GEN 1:1 ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు.
GEN 1:2 భూమి ఆకారం లేనిదిగా శూన్యంగా ఉంది; అగాధజలాల మీద చీకటి ఆవరించి ఉంది, దేవుని ఆత్మ నీళ్ల మీద అల్లాడుతూ ఉన్నాడు.
GEN 1:3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక” అని అనగా వెలుగు కలిగింది.
GEN 1:4 దేవుడు ఆ వెలుగు బాగుందని చూసి, వెలుగును చీకటిని వేరుచేశారు.
GEN 1:5 దేవుడు వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని పేరు పెట్టారు. సాయంకాలం గడిచి ఉదయం వచ్చింది. అది మొదటి రోజు.
GEN 1:6 దేవుడు, “ఆకాశ జలాలను భూ జలాలను వేరు చేయడానికి జలాల మధ్య విశాలం కలుగును గాక” అన్నారు.
GEN 1:7 అలాగే జరిగింది. దేవుడు విశాలాన్ని చేసి ఆ విశాలం క్రింది జలాలను విశాలం మీది జలాలను వేరుచేశారు.
GEN 1:8 దేవుడు ఆ విశాలానికి “ఆకాశం” అని పేరు పెట్టారు. సాయంకాలం గడిచి ఉదయం వచ్చింది. అది రెండవ రోజు.
GEN 1:9 దేవుడు, “ఆకాశం క్రింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడును గాక” అని అనగా అలాగే జరిగింది.
GEN 1:10 దేవుడు ఆరిన నేలకు “భూమి” అని, ఒకే చోట సమకూడిన జలాలకు “సముద్రం” అని పేరు పెట్టారు. అది మంచిదని దేవుడు చూశారు.
GEN 1:11 అప్పుడు దేవుడు, “భూమి వృక్ష సంపదను అనగా విత్తనాలు ఉత్పత్తి చేసే మొక్కలు, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలతో ఉన్న ఫలమిచ్చే చెట్లను భూమి మొలిపించును గాక” అని అన్నారు. అలాగే జరిగింది.
GEN 1:12 భూమి వృక్ష సంపదను ఉత్పత్తి చేసింది అంటే, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలు గల మొక్కలు, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలతో ఉన్న ఫలమిచ్చే చెట్లు మొలిపించింది. అది మంచిదని దేవుడు చూశారు.
GEN 1:13 సాయంకాలం గడిచి ఉదయం రాగా అది మూడవ రోజు.
GEN 1:14 దేవుడు, “పగలు రాత్రులను వేరు చేయడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుండాలి, అవి రుతువులను రోజులను సంవత్సరాలను సూచించే అసాధారణ గుర్తులుగా ఉండాలి.
GEN 1:15 ఆకాశ విశాలంలో భూమికి వెలుగునిచ్చే జ్యోతులుండును గాక” అని అన్నారు, అలాగే జరిగింది.
GEN 1:16 దేవుడు పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని అలా రెండు గొప్ప జ్యోతులను అలాగే నక్షత్రాలను కూడా చేశారు.
GEN 1:17 భూమికి వెలుగునివ్వడానికి, పగటిని రాత్రిని పాలించడానికి, చీకటిని వెలుగును వేరు చేయడానికి, దేవుడు వాటిని ఆకాశ విశాలంలో అమర్చారు. అది మంచిదని దేవుడు చూశారు.
GEN 1:19 సాయంకాలం గడిచి ఉదయం రాగా అది నాలుగవ రోజు.
GEN 1:20 దేవుడు, “నీటిలో జలజీవులు విస్తరించాలి, భూమిపై నుండి పక్షులు ఆకాశ విశాలంలో ఎగురును గాక” అని అన్నారు.
GEN 1:21 కాబట్టి దేవుడు సముద్రపు గొప్ప జీవులను, వాటి వాటి జాతుల ప్రకారం నీటిలో ఉండి నీటిలో తిరిగే ప్రతి జీవిని, వాటి వాటి జాతి ప్రకారం రెక్కలు గల పక్షులను సృష్టించారు. అది మంచిదని దేవుడు చూశారు.
GEN 1:22 దేవుడు, “ఫలించి, వృద్ధి చెంది, సముద్ర జలాల్లో నిండిపోవాలి, అలాగే భూమి మీద పక్షులు విస్తరించును గాక” అని వాటిని ఆశీర్వదించారు.
GEN 1:23 అలా సాయంకాలం గడిచి ఉదయం రాగా అది అయిదవ రోజు.
GEN 1:24 దేవుడు, “భూమి వాటి వాటి జాతి ప్రకారం జీవులను పుట్టించాలి అంటే, పశువులను, నేల మీద ప్రాకే జీవులను, అడవి మృగాలను, వాటి వాటి జాతుల ప్రకారం పుట్టించును గాక” అని అన్నారు, అలాగే జరిగింది.
GEN 1:25 దేవుడు వాటి వాటి జాతుల ప్రకారం అడవి మృగాలను, వాటి వాటి జాతుల ప్రకారం పశువులను, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద ప్రాకే జీవులను చేశారు. అది మంచిదని దేవుడు చూశారు.
GEN 1:26 అప్పుడు దేవుడు, “మనం మన స్వరూపంలో, మన పోలికలో నరులను చేద్దాము. వారు సముద్రంలోని చేపలను, ఆకాశంలో ఎగిరే పక్షులను, పశువులను, అడవి మృగాలను భూమిపై ప్రాకే జీవులన్నిటిని ఏలుతారు” అని అన్నారు.
GEN 1:27 కాబట్టి దేవుడు తన స్వరూపంలో నరులను సృజించారు, దేవుని స్వరూపంలో వారిని సృజించారు; వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు.
GEN 1:28 దేవుడు వారితో, “మీరు ఫలించి, వృద్ధి చెంది, భూలోకమంతా విస్తరించి, దానిని లోబరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, నేలపై ప్రాకే ప్రతి జీవిని ఏలండి” అని చెప్పి ఆశీర్వదించారు.
GEN 1:29 అప్పుడు దేవుడు, “భూమిపై విత్తనాలు ఇచ్చే ప్రతి మొక్కను, విత్తనాలు గల ఫలమిచ్చే ప్రతి చెట్టును మీకు ఆహారంగా ఇస్తున్నాను.
GEN 1:30 భూమిపై ఉన్న మృగాలన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, నేలపై ప్రాకే జీవులన్నిటికి, జీవం ఉన్న ప్రతీ దానికి ప్రతి పచ్చని మొక్కను ఆహారంగా ఇస్తున్నాను” అని అన్నారు. అలాగే జరిగింది.
GEN 1:31 దేవుడు తాను చేసిందంతా చూశారు. అది చాలా బాగుంది. సాయంకాలం గడిచి ఉదయం రాగా అది ఆరవరోజు.
GEN 2:1 ఆ విధంగా ఆకాశం భూమి వాటిలో సమస్తం సంపూర్తి చేయబడ్డాయి.
GEN 2:2 ఏడవ రోజు నాటికి దేవుడు తాను చేస్తున్న పనంతా ముగించారు; కాబట్టి ఏడవ రోజున తన పని అంతటి నుండి విశ్రాంతి తీసుకున్నారు.
GEN 2:3 ఆ రోజున సృష్టి క్రియ అంతటి నుండి దేవుడు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఆయన ఆ రోజును దీవించి పరిశుద్ధపరిచారు.
GEN 2:4 యెహోవా దేవుడు భూమిని సృజించినప్పుడు, భూమ్యాకాశాల సృష్టి జరిగిన విధానం ఇదే.
GEN 2:5 భూమి మీద ఏ పొద కనిపించలేదు, మొక్క మొలవలేదు, ఎందుకంటే యెహోవా దేవుడు భూమి మీద వాన కురిపించలేదు, భూమిని సేద్యం చేయడానికి నరులు లేరు,
GEN 2:6 అయితే భూమిలో నుండి నీటిబుగ్గలు వచ్చి అంతా పారుతూ నేలను తడిపేవి.
GEN 2:7 యెహోవా దేవుడు నేల మట్టితో మనుష్యుని చేసి, అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవి అయ్యాడు.
GEN 2:8 యెహోవా దేవుడు తూర్పు దిక్కున ఏదెనులో తోట నాటి, అందులో తాను రూపించిన నరుని ఉంచారు.
GEN 2:9 యెహోవా దేవుడు నేల నుండి కంటికి అందంగా కనిపించే ఆహారానికి సరియైన అన్ని రకాల చెట్లను మొలిపించారు. అలాగే ఆ తోట మధ్యలో జీవవృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చే జ్ఞాన వృక్షం ఉన్నాయి.
GEN 2:10 ఏదెను నుండి ఒక నది పారుతూ తోటను తడిపేది; అది అక్కడినుండి నాలుగు పాయలుగా చీలిపోయింది.
GEN 2:11 ఈ నదులలో మొదటి దాని పేరు పీషోను; ఇది బంగారం ఉన్న హవీలా దేశం చుట్టూ పారుతుంది.
GEN 2:12 ఆ దేశ బంగారం ఉండేది; సువాసనగల గుగ్గిలం లేతపచ్చ రాళ్లు కూడా అక్కడ ఉండేవి.
GEN 2:13 రెండవ నది పేరు గిహోను, అది కూషు దేశమంతటా పారుతుంది.
GEN 2:14 మూడవ నది పేరు టైగ్రీసు, అది అష్షూరు ప్రాంతానికి తూర్పున ప్రవహిస్తుంది. నాలుగవ నది యూఫ్రటీసు.
GEN 2:15 ఏదెను తోటను సాగుచేయడానికి దానిని, జాగ్రత్తగా చూసుకోడానికి యెహోవా దేవుడు నరుని దానిలో ఉంచారు.
GEN 2:16 యెహోవా దేవుడు ఆ నరునితో, “ఈ తోటలోని చెట్ల పండ్లన్నీ నీవు తినవచ్చు;
GEN 2:17 కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినకూడదు. అది తిన్న రోజున నీవు తప్పక చస్తావు” అని ఆజ్ఞాపించారు.
GEN 2:18 యెహోవా దేవుడు, “నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి తగిన తోడును చేస్తాను” అని అనుకున్నారు.
GEN 2:19 యెహోవా దేవుడు నేల మట్టితో ప్రతి విధమైన అడవి జంతువులను, ఆకాశ పక్షులను చేసి, ఆ మనుష్యుని దగ్గరకు తెచ్చి వాటికి అతడు ఏ పేర్లు పెడతాడో అని చూశారు; అతడు ఒక్కొక్క జీవికి ఏ పేరైతే పెట్టాడో అదే ఆ జీవికి పేరు అయ్యింది.
GEN 2:20 ఆ మనుష్యుడు పశువులన్నిటికి, ఆకాశపక్షులకు, అడవి జంతువులన్నిటికి పేర్లు పెట్టాడు. అయితే మనుష్యునికి తగిన తోడు దొరకలేదు.
GEN 2:21 కాబట్టి యెహోవా దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలిగించి, అతని ప్రక్కటెముకల్లో ఒకటి తీసి, ఆ స్థలాన్ని మాంసంతో పూడ్చి వేశారు.
GEN 2:22 అప్పుడు యెహోవా దేవుడు మనుష్యుని నుండి తీసిన ప్రక్కటెముకతో స్త్రీని చేసి అతని దగ్గరకు తెచ్చారు.
GEN 2:23 అప్పుడు ఆ మనుష్యుడు ఇలా అన్నాడు: “ఈమె నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం; ఈమె నరుని నుండి వచ్చింది కాబట్టి ఈమె ‘నారీ’ అని పిలువబడుతుంది.”
GEN 2:24 అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరు ఏకశరీరం అవుతారు.
GEN 2:25 ఆదాము, అతని భార్య, ఇద్దరు నగ్నంగా ఉన్నారు, కానీ వారికి సిగ్గు అనిపించలేదు.
GEN 3:1 యెహోవా దేవుడు చేసిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా యుక్తి కలది. సర్పం స్త్రీతో, “దేవుడు, ‘తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లు తినకూడదు’ అని నిజంగా చెప్పారా?” అని అడిగింది.
GEN 3:2 అందుకు స్త్రీ, “తోటలోని చెట్ల పండ్లు మేము తినవచ్చు
GEN 3:3 కాని, ‘తోట మధ్యలో చెట్టు పండు మాత్రం తినకూడదు, దానిని ముట్టుకోవద్దు, లేదంటే మీరు చస్తారు’ అని దేవుడు చెప్పారు” అని జవాబిచ్చింది.
GEN 3:4 అప్పుడు సర్పం, “మీరు ఖచ్చితంగా చావరు.
GEN 3:5 మీరు అది తింటే మీ కళ్లు తెరవబడతాయని, మీరు దేవునిలా అవుతారని, మంచిచెడులు తెలుసుకుంటారని దేవునికి తెలుసు” అని చెప్పింది.
GEN 3:6 స్త్రీ ఆ చెట్టు పండు తినడానికి మంచిది, చూడటానికి బాగుంది, తింటే జ్ఞానం వస్తుందని తలంచి, దానిలో కొంచెం తిని, తన భర్తకు కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు.
GEN 3:7 అప్పుడు వారి ఇద్దరి కళ్లు తెరవబడి తాము నగ్నంగా ఉన్నారని గ్రహించి, తమ శరీరాలను కప్పుకోడానికి అంజూర ఆకులు అల్లుకొన్నారు.
GEN 3:8 అప్పుడు ఆ రోజు చల్లని సమయంలో యెహోవా దేవుడు తోటలో నడుస్తున్న శబ్దం విని, ఆదాము అతని భార్య యెహోవా దేవునికి కనబడకూడదని తోట చెట్ల మధ్య దాక్కున్నారు.
GEN 3:9 అప్పుడు యెహోవా దేవుడు ఆదామును పిలిచి, “నీవెక్కడున్నావు?” అని అడిగారు.
GEN 3:10 అతడు, “తోటలో మీ శబ్దం విని, నేను దిగంబరిగా ఉన్నానని భయపడ్డాను; అందుకే నేను దాక్కున్నాను” అని జవాబిచ్చాడు.
GEN 3:11 అప్పుడు దేవుడు, “నీవు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినకూడదని నేను మీకు ఆజ్ఞాపించిన ఆ చెట్టు నుండి పండు తిన్నావా?” అని అడిగారు.
GEN 3:12 అందుకు ఆదాము, “మీరు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ చెట్టు పండును కొంచెం నాకిచ్చింది, నేను తిన్నాను” అని చెప్పాడు.
GEN 3:13 అప్పుడు యెహోవా దేవుడు స్త్రీని, “నీవు చేసిన ఈ పనేంటి?” అని అడిగారు. అందుకు ఆ స్త్రీ జవాబిస్తూ, “సర్పం మాటలకు మోసపోయి నేను తిన్నాను” అని చెప్పింది.
GEN 3:14 అందుకు యెహోవా దేవుడు సర్పంతో, “నీవు ఇలా చేశావు కాబట్టి, “అన్ని రకాల పశువుల్లోను, అడవి జంతువులన్నిటిలోనూ నీవు శపించబడ్డావు! నీవు బ్రతుకు దినాలన్ని నీ పొట్టతో ప్రాకుతావు, మన్ను తింటావు.
GEN 3:15 నేను నీకు స్త్రీకి మధ్య, నీ సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య శత్రుత్వం కలుగజేస్తాను; అతడు నీ తలను చితకగొడతాడు, నీవు అతని మడిమె మీద కాటేస్తావు” అని అన్నారు.
GEN 3:16 తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు, “నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను; తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు. నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు.”
GEN 3:17 ఆదాముతో ఆయన ఇలా అన్నారు, “నీవు నీ భార్య మాట విని, ‘తినవద్దు’ అని నేను నీకు చెప్పిన ఆ చెట్టు పండును నీవు తిన్నావు కాబట్టి, “నిన్ను బట్టి ఈ నేల శపించబడింది; నీ జీవితకాలమంతా దాని పంట నుండి, కష్టపడి పని చేసి తింటావు.
GEN 3:18 భూమి నీకోసం ముళ్ళ కంపలను గచ్చపొదలను మొలిపిస్తుంది, నీవు పొలం లోని పంటను తింటావు.
GEN 3:19 నీవు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి నీవు మట్టికి చేరేవరకు, నీ నుదిటి మీద చెమట కార్చి నీ ఆహారాన్ని తింటావు నీవు మట్టివి కాబట్టి తిరిగి మన్నై పోతావు.”
GEN 3:20 ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు, ఎందుకంటే ఆమె జీవంగల వారందరికి తల్లి.
GEN 3:21 యెహోవా దేవుడు ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో చేసిన వస్త్రాలను తొడిగించారు.
GEN 3:22 అప్పుడు యెహోవా దేవుడు, “మనుష్యుడు ఇప్పుడు మంచి చెడ్డలు తెలుసుకోగలిగి మనలాంటి వాడయ్యాడు, కాబట్టి అతడు తన చేయి చాపి జీవవృక్ష ఫలం కూడా తెంపుకొని తిని ఎప్పటికీ బ్రతికే ఉంటాడేమో, అలా జరగనివ్వకూడదు” అని అనుకున్నారు.
GEN 3:23 కాబట్టి యెహోవా దేవుడు అతన్ని ఏదెను తోట నుండి బయటకు వెళ్లగొట్టి అతడు ఏ మట్టి నుండి తీయబడ్డాడో, ఆ మట్టినే సాగు చేసుకునేలా చేశారు.
GEN 3:24 దేవుడు ఆదామును బయటకు పంపివేసి జీవవృక్షం దగ్గరకు వెళ్లే మార్గాన్ని కాపాడడానికి ఏదెను తోటకు తూర్పున కెరూబును ఇటు అటు తిరుగుతున్న మండుతున్న ఖడ్గాన్ని కాపలా ఉంచారు.
GEN 4:1 అటు తర్వాత ఆదాము హవ్వను లైంగికంగా కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతియై కయీనుకు జన్మనిచ్చింది. “యెహోవా సహాయంతో నేను కుమారున్ని సంపాదించుకున్నాను” అని ఆమె అన్నది.
GEN 4:2 తర్వాత అతని సహోదరుడైన హేబెలుకు జన్మనిచ్చింది. హేబెలు గొర్రెల కాపరి, కయీను వ్యవసాయకుడు.
GEN 4:3 కోత సమయం వచ్చినప్పుడు కయీను పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు.
GEN 4:4 హేబెలు కూడా తన గొర్రెలలో మొదటి సంతానంగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అర్పణగా తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను అంగీకరించారు.
GEN 4:5 కానీ కయీనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. అందుకు కయీనుకు చాలా కోపం వచ్చి ముఖం మాడ్చుకున్నాడు.
GEN 4:6 అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నారు, “నీవెందుకు కోపంతో ఉన్నావు? నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకొన్నావు?
GEN 4:7 నీవు చేసేది మంచిదైతే నీవు అంగీకరించబడవా? నీవు సరియైనది చేయకపోతే, పాపం నీ వాకిట్లో పొంచుకొని ఉంది; అది నిన్ను పొందుకోవాలని వాంఛతో ఉంది, కానీ నీవు దానిని జయించాలి.”
GEN 4:8 ఒక రోజు కయీను తన తమ్మున్ని పిలిచి, “మనం పొలానికి వెళ్దాం” అని అన్నాడు. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను హేబెలు మీద దాడి చేసి అతన్ని చంపేశాడు.
GEN 4:9 అప్పుడు యెహోవా కయీనును, “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అని అడిగారు. అందుకు అతడు, “ఏమో నాకు తెలియదు, నేనేమైన నా తమ్మునికి కావలివాడినా?” అని అన్నాడు.
GEN 4:10 అందుకు యెహోవా, “నీవేం చేశావు? విను, నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది.
GEN 4:11 ఇప్పుడు నీవు శపించబడ్డావు, నీ చేతి నుండి వచ్చిన నీ తమ్ముని రక్తాన్ని పీల్చుకున్న నేల నుండి నీవు తరిమివేయబడ్డావు.
GEN 4:12 నీవు భూమిలో ఎంత కృషి చేసినా, అది ఇకమీదట నీకు మంచి పంటను ఇవ్వదు. నీవు భూమిపై విశ్రాంతి లేని దేశదిమ్మరిగా ఉంటావు” అని చెప్పారు.
GEN 4:13 కయీను యెహోవాతో, “ఈ శిక్ష నేను భరించలేనంత కఠినమైనది.
GEN 4:14 ఈ రోజు నన్ను ఈ ప్రాంతం నుండి వెళ్లగొట్టారు, మీ సన్నిధిలో నుండి దూరం చేశారు; నేను విశ్రాంతి లేని దేశదిమ్మరిని అవుతాను, నేను కంటపడితే నన్ను చంపేస్తారు” అని అన్నాడు.
GEN 4:15 అయితే యెహోవా అతనితో, “అలా జరగదు; ఎవరైనా కయీనును చంపితే, వారు ఏడు రెట్లు ఎక్కువ శిక్ష అనుభవిస్తారు” అని అన్నారు. అప్పుడు యెహోవా కయీనును ఎవరూ చంపకుండ ఉండేలా కయీను మీద ఒక గుర్తు వేశారు.
GEN 4:16 కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లి ఏదెనుకు తూర్పున ఉన్న నోదు దేశంలో నివసించాడు.
GEN 4:17 కయీను తన భార్యను లైంగికంగా కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతియై హనోకుకు జన్మనిచ్చింది. అప్పుడు కయీను ఒక పట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నాడు, దానికి హనోకు అని తన కుమారుని పేరు పెట్టాడు.
GEN 4:18 హనోకుకు ఈరాదు పుట్టాడు, ఈరాదు మెహూయాయేలు తండ్రి, మెహూయాయేలు మెతూషాయేలుకు తండ్రి, మెతూషాయేలు లెమెకుకు తండ్రి.
GEN 4:19 లెమెకు ఇద్దరిని భార్యలుగా చేసుకున్నాడు, ఒకరు ఆదా ఇంకొకరు సిల్లా.
GEN 4:20 ఆదా యాబాలుకు జన్మనిచ్చింది; అతడు గుడారాల్లో నివసిస్తూ పశువులను పెంచేవారికి మూలపురుషుడు.
GEN 4:21 అతని తమ్ముని పేరు యూబాలు, అతడు తంతి వాయిద్యాలు వాయించే వారికి మూలపురుషుడు.
GEN 4:22 సిల్లా కూడా ఒక కుమారునికి జన్మనిచ్చింది, అతని పేరు తూబల్-కయీను, అతడు అన్ని రకాల ఇత్తడి ఇనుప పనిముట్లు తయారుచేయడంలో నిపుణుడు. తూబల్-కయీను యొక్క సోదరి నయమా.
GEN 4:23 ఒక రోజు లెమెకు తన భార్యలతో, “ఆదా, సిల్లా నా మాట ఆలకించండి; లెమెకు భార్యలారా, నా పలుకులు వినండి. నాకు గాయం చేసినందుకు ఒక మనుష్యుని, నన్ను గాయపరిచినందుకు ఒక యువకుడిని చంపాను.
GEN 4:24 కయీనును చంపితే ఏడు రెట్లు శిక్ష పడితే, లెమెకును చంపితే డెబ్బై ఏడు రెట్లు” అని అన్నాడు.
GEN 4:25 ఆదాము తన భార్యను మరోసారి లైంగికంగా కలుసుకున్నప్పుడు, ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చి, “దేవుడు, కయీను చంపిన నా కుమారుడు హేబెలుకు బదులుగా మరొక శిశువునిచ్చారు” అని అతనికి షేతు అని పేరు పెట్టింది.
GEN 4:26 షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోషు అని పేరు పెట్టాడు. అప్పటినుండి ప్రజలు యెహోవా నామంలో ప్రార్థించడం మొదలుపెట్టారు.
GEN 5:1 ఆదాము వంశావళి యొక్క జాబితా ఇదే. దేవుడు మనుష్యజాతిని సృష్టించినప్పుడు వారిని దేవుని పోలికలో చేశారు.
GEN 5:2 ఆయన వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు. ఆయన వారిని ఆశీర్వదించి వారికి “మనుష్యజాతి” అని పేరు పెట్టారు.
GEN 5:3 ఆదాము 130 సంవత్సరాలు జీవించి తన పోలికలో తన స్వరూపంలో ఒక కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాడు.
GEN 5:4 షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
GEN 5:5 ఆదాము మొత్తం 930 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
GEN 5:6 షేతు 105 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఎనోషు పుట్టాడు.
GEN 5:7 ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 5:8 షేతు మొత్తం 912 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
GEN 5:9 ఎనోషు 90 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి కేయినాను పుట్టాడు.
GEN 5:10 కేయినాను పుట్టిన తర్వాత ఎనోషు 815 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 5:11 ఎనోషు మొత్తం 905 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
GEN 5:12 కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు.
GEN 5:13 మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
GEN 5:14 కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
GEN 5:15 మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి యెరెదు పుట్టాడు.
GEN 5:16 యెరెదు పుట్టిన తర్వాత మహలలేలు 830 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
GEN 5:17 మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
GEN 5:18 యెరెదు 162 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి హనోకు పుట్టాడు.
GEN 5:19 హనోకు పుట్టిన తర్వాత యెరెదు 800 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
GEN 5:20 యెరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
GEN 5:21 హనోకు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మెతూషెల పుట్టాడు.
GEN 5:22 మెతూషెల పుట్టిన తర్వాత హనోకు 300 సంవత్సరాలు బ్రతికి దేవునితో నమ్మకంగా నడిచాడు; ఈ సమయంలో ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
GEN 5:23 హనోకు మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు.
GEN 5:24 హనోకు దేవునితో నమ్మకంగా నడిచాడు; తర్వాత ఒక రోజు దేవుడు అతన్ని తీసుకెళ్లారు కాబట్టి అతడు కనబడలేదు.
GEN 5:25 మెతూషెల 187 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి లెమెకు పుట్టాడు.
GEN 5:26 లెమెకు పుట్టిన తర్వాత మెతూషెల 782 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
GEN 5:27 మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
GEN 5:28 లెమెకు 182 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు.
GEN 5:29 అతనికి నోవహు అని పేరు పెట్టి, “యెహోవా శపించిన ఈ భూమిని సాగుచేయడానికి మనం పడే ప్రయాసలో, మన చేతుల బాధాకరమైన శ్రమలలో ఆయన మనలను ఆదరిస్తారు” అని అన్నాడు.
GEN 5:30 నోవహు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
GEN 5:31 లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
GEN 5:32 నోవహు 500 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి షేము, హాము యాపెతులు పుట్టారు.
GEN 6:1 నరులు భూమిపై వృద్ధి చెంది విస్తరిస్తూ ఉన్న సమయంలో వారికి కుమార్తెలు పుట్టినప్పుడు,
GEN 6:2 దేవుని కుమారులు నరుల కుమార్తెలు అందంగా ఉండడం చూసి, వారిలో నచ్చిన వారిని పెళ్ళి చేసుకున్నారు.
GEN 6:3 అప్పుడు యెహోవా, “నా ఆత్మ నరులతో నిరంతరం వాదించదు, ఎందుకంటే వారు శరీరులు; వారి బ్రతుకు దినాలు 120 సంవత్సరాలు అవుతాయి” అని అన్నారు.
GEN 6:4 ఆ దినాల్లో భూమిపై నెఫిలీములు ఉండేవారు, వీరు తర్వాత కూడా ఉన్నారు. వీరు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు పుట్టిన పిల్లలు. వీరు ప్రాచీన కాలంలో పేరు పొందిన యోధులు.
GEN 6:5 యెహోవా భూమిపై నరుల దుష్టత్వం చాలా విస్తరించిందని, నరుల హృదయంలోని ప్రతీ ఊహ కేవలం చెడు అని చూశారు.
GEN 6:6 యెహోవా భూమిపై నరులను చేసినందుకు చింతించి, హృదయంలో చాలా బాధపడ్డారు.
GEN 6:7 అప్పుడు యెహోవా, “నేను సృజించిన నరులను, వారితో పాటు జంతువులను, పక్షులను, నేలపై ప్రాకే జీవులను భూమి మీద నుండి తుడిచివేస్తాను, వాటిని చేసినందుకు నేను బాధపడుతున్నాను” అని అనుకున్నారు.
GEN 6:8 అయితే నోవహు యెహోవా దృష్టిలో దయ పొందుకున్నాడు.
GEN 6:9 నోవహు అతని కుటుంబం యొక్క వివరాలు: నోవహు నీతిమంతుడు, అతని సమకాలికులలో అతడు నిందారహితుడు, దేవునితో నమ్మకంగా జీవించాడు.
GEN 6:10 నోవహుకు ముగ్గురు కుమారులు: షేము, హాము, యాపెతు.
GEN 6:11 దేవుని దృష్టిలో భూమి అవినీతితో హింసతో నిండిపోయింది.
GEN 6:12 దేవుడు ఈ భూమి ఎంతో అవినీతితో ఉందని చూశారు, ఎందుకంటే భూమిపై ఉన్న ప్రజలంతా తమ జీవిత విధానాలను పాడుచేసుకున్నారు.
GEN 6:13 కాబట్టి దేవుడు నోవహుతో ఇలా అన్నారు, “నేను ప్రజలందరినీ నాశనం చేయబోతున్నాను, ఎందుకంటే వారిని బట్టి భూమి హింసతో నిండిపోయింది. నేను ఖచ్చితంగా వారిని, భూమిని నాశనం చేయబోతున్నాను.
GEN 6:14 కాబట్టి నీకోసం తమాల వృక్ష చెక్కతో ఒక ఓడను నిర్మించుకో; దానిలో గదులు చేసి, దానికి లోపల బయట కీలు పూయాలి.
GEN 6:15 దానిని నిర్మించవలసిన విధానం: ఆ ఓడ పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు ఉండాలి.
GEN 6:16 దానికి పైకప్పు వేసి, మూర కొలత క్రింద అన్ని మూలలు గల ఒక కిటికీ పెట్టాలి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టాలి, క్రింద, మధ్య, పై అంతస్తులు నిర్మించాలి.
GEN 6:17 ఆకాశం క్రింద ఉన్న సమస్త జీవులను, జీవవాయువు గల ప్రతి ప్రాణిని నాశనం చేయడానికి నేను భూమి మీదికి జలప్రళయం తీసుకురాబోతున్నాను. భూమిపై ఉన్న ప్రతిదీ నశిస్తుంది.
GEN 6:18 అయితే నీతో నా నిబంధనను స్థిరపరుస్తాను, ఓడలో నీతో పాటు నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు ప్రవేశించాలి.
GEN 6:19 మీతో పాటు బ్రతికి ఉండేలా జీవులన్నిటిలో మగ, ఆడవాటిని మీరు ఓడలోకి తీసుకురావాలి.
GEN 6:20 ప్రతి జాతిలో రెండేసి పక్షులు, ప్రతి జాతిలో రెండేసి జంతువులు, ప్రతి జాతిలో నేలపై ప్రాకే ప్రాణులు బ్రతికి ఉండడానికి నీ దగ్గరకు వస్తాయి.
GEN 6:21 నీకు, వాటికి తినడానికి ఆహారాన్ని అన్ని రకాల భోజనపదార్థాలు సమకూర్చుకోవాలి.”
GEN 6:22 దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టే నోవహు అంతా చేశాడు.
GEN 7:1 అప్పుడు యెహోవా నోవహుతో, “నీవు, నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి, ఎందుకంటే ఈ తరంలో నీవు మాత్రమే నాకు నీతిమంతునిగా కనిపించావు.
GEN 7:2 నీతో పాటు పవిత్రమైన జంతువుల్లో జంటల చొప్పున ఏడు మగవాటిని, ఏడు ఆడవాటిని, అపవిత్రమైన వాటిలో ఒక మగదానిని,
GEN 7:3 అలాగే పక్షిజాతులన్నిటిలో నుండి ఏడు మగవాటిని ఏడు ఆడవాటిని భూమిపై వాటి జాతులు సజీవంగా ఉంచడానికి ఓడలోకి తీసుకెళ్లు.
GEN 7:4 ఇంకా ఏడు రోజుల్లో భూమి మీద నలభై రాత్రింబగళ్ళు నేను వర్షం కురిపిస్తాను, నేను చేసిన ప్రతి ప్రాణిని భూమి మీద నుండి తుడిచివేస్తాను” అని అన్నారు.
GEN 7:5 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే నోవహు అంతా చేశాడు.
GEN 7:6 భూమి మీదికి జలప్రళయం వచ్చినప్పుడు నోవహుకు 600 సంవత్సరాలు.
GEN 7:7 జలప్రళయం నుండి తప్పించుకోడానికి నోవహు, అతని భార్య, కుమారులు, వారి భార్యలు ఓడలోనికి ప్రవేశించారు.
GEN 7:8 పవిత్రమైన, అపవిత్రమైన జంతువుల్లో, పక్షుల్లో, నేలపై ప్రాకే జీవులన్నిటిలో,
GEN 7:9 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారమే మగవి ఆడవి, జతలుగా నోవహు దగ్గరకు వచ్చి ఓడలో ప్రవేశించాయి.
GEN 7:10 ఏడు రోజుల తర్వాత భూమి మీదికి జలప్రళయం వచ్చింది.
GEN 7:11 నోవహుకు 600 సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున గొప్ప అగాధంలోని ఊటలన్నీ ఉప్పొంగాయి, ఆకాశ తూములు ద్వారాలు తెరుచుకున్నాయి.
GEN 7:12 నలభై రాత్రింబగళ్ళు భూమిపై వర్షం కురిసింది.
GEN 7:13 ఆ రోజే నోవహు, అతని కుమారులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, అతని ముగ్గురు కుమారుల భార్యలు ఓడలోనికి వెళ్లారు.
GEN 7:14 ప్రతి జాతి ప్రకారం అడవి జంతువులు, వాటి వాటి జాతుల ప్రకారం అన్ని రకాల పశువులు, ఆయా జాతుల ప్రకారం నేలపై ప్రాకే జీవులు, వాటి వాటి జాతుల ప్రకారం పక్షులు, రెక్కలు గల ప్రతిదీ వారితో ఉన్నాయి.
GEN 7:15 జీవపు ఊపిరి ఉన్న అన్ని జీవుల జతలు నోవహు దగ్గరకు వచ్చి ఓడలోకి ప్రవేశించాయి.
GEN 7:16 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారమే అన్ని జీవులలో ఆడవి మగవి జతలుగా ఓడలోకి వెళ్లాయి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశారు.
GEN 7:17 నలభై రోజులు భూమిపై జలప్రళయం ముంచెత్తింది, నీళ్లు నిండిన కొలది ఓడ నీటిపై తేలుతూ ఉంది.
GEN 7:18 భూమిపై జలాలు అధికంగా విస్తరించాయి, ఆ ఓడ నీటిపై తేలింది.
GEN 7:19 నీరు ఎక్కువై భూమిని కప్పివేశాయి, ఆకాశాల క్రింద ఉన్న అన్ని ఎత్తైన పర్వతాలు నీటిలో మునిగిపోయాయి.
GEN 7:20 నీరు పర్వతాల కన్నా పదిహేను మూరల ఎత్తు లేచి వాటిని కప్పివేశాయి.
GEN 7:21 భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంటే పక్షులు, పశువులు, అడవి జంతువులు, భూమి మీద సంచరించే సమస్త ప్రాణులు చనిపోయాయి, మనుష్యులు కూడా అందరు చనిపోయారు.
GEN 7:22 పొడి నేలపై నాసికారంధ్రాలలో జీవం కలిగి ఉన్న ప్రతి ప్రాణి చనిపోయింది.
GEN 7:23 నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయి; మనుష్యులు, పశువులు, నేల మీద తిరిగే జీవులు, పక్షులు తుడిచివేయబడ్డాయి. కేవలం నోవహు, అతనితో ఓడలో ఉన్నవారు మిగిలారు.
GEN 7:24 వరదనీరు భూమిని నూట యాభై రోజులు ముంచెత్తాయి.
GEN 8:1 అయితే దేవుడు నోవహును, అతనితో ఓడలో ఉన్న సమస్త అడవి జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకుని, భూమి మీదికి గాలిని పంపినప్పుడు నీరు వెనుకకు తగ్గింది.
GEN 8:2 అగాధజలాల ఊటలు ఆకాశపు తూములు మూయబడ్డాయి, ఆకాశం నుండి కురుస్తున్న వర్షం ఆగిపోయింది.
GEN 8:3 భూమి నుండి క్రమంగా నీరు తగ్గింది, నూట యాభై రోజుల తర్వాత నీరు తగ్గి,
GEN 8:4 ఏడవ నెల పదిహేడవ రోజున ఓడ అరారతు పర్వతాలమీద ఆగింది.
GEN 8:5 పదవనెల వరకు నీరు తగ్గుతూ ఉంది, పదవనెల మొదటి రోజున పర్వత శిఖరాలు కనిపించాయి.
GEN 8:6 నలభైౖ రోజుల తర్వాత నోవహు తాను తయారుచేసిన ఓడ కిటికీ తెరిచి,
GEN 8:7 ఒక కాకిని బయటకు పంపాడు, అది భూమిపై నీళ్లు ఆరిపోయే వరకు ఇటు అటు ఎగురుతూ ఉంది.
GEN 8:8 అప్పుడు భూమి మీద నీరు తగ్గిందో లేదో చూడటానికి నోవహు ఒక పావురాన్ని బయటకు పంపాడు.
GEN 8:9 అయితే భూమి మీద అంతటా నీరు ఉన్నందుకు ఆ పావురానికి వాలడానికి చోటు దొరకలేదు; కాబట్టి అది ఓడలో ఉన్న నోవహు దగ్గరకు తిరిగి వచ్చింది. అతడు చేయి చాపి, పావురాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు.
GEN 8:10 మరో ఏడు రోజులు వేచియున్న తర్వాత అతడు ఆ పావురాన్ని మళ్ళీ బయటకు పంపాడు.
GEN 8:11 సాయంకాలం ఆ పావురం అతని దగ్గరకు వచ్చినప్పుడు, దాని ముక్కుకు పచ్చని ఒలీవ ఆకు ఉంది. అప్పుడు భూమి మీద నీరు తగ్గిందని నోవహు గ్రహించాడు.
GEN 8:12 మరో ఏడు రోజులు ఆగి, ఆ పావురాన్ని మళ్ళీ బయటకు పంపాడు, అయితే ఈసారి అది అతని దగ్గరకు తిరిగి రాలేదు.
GEN 8:13 నోవహు యొక్క 601 వ సంవత్సరం మొదటి నెల మొదటి దినాన భూమి మీద నీళ్లు ఎండిపోయాయి. అప్పుడు నోవహు ఓడ కప్పు తెరిచి చూస్తే నేల ఆరిపోయి కనిపించింది.
GEN 8:14 రెండవ నెల ఇరవై ఏడవ రోజు నాటికి భూమి పూర్తిగా ఆరిపోయింది.
GEN 8:15 అప్పుడు దేవుడు నోవహుతో,
GEN 8:16 “నీవూ, నీ భార్య, నీ కుమారులు, వారి భార్యలు, ఓడలో నుండి బయటకు రండి.
GEN 8:17 నీతో ఉన్న ప్రతి జీవిని అంటే పక్షులు, జంతువులు, నేల మీద ప్రాకే ప్రాణులన్నిటిని బయటకు తీసుకురా, అప్పుడు అవి భూమి మీద ఫలించి, వృద్ధి చెంది, విస్తరిస్తాయి” అని అన్నారు.
GEN 8:18 నోవహు, తన భార్య, కుమారులు, కుమారుల భార్యలతో పాటు బయటకు వచ్చాడు.
GEN 8:19 జంతువులు, నేల మీద ప్రాకే జీవులు, పక్షులు, భూమి మీద తిరిగే జీవులన్నీ ఒక జాతి వెంబడి మరో జాతి, వాటి వాటి జంటల ప్రకారం ఓడలో నుండి బయటకు వచ్చాయి.
GEN 8:20 అప్పుడు నోవహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి, జంతువుల్లో పక్షుల్లో పవిత్రమైనవాటిలో కొన్ని తీసి ఆ బలిపీఠంపై దహనబలి అర్పించాడు.
GEN 8:21 యెహోవా ఆ బలి అర్పణ యొక్క ఇష్టమైన సువాసన పీల్చుకుని తన హృదయంలో ఇలా అనుకున్నారు: “మనుష్యుల హృదయాలోచన బాల్యం నుండే చెడ్డది అయినప్పటికీ, ఇక ఎన్నడు మనుష్యుల కారణంగా భూమిని శపించను. నేను ఇప్పుడు చేసినట్టు ఇంకెప్పుడు సమస్త జీవులను నాశనం చేయను.
GEN 8:22 “ఈ భూమి ఉన్నంత కాలం, నాటే కాలం కోతకాలం, చలి వేడి, ఎండకాలం చలికాలం, పగలు రాత్రి, ఎప్పుడూ నిలిచిపోవు.”
GEN 9:1 అప్పుడు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదిస్తూ, “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూలోకాన్ని నింపండి.
GEN 9:2 భూలోకంలో ఉన్న అన్ని రకాల జంతువులు, ఆకాశంలోని అన్ని రకాల పక్షులు, నేల మీద తిరిగే ప్రతీ జీవి, సముద్రంలో ఉన్న అన్ని చేపలు మీకు భయపడతాయి భీతి చెందుతాయి; అవి మీ చేతికి అప్పగించబడ్డాయి.
GEN 9:3 జీవిస్తూ తిరిగే ప్రతిదీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను నేను మీకు ఇచ్చినట్టుగా ఇప్పుడు అన్నిటిని మీకు ఇస్తున్నాను.
GEN 9:4 “అయితే మాంసంలో ప్రాణాధారమైన రక్తం ఉంటే మీరు తినకూడదు.
GEN 9:5 ఎవరైనా ఇంకొకరి ప్రాణం తీస్తే నేను వారి రక్తం గురించి లెక్క అడుగుతాను. అడవి జంతువు ఒక మనుష్యుని చంపితే, అది చంపబడాలి. ఎవరైనా తోటి మనుష్యుల ప్రాణం తీస్తే దాని గురించి నేను లెక్క అడుగుతాను.
GEN 9:6 “ఎవరైనా మనుష్యుని రక్తం చిందిస్తే, మనుష్యులచే వారి రక్తం చిందించబడాలి; ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో మనుష్యుని సృజించారు.
GEN 9:7 మీరైతే, ఫలించి, అభివృద్ధిచెంది; భూమిపై విస్తరించండి” అని చెప్పారు.
GEN 9:8 దేవుడు నోవహుతో అతని కుమారులతో ఇలా అన్నారు:
GEN 9:9 “నేను మీతో మీ రాబోయే తరం వారితో నా నిబంధన స్థిరపరస్తున్నాను,
GEN 9:10 మీతో పాటు ఉన్న ప్రతి జీవితో అనగా పక్షులతో, పశువులతో, సమస్త అడవి జంతువులతో, ఓడలో నుండి మీతో పాటు బయటకు వచ్చిన జీవులన్నిటితో, భూమిపై ఉన్న ప్రతి జీవితోను నా నిబంధన స్థిరపరస్తున్నాను.
GEN 9:11 నేను నీతో చేసిన నిబంధనను ధృవీకరిస్తున్నాను: ఇక ఎన్నడు వరద నీటితో సమస్త ప్రాణులు నాశనం కావు; భూమిని నాశనం చేసే జలప్రళయం ఇక ఎన్నడు రాదు.”
GEN 9:12 దేవుడు ఇలా అన్నారు, “నాకును మీకును, మీతో ఉన్న ప్రతి ప్రాణికిని మధ్య తరాలన్నిటి కోసం నేను చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే:
GEN 9:13 నేను మేఘాలలో నా ధనుస్సును పెట్టాను, అది నాకూ భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉంటుంది.
GEN 9:14 నేను భూమిపై మేఘాలను తీసుకువచ్చినప్పుడు ఈ ధనుస్సు మేఘాలలో కనిపిస్తుంది,
GEN 9:15 అప్పుడు నేను నాకును మీకును, ప్రతి రకమైన ప్రాణులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. ఇక ఎన్నడు కూడా సమస్త జీవులన్నిటిని నాశనం చేయడానికి నీరు వరదలా మారదు.
GEN 9:16 మేఘాలలో ధనస్సు కనిపించినప్పుడు, నేను దానిని చూసి దేవునికి, భూమిపై ఉన్న సమస్త ప్రాణులకు మధ్య నేను చేసిన నిత్యనిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను.”
GEN 9:17 ఇంకా దేవుడు నోవహుతో, “ఇది నాకూ భూమిపై ఉన్న సమస్త జీవులకు మధ్య ఉన్న నిబంధనకు గుర్తు” అని చెప్పారు.
GEN 9:18 ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతు. (హాము కనానీయులకు తండ్రి.)
GEN 9:19 ఈ ముగ్గురు నోవహు కుమారులు, వీరి నుంచే భూలోకమంతా ప్రజలు విస్తరించారు.
GEN 9:20 వ్యవసాయకుడైన నోవహు ద్రాక్షతోట నాటడం ఆరంభించాడు.
GEN 9:21 అతడు కొంత మద్యం త్రాగి మత్తులో తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు.
GEN 9:22 కనాను తండ్రియైన హాము తన తండ్రి దిగంబరిగా ఉండడం చూసి బయట ఉన్న తన ఇద్దరు అన్నలకు చెప్పాడు.
GEN 9:23 అయితే షేము, యాపెతు ఒక వస్త్రం తీసుకుని తమ భుజాల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి నగ్న శరీరాన్ని కప్పారు. తండ్రి నగ్న శరీరం వైపు చూడకుండ వారు తమ ముఖాలను మరోవైపుకు తిప్పుకున్నారు.
GEN 9:24 నోవహుకు మత్తు వదిలిన తర్వాత చిన్నకుమారుడు తనకు చేసింది తెలుసుకుని,
GEN 9:25 ఇలా అన్నాడు, “కనాను శపించబడాలి! అతడు తన సహోదరులకు దాసులలో అత్యల్పునిగా ఉంటాడు.”
GEN 9:26 ఇంకా అతడు, “షేము దేవుడైన యెహోవాకు స్తుతి! కనాను అతనికి దాసుడవాలి.
GEN 9:27 దేవుడు యాపెతు సరిహద్దును విస్తరింపజేయాలి; యాపెతు షేము గుడారాల్లో నివసించాలి, కనాను యాపెతుకు దాసుడవాలి” అని అన్నాడు.
GEN 9:28 జలప్రళయం తర్వాత నోవహు ఇంకా 350 సంవత్సరాలు జీవించాడు.
GEN 9:29 నోవహు మొత్తం 950 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
GEN 10:1 నోవహు కుమారులైన షేము, హాము, యాపెతు అనబడే వారి వంశావళి వివరణ: జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టారు.
GEN 10:2 యాపెతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషెకు, తీరసు.
GEN 10:3 గోమెరు కుమారులు: అష్కెనజు, రీఫతు, తోగర్మా.
GEN 10:4 యవాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
GEN 10:5 (వీరినుండి సముద్ర తీర ప్రజలు, వారి వారి వంశం ప్రకారం, తమ తమ భాషలతో సరిహద్దులలో విస్తరించారు.)
GEN 10:6 హాము కుమారులు: కూషు, ఈజిప్టు, పూతు, కనాను.
GEN 10:7 కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తెకా. రాయమా కుమారులు: షేబ, దేదాను.
GEN 10:8 కూషు నిమ్రోదుకు తండ్రి, ఇతడు భూమిపై మొదటి బలమైన యోధుడు అయ్యాడు.
GEN 10:9 అతడు యెహోవా దృష్టిలో బలమైన వేటగాడు. అందుకే, “యెహోవా ఎదుట గొప్ప వేటగాడైన నిమ్రోదు వలె” అని సామెత ఉంది.
GEN 10:10 షీనారులో అతని రాజ్యంలో మొదటి ప్రాంతాలు బబులోను, ఎరెకు, అక్కదు, కల్నే అనేవి ప్రధాన పట్టణాలు.
GEN 10:11 అక్కడినుండి అతడు అష్షూరుకు వెళ్లి అక్కడ నీనెవె, రెహోబోత్-ఇర్, కలహు,
GEN 10:12 నీనెవెకు కలహుకు మధ్యలో ఉన్న రెసెను అనే గొప్ప పట్టణం కట్టి తన సరిహద్దును విస్తరింపజేశాడు.
GEN 10:13 ఈజిప్టు కుమారులు: లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు,
GEN 10:14 పత్రూసీయులు, కస్లూహీయులు (వీరినుండి ఫిలిష్తీయులు వచ్చారు) కఫ్తోరీయులు.
GEN 10:15 కనాను కుమారులు: మొదటి కుమారుడగు సీదోను, హిత్తీయులు,
GEN 10:16 యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,
GEN 10:17 హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు,
GEN 10:18 అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు. (తర్వాత కనాను వంశస్థులు చెదిరిపోయారు
GEN 10:19 కనాను సరిహద్దులు సీదోను నుండి గెరారు వైపు గాజా వరకు అలాగే సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము, లాషా పట్టణాల వరకు విస్తరించాయి.)
GEN 10:20 వీరు వంశాల ప్రకారం, వివిధ భాషల ప్రకారం విభిన్న ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించిన హాము కుమారులు.
GEN 10:21 షేముకు కూడా కుమారులు పుట్టారు, ఇతని పెద్ద సహోదరుడు యాపెతు; షేము ఏబెరు కుమారులందరికి పూర్వికుడు.
GEN 10:22 షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
GEN 10:23 అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మెషెకు.
GEN 10:24 అర్పక్షదు షేలహుకు తండ్రి: షేలహు ఏబెరుకు తండ్రి.
GEN 10:25 ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు: ఒకనికి పెలెగు అని పేరు పెట్టారు ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు.
GEN 10:26 యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
GEN 10:27 హదోరము, ఊజాలు, దిక్లా,
GEN 10:28 ఓబాలు, అబీమాయేలు, షేబ,
GEN 10:29 ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు.
GEN 10:30 (వీరు నివసించే ప్రాంతం మేషా నుండి తూర్పు కొండసీమ ఉన్న సెఫారా వరకు ఉంది.)
GEN 10:31 వీరు తమ వంశాల ప్రకారం వారి భాషల ప్రకారం విభిన్న ప్రాంతాలకు, దేశాలకు వ్యాపించిన షేము కుమారులు.
GEN 10:32 తమ వంశాల ప్రకారం తమ దేశాల్లో ఉంటున్న నోవహు కుమారుల వంశావళి ఇదే. జలప్రళయం తర్వాత వీరి ద్వారా ప్రజలు విస్తరించారు.
GEN 11:1 భూలోకమంతా ఒకే భాష ఒకే యాస ఉంది.
GEN 11:2 ప్రజలు తూర్పు వైపునకు ప్రయాణమై వెళ్తుండగా, షీనారు దేశంలో ఒక మైదానాన్ని కనుగొని అక్కడే స్థిరపడ్డారు.
GEN 11:3 వారు ఒకరితో ఒకరు, “రండి ఇటుకలు చేసి వాటిని బాగా కాలుద్దాం” అని చెప్పుకున్నారు. వారు రాళ్లకు బదులు ఇటుకలు, అడుసుకు బదులుగా కీలుమట్టి వాడారు.
GEN 11:4 అప్పుడు వారు, “రండి, మన కోసం ఆకాశాన్ని అంటే గోపురం గల ఒక పట్టణాన్ని కట్టుకుని మనకు మనం పేరు తెచ్చుకుందాం; లేదా మనం భూమంతా చెదిరిపోతాం” అని అన్నారు.
GEN 11:5 అయితే యెహోవా మనుష్యులు కట్టుకుంటున్న పట్టణాన్ని, గోపురాన్ని చూడటానికి క్రిందికి దిగి వచ్చారు.
GEN 11:6 యెహోవా, “ఒకవేళ ప్రజలు ఒకే భాష మాట్లాడుతూ ఇది చేయడం ప్రారంభిస్తే, అప్పుడు వారు చేద్దామనుకుంది ఏదైనా వారికి అసాధ్యం కాదు.
GEN 11:7 రండి, మనం క్రిందికి వెళ్లి వారి భాషను తారుమారు చేద్దాం, అప్పుడు ఒకరి సంభాషణ ఒకరు అర్థం చేసుకోలేరు” అని అన్నారు.
GEN 11:8 కాబట్టి యెహోవా వారిని భూమి అంతట చెదరగొట్టారు, వారు పట్టణ నిర్మాణం ఆపివేశారు.
GEN 11:9 యెహోవా భూప్రజలందరి భాషను తారుమారు చేశారు కాబట్టి అది బాబెలు అని పిలువబడింది. యెహోవా వారిని అక్కడినుండి భూలోకమంతా చెదరగొట్టారు.
GEN 11:10 ఇది షేము కుటుంబ వంశావళి. జలప్రళయం గతించిన రెండు సంవత్సరాల తర్వాత, షేముకు 100 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతనికి అర్పక్షదు పుట్టాడు.
GEN 11:11 అర్పక్షదు పుట్టిన తర్వాత షేము 500 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
GEN 11:12 అర్పక్షదు 35 సంవత్సరాల వయసువాడై షేలహుకు తండ్రి అయ్యాడు.
GEN 11:13 షేలహు పుట్టిన తర్వాత అర్పక్షదు 403 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా అతనికి కుమారులు కుమార్తెలు పుట్టారు.
GEN 11:14 షేలహు 30 సంవత్సరాల వయసువాడై ఏబెరుకు తండ్రి అయ్యాడు.
GEN 11:15 ఏబెరు పుట్టిన తర్వాత షేలహు 403 సంవత్సరాలు బ్రతికాడు, అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 11:16 ఏబెరు 34 సంవత్సరాల వయసువాడై పెలెగును కన్నాడు.
GEN 11:17 పెలెగు పుట్టిన తర్వాత ఏబెరు 430 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
GEN 11:18 పెలెగు 30 సంవత్సరాల వయసువాడై రయూను కన్నాడు.
GEN 11:19 రయూ పుట్టిన తర్వాత పెలెగు 209 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
GEN 11:20 రయూ 32 సంవత్సరాల వయసువాడై సెరూగును కన్నాడు.
GEN 11:21 సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
GEN 11:22 సెరూగు 30 సంవత్సరాల వయసువాడై నాహోరును కన్నాడు.
GEN 11:23 నాహోరు పుట్టిన తర్వాత సెరూగు 200 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు కుమార్తెలు అతనికి పుట్టారు.
GEN 11:24 నాహోరు 29 సంవత్సరాల వయసువాడై తెరహును కన్నాడు.
GEN 11:25 తెరహు పుట్టిన తర్వాత నాహోరు 119 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
GEN 11:26 తెరహు 70 సంవత్సరాల వయసులో ఉండగా అతనికి అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు.
GEN 11:27 ఇది తెరహు కుటుంబ వంశావళి. తెరహుకు అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.
GEN 11:28 హారాను, తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే, కల్దీయుల ఊరు అనే పట్టణంలో, తన జన్మస్థలంలో చనిపోయాడు.
GEN 11:29 అబ్రాము, నాహోరు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్యపేరు శారాయి, నాహోరు భార్యపేరు మిల్కా; ఈమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.
GEN 11:30 శారాయి గొడ్రాలు, ఆమెకు పిల్లలు కలుగలేదు.
GEN 11:31 తెరహు తన కుమారుడైన అబ్రామును, తన మనవడు, హారాను కుమారుడైన లోతును, తన కోడలైన అబ్రాము భార్య శారాయిని తీసుకుని కల్దీయుల ఊరు నుండి కనానుకు ప్రయాణమయ్యాడు. కాని దారిలో వారు హారానుకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు.
GEN 11:32 తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో చనిపోయాడు.
GEN 12:1 యెహోవా అబ్రాముతో ఇలా అన్నారు, “నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు.
GEN 12:2 “నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను; నీ పేరును గొప్పగా చేస్తాను, నీవు దీవెనగా ఉంటావు.
GEN 12:3 నిన్ను దీవించే వారిని దీవిస్తాను, శపించే వారిని శపిస్తాను; నిన్ను బట్టి భూమి మీద ఉన్న సర్వ జనాంగాలు దీవించబడతారు.”
GEN 12:4 యెహోవా చెప్పినట్టే అబ్రాము బయలుదేరాడు; లోతు అతనితో వెళ్లాడు. హారాను నుండి ప్రయాణమైనప్పుడు అబ్రాము వయస్సు డెబ్బై అయిదు సంవత్సరాలు.
GEN 12:5 అబ్రాము తన భార్య శారాయిని, తమ్ముని కుమారుడైన లోతును, హారానులో వారు కూడబెట్టుకున్న మొత్తం ఆస్తిని, సంపాదించుకున్న ప్రజలను తీసుకుని కనాను దేశం చేరుకున్నాడు.
GEN 12:6 అబ్రాము ఆ దేశం గుండా ప్రయాణమై షెకెములో మోరె యొక్క సింధూర వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో ఆ దేశంలో కనానీయులు నివసిస్తున్నారు.
GEN 12:7 యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై, “నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తాను” అని అన్నారు. కాబట్టి తనకు ప్రత్యక్షమైన చోట యెహోవాకు బలిపీఠం కట్టాడు.
GEN 12:8 అక్కడినుండి బేతేలుకు తూర్పున ఉన్న కొండల వైపు వెళ్లి అక్కడ గుడారం వేసుకున్నాడు. దానికి పడమర బేతేలు, తూర్పున హాయి ఉన్నాయి. అక్కడ అతడు యెహోవాకు బలిపీఠం నిర్మించి యెహోవాను ఆరాధించాడు.
GEN 12:9 తర్వాత అబ్రాము ప్రయాణిస్తూ దక్షిణంగా వెళ్లాడు.
GEN 12:10 అప్పుడు దేశంలో కరువు వచ్చింది, అది తీవ్రంగా ఉన్నందుకు అబ్రాము కొంతకాలం ఉందామని ఈజిప్టుకు వెళ్లాడు.
GEN 12:11 అతడు ఈజిప్టు ప్రవేశిస్తుండగా తన భార్య శారాయితో, “నీవు చాలా అందంగా ఉంటావని నాకు తెలుసు.
GEN 12:12 ఈజిప్టువారు నిన్ను చూసినప్పుడు, ‘ఈమె అతని భార్య’ అని అంటారు. తర్వాత వారు నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు.
GEN 12:13 నీవు నా చెల్లివని చెప్పు, అప్పుడు నీకోసం నన్ను మంచిగా చూసుకుంటారు, అప్పుడు నిన్ను బట్టి నా ప్రాణం సురక్షితంగా ఉంటుంది” అని చెప్పాడు.
GEN 12:14 అబ్రాము ఈజిప్టుకు వచ్చినప్పుడు ఈజిప్టువారు శారాయి అందంగా ఉందని చూశారు.
GEN 12:15 ఫరో అధికారులు ఆమెను చూసి, ఆమె అందాన్ని ఫరో ఎదుట పొగిడారు, ఆమెను రాజభవనం లోనికి తీసుకెళ్లారు.
GEN 12:16 ఆమెను బట్టి అతడు అబ్రామును మంచిగా చూసుకున్నాడు, అబ్రాము గొర్రెలు, మందలు, ఆడ మగ గాడిదలు, ఆడ మగ దాసులు, ఒంటెలను ఇచ్చాడు.
GEN 12:17 కాని యెహోవా అబ్రాము భార్య శారాయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని ఘోరమైన వ్యాధులతో శిక్షించారు.
GEN 12:18 కాబట్టి ఫరో అబ్రామును పిలిపించి, “నాకెందుకిలా చేశావు?” అని అన్నాడు. “ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు?
GEN 12:19 నేను ఆమెను నా భార్యగా చేసుకునేలా, ‘ఈమె నా చెల్లెలు’ అని నీవెందుకు నాతో చెప్పావు? ఇదిగో నీ భార్య, నీవు ఆమెను తీసుకుని వెళ్లిపో!” అని అన్నాడు.
GEN 12:20 అప్పుడు ఫరో తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు, వారు అతన్ని, అతని భార్యను, అతనితో ఉన్న ప్రతి దానితో పాటు పంపివేశారు.
GEN 13:1 అబ్రాము తన భార్యను తనకున్న అంతటిని తీసుకుని ఈజిప్టు నుండి దక్షిణ దేశానికి వెళ్లాడు, లోతు అతనితో పాటు వెళ్లాడు.
GEN 13:2 అబ్రాము పశువులు, వెండి బంగారాలతో ఎంతో ధనవంతుడయ్యాడు.
GEN 13:3 దక్షిణం నుండి బయలుదేరి బేతేలుకు వచ్చేవరకు, అంటే బేతేలుకు హాయికి మధ్యలో తాను మొదట గుడారం వేసుకున్న చోటికి వెళ్లి,
GEN 13:4 తాను మొదట బలిపీఠం కట్టిన చోటుకు చేరుకున్నాడు. అక్కడ అబ్రాము యెహోవాకు ప్రార్థన చేశాడు.
GEN 13:5 అబ్రాముతో కలిసి ప్రయాణిస్తున్న లోతుకు కూడా గొర్రెలు, మందలు, గుడారాలు ఉన్నాయి.
GEN 13:6 వీరిద్దరి ఆస్తులు ఎంతో అధికంగా ఉండడం వల్ల వీరు కలిసి ఉండడానికి ఆ స్థలం సహకరించలేదు.
GEN 13:7 అబ్రాము కాపరులకు లోతు కాపరులకు మధ్య వివాదం మొదలైంది. ఆ సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఆ దేశంలో నివసిస్తున్నారు.
GEN 13:8 కాబట్టి అబ్రాము లోతుతో, “మనం సమీప బంధువులం కాబట్టి నీ కాపరులకు నా కాపరులకు మధ్య వైరం కలిగి ఉండడం మంచిది కాదు.
GEN 13:9 ఈ దేశమంతా నీ ముందు లేదా? మనం విడిపోదాము. నీవు ఈ భూభాగంలో ఎడమ వైపుకు వెళ్తే నేను కుడి వైపుకు వెళ్తాను; నీవు కుడి వైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తాను” అని అన్నాడు.
GEN 13:10 లోతు కళ్ళెత్తి సోయరు వైపు యొర్దాను మైదాన ప్రాంతమంతా యెహోవా తోటలా, ఈజిప్టులా, సస్యశ్యామలమై ఉన్నట్లు చూశాడు. (ఇది యెహోవా సొదొమ గొమొర్రాలను నాశనం చేయక ముందు అలా ఉంది.)
GEN 13:11 కాబట్టి లోతు యొర్దాను మైదాన ప్రాంతమంతా తన కోసం ఎంచుకుని తూర్పు వైపు వెళ్లిపోయాడు. వారు ఒకరి నుండి ఒకరు విడిపోయారు:
GEN 13:12 అబ్రాము కనాను దేశంలో నివసించాడు, లోతు మైదాన పట్టణాల మధ్య నివసిస్తూ, సొదొమ దగ్గర గుడారాలు వేసుకున్నాడు.
GEN 13:13 అయితే, సొదొమ ప్రజలు దుర్మార్గులు, యెహోవాకు విరోధంగా ఘోరంగా పాపం చేస్తూ ఉండేవారు.
GEN 13:14 లోతు అబ్రాము నుండి విడిపోయిన తర్వాత యెహోవా అబ్రాముతో, “నీవున్న చోట నుండి ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిశలు చూడు.
GEN 13:15 నీవు చూస్తున్న భూమంతా నీకు, నీ సంతానానికి శాశ్వతంగా ఇస్తాను.
GEN 13:16 నీ సంతానాన్ని భూమి మీద ఉన్న ఇసుక రేణువుల్లా అంటే ఒకవేళ ఎవరైనా లెక్కించాలనుకున్నా లెక్కించలేనంత విస్తారంగా చేస్తాను.
GEN 13:17 నీవు లేచి దేశం యొక్క అన్ని దిక్కులకు వెళ్లు, అదంతా నేను నీకు ఇస్తున్నాను” అని అన్నారు.
GEN 13:18 కాబట్టి అబ్రాము హెబ్రోనులో మమ్రే అనే చోట సింధూర వృక్షాల దగ్గర నివసించడానికి వెళ్లాడు. అక్కడ తన గుడారాలు వేసుకున్నాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.
GEN 14:1 అమ్రాపేలు షీనారు యొక్క రాజుగా ఉన్న కాలంలో, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీము రాజైన తిదాలు,
GEN 14:2 ఈ రాజులు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయిము రాజైన షెమేబెరుతోను బేల (సోయరు) రాజుతోను యుద్ధం చేశారు.
GEN 14:3 ఈ రెండవ గుంపు రాజులందరూ సిద్దీము లోయలో (మృత సముద్ర లోయలో) కూడుకున్నారు.
GEN 14:4 వారంతా పన్నెండు సంవత్సరాలు కదొర్లాయోమెరుకు సేవ చేశారు, కానీ పదమూడవ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు.
GEN 14:5 పద్నాలుగవ సంవత్సరంలో కదొర్లాయోమెరు, అతనితో పొత్తు పెట్టుకున్న రాజులు కలిసి అష్తారోతు కర్నాయింలో రెఫాయీయులను, హాములో జూజీయులను, షావే కిర్యతాయిములో ఎమీయులను
GEN 14:6 హోరీయులను, శేయీరు కొండ సీమలో ఎడారి దగ్గర ఉన్న ఎల్ పారాను వరకు తరిమి ఓడించారు.
GEN 14:7 తర్వాత అక్కడినుండి వెనుకకు తిరిగి ఎన్ మిష్పాతు అనబడిన కాదేషుకు వెళ్లి, అమాలేకీయుల భూభాగమంతా, హససోన్ తామారులో నివసిస్తున్న అమోరీయుల భూభాగమంతా జయించారు.
GEN 14:8 అప్పుడు సిద్దీం లోయలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బేల (సోయరు) రాజు తమ సైన్యాలతో,
GEN 14:9 ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీము రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, అంటే నలుగురు రాజులు అయిదుగురు రాజులతో యుద్ధం చేశారు.
GEN 14:10 సిద్దీము లోయ అంతా కీలుమట్టి గుంటలు ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోతూ ఉన్నప్పుడు, కొంతమంది వాటిలో పడిపోయారు మిగిలినవారు కొండల్లోకి పారిపోయారు.
GEN 14:11 ఆ నలుగురు రాజులు సొదొమ గొమొర్రాల ఆస్తిపాస్తులను, భోజన పదార్థాలను అన్నిటిని దోచుకున్నారు; తర్వాత వారు వెళ్లిపోయారు.
GEN 14:12 అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో నివసిస్తున్నాడు కాబట్టి, అతన్ని కూడా అతని ఆస్తితో పాటు తీసుకెళ్లారు.
GEN 14:13 అయితే ఒక వ్యక్తి తప్పించుకు వచ్చి, హెబ్రీయుడైన అబ్రాముకు ఈ సంగతి తెలిపాడు. అబ్రాము ఎష్కోలు ఆనేరుల సోదరుడైన మమ్రే అనే అమోరీయుని సింధూర వృక్షాలు దగ్గర నివసిస్తున్నాడు. వీరు అబ్రాముతో ఒప్పందం చేసుకున్న వారు.
GEN 14:14 అబ్రాము తన బంధువు బందీగా కొనిపోబడ్డాడు అని విన్నప్పుడు, తన ఇంట్లో పుట్టి శిక్షణ పొందిన 318 మందిని తీసుకుని వారిని దాను వరకు తరిమాడు.
GEN 14:15 రాత్రివేళ అబ్రాము తన మనుష్యులను గుంపులుగా విభజించి దాడి చేస్తూ, శత్రువులను ముట్టడించి, దమస్కుకు ఉత్తరాన ఉన్న హోబా వరకు వారిని తరిమాడు.
GEN 14:16 అబ్రాము తన బంధువైన లోతును, అతని ఆస్తిని, అతని స్త్రీలను, ఇతర ప్రజలను విడిపించాడు.
GEN 14:17 కదొర్లాయోమెరు, అతనితో పొత్తు ఉన్న రాజులను ఓడించిన తర్వాత, రాజు లోయ అనబడే షావే లోయలో సొదొమ రాజు అబ్రామును కలిశాడు.
GEN 14:18 అప్పుడు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం తెచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు.
GEN 14:19 అతడు అబ్రామును, “భూమ్యాకాశాల సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు అబ్రామును దీవించును గాక,
GEN 14:20 నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగును గాక” అంటూ ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రాము అన్నిటిలో పదవ భాగాన్ని అతనికి ఇచ్చాడు.
GEN 14:21 సొదొమ రాజు, “చెరగా తెచ్చిన ప్రజలను నాకు ఇవ్వండి, వస్తువులను మీ కోసం పెట్టుకోండి” అని అబ్రాముతో అన్నాడు.
GEN 14:22 అయితే అబ్రాము సొదొమ రాజుతో, “చేతులెత్తి సర్వోన్నతుడైన దేవుడు, భూమ్యాకాశాల సృష్టికర్తయైన యెహోవాకు ఇలా ప్రమాణం చేశాను,
GEN 14:23 ఒక దారం పోగైననూ, చెప్పులవారైననూ నేను ఆశించను, తద్వార నీవు, ‘నేనే అబ్రామును ధనికుడయ్యేలా చేశాను’ అని చెప్పకుండ ఉంటావు.
GEN 14:24 నేను దేన్ని అంగీకరించను కాని నా మనుష్యులు తిన్నది, నాతోపాటు వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే వారికి వారి వాటాను తీసుకోనివ్వు” అని చెప్పాడు.
GEN 15:1 ఈ సంఘటనల తర్వాత దర్శనంలో యెహోవా వాక్కు అబ్రాము వద్దకు వచ్చి: “అబ్రామూ, భయపడకు, నేను నీకు డాలును, నీ గొప్ప బహుమానాన్ని.”
GEN 15:2 అయితే అబ్రాము, “ప్రభువైన యెహోవా, నాకు సంతానం లేదు కదా మీరు నాకేమిచ్చినా ఏం లాభం? నా ఆస్తికి వారసుడు దమస్కువాడైన ఎలీయెజెరే కదా” అని అన్నాడు.
GEN 15:3 ఇంకా అబ్రాము దేవునితో, “మీరు నాకు సంతానం ఇవ్వలేదు, కాబట్టి నా ఇంటి పనివారిలో ఒకడు నా వారసుడవుతాడు” అని అన్నాడు.
GEN 15:4 అప్పుడు యెహోవా వాక్కు అతని వద్దకు వచ్చింది: “ఈ మనుష్యుడు నీకు వారసుడు కాడు, కాని నీ రక్తమాంసాలను పంచుకుని పుట్టేవాడే నీకు వారసుడు.”
GEN 15:5 దేవుడు అబ్రామును బయటకు తీసుకువచ్చి, “పైన ఆకాశాన్ని చూసి నీకు చేతనైతే నక్షత్రాలను లెక్కబెట్టు. నీ సంతానం అలా ఉంటుంది” అని చెప్పారు.
GEN 15:6 అబ్రాము యెహోవాను నమ్మాడు, ఆయన దాన్ని అతనికి నీతిగా ఎంచారు.
GEN 15:7 అంతేకాక దేవుడు అతనితో, “ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి నిన్ను కల్దీయుల ఊరు నుండి బయటకు తీసుకువచ్చిన యెహోవాను నేనే” అని చెప్పారు.
GEN 15:8 అయితే అబ్రాము, “ప్రభువైన యెహోవా, దీనిని నేను స్వాస్థ్యంగా పొందుతానని నాకెలా తెలుస్తుంది?” అని అడిగాడు.
GEN 15:9 అందుకు యెహోవా అతనితో, “ఒక దూడను, ఒక మేకను, ఒక పొట్టేలును, అన్నీ మూడు సంవత్సరాలవై ఉండాలి, వాటితో పాటు ఒక గువ్వను, ఒక పావురాన్ని నా దగ్గరకు తీసుకురా” అని చెప్పారు.
GEN 15:10 అబ్రాము వాటన్నిటిని తెచ్చి, వాటిని సగానికి రెండు ముక్కలుగా కోసి, దేనికది ఎదురెదురుగా పేర్చాడు; అయితే అతడు పక్షులను మాత్రం సగం చేయలేదు.
GEN 15:11 ఆ కళేబరాలపై వాలడానికి రాబందులు వచ్చాయి అయితే అబ్రాము వాటిని వెళ్లగొట్టాడు.
GEN 15:12 సూర్యాస్తమయం అవుతుండగా అబ్రాముకు గాఢనిద్ర పట్టింది, భయంకరమైన కారుచీకటి అతని మీదుగా కమ్ముకుంది.
GEN 15:13 అప్పుడు యెహోవా అబ్రాముతో ఇలా చెప్పారు, “నీవు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి; నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, అక్కడ వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు.
GEN 15:14 అయితే వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత గొప్ప ఆస్తులతో వారు బయటకు వస్తారు.
GEN 15:15 నీవైతే సమాధానంగా నీ పూర్వికుల దగ్గరకు చేరతావు, మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడతావు.
GEN 15:16 నీ సంతానంలో నాలుగవ తరం వారు ఇక్కడకు తిరిగి వచ్చేస్తారు, ఎందుకంటే ఇంకా అమోరీయుల పాపం పండలేదు.”
GEN 15:17 సూర్యుడు అస్తమించి చీకటి కమ్మినప్పుడు పొగలేస్తున్న కుంపటి, మండుతున్న దివిటీ కనిపించి, ఆ ముక్కల మధ్యలో నుండి దాటి వెళ్లాయి.
GEN 15:18 ఆ రోజు యెహోవా అబ్రాముతో నిబంధన చేసి, “నేను నీ సంతానానికి ఈజిప్టు వాగు నుండి యూఫ్రటీసు మహా నది వరకు అంటే,
GEN 15:19 కెనీయులు, కెనిజ్జీయులు, కద్మోనీయులు,
GEN 15:20 హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీయులు,
GEN 15:21 అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయులు ఉన్న దేశమంతటిని ఇస్తున్నాను” అని అన్నారు.
GEN 16:1 అబ్రాము భార్యయైన శారాయి వలన అతనికి పిల్లలు పుట్టలేదు. అయితే ఆమెకు ఈజిప్టు నుండి వచ్చిన దాసి ఉంది, ఆమె పేరు హాగరు;
GEN 16:2 కాబట్టి శారాయి అబ్రాముతో, “యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశారు. నీవు వెళ్లి నా దాసితో లైంగికంగా కలువు; బహుశ ఆమె ద్వార నాకు సంతానం కలుగుతుందేమో” అని అన్నది. శారాయి చెప్పిన దానికి అబ్రాము అంగీకరించాడు.
GEN 16:3 అబ్రాము కనానులో పది సంవత్సరాలు నివసించిన తర్వాత, శారాయి ఈజిప్టు నుండి దాసిగా తెచ్చుకున్న హాగరును తన భర్తకు భార్యగా ఇచ్చింది.
GEN 16:4 అతడు హాగరును లైంగికంగా కలిశాడు, ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భవతినని ఆమె తెలుసుకున్నప్పుడు తన యజమానురాలైన శారాయిని చిన్న చూపు చూసింది.
GEN 16:5 అప్పుడు శారాయి అబ్రాముతో, “నేను అనుభవించే బాధకు నీవే బాధ్యుడవు. నా దాసిని నీ చేతిలో పెట్టాను, ఇప్పుడు తాను గర్భవతి కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తుంది. యెహోవా నీకు నాకు మధ్య తీర్పు తీర్చును గాక” అని అన్నది.
GEN 16:6 అబ్రాము శారాయితో, “నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు ఏది మంచిదనిపిస్తే అది తనకు చేయి” అన్నాడు. శారాయి హాగరును వేధించింది కాబట్టి ఆమె శారాయి దగ్గర నుండి పారిపోయింది.
GEN 16:7 యెహోవా దూత హాగరు ఎడారిలో నీటిబుగ్గ దగ్గర ఉండడం చూశాడు; అది షూరు మార్గం ప్రక్కన ఉండే నీటిబుగ్గ.
GEN 16:8 ఆ దూత, “శారాయి దాసియైన హాగరూ, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాడు. ఆమె, “నా యజమానురాలైన శారాయి దగ్గర నుండి వెళ్లిపోతున్నాను” అని జవాబిచ్చింది.
GEN 16:9 అప్పుడు యెహోవా దూత ఆమెతో, “నీ యజమానురాలి దగ్గరకు తిరిగివెళ్లి ఆమెకు లోబడి ఉండు” అని చెప్పాడు.
GEN 16:10 యెహోవా దూత ఇంకా మాట్లాడుతూ, “నీ సంతానాన్ని లెక్కించలేనంత అధికం చేస్తాను” అని చెప్పాడు.
GEN 16:11 యెహోవా దూత ఆమెతో ఇలా కూడా చెప్పాడు: “ఇప్పుడు నీవు గర్భవతివి నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు, యెహోవా నీ బాధ విన్నారు కాబట్టి అతనికి ఇష్మాయేలు అని నీవు పేరు పెడతావు.
GEN 16:12 అతడు ఒక అడవి గాడిదలాంటి మనుష్యుడు; అందరితో అతడు విరోధం పెట్టుకుంటాడు, అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి, అతడు తన సోదరులందరితో శత్రుత్వం కలిగి జీవిస్తాడు.”
GEN 16:13 ఆమె తనతో మాట్లాడిన యెహోవాకు ఈ పేరు పెట్టింది: “నన్ను చూస్తున్న దేవుడు మీరే.” ఆమె, “నన్ను చూస్తున్న దేవుని నేను వెనుక నుండి చూశాను” అని అన్నది.
GEN 16:14 అందుకే ఆ బావికి బెయేర్-లహాయి-రోయి అని పేరు వచ్చింది; అది కాదేషు బెరెదు మధ్యలో ఇప్పటికి ఉంది.
GEN 16:15 హాగరు అబ్రాముకు కుమారుని కన్నది, అబ్రాము అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు.
GEN 16:16 హాగరు ఇష్మాయేలుకు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు.
GEN 17:1 అబ్రాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, “నేను సర్వశక్తిగల దేవుడను, నా ఎదుట నీవు నమ్మకంగా నిందారహితునిగా జీవించాలి.
GEN 17:2 అప్పుడు నేను నీకు నాకు మధ్య నిబంధన చేస్తాను, నీ సంతతిని అత్యధికంగా వర్ధిల్లజేస్తాను” అన్నారు.
GEN 17:3 అబ్రాము సాష్టాంగపడ్డాడు, అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నారు,
GEN 17:4 “నేను నీతో చేస్తున్న నిబంధన ఇదే: నీవు అనేక జనాంగాలకు తండ్రివవుతావు.
GEN 17:5 ఇకమీదట నీ పేరు అబ్రాము కాదు; నీకు అబ్రాహాము అని పేరు పెడుతున్నాను ఎందుకంటే నేను నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను.
GEN 17:6 నిన్ను ఎంతో ఫలభరితంగా చేస్తాను; నిన్ను అనేక జనాంగాలుగా చేస్తాను, రాజులు నీ నుండి వస్తారు.
GEN 17:7 నా నిబంధనను నాకు నీకు మరి నీ తర్వాత వచ్చు నీ వారసులకు మధ్య నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను, నీకు దేవునిగా, నీ తర్వాత నీ వారసులకు దేవునిగా ఉంటాను.
GEN 17:8 నీవు పరదేశిగా ఉంటున్న కనాను దేశమంతా నీకు, నీ తర్వాత నీ వారసులకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను; వారికి నేను దేవునిగా ఉంటాను.”
GEN 17:9 అప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవైతే, నీవు, నీ తర్వాత నీ సంతానం తరతరాల వరకు నా నిబంధనను నిలుపుకోవాలి.
GEN 17:10 నీకు నీ తర్వాత నీ సంతతివారికి నేను చేసే నా నిబంధన, మీరు నిలుపుకోవలసిన నిబంధన ఇదే: మీలో ప్రతి మగవాడు సున్నతి చేసుకోవాలి.
GEN 17:11 మీకు నాకు మధ్య నిబంధన గుర్తుగా మీ గోప్య చర్మాన్ని సున్నతి చేసుకోవాలి.
GEN 17:12 రాబోయే తరాలలో ఎనిమిది రోజుల వయస్సున్న ప్రతి మగబిడ్డకు అంటే మీ ఇంట్లో పుట్టినవారైనా మీ సంతతి కాక విదేశీయుల నుండి కొనబడినవారైనా సున్నతి చేయబడాలి.
GEN 17:13 మీ డబ్బుతో కొనబడినవారైనా, వారికి సున్నతి చేయబడాలి. మీ శరీరంలో నా నిబంధన నిత్య నిబంధనగా ఉండాలి.
GEN 17:14 సున్నతి చేయబడని మగవారు అంటే తన గోప్య చర్మానికి సున్నతి చేయబడనివారు తమ జనులలో నుండి బహిష్కరించబడాలి; ఎందుకంటే వారు నా నిబంధనను మీరారు.”
GEN 17:15 దేవుడు అబ్రాహాముతో ఇలా కూడా చెప్పారు, “నీ భార్యయైన శారాయిని ఇకపై శారాయి అని పిలువకూడదు; ఇప్పటినుండి తన పేరు శారా.
GEN 17:16 నేను ఖచ్చితంగా ఆమెను ఆశీర్వదిస్తాను, ఆమె ద్వార నీకు కుమారున్ని ఇస్తాను. ఆమె జనాంగాలకు తల్లిగా ఉండేలా తనను ఆశీర్వదిస్తాను; అనేక జనాంగాల రాజులు ఆమె నుండి వస్తారు.”
GEN 17:17 అప్పుడు అబ్రాహాము సాష్టాంగపడ్డాడు; అతడు తన హృదయంలో నవ్వుకుంటూ, “నూరు సంవత్సరాలు నిండిన మనుష్యునికి కుమారుడు పుడతాడా? తొంభై సంవత్సరాలు నిండిన శారా బిడ్డను కంటుందా?” అని అనుకున్నాడు.
GEN 17:18 అబ్రాహాము దేవునితో, “మీ ఆశీర్వాదం క్రింద ఇష్మాయేలు జీవిస్తే చాలు!” అని అన్నాడు.
GEN 17:19 అప్పుడు దేవుడు, “అవును, అయితే నీ భార్య శారా ఒక కుమారునికి జన్మనిస్తుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. అతనితో నా నిబంధనను చేస్తాను, తన తర్వాత తన సంతానంతో ఉండేలా నిత్య నిబంధనగా దానిని స్థిరపరుస్తాను.
GEN 17:20 ఇష్మాయేలు గురించి, నీవు అడిగింది విన్నాను: నేను అతన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను; అతడు ఫలించి విస్తరించేలా చేస్తాను, సంఖ్యాపరంగా గొప్పగా విస్తరింపజేస్తాను. అతడు పన్నెండుమంది పాలకులకు తండ్రిగా ఉంటాడు; అతన్ని గొప్ప జనంగా చేస్తాను.
GEN 17:21 అయితే వచ్చే యేడాది ఈ సమయానికి శారా నీకోసం కనే ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను” అని చెప్పారు.
GEN 17:22 దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన తర్వాత, పైకి వెళ్లిపోయారు.
GEN 17:23 ఆ రోజే అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, ఇంట్లో పుట్టిన లేదా డబ్బుతో కొనబడిన మగవారికందరికి దేవుడు చెప్పినట్టు సున్నతి చేయించాడు.
GEN 17:24 అబ్రాహాము సున్నతి పొందినప్పుడు అతని వయస్సు తొంభై తొమ్మిది సంవత్సరాలు,
GEN 17:25 తన కుమారుడైన ఇష్మాయేలు వయస్సు పదమూడు సంవత్సరాలు;
GEN 17:26 అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలు, ఇద్దరు అదే రోజు సున్నతి పొందారు.
GEN 17:27 అబ్రాహాము ఇంటివారిలో మగవారందరు, అతని ఇంట్లో పుట్టిన వారు లేదా విదేశీయుల నుండి కొనబడిన అతనితో పాటు సున్నతి చేయించుకున్నారు.
GEN 18:1 అబ్రాహాము మమ్రేలో ఉన్న సింధూర వృక్షాల దగ్గర తన గుడార ద్వారం దగ్గర ఎండలో కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యారు.
GEN 18:2 అబ్రాహాము కళ్ళెత్తి చూసినప్పుడు అతని ఎదుట ముగ్గురు మనుష్యులు నిలిచి ఉన్నారు. వారిని చూసిన వెంటనే తన గుడార ద్వారం నుండి వారిని కలవడానికి త్వరపడి వెళ్లి సాష్టాంగపడ్డాడు.
GEN 18:3 అబ్రాహాము వారితో, “నా ప్రభువా, మీ దృష్టిలో నేను దయ పొందినట్లైతే, మీ దాసున్ని విడిచి వెళ్లకండి.
GEN 18:4 నీళ్లు తెప్పిస్తాను, కాళ్లు కడుక్కుని ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి.
GEN 18:5 మీరు మీ సేవకుని దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు తినడానికి ఆహారం తీసుకువస్తాను, మీ ఆకలి తీరిన తర్వాత వెళ్లవచ్చు” అని అన్నాడు. “మంచిది, అలాగే చేయి” అని వారు జవాబిచ్చారు.
GEN 18:6 కాబట్టి అబ్రాహాము శారా గుడారంలోకి త్వరపడి వెళ్లి, “త్వరగా మూడు మానికెలు నాణ్యమైన పిండి తెచ్చి, బాగా పిసికి రొట్టెలు చేయి” అని చెప్పాడు.
GEN 18:7 తర్వాత అబ్రాహాము పశువుల మంద దగ్గరకు పరుగెత్తి వెళ్లి, లేగదూడను తెచ్చి తన పనివానికి ఇచ్చాడు, ఆ పనివాడు త్వరగా దానిని వండి పెట్టాడు.
GEN 18:8 తర్వాత అతడు కొంచెం వెన్న, పాలు, వండిన దూడ మాంసాన్ని వారి ముందు ఉంచాడు. వారు భోజనం చేస్తుండగా, వారి దగ్గర చెట్టు క్రింద అతడు నిలబడ్డాడు.
GEN 18:9 “నీ భార్య శారా ఎక్కడ?” అని వారు అడిగారు. “అదిగో ఆ గుడారంలో ఉంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు.
GEN 18:10 అప్పుడు వారిలో ఒకరు, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి తప్పకుండా నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి నీ భార్య శారా ఒక కుమారున్ని కలిగి ఉంటుంది” అని అన్నారు. శారా అతని వెనుక ఉన్న గుడార ద్వారం దగ్గర నిలబడి వింటుంది.
GEN 18:11 అబ్రాహాము శారా అప్పటికే చాలా వృద్ధులు, శారా పిల్లలు కనే వయస్సు దాటిపోయింది.
GEN 18:12 శారా తనలో తాను నవ్వుకుని, “నేను బలం ఉడిగిన దానిని, నా భర్త కూడా వృద్ధుడు కదా ఇప్పుడు నాకు ఈ భాగ్యం ఉంటుందా?” అని అనుకుంది.
GEN 18:13 అప్పుడు యెహోవా అబ్రాహాముతో, “శారా ఎందుకలా నవ్వుకుంది, ‘ముసలిదాన్ని నేను కనగలనా అని ఎందుకు అనుకుంది?’
GEN 18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? వచ్చే సంవత్సరం నియమించబడిన సమయానికి నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను, అప్పటికి శారా ఒక కుమారున్ని కంటుంది” అని అన్నారు.
GEN 18:15 శారా భయపడి, “నేను నవ్వలేదు” అని అబద్ధమాడింది. “లేదు, నీవు నవ్వావు” అని ఆయన అన్నారు.
GEN 18:16 ఆ మనుష్యులు వెళ్లడానికి లేచి సొదొమ, గొమొర్రాల వైపు చూశారు, అబ్రాహాము వారిని పంపించడానికి వారితో పాటు వెళ్లాడు.
GEN 18:17 అప్పుడు యెహోవా ఇలా అన్నారు, “నేను చేయబోతున్న దానిని అబ్రాహాముకు చెప్పకుండ ఎలా దాచగలను?
GEN 18:18 అబ్రాహాము ఖచ్చితంగా గొప్ప శక్తిగల దేశం అవుతాడు, అతని ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి.
GEN 18:19 ఎందుకంటే నేను అతన్ని ఎంచుకున్నాను, అతడు తన పిల్లలను తన తర్వాత తన ఇంటివారిని యెహోవా మార్గంలో నీతి న్యాయాలు జరిగిస్తూ జీవించేలా నడిపిస్తాడు, తద్వారా యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జరిగిస్తారు.”
GEN 18:20 అప్పుడు యెహోవా, “సొదొమ, గొమొర్రాల గురించిన మొర చాలా గొప్పది, వారి పాపం ఘోరమైనది.
GEN 18:21 నేను అక్కడికి వెళ్లి నాకు చేరిన ఫిర్యాదు వలె వారి క్రియలు ఎంత చెడ్డగా ఉన్నాయో చూసి తెలుసుకుంటాను” అని అన్నారు.
GEN 18:22 ఆ మనుష్యులు అక్కడినుండి సొదొమ వైపు వెళ్లారు, అయితే అబ్రాహాము యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు.
GEN 18:23 అప్పుడు అబ్రాహాము ఆయనను సమీపించి, “దుష్టులతో పాటు నీతిమంతులను నిర్మూలం చేస్తారా?
GEN 18:24 ఒకవేళ ఆ పట్టణంలో యాభైమంది నీతిమంతులుంటే ఎలా? ఆ యాభైమంది కోసమన్నా ఆ పట్టణాన్ని కాపాడకుండా నిజంగా దానిని నాశనం చేస్తారా?
GEN 18:25 అలా నాశనం చేయడం మీకు దూరమవును గాక! దుష్టులతో పాటు నీతిమంతులను చంపడం, దుష్టులను నీతిమంతులను ఒకేలా చూడడము. మీ నుండి ఆ తలంపు దూరమవును గాక! సర్వలోక న్యాయాధిపతి న్యాయం చేయరా?” అని అన్నాడు.
GEN 18:26 యెహోవా జవాబిస్తూ, “సొదొమలో యాభైమంది నీతిమంతులను నేను కనుగొంటే, వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాపాడతాను” అని అన్నారు.
GEN 18:27 అబ్రాహాము మరలా మాట్లాడాడు: “నేను ధూళిని బూడిదను, అయినాసరే నేను ప్రారంభించాను కాబట్టి నేను ప్రభువుతో ఇంకా మాట్లాడతాను.
GEN 18:28 ఒకవేళ యాభైమందిలో నీతిమంతులు అయిదుగురు తక్కువైతే అప్పుడు పట్టణం అంతటిని అయిదుగురు తక్కువ ఉన్నందుకు నాశనం చేస్తారా?” ఆయన, “నేను అక్కడ నలభై అయిదుగురు చూస్తే అప్పుడు దానిని నాశనం చేయను” అన్నారు.
GEN 18:29 అబ్రాహాము, “ఒకవేళ నలభైమంది నీతిమంతులు ఉంటే?” అని మరలా అడిగాడు. “ఆ నలభైమంది కోసం దానిని నాశనం చేయను” అని దేవుడు అన్నారు.
GEN 18:30 అప్పుడు అతడు, “ప్రభువు కోప్పడకండి, నన్ను మాట్లాడనివ్వండి. ఒకవేళ అక్కడ ముప్పైమంది నీతిమంతులు మాత్రమే ఉంటే?” అని అడిగాడు. ఆయన, “ముప్పైమందిని నేను కనుగొంటే నేను నాశనం చేయను” అని జవాబిచ్చారు.
GEN 18:31 అబ్రాహాము, “నేను ప్రభువుతో మాట్లాడడానికి తెగించాను; ఒకవేళ అక్కడ ఇరవైమందే మాత్రమే ఉంటే?” అని అన్నాడు. ఆయన, “ఆ ఇరవైమంది కోసం దానిని నాశనం చేయను” అన్నారు.
GEN 18:32 అప్పుడతడు, “ప్రభువా, కోప్పడకండి, నేను ఇంకొక్కసారి మాట్లాడతాను. ఒకవేళ అక్కడ పదిమందే ఉంటే?” అని అడిగాడు. ఆయన, “ఆ పదిమంది కోసం దానిని నాశనం చేయను” అని జవాబిచ్చారు.
GEN 18:33 యెహోవా అబ్రాహాముతో సంభాషణ ముగించిన తర్వాత, ఆయన వెళ్లిపోయారు, అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్లాడు.
GEN 19:1 ఆ సాయంత్రం ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నారు, లోతు సొదొమ పట్టణ ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. అతడు వారిని చూడగానే, వారిని కలవడానికి లేచి వారి ఎదుట సాష్టాంగపడ్డాడు.
GEN 19:2 “నా ప్రభువులారా! దయచేసి మీ దాసుని ఇంటికి రండి, మీ కాళ్లు కడుక్కుని ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి, వేకువజామున లేచి వెళ్లవచ్చు” అని వారితో అన్నాడు. అప్పుడు వారు, “లేదు, ఈ రాత్రి నడి వీధిలోనే ఉంటాం” అని చెప్పారు.
GEN 19:3 అయితే అతడు వారిని బలవంతం చేశాడు, కాబట్టి వారు అతని ఇంటికి వెళ్లారు. అతడు వారికి పులియని పిండితో రొట్టెలు చేశాడు, వారు తిన్నారు.
GEN 19:4 వారు పడుకోకముందు, సొదొమ పట్టణపు వారంతా నలుదిక్కుల నుండి పురుషులు యువకులు, ముసలివారు లోతు ఇంటిని చుట్టుముట్టారు.
GEN 19:5 వారు లోతును పిలిచి, “రాత్రి నీ దగ్గరకు వచ్చిన ఆ మనుష్యులు ఎక్కడ? వారితో మేము లైంగికంగా కలుసుకునేలా బయటకు తీసుకురా” అని అన్నారు.
GEN 19:6 లోతు వారిని కలవడానికి బయటకు వెళ్లి తన వెనుక తలుపు మూసివేసి
GEN 19:7 వారితో, “సోదరులారా వద్దు, ఈ దుర్మార్గపు పని చేయవద్దు.
GEN 19:8 ఇదిగో! నాకు పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకొనని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిని మీ దగ్గరకు తెస్తాను వారితో మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. కానీ ఈ మనుష్యులు అతిథులుగా నా ఇంటికి వచ్చారు, వీరిని మీరేమి చేయవద్దు” అని బ్రతిమాలుకున్నాడు.
GEN 19:9 వారు, “మాకు అడ్డు పడకుండా వెళ్లిపో” అని బదులిచ్చారు. “వీడు పరదేశిగా ఇక్కడకు వచ్చి మనకే తీర్పు చెప్తున్నాడు! మేము నిన్ను వారిపైన కంటే నీమీద ఎక్కువ దౌర్జన్యం చేస్తాం” అని అంటూ లోతు మీద పడి తలుపు బద్దలు కొట్టడానికి ముందుకు వెళ్లారు.
GEN 19:10 అయితే లోపల ఉన్న మనుష్యులు లోతును ఇంట్లోకి లాగి తలుపు వేశారు.
GEN 19:11 తర్వాత వారు ఇంటి తలుపు దగ్గర ఉన్న యువకులను వృద్ధులను గ్రుడ్డితనంతో మొత్తగా వారు ద్వారం కనుగొనలేకపోయారు.
GEN 19:12 ఆ ఇద్దరు మనుష్యులు లోతుతో, “నీకు నీ అల్లుళ్ళు, కుమారులు, కుమార్తెలు, లేదా నీకు సంబంధించిన వారెవరైనా ఈ పట్టణంలో ఉన్నారా? వారిని బయటకు తీసుకురా,
GEN 19:13 ఎందుకంటే మేము ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాము. ఈ స్థలం యొక్క ప్రజల గురించి యెహోవాకు చేరిన మొర ఎంతో గొప్పది కాబట్టి దీనిని నాశనం చేయడానికి ఆయన మమ్మల్ని పంపారు” అని అన్నారు.
GEN 19:14 లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెళ్ళి చేసుకోబోయే తన అల్లుళ్ళతో మాట్లాడి, “త్వరపడండి, ఈ స్థలాన్ని విడిచిపెట్టి రండి, యెహోవా దీనిని నాశనం చేయబోతున్నారు” అని అన్నాడు. అయితే వారికి తన మాటలు హేళనగా అనిపించాయి.
GEN 19:15 తెల్లవారుజామున ఆ దూతలు లోతుతో, “త్వరగా, ఇక్కడున్న నీ భార్యను, నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని బయలుదేరు లేదా ఈ పట్టణం శిక్షించబడినప్పుడు మీరు కూడా నాశనమవుతారు” అని చెప్పారు.
GEN 19:16 లోతు సంశయిస్తుండగా ఆ మనుష్యులు లోతును, అతని భార్యను, ఇద్దరు కుమార్తెలను చేయి పట్టుకుని పట్టణం బయటకు తీసుకువచ్చారు, ఎందుకంటే యెహోవా వారిపై కనికరం చూపారు.
GEN 19:17 వారిని బయటకు తీసుకువచ్చిన వెంటనే, వారిలో ఒకరు, “మీ ప్రాణాల కోసం పారిపోండి! వెనుకకు చూడకండి, మైదానంలో ఎక్కడ ఆగకండి! పర్వతాల వైపు పారిపోండి లేదా మీరు తుడిచివేయబడతారు!” అని చెప్పారు.
GEN 19:18 కానీ లోతు వారితో, “నా ప్రభువులారా! దయచేసి అలా కాదు,
GEN 19:19 మీ సేవకుడు మీ దృష్టిలో దయ పొందాడు, మీ దయ వలన మీరు నా ప్రాణం కాపాడారు. అయితే నేను పర్వతాలకు వెళ్లను; ఈ విపత్తు నా మీదికి వచ్చి నేను చస్తాను.
GEN 19:20 చూడండి, నేను తప్పించుకోడానికి ఇక్కడ ఒక చిన్న పట్టణం ఉంది. దానిలోకి వెళ్లనివ్వండి అది చిన్నగా ఉంది కదా, అప్పుడు నా ప్రాణం రక్షింపబడుతుంది” అని అన్నాడు.
GEN 19:21 ఆ దూత, “మంచిది, ఈ మనవి కూడా అంగీకరిస్తున్నాను; నీవు చెప్పే ఈ పట్టణాన్ని నాశనం చేయను.
GEN 19:22 కాని అక్కడికి త్వరగా పారిపోండి, ఎందుకంటే మీరు అక్కడికి చేరేవరకు నేను ఏమి చేయలేను” అని అన్నాడు. అందుకే ఆ పట్టణానికి సోయరు అని పేరు పెట్టబడింది.
GEN 19:23 లోతు సోయరు చేరే లోపు ఆ ప్రాంతంలో సూర్యుడు ఉదయించాడు.
GEN 19:24 అప్పుడు యెహోవా సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కురిపించారు; యెహోవా దగ్గర నుండి ఆకాశం నుండి అవి కురిపించబడ్డాయి.
GEN 19:25 అలా ఆయన ఆ పట్టణాలను, ఆ మైదానమంతటిని ఆ పట్టణాల్లో నివసించే వారినందరిని ఆ ప్రాంతంలో ఉన్న నేల మొలకలతో సహా నాశనం చేశారు.
GEN 19:26 అయితే లోతు భార్య వెనుకకు తిరిగింది, ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది.
GEN 19:27 మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి అంతకుముందు యెహోవా ఎదుట తాను నిలిచిన స్థలానికి వెళ్లాడు.
GEN 19:28 సొదొమ గొమొర్రాల వైపు, ఆ మైదానమంతటిని చూశాడు, ఆ స్థలం నుండి కొలిమిలో నుండి వచ్చే పొగలా పొగ రావడం చూశాడు.
GEN 19:29 దేవుడు మైదానంలోని పట్టణాలను నాశనం చేసినప్పుడు, ఆయన అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నారు, లోతును, తాను నివసించిన ఆ పట్టణాలను పడగొట్టిన విపత్తు నుండి అతన్ని తప్పించారు.
GEN 19:30 లోతు, అతని ఇద్దరు కుమార్తెలు సోయరును విడిచి పర్వతాల్లో స్థిరపడ్డారు ఎందుకంటే సోయరులో ఉండడానికి అతడు భయపడ్డాడు. అతడు, అతని కుమార్తెలిద్దరు ఒక గుహలో నివసించారు.
GEN 19:31 ఒక రోజు అతని పెద్దకుమార్తె తన చెల్లెలితో, “మన తండ్రి వృద్ధుడు, ఈ లోకమర్యాద ప్రకారం మనకు పిల్లలను ఇవ్వడానికి ఈ చుట్టుప్రక్కల పురుషులెవ్వరు లేరు.
GEN 19:32 మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి, అతనితో పడుకుని మన తండ్రి ద్వార కుటుంబ వంశావళిని కాపాడదాం” అని అన్నది.
GEN 19:33 ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించారు, పెద్దకుమార్తె అతనితో పడుకుంది. ఆమె ఎప్పుడు పడుకుందో ఎప్పుడు లేచి వెళ్లిందో అతనికి తెలియలేదు.
GEN 19:34 మర్నాడు పెద్దకుమార్తె తన చెల్లెలితో, “నిన్న రాత్రి తండ్రితో పడుకున్నాను. ఈ రోజు మరలా అతడు ద్రాక్షరసం త్రాగేలా చేద్దాం, నీవు వెళ్లి అతనితో పడుకో, అలా మన తండ్రి ద్వారా మన కుటుంబ వంశావళిని కాపాడదాం” అని అన్నది.
GEN 19:35 ఆ రాత్రి కూడా తమ తండ్రి ద్రాక్షరసం త్రాగేలా చేశారు, చిన్న కుమార్తె అతనితో పడుకుంది. ఈసారి కూడా ఆమె ఎప్పుడు పడుకుందో ఎప్పుడు లేచి వెళ్లిందో అతనికి తెలియలేదు.
GEN 19:36 అలా లోతు ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యారు.
GEN 19:37 పెద్దకుమార్తెకు కుమారుడు పుట్టాడు, ఆమె అతనికి మోయాబు అని పేరు పెట్టింది; నేడు ఇతడు మోయాబీయులకు మూలపురుషుడు.
GEN 19:38 చిన్నకుమార్తెకు కూడా కుమారుడు పుట్టాడు, ఆమె అతనికి బెన్-అమ్మి అని పేరు పెట్టింది; నేడు ఇతడు అమ్మోనీయులకు మూలపురుషుడు.
GEN 20:1 అబ్రాహాము అక్కడినుండి దక్షిణాదికి ప్రయాణం చేసి కాదేషుకు, షూరుకు మధ్య నివాసం ఉన్నాడు. కొంతకాలం గెరారులో ఉన్నాడు.
GEN 20:2 అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గురించి, “ఈమె నా చెల్లెలు” అని చెప్పాడు. అప్పుడు గెరారు రాజైన అబీమెలెకు శారాను తన రాజభవనం లోనికి రప్పించుకున్నాడు.
GEN 20:3 అయితే ఆ రాత్రి కలలో దేవుడు అబీమెలెకుకు కనిపించి, “నీవు తీసుకున్న స్త్రీ కారణంగా నీవు చచ్చినట్టే ఎందుకంటే ఆమె ఇంకొకని భార్య” అని చెప్పారు.
GEN 20:4 అబీమెలెకు ఆమెను సమీపించలేదు. కాబట్టి అతడు, “ప్రభువా, మీరు ఒక నిర్దోషులైన జనాన్ని నాశనం చేస్తారా?
GEN 20:5 ‘ఆమె నా సోదరి’ అని అతడు చెప్పలేదా? ‘ఇతడు నా అన్న’ అని ఆమె కూడా చెప్పలేదా? నేను నిర్మలమైన మనస్సాక్షితో నిర్దోషిగా ఉండి దీన్ని చేశాను” అని అన్నాడు.
GEN 20:6 అప్పుడు దేవుడు అతనితో కలలో ఇలా అన్నారు, “అవును, నీవు నిర్మలమైన మనస్సాక్షితో చేశావని నాకు తెలుసు, అందుకే నీవు పాపం చేయకుండా ఆపాను. అందుకే నీవామెను ముట్టుకోకుండా చేశాను.
GEN 20:7 ఇప్పుడు ఆ మనుష్యుని భార్యను తనకు ఇవ్వు, అతడు ప్రవక్త కాబట్టి నీకోసం ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు. ఒకవేళ ఆమెను తిరిగి ఇవ్వకపోతే, నీవు, నీకు సంబంధించిన వారందరు చస్తారు.”
GEN 20:8 మర్నాడు వేకువజామున అబీమెలెకు తన అధికారులను పిలిపించి, వారితో ఏమి జరిగిందో చెప్పాడు, వారు ఎంతో భయపడ్డారు.
GEN 20:9 అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, “నీవు మాకు చేసింది ఏంటి? నీ పట్ల నేను ఏ తప్పు చేశానని ఇంత గొప్ప అపరాధం నాపైన, నా రాజ్యం పైన తెచ్చావు? నీవు నా పట్ల చేసినవి ఎవరు చేయకూడనివి” అని అన్నాడు.
GEN 20:10 అబీమెలెకు, “నీవు ఇలా చేయడానికి కారణమేంటి?” అని అబ్రాహామును అడిగాడు.
GEN 20:11 అందుకు అబ్రాహాము అన్నాడు, “ఈ స్థలంలో దేవుని భయం లేదు, ‘నా భార్యను బట్టి వారు నన్ను చంపేస్తారు’ అని నాలో నేను అనుకున్నాను.
GEN 20:12 అంతేకాదు, ఆమె నిజంగా నా సోదరి, నా తండ్రికి కుమార్తె కాని నా తల్లికి కాదు; ఆమె నా భార్య అయ్యింది.
GEN 20:13 దేవుడు నన్ను నా తండ్రి ఇంటి నుండి తిరిగేలా చేసినప్పుడు, నేను ఆమెతో ఇలా చెప్పాను, ‘మనం వెళ్లే ప్రతిచోటా నా గురించి, “ఈయన నా సోదరుడు” అని చెప్పు, ఇది నా పట్ల నీ ప్రేమ.’ ”
GEN 20:14 అప్పుడు అబీమెలెకు గొర్రెలను, పశువులను, దాసదాసీలను అబ్రాహాముకు ఇచ్చాడు. అబ్రాహాము భార్యయైన శారాను కూడా తిరిగి అప్పగించాడు.
GEN 20:15 అబీమెలెకు, “నా దేశం నీ ఎదుట ఉన్నది; నీకు ఇష్టమైన చోట నీవు నివసించవచ్చు” అన్నాడు.
GEN 20:16 అతడు శారాతో, “నీ అన్నకు వెయ్యి షెకెళ్ళ వెండి ఇస్తున్నాను, ఇది నీతో ఉన్న వారందరి ఎదుట నీకు విరోధంగా చేసిన దానికి నష్టపరిహారం; నీవు పూర్తిగా నిర్దోషివి” అన్నాడు.
GEN 20:17 అప్పుడు అబ్రాహాము దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు అబీమెలెకును, అతని భార్య, అతని ఆడ దాసీలను స్వస్థపరచగా వారు తిరిగి పిల్లలు కన్నారు.
GEN 20:18 ఎందుకంటే యెహోవా అబ్రాహాము భార్య శారాను బట్టి అబీమెలెకు ఇంట్లోని స్త్రీలందరిని పిల్లలు కనలేకుండా చేశారు.
GEN 21:1 యెహోవా తాను చెప్పినట్టే శారా పట్ల కృప చూపించారు, శారాకు వాగ్దానం చేసినట్టే యెహోవా చేశారు.
GEN 21:2 సరిగ్గా దేవుడు వాగ్దానం చేసిన నిర్ణీత కాలంలో శారా గర్భవతియై, వృద్ధాప్యంలో ఉన్న అబ్రాహాముకు కుమారున్ని కన్నది.
GEN 21:3 అబ్రాహాము, శారా తన కోసం కన్న కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు.
GEN 21:4 దేవుని ఆజ్ఞమేరకు తన కుమారుడైన ఇస్సాకుకు ఎనిమిదో రోజున అబ్రాహాము సున్నతి చేశాడు.
GEN 21:5 ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము నూరు సంవత్సరాల వృద్ధుడు.
GEN 21:6 శారా, “నాకు దేవుడు నవ్వు తెప్పించారు, ఇది వినే ప్రతివారు నాతో నవ్వుతారు,
GEN 21:7 శారా పిల్లలకు పాలిస్తుందని అబ్రాహాముతో ఎవరు అంటారు? అయినా నా భర్తకు వృద్ధాప్యంలో కుమారున్ని కన్నాను” అని అన్నది.
GEN 21:8 ఇస్సాకు పాలు విడిచిన రోజు అబ్రాహాము పెద్ద విందు చేశాడు.
GEN 21:9 అయితే ఈజిప్టు దాసి హాగరు ద్వార అబ్రాహాముకు పుట్టిన కుమారుడు శారాను హేళన చేయడం చూసి,
GEN 21:10 ఆమె అబ్రాహాముతో, “ఆ దాసిని దాని కుమారున్ని పంపివేయండి, దాని కుమారుడు ఎప్పటికీ నా కుమారునితో వారసత్వం పంచుకోలేడు” అని శారా చెప్పింది.
GEN 21:11 తన కుమారునికి సంబంధించిన విషయం కాబట్టి అబ్రాహాము చాలా బాధపడ్డాడు.
GEN 21:12 అయితే దేవుడు అబ్రాహాముతో, “ఈ బాలుని గురించి, నీ దాసి గురించి నీవు బాధపడకు. శారా చెప్పినట్టు నీవు చేయి, ఎందుకంటే ఇస్సాకు మూలంగానే నీ సంతానం లెక్కించబడుతుంది.
GEN 21:13 అయితే దాసి కుమారుడు కూడా నీ సంతానమే కాబట్టి అతన్ని కూడా గొప్ప జనంగా చేస్తాను.”
GEN 21:14 మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి కొంత ఆహారం, నీళ్ల తిత్తి హాగరుకు ఇచ్చాడు. వాటిని ఆమె భుజం మీద పెట్టి, ఆమెను తన కుమారునితో పంపివేశాడు. ఆమె వెళ్లి బెయేర్షేబ ఎడారిలో తిరుగుతూ ఉంది.
GEN 21:15 తిత్తిలో నీళ్లు అయిపోయినప్పుడు ఆమె ఆ పిల్లవాన్ని ఒక పొద క్రింద ఉంచింది.
GEN 21:16 తర్వాత ఆమె కొంత దూరం వెళ్లి కూర్చుంది, ఎందుకంటే, “బాలుడు చావడం నేను చూడలేను” అని అనుకుంది. అక్కడ కూర్చుని అదుపు లేకుండ ఏడవసాగింది.
GEN 21:17 దేవుడు చిన్నవాని మొర విన్నారు, దేవదూత పరలోకం నుండి హాగరును పిలిచి, “హాగరూ! ఏమైంది? భయపడకు; బాలుడు అక్కడ పడి ఏడ్వడం దేవుడు విన్నారు.
GEN 21:18 ఆ పిల్లవాన్ని లేపి నీ చేతితో పట్టుకో, నేను అతన్ని గొప్ప జనంగా చేస్తాను” అని అన్నాడు.
GEN 21:19 అప్పుడు దేవుడు ఆమె కళ్లు తెరిచారు, ఆమె నీళ్ల ఊటను చూసింది. ఆమె వెళ్లి తిత్తిని నీళ్లతో నింపి బాలునికి త్రాగడానికి ఇచ్చింది.
GEN 21:20 ఆ పిల్లవాడు ఎదుగుతుండగా దేవుడు అతనితో ఉన్నారు. అతడు ఎడారిలో నివసిస్తూ విలుకాడయ్యాడు.
GEN 21:21 అతడు పారాను ఎడారిలో నివసిస్తున్నప్పుడు అతని తల్లి ఈజిప్టు నుండి అతనికి భార్యను తీసుకువచ్చింది.
GEN 21:22 ఆ సమయంలో అబీమెలెకు, అతని సేనాధిపతి ఫీకోలు వచ్చి, అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నీతో ఉన్నారు.
GEN 21:23 కాబట్టి నీవు నాతో గాని నా పిల్లలతో గాని నా వారసులతో గాని మోసపూరితంగా వ్యవహరించవని దేవుని ఎదుట నాతో ప్రమాణం చేయి. నీవు పరదేశిగా ఉంటున్న ఈ దేశంలో నేను చూపించిన దయ నాకు, ఈ దేశానికి చూపించు.”
GEN 21:24 అబ్రాహాము, “నేను ప్రమాణం చేస్తున్నా” అన్నాడు.
GEN 21:25 అప్పుడు అబీమెలెకు దాసులు అంతకుముందు ఒక బావిని ఆక్రమించుకున్న విషయాన్ని అబ్రాహాము అబీమెలెకుకు చెప్పాడు.
GEN 21:26 అయితే అబీమెలెకు, “ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. నీవు నాకు చెప్పలేదు, ఈ రోజే ఈ సంగతి వింటున్నాను” అని అన్నాడు.
GEN 21:27 అబ్రాహాము గొర్రెలు పశువులు తీసుకువచ్చి అబీమెలెకుకు ఇచ్చాడు, ఆ ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు.
GEN 21:28 అబ్రాహాము తన మంద నుండి ఏడు ఆడ గొర్రెపిల్లలను వేరు చేశాడు.
GEN 21:29 అబీమెలెకు, “నీవు స్వయంగా వేరు చేసిన ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలకు అర్థం ఏంటి?” అని అబ్రాహామును అడిగాడు.
GEN 21:30 అందుకు అతడు, “నేను ఈ బావిని త్రవ్వించాను అనడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెపిల్లలను నా చేతి నుండి అంగీకరించు” అని చెప్పాడు.
GEN 21:31 అక్కడ వారిద్దరు ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఆ స్థలానికి బెయేర్షేబ అని పేరు పెట్టారు.
GEN 21:32 బెయేర్షేబ దగ్గర ఒప్పందం చేసుకున్న తర్వాత అబీమెలెకు, సేనాధిపతియైన ఫీకోలు ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్లారు.
GEN 21:33 అబ్రాహాము బెయేర్షేబలో ఒక పిచుల వృక్షం నాటాడు, అక్కడ నిత్య దేవుడైన యెహోవా నామాన్ని ఆరాధించాడు.
GEN 21:34 అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా కాలం పరదేశిగా ఉన్నాడు.
GEN 22:1 కొంతకాలం తర్వాత దేవుడు అబ్రాహామును పరీక్షించారు. ఆయన, “అబ్రాహామూ!” అని పిలిచారు. “చిత్తం! ప్రభువా” అని అతడు జవాబిచ్చాడు.
GEN 22:2 అప్పుడు దేవుడు ఇలా అన్నారు, “నీ ఏకైక కుమారున్ని, అంటే నీవు ప్రేమించే ఇస్సాకును మోరీయా ప్రదేశానికి తీసుకెళ్లు. నేను నీకు చూపబోయే పర్వతం మీద అతన్ని దహనబలిగా అర్పించు.”
GEN 22:3 మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి గాడిదకు గంతలు కట్టి ఇద్దరు పనివారిని, తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని బయలుదేరాడు. దహనబలి కోసం కట్టెలు కొట్టుకుని దేవుడు చూపిన స్థలం వైపు వెళ్లాడు.
GEN 22:4 మూడవ రోజు అబ్రాహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ స్థలాన్ని చూశాడు.
GEN 22:5 అబ్రాహాము తన పనివారితో, “మీరు గాడిదతో ఇక్కడ ఉండండి, నేను, ఈ చిన్నవాడు అక్కడికి వెళ్లి, ఆరాధించి తిరిగి వస్తాం” అని అన్నాడు.
GEN 22:6 అబ్రాహాము దహనబలి కోసం కట్టెలు తీసుకుని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టాడు, అతడు నిప్పును కత్తిని పట్టుకుని వెళ్లాడు. వారిద్దరు కలసి నడిచి వెళ్తున్నప్పుడు,
GEN 22:7 ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో, “తండ్రీ” అని పిలిచాడు. “నా కుమారుడా, ఏంటి?” అని అబ్రాహాము జవాబిచ్చాడు. ఇస్సాకు, “నిప్పు కట్టెలు ఉన్నాయి. కాని దహనబలి కోసం కావలసిన గొర్రెపిల్ల ఎక్కడ?” అని అడిగాడు.
GEN 22:8 “నా కుమారుడా, దేవుడే స్వయంగా దహనబలి కోసం గొర్రెపిల్లను ఇస్తారు” అని అబ్రాహాము జవాబిచ్చాడు. వారిద్దరు కలిసి వెళ్లారు.
GEN 22:9 దేవుడు నిర్దేశించిన స్థలం వారు చేరుకున్నాక, అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠం కట్టాడు, దాని మీద కట్టెలు పేర్చాడు. తన కుమారుడైన ఇస్సాకును బంధించి, కట్టెల మీద పడుకోబెట్టాడు.
GEN 22:10 తర్వాత అబ్రాహాము తన కుమారున్ని బలి ఇవ్వడానికి చేయి చాపి కత్తి పట్టుకున్నాడు.
GEN 22:11 అయితే యెహోవా దూత ఆకాశం నుండి, “అబ్రాహామూ! అబ్రాహామూ!” అని పిలిచాడు. “చిత్తం ప్రభువా” అని అతడు జవాబిచ్చాడు.
GEN 22:12 “ఆ బాలుని మీద చేయివేయకు అతన్ని ఏమీ చేయకు. నీవు దేవునికి భయపడతావని ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే నీ ఏకైక కుమారున్ని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు!” అని దేవుని దూత మాట్లాడాడు.
GEN 22:13 అబ్రాహాము కళ్ళెత్తి చూశాడు, ఆ పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న పొట్టేలు కనిపించింది. అక్కడికి వెళ్లి ఆ పొట్టేలును తెచ్చి తన కుమారునికి బదులు దహనబలి అర్పించాడు.
GEN 22:14 అబ్రాహాము ఆ స్థలానికి, యెహోవా యీరే అని పేరు పెట్టాడు. ఇప్పటికీ, “యెహోవా పర్వతం మీద సమకూర్చబడుతుంది” అని చెప్పబడుతుంది.
GEN 22:15 యెహోవా దూత రెండవసారి అబ్రాహాముతో ఇలా అన్నాడు,
GEN 22:16 “యెహోవా ప్రకటిస్తున్నారు, నా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నీవిలా నీ ఏకైక కుమారున్ని ఇవ్వడానికి వెనుకాడలేదు కాబట్టి,
GEN 22:17 నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని లెక్కించలేని ఆకాశ నక్షత్రాల్లా సముద్ర ఒడ్డు మీద ఇసుక రేణువుల్లా విస్తరింపజేస్తాను. నీ సంతతివారు వారి శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు,
GEN 22:18 నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న సర్వ దేశాలు దీవించబడతాయి, ఎందుకంటే నీవు నాకు లోబడ్డావు.”
GEN 22:19 తర్వాత అబ్రాహాము తన పనివారి దగ్గరకు తిరిగి వెళ్లాడు, వారు కలిసి బెయేర్షేబకు వెళ్లారు. అబ్రాహాము బెయేర్షేబలో నివసించాడు.
GEN 22:20 కొంతకాలం తర్వాత, అబ్రాహాముకు ఇలా చెప్పబడింది, “మిల్కా కూడా తల్లి అయ్యింది; నీ సోదరుడు నాహోరుకు ఆమె జన్మనిచ్చిన కుమారులు:
GEN 22:21 మొదటి కుమారుడు ఊజు, అతని తమ్ముడు బూజు, కెమూయేలు (అరాము ఇతని కుమారుడు),
GEN 22:22 కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయేలు.”
GEN 22:23 బెతూయేలు రిబ్కాకు తండ్రి అయ్యాడు.
GEN 22:24 రయూమా అనే అతని ఉంపుడుగత్తె కూడా కుమారులు కన్నది: తెబహు, గహము, తహషు, మయకా.
GEN 23:1 శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది.
GEN 23:2 ఆమె కనాను దేశంలోని కిర్యత్-అర్బా అనగా హెబ్రోనులో చనిపోయింది, అబ్రాహాము శారా కోసం దుఃఖపడడానికి, ఏడ్వడానికి వెళ్లాడు.
GEN 23:3 తర్వాత అబ్రాహాము చనిపోయిన తన భార్య మృతదేహం దగ్గర నుండి లేచి హిత్తీయులతో మాట్లాడుతూ,
GEN 23:4 “నేను మీ మధ్య విదేశీయునిగా, అపరిచితునిగా ఉన్నాను. చనిపోయిన నా భార్యను పాతిపెట్టడానికి నాకు కొంత భూమి అమ్మండి” అని అన్నాడు.
GEN 23:5 హిత్తీయులు అబ్రాహాముకు జవాబిస్తూ,
GEN 23:6 “అయ్యా, మేము చెప్పేది వినండి, మీరు మా మధ్య దేవుని రాజకుమారునిలా ఉన్నారు. సమాధి స్థలాల్లో మీకు నచ్చిన దానిలో మీరు పాతిపెట్టండి. మాలో ఎవ్వరూ మిమ్మల్ని ఆపరు” అన్నారు.
GEN 23:7 అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హిత్తీయుల ఎదుట తలవంచాడు.
GEN 23:8 వారితో ఇలా అన్నాడు, “మీరు నా భార్య మృతదేహాన్ని పాతిపెట్టడానికి సమ్మతిస్తే, సోహరు కుమారుడైన ఎఫ్రోనుకు చెందిన పొలం చివర మక్పేలా గుహ ఉంది, నా తరపున అతనితో మాట్లాడి, ఆ స్థలం నాకు మీ మధ్యలో ఉండే సమాధి స్థలంగా పూర్తి వెలకు అమ్ముమని అడగండి.”
GEN 23:10 హిత్తీయుడైన ఎఫ్రోను అక్కడే తన ప్రజలమధ్య కూర్చుని, పట్టణ గవినికి వచ్చిన హిత్తీయులందరి సమక్షంలో అబ్రాహాముకు ఇలా జవాబిచ్చాడు.
GEN 23:11 “నా ప్రభువా, అలా కాదు, నా మాట వినండి; ప్రజలందరి సమక్షంలో నేను పొలాన్ని ఇస్తాను, అందులోని గుహను ఇస్తాను. మీరు పాతి పెట్టుకోండి.”
GEN 23:12 మళ్ళీ అబ్రాహాము ఆ దేశ ప్రజలందరి ఎదుట తలవంచాడు,
GEN 23:13 అతడు ఆ దేశ ప్రజలందరూ వినేలా ఎఫ్రోనుతో, “నా మాట విను, పొలం యొక్క వెల నేను చెల్లిస్తాను. నా భార్య మృతదేహాన్ని అక్కడ నేను పాతిపెట్టేలా నా నుండి అది అంగీకరించు” అన్నాడు.
GEN 23:14 ఎఫ్రోను అబ్రాహాముకు జవాబిస్తూ, “నా ప్రభువా, మా మాట వినండి; దాని ఖరీదు నాలుగు వందల షెకెళ్ళ వెండి, అయితే నాకు మీకు మధ్య అదెంత? మీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టండి” అన్నాడు.
GEN 23:16 అబ్రాహాము ఎఫ్రోను చెప్పినట్టే ఒప్పుకుని, హిత్తీయుల వినికిడిలో వ్యాపారుల కొలత ప్రకారం నాలుగు వందల షెకెళ్ళ వెండి తూచి అతనికి ఇచ్చాడు.
GEN 23:17 మమ్రే దగ్గర మక్పేలాలో ఉన్న ఎఫ్రోను పొలం అందులో ఉన్న గుహ ఆ పొలం సరిహద్దులో ఉన్న అన్ని చెట్లు
GEN 23:18 పట్టణ గవిని దగ్గర ఉన్న హిత్తీయుల సమక్షంలో అబ్రాహాము పేర దస్తావేజు చేయబడింది.
GEN 23:19 అప్పుడు అబ్రాహాము కనాను దేశంలో, హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న మక్పేలా పొలం లోని గుహలో తన భార్య శారా మృతదేహాన్ని పాతిపెట్టాడు.
GEN 23:20 కాబట్టి ఆ పొలం, అందులోని గుహ, హిత్తీయుల వలన స్మశాన వాటికగా అబ్రాహాము పేరు మీద వ్రాయబడింది.
GEN 24:1 అబ్రాహాము చాలా వృద్ధుడయ్యాడు, యెహోవా అతన్ని అన్ని విధాలుగా ఆశీర్వదించారు.
GEN 24:2 అబ్రాహాము తన ఇంట్లో గృహనిర్వాహకుడైన ముఖ్య సేవకునితో, “నీ చేయి నా తొడ క్రింద పెట్టు.
GEN 24:3 నేను ఎవరి మధ్య నివసిస్తున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో నుండి నా కుమారునికి భార్యను తీసుకురావని, నా దేశం, నా బంధువుల దగ్గరకు వెళ్లి వారిలో నుండి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకువస్తావని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేయి” అని అన్నాడు.
GEN 24:5 అందుకు ఆ సేవకుడు, “ఒకవేళ ఆ స్త్రీ ఈ దేశానికి రావడానికి ఇష్టపడకపోతే ఏం చేయాలి? నీవు వచ్చిన ఆ దేశానికి నీ కుమారున్ని తీసుకెళ్లాలా?” అని అతన్ని అడిగాడు.
GEN 24:6 అబ్రాహాము, “ఖచ్చితంగా నా కుమారున్ని అక్కడికి తీసుకెళ్లకూడదు.
GEN 24:7 నా తండ్రి ఇంటి నుండి, నా స్వదేశం నుండి బయటకు తీసుకువచ్చి, ‘నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను’ అని వాగ్దానం చేసిన పరలోక దేవుడైన యెహోవాయే నా కుమారునికి భార్యను అక్కడినుండి తీసుకువచ్చేలా తన దూతను నీకు ముందుగా పంపుతారు.
GEN 24:8 ఒకవేళ ఆ స్త్రీ నీ వెంట రావడానికి ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుండి నీవు నిర్దోషివి, కాని నా కుమారున్ని మాత్రం అక్కడికి తీసుకెళ్లకూడదు” అని చెప్పాడు.
GEN 24:9 ఆ సేవకుడు ఈ విషయమై తన యజమానియైన అబ్రాహాము తొడ క్రింద చేయి పెట్టి ప్రమాణం చేశాడు.
GEN 24:10 అప్పుడు ఆ సేవకుడు యజమాని ఒంటెల్లో పది ఒంటెలను, యజమాని యొక్క అన్ని రకాల శ్రేష్ఠమైన వస్తు సముదాయాన్ని తీసుకుని బయలుదేరాడు. అతడు అరాము నహరయీముకు బయలుదేరి, నాహోరు పట్టణం చేరాడు.
GEN 24:11 పట్టణం బయట ఉన్న బావి దగ్గర ఒంటెలను మోకరింపజేశాడు; అది సాయంకాలం, స్త్రీలు నీళ్లు చేదుకోడానికి వచ్చే సమయము.
GEN 24:12 అప్పుడు అతడు ఇలా ప్రార్థన చేశాడు, “యెహోవా! నా యజమానియైన అబ్రాహాము దేవా, నేను వచ్చిన పని ఈ రోజు సఫలం చేయండి, నా యజమాని అబ్రాహాముపై దయ చూపండి.
GEN 24:13 నేను ఈ నీటి ఊట దగ్గర నిలబడి ఉన్నాను, ఈ పట్టణవాసుల కుమార్తెలు నీళ్లు తోడుకోడానికి వస్తున్నారు.
GEN 24:14 నేను వారిలో ఒక యవ్వన స్త్రీతో, ‘నీ కడవ క్రిందికి వంచు, నేను నీళ్లు త్రాగుతాను’ అని అడిగినప్పుడు, ఏ స్త్రీ అయితే, ‘ఇదిగో త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను’ అని అంటుందో, ఆమె నీ సేవకుడైన ఇస్సాకుకు మీరు ఎంచుకున్న స్త్రీ అయి ఉండాలి. దీనిని బట్టి నా యజమాని పట్ల మీరు దయ చూపారు అని గ్రహిస్తాను.”
GEN 24:15 అతడు ప్రార్థన ముగించకముందే రిబ్కా కడవ భుజంపై పెట్టుకుని వచ్చింది. ఆమె అబ్రాహాము సోదరుడు నాహోరు యొక్క భార్యయైన మిల్కా దంపతులకు పుట్టిన బెతూయేలు కుమార్తె.
GEN 24:16 రిబ్కా చాలా అందమైన కన్యక; ఏ మనుష్యుడు ఆమెతో శయనించలేదు. ఆమె బావిలోనికి దిగివెళ్లి తన కుండలో నీళ్లు నింపుకుని పైకి వచ్చింది.
GEN 24:17 ఆ సేవకుడు పరుగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లి, “నీ కుండలోని నీళ్లు కొన్ని నాకు త్రాగడానికి ఇవ్వు” అని అన్నాడు.
GEN 24:18 “అయ్యా త్రాగండి” అని అంటూ రిబ్కా వెంటనే కుండను చేతి మీదికి దించుకుని, అతనికి నీళ్లు ఇచ్చింది.
GEN 24:19 అతనికి నీళ్లు ఇచ్చిన తర్వాత, “మీ ఒంటెలకు కూడా, వాటికి సరిపడే నీళ్లు చేది పోస్తాను” అని చెప్పింది.
GEN 24:20 కాబట్టి ఆమె త్వరపడి తన కుండలో నీళ్లు తొట్టిలో పోసి, పరుగెత్తుకుంటూ మళ్ళీ బావి దగ్గరకు వెళ్లి, ఒంటెలన్నిటికి సరిపడే నీళ్లు చేది పోసింది.
GEN 24:21 ఆ సేవకుడు ఒక్క మాట మాట్లాడకుండా, యెహోవా తన ప్రయాణం సఫలం చేశారా లేదా అని ఆమెను గమనిస్తూ ఉన్నాడు.
GEN 24:22 ఒంటెలు నీళ్లు త్రాగిన తర్వాత, అతడు ఒక బెకా బరువుగల బంగారం ముక్కుపుడక, పది షెకెళ్ళ బరువుగల రెండు బంగారు కడియాలు చేతిలో పట్టుకున్నాడు.
GEN 24:23 అప్పుడతడు, “నీవెవరి కుమార్తెవు? దయచేసి చెప్పు, ఈ రాత్రి నీ తండ్రి ఇంట్లో మేము గడపడానికి స్థలం ఉందా?” అని అడిగాడు.
GEN 24:24 అందుకు ఆమె, “నేను మిల్కా నాహోరులకు పుట్టిన బెతూయేలు కుమార్తెను” అని జవాబిచ్చింది.
GEN 24:25 “మీరు బసచేయడానికి కావలసిన స్థలం, మీ ఒంటెలకు మేత కూడా మా ఇంట్లో ఉంది” అని కూడా చెప్పింది.
GEN 24:26 అప్పుడు ఆ మనుష్యుడు తలవంచి యెహోవాను ఆరాధిస్తూ,
GEN 24:27 “నా యజమానియైన అబ్రాహాము దేవుడైన యెహోవాకు స్తుతి, ఆయన నా యజమానికి తన దయను, తన నమ్మకత్వాన్ని చూపడం మానలేదు. నా మట్టుకైతే, యెహోవా నా ప్రయాణాన్ని సఫలపరచి నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించారు” అని అన్నాడు.
GEN 24:28 ఆ యవ్వన స్త్రీ పరుగెత్తుకుంటూ వెళ్లి తన తల్లి ఇంటివారికి ఈ సంగతులన్ని చెప్పింది.
GEN 24:29 రిబ్కాకు లాబాను అనే సోదరుడు ఉన్నాడు, అతడు వెంటనే నీటిబుగ్గ దగ్గర ఉన్న ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లాడు.
GEN 24:30 లాబాను రిబ్కా ధరించిన ముక్కుపుడక, చేతి కడియాలు చూసి, ఆ వ్యక్తి రిబ్కాతో మాట్లాడినదంతా ఆమె తన వారితో చెప్పినప్పుడు, వెంటనే ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లి, ఆ బావి దగ్గర తన ఒంటెలతో నిలబడి ఉండడం చూశాడు.
GEN 24:31 “యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రా, నీవు బయటే ఎందుకు నిలబడ్డావు? నీవు బసచేయడానికి ఇల్లును, ఒంటెలకు స్థలాన్ని సిద్ధం చేశాను” అని అతడు అన్నాడు.
GEN 24:32 కాబట్టి ఆ వ్యక్తి ఆ ఇంటికి వెళ్లి, ఒంటెల మీది నుండి బరువును దించారు. వాటికి మేత వేశారు, అతనికి, అతనితో ఉన్న మనుష్యులందరికి కాళ్లు కడుక్కోడానికి నీళ్లు ఇచ్చారు.
GEN 24:33 అతనికి భోజనం వడ్డించారు కాని అతడు, “నేను వచ్చిన పని ఏంటో మీకు చెప్పకుండా నేను తినను” అని అన్నాడు. అందుకు లాబాను, “అయితే చెప్పు” అన్నాడు.
GEN 24:34 అప్పుడు అతడు, “నేను అబ్రాహాము సేవకుడను.
GEN 24:35 యెహోవా నా యజమానిని ఎంతో దీవించారు కాబట్టి అతడు చాలా ధనికుడయ్యాడు. అతనికి గొర్రెలను, మందలను, వెండి బంగారాలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను ఆయన ఇచ్చారు.
GEN 24:36 నా యజమాని భార్య శారా తన వృద్ధాప్యంలో కుమారున్ని కన్నది, తన ఆస్తినంతటిని అతనికి ఇచ్చాడు.
GEN 24:37 నా యజమాని నాతో ప్రమాణం చేయించి, ‘నీవు నా కుమారునికి నేను నివసించే కనానీయుల కుమార్తెలలో నుండి భార్యను తీసుకురాకూడదు,
GEN 24:38 అయితే నా తండ్రి ఇంటికి, నా బంధువుల దగ్గరకు వెళ్లి, నా కుమారునికి భార్యను తీసుకురా’ అని చెప్పాడు.
GEN 24:39 “అందుకు నేను, ‘ఒకవేళ ఆమె నాతో రాకపోతే ఎలా?’ అని నా యజమానిని అడిగాను.
GEN 24:40 “అందుకతడు జవాబిస్తూ, ‘నేను ఇంతవరకు ఎవరి ఎదుట నమ్మకంగా జీవించానో, ఆ యెహోవా తన దూతను నీకు ముందుగా పంపి నీ ప్రయాణం విజయవంతం చేస్తారు, కాబట్టి నీవు నా సొంత వంశస్థులలో నుండి నా తండ్రి ఇంటి నుండి నా కుమారుని కోసం భార్యను తీసుకువస్తావు.
GEN 24:41 నీవు మా వంశస్థుల దగ్గరకు వెళ్లినప్పుడు ఒకవేళ వారు ఆమెను ఇవ్వడానికి ఒప్పుకోకపోతే, నీకు ఈ ప్రమాణం నుండి విముక్తి’ అని అన్నాడు.
GEN 24:42 “ఈ రోజు నేను నీటిబుగ్గ దగ్గరకు వచ్చినప్పుడు, ‘యెహోవా, నా యజమానియైన అబ్రాహాము దేవా! మీకు ఇష్టమైతే, నా ప్రయాణం సఫలం చేయండి.
GEN 24:43 ఇదిగో, నేను ఈ నీటిబుగ్గ దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒకవేళ ఒక యువతి నీళ్ల చేదుకోడానికి వస్తే, నేను, “దయచేసి త్రాగడానికి నీ కుండ నుండి కొన్ని నీళ్లు ఇవ్వు” అని నేను అడిగితే,
GEN 24:44 ఏ యువతైతే, “త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు తోడి పోస్తాను” అని అంటుందో, ఆ యువతే యెహోవా నా యజమాని కుమారునికి భార్య కావాలి’ అని నేను ప్రార్థన చేశాను.
GEN 24:45 “నేను నా హృదయంలో ఇంకా ప్రార్థన ముగించకముందే, రిబ్కా తన కుండను భుజంపై పెట్టుకుని రావడం నేను చూశాను. ఆమె బావిలోనికి దిగివెళ్లి నీళ్లు తోడుకున్న తర్వాత, ఆమెతో, ‘దయచేసి త్రాగడానికి నాకు నీళ్లు ఇవ్వు’ అని అడిగాను.
GEN 24:46 “త్వరగా ఆమె కడవ భుజం మీది నుండి దింపుకుని, ‘త్రాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు ఇస్తాను’ అని అన్నది. కాబట్టి నేను త్రాగాను ఒంటెలకు కూడా ఆమె నీళ్లు పోసింది.
GEN 24:47 “అప్పుడు నేను, ‘నీవు ఎవరి కుమార్తెవు?’ అని అడిగాను. “అందుకు ఆమె, ‘మిల్కా నాహోరులకు పుట్టిన బెతూయేలు కుమార్తెను’ అని చెప్పింది. “అప్పుడు నేను ఆమెకు ముక్కు పుడకను, చేతులకు కడియాలు ఇచ్చి,
GEN 24:48 తలవంచి నేను యెహోవాను ఆరాధించాను; నా యజమాని సోదరుని మనవరాలిని తన కుమారునికి భార్యగా తీసుకురావడానికి నన్ను సరియైన మార్గంలో నడిపించిన నా యజమాని అబ్రాహాముకు దేవుడైన యెహోవాను స్తుతించాను.
GEN 24:49 ఇప్పుడు మీరు నా యజమాని పట్ల దయను, నమ్మకత్వాన్ని చూపాలనుకున్నా, ఒకవేళ లేదు అనుకున్నా చెప్పండి. అప్పుడు నేను ఏ మార్గంలో వెళ్లాలో తెలుసుకుంటాను” అని అన్నాడు.
GEN 24:50 అప్పుడు లాబాను, బెతూయేలు ఇలా జవాబిచ్చారు, “ఇది యెహోవా చేసిన కార్యం; ఈ విషయంలో మేము చెప్పేది ఏమి లేదు.
GEN 24:51 ఇదిగో రిబ్కా, ఆమెను తీసుకెళ్లండి. యెహోవా సూచించినట్లే ఆమె నీ యజమాని కుమారునికి భార్య అవును గాక.”
GEN 24:52 అబ్రాహాము సేవకుడు ఈ మాటలు విని, యెహోవా ఎదుట నేల మీద సాష్టాంగపడ్డాడు.
GEN 24:53 తర్వాత ఆ వ్యక్తి వెండి, బంగారు నగలు, వస్త్రాలు రిబ్కాకు ఇచ్చాడు; అతడు ఆమె సోదరునికి, ఆమె తల్లికి కూడా విలువైన కానుకలిచ్చాడు.
GEN 24:54 అప్పుడు అతడు, అతని మనుష్యులు భోజనం చేసి ఆ రాత్రి అక్కడే గడిపారు. మర్నాడు ఉదయం వారు లేచినప్పుడు, అతడు, “నా దారిన నన్ను నా యజమాని దగ్గరకు పంపివేయండి” అని అన్నాడు.
GEN 24:55 అయితే ఆమె తల్లి సోదరుడు, “యువతిని కనీసం పదిరోజులైనా మా దగ్గర ఉండనివ్వండి, ఆ తర్వాత ఆమె వెళ్లిపోవచ్చు” అని అన్నారు.
GEN 24:56 కాని అతడు, “యెహోవా నా ప్రయాణం సఫలం చేశారు, కాబట్టి ఆలస్యం చేయకుండా నన్ను పంపివేయండి, నా యజమాని దగ్గరకు నేను వెళ్తాను” అన్నాడు.
GEN 24:57 అప్పుడు వారు, “యువతిని పిలిచి ఆమె ఏమంటుందో అడుగుదాం” అని అన్నారు.
GEN 24:58 కాబట్టి వారు రిబ్కాను పిలిచి, “ఇతనితో నీవు వెళ్తావా?” అని అడిగారు. అందుకు ఆమె, “నేను వెళ్తాను” అని జవాబిచ్చింది.
GEN 24:59 కాబట్టి వారు తమ సోదరి రిబ్కాను, ఆమెకు తోడుగా దాదిని, అబ్రాహాము సేవకుని, అతనితో వచ్చిన మనుష్యులను పంపివేశారు.
GEN 24:60 వారు రిబ్కాను దీవించి ఆమెతో ఇలా అన్నారు, “మా సోదరీ, నీవు వర్ధిల్లాలి, వేవేల మందికి తల్లివి కావాలి; నీ సంతానపు వారు తమ శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకోవాలి.”
GEN 24:61 అప్పుడు రిబ్కా, ఆమె పరిచారకులు సిద్ధపడి, ఒంటెలు ఎక్కి ఆ మనుష్యునితో పాటు వెళ్లారు. అలా ఆ సేవకుడు రిబ్కాను తీసుకుని వెళ్లాడు.
GEN 24:62 ఇప్పుడు ఇస్సాకు బెయేర్-లహాయి-రోయి నుండి వచ్చాడు, ఎందుకంటే అతడు దక్షిణాదిలో నివాసముంటున్నాడు.
GEN 24:63 ఒక రోజు సాయంకాలం అతడు ధ్యానం చేసుకోవడానికి పొలానికి వెళ్లాడు; ఆ సమయంలో ఇస్సాకు తేరిచూడగా, అతనికి ఒంటెలు వస్తున్నట్లు కనిపించాయి.
GEN 24:64 రిబ్కా తలెత్తి ఇస్సాకును చూసి, ఒంటె మీది నుండి క్రిందికి దిగి,
GEN 24:65 “మనలను కలవడానికి పొలంలో నుండి వస్తున్న అతడు ఎవరు?” అని ఆ సేవకుని అడిగింది. అందుకతడు, “అతడే నా యజమాని” అని అన్నాడు. ఆమె తన తలమీద ముసుగు వేసుకుంది.
GEN 24:66 ఆ సేవకుడు జరిగినదంతా ఇస్సాకుకు చెప్పాడు.
GEN 24:67 ఇస్సాకు తన తల్లియైన శారా గుడారం లోనికి ఆమెను తీసుకెళ్లి, ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఇలా రిబ్కా అతని భార్య అయ్యింది. అతడు ఆమెను ప్రేమించాడు; ఇలా తల్లి మరణం చేత బాధతో ఉన్న ఇస్సాకుకు రిబ్కా ద్వార ఓదార్పు కలిగింది.
GEN 25:1 అబ్రాహాము కెతూరా అనే మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు,
GEN 25:2 ఆమె అతనికి కన్న కుమారులు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు.
GEN 25:3 యొక్షాను కుమారులు షేబ, దేదాను; అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు దేదాను వారసులు.
GEN 25:4 ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా సంతానము.
GEN 25:5 అబ్రాహాము తనకున్నదంతా ఇస్సాకుకు ఇచ్చాడు.
GEN 25:6 అయితే అబ్రాహాము ఇంకా బ్రతికి ఉండగానే తన ఉపపత్నులకు పుట్టిన కుమారులకు బహుమానాలిచ్చి, వారినందరిని తన కుమారుడైన ఇస్సాకు దగ్గర నుండి తూర్పు ప్రాంతాలకు పంపివేశాడు.
GEN 25:7 అబ్రాహాము నూట డెబ్బై సంవత్సరాలు జీవించాడు.
GEN 25:8 అబ్రాహాము తన వృద్ధాప్యంలో, సంవత్సరాలు నిండిన వృద్ధునిగా తుది శ్వాస విడిచి చనిపోయాడు; తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు.
GEN 25:9 అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలులు కలిసి తమ తండ్రిని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా గుహలో సమాధి చేశారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడైన ఎఫ్రోను పొలము.
GEN 25:10 అబ్రాహాము ఆ పొలాన్ని హిత్తీయుల దగ్గర కొన్నాడు. అందులో అబ్రాహాము తన భార్యయైన శారాతో పాటు పాతిపెట్టబడ్డాడు.
GEN 25:11 అబ్రాహాము మృతి చెందిన తర్వాత, దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించారు, అప్పుడు అతడు బెయేర్-లహాయి-రోయి దగ్గర నివసించాడు.
GEN 25:12 శారా దాసి, ఈజిప్టుకు చెందిన హాగరు, అబ్రాహాముకు కన్న ఇష్మాయేలు కుటుంబ వంశావళి:
GEN 25:13 ఇష్మాయేలు కుమారులు, వారు పుట్టిన క్రమం ప్రకారం వారి పేర్లు: ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, కేదారు, అద్బీయేలు, మిబ్శాము,
GEN 25:14 మిష్మా, దూమా, మశ్శా,
GEN 25:15 హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా.
GEN 25:16 వీరు ఇష్మాయేలు కుమారులు, వారి వారి స్థావరాలలో, శిబిరాలలో, తమ తమ జనాంగాలకు పన్నెండుగురు గోత్ర పాలకుల పేర్లు.
GEN 25:17 ఇష్మాయేలు నూట ముప్పై ఏడు సంవత్సరాలు జీవించాడు. తన తుది శ్వాస విడిచి చనిపోయాడు, తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు.
GEN 25:18 అతని వారసులు అష్షూరు వైపు వెళ్లే మార్గంలో హవీలా నుండి ఈజిప్టు సరిహద్దు దగ్గర ఉన్న షూరు వరకు ఉన్న ప్రాంతంలో స్థిరపడ్డారు. వారు తమ సోదరులందరికి విరోధంగా నివసించారు.
GEN 25:19 అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు వంశావళి. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు,
GEN 25:20 ఇస్సాకు పద్దనరాములోని సిరియావాడైన బెతూయేలు కుమార్తె, లాబాను సోదరియైన రిబ్కాను పెళ్ళి చేసుకున్నప్పుడు అతని వయస్సు నలభై సంవత్సరాలు.
GEN 25:21 రిబ్కాకు సంతానం కలుగలేదు కాబట్టి ఇస్సాకు ఆమె గురించి యెహోవాకు ప్రార్థన చేశాడు, యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చారు, అతని భార్య రిబ్కా గర్భవతి అయ్యింది.
GEN 25:22 ఆమె గర్భంలో పిల్లలు ఒకరితో ఒకరు పెనుగులాడారు, అందుకు ఆమె, “నాకెందుకు ఇలా జరుగుతుంది?” అని అంటూ యెహోవాను అడగడానికి వెళ్లింది.
GEN 25:23 యెహోవా ఆమెతో ఇలా చెప్పారు, “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి, ఈ రెండు జనాంగాలు నీ గర్భం నుండే వేరుగా ఉంటాయి; ఒక జనం మరొక జనం కంటే బలంగా ఉంటారు. పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు.”
GEN 25:24 ఆమె ప్రసవ కాలం సమీపించినప్పుడు, ఆమె గర్భంలో కవలపిల్లలు ఉన్నారు.
GEN 25:25 మొదట పుట్టినవాడు ఎర్రగా ఉన్నాడు, అతని శరీరమంతా రోమాల వస్త్రంలా ఉంది; కాబట్టి అతనికి ఏశావు అని పేరు పెట్టారు.
GEN 25:26 తర్వాత అతని సోదరుడు, అతని మడిమెను పట్టుకుని బయటకు వచ్చాడు, అతనికి యాకోబు అని పేరు పెట్టారు. రిబ్కా వారికి జన్మనిచ్చినప్పుడు ఇస్సాకు వయస్సు అరవై సంవత్సరాలు.
GEN 25:27 అబ్బాయిలు పెరిగారు, ఏశావు అరణ్యంలో తిరుగుతూ నేర్పుగల వేటగాడయ్యాడు. యాకోబు నెమ్మదస్థుడై గుడారాల్లో నివసించేవాడు.
GEN 25:28 ఇస్సాకు వేటాడిన మాంసం కోరుకునేవాడు, అతడు ఏశావును ప్రేమించేవాడు, కానీ రిబ్కా యాకోబును ప్రేమించేది.
GEN 25:29 ఒక రోజు యాకోబు వంటకం చేస్తున్నపుడు, ఏశావు పొలం నుండి బాగా ఆకలితో వచ్చి,
GEN 25:30 “నేను చాలా ఆకలితో ఉన్నాను, నీవు వండుచున్న ఆ ఎర్రని కూర కొంచెం నాకు పెట్టు!” అని అడిగాడు, (అందుకే అతనికి ఎదోము అని పేరు వచ్చింది.)
GEN 25:31 యాకోబు, “అలా అయితే మొదట నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు అమ్ము” అని అన్నాడు.
GEN 25:32 అప్పుడు ఏశావు, “నేను ఆకలితో చస్తూ ఉంటే నాకు జ్యేష్ఠత్వం దేనికి ఉపయోగం?” అని అన్నాడు.
GEN 25:33 అయితే యాకోబు, “ముందు నాకు ప్రమాణం చేయి” అన్నాడు. కాబట్టి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మివేస్తున్నట్టుగా ప్రమాణం చేశాడు.
GEN 25:34 అప్పుడు యాకోబు కొంత రొట్టె, కొంత కాయధాన్యం వంటకం ఏశావుకు ఇచ్చాడు. అతడు తిని త్రాగి లేచి వెళ్లిపోయాడు. ఈ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు.
GEN 26:1 ఆ దేశంలో అబ్రాహాము కాలంలో వచ్చిన కరువు కాక మరో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులోని ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరకు వెళ్లాడు.
GEN 26:2 యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు, “నీవు ఈజిప్టుకు వెళ్లకు; నేను చెప్పిన దేశంలోనే నివసించు.
GEN 26:3 కొంతకాలం ఈ దేశంలోనే ఉండు, నేను నీకు తోడుగా ఉండి, నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు నీ వారసులకు ఈ దేశాలన్నీ ఇస్తాను, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేరుస్తాను.
GEN 26:4 నీ వారసులను ఆకాశంలోని అనేక నక్షత్రాల్లా విస్తరింపజేసి ఈ దేశాలన్నీ వారికిస్తాను, నీ సంతానం ద్వారా సమస్త భూప్రజలు ఆశీర్వదించబడతారు,
GEN 26:5 ఎందుకంటే అబ్రాహాము నా మాట విని, నేను చెప్పింది చేశాడు, నా ఆజ్ఞలను, కట్టడలను, సూచనలను పాటించాడు.”
GEN 26:6 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు.
GEN 26:7 అక్కడి మనుష్యులు అతని భార్యను చూసి ఆమె ఎవరు అని అతన్ని అడిగితే, “ఆమె నా సోదరి” అని చెప్పాడు, ఎందుకంటే, “ఆమె నా భార్య” అని చెప్పడానికి భయపడ్డాడు. “రిబ్కా అందంగా ఉంది కాబట్టి తనను బట్టి ఈ స్థలం యొక్క మనుష్యులు నన్ను చంపేస్తారు” అని అతడు అనుకున్నాడు.
GEN 26:8 ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్నాడు, ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరసాలాడడం చూశాడు.
GEN 26:9 కాబట్టి అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, “నిజంగా ఈమె నీ భార్య కదా! ‘ఆమె నా సోదరి’ అని ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. ఇస్సాకు, “ఆమె కారణంగా నా ప్రాణం పోతుందేమో అని అనుకున్నాను” అని జవాబిచ్చాడు.
GEN 26:10 అప్పుడు అబీమెలెకు, “నీవు మా పట్ల చేసినదేంటి? ఈ మనుష్యుల్లో ఎవరైనా ఆమెతో శయనించి ఉండేవారు. అప్పుడు నీవు మాపైన అపరాధం తెచ్చిపెట్టేవాడివి” అని అన్నాడు.
GEN 26:11 అప్పుడు అబీమెలెకు ప్రజలందరికి ఆదేశించాడు: “ఎవరైనా ఈ మనుష్యునికి లేదా అతని భార్యకు హాని చేస్తే, వారికి మరణశిక్ష విధించబడును.”
GEN 26:12 ఇస్సాకు ఆ దేశంలో విత్తనాలు విత్తాడు, యెహోవా అతన్ని దీవించారు కాబట్టి, అదే సంవత్సరం అతనికి నూరంతల పంట వచ్చింది.
GEN 26:13 అతడు ధనికుడయ్యాడు, అతడు ఎంతో గొప్పవాడయ్యే వరకు అతని ఆస్తి వృద్ధిచెందుతూ ఉంది.
GEN 26:14 అతనికి మందలు, పశువులు, దాసులు ఎక్కువగా ఉన్నందుకు ఫిలిష్తీయులు అసూయపడ్డారు.
GEN 26:15 అతని తండ్రియైన అబ్రాహాము కాలంలో అతని దాసులు త్రవ్విన బావులన్ని ఫిలిష్తీయులు మట్టితో నింపి పూడ్చేశారు.
GEN 26:16 అబీమెలెకు ఇస్సాకుతో, “నీవు ఇక్కడినుండి వెళ్లిపో; మాకంటే చాలా బలవంతుడవు అయ్యావు” అన్నాడు.
GEN 26:17 కాబట్టి ఇస్సాకు అక్కడినుండి గెరారు లోయకు వెళ్లి, గుడారం వేసుకుని అక్కడ స్థిరపడ్డాడు.
GEN 26:18 తన తండ్రి అబ్రాహాము కాలంలో త్రవ్వించిన బావులను అతడు చనిపోయాక ఫిలిష్తీయులు పూడ్చేసిన వాటిని ఇస్సాకు తిరిగి త్రవ్వించాడు, వాటికి తన తండ్రి పెట్టిన అవే పేర్లు పెట్టాడు.
GEN 26:19 ఇస్సాకు సేవకులు గెరారు లోయలో కూడా త్రవ్వినప్పుడు మంచి నీళ్ల బావి కనుగొన్నారు.
GEN 26:20 అయితే గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో గొడవపడి, “ఈ నీళ్లు మావి!” అని అన్నారు. వారు జగడమాడారు కాబట్టి ఇస్సాకు ఆ బావికి ఏశెకు అని పేరు పెట్టాడు.
GEN 26:21 తర్వాత వారు మరో బావి త్రవ్వారు, కానీ దాని కోసం కూడా గొడవపడ్డారు; కాబట్టి ఆ బావికి శిత్నా అని పేరు పెట్టాడు.
GEN 26:22 అతడు అక్కడినుండి వెళ్లి మరో బావి త్రవ్వించాడు, దాని కోసం ఎలాంటి గొడవ జరగలేదు. అతడు, “ఇప్పుడు యెహోవా మాకు స్థలం ఇచ్చారు, మేము ఈ దేశంలో వర్ధిల్లుతాము” అని ఆ బావికి రహెబోతు అని పేరు పెట్టాడు.
GEN 26:23 అక్కడినుండి అతడు బెయేర్షేబకు వెళ్లాడు.
GEN 26:24 ఆ రాత్రి యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై, “నేను నీ తండ్రి అబ్రాహాము దేవుడను. భయపడకు, నేను నీతో ఉన్నాను; నా సేవకుడైన అబ్రాహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, సంఖ్యాపరంగా నీ వారసులను విస్తరింపజేస్తాను” అని అన్నారు.
GEN 26:25 ఇస్సాకు అక్కడ బలిపీఠం కట్టి యెహోవాను ఆరాధించాడు. అక్కడ తన గుడారం వేసుకున్నాడు, అక్కడే తన సేవకులు బావి త్రవ్వారు.
GEN 26:26 ఇంతలో అబీమెలెకు, అతని స్నేహితుడు అహుజతు, సేనాధిపతి ఫీకోలు, గెరారు నుండి ఇస్సాకు దగ్గరకు వచ్చారు.
GEN 26:27 ఇస్సాకు వారిని, “మీరెందుకు నా దగ్గరకు వచ్చారు, నాకు వ్యతిరేకంగా ఉంటూ నన్ను పంపివేశారు కదా?” అని అడిగాడు.
GEN 26:28 వారు జవాబిస్తూ ఇలా అన్నారు, “యెహోవా నీతో ఉండడం మేము స్పష్టంగా చూశాం; కాబట్టి, ‘మాకు నీకు మధ్య ప్రామాణిక ఒప్పందం ఉండాలి’ అని మేము అనుకున్నాము. కాబట్టి మనం ఒప్పందం చేసుకుందాము.
GEN 26:29 మేము నీకు ఏ హాని చేయలేదు కాని మిమ్మల్ని మంచిగా చూసుకుని సమాధానంతో పంపించాం, కాబట్టి నీవు మాకు ఏ హాని చేయకూడదు. ఇప్పుడు నీవు యెహోవాచేత ఆశీర్వదించబడ్డావు.”
GEN 26:30 అప్పుడు ఇస్సాకు వారికి విందు చేశాడు, వారు తిని త్రాగారు.
GEN 26:31 మర్నాడు వేకువజామున వారు లేచి, ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకున్నారు. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపాడు, వారు అక్కడినుండి సమాధానంతో వెళ్లారు.
GEN 26:32 ఆ రోజు ఇస్సాకు సేవకులు వచ్చి అతనితో వారు త్రవ్విన మరో బావి గురించి ఇలా చెప్పారు. వారు, “మాకు నీళ్లు కనిపించాయి!” అని చెప్పారు.
GEN 26:33 అతడు ఆ బావికి షేబ అని పేరు పెట్టాడు, అందుకే ఇప్పటివరకు ఆ పట్టణం పేరు బెయేర్షేబ.
GEN 26:34 ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో, హిత్తీయుడైన బెయేరి కుమార్తె యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తె బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు.
GEN 26:35 ఈ ఇద్దరు ఇస్సాకు రిబ్కాల దుఃఖానికి కారకులయ్యారు.
GEN 27:1 ఇస్సాకు వృద్ధుడైనప్పుడు, అతడు ఇక చూడలేనంతగా తన కళ్ళు మసకబారినప్పుడు, తన పెద్దకుమారుడైన ఏశావును, “నా కుమారుడా” అని పిలిచాడు. అతడు, “చిత్తం, నేను ఉన్నాను” అని జవాబిచ్చాడు.
GEN 27:2 ఇస్సాకు ఇలా అన్నాడు, “నేను వృద్ధున్ని అని నాకు తెలుసు, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు.
GEN 27:3 కాబట్టి నీవు నీ ఆయుధాలను అంటే నీ అంబులపొదిని విల్లును తీసుకుని అడవికి వెళ్లి జంతువును వేటాడి నాకు మాంసం తెచ్చిపెట్టు.
GEN 27:4 నాకు ఇష్టమైన భోజనం రుచిగా సిద్ధం చేసి తీసుకురా, నేను చనిపోకముందు తిని నిన్ను దీవిస్తాను” అని చెప్పాడు.
GEN 27:5 అయితే ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో మాట్లాడుతున్నప్పుడు రిబ్కా విన్నది. ఏశావు వేటాడేందుకు బహిరంగ పొలానికి వెళ్లిపోయాక,
GEN 27:6 రిబ్కా తన కుమారుడైన యాకోబుతో, “ఇదిగో, నీ తండ్రి నీ అన్న ఏశావుతో చెప్పడం నేను విన్నాను,
GEN 27:7 ‘నేను చనిపోకముందు దానిని తిని యెహోవా సన్నిధిలో నిన్ను దీవిస్తాను’ అందుకు నీవు నా కోసం వేటాడి మాంసం తెచ్చి రుచికరమైన భోజనం సిద్ధం చేసి తీసుకురా అని చెప్పాడు.
GEN 27:8 కాబట్టి నా కుమారుడా! నా మాట జాగ్రతగా విని, నేను చెప్పినట్టు చేయి:
GEN 27:9 మన మందలో నుండి రెండు మంచి మేక పిల్లలను తీసుకురా, నేను నీ తండ్రికి ఇష్టమైన భోజనం వండి పెడతాను.
GEN 27:10 అప్పుడు నీ తండ్రి తినడానికి దానిని తీసుకెళ్లు, అప్పుడు అతడు చనిపోకముందు నిన్ను దీవిస్తాడు” అని చెప్పింది.
GEN 27:11 యాకోబు తన తల్లి రిబ్కాతో, “నా అన్న ఏశావు వెంట్రుకలు గలవాడు, నాకు నునుపైన చర్మం ఉంది.
GEN 27:12 ఒకవేళ నా తండ్రి నన్ను తాకిచూస్తే ఎలా? అతన్ని మోసం చేసినవాడనై, నా మీదికి ఆశీర్వాదానికి బదులు శాపం తెచ్చుకున్నవాన్ని అవుతాను” అని అన్నాడు.
GEN 27:13 అతని తల్లి అతనితో, “నా కుమారుడా, ఆ శాపం నా మీదికే రానివ్వు. కేవలం నేను చెప్పింది చేయి; వెళ్లి వాటిని నా కోసం తీసుకురా” అని చెప్పింది.
GEN 27:14 కాబట్టి అతడు వెళ్లి వాటిని తన తల్లి దగ్గరకు తెచ్చాడు, ఆమె అతని తండ్రికి ఇష్టమైన భోజనం వండింది.
GEN 27:15 తర్వాత రిబ్కా ఇంట్లో ఉన్న తన పెద్దకుమారుడైన ఏశావు యొక్క శ్రేష్ఠమైన బట్టలు తీసుకుని తన చిన్న కుమారుడైన యాకోబుకు తొడిగించింది.
GEN 27:16 ఆమె అతని చేతులను, మెడ దగ్గర ఉండే నునుపైన భాగాలను మేక చర్మంతో కప్పింది.
GEN 27:17 తర్వాత తాను చేసిన రుచిగల భోజనాన్ని, రొట్టెలను యాకోబు చేతికి ఇచ్చింది.
GEN 27:18 యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, “నా తండ్రి” అని పిలిచాడు. “నా కుమారుడా, నీవెవరివి?” అని అతడు అడిగాడు.
GEN 27:19 యాకోబు తన తండ్రితో, “నేను నీ మొదటి కుమారుడనైన ఏశావును, నీవు చెప్పిన ప్రకారం నేను చేశాను. నన్ను ఆశీర్వదించడానికి లేచి, నేను చేసింది తిను” అని అన్నాడు.
GEN 27:20 ఇస్సాకు తన కుమారున్ని, “నా కుమారుడా, ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అని అడిగాడు. యాకోబు, “నీ దేవుడైన యెహోవా నా దగ్గరకు దానిని తీసుకువచ్చారు” అని జవాబిచ్చాడు.
GEN 27:21 అప్పుడు ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, నా దగ్గరకు రా, నేను నిన్ను ముట్టుకొని, నీవు నిజంగా ఏశావువో కాదో తెలుసుకుంటాను” అని అన్నాడు.
GEN 27:22 యాకోబు తండ్రి దగ్గరకు వెళ్లగా, ఇస్సాకు అతన్ని తాకిచూసి, “స్వరం యాకోబు స్వరంలా ఉంది, కాని చేతులు ఏశావులా ఉన్నాయి” అని అన్నాడు.
GEN 27:23 యాకోబు చేతులు తన అన్న ఏశావులా రోమాలు కలిగి ఉన్నాయి కాబట్టి అతడు గుర్తు పట్టలేదు; కాబట్టి అతన్ని దీవించడం ప్రారంభించాడు.
GEN 27:24 “నీవు నిజంగా నా కుమారుడైన ఏశావువేనా?” అని అతడు అడిగాడు. “అవును నేనే” అని అతడు జవాబిచ్చాడు.
GEN 27:25 అప్పుడు అతడు, “నా కుమారుడా, నీవు వండింది కొంత తీసుకురా, నేను తిని నిన్ను దీవిస్తాను” అని అన్నాడు. యాకోబు తెచ్చాడు, అతడు తిన్నాడు; ద్రాక్షరసం తెచ్చాడు, అతడు త్రాగాడు.
GEN 27:26 అప్పుడు అతని తండ్రి ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, దగ్గరకు వచ్చి నాకు ముద్దుపెట్టు” అన్నాడు.
GEN 27:27 కాబట్టి అతడు దగ్గరకు వెళ్లి అతనికి ముద్దుపెట్టాడు. ఇస్సాకు కుమారుని వస్త్రాల వాసనను పసిగట్టి, అతన్ని ఇలా దీవించాడు, “ఆహా, నా కుమారుని వాసన యెహోవా దీవించిన పొలం యొక్క సువాసన
GEN 27:28 దేవుడు నీకు ఆకాశపు మంచును, భూమి యొక్క సారాన్ని, సమృద్ధికరమైన ధాన్యాన్ని, నూతన ద్రాక్షరసాన్ని ఇచ్చును గాక.
GEN 27:29 జనాంగాలు నీకు సేవ చేయాలి, జనాలు నీకు తలవంచాలి. నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు, నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి. నిన్ను శపించేవారు శపించబడతారు నిన్ను దీవించే వారు దీవించబడతారు.”
GEN 27:30 ఇస్సాకు అతన్ని దీవించడం ముగించిన తర్వాత, యాకోబు తండ్రి దగ్గర నుండి వెళ్లీ వెళ్లకముందే, తన సోదరుడు ఏశావు వేటనుండి వచ్చాడు.
GEN 27:31 అతడు కూడా రుచిగల భోజనం వండుకొని తన తండ్రి దగ్గరకు తీసుకువచ్చాడు. అప్పుడతడు, “నా తండ్రి, నన్ను దీవించడానికి నేను వేటాడి తెచ్చిన మాంసంతో సిద్ధం చేసిన భోజనం తిను” అని అతనితో అన్నాడు.
GEN 27:32 అప్పుడు తన తండ్రి ఇస్సాకు, “నీవెవరివి?” అని అడిగాడు. అందుకతడు, “నేను నీ కుమారున్ని, నీ మొదటి సంతానమైన ఏశావును” అని జవాబిచ్చాడు.
GEN 27:33 ఇస్సాకు గజగజ వణకుతూ ఇలా అన్నాడు, “మరీ ఇంతకుముందు వేట మాంసం తెచ్చి పెట్టింది ఎవరు? నీవు రాకముందే నేను తిని అతన్ని దీవించాను; నిజంగా అతడు దీవించబడతాడు!”
GEN 27:34 తన తండ్రి మాట విన్న వెంటనే ఏశావు దుఃఖంతో బిగ్గరగా ఏడ్చి, “నన్ను కూడా దీవించు, నా తండ్రి!” అని అన్నాడు.
GEN 27:35 అయితే అతడు, “నీ తమ్ముడు మోసపూరితంగా వచ్చి నీ దీవెనను తీసుకున్నాడు” అన్నాడు.
GEN 27:36 ఏశావు, “అతనికి యాకోబు అని సరిగ్గానే పేరు పెట్టారు కదా? నన్ను అతడు మోసగించడం ఇది రెండవసారి: నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, ఇప్పుడు నా దీవెనను దొంగిలించాడు! నా కోసం ఒక్క దీవెన కూడా మిగలలేదా?” అని అడిగాడు.
GEN 27:37 ఇస్సాకు జవాబిస్తూ, “నేను అతన్ని నీపై ప్రభువుగా నియమించాను, అతని బంధువులందరినీ అతనికి దాసులుగా చేశాను, సమృద్ధిగా ధాన్యం, ద్రాక్షరసం అతనికి సమకూర్చాను. కాబట్టి నా కుమారుడా! ఇప్పుడు నీకోసం నేను ఏమి చేయగలను?” అని అడిగాడు.
GEN 27:38 అందుకు ఏశావు తన తండ్రితో, “నా తండ్రి, ఒక్క దీవెననే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించు!” అని అంటూ గట్టిగా ఏడ్చాడు.
GEN 27:39 అప్పుడు ఇస్సాకు అతనికి జవాబిస్తూ ఇలా అన్నాడు, “నీ నివాసం సారవంతమైన భూమికి దూరంగా, పైనున్న ఆకాశం యొక్క మంచుకు దూరంగా ఉంటుంది.
GEN 27:40 నీవు నీ ఖడ్గం చేత జీవిస్తావు నీ సోదరునికి సేవ చేస్తావు, అయితే నీవు విశ్రాంతి లేక ఉన్నప్పుడు, నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి పడవేస్తావు.”
GEN 27:41 తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెనను బట్టి ఏశావు తన సోదరుని మీద పగబెట్టుకున్నాడు, “నా తండ్రిని గురించి దుఃఖించే రోజులు సమీపంగా ఉన్నాయి; తర్వాత నా సోదరుడైన యాకోబును చంపేస్తా” అని తనకు తాను అనుకున్నాడు.
GEN 27:42 రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు ఏమన్నాడో తెలుసుకుని, తన చిన్న కుమారుడైన యాకోబును పిలిపించి అతనితో ఇలా అన్నది, “నీ అన్న ఏశావు నిన్ను చంపి ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాడు.
GEN 27:43 కాబట్టి నా కుమారుడా! నేను చెప్పేది విను: హారానులో ఉన్న నా సోదరుడైన లాబాను దగ్గరకు పారిపో.
GEN 27:44 మీ అన్న కోపం తగ్గే వరకు అక్కడ కొంతకాలం అతని దగ్గరే ఉండు.
GEN 27:45 అతని కోపం చల్లారి, నీవు అతనికి చేసింది అతడు మరచిపోయిన తర్వాత, నేను నీకు కబురు పెడతాను. ఒక్క రోజే మీ ఇద్దరిని ఎందుకు పోగొట్టుకోవాలి?”
GEN 27:46 తర్వాత రిబ్కా ఇస్సాకుతో, “ఈ హిత్తీయుల స్త్రీల వలన నేను విసిగిపోయాను. యాకోబు కూడా ఇలాంటి హిత్తీయుల స్త్రీలలా ఈ దేశ స్త్రీని భార్యగా చేసుకుంటే, ఇక నేను బ్రతికి లాభం లేదు” అని అన్నది.
GEN 28:1 ఇస్సాకు యాకోబును పిలిపించి అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు తనకు ఇలా ఆజ్ఞాపించాడు: “కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు.
GEN 28:2 వెంటనే పద్దనరాములో నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లు. అక్కడ నీ తల్లి సోదరుడైన లాబాను కుమార్తెలలో ఒకరిని భార్యగా చేసుకో.
GEN 28:3 సర్వశక్తిగల దేవుడు నిన్ను దీవించి, నిన్ను ఫలభరితంగా చేసి, జనాంగాల సమాజంగా విస్తరించేలా సంఖ్యాపరంగా వృద్ధి చేయును గాక.
GEN 28:4 ఆయన నీకును, నీ వారసులకు అబ్రాహాముకు ఇచ్చిన ఆశీర్వాదం ఇచ్చును గాక, తద్వార నీవు పరదేశిగా ఉన్న ఈ దేశాన్ని, దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశాన్ని నీవు స్వాధీనం చేసుకుంటావు.”
GEN 28:5 తర్వాత ఇస్సాకు యాకోబును పంపివేశాడు. అతడు పద్దనరాముకు, యాకోబు ఏశావుల తల్లియైన రిబ్కా సోదరుడైన లాబాను దగ్గరకు వెళ్లాడు. లాబాను సిరియావాడైన బెతూయేలు కుమారుడు.
GEN 28:6 ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాముకు పంపి అక్కడే అతడు భార్యను చూసుకోవాలని, “కనాను స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు” అని చెప్పాడని, యాకోబు తన తల్లిదండ్రులకు లోబడి పద్దనరాముకు వెళ్లాడని ఏశావు తెలుసుకున్నాడు.
GEN 28:8 అప్పుడు ఏశావు కనాను స్త్రీలంటే తన తండ్రి ఇస్సాకుకు ఇష్టం లేదని గ్రహించాడు;
GEN 28:9 కాబట్టి అతడు తనకున్న భార్యలు కాక ఇష్మాయేలు దగ్గరకు వెళ్లి, అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సోదరియైన మహలతును భార్యగా చేసుకున్నాడు.
GEN 28:10 యాకోబు బెయేర్షేబను విడిచి హారాను వైపు వెళ్లాడు.
GEN 28:11 ఒక స్థలం చేరిన తర్వాత సూర్యాస్తమయం అయినందున రాత్రికి అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉన్న రాళ్లలో ఒకటి తీసుకుని, తలగడగా పెట్టుకుని పడుకున్నాడు.
GEN 28:12 అతడు ఒక కల కన్నాడు, అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి ఆకాశాన్ని అంటి ఉంది. ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.
GEN 28:13 దాని మీద యెహోవా నిలబడి ఇలా అన్నారు: “యెహోవాను నేనే, నీ తాత అబ్రాహాముకు దేవుడను, నీ తండ్రి ఇస్సాకుకు దేవుడను. నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకు, నీ వారసులకు ఇస్తాను.
GEN 28:14 నీ సంతానం భూమిపై ఇసుక రేణువుల్లా అవుతారు, నీవు పడమర, తూర్పు, ఉత్తర, దక్షిణాలకు వ్యాపిస్తావు. భూమిపై ఉన్న సర్వ జనాంగాలు నీ ద్వార, నీ సంతానం ద్వార దీవించబడతారు.
GEN 28:15 నేను నీతో ఉంటాను, నీవు వెళ్లే ప్రతీ చోట నిన్ను సంరక్షిస్తాను, ఈ దేశానికి మళ్ళీ రప్పిస్తాను. నేను నీకు వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నిన్ను విడువను.”
GEN 28:16 యాకోబు నిద్రలేచి, “ఖచ్చితంగా ఈ స్థలంలో యెహోవా ఉన్నారు, నేను అది గ్రహించలేకపోయాను” అని అనుకున్నాడు.
GEN 28:17 అతడు భయపడి ఇలా అన్నాడు, “ఈ స్థలం ఎంత అద్భుతమైనది! ఇది దేవుని మందిరమే కాని ఇంకొకటి కాదు; ఇది పరలోక ద్వారము.”
GEN 28:18 మర్నాడు తెల్లవారినప్పుడు యాకోబు తన తలగడగా పెట్టుకున్న రాయిని తీసుకుని, దానిని స్తంభంగా నిలిపి, దాని మీదుగా నూనె పోశాడు.
GEN 28:19 ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు, ముందు ఆ పట్టణం లూజు అని పిలువబడేది.
GEN 28:20 తర్వాత యాకోబు మ్రొక్కుబడి చేస్తూ ఇలా అన్నాడు, “దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఈ ప్రయాణంలో కాపాడి నాకు తినడానికి ఆహారం ఇచ్చి వేసుకోడానికి వస్త్రాలు ఇచ్చి నన్ను నా తండ్రి ఇంటికి క్షేమంగా చేరిస్తే, యెహోవాయే నా దేవుడుగా ఉంటారు, స్తంభంగా నేను నిలబెట్టిన ఈ రాయి దేవుని మందిరంగా ఉంటుంది. అంతేకాక, నీవు నాకు ఇచ్చే అంతటిలో నుండి నేను నీకు పదవ భాగం ఇస్తాను” అని ఆయనకు మ్రొక్కుబడి చేసుకున్నాడు.
GEN 29:1 యాకోబు తన ప్రయాణం కొనసాగించి తూర్పు ప్రజల దేశానికి వచ్చాడు.
GEN 29:2 అక్కడ ఒక బహిరంగ పొలంలో అతనికి ఒక బావి కనిపించింది. అక్కడ మూడు గొర్రె మందలు దాని దగ్గర పడుకుని ఉన్నాయి, కాపరులు ఆ బావి నీళ్లు వాటికి పెడతారు. ఆ బావి మీద పెద్ద రాయి మూత పెట్టి ఉంది.
GEN 29:3 మందలన్నీ కూడి రాగానే కాపరులు ఆ బావి మీద నుండి రాయిని దొర్లించి, గొర్రెలకు నీళ్లుపెట్టి, రాయి మూతను తిరిగి బావి మీద పెడతారు.
GEN 29:4 యాకోబు కాపరులను చూసి, “సోదరులారా, మీరు ఎక్కడి వారు?” అని అడిగాడు. వారు, “మేము హారాను వారం” అని జవాబిచ్చారు.
GEN 29:5 అతడు, “నాహోరు మనవడు, లాబాను మీకు తెలుసా?” అని వారిని అడిగాడు. వారు, “అవును, తెలుసు” అని చెప్పారు.
GEN 29:6 అప్పుడు యాకోబు, “లాబాను క్షేమమేనా?” అని అడిగాడు. “అవును, అతడు క్షేమమే, అదిగో, అతని కుమార్తె రాహేలు గొర్రెల మందతో వస్తుంది” అని వారు చెప్పారు.
GEN 29:7 యాకోబు, “ఇంకా ప్రొద్దుగుంకలేదు; మందలను తీసుకెళ్లే సమయం కాలేదు. గొర్రెలకు నీళ్లు పెట్టుకోండి, వాటిని మేపుకోండి” అన్నాడు.
GEN 29:8 “మందలన్నీ పోగయ్యేవరకు వాటికి నీళ్లు పెట్టలేము. బావి మీది నుండి రాయి దొర్లిస్తారు, అప్పుడు మేము గొర్రెలకు నీళ్లు పెడతాం” అని వారు జవాబిచ్చారు.
GEN 29:9 యాకోబు వారితో ఇంకా మాట్లాడుతుండగా, రాహేలు తన తండ్రి గొర్రెలతో వచ్చింది, ఆమె కూడా కాపరి.
GEN 29:10 యాకోబు తన మామ లాబాను కుమార్తెయైన రాహేలును, తన మామ మందను చూడగానే, అతడు వెళ్లి బావి మీద ఉన్న రాయిని దొర్లించి తన మామ మందకు నీళ్లు పెట్టాడు.
GEN 29:11 తర్వాత యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని బిగ్గరగా ఏడ్చాడు.
GEN 29:12 అతడు తన తండ్రి బంధువని, రిబ్కా కుమారుడని రాహేలుతో చెప్పాడు. కాబట్టి ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రికి చెప్పింది.
GEN 29:13 తన సోదరి కుమారుడైన యాకోబును గురించిన సమాచారం విన్న వెంటనే, లాబాను అతన్ని కలవడానికి త్వరపడ్డాడు. అతన్ని హత్తుకుని, ముద్దుపెట్టి, తన ఇంటికి తీసుకెళ్లాడు, అక్కడ యాకోబు అన్ని విషయాలు అతనికి చెప్పాడు.
GEN 29:14 లాబాను అతనితో, “నీవు నా సొంత శరీరం, రక్తం” అన్నాడు. ఒక పూర్తి నెల యాకోబు అతనితో ఉన్న తర్వాత,
GEN 29:15 లాబాను అతనితో, “నీవు నా బంధువైనంత మాత్రాన ఏమి తీసుకోకుండ నా కోసం పని చేస్తావా? నీకు జీతంగా ఏమి కావాలో చెప్పు” అని అన్నాడు.
GEN 29:16 లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు; పెద్దకుమార్తె పేరు లేయా, చిన్న కుమార్తె పేరు రాహేలు.
GEN 29:17 లేయాకు బలహీనమైన కళ్లు ఉన్నాయి, కాని రాహేలు రూపవతి, అందగత్తె.
GEN 29:18 యాకోబు రాహేలుతో ప్రేమలో ఉండి, “నీ చిన్న కుమార్తె రాహేలు కోసం నేను నీ దగ్గర ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను” అన్నాడు.
GEN 29:19 లాబాను, “ఆమెను పరాయి మనుష్యునికి ఇవ్వడం కంటే నీకివ్వడం మంచిది. నా దగ్గరే పని చేస్తూ ఉండు” అన్నాడు.
GEN 29:20 యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు, అయితే తనకు రాహేలు పట్ల ఉన్న ప్రేమను బట్టి అతనికి ఆ ఏడు సంవత్సరాలు కొద్దిరోజులే అనిపించింది.
GEN 29:21 తర్వాత యాకోబు లాబానుతో, “నా భార్యను నాకు ఇవ్వు, నా గడువు తీరింది. నేను ఆమెతో పడుకుంటాను” అని అన్నాడు.
GEN 29:22 కాబట్టి లాబాను ఆ ప్రాంత ప్రజలందరినీ సమావేశపరిచి విందు చేశాడు.
GEN 29:23 అయితే అతడు రాత్రివేళలో తన కుమార్తె లేయాను యాకోబుకు ఇచ్చాడు, యాకోబు తనతో పడుకున్నాడు.
GEN 29:24 లాబాను తన దాసి జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చాడు.
GEN 29:25 తెల్లవారినప్పుడు యాకోబు లేచి చూస్తే, అతనితో ఉన్నది లేయా! కాబట్టి యాకోబు లాబానును, “నీవు చేసింది ఏంటి? నేను రాహేలు కోసం నీకు పని చేశాను కదా; నీవు నన్నెందుకు మోసం చేశావు?” అని అడిగాడు.
GEN 29:26 లాబాను జవాబిస్తూ, “పెద్దకుమార్తెకు ముందు చిన్న కుమార్తెను ఇవ్వడం మా ఆచారం కాదు.
GEN 29:27 లేయాతో వైవాహిక వారం గడువు ముగించు. తర్వాత మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేస్తే రాహేలును కూడా నీకిస్తాను” అని అన్నాడు.
GEN 29:28 యాకోబు అలాగే చేశాడు. లేయాతో తన వారం ముగించుకున్న తర్వాత లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు.
GEN 29:29 లాబాను తన దాసి బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చాడు.
GEN 29:30 యాకోబు రాహేలుతో కూడా పడుకున్నాడు, అతడు లేయాకంటే రాహేలును ఎక్కువ ప్రేమించాడు కాబట్టి అతడు లాబాను కోసం ఇంకా ఏడు సంవత్సరాలు పని చేశాడు.
GEN 29:31 లేయా ప్రేమించబడడం లేదని యెహోవా చూసి, ఆమె గర్భవతి అయ్యేలా ఆయన కరుణించారు, కాని రాహేలు గొడ్రాలిగా ఉంది.
GEN 29:32 లేయా గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “యెహోవా నా బాధను చూశారు. ఇప్పుడు తప్పకుండ నా భర్త నన్ను ప్రేమిస్తాడు” అని చెప్పి, అతనికి రూబేను అని పేరు పెట్టింది.
GEN 29:33 ఆమె మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “నేను ప్రేమించబడడం లేదని యెహోవా విన్నారు కాబట్టి, ఇతన్ని కూడా నాకు ఇచ్చారు” అని చెప్పి, అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది.
GEN 29:34 లేయా మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “నా భర్తకు నేను ముగ్గురు కుమారులను కన్నాను కాబట్టి ఇప్పుడు నన్ను అంటిపెట్టుకుని ఉంటాడు” అని ఆమె అతనికి లేవీ అని పేరు పెట్టింది.
GEN 29:35 ఆమె మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను” అని ఆమె అతనికి యూదా అని పెట్టింది. తర్వాత ఆమె పిల్లలు కనడం ఆగిపోయింది.
GEN 30:1 రాహేలు తనకు పిల్లలు కలగడం లేదు అని గ్రహించి, తన అక్క మీద అసూయ పడింది. కాబట్టి యాకోబుతో, “నాకు పిల్లలను ఇవ్వు లేదా నేను చస్తాను!” అని అన్నది.
GEN 30:2 యాకోబు ఆమెపై కోప్పడి, “నేనేమైన నీకు పిల్లలు పుట్టకుండా ఆపిన దేవుని స్థానంలో ఉన్నానా?” అని అన్నాడు.
GEN 30:3 అప్పుడు ఆమె, “ఇదిగో, నా దాసి బిల్హా. ఈమెతో వెళ్లు, తద్వార ఆమె నా కోసం పిల్లలను కంటుంది, ఆమె ద్వార నేను కూడా కుటుంబం కట్టుకుంటాను” అని చెప్పింది.
GEN 30:4 కాబట్టి తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో పడుకున్నాడు.
GEN 30:5 బిల్హా గర్భవతియై అతనికి కుమారుని కన్నది.
GEN 30:6 అప్పుడు రాహేలు, “దేవుడు నాకు శిక్షావిముక్తి చేశారు; నా మొర విని నాకు కుమారుని ఇచ్చారు” అని అన్నది. కాబట్టి అతనికి దాను అని పేరు పెట్టింది.
GEN 30:7 రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతియై యాకోబుకు మరో కుమారున్ని కన్నది.
GEN 30:8 అప్పుడు రాహేలు, “నేను అక్కతో గొప్ప పోరాటం చేశాను, నేను గెలిచాను” అని అన్నది. కాబట్టి అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది.
GEN 30:9 లేయా పిల్లలు కనడం ఆగిపోయింది అని గ్రహించినప్పుడు, తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది.
GEN 30:10 లేయా దాసి జిల్పా యాకోబుకు కుమారున్ని కన్నది.
GEN 30:11 అప్పుడు లేయా, “ఎంత భాగ్యం!” అని అన్నది. కాబట్టి అతనికి గాదు అని పేరు పెట్టింది.
GEN 30:12 లేయా దాసి జిల్పా యాకోబుకు మరో కుమారున్ని కన్నది.
GEN 30:13 అప్పుడు లేయా అన్నది, “నాకు ఎంత సంతోషం! స్త్రీలు నన్ను సంతోషం అని పిలుస్తారు.” కాబట్టి అతనికి ఆషేరు అని పేరు పెట్టింది.
GEN 30:14 గోధుమ కోతకాలంలో రూబేను పొలాలకు వెళ్లాడు, అక్కడ ఉన్న పుత్రదాత వృక్షం పండ్లు కొన్ని తెచ్చి, తల్లి లేయాకు ఇచ్చాడు. రాహేలు లేయాతో, “నీ కుమారుడు తెచ్చిన పండ్లలో కొన్ని నాకు దయచేసి ఇవ్వు” అని అడిగింది.
GEN 30:15 అయితే లేయా ఆమెతో, “నా భర్తను నీవు తీసుకున్నావు, అది చాలదా? ఇప్పుడు నా కుమారుడు తెచ్చిన పండ్లు కూడా కావాలా?” అని అన్నది. రాహేలు, “సరే, నీ కుమారుడు తెచ్చిన పండ్ల కోసం ఈ రోజు నీతో అతడు పడుకోవచ్చు” అని అన్నది.
GEN 30:16 సాయంత్రం యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు, లేయా అతన్ని కలవడానికి వెళ్లింది. “నీవు నాతో పడుకోవాలి, నీకోసం నా కుమారుని పండ్లను ఇచ్చాను” అని అతనితో అన్నది. కాబట్టి ఆ రాత్రి అతడు ఆమెతో పడుకున్నాడు.
GEN 30:17 దేవుడు లేయా మనవి విన్నారు, ఆమె గర్భవతియై అయిదవ కుమారున్ని కన్నది.
GEN 30:18 అప్పుడు లేయా, “నా భర్తకు నా దాసిని ఇచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చారు” అని అన్నది. కాబట్టి అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టింది.
GEN 30:19 ఆమె మరోసారి గర్భవతియై ఆరవ కుమారున్ని కన్నది.
GEN 30:20 అప్పుడు లేయా, “దేవుడు నాకు ప్రశస్తమైన బహుమానం ఇచ్చారు. ఆరుగురు కుమారులను కన్నాను కాబట్టి నా భర్త నన్ను ఘనపరుస్తాడు” అని అన్నది. కాబట్టి అతనికి జెబూలూను అని పేరు పెట్టింది.
GEN 30:21 కొంతకాలం తర్వాత ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు దీనా అని పేరు పెట్టింది.
GEN 30:22 తర్వాత దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నారు; ఆయన ఆమె మనవి విన్నారు, ఆమెకు పిల్లలు పుట్టేలా చేశారు.
GEN 30:23 ఆమె గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “దేవుడు నా నిందను తొలగించారు” అని అన్నది.
GEN 30:24 ఆమె అతనికి యోసేపు అని పేరు పెట్టి, “యెహోవా నాకు ఇంకొక కుమారుని కూడా ఇచ్చును గాక” అని అన్నది.
GEN 30:25 రాహేలు యోసేపుకు జన్మనిచ్చిన తర్వాత, యాకోబు లాబానుతో, “నేను నా స్వదేశానికి వెళ్తాను, నన్ను పంపించు.
GEN 30:26 నా భార్యలను, పిల్లలను నాతో పంపించు. వారి కోసమే నేను నీకు సేవ చేశాను, ఇక నేను వెళ్తాను. నేను ఎంతగా నీకోసం పని చేశానో నీకు తెలుసు” అని అన్నాడు.
GEN 30:27 అయితే లాబాను, “నీకు నాపై దయ ఉంటే, దయచేసి ఉండు. నిన్ను బట్టి యెహోవా నన్ను దీవించారని నేను భవిష్యవాణి ద్వార తెలుసుకున్నాను.
GEN 30:28 నీకెంత జీతం కావాలో అడుగు, ఇస్తాను” అని అన్నాడు.
GEN 30:29 యాకోబు అతనితో, “నీకోసం ఎంత పని చేశానో, నా ఆధీనంలో నీ మంద ఎంత ఎదిగిందో నీకు తెలుసు.
GEN 30:30 నేను రాకముందు నీకున్న కొంచెం ఇప్పుడు చాలా అభివృద్ధి చెందినది, నేను ఏ చోట ఉన్నా యెహోవా నిన్ను దీవించారు. అయితే, నా సొంత ఇంటివారి కోసం నేను ఎప్పుడు సంపాదించుకోవాలి?” అని అన్నాడు.
GEN 30:31 లాబాను, “నీకు ఏమివ్వాలి?” అని అడిగాడు. అందుకు యాకోబు, “నాకు ఈ ఒక్కటి చేస్తే చాలు వేరే ఏమి అక్కర్లేదు. నేను నీ మందను కాపాడుతూ మేపుతాను:
GEN 30:32 ఈ రోజు నేను నీ మందలన్నిటి మధ్య గుండా వెళ్లి పొడలు, మచ్చలు ఉన్న ప్రతి గొర్రెను, గొర్రెపిల్లలలో నల్లవాటిని, మేకలలో మచ్చలు, పొడలు గలవాటిని వేరు చేస్తాను. వాటిని నాకు జీతంగా ఇవ్వు.
GEN 30:33 నీవు నాకు జీతంగా ఇచ్చిన వాటిని పరిశీలించడానికి వచ్చినప్పుడు నేను యథార్థంగా ఉన్నట్లు నీవు చూస్తావు. మచ్చలు, పొడలు లేని మేకలు లేదా నల్ల గొర్రెపిల్లలు నా దగ్గర ఉంటే, అవి నేను దొంగిలించాను అని గ్రహించ వచ్చు” అని అన్నాడు.
GEN 30:34 లాబాను, “సరే, నీ మాట ప్రకారమే కానివ్వు” అని అన్నాడు.
GEN 30:35 ఆ రోజే లాబాను చారలు, మచ్చలు ఉన్న మేకపోతులన్నిటిని పొడలు, మచ్చలు ఉన్న ఆడ మేకలను (తెల్ల మచ్చలు ఉన్నవాటిని), గొర్రెపిల్లలలో నల్లవాటిని వేరుచేసి వాటిని తన కుమారులకు అప్పగించాడు.
GEN 30:36 అప్పుడు అతడు, తనకు యాకోబుకు మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపడం కొనసాగించాడు.
GEN 30:37 అయితే యాకోబు చినారు, బాదం, సాలు అనే చెట్ల కొమ్మలను తీసుకుని ఆ కొమ్మల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచాడు.
GEN 30:38 తర్వాత అతడు మందలు నీళ్లు త్రాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టాలని ఒలిచిన కొమ్మలను వాటి ఎదురుగా ఉండేలా నీళ్లగాళ్లలో పెట్టాడు. మందలు వేడి మీద ఉన్నప్పుడు నీళ్లు త్రాగడానికి వచ్చాయి.
GEN 30:39 అక్కడ అవి ఆ కొమ్మల ముందు చూలు కట్టి చారలు, మచ్చలు, పొడలు ఉన్న పిల్లలను ఈనాయి.
GEN 30:40 యాకోబు మందలో చిన్నవాటిని వేరు చేశాడు, కానీ మిగితా వాటిని లాబాను మందలోని చారలు ఉన్నవాటి వైపు, నల్లనివాటివైపు వాటి ముఖాలు త్రిప్పి ఉంచాడు. ఇలా తన కోసం వేరే మందను చేసుకున్నాడు, వాటిని లాబాను మందలతో కలపలేదు.
GEN 30:41 మందలలో బలమైన ఆడవి వేడి మీద ఉన్నప్పుడు, అవి కొమ్మల దగ్గర చూలు కట్టేలా యాకోబు ఆ కొమ్మలను వాటికి ఎదురుగా నీటి తొట్టిలో పెట్టేవాడు.
GEN 30:42 ఒకవేళ పశువులు బలహీనంగా ఉంటే, వాటిని అక్కడ పెట్టేవాడు కాదు. కాబట్టి బలహీనమైనవి లాబానుకు వెళ్లాయి, బలమైనవి యాకోబుకు వచ్చాయి.
GEN 30:43 ఈ విధంగా యాకోబు ఎంతో అభివృద్ధి చెందాడు, గొప్ప మందలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను సొంతం చేసుకున్నాడు.
GEN 31:1 లాబాను కుమారులు, “యాకోబు మన తండ్రికి ఉన్న ఆస్తి అంతా తీసుకున్నాడు; అతడు సంపాదించుకున్న ఆస్తి అంతా మన తండ్రికి సంబంధించినదే” అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు.
GEN 31:2 లాబాను వైఖరి తన పట్ల ముందు ఉన్నట్లు లేదు అని యాకోబు గ్రహించాడు.
GEN 31:3 అప్పుడు యెహోవా యాకోబుతో, “నీ పూర్వికుల దేశానికి నీ బంధువుల ఇంటికి తిరిగి వెళ్లు, నేను నీతో ఉంటాను” అని చెప్పారు.
GEN 31:4 యాకోబు తన మందలు ఉన్న పొలం దగ్గరకు రమ్మని రాహేలుకు, లేయాకు కబురు పంపాడు.
GEN 31:5 వారితో అన్నాడు, “మీ తండ్రి వైఖరి నా పట్ల ముందులా లేదని నేను గమనించాను, కానీ నా తండ్రి యొక్క దేవుడు నాతో ఉన్నారు.
GEN 31:6 నేను నా బలమంతటితో మీ తండ్రికి సేవ చేశానని మీకు తెలుసు,
GEN 31:7 అయినాసరే మీ తండ్రి నా జీతం పదిసార్లు మార్చి నన్ను మోసగించాడు. కానీ అతడు నాకు హాని చేయడాన్ని దేవుడు అనుమతించలేదు.
GEN 31:8 ఒకవేళ అతడు, ‘పొడలు ఉన్నవి నీ జీతం’ అని అంటే, మందలన్నీ పొడలు గల పిల్లలనే ఈనాయి; ‘చారలు ఉన్నవి నీ జీతం’ అని అంటే, అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలనే ఈనాయి.
GEN 31:9 ఇలా దేవుడు మీ తండ్రి పశువులను తీసుకుని నాకిచ్చారు.
GEN 31:10 “మందలు చూలు కట్టే కాలంలో నాకొక కల వచ్చింది, అందులో మందతో వెళ్లిన మేకపోతులు చారలు, పొడలు లేదా మచ్చలతో ఉండడం నేను చూశాను.
GEN 31:11 కలలో దేవదూత నాతో, ‘యాకోబు’ అని పిలిచాడు. ‘చిత్తం, నేను ఉన్నాను’ అని జవాబిచ్చాను.
GEN 31:12 అతడు నాతో, ‘కళ్ళెత్తి చూడు, మందతో కూడుకుంటున్న మేకపోతులు పొడలు, మచ్చలు లేదా చారలతో ఉన్నాయి, ఎందుకంటే లాబాను నీకు చేసిందంతా నేను చూశాను.
GEN 31:13 నీవు ఎక్కడైతే ఒక స్తంభాన్ని అభిషేకించి నాకు మ్రొక్కుబడి చేసుకున్నావో ఆ బేతేలు యొక్క దేవున్ని నేనే. ఇప్పుడు లేచి ఈ దేశాన్ని విడిచి నీ స్వదేశానికి వెళ్లు’ అని అన్నారు.”
GEN 31:14 అప్పుడు రాహేలు, లేయా జవాబిస్తూ, “మా తండ్రి స్వాస్థ్యంలో మాకు ఇంకా ఏమైనా పాలుపంపులు ఉన్నాయా?
GEN 31:15 అతడు మమ్మల్ని విదేశీయులుగా చూడట్లేదా? మమ్మల్ని అమ్మివేయడమే కాక, మాకు రావలసింది అతనే వాడుకున్నాడు.
GEN 31:16 దేవుడు మా తండ్రి దగ్గర తీసివేసిన ఆస్తి ఖచ్చితంగా మనకు మన పిల్లలకు చెందినది. కాబట్టి దేవుడు నీకేమి చెప్తే అది చేయి” అని అన్నారు.
GEN 31:17 కాబట్టి యాకోబు తన పిల్లలను భార్యలను ఒంటెలపై ఎక్కించి,
GEN 31:18 తన ముందు పశువులను పంపుతూ, తాను పద్దనరాములో సంపాదించుకున్న అన్నిటితో కలిసి, కనాను దేశంలో ఉన్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు బయలుదేరాడు.
GEN 31:19 లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించే పనిమీద వెళ్లినప్పుడు, రాహేలు తన తండ్రి యొక్క గృహదేవతలను దొంగిలించింది.
GEN 31:20 అంతేకాక తాను పారిపోతున్నాడని సిరియావాడైన లాబానుకు చెప్పకుండా యాకోబు మోసం చేశాడు.
GEN 31:21 తన యావదాస్తితో పారిపోయాడు, యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండసీమ వైపు వెళ్లాడు.
GEN 31:22 మూడవ రోజు యాకోబు పారిపోయాడని లాబానుకు తెలియజేయబడింది.
GEN 31:23 లాబాను తన బంధువులను తీసుకుని, యాకోబును ఏడు రోజులు వెంటాడి గిలాదు కొండ సీమలో అతన్ని ఎదుర్కొన్నాడు.
GEN 31:24 రాత్రి దేవుడు కలలో సిరియావాడైన లాబానుకు ప్రత్యక్షమై, “నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏమి అనవద్దు, జాగ్రత్త” అని హెచ్చరించారు.
GEN 31:25 లాబాను యాకోబును ఎదుర్కొన్నప్పుడు యాకోబు గిలాదు కొండ సీమలో తన గుడారం వేసుకున్నాడు, లాబాను అతని బంధువులు కూడా అక్కడే మకాం వేశారు.
GEN 31:26 అప్పుడు లాబాను యాకోబుతో అన్నాడు, “నీవు చేసింది ఏంటి? నన్ను మోసం చేసి, నా కుమార్తెలను యుద్ధంలో చెరగా తీసుకెళ్లావు.
GEN 31:27 నీవెందుకు రహస్యంగా పారిపోయి, నన్ను మోసం చేశావు? మృదంగ సితారాల సంగీతంతో నిన్ను ఆనందంగా పంపేవాన్ని కదా, నాకెందుకు చెప్పలేదు?
GEN 31:28 నేను నా మనవళ్లకు ముద్దుపెట్టనివ్వలేదు, నా కుమార్తెలను సాగనంపనివ్వలేదు. నీవు బుద్ధిలేని పని చేశావు.
GEN 31:29 నీకు హాని చేసే సత్తా నాకు ఉంది; కానీ గత రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు, ‘నీవు యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏమి అనవద్దు, జాగ్రత్త’ అని నన్ను హెచ్చరించారు.
GEN 31:30 సరే, నీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాలన్న ఆశతో నీవు బయలుదేరావు. కానీ నా దేవతలను ఎందుకు దొంగిలించావు?”
GEN 31:31 యాకోబు లాబానుకు జవాబిస్తూ, “నేను భయపడ్డాను, ఎందుకంటే నీవు నీ కుమార్తెలను బలవంతంగా నా నుండి తీసుకెళ్తావని అనుకున్నాను.
GEN 31:32 అయితే ఒకవేళ ఎవరి దగ్గర నీ దేవతల విగ్రహాలు దొరికితే, వారు బ్రతకరు. నీదేదైనా నా దగ్గర ఉన్నదేమో నీ బంధువుల సమక్షంలో వెదుక్కో; ఒకవేళ ఉంటే, తీసుకెళ్లు” అని అన్నాడు. అయితే రాహేలు ఆ దేవతల విగ్రహాలను దొంగిలించిందని యాకోబుకు తెలియదు.
GEN 31:33 లాబాను వెదకడానికి యాకోబు గుడారంలోకి, లేయా గుడారంలోకి, ఇద్దరు దాసీల గుడారాల్లోకి వెళ్లి చూశాడు కానీ అతనికి ఏమీ దొరకలేదు. లేయా గుడారం నుండి బయటకు వచ్చి రాహేలు గుడారంలోకి వెళ్లాడు.
GEN 31:34 రాహేలు ఆ గృహదేవతల విగ్రహాలను ఒంటె సామాగ్రిలో దాచిపెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికాడు కానీ అతనికి ఏమి దొరకలేదు.
GEN 31:35 రాహేలు తన తండ్రితో, “నా ప్రభువా! నాపై కోప్పడకండి, నేను మీ ఎదుట లేవలేను, నేను నెలసరిలో ఉన్నాను” అని చెప్పింది. కాబట్టి లాబాను వెదకినా అతనికి తన గృహదేవతల విగ్రహాలు దొరకలేదు.
GEN 31:36 యాకోబు కోపంతో లాబానుతో వాదన పెట్టుకున్నాడు. “నా నేరమేంటి? నేను ఏం పాపం చేశానని నన్నిలా తరుముతున్నావు?
GEN 31:37 నా సామానంతా వెదికావు కదా, నీ ఇంటికి సంబంధించింది నీకు ఏమి దొరికింది? నీ బంధువుల ఎదుట, మా వారి ఎదుట ఉంచు, వారు మన మధ్యలో తీర్పు తీర్చనివ్వు.
GEN 31:38 “ఇరవై సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలకు, మేకలకు గర్భస్రావం కలుగలేదు లేదా నీ మందలోని పొట్టేళ్లను నేనేమి తినలేదు.
GEN 31:39 అడవి మృగాలు ద్వార చీల్చబడిన జంతువులను నీ దగ్గరకు తేలేదు; ఆ నష్టం నేనే భరించాను. పగలైనా, రాత్రైనా దొంగిలించబడిన దానికి నీవు నన్ను నష్టపరిహారం అడిగావు.
GEN 31:40 నా పరిస్థితి ఇది: పగలు ఎండ రాత్రి చలి నన్ను క్షీణింపజేశాయి, నిద్ర నా కళ్ళకు దూరమైంది.
GEN 31:41 నీ ఇంట్లో ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా ఉండేది. నీ ఇద్దరు కుమార్తెల కోసం పద్నాలుగు సంవత్సరాలు, నీ మంద కోసం ఆరు సంవత్సరాలు పని చేశాను, అయితే నీవు పదిసార్లు నా జీతం మార్చావు.
GEN 31:42 ఒకవేళ నా తండ్రి యొక్క దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడే దేవుడు నాకు తోడుగా లేకపోతే, నీవు నన్ను ఖచ్చితంగా ఖాళీ చేతులతో పంపియుండేవాడివి. కానీ దేవుడు నా ప్రయాసను, నా చేతి కష్టాన్ని చూశారు, గత రాత్రి నిన్ను గద్దించారు.”
GEN 31:43 లాబాను యాకోబుతో, “ఈ స్త్రీలు నా కుమార్తెలు, పిల్లలు నా పిల్లలు, మందలు నా మందలు. అయినా ఇప్పుడు ఈ నా కుమార్తెల గురించి, లేదా వారు కన్న పిల్లల గురించి నేనేమి చేయగలను?
GEN 31:44 ఇప్పుడు రా, మనం నిబంధన చేసుకుందాము. అది మనిద్దరి మధ్య సాక్ష్యంగా ఉంటుంది” అని అన్నాడు.
GEN 31:45 కాబట్టి యాకోబు ఒక రాయిని తీసుకుని దానిని స్తంభంగా నిలబెట్టాడు.
GEN 31:46 అతడు తన బంధువులతో, “కొన్ని రాళ్లు పోగు చేయండి” అని అన్నాడు. వారు రాళ్లు తెచ్చి కుప్పగా పోశారు, ఆ రాళ్లకుప్ప దగ్గర వారు భోజనం చేశారు.
GEN 31:47 లాబాను దానికి యెగర్ శాహదూతా అని పేరు పెట్టాడు, యాకోబు దానికి గలీదు అని పేరు పెట్టాడు.
GEN 31:48 లాబాను, “ఈ రోజున ఈ రాళ్ల గుట్ట నీకు, నాకు మధ్య సాక్షి” అన్నాడు. అందుకే అది గలీదు అని పిలువబడింది.
GEN 31:49 ఈ స్థలం మిస్పా అని కూడా పిలువబడేది, ఎందుకంటే అతడు అన్నాడు, “మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నప్పుడు యెహోవా నాకు నీకు మధ్య జరిగేది గమనించును గాక.
GEN 31:50 నీవు నా కుమార్తెలను బాధ పెడితే లేదా నా కుమార్తెలు ఉన్నా వేరే స్త్రీలను భార్యలుగా చేసుకుంటే, మనతో ఎవరు లేకపోయినా, మన మధ్యలో సాక్షిగా దేవుడు ఉన్నారని గుర్తుంచుకో.”
GEN 31:51 లాబాను ఇంకా యాకోబుతో, “ఇదిగో రాళ్లకుప్ప, ఇదిగో నీకు నాకు మధ్య నిలబెట్టబడి ఉన్న ఈ రాతి స్తంభము.
GEN 31:52 ఈ రాళ్లకుప్ప సాక్షి, ఈ స్తంభం సాక్షి, నీకు హాని చేయడానికి ఈ రాళ్లకుప్ప, స్తంభం దాటి నేను రాను, నాకు హాని చేయడానికి ఈ రాళ్లకుప్ప, స్తంభం దాటి నీవు రావద్దు.
GEN 31:53 అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చును గాక” అని అన్నాడు. కాబట్టి యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడే దేవుని నామంలో ప్రమాణం చేశాడు.
GEN 31:54 అతడు ఆ కొండమీద బలి అర్పించి, బంధువులను భోజనానికి పిలిచాడు. వారు భోజనం చేసిన తర్వాత ఆ రాత్రి అక్కడే గడిపారు.
GEN 31:55 మర్నాడు వేకువజామున లాబాను మనవళ్లను, అతని కుమార్తెలను ముద్దు పెట్టుకుని దీవించాడు. తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.
GEN 32:1 యాకోబు కూడా బయలుదేరి వెళ్తుండగా దేవదూతలు అతన్ని కలిశారు.
GEN 32:2 యాకోబు వారిని చూసి, “ఇది దేవుని సేన!” అని ఆ స్థలానికి మహనయీము అని పెట్టారు.
GEN 32:3 యాకోబు ఎదోము దేశంలోని శేయీరు ప్రాంతంలో ఉన్న తన సోదరుడైన ఏశావు దగ్గరకు తనకంటే ముందు దూతలను పంపాడు.
GEN 32:4 ఆయన వారికి ఇలా సూచించాడు: “నా ప్రభువైన ఏశావుతో మీరు ఇలా చెప్పాలి: ‘మీ సేవకుడైన యాకోబు చెప్తున్నాడు, ఇంతవరకు నేను లాబాను దగ్గరే ఉన్నాను.
GEN 32:5 నాకు మందలు గాడిదలు గొర్రెలు మేకలు, దాసదాసీలు ఉన్నారు. నీ దృష్టిలో దయ పొందడానికి ఇప్పుడు నా ప్రభువుకు ఈ వర్తమానం పంపుతున్నాను.’ ”
GEN 32:6 ఆ దూతలు యాకోబు దగ్గరకు తిరిగివచ్చి, “నీ సోదరుడు ఏశావు దగ్గరకు వెళ్లాం, ఇప్పుడు అతడు నిన్ను కలవడానికి వస్తున్నాడు, అతనితో నాలుగువందలమంది మనుష్యులు ఉన్నారు” అని అన్నారు.
GEN 32:7 ఎంతో భయంతో, బాధతో యాకోబు తనతో ఉన్న ప్రజలను, తన మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు.
GEN 32:8 “ఒకవేళ ఏశావు ఒక గుంపు మీద దాడి చేస్తే, ఇంకొక గుంపు తప్పించుకోవచ్చు” అని అతడు అనుకున్నాడు.
GEN 32:9 తర్వాత యాకోబు ప్రార్థిస్తూ, “నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, ‘నీ దేశానికి, నీ బంధువుల దగ్గరకు వెళ్లు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను’ అని నాతో చెప్పిన యెహోవా,
GEN 32:10 మీరు మీ సేవకునికి చూపిన దయ నమ్మకత్వానికి నేను యోగ్యుడను కాను. నేను యొర్దాను దాటినప్పుడు, నా దగ్గర చేతికర్ర మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు నేను రెండు గుంపులుగా అయ్యాను.
GEN 32:11 దేవా, నా సోదరుడు ఏశావు చేతిలో పడకుండ నన్ను తప్పించు, ఎందుకంటే అతడు వచ్చి నన్ను, నా పిల్లలను వారి తల్లులతో పాటు చంపేస్తాడని నాకు భయమేస్తుంది.
GEN 32:12 కానీ మీరు, ‘నేను ఖచ్చితంగా నిన్ను వృద్ధి చేసి నీ సంతానాన్ని లెక్కించబడలేని సముద్రపు ఇసుక రేణువుల్లా చేస్తాను’ అని అన్నారు” అని ప్రార్థన చేశాడు.
GEN 32:13 ఆ రాత్రి యాకోబు అక్కడే గడిపి తన దగ్గర ఉన్న దాంట్లో నుండి తన అన్నయైన ఏశావుకు కానుక ఇవ్వడానికి పెట్టినవి:
GEN 32:14 రెండువందల మేకలు, ఇరవై మేకపోతులు, రెండువందల గొర్రెలు, ఇరవై పొట్టేళ్లు,
GEN 32:15 ముప్పై పాడి ఒంటెలు వాటి పిల్లలు, నలభై ఆవులు, పది ఎద్దులు, ఇరవై ఆడగాడిదలు, పది మగ గాడిదలు.
GEN 32:16 వాటిని మందలు మందలుగా విభజించి, తన సేవకులకు అప్పగించి, తన సేవకులతో, “మంద మందకు నడుమ ఖాళీ ఉంచి, నాకంటే ముందుగా వెళ్లండి” అని అన్నాడు.
GEN 32:17 వారిలో మొదట నిలబడి ఉన్నవాన్ని ఇలా హెచ్చరించాడు: “నా సోదరుడు ఏశావు మీకు ఎదురై, ‘నీవు ఎవరి సంబంధివి, నీవు ఎక్కడికి వెళ్తున్నావు, నీ ముందు ఉన్న ఈ జంతువులన్నీ ఎవరివి?’ అని అడిగితే,
GEN 32:18 అప్పుడు నీవు ఇలా చెప్పాలి, ‘ఇవి నీ సేవకుడైన యాకోబువి, నా ప్రభువైన ఏశావుకు కానుకగా పంపబడ్డాయి, అతడు వెనుక వస్తున్నాడు.’ ”
GEN 32:19 అతడు మందల వెంట వెళ్తున్న రెండవ వానికి, మూడవ వానికి, మిగతా అందరికి అలాగే సూచించాడు: “మీరు ఏశావును కలిసినప్పుడు అతనితో ఇలాగే చెప్పాలి.
GEN 32:20 నీవు తప్పకుండ ఈ మాట చెప్పాలి, ‘నీ సేవకుడైన యాకోబు మా వెనుక వస్తున్నాడు.’ ” ఎందుకంటే అతడు, “నేను ముందుగా పంపుతున్న ఈ బహుమతులతో నేను అతన్ని శాంతింపజేస్తాను; తర్వాత, నేను అతన్ని చూసినప్పుడు, బహుశ అతడు నన్ను చేర్చుకుంటాడు” అని అనుకున్నాడు.
GEN 32:21 కాబట్టి యాకోబు బహుమతులు తనకు ముందుగా వెళ్లాయి, అయితే తాను మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే ఉన్నాడు.
GEN 32:22 ఆ రాత్రి యాకోబు లేచి తన ఇద్దరు భార్యలను ఇద్దరు దాసీలను పదకొండుగురు పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటి వెళ్లాడు.
GEN 32:23 వారిని ఏరు దాటించి, తనకున్న ఆస్తినంతా వారితో పంపించాడు.
GEN 32:24 యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తెల్లవారే వరకు ఒక మనుష్యుడు అతనితో పెనుగులాడాడు.
GEN 32:25 అతన్ని గెలవలేనని ఆ మనుష్యుడు గ్రహించి, యాకోబు తొడగూటి మీద కొట్టాడు. ఆ మనుష్యునితో పోరాడినందున యాకోబు తొడగూడు సడలింది.
GEN 32:26 అప్పుడు అతడు, “నన్ను వెళ్లనివ్వు, తెల్లవారింది” అన్నాడు. కానీ యాకోబు, “నన్ను దీవిస్తేనే గాని, నిన్ను వెళ్లనివ్వను” అన్నాడు.
GEN 32:27 అప్పుడు ఆ మనుష్యుడు, “నీ పేరేంటి?” అని అడిగాడు. అందుకతడు, “యాకోబు” అని జవాబిచ్చాడు.
GEN 32:28 అప్పుడు ఆ మనుష్యుడు, “ఇకమీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు, ఎందుకంటే నీవు దేవునితో, మనుష్యులతో పోరాడి గెలిచావు” అని అన్నాడు.
GEN 32:29 యాకోబు అన్నాడు, “దయచేసి నీ పేరు నాకు చెప్పు.” కానీ అతడు అన్నాడు, “నా పేరు ఎందుకు అడుగుతున్నావు?” తర్వాత అతడు అక్కడ యాకోబును ఆశీర్వదించాడు.
GEN 32:30 యాకోబు ఆ స్థలానికి పెనీయేలు అని పేరు పెట్టి, “నేను దేవున్ని ముఖాముఖిగా చూశాను, అయినా నా ప్రాణం దక్కింది” అని అన్నాడు.
GEN 32:31 యాకోబు పెనీయేలు నుండి వెళ్లే సమయంలో సూర్యోదయం అయ్యింది, అతడు తొడకుంటుతూ నడిచాడు.
GEN 32:32 కాబట్టి యాకోబు తొడగూటి మీది తుంటినరం మీద దెబ్బ తిన్నాడు కాబట్టి, ఇశ్రాయేలీయులు నేటి వరకు తొడగూటి మీద ఉన్న తుంటినరం తినరు.
GEN 33:1 యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు, ఏశావు తన నాలుగువందలమంది మనుష్యులతో వస్తూ కనిపించాడు; కాబట్టి అతడు పిల్లలను లేయాకు రాహేలుకు ఇద్దరు దాసీలకు పంచి అప్పగించాడు.
GEN 33:2 అతడు దాసీలు, వారి పిల్లలను ముందు ఉంచి, తర్వాత లేయా తన పిల్లలను, చివరిగా రాహేలును, యోసేపును ఉంచాడు.
GEN 33:3 అతడు అందరికంటే ముందు వెళ్తూ, తన సోదరున్ని సమీపించే వరకు ఏడుసార్లు సాష్టాంగపడ్డాడు.
GEN 33:4 అయితే ఏశావు యాకోబును కలవడానికి పరుగెత్తి వెళ్లి అతన్ని హత్తుకున్నాడు; తన చేతులు అతని మెడ మీద వేసి ముద్దు పెట్టుకున్నాడు. వారు ఏడ్చారు.
GEN 33:5 ఏశావు కళ్ళెత్తి స్త్రీలను, పిల్లలను చూశాడు. “నీతో ఉన్న వీరెవరు?” అని అడిగాడు. యాకోబు, “వీరు నీ సేవకునికి దేవుడు దయతో ఇచ్చిన పిల్లలు” అని జవాబిచ్చాడు.
GEN 33:6 అప్పుడు ఆ దాసీలు, వారి పిల్లలు వచ్చి అతనికి నమస్కారం చేశారు.
GEN 33:7 తర్వాత లేయా, ఆమె పిల్లలు వచ్చి నమస్కరించారు. చివరికి యోసేపు, రాహేలు కూడా వచ్చి నమస్కరించారు.
GEN 33:8 ఏశావు, “ఈ మందలు, పశువులన్నీ నాకు ఎందుకు?” అని అడిగాడు. “నా ప్రభువా, నీ దృష్టిలో దయ పొందడానికి” అని యాకోబు అన్నాడు.
GEN 33:9 అయితే ఏశావు, “నా తమ్ముడా, నాకిప్పటికే సమృద్ధిగా ఉంది. నీది నీవే ఉంచుకో” అని అన్నాడు.
GEN 33:10 యాకోబు ఇలా అన్నాడు, “దయచేసి, వద్దు! నీ దృష్టిలో నేను దయ పొందితే, ఈ బహుమానం అంగీకరించాలి. నిన్ను చూస్తే దేవుని ముఖం చూసినట్టే ఉంది, దయతో నీవు నన్ను చేర్చుకున్నావు.
GEN 33:11 దయచేసి నేను తెచ్చిన ఈ కానుకను స్వీకరించు, ఎందుకంటే దేవుడు నన్ను కనికరించారు, నాకు అవసరమైనది నా దగ్గర ఉన్నది.” యాకోబు పట్టుబట్టడంతో ఏశావు దానిని స్వీకరించాడు.
GEN 33:12 అప్పుడు ఏశావు, “మనం వెళ్తూ ఉందాము; నేను మీతో వస్తాను” అని అన్నాడు.
GEN 33:13 కానీ యాకోబు అతనితో, “నా దగ్గర ఉన్నవి పసిపిల్లలు, గొర్రెలు, మేకలు వాటికి పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వీటిని త్వరపెట్టి తోలితే, పశువులన్నీ చస్తాయి.
GEN 33:14 కాబట్టి నా ప్రభువు తన సేవకునికి ముందుగా వెళ్లాలి. నేను శేయీరులో ఉన్న నా ప్రభువు దగ్గరకు వచ్చేవరకు, నా ముందున్న గొర్రెల మందలు పశువుల మందలు, అలాగే ఈ పసిపిల్లలు నడువగలిగిన దానిని బట్టి వాటిని నెమ్మదిగా నడిపిస్తూ తీసుకువస్తాను” అని అన్నాడు.
GEN 33:15 అందుకు ఏశావు, “అలాగైతే నా మనుష్యుల్లో కొందరిని మీతో ఉంచుతాను” అని అన్నాడు. “అలా ఎందుకు? నా ప్రభువు దృష్టిలో దయ ఉంటే చాలు” అని యాకోబు అన్నాడు.
GEN 33:16 కాబట్టి ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం చేశాడు.
GEN 33:17 అయితే యాకోబు మాత్రం సుక్కోతుకు వెళ్లాడు, అక్కడ తన కోసం ఒక ఇల్లు కట్టించుకుని, పశువులకు పాకలు వేశాడు. అందుకే ఆ స్థలం సుక్కోతు అని పిలువబడింది.
GEN 33:18 యాకోబు పద్దనరాము నుండి వచ్చి, క్షేమంగా కనానులో ఉన్న షెకెము పట్టణానికి చేరాడు, ఆ పట్టణం ఎదురుగా గుడారం వేసుకున్నాడు.
GEN 33:19 తాను గుడారం వేసుకున్న స్థలాన్ని షెకెము తండ్రియైన హమోరు కుమారుల దగ్గర వంద వెండి నాణేలకు కొన్నాడు.
GEN 33:20 అక్కడ అతడు బలిపీఠం కట్టాడు, ఆ స్థలానికి ఎల్ ఎలోహి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
GEN 34:1 యాకోబు లేయాలకు పుట్టిన కుమార్తెయైన దీనా ఆ దేశంలోని యువతులను దర్శించడానికి వెళ్లింది.
GEN 34:2 ఆ ప్రాంత పాలకుడు, హివ్వీయుడైన హమోరు కుమారుడైన షెకెము ఆమెను చూశాడు, ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
GEN 34:3 అతడు యాకోబు కుమార్తె దీనాపై మనస్సు పడ్డాడు; ఆ యువతిని అతడు ప్రేమించాడు, ఆమెతో ప్రేమగా మాట్లాడాడు.
GEN 34:4 షెకెము తన తండ్రి హమోరుతో, “ఈ అమ్మాయిని నాకు భార్యగా చేయండి” అని అన్నాడు.
GEN 34:5 యాకోబు తన కుమార్తెయైన దీనా మానభంగం చేయబడి అపవిత్రమైనది అని విన్నప్పుడు, అతని కుమారులు తన మందతో పొలంలో ఉన్నారు; కాబట్టి వారు ఇంటికి వచ్చేవరకు అతడు ఏమి చేయలేదు.
GEN 34:6 అప్పుడు షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి వెళ్లాడు.
GEN 34:7 ఇంతలో యాకోబు కుమారులు జరిగిన సంగతి విన్న వెంటనే పొలాల నుండి వచ్చేశారు. ఇశ్రాయేలులో జరగకూడని దారుణమైన సంఘటన, యాకోబు కుమార్తెను షెకెము బలత్కారం చేశాడని వారు ఆశ్చర్యానికి గురై ఆగ్రహంతో ఉన్నారు.
GEN 34:8 కానీ హమోరు వారితో, “నా కుమారుడు షెకెము మీ కుమార్తె మీద మనస్సు పడ్డాడు. దయచేసి ఆమెను అతనికి భార్యగా ఇవ్వండి.
GEN 34:9 మనం వియ్యమందుకుందాం; మీ కుమార్తెలను మాకు, మా కుమార్తెలను మీకు ఇచ్చి పుచ్చుకుందాము.
GEN 34:10 మీరు మాతో నివసించవచ్చు, ఈ దేశం మీ ఎదుట ఉంది. ఇక్కడ ఉండండి, వ్యాపారం చేయండి, ఆస్తి సంపాదించండి” అని అన్నాడు.
GEN 34:11 తర్వాత షెకెము దీనా తండ్రితో, సోదరులతో, “మీ దృష్టిలో నేను దయ పొందితే మీరు ఏది అడిగినా నేను ఇస్తాను.
GEN 34:12 వధువు కట్నం, నేను తెచ్చే బహుమానం ఎంతైనా సరే, మీరు అడిగింది నేను ఇస్తాను. యువతిని మాత్రం నాకు భార్యగా ఇవ్వండి” అని అడిగాడు.
GEN 34:13 వారి సోదరియైన దీనా మానభంగం చేయబడి అపవిత్రమైనది కాబట్టి యాకోబు కుమారులు షెకెముతో అతని తండ్రి హమోరుతో మోసపూరితంగా జవాబిచ్చారు.
GEN 34:14 వారు అన్నారు, “అలా మేము చేయలేము; సున్నతిలేని మనుష్యునికి మా సోదరిని ఇవ్వలేము. మాకది అవమానము.
GEN 34:15 ఒక షరతుతో మాత్రమే మీతో ఒప్పందం లోనికి వస్తాం; మీ మగవారందరు సున్నతి చేసుకుని మాలాగా మారాలి.
GEN 34:16 అప్పుడు మా కుమార్తెలను మీకు ఇస్తాము, మీ కుమార్తెలను మేము తీసుకుని మీతో నివసిస్తాం, మీతో ఒకే ప్రజలుగా అవుతాము.
GEN 34:17 మీరు సున్నతి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే, మా సోదరిని తీసుకుని వెళ్లిపోతాము.”
GEN 34:18 వారి ప్రతిపాదన హమోరుకు అతని కుమారుడైన షెకెముకు నచ్చింది.
GEN 34:19 ఆ యువకుడు, తన తండ్రి ఇంటి అంతటిలో ఘనత పొందినవాడు, యాకోబు కుమార్తె దీనాను ఎంతో కోరుకున్నాడు కాబట్టి వారు చెప్పింది చేయడానికి ఆలస్యం చేయలేదు.
GEN 34:20 కాబట్టి హమోరు అతని కుమారుడు షెకెము వారి పట్టణ నాయకులతో మాట్లాడడానికి పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లారు.
GEN 34:21 “ఈ మనుష్యులు మనతో స్నేహంగా ఉంటున్నారు” అని వారు అన్నారు. “వారిని మన దేశంలో నివసిస్తూ, వ్యాపారం చేయనిద్దాం; దేశంలో వారి కోసం చాల స్థలం ఉంది. మనం వారి కుమార్తెలను పెళ్ళి చేసుకుందాం, వారు మన వారిని చేసుకుంటారు.
GEN 34:22 అయితే వారు మనతో నివసిస్తూ, మనతో ఒకే ప్రజలుగా ఉండాలంటే మన మగవారందరు వారిలా సున్నతి చేసుకోవాలని ఒక షరతు పెట్టారు.
GEN 34:23 వారి పశువులు, వారి ఆస్తులు, వారి జంతువులన్నీ మనవి అవుతాయి కదా! కాబట్టి వారి షరతులు ఒప్పుకుందాము, వారు మన మధ్య స్థిరపడతారు.”
GEN 34:24 పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లిన మనుష్యులందరు హమోరు, అతని కుమారుడైన షెకెముతో ఏకీభవించారు, పట్టణంలో ప్రతి మగవాడు సున్నతి పొందాడు.
GEN 34:25 మూడు రోజుల తర్వాత, వారు ఇంకా నొప్పితో ఉండగా, యాకోబు కుమారులలో ఇద్దరు, దీనా సోదరులు షిమ్యోను, లేవీ వారి ఖడ్గాలు తీసుకుని, క్షేమంగా ఉన్నాం అని దాడిని కూడా ఊహించని పట్టణం మీద దాడి చేసి, ప్రతి పురుషుని చంపేశారు.
GEN 34:26 వారు హమోరును, అతని కుమారుడైన షెకెమును ఖడ్గంతో చంపి, షెకెము ఇంటి నుండి దీనాను తీసుకెళ్లారు.
GEN 34:27 యాకోబు కుమారులు వారిని చంపి, తమ సోదరి అపవిత్రం చేయబడిన పట్టణాన్ని దోచుకున్నారు.
GEN 34:28 వారి మందలను, పశువులను, గాడిదలను, వారి పట్టణంలో, పొలాల్లో ఉన్న సమస్తాన్ని దోచుకున్నారు.
GEN 34:29 వారి ధనమంతటిని, వారి స్త్రీలనందరిని, పిల్లలందరిని తీసుకెళ్లి, వారి ఇండ్లలో ఉన్నదంతటిని దోచుకున్నారు.
GEN 34:30 అప్పుడు యాకోబు షిమ్యోను, లేవీతో అన్నాడు, “ఈ దేశంలో నివసించే కనానీయులు, పెరిజ్జీయులు నన్ను చెడ్డవానిగా చూసేలా ఈ కష్టం నా మీదికి తెచ్చారు. మేము కొద్ది మందిమి, ఒకవేళ వారు ఏకమై నా మీద దాడి చేస్తే, నేను నా ఇంటివారు నాశనమవుతాము.”
GEN 34:31 అయితే వారు, “మా సోదరి వేశ్యగా పరిగణించబడాలా?” అని జవాబిచ్చారు.
GEN 35:1 దేవుడు యాకోబుతో, “నీవు లేచి, బేతేలుకు వెళ్లి, అక్కడ స్థిరపడు, నీవు నీ సోదరుడైన ఏశావు నుండి పారిపోతున్నప్పుడు నీకు ప్రత్యక్షమైన దేవునికి అక్కడ బలిపీఠం కట్టు” అని అన్నారు.
GEN 35:2 కాబట్టి యాకోబు తన ఇంటివారితో, తనతో ఉన్నవారందరితో అన్నాడు, “మీ దగ్గర ఉన్న ఇతర దేవతలను తీసివేయండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని శుభ్రమైన బట్టలు వేసుకోండి.
GEN 35:3 తర్వాత నాతో బేతేలుకు రండి, అక్కడ నా శ్రమ దినాన నాకు జవాబిచ్చిన దేవునికి బలిపీఠం కడతాను.”
GEN 35:4 కాబట్టి వారు తమ దగ్గర ఉన్న ఇతర దేవతలను, చెవి పోగులను యాకోబుకు ఇచ్చారు, యాకోబు వాటిని షెకెము ప్రాంతంలో ఒక సింధూర వృక్షం క్రింద పాతిపెట్టాడు.
GEN 35:5 తర్వాత వారు బయలుదేరారు. వారి చుట్టూ ఉన్న పట్టణాలకు దేవుని భయం పట్టుకుంది, కాబట్టి వారిని ఎవ్వరూ వెంటాడలేదు.
GEN 35:6 యాకోబు, అతనితో ఉన్న ప్రజలందరు కనాను దేశంలో ఉన్న లూజుకు (అంటే బేతేలుకు) వచ్చారు.
GEN 35:7 అక్కడా అతడు బలిపీఠం కట్టి ఆ స్థలానికి ఎల్ బేతేలు అని పేరు పెట్టాడు. యాకోబు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు ఇక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యారు.
GEN 35:8 ఆ తర్వాత రిబ్కా దాది, దెబోరా చనిపోయింది, బేతేలుకు దిగవ ఉన్న సింధూర వృక్షం క్రింద పాతిపెట్టబడింది. కాబట్టి ఆ వృక్షానికి అల్లోన్ బాకూత్ అని పేరు పెట్టారు.
GEN 35:9 యాకోబు పద్దనరాము నుండి తిరిగి వచ్చాక, దేవుడు అతనికి మరలా ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించారు.
GEN 35:10 దేవుడు అతనితో, “నీ పేరు యాకోబు, కానీ ఇక ఎన్నడు యాకోబుగా పిలువబడవు; నీ పేరు ఇశ్రాయేలు” అని అన్నారు. కాబట్టి ఆయన అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టారు.
GEN 35:11 దేవుడు అతనితో అన్నారు, “నేను సర్వశక్తుడగు దేవుడను; నీవు ఫలించి, సంఖ్యాపరంగా అభివృద్ధి పొందు. ఒక జనం, జనాంగాల సమాజం నీ నుండి వస్తాయి, నీ వారసులలో నుండి రాజులు వస్తారు.
GEN 35:12 అబ్రాహాముకు, ఇస్సాకుకు నేనిచ్చిన దేశాన్ని, నీకు కూడా ఇస్తాను. నీ తర్వాత నీ వారసులకు కూడా ఈ దేశాన్ని ఇస్తాను.”
GEN 35:13 తర్వాత దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి ఆరోహణమయ్యారు.
GEN 35:14 దేవుడు అతనితో మాట్లాడిన స్థలంలో, యాకోబు ఒక రాతి స్తంభాన్ని నిలబెట్టి, దాని మీద పానార్పణం కుమ్మరించాడు; నూనె కూడా దాని మీద పోశాడు.
GEN 35:15 యాకోబు, దేవుడు తనతో మాట్లాడిన ఆ స్థలాన్ని బేతేలు అని పేరు పెట్టాడు.
GEN 35:16 తర్వాత బేతేలు నుండి వారు బయలుదేరి వెళ్లారు. ఎఫ్రాతాకు కొద్ది దూరంలో ఉన్నప్పుడు రాహేలుకు కాన్పు నొప్పులు మొదలయ్యాయి.
GEN 35:17 బిడ్డకు జన్మనివ్వడంలో చాల శ్రమపడింది. మంత్రసాని, “భయపడకమ్మా, నీవు ఇంకొక మగపిల్లవాన్ని కన్నావు” అని చెప్పింది.
GEN 35:18 రాహేలు చనిపోతూ తన కుమారునికి బెన్-ఓని అని పేరు పెట్టింది. కానీ అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.
GEN 35:19 కాబట్టి రాహేలు చనిపోయి, ఎఫ్రాతా (అనగా బేత్లెహేము) మార్గంలో పాతిపెట్టబడింది.
GEN 35:20 యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలబెట్టాడు, అది ఈ రోజు వరకు రాహేలు సమాధిని సూచిస్తుంది.
GEN 35:21 ఇశ్రాయేలు మరలా ప్రయాణించి మిగ్దల్ ఏదెరు అవతల తన గుడారం వేసుకున్నాడు.
GEN 35:22 ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, రూబేను తన తండ్రి ఉంపుడుగత్తెయైన బిల్హాతో శయనించాడు, ఈ సంగతి ఇశ్రాయేలు విన్నాడు.
GEN 35:23 లేయా కుమారులు: యాకోబు మొదటి కుమారుడు రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను.
GEN 35:24 రాహేలు కుమారులు: యోసేపు, బెన్యామీను.
GEN 35:25 రాహేలు దాసి బిల్హా కుమారులు: దాను, నఫ్తాలి.
GEN 35:26 లేయా దాసి జిల్పా కుమారులు: గాదు, ఆషేరు.
GEN 35:27 యాకోబు కిర్యత్-అర్బా (అంటే, హెబ్రోను) దగ్గర ఉన్న మమ్రేలో తన తండ్రి దగ్గరకు వచ్చాడు, అబ్రాహాము, ఇస్సాకు అక్కడే నివసించారు.
GEN 35:28 ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు.
GEN 35:29 అతడు తన తుది శ్వాస విడిచి, చనిపోయి మంచి వృద్ధాప్యంలో తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు. అతని కుమారులు, ఏశావు, యాకోబు అతన్ని పాతిపెట్టారు.
GEN 36:1 ఇది ఏశావు అనగా ఎదోము కుటుంబ వంశావళి:
GEN 36:2 కనాను స్త్రీలలో నుండి ఏశావు తన భార్యలుగా చేసుకున్న వారు: హిత్తీయుడైన ఎలోను కుమార్తెయైన ఆదా, హివ్వీయుడైన సిబ్యోను మనవరాలు, అనా కుమార్తెయైన ఒహోలీబామా,
GEN 36:3 అలాగే నెబాయోతు సోదరి, ఇష్మాయేలు కుమార్తెయైన బాశెమతు.
GEN 36:4 ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది, బాశెమతు రెయూయేలును కన్నది.
GEN 36:5 ఒహోలీబామా యూషు, యాలాము, కోరహులను కన్నది. వీరంత కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కుమారులు.
GEN 36:6 ఏశావు తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన ఇంటి వారందరిని, పశువులను, అన్ని జంతువులను, కనానులో సంపాదించుకున్న వస్తువులన్నిటిని తీసుకుని తన తమ్ముడికి దూరంగా ఉన్న దేశానికి వెళ్లాడు.
GEN 36:7 వారి ఆస్తులు వారు కలిసి ఉండలేనంత గొప్పగా ఉన్నాయి; వారికున్న పశువులను బట్టి వారున్న స్థలం వారికి సరిపోలేదు.
GEN 36:8 కాబట్టి ఏశావు అనగా ఎదోము శేయీరు కొండ సీమలో స్థిరపడ్డాడు.
GEN 36:9 శేయీరు కొండ సీమలో స్థిరపడిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి:
GEN 36:10 ఏశావు కుమారులు: ఏశావు భార్య ఆదా కుమారుడైన ఎలీఫజు, ఏశావు భార్య బాశెమతు కుమారుడైన రెయూయేలు.
GEN 36:11 ఎలీఫజు కుమారులు: తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు.
GEN 36:12 ఏశావు కుమారుడైన ఎలీఫజుకు తిమ్నా అనే ఉంపుడుగత్తె కూడా ఉంది. ఆమె అమాలేకును కన్నది. వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు.
GEN 36:13 రెయూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు.
GEN 36:14 ఏశావు భార్య అనా కుమార్తెయైన సిబ్యోను మనవరాలైన ఒహోలీబామా ద్వారా కలిగిన ఏశావు కుమారులు: యూషు, యాలాము, కోరహు.
GEN 36:15 ఏశావు వారసులలో నాయకులైన వారు వీరు: ఏశావు మొదటి కుమారుడైన ఎలీఫజు కుమారులు: నాయకులైన తేమాను, సెఫో, కనజు, ఓమారు,
GEN 36:16 కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోములో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు.
GEN 36:17 ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు: నాయకులైన నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు ఎదోములో రెయూయేలు నుండి వచ్చిన నాయకులు; వీరు ఏశావు భార్య బాశెమతు యొక్క మనవళ్లు.
GEN 36:18 ఏశావు భార్య ఒహోలీబామా యొక్క కుమారులు: నాయకులైన యూషు, యాలాము, కోరహు. వీరు అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామా నుండి వచ్చిన నాయకులు.
GEN 36:19 వీరు ఏశావు అనగా ఎదోము కుమారులు, వీరు వారి నాయకులుగా ఉన్నవారు.
GEN 36:20 ఆ ప్రాంతంలో నివసిస్తున్న హోరీయుడైన శేయీరు కుమారులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
GEN 36:21 దిషోను, ఏసెరు, దిషాను. ఎదోములో ఉన్న శేయీరు కుమారులైన వీరు హోరీయుల నాయకులు.
GEN 36:22 లోతాను కుమారులు: హోరీ, హోమాము. లోతాను సోదరి తిమ్నా.
GEN 36:23 శోబాలు కుమారులు: అల్వాను, మనహతు, ఏబాలు, షెఫో, ఓనాము.
GEN 36:24 సిబ్యోను కుమారులు: అయ్యా, అనా. ఈ అనా తన తండ్రి గాడిదలను మేపుతూ ఉన్నప్పుడు అరణ్యంలో నీటి ఊటలను కనుగొన్నాడు.
GEN 36:25 అనా సంతానం: కుమారుడైన దిషోను, కుమార్తెయైన ఒహోలీబామా.
GEN 36:26 దిషోను కుమారులు: హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
GEN 36:27 ఏసెరు కుమారులు: బిల్హాను, జవాను, ఆకాను.
GEN 36:28 దిషాను కుమారులు: ఊజు, అరాను.
GEN 36:29 వీరు హోరీయుల నాయకులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
GEN 36:30 దిషోను ఏసెరు దిషాను.
GEN 36:31 ఇశ్రాయేలు రాజులెవరు పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు:
GEN 36:32 బెయోరు కుమారుడైన బేల ఎదోముకు రాజయ్యాడు. అతని పట్టణానికి దిన్హాబా అని పేరు పెట్టబడింది.
GEN 36:33 బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు, బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు.
GEN 36:34 యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు.
GEN 36:35 హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది.
GEN 36:36 హదదు చనిపోయిన తర్వాత, మశ్రేకావాడైన శమ్లా అతని స్థానంలో రాజయ్యాడు.
GEN 36:37 శమ్లా చనిపోయిన తర్వాత, నది తీరాన ఉన్న రహెబోతువాడైన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు.
GEN 36:38 షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు.
GEN 36:39 అక్బోరు కుమారుడైన బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు, అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె.
GEN 36:40 వారి వారి వంశాల ప్రకారం వారి వారి ప్రాంతాల ప్రకారం ఇవి ఏశావు వారసుల నాయకులు పేర్లు: తిమ్నా, అల్వా, యతేతు,
GEN 36:41 ఒహోలీబామా, ఏలహు, పీనోను,
GEN 36:42 కనజు, తేమాను, మిబ్సారు,
GEN 36:43 మగ్దీయేలు, ఈరాము.
GEN 37:1 యాకోబు తన తండ్రి ప్రవాసమున్న కనాను దేశంలో నివసించాడు.
GEN 37:2 యాకోబు వంశావళి వివరాలు ఇవి. యోసేపు పదిహేడు సంవత్సరాల యువకుడు, తన అన్నలతో, తన తండ్రి భార్యలైన బిల్హా జిల్పాల కుమారులతో కలిసి మందలను మేపుతూ ఉండేవాడు. వారు చేసే చెడు పనుల గురించి తండ్రికి చెప్పేవాడు.
GEN 37:3 ఇశ్రాయేలు తన ఇతర కుమారుల కంటే యోసేపును ఎక్కువ ప్రేమించాడు, ఎందుకంటే అతడు తన వృద్ధాప్యంలో పుట్టినవాడు; అతని కోసం ఒక ప్రత్యేకమైన బాగా అలంకరించబడిన అంగీని కుట్టించాడు.
GEN 37:4 తమ తండ్రి అతన్ని తమకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చూసి వారు యోసేపును ద్వేషించారు, అతని క్షేమసమాచారం కూడా అడగలేదు.
GEN 37:5 ఒక రోజు యోసేపుకు ఒక కల వచ్చింది, అది తన అన్నలకు చెప్పినప్పుడు వారతన్ని మరీ ఎక్కువగా ద్వేషించారు.
GEN 37:6 అతడు వారితో, “నాకు వచ్చిన కలను వినండి:
GEN 37:7 మనం పొలంలో వరి పనలు కడుతున్నాము, అప్పుడు అకస్మాత్తుగా నా పన లేచి నిలబడింది, నా పన చుట్టూ మీ పనలు చేరి సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు.
GEN 37:8 అతని అన్నలు అతనితో, “నీవు మమ్మల్ని ఏలాలి అనుకుంటున్నావా? నిజంగా మమ్మల్ని ఏలుతావా?” అని అన్నారు. అతని కలను బట్టి వారు అతన్ని ఇంకా ద్వేషించారు.
GEN 37:9 అతనికి మరో కల వచ్చింది, “వినండి. నాకు ఇంకొక కల వచ్చింది, ఈసారి సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి” అని తన అన్నలకు చెప్పాడు.
GEN 37:10 తన తండ్రికి తన అన్నలకు ఈ కలను గురించి చెప్పినప్పుడు, తన తండ్రి అతని గద్దిస్తూ, “నీకు వచ్చిన ఈ కల ఏంటి? నీ తల్లి, నేను, నీ అన్నలు నీ ఎదుట నిజంగా సాష్టాంగపడాలా?” అని అన్నాడు.
GEN 37:11 యోసేపు అన్నలు అతనిపై అసూయపడ్డారు కానీ అతని తండ్రి ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్నాడు.
GEN 37:12 యోసేపు అన్నలు తమ తండ్రి మందలను మేపడానికి షెకెముకు వెళ్లారు.
GEN 37:13 ఒక రోజు ఇశ్రాయేలు యోసేపుతో, “నీ అన్నలు షెకెము దగ్గర మందలను మేపుతున్నారని నీకు తెలుసు కదా. రా, నేను నిన్ను వారి దగ్గరకు పంపుతాను” అని అన్నాడు. “సరే, మంచిది” అని అతడు జవాబిచ్చాడు.
GEN 37:14 కాబట్టి యాకోబు, “వెళ్లు, నీ అన్నలు, అలాగే మందల యోగక్షేమాలు తెలుసుకుని, వచ్చి నాకు చెప్పు” అని యోసేపుతో అన్నాడు. తర్వాత అతడు హెబ్రోను లోయ నుండి అతన్ని పంపించాడు. యోసేపు షెకెముకు చేరుకున్నప్పుడు,
GEN 37:15 అతడు పొలాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండడం ఒక మనుష్యుడు చూసి, “నీవు ఏం వెదకుతున్నావు?” అని అడిగాడు.
GEN 37:16 యోసేపు జవాబిస్తూ, “నేను మా అన్నల కోసం వెదకుతున్నాను. వారు తమ మందలను ఎక్కడ మేపుతున్నారో మీరు చెప్పగలరా?” అని అడిగాడు.
GEN 37:17 “వారు ఇక్కడినుండి వెళ్లిపోయారు. ‘మనం దోతానుకు వెళ్దాం’ అని వారు అనుకోవడం నేను విన్నాను” అని ఆ వ్యక్తి అన్నాడు. కాబట్టి యోసేపు తన అన్నలను వెదుకుతూ వెళ్లి దోతానులో వారిని కనుగొన్నాడు.
GEN 37:18 అయితే వారు అతన్ని దూరం నుండి చూడగానే, అతడు వారిని చేరకముందే, వారు అతన్ని చంపడానికి కుట్రపన్నారు.
GEN 37:19 “కలలు కనేవాడు వస్తున్నాడు!” అని వారు ఒకరితో ఒకరు అనుకున్నారు.
GEN 37:20 “రండి, వాన్ని చంపి ఈ బావులలో ఒక దాంట్లో పడవేద్దాం, క్రూరమృగం చంపేసిందని చెప్పుదాము. అప్పుడు వీని కలలు ఏమైపోతాయో చూద్దాం” అని అనుకున్నారు.
GEN 37:21 రూబేను ఇది విని, అతన్ని వారి నుండి రక్షించాలని ప్రయత్నించాడు. “మనం అతన్ని చంపొద్దు.
GEN 37:22 రక్తం చిందించవద్దు. అరణ్యంలో ఈ బావిలో వాన్ని పడద్రోయండి కానీ వానికి హానిచెయ్యవద్దు” అని అన్నాడు. యోసేపును వారి నుండి కాపాడి తన తండ్రి దగ్గరకు తిరిగి తీసుకెళ్లడానికి రూబేను ఇలా అన్నాడు.
GEN 37:23 కాబట్టి యోసేపు తన అన్నల దగ్గరకు రాగానే, అతడు వేసుకున్న రంగుల అంగీని చింపేశారు.
GEN 37:24 అతన్ని తీసుకెళ్లి బావిలో పడద్రోసారు. ఆ బావి ఖాళీగా ఉంది; అందులో నీళ్లు లేవు.
GEN 37:25 వారు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, కళ్ళెత్తి చూశారు, గిలాదు నుండి ఇష్మాయేలీయుల వర్తక బాటసారుల గుంపు ఒకటి రావడం కనిపించింది. వారి ఒంటెలు గుగ్గిలం, మస్తకి, బోళం మోస్తూ ఉన్నాయి, వారు వాటిని ఈజిప్టుకు తీసుకెళ్తున్నారు.
GEN 37:26 యూదా తన అన్నలతో, “మన తమ్మున్ని చంపి, అతని రక్తం దాచిపెట్టడం ద్వారా మనకు ఉపయోగం ఏంటి?
GEN 37:27 రండి, వీడిని మనం ఏమి హాని చేయకుండా, ఇష్మాయేలీయులకు అమ్మివేద్దాం; ఎంతైనా మన తమ్ముడు మన సొంత శరీరం కదా” అని అన్నాడు. అతని అన్నలు అందుకు ఒప్పుకున్నారు.
GEN 37:28 కాబట్టి మిద్యాను వర్తకులు అటు వచ్చినప్పుడు, యోసేపును తన అన్నలు బావిలో నుండి బయటకు లాగి ఇరవై షెకెళ్ళ వెండికి ఆ ఇష్మాయేలీయులకు అమ్మివేశారు, వారు అతన్ని ఈజిప్టుకు తీసుకెళ్లారు.
GEN 37:29 రూబేను ఆ బావి దగ్గరకు తిరిగివచ్చి, అక్కడ యోసేపు లేడని చూసి, తన బట్టలు చింపుకున్నాడు.
GEN 37:30 అతడు తన తమ్ముళ్ల దగ్గరకు తిరిగివెళ్లి, “ఆ బాలుడు అక్కడ లేడు! నేనిప్పుడు ఎక్కడికి వెళ్లాలి?” అని అన్నాడు.
GEN 37:31 అప్పుడు వారు యోసేపు అంగీని తీసుకుని, ఒక మేకను చంపి దాని రక్తంలో ముంచారు.
GEN 37:32 వారు ఆ రంగుల అంగీని తమ తండ్రి దగ్గరకు తీసుకెళ్లి, “మాకు ఇది దొరికింది. ఇది నీ కుమారుని చొక్కాయో కాదో చూడండి” అని అన్నారు.
GEN 37:33 అతడు దానిని గుర్తుపట్టి, “ఈ చొక్కా నా కుమారునిదే! ఒక క్రూరమృగం అతన్ని మ్రింగివేసింది. ఖచ్చితంగా యోసేపును ముక్కలు చేసి ఉంటుంది” అని అన్నాడు.
GEN 37:34 అప్పుడు యాకోబు తన బట్టలు చింపుకుని, గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కుమారుని కోసం ఏడ్చాడు.
GEN 37:35 అతని కుమారులు, కుమార్తెలు అందరు అతని ఓదార్చడానికి ప్రయత్నించారు, కానీ అతడు ఓదార్పు పొందలేదు. అతడు వారితో, “లేదు, నేను సమాధిలో నా కుమారుని కలిసే వరకు నేను దుఃఖిస్తాను” అని అన్నాడు. అలా అతడు తన కుమారుని కోసం ఏడ్చాడు.
GEN 37:36 ఇంతలో మిద్యానీయులు యోసేపును, ఈజిప్టులో ఫరో అధికారులలో ఒకడు, రాజ సంరక్షక సేనాధిపతియైన పోతీఫరుకు అమ్మివేశారు.
GEN 38:1 ఆ సమయంలో, యూదా తన సోదరులను విడిచి, హీరా అనే ఒక అదుల్లామీయుని దగ్గర ఉన్నాడు.
GEN 38:2 అక్కడ ఒక కనానీయుడైన షూయ కుమార్తెను కలిశాడు. ఆమెను పెళ్ళి చేసుకుని ఆమెతో లైంగికంగా కలుసుకున్నాడు;
GEN 38:3 ఆమె గర్భవతియై కుమారున్ని కన్నది. అతనికి ఏరు అని పేరు పెట్టారు.
GEN 38:4 ఆమె మరలా గర్భవతియై కుమారుని కన్నది, అతనికి ఓనాను అని పేరు పెట్టింది.
GEN 38:5 ఆమె మరొక కుమారుని కన్నది, అతనికి షేలా అని పేరు పెట్టింది. ఆమె కజీబులో ఇతనికి జన్మనిచ్చింది.
GEN 38:6 యూదా అతని మొదటి కుమారుడైన ఏరుకు తామారుతో పెళ్ళి చేశాడు.
GEN 38:7 కానీ యూదా మొదటి కుమారుడైన ఏరు, యెహోవా దృష్టికి చెడ్డవాడు కాబట్టి యెహోవా అతన్ని మరణానికి గురి చేశారు.
GEN 38:8 అప్పుడు యూదా ఓనానుతో, “నీ అన్న భార్యతో పడుకోని మరిది ధర్మం నిర్వర్తించి నీ అన్నకు సంతానం కలిగేలా చేయి” అని అన్నాడు.
GEN 38:9 అయితే పుట్టే బిడ్డ అతని బిడ్డగా ఉండదని ఓనానుకు తెలుసు; కాబట్టి తన అన్న భార్యతో పడుకున్న ప్రతిసారి, తన అన్నకు సంతానం కలుగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు.
GEN 38:10 అతడు చేసిన పని యెహోవా దృష్టికి చెడ్డదైనందుకు యెహోవా అతన్ని కూడా మరణానికి గురి చేశారు.
GEN 38:11 అప్పుడు యూదా తన కోడలు తామారుతో, “నా కుమారుడు షేలా ఎదిగే వరకు నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని అన్నాడు. ఎందుకంటే అతడు, “తన అన్నల్లా ఇతడు కూడా చనిపోతాడేమో” అని అనుకున్నాడు. కాబట్టి తామారు తన తండ్రి ఇంట్లో ఉండడానికి వెళ్లింది.
GEN 38:12 చాలా కాలం తర్వాత యూదా భార్య, షూయ కుమార్తె చనిపోయింది. యూదా దుఃఖ కాలం తీరిపోయాక, తన గొర్రెబొచ్చు కత్తిరించే వారున్న తిమ్నాకు వెళ్లాడు, అతని స్నేహితుడైన హీరా అనే అదుల్లామీయుడు అతనితో వెళ్లాడు.
GEN 38:13 “నీ మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాకు వెళ్తున్నాడు” అని తామారుకు తెలిసినప్పుడు,
GEN 38:14 తన విధవరాలి బట్టలు తీసివేసి తలమీద ముసుగు వేసుకుని, తిమ్నా మార్గంలో ఉన్న ఎనయీము అనే గ్రామ ప్రవేశం దగ్గర కూర్చుంది. షేలా పెద్దవాడైనా కూడా ఆమె అతనికి భార్యగా ఇవ్వబడలేదు కాబట్టి ఆమె అలా చేసింది.
GEN 38:15 యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకున్నందుకు వేశ్య అనుకున్నాడు.
GEN 38:16 ఆమె తన కోడలని తెలియక, దారిలో ఉన్న ఆమె వైపు వెళ్లి, “రా, నేను నీతో పడుకుంటాను” అని అన్నాడు. “నాతో పడుకోడానికి నాకు ఏమి ఇస్తావు?” అని ఆమె అడిగింది.
GEN 38:17 అతడు, “నా మంద నుండి మేకపిల్లను ఇస్తాను” అని చెప్పాడు. అప్పుడు ఆమె, “అది పంపే వరకు నా దగ్గర ఏదైనా తాకట్టు పెడతావా?” అని అడిగింది.
GEN 38:18 అతడు, “ఏం తాకట్టు పెట్టాలి?” అని అడిగాడు. ఆమె, “నీ ముద్ర, దాని దారం, నీ చేతిలో ఉన్న కర్ర” అని అన్నది. కాబట్టి అతడు అవి ఆమెకు ఇచ్చి ఆమెతో పడుకున్నాడు, అతని ద్వారా ఆమె గర్భవతి అయ్యింది.
GEN 38:19 ఆమె వెళ్లి తన ముసుగు తీసివేసి తిరిగి తన విధవరాలి బట్టలు వేసుకుంది.
GEN 38:20 అంతలో యూదా ఆ స్త్రీ దగ్గర తాకట్టు పెట్టినవి విడిపించుకోడానికి తన స్నేహితుడైన అదుల్లామీయుని ద్వారా మేకపిల్లను పంపాడు కానీ ఆమె అతనికి కనబడలేదు.
GEN 38:21 అక్కడున్న మనుష్యులను, “ఎనయీము దారి ప్రక్కన ఉండే పుణ్యక్షేత్ర వేశ్య ఎక్కడుంది?” అని అడిగాడు. “ఇక్కడ పుణ్యక్షేత్ర వేశ్య ఎవరు లేరు” అని వారన్నారు.
GEN 38:22 కాబట్టి అతడు యూదా దగ్గరకు తిరిగివెళ్లి, “నేను ఆమెను కనుగొనలేదు. అంతేకాక, అక్కడ ఉండే మనుష్యులు, ‘ఇక్కడ పుణ్యక్షేత్ర వేశ్య లేదు’ అని అన్నారు” అని చెప్పాడు.
GEN 38:23 అప్పుడు యూదా, “ఆమె తన దగ్గర ఉన్నవాటిని ఉంచుకోనివ్వండి, లేకపోతే మనం నవ్వుల పాలవుతాము. ఎంతైనా నేను ఆమెకు ఈ మేకపిల్లను పంపాను, కానీ నీకు ఆమె కనబడలేదు” అని అన్నాడు.
GEN 38:24 దాదాపు మూడు నెలలు తర్వాత, “నీ కోడలు తామారు వ్యభిచారిగా అపరాధం చేసింది, ఫలితంగా ఇప్పుడు ఆమె గర్భవతి” అని యూదాకు తెలియజేయబడింది. యూదా అన్నాడు, “ఆమెను బయటకు తీసుకువచ్చి ఆమెను కాల్చి చంపండి!” అని అన్నాడు.
GEN 38:25 ఆమెను బయటకు తీసుకువచ్చినప్పుడు, ఆమె తన మామకు వార్త పంపి, “ఇవి ఎవరికి చెందినవో ఆ యజమాని ద్వార నేను గర్భవతినయ్యాను” అని అన్నది. ఇంకా ఆమె, “ఈ ముద్ర, దారం, కర్ర ఎవరివో గుర్తుపడ్తారేమో చూడండి” అని అన్నది.
GEN 38:26 యూదా అవి తనవేనని గుర్తుపట్టి ఇలా అన్నాడు, “ఆమె నాకంటే నీతిమంతురాలు, ఎందుకంటే నేను ఆమెను నా కుమారుడైన షేలాకు ఇచ్చి పెళ్ళి చేయలేదు.” ఆ తర్వాత అతడు ఆమెతో మరలా ఎప్పుడూ పడుకోలేదు.
GEN 38:27 ఆమె బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.
GEN 38:28 కాన్పు సమయంలో ఒక శిశువు బయటకు వస్తూ చేయి చాచాడు; మంత్రసాని ఎర్రటి నూలుదారం ఆ శిశువు చేతికి కట్టి, “ఇతడు మొదట బయటకు వచ్చినవాడు” అని అన్నది.
GEN 38:29 అయితే ఆ శిశువు చేయి వెనుకకు తీసుకున్నప్పుడు, అతని సోదరుడు బయటకు వచ్చాడు, అప్పుడు ఆమె, “ఇలా నీవు దూసుకుని వచ్చావు!” అన్నది. అతనికి పెరెసు అని పేరు పెట్టారు.
GEN 38:30 తర్వాత చేతికి ఎర్రటి దారం ఉన్నవాడు బయటకు వచ్చాడు. అతనికి జెరహు అని పేరు పెట్టారు.
GEN 39:1 యోసేపు ఈజిప్టుకు కొనిపోబడ్డాడు. ఫరో అధికారులలో ఒకడు, రాజ సంరక్షక సేనాధిపతియైన పోతీఫరు అనే ఈజిప్టువాడు యోసేపును తీసుకెళ్లిన ఇష్మాయేలీయుల దగ్గర అతన్ని కొన్నాడు.
GEN 39:2 యెహోవా యోసేపుతో ఉన్నారు కాబట్టి అతడు వర్ధిల్లాడు, తన ఈజిప్టు యజమాని ఇంట్లో ఉన్నాడు.
GEN 39:3 యెహోవా అతనితో ఉన్నారని, అతడు చేసే ప్రతి పనిలో యెహోవా విజయం ఇచ్చారని అతని యజమాని చూసినప్పుడు
GEN 39:4 యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు, అతనికి వ్యక్తిగత పరిచారకుడయ్యాడు. పోతీఫరు యోసేపును అతని ఇంటికి అధికారిగా నియమించి తనకున్న సమస్తాన్ని అతని పర్యవేక్షణలో పెట్టాడు.
GEN 39:5 తన ఇంటికి, తన సమస్తానికి యోసేపును అధికారిగా నియమించినప్పటి నుండి, యెహోవా ఈజిప్టు యజమాని ఇంటిని ఆశీర్వదించారు. ఇంట్లోనూ, పొలంలోనూ పోతీఫరుకు ఉన్న సమస్తం మీద యెహోవా ఆశీర్వాదం ఉంది.
GEN 39:6 కాబట్టి పోతీఫరు సమస్తాన్ని యోసేపు పర్యవేక్షణలో పెట్టాడు; యోసేపు అధికారిగా ఉన్నందుకు తన భోజనం తప్ప మరి దేని గురించి అతడు పట్టించుకోలేదు. యోసేపు మంచి రూపం కలిగినవాడు, అందగాడు.
GEN 39:7 కొంతకాలం తర్వాత తన యజమాని భార్య అతని మీద కన్నేసి, “నాతో పడుకో!” అని అన్నది.
GEN 39:8 కానీ అతడు తిరస్కరించాడు. “నా యజమాని నన్ను అధికారిగా నియమించి ఇంట్లో నేనున్నాననే నమ్మకంతో తాను నిశ్చింతగా ఉన్నారు. తన సమస్తాన్ని నా పర్యవేక్షణలో ఉంచాడు.
GEN 39:9 ఈ ఇంట్లో నాకన్నా పైవాడు లేడు. మీరు తన భార్య కాబట్టి నా యజమాని మిమ్మల్ని తప్ప మిగతాదంతా నాకు అప్పగించాడు. కాబట్టి దేవునికి విరుద్ధంగా అలాంటి చెడ్డపని నేను ఎలా చేయగలను?” అని అన్నాడు.
GEN 39:10 ప్రతిరోజు ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ, ఆమెతో పడుకోడానికి లేదా ఆమెతో ఉండడానికి కూడా అతడు తిరస్కరించారు.
GEN 39:11 ఒక రోజు అతడు ఇంట్లో తన పనులు చేసుకోవడానికి వెళ్లాడు, అప్పుడు ఇంట్లో పనివారు ఎవరు లేరు.
GEN 39:12 ఆమె అతని అంగీ పట్టుకుని లాగి, “నాతో పడుకో!” అని అన్నది. అయితే అతడు తన అంగీ ఆమె చేతిలో వదిలేసి ఇంట్లోనుండి తప్పించుకుపోయాడు.
GEN 39:13 అతడు తన అంగీని ఆమె చేతిలో వదిలేసి ఇంట్లోనుండి తప్పించుకుపోయాడని చూసి,
GEN 39:14 తన ఇంటి పనివారిని పిలిచి, “చూడండి, నా భర్త మనలను అవమానించాలని ఈ హెబ్రీయున్ని తెచ్చాడు. అతడు నాతో శయనించాలని లోనికి వచ్చాడు కానీ నేను కేకలు పెట్టాను.
GEN 39:15 సహాయం కోసం నేను పెట్టిన కేకలు విని, తన అంగీని నా ప్రక్కన వదిలేసి పారిపోయాడు” అని చెప్పింది.
GEN 39:16 తన యజమాని ఇంటికి వచ్చేవరకు అతని అంగీని ఆమె ప్రక్కనే పెట్టుకుంది.
GEN 39:17 తర్వాత అతనికి ఈ కథ చెప్పింది: “నీవు తీసుకువచ్చిన ఆ హెబ్రీ బానిస నా దగ్గరకు వచ్చి నన్ను లోబరచుకోవాలని చూశాడు.
GEN 39:18 నేను సహాయం కోసం కేకలు పెట్టిన వెంటనే, తన అంగీని నా ప్రక్కన వదిలేసి ఇంట్లోనుండి పారిపోయాడు.”
GEN 39:19 అతని యజమాని, “నీ దాసుడు ఇలా ప్రవర్తించాడు” అని తన భార్య చెప్పిన కథ విని కోపంతో రగిలిపోయాడు.
GEN 39:20 యోసేపు యజమాని అతన్ని రాజద్రోహులనుంచే చెరసాలలో పడవేశాడు. అయితే యోసేపు అక్కడే చెరసాలలో ఉన్నప్పుడు,
GEN 39:21 యెహోవా అతనితో ఉన్నారు; ఆయన అతనిపై దయ చూపించారు, చెరసాల అధికారి దృష్టిలో అతనిపై దయ కలిగించారు.
GEN 39:22 కాబట్టి చెరసాల అధికారి చెరసాలలో ఉన్నవారందరిపై యోసేపుకు అధికారం ఇచ్చాడు, అక్కడ జరిగే అంతటి మీద అతనికి బాధ్యత అప్పగించాడు.
GEN 39:23 చెరసాల అధికారి యోసేపు ఆధీనంలో ఉన్నవాటి గురించి చింతించలేదు, ఎందుకంటే యెహోవా యోసేపుతో ఉన్నారు, అతడు చేసే అన్నిటిలో విజయాన్ని ఇచ్చారు.
GEN 40:1 కొంతకాలం తర్వాత ఈజిప్టు రాజుకు గిన్నె అందించేవాడు రొట్టెలు చేసేవాడు తమ యజమాని పట్ల తప్పు చేశారు.
GEN 40:2 కాబట్టి ఫరో తన ఇద్దరి అధికారులపై అనగా గిన్నె అందించేవారి నాయకునిపై, రొట్టెలు కాల్చేవారి నాయకునిపై కోప్పడి,
GEN 40:3 వారిని అంగరక్షకుల అధికారి ఆధీనంలో, అతని ఇంట్లో ఉంచాడు, అదే చెరసాలలో యోసేపు బంధించబడి ఉన్నాడు.
GEN 40:4 అంగరక్షకుల అధికారి వీరిద్దరిని యోసేపుకు అప్పగించాడు, అతడు వారిని చూసుకున్నాడు. వారు కొంతకాలం వరకు చెరసాలలో ఉన్నప్పుడు,
GEN 40:5 ఈజిప్టు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు చెరలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకే రాత్రి కలగన్నారు. ఇద్దరి కలలకు దేని భావం దానికే ఉంది.
GEN 40:6 మరుసటిరోజు ప్రొద్దున్నే యోసేపు వారి దగ్గరకు వచ్చినప్పుడు, వారు దిగులుగా ఉన్నట్లు గమనించాడు.
GEN 40:7 కాబట్టి అతడు తన యజమాని ఇంట్లో నిర్బంధంలో ఉన్న అధికారులను, “మీరు ఎందుకు ఈ రోజు విచారంగా ఉన్నారు?” అని అడిగాడు.
GEN 40:8 “మా ఇద్దరికి కలలు వచ్చాయి కానీ వాటి భావం చెప్పడానికి ఎవరు లేరు” అని వారు జవాబిచ్చారు. అప్పుడు యోసేపు వారితో, “భావాలు చెప్పడం దేవుని వశం కాదా? మీ కలలు నాకు చెప్పండి” అని అన్నాడు.
GEN 40:9 కాబట్టి గిన్నె అందించేవారి నాయకుడు యోసేపుకు తన కలను చెప్పాడు. అతడు, “నా కలలో నా ఎదుట ఒక ద్రాక్షచెట్టు ఉంది,
GEN 40:10 ఆ ద్రాక్షచెట్టుకు మూడు తీగెలున్నాయి. అది చిగురించి, పూలు పూసింది, దాని గెలలు ద్రాక్షపండ్లతో ఉన్నాయి.
GEN 40:11 ఫరో గిన్నె నా చేతిలో ఉంది, నేను ద్రాక్షపండ్లు తీసుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి అతని చేతికి ఆ గిన్నెను ఇచ్చాను” అని చెప్పాడు.
GEN 40:12 యోసేపు అతనితో, “దాని అర్థం ఇది. మూడు తీగెలు మూడు రోజులు.
GEN 40:13 మూడు రోజుల్లో ఫరో నీ తల పైకెత్తి నీ స్థానం నీకు మరలా ఇస్తాడు, గతంలో నీవు గిన్నె అందించే వానిగా ఉన్నప్పుడు చేసినట్టు, ఫరో గిన్నెను అతనికి చేతికి అందిస్తావు.
GEN 40:14 నీకు అంతా మంచి జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు దయ చూపించు; ఫరోతో నా గురించి మాట్లాడి నన్ను ఈ చెరసాల నుండి బయటకు రప్పించు.
GEN 40:15 హెబ్రీ దేశం నుండి బలవంతంగా నన్ను దొంగిలించి తీసుకువచ్చారు, నేను చెరసాలలో ఉండడానికి చేసిన నేరం ఏమి లేదు” అని చెప్పాడు.
GEN 40:16 యోసేపు అనుకూలంగా భావం చెప్పాడు అని గమనించిన రొట్టెలు కాల్చేవాడు యోసేపుతో, “నాకు కూడా కల వచ్చింది: నా తలమీద రొట్టెలు ఉన్న మూడు గంపలు ఉన్నాయి.
GEN 40:17 పై గంపలో ఫరో కోసం అన్ని రకాల మంచి వంటకాలున్నాయి, కానీ పక్షులు వచ్చి, నా తలమీద ఉన్న గంపలో నుండి తింటున్నాయి” అని చెప్పాడు.
GEN 40:18 యోసేపు అన్నాడు, “దాని అర్థం ఇది. మూడు గంపలు మూడు రోజులు.
GEN 40:19 మూడు రోజుల్లో ఫరో నీ తలను తీసివేసి, నీ శరీరాన్ని స్తంభానికి వ్రేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తినివేస్తాయి.”
GEN 40:20 మూడవ రోజు ఫరో పుట్టిన రోజు, అతడు తన అధికారులందరికి విందు ఏర్పాటు చేశాడు. అధికారులందరి ఎదుట గిన్నె అందించేవారి నాయకుడి, రొట్టెలు కాల్చేవాని నాయకుడి తలలను పైకెత్తాడు:
GEN 40:21 గిన్నె అందించేవారి నాయకున్ని అతని స్థానం తిరిగి ఇచ్చాడు కాబట్టి మరలా అతడు ఫరో చేతికి గిన్నె అందించాడు.
GEN 40:22 కానీ యోసేపు కల భావం చెప్పినట్టే, అతడు రొట్టెలు కాల్చేవారి నాయకున్ని వ్రేలాడదీశాడు.
GEN 40:23 అయితే గిన్నె అందించేవారి నాయకుడు యోసేపును జ్ఞాపకం చేసుకోలేదు; అతన్ని మరచిపోయాడు.
GEN 41:1 రెండు సంవత్సరాల ముగిసిన తర్వాత ఫరో కలగన్నాడు: అతడు నైలు నది దగ్గర నిలబడి ఉన్నాడు,
GEN 41:2 నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి.
GEN 41:3 వాటి తర్వాత, చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు వాటి ప్రక్కన నైలు నది ఒడ్డున నిలబడ్డాయి.
GEN 41:4 చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు అందంగా పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి. అప్పుడు ఫరో నిద్రలేచాడు.
GEN 41:5 మళ్ళీ అతడు పడుకున్నాడు, రెండవ కలగన్నాడు: పుష్టిగా, మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కొమ్మకు పెరుగుతున్నాయి.
GEN 41:6 వాటి తర్వాత పీలగా, తూర్పుగాలికి ఎండిపోయిన మరో ఏడు వెన్నులు పెరిగాయి.
GEN 41:7 పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. అప్పుడు ఫరో నిద్రలేచాడు; అది కల అని గ్రహించాడు.
GEN 41:8 ఉదయం అతని మనస్సు కలవరపడింది, కాబట్టి ఈజిప్టులోని మాంత్రికులను, జ్ఞానులను అందరిని పిలిపించాడు. ఫరో తన కలలు వారికి చెప్పాడు, కానీ వాటి భావం ఎవరు చెప్పలేకపోయారు.
GEN 41:9 అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు ఫరోతో అన్నాడు, “ఈ రోజు నా తప్పులు నాకు జ్ఞాపకం చేయబడ్డాయి.
GEN 41:10 ఫరో ఒకసారి తన సేవకులపై కోప్పడి, నన్ను రొట్టెలు కాల్చేవారి నాయకున్ని అంగరక్షకుల అధిపతి ఇంట్లో నిర్బంధంలో ఉంచారు.
GEN 41:11 మా ఇద్దరికి ఒకే రాత్రి కలలు వచ్చాయి, ఒక్కొక్క కలకు ఒక్కొక్క అర్థం ఉంది.
GEN 41:12 అక్కడ మాతో పాటు ఒక హెబ్రీ యువకుడు ఉన్నాడు. అతడు అంగరక్షకుల అధికారికి దాసుడు. మా కలలు అతనికి చెప్పాం, అతడు ఎవరి కల భావాన్ని వారికి చెప్పాడు.
GEN 41:13 అతడు వాటిని వివరించినట్టే మాకు జరిగింది: నా స్థానం నాకు తిరిగి వచ్చింది, మరో వ్యక్తి వ్రేలాడదీయబడ్డాడు.”
GEN 41:14 అప్పుడు ఫరో యోసేపును పిలిపించాడు, వారు అతన్ని చెరసాల నుండి త్వరగా తీసుకువచ్చారు. యోసేపు శుభ్రంగా క్షౌరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో సమక్షంలో నిలబడ్డాడు.
GEN 41:15 ఫరో యోసేపుతో, “నేనొక కలగన్నాను, దాని భావం ఎవరూ చెప్పలేకపోయారు. కానీ నీవు ఒక కల వింటే దాని భావం చెప్తావని నీ గురించి విన్నాను” అని అన్నాడు.
GEN 41:16 అందుకు యోసేపు, “నేను చేయలేను, అయితే ఫరోకు క్షేమకరమైన జవాబు దేవుడు ఇస్తారు” అని ఫరోతో అన్నాడు.
GEN 41:17 అప్పుడు ఫరో యోసేపుతో అన్నాడు, “నా కలలో నేను నైలు నది తీరాన నిలబడ్డాను,
GEN 41:18 నదిలో నుండి పుష్టిగా అందంగా ఉన్న ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ము మధ్య మేస్తున్నాయి.
GEN 41:19 వాటి తర్వాత చిక్కిపోయి వికారంగా ఉన్న మరో ఏడు ఆవులు పైకి వచ్చాయి. అంత వికారమైన ఆవులను ఈజిప్టులో నేనెప్పుడు చూడలేదు.
GEN 41:20 బక్కగా వికారంగా ఉన్న ఆవులు ముందు వచ్చిన పుష్టిగా ఉన్న ఏడు ఆవులను తినివేశాయి.
GEN 41:21 కానీ అవి తిన్నా కూడా అవి తిన్నాయని ఎవరు చెప్పలేరు; అవి ముందు ఉన్నట్లే వికారంగా ఉన్నాయి. అప్పుడు నేను నిద్రలేచాను.
GEN 41:22 “నా కలలో పుష్టిగా మంచిగా ఉన్న ఏడు వెన్నులు ఒకే కాడకు పెరుగుతున్నాయి.
GEN 41:23 వాటి తర్వాత పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన మరో పీలవెన్నులు వాటి తర్వాత మొలిచాయి.
GEN 41:24 పీలవెన్నులు పుష్టిగా ఉన్న ఏడు వెన్నులను మ్రింగివేశాయి. ఇది మాంత్రికులకు చెప్పాను, కానీ దాని అర్థాన్ని చెప్పేవారు ఎవరూ లేరు.”
GEN 41:25 అప్పుడు యోసేపు ఫరోకు చెప్పాడు, “ఫరో కలల భావం ఒక్కటే. దేవుడు ఏమి చేయబోతున్నారో ఫరోకు తెలియజేశారు.
GEN 41:26 ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు, అలాగే ఏడు మంచి వెన్నులు ఏడు సంవత్సరాలు; రెండు కలల భావం ఒకటే.
GEN 41:27 వాటి తర్వాత వచ్చిన చిక్కిపోయి వికారంగా ఉన్న ఏడు ఆవులు ఏడు సంవత్సరాలు, పీలగా తూర్పుగాలికి ఎండిపోయిన ఏడు వెన్నులు కూడా అవే ఏడు సంవత్సరాలు; అవి ఏడు సంవత్సరాలు కరువు కాలము.
GEN 41:28 “నేను ఫరోకు చెప్పినట్టే జరుగుతుంది. దేవుడు తాను ఏమి చేయబోతున్నారో ఫరోకు చూపించారు.
GEN 41:29 ఈజిప్టు దేశమంతటా గొప్ప సమృద్ధిగల ఏడు సంవత్సరాలు రాబోతున్నాయి.
GEN 41:30 కానీ వాటి తర్వాత ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ సమయంలో ఈజిప్టులో ఉండే సమృద్ధి అందరు మరిచిపోతారు, కరువు దేశాన్ని నాశనం చేస్తుంది.
GEN 41:31 తర్వాత వచ్చే కరువు ఇంకా తీవ్రంగా ఉంటుంది కాబట్టి దేశంలో ఉండిన సమృద్ధి ఎవరికీ జ్ఞాపకం ఉండదు.
GEN 41:32 కల రెండు విధాలుగా ఫరోకు ఇవ్వబడిన కారణం ఏంటంటే ఇది దేవునిచే దృఢంగా నిర్ణయించబడింది, దేవుడు త్వరలో దానిని చేస్తారు.
GEN 41:33 “ఇప్పుడు ఫరో జ్ఞాన వివేచనలు కలిగిన ఒక వ్యక్తిని ఈజిప్టు అంతటి మీద అధికారిగా నియమించాలి.
GEN 41:34 సమృద్ధిగా పండే ఏడు సంవత్సరాల్లో పంటలో అయిదవ భాగాన్ని సేకరించడానికి ఫరో దేశమంతా పర్యవేక్షకులను నియమించాలి.
GEN 41:35 వారు ఈ మంచి సంవత్సరాల్లో పండే ధాన్యం సేకరించి ఫరో ఆధీనంలో పట్టణాల్లో ఆహారం ఉండేలా నిలువచేయాలి.
GEN 41:36 ఈ ఆహారం దేశం కోసం నిలువచేయబడి ఈజిప్టు మీదికి వచ్చే ఏడు సంవత్సరాల కరువు కాలంలో ఉపయోగించబడుతుంది, అప్పుడు కరువు ద్వారా దేశం నాశనం కాదు.”
GEN 41:37 ఈ మాట ఫరోకు అతని అధికారులకు నచ్చింది.
GEN 41:38 కాబట్టి ఫరో వారిని, “ఇతనిలా దేవుని ఆత్మ కలిగిన వారెవరినైనా కనుగొనగలమా?” అని అడిగాడు.
GEN 41:39 అప్పుడు ఫరో యోసేపుతో, “దేవుడు నీకు ఇదంతా తెలియజేశారు కాబట్టి, నీలా వివేచన జ్ఞానం కలిగిన వారెవరూ లేరు.
GEN 41:40 నా రాజభవన అధికారిగా నీవు ఉంటావు, నా ప్రజలంతా నీ ఆదేశాలకు లోబడతారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీ పైవాడిగా ఉంటాను” అని అన్నాడు.
GEN 41:41 కాబట్టి ఫరో యోసేపుతో, “నేను నిన్ను ఈజిప్టు దేశమంతటికి అధికారిగా ప్రకటిస్తున్నాను” అని అన్నాడు.
GEN 41:42 ఫరో తన రాజముద్ర ఉంగరం తీసి యోసేపు వ్రేలికి పెట్టాడు. సన్నని నారబట్టలు అతనికి తొడిగించాడు, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు.
GEN 41:43 తన రెండవ రథంలో అతన్ని కూర్చోబెట్టాడు, అప్పుడు ప్రజలు, “నమస్కారం చేయండి!” అని అంటూ అతని ముందు కేకలు వేశారు. ఈ విధంగా అతడు యోసేపును దేశమంతటిమీద అధికారిగా చేశాడు.
GEN 41:44 అప్పుడు ఫరో యోసేపుతో, “నేను ఫరోను, కానీ నీ అనుమతి లేకుండా ఈజిప్టు అంతటిలో ఎవరు కూడా తన చేయి కానీ కాలు కానీ ఎత్తరు” అని అన్నాడు.
GEN 41:45 ఫరో యోసేపుకు జఫెనత్-ఫనేహు అనే పేరు పెట్టాడు, ఓనులో యాజకుడైన పోతీఫెర కుమార్తె, ఆసెనతును అతనికి భార్యగా ఇచ్చాడు. యోసేపు ఈజిప్టు దేశమంతటా పర్యటించాడు.
GEN 41:46 యోసేపు ఈజిప్టు రాజైన ఫరో సేవ మొదలుపెట్టినప్పుడు అతని వయస్సు ముప్పై సంవత్సరాలు. యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి, ఈజిప్టు దేశమంతా సంచరించాడు.
GEN 41:47 ఏడు సమృద్ధిగల సంవత్సరాల్లో భూమిపై విస్తారమైన పంట పండింది.
GEN 41:48 యోసేపు ఈజిప్టులో ఆ ఏడు సంవత్సరాల పంటనంతా సేకరించి పట్టణాల్లో నిల్వచేశాడు. ప్రతి పట్టణం చుట్టూ ఉన్న పొలాల్లో సేకరించిన ధాన్యాన్ని ఆ పట్టణాల్లోనే నిల్వచేశాడు.
GEN 41:49 యోసేపు సముద్రతీరాన ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిలువచేశాడు; అది విస్తారంగా ఉంది కాబట్టి దాన్ని కొలవడం ఆపేశాడు.
GEN 41:50 కరువు సంవత్సరాలకు ముందు యోసేపుకు ఓనులో యాజకుడైన పోతీఫెర కుమార్తె, ఆసెనతు ద్వారా ఇద్దరు కుమారులు పుట్టారు.
GEN 41:51 తన మొదటి కుమారునికి యోసేపు మనష్షే అని పేరు పెట్టి, “దేవుడు నా కష్టాలన్నీ, నా తండ్రి ఇంటివారందరినీ మరచిపోయేలా చేశారు” అని అన్నాడు.
GEN 41:52 రెండవ కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టి, “నాకు శ్రమలు కలిగిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశారు” అని అన్నాడు.
GEN 41:53 ఈజిప్టులో సమృద్ధి కలిగిన ఏడు సంవత్సరాలు ముగిశాయి,
GEN 41:54 యోసేపు చెప్పినట్టే ఏడు సంవత్సరాల కరువు ప్రారంభమయ్యింది. ఇతర దేశాల్లో కరువు ఉన్నది కానీ ఈజిప్టు దేశమంతా ఆహారం ఉంది.
GEN 41:55 ఈజిప్టు అంతా కరువు అనుభవించడం ప్రారంభమైనప్పుడు, ఆహారం కోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. అప్పుడు ఫరో ఈజిప్టు వారందరితో, “యోసేపు దగ్గరకు వెళ్లి అతడు చెప్పినట్టు చేయండి” అని చెప్పాడు.
GEN 41:56 దేశమంతటా కరువు వ్యాపించినప్పుడు, యోసేపు ధాన్య కొట్లన్నీ తెరిచి, ఈజిప్టువారికి ధాన్యం అమ్మాడు, ఎందుకంటే ఈజిప్టు దేశంలో కరువు చాలా తీవ్రంగా ఉంది.
GEN 41:57 లోకమంతా ఈజిప్టుకు వచ్చి యోసేపు దగ్గర ధాన్యం కొనుగోలు చేశారు, ఎందుకంటే కరువు అంతటా తీవ్రంగా ఉంది.
GEN 42:1 యాకోబు ఈజిప్టులో ధాన్యం ఉందని తెలుసుకుని, తన కుమారులతో, “ఎందుకు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు?
GEN 42:2 ఈజిప్టులో ధాన్యం ఉందని నేను విన్నాను. అక్కడికి వెళ్లి మన కోసం కొంత ధాన్యం కొనుక్కురండి, అప్పుడు మనం చావకుండ బ్రతుకుతాం” అని అన్నాడు.
GEN 42:3 అప్పుడు యోసేపు సోదరులు పదిమంది ధాన్యం కొనడానికి ఈజిప్టుకు వెళ్లారు.
GEN 42:4 అయితే యాకోబు యోసేపు తమ్ముడైన బెన్యామీనును పంపలేదు ఎందుకంటే అతనికి ఏదైన హాని కలుగుతుందని భయపడ్డాడు.
GEN 42:5 కాబట్టి ఇశ్రాయేలు కుమారులు కూడా ధాన్యం కొనుగోలు చేయడానికి వచ్చారు ఎందుకంటే, కనాను దేశంలో కూడా కరువు వచ్చింది.
GEN 42:6 అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారిగా ఉంటూ, ఆ దేశ ప్రజలందరికి ధాన్యం అమ్మేవాడు. యోసేపు అన్నలు వచ్చి అతనికి సాష్టాంగపడి నమస్కారం చేశారు.
GEN 42:7 యోసేపు వారిని చూసిన వెంటనే, వారిని గుర్తుపట్టాడు కాని తెలియనట్లుగా నటిస్తూ వారితో కఠినంగా మాట్లాడాడు. “మీరెక్కడ నుండి వచ్చారు?” అని అతడు అడిగాడు. వారు, “కనాను దేశం నుండి ఆహారం కొనడానికి వచ్చాం” అని జవాబిచ్చారు.
GEN 42:8 యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు కాని వారతన్ని గుర్తు పట్టలేదు.
GEN 42:9 వారి గురించి తాను కన్న కలలు యోసేపు జ్ఞాపకం చేసుకుని, “మీరు వేగులవారు. మా దేశానికి చెందిన భద్రత రహస్యాలు తెలుసుకోడానికి వచ్చారు” అని వారితో అన్నాడు.
GEN 42:10 వారు, “లేదు ప్రభువా, మీ దాసులమైన మేము ఆహారం కొనడానికి వచ్చాము.
GEN 42:11 మేమంతా ఒక్క మనుష్యుని కుమారులము. నీ దాసులమైన మేము యథార్థవంతులం, వేగులవారం కాము” అని అన్నారు.
GEN 42:12 “లేదు! మా దేశ భద్రత రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చారు” అని యోసేపు వారితో అన్నాడు.
GEN 42:13 అందుకు వారు, “నీ దాసులమైన మేము పన్నెండుమంది అన్నదమ్ములం, ఒక్క మనుష్యుని కుమారులం, కనాను దేశంలో నివసిస్తాము. మాలో చిన్నవాడు మా తండ్రి దగ్గరే ఉన్నాడు, ఇంకొకడు చనిపోయాడు” అన్నారు.
GEN 42:14 అప్పుడు యోసేపు వారితో, “నేను మీతో చెప్పిందే నిజం: మీరు వేగులవారే!
GEN 42:15 ఫరో జీవం తోడు, మీ తమ్ముడు ఇక్కడకు వస్తేనే తప్ప మీరు ఈ స్థలం విడిచి వెళ్లడానికి వీల్లేదు.
GEN 42:16 మీ తమ్మున్ని తీసుకురావడానికి మీలో ఒకర్ని పంపి మిగిలినవారు జైల్లో ఉండాలి, అప్పుడు మీ మాటల్లో సత్యం ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ లేకపోతే ఫరో జీవం తోడు, మీరు వేగులవారే!” అని అన్నాడు.
GEN 42:17 అతడు వారిని మూడు రోజుల వరకు జైల్లో ఉంచాడు.
GEN 42:18 మూడవ రోజున యోసేపు వారితో, “మీరు ఒక పని చేస్తే బ్రతికి ఉంటారు, ఎందుకంటే నేను దేవునికి భయపడేవాన్ని:
GEN 42:19 మీరు నిజంగా యథార్థవంతులైతే, మీ సోదరులలో ఒకరిని ఇక్కడ చెరసాలలో ఉండనివ్వండి, మిగితా వారు ఆకలితో ఉన్న మీ ఇంటివారికి ధాన్యం తీసుకెళ్లండి.
GEN 42:20 అయితే మీ చిన్న తమ్మున్ని నా దగ్గరకు తీసుకురావాలి, అప్పుడు మీ మాటలు స్థిరపరచబడతాయి, మీరు చావరు” అని అన్నాడు. వారు అలానే చేశారు.
GEN 42:21 అప్పుడు వారు ఒకరితో ఒకరు, “మన తమ్మున్ని బట్టి మనం ఇలా శిక్షించబడుతున్నాము. తనను చంపవద్దని అతడు మనలను ఎంత వేడుకున్నా మనం వినలేదు అప్పుడు అతడు ఎంత బాధపడ్డాడో చూశాం; మనం చేసిన ఆ దోషం వల్లే ఇప్పుడు మనకు ఈ దుస్థితి వచ్చింది” అని మాట్లాడుకున్నారు.
GEN 42:22 రూబేను జవాబిస్తూ, “ఈ చిన్నవాని పట్ల పాపం చేయవద్దని నేను చెప్పలేదా? అయినా మీరు వినిపించుకోలేదు! ఇప్పుడు తన రక్తం కోసం మనం లెక్క అప్పగించాలి” అన్నాడు.
GEN 42:23 యోసేపు దగ్గర భాషను తర్జుమా చేసేవాడు ఉన్నాడని అతడు వారి మాటలు అర్థం చేసుకోగలడని వారు గ్రహించలేదు.
GEN 42:24 యోసేపు వారి దగ్గర నుండి వెళ్లి ఏడ్చి తిరిగివచ్చి వారితో మళ్ళీ మాట్లాడాడు. వారిలో నుండి షిమ్యోనును పట్టుకుని వారి కళ్లముందే బంధించాడు.
GEN 42:25 యోసేపు వారి సంచుల్లో ధాన్యం నింపి, ఎవరి బస్తాలో వారి వెండిని తిరిగి పెట్టి, ప్రయాణంలో వారికి అవసరమైన భోజనపదార్థాలు ఇవ్వుమని ఆదేశించాడు.
GEN 42:26 వారు తమ ధాన్యాన్ని తమ గాడిదల మీద పెట్టుకుని వెళ్లిపోయారు.
GEN 42:27 రాత్రి గడపడానికి ఒక స్థలంలో ఆగినప్పుడు, వారిలో ఒకడు గాడిదకు మేతపెడదామని సంచి విప్పాడు, గోనెసంచి విప్పగానే అందులో తన వెండి ఉండడం చూశాడు.
GEN 42:28 “నా వెండి నాకు తిరిగి ఇవ్వబడింది, నా గోనెసంచిలోనే అది ఉంది” అని సోదరులకు చెప్పాడు. వారి హృదయాలు కలవరపడ్డాయి. వారు వణకుతూ, ఒకరి వైపు ఒకరు తిరిగి, “దేవుడు మనకిలా చేశారేంటి?” అని చెప్పుకున్నారు.
GEN 42:29 వారు కనాను దేశంలో తమ తండ్రి యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు, తమకు జరిగిందంతా అతనికి చెప్పారు. వారు అన్నారు,
GEN 42:30 “ఆ దేశాధిపతి మాతో కఠినంగా మాట్లాడాడు, మేము ఆ దేశానికి వేగుచూడటానికి వచ్చామని అనుకున్నాడు.
GEN 42:31 అతనికి, ‘మేము యథార్థవంతులం; వేగులవారం కాము.
GEN 42:32 మేము పన్నెండుమంది సోదరులం, ఒక తండ్రి కుమారులము. ఒకడు చనిపోయాడు, కనిష్ఠుడు కనానులో తండ్రి దగ్గర ఉన్నాడు’ అని చెప్పాము.
GEN 42:33 “ఆ దేశాధిపతి మాతో, ‘ఇలా మీరు యథార్థవంతులని నాకు తెలుస్తుంది: మీ సోదరులలో ఒకరిని ఇక్కడ నా దగ్గర వదిలేసి, ఆకలితో ఉన్న మీ ఇంటివారికి ఆహారం తీసుకెళ్లండి.
GEN 42:34 కాని మీ తమ్మున్ని నా దగ్గరకు తీసుకురండి, తద్వారా మీరు యథార్థవంతులని తెలుసుకుంటాను. అప్పుడు మీ సోదరుని తిరిగి ఇచ్చేస్తాను, ఈ దేశంలో మీరు వ్యాపారం చేసుకోవచ్చు’ అన్నాడు.”
GEN 42:35 వారు తమ గోనెసంచులను ఖాళీ చేస్తుండగా, ఎవరి గోనెసంచిలో వారి వెండి మూట ఉంది. వారు, వారి తండ్రి, వారి డబ్బు మూటలు చూసి భయపడిపోయారు.
GEN 42:36 వారి తండ్రి యాకోబు వారితో, “మీరు నన్ను పిల్లలు కోల్పోయేలా చేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనును కూడా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ప్రతిదీ నాకు వ్యతిరేకంగా ఉంది!” అని అన్నాడు.
GEN 42:37 అప్పుడు రూబేను తన తండ్రితో, “నేను బెన్యామీనును తిరిగి నీ దగ్గరకు తీసుకురాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చు. అతన్ని నాకు అప్పగించు, నేను తిరిగి అతన్ని నీ దగ్గరకు తీసుకువస్తాను” అన్నాడు.
GEN 42:38 అయితే యాకోబు, “నా కుమారుడు నీతో అక్కడికి రాడు; అతని అన్న చనిపోయాడు, మిగిలింది ఒక్కడే. మీరు వెళ్లే ప్రయాణంలో ఏదైన హాని జరిగితే, మీరు నెరిసిన వెంట్రుకలతో ఉన్న నన్ను దుఃఖంలో సమాధికి తీసుకెళ్తారు” అని అన్నాడు.
GEN 43:1 దేశంలో కరువు ఇంకా తీవ్రంగా ఉంది.
GEN 43:2 ఈజిప్టు నుండి తెచ్చుకున్న ధాన్యమంతా వారు తిన్న తర్వాత, వారి తండ్రి వారితో, “మీరు తిరిగివెళ్లి మన కోసం ఇంకా కొంచెం ఆహారం కొనండి” అని అన్నాడు.
GEN 43:3 కానీ యూదా అతనితో, “ఆ మనుష్యుడు, ‘మీ తమ్ముడు మీతో ఉండే వరకు నన్ను మీరు మళ్ళీ చూడరు’ అని గట్టిగా హెచ్చరించాడు.
GEN 43:4 ఒకవేళ మా తమ్మున్ని మాతో పంపితే, మేము వెళ్లి నీకు ఆహారం కొంటాము.
GEN 43:5 కానీ ఒకవేళ అతన్ని పంపకపోతే, మేము వెళ్లం ఎందుకంటే, ‘మీ తమ్ముడు మీతో ఉండకపోతే మీరు నన్ను మళ్ళీ చూడరు’ అని ఆ మనుష్యుడు అన్నాడు” అని చెప్పాడు.
GEN 43:6 “మీకు ఇంకొక సోదరుడున్నాడని చెప్పి ఎందుకు ఈ శ్రమ నాకు తెచ్చి పెట్టారు?” అని ఇశ్రాయేలు అడిగాడు.
GEN 43:7 వారు, “ఆయన మమ్మల్ని ఖండితంగా ప్రశ్నించాడు. ‘మీ తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? మీకు ఇంకొక సోదరుడు ఉన్నాడా?’ అని అడిగాడు. మేము అతని ప్రశ్నలకు జవాబిచ్చాం అంతే. ‘మీ తమ్మున్ని ఇక్కడకు తీసుకురండి’ అని అంటాడని మాకు ఎలా తెలుస్తుంది?” అని అన్నారు.
GEN 43:8 అప్పుడు యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో, “బాలున్ని నాతో పంపించు, మేము వెంటనే వెళ్తాము. అప్పుడు మేము నీవు మా పిల్లలు చావకుండ బ్రతుకుతాము.
GEN 43:9 నేను అతని భద్రతకు హామీ ఇస్తున్నాను; అతని కోసం నన్ను బాధ్యున్ని చేయవచ్చు. నేను అతన్ని నీ దగ్గరకు తిరిగి తీసుకువచ్చి నీ ఎదుట ఉంచకపోతే, నా జీవితం అంతా ఆ నిందను భరిస్తాను.
GEN 43:10 ఇలా ఆలస్యం కాకపోయి ఉంటే, రెండవసారి కూడా వెళ్లి వచ్చియుండేవారం” అని అన్నాడు.
GEN 43:11 అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు, “ఒకవేళ అలాగైతే, ఇలా చేయండి: దేశంలో ఉన్న శ్రేష్ఠమైన వాటిని అంటే ఔషధతైలం, కొంచెం తేనె, కొన్ని సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తా గింజలు, బాదం పప్పులు మీ సంచుల్లో పెట్టుకుని ఆ వ్యక్తికి కానుకగా తీసుకెళ్లండి.
GEN 43:12 మీ దగ్గర ఉన్న వెండికి రెట్టింపు తీసుకెళ్లండి, ఎందుకంటే మీ గోనెసంచులలో పెట్టబడిన వెండిని మీరు తిరిగి ఇచ్చేయాలి. బహుశ అది పొరపాటు కావచ్చు.
GEN 43:13 మీ సోదరున్ని కూడా తీసుకుని వెంటనే ఆ మనుష్యుని దగ్గరకు తిరిగి వెళ్లండి.
GEN 43:14 సర్వశక్తిగల దేవుడు ఆ మనుష్యుని ఎదుట కరుణ చూపును గాక తద్వారా మీ ఇంకొక సోదరుడు బెన్యామీను మీతో తిరిగి వచ్చేలా అనుమతిస్తాడు. నా మట్టుకైతే, ఒకవేళ నేను కోల్పోవలసి వస్తే కోల్పోతాను.”
GEN 43:15 కాబట్టి ఆ మనుష్యులు కానుకలను, రెట్టింపు డబ్బును, బెన్యామీనును కూడా తీసుకుని త్వరగా ఈజిప్టుకు వెళ్లి యోసేపు ఎదుట హాజరయ్యారు.
GEN 43:16 యోసేపు వారితో బెన్యామీనును చూసి తన గృహనిర్వాహకునితో, “ఈ మనుష్యులను నా ఇంటికి తీసుకెళ్లి, ఒక జంతువును వధించి, భోజనం సిద్ధం చేయి; వారు మధ్యాహ్నం నాతో భోజనం చేస్తారు” అని చెప్పాడు.
GEN 43:17 ఆ మనుష్యుడు యోసేపు చెప్పినట్టు చేశాడు, వారిని యోసేపు ఇంటికి తీసుకెళ్లాడు.
GEN 43:18 యోసేపు వారిని తన ఇంటికి తీసుకెళ్లినందుకు ఆ మనుష్యులు భయపడ్డారు. “మొదటిసారి మన గోనెసంచులలో పెట్టబడిన వెండి గురించి మనం ఇక్కడకు రావలసివచ్చింది. అతడు మనపై దాడి చేసి, మనలను బానిసలుగా బంధించి మన గాడిదలను తీసుకుంటాడు” అని అనుకున్నారు.
GEN 43:19 కాబట్టి వారు యోసేపు యొక్క గృహనిర్వాహకుని దగ్గరకు వెళ్లి ద్వారం దగ్గర అతనితో మాట్లాడారు.
GEN 43:20 “అయ్యా, మా మనవి వినండి. మేము మొదటిసారి ఆహారం కొనడానికే వచ్చాము.
GEN 43:21 కానీ మేము రాత్రి గడిపిన స్థలంలో మా గోనెసంచులను విప్పి చూస్తే, ఎవరు ఎంత వెండి తెచ్చారో సరిగ్గా అంతే వెండి వారి గోనెసంచిలో ఉంది. కాబట్టి మేము తిరిగి దానిని తెచ్చాము.
GEN 43:22 ఆహారం కొనడానికి మరికొంత వెండిని కూడా తీసుకుని వచ్చాము. మా గోనెసంచులలో వెండిని ఎవరు పెట్టారో మాకు తెలియదు” అన్నారు.
GEN 43:23 అప్పుడు అతడు, “మీకు క్షేమం కలుగును గాక మీరు భయపడకండి, మీ దేవుడు, మీ తండ్రి యొక్క దేవుడు, ఈ ధనాన్ని మీ గోనెసంచులలో పెట్టారు; మీ వెండి నాకు ముట్టింది” అని అన్నాడు. తర్వాత షిమ్యోనును వారి దగ్గరకు తీసుకువచ్చాడు.
GEN 43:24 గృహనిర్వాహకుడు ఆ మనుష్యులను యోసేపు ఇంట్లోకి తీసుకెళ్లాడు, కాళ్లు కడుక్కోడానికి వారికి నీళ్లిచ్చాడు, వారి గాడిదలకు మేత పెట్టాడు.
GEN 43:25 తాము భోజనం చేయాల్సింది అక్కడే అని విన్నందుకు మధ్యాహ్నం యోసేపు రాక కోసం తమ కానుకలను సిద్ధపరచుకున్నారు.
GEN 43:26 యోసేపు ఇంటికి రాగానే, వారు ఇంట్లోకి తెచ్చిన కానుకలను అతనికి ఇచ్చి, అతని ఎదుట సాష్టాంగపడ్డారు.
GEN 43:27 వారు ఎలా ఉన్నారని వారిని అడిగి, “వృద్ధుడైన మీ తండ్రి గురించి మీరు నాకు చెప్పారు కదా, ఆయన ఎలా ఉన్నారు? ఇంకా బ్రతికే ఉన్నారా?” అని అన్నాడు.
GEN 43:28 వారు జవాబిస్తూ, “తమ దాసుడు, మా తండ్రి బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు” అన్నారు, అప్పుడు వారు తలవంచి, సాష్టాంగపడ్డారు.
GEN 43:29 యోసేపు కళ్ళెత్తి తన తమ్ముడు అనగా తన సొంత తల్లి కుమారుడైన బెన్యామీనును చూసి, “మీరు నాకు చెప్పిన మీ చిన్న తమ్ముడు ఇతడేనా?” అని అడిగి, “నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక!” అని అన్నాడు.
GEN 43:30 తమ్మున్ని చూడగానే యోసేపుకు అతని మీద ప్రేమ పొర్లుకు వచ్చింది, అందుకు అతడు వెంటనే లోపలి గదిలోకి వెళ్లి ఏడ్చాడు.
GEN 43:31 తన ముఖం కడుక్కున్న తర్వాత, తనను తాను అదుపుచేసుకుని, “భోజనం వడ్డించండి” అని చెప్పాడు.
GEN 43:32 సేవకులు యోసేపుకు తన బల్ల దగ్గర, అతని సోదరులకు వేరే బల్ల దగ్గర, అతనితో భోజనంచేస్తున్న ఈజిప్టువారికి వరుసగా భోజనం వడ్డించారు, ఎందుకంటే హెబ్రీయులతో కలసి భోజనం చేయడం ఈజిప్టువారికి అసహ్యము.
GEN 43:33 వారి వయస్సు ప్రకారం మొదటివాడు మొదలుకొని చివరివాని వరకు అతని ఎదుట కూర్చున్నారు; వారు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు.
GEN 43:34 యోసేపు బల్ల నుండి వారికి భోజనం వడ్డించబడినప్పుడు, ఇతరులకంటే అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. కాబట్టి వారు అతనితో స్వేచ్ఛగా విందు చేసుకున్నారు, త్రాగారు.
GEN 44:1 యోసేపు తన ఇంటి గృహనిర్వాహకుని పిలిచి, “ఈ మనుష్యులు మోసికొని వెళ్లగలిగినంత ఆహారంతో వారి సంచులు నింపి ఎవరి గోనెసంచిలో వారు రూకలుగా తెచ్చిన వెండిని కూడా పెట్టు.
GEN 44:2 తర్వాత కనిష్ఠుని గోనెసంచిలో మాత్రం ధాన్యం, రూకలుగా తెచ్చిన వెండితో పాటు నా వెండి గిన్నెను పెట్టు” అని సూచించాడు. అతడు యోసేపు చెప్పినట్టు చేశాడు.
GEN 44:3 తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు వారి గాడిదలతో పాటు పంపబడ్డారు.
GEN 44:4 పట్టణం నుండి వారింకా దూరం వెళ్లకముందే, యోసేపు గృహనిర్వాహకునితో, “వెంటనే ఆ మనుష్యుల వెంట వెళ్లు, వారిని పట్టుకున్నప్పుడు, ‘మేలుకు ప్రతిగా కీడును ఎందుకు చేశారు?
GEN 44:5 ఇది మా యజమాని త్రాగడానికి, భవిష్యవాణి కోసం ఉపయోగించే గిన్నె కాదా? మీరు చేసింది చెడ్డ పని’ అని వారితో చెప్పు” అన్నాడు.
GEN 44:6 గృహనిర్వాహకుడు వారిని కలిసినప్పుడు, అవే మాటలు చెప్పాడు.
GEN 44:7 అయితే వారు, “మా ప్రభువు ఎందుకు అలా అంటున్నాడు? మీ దాసులకు అలాంటి పని దూరమవును గాక!
GEN 44:8 మా గోనెసంచులలో దొరికిన వెండి తిరిగి కనాను దేశం నుండి తెచ్చాము. కాబట్టి వెండి లేదా బంగారం ఎందుకు నీ యజమాని ఇంటి నుండి దొంగిలిస్తాము?
GEN 44:9 ఒకవేళ మీ దాసులలో ఎవరి దగ్గరైనా దొరికితే, వాడు చస్తాడు; మిగిలినవారం మా ప్రభువా బానిసలమవుతాం” అని అన్నారు.
GEN 44:10 అప్పుడు అతడు, “సరే మీరన్నట్టే కానివ్వండి; ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడు నాకు బానిస అవుతాడు, మిగితా వారు నిర్దోషులవుతారు” అని అన్నాడు.
GEN 44:11 వారంతా త్వరత్వరగా గోనెసంచులను క్రిందికి దించి వాటిని తెరిచారు.
GEN 44:12 అప్పుడు గృహనిర్వాహకుడు పెద్దవాడి నుండి ప్రారంభించి చిన్నవాడి వరకు సోదా చేశాడు. ఆ గిన్నె బెన్యామీను గోనెసంచిలో దొరికింది.
GEN 44:13 ఇది చూసి వారు తమ బట్టలు చింపుకున్నారు. వారందరు తమ గాడిదల మీద తన గోనెసంచులు ఎత్తుకుని, తిరిగి పట్టణానికి వెళ్లారు.
GEN 44:14 యూదా అతని సోదరులు వచ్చినప్పుడు యోసేపు ఇంట్లోనే ఉన్నాడు, వారు అతని ఎదుట సాష్టాంగపడ్డారు.
GEN 44:15 యోసేపు వారితో, “మీరు చేసిన ఈ పని ఏంటి? నా లాంటి మనుష్యుని భవిష్యవాణి ద్వారా విషయాలు తెలుసుకుంటాడని మీకు తెలియదా?” అని అన్నాడు.
GEN 44:16 యూదా జవాబిస్తూ, “మా ప్రభువా, మేమేమి చెప్పగలం? మా నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలం? మీ దాసుల అపరాధాన్ని దేవుడు బయటపెట్టారు. మేమిప్పుడు మా ప్రభువు బానిసలం; మాలో ఎవరి సంచిలో గిన్నె దొరుకుతుందో వాడు కూడా మా ప్రభువుకు దాసుడవుతాడు” అన్నాడు.
GEN 44:17 అయితే యోసేపు, “అలా చేయడం నాకు దూరం అవును గాక! ఎవరి దగ్గర గిన్నె దొరికిందో అతడు మాత్రమే నా బానిస. మిగిలిన మీరు మీ తండ్రి దగ్గరకు సమాధానంగా వెళ్లండి” అన్నాడు.
GEN 44:18 అప్పుడు యూదా అతని దగ్గరకు వెళ్లి అన్నాడు: “నా ప్రభువా, మీ దాసుని క్షమించి నా ప్రభువుతో ఒక్క మాట మాట్లాడనివ్వండి. మీరు ఫరోతో సమానులైనను మీ దాసునిపై కోప్పడకండి.
GEN 44:19 నా ప్రభువు తమ దాసులను, ‘మీకు తండ్రి గాని సోదరుడు గాని ఉన్నాడా?’ అని అడిగారు.
GEN 44:20 దానికి మేము, ‘నా ప్రభువా, మాకు వృద్ధుడైన తండ్రి, వృద్ధాప్యంలో తనకు పుట్టిన చిన్నకుమారుడు ఉన్నాడు. అతని అన్న చనిపోయాడు, అతని తల్లి కుమారులలో ఆ ఒక్కడే మిగిలాడు, అతని తండ్రికి ఆ చిన్నవాడంటే చాలా ప్రేమ’ అని చెప్పాము.
GEN 44:21 “అప్పుడు మీరు మీ దాసులతో, ‘అతన్ని నేను చూడాలి, నా దగ్గరకు తీసుకురండి’ అని అన్నారు.
GEN 44:22 అందుకు మేము నా ప్రభువుతో, ‘అతడు తండ్రిని విడిచి ఉండలేడు; ఒకవేళ అతడు విడిచిపెట్టి వస్తే, అతని తండ్రి చనిపోతాడు’ అని చెప్పాము.
GEN 44:23 కాని మీరు మీ దాసులతో, ‘మీ చిన్న తమ్ముడు మీతో వస్తేనే తప్ప మీరు నాకు కనబడవద్దు’ అని అన్నారు.
GEN 44:24 మేము మా తండ్రి దగ్గరకు వెళ్లి మా ప్రభువు చెప్పిందంతా చెప్పాము.
GEN 44:25 “మా తండ్రి, ‘ఇంకొంచెం ఆహారం కొనడానికి మళ్ళీ వెళ్లండి’ అన్నాడు.
GEN 44:26 అందుకు మేము అతనితో, ‘మేము వెళ్లలేము. మా చిన్న తమ్ముడు మాతో వెళ్తేనే మేము వెళ్తాము. మా చిన్న తమ్ముడు మాతో ఉంటేనే తప్ప మేము వెళ్లి ఆయన ముఖం చూడలేం’ అని చెప్పాము.
GEN 44:27 “మీ దాసుడైన మా తండ్రి మాతో, ‘నా భార్య నాకు ఇద్దరు కుమారులను కన్నదని మీకు తెలుసు.
GEN 44:28 వారిలో ఒకడు వెళ్లి తిరిగి రాలేదు. నిస్సందేహంగా అతన్ని ఏదో అడవి జంతువు చంపి ముక్కలు చేసి ఉంటుంది. అప్పటినుండి అతన్ని నేను చూడలేదు.
GEN 44:29 మీరు నా దగ్గర నుండి వీన్ని కూడా తీసుకెళ్తే, వీనికి ఏదైన హాని సంభవిస్తే, దుఃఖిస్తూ ఉన్న, తల నెరసిన ఈ వ్యక్తిని సమాధికి పంపిన వారవుతారు’ అన్నాడు.
GEN 44:30 “కాబట్టి ఇప్పుడు మా తమ్ముడు మాతో లేకుండ, మీ దాసుడైన మా తండ్రి దగ్గరకు మేము తిరిగి వెళ్తే, ఈ చిన్నవానితో ముడిపడి ఉన్న మా తండ్రి,
GEN 44:31 మాతో చిన్నవాడు లేకపోవడం చూసి, అతడు చనిపోతాడు. మీ దాసులమైన మేము తల నెరిసిన మా తండ్రిని దుఃఖంలోనే సమాధికి తీసుకెళ్లిన వారమవుతాము.
GEN 44:32 మీ దాసుడనైన నేను బాలుని భద్రతకు నా తండ్రికి హామీ ఇచ్చాను. ‘నేను అతన్ని తీసుకురాకపోతే, నా జీవితాంతం ఆ నిందను నేను భరిస్తాను’ అని చెప్పాను.
GEN 44:33 “కాబట్టి ఇప్పుడు, ఈ చిన్నవానికి బదులు నా ప్రభువు యొక్క దాసుని మీ దగ్గర బానిసగా ఉండనివ్వండి, ఈ చిన్నవాన్ని మాత్రం తన సోదరులతో తిరిగి వెళ్లనివ్వండి.
GEN 44:34 చిన్నవాడు నాతో లేకుండ నా తండ్రి దగ్గరకు ఎలా తిరిగి వెళ్లగలను? లేదు! నా తండ్రికి కలిగే బాధను నేను చూడలేను.”
GEN 45:1 అప్పుడు యోసేపు తన సేవకులందరి ఎదుట తనను తాను అదుపు చేసుకోలేక, “అందరిని నా ఎదుట నుండి పంపివేయండి!” అని బిగ్గరగా చెప్పాడు. తన సోదరులకు తనను తాను తెలియపరచుకున్నప్పుడు యోసేపుతో ఎవరు లేరు.
GEN 45:2 అతడు ఈజిప్టువారు వినేటంతగా బిగ్గరగా ఏడ్చాడు, ఫరో ఇంటివారు దాని గురించి విన్నారు.
GEN 45:3 యోసేపు తన సోదరులతో, “నేను యోసేపును! నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా?” అని అన్నాడు. అతన్ని చూసి అతని సోదరులు కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు.
GEN 45:4 యోసేపు తన సోదరులతో, “నా దగ్గరకు రండి” అన్నాడు. వారు అతని దగ్గరకు వచ్చాక, “నేను మీ సోదరుడైన యోసేపును, మీరు ఈజిప్టుకు అమ్మివేసినవాన్ని!
GEN 45:5 ఇప్పుడు నన్ను ఇక్కడకు అమ్మివేసినందుకు బాధపడకండి, మీపై మీరు కోప్పడకండి, ఎందుకంటే జీవితాలను రక్షించడానికి మీకంటే ముందే దేవుడు నన్ను పంపించారు.
GEN 45:6 ఇప్పటికి దేశంలో కరువు వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది, ఇంకా వచ్చే అయిదు సంవత్సరాలు దున్నడం, కోత కోయడం ఉండదు.
GEN 45:7 అయితే దేవుడు భూమిపై మిమ్మల్ని సంరక్షించి, మీ జీవితాలను కాపాడడానికి మీకంటే ముందు నన్ను ఇక్కడకు పంపించారు.
GEN 45:8 “కాబట్టి ఇప్పుడు, నన్ను ఇక్కడకు పంపింది మీరు కాదు, దేవుడే. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా, అతని ఇంటికి ప్రభువుగా, ఈజిప్టు అంతటికి పాలకునిగా చేశారు.
GEN 45:9 ఇప్పుడు నా తండ్రి దగ్గరకు వెంటనే వెళ్లి అతనితో, ‘నీ కుమారుడైన యోసేపు ఇలా అన్నాడు: దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద ప్రభువుగా చేశారు. నా దగ్గరకు వచ్చేయండి; ఆలస్యం చేయకండి!
GEN 45:10 మీరు, మీ పిల్లలు, మీ మనవళ్లు, మీ మందలు, మీ పశువులు, మీతో ఉన్న సమస్తం గోషేను ప్రాంతంలో నాకు సమీపంగా ఉండవచ్చు.
GEN 45:11 ఇంకా రాబోయే అయిదు సంవత్సరాలు కరువు ఉంటుంది అయితే అక్కడ మిమ్మల్ని నేను పోషిస్తాను. లేకపోతే మీకు మీ ఇంటివారికి పేదరికం ఏర్పడుతుంది.’
GEN 45:12 “మాట్లాడుతుంది నిజంగా నేనే అని స్వయంగా మీరు, నా తమ్ముడైన బెన్యామీను చూడవచ్చు.
GEN 45:13 ఈజిప్టులో నాకు ఇవ్వబడిన ఘనత గురించి, మీరు చూసిన ప్రతి దాని గురించి నా తండ్రికి చెప్పండి. నా తండ్రిని ఇక్కడకు త్వరగా తీసుకురండి” అని చెప్పాడు.
GEN 45:14 తర్వాత తన సోదరుడైన బెన్యామీనుపై మెడ మీద చేతులు వేసి, ఏడ్చాడు, బెన్యామీను అతన్ని హత్తుకుని ఏడ్చాడు.
GEN 45:15 తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. తర్వాత అతని సోదరులు అతనితో మాట్లాడారు.
GEN 45:16 ఫరో ఇంటివారికి యోసేపు సోదరులు వచ్చారని సమాచారం చేరినప్పుడు, ఫరో, అతని అధికారులందరు సంతోషించారు.
GEN 45:17 ఫరో యోసేపుతో, “మీ సోదరులతో, ‘మీరు ఇలా చేయండి: మీ జంతువులను ఎక్కించి, కనాను దేశానికి తిరిగివెళ్లి,
GEN 45:18 మీ తండ్రిని మీ కుటుంబాలను తీసుకురండి. ఈజిప్టు దేశంలో శ్రేష్ఠమైన నేలను మీకిస్తాను. మీరు శ్రేష్ఠమైన ఆహారం తినవచ్చు’ అని చెప్పు.
GEN 45:19 “ఇలా కూడ చెప్పమని ఆదేశిస్తున్నాను, ‘మీరు ఇలా చేయండి: మీ పిల్లలు, మీ భార్యల కోసం ఈజిప్టు నుండి కొన్ని బండ్లను తీసుకెళ్లండి, మీ తండ్రిని తీసుకురండి.
GEN 45:20 అక్కడ మీ సామాన్ల గురించి చింతించకండి ఎందుకంటే ఈజిప్టులో శ్రేష్ఠమైనవన్నీ మీవి.’ ”
GEN 45:21 కాబట్టి ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. యోసేపు ఫరో ఆజ్ఞమేరకు వారికి బండ్లను ఇచ్చాడు, ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు.
GEN 45:22 అతడు వారందరికి క్రొత్త బట్టలు ఇచ్చాడు, కాని బెన్యామీనుకు మూడువందల షెకెళ్ళ వెండి, అయిదు జతల బట్టలు ఇచ్చాడు.
GEN 45:23 తన తండ్రికి పంపించింది ఇది: పది గాడిదల మీద ఈజిప్టులో నుండి శ్రేష్ఠమైన వస్తువులు, పది ఆడగాడిదలు మీద ధాన్యం, ఆహారం, తన ప్రయాణానికి కావలసిన ఇతర సామాగ్రి.
GEN 45:24 తర్వాత తన సోదరులను పంపిస్తూ, వారు వెళ్లేటప్పుడు, “మీలో మీరు గొడవపడకండి!” అని చెప్పాడు.
GEN 45:25 కాబట్టి వారు ఈజిప్టు నుండి వెళ్లారు, కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వచ్చారు.
GEN 45:26 వారు అతనితో, “యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు! నిజానికి, అతడు ఈజిప్టు అంతటికి పాలకుడు” అని చెప్పారు. అది విని యాకోబు ఆశ్చర్యపోయాడు; అతడు వారి మాటను నమ్మలేదు.
GEN 45:27 అయితే యోసేపు తమతో చెప్పిందంతా వారు అతనికి చెప్పి, యోసేపు తనను తీసుకెళ్లడానికి పంపిన బండ్లను చూసినప్పుడు, తమ తండ్రియైన యాకోబు ప్రాణం తెప్పరిల్లింది.
GEN 45:28 అప్పుడు ఇశ్రాయేలు, “నాకిది చాలు, నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. నేను చనిపోకముందు వెళ్లి అతన్ని చూస్తాను” అని అన్నాడు.
GEN 46:1 కాబట్టి ఇశ్రాయేలు తనకున్నదంతటితో బయలుదేరాడు, బెయేర్షేబకు వచ్చాక, తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులు అర్పించారు.
GEN 46:2 రాత్రి దర్శనం ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడారు. ఆయన, “యాకోబూ! యాకోబూ!” అని పిలిచారు. అతడు, “చిత్తం, నేను ఉన్నాను” అని జవాబిచ్చాడు.
GEN 46:3 ఆయన, “నేను దేవున్ని, నీ తండ్రి యొక్క దేవున్ని. ఈజిప్టుకు వెళ్లడానికి భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను.
GEN 46:4 నేను నీతో ఈజిప్టుకు వస్తాను, ఖచ్చితంగా నిన్ను తిరిగి తీసుకువస్తాను. యోసేపు స్వహస్తాలే నీ కళ్లు మూస్తాయి” అని అన్నారు.
GEN 46:5 అప్పుడు యాకోబు బెయేర్షేబ నుండి బయలుదేరాడు, ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రియైన యాకోబును, వారి పిల్లలను, వారి భార్యలను ఫరో పంపిన బండ్లలో తీసుకెళ్లారు.
GEN 46:6 కాబట్టి యాకోబు, అతని సంతానమంతా వారి పశువులతో, కనానులో వారు సంపాదించిన సమస్త సంపదతో ఈజిప్టుకు వెళ్లారు.
GEN 46:7 యాకోబు తనతో తన కుమారులను, మనవళ్లను, కుమార్తెలను, మనవరాళ్లను, తన సంతానమంతటిని ఈజిప్టుకు తీసుకువచ్చాడు.
GEN 46:8 ఈజిప్టుకు వెళ్లిన ఇశ్రాయేలు కుమారుల (యాకోబు అతని సంతానం) పేర్లు: రూబేను, యాకోబు యొక్క మొదటి కుమారుడు.
GEN 46:9 రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.
GEN 46:10 షిమ్యోను కుమారులు: యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీ యొక్క కుమారుడైన షావూలు.
GEN 46:11 లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.
GEN 46:12 యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (కాని ఏరు, ఓనాను కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు.
GEN 46:13 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువా, యోబు, షిమ్రోను.
GEN 46:14 జెబూలూను కుమారులు: సెరెదు, ఏలోను, యహలేలు.
GEN 46:15 వీరు పద్దనరాములో లేయాకు యాకోబుకు పుట్టిన కుమారులు, దీనా వారి కుమార్తె. కుమారులు, కుమార్తెలు కలిసి వీరంతా ముప్పై ముగ్గురు.
GEN 46:16 గాదు కుమారులు: సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, అరోది, అరేలీ.
GEN 46:17 ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. శెరహు వారి సోదరి. బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు.
GEN 46:18 వీరు లాబాను తన కుమార్తె లేయాకు ఇచ్చిన జిల్పా ద్వారా యాకోబుకు కలిగిన సంతానం మొత్తం పదహారు మంది.
GEN 46:19 యాకోబు భార్య రాహేలు యొక్క కుమారులు: యోసేపు, బెన్యామీను.
GEN 46:20 ఈజిప్టులో యోసేపుకు ఓను పట్టణానికి యాజకుడైన పోతీఫెర కుమార్తె ఆసెనతు ద్వారా మనష్షే, ఎఫ్రాయిం పుట్టారు.
GEN 46:21 బెన్యామీను కుమారులు: బేల, బెకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీ, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు.
GEN 46:22 వీరు యాకోబుకు కలిగిన రాహేలు సంతానం మొత్తం పద్నాలుగు మంది.
GEN 46:23 దాను కుమారుడు: హూషీము.
GEN 46:24 నఫ్తాలి కుమారులు: యహజీయేలు, గూనీ, యేజెరు, షిల్లేము.
GEN 46:25 వీరు లాబాను తన కుమార్తె రాహేలుకు ఇచ్చిన బిల్హా ద్వారా యాకోబుకు కలిగిన సంతానం మొత్తం ఏడుగురు.
GEN 46:26 యాకోబుతో ఈజిప్టుకు అతని కుమారుల భార్యలు కాక, యాకోబు సంతతివారు మొత్తం అరవై ఆరు మంది వ్యక్తులు.
GEN 46:27 ఈజిప్టులో యోసేపుకు పుట్టిన కుమారులు ఇద్దరితో కలిపి, ఈజిప్టుకు వెళ్లిన యాకోబు కుటుంబీకులంతా డెబ్బైమంది.
GEN 46:28 గోషేనుకు త్రోవ చూపడానికి యాకోబు యూదాను తనకన్నా ముందు యోసేపు దగ్గరకు పంపాడు. వారు గోషేను ప్రాంతం చేరుకున్నప్పుడు,
GEN 46:29 యోసేపు తన రథం సిద్ధం చేయించుకుని తన తండ్రి ఇశ్రాయేలును కలవడానికి గోషేనుకు వెళ్లాడు. యోసేపు కనుపరచుకున్న వెంటనే, తన తండ్రిని కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చాడు.
GEN 46:30 ఇశ్రాయేలు యోసేపుతో, “నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను కళ్లారా చూశాను కాబట్టి, ఇప్పుడు హాయిగా చనిపోగలను” అని అన్నాడు.
GEN 46:31 అప్పుడు యోసేపు తన సోదరులతో తన తండ్రి ఇంటివారితో, “నేను వెళ్లి ఫరోతో మాట్లాడి అతనికి, ‘కనాను దేశంలో నివసించే నా సోదరులు, నా తండ్రి ఇంటివారు నా దగ్గరకు వచ్చారు.
GEN 46:32 ఈ మనుష్యులు కాపరులు; వారు పశువులను మేపుతారు, వారు తమ మందలను, పశువులను, వారికి ఉన్నదంతా తెచ్చారు’ అని చెప్తాను.
GEN 46:33 ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే,
GEN 46:34 ‘మీ సేవకులు మా పితరులు చేసినట్టే బాల్యం నుండి పశువులను మేపేవారము’ అని జవాబివ్వాలి. అప్పుడు గోషేనులో స్థిరపడడానికి మీకు అనుమతి వస్తుంది, ఎందుకంటే గొర్రెల కాపరులంటే ఈజిప్టువారికి అసహ్యం” అని చెప్పాడు.
GEN 47:1 యోసేపు వెళ్లి ఫరోతో, “నా తండ్రి, నా సోదరులు కనాను దేశం నుండి వారి గొర్రెల మందలు, పశువులు, వారి సమస్తంతో వచ్చారు, ఇప్పుడు గోషేనులో ఉన్నారు” అన్నాడు.
GEN 47:2 అతడు తన సోదరులలో అయిదుగురిని ఫరోకు ఎదుట కనుపరిచాడు.
GEN 47:3 ఫరో ఆ సోదరులతో, “మీ వృత్తి ఏంటి?” అని అడిగాడు. “మీ దాసులు మా పూర్వికుల్లా గొర్రెల కాపరులు” అని వారు ఫరోకు జవాబిచ్చారు.
GEN 47:4 వారు అతనితో, “మేము కొంతకాలం ఇక్కడ నివసించడానికి వచ్చాం ఎందుకంటే కనానులో కరువు తీవ్రంగా ఉంది, మీ దాసుల గొర్రెల మందలకు మేత లేదు. కాబట్టి ఇప్పుడు మీ దాసులను గోషేనులో నివసించనివ్వండి” అని కూడా అన్నారు.
GEN 47:5 ఫరో యోసేపుతో, “నీ తండ్రి, సోదరులు నీ దగ్గరకు వచ్చారు,
GEN 47:6 ఈజిప్టు దేశమంతా నీ ముందుంది; శ్రేష్ఠమైన ప్రాంతంలో నీ తండ్రిని, నీ సోదరులను ఉంచు. గోషేనులో వారు నివసించవచ్చు. వీరిలో ప్రత్యేక సామర్థ్యం కలిగినవారు ఎవరైనా ఉంటే, నా సొంత పశువులకు ముఖ్య కాపరులుగా నియమించు” అన్నాడు.
GEN 47:7 తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును తీసుకువచ్చి ఫరో ఎదుట కనుపరిచాడు. యాకోబు ఫరోను దీవించిన తర్వాత,
GEN 47:8 ఫరో, “నీ వయసెంత?” అని అడిగాడు.
GEN 47:9 యాకోబు ఫరోతో, “నేను యాత్రచేసిన సంవత్సరాలు నూట ముప్పై. నేను బ్రతికిన సంవత్సరాలు తక్కువ, అవి కూడా శ్రమతో నిండి ఉన్నాయి, అవి నా పూర్వికుల యాత్ర సంవత్సరాలతో సమానం కాదు” అని అన్నాడు.
GEN 47:10 తర్వాత యాకోబు ఫరోను దీవించి, అతని ఎదుట నుండి వెళ్లిపోయాడు.
GEN 47:11 కాబట్టి యోసేపు తన తండ్రిని, తన సోదరులను ఈజిప్టులో స్థిరపరచి, దేశంలో శ్రేష్ఠమైన భాగంలో, ఫరో చెప్పినట్టు రామెసేసు జిల్లాను వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు.
GEN 47:12 యోసేపు తన తండ్రికి, తన సోదరులకు, తన తండ్రి ఇంటివారికందరికి వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారాన్ని కూడా అందించాడు.
GEN 47:13 అయితే దేశమంతటిలో ఆహారం లేదు ఎందుకంటే కరువు తీవ్రంగా ఉంది; ఈజిప్టు కనాను దేశాలు కరువును బట్టి ఆకలితో అలమటించాయి.
GEN 47:14 యోసేపు ఈజిప్టు కనాను దేశాలకు, ధాన్యం కొనుగోలుకు వచ్చిన డబ్బు మొత్తం సేకరించి ఫరో రాజభవనానికి తెచ్చాడు.
GEN 47:15 ఈజిప్టు కనాను ప్రజల డబ్బు అయిపోయినప్పుడు, ఈజిప్టు వారంతా యోసేపు దగ్గరకు వచ్చి, “మాకు ఆహారం ఇవ్వండి. మీ కళ్లముందే మేము ఎందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది” అని అన్నారు.
GEN 47:16 అందుకు యోసేపు, “అలాగైతే మీ పశువులను తీసుకురండి, మీ డబ్బు అయిపోయింది కాబట్టి మీ పశువులకు బదులుగా నేను ఆహారం సరఫరా చేస్తాను” అని అన్నాడు.
GEN 47:17 కాబట్టి వారు యోసేపు దగ్గరకు తమ పశువులను తెచ్చారు. వారి గుర్రాలు, గొర్రెలు, మేకలు, పశువులు, గాడిదలకు బదులుగా వారికి ఆహారం ఇచ్చాడు. ఆ సంవత్సరమంతా వారి పశువులకు బదులుగా ఆహారం అందించాడు.
GEN 47:18 సంవత్సరం ముగిసిన తర్వాత, మరుసటి సంవత్సరం వారు అతని దగ్గరకు వచ్చి, “మేము మా ప్రభువు నుండి నిజాన్ని దాచలేము, మా డబ్బు అయిపోయింది, మా పశువులు మీకే ఇచ్చాం, ఇక మా శరీరాలు, మా భూమి తప్ప మా ప్రభువుకు ఇవ్వడానికి ఏమీ మిగల్లేదు.
GEN 47:19 మేము, మా భూమి మీ కళ్లముందే నశించడం బాగుంటుందా? ఆహారం కోసం మమ్మల్ని, మా భూములను కొనండి. మేము మా భూములతో సహా ఫరోకు బానిసలమవుతాము. మేము చావకుండ బ్రతికేలా పొలాలు పాడైపోకుండ మాకు విత్తనాలు ఇవ్వండి” అని మనవి చేసుకున్నారు.
GEN 47:20 కాబట్టి యోసేపు ఫరో కోసం ఈజిప్టు భూమి అంతా కొన్నాడు. ఈజిప్టు వారంతా కరువు చాలా తీవ్రంగా ఉండడం వల్ల తమ భూములన్నీ అమ్మివేశారు. భూమి ఫరో ఆధీనంలోనికి వచ్చింది,
GEN 47:21 యోసేపు ఈజిప్టు యొక్క సరిహద్దు నుండి ఇంకొక సరిహద్దు వరకు ఉన్న ప్రజలందరినీ బానిసలుగా చేశాడు.
GEN 47:22 అయితే, యాజకులకు చెందిన భూమిని మాత్రం అతడు కొనలేదు. ఎందుకంటే వారు క్రమంగా ఫరో నుండి బత్తెం పొందుకునే వారు, ఆ బత్తెంతో వారికి సరిపడే ఆహారం ఉంది. కాబట్టి వారు తమ భూమిని అమ్మలేదు.
GEN 47:23 యోసేపు ప్రజలతో, “నేను మీ భూములను మిమ్మల్ని ఈ రోజు ఫరో కోసం కొన్నాను. ఇదిగో మీరు భూమిలో నాటడానికి విత్తనాలు తీసుకోండి.
GEN 47:24 అయితే పంట వచ్చినప్పుడు అయిదవ వంతు ఫరోకు ఇవ్వండి. మిగితా నాలుగు వంతులు మీ పొలాల్లో విత్తనం కోసం, మీకూ మీ ఇంటివారికి మీ పిల్లలకు ఆహారం కోసం ఉంచుకోండి” అన్నాడు.
GEN 47:25 అప్పుడు వారు, “మీరు మా జీవితాలను కాపాడారు. ప్రభువా, మామీద మీ దయ ఉంచండి; మేము ఫరోకు బానిసలుగా ఉంటాం” అని అన్నారు.
GEN 47:26 కాబట్టి యోసేపు ఈజిప్టు దేశాన్ని ఉద్దేశించి శాసనం నియమించాడు. అది నేటి వరకు ఉంది. పంటంతటిలో అయిదవ వంతు ఫరోకు చెందుతుంది. అయితే యాజకుల స్థలం మాత్రం ఫరోకు చెందలేదు.
GEN 47:27 ఇశ్రాయేలీయులు ఈజిప్టులో గోషేను ప్రదేశంలో స్థిరపడ్డారు. అక్కడ స్వాస్థ్యం సంపాదించుకుని ఫలించి, సంతానాభివృద్ధి చెందుతూ వేగంగా విస్తరించారు.
GEN 47:28 యాకోబు ఈజిప్టులో పదిహేడు సంవత్సరాలు జీవించాడు, అతడు జీవించిన సంవత్సరాలు నూట నలభై ఏడు.
GEN 47:29 ఇశ్రాయేలు చనిపోయే సమయం సమీపించినప్పుడు, తన కుమారుడైన యోసేపును పిలిపించి, “నీ దృష్టిలో నేను దయ పొందినవాడనైతే, నా తొడ క్రింద చేయి పెట్టి, నా పట్ల మంచితనాన్ని, నమ్మకత్వాన్ని చూపుతావని ప్రమాణం చేయి. ఈజిప్టులో నన్ను పాతిపెట్టకు,
GEN 47:30 నా పితరులతో నేను నిద్రించినప్పుడు, ఈజిప్టు నుండి నన్ను తీసుకెళ్లి వారు పాతిపెట్టబడిన దగ్గరే నన్ను పాతిపెట్టు” అని చెప్పాడు. “నీవు చెప్పినట్టే చేస్తాను” అని యోసేపు జవాబిచ్చాడు.
GEN 47:31 అయితే యాకోబు, “నాతో ప్రమాణం చేయి” అని అన్నాడు. అప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాడు, ఇశ్రాయేలు తన చేతికర్ర మీద ఆనుకుని ఆరాధించాడు.
GEN 48:1 కొంతకాలం తర్వాత, “నీ తండ్రి అస్వస్థతతో ఉన్నాడు” అని యోసేపుకు చెప్పబడింది. కాబట్టి తన ఇద్దరు కుమారులు, మనష్షేను ఎఫ్రాయిమును తీసుకెళ్లాడు.
GEN 48:2 “నీ కుమారుడు, యోసేపు నీ దగ్గరకు వచ్చాడు” అని యాకోబుకు చెప్పబడినప్పుడు, ఇశ్రాయేలు బలం తెచ్చుకుని పడక మీద కూర్చున్నాడు.
GEN 48:3 యాకోబు యోసేపుతో ఇలా అన్నాడు, “సర్వశక్తిగల దేవుడు కనాను దేశంలో లూజు దగ్గర నాకు ప్రత్యక్షమై నన్ను దీవించి,
GEN 48:4 ‘నేను నిన్ను ఫలవంతం చేస్తాను, నీ సంఖ్యను పెంచుతాను. నేను నిన్ను ప్రజల సమాజంగా చేస్తాను, నీ తర్వాత నీ వారసులకు ఈ భూమిని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను’ అని అన్నారు.
GEN 48:5 “కాబట్టి ఇప్పుడు, నేను నీ దగ్గరకు రాకముందు ఈజిప్టులో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా వారిగా లెక్కించబడతారు; రూబేను షిమ్యోనుల్లా, ఎఫ్రాయిం మనష్షే కూడా నా వారిగా ఉంటారు.
GEN 48:6 వారి తర్వాత నీకు పిల్లలు పుడితే వారు నీ సంతానమవుతారు; వారు వారసత్వంగా పొందిన భూభాగంలో వారు తమ సోదరుల పేర్లతో లెక్కించబడతారు.
GEN 48:7 నేను పద్దన నుండి తిరిగి వస్తున్నప్పుడు, మేము ఇంకా దారిలో ఉండగానే, కనాను దేశంలో, ఎఫ్రాతాకు కొద్ది దూరంలో రాహేలు చనిపోయింది. కాబట్టి నేను ఆమెను ఎఫ్రాతా (అనగా బేత్లెహేము) దారి ప్రక్కన సమాధి చేశాను.”
GEN 48:8 ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసినప్పుడు, “వీరు ఎవరు?” అని అడిగాడు.
GEN 48:9 “వారు దేవుడు నాకు ఇక్కడ అనుగ్రహించిన కుమారులు” అని యోసేపు తన తండ్రికి చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు, “నేను వారిని దీవించేలా వారిని నా దగ్గరకు తీసుకురా” అని అన్నాడు.
GEN 48:10 ఇశ్రాయేలు వృద్ధాప్యంలో ఉన్నందుకు దృష్టి మందగించింది కాబట్టి అతడు చూడలేకపోయాడు. కాబట్టి యోసేపు తన కుమారులను అతనికి సమీపంగా తెచ్చాడు, తన తండ్రి వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు.
GEN 48:11 ఇశ్రాయేలు యోసేపుతో, “నేను నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు, కాని ఇప్పుడు నాకు దేవుడు నీ పిల్లలను కూడా చూసే భాగ్యం ఇచ్చారు” అన్నాడు.
GEN 48:12 అప్పుడు యోసేపు వారిని ఇశ్రాయేలు మోకాళ్లమీద నుండి తీసివేసి అతనికి తలవంచి నమస్కరించాడు.
GEN 48:13 యోసేపు వారిద్దరిని తీసుకుని, ఎఫ్రాయిమును తన కుడివైపు ఇశ్రాయేలుకు ఎడమవైపు మనష్షేను తన ఎడమవైపు ఇశ్రాయేలుకు కుడివైపు ఉంచి అతని దగ్గరకు తీసుకువచ్చాడు.
GEN 48:14 అయితే ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా త్రిప్పి చిన్నవాడైన ఎఫ్రాయిం తలపై తన కుడిచేతిని మొదటి కుమారుడైన మనష్షే తలపై తన ఎడమ చేతిని పెట్టాడు.
GEN 48:15 అప్పుడు అతడు యోసేపును దీవిస్తూ అన్నాడు, “నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నమ్మకంగా నడిచారో ఆ దేవుడు, నేటి వరకు నా జీవితమంతా నాకు కాపరిగా ఉన్న దేవుడు,
GEN 48:16 నన్ను ప్రతి హాని నుండి విడిపించిన దూత ఈ బాలురను దీవించును గాక. వారు నా నామాన నా పితరులైన అబ్రాహాము ఇస్సాకుల నామాన పిలువబడుదురు గాక, భూమిపై వారు గొప్పగా విస్తరించుదురు గాక.”
GEN 48:17 తన తండ్రి ఎఫ్రాయిం తలపై కుడిచేయి పెట్టడం చూసి యోసేపు అసంతృప్తి చెందాడు; ఎఫ్రాయిం తలపై నుండి మనష్షే తలపైకి చేయి మార్చడానికి తన తండ్రి చేతిని పట్టుకున్నాడు.
GEN 48:18 యోసేపు అతనితో, “లేదు, నా తండ్రి, ఇతడు మొదటి కుమారుడు; ఇతని తలపై నీ కుడిచేయిని పెట్టు” అన్నాడు.
GEN 48:19 కాని అతని తండ్రి ఒప్పుకోకుండా, “నాకు తెలుసు, నా కుమారుడా, నాకు తెలుసు, అతడు కూడా జనాల సమూహమై గొప్పవాడవుతాడు. అయినా, అతని తమ్ముడు అతనికంటే గొప్పవాడవుతాడు, అతని వారసులు జనాల సమూహం అవుతారు” అని చెప్పాడు.
GEN 48:20 అతడు వారిని ఆ రోజు దీవిస్తూ అన్నాడు, “నీ నామంలో ఇశ్రాయేలు ఈ ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడు: ‘దేవుడు మిమ్మల్ని ఎఫ్రాయిములా మనష్షేలా చేయును గాక.’ ” కాబట్టి ఎఫ్రాయిమును మనష్షేకు ముందుగా పెట్టాడు.
GEN 48:21 తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో, “నేను చనిపోబోతున్నాను, అయితే దేవుడు మీతో ఉంటారు. మిమ్మల్ని తిరిగి మీ పూర్వికుల స్థలమైన కనానుకు తిరిగి తీసుకెళ్తారు.
GEN 48:22 నీ సోదరులకంటే ఎక్కువగా ఒక కొండ ప్రాంతం, నా ఖడ్గం, నా విల్లుతో అమోరీయుల దగ్గర నుండి తీసుకున్న కొండ ప్రాంతాన్ని నీకు ఇస్తున్నాను” అని చెప్పాడు.
GEN 49:1 యాకోబు తన కుమారులను పిలిపించి ఇలా అన్నాడు: “చుట్టూ కూడి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏమి జరగబోతుందో నేను మీకు చెప్తాను.
GEN 49:2 “యాకోబు కుమారులారా, సమావేశమై వినండి మీ తండ్రియైన ఇశ్రాయేలు చెప్పేది వినండి.
GEN 49:3 “రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి నా బలం యొక్క మొదటి గుర్తు, ఘనతలోను శక్తిలోను ఆధిక్యత గలవాడవు
GEN 49:4 కానీ నీళ్లలా అస్థిరంగా ఉండే నీవు ఇకపై రాణించవు, ఎందుకంటే నీవు నీ తండ్రి మంచం ఎక్కావు, నా పడకను అపవిత్రం చేశావు.
GEN 49:5 “షిమ్యోను లేవీ సోదరులు వారి ఖడ్గాలు హింసాయుధాలు.
GEN 49:6 వారి సమావేశాల్లో నేను ప్రవేశించకుందును గాక, నా ఘనతను వారి కూడికలో చేర్చకుందును గాక, ఎందుకంటే వారి కోపంలో వారు మనుష్యులను చంపేశారు సరదా కోసం ఎడ్ల కాలి నరాలు తెగగొట్టారు.
GEN 49:7 వారి కోపం శపించబడాలి, అది భయంకరమైనది, వారి ఆగ్రహం ఎంతో క్రూరమైనది! వారిని యాకోబులో చెల్లాచెదురు చేస్తాను, ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.
GEN 49:8 “యూదా, నీ సోదరులు నిన్ను ప్రశంసిస్తారు; నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది; నీ తండ్రి కుమారులు నీకు తలవంచుతారు
GEN 49:9 యూదా, నీవు ఒక కొదమసింహం; నా కుమారుడా, నీవు వేటాడి తిరిగి వచ్చావు. అతడు సింహంలా కాళ్లు ముడుచుకుని, ఆడ సింహంలా పడుకుంటాడు, అతన్ని లేపడానికి ఎవరు తెగిస్తారు?
GEN 49:10 రాజదండం యూదా దగ్గర నుండి తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు, అది ఎవరికి చెందుతుందో అతడు వచ్చేవరకు తొలగదు, దేశాలు అతనికి విధేయులై ఉంటాయి.
GEN 49:11 అతడు ద్రాక్షచెట్టుకు తన గాడిదను, మంచి ద్రాక్షచెట్టుకు గాడిద పిల్లను కడతాడు; అతడు ద్రాక్షరసంలో తన బట్టలను, ద్రాక్షరసంలో తన వస్త్రాలను ఉతుకుతాడు.
GEN 49:12 అతని కళ్లు ద్రాక్షరసం కంటే ఎర్రగా, అతని పళ్లు పాలకంటే తెల్లగా ఉంటాయి.
GEN 49:13 “జెబూలూను సముద్రతీరాన నివసిస్తాడు ఓడలకు రేవు అవుతాడు; అతని సరిహద్దు సీదోను వరకు వ్యాపిస్తుంది.
GEN 49:14 “ఇశ్శాఖారు రెండు గొర్రెల దొడ్ల మధ్య పడుకుని ఉన్న బలమైన గాడిద వంటివాడు.
GEN 49:15 అతడు తన విశ్రాంతి స్థలం ఎంత మంచిదో, అతని నేల ఎంత ఆహ్లాదకరమో చూసినప్పుడు, అతడు భుజం వంచి శ్రమించి, వెట్టిచాకిరికి సమర్పించుకుంటాడు.
GEN 49:16 “దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంలా తన ప్రజలకు న్యాయం చేస్తాడు.
GEN 49:17 దాను దారిన ఉండే పాములా, మార్గంలో ఉండే విషసర్పంలా, గుర్రాల మడిమెలు కాటు వేస్తాడు. అప్పుడు స్వారీ చేస్తున్నవాడు వెనుకకు పడతాడు.
GEN 49:18 “యెహోవా! మీ రక్షణ కోసం వేచియున్నాను.
GEN 49:19 “గాదు దోపిడి మూక ద్వారా దాడి చేయబడతాడు, కానీ అతడు వారి మడిమెలను కొడతాడు.
GEN 49:20 “ఆషేరుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది; రాజులకు తగిన భోజనం అతడు సమకూరుస్తాడు.
GEN 49:21 “నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు.
GEN 49:22 “యోసేపు ఫలించే కొమ్మ, నీటిబుగ్గ దగ్గర ఫలించే కొమ్మ దాని తీగెలు గోడ మీదికి ఎక్కి ప్రాకుతాయి.
GEN 49:23 అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; అతనిపై బాణాలు విసిరారు.
GEN 49:24 కానీ అతని విల్లు స్థిరంగా నిలిచింది, అతని చేతులు బలంగా ఉన్నాయి, ఎందుకంటే యాకోబు యొక్క బలవంతుని హస్తాన్ని బట్టి, కాపరి, ఇశ్రాయేలు యొక్క బండను బట్టి,
GEN 49:25 నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవున్ని బట్టి, పైనున్న ఆకాశాల దీవెనలతో, క్రింది అగాధజలాల దీవెనలతో, స్తనాల దీవెనలతో గర్భం యొక్క దీవెనలతో, నిన్ను ఆశీర్వదించే సర్వశక్తిమంతున్ని బట్టి బలపరచబడ్డాయి.
GEN 49:26 నీ తండ్రి ఆశీర్వాదాలు పురాతన పర్వత ఆశీర్వాదాల కంటే, ప్రాచీన కొండల యొక్క కోరదగిన వాటికంటే గొప్పవి. ఇవన్నీ యోసేపు తలమీద, తన సోదరులలో అధికారిగా ఉన్న వాడిపై ఉండాలి.
GEN 49:27 “బెన్యామీను ఆకలితో ఉన్న తోడేలు వంటివాడు; ఉదయం అతడు ఎరను మ్రింగుతాడు, సాయంత్రం దోచుకున్నది పంచుతాడు.”
GEN 49:28 ఇవన్నీ ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రాలు. వారి తండ్రి ఎవరి దీవెన ప్రకారం వారిని దీవిస్తూ వారికి చెప్పింది అదే.
GEN 49:29 తర్వాత అతడు వారికి ఈ సూచనలు ఇచ్చాడు: “నేను నా జనుల దగ్గరకు చేరబోతున్నాను. మీరు నన్ను నా పూర్వికుల దగ్గర, హిత్తీయుడైన ఎఫ్రోను గుహలో, కనానులో మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో, అంటే అబ్రాహాము సమాధి స్థలంగా హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర పొలంతో పాటు కొన్న గుహలో పాతిపెట్టండి.
GEN 49:31 అక్కడే అబ్రాహాము అతని భార్య శారా సమాధి చేయబడ్డారు, అక్కడే ఇస్సాకు అతని భార్య రిబ్కా సమాధి చేయబడ్డారు, అక్కడే నేను లేయాను సమాధి చేశాను.
GEN 49:32 ఆ పొలం, అందులోని గుహ హిత్తీయుల దగ్గర కొనబడ్డాయి.”
GEN 49:33 యాకోబు తన కుమారులకు సూచనలు ఇచ్చిన తర్వాత, మంచంపై తన కాళ్లు ముడుచుకుని తుది శ్వాస విడిచాడు, తన ప్రజల దగ్గరకు చేర్చబడ్డాడు.
GEN 50:1 యోసేపు తన తండ్రి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు.
GEN 50:2 తర్వాత తన తండ్రి ఇశ్రాయేలు శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరచమని వైద్యులకు ఆదేశించాడు.
GEN 50:3 కాబట్టి వైద్యులు పూర్తి నలభై రోజులు తీసుకుని భద్రపరిచారు, ఎందుకంటే భద్రపరచడానికి అవసరమయ్యే సమయం అది. ఈజిప్టువారు అతని కోసం డెబ్బై రోజులు దుఃఖించారు.
GEN 50:4 సంతాప దినాలు గడిచాక, యోసేపు ఫరో ఇంటివారితో, “నేను మీ దృష్టిలో దయ పొందితే, నా పక్షాన ఫరోతో మాట్లాడండి. అతనితో,
GEN 50:5 ‘నా తండ్రి నా చేత ప్రమాణం చేయించుకుని, “నేను చనిపోబోతున్నాను; కనాను దేశంలో నా కోసం నేను త్రవ్వించుకున్న సమాధిలో నన్ను పాతిపెట్టండి” అని చెప్పాడు. కాబట్టి నాకు సెలవిస్తే నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి తిరిగి వస్తాను’ అని చెప్పండి” అని అన్నాడు.
GEN 50:6 అప్పుడు ఫరో, “నీవు వెళ్లి, అతడు నీతో ప్రమాణం చేయించినట్టు నీ తండ్రిని పాతిపెట్టు” అన్నాడు.
GEN 50:7 కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్లినప్పుడు అతనితో ఫరో అధికారులందరు, అతని ఇంటి పెద్దలు, ఈజిప్టు ఉన్నతాధికారులందరు,
GEN 50:8 యోసేపు ఇంటివారందరు, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివారితో వెళ్లారు. కేవలం వారి పిల్లలను, వారి మందలను, పశువులను గోషేనులో విడిచిపెట్టారు.
GEN 50:9 రథాలు, రథసారధులు కూడా అతనితో వెళ్లారు. అది చాలా పెద్ద గుంపు.
GEN 50:10 వారు యొర్దాను దగ్గర ఉన్న ఆటదు నూర్పిడి కళ్లం దగ్గర చేరినప్పుడు, వారు బిగ్గరగా, ఘోరంగా ఏడ్చారు; అక్కడ తన తండ్రి కోసం యోసేపు ఏడు రోజుల సంతాప కాలం పాటించాడు.
GEN 50:11 అక్కడ నివసించే కనానీయులు ఆటదు నూర్పిడి కళ్లం దగ్గర ఏడ్వడం చూసి, “ఈజిప్టువారు శోకంతో సంతాప వేడుకను జరుపుకుంటున్నారు” అని అన్నారు. అందుకే యొర్దాను దగ్గర ఉన్న ఆ స్థలం ఆబేల్-మిస్రాయిము అని పిలువబడింది.
GEN 50:12 కాబట్టి యాకోబు ఆజ్ఞాపించినట్టు అతని కుమారులు చేశారు:
GEN 50:13 అతన్ని కనాను దేశానికి మోసుకెళ్లి, అబ్రాహాము సమాధి స్థలంగా హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర పొలంతో పాటు కొన్న మమ్రే దగ్గర ఉన్న మక్పేలా పొలంలో ఉన్న గుహలో సమాధి చేశారు.
GEN 50:14 తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత యోసేపు తన సోదరులతో, సమాధి కార్యక్రమానికి వచ్చిన వారందరితో ఈజిప్టుకు తిరిగి వెళ్లాడు.
GEN 50:15 తమ తండ్రి చనిపోయాడని యోసేపు సోదరులు చూసి, “ఒకవేళ యోసేపు మనపై కక్ష పెట్టుకుని మనం చేసిన తప్పులకు ప్రతి కీడు చేస్తే ఎలా?” అని అనుకున్నారు.
GEN 50:16 కాబట్టి వారు యోసేపుకు ఇలా కబురు పంపారు, “నీ తండ్రి చనిపోకముందు ఇలా ఈ సూచనలు ఇచ్చాడు:
GEN 50:17 ‘యోసేపుతో ఇలా మీరు చెప్పాలి: నీ సోదరులు నిన్ను హీనంగా చూస్తూ నీ పట్ల చేసిన పాపాలను తప్పులను క్షమించమని చెప్తున్నాను.’ కాబట్టి దయచేసి నీ తండ్రి యొక్క దేవుని సేవకుల పాపాలను క్షమించు.” వారి కబురు అందిన తర్వాత యోసేపు ఏడ్చాడు.
GEN 50:18 అప్పుడు తన సోదరులు అతని దగ్గరకు వచ్చి సాష్టాంగపడి, “మేము నీ బానిసలం” అన్నారు.
GEN 50:19 అయితే యోసేపు వారితో, “భయపడకండి, నేనేమైన దేవుని స్థానంలో ఉన్నానా?
GEN 50:20 మీరు నాకు హాని చేయాలనుకున్నారు కానీ ఎంతోమంది జీవితాలను కాపాడడానికి, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిని సాధించడానికి దేవుడు దానిని మేలుకే మార్చారు.
GEN 50:21 కాబట్టి ఇప్పుడు భయపడకండి. నేను మీకు, మీ పిల్లలకు సమకూరుస్తాను” అని అన్నాడు. అతడు వారికి మళ్ళీ అభయమిచ్చి దయతో మాట్లాడాడు.
GEN 50:22 యోసేపు తన తండ్రి కుటుంబంతో కలిసి ఈజిప్టులో నివసించాడు. అతడు నూటపది సంవత్సరాలు జీవించాడు,
GEN 50:23 ఎఫ్రాయిం పిల్లల మూడవ తరాన్ని చూశాడు. మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన పిల్లలు కూడా యోసేపు సొంతవారిగా పెరిగారు.
GEN 50:24 యోసేపు తన సోదరులతో, “నేను చనిపోబోతున్నాను. అయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శించి, ఈ దేశం నుండి ఆయన అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తారు” అని చెప్పాడు.
GEN 50:25 యోసేపు ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణం చేయించుకుని, “దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తారు, అప్పుడు మీరు ఈ స్థలం నుండి నా ఎముకలను తీసుకెళ్లండి” అని చెప్పాడు.
GEN 50:26 యోసేపు నూటపది సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. అతని శవాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచాక, ఈజిప్టులో అతని శరీరాన్ని ఒక శవపేటికలో ఉంచారు.
EXO 1:1 తమ కుటుంబాలతో యాకోబు వెంట ఈజిప్టుకు వెళ్లిన ఇశ్రాయేలు కుమారుల పేర్లు:
EXO 1:2 రూబేను, షిమ్యోను, లేవీ, యూదా;
EXO 1:3 ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను;
EXO 1:4 దాను, నఫ్తాలి; గాదు, ఆషేరు.
EXO 1:5 యాకోబు సంతతివారందరు డెబ్బైమంది; అప్పటికే యోసేపు ఈజిప్టులో ఉన్నాడు.
EXO 1:6 కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు, అతని అన్నదమ్ములు ఆ తరం వారందరు చనిపోయారు,
EXO 1:7 అయితే ఇశ్రాయేలీయులు అత్యధికంగా ఫలించారు; వారు గొప్పగా విస్తరించారు, అభివృద్ధి చెందారు, వారి సంఖ్య అంతకంతకు అభివృద్ధి పొంది వారున్న ప్రదేశం వారితోనే నిండిపోయింది.
EXO 1:8 కొంతకాలం తర్వాత, యోసేపు గురించి తెలియని ఒక క్రొత్త రాజు ఈజిప్టులో అధికారంలోకి వచ్చాడు.
EXO 1:9 అతడు తన ప్రజలతో, “చూడండి, ఈ ఇశ్రాయేలీయులు సంఖ్యలో, బలంలో మనలను అధిగమించారు.
EXO 1:10 మనం వారితో యుక్తిగా నడుచుకోవాలి, లేకపోతే వారి సంఖ్య ఇంకా అధికమవుతుంది. ఒకవేళ యుద్ధం వస్తే వారు మన శత్రువులతో చేరి మనకు వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో” అన్నాడు.
EXO 1:11 కాబట్టి వారిని అణచివేయాలని వారితో వెట్టిచాకిరి చేయించడానికి వారిపై బానిస యజమానులను నియమించారు, ఫరో కోసం పీతోము రామెసేసు అనే రెండు పట్టణాలను గిడ్డంగులుగా కట్టారు.
EXO 1:12 అయితే వారు ఎంతగా అణచివేయబడ్డారో, అంతకన్నా ఎక్కువ విస్తరించి వారు వ్యాపించారు; కాబట్టి ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలీయులను బట్టి భయపడి,
EXO 1:13 వారి చేత వెట్టిచాకిరి చేయించారు.
EXO 1:14 మట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలంలో చేసే ప్రతి పనిలో వారిచేత కఠిన సేవ చేయిస్తూ వారి జీవితాలను దుర్భరంగా మార్చారు. ఈజిప్టు ప్రజలు వారితో కఠినంగా పని చేయించారు.
EXO 1:15 ఈజిప్టు రాజు, షిఫ్రా పూయా అనే హెబ్రీ మంత్రసానులతో మాట్లాడుతూ,
EXO 1:16 “హెబ్రీ స్త్రీలకు ప్రసవ సమయంలో కాన్పుపీట దగ్గర మీరు వారికి సహాయం చేస్తున్నప్పుడు పుట్టింది మగపిల్లవాడైతే వానిని చంపెయ్యండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి” అని అన్నాడు.
EXO 1:17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఈజిప్టు రాజు తమతో చెప్పింది చేయకుండా మగపిల్లలను బ్రతకనిచ్చారు.
EXO 1:18 ఈజిప్టు రాజు ఆ స్త్రీలను పిలిపించి, “మీరెందుకు ఇలా చేశారు? మగపిల్లలను ఎందుకు బ్రతకనిచ్చారు?” అని వారిని అడిగాడు.
EXO 1:19 అందుకు ఆ మంత్రసానులు, “హెబ్రీ స్త్రీలు ఈజిప్టు స్త్రీల వంటివారు కారు; వారు బలం గలవారు, మంత్రసానులు వారి దగ్గరకు రావడానికి ముందే ప్రసవిస్తున్నారు” అని ఫరోతో చెప్పారు.
EXO 1:20 కాబట్టి దేవుడు ఆ మంత్రసానుల పట్ల దయ చూపించారు, ప్రజలు మరింత ఎక్కువగా విస్తరించారు.
EXO 1:21 ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు, కాబట్టి ఆయన వారి సొంత కుటుంబాలను వృద్ధిచేశారు.
EXO 1:22 అప్పుడు ఫరో, “హెబ్రీయులకు పుట్టిన ప్రతి మగపిల్లవాన్ని నైలు నదిలో పడవేసి, ఒకవేళ ఆడపిల్లను అయితే బ్రతకనివ్వాలి” అని ఆజ్ఞాపించాడు.
EXO 2:1 ఆ రోజుల్లో లేవీ గోత్రపు పురుషుడు లేవీ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు,
EXO 2:2 ఆమె గర్భవతియై ఒక కుమారుడిని కన్నది. అతడు చక్కగా ఉండడం చూసి, ఆమె వానిని మూడు నెలలు దాచిపెట్టింది.
EXO 2:3 కాని ఆమె వానిని ఇక దాచలేకపోయినప్పుడు, వాని కోసం ఒక జమ్ము బుట్ట తీసుకుని దానికి జిగటమన్ను తారు పూసింది. ఆ పిల్లవాన్ని అందులో పడుకోబెట్టి దానిని నైలు నది ఒడ్డున ఉన్న జమ్ములో ఉంచింది.
EXO 2:4 అతనికి ఏమి జరుగుతుందో చూడడానికి ఆ పిల్లవాని అక్క దూరంలో నిలబడి ఉంది.
EXO 2:5 ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైలు నదికి రాగా ఆమె పనికత్తెలు నది ఒడ్డున నడుస్తున్నారు. ఆమె జమ్ము మధ్యలో ఉన్న పెట్టెను చూసి దానిని తీసుకురావడానికి తన దాసిని పంపించింది.
EXO 2:6 దానిని తెరిచి ఆ పిల్లవాన్ని చూసింది. ఆ పిల్లవాడు ఏడ్వడం చూసిన ఆమె అతనిపై కనికరపడి, “వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడు” అన్నది.
EXO 2:7 అప్పుడు ఆ పిల్లవాని అక్క ఫరో కుమార్తెతో, “ఈ పిల్లవాన్ని నీకోసం పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒకరిని పిలుచుకొని రమ్మంటారా?” అని అడిగింది.
EXO 2:8 అందుకు ఆమె, “సరే, వెళ్లు” అన్నది. కాబట్టి ఆ అమ్మాయి వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకువచ్చింది.
EXO 2:9 ఫరో కుమార్తె ఆమెతో, “నీవు ఈ బిడ్డను తీసుకెళ్లి నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతమిస్తాను” అని చెప్పింది. ఆమె ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచింది.
EXO 2:10 పిల్లవాడు పెద్దయ్యాక, ఆమె అతన్ని ఫరో కుమార్తె దగ్గరకు తీసుకెళ్లింది, అతడు ఆమె కుమారుడయ్యాడు. “నేను అతన్ని నీటి నుండి బయటకు తీశాను” అని ఆమె అతనికి మోషే అని పేరు పెట్టింది.
EXO 2:11 కొన్ని సంవత్సరాల తర్వాత, మోషే పెద్దవాడైన తర్వాత ఒక రోజు అతడు తన సొంత ప్రజలు ఉన్న చోటికి వెళ్లి వారి దుస్థితిని చూశాడు. అప్పుడు అతడు తన సొంత ప్రజల్లో ఒకడైన ఒక హెబ్రీయున్ని ఒక ఈజిప్టువాడు కొట్టడం చూశాడు.
EXO 2:12 మోషే అటు ఇటు తిరిగి ఎవరూ లేకపోవడం చూసి ఆ ఈజిప్టువాన్ని చంపి ఇసుకలో దాచిపెట్టాడు.
EXO 2:13 మరునాడు అతడు బయటకు వెళ్లినప్పుడు ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకోవడం చూశాడు. అతడు వారిలో తప్పు చేసినవానితో, “నీ తోటి హెబ్రీయున్ని ఎందుకు కొడుతున్నావు?” అని అడిగాడు.
EXO 2:14 అందుకు అతడు, “మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు? ఆ ఈజిప్టువాన్ని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?” అన్నాడు. అప్పుడు మోషే, “నేను చేసిన పని అందరికి తెలిసిపోయింది” అని అనుకుని భయపడ్డాడు.
EXO 2:15 ఫరో ఈ సంగతి విన్నప్పుడు, అతడు మోషేను చంపడానికి ప్రయత్నించాడు, కాని మోషే ఫరో దగ్గరనుండి పారిపోయి మిద్యానులో జీవించడానికి వెళ్లాడు, అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు.
EXO 2:16 మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు, వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు పెట్టడానికి నీళ్లు తోడి తొట్టెలు నింపడం మొదలుపెట్టారు.
EXO 2:17 కొంతమంది గొర్రెల కాపరులు వచ్చి వారిని తరిమివేశారు, అయితే మోషే లేచి వారిని రక్షించి వారి మందకు నీళ్లు పెట్టాడు.
EXO 2:18 వారు తమ తండ్రియైన రెయూయేలు దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు అతడు, “ఈ రోజు మీరు ఇంత త్వరగా ఎందుకు వచ్చారు?” అని వారిని అడిగాడు.
EXO 2:19 అందుకు వారు, “ఒక ఈజిప్టువాడు మమ్మల్ని గొర్రెల కాపరుల బారి నుండి కాపాడాడు. అంతేకాక మాకు, మందకు నీళ్లు తోడి పెట్టాడు” అని చెప్పారు.
EXO 2:20 అందుకు రగూయేలు, “అయితే, అతడు ఎక్కడున్నాడు? అతన్ని ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతన్ని భోజనానికి పిలుచుకొని రండి” అని తన కుమార్తెలతో అన్నాడు.
EXO 2:21 మోషే ఆ వ్యక్తితో ఉండడానికి అంగీకరించాడు. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషేకిచ్చి పెళ్ళి చేశాడు.
EXO 2:22 సిప్పోరా ఒక కుమారుని కన్నది, మోషే, “నేను పరాయి దేశంలో పరదేశినయ్యాను” అని అతనికి గెర్షోము అని పేరు పెట్టాడు.
EXO 2:23 కొన్ని సంవత్సరాలు గడచిన తర్వాత, ఈజిప్టు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తమ బానిసత్వంలో మూల్గుతూ మొరపెట్టారు, తమ బానిస చాకిరీని బట్టి వారు పెట్టిన మొర దేవుని దగ్గరకు చేరింది.
EXO 2:24 దేవుడు వారి మూల్గును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన తన ఒడంబడికను జ్ఞాపకం చేసుకున్నారు.
EXO 2:25 దేవుడు ఇశ్రాయేలీయులను చూసి వారి పట్ల దయ చూపించారు.
EXO 3:1 ఈ సమయంలో, మోషే మిద్యానులో యాజకుడైన యెత్రో అనే తన మామ మందను మేపుతూ, మందను అరణ్యానికి చాలా దూరంగా నడిపించి దేవుని పర్వతమైన, హోరేబు దగ్గరకు వచ్చాడు.
EXO 3:2 అక్కడ ఒక పొదలో మండుతున్న అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద అగ్నితో మండుతూ ఉన్నప్పటికీ అది కాలిపోకపోవడం మోషే చూశాడు.
EXO 3:3 అప్పుడు మోషే, “నేను అక్కడికి వెళ్లి ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదనే ఆ గొప్ప అద్భుతాన్ని చూస్తాను” అని అనుకున్నాడు.
EXO 3:4 దానిని చూడడానికి అతడు అక్కడికి రావడం యెహోవా చూసినప్పుడు, ఆ పొద మధ్యలో నుండి దేవుడు, “మోషే! మోషే!” అని అతన్ని పిలిచారు. అందుకు మోషే, “నేను ఇక్కడ ఉన్నాను” అన్నాడు.
EXO 3:5 అందుకు దేవుడు, “దగ్గరకు రావద్దు, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు” అన్నారు.
EXO 3:6 ఇంకా ఆయన, “నేను నీ తండ్రి దేవుడను, అనగా అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను” అన్నారు. అప్పుడు మోషే దేవుని వైపు చూడడానికి భయపడి, తన ముఖాన్ని దాచుకున్నాడు.
EXO 3:7 అప్పుడు యెహోవా, “నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను చూశాను. వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్న అధికారులను గురించి వారు నాకు చేసిన మొరను నేను విన్నాను, వారి శ్రమల గురించి నాకు తెలుసు.
EXO 3:8 కాబట్టి ఈజిప్టువారి చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకెళ్లడానికి నేను దిగి వచ్చాను.
EXO 3:9 ఇశ్రాయేలీయుల మొర నాకు చేరింది, ఈజిప్టువారు వారినెలా అణచివేస్తున్నారో నేను చూశాను.
EXO 3:10 కాబట్టి ఇప్పుడు, వెళ్లు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు బయటకు తీసుకురావడానికి నేను నిన్ను ఫరో దగ్గరకు పంపుతున్నాను” అని అన్నారు.
EXO 3:11 అయితే మోషే, “ఫరో దగ్గరకు వెళ్లడానికి ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురావడానికి నేను ఎంతటివాన్ని?” అని దేవునితో అన్నాడు.
EXO 3:12 అప్పుడు దేవుడు, “ఖచ్చితంగా నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను పంపాను అనడానికి ఇది ఒక అసాధారణ గుర్తుగా ఉంటుంది: మీరు ఈజిప్టు నుండి ప్రజలను బయటకు తీసుకువచ్చినప్పుడు, మీరూ ఈ పర్వతం మీద దేవుని ఆరాధిస్తారు” అని చెప్పారు.
EXO 3:13 అప్పుడు మోషే, “నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి వారితో, ‘మీ పితరుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పినప్పుడు వారు, ‘ఆయన పేరు ఏమిటి?’ అని నన్ను అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏమి చెప్పాలి?” అని దేవుని అడిగాడు.
EXO 3:14 అందుకు దేవుడు మోషేతో, “నేను నేనైయున్నాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘నేనైయున్నాను అనేవాడు నన్ను మీ దగ్గరకు పంపాడు.’ ”
EXO 3:15 దేవుడు మోషేతో, “నీవు ఇశ్రాయేలీయులతో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పాలి. “ఇదే నా నిత్యమైన పేరు, తరతరాల వరకు మీరు జ్ఞాపకముంచుకోవలసిన పేరు ఇదే.
EXO 3:16 “వెళ్లు, ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి వారితో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: నేను మిమ్మల్ని చూశాను; ఈజిప్టులో మీకు జరిగిన దానిని చూశాను.
EXO 3:17 ఈజిప్టు కష్టాల నుండి విడిపించి, కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రమాణం చేశాను’ అని వారితో చెప్పు.
EXO 3:18 “ఇశ్రాయేలీయుల పెద్దలు నీ మాట వింటారు. అప్పుడు నీవు వారితో కలిసి ఈజిప్టు రాజు దగ్గరకు వెళ్లి అతనితో, ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యారు. మేము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించేలా మమ్మల్ని వెళ్లనివ్వండి’ అని చెప్పాలి.
EXO 3:19 అయితే ఈజిప్టు రాజు ఒక బలమైన హస్తం అతన్ని ఒత్తిడి చేస్తేనే తప్ప మిమ్మల్ని పోనివ్వడని నాకు తెలుసు.
EXO 3:20 కాబట్టి నేను నా చేతిని చాచి ఈజిప్టువారి మధ్య నేను చేయదలచిన అద్భుత కార్యాలను చేసి వారిని మొత్తుతాను. దాని తర్వాత అతడు మిమ్మల్ని వెళ్లనిస్తాడు.
EXO 3:21 “ఈ ప్రజల పట్ల ఈజిప్టువారిలో దయను పుట్టిస్తాను కాబట్టి మీరు వెళ్లినప్పుడు వట్టి చేతులతో వెళ్లరు.
EXO 3:22 ప్రతి స్త్రీ తన పొరుగువారిని వారి ఇంట్లో ఉండే స్త్రీని వెండి బంగారు ఆభరణాలను, బట్టలను అడిగి తీసుకుని వాటిని మీ కుమారులకు కుమార్తెలకు ధరింపచేయాలి. ఈ విధంగా మీరు ఈజిప్టువారిని కొల్లగొడతారు.”
EXO 4:1 అందుకు మోషే, “ఒకవేళ వారు నన్ను నమ్మకుండ లేదా నేను చెప్పేది వినకుండ, ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అని అంటే ఎలా?” అన్నాడు.
EXO 4:2 అప్పుడు యెహోవా అతనితో, “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని అన్నారు. “ఒక కర్ర” అని అతడు జవాబిచ్చాడు.
EXO 4:3 అందుకు యెహోవా, “దానిని నేలపై పడవేయి” అన్నారు. మోషే దానిని నేల మీద పడవేయగానే అది పాముగా మారింది, అతడు దాని నుండి పారిపోయాడు.
EXO 4:4 అప్పుడు యెహోవా, “నీ చేయి చాచి దాని తోక పట్టుకుని పైకెత్తు” అని అతనితో అన్నారు. మోషే తన చేతిని చాచి ఆ పాము తోక పట్టుకుని పైకెత్తగానే అది తిరిగి అతని చేతిలో కర్రగా మారింది.
EXO 4:5 అప్పుడు యెహోవా, “దీనిని బట్టి వారు, తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యారని నమ్ముతారు” అని అన్నారు.
EXO 4:6 యెహోవా, “నీ చేతిని నీ ఛాతీ మీద పెట్టు” అన్నారు. మోషే తన చేతిని తన ఛాతీ మీద పెట్టాడు, అతడు దానిని బయటకు తీయగా, అది కుష్ఠురోగంతో మంచులా తెల్లగా మారిపోయింది.
EXO 4:7 “ఇప్పుడు నీ చేయి మరలా నీ ఛాతీ మీద పెట్టు” అని ఆయన అన్నారు. మోషే తన చేతిని మరలా తన ఛాతీ మీద పెట్టాడు, అతడు దానిని బయటకు తీసినప్పుడు, అది తిరిగి మంచిదిగా, మిగితా దేహంలా అది మారింది.
EXO 4:8 అప్పుడు యెహోవా, “వారు నిన్ను నమ్మకపోయినా మొదటి అసాధారణ గుర్తును లక్ష్యపెట్టకపోయినా, రెండవదానిని బట్టి నమ్మవచ్చు.
EXO 4:9 అయితే వారు ఈ రెండు అసాధారణ గుర్తులను కూడా నమ్మకపోయినా లేదా నీ మాట వినకపోయినా, నీవు నైలు నది నుండి కొంచెం నీరు తీసుకుని పొడినేల మీద పోయి. నీవు నది నుండి తీసుకున్న నీరు నేలమీద రక్తంగా మారుతుంది” అని చెప్పారు.
EXO 4:10 అప్పుడు మోషే యెహోవాతో, “ప్రభువా, నీ సేవకుని క్షమించు. గతంలో కాని నీవు నీ సేవకునితో మాట్లాడినప్పటినుండి కాని నేను ఎప్పుడూ మాటకారిని కాదు. నేను నత్తివాన్ని నా నాలుక సరిగా తిరగదు” అన్నాడు.
EXO 4:11 యెహోవా అతనితో అన్నారు, “మానవులకు నోరు ఇచ్చింది ఎవరు? వారిని చెవిటివారిగా మూగవారిగా చేసింది ఎవరు? వారికి చూపును ఇచ్చింది, గ్రుడ్డివారిగా చేసింది ఎవరు? యెహోవానైన, నేను కాదా?
EXO 4:12 కాబట్టి వెళ్లు; నేను సహాయం చేస్తాను, ఏమి మాట్లాడాలో నేను నీకు బోధిస్తాను.”
EXO 4:13 కాని మోషే, “ప్రభువా, నీ సేవకుని క్షమించండి. దయచేసి మరొకరిని పంపించండి” అన్నాడు.
EXO 4:14 అప్పుడు యెహోవా కోపం మోషేపై కోపం రగులుకుంది, ఆయన అన్నారు, “లేవీయుడైన నీ అన్న అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నాకు తెలుసు. అతడు నిన్ను కలుసుకోడానికి వస్తున్నాడు. నిన్ను చూసి అతడు సంతోషిస్తాడు.
EXO 4:15 నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించాలి. నేను నీ నోటికి అతని నోటికి తోడుగా ఉంటాను. మీరు మాట్లాడడానికి సహాయం చేస్తాను, అలాగే మీరేమి చేయాలో నేను మీకు బోధిస్తాను.
EXO 4:16 అతడే నీ బదులు ప్రజలతో మాట్లాడతాడు. అతడు నీకోసం మాట్లాడే వాడిగా ఉంటాడు, నీవు అతనికి దేవునిలా ఉంటావు.
EXO 4:17 ఈ కర్రను నీ చేతితో పట్టుకో, దీనితో నీవు అసాధారణ గుర్తులు చేయగలవు” అన్నారు.
EXO 4:18 ఆ తర్వాత మోషే తన మామయైన యెత్రో దగ్గరకు తిరిగివెళ్లి అతనితో, “నేను ఈజిప్టులో ఉన్న నా బంధువుల దగ్గరకు తిరిగివెళ్లి వారిలో ఎవరైనా ఇంకా బ్రతికి ఉన్నారో లేదో చూడడానికి నన్ను వెళ్లనివ్వు” అన్నాడు. అందుకు యెత్రో, “సమాధానం కలిగి, వెళ్లు” అన్నాడు.
EXO 4:19 తర్వాత యెహోవా మిద్యానులో మోషేతో, “నిన్ను చంపడానికి చూసినవారందరు చనిపోయారు కాబట్టి నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్లు” అన్నారు.
EXO 4:20 కాబట్టి మోషే తన భార్య పిల్లలను తీసుకుని గాడిద మీద ఎక్కించి ఈజిప్టుకు తిరిగి ప్రయాణమయ్యాడు. అతడు దేవుని కర్రను తన చేతిలో పట్టుకున్నాడు.
EXO 4:21 అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, “నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్లిన తర్వాత, నేను నీకు చేయడానికి శక్తినిచ్చిన ఇచ్చిన అద్భుతాలన్నిటిని ఫరో ఎదుట నీవు చేయాలి. అయితే నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను కాబట్టి అతడు ప్రజలను వెళ్లనివ్వడు.
EXO 4:22 అప్పుడు నీవు ఫరోతో, ‘యెహోవా నాతో ఇలా చెప్పారు: ఇశ్రాయేలు నా మొదటి సంతానమైన కుమారుడు,
EXO 4:23 “నన్ను సేవించేలా నా కుమారుని వెళ్లనివ్వు” అని నీకు చెప్పాను. కాని నీవు వారిని పంపడానికి నిరాకరించావు; కాబట్టి నేను నీ మొదటి సంతానమైన నీ కుమారున్ని చంపుతాను.’ ”
EXO 4:24 ప్రయాణ మార్గంలో వారు బసచేసిన చోటు దగ్గర యెహోవా మోషేను ఎదుర్కొని అతన్ని చంపబోయారు.
EXO 4:25 అయితే సిప్పోరా ఒక చెకుముకి కత్తిని తీసుకుని, తన కుమారుని యొక్క మర్మాంగ చర్మం యొక్క కొనను కత్తిరించుట ద్వార సున్నతిచేసి, దానితో మోషే పాదాలను తాకించి, “నీవు నాకు రక్తసంబంధమైన భర్తవు” అన్నది.
EXO 4:26 అప్పుడు యెహోవా అతన్ని విడిచిపెట్టారు. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు “రక్తసంబంధమైన భర్తవయ్యావు” అన్నది.
EXO 4:27 యెహోవా అహరోనుతో, “మోషేను కలవడానికి అరణ్యంలోనికి వెళ్లు” అని అన్నారు. కాబట్టి అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకున్నాడు.
EXO 4:28 అప్పుడు మోషే తనను పంపించిన యెహోవా చెప్పమన్న వాటన్నిటిని, ఆయన తనను చేయమని ఆజ్ఞాపించిన సూచనలన్నింటిని గురించి అహరోనుకు చెప్పాడు.
EXO 4:29 అప్పుడు మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి,
EXO 4:30 యెహోవా మోషేకు చెప్పిన వాటన్నిటిని అహరోను పెద్దలందరికి తెలియజేశాడు. మోషే వారి ఎదుట ఆ అసాధారణమైన సూచకక్రియలను చేశాడు,
EXO 4:31 అప్పుడు వారు నమ్మారు. యెహోవా ఇశ్రాయేలీయులను పట్టించుకున్నాడని తమ బాధలను చూశాడని విని వారు తమ తలలు వంచి ఆరాధించారు.
EXO 5:1 ఆ తర్వాత మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లి, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పిన మాట ఇదే: ‘అరణ్యంలో నాకు ఉత్సవం చేయడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.’ ”
EXO 5:2 అందుకు ఫరో, “నేను ఆయన మాట విని ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వడానికి యెహోవా ఎవరు? ఆ యెహోవా నాకు తెలియదు, ఇశ్రాయేలీయులను నేను పంపను” అన్నాడు.
EXO 5:3 అందుకు వారు, “హెబ్రీయుల దేవుడు మాకు ప్రత్యక్షమయ్యారు. కాబట్టి మేము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ మా దేవుడైన యెహోవాకు బలి అర్పించాలి. లేకపోతే ఆయన మమ్మల్ని తెగులుతోగాని ఖడ్గంతోగాని బాధిస్తారు” అన్నారు.
EXO 5:4 అందుకు ఈజిప్టు రాజు, “మోషే అహరోనూ, ఈ ప్రజలు తమ పనులను చేయకుండా మీరెందుకు ఆటంకపరుస్తున్నారు? మీ పనికి తిరిగి వెళ్లండి!” అన్నాడు.
EXO 5:5 ఫరో, “చూడండి, ఈ దేశ ప్రజలు చాలామంది ఉన్నారు, మీరు వారిని పని చేయకుండా ఆటంకపరుస్తున్నారు” అన్నాడు.
EXO 5:6 అదే రోజు ఫరో బానిసల నాయకులకు, వారిపై అధికారులుగా ఉన్నవారికి ఇలా ఆజ్ఞాపించాడు:
EXO 5:7 “ఇటుకలు చేయడానికి వారికి కావలసిన గడ్డిని ఇకపై మీరు ఇవ్వకండి; వారే వెళ్లి తమకు కావలసిన గడ్డిని తెచ్చుకోవాలి.
EXO 5:8 అయినప్పటికీ వారు ఇంతకుముందు చేసినన్ని ఇటుకలనే ఇప్పుడు కూడా చేయాలి; కోటా తగ్గించకండి. వారు సోమరివారు కాబట్టి, ‘మేము వెళ్లి మా దేవునికి బలి అర్పించడానికి మమ్మల్ని పంపించండి’ అని మొరపెడుతున్నారు.
EXO 5:9 ఆ ప్రజలచేత మరింత కఠినంగా పని చేయించండి అప్పుడు వారు పని చేస్తూ ఉండి అబద్ధపు మాటలను పట్టించుకోరు.”
EXO 5:10 కాబట్టి బానిసల నాయకులు వారి అధికారులు వెళ్లి ప్రజలతో, “ఫరో ఇలా అంటున్నారు: ‘నేను ఇకపై మీకు గడ్డి ఇవ్వను.
EXO 5:11 మీరు వెళ్లి గడ్డి ఎక్కడ దొరికితే అక్కడినుండి తెచ్చుకోండి, అయినాసరే మీ పని ఏమాత్రం తగ్గించబడదు.’ ”
EXO 5:12 కాబట్టి ప్రజలు గడ్డికి బదులు ఎండిన దుబ్బులను సేకరించడానికి ఈజిప్టు దేశమంతా చెదిరిపోయారు.
EXO 5:13 బానిసల నాయకులు వారితో, “మీకు గడ్డి ఉన్నప్పుడు చేసినట్లే ఏ రోజు పనిని ఆ రోజే పూర్తి చేయండి” అని వారిని తీవ్రంగా హెచ్చరించారు.
EXO 5:14 ఫరో యొక్క బానిస నాయకులు వారు నియమించిన ఇశ్రాయేలీయుల పర్యవేక్షకులను కొట్టి, “నిన్న లేదా ఈ రోజు మీ ఇటుకల కోటా మునుపటిలా ఎందుకు చేరుకోలేదు?” అని అడిగారు.
EXO 5:15 అప్పుడు ఇశ్రాయేలీయుల పర్యవేక్షకులు ఫరో దగ్గరకు వెళ్లి, “మీ సేవకుల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?
EXO 5:16 మీ సేవకులకు గడ్డి ఇవ్వడం లేదు గాని ఇటుకలు చేయండి అని మాతో అంటున్నారు. మీ సేవకులు దెబ్బలు తింటున్నారు కాని తప్పు మీ సొంత ప్రజలలోనే ఉంది” అని మనవి చేశారు.
EXO 5:17 అందుకు ఫరో, “మీరు సోమరులు, మీరు సోమరులు! అందుకే, ‘మేము వెళ్లి యెహోవాకు బలి అర్పిస్తాము మమ్మల్ని వెళ్లనివ్వండి’ అని అడుగుతున్నారు.
EXO 5:18 వెళ్లండి, వెళ్లి పని చేయండి. మీకు గడ్డి ఇవ్వరు అయినా మీరు చేయాల్సిన ఇటుకల పూర్తి కోట చేయాల్సిందే” అని అన్నాడు.
EXO 5:19 “మీరు ప్రతిరోజు చేయాల్సిన ఇటుకల సంఖ్య ఏమాత్రం తగ్గించబడదు” అని తమతో చెప్పినప్పుడు తాము కష్టాల్లో చిక్కుకున్నామని ఇశ్రాయేలీయుల పర్యవేక్షకులు గ్రహించారు.
EXO 5:20 వారు ఫరో దగ్గర నుండి వస్తున్నప్పుడు తమను కలవాలని ఎదురు చూస్తున్న మోషే అహరోనులను కలుసుకొని,
EXO 5:21 వారు, “యెహోవా మిమ్మల్ని చూసి మిమ్మల్ని తీర్పు తీర్చును గాక! మీరు ఫరో ఎదుట అతని అధికారుల ఎదుట మమ్మల్ని చెడ్డవారిగా చేశారు, మమ్మల్ని చంపడానికి వారి చేతిలో కత్తి పెట్టారు” అని అన్నారు.
EXO 5:22 మోషే యెహోవా దగ్గరకు తిరిగివెళ్లి, “ప్రభువా, ఈ ప్రజలమీదికి ఎందుకు ఇబ్బంది రప్పించారు? నన్ను ఇందుకే పంపించారా?
EXO 5:23 నేను మీ నామాన్ని బట్టి ఫరోతో మాట్లాడడానికి వెళ్లినప్పటి నుండి అతడు ఈ ప్రజలను కష్టపెడుతున్నాడు. మీరు మీ ప్రజలను ఏమాత్రం విడిపించడంలేదు” అన్నాడు.
EXO 6:1 అప్పుడు యెహోవా మోషేతో, “ఇప్పుడు నేను ఫరోకు ఏం చేయబోతున్నానో నీవు చూస్తావు: నా బలమైన హస్తాన్ని బట్టి అతడు వారిని వెళ్లనిస్తాడు; నా బలమైన హస్తాన్ని బట్టి అతడు వారిని తన దేశం నుండి తరిమివేస్తాడు” అన్నారు.
EXO 6:2 దేవుడు మోషేతో అన్నారు, “నేను యెహోవాను.
EXO 6:3 నేను సర్వశక్తిగల దేవునిగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను, కాని యెహోవా అనే నా పేరుతో నన్ను నేను వారికి తెలియపరచుకోలేదు.
EXO 6:4 వారు విదేశీయులుగా ఉండిన కనాను దేశాన్ని వారికి ఇస్తాననే నా నిబంధనతో నేను వారిని స్థిరపరిచాను.
EXO 6:5 అంతేకాక, ఈజిప్టు వారిచేత బానిసలుగా చేయబడిన ఇశ్రాయేలీయుల మూలుగును నేను విన్నాను, నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను.
EXO 6:6 “కాబట్టి, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను యెహోవాను, ఈజిప్టువారి వెట్టిచాకిరి నుండి నేను మిమ్మల్ని బయటకు తీసుకువస్తాను. మీరు వారికి బానిసలుగా ఉండకుండ నేను మిమ్మల్ని స్వతంత్రులను చేస్తాను, చాపబడిన బాహువుతో, గొప్ప తీర్పు చర్యలతో నేను మిమ్మల్ని విమోచిస్తాను.
EXO 6:7 నేను మిమ్మల్ని నా సొంత ప్రజలుగా చేసుకుని, మీకు దేవుడనై ఉంటాను. అప్పుడు ఈజిప్టువారి కాడి క్రిందనుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.
EXO 6:8 నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేయెత్తి ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. దానిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. నేను యెహోవాను.’ ”
EXO 6:9 మోషే ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని తెలియజేశాడు, కాని వారి కఠినమైన శ్రమను బట్టి, నిరుత్సాహాన్ని బట్టి వారు అతని మాట వినలేదు.
EXO 6:10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు,
EXO 6:11 “వెళ్లు, ఇశ్రాయేలీయులను తన దేశం నుండి బయటకు వెళ్లనివ్వమని ఈజిప్టు రాజైన ఫరోకు చెప్పు.”
EXO 6:12 అయితే మోషే యెహోవాతో, “ఇశ్రాయేలీయులే నా మాట వినకపోతే స్పష్టంగా మాట్లాడలేని నా మాట ఫరో ఎందుకు వింటాడు?” అని అన్నాడు.
EXO 6:13 అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఇశ్రాయేలీయులను గురించి ఈజిప్టు రాజైన ఫరోను గురించి మాట్లాడి, ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురమ్మని వారిని ఆదేశించారు.
EXO 6:14 వారి కుటుంబాలకు మూలపురుషులు వీరే: ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ;
EXO 6:15 షిమ్యోను కుమారులు: యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి పుట్టిన షావూలు;
EXO 6:16 కుటుంబ వివరాల ప్రకారం లేవీ కుమారుల పేర్లు: గెర్షోను, కహాతు, మెరారి.
EXO 6:17 వంశాల ప్రకారం గెర్షోను కుమారులు: లిబ్నీ, షిమీ.
EXO 6:18 కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. (కహాతు 133 సంవత్సరాలు బ్రతికాడు.)
EXO 6:19 మెరారి కుమారులు: మహలి, మూషి.
EXO 6:20 అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెళ్ళి చేసుకున్నాడు. వారికి అహరోను మోషేలు పుట్టారు.
EXO 6:21 ఇస్హారు కుమారులు: కోరహు, నెఫెగు, జిఖ్రీ.
EXO 6:22 ఉజ్జీయేలు కుమారులు: మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ.
EXO 6:23 అహరోను అమ్మీనాదాబు కుమార్తె నయస్సోను సహోదరియైన ఎలీషేబను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె అతనికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులను కన్నది.
EXO 6:24 కోరహు కుమారులు: అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు.
EXO 6:25 అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకున్నాడు, ఆమె అతనికి ఫీనెహాసును కన్నది.
EXO 6:26 “ఇశ్రాయేలీయులను వారి విభజనల ప్రకారం ఈజిప్టులో నుండి బయటకు తీసుకురండి” అని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరే.
EXO 6:27 ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురావడం గురించి ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడిన అహరోను మోషేలు వీరే.
EXO 6:28 ఇక ఈజిప్టు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు,
EXO 6:29 ఆయన మోషేతో, “నేను యెహోవానై ఉన్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఈజిప్టు రాజైన ఫరోతో చెప్పు” అన్నారు.
EXO 6:30 కాని మోషే యెహోవాతో, “తడబడే పెదవులతో మాట్లాడే నా మాటను ఫరో ఎందుకు వింటాడు?” అని అన్నాడు.
EXO 7:1 అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, “చూడు, నేను నిన్ను ఫరోకు దేవునిలా చేస్తాను, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు.
EXO 7:2 నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతిదీ నీవు చెప్పాలి, ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వాలని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పాలి.
EXO 7:3 కాని నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, కాబట్టి ఈజిప్టు దేశంలో నా సూచనలను, అద్భుతాలను అధికంగా చేసినప్పటికీ,
EXO 7:4 ఫరో మీ మాట వినడు. అప్పుడు నేను ఈజిప్టుపై నా చేతిని ఉంచి గొప్ప తీర్పు చర్యలతో, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను వారి విభజనల ప్రకారం బయటకు తీసుకువస్తాను.
EXO 7:5 నేను ఈజిప్టుకు వ్యతిరేకంగా చేయి చాచి ఇశ్రాయేలీయులను దాని నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు నేను యెహోవానని ఈజిప్టువారు తెలుసుకుంటారు.”
EXO 7:6 మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.
EXO 7:7 వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 సంవత్సరాలు అహరోనుకు 83 సంవత్సరాలు.
EXO 7:8 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు,
EXO 7:9 “ ‘ఒక అద్భుతకార్యం చేయండి’ అని ఫరో మీతో చెప్పినప్పుడు, నీవు అహరోనుతో, ‘నీ చేతికర్రను తీసుకుని ఫరో ఎదుట పడవేయి’ అని చెప్పు. అది పాముగా మారుతుంది.”
EXO 7:10 మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే చేశారు. అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పడవేయగానే అది పాముగా మారింది.
EXO 7:11 ఫరో జ్ఞానులను మంత్రగాళ్ళను పిలిపించాడు. ఈజిప్టువారి మంత్రగాళ్ళు కూడా తమ మంత్రవిద్యతో అలాగే చేశారు.
EXO 7:12 ప్రతి ఒక్కరు తమ కర్రను క్రింద పడవేయగా అది పాముగా మారింది. అయితే అహరోను కర్ర వారి కర్రలను మ్రింగివేసింది.
EXO 7:13 కాని యెహోవా వారితో చెప్పిన ప్రకారమే ఫరో హృదయం కఠినంగా మారి అతడు వారి మాటను వినలేదు.
EXO 7:14 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఫరో హృదయం కఠినమైనది కాబట్టి అతడు ప్రజలను పంపించడానికి నిరాకరిస్తాడు.
EXO 7:15 ఫరో నదికి వెళ్లేటప్పుడు ఉదయాన్నే నీవు అతని దగ్గరకు వెళ్లు. నైలు నది తీరాన నీవు అతనికి ఎదురు వెళ్లు. పాముగా మారిన కర్రను నీ చేతితో పట్టుకో.
EXO 7:16 అతనితో, ‘అరణ్యంలో నన్ను సేవించడానికి నా ప్రజలను వెళ్లనివ్వమని నీతో చెప్పడానికి హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ దగ్గరకు పంపాడు. ఇప్పటివరకు నీవు మాట వినలేదు.
EXO 7:17 యెహోవా చెప్పిన మాట ఇదే: దీని ద్వారా నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు. నా చేతిలో ఉన్న కర్రతో నేను నైలు నది నీటిని కొడతాను. అది రక్తంగా మారుతుంది.
EXO 7:18 నైలు నదిలోని చేపలన్నీ చస్తాయి, నది కంపు కొడుతుంది; ఈజిప్టువారు దాని నీటిని త్రాగలేరు.’ ”
EXO 7:19 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నారు, “నీవు అహరోనుతో ఇలా చెప్పు, ‘నీ కర్రను తీసుకుని ఈజిప్టు జలాల మీద అనగా వారి నదులు కాలువలు చెరువులు, అన్ని జలాశయాల మీద చాపు, అప్పుడు అవన్నీ రక్తంగా మారుతాయి.’ ఈజిప్టులో ఎటు చూసినా రక్తమే ఉంటుంది. చివరికి చెక్క, రాతి పాత్రల్లో కూడా.”
EXO 7:20 మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే చేశారు. అతడు ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పైకి లేపి నైలు నది నీటిని కొట్టగా, దాని నీరంతా రక్తంగా మారాయి.
EXO 7:21 నైలు నదిలోని చేపలు చనిపోయి, నది కంపు కొట్టడంతో ఈజిప్టువారు ఆ నీటిని త్రాగలేకపోయారు. ఈజిప్టులో ఎటు చూసినా రక్తమే కనబడింది.
EXO 7:22 అయితే ఈజిప్టు మంత్రగాళ్ళు కూడా తమ మంత్రవిద్యతో వాటిని చేశారు, అయితే యెహోవా వారితో చెప్పిన ప్రకారమే ఫరో హృదయం కఠినంగా మారి అతడు వారి మాటలను వినిపించుకోలేదు.
EXO 7:23 దానికి బదులు, ఫరో తన రాజభవనానికి తిరిగి వెళ్లిపోయాడు, కనీసం జరిగిన వాటి గురించి ఆలోచించలేదు.
EXO 7:24 ఈజిప్టు వారంతా నైలు నది నీటిని త్రాగలేక త్రాగునీటి కోసం నది ప్రక్కన త్రవ్వారు.
EXO 7:25 యెహోవా నైలు నదిని కొట్టి ఏడు రోజులు గడిచాయి.
EXO 8:1 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు ఫరో దగ్గరకు వెళ్లి అతనితో, ‘యెహోవా చెప్పిన మాట ఇదే: నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
EXO 8:2 నీవు వారిని వెళ్లనివ్వకపోతే నేను నీ దేశమంతట కప్పలు పంపించి బాధిస్తాను.
EXO 8:3 నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి నీ రాజభవనం లోనికి నీ పడకగదిలోనికి, నీ పడక మీదికి, నీ అధికారుల ఇళ్ళలోనికి, నీ ప్రజలమీదికి, మీ పొయ్యిల్లోనికి, పిండి పిసికే తొట్టెల్లోనికి వస్తాయి.
EXO 8:4 ఆ కప్పలు నీ మీదికి నీ ప్రజలమీదికి నీ అధికారుల మీదికి వస్తాయి అని చెప్పు’ అని అన్నారు.”
EXO 8:5 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు అహరోనుతో, ‘ప్రవాహాలు, కాలువలు, చెరువులపై నీ కర్రతో నీ చేయిని చాచి, ఈజిప్టు భూమిపై కప్పలు పైకి వచ్చేలా చేయి’ అని చెప్పు.”
EXO 8:6 అహరోను ఈజిప్టు జలాల మీద తన చేతిని చాపినప్పుడు కప్పలు వచ్చి ఆ దేశాన్ని కప్పివేశాయి.
EXO 8:7 అయితే మంత్రగాళ్ళు కూడా తమ మంత్రవిద్యతో అవే చేసి ఈజిప్టు దేశం మీదికి కప్పలు వచ్చేలా చేశారు.
EXO 8:8 ఫరో మోషే అహరోనులను పిలిపించి, “నా నుండి నా ప్రజల నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాకు ప్రార్థించండి, అప్పుడు యెహోవాకు బలి అర్పించడానికి నీ ప్రజలను వెళ్లనిస్తాను” అని అన్నాడు.
EXO 8:9 అందుకు మోషే ఫరోతో, “నైలు నదిలో మిగిలి ఉన్న కప్పలు తప్ప, మిమ్మల్ని, మీ ఇళ్ళను కప్పలు వదిలి వెళ్లేలా, మీ కోసం మీ ప్రజల కోసం, మీ అధికారుల కోసం ప్రార్థించడానికి సమయం నిర్ణయించే గౌరవాన్ని నేను మీకే ఇస్తున్నాను” అన్నాడు.
EXO 8:10 అందుకు ఫరో, “రేపే” అన్నాడు. అందుకు మోషే అన్నాడు, “మా దేవుడైన యెహోవా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకునేలా నీవన్నట్టే జరుగుతుంది.
EXO 8:11 కప్పలు మిమ్మల్ని, మీ ఇళ్ళను, మీ అధికారులను, మీ ప్రజలను వదిలివేస్తాయి; అవి నైలు నదిలో మాత్రమే ఉంటాయి.”
EXO 8:12 మోషే అహరోనులు ఫరో దగ్గరనుండి వెళ్లిన తర్వాత, యెహోవా ఫరో మీదికి రప్పించిన కప్పల గురించి మోషే ఆయనకు మొరపెట్టాడు.
EXO 8:13 మోషే అడిగినట్టే యెహోవా చేశారు. ఇళ్ళలో ఆవరణాల్లో పొలాల్లో ఉన్న కప్పలు చనిపోయాయి.
EXO 8:14 ఈజిప్టు ప్రజలు వాటిని కుప్పలుగా వేసినప్పుడు నేల కంపుకొట్టింది.
EXO 8:15 కప్పల నుండి ఉపశమనం కలిగిందని చూసిన ఫరో యెహోవా చెప్పిన ప్రకారమే తన హృదయాన్ని కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు.
EXO 8:16 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు అహరోనుతో, ‘నీ కర్రను చాపి నేలమీది ధూళిని కొట్టు’ అని చెప్పు, అప్పుడు ఈజిప్టు దేశమంతటా ఆ ధూళి చిన్న దోమలుగా మారుతుంది” అని అన్నారు.
EXO 8:17 వారు అలాగే చేశారు, అహరోను కర్ర పట్టుకుని తన చేతిని చాచి నేలమీది ధూళిని కొట్టినప్పుడు మనుష్యుల మీదికి జంతువుల మీదికి చిన్న దోమలు వచ్చాయి. ఈజిప్టు దేశంలోని ధూళి అంతా చిన్న దోమలుగా మారింది.
EXO 8:18 అయితే మంత్రగాళ్ళు తమ మంత్రవిద్యతో చిన్న దోమలను పుట్టించడానికి ప్రయత్నించారు, కాని వారు చేయలేకపోయారు. చిన్న దోమలు మనుష్యుల మీద జంతువుల మీద వాలాయి,
EXO 8:19 మంత్రగాళ్ళు ఫరోతో, “ఇది దేవుని వ్రేలు చేసిన పనే” అని చెప్పారు. అయినా యెహోవా చెప్పిన ప్రకారమే ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని వారి మాట వినలేదు.
EXO 8:20 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు ప్రొద్దుటే లేచి ఫరో నదికి వెళ్తున్నప్పుడు అతనికి ఎదురై అతనితో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పిన మాట ఇదే: నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
EXO 8:21 నీవు నా ప్రజలను వెళ్లనివ్వకపోతే నేను నీ మీదికి నీ అధికారుల మీదికి నీ ప్రజలమీదికి నీ ఇళ్ళలోనికి ఈగల గుంపులను పంపిస్తాను, అప్పుడు ఈజిప్టువారి ఇల్లు ఈగలతో నిండిపోతాయి; చివరికి నేల కూడా వాటితో నిండిపోతుంది.
EXO 8:22 “ ‘అయితే ఆ దినాన నా ప్రజలు నివసించే గోషేను దేశంలో మాత్రం ఏ ఈగల గుంపు ఉండదు; అప్పుడు యెహోవానైన నేను ఈ దేశంలో ఉన్నానని నీవు తెలుసుకుంటావు;
EXO 8:23 నీ ప్రజలకు నా ప్రజలకు మధ్య భేదాన్ని చూపిస్తాను. ఈ సూచన రేపే కనబడుతుంది.’ ”
EXO 8:24 ఇది యెహోవా చేశారు. బాధించే ఈగల గుంపులు ఫరో రాజభవనం లోనికి అతని సేవకుల ఇళ్ళలోనికి వచ్చి పడ్డాయి; ఈగల గుంపుల వలన ఈజిప్టు దేశమంతటా నేల నాశనమైంది.
EXO 8:25 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, “మీరు వెళ్లి ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి” అన్నాడు.
EXO 8:26 అందుకు మోషే, “అది సరికాదు. మా దేవుడైన యెహోవాకు మేము బలి అర్పించడం ఈజిప్టువారికి అసహ్యం కలిగించవచ్చు. వారి కళ్ళకు అసహ్యమైన బలిని మేము అర్పించినప్పుడు వారు మమ్మల్ని రాళ్లతో కొట్టరా?
EXO 8:27 మేము అరణ్యంలో మూడు రోజులు ప్రయాణం చేసి మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన ప్రకారం మేము అక్కడే బలి అర్పించాలి” అన్నాడు.
EXO 8:28 అందుకు ఫరో, “మీ దేవుడైన యెహోవాకు అరణ్యంలో బలులు అర్పించడానికి నేను మిమ్మల్ని పంపిస్తాను కాని మీరు ఎక్కువ దూరం వెళ్లకూడదు. ఇప్పుడు నా కోసం ప్రార్థించండి” అన్నాడు.
EXO 8:29 అందుకు మోషే, “నేను నీ దగ్గర నుండి వెళ్లిన వెంటనే యెహోవాకు మొరపెడతాను, రేపు ఫరో దగ్గర నుండి అతని అధికారుల దగ్గర నుండి అతని ప్రజల దగ్గర నుండి ఈగల గుంపులు వెళ్లిపోతాయి. అయితే యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలను వెళ్లనివ్వకుండ ఫరో మరలా మోసపూరితంగా ప్రవర్తించకుండ చూసుకోవాలి” అని చెప్పాడు.
EXO 8:30 మోషే ఫరో దగ్గరనుండి వెళ్లి యెహోవాకు మొరపెట్టాడు.
EXO 8:31 మోషే అడిగినట్టే యెహోవా చేశారు. ఈగలు ఫరోను అతని సేవకులను అతని ప్రజలను విడిచిపోయాయి. ఒక్క ఈగ కూడా మిగల్లేదు.
EXO 8:32 అయితే ఫరో మరలా తన హృదయం కఠినం చేసుకుని ప్రజలను వెళ్లనివ్వలేదు.
EXO 9:1 ఆ తర్వాత యెహోవా మోషేతో, “నీవు ఫరో దగ్గరకు వెళ్లి అతనితో, ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: “నా ప్రజలు నన్ను సేవించేలా, వారిని వెళ్లనివ్వు.”
EXO 9:2 నీవు వారిని వెళ్లనివ్వకుండా వారిని ఇంకా నిర్బంధించి ఉంచితే,
EXO 9:3 యెహోవా హస్తం పొలంలో ఉన్న నీ పశువుల మీదికి అంటే గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు మేకల మీదకు భయానకమైన వ్యాధిని తెస్తుంది.
EXO 9:4 అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులకు ఈజిప్టువారి పశువులకు మధ్య భేదాన్ని చూపిస్తారు. ఇశ్రాయేలీయుల పశువుల్లో ఏ ఒక్కటి చనిపోదు’ అని చెప్పు” అన్నారు.
EXO 9:5 యెహోవా సమయాన్ని నిర్ణయించి, “రేపు యెహోవా దీనిని ఈ దేశంలో జరిగిస్తారు” అన్నారు.
EXO 9:6 మరునాడు యెహోవా దానిని జరిగించారు: ఈజిప్టువారి పశువులన్నీ చనిపోయాయి కాని, ఇశ్రాయేలీయులకు చెందిన పశువుల్లో ఒకటి కూడా చావలేదు.
EXO 9:7 ఫరో దాని గురించి విచారణకు పంపగా ఇశ్రాయేలీయులకు చెందిన పశువుల్లో ఒకటి కూడా చావలేదని తెలిసింది. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా ఉంది కాబట్టి అతడు ప్రజలను వెళ్లనివ్వలేదు.
EXO 9:8 అయితే యెహోవా మోషే అహరోనులతో, “కొలిమి నుండి చేతి పిడికిలి నిండ బూడిద తీసుకుని, ఫరో ఎదుట మోషే దానిని గాలిలో చల్లాలి.
EXO 9:9 అది సన్నని ధూళిగా మారి ఈజిప్టు దేశమంతా వ్యాపించి, దేశంలోని మనుష్యుల మీద జంతువుల మీద చీముపట్టిన కురుపులు పుడతాయి” అన్నారు.
EXO 9:10 కాబట్టి వారు కొలిమిలోని బూడిద తీసుకుని ఫరో ఎదుట నిలబడ్డారు. మోషే దానిని గాలిలో చల్లినప్పుడు మనుష్యుల మీద జంతువుల మీద చీముపట్టిన కురుపులు పుట్టాయి.
EXO 9:11 ఈజిప్టు వారందరి మీద, తమ మీద ఆ కురుపులు ఉండడం వల్ల మంత్రగాళ్ళు మోషే ఎదుట నిలబడలేకపోయారు.
EXO 9:12 అయితే యెహోవా మోషేకు చెప్పినట్లే, మోషే అహరోనుల మాట వినకుండ యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచారు.
EXO 9:13 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుటకు వెళ్లి అతనితో, ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నన్ను సేవించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
EXO 9:14 లేకపోతే భూమి అంతటి మీద నా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకునేలా ఈసారి నేను నీ అధికారుల పైకి నీ ప్రజలమీదికి నా తెగుళ్ళ యొక్క పూర్తి శక్తిని పంపుతాను.
EXO 9:15 ఈపాటికి నేను నా చేయిని చాచి, నిన్ను నీ ప్రజలను తెగులుతో మొత్తగలిగేవాన్ని, అది మిమ్మల్ని భూమి నుండి తుడిచిపెట్టేది.
EXO 9:16 కాని నేను నా బలాన్ని నీకు చూపించాలని భూలోకమంతా నా నామం ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను లేవనెత్తాను.
EXO 9:17 నీవింకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటూ వారిని వెళ్లనివ్వడం లేదు.
EXO 9:18 కాబట్టి రేపు ఈ సమయానికి నేను ఈజిప్టు ఏర్పడిన రోజు నుండి ఇప్పటివరకు ఎన్నడు పడని భయంకరమైన వడగండ్ల తుఫాను పంపుతాను.
EXO 9:19 కాబట్టి ఇప్పుడే నీ పశువులను నీ పొలంలో ఉన్న సమస్తాన్ని సురక్షితమైన చోటుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించు, ఎందుకంటే ఇంటికి రప్పింపబడక పొలంలోనే ఉన్న ప్రతి మనిషి మీద జంతువుల మీద వడగండ్లు పడతాయి, అప్పుడు మనుష్యులు చనిపోతారు, జంతువులు చనిపోతాయి’ అని చెప్పు” అన్నారు.
EXO 9:20 ఫరో సేవకులలో యెహోవా మాట విని భయపడినవారు తమ బానిసలను తమ పశువులను తమ ఇళ్ళకు త్వరపడి రప్పించారు.
EXO 9:21 అయితే యెహోవా మాటను లక్ష్యపెట్టనివారు తమ బానిసలను తమ పశువులను పొలంలోనే విడిచిపెట్టారు.
EXO 9:22 అప్పుడు యెహోవా మోషేతో, “నీ చేయి ఆకాశం వైపు చాపు అప్పుడు ఈజిప్టు అంతా మనుష్యుల మీద జంతువుల మీద ఈజిప్టు పొలాల్లో పెరిగే ప్రతి దాని మీద వడగండ్లు పడతాయి” అని చెప్పారు.
EXO 9:23 మోషే తన కర్రను ఆకాశం వైపు చాచినప్పుడు, యెహోవా ఉరుములను వడగండ్లను పంపినప్పుడు మెరుపులు వేగంగా నేలను తాకాయి. ఈజిప్టు దేశమంతటా యెహోవా వడగండ్లు కురిపించారు.
EXO 9:24 వడగండ్లు పడ్డాయి, మెరుపులు ఇటు అటు మెరిసాయి. ఈజిప్టు దేశమంతా ఒక దేశంగా ఏర్పడిన తర్వాత ఇది అత్యంత భయంకరమైన తుఫాను.
EXO 9:25 ఆ వడగండ్లు ఈజిప్టు దేశమంతటా, పొలాల్లో ఉన్న మనుష్యులను జంతువులను నాశనం చేశాయి; పొలాల్లో పెరుగుతున్నవన్నీ పాడయ్యాయి, ప్రతి చెట్టు విరిగిపోయింది.
EXO 9:26 అయితే ఇశ్రాయేలీయులు ఉన్న గోషేను దేశంలో మాత్రమే వడగండ్లు పడలేదు.
EXO 9:27 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, “ఈసారి నేను పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా ప్రజలు దోషులము.
EXO 9:28 యెహోవాకు ప్రార్థించండి, ఎందుకంటే ఇంతవరకు పడిన ఉరుములు వడగండ్లు చాలు. నేను మిమ్మల్ని వెళ్లనిస్తాను; మీరు ఇక ఇక్కడ ఉండనవసరం లేదు” అని అన్నాడు.
EXO 9:29 అందుకు మోషే, “నేను పట్టణంలో నుండి బయటకు వెళ్లగానే, నా చేతులు చాపి యెహోవాకు ప్రార్థిస్తాను. అప్పుడు ఉరుములు ఆగిపోతాయి, ఇక వడగండ్లు ఉండవు, కాబట్టి భూమి యెహోవాదే అని నీవు తెలుసుకుంటావు.
EXO 9:30 అయినప్పటికీ నీవు నీ అధికారులు ఇంకా యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు” అన్నాడు.
EXO 9:31 అప్పుడు యవలు వెన్నులు వేశాయి అవిసె పూలు పూసాయి కాబట్టి అవి నాశనం చేయబడ్డాయి.
EXO 9:32 గోధుమలు, మరో రకం గోధుమలు ఇంకా ఎదగలేదు, అవి తర్వాత ఎదుగుతాయి కాబట్టి అవి నాశనం చేయబడలేదు.
EXO 9:33 అప్పుడు మోషే ఫరో దగ్గరనుండి బయలుదేరి పట్టణం నుండి బయటకు వెళ్లి యెహోవా వైపు చేతులు చాపినప్పుడు ఉరుములు వడగండ్లు ఆగిపోయాయి. నేలపై వర్షం కురవడం ఆగిపోయింది.
EXO 9:34 వర్షం వడగండ్లు ఉరుములు ఆగిపోవడం ఫరో చూసినప్పుడు, అతడు మరలా పాపం చేశాడు: అతడు అతని అధికారులు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు.
EXO 9:35 యెహోవా మోషే ద్వారా చెప్పినట్లే ఫరో హృదయం కఠినపరచబడింది; అతడు ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వలేదు.
EXO 10:1 తర్వాత యెహోవా మోషేతో, “ఫరో దగ్గరకు వెళ్లు, ఎందుకంటే నేను అతని హృదయాన్ని అతని అధికారుల హృదయాలను కఠినం చేశాను తద్వార నేను ఈ నా సూచనలను వారి మధ్య ప్రదర్శించవచ్చు,
EXO 10:2 అప్పుడు మీరు మీ పిల్లలకు మనవళ్ళకు నేను ఈజిప్టు వారితో ఎలా కఠినంగా వ్యవహరించానో, వారి మధ్య నా సూచనలను ఎలా కనుపరిచానో చెప్పగలరు, నేను యెహోవానై ఉన్నాను అని మీరు తెలుసుకుంటారు” అన్నారు.
EXO 10:3 కాబట్టి మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లి అతనితో అన్నారు, “నేను యెహోవాను, హెబ్రీయుల దేవుడు ఇలా చెప్పారు: ‘ఎంతకాలం నిన్ను నీవు నా ఎదుట తగ్గించుకోకుండ ఉంటావు? నన్ను సేవించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
EXO 10:4 నీవు వారిని వెళ్లనివ్వకపోతే రేపు నేను నీ దేశం మీదికి మిడతలను రప్పిస్తాను.
EXO 10:5 ఎవరు నేలను చూడలేనంతగా అవి నేలను కప్పివేస్తాయి. వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకుని మీకు మిగిలిన కొద్ది దాన్ని కూడా అవి తినివేస్తాయి. మీ పొలంలో పెరుగుతున్న ప్రతి చెట్టును అవి తింటాయి.
EXO 10:6 నీ ఇల్లు నీ అధికారులందరి ఇల్లు ఈజిప్టు వారందరి ఇల్లు వాటితో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు గాని మీ పూర్వికులు గాని వారు ఈ దేశంలో స్థిరపడినప్పటి నుండి ఇప్పటివరకు అటువంటి వాటిని ఎన్నడూ చూడలేదు.’ ” తర్వాత మోషే ఫరో దగ్గర నుండి తిరిగి వచ్చేశాడు.
EXO 10:7 ఫరో అధికారులు అతనితో, “ఈ మనిషి ఎంతకాలం మనకి ఉరిగా ఉంటాడు? ఈ ప్రజలు తమ దేవుడైన యెహోవాను సేవించడానికి వారిని వెళ్లనివ్వు. ఈజిప్టు నాశనం చేయబడుతుందని నీవు గ్రహించవా?” అని అన్నారు.
EXO 10:8 అప్పుడు మోషే అహరోనులను తిరిగి ఫరో దగ్గరకు తీసుకువచ్చినప్పుడు అతడు, “వెళ్లండి, మీ దేవుడైన యెహోవాను సేవించండి, కాని ఎవరు వెళ్తారో నాకు చెప్పండి” అని అన్నాడు.
EXO 10:9 అందుకు మోషే, “మేము యెహోవాకు పండుగ జరుపుకోవాలి కాబట్టి మేము మాలో చిన్నవారిని పెద్దవారిని మా కుమారులను కుమార్తెలను మా గొర్రెలను పశువులను తీసుకెళ్తాము” అన్నాడు.
EXO 10:10 అందుకు ఫరో, “యెహోవా మీతో ఉండును గాక! ఒకవేళ నేను మిమ్మల్ని మీ స్త్రీలు, పిల్లలతో సహా వెళ్లనిస్తే! మీ చెడు ఆలోచన నాకు తెలుసు.
EXO 10:11 కాబట్టి కేవలం పురుషులు మాత్రమే వెళ్లి యెహోవాను సేవించండి; మీరు అడుగుతుంది ఇదే కదా” అని వారితో అన్నాడు. అప్పుడు వారు ఫరో ఎదుట నుండి తరిమివేయబడ్డారు.
EXO 10:12 అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టు దేశమంతటిమీదికి మిడతల దండు వచ్చి పొలంలో పెరుగుతున్న ప్రతి మొక్కను, వడగండ్ల వలన పాడవని ప్రతిదాన్ని తినివేసేలా నీ చేతిని ఈజిప్టు మీద చాపు” అని చెప్పారు.
EXO 10:13 మోషే తన కర్రను ఈజిప్టు మీద చాపినప్పుడు యెహోవా పగలంతా రాత్రంతా ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశారు. ఉదయానికి ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చాయి.
EXO 10:14 ఆ మిడతలు ఈజిప్టు దేశమంతటిని ఆక్రమించుకుని దేశంలోని ప్రతిచోట వాలాయి. అవి అసంఖ్యాకమైనవి. అటువంటి మిడతలు గతంలో ఎన్నడూ లేవు ఇకముందు ఉండవు.
EXO 10:15 నల్లగా ఉండే వరకు అవి భూమి అంతా కప్పాయి. వడగళ్ళకు పాడవకుండ పొలాల్లో ఉన్నవాటిని చెట్లకున్న పండ్లను అవి తినివేశాయి. ఈజిప్టు దేశమంతా చెట్టు మీద గాని మొక్క మీద గాని పచ్చదనం మిగల్లేదు.
EXO 10:16 ఫరో వెంటనే మోషే అహరోనులను పిలిపించి వారితో, “మీ దేవుడైన యెహోవాకు మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను.
EXO 10:17 దయచేసి మరొకసారి నా పాపాన్ని క్షమించి మరణం కలిగించే ఈ తెగులును నా నుండి తొలగించమని మీ దేవుడైన యెహోవాకు ప్రార్థించండి” అని అన్నాడు.
EXO 10:18 మోషే ఫరో దగ్గర నుండి వెళ్లి యెహోవాకు ప్రార్థన చేశాడు.
EXO 10:19 అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి బలమైన పడమటి గాలి వీచేలా చేసినప్పుడు ఆ గాలికి మిడతలు ఎర్ర సముద్రంలోకి కొట్టుకుపోయాయి. ఈజిప్టులో ఎక్కడ కూడా ఒక్క మిడత కూడా మిగల్లేదు.
EXO 10:20 అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశారు కాబట్టి అతడు ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వలేదు.
EXO 10:21 అప్పుడు యెహోవా మోషేతో, “ప్రతి ఒక్కరూ తడుముకునేంత కటిక చీకటి ఈజిప్టు దేశం మీద కమ్ముకునేలా నీ చేతిని ఆకాశం వైపు చాపు” అన్నారు.
EXO 10:22 మోషే తన చేతిని ఆకాశం వైపు చాపినప్పుడు మూడు రోజులపాటు ఈజిప్టు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంది.
EXO 10:23 ఆ మూడు రోజులు ఎవరూ ఎవరిని చూడలేకపోయారు తామున్న చోట నుండి లేవలేకపోయారు. అయినప్పటికీ ఇశ్రాయేలీయులు నివసిస్తున్న ప్రాంతాల్లో వెలుగు ఉంది.
EXO 10:24 అప్పుడు ఫరో మోషేను పిలిపించి, “వెళ్లి యెహోవాను సేవించండి. మీ స్త్రీలు పిల్లలను కూడా మీతో వెళ్లవచ్చు; కాని మీ గొర్రెలు పశువులను ఇక్కడే వదిలేయండి” అన్నాడు.
EXO 10:25 అందుకు మోషే, “మేము మా దేవుడైన యెహోవాకు బలులు, దహనబలులు అర్పించడానికి కావలసిన పశువులను నీవు మాకు ఇవ్వాలి.
EXO 10:26 మా పశువులు కూడా మాతో రావాలి; ఒక్క డెక్క కూడా వదిలిపెట్టము. మా దేవుడైన యెహోవాను సేవించడానికి వాటిలో నుండే మేము తీసుకోవాలి, మేము అక్కడికి వెళ్లి మేము వేటితో యెహోవాను సేవించాలో మాకు తెలియదు” అన్నాడు.
EXO 10:27 అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశారు కాబట్టి అతడు వారు వెళ్లడానికి ఒప్పుకోలేదు.
EXO 10:28 అప్పుడు ఫరో మోషేతో, “నా ఎదుట నుండి వెళ్లిపో! మరలా నీవు నాకు కనపడకుండా చూసుకో! నీవు నా ముఖాన్ని చూసిన రోజునే నీవు మరణిస్తావు” అన్నాడు.
EXO 10:29 అందుకు మోషే, “నీవన్నట్లే చేస్తాను, మళ్ళీ ఇంకెప్పుడు నీ ముందు కనబడను” అన్నాడు.
EXO 11:1 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఫరో మీదికి ఈజిప్టు మీదికి నేను మరొక తెగులును తీసుకువస్తాను. దాని తర్వాత అతడు మిమ్మల్ని వెళ్లనిస్తాడు. అతడు మిమ్మల్ని వెళ్లనిచ్చినప్పుడు అతడు ఇక్కడినుండి మిమ్మల్ని పూర్తిగా వెళ్లగొడతాడు.
EXO 11:2 పురుషులు స్త్రీలు తమ పొరుగువారి నుండి వెండి బంగారు వస్తువులను అడిగి తీసుకోవాలని ప్రజలకు చెప్పు.”
EXO 11:3 యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఈజిప్టువారికి కనికరం కలిగేలా చేశారు, అంతేకాక మోషే ఈజిప్టు దేశంలో ఫరో అధికారులచేత ప్రజలచేత గొప్పగా గౌరవించబడ్డాడు.
EXO 11:4 మోషే ఫరోతో, “యెహోవా చెప్పిన మాట ఇదే: ‘మధ్యరాత్రి నేను ఈజిప్టు దేశం గుండా వెళ్తాను.
EXO 11:5 అప్పుడు ఈజిప్టులోని ప్రతి మొదటి సంతానం చస్తారు, సింహాసనం మీద కూర్చునే ఫరో మొదటి సంతానం మొదలుకొని తిరగలి విసిరే దాసి మొదటి సంతానం వరకు, పశువుల్లో కూడా మొదట పుట్టినవి చస్తాయి.
EXO 11:6 అప్పుడు ఈజిప్టు దేశమంతటా పెద్ద రోదన ఉంటుంది. అటువంటి రోదన గతంలో ఎప్పుడూ లేదు ఇకముందు ఉండదు.
EXO 11:7 అయితే ఇశ్రాయేలీయులలో ఏ వ్యక్తిని చూసి కానీ లేదా జంతువును చూసి గాని ఒక కుక్క కూడా మొరుగదు.’ అప్పుడు యెహోవా ఈజిప్టు, ఇశ్రాయేలు మధ్య భేదం చూపించారని మీకు తెలుస్తుంది.
EXO 11:8 అప్పుడు మీ అధికారులైన వీరందరు నా దగ్గరకు వచ్చి నా ఎదుట తలవంచి, ‘నీవు, నిన్ను అనుసరించే ప్రజలందరు వెళ్లండి’ అని చెప్తారు. అప్పుడు నేను వెళ్తాను” అని చెప్పి మోషే తీవ్రమైన కోపంతో ఫరో దగ్గర నుండి వెళ్లిపోయాడు.
EXO 11:9 అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టు దేశంలో నా అద్భుతాలు అధికమయ్యేలా ఫరో నీ మాట వినడం తృణీకరిస్తాడు” అన్నారు.
EXO 11:10 మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ అద్భుతాలన్నిటిని చేశారు, కాని యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచారు కాబట్టి అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి బయటకు వెళ్లనివ్వలేదు.
EXO 12:1 యెహోవా మోషే అహరోనులతో ఈజిప్టులో ఇలా అన్నారు,
EXO 12:2 “ఈ నెల మీకు మొదటి నెల, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల.
EXO 12:3 ఇశ్రాయేలీయుల సమాజమంతటికి చెప్పండి, ఈ నెల పదవ రోజున ప్రతి మనిషి తన కుటుంబానికి ఒక గొర్రెను తీసుకోవాలి, ప్రతి ఇంటికి ఒకటి.
EXO 12:4 ఆ గొర్రెపిల్ల మొత్తాన్ని తినడానికి ఒకవేళ కుటుంబం మరీ చిన్నగా ఉంటే, దానిని తమకు అతి దగ్గరగా ఉన్న పొరుగువారితో, అక్కడ ఎంతమంది ఉన్నారో ఆ లెక్కను పరిగణలోకి దానిని పంచుకోవాలి. ప్రతి ఒక్కరు తినే పరిమాణం బట్టి మీరు గొర్రెపిల్లను ఎంచుకోవాలి.
EXO 12:5 మీరు ఎంచుకున్న జంతువులు తప్పనిసరిగా ఏ లోపం లేని సంవత్సరపు మగవై ఉండాలి; వాటిని గొర్రెలలో నుండి కాని మేకలలో నుండి కాని తీసుకోవాలి.
EXO 12:6 ఇశ్రాయేలు సమాజంలోని సభ్యులందరు సంధ్య సమయంలో వాటిని వధించవలసిన నెల పద్నాలుగవ రోజు వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోండి.
EXO 12:7 అప్పుడు వారు దాని రక్తంలో కొంచెం తీసుకుని తాము గొర్రెపిల్లలను తినే వారి ఇళ్ళ ద్వారబంధాలకు రెండు పలకల మీద పూయాలి.
EXO 12:8 ఆ రాత్రే వారు అగ్నిలో కాల్చబడిన ఆ మాంసాన్ని చేదు మూలికలతో, పులియని రొట్టెలతో తినాలి.
EXO 12:9 ఆ మాంసాన్ని పచ్చిగా గాని లేదా నీళ్లలో ఉడకబెట్టి గాని తినకూడదు, అయితే దాని తల, కాళ్లు, లోపలి భాగాలను అగ్నిలో కాల్చి తినాలి.
EXO 12:10 దానిలో దేన్ని కూడా ఉదయం వరకు మిగిలించకూడదు; ఉదయం వరకు దానిలో ఏమైనా మిగిలితే, దానిని మీరు కాల్చివేయాలి.
EXO 12:11 దానిని మీరు ఇలా తినాలి: మీ నడుము కట్టుకుని, మీ పాదాలకు చెప్పులు వేసుకుని మీ చేతిలో కర్ర పట్టుకోవాలి. త్వరగా దానిని తినాలి; ఇది యెహోవా పస్కాబలి.
EXO 12:12 “అదే రాత్రి నేను ఈజిప్టు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుష్యుల్లో జంతువుల్లో ప్రతి మొదటి సంతానాన్ని చంపి ఈజిప్టు దేవుళ్ళందరికి తీర్పు తీరుస్తాను. నేను యెహోవానై యున్నాను.
EXO 12:13 మీరున్న ఇళ్ళ మీద ఉన్న రక్తం మీకు గుర్తుగా ఉంటుంది, నేను ఆ రక్తాన్ని చూసినప్పుడు, మిమ్మల్ని దాటి వెళ్తాను. నేను ఈజిప్టును మొత్తినప్పుడు ఏ నాశనకరమైన తెగులు మిమ్మల్ని తాకదు.
EXO 12:14 “ఈ రోజును మీరు స్మారకోత్సవం జరుపుకోవాలి; ఎందుకంటే రాబోయే తరాలకు దీనిని ఒక నిత్య కట్టుబాటుగా మీరు యెహోవాకు పండుగగా జరుపుకోవాలి.
EXO 12:15 ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి. మొదటి రోజు మీ ఇండ్ల నుండి పులిసిన దాన్ని తీసివేయాలి, ఎందుకంటే మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకు పులిసిన దానితో చేసిన రొట్టెలు ఎవరు తిన్నా, వారు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడాలి.
EXO 12:16 మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, ఏడవ రోజు మరొకటి నిర్వహించాలి. ఈ రోజుల్లో ప్రతిఒక్కరు తినడానికి ఆహారం సిద్ధం చేయడం తప్ప పనులేవీ చేయకూడదు.
EXO 12:17 “పులియని రొట్టెల పండుగ మీరు జరుపుకోవాలి, ఎందుకంటే ఈ రోజునే నేను మీ విభాగాలను ఈజిప్టులో నుండి బయటకు తీసుకువచ్చాను. ఈ రోజును మీరు రాబోయే తరాలకు ఒక నిత్య కట్టుబాటుగా జరుపుకోవాలి.
EXO 12:18 మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంత్రం నుండి ఇరవై ఒకటవ రోజు సాయంత్రం వరకు మీరు పులియని రొట్టెలు తినాలి.
EXO 12:19 ఎందుకంటే ఏడు రోజులు మీ ఇళ్ళలో పులిసినదేది ఉండకూడదు. విదేశీయులు గాని స్వదేశీయులు గాని పులిసినదేదైనా తింటే వారిని ఇశ్రాయేలు సమాజం నుండి కొట్టివేయబడాలి.
EXO 12:20 పులిసినదేది మీరు తినకూడదు. మీరుండే అన్ని చోట్లలో పులియని రొట్టెలు మాత్రమే మీరు తినాలి.”
EXO 12:21 అప్పుడు మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇలా చెప్పాడు, “మీరు వెంటనే వెళ్లి మీ కుటుంబాల కోసం మందలో నుండి గొర్రెపిల్లను ఎంచుకుని పస్కా గొర్రెపిల్లను వధించండి.
EXO 12:22 హిస్సోపు కొమ్మను తీసుకుని, పళ్ళెంలో ఉన్న రక్తంలో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మికి, రెండు నిలువు కమ్మీలకు పూయాలి. ఉదయం వరకు మీలో ఎవరూ మీ ఇంటి ద్వారం నుండి బయటకు రాకూడదు.
EXO 12:23 యెహోవా ఈజిప్టువారిని హతం చేయడానికి దేశమంతా సంచరిస్తూ, ద్వారబంధపు పైకమ్మికి రెండు నిలువు కమ్మీలకు పూయబడిన రక్తాన్ని చూసి ఆయన ఆ ద్వారాన్ని దాటి వెళ్తారు. సంహారకుడు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని చంపడానికి ఆయన అనుమతించడు.
EXO 12:24 “మీకు మీ వారసులకు ఒక నిత్య కట్టుబాటుగా నా ఈ ఆదేశాలను పాటించాలి.
EXO 12:25 యెహోవా వాగ్దానం చేసినట్లుగా ఆయన మీకు ఇస్తానన్న దేశంలోనికి మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరించాలి.
EXO 12:26 ‘ఈ వేడుకకు అర్థమేంటి?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు
EXO 12:27 మీరు వారితో, ‘ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఈజిప్టువారిని చంపుతున్నప్పుడు ఈజిప్టులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇళ్ళను ఆయన ఏమీ చేయకుండా దాటి వెళ్లారు’ అని చెప్పాలి.” అప్పుడు ప్రజలు తలలు వంచి ఆరాధించారు.
EXO 12:28 యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించిన విధంగానే ఇశ్రాయేలీయులు చేశారు.
EXO 12:29 అర్థరాత్రి సమయంలో సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదటి సంతానం మొదలుకొని చెరసాలలోని ఖైదీ యొక్క మొదటి సంతానం వరకు ఈజిప్టులోని మొదటి సంతానమంతటిని పశువుల మొదటి సంతానాన్ని యెహోవా హతం చేశారు.
EXO 12:30 ఆ రాత్రి సమయంలో ఫరో అతని అధికారులందరు, ఈజిప్టువారందరు లేచారు, ఈజిప్టులో గొప్ప రోదన వినబడింది, ఎందుకంటే మరణం సంభవించని ఇల్లు ఒకటి కూడా లేదు.
EXO 12:31 ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, “లేవండి! మీరు ఇశ్రాయేలు ప్రజలు వెంటనే బయలుదేరి నా ప్రజలను వదిలి వెళ్లిపొండి! మీరు కోరినట్లే వెళ్లి యెహోవాను ఆరాధించండి.
EXO 12:32 మీరు చెప్పినట్లే మీ పశువులను గొర్రెలను తీసుకుని వెళ్లండి. అలాగే నన్ను దీవించండి” అని చెప్పాడు.
EXO 12:33 ఈజిప్టువారు ప్రజలను తొందరపెట్టి దేశం విడిచి వెళ్లాలని కోరారు. వారు, “లేకపోతే, మనమందరం చనిపోతాము!” అని అనుకున్నారు.
EXO 12:34 కాబట్టి ఇశ్రాయేలీయులు తమ పిండిముద్దను తీసుకుని అది పులియకముందే దానిని పిండి పిసికే తొట్లలో వేసి బట్టలో మూట కట్టుకుని తమ భుజాలమీద మోసుకొనిపోయారు.
EXO 12:35 ఇశ్రాయేలీయులు మోషే సూచించిన ప్రకారమే చేసి ఈజిప్టువారి దగ్గర నుండి వెండి బంగారు వస్తువులను వస్త్రాలను అడిగి తీసుకున్నారు.
EXO 12:36 యెహోవా ఈజిప్టువారికి ఇశ్రాయేలీయుల పట్ల దయ పుట్టించారు కాబట్టి వారు తమను అడిగి వాటన్నిటిని వారికి ఇచ్చారు. ఆ విధంగా వారు ఈజిప్టువారిని దోచుకున్నారు.
EXO 12:37 అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమై వెళ్లారు. వారిలో స్త్రీలు పిల్లలు కాకుండా కాలినడకన ఉన్నవారు ఆరు లక్షలమంది పురుషులు.
EXO 12:38 వారితో పాటు అనేకమంది ఇతర ప్రజలు ఉన్నారు అంతేకాక గొర్రెలు పశువుల పెద్ద మందలు కూడా ఉన్నాయి.
EXO 12:39 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన పిండితో పులియని రొట్టెలు చేసి కాల్చారు. వారు ఈజిప్టు నుండి వెళ్లగొట్టబడినప్పుడు తమ కోసం ఆహారం సిద్ధపరచుకోవడానికి సమయం లేదు కాబట్టి ఆ పిండి పులియలేదు.
EXO 12:40 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో నివసించిన కాలం 430 సంవత్సరాలు.
EXO 12:41 సరిగ్గా 430 సంవత్సరాలు గడిచిన రోజునే యెహోవా సేనలన్ని ఈజిప్టు దేశం నుండి బయలుదేరి వెళ్లిపోయాయి.
EXO 12:42 ఈజిప్టు నుండి బయటకు తీసుకురావడానికి ఆ రాత్రి యెహోవా మెళకువగా ఉన్నందున, ప్రతి సంవత్సరం ఈ రాత్రి ఇశ్రాయేలీయులందరు రాబోయే తరాల కోసం ప్రభువును గౌరవించడానికి మెలకువగా ఉండాలి.
EXO 12:43 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు, “పస్కాను ఆచరించడానికి పాటించవలసిన నియమాలు ఇవే: “విదేశీయులెవరు దీనిని తినకూడదు.
EXO 12:44 మీరు వెండి పెట్టి కొన్న బానిసకు మీరు సున్నతి చేసిన తర్వాత అతడు దీనిని తినవచ్చు,
EXO 12:45 తాత్కాలిక నివాసులు కాని కూలికి వచ్చినవారు కాని దీనిని తినకూడదు.
EXO 12:46 “దీనిని ఒక ఇంటి లోపలే తినాలి; దాని మాంసంలో దేన్ని ఇంటి బయటకు తీసుకెళ్లకూడదు. దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు.
EXO 12:47 ఇశ్రాయేలీయుల సమాజమంతా దీనిని ఆచరించాలి.
EXO 12:48 “మీ మధ్య నివసించే విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలనుకుంటే అతని ఇంట్లోని మగవారందరు సున్నతి పొందాలి. అప్పుడు వారు దేశంలో పుట్టినవారిలా దానిలో పాల్గొనవచ్చు. సున్నతి పొందని మగవారు దీనిని తినకూడదు.
EXO 12:49 దీని గురించి స్వదేశీయులకు మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు ఒకే నియమం వర్తిస్తుంది.”
EXO 12:50 యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇశ్రాయేలీయులందరు చేశారు.
EXO 12:51 అదే రోజు యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి విభజనల ప్రకారం ఈజిప్టు నుండి బయటకు రప్పించారు.
EXO 13:1 యెహోవా మోషేతో ఇలా చెప్పారు,
EXO 13:2 “ప్రతీ మొదటి మగ సంతానాన్ని నాకు ప్రతిష్ఠించండి. ఇశ్రాయేలీయుల మనుష్యుల్లోనైనా పశువుల్లోనైనా ప్రతి గర్భం యొక్క మొదటి సంతానం నాదే.”
EXO 13:3 అప్పుడు మోషే ప్రజలతో ఇలా అన్నాడు, “మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు నుండి మీరు బయటకు వచ్చిన ఈ రోజును మీరు స్మారకోత్సవంగా జరుపుకోండి, ఎందుకంటే యెహోవా తన బలమైన హస్తంతో దాని నుండి మిమ్మల్ని బయటకు రప్పించారు. పులిసిన దేన్ని తినకూడదు.
EXO 13:4 అబీబు అనే ఈ నెలలో ఈ రోజున మీరు బయలుదేరారు.
EXO 13:5 యెహోవా కనానీయుల హిత్తీయుల అమోరీయుల హివ్వీయుల యెబూసీయుల దేశం మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని రప్పించినప్పుడు ఈ నెలలో మీరు ఈ సేవలు జరిగించాలి.
EXO 13:6 ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి, ఏడవ రోజున యెహోవాకు పండుగ చేయాలి.
EXO 13:7 ఈ ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి; పులిసినదేది మీ మధ్య కనపడకూడదు. మీ సరిహద్దుల లోపల ఎక్కడా పులిసినది కనపడకూడదు.
EXO 13:8 ఆ రోజున, ‘నేను ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దానిని బట్టి నేను ఇది చేస్తున్నాను’ అని నీ కుమారునితో చెప్పాలి.
EXO 13:9 యెహోవా తన బలమైన హస్తంతో మిమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించారు కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం మీ నోటిలో ఉండేలా ఈ సంస్కారం మీ చేతి మీద ఒక గుర్తుగా మీ నుదుటి మీద ఒక జ్ఞాపకంగా ఉంటుంది.
EXO 13:10 ప్రతి సంవత్సరం నిర్ణయ కాలంలో మీరు ఈ సంస్కారాన్ని ఆచరించాలి.
EXO 13:11 “యెహోవా మీకు మీ పూర్వికులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన ప్రకారం కనాను దేశంలోనికి మిమ్మల్ని తీసుకువచ్చి దానిని మీకు ఇచ్చిన తర్వాత,
EXO 13:12 ప్రతి గర్భం యొక్క మొదటి సంతానాన్ని మీరు యెహోవాకు వేరుగా ఉంచాలి. మీ పశువుల మొదటి మగపిల్లలు యెహోవాకు చెందుతాయి.
EXO 13:13 ప్రతి మొదటి సంతానమైన గాడిదను గొర్రెపిల్లతో విడిపించాలి, కాని ఒకవేళ దానిని విడిపించకపోతే, దాని మెడ విరిచివేయాలి. మీ కుమారులలో మనుష్యుల ప్రతి మొదటి మగ సంతానాన్ని విడిపించుకోవాలి.
EXO 13:14 “భవిష్యత్తులో మీ కుమారుడు, ‘దీని అర్థమేంటి?’ అని మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు వానితో ఇలా చెప్పాలి, ‘బలమైన హస్తంతో యెహోవా బానిస దేశమైన ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు రప్పించారు.
EXO 13:15 ఫరో మమ్మల్ని వెళ్లనివ్వకుండా తన మనస్సు కఠినం చేసుకుని నిరాకరించినప్పుడు, యెహోవా ఈజిప్టులో ఉన్న మనుష్యుల, పశువుల మొదటి సంతానమంతటిని చంపేశారు. ఆ కారణంగానే ప్రతి గర్భం యొక్క మొదటి మగ పిల్లను యెహోవాకు బలి ఇచ్చి, నా కుమారులలో ప్రతి మొదటి సంతానాన్ని విడిపించుకుంటాను.’
EXO 13:16 యెహోవా తన బలమైన హస్తంతో మమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించారు అనడానికి ఇది మీ చేతి మీద ఒక గుర్తుగా మీ నుదుటి మీద ఒక ముద్రగా ఉంటుంది.”
EXO 13:17 ఫరో ప్రజలను వెళ్లనిచ్చినప్పుడు, ఫిలిష్తీయుల దేశం గుండా దగ్గర మార్గం ఉన్నప్పటికీ దేవుడు వారిని ఆ మార్గంలో నడిపించలేదు. ఎందుకంటే, “ఒకవేళ ఈ ప్రజలు యుద్ధాన్ని చూసి, వారు మనస్సు మార్చుకొని తిరిగి ఈజిప్టుకు వెళ్తారేమో” అని దేవుడు అనుకున్నారు.
EXO 13:18 కాబట్టి దేవుడు వారిని చుట్టూ త్రిప్పి అరణ్యమార్గంలో ఎర్ర సముద్రం వైపు నడిపించారు. ఇశ్రాయేలీయులు యుద్ధానికి సిద్ధపడి ఈజిప్టు నుండి బయటకు వచ్చారు.
EXO 13:19 యోసేపు ఇశ్రాయేలీయులతో, “దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించడానికి వస్తారు, అప్పుడు మీరు నా ఎముకలను ఈ ప్రదేశం నుండి మీతో తీసుకెళ్లాలి” అని ప్రమాణం చేయించుకున్నాడు. కాబట్టి మోషే యోసేపు ఎముకలను తనతో తీసుకున్నాడు.
EXO 13:20 వారు సుక్కోతు నుండి బయలుదేరి ఏతాము ఎడారి అంచున గుడారాలు వేసుకున్నారు.
EXO 13:21 వారు పగలు రాత్రి ప్రయాణం చేయగలిగేలా యెహోవా పగటివేళ మేఘస్తంభంలో రాత్రివేళ వారికి వెలుగివ్వడానికి అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడిచారు.
EXO 13:22 పగటివేళ మేఘస్తంభం గాని, రాత్రివేళ అగ్నిస్తంభం గాని ప్రజల ఎదుట నుండి వాటి స్థలం వదిలిపోలేదు.
EXO 14:1 తర్వాత యెహోవా మోషేతో అన్నారు,
EXO 14:2 “ఇశ్రాయేలీయులను వెనుకకు తిరిగి పీ హహీరోతుకు సమీపంలో మిగ్దోలుకు సముద్రానికి మధ్యలో బయల్-సెఫోనుకు సరిగ్గా ఎదురుగా సముద్రతీరాన బసచేయమని వారితో చెప్పు.
EXO 14:3 ఫరో ఇశ్రాయేలీయుల గురించి, ‘వారు ఈ దేశంలో కలవరంతో దారితప్పి తిరుగుతున్నారని, ఎడారిలో చిక్కుకున్నారని’ అనుకుంటాడు.
EXO 14:4 నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను కాబట్టి అతడు వారిని వెంటాడుతాడు. కాని ఫరో, అతని సైన్యం వలన నాకు మహిమ కలుగుతుంది. నేను యెహోవానై యున్నానని ఈజిప్టువారందరు తెలుసుకుంటారు.” కాబట్టి ఇశ్రాయేలీయులు అలాగే చేశారు.
EXO 14:5 ప్రజలు పారిపోయారని ఈజిప్టు రాజుకు తెలియజేసినప్పుడు, వారి గురించి ఫరో అతని సేవకులు తమ మనస్సులు మార్చుకొని, “మనమెందుకు ఇలా చేశాము? మనకు సేవలు చేయకుండా మనం ఇశ్రాయేలీయులను వెళ్లనిచ్చాము!” అని చెప్పుకొన్నారు.
EXO 14:6 కాబట్టి అతడు తన రథాన్ని సిద్ధం చేసుకుని తనతో పాటు తన సైన్యాన్ని తీసుకెళ్లాడు.
EXO 14:7 అతడు ప్రత్యేకమైన ఆరువందల రథాలను వాటితో పాటు ఈజిప్టులో ఉన్న ఇతర రథాలన్నిటిని ప్రతి దాని మీద అధిపతులతో తీసుకెళ్లాడు.
EXO 14:8 యెహోవా ఈజిప్టు రాజైన ఫరో హృదయాన్ని కఠినం చేసినప్పుడు అతడు నిర్భయంగా వెళ్తున్న ఇశ్రాయేలీయులను వెంటాడాడు.
EXO 14:9 ఈజిప్టువారు అంటే ఫరో యొక్క అన్ని గుర్రాలు, రథాలు, గుర్రపురౌతులు, దళాలు ఇశ్రాయేలీయులను వెంటాడి, వారిని దాటి బయల్-సెఫోను ఎదురుగా ఉన్న పీ హహీరోతుకు సమీపంలో సముద్రతీరాన బసచేసి వారిని పట్టుకోడానికి వచ్చారు.
EXO 14:10 ఫరో దగ్గరగా వస్తుండగా, ఇశ్రాయేలీయులు పైకి చూసినప్పుడు ఈజిప్టువారు తమ వెనుక రావడం చూశారు. వారు భయపడి యెహోవాకు మొరపెట్టారు.
EXO 14:11 వారు మోషేతో, “ఈజిప్టులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చావడానికి మమ్మల్ని తీసుకువచ్చావా? ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చి మాకు నీవు చేసిందేంటి?
EXO 14:12 మమ్మల్ని వదిలిపెట్టు, మేము ఈజిప్టువారికి సేవచేసుకుంటామని ఈజిప్టులో మేము నీతో చెప్పలేక? ఈ ఎడారిలో చావడం కంటే ఈజిప్టువారికి సేవచేసుకోవడం మాకు మేలు కదా!” అన్నారు.
EXO 14:13 అందుకు మోషే ప్రజలతో అన్నాడు, “భయపడకండి. స్థిరంగా నిలబడి యెహోవా ఈ రోజు మీకు కలుగజేసే విడుదలను చూడండి. ఈ రోజు మీరు చూస్తున్న ఈజిప్టువారు మరలా మీరెప్పుడూ చూడరు.
EXO 14:14 యెహోవా మీ కోసం యుద్ధం చేస్తారు; మీరు మౌనంగా ఉంటే చాలు.”
EXO 14:15 అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, “నీవెందుకు నాకు మొరపెడుతున్నావు? ముందుకు సాగిపొమ్మని ఇశ్రాయేలీయులకు చెప్పు.
EXO 14:16 నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేతిని చాపి దానిని పాయలుగా చేయి అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేలమీద నడిచివెళ్తారు.
EXO 14:17 నేను ఈజిప్టువారి హృదయాలను కఠినం చేస్తాను కాబట్టి వారు వీరి వెనుక వస్తారు. ఫరోను బట్టి అతని సైన్యమంతటిని బట్టి అతని రథాలు గుర్రపురౌతులను బట్టి నాకు మహిమ కలుగుతుంది.
EXO 14:18 ఫరోను బట్టి అతని రథాలు గుర్రపురౌతులను బట్టి నాకు మహిమ కలిగినప్పుడు నేనే యెహోవానై యున్నానని ఈజిప్టువారు తెలుసుకుంటారు.”
EXO 14:19 అప్పుడు ఇశ్రాయేలీయుల సైన్యానికి ముందు నడుస్తున్న దేవదూత వారి వెనుకకు వెళ్లాడు. మేఘస్తంభం కూడా వారి ఎదుట నుండి కదిలి వారి వెనుకకు వెళ్లి,
EXO 14:20 ఈజిప్టువారి సైన్యానికి ఇశ్రాయేలీయుల సైన్యానికి మధ్య నిలబడింది. ఆ రాత్రంతా ఆ మేఘం ఈజిప్టువారికి చీకటి కలిగించింది కాని ఇశ్రాయేలీయులకు వెలుగునిచ్చింది కాబట్టి ఈజిప్టువారు వీరిని సమీపించలేదు.
EXO 14:21 మోషే సముద్రం వైపు తన చేతిని చాపగా యెహోవా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలిచేత సముద్రాన్ని పాయలుగా చేసి దానిని ఆరిన నేలగా చేశారు. నీళ్లు రెండుగా విడిపోయాయి,
EXO 14:22 ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేల మీద నడిచివెళ్లారు. వారి కుడి ఎడమల వైపు నీళ్లు గోడల వలె నిలబడ్డాయి.
EXO 14:23 ఈజిప్టువారు వారిని వెంటపడ్డారు; ఫరో గుర్రాలు రథాలు, గుర్రపురౌతులు అన్ని సముద్రం మధ్యలో వారిని వెంటాడాయి.
EXO 14:24 తెల్లవారుజామున యెహోవా అగ్ని మేఘస్తంభం నుండి ఈజిప్టువారి సైన్యాన్ని చూసి ఆయన వారిని కలవరానికి గురి చేశారు.
EXO 14:25 ఆయన వారి రథచక్రాలను ఇరక్కుపోయేలా చేయడంతో వాటిని నడపడం వారికి కష్టంగా ఉంది. అప్పుడు ఈజిప్టువారు, “ఇశ్రాయేలీయుల దగ్గర నుండి పారిపోదాం రండి! వారి పక్షంగా యెహోవా ఈజిప్టువారికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు” అని చెప్పుకున్నారు.
EXO 14:26 అప్పుడు యెహోవా మోషేతో, “ఈజిప్టువారి మీదికి వారి రథాల మీదికి వారి గుర్రపురౌతుల మీదికి నీళ్లు వచ్చేలా నీ చేయి సముద్రం మీద చాపు” అన్నారు.
EXO 14:27 మోషే సముద్రం మీద తన చేయి చాపగా సూర్యోదయ సమయంలో సముద్రం తన స్థానంలోనికి తిరిగి వచ్చేసింది. ఈజిప్టువారు దాని నుండి పారిపోతున్నారు కాని యెహోవా వారిని సముద్రంలో ముంచివేసారు.
EXO 14:28 నీళ్లు వెనుకకు ప్రవహించి సముద్రంలో ఇశ్రాయేలీయులను తరుముతున్న ఫరో సైన్యమంతటిని అంటే రథాలను గుర్రపురౌతులను కప్పివేశాయి. వారిలో ఒక్కరు కూడా బ్రతికి బయటపడలేదు.
EXO 14:29 అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేలమీద వెళ్తున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడల వలె నిలబడ్డాయి.
EXO 14:30 ఆ రోజు యెహోవా ఈజిప్టువారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించారు. ఇశ్రాయేలీయులు సముద్రతీరాన చచ్చిపడివున్న ఈజిప్టువారిని చూశారు.
EXO 14:31 ఈజిప్టువారికి వ్యతిరేకంగా పని చేసిన యెహోవా బలమైన హస్తాన్ని ఇశ్రాయేలీయులు చూచారు కాబట్టి ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా మీద ఆయన సేవకుడైన మోషే మీద నమ్మకముంచారు.
EXO 15:1 దాని తర్వాత మోషే ఇశ్రాయేలీయులు యెహోవాకు ఈ పాట పాడారు: “నేను యెహోవాకు పాడతాను, ఆయన ఉన్నతంగా హెచ్చింపబడ్డారు. గుర్రాన్ని దాని రౌతును ఆయన సముద్రంలో పడవేశారు.
EXO 15:2 “యెహోవాయే నా బలము నా పాట; ఆయన నాకు రక్షణ అయ్యారు. ఆయన నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తాను, ఆయన నా తండ్రికి దేవుడు నేనాయనను మహిమపరుస్తాను.
EXO 15:3 యెహోవా యుద్ధవీరుడు; యెహోవా అని ఆయనకు పేరు.
EXO 15:4 ఆయన ఫరో రథాలను అతని సైన్యాన్ని సముద్రంలో ముంచివేసారు. అతని అధిపతులలో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
EXO 15:5 అగాధజలాలు వారిని కప్పివేశాయి. రాయిలా వారు అడుగున మునిగిపోయారు.
EXO 15:6 యెహోవా, మీ కుడిచేయి, బలంలో మహిమగలది. యెహోవా, మీ కుడిచేయి, శత్రువును పడగొట్టింది.
EXO 15:7 “మీకు వ్యతిరేకంగా లేచినవారిని మీ మహిమాతిశయంతో అణచివేశారు. మీరు మీ కోపాగ్నిని రగిలించారు అది వారిని చెత్తలా దహించింది.
EXO 15:8 మీ ముక్కు నుండి వచ్చిన ఊపిరివలన నీళ్లు కుప్పగా నిలిచాయి. ప్రవాహజలాలు గోడలా నిలబడ్డాయి; అగాధజలాలు సముద్రం మధ్యలో గడ్డకట్టాయి.
EXO 15:9 ‘నేను వారిని తరుముతాను, వారిని పట్టుకుంటాను. దోపుడుసొమ్మును పంచుకుంటాను; వాటివలన నా ఆశ తీర్చుకుంటాను. నేను నా ఖడ్గాన్ని దూస్తాను నా చేయి వారిని నాశనం చేస్తుంది’ అని శత్రువు అనుకున్నాడు.
EXO 15:10 అయితే మీరు మీ శ్వాసను ఊదగా సముద్రం వారిని కప్పేసింది. వారు బలమైన జలాల క్రింద సీసంలా మునిగిపోయారు.
EXO 15:11 యెహోవా, దేవుళ్ళ మధ్యలో మీవంటి వారెవరు? పరిశుద్ధతలో ఘనమైనవారు మహిమలో భీకరమైనవారు, అద్భుతాలు చేసే మీవంటి వారెవరు?
EXO 15:12 “మీరు మీ కుడిచేయి చాపగా భూమి మీ శత్రువులను మ్రింగివేసింది.
EXO 15:13 మీరు విమోచించిన ప్రజలను మారని మీ ప్రేమతో నడిపిస్తారు. మీ బలంతో మీరు వారిని మీ పరిశుద్ధాలయానికి నడిపిస్తారు.
EXO 15:14 దేశాలు విని వణుకుతాయి; ఫిలిష్తియా ప్రజలకు వేదన కలుగుతుంది.
EXO 15:15 ఎదోము పెద్దలు భయపడతారు, మోయాబు నాయకులకు వణుకు పుడుతుంది. కనాను ప్రజలు భయంతో నీరైపోతారు;
EXO 15:16 భయం దిగులు వారి మీద పడతాయి. యెహోవా, మీ ప్రజలు దాటి వెళ్లేవరకు, మీరు కొనిన మీ ప్రజలు దాటి వెళ్లేవరకు మీ బాహుబలము చేత వారు రాతిలా కదలకుండా ఉంటారు.
EXO 15:17 మీరు వారిని లోపలికి తెచ్చి మీ స్వాస్థ్యమైన పర్వతం మీద యెహోవా, మీరు నివసించడానికి నిర్మించుకున్న స్థలంలో, ప్రభువా, మీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయంలో నాటుతారు.
EXO 15:18 “యెహోవా నిరంతరం పరిపాలిస్తారు.”
EXO 15:19 ఫరో గుర్రాలు, రథాలు, గుర్రపురౌతులు సముద్రంలోకి వచ్చినప్పుడు, యెహోవా వారి మీదికి సముద్రపు నీటిని రప్పించారు. అయితే ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేల మీద నడిచారు.
EXO 15:20 అప్పుడు అహరోను సోదరి ప్రవక్త్రియైన మిర్యాము తంబుర తన చేతిలోనికి తీసుకున్నది. అప్పుడు స్త్రీలందరు తంబురలతో నాట్యంతో ఆమెను అనుసరించారు.
EXO 15:21 మిర్యాము వారితో ఇలా పాడింది: “యెహోవాకు పాడండి, ఎందుకంటే ఉన్నతంగా హెచ్చింపబడ్డారు. గుర్రాన్ని దాని రౌతును ఆయన సముద్రంలో విసిరిపడవేశారు.”
EXO 15:22 తర్వాత మోషే ఎర్ర సముద్రం నుండి ఇశ్రాయేలీయులను నడిపించగా వారు షూరు ఎడారిలోనికి వెళ్లి మూడు రోజులు దానిలో ప్రయాణం చేశారు. అక్కడ వారికి నీరు దొరకలేదు.
EXO 15:23 అప్పుడు వారు మారాకు వచ్చారు. అయితే మారా నీళ్లు చేదుగా ఉండడంతో వారు ఆ నీటిని త్రాగలేకపోయారు. (అందువల్ల ఆ చోటికి మారా అనే పేరు వచ్చింది.)
EXO 15:24 కాబట్టి ప్రజలు, “మేమేమి త్రాగాలి?” అని మోషే మీద సణిగారు.
EXO 15:25 అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా యెహోవా అతనికి ఒక చెట్టు కొమ్మను చూపించారు. అతడు దానిని నీటిలో వేయగా ఆ నీరు తియ్యగా మారాయి. అక్కడే యెహోవా వారికి ఒక శాసనాన్ని నియమించి వారిని పరీక్షించారు.
EXO 15:26 ఆయన వారితో, “మీ దేవుడైన యెహోవా స్వరాన్ని మీరు సరిగ్గా విని, ఆయన దృష్టికి న్యాయమైన వాటిని చేసి, మీరు ఆయన ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడి ఆయన శాసనాలన్నిటిని అనుసరిస్తే, నేను ఈజిప్టువారి మీదికి రప్పించిన తెగుళ్ళలో ఏదీ మీ మీదికి రాదు, మిమ్మల్ని స్వస్థపరచే యెహోవాను నేనే” అన్నారు.
EXO 15:27 తర్వాత వారు ఎలీముకు వచ్చారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు డెబ్బై తాటి చెట్లు ఉన్నాయి. వారు ఆ నీటి దగ్గరే బస చేశారు.
EXO 16:1 ఇశ్రాయేలీయుల సమాజమంతా ఎలీము నుండి ప్రయాణమై, వారు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రెండవ నెల పదిహేనవ రోజున ఎలీముకు సీనాయికి మధ్య ఉన్న సీను అరణ్యం చేరారు.
EXO 16:2 ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే అహరోనుల మీద సణిగింది.
EXO 16:3 ఇశ్రాయేలీయులు వారితో, “మేము ఈజిప్టు దేశంలో మాంసం వండుకున్న కుండల చుట్టూ కూర్చుని మేము కోరుకున్న ఆహారమంతా తృప్తిగా తిన్నప్పుడే యెహోవా చేతిలో చనిపోయినా బాగుండేది. అయితే ఈ సమాజమంతా ఆకలితో చనిపోవాలని మీరు మమ్మల్ని ఈ అరణ్యంలోకి తీసుకువచ్చారు” అని అన్నారు.
EXO 16:4 అప్పుడు యెహోవా మోషేతో, “నేను మీ కోసం ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తాను. ప్రజలు ప్రతిరోజు వెళ్లి ఆ రోజుకు సరిపడే ఆహారం పోగుచేసుకోవాలి. ఆ విధంగా వారిని పరీక్షించి వారు నా ఉపదేశాలను పాటిస్తున్నారో లేదో చూస్తాను.
EXO 16:5 ఆరవ రోజున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకోవాలి, అది మిగిలిన రోజుల్లో వారు సమకూర్చుకొనే దానికన్నా రెండింతలు ఉండాలి” అని చెప్పారు.
EXO 16:6 కాబట్టి మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, “మిమ్మల్ని ఈజిప్టులో నుండి బయటకు రప్పించింది యెహోవాయే అని సాయంకాలాన మీరు తెలుసుకుంటారు.
EXO 16:7 ఉదయకాలం మీరు యెహోవా మహిమను చూస్తారు, ఎందుకంటే మీరు ఆయనకు వ్యతిరేకంగా సణగడం ఆయన విన్నారు. మీరు మామీద సణగడానికి మేము ఏపాటివారం?” అన్నారు.
EXO 16:8 ఇంకా మోషే మాట్లాడుతూ, “మీరు తినడానికి సాయంకాలం మాంసాన్ని, ఉదయకాలం మీకు సరిపడే ఆహారాన్ని యెహోవా మీకు ఇచ్చినప్పుడు, ఆయన యెహోవా అని మీరు తెలుసుకుంటారు, ఎందుకంటే మీరు ఆయనకు వ్యతిరేకంగా సణగడం ఆయన విన్నారు. మేము ఏపాటివారం? మీరు మామీద సణగడం లేదు, కాని యెహోవా మీదనే సణుగుతున్నారు” అన్నాడు.
EXO 16:9 తర్వాత మోషే అహరోనుతో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల సమాజమంతటికి ఇలా చెప్పు, ‘యెహోవా మీ సణుగుడు విన్నారు కాబట్టి ఆయన ఎదుటకు రండి.’ ”
EXO 16:10 అహరోను ఇశ్రాయేలీయుల సమాజమంతటితో మాట్లాడుతున్నప్పుడు వారు అరణ్యం వైపు చూసినప్పుడు అక్కడ వారికి యెహోవా మహిమ మేఘంలో కనిపించింది.
EXO 16:11 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు,
EXO 16:12 “నేను ఇశ్రాయేలీయుల సణుగులు విన్నాను. వారితో ఇలా చెప్పు, ‘సాయంకాలం మీరు మాంసాన్ని తింటారు, ఉదయకాలం ఆహారం తిని తృప్తిపొందుతారు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’ ”
EXO 16:13 ఆ సాయంకాలం పూరేళ్ళు వచ్చి శిబిరం స్థలాన్ని కప్పివేశాయి, ఉదయకాలం ఆ శిబిరం చుట్టూ మంచు పొర ఉంది.
EXO 16:14 ఆ మంచు కరిగిపోయిన తర్వాత, ఆ ఎడారి నేలమీద మంచుకణాల వంటి సన్నని కణాలు కనిపించాయి.
EXO 16:15 ఇశ్రాయేలీయులు వాటిని చూసి, అది ఏమిటో వారికి తెలియక, “ఇదేమిటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే వారితో, “ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారము.
EXO 16:16 యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ఇదే: ‘ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత పోగుచేసుకోవాలి. మీ గుడారంలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమెరు చొప్పున పోగుచేసుకోవాలి.’ ”
EXO 16:17 ఇశ్రాయేలీయులు తమకు చెప్పబడినట్లుగానే చేశారు; కొందరు ఎక్కువ, కొందరు తక్కువ కూర్చుకున్నారు.
EXO 16:18 వారు దానిని ఓమెరుతో కొలిచినప్పుడు ఎక్కువ పోగుచేసుకున్న వారికి ఎక్కువ మిగల్లేదు తక్కువ పోగుచేసుకున్న వారికి తక్కువ కాలేదు. ప్రతిఒక్కరు తమకు ఎంత అవసరమో అంతే పోగుచేసుకున్నారు.
EXO 16:19 అప్పుడు మోషే వారితో, “దీనిలో ఏది ఉదయం వరకు ఎవరూ మిగుల్చుకోకూడదు” అని చెప్పాడు.
EXO 16:20 అయితే వారిలో కొందరు మోషే మాట వినిపించుకోకుండా దానిలో కొంచెం ఉదయం వరకు మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపుకొట్టింది. కాబట్టి మోషే వారిమీద కోపడ్డాడు.
EXO 16:21 ప్రతి ఉదయం ప్రతి ఒక్కరు తమకు కావలసినంత పోగుచేసుకునేవారు, ఎండ తీవ్రత పెరిగినప్పుడు అది కరిగిపోయేది.
EXO 16:22 ఆరవరోజు, ఒక్కొక్కరికి రెండేసి ఓమెర్ల చొప్పున రెట్టింపు పోగుచేసుకున్నారు, సమాజ నాయకులు వచ్చి మోషేకు దానిని తెలిపారు.
EXO 16:23 అతడు వారితో, “యెహోవా ఆజ్ఞ ఇదే, రేపు సబ్బాతు దినము. అది యెహోవాకు పరిశుద్ధమైన సబ్బాతు విశ్రాంతి దినము. కాబట్టి మీరు కాల్చుకోవాలనుకున్నది కాల్చుకోండి, వండుకోవాలనుకున్నది వండుకోండి. మిగిలింది ఉదయం వరకు ఉంచుకోండి” అని చెప్పాడు.
EXO 16:24 మోషే ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఉదయం వరకు దానిని ఉంచారు కాని అది కంపుకొట్టలేదు పురుగులు పట్టలేదు.
EXO 16:25 అప్పుడు మోషే, “ఈ రోజు దానిని తినండి. ఈ రోజు యెహోవాకు సబ్బాతు దినము. ఈ రోజు నేల మీద ఏమి దొరకదు.
EXO 16:26 ఆరు రోజులు మీరు దానిని పోగుచేసుకోవాలి కాని ఏడవ రోజున, అనగా సబ్బాతు దినాన్న అది దొరకదు” అని చెప్పాడు.
EXO 16:27 అయితే కొందరు ఏడవ రోజున దానిని పోగుచేసుకుందామని బయటకు వెళ్లారు కాని వారికేమి దొరకలేదు.
EXO 16:28 కాబట్టి యెహోవా మోషేతో, “ఎంతకాలం మీరు నా ఆజ్ఞలను సూచనలను పాటించకుండా ఉంటారు?
EXO 16:29 యెహోవా ఈ సబ్బాతును మీకు ఇచ్చారని మనస్సులో గుర్తించుకోండి; అందుకే ఆరవరోజు ఆయన మీకు రెండు రోజులకు సరిపడా ఆహారమిస్తున్నారు. ఏడవ రోజున ప్రతిఒక్కరు తామున్న చోటనే ఉండాలి. ఏడవ రోజున ఎవరు తామున్న చోటినుండి బయటకు వెళ్లకూడదు” అన్నారు.
EXO 16:30 కాబట్టి ప్రజలు ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నారు.
EXO 16:31 ఇశ్రాయేలీయులు ఈ ఆహారానికి మన్నా అని పేరు పెట్టారు. అది తెల్లగా కొత్తిమెర గింజల్లా ఉండి దాని రుచి తేనెతో చేసిన పల్చనిరొట్టెల వలె ఉంది.
EXO 16:32 మోషే వారితో, “యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ఇదే: ‘నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి రప్పించినప్పుడు అరణ్యంలో తినడానికి నేను మీకిచ్చిన ఆహారాన్ని రాబోయే తరాలవారు చూసేలా ఒక ఓమెరు మన్నాను తీసుకుని తమ దగ్గర ఉంచాలి.’ ”
EXO 16:33 కాబట్టి మోషే అహరోనుతో, “ఒక జాడీ తీసుకుని అందులో ఒక ఓమెరు మన్నాను నింపి, రాబోయే తరాలవారు తమ దగ్గర ఉంచుకునేలా దానిని యెహోవా ఎదుట ఉంచాలి” అని చెప్పాడు.
EXO 16:34 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం, అహరోను మన్నాను నిబంధన పలకలను మందసం దగ్గర ఉంచాడు.
EXO 16:35 ఇశ్రాయేలీయులు తాము నివసించవలసిన దేశానికి వచ్చేవరకు 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు; వారు కనాను సరిహద్దులు చేరేవరకు మన్నాను తిన్నారు.
EXO 16:36 (ఓమెరు అనగా ఏఫాలో పదవ వంతు.)
EXO 17:1 ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను అరణ్యం నుండి బయలుదేరి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించారు. వారు రెఫీదీములో బస చేశారు, కాని అక్కడ ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు.
EXO 17:2 కాబట్టి వారు మోషేతో గొడవపడుతూ, “మాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వు” అని అడిగారు. అందుకు మోషే, “నాతో ఎందుకు గొడవపడుతున్నారు? యెహోవాను ఎందుకు పరీక్షిస్తున్నారు?” అన్నాడు.
EXO 17:3 కాని అక్కడ ప్రజలు దాహం తట్టుకోలేక మోషే మీద సణుగుతూ, “మీరు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకువచ్చారు? దాహంతో మేము మా పిల్లలు మా పశువులు చావాలనా?” అన్నారు.
EXO 17:4 అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టి, “ఈ ప్రజలతో నేనేం చేయాలి? వీరు దాదాపు నన్ను రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు” అన్నాడు.
EXO 17:5 యెహోవా మోషేతో, “ప్రజలకు ముందుగా వెళ్లు. నీతో ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని నైలు నదిని కొట్టిన చేతికర్రను పట్టుకుని వెళ్లు.
EXO 17:6 అక్కడ హోరేబులో బండ దగ్గర నేను నీకు ఎదురుగా నిలబడి ఉంటాను. నీవు ఆ బండను కొట్టు, ప్రజలు త్రాగడానికి ఆ బండ నుండి నీళ్లు వస్తాయి” అని చెప్పారు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలు చూస్తుండగా యెహోవా చెప్పినట్టు చేశాడు.
EXO 17:7 ఇశ్రాయేలీయులు, “యెహోవా మన మధ్య ఉన్నాడా లేడా?” అని అంటూ మోషేతో జగడమాడి, యెహోవాను పరీక్షించారు కాబట్టి మోషే ఆ చోటికి మస్సా అని మెరీబా అని పేరు పెట్టాడు.
EXO 17:8 రెఫీదీములో అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలీయులపై దాడి చేశారు.
EXO 17:9 అప్పుడు మోషే యెహోషువతో, “మన పురుషులలో కొందరిని ఎంపిక చేసుకుని అమాలేకీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్లు. రేపు దేవుని కర్ర నా చేతులతో పట్టుకుని కొండ శిఖరం మీద నిలబడతాను” అని చెప్పాడు.
EXO 17:10 మోషే ఆజ్ఞాపించిన ప్రకారం యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేశాడు. మోషే అహరోను హూరు అనేవారు కొండశిఖరానికి ఎక్కి వెళ్లారు.
EXO 17:11 మోషే తన చేతులు పైకి ఎత్తినంతసేపు ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే తన చేతులు క్రిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు.
EXO 17:12 మోషే చేతులు అలసిపోయినప్పుడు వారు ఒక రాయిని తెచ్చి అతని దగ్గర వేయగా అతడు దాని మీద కూర్చున్నాడు. అహరోను హూరులు అతనికి ఆ ప్రక్కన ఒకరు ఈ ప్రక్కన ఒకరు నిలబడి సూర్యుడు అస్తమించే వరకు మోషే చేతులు స్థిరంగా ఉండేలా పైకి ఎత్తి పట్టుకున్నారు.
EXO 17:13 దాని ఫలితంగా యెహోషువ ఖడ్గంతో అమాలేకీయుల సైన్యాన్ని జయించాడు.
EXO 17:14 తర్వాత యెహోవా మోషేతో, “అమాలేకు పేరును ఆకాశం క్రింద ఉండకుండ పూర్తిగా కొట్టివేస్తాను, కాబట్టి జ్ఞాపకం చేసుకునేలా దీనిని ఒక గ్రంథంలో వ్రాసి యెహోషువకు వినిపించు” అని చెప్పారు.
EXO 17:15 మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టారు.
EXO 17:16 అతడు, “యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా తమ చేతిని పైకి ఎత్తారు, కాబట్టి యెహోవా అమాలేకీయులతో తరతరాల వరకు యుద్ధం చేస్తూనే ఉంటారు” అన్నాడు.
EXO 18:1 కొంతకాలం గడిచిన తర్వాత మిద్యాను యాజకుడు, మోషేకు మామయైన యెత్రో, దేవుడు మోషేకు అతని ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసినదంతటిని గురించి, యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన సంగతి విన్నాడు.
EXO 18:2 మోషే తన భార్య సిప్పోరాను పంపిన తర్వాత, అతని మామ యెత్రో ఆమెను చేర్చుకున్నాడు.
EXO 18:3 మోషే, “నేను పరాయి దేశంలో విదేశీయునిగా ఉన్నాను” అని చెప్పి ఒక కుమారునికి గెర్షోము అని పేరు పెట్టాడు;
EXO 18:4 మరొకనికి, “నా తండ్రి దేవుడు నాకు సహాయకుడు; ఫరో ఖడ్గం నుండి ఆయన నన్ను రక్షించారు” అని చెప్పి ఎలీయెజెరు అని పేరు పెట్టాడు.
EXO 18:5 మోషే మామయైన యెత్రో మోషే కుమారులను అతని భార్యను తీసుకుని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర బస చేస్తున్న మోషే దగ్గరకు వచ్చాడు.
EXO 18:6 “నీ మామనైన యెత్రో అనే నేను, నీ భార్యను నీ ఇద్దరు కుమారులను తీసుకుని నీ దగ్గరకు వస్తున్నాను” అని యెత్రో మోషేకు కబురు పంపాడు.
EXO 18:7 కాబట్టి మోషే తన మామను ఎదుర్కోడానికి వెళ్లి నమస్కరించి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. వారు ఒకరి క్షేమాన్ని ఒకరు తెలుసుకొని గుడారంలోకి వెళ్లారు.
EXO 18:8 అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల కోసం ఫరోకు ఈజిప్టువారికి చేసిన దాని గురించి, దారిలో తమకు ఎదురైన కష్టాల గురించి, యెహోవా తమను కాపాడిన విధానం గురించి మోషే తన మామకు వివరించాడు.
EXO 18:9 ఈజిప్టువారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి యెహోవా చేసిన మేలులన్నిటిని విని యెత్రో ఎంతో సంతోషించాడు.
EXO 18:10 అప్పుడు యెత్రో, “ఈజిప్టువారి చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఈజిప్టువారి చేతి క్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతించబడును గాక.
EXO 18:11 ఇశ్రాయేలీయుల పట్ల అహంకారంగా ప్రవర్తించిన వారికి ఆయన చేసిన దానిని బట్టి ఇతర దేవుళ్ళందరికంటే యెహోవాయే గొప్పవాడని నేనిప్పుడు తెలుసుకున్నాను” అన్నాడు.
EXO 18:12 అప్పుడు మోషే మామయైన యెత్రో, ఒక దహనబలిని ఇతర బలులను దేవునికి అర్పించగా, దేవుని సన్నిధిలో మోషే మామతో కలిసి భోజనం తినడానికి అహరోను, ఇశ్రాయేలీయుల పెద్దలందరితో కలిసి వచ్చాడు.
EXO 18:13 మర్నాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చడానికి తన స్థానంలో కూర్చున్నాడు, వారు ఉదయం నుండి సాయంత్రం వరకు అతని చుట్టూ నిలబడ్డారు.
EXO 18:14 మోషే ప్రజలకు చేస్తున్న వాటన్నిటిని అతని మామ చూసినప్పుడు, అతడు, “నీవు ఈ ప్రజలకు చేస్తున్నది ఏమిటి? ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ప్రజలందరు నీ చుట్టూ నిలబడి ఉండగా, న్యాయాధిపతిగా నీవు ఒక్కడివే ఎందుకు కూర్చున్నావు?” అని అడిగాడు.
EXO 18:15 అందుకు మోషే అతనితో, “ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రజలు నా దగ్గరకు వస్తారు.
EXO 18:16 వారికెప్పుడు ఏ వివాదం ఉన్నా, అది నా దగ్గరకు తేబడుతుంది, నేను వారి మధ్య నిర్ణయించిన దేవుని శాసనాలను, సూచనలను వారికి తెలియజేస్తాను” అని చెప్పాడు.
EXO 18:17 అందుకు మోషే మామ, “నీవు చేస్తున్నది సరియైనది కాదు.
EXO 18:18 నీవు, నీ దగ్గరకు వస్తున్న ఈ ప్రజలు అలసిపోతారు. ఈ పని నీకు చాలా భారంగా ఉంది; నీవు ఒక్కడివే దీనిని చేయలేవు.
EXO 18:19 ఇప్పుడు నా మాట విను, నేను నీకొక సలహా ఇస్తాను, దేవుడు నీకు తోడుగా ఉండును గాక. నీవు దేవుని ఎదుట ప్రజల ప్రతినిధిగా ఉండి, వారి వివాదాలను ఆయన దగ్గరకు తీసుకురావాలి.
EXO 18:20 ఆయన శాసనాలను సూచనలను నీవు వారికి బోధించి, వారు జీవించాల్సిన మార్గాన్ని వారికి చూపించు.
EXO 18:21 దేవునికి భయపడే, అన్యాయపు లాభాన్ని అసహ్యించుకునే, నమ్మదగిన సామర్థ్యం కలిగిన పురుషులను ప్రజలందరిలో నుండి ఎంపికచేయాలి. తర్వాత వారిని వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాలి.
EXO 18:22 వారు అన్ని వేళలా ప్రజలకు న్యాయాధిపతులుగా ఉండాలి, కాని ప్రతీ కఠిన సమస్యను నీ దగ్గరకు తీసుకువచ్చేలా చూడు, మామూలు సమస్యల విషయంలో వారే నిర్ణయించవచ్చు. ఈ విధంగా చేస్తే వారు నీతో పాటు నీ భారాన్ని పంచుకుంటారు, కాబట్టి నీకు భారం తగ్గుతుంది.
EXO 18:23 ఒకవేళ నీవు ఇలా చేస్తే, దేవుడు అలాగే ఆజ్ఞాపిస్తే, నీవు ఈ ఒత్తిడిని తట్టుకోగలుగుతావు, అలాగే ఈ ప్రజలందరు కూడా సమాధానంగా తమ ఇళ్ళకు వెళ్తారు” అని అన్నాడు.
EXO 18:24 మోషే తన మామ చెప్పిన సలహా విని అతడు చెప్పినట్లే చేశాడు.
EXO 18:25 అతడు ఇశ్రాయేలీయులందరిలో సమర్థవంతులైన వారిని ఎంపికచేసి వారిని ప్రజల మీద అధికారులుగా, వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాడు.
EXO 18:26 వారు అన్ని వేళలా ప్రజలకు న్యాయాధిపతులుగా సేవ చేశారు. కఠిన సమస్యలను వారు మోషే దగ్గరకు తీసుకువచ్చేవారు, కాని మామూలు వాటి విషయంలో వారే నిర్ణయించేవారు.
EXO 18:27 తర్వాత మోషే తన మామను అతని మార్గంలో పంపించాడు, యెత్రో తిరిగి తన స్వదేశానికి వెళ్లాడు.
EXO 19:1 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన మూడవ నెల మొదటి రోజున వారు సీనాయి అరణ్యానికి వచ్చారు.
EXO 19:2 వారు రెఫీదీము నుండి బయలుదేరిన తర్వాత, వారు సీనాయి ఎడారిలో ప్రవేశించారు, అక్కడ పర్వతం ఎదురుగా ఇశ్రాయేలీయులు బసచేశారు.
EXO 19:3 తర్వాత మోషే దేవుని దగ్గరకు ఎక్కి వెళ్లగా, ఆ పర్వతం నుండి యెహోవా అతన్ని పిలిచి, “యాకోబు వంశస్థులకు నీవు చెప్పాల్సింది, ఇశ్రాయేలు ప్రజలకు నీవు చెప్పాల్సింది ఇదే:
EXO 19:4 ‘నేను ఈజిప్టుకు ఏమి చేశానో, గ్రద్ద రెక్కల మీద మోసినట్లు నేను మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చుకున్నది మీరే స్వయంగా చూశారు.
EXO 19:5 మీరిప్పుడు నాకు పూర్తిగా లోబడి నా ఒడంబడికను పాటిస్తే, అన్ని దేశాల్లో మీరు నా విలువైన ఆస్తి అవుతారు. ఈ భూమి అంతా నాదే అయినా,
EXO 19:6 మీరు నాకు ఒక యాజకుల రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉంటారు.’ నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాల్సిన మాటలు ఇవే” అని చెప్పారు.
EXO 19:7 మోషే తిరిగివెళ్లి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించి చెప్పమన్న మాటలన్నీ వారికి తెలియచేశాడు.
EXO 19:8 ప్రజలంతా కలిసి స్పందించి, “యెహోవా చెప్పిందంతా మేము చేస్తాము” అని అన్నారు. అప్పుడు మోషే వారి సమాధానాన్ని యెహోవా దగ్గరకు తీసుకెళ్లాడు.
EXO 19:9 అప్పుడు యెహోవా మోషేతో, “నేను నీతో మాట్లాడడం ప్రజలు విని నీ మీద ఎప్పటికీ వారు నమ్మకం ఉంచేలా, నేను దట్టమైన మేఘంలో నీ దగ్గరకు వస్తాను” అని అన్నారు. అప్పుడు మోషే ప్రజలు చెప్పిన మాటలు యెహోవాకు చెప్పాడు.
EXO 19:10 యెహోవా మోషేతో, “నీవు ప్రజల దగ్గరకు వెళ్లి ఈ రోజు రేపు వారిని ప్రతిష్ఠించు. వారు తమ వస్త్రాలను ఉతుక్కుని,
EXO 19:11 మూడవరోజున సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఆ రోజు ప్రజలందరి కళ్ళెదుట యెహోవా సీనాయి పర్వతం మీదికి దిగివస్తారు.
EXO 19:12 నీవు పర్వతం చుట్టూ ప్రజలకు సరిహద్దు ఏర్పాటు చేసి ప్రజలతో, ‘మీరు ఎవరు పర్వతం దగ్గరకు రాకూడదు దాని అంచును తాకకూడదు. ఎవరైనా ఆ పర్వతాన్ని తాకితే వారు చంపబడతారు.
EXO 19:13 ఎవరైనా తమ చేతులతో ముట్టుకుంటే వారు బాణాలతో గుచ్చబడి లేదా రాళ్లతో కొట్టబడి చంపబడాలి; తాకింది మనిషైనా ఒక జంతువైనా చంపబడాలి’ అని చెప్పాలి. పొట్టేలు కొమ్ము బూర శబ్దం సుదీర్ఘంగా విన్నప్పుడు వారు పర్వతం దగ్గరకు రావాలి” అని చెప్పారు.
EXO 19:14 మోషే పర్వతం నుండి దిగి ప్రజల దగ్గరకు వెళ్లి వారిని పవిత్రపరిచాడు. వారు తమ వస్త్రాలను ఉతుక్కున్నారు.
EXO 19:15 అప్పుడు మోషే ప్రజలతో, “మూడవరోజుకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు” అని చెప్పాడు.
EXO 19:16 మూడవ రోజు ఉదయం ఆ పర్వతం మీద దట్టమైన మేఘంతో ఉరుములు మెరుపులు పెద్ద శబ్దంతో బూరధ్వని వినిపించింది. అప్పుడు ఆ శిబిరంలో ఉన్న ప్రజలంతా వణికిపోయారు.
EXO 19:17 అప్పుడు దేవుని కలుసుకోడానికి మోషే ప్రజలను శిబిరం బయటకు నడిపించగా, వారు పర్వతం అంచున నిలబడ్డారు.
EXO 19:18 యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చారు కాబట్టి ఆ పర్వతమంతా పొగతో నిండిపోయింది. కొలిమి నుండి పొగ వచ్చినట్లుగా ఆ పొగ పైకి లేచింది. ఆ పర్వతమంతా భయంకరంగా కంపించింది.
EXO 19:19 బూరధ్వని అంతకంతకు అధికమయ్యింది, మోషే మాట్లాడుతుండగా దేవుని స్వరం అతనికి జవాబిస్తున్నది.
EXO 19:20 సీనాయి పర్వత శిఖరం మీదికి యెహోవా దిగివచ్చి ఆ పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే పర్వతం పైకి ఎక్కి వెళ్లాడు.
EXO 19:21 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు క్రిందకు దిగివెళ్లి, ప్రజలు యెహోవాను చూడాలని హద్దులు దాటివచ్చి వారిలో అనేకమంది నశించిపోకుండా వారిని హెచ్చరించు.
EXO 19:22 యెహోవాను సమీపించే యాజకులు సహితం, తమను తాము ప్రతిష్ఠించుకోవాలి లేకపోతే యెహోవా వారిపై విరుచుకుపడతారు” అని చెప్పారు.
EXO 19:23 అప్పుడు మోషే యెహోవాతో, “ప్రజలు సీనాయి పర్వతం ఎక్కి రాలేరు, ఎందుకంటే ‘పర్వతం చుట్టూ సరిహద్దులు ఏర్పరచి దానిని పరిశుద్ధంగా ఉంచాలి’ అని మీరే మాకు ఆజ్ఞాపించారు” అన్నాడు.
EXO 19:24 అందుకు యెహోవా, “నీవు క్రిందకు దిగివెళ్లి నీతో పాటు అహరోనును పైకి తీసుకురా. అయితే యాజకులు గాని ప్రజలు గాని యెహోవా దగ్గరకు రావడానికి హద్దులు దాటకూడదు, లేకపోతే ఆయన వారికి వ్యతిరేకంగా విరుచుకుపడతారు” అన్నారు.
EXO 19:25 కాబట్టి మోషే ప్రజల దగ్గరకు దిగివెళ్లి ఆ మాటలు వారితో చెప్పాడు.
EXO 20:1 తర్వాత దేవుడు ఈ మాటలన్నీ మాట్లాడారు:
EXO 20:2 “బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
EXO 20:3 “నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు.
EXO 20:4 పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని భూమి క్రింద నీళ్లలో గాని ఉన్న దేని రూపంలో మీరు మీకోసం ప్రతిమను చేసుకోకూడదు.
EXO 20:5 మీరు వాటికి నమస్కరించకూడదు పూజింపకూడదు; ఎందుకంటే నేను, మీ దేవుడనైన యెహోవాను, రోషం గల దేవుడను, నన్ను ద్వేషించినవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల పాపం యొక్క శిక్షను వారి పిల్లల మీదికి రప్పిస్తాను.
EXO 20:6 అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించే వారికి వెయ్యి తరాల వరకు కరుణను చూపిస్తాను.
EXO 20:7 మీ దేవుడైన యెహోవా నామాన్ని అనవసరంగా ఉపయోగించకూడదు, ఎందుకంటే తన నామాన్ని అనవసరంగా ఉపయోగించే వారిని యెహోవా నిర్దోషులుగా వదిలేయరు.
EXO 20:8 సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం జ్ఞాపకముంచుకోండి.
EXO 20:9 ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి,
EXO 20:10 కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు.
EXO 20:11 ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించి, ఏడవ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. కాబట్టి యెహోవా సబ్బాతు దినాన్ని ఆశీర్వదించి దానిని పరిశుద్ధం చేశారు.
EXO 20:12 మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు ఎక్కువకాలం జీవించేలా మీ తండ్రిని తల్లిని గౌరవించాలి.
EXO 20:13 మీరు హత్య చేయకూడదు.
EXO 20:14 మీరు వ్యభిచారం చేయకూడదు.
EXO 20:15 మీరు దొంగతనం చేయకూడదు.
EXO 20:16 మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు.
EXO 20:17 మీ పొరుగువాని ఇంటిని మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని భార్యను గాని, అతని దాసుని గాని దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”
EXO 20:18 ప్రజలు ఆ ఉరుములు మెరుపులు చూసి బూరధ్వని విని పర్వతం నుండి వస్తున్న పొగను చూసి, వారు భయంతో వణికారు. వారు దూరంగా నిలబడి
EXO 20:19 మోషేతో, “నీవు మాతో మాట్లాడు మేము వింటాము. మాతో దేవుడు నేరుగా మాట్లాడవద్దు లేదా మేము చనిపోతాం” అన్నారు.
EXO 20:20 అందుకు మోషే ప్రజలతో, “భయపడకండి. మిమ్మల్ని పరీక్షించడానికి దేవుడు వచ్చారు, తద్వార మీరు పాపం చేయకుండా దేవుని భయం మీలో ఉంటుంది” అని చెప్పాడు.
EXO 20:21 దేవుడున్న ఆ కటికచీకటిని మోషే సమీపిస్తూ ఉండగా ప్రజలు దూరంగా ఉన్నారు.
EXO 20:22 తర్వాత యెహోవా మోషేతో, “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను పరలోకం నుండి మీతో మాట్లాడడం మీరే చూశారు.
EXO 20:23 మీరు నాతో పాటు దేన్ని దేవుళ్ళుగా చేసుకోకూడదు; మీ కోసం వెండి దేవుళ్ళను గాని బంగారు దేవుళ్ళను గాని మీరు చేసుకోకూడదు.
EXO 20:24 “ ‘నా కోసం మట్టితో బలిపీఠం తయారుచేసి దానిపై మీ దహనబలులను, సమాధానబలులను, మీ గొర్రెలను పశువులను అర్పించాలి. నేను ఎక్కడ నా పేరును ఘనపరచబడేలా చేసిన, నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
EXO 20:25 ఒకవేళ మీరు నా కోసం రాళ్లతో బలిపీఠం కడితే, దానిని చెక్కిన రాళ్లతో కట్టవద్దు, ఎందుకంటే వాటిపైన మీరు పనిముట్టు ఉపయోగిస్తే అది అపవిత్రం అవుతుంది.
EXO 20:26 నా బలిపీఠం దగ్గరకు మెట్లు ఎక్కి వెళ్లవద్దు, ఎందుకంటే మీ లోపలి అవయవాలు కనబడతాయి.’
EXO 21:1 “నీవు వారి ఎదుట ఉంచవలసిన చట్టాలు ఇవే:
EXO 21:2 “ఒకవేళ నీవు హెబ్రీ దాసులను కొంటే, వారు ఆరు సంవత్సరాలు నీకు సేవ చేయాలి. ఏడవ సంవత్సరంలో, ఏమి చెల్లించనవసరం లేకుండానే, వారు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు.
EXO 21:3 అతడు వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చియుంటే ఒంటరిగానే వెళ్లిపోవాలి; ఒకవేళ అతడు వచ్చినప్పుడు అతని భార్యతో వచ్చియుంటే, ఆమె తన భర్తతో వెళ్లిపోవాలి.
EXO 21:4 ఒకవేళ వాని యజమాని వానికి భార్యను ఇస్తే ఆమె వానికి కుమారులను లేదా కుమార్తెలను కంటే, వాడు మాత్రమే స్వతంత్రునిగా వెళ్లాలి.
EXO 21:5 “కాని ఒకవేళ దాసుడు, ‘నాకు నా యజమాని మీద, నా భార్య మీద నా పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టి నేను స్వతంత్రునిగా వెళ్లను’ అని అంటే,
EXO 21:6 వాని యజమాని వానిని దేవుని ఎదుటకు తీసుకురావాలి. వాని యజమాని వానిని తలుపు దగ్గరకు గాని ద్వారబంధం దగ్గరకు గాని తీసుకెళ్లి వాని చెవిని కదురుతో గుచ్చాలి. అప్పుడు వాడు వాని యజమానికి జీవితకాల దాసునిగా ఉంటాడు.
EXO 21:7 “ఒకవేళ ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మివేస్తే, ఆమె ఒక దాసుడు వెళ్లినట్లుగా స్వతంత్రంగా వెళ్లకూడదు.
EXO 21:8 కావాలని ఆమెను ఎన్నుకున్న యజమానిని ఆమె సంతోషపెట్టలేకపోతే, అతడు ఆమెను విడిపించబడనివ్వాలి. అతడు ఆమెను విదేశీయులకు అమ్మడానికి అతనికి అధికారం లేదు, ఎందుకంటే అతడు ఆమె నమ్మకాన్ని వమ్ముచేశాడు.
EXO 21:9 ఒకవేళ అతడు ఆమెను తన కుమారుని కోసం ఎంపికచేస్తే, ఆమెకు ఒక కుమార్తెకు ఇచ్చే హక్కు ఇవ్వాలి.
EXO 21:10 అతడు మరొక స్త్రీని పెళ్ళి చేసుకుంటే, మొదటి భార్యకు ఆహారం, బట్టలు, దాంపత్య హక్కులు లేకుండ చేయకూడదు.
EXO 21:11 అతడు ఈ మూడింటిని ఆమెకు సమకూర్చకపోతే, ఆమె డబ్బు ఏమి చెల్లించకుండ, స్వతంత్రురాలిగా వెళ్లిపోవచ్చు.
EXO 21:12 “ఎవరైనా చావు దెబ్బతో ఒక వ్యక్తిని కొడితే వారికి మరణశిక్ష విధించబడాలి.
EXO 21:13 అయినప్పటికీ, ఒకవేళ అది ఉద్దేశపూర్వకంగా కాక, దేవుడు దానిని జరగనిస్తే, వారు నేను నియమించే స్థలానికి పారిపోవాలి.
EXO 21:14 అయితే ఒకవేళ ఎవరైనా ఎవరినైన కావాలని కుట్రచేసి చంపితే, ఆ వ్యక్తిని నా బలిపీఠం దగ్గర నుండి ఈడ్చుకు వెళ్లి చంపివేయాలి.
EXO 21:15 “ఎవరైనా తన తండ్రి మీద గాని తల్లి మీద గాని దాడి చేస్తే వారికి మరణశిక్ష విధించాలి.
EXO 21:16 “ఎవరైనా ఎవరినైనా ఎత్తుకెళ్లిన తర్వాత ఒకవేళ అమ్మివేయబడినా లేదా వారి దగ్గరే ఉన్నా, ఎత్తుకెళ్లిన వారికి మరణశిక్ష విధించబడాలి.
EXO 21:17 “ఎవరైనా తన తండ్రిని గాని తల్లిని గాని శపిస్తే వారికి తప్పక మరణశిక్ష విధించబడాలి.
EXO 21:18 “ఒకవేళ ప్రజలు జగడమాడుతూ ఒక వ్యక్తి ఇంకొకరిని రాయితో గాని పిడికిలితో గాని కొడితే బాధితుడు చావకపోవచ్చు కాని మంచానికి పరిమితమై,
EXO 21:19 తర్వాత అతడు లేచి చేతికర్ర సహాయంతో బయట తిరుగుతూ ఉంటే కొట్టినవానికి శిక్ష విధించబడదు; కాని ఆ కొట్టినవాడు గాయపడిన వ్యక్తికి ఆ సమయంలో కలిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించి ఆ బాధితుడు పూర్తిగా బాగుపడేలా చూడాలి.
EXO 21:20 “ఎవరైనా తమ దాసుని గాని దాసిని గాని కర్రతో కొట్టినప్పుడు ఒకవేళ వారు చనిపోతే కొట్టినవారు శిక్షించబడాలి,
EXO 21:21 కాని ఒకవేళ వారు ఒకటి లేదా రెండు రోజుల్లో కోలుకుంటే, ఆ దాసులు వారి ఆస్తియే కాబట్టి వారు శిక్షించబడనక్కర్లేదు.
EXO 21:22 “ఒకవేళ ప్రజలు పోట్లాడుకుంటూ గర్భవతియైన స్త్రీని కొట్టినప్పుడు ఆమె అకాల జన్మనిస్తే ఆమెకు గర్భస్రావమై మరి ఏ ఇతర గాయాలు కాకపోతే, దానికి కారణమైనవాడు ఆమె భర్త అడిగిన నష్టపరిహారాన్ని న్యాయాధిపతులు నిర్ణయించిన ప్రకారం చెల్లించాలి.
EXO 21:23 తీవ్రమైన గాయాలు అయినప్పుడు మీరు విధించవలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం
EXO 21:24 కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు,
EXO 21:25 వాతకు వాత, గాయానికి గాయం, నలిపివేతకు నలిపివేత.
EXO 21:26 “ఒక యజమాని కొట్టడం వలన అతని దాసునికి గాని దాసికి గాని కన్ను పోతే కంటికి కలిగిన నష్టాన్ని బట్టి ఆ యజమాని వారిని స్వతంత్రంగా పోనివ్వాలి.
EXO 21:27 యజమాని తన దాసునిది గాని దాసిది గాని పన్ను ఊడగొడితే ఆ పంటికి బదులుగా వారిని స్వతంత్రంగా పోనివ్వాలి.
EXO 21:28 “ఒక ఎద్దు పురుషుని గాని స్త్రీని గాని చనిపోయేంతగా పొడిస్తే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. దాని మాంసం ఎవరూ తినకూడదు. కాని ఆ ఎద్దు యజమాని నిర్దోషి.
EXO 21:29 అయితే ఎద్దుకు అంతకుముందే స్త్రీని గాని పురుషుని గాని పొడిచే అలవాటు ఉండి, దాని యజమానిని ఈ విషయంలో హెచ్చరించినా అతడు దానిని కట్టి అదుపులో పెట్టకపోవడం చేత ఆ ఎద్దు ఎవరినైనా చంపితే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. దాని యజమానికి మరణశిక్ష విధించాలి.
EXO 21:30 ఒకవేళ నష్టపరిహారం అడిగితే ఆ యజమాని ఆ నష్టపరిహారాన్ని చెల్లించి తన ప్రాణాన్ని విడిపించుకోవచ్చు.
EXO 21:31 ఆ ఎద్దు కుమారుని గాని కుమార్తెను గాని పొడిచినా ఇదే నియమం వర్తించబడుతుంది.
EXO 21:32 ఎద్దు దాసుని గాని దాసిని గాని పొడిస్తే, దాని యజమాని ముప్పై షెకెళ్ళ వెండిని వారి యజమానికి చెల్లించాలి. ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి.
EXO 21:33 “ఒకరు గొయ్యిని తెరచి ఉంచడం వలన లేదా గొయ్యి త్రవ్వి దానిని మూయకపోవడం వలన ఎద్దు గాని గాడిద గాని దానిలో పడిపోతే
EXO 21:34 ఆ గోతి యజమాని వాటి యజమానికి నష్టపరిహారం చెల్లించాలి; చచ్చిన జంతువు గొయ్యి యజమానిదవుతుంది.
EXO 21:35 “ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును గాయపరచగా అది చనిపోతే ఆ ఇద్దరు బ్రతికి ఉన్న ఎద్దును అమ్మగా వచ్చిన డబ్బును చచ్చిన ఎద్దును చెరిసగం పంచుకోవాలి.
EXO 21:36 ఆ ఎద్దుకు అంతకుముందే పొడిచే అలవాటు ఉంటే దాని యజమాని దానిని కట్టి అదుపులో పెట్టలేదు కాబట్టి అతడు ఖచ్చితంగా ఎద్దుకు బదులు ఎద్దు ఇవ్వాలి; చచ్చిన ఎద్దు అతనిది అవుతుంది.
EXO 22:1 “ఎవరైనా ఎద్దునైన గొర్రెనైన దొంగతనం చేసి దానిని చంపినా లేదా అమ్మినా ఆ ఎద్దుకు బదులు అయిదు ఎద్దులను, ఆ గొర్రెకు బదులు నాలుగు గొర్రెలను నష్టపరిహారంగా ఇవ్వాలి.
EXO 22:2 “రాత్రివేళ దొంగ ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి ఒకవేళ దొరికిపోయి చావుదెబ్బలు తింటే కొట్టినవాడు రక్తం కారిన దాన్ని బట్టి అపరాధి కాడు.
EXO 22:3 కాని ఒకవేళ సూర్యోదయం తర్వాత ఇది జరిగితే, కొట్టినవాడు రక్తం కారిన దాన్ని బట్టి అపరాధి అవుతాడు. “ఎవరైనా దొంగతనం చేస్తే తప్పక నష్టపరిహారం చెల్లించాలి, కాని వాని దగ్గర ఏమిలేకపోతే, వారి దొంగతనానికి చెల్లించడానికి వారు అమ్మివేయబడాలి.
EXO 22:4 ఒకవేళ దొంగతనానికి గురియైన జంతువు ప్రాణంతో వారి స్వాధీనంలో కనబడితే, అది ఎద్దు గాని గాడిద గాని గొర్రెగాని దానికి రెండింతలు చెల్లించాలి.
EXO 22:5 “ఒకడు తన పశువులను మేపడానికి ఒక పొలంలోగాని ద్రాక్షతోటలో గాని వదిలిపెట్టినప్పుడు ఆ పశువులు వేరొకని పొలంలో మేస్తే అతడు తన పొలంలో నుండి గాని ద్రాక్షతోటలో నుండి గాని మంచివాటిని నష్టపరిహారంగా చెల్లించాలి.
EXO 22:6 “అగ్ని రాజుకొని ముళ్ళకంపలకు అంటుకున్నందు వల్ల పంట కుప్పలు గాని పొలంలో పైరుగాని లేదా పొలమంతా కాలిపోతే ఆ అగ్నిని అంటించినవాడు నష్టపరిహారం చెల్లించాలి.
EXO 22:7 “ఒకరు తమ డబ్బును గాని వస్తువులను గాని దాచమని తన పొరుగువారికి ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తి ఇంట్లోనుండి అవి దొంగతనం చేయబడి ఆ దొంగ దొరికితే వాటికి రెండింతలు వాడు చెల్లించాలి.
EXO 22:8 ఒకవేళ దొంగ దొరక్కపోతే ఆ ఇంటి యజమాని దేవుని ఎదుటకు హాజరు కావాలి, అప్పుడు వారు అతడు తన పొరుగువాని వస్తువులను తీశాడో లేదో తెలుసుకుంటారు.
EXO 22:9 అన్యాయంగా సంపాదించిన ఎద్దు, గాడిద, గొర్రె, బట్ట వంటి వాటన్నిటి విషయంలో పోగొట్టుకున్నవాడు వాటిని చూసి, ‘ఇది నాది’ అని చెప్తే వారిద్దరు దేవుని సమక్షానికి తమ సమస్యను తీసుకురావాలి. న్యాయాధికారులు నేరస్థునిగా నిర్ధారించినవాడు ఎదుటివానికి రెట్టింపు పరిహారం చెల్లించాలి.
EXO 22:10 “ఒకరు తన గాడిదనైన ఎద్దునైన గొర్రెనైన కాపాడమని తన పొరుగువానికి ఇచ్చినప్పుడు అది చనిపోయినా లేదా గాయపడినా లేదా ఎవరూ చూడనప్పుడు దాన్ని ఎవరైనా తీసుకెళ్లినా,
EXO 22:11 పొరుగువాడు ఆ వ్యక్తి ఆస్తి మీద చేతులు వేయలేదని యెహోవా ఎదుట ప్రమాణం చేయడం ద్వారా వారిద్దరి మధ్య సమస్య పరిష్కరించబడుతుంది. యజమాని దానికి అంగీకరించాలి; నష్టపరిహారం అవసరం లేదు.
EXO 22:12 అతని దగ్గర నుండి ఆ జంతువు దొంగతనం చేయబడితే అతడు దాని యజమానికి నష్టపరిహారం చెల్లించాలి.
EXO 22:13 దానిని ఏ మృగమేదైనా చీల్చివేస్తే, సాక్ష్యంగా దాని మిగిలిన భాగాలను తీసుకురావాలి, చీల్చబడినదానికి నష్టపరిహారం అవసరం లేదు.
EXO 22:14 “ఎవరైనా తమ పొరుగువాని దగ్గర నుండి ఒక జంతువును బదులు తీసుకున్నప్పుడు దాని యజమాని దాని దగ్గర లేనప్పుడు, అది గాయపడినా లేదా చచ్చినా, బదులు తీసుకున్నవాడు నష్టపరిహారం చెల్లించాలి.
EXO 22:15 దాని యజమాని దాని దగ్గరే ఉంటే, బదులు తీసుకున్నవాడు నష్టపరిహారం చెల్లించనవసరం లేదు. ఒకవేళ ఆ జంతువు అద్దెకు తెచ్చినదైతే, దాని అద్దె లోనే నష్టం సరిపెట్టబడుతుంది.
EXO 22:16 “ఒకడు పెళ్ళి నిశ్చయించబడని కన్యను లోబరచుకొని ఆమెతో పడుకుంటే అతడు ఆమెకు కట్నం చెల్లించి ఆమెను తన భార్యగా చేసుకోవాలి.
EXO 22:17 ఆమె తండ్రి ఆమెను అతనికి ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోకపోతే అతడు కన్యకల కట్నం ప్రకారం డబ్బు చెల్లించాలి.
EXO 22:18 “మంత్రగత్తెలను బ్రతకనివ్వకూడదు.
EXO 22:19 “జంతు సంపర్కం చేసినవారికి మరణశిక్ష విధించాలి.
EXO 22:20 “యెహోవాకు మాత్రమే కాకుండా మరొక దేవునికి బలి అర్పించేవారు పూర్తిగా నాశనం చేయబడతారు.
EXO 22:21 “మీరు ఈజిప్టు దేశంలో విదేశీయులుగా ఉన్నారు; కాబట్టి విదేశీయులను బాధించకూడదు, అణగద్రొక్కకూడదు.
EXO 22:22 “విధవరాలిని గాని తండ్రిలేనివారిని గాని బాధపెట్టకూడదు.
EXO 22:23 మీరు వారిని వేధించడం వలన వారు నాకు మొరపెడితే, నేను ఖచ్చితంగా వారి మొర వింటాను.
EXO 22:24 నా కోపం రగులుకొని నేను మిమ్మల్ని కత్తితో చంపుతాను; అప్పుడు మీ భార్యలు విధవరాళ్లు అవుతారు మీ పిల్లలు తండ్రిలేనివారవుతారు.
EXO 22:25 “మీ మధ్య ఉన్న నా ప్రజల్లో ఎవరైనా అవసరంలో ఉంటే, మీరు వారికి డబ్బు అప్పు ఇస్తే, అప్పులు ఇచ్చేవారిలా ప్రవర్తించకూడదు; వడ్డీ తీసుకోకూడదు.
EXO 22:26 నీ పొరుగువారి పైవస్త్రాన్ని తాకట్టుగా తీసుకుంటే, సూర్యాస్తమయానికి తిరిగి ఇచ్చేయాలి.
EXO 22:27 ఎందుకంటే రాత్రివేళ కప్పుకోడానికి మీ పొరుగువారికి ఉన్నది అదొక్కటే. అది లేకుండా వారు ఎలా నిద్రపోగలరు? నేను కనికరం గలవాన్ని, కాబట్టి వారు నాకు మొరపెడితే నేను వింటాను.
EXO 22:28 “మీరు దేవుని దూషించకూడదు; మీ ప్రజల అధికారిని శపించకూడదు.
EXO 22:29 “మీ ధాన్యాగారాల నుండి, తొట్టెల నుండి అర్పణలు చెల్లించడం ఆలస్యం చేయకూడదు. “ఖచ్చితంగా మీ కుమారులలో మొదటి సంతానాన్ని నాకు అర్పించాలి.
EXO 22:30 మీ పశువులు గొర్రెల విషయంలో కూడా అలాగే చేయాలి. వాటిని తల్లి దగ్గర ఏడు రోజుల వరకు ఉంచాలి. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి.
EXO 22:31 “మీరు నా పరిశుద్ధ ప్రజలుగా ఉండాలి కాబట్టి అడవి మృగాలు చీల్చిన జంతు మాంసాన్ని తినకూడదు; దానిని కుక్కలకు పారవేయాలి.
EXO 23:1 “పుకార్లు ప్రచారం చేయకూడదు. అన్యాయపు సాక్షిగా ఉండి దుర్మార్గులకు సహాయం చేయకూడదు.
EXO 23:2 “తప్పు చేయడంలో జనాన్ని అనుసరించవద్దు. మీరు ఒక దావాలో సాక్ష్యం ఇచ్చినప్పుడు, జనంతో కలిసి న్యాయాన్ని వక్రీకరించవద్దు.
EXO 23:3 న్యాయం చేసేటప్పుడు పేదవారైనా సరే వారిపట్ల పక్షపాతం చూపకూడదు.
EXO 23:4 “ఒకవేళ నీ శత్రువు యొక్క ఎద్దు గాని గాడిద గాని తప్పిపోయి తిరుగుతూ నీకు కనబడితే, దానిని తప్పక తిరిగి అప్పగించాలి.
EXO 23:5 నిన్ను ద్వేషించేవారి గాడిద ఒకవేళ అది మోస్తున్న బరువు క్రింద పడివుండడం చూస్తే దానిని అలాగే వదిలేయవద్దు; దానిని లేపడానికి వానికి ఖచ్చితంగా సహాయం చేయాలి.
EXO 23:6 “న్యాయవిషయంలో పేదవారికి అన్యాయంగా తీర్పు తీర్చకూడదు.
EXO 23:7 తప్పుడు ఆరోపణలకు దూరంగా ఉండాలి, అమాయక లేదా నిజాయితీగల వ్యక్తిని చంపవద్దు, ఎందుకంటే నేను దోషులను నిర్దోషిగా ప్రకటించను.
EXO 23:8 “లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం చూసేవారికి గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.
EXO 23:9 “పరదేశిని అణగద్రొక్కకూడదు; మీరు ఈజిప్టులో విదేశీయులుగా ఉన్నారు కాబట్టి విదేశీయుల జీవితం ఎలా ఉంటుందో మీకే తెలుసు కదా!
EXO 23:10 “ఆరు సంవత్సరాలు మీరు పొలంలో విత్తనాలు విత్తి పంట కోయాలి,
EXO 23:11 ఏడవ సంవత్సరం ఆ భూమిని దున్నకుండా ఉపయోగించకుండా వదిలేయాలి. అప్పుడు మీ ప్రజల్లో పేదవారు దాని నుండి ఆహారం తీసుకోగా మిగిలింది అడవి జంతువులు తినవచ్చు. మీ ద్రాక్షతోటకు ఒలీవతోటకు ఇలాగే చేయాలి.
EXO 23:12 “ఆరు రోజులు మీ పని చేసుకోండి, కానీ ఏడవ రోజు పని చేయకండి, తద్వారా మీ ఎద్దు, మీ గాడిద విశ్రాంతి తీసుకోవచ్చు, మీ ఇంట్లో జన్మించిన దాసి కుమారుడు, మీ మధ్య నివసించే విదేశీయుడు సేదదీరుతారు.
EXO 23:13 “నేను మీతో చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటించండి. మరొక దేవుళ్ళ పేరును ఉచ్చరించకూడదు. అవి మీ నోటి నుండి వినిపించకూడదు.
EXO 23:14 “సంవత్సరానికి మూడుసార్లు మీరు నాకు పండుగ జరపాలి.
EXO 23:15 “పులియని రొట్టెల పండుగ జరుపుకోండి; నేను మీకు ఆజ్ఞాపించినట్లు ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి. అబీబు నెలలో నిర్ణీత సమయంలో ఇలా తినండి, ఎందుకంటే ఆ నెలలో మీరు ఈజిప్టు నుండి వచ్చారు. “నా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు.
EXO 23:16 “మీరు మీ పొలంలో విత్తి పండించిన ప్రథమ ఫలాలతో కోత కాల పండుగ చేయాలి. “పొలం నుండి మీ పంటలన్నిటిని కూర్చుకున్న తర్వాత సంవత్సరం చివరిలో పంటకూర్పు పండుగ చేయాలి.
EXO 23:17 “సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిలో కనబడాలి.
EXO 23:18 “పులిసిన దానితో కలిపి నాకు బలి యొక్క రక్తాన్ని అర్పించకూడదు. “నా పండుగ అర్పణల క్రొవ్వును ఉదయం వరకు ఉంచవద్దు.
EXO 23:19 “మీ పొలంలో పండిన ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైన వాటిని మీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి. “మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.
EXO 23:20 “ఇదిగో, మార్గమంతటిలో మిమ్మల్ని కాపాడి నేను సిద్ధం చేసి ఉంచిన చోటికి మిమ్మల్ని తీసుకురావడానికి ఒక దేవదూతను మీకు ముందుగా పంపుతున్నాను.
EXO 23:21 ఆయన పట్ల శ్రద్ధ వహించండి, ఆయన చెప్పేది వినండి. ఆయనకు ఎదురు తిరుగవద్దు; నా నామం ఆయనలో ఉంది, కాబట్టి ఆయన మీ తిరుగుబాటును క్షమించరు.
EXO 23:22 మీరు ఆయన చెప్పేది జాగ్రత్తగా విని నేను చెప్పేవాటన్నిటిని చేస్తే, నేను మీ శత్రువులకు శత్రువుగా ఉంటాను, మిమ్మల్ని వ్యతిరేకించే వారిని వ్యతిరేకిస్తాను.
EXO 23:23 నా దూత మీకు ముందుగా వెళ్తూ, అమోరీయుల హిత్తీయుల పెరిజ్జీయుల కనానీయుల హివ్వీయుల యెబూసీయుల దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాడు, నేను వారిని నిర్మూలం చేస్తాను.
EXO 23:24 మీరు వారి దేవుళ్ళ ముందు సాష్టాంగపడకూడదు వాటిని పూజించకూడదు, వారి ఆచారాలను పాటించకూడదు. మీరు వాటిని కూల్చివేసి వారి పవిత్ర రాళ్లను ముక్కలు చేయాలి.
EXO 23:25 మీ దేవుడైన యెహోవాను ఆరాధించండి, ఆయన ఆశీర్వాదం మీ ఆహారం మీద నీటి మీద ఉంటుంది. నేను మీ మధ్య నుండి రోగాన్ని తీసివేస్తాను,
EXO 23:26 మీ దేశంలో ఏ స్త్రీకి గర్భస్రావం కలుగదు లేదా గొడ్రాలిగా ఉండదు. నేను మీకు సంపూర్ణ జీవితకాలాన్ని ఇస్తాను.
EXO 23:27 “మీకు ఎదురయ్యే ప్రతి దేశానికి మీకు ముందుగా నా భయాన్ని పంపించి వారిని గందరగోళంలో పడవేస్తాను. నేను మీ శత్రువులందరిని వెనుతిరిగి పారిపోయేలా చేస్తాను.
EXO 23:28 మీ మార్గంలో నుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టడానికి మీకు ముందుగా కందిరీగలను పంపిస్తాను.
EXO 23:29 కానీ నేను ఒకే సంవత్సరంలో వారిని తరిమికొట్టను, ఎందుకంటే భూమి నిర్జనమైపోతుంది, అడవి జంతువులు మీకు చాలా ఎక్కువై మీకు హాని కలిగిస్తాయి.
EXO 23:30 మీరు అభివృద్ధిచెంది ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేవరకు, కొద్దికొద్దిగా వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడతాను.
EXO 23:31 “ఎర్ర సముద్రం నుండి మధ్యధరా సముద్రం వరకు, అరణ్యం నుండి యూఫ్రటీసు నది వరకు నేను మీకు సరిహద్దులును ఏర్పరుస్తాను. ఆ దేశంలో నివసించే ప్రజలను మీ చేతికి అప్పగిస్తాను, మీరు వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడతారు.
EXO 23:32 వారితో గాని వారి దేవుళ్ళతో గాని ఎలాంటి ఒడంబడిక చేసుకోవద్దు.
EXO 23:33 వారిని మీ దేశంలో నివసింపనివ్వకండి లేదా మీరు నాకు వ్యతిరేకంగా పాపం చేయడానికి వారు కారణమవుతారు, ఎందుకంటే మీరు వారి దేవుళ్ళను సేవించడం ఖచ్చితంగా మీకు ఉరి అవుతుంది.”
EXO 24:1 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బైమంది యెహోవా దగ్గరకు ఎక్కి వచ్చి దూరం నుండి ఆరాధించాలి.
EXO 24:2 అయితే మోషే ఒక్కడే యెహోవాను సమీపించాలి; ఇతరులు దగ్గరగా రాకూడదు. ప్రజలు అతనితో పైకి ఎక్కి రాకూడదు.”
EXO 24:3 మోషే వచ్చి యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిని, చట్టాలను ప్రజలకు చెప్పినప్పుడు వారందరు ఏకకంఠంతో, “యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిని మేము చేస్తాం” అన్నారు.
EXO 24:4 అప్పుడు మోషే యెహోవా చెప్పిన వాటన్నిటిని వ్రాశాడు. మరుసటిరోజు ఉదయానే లేచి పర్వతం క్రింద ఒక బలిపీఠాన్ని కట్టి ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలను బట్టి పన్నెండు స్తంభాలను నిలబెట్టాడు.
EXO 24:5 అతడు ఇశ్రాయేలీయులలో యువకులను పంపగా వారు దహనబలులు అర్పించి, యెహోవాకు సమాధానబలులుగా ఎద్దులను వధించారు.
EXO 24:6 మోషే వాటి రక్తంలో సగం తీసుకుని గిన్నెల్లో పోసి మిగతా సగం బలిపీఠం మీద చల్లాడు.
EXO 24:7 తర్వాత అతడు ఒడంబడిక గ్రంథాన్ని తీసుకుని ప్రజలకు చదివి వినిపించాడు. అప్పుడు వారు, “యెహోవా ఆజ్ఞాపించినవన్నీ మేము చేస్తాము; వాటికి లోబడి ఉంటాం” అని చెప్పారు.
EXO 24:8 అప్పుడు మోషే రక్తాన్ని తీసుకుని ప్రజలపై చిలకరించి, “ఈ మాటలన్నిటి ప్రకారం యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే” అన్నాడు.
EXO 24:9 అప్పుడు మోషే అహరోను, నాదాబు అబీహు, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బైమంది పైకి ఎక్కి వెళ్లి,
EXO 24:10 ఇశ్రాయేలీయుల దేవుని చూశారు. ఆయన పాదాల క్రింద నిగనిగలాడే నీలమణులతో తయారుచేసిన దారివంటిది ఉంది; అది ఆకాశమంత నిర్మలంగా ఉంది.
EXO 24:11 ఇశ్రాయేలీయుల ఈ నాయకులపై దేవుడు చేయి ఎత్తలేదు; వారు దేవున్ని చూశారు, వారు తిని త్రాగారు.
EXO 24:12 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు పర్వతం ఎక్కి, నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఉండు, నీవు వారికి బోధించడానికి నేను రాతిపలకలపై నియమాలను ఆజ్ఞలను వ్రాసి ఇస్తాను” అని చెప్పారు.
EXO 24:13 మోషే తన సహాయకుడైన యెహోషువతో కలిసి లేచి, మోషే దేవుని పర్వతం పైకి ఎక్కి వెళ్లాడు.
EXO 24:14 అతడు పెద్దలతో, “మేము మీ దగ్గరకు తిరిగి వచ్చేవరకు మీరు ఇక్కడే ఉండండి. అహరోను హూరులు మీతో ఉన్నారు; ఎవరికైనా సమస్య ఉంటే వారి దగ్గరకు వెళ్లండి” అని చెప్పాడు.
EXO 24:15 మోషే దేవుని పర్వతం పైకి ఎక్కి వెళ్లినప్పుడు మేఘం దానిని కమ్ముకుంది.
EXO 24:16 దేవుని మహిమ సీనాయి పర్వతంమీద నిలిచింది. ఆరు రోజులు మేఘం దానిని కమ్ముకుని ఉంది. ఏడవ రోజు యెహోవా ఆ మేఘంలోనుండి మోషేను పిలిచారు.
EXO 24:17 ఇశ్రాయేలీయులకు యెహోవా మహిమ ఆ పర్వతం మీద దహించే అగ్నిలా కనిపించింది.
EXO 24:18 మోషే పర్వతం పైకి ఎక్కి వెళ్లి ఆ మేఘంలోకి ప్రవేశించాడు. అతడు ఆ పర్వతం మీద నలభై పగళ్లు నలభై రాత్రులు ఉన్నాడు.
EXO 25:1 యెహోవా మోషేతో ఇలా చెప్పారు,
EXO 25:2 “నాకు ఒక అర్పణ తీసుకురావాలి అని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనసారా అర్పించే ప్రతిఒక్కరి నుండి నీవు నా కోసం కానుక తీసుకోవాలి.
EXO 25:3 “నీవు వారి దగ్గర నుండి తీసుకోవలసిన కానుకలు ఇవే: “బంగారం, వెండి, ఇత్తడి;
EXO 25:4 నీలం ఊదా ఎరుపు రంగుల నూలు, సన్నని నారబట్ట; మేక వెంట్రుకలు;
EXO 25:5 ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాలు, మన్నికైన తోలు; తుమ్మకర్ర;
EXO 25:6 దీపాలకు ఒలీవనూనె; అభిషేక తైలానికి, సువాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు;
EXO 25:7 ఏఫోదు మీద, రొమ్ము పతకం మీద పొదగడానికి లేతపచ్చ రాళ్లు, ఇతర రత్నాలు.
EXO 25:8 “నేను వారి మధ్య నివసించేలా వారు నా కోసం పరిశుద్ధాలయాన్ని నిర్మించాలి.
EXO 25:9 ఈ సమావేశ గుడారాన్ని, దాని అన్ని అలంకరణలను నేను మీకు చూపించే నమూనా వలె చేయండి.
EXO 25:10 “వారు తుమ్మకర్రతో మందసం తయారుచేయాలి. దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర, ఎత్తు ఒకటిన్నర మూర ఉండాలి.
EXO 25:11 లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును తయారుచేయాలి.
EXO 25:12 నాలుగు బంగారు ఉంగరాలు పోతపోయించి ఒకవైపు రెండు మరోవైపు రెండు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.
EXO 25:13 తర్వాత తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించాలి.
EXO 25:14 మందసాన్ని మోయడానికి ఆ మోతకర్రలను మందసానికి ఇరుప్రక్కల ఉన్న ఉంగరాల్లో దూర్చాలి.
EXO 25:15 ఈ మందసపు ఉంగరాల్లో మోతకర్రలు అలాగే ఉండాలి; వాటిని తీసివేయకూడదు.
EXO 25:16 అప్పుడు నేను మీకు ఇచ్చే ఒడంబడిక పలకలను మందసంలో ఉంచండి.
EXO 25:17 “స్వచ్ఛమైన బంగారంతో ప్రాయశ్చిత్త మూతను తయారుచేయాలి; దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉండాలి.
EXO 25:18 తర్వాత సాగగొట్టిన బంగారంతో మూత చివర్లలో రెండు కెరూబులను తయారుచేయాలి.
EXO 25:19 ఒక చివర ఒక కెరూబును మరోచివర రెండవ కెరూబును చేయాలి; మూత మీద దాని రెండు చివర్లలో కెరూబులతో పాటు దానంతటిని ఒకే ముక్కలా చేయాలి.
EXO 25:20 ఆ కెరూబులు తమ రెక్కలను పైకి చాపి వాటితో ప్రాయశ్చిత్త మూతను కప్పుతూ ఉండాలి. కెరూబుల ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండి ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూతను చూస్తున్నట్లుగా ఉండాలి.
EXO 25:21 ప్రాయశ్చిత్త మూతను పైకెత్తి మందసం మీద ఉంచి మందసంలో నేను మీకిచ్చే ఒడంబడిక పలకలను పెట్టాలి.
EXO 25:22 అక్కడ, నిబంధన మందసం పైన ఉన్న ఆ ప్రాయశ్చిత్త మూత మీదుగా రెండు కెరూబుల మధ్యలో నుండి, నేను నిన్ను కలుసుకొని ఇశ్రాయేలీయుల కోసం నా ఆజ్ఞలన్నిటిని నీకు ఇస్తాను.
EXO 25:23 “తుమ్మకర్రతో ఒక బల్లను చేయాలి. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు ఒకటిన్నర మూర ఉండాలి.
EXO 25:24 దాన్ని స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును చేయించారు.
EXO 25:25 అలాగే దాని చుట్టూ బెత్తెడు వెడల్పున చట్రం కూడా చేసి దానిపై బంగారంతో పోతపోయాలి.
EXO 25:26 ఆ బల్లకు నాలుగు ఉంగరాలు చేసి వాటిని నాలుగు కాళ్లు ఉన్న నాలుగు మూలల్లో తగిలించాలి.
EXO 25:27 బల్ల మోయడానికి ఉపయోగించే మోతకర్రలు ఉంచే ఉంగరాలు చట్రానికి దగ్గరగా పెట్టబడాలి.
EXO 25:28 తుమ్మకర్రతో మోతకర్రలు చేసి, వాటికి బంగారు పోతపోసి వాటితో ఆ బల్లను మోయాలి.
EXO 25:29 దాని పళ్లెములు పాత్రలు, పానార్పణలు పోయడానికి ఉపయోగించే బానలు గిన్నెలను స్వచ్ఛమైన బంగారంతో తయారుచేయాలి.
EXO 25:30 అన్ని వేళలా నా ఎదుట సన్నిధి రొట్టెలను ఈ బల్లమీద ఉంచాలి.
EXO 25:31 “స్వచ్ఛమైన బంగారంతో దీపస్తంభం చేయాలి. దాని అడుగు పీఠాన్ని నడిమి భాగాన్ని సుత్తెతో సాగగొట్టాలి, దాని కలశాలు దాని మొగ్గలు దాని పువ్వులు తయారుచేసి వాటితో ఒకే ఖండంలా చేయాలి.
EXO 25:32 దీపస్తంభానికి రెండు వైపుల నుండి ఆరు కొమ్మలు; ఒక ప్రక్క మూడు మరొక ప్రక్క మూడు కొమ్మలు విస్తరించి ఉండాలి.
EXO 25:33 ఒక కొమ్మకు మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన మూడు కలశాలు, తర్వాతి కొమ్మకు కూడా అలాగే మూడు కలశాల చొప్పున దీపస్తంభం నుండి విస్తరించివున్న ఆరు కొమ్మలకు అదే విధంగా ఉండాలి.
EXO 25:34 దీపస్తంభం మీద మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన నాలుగు కలశాలు ఉండాలి.
EXO 25:35 దీపస్తంభం నుండి విస్తరించి ఉన్న మొదటి జత కొమ్మల క్రింద మొదటి మొగ్గ, రెండవ జత కొమ్మల క్రింద రెండవ మొగ్గ, మూడవ జత కొమ్మల క్రింద మూడవ మొగ్గ చొప్పున ఆరు కొమ్మలకు అమర్చాలి.
EXO 25:36 సాగగొట్టబడిన స్వచ్ఛమైన బంగారంతో మొగ్గలు కొమ్మలు దీపస్తంభంతో ఒకే ఖండంగా చేయాలి.
EXO 25:37 “తర్వాత దాని ఏడు దీపాలు తయారుచేసి దాని ఎదుట భాగం ప్రకాశించేలా వాటిని వెలిగించాలి.
EXO 25:38 దాని వత్తులు కత్తిరించే కత్తెరలు, పళ్ళాలను స్వచ్ఛమైన బంగారంతో చేయాలి.
EXO 25:39 దీపస్తంభాన్ని దాని ఉపకరణాలను తయారుచేయడానికి ఒక తలాంతు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాలి.
EXO 25:40 పర్వతం మీద నేను నీకు చూపించిన నమూనా ప్రకారమే నీవు వాటిని చేసేలా చూడాలి.
EXO 26:1 “పది తెరలతో సమావేశ గుడారాన్ని తయారుచేయాలి. వాటిని నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో చేసి, వాటిపై చేయితిరిగిన పనివానితో కెరూబులను అల్లాలి.
EXO 26:2 తెరలన్నీ ఇరవై ఎనిమిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలిగి ఒకే కొలతతో ఉండాలి.
EXO 26:3 అయిదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి ఒక్కటిగా చేయాలి; మిగిలిన అయిదింటిని కూడా అలాగే చేయాలి.
EXO 26:4 ఒక కూర్పులోని తెరల చివర మొదటి తెర అంచుకు నీలి నూలుతో ఉచ్చులు చేయాలి. రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలాగే చేయాలి.
EXO 26:5 ఒక తెరకు యాభై ఉచ్చులు చేసి, ఉచ్చులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా మరొకదాని తెర అంచుకు యాభై ఉచ్చులు చేయాలి.
EXO 26:6 తర్వాత యాభై బంగారు గుండీలు తయారుచేసి ఆ గుండీలతో ఆ తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది ఒకే సమావేశ గుడారంగా ఉంటుంది.
EXO 26:7 “సమావేశ గుడారం పైకప్పుగా ఉండే గుడారం కోసం మేక వెంట్రుకలతో మొత్తం పదకొండు తెరలు తయారుచేయాలి.
EXO 26:8 పదకొండు తెరలన్నీ పొడవు ముప్పై మూరలు, వెడల్పు నాలుగు మూరలు కలిగి ఒకే కొలతతో ఉండాలి.
EXO 26:9 అయిదు తెరలను ఒకటిగా మిగతా ఆరు తెరలను ఒకటిగా కలపాలి. ఆరవ తెరను గుడారం ముందు భాగంలో మడతపెట్టాలి.
EXO 26:10 మొదటి కూర్పులోని చివరి తెర అంచున, అలాగే రెండవ కూర్పులోని చివరి తెర అంచున యాభై ఉచ్చులు చేయాలి.
EXO 26:11 యాభై ఇత్తడి గుండీలు తయారుచేసి ఒకటే గుడారమయ్యేలా ఆ గుండీలను ఆ ఉచ్చులకు తగిలించి కూర్చాలి.
EXO 26:12 గుడారపు తెరల అధనపు పొడవు విషయానికొస్తే, మిగిలిన సగం తెర సమావేశ గుడారం వెనుక భాగం దగ్గర క్రిందకు వ్రేలాడి ఉండాలి.
EXO 26:13 గుడారపు తెరలు ఒక ప్రక్క ఒక మూర మరో ప్రక్క ఒక మూర పొడవు ఉండి, మిగిలిన భాగం సమావేశ గుడారాన్ని కప్పి ఉంచేలా దాని ప్రక్కల మీద వ్రేలాడదీయాలి.
EXO 26:14 గుడారం కోసం ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మంతో పైకప్పును, దానిపైన మన్నికైన తోళ్లతో పైకప్పు తయారుచేయాలి.
EXO 26:15 “సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేయాలి.
EXO 26:16 ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉండాలి.
EXO 26:17 రెండు కొయ్యమేకులు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చాలి. సమావేశ గుడారపు చట్రాలన్నిటిని ఈ విధంగా తయారుచేయాలి.
EXO 26:18 సమావేశ గుడారపు దక్షిణ వైపుకు ఇరవై చట్రాలు తయారుచేయాలి.
EXO 26:19 ప్రతి చట్రానికి క్రింద రెండు కొయ్య మేకులకు రెండు దిమ్మల చొప్పున ఇరవై చట్రాలకు నలభై వెండి దిమ్మలు తయారుచేయాలి.
EXO 26:20 మరోవైపుకు, అంటే సమావేశ గుడారానికి ఉత్తర వైపుకు, ప్రతి చట్రం క్రింద రెండు చొప్పున, ఇరవై చట్రాలు తయారుచేయాలి.
EXO 26:21 నలభై వెండి దిమ్మలు తయారుచేయాలి.
EXO 26:22 పడమర వైపు అంటే సమావేశ గుడారం యొక్క వెనుక వైపు ఆరు చట్రాలు తయారుచేయాలి,
EXO 26:23 మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయాలి.
EXO 26:24 ఈ రెండు మూలల వద్ద అవి క్రింది నుండి పై వరకు రెండింతలు ఉండి ఒకే ఉంగరంలోకి అమర్చబడాలి; రెండూ ఒకేలా ఉండాలి.
EXO 26:25 అక్కడ ఎనిమిది చట్రాలు, ప్రతి చట్రం క్రింద రెండేసి చొప్పున పదహారు వెండి దిమ్మలు ఉంటాయి.
EXO 26:26 “అలాగే తుమ్మకర్రతో అడ్డకర్రలు తయారుచేయాలి: సమావేశ గుడారానికి ఒక ప్రక్కన ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు,
EXO 26:27 రెండవ వైపున ఉన్నవాటికి అయిదు, సమావేశ గుడారానికి వెనుక వైపున పడమర వైపున ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు చేయాలి.
EXO 26:28 మధ్య అడ్డకర్ర, చట్రాల మధ్యలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు విస్తరించాలి.
EXO 26:29 ఆ చట్రాలను బంగారంతో పొదిగించి, అడ్డకర్రలు ఉంచడానికి బంగారు ఉంగరాలు చేయాలి. అలాగే అడ్డకర్రలను కూడా బంగారంతో పొదిగించాలి.
EXO 26:30 “కొండమీద నీకు చూపించిన నమూనా ప్రకారమే సమావేశ గుడారాన్ని నిలబెట్టాలి.
EXO 26:31 “నీలం ఊదా ఎరుపు రంగుల్లో పేనిన సన్నని నారతో ఒక తెరను చేయించి, నిపుణుడైన పనివానితో దానిమీద కెరూబులను అల్లించాలి.
EXO 26:32 తుమ్మ చెక్కతో నాలుగు స్తంభాలు చేసి బంగారంతో పొదిగించి నాలుగు వెండి దిమ్మలపై నిలబెట్టిన నాలుగు స్తంభాలకు బంగారు కొక్కేలతో దానిని వ్రేలాడదీయాలి.
EXO 26:33 ఆ తెరను కొలుకుల క్రింద తగిలించి నిబంధన మందసాన్ని ఆ తెర వెనుక ఉంచాలి. ఈ తెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది.
EXO 26:34 అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి.
EXO 26:35 తెర బయట సమావేశ గుడారానికి ఉత్తరం వైపు బల్ల ఉంచి దానికి ఎదురుగా దక్షిణం వైపు దీపస్తంభాన్ని ఉంచాలి.
EXO 26:36 “గుడారపు ప్రవేశ ద్వారానికి నీలం, ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో బుటా పనితో ఒక తెర తయారుచేయాలి.
EXO 26:37 ఈ తెర కోసం తుమ్మ చెక్కతో అయిదు స్తంభాలు చేసి వాటిని బంగారంతో పొదిగించాలి, అలాగే బంగారు కొక్కేలు చేయాలి. తర్వాత వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు చేయాలి.
EXO 27:1 “తుమ్మకర్రతో మూడు మూరల ఎత్తుగల బలిపీఠం కట్టాలి; అది అయిదు మూరల పొడవు అయిదు మూరల వెడల్పుతో చతురస్రంగా ఉండాలి.
EXO 27:2 కొమ్ములు, బలిపీఠం ఒకే భాగంలా ఉండేలా దాని నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక కొమ్మును చేయాలి. బలిపీఠాన్ని ఇత్తడితో పొదిగించాలి.
EXO 27:3 దాని పాత్రలన్నిటిని అంటే బూడిద తొలగించడానికి కుండలు, పారలు, చల్లే గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పు పెనాలను ఇత్తడితో చేయాలి.
EXO 27:4 దానికి వలలాంటి ఇత్తడి జాలి తయారుచేసి, ఆ జాలి నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక ఇత్తడి ఉంగరాన్ని తయారుచేసి,
EXO 27:5 ఆ జాలి బలిపీఠం మధ్యకు చేరేలా బలిపీఠం గట్టు క్రింది భాగంలో దానిని ఉంచాలి.
EXO 27:6 బలిపీఠం కోసం తుమ్మకర్రతో మోతకర్రలు తయారుచేసి, వాటిని ఇత్తడితో పొదిగించాలి.
EXO 27:7 బలిపీఠాన్ని మోసినప్పుడు దాన్ని మోయడానికి ఉపయోగించే మోతకర్రలు దాని రెండు ప్రక్కలా ఉన్న ఉంగరాల్లో దూర్చాలి.
EXO 27:8 పలకలను ఉపయోగించి బలిపీఠాన్ని గుల్లగా చేయాలి. కొండమీద నీకు చూపించిన నమూనా ప్రకారమే దాన్ని చేయాలి.
EXO 27:9 “నీవు సమావేశ గుడారానికి ఆవరణం నిర్మించాలి. దక్షిణం వైపు వంద మూరల పొడవు గల పేనిన సన్నని నార తెరలు ఉండాలి.
EXO 27:10 దానికి ఇరవై స్తంభాలు వాటికి ఇరవై ఇత్తడి దిమ్మలు, అలాగే ఆ స్తంభాలకు వెండి కొక్కేలు, బద్దలు ఉండాలి.
EXO 27:11 ఉత్తరం వైపు కూడా వంద మూరల పొడవు ఉండాలి, ఇరవై స్తంభాలు, ఇరవై ఇత్తడి దిమ్మలు, స్తంభాల మీద వెండి కొక్కేలు, దిమ్మలు ఉండాలి.
EXO 27:12 “పడమటి వైపున ఆవరణం వెడల్పులో యాభై మూరల తెరలు ఉండాలి, వాటికి పది స్తంభాలు, పది దిమ్మలు ఉండాలి.
EXO 27:13 తూర్పు వైపు అనగా సూర్యోదయం వైపు కూడా, ఆవరణం యాభై మూరల వెడల్పు ఉండాలి.
EXO 27:14 ప్రవేశ ద్వారానికి ఒక ప్రక్క పదిహేను మూరల పొడవు గల తెరలు, వాటికి మూడు స్తంభాలు వాటికి మూడు దిమ్మలు ఉండాలి.
EXO 27:15 అటు ప్రక్కన మూడు స్తంభాలు, మూడు దిమ్మలతో పదిహేను మూరల పొడవు గల తెరలు ఉండాలి.
EXO 27:16 “ఆవరణం యొక్క ద్వారానికి నీలం ఊదా ఎరుపు రంగుల పేనిన సన్నని నారతో బుటా పనితో చేసిన ఇరవై మూరల పొడవు గల తెర ఉండాలి. దానికి నాలుగు స్తంభాలు వాటికి నాలుగు దిమ్మలు ఉండాలి.
EXO 27:17 ఆవరణం చుట్టూ ఉన్న స్తంభాలన్నిటికి వెండి బద్దలు కొక్కేలు ఇత్తడి దిమ్మలు ఉండాలి.
EXO 27:18 ఆవరణం పొడవు వంద మూరలు వెడల్పు యాభై మూరలు, ఎత్తు అయిదు మూరలు; అవి పేనిన నారతో చేసిన తెరలు వాటికి దిమ్మలు ఇత్తడివి.
EXO 27:19 సమావేశ గుడారం యొక్క సేవలో వాడబడే ఉపకరణాలన్నీ, వాటి పనులేవైనా, దాని కొరకైన గుడారపు మేకులన్నీ, ఆవరణం కొరకైన వాటితో సహా అన్నీ ఇత్తడివై ఉండాలి.
EXO 27:20 “వెలుగు కోసం దీపాలు వెలుగుతూ ఉండేలా దంచి తీసిన ఒలీవ నూనెను మీ దగ్గరకు తీసుకురావాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.
EXO 27:21 సమావేశ గుడారంలో, నిబంధన మందసాన్ని కప్పి ఉంచే తెర బయట, అహరోను, అతని కుమారులు సాయంత్రం నుండి ఉదయం వరకు యెహోవా ఎదుట దీపాలను వెలిగించాలి. ఇది ఇశ్రాయేలీయుల రాబోయే తరాలకు మధ్య నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
EXO 28:1 “నాకు యాజకులుగా సేవ చేయడానికి నీ సోదరుడైన అహరోనును అతని కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులను ఇశ్రాయేలీయులలో నుండి నీ దగ్గరకు రమ్మని పిలిపించు.
EXO 28:2 నీ సోదరుడైన అహరోనుకు గౌరవం, ఘనత కలిగేలా అతని కోసం పవిత్ర వస్త్రాలను కుట్టాలి.
EXO 28:3 అహరోను నాకు యాజకునిగా సేవ చేయడానికి, అతడు ప్రతిష్ఠించబడాలి కాబట్టి అతనికి వస్త్రాలను తయారుచేయమని అలాంటి వాటి విషయాల్లో నేను జ్ఞానాన్ని ఇచ్చిన నైపుణ్యంగల పనివారందరికి చెప్పు.
EXO 28:4 వారు తయారుచేయవలసిన వస్త్రాలు ఇవే: రొమ్ము పతకం, ఏఫోదు, నిలువుటంగీ, అల్లిన చొక్కా, తలపాగా, నడికట్టు. నాకు యాజకులుగా సేవ చేయడానికి నీ సోదరుడైన అహరోనుకు అతని కుమారులకు ఈ పవిత్ర వస్త్రాలను తయారుచేయాలి.
EXO 28:5 వారికి బంగారంతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారబట్టను ఉపయోగించమని చెప్పండి.
EXO 28:6 “బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో ఏఫోదును తయారుచేయాలి.
EXO 28:7 అది కదలకుండా ఉండేలా దాని రెండు భుజాల ముక్కలు రెండు మూలల్లో కూర్చబడాలి.
EXO 28:8 నైపుణ్యంగా అల్లబడిన దాని నడికట్టు ఏఫోదుతో ఒకే ముక్కగా బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో చేయబడినదై ఉండాలి.
EXO 28:9 “రెండు లేతపచ్చ రాళ్లు తీసుకుని వాటిపై ఇశ్రాయేలు కుమారుల పేర్లు, వారు పుట్టిన క్రమం ప్రకారం ఒక రాయి మీద ఆరు పేర్లు మరొకదాని మీద మిగిలిన ఆరు పేర్లు చెక్కాలి.
EXO 28:11 ముత్యాలు చెక్కేవారు ముద్రను చెక్కినట్లు ఆ రెండు లేతపచ్చ రాళ్లమీద ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కాలి. తర్వాత ఆ రాళ్లను బంగారు జరీ చట్రంలోకి ఎక్కించాలి.
EXO 28:12 తర్వాత వాటిని ఇశ్రాయేలు కుమారుల జ్ఞాపకార్థ రాళ్లుగా ఏఫోదు భుజాలపై బిగించాలి. యెహోవా ఎదుట జ్ఞాపకంగా అహరోను తన భుజాలమీద ఆ పేర్లను మోయాలి.
EXO 28:13 బంగారు జవలను తయారుచేయాలి
EXO 28:14 స్వచ్ఛమైన బంగారంతో ఒక తాడులా రెండు అల్లిన గొలుసులు చేసి, ఆ గొలుసులను జవలకు తగిలించాలి.
EXO 28:15 “నిర్ణయాలు తీసుకోవటానికి హస్త నైపుణ్యంతో కూడిన రొమ్ము పతకం చేయాలి. ఏఫోదును చేసినట్లు దీనిని బంగారం నీలం ఊదా ఎరుపురంగు నూలు పేనిన సన్నని నారతో తయారుచేయాలి.
EXO 28:16 అది చతురస్రంగా జానెడు పొడవు జానెడు వెడల్పుతో రెండుగా మడత పెట్టబడి ఉండాలి.
EXO 28:17 దానిపై నాలుగు వరుసల ప్రశస్తమైన రాళ్లు పొదగాలి. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం;
EXO 28:18 రెండవ వరుసలో పద్మరాగం, నీలమణి, సూర్యకాంతం;
EXO 28:19 మూడవ వరుసలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం;
EXO 28:20 నాలుగవ వరుసలో పుష్యరాగం, లేతపచ్చ రాళ్లు, సూర్యకాంతమణి ఉండాలి. వాటిని బంగారు చట్రంలో అమర్చాలి.
EXO 28:21 ఇశ్రాయేలు కుమారుల పేర్లకు ఒక్కొక్కటి చొప్పున పన్నెండు రాళ్లు ఉండాలి, ప్రతిదీ వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ముద్రలా చెక్కబడి ఉండాలి.
EXO 28:22 “రొమ్ము పతకానికి స్వచ్ఛమైన బంగారంతో ఒక తాడులా అల్లికపనితో గొలుసులు చేయాలి.
EXO 28:23 రెండు బంగారు ఉంగరాలను చేసి వాటిని రొమ్ము పతకానికి రెండు చివర్లకు తగిలించాలి.
EXO 28:24 రొమ్ము పతకం చివరిలో ఉన్న ఉంగరాలకు రెండు బంగారు గొలుసులు బిగించి,
EXO 28:25 గొలుసుల యొక్క ఇతర చివరలను రెండు జవలకు, ముందు భాగంలో ఉన్న ఏఫోదు యొక్క భుజాలకు జోడించాలి.
EXO 28:26 రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి, వాటిని ఏఫోదు ముందు భాగంలో రొమ్ము పతకానికి లోపలి అంచున ఉన్న రెండు చివర్లకు జోడించాలి.
EXO 28:27 మరో రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి వాటిని ఏఫోదు నడికట్టుకు కొంచెం పైన దాని అతుకు దగ్గరగా ఏఫోదు ముందు భాగంలో రెండు భుజభాగాలకు క్రింది వైపున జోడించాలి.
EXO 28:28 అప్పుడు రొమ్ము పతకం ఏఫోదు నుండి బయటకు వ్రేలాడకుండా నడికట్టును అంటిపెట్టుకుని ఉండేలా రొమ్ము పతకం యొక్క ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు నీలిరంగు దారంతో కట్టాలి.
EXO 28:29 “అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్లినప్పుడు అతడు తన హృదయం మీద న్యాయవిధాన పతకంలోని ఇశ్రాయేలు కుమారుల పేర్లను నిత్యం యెహోవా సన్నిధిలో జ్ఞాపకంగా మోయాలి.
EXO 28:30 రొమ్ము పతకంలో ఊరీము తుమ్మీము అనే వాటిని ఉంచాలి. అప్పుడు అహరోను యెహోవా సన్నిధికి వెళ్లినప్పుడు అవి అతని రొమ్ము మీద ఉంటాయి. అహరోను యెహోవా సన్నిధిలో తన హృదయం మీద ఇశ్రాయేలీయుల న్యాయవిధానాలను నిత్యం మోస్తాడు.
EXO 28:31 “ఏఫోదు నిలువుటంగీని పూర్తిగా నీలి బట్టతో తయారుచేయాలి.
EXO 28:32 దాని మధ్యలో తల దూర్చడానికి రంధ్రం ఉండాలి. అది చిరిగిపోకుండా మెడపట్టీలా దాని అంచుల చుట్టూ అల్లికపని చేయాలి.
EXO 28:33 ఆ వస్త్రం అంచు చుట్టూ నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో దానిమ్మపండ్లు తయారుచేసి, వాటి మధ్య బంగారంతో తయారుచేసిన గంటలను తగిలించాలి.
EXO 28:34 బంగారు గంటలు దానిమ్మపండ్లు ఒకదాని ప్రక్కన ఒకటిగా వస్త్రం అంచు చుట్టూ ఉండాలి.
EXO 28:35 అహరోను సేవ చేస్తున్నప్పుడు అతడు దీనిని ఖచ్చితంగా ధరించాలి. అతడు యెహోవా సన్నిధికి పరిశుద్ధాలయంలోకి వెళ్లినప్పుడు బయటకు వచ్చినప్పుడు అతడు చనిపోలేదు అని గ్రహించేలా ఆ గంటల శబ్దం తెలియజేస్తుంది.
EXO 28:36 “స్వచ్ఛమైన బంగారంతో ఒక కిరీటం తయారుచేసి దాని మీద ముద్రలా ఈ మాటలు చెక్కాలి: పరిశుద్ధత యెహోవాకే.
EXO 28:37 దాన్ని తలపాగాకు అతకడానికి దానిని నీలి దారంతో కట్టాలి. అది తలపాగా ముందు భాగంలో ఉండాలి.
EXO 28:38 అది అహరోను నుదిటిపై ఉంటుంది, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించే పవిత్ర బహుమతులలో, ఆ బహుమతులు ఏవైనా సరే, వాటిలో ఉన్న అపరాధాన్ని అతడు భరిస్తాడు, అది అహరోను నుదుటిపై నిరంతరం ఉంటుంది, తద్వారా వారు యెహోవాకు అంగీకారంగా ఉంటారు.
EXO 28:39 “సన్నని నారబట్టతో చొక్కా నేయాలి. సన్నని నారబట్టతో తలపాగా తయారుచేయాలి. బుటా పనిగా నడికట్టు చేయాలి.
EXO 28:40 అహరోను కుమారులకు గౌరవం ఘనతా కలిగేలా చొక్కా నడికట్టు టోపీలను తయారుచేయాలి.
EXO 28:41 నీవు నీ సోదరుడైన అహరోనుకు అతని కుమారులకు ఈ వస్త్రాలను తొడిగించిన తర్వాత వారిని అభిషేకించి ప్రతిష్ఠించాలి. వారు నాకు యాజకులుగా సేవ చేయడానికి వారిని పవిత్రపరచాలి.
EXO 28:42 “వారి నగ్నత్వాన్ని కప్పుకోడానికి నడుము నుండి తొడల వరకు నారతో లోదుస్తులు తయారుచేయాలి.
EXO 28:43 అహరోను అతని కుమారులు సమావేశ గుడారంలోకి ఎప్పుడు వెళ్లినా లేదా పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి ఎప్పుడు బలిపీఠాన్ని సమీపించినా వారు దోషశిక్షను భరించి చావకూడదంటే వారు ఖచ్చితంగా ఆ దుస్తులు ధరించాలి. “ఇది అహరోనుకు అతని కుమారులకు ఇవ్వబడిన నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
EXO 29:1 “వారు నాకు యాజకులుగా సేవ చేసేలా వారిని ప్రతిష్ఠించడానికి నీవు చేయవలసినది ఏంటంటే, ఏ లోపం లేని ఒక కోడెను రెండు పొట్టేళ్లను తీసుకోవాలి.
EXO 29:2 మెత్తని గోధుమపిండితో పులియని గుండ్రని రొట్టెలు, నూనెతో కలిపిన పులియని పిండితో మందమైన రొట్టెలు, నూనె పూసిన పులియని రొట్టెలు చేయాలి.
EXO 29:3 వాటిని గంపలో పెట్టి ఆ కోడెను రెండు పొట్టేళ్లతో పాటు సమర్పించాలి.
EXO 29:4 తర్వాత అహరోనును అతని కుమారులను సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చి నీటితో వారిని కడగాలి.
EXO 29:5 ఆ వస్త్రాలను తీసుకుని అహరోను మీద పైవస్త్రం వేసి, ఏఫోదు వస్త్రాన్ని, ఏఫోదును, రొమ్ము పతకాన్ని ధరింపచేయాలి. ఏఫోదును నైపుణ్యంగా అల్లబడిన నడికట్టుతో అతనికి కట్టాలి.
EXO 29:6 అతని తలమీద తలపాగాను పెట్టి పవిత్ర చిహ్నాన్ని తలపాగాకు తగిలించాలి.
EXO 29:7 అభిషేక తైలాన్ని తీసుకుని అతని తలపై పోసి అతన్ని అభిషేకించాలి.
EXO 29:8 అతని కుమారులను తీసుకువచ్చి చొక్కాలు తొడిగించి
EXO 29:9 వారిపై టోపీలు పెట్టాలి. తర్వాత అహరోనుకు, అతని కుమారులకు నడికట్టు కట్టాలి. నిత్య కట్టుబాటు ద్వారా యాజకత్వం వారిదవుతుంది. “ఈ విధంగా అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠించాలి.
EXO 29:10 “నీవు సమావేశ గుడారం ఎదుటకు ఎద్దును తీసుకురావాలి, దాని తలపై అహరోను అతని కుమారులు తమ చేతులుంచాలి.
EXO 29:11 సమావేశ గుడారపు ద్వారం దగ్గర యెహోవా సన్నిధిలో ఆ ఎద్దును వధించాలి.
EXO 29:12 ఆ ఎద్దు రక్తంలో కొంత తీసుకుని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి.
EXO 29:13 కోడె లోపలి అవయవాల మీద ఉన్న క్రొవ్వునంతటిని, కాలేయం మీది క్రొవ్వు, రెండు మూత్రపిండాలు వాటి క్రొవ్వును తీసుకుని బలిపీఠం మీద కాల్చాలి.
EXO 29:14 అయితే కోడెను, దాని చర్మాన్ని దాని మాంసాన్ని, దాని పేడను శిబిరం బయట కాల్చివేయాలి. అది పాపపరిహారబలి.
EXO 29:15 “నీవు పొట్టేళ్లలో ఒకదాని తీసుకురావాలి, దాని తలపై అహరోను అతని కుమారులు తమ చేతులుంచాలి.
EXO 29:16 నీవు పొట్టేలును వధించి దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాలి.
EXO 29:17 పొట్టేలును ముక్కలు చేసి, దాని లోపలి అవయవాలను కాళ్లను కడిగి, వాటిని తల ఇతర ముక్కలతో ఉంచి,
EXO 29:18 ఆ పొట్టేలంతటిని బలిపీఠం మీద కాల్చాలి. అది యెహోవాకు దహనబలి, యెహోవాకు సమర్పించబడిన ఇష్టమైన సువాసనగల హోమబలి.
EXO 29:19 “మరొక పొట్టేలును తీసుకురావాలి, దాని తలమీద అహరోను అతని కుమారులు వారి చేతులుంచాలి.
EXO 29:20 నీవు ఆ పొట్టేలును వధించి, దాని రక్తం కొంత తీసుకుని అహరోను అతని కుమారుల కుడిచెవి అంచుకు, వారి కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలు బొటన వ్రేలి మీద పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాలి.
EXO 29:21 బలిపీఠం మీద నుండి కొంచెం రక్తాన్ని కొంచెం అభిషేక తైలాన్ని తీసుకుని అహరోను మీద అతని వస్త్రాల మీద, అతని కుమారుల మీద వారి వస్త్రాల మీద చిలకరించాలి. అప్పుడు అతడు అతని కుమారులు వారి వస్త్రాలు కూడా పవిత్రం చేయబడతాయి.
EXO 29:22 “ఆ పొట్టేలు ప్రతిష్ఠితమైనది కాబట్టి దాని క్రొవ్వును క్రొవ్విన దాని తోకను, లోపలి అవయవాలను కాలేయాన్ని క్రొవ్వుతో ఉన్న రెండు మూత్రపిండాలను, కుడి తొడను తీసుకోవాలి.
EXO 29:23 యెహోవా ఎదుట ఉన్న పులియని రొట్టెల గంపలో నుండి ఒక గుండ్రని రొట్టెను, ఒలీవనూనె కలిపి చేసిన ఒక మందమైన రొట్టెను, పల్చని రొట్టెను తీసుకుని,
EXO 29:24 వాటిని అహరోను అతని కుమారుల చేతుల్లో ఉంచాలి. వారు యెహోవా ఎదుట వాటిని పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి.
EXO 29:25 తర్వాత నీవు వారి చేతుల్లో నుండి వాటిని తీసుకుని బలిపీఠం మీద దహనబలితో కలిపి యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమంగా దహించాలి, ఇది యెహోవాకు సమర్పించబడిన హోమబలి.
EXO 29:26 అహరోనును ప్రతిష్ఠించడానికి పొట్టేలు రొమ్ము తీసుకుని యెహోవా ఎదుట పైకెత్తి దానిని ప్రత్యేక అర్పణగా అర్పించాలి. అది నీ వాటా అవుతుంది.
EXO 29:27 “అహరోనుకు అతని కుమారులకు చెందిన ప్రతిష్ఠార్పణకు చెందిన పొట్టేలులోని ఆ భాగాలను ప్రతిష్ఠించాలి: ఆడించిన రొమ్ము, సమర్పించబడిన తొడ.
EXO 29:28 ఇది ఇశ్రాయేలీయుల నుండి అహరోనుకు అతని కుమారులకు చెందవలసిన శాశ్వత వాటా. ఇది ఇశ్రాయేలీయులు అర్పించే సమాధానబలులలో నుండి వారు యెహోవాకు అర్పించే ప్రత్యేక కానుక.
EXO 29:29 “అహరోను పవిత్ర వస్త్రాలు అతని తర్వాత అతని కుమారులకు చెందుతాయి; వారు అభిషేకించబడడానికి, ప్రతిష్ఠించబడడానికి వాటిని ధరించాలి.
EXO 29:30 అతని తర్వాత యాజకుడయ్యే అతని కుమారుడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి సమావేశ గుడారంలోకి వెళ్లేటప్పుడు ఏడు రోజులు వాటిని ధరించాలి.
EXO 29:31 “ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని పవిత్ర స్థలంలో దాని మాంసాన్ని వండాలి.
EXO 29:32 సమావేశ గుడారపు ద్వారం దగ్గర అహరోను, అతని కుమారులు ఆ పొట్టేలు మాంసాన్ని గంపలోని రొట్టెలతో తినాలి.
EXO 29:33 వారిని ప్రతిష్ఠించడానికి, పరిశుద్ధపరచడానికి ప్రాయశ్చిత్తంగా వేటిని అర్పించారో వాటిని వారు తినాలి. అవి పవిత్రమైనవి కాబట్టి వారు తప్ప ఇతరులెవరు వాటిని తినకూడదు.
EXO 29:34 ఒకవేళ ప్రతిష్ఠితమైన పొట్టేలు మాంసం గాని రొట్టెలు గాని ఉదయం వరకు మిగిలి ఉంటే వాటిని కాల్చివేయాలి. అవి పవిత్రమైనవి కాబట్టి వాటిని తినకూడదు.
EXO 29:35 “నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అహరోను అతని కుమారుల పట్ల జరిగించాలి; ఏడు రోజులు నీవు వారిని ప్రతిష్ఠించాలి.
EXO 29:36 ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రతిరోజు ఒక ఎద్దును పాపపరిహారబలిగా అర్పించాలి. బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం జరిగించి బలిపీఠాన్ని శుద్ధి చేయాలి, అలాగే దాన్ని ప్రతిష్ఠించడానికి అభిషేకం చేయాలి.
EXO 29:37 ఏడు రోజులు బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేసి దానిని ప్రతిష్ఠించండి. అప్పుడు బలిపీఠం అత్యంత పరిశుద్ధమవుతుంది; దానికి తగిలినవన్ని పరిశుద్ధమవుతాయి.
EXO 29:38 “నీవు క్రమం తప్పకుండా ప్రతిరోజు బలిపీఠం మీద ఏడాది గొర్రెపిల్లలు రెండు అర్పించాలి.
EXO 29:39 ఒక గొర్రెపిల్లను ఉదయాన, మరొకదాన్ని సూర్యాస్తమయ వేళ అర్పించాలి.
EXO 29:40 దంచి తీసిన ఒక పావు హిన్ ఒలీవనూనెతో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్ ద్రాక్షారసాన్ని పానార్పణగా మొదటి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి.
EXO 29:41 సాయంకాలం మరొక గొర్రెపిల్లతో కలిపి ఉదయకాలం అర్పించినట్లే భోజనార్పణ, పానార్పణ అర్పించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
EXO 29:42 “యెహోవా ఎదుట సమావేశ గుడారపు ద్వారం దగ్గర రాబోయే తరాలన్ని క్రమంగా నిత్యం ఈ దహనబలిని అర్పించాలి. అక్కడే నేను మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడతాను.
EXO 29:43 అక్కడే నేను ఇశ్రాయేలీయులను కలుసుకుంటాను; ఆ స్థలం నా మహిమచేత పవిత్రం చేయబడుతుంది.
EXO 29:44 “కాబట్టి నేను సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని ప్రతిష్ఠ చేస్తాను, నాకు యాజకులుగా సేవ చేసేందుకు అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠ చేస్తాను.
EXO 29:45 అప్పుడు నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవునిగా ఉంటాను.
EXO 29:46 నేను వారి మధ్య నివసించేలా, వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన వారి దేవుడనైన యెహోవాను నేనేనని వారు తెలుసుకుంటారు. నేను వారి దేవుడనైన యెహోవాను.
EXO 30:1 “ధూపం వేయడానికి నీవు తుమ్మకర్రతో ఒక వేదిక తయారుచేయాలి.
EXO 30:2 అది చతురస్రంగా, ఒక మూర పొడవు ఒక మూర వెడల్పు రెండు మూరల ఎత్తు ఉండాలి. దాని కొమ్ములను దానితో ఒకే ఖండంగా ఉండేలా చేయాలి.
EXO 30:3 దాని పైభాగానికి, అన్ని ప్రక్కలకు, కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకుతో పొదిగించి దాని చుట్టూ బంగారు కడ్డీ చేయించాలి.
EXO 30:4 ఆ కడ్డీ క్రింద ఉన్న బలిపీఠాన్ని మోయడానికి ఉపయోగించే మోతకర్రలను పెట్టడానికి, ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా రెండు బంగారు ఉంగరాలు తయారుచేయాలి.
EXO 30:5 తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించాలి.
EXO 30:6 ధూపవేదికను నిబంధన మందసాన్ని కాపాడే తెర ముందు పెట్టాలి, ఒడంబడిక పలకల మీద ఉన్న ప్రాయశ్చిత్త మూత ఎదుట దాన్ని ఉంచాలి. అక్కడే నేను నిన్ను కలుసుకుంటాను.
EXO 30:7 “అహరోను ప్రతిరోజు ఉదయం దీపాలు పెట్టినప్పుడు బలిపీఠం మీద పరిమళ వాసనతో కూడిన ధూపం వేయాలి.
EXO 30:8 సాయంకాలం అహరోను దీపాలను వెలిగించేటప్పుడు దాని మీద మరలా ధూపం వేయాలి. రాబోయే తరాల వరకు యెహోవా ఎదుట నిత్యం ధూపం వేయాలి.
EXO 30:9 నీవు దాని మీద ఇతర ధూపాలను గాని దహనబలిని గాని భోజనార్పణ గాని అర్పించకూడదు, దాని మీద పానార్పణ పోయకూడదు.
EXO 30:10 సంవత్సరానికి ఒకసారి అహరోను దాని కొమ్ముల మీద ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ వార్షిక ప్రాయశ్చిత్తం రాబోయే తరాల కోసం ప్రాయశ్చిత్త పాపపరిహారబలి రక్తంతో చేయాలి. అది యెహోవాకు అతిపరిశుద్ధమైనది.”
EXO 30:11 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నారు:
EXO 30:12 “నీవు ఇశ్రాయేలీయుల జనాభా లెక్కించేటప్పుడు, వారు లెక్కించబడుతున్న సమయంలో ప్రతి ఒక్కరు యెహోవాకు తమ జీవితానికి విమోచన క్రయధనం చెల్లించాలి. అలా చేస్తే నీవు వారిని లెక్కించినప్పుడు ఏ తెగులు వారి మీదికి రాదు.
EXO 30:13 లెక్కించబడినవారిలో చేరే ప్రతి ఒక్కరు పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం అర షెకెల్ ఇవ్వాలి, దాని బరువు ఇరవై గెరాలు ఉంటుంది. ఈ అర షెకెల్ యెహోవాకు కానుక.
EXO 30:14 ఇరవై సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు కలిగి లెక్కించబడేవారిలో చేరే వారు యెహోవాకు కానుక ఇవ్వాలి.
EXO 30:15 మీ ప్రాణాలకు ప్రాయశ్చిత్తం కలగడానికి మీరు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతులు అర షెకెల్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు, పేదవారు అర షెకెల్ కన్నా తక్కువ ఇవ్వకూడదు.
EXO 30:16 నీవు ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ప్రాయశ్చిత్త డబ్బును తీసుకుని సమావేశ గుడారపు సేవ కోసం ఉపయోగించాలి. మీ ప్రాణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి యెహోవా ఎదుట ఇది ఇశ్రాయేలీయులకు జ్ఞాపకంగా ఉంటుంది.”
EXO 30:17 యెహోవా మోషేతో ఇలా అన్నారు:
EXO 30:18 “కడుక్కోడానికి నీవు ఒక ఇత్తడి గంగాళాన్ని, దానికి ఇత్తడి పీటని చేసి సమావేశ గుడారానికి బలిపీఠానికి మధ్యలో పెట్టి దానిలో నీళ్లు పోయాలి.
EXO 30:19 దానిలో ఉన్న నీళ్లతో అహరోను అతని కుమారులు తమ చేతులు పాదాలు కడుక్కోవాలి.
EXO 30:20 వారు సమావేశ గుడారంలోకి వెళ్లినప్పుడెల్లా, వారు నీళ్లతో కడుక్కోవాలి, తద్వారా వారు చావరు. అలాగే, వారు యెహోవాకు హోమబలి అర్పించి సేవ చేయడానికి బలిపీఠాన్ని సమీపించినప్పుడు,
EXO 30:21 తాము చనిపోకుండా ఉండడానికి వారు తమ చేతులు పాదాలు కడుక్కోవాలి. ఇది అహరోనుకు అతని కుమారులకు తర్వాతి తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.”
EXO 30:22 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నారు:
EXO 30:23 “నీవు ఈ శ్రేష్ఠమైన సుగంధద్రవ్యాలు తీసుకోవాలి: పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం గోపరసం 500 షెకెళ్ళు, వాసనగల దాల్చిన చెక్క సగం అనగా 250 షెకెళ్ళు, పరిమళ వాసనగల నిమ్మగడ్డి నూనె 250 షెకెళ్ళు
EXO 30:24 లవంగపట్ట 500 షెకెళ్ళు, అయిదు శేర్ల ఒలీవనూనె; అన్నీ పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం తీసుకోవాలి.
EXO 30:25 వాటిని పవిత్ర అభిషేక తైలంగా, పరిమళద్రవ్యాలు చేసేవాని పనిలా పరిమళ మిశ్రమం చేయాలి. అది పవిత్ర అభిషేక తైలం అవుతుంది.
EXO 30:26 ఆ అభిషేక తైలంతో సమావేశ గుడారాన్ని, నిబంధన మందసాన్ని,
EXO 30:27 బల్లను, దానిమీది ఉపకరణాలను, దీపస్తంభాన్ని, దాని ఉపకరణాలను, ధూపవేదికను,
EXO 30:28 దహనబలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటిని, గంగాళాన్ని, దాని పీటని అభిషేకించాలి.
EXO 30:29 మీరు వాటిని పవిత్రం చేయాలి అప్పుడు అవి అత్యంత పరిశుద్ధమవుతాయి; వాటిని తాకిన ప్రతిదీ పరిశుద్ధమవుతుంది.
EXO 30:30 “నాకు యాజకులుగా సేవ చేయడానికి అహరోనును అతని కుమారులను అభిషేకించి ప్రతిష్ఠించాలి.
EXO 30:31 నీవు ఇశ్రాయేలీయులతో, ‘ఇది రాబోయే తరాలకు పవిత్రమైన అభిషేక తైలం అవుతుంది.
EXO 30:32 దానిని సాధారణ మనుష్యుల శరీరంపై పోయకూడదు, ఆ సూత్రాన్ని ఉపయోగించి మరే ఇతర నూనెను తయారుచేయవద్దు. ఇది పవిత్రమైనది, మీరు దానిని పవిత్రంగా పరిగణించాలి.
EXO 30:33 దాన్ని పోలిన పరిమళద్రవ్యాన్ని తయారుచేసినవారు, యాజకుల మీద కాకుండా ఇతరుల మీద దానిని పోసిన వారు తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి’ అని చెప్పు.”
EXO 30:34 యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు జటామాంసి, గోపిచందనం, గంధం అనే పరిమళద్రవ్యాలను, స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగాలలో తీసుకుని
EXO 30:35 పరిమళద్రవ్యాలను తయారుచేసేవాని పనియైన ధూపం యొక్క సువాసన మిశ్రమాన్ని తయారుచేయాలి. అది ఉప్పుగా, స్వచ్ఛముగా, పవిత్రంగా ఉండాలి.
EXO 30:36 దానిలో కొంచెం పొడిచేసి, సమావేశ గుడారంలో నిబంధన మందసం ముందు ఉంచండి, అక్కడ నేను మిమ్మల్ని కలుస్తాను. అది మీకు అతి పరిశుద్ధమైనదిగా ఉంటుంది.
EXO 30:37 అదే సూత్రంతో మీ కోసం మరొక ధూపద్రవ్యాలను తయారుచేసుకోవద్దు; అది యెహోవాకు పరిశుద్ధమైనదని పరిగణించండి.
EXO 30:38 దాని పరిమళాన్ని ఆస్వాదించడానికి దానిని పోలిన ధూపాన్ని తయారుచేసినవారు వారు తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.”
EXO 31:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
EXO 31:2 “చూడు, నేను యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును ఏర్పరచుకొని,
EXO 31:3 నేను అతన్ని దేవుని ఆత్మతో జ్ఞానంతో సామర్థ్యంతో అన్ని రకాల నైపుణ్యతలతో నింపాను.
EXO 31:4 అతడు బంగారం వెండి ఇత్తడితో కళాత్మక నమూనాలను తయారుచేస్తాడు.
EXO 31:5 ఇంకా అతడు రాళ్లను చెక్కి అమర్చడం, చెక్క పని చేయడం, అలా అన్ని రకాల చేతిపనులు చేస్తాడు.
EXO 31:6 అంతేకాక అతనికి సహాయం చేయడానికి దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబును నేను నియమించాను.
EXO 31:7 “ప్రత్యక్ష గుడారం, నిబంధన మందసం, దాని మీద ఉండే ప్రాయశ్చిత్త మూత, గుడారంలోని ఇతర ఉపకరణాలు
EXO 31:8 బల్ల, దానిమీది ఉపకరణాలు, స్వచ్ఛమైన బంగారపు దీపస్తంభం, దాని ఉపకరణాలు, ధూపవేదిక,
EXO 31:9 దహనబలిపీఠం దాని పాత్రలు, ఇత్తడి గంగాళం దాని ఇత్తడి పీట;
EXO 31:10 అంతేకాక యాజక సేవ చేసేటప్పుడు ధరించడానికి నేసిన వస్త్రాలు, యాజకుడైన అహరోనుకు పవిత్ర వస్త్రాలు, అలాగే అతని కుమారులకు వస్త్రాలు వారు యాజకులుగా పరిచర్య చేస్తున్నప్పుడు వేసుకోడానికి,
EXO 31:11 పరిశుద్ధస్థలం కోసం అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపము.
EXO 31:12 ఇంకా యెహోవా మోషేతో ఇలా అన్నారు,
EXO 31:13 “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు నా సబ్బాతులు ఖచ్చితంగా ఆచరించాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచే యెహోవానై యున్నాను అని మీరు తెలుసుకునేలా అది రాబోయే తరాలకు నాకు మీకు మధ్య ఒక గుర్తుగా ఉంటుంది.
EXO 31:14 “ ‘మీరు సబ్బాతును ఆచరించాలి, ఎందుకంటే అది మీకు పరిశుద్ధమైనది. దానిని అపవిత్రం చేసినవారికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి; ఆ రోజు ఏ పనైనా చేస్తే చేసినవారు తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.
EXO 31:15 ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు యెహోవాకు సబ్బాతు విశ్రాంతి దినం, యెహోవాకు పరిశుద్ధమైనది. సబ్బాతు దినాన ఎవరైనా ఏ పనైనా చేస్తే చేసినవారికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి.
EXO 31:16 రాబోయే తరాలకు నిత్యమైన ఒడంబడికగా ఇశ్రాయేలీయులు సబ్బాతును ఆచరించాలి.
EXO 31:17 ఇది నాకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఎప్పటికీ ఒక గుర్తులా ఉంటుంది, ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాలను భూమిని చేశారు, ఏడవ రోజున ఆయన విశ్రాంతి తీసుకుని సేదదీరారు.’ ”
EXO 31:18 యెహోవా సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడడం పూర్తి చేసిన తర్వాత, ఆయన ఒడంబడిక పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతిపలకలను అతనికి ఇచ్చారు.
EXO 32:1 మోషే పర్వతం దిగిరావడానికి ఆలస్యం చేయడం చూసిన ప్రజలు అహరోను చుట్టూ గుమికూడి, అతనితో, “ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి” అని అన్నారు.
EXO 32:2 అందుకు అహరోను, “అయితే మీ భార్యలు మీ కుమారులు మీ కుమార్తెలు ధరించిన బంగారు చెవికమ్మలు తీసి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.
EXO 32:3 కాబట్టి ప్రజలందరు తమ చెవికమ్మలు తీసి అహరోను దగ్గరకు తెచ్చారు.
EXO 32:4 అతడు వారు తనకు ఇచ్చిన వాటిని తీసుకుని ఒక సాధనంతో దూడ రూపంలో పోతపోసి ఒక విగ్రహం తయారుచేశాడు. అప్పుడు వారు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుళ్ళు వీరే” అని అన్నారు.
EXO 32:5 అహరోను ఇది చూసి ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం కట్టించి, “రేపు యెహోవాకు పండుగ జరుగుతుంది” అని ప్రకటించాడు.
EXO 32:6 కాబట్టి మరునాడు ప్రజలు ఉదయాన్నే లేచి దహనబలులు సమాధానబలులు అర్పించారు. ఆ తర్వాత ప్రజలు తినడానికి త్రాగడానికి కూర్చుని ఆడడానికి లేచారు.
EXO 32:7 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు క్రిందికి వెళ్లు, ఈజిప్టులో నుండి నీవు తీసుకువచ్చిన నీ ప్రజలు చెడిపోయారు.
EXO 32:8 నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి చాలా త్వరగా తప్పిపోయి ఒక దూడ రూపంలో పోతపోసిన విగ్రహాన్ని తమ కోసం తయారుచేసుకుని దానికి సాష్టాంగపడి బలి అర్పించి, ‘ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుళ్ళు వీరే’ అని అన్నారు.
EXO 32:9 “నేను ఈ ప్రజలను చూశాను” అని అంటూ యెహోవా మోషేతో ఇలా అన్నారు, “వారు మొండి ప్రజలు,
EXO 32:10 నా కోపం వారి మీద రగులుకొని, నేను వారిని నాశనం చేస్తాను, నీవు నన్ను వదిలేయి. తర్వాత నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను.”
EXO 32:11 అయితే మోషే తన దేవుడైన యెహోవా దయ కోసం మొరపెడుతూ, “యెహోవా, మీరు గొప్ప బలముతో బలమైన చేతితో ఈజిప్టులో నుండి రప్పించిన మీ ప్రజల మీద ఎందుకంత కోపం?
EXO 32:12 ‘వారిని పర్వతాల మధ్య చంపాలని భూమి మీద ఉండకుండా వారిని నాశనం అయ్యేలా కీడు చేయడానికే ఆయన వారిని బయటకు రప్పించారని ఈజిప్టువారు ఎందుకు చెప్పుకోవాలి?’ రగులుతున్న నీ కోపాన్ని విడిచిపెట్టండి; మనస్సు మార్చుకోండి, మీ ప్రజలపై విపత్తును తీసుకురావద్దు.
EXO 32:13 మీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరే స్వయంగా ఇలా ప్రమాణం చేశారు: ‘నేను మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లా అసంఖ్యాకంగా చేసి వారికి ఇస్తానని నేను వాగ్దానం చేసిన ఈ దేశాన్నంతా మీ సంతానానికి ఇస్తాను, అది వారి వారసత్వంగా నిరంతరం ఉంటుంది.’ ”
EXO 32:14 అప్పుడు యెహోవా మనస్సు మార్చుకొని తన ప్రజలకు తాను తెస్తానని చెప్పిన విపత్తును వారి మీదికి తేలేదు.
EXO 32:15 మోషే తన చేతులతో రెండు నిబంధన పలకలు పట్టుకుని పర్వతం దిగి వెళ్లాడు. ఆ పలకలకు రెండు వైపులా ముందు వెనుక వ్రాసి ఉంది.
EXO 32:16 ఆ పలకలు దేవుని పని; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేతివ్రాత.
EXO 32:17 ప్రజలు కేకలు వేస్తున్న శబ్దం యెహోషువ విని మోషేతో, “శిబిరంలో యుద్ధధ్వని వినబడుతుంది” అన్నాడు.
EXO 32:18 మోషే ఇలా జవాబిచ్చాడు: “అది విజయధ్వని కాదు, అపజయధ్వని కాదు; నేను వింటుంది పాడుతున్న ధ్వని.”
EXO 32:19 మోషే శిబిరాన్ని సమీపించి ఆ దూడ విగ్రహాన్ని, వారు నాట్యం చేయడాన్ని చూసినప్పుడు అతనికి చాలా కోపం వచ్చి, అతడు తన చేతుల్లో ఉన్న రెండు పలకలను విసిరి, పర్వత అడుగు భాగాన వాటిని ముక్కలు చేశాడు.
EXO 32:20 అతడు ఆ ప్రజలు చేసిన దూడ విగ్రహాన్ని తీసుకుని అగ్నిలో కాల్చివేశాడు; తర్వాత అతడు దానిని పొడిచేసి, నీళ్ల మీద చల్లి, ఆ నీళ్లను ఇశ్రాయేలీయులతో త్రాగించాడు.
EXO 32:21 అప్పుడు మోషే అహరోనును, “నీవు వారిని ఇలాంటి ఘోరమైన పాపం చేసేలా నడిపించడానికి ఈ ప్రజలు నిన్ను ఎలా ప్రేరేపించారు?” అని అడిగాడు.
EXO 32:22 అందుకు అహరోను, “నా ప్రభువా, కోప్పడకు, ఈ ప్రజలు చెడుకు ఎంతగా అలవాటుపడ్డారో నీకు తెలుసు.
EXO 32:23 వీరు నన్ను, ‘ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి’ అని అన్నారు.
EXO 32:24 అందుకు నేను, ‘ఎవరి దగ్గర బంగారు ఆభరణాలు ఉంటే వారు తీసుకురండి’ అని చెప్పాను. అప్పుడు వారు నాకు బంగారం ఇచ్చారు, నేను దాన్ని అగ్నిలో పడేస్తే, ఈ దూడ అయ్యింది!” అని చెప్పాడు.
EXO 32:25 ప్రజలు విచ్చలవిడిగా తిరగడం మోషే చూశాడు. వారి శత్రువుల ముందు నవ్వులపాలయ్యేలా అహరోను వారిని వదిలేశాడు.
EXO 32:26 కాబట్టి మోషే శిబిరం ద్వారం దగ్గర నిలబడి, “యెహోవా పక్షం ఉన్నవారందరు నా దగ్గరకు రండి” అని అన్నాడు. అప్పుడు లేవీయులందరు అతని దగ్గరకు వచ్చారు.
EXO 32:27 అతడు వారితో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: ‘ప్రతి ఒక్కరు తన కత్తిని తన నడుముకు కట్టుకుని, శిబిరం ఒక ద్వారం నుండి ఇంకొక ద్వారం వరకు వెళ్తూ ప్రతివారు తన సోదరులను స్నేహితులను పొరుగువారిని చంపాలి.’ ”
EXO 32:28 లేవీయులు మోషే ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు; ఆ రోజు సుమారు మూడువేలమంది చనిపోయారు.
EXO 32:29 అప్పుడు మోషే, “ఈ రోజు, మీరు మీ సొంత కుమారులకు సోదరులకు వ్యతిరేకంగా మిమ్మల్ని మీరు యెహోవా కోసం ప్రత్యేకించుకున్నారు, కాబట్టి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించారు” అని అన్నాడు.
EXO 32:30 ఆ మరునాడు మోషే ప్రజలతో, “మీరు ఘోరమైన పాపం చేశారు. కాని నేను యెహోవా దగ్గరకు ఎక్కి వెళ్తాను; బహుశ మీ పాపాల కోసం నేనేమైనా ప్రాయశ్చిత్తం చేయగలనేమో” అని అన్నాడు.
EXO 32:31 అప్పుడు మోషే యెహోవా దగ్గరకు తిరిగివెళ్లి, “అయ్యో, ఈ ప్రజలు ఎంతో ఘోరమైన పాపం చేశారు! తమ కోసం బంగారంతో దేవుళ్ళను తయారుచేసుకున్నారు.
EXO 32:32 కాని ఇప్పుడు, దయచేసి వారి పాపాలను క్షమించండి, వారిని మీరు క్షమించకపోతే మీరు వ్రాసిన గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయండి” అని అడిగాడు.
EXO 32:33 అందుకు యెహోవా మోషేకు, “నాకు వ్యతిరేకంగా ఎవరు పాపం చేశారో వారి పేరును నా గ్రంథంలో నుండి కొట్టివేస్తాను.
EXO 32:34 నీవు వెళ్లి, నేను నీకు చెప్పిన చోటికి ప్రజలను నడిపించు, నా దూత మీకు ముందుగా వెళ్తాడు. అయితే నేను శిక్ష విధించవలసిన సమయం వచ్చినప్పుడు వారి పాపాలకు వారికి శిక్ష విధిస్తాను” అని సమాధానం ఇచ్చారు.
EXO 32:35 అహరోను చేసిన దూడ విగ్రహంతో వారు చేసిన దానిని బట్టి యెహోవా ప్రజలను తెగులుతో మొత్తారు.
EXO 33:1 అప్పుడు యెహోవా మోషేతో, “ఈ స్థలాన్ని విడిచి, నీవు, నీవు ఈజిప్టు నుండి తీసుకువచ్చిన ప్రజలు, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు, ‘నేను దాన్ని మీ వారసులకు ఇస్తాను’ అని ప్రమాణం చేసిన దేశానికి వెళ్లండి.
EXO 33:2 నేను నా దూతను మీకు ముందుగా పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్లగొడతాను.
EXO 33:3 పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లండి. అయితే మీరు లోబడని ప్రజలు కాబట్టి నేను మీతో రాను, ఎందుకంటే మార్గం మధ్యలో నేను మిమ్మల్ని అంతం చేస్తానేమో” అన్నారు.
EXO 33:4 ప్రజలు ఈ బాధ కలిగించే మాటలు విన్నప్పుడు, వారు దుఃఖించడం మొదలుపెట్టారు, ఎవరూ ఆభరణాలు ధరించలేదు.
EXO 33:5 యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు లోబడని ప్రజలు. ఒకవేళ నేను ఒక్క క్షణం మీతో కలిసి వెళ్లినా, మిమ్మల్ని అంతం చేయవచ్చు. కాబట్టి మీ ఆభరణాలను తీసివేయండి మిమ్మల్ని ఏం చేయాలో నేను నిర్ణయిస్తాను.’ ”
EXO 33:6 కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు పర్వతం దగ్గర నుండి తమ ఆభరణాలను ధరించలేదు.
EXO 33:7 మోషే గుడారం తీసుకుని శిబిరం బయట కొంత దూరంలో దానిని వేసి, దానికి “సమావేశ గుడారం” అని పేరు పెట్టాడు. యెహోవా దగ్గర విచారణ చేసే ప్రతి ఒక్కరు శిబిరం బయట ఉన్న సమావేశ గుడారానికి వెళ్లేవారు.
EXO 33:8 మోషే గుడారంలోకి వెళ్లినప్పుడెల్లా, ప్రజలంతా వారి గుడారపు ద్వారాల దగ్గర నిలబడి, మోషే ఆ గుడారం లోపలికి వెళ్లేవరకు కనిపెట్టుకుని ఉండేవారు.
EXO 33:9 మోషే ఆ గుడారం లోపలికి వెళ్లగానే, మేఘస్తంభం దిగివచ్చి దాని ద్వారం దగ్గర నిలబడేది, అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడేవారు.
EXO 33:10 ఆ గుడారపు ద్వారం దగ్గర మేఘస్తంభం నిలబడడం ప్రజలు చూసినప్పుడెల్లా, వారంతా లేచి నిలబడి, ప్రతిఒక్కరు తమ గుడారపు ద్వారం దగ్గర యెహోవాను ఆరాధించేవారు.
EXO 33:11 ఒకరు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవారు. తర్వాత మోషే శిబిరానికి తిరిగి వచ్చేవాడు, కాని అతని సేవకుడు నూను కుమారుడైన యెహోషువ అనే యువకుడు ఆ గుడారాన్ని విడిచిపెట్టేవాడు కాదు.
EXO 33:12 మోషే యెహోవాతో, “ ‘ఈ ప్రజలను నడిపించు’ అని మీరు నాకు చెప్తున్నారు, కాని నాతో ఎవరిని పంపుతారో నాకు చెప్పలేదు. ‘నీ పేరుతో సహా నీవు నాకు తెలుసు, నీవు నా దయను పొందావు’ అని మీరు అన్నారు.
EXO 33:13 ఒకవేళ మీకు నా మీద దయ ఉంటే, నేను మిమ్మల్ని తెలుసుకొని మీ దయ పొందుతూ ఉండేలా మీ మార్గాలను నాకు బోధించండి. ఈ జనులు మీ ప్రజలేనని జ్ఞాపకముంచుకోండి” అని అన్నాడు.
EXO 33:14 అందుకు యెహోవా, “నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి ఇస్తాను” అన్నారు.
EXO 33:15 అప్పుడు మోషే ఆయనతో, “మీ సన్నిధి మాతో పాటు రాకపోతే మమ్మల్ని ఇక్కడినుండి పంపవద్దు.
EXO 33:16 మీరు మాతో రాకపోతే నా పట్ల మీ ప్రజల పట్ల మీరు కనికరం చూపించారని ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ఈ భూమి మీద ఉన్న ఇతర ప్రజల నుండి నన్ను, మీ ప్రజలను ఏది ప్రత్యేకపరుస్తుంది?” అని అడిగాడు.
EXO 33:17 అందుకు యెహోవా మోషేతో, “నీవడిగినట్టే నేను చేస్తాను, ఎందుకంటే నీ మీద నాకు దయ కలిగింది, నీ పేరుతో సహా నీవు నాకు తెలుసు” అని అన్నారు.
EXO 33:18 అప్పుడు మోషే, “ఇప్పుడు నీ మహిమ నాకు చూపించు” అని అన్నాడు.
EXO 33:19 అందుకు యెహోవా, “నా మంచితనమంతా నీ ఎదుట నుండి దాటిపోయేలా చేస్తాను. యెహోవా అనే నా పేరును నీ ఎదుట ప్రకటిస్తాను. నాకు ఎవరి మీద కనికరం కలుగుతుందో వారిని కనికరిస్తాను, నాకు ఎవరి మీద దయ కలుగుతుందో వారికి నేను దయ చూపిస్తాను.”
EXO 33:20 అయితే ఆయన, “నీవు నా ముఖాన్ని చూడలేవు; ఎందుకంటే నన్ను చూసిన మనుష్యులు బ్రతుకరు” అని అన్నారు.
EXO 33:21 యెహోవా, “నాకు దగ్గరగా ఒక స్థలముంది అక్కడ నీవు బండ మీద నిలబడు.
EXO 33:22 నా మహిమ నిన్ను దాటి వెళ్తున్నప్పుడు ఆ బండ సందులో నిన్ను ఉంచి నేను వెళ్లిపోయేవరకు నా చేతితో నిన్ను కప్పుతాను.
EXO 33:23 నేను చేయి తీసిన తర్వాత నీవు నా వెనుక భాగం చూస్తావు; కాని నా ముఖం నీకు కనబడదు” అన్నారు.
EXO 34:1 యెహోవా మోషేతో, “మొదటి పలకలవంటి మరో రెండు రాతిపలకలను చెక్కు, నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే నేను వాటిపై వ్రాస్తాను.
EXO 34:2 నీవు ఉదయమే సిద్ధపడి, సీనాయి పర్వతం మీదికి రా. ఆ పర్వత శిఖరం మీద నీవు నా ఎదుట నిలబడు.
EXO 34:3 నీతో మరెవరూ రాకూడదు, ఈ పర్వతం మీద ఎవరూ కనపడకూడదు; ఈ పర్వతం దగ్గర పశువులు గాని గొర్రెలు గాని మేయకూడదు” అని చెప్పారు.
EXO 34:4 కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మొదటి వాటిలా రెండు రాతిపలకలను చెక్కి తన చేతులతో ఆ రెండు రాతిపలకలు పట్టుకుని తెల్లవారుజామునే సీనాయి పర్వతం పైకి వెళ్లాడు.
EXO 34:5 అప్పుడు యెహోవా మేఘంలో దిగివచ్చి అతనితో అక్కడ నిలబడి యెహోవా అనే తన పేరును ప్రకటించారు.
EXO 34:6 మోషే ఎదుట నుండి ఆయన దాటి వెళ్తూ, “యెహోవా, దేవుడైన యెహోవా కనికరం దయ కలిగినవారు, త్వరగా కోప్పడరు, ప్రేమ నమ్మకత్వాలతో నిండియున్నవారు,
EXO 34:7 వేలాదిమందికి ప్రేమను చూపిస్తూ, దుర్మార్గాన్ని, తిరుగుబాటును, పాపాన్ని క్షమిస్తారు గాని ఆయన దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టక, మూడు నాలుగు తరాల వరకు తల్లిదండ్రుల పాపానికి పిల్లలను వారి పిల్లలను శిక్షిస్తారు” అని ప్రకటించారు.
EXO 34:8 వెంటనే మోషే నేలవరకు తలవంచి ఆరాధిస్తూ,
EXO 34:9 “ప్రభువా, నా మీద మీకు దయ కలిగితే, ప్రభువు మాతో పాటు రావాలి. వీరు లోబడని ప్రజలే అయినప్పటికీ, మా దుర్మార్గాన్ని మా పాపాన్ని క్షమించి, మమ్మల్ని మీ స్వాస్థ్యంగా తీసుకోండి” అన్నాడు.
EXO 34:10 అందుకు యెహోవా: “నీతో నేను ఒక ఒడంబడిక చేస్తున్నాను. ఈ భూమి మీద ఏ దేశంలో ఎప్పుడూ జరుగని అద్భుతాలు నేను నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. నీవు ఏ ప్రజలమధ్య నివసిస్తున్నావో వారందరు యెహోవానైన నేను మీ కోసం చేసే భయంకరమైన కార్యాన్ని చూస్తారు.
EXO 34:11 నేడు నేను మీకు ఆజ్ఞాపించే దానికి లోబడాలి. నేను అమోరీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్లగొడతాను.
EXO 34:12 మీరు వెళ్లబోతున్న దేశంలో నివసిస్తున్న వారితో సంధి చేసుకోకుండ జాగ్రత్తపడండి, లేకపోతే వారు మీ మధ్య ఉరిగా ఉంటారు.
EXO 34:13 మీరు వారి బలిపీఠాలను పడగొట్టండి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టండి, వారి అషేరా స్తంభాలను ముక్కలు చేయండి.
EXO 34:14 మీరు ఇతర దేవుళ్ళను ఆరాధించకూడదు, ఎందుకంటే రోషం గలవాడని పేరుగల యెహోవా, రోషం గల దేవుడు.
EXO 34:15 “ఆ దేశంలో నివసిస్తున్న వారితో సంధి చేసుకోకుండ జాగ్రత్తపడండి; ఎందుకంటే వారు తమ దేవుళ్ళతో వ్యభిచరించి వాటికి బలులు అర్పించినప్పుడు, వారు మిమ్మల్ని ఆహ్వానిస్తారు, మీరు ఆ బలులను తింటారు.
EXO 34:16 మీరు మీ కుమారులకు వారి కుమార్తెలను భార్యలుగా చేసుకున్నప్పుడు ఆ కుమార్తెలు తమ దేవుళ్ళతో వ్యభిచరించి మీ కుమారులచేత అదే విధంగా చేయిస్తారు.
EXO 34:17 “ఏ దేవుళ్ళ విగ్రహాలు చేసుకోకూడదు.
EXO 34:18 “పులియని రొట్టెల పండుగ జరుపుకోవాలి. ఎందుకంటే నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఏడు రోజులు మీరు పులియని పిండితో చేసిన రొట్టెలే తినాలి. అబీబు నెలలో నిర్ణీత సమయంలో మీరిలా చేయాలి, ఎందుకంటే ఆ నెలలో మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చారు.
EXO 34:19 “ప్రతి గర్భం యొక్క మొదటి సంతానం నాదే, మీ పశువుల్లో మొదటి సంతానమైన ప్రతి మగపిల్ల అది దూడ గాని, గొర్రెపిల్ల గాని, అది నాకు చెందుతుంది.
EXO 34:20 గొర్రెపిల్లను ఇచ్చి మొదటి సంతానమైన గాడిదను విడిపించుకోవాలి, అలా మీరు దాన్ని విడిపించుకోకపోతే, దాని మెడ విరగ్గొట్టాలి. మీ ప్రతి మొదటి మగపిల్లవాన్ని విడిపించుకోవాలి. “నా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు.
EXO 34:21 “ఆరు రోజులు మీరు పని చేయాలి, కాని ఏడవ రోజు మీరు విశ్రాంతి తీసుకోవాలి; అది దున్నే కాలమైనా పంట కోసే కాలమైనా సరే మీరు విశ్రాంతి తీసుకోవాలి.
EXO 34:22 “గోధుమపంటలోని ప్రథమ ఫలాలతో వారాల పండుగ ఆచరించాలి, సంవత్సరం చివరిలో పంటకూర్పు పండుగ ఆచరించాలి.
EXO 34:23 సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులందరు ఇశ్రాయేలీయుల దేవుడు ప్రభువైన యెహోవా సన్నిధిలో కనబడాలి.
EXO 34:24 నేను మీ ఎదుట నుండి దేశాలను తరిమివేసి, మీ భూభాగాన్ని విస్తరింపజేస్తాను, మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో కనబడడానికి మీరు సంవత్సరానికి మూడుసార్లు పైకి వెళ్లినప్పుడు మీ భూమిని ఎవరూ ఆశించరు.
EXO 34:25 “పులిసిన దానితో కలిపి నాకు బలి యొక్క రక్తాన్ని అర్పించకూడదు, పస్కా పండుగ నుండి ఏ బలికి చెందినది ఏదీ ఉదయం వరకు మిగలకూడదు.
EXO 34:26 “మీ పొలంలో పండిన ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైన వాటిని మీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి. “మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.”
EXO 34:27 తర్వాత యెహోవా మోషేతో, “ఈ మాటలను వ్రాయి; ఎందుకంటే ఈ మాటలను అనుసరించి నేను నీతో, అలాగే ఇశ్రాయేలీయులతో నిబంధన చేశాను” అన్నారు.
EXO 34:28 మోషే నలభై రాత్రింబవళ్ళు యెహోవాతో పాటు అక్కడే, ఆహారం తినకుండ నీళ్లు త్రాగకుండ ఉన్నాడు. అతడు నిబంధన మాటలు అనగా పది ఆజ్ఞలు ఆ పలకల మీద వ్రాశాడు.
EXO 34:29 మోషే తన చేతుల్లో ఆ రెండు నిబంధన పలకలను మోస్తూ సీనాయి పర్వతం దిగివస్తున్నప్పుడు, అతడు యెహోవాతో మాట్లాడాడు కాబట్టి అతని ముఖం ప్రకాశమానంగా ఉందని అతనికి తెలియదు.
EXO 34:30 అహరోను, ఇశ్రాయేలీయులందరు మోషేను చూసినప్పుడు అతని ముఖం ప్రకాశవంతంగా ఉంది కాబట్టి అతని దగ్గరకు వెళ్లడానికి వారు భయపడ్డారు.
EXO 34:31 అయితే మోషే వారిని పిలిచాడు; కాబట్టి అహరోను, సమాజ నాయకులు అతని దగ్గరకు తిరిగి వచ్చారు, అతడు వారితో మాట్లాడాడు.
EXO 34:32 ఆ తర్వాత ఇశ్రాయేలీయులందరు అతని దగ్గరకు రాగా సీనాయి పర్వతం మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని అతడు వారికిచ్చాడు.
EXO 34:33 మోషే వారితో మాట్లాడడం ముగించినప్పుడు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు.
EXO 34:34 అయితే మోషే యెహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధిలోనికి వెళ్లినప్పుడెల్లా బయటకు వచ్చేవరకు అతడు ముసుగు తీసివేసేవాడు. అతడు బయటకు వచ్చి తనకు ఆజ్ఞాపించిన వాటిని ఇశ్రాయేలీయులకు చెప్పేవాడు.
EXO 34:35 అప్పుడు అతని ముఖం ప్రకాశించడం ఇశ్రాయేలీయులు చూశారు; మోషే తిరిగి యెహోవాతో మాట్లాడడానికి వెళ్లేవరకు తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు.
EXO 35:1 మోషే ఇశ్రాయేలీయుల సమాజమంతటిని సమావేశపరచి వారితో, “మీరు పాటించడానికి యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు ఇవే:
EXO 35:2 ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు మీ పరిశుద్ధ దినం, అది యెహోవాకు సబ్బాతు విశ్రాంతి దినము. ఆ రోజు ఎవరు ఏ పని చేసినా వారికి మరణశిక్ష విధించబడాలి.
EXO 35:3 సబ్బాతు దినాన మీరు మీ నివాసాల్లో మంట వెలిగించకూడదు.”
EXO 35:4 మోషే ఇశ్రాయేలీయుల సమాజమంతటితో, “యెహోవా ఆజ్ఞాపించింది ఇదే:
EXO 35:5 మీ దగ్గర ఉన్నదానిలో నుండి యెహోవా కోసం అర్పణ తీసుకురావాలి. ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుక తెచ్చే ప్రతి ఒక్కరు ఇవి తీసుకురావలసినవి: “బంగారం, వెండి, ఇత్తడి;
EXO 35:6 నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారబట్ట; మేక వెంట్రుకలు;
EXO 35:7 ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాలు మన్నికైన తోలు; తుమ్మకర్ర;
EXO 35:8 దీపాలకు ఒలీవనూనె; అభిషేక తైలానికి సువాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు;
EXO 35:9 ఏఫోదు మీద, రొమ్ము పతకం మీద పొదగడానికి లేతపచ్చ రాళ్లు, ఇతర రత్నాలు.
EXO 35:10 “మీలో నైపుణ్యం ఉన్నవారు వచ్చి యెహోవా ఆజ్ఞాపించిన ప్రతిదీ తయారుచేయాలి:
EXO 35:11 “అవేమంటే, సమావేశ గుడారం, దాని గుడారం, దాని పైకప్పు, దాని కొలుకులు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు;
EXO 35:12 మందసం, దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత దానిని కప్పివుంచే తెర;
EXO 35:13 బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణాలన్నీ, సన్నిధి రొట్టెలు;
EXO 35:14 వెలుగు కోసం దీపస్తంభం, దాని ఉపకరణాలు, దీపాలు, వెలిగించడానికి ఒలీవనూనె;
EXO 35:15 ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం; సమావేశ గుడారపు ద్వారానికి తెర;
EXO 35:16 దహనబలిపీఠం దాని ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని పాత్రలన్నీ; ఇత్తడి గంగాళం, దాని పీట;
EXO 35:17 ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, దిమ్మలు, ఆవరణ ద్వారానికి తెర;
EXO 35:18 సమావేశ గుడారానికి, ఆవరణానికి మేకులు, వాటి త్రాళ్లు;
EXO 35:19 పరిశుద్ధాలయంలో పరిచర్య చేయడానికి ధరించే నేసిన వస్త్రాలు; యాజకుడైన అహరోనుకు పవిత్ర వస్త్రాలు, యాజకులుగా సేవ చేస్తున్నప్పుడు అతని కుమారులకు వస్త్రాలు” అని చెప్పాడు.
EXO 35:20 అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే దగ్గరి నుండి వెళ్లి,
EXO 35:21 ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకున్న ప్రతిఒక్కరు, హృదయాల్లో ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరు వచ్చి, సమావేశ గుడారం యొక్క పనుల కోసం, దాని సేవలన్నిటి కోసం, పవిత్ర వస్త్రాల కోసం యెహోవాకు అర్పణలు తెచ్చారు.
EXO 35:22 ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకున్న స్త్రీలు పురుషులు వచ్చి, చెవికమ్మలు, వ్రేలి ఉంగరాలు, నగలు, వివిధ రకాల బంగారు ఆభరణాలు తెచ్చి ఆ బంగారాన్ని పైకెత్తి ఆడించి యెహోవాకు ప్రత్యేక అర్పణగా సమర్పించారు.
EXO 35:23 తమ దగ్గర నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నార మేక వెంట్రుకలు ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాలు, మన్నికైన తోళ్లు ఉన్నవారు వాటిని తెచ్చారు.
EXO 35:24 వెండిని ఇత్తడిని అర్పించాలనుకున్నవారు వాటిని యెహోవాకు అర్పణగా తెచ్చారు, ఆ పనిలో దేనికైనా ఉపయోగపడే తుమ్మకర్రలు ఉన్న ప్రతిఒక్కరు వాటిని తెచ్చారు.
EXO 35:25 నైపుణ్యం కలిగిన ప్రతి స్త్రీ తమ చేతులతో వడికి తాము వడికిన నీలం ఊదా ఎరుపు రంగుల నూలు లేదా సన్నని నార తెచ్చారు.
EXO 35:26 నైపుణ్యం కలిగి ప్రేరేపించబడిన స్త్రీలందరు మేక వెంట్రుకలను వడికారు.
EXO 35:27 నాయకులు ఏఫోదులో, రొమ్ము పతకంలో పొదగడానికి లేతపచ్చ రాళ్లు, ఇతర రత్నాలు తెచ్చారు.
EXO 35:28 అలాగే దీపాలు వెలిగించడానికి ఒలీవనూనె, అభిషేక తైలానికి, పరిమళ వాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు తెచ్చారు.
EXO 35:29 మోషే ద్వారా యెహోవా వారికి చేయమని ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇశ్రాయేలీయుల స్త్రీలు పురుషులలో ప్రేరేపించబడిన వారందరు ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుకలు తెచ్చారు.
EXO 35:30 తర్వాత మోషే ఇశ్రాయేలీయులతో, “చూడండి, యెహోవా యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును ఏర్పరచుకొని,
EXO 35:31 బంగారం వెండి ఇత్తడితో కళాత్మక నమూనాలను రూపొందించడానికి, రాళ్లను చెక్కి అమర్చడం, చెక్క పని చేయడం వంటి అన్ని రకాల కళాత్మక నైపుణ్యాలతో పని చేయడానికి అతన్ని దేవుని ఆత్మతో జ్ఞానంతో సామర్థ్యంతో తెలివితో అన్ని రకాల నైపుణ్యతలతో నింపారు.
EXO 35:34 ఆయన బెసలేలుకు, అలాగే దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబుకు ఇతరులకు నేర్పగల సామర్థ్యాన్ని ఇచ్చారు.
EXO 35:35 చెక్కేవారి పని, కళాకారుల పని, నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారతో కుట్టుపని, నేతగాని పని, చిత్రకారులు చేయగల అన్ని రకాల పనులను చేయడానికి కావలసిన నైపుణ్యంతో యెహోవా వారిని నింపారు.
EXO 36:1 పరిశుద్ధాలయం యొక్క సేవ కోసం చేయవలసిన అన్ని రకాల పనులు ఎలా చేయాలో తెలుసుకోవడానికి యెహోవా నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ఇచ్చిన బెసలేలు ఒహోలీయాబు వలె నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్కరు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం పని చేయాలి” అన్నాడు.
EXO 36:2 తర్వాత బెసలేలును ఒహోలీయాబును, యెహోవా సామర్థ్యం ఇచ్చిన వారిని, పని చేయడానికి ప్రేరేపించబడిన వారందరిని మోషే పిలిపించాడు.
EXO 36:3 పరిశుద్ధాలయ నిర్మాణానికి ఇశ్రాయేలీయులు తెచ్చిన కానుకలన్నిటిని మోషే దగ్గర నుండి వారు తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ప్రతి ఉదయం స్వేచ్ఛార్పణగా అతని దగ్గరకు కానుకలు తెస్తూనే ఉన్నారు.
EXO 36:4 కాబట్టి పరిశుద్ధాలయం యొక్క పనులన్నిటిని చేస్తున్న నైపుణ్యంగల పనివారంతా తాము చేస్తున్న పని విడిచి వచ్చి,
EXO 36:5 మోషేతో, “యెహోవా చేయమని ఆజ్ఞాపించిన పనికి కావలసిన దానికన్నా ఎక్కువగా ప్రజలు తెస్తున్నారు” అని చెప్పారు.
EXO 36:6 అప్పుడు మోషే: “పరిశుద్ధాలయం కోసం ఏ పురుషుడు గాని స్త్రీ గాని ఇకమీదట ఏ అర్పణ తీసుకురాకూడదు” అని ఒక ఆజ్ఞ ఇవ్వగా వారు దాన్ని శిబిరమంతటికి తెలియజేశారు. అప్పుడు ప్రజలు కానుకలు తీసుకురావడం మానుకున్నారు.
EXO 36:7 ఎందుకంటే, వారు తెచ్చిన కానుకలు ఆ పని అంతా పూర్తి చేయడానికి కావలసిన దానికన్నా ఎక్కువ.
EXO 36:8 ఆ పనివారిలో నిపుణులైన వారందరు పది తెరలతో సమావేశ గుడారాన్ని తయారుచేశారు; వాటిని నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో చేసి వాటిపై చేయితిరిగిన పనివానితో కెరూబులను అల్లించారు.
EXO 36:9 తెరలన్నీ ఇరవై ఎనిమిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలిగి ఒకే కొలతతో ఉన్నాయి.
EXO 36:10 వారు అయిదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి ఒక్కటిగా చేశారు; మిగిలిన అయిదింటిని కూడా అలాగే చేశారు.
EXO 36:11 తర్వాత వారు ఒక కూర్పులోని తెరల చివర మొదటి తెర అంచుకు నీలి నూలుతో ఉచ్చులు చేశారు, రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలాగే చేశారు.
EXO 36:12 అంతేకాక వారు ఒక తెరకు యాభై ఉచ్చులు చేసి, ఉచ్చులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా మరొకదాని తెర అంచుకు యాభై ఉచ్చులు చేశారు.
EXO 36:13 తర్వాత వారు యాభై బంగారు గుండీలు తయారుచేసి ఆ గుండీలతో ఆ రెండు తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది ఒకే సమావేశ గుడారంగా ఉంటుంది.
EXO 36:14 వారు సమావేశ గుడారం పైకప్పుగా ఉండే గుడారం కోసం మేక వెంట్రుకలతో మొత్తం పదకొండు తెరలు తయారుచేశారు.
EXO 36:15 పదకొండు తెరలన్నీ పొడవు ముప్పై మూరలు, వెడల్పు నాలుగు మూరలు కలిగి ఒకే కొలతతో ఉన్నాయి.
EXO 36:16 వారు అయిదు తెరలను ఒకటిగా మిగతా ఆరు తెరలను ఒకటిగా కలిపారు.
EXO 36:17 అప్పుడు వారు మొదటి కూర్పులోని చివరి తెర అంచున, అలాగే రెండవ కూర్పులోని చివరి తెర అంచున యాభై ఉచ్చులు చేశారు.
EXO 36:18 దాన్ని ఒకటే గుడారమయ్యేలా వారు యాభై ఇత్తడి గుండీలు తయారుచేశారు.
EXO 36:19 ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మంతో గుడారం కోసం పైకప్పును దానిపైన మన్నికైన తోళ్లతో పైకప్పు తయారుచేశారు.
EXO 36:20 వారు సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేశారు.
EXO 36:21 ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉన్నాయి,
EXO 36:22 రెండు కొయ్యమేకులు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చారు. వారు సమావేశ గుడారపు చట్రాలన్నిటిని ఈ విధంగా తయారుచేశారు.
EXO 36:23 సమావేశ గుడారపు దక్షిణ వైపుకు వారు ఇరవై చట్రాలు తయారుచేశారు.
EXO 36:24 ప్రతి చట్రానికి క్రింద రెండు కొయ్య మేకులకు రెండు దిమ్మల చొప్పున ఇరవై చట్రాలకు నలభై వెండి దిమ్మలు తయారుచేశారు.
EXO 36:25 మరోవైపుకు, అంటే సమావేశ గుడారానికి ఉత్తర వైపుకు, ప్రతి చట్రం క్రింద రెండు చొప్పున, వారు ఇరవై చట్రాలు తయారుచేశారు.
EXO 36:26 వాటి క్రిందకు నలభై వెండి దిమ్మలు తయారుచేశారు.
EXO 36:27 పడమర వైపుకు అంటే సమావేశ గుడారపు వెనుక వైపుకు వారు ఆరు చట్రాలు తయారుచేశారు,
EXO 36:28 సమావేశ గుడారం యొక్క మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయబడ్డాయి.
EXO 36:29 ఈ రెండు మూలల వద్ద చట్రాలు క్రింది నుండి పై వరకు రెండింతలు ఉండి ఒకే ఉంగరంలోకి అమర్చబడ్డాయి; రెండూ ఒకేలా ఉన్నాయి.
EXO 36:30 అక్కడ ఎనిమిది చట్రాలు, ప్రతి చట్రం క్రింద రెండేసి చొప్పున పదహారు వెండి దిమ్మలు ఉన్నాయి.
EXO 36:31 అలాగే వారు తుమ్మకర్రతో అడ్డకర్రలు తయారుచేశారు: సమావేశ గుడారానికి ఒక ప్రక్కన ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు,
EXO 36:32 రెండవ వైపున ఉన్నవాటికి అయిదు, సమావేశ గుడారానికి వెనుక వైపున పడమర వైపున ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు చేశారు.
EXO 36:33 చట్రాల మధ్యలో ఉండే అడ్డకర్రను ఈ చివరి నుండి ఆ చివరి వరకు చేశారు.
EXO 36:34 వారు చట్రాలను బంగారంతో పొదిగించి, అడ్డకర్రలు ఉంచడానికి బంగారు ఉంగరాలు చేశారు. అలాగే అడ్డకర్రలను కూడా బంగారంతో పొదిగించారు.
EXO 36:35 వారు నీలం ఊదా ఎరుపు రంగుల్లో ఒక తెరను పేనిన సన్నని నారతో చేయించి, నిపుణుడైన పనివానితో దానిమీద కెరూబులను అల్లించారు.
EXO 36:36 వారు దాని కోసం తుమ్మ చెక్కతో నాలుగు స్తంభాలు చేసి బంగారంతో పొదిగించారు. వాటికి బంగారు కొక్కేలు చేసి, వాటికి నాలుగు వెండి దిమ్మలు వేశారు.
EXO 36:37 గుడారపు ప్రవేశ ద్వారానికి వారు నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో బుటా పని చేసిన తెర తయారుచేశారు.
EXO 36:38 వారు వాటికోసం అయిదు స్తంభాలు అలాగే కొక్కేలు చేశారు. వారు స్తంభాల పైభాగాలను, వాటి పట్టీలను బంగారంతో పొదిగించారు, అలాగే వాటికోసం అయిదు ఇత్తడి దిమ్మలు చేశారు.
EXO 37:1 బెసలేలు తుమ్మకర్రతో మందసం తయారుచేశాడు. దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర, ఎత్తు ఒకటిన్నర మూర.
EXO 37:2 అతడు దాని లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును తయారుచేశాడు.
EXO 37:3 నాలుగు బంగారు ఉంగరాలు పోతపోయించి ఒకవైపు రెండు మరోవైపు రెండు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాడు.
EXO 37:4 తర్వాత తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించాడు.
EXO 37:5 వాటిని మందసాన్ని మోయడానికి ఆ మోతకర్రలను మందసానికి ఇరుప్రక్కల ఉన్న ఉంగరాల్లో దూర్చాడు.
EXO 37:6 అతడు స్వచ్ఛమైన బంగారంతో ప్రాయశ్చిత్త మూతను తయారుచేశాడు; దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉంది.
EXO 37:7 తర్వాత అతడు సాగగొట్టిన బంగారంతో మూత చివర్లలో రెండు కెరూబులను తయారుచేశాడు.
EXO 37:8 అతడు ఒక చివర ఒక కెరూబును మరోచివర రెండవ కెరూబును చేశాడు; మూత మీద దాని రెండు చివర్లలో కెరూబులతో పాటు దానంతటిని ఒకే ముక్కలా చేశాడు.
EXO 37:9 ఆ కెరూబులు తమ రెక్కలను పైకి చాపి వాటితో ప్రాయశ్చిత్త మూతను కప్పుతూ ఉన్నాయి. కెరూబుల ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండి, ప్రాయశ్చిత్త మూతను చూస్తున్నట్లుగా ఉన్నాయి.
EXO 37:10 వారు తుమ్మకర్రతో ఒక బల్లను చేశారు. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు ఒకటిన్నర మూర.
EXO 37:11 తర్వాత వారు దాన్ని స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును చేశారు.
EXO 37:12 అలాగే దాని చుట్టూ బెత్తెడు వెడల్పున చట్రం కూడా చేసి దానిపై బంగారంతో పొదిగించారు.
EXO 37:13 ఆ బల్లకు నాలుగు ఉంగరాలు చేసి వాటిని నాలుగు కాళ్లు ఉన్న నాలుగు మూలల్లో తగిలించారు.
EXO 37:14 బల్ల మోయడానికి ఉపయోగించే మోతకర్రలు ఉంచే ఉంగరాలు చట్రానికి దగ్గరగా పెట్టారు.
EXO 37:15 ఆ బల్లను మోయడానికి తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటికి బంగారంతో పొదిగించారు.
EXO 37:16 బల్ల యొక్క ఉపకరణాలు అనగా దాని పళ్లెములు, పాత్రలు, పానార్పణలు పోయడానికి ఉపయోగించే బానలు గిన్నెలను స్వచ్ఛమైన బంగారంతో తయారుచేశాడు.
EXO 37:17 వారు స్వచ్ఛమైన బంగారంతో దీపస్తంభం చేశారు. దాని అడుగు పీఠాన్ని నడిమి భాగాన్ని సుత్తెతో సాగగొట్టారు, దాని కలశాలు, దాని మొగ్గలు దాని పువ్వులు తయారుచేసి వాటితో ఒకే ఖండంలా చేశారు.
EXO 37:18 దీపస్తంభానికి రెండు వైపుల నుండి ఆరు కొమ్మలు; ఒక ప్రక్క మూడు మరొక ప్రక్క మూడు కొమ్మలు విస్తరించి ఉన్నాయి.
EXO 37:19 ఒక కొమ్మకు మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన మూడు కలశాలు, తర్వాతి కొమ్మకు కూడా అలాగే మూడు కలశాల చొప్పున దీపస్తంభం నుండి విస్తరించివున్న ఆరు కొమ్మలకు అదే విధంగా ఉన్నాయి.
EXO 37:20 దీపస్తంభం మీద మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన నాలుగు కలశాలు ఉన్నాయి.
EXO 37:21 దీపస్తంభం నుండి విస్తరించి ఉన్న మొదటి జత కొమ్మల క్రింద మొదటి మొగ్గ, రెండవ జత కొమ్మల క్రింద రెండవ మొగ్గ, మూడవ జత కొమ్మల క్రింద మూడవ మొగ్గ చొప్పున ఆరు కొమ్మలకు అమర్చారు.
EXO 37:22 సాగగొట్టబడిన స్వచ్ఛమైన బంగారంతో మొగ్గలు కొమ్మలు దీపస్తంభంతో ఒకే ఖండంగా చేశారు.
EXO 37:23 వారు ఏడు దీపాలు దాని వత్తులు కత్తిరించే కత్తెరలు, పళ్ళాలను స్వచ్ఛమైన బంగారంతో చేశారు.
EXO 37:24 దీపస్తంభాన్ని దాని ఉపకరణాలను తయారుచేయడానికి ఒక తలాంతు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాడు.
EXO 37:25 వారు తుమ్మకర్రతో ఒక ధూపవేదిక తయారుచేశారు. అది చతురస్రంగా ఒక మూర పొడవు ఒక మూర వెడల్పు రెండు మూరల ఎత్తు ఉంది. దాని కొమ్ములను దానితో ఒకే ఖండంగా ఉండేలా చేశారు.
EXO 37:26 దాని పైభాగానికి, అన్ని ప్రక్కలకు, కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకుతో పొదిగించి దాని చుట్టూ బంగారు కడ్డీ చేశారు.
EXO 37:27 మోయడానికి ఉపయోగించే మోతకర్రలను పెట్టడానికి, కడ్డీ క్రింద రెండు బంగారు ఉంగరాలు, ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా తయారుచేశారు.
EXO 37:28 వారు తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించారు.
EXO 37:29 అంతేకాక వారు పవిత్ర అభిషేక తైలాన్ని, స్వచ్ఛమైన, పరిమళద్రవ్యాలు చేసేవాని పనిలా పరిమళ వాసనగల ధూపాన్ని తయారుచేశారు.
EXO 38:1 వారు తుమ్మకర్రతో మూడు మూరల ఎత్తుగల బలిపీఠం దహనబలి కోసం కట్టారు; అది అయిదు మూరల పొడవు అయిదు మూరల వెడల్పుతో చతురస్రంగా ఉంది.
EXO 38:2 వారు కొమ్ములు, బలిపీఠం ఒకే భాగంలా ఉండేలా దాని నాలుగు మూలల్లో ప్రతి మూలకు ఒక కొమ్మును చేశారు. వారు బలిపీఠాన్ని ఇత్తడితో పొదిగించారు.
EXO 38:3 దాని పాత్రలన్నిటిని అంటే బూడిద తొలగించడానికి కుండలు, పారలు, చల్లే గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పు పెనాలను ఇత్తడితో తయారుచేశారు.
EXO 38:4 దానికి వలలాంటి ఇత్తడి జాలి తయారుచేసి, ఆ జాలి బలిపీఠం మధ్యకు చేరేలా బలిపీఠం గట్టు క్రింది భాగంలో దానిని ఉంచారు.
EXO 38:5 ఆ జాలి నాలుగు మూలల్లో మోతకర్రలు ఉంచేందుకు ఆ జాలి నాలుగు మూలలకు నాలుగు ఇత్తడి ఉంగరాలు తయారుచేశారు.
EXO 38:6 వారు తుమ్మకర్రతో మోతకర్రలు తయారుచేసి, వాటిని ఇత్తడితో పొదిగించారు.
EXO 38:7 బలిపీఠాన్ని మోయడానికి దాన్ని మోయడానికి ఉపయోగించే మోతకర్రలు దాని రెండు ప్రక్కలా ఉన్న ఉంగరాల్లో దూర్చారు; వారు పలకలను ఉపయోగించి బలిపీఠాన్ని గుల్లగా చేశారు.
EXO 38:8 వారు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సేవించడానికి వచ్చిన స్త్రీల అద్దాలతో ఒక ఇత్తడి గంగాళం దానికి ఇత్తడి పీట చేశారు.
EXO 38:9 తర్వాత వారు ఆవరణం నిర్మించారు. దక్షిణం వైపు వంద మూరల పొడవు గల పేనిన సన్నని నార తెరలు ఉన్నాయి.
EXO 38:10 దానికి ఇరవై స్తంభాలు వాటికి ఇరవై ఇత్తడి దిమ్మలు, అలాగే ఆ స్తంభాలకు వెండి కొక్కేలు, బద్దలు ఉన్నాయి.
EXO 38:11 ఉత్తరం వైపు కూడా వంద మూరల పొడవు ఉంది, ఇరవై స్తంభాలు, ఇరవై ఇత్తడి దిమ్మలు, స్తంభాల మీద వెండి కొక్కేలు, దిమ్మలు ఉన్నాయి.
EXO 38:12 పడమర చివర యాభై మూరల వెడల్పు ఉండి, పది స్తంభాలు, పది దిమ్మలతో తెరలు ఉన్నాయి. ఆ స్తంభాలకు వెండి కొక్కేలు, బద్దలు ఉన్నాయి.
EXO 38:13 తూర్పు వైపు, అనగా సూర్యోదయం వైపు కూడా, యాభై మూరల వెడల్పు ఉంది.
EXO 38:14 ప్రవేశ ద్వారానికి ఒక ప్రక్క పదిహేను మూరల పొడవు గల తెరలు, వాటికి మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి.
EXO 38:15 ఆవరణం యొక్క ద్వారానికి అటు ప్రక్కన మూడు స్తంభాలు, మూడు దిమ్మలతో పదిహేను మూరల పొడవు గల తెరలు ఉన్నాయి.
EXO 38:16 ఆవరణం చుట్టూ ఉన్న తెరలన్నీ పేనిన సన్నని నారతో చేసినవి.
EXO 38:17 ఆ స్తంభాల దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల మీదున్న బద్దలు, కొక్కేలు వెండివి. వాటి పైభాగాలు వెండితో పొదిగించబడ్డాయి; అలా ఆవరణం యొక్క స్తంభాలన్నిటికి వెండి బద్దలు ఉన్నాయి.
EXO 38:18 ఆవరణం యొక్క ద్వారానికి నీలం ఊదా ఎరుపు రంగుల పేనిన సన్నని నారతో బుటా పనితో తెర తయారుచేయబడింది. అది ఇరవై మూరల పొడవు గల తెర, ఆవరణం యొక్క తెరల్లా అయిదు మూరల ఎత్తు ఉంది.
EXO 38:19 దానికి నాలుగు స్తంభాలు వాటిని నాలుగు దిమ్మలు ఇత్తడివి. దాని బద్దలు కొక్కేలు వెండివి. వాటి పైభాగం వెండితో పొదిగించబడ్డాయి.
EXO 38:20 సమావేశ గుడారం, దాని చుట్టూ ఉన్న ఆవరణం యొక్క గుడారపు మేకులన్నీ ఇత్తడివి.
EXO 38:21 సమావేశ గుడారం అనగా సాక్షి గుడారానికి ఉపయోగించిన వస్తువుల వివరాలు ఇవే, యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు పర్యవేక్షణలో మోషే ఆజ్ఞ ప్రకారం లేవీయులు నమోదు చేశారు:
EXO 38:22 యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడు హూరు మనుమడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాడు;
EXO 38:23 దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబు అతనికి సహాయకుడు. ఇతడు చెక్కేవాడు, కళాకారుడు, నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారతో బుటా పని చేయగలడు.
EXO 38:24 ప్రత్యేక అర్పణల నుండి పరిశుద్ధాలయం యొక్క పనులన్నిటికి ఉపయోగించిన మొత్తం బంగారం పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం 29 తలాంతుల 730 షెకెళ్ళు.
EXO 38:25 జనాభా లెక్కలలో నమోదైన వారు ఇచ్చిన వెండి పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం 100 తలాంతుల 1,775 షెకెళ్ళు.
EXO 38:26 ఇరవై సంవత్సరాలు, ఆపై వయస్సు కలిగి నమోదు చేసుకున్న వారు అనగా 6,03,550 మంది పురుషులు తలా ఒక బెకా అంటే, అర షెకెల్, పరిశుద్ధాలయ షెకెల్ చొప్పున చెల్లించారు.
EXO 38:27 100 తలాంతుల వెండిని పరిశుద్ధాలయ దిమ్మలకు ఉపయోగించారు. అవి తెరలకు దిమ్మలు; ఒక దిమ్మకు ఒక తలాంతు చొప్పున 100 దిమ్మలకు 100 తలాంతులు.
EXO 38:28 స్తంభాలకు కొక్కేలను, స్తంభం పై భాగంలో పోతపోయడానికి, వాటికి బద్దెలు చేయడానికి 1,775 షెకెళ్ళు ఉపయోగించారు.
EXO 38:29 ప్రత్యేక అర్పణల నుండి లభించిన ఇత్తడి 70 తలాంతుల 2,400 షెకెళ్ళు.
EXO 38:30 ఆ ఇత్తడిని సమావేశ గుడారపు ద్వారం యొక్క దిమ్మల కోసం, ఇత్తడి బలిపీఠానికి, ఇత్తడి జల్లెడ, దాని పాత్రలన్నిటికి,
EXO 38:31 చుట్టూ ఉన్న ఆవరణానికి, దాని ద్వారానికి దిమ్మలు చేయడానికి, సమావేశ గుడారం, చుట్టూ ఉన్న ఆవరణపు అన్ని మేకులు చేయడానికి ఉపయోగించారు.
EXO 39:1 పరిశుద్ధాలయంలో సేవ చేయడానికి నీలం ఊదా ఎరుపు రంగుల నూలు ఉపయోగించి వారు నేసిన వస్త్రాలను తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం అహరోనుకు పవిత్ర వస్త్రాలను కూడా తయారుచేశారు.
EXO 39:2 బంగారంతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో ఏఫోదును తయారుచేశారు.
EXO 39:3 నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో నైపుణ్యమైన పనిగా నేయడానికి బంగారాన్ని రేకులుగా సాగగొట్టి దానిని తీగెలుగా కత్తిరించారు.
EXO 39:4 ఏఫోదుకు భుజాల ముక్కలు తయారుచేసి అది కదలకుండా ఉండేలా దాని రెండు మూలల్లో కూర్చారు.
EXO 39:5 నైపుణ్యంగా అల్లబడిన దాని నడికట్టు ఏఫోదుతో ఒకే ముక్కగా, బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో చేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవన్నీ చేశారు.
EXO 39:6 వారు లేతపచ్చ రాళ్లు తీసుకుని చెక్కేవారు ముద్రను చెక్కినట్లు వాటిపై ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కి బంగారు జరీ చట్రంలోకి ఎక్కించి,
EXO 39:7 తర్వాత వాటిని ఇశ్రాయేలు కుమారుల జ్ఞాపకార్థ రాళ్లుగా ఏఫోదు భుజాలపై బిగించారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవన్నీ చేశారు.
EXO 39:8 నైపుణ్యం ఉట్టిపడేలా ఏఫోదును చేసినట్లు బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో పతకాన్ని తయారుచేశారు.
EXO 39:9 అది చతురస్రంగా జానెడు పొడవు జానెడు వెడల్పుతో రెండుగా మడత పెట్టబడి ఉంది.
EXO 39:10 దానిపై నాలుగు వరుసల ప్రశస్తమైన రాళ్లు పొదిగారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం;
EXO 39:11 రెండవ వరుసలో పద్మరాగం, నీలమణి, పచ్చ;
EXO 39:12 మూడవ వరుసలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం;
EXO 39:13 నాలుగవ వరుసలో పుష్యరాగం, లేతపచ్చ రాళ్లు, సూర్యకాంతమణి ఉన్నాయి. వాటిని బంగారు చట్రంలో అమర్చారు.
EXO 39:14 ఇశ్రాయేలు కుమారుల పేర్లకు ఒక్కొక్కటి చొప్పున పన్నెండు రాళ్లు ఉన్నాయి, ప్రతిదీ వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ముద్రలా చెక్కబడ్డాయి.
EXO 39:15 వారు రొమ్ము పతకానికి స్వచ్ఛమైన బంగారంతో ఒక తాడులా అల్లికపనితో గొలుసులు చేశారు.
EXO 39:16 రెండు బంగారు జరీ పలకలు రెండు బంగారు ఉంగరాలను చేసి, వాటిని పతకానికి రెండు చివర్లకు తగిలించారు.
EXO 39:17 వారు రొమ్ము పతకం చివరిలో ఉన్న ఉంగరాలకు రెండు బంగారు గొలుసులు బిగించి,
EXO 39:18 గొలుసుల యొక్క ఇతర చివరలను రెండు జవలకు, ముందు భాగంలో ఉన్న ఏఫోదు యొక్క భుజాలకు జోడించారు.
EXO 39:19 వారు రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి, వాటిని ఏఫోదు ముందు భాగంలో రొమ్ము పతకానికి లోపలి అంచున ఉన్న రెండు చివర్లకు జోడించారు.
EXO 39:20 వారు మరో రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి వాటిని ఏఫోదు నడికట్టుకు కొంచెం పైన దాని అతుకు దగ్గరగా ఏఫోదు ముందు భాగంలో రెండు భుజభాగాలకు క్రింది వైపున జోడించారు.
EXO 39:21 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు, రొమ్ము పతకం ఏఫోదు నుండి బయటకు వ్రేలాడకుండా నడికట్టును అంటిపెట్టుకుని ఉండేలా రొమ్ము పతకం యొక్క ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు నీలిరంగు దారంతో కట్టారు.
EXO 39:22 వారు ఏఫోదు నిలువుటంగీని ఒక నేత పనిలా పూర్తిగా నీలి బట్టతో తయారుచేసి,
EXO 39:23 దాని మధ్యలో తల దూర్చడానికి రంధ్రం చేసి అది చిరిగిపోకుండా మెడపట్టీలా దాని అంచుల చుట్టూ అల్లికపని చేశారు.
EXO 39:24 వారు ఆ వస్త్రం అంచు చుట్టూ నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో పాటు, పేనిన సన్నని నారతో దానిమ్మపండ్లు తయారుచేశారు.
EXO 39:25 స్వచ్ఛమైన బంగారంతో తయారుచేసిన గంటలను వస్త్రం అంచు చుట్టూ ఉన్న దానిమ్మపండ్ల మధ్య తగిలించారు.
EXO 39:26 సేవ చేస్తున్నప్పుడు వేసుకోడానికి బంగారు గంటలు దానిమ్మపండ్లు ఒకదాని ప్రక్కన ఒకటిగా వస్త్రం అంచు చుట్టూ ఉంచారు; యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.
EXO 39:27 వారు అహరోనుకు అతని కుమారులకు సన్నని నారబట్టతో చొక్కా నేసారు.
EXO 39:28 సన్నని నారతో తలపాగా, నార టోపీలు, పేనిన సన్నని నారతో లోదుస్తులు చేశారు.
EXO 39:29 పేనిన సన్నని నారతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో బుటా పనిగా నడికట్టు తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.
EXO 39:30 వారు పవిత్ర చిహ్నంగా స్వచ్ఛమైన బంగారంతో ఒక కిరీటం తయారుచేసి, దాని మీద ముద్రలా ఈ మాటలు చెక్కారు: పరిశుద్ధత యెహోవాకే.
EXO 39:31 దాన్ని తలపాగాకు అతకడానికి దానిని నీలి దారంతో కట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.
EXO 39:32 సమావేశ గుడారపు పనంతా పూర్తి అయింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చేశారు.
EXO 39:33 అప్పుడు వారు సమావేశ గుడారం మోషే దగ్గరకు తెచ్చారు: గుడారం దాని అలంకరణలు, దాని కొలుకులు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు;
EXO 39:34 ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాల పైకప్పు, మన్నికైన తోళ్ల పైకప్పు, కప్పివుంచే తెర;
EXO 39:35 నిబంధన మందసం దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత;
EXO 39:36 బల్ల, దాని ఉపకరణాలన్నీ, సన్నిధి రొట్టెలు;
EXO 39:37 మేలిమి బంగారు దీపస్తంభం, దాని దీపాల వరుస, దాని ఉపకరణాలన్నీ, వెలిగించడానికి ఒలీవనూనె;
EXO 39:38 బంగారు బలిపీఠం, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం, గుడారపు ద్వారానికి తెర;
EXO 39:39 ఇత్తడి బలిపీఠం, దాని ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు దాని పాత్రలన్నీ; ఇత్తడి గంగాళం, దాని పీట;
EXO 39:40 ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, దిమ్మలు, ఆవరణ ద్వారానికి తెర; ఆవరణానికి మేకులు, వాటి త్రాళ్లు; సమావేశ గుడారంలో సేవకు ఉపయోగించే అన్ని ఉపకరణాలు;
EXO 39:41 పరిశుద్ధాలయంలో పరిచర్య చేయడానికి ధరించే నేసిన వస్త్రాలు; యాజకుడైన అహరోనుకు పవిత్ర వస్త్రాలు, యాజకులుగా సేవ చేస్తున్నప్పుడు అతని కుమారులకు వస్త్రాలు.
EXO 39:42 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు ఆ పని అంతా పూర్తి చేశారు.
EXO 39:43 మోషే వారు చేసిన పనిని పరిశీలించి, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు దానిని చేశారని చూశాడు. కాబట్టి మోషే వారిని దీవించాడు.
EXO 40:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు:
EXO 40:2 “మొదటి నెల మొదటి రోజున సమావేశ గుడారాన్ని నిలబెట్టాలి.
EXO 40:3 దానిలో నిబంధన మందసాన్ని ఉంచి ఆ మందసాన్ని తెరతో కప్పాలి.
EXO 40:4 బల్లను లోపలికి తెచ్చి దానికి చెందినవి దాని మీద క్రమంగా ఉంచాలి. దీపస్తంభాన్ని తెచ్చి దీపాలు వెలిగించాలి.
EXO 40:5 నిబంధన మందసం ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి సమావేశ గుడారపు ద్వారానికి తెర తగిలించాలి.
EXO 40:6 “నీవు ప్రత్యక్ష గుడారపు ద్వారం ఎదుట దహనబలిపీఠాన్ని ఉంచాలి;
EXO 40:7 సమావేశ గుడారానికి బలిపీఠానికి మధ్యలో గంగాళం ఉంచి దానిలో నీళ్లు నింపాలి.
EXO 40:8 దాని చుట్టూ ఆవరణాన్ని నిలబెట్టి ఆవరణ ద్వారానికి తెర తగిలించాలి.
EXO 40:9 “అభిషేక తైలాన్ని తీసుకుని సమావేశ గుడారాన్ని, దానిలో ఉన్నవాటన్నిటిని అభిషేకించాలి; దానిని, దాని సామాగ్రి అన్నిటిని ప్రతిష్ఠించాలి, అప్పుడు అది పరిశుద్ధం అవుతుంది.
EXO 40:10 తర్వాత దహనబలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటిని అభిషేకించాలి; బలిపీఠాన్ని ప్రతిష్ఠించాలి, అది అత్యంత పరిశుద్ధమవుతుంది.
EXO 40:11 గంగాళాన్ని దాని పీటను అభిషేకించి వాటిని పవిత్రం చేయాలి.
EXO 40:12 “తర్వాత నీవు అహరోనును అతని కుమారులను సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చి వారిని నీటితో కడగాలి.
EXO 40:13 అహరోను నాకు యాజక సేవ చేయటానికి అతనికి పవిత్ర వస్త్రాలను ధరింపజేసి, అతన్ని అభిషేకించి ప్రతిష్ఠించాలి.
EXO 40:14 అతని కుమారులను తీసుకువచ్చి వారికి చొక్కాలు తొడిగించాలి.
EXO 40:15 నాకు యాజక సేవ చేయటానికి వారి తండ్రిని అభిషేకించినట్లే వారిని కూడా అభిషేకించాలి. వారి అభిషేకం యాజకత్వానికి గుర్తుగా తరతరాలకు కొనసాగుతుంది.”
EXO 40:16 యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం మోషే అన్నిటిని చేశాడు.
EXO 40:17 రెండవ సంవత్సరం మొదటి నెలలో మొదటి రోజున సమావేశ గుడారాన్ని నిలబెట్టారు.
EXO 40:18 మోషే మందిరాన్ని నిలబెడుతున్నప్పుడు, అతడు దాని దిమ్మలు సరియైన చోట పెట్టి, పలకలను నిలబెట్టి అడ్డకర్రలు దూర్చి దాని స్తంభాలు నిలబెట్టాడు.
EXO 40:19 తర్వాత మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం సమావేశ గుడారం మీద గుడారాన్ని పరచి దానిపైన గుడారపు కప్పు వేశాడు.
EXO 40:20 అతడు నిబంధన పలకలను తీసుకుని మందసంలో పెట్టి, మందసానికి మోతకర్రలు దూర్చి దాని మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాడు.
EXO 40:21 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే మందసాన్ని సమావేశ గుడారంలోకి తీసుకువచ్చి కప్పివుంచే తెర తగిలించి నిబంధన మందసాన్ని కప్పాడు.
EXO 40:22 మోషే సమావేశ గుడారంలో ఉత్తరం వైపున తెర బయట బల్లను ఉంచి,
EXO 40:23 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దానిపైన రొట్టెను పెట్టాడు.
EXO 40:24 అతడు సమావేశ గుడారంలో బల్లకు ఎదురుగా సమావేశ గుడారానికి దక్షిణ వైపు దీపస్తంభాన్ని ఉంచి,
EXO 40:25 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దీపాలు వెలిగించాడు.
EXO 40:26 మోషే సమావేశ గుడారంలో తెర ఎదుట బంగారు ధూపవేదిక ఉంచి,
EXO 40:27 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, పరిమళ వాసనగల ధూపాన్ని దాని మీద కాల్చాడు.
EXO 40:28 తర్వాత అతడు సమావేశ గుడారపు ప్రవేశ ద్వారానికి తెర వేశాడు.
EXO 40:29 సమావేశ గుడారపు ద్వారానికి సమీపంగా దహనబలిపీఠాన్ని ఉంచి దాని మీద దహనబలి అర్పించి భోజనార్పణను సమర్పించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ఇది చేశాడు.
EXO 40:30 సమావేశ గుడారానికి బలిపీఠానికి మధ్యలో గంగాళాన్ని ఉంచి, కడుక్కోడానికి దానిలో నీళ్లు పోశాడు.
EXO 40:31 మోషే అహరోను అతని కుమారులు తమ చేతులు కాళ్లు కడుక్కోడానికి దీనిని ఉపయోగించారు.
EXO 40:32 వారు సమావేశ గుడారం లోనికి వెళ్లినప్పుడు బలిపీఠాన్ని సమీపించినప్పుడు కడుక్కునేవారు; యెహోవా మోషే ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ఇది చేశాడు.
EXO 40:33 తర్వాత మోషే సమావేశ గుడారానికి బలిపీఠానికి చుట్టూ ఆవరణాన్ని ఏర్పాటు చేసి ఆవరణ ద్వారానికి తెర వేశాడు. ఇలా మోషే పని ముగించాడు.
EXO 40:34 అప్పుడు సమావేశ గుడారాన్ని మేఘం కమ్మింది, యెహోవా మహిమతో సమావేశ గుడారం నిండింది.
EXO 40:35 ఆ మేఘం దాని మీద నిలిచి ఉండడం వల్ల, యెహోవా మహిమ సమావేశ గుడారాన్ని నింపివేసేది, కాబట్టి మోషే సమావేశ గుడారం లోనికి ప్రవేశించలేకపోయాడు.
EXO 40:36 ఇశ్రాయేలీయుల ప్రయాణాలన్నిటిలో, సమావేశ గుడారం మీద నుండి మేఘం పైకి వెళ్లినప్పుడు వారు బయలుదేరేవారు.
EXO 40:37 ఒకవేళ మేఘం పైకి వెళ్లకపోతే, అది పైకి వెళ్లేవరకు బయలుదేరేవారు కారు.
EXO 40:38 ఇశ్రాయేలీయుల ప్రయాణాలన్నిటిలో ఇశ్రాయేలీయులంతా చూస్తూ ఉండగా పగటివేళ యెహోవా మేఘం సమావేశ గుడారం మీద ఉండేది, రాత్రివేళ ఆ మేఘంలో అగ్ని ఉండేది.
LEV 1:1 యెహోవా మోషేను పిలిచి సమావేశ గుడారం నుండి అతనితో మాట్లాడారు. ఆయన అన్నారు,
LEV 1:2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘మీలో ఏ మనుష్యుడైనా యెహోవాకు అర్పణ తెచ్చినప్పుడు, మీ అర్పణగా పశువుల మంద నుండి గాని లేదా గొర్రెల మంద నుండి ఒక జంతువును తీసుకురావాలి.
LEV 1:3 “ ‘ఒకవేళ అర్పణ, మంద నుండి దహనబలి అయితే, మీరు లోపం లేని మగదానిని అర్పించాలి. అది యెహోవాకు అంగీకారంగా ఉండేలా మీరు దానిని సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సమర్పించాలి.
LEV 1:4 దహనబలి పశువు యొక్క తలపై మీరు చేయి ఉంచాలి, అప్పుడు అది మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి మీ తరపున అంగీకరించబడుతుంది.
LEV 1:5 మీరు కోడెను యెహోవా ఎదుట వధించాలి, అప్పుడు యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని తెచ్చి సమావేశ గుడారపు ద్వారం దగ్గర ఉన్న బలిపీఠం చుట్టూ చల్లుతారు.
LEV 1:6 తర్వాత అతడు దహనబలి పశువు చర్మం తీసి, దానిని ముక్కలుగా చేయాలి.
LEV 1:7 యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద నిప్పు పెట్టి ఆ నిప్పుమీద కట్టెలు పేర్చాలి.
LEV 1:8 అప్పుడు యాజకులైన అహరోను కుమారులు దాని తల, క్రొవ్వుతో పాటు, ముక్కలను బలిపీఠం మీద కాలుతున్న కట్టెల మీద పేర్చాలి.
LEV 1:9 అతడు లోపలి అవయవాలను కాళ్లను నీటితో కడగాలి, యాజకుడు వాటన్నిటిని బలిపీఠం మీద కాల్చాలి. అది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
LEV 1:10 “ ‘ఒకవేళ అర్పణ మంద నుండి తెచ్చిన దహనబలి అర్పణ అయితే, గొర్రెల నుండి గాని లేదా మేకల నుండి గాని, మీరు లోపం లేని మగవాటినే అర్పించాలి.
LEV 1:11 మీరు దానిని బలిపీఠానికి ఉత్తర దిక్కున యెహోవా ఎదుట వధించాలి, యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చల్లుతారు.
LEV 1:12 మీరు దానిని ముక్కలుగా చేయాలి, యాజకుడు దాని తల, క్రొవ్వుతో పాటు, వాటిని బలిపీఠం మీద కాలుతున్న కట్టెల మీద పేర్చాలి.
LEV 1:13 మీరు దాని లోపలి అవయవాలను కాళ్లను నీటితో కడగాలి, యాజకుడు వాటినన్నిటిని తెచ్చి బలిపీఠం మీద దహించాలి. అది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
LEV 1:14 “ ‘ఒకవేళ యెహోవాకు అర్పించే అర్పణ పక్షుల దహనబలి అయితే, మీరు పావురం లేదా గువ్వను అర్పించాలి.
LEV 1:15 యాజకుడు దానిని బలిపీఠం దగ్గరకు తెచ్చి, దాని తలను విరిచి బలిపీఠం మీద దానిని కాల్చాలి; దాని రక్తం బలిపీఠం ప్రక్కనే పిండాలి.
LEV 1:16 యాజకుడు ఆ పక్షి ప్రేగులను ఈకలను తీసివేసి అదంతా బలిపీఠానికి తూర్పుగా బూడిద ఉండే స్థలంలో పారవేయాలి.
LEV 1:17 పక్షిని పూర్తిగా విడదీయక, అతడు రెక్కల సందులో దానిని చీల్చాలి, అప్పుడు యాజకుడు బలిపీఠం మీద కాలుతున్న కట్టెల మీద దానిని కాల్చాలి. అది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
LEV 2:1 “ ‘ఎవరైనా యెహోవాకు భోజనార్పణ తెచ్చినప్పుడు, అది నాణ్యమైన పిండితో చేసినదై ఉండాలి. వారు దాని మీద ఒలీవనూనె పోసి, దానిపై ధూపం వేసి,
LEV 2:2 దానిని యాజకులైన అహరోను కుమారుల దగ్గరకు తీసుకురావాలి. యాజకుడు ఒక పిడికెడు పిండి, నూనె, ధూపమంతటితో పాటు తీసుకుని బలిపీఠం మీద దానిని ఒక జ్ఞాపకార్థ భాగంగా, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా దహించాలి.
LEV 2:3 భోజనార్పణలో మిగిలింది అహరోనుకు అతని కుమారులకు చెందుతుంది; యెహోవాకు అర్పించే హోమబలులలో ఇది అతిపరిశుద్ధమైనది.
LEV 2:4 “ ‘ఒకవేళ మీరు పొయ్యిలో కాల్చిన భోజనార్పణ తెస్తే, అది నాణ్యమైన పిండితో చేసినదై ఉండాలి: నూనె కలిపి చేసిన పులియని మందమైన రొట్టెలు లేదా నూనె రాసి చేసిన పులియని రొట్టెలు.
LEV 2:5 ఒకవేళ మీ భోజనార్పణ పెనం మీద కాల్చినదైతే, అది నాణ్యమైన పిండిలో నూనె కలిపి, పులుపు లేకుండ చేయబడాలి.
LEV 2:6 దానిని ముక్కలుగా చేసి, నూనె పోయాలి; అది భోజనార్పణ.
LEV 2:7 ఒకవేళ మీ భోజనార్పణ వంటపాత్రలో వండినదైతే, దానిని నాణ్యమైన పిండిలో కొంచెం నూనె కలిపి చేయాలి.
LEV 2:8 వీటితో చేయబడిన భోజనార్పణను యెహోవా దగ్గరకు తీసుకురావాలి; దానిని బలిపీఠం దగ్గరకు తీసుకెళ్లేలా యాజకునికి అప్పగించాలి.
LEV 2:9 యాజకుడు ఆ భోజనార్పణలో నుండి జ్ఞాపకార్థ భాగాన్ని తీసి బలిపీఠం మీద దానిని యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా కాల్చుతాడు.
LEV 2:10 భోజనార్పణలో మిగిలింది అహరోనుకు అతని కుమారులకు చెందుతుంది; యెహోవాకు అర్పించే హోమబలులలో ఇది అతిపరిశుద్ధమైనది.
LEV 2:11 “ ‘యెహోవాకు అర్పించే ప్రతి భోజనార్పణ పులిసిన పదార్థం లేకుండా ఉండాలి, ఎందుకంటే యెహోవాకు అర్పించే హోమబలిలో మీరు పులిసిన దానిని లేదా తేనెను దహించకూడదు.
LEV 2:12 వాటిని ప్రథమ ఫలంగా యెహోవాకు అర్పించవచ్చు కాని, బలిపీఠం మీద ఇష్టమైన సువాసనగల దానిగా వాటిని అర్పించకూడదు.
LEV 2:13 మీ భోజనార్పణలను అన్నిటికి ఉప్పు కలపండి. మీ దేవుని నిబంధన ఉప్పు లేకుండా మీ భోజనార్పణలు ఉండకూడదు; మీ అర్పణలన్నిటికీ ఉప్పు కలపండి.
LEV 2:14 “ ‘మీరు ప్రథమ ఫలాల భోజనార్పణ యెహోవా దగ్గరకు తీసుకువస్తే, క్రొత్త ధాన్యాన్ని దంచి అగ్నిలో వేయించి అర్పించాలి.
LEV 2:15 దాని మీద నూనె పోయాలి, ధూపం వేయాలి; అది భోజనార్పణ.
LEV 2:16 యాజకుడు జ్ఞాపకార్థ భాగమైన నలుగగొట్టిన ధాన్యాన్ని, నూనెను, ధూపంతో కలిపి యెహోవాకు హోమబలిగా దహించాలి.
LEV 3:1 “ ‘ఒకవేళ మీ అర్పణ సమాధానబలి అయితే, పశువుల్లో మగదానిని గాని, ఆడదానిని గాని, ఏ లోపం లేని దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి.
LEV 3:2 మీరు అర్పించిన పశువు మీద చేయి ఉంచి, సమావేశ గుడారపు ద్వారం దగ్గర దానిని వధించాలి. యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చిలకరించాలి.
LEV 3:3 సమాధానబలి అర్పణ నుండి మీరు యెహోవాకు హోమబలిని తీసుకురావాలి: లోపలి అవయవాలు, వాటికి ఉన్న సమస్త క్రొవ్వు,
LEV 3:4 రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మీరు మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి.
LEV 3:5 అహరోను కుమారులు బలిపీఠం మీద నిప్పుపై పేర్చిన కట్టెల మీద ఉన్న దహనబలితో పాటు వీటిని దహించాలి; అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
LEV 3:6 “ ‘ఒకవేళ మీరు మంద నుండి ఒక పశువును సమాధానబలిగా యెహోవాకు అర్పిస్తే, మగదైనా ఆడదైనా మీరు లోపం లేనిదే అర్పించాలి.
LEV 3:7 ఒకవేళ మీరు గొర్రెపిల్లను అర్పిస్తే, దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి.
LEV 3:8 మీరు దాని తలపై చేయి ఉంచి సమావేశ గుడారం ముందు దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూరా దాని రక్తం చల్లాలి.
LEV 3:9 సమాధానబలి నుండి మీరు యెహోవాకు హోమబలిని తీసుకురావాలి: ఆ బలి పశువు క్రొవ్వునూ, వెన్నెముక చివర వరకు ఉండే క్రొవ్వు పట్టిన తోకంతటిని, దాని అంతర్భాగాలకు పట్టి ఉన్న క్రొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే క్రొవ్వునూ పూర్తిగా తీసుకురావాలి,
LEV 3:10 రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి.
LEV 3:11 యాజకుడు వాటిని బలిపీఠం మీద యెహోవాకు హోమబలిగా దహించాలి.
LEV 3:12 “ ‘ఒకవేళ మీరు మేకను అర్పించాలంటే, దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి.
LEV 3:13 మీరు దాని తలమీద చేయి పెట్టి సమావేశ గుడారం ముందు దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూరా దాని రక్తం చల్లాలి.
LEV 3:14 మీరు అర్పించే దాని నుండి హోమబలి యెహోవా ఎదుట సమర్పించాలి: లోపలి అవయవాలు వాటి మీద ఉన్న కొవ్వంతా.
LEV 3:15 రెండు మూత్రపిండాలు నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి.
LEV 3:16 యాజకుడు వాటిని హోమబలిగా యెహోవాకు ఇష్టమైన సువాసనగల అర్పణగా బలిపీఠం మీద కాల్చివేయాలి. కొవ్వంతా యెహోవాదే.
LEV 3:17 “ ‘మీరెక్కడ ఉన్నాసరే క్రొవ్వును గాని రక్తాన్ని గాని అసలు తినకూడదు. ఇది మీ రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.’ ”
LEV 4:1 యెహోవా మోషేతో అన్నారు,
LEV 4:2 “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా అనుకోకుండ పాపం చేసి, యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైన చేసినప్పుడు ఇలా చేయాలి.
LEV 4:3 “ ‘అభిషేకించబడిన యాజకుడు పాపం చేసి ప్రజలపై అపరాధాన్ని తెస్తే, అతడు చేసిన పాపానికి పాపపరిహారబలిగా లోపం లేని ఒక కోడెను యెహోవా దగ్గరకు తీసుకురావాలి.
LEV 4:4 ఆ కోడెను యెహోవా ఎదుట సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకురావాలి. దాని తలపై చేయి పెట్టి యెహోవా ఎదుట దానిని వధించాలి.
LEV 4:5 అప్పుడు అభిషేకించబడిన యాజకుడు ఆ కోడె రక్తాన్ని కొంత సమావేశ గుడారం లోనికి తీసుకురావాలి.
LEV 4:6 అతడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి పరిశుద్ధాలయం యొక్క తెర ముందు యెహోవా ఎదుట ఏడుసార్లు ఆ రక్తాన్ని చిలకరించాలి.
LEV 4:7 యాజకుడు అప్పుడు కొంచెం రక్తాన్ని సమావేశ గుడారంలో యెహోవా ఎదుట ఉన్న పరిమళ వాసనగల ధూపవేదిక కొమ్ములపై పూయాలి. మిగిలిన ఎద్దు రక్తం అతడు సమావేశ గుడార ద్వారం దగ్గర దహనబలి యొక్క బలిపీఠం అడుగున పోయాలి.
LEV 4:8 పాపపరిహారబలి కోసం తెచ్చిన కోడె యొక్క క్రొవ్వంతా అంటే లోపలి అవయవాలకు ఉన్న క్రొవ్వు,
LEV 4:9 రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు
LEV 4:10 సమాధానబలిగా అర్పించబడే ఎద్దు క్రొవ్వును తీసేసినట్లే తీయాలి. అప్పుడు యాజకుడు వాటిని దహనబలి యొక్క బలిపీఠం మీద కాల్చాలి.
LEV 4:11 అయితే కోడెలో ఇంకా మిగిలి ఉన్నవి అంటే చర్మం, దాని పూర్తి మాంసం, తల, కాళ్లు, లోపలి అవయవాలు, పేడ
LEV 4:12 అంటే కోడె శేషమంతటిని శిబిరం బయట ఆచార ప్రకారం శుభ్రమైన ప్రదేశానికి, బూడిద పడవేయబడే స్థలానికి తీసుకెళ్లి, బూడిద కుప్ప మీద కట్టెల మంటలో దానిని కాల్చాలి.
LEV 4:13 “ ‘ఒకవేళ ఇశ్రాయేలీయుల సమాజమంతా పొరపాటున యెహోవా చేయకూడదని ఆజ్ఞాపించిన విషయాల్లో దేనినైనా చేసి అపరాధులై తాము చేసిన తప్పును గ్రహించినప్పుడు, సమాజానికి ఈ విషయం తెలియకపోయినా, వారు అపరాధులు,
LEV 4:14 వారు చేసిన పాపం బయటపడినప్పుడు, సమాజం పాపపరిహారబలిగా ఒక కోడెను తెచ్చి సమావేశ గుడారం ఎదుట సమర్పించాలి.
LEV 4:15 సమాజపెద్దలు యెహోవా ఎదుట కోడె తలమీద చేతులు ఉంచి యెహోవా ఎదుట కోడెను వధించాలి.
LEV 4:16 అప్పుడు అభిషేకించబడిన యాజకుడు కోడె రక్తంలో కొంత భాగాన్ని సమావేశ గుడారంలోకి తీసుకెళ్లాలి.
LEV 4:17 అతడు ఆ రక్తంలో వ్రేలు ముంచి యెహోవా ఎదుట ఏడుసార్లు తెర ఎదుట చిలకరించాలి.
LEV 4:18 అతడు సమావేశ గుడారంలో యెహోవా ఎదుట ఉన్న బలిపీఠం కొమ్ములపై కొంత రక్తాన్ని పూసి మిగిలిన రక్తం సమావేశ గుడార ద్వారం దగ్గర దహనబలి యొక్క బలిపీఠం అడుగున పోయాలి.
LEV 4:19 అతడు దాని కొవ్వంతా తీసి బలిపీఠం మీద దహించాలి,
LEV 4:20 పాపపరిహారబలి కోసం కోడెను చేసినట్లే దీనికి కూడా చేయాలి. ఈ విధంగా యాజకుడు సమాజానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడు వారు క్షమించబడతారు.
LEV 4:21 తర్వాత అతడు ఎద్దును శిబిరం బయటకు తీసుకెళ్లి మొదటి ఎద్దును కాల్చినట్లుగా దానిని కాల్చాలి. ఇది సమాజం కోసం చేసిన పాపపరిహారబలి.
LEV 4:22 “ ‘ఒక నాయకుడు అనుకోకుండ పాపం చేసి, తన దేవుడైన యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైనా చేసినప్పుడు, అతడు అపరాధి,
LEV 4:23 తాను దేన్ని బట్టి పాపం చేశాడో తెలుకున్నప్పుడు అతడు లోపం లేని మేకపోతును అర్పణగా తీసుకురావాలి.
LEV 4:24 అతడు మేక తలపై చేయి ఉంచి, యెహోవా ఎదుట దహనబలిని వధించిన స్థలంలో దానిని వధించాలి. ఇది పాపపరిహారబలి.
LEV 4:25 అప్పుడు యాజకుడు పాపపరిహారబలి రక్తం నుండి కొంత రక్తాన్ని తన వ్రేలితో తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి.
LEV 4:26 అతడు సమాధాన బలిపశువు క్రొవ్వును కాల్చినట్టే దీని క్రొవ్వంతా తీసి బలిపీఠం మీద కాల్చాలి. ఈ విధంగా యాజకుడు ఆ నాయకుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడు అతడు క్షమించబడతాడు.
LEV 4:27 “ ‘సమాజంలోని ఏ సభ్యుడైనా అనుకోకుండ పాపం చేసి, యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైన చేస్తే, వారు అపరాధులు,
LEV 4:28 వారు చేసిన పాపం తెలియ వచ్చినప్పుడు, వారు చేసిన పాపం కోసం తమ అర్పణగా లోపం లేని ఆడ మేకను తీసుకురావాలి.
LEV 4:29 వారు పాపపరిహారబలి యొక్క తలపై చేయి ఉంచి, దహనబలి చేసిన స్థలంలో దానిని వధించాలి.
LEV 4:30 అప్పుడు యాజకుడు తన వ్రేలితో కొంత రక్తాన్ని తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి.
LEV 4:31 సమాధానబలి నుండి క్రొవ్వును తీసినట్లే వారు కొవ్వంతా తీస్తారు, యాజకుడు దానిని బలిపీఠం మీద యెహోవాకు ఇష్టమైన సువాసనగా కాల్చాలి. ఈ విధంగా యాజకుడు వారికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.
LEV 4:32 “ ‘ఎవరైనా తమ పాపపరిహారబలిగా గొర్రెపిల్లను తెస్తే, వారు లోపం లేని ఆడదానిని తీసుకురావాలి.
LEV 4:33 వారు దాని తలపై చేయి వేసి దహనబలిని వధించిన స్థలంలో దానిని పాపపరిహారబలిగా వధించాలి.
LEV 4:34 అప్పుడు యాజకుడు పాపపరిహారబలిలో కొంత రక్తాన్ని తన వ్రేలితో తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి.
LEV 4:35 సమాధానబలి యొక్క గొర్రెపిల్ల నుండి క్రొవ్వును తీసినట్లే వారు సమస్త క్రొవ్వును తీస్తారు, యాజకుడు దానిని యెహోవాకు సమర్పించిన హోమబలుల పైన బలిపీఠం మీద కాల్చాలి. ఈ విధంగా యాజకుడు వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.
LEV 5:1 “ ‘ఒకవేళ ఎవరైనా ఒట్టు పెట్టుకోవడం వల్ల తాము చూసిన దాని గురించి గాని తమకు తెలిసిన దాని గురించి గాని నిజం చెప్పాల్సి ఉండి దాని గురించి వారు మాట్లాడకుండా పాపం చేస్తే, దానికి వారే శిక్షను భరిస్తారు.
LEV 5:2 “ ‘ఒకవేళ ఎవరైనా తాము అపరాధులని తెలుసుకుంటే పొరపాటున ఆచారరీత్య అపవిత్రమైన దానిని తాకితే (అపవిత్రమైన జంతువు కళేబరం, అది అడవిదైనా పెంపుడుదైనా, లేదా భూమి మీద ప్రాకే జీవియైనా కావచ్చు), వారు అపవిత్రులయ్యారు అని వారికి అవగాహన లేకపోతే, తర్వాత తాము గ్రహిస్తే,
LEV 5:3 లేదా ఒకవేళ వారు పొరపాటున మనుష్యులను అపవిత్రం చేసే దేనినైనా తాకితే, దాని గురించి తెలుసుకున్నా తర్వాత వారు అపరాధులు అవుతారు,
LEV 5:4 లేదా మనుష్యులెవరైనా అనాలోచితంగా మంచి గాని చెడు గాని చేస్తానని పొరపాటున ప్రమాణం చేసి, దాని గురించి తెలిసిన తర్వాత వారు అపరాధులు అని గ్రహిస్తారు.
LEV 5:5 ఎవరైనా ఈ విషయాల్లో అపరాధులని గ్రహిస్తే, వారు ఏ విధంగా పాపం చేశారో అది ఒప్పుకోవాలి.
LEV 5:6 వారు చేసిన పాపానికి జరిమానాగా, వారు మంద నుండి ఆడ గొర్రెపిల్ల లేదా మేకను పాపపరిహారబలిగా యెహోవా దగ్గరకు తీసుకురావాలి; యాజకుడు వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి.
LEV 5:7 “ ‘గొర్రెపిల్లను కొనలేని వారెవరైనా వారి పాపానికి జరిమానాగా రెండు పావురాలు లేదా రెండు చిన్న గువ్వలను యెహోవా దగ్గరకు తీసుకురావాలి, వాటిలో ఒకటి పాపపరిహారబలి కోసం మరొకటి దహనబలి కోసము.
LEV 5:8 అతడు వాటిని యాజకుడి దగ్గరకు తీసుకురావాలి, యాజకుడు మొదట పాపపరిహారబలి అర్పిస్తాడు. అతడు దాని తలను దాని మెడ నుండి పూర్తిగా వేరు చేయకుండ, మెలిపెట్టాలి, తల విరిచేయకూడదు,
LEV 5:9 పాపపరిహారబలి యొక్క రక్తంలో కొంత భాగాన్ని బలిపీఠం వైపు చల్లాలి; మిగిలిన రక్తం బలిపీఠం యొక్క అడుగు నుండి బయటకు పంపాలి. ఇది పాపపరిహారబలి.
LEV 5:10 యాజకుడు మరొకదాన్ని నిర్ణీత విధానంలో దహనబలిగా అర్పించి, వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి, వారు క్షమించబడతారు.
LEV 5:11 “ ‘అయితే, ఒకవేళ వారు రెండు పావురాలు లేదా రెండు గువ్వలను కొనలేకపోతే, వారు తమ పాపానికి బలిగా పాపపరిహారబలి కోసం ఒక ఓమెరు నాణ్యమైన పిండి తీసుకురావాలి. వారు దానిపై ఒలీవనూనె గాని ధూపం గాని పెట్టకూడదు, ఎందుకంటే అది పాపపరిహారబలి.
LEV 5:12 వారు దానిని యాజకుని దగ్గరకు తీసుకురావాలి, అతడు దానిలో ఒక చేతినిండ భాగాన్ని జ్ఞాపక భాగంగా తీసుకుని యెహోవాకు సమర్పించిన హోమబలుల పైన బలిపీఠం మీద కాల్చాలి. ఇది పాపపరిహారబలి.
LEV 5:13 ఈ విధంగా యాజకుడు వారు చేసిన ఈ పాపాల్లో దేనికోసమైనా ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు. మిగిలిన అర్పణ, భోజనార్పణ మాదిరిగానే యాజకునికి చెందుతుంది.’ ”
LEV 5:14 యెహోవా మోషేతో ఇలా అన్నారు:
LEV 5:15 “యెహోవాకు చెందిన పరిశుద్ధమైన వాటిలో దేని విషయంలోనైనా, ఎవరైనా అనుకోకుండ పాపం చేసి ఎవరైనా యెహోవా పట్ల నమ్మకద్రోహులైతే, వారు మంద నుండి లోపం లేని, పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం, వెండిలో సరియైన విలువగల ఒక పొట్టేలును ప్రాయశ్చిత్తంగా తీసుకురావాలి. ఇది అపరాధపరిహారబలి.
LEV 5:16 ఆ వ్యక్తి పవిత్ర పదార్థం విషయంలో తప్పిదం చేసినందుకు, అధనంగా దాని విలువలో అయిదవ వంతు నష్టపరిహారం చెల్లించి అదంతా యాజకునికి ఇవ్వాలి. యాజకుడు పొట్టేలును అపరాధపరిహారబలిగా వారికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.
LEV 5:17 “ఎవరైనా పాపం చేసి, యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైన చేసినప్పుడు, అది వారికి తెలియకపోయినా సరే, వారు అపరాధులు, కాబట్టి వారు శిక్ష భరిస్తారు.
LEV 5:18 వారు మంద నుండి అపరాధపరిహారబలిగా, ఒక లోపం లేని, సరియైన విలువగల పొట్టేలును యాజకుని దగ్గరకు తీసుకురావాలి. ఈ విధంగా యాజకుడు వారు అనుకోకుండ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.
LEV 5:19 ఇది అపరాధ పరిహారార్థబలి; అతడు యెహోవాకు విరోధంగా తప్పు చేసినందుకు అపరాధి అయ్యాడు.”
LEV 6:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు:
LEV 6:2 “ఒకవేళ మనుష్యులెవరైనా తన పొరుగువాడు తనకు అప్పగించిన దాని విషయంలో ఆ వ్యక్తిని మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక ఒత్తిడిచేసినా, లేక పొరుగువాడు పోగొట్టుకున్న వస్తువు దొరికినా సరే దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి వాటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకు వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపమే అవుతుంది.
LEV 6:4 వారు వీటిలోని దేని విషయంలోనైనా పాపం చేసి తమ అపరాధాన్ని గ్రహిస్తే, వారు దొంగిలించిన లేదా దోపిడి ద్వారా తీసుకున్నా, లేదా వారికి అప్పగించబడినదైనా, లేదా పోయిన ఆస్తి తిరిగి దొరికినదైనా,
LEV 6:5 లేదా వారు అబద్ధ ప్రమాణం చేసినదైనా, వారు తప్పక పూర్తి నష్టపరిహారం చెల్లించాలి, దానికి దాని వెలలో అయిదవ వంతు కలిపి వారు తమ అపరాధపరిహారబలి సమర్పించే రోజున దానినంతటిని యజమానికి ఇవ్వాలి.
LEV 6:6 నిర్ణయించిన విలువ ప్రకారం వారు మందలో నుండి యెహోవాకు అపరాధపరిహారబలిగా ఒక లోపం లేని పొట్టేలును జరిమానాగా యాజకుని దగ్గరకు తీసుకురావాలి.
LEV 6:7 ఈ విధంగా యాజకుడు యెహోవా ఎదుట వారి కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు అపరాధులవడానికి కారణమైన కృత్యాల నుండి వారు క్షమించబడతారు.”
LEV 6:8 యెహోవా మోషేతో ఇలా అన్నారు:
LEV 6:9 “అహరోనుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు: ‘ఇది దహనబలికి సంబంధించిన నియమం: దహనబలి రాత్రి నుండి ఉదయం వరకు బలిపీఠం పొయ్యిపై ఉండాలి, బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి.
LEV 6:10 యాజకుడు తన నారబట్టలు నారలోదుస్తులు వేసుకుని, బలిపీఠం మీద అగ్నికి కాలిపోయిన దహనబలి అర్పణ బూడిదను తీసి బలిపీఠం ప్రక్కన ఉంచాలి.
LEV 6:11 తర్వాత అతడు ఈ బట్టలు విడిచి వేరే దుస్తులు ధరించి శిబిరం బయట ఆచార ప్రకారంగా శుభ్రంగా ఉన్న స్థలానికి ఆ బూడిద తీసుకెళ్లాలి.
LEV 6:12 బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి; అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు పేర్చి, మంట మీద దహనబలి ఉంచి సమాధానబలుల క్రొవ్వును దహించాలి.
LEV 6:13 బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూ ఉండాలి; అది ఆరిపోకూడదు.
LEV 6:14 “ ‘ఇవి భోజనార్పణకు సంబంధించిన నియమాలు: అహరోను కుమారులు యెహోవా ఎదుట బలిపీఠం ఎదురుగా దానిని అర్పించాలి.
LEV 6:15 యాజకుడు భోజనార్పణలో నుండి పిడికెడు నాణ్యమైన పిండిని కొంచెం ఒలీవ నూనెను సాంబ్రాణి మొత్తాన్ని తీసుకుని వాటిని జ్ఞాపక భాగంగా బలిపీఠం మీద యెహోవాకు ఇష్టమైన సువాసనగా దహించాలి.
LEV 6:16 అందులో మిగిలింది అహరోను అతని కుమారులు తినాలి, అయితే పరిశుద్ధాలయ ప్రాంతంలో పులియకుండా దానిని తినాలి; సమావేశ గుడారం యొక్క ఆవరణంలో వారు దానిని తినాలి.
LEV 6:17 దానిని పులిసిన దానితో కలిపి కాల్చకూడదు; నాకు సమర్పించిన హోమబలులలో నేను దానిని వారి వాటాగా ఇచ్చాను. పాపపరిహారబలిలా అపరాధపరిహారబలిలా, ఇది అతిపరిశుద్ధము.
LEV 6:18 అహరోను వంశస్థుడు ఎవరైనా దానిని తినవచ్చు. అన్ని తరాలకు ఇది యెహోవాకు సమర్పించబడే హోమబలులలో అతని శాశ్వత వాటా. వాటిని ఏది తాకినా అది పవిత్రమవుతుంది.’ ”
LEV 6:19 యెహోవా మోషేకు ఇలా కూడా చెప్పారు,
LEV 6:20 “అహరోను అభిషేకించబడిన రోజున అతడు, అతని కుమారులు యెహోవా దగ్గరకు తీసుకురావలసిన అర్పణ ఇది: భోజనార్పణగా ఒక ఓమెరు నాణ్యమైన పిండి ఉదయం సగం, సాయంత్రం సగం అర్పించాలి.
LEV 6:21 దానిని పెనం మీద నూనెతో కాల్చాలి; బాగా కాల్చి ముక్కలుగా చేసిన భోజనార్పణను యెహోవాకు ఇష్టమైన సువాసనగా సమర్పించాలి.
LEV 6:22 ప్రధాన యాజకునిగా అతని తర్వాత వచ్చే కుమారుడు దానిని సిద్ధం చేయాలి. ఇది యెహోవాకు శాశ్వత వాటా, ఇది పూర్తిగా దహించబడాలి.
LEV 6:23 యాజకుడు అర్పించే ప్రతి భోజనార్పణను పూర్తిగా దహించబడాలి; దానిని తినకూడదు.”
LEV 6:24 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 6:25 “అహరోను, అతని కుమారులకు ఇలా చెప్పు: ‘పాపపరిహారబలికి సంబంధించిన నియమాలు ఇవే: దహనబలిని వధించే స్థలంలోనే పాపపరిహారబలి పశువులను కూడా యెహోవా ఎదుట వధించాలి. అది అతిపరిశుద్ధము.
LEV 6:26 పాపపరిహారం కోసం దానిని అర్పించే యాజకుడు దానిని తినాలి; పరిశుద్ధాలయ ప్రాంతంలో, సమావేశ గుడారం యొక్క ఆవరణంలో దానిని తినాలి.
LEV 6:27 బలి మాంసానికి తగిలే ప్రతిదీ పవిత్రమవుతుంది, దాని రక్తంలో కొంచెమైనా సరే వస్త్రం మీద పడితే ఆ వస్త్రాన్ని మీరు పరిశుద్ధాలయ ప్రాంతంలో ఉతకాలి.
LEV 6:28 ఆ మాంసం వండిన మట్టికుండను పగులగొట్టాలి. ఒకవేళ ఇత్తడి పాత్రలో వండితే, దానిని తోమి నీళ్లతో కడగాలి.
LEV 6:29 యాజకుడి కుటుంబంలో ప్రతి పురుషుడు దానిని తినాలి. అది అతిపరిశుద్ధము.
LEV 6:30 కాని పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయటానికి సమావేశ గుడారంలోకి తేబడిన రక్తం ఏ పాపపరిహారబలిదైనాసరే తినకూడదు; దానిని కాల్చివేయాలి.
LEV 7:1 “ ‘అతిపరిశుద్ధమైన, అపరాధపరిహారబలికి సంబంధించిన నియమాలు ఇవి:
LEV 7:2 దహనబలి వధించబడిన స్థలంలోనే అపరాధపరిహారబలిని వధించాలి, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాలి.
LEV 7:3 దాని కొవ్వంతా అనగా క్రొవ్విన తోక, లోపలి అవయవాలపై ఉన్న క్రొవ్వు,
LEV 7:4 రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి.
LEV 7:5 యెహోవాకు అర్పించిన హోమబలిగా యాజకుడు వాటిని బలిపీఠం మీద కాల్చివేయాలి. ఇది అపరాధపరిహారబలి.
LEV 7:6 యాజకుల కుటుంబాలలో ప్రతి పురుషుడు దాన్ని పరిశుద్ధాలయ ప్రాంగణంలో తినవచ్చు; అది అతిపరిశుద్ధము.
LEV 7:7 “ ‘అదే నియమం పాపపరిహారబలి, అపరాధపరిహారబలి, రెండింటికీ వర్తిస్తుంది: వాటితో ప్రాయశ్చిత్తం చేసే యాజకునికి అవి చెందుతాయి.
LEV 7:8 దహనబలి తెచ్చినప్పుడు దాన్ని అర్పించే యాజకునికి ఆ బలి పశువు చర్మం చెందుతుంది.
LEV 7:9 ప్రతి భోజనార్పణ, పొయ్యిమీద వండిందైనా కుండలో లేదా పెనం మీద చేయబడినదైనా గాని, అర్పించే యాజకునికి చెందుతుంది.
LEV 7:10 ప్రతి భోజనార్పణ, ఒలీవనూనెతో కలిపినదైనా లేదా పొడిగా ఉన్నదైనా, అహరోను కుమారులందరికి సమానంగా చెందుతుంది.
LEV 7:11 “ ‘ఎవరైనా యెహోవాకు సమాధానబలి సమర్పించాలంటే నియమాలు ఇవి:
LEV 7:12 “ ‘ఒకవేళ వారు దానిని కృతజ్ఞత అర్పణగా అర్పిస్తే, కృతజ్ఞతార్పణతో పాటు వారు ఒలీవనూనె కలిపి చేసిన పులియని మందమైన రొట్టెలు, నూనె రాసి తయారుచేసిన పులియని సన్నని రొట్టెలు, నూనె కలిపి మెత్తగా పిసికిన నాణ్యమైన పిండితో తయారుచేసిన మందమైన రొట్టెలు అర్పించాలి.
LEV 7:13 కృతజ్ఞతతో కూడిన సమాధానబలితో పాటు వారు పులిసిన మందమైన రొట్టెలను సమర్పించాలి.
LEV 7:14 వారు ప్రతి దానిలో నుండి ఒకదాన్ని అర్పణగా, యెహోవాకు ప్రత్యేక నైవేద్యంగా తీసుకురావాలి; అది బలిపీఠం వైపు సమాధానబలి రక్తాన్ని ప్రోక్షించిన యాజకునికి చెందుతుంది.
LEV 7:15 కృతజ్ఞతతో అర్పించిన సమాధానబలి మాంసం అది అర్పించిన రోజే వారు తినాలి; ఉదయం వరకు అందులో దేన్ని మిగిలించకూడదు.
LEV 7:16 “ ‘ఒకవేళ వారి అర్పణ మ్రొక్కుబడి కోసం గాని, స్వేచ్ఛార్పణ గాని అయితే, దానిని అర్పించిన రోజే తినాలి, అయితే మిగిలింది మరుసటిరోజు తినవచ్చు.
LEV 7:17 మూడవ రోజు ఆ బలి మాంసంలో ఏమైనా మిగిలితే దానిని కాల్చివేయాలి.
LEV 7:18 సమాధానబలి మాంసం మూడవ రోజు కాబట్టి తింటే దానిని అర్పించిన వారు అంగీకరించబడరు. తెచ్చిన వానికి గుర్తింపు ఉండదు, ఎందుకంటే అది అపవిత్రమైంది; కాబట్టి దానిలో ఏదైన తింటే వారు దోషశిక్షను భరిస్తారు.
LEV 7:19 “ ‘మాంసానికి ఏదైనా ఆచారరీత్య అపవిత్ర పదార్థం తగిలితే అది తినకూడదు. అది కాల్చివేయాలి. ఇతర మాంసం అయితే ఆచార ప్రకారం శుభ్రంగా ఉన్నవారు తినవచ్చు.
LEV 7:20 కాని అపవిత్రంగా ఉన్న ఎవరైనా యెహోవాకు చెందిన సమాధానబలి మాంసం తింటే, వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.
LEV 7:21 ఎవరైనా అపవిత్రమైన దాన్ని అది మానవ అపవిత్రత గాని అపవిత్రమైన జంతువునే గాని నేలపై ప్రాకే జీవులనే గాని తాకి, యెహోవాకు చెందిన సమాధానబలి మాంసం తింటే, వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.’ ”
LEV 7:22 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 7:23 “నీవు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘పశువులదే గాని గొర్రెలదే గాని లేదా మేకలదే గాని క్రొవ్వును మీరు తినకూడదు.
LEV 7:24 చచ్చిన జంతువు క్రొవ్వును లేదా అడవి మృగాలు చీల్చిన జంతువు క్రొవ్వును దేనికైనా ఉపయోగించవచ్చు కాని దానిని తినకూడదు.
LEV 7:25 ఎవరైనా యెహోవాకు హోమబలిగా అర్పించే జంతువు యొక్క క్రొవ్వును తింటే వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.
LEV 7:26 మీరు నివసించే చోట పక్షి రక్తం గాని, జంతు రక్తం గాని తినకూడదు.
LEV 7:27 ఎవరైనా రక్తాన్ని తింటే వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.’ ”
LEV 7:28 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 7:29 “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా యెహోవాకు సమాధానబలిని తెస్తే, దానిలో ఒక భాగాన్ని ప్రత్యేకంగా యెహోవాకు అర్పించాలి.
LEV 7:30 వారు తమ స్వహస్తాలతో హోమబలిని యెహోవాకు అర్పించాలి; వారు రొమ్ము భాగాన్ని దాని మీద ఉన్న క్రొవ్వుతో పాటు తెచ్చి, ఆ రొమ్ము భాగాన్ని యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి.
LEV 7:31 యాజకుడు ఆ క్రొవ్వును బలిపీఠం మీద దహించాలి, కాని రొమ్ము భాగం అహరోను, అతని కుమారులకు చెందుతుంది.
LEV 7:32 సమాధానబలులలో నుండి తీసిన కుడి తొడను యాజకునికి కానుకగా ఇవ్వాలి.
LEV 7:33 అహరోను కుమారులలో ఎవరైతే సమాధానబలి రక్తాన్ని, క్రొవ్వును అర్పిస్తాడో అతడు ఆ కుడి తొడను తన వాటాగా తీసుకోవచ్చు.
LEV 7:34 ఇశ్రాయేలీయుల సమాధానబలులలో నుండి నేను పైకెత్తిన రొమ్ము భాగాన్ని, అర్పించిన తొడను తీసుకుని యాజకుడైన అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలీయుల నుండి శాశ్వత వాటాగా ఇచ్చాను.’ ”
LEV 7:35 ఇది యెహోవాకు అర్పించిన హోమబలులలో అహరోను, అతని కుమారులు యెహోవాకు యాజకులుగా సేవ చేయడానికి సమర్పించబడిన రోజున వారికి కేటాయించబడిన వాటా.
LEV 7:36 వారు అభిషేకించబడిన రోజున, ఇశ్రాయేలీయులు రాబోయే తరాలకు తమ శాశ్వత వాటాగా ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించారు.
LEV 7:37 దహనబలికి, భోజనార్పణకు, పాపపరిహారబలికి, అపరాధపరిహారబలికి, ప్రతిష్ఠార్పణకు, సమాధానబలికి ఇవి నియమాలు,
LEV 7:38 వీటిని ఇశ్రాయేలీయులు తమ అర్పణలను యెహోవా దగ్గరకు తీసుకురావాలని ఆజ్ఞాపించిన రోజున యెహోవా సీనాయి అరణ్యంలోని సీనాయి పర్వతం దగ్గర మోషేకు ఇచ్చారు.
LEV 8:1 యెహోవా మోషేతో చెప్పారు,
LEV 8:2 “నీవు అహరోనును అతని కుమారులను, వారి వస్త్రాలను, అభిషేక తైలాన్ని, పాపపరిహారబలికి ఒక కోడెను, రెండు పొట్టేళ్లను గంపెడు పులియని రొట్టెలు తీసుకువచ్చి,
LEV 8:3 సమాజమంతటిని సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సమకూర్చాలి.”
LEV 8:4 యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడు, అలాగే సమాజం సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సమావేశమయ్యింది.
LEV 8:5 “యెహోవా ఇలా చేయాలని ఆజ్ఞాపించారు” అని మోషే సమాజానికి చెప్పాడు.
LEV 8:6 అప్పుడు మోషే, అహరోనును, అతని కుమారులను ముందుకు తెచ్చి నీటితో వారిని కడిగాడు.
LEV 8:7 అతడు అహరోను మీద పైవస్త్రం వేసి, నడికట్టు కట్టి, ఏఫోదు వస్త్రాన్ని, అలాగే ఏఫోదును అతనికి ధరింపజేశాడు. అతడు ఏఫోదును అల్లబడిన నడికట్టుతో అతనికి చుట్టూ కట్టాడు.
LEV 8:8 అతడు రొమ్ము పతకాన్ని అతనిపై ఉంచాడు, రొమ్ము పతకం లోపల ఊరీము తుమ్మీములను అమర్చాడు.
LEV 8:9 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు అహరోను తలమీద తలపాగాను పెట్టి, దానికి బంగారు పలకను అమర్చి దానికి పవిత్ర చిహ్నాన్ని తగిలించాడు.
LEV 8:10 తర్వాత మోషే అభిషేక తైలాన్ని తీసుకుని సమావేశ గుడారాన్ని, దానిలోని ప్రతిదాన్ని అభిషేకించి, వాటిని పవిత్రం చేశాడు.
LEV 8:11 అతడు బలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటిని, దాని గంగాళాన్ని దాని పీటను ప్రతిష్ఠించడానికి, బలిపీఠం మీద ఏడుసార్లు కొంచెం నూనె చిలకరించి వాటిని అభిషేకించాడు.
LEV 8:12 అహరోనును ప్రతిష్ఠించడానికి అభిషేక తైలంలో కొంచెం అతని తలమీద పోశాడు.
LEV 8:13 తర్వాత యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా అతడు అహరోను కుమారులను ముందుకు తీసుకువచ్చి, వారికి చొక్కాలు తొడిగించి నడికట్టు కట్టి, వారి తలల మీద టోపీలను పెట్టాడు.
LEV 8:14 తర్వాత అతడు పాపపరిహారబలి కోసం ఎద్దును సమర్పించాడు, దాని తలపై అహరోను అతని కుమారులు తమ చేతులు ఉంచారు.
LEV 8:15 మోషే ఎద్దును వధించి, కొంత రక్తాన్ని తీసుకుని, బలిపీఠం శుద్ధి చేయడానికి, తన వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద దానిని పూసాడు. మిగిలిన రక్తాన్ని అతడు బలిపీఠం అడుగున పోశాడు. కాబట్టి మోషే దానికి ప్రాయశ్చిత్తం చేసి దానిని ప్రతిష్ఠించాడు.
LEV 8:16 మోషే లోపలి అవయవాల చుట్టూ ఉన్న క్రొవ్వునంతటిని, కాలేయం మీది క్రొవ్వు, రెండు మూత్రపిండాలు వాటి క్రొవ్వును తీసుకుని బలిపీఠం మీద కాల్చాడు.
LEV 8:17 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, కోడెను, దాని చర్మాన్ని దాని మాంసాన్ని, దాని పేడను శిబిరం బయట కాల్చివేశాడు.
LEV 8:18 తర్వాత అతడు దహనబలికి పొట్టేలును తీసుకువచ్చినప్పుడు, దాని తలపై అహరోను అతని కుమారులు చేతులుంచారు.
LEV 8:19 అప్పుడు మోషే పొట్టేలును వధించి దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు.
LEV 8:20 అతడు పొట్టేలును ముక్కలు చేసి తలను, ముక్కలను, క్రొవ్వును కాల్చాడు.
LEV 8:21 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దాని లోపలి అవయవాలను కాళ్లను నీళ్లతో కడిగి పొట్టేలంతటిని బలిపీఠం మీద కాల్చాడు. అది దహనబలి, యెహోవాకు సమర్పించబడిన ఇష్టమైన సువాసనగల హోమబలి.
LEV 8:22 తర్వాత మోషే మరొక పొట్టేలును అనగా యాజకుని నియామకం కోసం కావలసిన పొట్టేలును తీసుకువచ్చినప్పుడు, అహరోను అతని కుమారులు దాని తలమీద వారి చేతులుంచారు.
LEV 8:23 మోషే పొట్టేలును వధించి, దాని రక్తం కొంత తీసుకుని అహరోను కుడిచెవి అంచుకు, కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలి బొటన వ్రేలి మీద పూసాడు.
LEV 8:24 మోషే అహరోను కుమారులను కూడా ముందుకు పిలిచి వారి కుడిచెవి అంచుకు, కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలు బొటన వ్రేలి మీద పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు.
LEV 8:25 తర్వాత దాని క్రొవ్వును, తోకకు ఉన్న క్రొవ్వును, లోపలి అవయవాలపై ఉన్న క్రొవ్వునంతటిని, కాలేయం మీది క్రొవ్వును, రెండు మూత్రపిండాలను వాటి క్రొవ్వును, వాటి కుడి తొడను తీసుకున్నాడు.
LEV 8:26 యెహోవా ఎదుట ఉన్న పులియని రొట్టెల గంపలో నుండి ఒక మందమైన రొట్టెను, ఒలీవనూనె కలిపి చేసిన ఒక మందమైన రొట్టెను, ఒక పల్చని రొట్టెను తీసుకుని, ఆ క్రొవ్వు మీద, కుడి తొడ మీద ఉంచాడు.
LEV 8:27 అవన్నీ అహరోను, అతని కుమారుల చేతుల్లో పెట్టగా, వారు యెహోవా ఎదుట వాటిని పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించారు.
LEV 8:28 తర్వాత మోషే వారి చేతుల్లో నుండి వాటిని తీసుకుని బలిపీఠం మీద ఉన్న దహనబలి మీదుగా ప్రతిష్ఠార్పణగా వాటిని కాల్చి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా అర్పించాడు.
LEV 8:29 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ప్రతిష్ఠార్పణకు చెందిన పొట్టేలులో మోషే వాటాయైన రొమ్ము భాగాన్ని కూడా తీసి పైకెత్తి దానిని యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాడు.
LEV 8:30 అప్పుడు మోషే కొంత అభిషేక తైలాన్ని, బలిపీఠం మీద నుండి కొంచెం రక్తాన్ని తీసుకుని అహరోను మీద అతని వస్త్రాల మీద, అతని కుమారుల మీద వారి వస్త్రాల మీద చిలకరించాడు. ఇలా అతడు అహరోనును అతని వస్త్రాలను, అతని కుమారులను వారి వస్త్రాలను ప్రతిష్ఠించాడు.
LEV 8:31 అప్పుడు మోషే అహరోనుతో, అతని కుమారులతో, “సమావేశ గుడారపు ద్వారం దగ్గర మాంసాన్ని వండి ప్రతిష్ఠార్పణల గంపలోని రొట్టెలతో తినాలి, నాకు ఆజ్ఞాపించబడిన ప్రకారం, ‘అహరోను అతని కుమారులు దానిని తినాలి.’
LEV 8:32 తర్వాత మిగిలిన మాంసాన్ని, రొట్టెను కాల్చాలి.
LEV 8:33 మీ నియామక రోజులు పూర్తయ్యే వరకు ఏడు రోజులు సమావేశ గుడారపు ద్వారాన్ని విడిచివెళ్లవద్దు, ఎందుకంటే మీ నియామకం ఏడు రోజులు ఉంటుంది.
LEV 8:34 ఈ రోజు జరిగింది యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి జరిగింది.
LEV 8:35 మీరు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర ఏడు రోజులు రాత్రింబగళ్ళు ఉండి యెహోవా ఏం చేయమంటారో అది చేయాలి, అప్పుడు మీరు చావరు; ఎందుకంటే నాకివ్వబడిన ఆజ్ఞ ఇదే” అని చెప్పాడు.
LEV 8:36 కాబట్టి అహరోను అతని కుమారులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతిదీ చేశారు.
LEV 9:1 ఎనిమిదవ రోజు మోషే అహరోనును అతని కుమారులను, ఇశ్రాయేలు గోత్ర పెద్దలను పిలిపించాడు.
LEV 9:2 అతడు అహరోనుతో ఇలా అన్నాడు, “మీ పాపపరిహారబలి కోసం ఏ లోపం లేని ఒక మగ దూడను, మీ దహనబలికి ఒక లోపం లేని పొట్టేలును తీసుకువచ్చి వాటిని యెహోవా ఎదుట సమర్పించాలి.
LEV 9:3 అప్పుడు నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘పాపపరిహారబలి కోసం లోపం లేని ఒక మేకపోతును దహనబలి కోసం లోపం లేని ఒక దూడను, ఒక గొర్రెపిల్లను తీసుకురావాలి.
LEV 9:4 యెహోవా ఎదుట బలి అర్పించడానికి సమాధానబలికి ఎద్దును, పొట్టేలును, ఒలీవనూనె కలిపిన భోజనార్పణతో పాటు తీసుకురండి. ఎందుకంటే యెహోవా ఈ రోజు మీకు ప్రత్యక్షమవుతారు.’ ”
LEV 9:5 వారు మోషే ఆజ్ఞాపించినట్లుగా సమావేశ గుడారం ఎదుటికి వాటన్నిటిని తీసుకువచ్చారు, అప్పుడు సమాజమంతా దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిలో నిలబడ్డారు.
LEV 9:6 అప్పుడు మోషే ఇలా అన్నాడు, “మీరు ఇలా చేయాలని యెహోవా ఆజ్ఞాపించారు, తద్వార యెహోవా మహిమ మీకు ప్రత్యక్షం అవుతుంది.”
LEV 9:7 మోషే అహరోనుతో ఇలా అన్నాడు, “యెహోవా ఆజ్ఞాపించినట్లు బలిపీఠం దగ్గరకు వచ్చి, నీ పాపపరిహారబలిని, దహనబలిని అర్పించి, నీకోసం, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి; ప్రజల కోసం అర్పణను అర్పించి వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.”
LEV 9:8 కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరికి సమీపించి తన పాపపరిహారబలిగా కోడెను వధించాడు.
LEV 9:9 అహరోను కుమారులు దాని రక్తాన్ని అతనికి అందించారు, ఆ రక్తంలో తన వ్రేలు ముంచి బలిపీఠం కొమ్ములకు రాశాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోశాడు.
LEV 9:10 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు బలిపీఠం మీద పాపపరిహారబలిగా దాని క్రొవ్వును, మూత్రపిండాలను, కాలేయం దగ్గర ఉన్న క్రొవ్వును దహించాడు.
LEV 9:11 దాని మాంసాన్ని, చర్మాన్ని, శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు.
LEV 9:12 తర్వాత అతడు దహనబలిని వధించాడు. అహరోను కుమారులు రక్తాన్ని అతనికి అందించగా, అతడు దానిని బలిపీఠం చుట్టూరా చల్లాడు.
LEV 9:13 వారు అతనికి దహనబలి తలను దాని ముక్కలను ఇవ్వగా, అతడు వాటిని బలిపీఠం మీద కాల్చాడు.
LEV 9:14 లోపలి అవయవాలను, కాళ్లను కడిగి బలిపీఠం మీద ఉన్న దహనబలిపైన వాటిని కాల్చాడు.
LEV 9:15 అప్పుడు అహరోను ప్రజల అర్పణను తీసుకువచ్చాడు. అతడు ప్రజల పాపపరిహారబలి కోసం మేకను తీసుకుని దానిని వధించి మొదటి దానిని చేసినట్లుగానే దీన్ని కూడా పాపపరిహారబలిగా అర్పించాడు.
LEV 9:16 అతడు దహనబలిని తెచ్చి సూచించబడినట్టే అర్పించాడు.
LEV 9:17 అతడు భోజనార్పణ కూడా తీసుకువచ్చి, దానిలో నుండి పిడికెడు తీసి బలిపీఠంపై దానిని ఉదయం చెల్లించాల్సిన దహనబలితో పాటు దహించాడు.
LEV 9:18 ప్రజల నిమిత్తం అహరోను సమాధానబలిగా ఎద్దును, పొట్టేలును వధించాడు. అతని కుమారులు అతనికి రక్తాన్ని అందించగా, అతడు బలిపీఠం చుట్టూరా దానిని చల్లాడు.
LEV 9:19 ఎద్దు క్రొవ్వును, పొట్టేలు క్రొవ్వును, క్రొవ్విన తోకను, లోపల అవయవాల మీద ఉన్న క్రొవ్వును, మూత్రపిండాలను, కాలేయం మీది క్రొవ్వును
LEV 9:20 బోరల మీద వేశారు, అహరోను ఆ క్రొవ్వును బలిపీఠం మీద కాల్చాడు.
LEV 9:21 మోషే ఆజ్ఞాపించినట్టు అహరోను రొమ్ము భాగాన్ని, కుడి తొడను పైకెత్తి ఊపి యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాడు.
LEV 9:22 తర్వాత అహరోను ప్రజల వైపు చేతులెత్తి వారిని దీవించాడు. పాపపరిహారబలి, దహనబలి, సమాధానబలి అర్పించిన తర్వాత బలిపీఠం నుండి దిగివచ్చాడు.
LEV 9:23 అప్పుడు మోషే అహరోనులు కలిసి సమావేశ గుడారం లోనికి వెళ్లారు. వారు బయటకు వచ్చినప్పుడు ప్రజలను దీవించారు; యెహోవా మహిమ ప్రజలందరికి కనిపించింది.
LEV 9:24 యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి బలపీఠం మీద ఉన్న దహనబలిని క్రొవ్వు భాగాలను కాల్చివేసింది. అది చూసి ప్రజలంతా ఆనందంతో కేకలువేస్తూ సాగిలపడ్డారు.
LEV 10:1 అహరోను కుమారులు నాదాబు, అబీహు తమ ధూపార్తులను తీసుకుని, వాటిలో నిప్పు ఉంచి దానిపై ధూపం వేశారు; వారు యెహోవా ఎదుట ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా అనధికార అగ్నిని సమర్పించారు.
LEV 10:2 కాబట్టి యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి వారిని దహించివేయగా, వారు యెహోవా ఎదుట చనిపోయారు.
LEV 10:3 అప్పుడు మోషే అప్పుడు అహరోనుతో ఇలా అన్నాడు, “యెహోవా ఇలా చెప్పారు: “ ‘నన్ను సమీపించేవారి ద్వారా నేను నా పరిశుద్ధతను కనుపరచుకుంటాను; ప్రజలందరి దృష్టిలో నేను ఘనపరచబడతాను.’ ” అహరోను మౌనంగా ఉండిపోయాడు.
LEV 10:4 మోషే అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలు, ఎల్సాఫానులను పిలిపించి వారితో, “ఇక్కడకు రండి; మీ బంధువులను పరిశుద్ధాలయం ఎదుట నుండి, బయటకు తీసుకెళ్లండి” అని అన్నాడు.
LEV 10:5 కాబట్టి వారు వచ్చి, మోషే ఆజ్ఞాపించినట్లుగా, శిబిరం బయట ఇప్పటికీ తమ వస్త్రాలతో వాటిని తీసుకెళ్లారు.
LEV 10:6 మోషే అహరోనుతో అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారులతో, “మీరు చావకూడదన్నా, యెహోవా ఆగ్రహం ఈ సమాజం మీదికి రావద్దన్నా మీరు మీ జుట్టు విరబోసుకోవద్దు, మీ బట్టలు చింపుకోవద్దు, అయితే యెహోవా అగ్నితో వారిని నాశనం చేసినందుకు మీ బంధువులైన ఇశ్రాయేలీయులందరు దుఃఖించవచ్చు.
LEV 10:7 యెహోవా యొక్క అభిషేక తైలం మీమీద ఉంది కాబట్టి సమావేశ గుడారం యొక్క ప్రవేశం వదిలి వెళ్లొద్దు, వెళ్తే మీరు చస్తారు” అని అన్నాడు. కాబట్టి వారు మోషే చెప్పినట్లు చేశారు.
LEV 10:8 తర్వాత యెహోవా అహరోనుతో ఇలా అన్నారు,
LEV 10:9 “నీవూ, నీ కుమారులు సమావేశ గుడారంలోకి ఎప్పుడు వెళ్లినా మద్యం త్రాగకూడదు ఇతర పులిసిన పానీయం త్రాగకూడదు, ఒకవేళ అలా చేస్తే మీరు చస్తారు. మీ రాబోయే తరాలకు ఇది నిత్య సంస్కారంగా ఉంటుంది.
LEV 10:10 పరిశుద్ధమైన దానికి సాధారణమైన దానికి, అపవిత్రమైన దానికి పవిత్రమైన దానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించగలిగేలా,
LEV 10:11 యెహోవా మోషే ద్వార ఇశ్రాయేలీయులకు ఇచ్చిన శాసనాలన్నిటిని మీరు వారికి బోధించాలి.”
LEV 10:12 మోషే అహరోనుతో అతని కుమారులలో మిగతా వారైన ఎలియాజరు, ఈతామారులతో ఇలా అన్నాడు, “యెహోవాకు సమర్పించిన హోమబలిలో మిగిలిన భోజనార్పణ పులుపు లేకుండ తీసుకుని బలిపీఠం ప్రక్కన తినండి, ఎందుకంటే అది అతిపరిశుద్ధమైనది.
LEV 10:13 యెహోవాకు సమర్పించిన హోమబలులలో ఇది మీకు, మీ కుమారులకు ఇచ్చిన వాటా; దీనిని పరిశుద్ధాలయ ప్రాంతంలో తినండి; ఎందుకంటే నాకు అలాగే ఆజ్ఞ ఇవ్వబడింది.
LEV 10:14 కానీ నీవూ, నీ కుమారులు, మీ కుమార్తెలు పైకెత్తిన రొమ్ము భాగాన్ని, ప్రత్యేక అర్పణగా అర్పించిన తొడను తినవచ్చు. ఆచారరీత్య శుభ్రంగా ఉన్న స్థలంలో వాటిని తినండి; అవి నీకు, నీ పిల్లలకు ఇశ్రాయేలీయుల సమాధానబలులలో మీ వాటాగా ఇవ్వబడ్డాయి.
LEV 10:15 ప్రత్యేక అర్పణ యైన తొడను పైకెత్తిన రొమ్ము భాగాన్ని హోమబలుల క్రొవ్వుతో పాటు తీసుకువచ్చి, యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి. యెహోవా ఆజ్ఞాపించినట్లు ఇది నీకు, నీ పిల్లలకు శాశ్వత వాటాగా ఉంటుంది.”
LEV 10:16 పాపపరిహారబలి కొరకైన మేక గురించి మోషే ఆరా తీయగా, అది కాలిపోయిందని తెలుసుకుని, అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు, ఈతామారులపై కోప్పడి,
LEV 10:17 “మీరు పాపపరిహారబలిని పరిశుద్ధాలయ ప్రాంగణంలో ఎందుకు తినలేదు? అది అతిపరిశుద్ధమైనది; సమాజం యొక్క అపరాధం యొక్క శిక్షను భరించి యెహోవా ఎదుట వారి కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఇది మీకు ఇచ్చారు.
LEV 10:18 దాని రక్తం పరిశుద్ధ స్థలంలోకి తేబడలేదు కాబట్టి నేను ఆజ్ఞాపించినట్లు, మీరు పరిశుద్ధాలయ ప్రాంతంలో మేకను తప్పక తిని ఉండాల్సింది” అని అన్నాడు.
LEV 10:19 అందుకు అహరోను మోషేతో, “ఈ రోజు వారు యెహోవా ఎదుట వారి పాపపరిహారబలి, దహనబలి అర్పించారు, అయినా నా పట్ల ఇలాంటి విషాదం జరిగింది. ఈ రోజు ఒకవేళ నేను పాపపరిహారబలి తినివుంటే యెహోవా ఆనందించి ఉండేవారా?” అని అడిగాడు.
LEV 10:20 ఆ మాటలు మోషే విని సంతృప్తి చెందాడు.
LEV 11:1 యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు,
LEV 11:2 “ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పండి: ‘భూమి మీద జీవించే జంతువులన్నిటిలో మీరు తినదగిన జంతువులు:
LEV 11:3 చీలిన డెక్కలు కలిగి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు.
LEV 11:4 “ ‘కొన్ని కేవలం నెమరువేస్తాయి కొన్ని చీలిన డెక్కలు మాత్రమే కలిగి ఉంటాయి, వాటిని మీరు తినకూడదు. ఒంటెలు నెమరువేస్తాయి కానీ వాటికి చీలిన డెక్కలు లేవు; ఇవి మీకు ఆచారరీత్య అపవిత్రమైనవి.
LEV 11:5 అలాగే పొట్టి కుందేలు కూడా నెమరువేస్తుంది కాని దానికి చీలిన డెక్కలు లేవు; ఇది మీకు అపవిత్రమైనది.
LEV 11:6 అలాగే కుందేలు నెమరువేస్తుంది గాని దానికి చీలిన డెక్కలు లేవు; ఇది మీకు అపవిత్రమైనది.
LEV 11:7 పందికి చీలిన డెక్కలు ఉంటాయి కాని అది నెమరువేయదు; ఇది మీకు అపవిత్రమైనది.
LEV 11:8 వాటి మాంసం తినవద్దు వాటి కళేబరాలు ముట్టుకోవద్దు; అవి మీకు అపవిత్రమైనవి.
LEV 11:9 “ ‘సముద్రాల్లో నదులలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు.
LEV 11:10 సముద్రంలో గాని, నదిలో గాని నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోను, నీటి ప్రాణుల్లోను రెక్కలు, పొలుసులు లేనివాటిని మీరు అపవిత్రమైనవిగా చూడాలి.
LEV 11:11 అవి అపవిత్రమైనవి కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు; వాటి కళేబరాలను మీరు అసహ్యించుకోవాలి.
LEV 11:12 రెక్కలు, పొలుసులు లేని జలచరాలేవైనా అపవిత్రమైనవిగా చూడాలి.
LEV 11:13 “ ‘మీకు అపవిత్రమైనవిగా భావించి మీరు తినకూడని పక్షులు ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,
LEV 11:14 ఎర్ర గ్రద్ద, ప్రతి రకమైన నల్ల గ్రద్ద,
LEV 11:15 ప్రతి రకమైన కాకి,
LEV 11:16 కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,
LEV 11:17 పైడికంటే, చెరువు కాకి, గుడ్లగూబ,
LEV 11:18 హంస, గూడబాతు, నల్లబోరువ,
LEV 11:19 సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.
LEV 11:20 “ ‘నాలుగు కాళ్లతో నడిచే ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవిగా మీరు భావించాలి.
LEV 11:21 అయితే, నాలుగు కాళ్లతో నడుస్తూ నేలమీద గెంతడానికి కాళ్లకు కీళ్ళున్న ఎగిరే కీటకాలను మీరు తినవచ్చు.
LEV 11:22 వీటిలో నేత మిడత గాని చిన్న మిడత గాని ఆకు మిడత గాని ప్రతి రకమైన మిడతను తినవచ్చు.
LEV 11:23 కాని నాలుగు కాళ్లు ఉండి ఎగిరే ఇతర పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి.
LEV 11:24 “ ‘వీటి ద్వార మీరు అపవిత్రులవుతారు; వాటి కళేబరాలను ఎవరైనా తాకితే వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
LEV 11:25 వీటి కళేబరాలలో దేనినైన ఎవరైనా మోస్తే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు.
LEV 11:26 “ ‘చీలిన డెక్కలు లేని నెమరువేయని ప్రతి జంతువు మీకు అపవిత్రం; వాటిలో దేని కళేబరాన్నైనా ఎవరైనా తాకితే వారు అపవిత్రులవుతారు.
LEV 11:27 నాలుగు కాళ్ల జంతువులన్నిటిలో తమ పంజాలతో నడిచేవన్నీ అపవిత్రమైనవి; వాటిలో దేని కళేబరాన్నైనా ఎవరైనా తాకితే వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
LEV 11:28 వీటి కళేబరాలలో దేనినైన ఎవరైనా మోస్తే, వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు. ఈ జంతువులు మీకు అపవిత్రమైనవి.
LEV 11:29 “ ‘నేల మీద ప్రాకే జంతువుల్లో, మీకు అపవిత్రమైనవి ఇవే: ముంగీస, ఎలుక, ప్రతి రకమైన పెద్ద బల్లి,
LEV 11:30 తొండ, మచ్చల బల్లి, గోడ తొండ, ఉడుము, ఊసరవెల్లి.
LEV 11:31 భూమి మీద కదిలే వాటన్నిటిలో, ఇవి మీకు నిషేధమైనవి. అవి చనిపోయిన తర్వాత వాటి కళేబరాన్ని తాకినవారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
LEV 11:32 అవి చనిపోయిన తర్వాత వాటి కళేబరం దేని పైననైన పడితే, అది చెక్క గాని, వస్త్రం గాని, చర్మం గాని గోనెసంచి గాని దేనితో చేసినదైనా, దాని ఉపయోగం ఏదైనా దానిని నీటిలో పెట్టండి; అది సాయంత్రం వరకు అపవిత్రం, తర్వాత అది పవిత్రమవుతుంది.
LEV 11:33 వాటిలో ఏదైనా మట్టికుండలో పడితే, దానిలో ఉన్నదంతా అపవిత్రమవుతుంది, మీరు తప్పనిసరిగా ఆ కుండను పగులగొట్టాలి.
LEV 11:34 మీరు తినదగిన ఏ ఆహారమైనా అలాంటి కుండలోని నీరు తగిలితే అది అపవిత్రమవుతుంది, ఎటువంటి పానీయమైనా సరే అలాంటి కుండలో నుండి త్రాగితే అది అపవిత్రము.
LEV 11:35 వాటి కళేబరాలలో కొంచెమైనా ఒకటి దేనిపైనైనా పడితే అది అపవిత్రమవుతుంది; అది పొయ్యి గాని లేదా వంటచేసే కుండ గాని తప్పకుండ పగులగొట్టబడాలి. అవి అపవిత్రమైనవి, మీరు వాటిని అపవిత్రమైనవిగా భావించాలి.
LEV 11:36 ఏదేమైనా, ఒక ఊటలో గాని లేదా నీటి తొట్టిలో గాని పవిత్రంగా ఉంటుంది, కానీ వీటిలో ఏదైన ఒకటి ఈ కళేబరాన్ని తాకితే వారు అపవిత్రమవుతారు.
LEV 11:37 ఒకవేళ నాటబడవలసిన విత్తనాలపై కళేబరం పడితే, అవి పవిత్రంగా ఉంటాయి.
LEV 11:38 కానీ ఒకవేళ విత్తనాలకు నీరు పెట్టిన తర్వాత, వాటిపై పడితే, అది మీకు అపవిత్రమవుతాయి.
LEV 11:39 “ ‘ఒకవేళ మీరు తినదగిన జంతువుల్లో ఏదైనా చనిపోతే, దాని కళేబరాన్ని తాకిన ఎవరైనా సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
LEV 11:40 దాని కళేబరంలో ఎవరైనా ఏదైనా తింటే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు. కళేబరాన్ని ఎవరైనా మోస్తే వారు బట్టలు ఉతుక్కోవాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
LEV 11:41 “ ‘నేలపై ప్రాకే జీవులన్నీ అపవిత్రమైనవి; దానిని తినకూడదు.
LEV 11:42 నేలమీద ప్రాకే జీవులలో పొట్ట మీద ప్రాకేవైనా లేదా నాలుగు కాళ్లతో లేదా అంతకన్నా ఎక్కువ కాళ్లతో నడిచేవైనా అవి మీకు అపవిత్రమైనవి.
LEV 11:43 ప్రాకే జీవులను తిని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు. వాటిని బట్టి గాని వాటి ద్వారా గాని మీరు అపవిత్రం కాకూడదు.
LEV 11:44 నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను కాబట్టి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని పరిశుద్ధంగా ఉండండి. నేలపై ప్రాకే ఏ జీవిని బట్టి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు.
LEV 11:45 మీకు దేవునిగా ఉండాలని ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు తెచ్చిన యెహోవాను నేనే; నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి.
LEV 11:46 “ ‘జంతువులు, పక్షులు, నీటిలో నివసించే ప్రతి జీవి, నేలపైన ప్రాకే జీవులకు సంబంధించిన నియమాలు ఇవే.
LEV 11:47 అపవిత్రమైన వాటికి పవిత్రమైన వాటికి మధ్య తేడాను, తినదగిన జీవులకు తినకూడని జీవులకు మధ్య తేడాను మీరు గుర్తించాలి.’ ”
LEV 12:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 12:2 “ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ఒక స్త్రీ గర్భవతియై ఒక మగశిశువుకు జన్మనిస్తే నెలసరి సమయంలో ఉన్నట్లే ఆచారరీత్య ఆమె ఏడు రోజులు అపవిత్రురాలిగా ఉంటుంది.
LEV 12:3 ఆ మగశిశువుకు ఎనిమిదవ రోజున సున్నతి చేయించాలి.
LEV 12:4 అప్పుడు స్త్రీ తన రక్తస్రావం నుండి శుద్ధి కావడానికి ముప్పై మూడు రోజులు వేచి ఉండాలి. శుద్ధీకరణ రోజులు పూర్తయే వరకు ఆమె పవిత్రమైన దేన్ని తాకకూడదు, పరిశుద్ధాలయానికి వెళ్లకూడదు.
LEV 12:5 ఒకవేళ ఆమె ఆడపిల్లకు జన్మనిస్తే, ఆమె రెండు వారాలు అపవిత్రురాలిగా ఉంటుంది. అప్పుడు ఆమె రక్తస్రావం నుండి శుద్ధి కావడానికి అరవై ఆరు రోజులు వేచి ఉండాలి.
LEV 12:6 “ ‘కుమారుని కోసం గాని కుమార్తె కోసం గాని ఆమె శుద్ధీకరణ రోజులు ముగిసిన తర్వాత ఆమె దహనబలి కోసం ఒక సంవత్సరపు గొర్రెపిల్లను, పాపపరిహారబలి కోసం ఒక చిన్న గువ్వను గాని పావురాన్ని గాని సమావేశ గుడార ద్వారం దగ్గర ఉన్న యాజకుని దగ్గరకు తీసుకురావాలి.
LEV 12:7 ఆమె కోసం ప్రాయశ్చిత్తం చేయటానికి అతడు వాటిని యెహోవా ఎదుట అర్పించినప్పుడు ఆమె తన రక్తస్రావం నుండి ఆచారరీత్య శుద్ధి అవుతుంది. “ ‘మగశిశువుకు గాని ఆడపిల్లకు గాని జన్మనిచ్చే స్త్రీకి నియమాలు ఇవే.
LEV 12:8 ఆమె ఒకవేళ గొర్రెపిల్లను కొనలేకపోతే, ఆమె గువ్వల జతను లేదా రెండు చిన్న పావురాలను తీసుకురావాలి. వాటిలో ఒకటి దహనబలి కోసం మరొకటి పాపపరిహారబలి కోసము. ఈ విధంగా యాజకుడు ఆమెకు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు, ఆమె శుద్ధి అవుతుంది.’ ”
LEV 13:1 యెహోవా మోషే అహరోనులతో అన్నారు,
LEV 13:2 “మనుష్యులెవరికైనా వారి చర్మంపై వాపు లేదా దద్దుర్లు లేదా మెరిసే మచ్చ ఉన్నట్లయితే, అది అపవిత్రమైన కుష్ఠువ్యాధి కావచ్చు, వారు యాజకుడైన అహరోను దగ్గరకు లేదా యాజకుడుగా ఉన్న అతని కుమారులలో ఒకరి దగ్గరకు తీసుకురాబడాలి.
LEV 13:3 యాజకుడు వారి చర్మం మీద ఉన్న పుండును పరీక్షించాలి. ఆ పుండులో వెంట్రుకలు తెల్లబారి ఆ పుండు చర్మంలో లోతుగా ఉంటే అది కుష్ఠువ్యాధి యొక్క లక్షణము. యాజకుడు ఆ వారిని పరీక్షించి వారు ఆచారరీత్య అపవిత్రులని ప్రకటించాలి.
LEV 13:4 చర్మంలో మచ్చ మెరుస్తూ తెల్లగా ఉండి, చర్మం లోతుకంటే ఎక్కువ లేకపోతే అందులోని వెంట్రుకలు తెల్లగా మారకపోతే యాజకుడు వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.
LEV 13:5 ఏడవ రోజు యాజకుడు వారిని పరీక్షించాలి. చర్మం పుండు అలాగే ఉండి వ్యాపించకుండ ఉంటే యాజకుడు మరో ఏడు రోజులు వారిని వేరుగా ఉంచాలి.
LEV 13:6 ఏడవ రోజు యాజకుడు వారిని మళ్ళీ పరీక్షించాలి, పుండు క్షీణించి, చర్మంలో వ్యాపించకపోతే, యాజకుడు వారిని శుభ్రంగా ప్రకటించాలి; ఇది దద్దుర్లు మాత్రమే. వారు బట్టలు ఉతుక్కోవాలి, వారు శుభ్రంగా అవుతారు.
LEV 13:7 కాని వారు శుద్ధులని ప్రకటించబడడానికి యాజకునికి కనుపరచుకున్న తర్వాత దద్దుర్లు చర్మంలో వ్యాపిస్తే వారిని తిరిగి యాజకుని దగ్గరకు రావాలి.
LEV 13:8 యాజకుడు ఆ వ్యక్తిని పరీక్షించాలి, ఒకవేళ దద్దుర్లు చర్మంలో వ్యాపించి ఉంటే, అతన్ని అపవిత్రునిగా ప్రకటించాలి; అది కుష్ఠువ్యాధి.
LEV 13:9 “మనుష్యులెవరికైనా తీవ్రమైన కుష్ఠువ్యాధి ఉంటే, వారిని యాజకుని దగ్గరకు తీసుకురావాలి.
LEV 13:10 యాజకుడు వారిని పరీక్షించాలి, ఒకవేళ చర్మంలో తెల్లని వాపు ఉండి వెంట్రుకలు తెల్లగా మార్చి ఆ వాపులో ఒకవేళ పచ్చి మాంసం ఉంటే,
LEV 13:11 ఇది దీర్ఘకాలిక కుష్ఠువ్యాధి, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి. అతడు వారిని ఒంటరి చేయకూడదు, ఎందుకంటే వారు అప్పటికే అపవిత్రమైనవారు.
LEV 13:12 “యాజకుడు చూడగలిగినంతవరకు ఆ వ్యాధి వారి చర్మం అంతా వ్యాపించి ఉంటే, అది తల నుండి పాదం వరకు బాధిత వ్యక్తి యొక్క చర్మమంతా వ్యాపించి ఉంటే,
LEV 13:13 యాజకుడు వారిని పరీక్షించాలి, ఒకవేళ వ్యాధి వారి శరీరమంతా వ్యాపించి ఉంటే, అతడు వారిని పవిత్రులని ప్రకటించాలి. అదంతా తెల్లగా మారినందుకు, వారు పవిత్రులు.
LEV 13:14 కాని శరీరంలో పచ్చిపుండు కనిపిస్తే, వారు అపవిత్రులు.
LEV 13:15 యాజకుడు పచ్చిపుండును చూసినప్పుడు, అతడు వారిని అపవిత్రులని ప్రకటించాలి. పచ్చిపుండు అపవిత్రం; వారు తీవ్రమైన కుష్ఠువ్యాధి కలవారు.
LEV 13:16 పచ్చిపుండు మారి తెల్లబారితే వారు యాజకుని దగ్గరకు వెళ్లాలి.
LEV 13:17 యాజకుడు వారిని పరీక్షించి, ఒకవేళ పుండ్లు తెల్లబారి ఉంటే, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి; అప్పుడు వారు పవిత్రులవుతారు.
LEV 13:18 “ఎవరికైనా వారి చర్మం మీద బొబ్బ వచ్చి మానిపోతే,
LEV 13:19 అది ఉండిన చోట, తెల్లని వాపు గాని లేదా గులాబి రంగు మచ్చ గాని కనిపిస్తే, వారు దానిని యాజకునికి చూపించాలి.
LEV 13:20 యాజకుడు దానిని పరీక్షించాలి, ఒకవేళ అది చర్మంపై లోతుగా ఉండి దానిలోని వెంట్రుకలు తెల్లబారినట్లు కనిపిస్తే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి. అది బొబ్బ ఉన్నచోట బయటపడిన తీవ్రమైన కుష్ఠువ్యాధి.
LEV 13:21 యాజకుడు పరీక్షించినప్పుడు, అందులో తెల్లని వెంట్రుకలు లేకపోతే, చర్మంపై లోతుగా లేకుండ కొంచెం మాని ఉంటే, యాజకుడు పరీక్షించి వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.
LEV 13:22 ఒకవేళ అది చర్మంపై వ్యాపిస్తూ ఉంటే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తీవ్రమైన కుష్ఠువ్యాధి లక్షణము.
LEV 13:23 అయితే ఒకవేళ ఆ మచ్చ వ్యాపించకుండ అలాగే ఉంటే, అది కేవలం ఒక బొబ్బను బట్టి ఏర్పడిన మచ్చ, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి.
LEV 13:24 “ఎవరికైనా వారి చర్మంపై కాలి గాయమై, కాలిన చోట ఎర్రగా గాని తెల్లగా గాని మచ్చ కనబడితే,
LEV 13:25 యాజకుడు ఆ చోటును పరీక్షించాలి, ఒకవేళ అక్కడ వెంట్రుకలు తెల్లగా మారి చర్మం కొంచెం లోపలికి ఉంటే, అది కాలిన చోట బయటపడిన తీవ్రమైన కుష్ఠువ్యాధి; యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తీవ్రమైన కుష్ఠువ్యాధి.
LEV 13:26 అయితే ఒకవేళ యాజకుడు దానిని పరీక్షిస్తే అక్కడ తెల్లని వెంట్రుకలు లేకుండ ఒకవేళ అది చర్మంపై లోతుగా లేకుండా కొంచెం మానినట్లు కనబడితే, యాజకుడు వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.
LEV 13:27 ఏడవ రోజున యాజకుడు వారిని పరీక్షించినప్పుడు, ఒకవేళ అది చర్మంపై వ్యాపిస్తున్నట్లయితే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తీవ్రమైన కుష్ఠువ్యాధి.
LEV 13:28 అయితే అది వ్యాపించకుండ అలాగే ఉండి మానుతున్నట్లు కనిపిస్తే, అది కేవలం కాలడం వలన ఏర్పడిన వాపు, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి; ఎందుకంటే అది కేవలం కాలిన గాయం వలన ఏర్పడిన మచ్చ.
LEV 13:29 “స్త్రీకైనా పురుషునికైనా తలమీద గాని గడ్డం మీద గాని పుండు ఏర్పడితే,
LEV 13:30 యాజకుడు ఆ పుండును పరీక్షించాలి, ఒకవేళ అది చర్మంపై లోతుగా ఉండి అందులో పసుపు రంగులో సన్నని వెంట్రుకలుంటే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తలమీద గాని గడ్డం మీద గాని ఏర్పడిన గజ్జిపుండు.
LEV 13:31 కాని యాజకుడు ఆ పుండును పరీక్షించినప్పుడు, అది చర్మంపై లోతుగా లేకపోతే, యాజకుడు వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.
LEV 13:32 ఏడవ రోజు యాజకుడు ఆ గజ్జిపుండును పరీక్షించాలి, ఒకవేళ అది వ్యాపించకపోతే, అందులో పసుపురంగు వెంట్రుకలు లేకపోతే, చర్మంపై లోతుగా లేకపోతే,
LEV 13:33 ఆ పురుషుడు గాని ఆ స్త్రీ గాని పుండు ఉన్న చోటు వదిలి క్షవరం చేసుకోవాలి క్షౌరం చేసుకోవచ్చు, యాజకుడు వారిని మరో ఏడు రోజులు వేరుగా ఉంచాలి.
LEV 13:34 ఏడవ రోజు యాజకుడు ఆ గజ్జిపుండును పరీక్షించాలి, అది చర్మంపై వ్యాపించకుండ చర్మంపై లోతుగా లేకపోతే, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి. వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు.
LEV 13:35 కానీ వారు పవిత్రులని ప్రకటించిన తర్వాత ఒకవేళ గజ్జిపుండు వ్యాపిస్తే,
LEV 13:36 యాజకుడు వారిని పరీక్షించి ఒకవేళ ఆ గజ్జిపుండు చర్మంపై వ్యాపించినట్లు కనబడితే, అతడు పసుపురంగు వెంట్రుకల కోసం చూడాల్సిన అవసరం లేదు; వారు అపవిత్రులు.
LEV 13:37 ఒకవేళ, యాజకుడు చూసే వరకు ఆ పుండు అలాగే ఉండి, ఒకవేళ దానిపై నల్ల జుట్టు పెరిగితే, వారు బాగయ్యారని అర్థము. వారు శుభ్రంగా ఉన్నారు, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి.
LEV 13:38 “పురుషునికి గాని స్త్రీకి గాని చర్మంపై తెల్ల మచ్చలు ఉంటే,
LEV 13:39 యాజకుడు వాటిని పరీక్షించాలి, ఒకవేళ ఆ మచ్చలు స్పష్టంగా కనబడక మామూలుగా ఉంటే, అవి చర్మం మీద వచ్చిన సాధారణ పొక్కులు, అవి హానికరం కావు; వారు ఆచారరీత్య పవిత్రులు.
LEV 13:40 “తలవెంట్రుకలు రాలిపోయి బట్టతల ఉన్న పురుషుడు పవిత్రుడు.
LEV 13:41 ఒకవేళ తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోయి, నుదురు బోడిగా ఉంటే, అతడు పవిత్రుడు.
LEV 13:42 అయితే అతని బట్టతలపై గాని లేదా నుదిటిపై గాని గులాబి రంగు పుండు ఉంటే, అది అతని తలమీద గాని నుదుటి మీద గాని ఏర్పడుతున్న తీవ్రమైన కుష్ఠువ్యాధి.
LEV 13:43 యాజకుడు అతన్ని పరీక్షించాలి, ఒకవేళ అతని తలపై గాని నుదిటిపై వాచిన పుండు గులాబి రంగులో తీవ్రమైన కుష్ఠువ్యాధిలా ఉంటే,
LEV 13:44 ఆ పురుషుడు వ్యాధిగ్రస్తుడు, అపవిత్రుడు. యాజకుడు అతని తలపై ఉన్న కుష్ఠువ్యాధిని బట్టి అతన్ని అపవిత్రునిగా ప్రకటించాలి.
LEV 13:45 “అలాంటి కుష్ఠువ్యాధి ఉన్నవారెవరైనా తప్పనిసరిగా చిరిగిన బట్టలు ధరించాలి, చింపిరి జుట్టుతో ఉండాలి, వారు తమ నోటిని కప్పుకుని, ‘అపవిత్రులం! అపవిత్రులం!’ అని బిగ్గరగా అరవాలి.
LEV 13:46 వారికి వ్యాధి ఉన్నంత వరకు వారు అపవిత్రులే. వారు ఒంటరిగా జీవించాలి; వారు శిబిరం బయట నివసించాలి.
LEV 13:47 “అపవిత్రమైన మరకతో పాడైన వస్త్రానికి సంబంధించి, అవి ఉన్నివైనా లేదా నార వస్త్రాలైనా,
LEV 13:48 నారతో నేసిన వస్త్రాలైనా లేదా ఉన్నితో అల్లిన వస్త్రాలైనా, చర్మమైనా, చర్మంతో చేసినవైనా,
LEV 13:49 ఒకవేళ వస్త్రాల్లో గాని, చర్మంలో గాని, నేసిన దుస్తుల్లో గాని లేదా అల్లిన దుస్తుల్లో గాని, లేదా ఏదైనా చర్మంతో చేయబడిన వస్తువు మీద గాని పాడైన చోట పచ్చగా లేదా ఎరుపుగా ఉంటే, అది కుష్ఠు మరక యొక్క లక్షణం కాబట్టి తప్పక యాజకునికి చూపించాలి.
LEV 13:50 యాజకుడు ఆ పాడైన చోటును పరీక్షించి ఏడు రోజులు ఆ వస్తువును వేరుగా ఉంచాలి.
LEV 13:51 ఏడవ రోజు అతడు దానిని పరీక్షించాలి, ఒకవేళ వస్త్రంలో గాని, నేసిన దానిలో గాని లేదా అల్లిన దానిలో గాని, లేదా చర్మంలో గాని, చర్మంతో చేసినవైనా దానిలో గాని వ్యాపిస్తే, దాని ఉపయోగం ఏదైనా, అది తీవ్రమైన కుష్ఠు మరక; ఆ వస్తువు అపవిత్రము.
LEV 13:52 పాడైన వస్త్రమైనా, నారతో గాని ఉన్నితో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాలైనా, లేదా చర్మంలో గాని, చర్మంతో చేసిన వస్తువైనా అతడు తప్పక కాల్చివేయాలి, ఎందుకంటే అది తీవ్రమైన మరక, ఆ వస్తువు తప్పనిసరిగా కాల్చివేయబడాలి.
LEV 13:53 “కానీ ఒకవేళ యాజకుడు దానిని పరీక్షించినప్పుడు, మరక వస్త్రంపై గాని, నేసిన దుస్తులపై గాని లేదా అల్లిన దుస్తులపై గాని, చర్మంపై గాని లేదా చర్మంతో చేసిన వస్తువుపై గాని వ్యాపించి ఉండకపోతే,
LEV 13:54 దానిని ఉతకమని అతడు ఆదేశించి దానిని మరో ఏడు రోజులు వేరుగా ఉంచాలి.
LEV 13:55 దానిని ఉతికిన తర్వాత, యాజకుడు దానిని మళ్ళీ పరీక్షించాలి, ఒకవేళ ఆ మరక మారకుండా వ్యాపించకుండ అలాగే ఉంటే, అది అపవిత్రమే. వస్త్రం ఎటువైపు పాడైనా, దానిని కాల్చివేయాలి.
LEV 13:56 ఒకవేళ యాజకుడు దానిని పరీక్షించినప్పుడు, ఆ వస్త్రం ఉతికిన తర్వాత మరక పోయినట్లైతే, అతడు ఆ పాడైన భాగాన్ని వస్త్రమైనా, చర్మమైనా నేసిన వస్త్రమైనా అల్లిన వస్త్రమైనా సరే కత్తిరించివేయాలి.
LEV 13:57 అయితే ఒకవేళ అది దుస్తుల్లో గాని నేసిన, అల్లిన వస్త్రాల్లో గాని లేదా చర్మంతో చేసిన వాటిలో గాని మళ్ళీ కనిపిస్తే, అది వ్యాపించే మరక అని గుర్తించి అది ఎలాంటి మరకైనా సరే దానిని కాల్చివేయాలి.
LEV 13:58 వస్త్రమైనా, నేసినదైనా అల్లినదైనా, చర్మంతో చేసిన వస్తువైనా సరే ఉతికిన తర్వాత మరక తొలగిపోతే దానిని మళ్ళీ ఉతకాలి. అప్పుడు అది పవిత్రమవుతుంది.”
LEV 13:59 ఉన్ని లేదా నార దుస్తుల్లో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాల్లో గాని చర్మంతో చేసిన వస్తువులలో గాని కుష్ఠు మరకలు ఉంటే, వాటిని పవిత్రమైనవిగా గాని అపవిత్రమైనవిగా గాని ప్రకటించడానికి ఈ నియమాలు వర్తిస్తాయి.
LEV 14:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 14:2 “ఎవరైనా అనారోగ్య వ్యక్తిని వారి ఆచారరీత్య శుద్ధీకరణ పాటిస్తున్న సమయంలో, యాజకుని దగ్గరకు తీసుకువచ్చినప్పుడు పాటించవలసిన నియమాలు ఇవి:
LEV 14:3 యాజకుడు శిబిరం బయటకు వెళ్లి వారిని పరీక్షించాలి. ఒకవేళ వారు వారి అపవిత్ర చర్మ వ్యాధి నుండి స్వస్థత పొందివుంటే,
LEV 14:4 వారిని శుద్ధీకరించడానికి రెండు బ్రతికి ఉన్న పవిత్రమైన పక్షులు, కొంత దేవదారు కలప, ఎరుపురంగు నూలు, హిస్సోపును తీసుకురావాలని యాజకుడు ఆదేశించాలి.
LEV 14:5 తర్వాత ఆ పక్షుల్లో ఒకదాన్ని మట్టికుండలో ఉన్న మంచినీటిపై చంపుమని యాజకుడు ఆదేశించాలి.
LEV 14:6 అప్పుడు యాజకుడు బ్రతికి ఉన్న పక్షిని పట్టుకుని, దేవదారు కర్రను, ఎర్రని నూలును, హిస్సోపును తీసుకుని మంచినీటిపై చంపబడిన పక్షి రక్తంలో ముంచాలి.
LEV 14:7 కుష్ఠువ్యాధి నుండి శుద్ధీకరణ పొందే వారిపై ఆ నీటిని ఏడుసార్లు చల్లి, అతడు ఏడుసార్లు చల్లి, వారిని పవిత్రులుగా ప్రకటించాలి. ఆ తర్వాత, యాజకుడు బ్రతికి ఉన్న మరొక పక్షిని బయట పొలాల్లోకి వదిలేయాలి.
LEV 14:8 “శుద్ధి చేయబడిన వ్యక్తులు తమ బట్టలు ఉతుక్కోవాలి, వారు తమ వెంట్రుకలన్నీ క్షవరం చేయించుకుని నీటితో స్నానం చేయాలి; అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు. దీని తర్వాత వారు శిబిరంలోకి రావచ్చు, కాని వారు తమ గుడారం బయట ఏడు రోజులు ఉండాలి.
LEV 14:9 ఏడవ రోజున వారు తమ వెంట్రుకలంతా క్షవరం చేయించుకోవాలి; గడ్డం, కనుబొమ్మలు ఇంకా మిగతా వెంట్రుకలు పూర్తిగా క్షవరం చేసుకోవాలి. అలాగే వారు తమ బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు.
LEV 14:10 “ఎనిమిదవ రోజు ఏ లోపం లేని రెండు మగ గొర్రెపిల్లలను, ఏ లోపం లేని ఏడాది ఆడ గొర్రెపిల్లను, రెండు కూడా ఏ లోపం లేనివాటిని తీసుకురావాలి. భోజనార్పణ కోసం నూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి, ఒక సేరు నూనె యాజకుని దగ్గరకు తీసుకురావాలి.
LEV 14:11 వారిని శుద్ధులుగా ప్రకటించే యాజకుడు శుద్ధీకరించబడిన వారిని, వారి అర్పణలతో పాటు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర యెహోవా ఎదుట కనుపరచాలి.
LEV 14:12 “అప్పుడు యాజకుడు మగ గొర్రెపిల్లలలో ఒకదాన్ని తీసుకుని, అపరాధపరిహారబలిగా, కొంచెం నూనెతో పాటు అర్పించాలి; అతడు వాటిని పైకెత్తి యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాలి.
LEV 14:13 అతడు పాపపరిహారబలిని, దహనబలిని వధించే పరిశుద్ధాలయ ప్రాంతంలో గొర్రెపిల్లను వధించాలి. పాపపరిహారబలిలా, అపరాధపరిహారబలి కూడా యాజకునికే చెందుతుంది; అది అతిపరిశుద్ధము.
LEV 14:14 యాజకుడు అపరాధపరిహారబలి పశువు రక్తాన్ని కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి యొక్క కుడిచెవి కొన మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడికాలి బొటనవ్రేలుపై పూయాలి.
LEV 14:15 అప్పుడు యాజకుడు కొంచెం నూనె తీసుకుని, తన ఎడమచేతి అరచేతిలో పోసి,
LEV 14:16 తన కుడి చూపుడు వ్రేలు తన అరచేతిలో ఉన్న నూనెలో ముంచి, తన వ్రేలితో దానిలో కొంచెం యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరిస్తాడు.
LEV 14:17 యాజకుడు తన అరచేతిలో మిగిలి ఉన్న నూనెలో కొంచెం శుద్ధి చేయబడవలసిన వ్యక్తి యొక్క కుడిచెవి యొక్క లోలాకుల మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడి పాదం యొక్క పెద్ద బొటనవ్రేలుపై, అపరాధపరిహారబలి పశువు రక్తం పైన ఉంచాలి.
LEV 14:18 యాజకుడు తన అరచేతిలో మిగిలి ఉన్న నూనెను శుద్ధీకరణ కోసం వచ్చిన వారి తలమీద పూసి యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.
LEV 14:19 “అప్పుడు యాజకుడు అపవిత్రత పోగొట్టుకోవాలని వచ్చిన వారి కోసం పాపపరిహారబలి అర్పించి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత దహనబలి పశువును వధించాలి.
LEV 14:20 దానిని భోజనార్పణతో కలిపి బలిపీఠం మీద అర్పించి, వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి, అప్పుడు వారు శుద్ధులవుతారు.
LEV 14:21 “అయినప్పటికీ, ఒకవేళ వారు పేదవారైయుండి వీటిని చేసే స్తోమత లేనివారైతే, వారి ప్రాయశ్చిత్తం కోసం అపరాధపరిహారబలిగా ప్రత్యేకంగా అర్పించడానికి వారు ఒక మగ గొర్రెపిల్లను, దానితో పాటు భోజనార్పణ కోసం ఒక సేరు నూనెలో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని,
LEV 14:22 రెండు పావురాలు లేదా రెండు చిన్న గువ్వలను, వారి స్థోమతను బట్టి ఒకటి పాపపరిహారబలి కోసం మరొకటి దహనబలి కోసం తీసుకురావాలి.
LEV 14:23 “ఎనిమిదవ రోజున వారు తమ శుద్ధీకరణ కోసం యెహోవా ఎదుటికి సమావేశ గుడారపు ద్వారం దగ్గర యాజకుని దగ్గరకి వాటిని తీసుకురావాలి.
LEV 14:24 యాజకుడు అపరాధపరిహారబలిగా అర్పించేందుకు గొర్రెపిల్లతో పాటు కొంచెం నూనె కూడా తీసుకుని పైకెత్తి ప్రత్యేక అర్పణగా యెహోవా ఎదుట అర్పించాలి.
LEV 14:25 అతడు అపరాధపరిహారబలిగా గొర్రెపిల్లను వధించి, దాని రక్తంలో కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వారి కుడిచెవి కొన మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడికాలి బొటనవ్రేలుపై పూయాలి.
LEV 14:26 యాజకుడు కొంచెం నూనె తన ఎడమ అరచేతిలో వేసుకుని,
LEV 14:27 తన కుడి చూపుడు వ్రేలును దానిలో ముంచి యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరించాలి.
LEV 14:28 తన అరచేతిలో మిగిలిన నూనెలో కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వారి కుడిచెవి కొన మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడికాలి బొటనవ్రేలుపై ఉన్న అపరాధ బలి పశువు రక్తం మీద ఉంచాలి.
LEV 14:29 యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెను యెహోవా ఎదుట శుద్ధీకరణ కోసం వచ్చిన వారి తలకు పూసి వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.
LEV 14:30 అప్పుడు వారు తమ స్థోమతను బట్టి తీసుకువచ్చిన గువ్వలను పావురం పిల్లలను యాజకుడు తీసుకుని,
LEV 14:31 పాపపరిహారబలిగా ఒకదాన్ని, దహనబలిగా ఒకదాన్ని సమర్పించాలి. వాటిని భోజనార్పణతో పాటు అర్పించాలి. ఈ విధంగా యాజకుడు యెహోవా ఎదుట శుద్ధీకరణ కోసం వచ్చిన వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.”
LEV 14:32 తీవ్రమైన కుష్ఠువ్యాధి ఉండి తమ శుద్ధీకరణకు తీసుకురావలసిన అర్పణలను తీసుకురావడానికి స్థోమతలేని వారికి సంబంధించిన నియమాలు ఇవి.
LEV 14:33 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు,
LEV 14:34 “మీ స్వాస్థ్యంగా నేను మీకు ఇస్తున్న కనాను దేశానికి మీరు వచ్చిన తర్వాత, ఆ దేశంలోని ఒక ఇంట్లో నేను కుష్ఠు మచ్చను ఉంచితే,
LEV 14:35 వెంటనే ఆ ఇంటి యజమాని యాజకుడి దగ్గరకు వెళ్లి, ‘నేను నా ఇంట్లో అపవిత్రమైన మచ్చ చూశాను’ అని చెప్పాలి.
LEV 14:36 ఆ ఇంట్లో ఉన్నదంతా అపవిత్రంగా కాకుండ ఉండడానికి యాజకుడు ఆ మచ్చను పరీక్షించడానికి రాకముందే ఆ ఇళ్ళంతా ఖాళీ చేయించాలి. ఆ తర్వాత యాజకుడు లోపలికి వెళ్లి ఇంటిని పరీక్షించాలి.
LEV 14:37 అతడు గోడలపై ఉన్న మచ్చను పరీక్షించినప్పుడు ఆ గోడల మీద పచ్చని గీతలు గాని ఎర్రని గీతలు గోడ పగుళ్లలో ఉంటే,
LEV 14:38 యాజకుడు ఆ ఇంటి ద్వారం నుండి బయటకు వెళ్లి ఏడు రోజులు దానిని మూసివేయాలి.
LEV 14:39 ఏడవ రోజున యాజకుడు ఆ ఇంటిని పరిశీలించడానికి మరలా రావాలి. ఒకవేళ గోడలపై మరక వ్యాపించి ఉంటే,
LEV 14:40 మచ్చలు ఉన్న ఆ రాళ్లను ఊడదీసి పట్టణానికి బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయమని యాజకుడు ఆదేశించాలి.
LEV 14:41 అతడు ఇంటి లోపలి గోడలన్నింటిని గీయించి ఆ చెత్తను పట్టణం బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయాలి.
LEV 14:42 తీసివేసిన వాటి స్థానంలో వేరే రాళ్లు పెట్టి క్రొత్త బంకమట్టిని తీసుకుని ఇంటికి అడుసు పూయాలి.
LEV 14:43 “రాళ్లు ఊడదీసి ఇంటి గోడలను గీయించి కొత్త అడుసు పూసిన తర్వాత ఇంట్లో అపవిత్రమైన మరక తిరిగి కనిపిస్తే,
LEV 14:44 యాజకుడు వెళ్లి దానిని పరీక్షించాలి, ఒకవేళ ఇంట్లో మరక వ్యాపించి ఉంటే అది అపవిత్రపరచే మరక; ఆ ఇల్లు అపవిత్రమైనది.
LEV 14:45 ఆ ఇంటిని దాని రాళ్లను కలపను అడుసును కూలగొట్టి వాటిని పట్టణం బయట ఉన్న అపవిత్రమైన ప్రదేశంలో పడవేయాలి.
LEV 14:46 “ఒకవేళ ఇల్లు మూసివేసి ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్లోకి వెళ్తే సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు.
LEV 14:47 ఆ ఇంట్లో పడుకునేవారు తినేవారు ఎవరైనా సరే తమ బట్టలు ఉతుక్కోవాలి.
LEV 14:48 “యాజకుడు వచ్చి దానిని పరీక్షించినప్పుడు ఆ ఇంటికి అడుసు పూసిన తర్వాత మరక వ్యాపించకపోతే, అపవిత్రం చేసే మరక పోయింది కాబట్టి ఆ ఇల్లు పవిత్రమని అతడు ప్రకటించాలి.
LEV 14:49 ఇంటిని శుద్ధి చేయడానికి అతడు రెండు పక్షులను కొంచెం దేవదారు కర్రను, ఎర్రని నూలును, హిస్సోపును తీసుకోవాలి.
LEV 14:50 అతడు ఆ పక్షుల్లో ఒకదాన్ని మట్టికుండలో ఉన్న మంచినీటిపై చంపాలి.
LEV 14:51 అప్పుడు అతడు దేవదారు కర్రను హిస్సోపును ఎర్రని నూలును బ్రతికి ఉన్న పక్షిని తీసుకుని చనిపోయిన పక్షి రక్తంలోను మంచినీటిలోను ముంచి ఆ ఇంట్లో ఏడుసార్లు చల్లాలి.
LEV 14:52 అతడు ఇంటిని పక్షి రక్తంతోను మంచినీటితోను బ్రతికి ఉన్న పక్షితో దేవదారు కర్రతో హిస్సోపుతో ఎర్రని నూలుతో శుద్ధి చేయాలి.
LEV 14:53 అప్పుడు అతడు బ్రతికి ఉన్న పక్షిని పట్టణం బయట ఉన్న పొలాల్లో వదలివేయాలి. ఈ విధంగా అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయాలి, అది శుద్ధి అవుతుంది.”
LEV 14:54 ఏదైనా కుష్ఠువ్యాధికైనా గజ్జిపుండ్లకైనా నియమాలు ఇవి,
LEV 14:55 వస్త్రాల్లో గాని ఇంట్లో గాని ఏర్పడే అపవిత్రపరచే మరకలకు,
LEV 14:56 వాపుకైనా దద్దుర్లకైనా లేదా మెరిసే మచ్చలకైనా,
LEV 14:57 అవి పవిత్రమైనవా అపవిత్రమైనవా అని ఈ నిబంధనలు తెలియజేస్తాయి. కుష్ఠువ్యాధులు, అపవిత్రపరచే మరకలకు సంబంధించిన నియమాలు ఇవే.
LEV 15:1 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు,
LEV 15:2 “మీరు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో ఇలా చెప్పండి: ‘ఎప్పుడైనా ఏ పురుషునికైనా శరీరంలో నుండి ఏదైనా ద్రవం కారుతుంటే అది అపవిత్రమైనది.
LEV 15:3 అది అతని శరీరం నుండి కారుతూ ఉన్నా లేక ఆగిపోయినా అది అతన్ని అపవిత్రం చేస్తుంది. ఈ విధంగా కారడం వలన అతడు అపవిత్రుడు అవుతాడు.
LEV 15:4 “ ‘స్రవిస్తున్న వ్యక్తి ఏ పడక మీద పడుకున్నా అది అపవిత్రమవుతుంది, అతడు దేనిపైనా కూర్చున్న అది అపవిత్రమవుతుంది.
LEV 15:5 అతని పడకను తాకినవారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
LEV 15:6 స్రవిస్తున్న వ్యక్తి కూర్చున్న దానిపైన ఎవరు కూర్చున్నా వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
LEV 15:7 “ ‘స్రవిస్తున్న వ్యక్తిని ఎవరు తాకినవారు బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.
LEV 15:8 “ ‘స్రవిస్తున్న వ్యక్తి శుభ్రంగా ఉన్నవారిపై ఉమ్మివేస్తే, వారు బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.
LEV 15:9 “ ‘స్వారీ చేసేటప్పుడు ఆ వ్యక్తి కూర్చున్నది అపవిత్రమవుతుంది.
LEV 15:10 అతని క్రింద ఉన్న ఏ వస్తువునైనా తాకినవారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు; ఆ వస్తువులను పైకెత్తినవారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
LEV 15:11 “ ‘స్రవిస్తున్న వ్యక్తి నీటితో చేతులు కడుక్కోకుండా ఎవరినైన తాకితే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.
LEV 15:12 “ ‘ఆ వ్యక్తి తాకిన మట్టికుండను ఖచ్చితంగా పగులగొట్టాలి, అది చెక్క వస్తువైతే దానిని నీటితో కడగాలి.
LEV 15:13 “ ‘స్రవిస్తున్న వ్యక్తి తన స్రావం నుండి శుద్ధి చేయబడినప్పుడు, అతడు తన శుద్ధీకరణ కోసం ఏడు రోజులు లెక్కించి తన బట్టలు ఉతుక్కోవాలి, మంచి నీటితో స్నానం చేయాలి, అప్పుడు అతడు పవిత్రంగా అవుతాడు.
LEV 15:14 ఎనిమిదవ రోజున అతడు రెండు పావురాలను లేదా రెండు చిన్న గువ్వలను తీసుకుని యెహోవా ఎదుట సమావేశ గుడార ద్వారం దగ్గర యాజకునికి ఇవ్వాలి.
LEV 15:15 యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా ఒకదాన్ని దహనబలిగా అర్పించాలి. ఈ విధంగా యాజకుడు స్రవిస్తున్న వ్యక్తికి యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.
LEV 15:16 “ ‘ఒక వ్యక్తికి వీర్యస్కలనం జరిగితే అతడు నీటితో పూర్తిగా స్నానం చేయాలి, అతడు సాయంత్రం వరకు అపవిత్రునిగా ఉంటాడు.
LEV 15:17 బట్టలమీద గాని లేదా చర్మం మీద గాని వీర్యం పడివుంటే నీటితో వాటిని కడగాలి, అవి సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాయి.
LEV 15:18 ఒక పురుషుడు స్త్రీ తో లైంగికంగా కలిసినప్పుడు వీర్యస్కలనం జరిగితే ఇద్దరూ నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
LEV 15:19 “ ‘ఒక స్త్రీకి నెలసరి సమయంలో రక్తస్రావం జరిగినప్పుడు ఆమె నెలసరి అపవిత్రత ఏడు రోజులు ఉంటుంది, ఆమెను తాకిన వారెవరైనా సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
LEV 15:20 “ ‘నెలసరి సమయంలో ఆమె దేనిపై పడుకుంటుందో అది అపవిత్రం అవుతుంది, ఆమె దేనిపై కూర్చుంటుందో అది అపవిత్రం అవుతుంది.
LEV 15:21 ఆమె పడకను తాకినవారు అపవిత్రులవుతారు; వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
LEV 15:22 ఆమె కూర్చున్న దాన్ని తాకినవారు అపవిత్రులవుతారు; వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
LEV 15:23 ఆమె పడకను గాని ఆమె కూర్చున్న దానిని గాని తాకినవారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
LEV 15:24 “ ‘ఒక వ్యక్తి ఆమెతో లైంగికంగా కలిసినప్పుడు ఆమె నెలసరి అతన్ని తాకితే, అతడు ఏడు రోజులు అపవిత్రునిగా ఉంటాడు; అతడు పడుకున్న ఏ పడకయైనా అపవిత్రమవుతుంది.
LEV 15:25 “ ‘ఒక స్త్రీకి తన నెలసరి సమయం కాకుండా చాలా రోజులు రక్తస్రావం జరిగినా లేదా ఆమె నెలసరి వ్యవధి మించి రక్తస్రావం కొనసాగితే, రక్తస్రావం ఉన్నంత వరకు నెలసరి రోజుల్లా ఆమె అపవిత్రంగా ఉంటుంది.
LEV 15:26 ఆమెకు రక్తస్రావం కొనసాగుతున్నప్పుడు ఆమె పడుకున్న ఏ పడకైనా ఆమె నెలసరి సమయంలో ఉన్నప్పటిలాగే ఆ పడక అపవిత్రం, అలాగే ఆమె దేనిపై కూర్చున్న అది అపవిత్రం అవుతుంది.
LEV 15:27 వాటిని తాకినవారు అపవిత్రులు; వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
LEV 15:28 “ ‘ఆమె స్రావం నుండి శుద్ధి చేయబడినప్పుడు, ఆమె ఏడు రోజులు లెక్కించి అవి ముగిసిన తర్వాత ఆమె పవిత్రమవుతుంది.
LEV 15:29 ఎనిమిదవ రోజున ఆమె రెండు గువ్వలను గాని, రెండు పావురం పిల్లలను గాని తీసుకువచ్చి సమావేశ గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యాజకునికి ఇవ్వాలి.
LEV 15:30 యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా ఒకదాన్ని దహనబలిగా అర్పించాలి. ఈ విధంగా యాజకుడు స్త్రీకి స్రావం ద్వార కలిగిన అపవిత్రతకు యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.
LEV 15:31 “ ‘తమను అపవిత్రం చేసే వాటినుండి మీరు ఇశ్రాయేలీయులను దూరంగా ఉంచాలి, తద్వార వారి మధ్య ఉన్న నా నివాస స్థలాన్ని వారు అపవిత్రం చేసినందుకు వారి అపవిత్రతలో వారు చావరు.’ ”
LEV 15:32 ఈ నియమాలు స్రవిస్తున్న వ్యక్తికి వీర్యస్కలనం వలన అపవిత్రమైన వారికి ఈ నియమాలు వర్తిస్తాయి.
LEV 15:33 తన నెలసరి సమయంలో ఉన్న ఒక స్త్రీకి, స్రవిస్తున్న పురుషునికి గాని స్త్రీకి గాని, అపవిత్రురాలైన స్త్రీతో లైంగికంగా కలిసిన పురుషునికి వర్తిస్తాయి.
LEV 16:1 అహరోను ఇద్దరు కుమారులు అనధికార నిప్పుతో యెహోవాను సమీపించినప్పుడు వారు చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడారు.
LEV 16:2 యెహోవా మోషేతో అన్నారు: “నీ సహోదరుడైన అహరోను మందసం మీద ఉన్న ప్రాయశ్చిత్త మూతకు ఎదురుగా ఉన్న తెర వెనుక ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడంటే అప్పుడు రావద్దు అని చెప్పు, అలా వస్తే అతడు చస్తాడు. ఎందుకంటే నేను మేఘంలో ఆ ప్రాయశ్చిత్త మూత మీదే మీకు ప్రత్యక్షమవుతాను.
LEV 16:3 “అహరోను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లే విధానం ఇది: మొదట అతడు పాపపరిహారబలిగా ఒక కోడెను, దహనబలి కోసం ఒక పొట్టేలును తేవాలి.
LEV 16:4 అతడు సన్నని నార చొక్కా, సన్నని నారలోదుస్తులు వేసుకోవాలి; సన్నని నార నడికట్టు కట్టుకుని, సన్నని నార పాగా పెట్టుకోవాలి. ఇవి పవిత్ర దుస్తులు; అవి వేసుకోక ముందు అతడు నీటితో స్నానం చేయాలి.
LEV 16:5 అతడు ఇశ్రాయేలు సమాజం నుండి పాపపరిహారబలి కోసం రెండు మేకపోతులను, దహనబలి కోసం ఒక పొట్టేలును తీసుకోవాలి.
LEV 16:6 “అహరోను తనకు, తన ఇంటివారికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఎద్దును తన పాపపరిహారబలిగా అర్పించాలి.
LEV 16:7 తర్వాత అతడు రెండు మేకపోతులు తీసుకుని సమావేశ గుడార ద్వారం దగ్గర యెహోవా ఎదుట వాటిని సమర్పించాలి.
LEV 16:8 అహరోను ఆ రెండు మేకపోతుల మధ్య చీట్లు వేయాలి ఎందుకంటే వాటిలో ఒకటి యెహోవా భాగం, మరొకటి విడిచిపెట్టబడే మేక.
LEV 16:9 అప్పుడు అహరోను యెహోవా పేరిట చీటి వచ్చిన మేకను తీసుకుని పాపపరిహారబలిగా అర్పించాలి.
LEV 16:10 విడిచిపెట్టాలి అనే చీటి వచ్చిన మేకను దాని వలన ప్రాయశ్చిత్తం కలిగేలా దాన్ని అడవిలో విడిచిపెట్టడానికి యెహోవా ఎదుట సజీవంగా నిలబెట్టాలి.
LEV 16:11 “అహరోను పాపపరిహారబలిగా ఒక కోడెదూడను తన కోసం తన ఇంటివారి ప్రాయశ్చిత్తం కోసం తీసుకురావాలి, దానిని తన పాపపరిహారబలిగా వధించాలి.
LEV 16:12 అతడు యెహోవా ఎదుట ఉన్న బలిపీఠం మీద ఉన్న నిప్పులతో నింపిన ధూపార్తిని, రెండు పిడికెళ్ళ పరిమళ ధూపం పొడిని తీసుకుని వాటిని తెర వెనుకకు తీసుకెళ్లాలి.
LEV 16:13 అతడు ధూపాన్ని యెహోవా ముందు అగ్ని మీద ఉంచాలి, ధూపం యొక్క పొగ ఒడంబడిక పలకలను కప్పి ఉంచిన ప్రాయశ్చిత్త మూతను కప్పివేస్తుంది, తద్వారా అతడు చనిపోడు.
LEV 16:14 ఆ కోడె రక్తంలో కొంత తన వ్రేలితో తీసుకుని ప్రాయశ్చిత్త మూత ముందు చల్లాలి; తర్వాత దానిలో కొంత రక్తం వ్రేలితో ఏడుసార్లు ప్రాయశ్చిత్త మూత ఎదుట ప్రోక్షించాలి.
LEV 16:15 “తర్వాత అతడు ప్రజల పాపపరిహారబలి కోసం మేకపోతును వధించాలి, దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తెచ్చి కోడె రక్తాన్ని చేసినట్టు ప్రాయశ్చిత్త మూత మీద, దాని ముందు చిలకరించాలి.
LEV 16:16 ఇశ్రాయేలీయుల అపవిత్రత కోసం, తిరుగుబాటు కోసం, వారి పాపాలన్నిటి కోసం అతడు అతి పరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ఇశ్రాయేలీయుల అపవిత్రత మధ్య వారి మధ్యలో ఉన్న సమావేశ గుడారం కోసం కూడా ఇదే రీతిలో ప్రాయశ్చిత్తం చేయాలి.
LEV 16:17 అతి పరిశుద్ధస్థలంలో ప్రాయశ్చిత్తం చేయడానికి అహరోను లోపలికి వెళ్లినప్పుడు, తన కోసం తన ఇంటివారి కోసం ఇశ్రాయేలు సమాజమంతటి కోసం ప్రాయశ్చిత్తం జరిగించి బయటకు వచ్చేవరకు ఏ మనుష్యుడు సమావేశ గుడారంలో ఉండకూడదు.
LEV 16:18 “తర్వాత అతడు యెహోవా ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరకు వచ్చి దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అతడు కోడె రక్తం కొంచెం, మేకపోతు రక్తం కొంచెం తీసుకుని బలిపీఠం కొమ్ములన్నిటికి పూయాలి.
LEV 16:19 దానిని శుద్ధీకరించడానికి అతడు తన వ్రేలితో ఆ రక్తాన్ని దానిపై ఏడుసార్లు చల్లి ఇశ్రాయేలీయుల అపవిత్రత నుండి దానిని పవిత్రపరచాలి.
LEV 16:20 “అహరోను అతి పరిశుద్ధ స్థలానికి సమావేశ గుడారానికి బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత, అతడు సజీవ మేకపోతును తీసుకురావాలి.
LEV 16:21 ఆ మేకపోతు తలమీద అహరోను తన రెండు చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల దుష్టత్వమంతటిని, తిరుగుబాటును, పాపాలన్నిటిని దానిపై ఒప్పుకుని వాటిని మేకపోతు తలపై మోపాలి. ఈ పనికి నియమించబడిన వ్యక్తి ఆ మేకపోతును తీసుకెళ్లి అరణ్యంలో వదిలిపెట్టాలి.
LEV 16:22 ఆ మేకపోతు ఈ విధంగా వారి పాపాలన్నిటిని భరిస్తూ నిర్జన ప్రదేశాలకు వెళ్తుంది; ఆ వ్యక్తి దానిని అరణ్యంలో వదిలేస్తాడు.
LEV 16:23 “అప్పుడు అహరోను సమావేశ గుడారంలోకి వెళ్లి అతి పరిశుద్ధస్థలంలోకి వెళ్లేముందు తాను వేసుకున్న సన్నని నార వస్త్రాలను విప్పివేయాలి.
LEV 16:24 అతడు పరిశుద్ధాలయ ప్రాంగణంలో నీటితో స్నానం చేసి తన సాధారణ బట్టలు వేసుకోవాలి. బయటకు వచ్చి తన కోసం దహనబలిని, ప్రజల పక్షాన మరో దహనబలిని అర్పించి తన కోసం, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.
LEV 16:25 అతడు పాపపరిహారబలి యొక్క క్రొవ్వును బలిపీఠం మీద కాల్చాలి.
LEV 16:26 “బలిపశువైన మేకను విడిచిపెట్టి వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసిన తర్వాత అతడు శిబిరంలోకి రావచ్చు.
LEV 16:27 ప్రాయశ్చిత్తం కోసం అతి పరిశుద్ధస్థలంలోకి వేటి రక్తాన్నైతే తీసుకువచ్చారో ఆ పాపపరిహార బలులైన కోడెదూడను, మేకపోతును శిబిరం బయటకు తీసుకెళ్ళాలి; వాటి చర్మాలను, మాంసాన్ని, పేడను కాల్చివేయాలి.
LEV 16:28 వాటిని కాల్చే వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసి ఆ తర్వాత శిబిరంలోకి రావచ్చు.
LEV 16:29 “నెల పదవ రోజున మీరంతా ఉపవాసముండాలి. స్వదేశీయులు గాని, మీ ఇంట్లో ఉన్నా విదేశీయులు గాని ఎవరైనా సరే ఈ నియమం అందరికి వర్తిస్తుంది. ఆ రోజున ఎవరూ ఏ పని చేయకూడదు.
LEV 16:30 ఎందుకంటే ఆ రోజున మిమ్మల్ని పవిత్రపరచడానికి ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. అప్పుడు యెహోవా ఎదుట, మీ పాపాలన్నిటి నుండి మీరు శుద్ధి చేయబడతారు.
LEV 16:31 ఆ రోజు మీకు సబ్బాతు విశ్రాంతి దినము. అప్పుడు మీరు ఉపవాసముండాలి; ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
LEV 16:32 ఎవరైతే తన తండ్రి స్థానంలో అభిషేకం పొంది ప్రధాన యాజకుడుగా ప్రతిష్ఠించబడతారో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం జరిగించాలి. అతడు పవిత్రమైన నార వస్త్రాలు ధరించి,
LEV 16:33 అతి పరిశుద్ధ స్థలానికి, సమావేశ గుడారానికి బలిపీఠానికి, యాజకులకు, సమాజంలోని సభ్యులందరికి ప్రాయశ్చిత్తం చేయాలి.
LEV 16:34 “ఇది మీ కోసం నిత్య కట్టుబాటుగా ఉంటుంది: ఇశ్రాయేలీయుల పాపాలన్నిటికీ సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చేయాలి.” యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే, అంతా జరిగింది.
LEV 17:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 17:2 “అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘యెహోవా ఆజ్ఞాపించింది ఇది:
LEV 17:3 ఏ ఇశ్రాయేలీయుడైనా ఒక ఎద్దును, గొర్రెపిల్లను లేదా మేకను యెహోవా ఎదుట సమావేశ గుడార ప్రవేశం ముందు కాక శిబిరంలో గాని శిబిరం బయట గాని బలి ఇస్తే, వారు రక్తపాతం కలిగించిన అపరాధులుగా పరిగణించబడతారు; వారు రక్తం చిందించినవారు కాబట్టి వారు వారి ప్రజల నుండి కొట్టివేయబడాలి.
LEV 17:5 కాబట్టి ఇశ్రాయేలీయులు బయట పొలాల్లో అర్పిస్తున్న బలులను ఇకపై యెహోవా ఎదుట సమర్పించాలి. వారు సమావేశ గుడారపు ద్వారం దగ్గర యెహోవాకు సమాధానబలులుగా అర్పించడానికి యాజకుని దగ్గరకు తీసుకురావాలి.
LEV 17:6 సమావేశ గుడార ప్రవేశ ద్వారం దగ్గర యెహోవా బలిపీఠం మీద యాజకుడు రక్తాన్ని చల్లి, క్రొవ్వును యెహోవాకు ఇష్టమైన సువాసనగా దహించాలి.
LEV 17:7 వారు వ్యభిచారం చేస్తూ వచ్చిన మేక విగ్రహాలకు ఇకపై తమ బలులను అర్పించకూడదు. ఇది వారికి, రాబోయే తరాలకు ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.’
LEV 17:8 “వారితో ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలీయులలో గాని వారి మధ్యలో నివసించే విదేశీయులలో గాని ఎవరైనా దహనబలిని గాని మరేదైనా బలిని గాని అర్పించాలనుకుని
LEV 17:9 యెహోవాకు బలి ఇవ్వడానికి సమావేశ గుడార ద్వారం దగ్గరకు దాన్ని తీసుకురాకపోతే వారు ఇశ్రాయేలు ప్రజల నుండి తొలగించబడాలి.
LEV 17:10 “ ‘ఇశ్రాయేలీయులలో గాని వారి మధ్యలో నివసించే విదేశీయులలో గాని ఎవరైనా రక్తాన్ని తింటే వారికి నేను విరోధంగా ఉంటాను, వారిని తమ ప్రజల నుండి తొలగిస్తాను.
LEV 17:11 ఎందుకంటే, ఒక జీవికి ప్రాణం రక్తంలో ఉంది, బలిపీఠం మీద మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నేను దానిని మీకిచ్చాను. ఇది ఒకరి జీవితానికి ప్రాయశ్చిత్తం చేసే రక్తము.
LEV 17:12 అందుకే, “మీలో గాని, మీ మధ్య ఉన్న విదేశీయులలో గాని ఎవరూ రక్తాన్ని తినకూడదు” అని నేను ఇశ్రాయేలీయులకు ఆదేశించాను.
LEV 17:13 “ ‘ఇశ్రాయేలీయులలో వారి మధ్య నివసించే విదేశీయులలో ఎవరైనా వేటాడుతూ జంతువును గాని పక్షిని గాని పట్టుకుంటే అతడు దాని రక్తాన్ని పూర్తిగా పారబోసి మట్టితో కప్పెయ్యాలి,
LEV 17:14 ఎందుకంటే ప్రతి జీవికి ప్రాణం దాని రక్తము. అందుకే, “ప్రతి జీవికి ప్రాణం దాని రక్తం కాబట్టి మీరు ఏ ప్రాణి రక్తాన్నీ తినకూడదు. ఎవరైన దానిని తింటే వారు తొలిగించబడతారు” అని నేను ఇశ్రాయేలీయులకు ఆదేశించాను.
LEV 17:15 “ ‘ఎవరైన, స్వదేశీయులు గాని విదేశీయులు గాని చచ్చిన జంతువును గాని మృగాలు చీల్చిన పశువులను గాని తింటే, వారు తమ బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. సాయంత్రం వరకు వారు ఆచారరీత్య అపవిత్రులుగా ఉంటారు; తర్వాత శుద్ధులవుతారు.
LEV 17:16 వారు తమ బట్టలు ఉతుక్కోకుండా స్నానం చేయకుండ ఉంటే వారి దోషశిక్షకు వారే బాధ్యులవుతారు.’ ”
LEV 18:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 18:2 “నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి, ‘నేను మీ దేవుడనైన యెహోవాను అని చెప్పు.
LEV 18:3 మీరు నివసించిన ఈజిప్టులోని వారు చేసినట్లు మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని తీసుకెళ్లే కనాను దేశంలోని వారు చేసినట్టు మీరు చేయకూడదు. వారి ఆచారాలను పాటించకూడదు.
LEV 18:4 మీరు నా చట్టాలకు లోబడాలి, నా శాసనాలను జాగ్రతగా పాటించాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.
LEV 18:5 నా శాసనాలను చట్టాలను మీరు పాటించండి. ఎవరైతే వాటికి లోబడేవారు వాటి వల్లనే జీవిస్తారు. నేను యెహోవాను.
LEV 18:6 “ ‘ఎవరూ తమ రక్తసంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నేను యెహోవాను.
LEV 18:7 “ ‘నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకుని నీ తండ్రిని అగౌరపరచవద్దు. ఆమె నీ తల్లి; ఆమెతో లైంగిక సంబంధం ఉండకూడదు.
LEV 18:8 “ ‘నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది నీ తండ్రిని అగౌరపరుస్తుంది.
LEV 18:9 “ ‘నీ సోదరితో అనగా అదే ఇంట్లో పుట్టిన లేదా వేరొక చోట పుట్టిన నీ తండ్రి కుమార్తెతో గాని నీ తల్లి కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకోవద్దు.
LEV 18:10 “ ‘నీ కుమారుని కుమార్తెతో గాని నీ కుమార్తె కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది నిన్ను అగౌరపరుస్తుంది.
LEV 18:11 “ ‘నీ తండ్రి భార్యకు పుట్టిన కుమార్తెతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ సోదరి.
LEV 18:12 “ ‘నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ తండ్రి రక్తసంబంధి.
LEV 18:13 “ ‘నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.
LEV 18:14 “ ‘నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొని అతన్ని అగౌరపరచవద్దు; ఆమె నీ పినతల్లి.
LEV 18:15 “ ‘నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు. ఆమె మీ కుమారుని భార్య; ఆమెతో సంబంధం పెట్టుకోవద్దు.
LEV 18:16 “ ‘నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది నీ సోదరుని అగౌరపరుస్తుంది.
LEV 18:17 “ ‘ఒక స్త్రీతో, ఆమె కుమార్తెతో కూడా లైంగిక సంబంధం పెట్టుకోవద్దు. ఆమె కుమారుని కుమార్తెతో గాని కుమార్తె యొక్క కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; వారు ఆమె సమీప బంధువులు. అది దుష్టత్వము.
LEV 18:18 “ ‘నీ భార్య బ్రతికి ఉండగా నీ భార్యను బాధపెట్టడానికి ఆమె సోదరిని భార్యగా చేసుకుని ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు.
LEV 18:19 “ ‘స్త్రీ నెలసరి ద్వార అపవిత్రంగా ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోడానికి ఆమె దగ్గరకు వెళ్లవద్దు.
LEV 18:20 “ ‘పొరుగువాని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొని ఆమెతో నిన్ను నీవు అపవిత్రం చేసుకోవద్దు.
LEV 18:21 “ ‘మీ పిల్లల్లో ఎవరినీ మోలెకుకు బలి ఇవ్వవద్దు, ఎందుకంటే మీరు మీ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.
LEV 18:22 “ ‘స్త్రీతో ఉన్నట్లు పురుషునితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది అసహ్యకరమైనది.
LEV 18:23 “ ‘జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకుని మిమ్మల్ని మీరు దానితో అపవిత్రం చేసుకోవద్దు. జంతువు స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకునేలా ఆమె దాని ముందు నిలబడకూడదు; అది విపరీతము.
LEV 18:24 “ ‘వీటిలో దేని ద్వారానైన మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు, ఎందుకంటే మీ ముందు నుండి నేను వెళ్లగొట్టే దేశాల ప్రజలు ఇలాంటి వాటి వల్లనే అపవిత్రమయ్యారు.
LEV 18:25 ఆ దేశం కూడ అపవిత్రమైంది; కాబట్టి దాని పాపాన్ని బట్టి దాన్ని శిక్షించాను, ఆ దేశం తనలో నివసించేవారిని బయటికి వెళ్లగ్రక్కుతుంది.
LEV 18:26 కానీ మీరు నా శాసనాలను నా చట్టాలను పాటించాలి. మీలో నివసించే స్వదేశీయులు గాని విదేశీయులు గాని ఈ హేయమైన పనులేవి చేయకూడదు.
LEV 18:27 ఎందుకంటే ఆ దేశంలో మీకంటే ముందు అక్కడ నివసించిన ప్రజలు ఇవన్నీ చేయడం వలన ఆ దేశం అపవిత్రమైంది.
LEV 18:28 మీరు దేశాన్ని అపవిత్రం చేస్తే, అది ముందున్న జనాలను బయటికి వెళ్లగ్రక్కినట్లు మిమ్మల్ని కూడ వెళ్లగ్రక్కుతుంది.
LEV 18:29 “ ‘ఎవరైనా ఇలాంటి హేయమైన కార్యాలు చేస్తే వారు ప్రజల్లో నుండి తొలగించబడతారు.
LEV 18:30 నేను మీకు చెప్పినవి పాటించి, అక్కడ మీకన్నా ముందు నివసించినవారు పాటించిన హేయమైన ఆచారాల్లో దేనినైనా పాటించి వాటివలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకండి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”
LEV 19:1 యెహోవా మోషేతో అన్నారు,
LEV 19:2 “నీవు ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘మీరు పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను.
LEV 19:3 “ ‘మీలో ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులను గౌరవించాలి, నా సబ్బాతులను ఆచరించాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.
LEV 19:4 “ ‘విగ్రహాలవైపు తిరగకండి లేదా మీ కోసం అచ్చు వేసిన విగ్రహ దేవుళ్ళను చేసుకోకండి. నేను మీ దేవుడనైన యెహోవాను.
LEV 19:5 “ ‘మీరు యెహోవాకు సమాధానబలి అర్పించినప్పుడు, అది మీ తరపున అంగీకరించబడే విధంగా దానిని అర్పించాలి.
LEV 19:6 మీరు దానిని బలి అర్పించిన రోజున లేదా మరుసటిరోజున తినాలి; మూడవ రోజు వరకు ఏదైనా మిగిలి ఉంటే దానిని కాల్చివేయాలి.
LEV 19:7 ఒకవేళ దానిలో నుండి ఏదైనా మూడవ రోజున తిన్నట్లైతే, అది అపవిత్రమైనది, అది అంగీకరించబడదు.
LEV 19:8 ఎవరైనా దానిని తింటే, యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రం చేసినందుకు వారు దోషశిక్షను భరిస్తారు; వారు తమ ప్రజల నుండి తొలగించబడాలి.
LEV 19:9 “ ‘మీరు మీ భూమి యొక్క పంటను కోసినప్పుడు, మీ పొలం యొక్క అంచులకు కోయవద్దు లేదా మీ పంట కోతల యొక్క పరిగెలను సేకరించవద్దు.
LEV 19:10 మీ ద్రాక్షతోటపై రెండవసారి వెళ్లవద్దు లేదా పడిపోయిన ద్రాక్షను తీయవద్దు. పేదలు, విదేశీయుల కోసం వాటిని వదిలేయండి. నేను మీ దేవుడనైన యెహోవాను.
LEV 19:11 “ ‘దొంగతనం చేయకూడదు. “ ‘అబద్ధాలాడకూడదు. “ ‘ఒకరిని ఒకరు మోసపుచ్చుకోకూడదు.
LEV 19:12 “ ‘నా పేరిట అబద్ధ ప్రమాణాలు చేసి మీ దేవుని పేరు అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.
LEV 19:13 “ ‘పొరుగువారిని పీడించకండి లేదా దోచుకోకండి. “ ‘కూలివాళ్ళకు ఇవ్వాల్సిన కూలి మరుసటిరోజు ఉదయం వరకు మీ దగ్గర నిల్వ ఉంచుకోకూడదు.
LEV 19:14 “ ‘చెవిటివారిని శపించవద్దు లేదా గ్రుడ్డివారి ముందు అడ్డు బండలు పెట్టవద్దు, కానీ మీ దేవునికి భయపడండి. నేను యెహోవాను.
LEV 19:15 “ ‘తీర్పును వక్రీకరించకండి; బీదవారికి పక్షపాతం చూపకూడదు లేదా గొప్పవారిని అభిమానం చూపకూడదు, కాని మీ పొరుగువారికి న్యాయమైన తీర్పు తీర్చండి.
LEV 19:16 “ ‘మీ ప్రజల్లో కొండేలు వ్యాపింపచేస్తూ తిరగకూడదు. “ ‘మీ పొరుగువారి ప్రాణానికి అపాయం కలిగించేది ఏది చేయకూడదు. నేను యెహోవాను.
LEV 19:17 “ ‘మీ తోటి ఇశ్రాయేలీయున్ని మీ హృదయంలో ద్వేషించకూడదు. మీ పొరుగువారి దోషం మీరు భరించకూడదు అంటే మీరు మీ పొరుగువారిని ఉన్నది ఉన్నట్లుగా గద్దించాలి.
LEV 19:18 “ ‘ప్రతీకారం ప్రయత్నించవద్దు లేదా మీ ప్రజల్లో ఎవరి మీదా పగ పెట్టుకోవద్దు, కానీ మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి. నేను యెహోవానై ఉన్నాను.
LEV 19:19 “ ‘నా శాసనాలు పాటించాలి. “ ‘రకరకాల జంతువులతో సంపర్కం కానివ్వకూడదు. “ ‘పొలంలో రెండు జాతుల విత్తనాలు కలిపి చల్లకూడదు. “ ‘రెండు రకాల దారంతో నేసిన బట్టలు ధరించకూడదు.
LEV 19:20 “ ‘ఒక దాసికి మరొక పురుషునితో నిశ్చితార్థం జరిగి, ఆమె కోసం విమోచన క్రయధనం చెల్లించబడక, ఆమెకు విడుదల కలుగక ముందే ఎవడైనా ఆమెతో పడుకున్నట్లైతే సరియైన శిక్ష ఉండాలి. అయితే ఆమె స్వతంత్రురాలు కాదు, కాబట్టి వారు చంపబడాల్సిన అవసరం లేదు.
LEV 19:21 అయినాసరే, ఆ పురుషుడు సమావేశ గుడార ద్వారం దగ్గరకు ఒక పొట్టేలును తెచ్చి యెహోవాకు అపరాధపరిహారబలి అర్పించాలి.
LEV 19:22 యాజకుడు ఆ పొట్టేలును అపరాధపరిహారబలిగా సమర్పించి యెహోవా ఎదుట అతడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు; అతని పాపం క్షమించబడుతుంది.
LEV 19:23 “ ‘మీరు దేశంలోకి ప్రవేశించి, ఎలాంటి పండ్ల చెట్టునైన నాటితే, దాని పండును నిషేధించబడినదానిగా పరిగణించండి. మూడు సంవత్సరాల వరకు మీరు దానిని నిషేధించబడినదానిగా పరిగణించండి; అది తినకూడదు.
LEV 19:24 నాలుగవ సంవత్సరం దాని పండు పరిశుద్ధంగా, యెహోవాకు స్తుతి యాగంగా ఉంటాయి.
LEV 19:25 అయితే అయిదవ సంవత్సరంలో మీరు దాని పండు తినవచ్చు. ఈ విధంగా మీ పంట అధికమవుతుంది. నేను మీ దేవుడనైన యెహోవాను.
LEV 19:26 “ ‘ఏ మాంసమైన ఇంకా రక్తంతో ఉన్నప్పుడు తినకూడదు. “ ‘భవిష్యవాణి పాటించవద్దు లేదా శకునాలు చూడవద్దు.
LEV 19:27 “ ‘మీ తల ప్రక్క వెంట్రుకలు కత్తిరించవద్దు లేదా మీ గడ్డం చివరలు చిన్నవిగా చేయవద్దు.
LEV 19:28 “ ‘చనిపోయినవారి కోసం మీ శరీరాలు గాయపరచుకోకూడదు లేదా మీ దేహం మీద పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను యెహోవాను.
LEV 19:29 “ ‘మీ కుమార్తెను వేశ్యగా మార్చి ఆమెను దిగజార్చవద్దు, లేదా దేశం వ్యభిచారం వైపు తిరుగుతుంది, దుష్టత్వంతో నిండి ఉంటుంది.
LEV 19:30 “ ‘నా సబ్బాతులను ఆచరించాలి, నా పరిశుద్ధాలయాన్ని గౌరవించండి. నేను యెహోవాను.
LEV 19:31 “ ‘మృతుల ఆత్మలతో మాట్లాడేవారి వైపు తిరగకండి లేదా ఆత్మలతో మాట్లాడేవారిని అనుసరించకండి, ఎందుకంటే మీరు వారి ద్వార అపవిత్రం అవుతారు. నేను మీ దేవుడనైన యెహోవాను.
LEV 19:32 “ ‘వృద్ధులు ఉన్నప్పుడు వారి ముందు నిలబడండి, వృద్ధులను గౌరవించండి, మీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నేను యెహోవాను.
LEV 19:33 “ ‘విదేశీయులు మీ దేశంలో మీ మధ్య నివసించినప్పుడు, వారిని చులకనగా చూడవద్దు.
LEV 19:34 మీ మధ్య నివసించే పరదేశిని మీ స్థానికంగా జన్మించిన వానిగా పరిగణించాలి. మీలాగే వారిని ప్రేమించండి, ఎందుకంటే మీరు ఈజిప్టులో విదేశీయులుగా ఉండేవారు. నేను మీ దేవుడనైన యెహోవాను.
LEV 19:35 “ ‘పొడవు, బరువు లేదా పరిమాణాన్ని కొలిచేటప్పుడు నిజాయితీ లేని ప్రమాణాలను ఉపయోగించవద్దు.
LEV 19:36 న్యాయమైన త్రాసులు, న్యాయమైన తూనిక రాళ్లు, న్యాయమైన ఏఫా, న్యాయమైన హిన్ ఉపయోగించండి. నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన మీ దేవుడనైన యెహోవాను.
LEV 19:37 “ ‘నా శాసనాలు, నా చట్టాలన్నిటిని జ్ఞాపకముంచుకొని వాటిని పాటించండి. నేను యెహోవాను.’ ”
LEV 20:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 20:2 “ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలులో స్వదేశీయులు గాని విదేశీయులు గాని తమ పిల్లలను మోలెకు దేవతకు అర్పిస్తే అలాంటి వారికి మరణశిక్ష విధించాలి. సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపాలి.
LEV 20:3 వారు తమ పిల్లలను మోలెకుకు బలి ఇచ్చి నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు, నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేశారు కాబట్టి నేను వారికి విరోధిగా మారి ప్రజల్లో నుండి వారిని తొలగిస్తాను.
LEV 20:4 ఎవరైన తమ పిల్లలను మోలెకుకు అర్పించినప్పుడు మీ దేశ ప్రజలు చూసి చూడనట్లు తమ కళ్లు మూసుకుని వారిని చంపకుండా వదిలేస్తే,
LEV 20:5 స్వయంగా నేనే వారికి వారి కుటుంబానికి వ్యతిరేకంగా మారి వారిని వారితో పాటు కలిసి మోలెకుతో వ్యభిచరించే వారినందరిని ప్రజల్లో నుండి తొలగిస్తాను.
LEV 20:6 “ ‘మృతుల ఆత్మలతో మాట్లాడేవారితో సోదె చెప్పేవారితో వ్యభిచారం చేయడానికి వారిని అనుసరించేవారికి నేను విరోధిగా మారి వారిని ప్రజల్లో నుండి తొలగిస్తాను.
LEV 20:7 “ ‘నేనే మీ దేవుడైన యెహోవాను కాబట్టి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని పవిత్రంగా ఉండాలి.
LEV 20:8 నా శాసనాలను పాటించి వాటి ప్రకారం నడుచుకోండి. మిమ్మల్ని పరిశుద్ధపరచే యెహోవాను నేనే.
LEV 20:9 “ ‘తన తండ్రిని గాని తల్లిని గాని దూషించే వారికి మరణశిక్ష విధించాలి. వారు తన తండ్రిని తల్లిని శపించారు కాబట్టి వారి మరణానికి వారే బాధ్యులు.
LEV 20:10 “ ‘మరొకని భార్యతో అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వారికి ఆ వ్యభిచారిణికి ఇద్దరికి మరణశిక్ష విధించాలి.
LEV 20:11 “ ‘తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం ఉన్నవాడు తన తండ్రిని అగౌరపరిచాడు. ఆ స్త్రీ పురుషులిద్దరినీ చంపేయాలి; వారి మరణానికి వారే బాధ్యులు.
LEV 20:12 “ ‘ఒకడు తన కోడలితో లైంగిక సంబంధం కలిగియుంటే, వారిద్దరినీ చంపేయాలి; వారు వక్రబుద్ధికి పాల్పడ్డారు; వారి మరణానికి వారే బాధ్యులు.
LEV 20:13 “ ‘ఒకడు స్త్రీతో ఉన్నట్టు మరో పురుషునితో లైంగిక సంబంధం కలిగివుంటే వారిద్దరు హేయమైనది చేశారు కాబట్టి వారికి మరణశిక్ష విధించాలి. వారి మరణానికి వారే బాధ్యులు.
LEV 20:14 “ ‘ఒకడు స్త్రీని, ఆమె తల్లిని కూడా పెళ్ళి చేసుకోవడం దుర్మార్గము. అతడిని వారిద్దరు అగ్నిలో కాల్చివేయాలి. అప్పుడు మీ మధ్యలో దుర్మార్గం ఉండదు.
LEV 20:15 “ ‘జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్న వానికి మరణశిక్ష విధించాలి, ఆ జంతువును చంపాలి.
LEV 20:16 “ ‘ఒక స్త్రీ లైంగిక సంబంధం కోసం జంతువు దగ్గరకు వెళ్లితే, ఆ స్త్రీని ఆ జంతువు చంపాలి; వారి మరణానికి వారే బాధ్యులు.
LEV 20:17 “ ‘ఒకడు తన సోదరిని అనగా తన తండ్రి కుమార్తెను గాని తల్లి కుమార్తెను గాని పెళ్ళి చేసుకుని వారికి లైంగిక సంబంధం ఉంటే, అది అపకీర్తి. వారిని బహిరంగంగా వారి ప్రజల ఎదుట శిక్షించాలి. అతడు తన సోదరిని అగౌరపరిచాడు కాబట్టి అతడే బాధ్యత వహించాలి.
LEV 20:18 “ ‘ఒకడు నెలసరిలో ఉన్న స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అతడు ఆమె రక్తస్రావాన్ని బహిర్గతం చేశాడు, ఆమె కూడ దానిని బయటపెట్టింది. కాబట్టి వారిద్దరిని ప్రజల్లో నుండి తొలగించాలి.
LEV 20:19 “ ‘మీ తల్లి సోదరితో గాని మీ తండ్రి సోదరితో గాని లైంగిక సంబంధం పెట్టుకోకండి, ఎందుకంటే అది రక్తసంబంధాన్ని అగౌరపరచడమే; వారి శిక్షకు వారే బాధ్యులు.
LEV 20:20 “ ‘ఒకడు తన అత్తతో లైంగిక సంబంధం పెట్టుకుంటే, అతడు మామను అగౌరపరచినట్టు. వారి పాపశిక్షకు వారే బాధ్యులు; వారు సంతానం లేకుండా చస్తారు.
LEV 20:21 “ ‘ఒకడు తన సోదరుని భార్యను పెళ్ళి చేసుకోవడం అపవిత్రమైన పని; అతడు తన సోదరున్ని అగౌరపరచినట్టే వారికి సంతానం కలుగదు.
LEV 20:22 “ ‘నా శాసనాలను చట్టాలన్నిటిని పాటించండి, వాటిని అనుసరించండి, తద్వారా మీరు నివసించడానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశం మిమ్మల్ని వెళ్లగ్రక్కదు.
LEV 20:23 నేను మీ ఎదుట నుండి వెళ్లగొట్టబోయే జనాల ఆచారాల ప్రకారం మీరు జీవించకూడదు. వారు అలాంటివి చేశారు కాబట్టి నేను వారిని అసహ్యించుకున్నాను.
LEV 20:24 కానీ నేను మీతో, “మీరు వారి భూమిని స్వాధీనం చేసుకుంటారు; పాలు తేనెలు ప్రవహించే భూమిని నేను మీకు వారసత్వంగా ఇస్తాను” అని చెప్పాను. దేశాల్లో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
LEV 20:25 “ ‘అందువల్ల మీరు పవిత్రమైన జంతువులకు అపవిత్రమైన జంతువులకు, పవిత్రమైన పక్షులకు అపవిత్రమైన పక్షులకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. అపవిత్రమైనవని మీకు వేరుచేసి చెప్పిన ఏ జంతువు వలన గాని పక్షి వలన గాని నేల మీద ప్రాకే దేనివలన గాని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు.
LEV 20:26 మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి, ఎందుకంటే, నేను యెహోవాను, నేను పరిశుద్ధుడను, జనాల్లో నుండి నేను మిమ్మల్ని నా సొంతవారిగా ప్రత్యేకించుకున్నాను.
LEV 20:27 “ ‘మీ మధ్య స్త్రీలలో గాని పురుషులలో గాని మృతుల ఆత్మలతో మాట్లాడేవారు లేదా సోదె చెప్పేవారు వారికి మరణశిక్ష విధించాలి. వారిని రాళ్ళతో కొట్టాలి; వారి మరణానికి వారే బాధ్యులు.’ ”
LEV 21:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు యాజకులతో అనగా అహరోను కుమారులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘యాజకుడు తన ప్రజల్లో ఎవరు చనిపోయినా వారిని తాకి తనను తాను అపవిత్రపరచుకోకూడదు.
LEV 21:2 తన రక్తసంబంధులైన తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సోదరుడు,
LEV 21:3 తన ఇంట్లో ఉంటున్న పెళ్ళికాని కన్య అయిన సోదరి చనిపోతే వారిని తాకి తన తాను అపవిత్రం చేసుకోవచ్చు.
LEV 21:4 యాజకుడు తన భార్య తరుపు బంధువుల కోసం తనను అపవిత్రపరచుకుని అప్రతిష్ఠపాలు కాకూడదు.
LEV 21:5 “ ‘యాజకులు తమ తల గుండు చేసుకోకూడదు, గడ్డం అంచులు కత్తిరించవద్దు; శరీరాన్ని గాయపరచవద్దు.
LEV 21:6 వారు తమ దేవునికి పరిశుద్ధులై ఉండాలి. వారు తమ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. వారు దేవుని ఆహారమైన హోమబలులను యెహోవాకు సమర్పిస్తారు కాబట్టి వారు పరిశుద్ధులై ఉండాలి.
LEV 21:7 “ ‘వారు వేశ్యను గాని చెడిపోయిన దాన్ని గాని పెళ్ళి చేసుకోవద్దు. భర్త విడాకులు ఇచ్చిన స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు, ఎందుకంటే యాజకులు తమ దేవునికి పవిత్రులు.
LEV 21:8 మీ దేవునికి ఆహారం వారే అర్పిస్తారు కాబట్టి వారు పరిశుద్ధులు అని మీరు పరిగణించాలి. మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసే నేను పరిశుద్ధుడైన యెహోవాను కాబట్టి వారిని పరిశుద్ధులుగా భావించాలి.
LEV 21:9 “ ‘యాజకుని కుమార్తె వేశ్యగా మారడం వల్ల తాను అపవిత్రమై తన తండ్రికి అపకీర్తి తెచ్చింది; కాబట్టి ఆమెను అగ్నితో కాల్చివేయాలి.
LEV 21:10 “ ‘ప్రధాన యాజకునిగా ఉండడానికి తన సహోదరులలో ఎవరి తలపై అభిషేకతైలం పోయబడి, యాజక వస్త్రాలను ధరించడానికి ఎవరు నియమించబడ్డారో వారు తన జుట్టును విరబోసుకోవద్దు, బట్టలు చింపుకోకూడదు.
LEV 21:11 అతడు శవాల దగ్గరకి వెళ్లకూడదు. అతడు తన తండ్రి శవం వలన గాని తల్లి శవం వలన గాని తనను తాను అపవిత్రంగా చేసుకోకూడదు.
LEV 21:12 అతడు తన దేవుని అభిషేక తైలంతో ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి అతడు తన దేవుని పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టకూడదు, దానిని అపవిత్రం చేయకూడదు. నేను యెహోవాను.
LEV 21:13 “ ‘అతడు కన్యను పెళ్ళి చేసుకోవాలి.
LEV 21:14 విధవరాలిని గాని, భర్త విడిచిపెట్టిన దాన్ని గాని, వేశ్యను గాని పెళ్ళి చేసుకోకూడదు, తన సొంత ప్రజల్లో నుండి కన్యను అతడు పెళ్ళి చేసుకోవాలి,
LEV 21:15 అతడు తన ప్రజల్లో తన సంతానాన్ని అపవిత్రం చేయకూడదు. అతన్ని పరిశుద్ధపరచే యెహోవాను నేను.’ ”
LEV 21:16 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 21:17 “నీవు అహరోనుతో చెప్పు: ‘రాబోయే తరాలలో మీ వారసులలో లోపం ఉన్నవారెవరైనా తన దేవుని ఆహారాన్ని అర్పించడానికి దగ్గరకు రాకూడదు.
LEV 21:18 లోపం ఉన్నవారు అనగా గ్రుడ్డివారు గాని కుంటివారు గాని వికృతంగా ఉన్నవారు గాని లేదా అంగవైకల్యం గలవారు గాని;
LEV 21:19 కాలు లేక చేయి విరిగినవారు గాని
LEV 21:20 గూనివారు గాని మరుగుజ్జులు గాని కంటి లోపం ఉన్నవారు గాని గజ్జి ఉన్నవారు గాని చీము కారుతున్న పుండ్లతో ఉన్నవారు గాని వరిబీజములు పాడైనవారు గాని సమీపంగా రాకూడదు.
LEV 21:21 యాజకుడైన అహరోను వారసులలో లోపం ఉన్న ఏ ఒక్కరు యెహోవాకు హోమబలులు అర్పించడానికి దగ్గరకు రాకూడదు. అతనికి లోపం ఉంది; అతడు తన దేవుని ఆహారాన్ని అర్పించడానికి దగ్గరకు రాకూడదు.
LEV 21:22 అతడు తన దేవునికి అర్పించే అతి పవిత్రమైన ఆహారాన్ని గాని పవిత్రమైన ఆహారాన్ని తినవచ్చు;
LEV 21:23 అయినాసరే అతనికున్న లోపం కారణంగా అతడు తెర దగ్గరకు వెళ్లకూడదు, బలిపీఠం దగ్గరకు వెళ్లకూడదు, నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేయకూడదు. వారిని పరిశుద్ధులుగా చేసే యెహోవాను నేనే.’ ”
LEV 21:24 మోషే అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలీయులందరికి ఈ విషయాలు చెప్పాడు.
LEV 22:1 యెహోవా మోషేతో అన్నారు,
LEV 22:2 “ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే పవిత్రమైన అర్పణలను గౌరవించుమని అహరోనుతో అతని కుమారులతో చెప్పు, తద్వార వారు నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేయకుండ ఉంటారు. నేను యెహోవాను.
LEV 22:3 “వారితో ఇలా చెప్పు: ‘రాబోయే తరాలలో మీ వారసులలో ఎవరైనా ఆచారరీత్య అపవిత్రులై ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్ర అర్పణల దగ్గరకు వస్తే, వారు నా సన్నిధిలో నుండి తొలగించబడాలి. నేను యెహోవాను.
LEV 22:4 “ ‘అహరోను సంతతిలో ఎవరికైనా కుష్ఠువ్యాధి గాని, స్రావ రోగం గాని ఉంటే వారు పవిత్రమయ్యేవరకు పవిత్ర పదార్థాలను తినకూడదు. వారు శవాన్ని గాని అపవిత్రమైన దేనినైనా గాని తాకినా లేదా వీర్యం విసర్జనతో ఉన్న ఎవరినైన తాకినా, వారు అపవిత్రం అవుతారు,
LEV 22:5 అపవిత్రమైన ప్రాకే పురుగును తాకినా, లేదా ఆచారరీత్య అపవిత్రంగా ఉన్న మనుష్యుని తాకినవారు అపవిత్రం అవుతారు.
LEV 22:6 అలాంటి వాటిలో దేనినైన తాకితే, వారు సాయంత్రం వరకు అపవిత్రంగానే ఉంటారు. వారు నీటితో స్నానం చేసే వరకు పవిత్రమైన అర్పణల నుండి దేన్ని తినకూడదు.
LEV 22:7 సూర్యుడు అస్తమించినప్పుడు వారు పవిత్రం అవుతారు, తర్వాత వారు పవిత్ర అర్పణలు తినవచ్చు, ఎందుకంటే అది వారి ఆహారము.
LEV 22:8 వారు చచ్చినదానిని గాని అడవి జంతువులు చీల్చిన దానిని గాని తిని అపవిత్రం కాకూడదు. నేను యెహోవాను.
LEV 22:9 “ ‘యాజకులు నాకు పరిచర్య చేసినప్పుడు వారికి ఇవ్వబడిన ఆదేశాలను ఉల్లంఘించి దానిని అపవిత్రపరిస్తే దాని పాపదోషం తమ మీదకు చావు తెచ్చుకుంటే దానికి వారే బాధ్యులు. వారిని పరిశుద్ధపరచే యెహోవాను నేనే.
LEV 22:10 “ ‘పరిశుద్ధ అర్పణను యాజక కుటుంబ సభ్యులు తప్ప బయటి వారెవరూ అంటే యాజకుని అతిథి గాని అతని ఇంట్లో జీతగాడు గాని తినకూడదు.
LEV 22:11 అయితే ఒకవేళ యాజకుడు డబ్బుతో బానిసను కొనుగోలు చేస్తే, లేదా బానిసలు అతని కుటుంబంలో జన్మించి ఉంటే, వారు అతని ఆహారాన్ని తినవచ్చు.
LEV 22:12 ఒక యాజకుని కుమార్తె యాజకుని కాకుండ వేరేవాన్ని పెళ్ళి చేసుకుంటే, ఆమె పవిత్రమైన దానాలు దేన్ని తినకూడదు.
LEV 22:13 ఒక యాజకుని కుమార్తె విధవరాలు అయితే లేదా విడాకులు తీసుకుంటే, ఇంకా పిల్లలు లేకుండా ఆమె యవ్వనురాలై తన తండ్రి ఇంట్లో నివసించడానికి తిరిగి వస్తే, ఆమె తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు గాని ఏ అనధికార వ్యక్తి దానిని తినకూడదు.
LEV 22:14 “ ‘ఎవరైనా పొరపాటున పరిశుద్ధ ఆహారం తింటే దానికి వెలకట్టి దాని వెలలో అయిదవ వంతు కలిపి యాజకునికి ఇవ్వాలి.
LEV 22:15 యాజకులు ఇశ్రాయేలీయులు యెహోవాకు సమర్పించే పవిత్రమైన అర్పణలను యాజకులు అపవిత్రం చేయకూడదు.
LEV 22:16 వారి మీదికి అపరాధపరిహార రుసుము చెల్లించుకునేలా చేయకూడదు. వారిని పరిశుద్ధపరచే యెహోవాను నేనే.’ ”
LEV 22:17 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 22:18 “అహరోనుతో అతని కుమారులతో, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘మీలో ఇశ్రాయేలీయుడైనా, ఇశ్రాయేలులో నివసించే పరదేశియైనా యెహోవాకు దహనబలిగా మ్రొక్కుబడిని గాని స్వేచ్ఛార్పణ గాని అర్పిస్తే,
LEV 22:19 ఆ అర్పణ అంగీకరించబడేలా పశువుల మందలో నుండి గాని గొర్రె మేకల మందలో నుండి గాని లోపం లేని మగదాన్ని అర్పించాలి.
LEV 22:20 లోపం ఉన్నదానిని తీసుకురాకండి ఎందుకంటే అది మీ పక్షాన అంగీకరించబడదు.
LEV 22:21 ప్రత్యేక మ్రొక్కుబడి లేదా స్వేచ్ఛార్పణ కోసం ఎవరైనా పశువుల మందలో నుండి గాని లేదా గొర్రెల మందలో నుండి గాని యెహోవాకు సమాధానబలి తెస్తే, అది అంగీకరించబడేలా ఏ లోపం లేనిదై ఉండాలి.
LEV 22:22 యెహోవాకు గ్రుడ్డి దానిని గాని, గాయపడిన దానిని గాని లేదా అంగవైకల్యం ఉన్నదానిని గాని, చీముపట్టిన పుండ్లతో ఉన్నదానిని గాని అర్పించకూడదు. యెహోవాకు హోమబలిగా వీటిలో దేన్ని బలిపీఠం మీద ఉంచవద్దు.
LEV 22:23 అయితే మీరు ఒక అంగవైకల్యంతో ఉన్న ఎద్దును గాని లేదా గొర్రెలను గాని స్వేచ్ఛార్పణగా సమర్పించవచ్చు, కాని ఒక మ్రొక్కుబడి చెల్లించడానికైతే ఇది అంగీకరించబడదు.
LEV 22:24 వృషణాలు నలిపివేయబడిన, గాయపడిన, చీల్చివేయబడిన లేదా కత్తిరించబడిన జంతువును మీరు యెహోవాకు అర్పించకూడదు. మీరు మీ స్వదేశంలో ఇలా చేయకూడదు.
LEV 22:25 మీరు అలాంటి జంతువులను విదేశీయుని చేతిలో నుండి స్వీకరించి, వాటిని మీ దేవునికి ఆహారంగా అర్పించకూడదు. అవి అంగవైకల్యం, లోపాలు కలిగి ఉన్నాయి కాబట్టి మీ పక్షాన అవి అంగీకరించబడవు.’ ”
LEV 22:26 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 22:27 “ఒక దూడ గాని గొర్రెపిల్ల గాని లేదా మేకపిల్ల పుట్టినప్పుడు, అది ఏడు రోజులు తన తల్లితో ఉండాలి. ఎనిమిదవ రోజు నుండి, అది యెహోవాకు సమర్పించబడిన హోమబలిగా అంగీకరించబడుతుంది.
LEV 22:28 ఒకే రోజు ఒక ఆవు లేదా గొర్రెలను, వాటి పిల్లలను మీరు వధించవద్దు.
LEV 22:29 “మీరు యెహోవాకు కృతజ్ఞతార్పణ అర్పించినప్పుడు, అది మీ పక్షంగా అంగీకరించబడే విధంగా అర్పించాలి.
LEV 22:30 అదే రోజు తప్పక దానిని తినాలి; ఉదయం వరకు ఏదీ మిగుల్చవద్దు. నేను యెహోవాను.
LEV 22:31 “నా ఆజ్ఞలు పాటించి వాటిని అనుసరించాలి. నేను యెహోవాను.
LEV 22:32 నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేయవద్దు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల ద్వార పరిశుద్ధునిగా గుర్తించబడాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచిన యెహోవాను,
LEV 22:33 మీకు దేవునిగా ఉండడానికి నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన వాడను. నేను యెహోవాను.”
LEV 23:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 23:2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘నేను నియమించిన పండుగలు, యెహోవాకు నియమించబడిన పండుగలు, మీరు పరిశుద్ధ సమాజంగా చాటాల్సిన పండుగలు ఇవి.
LEV 23:3 “ ‘వారంలో ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు సబ్బాతు విశ్రాంతి దినం, పరిశుద్ధ సమాజపు రోజు. అప్పుడు మీరు ఏ పని చేయకూడదు; మీరు ఎక్కడ నివసించినా, అది యెహోవాకు సబ్బాతు దినము.
LEV 23:4 “ ‘ఇవి యెహోవాకు నియమించబడిన పండుగలు, వీటిని మీరు పరిశుద్ధ సమాజానికి వాటి నియామక సమయాల్లో ప్రకటించాలి:
LEV 23:5 మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంత్రం యెహోవా యొక్క పస్కా పండుగ ప్రారంభము.
LEV 23:6 ఆ నెల పదిహేనవ రోజు యెహోవా యొక్క పులియని రొట్టెల పండుగ మొదలవుతుంది; ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి.
LEV 23:7 మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, పనులేవీ చేయకూడదు.
LEV 23:8 ఏడు రోజులు యెహోవాకు హోమబలులు అర్పించాలి. ఏడవ రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.’ ”
LEV 23:9 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 23:10 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘నేను మీకు ఇవ్వబోతున్న దేశంలోకి మీరు ప్రవేశించినప్పుడు మీరు దాని పంటను కోయండి, మీరు పండించిన మొదటి ధాన్యం యొక్క పనను యాజకుని దగ్గరకు తీసుకుని రండి.
LEV 23:11 అతడు యెహోవా ఎదుట ఆ పనను పైకెత్తి దానిని అర్పించాలి తద్వార అది మీ పక్షంగా అంగీకరించబడుతుంది; దానిని యాజకుడు సబ్బాతు తర్వాత రోజున పైకెత్తి ఆడించాలి.
LEV 23:12 పనను పైకెత్తి అర్పించిన రోజు, లోపం లేని ఒక ఏడాది గొర్రెపిల్లను యెహోవాకు దహనబలిగా అర్పించాలి,
LEV 23:13 దాని భోజనార్పణతో పాటు రెండు ఓమెర్ల నాణ్యమైన పిండిని నూనెతో కలిపి యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా ఒక పావు హిన్ ద్రాక్షరసాన్ని పానార్పణగా సమర్పించాలి.
LEV 23:14 మీరు ఈ అర్పణను మీ దేవునికి తీసుకువచ్చే రోజు వరకు ఏ రొట్టె గాని, కాల్చిన ధాన్యం గాని లేదా క్రొత్త ధాన్యం గాని తినకూడదు. మీరు ఎక్కడ నివసించినా, రాబోయే తరాలకు ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
LEV 23:15 “ ‘సబ్బాతు దినం మరుసటి నుండి, మీరు ప్రత్యేక అర్పణ యొక్క పనను తెచ్చిన దినం నుండి, ఏడు వారాలు పూర్తిగా లెక్కించాలి.
LEV 23:16 ఏడవ సబ్బాతు దినానికి సరిగ్గా యాభై రోజులు లెక్కించాలి, అప్పుడు యెహోవాకు క్రొత్త ధాన్య అర్పణ అర్పించాలి.
LEV 23:17 మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడినుండి, రెండు ఓమెర్ల నాణ్యమైన పిండితో రెండు రొట్టెలను పులిసిన దానితో కాల్చి, యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాల ప్రత్యేక అర్పణగా తీసుకురండి.
LEV 23:18 ఈ రొట్టెతో పాటు లోపం లేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను, ఒక చిన్న ఎద్దును, రెండు పొట్టేళ్లను సమర్పించాలి. భోజనార్పణలు, పానార్పణలతో పాటు అవి యెహోవాకు దహనబలిగా ఉంటాయి, అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
LEV 23:19 పాపపరిహారబలి కోసం మేకపోతును, సమాధానబలిగా రెండు ఏడాది మగ గొర్రెపిల్లను అర్పించాలి.
LEV 23:20 యాజకుడు రెండు గొర్రెపిల్లలను ప్రథమ ఫలాల రొట్టెలతో పాటు యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి. అవి యాజకుని కోసం యెహోవాకు అర్పించే పరిశుద్ధ అర్పణలు.
LEV 23:21 అదే రోజు పరిశుద్ధ సభను ప్రకటించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. మీరెక్కడున్నా ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
LEV 23:22 “ ‘మీరు మీ భూమి యొక్క పంటను కోసినప్పుడు, మీ పొలం అంచుల మట్టుకు కోయకండి లేదా మీ పంట కోతలను సేకరించకండి. పేదల కోసం, మీ మధ్య నివసించే విదేశీయుల కోసం వాటిని వదిలేయండి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”
LEV 23:23 యెహోవా మోషేతో అన్నారు,
LEV 23:24 “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏడవ నెల మొదటి రోజున మీరు సబ్బాతు విశ్రాంతి దినం, బూర ధ్వనితో స్మరించుకుంటూ పరిశుద్ధ సభ నిర్వహించాలి.
LEV 23:25 సాధారణ పని చేయకూడదు కాని యెహోవాకు హోమబలి అర్పించాలి.’ ”
LEV 23:26 యెహోవా మోషేతో అన్నారు,
LEV 23:27 “ఈ ఏడవ నెల పదవ రోజు ప్రాయశ్చిత్త దినము. పరిశుద్ధ సభ నిర్వహించి, మీరు ఉపవాసముండాలి, యెహోవాకు హోమబలి సమర్పించాలి.
LEV 23:28 ఆ రోజు ఎలాంటి పని చేయకూడదు, ఎందుకంటే అది ప్రాయశ్చిత్త దినం, మీ దేవుడైన యెహోవా ఎదుట మీ కోసం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది.
LEV 23:29 ఆ రోజున తమను తాము ఉపేక్షించుకొనని వారు తమ ప్రజల నుండి తొలగించబడాలి.
LEV 23:30 ఆ రోజు ఎవరైనా పని చేస్తే, వారని తమ ప్రజల నుండి నిర్మూలం చేస్తాను.
LEV 23:31 మీరు ఏ పని చేయకూడదు. మీరు ఎక్కడున్నా, రాబోయే తరాలకు ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
LEV 23:32 అది మీకు సబ్బాతు విశ్రాంతి దినం, మీరు ఉపవాసముండాలి. ఆ నెల తొమ్మిదవ రోజు సాయంత్రం నుండి మర్నాడు సాయంత్రం వరకు సబ్బాతును ఆచరించాలి.”
LEV 23:33 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 23:34 “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏడవ నెల పదిహేనవ రోజున యెహోవా యొక్క గుడారాల పండుగ ప్రారంభమవుతుంది, అది ఏడు రోజులు ఉంటుంది.
LEV 23:35 మొదటి రోజు పరిశుద్ధ సభ నిర్వహించాలి; ఆ రోజు జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.
LEV 23:36 ఏడు రోజులు యెహోవాకు హోమబలులు అర్పించాలి, ఎనిమిదవ రోజు పరిశుద్ధ సభ నిర్వహించి యెహోవాకు హోమబలి అర్పించాలి. అది ప్రత్యేక సభ ముగింపు; అప్పుడు జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.
LEV 23:37 “ ‘ఇవి యెహోవా నియమించబడిన పండుగలు, వీటిని యెహోవాకు హోమబలులు, దహనబలులు, భోజనార్పణలు, బలులు, పానార్పణలు తీసుకురావడానికి పరిశుద్ధ సభలుగా మీరు ప్రకటించాలి. ఏ రోజు అర్పణ ఆ రోజు తీసుకురావాలి.
LEV 23:38 ఇవి యెహోవా సబ్బాతులకు, మీ బహుమానాలకు, మ్రొక్కుబడులకు, యెహోవాకు అర్పించే స్వేచ్ఛార్పణలన్నిటికి అధనంగా అర్పించవలసిన అర్పణలు.
LEV 23:39 “ ‘ఏడవ నెల పదిహేనవ రోజు నుండి మీరు పొలం పంట కూర్చుకున్న తర్వాత యెహోవాకు ఏడు రోజుల పండుగ ఆచరించాలి; మొదటి రోజు సబ్బాతు విశ్రాంతి దినం, ఎనిమిదవ రోజు కూడా సబ్బాతు విశ్రాంతి దినము.
LEV 23:40 మొదటి రోజున మీరు మనోహరమైన చెట్ల కొమ్మలు, తాటి మట్టలు, కాలువల ప్రక్కన ఉండే నిరవంజి చెట్ల కొమ్మలు, ఇతర నిరవంజి చెట్ల కొమ్మలను పట్టుకుని మీ దేవుడైన యెహోవా ఎదుట ఏడు రోజులు ఆనందించండి.
LEV 23:41 ప్రతి సంవత్సరం ఈ పండుగ యెహోవా కోసం ఏడు రోజులు మీరు ఆచరించాలి. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది; దీనిని ఏడవ నెలలో ఆచరించాలి.
LEV 23:42 ఏడు రోజులు తాత్కాలిక ఆశ్రయాలలో నివసించండి: స్థానికంగా జన్మించిన ఇశ్రాయేలీయులందరు అలాంటి ఆశ్రయాలలో నివసించాలి.
LEV 23:43 తద్వార ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన తర్వాత వారిని తాత్కాలిక ఆశ్రయాలలో నివసింపజేశానని మీ సంతతివారు తెలుసుకుంటారు. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”
LEV 23:44 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియమించబడిన పండుగలను ప్రకటించాడు.
LEV 24:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 24:2 “వెలుగు కోసం దీపాలు నిరంతరం వెలుగుతూ ఉండేలా దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనెను మీ దగ్గరకు తీసుకురావాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.
LEV 24:3 సమావేశ గుడారంలో నిబంధన మందసాన్ని కప్పి ఉంచే తెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం వరకు నిత్యం యెహోవా ఎదుట దీపాలను వెలిగించాలి. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
LEV 24:4 యెహోవా ఎదుట మేలిమి బంగారు దీపస్తంభంపై ఉన్న దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి.
LEV 24:5 “నాణ్యమైన పిండి తీసుకుని ఒక్కొక్క రొట్టెకు రెండు ఓమెర్ల చొప్పున పన్నెండు రొట్టెలు చేయాలి.
LEV 24:6 యెహోవా ఎదుట మేలిమి బంగారు బల్లపై, వాటిని ఒక వరుసకు ఆరు చొప్పున రెండు వరుసల్లో అమర్చాలి.
LEV 24:7 రొట్టెను సూచించడానికి యెహోవాకు అర్పించే హోమబలిగా ఉండడానికి ప్రతి వరుస దగ్గర జ్ఞాపక భాగంగా కొంత స్వచ్ఛమైన ధూపం ఏర్పాటు చేయాలి.
LEV 24:8 నిత్య నిబంధనగా, ఇశ్రాయేలు పక్షాన ప్రతి సబ్బాతు దినాన యెహోవా ఎదుట ఆ రొట్టెలను బల్లపై పెడుతూ ఉండాలి.
LEV 24:9 అది అహరోను అతని కుమారులకు చెందినది, వారు దీనిని పరిశుద్ధాలయ ప్రాంతంలో తినాలి, ఎందుకంటే ఇది యెహోవాకు సమర్పించిన హోమబలులలో వారి శాశ్వత వాటాలో అతిపరిశుద్ధమైన భాగము.”
LEV 24:10 ఒక రోజు ఇశ్రాయేలు తల్లికి ఈజిప్టు తండ్రికి పుట్టిన కుమారుడు ఇశ్రాయేలీయుల మధ్యకు వెళ్లాడు, అక్కడ శిబిరంలో అతనికి, ఒక ఇశ్రాయేలీయునికి మధ్య గొడవ జరిగింది.
LEV 24:11 ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు యెహోవా నామాన్ని దూషిస్తూ శపించాడు; కాబట్టి వారు అతన్ని మోషే దగ్గరకు తీసుకువచ్చారు. (అతని తల్లి పేరు షెలోమీతు, దాను గోత్రానికి చెందిన దిబ్రీ కుమార్తె.)
LEV 24:12 యెహోవా చిత్తం వారికి తెలిసే వరకు వారు అతన్ని అదుపులో ఉంచారు.
LEV 24:13 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 24:14 “ఆ దైవదూషకున్ని శిబిరం బయటకు తీసుకెళ్లు. అతని మాటలు విన్న వారంతా అతని తలపై చేతులుంచగానే సమాజమంతా రాళ్లతో అతన్ని కొట్టి చంపాలి.
LEV 24:15 ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా తమ దేవున్ని శపిస్తే, తమ పాపశిక్షను భరించాలి;
LEV 24:16 యెహోవా నామాన్ని ఎవరైనా దూషిస్తే, వారు మరణశిక్షకు గురి అవుతారు. సమాజమంత వారిని రాళ్లతో కొట్టి చంపాలి. విదేశీయులైనా, స్వదేశీయులైనా, యెహోవా నామాన్ని దూషిస్తే, వారికి మరణశిక్ష విధించాలి.
LEV 24:17 “ ‘ఎవరైనా మనుష్యుని చంపితే వారికి మరణశిక్ష విధించాలి.
LEV 24:18 ఎవరైనా జంతువును చంపితే ప్రాణానికి బదులుగా ప్రాణమిచ్చి నష్టపరిహారం చెల్లించాలి.
LEV 24:19 పొరుగువారిని ఎవరైనా గాయపరిస్తే, వారిని కూడా అలాగే గాయపరచాలి:
LEV 24:20 ఎముక విరగ్గొడితే ఎముక విరగ్గొట్టాలి, కంటికి కన్ను, పంటికి పన్ను. గాయం చేసిన మనుష్యునికి గాయం చేయాలి.
LEV 24:21 ఎవరైనా జంతువును చంపితే నష్టపరిహారం చెల్లించాలి కాని ఎవరైనా మనిషిని చంపితే, వారికి మరణశిక్ష విధించాలి.
LEV 24:22 విదేశీయులకు స్వదేశీయులకు ఒకే చట్టం ఉండాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”
LEV 24:23 అప్పుడు మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడిన తర్వాత వారు దైవదూషకున్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేశారు.
LEV 25:1 సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో ఇలా అన్నారు,
LEV 25:2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘నేను మీకు ఇవ్వబోయే దేశంలో మీరు ప్రవేశించినప్పుడు, స్వయాన ఆ భూమి కూడా యెహోవాకు సబ్బాతు పాటించాలి.
LEV 25:3 ఆరు సంవత్సరాలు పొలంలో విత్తనాలు చల్లాలి విత్తనాలు చల్లవచ్చు, ద్రాక్షతోటలు సాగుచేసుకుని వాటి ఫలాలు సమకూర్చుకోవచ్చు.
LEV 25:4 కానీ ఏడవ సంవత్సరం భూమికి సబ్బాతు విశ్రాంతి సంవత్సరం, అది యెహోవాకు సబ్బాతు. మీ పొలాల్లో విత్తనాలు వేయకూడదు. ద్రాక్షతోటలు సాగుచేయకూడదు.
LEV 25:5 దానికదిగా పెరిగే పంటను కోయవద్దు, సాగుచేయని మీ ద్రాక్షతోటల నుండి ద్రాక్షపండ్లను కోయవద్దు. భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి ఉండాలి.
LEV 25:6 సబ్బాతు సంవత్సరంలో భూమి దానికదిగా ఏ పంట మీకు, మీ దాసులకు, దాసీలకు, మీ మధ్య నివసించే కూలి పనివారికి, అలాగే మీ మధ్య నివసించే విదేశీయులకు ఆహారమవుతుంది,
LEV 25:7 అలాగే మీ పశువులకు, మీ దేశంలోని అడవి జంతువులకు ఆహారం అవుతుంది. భూమి దేన్ని ఉత్పత్తి చేసినా తినవచ్చు.
LEV 25:8 “ ‘ఏడు సబ్బాతు విశ్రాంతి సంవత్సరాలు లెక్కించాలి అంటే ఏడు సంవత్సరాలు ఏడు మార్లు గుణిస్తే ఏడు సబ్బాతు విశ్రాంతి సంవత్సరాల కాలం మొత్తం నలభై తొమ్మిది సంవత్సరాలు.
LEV 25:9 ఏడవ నెల పదవ రోజు అంతటా బూరధ్వని చేయాలి. ప్రాయశ్చిత్త దినాన మీ దేశమంతటా ఈ బూరధ్వని చేయాలి.
LEV 25:10 యాభైయవ సంవత్సరాన్ని ప్రతిష్ఠితం చేసి, దేశమంతటా దాని నివాసులందరికి స్వేచ్ఛను ప్రకటించండి. ఇది మీకు యాభైయవ వార్షికోత్సవం అవుతుంది; మీలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబ స్వాస్థ్యానికి, మీ సొంత కుటుంబానికి తిరిగి వెళ్లాలి.
LEV 25:11 యాభైయవ సంవత్సరం మీకు వార్షికోత్సవంగా ఉండాలి. ఆ ఏట మీరు విత్తనాలు వేయకూడదు, దానంతట అది పెరిగిన పంట కోయగూడదు. తీర్చిదిద్దని ద్రాక్ష తీగె నుండి పండ్లు కోయగూడదు.
LEV 25:12 అది యాభైయవ వార్షికోత్సవం, మీకు పరిశుద్ధంగా ఉండాలి; నేరుగా పొలాల నుండి తీసుకున్న దానిని మాత్రమే తినాలి.
LEV 25:13 “ ‘ఈ యాభైయవ వార్షికోత్సవంలో అందరు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్తారు.
LEV 25:14 “ ‘మీ సొంత ప్రజలకు స్థలమేదైన అమ్మినా లేదా వారి నుండి కొన్నా, ఒకరిపట్ల ఒకరు స్వప్రయోజనం ఆశించకూడదు.
LEV 25:15 గత యాభైయవ వార్షికోత్సవం తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచాయో లెక్క చూసి ఆ ప్రకారం మీ సొంత ప్రజల దగ్గర పొలం కొనాలి. పంట పండించడానికి మిగతా సంవత్సరాల లెక్క ప్రకారమే అతడు అమ్మాలి.
LEV 25:16 సంవత్సరాలు చాలా ఉన్నప్పుడు, మీరు ధరను పెంచాలి, సంవత్సరాలు తక్కువగా ఉన్నప్పుడు, మీరు ధరను తగ్గించాలి, ఎందుకంటే మీకు నిజంగా అమ్మబడుతుంది పంటల సంఖ్య.
LEV 25:17 ఒకరిపట్ల ఒకరు స్వప్రయోజనం చూసుకోకూడదు కాని మీ దేవునికి భయపడాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.
LEV 25:18 “ ‘నా శాసనాలు పాటించండి, నా చట్టాలకు లోబడుటలో జాగ్రత్త వహించండి, తద్వార మీరు దేశంలో క్షేమంగా జీవిస్తారు.
LEV 25:19 అప్పుడు భూమి దాని ఫలాలను ఇస్తుంది, మీరు మీ సమృద్ధి నుండి తిని అక్కడ క్షేమంగా జీవిస్తారు.
LEV 25:20 “మేము మా పంటలను నాటడం లేదా పండించకపోతే ఏడవ సంవత్సరంలో మేము ఏమి తింటాము?” అని మీరు అడగవచ్చు.
LEV 25:21 ఆరవ సంవత్సరంలో మీకు మూడేళ్లకు తగినంత దిగుబడిని భూమి ఇచ్చేటువంటి ఆశీర్వాదం నేను పంపుతాను.
LEV 25:22 ఎనిమిదవ సంవత్సరంలో మళ్ళీ విత్తనాలు వేయండి. ఆ సంవత్సరంలో మళ్ళీ తొమ్మిదవ సంవత్సరంలో పంట కూర్చునే వరకు మీరు ఆ పంటే తింటారు.
LEV 25:23 “ ‘భూమి శాశ్వతంగా అమ్మకూడదు, ఎందుకంటే భూమి నాది, మీరు నా భూమిలో విదేశీయులు, అపరిచితులుగా నివసిస్తున్నారు.
LEV 25:24 మీరు స్వాధీనంగా కలిగి ఉన్న భూమి అంతటా, మీరు భూమిని విడిపించడానికి తప్పక ఏర్పాటు చేయాలి.
LEV 25:25 “ ‘ఒకవేళ మీ తోటి ఇశ్రాయేలీయులలో ఒకరు పేదవారిగా మారి వారి ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మితే, వారి అతి సమీపబంధువు వచ్చి వారు అమ్మిన వాటిని తిరిగి విడిపించాలి.
LEV 25:26 ఒకవేళ, వారి కోసం దానిని విడిపించడానికి సమీపబంధువు ఎవరు లేకపోతే, కాని తర్వాత వారు వృద్ధి చెంది దానిని విడిపించుకోడానికి తగినంత సంపాదిస్తే,
LEV 25:27 వారు దాన్ని కొన్నప్పటి నుండి వారు విలువను నిర్ణయించి, బకాయిలను వారు ఎవరికి అమ్మారో వారికి తిరిగి చెల్లించాలి; వారు తిరిగి వారి సొంత ఆస్తికి వెళ్లవచ్చు.
LEV 25:28 ఆస్తి మళ్ళీ కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు వారికి దొరక్కపోతే, వారు అమ్మిన ఆస్తి యాభైయవ వార్షికోత్సవం వరకు కొన్న వారి స్వాధీనమవుతుంది. యాభైయవ వార్షికోత్సవంలో అది వారికి తిరిగి ఇవ్వబడుతుంది, వారు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్లవచ్చు.
LEV 25:29 “ ‘ప్రాకారాలు గల పట్టణంలో ఎవరైనా ఇంటిని అమ్మితే, దాని అమ్మకం తర్వాత పూర్తి సంవత్సరం విముక్తి హక్కును కలిగి ఉంటారు. ఆ సమయంలో అమ్మేవారు దానిని విడిపించవచ్చు.
LEV 25:30 ఒకవేళ సంవత్సరం పూర్తిగా గడిచే లోపు దానిని విడిపించకపోతే, ప్రాకారం కలిగిన పట్టణంలోని ఇల్లు శాశ్వతంగా కొనుగోలుదారునికి, అతని వారసులకు చెందుతుంది. ఇది యాభైయవ వార్షికోత్సవంలో తిరిగి ఇవ్వబడదు.
LEV 25:31 కానీ వారి చుట్టూ ఉన్న ప్రాకారాలు లేని గ్రామాల్లోని ఇల్లు బహిరంగ దేశానికి చెందినవిగా పరిగణించాలి. అవి విడిపించబడవచ్చు, అవి యాభైయవ వార్షికోత్సవంలో తిరిగి ఇవ్వబడాలి.
LEV 25:32 “ ‘లేవీయులకు శాశ్వతంగా తమ దగ్గర ఉన్న లేవీయ పట్టణాల్లో తమ ఇళ్ళను విడిపించుకునే హక్కు ఉంటుంది.
LEV 25:33 కాబట్టి లేవీయుల ఆస్తి విడిపించదగినది అంటే, వారి ఇల్లు ఏ పట్టణంలో అమ్మబడినా యాభైయవ వార్షికోత్సవంలో, తిరిగి ఇవ్వబడాలి, ఎందుకంటే లేవీయుల పట్టణాలలోని ఇల్లు ఇశ్రాయేలీయుల మధ్యలో వారి ఆస్తి.
LEV 25:34 కానీ వారి పట్టణాలకు చెందిన పచ్చికబయళ్లు అమ్మకూడదు; అది వారి శాశ్వత స్వాస్థ్యము.
LEV 25:35 “ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి, మీలో తమను తాము ఆదరించుకోలేకపోతే, మీరు ఒక విదేశీయునికి, అపరిచితునికి చేసినట్టుగానే వారికి సహాయం చేయండి, కాబట్టి వారు మీ మధ్య జీవించడం కొనసాగించవచ్చు.
LEV 25:36 వారి నుండి వడ్డీ లేదా లాభం తీసుకోకండి, అయితే మీ దేవునికి భయపడండి, తద్వారా వారు మీ మధ్యనే జీవించడం కొనసాగించవచ్చు.
LEV 25:37 మీరు వారికి వడ్డీకి డబ్బు ఇవ్వకూడదు లేదా లాభం కోసం ఆహారాన్ని అమ్మకూడదు.
LEV 25:38 మీకు కనాను దేశాన్ని ఇచ్చి, నేను మీకు దేవుడనై ఉండాలని మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
LEV 25:39 “ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి తమను తాము మీకు అమ్ముకున్నట్లయితే, వారితో బానిసలుగా పని చేయించవద్దు.
LEV 25:40 వారిని మీ మధ్య జీతగాలుగా లేదా తాత్కాలిక నివాసితులుగా పరిగణించాలి; యాభైయవ వార్షికోత్సవం వరకు, వారు మీ కోసం పని చేస్తారు.
LEV 25:41 అప్పుడు వారు, వారి పిల్లలు విడవబడాలి, వారు తమ కుటుంబాల దగ్గరకు, వారి పూర్వికుల స్వాస్థ్యానికి వెళ్తారు.
LEV 25:42 ఎందుకంటే ఇశ్రాయేలీయులు నా సేవకులు, నేనే ఈజిప్టు నుండి వారిని బయటకు తీసుకువచ్చాను, బానిసలుగా వారు అమ్మబడకూడదు.
LEV 25:43 వారిని కఠినంగా పాలించవద్దు, మీ దేవునికి భయపడాలి.
LEV 25:44 “ ‘మీ చుట్టూ ఉన్న జనాంగాలలో నుండి దాసులు, దాసీలు రావాలి; వారి నుండి బానిసలను కొనవచ్చు.
LEV 25:45 మీ మధ్యనున్న తాత్కాలిక నివాసులు, మీ దేశంలో పుట్టిన వారి కుటుంబాల సభ్యులను మీరు కొనవచ్చు. వారు మీ సొత్తవుతారు.
LEV 25:46 మీరు వారిని మీ పిల్లలకు వారసత్వపు ఆస్తిగా ఇవ్వవచ్చు, వారిని జీవితకాల బానిసలుగా చేయవచ్చు, కానీ మీరు మీ తోటి ఇశ్రాయేలీయులను కఠినంగా పాలించకూడదు.
LEV 25:47 “ ‘మీ మధ్య నివాసమున్న పరదేశి ధనవంతుడైతే, అతని దగ్గర ఉన్న మీ స్వదేశీయుడు బీదవాడై ధనవంతుని లేదా అతని కుటుంబ సభ్యునికి అమ్ముడు పోతే,
LEV 25:48 వారు తమను తాము అమ్మిన తర్వాత విడుదల హక్కును కలిగి ఉంటారు. వారి బంధువుల్లో ఒకరు వారిని విడిపించవచ్చు:
LEV 25:49 మామ లేదా ఒక బంధువు లేదా వారి కుటుంబంలోని రక్తసంబంధి ఎవరైనా వారిని విడిపించవచ్చు. లేదా వారు అభివృద్ధి చెందితే, వారు తమను తాము విడిపించుకోవచ్చు.
LEV 25:50 వారు, వారిని కొనుక్కున్న వ్యక్తి కలిసి అమ్ముడు పోయిన సంవత్సరం నుండి యాభైయవ వార్షికోత్సవం వరకు మిగతా కాలమెంతో లెక్కించాలి. వారి విడుదల యొక్క వెల ఆ సంవత్సరాల లెక్కను బట్టి, జీతగాని వెల ప్రకారం ఉంటుంది.
LEV 25:51 ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉంటే, వాటి ప్రకారం తమను అమ్ముకున్న వెలలో ఎక్కువ వంతు తమ విడుదలకు మళ్ళీ చెల్లించాల్సి ఉంటుంది.
LEV 25:52 యాభైయవ వార్షికోత్సవం వరకు మిగతా సంవత్సరాలు కొన్ని మాత్రమే ఉంటే తమ లెక్క చూసుకొని వారి విడుదల వెల చెల్లించాలి.
LEV 25:53 వారిని జీతగాల్లలా ప్రతి సంవత్సరం పరిగణించాలి; వారు ఎవరికైతే సేవ చేస్తారో వారు, కఠినంగా వ్యవహరించకుండా మీరు చూసుకోవాలి.
LEV 25:54 “ ‘ఒకవేళ ఈ విధానాల్లో ఎవరైనా విడిపించబడకపోయినా, వారు, వారి పిల్లలు యాభైయవ వార్షికోత్సవంలో విడిపించబడాలి,
LEV 25:55 ఎందుకంటే ఇశ్రాయేలీయులు నా దాసులుగా ఉన్నారు, నేను ఈజిప్టు దేశం నుండి వారిని తీసుకువచ్చిన నా దాసులు. నేను మీ దేవుడనైన యెహోవాను.
LEV 26:1 “ ‘మీ కోసం విగ్రహాలను తయారుచేసుకోవద్దు లేదా ఒక బొమ్మను గాని పవిత్రమైన రాయిని గాని నిలుపకూడదు, దాని ముందు తలవంచడానికి చెక్కిన రాయిని మీ భూమిలో పెట్టకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.
LEV 26:2 “ ‘మీరు నా సబ్బాతులను ఆచరించాలి, నా పరిశుద్ధాలయాన్ని గౌరవించండి. నేను యెహోవాను.
LEV 26:3 “ ‘ఒకవేళ మీరు నా శాసనాలు పాటిస్తూ, నా ఆజ్ఞలకు లోబడడానికి జాగ్రత్త వహిస్తే,
LEV 26:4 వాన కాలంలో వాన పంపుతాను, భూమి తన పంటను, చెట్లు వాటి ఫలాలను ఇస్తాయి.
LEV 26:5 ద్రాక్ష కోత వరకు మీ నూర్పిడి కాలం కొనసాగుతుంది, నాటడం వరకు ద్రాక్ష కోత కొనసాగుతుంది, మీరు కోరుకునే ఆహారాన్ని మీరు తిని, మీ దేశంలో క్షేమంగా జీవిస్తారు.
LEV 26:6 “ ‘నేను దేశంలో సమాధానాన్ని అనుగ్రహిస్తాను, మీరు పడుకుంటారు, ఎవరూ మిమ్మల్ని భయపెట్టరు. నేను దేశం నుండి అడవి జంతువులను తొలగిస్తాను, ఖడ్గం మీ దేశం గుండా వెళ్లదు.
LEV 26:7 శత్రువులను మీరు వెంటాడుతారు. వారు మీ ఎదుట ఖడ్గం ద్వార కూలుతారు.
LEV 26:8 మీలో అయిదుగురు వందమందిని, వందమంది పదివేలమందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం ద్వార కూలుతారు.
LEV 26:9 “ ‘నేను మిమ్మల్ని దయతో చూస్తాను, మిమ్మల్ని ఫలవంతం చేస్తాను, మీ సంఖ్యను పెంచుతాను, నేను మీతో నా నిబంధనను ఉంచుతాను.
LEV 26:10 క్రొత్త దానికి స్థలం ఇవ్వడానికి పాత పంటను ఖాళీ చేయునట్లు మీరు ఇంకా గత సంవత్సర పంటను తింటారు.
LEV 26:11 మీ మధ్యనే నా నివాసస్థలం ఉంచుతాను. మిమ్మల్ని త్రోసివేయను.
LEV 26:12 నేను మీ మధ్య నడుస్తూ మీ దేవునిగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు.
LEV 26:13 ఈజిప్టువారికి ఇక మీరు బానిసలుగా ఉండకూడదని మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన మీ దేవుడనైన యెహోవాను నేనే; నేను మీ బానిసత్వ కాడి యొక్క పట్టీలను విరగ్గొట్టాను, మిమ్మల్ని తలలు పైకెత్తి నడిచేలా చేశాను.
LEV 26:14 “ ‘కానీ మీరు నా మాట వినకపోతే, ఈ ఆజ్ఞలన్నిటిని పాటించకపోతే,
LEV 26:15 మీరు నా శాసనాలను తిరస్కరించి, నా చట్టాలను అసహ్యించుకుని నా ఆజ్ఞలన్నిటిని పాటించడంలో విఫలమై, నా నిబంధనను ఉల్లంఘిస్తే,
LEV 26:16 అప్పుడు నేను మీకు ఇలా చేస్తాను: మీ దృష్టిని నాశనం చేసే, మీ బలాన్ని తగ్గించే ఆకస్మిక భీభత్సం, చెడు వ్యాధులు జ్వరాలు తెస్తాను. మీరు వృధాగా విత్తనాన్ని చల్లుతారు, ఎందుకంటే మీ శత్రువులు దానిని తింటారు.
LEV 26:17 నేను మీకు విరోధంగా నా ముఖం పెడతాను, తద్వార మీ శత్రువులతో ఓడిపోతారు; మిమ్మల్ని ద్వేషించేవారే మిమ్మల్ని పరిపాలిస్తారు, ఎవరూ తరమకుండానే మీరు పారిపోతారు.
LEV 26:18 “ ‘ఇదంతటి తర్వాత మీరు నా మాట వినకపోతే, నేను మీ పాపాల కోసం మిమ్మల్ని ఏడు రెట్లు ఎక్కువగా శిక్షిస్తాను.
LEV 26:19 నేను మీ మొండి అహంకారాన్ని విచ్ఛిన్నం చేసి, మీ పైన ఉన్న ఆకాశాన్ని ఇనుములా, మీ క్రింద ఉన్న భూమిని ఇత్తడిలా చేస్తాను.
LEV 26:20 మీ బలము వ్యర్థమైపోతుంది ఎందుకంటే మీ నేల తన పంటలను ఇవ్వదు, పండదు. మీ భూమిలో ఉన్న చెట్లు ఫలం ఇవ్వవు.
LEV 26:21 “ ‘మీరు నా పట్ల శత్రుత్వం కలిగి ఉంటే, నా మాట వినడానికి నిరాకరిస్తే, మీ పాపాలకు తగినంతగా నేను మీ బాధలను ఏడు రెట్లు పెంచుతాను.
LEV 26:22 మీకు విరుద్ధంగా అడవి జంతువులు పంపుతాను, అవి మీ నుండి మీ పిల్లలను దోచుకుంటాయి, మీ పశువులను నాశనం చేస్తాయి, మీ మార్గాలన్నీ నిర్మానుష్యమయేలా మీ సంఖ్య తగ్గేలా చేస్తాయి.
LEV 26:23 “ ‘ఇవన్నీ జరిగినా కూడా నా దిద్దుబాటును అంగీకరించకుండా నాకు విరుద్ధంగా ఉండడం కొనసాగిస్తే,
LEV 26:24 నేనే మీ పట్ల శత్రువుగా ఉంటాను, మీ పాపాలకు ఇంకా ఏడు రెట్లు బాధిస్తాను.
LEV 26:25 నిబంధన ఉల్లంఘనకు ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మీపై ఖడ్గం తెస్తాను. మీరు మీ పట్టణాల్లోకి వెళ్లినప్పుడు, నేను మీ మధ్యకు తెగులును పంపుతాను, మీరు శత్రువు చేతుల్లోకి ఇవ్వబడతారు.
LEV 26:26 నేను మీ రొట్టె సరఫరాను నిలిపివేసినప్పుడు, పదిమంది స్త్రీలు మీ రొట్టెను ఒక పొయ్యిలో కాల్చగలుగుతారు, వారు తూనికె చొప్పున రొట్టెను కొలిచి ఇస్తారు. మీరు తింటారు, కానీ మీరు సంతృప్తి చెందరు.
LEV 26:27 “ ‘ఇవన్నీ జరిగినా కూడా మీరు నా మాట వినకుండా ఇంకా నాకు విరుద్ధంగా ఉంటే,
LEV 26:28 అప్పుడు నా కోపంలో నేను మీ పట్ల శత్రుత్వం కలిగి ఉంటాను, నేనే మిమ్మల్ని మీ పాపాల కోసం ఇంకా ఏడు రెట్లు శిక్షిస్తాను.
LEV 26:29 మీరు మీ కుమారుల మాంసాన్ని, మీ కుమార్తెల మాంసాన్ని తింటారు.
LEV 26:30 నేను మీ క్షేత్రాలను నిర్మూలం చేస్తాను, మీ ధూప బలిపీఠాలను పడగొట్టి, మీ మృతదేహాలను ప్రాణం లేని మీ విగ్రహాల రూపాలపై పోగుచేస్తాను, నేను మిమ్మల్ని అసహ్యించుకుంటాను.
LEV 26:31 నేను మీ పట్టణాలను శిథిలాలుగా మారుస్తాను, మీ పరిశుద్ధాలయాలను వృథా చేస్తాను, మీ అర్పణల సువాసన యందు నేను ఆనందించను.
LEV 26:32 నేను భూమిని వృధా చేస్తాను, తద్వార అక్కడ నివసించే మీ శత్రువులు ఆశ్చర్యపడతారు.
LEV 26:33 నేను మిమ్మల్ని దేశాల మధ్యకు చెదరగొట్టి, నా ఖడ్గాన్ని తీసి మిమ్మల్ని వెంటాడుతాను. మీ భూమి వృథా అవుతుంది, మీ పట్టణాలు శిథిలావస్థలో ఉంటాయి.
LEV 26:34 మీరు మీ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు భూమి తన సబ్బాతు సంవత్సరాలను ఆనందిస్తుంది తద్వార ఎప్పటికీ అది నిర్జనమై ఉంటుంది; అప్పుడు భూమి విశ్రాంతి తీసుకుని దాని సబ్బాతు దినాలను ఆనందిస్తుంది.
LEV 26:35 అన్ని సమయాల్లో అది నిర్జనమై ఉంటుంది, మీరు అందులో నివసించినప్పుడు సబ్బాతు దినాల్లో అది పొందని విశ్రాంతిని పొందుతుంది.
LEV 26:36 “ ‘మీలో మిగిలిన వారికైతే, వారి శత్రువుల దేశాల్లో గాలికి ఆకులు అల్లాడితే పారిపోవునంతగా వారి హృదయాలు ఎంతో భయపడేలా చేస్తాను. ఖడ్గం నుండి వారు పారిపోతున్నట్టు వారు పరుగెత్తుతారు, ఎవరు తరమకుండానే వారు పడిపోతారు,
LEV 26:37 ఎవరూ వారిని తరమనప్పట్టికి ఖడ్గం నుండి పారిపోతున్నట్లు వారు ఒకరిపై ఒకరు దొర్లుతారు. కాబట్టి మీరు మీ శత్రువుల ఎదుట నిలువలేరు.
LEV 26:38 మీరు దేశాల మధ్య నశిస్తారు; మీ శత్రువుల భూమి మిమ్మల్ని మ్రింగివేస్తుంది.
LEV 26:39 శత్రు దేశంలో మీలో మిగిలిన వారు తమ పాపాలను బట్టి కుళ్ళిపోతారు; తమ పూర్వికుల పాపాలను బట్టి కూడా కుళ్ళిపోతారు.
LEV 26:40 “ ‘కాని వారు తమ పాపాలను, వారి పూర్వికుల పాపాలను ఒప్పుకుని అంటే వారు నాకు చేసిన ద్రోహం, తద్వార నేను వారికి విరుద్ధంగా నడిచి, వారిని శత్రువుల దేశానికి పంపానని ఒప్పుకుని, అంటే సున్నతిలేనివారి హృదయాలు తగ్గించుకొని వారి పాపాలకు వారు మూల్యం చెల్లిస్తే,
LEV 26:42 నేను యాకోబుతో నా నిబంధనను, ఇస్సాకుతో నా నిబంధనను, అబ్రాహాముతో నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను, దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను.
LEV 26:43 భూమి వారిచే విడిచిపెట్టబడుతుంది, నిర్జనమవుతుంది, వారు లేకుండా, నిర్జన స్థితిలో ఉండగా, అది సబ్బాతు దినాలను ఆనందిస్తుంది. వారు నా చట్టాలను తిరస్కరించారు, నా శాసనాలను అసహ్యించుకున్నారు కాబట్టి వారు వారి పాపాలకు మూల్యం చెల్లిస్తారు.
LEV 26:44 అయినప్పటికీ, వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు, వారితో నా నిబంధనను విచ్ఛిన్నం చేస్తూ, వారిని పూర్తిగా నాశనం చేసే విధంగా నేను వారిని తిరస్కరించను, అసహ్యించుకోను. నేను వారి దేవుడనైన యెహోవానై ఉన్నాను.
LEV 26:45 అయితే వారి కోసం నేను జనముల దృష్టిలో వారి దేవునిగా ఉండాలని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. నేను యెహోవాను.’ ”
LEV 26:46 మోషే ద్వారా తనకు, ఇశ్రాయేలీయులకు మధ్య సీనాయి పర్వతం దగ్గర యెహోవా ఏర్పాటుచేసిన శాసనాలు, చట్టాలు, నియమాలు ఇవి.
LEV 27:1 యెహోవా మోషేతో అన్నారు,
LEV 27:2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో చెప్పు: ‘ఒకవేళ సమాన విలువను ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తిని యెహోవాకు అంకితం చేయడానికి ఎవరైనా ప్రత్యేక మ్రొక్కుబడి చేస్తే,
LEV 27:3 పురుషులకైతే ఇరవై సంవత్సరాల వయస్సు మొదలుకొని అరవై సంవత్సరాల వయస్సు వరకు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం యాభై షెకెళ్ళ వెండి, వెల నిర్ణయించాలి;
LEV 27:4 స్త్రీలకు వెల ముప్పై షెకెళ్ళ వెండి నిర్ణయించాలి;
LEV 27:5 అయిదు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల లోపు వయస్సుగల వారైతే మగపిల్లవాడికి వెల ఇరవై షెకెళ్ళ వెండి, ఆడపిల్లకు వెల పది షెకెళ్ళ వెండిగా నిర్ణయించాలి;
LEV 27:6 నెల మొదలుకొని అయిదు సంవత్సరాల వయస్సుగల మగపిల్లవాడికి వెల అయిదు షెకెళ్ళ వెండి, ఆడపిల్లకు మూడు షెకెళ్ళ వెండిగా నిర్ణయించాలి;
LEV 27:7 అరవై సంవత్సరాలు మొదలుకొని ఆపై వయస్సుగల పురుషునికి వెల పదిహేను షెకెళ్ళ వెండిగా, స్త్రీకి వెల పది షెకెళ్ళ వెండిగా నిర్ణయించాలి.
LEV 27:8 మ్రొక్కుబడి చేసిన ఎవరైనా నిర్దిష్టమైన మొత్తాన్ని చెల్లించలేనంత పేదవారైతే, ప్రతిష్ఠించబడిన వ్యక్తి యాజకునికి సమర్పించబడాలి, అతడు మ్రొక్కుబడి చేసిన వ్యక్తి స్తోమత ప్రకారం విలువను నిర్ణయిస్తాడు.
LEV 27:9 “ ‘ఒకవేళ వారు ప్రమాణం చేసినది ఒక జంతువై అది యెహోవాకు అంగీకారమైన అర్పణ అయితే, అలాంటి జంతువు యెహోవాకు ఇచ్చినప్పుడు పరిశుద్ధమవుతుంది.
LEV 27:10 వారు దానిని మార్చుకోవడం లేదా ప్రతిమార్పిడి చేయకూడదు లేదా చెడ్డ దానికి బదులుగా మంచిది, లేదా మంచి దాని బదులు చెడ్డ దానిని ప్రతిమార్పిడి చేయకూడదు; ఒకవేళ వారు ఒక జంతువుకు బదులుగా మరొకదానిని ప్రతిమార్పిడి చేయాలనుకుంటే, అప్పుడు ఇది, ప్రతిమార్పిడి చేసినది రెండూ పరిశుద్ధమవుతాయి.
LEV 27:11 ఒకవేళ వారు ప్రమాణం చేసిన జంతువు ఆచారరీత్య అపవిత్రమైనదై ఒక అర్పణగా యెహోవాకు అంగీకారమైంది కానట్లైతే, ఆ జంతువును యాజకునికి సమర్పించాలి,
LEV 27:12 అతడు దాని నాణ్యత మంచిదా లేదా చెడ్డదా అని నిర్ణయిస్తాడు. యాజకుడు ఏ విలువను నిర్ణయిస్తే, అదే అవుతుంది.
LEV 27:13 ఒకవేళ యజమాని జంతువును విడిపించాలనుకుంటే, దాని విలువకు అయిదవ భాగాన్ని కలపాలి.
LEV 27:14 “ ‘ఒకవేళ ఎవరైనా తమ ఇంటిని పరిశుద్ధమైనదిగా యెహోవాకు ప్రతిష్ఠిస్తే, దాని నాణ్యత మంచిదా లేదా చెడ్డదా అని యాజకుడు నిర్ణయిస్తాడు. యాజకుడు అప్పుడు ఏ వెలను నిర్ణయిస్తే అదే ఉంటుంది.
LEV 27:15 ఒకవేళ తమ ఇంటిని ప్రతిష్ఠించినవారు దానిని విడిపించాలనుకుంటే, వారు దాని వెలకు అయిదవ వంతు కలపాలి, ఆ ఇల్లు మళ్ళీ వారిది అవుతుంది.
LEV 27:16 “ ‘ఒకవేళ ఎవరైనా తమ కుటుంబ భూమిలో కొంత భాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తే, దానికి అవసరమయ్యే విత్తన మొత్తాన్ని బట్టి దాని వెల నిర్ణయించబడుతుంది. ఒక హోమెరు యవలు విత్తనాల వెల యాభై షెకెళ్ళ వెండి.
LEV 27:17 యాభైయవ వార్షికోత్సవంలో వారు భూమిని ప్రతిష్ఠిస్తే, నిర్ణయించబడిన వెల కొనసాగుతుంది.
LEV 27:18 కాని ఒకవేళ యాభైయవ వార్షికోత్సవం తర్వాత భూమిని ప్రతిష్ఠిస్తే, మరుసటి వార్షికోత్సవం వరకు మిగిలి ఉన్న సంవత్సరాల ప్రకారం యాజకుడు వెల నిర్ణయిస్తాడు, దాని నిర్ణయించబడిన వెల తగ్గుతుంది.
LEV 27:19 ఒకవేళ భూమిని ప్రతిష్ఠించినవాడు దానిని విడిపించాలనుకుంటే, వారు దాని వెలకు అయిదవ వంతు కలపాలి, అప్పుడు పొలం మళ్ళీ వారిది అవుతుంది.
LEV 27:20 ఒకవేళ, వారు పొలాన్ని విడిపించకపోతే, లేదా వారు దానిని వేరొకరికి అమ్మినట్లయితే, అది ఎప్పటికీ విడిపించబడదు.
LEV 27:21 యాభైయవ వార్షికోత్సవంలో పొలం విడిపించబడినప్పుడు, యెహోవాకు ప్రతిష్ఠించబడిన పొలంలా, అది పరిశుద్ధమవుతుంది; అది యాజకత్వపు ఆస్తి అవుతుంది.
LEV 27:22 “ ‘ఎవరైనా తాము కొనిన తమ కుటుంబ భూమిలో భాగం కానిది, యెహోవాకు అంకితం చేస్తే,
LEV 27:23 యాభైయవ వార్షికోత్సవం వరకు యాజకుడు దాని వెలను నిర్ణయిస్తాడు, యజమాని అది యెహోవాకు చెందిన పరిశుద్ధమైనదిగా దాని వెల ఆ రోజున చెల్లించాలి.
LEV 27:24 యాభైయవ వార్షికోత్సవంలో ఆ పొలం ఎవరినుండి కొనుగోలు చేయబడిందో, అది తిరిగి ఆ వ్యక్తికే అనగా ఆ పొలం ఎవరిదో వారిదే అవుతుంది.
LEV 27:25 ప్రతి వెల పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నిర్ణయించబడాలి, షెకెల్ ఒకటికి ఇరవై గెరాలు.
LEV 27:26 “ ‘అయినప్పటికీ, జంతువు యొక్క మొదట పుట్టిన సంతానాన్ని ఎవరూ ప్రతిష్ఠించకూడదు, ఎందుకంటే మొదట సంతానం అప్పటికే యెహోవాకు చెందినది; ఒక ఎద్దు అయినా లేదా గొర్రె అయినా, అది యెహోవాదే.
LEV 27:27 ఒకవేళ అది అపవిత్రమైన జంతువుల్లో ఒకటి అయితే, దానికి నిర్ణయించబడిన వెలకు, అయిదవ వంతు కలిపి తిరిగి దానిని కొనవచ్చు. ఒకవేళ అది విడిపించబడకపోతే, దానికి నిర్ణయించబడిన వెలకు అమ్మబడాలి.
LEV 27:28 “ ‘కానీ ఒక వ్యక్తి తనకు చెందిన మనిషైనా జంతువైనా కుటుంబ భూమియైనా యెహోవాకు ప్రతిష్ఠిస్తే దాన్ని అమ్మకూడదు, విడిపించకూడదు; యెహోవాకు ప్రతిష్ఠితమైన ప్రతిదీ అతిపరిశుద్ధము.
LEV 27:29 “ ‘మనుష్యులు నాశనం చేయబడడానికి ప్రతిష్ఠించిన వాటిని విమోచన క్రయధనం చెల్లించి విడిపించకూడదు; వాటిని చంపాల్సిందే.
LEV 27:30 “ ‘భూమి నుండి వచ్చే ప్రతి దానిలో నుండి దశమభాగం, అది భూమి నుండి వచ్చే ధాన్యమైనా లేదా చెట్ల నుండి వచ్చే ఫలాలైనా, యెహోవాకు చెందినది; అది యెహోవాకు పరిశుద్ధమైనది.
LEV 27:31 ఎవరైనా తమ దశమభాగంలో దేనినైన విడిపించుకోవాలంటే దాని వెలకు అయిదవ వంతు కలపాలి.
LEV 27:32 మంద, గొర్రెల మంద నుండి ప్రతీ దశమభాగం అనగా గొర్రెల కాపరి కర్ర క్రిందనుండి వెళ్లే ప్రతి పదవ జంతువు యెహోవాకు పరిశుద్ధంగా ఉంటుంది.
LEV 27:33 చెడు నుండి మంచిని తీసుకోకూడదు లేదా ప్రతిమార్పిడి చేయకూడదు. ఒకవేళ ఎవరైనా ప్రతిమార్పిడి చేస్తే జంతువు, దాని ప్రతిమార్పిడి రెండూ పవిత్రమవుతాయి, అవి విడిపించబడలేవు.’ ”
LEV 27:34 ఇవి సీనాయి పర్వతం దగ్గర యెహోవా ఇశ్రాయేలీయుల కోసం మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.
NUM 1:1 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి రోజు సీనాయి ఎడారిలో ఉన్న సమావేశ గుడారంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా అన్నారు:
NUM 1:2 మొత్తం సమాజంలోని ఇశ్రాయేలీయుల వంశాలు కుటుంబాల ప్రకారం వారి జనాభా లెక్కలు నమోదు చేయి.
NUM 1:3 నీవూ అహరోను కలిసి ఇశ్రాయేలీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు గలవారు, సైన్యంలో సేవ చేయగలవారిని వారి వారి సేనల ప్రకారం లెక్కించాలి.
NUM 1:4 ప్రతీ గోత్రం నుండి ఒకడు తన కుటుంబానికి పెద్దగా ఉన్న ప్రతీ ఒకడు మీకు సహాయం చేయాలి.
NUM 1:5 “మీకు సహాయం చేయాల్సిన పురుషుల పేర్లు ఇవి: “రూబేను గోత్రం నుండి షెదేయూరు కుమారుడైన ఎలీసూరు;
NUM 1:6 షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు;
NUM 1:7 యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను;
NUM 1:8 ఇశ్శాఖారు గోత్రం నుండి సూయరు కుమారుడైన నెతనేలు;
NUM 1:9 జెబూలూను గోత్రం నుండి హేలోను కుమారుడైన ఏలీయాబు;
NUM 1:10 యోసేపు కుమారుల నుండి: ఎఫ్రాయిం గోత్రం నుండి అమీహూదు కుమారుడైన ఎలీషామా; మనష్షే గోత్రం నుండి పెదాసూరు కుమారుడైన గమలీయేలు;
NUM 1:11 బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కుమారుడైన అబీదాను;
NUM 1:12 దాను గోత్రం నుండి అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు;
NUM 1:13 ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కుమారుడైన పగీయేలు;
NUM 1:14 గాదు గోత్రం నుండి దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు;
NUM 1:15 నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కుమారుడైన అహీర.”
NUM 1:16 వీరు సమాజంలో వారి పితరుల గోత్రాల నుండి నాయకులుగా ఏర్పాటు చేయబడినవారు. వీరు ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు.
NUM 1:17 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే అహరోనులు పేర్లు పేర్కొనబడిన వారిని తీసుకుని,
NUM 1:18 రెండవ నెల మొదటి రోజున సమాజమంతటిని సమావేశ పరిచారు. ప్రజలు వారి వారి గోత్రాలు, వారి వారి కుటుంబాల ప్రకారం తమ వంశాన్ని నమోదు చేసుకున్నారు. యిరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సున్న వారు ఒకరి తర్వాత ఒకరి పేరు నమోదు చేశారు.
NUM 1:19 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే సీనాయి ఎడారిలో వారిని లెక్కించాడు:
NUM 1:20 ఇశ్రాయేలు మొదటి సంతానమైన రూబేను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి, సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
NUM 1:21 రూబేను గోత్రం నుండి లెక్కించబడినవారు 46,500.
NUM 1:22 షిమ్యోను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
NUM 1:23 షిమ్యోను గోత్రం నుండి లెక్కించబడినవారు 59,300.
NUM 1:24 గాదు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
NUM 1:25 గాదు గోత్రం నుండి లెక్కించబడినవారు 45,650.
NUM 1:26 యూదా సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
NUM 1:27 యూదా గోత్రం నుండి లెక్కించబడినవారు 74,600.
NUM 1:28 ఇశ్శాఖారు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
NUM 1:29 ఇశ్శాఖారు గోత్రం నుండి లెక్కించబడినవారు 54,400.
NUM 1:30 జెబూలూను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
NUM 1:31 జెబూలూను గోత్రం నుండి లెక్కించబడినవారు 57,400.
NUM 1:32 యోసేపు కుమారులు: ఎఫ్రాయిం సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
NUM 1:33 ఎఫ్రాయిం గోత్రం నుండి లెక్కించబడినవారు 40,500.
NUM 1:34 మనష్షే సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
NUM 1:35 మనష్షే గోత్రం నుండి లెక్కించబడినవారు 32,200.
NUM 1:36 బెన్యామీను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
NUM 1:37 బెన్యామీను గోత్రం నుండి లెక్కించబడినవారు 35,400.
NUM 1:38 దాను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
NUM 1:39 దాను గోత్రం నుండి లెక్కించబడినవారు 62,700.
NUM 1:40 ఆషేరు సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
NUM 1:41 ఆషేరు గోత్రం నుండి లెక్కించబడినవారు 41,500.
NUM 1:42 నఫ్తాలి సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
NUM 1:43 నఫ్తాలి గోత్రం నుండి లెక్కించబడినవారు 53,400.
NUM 1:44 వీరంతా ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల నాయకులతో కలిసి మోషే అహరోనులచేత లెక్కించబడినవారు.
NUM 1:45 ఇశ్రాయేలీయులందరిలో ఇరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సుండి ఇశ్రాయేలు సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
NUM 1:46 వీరి మొత్తం సంఖ్య 6,03,550.
NUM 1:47 అయితే లేవీయుల పూర్వికుల గోత్రం ప్రకారం వీరితో పాటు లెక్కించబడలేదు.
NUM 1:48 యెహోవా మోషేతో ఇలా అన్నారు:
NUM 1:49 “లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు.
NUM 1:50 దానికి బదులుగా సాక్షి గుడారం లేదా సాక్షి గుడారం మీద, దాని ఉపకరణాల మీద, దానికి సంబంధించిన అన్నిటి మీద లేవీయులను నియమించు. వారు సమావేశ గుడారాన్ని, దాని ఉపకరణాలన్నిటిని మోయాలి; వారు దాని చుట్టూ ఉంటూ దానిని చూసుకోవాలి.
NUM 1:51 సమావేశ గుడారాన్ని తరలించాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దానిని క్రిందికి దించాలి, అలాగే సమావేశ గుడారాన్ని వేయాల్సి వచ్చినప్పుడెల్లా, లేవీయులే దాన్ని వేయాలి. ఇతరులు దానిని సమీపిస్తే వారికి మరణశిక్ష విధించాలి.
NUM 1:52 ఇశ్రాయేలీయులు తమ తమ గోత్ర విభజన ప్రకారం సొంత జెండాలతో తమ డేరాలు వేసుకోవాలి.
NUM 1:53 అయితే నా కోపం ఇశ్రాయేలీయుల సమాజం మీదికి రాకుండా లేవీయులు సాక్షి గుడారం చుట్టూ డేరాలు వేసుకోవాలి. సాక్షి గుడారాన్ని కాపాడే బాధ్యత లేవీయులదే.”
NUM 1:54 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు చేశారు.
NUM 2:1 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు:
NUM 2:2 “ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం చుట్టూ దానికి కొంత దూరంలో, వారిలో ప్రతి ఒక్కరు తమ తమ స్థలంలో తమ గోత్రపు జెండాలను పట్టుకుని శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలి.”
NUM 2:3 తూర్పున, సూర్యుడు ఉదయించే వైపు: యూదా శిబిరానికి చెందిన దళాలవారు తమ జెండాల దగ్గర దిగాలి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా ప్రజల నాయకుడు.
NUM 2:4 అతని దళంలో ఉన్నవారు 74,600.
NUM 2:5 వారి ప్రక్కన ఇశ్శాఖారు గోత్రం వారు దిగాలి. సూయరు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు ప్రజల నాయకుడు.
NUM 2:6 అతని దళంలో ఉన్నవారు 54,400.
NUM 2:7 వారి ప్రక్కన జెబూలూను గోత్రము. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూను ప్రజల నాయకుడు.
NUM 2:8 అతని విభజనలో ఉన్నవారు 57,400.
NUM 2:9 యూదా శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన పురుషులందరు, 1,86,400. వారు ముందుగా వెళ్తారు.
NUM 2:10 దక్షిణం వైపు: రూబేను గోత్రం వారు వారి జెండా క్రింద ఉండాలి. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను ప్రజల నాయకుడు.
NUM 2:11 అతని దళంలో ఉన్నవారు 46,500.
NUM 2:12 వారి ప్రక్కన షిమ్యోను గోత్రం వారు దిగాలి. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను ప్రజల నాయకుడు.
NUM 2:13 అతని దళంలో ఉన్నవారు 59,300.
NUM 2:14 వారి ప్రక్కన గాదు గోత్రం వారు దిగాలి. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు ప్రజల నాయకుడు.
NUM 2:15 అతని దళంలో ఉన్నవారు 45,650.
NUM 2:16 రూబేను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,51,450. వీళ్ళు రెండవ గుంపుగా వెళ్తారు.
NUM 2:17 తర్వాత సమావేశ గుడారం, శిబిరాల మధ్యలో లేవీయుల శిబిరం ఉంటుంది. వారు ఉన్న ఈ క్రమంలోనే, ప్రతి ఒక్కరూ తమ జెండా క్రింద తమ స్థలంలో ఉంటారు.
NUM 2:18 పడమర వైపు: ఎఫ్రాయిం గోత్రం వారి జెండా ప్రకారం ఉండాలి. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిం ప్రజల నాయకుడు.
NUM 2:19 అతని దళంలో ఉన్నవారు 40,500.
NUM 2:20 మనష్షే గోత్రం వారు వారి ప్రక్కన దిగాలి. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే ప్రజల నాయకుడు
NUM 2:21 అతని దళంలో ఉన్నవారు 32,200.
NUM 2:22 వారి ప్రక్కన బెన్యామీను గోత్రం వారు దిగాలి. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను ప్రజల నాయకుడు.
NUM 2:23 అతని దళంలో ఉన్నవారు 35,400.
NUM 2:24 ఎఫ్రాయిం శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,08,100. వీరు మూడవ గుంపుగా వెళ్తారు.
NUM 2:25 ఉత్తరం వైపున: దాను గోత్రం వారు వారి జెండా దగ్గర ఉండాలి. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు దాను ప్రజల నాయకుడు.
NUM 2:26 అతని దళంలో ఉన్న వారి సంఖ్య 62,700.
NUM 2:27 ఆషేరు గోత్రం వారు వారి ప్రక్కన దిగాలి. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు ప్రజల నాయకుడు.
NUM 2:28 అతని దళంలో ఉన్నవారు 41,500.
NUM 2:29 వారి ప్రక్కన నఫ్తాలి గోత్రం వారు దిగాలి. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి ప్రజల నాయకుడు.
NUM 2:30 అతని దళంలో ఉన్నవారు 53,400.
NUM 2:31 దాను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,57,600. వీళ్ళు తమ ధ్వజాల ప్రకారం చివరి గుంపుగా జెండాల క్రింద వెళ్తారు.
NUM 2:32 వారి వారి కుటుంబాల పరంగా లెక్కించబడినవారు ఇశ్రాయేలీయులు వీరు. విభజనల ప్రకారం శిబిరాలలో ఉన్న పురుషులు 6,03,550.
NUM 2:33 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులను ఇతర ఇశ్రాయేలీయులతో లెక్కించలేదు.
NUM 2:34 కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలీయులు చేశారు; ఆ ప్రకారం వారు గుడారాలు వేసుకున్నారు, ఆ విధంగా వారి వారి వంశం, కుటుంబంతో ప్రయాణిస్తారు.
NUM 3:1 యెహోవా మోషేతో సీనాయి కొండమీద మాట్లాడిన సమయంలో ఉన్న అహరోను మోషేల వంశావళి ఇదే.
NUM 3:2 అహరోను కుమారుల పేర్లు: మొదటి సంతానమైన నాదాబు, అబీహు, ఎలియాజరు ఈతామారు.
NUM 3:3 అవి అహరోను కుమారుల పేర్లు; వీరు అభిషేకించబడిన యాజకులు; వీరు యాజకులుగా సేవ చేయడానికి ప్రతిష్ఠించబడ్డారు.
NUM 3:4 నాదాబు అబీహులు సీనాయి అరణ్యంలో యెహోవా ఎదుట అనధికార అగ్నితో అర్పణ అర్పించినందుకు ఆయన ఎదుటే చనిపోయారు. వారికి కుమారులు లేరు కాబట్టి అహరోను జీవితకాలమంతా, తన కుమారులైన ఎలియాజరు, ఈతామారు యాజకులుగా సేవ చేశారు.
NUM 3:5 యెహోవా మోషేతో ఇలా చెప్పారు,
NUM 3:6 “లేవీ గోత్రం వారిని తీసుకువచ్చి యాజకుడైన అహరోనుకు సహాయం చేయడానికి అతని ఎదుట నిలబెట్టు.
NUM 3:7 వారు సమావేశ గుడారపు సేవ చేస్తూ సమావేశ గుడారం దగ్గర అతని తరపున సమాజమంతటి తరపున విధులు నిర్వర్తిస్తారు.
NUM 3:8 ప్రత్యక్ష గుడారపు పని చేయడం ద్వారా ఇశ్రాయేలీయుల బాధ్యతలను నెరవేరుస్తూ, వారు సమావేశ గుడారపు సామాగ్రి అంతా చూసుకోవాలి.
NUM 3:9 లేవీయులను అహరోనుకు అతని కుమారులకు అప్పగించు; వారు సంపూర్ణంగా అతని స్వాధీనం చేయబడిన ఇశ్రాయేలీయులు.
NUM 3:10 యాజకులుగా సేవ చేయడానికి అహరోనును, అతని కుమారులను నియమించు; ఎవరైనా పరిశుద్ధాలయం దగ్గరకు వస్తే వారికి మరణశిక్ష విధించబడుతుంది.”
NUM 3:11 యెహోవా మోషేతో ఇలా కూడా చెప్పారు,
NUM 3:12 “ఇశ్రాయేలు ప్రజల్లో తొలి మగ సంతానం స్థానంలో నేను లేవీయులను తీసుకున్నాను. లేవీయులు నావారు,
NUM 3:13 ఎందుకంటే తొలిసంతానమంతా నావారు. ఈజిప్టు తొలిసంతానాన్ని నేను మొత్తినప్పుడు, ఇశ్రాయేలీయులలో మనుష్యుల్లో, పశువుల్లో ప్రతి తొలిసంతానాన్ని, నా కోసం ప్రత్యేకపరచుకున్నాను. వారు నా వారిగా ఉండాలి. నేనే యెహోవాను.”
NUM 3:14 సీనాయి ఎడారిలో యెహోవా మోషేతో ఇలా అన్నారు.
NUM 3:15 “లేవీయులను వారి కుటుంబాలు వంశాల ప్రకారం లెక్కించు. ఒక నెల మొదలుకొని ఆపై వయస్సున్న మగవారినందరిని లెక్కించు.”
NUM 3:16 కాబట్టి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే వారిని లెక్కించాడు.
NUM 3:17 లేవీ కుమారుల పేర్లు ఇవి: గెర్షోను, కహాతు, మెరారి.
NUM 3:18 గెర్షోను వంశస్థుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ.
NUM 3:19 కహాతు వంశస్థుల పేర్లు ఇవి: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
NUM 3:20 మెరారి వంశస్థులు: మహలి, మూషి.
NUM 3:21 లిబ్నీయులు, షిమీయులు వంశస్థులు గెర్షోనుకు చెందినవారు; వీరు గెర్షోను వంశస్థులు.
NUM 3:22 వీరిలో ఒక నెల మొదలుకొని ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 7,500.
NUM 3:23 గెర్షోను వంశస్థులు సమావేశ గుడారం వెనుక పశ్చిమ వైపు దిగాలి.
NUM 3:24 లాయేలు కుమారుడైన ఎలీయాసాపు గెర్షోను కుటుంబాల నాయకుడు.
NUM 3:25 గెర్షోనీయులు కాపాడవలసినవి: సమావేశ గుడారం, గుడారం, దాని పైకప్పు, సమావేశ గుడార ద్వారం యొక్క తెర,
NUM 3:26 ఆవరణం యొక్క తెరలు, గుడారం బలిపీఠం చుట్టూ ఉన్న ద్వారపు తెర, దాని త్రాళ్లు, వాటికి ఉపయోగించబడే ప్రతి వస్తువు.
NUM 3:27 అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు కహాతుకు చెందినవారు; వీరు కహాతు వంశస్థులు.
NUM 3:28 ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరు 8,600 మంది. పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత కహాతీయులది.
NUM 3:29 కహాతు వంశస్థులు సమావేశ గుడారం యొక్క దక్షిణ వైపు దిగాలి.
NUM 3:30 ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను కహాతు వంశస్థుల కుటుంబాల నాయకుడు.
NUM 3:31 వారు మందసం, బల్ల, దీపస్తంభం, బలిపీఠాలు, పరిచర్య కోసం పరిశుద్ధాలయం లోని వస్తువులు, తెర వాటికి ఉపయోగించబడే ప్రతి వస్తువు విషయం బాధ్యత వహించాలి.
NUM 3:32 యాజకుడును అహరోను కుమారుడునైన ఎలియాజరు లేవీయుల ప్రధాన నాయకుడు. పరిశుద్ధాలయాన్ని కాపాడే వారి మీద ఇతడు ముఖ్య నాయకునిగా నియమించబడ్డాడు.
NUM 3:33 మహలీయులు, మూషీయుల వంశస్థులు మెరారికి చెందినవారు. వీరు మెరారి వంశస్థులు.
NUM 3:34 ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 6,200.
NUM 3:35 అబీహయిలు కుమారుడైన సూరీయేలు మెరారి వంశస్థుల కుటుంబాల నాయకుడు. వీరు సమావేశ గుడారం యొక్క ఉత్తర వైపున దిగాలి.
NUM 3:36 మెరారీయులు సమావేశ గుడారం యొక్క పలకలు, దాని అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, దాని ప్రతి ఉపకరణాలు వాటికి సంబంధించినవన్నీ,
NUM 3:37 అలాగే ఆవరణం చుట్టూ ఉన్న ప్రాకార స్తంభాలు, వాటి దిమ్మలు, వాటి మేకులు త్రాళ్లను కాపాడడానికి నియమింపబడ్డారు.
NUM 3:38 మోషే, అహరోను, అతని కుమారులు సమావేశ గుడారానికి తూర్పున, అనగా సూర్యుడు ఉదయించే వైపున సమావేశ గుడారానికి ఎదురుగా ఉండాలి. ఇశ్రాయేలీయుల పక్షంగా పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత వీరిది. ఇతరులెవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే వారికి మరణశిక్ష.
NUM 3:39 యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే అహరోనుల ద్వారా లెక్కించబడిన లేవీయులు, వారి వారి వంశాల ప్రకారం ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 22,000.
NUM 3:40 యెహోవా మోషేతో, “ఒక నెల లేదా ఆపై వయస్సున్న ఇశ్రాయేలీయుల తొలిసంతానమైన మగవారిని లెక్కించండి, వారి పేర్ల జాబితాను తయారుచేయండి.
NUM 3:41 ఇశ్రాయేలీయుల్లోని తొలిసంతానానికి బదులు లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకోవాలి. నేను యెహోవానై యున్నాను.”
NUM 3:42 కాబట్టి మోషే యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులలో తొలిసంతానాన్ని లెక్కించాడు.
NUM 3:43 ఒక నెల లేదా ఆ పైబడి వయస్సుగల మొదటి సంతానమైన మగవారందరు 22,273 మంది.
NUM 3:44 యెహోవా మోషేకు ఇలా కూడా చెప్పారు.
NUM 3:45 “ఇశ్రాయేలీయుల తొలి సంతానమంతటికి బదులు లేవీయులను, వారి పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకో. లేవీయులు నా వారిగా ఉండాలి. నేనే యెహోవాను.
NUM 3:46 లేవీయుల కంటే ఇశ్రాయేలీయులు 273 మంది ఎక్కువ ఉన్నారు. వీరిని విడిపించడానికి,
NUM 3:47 పరిశుద్ధాలయం యొక్క షెకెల్ చొప్పున, ఒక్క షెకెల్ అంటే ఇరవై గెరాలు, ఒక్కొక్కరికి అయిదు షెకెళ్ళ వెండి తీసుకోవాలి.
NUM 3:48 ఆ మిగిలిన ఇశ్రాయేలీయుల విమోచన కోసం అహరోనుకు అతని కుమారులకు ఆ డబ్బు ఇవ్వాలి.”
NUM 3:49 కాబట్టి మోషే లేవీయుల ద్వారా విడిపించబడిన వారికంటే ఎక్కువగా ఉన్న వారి నుండి విమోచన డబ్బు తీసుకున్నాడు.
NUM 3:50 ఇశ్రాయేలీయులలో తొలిసంతానం నుండి పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం మోషే 1,365 షెకెళ్ళ వెండి తీసుకున్నాడు.
NUM 3:51 యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే విమోచన డబ్బును అహరోను అతని కుమారులకు ఇచ్చాడు.
NUM 4:1 యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పారు:
NUM 4:2 “లేవీ గోత్రంలో కహాతు వంశాల, కుటుంబాల ప్రకారం జనాభా లెక్కలు తీసుకోండి.
NUM 4:3 సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సున్న పురుషులందరినీ లెక్కించు.
NUM 4:4 “కహాతీయులు సమావేశ గుడారంలో చేయాల్సిన పని: అతిపరిశుద్ధమైనవాటిని జాగ్రత్తగా చూసుకోవడము.
NUM 4:5 ప్రజలు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు అహరోను అతని కుమారులు లోపలికి వెళ్లి అడ్డతెర దించి నిబంధన మందసం మీద కప్పాలి.
NUM 4:6 తర్వాత వారు ఆ తెరను మన్నికైన తోలుతో కప్పి, దానిపై నీలిరంగు బట్ట పరిచి మోతకర్రలను వాటి ఉంగరాల్లో దూర్చాలి.
NUM 4:7 “వారు సన్నిధి బల్లమీద నీలిరంగు బట్టను పరిచి దాని మీద పళ్లాలను, పాత్రలు, గిన్నెలు, పానార్పణ కోసం జాడీలను ఉంచాలి; రొట్టె ఎప్పుడూ దాని మీద ఉండాలి.
NUM 4:8 వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి, మన్నికైన తోలుతో దాన్ని కప్పి, మోతకర్రలను ఉంగరాల్లో దూర్చాలి.
NUM 4:9 “వారు నీలిరంగు బట్ట తీసుకుని దీపస్తంభాన్ని, దాని దీపాలను, వత్తులు కత్తిరించే కత్తెరలను, వాటి పళ్లాలను, దీపాల్లో పోసే ఒలీవనూనె జాడీలన్నిటిని కప్పాలి.
NUM 4:10 తర్వాత వారు దానిని, దాని ఉపకరణాలన్నిటిని మన్నికైన తోలుతో చుట్టి మోసుకెళ్లే పలక మీద ఉంచాలి.
NUM 4:11 “బంగారు బలిపీఠం మీద వారు నీలిరంగు బట్ట పరిచి, దాన్ని మన్నికైన తోలుతో కప్పి, మోతకర్రలను వాటి ఉంగరాల్లో దూర్చాలి.
NUM 4:12 “వారు పరిశుద్ధాలయంలో పరిచర్య కోసం వాడే వస్తువులన్నిటిని తీసుకుని వాటిని నీలి బట్టలో చుట్టి, మన్నికైన తోలుతో కప్పి మోసుకెళ్లే పలక మీద ఉంచాలి.
NUM 4:13 “వారు ఇత్తడి బలిపీఠం మీది నుండి బూడిదను తీసివేసి, దాని మీద ఊదా బట్ట కప్పాలి.
NUM 4:14 తర్వాత వారు బలిపీఠం దగ్గర పరిచర్యకు వాడే అన్ని పాత్రలను, నిప్పు పెనాలు, ముళ్ళ గరిటెలు, పారలు, ప్రోక్షణ గిన్నెలతో సహా దాని మీద పెట్టాలి. దాని మీద మన్నికైన తోలు కప్పి, మోతకర్రలను వాటి స్థలంలో దూర్చాలి.
NUM 4:15 “అహరోను అతని కుమారులు పరిశుద్ధ సామాగ్రి, పరిశుద్ధ ఉపకరణాలన్నిటిని కప్పడం పూర్తి చేసిన తర్వాత, ప్రజలు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కహాతీయులు వచ్చి దానిని మోయాలి. అయితే వారు పరిశుద్ధమైన వాటిని ముట్టకూడదు, ముట్టుకుంటే వారు చస్తారు. కహాతీయులు సమావేశ గుడారంలో ఉన్నవాటిని మోయాలి.
NUM 4:16 “అహరోను కుమారుడును యాజకుడునైన ఎలియాజరు, దీపానికి నూనె, పరిమళ వాసనగల ధూపద్రవ్యం, నిత్యం అర్పించే భోజనార్పణ, అభిషేక తైలం మొదలగువాటిని పర్యవేక్షిస్తాడు. అతడు సమావేశ గుడారమంతటిని, అందులో ఉన్న సామాగ్రిని, పరిశుద్ధ ఉపకరణాలతో పాటు ప్రతిదీ పర్యవేక్షిస్తాడు.”
NUM 4:17 యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు,
NUM 4:18 “లేవీయుల మధ్య నుండి కహాతీయుల వంశం నాశనమై పోకుండా చూడండి.
NUM 4:19 వారు అతిపరిశుద్ధమైన వాటి దగ్గరకు వచ్చినప్పుడు చావకుండ బ్రతికి ఉండేలా మీరు వారి కోసం ఇలా చేయండి: అహరోను అతని కుమారులు పరిశుద్ధాలయంలోకి వెళ్లి, వారందరికి వారు చేయాల్సిన పనిని, వారు మోయాల్సిన వాటిని వారికి అప్పగించాలి.
NUM 4:20 అయితే కహాతీయులు పరిశుద్ధమైన వాటిని చూడాలని, కనీసం ఒక్క క్షణమైనా లోనికి వెళ్లకూడదు, వెళ్తే వారు చస్తారు.”
NUM 4:21 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
NUM 4:22 “గెర్షోనీయులను కూడా వారి కుటుంబాలు, వంశాల ప్రకారం జనాభా లెక్కలు తీసుకోండి.
NUM 4:23 సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సుగల పురుషులందరినీ లెక్కించండి.
NUM 4:24 “మోయడంలో, అలాగే వారి ఇతర పనులలో గెర్షోను వంశస్థుల సేవ ఇదే:
NUM 4:25 ప్రత్యక్ష గుడారం యొక్క తెరలు అంటే సమావేశ గుడారం దాని కప్పు అలాగే మన్నికైన తోలుతో చేయబడిన వెలుపటి కప్పు ఇంకా సమావేశ గుడార ద్వారం యొక్క తెరలు,
NUM 4:26 సమావేశ గుడారం, బలిపీఠం చుట్టూ ఉన్న ఆవరణ తెరలు, ఆవరణ ప్రవేశ ద్వారపు తెరలు, వాటి త్రాళ్లు గుడారంలో సేవకు ఉపయోగించే వస్తువులన్నిటిని మోయాలి. వీటితో చేయాల్సిన పనులన్నీ గెర్షోనీయులు చేయాలి.
NUM 4:27 గెర్షోనీయులు మోసుకెళ్లే పనైనా లేదా వేరే పనైనా వారి సేవ అంతా అహరోను అతని కుమారుల ఆధ్వర్యంలోనే జరగాలి. వారు మోయాల్సిన బాధ్యతను మీరు వారికి అప్పగించాలి.
NUM 4:28 సమావేశ గుడారం దగ్గర గెర్షోను వంశస్థులు చేయాల్సిన సేవ ఇదే. వారి విధులను అహరోను కుమారుడును యాజకుడునైన ఈతామారు పర్యవేక్షణలో జరగాలి.
NUM 4:29 “మెరారీయుల కుటుంబాలను వారి వంశాల ప్రకారం జనాభా లెక్క తీసుకోండి.
NUM 4:30 సమావేశ గుడారంలో పని చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల వయస్సుగల పురుషులందరినీ లెక్కించండి.
NUM 4:31 గుడారంలో వారి సేవలో భాగంగా వారు గుడారపు పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు,
NUM 4:32 అంతేకాక, ఆవరణం చుట్టూ ఉండే స్తంభాలు వాటి దిమ్మలు, మేకులు, త్రాళ్లు వాటికి సంబంధించినవన్నీ వారే మోయాలి. ప్రతి ఒక్కరు మోయడానికి నిర్దిష్టమైన వాటిని అప్పగించండి.
NUM 4:33 సమావేశ గుడారం దగ్గర అహరోను కుమారుడు, యాజకుడైన ఈతామారు పర్యవేక్షణలో మెరారి వంశస్థులు చేసే సేవ ఇది.”
NUM 4:34 మోషే, అహరోనులు సమాజ నాయకులతో కలిసి కహాతీయులను వారి వంశాలు, వారి కుటుంబాల ప్రకారం లెక్కించారు.
NUM 4:35 వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులంతా 2,750 మంది.
NUM 4:37 సమావేశ గుడారం దగ్గర సేవచేసే కహాతు వంశాల మొత్తం లెక్క ఇది. యెహోవా మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు వారిని లెక్కించారు.
NUM 4:38 గెర్షోనీయులు వారి వంశాలు, కుటుంబాల ప్రకారం లెక్కించబడ్డారు.
NUM 4:39 వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి, సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులందరు 2,630 మంది.
NUM 4:41 సమావేశ గుడారం దగ్గర సేవ చేసిన గెర్షోను వంశాల మొత్తం లెక్క ఇది. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు వారిని లెక్కించారు.
NUM 4:42 మెరారీయులు వారి వంశాలు కుటుంబాల ప్రకారం లెక్కించబడ్డారు.
NUM 4:43 వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సు కలిగి సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చిన పురుషులందరు 3,200 మంది.
NUM 4:45 మెరారి వంశాల మొత్తం లెక్క ఇది. మోషే ద్వారా వచ్చిన యెహోవా ఆజ్ఞమేరకు మోషే అహరోనులు వారిని లెక్కించారు.
NUM 4:46 మోషే, అహరోను ఇశ్రాయేలు నాయకులు కలిసి లేవీయులందరిని వంశాల, కుటుంబాల ప్రకారం లెక్కించారు.
NUM 4:47 వంశాల ప్రకారం, ముప్పై నుండి యాభై సంవత్సరాల వయస్సు కలిగి సమావేశ గుడారంలో సేవ చేయడానికి దాన్ని మోయడానికి వచ్చిన వారి
NUM 4:48 సంఖ్య 8,580.
NUM 4:49 మోషే ద్వార వచ్చిన యెహోవా ఆజ్ఞ ప్రకారం, వారందరికి వారి వారి పనులు, వారు మోయాల్సినవి అప్పగించబడ్డాయి. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, వారు లెక్కించబడ్డారు.
NUM 5:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
NUM 5:2 “ఎవరికైనా అపవిత్రమైన కుష్ఠువ్యాధి ఉన్నా లేదా ఏదైనా స్రావము కలిగి ఉన్నా లేదా శవాన్ని ముట్టుకొని ఆచారరీత్య అపవిత్రమై ఉన్నా, అలాంటి వారిని శిబిరంలో నుండి పంపివేయాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు.
NUM 5:3 పురుషులనైనా స్త్రీలనైనా పంపివేయాలి; నేను ప్రజలమధ్య నివసిస్తాను కాబట్టి వారు శిబిరాన్ని అపవిత్రం చేయకుండేలా వారిని పంపివేయాలి.”
NUM 5:4 ఇశ్రాయేలీయులు అలాగే చేశారు; వారిని శిబిరం బయటకు పంపివేశారు. యెహోవా మోషేకు సూచించిన ప్రకారం వారు చేశారు.
NUM 5:5 యెహోవా మోషేతో ఇలా చెప్పారు,
NUM 5:6 “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏ స్త్రీ గాని, పురుషుడు గాని యెహోవా పట్ల ద్రోహులై మనుష్యులు చేసే పాపాల్లో దేనినైనా చేసి అపరాధులైతే,
NUM 5:7 వారు వారి పాపాన్ని ఒప్పుకుని వారు చేసిన అపరాధానికి పూర్ణ ప్రాయశ్చిత్తం చేయాలి, చేసిన తప్పుకు అయిదవ వంతు చేర్చి ఎవరికి విరుద్ధంగా తప్పు చేశారో వారికి ఇవ్వాలి.
NUM 5:8 అయితే ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించడానికి సమీపబంధువు లేకపోతే, ఆ నష్టపరిహారం యెహోవాది, అది ప్రాయశ్చిత్త బలిగా ఇవ్వబడే పొట్టేలుతో పాటు యాజకునికి ఇవ్వబడాలి.
NUM 5:9 ఇశ్రాయేలీయులు ఒక యాజకునికి తీసుకొనివచ్చే పవిత్రమైన విరాళాలన్నీ అతనికే చెందుతాయి.
NUM 5:10 పవిత్రమైనవి వాటి యజమానులకు చెందుతాయి, కానీ వారు యాజకునికి ఇచ్చేది యాజకునికే చెందుతుంది.’ ”
NUM 5:11 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
NUM 5:12 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఇలా చెప్పు: ‘ఒకవేళ ఒక వ్యక్తి భార్య దారితప్పి అతనికి నమ్మకద్రోహం చేసి,
NUM 5:13 మరొక వ్యక్తి ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకొని, ఆ విషయం తన భర్తకు తెలియకుండ దాచబడి ఆమె అపవిత్రపరచబడింది అనడానికి సాక్ష్యం లేకపోయినా, ఆమె పట్టుబడకపోయినా,
NUM 5:14 ఒకవేళ అతడు తన భార్య మీద అసూయపడి ఆమెను అనుమానించినప్పుడు, ఆమె నిజంగానే అపవిత్రమైతే, ఒకవేళ ఆమె అపవిత్రం కాకపోయినా అతడు ఆమెను అనుమానిస్తే,
NUM 5:15 అతడు తన భార్యను యాజకుని దగ్గరకు తీసుకెళ్లాలి. అతడు ఆమె పక్షంగా ఒక ఓమెరు యవల పిండి తీసుకురావాలి. దాని మీద ఒలీవనూనె పోయకూడదు ధూపం వేయకూడదు ఎందుకంటే అది అసూయ కోసం అర్పించే భోజనార్పణ, చేసిన తప్పును జ్ఞాపకం చేసే జ్ఞాపక అర్పణ.
NUM 5:16 “ ‘యాజకుడు ఆమెను తీసుకువచ్చి యెహోవా ఎదుట నిలబెట్టాలి.
NUM 5:17 తర్వాత యాజకుడు ఓ మట్టి కూజలో పవిత్ర జలం తీసుకుని సమావేశ గుడారంలోని నేల మట్టిని ఆ నీటిలో వేయాలి.
NUM 5:18 యాజకుడు యెహోవా ఎదుట ఆమెను నిలబెట్టిన తర్వాత, ఆమె జుట్టును విప్పి, శాపాన్ని తెచ్చే చేదు నీటిని యాజకుడు పట్టుకుని, జ్ఞాపక అర్పణను అంటే అనుమానం కొరకైన జ్ఞాపక అర్పణను ఆమె చేతుల్లో పెట్టాలి.
NUM 5:19 తర్వాత యాజకుడు ఆ స్త్రీతో ప్రమాణం చేయించి, “ఏ మనుష్యుడు నీతో లైంగిక సంబంధం లేకపోతే, నీ భర్తతో దాంపత్య సంబంధం కలిగి ఉన్నప్పుడు నీవు త్రోవ తప్పకుండ, అపవిత్రం కాకుండ ఉంటే, శాపం తెచ్చే ఈ చేదు నీళ్ల నుండి నీవు నిర్దోషివి అవుతావు.
NUM 5:20 అయితే నీ భర్తతో పెళ్ళి చేసుకున్న తర్వాత నీవు త్రోవ తప్పి, నీ భర్త కాకుండా వేరొక వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా నిన్ను నీవు అపవిత్రపరచుకుని ఉంటే,”
NUM 5:21 యాజకుడు ఆమె మీదికి, “యెహోవా నిన్ను నీ ప్రజలమధ్య ఒక శాపంగా చేసి, నీ గర్భం పోవునట్లు, నీ ఉదరం ఉబ్బిపోయేలా చేయును గాక.
NUM 5:22 శాపం తెచ్చే ఈ నీరు నీ శరీరంలోనికి ప్రవేశించి నీ ఉదరం ఉబ్బిపోయేలా లేదా నీ గర్భం పోవునట్లు చేయును గాక” అని శాపం పలుకుతాడు. “ ‘అప్పుడు ఆ స్త్రీ, “ఆమేన్, అలాగే జరుగును గాక” అని అనాలి.
NUM 5:23 “ ‘యాజకుడు ఈ శాపాలను ఒక గ్రంథపుచుట్ట మీద వ్రాసి దానిని చేదు నీటితో కడగాలి.
NUM 5:24 శాపం తెచ్చే ఆ చేదు నీటిని ఆమెతో త్రాగించాలి, అప్పుడు శాపం తెచ్చే ఆ నీరు ఆమెలో చేదు పుట్టిస్తుంది.
NUM 5:25 యాజకుడు ఆమె చేతి నుండి అసూయ కొరకైన భోజనార్పణను తీసుకుని, యెహోవా ఎదుట పైకెత్తి దానిని బలిపీఠం దగ్గరకు తీసుకురావాలి.
NUM 5:26 యాజకుడు ఆ భోజనార్పణలో నుండి పిడికెడు తీసుకుని దాన్ని బలిపీఠం మీద జ్ఞాపకార్థ అర్పణగా దహించాలి; తర్వాత అతడు ఆ స్త్రీతో ఆ నీరు త్రాగించాలి.
NUM 5:27 ఆమె తనను తాను అపవిత్రపరచుకుని ఉంటే, తన భర్తకు నమ్మకద్రోహం చేసి ఉంటే, ఫలితం ఇలా ఉంటుంది: శాపం తెచ్చే ఆ నీళ్లను ఆమె త్రాగినప్పుడు, ఆ నీళ్లు ఆమెలో ప్రవేశించి, ఆమె కడుపు ఉబ్బుతుంది, ఆమె గర్భం పోతుంది ఆమె శాపంగా మారుతుంది.
NUM 5:28 అయితే ఆమె తనను తాను అపవిత్రం చేసుకోకుండ పవిత్రంగా ఉంటే, తాను నిర్దోషిగా ఉండి పిల్లలను కనగలుగుతుంది.
NUM 5:29 “ ‘ఇది అసూయకు సంబంధించిన నియమము. ఒక స్త్రీ తన భర్తతో దాంపత్య సంబంధం కలిగి ఉన్నప్పుడు త్రోవ తప్పి తనను తాను అపవిత్రపరచుకుంటే,
NUM 5:30 లేదా ఒక వ్యక్తి తన భార్య మీద అసూయ పడినప్పుడు వర్తించే న్యాయవిధి. యాజకుడు ఆమెను యెహోవా ఎదుట నిలబెట్టి ఈ నియమాన్ని ఆ స్త్రీకి అన్వయింపచేయాలి.
NUM 5:31 అప్పుడు ఆ భర్త ఏ తప్పు చేసినా నిర్దోషిగా ఉంటాడు. కానీ స్త్రీ తన పాపపు పరిణామాలను భరిస్తుంది.’ ”
NUM 6:1 యెహోవా మోషేతో,
NUM 6:2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘పురుషుడు గాని స్త్రీ గాని ఒక ప్రత్యేకమైన మ్రొక్కుబడి చేయాలనుకుంటే అనగా, యెహోవాకు నాజీరుగా ప్రతిష్ఠించుకునే మ్రొక్కుబడి చేయాలనుకుంటే,
NUM 6:3 వారు ద్రాక్షరసం, మద్యానికి వేరుగా ఉండాలి, ద్రాక్షరసం నుండి గాని మద్యం నుండి గాని తయారుచేసిన చిరక త్రాగవద్దు. వారు ఏ ద్రాక్షరసం త్రాగకూడదు, పండు ద్రాక్షలు గాని ఎండు ద్రాక్షలు గాని తినకూడదు.
NUM 6:4 వారు నాజీరుగా ఉన్నంత కాలం ద్రాక్షరసం నుండి వచ్చే ఏవైన, విత్తనాలైనా లేదా వాటి ఎండిన తినకూడదు.
NUM 6:5 “ ‘నాజీరుగా మ్రొక్కుబడి చేసుకున్న కాలమంతా, వారి వెంట్రుకలు కత్తిరించకూడదు. తమను తాము యెహోవాకు ప్రత్యేకించుకున్న కాలమంతా వారు ముగిసేవరకు పవిత్రులుగా ఉండాలి; వారి వెంట్రుకలు పెరిగేలా వదిలేయాలి.
NUM 6:6 “ ‘వారు యెహోవాకు తాము ప్రత్యేకించుకున్న కాలమంతా శవం దగ్గరకు వెళ్లకూడదు.
NUM 6:7 వారి సొంత తండ్రి లేదా తల్లి లేదా సోదరుడు లేదా సోదరి మరణించినా కూడా, వారు తమను తాము ఆచారబద్ధంగా అపవిత్రం చేసుకోవద్దు, ఎందుకంటే దేవునికి వారు అంకితం చేసుకున్న చిహ్నం వారి తలపై ఉంటుంది.
NUM 6:8 వారి సమర్పణ కాలం అంతా, వారు యెహోవాకు ప్రతిష్ఠించబడ్డారు.
NUM 6:9 “ ‘నాజీరు చేయబడినవారు ఉన్నచోట ఎవరైనా చనిపోయి, తాము ప్రతిష్ఠించుకున్న దానికి సూచనగా ఉన్న వారి వెంట్రుకలు అపవిత్రం అయితే, వారు ఏడవ రోజున, శుభ్ర పరచుకునే రోజున తమ తల గొరిగించుకోవాలి.
NUM 6:10 తర్వాత ఎనిమిదవ రోజు రెండు తెల్ల గువ్వలను, రెండు పావురపు పిల్లలను సమావేశ గుడారం ద్వారం దగ్గర యాజకుడి దగ్గరకు తేవాలి.
NUM 6:11 నాజీరు శవం దగ్గర ఉండడం పాపమవుతుంది, కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా, ఇంకొక దానిని దహనబలిగా అర్పించాలి. అదే రోజు తమ తలను మరలా పవిత్రం చేసుకోవాలి.
NUM 6:12 వారు ప్రత్యేకించుకున్న కాలాన్ని నియమించుకొని తిరిగి తమను తాము యెహోవాకు ప్రత్యేకించుకుని ఒక ఏడాది గొర్రెపిల్లను అపరాధపరిహారబలి కోసం తేవాలి. ప్రత్యేకించుకున్న కాలంలో అపవిత్రులయ్యారు కాబట్టి మునుపటి రోజులు లెక్కకు రావు.
NUM 6:13 “ ‘ప్రత్యేకించుకున్న కాలం ముగిసినప్పుడు నాజీరు పాటించవలసిన నియమమేదంటే వారు సమావేశ గుడారం ద్వారం దగ్గరకు రావాలి.
NUM 6:14 అక్కడ వారు యెహోవాకు తమ అర్పణలు అర్పించాలి: దహనబలి కోసం లోపం లేని ఏడాది మగ గొర్రెపిల్ల, పాపపరిహారబలి కోసం లోపం లేని ఆడ గొర్రెపిల్ల, సమాధానబలి కోసం లోపం లేని పొట్టేలు,
NUM 6:15 వీటితో పాటు భోజనార్పణలు, పానార్పణలు, ఒక గంపెడు నూనె కలిపిన పులుపు కలపకుండ చేసిన నాణ్యమైన పిండి వంటలు ఒలీవనూనె కలిపిన మందమైన రొట్టెలు, ఒలీవనూనె పూసిన అప్పడాలు తీసుకురావాలి.
NUM 6:16 “ ‘ఇవన్నీ యాజకుడు యెహోవా ఎదుట ఉంచి పాపపరిహారబలి, దహనబలి అర్పించాలి.
NUM 6:17 అతడు గంపెడు పులియని రొట్టెలతో పాటు పొట్టేలును భోజనార్పణ పానార్పణంతో పాటు యెహోవాకు సమాధానబలిగా అర్పించాలి.
NUM 6:18 “ ‘అప్పుడు సమావేశ గుడారం ద్వారం దగ్గర, నాజీరు తాను ప్రత్యేకించుకున్న దానికి చిహ్నంగా ఉన్న తల వెంట్రుకలను గొరిగించుకోవాలి. ఆ వెంట్రుకలు సమాధానబలి అగ్నిలో వేసేయాలి.
NUM 6:19 “ ‘నాజీరు తాను ప్రత్యేకించుకున్న దానికి చిహ్నంగా ఉన్న తల వెంట్రుకలను గొరిగించుకున్న తర్వాత వండిన పొట్టేలు జబ్బను, గంపలోని ఒక పులుపు కలపకుండ చేసిన మందమైన రొట్టెను, ఒక అప్పడాన్ని యాజకుడు నాజీరు చేయబడిన వాని చేతిలో పెట్టాలి.
NUM 6:20 యాజకుడు అప్పుడు వాటిని యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి; పైకెత్తబడి అర్పించబడిన రొమ్ము, ప్రత్యేక అర్పణగా సమర్పించబడిన తొడ పరిశుద్ధమైనవి, అవి యాజకునికి చెందినవి. ఆ తర్వాత, నాజీరు చేయబడిన వాడు ద్రాక్షరసం త్రాగవచ్చు.
NUM 6:21 “ ‘తాము ప్రత్యేకించుకున్న దాని ప్రకారం యెహోవాకు అర్పణలను తెస్తామని మ్రొక్కుబడి చేసే నాజీరుల నియమము. వారు తేగలిగితే అధనపు అర్పణలను కూడా తీసుకురావచ్చు. నాజీరు నియమం ప్రకారం వారు చేసిన మ్రొక్కుబడులను వారు తప్పక నెరవేర్చాలి.’ ”
NUM 6:22 యెహోవా మోషేతో ఇలా చెప్పారు,
NUM 6:23 “అహరోను, అతని కుమారులతో చెప్పు, ‘ఈ విధంగా ఇశ్రాయేలీయులను దీవించాలి:
NUM 6:24 “ ‘ “యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక;
NUM 6:25 యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి నిన్ను కరుణించును గాక;
NUM 6:26 యెహోవా నీవైపు తన ముఖాన్ని త్రిప్పును గాక సమాధానం ఇచ్చును గాక.” ’
NUM 6:27 “ఇలా అహరోను అతని కుమారులను ఇశ్రాయేలీయులను నా నామమున దీవించినప్పుడు, నేనే స్వయంగా ఆశీర్వదిస్తాను.”
NUM 7:1 మోషే సమావేశ గుడారాన్ని సిద్ధం చేసినప్పుడు దాన్ని అభిషేకించి, దాన్ని, దాని సామాగ్రినంతటిని ప్రతిష్ఠించాడు. అతడు బలిపీఠాన్ని, దాని వస్తువులను కూడా ప్రతిష్ఠించాడు.
NUM 7:2 తర్వాత ఇశ్రాయేలు నాయకులు, లెక్కించబడిన వారిపట్ల బాధ్యత వహించిన గోత్ర నాయకులు యైన కుటుంబ పెద్దలు అర్పణలు అర్పించారు.
NUM 7:3 వారు యెహోవా ఎదుటకు ప్రతి నాయకుడి నుండి ఒక ఎద్దు, ప్రతి ఇద్దరి నుండి ఒక బండి చొప్పున ఆరు పైకప్పు ఉన్న బండ్లు, పన్నెండు ఎద్దులను తమ బహుమతులుగా తెచ్చారు. వీటిని వారు సమావేశం గుడారం ముందు సమర్పించారు.
NUM 7:4 యెహోవా మోషేతో,
NUM 7:5 “సమావేశ గుడారం సేవలో వాడబడేలా వారి నుండి వీటిని స్వీకరించు. ప్రతీ వ్యక్తి యొక్క పనికి అవసరం ఉన్న ప్రకారం, వాటిని లేవీయులకు ఇవ్వు.”
NUM 7:6 కాబట్టి మోషే ఆ బండ్లను, ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాడు.
NUM 7:7 అతడు రెండు బండ్లు, నాలుగు ఎద్దులను గెర్షోనీయులకు, వారి పనికి అవసరం ఉన్న ప్రకారం ఇచ్చాడు,
NUM 7:8 అలాగే నాలుగు బండ్లు, ఎనిమిది ఎద్దులను మెరారీయులకు ఇచ్చాడు. వారందరు యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు పర్యవేక్షణలో ఉన్నారు.
NUM 7:9 కానీ మోషే కహాతీయులకు ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే వారు వారి బాధ్యత ప్రకారం, పరిశుద్ధ వస్తువులను వారి భుజాలపై మోసేవారు.
NUM 7:10 బలిపీఠాన్ని అభిషేకించినప్పుడు, నాయకులు ప్రతిష్ఠార్పణలు తెచ్చి, బలిపీఠం ముందుంచారు.
NUM 7:11 యెహోవా మోషేతో, “బలిపీఠం ప్రతిష్ఠించడం కోసం ప్రతిరోజు ఒక్కొక్క నాయకుడు తమ అర్పణను తీసుకురావాలి.”
NUM 7:12 మొదటి రోజు తన అర్పణను తెచ్చిన వారు యూదా గోత్రానికి చెందిన అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను.
NUM 7:13 అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
NUM 7:14 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
NUM 7:15 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
NUM 7:16 పాపపరిహారబలి కోసం మేకపోతు;
NUM 7:17 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
NUM 7:18 రెండవ రోజు అర్పణను తెచ్చిన వారు ఇశ్శాఖారు గోత్ర నాయకుడు, నెతనేలు కుమారుడైన సూయరు.
NUM 7:19 అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
NUM 7:20 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
NUM 7:21 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
NUM 7:22 పాపపరిహారబలి కోసం మేకపోతు;
NUM 7:23 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, ఒక సంవత్సరపు అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
NUM 7:24 మూడవ రోజు అర్పణను తెచ్చిన వారు జెబూలూను గోత్ర నాయకుడు, హేలోను కుమారుడైన ఏలీయాబు.
NUM 7:25 అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
NUM 7:26 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
NUM 7:27 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
NUM 7:28 పాపపరిహారబలి కోసం మేకపోతు;
NUM 7:29 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
NUM 7:30 నాలుగవ రోజు అర్పణను తెచ్చిన వారు రూబేను గోత్ర నాయకుడు, షెదేయూరు కుమారుడైన ఎలీసూరు.
NUM 7:31 అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
NUM 7:32 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
NUM 7:33 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
NUM 7:34 పాపపరిహారబలి కోసం మేకపోతు;
NUM 7:35 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
NUM 7:36 అయిదవ రోజు అర్పణను తెచ్చిన వారు షిమ్యోను గోత్ర నాయకుడు, సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు.
NUM 7:37 అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
NUM 7:38 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
NUM 7:39 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
NUM 7:40 పాపపరిహారబలి కోసం మేకపోతు;
NUM 7:41 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
NUM 7:42 ఆరవరోజు అర్పణను తెచ్చిన వారు గాదు గోత్ర నాయకుడు, దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు.
NUM 7:43 అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
NUM 7:44 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
NUM 7:45 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
NUM 7:46 పాపపరిహారబలి కోసం మేకపోతు;
NUM 7:47 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
NUM 7:48 ఏడవ రోజు అర్పణను తెచ్చిన వారు ఎఫ్రాయిం గోత్ర నాయకుడు, అమీహూదు కుమారుడైన ఎలీషామా.
NUM 7:49 అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
NUM 7:50 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
NUM 7:51 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
NUM 7:52 పాపపరిహారబలి కోసం మేకపోతు;
NUM 7:53 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
NUM 7:54 ఎనిమిదవ రోజు అర్పణను తెచ్చిన వారు మనష్షే గోత్ర నాయకుడు, పెదాసూరు కుమారుడైన గమలీయేలు.
NUM 7:55 అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
NUM 7:56 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
NUM 7:57 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
NUM 7:58 పాపపరిహారబలి కోసం మేకపోతు;
NUM 7:59 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
NUM 7:60 తొమ్మిదవ రోజు అర్పణను తెచ్చిన వారు బెన్యామీను గోత్ర నాయకుడు, గిద్యోనీ కుమారుడైన అబీదాను.
NUM 7:61 అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
NUM 7:62 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
NUM 7:63 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
NUM 7:64 పాపపరిహారబలి కోసం మేకపోతు;
NUM 7:65 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
NUM 7:66 పదవ రోజు అర్పణను తెచ్చిన వారు దాను గోత్ర నాయకుడు, అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు.
NUM 7:67 అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
NUM 7:68 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
NUM 7:69 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
NUM 7:70 పాపపరిహారబలి కోసం మేకపోతు;
NUM 7:71 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
NUM 7:72 పదకొండవ రోజు అర్పణను తెచ్చిన వారు ఆషేరు గోత్ర నాయకుడు, ఒక్రాను కుమారుడైన పగీయేలు.
NUM 7:73 అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
NUM 7:74 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
NUM 7:75 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
NUM 7:76 పాపపరిహారబలి కోసం మేకపోతు;
NUM 7:77 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
NUM 7:78 పన్నెండవ రోజు అర్పణను తెచ్చిన వారు నఫ్తాలి గోత్ర నాయకుడు, ఏనాను కుమారుడైన అహీర.
NUM 7:79 అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
NUM 7:80 ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
NUM 7:81 దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
NUM 7:82 పాపపరిహారబలి కోసం మేకపోతు;
NUM 7:83 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
NUM 7:84 బలిపీఠం అభిషేకించబడినప్పుడు దాని ప్రతిష్ఠించడానికి ఇశ్రాయేలీయుల నాయకులు సమర్పించిన అర్పణలు ఇవి: పన్నెండు వెండి పళ్ళాలు, పన్నెండు వెండి పాత్రలు పన్నెండు బంగారు పాత్రలు.
NUM 7:85 వెండి పళ్ళెం ఒక్కొక్కటి నూట ముప్పై షెకెళ్ళు, వెండి పాత్ర ఒక్కొక్కటి డెబ్బై షెకెళ్ళు. అంతా కలిపితే వెండి పాత్రల బరువు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం రెండువేల నాలుగు వందల షెకెళ్ళు.
NUM 7:86 ధూపద్రవ్యాలతో నిండియున్న బంగారు పళ్ళాలు, పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం పది షెకెళ్ళ బరువు గలవి పన్నెండు. అంతా కలిపితే, బంగారు పాత్రల బరువు నూట యిరవై షెకెళ్ళు.
NUM 7:87 దహనబలి కోసం వాటి భోజనార్పణతో పాటు ఇవ్వబడిన పశువులు మొత్తం పన్నెండు కోడెలు, పన్నెండు పొట్టేళ్లు. పన్నెండు ఏడాది గొర్రెపిల్లలు. పన్నెండు మేకపోతులు పాపపరిహారబలి కోసం వాడబడ్డాయి.
NUM 7:88 సమాధానబలి కోసం ఇవ్వబడిన పశువులు మొత్తం యిరవై నాలుగు ఎడ్లు, అరవై పొట్టేళ్లు, అరవై మేకపోతులు అరవై ఏడాది గొర్రెపిల్లలు.
NUM 7:89 యెహోవాతో మాట్లాడటానికి మోషే సమావేశ గుడారంలో ప్రవేశించినప్పుడు, నిబంధన మందసం పైనున్న ప్రాయశ్చిత్త మూత మీదుగా ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి అతనితో మాట్లాడటం అతనికి వినిపించింది. ఇలా యెహోవా అతనితో మాట్లాడారు.
NUM 8:1 యెహోవా మోషేతో ఇలా చెప్పారు.
NUM 8:2 “అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు, ‘దీపాలను వెలిగించినప్పుడు, దీపస్తంభం ముందు ఉన్న స్థలమంతా ప్రకాశించేలా మొత్తం ఏడు దీపాలు వెలిగేలా చూడాలి.’ ”
NUM 8:3 అహరోను అలాగే చేశాడు; యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు దీపస్తంభం మీద దీపాలు వెలుగు ఇచ్చేలా అమర్చాడు.
NUM 8:4 దీపస్తంభం ఇలా చేయబడింది: అది దాని స్తంభం నుండి దాని పుష్పాల వరకు సుత్తెతో సాగగొట్టబడిన బంగారంతో చేయబడింది. యెహోవా మోషేకు చూపిన నమూన ప్రకారం అది తయారుచేయబడింది.
NUM 8:5 యెహోవా మోషేతో ఇలా చెప్పారు.
NUM 8:6 “ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను ప్రత్యేకపరచి వారిని ఆచార ప్రకారం పవిత్రపరచు.
NUM 8:7 వారిని పవిత్రపరచడానికి ఇలా చేయాలి: వారి మీద శుద్ధి జలం ప్రోక్షించాలి; తర్వాత వారు తమ శరీరాలంతా క్షవరం చేయించుకొని తమ బట్టలు ఉతుక్కోవాలి. అలా తమను తాము పవిత్రపరచుకుంటారు.
NUM 8:8 వారు ఒక కోడెతో పాటు ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండిని భోజనార్పణగా తేవాలి; తర్వాత వారి నుండి రెండవ కోడెను పాపపరిహారబలి కోసం తీసుకోవాలి.
NUM 8:9 లేవీయులను సమావేశ గుడారం ముందుకు తీసుకువచ్చి మొత్తం ఇశ్రాయేలీయుల సమాజాన్ని సమావేశపరచు.
NUM 8:10 యెహోవా ముందుకు లేవీయులను నీవు తీసుకురావాలి, ఇశ్రాయేలీయులు వారి మీద చేతులుంచాలి.
NUM 8:11 అహరోను తన చేతులు పైకెత్తి, ఇశ్రాయేలు ప్రజల నుండి ప్రత్యేక అర్పణగా లేవీయులను యెహోవాకు సమర్పించాలి, తద్వారా వారు యెహోవా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు.
NUM 8:12 “అప్పుడు లేవీయులు కోడెల తలలపై వారి చేతులుంచి, ఒకటి పాపపరిహారబలిగా ఇంకొకటి లేవీయుల ప్రాయశ్చిత్తం కోసం దహనబలిగా యెహోవాకు అర్పించాలి.
NUM 8:13 లేవీయులను అహరోను, అతని కుమారుల ఎదుట నిలబెట్టి, చేతులు పైకెత్తి యెహోవాకు వారిని ప్రత్యేక అర్పణగా సమర్పించాలి.
NUM 8:14 ఈ విధంగా ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించాలి, లేవీయులంతా నా వారుగా ఉంటారు.
NUM 8:15 “లేవీయులను పవిత్రపరచిన తర్వాత, చేతులు పైకెత్తి వారిని ప్రత్యేక అర్పణగా సమర్పించిన తర్వాత, వారు సమావేశ గుడారంలో సేవ చేయడానికి రావాలి.
NUM 8:16 వీరు ఇశ్రాయేలీయులలో నుండి సంపూర్ణంగా ఇవ్వబడాల్సిన లేవీయులు. ప్రతి ఇశ్రాయేలు స్త్రీ యొక్క మొదటి మగ సంతానానికి బదులు వీరిని నా సొంతవారిగా తీసుకున్నాను.
NUM 8:17 ఇశ్రాయేలులో మనుష్యుల్లోను పశువుల్లోను ప్రతి తొలిచూలు మగ సంతతి నాదే. ఈజిప్టులో జ్యేష్ఠ సంతతిని మొత్తాను కాబట్టి వీరిని నాకు నేను ప్రత్యేకపరచుకున్నాను.
NUM 8:18 ఇశ్రాయేలులో జ్యేష్ఠులైన మగవారికి ప్రత్యామ్నాయంగా నేను లేవీయులను ఏర్పరచుకున్నాను.
NUM 8:19 ఇశ్రాయేలీయులందరిలో లేవీయులను అహరోనుకు, అతని కుమారులకు కానుకగా ఇచ్చాను. వీరు సమావేశ గుడారంలో సేవ చేస్తారు, ఇశ్రాయేలీయులు పరిశుద్ధాలయాన్ని సమీపించినప్పుడు వారికి తెగులు రాకుండ వారి పక్షాన ప్రాయశ్చిత్తం చేస్తారు.”
NUM 8:20 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే, అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజం లేవీయుల పట్ల చేశారు.
NUM 8:21 లేవీయులు తమను తాము పవిత్రపరచుకుని వారి బట్టలు ఉతుక్కున్నారు. తర్వాత అహరోను తన చేతులు పైకెత్తి ప్రత్యేక అర్పణగా వారిని యెహోవా ఎదుట సమర్పించి వారిని శుద్ధీకరించడానికి ప్రాయశ్చిత్తం చేశాడు.
NUM 8:22 ఆ తర్వాత, లేవీయులు అహరోను అతని కుమారుల క్రింద సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వారు లేవీయులకు చేశారు.
NUM 8:23 యెహోవా మోషేకు ఇలా ఆదేశించారు,
NUM 8:24 “లేవీయులు ఈ నియమాలు పాటించాలి: యిరవై సంవత్సరాలు ఆ పైబడి వయస్సు గలవారు సమావేశ గుడారంలో సేవలో భాగంగా ఉండడానికి రాగలరు,
NUM 8:25 అయితే, యాభై సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు వారు ఇంకా పని నుండి విరమించుకోవాలి.
NUM 8:26 విరమణ తర్వాత సమావేశ గుడారంలో వారి సహోదరులకు సహకారంగా ఉండవచ్చు కానీ వారంతట వారు పని చేయకూడదు. ఇలా నీవు లేవీయులకు వారి బాధ్యతలను అప్పగించాలి.”
NUM 9:1 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం మొదటి నెలలో సీనాయి అరణ్యంలో యెహోవా మోషేతో మాట్లాడారు. ఆయన ఇలా చెప్పారు,
NUM 9:2 “ఇశ్రాయేలీయులు నిర్ణీత సమయంలో పస్కా పండుగ జరుపుకోవాలి.
NUM 9:3 దాని నిర్ణీత సమయంలో అనగా, ఈ నెల పద్నాలుగవ రోజు సాయంకాల సమయంలో, నియమ నిబంధనలతో ఈ పండుగ జరుపుకోవాలి.”
NUM 9:4 కాబట్టి మోషే పస్కాను జరుపుకోమని ఇశ్రాయేలీయులకు చెప్పాడు,
NUM 9:5 వారంతా అదే విధంగా మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంకాలం సీనాయి అరణ్యంలో పస్కాను జరుపుకుంటారు. ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశారు.
NUM 9:6 అయితే కొందరు మనుష్యులు మృతదేహాన్ని బట్టి ఆచారరీత్య అపవిత్రులైనందుకు ఆ రోజున పస్కాను జరుపుకోలేకపోయారు. కాబట్టి అదే రోజు వారు మోషే అహరోనుల దగ్గరకు వచ్చి,
NUM 9:7 వారు మోషేతో, “ఒక మనుష్యుని మృతదేహాన్ని బట్టి మేము అపవిత్రులం అయ్యాము, అయితే యెహోవా అర్పణను ఇతర ఇశ్రాయేలీయులతో పాటు నిర్ణీత సమయంలో మేము ఎందుకు సమర్పించకూడదు?” అని అడిగారు.
NUM 9:8 అందుకు మోషే వారితో, “మీ గురించి యెహోవా ఏమి ఆజ్ఞాపిస్తారో తెలుసుకునే వరకు ఆగండి” అని జవాబిచ్చాడు.
NUM 9:9 అప్పుడు యెహోవా మోషేతో,
NUM 9:10 “ఇశ్రాయేలీయులతో చెప్పు: ‘ఇప్పుడున్న మీలో ఎవరైనా లేదా రాబోయే తరాల వారైనా మృతదేహాన్ని బట్టి గాని దూర ప్రయాణాన్ని బట్టి గాని అపవిత్రులైతే, వారు యెహోవా పస్కాను జరుపుకోవచ్చు,
NUM 9:11 అయితే వారు రెండవ నెల పద్నాలుగవ రోజు సాయంకాలం జరుపుకోవాలి. వారు పులియని రొట్టెలతో, చేదు కూరలతో పాటు గొర్రెపిల్లను తినాలి.
NUM 9:12 తెల్లవారేటప్పడికి దానిలో ఏది మిగులకూడదు లేదా దాని ఎముకల్లో ఒక్కటి కూడా విరువకూడదు. పస్కాను జరుపుకున్నప్పుడు వారు నియమాలన్నీ పాటించాలి.
NUM 9:13 అయితే ఎవరైనా ఆచార ప్రకారం పవిత్రంగా ఉంటూ ప్రయాణంలో లేదా ఉన్న చోటే ఉంటూ, పస్కాను జరుపుకోకుండా ఉంటే, నిర్ణీత సమయంలో యెహోవాకు అర్పణను అర్పించనందుకు వారిని ప్రజల నుండి తొలగించాలి. వారి పాపానికి వారే పాపశిక్షను భరిస్తారు.
NUM 9:14 “ ‘మీ మధ్యలో ఉంటున్న విదేశీయులు కూడా యెహోవా పస్కాను నియమ నిబంధనలతో జరుపుకోవాలి. విదేశీయులకు స్వదేశీయులకు ఒకే నియమాలు ఉండాలి.’ ”
NUM 9:15 నిబంధన గుడారమైన సమావేశ గుడారం సిద్ధపరచబడిన రోజున దాన్ని మేఘం కమ్మింది. సాయంత్రం నుండి ఉదయం వరకు సమావేశ గుడారం మీద మేఘం అగ్నిలా కనిపించింది.
NUM 9:16 అది నిత్యం అలాగే ఉంది; మేఘం దాన్ని కమ్మింది, రాత్రివేళ ఆ మేఘం అగ్నిలా కనిపించేది.
NUM 9:17 గుడారం మీద నుండి మేఘం పైకి వెళ్లినప్పుడు, ఇశ్రాయేలీయులు బయలుదేరేవారు; ఎక్కడ మేఘం ఆగితే వారు అక్కడ గుడారాలు వేసుకునేవారు.
NUM 9:18 యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేవారు, ఆయన ఆజ్ఞ ప్రకారం అక్కడ ఉండేవారు. మేఘం సమావేశ గుడారం మీద నిలిచి ఉన్నంత వరకు వారు శిబిరంలో ఉండేవారు.
NUM 9:19 మేఘం ఎక్కువకాలం సమావేశ గుడారం మీద ఆగితే యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులు బయలుదేరేవారు కారు.
NUM 9:20 కొన్నిసార్లు మేఘం సమావేశ గుడారానికి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది; యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు శిబిరం చేస్తారు, ఆయన ఆజ్ఞ ప్రకారం వారు ప్రయాణం చేస్తారు.
NUM 9:21 కొన్నిసార్లు మేఘం సాయంత్రం నుండి ఉదయం వరకు మాత్రమే ఉండేది, ఉదయం ఎత్తినప్పుడు, వారు ప్రయాణించేవారు. పగలైన, రాత్రైనా, మేఘం ఎత్తినప్పుడల్లా వారు ప్రయాణించేవారు.
NUM 9:22 మేఘం సమావేశ గుడారంలో రెండు రోజులు లేదా ఒక నెల లేదా ఒక సంవత్సరం పాటు ఉండిపోతే, ఇశ్రాయేలీయులు శిబిరంలోనే ఉండేవారు; కానీ అది ఎత్తినప్పుడు, వారు బయలుదేరేవారు.
NUM 9:23 యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు గుడారాలు వేసుకునేవారు, యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు బయలుదేరేవారు. మోషే ద్వారా ఇవ్వబడిన యెహోవా ఆజ్ఞ ప్రకారం వారు లోబడ్డారు.
NUM 10:1 యెహోవా మోషేతో ఇలా చెప్పారు:
NUM 10:2 “సుత్తెతో సాగగొట్టబడిన వెండితో రెండు బూరలు తయారుచేసి, సమాజం కూడుకోడానికి, శిబిరాలు బయలుదేరడాన్ని సూచించడానికి వాటిని వాడాలి.
NUM 10:3 రెండు బూరలు ఒకేసారి మ్రోగితే ఆ శబ్దానికి సమాజమంతా నీ ఎదుట సమావేశ గుడార ద్వారం దగ్గర కూడుకోవాలి.
NUM 10:4 ఒక బూర మాత్రమే మ్రోగితే, నాయకులు అంటే ఇశ్రాయేలు గోత్రాల అధిపతులు నీ ముందు సమకూడాలి.
NUM 10:5 బూరధ్వని వినబడినప్పుడు, తూర్పున ఉన్న గోత్రాలు బయలుదేరాలి.
NUM 10:6 రెండవ ధ్వని వినబడినప్పుడు, దక్షిణాన ఉన్న దండ్లు బయలుదేరాలి. బయలుదేరడానికి ధ్వని ఒక సూచన.
NUM 10:7 సమాజం కూడుకోడానికి, బూరలు ఊదండి, అయితే బయలుదేరడానికి ఊదే విధంగా కాదు.
NUM 10:8 “యాజకులైన అహరోను కుమారులు, బూరలు ఊదాలి. ఇది మీకు రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
NUM 10:9 మీ భూమిలో మిమ్మల్ని బాధపరిచే మీ శత్రువులపై యుద్ధం చేయబోతున్నప్పుడు బూరధ్వని చేయాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ శత్రువుల నుండి మిమ్మల్ని విడిపిస్తారు.
NUM 10:10 అంతేకాక మీ సంతోష సమయాల్లో అంటే నియమించబడిన పండుగలు, అమావాస్య వేడుకలప్పుడు మీ దహనబలులు, మీ సమాధాన బలులపై బూరధ్వని చేయండి. అవి మీ దేవుని ఎదుట జ్ఞాపకార్థంగా ఉంటాయి. నేను మీ దేవుడనైన యెహోవానై ఉన్నాను.”
NUM 10:11 రెండవ సంవత్సరం రెండవ నెల ఇరవయ్యవ రోజున, మేఘం సాక్షి గుడారం మీది నుండి కదిలింది.
NUM 10:12 ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యం నుండి బయలుదేరి మేఘం పారాను అరణ్యంలో ఆగేవరకు స్థలం నుండి స్థలానికి ప్రయాణించారు.
NUM 10:13 యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మొదటిసారిగా, వారు బయలుదేరారు.
NUM 10:14 యూదా శిబిరం యొక్క విభజనలు వారి పతాకాన్ని పట్టుకుని ముందుగా వెళ్లాయి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా గోత్రం వారిని నడిపించాడు.
NUM 10:15 అదే విధంగా సూయరు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు గోత్రం,
NUM 10:16 ఏలీయాబు కుమారుడైన హేలోను జెబూలూను గోత్రానికి నియమించబడ్డారు.
NUM 10:17 తర్వాత గుడారాన్ని తీసివేశారు, గెర్షోను, మెరారి వంశస్థులు దానిని మోస్తూ బయలుదేరారు.
NUM 10:18 వారి తర్వాత రూబేను శిబిరం వారు వారి సేనల ప్రకారం వెళ్లారు. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను గోత్ర నాయకుడు సైన్యాధిపతి.
NUM 10:19 సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను గోత్రం మీద,
NUM 10:20 దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు గోత్రం మీద నియమించబడ్డారు.
NUM 10:21 తర్వాత కహాతు వంశస్థులు పవిత్ర వస్తువులను మోస్తూ బయలుదేరారు. వీరు తర్వాతి శిబిరాన్ని చేరకముందే సమావేశ గుడారం సిద్ధం చేయబడాలి.
NUM 10:22 వారి తర్వాత ఎఫ్రాయిం శిబిరం వారు వారి సేనల ప్రకారం బయలుదేరారు. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిం గోత్ర సైన్యాధిపతి.
NUM 10:23 తర్వాత మనష్షే గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు పెదాసూరు కుమారుడైన గమలీయేలు,
NUM 10:24 తర్వాత బెన్యామీను గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు గిద్యోనీ కుమారుడైన అబీదాను సైన్యాధిపతి.
NUM 10:25 చివరకు, అన్ని శిబిరాల వెనుక దాను శిబిరం వారు వారి సేనల ప్రకారం బయలుదేరారు. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు న్యాయాధిపతి.
NUM 10:26 తర్వాత ఆషేరు గోత్రం వారు వెళ్లారు. వారు నాయకుడు ఒక్రాను కుమారుడైన పగీయేలు.
NUM 10:27 తర్వాత నఫ్తాలి గోత్రం వారు వెళ్లారు. వారి నాయకుడు ఏనాను కుమారుడైన అహీర సైన్యాధిపతి.
NUM 10:28 ఈ క్రమంలో తమ తమ సేనలతో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేశారు.
NUM 10:29 ఒక రోజు మోషే తన మామ మిద్యానీయుడైన రెయూయేలు కుమారుడైన హోబాబుతో, “యెహోవా, ‘నేను మీకు ఇస్తాను’ అని చెప్పిన స్థలానికి వెళ్తున్నాము. నీవు మాతో వచ్చెయ్యి, మేము నిన్ను మంచిగా చూసుకుంటాం, ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలుకు మంచి వాటిని వాగ్దానం చేశారు” అని చెప్పాడు.
NUM 10:30 అతడు, “నేను రాను, నా స్వదేశానికి, నా బంధువుల దగ్గరకు తిరిగి వెళ్తున్నాను” అని జవాబిచ్చాడు.
NUM 10:31 అయితే మోషే, “దయచేసి మమ్మల్ని వదిలి వెళ్లకు. ఈ అరణ్యంలో ఎక్కడ దిగాలో నీకు దారి బాగా తెలుసు, నీవు మాకు దారి చూపించగలవు.
NUM 10:32 నీవు కాబట్టి మాతో వస్తే యెహోవా మాకు ఇచ్చే మేలులు నీతో పంచుకుంటాం” అని చెప్పాడు.
NUM 10:33 కాబట్టి వారు యెహోవా పర్వతం నుండి బయలుదేరి మూడు రోజులు ప్రయాణించారు. వారి విశ్రాంతి స్థలం కోసం ఈ మూడు రోజులు యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా వెళ్లింది.
NUM 10:34 వారు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు యెహోవా మేఘము పగలు వారి మీద ఉంది.
NUM 10:35 మందసం ఎప్పుడు బయలుదేరుతుందో అప్పుడు మోషే బిగ్గరగా, “యెహోవా, లేవండి! మీ శత్రువులు చెదిరిపోవుదురు గాక; మీ ఎదుట నుండి మీ శత్రువులు పారిపోవుదురు గాక” అని అనేవాడు.
NUM 10:36 మందసం ఆగినప్పుడు, అతడు, “యెహోవా, లెక్కలేనంతగా ఉన్న వేలాది ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తిరిగి రండి” అని అనేవాడు.
NUM 11:1 దాని తర్వాత యెహోవా వినేలా ప్రజలు తమ కష్టాల గురించి ఫిర్యాదు చేసినప్పుడు, ఆయన అవి వినగానే ఆయన కోపం రగులుకుంది. అప్పుడు యెహోవా నుండి అగ్ని వారి మధ్యకు వచ్చి శిబిరం శివార్లలో కొంత భాగాన్ని దహించివేసింది.
NUM 11:2 ప్రజలు మోషేకు మొరపెట్టగా, అతడు యెహోవాకు ప్రార్థించాడు, ఆ అగ్ని ఆరిపోయింది.
NUM 11:3 అందుకు ఆ స్థలానికి తబేరా అని పేరు పెట్టారు, ఎందుకంటే యెహోవా నుండి వచ్చిన అగ్ని వారి మధ్యలో వచ్చింది కాబట్టి.
NUM 11:4 వారితో ఉన్న అల్లరి గుంపు వేరే ఆహారం ఆశించడం ప్రారంభించారు, అప్పుడు మళ్ళీ ఇశ్రాయేలీయులు ఏడ్వడం మొదలుపెట్టి, “మనకు తినడానికి మాంసం మాత్రం ఉంటే ఎంత బాగుండేది!
NUM 11:5 ఈజిప్టులో చేపలు, దోసకాయలు, పుచ్చకాయలు, ఒక రకమైన ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు ఉచితంగా తిన్నాము.
NUM 11:6 కానీ ఇప్పుడు మాకు తిండి మీద ఇష్టం లేకుండ పోయింది; ఈ మన్నా తప్ప మాకేమి కనిపించడం లేదు!” అని అన్నారు.
NUM 11:7 మన్నా కొత్తిమెర గింజల్లా ఉండి గుగ్గిలంలా కనబడుతుంది.
NUM 11:8 ప్రజలు బయటకు వెళ్లి, తిరుగుతూ దానిని సేకరించుకొని, దానిని తిరగలితో విసరేవారు లేదా రోటిలో దంచేవారు. కుండలో దానిని ఉడకబెట్టి దానితో రొట్టెలు చేసుకునేవారు. దాని రుచి నూనెతో చేసిన అప్పడంలా ఉంటుంది.
NUM 11:9 రాత్రివేళ శిబిరంలో మంచు కురిసినప్పుడు మన్నా దాని వెంటనే పడేది.
NUM 11:10 మోషే ప్రతి కుటుంబంలోని ప్రజలు వారి డేరాల దగ్గర ఏడుస్తూ ఉండడం విన్నాడు. యెహోవా చాలా కోప్పడ్డారు మోషే బాధపడ్డాడు.
NUM 11:11 మోషే యెహోవాతో, “మీ సేవకునిపై ఈ కష్టం ఎందుకు తెచ్చారు? వీరందరి భారం నా మీద వేయకుండ మీ దృష్టిలో నేనెందుకు దయను పొందలేకపోయాను?
NUM 11:12 వీరందరిని నేను గర్భందాల్చానా? నేను వీరిని కన్నానా? దాది శిశువును ఎత్తుకున్నట్లు, మీ పూర్వికులకు మీరు ప్రమాణం వాగ్దానం చేసిన స్థలానికి నడిపించడానికి వీరిని నా చేతిలో ఎందుకు మోయమన్నారు?
NUM 11:13 వీరందరి కోసం మాంసం ఎక్కడ నుండి తేవాలి? నన్ను చూసి, ‘మాకు తినడానికి మాంసం ఇవ్వు!’ అంటూ ఏడుస్తున్నారు.
NUM 11:14 నా అంతట నేను ఈ ప్రజలందరినీ మోయలేను; భారం నాకు చాల భారీగా ఉంది.
NUM 11:15 ఒకవేళ నాతో మీరు ఇలా వ్యవహరించ తలిస్తే దయచేసి నన్ను చంపేయండి; నా మీద మీకు దయ కలిగితే నా దురవస్థను నేను చూడకుండ నన్ను చంపేయండి” అని చెప్పాడు.
NUM 11:16 యెహోవా మోషేతో: “ఇశ్రాయేలు గోత్ర పెద్దలను డెబ్బై మందిని నాయకులుగా, ఎవరైతే పెద్దలుగా ఉన్నవారు నీకు తెలిసినవారిని తీసుకురా. నీతో వారు నిలబడేలా వారు సమావేశ గుడారం దగ్గరకు రావాలి.
NUM 11:17 నేను దిగివచ్చి నీతో మాట్లాడతాను. నీ మీద ఉన్న ఆత్మ యొక్క శక్తిలో కొద్ది భాగం వారి మీద పెడతాను. వారు నీతో కలిసి ప్రజల భారం పంచుకుంటారు అప్పుడు నీవు ఒంటరిగా మోయనవసరం ఉండదు.
NUM 11:18 “నీవు ప్రజలకు ఇలా చెప్పు: ‘రేపటి కోసం మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి, రేపు మీరు మాంసం తినబోతున్నారు. మీరు, “మాకు మాంసం మాత్రం ఉంటే బాగుండేది! ఈజిప్టులో మాకు బాగుండేది!” అని ఏడ్వడం యెహోవా విన్నారు కాబట్టి యెహోవా మీకు మాంసం ఇస్తారు, మీరు తింటారు.
NUM 11:19 దానిని మీరు తినడం ఒక రోజు కాదు, రెండు రోజులు, అయిదు రోజులు, పది రోజులు, యిరవై రోజులు కాదు,
NUM 11:20 ఒక నెలంతా మీ నాసికా రంధ్రాల నుండి బయటకు వచ్చి మీరు అసహ్యించుకునే వరకు తింటారు; ఎందుకంటే మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిరాకరించి, “మేము అసలు ఈజిప్టును ఎందుకు విడిచిపెట్టామో?” అంటూ ఆయన ఎదుట ఏడ్చారు.’ ”
NUM 11:21 అయితే మోషే, “నేను ఆరు లక్షలమంది పాదాచారుల మధ్య ఉన్నాను, మీరేమో, ‘నేను వారికి నెలరోజులు తినడానికి సరిపడే మాంసం ఇస్తాను!’ అని అన్నారు.
NUM 11:22 ఉన్న పశువులు, మందలు అన్నిటిని వధించినా వీరికి సరిపోతుందా? సముద్రంలో చేపలన్నీ పట్టినా వీరికి సరిపోతాయా?”
NUM 11:23 యెహోవా మోషేకు జవాబిస్తూ, “యెహోవా బాహుబలం తక్కువయ్యిందా? నేను చెప్పింది జరుగుతుందో లేదో నీవు చూస్తావు” అని అన్నారు.
NUM 11:24 మోషే బయటకు వెళ్లి యెహోవా చెప్పిందంతా ప్రజలకు తెలియజేశాడు. డెబ్బైమంది గోత్ర పెద్దలను తెచ్చి మందిరం చుట్టూ నిలబెట్టాడు.
NUM 11:25 అప్పుడు యెహోవా మేఘంలో దిగివచ్చి అతనితో మాట్లాడారు. అతనిపై ఉన్న ఆత్మ శక్తిలో కొంత ఆ డెబ్బై గోత్ర పెద్దలపై ఉంచినప్పుడు ఆత్మ వారిమీద నిలిచి వారు ప్రవచించారు అయితే, తర్వాత ఎన్నడు ప్రవచించలేదు.
NUM 11:26 అయితే, ఇద్దరు, శిబిరంలోనే ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. వారు గోత్ర పెద్దలలో ఉన్నవారే, కానీ గుడారం బయటకు వెళ్లలేదు. అయినప్పటికీ ఆత్మ వారి మీద ఉంది, వారు శిబిరంలో ప్రవచించారు.
NUM 11:27 ఒక యువకుడు మోషే దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, “ఎల్దాదు, మేదాదు శిబిరంలో ప్రవచిస్తున్నారు” అని చెప్పాడు.
NUM 11:28 నూను కుమారుడైన యెహోషువ, యవ్వనకాలం నుండి మోషే దగ్గరే ఉన్నవాడు, అతడు మాట్లాడుతూ, “మోషే, నా ప్రభువా, వారిని ఆపండి!” అని అన్నాడు.
NUM 11:29 కానీ మోషే అతనితో, “నా పక్షంగా నీవు అసూయపడుతున్నావా? నేనైతే యెహోవా ప్రజలంతా ప్రవక్తలు కావాలని, యెహోవా తన ఆత్మ వారందరి మీద ఉంచాలని కోరతాను!” అని జవాబిచ్చాడు.
NUM 11:30 తర్వాత మోషే, ఇశ్రాయేలు గోత్ర పెద్దలు, శిబిరానికి తిరిగి వెళ్లారు.
NUM 11:31 తర్వాత యెహోవా దగ్గరి నుండి గాలి వెళ్లి సముద్రం దిక్కునుండి పూరేళ్ళను తీసుకువచ్చింది. అది వాటిని రెండు మూరల ఎత్తుగా, ఏ దిశలోనైనా ఒక రోజు నడకంత దూరంగా శిబిరం చుట్టూరా చెదరగొట్టింది.
NUM 11:32 ఆ దినమంతా, రాత్రంతా, మరుసటి రోజంతా, ప్రజలు బయటకు వెళ్లి పూరేళ్ళను సమకూర్చుకున్నారు. ఏ ఒక్కరు కూడా పది హోమెర్ల కంటే తక్కువ పోగు చేసుకోలేదు. వాటిని శిబిరం చుట్టూ పరిచారు.
NUM 11:33 అయితే, మాంసం పళ్ళ సందుల్లో ఉండగానే దానిని నమిలి మ్రింగకముందే, యెహోవా కోపం వారిపై రగులుకుంది, ఆయన వారిని భయంకరమైన తెగులుతో మొత్తారు.
NUM 11:34 ఆ స్థలంలో ఇతర ఆహారం కోసం ఆశపడిన వారిని పాతిపెట్టినందుకు ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అనే పేరు పెట్టారు.
NUM 11:35 ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణం చేసి అక్కడే ఉండిపోయారు.
NUM 12:1 మోషే కూషీయురాలిని పెళ్ళి చేసుకున్నందుకు, అతనికి వ్యతిరేకంగా మిర్యాము, అహరోనులు మాట్లాడడం ప్రారంభించారు,
NUM 12:2 “యెహోవా కేవలం మోషే ద్వారానే మాట్లాడారా?” అని, “ఆయన మా ద్వారా కూడా మాట్లాడలేక?” అని అన్నారు. యెహోవా వారి మాటలు విన్నారు.
NUM 12:3 మోషే చాలా దీనుడు, భూమి మీద ఉన్న మనుష్యులందరి కన్నా దీనుడు.
NUM 12:4 వెంటనే యెహోవా మోషే, అహరోను మిర్యాములతో, “మీ ముగ్గురు, సమావేశ గుడారం దగ్గరకు రండి” అని చెప్పారు. కాబట్టి ముగ్గురు వెళ్లారు.
NUM 12:5 అప్పుడు యెహోవా మేఘస్తంభంలో దిగి వచ్చారు; ఆయన గుడార ద్వారం దగ్గర నిలబడి అహరోను, మిర్యాములను పిలిచారు. ఆ ఇద్దరు ముందుకు వచ్చినప్పుడు,
NUM 12:6 ఆయన, “నా మాటలు వినండి: “ఒకవేళ మీ మధ్య ప్రవక్త ఉంటే, యెహోవానైన నేను దర్శనాలలో వారికి ప్రత్యక్షమవుతాను, కలలలో నేను వారితో మాట్లాడతాను.
NUM 12:7 అయితే నా సేవకుడైన మోషే విషయంలో ఇలా కాదు; అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు.
NUM 12:8 అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, పొడుపుకథల్లా కాక స్పష్టంగా మాట్లాడతాను. అతడు యెహోవా రూపాన్ని చూస్తాడు. అలాంటప్పుడు మీరెందుకు భయపడకుండా నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు?”
NUM 12:9 యెహోవా కోపం వారిపై రగులుకుంది, ఆయన వారిని విడిచి వెళ్లారు.
NUM 12:10 మేఘం గుడారం నుండి పైకి వెళ్లిపోయాక, మిర్యాముకు కుష్ఠువ్యాధి వచ్చి చర్మం మంచులా తెల్లగా మారింది. అహరోను ఆమె వైపు చూసి, ఆమెకు కుష్ఠువ్యాధి వచ్చిందని గ్రహించి,
NUM 12:11 అహరోను మోషేతో, “నా ప్రభువా, మేము తెలివితక్కువగా చేసిన పాపాన్ని మా మీదకు తేవద్దు.
NUM 12:12 తల్లి గర్భంలో సగం మాంసం కుళ్ళిన శిశువులా ఆమెను కానివ్వకండి” అని అన్నాడు.
NUM 12:13 కాబట్టి మోషే యెహోవాకు, “దేవా, దయచేసి ఈమెను స్వస్థపరచు!” అని మొరపెట్టాడు.
NUM 12:14 అందుకు యెహోవా మోషేతో, “ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేస్తే, ఆమె ఏడు రోజులు అవమానంలో ఉండదా? ఆమెను శిబిరం బయట ఏడు రోజులు ఉంచు; ఆ తర్వాత ఆమెను వెనుకకు తీసుకురావచ్చు” అని జవాబిచ్చారు.
NUM 12:15 కాబట్టి మిర్యాము శిబిరం బయట ఏడు రోజులు ఉన్నది, ఆమెను తిరిగి తీసుకువచ్చే వరకు ప్రజలు ముందుకు వెళ్లలేదు.
NUM 12:16 ఆ పిమ్మట ప్రజలు హజేరోతు నుండి బయలుదేరి పారాను ఎడారిలో గుడారాలు వేసుకున్నారు.
NUM 13:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
NUM 13:2 “కనాను దేశాన్ని పరిశీలించడానికి కొంతమంది పురుషులను పంపు, ఈ దేశం ఇశ్రాయేలీయులకు ఇవ్వబోతున్నాను. ప్రతి పితరుల గోత్ర నాయకుల్లో ఒకరిని పంపు.”
NUM 13:3 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే వారిని పారాను ఎడారి నుండి పంపాడు. వారందరు ఇశ్రాయేలీయుల నాయకులు.
NUM 13:4 వారి పేర్లు ఇవి: రూబేను గోత్రం నుండి, జక్కూరు కుమారుడైన షమ్మూయ;
NUM 13:5 షిమ్యోను గోత్రం నుండి, హోరీ కుమారుడైన షాపాతు;
NUM 13:6 యూదా గోత్రం నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు;
NUM 13:7 ఇశ్శాఖారు గోత్రం నుండి, యోసేపు కుమారుడైన ఇగాలు;
NUM 13:8 ఎఫ్రాయిం గోత్రం నుండి, నూను కుమారుడైన హోషేయ;
NUM 13:9 బెన్యామీను గోత్రం నుండి, రాఫు కుమారుడైన పల్తీ;
NUM 13:10 జెబూలూను గోత్రం నుండి, సోది కుమారుడైన గదీయేలు;
NUM 13:11 మనష్షే (యోసేపు గోత్రం) గోత్రం నుండి, సూసీ కుమారుడైన గద్దీ;
NUM 13:12 దాను గోత్రం నుండి, గెమలి కుమారుడైన అమ్మీయేలు;
NUM 13:13 ఆషేరు గోత్రం నుండి, మిఖాయేలు కుమారుడైన సెతూరు;
NUM 13:14 నఫ్తాలి గోత్రం నుండి, వోఫ్సీ కుమారుడైన నహబీ;
NUM 13:15 గాదు గోత్రం నుండి, మాకీ కుమారుడైన గెయుయేలు.
NUM 13:16 ఇవి వాగ్దాన దేశాన్ని చూడడానికి మోషే పంపిన వారి పేర్లు. (నూను కుమారుడైన హోషేయకు మోషే యెహోషువ అని పేరు పెట్టాడు.)
NUM 13:17 మోషే వారిని కనాను దేశాన్ని పరిశీలించమని పంపినప్పుడు, అతడు ఇలా చెప్పాడు, “మీరు దక్షిణ మార్గం గుండా వెళ్లి, కొండసీమ వైపు వెళ్లండి.
NUM 13:18 ఆ దేశం ఎలా ఉందో, అందులోని ప్రజలు బలవంతులా, బలహీనులా, తక్కువగా ఉన్నారా, ఎక్కువగా ఉన్నారా అని చూడండి.
NUM 13:19 వారు ఎలాంటి భూమిలో నివసిస్తున్నారు? అది మంచిదా చెడ్డదా? వారు ఎలాంటి పట్టణాల్లో నివసిస్తున్నారు? అవి కోటగోడలు లేనివా? లేదా కోటగోడలు కలవా?
NUM 13:20 ఆ దేశపు మట్టి ఎలా ఉంది? అది సారవంతమైనదా కాదా? అక్కడ చెట్లున్నాయా లేవా? అక్కడి పండ్లలో కొన్ని తీసుకురావడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి.” (అది ప్రథమ ద్రాక్షపండ్ల కాలము.)
NUM 13:21 కాబట్టి వారు వెళ్లి సీను ఎడారి నుండి లెబో హమాతు వైపున, రెహోబు వరకు ఆ దేశాన్ని పరిశీలించారు.
NUM 13:22 దక్షిణ దిక్కునుండి వెళ్లి, హెబ్రోనుకు వచ్చారు, అక్కడ అహీమాను, షేషయి, తల్మయి అనే అనాకు వంశస్థులు నివసించారు. (హెబ్రోను, ఈజిప్టులోని సోయను కంటే ఏడు సంవత్సరాల ముందే కట్టబడిన పురాతన పట్టణము.)
NUM 13:23 వారు ఎష్కోలు లోయకు చేరుకున్నప్పుడు ఒకే గెల ఉన్న ద్రాక్షచెట్టు కొమ్మను నరికారు. దానిని ఇద్దరు వారి మధ్య కర్ర మీద మోసారు, దానితో పాటు కొన్ని దానిమ్మలు, అంజూరాలు కూడా తీసుకున్నారు.
NUM 13:24 అక్కడ ఇశ్రాయేలీయులు ద్రాక్ష గెలను కోసినందుకు ఆ స్థలం ఎష్కోలు లోయ అని పిలువబడింది.
NUM 13:25 ఆ దేశాన్ని పరిశీలించిన నలభైరోజల తర్వాత వారు తిరిగి వచ్చారు.
NUM 13:26 వారు పారాను ఎడారిలో కాదేషులో ఉన్న మోషే అహరోనులు, ఇశ్రాయేలు సర్వసమాజం దగ్గరకు వచ్చారు. అక్కడ వారికి, సర్వ సమాజానికి విశేషాలు చెప్పి, ఆ దేశ పండ్లను వారికి చూపించారు.
NUM 13:27 వారు మోషేకు ఇచ్చిన నివేదిక ఇది: “మీరు పంపిన దేశానికి మేము వెళ్లాము. నిజంగా పాలు తేనెలు అక్కడ పారుతున్నాయి. ఇవి ఆ దేశంలోని పండ్లు.
NUM 13:28 అయితే అక్కడి నివాసులు బలిష్ఠులు, వారి పట్టణాలు కోటగోడలు కలిగి ఉన్నాయి, చాలా పెద్దవి. అక్కడ అనాకీయులను కూడా చూశాము.
NUM 13:29 అమాలేకీయులు దక్షిణాదిలో నివసిస్తారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ సీమలో ఉంటారు. కనానీయులు సముద్రతీరాన యొర్దాను నది ఒడ్డున నివసిస్తారు.”
NUM 13:30 అప్పుడు కాలేబు మోషే ఎదుట ప్రజలను శాంత పరుస్తూ, “తప్పకుండా మనం వెళ్లి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, ఖచ్చితంగా చేయగలం” అని అన్నాడు.
NUM 13:31 కానీ అతనితో కలసి వెళ్లినవారు, “మనం వారిపై దాడి చేయలేము; అక్కడి ప్రజలు మనకన్నా బలమైన వారు” అని అన్నారు.
NUM 13:32 వారు పరిశీలించిన దేశం గురించి ఇశ్రాయేలీయుల మధ్య చెడ్డ నివేదికను వ్యాప్తి చేశారు. వారు, “మేము వేగు చూసిన భూమి దానిలో నివసించేవారిని మ్రింగివేస్తుంది. అక్కడ మేము చూసిన ప్రజలందరూ చాలా పెద్దగా ఉన్నారు.
NUM 13:33 మేము అక్కడ ఆజానుబాహులను (అనాకు వంశస్థులు నెఫిలీము నుండి వచ్చినవారు) చూశాము. మా దృష్టిలో మేము మిడతల్లా కనిపించాం, వారికి కూడా అలాగే కనిపించాం” అని అన్నారు.
NUM 14:1 ఆ రాత్రి సమాజంలో ఉన్న అందరు స్వరాలెత్తి బిగ్గరగా ఏడ్చారు.
NUM 14:2 ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనుల మీద సణిగి, సమాజమంతా, “మేము ఈజిప్టులో గాని ఎడారిలో గాని చనిపోయుంటే బాగుండేది!
NUM 14:3 మేము ఖడ్గం చేత చావడానికి మమ్మల్ని యెహోవా ఈ దేశానికి ఎందుకు తెస్తున్నారు? మా భార్య పిల్లలు చెరగా కొనిపోబడతారు. ఈజిప్టుకు తిరిగి వెళ్లడం మాకు మంచిది కాదా?” అని వారితో అన్నారు.
NUM 14:4 వారు ఒకరితో ఒకరు, “మనం ఒక నాయకుని ఎన్నుకుని ఈజిప్టుకు తిరిగి వెళ్దాం” అని మాట్లాడుకున్నారు.
NUM 14:5 అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలు సమాజమందరి ఎదుట సాష్టాంగపడ్డారు.
NUM 14:6 ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్లిన వారిలో ఉన్న నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు తమ బట్టలు చింపుకొని,
NUM 14:7 ఇశ్రాయేలు సమాజమంతటితో ఇలా అన్నారు: “మేము వెళ్లి పరిశీలించిన దేశం చాలా మంచిగా ఉంది.
NUM 14:8 యెహోవా మనయందు ఆనందిస్తే, ఆ దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనలను నడిపిస్తారు, దానిని మనకు ఇస్తారు.
NUM 14:9 మీరు మాత్రం యెహోవా మీద తిరగబడకండి. అక్కడి ప్రజలకు భయపడకండి ఎందుకంటే వారిని మనం చంపుతాము. వారికి కాపుదల లేదు, కానీ యెహోవా మనతో ఉన్నారు. వారికి భయపడకండి” అని చెప్పారు.
NUM 14:10 అయితే సమాజమంతా వారిని రాళ్లతో కొట్టాలని మాట్లాడుకున్నారు. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశం సమావేశ గుడారం దగ్గర ఇశ్రాయేలీయులందరికి కనిపించింది.
NUM 14:11 యెహోవా మోషేతో, “ఎంతకాలం ఈ ప్రజలు నన్ను ధిక్కరిస్తారు? నేను వారి మధ్య అన్ని సూచనలు చేసినప్పటికీ, వారు నన్ను నమ్మడానికి ఎంతకాలం నిరాకరిస్తారు?
NUM 14:12 తెగులుతో వారిని మొత్తి నాశనం చేస్తాను, అయితే వీరిని మించిన బలమైన గొప్ప ప్రజలుగా నిన్ను చేస్తాను” అని అన్నారు.
NUM 14:13 మోషే యెహోవాతో, “ఈజిప్టువారు దాని గురించి విన్నప్పుడు వారు ఏమనుకుంటారు? మీ ప్రభావం చేత వారి మధ్య నుండి వీరిని తెచ్చారు.
NUM 14:14 ఈ దేశ నివాసులకు దానిని గురించి వారు చెప్తారు. ఇప్పటికే మీరు యెహోవా, ఈ ప్రజలతో ఉన్నారని, మీరు ముఖాముఖిగా వీరికి కనిపిస్తారని, మీ మేఘము వీరితో ఉంటుందని, మీరు పగలు మేఘస్తంభంలో, రాతి అగ్నిస్తంభంలో ఉంటూ వారిని నడిపిస్తారని వారు విన్నారు.
NUM 14:15 ఒకవేళ ఎవరిని విడిచిపెట్టకుండా ఈ ప్రజలందరినీ చంపేస్తే, మీ గురించి ఈ విషయాలు విన్న దేశాలు,
NUM 14:16 ‘యెహోవా ఈ ప్రజలకు మ్రొక్కుబడిగా వాగ్దానం చేసిన స్థలానికి తీసుకెళ్లలేక, వీరిని అరణ్యంలో చంపేశారు’ అని అంటారు.
NUM 14:17 “కాబట్టి మీరు ప్రకటించినట్లే, ఇప్పుడు ప్రభువు యొక్క బలం కనుపరచబడును గాక:
NUM 14:18 ‘యెహోవా త్వరగా కోప్పడరు, ప్రేమ క్షమాగుణాలతో నిండియున్నవారు, ఆయన తిరుగుబాటును పాపాన్ని క్షమిస్తారు గాని ఆయన దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టక, మూడు నాలుగు తరాల వరకు తల్లిదండ్రుల పాపానికి వారి పిల్లలను శిక్షిస్తారు.’
NUM 14:19 మీ గొప్ప ప్రేమను బట్టి, ఈ ప్రజల పాపాన్ని, ఈజిప్టు వదిలినప్పటి నుండి ఇప్పటివరకు వీరిని క్షమించిన ప్రకారం క్షమించండి” అని అన్నాడు.
NUM 14:20 యెహోవా జవాబిస్తూ, “నీవడిగినట్టే, నేను వారిని క్షమించాను.
NUM 14:21 అయినా, నా జీవం తోడు, యెహోవా మహిమ భూమంతటిని నింపునట్లు,
NUM 14:22 నా మహిమను, ఈజిప్టులోను, అరణ్యంలోను నేను చూపిన సూచనలను చూసి నాకు లోబడక, నన్ను పదిసార్లు పరీక్షించిన ఏ ఒకరు,
NUM 14:23 వారి పూర్వికులకు నేను వాగ్దానంగా ప్రమాణం చేసిన దేశాన్ని వారిలో ఏ ఒక్కరు ఎప్పటికిని చూడరు. నా పట్ల ధిక్కారంగా ప్రవర్తించిన వారెవ్వరూ ఎప్పటికీ చూడరు.
NUM 14:24 అయితే నా సేవకుడు కాలేబు భిన్నమైన ఆత్మ కలిగి ఉండి నన్ను హృదయమంతటితో వెంబడిస్తున్నందుకు, అతడు వెళ్లిన దేశంలోకి నేను అతన్ని తీసుకువస్తాను, అతని వారసులు దానిని స్వతంత్రించుకుంటారు.
NUM 14:25 అమాలేకీయులు, కనానీయులు ఆ లోయల్లో నివసిస్తున్నారు కాబట్టి, రేపు వెనుకకు తిరగండి, ఎడారి వైపు ఎర్ర సముద్రం మార్గం గుండా రండి” అని చెప్పారు.
NUM 14:26 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు:
NUM 14:27 “ఎంతకాలం ఈ చెడు సమాజం నా మీద సణుగుతారు? ఈ సణిగే ఇశ్రాయేలీయుల ఫిర్యాదులు నేను విన్నాను.
NUM 14:28 కాబట్టి వారికి చెప్పండి, ‘నా జీవం తోడు, మీరు సణుగులను నేను విన్న ప్రకారం నేను మీకు చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు:
NUM 14:29 ఈ అరణ్యంలో మీ శవాలు రాలిపోతాయి అనగా ఇరవై సంవత్సరాలకు పైబడి జనాభా లెక్కలో నమోదై యుండి, నాకు వ్యతిరేకంగా సణిగిన ప్రతి ఒక్కరు రాలిపోతారు.
NUM 14:30 నేను చేయెత్తి వాగ్దానం చేసిన భూమిలో యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మీలో ఏ ఒక్కరు ప్రవేశించరు.
NUM 14:31 దోచుకోబడతారని నీవు చెప్పిన నీ పిల్లల విషయానికొస్తే, నీవు తిరస్కరించిన భూమిని అనుభవించడానికి నేను వారిని తీసుకువస్తాను.
NUM 14:32 మీ విషయానికొస్తే, మీ శవాలు ఈ అరణ్యంలో రాలిపోతాయి.
NUM 14:33 మీ పిల్లలు ఇక్కడ నలభై సంవత్సరాలు కాపరులుగా ఉంటారు, మీలో చివరి శవం ఈ అరణ్యంలో రాలిపోయే వరకు, మీ నమ్మకద్రోహాన్ని బట్టి మీ వ్యభిచారశిక్షను భరిస్తారు.
NUM 14:34 నలభై సంవత్సరాల వరకు మీరు దేశాన్ని వేగు చూసిన ప్రతి నలభై రోజులకు ఒక సంవత్సరం, మీ దోషశిక్షను మీరు భరించి నేను మీకు వ్యతిరేకంగా ఉంటే ఎలా ఉంటుందో మీరు తెలుసుకుంటారు.’
NUM 14:35 యెహోవానగు నేనే స్వయంగా చెప్తున్నాను, నాకు వ్యతిరేకంగా పోగయిన ఈ దుష్ట సమాజం మొత్తానికి, నేను ఖచ్చితంగా ఇవి చేస్తాను. ఈ అరణ్యంలో వారు అంతరిస్తారు; ఇక్కడ వారు చస్తారు.”
NUM 14:36 మోషే, ఆ దేశాన్ని పరిశీలించండి, అని పంపిన మనుష్యులు, వెళ్లి తిరిగివచ్చి దాని గురించి తప్పుడు నివేదిక తెచ్చి సమర్పించి, సర్వసమాజం సణుగునట్లు చేశారు
NUM 14:37 తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడానికి బాధ్యులైన వీరు మొత్తబడి, యెహోవా ఎదుట తెగులు ద్వార చనిపోయారు.
NUM 14:38 ఆ దేశాన్ని పరిశీలించిన వారిలో నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే బ్రతికారు.
NUM 14:39 మోషే ఇశ్రాయేలీయులందరికి ఈ విషయం చెప్పినప్పుడు, వారు చాలా ఏడ్చారు.
NUM 14:40 మరుసటిరోజు ఉదయాన్నే వారు, “నిజంగా మేము పాపం చేశాము. ఇప్పుడు మేము యెహోవా వాగ్దానం చేసిన దేశానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం!” అని అంటూ, కొండసీమ మీదున్న ఎత్తైన ప్రదేశానికి బయలుదేరారు.
NUM 14:41 కానీ మోషే, “ఎందుకు మీరు యెహోవా ఆజ్ఞను మీరుతున్నారు? ఇదిలా కొనసాగదు!
NUM 14:42 యెహోవా మీతో లేడు కాబట్టి మీరు వెళ్లకండి. మీరు శత్రువుల చేతిలో ఓడిపోతారు,
NUM 14:43 ఎందుకంటే అమాలేకీయులు, కనానీయులు అక్కడ మీ మీదికి వస్తారు, మీరు వారి ఖడ్గం చేత చస్తారు. ఎందుకంటే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి ఆయన మీతో ఉండరు” అని చెప్పాడు.
NUM 14:44 అయినాసరే, వారు అహంకారంతో మోషే గాని, యెహోవా నిబంధన మందసం గాని శిబిరం నుండి కదలక పోయినా, కొండసీమ ప్రాంతానికి ఎక్కి వెళ్లారు.
NUM 14:45 అప్పుడు కొండ సీమలో నివసిస్తున్న అమాలేకీయులు కనానీయులు దిగి వచ్చి, ఇశ్రాయేలీయులపై దాడి చేసి, హోర్మా వరకు తరిమికొట్టారు.
NUM 15:1 యెహోవా మోషేతో అన్నారు,
NUM 15:2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: మీకు నివాస స్థలంగా ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు
NUM 15:3 యెహోవాకు ఇష్టమైన సువాసన కలుగునట్లు మీ మందల నుండి లేదా పశువుల నుండి అర్పణలు అంటే దహనబలులు గాని బలులు గాని, ప్రత్యేకమైన మ్రొక్కుబడులు గాని స్వేచ్ఛార్పణలు గాని, లేదా పండుగ అర్పణలు గాని అర్పించవచ్చు.
NUM 15:4 అప్పుడు అర్పణ తెచ్చే వ్యక్తి ఒక పావు హిన్ నూనెలో ఒక ఓమెరు నాణ్యమైన పిండి కలిపి యెహోవాకు భోజనార్పణ సమర్పించాలి.
NUM 15:5 దహనబలి లేదా బలి కోసం తెచ్చే ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం పానార్పణంగా తేవాలి.
NUM 15:6 “ ‘భోజనార్పణ కోసం పొట్టేళ్ళతో పాటు రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి ఒక హిన్‌లో మూడవ వంతు నూనెతో కలిపి తేవాలి,
NUM 15:7 దానితో పాటు ఒక హిన్‌లో మూడవ వంతు ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా అర్పించాలి.
NUM 15:8 “ ‘యెహోవాకు ప్రత్యేకమైన మ్రొక్కుబడి లేదా సమాధానబలి కోసం దహనబలిగా లేదా బలిగా అర్పించడానికి కోడెను సిద్ధపరిచేటప్పుడు,
NUM 15:9 కోడెతో పాటు అయితే భోజనార్పణగా మూడు ఓమెర్ల నూనె కలిపిన అర హిన్ లో నాణ్యమైన పిండి,
NUM 15:10 దానితో పాటు అర హిన్ ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా ఉంటుంది.
NUM 15:11 ప్రతి కోడె లేదా పొట్టేలు, ప్రతి గొర్రెపిల్ల లేదా మగ మేకపిల్ల ఈ విధంగా సిద్ధపరచబడాలి.
NUM 15:12 ఇలా ప్రతి దానిలోకి, మీరు ఎన్ని సిద్ధం చేస్తారో, అన్నిటికి చేయాలి.
NUM 15:13 “ ‘స్వదేశీయులుగా ఉన్న ప్రతి ఒక్కరు యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి అర్పించినప్పుడు ఇలాగే చేయాలి. వారు ఇలాగే విధులను పాటించాలి.
NUM 15:14 వచ్చే తరాలకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. విదేశీయులు లేదా మీ మధ్య నివసించే ఎవరైనా సరే, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి అర్పించాలనుకుంటే, మీలాగే వారు కూడా చేయాలి.
NUM 15:15 సమాజంలో ఉండే మీరైనా, విదేశీయులైనా ఒకే చట్టం పాటించాలి; ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. యెహోవా దృష్టిలో మీరూ విదేశీయులు ఒక్కటే:
NUM 15:16 మీకూ, మీ మధ్య ఉన్న విదేశీయులకు అవే నియమాలు, అవే నిబంధనలు వర్తిస్తాయి.’ ”
NUM 15:17 యెహోవా మోషేతో అన్నారు,
NUM 15:18 “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశంలో ప్రవేశించినప్పుడు,
NUM 15:19 ఆ దేశం ఆహారాన్ని మీరు తినేటప్పుడు, ఒక భాగం యెహోవాకు అర్పణగా సమర్పించాలి.
NUM 15:20 మీరు రుబ్బిన పిండితో చేసిన మొదటి రొట్టెను నూర్పిడి కళ్ళపు అర్పణగా అర్పించాలి.
NUM 15:21 రాబోయే తరాలకు ఇలా మీ మొదటి పిండి ముద్ద నుండి యెహోవాకు అర్పణను అర్పించాలి.
NUM 15:22 “ ‘సమాజంగా మీరు అనుకోకుండ యెహోవా మోషేకు ఇచ్చిన ఈ ఆజ్ఞలలో దేనినైనా పాటించడంలో ఒకవేళ విఫలమైతే,
NUM 15:23 యెహోవా మోషే ద్వార మీకు ఇచ్చిన ఆజ్ఞలు, యెహోవా వాటిని ఇచ్చిన రోజు నుండి రాబోయే తరాల వరకు కొనసాగిస్తూ,
NUM 15:24 ఒకవేళ తెలియక పొరపాటున మీరితే, అప్పుడు సమాజమంతా యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా కోడెను, దానితో పాటు నిర్దేశించిన భోజనార్పణ, పానార్పణలతో, పాపపరిహారబలి కోసం మేకపోతుతో కలిపి అర్పించాలి.
NUM 15:25 యాజకుడు ఇశ్రాయేలు సమాజమంతటి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి అప్పుడు వారు క్షమించబడతారు ఎందుకంటే ఆ పాపం ఉద్దేశపూర్వకమైనది కాదు, పైగా వారు పొరపాటున చేసిన తప్పును బట్టి యెహోవాకు వారు హోమబలి పాపపరిహారబలిని అర్పించారు.
NUM 15:26 ప్రజలు అనుకోకుండ తప్పు చేశారు కాబట్టి ఇశ్రాయేలు సర్వసమాజం, వారితో నివసిస్తున్న విదేశీయులు క్షమించబడతారు.
NUM 15:27 “ ‘అయితే ఒక్క వ్యక్తి అనుకోకుండ చేసిన పాపాలకు, ఆ వ్యక్తి పాపపరిహారబలిగా ఏడాది ఆడ మేకను అర్పించాలి.
NUM 15:28 పొరపాటున పాపం చేసిన వారి కోసం యాజకుడు యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు, అది జరిగినప్పుడు ఆ వ్యక్తి క్షమించబడతాడు.
NUM 15:29 స్వదేశీయులైన ఇశ్రాయేలీయులైనా వారి మధ్యలో నివసించే విదేశీయులైనా పొరపాటున పాపం చేసినవారందరికి ఒకే చట్టం వర్తిస్తుంది.
NUM 15:30 “ ‘అయితే ఎవరైనా కావాలని పాపం చేస్తే, స్వదేశీయులైనా విదేశీయులైనా వారు యెహోవాను దూషించిన వారు కాబట్టి ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల నుండి వారిని తొలగించాలి.
NUM 15:31 వారు యెహోవా మాటను తృణీకరించి, ఆయన ఆజ్ఞలను అతిక్రమించారు, కాబట్టి వారు తప్పక తొలగించబడాలి; వారి అపరాధం వారి మీదే ఉంటుంది.’ ”
NUM 15:32 ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు, ఒక మనుష్యుడు సబ్బాతు దినాన్న కట్టెలు ఏరుకుంటున్నాడు.
NUM 15:33 అది చూసినవారు అతన్ని పట్టుకుని, మోషే అహరోనుల ఎదుట సమాజమందరి ఎదుట నిలబెట్టారు.
NUM 15:34 అతనికి ఏం చేయాలో స్పష్టత లేనందున అతన్ని కావలిలో ఉంచారు.
NUM 15:35 అప్పుడు యెహోవా మోషేతో, “ఆ మనుష్యుడు చావాలి. సమాజమంతా అతన్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టాలి.”
NUM 15:36 కాబట్టి యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు అతన్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు.
NUM 15:37 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
NUM 15:38 “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘రాబోయే తరాలన్నిటిలో మీరు మీ వస్త్రాల మూలల్లో నీలం రంగు దారంతో కుచ్చులు తయారుచేయాలి.
NUM 15:39 ఆ కుచ్చులను చూసినప్పుడు యెహోవా ఆజ్ఞలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు, వాటికి లోబడాలని మీ హృదయాభిలాషలు మీ నేత్రాశల వెంటపడుతూ వ్యభిచరించకూడదని జ్ఞాపకం చేసుకుంటారు.
NUM 15:40 అప్పుడు నా ఆజ్ఞలన్నిటికి లోబడాలని జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి మీరు ప్రతిష్ఠించుకుంటారు.
NUM 15:41 నేను మీ దేవుడైన యెహోవానై ఉన్నాను, మీకు దేవునిగా ఉండడానికి నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చాను. నేను మీ దేవుడైన యెహోవాను.’ ”
NUM 16:1 లేవీ మునిమనమడు, కహాతు మనుమడు, ఇస్హారు కుమారుడగు కోరహు, కొంతమంది రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములు, పేలెతు కుమారుడైన ఓనులు కొంతమందిని పోగు చేసి,
NUM 16:2 మోషేకు ఎదురు తిరిగారు. వారితో 250 మంది ఇశ్రాయేలు నాయకులు, సమాజ నాయకులుగా ఏర్పరచబడిన ప్రముఖులు చేరారు.
NUM 16:3 వారంతా మోషే, అహరోనులకు విరోధంగా పోగై, “మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు! సర్వసమాజంలో ప్రతిఒక్కరు పరిశుద్ధంగానే ఉన్నారు, యెహోవా వారితో ఉన్నారు. అలాంటప్పుడు యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు?” అని అడిగారు.
NUM 16:4 మోషే ఇది విని సాగిలపడ్డాడు.
NUM 16:5 తర్వాత కోరహుతో, అతని సహచరులందరితో ఇలా అన్నాడు: “రేపు ప్రొద్దున యెహోవా తన వారు ఎవరో పవిత్రులెవరో బయలుపరచి తన దగ్గరకు రానిస్తారు. తాను ఎన్నుకున్న మనిషిని ఆయన తన దగ్గరకు రానిస్తారు.
NUM 16:6 కోరహూ! నీవూ, నీ వెంట ఉన్న సమస్త సమూహం ఇలా చేయండి: ధూపార్తులు తీసుకోండి
NUM 16:7 రేపు యెహోవా ఎదుట వాటిలో నిప్పు తెచ్చి ధూపం వేయండి. యెహోవా ఎవరిని ఎన్నుకుంటారో అతడు పవిత్రుడు. లేవీయులారా! మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు!”
NUM 16:8 మోషే కోరహుతో మాట్లాడుతూ, “ఇప్పుడు వినండి లేవీయులారా!
NUM 16:9 ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని మిగిలిన ఇశ్రాయేలీయుల సమాజం నుండి వేరుచేసి, యెహోవా గుడారంలో పని చేయడానికి, సమాజం ముందు నిలబడి వారికి సేవ చేయడానికి మిమ్మల్ని దగ్గరకు తీసుకువచ్చినందుకు ఇది మీకు సరిపోదా?
NUM 16:10 నిన్ను, నీ తోటి లేవీయులను ఆయన చేర్చుకున్నారు, కానీ ఇప్పుడు యాజకత్వం కూడా కావాలని మీరు ప్రయత్నిస్తున్నారు.
NUM 16:11 యెహోవాకు విరోధంగా నీవు నీ పక్షంవారు గుమికూడారు. మీరు అహరోను మీద సణగడానికి అతనెవరు?”
NUM 16:12 అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను పిలిపించాడు. కానీ వారు, “మేము రాము!
NUM 16:13 మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే భూమి నుండి ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకువచ్చారు, అది చాలదా? ఇప్పుడు నీవు మాపై ప్రభువుగా కూడా ఉండాలనుకుంటున్నావు!
NUM 16:14 అంతేకాక, మీరు మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురాలేదు లేదా పొలాలు ద్రాక్షతోటల వారసత్వాన్ని మాకు ఇవ్వలేదు. మీరు ఈ మనుష్యులను బానిసలుగా చూడాలనుకుంటున్నారా? మేము రాము!” అని అన్నారు.
NUM 16:15 మోషేకు చాలా కోపం వచ్చి యెహోవాతో, “వారి అర్పణలు స్వీకరించకండి. వారి దగ్గర నుండి కనీసం ఒక గాడిదను కూడా నేను తీసుకోలేదు, వారిలో ఎవరి పట్ల ఏ తప్పు చేయలేదు” అని అన్నాడు.
NUM 16:16 మోషే కోరహుతో అన్నాడు, “రేపు నీవూ నీ అనుచరులు అనగా నీవు, వారు, అహరోను యెహోవా ఎదుట నిలబడాలి.
NUM 16:17 మీలో ప్రతి ఒక్కరు తమ ధూపార్తి చేతపట్టుకుని ధూపం వేయాలి. అన్నీ కలిపి 250 ధూపార్తులు యెహోవా ఎదుట దానిని సమర్పించాలి. నీవు అహరోను కూడా మీ ధూపార్తులు సమర్పించాలి.”
NUM 16:18 కాబట్టి ప్రతి ఒక్కరు తమ ధూపార్తిలో నిప్పువేసి దాని మీద ధూపం వేసి సమావేశ గుడార ద్వారం దగ్గర, మోషే అహరోనులతో నిలిచారు.
NUM 16:19 కోరహు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా తన పక్షం వారినందరిని సమావేశ గుడార ప్రవేశం దగ్గర పోగు చేశాడు. అప్పుడు యెహోవా మహిమ సమాజమంతటికి కనిపించింది.
NUM 16:20 యెహోవా మోషే అహరోనులతో అన్నారు,
NUM 16:21 “ఒక్కసారిగా నేను వారిని నాశనం చేయడానికి అనుకూలంగా ఉండేలా మీరు ఈ సమాజం నుండి వేరుగా నిలబడండి.”
NUM 16:22 కానీ మోషే అహరోనులు సాగిలపడి, “ఓ దేవా! సర్వ ప్రాణులకు ఊపిరి ఇచ్చే దేవా, ఒక్క మనిషి పాపం చేస్తే సమాజమంతటి మీద కోప్పడతారా?” అని వేడుకున్నారు.
NUM 16:23 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పారు.
NUM 16:24 “సమాజంతో చెప్పు, ‘కోరహు, దాతాను, అబీరాముల డేరాల నుండి దూరంగా వెళ్లండి.’ ”
NUM 16:25 మోషే లేచి దాతాను, అబీరాముల దగ్గరకు వెళ్లాడు. ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్లారు.
NUM 16:26 అతడు సమాజాన్ని హెచ్చరించాడు, “ఈ దుష్టుల డేరాల నుండి దూరంగా వెళ్లండి! వారికి చెందిన దేన్ని తాకకండి, లేదా వారి పాపాలన్నిటిని బట్టి మీరు తుడిచివేయబడతారు.”
NUM 16:27 కాబట్టి కోరహు, దాతాను, అబీరాములు డేరాల దగ్గర నుండి వారు కదిలి దూరంగా వెళ్లారు. దాతాను, అబీరాములు వారి భార్యాపిల్లలు చిన్న పిల్లలు తమ డేరాల ద్వారాలలో నిలబడి ఉన్నారు.
NUM 16:28 అప్పుడు మోషే అన్నాడు, “యెహోవా ఇవన్నీ చేయడానికి నన్ను పంపించారని, నా అంతట నేనే ఏమీ చేయలేదని ఇలా మీరు తెలుసుకుంటారు:
NUM 16:29 ఈ మనుష్యులు, సహజ మరణం పొందితే, మనుష్యులు అనుభవించు విధిని వీరు అనుభవిస్తే, అప్పుడు యెహోవా నన్ను పంపలేదు.
NUM 16:30 కానీ ఒకవేళ యెహోవా పూర్తిగా క్రొత్తదాన్ని తెస్తే, భూమి తన నోరు తెరిచి, వారికి సంబంధించిన ప్రతి దానితో పాటు వారిని మ్రింగివేసి, వారు సజీవంగా పాతాళంలోకి వెళ్తే, వీరు యెహోవాతో ధిక్కారంతో వ్యవహరించారని మీకు తెలుస్తుంది.”
NUM 16:31 మోషే ఈ మాటలు చెప్పి ముగించిన వెంటనే వారి పాదాల క్రింద నేల చీలిపోయింది,
NUM 16:32 భూమి నోరు తెరిచి, ఆ మనుష్యులను వారి ఇంటివారిని, కోరహు పక్షంగా ఉన్నవారందరిని, వారి ఆస్తితో సహా మ్రింగివేసింది.
NUM 16:33 వారంతా వారికి చెందిన సమస్తంతో పాటు ప్రాణంతోనే పాతాళంలోకి వెళ్లారు; భూమి వారిని కప్పేసింది. వారంతా సమాజంలో లేకుండా నాశనమయ్యారు.
NUM 16:34 వారి కేకలు విని చుట్టూరా ఉన్న ఇశ్రాయేలీయులు, “మనలను కూడా భూమి మ్రింగివేస్తుంది!” అని అంటూ అరుస్తూ పారిపోయారు.
NUM 16:35 యెహోవా దగ్గర నుండి మంటలు లేచి ధూపారాధన చేసే 250 మందిని కాల్చివేసింది.
NUM 16:36 యెహోవా మోషేతో అన్నారు,
NUM 16:37 “యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరుకు, బూడిదలో నుండి ఆ ధూపార్తులను తీసివేసి నిప్పు కణాలను దూరంగా చెదరగొట్టమని చెప్పు, ఎందుకంటే అవి పవిత్రమైన ధూపార్తులు.
NUM 16:38 పాపం చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వారి ధూపార్తులు. వాటిని చెడగొట్టి, రేకులుగా చేసి, వాటిని బలిపీఠం కప్పుగా వాడాలి, అవి యెహోవా ఎదుట సమర్పించబడినవి కాబట్టి పవిత్రమైనవి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తులుగా ఉండును గాక.”
NUM 16:39 కాబట్టి యాజకుడైన ఎలియాజరు కాల్చి చంపబడినవారు తీసుకువచ్చిన ఇత్తడి ధూపార్తులను సేకరించి, బలిపీఠం మీద కప్పి ఉండేలా వాటిని సుత్తెతో కొట్టించాడు,
NUM 16:40 యెహోవా మోషే ద్వారా అతనికి సూచించిన ప్రకారం చేశాడు. అలా ఎందుకు చేయించారంటే, అహరోను వంశస్థుడు తప్ప ఇతరులెవ్వరు యెహోవా ఎదుట ధూపం వేయడానికి రాకూడదని, వస్తే కోరహు అతని అనుచరుల్లా అవుతారని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేయడానికి.
NUM 16:41 మరుసటిరోజు ఇశ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద సణిగారు. “మీరు యెహోవా యొక్క ప్రజలను చంపేశారు” అని వారన్నారు.
NUM 16:42 మోషే అహరోనులకు వ్యతిరేకంగా సమాజం గుమికూడి, సమావేశ గుడారం వైపు చూశారు, అకస్మాత్తుగా మేఘం దానిని కప్పింది, యెహోవా మహిమ కనిపించింది.
NUM 16:43 అప్పుడు మోషే, అహరోనులు సమావేశ గుడారం ముందుకు వెళ్లారు.
NUM 16:44 యెహోవా మోషేతో,
NUM 16:45 “మీరు సమాజం మధ్య నుండి తొలగిపోండి, వెంటనే వారిని చంపేస్తాను” అన్నారు. అప్పుడు వారు సాష్టాంగపడ్డారు.
NUM 16:46 అప్పుడు మోషే అహరోనుతో, “నీ ధూపార్తిని తీసుకుని దానిలో ధూపం వేసి, బలిపీఠం నుండి మండుతున్న బొగ్గును తీసుకుని వారికి ప్రాయశ్చిత్తం చేయడానికి సమాజం దగ్గరకు త్వరగా వెళ్లు. యెహోవా నుండి కోపం రగులుతూ వస్తుంది; తెగులు ప్రారంభమైంది” అన్నాడు.
NUM 16:47 మోషే చెప్పినట్లే అహరోను చేశాడు. ధూపార్తులతో సమాజం మధ్యకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అప్పటికే ప్రజల్లో తెగులు మొదలయ్యింది కానీ అహరోను ధూపం వేసి వారి కోసం ప్రాయశ్చిత్తం చేశాడు.
NUM 16:48 మృతులకు, జీవులకు మధ్య అతడు నిలిచాడు, తెగులు ఆగిపోయింది.
NUM 16:49 అయితే, కోరహు తిరుగుబాటు వల్ల చనిపోయినవారు కాక తెగులు ద్వారా 14,700 మంది చనిపోయారు.
NUM 16:50 తర్వాత తెగులు ఆగిపోయినందుకు అహరోను, సమావేశ గుడార ద్వారం దగ్గర ఉన్న మోషే దగ్గరకు తిరిగి వచ్చాడు.
NUM 17:1 యెహోవా మోషేతో అన్నారు,
NUM 17:2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి పూర్వికుల గోత్రాల ఒక్కొక్క నాయకుడి నుండి ఒకటి చొప్పున కర్రలను తెప్పించు. ప్రతి వ్యక్తి పేరు అతని కర్రపై వ్రాయాలి.
NUM 17:3 లేవీ కర్రపై అహరోను పేరు వ్రాయాలి, ఎందుకంటే ప్రతి పూర్వికుల గోత్ర నాయకునికి ఒక కర్ర ఉండాలి.
NUM 17:4 సమావేశ గుడారంలో నేను మీతో కలిసే నిబంధన మందసం ఎదుట ఈ కర్రలను పెట్టు.
NUM 17:5 నేను ఎన్నుకున్న నాయకుడి కర్ర చిగురిస్తుంది, నీకు విరోధంగా ఇశ్రాయేలీయుల నుండి ఎప్పుడు వచ్చే సణుగుళ్లను ముగిస్తాను.”
NUM 17:6 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు, పూర్వికుల వంశాల క్రమం ప్రకారం ఒక్కొక్క నాయకుడు వారి వారి కర్రను, మొత్తం పన్నెండు కర్రలు ఇచ్చారు. వాటిలో అహరోను కర్ర ఉంది.
NUM 17:7 మోషే ఆ కర్రలను నిబంధన గుడారంలో యెహోవా ఎదుట ఉంచాడు.
NUM 17:8 మర్నాడు మోషే నిబంధన గుడారంలోకి వెళ్లి చూడగా, వాటిలో లేవీ వంశ ప్రతినిధి యైన అహరోను కర్ర చిగురించి మొగ్గలు తొడిగి, పూలు పూసి, బాదం పండ్లు వచ్చాయి.
NUM 17:9 మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నీ ఇశ్రాయేలీయులందరి దగ్గరకు తెచ్చాడు. వారు వాటిని చూశారు, ప్రతీ నాయకుడు తన కర్రలను తీసుకున్నారు.
NUM 17:10 యెహోవా మోషేతో, “అహరోను కర్రను తెచ్చి మళ్ళీ నిబంధన మందసం ఎదుట పెట్టు. తిరుగుబాటు చేసినవారికి అది ఒక గుర్తుగా ఉండాలి. నాకు విరోధంగా వారు చేసే సణుగుడుకు ఇది ముగింపు కలిగిస్తుంది, తద్వార వారు చావరు” అని చెప్పారు.
NUM 17:11 యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే చేశాడు.
NUM 17:12 ఇశ్రాయేలీయులు మోషేతో, “మేము చస్తాము! మేము నశించాము, మేమంతా నశించాము!
NUM 17:13 ఎవరైనా కనీసం యెహోవా యొక్క సమావేశ గుడారం దగ్గరకు వచ్చినా చస్తారు. మేమంతా చస్తామా?” అని అన్నారు.
NUM 18:1 యెహోవా అహరోనుతో, “పరిశుద్ధాలయానికి సంబంధించిన అపరాధాలకు నీవూ నీ కుమారులు నీ కుటుంబం బాధ్యులు, యాజక ధర్మానికి సంబంధించిన అపరాధాలకు నీవూ నీ కుమారులు బాధ్యులు.
NUM 18:2 మీతో చేరి నీవు, మీ కుమారులు నిబంధన గుడారం ముందు పరిచర్య చేస్తున్నప్పుడు మీకు సహాయపడడానికి మీ పూర్వికుల గోత్రానికి చెందిన మీ తోటి లేవీయులను తీసుకురండి.
NUM 18:3 వారు నీకు బాధ్యత వహించాలి, గుడారం యొక్క అన్ని విధులను నిర్వర్తించాలి, అయితే వారు పరిశుద్ధాలయం యొక్క సామాగ్రి దగ్గరకు గాని బలిపీఠం దగ్గరకు గాని వెళ్లకూడదు. లేదంటే వారు మీరు చస్తారు.
NUM 18:4 వారు మీతో కలిసి సమావేశ గుడారంలోని అన్ని పనులు జరిగేలా బాధ్యత వహించాలి; మీకు సహాయం చేయడానికి ఇతరులెవ్వరు రాకూడదు.
NUM 18:5 “పరిశుద్ధాలయం, బలిపీఠం పట్ల శ్రద్ధ వహించే విషయంలో మీరు బాధ్యత వహించాలి. తద్వారా ఇశ్రాయేలీయుల మీదికి యెహోవా కోపం రాదు.
NUM 18:6 నేను నేనే ఇశ్రాయేలీయుల నుండి మీ తోటి లేవీయులను మీకు బహుమానంగా, సమావేశ గుడారంలో సేవ చేయడానికి యెహోవాకు ప్రతిష్ఠించాను.
NUM 18:7 అయితే నీవు, నీ కుమారులు మాత్రమే బలిపీఠం దగ్గర, తెర వెనుక ఉన్న ప్రతిదానికీ సంబంధించి యాజకులుగా పని చేయవచ్చు. యాజక ధర్మాన్ని మీకు ప్రత్యేకమైన వరంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే, వారికి మరణశిక్ష విధించబడుతుంది.”
NUM 18:8 అప్పుడు యెహోవా అహరోనుతో ఇలా అన్నాడు: “నాకు అర్పించిన అర్పణలకు నేనే నీకు బాధ్యత అప్పగించాను; ఇశ్రాయేలీయులు నాకు ఇచ్చే పరిశుద్ధ అర్పణలన్నీ నేను నీకు, నీ కుమారులకు మీ భాగంగా, మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను.
NUM 18:9 బలిపీఠం మీది నిప్పులో కాల్చివేయబడని అతి పవిత్ర అర్పణలలో కొంత భాగం మీరు తీసుకోవాలి. నాకు వారు తెచ్చే అతి పవిత్రమైన భోజనార్పణలు పాపపరిహారబలులు అపరాధబలులు నీకు, నీ కుమారులకు చెందినవి.
NUM 18:10 అవి అతి పవిత్రంగా ఎంచి తినాలి. ప్రతి మగవాడు అది తినాలి. వాటిని పవిత్రమైనవిగా పరిగణించాలి.
NUM 18:11 “ఇది కూడా మీదే: ఇశ్రాయేలీయులు అర్పించే అర్పణలన్నిటిలో నుండి ప్రక్కన పెట్టబడినది. నేను నీకు, నీ కుమారులు కుమార్తెలకు మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను. మీ ఇంట్లో ఆచార ప్రకారంగా శుభ్రంగా ఉన్న ప్రతి ఒక్కరూ దానిని తినవచ్చు.
NUM 18:12 “యెహోవాకు ఇశ్రాయేలీయులు వారి కోతలో నుండి ప్రథమ ఫలంగా అర్పించే ధాన్యము, ద్రాక్షరసము, నూనె అంతటిని మీకు ఇస్తున్నాను.
NUM 18:13 దేశం పంటలన్నిటిలో యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాలు మీకు చెందుతాయి. నీ కుటుంబంలో ఆచార ప్రకారం పవిత్రులందరు వాటిని తినవచ్చు.
NUM 18:14 “ఇశ్రాయేలీయులు యెహోవా కోసం ప్రతిష్ఠించిన ప్రతిదీ నీకు చెందుతుంది.
NUM 18:15 ప్రతి గర్భం నుండి వచ్చిన యెహోవాకు అర్పించబడ్డ జ్యేష్ఠ సంతానం, మనుష్యులైన, జంతువులైన, మీకు చెందుతాయి. కానీ మీరు ప్రతి పెద్ద కుమారున్ని, అపవిత్ర జంతువుల తొలిచూలును విడిపించాలి.
NUM 18:16 ఒక నెల వయస్సున్నప్పుడు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం అయిదు షెకెళ్ళ వెండితో విడిపించాలి, అంటే ఇరవై గెరాలు.
NUM 18:17 “ఆవులలో, గొర్రెలలో, మేకలలో తొలిచూలును విడిపించకూడదు. అవి పవిత్రమైనవి. వాటి రక్తం బలిపీఠం చుట్టూ ప్రోక్షించి యెహోవాకు సువాసనగా ఉండే హోమంగా వాటి క్రొవ్వును కాల్చివేయాలి.
NUM 18:18 ప్రత్యేక అర్పణలోని బోర, కుడి తొడ ఎలాగో, వాటి మాంసం కూడా మీకు చెందుతుంది.
NUM 18:19 ఇశ్రాయేలీయులు యెహోవాకు తెచ్చే పవిత్రార్పణలను ప్రక్కకు పెట్టినవి నీకు, నీ కుమారులకు, కుమార్తెలకు శాశ్వత వాటాగా ఇస్తున్నాను. ఇది యెహోవా ఎదుట నీతో పాటు నీ సంతానానికి నిత్య ఉప్పు ఒడంబడికగా ఉంటుంది.”
NUM 18:20 యెహోవా అహరోనుతో ఇలా చెప్పారు, “వారి దేశంలో నీకు స్వాస్థ్యం కానీ వాటా కానీ ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్య నేనే నీ వాటాను నేనే నీ స్వాస్థ్యాన్ని.
NUM 18:21 “సమావేశ గుడారం దగ్గర సేవ చేస్తున్న లేవీయులకు పారితోషికంగా ఇశ్రాయేలీయులు ఇచ్చే దశమ భాగాలను స్వాస్థ్యంగా ఇస్తున్నాను.
NUM 18:22 ఇప్పటినుండి యాజకులు, లేవీయులు తప్ప ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం దగ్గరకు రాకూడదు లేదా వారి పాపానికి ప్రతిఫలం భరించి చస్తారు.
NUM 18:23 లేవీయులు మాత్రమే సమావేశ గుడారంలో సేవ చేస్తారు వారు చేసే అపరాధాలకు వారే బాధ్యులు. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. ఇశ్రాయేలీయుల మధ్య వారికి వారసత్వం ఉండదు.
NUM 18:24 దానికి బదులు, ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణగా ప్రతిష్ఠించే దశమ భాగాలను నేను లేవీ వంశస్థులకు వారసత్వంగా ఇస్తున్నాను. అందుకే, వారిని ఉద్దేశించి ఇలా చెప్పాను: ‘ఇశ్రాయేలీయుల మధ్య వారికి వారసత్వం ఉండదు.’ ”
NUM 18:25 యెహోవా మోషేతో ఇలా అన్నారు:
NUM 18:26 “లేవీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు ఇశ్రాయేలీయుల నుండి వారసత్వంగా దశమభాగం తీసుకున్నప్పుడు, ఆ దశమభాగంలో పదవ వంతు మీరు యెహోవాకు అర్పణగా సమర్పించాలి.
NUM 18:27 అలా ప్రత్యేకించిన అర్పణలు నూర్పిడి కళ్ళంలోని ధాన్యంలా, గానుగ నుండి వచ్చిన ద్రాక్షరసంలా లెక్కకు వస్తాయి.
NUM 18:28 ఇశ్రాయేలీయుల నుండి పుచ్చుకొనే దశమ భాగాలన్నిటి నుండి యెహోవాకు మీరు కూడా అర్పణలు ఇస్తారు. ఈ దశమ భాగాల నుండి యెహోవా భాగమును యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి.
NUM 18:29 మీకు ఇవ్వబడిన ప్రతి దానిలో ఉత్తమమైన పవిత్రమైన భాగాన్ని మీరు యెహోవా యొక్క భాగంగా సమర్పించాలి.’
NUM 18:30 “లేవీయులకు చెప్పు: ‘శ్రేష్ఠమైనవి అర్పించినప్పుడు, అవి మీ నూర్పిడి కళ్ళంలా, ద్రాక్ష గానుగలా లెక్కకు వస్తాయి.
NUM 18:31 మిగితా వాటిని మీరు, మీ ఇంటివారు ఎక్కడైనా తినవచ్చు అది సమావేశ గుడారంలో మీరు చేస్తున్న సేవకు మీ జీతము.
NUM 18:32 మీరు దానిలో ఉత్తమమైన వాటిని అర్పించినప్పుడు మీరు దాని గురించి ఎటువంటి పాపశిక్షను భరించరు; అయితే ఇశ్రాయేలీయుల పరిశుద్ధ అర్పణలను అపవిత్రపరచవద్దు. అప్పుడు మీరు చావరు.’ ”
NUM 19:1 యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు:
NUM 19:2 యెహోవా ఆజ్ఞాపించిన నియమానికి ఇది అవసరం: ఇశ్రాయేలీయులు లోపం లేని లేదా మచ్చలేని కాడి మోయని ఎర్రని పెయ్యను మీ దగ్గరకు తేవాలని చెప్పండి.
NUM 19:3 దానిని యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి; అతని ఎదుట శిబిరం బయట దానిని వధించాలి.
NUM 19:4 అప్పుడు యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంత వ్రేలితో తీసుకుని సమావేశ గుడారం ముందు భాగం వైపు ఆ రక్తాన్ని ఏడుసార్లు చిలకరించాలి.
NUM 19:5 అతడు చూస్తుండగా ఆ పెయ్య కాల్చివేయబడాలి. దాని చర్మం, మాంసం, రక్తం, పేడ అంతా కాల్చివేయబడాలి.
NUM 19:6 అప్పుడు యాజకుడు కొంత దేవదారు కర్రను, హిస్సోపు చెట్టురెమ్మను ఎర్ర దారాన్ని తీసుకుని పెయ్యను కాల్చి నిప్పులో వెయ్యాలి.
NUM 19:7 తర్వాత యాజకుడు తన బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి. తర్వాత అతడు శిబిరంలో ప్రవేశించవచ్చు గాని సాయంత్రం వరకు ఆచారరీత్య అపవిత్రుడే.
NUM 19:8 ఆ పెయ్యను దహించు వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు అతడు అపవిత్రుడే.
NUM 19:9 పవిత్రుడైనవాడు ఆవు పెయ్య బూడిదను పోగు చేసి శిబిరం బయట ఆచార ప్రకారం శుభ్రమైన చోట ఉంచాలి. అది శుద్ధి జలంలో వాడబడడానికి ఇశ్రాయేలు సమాజం ద్వారా పెట్టబడాలి; అది పాపపరిహారబలి.
NUM 19:10 పెయ్య బూడిదను పోగుచేసిన వ్యక్తి కూడా తన బట్టలు ఉతుక్కోవాలి, అతడు సాయంత్రం వరకు అపవిత్రునిగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయులకు, వారి మధ్య నివసిస్తున్న విదేశీయులకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
NUM 19:11 “మానవ శవాన్ని ఎవరైనా తాకితే వారు ఏడు రోజులు అపవిత్రులై ఉంటారు.
NUM 19:12 వారు మూడవ రోజు, ఏడవ రోజు తమను తాము శుద్ధి చేసుకోవాలి; అప్పుడు వారు శుద్ధులవుతారు. అయితే వారు మూడవ రోజు, ఏడవ రోజు శుద్ధి చేసుకోకపోతే అపవిత్రంగానే ఉంటారు.
NUM 19:13 ఒక మనుష్యుని మృతదేహాన్ని తాకిన తర్వాత తమను తాము శుద్ధి చేసుకోకపోతే, యెహోవా సమావేశ గుడారాన్ని అపవిత్రం చేసినవారవుతారు. అలాంటి వారిని ఇశ్రాయేలు నుండి బహిష్కరించాలి. ఎందుకంటే, శుద్ధి జలం వారి మీద చిలకరింపబడలేదు, వారు అపవిత్రులుగా ఉన్నారు. వారి అపవిత్రత వారి మీద ఉంటుంది.
NUM 19:14 “ఇదీ గుడారంలో మనుష్యులెవరైనా చనిపోతే దానికి సంబంధించిన నియమం: ఎవరైనా డేరాలో ప్రవేశిస్తే, దానిలో ఉంటే, వారు ఏడు రోజులపాటు అపవిత్రులుగా ఉంటారు.
NUM 19:15 మూత పెట్టి ఉంచని ప్రతి పాత్ర అపవిత్రమే.
NUM 19:16 “ఎవరైనా బయట ఉన్నప్పుడు ఖడ్గం చేత చంపబడిన వారిని లేదా సహజ మరణం పొందినవారిని, లేదా మానవుల ఎముకలు కానీ, సమాధి కానీ ముట్టుకుంటే, వారు ఏడు రోజులు అపవిత్రులుగా ఉంటారు.
NUM 19:17 “ఎందుకంటే అపవిత్రమైన వ్యక్తి కోసం, కాల్చబడిన పాపపరిహారబలి యొక్క బూడిద కొంత పాత్రలో వేసి, వాటి మీద పారే తాజా నీరు పొయ్యాలి.
NUM 19:18 అప్పుడు ఆచార ప్రకారం పవిత్రంగా ఉన్న వ్యక్తి కొంత హిస్సోపు తీసుకుని, నీటిలో ముంచి గుడారం అన్ని అలంకరణలు అక్కడ ఉన్న ప్రజలను చిలకరించాలి. అతడు మానవ ఎముక లేదా సమాధిని తాకిన వారి మీద లేదా చంపబడిన ఎవరైనా లేదా సహజ మరణం పొందినవారి మీద కూడా చిలకరించాలి.
NUM 19:19 పవిత్రుడైన పురుషుడు అపవిత్రుల మీద మూడవ రోజు, ఏడవ రోజు చిలకరించాలి, ఏడవ రోజు వారిని పవిత్రపరచాలి. పవిత్రపరచబడే వారు వారి బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి, ఆ సాయంత్రం వారు శుద్ధులవుతారు.
NUM 19:20 కానీ అపవిత్రులైనవారు తమను తాము శుద్ధి చేసుకోకపోతే, వారు సమాజం నుండి బహిష్కరించబడాలి, వారు యెహోవా పరిశుద్ధాలయాన్ని అపవిత్ర పరిచిన వారు. శుద్ధి జలం వారి మీద చిలకరింపబడలేదు కాబట్టి వారు అపవిత్రులు.
NUM 19:21 ఇది వారికి నిత్య కట్టుబాటుగా ఉంటుంది. “శుద్ధి జలం చిలకరించు పురుషుడు కూడా తన బట్టలు ఉతుక్కోవాలి. ఎవరైనా శుద్ధి జలం తాకితే సాయంత్రం వరకు వారు అపవిత్రులు.
NUM 19:22 అపవిత్రమైనవారు ఏది ముట్టిన అది అపవిత్రమే, ఎవరైనా దానిని ముట్టుకుంటే సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.”
NUM 20:1 సంవత్సరం మొదటి నెలలో ఇశ్రాయేలు సమాజమంతా సీను ఎడారికి చేరి కాదేషులో దిగారు. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడింది.
NUM 20:2 అయితే సమాజానికి నీళ్లు లేవు కాబట్టి ప్రజలు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా గుమికూడారు.
NUM 20:3 వారు మోషేతో గొడవపడుతూ, “మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము కూడా చనిపోయి ఉంటే బాగుండేది!
NUM 20:4 యెహోవా సమాజాన్ని ఈ అరణ్యంలోనికి ఎందుకు తెచ్చావు? మేము, మా పశువులు చావాలనా?
NUM 20:5 మీరు మమ్మల్ని ఈజిప్టు నుండి ఈ భయంకరమైన చోటికి ఎందుకు తీసుకువచ్చారు? దీనిలో ధాన్యాలు లేదా అంజూరాలు, ద్రాక్షలు లేదా దానిమ్మలు లేవు. త్రాగడానికి నీరు దొరకలేదు!”
NUM 20:6 మోషే అహరోనులు సమాజం నుండి సమావేశ గుడారం దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశం వారికి కనిపించింది.
NUM 20:7 యెహోవా మోషేతో,
NUM 20:8 “చేతికర్రను పట్టుకుని, నీవు నీ అన్న అహరోను కలిసి సమాజాన్ని సమకూర్చి, వారు చూస్తుండగా ఆ బండను ఆజ్ఞాపించు, ఆ బండ నుండి నీళ్లు వస్తాయి. వారు వారి పశువులు త్రాగడానికి సమాజం కోసం నీవు ఆ బండ నుండి నీళ్లను రప్పిస్తావు.”
NUM 20:9 కాబట్టి మోషే ఆయన ఆజ్ఞ ప్రకారం యెహోవా సన్నిధి నుండి తన చేతికర్రను తీసుకున్నాడు.
NUM 20:10 అతడు, అహరోను సమాజాన్ని బండ ఎదుట సమకూర్చారు మోషే, “ద్రోహులారా! వినండి. ఈ బండలో నుండి మీ కోసం నీళ్లు రప్పించాలా?”
NUM 20:11 అప్పుడు మోషే చేయి ఎత్తి రెండు సార్లు కర్రతో బండను కొట్టాడు. వెంటనే నీళ్లు ఉబుకుతూ వచ్చాయి, సమాజ ప్రజలు, వారి పశువులతో సహా త్రాగారు.
NUM 20:12 అయితే యెహోవా మోషే అహరోనులతో, “మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నా పరిశుద్ధతను ఘనపరచడానికి నన్ను నమ్మలేదు కాబట్టి మీరు ఈ సమాజాన్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్లరు” అని అన్నారు.
NUM 20:13 ఇవి మెరీబా జలాలు. ఇక్కడ ఇశ్రాయేలీయులు యెహోవాతో గొడవపడ్డారు, యెహోవా తన పరిశుద్ధతను నిరూపించుకున్నారు.
NUM 20:14 మోషే కాదేషు నుండి ఎదోము రాజు దగ్గరకు ఈ వర్తమానంతో దూతలను పంపాడు: “నీ సహోదరుడైన ఇశ్రాయేలు ఇలా చెప్తున్నాడు: మా మీదికి వచ్చిన కష్టాలన్నిటి గురించి నీకు తెలుసు.
NUM 20:15 మా పూర్వికులు ఈజిప్టుకు వెళ్లారు. చాలా కాలం మేమక్కడ ఉన్నాము. ఈజిప్టువారు మా పట్ల, మా పూర్వికుల పట్ల దారుణంగా ప్రవర్తించారు,
NUM 20:16 అయితే మేము యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన మా మొర ఆలకించాడు దేవదూతను పంపి, ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చాడు. “ఇప్పుడు మేము కాదేషులో ఉన్నాము, ఈ పట్టణం మీ సరిహద్దుల చివర ఉంది.
NUM 20:17 దయచేసి మమ్మల్ని మీ దేశం మార్గం ద్వారా వెళ్లనివ్వండి. మేము మీ పొలాలు, ద్రాక్షతోటల్లో నుండి వెళ్లము, మీ బావులలోని నీళ్లు త్రాగము. రాజమార్గంలోనే సాగిపోతాము. ఈ దేశం పొలిమేర దాటే వరకు కుడికి గాని, ఎడమకు గాని తిరగకుండా వెళ్తాము.”
NUM 20:18 కానీ ఎదోము రాజు ఇలా ఆజ్ఞాపించారు: “మీరు ఇక్కడినుండి వెళ్లకూడదు. వెళ్లడానికి ప్రయత్నిస్తే ఖడ్గంతో మీపై దాడి చేస్తాము.”
NUM 20:19 ఇశ్రాయేలు ప్రజలు తిరిగి కబురు పంపారు: “మేము రాజమార్గంలోనే సాగిపోతాము. మేము మా పశువులు నీళ్లు త్రాగితే దానికి వెల చెల్లిస్తాము. మేము కేవలం కాలినడకతో దాటి వెళ్తాం అంతే ఇంకేమి లేదు.”
NUM 20:20 వారు తిరిగి జవాబిచ్చారు: “మీరు దాటి వెళ్లకూడదు.” ఎదోము వారు వారిని ఎదుర్కోడానికి, శక్తిగల పెద్దబలగంతో వచ్చారు.
NUM 20:21 ఎదోము వారు ఇశ్రాయేలీయులను తమ సరిహద్దులు దాటనివ్వలేదు కాబట్టి ఇశ్రాయేలీయులు అక్కడినుండి తిరిగిపోయారు.
NUM 20:22 ఇశ్రాయేలు సమాజమంత కాదేషు నుండి ప్రయాణమై హోరు పర్వతానికి చేరారు.
NUM 20:23 ఎదోము సరిహద్దు దగ్గర ఉన్న హోరు పర్వతం దగ్గర, యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు,
NUM 20:24 “అహరోను తన పూర్వికుల దగ్గర చేర్చబడతాడు. మీరిద్దరు మెరీబా నీళ్ల దగ్గర నా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి అతడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించడు.
NUM 20:25 నీవు అహరోనును, అతని కుమారుడైన ఎలియాజరును హోరు పర్వతం పైకి తీసుకెళ్లు.
NUM 20:26 అహరోను వస్త్రాలు తీసి, అతని కుమారుడైనా ఎలియాజరుకు తొడిగించు. అక్కడే అహరోను చనిపోయి తన పూర్వికుల దగ్గర చేర్చబడతాడు.”
NUM 20:27 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉండగా వారు హోరు పర్వతం ఎక్కారు.
NUM 20:28 మోషే అహరోను వస్త్రాలు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను ఆ పర్వత శిఖరం మీదనే చనిపోయాడు. మోషే ఎలియాజరు పర్వతం దిగి వచ్చారు,
NUM 20:29 సమాజమంతా అహరోను చనిపోయాడని ఎప్పుడైతే తెలుసుకుందో, ఇశ్రాయేలీయులంతా ముప్పై రోజులు అహరోను కోసం సంతాపం పాటించారు.
NUM 21:1 ఇశ్రాయేలీయులు అతారీముకు వెళ్లే మార్గాన వస్తున్నారని దక్షిణ ప్రాంతంలో ఉన్న అరాదులో ఉన్న కనానీయ రాజు విని, ఇశ్రాయేలీయులపై దాడి చేసి, కొంతమందిని చెరగా తీసుకెళ్లాడు.
NUM 21:2 అప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు ఈ మ్రొక్కుబడి చేసుకున్నారు: “మీరు ఈ ప్రజలను మా చేతులకు అప్పగిస్తే, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేస్తాము.”
NUM 21:3 యెహోవా ఇశ్రాయేలు మనవి విని కనానీయులను వారికి అప్పగించారు. వారు వారిని, వారి పట్టణాలను సర్వనాశనం చేశారు; కాబట్టి ఆ స్థలానికి హోర్మా అనే పేరు వచ్చింది.
NUM 21:4 ఎదోము చుట్టూ తిరిగి రావాలని వారు హోరు పర్వతం నుండి ఎర్ర సముద్రం మార్గాన ప్రయాణం చేశారు. అయితే ప్రజలు ఈ ప్రయాణంలో ఓపిక కోల్పోయారు;
NUM 21:5 దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడుతూ, “ఈ అరణ్యంలో మేము చావాలని ఈజిప్టు నుండి మమ్మల్ని ఎందుకు తెచ్చారు? ఇక్కడ తినడానికి తిండి లేదు! త్రాగడానికి నీళ్లు లేవు! ఈ పిచ్చి ఆహారమంటే మాకు అసహ్యం!” అని అన్నారు.
NUM 21:6 అప్పుడు యెహోవా వారి మధ్యకు విషసర్పాలను పంపారు; అవి ప్రజలను కాటు వేశాయి, చాలామంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.
NUM 21:7 ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాము. యెహోవా మా మధ్య నుండి సర్పాలను తీసివేసేలా ప్రార్థన చేయండి” అన్నారు. కాబట్టి మోషే ప్రజల కోసం ప్రార్థన చేశాడు.
NUM 21:8 యెహోవా మోషేతో, “ఒక సర్పం చేసి స్తంభం మీద పెట్టు; పాము కాటేసినప్పుడు ఎవరైనా దానిని చూస్తే, వారు బ్రతుకుతారు” అని చెప్పారు.
NUM 21:9 కాబట్టి మోషే ఇత్తడి సర్పాన్ని చేసి, దాన్ని ఒక స్తంభం మీద పెట్టాడు. అప్పుడు ఎవరైనా పాము కాటేసినప్పుడు, ఇత్తడి సర్పాన్ని చూస్తే, వారు చావలేదు.
NUM 21:10 ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి, ఓబోతులో దిగారు.
NUM 21:11 తర్వాత ఓబోతు నుండి ప్రయాణం చేసి, ఈయ్యె-అబారీములో దిగారు. అది మోయాబుకు ఎదురుగా, సూర్యోదయ దిక్కున ఉన్న అరణ్యము.
NUM 21:12 అక్కడినుండి ప్రయాణం చేసి జెరెదు లోయలో దిగారు.
NUM 21:13 వారు అక్కడినుండి బయలుదేరి, అమోరీయుల భూభాగంలో విస్తరించి ఉన్న అరణ్యంలో ఉన్న అర్నోను ప్రక్కన విడిది చేశారు. అర్నోను మోయాబు అమోరీయుల మధ్య మోయాబు సరిహద్దు.
NUM 21:14 అందుకే యెహోవా యుద్ధాల గ్రంథంలో: “సుఫాలోని వాహేబు, అర్నోను లోయలు ఆరు పట్టణం వరకు ఉన్న పల్లపు లోయలు మోయాబు సరిహద్దులో ఉన్నాయి” అని వ్రాయబడి ఉంది.
NUM 21:16 అక్కడినుండి వారు బెయేర్‌కు వెళ్లారు, ఈ బావి గురించి యెహోవా మోషేతో, “ప్రజలను సమకూర్చు, నేను వారికి నీళ్లిస్తాను” అని అన్నారు.
NUM 21:17 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పాట పాడారు: “ఓ బావి ఉప్పొంగు! దాని గురించి పాడండి.
NUM 21:18 రాకుమారులు ఆ బావిని త్రవ్వించారు, ప్రజల సంస్థానాధిపతులు తమ రాజదండాలతో కర్రలతో త్రవ్వారు.” తర్వాత వారు అరణ్యం నుండి మత్తానకు వెళ్లారు,
NUM 21:19 మత్తాన నుండి నహలీయేలుకు, నహలీయేలు నుండి బామోతుకు,
NUM 21:20 బామోతు నుండి మోయాబు లోయకు వెళ్లారు. అక్కడే పిస్గా పర్వతం ఉంది.
NUM 21:21 ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను దగ్గరకు దూతలను పంపారు:
NUM 21:22 “మీ దేశం మీదుగా మమ్మల్ని వెళ్లనివ్వండి. మీ పొలాల వైపు, ద్రాక్షతోటల పొలాల వైపు తిరగము, మీ బావులలోని నీళ్లు త్రాగము. మీ దేశం పొలిమేర దాటే వరకు రాజమార్గంలోనే వెళ్తాము.”
NUM 21:23 అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన దేశం గుండా వెళ్లడానికి అనుమతించలేదు. అతడు తన సైన్యమంతటిని పోగు చేసి, ఇశ్రాయేలుపై దాడి చేయడానికి అరణ్యంలోకి వెళ్లాడు. అతడు యాహాజుకు చేరినప్పుడు, ఇశ్రాయేలుతో పోరాడాడు.
NUM 21:24 అయితే ఇశ్రాయేలు అతన్ని ఖడ్గంతో చంపి అతని దేశాన్ని అర్నోను నది నుండి యబ్బోకు వరకు ఆక్రమించారు, కానీ అమ్మోనీయుల సరిహద్దు వరకు మాత్రమే ఎందుకంటే వారి సరిహద్దు పటిష్టమైనది.
NUM 21:25 ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణాలన్నిటిని, హెష్బోను దాని చుట్టూరా ఉన్న గ్రామాలతో సహా స్వాధీనం చేసుకుని ఆక్రమించారు.
NUM 21:26 హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము. సీహోను అంతకుముందు మోయాబు రాజుతో యుద్ధం చేసి, అర్నోను నది వరకు ఉన్న ప్రదేశమంతా వశం చేసుకున్నాడు.
NUM 21:27 అందుకే సామెతలు చెప్పేవారు ఇలా అంటారు: హెష్బోనుకు రండి అది తిరిగి కట్టబడనివ్వండి; సీహోను పట్టణం పూర్వస్థితికి వచ్చును గాక.
NUM 21:28 హెష్బోను నుండి అగ్ని బయలుదేరింది, సీహోను పట్టణం నుండి మంటలు వచ్చాయి. అది మోయాబులోని ఆరు పట్టణాన్ని కాల్చివేసింది. అర్నోను యొక్క ఎత్తైన స్థలాల యజమానులను దహించివేసింది.
NUM 21:29 మోయాబూ, నీకు శ్రమ! కెమోషు ప్రజలారా! మీరు నాశనమయ్యారు. అతడు తన కుమారులను పారిపోయేవారిగా, అతని కుమార్తెలను అమోరీయుల రాజైన సీహోను దగ్గర చెరగా అప్పగించాడు.
NUM 21:30 “అయితే మేము వారిని కూల్చివేసాము; హెష్బోను అధికారం దీబోను వరకు నాశనమైంది. నోఫహు వరకు వారిని పడగొట్టాము, మెదెబా వరకు అది వ్యాపించింది.”
NUM 21:31 కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల స్థలంలో స్థిరపడ్డారు.
NUM 21:32 యాజెరు ప్రాంతాన్ని చూసి రమ్మని మోషే వేగులవారిని పంపిన తర్వాత, ఇశ్రాయేలీయులు ఆ పట్టణాన్ని, దాని చుట్టూరా ఉన్న గ్రామాలను స్వాధీనపరచుకుని అక్కడ ఉన్న అమోరీయులను తరిమేశారు.
NUM 21:33 తర్వాత వారు తిరిగి బాషానుకు వెళ్లే మార్గంలో వెళ్లాము, అప్పుడు బాషాను రాజైన ఓగు తన సైన్యమంతటితో ఎద్రెయీ దగ్గర యుద్ధంలో వారిని ఎదుర్కోడానికి బయలుదేరాడు.
NUM 21:34 యెహోవా మోషేతో, “అతనికి భయపడకండి, ఎందుకంటే అతన్ని, అతని సైన్యమంతటిని, అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు అతనికి చేయండి” అని ఆజ్ఞాపించారు.
NUM 21:35 కాబట్టి వారు ఓగును, అతని కుమారులను, అతని సైన్యమంతటిని, ఏ ఒక్కరు మిగలకుండా హతం చేశారు. అతని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
NUM 22:1 తర్వాత ఇశ్రాయేలీయులు మోయాబు సమతల మైదానాల వైపు ప్రయాణం చేసి యొర్దాను నది తూర్పుగా, యెరికో వైపు దిగారు.
NUM 22:2 ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతా సిప్పోరు కుమారుడైన బాలాకు చూశాడు,
NUM 22:3 చాలామంది ఉన్నందున మోయాబు భయపడింది. నిజానికి, ఇశ్రాయేలీయుల వల్ల మోయాబు భయంతో నిండిపోయింది.
NUM 22:4 మోయాబీయులు మిద్యాను పెద్దలతో, “ఈ దండు, ఒక ఎద్దు పొలం లోని గడ్డిని లాక్కున్నట్లు, మన చుట్టూ ఉన్న సమస్తాన్ని లాక్కుంటుంది” అని అన్నారు. కాబట్టి ఆ సమయంలో మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు,
NUM 22:5 యూఫ్రటీసు నదికి సమీపంలో ఉన్న పెతోరు దగ్గర ఉన్న బెయోరు కుమారుడైన బిలామును తన స్వదేశంలో పిలువడానికి దూతలను పంపాడు. బాలాకు అన్నాడు: “ఈజిప్టు నుండి ప్రజలు వచ్చారు; వారు భూ ముఖాన్ని కప్పి, నా ప్రక్కన స్థిరపడ్డారు.
NUM 22:6 నీవు వచ్చి వీరిని శపించాలి, ఎందుకంటే వారు నా శక్తికి మించి ఉన్నారు. బహుశా అప్పుడు నేను వీరిని ఓడించి ఈ స్థలం నుండి తరిమివేయగలుగుతాను. నీవు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారని, నీవు ఎవరిని శపిస్తే వారు శపించబడతారని నాకు తెలుసు.”
NUM 22:7 మోయాబు మిద్యాను పెద్దలు, భవిష్యవాణికి రుసుము తీసుకెళ్లారు. వారు బిలాము దగ్గరకు వచ్చి, బాలాకు చెప్పింది అతనికి చెప్పారు.
NUM 22:8 బిలాము వారితో, “ఈ రాత్రికి ఇక్కడ ఉండండి, యెహోవా నాకు చెప్పేది నేను మీకు తెలియజేస్తాను” అని అన్నాడు. కాబట్టి మోయాబు అధికారులు ఆ రాత్రి అతనితో ఉన్నారు.
NUM 22:9 ఆ రాత్రి దేవుడు వచ్చి బిలామును, “నీతో ఉన్న వీళ్ళు ఎవరు?” అని ప్రశ్నించారు.
NUM 22:10 బిలాము దేవునితో, “సిప్పోరు కుమారుడు, మోయాబు రాజైన బాలాకు, నాకు ఈ సందేశం పంపాడు:
NUM 22:11 ‘ఈజిప్టు నుండి వచ్చిన ఒక ప్రజల గుంపు భూమినంతా కప్పుతుంది. నా కోసం వారిని శపించు. బహుశ అప్పుడు నేను వారితో యుద్ధం చేసి తరిమివేస్తాను.’ ”
NUM 22:12 అయితే దేవుడు బిలాముతో, “నీవు వారితో వెళ్లొద్దు. వారు దీవించబడినవారు కాబట్టి నీవు వారిని శపించకూడదు” అని అన్నారు.
NUM 22:13 మర్నాడు ఉదయం బిలాము బాలాకు అధికారులతో, “మీ సొంత దేశానికి వెళ్లిపొండి, నేను మీతో వెళ్లడానికి యెహోవా నిరాకరించారు” అని చెప్పాడు.
NUM 22:14 కాబట్టి మోయాబు అధికారులు బాలాకు దగ్గరకు తిరిగివెళ్లి, “బిలాము మాతో రావడానికి ఒప్పుకోలేదు” అని చెప్పారు.
NUM 22:15 అప్పుడు బాలాకు ఇతర అధికారులను, మొదటిసారి కన్నా ఇంకా ఎక్కువ మంది ప్రముఖులను, పంపాడు.
NUM 22:16 వారు బిలాము దగ్గరకు వచ్చి అన్నారు: “సిప్పోరు కుమారుడైన బాలాకు ఇలా చెప్తున్నాడు: నా దగ్గరకు రాకుండ ఏది కూడా మిమ్మల్ని ఆపనివ్వకండి,
NUM 22:17 ఎందుకంటే నేను నిన్ను గొప్పగా గౌరవిస్తాను, నీవు నాకు ఏది చెబితే అది చేస్తాను. వచ్చి నా కోసం ఈ ప్రజలపై శాపం పెట్టండి.”
NUM 22:18 అయితే బిలాము వారితో, “బాలాకు తన రాజభవనంలో ఉన్న వెండి బంగారమంతా ఇచ్చినా సరే, నా దేవుడైన యెహోవా ఆజ్ఞకు మించి ఎక్కువ గాని తక్కువ గాని చేయలేను.
NUM 22:19 మీరు రాత్రి ఇక్కడ గడపండి, యెహోవా నాకేమి చెప్తారు తెలుసుకుంటాను” అని చెప్పాడు.
NUM 22:20 ఆ రాత్రి దేవుడు బిలాముతో, “ఈ మనుష్యులు నిన్ను పిలువడానికి వచ్చారు కాబట్టి నీవు వారితో వెళ్లు కానీ నేను చెప్పేది మాత్రమే చేయు” అని అన్నారు.
NUM 22:21 మర్నాడు ఉదయం బిలాము తన గాడిదకు సీను కట్టుకుని మోయాబు అధికారులతో వెళ్లాడు.
NUM 22:22 కాని బిలాము వెళ్తునప్పుడు దేవుని కోపం రగులుకుంది. యెహోవా దూత మార్గంలో బిలామును అడ్డుకోడానికి నిలబడ్డాడు. బిలాము గాడిద మీద వెళ్తున్నాడు, అతనితో తన ఇద్దరు సేవకులు ఉన్నారు.
NUM 22:23 యెహోవా దూత కత్తి దూసి చేతపట్టుకుని త్రోవలో నిలిచి ఉండడం చూసి గాడిద దారి విడిచి పొలంలోకి వెళ్లింది. అది మార్గంలోకి రావాలని బిలాము దాన్ని కొట్టాడు.
NUM 22:24 అప్పుడు యెహోవా దూత రెండు ద్రాక్షతోటల మధ్య రెండు వైపుల గోడలు ఉన్నచోట నిలబడ్డాడు.
NUM 22:25 యెహోవా దూతను చూసి ఆ గాడిద గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది కాబట్టి అతడు గాడిదను మళ్ళీ కొట్టాడు.
NUM 22:26 తర్వాత యెహోవా దూత కొంచెం ముందుకు వెళ్లి, గాడిద కుడివైపు కానీ, ఎడమవైపు కానీ తిరుగకుండునట్లు ఇరుకు స్థలంలో నిలబడ్డాడు.
NUM 22:27 యెహోవా దూతను చూసి గాడిద బిలాము క్రింద నేల మీద పడి ఉన్నది. బిలాము కోపంతో తన చేతికర్రతో గాడిదను కొట్టాడు.
NUM 22:28 అప్పుడు యెహోవా ఆ గాడిద నోరు తెరిచారు, అది బిలాముతో మాట్లాడుతూ, “నేను నీకు ఏమి చేశానని నన్ను మూడుసార్లు కొట్టావు?” అని అన్నది.
NUM 22:29 బిలాము గాడిదకు, “నీవు నన్ను మూర్ఖునిగా ఎంచావు. నా చేతిలో ఖడ్గం ఉండి ఉంటే నిన్ను ఇప్పుడే చంపేసే వాన్ని” అని జవాబిచ్చాడు.
NUM 22:30 గాడిద బిలాముతో, “ఈ రోజు వరకు ప్రతిసారి స్వారీ చేసిన మీ సొంత గాడిదను నేను కాదా? ఇలా ఎప్పుడైనా చేశానా?” అని అడిగింది. “లేదు” అని అతడు అన్నాడు.
NUM 22:31 అప్పుడు యెహోవా బిలాము కళ్లు తెరిచారు, దూసిన ఖడ్గం చేతితో పట్టుకుని దారికి అడ్డుగా ఉన్న యెహోవా దూతను అతడు చూశాడు. బిలాము తలవంచి సాష్టాంగపడ్డాడు.
NUM 22:32 యెహోవా దూత, “నీవెందుకు నీ గాడిదను ఈ మూడుసార్లు కొట్టావు? నీ మార్గం నాశనకరమైనది కాబట్టి నిన్ను అడ్డుకోడానికి వచ్చాను.
NUM 22:33 మూడుసార్లు గాడిద నన్ను చూసి తొలగిపోయింది. ఒకవేళ అది తిరగకపోయి ఉంటే, ఈపాటికి నేను తప్పకుండా నిన్ను చంపేసి గాడిదను వదిలేసేవాన్ని” అని అతనితో అన్నాడు.
NUM 22:34 బిలాము యెహోవా దూతతో, “నేను పాపం చేశాను. నన్ను ఎదుర్కోడానికి నీవు దారికి అడ్డుగా నిలబడ్డావని నేను గ్రహించలేదు. ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను” అని అన్నాడు.
NUM 22:35 యెహోవా దూత బిలాముతో, “వారితో వెళ్లు కానీ నేను చెప్పేదే నీవు పలకాలి” అని అన్నాడు. కాబట్టి బిలాము బాలాకు అధికారులతో వెళ్లాడు.
NUM 22:36 బిలాము వస్తున్నాడని విని బాలాకు అర్నోను నది సరిహద్దులో ఉన్న మోయాబు పట్టణం పొలిమేరలో అతన్ని కలసుకోడానికి వెళ్లాడు.
NUM 22:37 బాలాకు బిలాముతో, “నిన్ను త్వరగా రమ్మని చెప్పలేదా? నా దగ్గరకు ఎందుకు రాలేదు? నేను నీకు ఘనత ఇవ్వలేనా?” అని అన్నాడు.
NUM 22:38 “ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను కదా” అని బిలాము జవాబిచ్చాడు. “కానీ నాకిష్టమైనది నేను చెప్పలేను. దేవుడు నా నోట్లో పెట్టిందే నేను చెప్పాలి” అని బాలాకుతో అన్నాడు.
NUM 22:39 తర్వాత బిలాము బాలాకు వెంట కిర్యత్-హుచ్చోతుకు వెళ్లాడు.
NUM 22:40 అక్కడ బాలాకు ఎద్దులను గొర్రెలను బలి ఇచ్చాడు, బిలాముకు, అతనితో ఉన్న అధికారులకు కొంత ఇచ్చాడు.
NUM 22:41 మర్నాడు ఉదయం బాలాకు బిలామును బామోత్ బయలుకు తీసుకెళ్లాడు, అక్కడినుండి ఇశ్రాయేలు శిబిరం యొక్క చివరలను చూడగలిగాడు.
NUM 23:1 బిలాము బాలాకుతో అన్నాడు, “నాకు ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టాలి, ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్లను నా కోసం సిద్ధం చేయాలి.”
NUM 23:2 బాలాకు బిలాము చెప్పినట్లు చేశాడు, వారిద్దరు ఒక కోడెను, ఇద్దరు ఒక్కో బలిపీఠం మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించారు.
NUM 23:3 అప్పుడు బిలాము బాలాకుతో, “నీవు నీ దహనబలి దగ్గర ఉండు. బహుశ యెహోవా నన్ను కలుసుకోడానికి రావొచ్చు. ఆయన నాకు ఏమి బయలుపరుస్తారో అది నీకు చెప్తాను” అని అన్నాడు. తర్వాత అతడు ఖాళీ కొండపైకి వెళ్లాడు.
NUM 23:4 దేవుడు అతన్ని కలుసుకున్నారు, బిలాము, “నేను ఏడు బలిపీఠాలు సిద్ధపరచి ఒక్కొక్క బలిపీఠం మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించాను” అని అన్నాడు.
NUM 23:5 యెహోవా బిలాము నోటిలో ఒక సందేశం పెట్టి, “బాలాకు దగ్గరకు వెళ్లి ఈ మాటలు చెప్పు” అని అన్నారు.
NUM 23:6 కాబట్టి బిలాము తిరిగివెళ్లి రాజు, తన మోయాబు అధికారులతో దహనబలి దగ్గర నిలిచియుండడం చూశాడు.
NUM 23:7 అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు: “బాలాకు నన్ను అరాము నుండి తీసుకువచ్చాడు, మోయాబు రాజు తూర్పు పర్వతాల నుండి తెచ్చాడు. ‘రా, నా కోసం యాకోబును శపించు’ అని అన్నాడు; ‘రా, ఇశ్రాయేలును శపించు.’
NUM 23:8 దేవుడు శపించని వారిని నేనెలా శపించగలను? యెహోవా శపించని వారిని నేనెలా శపించగలను?
NUM 23:9 ఎత్తైన కొండ శిఖరాల నుండి నేను వారిని చూడగలను, ఎత్తైన స్థలాల నుండి నేను వారిని వీక్షించగలను. విడివిడిగా నివసించే ప్రజలను నేను చూస్తున్నాను తమను తాము దేశాల్లో ఒకటిగా పరిగణించని వారు.
NUM 23:10 యాకోబు ధూళిని ఎవరు లెక్కించగలరు? ఇశ్రాయేలు ప్రజల్లో కనీసం నాలుగవ వంతు ఎవరు లెక్కించగలరు? నేను యథార్థవంతుల మరణం పొందుదును గాక, నా అంతం వారి అంతంలా ఉండును గాక!”
NUM 23:11 బాలాకు బిలాముతో, “నీవు నాకు ఏమి చేశావు? నా శత్రువులను శపిస్తావని నిన్ను తీసుకువచ్చాను, కానీ నీవు వారిని ఆశీర్వదించడం తప్ప ఏమి చేయలేదు!”
NUM 23:12 బిలాము, “యెహోవా నా నోట పెట్టిన మాటను నేను మాట్లాడకూడదా?” అని అన్నాడు.
NUM 23:13 అప్పుడు బాలాకు అతనితో, “వారు కనిపించే మరో చోటికి నాతో రా; వారందరిని చూడవు కానీ, వారి శిబిరం సరిహద్దులు చూస్తావు. అక్కడినుండి నా కోసం వారిని శపించు” అని అన్నాడు.
NUM 23:14 బాలాకు బిలామును సోఫీము పొలములో ఉన్న పిస్గా శిఖరం మీదికి తీసుకెళ్లాడు. అక్కడ ఏడు బలిపీఠాలు కట్టి, ఒక్కో దాని మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించాడు.
NUM 23:15 బిలాము బాలాకుతో, “నీవు ఇక్కడ నీ బలిపీఠం దగ్గర ఉండు, నేను అక్కడ దేవున్ని కలుస్తాను” అని అన్నాడు.
NUM 23:16 యెహోవా బిలామును కలుసుకొని, అతని నోటిలో మాట ఉంచి, “బాలాకు దగ్గరకు వెళ్లి ఈ మాటను చెప్పు” అని అన్నారు.
NUM 23:17 బిలాము తిరిగివెళ్లి రాజు, తన మోయాబు అధికారులతో దహనబలి దగ్గర నిలిచియుండడం చూశాడు. బాలాకు అతన్ని, “యెహోవా ఏమి చెప్పారు?” అని అడిగాడు.
NUM 23:18 అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు: “బాలాకు! లేచి, విను; సిప్పోరు కుమారుడా! నా మాట విను.
NUM 23:19 అబద్ధమాడడానికి దేవుడు మనుష్యుడు కాదు, మనస్సు మార్చుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన మాట్లాడి క్రియ చేయరా? ఆయన వాగ్దానం చేసి నెరవేర్చరా?
NUM 23:20 ఆశీర్వదించమని నేను ఆజ్ఞ పొందుకున్నాను; ఆయన వారిని ఆశీర్వదించారు, దాన్ని నేను మార్చలేను.
NUM 23:21 “యాకోబులో ఎటువంటి దోషం కనిపించలేదు, ఇశ్రాయేలులో ఏ చెడు కనిపించలేదు. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు; రాజు యొక్క కేక వారి మధ్య ఉన్నది.
NUM 23:22 దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తెచ్చారు; వారికి అడవి ఎద్దుకు ఉన్న బలం ఉంది.
NUM 23:23 యాకోబుకు వ్యతిరేకంగా ఏ భవిష్యవాణి లేదు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ శకునాలు లేవు. ఇప్పుడు యాకోబు గురించి, ఇశ్రాయేలు గురించి, ‘దేవుడు ఏమి చేశారో చూడండి!’
NUM 23:24 ప్రజలు ఆడ సింహంలా లేస్తారు; వారు తమకు తాము సింహంలా లేస్తారు అది తన వేట మాంసాన్ని మ్రింగివేసే వరకు దాని బాధితుల రక్తం త్రాగే వరకు విశ్రాంతి తీసుకోదు” అని చెప్పబడుతుంది.
NUM 23:25 బాలాకు బిలాముతో, “వారిని అసలు శపించకు వారిని దీవించకు!” అని అన్నాడు.
NUM 23:26 బిలాము బాలాకుతో, “యెహోవా ఏది చెప్తే నేను అదే చేయాలని నేను చెప్పలేదా?” అని జవాబిచ్చాడు.
NUM 23:27 అప్పుడు బాలాకు బిలాముతో, “అయితే నిన్ను మరో స్థలానికి తీసుకెళ్తాను. బహుశ అక్కడినుండి నీవు నా కోసం వారిని శపించడం దేవునికి ఇష్టం కావచ్చు” అని అన్నాడు.
NUM 23:28 బాలాకు, బిలామును నిర్మానుష్య స్థలానికి ఎదురుగా ఉన్న పెయోరు కొండ శిఖరం పైకి తీసుకెళ్లాడు.
NUM 23:29 బిలాము బాలాకుతో, “నా కోసం ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టించు, ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్ళను సిద్ధం చేయించు” అని అన్నాడు.
NUM 23:30 బాలాకు బిలాము చెప్పినట్టు చేశాడు, ప్రతి బలిపీఠం మీద కోడెను, పొట్టేలును అర్పించాడు.
NUM 24:1 ఇశ్రాయేలును ఆశీర్వదించడం యెహోవాకు ఇష్టమని బిలాము గ్రహించినప్పుడు, అతడు ఇతర సమయాల్లో చేసినట్టు భవిష్యవాణి ఆశ్రయించలేదు, కానీ తన ముఖాన్ని అరణ్యం వైపు త్రిప్పాడు.
NUM 24:2 ఇశ్రాయేలు వారు గోత్రాల ప్రకారం గుడారాలు వేసుకుని ఉండడం బిలాము చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది,
NUM 24:3 అతడు ఈ సందేశం ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం,
NUM 24:4 దేవుని మాటలు వినే వాని ప్రవచనం, సర్వశక్తిగల దేవుని నుండి దర్శనం చూసేవాడు, సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు:
NUM 24:5 “ఓ యాకోబు, నీ గుడారాలు ఎంత అందంగా ఉన్నాయి, ఓ ఇశ్రాయేలు, నీ నివాస భవనాలు ఎంత రమ్యంగా ఉన్నాయి!
NUM 24:6 “అవి లోయల్లా వ్యాపించాయి, నది ప్రక్కన తోటల్లా ఉన్నాయి, యెహోవా నాటిన అగరు వంటివి, జలాల ప్రక్కన దేవదారు చెట్లలా ఉన్నాయి.
NUM 24:7 వాటి బొక్కెనల నుండి నీళ్లు పారుతున్నాయి; వాటి విత్తనాలకు సమృద్ధిగా నీళ్లుంటాయి. “వారి రాజు అగగు కంటే గొప్పవాడు; వారి రాజ్యం హెచ్చింపబడుతుంది.
NUM 24:8 “దేవుడు ఈజిప్టు నుండి వారిని బయటకు తెచ్చారు; వారు అడవి ఎద్దు బలం కలిగి ఉన్నారు. వారు శత్రు దేశాలను మ్రింగివేస్తారు వారి ఎముకలను తునాతునకలు చేస్తారు; వారి బాణాలతో వారు వారిని గుచ్చుతారు.
NUM 24:9 సింహంలా ఆడు సింహంలా వారు ముడుచుకుని పడుకుంటారు, వారిని ధైర్యంగా ఎవరు లేపగలరు? “ఓ ఇశ్రాయేలు, నిన్ను దీవించే వారు దీవించబడుదురు గాక నిన్ను శపించేవారు శపించబడుదురు గాక!”
NUM 24:10 బిలాము మీద బాలాకుకు కోపం రగులుకుంది. చేతులు చరుస్తూ అతనితో, “నా శత్రువులను శపించమని నిన్ను పిలిపిస్తే, వారిని మూడుసార్లు దీవించావు.
NUM 24:11 ఇప్పుడు ఇక్కడినుండి మీ ఇంటికి పో! నిన్ను ఘనంగా సన్మానిస్తానని నేను అన్నాను కానీ యెహోవా నీకు ఆ సన్మానం లేకుండా చేశారు” అని అన్నాడు.
NUM 24:12 బిలాము బాలాకుతో, “నీవు పంపిన దూతలకు నేను చెప్పలేదా,
NUM 24:13 ‘బాలాకు తన రాజభవనంలో ఉన్న వెండి బంగారం అంతా నాకు ఇచ్చినా సరే, నా సొంతగా నేనేమి చెప్పలేను, మంచిదైనా, చెడ్డదైనా యెహోవా ఆజ్ఞ దాటి ఏమి చెప్పలేను యెహోవా చెప్పిందే నేను చెప్పాలి.’
NUM 24:14 నేనిప్పుడు నా ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నాను. కానీ ముందు ఈ ప్రజలు రాబోయే రోజుల్లో మీ ప్రజలకు ఏమి చేస్తారో చెప్తాను.”
NUM 24:15 అప్పుడు బిలాము ఈ సందేశాన్ని ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం,
NUM 24:16 దేవుని మాటలు వినే వాని ప్రవచనం, మహోన్నతుని దగ్గర నుండి తెలివి సంపాదించుకున్నవాడు, సర్వశక్తిగల వాడి నుండి దర్శనం చూసేవాడు, సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు:
NUM 24:17 “అతన్ని చూస్తాను, కానీ ఇప్పుడు కాదు; అతన్ని కనిపెడతాను, కానీ సమీపంగా కాదు. యాకోబు నుండి నక్షత్రం వస్తుంది; ఇశ్రాయేలు నుండి రాజదండం లేస్తుంది. అతడు మోయాబు కణతలను నలగ్గొడతాడు, షేతు ప్రజల కపాలాలను చితకగొడతాడు.
NUM 24:18 ఎదోము జయించబడుతుంది; అతని శత్రువైన శేయీరు జయించబడుతుంది. కానీ ఇశ్రాయేలు బలంగా ఎదుగుతుంది.
NUM 24:19 యాకోబు నుండి రాజ్యమేలేవాడు వస్తాడు. అతడు పట్టణంలో మిగిలిన వారిని నాశనం చేస్తాడు.”
NUM 24:20 అప్పుడు బిలాము, అమాలేకును చూసి ఈ సందేశాన్ని ఇచ్చాడు: “అమాలేకు దేశాల్లో మొదటిది, కానీ దాని అంతం పూర్తి నాశనమే!”
NUM 24:21 అతడు కెనీయులను చూసి తన సందేశాన్ని ఇచ్చాడు: “మీ నివాసస్థలం భద్రంగా ఉంది, నీ గూడు బండలో ఉంది;
NUM 24:22 అయినా కెనీయులైన మీరు నాశనమవుతారు అష్షూరు మిమ్మల్ని బందీగా పట్టుకెళ్తుంది.”
NUM 24:23 తర్వాత అతడు తన సందేశాన్ని ఇచ్చాడు: “అయ్యో, దేవుడు ఇలా చేస్తే, ఎవరు జీవించగలరు?
NUM 24:24 కుప్ర తీరం నుండి ఓడలు వస్తాయి; అవి అష్షూరును, ఏబెరును అణచివేస్తాయి, అయితే మీరు కూడా పతనమవుతారు.”
NUM 24:25 తర్వాత బిలాము లేచి తన ఇంటికి వెళ్లాడు, బాలాకు తన దారిన వెళ్లాడు.
NUM 25:1 ఇశ్రాయేలు ప్రజలు షిత్తీములో ఉన్నప్పుడు వారు మోయాబు స్త్రీలతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు,
NUM 25:2 వారు తమ దేవుళ్ళకు బలి ఇవ్వడానికి వారిని ఆహ్వానించారు. ప్రజలు వాటికి అర్పించినవి తినడమే కాక, వారి దేవుళ్ళకు మొక్కారు.
NUM 25:3 కాబట్టి ఇశ్రాయేలు బయల్-పెయోరును పూజించడంలో వారితో కలిసిపోయారు యెహోవా కోపం వారిపై రగులుకుంది.
NUM 25:4 యెహోవా మోషేతో అన్నారు, “ఈ ప్రజల నాయకులందరిని తీసుకువచ్చి, యెహోవా ఎదుట వారిని చంపి, పట్టపగలే వారిని ప్రదర్శించు, తద్వారా యెహోవా కోపం ఇశ్రాయేలు మీద నుండి వెళ్లిపోతుంది.”
NUM 25:5 కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులతో, “మీలో ప్రతి ఒక్కరు బయల్-పెయోరును పూజించిన వారితో కలిసిన ప్రతి పురుషుని చంపేయండి” అని అన్నాడు.
NUM 25:6 అప్పుడే ఇశ్రాయేలీయులలో ఒకడు మిద్యాను స్త్రీని మోషే సమాజమందరి ఎదుట, ఆ శిక్షను బట్టి వారు సమావేశ గుడార ద్వారం దగ్గర ఏడుస్తున్న సమయంలో తీసుకువచ్చాడు.
NUM 25:7 యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఇది చూసినప్పుడు, సమాజాన్ని వదిలి, ఒక ఈటెను పట్టుకుని,
NUM 25:8 ఆ ఇశ్రాయేలీయుని వెంట అతని గుడారంలోకి వెళ్లాడు. అతన్ని ఆ స్త్రీని కలిపి ఈటెతో పొడిచాడు, ఆ ఈటె అతని శరీరంలో నుండి ఆమె కడుపులోనికి దూసుకుపోయింది. అప్పుడు ఇశ్రాయేలు మీదికి వచ్చిన తెగులు అంతరించింది;
NUM 25:9 అయితే తెగులు ద్వారా 24,000 మంది చనిపోయారు.
NUM 25:10 యెహోవా మోషేతో అన్నారు,
NUM 25:11 “యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఇశ్రాయేలీయుల మీద ఉన్న నా కోపాన్ని తిప్పాడు. నాలాగే అతడు నా ఘనత కోసం వారి మధ్యలో రోషం కలిగి ఉన్నాడు కాబట్టి, నా రోషాన్ని బట్టి వారిని శిక్షించకుండ ఆపివేశాను.
NUM 25:12 కాబట్టి నేను అతనితో సమాధాన ఒడంబడిక చేస్తున్నానని అతనితో చెప్పు.
NUM 25:13 అతడు అతని సంతానం నిత్య యాజకత్వ నిబంధన కలిగి ఉంటారు ఎందుకంటే తన దేవుని ఘనత కోసం రోషం కలిగి, ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు.”
NUM 25:14 మిద్యాను స్త్రీతో పాటు చంపబడిన ఇశ్రాయేలీయుని పేరు సలూ కుమారుడైన జిమ్రీ. ఇతడు షిమ్యోను కుటుంబంలో నాయకుడు.
NUM 25:15 చంపబడిన ఆ మిద్యానీయ స్త్రీ పేరు కొజ్బీ, ఈమె మిద్యానీయ కుటుంబాలలో ఒక గోత్ర నాయకుడైన సూరు కుమార్తె.
NUM 25:16 యెహోవా మోషేతో అన్నారు.
NUM 25:17 “మిద్యానీయులను శత్రువులుగా భావించి వారిని చంపండి.
NUM 25:18 వారు మిమ్మల్ని శత్రువులుగా భావించి మిమ్మల్ని మోసం చేయడానికి ఉపయోగించిన వారి సహోదరి, కొజ్బీ, మిద్యానీయుల నాయకుని కుమార్తె, పెయోరులో జరిగిన సంఘటన ఫలితంగా తెగులు వచ్చినప్పుడు చంపబడింది.”
NUM 26:1 తెగులు అంతరించిన తర్వాత, యెహోవా మోషేతో యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో అన్నారు,
NUM 26:2 “ఇశ్రాయేలు సమాజమంతటిని ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు ఉండి ఇశ్రాయేలు సైన్యంలో సేవ చేయగలవారిని కుటుంబాల ప్రకారం లెక్కించాలి.”
NUM 26:3 కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు, యెరికో నుండి యొర్దాను వైపు ఉన్న మోయాబు సమతల మైదానాల్లో ఇశ్రాయేలీయుల నాయకులతో మాట్లాడుతూ,
NUM 26:4 “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉన్న పురుషులను లెక్కించండి” అని చెప్పారు.
NUM 26:5 ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన, రూబేను వారసులు: హనోకు ద్వార, హనోకీయుల వంశం; పల్లు ద్వార, పల్లువీయుల వంశం;
NUM 26:6 హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; కర్మీ ద్వార, కర్మీయుల వంశము.
NUM 26:7 ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730.
NUM 26:8 పల్లు కుమారుడు ఏలీయాబు,
NUM 26:9 ఏలీయాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. ఈ దాతాను, అబీరాములే మోషే అహరోనులకు ఎదురు తిరిగినవారు, కోరహు అనుచరులు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారి మధ్య ఉన్న అధికారులు.
NUM 26:10 భూమి నోరు తెరచుకొని కోరహుతో పాటు వారిని మ్రింగివేసింది, అతని అనుచరులు 250 మంది మంటలో హతమయ్యారు. వారు హెచ్చరిక గుర్తుగా ఉన్నారు.
NUM 26:11 అయితే, ఆ రోజున కోరహు కుమారులు చనిపోలేదు.
NUM 26:12 షిమ్యోను వారసులు వారి వంశాల ప్రకారం: నెమూయేలు ద్వార, నెమూయేలీయుల వంశం; యామీను ద్వార, యామీనీయుల వంశం; యాకీను ద్వార, యాకీనీయుల వంశం;
NUM 26:13 జెరహు ద్వార, జెరహీయుల వంశం; షావూలు ద్వార, షావూలీయుల వంశము.
NUM 26:14 ఇవి షిమ్యోను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 22,200.
NUM 26:15 గాదు యొక్క వారసులు వారి వంశాల ప్రకారం: సెఫోను ద్వార, సెఫోనీయుల వంశం; హగ్గీ ద్వార, హగ్గీయుల వంశం; షూనీ ద్వార, షూనీయుల వంశం;
NUM 26:16 ఓజ్ని ద్వార, ఓజ్నీయుల వంశం; ఏరీ ద్వార, ఏరీయుల వంశం;
NUM 26:17 అరోదు ద్వార, అరోదీయుల వంశం; అరేలీ ద్వార, అరేలీయుల వంశము.
NUM 26:18 ఇవి గాదు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 40,500.
NUM 26:19 యూదా కుమారులు ఏరు ఓనాను, కానీ వారు కనాను దేశంలో చనిపోయారు.
NUM 26:20 యూదా వారసులు వారి వంశాల ప్రకారం: షేలా ద్వార, షేలాహీయుల వంశం; పెరెసు ద్వార, పెరెజీయుల వంశం; జెరహు ద్వార, జెరహీయుల వంశము.
NUM 26:21 పెరెసు యొక్క వారసులు: హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; హామూలు ద్వార, హామూలీయుల వంశము.
NUM 26:22 ఇవి యూదా వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 76,500.
NUM 26:23 ఇశ్శాఖారు వారసులు వారి వంశాల ప్రకారం: తోలా ద్వార, తోలాహీయుల వంశం; పువా ద్వార, పువీయుల వంశం;
NUM 26:24 యాషూబు ద్వార, యాషూబీయుల వంశం; షిమ్రోను ద్వార, షిమ్రోనీయుల వంశము.
NUM 26:25 ఇవి ఇశ్శాఖారు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,300.
NUM 26:26 జెబూలూను వారసులు వారి వంశాల ప్రకారం: సెరెదు ద్వార, సెరెదీయుల వంశం; ఏలోను ద్వార, ఏలోనీయుల వంశం; యహలేలు ద్వార, యహలేలీయుల వంశము.
NUM 26:27 ఇవి జెబూలూను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 60,500.
NUM 26:28 మనష్షే ఎఫ్రాయిం వంశాల ప్రకారం యోసేపు వారసులు:
NUM 26:29 మనష్షే వారసులు: మాకీరు ద్వార, మాకీరీయుల వంశం (మాకీరు గిలాదు యొక్క తండ్రి); గిలాదు ద్వార, గిలాదీయుల వంశము.
NUM 26:30 గిలాదు వారుసులు: ఈజరు ద్వార, ఈజరీయుల వంశం; హెలెకు ద్వార, హెలెకీయుల వంశం;
NUM 26:31 అశ్రీయేలు ద్వార, అశ్రీయేలీయుల వంశం; షెకెము ద్వార, షెకెమీయుల వంశం;
NUM 26:32 షెమీదా ద్వార, షెమీదయీయుల వంశం; హెఫెరు ద్వార, హెఫెరీయుల వంశము.
NUM 26:33 (హెఫెరు కుమారుడైన సెలోఫెహాదుకు కుమారులు లేరు; అతనికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారి పేర్లు, మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా.)
NUM 26:34 ఇవి మనష్షే వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 52,700.
NUM 26:35 ఎఫ్రాయిం వారసులు వారి వంశాల ప్రకారం: షూతలహు ద్వార, షూతలహీయుల వంశం; బేకరు ద్వార, బేకరీయల వంశం; తహను ద్వార, తహనీయుల వంశము.
NUM 26:36 వీరు షూతలహు వారసులు: ఏరాను ద్వార, ఏరానీయుల వంశము.
NUM 26:37 ఇవి ఎఫ్రాయిం వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 32,500.
NUM 26:38 బెన్యామీను వారసులు వారి వంశాల ప్రకారం: బేల ద్వార, బేలీయుల వంశం; అష్బేలు ద్వార, అష్బేలీయుల వంశం; అహీరాము ద్వార, అహీరామీయుల వంశం;
NUM 26:39 షూఫాము ద్వార, షూఫామీయుల వంశం; హుఫాము ద్వార, హుఫామీయుల వంశము.
NUM 26:40 అర్దు, నయమానుల ద్వార కలిగిన బేల వారసులు: అర్దు ద్వార, అర్దీయుల వంశం; నయమాను ద్వార, నయమానీయుల వంశము.
NUM 26:41 ఇవి బెన్యామీను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,600.
NUM 26:42 దాను వారుసులు వారి వంశాల ప్రకారం: షూహాము ద్వార, షూహామీయుల వంశము.
NUM 26:43 వారంతా షూహామీయుల వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,400.
NUM 26:44 ఆషేరు వారసులు వారి వంశాల ప్రకారం: ఇమ్నా ద్వార, ఇమ్నీయుల వంశం; ఇష్వీ ద్వార, ఇష్వీయుల వంశం; బెరీయా ద్వార, బెరీయుల వంశం;
NUM 26:45 బెరీయా వారసుల ద్వార వచ్చినవారు: హెబెరు ద్వార, హెబెరీయుల వంశం; మల్కీయేలు ద్వార, మల్కీయేలీయుల వంశము.
NUM 26:46 ఆషేరుకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు శెరహు.
NUM 26:47 ఇవి ఆషేరు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 53,400.
NUM 26:48 నఫ్తాలి వారసులు వారి వంశాల ప్రకారం: యహజీయేలు ద్వార, యహజీయేలీయుల వంశం; గూనీ ద్వార, గూనీయుల వంశం;
NUM 26:49 యేజెరు ద్వార, యెజెరీయుల వంశం; షిల్లేము ద్వార, షిల్లేమీయుల వంశము.
NUM 26:50 ఇవి నఫ్తాలి వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,400.
NUM 26:51 లెక్కించబడిన ఇశ్రాయేలు పురుషుల మొత్తం సంఖ్య 6,01,730.
NUM 26:52 యెహోవా మోషేతో అన్నారు,
NUM 26:53 “పేర్ల లెక్క సంఖ్య ప్రకారం భూమిని వారసత్వంగా కేటాయించాలి.
NUM 26:54 పెద్ద గుంపుకు పెద్ద భూభాగం, చిన్న గుంపుకు చిన్న భూభాగం వారసత్వంగా ఇవ్వాలి; ప్రతి గుంపు దానిలో లెక్కించబడినవారి సంఖ్య ప్రకారం పొందుకోవాలి.
NUM 26:55 చీట్లు వేసి భూమిని పంచడం ఖచ్చితంగా చేయాలి. ప్రతి గుంపు వారి పూర్వికుల గోత్రాల పేర్ల ప్రకారం పొందుకుంటుంది.
NUM 26:56 ప్రతి వారసత్వం చీట్లు వేయడం ద్వార పెద్ద, చిన్న గుంపుల మధ్య పంచాలి.”
NUM 26:57 వంశాల ప్రకారం లెక్కించబడిన లేవీయులు: గెర్షోను ద్వార, గెర్షోనీయుల వంశం; కహాతు ద్వార, కహాతీయుల వంశం; మెరారి ద్వార మెరారీయుల వంశము.
NUM 26:58 ఇవి కూడా లేవీ వంశాలు: లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశము. (కహాతు కుమారుడు అమ్రాము;
NUM 26:59 అమ్రాము భార్యపేరు యోకెబెదు, ఈమె లేవీ సంతానం, లేవీయులకు ఈజిప్టులో ఉన్నప్పుడు జన్మించింది. అమ్రాము వల్ల అహరోనును, మోషేను, వారి సహోదరి మిర్యామును కన్నది.
NUM 26:60 అహరోను నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారుల తండ్రి.
NUM 26:61 అయితే నాదాబు, అబీహులు, యెహోవాకు అన్యాగ్నిని అర్పించినందుకు చనిపోయారు.)
NUM 26:62 లేవీయులలో పురుషులు ఒక నెల ఆపైన వయస్సు ఉన్న వారి సంఖ్య 23,000. ఇశ్రాయేలీయులతో వారు లెక్కించబడలేదు ఎందుకంటే వారి మధ్యలో వారికి వారసత్వం ఇవ్వబడలేదు.
NUM 26:63 యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు మైదానంలో మోషే, యాజకుడైన ఎలియాజరు ద్వార లెక్కించబడిన ఇశ్రాయేలీయులు వీరు.
NUM 26:64 వీరిలో ఏ ఒక్కరైన మోషే, యాజకుడైన అహరోను సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్క తీసుకున్నప్పుడు ఉన్నవారు కారు.
NUM 26:65 ఎందుకంటే యెహోవా ఆ ఇశ్రాయేలీయులు అరణ్యంలో తప్పక చస్తారని చెప్పారు, యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఏ ఒక్కరు మిగల్లేదు.
NUM 27:1 యోసేపు కుమారుడైన మనష్షే వంశానికి చెందిన మనష్షే కుమారుడైన మాకీరు, అతని కుమారుడు గిలాదు, అతని కుమారుడు హెఫెరు, అతని కుమారుడైన సెలోఫెహాదు కుమార్తెలు. ఆ కుమార్తెల పేర్లు మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు ముందుకు వచ్చి
NUM 27:2 సమావేశ గుడార ద్వారం దగ్గర మోషే, యాజకుడైన ఎలియాజరు, నాయకులు సమాజమంతటి ఎదుట నిలబడి,
NUM 27:3 “మా తండ్రి అరణ్యంలో చనిపోయాడు. అతడు యెహోవాకు విరుద్ధంగా తిరుగుబాటు చేసిన కోరహు సమూహంలో లేడు, కానీ తన సొంత పాపాన్ని బట్టి చనిపోయాడు, అతనికి కుమారులు లేరు.
NUM 27:4 కుమారులు లేనందుకు మా తండ్రి పేరు అతని వంశం నుండి తీసివేయబడాలి? మా తండ్రి బంధువుల్లో మాకు స్వాస్థ్యం ఇవ్వండి” అని అన్నారు.
NUM 27:5 మోషే ఈ విషయాన్ని యెహోవా దగ్గరకు తెచ్చాడు,
NUM 27:6 యెహోవా మోషేతో అన్నారు,
NUM 27:7 సెలోఫెహాదు కుమార్తెలు చెప్పేది న్యాయమైనదే. నీవు వారికి తమ తండ్రి బంధువుల్లో వారసత్వంగా స్వాస్థ్యం ఖచ్చితంగా ఇచ్చి వారి తండ్రి వారసత్వాన్ని వారికి ఇవ్వాలి.
NUM 27:8 “ఇశ్రాయేలీయులతో చెప్పు, ‘ఒక మనిషి చనిపోతే, అతనికి కుమారులు లేకపోతే, అతని వారసత్వం అతని కుమార్తెకు ఇవ్వాలి.
NUM 27:9 ఒకవేళ అతనికి కుమార్తెలు లేకపోతే, అతని వారసత్వం అతని సహోదరులకు ఇవ్వాలి.
NUM 27:10 ఒకవేళ సహోదరులు లేకపోతే, వారసత్వం అతని తండ్రి సహోదరులకు ఇవ్వాలి.
NUM 27:11 అతని తండ్రికి సహోదరులు లేకపోతే, తన వారసత్వం సమీప బంధువుకు ఇవ్వాలి, అతడు స్వాస్థ్యంగా పొందుకుంటాడు. ఇది ఇశ్రాయేలీయుల కోసం యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన న్యాయ నియమము.’ ”
NUM 27:12 యెహోవా మోషేతో అన్నారు, “నీవు అబారీము పర్వతం ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశాన్ని చూడు.
NUM 27:13 చూసిన తర్వాత, నీవును నీ అన్న అహరోను లాగే చనిపోయి స్వజనుల దగ్గరకు చేరతావు.
NUM 27:14 ఎందుకంటే, సీను ఎడారిలో సమాజం నీళ్ల దగ్గర తిరుగుబాటు చేసినప్పుడు, మీరిద్దరు వారి దృష్టిలో నన్ను పరిశుద్ధునిగా గౌరవించకుండా అవిధేయత చూపారు.” (ఈ నీళ్లు సీను అరణ్యంలో మెరీబా కాదేషు నీళ్లు.)
NUM 27:15 మోషే యెహోవాతో అన్నాడు,
NUM 27:16 “సమస్త జీవులకు శ్వాసనిచ్చే దేవుడైన యెహోవా, ఈ సమాజం మీద ఒక నాయకుని నియమించాలి,
NUM 27:17 అతడు ఈ సమాజం ముందు వెళ్తూ, వస్తూ, వారిని బయటకు లోనికి నడిపిస్తూ ఉండాలి, అప్పుడు యెహోవా ప్రజలైన వీరు కాపరి లేని గొర్రెల్లా ఉండరు.”
NUM 27:18 కాబట్టి యెహోవా మోషేతో అన్నారు, “నూను కుమారుడైన యెహోషువను తీసుకో, అతనిలో నాయకత్వపు ఆత్మ ఉంది, అతని మీద నీ చేయి పెట్టు.
NUM 27:19 యాజకుడైన ఎలియాజరు సమాజమందరి సముఖంలో అతన్ని నిలబెట్టి, అధికార పూర్వకంగా నియమించు.
NUM 27:20 నీ ప్రభావంలో కొంత అతనికి ఇవ్వు, అప్పుడు ఇశ్రాయేలు సమాజమంతా అతనికి లోబడుతుంది.
NUM 27:21 అతన్ని యాజకుడైన ఎలియాజరు ఎదుట నిలబెట్టు, ఎలియాజరు యెహోవా సన్నిధిలో ఊరీముతో సంప్రదించి అతని కోసం చట్టాలు పొందుకోవాలి. అతని ఆజ్ఞమేరకు అతడు, ఇశ్రాయేలు సమాజమంతా బయటకు వెళ్తుంది, అతని ఆజ్ఞమేరకు వారు లోనికి వస్తారు.”
NUM 27:22 యెహోవా ఆజ్ఞమేరకు మోషే చేశాడు. యెహోషువను యాజకుడైన ఎలియాజరు ముందు, సర్వసమాజం ముందు నిలబెట్టాడు.
NUM 27:23 తర్వాత యెహోవా మోషేకు సూచించిన ప్రకారం అతనిపై చేతులుంచి అధికార పూర్వకంగా అతన్ని నియమించాడు.
NUM 28:1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,
NUM 28:2 “నీవు ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞలిస్తూ వారితో ఇలా చెప్పు: ‘నియమింపబడిన సమయంలో నాకు ఇష్టమైన సువాసనగా ఉండే హోమబలులు అర్పించేలా చూసుకోండి.’
NUM 28:3 నీవు వారికి ఇలా చెప్పు: ‘ఇది మీరు యెహోవాకు సమర్పించాల్సిన హోమబలి: ప్రతిరోజు లోపం లేని ఏడాది గొర్రెపిల్లలు రెండు దహనబలిగా అర్పించాలి.
NUM 28:4 ఒక గొర్రెపిల్లను ఉదయాన, మరొకదాన్ని సూర్యాస్తమయ వేళ అర్పించాలి,
NUM 28:5 దానితో పాటు ఒక ఓమెరు నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్ ఒలీవనూనెతో కలిపి భోజనార్పణగా అర్పించాలి.
NUM 28:6 ఇది సీనాయి కొండపై నియమించబడిన క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
NUM 28:7 దానితో పాటు ఒక పావు హిన్ పులియబెట్టిన పానీయాన్ని పానార్పణగా ప్రతి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి. పరిశుద్ధాలయం దగ్గర యెహోవాకు పానార్పణ పోయాలి.
NUM 28:8 సాయంకాలం రెండవ గొర్రెపిల్లతో కలిపి ఉదయకాలం అర్పించినట్లే భోజనార్పణను పానార్పణను అర్పించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
NUM 28:9 “ ‘సబ్బాతు దినాన, లోపం లేని ఒక ఏడాది వయస్సు ఉన్న రెండు గొర్రెపిల్లలను, వాటితో పాటు పానార్పణం, భోజనార్పణగా ఒలీవనూనెతో కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి అర్పించాలి.
NUM 28:10 ప్రతి సబ్బాతుకు క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, పానార్పణంతో పాటు ఈ దహనబలి కూడా అర్పించాలి.
NUM 28:11 “ ‘ప్రతి నెల మొదటి రోజు యెహోవాకు లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, యేడు ఏడాది మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి.
NUM 28:12 ప్రతి కోడెతో పాటు ఒలీవనూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండితో భోజనార్పణ ఉండాలి; పొట్టేలుతో పాటు, నూనె కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి భోజనార్పణగా ఉండాలి;
NUM 28:13 అలాగే ప్రతి గొర్రెపిల్లతో పాటు, నూనె కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని భోజనార్పణగా సమర్పించాలి. ఇది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే హోమబలి.
NUM 28:14 ప్రతి కోడెతో పాటు పానార్పణగా అర హిన్ ద్రాక్షరసం ఉండాలి; పొట్టేలుతో పాటు, హిన్‌లో మూడవ వంతు ద్రాక్షరసం; ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం అర్పించాలి. సంవత్సరంలో ప్రతి అమావాస్యకు అర్పించాల్సిన దహనబలి ఇది.
NUM 28:15 క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, దాని పానార్పణంతో పాటు, యెహోవాకు పాపపరిహారబలిగా ఒక మేకపోతును అర్పించాలి.
NUM 28:16 “ ‘మొదటి నెల పద్నాలుగవ రోజు యెహోవా యొక్క పస్కా పండుగ ఆచరించాలి.
NUM 28:17 ఆ నెల పదిహేనవ రోజు ఒక పండుగ జరగాలి; ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి.
NUM 28:18 మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, పనులేవీ చేయకూడదు.
NUM 28:19 యెహోవాకు హోమబలిగా లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి.
NUM 28:20 ప్రతి కోడెతో పాటు ఒలీవనూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండిని భోజనార్పణగా అర్పించాలి; పొట్టేలుతో, రెండు ఓమెర్లు;
NUM 28:21 ఏడు గొర్రెపిల్లలలో ఒక్కో దానితో ఒక్కో ఓమెరు అర్పించాలి.
NUM 28:22 మీ ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపోతును పాపపరిహారబలిగా అర్పించాలి.
NUM 28:23 ఇవన్నీ ప్రతి ఉదయం దహన బలులతో పాటు అర్పించాలి.
NUM 28:24 ఈ విధంగా ఏడు రోజులపాటు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉండే ఆహార అర్పణను అర్పించాలి; ప్రతిరోజు అర్పించే దహనబలి దాని పానార్పణంతో పాటు దీనిని అర్పించాలి.
NUM 28:25 ఏడవ రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.
NUM 28:26 “ ‘ప్రథమ ఫలాల రోజున, వారాల పండుగలో యెహోవాకు క్రొత్త ధాన్యంతో భోజనార్పణ అర్పించినప్పుడు పరిశుద్ధ సభ ఏర్పాటు చేయాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.
NUM 28:27 రెండు కోడెలు, ఒక పొట్టేలు, ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా అర్పించాలి.
NUM 28:28 ప్రతి కోడెతో పాటు భోజనార్పణగా ఒలీవనూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి; పొట్టేలుతో రెండు ఓమెర్లు;
NUM 28:29 ఏడు గొర్రెపిల్లలలో ఒక్కో దానితో ఒక్కో ఓమెరు అర్పించాలి.
NUM 28:30 దానితో పాటు ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపోతును అర్పించాలి.
NUM 28:31 దహనబలులు, ఆహార అర్పణలతో పాటు, వీటిని వీటి పానార్పణాలతో కలిపి అర్పించాలి. అర్పణ కోసం తెచ్చే ప్రతి జంతువు లోపం లేనిదై ఉండాలి.
NUM 29:1 “ ‘ఏడవ నెల మొదటి రోజు పరిశుద్ధ సభను ఏర్పాటు చేయాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. ఆ రోజు మీరు బూరల ధ్వని చేసే రోజు.
NUM 29:2 యెహోవాకు ఇష్టమైన సువాసనగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలను దహనబలిగా అర్పించాలి.
NUM 29:3 కోడెతో పాటు భోజనార్పణగా ఒలీవనూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి తేవాలి; పొట్టేలుతో రెండు ఓమెర్లు;
NUM 29:4 ఏడు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు నాణ్యమైన పిండి అర్పించాలి.
NUM 29:5 అంతేకాక మీకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహారబలిగా మేకపోతును కూడా అర్పించాలి.
NUM 29:6 ఇవి నిర్దేశించబడిన ప్రతి నెలనెలా అనుదినం దహనబలులకు అధనంగా వాటి భోజనార్పణలు, పానార్పణలు. ఇవి యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే హోమబలులుగా తేవాలి.
NUM 29:7 “ ‘ఏడవ నెల పదవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి. మీరు ఉపవాసముండాలి ఏ పని చేయకూడదు.
NUM 29:8 యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి.
NUM 29:9 కోడెతో పాటు భోజనార్పణగా నూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి తేవాలి; పొట్టేలుతో రెండు ఓమెర్లు;
NUM 29:10 ఏడు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు నాణ్యమైన పిండి అర్పించాలి.
NUM 29:11 అంతేకాక ప్రాయశ్చిత్తం కొరకైన పాపపరిహారబలి, క్రమంగా అర్పించే దహనబలి, భోజనార్పణ, వారి పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
NUM 29:12 “ ‘ఏడవ నెల పదిహేనవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. యెహోవా కోసం ఏడు రోజులు పండుగ ఆచరించాలి.
NUM 29:13 యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని పదమూడు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను హోమబలిగా అర్పించాలి.
NUM 29:14 పదమూడు కోడెల్లో ప్రతి దానితో పాటు భోజనార్పణగా నూనెతో కలిపిన మూడు ఓమెర్ల పిండి తేవాలి; రెండు పొట్టేళ్లలో ఒక్కో దానితో రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి;
NUM 29:15 పద్నాలుగు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు నాణ్యమైన పిండి అర్పించాలి.
NUM 29:16 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
NUM 29:17 “ ‘రెండవ రోజున లోపం లేని పన్నెండు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
NUM 29:18 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
NUM 29:19 అంతేకాక, ప్రతిరోజు దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
NUM 29:20 “ ‘మూడవ రోజు లోపం లేని పదకొండు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
NUM 29:21 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
NUM 29:22 అంతేకాక, ప్రతిరోజు దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
NUM 29:23 “ ‘నాలుగవ రోజున లోపం లేని పది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
NUM 29:24 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
NUM 29:25 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
NUM 29:26 “ ‘అయిదవ రోజు లోపం లేని తొమ్మిది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
NUM 29:27 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
NUM 29:28 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
NUM 29:29 “ ‘ఆరవరోజు లోపం లేని ఎనిమిది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
NUM 29:30 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
NUM 29:31 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
NUM 29:32 “ ‘ఏడవ రోజున లోపం లేని ఏడు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
NUM 29:33 కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
NUM 29:34 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
NUM 29:35 “ ‘ఎనిమిదవ రోజున ప్రత్యేక సభగా కూడుకోవాలి, పని ఏదీ చేయకూడదు.
NUM 29:36 యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలను హోమబలిగా అర్పించాలి.
NUM 29:37 కోడె, పొట్టేలు గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
NUM 29:38 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
NUM 29:39 “ ‘మీ మ్రొక్కుబళ్ళు, స్వేచ్ఛార్పణలతో పాటు వీటిని నియమించబడిన పండుగల్లో యెహోవాకు అర్పించాలి: మీ దహనబలులు, భోజనార్పణలు, పానార్పణలు, సమాధానబలులు.’ ”
NUM 29:40 యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా మోషే ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు.
NUM 30:1 మోషే ఇశ్రాయేలు గోత్ర పెద్దలతో ఇలా చెప్పాడు: “యెహోవా ఆజ్ఞాపించింది ఇదే:
NUM 30:2 ఒక వ్యక్తి యెహోవాకు మ్రొక్కుబడి చేస్తే లేదా ప్రతిజ్ఞ ద్వారా ప్రమాణం చేస్తే, ఆ వ్యక్తి మాట తప్పకుండా, తాను చెప్పినదంతా చేయాలి.
NUM 30:3 “ఒక యువతి తండ్రి ఇంట ఉన్నప్పుడు యెహోవాకు మ్రొక్కుబడి చేస్తే లేదా ప్రతిజ్ఞ చేస్తే,
NUM 30:4 తన తండ్రి దాన్ని గురించి వినిన తర్వాత తనను ఏమి అనకపోతే అప్పుడు ఆ యువతి మ్రొక్కుబళ్ళు లేదా తాను చేసిన ప్రతి ప్రతిజ్ఞ నిలుస్తుంది.
NUM 30:5 అయితే, తన తండ్రి దాని గురించి విని ఒప్పుకోకపోతే, అప్పుడు ఆ యువతి చేసిన మ్రొక్కుబళ్ళు లేదా ప్రతిజ్ఞలు ఏవి కూడా నిలువవు; తన తండ్రి ఒప్పుకోలేదు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తారు.
NUM 30:6 “ఆమె మ్రొక్కుబడి చేసుకున్న తర్వాత లేదా అవివేకంగా ప్రమాణం చేసిన తర్వాత ఆమె పెళ్ళి చేసుకుంటే,
NUM 30:7 ఆమె భర్తకు ఈ సంగతి తెలుసుకుని అతడు మౌనంగా ఉంటే ఆమె మ్రొక్కుబళ్ళు లేదా ప్రతిజ్ఞలు నిలుస్తాయి.
NUM 30:8 కానీ ఆమె భర్త ఈ సంగతి తెలుసుకుని, అతడు ఆ మ్రొక్కుబడిని లేదా ఆమె అవివేకంగా చేసిన ప్రమాణాన్ని కానీ ఒప్పుకోక రద్దు చేస్తే యెహోవా ఆమెను క్షమిస్తారు.
NUM 30:9 “విధవరాలు లేదా విడాకులు తీసుకున్న స్త్రీ చేసే మ్రొక్కుబడి కానీ ప్రమాణం తప్పనిసరిగా చెల్లించాలి.
NUM 30:10 “ఒక స్త్రీ తన భర్తతో నివసిస్తూ మ్రొక్కుబడి చేస్తే లేదా ప్రతిజ్ఞ చేస్తే,
NUM 30:11 తన భర్త దాన్ని గురించి వినిన తర్వాత తనను ఏమి అనకపోతే అప్పుడు ఆ యువతి మ్రొక్కుబళ్ళు లేదా తాను చేసిన ప్రతి ప్రతిజ్ఞ నిలుస్తుంది.
NUM 30:12 కానీ ఆమె భర్త వాటి గురించి విన్నప్పుడు వాటిని రద్దు చేస్తే, అప్పుడు ఆమె చేసిన మ్రొక్కుబళ్ళు లేదా తన పెదవులతో చేసిన ప్రమాణాలు ఏవి కూడా నిలువవు, యెహోవా ఆమెను క్షమిస్తారు.
NUM 30:13 స్త్రీ తాను ఉపవాసం ఉంటానని చేసుకున్న మ్రొక్కుబడి లేదా ప్రతిజ్ఞను ఆమె భర్త ఒప్పుకోవచ్చు లేదా రద్దు చేయవచ్చు.
NUM 30:14 కానీ ఆమె భర్త కొన్ని రోజుల వరకు కూడా ఏమి అనకుండా ఉంటే, అప్పుడు ఆమె చేసిన మ్రొక్కుబళ్ళు లేదా ప్రతిజ్ఞలు ఒప్పుకుంటున్నాడు. వాటి గురించి విన్నప్పుడు మౌనంగా ఉండడం ద్వారా అతడు వాటిని అంగీకరించాడు.
NUM 30:15 అయితే అతడు వినిన కొద్ది కాలం తర్వాత వాటిని రద్దు చేస్తే అతడు చేసిన తప్పుకు ప్రతిఫలం భరించాలి.”
NUM 30:16 ఇవి భార్యా భర్తల సంబంధం, యవ్వన కుమార్తె తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తండ్రికి తనకు మధ్య ఉండవలసిన సంబంధం గురించి యెహోవా మోషేకు ఇచ్చిన నియమాలు.
NUM 31:1 యెహోవా మోషేతో మాట్లాడుతూ,
NUM 31:2 “ఇశ్రాయేలీయుల కోసం మిద్యానీయుల మీద నీవు ప్రతీకారం తీర్చుకో. ఆ తర్వాత నీవు నీ స్వజనుల దగ్గరకు చేరతావు.”
NUM 31:3 కాబట్టి మోషే ప్రజలతో, “మీలో కొందరు యుద్ధానికి సిద్ధపడి మిద్యానీయుల మీదికి వెళ్లి యెహోవా వారి మీద తీర్చుకోవాలనుకున్న ప్రతీకారాన్ని తీర్చుకోండి.
NUM 31:4 ఇశ్రాయేలు యొక్క ప్రతి గోత్రం నుండి వేయిమంది పురుషులను యుద్ధానికి పంపండి” అని చెప్పాడు.
NUM 31:5 కాబట్టి ఇశ్రాయేలు వంశాల నుండి పన్నెండువేలమంది పురుషులు ఆయుధాలతో యుద్ధం కోసం సిద్ధపడ్డారు.
NUM 31:6 మోషే వారిని యుద్ధానికి పంపాడు, ప్రతి గోత్రం నుండి వేయిమందిని పంపాడు. యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు, తనతో పాటు పరిశుద్ధాలయం నుండి పరికరాలు సంకేతం ఇవ్వడానికి బూరలు తీసుకున్నాడు.
NUM 31:7 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మిద్యానుతో వారు పోరాడారు, ప్రతి మగవాన్ని హతం చేశారు.
NUM 31:8 చచ్చినవారిలో అయిదుగురు మిద్యాను రాజులైన ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ. వారు బెయోరు కుమారుడైన బిలామును కూడా ఖడ్గంతో చంపేశారు.
NUM 31:9 ఇశ్రాయేలీయులు మిద్యానీయుల స్త్రీలను, పిల్లలను బందీగా తీసుకుని వారి పశువులను, మందలను, వారి ఆస్తిని దోచుకున్నారు.
NUM 31:10 వారు మిద్యానీయులు నివసించే పట్టణాలన్ని, వారి శిబిరాలతో, తగలబెట్టారు.
NUM 31:11 వారు తీసుకున్న దోపుడుసొమ్మును, కొల్లగొట్టిన వాటిని, మనుష్యులు, పశువులతో సహా,
NUM 31:12 బందీలను, కొల్లగొట్టిన వాటిని, దోపుడుసొమ్మును తీసుకువచ్చారు యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు సమతల మైదానంలో ఉన్న మోషే, యాజకుడైన ఎలియాజరు ఇశ్రాయేలు సమాజం దగ్గరకు తీసుకువచ్చారు.
NUM 31:13 మోషే, యాజకుడైన ఎలియాజరు సమాజ నాయకులు వారిని కలుసుకోడానికి శిబిరం బయటకు వచ్చారు.
NUM 31:14 మోషే సైన్య అధికారులు అనగా, యుద్ధం నుండి తిరిగివచ్చిన సహస్రాధిపతులు శతాధిపతులపై కోప్పడ్డాడు.
NUM 31:15 “స్త్రీలందరిని మీరు బ్రతకనిచ్చారా?” అని మోషే వారిని అడిగాడు.
NUM 31:16 “వీరు బిలాము సలహా ప్రకారం పెయోరు సంఘటనలో ఇశ్రాయేలీయులు యెహోవా పట్ల నమ్మకద్రోహులుగా ఉండడానికి పురికొల్పినవారు, వీరి మూలంగా యెహోవా ప్రజలు తెగులు ద్వారా మొత్తబడ్డారు.
NUM 31:17 ఇప్పుడు అబ్బాయిలందరిని చంపండి. స్త్రీలలో పురుషులతో లైంగిక సంబంధం కలిగినవారిని చంపండి,
NUM 31:18 కానీ కన్యగా ఉన్న ప్రతి అమ్మాయిని మీ కోసం బ్రతకనివ్వండి.
NUM 31:19 “ఎవరైనా ఎవరినైన చంపినా, లేదా చంపబడిన వారిని తాకినా, తాకినవారు ఏడు రోజులు శిబిరం బయట ఉండాలి. మూడవ రోజున ఏడవ రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి, మీ బందీలను కూడా శుద్ధి చేయాలి.
NUM 31:20 మీ బట్టలను తోలుతో, మేక వెంట్రుకలతో, చెక్కతో చేయబడిన ప్రతీ వస్తువును శుద్ధి చేసుకోవాలి.”
NUM 31:21 అప్పుడు యాజకుడైన ఎలియాజరు యుద్ధానికి వెళ్లిన సైనికులతో, “యెహోవా మోషేకు ఇచ్చిన నియమం ఇది:
NUM 31:22 బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం,
NUM 31:23 అగ్నిని తట్టుకోగలిగిన దేనినైనా అగ్నిలో వేయాలి, ఆపై అది శుద్ధి అవుతుంది. కానీ అది కూడా శుద్ధి జలంతో శుద్ధి చేయబడాలి. అలాగే అగ్నిని తట్టుకోలేని దానిని ఆ నీటిలో వేయాలి.
NUM 31:24 ఏడవ రోజు మీరు బట్టలు ఉతుక్కోండి, మీరు శుద్ధులవుతారు. ఆ తర్వాత శిబిరంలోకి రావచ్చు.”
NUM 31:25 యెహోవా మోషేతో ఇలా చెప్పారు,
NUM 31:26 “నీవూ, యాజకుడైన ఎలియాజరు, సమాజం యొక్క కుటంబ యజమానులు, చెరపట్టబడిన మనుష్యులందరిని, జంతువులన్నిటిని లెక్కబెట్టాలి.
NUM 31:27 ఆ కొల్లగొట్టిన వాటిని యుద్ధంలో పాల్గొన్న సైనికులకు మిగితా సమాజానికి సమానంగా పంచాలి.
NUM 31:28 యుద్ధంలో పోరాడిన సైనికుల భాగం నుండి, ప్రతి అయిదువందల నుండి అనగా మనుష్యులైనా, పశువులైనా, గాడిదలైనా లేదా గొర్రెలైనా సరే ఒకరిని, ఒకదాన్ని యెహోవాకు పన్నుగా వేరు చేయాలి.
NUM 31:29 ఈ పన్ను వారి భాగం నుండి తీసుకుని యాజకుడైన ఎలియాజరుకు యెహోవా భాగంగా ఇవ్వాలి.
NUM 31:30 ఇశ్రాయేలీయుల మిగతా సగం వాటా నుండి, మనుష్యులైనా, పశువులైనా, గాడిదలైనా, గొర్రెలైనా, వీటిలో ఏవైనా సరే, ప్రతి 50 నుండి ఒకటి తీసుకుని, యెహోవా సమావేశ గుడారాన్ని చూసుకునే బాధ్యత కలిగిన లేవీయులకు ఇవ్వాలి.”
NUM 31:31 కాబట్టి మోషే యాజకుడైన ఎలియాజరు యెహోవాకు మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.
NUM 31:32 సైనికులు తీసుకున్న కొల్లగొట్టిన వాటిలో మిగిలి ఉన్న దోపుడుసొమ్ము 6,75,000 గొర్రెలు, 72,000 పశువులు, 61,000 గాడిదలు, 32,000 మంది పురుషులతో పడుకొనని కన్యలు.
NUM 31:36 ఇది యుద్ధంలో పోరాడిన వారి సగం వాటా: 3,37,500 గొర్రెలు
NUM 31:37 వీటిలో యెహోవాకు ఇచ్చినవి 675;
NUM 31:38 36,000 పశువులు, వీటిలో యెహోవాకు ఇచ్చినవి 72;
NUM 31:39 30,500 గాడిదలు, వీటిలో యెహోవాకు ఇచ్చినవి 61;
NUM 31:40 16,000 మంది మనుష్యులు, వీరిలో యెహోవాకు ప్రత్యేకింపబడినవారు 32.
NUM 31:41 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే యాజకుడైన ఎలియాజరుకు యెహోవా భాగంగా ఇచ్చాడు.
NUM 31:42 సైనికుల భాగం నుండి ఇశ్రాయేలు సమాజం కోసం మోషే వేరుగా ఉంచిన సగభాగం ఇది: 3,37,500 గొర్రెలు, 36,000 పశువులు, 30,500 గాడిదలు, 16,000 మంది మనుష్యులు.
NUM 31:47 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే, ఇశ్రాయేలీయుల సగభాగంలో నుండి, ప్రతి యాభైమంది మనుష్యుల్లో నుండి ఒకరిని, జంతువుల్లో నుండి ఒకదాన్ని ఎంచుకుని, యెహోవా సమావేశ గుడారాన్ని చూసుకునే బాధ్యత కలిగిన లేవీయులకు ఇచ్చాడు.
NUM 31:48 తర్వాత సైన్యానికి అధికారులుగా ఉన్న సహస్రాధిపతులు, శతాధిపతులు మోషే దగ్గరకు వచ్చి,
NUM 31:49 మోషేతో, “మేము సైనికుల లెక్క చూశాము. మాలో ఏ ఒక్కరు కూడా తప్పిపోలేదు.
NUM 31:50 కాబట్టి యెహోవా సన్నిధిలో మాకు ప్రాయశ్చిత్తం కలగాలని మేము భుజ కడియాలు, కడియాలు, ఉంగరాలు, చెవిపోగులు, మెడ హారాలు యెహోవాకు అర్పణగా తెచ్చాము” అని చెప్పారు.
NUM 31:51 మోషే, యాజకుడైన ఎలియాజరు వారి నుండి బంగారు ఆభరణాలు తీసుకున్నారు.
NUM 31:52 సహస్రాధిపతుల నుండి, శతాధిపతుల నుండి వారు తీసుకుని, యెహోవాకు అర్పణగా అర్పించిన బంగారం మొత్తం 16,750 షెకెళ్ళు.
NUM 31:53 ప్రతి సైనికుడు తన కోసం తాను దోపుడుసొమ్మును తీసుకున్నాడు.
NUM 31:54 సహస్రాధిపతుల శతాధిపతుల దగ్గర నుండి మోషే, యాజకుడైన ఎలియాజరు ఆ బంగారం తీసుకుని ఇశ్రాయేలీయులకు యెహోవా ఎదుట జ్ఞాపకార్థంగా సమావేశ గుడారంలో ఉంచారు.
NUM 32:1 చాలా ఎక్కువ పశువుల మందలు కలిగిన రూబేనీయులు, గాదీయులు తమ పశువులకు యాజెరు, గిలాదు ప్రాంతాలు తగిన స్థలాలని చూశారు.
NUM 32:2 కాబట్టి వారు మోషే, యాజకుడైన ఎలియాజరు, సమాజ నాయకుల దగ్గరకు వచ్చి,
NUM 32:3 “అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఎల్యాలెహు, షెబాము, నెబో, బెయోను ప్రాంతాలు,
NUM 32:4 ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన స్థలం పశువులకు తగిన స్థలాలు, మీ సేవకులమైన మాకు పశువులు ఉన్నాయి.
NUM 32:5 మీరు మా పట్ల దయ చూపిస్తే ఈ స్థలం మీ సేవకులమైన మాకు స్వాస్థ్యంగా ఇవ్వండి. మమ్మల్ని యొర్దాను అవతలికి దాటించకండి” అని అన్నారు.
NUM 32:6 మోషే రూబేనీయులతో, గాదీయులతో, “మీరు ఇక్కడ కూర్చుని ఉండగా మీ తోటి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్లాలా?” అని అడిగాడు.
NUM 32:7 “యెహోవా ఇచ్చిన దేశానికి ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులను ఎందుకు నిరాశపరుస్తారు?
NUM 32:8 మీ తండ్రులను కాదేషు బర్నియాకు స్థలాన్ని చూసి రమ్మని పంపితే వారు ఇలాగే చేశారు.
NUM 32:9 వారు ఎష్కోలు లోయలోకి వెళ్లి తిరిగివచ్చి, యెహోవా వారికిచ్చిన వాగ్దాన భూమికి ప్రవేశించకుండా ఇశ్రాయేలీయులను నిరాశ పరిచారు.
NUM 32:10 ఆ రోజు యెహోవా కోపం వారిపై రగులుకొని, ఆయన ఇలా ప్రమాణం చేశారు:
NUM 32:11 ‘వారు హృదయమంతటితో నన్ను వెంబడించలేదు కాబట్టి, ఈజిప్టు నుండి వచ్చిన వారిలో ఇరవై సంవత్సరాలు ఆ పైబడి వయస్సు ఉన్నవారు ఎవ్వరూ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ఈ దేశాన్ని చూడరు.
NUM 32:12 కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ మాత్రమే వెళ్తారు, ఎందుకంటే వీరు యెహోవాను హృదయమంతటితో వెంబడించారు.’
NUM 32:13 యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకుంది. ఆయన వారు అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరిగేలా చేశారు, ఆయన దృష్టి నుండి చెడు చేసిన వారందరు చనిపోయే వరకు అలా చేశారు.
NUM 32:14 “ఇక్కడ మీరు, పాపుల సంతానం, మీ తండ్రుల స్థానంలో నిలబడి, యెహోవాకు ఇశ్రాయేలుపై మరింత కోపం తెప్పిస్తున్నారు.
NUM 32:15 మీరు ఆయనను వెంబడించకుండా తప్పుకుంటే, ఆయన మరలా ప్రజలందరినీ అరణ్యంలో వదిలేస్తారు వారి నాశనానికి మీరే కారణం అవుతారు.”
NUM 32:16 వారు అతని దగ్గరకు వచ్చి, “మేము ఇక్కడ మందలకు కావలసిన దొడ్లు మా స్త్రీలు, పిల్లలకు పట్టణాలు కట్టుకుంటాము.
NUM 32:17 కానీ మేము యుద్ధానికి మమ్మల్ని మేము సిద్ధంగా ఉంచుకుని ఇశ్రాయేలీయులకు ముందుగా వెళ్తూ వారు వారి స్థలాలకు చేరేవరకు ఉంటాము. ఆ సమయంలో మా స్త్రీలు, పిల్లలు కోటగోడలు గల పట్టణాల్లో ఉంటూ, ప్రాంత నివాసులకు కాపుదలగా ఉంటారు.
NUM 32:18 ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరు తమ వారసత్వం స్వాధీనం చేసుకునేవరకు మా గృహాలకు వెళ్లము.
NUM 32:19 యొర్దానుకు అవతల వారసత్వం పొందుకోము ఎందుకంటే మా వారసత్వం యొర్దాను తూర్పు ప్రదేశంలో ఉంది.”
NUM 32:20 అప్పుడు మోషే వారితో, “మీరు ఇలా చేస్తే అంటే మీరు యుద్ధం కోసం యెహోవా ఎదుట సిద్ధంగా ఉంటే,
NUM 32:21 ఆయుధాలు ధరించిన మీరందరూ యొర్దాను దాటి యెహోవా తన శత్రువులను తన ఎదుట నుండి తరిమికొట్టే వరకు యొర్దానును దాటితే,
NUM 32:22 దేశం యెహోవా ఎదుట వశపరచబడినప్పుడు, మీరు తిరిగివచ్చి యెహోవాకు, ఇశ్రాయేలుకు మీ బాధ్యత నుండి విముక్తి పొందవచ్చు. ఈ దేశం యెహోవా ఎదుట మీకు స్వాస్థ్యంగా ఉంటుంది.
NUM 32:23 “కానీ మీరు ఇలా చేయకపోతే, యెహోవాకు విరోధంగా పాపం చేసినవారవుతారు; మీ పాపం మిమ్మల్ని వెంటాడుతుందని ఖచ్చితంగా నమ్మవచ్చు.
NUM 32:24 ఇప్పుడు మీ స్త్రీల కోసం, పిల్లల కోసం పట్టణాలు, మీ మందల దొడ్లు నిర్మించుకోండి, కానీ మీరు చెప్పినదంతా చేయండి.”
NUM 32:25 గాదీయులు, రూబేనీయులు మోషేతో ఇలా అన్నారు, “మీ సేవకులైన మేము మా ప్రభువా ఆజ్ఞాపించినట్లే చేస్తాము.
NUM 32:26 మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, పశువులు ఇక్కడే గిలాదు పట్టణాల్లో ఉంటారు.
NUM 32:27 అయితే, యుద్ధానికి సిద్ధపడిన మీ సేవకుల మందరం మా ప్రభువా చెప్పినట్లు, యెహోవా ఎదుట యుద్ధానికి యొర్దానును దాటుతాము.”
NUM 32:28 అప్పుడు మోషే వారి గురించి యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, ఇశ్రాయేలీయుల గోత్రాల కుటుంబ పెద్దలకు ఆదేశించాడు.
NUM 32:29 మోషే వారితో అన్నాడు, “గాదీయులు, రూబేనీయులు, వీరిలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు యెహోవా ఎదుట మీతో యొర్దానును దాటుతారు, అప్పుడు ఆ స్థలాన్ని జయించినప్పుడు, మీరు గిలాదు భూమిని వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలి.
NUM 32:30 కానీ వారు ఒకవేళ ఆయుధాలు ధరించి మీతో దాటకపోతే, వారు కనానులో మీ దగ్గర తమ స్వాస్థ్యాన్ని అంగీకరించాలి.”
NUM 32:31 గాదీయులు, రూబేనీయులు జవాబిస్తూ ఇలా అన్నారు, “యెహోవా చెప్పినది మీ సేవకులమైన మేము చేస్తాము.
NUM 32:32 ఆయుధాలు ధరించి యెహోవా ఎదుట కనాను లోనికి వెళ్తాము, కానీ మేము వారసత్వంగా సంపాదించుకునే స్వాస్థ్యం యొర్దానుకు ఇటువైపు ఉంటుంది.”
NUM 32:33 అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడైన మనష్షే అర్థగోత్రానికి అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని దాని పట్టణాలు, వాటి సరిహద్దులతో సహా ఆ స్థలాన్నంతటిని ఇచ్చాడు.
NUM 32:34 గాదీయులు దీబోను, అతారోతు, అరోయేరు,
NUM 32:35 అత్రోత్-షోఫాను, యాజెరు, యొగ్బెహ,
NUM 32:36 బేత్-నిమ్రా, బేత్-హారాను, అనే పట్టణాలను కోటగోడలతో నిర్మించారు, మందలకు దొడ్లు కూడా కట్టుకున్నారు.
NUM 32:37 రూబేనీయులు నిర్మించిన పట్టణాలు హెష్బోను, ఎల్యాలెహు, కిర్యతాయిము,
NUM 32:38 అలాగే నెబో, బయల్-మెయోను (ఈ పేర్లు మార్చబడ్డాయి) షిబ్మా అనే పట్టణాలను నిర్మించుకున్నారు. వారు తిరిగి కట్టుకున్న పట్టణాలకు వారు పేర్లు పెట్టుకున్నారు.
NUM 32:39 మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులు గిలాదుకు వెళ్లి, దాన్ని జయించి, అక్కడ ఉన్న అమోరీయులను తరిమేశారు.
NUM 32:40 కాబట్టి మోషే మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు గిలాదును ఇచ్చాడు. వారు అక్కడే కాపురమున్నారు.
NUM 32:41 మనష్షే వంశస్థుడైన యాయీరు వారి స్థావరాలను స్వాధీనం చేసుకుని వాటికి హవ్వోత్ యాయీరు అని పేరు పెట్టాడు.
NUM 32:42 నోబహు అనేవాడు వెళ్లి కెనాతు దాని స్థావరాలను జయించి ఆ ప్రాంతానికి నోబహు అని తన పేరు పెట్టుకున్నాడు.
NUM 33:1 ఇశ్రాయేలీయులు మోషే అహరోనుల నాయకత్వంలో సేనలుగా ఏర్పడి ఈజిప్టు నుండి బయలుదేరి చేసిన ప్రయాణాలు.
NUM 33:2 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే వారి ప్రయాణాల దశలను నమోదు చేశాడు. ఇవి వారి ప్రయాణాల దశలు:
NUM 33:3 ఇశ్రాయేలీయులు మొదటి నెల పదిహేనవ రోజు అంటే పస్కా తర్వాత రోజున, రామెసేసు నుండి ప్రయాణమయ్యారు. యెహోవా హతం చేసిన తమ జ్యేష్ఠులందరిని ఈజిప్టువారు సమాధి చేస్తూ ఉన్నప్పుడు, వారు చూస్తూ ఉండగా జయోత్సాహంతో బయలుదేరారు; ఎందుకంటే యెహోవా వారి దేవుళ్ళ మీద తీర్పు తీర్చారు.
NUM 33:5 ఇశ్రాయేలీయులు రామెసేసును వదిలి సుక్కోతు దగ్గర దిగారు.
NUM 33:6 వారు సుక్కోతును నుండి బయలుదేరి ఎడారి అంచున ఉన్న ఏతాముకు వచ్చారు.
NUM 33:7 వారు ఏతాము నుండి వెనుకకు తిరిగి బయల్-సెఫోను ఎదురుగా పీ హహీరోతు వైపుకు వెళ్లి మిగ్దోలు ఎదుట దిగారు.
NUM 33:8 పీ హహీరోతు నుండి బయలుదేరి సముద్రం గుండా దాటుతూ ఎడారిలోకి చేరారు, వారు మూడు రోజులు ఏతాము ఎడారిలో ప్రయాణం చేసి మారాలో దిగారు.
NUM 33:9 మారా నుండి బయలుదేరి ఎలీముకు వెళ్లారు, ఎలీములో పన్నెండు నీటి ఊటలు, డెబ్బయి ఈతచెట్లు ఉన్నాయి, వారక్కడ ఉన్నారు.
NUM 33:10 ఎలీము నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర దిగారు.
NUM 33:11 ఎర్ర సముద్రం నుండి బయలుదేరి సీను ఎడారికి వచ్చారు.
NUM 33:12 సీను ఎడారి నుండి బయలుదేరి దోపకాకు వచ్చారు.
NUM 33:13 దోపకా నుండి బయలుదేరి ఆలూషుకు వచ్చారు.
NUM 33:14 ఆలూషు నుండి బయలుదేరి రెఫీదీముకు వచ్చారు. అక్కడ ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు.
NUM 33:15 రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చారు.
NUM 33:16 సీనాయి ఎడారి నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.
NUM 33:17 కిబ్రోతు హత్తావా నుండి బయలుదేరి హజేరోతుకు వచ్చారు.
NUM 33:18 హజేరోతు నుండి బయలుదేరి రిత్మాకు వచ్చారు.
NUM 33:19 రిత్మా నుండి బయలుదేరి రిమ్మోను పెరెజుకు వచ్చారు.
NUM 33:20 రిమ్మోను పెరెజు నుండి బయలుదేరి లిబ్నాకు వచ్చారు.
NUM 33:21 లిబ్నా నుండి బయలుదేరి రీసాకు వచ్చారు.
NUM 33:22 రీసా నుండి బయలుదేరి కేహేలాతాకు వచ్చారు.
NUM 33:23 కేహేలాతా నుండి బయలుదేరి షాపెరు పర్వతముకు వచ్చారు.
NUM 33:24 షాపెరు పర్వతము నుండి బయలుదేరి హరాదాకు వచ్చారు.
NUM 33:25 హరాదా నుండి బయలుదేరి మకెలోతుకు వచ్చారు.
NUM 33:26 మకెలోతు నుండి బయలుదేరి తాహతుకు వచ్చారు.
NUM 33:27 తాహతు నుండి బయలుదేరి తారహుకు వచ్చారు.
NUM 33:28 తారహు నుండి బయలుదేరి మిత్కాకు వచ్చారు.
NUM 33:29 మిత్కా నుండి బయలుదేరి హష్మోనాకు వచ్చారు.
NUM 33:30 హష్మోనా నుండి బయలుదేరి మొసేరోతుకు వచ్చారు.
NUM 33:31 మొసేరోతు నుండి బయలుదేరి బెనె యహకానుకు వచ్చారు.
NUM 33:32 బెనె యహకాను నుండి బయలుదేరి హోర్-హగ్గిద్గాదుకు వచ్చారు.
NUM 33:33 హోర్-హగ్గిద్గాదు నుండి బయలుదేరి యొత్బాతాకు వచ్చారు.
NUM 33:34 యొత్బాతా నుండి బయలుదేరి ఎబ్రోనాకు వచ్చారు.
NUM 33:35 ఎబ్రోనా నుండి బయలుదేరి ఎసోన్-గెబెరుకు వచ్చారు.
NUM 33:36 ఎసోన్-గెబెరు నుండి బయలుదేరి సీను ఎడారిలో ఉన్న కాదేషుకు వచ్చారు.
NUM 33:37 కాదేషు నుండి బయలుదేరి ఎదోము సరిహద్దులో ఉన్న హోరు పర్వతం దగ్గర దిగారు.
NUM 33:38 యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడైన అహరోను హోరు పర్వతం మీద చనిపోయాడు, ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన నలభైయవ సంవత్సరం, అయిదవ నెల, మొదటి రోజున అతడు చనిపోయాడు.
NUM 33:39 హోరు పర్వతం మీద అహరోను చనిపోయినప్పుడు అతని వయస్సు నూట యిరవై మూడు సంవత్సరాలు.
NUM 33:40 కనాను దక్షిణ దిక్కున కనానీయుడైన అరాదు పట్టణ రాజు ఇశ్రాయేలీయులు వస్తున్నారని విన్నాడు.
NUM 33:41 వారు హోరు పర్వతం నుండి బయలుదేరి సల్మానాకు వచ్చారు.
NUM 33:42 సల్మానా నుండి బయలుదేరి పూనొనుకు వచ్చారు.
NUM 33:43 పూనొను నుండి బయలుదేరి ఓబోతుకు వచ్చారు.
NUM 33:44 ఓబోతు నుండి బయలుదేరి మోయాబు సరిహద్దులో ఉన్న ఈయ్యె-అబారీముకు వచ్చారు.
NUM 33:45 ఈయ్యె-అబారీము నుండి బయలుదేరి దీబోనుగాదుకు వచ్చారు.
NUM 33:46 దీబోనుగాదు నుండి బయలుదేరి అల్మోన్-దిబ్లాతయీముకు వచ్చారు.
NUM 33:47 అల్మోన్-దిబ్లాతయీము నుండి బయలుదేరి నెబో ఎదుట ఉన్న అబారీము పర్వతాల దగ్గర దిగారు.
NUM 33:48 అబారీము పర్వతాల నుండి బయలుదేరి యెరికోకు దగ్గర యొర్దాను అవతలి వైపున మోయాబు సమతల మైదానాల్లో దిగారు.
NUM 33:49 మోయాబు సమతల మైదానంలో బేత్-యెషిమోతు మొదలుకొని ఆబేల్-షిత్తీము వరకు యొర్దాను దగ్గర దిగారు.
NUM 33:50 యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు సమతల మైదానంలో యెహోవా మోషేతో ఇలా మాట్లాడారు,
NUM 33:51 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు యొర్దాను దాటి కనానుకు వెళ్లినప్పుడు,
NUM 33:52 ఆ దేశవాసులందర్నీ తరిమేయాలి. వారి రాతి విగ్రహాలను, కోట విగ్రహాలను నాశనం చేయాలి వారి క్షేత్రాలను పడగొట్టాలి.
NUM 33:53 ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించండి ఎందుకంటే మీరు స్వాధీనపరచుకోడానికి ఆ దేశాన్ని మీకు ఇచ్చాను.
NUM 33:54 చీట్లు వేసి మీ వంశాల ప్రకారం ఆ దేశాన్ని పంచుకోండి. పెద్ద గోత్రాలకు ఎక్కువ వారసత్వం చిన్న గోత్రాలకు తక్కువ వారసత్వంగా పంచుకోండి. చీట్లలో ఏది వస్తే, అది వారికి చెందుతుంది. మీ పూర్వికుల గోత్రాల ప్రకారం దానిని పంచుకోండి.
NUM 33:55 “ ‘అయితే ఆ దేశవాసులను మీరు తరిమివేయకపోతే, అక్కడ ఉండడానికి అనుమతించిన వారు మీ కళ్లలో ముళ్ళుగా, మీ ప్రక్కలలో శూలాలుగా చేసినవారవుతారు. మీరు నివసించే భూమిలో వారు మిమ్మల్ని కష్ట పెడతారు.
NUM 33:56 అప్పుడు నేను వారికేమి చేయాలని అనుకున్నానో, అది మీకు చేస్తాను.’ ”
NUM 34:1 యెహోవా మోషేతో ఇలా చెప్పారు,
NUM 34:2 “నీవు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తూ వారికి ఇలా చెప్పు: ‘మీరు కనానులో ప్రవేశించిన తర్వాత, మీకు వారసత్వంగా కేటాయించబడే భూములకు చెందిన సరిహద్దులు:
NUM 34:3 “ ‘మీ దక్షిణం వైపు ఎదోము సరిహద్దు ప్రక్కన సీను ఎడారిలో కొద్ది భాగం ఉంటుంది. మీ దక్షిణ సరిహద్దు మృత సముద్రం యొక్క దక్షిణ చివర తూర్పు దిక్కున ప్రారంభమై,
NUM 34:4 దక్షిణం వైపు అక్రబ్బీం కనుమ నుండి తిరిగి సీను వరకు వ్యాపించి కాదేషు బర్నియాకు దక్షిణంగా ఉంటుంది. అక్కడినుండి హజర్ అద్దారుకు, అక్కడినుండి అజ్మోను వరకు,
NUM 34:5 అజ్మోను నుండి తిరిగి ఈజిప్టు వాగు వైపు తిరిగి మధ్యధరా సముద్రం దగ్గర ముగుస్తుంది.
NUM 34:6 మీ పడమటి సరిహద్దు మధ్యధరా సముద్ర తీరము. ఇదే మీ పడమటి వైపు సరిహద్దుగా ఉంటుంది.
NUM 34:7 మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం నుండి హోరు పర్వతం వరకు
NUM 34:8 హోరు పర్వతం నుండి లెబో హమాతు వరకు అక్కడినుండి సరిహద్దు సెదాదు వరకు వెళ్తూ,
NUM 34:9 అక్కడినుండి జిఫ్రోను వరకు కొనసాగుతూ హజర్-ఎనాను వరకు వ్యాపిస్తుంది. ఇది మీకు ఉత్తర సరిహద్దుగా ఉంటుంది.
NUM 34:10 మీ తూర్పు సరిహద్దు హజర్-ఎనాను నుండి షెఫాము వరకు ఉంటుంది.
NUM 34:11 సరిహద్దు షెఫాము నుండి ఆయినుకు తూర్పు వైపు రిబ్లా వరకు వెళ్లి కిన్నెరెతు సరస్సు తూర్పున ఉన్న వాలుల వెంట కొనసాగుతుంది.
NUM 34:12 తర్వాత ఆ సరిహద్దు యొర్దాను గుండా వెళ్తూ మృత సముద్రం వరకు వ్యాపిస్తుంది.
NUM 34:13 మోషే ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు చీట్లు వేసి ఈ దేశాన్ని ఒక వారసత్వంగా కేటాయించాలి. తొమ్మిదిన్నర గోత్రాలకు ఇవ్వమని యెహోవా ఆదేశించారు,
NUM 34:14 ఎందుకంటే రూబేను గోత్రికులు, గాదు గోత్రికులు, మనష్షే అర్థగోత్రం, తమ తమ కుటుంబాలు వారసత్వం పొందారు.
NUM 34:15 ఈ రెండున్నర గోత్రాల వారు యెరికోకు తూర్పున యొర్దానుకు అవతలి వైపు, సూర్యోదయం వైపున ఉన్న భూభాగాన్ని స్వాస్థ్యంగా పొందుకున్నారు.”
NUM 34:16 యెహోవా మోషేతో అన్నారు,
NUM 34:17 “మీకు భూమిని స్వాస్థ్యంగా కేటాయించే పురుషుల పేర్లు ఇవి: యాజకుడైన ఎలియాజరు నూను కుమారుడైన యెహోషువ.
NUM 34:18 భూకేటాయింపు కోసం సహాయపడడానికి ప్రతి గోత్రం నుండి ఒక నాయకున్ని నియమించు.
NUM 34:19 “వారి పేర్లు ఇవి: “యూదా గోత్రం నుండి, యెఫున్నె కుమారుడైన కాలేబు;
NUM 34:20 షిమ్యోను గోత్రం నుండి అమీహూదు కుమారుడైన షెమూయేలు;
NUM 34:21 బెన్యామీను గోత్రం నుండి కిస్లోను కుమారుడైన ఎలీదాదు;
NUM 34:22 దాను గోత్రం నుండి యొగ్లీ కుమారుడైన బుక్కీ నాయకుడు;
NUM 34:23 యోసేపు కుమారుడైన మనష్షే గోత్రం నుండి ఏఫోదు కుమారుడైన హన్నీయేలు నాయకుడు;
NUM 34:24 ఎఫ్రాయిం గోత్రం నుండి షిఫ్తాను కుమారుడైన కెమూయేలు నాయకుడు;
NUM 34:25 జెబూలూను గోత్రం నుండి పర్నాకు కుమారుడైన ఎలీషాపాను నాయకుడు;
NUM 34:26 ఇశ్శాఖారు గోత్రం నుండి అజ్జాను కుమారుడైన పల్తీయేలు నాయకుడు;
NUM 34:27 ఆషేరు గోత్రం నుండి షెలోమి కుమారుడైన అహీహూదు నాయకుడు;
NUM 34:28 నఫ్తాలి గోత్రం నుండి అమీహూదు కుమారుడైన పెదహేలు నాయకుడు.”
NUM 34:29 కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారసత్వ భూమిని కేటాయించడానికి యెహోవా ఈ పురుషులను నియమించారు.
NUM 35:1 మోయాబు సమతల మైదానాల్లో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ఉన్న ప్రాంతంలో యెహోవా మోషేతో అన్నారు,
NUM 35:2 “ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకునే స్వాస్థ్యం నుండి పట్టణాలను లేవీయులు నివసించడానికి ఇమ్మని ఆజ్ఞాపించు. పట్టణాల చుట్టూ ఉన్న పచ్చికబయళ్లు వారికి ఇవ్వాలి.
NUM 35:3 అప్పుడు వారు నివసించడానికి పట్టణాలు కలిగి ఉంటారు వారి సొంత పశువుల కోసం, ఇతర జంతువుల కోసం పచ్చికబయళ్లు ఉంటాయి.
NUM 35:4 “లేవీయులకు ఇచ్చే పట్టణాల చుట్టూ ఉండే పచ్చికబయళ్లు పట్టణ ప్రాకారానికి 1,000 క్యూబిట్‌ల దూరంలో ఉంటుంది.
NUM 35:5 పట్టణం బయట తూర్పు దిక్కున 2,000 క్యూబిట్‌ల దక్షిణ దిక్కున 2,000 క్యూబిట్‌ల, పడమటి దిక్కున 2,000 క్యూబిట్‌ల, ఉత్తర దిక్కున 2,000 క్యూబిట్‌లు కొలవాలి, దాని కేంద్రంగా పట్టణం ఉంటుంది. వారు ఈ భూభాగాన్ని పట్టణాలకు పచ్చికబయళ్లుగా కలిగి ఉంటారు.
NUM 35:6 “లేవీయులకు ఇచ్చే వాటిలో ఆరు పట్టణాలు ఆశ్రయపురాలుగా ఉండాలి. ప్రమాదవశాత్తు ఎవరినైనా చంపితే ఆ వ్యక్తి ఇక్కడకు పారిపోవచ్చు. వీటితో సహా 42 పట్టణాలు వారికి ఇవ్వాలి.
NUM 35:7 మొత్తం 48 పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో సహా లేవీయులకు ఇవ్వాలి.
NUM 35:8 ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకునే వాటిలో లేవీయులకు ఇచ్చే పట్టణాలు ప్రతి గోత్రం వారి వారసత్వం నుండి ఇవ్వాలి. ఎక్కువ పట్టణాలు గల గోత్రం నుండి ఎక్కువ పట్టణాలు, తక్కువ ఉన్న వారి నుండి తక్కువ తీసుకోవాలి.”
NUM 35:9 తర్వాత యెహోవా మోషేతో ఇలా మాట్లాడారు:
NUM 35:10 “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు యొర్దాను దాటి కనానుకు వెళ్లినప్పుడు,
NUM 35:11 కొన్ని పట్టణాలను ఆశ్రయపురాలుగా ఎన్నుకోండి. ప్రమాదవశాత్తు ఒకరు ఎవరినైన చంపితే, వాటికి పారిపోయి ఆశ్రయం పొందవచ్చు.
NUM 35:12 ఆ పట్టణాలు ప్రతీకారం తీర్చుకునే వారి నుండి కాపాడుకోడానికి ఆశ్రయంగా ఉంటాయి, తద్వారా హత్యకు పాల్పడిన ఎవరైనా సమాజం ముందు విచారణకు రాకముందు చంపబడరు.
NUM 35:13 ఈ ఆరు పట్టణాలు మీ ఆశ్రయ పట్టణాలుగా ఉంటాయి.
NUM 35:14 మూడు యొర్దానుకు ఇటువైపు, మూడు కనాను దేశంలో ఆశ్రయపురాలుగా ఇవ్వాలి.
NUM 35:15 ఈ ఆరు పట్టణాలు ఇశ్రాయేలీయులు వారి మధ్య నివసించే విదేశీయులకు ఆశ్రయపురాలుగా ఉంటాయి, తద్వార, ప్రమాదవశాత్తు ఒకరు ఎవరినైన చంపితే, వాటికి పారిపోయి ఆశ్రయం పొందవచ్చు.
NUM 35:16 “ ‘ఎవరైనా ఇనుప వస్తువుతో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి.
NUM 35:17 లేదా ఒకవేళ ఎవరైనా ఒక రాయితో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి.
NUM 35:18 లేదా ఒకవేళ ఎవరైనా ఒక చెక్క వస్తువుతో ఎవరినైన చచ్చేటట్టు కొడితే, ఆ వ్యక్తి హంతకుడు; హంతకుడు మరణశిక్ష పొందాలి.
NUM 35:19 పగ తీర్చుకునేవాడు ఆ హంతకునికి మరణశిక్ష వేయాలి; పగ తీర్చుకునేవాడు హంతకున్ని పట్టుకున్నప్పుడు అతన్ని చంపుతాడు.
NUM 35:20 ఎవరైనా పగతో నెట్టినా లేదా వారివైపు ఉద్దేశపూర్వకంగా చేతిలో ఉన్నదానిని వారి మీదికి విసిరివేసినా, వారు చనిపోతే
NUM 35:21 లేదా శత్రుత్వం బట్టి ఒకరిని పిడికిలితో కొడితే ఆ వ్యక్తి చస్తే, వాడు మరణశిక్ష పొందాలి; ఆ వ్యక్తి హంతకుడు. పగ తీర్చుకునేవాడు అతన్ని కలిసినప్పుడు అతన్ని చంపుతాడు.
NUM 35:22 “ ‘అయితే ఎవరైనా శత్రుత్వం లేకుండ ఎవరినైన అకస్మాత్తుగా నెట్టినా, లేదా వారివైపు అనుకోకుండ ఏదైనా విసిరినా,
NUM 35:23 లేదా చూడకుండ బరువైన రాయి వేసినా, వారు చనిపోతే, వేసినవానికి వారు శత్రువు కాదు హాని చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి,
NUM 35:24 సమాజం నిందితునికి, పగతీర్చుకునే వానికి మధ్య ఉండి ఈ చట్టాల ప్రకారం తీర్పు తీర్చాలి.
NUM 35:25 సమాజం ఆ నిందితుడిని పగతీర్చుకునే వాని నుండి కాపాడి తిరిగి అతడు పారిపోయిన ఆశ్రయపురానికి పంపించాలి. నిందితుడు పరిశుద్ధ నూనెతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు చనిపోయే వరకు అక్కడే ఉండాలి.
NUM 35:26 “ ‘ఒకవేళ నిందితుడు తాను వెళ్లిన ఆశ్రయపురం నుండి బయటకు వెళ్తే,
NUM 35:27 పగ తీర్చుకునేవాడు అతన్ని ఆశ్రయపురం బయట చూస్తే, అతన్ని చంపవచ్చు, అది హత్యగా లెక్కించబడదు.
NUM 35:28 ప్రధాన యాజకుడు చనిపోయే వరకు నిందితుడు ఆశ్రయపురం లోనే ఉండాలి. ఆ తర్వాత అతడు తన స్వస్థలానికి వెళ్లిపోవచ్చు.
NUM 35:29 “ ‘ఇది మీరు ఎక్కడ నివసించినా, రాబోయే తరాలలో మీ కోసం చట్టబద్ధమైన నియమంగా ఉంటుంది.
NUM 35:30 “ ‘సాక్షుల నోటి మాటను బట్టి హంతకులు మరణశిక్ష పొందుతారు. అయితే ఒక్క సాక్షి సాక్ష్యాన్ని బట్టి ఏ ఒక్కరికీ మరణశిక్ష విధించబడకూడదు.
NUM 35:31 “ ‘శిక్ష పొందాల్సిన హంతకుల జీవితం కోసం విమోచన క్రయధనం స్వీకరించకూడదు. వారు మరణశిక్ష పొందాలి.
NUM 35:32 “ ‘ఆశ్రయపురానికి పారిపోయినవారి నుండి విమోచన క్రయధనం స్వీకరించకూడదు, ప్రధాన యాజకుడు చనిపోకముందు వారిని తమ స్వస్థలానికి పంపించవద్దు.
NUM 35:33 “ ‘మీరున్న భూమిని కలుషితం చేయకండి. రక్తపాతం దేశాన్ని కలుషితం చేస్తుంది రక్తపాతం చేసిన ఆ వ్యక్తి రక్తం ద్వారానే తప్ప ఆ భూమికి ప్రాయశ్చిత్తం చేయలేము.
NUM 35:34 మీరు నివసించే, నేను నివసించే భూమిని అపవిత్రం చేయవద్దు, ఎందుకంటే, యెహోవానైన నేను, ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాను.’ ”
NUM 36:1 యోసేపు వంశం నుండి వచ్చిన మనష్షే కుమారుడు మాకీరు, గిలాదు వంశ పెద్దలు వచ్చి నాయకులు, ఇశ్రాయేలీయుల కుటుంబాల పెద్దలు ఎదుట మోషేతో మాట్లాడారు.
NUM 36:2 “చీట్లు వేసి ఇశ్రాయేలీయులకు భూమిని వారసత్వంగా ఇవ్వమని యెహోవా మా ప్రభువుకు ఆజ్ఞాపించినప్పుడు మా సహోదరుడు సెలోఫెహాదు భూ వారసత్వాన్ని అతని కుమార్తెలకు ఇమ్మని ఆజ్ఞాపించారు.
NUM 36:3 ఒకవేళ వారు ఇతర ఇశ్రాయేలు గోత్రం వారిని పెళ్ళి చేసుకుంటే, అప్పుడు వారి వారసత్వం పూర్వికుల గోత్రం నుండి మారి వేరే వారు పెళ్ళి చేసుకున్న వారి గోత్రంలో కలిసిపోతుంది. కాబట్టి వారి వారసత్వం లోని భాగం తీసివేయబడుతుంది.
NUM 36:4 ఇశ్రాయేలు యొక్క మహోత్సవ సంవత్సరం వచ్చినప్పుడు, వారి వారసత్వం వారు పెళ్ళి చేసుకున్న వారి గోత్రంలో కలిసిపోతుంది, మా పూర్వికుల వంశ వారసత్వం నుండి స్వాస్థ్యం పోతుంది” అని అంటూ చెప్పారు.
NUM 36:5 అప్పుడు యెహోవా ఆజ్ఞమేరకు మోషే ఇశ్రాయేలీయులను ఆదేశించాడు: “యోసేపు సంతతివారి గోత్రం వారు తెచ్చిన ఫిర్యాదు సరియైనదే.
NUM 36:6 సెలోఫెహాదు కుమార్తెల గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించారు: వారు తమకు ఇష్టం వచ్చిన వారిని పెళ్ళి చేసుకోవచ్చు, కానీ అది వారి తండ్రి గోత్ర వంశం వారై ఉండాలి.
NUM 36:7 ఇశ్రాయేలు ప్రజల వారసత్వం ఒక గోత్రం నుండి ఇంకొక గోత్రం లోకి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరూ తమ పూర్వికుల గోత్ర వారసత్వాన్ని తమ వంశం లోనే ఉంచుకోవాలి.
NUM 36:8 ఇశ్రాయేలు ప్రజల గోత్రాల్లో వారసత్వం ఉన్న ప్రతి కుమార్తె తన తండ్రి గోత్రం వారినే పెళ్ళి చేసుకోవాలి. ఈ విధంగా వారి వారి పూర్వికులు వారసత్వం వారి స్వాధీనంలోనే ఉంటుంది.
NUM 36:9 వారసత్వం ఒక వంశం నుండి ఇంకొక వంశానికి వెళ్లకూడదు. ప్రతి ఇశ్రాయేలు గోత్రం వారు వారసత్వ భూమిని కాపాడుకోవాలి.”
NUM 36:10 కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం సెలోఫెహాదు కుమార్తెలు చేశారు.
NUM 36:11 సెలోఫెహాదు కుమార్తెలైన మహ్లా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోవా తమ తండ్రి సహోదరుల కుమారులను పెళ్ళి చేసుకున్నారు.
NUM 36:12 వీరు యోసేపు కుమారుడైన మనష్షే సంతతివారిని పెళ్ళి చేసుకున్నారు వారి వారసత్వం వారి తండ్రి గోత్రం లోనే, వంశం లోనే నిలిచింది.
NUM 36:13 ఇవి మోయాబు సమతల మైదానంలో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ప్రాంతంలో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు, నియమాలు ఇచ్చారు.
DEU 1:1 యొర్దానుకు తూర్పున ఉన్న అరణ్యంలో అనగా పారానుకు తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహబ్ అనే స్థలాలకు మధ్య సూఫుకు ఎదురుగా ఉన్న అరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవి.
DEU 1:2 (సాధారణంగా శేయీరు పర్వత దారి గుండా హోరేబు నుండి కాదేషు బర్నియాకు ప్రయాణించడానికి పదకొండు రోజులు పడుతుంది.)
DEU 1:3 నలభైయవ సంవత్సరం, పదకొండవ నెల మొదటి రోజున మోషే ఇశ్రాయేలీయులను ఉద్దేశించి యెహోవా ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటించాడు.
DEU 1:4 ఇది తాను హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోనును ఓడించిన తర్వాత, ఎద్రెయీ దగ్గర అష్తారోతులో పరిపాలించిన బాషాను రాజైన ఓగును ఓడించిన తర్వాత వారికి ప్రకటించాడు.
DEU 1:5 యొర్దాను తూర్పున మోయాబు దేశంలో మోషే ఈ ధర్మశాస్త్రాన్ని వివరించడం మొదలుపెట్టి ఇలా అన్నాడు:
DEU 1:6 దేవుడైన యెహోవా హోరేబు దగ్గర మనతో ఇలా మాట్లాడారు, “మీరు ఈ పర్వతం దగ్గర చాలా కాలం నుండి ఉన్నారు.
DEU 1:7 మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల కొండ ప్రాంతం వైపు వెళ్లండి; అరాబాలో, పర్వతాల్లో, పశ్చిమ కొండ ప్రాంతంలో, దక్షిణం వైపున సముద్రతీరంలో ఉన్న అన్ని స్థలాలకు, కనాను దేశానికి, లెబానోనుకు మహానదియైన యూఫ్రటీసు వరకు ఉన్న పొరుగు దేశాలకు వెళ్లండి.
DEU 1:8 చూడండి, ఈ దేశాన్ని నేను మీకిచ్చాను. కాబట్టి మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు, వారి తర్వాత వారి సంతానానికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.”
DEU 1:9 ఆ సమయంలో నేను మీతో, “నేను ఒంటరిగా మోయలేనంత భారంగా మీరున్నారు.
DEU 1:10 మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింపజేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఆకాశ నక్షత్రాల్లా లెక్కించలేనంతగా ఉన్నారు.
DEU 1:11 మీ పూర్వికుల దేవుడైన యెహోవా మిమ్మల్ని వెయ్యిరెట్లు ఎక్కువ చేసి ఆయన వాగ్దానం చేసినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక!
DEU 1:12 అయితే నేనొక్కడినే మీ సమస్యలను మీ భారాలను మీ వివాదాలను ఎలా తీర్చగలను?
DEU 1:13 ప్రతి గోత్రంలో నుండి జ్ఞాన వివేకాలు కలిగిన పురుషులను ఎంపిక చేయండి, నేను వారిని మీకు నాయకులుగా నియమిస్తాను” అని చెప్పాను.
DEU 1:14 అందుకు మీరు, “నీవు చెప్పింది బాగుంది” అని జవాబిచ్చారు.
DEU 1:15 కాబట్టి మీ గోత్రాల్లో నుండి జ్ఞానం కలిగి ప్రసిద్ధులైన వారిని పిలిపించి, వారిని మీ గోత్రాలకు అధికారులుగా, వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాను.
DEU 1:16 అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో, “మీ ప్రజలమధ్య ఉన్న వివాదాలు విని, ఇద్దరు ఇశ్రాయేలీయుల మధ్య అయినా లేదా ఒక ఇశ్రాయేలీయునికి ఒక విదేశీయునికి మధ్య అయినాసరే, న్యాయంగానే తీర్పు తీర్చాలి.
DEU 1:17 తీర్పు తీర్చడంలో పక్షపాతం చూపించవద్దు; పేదవారైనా గొప్పవారైనా సరే ఒకే రీతిగా వినాలి, తీర్పు దేవునికి సంబంధించింది కాబట్టి ఎవరికి భయపడవద్దు. మీకు పరిష్కరించడానికి కష్టంగా ఉన్న సమస్యను నా దగ్గరకు తీసుకురండి, నేను దానిని వింటాను” అని చెప్పాను.
DEU 1:18 మీరు చేయవలసిందంతా ఆ సమయంలో నేను మీకు చెప్పాను.
DEU 1:19 తర్వాత మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన ప్రకారం, హోరేబు నుండి బయలుదేరి మీరు చూసిన భయంకరమైన మహారణ్యం గుండా వచ్చి, అమోరీయుల కొండ ప్రాంతం ద్వారా ప్రయాణించి కాదేషు బర్నియాకు చేరుకున్నాము.
DEU 1:20 అప్పుడు నేను మీతో, “మన దేవుడైన యెహోవా మనకు ఇస్తున్న అమోరీయుల కొండ ప్రాంతానికి మీరు చేరుకున్నారు.
DEU 1:21 చూడండి, మీ దేవుడైన యెహోవా మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీతో చెప్పినట్లుగా, వెళ్లి దానిని స్వాధీనపరచుకోండి. భయపడకండి; అధైర్యపడకండి” అని చెప్పాను.
DEU 1:22 అప్పుడు మీరందరు నా దగ్గరకు వచ్చి, “ఆ దేశంలో గూఢచర్యం చేసి మనం వెళ్లవలసిన దారి, మనం వెళ్లే పట్టణాల గురించి సమాచారం తెలుసుకోవడానికి ముందుగానే కొంతమందిని పంపుదాం” అన్నారు.
DEU 1:23 ఈ ఆలోచన నాకు నచ్చింది కాబట్టి మీలో ప్రతి గోత్రం నుండి ఒకరు చొప్పున పన్నెండుమందిని పంపాను.
DEU 1:24 వారు అక్కడినుండి కొండ ప్రాంతానికి ఎక్కి వెళ్లి ఎష్కోలు లోయకు వచ్చి దాన్ని పరిశీలించారు.
DEU 1:25 వారు ఆ దేశపు పండ్లు కొన్ని మన దగ్గరకు తెచ్చి, “మన దేవుడైన యెహోవా మనకిస్తున్న దేశం మంచిది” అని చెప్పారు.
DEU 1:26 కాని మీరు వెళ్లడానికి ఇష్టపడలేదు; మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు తిరుగుబాటు చేశారు.
DEU 1:27 మీ గుడారాల్లో సణుగుతూ, “యెహోవా మనలను ద్వేషించి మనలను నాశనం చేయడానికి అమోరీయుల చేతికి మనలను అప్పగించడానికి ఈజిప్టు నుండి మనలను బయటకు తీసుకువచ్చారు.
DEU 1:28 మనం ఎక్కడికి వెళ్లగలం? మన సహోదరులు, ‘అక్కడి ప్రజలు మనకన్నా బలవంతులు, పొడవైనవారు; ఆ పట్టణాలు ఎంతో పెద్దవిగా ఆకాశమంత ఎత్తైన గోడలతో ఉన్నాయి; అక్కడ అనాకీయులను కూడా చూశాం’ అని చెప్పి మా గుండెలు భయంతో చెదిరిపోయేలా చేశారు” అన్నారు.
DEU 1:29 అప్పుడు నేను మీతో, “దిగులుపడకండి, వారికి భయపడకండి.
DEU 1:30 మీకు ముందుగా నడుస్తున్న మీ దేవుడైన యెహోవా మీ కళ్ళెదుట ఈజిప్టులోను అరణ్యంలోను మీ కోసం చేసినట్లు ఆయన మీ కోసం యుద్ధం చేస్తారు,
DEU 1:31 మీరు ఈ స్థలానికి చేరుకునేవరకు తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మీ మార్గమంతటిలో మిమ్మల్ని ఎలా ఎత్తుకుని వచ్చారో మీరు చూశారు” అని అన్నాను.
DEU 1:32 ఇంత చెప్పినా, మీ ప్రయాణమంతటిలో మీరు బస కోసం చోటు వెదకడానికి, మీరు వెళ్లవలసిన మార్గాన్ని మీకు చూపించడానికి రాత్రివేళ అగ్నిలో, పగటివేళ మేఘంలో మీకు ముందుగా నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు నమ్మకం ఉంచలేదు.
DEU 1:34 మీరు చెప్పిన మాటలు యెహోవా విన్నప్పుడు ఆయన కోపంతో, కాబట్టి ఆయన ప్రమాణ చేస్తూ,
DEU 1:35 “నేను మీ పూర్వికులకు ఇస్తానని వాగ్దానం చేసిన ఈ మంచి దేశాన్ని ఈ చెడ్డతరంలో
DEU 1:36 యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరు చూడరు. అతడు హృదయమంతటితో యెహోవాను అనుసరించాడు కాబట్టి దానిని చూస్తాడు. అతడు అడుగుపెట్టిన దేశాన్ని అతనికి, అతని సంతానానికి నేను ఇస్తాను” అని ప్రమాణం చేశారు.
DEU 1:37 మీ కారణంగా యెహోవా నా మీద కూడా కోప్పడి, “నీవు కూడా ఆ దేశంలో అడుగుపెట్టవు.
DEU 1:38 కాని, నీ సహాయకుడు నూను కుమారుడైన యెహోషువ దానిలో అడుగుపెడతాడు. దానిని స్వాధీనపరచుకునేలా అతడు ఇశ్రాయేలీయులను నడిపిస్తాడు కాబట్టి అతన్ని ప్రోత్సహించు.
DEU 1:39 బందీలుగా వెళ్తారని మీరు చెప్పిన మంచి చెడు తెలియని మీ పిల్లలు ఆ దేశంలో అడుగుపెడతారు. నేను దానిని వారికి ఇస్తాను, వారు దానిని స్వాధీనం చేసుకుంటారు.
DEU 1:40 మీరైతే వెనుకకు తిరిగి ఎర్ర సముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణించండి” అని అన్నారు.
DEU 1:41 అప్పుడు మీరు, “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాము. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన ప్రకారం మేము వెళ్లి పోరాడతాం” అని నాతో చెప్పి మీ ఆయుధాలను ధరించి కొండసీమ మీదికి వెళ్లడం సులభమనుకుని మీలో ప్రతి ఒక్కరు సిద్ధపడ్డారు.
DEU 1:42 అయితే యెహోవా నాతో, “యుద్ధానికి మీరు వెళ్లకండి. ఎందుకంటే నేను మీతో ఉండను. మీరు మీ శత్రువుల చేతిలో ఓడిపోతారు” అని చెప్పారు.
DEU 1:43 నేను మీతో ఆ సంగతి చెప్పాను కాని మీరు వినలేదు. యెహోవా ఆజ్ఞకు వ్యతిరేకంగా మీరు తిరుగుబాటు చేసి మీ అహంకారాన్ని బట్టి కొండసీమ ప్రాంతానికి ఎక్కి వెళ్లారు.
DEU 1:44 ఆ కొండల్లో నివసిస్తున్న అమోరీయులు మీ మీదికి వచ్చి కందిరీగల్లా మిమ్మల్ని శేయీరు నుండి హోర్మా వరకు తరిమికొట్టారు.
DEU 1:45 అప్పుడు మీరు తిరిగివచ్చి యెహోవా ఎదుట ఏడ్చారు కాని ఆయన మిమ్మల్ని లక్ష్యపెట్టలేదు మీ మొర వినలేదు.
DEU 1:46 కాబట్టి మీరు కాదేషులో చాలా రోజులు ఉండిపోయారు. అక్కడ ఎన్ని రోజులు నివసించారో మీకు తెలుసు.
DEU 2:1 యెహోవా నాతో చెప్పిన ప్రకారం మనం వెనుకకు తిరిగి ఎర్ర సముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణమై వెళ్లి చాలా రోజులు శేయీరు కొండ ప్రాంతం చుట్టూ తిరిగాము.
DEU 2:2 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు,
DEU 2:3 “మీరు ఈ కొండ ప్రాంతం చుట్టూ తిరిగింది చాలు; ఉత్తరం వైపు తిరగండి.
DEU 2:4 ప్రజలకు ఈ ఆదేశాలు ఇవ్వు: ‘శేయీరులో నివసిస్తున్న ఏశావు సంతానమైన మీ బంధువుల భూభాగం గుండా వెళ్లబోతున్నారు. వారు మీకు భయపడతారు, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి.
DEU 2:5 వారితో ఘర్షణ పడకండి, ఎందుకంటే నేను వారి భూమిలో ఒక్క అడుగు కూడా మీకు ఇవ్వను. నేను ఏశావుకు స్వాస్థ్యంగా శేయీరు కొండ ప్రాంతాన్ని ఇచ్చాను.
DEU 2:6 మీరు వారికి వెండి ఇచ్చి తినడానికి ఆహారం, త్రాగడానికి నీరు కొనుక్కోవాలి.’ ”
DEU 2:7 మీ దేవుడైన యెహోవా మీ చేతి పనులన్నిటిని ఆశీర్వదించారు, ఈ గొప్ప అరణ్యం గుండా మీ ప్రయాణాన్ని ఆయన చూసుకున్నారు. ఈ నలభై సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నారు, మీకు ఏది తక్కువ కాలేదు.
DEU 2:8 శేయీరులో నివసిస్తున్న మన బంధువులైన ఏశావు సంతతివారిని విడిచిపెట్టి ముందుకు సాగాము. ఏలతు, ఎసోన్-గెబెరు నుండి వచ్చే అరాబా మార్గం నుండి మనం బయలుదేరి మోయాబు ఎడారి మార్గంలో ప్రయాణించాము.
DEU 2:9 అప్పుడు యెహోవా నాతో అన్నారు, “మోయాబీయులను బాధపెట్టకండి లేదా వారితో ఘర్షణ పడకండి, ఎందుకంటే వారి భూమిలో మీకు ఏమి ఇవ్వను. నేను లోతు సంతానానికి ఆరు దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను.”
DEU 2:10 గతంలో ఎమీయులు ఆ దేశంలో నివసించేవారు, వారు బలవంతులు అనేకమంది, వారు అనాకీయుల్లా పొడవైనవారు.
DEU 2:11 అనాకీయుల్లా వారిని కూడా రెఫాయీయులుగా పరిగణించేవారు కాని మోయాబీయులు వారికి ఎమీయులు అని పేరు పెట్టారు.
DEU 2:12 గతంలో హోరీయులు శేయీరులో నివసించేవారు, అయితే ఏశావు సంతతివారు, ఇశ్రాయేలీయులు యెహోవా తమకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో చేసినట్లుగా, వారిని తరిమివేశారు. వారు హోరీయులను తమ ఎదుట నుండి నాశనం చేసి వారి దేశంలో స్థిరపడ్డారు.
DEU 2:13 యెహోవా అన్నారు, “ఇప్పుడు మీరు లేచి జెరెదు వాగు దాటండి.” కాబట్టి మనం వాగు దాటాము.
DEU 2:14 మనం కాదేషు బర్నియాలో నుండి బయలుదేరి జెరెదు వాగు దాటే వరకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. యెహోవా వారికి ప్రమాణం చేసిన రీతిగా, సైనికులుగా ఉన్న వారి తరమంతా అప్పటి శిబిరం నుండి నశించిపోయింది.
DEU 2:15 ఆయన వారిని శిబిరంలో నుండి పూర్తిగా తొలగించే వరకు యెహోవా చేయి వారికి వ్యతిరేకంగా ఉంది.
DEU 2:16 ప్రజల మధ్యలో నుండి ఈ సైనికులు అందరు చనిపోయిన తర్వాత,
DEU 2:17 యెహోవా నాతో ఇలా చెప్పారు,
DEU 2:18 “ఈ రోజు మీరు మోయాబుకు సరిహద్దుగా ఉన్న ఆరు దేశాన్ని దాటబోతున్నారు.
DEU 2:19 మీరు అమ్మోనీయుల దగ్గరకు వచ్చినప్పుడు, మీరు వారిని బాధించవద్దు వారిని యుద్ధానికి రెచ్చగొట్టవద్దు. ఎందుకంటే అమ్మోనీయులకు చెందిన దేశంలో ఏది మీకు ఇవ్వను. ఆ దేశాన్ని నేను లోతు సంతతికి స్వాస్థ్యంగా ఇచ్చాను.”
DEU 2:20 అది కూడా రెఫాయీయుల దేశం అని పరిగణించబడింది; గతంలో రెఫాయీయులు అక్కడ నివసించేవారు. అయితే అమ్మోనీయులు వారికి జంజుమ్మీయులు అని పిలిచేవారు.
DEU 2:21 వారు బలవంతులు, అనేకమంది, అనాకీయుల్లా పొడువైనవారు. యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్లగొట్టారు, కాబట్టి అమ్మోనీయులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని వారి దేశంలో స్థిరపడ్డారు.
DEU 2:22 శేయీరులో నివసిస్తున్న ఏశావు సంతానం కోసం కూడా యెహోవా ఇలాగే చేశారు. ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నాశనం చేశారు, కాబట్టి వారు వారిని తరిమి ఇప్పటివరకు వారి దేశంలో నివసిస్తున్నారు.
DEU 2:23 గాజా వరకు గ్రామాల్లో నివసించిన ఆవీయులను కఫ్తోరులో నుండి వచ్చిన కఫ్తోరీయులు నాశనం చేసి వారి దేశంలో స్థిరపడ్డారు.
DEU 2:24 “మీరు లేచి బయలుదేరి అర్నోను వాగు దాటండి. చూడండి, అమోరీయుడైన హెష్బోను రాజైన సీహోనును అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. దానిని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టి అతనితో యుద్ధం చేయండి.
DEU 2:25 ఈ రోజే నేను ఆకాశం క్రింద ఉన్న అన్ని దేశాలకు మీరంటే భయాన్ని, వణుకుని కలిగించడం మొదలుపెడతాను. వారు మీ గురించి సమాచారాన్ని విని వణుకుతారు; మీ కారణంగా వారు కలవరపడతారు.”
DEU 2:26 కెదేమోతు ఎడారి నుండి నేను హెష్బోను రాజైన సీహోను దగ్గరకు దూతలను పంపి సమాధానాన్ని తెలియజేశాను,
DEU 2:27 “మీ దేశం మీదుగా మమ్మల్ని వెళ్లనివ్వండి. మేము కుడి ఎడమల వైపు తిరగము, రహదారి మీదనే వెళ్తాము.
DEU 2:28 మా దగ్గర నుండి వెండి తీసుకుని తినడానికి ఆహారం త్రాగడానికి నీళ్లు ఇవ్వండి. మమ్మల్ని కాలినడకన వెళ్లనివ్వండి.
DEU 2:29 శేయీరులో నివసించే ఏశావు సంతతివారు ఆరులో మోయాబీయులు మాకు చేసినట్టే మా దేవుడైన యెహోవా మాకు ఇస్తున్న దేశానికి వెళ్లడానికి కాలినడకన యొర్దాను దాటి వెళ్లనివ్వండి” అని తెలియజేశాను.
DEU 2:30 అయితే హెష్బోను రాజైన సీహోను మనం అతని దేశం గుండా వెళ్లడానికి అనుమతించలేదు. ఎందుకంటే ఇప్పుడు జరిగినట్లుగా అతన్ని మీ చేతికి అప్పగించడానికి మీ దేవుడైన యెహోవా అతని మనస్సు కఠినపరచి అతని హృదయాన్ని మొండిగా మార్చారు.
DEU 2:31 అప్పుడు యెహోవా నాతో అన్నారు, “చూడండి, నేను సీహోనును, అతని దేశాన్ని మీకు అప్పగించడం మొదలుపెట్టాను. అతని దేశాన్ని జయించి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టండి.”
DEU 2:32 సీహోను అతని సైన్యమంతా యాహాజులో మనతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు,
DEU 2:33 మన దేవుడైన యెహోవా అతన్ని మనకు అప్పగించారు కాబట్టి అతన్ని, అతని కుమారులను, అతని సైన్యమంతటిని మనం హతం చేశాము.
DEU 2:34 ఆ సమయంలో అతని పట్టణాలన్నిటిని, వాటిలో ఉన్న పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎవరు మిగులకుండా పూర్తిగా నాశనం చేశాము.
DEU 2:35 అయితే మన కోసం పశువులను, ఆ పట్టణాల సొమ్మును దోచుకున్నాము.
DEU 2:36 అర్నోను వాగు ఒడ్డున ఉన్న అరోయేరు నుండి, ఆ వాగు దగ్గర ఉన్న పట్టణం మొదలుపెట్టి గిలాదు వరకు మనలను మించి బలం కలిగిన పట్టణం ఒకటి కూడా లేదు. మన దేవుడైన యెహోవా వాటన్నిటిని మనకు అప్పగించారు.
DEU 2:37 అయితే మన దేవుడైన యెహోవా ఆజ్ఞ ప్రకారం అమ్మోనీయుల దేశాన్ని కాని యబ్బోకు వాగు లోయలోని ఏ ప్రాంతాన్ని కాని కొండల్లో ఉన్న పట్టణాలను కాని మీరు ఆక్రమించలేదు.
DEU 3:1 తర్వాత మనం తిరిగి బాషానుకు వెళ్లే మార్గంలో వెళ్లాము. అప్పుడు బాషాను రాజైన ఓగు తన సైన్యమంతటితో ఎద్రెయీ దగ్గర యుద్ధంలో మనలను ఎదుర్కోడానికి బయలుదేరాడు.
DEU 3:2 యెహోవా నాతో, “అతనికి భయపడకండి, ఎందుకంటే అతన్ని, అతని సైన్యమంతటిని, అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. హెష్బోనును పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు అతనికి చేయండి” అని అన్నారు.
DEU 3:3 కాబట్టి మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును, అతని సైన్యమంతటిని మన చేతికి అప్పగించారు. వారిలో ఎవరిని మిగల్చకుండా అందరిని హతం చేశాము.
DEU 3:4 ఆ సమయంలో అతని పట్టణాలన్నిటిని మనం స్వాధీనం చేసుకున్నాము. బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రాంతమంతటిలో ఉన్న అరవై పట్టణాల్లో స్వాధీనం చేసుకోనిది ఒక్కటి కూడా లేదు.
DEU 3:5 ఈ పట్టణాలన్ని ఎత్తైన గోడలు, ద్వారాలు గడియలతో పటిష్టంగా ఉన్నాయి, వీటితో పాటు గోడలులేని అనేక గ్రామాలు కూడా ఉన్నాయి.
DEU 3:6 హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లే ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులు, పిల్లలను పూర్తిగా నాశనం చేశాము.
DEU 3:7 అయితే మన కోసం పశువులన్నిటిని, వారి పట్టణాల నుండి సొమ్మును దోచుకున్నాము.
DEU 3:8 ఆ సమయంలో ఈ ఇద్దరు అమోరీయుల రాజుల నుండి అర్నోను వాగు మొదలుకొని హెర్మోను పర్వతం వరకు యొర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాము.
DEU 3:9 హెర్మోనును సీదోనీయులు షిర్యోను అంటారు; అమోరీయులు శెనీరు అని పిలుస్తారు.
DEU 3:10 పీఠభూమిలో ఉన్న పట్టణాలన్నిటిని, బాషానులో ఓగు రాజ్యంలోని పట్టణాలైన సలేకా ఎద్రెయీల వరకు గిలాదు అంతటిని, బాషానును అంతటిని స్వాధీనం చేసుకున్నాము.
DEU 3:11 రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు చివరివాడు. అతని సమాధి ఇనుముతో చేయబడి తొమ్మిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలది. అది ఇంకా అమ్మోనీయులకు చెందిన రబ్బాలో ఉంది.
DEU 3:12 ఆ సమయంలో మనం స్వాధీనం చేసుకున్న దేశాన్ని అనగా అర్నోను వాగు లోయలో ఉన్న అరోయేరు నుండి గిలాదు కొండ ప్రాంతంలోని సగభాగాన్ని దానిలో ఉన్న పట్టణాలతో కలిపి రూబేనీయులకు గాదీయులకు ఇచ్చాను.
DEU 3:13 గిలాదులో మిగతా ప్రాంతాన్ని, ఓగు రాజ్యమైన బాషాను అంతటిని మనష్షే అర్ధగోత్రానికి ఇచ్చాను. బాషానులోని అర్గోబు ప్రాంతమంతా రెఫాయీయుల దేశమని పిలువబడేది.
DEU 3:14 మనష్షే సంతానమైన యాయీరు అర్గోబు ప్రాంతమంతా గెషూరీయుల మయకాతీయుల సరిహద్దుల వరకు స్వాధీనపరచుకున్నాడు. దానికి అతని పేరు పెట్టబడింది కాబట్టి నేటికీ బాషాను హవ్వోత్ యాయీరు అని పిలుస్తారు.
DEU 3:15 గిలాదును మాకీరుకు ఇచ్చాను.
DEU 3:16 అయితే రూబేనీయులకు, గాదీయులకు గిలాదు నుండి అర్నోను వాగు లోయ మధ్య వరకు, యబ్బోకు నది వరకు, అమ్మోనీయుల సరిహద్దు వరకు నేను ఇచ్చాను.
DEU 3:17 దాని పశ్చిమ సరిహద్దు కిన్నెరెతు నుండి పిస్గా కొండచరియల తూర్పున, మృత సముద్రమనే అరాబా సముద్రం వరకు వ్యాపించి ఉన్న అరాబాలోని యొర్దాను నది.
DEU 3:18 ఆ సమయంలో నేను యొర్దాను తూర్పున నివసిస్తున్న గోత్రాలకు మీకు ఇలా ఆజ్ఞాపించాను: “మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోవడానికి మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. అయితే మీలో ధృడమైనవారు, యుద్ధానికి సిద్ధపడినవారు ఇతర ఇశ్రాయేలీయులకు ముందుగా నది దాటాలి.
DEU 3:19 అయితే యెహోవా మీకు విశ్రాంతి ఇచ్చినట్టు మీ సోదరులకును విశ్రాంతి ఇచ్చేవరకు, అంటే యొర్దాను అవతల మీ దేవుడైన యెహోవా వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునేవరకు మీ భార్యలు, మీ పిల్లలు మీ పశువులు నేను మీకిచ్చిన పట్టణాల్లోనే ఉండాలి. ఆ తర్వాత నేను మీకు ఇచ్చిన స్వాస్థ్యాలకు ప్రతి ఒక్కరు తిరిగి వెళ్లవచ్చు.”
DEU 3:21 ఆ సమయంలో నేను యెహోషువకు ఆజ్ఞాపించాను: “నీవు నీ కళ్లారా దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకు చేసిందంతా చూశావు. నీవు వెళ్లబోయే చోటులో ఉన్న అన్ని రాజ్యాలకు యెహోవా అలాగే చేస్తారు.
DEU 3:22 వారికి నీవు భయపడకు; నీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తారు.”
DEU 3:23 ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమాలుకున్నాను:
DEU 3:24 “ప్రభువైన యెహోవా, మీ గొప్పతనాన్ని, మీ బలమైన చేతిని మీ సేవకునికి చూపించడం మొదలుపెట్టారు. ఆకాశంలో గాని భూమిమీదగాని మీరు చేసే పనులు, అద్భుతకార్యాలు చేయగల దేవుడెవరున్నారు?
DEU 3:25 నేను వెళ్లి యొర్దాను అవతల ఉన్న మంచి దేశాన్ని, మంచి కొండ ప్రాంతాన్ని, లెబానోనును చూడనివ్వండి.”
DEU 3:26 అయితే మీ కారణంగా యెహోవా నా మీద కోప్పడి, నా మొర వినలేదు. యెహోవా నాతో అన్నారు, “ఇక చాలు, ఈ విషయమై నాతో ఇక మాట్లాడవద్దు.
DEU 3:27 నీవు పిస్గా కొండ శిఖరం పైకెక్కి అక్కడినుండి పడమర, ఉత్తరం, దక్షిణం, తూర్పు వైపులకు చూడు. నీవు యొర్దాను నది దాటవు కాబట్టి నీ కళ్లారా ఆ దేశాన్ని చూడు.
DEU 3:28 అయితే యెహోషువను నియమించి, అతన్ని ప్రోత్సాహించి బలపరచు, ఎందుకంటే అతడు ఈ ప్రజలను నది దాటిస్తాడు, నీవు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకునేలా చేస్తాడు.”
DEU 3:29 కాబట్టి మనం బేత్-పెయోరు దగ్గర ఉన్న లోయలో ఉన్నాము.
DEU 4:1 ఇప్పుడు, ఇశ్రాయేలూ, నేను మీకు బోధించే శాసనాలు చట్టాలను వినండి. మీరు జీవించి, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోకి వెళ్లి స్వాధీనం చేసుకోవడానికి వాటిని అనుసరించండి.
DEU 4:2 నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలుపకూడదు, దాని నుండి దేన్ని తీసివేయకూడదు, కాని నేను మీకు ఇస్తున్న మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించండి.
DEU 4:3 బయల్-పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కళ్లారా చూశారు. బయల్-పెయోరును వెంబడించిన వారందరిని మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉండకుండా నాశనం చేశారు,
DEU 4:4 కాని మీ దేవుడైన యెహోవాను నమ్మకంగా పట్టుకుని ఉన్న మీరందరు ఈ రోజు వరకు బ్రతికి ఉన్నారు.
DEU 4:5 చూడండి, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించవలసిన శాసనాలను చట్టాలను నేను మీకు బోధించాను.
DEU 4:6 వాటిని జాగ్రతగా పాటించండి. ఈ శాసనాలన్నిటి గురించి వినే దేశాలకు అవే మీ జ్ఞానాన్ని మీ వివేకాన్ని తెలియజేస్తాయి; వారు, “ఈ గొప్ప దేశం ఖచ్చితంగా జ్ఞానం వివేకం కలిగిన ప్రజలు” అని చెప్పుకుంటారు.
DEU 4:7 మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్పప్రజలకు వారి దేవుళ్ళు సమీపంగా ఉంటారు?
DEU 4:8 ఈ రోజు నేను మీ ఎదుట పెట్టిన ఈ ధర్మశాస్త్రమంతటిలో నీతిగల శాసనాలు, చట్టాలు ఏ గొప్ప దేశం కలిగి ఉంది?
DEU 4:9 అయితే జాగ్రత్తగా ఉండండి, మీరు మీ కళ్లారా చూసినవాటిని మరచిపోకుండా, మీరు జీవితాంతం మీ హృదయంలోనుండి చెరిగిపోకుండా జాగ్రత్త వహించండి. మీ పిల్లలకు వారి తర్వాత వారి పిల్లలకు వాటిని బోధించండి.
DEU 4:10 హోరేబు దగ్గర మీ దేవుడైన యెహోవా ఎదుట మీరు నిలబడినప్పుడు ఆయన నాతో, “వారు ఆ దేశంలో జీవించినంత వరకు నాకు భయపడడం నేర్చుకొని, వాటిని తమ పిల్లలకు నేర్పేలా వారు నా మాటలు వినడానికి ప్రజలందర్ని సమకూర్చు” అని చెప్పిన రోజును జ్ఞాపకం ఉంచుకోండి.
DEU 4:11 మీరంతా దగ్గరకు వచ్చి ఆ పర్వతం క్రింద నిలబడ్డారు, అది దట్టమైన మేఘాలు, కటిక చీకటి కమ్మి, ఆకాశం వరకు అగ్నితో మండుతూ ఉంది,
DEU 4:12 యెహోవా ఆ అగ్నిలో నుండి మీతో మాట్లాడారు. మీరు మాటల శబ్దం విన్నారు కాని ఏ రూపాన్ని మీరు చూడలేదు; స్వరం మాత్రమే వినిపించింది.
DEU 4:13 ఆయన మీకు తన నిబంధనను ప్రకటించారు, అనగా మీరు పాటించాలని పది ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించి, వాటిని రెండు రాతి పలకలమీద వ్రాశారు.
DEU 4:14 మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు అనుసరించాల్సిన శాసనాలను చట్టాలను మీకు నేర్పించమని యెహోవా నాకు ఆదేశించారు.
DEU 4:15 అయితే చాలా జాగ్రతగా ఉండండి! హోరేబులో యెహోవా అగ్ని మధ్యలో నుండి మీతో మాట్లాడిన రోజున మీరు ఏ రూపాన్ని చూడలేదు.
DEU 4:16 మీ కోసం ఎలాంటి విగ్రహాన్ని, ఎలాంటి రూపంలో ఉన్న దానినైన, స్త్రీ లేదా పురుషుని రూపంలో కాని,
DEU 4:17 లేదా భూమి మీద ఉండే ఏ జంతువులా కాని, ఆకాశంలో ఎగిరే పక్షిలా కాని,
DEU 4:18 లేదా నేల మీద ప్రాకే ఏ ప్రాణిలా కాని, నీటి క్రింద ఉండే ఏ చేపలా కాని విగ్రహం తయారుచేసుకోకండి.
DEU 4:19 మీరు ఆకాశం వైపు కళ్ళెత్తి ఆకాశ సైన్యాలైన సూర్యచంద్ర నక్షత్రాలను చూసిన వాటిచే ఆకర్షించబడి, మీ దేవుడైన యెహోవా ఆకాశం క్రింద సమస్త దేశాల కోసం పంచి ఇచ్చిన వాటికి నమస్కరించి వాటికి సేవచేయకుండ మీరు జాగ్రత్తపడండి.
DEU 4:20 మీరైతే, యెహోవా మిమ్మల్ని పట్టుకుని నేడు మీరున్నట్లుగా ఆయన వారసత్వ ప్రజలుగా ఉండడానికి ఇనుప కొలిమిలో నుండి, ఈజిప్టు నుండి, మిమ్మల్ని బయటకు తీసుకువచ్చారు.
DEU 4:21 మీ కారణంగా యెహోవా నా మీద కోప్పడి నేను ఈ యొర్దాను దాటకూడదని, మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న మంచి దేశంలో ప్రవేశించకూడదని ఆయన ప్రమాణము చేశారు.
DEU 4:22 నేను ఈ దేశంలో చనిపోతాను; నేను యొర్దానును దాటను; కాని మీరు నది దాటి వెళ్లి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు.
DEU 4:23 మీ దేవుడైన యెహోవా మీతో చేసిన నిబంధనను మరచిపోకుండా జాగ్రత్తపడండి; మీ దేవుడైన యెహోవా నిషేధించిన వాటి యొక్క ఎలాంటి రూపంలోను మీ కోసం విగ్రహాన్ని చేసుకోకండి.
DEU 4:24 ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దహించు అగ్ని, ఆయన రోషం గల దేవుడు.
DEU 4:25 మీకు పిల్లలు మనవళ్లు కలిగి, ఆ దేశంలో చాలా కాలం నివసించిన తర్వాత, మీరు అప్పుడు చెడిపోయి ఏ రూపంలోనైనా విగ్రహాన్ని చేసుకుని మీ దేవుడైన యెహోవా కళ్ళెదుట చెడు చేసి ఆయనకు కోపం పుట్టిస్తే,
DEU 4:26 మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే ఆ దేశంలో ఎక్కువకాలం నివసించకుండా వెంటనే నశిస్తారని ఈ రోజు ఆకాశాలను భూమిని మీమీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశంలో ఎక్కువకాలం నివసించరు ఖచ్చితంగా నశించిపోతారు.
DEU 4:27 యెహోవా జనాంగాల మధ్యలో మిమ్మల్ని చెదరగొడతారు, యెహోవా మిమ్మల్ని తోలివేసే దేశాల మధ్యలో మీలో కొద్దిమంది మాత్రమే మిగులుతారు.
DEU 4:28 అక్కడ మీరు మనుష్యులు తయారుచేసిన కర్ర, రాతి దేవుళ్ళను సేవిస్తారు. అవి చూడలేవు, వినలేవు, తినలేవు, వాసన చూడలేవు.
DEU 4:29 అయితే అక్కడినుండి మీరు మీ దేవుడైన యెహోవాను వెదికితే, మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో వెదికినప్పుడు ఆయన మీకు దొరుకుతారు.
DEU 4:30 మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, ఈ సంగతులన్ని మీకు జరిగిన తర్వాత, అప్పుడు చివరి రోజుల్లో మీరు మీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వింటారు.
DEU 4:31 మీ దేవుడైన యెహోవా జాలిగల దేవుడు; కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని నాశనం చేయడు, ఆయన మీ పూర్వికులతో ప్రమాణం ద్వార నిశ్చయం చేసిన నిబంధనను మరచిపోరు.
DEU 4:32 దేవుడు భూమి మీద నరుని సృజించిన రోజు నుండి, మీకంటే ముందు ఉన్న గత కాలం గురించి అడగండి; ఆకాశం యొక్క ఒక చివరి నుండి మరో చివరి వరకు అడగండి. ఇలాంటి గొప్ప కార్యం ఎప్పుడైనా జరిగిందా? లేదా అటువంటి దాని గురించి ఎప్పుడైనా విన్నారా?
DEU 4:33 అగ్ని మధ్యలో నుండి మాట్లాడిన దేవుని స్వరాన్ని మీరు విన్నట్లు మరి ఏ ప్రజలైనా విని బ్రతికారా?
DEU 4:34 మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో మీ కళ్ళెదుట మీ కోసం శోధనలతో, సూచకక్రియలతో, అద్భుతాలతో, యుద్ధంతో, బలమైన హస్తంతో, చాచిన చేతితో మహా భయంకరమైన కార్యాలతో సమస్త కార్యాలను చేసినట్లు ఏ దేవుడైన తన కోసం ఒక దేశం నుండి మరొక దేశాన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడా?
DEU 4:35 యెహోవాయే దేవుడని ఆయన తప్ప మరి ఎవరు లేరని మీరు తెలుసుకునేలా ఇవన్నీ మీకు చూపబడ్డాయి.
DEU 4:36 మిమ్మల్ని క్రమపరచడానికి ఆకాశం నుండి తన స్వరాన్ని మీకు వినిపించారు. భూమి మీద మీకు తన గొప్ప అగ్నిని చూపించారు, ఆ అగ్ని మధ్యలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు.
DEU 4:37 ఆయన మీ పూర్వికులను ప్రేమించి వారి సంతతిని ఎంపిక చేసుకున్నారు కాబట్టి, మీకంటే బలమైన గొప్ప దేశాలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి దేశంలోనికి మిమ్మల్ని తీసుకువచ్చి, ఈ రోజు ఇస్తున్నట్లుగా వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఆయన తన సన్నిధితో, తన మహాబలంతో మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించారు.
DEU 4:39 కాబట్టి పైనున్న పరలోకంలో గాని, క్రిందున్న భూమిమీద గాని, యెహోవాయే దేవుడని, మరొక దేవుడు లేడని ఈ రోజే మీరు గుర్తించి, మీ హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకోండి.
DEU 4:40 మీకు, మీ తర్వాత మీ సంతతివారికి క్షేమం కలగడానికి యెహోవా శాశ్వతంగా మీకు ఇస్తున్న దేశంలో మీరు అధిక కాలం జీవించేలా ఈ రోజు నేను మీకు ఇస్తున్న శాసనాలను ఆజ్ఞలను పాటించండి.
DEU 4:41 తర్వాత మోషే యొర్దానుకు తూర్పు వైపు ఉన్న మూడు పట్టణాలను ప్రత్యేకంగా ఉంచాడు.
DEU 4:42 ఒక వ్యక్తిని చంపిన ఎవరైనా ఏ దురుద్దేశం లేకుండా పొరుగువారిని చంపినట్లయితే పారిపోవచ్చు. వారు ఈ పట్టణాల్లో ఒక దానికి పారిపోయి తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు.
DEU 4:43 ఆ పట్టణాలు ఇవి: రూబేనీయులకు అరణ్య పీఠభూమిలో ఉన్న బేసెరు; గాదీయులకు గిలాదులో ఉన్న రామోతు; మనష్షీయులకు బాషానులో ఉన్న గోలాను.
DEU 4:44 మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది.
DEU 4:45 ఈ నిబంధనలు శాసనాలు చట్టాలు, ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి బయటకు వచ్చినప్పుడు యొర్దాను తూర్పున బేత్-పెయోరుకు ఎదురుగా ఉన్న లోయలో హెష్బోనులో పరిపాలించి, మోషే, ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయిన అమోరీయుల రాజైన సీహోను దేశంలో వారికి ఇవ్వబడినవి.
DEU 4:47 యొర్దానుకు తూర్పున ఉన్న అతని దేశాన్ని, బాషాను రాజైన ఓగు దేశాన్ని, ఈ ఇద్దరు అమోరీయుల రాజుల దేశాలను వారు స్వాధీనం చేసుకున్నారు.
DEU 4:48 ఆ దేశం అర్నోను వాగు లోయ ఒడ్డున ఉన్న అరోయేరు నుండి హెర్మోను అనే సీయోను కొండ వరకు,
DEU 4:49 యొర్దాను తూర్పున ఉన్న అరాబా ప్రాంతమంతా, పిస్గా కొండచరియల దిగువగా ఉప్పు సముద్రం వరకు ఉంది.
DEU 5:1 మోషే ఇశ్రాయేలీయులందరిని పిలిపించి వారితో ఇలా చెప్పాడు: ఇశ్రాయేలూ, మీ వినికిడిలో నేను ప్రకటించే శాసనాలను, చట్టాలను వినండి. వాటిని నేర్చుకొని ఖచ్చితంగా పాటించండి.
DEU 5:2 మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశారు.
DEU 5:3 యెహోవా ఈ నిబంధన చేసింది మన పూర్వికులతో కాదు, మనతో, ఈ రోజు సజీవంగా ఉన్న మనందరితో చేశారు.
DEU 5:4 ఆ పర్వతం మీద అగ్నిలో నుండి యెహోవా మీతో ముఖాముఖిగా మాట్లాడారు.
DEU 5:5 అయితే మీరు ఆ అగ్నికి భయపడి పర్వతం ఎక్కలేదు కాబట్టి యెహోవా మాట మీకు తెలియజేయడానికి నేను యెహోవాకు మీకు మధ్యలో నిలబడ్డాను. ఆయన ఇలా అన్నారు:
DEU 5:6 “బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
DEU 5:7 “నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు.
DEU 5:8 పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని భూమి క్రింద నీళ్లలో గాని ఉన్న దేని రూపంలో మీరు మీకోసం ప్రతిమను చేసుకోకూడదు.
DEU 5:9 మీరు వాటికి నమస్కరించకూడదు పూజింపకూడదు; ఎందుకంటే నేను, మీ దేవుడనైన యెహోవాను, రోషం గల దేవుడను, నన్ను ద్వేషించినవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల పాపం యొక్క శిక్షను వారి పిల్లల మీదికి రప్పిస్తాను.
DEU 5:10 అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించే వారికి వెయ్యి తరాల వరకు కరుణను చూపిస్తాను.
DEU 5:11 మీ దేవుడైన యెహోవా నామాన్ని అనవసరంగా ఉపయోగించకూడదు, ఎందుకంటే తన నామాన్ని అనవసరంగా ఉపయోగించే వారిని యెహోవా నిర్దోషులుగా వదిలేయరు.
DEU 5:12 యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం జ్ఞాపకముంచుకోండి.
DEU 5:13 ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి,
DEU 5:14 కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ ఎద్దు గాని, మీ గాడిద గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు తద్వార మీలా మీ దాసదాసీలు విశ్రాంతి తీసుకుంటారు.
DEU 5:15 మీరు ఈజిప్టులో బానిసత్వంలో ఉన్నప్పుడు, మీ దేవుడైన యెహోవా బలమైన హస్తంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడినుండి బయటకు తీసుకువచ్చారని జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి సబ్బాతు దినాన్ని పాటించమని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించారు.
DEU 5:16 మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులై మీకు క్షేమం కలిగేలా మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారం, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి.
DEU 5:17 మీరు హత్య చేయకూడదు.
DEU 5:18 మీరు వ్యభిచారం చేయకూడదు.
DEU 5:19 మీరు దొంగతనం చేయకూడదు.
DEU 5:20 మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు.
DEU 5:21 మీ పొరుగువాని భార్యను మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని ఇంటిని గాని స్థలాన్ని గాని అతని దాసుని గాని, దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”
DEU 5:22 ఈ ఆజ్ఞలు యెహోవా ఆ పర్వతం మీద అగ్ని, మేఘం, కటిక చీకటిలో నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటికి ప్రకటించారు; ఆయన ఇంకా ఏది కలుపలేదు. ఆ తర్వాత ఆయన రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చారు.
DEU 5:23 ఆ పర్వతం అగ్నితో మండుతున్నప్పుడు, ఆ చీకటిలో నుండి స్వరాన్ని మీరు విన్నప్పుడు, మీ గోత్రాల నాయకులందరు, మీ పెద్దలు నా దగ్గరకు వచ్చారు.
DEU 5:24 మీరు నాతో అన్నారు, “మన దేవుడైన యెహోవా తన మహిమను తన ఘనతను మాకు చూపించారు, అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని మేము విన్నాము. దేవుడు మనుష్యులతో మాట్లాడినా వారు బ్రతికే ఉంటారని ఈ రోజు మేము చూశాము.
DEU 5:25 అయితే ఇప్పుడు మేమెందుకు చావాలి? ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది, మేము మన దేవుడైన యెహోవా స్వరాన్ని ఇంకా వింటే చనిపోతాము.
DEU 5:26 మేము విన్నట్లు మానవులలో ఎవరైనా సజీవుడైన దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడడం విని బ్రతికి ఉన్నారా?
DEU 5:27 నీవే దగ్గరకు వెళ్లి మన దేవుడైన యెహోవా చెప్పినదంతా విను. తర్వాత మన దేవుడైన యెహోవా నీకు చెప్పినదంతా నీవు మాకు చెప్పు, మేము వింటాము, లోబడతాము.”
DEU 5:28 మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు విన్నారు, యెహోవా నాతో ఇలా అన్నారు, “ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పిందంతా మంచిదే.
DEU 5:29 వారికి వారి సంతతికి నిరంతరం క్షేమం కలిగేలా వారు నా పట్ల భయం కలిగి, నా ఆజ్ఞలన్నిటిని అనుసరించే హృదయం వారికుంటే ఎంతో మంచిది.
DEU 5:30 “నీవు వెళ్లి, వారి గుడారలకు వారిని తిరిగి వెళ్లమని చెప్పు.
DEU 5:31 అయితే నీవు ఇక్కడ నాతో ఉండు, ఎందుకంటే వారు స్వాధీనం చేసుకోవడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో పాటించేలా నీవు బోధించాల్సిన ఆజ్ఞలు, శాసనాలు చట్టాలు నీకు ఇస్తాను.”
DEU 5:32 కాబట్టి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన వాటిని చేయడంలో జాగ్రత్త వహించండి; కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు.
DEU 5:33 మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు జీవిస్తూ, అభివృద్ధి పొందుతూ, ఎక్కువకాలం జీవించేలా, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నడవండి.
DEU 6:1 మీరు యొర్దాను దాటి స్వాధీనపరుచుకోబోయే దేశంలో మీరు పాటించాలని మీకు బోధించమని మీ దేవుడైన యెహోవా నాకు నిర్దేశించిన ఆజ్ఞలు, శాసనాలు చట్టాలు ఇవే.
DEU 6:2 మీరు, మీ పిల్లలు, వారి పిల్లలు జీవితకాలమంతా మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఇచ్చే ఆయన శాసనాలు, ఆజ్ఞలు పాటించడం ద్వారా మీరు దీర్ఘాయువును అనుభవిస్తారు.
DEU 6:3 ఇశ్రాయేలూ విను, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన రీతిగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీకు శ్రేయస్సు కలిగి అధికంగా అభివృద్ధి కలిగేలా మీరు వాటికి లోబడి ఉండేలా జాగ్రత్త వహించండి.
DEU 6:4 ఓ ఇశ్రాయేలీయులారా, వినండి: మన దేవుడైన యెహోవా, యెహోవా ఒక్కరే.
DEU 6:5 మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.
DEU 6:6 ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు మీ హృదయాల్లో నిలిచి ఉండాలి.
DEU 6:7 వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వాటి గురించి మాట్లాడాలి.
DEU 6:8 వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి.
DEU 6:9 మీ ఇళ్ళ ద్వారబంధాల మీద, ద్వారాల మీద వాటిని వ్రాయండి.
DEU 6:10 మీ దేవుడైన యెహోవా మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన రీతిగా మిమ్మల్ని ఆ దేశంలోనికి తీసుకువచ్చి మీరు కట్టని విశాలమైన మంచి పట్టణాలను,
DEU 6:11 మీరు సమకూర్చని అన్ని రకాల మంచి వస్తువులతో నిండిన ఇళ్ళను, మీరు తవ్వని బావులను, మీరు నాటని ద్రాక్షతోటలు, ఒలీవల తోటలను మీకు ఇస్తారు; మీరు తిని తృప్తిపొందిన తర్వాత,
DEU 6:12 బానిస దేశమైన ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్తగా ఉండండి.
DEU 6:13 మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను మాత్రమే సేవించి, ఆయన పేరిట మాత్రమే మీరు ప్రమాణం చేయాలి.
DEU 6:14 ఇతర దేవుళ్ళను అనగా మీ చుట్టూ ఉన్న ప్రజల దేవుళ్ళను అనుసరించకూడదు;
DEU 6:15 మీ మధ్యనున్న మీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు, ఆయన కోపం మీమీద రగులుకొని దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నాశనం చేస్తారు.
DEU 6:16 మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను పరీక్షించినట్లు ఆయనను పరీక్షించకూడదు.
DEU 6:17 మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన మీకు ఇచ్చిన నిబంధనలను, శాసనాలను జాగ్రత్తగా పాటించండి.
DEU 6:18 మీకు మేలు కలిగేలా యెహోవా చెప్పినట్లు మీ శత్రువులందరిని మీ ఎదుట నుండి తరిమివేసి యెహోవా మీ పూర్వికులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకోవాలంటే మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి.
DEU 6:20 భవిష్యత్తులో, “మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన నిబంధనలు, శాసనాలు, చట్టాలకు అర్థం ఏంటి?” అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు,
DEU 6:21 మీరు వారితో, “మనం ఈజిప్టులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు, యెహోవా బలమైన హస్తంతో మనలను ఈజిప్టులో నుండి బయటకు తీసుకువచ్చారు.
DEU 6:22 మన కళ్లముందు యెహోవా ఈజిప్టు మీద, ఫరో మీద, అతని ఇంటివారందరి మీద గొప్ప, భయంకరమైన అసాధారణ గుర్తులను, అద్భుతాలను చేశారు.
DEU 6:23 ఆయన మన పూర్వికులతో ప్రమాణం చేసిన దేశంలోనికి మనలను తీసుకువచ్చి దానిని మనకు ఇవ్వడానికి అక్కడినుండి మనలను బయటకు తీసుకువచ్చారు.
DEU 6:24 మనం ఎల్లప్పుడు వర్ధిల్లుతూ, నేడు ఉన్నట్లుగా మనం బ్రతికి ఉండడానికి ఈ శాసనాలన్నిటికి లోబడి మన దేవుడైన యెహోవాకు భయపడమని యెహోవా మనకు ఆజ్ఞాపించారు.
DEU 6:25 మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన ఎదుట మనం ఈ ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా అనుసరిస్తే అది మనకు నీతిగా పరిగణించబడుతుంది” అని చెప్పండి.
DEU 7:1 మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకువచ్చి, మీ ఎదుట నుండి అనేక జనాంగాలను అనగా మీకన్నా విస్తారమైన, బలమైన ఏడు జనాంగాలను హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వెళ్లగొట్టి,
DEU 7:2 మీ దేవుడైన యెహోవా వారిని మీకు అప్పగించగా, మీరు వారిని ఓడించినప్పుడు, వారిని పూర్తిగా నాశనం చేయాలి. వారితో సంధి చేసుకోకూడదు వారిని కరుణించకూడదు.
DEU 7:3 వారితో పెళ్ళి సంబంధాలు పెట్టుకోవద్దు. వారి కుమారులకు మీ కుమార్తెలను ఇవ్వకూడదు, మీ కుమారులకు వారి కుమార్తెలను పుచ్చుకోకూడదు,
DEU 7:4 ఎందుకంటే వారు నన్ను అనుసరించకుండా ఇతర దేవుళ్ళను సేవించేలా మీ పిల్లలను త్రిప్పివేస్తారు, అప్పుడు యెహోవా కోపం మీమీద రగులుకొని మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తుంది.
DEU 7:5 మీరు వారికి ఇలా చేయాలి: వారి బలిపీఠాలను పడగొట్టండి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టండి, వారి అషేరా స్తంభాలను ముక్కలు చేయండి, వారి విగ్రహాలను అగ్నితో కాల్చివేయండి.
DEU 7:6 ఎందుకంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలు. ఈ భూమి మీద ప్రజలందరిలో నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తన సొంత ప్రజలుగా, విలువైన ఆస్తిగా ఎన్నుకున్నారు.
DEU 7:7 మీరు ఇతర జనాంగాల కంటే ఎక్కువగా ఉన్నారని కాదు జనాంగాలన్నిటిలో మీరే తక్కువగా ఉన్నారని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకున్నారు.
DEU 7:8 అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి, మీ పూర్వికులతో చేసిన ప్రమాణం నెరవేర్చారు కాబట్టి, తన బలమైన హస్తంతో మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి బానిస దేశం నుండి, ఈజిప్టు రాజైన ఫరో శక్తి నుండి మిమ్మల్ని విడిపించారు.
DEU 7:9 కాబట్టి మీ దేవుడైన యెహోవాయే దేవుడని తెలుసుకోండి; ఆయన నమ్మదగిన దేవుడు, తనను ప్రేమిస్తూ, తన ఆజ్ఞలను పాటించే వారికి, ఆయన వెయ్యి తరాల వరకు తన నిబంధన స్థిరపరిచేవారు.
DEU 7:10 అయితే, తనను ద్వేషించేవారిని నేరుగా నాశనం చేస్తారు; ఆలస్యం చేయకుండా నేరుగా వారికి ప్రతిఫలం చెల్లిస్తారు.
DEU 7:11 కాబట్టి ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలు, శాసనాలు, చట్టాలను జాగ్రత్తగా అనుసరించండి.
DEU 7:12 మీరు ఈ చట్టాలను శ్రద్ధగా విని వాటిని జాగ్రత్తగా అనుసరిస్తే, మీ దేవుడైన యెహోవా మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లుగా, మీతో తన ప్రేమ నిబంధనను కొనసాగిస్తారు.
DEU 7:13 ఆయన మిమ్మల్ని ప్రేమించి దీవించి అభివృద్ధి కలుగజేస్తారు. మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భఫలాన్ని, మీ భూఫలమైన మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె, పశువుల దూడలను, మందల గొర్రెపిల్లలను దీవిస్తారు.
DEU 7:14 ఇతర ప్రజలకన్నా అధికంగా మీరు ఆశీర్వదించబడతారు; మీలో పురుషులలో కాని స్త్రీలలో కాని సంతానలేమి ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు.
DEU 7:15 యెహోవా మిమ్మల్ని ప్రతీ వ్యాధి నుండి కాపాడతారు. ఈజిప్టులో మీకు తెలిసిన భయంకరమైన రోగాల మీ మీదికి రాకుండా చేస్తారు, కాని మిమ్మల్ని ద్వేషించే వారందరి మీదికి వాటిని రప్పిస్తారు.
DEU 7:16 మీ దేవుడైన యెహోవా మీకు అప్పగించే ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపించకూడదు, వారి దేవుళ్ళను సేవించకూడదు, ఎందుకంటే అది మీకు ఉరిగా బిగుసుకుంటుంది.
DEU 7:17 “ఈ జనాంగాలు మా కన్నా బలవంతులు. మేము వారినెలా వెళ్లగొట్టగలము?” అని మీలో మీరు అనుకోవచ్చు.
DEU 7:18 అయితే వారికి భయపడకండి; మీ దేవుడైన యెహోవా ఫరోకు, ఈజిప్టు దేశమంతటికి చేసింది జాగ్రతగా జ్ఞాపకం చేసుకోండి.
DEU 7:19 గొప్ప శోధనలు, సూచకక్రియలు, అద్భుతాలు, బలమైన హస్తం చాచిన చేతితో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని బయటకు తీసుకురావడం మీ కళ్లతో మీరే చూశారు. మీరు భయపడుతున్న ప్రజలందరికి మీ దేవుడైన యెహోవా అలాగే చేస్తారు.
DEU 7:20 అంతేకాక, మీకు కనబడకుండా దాక్కున్న మిగిలినవారంతా నశించే వరకు, మీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపుతారు.
DEU 7:21 మీరు వారికి భయపడకండి, ఎందుకంటే మీ మధ్య ఉన్న మీ దేవుడైన యెహోవా గొప్పవాడు, అద్భుత దేవుడు
DEU 7:22 మీ దేవుడైన యెహోవా ఆ జనాంగాలను మీ ఎదుట నుండి కొద్దికొద్దిగా తొలగిస్తారు. అడవి జంతువులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఒకేసారి వారందరిని నాశనం చేయడానికి అనుమతి లేదు.
DEU 7:23 అయితే మీ దేవుడైన యెహోవా వారిని మీ చేతికి అప్పగించి, వారు నాశనం చేయబడేవరకు, వారికి గొప్ప కలవరాన్ని పుట్టిస్తారు.
DEU 7:24 ఆయన వారి రాజులను మీ చేతికి అప్పగిస్తారు. మీరు వారి పేర్లను ఆకాశం క్రిందనుండి తుడిచివేస్తారు. మీకు విరోధంగా ఎవరు నిలువలేరు; మీరు వారిని నాశనం చేస్తారు.
DEU 7:25 మీరు వారి దేవుళ్ళ విగ్రహాలను అగ్నిలో కాల్చివేయాలి. వాటి మీది వెండి బంగారాలను ఆశించి, మీ కోసం తీసుకోకూడదు, లేకపోతే దాని వలన మీరు చిక్కులో పడతారు. మీ దేవుడైన యెహోవాకు అది అసహ్యము.
DEU 7:26 అసహ్యమైన వాటిని మీరు ఇంటికి తీసుకురాకూడదు, లేదా మీరు, దానివలె నాశనానికి మీరు వేరు చేయబడతారు. అది నాశనం కోసం వేరు చేయబడుతుంది కాబట్టి దానిని నీచమైనదిగా చూసి పూర్తిగా అసహ్యించుకోవాలి.
DEU 8:1 మీరు జీవించి అభివృద్ధిచెంది, యెహోవా మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశానికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకునేలా, ఈ రోజు నేను మీకిచ్చే ప్రతి ఆజ్ఞను జాగ్రత్తగా అనుసరించాలి.
DEU 8:2 మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో అని మిమ్మల్ని పరీక్షించి మీ హృదయంలో ఏమున్నదో తెలుసుకోవడానికి మిమ్మల్ని దీనులుగా చేయడానికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అరణ్యంలో ఈ నలభై సంవత్సరాలు ఎలా నడిపించారో జ్ఞాపకం చేసుకోండి.
DEU 8:3 మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు కాని యెహోవా నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అని మీకు నేర్పించడానికి ఆయన మిమ్మల్ని అణచి మీకు ఆకలి కలిగించి మీకు గాని మీ పూర్వికులకు గాని ఇంతకుముందు తెలియని మన్నాతో మిమ్మల్ని పోషించారు.
DEU 8:4 ఈ నలభై సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడలేదు, మీ కాళ్లు వాయలేదు.
DEU 8:5 ఒకరు తన కుమారుని ఎలా క్రమశిక్షణలో పెడతారో, అలాగే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని మీ హృదయంలో మీరు గ్రహించాలి.
DEU 8:6 మీరు మీ దేవుడైన యెహోవాయందు భయం కలిగి, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటించాలి.
DEU 8:7 మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మంచి దేశంలోకి తీసుకెళ్తారు; అది నదులు నీటిప్రవాహాలు లోయల నుండి కొండల నుండి ఉబికే లోతైన నీటి ఊటలు ఉండే దేశం;
DEU 8:8 అంతేకాదు గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూర చెట్లు దానిమ్మపండ్లు ఒలీవనూనె తేనె దొరికే దేశం;
DEU 8:9 ఆ దేశంలో రొట్టెలకు కొరత ఉండదు మీకు ఏది తక్కువకాదు; ఇనుప రాళ్లు గల దేశం, దాని కొండల్లో మీరు రాగి త్రవ్వితీయవచ్చు.
DEU 8:10 మీరు తిని తృప్తి చెందిన తర్వాత, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయనను స్తుతించండి.
DEU 8:11 ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆయన ఆజ్ఞలను, చట్టాలను శాసనాలను పాటించడంలో విఫలమై మీ దేవుడనైన యెహోవాను మరచిపోకుండ జాగ్రత్తపడండి.
DEU 8:12 లేకపోతే మీరు తిని తృప్తి చెందినప్పుడు, మీరు మంచి ఇళ్ళు కట్టుకుని వాటిలో స్థిరపడినప్పుడు,
DEU 8:13 మీ పశువుల మందలు విస్తరించి, వెండి బంగారాలు విస్తరించి, మీకు ఉన్నదంతా వృద్ధి చెందినప్పుడు,
DEU 8:14 మీ హృదయం గర్వించి, బానిస దేశమైన ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవాను మరచిపోతారు.
DEU 8:15 ఆయన మిమ్మల్ని విషసర్పాలు, తేళ్లు ఉన్న నీళ్లు లేని భయంకరమైన పెద్ద అరణ్యంలో నుండి నడిపించారు. రాతి బండ నుండి మీకు నీళ్లు ఇచ్చారు.
DEU 8:16 ఆయన అరణ్యంలో మీ పూర్వికులకు ఎన్నడూ తెలియని మన్నాను మీకు తినడానికి ఇచ్చారు, మిమ్మల్ని తగ్గించడానికి మిమ్మల్ని పరీక్షించడానికి మీ మంచి కోసం ఇచ్చారు.
DEU 8:17 “నా శక్తి, నా చేతుల బలం ఈ సంపదను నాకు సంపాదించాయి” అని మీలో మీరు అనుకోవచ్చు.
DEU 8:18 కాని, మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, ఆయన మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లు, తన నిబంధన ఈ రోజు ఉన్నట్లుగా స్థిరపరచడానికి మీరు సంపదను సంపాదించే సామర్థ్యం ఇచ్చేవారు ఆయనే.
DEU 8:19 మీరు మీ దేవుడనైన యెహోవాను మరచిపోయి, ఇతర దేవుళ్ళను వెంబడించి పూజించి వాటిని సేవిస్తే, మీరు ఖచ్చితంగా నశించిపోతారని మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నాను.
DEU 8:20 మీ దేవుడైన యెహోవాకు లోబడకపోతే, మీ ఎదుట ఉండకుండా యెహోవా నాశనం చేసిన దేశాల్లా మీరు నాశనమవుతారు.
DEU 9:1 ఇశ్రాయేలూ, విను: ఇప్పుడు మీరు ఆకాశాన్నంటే ఎత్తైన గోడలున్న పెద్ద పట్టణాలు గల మీకన్నా గొప్ప బలమైన దేశాలను, స్వాధీనం చేసుకోవడానికి మీరు యొర్దాను దాటబోతున్నారు.
DEU 9:2 అక్కడి ప్రజలు బలవంతులు పొడవైనవారు, వారు మీకు తెలిసిన అనాకీయుల వంశస్థులు. వారి గురించి, “అనాకీయుల ఎదుట ఎవరు నిలబడగలరు?” అని చెప్పడం మీరు విన్నారు కదా.
DEU 9:3 అయితే దహించే అగ్నిలా మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా దాటి వెళ్తారని మీరు నమ్మండి. ఆయన వారిని నాశనం చేస్తారు; మీ ఎదుట వారిని అణచివేస్తారు. యెహోవా మీకు ప్రమాణం చేసిన ప్రకారం, మీరు వారిని వెళ్లగొట్టి త్వరగా వారిని నిర్మూలం చేస్తారు.
DEU 9:4 మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టిన తర్వాత, “మా నీతిని బట్టే ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి యెహోవా మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చారు” అని మీ హృదయంలో అనుకోవద్దు. ఈ జనాంగాల దుర్మార్గాన్ని బట్టే యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టబోతున్నారు.
DEU 9:5 మీ నీతి, నిష్కపటమైన మీ హృదయం కారణంగా మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవడంలేదు కాని ఈ జనాంగాల దుర్మార్గాన్ని బట్టే యెహోవా మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొడతారు.
DEU 9:6 మీరు మొండి ప్రజలు కాబట్టి, మీ దేవుడైన యెహోవా స్వాధీనం చేసుకోవడానికి ఈ మంచి దేశాన్ని మీకు ఇవ్వడానికి మీ నీతి కారణం కాదని మీరు గ్రహించండి.
DEU 9:7 అరణ్యంలో మీరు మీ దేవుడైన యెహోవాకు ఎలా కోపం పుట్టించారో జ్ఞాపకం చేసుకోండి. మీరు ఈజిప్టు విడిచిన రోజు నుండి ఇక్కడకు వచ్చిన కాలం వరకు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.
DEU 9:8 హోరేబులో యెహోవా మిమ్మల్ని నాశనం చేసేంతగా ఆయనకు కోపం పుట్టించారు.
DEU 9:9 రాతిపలకలు అనగా, యెహోవా మీతో చేసిన నిబంధనకు సంబంధించి పలకలను తీసుకోవడానికి నేను పర్వతం మీదికి ఎక్కి వెళ్లినప్పుడు, ఆ పర్వతం మీద నేను నలభై పగళ్లు, నలభై రాత్రులు ఉన్నాను; నేను ఆహారం తినలేదు, నీళ్లు త్రాగలేదు.
DEU 9:10 దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతిపలకలను యెహోవా నాకు ఇచ్చారు. మీరందరు సమావేశమైన రోజున పర్వతం మీద అగ్ని మధ్యలో నుండి యెహోవా మీకు ప్రకటించిన ఆజ్ఞలు ఆ పలకల మీద ఉన్నాయి.
DEU 9:11 నలభై పగళ్లు, నలభై రాత్రులు గడిచినప్పుడు, యెహోవా రెండు రాతిపలకలు అనగా, నిబంధనకు సంబంధించిన పలకలు నాకు ఇచ్చారు.
DEU 9:12 అప్పుడు యెహోవా నాతో, “నీవు వెంటనే ఇక్కడినుండి క్రిందికి వెళ్లు, నీవు ఈజిప్టు నుండి తీసుకువచ్చిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి తమ కోసం ఒక విగ్రహాన్ని తయారుచేసుకున్నారు” అని చెప్పారు.
DEU 9:13 ఇంకా యెహోవా నాతో, “నేను ఈ ప్రజలను చూశాను, వారు నిజంగా మొండి ప్రజలు.
DEU 9:14 నన్ను విడిచిపెట్టు, నేను వారిని నాశనం చేసి, ఆకాశం క్రింద వారి పేరు ఉండకుండా తుడిచివేస్తాను. నిన్ను వారికంటే బలమైన దేశంగా, సంఖ్యలో వారికంటే ఎక్కువ ఉండేలా చేస్తాను” అని అన్నారు.
DEU 9:15 కాబట్టి నేను పర్వతం అగ్నితో మండుతున్నప్పుడు తిరిగి పర్వతం దిగి వచ్చాను. రెండు నిబంధన పలకలు నా చేతిలో ఉన్నాయి.
DEU 9:16 నేను చూసినప్పుడు, మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మీరు పాపం చేశారని నేను చూశాను; దూడ రూపంలో తయారుచేసిన విగ్రహాన్ని మీ కోసం తయారుచేసుకున్నారు. యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి త్వరగా తొలగిపోయారు.
DEU 9:17 కాబట్టి నా చేతుల్లో ఉన్న రెండు పలకలను విసిరి, మీ కళ్లముందే వాటిని ముక్కలు చేశాను.
DEU 9:18 యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించి చేసిన పాపాలన్నిటిని బట్టి మీరు ఆయనకు కోపం పుట్టించిన కారణంగా మళ్ళీ నేను నలభై పగళ్లు నలభై రాత్రులు ఆహారం తినకుండా నీళ్లు త్రాగకుండా యెహోవా ఎదుట సాష్టాంగపడ్డాను.
DEU 9:19 మిమ్మల్ని నాశనం చేయాలన్నంతగా కోప్పడిన యెహోవా కోపాన్ని ఉగ్రతను చూసి నేను భయపడ్డాను. కాని యెహోవా మరలా నా మనవి ఆలకించారు.
DEU 9:20 అహరోనును కూడా నాశనం చేసేంతగా యెహోవా అతనిపై కోప్పడ్డారు, కాని నేను అప్పుడు అహరోను కోసం కూడా ప్రార్థన చేశాను.
DEU 9:21 అలాగే మీరు చేసిన పాపిష్ఠి పని, అనగా దూడ విగ్రహాన్ని తీసుకుని అగ్నిలో కాల్చివేశాను. తర్వాత నలగ్గొట్టి దుమ్ము అంత మెత్తగా దానిని పొడిచేసి, ఆ పర్వతం నుండి ప్రవహిస్తున్న వాగులో పడేశాను.
DEU 9:22 తబేరా, మస్సా, కిబ్రోతు హత్తావాలలో కూడా మీరు యెహోవాకు కోపం పుట్టించారు.
DEU 9:23 యెహోవా మిమ్మల్ని కాదేషు బర్నియాలో నుండి పంపిస్తున్నప్పుడు ఆయన మీతో, “మీరు వెళ్లి నేను మీకు ఇచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి” అని చెప్పారు. కాని మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు తిరుగుబాటు చేశారు. మీరు ఆయనను నమ్మలేదు, లోబడలేదు.
DEU 9:24 మీరు నాకు తెలిసినప్పటినుండి మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.
DEU 9:25 యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తానని చెప్పిన కారణంగా నేను ఆ నలభై పగళ్లు నలభై రాత్రులు యెహోవా ఎదుట సాష్టాంగపడ్డాను.
DEU 9:26 నేను యెహోవాకు ఇలా ప్రార్థన చేశాను, “ప్రభువైన యెహోవా! మీ గొప్ప బలంతో విడిపించి, మీ బలమైన హస్తంతో ఈజిప్టులో నుండి బయటకు తీసుకువచ్చిన మీ స్వాస్థ్యమైన మీ ప్రజలను నాశనం చేయవద్దు.
DEU 9:27 మీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజల మొండితనాన్ని చెడుతనాన్ని పాపాన్ని పట్టించుకోకండి.
DEU 9:28 లేకపోతే మీరు మమ్మల్ని ఏ దేశం నుండి బయటకు తీసుకువచ్చారో ఆ ప్రజలు, ‘యెహోవా వారికి వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని తీసుకెళ్లలేక పోయారు, వారిని ద్వేషించారు కాబట్టి అరణ్యంలో చంపడానికి వారిని బయటకు తీసుకెళ్లారు’ అని చెప్పుకుంటారు.
DEU 9:29 అయితే వారు మీ ప్రజలు, మీ అధిక బలం చేత, మీ చాచిన చేతి చేత మీరు బయటకు తీసుకువచ్చిన మీ స్వాస్థ్యము.”
DEU 10:1 అప్పుడు యెహోవా నాతో అన్నారు, “నీవు మొదటి పలకలవంటి మరో రెండు రాతిపలకలను చెక్కి పర్వతమెక్కి నా దగ్గరకు రా. అలాగే ఒక కర్ర మందసాన్ని తయారుచేయు.
DEU 10:2 నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే నేను వాటిపై వ్రాస్తాను. తర్వాత నీవు వాటిని ఆ మందసంలో ఉంచాలి.”
DEU 10:3 కాబట్టి నేను తుమ్మకర్రతో మందసం చేసి, మొదటి వాటిలా రెండు రాతిపలకలను చెక్కి, నా చేతులతో ఆ రెండు రాతిపలకలు పట్టుకుని నేను పైకి వెళ్లాను.
DEU 10:4 సమావేశమైన రోజున, పర్వతం మీద, అగ్ని మధ్యలో నుండి మీకు ప్రకటించిన పది ఆజ్ఞలను మొదట వ్రాసినట్లుగానే, యెహోవా ఆ పలకల మీద వ్రాశారు. యెహోవా వాటిని నాకు ఇచ్చారు.
DEU 10:5 తర్వాత నేను పర్వతం దిగివచ్చి, యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం, నేను చేసిన మందసంలో ఆ పలకలను ఉంచాను. ఇప్పుడవి దానిలో ఉన్నాయి.
DEU 10:6 ఇశ్రాయేలీయులు బెనె యహకాను బావులనుండి మొసేరాకు ప్రయాణించారు. అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడ్డాడు, అతని కుమారుడైన ఎలియాజరు అతనికి బదులుగా యాజకుడయ్యాడు.
DEU 10:7 అక్కడినుండి వారు గుద్గోదకు, తర్వాత నీటిప్రవాహాలు ఉన్న దేశమైన యొత్బాతాకు ప్రయాణించారు.
DEU 10:8 నేటి వరకు చేస్తున్నట్లుగా, యెహోవా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవ చేయడానికి, ఆయన పేరిట ఆశీర్వచనం పలకడానికి లేవీ గోత్రికులను ఆ సమయంలో యెహోవా ప్రత్యేకించుకున్నారు.
DEU 10:9 అందుకే లేవీయులకు వారి తోటి ఇశ్రాయేలీయులతో పాటు వాటా గాని స్వాస్థ్యం గాని లేదు; మీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారి స్వాస్థ్యము.
DEU 10:10 మొదట ఉన్నట్లే నేను ఆ పర్వతం మీద నలభై పగళ్లు నలభై రాత్రులు ఉన్నాను, ఈసారి కూడా యెహోవా నా మనవి ఆలకించారు. మిమ్మల్ని నాశనం చేయడం ఆయన చిత్తం కాదు.
DEU 10:11 యెహోవా నాతో అన్నారు, “నీవు లేచి వెళ్లు, వారికి ఇస్తానని వారి పూర్వికులతో నేను ప్రమాణం చేసిన దేశంలోనికి వారు వెళ్లి, దానిని స్వాధీనం చేసుకునేటట్లు నీవు వారిని నడిపించు.”
DEU 10:12 ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏమి అడుగుతున్నారు? మీ దేవుడైన యెహోవాయందు మీరు భయం కలిగి ఉండాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయనను ప్రేమించాలని, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడనైన యెహోవాను సేవించాలని,
DEU 10:13 మీ మేలుకోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న యెహోవా ఆజ్ఞలు శాసనాలు పాటించమనే కదా?
DEU 10:14 ఆకాశాలు, మహాకాశాలు, భూమి, భూమిపై ఉన్నవన్నీ మీ దేవుడైన యెహోవాకు చెందినవి.
DEU 10:15 అయితే యెహోవా మీ పూర్వికులపై తన దయ చూపించి, వారిని ప్రేమించి, జనాంగాలందరిలో వారి సంతానమైన మిమ్మల్ని ఈ రోజు వలె ఏర్పరచుకున్నారు.
DEU 10:16 కాబట్టి మీ హృదయాలను సున్నతి చేసుకుని ఇకపై మొండిగా ఉండకండి.
DEU 10:17 ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా దేవుళ్ళకు దేవుడు ప్రభువులకు ప్రభువు, గొప్ప దేవుడు, బలవంతుడు, అద్భుత దేవుడు, పక్షపాతం లేనివారు, లంచం పుచ్చుకోని దేవుడు.
DEU 10:18 తండ్రిలేనివారికి, విధవరాండ్రకు న్యాయం తీరుస్తారు, మీ మధ్యన ఉన్న విదేశీయులను ప్రేమించి వారికి అన్నవస్త్రాలు ఇస్తారు.
DEU 10:19 మీరు కూడ ఈజిప్టులో విదేశీయులుగా ఉన్నారు కాబట్టి మీరు విదేశీయులను ప్రేమించాలి.
DEU 10:20 మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను సేవించండి. ఆయనను గట్టిగా పట్టుకుని ఆయన పేరిట ప్రమాణాలు చేయండి.
DEU 10:21 మీరు స్తుతించవలసింది ఆయననే; మీ కళ్లారా మీరు చూసిన గొప్ప భయంకరమైన అద్భుతాలను మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.
DEU 10:22 ఈజిప్టుకు వెళ్లినప్పుడు మీ పూర్వికులు మొత్తం డెబ్బైమంది, అయితే ఇప్పుడు మీ దేవుడైన యెహోవా ఆకాశంలోని నక్షత్రాలవలె మిమ్మల్ని అసంఖ్యాకంగా వృద్ధిచేశారు.
DEU 11:1 మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మీకు చెప్పేవాటన్నిటిని, ఆయన శాసనాలను, ఆయన చట్టాలను, ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాలి.
DEU 11:2 మీ దేవుడైన యెహోవా క్రమశిక్షణను చూసింది, అనుభవించింది మీ పిల్లలు కాదని ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి: ఆయన మహిమను, ఆయన బలమైన హస్తాన్ని, ఆయన చాచిన చేయిని;
DEU 11:3 ఈజిప్టులో, ఈజిప్టు రాజైన ఫరోకు అతని దేశమంతటికి ఆయన చేసిన అసాధారణ గుర్తులు;
DEU 11:4 ఈజిప్టు సైన్యానికి, దాని గుర్రాలకు రథాలకు ఆయన చేసింది, వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్ర సముద్రపు నీటితో వారిని కప్పివేయడం, యెహోవా వారిపై నిత్య నాశనం ఎలా తెచ్చారో మీరు చూశారు.
DEU 11:5 మీరు ఈ చోటికి చేరుకునేవరకు అరణ్యంలో ఆయన మీ కోసం ఏమి చేశారో చూసింది మీ పిల్లలు కాదు.
DEU 11:6 ఆయన రూబేనీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములకు చేసిన దానిని అనగా ఇశ్రాయేలీయులందరి మధ్యలో భూమి నోరు తెరిచి వారిని వారు కుటుంబాలను వారి గుడారాలను వారికి చెందిన ప్రతి జీవిని మ్రింగివేసిన విధానాన్ని మీరు చూశారు.
DEU 11:7 యెహోవా చేసిన ఈ గొప్ప కార్యాలన్నిటిని చూసింది మీ సొంత కళ్లు.
DEU 11:8 కాబట్టి ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటిని పాటించండి, అప్పుడు మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటి వెళ్తున్న ఆ దేశంలోనికి వెళ్లడానికి బలం కలిగి ఉంటారు,
DEU 11:9 తద్వార వారికి వారి సంతానానికి ఇస్తానని యెహోవా మీ పూర్వికులతో వాగ్దానం చేసిన దేశంలో అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు అధిక కాలం జీవిస్తారు.
DEU 11:10 మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఈజిప్టు దేశం వంటిది కాదు; అక్కడ మీరు విత్తనాలు విత్తి కూరతోటలలో చేసినట్లు వాటికి కాళ్లతో నీరు పెట్టారు.
DEU 11:11 మీరు యొర్దాను దాటి వెళ్లి స్వాధీనం చేసుకోబోయే దేశం ఆకాశపు వర్షాన్ని త్రాగే పర్వతాలు లోయలు ఉన్న దేశము.
DEU 11:12 అది మీ దేవుడైన యెహోవా సంరక్షించే దేశము; సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దేవుడైన యెహోవా దృష్టి దాని మీద నిలిచి ఉంటుంది.
DEU 11:13 కాబట్టి ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలకు నమ్మకంగా లోబడితే, మీరు మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించాలి.
DEU 11:14 అప్పుడు మీ దేశంలో సకాలంలో తొలకరి కడవరి వర్షాలు కురిపిస్తాను. అప్పుడు మీరు ధాన్యాన్ని క్రొత్త ద్రాక్షరసాన్ని, ఒలీవ నూనెను సమకూర్చుకోవచ్చు.
DEU 11:15 మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను; మీరు తిని తృప్తి చెందుతారు.
DEU 11:16 జాగ్రత్తపడండి, లేదా మీరు మోసపోయి ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని పూజించి సేవిస్తారు.
DEU 11:17 అప్పుడు యెహోవా కోపం మీమీద రగులుకొని ఆయన ఆకాశాన్ని మూసేస్తారు, అప్పుడు వాన కురవదు, భూమి పండదు, యెహోవా మీకు ఇవ్వబోయే ఆ మంచి దేశంలో ఉండకుండా మీరు త్వరలోనే నశించిపోతారు.
DEU 11:18 ఈ నా మాటలు మీ మనస్సులో హృదయంలో ఉంచుకోండి; వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి.
DEU 11:19 వాటిని మీ పిల్లలకు నేర్పించండి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు మీరు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి.
DEU 11:20 మీ ఇంటి ద్వారబంధాల మీద ద్వారాల మీద వాటిని వ్రాయండి,
DEU 11:21 తద్వార యెహోవా మీ పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో మీరు, మీ పిల్లలు ఎక్కువ రోజులు అనగా భూమిపై ఆకాశం ఉన్నంత కాలం మీరు జీవిస్తారు.
DEU 11:22 మీరు పాటించాలని నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రతగా పాటిస్తే అనగా మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనను అంటిపెట్టుకుని ఉండాలి.
DEU 11:23 అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జనాంగాలన్నిటిని వెళ్లగొడతారు. మీకంటే విస్తారమైన, బలమైన దేశాలను మీరు వెళ్లగొడతారు.
DEU 11:24 మీరు అడుగుపెట్టే ప్రతి చోటు మీదే అవుతుంది: ఎడారి నుండి లెబానోను వరకు, యూఫ్రటీసు నది నుండి మధ్యధరా సముద్రం వరకు మీ సరిహద్దులు వ్యాపిస్తాయి.
DEU 11:25 మీకు ఎదురుగా ఎవరు నిలబడలేరు. ఆయన మీకు వాగ్దానం చేసిన ప్రకారం మీ దేవుడైన యెహోవా మీరు వెళ్లే దేశమంతటికి మీరంటే వణుకును భయాన్ని పుట్టిస్తారు.
DEU 11:26 చూడండి, ఈ రోజు నేను మీ ముందు దీవెనను శాపాన్ని ఉంచుతున్నాను.
DEU 11:27 ఈ రోజు నేను మీకు ఇచ్చే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడితే మీకు దీవెన;
DEU 11:28 మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడకుండా, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం.
DEU 11:29 మీరు స్వాధీనం చేసుకోబోతున్న దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చేర్చిన తర్వాత, గెరిజీము పర్వతం మీద దీవెనను ఏబాలు పర్వతంమీద శాపాన్ని ప్రకటించాలి.
DEU 11:30 మీకు తెలిసినట్లు, ఈ పర్వతాలు యొర్దాను అవతల సూర్యుడు అస్తమించే దిక్కుకు వెనుక మోరె లోని సింధూర వృక్షాల దగ్గర గిల్గాలు ప్రాంతంలో ఉన్న అరాబాలో నివసించే కనానీయుల సరిహద్దులో ఉన్నాయి.
DEU 11:31 మీ దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోతున్న దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మీరు యొర్దాను నది దాటబోతున్నారు. మీరు దానిని స్వాధీనం చేసుకుని దానిలో నివసించినప్పుడు,
DEU 11:32 ఈ రోజు నేను మీ ముందు ఉంచిన అన్ని శాసనాలను చట్టాలను తప్పనిసరిగా పాటించండి.
DEU 12:1 మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలో మీరు నివసించినంత కాలం మీరు జాగ్రత్తగా అనుసరించవలసిన శాసనాలు చట్టాలు ఇవి.
DEU 12:2 మీరు స్వాధీనం చేసుకోబోయే దేశాల్లో ఎక్కడైతే ప్రజలు తమ దేవుళ్ళను సేవిస్తారో, అనగా ఎత్తైన పర్వతాలమీద కొండల పైన విస్తరించి ఉన్న చెట్టు క్రింద ఉన్న ఆ స్థలాలన్నిటిని పూర్తిగా నాశనం చేయాలి.
DEU 12:3 వారి బలిపీఠాలను పడగొట్టాలి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టాలి, వారి అషేరా స్తంభాలను అగ్నితో కాల్చివేయాలి; వారి దేవతల ప్రతిమలను కూల్చివేసి, వాటి పేర్లు ఆ స్థలంలో లేకుండా నిర్మూలం చేయాలి.
DEU 12:4 మీరు మీ దేవుడైన యెహోవాను వారి విధానంలో ఆరాధించకూడదు.
DEU 12:5 కాని మీ దేవుడైన యెహోవా మీ గోత్రాలన్నిటిలో తన పేరును స్థాపించడానికి ఆయనకు నివాస స్థానంగా ఏర్పరచుకొనే స్థలాన్ని మీరు వెదికి ఆ స్థలానికి మీరు వెళ్లాలి;
DEU 12:6 అక్కడికే మీరు మీ దహనబలులు, మీ బలులు, మీ దశమభాగాలు, ప్రత్యేక అర్పణలు, మీరు ఇస్తామన్న మ్రొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు, పశువుల మందలో గొర్రెల మందలోని మొదట పుట్టిన వాటిని తీసుకురావాలి.
DEU 12:7 మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి, అక్కడ మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు, మీ కుటుంబాలు తిని, మీ చేతి పనులన్నిటిని బట్టి సంతోషించాలి.
DEU 12:8 ఈ రోజు మనం ఇక్కడ చేస్తున్నట్లు మీలో ప్రతిఒక్కరు తమ దృష్టికి సరియైనది అనుకున్న దానిని చేయకూడదు,
DEU 12:9 ఎందుకంటే, ఇంకా మీరు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న విశ్రాంతి స్థలానికి వారసత్వ దేశాన్ని చేరుకోలేదు.
DEU 12:10 అయితే మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశంలో స్థిరపడాలి, మీరు క్షేమంగా జీవించేలా ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిస్తారు.
DEU 12:11 అప్పుడు యెహోవా తన నామానికి నివాస స్థలాన్ని ఏర్పరచుకుంటారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అనగా, మీ దహనబలులు, మీ బలులు, మీ దశమభాగాలు, ప్రత్యేక అర్పణలు, మీరు యెహోవాకు ఇస్తామని మ్రొక్కుబడి చేసుకున్న కానుకలు అక్కడికే తీసుకురావాలి.
DEU 12:12 అక్కడ మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు దాసీలు, భాగం గాని స్వాస్థ్యం గాని లేకుండా మీ ఇళ్ళలో ఉండే లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి.
DEU 12:13 మీరు నచ్చిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకుండ జాగ్రత్తపడండి.
DEU 12:14 మీ గోత్రాల్లో ఒకదానిలో యెహోవా ఏర్పరచుకొనే స్థలంలోనే మీ దహనబలులు అర్పించి, అక్కడే నేను ఆజ్ఞాపించే వాటన్నిటిని జరిగించాలి.
DEU 12:15 అయితే మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారం, మీ ఇళ్ళలో ఉన్న పశువులను, జింకను లేదా దుప్పిని తిన్నట్లుగా మీకు ఇష్టం వచ్చినంత మాంసాన్ని తినవచ్చు. ఆచారరీత్య పవిత్రులైనవారు, అపవిత్రులైనవారు దానిని తినవచ్చు.
DEU 12:16 అయితే మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి.
DEU 12:17 మీ ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో దశమభాగాన్ని, లేదా మీ పశువుల్లో, మందలలో మొదట పుట్టిన దానిని, లేదా మీరు ఇస్తామన్న మ్రొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు ప్రత్యేక అర్పణలు వేటిని మీ పట్టణాల్లో తినకూడదు.
DEU 12:18 అయితే మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలంలోనే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో ఉండే లేవీయులు, అందరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో తిని, మీ చేతి పనులన్నిటిని బట్టి మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి.
DEU 12:19 మీరు మీ దేశంలో ఉన్నంతకాలం లేవీయులను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడండి.
DEU 12:20 మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన మీ సరిహద్దులు విశాలపరచినప్పుడు, మీకు మాంసం తినాలనే ఆశ కలిగి, “నేను కొంత మాంసాన్ని తింటాను” అని అనుకోవచ్చు. అప్పుడు మీకు కావలసినంత మాంసాన్ని తినవచ్చు.
DEU 12:21 మీ దేవుడైన యెహోవా తన నామం కోసం ఏర్పరచుకున్న స్థలం మీకు చాలా దూరంగా ఉంటే, యెహోవా మీకు ఇచ్చిన పశువుల్లో, మందలో నుండి పశువులను వధించి, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీ స్వస్థలాలలోనే మీకు కావలసినంత మాంసాన్ని మీరు తినవచ్చు.
DEU 12:22 జింకను దుప్పిని తిన్నట్లుగా మీరు వాటిని తినవచ్చు. ఆచారరీత్య పవిత్రులైనవారు అపవిత్రులైనవారు తినవచ్చు.
DEU 12:23 రక్తం తినకుండా చూసుకోండి, రక్తమంటే ప్రాణము కాబట్టి మాంసంతో పాటు ప్రాణాన్ని తినకూడదు.
DEU 12:24 ఖచ్చితంగా మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి.
DEU 12:25 యెహోవా దృష్టిలో సరియైన దానిని మీరు చేస్తారు కాబట్టి దానిని తినకండి, అప్పుడు మీకు మీ తర్వాత మీ పిల్లలకు మేలు కలుగుతుంది.
DEU 12:26 అయితే మీ పవిత్ర వస్తువులను, మీరు ఇస్తానని మ్రొక్కుబడి చేసినవన్నీ తీసుకుని, యెహోవా ఎన్నుకునే ప్రదేశానికి వెళ్లండి.
DEU 12:27 మీ దహనబలులను, వాటి రక్తమాంసాలను మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించాలి. మీ బలుల రక్తాన్ని మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయాలి, అయితే ఆ మాంసాన్ని మీరు తినవచ్చు.
DEU 12:28 మీ దేవుడైన యెహోవా దృష్టిలో సరియైన దానిని మీరు చేస్తారు కాబట్టి మీకు, మీ తర్వాత మీ పిల్లలకు మేలు కలిగేలా నేను మీకు ఇస్తున్న నిబంధనలన్నిటిని మీరు జాగ్రత్తగా విని పాటించాలి.
DEU 12:29 మీరు దాడి చేసి వెళ్లగొట్టబోతున్న జనాంగాలను మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి తొలగిస్తారు. అయితే మీరు వారిని వెళ్లగొట్టి వారి దేశంలో స్థిరపడిన తర్వాత,
DEU 12:30 వారు మీ ఎదుట నుండి నిర్మూలమైనప్పుడు, మీరు వారి పద్ధతులను అనుసరించి, “ఈ ప్రజలు తమ దేవుళ్ళను ఎలా సేవిస్తున్నారు? మేము కూడా అలాగే చేస్తాము” అని అంటూ చిక్కుల్లో పడిపోకుండా జాగ్రత్తపడండి.
DEU 12:31 వారి విధానాల్లో మీ దేవుడనైన యెహోవాను మీరు ఆరాధించకూడదు, ఎందుకంటే వారు తమ దేవుళ్ళను పూజిస్తూ యెహోవా ద్వేషించే అసహ్యమైన సమస్తాన్ని చేస్తారు. వారు తమ కుమారులను కుమార్తెలను తమ దేవుళ్ళకు బలిగా అగ్నిలో కాల్చివేస్తారు.
DEU 12:32 నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు పాటించేలా చూడండి; దానికి ఏది కలపవద్దు, దానిలో నుండి ఏది తీసివేయవద్దు.
DEU 13:1 ప్రవక్త గాని కలల ద్వారా భవిష్యత్తును చెప్పగలవారు గాని మీ మధ్యకు వచ్చి, మీ ఎదుట ఒక గుర్తును లేదా అద్భుతాన్ని ప్రకటిస్తే,
DEU 13:2 ఒకవేళ చెప్పిన గుర్తు లేదా అద్భుతం జరిగి, ఆ ప్రవక్త, “మనం ఇతర దేవుళ్ళను అనుసరిద్దాం” (మీకు తెలియని దేవుళ్ళు) “వాటిని సేవిద్దాం” అని ప్రలోభపెడితే,
DEU 13:3 ఆ ప్రవక్త మాటలు లేదా కలలు కనేవారి మాటలు గాని మీరు వినకూడదు. మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నారు.
DEU 13:4 మీరు మీ దేవుడైన యెహోవాను వెంబడించి ఆయనకు భయపడాలి; ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనకు లోబడాలి; ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండాలి.
DEU 13:5 ఈజిప్టు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి, బానిస దేశం నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద మీరు తిరుగుబాటు చేయడానికి వారు మిమ్మల్ని ప్రేరేపించారు కాబట్టి వారు చంపబడాలి. ప్రవక్త లేదా కలలు కనేవారు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అనుసరించమని ఆజ్ఞాపించిన మార్గం నుండి మిమ్మల్ని త్రిప్పివేయడానికి ప్రయత్నించారు. ఈ విధంగా మీ మధ్యలో నుండి చెడుతనాన్ని తొలగించాలి.
DEU 13:6 మీ సొంత సోదరుడు లేదా మీ కుమారుడు గాని కుమార్తె గాని, లేదా మీరు ప్రేమిస్తున్న భార్య లేదా మీ ప్రాణస్నేహితుడు గాని రహస్యంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి, “మనం వెళ్లి ఇతర దేవుళ్ళను (మీకు గాని మీ పూర్వికులకు తెలియని దేవుళ్ళు, మీ చుట్టూ ఉన్న, మీకు దగ్గరగా ఉన్న, దూరంగా ఉన్న ప్రజల దేవుళ్ళు, భూమి ఒక చివరి నుండి ఇంకొక చివరి వరకు ఉన్న దేవుళ్ళు) సేవిద్దాం” అని చెప్తే,
DEU 13:8 మీరు వారి మాటలు అంగీకరించవద్దు, వారి మాట వినవద్దు. వారి మీద జాలి చూపవద్దు. వారిని విడిచిపెట్టవద్దు, వారిని కాపాడవద్దు.
DEU 13:9 వారిని ఖచ్చితంగా చంపాల్సిందే. వారిని చంపడానికి మిగిలిన ప్రజలందరి కంటే ముందు మీ చేయి వారి మీద పడాలి.
DEU 13:10 వారిని రాళ్లతో కొట్టి చంపాలి ఎందుకంటే, ఈజిప్టు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి బానిస దేశం నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా దగ్గర నుండి మిమ్మల్ని దూరం చేయడానికి వారు ప్రయత్నించారు.
DEU 13:11 అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడతారు, మీలో ఎవరూ మరలా అలాంటి దుర్మార్గం చేయరు.
DEU 13:12 మీరు నివసించడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పట్టణాల్లో దేనిలోనైనా దుష్టులు కొందరు మీ మధ్యలో లేచి, “మనం ఇతర దేవుళ్ళను సేవిద్దాం” అని చెప్పి (మీకు తెలియని దేవుళ్ళను) తమ పట్టణంలోని ప్రజలను ప్రోత్సహించినట్లు మీరు వినివుంటే,
DEU 13:14 దాని గురించి మీరు విచారణ చేసి పూర్తిగా పరిశోధించి తెలుసుకోవాలి. అది నిజమై, మీ మధ్య ఈ అసహ్యకరమైన పని జరిగిందని నిరూపించబడితే,
DEU 13:15 ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ ఖచ్చితంగా ఖడ్గంతో సంహరించాలి; దానిలో ఉన్న సమస్తాన్ని, అంటే ప్రజలను పశువులను పూర్తిగా నాశనం చేయాలి.
DEU 13:16 దానిలో ఉన్న విలువైన వస్తువులన్నిటిని పట్టణంలో మధ్యలోనికి తీసుకువచ్చి మీ దేవుడైన యెహోవాకు దహనబలిగా ఆ పట్టణాన్ని, దానిలోని వస్తువులను పూర్తిగా కాల్చివేయాలి. ఆ పట్టణం మరలా కట్టబడకుండా ఎల్లప్పుడు పాడుపడిన దానిగానే ఉండాలి,
DEU 13:17 నాశనానికి చెందిన వాటిలో ఏది మీ దగ్గర ఉండకూడదు. అప్పుడు యెహోవా తన తీవ్రమైన కోపాన్ని విడిచిపెట్టి, మిమ్మల్ని కనికరించి, మీమీద దయ చూపుతారు. మీ పూర్వికులకు ఇచ్చిన వాగ్దానం మేరకు మిమ్మల్ని అసంఖ్యాకంగా విస్తరింపజేస్తారు,
DEU 13:18 ఎందుకంటే నేను ఈ రోజు మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని పాటించడం ద్వారా, మీ దేవుడైన యెహోవాకు మీరు విధేయత చూపించి ఆయన దృష్టిలో సరియైన వాటిని మీరు చేస్తున్నారు.
DEU 14:1 మీరు మీ దేవుడైన యెహోవాకు పిల్లలు. చనిపోయినవారి కోసం మిమ్మల్ని మీరు కోసుకోకూడదు, మీ కనుబొమ్మల మధ్య క్షవరం చేసుకోకూడదు,
DEU 14:2 ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు పవిత్ర ప్రజలు. భూమి మీద ఉన్న ప్రజలందరిలో యెహోవా మిమ్మల్ని తన విలువైన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నారు.
DEU 14:3 అసహ్యమైనదేది తినకూడదు.
DEU 14:4 మీరు తినదగిన జంతువులు: ఎద్దు, గొర్రె, మేక,
DEU 14:5 జింక, దుప్పి, ఎర్రచిన్న జింక, అడవి మేకలు, అడవి గొర్రెలు, లేడి దుప్పులు, కొండ గొర్రెలు,
DEU 14:6 చీలిన డెక్కలు ఉండి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు.
DEU 14:7 అయితే, నెమరువేసే జంతువు లేదా చీలిన డెక్కలు కలిగి ఉన్న ఒంటెలు, కుందేలు, పొట్టి కుందేలు లాంటివి మీరు తినకూడదు. అవి నెమరువేసేవైనా వాటికి చీలిన డెక్కలు లేవు; అవి మీకు ఆచారరీత్య అపవిత్రమైనవి.
DEU 14:8 పంది కూడా అపవిత్రమైనది; దానికి చీలిన డెక్కలు ఉంటాయి కాని అది నెమరువేయదు. వాటి మాంసం తినవద్దు వాటి కళేబరాలు ముట్టుకోవద్దు.
DEU 14:9 నీటిలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు.
DEU 14:10 రెక్కలు పొలుసులు లేనివాటిని మీరు తినకూడదు; అవి మీకు అపవిత్రమైనవి.
DEU 14:11 పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు.
DEU 14:12 కాని మీరు తినకూడనివి ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,
DEU 14:13 ఎర్ర గ్రద్ద, నల్ల గ్రద్ద, ప్రతి రకమైన తెల్ల గ్రద్ద,
DEU 14:14 ప్రతి రకమైన కాకి,
DEU 14:15 కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,
DEU 14:16 పైడికంటే, గుడ్లగూబ, హంస,
DEU 14:17 గూడబాతు, నల్లబోరువ, చెరువు కాకి,
DEU 14:18 సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.
DEU 14:19 ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి; మీరు వాటిని తినకూడదు.
DEU 14:20 ఆచారరీత్య పవిత్రమైన రెక్కలు గల ప్రతి ప్రాణిని మీరు తినవచ్చు.
DEU 14:21 మీరు ముందే కనుగొన్న చచ్చినదానిని తినకూడదు. మీ పట్టణాల్లో నివసించే విదేశీయులకు మీరు దానిని ఇవ్వవచ్చు, వారు దానిని తినవచ్చు లేదా ఇతర విదేశీయులకు దానిని అమ్మవచ్చు. అయితే మీరు మీ దేవుడైన యెహోవాకు పవిత్ర ప్రజలు. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.
DEU 14:22 ప్రతి సంవత్సరం మీ పొలాల్లో పండే పంటల్లో పదవ వంతును ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉంచాలి.
DEU 14:23 మీ దేవుడైన యెహోవాకు మీరు ఎల్లప్పుడు భయపడడం నేర్చుకునేలా మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో మీ ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో దశమభాగాన్ని, పశువుల్లో, మందలలో మొదటి పిల్లల్లో పదవ దానిని యెహోవా సన్నిధిలో తినాలి.
DEU 14:24 ఒకవేళ ఆ స్థలం అంటే యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలం మీకు చాలా దూరంగా ఉంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినందున మీ దశమభాగాన్ని అక్కడికి మోసుకొని వెళ్లలేనప్పుడు,
DEU 14:25 మీ దశమభాగాన్ని వెండికి మార్చి, దానిని మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనే స్థలానికి తీసుకురావాలి.
DEU 14:26 ఆ వెండితో మీకు నచ్చిన వాటిని కొనండి: పశువులు, గొర్రెలు, ద్రాక్షరసం లేదా మద్యం లేదా మీకు నచ్చింది ఏదైన. తర్వాత మీరు మీ కుటుంబీకులు అక్కడే మీ దేవుడైన యెహోవా సన్నిధిలో వాటిని తిని సంతోషించాలి.
DEU 14:27 మీ పట్టణాల్లో నివసించే లేవీయులను నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే వారికి మీతో పాటు భాగం గాని వారసత్వం గాని లేదు.
DEU 14:28 మీ దేవుడైన యెహోవా మీ చేతిపనిని ఆశీర్వదించేలా, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, ఆ సంవత్సరం పండిన పంటలో దశమభాగాన్ని తెచ్చి మీ పట్టణాల్లో నిలువచేయాలి, తద్వార మీతో పాటు భాగం గాని వారసత్వం గాని లేని లేవీయులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు వచ్చి భోజనం చేసి తృప్తిపొందుతారు.
DEU 15:1 ప్రతి ఏడు సంవత్సరాల చివర మీరు అప్పులు రద్దు చేయాలి.
DEU 15:2 రద్దు చేయవలసిన విధానం ఇది: తన తోటి ఇశ్రాయేలీయునికి అప్పు ఇచ్చిన ప్రతి అప్పులవాడు దానిని రద్దు చేయాలి. ఆ సంవత్సరం అప్పు తీర్చమని అడగకూడదు, ఎందుకంటే అది అప్పులు రద్దు చేయడానికి యెహోవా సమయంగా ప్రకటించబడింది.
DEU 15:3 మీరు విదేశీయులను అప్పు చెల్లించమని అడగవచ్చు కాని మీ తోటి ఇశ్రాయేలీయుని ప్రతి అప్పు రద్దు చేయాలి.
DEU 15:4 అయితే, మీ మధ్యలో పేదవారు ఎవరు ఉండకూడదు, ఎందుకంటే మీ స్వాస్థ్యంగా మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని అధికంగా దీవిస్తారు.
DEU 15:5 కాబట్టి ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా పాటించి మీ దేవుడైన యెహోవాకు మీరు పూర్తిగా లోబడి జీవించాలి.
DEU 15:6 మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన మిమ్మల్ని దీవిస్తారు. మీరు అనేకమంది ప్రజలకు అప్పు ఇస్తారు కాని అప్పు చేయరు. మీరు అనేక దేశాలను పరిపాలిస్తారు అయితే మిమ్మల్ని ఎవరు పరిపాలించరు.
DEU 15:7 మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశపు పట్టణాల్లో ఎక్కడైనా మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదవారు ఉంటే, వారి పట్ల మీ హృదయాలను కఠినంగా లేదా పిసినారిగా ఉంచకూడదు.
DEU 15:8 కాని వారికి అవసరమైనంత దానిని వారికి గుప్పిలి విప్పి ధారాళంగా అప్పు ఇవ్వాలి.
DEU 15:9 ఈ దుష్ట ఆలోచన మీ హృదయాల్లో పుట్టకుండా జాగ్రత్తపడండి: “ఏడవ సంవత్సరం, అప్పులు రద్దు చేసే సంవత్సరం సమీపించింది” తద్వార మీ తోటి ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న పేదవారి పట్ల దయ చూపించకుండ మీరు వారికి ఏమి ఇవ్వకుండ ఉండకూడదు. మీరు అలా చేస్తే, వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతారు; అప్పుడు మీరు పాపం చేసినవారిగా పరిగణించబడతారు.
DEU 15:10 వారికి ధారాళంగా ఇవ్వండి, సణిగే హృదయం లేకుండా వారికి ఇవ్వండి; అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ పనులన్నిటిలో మీరు చేసే ప్రతీ దానిలో మిమ్మల్ని దీవిస్తారు.
DEU 15:11 దేశంలో ఎల్లప్పుడు పేదవారు ఉంటారు. కాబట్టి మీ దేశంలో తోటి ఇశ్రాయేలీయులలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ధారాళంగా మీ గుప్పిలి విప్పాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను.
DEU 15:12 మీ ప్రజల్లో హెబ్రీ పురుషులే గాని స్త్రీలే గాని మీకు అమ్ముకుని ఆరు సంవత్సరాలు మీకు సేవ చేస్తే, ఏడవ సంవత్సరంలో మీరు వారిని స్వేచ్ఛగా వెళ్లనివ్వాలి.
DEU 15:13 మీరు వారిని విడుదల చేసినప్పుడు, వారిని వట్టి చేతులతో పంపకూడదు.
DEU 15:14 మీ మందలో నుండి మీ నూర్పిడి కళ్ళం నుండి, మీ ద్రాక్ష గానుగ తొట్టి నుండి వారికి ధారాళంగా ఇచ్చి పంపాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన దానికి తగినట్టుగా వారికి ఇవ్వాలి.
DEU 15:15 మీరు ఈజిప్టులో దాసులై ఉన్నారని, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విమోచించారని జ్ఞాపకం ఉంచుకోండి. అందుకే నేను ఈ రోజు మీకు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను.
DEU 15:16 కాని ఒకవేళ దాసుడు మీ దగ్గర సంతోషంగా ఉండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్న కారణంగా, “నేను మిమ్మల్ని విడిచి వెళ్లను” అని అంటే,
DEU 15:17 మీరు కదురు తీసుకుని, వాని చెవిని తలుపుకు ఆనించి తలుపు లోనికి దిగేలా కదురుతో గుచ్చాలి. అప్పుడు వాడు మీకు జీవితకాల దాసునిగా ఉంటాడు. మీ దాసికి కూడా అలాగే చేయాలి.
DEU 15:18 మీ దాసులను స్వేచ్ఛగా పోనివ్వడానికి మీరు కష్టం భావించవద్దు, ఎందుకంటే ఆరు సంవత్సరాలు వారు మీకు చేసిన సేవ మామూలు కూలివారు చేసే దానికన్నా రెట్టింపు ఉంటుంది. మీరు అలా చేస్తే మీ దేవుడైన యెహోవా మీరు చేసేవాటన్నిటిలో మిమ్మల్ని దీవిస్తారు.
DEU 15:19 పశువుల మందలో మొదట పుట్టిన ప్రతి మగదానిని మీ దేవుడైన యెహోవా కోసం పవిత్రపరచాలి. మీ ఎద్దులలో మొదట పుట్టిన దానితో పని చేయించకూడదు, గొర్రెలలో మొదట పుట్టిన దాని బొచ్చు కత్తిరించకూడదు.
DEU 15:20 యెహోవా ఏర్పరచుకున్న స్థలంలో మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ప్రతి సంవత్సరం మీరు మీ కుటుంబం వాటిని తినాలి.
DEU 15:21 ఆ జంతువుల్లో లోపం అంటే అది కుంటిదైనా గ్రుడ్డిదైనా లేదా వేరే ఏదైన లోపం ఉంటే మీరు దానిని మీ దేవుడైన యెహోవాకు అర్పించకూడదు.
DEU 15:22 మీరు దానిని మీ సొంత పట్టణాల్లోనే తినాలి. జింకను దుప్పిని తిన్నట్లు ఆచారరీత్య పవిత్రులు, అపవిత్రులు, ఇద్దరు దానిని తినవచ్చు.
DEU 15:23 అయితే మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి.
DEU 16:1 అబీబు నెలను ఆచరించి మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగించాలి, ఎందుకంటే అబీబు నెలలో రాత్రివేళ మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో నుండి మిమ్మల్ని తీసుకువచ్చారు.
DEU 16:2 యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించి పశువుల్లో నుండి గాని మందలో నుండి గాని ఒక జంతువును బలి ఇవ్వాలి.
DEU 16:3 పులిసిన దానితో చేసిన రొట్టెలు తినకూడదు, కాని మీరు ఈజిప్టులో నుండి త్వరగా బయలుదేరి వచ్చారు కాబట్టి, ఈజిప్టు దేశం నుండి వచ్చిన ఆ రోజును జీవితకాలమంతా జ్ఞాపకముంచుకోడానికి ఏడు రోజులు మీరు బాధను సూచించే రొట్టె అనగా పులియని రొట్టెలు తినాలి.
DEU 16:4 ఆ ఏడు రోజులు మీ దేశంలో ఎక్కడా పులిసిన పదార్థమేదీ కనిపించకూడదు. మీరు మొదటి రోజు సాయంకాలం వధించిన బలి మాంసంలో ఏదీ ఉదయం వరకు మిగలకూడదు.
DEU 16:5 మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాసంగా ఏర్పరచుకొనే స్థలంలో తప్ప ఆయన మీకు ఇచ్చే ఏ పట్టణాల్లో పస్కా పశువును అర్పించకూడదు. ఈజిప్టు నుండి మీరు బయలుదేరిన సందర్భంగా, సూర్యుడు అస్తమించే సమయంలో, సాయంకాలంలో ఆ స్థలంలోనే మీరు పస్కా పశువును బలి ఇవ్వాలి.
DEU 16:7 మీ దేవుడైన యెహోవా ఎన్నుకునే స్థలంలో దానిని కాల్చి తినాలి. ఉదయం మీ గుడారాలకు తిరిగి వెళ్లాలి.
DEU 16:8 ఆరు రోజులు పులియని రొట్టెలు తినాలి, ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు ఒక సభను నిర్వహించాలి, అప్పుడు మీరు ఏ పని చేయకూడదు.
DEU 16:9 పంటపై కొడవలి వేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఏడు వారాలు లెక్కించాలి.
DEU 16:10 మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన దానిలో నుండి స్వేచ్ఛార్పణలు ఇవ్వడం ద్వారా మీ దేవుడైన యెహోవాకు వారాల పండుగ ఆచరించాలి.
DEU 16:11 మీరు, మీ కుమారులు, కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు, మీ మధ్య ఉండే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు, అందరు యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొన్న స్థలంలో మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఆనందించాలి.
DEU 16:12 మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకుని ఈ శాసనాలను జాగ్రత్తగా పాటించండి.
DEU 16:13 మీరు మీ నూర్పిడి కళ్ళం నుండి ధాన్యాన్ని, ద్రాక్ష గానుగ తొట్టె నుండి ద్రాక్షరసాన్ని సమకూర్చుకున్న తర్వాత గుడారాల పండుగ ఏడు రోజులు ఆచరించాలి.
DEU 16:14 మీరు, మీ కుమారులు కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు, మీ మధ్య ఉండే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు, అందరు ఈ పండుగలో ఆనందించాలి.
DEU 16:15 యెహోవా ఏర్పరచుకొన్న స్థలంలో మీ దేవుడైన యెహోవాకు మీరు ఈ పండుగ ఏడు రోజులు ఆచరించాలి. ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా మీ పంట అంతటిలో మీ చేతి పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీ ఆనందం పరిపూర్ణం అవుతుంది.
DEU 16:16 సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులందరు మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో కనబడాలి: పులియని రొట్టెల పండుగలో, వారాల పండుగలో, గుడారాల పండుగలో. యెహోవా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు.
DEU 16:17 మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన ప్రకారం మీలో ప్రతి ఒకరు తమ శక్తి కొద్ది కానుకలు తీసుకురావాలి.
DEU 16:18 మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి పట్టణంలో మీ గోత్రాలకు న్యాయాధిపతులను, అధికారులను మీరు నియమించాలి, వారు న్యాయంగా ప్రజలకు తీర్పు తీర్చాలి.
DEU 16:19 న్యాయం తప్పి తీర్పు చెప్పకూడదు లేదా పక్షపాతం చూపించకూడదు. లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం జ్ఞానుల కళ్లకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.
DEU 16:20 మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో మీరు జీవించేలా న్యాయాన్ని కేవలం న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి.
DEU 16:21 మీ దేవుడైన యెహోవాకు మీరు నిర్మించే బలిపీఠం ప్రక్కన ఏ అషేరా స్తంభాన్ని ఏర్పాటు చేయకూడదు,
DEU 16:22 పవిత్ర రాతిని నిలబెట్టకూడదు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు ఇవి అసహ్యము.
DEU 17:1 మీ దేవుడైన యెహోవాకు మచ్చ గాని లోపంగాని ఉన్న ఎద్దునైనా గొర్రెనైనా బలిగా అర్పించకూడదు, అది మీ దేవుడైన యెహోవాకు అసహ్యము.
DEU 17:2 ఒకవేళ మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాల్లో దేనిలోనైనా మీ మధ్య నివసిస్తున్న పురుషుడు గాని స్త్రీ గాని మీ దేవుడైన యెహోవా నిబంధన మీరి ఆయన దృష్టిలో చెడును చేస్తూ,
DEU 17:3 నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇతర దేవుళ్ళను సేవించి, వాటికి గాని ఆకాశంలో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలకు గాని నమస్కరిస్తూ ఉంటే,
DEU 17:4 ఆ విషయం మీ దృష్టికి తీసుకురాబడితే, మీరు దానిని క్షుణ్ణంగా పరిశోధించాలి. ఒకవేళ అది నిజమై, ఆ అసహ్యకరమైన విషయం ఇశ్రాయేలులో జరిగిందని నిరూపించబడితే,
DEU 17:5 ఆ దుర్మార్గం చేసిన పురుషుని గాని స్త్రీని గాని మీ పట్టణ ద్వారం దగ్గరకు తీసుకెళ్లి వారిని రాళ్లతో కొట్టి చంపాలి.
DEU 17:6 ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల వాంగ్మూలం మీదనే ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాలి, కానీ ఒక్క సాక్షి వాంగ్మూలంపై ఎవరికి మరణశిక్ష విధించకూడదు.
DEU 17:7 ఆ వ్యక్తికి మరణశిక్ష విధించడంలో మొదట సాక్షుల చేతులు, తర్వాత ప్రజలందరి చేతులు ఉండాలి. మీరు మీ మధ్య నుండి దుర్మార్గాన్ని తొలగించాలి.
DEU 17:8 మీ దగ్గరకు వచ్చిన వివాదాలలో మీరు తీర్పు తీర్చడానికి చాలా కష్టంగా ఉన్న వివాదాలను అంటే రక్తపాతానికి సంబంధించినవి గాని వాదనలు గాని దాడులు గాని అలాంటి వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలానికి తీసుకెళ్లండి.
DEU 17:9 లేవీయ యాజకుల దగ్గరకు, ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తి దగ్గరకు వెళ్లండి. వాటి గురించి విచారించండి, వారు మీకు తీర్పు ఇస్తారు.
DEU 17:10 మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలంలో వారు మీకు తెలియజేసిన నిర్ణయాల ప్రకారం మీరు నడుచుకోవాలి. మీరు చేయాలని వారు మీకు చెప్పే ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి.
DEU 17:11 వారు మీకు బోధించిన, ఇచ్చిన నిర్ణయాల ప్రకారం మీరు చేయాలి. వారు మీకు చెప్పిన వాటినుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగకూడదు.
DEU 17:12 న్యాయమూర్తి పట్ల గాని మీ దేవుడైన యెహోవాకు సేవచేసే యాజకుని పట్ల గాని ఎవరైనా ధిక్కారం ప్రదర్శిస్తే, వారికి మరణశిక్ష విధించబడాలి. మీరు ఈ దుర్మార్గాన్ని ఇశ్రాయేలు నుండి తొలగించాలి.
DEU 17:13 ప్రజలందరూ వింటారు, భయపడతారు, మళ్ళీ ధిక్కారంగా ఉండరు.
DEU 17:14 మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకుని స్థిరపడినప్పుడు మీరు, “మన చుట్టూ ఉన్న దేశాలవలె మనమీద కూడా రాజును నియమించుకుందాము” అని అంటే,
DEU 17:15 మీ దేవుడైన యెహోవా ఏర్పరచే వ్యక్తినే మీరు రాజుగా నియమించుకోవాలి. అతడు మీ మధ్యలో నుండి వచ్చిన తోటి ఇశ్రాయేలీయుడై ఉండాలి. ఇశ్రాయేలీయుడు కాని పరదేశిని మీమీద నియమించకూడదు.
DEU 17:16 అంతేకాక, రాజు గుర్రాలను అధిక సంఖ్యలో సంపాదించవద్దు, వాటిని ఇంకా ఎక్కువ సంపాదించుకునేందుకు ప్రజలను ఈజిప్టుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే, “మీరు మరలా ఆ త్రోవలో వెళ్లకూడదు” అని యెహోవా మీకు చెప్పారు.
DEU 17:17 అతడు చాలామంది భార్యలను చేసుకోకూడదు, లేదా అతని హృదయం దారి తప్పుతుంది. అతడు పెద్ద మొత్తంలో వెండి, బంగారాన్ని కూడబెట్టుకోకూడదు.
DEU 17:18 అతడు తన రాజ్యసింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, లేవీయ యాజకుల దగ్గర ఉన్న ధర్మశాస్త్రాన్ని చూసి తన కోసం ఒక ప్రతిని వ్రాసుకోవాలి.
DEU 17:19 అది అతని దగ్గర ఉండాలి, అతడు దానిని తన జీవితకాలంతా చదువుతూ ఉండాలి తద్వార అతడు తన దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకొని, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటిని, శాసనాలను జాగ్రత్తగా అనుసరిస్తాడు,
DEU 17:20 తన తోటి ఇశ్రాయేలీయునికన్నా తాను గొప్పవాడినని భావించడు, ధర్మశాస్త్రం నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోడు. అప్పుడు అతడు, అతని సంతానం ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎక్కువకాలం పరిపాలిస్తారు.
DEU 18:1 లేవీయులైన యాజకులకు అంటే, లేవీ గోత్రమంతటికి ఇశ్రాయేలీయులతో పాటు వాటా గాని వారసత్వం గాని ఉండదు. యెహోవాకు సమర్పించబడిన హోమబలుల పైనే వారు బ్రతకాలి, ఎందుకంటే అది వారి వారసత్వము.
DEU 18:2 వారి తోటి ఇశ్రాయేలీయులతో వారికి వారసత్వం ఉండదు; యెహోవా వాగ్దానం చేసినట్టుగా యెహోవాయే వారి వారసత్వము.
DEU 18:3 ప్రజలు అర్పణలుగా తీసుకువచ్చే పశువులు, గొర్రెలు మేకల నుండి యాజకులకు చెందవలసిన వాటా: భుజం, లోపలి అవయవాలు, చెంపలు.
DEU 18:4 మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవ నూనెలలో ప్రథమ ఫలాలు, అలాగే గొర్రెబొచ్చు కత్తిరించినప్పుడు మొదటి నూలు వారికే ఇవ్వాలి.
DEU 18:5 యెహోవా పేర నిలిచి ఎల్లప్పుడు సేవ చేయటానికి అతని గోత్రాలన్నిటిలో అతన్ని అతని సంతానాన్ని మీ దేవుడైన యెహోవా ఎన్నుకున్నాడు.
DEU 18:6 ఒక లేవీయుడు అతడు నివసించే ఇశ్రాయేలులో ఎక్కడైనా మీ పట్టణాల్లో ఒకదాని నుండి వెళ్తే, యెహోవా ఎంచుకునే ప్రదేశానికి పూర్తి శ్రద్ధతో వస్తే,
DEU 18:7 అతడు తన దేవుడైన యెహోవా పేరిట అక్కడ సేవచేసే తన తోటి లేవీయులందరిలా సేవ చేయవచ్చు
DEU 18:8 కుటుంబ ఆస్తులు అమ్మిన దానిలో డబ్బు వచ్చినప్పటికీ, వారి ప్రయోజనాలలో అతడు సమానంగా పంచుకోవాలి.
DEU 18:9 మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశంలో మీరు ప్రవేశించాక అక్కడి దేశాల అసహ్యకరమైన మార్గాలను అనుకరించడం నేర్చుకోకండి.
DEU 18:10 తమ కుమారున్ని లేదా కుమార్తెను అగ్నిలో బలి ఇచ్చే వారినైననూ, భవిష్యవాణి లేదా మంత్రవిద్య, శకునాలను చెప్పు వారినైననూ, మంత్రవిద్యలో నిమగ్నమయ్యేవారునూ మీలో ఎవరూ కనబడకూడదు.
DEU 18:11 మంత్రాలు జపించేవారు గాని, ఆత్మలతో మాట్లాడేవారు గాని, చనిపోయినవారిని సంప్రదించేవారు గాని మీలో ఉండకూడదు.
DEU 18:12 ఇలాంటివి అభ్యసించేవారు యెహోవాకు అసహ్యులు; ఇలాంటి హేయక్రియలు చేస్తారు కాబట్టే యెహోవా మీ ముందు నుండి జనాలను వెళ్లగొడుతున్నారు.
DEU 18:13 మీ దేవుడైన యెహోవా దృష్టిలో మీరు నిందారహితులై ఉండాలి.
DEU 18:14 మీరు స్వాధీనం చేసుకోబోయే జనులు మంత్రవిద్య లేదా భవిష్యవాణి పాటించేవారి మాట వింటారు. అయితే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అలా అనుమతించలేదు.
DEU 18:15 మీ దేవుడైన యెహోవా నా లాంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కోసం లేవనెత్తుతాడు, మీరు అతని మాట వినాలి.
DEU 18:16 ఆ సభ రోజున హోరేబు దగ్గర మీ దేవుడనైన యెహోవాను మీరు అడిగింది ఇదే, “మన దేవుడైన యెహోవా స్వరాన్ని వినవద్దు, ఈ గొప్ప అగ్నిని ఇక చూడము, చూస్తే మేము చనిపోతాము.”
DEU 18:17 యెహోవా నాతో, “వారన్న మాట సరియైనది.
DEU 18:18 వారి తోటి ఇశ్రాయేలీయులలో నుండే నీలాంటి ప్రవక్తను లేపుతాను. ఆయన నోట నా మాటలుంటాయి, నా ఆజ్ఞలన్నీ వారికి చెప్తాను.
DEU 18:19 నా పేరట ప్రవక్త చెప్పే మాటలకు ఎవరైనా స్పందించకపోతే వారిని నేనే లెక్క అడుగుతాను.
DEU 18:20 కానీ నేను ఆజ్ఞాపించనిదేదైనా నా పేరున మాట్లాడాలని భావించే ప్రవక్త లేదా ఇతర దేవుళ్ళ పేరిట మాట్లాడే ప్రవక్తను చంపాలి” అని అన్నారు.
DEU 18:21 “ఒక సందేశం యెహోవా మాట్లాడింది కాదు అని మనం ఎలా తెలుసుకోగలము?” అని మీలో మీరు అనుకుంటారు,
DEU 18:22 ఒకవేళ యెహోవా పేరెత్తి ఒక ప్రవక్త ప్రకటించి అది నెరవేరకపోయినా లేదా నిజం కాకపోయినా, అది యెహోవా మాట్లాడింది కాదు. ఆ ప్రవక్త అహంకారంతో మాట్లాడాడు, కాబట్టి భయపడవద్దు.
DEU 19:1 మీ దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోయే దేశంలో ఉన్న జనాన్ని ముందు నాశనం చేసినప్పుడు, ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకుని, మీరు వారిని తరిమివేసి వారి పట్టణాల్లో వారి ఇళ్ళలో నివసించాలి.
DEU 19:2 మీ దేవుడైన యెహోవా వాగ్దానం చేసి ఇస్తున్న భూమిని మీరు స్వాధీనం చేసుకున్న తర్వాత, అందులో మూడు పట్టణాలను ప్రత్యేకించాలి.
DEU 19:3 మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి ఆ పట్టణాలకు త్రోవలు ఏర్పరచాలి, ఒకడు ఎవరినైనా చంపితే అతడు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోయేలా ఉండాలి.
DEU 19:4 మునుపటి శత్రుత్వం ఏదీ లేకపోయినా ఎవరైనా అనుకోకుండ మరొకరిని చంపితే, హంతకుడు ప్రాణాలతో బ్రతకడానికి ఈ ఆశ్రయపురాల్లో దేనికైనా పారిపోవచ్చు.
DEU 19:5 ఉదాహరణకు, చెట్లు నరకడానికి పొరుగువాడితో అడవికి వెళ్లి గొడ్డలితో చెట్టు కొట్టినప్పుడు గొడ్డలి పడి ఊడి అవతలి వాడికి తగిలి చనిపోయిన, చంపినవాడు ఆ మూడు పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయి తన ప్రాణం దక్కించుకోవచ్చు.
DEU 19:6 ఎక్కువ దూరమైతే, ప్రతీకారం చేయాలని వెంటాడినవాడు అతన్ని పట్టుకుని చంపుతాడేమో! అతడు ద్వేషంతో పొరుగువానిని చంపలేదు కాబట్టి, అతనికి మరణశిక్ష తగదు.
DEU 19:7 అందువల్లనే మూడు పట్టణాలను మీరు ఎంచుకోవాలని ఆజ్ఞాపించాను.
DEU 19:8 మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లు మీ దేవుడైన యెహోవా మీ సరిహద్దులను విశాలపరచి వారికి వాగ్దానం చేసిన దేశమంతటిని మీకు ఇస్తే,
DEU 19:9 నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ చట్టాలన్నిటిని మీరు జాగ్రత్తగా అనుసరించి అనగా మీ దేవుడనైన యెహోవాను ప్రేమిస్తూ, నిత్యం ఆయన పట్ల విధేయత కలిగి మీరు నడుస్తూ, మరో మూడు పట్టణాలు ప్రత్యేకించాల్సి ఉంటుంది.
DEU 19:10 మీ దేవుడైన యెహోవా నీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషి రక్తం చిందించబడకుండ, మీరు రక్తపాతానికి పాల్పడకుండ ఉండడానికి ఇలా చేయండి.
DEU 19:11 కాని ఎవరైనా ద్వేషంతో ఎవరి కొరకైనా పొంచి ఉండి, అతని మీద పడి చంపితే అతడా పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయినా ఊరి పెద్దలు అతన్ని బయటకు రప్పించాలి.
DEU 19:12 హంతకుని పట్టణ పెద్దలు పిలిపించి, ప్రతీకారం చేయడానికి వచ్చిన వానికి అతన్ని అప్పగించాలి.
DEU 19:13 జాలి చూపవద్దు. నిర్దోషి రక్తాన్ని చిందించిన అపరాధాన్ని మీరు ఇశ్రాయేలు నుండి ప్రక్షాళన చేయాలి, తద్వారా మీరు బాగుంటారు.
DEU 19:14 మీ దేవుడైన యెహోవా స్వాధీనం చేసుకోమని మీకు ఇవ్వబోతున్న దేశంలో మీరు పొందే వారసత్వంలో మీ పూర్వికులు ఏర్పాటుచేసిన మీ పొరుగువారి సరిహద్దు రాయిని తరలించవద్దు.
DEU 19:15 ఒకడు చేసిన పాపం విషయంలో గాని అపరాధం విషయంలో గాని దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు, ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యాల మీద నేరం నిర్ధారణ చేయాలి.
DEU 19:16 ఒకవేళ కపట బుద్ధి గలవాడు ఎవరిమీదైనా నేరారోపణ చేయడానికే పూనుకుంటే,
DEU 19:17 ఆ వివాదంలో ఉన్న ఇద్దరూ యెహోవా ఎదుట అంటే ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న యాజకుల ఎదుట న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.
DEU 19:18 న్యాయాధిపతులు ఆ వాదనను బాగా విచారణ చేయాలి, సాక్షి అబద్ధికుడని రుజువైతే, తోటి ఇశ్రాయేలీయులపై అబద్ధ సాక్ష్యమును పలికిన ఎడల,
DEU 19:19 వాడు తలపెట్టిన కీడు వాడి మీదకే రావాలి, ఆ విధంగా న్యాయమైన తీర్పు చెప్పి మీ మధ్య నుండి దుర్మార్గాన్ని తొలగించాలి.
DEU 19:20 ప్రజలు ఇది చూసి భయపడి అలాంటి దుర్మార్గపు పనులు మీ దేశంలో మళ్ళీ చేయరు.
DEU 19:21 జాలి పడకూడదు: ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు. ఇదే నియమం పాటించి తీరాలి.
DEU 20:1 మీ శత్రువులతో యుద్ధానికి వెళ్లినప్పుడు, మీ దగ్గర ఉన్నవాటి కంటే వారి దగ్గర ఎక్కువ గుర్రాలు, రథాలను చూసినప్పుడు, వారికి భయపడవద్దు, ఎందుకంటే ఈజిప్టు నుండి క్షేమంగా రప్పించిన మీ దేవుడైన యెహోవా మీతో ఉంటారు.
DEU 20:2 మీరు యుద్ధానికి వెళ్లబోయేటప్పుడు, యాజకుడు ముందుకు వచ్చి సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతాడు.
DEU 20:3 అతడు వారితో ఇలా అంటారు: “ఇశ్రాయేలు విను: ఈ రోజు మీరు మీ శత్రువుల మీదికి యుద్ధానికి వెళ్తున్నారు. మీరు మూర్ఛపోవద్దు, భయపడవద్దు, జడియవద్దు, వారికి భయపడకండి.
DEU 20:4 శత్రువులతో యుద్ధం చేసేది, మిమ్మల్ని రక్షించేది మీ దేవుడైన యెహోవాయే! ఆయన మీతో ఉన్నాడు.”
DEU 20:5 అధికారులు సైనికులతో చెప్పవలసిన మాటలు: “మీలో ఎవరైనా క్రొత్తగా ఇల్లు కట్టుకుని ఇంకా గృహప్రవేశం చేయనట్లైతే, వెంటనే ఇంటికి వెళ్లిపోవాలి, లేకపోతే ఒకవేళ అతడు యుద్ధంలో చనిపోతే మరొకరు ఆ ఇంట్లో నివసిస్తారు.
DEU 20:6 ఎవడైనా ద్రాక్షతోట వేసి దాని ఫలసాయం అనుభవించకుండా ఉన్నాడా? అలాగైతే అతడు ఇంటికి తిరిగి వెళ్లవచ్చు, లేదా అతడు యుద్ధంలో చనిపోతే అతని తోట ఫలసాయం మరొకరు అనుభవిస్తారు.
DEU 20:7 ప్రధానం చేసుకుని ఇంకా పెండ్లి చేసుకోకుండా ఉన్నవాడు మీలో ఉంటే అతడు ఇంటికి వెళ్లిపోవచ్చు, అతడు ఒకవేళ యుద్ధంలో చనిపోతే మరొకడు ఆమెను పెళ్ళి చేసుకోవచ్చు.”
DEU 20:8 అధిపతులు చేయవలసిన హెచ్చరికలు, “ఎవనికైనా భయాందోళనలున్నాయా? అలాగైతే ఇంటికి వెళ్లిపోవచ్చు, లేకపోతే ఆ పిరికితనం మిగతా సైనికులకు కూడా వ్యాపిస్తుంది.”
DEU 20:9 అధిపతులు ప్రజలకు ఈ సందేశమిచ్చిన తర్వాత సేనాధిపతులు తమ బాధ్యతలను స్వీకరిస్తారు.
DEU 20:10 పట్టణాన్ని ముట్టడించినప్పుడు ముందు దాని ప్రజలకు సమాధానం కోసం రాయబారం పంపాలి.
DEU 20:11 ఒకవేళ వారు సమాధానపడడానికి ఒప్పుకుని వారి ద్వారాలు తెరిస్తే, అందులో ఉన్న ప్రజలంతా మీకు లొంగిపోయి మీ కోసం వెట్టిచాకిరి చేస్తారు.
DEU 20:12 ఒకవేళ వారు సంధికి నిరాకరించి మీతో యుద్ధానికి వస్తే, ఆ పట్టణాన్ని ముట్టడించండి.
DEU 20:13 మీ దేవుడైన యెహోవా దానిని మీ చేతికి అప్పగిస్తే, దానిలో ఉన్న మనుష్యులందరిని ఖడ్గంతో హతమార్చాలి.
DEU 20:14 స్త్రీలను, చిన్న పిల్లలను పశువులను మీరు కొల్లగొట్టిన ఆస్తిని మీరు తీసుకోవచ్చు; మీ దేవుడైన యెహోవా మీకిచ్చే మీ శత్రువుల దోపుడుసొమ్ము మీదే అవుతుంది.
DEU 20:15 మీకు దూరంగా ఉన్న సమీపంలోని దేశాలకు చెందని అన్ని పట్టణాల పట్ల మీరు ఈ విధంగా వ్యవహరిస్తారు.
DEU 20:16 యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇచ్చే పట్టణాల్లో ఊపిరి పీల్చేదేదీ మిగలకూడదు.
DEU 20:17 మీ దేవుడైన యెహోవా ఆజ్ఞమేరకు హిత్తీయులను, అమోరీయులను కనానీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను పూర్తిగా నాశనం చేయాలి.
DEU 20:18 లేకపోతే తమ దేవుళ్ళకు చేసే హేయ క్రియలను మీకు నేర్పుతారు, మీరు మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపాలు చేస్తారు, అందుకే వారిని నిర్మూలించమని చెప్తున్నాను.
DEU 20:19 మీరు ఒక పట్టణాన్ని ముట్టడి వేసి, దానిని స్వాధీనపరచుకోడానికి ఎక్కువసేపు దానితో పోరాడవలసి వస్తే, మీరు దాని చెట్లను గొడ్డలితో నరికివేయవద్దు, ఎందుకంటే వాటి ఫలాలు మీరు తినవచ్చు. చెట్లేమైనా మనుష్యులా మీరు వాటిని నరికివేయడానికి?
DEU 20:20 ఏదేమైనా, పండ్లచెట్లు కాదని మీకు తెలిసిన చెట్లను మీరు నరికివేయవచ్చు, వాటి కర్రను మీరు ముట్టడి వేసిన పట్టణం పతనం అయ్యేవరకు ముట్టడి పనులను నిర్మించడానికి ఉపయోగించవచ్చు.
DEU 21:1 మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని ఒక పొలంలో ఎవరైనా హత్యకు గురియై పడి ఉండడం కనబడి, ఆ హంతకుడు ఎవరో తెలియనప్పుడు,
DEU 21:2 మీ పెద్దలు, న్యాయాధిపతులు బయటకు వెళ్లి మృతదేహం నుండి దగ్గరలో ఉన్న పట్టణాలకు దూరం కొలుస్తారు.
DEU 21:3 తర్వాత మృతుడికి దగ్గరగా ఉన్న పట్టణ పెద్దలు ఎప్పుడూ పని చేయని, కాడి కట్టని ఓ దూడను తెచ్చి,
DEU 21:4 దానిని ప్రవహించే ప్రవాహం ఉండి, ఎన్నడు దున్నబడని నాటబడని లోయ దగ్గరకు తోలుకుపోవాలి. అక్కడ ఆ లోయలో పట్టణ పెద్దలు దూడ మెడను విరిచివేయాలి.
DEU 21:5 లేవీయ యాజకులు ముందుకు సాగాలి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా వారిని పరిచర్య కోసం, యెహోవా పేరిట ఆశీర్వాదాలు పలకడానికి, వివాదాలు దాడులకు సంబంధించిన అన్ని దావాలను నిర్ణయించడానికి వారిని ఎన్నుకున్నారు.
DEU 21:6 మృతుడి గ్రామానికి చెందిన పట్టణ పెద్దలు లోయలో మెడ విరగదీసిన దూడ మీద చేతులు కడుక్కుని,
DEU 21:7 వారు ఇలా ప్రకటించాలి: “మా చేతులు రక్తపాతం చేయలేదు, మా కళ్లు అది చేయడం చూడలేదు.
DEU 21:8 యెహోవా, మీరు విమోచించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు కోసం ఈ ప్రాయశ్చిత్తాన్ని అంగీకరించండి, నిర్దోషి యొక్క రక్తాన్ని బట్టి మీ ప్రజలను దోషులుగా పరిగణించవద్దు” అప్పుడు రక్తపాతం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది,
DEU 21:9 యెహోవా దృష్టిలో మీరు సరియైనది చేశారు కాబట్టి, నిర్దోషి రక్తం చిందించిన అపరాధం మీ నుండి తొలగిపోతుంది.
DEU 21:10 మీరు మీ శత్రువుల మీద యుద్ధానికి వెళ్లినప్పుడు మీ దేవుడైన యెహోవాకు వారిని మీ చేతులకు అప్పగించి, మీరు బందీలను తెచ్చినప్పుడు,
DEU 21:11 ఒకవేళ నీవు బందీలలో ఒక అందమైన స్త్రీని గమనించి, ఆమె పట్ల ఆకర్షితుడవైతే, నీవు ఆమెను మీ భార్యగా తీసుకోవచ్చు.
DEU 21:12 ఆమెను మీ ఇంటికి తీసుకురండి ఆమె తలను గుండు చేసుకోవాలి, గోర్లు కత్తిరించుకోవాలి,
DEU 21:13 చెరపట్టబడినప్పుడు ఆమె వేసుకుని ఉన్న వస్త్రాలు తీసివేయాలి. నెలరోజులు ఆమె మీ ఇంట్లోనే ఉండి, తన తల్లిదండ్రుల కోసం విలపించిన తర్వాత, నీవు ఆమె దగ్గరకు వెళ్లవచ్చు, నీవు ఆమెకు భర్తగా ఆమె నీకు భార్యగా ఉండవచ్చు.
DEU 21:14 వద్దనుకుంటే, ఆమె కిష్ఠమైన చోటికి ఆమెను పంపివేయాలి. నీవు ఆమెను అగౌరపరచినట్టే కాబట్టి ఆమెను డబ్బుకు అమ్మకూడదు బానిసగా చూడకూడదు.
DEU 21:15 ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటే, అతడు ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని ప్రేమించడు, ఇద్దరూ అతనికి కుమారులను కంటారు కాని జ్యేష్ఠ కుమారుడు అతడు ప్రేమించని భార్య కుమారుడు,
DEU 21:16 అతడు తన కుమారులకు తన ఆస్తిని పంచినప్పుడు, నిజానికి జ్యేష్ఠ కుమారుడైన తాను ప్రేమించని భార్య కుమారుని స్థానంలో అతడు ప్రేమించే భార్య కుమారునికి జ్యేష్ఠత్వపు హక్కును ఇవ్వకూడదు.
DEU 21:17 అతడు తనకున్న అన్నిటిలో రెట్టింపు వాటా ఇవ్వడం ద్వారా తాను ప్రేమించని భార్య కుమారుడిని జ్యేష్ఠ కుమారునిగా గుర్తించాలి. ఆ కుమారుడు తన తండ్రి శక్తికి మొదటి సంకేతము. జ్యేష్ఠత్వపు హక్కు అతనికి చెందినది.
DEU 21:18 ఒకవేళ ఎవరికైనా తండ్రికి తల్లికి లోబడని, వారు వాన్ని క్రమశిక్షణ చేసినప్పుడు వారికి వినని, మొండితనం గల తిరుగుబాటు చేసే కుమారుడు ఉంటే,
DEU 21:19 అతని తండ్రి, తల్లి అతన్ని పట్టుకుని పట్టణ ద్వారం దగ్గర ఉన్న పెద్దల దగ్గరకు తీసుకురావాలి.
DEU 21:20 వారు పెద్దలతో, “ఈ మా కుమారుడు మొండివాడు, తిరుగుబాటు చేసేవాడు. వీడు మాకు లోబడడు. వీడు తిండిబోతు, త్రాగుబోతు” అని చెప్పాలి.
DEU 21:21 అప్పుడు అతని పట్టణంలోని పురుషులందరు వాన్ని రాళ్లతో కొట్టి చంపాలి. మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి. ఇశ్రాయేలీయులందరు దాని గురించి విని భయపడతారు.
DEU 21:22 ఒకవేళ ఎవరైనా మరణశిక్షకు తగిన పాపం చేసి చంపబడి వారి దేహం చెట్టుకు వ్రేలాడదీయబడి ఉంటే,
DEU 21:23 దేహం రాత్రిపూట చెట్టుకు వ్రేలాడుతూ ఉండకూడదు. అదే రోజు దానిని పాతిపెట్టేలా చూడాలి, ఎందుకంటే మ్రానుపై వ్రేలాడదీయబడిన ఎవరైనా దేవుని శాపానికి గురవుతారు. మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశాన్ని మీరు అపవిత్రం చేయకూడదు!
DEU 22:1 మీ తోటి ఇశ్రాయేలీయుల ఎద్దు లేదా గొర్రెలు దారితప్పినట్లు మీరు చూస్తే దానిని విస్మరించవద్దు. కానీ దానిని తిరిగి దాని యజమాని దగ్గరకు తీసుకెళ్లండి.
DEU 22:2 ఒకవేళ వారు మీ దగ్గర నివసించకపోయినా లేదా దాని యజమాని ఎవరో మీకు తెలియకపోయినా, దానిని మీతో ఇంటికి తీసుకెళ్లి, వారు దానిని వెదుక్కునే వరకు ఉంచి, తర్వాత తిరిగి ఇచ్చేయండి.
DEU 22:3 గాడిద గాని వస్త్రం గాని మరి ఏ వస్తువైనా దొరికితే ఇలాగే చేయాలి. దాన్ని విస్మరించవద్దు.
DEU 22:4 మీ తోటి ఇశ్రాయేలీయుని గాడిద గాని ఎద్దు గాని దారిలో పడి ఉండడం మీరు చూస్తే, దానిని విస్మరించవద్దు. అది తిరిగి లేచి నిలబడేలా దాని యజమానికి సహాయం చేయండి.
DEU 22:5 స్త్రీలు పురుషుల దుస్తులు వేసుకోకూడదు, పురుషులు స్త్రీల వస్త్రాలు వేసుకోకూడదు, ఎందుకంటే అలా చేసేవారిని మీ దేవుడైన యెహోవా అసహ్యించుకుంటారు.
DEU 22:6 రోడ్డు ప్రక్కన, చెట్టు ప్రక్కన లేదా నేలపై పక్షుల గూడు కనిపిస్తే, తల్లి చిన్నపిల్లలపై లేదా గుడ్లపై కూర్చుంటే, తల్లిని పిల్లలతో తీసుకెళ్లవద్దు.
DEU 22:7 మీరు పిల్లలను తీసుకెళ్లవచ్చు, కాని తల్లిని వదిలేయాలి, తద్వార మీరు బాగుంటారు దీర్ఘాయువు కలిగి ఉంటారు.
DEU 22:8 మీరు ఒక క్రొత్త ఇంటిని కట్టుకున్నప్పుడు, మీ పైకప్పు చుట్టూ ఒక పిట్టగోడను కట్టుకోండి, తద్వారా ఎవరైనా పైకప్పు నుండి క్రింద పడితే మీ ఇంటిపైకి రక్తపాతం యొక్క అపరాధం తీసుకురాదు.
DEU 22:9 మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను నాటవద్దు; మీరు అలా చేస్తే, మీరు వేసే పంటలు మాత్రమే కాకుండా ద్రాక్షతోట యొక్క పండు కూడా అపవిత్రమవుతుంది.
DEU 22:10 ఒక ఎద్దును ఒక గాడిదను జతచేసి దున్నకూడదు.
DEU 22:11 ఉన్ని జనపనార కలిపి నేసిన బట్టలు ధరించకూడదు.
DEU 22:12 మీరు ధరించే వస్త్రం యొక్క నాలుగు మూలల్లో కుచ్చులు చేయండి.
DEU 22:13 ఒకవేళ ఒక వ్యక్తి భార్యను తీసుకుని, ఆమెతో పడుకున్న తర్వాత, ఆమెను ఇష్టపడక,
DEU 22:14 ఆమెను దూషించి, ఆమె పేరు చెడ్డ చేసి, “నేను ఈ స్త్రీని పెళ్ళి చేసుకున్నాను, కానీ నేను ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు, ఆమె కన్యత్వానికి రుజువు దొరకలేదు” అని చెప్తే,
DEU 22:15 అప్పుడు ఆ యువతి తల్లిదండ్రులు ఆమె కన్య అనే రుజువును పట్టణ పెద్దల దగ్గరకు తీసుకురావాలి.
DEU 22:16 ఆమె తండ్రి పెద్దలతో, “నేను నా కుమార్తెను ఈ వ్యక్తికిచ్చి పెళ్ళి చేశాను, కాని అతనికి ఆమెపై ఇష్టం లేదు.
DEU 22:17 ఇప్పుడు అతడు ఆమెను దూషించి, ‘మీ కుమార్తె కన్యగా నాకు కనిపించలేదు’ అని అంటున్నాడు. కానీ, నా కుమార్తె కన్యత్వానికి ఇది రుజువు” అని ఆమె తల్లిదండ్రులు పట్టణ పెద్దల ముందు వస్త్రాన్ని ప్రదర్శించాలి,
DEU 22:18 పట్టణ పెద్దలు ఆ వ్యక్తిని తీసుకెళ్లి అతన్ని శిక్షించాలి.
DEU 22:19 వారు అతనికి వంద షెకెళ్ళ వెండి జరిమానా విధించి, ఆ యువతి తండ్రికి ఇవ్వాలి, ఎందుకంటే ఈ వ్యక్తి ఇశ్రాయేలు కన్యకు చెడ్డ పేరు పెట్టాడు. ఆమె అతని భార్యగా ఉంటుంది; అతడు బ్రతికున్నంత కాలం అతడు ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.
DEU 22:20 ఒకవేళ, ఆరోపణ నిజమైతే ఆ యువతి కన్యత్వానికి రుజువు దొరకనట్లైతే,
DEU 22:21 ఆమెను తన తండ్రి ఇంటి తలుపు దగ్గరకు తీసుకురావాలి; అక్కడ ఆ పట్టణ పురుషులు ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. ఆమె తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు వేశ్యావృత్తి చేయడం ద్వారా ఆమె ఇశ్రాయేలులో తప్పుడు పని చేసింది. మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి.
DEU 22:22 ఒక వ్యక్తి మరొకరి భార్యతో పడుకున్నట్లు కనిపించినట్లయితే, ఆమెతో పడుకున్న వ్యక్తి, ఆ స్త్రీ ఇద్దరూ మరణించాలి. మీరు ఇశ్రాయేలు నుండి చెడును ప్రక్షాళన చేయాలి.
DEU 22:23 ఒకవేళ ఒక పురుషుడు ఒక పట్టణంలో పెళ్ళి నిశ్చయమైన ఒక కన్యను కలవడం జరిగి, అతడు ఆమెతో పడుకున్నట్లైతే,
DEU 22:24 మీరు వారిద్దరిని ఆ పట్టణ ద్వారం దగ్గరకు తీసుకెళ్లి, ఆ యువతి పట్టణంలో ఉండి కూడా సహాయం కోసం కేకలు వేయనందుకు తనను, మరొక వ్యక్తి భార్యను చెరిపినందుకు అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ఆ విధంగా మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి.
DEU 22:25 అయితే దేశంలో ఒకడు అనుకోకుండ పెళ్ళి నిశ్చయమైన ఒక యువతిని కలిసినప్పుడు, వాడు ఆమెను పాడు చేస్తే, అది చేసిన వ్యక్తి మాత్రమే చావాలి.
DEU 22:26 స్త్రీని ఏమీ చేయవద్దు; ఎందుకంటే ఆమె చంపబడేంత పాపం చేయలేదు. ఈ దావా ఒక పొరుగువాని మీద దాడి చేసి హత్యచేసిన దానిలా ఉంది,
DEU 22:27 ఎందుకంటే ఆ పురుషుడు దేశంలో ఆ యువతిని చూశాడు, నిశ్చితార్థమైన ఆ యువతి కేకలు వేసింది, కాని ఆమెను రక్షించడానికి ఎవరూ రాలేదు.
DEU 22:28 ఒకవేళ ఒక పురుషుడు పెళ్ళి నిశ్చయం కాని ఒక కన్యను కలవడం జరిగి ఆమెను బలత్కారం చేసి వారు పట్టుబడితే,
DEU 22:29 అతడు ఆమె తండ్రికి యాభై షెకెళ్ళ వెండి చెల్లించాలి. అతడు ఆ యువతిని అవమానించాడు కాబట్టి ఆమెను పెళ్ళి చేసుకోవాలి. అతడు బ్రతికున్నంత కాలం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.
DEU 22:30 ఒక పురుషుడు తన తండ్రి భార్యను పెళ్ళి చేసుకోకూడదు; అతడు తన తండ్రి పడకను అగౌరపరచకూడదు.
DEU 23:1 నలిగిన బీజములు ఉన్నవారు, పురుషాంగం కత్తిరించబడిన వారు యెహోవా సమాజంలో ప్రవేశించకూడదు.
DEU 23:2 అక్రమ సంతానమైన వ్యక్తి గాని అతని సంతతివారు గాని పదవ తరాల వరకు కూడా యెహోవా సమాజంలో ప్రవేశించకూడదు.
DEU 23:3 అమ్మోనీయులే గాని మోయాబీయులే గాని లేదా వారి సంతతివారే గాని పదితరాల వరకు కూడా యెహోవా సమాజంలో ప్రవేశించలేరు.
DEU 23:4 మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు వారు మిమ్మల్ని దారిలో రొట్టె గాని నీళ్లు గాని తీసుకుని కలవడానికి రాలేదు. వారు మిమ్మల్ని శపించడానికి అరాము నహరయీములోని పెతోరు నుండి బెయోరు కుమారుడు బిలామును తెచ్చుకున్నారు.
DEU 23:5 ఎలాగైతేనేం, మీ దేవుడైన యెహోవా బిలాము మాటలను ఆమోదించ లేదు. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకే శాపాన్ని దీవెనగా మార్చారు.
DEU 23:6 మీరు బ్రతికి ఉన్నంత వరకు వారితో స్నేహ ఒప్పందం కోరవద్దు.
DEU 23:7 ఎదోమీయులను తృణీకరించవద్దు, ఎందుకంటే ఎదోమీయులు మీ బంధువులు. ఈజిప్టువారిని తృణీకరించవద్దు, ఎందుకంటే మీరు వారి దేశంలో విదేశీయులుగా నివసించారు.
DEU 23:8 వారికి జన్మించిన మూడవ తరం పిల్లలు యెహోవా సమాజంలో ప్రవేశించవచ్చు.
DEU 23:9 మీరు మీ శత్రువులకు వ్యతిరేకంగా గుడారాలు వేసుకున్నప్పుడు, అపవిత్రమైన ప్రతీ దానికి దూరంగా ఉండండి.
DEU 23:10 రాత్రి జరిగినదాని వల్ల అపవిత్రమైన వ్యక్తి, శిబిరం బయటకు వెళ్లి అక్కడ ఉండాలి.
DEU 23:11 కానీ సాయంకాలం అవుతుండగా అతడు స్నానం చేసుకోవాలి, సూర్యాస్తమయం అయినప్పుడు అతడు శిబిరానికి తిరిగి రావచ్చు.
DEU 23:12 మీ విసర్జన కోసం శిబిరం బయట ప్రత్యేకంగా స్థలం ఏర్పరచుకోవాలి.
DEU 23:13 త్రవ్వడానికి మీ దగ్గర పరికరాలతో పాటు ఒక పారను దగ్గర ఉంచుకుని దానితో గుంట త్రవ్వి, మలవిసర్జన తర్వాత మట్టితో మలాన్ని కప్పివేయాలి.
DEU 23:14 మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షించడానికి, మీ శత్రువులను మీకు అప్పగించడానికి మీ శిబిరంలో సంచరిస్తారు. మీ శిబిరం తప్పనిసరిగా పరిశుద్ధంగా ఉండాలి, తద్వారా ఆయన మీ మధ్య అసభ్యకరమైనదేది చూడరు, మీ నుండి తప్పుకోరు.
DEU 23:15 బానిసలు మిమ్మల్ని ఆశ్రయిస్తే, వారిని వారి యజమానికి అప్పగించవద్దు.
DEU 23:16 వారిని మీ మధ్య వారికి ఇష్టమైనట్లు, వారు ఎంచుకున్న పట్టణంలో నివసింపనివ్వండి. వారిని అణచివేయవద్దు.
DEU 23:17 ఏ ఇశ్రాయేలు పురుషుడు గాని స్త్రీ గాని ఆలయ వేశ్యగా మారకూడదు.
DEU 23:18 మీ దేవుడైన యెహోవా వారిద్దరిని అసహ్యిస్తారు కాబట్టి ఏ మ్రొక్కుబడినైనా చెల్లించడానికి వేశ్యలైన స్త్రీలు గాని పురుషులు గాని వారి సంపాదనలు మీరు మీ దేవుడైన యెహోవా మందిరంలోకి తీసుకురాకూడదు.
DEU 23:19 వడ్డీ సంపాదించగల డబ్బు గాని ఆహారమే గాని వేరే ఏదైనా గాని, తోటి ఇశ్రాయేలు దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.
DEU 23:20 మీరు విదేశీయుల దగ్గర వడ్డీని వసూలు చేయవచ్చు, కానీ తోటి ఇశ్రాయేలు దగ్గర కాదు, తద్వారా మీరు స్వాధీనం చేసుకునే దేశంలో మీరు చేయి పెట్టిన ప్రతి దానిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
DEU 23:21 మీరు మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడి చేస్తే, దానిని తీర్చడానికి ఆలస్యం చేయకండి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా మీ నుండి దాన్ని కోరతారు, మీరు పాపాన్ని బట్టి దోషులవుతారు.
DEU 23:22 కానీ మీరు మ్రొక్కుబడి చేయడం మానుకుంటే, మీరు దోషులు కారు.
DEU 23:23 మీ పెదవులు ఏది చెప్పినా మీరు తప్పకుండా చేయాలి, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు మీ నోటితో స్వేచ్ఛగా మ్రొక్కుబడి చేశారు.
DEU 23:24 మీరు మీ పొరుగువారి ద్రాక్షతోటలోనికి ప్రవేశిస్తే, మీకు కావలసిన ద్రాక్షపండ్లను మీరు తినవచ్చు, కానీ మీ బుట్టలో వాటిని వేసుకోకూడదు.
DEU 23:25 మీరు మీ పొరుగువారి ధాన్యపు పొలంలోకి ప్రవేశిస్తే, మీరు మీ చేతులతో విత్తనాలను తీసుకోవచ్చు, కానీ మీరు పండిన పంటను కొడవలితో కోయకూడదు.
DEU 24:1 ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమె అంతకుముందే వేరొకనితో సంబంధం కలిగి ఉన్నట్లు అనుమానం కలిగి ఆమె మీద ఇష్టం తొలగిపోతే, అతడు ఆమెకు విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెకు ఇచ్చి తన ఇంట్లోనుండి పంపివేయాలి.
DEU 24:2 ఒకవేళ ఆమె అతని ఇంటి నుండి వెళ్లిన తర్వాత ఆమె మరొక వ్యక్తికి భార్య అయితే,
DEU 24:3 ఆమె రెండవ భర్త కూడా ఆమెను ఇష్టపడలేదు, ఆమెకు విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెకు ఇచ్చి అతని ఇంటి నుండి పంపిస్తే లేదా అతడు చనిపోతే,
DEU 24:4 అప్పుడు ఆమె విడాకులు తీసుకున్న ఆమె మొదటి భర్త, ఆమె అపవిత్రమైన తర్వాత ఆమెను మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి అనుమతించబడలేదు. అది యెహోవా దృష్టిలో అసహ్యకరమైనది. మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశం మీదికి మీరు దోషం తీసుకురావద్దు.
DEU 24:5 ఒక వ్యక్తి క్రొత్తగా పెళ్ళి చేసుకున్నట్లయితే, అతన్ని యుద్ధానికి పంపకూడదు, ఏ ఇతర భారాన్ని మోపకూడదు. ఒక సంవత్సరం పాటు అతడు స్వేచ్ఛగా ఇంట్లో ఉండి పెళ్ళి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి.
DEU 24:6 అప్పు కోసం పూచీకత్తుగా ఒక తిరగలిని గాని, తిరగలి పై రాతిని గాని తాకట్టు పెట్టకూడదు. ఎందుకంటే అది మనిషి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్లవుతుంది.
DEU 24:7 ఎవరైనా తోటి ఇశ్రాయేలును ఎత్తుకెళ్లి, బానిసగా చూస్తూ లేదా అమ్ముతూ పట్టుబడినా, ఎత్తుకెళ్లిన వాడు మరణించాలి. మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి.
DEU 24:8 అపవిత్రం చేసే కుష్ఠు లాంటి వ్యాధి విషయాల్లో, లేవీయ యాజకులు మీకు సూచించిన విధంగా ఖచ్చితంగా చేయండి. నేను వారికి ఆజ్ఞాపించిన వాటిని మీరు జాగ్రత్తగా పాటించాలి.
DEU 24:9 మీరు ఈజిప్టు నుండి ప్రయాణమై వస్తూ ఉండగా మీ దేవుడైన యెహోవా మిర్యాముకు ఏమి చేశారో జ్ఞాపకం ఉంచుకోండి.
DEU 24:10 మీరు మీ పొరుగువానికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు, వారు తాకట్టుగా పెట్టిన దాన్ని తెచ్చుకోడానికి ఇంట్లో చొరబడకూడదు.
DEU 24:11 బయటనే నిలవాలి, ఇంట్లోనుండి వచ్చి అతడే స్వయంగా ఆ వస్తువు తెచ్చి ఇవ్వాలి.
DEU 24:12 పొరుగువాడు పేదవాడైతే, వాని తాకట్టును మీ దగ్గర పెట్టుకుని నిద్రపోవద్దు.
DEU 24:13 సూర్యాస్తమయానికి వారి వస్త్రాన్ని తిరిగి ఇవ్వండి, తద్వారా మీ పొరుగువారు దానిపై నిద్రపోవచ్చు. అప్పుడు వారు మిమ్మల్ని దీవిస్తారు, అది మీ దేవుడైన యెహోవా దృష్టిలో నీతిగా లెక్కించబడుతుంది.
DEU 24:14 మీ తోటి ఇశ్రాయేలీయులలో గాని మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులలో గాని పేదవారై అవసరంలో ఉన్న కూలివారిని బాధించవద్దు.
DEU 24:15 ప్రతిరోజు సూర్యాస్తమయానికి ముందు వారి వేతనాలు చెల్లించండి, ఎందుకంటే వారు పేదవారు దానిని లెక్కిస్తున్నారు. లేకపోతే వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొర పెట్టవచ్చు, అప్పుడు మీరు దోషులుగా పరిగణించబడతారు.
DEU 24:16 తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందకూడదు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందకూడదు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు.
DEU 24:17 న్యాయం విషయంలో విదేశీయులను గాని తండ్రిలేనివారిని గాని వంచించకండి లేదా విధవరాలి యొక్క వస్త్రాన్ని తాకట్టుగా తీసుకోకండి,
DEU 24:18 మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్నారని, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడినుండి విడిపించారని జ్ఞాపకముంచుకోండి. అందుకే ఇలా చేయండని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
DEU 24:19 మీరు మీ పొలంలో పంట కోసినప్పుడు, మీరు ఒక పనను పట్టించుకోకపోతే, దాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లవద్దు. మీ చేతుల యొక్క అన్ని పనులలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించేలా విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.
DEU 24:20 మీరు మీ చెట్ల నుండి ఒలీవలను కొట్టినప్పుడు, రెండవసారి కొమ్మలపైకి వెళ్లవద్దు. విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం మిగిలి ఉన్నవాటిని వదిలేయండి.
DEU 24:21 మీరు మీ ద్రాక్షతోటలో ద్రాక్షను కోసినప్పుడు, మళ్ళీ తీగెల మీద వెదకవద్దు. మిగిలి ఉన్నవాటిని విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.
DEU 24:22 మీరు ఈజిప్టులో బానిసలుగా ఉంటిరని జ్ఞాపకముంచుకోండి. అందుకే ఇలా చేయండని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
DEU 25:1 ప్రజలకు వివాదం ఉన్నప్పుడు, వారు దానిని న్యాయస్థానానికి తీసుకెళ్లాలి, న్యాయాధిపతులు నిర్దోషులను విముక్తులుగా ప్రకటిస్తూ, దోషులను దోషులుగా ప్రకటిస్తారు.
DEU 25:2 ఒకవేళ దోషులు శిక్షార్హులైతే న్యాయాధిపతి వారిని పడుకోబెట్టి అతని సమక్షంలో నేరానికి తగ్గట్టుగా కొరడా దెబ్బల సంఖ్యతో కొరడాతో కొట్టాలి,
DEU 25:3 కానీ న్యాయాధిపతి నలభైకి మించి కొరడా దెబ్బలు వేయకూడదు. దోషిని అంతకు మించి కొరడాలతో కొడితే మీ తోటి ఇశ్రాయేలీయుడు మీ దృష్టిలో దిగజారిపోతాడు.
DEU 25:4 ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు.
DEU 25:5 అన్నదమ్ములు కలిసి ఉమ్మడి కుటుంబంగా వుంటున్నప్పుడు వారిలో ఒకడు సంతానం లేకుండా చనిపోతే అతని భార్య పరాయివాడ్ని చేసుకోకూడదు, గతించిన తన భర్త తోబుట్టువు ఆమెను పెళ్ళి చేసుకోవాలి, ఆమె పట్ల బావమరిది విధిని నెరవేర్చాలి.
DEU 25:6 ఆమె కనిన మొదటి కుమారుడు చనిపోయిన సోదరుడి పేరును కొనసాగించాలి, తద్వారా అతని పేరు ఇశ్రాయేలు నుండి తొలగించబడదు.
DEU 25:7 ఏదేమైనా, ఒక వ్యక్తి తన సోదరుడి భార్యను పెళ్ళి చేసుకోకూడదనుకుంటే, ఆమె పట్టణ ద్వారం దగ్గర ఉన్న పెద్దల దగ్గరకు వెళ్లి, “నా భర్త సోదరుడు ఇశ్రాయేలీయులలో తన సోదరుని పేరును కొనసాగించడానికి నా నిరాకరిస్తున్నాడు. అతడు నా పట్ల ఒక బావమరిది కర్తవ్యాన్ని నెరవేర్చడం లేదు” అని చెప్పాలి.
DEU 25:8 అప్పుడు పట్టణ పెద్దలు అతన్ని పిలిపించి మాట్లాడాలి. అప్పటికీ అతడు, “ఆమెను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు” అని మొండిగా ఉంటే,
DEU 25:9 అతని సోదరుని విధవరాలు పెద్దల సమక్షంలో అతని దగ్గరకు వెళ్లి, అతని కాలి చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మివేసి, “తన సోదరుని కుటుంబాన్ని నిలబెట్టని వ్యక్తికి ఇలాగే జరుగుతుంది” అని చెప్పాలి.
DEU 25:10 అప్పుడు వాని వంశం ఇశ్రాయేలులో చెప్పు ఊడదీయబడిన కుటుంబం అని పిలువబడుతుంది.
DEU 25:11 ఇద్దరు పురుషులు పోట్లాడుకుంటునప్పుడు వారిలో ఒకని భార్య అవతలివాని బారి నుండి తన భర్తను విడిపించడానికి వచ్చి వాని మర్మాంగాన్ని పట్టుకున్నట్లయితే,
DEU 25:12 ఆమె చేతిని తెగనరకాలి. ఆమె మీద దయ చూపకూడదు.
DEU 25:13 మీ సంచిలో రెండు వేరువేరు తూనిక రాళ్లు ఒకటి బరువైనవి ఇంకొకటి తేలికైనవి ఉండకూడదు.
DEU 25:14 మీ ఇంట్లో రెండు విభిన్న కొలతలు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉండకూడదు.
DEU 25:15 మీ ఖచ్చితమైన, న్యాయమైన తూనిక రాళ్లు న్యాయమైన త్రాసులు ఉండాలి, తద్వారా మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న భూమిలో మీరు ఎక్కువకాలం జీవిస్తారు.
DEU 25:16 అన్యాయపు తూకం వేసేవారిని, అన్యాయం చేసేవారిని మీ దేవుడైన యెహోవా అసహ్యించుకుంటారు.
DEU 25:17 ఈజిప్టు నుండి మీరు వచ్చినప్పుడు మీ ప్రయాణంలో అమాలేకీయులు మీకు చేసింది జ్ఞాపకముంచుకోండి.
DEU 25:18 మీరు అలసిపోయి బడలికతో ఉన్నప్పుడు, వారు మీ ప్రయాణంలో మిమ్మల్ని కలుసుకున్నారు వెనుకబడిన వారందరిపై దాడి చేశారు; వారికి దేవుని భయం లేదు.
DEU 25:19 మీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా మీకిస్తున్న దేశాన్ని మీరు స్వాధీనపరచుకున్న తర్వాత మీ చుట్టూ ఉన్న శత్రువులను పారద్రోలి మీకు విశ్రాంతి ప్రసాదించిన తర్వాత ఆకాశం క్రింద అమాలేకీయులను నామరూపాలు లేకుండా తుడిచివేయాలని మరచిపోవద్దు.
DEU 26:1 మీరు మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశంలోకి ప్రవేశించినప్పుడు దానిని స్వాధీనం చేసుకుని దానిలో స్థిరపడాలి.
DEU 26:2 మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న భూమి నేల నుండి మీరు ఉత్పత్తి చేసే అన్ని ఫలాలను తీసుకుని వాటిని బుట్టలో ఉంచండి, తర్వాత మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాసంగా ఎన్నుకునే ప్రదేశానికి వెళ్లి,
DEU 26:3 ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న యాజకునికి, “మాకు ఇస్తానని యెహోవా మా పూర్వికులకు ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చానని ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు ప్రకటిస్తున్నాను” అని చెప్పండి.
DEU 26:4 యాజకుడు మీ చేతుల్లో నుండి ఆ గంపను తీసుకుని మీ దేవుడైన యెహోవా బలిపీఠం ముందు క్రింద పెట్టాలి.
DEU 26:5 అప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా ఎదుట ఇలా ప్రకటించాలి: “నా తండ్రి సంచరించే అరామీయుడు, అతడు కొద్దిమంది వ్యక్తులతో ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించి, శక్తివంతమైన, అసంఖ్యాకమైన గొప్ప దేశంగా అయ్యాడు.
DEU 26:6 కాని ఈజిప్టువారు మనలను హింసించి, బాధపెట్టి, మనలను కఠినమైన శ్రమకు గురి చేశారు.
DEU 26:7 మనం మన పూర్వికుల దేవుడైన యెహోవాకు మొరపెట్టుకున్నాము. యెహోవా మన మొర విని, మన బాధ, ప్రయాస, మనకు కలిగిన హింసను చూశారు.
DEU 26:8 యెహోవా తన బలమైన హస్తంతో చేయి చాపి మహా భయంకరమైన విధంగా చర్య తీసుకున్నాడు, అసాధారణ గుర్తులను, అద్భుతాలను చూపించారు.
DEU 26:9 ఈ స్థలానికి మనలను తెచ్చి పాలు తేనెలు నదులైపారే ఈ దేశాన్ని మనకిచ్చారు.
DEU 26:10 యెహోవా, మీరు నాకు ఇచ్చిన భూమిలోని మొదటి ఫలాలను ఇప్పుడు తెస్తున్నాను.” ఆ గంపను మీ దేవుడైన యెహోవా ముందు పెట్టి ఆయన ముందు నమస్కరించాలి.
DEU 26:11 నీకు మీ ఇంటివారికి మీ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మేలును బట్టి మీరూ లేవీయులు అలాగే మీ మధ్య ఉన్న విదేశీయులు కలిసి సంతోషించాలి.
DEU 26:12 పదవ భాగం ఇచ్చే సంవత్సరం, అనగా మూడవ సంవత్సరం మీ రాబడిలో దశమభాగం చెల్లించి, అది లేవీయులకు విదేశీయులకు తండ్రిలేనివారికి విధవరాండ్రకు ఇవ్వాలి. వారు మీ గ్రామాల్లో వీరంతా తిని తృప్తి పొందాలి.
DEU 26:13 అప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఇలా చెప్పాలి: “మీరు ఆజ్ఞాపించిన ప్రకారము నేను ప్రతిష్ఠితమైన దాన్ని నా ఇంటి నుండి తీసివేసి లేవీయులకు విదేశీయులకు, తండ్రిలేనివారికి విధవరాండ్రకు ఇచ్చాను. నేను మీ ఆజ్ఞలను ప్రక్కన పెట్టలేదు వాటిలో దేన్ని నేను మరచిపోలేదు.
DEU 26:14 నేను దుఃఖంలో ఉన్నప్పుడు ప్రతిష్ఠితమైన దానిలోనిది ఏదీ తినలేదు, నేను అపవిత్రంగా ఉన్న సమయంలో అందులో ఏదీ తీసివేయలేదు, చనిపోయినవారి కోసం దాన్ని అర్పించలేదు.నేను నా దేవుడైన యెహోవాకు లోబడ్డాను; మీరు ఆజ్ఞాపించిన ప్రతిదీ నేను చేశాను.
DEU 26:15 మీ పవిత్ర నివాసమైన ఆకాశం నుండి క్రిందికి చూడండి మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లుగా మీ ప్రజలైన ఇశ్రాయేలీయులను, మీరు మాకు ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించే ఈ భూమిని ఆశీర్వదించండి.”
DEU 26:16 మీ దేవుడైన యెహోవా ఈ రోజున మీకాజ్ఞాపిస్తున్న ఈ శాసనాలు చట్టాలు మీరు పాటించాలి; మీ పూర్ణహృదయంతో, మీ ప్రాణమంతటితో మీరు జాగ్రత్తగా వాటిని పాటించాలి.
DEU 26:17 మీరు ఈ రోజు యెహోవాయే మీ దేవుడని మీరు ఆయనకు విధేయులై నడుస్తారని, మీరు ఆయన శాసనాలను, ఆజ్ఞలను, చట్టాలను పాటిస్తారని, ఆయన మార్గంలో నడుస్తారని మీరు ప్రకటించారు.
DEU 26:18 యెహోవా ఈ రోజున మీరు ఆయన ప్రజలని, ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు ఆయన స్వంత ప్రజలుగా ఉంటూ ఆయన ఆజ్ఞలన్నిటిని పాటించాలని ప్రకటించారు.
DEU 26:19 ఆయన తాను చేసిన అన్ని దేశాల కంటే మిమ్మల్ని హెచ్చిస్తారని, అప్పుడు మీరు ప్రశంసలు, కీర్తి, గౌరవం పొందుకుంటారని, ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలుగా ఉంటారని ఆయన ప్రకటించారు.
DEU 27:1 మోషే, ఇశ్రాయేలు పెద్దలు ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు: “ఈ రోజు మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నిటిని మీరు పాటించాలి.
DEU 27:2 మీకు దేవుడైన యెహోవా ఇస్తున్న వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి యొర్దాను దాటిన రోజున, మీరు పెద్ద రాళ్లు నిలబెట్టి వాటికి సున్నం వేయాలి.
DEU 27:3 మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసినట్లే, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించడానికి మీరు దాటునప్పుడు ఈ చట్టం లోని పూర్తి మాటలను వాటిపై వ్రాయండి.
DEU 27:4 మీరు యొర్దాను దాటినప్పుడు, సున్నం వేసిన ఈ రాళ్లను నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించినట్లు ఏబాలు పర్వతం మీద నిలబెట్టండి.
DEU 27:5 అక్కడ మీ దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం రాళ్లతో కట్టాలి. వాటిపై ఎలాంటి ఇనుప సాధనాన్ని వాడకూడదు.
DEU 27:6 చెక్కని రాళ్లతో యెహోవాకు బలిపీఠం కట్టి దాని మీద దహనబలులు అర్పించాలి.
DEU 27:7 అక్కడ సమాధానబలులు సమర్పించి, వాటిని తింటూ మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి.
DEU 27:8 మీరు నిలబెట్టిన రాళ్లమీద ఈ ధర్మశాస్త్రంలోని అన్ని మాటలను స్పష్టంగా వ్రాయండి.”
DEU 27:9 తర్వాత మోషే, లేవీయ యాజకులు ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా అన్నారు, “ఇశ్రాయేలూ, మౌనంగా ఉండి నేను చెప్పేది విను! ఇప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రజలయ్యారు.
DEU 27:10 మీరు దేవుడైన యెహోవాకు లోబడి, నేను మీకు ఈ రోజు ఇస్తున్న ఆయన ఆజ్ఞలను, శాసనాలను మీరు పాటించాలి.”
DEU 27:11 ఆ రోజే మోషే ప్రజలకు ఆజ్ఞాపించాడు:
DEU 27:12 మీరు యొర్దాను నది దాటిన తర్వాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రాల వారు గెరిజీము పర్వతం మీద నిలబడి ప్రజలను దీవించాలి.
DEU 27:13 రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వారు ఏబాలు పర్వతం మీద నిలబడి, శాపాలు పలకాలి.
DEU 27:14 లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరికి బిగ్గరగా ఇలా చెప్పాలి:
DEU 27:15 “శిల్పి చేతులతో చెక్కబడి పోతపోయబడిన యెహోవాకు అసహ్యమైన విగ్రహాలను రహస్య స్థలంలో దాచుకునే వారెవరైనా శాపగ్రస్తులు” అని అన్నప్పుడు ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
DEU 27:16 “తండ్రిని గాని తల్లిని గాని అవమానపరచే వారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
DEU 27:17 “తన పొరుగువాడి సరిహద్దు రాయిని తీసివేసేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
DEU 27:18 “గ్రుడ్డివాన్ని త్రోవ తప్పించేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
DEU 27:19 “విదేశీయుల పట్ల, తండ్రిలేనివారి పట్ల, విధవరాండ్ర పట్ల న్యాయం తప్పి తీర్పు తీర్చేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
DEU 27:20 “తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని తండ్రి పాన్పును అపవిత్రపరచినవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
DEU 27:21 “ఏ జంతువుతోనైనా లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
DEU 27:22 “తోబుట్టువుతో అనగా తన తండ్రి కుమార్తెతో గాని, తన తల్లి కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
DEU 27:23 “అత్తతో లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
DEU 27:24 “పొరుగువాన్ని రహస్యంగా చంపేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
DEU 27:25 “నిర్దోషి ప్రాణం తీయటానికి లంచం తీసుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
DEU 27:26 “ఈ ధర్మశాస్త్రంలోని మాటలను అమలు చేయడం ద్వారా వాటిని పాటించనివారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
DEU 28:1 మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటూ, నేను ఈ రోజు మీకిచ్చే ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరిస్తే, మీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త దేశాల కంటే పైగా మిమ్మల్ని హెచ్చిస్తారు.
DEU 28:2 మీ దేవుడైన యెహోవాకు మీరు లోబడితే, ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి, మిమ్మల్ని వెంబడిస్తాయి:
DEU 28:3 మీరు పట్టణంలో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు.
DEU 28:4 మీ గర్భఫలం దీవించబడుతుంది, భూ పంటలు, పశువుల మందల్లోని దూడలు గొర్రెల మందల్లోని గొర్రెపిల్లలు దీవించబడతాయి.
DEU 28:5 మీ గంప, మీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది.
DEU 28:6 మీరు లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్లినప్పుడు దీవించబడతారు.
DEU 28:7 శత్రువులు మీ మీదికి లేచినప్పుడు, యెహోవా వారిని మీ ముందు ఓడిపోయేలా చేస్తారు. వారు ఒకవైపు నుండి మీ దగ్గరకు వస్తారు కాని నీ దగ్గరి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు.
DEU 28:8 మీ కొట్ల మీదకు మీ ప్రయత్నాలన్నిటి మీదకు యెహోవా దీవెనలు పంపుతారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
DEU 28:9 మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించి, ఆయన మార్గంలో మీరు నడుచుకుంటే, యెహోవా ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసినట్లుగా, యెహోవా మిమ్మల్ని తన పరిశుద్ధ ప్రజలుగా స్థాపిస్తారు.
DEU 28:10 అప్పుడు భూమి మీద ఉన్న జనాంగాలందరూ మీరు యెహోవా పేరుతో పిలువబడ్డారని చూసి, వారు మీకు భయపడతారు.
DEU 28:11 యెహోవా మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భ ఫలంలో, మీ పశువుల పిల్లల్లో, మీ నేల పంటల్లో మీకు సమృద్ధిగా వృద్ధిని ఇస్తారు.
DEU 28:12 కాలానుగుణంగా మీ భూమిపై వర్షం కురిపించడానికి, మీ చేతి పనులన్నింటినీ దీవించడానికి యెహోవా తన ఆకాశ గిడ్డంగులను తెరుస్తారు. మీరు అనేక దేశాలకు అప్పు ఇస్తారు, కానీ ఎవరినుండి అప్పు తీసుకోరు.
DEU 28:13 యెహోవా మిమ్మల్ని తలగా చేస్తారు, తోకగా కాదు. ఈ రోజు నేను మీకు ఇచ్చే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు శ్రద్ధగా గమనించి, వాటిని జాగ్రత్తగా పాటిస్తే, మీరు పై వారిగా ఉంటారు, క్రింది వారిగా ఉండరు.
DEU 28:14 ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, వారిని సేవిస్తూ, ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆజ్ఞల నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగవద్దు.
DEU 28:15 అయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయత చూపక, నేను ఈ రోజు మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని, శాసనాలను జాగ్రత్తగా పాటించకపోతే, ఈ శాపాలన్నీ మీపైకి వచ్చి మిమ్మల్ని ముంచేస్తాయి.
DEU 28:16 మీరు పట్టణంలో శపించబడతారు, పొలంలో శపించబడతారు.
DEU 28:17 మీ గంప, పిండి పిసికే తొట్టి శపించబడతాయి.
DEU 28:18 మీ గర్భఫలం శపించబడుతుంది, మీ భూమి పంటలు, మీ పశువుల దూడలు, మీ మందల గొర్రెపిల్లలు శపించబడతాయి.
DEU 28:19 మీరు లోపలికి వచ్చినప్పుడు శపించబడతారు, బయటకు వెళ్లినప్పుడు శపించబడతారు.
DEU 28:20 మీరు ఆయనను విడిచిపెట్టి చేసిన చెడు కారణంగా, అకస్మాత్తుగా నాశనమయ్యే వరకు, యెహోవా మీరు చేయి వేసిన ప్రతి దాని మీదికి శాపాలు, నిరాశను, నిరుత్సాహాన్ని పంపుతారు.
DEU 28:21 మీరు స్వాధీనపరచుకోడానికి ప్రవేశిస్తున్న దేశంలో ఉండకుండ మిమ్మల్ని నాశనం చేసే వరకు యెహోవా మిమ్మల్ని రోగాలతో తెగులుతో బాధిస్తారు.
DEU 28:22 యెహోవా వ్యాధితో, జ్వరం, వాపు, తీవ్రమైన వేడి, ఖడ్గంతో, ముడత, బూజుతో మీమీద దాడి చేస్తారు, మీరు నశించే వరకు ఇది తెగులుగా మిమ్మల్ని వేధిస్తుంది.
DEU 28:23 మీ తలమీద ఆకాశం ఇత్తడిలా మీ క్రింద నేల ఇనుములా ఉంటాయి.
DEU 28:24 యెహోవా మీ దేశపు వర్షాన్ని దుమ్ము, పొడిగా మారుస్తారు; మీరు నాశనం అయ్యేవరకు అది ఆకాశాల నుండి దిగి వస్తుంది.
DEU 28:25 మీ శత్రువుల చేతిలో యెహోవా మిమ్మల్ని ఓడిపోయేలా చేస్తారు.మీరు వారి దగ్గరకు ఒకవైపు నుండి వస్తారు, కాని వారి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు. మీరంటే అన్ని రాజ్యాలకు భయం కలుగుతుంది.
DEU 28:26 మీ కళేబరాలు ఆకాశపక్షులకు అడవి మృగాలకు ఆహారమవుతాయి, వాటిని వెళ్లగొట్టే వారెవరూ ఉండరు.
DEU 28:27 యెహోవా మిమ్మల్ని నయం కాలేని ఈజిప్టు కురుపులు, గడ్డలు, చీముపట్టిన పుండ్లు, దురదతో బాధిస్తారు.
DEU 28:28 యెహోవా మిమ్మల్ని వెర్రితనంతో, గ్రుడ్డితనంతో, మానసిక ఆందోళనతో బాధిస్తారు.
DEU 28:29 మధ్యాహ్న సమయంలో మీరు చీకటిలో గ్రుడ్డివానిలా తడుముకుంటారు. మీరు చేసే ప్రతీ పనిలో మీరు విఫలమవుతారు; రోజు రోజుకు మీరు అణచివేయబడతారు, దోచుకోబడతారు, మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ ఉండరు.
DEU 28:30 మీకు ఒక స్త్రీతో పెళ్ళి నిశ్చయమవుతుంది, కానీ మరొకరు ఆమెను తీసుకెళ్లి పాడుచేస్తారు. మీరు ఇల్లు కట్టుకుంటారు, కానీ మీరు అందులో నివసించరు. మీరు ద్రాక్షతోటను నాటుతారు, కానీ మీరు దాని ఫలాలను తినరు.
DEU 28:31 మీరు చూస్తూ ఉండగానే మీ ఎద్దు వధించబడుతుంది, కానీ మీరు దాంట్లో నుండి ఏమి తినరు. మీ గాడిద బలవంతంగా తీసుకెళ్తారు, మళ్ళీ మీకివ్వరు. మీ గొర్రెలు మేకలు శత్రువుల వశమవుతాయి, వాటిని ఎవ్వరూ రక్షించరు.
DEU 28:32 మీ కుమారులు కుమార్తెలు వేరొక దేశానికి ఇవ్వబడతారు, దినదినం వారి కోసం ఎదురుచూసి మీ కళ్లు అలసిపోతాయి, చేయి ఎత్తడానికి కూడా శక్తి ఉండదు.
DEU 28:33 మీకు తెలియని ప్రజలు మీ భూమి, మీ శ్రమ ఉత్పత్తి చేసే వాటిని తింటారు, మీ జీవితమంతా క్రూరమైన అణచివేత తప్ప మీకు ఏమీ ఉండదు.
DEU 28:34 మీరు చూసే దృశ్యాలు మిమ్మల్ని పిచ్చివారిని చేస్తాయి.
DEU 28:35 యెహోవా మీ మోకాళ్లను, కాళ్లను నయం చేయలేని బాధాకరమైన కురుపులతో బాధిస్తారు, అవి మీ అరికాళ్ల నుండి నడినెత్తి వరకు వ్యాపిస్తాయి.
DEU 28:36 మీకు, మీ పూర్వికులకు తెలియని దేశానికి యెహోవా మిమ్మల్ని మీరు నియమించుకున్న రాజును తోలివేస్తారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళు, చెక్క, రాతి దేవుళ్ళను సేవిస్తారు.
DEU 28:37 యెహోవా మిమ్మల్ని నడిపించే ప్రజలందరి మధ్య మీరు భయానకమైన, ఒక సామెతగా హేళనకు కారణంగా మారతారు.
DEU 28:38 మీరు పొలంలో చాలా విత్తనాలు విత్తుతారు, కానీ మిడుతలు దాన్ని మ్రింగివేస్తాయి కాబట్టి మీరు కొద్దిగా పంట కోస్తారు.
DEU 28:39 మీరు ద్రాక్షతోటలు నాటి వాటిని శ్రమపడి సేద్యం చేస్తారు కాని ద్రాక్షరసం త్రాగరు, ద్రాక్షపండ్లు ఏరుకోరు, కారణం పురుగులు వాటిని తినేస్తాయి.
DEU 28:40 మీకు ఒలీవచెట్లు ఉంటాయి గాని మీరు నూనె వాడరు, ఎందుకంటే ఒలీవలు రాలిపోతాయి.
DEU 28:41 మీకు కుమారులు, కుమార్తెలు ఉంటారు, కానీ వారు మీ దగ్గర ఉండరు, ఎందుకంటే వారు చెరలోకి వెళ్లిపోతారు.
DEU 28:42 మీ చెట్లను మీ పొలం పంటలను మిడతల గుంపులు వచ్చి ఆక్రమించుకుంటాయి.
DEU 28:43 మీ మధ్య నివసించే విదేశీయులు మీకంటే అంతకంతకు పైకి ఎదుగుతారు, కానీ మీరు అంతకంతకు దిగజారిపోతారు.
DEU 28:44 వారు మీకు అప్పిస్తారు గాని, మీరు వారికి అప్పు ఇవ్వరు. వారు తలగా ఉంటారు, మీరు తోకగా ఉంటారు.
DEU 28:45 ఈ శాపాలన్నీ మీ మీదికి వస్తాయి. మీరు నాశనమయ్యే వరకు వారు మిమ్మల్ని వెంటాడి, మిమ్మల్ని అధిగమిస్తారు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయత చూపలేదు, ఆయన మీకు ఇచ్చిన ఆజ్ఞలను, శాసనాలను మీరు పాటించలేదు.
DEU 28:46 అవి మీకు, మీ వారసులకు ఎప్పటికీ సూచనలుగా ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి.
DEU 28:47 ఎందుకంటే మీరు సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ మీ దేవుడైన యెహోవాకు సంతోషంగా, ఆనందంగా సేవ చేయలేదు.
DEU 28:48 అందువల్ల ఆకలి, దాహం, నగ్నత్వం, పేదరికంలో, యెహోవా మీకు వ్యతిరేకంగా పంపే శత్రువులకు మీరు సేవ చేస్తారు. మిమ్మల్ని నాశనం చేసే వరకు ఆయన మీ మెడ మీద ఇనుప కాడి మోపుతాడు.
DEU 28:49 యెహోవా మీకు వ్యతిరేకంగా దూర ప్రాంతాల నుండి, భూమి చివర్ల నుండి, ఒక గ్రద్ద దూసుకు వస్తున్నట్లుగా, మీకు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే ఒక దేశాన్ని తెస్తారు.
DEU 28:50 అది వృద్ధుల పట్ల గౌరవం గాని చిన్నవారి పట్ల జాలి గాని లేని క్రూరంగా కనిపించే దేశము.
DEU 28:51 మీరు నాశనమయ్యే వరకు వారు మీ పశువుల పిల్లలను, మీ భూమిలోని పంటలను మ్రింగివేస్తారు. మీరు నాశనమయ్యే వరకు వారు మీకు ధాన్యం గాని, క్రొత్త ద్రాక్షరసం గాని, ఒలీవనూనె గాని, మీ పశువుల దూడలను గాని, మీ మందల గొర్రెపిల్లలను వదిలిపెట్టరు.
DEU 28:52 మీరు నమ్మే ఎత్తైన కోటగోడలు కూలిపోయే వరకు వారు మీ దేశంలోని అన్ని పట్టణాలను ముట్టడిస్తారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని అన్ని పట్టణాలను వారు ముట్టడిస్తారు.
DEU 28:53 ముట్టడి సమయంలో మీ శత్రువు మీకు కలిగించే బాధల కారణంగా, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన గర్భఫలం, కుమారులు కుమార్తెల మాంసాన్ని మీరు తింటారు.
DEU 28:54 మీలో అత్యంత సౌమ్యుడైన, సున్నితమైన పురుషునికి కూడా తన సొంత సోదరునిపై గాని లేదా తాను ప్రేమించే భార్యపై గాని లేదా మిగిలి ఉన్న పిల్లలపై గాని కనికరం ఉండదు.
DEU 28:55 అతడు తినే తన పిల్లల మాంసంలో కొంచెమైనా అతడు వారికి ఇవ్వడు. ఎందుకంటే మీ పట్టణాలన్ని ముట్టడి చేయబడిన సమయంలో మీ శత్రువు మీకు కలిగించిన బాధను బట్టి అతనికి మిగిలింది అదే.
DEU 28:56 మీలో అత్యంత సౌమ్యమైన సున్నితమైన స్త్రీ తన పాదం కూడా నేలమీద మోపే సాహసం చేయని స్త్రీ తాను ప్రేమించిన భర్తను, తన సొంత కుమారుడు లేదా కుమార్తెను వేధిస్తుంది.
DEU 28:57 మీ పట్టణాలు ముట్టడి చేయబడిన సమయంలో మీ శత్రువు మిమ్మల్ని పెట్టే బాధను బట్టి ఆమె వేరే దారి లేక ఆమె గర్భం నుండి స్రవించే మావిని, కనిన పిల్లలను రహస్యంగా తినాలని అనుకుంటుంది.
DEU 28:58 ఈ గ్రంథంలో వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర మాటలన్నిటిని ఒకవేళ మీరు జాగ్రత్తగా పాటించక, మీ దేవుడైన యెహోవా మహిమగల అద్భుతమైన నామానికి మీరు భయపడకపోతే,
DEU 28:59 యెహోవా మీకు, మీ వారసులకు భయంకరమైన తెగుళ్ళు, కఠినమైన, సుదీర్ఘమైన విపత్తులు, తీవ్రమైన, దీర్ఘకాలిక అనారోగ్యాలను పంపుతారు.
DEU 28:60 మీరు భయపడే ఈజిప్టు వ్యాధులన్నిటిని ఆయన మీ మీదికి తెస్తారు, అవి మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటాయి.
DEU 28:61 మీరు నాశనం అయ్యేవరకు ఈ ధర్మశాస్త్ర పుస్తకంలో నమోదు చేయబడని ప్రతి విధమైన రోగాన్ని, విపత్తును కూడా యెహోవా మీపైకి తెస్తారు.
DEU 28:62 ఆకాశంలోని నక్షత్రాల్లా అనేకమైన మీరు కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు.
DEU 28:63 మీరు వృద్ధి చెందడం, సంఖ్య పెరగడం యెహోవాకు ఎంత సంతోషాన్ని కలిగించిందో, మిమ్మల్ని పతనం చేయడం, నాశనం చేయడం కూడా ఆయనను అంతే సంతోషపరుస్తుంది. మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశిస్తున్న దేశం నుండి మీరు పెరికివేయబడతారు.
DEU 28:64 అప్పుడు యెహోవా భూమి యొక్క ఒక చివర నుండి మరొక చివర వరకు అన్ని దేశాల మధ్య మిమ్మల్ని చెదరగొడతారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళను మీకు గాని మీ పూర్వికులకు గాని తెలియని చెక్కతో రాతితో చేయబడిన దేవుళ్ళను సేవిస్తారు.
DEU 28:65 ఆ దేశాల్లో మీకు విశ్రాంతి దొరకదు, మీ అరికాలుకు కూడా విశ్రాంతి స్థలం ఉండదు. అక్కడ యెహోవా మీకు మనోవేదన, ఎదురుచూపులతో మసకబారిన కళ్లను, కలవరపడుతున్న హృదయాన్ని ఇస్తారు.
DEU 28:66 మీరు రాత్రి, పగలు దిగులుతో నిండుకొని, ఎప్పుడూ ప్రాణభయంతో జీవిస్తారు, మీరు బ్రతుకుతారన్న నమ్మకం మీకు ఉండదు.
DEU 28:67 ఎందుకంటే మీ హృదయాలను నింపే భయం మీ కళ్లు చూసే దృశ్యాలను బట్టి మీరు ఉదయాన, “ఒకవేళ ఇది సాయంత్రం అయితే బాగుండు!” అని సాయంత్రం, “ఒకవేళ ఇది ఉదయం అయితే బాగుండు!” అని అంటారు.
DEU 28:68 మీరు మళ్ళీ ఎన్నడూ ఈజిప్టుకు ప్రయాణం చేయకూడదని నేను చెప్పిన ఈజిప్టుకు యెహోవా మిమ్మల్ని ఓడలలో తిరిగి పంపుతారు. అక్కడ మీరు మగ, ఆడ బానిసలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరు అమ్మకానికి పెట్టుకుంటారు, కానీ ఎవరూ మిమ్మల్ని కొనరు.
DEU 29:1 యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన ఒడంబడికతో పాటు, మోయాబు దేశంలో వారితో మరో ఒడంబడిక చేయమని ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఒడంబడిక షరతులు.
DEU 29:2 మోషే ఇశ్రాయేలీయులందరిని పిలిపించి, వారితో ఇలా అన్నాడు: యెహోవా ఈజిప్టులో ఫరోకు అతని అధికారులందరికి, అతని దేశమంతటికి చేసింది మీ కళ్లు చూశాయి.
DEU 29:3 మీ కళ్లతో మీరు ఆ గొప్ప పరీక్షలను, ఆ అసాధారణ గుర్తులను, గొప్ప అద్భుతాలను చూశారు.
DEU 29:4 అయినా నేటి వరకు గ్రహించే మనస్సును గాని, చూసే కళ్లను గాని, వినే చెవులను గాని యెహోవా మీకు ఇవ్వలేదు.
DEU 29:5 అయినప్పటికీ యెహోవా అంటున్నారు, “నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించిన నలభై సంవత్సరాల్లో, మీ బట్టలు గాని, కాళ్ల చెప్పులు గాని పాతగిల్లలేదు.
DEU 29:6 మీరు రొట్టెలు తినలేదు ద్రాక్షరసం గాని మద్యం గాని త్రాగలేదు. నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకుంటారని ఇలా చేశాను.”
DEU 29:7 మీరిక్కడికి వచ్చినప్పుడు హెష్బోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మనతో పోరాడడానికి వచ్చారు, కాని మనం వారిని ఓడించాము.
DEU 29:8 మనం వారి దేశాన్ని స్వాధీనపరచుకుని రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రానికి వారసత్వంగా దాన్ని ఇచ్చాము.
DEU 29:9 ఈ ఒడంబడిక షరతులను జాగ్రత్తగా పాటించాలి, తద్వార మీరు చేసేవాటన్నిటిలో మీరు వృద్ధిచెందుతారు.
DEU 29:10 మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన ప్రకారం మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారం, నేడు మిమ్మల్ని తనకు ప్రజలుగా నియమించుకొని తానే మీకు దేవుడైయుండేలా మీ దేవుడైన యెహోవా నేడు మీకు నియమిస్తున్న మీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణంలోను మీరు ఈ రోజున మీరంతా అనగా మీ నాయకులు, ముఖ్య పురుషులు, మీ పెద్దలు, అధికారులు, ఇశ్రాయేలీయులలో ఇతర పురుషులందరు, మీ పిల్లలు, మీ భార్యలు, మీ పాళెంలో నివసిస్తున్న విదేశీయులు, మీ కట్టెలను నరికేవారు, మీ నీటిని తోడేవారు, అందరు నేడు మీ దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడికలోకి ప్రవేశించడానికి ఇక్కడ నిలబడి ఉన్నారు, ఈ రోజు యెహోవా ప్రమాణం చేయడం ద్వారా, ఈ రోజు మిమ్మల్ని తన ప్రజలుగా నియమించుకొని, ఆయన మీకు వాగ్దానం చేసినట్లుగా మీ తండ్రులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుతో ప్రమాణం చేసినట్లుగా మీ దేవునిగా ఉంటారు.
DEU 29:14 నేను ఈ ఒడంబడిక ప్రమాణాన్ని మీతో మాత్రమే కాదు, మన దేవుడైన యెహోవా సన్నిధిలో మాతోపాటు నిలబడి ఉన్నవారితో కూడా చేస్తున్నాను.
DEU 29:15 మా దేవుడైన యెహోవా సన్నిధిలో ఈ రోజు మాతో పాటు నిలబడ్డ వారు కానీ ఈ రోజు ఇక్కడ లేని వారితో కూడా ఉన్నారు.
DEU 29:16 మేము ఈజిప్టులో ఎలా జీవించామో, ఇక్కడి మార్గంలో దేశాల గుండా ఎలా వెళ్లామో మీకే తెలుసు.
DEU 29:17 వాటిలో మీరు వారి అసహ్యకరమైన చిత్రాలు చెక్క రాతి, వెండి బంగారు విగ్రహాలను చూశారు.
DEU 29:18 ఆ దేశాల దేవుళ్ళను సేవించడానికి వెళ్లి మన దేవుడైన యెహోవా నుండి తమ హృదయాన్ని మనస్సు ప్రక్కకు త్రిప్పుకున్న పురుషుడు గాని, స్త్రీ గాని, వంశం గాని గోత్రం గాని లేరనే విషయాన్ని నిర్ధారించుకోండి; అటువంటి చేదు విషాన్ని ఉత్పత్తి చేసే మూలం మీ మధ్యలో లేదనేది నిర్ధారించుకోండి.
DEU 29:19 అలాంటి వ్యక్తులు ఈ ప్రమాణం యొక్క మాటలు విన్నప్పుడు, వారు తమ మీదికి ఆశీర్వాదాన్ని ఆహ్వానించుకుంటూ, “నేను నా సొంత మార్గంలో వెళ్లాలని పట్టుదలతో ఉన్నప్పటికీ, నేను సమాధానం కలిగి ఉంటాను” అని అనుకుంటారు, వారు నీటితో తడపబడిన భూమిపైకి, అలాగే ఎండిన భూమిపైకి విపత్తును తెస్తారు.
DEU 29:20 యెహోవా వారిని క్షమించడానికి ఎన్నటికీ ఇష్టపడరు; ఆయన కోపం, రోషం వారిపై భగ్గుమంటాయి. ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపాలన్నీ వారి పైకి వస్తాయి, యెహోవా ఆకాశం క్రిందనుండి వారి పేర్లను తుడిచివేస్తారు.
DEU 29:21 ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఒడంబడిక యొక్క అన్ని శాపాల ప్రకారం, కీడు కలుగజేయడానికి యెహోవా వారిని ఇశ్రాయేలు యొక్క అన్ని గోత్రాల నుండి వేరు చేస్తారు.
DEU 29:22 తర్వాతి తరాలలో మిమ్మల్ని అనుసరించే మీ పిల్లలు, సుదూర దేశాల నుండి వచ్చిన విదేశీయులు, దేశంపై పడిన ఆపదలను, వ్యాధులను వేటితోనైతే యెహోవా దాన్ని బాధించారో చూస్తారు.
DEU 29:23 దేశమంతా ఉప్పు, గంధకం చేత తగలబడుతున్న వ్యర్థంలా ఉంటుంది అనగా ఏదీ నాటబడదు, ఏదీ మొలకెత్తదు, దానిపై ఏ కూరగాయలు పెరగవు. ఈ నాశనం యెహోవా తీవ్ర కోపంతో పడగొట్టిన సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయిము పట్టణాల నాశనంలా ఉంటుంది.
DEU 29:24 దేశాలన్నీ, “ఈ దేశానికి యెహోవా ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఈ భయంకరమైన, మండుతున్న కోపం?” అని అడుగుతాయి.
DEU 29:25 దానికి సమాధానం ఇలా ఉంటుంది: “ఈ ప్రజలు తమ పూర్వికుల దేవుడైన యెహోవా ఒడంబడికను, ఆయన వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు ఆయన వారితో చేసుకున్న ఒడంబడికను విడిచిపెట్టారు.
DEU 29:26 వారు వెళ్లి ఇతర దేవుళ్ళను సేవించారు, వారికి నమస్కరించారు, వారు వారికి తెలియని దేవుళ్ళు, ఆయన వారికి ఇవ్వని దేవుళ్ళు.
DEU 29:27 అందువల్ల ఆ దేశంపై యెహోవా కోపం భగ్గుమంది, అందుకే గ్రంథంలో వ్రాయబడి ఉన్న అన్ని శాపాలను ఆయన వారి పైకి తీసుకువచ్చారు.
DEU 29:28 యెహోవా భీకరమైన కోపంలో, గొప్ప క్రోధంలో వారి దేశంలో నుండి వారిని పెకిలించి, ఇప్పుడున్నట్లుగా, వారిని వేరే దేశంలోకి నెట్టివేశారు.”
DEU 29:29 రహస్య విషయాలు మన దేవుడైన యెహోవాకు చెందినవి, కానీ వెల్లడించబడిన విషయాలు మనకు మన పిల్లలకు ఎప్పటికీ ఉంటాయి, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ మనం పాటించాలి.
DEU 30:1 నేను మీ ముందుంచిన ఈ దీవెనలు, శాపాలన్నీ మీ మీదికి వచ్చి, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లో మీరు వాటిని హృదయంలో భద్రం చేసుకుని,
DEU 30:2 మీరు మీ పిల్లలు మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగివచ్చి, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ప్రతీదాని ప్రకారం మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణ ఆత్మతో ఆయనకు లోబడితే,
DEU 30:3 మీ దేవుడైన యెహోవా మీ భాగ్యాలను పునరుద్ధరిస్తారు, మీపై కనికరం చూపించి ఆయన మిమ్మల్ని చెదరగొట్టిన అన్ని దేశాలన్నిటి నుండి మిమ్మల్ని మళ్ళీ సమకూరుస్తారు.
DEU 30:4 మీరు ఆకాశం క్రింద అత్యంత సుదూర దేశానికి చెదరిపోయినప్పటికి, అక్కడినుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి తిరిగి తీసుకువస్తారు.
DEU 30:5 మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మీ పూర్వికులకు చెందిన దేశానికి తీసుకువస్తారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. మీ పూర్వికులకంటే ఆయన మిమ్మల్ని వృద్ధిలోను, సంఖ్యలోను అధికం చేస్తారు.
DEU 30:6 మీ దేవుడైన యెహోవా మీ హృదయాలను, మీ సంతతివారి హృదయాలను సున్నతి చేస్తారు. అప్పుడు మీరు ఆయనను మీ పూర్ణ హృదయం, మీ పూర్ణ ఆత్మతో ప్రేమించి జీవిస్తారు.
DEU 30:7 మీ దేవుడైన యెహోవా ఈ శాపాలన్నింటినీ మిమ్మల్ని ద్వేషించే, మిమ్మల్ని హింసించే మీ శత్రువులపైకి తెస్తారు.
DEU 30:8 మీరు తిరిగివచ్చిన తర్వాత యెహోవాకు లోబడి ఆయన ఆజ్ఞలన్నిటిని పాటిస్తారు.
DEU 30:9 అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ చేతిపనులన్నిటిలోను మీ గర్భఫలాల్లో మీ పశువుల పిల్లల్లోను మీ భూమిలోని పంటల్లోను మిమ్మల్ని వర్ధిల్ల చేస్తారు. యెహోవా మీ పూర్వికుల విషయంలో సంతోషించి మిమ్మల్ని అభివృద్ధి చేస్తారు.
DEU 30:10 అయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులై ఉండి, ఈ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను శాసనాలను పాటించి మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో యెహోవా వైపు తిరగాలి.
DEU 30:11 నేను ఈ రోజున మీకిస్తున్న ఆజ్ఞ అంత కష్టమైందేమీ కాదు, ఇది మీరు అందుకోలేనిదీ కాదు.
DEU 30:12 మీరు, “దానిని పొందడానికి పరలోకంలోకి ఎవరు ఎక్కి వెళ్లి, మేము దానిని పాటించేలా మాకు ఎవరు ప్రకటిస్తారు?” అని అడగడానికి ఇది పరలోకంలో లేదు.
DEU 30:13 లేదా, “సముద్రాన్ని దాటి దాన్ని తెచ్చి, మేము దానిని పాటించేలా మాకు ఎవరు ప్రకటిస్తారు?” అని మీరు అడగడానికి అది సముద్రం అవతల లేదు.
DEU 30:14 మీరు దానిని పాటించేలా ఆ వాక్యం మీకు చాలా దగ్గరగా ఉంది; అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.
DEU 30:15 చూడండి, నేను ఈ రోజు జీవాన్ని వృద్ధిని, మరణాన్ని నాశనాన్ని మీ ముందు ఉంచాను.
DEU 30:16 మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని, ఆయన మార్గంలో నడుచుకోవాలని, ఆయన ఆజ్ఞలు, శాసనాలు, చట్టాలను పాటించాలని నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపిస్తున్నాను; అప్పుడు మీరు జీవిస్తారు, వృద్ధిచెందుతారు, మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశించే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
DEU 30:17 కానీ ఒకవేళ మీ హృదయం మారి, మీరు విధేయత చూపకుండ ఇతర దేవుళ్ళకు నమస్కరించి వారిని సేవించడానికి ఆకర్షించబడితే,
DEU 30:18 మీరు ఖచ్చితంగా నాశనం చేయబడతారని నేను ఈ రోజు మీకు ప్రకటిస్తున్నాను. మీరు ప్రవేశించి, స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటుతున్న దేశంలో మీరు ఎక్కువకాలం జీవించలేరు.
DEU 30:19 ఈ రోజు నేను మీ ముందు జీవాన్ని మరణాన్ని, దీవెనలు శాపాలను ఉంచి, ఆకాశాలను భూమిని మీకు మీద సాక్షులుగా పిలుస్తాను. ఇప్పుడు జీవాన్ని ఎంచుకోండి, అప్పుడు మీరు, మీ పిల్లలు బ్రతకవచ్చు.
DEU 30:20 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించేలా, ఆయన స్వరాన్ని విని ఆయనను గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే యెహోవాయే మీ జీవం; మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో ఆయన మీకు దీర్ఘాయుష్షు ఇస్తారు.
DEU 31:1 మోషే బయటకు వెళ్లి ఇశ్రాయేలీయులతో ఈ మాటలు చెప్పాడు:
DEU 31:2 “నాకు ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాలు, నేను ఇకపై మిమ్మల్ని నడిపించలేను. ‘నీవు యొర్దాను దాటవు’ అని యెహోవా నాకు చెప్పారు.
DEU 31:3 మీ దేవుడైన యెహోవా స్వయంగా మీకు ముందుగా దాటి వెళ్లి మీ ముందు ఉండకుండ ఈ దేశాలను నాశనం చేస్తారు. మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవా చెప్పినట్టుగా, యెహోషువ కూడా మీకు ముందుగా దాటివెళ్తాడు.
DEU 31:4 అమోరీయుల రాజులైన సీహోను, ఓగులను వారి దేశంతో పాటు నాశనం చేసినట్టుగా, యెహోవా వారికి చేస్తారు.
DEU 31:5 యెహోవా వారిని మీకు అప్పగిస్తారు, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు వారికి చేయాలి.
DEU 31:6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. వారికి మీరు భయపడవద్దు దిగులుపడవద్దు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో వెళ్తారు; ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలేయరు, మీ చేయి విడువరు.”
DEU 31:7 తర్వాత మోషే యెహోషువను పిలిపించి, ఇశ్రాయేలీయులందరి సమక్షంలో అతనితో ఇలా అన్నాడు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, ఈ ప్రజలకు ఇస్తానని వారి పూర్వికులకు యెహోవా ప్రమాణం చేసిన దేశంలోకి నీవు ఈ ప్రజలతో పాటు వెళ్లి దానిని వారికి వారసత్వంగా ఇవ్వాలి.
DEU 31:8 యెహోవాయే స్వయంగా మీ ముందు వెళ్తారు మీతో ఉంటారు; ఆయన నిన్ను ఎన్నడూ వదిలేయరు, నిన్ను చేయి విడువరు. భయపడవద్దు; నిరుత్సాహపడవద్దు.”
DEU 31:9 కాబట్టి మోషే ఈ ధర్మశాస్త్రాన్ని వ్రాసి, లేవీయులైన యాజకులకు అంటే యెహోవా నిబంధన మందసాన్ని మోసేవారికి, ఇశ్రాయేలీయుల పెద్దలందరికి ఇచ్చాడు.
DEU 31:10 తర్వాత మోషే, “ప్రతి ఏడు సంవత్సరాల చివరిలో, అప్పులు రద్దు చేసే సంవత్సరంలో, గుడారాల పండుగ సమయంలో,
DEU 31:11 ఇశ్రాయేలీయులందరు మీ దేవుడైన యెహోవా ఎదుట ఆయన ఎంచుకున్న స్థలంలో కనబడినప్పుడు, మీరు వారందరికి ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాలి.
DEU 31:12 మీ పట్టణాల్లో నివసిస్తున్న పురుషులు, స్త్రీలు, పిల్లలు, విదేశీయులను సమకూర్చండి. అప్పుడు వారు విని మీ దేవుడైన యెహోవాకు భయపడటం, ఈ ధర్మశాస్త్రంలోని అన్ని మాటలను జాగ్రత్తగా పాటించడం నేర్చుకుంటారు.
DEU 31:13 ఈ ధర్మశాస్త్రం తెలియని వారి పిల్లలు తప్పక విని, మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటి వెళ్లబోయే దేశంలో మీరు నివసించినంత కాలం మీ దేవుడైన యెహోవాకు భయపడటం నేర్చుకోవాలి.”
DEU 31:14 ఆ తర్వాత యెహోవా మోషేతో, “నీవు చనిపోయే రోజు దగ్గరలో ఉంది. యెహోషువను పిలిచి, సమావేశ గుడారం దగ్గరకు రండి, అక్కడ నేను అతన్ని నియమిస్తాను” అని చెప్పారు. కాబట్టి మోషే, యెహోషువ వచ్చి సమావేశ గుడారం దగ్గర ఉన్నారు.
DEU 31:15 అప్పుడు యెహోవా గుడారం దగ్గర మేఘస్తంభంలో ప్రత్యక్షమయ్యారు, మేఘం గుడార ద్వారం మీద నిలిచింది.
DEU 31:16 యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు నీ పూర్వికులతో విశ్రాంతి తీసుకోబోతున్నావు, ఈ ప్రజలు త్వరలో తాము ప్రవేశించే దేశంలోని పరదేశి దేవతలకు వేశ్యగా మారతారు. వారు నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసుకున్న నిబంధనను ఉల్లంఘిస్తారు.
DEU 31:17 ఆ రోజున నేను వారిపై కోప్పడి వారి చేయి విడిచిపెడతాను; నేను వారి నుండి నా ముఖాన్ని దాచుకుంటాను, వారు నాశనమవుతారు. అనేక విపత్తులు, ఆపదలు వారి పైకి వస్తాయి, ఆ రోజు వారు, ‘ఈ విపత్తులు మనపైకి రావడానికి కారణం మన దేవుడు మనతో లేకపోవడం కాదా?’ అని అనుకుంటారు.
DEU 31:18 వారు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి చేసిన దుష్టత్వాన్ని బట్టి నేను ఆ రోజు ఖచ్చితంగా నా ముఖాన్ని దాచుకుంటాను.
DEU 31:19 “ఇప్పుడు ఈ పాటను వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించి వారితో పాడించండి, అది వారికి వ్యతిరేకంగా నాకు సాక్ష్యంగా ఉంటుంది.
DEU 31:20 నేను వారి పూర్వికులకు ప్రమాణం చేసిన ప్రకారం వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకువచ్చినప్పుడు, వారు తృప్తిగా తిని లావెక్కినప్పుడు, వారు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని సేవించి, నన్ను తిరస్కరిస్తూ, నా నిబంధనను ఉల్లంఘిస్తారు.
DEU 31:21 వారి మీదికి అనేక విపత్తులు, ఆపదలు వచ్చి పడతాయి. ఈ అనుభవాలకు సాక్ష్యంగా ఈ పాట పాడుకుంటారు. దీన్ని వారి సంతతివారు ఎన్నడూ మరచిపోరు. ప్రమాణం చేసిన వాగ్దాన దేశంలో నేను ఇంకా వారిని తీసుకురాకముందే, ఈ రోజే వారేం ఆలోచన చేస్తున్నారో నాకు తెలుసు.”
DEU 31:22 కాబట్టి మోషే ఆ రోజు ఈ పాటను వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించాడు.
DEU 31:23 యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈ ఆజ్ఞ ఇచ్చారు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీయులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన దేశంలోకి నీవు వారిని తీసుకువస్తావు, నేను నీతో ఉంటాను.”
DEU 31:24 మోషే ఈ ధర్మశాస్త్రం యొక్క మాటలన్నీ మొదటి నుండి చివరి వరకు ఒక గ్రంథంలో వ్రాయడం పూర్తి చేశాక,
DEU 31:25 యెహోవా నిబంధన మందసాన్ని మోసే లేవీయులకు మోషే ఇలా ఆజ్ఞాపించాడు:
DEU 31:26 “ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం ప్రక్కన ఉంచండి. అది మీమీద సాక్షిగా ఉంటుంది.
DEU 31:27 ఎందుకంటే మీ తిరుగుబాటుతనం, మొండితనం నాకు తెలుసు. నేను ఇంకా మీతో బ్రతికి ఉన్నప్పుడే మీరు యెహోవాపై తిరుగుబాటు చేస్తే, నేను చనిపోయిన తర్వాత మీరు ఇంకెంత ఎక్కువ తిరుగుబాటు చేస్తారు కదా!
DEU 31:28 గోత్ర పెద్దలందరినీ, మీ అధికారులందరినీ సమావేశపరచండి. ఆకాశాన్ని భూమిని వారి మీద సాక్షులుగా ఉంచి వారు వింటుండగా నేను మాట్లాడతాను.
DEU 31:29 ఎందుకంటే నేను చనిపోయాక మీరు పూర్తిగా అవినీతిపరులై నేను ఆజ్ఞాపించిన మార్గం నుండి మీరు తొలగిపోతారని నాకు తెలుసు. రాబోయే రోజుల్లో, మీరు యెహోవా దృష్టికి చెడు చేసి, మీ చేతులు చేసిన వాటి వల్ల ఆయనకు కోపం పుట్టిస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో విపత్తు మీ మీదికి వస్తుంది.”
DEU 31:30 ఇశ్రాయేలు సమాజమంతా వింటుండగా మోషే ఈ పాటలోని పదాలను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చదివాడు:
DEU 32:1 ఆకాశాల్లారా, ఆలకించండి, నేను మాట్లాడతాను; భూమీ, నా నోటి మాటలు విను.
DEU 32:2 నా ఉపదేశం వర్షంలా కురుస్తుంది నా మాటలు మంచు బిందువుల్లా దిగుతాయి, లేతగడ్డి మీద జల్లులా, లేత మొక్కల మీద సమృద్ధి వర్షంలా ఉంటుంది.
DEU 32:3 నేను యెహోవా నామాన్ని ప్రకటిస్తాను. మన దేవుని గొప్పతనాన్ని స్తుతించండి!
DEU 32:4 ఆయన మనకు ఆశ్రయదుర్గం, ఆయన పనులు పరిపూర్ణం, ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన తప్పుచేయని నమ్మదగిన దేవుడు, ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు.
DEU 32:5 ఆయన ప్రజలు అవినీతిపరులు, వారు ఆయన పిల్లలు కారు; వారి అవమానం పొందిన మూర్ఖులైన వక్ర తరం వారు.
DEU 32:6 అవివేకులైన తెలివితక్కువ ప్రజలారా, యెహోవాకు మీరు తిరిగి చెల్లించే విధానం ఇదేనా? మిమ్మల్ని చేసిన, మిమ్మల్ని రూపించిన, మీ తండ్రి, మీ సృష్టికర్త ఆయన కాడా?
DEU 32:7 పాత రోజులను జ్ఞాపకముంచుకోండి; గత తరాలను గురించి ఆలోచించండి. తండ్రిని అడగండి, ఆయనే మీకు చెప్తారు, మీ పెద్దలను అడగండి, వారే మీకు వివరిస్తారు.
DEU 32:8 మహోన్నతుడు జనాంగాలకు వారి వారి వారసత్వాలను ఇచ్చినప్పుడు, సర్వ మనుష్యజాతిని విభజించినప్పుడు, ఇశ్రాయేలు కుమారుల సంఖ్య ప్రకారం జనములకు ఆయన సరిహద్దులు ఏర్పరిచారు.
DEU 32:9 యెహోవా ప్రజలే ఆయన భాగం, యాకోబు ఆయనకు కేటాయించబడిన వారసత్వము.
DEU 32:10 ఆయన అతన్ని ఎడారి ప్రదేశంలో, శబ్దాలు వినబడే బంజరు భూమిలో కనుగొన్నారు. తన గూడును కదిలించి, తన పిల్లల పైగా అల్లాడుతూ ఉండే, వాటిని పైకి తీసుకెళ్లడానికి దాని రెక్కలు చాపి వాటిని పైకి మోసుకెళ్లే గ్రద్దలా, ఆయన అతన్ని చుట్టూ ఆవరించి సంరక్షిస్తూ, తన కనుపాపలా ఆయన అతన్ని కాపాడారు.
DEU 32:12 యెహోవా ఒక్కడే అతన్ని నడిపించారు; ఏ ఇతర దేవుడు అతనితో ఉండలేదు.
DEU 32:13 ఆయన అతన్ని ఎత్తైన స్థలాలపైకి ఎక్కించారు పొలాల పంటను అతనికి తినిపించారు. బండ నుండి తీసిన తేనెతో, రాళ్లమయమైన పర్వత శిఖరం నుండి తీసిన నూనెతో అతన్ని పోషించారు,
DEU 32:14 ఆవు పెరుగును, గొర్రెల, మేకల పాలను, గొర్రెపిల్లల క్రొవ్వును, మేకపోతులను, పశువుల మంద, గొర్రెల మంద నుండి పెరుగు, పాలతో క్రొవ్విన గొర్రెపిల్లలను, మేకలను, బాషాను శ్రేష్ఠమైన పొట్టేళ్లను నాణ్యమైన గోధుమలను మీకిచ్చారు. మీరు ద్రాక్షరసంతో చేసిన మద్యాన్ని త్రాగారు.
DEU 32:15 యెషూరూను క్రొవ్వుపట్టి కాలు జాడించాడు; తిండి ఎక్కువై, వారు బలిసి మొద్దులయ్యారు. వారు తమను చేసిన దేవున్ని విసర్జించి రక్షకుడైన తమ ఆశ్రయ దుర్గాన్ని తృణీకరించారు.
DEU 32:16 వారు ఇతర దేవుళ్ళ వల్ల ఆయనకు రోషం పుట్టించారు, వారి అసహ్యకరమైన విగ్రహాలతో ఆయనకు కోపం కలిగించారు.
DEU 32:17 దేవుడు కాని దయ్యాలకు వారు బలులర్పించారు తమకు తెలియని దేవుళ్ళకు, క్రొత్తగా వచ్చిన దేవుళ్ళకు, మీ పూర్వికులు లెక్కచెయ్యని దేవుళ్ళకు మ్రొక్కారు.
DEU 32:18 మీకు తండ్రిగా ఉన్న ఆశ్రయ దుర్గాన్ని మీరు విడిచిపెట్టారు; మీకు జన్మనిచ్చిన దేవుని మీరు మరచిపోయారు.
DEU 32:19 యెహోవా ఇది చూసి వారిని తృణీకరించారు, ఎందుకంటే ఆయన తన కుమారులు కుమార్తెల వల్ల కోప్పడ్డారు.
DEU 32:20 “నేను వారి నుండి నా ముఖాన్ని దాచుకుంటాను, వారి అంతం ఎలా ఉంటుందో చూస్తాను; ఎందుకంటే వారొక దుర్బుద్ధి కలిగిన తరం, నమ్మకద్రోహులైన పిల్లలు.
DEU 32:21 దేవుడు కాని దానితో వారు నాకు రోషం పుట్టించారు, అయోగ్యమైన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు. జనులు కాని వారిని చూసి వారు అసూయపడేలా చేస్తాను; తెలివిలేని జనులను చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను.
DEU 32:22 ఎందుకంటే నా ఉగ్రత అగ్నిలా రగులుకుంటుంది, పాతాళం వరకు అది మండుతుంది. అది భూమిని దాని పంటను మ్రింగివేస్తుంది పర్వతాల పునాదులకు నిప్పు పెడుతుంది.
DEU 32:23 “నేను ఆపదలను వారిపై కుప్పగా చేస్తాను, నా బాణాలను వారి మీదికి వేస్తాను.
DEU 32:24 నేను వారి మీదికి తీవ్రమైన కరువును పంపుతాను, తీవ్ర జ్వరం, మరణకరమైన తెగులు వారిని వేధిస్తాయి, నేను అడవి మృగాల కోరలను, దుమ్ములో ప్రాకే ప్రాణుల విషాన్ని నేను వారి మీదికి పంపుతాను.
DEU 32:25 బయట ఖడ్గం వారిని సంతానం లేనివారినిగా చేస్తుంది; వారి ఇళ్ళలో భయం పరిపాలిస్తుంది, యువతీ యువకులు, నశిస్తారు శిశువులు, తల నెరసినవారు నశిస్తారు.
DEU 32:26 నేను వారిని చెదరగొడతాను, మానవ జ్ఞాపకంలో నుండి వారి పేరును తుడిచివేస్తాను.
DEU 32:27 కాని వారి శత్రువులు తప్పుగా అర్థం చేసుకుని, ‘ఇదంతా యెహోవా చేసినది కాదు, మా బలంతోనే గెలిచాం’ అని అంటారేమోనని శత్రువుల దూషణకు భయపడి అలా చేయలేదు.”
DEU 32:28 వారు ఆలోచనలేని జనులు, వారిలో వివేచన లేదు.
DEU 32:29 వారు తెలివైన వారైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు, వారి అంతం ఏమిటో వివేచిస్తారు!
DEU 32:30 తమ ఆశ్రయదుర్గం వారిని అప్పగిస్తేనే తప్ప, యెహోవా వారిని వదిలివేస్తేనే తప్ప, ఒక్కడు వేయిమందిని తరుమగలడా? ఇద్దరు పదివేలమందిని పారిపోయేలా చేయగలరా?
DEU 32:31 వారి బండ మన ఆశ్రయదుర్గం వంటిది కాదు, మన శత్రువులు కూడా ఒప్పుకుంటారు.
DEU 32:32 వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్షచెట్టు నుండి వచ్చింది అది గొమొర్రా పొలాల్లో నుండి వచ్చింది. వాటి ద్రాక్షపండ్లు విషంతో నిండి ఉన్నాయి, వాటి గెలలు చేదుగా ఉన్నాయి.
DEU 32:33 వాటి ద్రాక్షరసం సర్ప విషం, నాగుపాముల మరణకరమైన విషము.
DEU 32:34 “వారి క్రియలు ఎలాంటివో ఆ లెక్క అంతా నా దగ్గరే ఉంది, దాన్ని నిల్వచేసే నా ఖజానాలో భద్రపరచలేదా?
DEU 32:35 పగ తీర్చుకోవడం నా పని; నేను తిరిగి చెల్లిస్తాను. సరియైన సమయంలో వారి పాదం జారుతుంది; వారి ఆపద్దినం దగ్గరపడింది వారి విధి వేగంగా వారి మీదికి వస్తుంది.”
DEU 32:36 వారి బలం పోయిందని బానిసలు గాని స్వతంత్రులు గాని ఎవరు మిగలలేదని చూసి, యెహోవా తన ప్రజలకు తీర్పు తీరుస్తారు తన సేవకుల మీద జాలి పడతారు.
DEU 32:37 ఆయన ఇలా అంటున్నారు: “వారి దేవుళ్ళు ఎక్కడ, వారు ఆశ్రయంగా ఏర్పరచుకున్న బండ ఎక్కడ,
DEU 32:38 వారి బలుల క్రొవ్వు తిని వారి పానార్పణల ద్రాక్షరసం త్రాగిన వారి దేవుళ్ళు ఎక్కడ? మీకు సాయం చేయడానికి వారు లేచెదరు గాక! వారు మీకు ఆశ్రయమిచ్చెదరు గాక!
DEU 32:39 “చూడండి, నేనే ఏకైక దేవున్ని! నేను తప్ప మరో దేవుడు లేడు చంపేవాడను నేనే బ్రతికించేవాడను నేనే. గాయం చేసేది నేనే, బాగు చేసేది నేనే, నా చేతిలో నుండి ఎవరూ విడిపించలేరు.
DEU 32:40 నేను ఆకాశం వైపు నా చేయి ఎత్తి రూఢిగా ప్రమాణం చేస్తున్నాను: నా శాశ్వత జీవం తోడని చెప్తున్న,
DEU 32:41 నేను నా మెరిసే ఖడ్గానికి పదును పెట్టి, నా చేయి న్యాయాన్ని పట్టుకున్నప్పుడు, నేను నా ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటాను నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను.
DEU 32:42 నా ఖడ్గం మాంసాన్ని తింటుండగా, నేను నా బాణాలను రక్తంతో మత్తెక్కేలా చేస్తాను: చంపబడినవారి రక్తం, బందీల రక్తంతో, శత్రు నాయకుల తలలను అవి తింటాయి.”
DEU 32:43 జనులారా, ఆయన ప్రజలతో కూడా సంతోషించండి, ఎందుకంటే ఆయన తన సేవకుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటారు; ఆయన తన శత్రువుల మీద పగతీర్చుకుంటారు తన దేశం కోసం తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తారు.
DEU 32:44 మోషే నూను కుమారుడైన యెహోషువతో పాటు వచ్చి ప్రజలు వింటుండగా ఈ పాటలోని అన్ని మాటలను వినిపించాడు.
DEU 32:45 మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలీయులందరికి వినిపించడం ముగించి,
DEU 32:46 వారితో, “ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటిని జాగ్రత్తగా పాటించమని మీ పిల్లలకు ఆజ్ఞాపించేలా, ఈ రోజు నేను మీకు హెచ్చరికగా ప్రకటించిన మాటలన్నిటిని జ్ఞాపకముంచుకోండి.
DEU 32:47 అవి కేవలం మామూలు మాటలు కావు, అవి మీకు జీవము. మీరు యొర్దాను దాటి వెళ్లి స్వాధీనపరుచుకోబోయే దేశంలో దీర్ఘకాలం జీవిస్తారు” అన్నాడు.
DEU 32:48 అదే రోజు యెహోవా మోషేతో మాట్లాడుతూ,
DEU 32:49 “యెరికోకు ఎదురుగా మోయాబులోని నెబో పర్వతానికి అబారీము పర్వతశ్రేణిలోకి వెళ్లి, నేను ఇశ్రాయేలీయులకు వారి సొంత స్వాస్థ్యంగా ఇస్తున్న కనాను దేశాన్ని చూడు.
DEU 32:50 నీ సహోదరుడు అహరోను హోరు కొండపై చనిపోయి తన ప్రజల దగ్గరకు చేరుకున్నట్టు, నీవు ఎక్కిన కొండమీద నీవు చనిపోయి నీ ప్రజల దగ్గరకు చేరుతావు.
DEU 32:51 అసలు ఇలా జరిగిందంటే, మీరు సీను ఎడారిలోని మెరీబా కాదేషు నీళ్ల దగ్గర ఇశ్రాయేలీయుల ముందు మీరిద్దరూ నా పట్ల నమ్మకద్రోహం చేశారు, ఇశ్రాయేలీయుల ఎదుట మీరు నా పరిశుద్ధతను గౌరవించకపోవడము.
DEU 32:52 కాబట్టి, నీవు దూరం నుండి మాత్రమే దేశాన్ని చూస్తావు; నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న దేశంలో నీవు ప్రవేశించవు” అని అన్నారు.
DEU 33:1 దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలపై పలికిన ఆశీర్వాద వచనాలు.
DEU 33:2 అతడు ఇలా అన్నాడు: “యెహోవా సీనాయి పర్వతం నుండి వచ్చారు శేయీరు నుండి వారి మీద ఉదయించారు; పారాను పర్వతం నుండి ప్రకాశించారు. వేవేల పరిశుద్ధులతో ఆయన వచ్చారు, దక్షిణం నుండి, పర్వత వాలు నుండి వచ్చారు.
DEU 33:3 నిజంగా ఆయన తన జనులను ప్రేమిస్తున్నారు; పరిశుద్ధులందరు మీ చేతిలో ఉన్నారు. వారు మీ పాదాల దగ్గర వంగి, మీ నుండి ఉపదేశాన్ని పొందుకుంటారు,
DEU 33:4 మోషే మనకు ఇచ్చిన ధర్మశాస్త్రం యాకోబు సమాజానికి స్వాస్థ్యము.
DEU 33:5 ప్రజల నాయకులు, ఇశ్రాయేలు గోత్రాలతో పాటు సమావేశమైనప్పుడు ఆయన యెషూరూనుకు రాజుగా ఉన్నాడు.
DEU 33:6 “రూబేను చనిపోకుండ బ్రతికి ఉండును గాక, అతని ప్రజల సంఖ్య తగ్గకుండును గాక.”
DEU 33:7 యూదా గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, యూదా మొరను వినండి; అతని ప్రజల దగ్గరకు అతన్ని చేర్చండి. అతడు తన చేతులతో తన కోసం పోరాడేలా, అతని శత్రువులకు వ్యతిరేకంగా అతనికి సహాయంగా ఉండండి!”
DEU 33:8 లేవీ గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, మీ తుమ్మీము, ఊరీము మీ నమ్మకమైన సేవకునికి చెందినవి. మస్సాలో మీరతనిని పరీక్షించారు; మెరీబా నీళ్ల దగ్గర అతనితో మీరు వాదించారు.
DEU 33:9 అతడు తన తండ్రి తల్లి గురించి చెబుతూ, ‘నేను వారిని చూడలేదు’ అతడు తన సోదరులను గుర్తించలేదు తన సొంత పిల్లలను అంగీకరించలేదు. కాని అతడు నీ మాట గమనించాడు నీ నిబంధనను కాపాడాడు.
DEU 33:10 అతడు యాకోబుకు నీ కట్టడలను ఇశ్రాయేలీయులకు నీ ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు, అతడు మీ ఎదుట ధూపం వేస్తాడు, మీ బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తాడు.
DEU 33:11 యెహోవా, అతని సేవను దీవించండి, అతని చేతి పనులను బట్టి సంతోషించండి. అతనికి వ్యతిరేకంగా లేచినవారిని కొట్టండి, అతని శత్రువులను తిరిగి లేవనంతగా కొట్టండి.”
DEU 33:12 బెన్యామీను గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవాకు ప్రియమైనవాడు ఆయనలో క్షేమంగా ఉండును గాక, ఎందుకంటే రోజంతా ఆయన రక్షణగా ఉంటారు, యెహోవా ప్రేమించేవాడు ఆయన భుజాల మధ్య ఉంటాడు.”
DEU 33:13 యోసేపు గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా అతని భూమిని ఆకాశం నుండి కురిసే శ్రేష్ఠమైన మంచుతో క్రింద ఉన్న లోతైన జలాలతో దీవించును గాక;
DEU 33:14 సూర్యుని వలన కలిగే ఉత్తమమైన ఫలాలతో చంద్రుడు ఫలింపచేసే శ్రేష్ఠమైన ఫలాలతో;
DEU 33:15 పురాతన పర్వతాల శ్రేష్ఠమైన వాటితో శాశ్వత కొండల శ్రేష్ఠమైన పంటతో;
DEU 33:16 భూమి ఇచ్చే ప్రశస్తమైన పదార్థాలతో వాటి సమృద్ధితో మండుతున్న పొదలో నివసించే ఆయన దయతో దీవించును గాక. ఇవన్నీ యోసేపు తలపై ఉండును గాక, అతని సోదరుల మధ్యలో యువరాజు నుదుటి మీద ఉండును గాక.
DEU 33:17 ప్రభావంలో అతడు మొదట పుట్టిన కోడెలాంటి వాడు; అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. వాటితో అతడు జనులను, భూమి అంచులో ఉన్నవారిని కూడా కుమ్ముతాడు. ఎఫ్రాయిముకు చెందిన పదివేలమంది అలాంటివారు, మనష్షేకు చెందిన వేలమంది అలాంటివారు.”
DEU 33:18 జెబూలూను గురించి అతడు ఇలా అన్నాడు: “జెబూలూనూ, నీవు బయటకు వెళ్లునప్పుడు, సంతోషించు, ఇశ్శాఖారూ, నీవు నీ గుడారాల్లో సంతోషించు.
DEU 33:19 వారు జనులను పర్వతం దగ్గరకు పిలుస్తారు అక్కడ నీతి బలులు అర్పిస్తారు; వారు సముద్రాల సమృద్ధి మీద ఇసుకలో దాగి ఉన్న నిధుల మీద విందు చేస్తారు.”
DEU 33:20 గాదు గురించి అతడు ఇలా అన్నాడు: “గాదు దేశాన్ని విశాలం చేసినవారు ధన్యులు! గాదు అక్కడ సింహంలా నివసిస్తాడు, చేతిని గాని నడినెత్తిని చీల్చివేస్తాడు.
DEU 33:21 అతడు తన కోసం శ్రేష్ఠమైన భాగాన్ని ఎంచుకున్నాడు; నాయకుని భాగం అతని కోసం ఉంచబడుతుంది. ప్రజల పెద్దలు సమావేశమైనప్పుడు యెహోవా యొక్క నీతియుక్తమైన చిత్తాన్ని, ఇశ్రాయేలీయు గురించి ఆయన తీర్పులను, అతడు అమలుచేస్తాడు.”
DEU 33:22 దాను గురించి అతడు ఇలా చెప్పాడు: “దాను గోత్రం సింహం పిల్లలాంటిది, బాషాను నుండి దూకుతుంది.”
DEU 33:23 నఫ్తాలి గురించి అతడు ఇలా అన్నాడు: “నఫ్తాలి యెహోవా దయతో తృప్తి చెంది ఆయన దీవెనలతో నింపబడ్డాడు; దక్షిణం నుండి సముద్రం వరకు అతడు స్వాధీనం చేసుకుంటాడు.”
DEU 33:24 ఆషేరు గురించి అతడు ఇలా అన్నాడు: “కుమారులలో ఆషేరు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు; అతడు తన సోదరుల దయను పొందును గాక. అతడు తన పాదాలను నూనెలో ముంచును గాక.
DEU 33:25 నీ ద్వారపు గడియలు ఇనుపవి, ఇత్తడివి నీ బలం నీ రోజులకు సమానంగా ఉంటుంది.
DEU 33:26 “యెషూరూను దేవుని పోలినవారు ఎవరు లేరు, ఆకాశవాహనుడై వచ్చి నీకు సహాయం చేయడానికి ఆయన ఆకాశం గుండా వస్తారు, తన తేజస్సుతో మేఘాలపై వస్తారు.
DEU 33:27 శాశ్వతమైన దేవుడు నీకు ఆశ్రయం, నిత్యమైన హస్తాలు నీ క్రింద ఉన్నాయి. ‘వారిని నాశనం చెయ్యండి!’ అంటూ ఆయన నీ శత్రువులను నీ ఎదుట నుండి తరిమివేస్తారు.
DEU 33:28 కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా నివసిస్తారు; ధాన్యం క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశంలో యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది, అక్కడ ఆకాశం మంచు కురిపిస్తుంది.
DEU 33:29 ఇశ్రాయేలూ, మీరు ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారు ఎవరు? ఆయన మీకు డాలు, సహాయకుడు మీ మహిమగల ఖడ్గము. మీ శత్రువులు మీ ఎదుట భయపడతారు; మీరు వారి వీపుపై త్రొక్కుతారు.”
DEU 34:1 తర్వాత మోషే మోయాబు సమతల మైదానాల నుండి వెళ్లి యెరికో ఎదురుగా ఉన్న పిస్గా పర్వత శిఖరం వరకు వెళ్లి నెబో పర్వతమెక్కాడు. అక్కడ యెహోవా అతనికి గిలాదు నుండి దాను వరకు ఉన్న దేశాన్నంతా చూపించారు,
DEU 34:2 నఫ్తాలి ప్రాంతమంతటిని, ఎఫ్రాయిం మనష్షేల ప్రాంతాలను, పశ్చిమదిక్కున ఉన్న మధ్యధరా సముద్రం వరకు ఉన్న యూదా ప్రాంతాన్ని,
DEU 34:3 దక్షిణ ప్రాంతాన్ని, ఖర్జూర చెట్ల పట్టణమైన యెరికో లోయ నుండి సోయరు వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని అతనికి చూపించారు.
DEU 34:4 అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నారు, “నేను మీ సంతానానికి ఇస్తానని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన దేశం ఇదే. కళ్ళారా నిన్ను దాన్ని చూడనిస్తున్నాను కాని, నది దాటి నీవు అక్కడికి వెళ్లవు.”
DEU 34:5 యెహోవా చెప్పిన ప్రకారంగా యెహోవా సేవకుడైన మోషే మోయాబు దేశంలోనే చనిపోయాడు.
DEU 34:6 బేత్-పెయోరు ఎదుట మోయాబులో ఉన్న ఒక లోయలో ఆయన అతన్ని పాతిపెట్టారు. అతని సమాధి ఎక్కడ ఉందో నేటివరకు ఎవరికీ తెలియదు.
DEU 34:7 మోషే చనిపోయినప్పుడు అతని వయస్సు నూట ఇరవై సంవత్సరాలు, అతని కళ్లు మసక బారలేదు అతని బలం తగ్గలేదు.
DEU 34:8 సంతాప దినాల సమయం పూర్తి అయ్యేవరకు ఇశ్రాయేలీయులు మోయాబు సమతల మైదానాల్లో మోషే కోసం ముప్పై రోజులు దుఃఖించారు.
DEU 34:9 అంతకుముందే మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచాడు కాబట్టి అతడు జ్ఞానాత్మతో నింపబడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.
DEU 34:10 అప్పటినుండి ఇశ్రాయేలులో యెహోవా ముఖాముఖిగా మాట్లాడిన మోషే వంటి ప్రవక్త,
DEU 34:11 ఈజిప్టులో ఫరోకు, అతని అధికారులందరికి, అతని దేశమంతటికి సూచనలను, అద్భుతాలను చేయడానికి యెహోవా పంపిన అలాంటి ప్రవక్త ఇశ్రాయేలులో లేడు.
DEU 34:12 ఎందుకంటే ఇశ్రాయేలీయులందరి దృష్టిలో మోషే చేసిన భయం పుట్టించే శక్తివంతమైన కార్యాలు ఎవ్వరూ చేయలేదు.
JOS 1:1 యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత యెహోవా నూను కుమారుడు, మోషే సహాయకుడైన యెహోషువతో ఇలా అన్నారు:
JOS 1:2 “నా సేవకుడైన మోషే చనిపోయాడు. కాబట్టి నీవు, నీతో పాటు ఈ ప్రజలందరూ బయలుదేరి యొర్దాను నదిని దాటి, నేను ఇశ్రాయేలీయులకు ఇవ్వబోతున్న దేశానికి వెళ్లడానికి సిద్ధపడండి.
JOS 1:3 నేను మోషేకు వాగ్దానం చేసినట్లు, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకిస్తాను.
JOS 1:4 మీ భూభాగం ఎడారి నుండి లెబానోను వరకు యూఫ్రటీసు అనే గొప్ప నది నుండి హిత్తీయుల దేశం అంతా, పశ్చిమాన మధ్యధరా సముద్రం వరకు విస్తరిస్తుంది.
JOS 1:5 నీ జీవితకాలమంతా ఎవ్వరూ నీకు వ్యతిరేకంగా నీ ముందు నిలబడలేరు, నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉంటాను; నేను నిన్ను విడువను ఎడబాయను.
JOS 1:6 దృఢంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను వారసత్వంగా ఇస్తానని వారి పూర్వికులతో ప్రమాణం చేసిన దేశానికి నీవు వారిని నడిపిస్తావు.
JOS 1:7 “నీవు నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రమంతటిని జాగ్రత్తగా పాటించాలి, నీవు వెళ్లే ప్రతి మార్గంలో నీవు విజయం పొందేలా దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగవద్దు.
JOS 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఎప్పుడు నీ పెదాల మీద ఉండాలి; పగలు రాత్రి దానిని ధ్యానించాలి, తద్వార నీవు దానిలో వ్రాయబడి ఉన్న ప్రతిదీ శ్రద్ధగా చేయగలవు. అప్పుడు నీవు విజయవంతంగా వర్ధిల్లుతావు.
JOS 1:9 బలంగా ధైర్యంగా ఉండమని నేను నీకు ఆజ్ఞాపించలేదా? భయపడవద్దు; నిరుత్సాహపడవద్దు; ఎందుకంటే నీవు ఎక్కడికి వెళ్లినా నీ దేవుడైన యెహోవా నీతో ఉంటారు.”
JOS 1:10 కాబట్టి యెహోషువ ప్రజల అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు:
JOS 1:11 “మీరు శిబిరం గుండా వెళ్తూ ప్రజలతో, ‘మీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా మీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకోడానికి మీరు మూడు రోజుల్లో యొర్దాను నదిని దాటాలి కాబట్టి భోజన ఏర్పాట్లు చేసుకోండి’ అని చెప్పండి.”
JOS 1:12 అయితే రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రానికి, యెహోషువ ఇలా చెప్పాడు,
JOS 1:13 “యెహోవా సేవకుడైన మోషే, ‘మీ దేవుడైన యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చి మీకు విశ్రాంతిని ఇస్తాడు’ అని మీకిచ్చిన ఆజ్ఞను జ్ఞాపకముంచుకోండి.
JOS 1:14 మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు యొర్దానుకు తూర్పున మోషే మీకిచ్చిన ప్రదేశంలో ఉండవచ్చు, అయితే యుద్ధానికి సిద్ధంగా ఉన్న మీ పోరాట పురుషులంతా, మీ తోటి ఇశ్రాయేలీయులకంటె ముందుగా దాటాలి.
JOS 1:15 యెహోవా మీకు సహాయం చేసినట్టు, ఆయన వారికి విశ్రాంతినిచ్చే వరకు, వారు కూడా మీ దేవుడైన యెహోవా వారికి ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకునే వరకు, మీరు కూడా వారికి సహాయం చేయాలి. ఆ తర్వాత, మీరు తిరిగివెళ్లి, యెహోవా సేవకుడైన మోషే యొర్దానుకు తూర్పున సూర్యోదయం వైపున మీకిచ్చిన మీ స్వాస్థ్యాన్ని మీరు ఆక్రమించుకోవచ్చు.”
JOS 1:16 అప్పుడు వారు యెహోషువకు ఇలా జవాబిచ్చారు, “నీవు మాకాజ్ఞాపించినదంతా మేము చేస్తాము. మమ్మల్ని ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తాము.
JOS 1:17 అన్ని విషయాల్లో మోషే మాటకు ఎలా పూర్తిగా లోబడినామో మీ మాటకు అలాగే లోబడతాము. నీ దేవుడైన యెహోవా మోషేతో ఉన్నట్లే నీతో కూడా ఉండును గాక.
JOS 1:18 నీ మాటకు తిరుగుబాటు చేసేవారు, నీ ఆజ్ఞలను లోబడనివారు చంపబడతారు. నీవు మాత్రం దృఢంగా ధైర్యంగా ఉండాలి!”
JOS 2:1 అప్పుడు నూను కుమారుడైన యెహోషువ షిత్తీము నుండి ఇద్దరు వేగులవారు రహస్యంగా పంపుతూ, “వెళ్లి ఆ దేశాన్ని, ముఖ్యంగా యెరికోను వేగుచూసి రండి” అని వారితో చెప్పాడు. వారు రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు.
JOS 2:2 ఎవరో యెరికో రాజుతో, “చూడండి, కొంతమంది ఇశ్రాయేలీయులు రాత్రి ఈ దేశాన్ని వేగుచూడటానికి వచ్చారు” అని చెప్పారు.
JOS 2:3 కాబట్టి యెరికో రాజు: “నీ దగ్గరకు వచ్చి నీ ఇంట్లో ఉన్న మనుష్యులను ఇక్కడకు తీసుకురా, ఎందుకంటే వారు ఈ దేశాన్ని వేగుచూడటానికి వచ్చారు” అని ఆజ్ఞ జారీచేస్తూ రాహాబుకు సందేశం పంపాడు.
JOS 2:4 అయితే ఆమె ఆ ఇద్దరిని తీసుకెళ్లి దాచిపెట్టి, వారి కోసం వచ్చిన వారితో, “అవును, నా దగ్గరకు మనుష్యులు వచ్చారు, కానీ వారెక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు.
JOS 2:5 చీకటి పడుతుండగా పట్టణ ద్వారం మూసివేసే సమయంలో వారు వెళ్లిపోయారు. వారు ఏ మార్గాన వెళ్లారో నాకు తెలియదు. మీరు త్వరగా వెళ్తే వారిని పట్టుకోవచ్చు” అని చెప్పింది.
JOS 2:6 (కాని నిజానికి ఆమె వారిని మిద్దె మీదికి తీసుకెళ్లి అక్కడ వరుసగా పేర్చి ఉన్న జనపకట్టెల్లో దాచిపెట్టింది.)
JOS 2:7 కాబట్టి రాజు మనుషులు ఆ గూఢచారులను పట్టుకోడానికి యొర్దాను రేవులకు వెళ్లే మార్గంలో వెళ్లారు. వారు బయటకు వెళ్లిన వెంటనే ద్వారం మూసివేశారు.
JOS 2:8 ఆ వేగులవారు రాత్రి పడుకునే ముందు రాహాబు వారున్న మిద్దె మీదికి వెళ్లి,
JOS 2:9 వారితో, “యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు చాలా భయం, ఈ దేశంలో నివసించే వారందరూ మీరంటే భయంతో క్రుంగిపోతున్నారు.
JOS 2:10 మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మీ కోసం ఎర్ర సముద్రపు నీటిని ఎలా ఆరిపోయేలా చేశారో, మీరు పూర్తిగా నాశనం చేసిన యొర్దానుకు తూర్పున ఉన్న ఇద్దరు అమోరీయుల రాజులైన సీహోను, ఓగుల గురించి విన్నాము.
JOS 2:11 ఈ విషయాలు విన్నప్పుడు, మా గుండెలు భయంతో క్రుంగి, మిమ్మల్ని బట్టి ఎవరికి ఏమాత్రం ధైర్యం లేదు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలోను క్రింద భూమి మీద కూడా దేవుడే.
JOS 2:12 “ఇప్పుడు, దయచేసి మీరు నా కుటుంబం మీద దయ చూపిస్తారని యెహోవా మీద ప్రమాణం చేయండి. ఎందుకంటే నేను మీ పట్ల దయ చూపించాను కాబట్టి మీరు నా తల్లిదండ్రుల, నా అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ల, అలాగే వారికి సంబంధించిన వారినందరిని ప్రాణాలతో కాపాడతారని నాకొక నిజమైన సూచన ఇవ్వండి” అని అడిగింది.
JOS 2:14 అందుకు వారు, “మేము ఏమి చేస్తున్నామో, నీవు చెప్పకుండా ఉంటే మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డుపెడతాం! యెహోవా ఈ దేశాన్ని మాకు ఇచ్చినప్పుడు మేము మీ పట్ల దయతో నమ్మకంగా ఉంటాము” అని చెప్పారు.
JOS 2:15 రాహాబు ఇల్లు పట్టణ గోడమీద ఉంది కాబట్టి, ఆమె వారిని కిటికీ నుండి త్రాడుతో క్రిందకు దింపింది.
JOS 2:16 ఆమె వారితో, “మీరు కొండ సీమకు వెళ్లండి, మిమ్మల్ని తరుముతున్నవారు మిమ్మల్ని పట్టుకోలేరు. వారు తిరిగి వచ్చేవరకు అక్కడే మూడు రోజులు దాక్కోండి, తర్వాత మీ దారిన మీరు వెళ్లవచ్చు” అని చెప్పింది.
JOS 2:17 అందుకు వారు ఆమెతో, “మేము నీతో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండేలా లేకపోతే మేము నిర్దోషులం:
JOS 2:18 మేము ఈ దేశానికి వచ్చినప్పుడు, నీవు మమ్మల్ని క్రిందికి దించిన కిటికీకి ఈ ఎర్రని త్రాడును కట్టి మమ్మల్ని క్రిందికి దించిన కిటికీకి కట్టాలి, మీ అమ్మ నాన్నలను, మీ అన్నదమ్ములను, మీ కుటుంబమంతటిని నీ ఇంట్లోనే ఉంచాలి.
JOS 2:19 ఒకవేళ నీ ఇంటి నుండి ఎవరైనా బయటి వీధిలోకి వెళ్తే వారి చావుకు వారే బాధ్యులు మేము బాధ్యులం కాము. అయితే నీ ఇంట్లో నీ దగ్గరున్న వారి మీద చేయి పడినా అది మా బాధ్యత.
JOS 2:20 అయితే ఒకవేళ మా గురించి నీవు ఎవరికైనా చెప్తే, నీవు మాతో చేయించిన ప్రమాణం నుండి మేము విముక్తులం” అని అన్నారు.
JOS 2:21 అందుకామె, “సరే, మీరు చెప్పినట్టే కానివ్వండి” అని చెప్పి వారిని పంపివేసింది. వారు వెళ్లిన తర్వాత ఆమె ఆ ఎర్రని త్రాడును కిటికీకి కట్టింది.
JOS 2:22 వారు అక్కడినుండి కొండల్లోకి వెళ్లి, తమను తరిమినవారు దారి పొడవునా తమను వెదికి వారిని పట్టుకోలేక తిరిగి వెళ్లిపోయేవరకు మూడు రోజులు అక్కడ ఉన్నారు.
JOS 2:23 తర్వాత ఆ ఇద్దరు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. వారు ఆ కొండలు దిగి నదిని దాటి నూను కుమారుడైన యెహోషువ దగ్గరకు వెళ్లి, జరిగినదంతా అతనికి చెప్పారు.
JOS 2:24 వారు యెహోషువతో, “ఖచ్చితంగా యెహోవా ఆ దేశాన్నంతటిని మన చేతులకు అప్పగించారు. ఆ దేశ ప్రజలందరూ మనమంటే భయంతో క్రుంగిపోతున్నారు” అని చెప్పారు.
JOS 3:1 ఉదయాన్నే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వెళ్లి, దానిని దాటే ముందు అక్కడ బస చేశారు.
JOS 3:2 మూడు రోజుల తర్వాత అధికారులు శిబిరమంతా తిరుగుతూ,
JOS 3:3 ప్రజలకిలా ఆజ్ఞలు జారీ చేశారు: “మీ దేవుడైన యెహోవా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులు మోయటం మీరు చూసినప్పుడు, మీ స్థలాల నుండి బయలుదేరి దానిని వెంబడించాలి.
JOS 3:4 మీరు వెళ్లే మార్గంలో ఇంతకు ముందు వెళ్లలేదు మీరు దానిని తెలుసుకోవాలి. కాబట్టి మీకు, మందసానికి మధ్య దాదాపు రెండువేల మూరల దూరం ఉండాలి; దాని దగ్గరగా నడవకూడదు.”
JOS 3:5 యెహోషువ ప్రజలతో, “రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు చేస్తారు, కాబట్టి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి” అని చెప్పాడు.
JOS 3:6 యెహోషువ యాజకులతో, “నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా వెళ్లండి” అన్నాడు. కాబట్టి వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజలకు ముందుగా నడిచారు.
JOS 3:7 యెహోవా యెహోషువతో, “నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉన్నానని ఇశ్రాయేలీయులందరు తెలుసుకునేలా ఈ రోజు వారి కళ్ళెదుట నిన్ను గొప్పవానిగా చేయడం ప్రారంభిస్తాను.
JOS 3:8 నిబంధన మందసాన్ని మోసే యాజకులతో: ‘మీరు యొర్దాను నది నీటి అంచులకు చేరినప్పుడు, వెళ్లి నదిలో నిలబడాలి’ అని నిబంధన మందసాన్ని మోసే యాజకులతో చెప్పు.”
JOS 3:9 యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు, “ఇక్కడకు వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినండి.
JOS 3:10 ఈ విధంగా సజీవుడైన దేవుడు మీ మధ్య ఉన్నారని, ఆయన కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను మీ ముందు నుండి వెళ్లగొడతారని మీరు తెలుసుకుంటారు.
JOS 3:11 చూడండి, సర్వలోక ప్రభువు యొక్క నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానులోకి వెళ్తుంది.
JOS 3:12 ఇప్పుడు, ఇశ్రాయేలు గోత్రాల్లో ప్రతి గోత్రం నుండి ఒక పురుషుని చొప్పున పన్నెండుమందిని ఎన్నుకోండి.
JOS 3:13 లోకమంతటికి ప్రభువైన యెహోవా మందసాన్ని మోసుకెళ్లే యాజకులు యొర్దానులో అడుగు పెట్టగానే, దిగువకు ప్రవహిస్తున్న ప్రవాహం తెగిపోయి ఒకవైపు రాశిగా నిలబడతాయి.”
JOS 3:14 కాబట్టి యాజకులు ప్రజలకు ముందుగా నిబంధన మందసం మోస్తూ నడుస్తుండగా ప్రజలు వారి శిబిరాల నుండి యొర్దాను దాటడానికి బయలుదేరతారు.
JOS 3:15 కోతకాలమంతా యొర్దాను నది పొంగుతూ ఉంటుంది. మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది దగ్గరకు వచ్చి వారి పాదాలు ఆ నీటికి తగలగానే పైనుండి వచ్చే నీళ్లు ఆగిపోయాయి.
JOS 3:16 ఆ నీళ్లు ఆగిపోయి చాలా దూరంలో సారెతాను ప్రక్కన ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఎత్తైన రాశిలా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రమనే అరాబా సముద్రం అంటే మృత సముద్రంలోకి ప్రవహించే నీళ్లు పూర్తిగా ఆగిపోయాయి. కాబట్టి ప్రజలు యెరికోకు ఎదురుగా నదిని దాటారు.
JOS 3:17 ఇశ్రాయేలీయులంతా పొడినేల మీద యొర్దాను నది దాటే వరకు యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో పొడినేల మీద నిలబడి ఉన్నారు. ఆ విధంగా ఇశ్రాయేలు జనాంగమంతా పొడినేల మీద యొర్దాను నదిని దాటారు.
JOS 4:1 ప్రజలంతా యొర్దాను నది దాటిన తర్వాత యెహోవా యెహోషువకు,
JOS 4:2 “ప్రతి గోత్రం నుండి ఒకరి చొప్పున ప్రజల్లో నుండి పన్నెండుమందిని ఎన్నుకుని,
JOS 4:3 యొర్దాను మధ్య నుండి, అంటే యాజకులు నిలబడి ఉన్న చోటుకు కుడివైపు నుండి పన్నెండు రాళ్లను తీసుకుని, వాటిని మీతో పాటు మోసుకువెళ్లి, ఈ రాత్రి మీరు బసచేసే స్థలంలో వాటిని ఉంచమని వారికి చెప్పు” అని ఆజ్ఞాపించారు.
JOS 4:4 కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయుల నుండి తాను నియమించిన పన్నెండుమందిని ప్రతి గోత్రం నుండి ఒకరి చొప్పున పిలిచి,
JOS 4:5 వారితో, “మీ దేవుడైన యెహోవా మందసానికి ముందుగా యొర్దాను మధ్యలోనికి వెళ్లండి. ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున మీలో ప్రతి ఒక్కరూ తన భుజంపై ఒక రాయిని మోయాలి,
JOS 4:6 అది మీ మధ్య ఒక సూచనగా ఉంటుంది. భవిష్యత్తులో, ‘ఈ రాళ్లకు అర్థమేంటి?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు,
JOS 4:7 యెహోవా నిబంధన మందసం యొర్దాను దాటుతున్నప్పుడు యొర్దాను నీళ్లు ఆగిపోయాయి. కాబట్టి ఈ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు నిత్యం జ్ఞాపకార్థంగా ఉంటాయి అని వారికి చెప్పండి.”
JOS 4:8 కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోషువ ఆజ్ఞాపించినట్లు చేశారు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క ప్రకారం వారు యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసుకొని తమతో పాటు తమ శిబిరానికి తెచ్చి వారు ఉన్నచోట పెట్టారు.
JOS 4:9 యెహోషువ ఆ పన్నెండు రాళ్లను యొర్దాను మధ్యలో, నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు నిలబడిన స్థలంలో నిలబెట్టించాడు. నేటి వరకు అవి అక్కడే ఉన్నాయి.
JOS 4:10 మోషే యెహోషువకు నిర్దేశించినట్లుగా యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన ప్రతిదీ ప్రజలు చేసే వరకు మందసాన్ని మోసిన యాజకులు యొర్దాను మధ్యలో నిలబడి ఉన్నారు. ప్రజలు త్వరత్వరగా దాటి వెళ్లారు,
JOS 4:11 వారంతా దాటిన వెంటనే ప్రజలు చూస్తుండగానే యెహోవా మందసాన్ని మోస్తూ యాజకులు అవతలి వైపుకు దాటి వచ్చారు.
JOS 4:12 ఇశ్రాయేలీయులకు ముందుగా రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు మోషే వారికి నిర్దేశించినట్టుగా యుద్ధానికి సిద్ధపడి దాటారు.
JOS 4:13 యుద్ధానికి సిద్ధపడిన దాదాపు నలభై వేలమంది ఆయుధాలు ధరించి యెహోవా ఎదుట దాటి యుద్ధానికి యెరికో మైదానాలకు చేరుకున్నారు.
JOS 4:14 ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులందరి ముందు యెహోషువను గొప్ప చేశారు; వారు మోషేను గౌరవించినట్టు యెహోషువ జీవించినంత కాలం అతన్ని గౌరవించారు.
JOS 4:15 తర్వాత యెహోవా యెహోషువతో,
JOS 4:16 “నిబంధన మందసాన్ని మోసే యాజకులను యొర్దానులో నుండి ఇవతలికి రమ్మని ఆజ్ఞాపించు” అని చెప్పారు.
JOS 4:17 కాబట్టి యెహోషువ, “యొర్దానులో నుండి పైకి వచ్చేయండి” అని యాజకులను ఆజ్ఞాపించాడు.
JOS 4:18 యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను మధ్యలో నుండి పైకి వచ్చారు. వారి అరికాళ్ల ఆరిన నేలను తాకగానే యొర్దాను నీరు ఎప్పటిలాగే పొంగుతూ ప్రవహించాయి.
JOS 4:19 మొదటి నెల పదవ రోజున ప్రజలు యొర్దాను నదిలో నుండి వచ్చి యెరికో తూర్పు సరిహద్దులోని గిల్గాలులో బస చేశారు.
JOS 4:20 వారు యొర్దాను నుండి తీసిన పన్నెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలబెట్టించాడు.
JOS 4:21 అతడు ఇశ్రాయేలీయులతో, “భవిష్యత్తులో మీ సంతతివారు తమ తల్లిదండ్రులను, ‘ఈ రాళ్లకు అర్థం ఏంటి?’ అని అడిగినప్పుడు,
JOS 4:22 మీరు వారితో, ‘ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దాను నదిని దాటారు’ అని చెప్పాలి.
JOS 4:23 ఎందుకంటే మీరు యొర్దానును దాటే వరకు మీ దేవుడైన యెహోవా మీ ఎదుట యొర్దానును ఆరిపోయేలా చేశారు. మేము ఎర్ర సముద్రాన్ని దాటే వరకు మా ఎదుట దాన్ని ఆరేలా చేసినట్టు మీ దేవుడైన యెహోవా ఇప్పుడు యొర్దానును చేశారు.
JOS 4:24 యెహోవా హస్తం శక్తివంతమైనదని భూమిపై ఉన్న ప్రజలందరూ తెలుసుకునేలా, మీరు మీ దేవుడైన యెహోవాకు ఎల్లప్పుడూ భయపడేలా ఆయన ఇలా చేశారు.”
JOS 5:1 ఇశ్రాయేలీయులు దాటే వరకు యెహోవా యొర్దానును వారి ముందు ఆరిపోయేలా చేశారని యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులందరూ, మధ్యధరా తీరం వెంబడి నివసించిన కనానీయుల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు కరిగి నీరై ఇశ్రాయేలు ప్రజలను ఎదుర్కొనే ధైర్యం వారికి లేకపోయింది.
JOS 5:2 ఆ సమయంలో యెహోవా యెహోషువతో, “చెకుముకిరాతి కత్తులు చేయించి ఇశ్రాయేలీయులకు మళ్ళీ సున్నతి చేయించు” అని చెప్పారు.
JOS 5:3 కాబట్టి యెహోషువ చెకుముకిరాతి కత్తులు చేయించి గిబియత్ హారలోతు దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించాడు.
JOS 5:4 యెహోషువ వారికి సున్నతి చేయించడానికి కారణం ఏంటంటే ఈజిప్టు నుండి బయటకు వచ్చిన వారిలో సైనిక వయస్సుగల పురుషులంతా ఈజిప్టును విడిచిన అరణ్య మార్గంలోనే చనిపోయారు.
JOS 5:5 బయటకు వచ్చిన వారందరూ సున్నతి పొందిన వారే, కానీ ఈజిప్టు నుండి ప్రయాణం చేస్తుండగా అరణ్యమార్గంలో పుట్టిన వారందరూ సున్నతి పొందనివారే.
JOS 5:6 యెహోవా మాట వినలేదు కాబట్టి, ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచినప్పుడు సైనిక వయస్సులో ఉన్న పురుషులందరు చనిపోయే వరకు వారు నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. ఎందుకంటే మనకు ఇస్తానని వారి పూర్వికులకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు చూడరని యెహోవా వారితో ప్రమాణం చేశారు.
JOS 5:7 కాబట్టి ఆయన వారి స్థానంలో వారి కుమారులను లేవనెత్తారు, యెహోషువ సున్నతి చేయించింది వీరికే. దారిలో వారికి సున్నతి జరుగలేదు కాబట్టి వారు సున్నతిలేనివారిగానే ఉన్నారు.
JOS 5:8 దేశంలోని మగవారంతా సున్నతి పొందిన తర్వాత, వారు స్వస్థత పొందేవరకు శిబిరంలోనే ఉన్నారు.
JOS 5:9 తర్వాత యెహోవా యెహోషువతో, “ఈ రోజు నేను మీ నుండి ఈజిప్టు అవమానాన్ని తొలగించాను” అని చెప్పారు. అందుకని ఈనాటి వరకు ఆ స్థలాన్ని గిల్గాలు అని పిలువబడుతుంది.
JOS 5:10 యెరికో మైదానాల్లోని గిల్గాలులో బస చేసినప్పుడు ఆ నెల పద్నాలుగవ రోజు సాయంత్రం అక్కడ ఇశ్రాయేలీయులు పస్కాను జరుపుకున్నారు.
JOS 5:11 పస్కా జరిగిన మరుసటి రోజే, వారు భూమిలో పండించిన వాటిలో నుండి పులియని రొట్టె, కాల్చిన ధాన్యం తినడం మొదలుపెట్టారు.
JOS 5:12 వారు భూమి నుండి ఈ ఆహారాన్ని తిన్న మరుసటిరోజు మన్నా ఆగిపోయింది; ఇశ్రాయేలీయులకు ఇకపై మన్నా లేదు, కానీ ఆ సంవత్సరం వారు కనాను పంటను తిన్నారు.
JOS 5:13 యెహోషువ యెరికోకు సమీపంలో ఉన్నప్పుడు, అతడు పైకి చూసినప్పుడు ఒక వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని తన ముందు నిలబడి కనిపించాడు. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, “నీవు మా పక్షమా లేదా మా శత్రువుల పక్షమా?” అని అడిగాడు.
JOS 5:14 “ఎవరి పక్షం కాను, అయితే నేనిప్పుడు యెహోవా సేనాధిపతిగా వచ్చాను” అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. అప్పుడు యెహోషువ భక్తితో నేలమీద బోర్లపడి, “నా ప్రభువు తన సేవకునికి ఏమి సందేశం ఇస్తారు?” అని అడిగాడు.
JOS 5:15 అందుకు యెహోవా సేనాధిపతి యెహోషువతో, “నీవు నిలబడిన స్ధలం పవిత్రమైనది, కాబట్టి నీ చెప్పులు తీసివేయి” అని చెప్పగానే యెహోషువ అలాగే చేశాడు.
JOS 6:1 ఇశ్రాయేలీయుల భయంతో యెరికో ద్వారాలు గట్టిగా మూసివేయబడ్డాయి. ఎవరూ బయటకు రావడానికి గాని లోపలికి వెళ్లడానికి గాని లేదు.
JOS 6:2 అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పారు, “చూడు, యెరికోను, దాని రాజును, దానిలో ఉన్న యుద్ధవీరులతో పాటు మీ చేతికి అప్పగిస్తున్నాను.
JOS 6:3 నీవు యుద్ధవీరులందరితో పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి. ఇలా ఆరు రోజులు చేయాలి.
JOS 6:4 మందసం ముందు ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి. ఏడవ రోజున యాజకులు బూరలు ఊదుతూ పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరగాలి.
JOS 6:5 వారు మానకుండా చేస్తున్న బూరధ్వని మీరు విన్నప్పుడు, సైన్యమంతా పెద్దగా కేకలు వేయాలి; అప్పుడు ఆ పట్టణపు గోడ కూలిపోతుంది, సైన్యంలో ప్రతి ఒక్కరు పైకి ఎక్కి నేరుగా లోపలికి వెళ్తారు.”
JOS 6:6 కాబట్టి నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిచి వారితో, “మీరు యెహోవా నిబంధన మందసాన్ని ఎత్తుకుని దాని ముందు ఏడుగురు యాజకులు బూరలు పట్టుకుని నడవాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
JOS 6:7 తర్వాత అతడు, “పదండి ముందుకు! యెహోవా మందసం ముందు ఆయుధాలు ధరించిన వీరులు నడుస్తుండగా పట్టణం చుట్టూ తిరగాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
JOS 6:8 యెహోషువ ప్రజలతో మాట్లాడినప్పుడు, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని ఏడు బూరలను మోస్తూ, బూరలు పట్టుకుని వాటిని ఊదుతూ ముందుకు సాగుతూ ఉండగా, యెహోవా నిబంధన మందసం వారి వెంట వెళ్లింది.
JOS 6:9 ఆయుధాలు ధరించిన వీరులు బూరలు ఊదుతున్న యాజకుల ముందు నడుస్తుండగా, వెనుక ఉన్న వీరులు మందసం వెనుక నడిచారు. ఆ సమయమంతా యాజకులు బూరలు ఊదుతూనే ఉన్నారు.
JOS 6:10 కానీ యెహోషువ, “యుద్ధపు కేక వేయవద్దు, మీ స్వరాలు ఎత్తవద్దు, నేను మీకు అరవమని చెప్పే రోజు వరకు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నేను చెప్పినప్పుడు అరవండి!” అని సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు.
JOS 6:11 అలా అతడు యెహోవా మందసాన్ని మోసుకొని పట్టణం చుట్టూ ఒకసారి తిరిగేలా చూశాడు. తర్వాత సైన్యం శిబిరానికి తిరిగివచ్చి రాత్రి అక్కడ గడిపింది.
JOS 6:12 యెహోషువ మరుసటిరోజు ఉదయాన్నే లేవగా, యాజకులు, యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తుకున్నారు.
JOS 6:13 ఆ ఏడుగురు యాజకులు ఏడు బూరలను పట్టుకుని యెహోవా మందసం ముందు నడుస్తూ బూరలు ఊదుతూ ఉన్నారు. బూరధ్వని వినబడుతూ ఉండగా, ఆయుధాలు ధరించిన వీరులు వారికి ముందు వెళ్తుండగా, వెనుక ఉన్న వీరులు యెహోవా మందసం వెనుక వెళ్లారు.
JOS 6:14 రెండవ రోజున కూడా వారు పట్టణం చుట్టూ ఒకసారి తిరిగి, శిబిరానికి తిరిగి వచ్చారు. అలా వారు ఆరు రోజులపాటు చేశారు.
JOS 6:15 ఏడవ రోజున వారు తెల్లవారుజామున లేచి, రోజూలాగే పట్టణం చుట్టూ తిరిగారు. అయితే ఆ రోజు ఆ పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు.
JOS 6:16 ఏడవసారి తిరుగుతూ ఉండగా, యాజకులు బూరధ్వని చేయగానే యెహోషువ, “అరవండి! యెహోవా మీకు ఈ పట్టణాన్ని ఇచ్చారు!
JOS 6:17 పట్టణం, దానిలో ఉన్నవన్నీ యెహోవా వలన శపించబడ్డాయి. అయితే మనం పంపిన దూతలను దాచిపెట్టిన వేశ్యయైన రాహాబును, ఆమెతో పాటు ఆమె ఇంట్లో ఉన్నవారిని మాత్రం మనం విడిచిపెట్టాలి.
JOS 6:18 శపించబడిన వాటికి దూరంగా ఉండండి, లేకపోతే వాటిలో ఏదైనా తీసుకుని మీ సొంత నాశనాన్ని మీరు తెచ్చుకుంటారు! ఇశ్రాయేలీయుల శిబిరాన్ని నాశనానికి గురిచేసి దాని మీదికి కష్టాలు తెచ్చిన వారవుతారు.
JOS 6:19 వెండి, బంగారం, ఇత్తడి, ఇనుప వస్తువులు అన్నీ యెహోవాకు పవిత్రమైనవి, వాటిని ఆయన ఖజానాలోనికి చేర్చాలి.”
JOS 6:20 బూరలు ఊదగానే సైన్యం కేకలు వేసింది. బూర శబ్దానికి పురుషులు పెద్దగా అరవడంతో గోడ కూలిపోయింది; కాబట్టి అందరు నేరుగా లోపలికి ప్రవేశించి వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు.
JOS 6:21 వారు పట్టణాన్ని యెహోవా కోసం ప్రత్యేకపరచి, పురుషులను, స్త్రీలను, చిన్నవారిని, పెద్దవారిని, పశువులను, గొర్రెలను, గాడిదలను దానిలోని ప్రతి జీవిని ఖడ్గంతో నాశనం చేశారు.
JOS 6:22 ఆ దేశాన్ని వేగు చూసిన ఇద్దరు వ్యక్తులతో యెహోషువ ఇలా అన్నాడు: “మీరు వేశ్య ఇంటికి వెళ్లి మీరు ఆమెతో చేసిన ప్రమాణం ప్రకారం ఆమెను, ఆమెకు చెందిన వారందరినీ బయటకు తీసుకురండి.”
JOS 6:23 కాబట్టి వేగు చూసిన యువకులు లోపలికి వెళ్లి రాహాబును, ఆమె తండ్రిని, తల్లిని, ఆమె సోదరులు, సోదరీమణులను, ఆమెకు చెందిన వారందరినీ బయటకు తీసుకువచ్చారు. వారు ఆమె కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి ఇశ్రాయేలు శిబిరం బయట ఒకచోట ఉంచారు.
JOS 6:24 ఆ తర్వాత వారు ఆ పట్టణాన్ని, దానిలోని సమస్తాన్ని కాల్చివేసి, వెండి బంగారాన్ని, ఇత్తడి ఇనుప వస్తువులను యెహోవా మందిరంలోని ఖజానాలో పెట్టారు.
JOS 6:25 అయితే యెరికోకు వేగులవారిగా యెహోషువ పంపిన వారిని దాచిపెట్టింది కాబట్టి, వేశ్యయైన రాహాబును ఆమె కుటుంబంతో పాటు ఆమెకు సంబంధించిన వారందరినీ విడిచిపెట్టాడు; ఆమె ఈనాటికీ ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తుంది.
JOS 6:26 ఆ సమయంలో యెహోషువ ఈ గంభీరమైన ప్రమాణం చేశాడు: “యెరికో పట్టణాన్ని మరలా కట్టాలనుకునేవాడు యెహోవా ఎదుట శాపగ్రస్తుడు: “దాని పునాది వేసే వాడి పెద్దకుమారుడు చనిపోతాడు దాని తలుపులను నిలబెట్టేవాడి చిన్నకుమారుడు చనిపోతాడు.”
JOS 6:27 యెహోవా యెహోషువతో ఉన్నారు కాబట్టి అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది.
JOS 7:1 శపించబడిన వాటి విషయంలో ఇశ్రాయేలీయులు నమ్మకద్రోహులుగా ఉన్నారు. యూదా గోత్రపు వాడైన జెరహు కుమారుడు జబ్ది, జబ్ది కుమారుడు కర్మీ, కర్మీ కుమారుడైన ఆకాను వాటిలో కొన్నిటిని తీసుకున్నాడు. కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలీయులపై రగులుకుంది.
JOS 7:2 తర్వాత యెహోషువ యెరికో నుండి బేతేలుకు తూర్పున బేత్-ఆవెను సమీపంలో ఉన్న హాయికి మనుష్యులను పంపుతూ, “మీరు వెళ్లి ఆ ప్రదేశాన్ని వేగుచూసి రండి” అని చెప్పాడు. కాబట్టి వారు వెళ్లి హాయిని వేగు చూశారు.
JOS 7:3 వారు యెహోషువ దగ్గరకు తిరిగివచ్చి, “హాయి మీదికి సైన్యమంతా వెళ్లాల్సిన అవసరం లేదు. దాన్ని స్వాధీనపరచుకోడానికి రెండు లేదా మూడువేలమందిని పంపండి చాలు, సైన్యమంతా అలసిపోనవసరం లేదు, ఎందుకంటే అక్కడ కొంతమంది మాత్రమే నివసిస్తున్నారు.”
JOS 7:4 కాబట్టి ప్రజల్లో సుమారు మూడువేలమంది యోధులు వెళ్లారు; కానీ వారు హాయి ప్రజల ఎదుట నిలబడలేక పారిపోయారు,
JOS 7:5 హాయి ప్రజలు వారిలో ముప్పై ఆరుగురిని చంపారు. వారు ఇశ్రాయేలీయులను పట్టణ ద్వారం నుండి రాతి గనుల వరకు కొండ దిగువన వారిని చంపారు. దీంతో ప్రజల గుండెలు భయంతో నీరుగారిపోయాయి.
JOS 7:6 అప్పుడు యెహోషువ, తన బట్టలు చింపుకొని యెహోవా మందసం ముందు నేలమీద పడి, సాయంకాలం వరకు అక్కడే ఉన్నాడు. ఇశ్రాయేలు పెద్దలు కూడా అలాగే చేసి తమ తలలపై దుమ్ము చల్లుకున్నారు.
JOS 7:7 యెహోషువ, “అయ్యో! ప్రభువైన యెహోవా! ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మమ్మల్ని నాశనం చేయమని అమోరీయుల చేతికి అప్పగించడానికా? మేము యొర్దాను అవతలి ఒడ్డున ఆగిపోవడానికి నిర్ణయించుకొని ఉంటే ఎంత బాగుండేది!
JOS 7:8 ప్రభువా, మీ సేవకుని క్షమించు. ఇప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువును ఎదుర్కోలేక పారిపోయారు, నేను ఏమి చెప్పగలను?
JOS 7:9 కనాను ప్రజలు, ఈ దేశంలో ఉన్న ఇతర ప్రజలు ఈ సంగతిని విని మమ్మల్ని చుట్టుముట్టి భూమి మీద మా పేరును తుడిచివేస్తారు. అప్పుడు మీ గొప్ప పేరుకు ఉన్న ఘనత కోసం ఏమి చేస్తావు?” అని ప్రార్థించాడు.
JOS 7:10 అయితే యెహోవా యెహోషువతో ఇలా అన్నారు, “నీవు లే! నీ ముఖం నేలకేసి నీవేమి చేస్తున్నావు?
JOS 7:11 ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు; నేను వారికి ఆజ్ఞాపించిన నా ఒడంబడికను వారు ఉల్లంఘించారు. శపించబడిన వాటిలో కొన్నిటిని తీసి దొంగిలించి అబద్ధమాడారు, వారు వాటిని తమ సొంత ఆస్తులతో పాటు పెట్టుకున్నారు.
JOS 7:12 అందుకే ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల ఎదుట నిలువలేక పోతున్నారు; వారు శాపానికి గురికావడం వల్లనే శత్రువులకు వెన్ను చూపి పారిపోయారు. మీ మధ్య వేరుగా ఉంచబడిన వాటన్నిటిని మీరు నాశనం చేస్తేనే తప్ప నేను ఇప్పటినుండి మీతో ఉండను.
JOS 7:13 “నీవు వెళ్లి, ప్రజలను పవిత్రపరచు. వారితో ఇలా చెప్పు, ‘రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి; ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలూ, మీ మధ్య శాపగ్రస్తమైనవి ఉన్నాయి. వాటిని తీసివేసే వరకు మీరు మీ శత్రువుల ఎదుట నిలబడలేరు.
JOS 7:14 “ ‘ఉదయాన్నే గోత్రం వెంబడి గోత్రం మీరు హాజరు కావాలి. అప్పుడు యెహోవా ఎంచుకున్న గోత్రం వంశాలవారిగా ముందుకు వస్తుంది; యెహోవా ఎంచుకున్న వంశం కుటుంబాల ప్రకారం ముందుకు వస్తుంది; యెహోవా ఎంచుకున్న కుటుంబం యొక్క పురుషులు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వస్తారు.
JOS 7:15 శపించబడినవి ఎవరి దగ్గర దొరుకుతుందో వారిని, వారికి చెందిన వారందరిని అగ్నితో నాశనం చేయాలి. వారు యెహోవా ఒడంబడికను మీరి ఇశ్రాయేలులో అవమానకరమైన పని చేశారు!’ ”
JOS 7:16 మరుసటిరోజు తెల్లవారుజామున యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను గోత్రాల ప్రకారం ముందుకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టుబడింది.
JOS 7:17 యూదా వంశాలు ముందుకు వచ్చినప్పుడు జెరహీయులు పట్టుబడ్డారు. అతడు జెరహీయుల వంశాన్ని కుటుంబాల ప్రకారం ముందుకు వచ్చినప్పుడు జబ్ది ఎంపిక చేయబడ్డాడు.
JOS 7:18 యెహోషువ అతని కుటుంబాన్ని ఒక్కొక్కరిగా ముందుకు రప్పించగా, యూదా గోత్రానికి చెందిన జెరహు కుమారుడైన జిమ్రీ, జిమ్రీ కుమారుడైన కర్మీ, కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడ్డాడు.
JOS 7:19 అప్పుడు యెహోషువ ఆకానుతో, “నా కుమారుడా, నిజం చెప్పి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మహిమ కలిగేలా ఆయనను ఘనపరచు. నువ్వేం చేశావో నాతో చెప్పు; దాన్ని నా దగ్గర దాచవద్దు అన్నాడు” అన్నాడు.
JOS 7:20 అందుకు ఆకాను యెహోషువతో, “అది నిజమే! ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరుద్ధంగా నేను పాపం చేశాను. నేను ఏం చేశానంటే,
JOS 7:21 దోపుడు సొమ్ములో ఒక అందమైన బబులోను వస్త్రం, రెండువందల షెకెళ్ళ వెండి, యాభై షెకెళ్ళ బరువుగల బంగారుకడ్డీని నేను చూసి, నాకు చాలా ఇష్టమై నేను వాటిని తెచ్చుకున్నాను. అవి నా డేరాలో నేలలో వెండిని క్రింద ఉంచి వాటిని దాచిపెట్టాను” అని చెప్పాడు.
JOS 7:22 కాబట్టి యెహోషువ దూతలను పంపినప్పుడు వారు గుడారానికి పరుగెత్తి, అతని గుడారంలో నేలలో క్రింద వెండి, దానిపై మిగతావి దాచిపెట్టబడి ఉండడం చూశారు.
JOS 7:23 ఆ డేరా మధ్య నుండి వారు వాటిని తీసి యెహోషువ, ఇశ్రాయేలీయుల దగ్గరకు తెచ్చి యెహోవా ఎదుట వాటిని ఉంచారు.
JOS 7:24 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులతో పాటు జెరహు వంశస్థుడైన ఆకానును వెండిని వస్త్రాన్ని బంగారుకడ్డీని ఆకాను కుమారులను కుమార్తెలను అతని ఎద్దులను గాడిదలను గొర్రెలను అతని డేరాను అతనికి ఉన్నదంతటిని పట్టుకుని ఆకోరు లోయకు తెచ్చారు.
JOS 7:25 యెహోషువ, “నీవు మాకు ఈ ఇబ్బంది ఎందుకు తెచ్చావు? ఈ రోజు యెహోవా నిన్ను బాధిస్తారు” అని అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులంతా ఆకానును, అతని కుటుంబీకులను రాళ్లతో కొట్టి కాల్చివేశారు.
JOS 7:26 ఆకాను మీద వారు ఒక పెద్ద రాళ్లకుప్పను వేశారు, అది ఇప్పటికీ ఉంది. అప్పుడు యెహోవా తీవ్రమైన కోపం చల్లారింది. కాబట్టి అప్పటినుండి ఆ స్థలాన్ని ఆకోరు లోయ అని పిలుస్తారు.
JOS 8:1 అప్పుడు యెహోవా యెహోషువతో, “భయపడకు; నిరుత్సాహపడకు. సైన్యమంతటిని నీతో తీసుకుని హాయి మీద దండెత్తు. నేను హాయి రాజును, అతని జనులను, పట్టణాన్ని, అతని దేశాన్ని నీ చేతులకు అప్పగించాను.
JOS 8:2 యెరికోకు దాని రాజుకు నీవు చేసిన విధంగా హాయికి దాని రాజుకు చేస్తావు, అయితే ఈసారి దానిలోని సొమ్మును, పశువులను మీ కోసం దోచుకోవచ్చు. పట్టణం వెనుక మాటు ఏర్పాటు చేయి” అని చెప్పారు.
JOS 8:3 కాబట్టి యెహోషువ, సైనికులందరూ హాయిని ముట్టడించడానికి బయలుదేరారు. ముప్పైవేలమంది గొప్ప పరాక్రమవంతులను యెహోషువ ఎన్నుకుని రాత్రివేళ వారిని పంపిస్తూ,
JOS 8:4 వారికి ఈ ఆజ్ఞలు ఇచ్చాడు: “శ్రద్ధగా వినండి. మీరు పట్టణం వెనుక మాటువేసి ఉండాలి. పట్టణానికి బాగా దూరంగా వెళ్లిపోకుండా మీరంతా సిద్ధంగా ఉండాలి.
JOS 8:5 నేను, నాతో ఉన్నవారంతా పట్టణం దగ్గరకు వస్తాం, వారు ఇంతకు ముందులా మా మీదికి వచ్చినప్పుడు మేము వారి నుండి పారిపోతాము.
JOS 8:6 ‘వారు ఇంతకుముందులాగే మన నుండి పారిపోతున్నారు’ అని వారనుకుంటారు కాబట్టి మేము వారిని పట్టణం నుండి బయటకు తీసుకువచ్చే వరకు వారు మమ్మల్ని వెంటాడుతారు. మేము వారి నుండి పారిపోయినప్పుడు,
JOS 8:7 మీరు మాటు నుండి బయటకు వచ్చి పట్టణాన్ని పట్టుకోండి. మీ దేవుడైన యెహోవా ఆ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తారు.
JOS 8:8 మీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత దానికి నిప్పు పెట్టండి. యెహోవా ఆజ్ఞాపించినట్లుగా చేసి దానికి నిప్పు పెట్టండి. నేను మీకు ఇచ్చే ఆదేశాలు ఇవే.”
JOS 8:9 యెహోషువ వారిని పంపించగా వారు వెళ్లి బేతేలుకు హాయికి మధ్య హాయి పడపటి వైపున మాటు వేశారు ఆ రాత్రి యెహోషువ ప్రజలమధ్య గడిపాడు.
JOS 8:10 యెహోషువ మరుసటి ఉదయాన్నే తన సైన్యాన్ని సిద్ధపరచి, అతడు ఇశ్రాయేలీయుల పెద్దలు కలిసి వారి ముందు హాయి మీదికి వెళ్లారు.
JOS 8:11 అతనితో ఉన్న బలగమంతా పట్టణానికి సమీపించి దాని ముందుకు చేరుకుంది. వారు హాయికి ఉత్తరాన, వారికి ఆ పట్టణానికి మధ్య లోయ ఉన్నచోట శిబిరం ఏర్పరచుకున్నారు.
JOS 8:12 యెహోషువ దాదాపు అయిదువేల మందిని తీసుకుని పట్టణానికి పడమటి వైపున బేతేలుకు, హాయికి మధ్య మాటు వేశాడు.
JOS 8:13 కాబట్టి సైనికులు పట్టణానికి ఉత్తరాన ప్రధాన శిబిరాన్ని, పట్టణానికి పడమర మాటు వేయడానికి తమ స్థానాలను ఏర్పరచుకున్నారు. ఆ రాత్రి యెహోషువ లోయలోకి వెళ్లాడు.
JOS 8:14 హాయి రాజు ఇది చూసినప్పుడు, అతడు, పట్టణపు ప్రజలందరూ ఉదయాన్నే త్వరగా లేచి అరాబాకు ఎదురుగా ఉన్న ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఇశ్రాయేలును యుద్ధంలో ఎదుర్కోడానికి బయలుదేరారు. అయితే పట్టణం వెనుక తనను పట్టుకోడానికి మాటువేసి ఉంటారని అతనికి తెలియలేదు.
JOS 8:15 యెహోషువ, ఇశ్రాయేలీయులందరు వారి ముందు నిలబడలేక అరణ్యానికి పారిపోయారు.
JOS 8:16 వారిని తరమడానికి హాయిలోని ప్రజలందరూ కలిసి యెహోషువను వెంటాడుతున్నామనే భ్రమలో పట్టణం నుండి దూరంగా వచ్చేశారు.
JOS 8:17 ఇశ్రాయేలును తరమడానికి వెళ్లకుండా ఉన్నవారు హాయిలో గాని బేతేలులో గాని ఒక్కరు కూడా లేదు. వారు పట్టణాన్ని మూయకుండా తెరిచే ఉంచి ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్లారు.
JOS 8:18 అప్పుడు యెహోవా యెహోషువతో, “నీ చేతిలో ఉన్న ఈటెను హాయి వైపు పట్టుకో, నీ చేతికి నేను పట్టణాన్ని అప్పగిస్తాను” అని చెప్పారు. కాబట్టి యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను పట్టణం వైపు చాపాడు.
JOS 8:19 యెహోషువ తన చేయి చాపిన వెంటనే మాటున ఉన్నవారు త్వరత్వరగా తమ స్థలాల నుండి బయటకు పరిగెత్తి వచ్చి పట్టణంలో జొరబడి దానిని స్వాధీనం చేసుకుని, వెంటనే దానికి నిప్పంటించారు.
JOS 8:20 హాయి మనుష్యులు వెనక్కి తిరిగి చూచేటప్పటికి ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంలోకి లేవడం చూశారు, అయితే వారు తప్పించుకోవడానికి ఏ వైపు నుండి కూడా అవకాశం లేదు; అరణ్యం వైపు పారిపోతున్న ఇశ్రాయేలీయులు ఇప్పుడు తమను వెంటాడుతున్న వారిమీదికి దాడికి దిగారు.
JOS 8:21 మాటున పొంచిన వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం పట్టణం నుండి పొగ పైకి లేవడం యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలంతా చూసి, వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యుల మీద దాడి చేశారు.
JOS 8:22 ఈ లోపు పట్టణం బయట మాటు వేసినవారు కూడా వారితో పోరాడటానికి బయలుదేరి వచ్చారు. కొంతమంది ఇటువైపు, మరికొంతమంది అటువైపు ఉండడంతో ఇశ్రాయేలీయుల మధ్యలో హాయి వారు చిక్కుకున్నారు. కాబట్టి వారిలో ఎవ్వరూ బ్రతికి బయటపడకుండ అందరిని హతమార్చారు.
JOS 8:23 కాని హాయి రాజును మాత్రం వారు ప్రాణంతో పట్టుకుని యెహోషువ దగ్గరకు తీసుకువచ్చారు.
JOS 8:24 పొలాల్లో, అరణ్యంలో హాయి మనుష్యులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపటం పూర్తి చేసిన తర్వాత, వారిలో ఎవరూ మిగలకుండా ప్రతి ఒక్కరు ఖడ్గం పాలయ్యాక, ఇశ్రాయేలీయులంతా హాయికి తిరిగివచ్చి దానిలో ఉన్నవారందరిని చంపివేశారు.
JOS 8:25 ఆ రోజున హాయి పట్టణానికి చెందిన స్త్రీ పురుషులు మొత్తం పన్నెండువేలమంది చనిపోయారు.
JOS 8:26 ఎందుకంటే హాయిలో నివసించే వారందరినీ నాశనం చేసే వరకు యెహోషువ తన ఈటెను పట్టుకున్న చేతిని వెనుకకు తీసుకోలేదు.
JOS 8:27 అయితే యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలీయులు ఈ పట్టణంలోని పశువులను, దోపుడుసొమ్మును తమ కోసం తీసుకెళ్లారు.
JOS 8:28 కాబట్టి యెహోషువ హాయిని కాల్చివేసి, దానిని శాశ్వత శిధిలాల కుప్పగా చేశాడు, ఇప్పటికీ అది నిర్జన ప్రదేశంగానే ఉంది.
JOS 8:29 అతడు హాయి రాజును సాయంకాలం వరకు స్తంభానికి వ్రేలాడదీశాడు. సూర్యాస్తమయ సమయంలో యెహోషువ ఆ మృతదేహాన్ని స్తంభం నుండి క్రిందికి దించి పట్టణ ద్వారం దగ్గర పడవేయమని ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేసి దానిపై ఒక పెద్ద రాళ్లకుప్పను వేశారు. అది ఇప్పటికీ అలాగే ఉంది.
JOS 8:30 యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు, యెహోషువ ఏబాలు పర్వతం మీద ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టాడు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన దాని ప్రకారం అతడు చెక్కని రాళ్లతో ఎటువంటి ఇనుప సాధనం వాడకుండ దాన్ని కట్టాడు. దానిపై వారు యెహోవాకు దహనబలులు సమాధానబలులు అర్పించారు.
JOS 8:32 ఇశ్రాయేలీయుల సమక్షంలో, యెహోషువ మోషే ధర్మశాస్త్ర ప్రతిని రాళ్లపై వ్రాశాడు.
JOS 8:33 ఇశ్రాయేలీయులందరు, వారి పెద్దలు, అధికారులు, న్యాయాధిపతులతో పాటు యెహోవా నిబంధన మందసానికి ఇరువైపులా, దానిని మోస్తున్న లేవీయ యాజకులకు ఎదురుగా నిలబడ్డారు. వారి మధ్య నివసిస్తున్న విదేశీయులు, స్థానికంగా పుట్టినవారు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడానికి యెహోవా సేవకుడైన మోషే గతంలో సూచనలు ఇచ్చినప్పుడు ఆజ్ఞాపించినట్లుగా వారిలో సగం మంది ప్రజలు గెరిజీము పర్వతం ముందు, సగం మంది ఏబాలు పర్వతం ముందు నిలబడ్డారు.
JOS 8:34 ఆ తర్వాత, యెహోషువ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటిని అనగా దీవెనలను శాపాలను ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినట్లే చదివాడు.
JOS 8:35 స్త్రీలు, పిల్లలు, వారి మధ్య నివసించే విదేశీయులతో సహా ఇశ్రాయేలీయుల సమాజమంతటి సమక్షంలో మోషే ఆజ్ఞాపించిన వాటిలో యెహోషువ చదవకుండా ఒక్క మాట కూడా విడిచిపెట్టలేదు.
JOS 9:1 యొర్దానుకు పశ్చిమాన ఉన్న రాజులందరూ అంటే కొండ సీమలోని రాజులు, పడమటి పర్వత ప్రాంతాల్లో, మధ్యధరా సముద్ర తీరప్రాంతంలో లెబానోను వరకు ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయుల, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయుల రాజులు ఈ విషయాలను గురించి విన్నప్పుడు,
JOS 9:2 వారు యెహోషువతో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి కలిసి వచ్చారు.
JOS 9:3 అయితే, యెరికోకు, హాయికి యెహోషువ ఏమి చేశాడో గిబియోను ప్రజలు విన్నప్పుడు,
JOS 9:4 వారు ఒక కుయుక్తిని ఆలోచించి, రాయబారులుగా నటిస్తూ తమ గాడిదల మీద చినిగిపోయిన గోనెసంచులు, పాతగిల్లి అతుకు వేసిన ద్రాక్షతిత్తులను పెట్టుకుని వెళ్లారు.
JOS 9:5 తమ కాళ్లకు అరిగిపోయి అతుకులు వేసిన పాత చెప్పులు, పాతబడిన బట్టలు వేసుకున్నారు. వారు తెచ్చుకున్న రొట్టెలన్నీ ఎండిపోయి బూజు పట్టి ఉన్నాయి.
JOS 9:6 వారు గిల్గాలులో శిబిరం దగ్గర ఉన్న యెహోషువ దగ్గరకు వచ్చి అతనితో, ఇశ్రాయేలీయులతో, “మేము దూరదేశం నుండి వచ్చాం; మాతో ఒక సమాధాన ఒడంబడిక” అని అన్నారు.
JOS 9:7 ఇశ్రాయేలీయులు హివ్వీయులతో, “కాని మీరు మా మధ్య నివసిస్తున్న వారిలా ఉన్నారు, మేము మీతో ఎలా సమాధాన ఒడంబడిక చేసుకోగలం?” అని అడిగారు.
JOS 9:8 అందుకు వారు, “మేము మీ దాసులం” అని యెహోషువతో అన్నారు. కాని యెహోషువ, “మీరెవరు, ఎక్కడ నుండి వచ్చారు?” అని వారిని అడిగాడు.
JOS 9:9 అందుకు వారు: “మీ దేవుడైన యెహోవా కీర్తిని గురించి విని, మీ దాసులమైన మేము చాలా దూరదేశం నుండి వచ్చాము. ఆయన ఈజిప్టులో చేసినదంతటిని గురించి,
JOS 9:10 యొర్దాను తూర్పున ఉన్న అమోరీయుల ఇద్దరు రాజులకు అనగా హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులో పాలించిన బాషాను రాజైన ఓగులకు చేసిన దాన్ని గురించి విన్నాము.
JOS 9:11 కాబట్టి మా పెద్దలు, మా దేశవాసులంతా మాతో, ‘ప్రయాణానికి అవసరమైన ఆహారం తీసుకుని వెళ్లి వారిని కలిసి వారితో, “మేము మీ దాసులం; మాతో సమాధాన ఒడంబడిక చేయండి” అని చెప్పండి’ అన్నారు.
JOS 9:12 మేము మీ దగ్గరకు రావడానికి బయలుదేరిన రోజు ఇంట్లో చేసినప్పుడు మా ఈ రొట్టెలు వేడిగా ఉన్నాయి. కానీ ఇప్పుడవి ఎండిపోయి బూజు పట్టి ఉన్నాయి చూడండి.
JOS 9:13 ఈ ద్రాక్షరసం తిత్తులు మేము నింపినప్పుడు క్రొత్తవే, కాని ఇప్పుడు చినిగిపోయాయి. చాలా దూరం ప్రయాణం చేయడంతో మా బట్టలు, చెప్పులు అరిగిపోయాయి.”
JOS 9:14 అయితే ఇశ్రాయేలీయులు యెహోవాను అడగకుండానే వారి ఆహారంలో కొంత తీసుకున్నారు.
JOS 9:15 తర్వాత యెహోషువ వారిని బ్రతకనివ్వడానికి వారితో సమాధాన ఒడంబడిక చేశాడు, దానిని సమాజ నాయకులు ప్రమాణం చేసి ఆమోదించారు.
JOS 9:16 గిబియోనీయులతో సమాధాన ఒడంబడిక చేసుకున్న మూడు రోజుల తర్వాత, వారు తమ పొరుగువారని, తమ దగ్గర నివసిస్తున్నారని ఇశ్రాయేలీయులు విన్నారు.
JOS 9:17 కాబట్టి ఇశ్రాయేలీయులు బయలుదేరి మూడవ రోజున వారి పట్టణాలైన గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్-యారీము చేరుకున్నారు.
JOS 9:18 అయితే ఇశ్రాయేలీయులు వారిపై దాడి చేయలేదు, ఎందుకంటే సమాజ నాయకులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరున వారితో ప్రమాణం చేశారు. సమాజమంతా నాయకుల మీద సణుగుకొన్నారు.
JOS 9:19 అయితే సమాజ నాయకులంతా, “మనం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున వారికి ప్రమాణం చేశాం కాబట్టి ఇప్పుడు మనం వారిని తాకకూడదు.
JOS 9:20 మనం వారికి చేసిన ప్రమాణం వల్ల మన మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండేలా వారిని బ్రతుకనిద్దాం” అన్నారు.
JOS 9:21 వారు ఇంకా మాట్లాడుతూ, “వారిని బ్రతుకనివ్వండి, వారు సమాజమంతటికి కట్టెలు కొట్టేవారిగా నీళ్లు తెచ్చేవారిగా ఉంటారు” అని జవాబిచ్చారు. అలా నాయకులు ఇచ్చిన మాట నెరవేరింది.
JOS 9:22 యెహోషువ గిబియోనీయులను పిలిపించి వారితో, “మీరు మా దగ్గరే నివసించే వారైనప్పటికి మేము చాలా దూరంలో ఉంటామని చెప్పి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు?
JOS 9:23 అందుకే మీరు శాపానికి గురైయ్యారు. మీరు ఎప్పటికీ నా దేవుని మందిరానికి కట్టెలు కొట్టేవారిగా, నీరు తెచ్చే వారిగానే ఉంటారు” అని చెప్పాడు.
JOS 9:24 అందుకు వారు యెహోషువకు, “మీ దేవుడైన యెహోవా ఈ దేశమంతటిని మీకు ఇవ్వమని, దాని నివాసులందరిని మీ ముందు నుండి తుడిచిపెట్టమని తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించారని మీ దాసులమైన మాకు స్పష్టంగా తెలిసింది. మీ వల్ల మాకు ప్రాణభయం ఉంది, అందుకే ఇలా చేశాము.
JOS 9:25 మేమిప్పుడు మీ చేతుల్లో ఉన్నాము. మా విషయంలో మీకు ఏది మంచిది, ఏది సరియైనది అనిపిస్తే అదే చేయండి” అని జవాబిచ్చారు.
JOS 9:26 కాబట్టి యెహోషువ గిబియోనీయులను ఇశ్రాయేలీయుల నుండి కాపాడి, వారిని చంపకుండా చేశాడు.
JOS 9:27 ఆ రోజు యెహోషువ యెహోవా ఎంచుకున్న స్థలంలో ఉండే బలిపీఠం యొక్క అవసరాలను తీర్చడానికి, గిబియోనీయులను సమాజం కోసం కట్టెలు కొట్టేవారిగా, నీరు తెచ్చేవారిగా చేశాడు. నేటికీ వారు అదే చేస్తున్నారు.
JOS 10:1 యెహోషువ హాయిని పట్టుకుని పూర్తిగా నాశనం చేసి, యెరికోకు దాని రాజుకు చేసినట్లు హాయికి దాని రాజుకు చేశాడని, గిబియోను ప్రజలు ఇశ్రాయేలుతో సమాధాన ఒప్పందం చేసుకుని వారితో కలిసిపోయారని యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు విన్నాడు.
JOS 10:2 అతడు, అతని ప్రజలు దీని గురించి చాలా భయపడ్డారు, ఎందుకంటే గిబియోను పట్టణం రాజధానుల్లో ఒక ముఖ్యమైన పట్టణం; అది హాయి కంటే పెద్దది, దాని మనుష్యులందరు మంచి పోరాట యోధులు.
JOS 10:3 కాబట్టి యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు హెబ్రోను రాజైన హోహాము, యర్మూతు రాజైన పిరాము, లాకీషు రాజైన యాఫీయా, ఎగ్లోను రాజైన దెబీరులకు,
JOS 10:4 “రండి గిబియోనుపై దాడి చేయడానికి నాకు సహాయం చేయండి, ఎందుకంటే గిబియోను యెహోషువతో ఇశ్రాయేలీయులతో సమాధాన ఒప్పందం చేసుకుంది” అని విన్నవించుకున్నారు.
JOS 10:5 అమోరీయుల అయిదుగురు రాజులు అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఒకటిగా చేరి, తమ సైనికులందరితో కలిసి వెళ్లి గిబియోనీయులతో యుద్ధం చేశారు.
JOS 10:6 గిబియోనీయులు గిల్గాలులోని శిబిరంలో ఉన్న యెహోషువకు: “నీ దాసులను విడిచిపెట్టక త్వరగా మా దగ్గరకు వచ్చి సహాయం చేసి మమ్మల్ని రక్షించండి! కొండ సీమలోని అమోరీయుల రాజులందరూ ఒక్కటిగా మా మీదికి దండెత్తి వచ్చారు” అని అంటూ సమాచారం పంపారు.
JOS 10:7 కాబట్టి యెహోషువ తన సైన్యమంతటితో, అత్యుత్తమ పోరాట యోధులందరితో సహా గిల్గాలు నుండి బయలుదేరాడు.
JOS 10:8 యెహోవా యెహోషువతో, “వారికి భయపడకు; నేను వారిని నీ చేతికి అప్పగించాను. వారిలో ఒక్కరు మీ ముందు నిలబడలేరు” అని చెప్పారు.
JOS 10:9 గిల్గాలు నుండి రాత్రంతా నడిచి వచ్చిన తర్వాత, యెహోషువ హఠాత్తుగా వారి మీద దాడి చేశాడు.
JOS 10:10 యెహోవా వారిని ఇశ్రాయేలీయుల ముందు గందరగోళంలో పడేశారు, కాబట్టి ఇశ్రాయేలీయులు గిబియోనులో వారిని పూర్తిగా ఓడించారు. ఇశ్రాయేలీయులు బేత్-హోరోనుకు పైకి వెళ్లే దారిలో అజేకా, మక్కేదా వరకు వారిని వెంటాడి నరికివేశారు.
JOS 10:11 వారు బేత్-హోరోను నుండి అజేకాకు వెళ్లే దారిలో ఇశ్రాయేలీయుల నుండి పారిపోతుండగా, యెహోవా వారిపై పెద్ద వడగళ్ళు కురిపించారు, ఇశ్రాయేలీయుల ఖడ్గాల చేత చంపబడినవారి కంటే వడగళ్ళతో చచ్చినవారే ఎక్కువ.
JOS 10:12 యెహోవా అమోరీయులను ఇశ్రాయేలీయులకు అప్పగించిన రోజున, యెహోషువ ఇశ్రాయేలీయుల సమక్షంలో యెహోవాతో ఇలా అన్నాడు: “సూర్యుడా, గిబియోనుపై నిలిచిపో, చంద్రుడా, అయ్యాలోను లోయ పైగా ఆగిపో.”
JOS 10:13 ప్రజలు తమ శత్రువులపై పూర్తి విజయం సాధించే వరకు, సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, అని యాషారు వ్రాసిన వీరుల గ్రంథంలో వ్రాయబడినట్లుగా జరిగింది. సూర్యుడు ఆకాశం మధ్యలో ఆగి, దాదాపు ఒక రోజు ఆలస్యమయ్యాడు.
JOS 10:14 యెహోవా ఒక మానవుడి మాట విన్న ఆ రోజులాంటిది ఇంకొకటి అంతకుముందుగానీ ఆ తర్వాత గాని లేదు. నిజంగా యెహోవా ఇశ్రాయేలీయుల కోసం యుద్ధం చేశారు!
JOS 10:15 ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు గిల్గాలులో ఉన్న శిబిరానికి తిరిగి వచ్చాడు.
JOS 10:16 అప్పుడు అయిదుగురు రాజులు పారిపోయి మక్కేదాలోని గుహలో దాక్కున్నారు.
JOS 10:17 అయిదుగురు రాజులు మక్కేదాలోని గుహలో దాక్కున్నట్టు యెహోషువకు తెలిసినప్పుడు,
JOS 10:18 యెహోషువ ఇలా అన్నాడు, “గుహ ద్వారానికి పెద్ద పెద్ద రాళ్లు దొర్లింది మూసివేసి దానికి మనుష్యులను కాపలా పెట్టండి.
JOS 10:19 ఆగవద్దు; మీ శత్రువులను వెంటాడండి! వెనుక నుండి వారిపై దాడి చేయండి, వారిని వారి పట్టణాలకు చేరనివ్వవద్దు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా వారిని మీ చేతికి అప్పగించారు.”
JOS 10:20 కాబట్టి యెహోషువ, ఇశ్రాయేలీయులు వారిని పూర్తిగా ఓడించారు, అయితే ప్రాణాలతో బయటపడిన కొంతమంది కోటగోడలు గల తమ పట్టణాలకు చేరుకున్నారు.
JOS 10:21 అప్పుడు సైన్యమంతా మక్కేదాలోని శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరకు క్షేమంగా తిరిగి వచ్చింది. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు.
JOS 10:22 యెహోషువ, “గుహ ద్వారం తెరిచి ఆ అయిదుగురు రాజులను నా దగ్గరకు తీసుకురండి” అని అన్నాడు.
JOS 10:23 కాబట్టి వారు ఆ అయిదుగురు రాజులను అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను యొక్క రాజులను గుహ నుండి బయటకు తెచ్చారు.
JOS 10:24 ఆ రాజులను వారు యెహోషువ దగ్గరకు తీసుకువచ్చాక, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి తనతో వెళ్లి వచ్చిన సేనాధిపతులతో, “నా దగ్గరకు రండి, మీ పాదాలు ఈ రాజుల మెడల మీద పెట్టండి” అని చెప్పాడు. కాబట్టి వారు ముందుకు వచ్చి తమ పాదాలను వారి మెడల మీద పెట్టారు.
JOS 10:25 అప్పుడు యెహోషువ వారితో, “భయపడకండి; నిరుత్సాహపడకండి. నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. మీరు పోరాడబోయే శత్రువులందరికీ యెహోవా ఇలాగే చేస్తారు” అన్నాడు.
JOS 10:26 అప్పుడు యెహోషువ రాజులను చంపి వారి శవాలను అయిదు స్తంభాలకు వ్రేలాడదీశాడు, సాయంత్రం వరకు వారి శవాలు స్తంభాలకు వ్రేలాడి ఉన్నాయి.
JOS 10:27 సూర్యాస్తమయ సమయంలో యెహోషువ ఆజ్ఞ ఇవ్వగా వారు వాటిని స్తంభాల నుండి దించి, వారు దాక్కున్న గుహలోకి విసిరి ఆ గుహ ముఖద్వారం దగ్గర వారు పెద్ద రాళ్లను ఉంచారు, అవి నేటికీ ఉన్నాయి.
JOS 10:28 ఆ రోజు యెహోషువ మక్కేదాను స్వాధీనపరచుకున్నాడు. అతడు ఆ పట్టణాన్ని దాని రాజును కత్తితో చంపి, దానిలోని వారందరినీ పూర్తిగా నాశనం చేశాడు. ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లుగా మక్కేదా రాజుకు చేశాడు.
JOS 10:29 అప్పుడు యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మక్కేదా నుండి లిబ్నాకు వెళ్లి దానిపై దాడి చేశారు.
JOS 10:30 యెహోవా ఆ పట్టణాన్ని దాని రాజును ఇశ్రాయేలు చేతికి అప్పగించారు. యెహోషువ ఆ పట్టణాన్ని, దానిలోని వారందరినీ కత్తితో చంపాడు. అక్కడ అతడు ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లు దాని రాజుకు చేశాడు.
JOS 10:31 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు లిబ్నా నుండి లాకీషుకు వెళ్లి అక్కడ తన దళాలను మోహరించి దాని మీద దాడి చేశాడు.
JOS 10:32 యెహోవా లాకీషును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించారు. రెండవ రోజు యెహోషువ దానిని పట్టుకుని లిబ్నాకు చేసినట్లే ఆ పట్టణాన్ని, అందులోని వారందరినీ ఖడ్గంతో చంపాడు.
JOS 10:33 ఇంతలో గెజెరు రాజైన హోరాము లాకీషుకు సహాయం చేయడానికి రాగా అయితే యెహోషువ ఎవరూ ప్రాణాలతో మిగులకుండా అతన్ని అతని సైన్యాన్ని హతం చేశాడు.
JOS 10:34 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు లాకీషు నుండి ఎగ్లోనుకు వెళ్లారు; దానికి వ్యతిరేకంగా వారు తమ సైన్యాన్ని మోహరింపజేసి దాని మీద దాడి చేశాడు.
JOS 10:35 వారు లాకీషుకు చేసినట్లుగా అదే రోజు దానిని పట్టుకుని ఖడ్గంతో అక్కడ ఉన్నవారందరిని పూర్తిగా నాశనం చేశారు.
JOS 10:36 ఎగ్లోను నుండి యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు హెబ్రోనుకు వెళ్లి దాని మీద దాడి చేశారు.
JOS 10:37 వారు దానిని పట్టుకుని దానిని దాని రాజును దానికి చెందిన అన్ని గ్రామాలను దానిలో ఉన్నవారినందరిని ఖడ్గంతో చంపారు. ఎగ్లోనుకు చేసినట్టే దానిని దానిలో ఉన్నవారినందరిని పూర్తిగా నాశనం చేశారు.
JOS 10:38 తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు వెనుకకు వచ్చి దెబీరు మీద దాడి చేశాడు.
JOS 10:39 వారు ఆ పట్టణాన్ని, దాని రాజును, దాని గ్రామాలను పట్టుకుని కత్తితో చంపారు. అందులో ఉన్నవారందరిని పూర్తిగా నాశనం చేశారు. వారు ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. లిబ్నాకు, దాని రాజుకు, హెబ్రోనుకు చేసినట్లే వారు దెబీరుకు, దాని రాజుకు చేశారు.
JOS 10:40 కాబట్టి యెహోషువ కొండ ప్రాంతాన్ని, దక్షిణ ప్రాంతాన్ని, పడమటి పర్వతాలను, కొండ వాలులతో సహా మొత్తం ప్రాంతాన్ని వాటి రాజులందరితో పాటు స్వాధీనం చేసుకున్నాడు. ఎవ్వరినీ మిగల్చలేదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లుగానే, ఊపిరితో ఉన్నవారందరిని అతడు పూర్తిగా నాశనం చేశాడు.
JOS 10:41 యెహోషువ వారిని కాదేషు బర్నియా నుండి గాజా వరకు, గోషేను ప్రాంతం నుండి గిబియోను వరకు జయించాడు.
JOS 10:42 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలు కోసం పోరాడారు కాబట్టి యెహోషువ ఈ రాజులందరినీ, వారి దేశాలను ఒకే దండయాత్రలో జయించాడు.
JOS 10:43 తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో కలిసి గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చాడు.
JOS 11:1 హాసోరు రాజు యాబీను ఈ విషయం విని, మాదోను రాజైన యోబాబుకు, షిమ్రోను, అక్షఫు రాజులకు,
JOS 11:2 ఉత్తరాన కొండ సీమలో ఉన్న రాజులకు, కిన్నెరెతు సరస్సుకు దక్షిణంగా ఉన్న అరాబా లోయ ప్రాంతంలో ఉన్న రాజులకు, పడమటి దిగువ కొండ ప్రదేశాల రాజులకు, పడమర ఉన్న నఫోత్ దోరు రాజుకు,
JOS 11:3 తూర్పు పడమర లోని కనానీయుల రాజులకు, అమోరీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, కొండ సీమలో ఉన్న యెబూసీయుల, మిస్పా ప్రదేశంలో హెర్మోను పర్వతం క్రింద ఉన్న హివ్వీయుల రాజులకు కబురు పంపాడు.
JOS 11:4 వారు సముద్రతీరంలో ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన తమ భారీ సైన్యంతో, లెక్కలేనన్ని గుర్రాలతో రథాలతో బయలుదేరి వచ్చారు.
JOS 11:5 ఈ రాజులందరూ తమ బలగాలను కలుపుకొని ఇశ్రాయేలీయులతో పోరాడడానికి మేరోము జలాల దగ్గర కలిసి మకాం వేశారు.
JOS 11:6 యెహోవా యెహోషువతో, “వారికి భయపడకు, ఎందుకంటే రేపు ఈ సమయానికి నేను వారందరినీ చంపి ఇశ్రాయేలు ప్రజలకు అప్పగిస్తాను. మీరు వారి గుర్రాల తొడనరాలు తెగకోసి, వారి రథాలను కాల్చివేయాలి” అని చెప్పారు.
JOS 11:7 కాబట్టి యెహోషువ అతనితో పాటు సైనికులంతా బయలుదేరి మేరోము జలాల దగ్గర ఒక్కసారిగా వారి మీద పడ్డారు.
JOS 11:8 యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించారు. వీరు వారిని ఓడించి, మహా పట్టణమైన సీదోను వరకు, మిస్రెఫోత్-మయీము వరకు, తూర్పున మిస్పే లోయవరకు ఏ ఒక్కరు మిగులకుండా వారిని వెంటాడి చంపారు.
JOS 11:9 యెహోవా చెప్పినట్లే యెహోషువ వారికి చేశాడు: అతడు వారి గుర్రాల తొడనరాలు తెగకోసి, వారి రథాలను కాల్చివేశాడు.
JOS 11:10 యెహోషువ ఆ సమయంలో వెనుకకు తిరిగి హాసోరును వశపరచుకున్నాడు. దాని రాజును కత్తితో చంపాడు. (అంతకుముందు హాసోరు ఆ రాజ్యాలన్నిటికీ ముఖ్యపట్టణంగా ఉండేది.)
JOS 11:11 దానిలో ఉన్నవారందరిని కత్తితో చంపారు. ఊపిరి ఉన్న ఎవరినీ విడిచిపెట్టకుండా వారిని పూర్తిగా నాశనం చేశారు. అతడు హాసోరును కాల్చివేశాడు.
JOS 11:12 యెహోషువ ఈ రాజ పట్టణాలన్నిటిని, వాటి రాజులందరినీ పట్టుకుని ఖడ్గంతో చంపాడు. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని పూర్తిగా నాశనం చేశాడు.
JOS 11:13 అయితే యెహోషువ కాల్చివేసిన హాసోరు తప్ప మట్టి కొండలమీద కట్టిన పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు.
JOS 11:14 ఇశ్రాయేలీయులు ఈ పట్టణాలలోని దోపుడుసొమ్మును, పశువులన్నిటిని తమ కోసం తీసుకెళ్లారు, కాని మనుష్యుల్లో ఎవరినీ విడిచిపెట్టకుండా, వాటిని పూర్తిగా నాశనం చేసేంతవరకు ప్రజలందరినీ ఖడ్గంతో చంపారు.
JOS 11:15 యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు, యెహోషువ దానినే చేశాడు; మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిలో అతడు ఏదీ వదల్లేదు.
JOS 11:16 కాబట్టి యెహోషువ ఈ మొత్తం భూమిని స్వాధీనం అనగా కొండసీమ, దక్షిణ ప్రాంతం, గోషేను ప్రాంతమంతా, పశ్చిమ పర్వత ప్రాంతాలు, అరాబా, ఇశ్రాయేలు పర్వతాలు వాటి దిగువ ప్రాంతాలు,
JOS 11:17 హలాకు పర్వతం నుండి శేయీరు వైపు, హెర్మోను పర్వతం క్రింద లెబానోను లోయలోని బయల్-గాదు వరకు అతడు స్వాధీనం చేసుకుని వాటి రాజులందరినీ పట్టుకుని చంపాడు.
JOS 11:18 యెహోషువ ఈ రాజులందరితో చాలా కాలం యుద్ధం చేశాడు.
JOS 11:19 గిబియోనులో నివసిస్తున్న హివ్వీయులు తప్ప, ఏ ఒక్క పట్టణం కూడా ఇశ్రాయేలీయులతో సమాధాన ఒప్పందం చేసుకోలేదు, వారు యుద్ధంలో వారందరినీ పట్టుకున్నారు.
JOS 11:20 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు కనికరం లేకుండా వారిని పూర్తిగా నాశనం చేయాలని, ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చేలా యెహోవా వారి హృదయాలను కఠినపరిచారు.
JOS 11:21 ఆ సమయంలో యెహోషువ వెళ్లి కొండ ప్రాంతంలో అనగా హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా, ఇశ్రాయేలు కొండ ప్రాంతమంతా నివసించిన అనాకీయులందరినీ, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేశాడు.
JOS 11:22 ఇశ్రాయేలీయుల భూభాగంలో అనాకీయులు ఎవరూ మిగల్లేదు; గాజా, గాతు, అష్డోదులలో మాత్రమే కొంతమంది మిగిలారు.
JOS 11:23 యెహోవా మోషేకు చెప్పినట్లుగానే యెహోషువ ఆ దేశమంతటిని స్వాధీనం చేసుకుని, ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారసత్వంగా దానిని ఇచ్చాడు. తర్వాత దేశం యుద్ధాలు లేకుండ విశ్రాంతిగా ఉంది.
JOS 12:1 ఇశ్రాయేలీయులు ఓడించిన దేశపు రాజులు వీరే: అర్నోను కొండగట్టు నుండి హెర్మోను పర్వతం వరకు, అరాబాకు తూర్పున ఉన్న ప్రాంతంతో సహా యొర్దానుకు తూర్పున ఉన్న వారి దేశాలను స్వాధీనం చేసుకున్నారు.
JOS 12:2 అమోరీయుల రాజైన సీహోను హెష్బోను నుండి పరిపాలించాడు. అతడు అర్నోను కొండగట్టు అంచున ఉన్న అరోయేరు నుండి అనగా కొండ మధ్య నుండి అమ్మోనీయుల సరిహద్దు యైన యబ్బోకు నది వరకు పరిపాలించాడు. ఇందులో సగం గిలాదు ఉంది.
JOS 12:3 అతడు తూర్పు అరాబాను కిన్నెరెతు సముద్రం నుండి అరాబా సముద్రం (అంటే మృత సముద్రం) వరకు, బేత్-యెషిమోతు వరకు, ఆపై పిస్గా కొండ క్రింద దక్షిణం వైపు వరకు పరిపాలించాడు.
JOS 12:4 అష్తారోతు, ఎద్రెయీలలో పాలించిన రెఫాయీయులలో చివరివాడైన బాషాను రాజైన ఓగు యొక్క భూభాగము.
JOS 12:5 అతడు హెర్మోను పర్వతం, సలేకా, గెషూరు, మయకా ప్రజల సరిహద్దు వరకు బాషాను మొత్తాన్ని, గిలాదులో సగం హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు పరిపాలించాడు.
JOS 12:6 యెహోవా సేవకుడైన మోషే, ఇశ్రాయేలీయులు వారిని జయించారు. యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రానికి వారి భూమిని స్వాస్థ్యంగా ఇచ్చాడు.
JOS 12:7 యెహోషువ, ఇశ్రాయేలీయులు యొర్దానుకు పశ్చిమాన, లెబానోను లోయలోని బయల్-గాదు నుండి శేయీరు వైపుగా ఉన్న హలాకు పర్వతం వరకు జయించిన దేశాల రాజుల జాబితా ఇది. యెహోషువ ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారి భూములను వారసత్వంగా ఇచ్చాడు.
JOS 12:8 ఈ భూములలో కొండసీమ, పశ్చిమ పర్వతాలు, అరాబా, పర్వత వాలులు, అరణ్యం, దక్షిణ ప్రాంతం ఉన్నాయి. ఇవి హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయుల దేశాలు.
JOS 12:9 యెరికో రాజు ఒక్కడు హాయి రాజు (బేతేలు సమీపంలోని) ఒక్కడు
JOS 12:10 యెరూషలేము రాజు ఒక్కడు హెబ్రోను రాజు ఒక్కడు
JOS 12:11 యర్మూతు రాజు ఒక్కడు లాకీషు రాజు ఒక్కడు
JOS 12:12 ఎగ్లోను రాజు ఒక్కడు గెజెరు రాజు ఒక్కడు
JOS 12:13 దెబీరు రాజు ఒక్కడు గెదెరు రాజు ఒక్కడు
JOS 12:14 హోర్మా రాజు ఒక్కడు అరాదు రాజు ఒక్కడు
JOS 12:15 లిబ్నా రాజు ఒక్కడు అదుల్లాము రాజు ఒక్కడు
JOS 12:16 మక్కేదా రాజు ఒక్కడు బేతేలు రాజు ఒక్కడు
JOS 12:17 తప్పూయ రాజు ఒక్కడు హెఫెరు రాజు ఒక్కడు
JOS 12:18 ఆఫెకు రాజు ఒక్కడు లషారోను రాజు ఒక్కడు
JOS 12:19 మాదోను రాజు ఒక్కడు హాసోరు రాజు ఒక్కడు
JOS 12:20 షిమ్రోను మెరోను రాజు ఒక్కడు అక్షఫు రాజు ఒక్కడు
JOS 12:21 తానాకు రాజు ఒక్కడు మెగిద్దో రాజు ఒక్కడు
JOS 12:22 కెదెషు రాజు ఒక్కడు కర్మెలులోని యొక్నీము రాజు ఒక్కడు
JOS 12:23 దోరు రాజు (నఫోత్ దోరు లోని) ఒక్కడు గిల్గాలులో గోయీం రాజు ఒక్కడు
JOS 12:24 తిర్సా రాజు ఒక్కడు
JOS 13:1 యెహోషువ ముసలివాడయ్యాక, యెహోవా అతనితో, “నీవు ముసలివాడవయ్యావు, ఇంకా చాలా ప్రాంతాలు స్వాధీనం చేసుకోవలసి ఉంది.
JOS 13:2 “ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాలు: “ఫిలిష్తీయుల, గెషూరీయుల అన్ని ప్రాంతాలు,
JOS 13:3 కనానీయులవని పిలువబడిన ఈజిప్టు తూర్పున ఉన్న షీహోరు నది నుండి ఉత్తరాన ఎక్రోను భూభాగం వరకు, అయిదుగురు ఫిలిష్తీయ పాలకులకు సంబంధించిన గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోను; ఆవీయుల భూభాగం,
JOS 13:4 దక్షిణాన; సీదోనీయుల ఆరా నుండి ఆఫెకు, అమోరీయుల సరిహద్దుల వరకు ఉన్న కనానీయుల దేశమంతా;
JOS 13:5 గెబాలీయుల ప్రాంతం; హెర్మోను పర్వతం క్రింద బయల్-గాదు నుండి లెబో హమాతు వరకు తూర్పున ఉన్న లెబానోను ప్రాంతమంతా.
JOS 13:6 “లెబానోను నుండి మిస్రెఫోత్-మయీము వరకు ఉన్న పర్వత ప్రాంతాల నివాసులందరిని అంటే, సీదోనీయులందరినీ ఇశ్రాయేలీయుల ముందు నుండి నేనే వారిని వెళ్లగొడతాను. నేను నీకు ఆజ్ఞాపించినట్లుగా ఈ భూమిని ఇశ్రాయేలుకు వారసత్వంగా ఇవ్వాలి,
JOS 13:7 దానిని తొమ్మిది గోత్రాలకు, మనష్షే అర్థగోత్రానికి వారసత్వంగా పంచి ఇవ్వాలి” అని చెప్పారు.
JOS 13:8 మనష్షే గోత్రంలో మిగిలిన సగభాగం, రూబేనీయులు, గాదీయులు యొర్దాను తూర్పున యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చిన విధంగా యొర్దాను తూర్పున వారసత్వంగా పొందారు.
JOS 13:9 ఇది అర్నోను కొండగట్టు అంచున ఉన్న అరోయేరు నుండి, కొండగట్టు మధ్యలో ఉన్న పట్టణం నుండి, మెదెబా మొత్తం పీఠభూమితో సహా దీబోను వరకు విస్తరించి ఉంది,
JOS 13:10 హెష్బోనులో అమ్మోనీయుల సరిహద్దు వరకు పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను పట్టణాలన్ని ఉన్నాయి.
JOS 13:11 అందులో గిలాదు, గెషూరు, మయకా ప్రజల భూభాగం, హెర్మోను పర్వతం మొత్తం, సలేకా వరకు ఉన్న బాషాను కూడా ఉన్నాయి,
JOS 13:12 అంటే, అష్తారోతు ఎద్రెయీలో పాలించిన బాషానులోని ఓగు రాజ్యం మొత్తము. (అతడు రెఫాయీయులలో చివరివాడు.) మోషే వారిని ఓడించి వారి భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
JOS 13:13 కానీ ఇశ్రాయేలీయులు గెషూరు, మయకా ప్రజలను బయటకు వెళ్లగొట్టలేదు, కాబట్టి వారు ఇప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్యనే నివసిస్తున్నారు.
JOS 13:14 కానీ లేవీ గోత్రానికి అతడు ఎలాంటి వారసత్వాన్ని ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన వారికి వాగ్దానం చేసినట్లు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు అర్పించబడిన హోమబలులే వారి వారసత్వము.
JOS 13:15 రూబేను గోత్రం వారికి వారి వంశాల ప్రకారం మోషే వారికిచ్చింది:
JOS 13:16 అర్నోను నది లోయ ప్రక్కన ఉన్న అరోయేరు లోయ మొదలుకొని ఆ లోయలో ఉన్న పట్టణం నుండి మెదెబా దగ్గరి పూర్తి మైదానం,
JOS 13:17 ఇదీగాక హెష్బోను దాని మైదానంలోని పట్టణాలన్ని, దీబోను, బామోత్ బయలు బేత్-బయల్-మెయోను,
JOS 13:18 యహజు, కెదేమోతు, మెఫాతు,
JOS 13:19 కిర్యతాయిము, షిబ్మా లోయలో ఉన్న కొండ మీది శెరెత్ షహరు,
JOS 13:20 బేత్-పెయోరు, పిస్గా కొండచరియలు, బేత్-యెషిమోతు,
JOS 13:21 మైదానంలోని పట్టణాలన్ని, హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోను రాజ్యం మొత్తం వారసత్వంగా ఇచ్చాడు. మోషే అతన్ని, ఆ దేశంలో నివసించిన సీహోనుతో జతకట్టిన మిద్యానీయుల ప్రధానులైన ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే వారిని ఓడించాడు.
JOS 13:22 ఇశ్రాయేలీయులు యుద్ధంలో చంపినవారితో పాటు, బెయోరు కుమారుడైన భవిష్యవాణి చెప్పే బిలామును కత్తితో చంపారు.
JOS 13:23 రూబేనీయుల సరిహద్దు యొర్దాను నది తీరము. ఈ పట్టణాలు, వాటి గ్రామాలు రూబేనీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి.
JOS 13:24 గాదు గోత్రానికి దాని వంశాల ప్రకారం మోషే ఇచ్చింది ఇదే:
JOS 13:25 యాజెరు ప్రాంతం, గిలాదు పట్టణాలన్ని, అమ్మోనీయుల దేశంలో సగం అంటే రబ్బాకు సమీపంలో ఉన్న అరోయేరు వరకు;
JOS 13:26 హెష్బోను నుండి రామాత్ మిస్పే, బెతోనీము వరకు, మహనయీము నుండి దెబీరు ప్రాంతం వరకు;
JOS 13:27 లోయలో, బేత్-హారాము, బేత్-నిమ్రా, సుక్కోతు, సాఫోను, హెష్బోను రాజైన సీహోను యొక్క ప్రాంతం (యొర్దాను తూర్పు వైపు, కిన్నెరెతు సముద్రం చివరి వరకు ఉన్న ప్రాంతం).
JOS 13:28 ఈ పట్టణాలు, వాటి గ్రామాలు గాదీయులకు వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఇవ్వబడ్డాయి.
JOS 13:29 మోషే మనష్షే యొక్క అర్థగోత్రానికి, అంటే మనష్షే వంశస్థుల సగం కుటుంబానికి, దాని వంశాల ప్రకారం ఇచ్చింది ఇదే:
JOS 13:30 వారి సరిహద్దు మహనయీము నుండి బాషాను రాజైన ఓగు రాజ్యం మొత్తం, అంటే బాషానులోని యాయీరు స్థిరనివాసాలైన అరవై పట్టణాలు,
JOS 13:31 గిలాదులో సగం, అష్తారోతు, ఎద్రెయీ (బాషానులోని ఓగు యొక్క రాజ పట్టణాలు).
JOS 13:32 యెరికోకు తూర్పున యొర్దాను అవతల మోయాబు సమతల మైదానంలో ఉన్నప్పుడు మోషే ఇచ్చిన వారసత్వం ఇదే.
JOS 13:33 కానీ లేవీ గోత్రానికి, మోషే వారసత్వం ఇవ్వలేదు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారికి వాగ్దానం చేసినట్లు ఆయనే వారి స్వాస్థ్యము.
JOS 14:1 ఇవి ఇశ్రాయేలీయులు కనాను దేశంలో వారసత్వంగా పొందిన ప్రాంతాలు, వీటిని యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు గోత్ర వంశ పెద్దలు వారికి కేటాయించారు.
JOS 14:2 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా, తొమ్మిదిన్నర గోత్రాలకు చీటి ద్వారా వారి వారసత్వాలు కేటాయించబడ్డాయి.
JOS 14:3 మోషే యొర్దాను తూర్పున ఉన్న రెండున్నర గోత్రాలకు వారి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు కానీ మిగిలిన వాటిలో లేవీయులకు వారసత్వం ఇవ్వలేదు,
JOS 14:4 ఎందుకంటే యోసేపు సంతతివారైన మనష్షే, ఎఫ్రాయిములు రెండు గోత్రాలుగా అయ్యారు. లేవీయులకు భూమిలో వాటా లేదు, కానీ వారి మందలు, గొర్రెల మందల కోసం పచ్చికబయళ్లు, నివసించడానికి పట్టణాలు మాత్రమే పొందుకున్నారు.
JOS 14:5 కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు దేశాన్ని విభజించారు.
JOS 14:6 యూదా ప్రజలు గిల్గాలులో ఉన్న యెహోషువ దగ్గరకు వచ్చి, కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో, “నీ గురించి, నా గురించి కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా ఏమి చెప్పారో నీకు తెలుసు.
JOS 14:7 యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియా నుండి దేశాన్ని పరిశోధించడానికి నన్ను పంపినప్పుడు నాకు నలభై సంవత్సరాలు. నా నమ్మకం ప్రకారం నేను అతనికి ఒక నివేదికను తీసుకువచ్చాను,
JOS 14:8 కానీ నాతో వచ్చిన నా తోటి ఇశ్రాయేలీయులు ప్రజల గుండెలు భయంతో కరిగిపోయేలా చేశారు. అయితే, నేను నా దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా అనుసరించాను.
JOS 14:9 కాబట్టి ఆ రోజున మోషే నాతో ప్రమాణం చేసి, ‘నీవు నా దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా అనుసరించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన దేశం నీకు, నీ పిల్లలకు శాశ్వత వారసత్వంగా ఉంటుంది’ అని చెప్పాడు.
JOS 14:10 “యెహోవా వాగ్దానం చేసినట్లుగా, ఆయన మోషేతో ఈ మాట చెప్పినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరిగిన ఈ నలభై అయిదు సంవత్సరాలు నన్ను బ్రతికించారు. ఇప్పుడు నాకు ఎనభై అయిదు సంవత్సరాలు!
JOS 14:11 మోషే నన్ను బయటకు పంపిన రోజు ఎంత బలంగా ఉన్నానో ఈ రోజు కూడా అంతే బలంగా ఉన్నాను; నేను అప్పటిలాగే ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్లడానికి చాలా శక్తివంతంగా ఉన్నాను.
JOS 14:12 ఆ రోజు యెహోవా నాకు వాగ్దానం చేసిన ఈ కొండ సీమను ఇప్పుడు నాకు ఇవ్వండి. అనాకీయులు అక్కడ ఉన్నారని, వారి పట్టణాలు కోటగోడలతో విశాలంగా ఉన్నాయని అప్పుడు నీవే స్వయంగా విన్నావు. అయితే, యెహోవా నాకు సహాయం చేస్తున్నారు, ఆయన చెప్పినట్లుగానే నేను వారిని వెళ్లగొడతాను” అని చెప్పాడు.
JOS 14:13 అప్పుడు యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబును దీవించి అతనికి హెబ్రోనును వారసత్వంగా ఇచ్చాడు.
JOS 14:14 అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను హృదయమంతటితో అనుసరించాడు కాబట్టి అప్పటినుండి హెబ్రోను కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడు కాలేబుకు వారసత్వంగా ఉంది.
JOS 14:15 (హెబ్రోనును అనాకీయులలో గొప్ప వ్యక్తియైన అర్బా పేరున కిర్యత్-అర్బా అని పిలిచేవారు.) అప్పుడు దేశం యుద్ధాలు లేకుండా విశ్రాంతిగా ఉంది.
JOS 15:1 యూదా గోత్రానికి దాని వంశాల ప్రకారం కేటాయించబడిన భాగం, ఎదోము సరిహద్దు వరకు, దక్షిణాన సీను ఎడారి వరకు విస్తరించి ఉంది.
JOS 15:2 వారి దక్షిణ సరిహద్దు మృత సముద్రం యొక్క దక్షిణ చివరన ఉన్న అఖాతం నుండి ప్రారంభమైంది,
JOS 15:3 అక్రబ్బీం కనుమకు దక్షిణంగా దాటి, సీను వరకు కొనసాగి, కాదేషు బర్నియాకు దక్షిణ వైపు వరకు వ్యాపించి ఉంది. తర్వాత అది హెస్రోను దాటి అద్దారు వరకు వెళ్లి కర్కా వైపు తిరిగింది.
JOS 15:4 అది అజ్మోను గుండా ఈజిప్టు వాగులో చేరి, మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది. ఇది వారి దక్షిణ సరిహద్దు.
JOS 15:5 దాని తూర్పు సరిహద్దు మృత సముద్రం వెంట యొర్దాను నది యొక్క ముఖద్వారం వరకు విస్తరించింది. ఉత్తర సరిహద్దు యొర్దాను ముఖద్వారం దగ్గర సముద్రం యొక్క అఖాతం నుండి ప్రారంభమై, బేత్-హొగ్లా వరకు వెళ్లి, బేత్-అరాబాకు ఉత్తరాన రూబేను కుమారుడైన బోహాను రాయి వరకు కొనసాగింది.
JOS 15:7 ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకు వెళ్లి కొండగట్టుకు దక్షిణాన అదుమ్మీము కనుమకు ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. అది ఎన్-షెమెషు నీళ్ల నుండి ఎన్-రోగేలు వరకు వ్యాపించింది.
JOS 15:8 ఆ తర్వాత అది యెబూసీయుల పట్టణం (అంటే, యెరూషలేము) దక్షిణ వాలు వెంబడి బెన్ హిన్నోము లోయవరకు వెళ్లింది. అక్కడినుండి అది రెఫాయీము లోయకు ఉత్తరాన ఉన్న హిన్నోము లోయకు పశ్చిమాన ఉన్న కొండపై వరకు వ్యాపించింది.
JOS 15:9 కొండపై నుండి సరిహద్దు నెఫ్తోవ నీటి ఊటవైపు వెళ్లి, ఎఫ్రోను పర్వత పట్టణాల నుండి బాలా (అనగా కిర్యత్-యారీము) వైపుకు వెళ్లింది.
JOS 15:10 తర్వాత ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు పర్వతానికి వంపుగా తిరిగి, యారీము పర్వతం (అంటే కెసాలోను) ఉత్తర వాలు గుండా వెళ్లింది, బేత్-షెమెషు వరకు కొనసాగి తిమ్నాకు వ్యాపించింది.
JOS 15:11 అది ఎక్రోను ఉత్తర వాలుకు వెళ్లి, షిక్కెరోను వైపు తిరిగి, బాలా పర్వతాన్ని దాటి జబ్నీలుకు చేరుకుంది. సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది.
JOS 15:12 పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్ర తీరప్రాంతము.
JOS 15:13 యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబుకు యూదాలో ఒక భాగాన్ని అనగా కిర్యత్-అర్బాను, అంటే హెబ్రోనును ఇచ్చాడు. (అర్బా అనాకు యొక్క పూర్వికుడు.)
JOS 15:14 కాలేబు హెబ్రోను నుండి అనాకు కుమారులైన షేషయి, అహీమాను, తల్మయి అనే ముగ్గురు అనాకీయులను వెళ్లగొట్టాడు.
JOS 15:15 అక్కడినుండి గతంలో కిర్యత్-సెఫెరు అని పిలువబడిన దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద దాడి చేశాడు.
JOS 15:16 కాలేబు, “కిర్యత్-సెఫెరు మీద దాడి చేసి స్వాధీనపరచుకున్న వ్యక్తికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్ళి చేస్తాను” అని అన్నాడు.
JOS 15:17 కాలేబు సోదరుడూ కెనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని స్వాధీనపరచుకున్నాడు; కాబట్టి కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్ళి చేశాడు.
JOS 15:18 ఒక రోజు ఆమె ఒత్నీయేలు దగ్గరకు వచ్చి తన తండ్రిని ఒక పొలం అడగమని అతన్ని కోరింది. ఆమె తన గాడిదను దిగినప్పుడు కాలేబు, “నేను నీకేమి చేయాలి?” అని ఆమెను అడిగాడు.
JOS 15:19 అందుకామె జవాబిస్తూ, “నాకు ప్రత్యేక దీవెన కావాలి. నీవు నాకు దక్షిణం దేశంలో భూమి ఇచ్చావు, ఇప్పుడు నీటి ఊటలు కూడా ఇవ్వు” అని అన్నది. కాబట్టి కాలేబు ఆమెకు ఎగువన, దిగువన ఉన్న నీటి మడుగులను ఇచ్చాడు.
JOS 15:20 ఇది యూదా గోత్రానికి దాని వంశాల ప్రకారం కేటాయించబడిన వారసత్వం:
JOS 15:21 ఎదోము సరిహద్దు వైపున దక్షిణ ప్రాంతంలోని యూదా గోత్రానికి చెందిన దక్షిణాన ఉన్న పట్టణాలు: కబ్సెయేలు, ఏదెరు, యాగూరు,
JOS 15:22 కీనా, దిమోనా, అదాదా,
JOS 15:23 కెదెషు, హాసోరు, ఇత్నాను,
JOS 15:24 జీఫు, తెలెము, బెయాలోతు,
JOS 15:25 హాసోర్-హదత్తా, కెరీయోతు హెస్రోను (అంటే, హాసోరు),
JOS 15:26 అమాం, షేమ, మొలాదా,
JOS 15:27 హజర్-గద్దా, హెష్మోను, బేత్-పెలెతు,
JOS 15:28 హజర్-షువలు, బెయేర్షేబ, బిసియోత్యా,
JOS 15:29 బాలా, ఐయీము, ఎజెము,
JOS 15:30 ఎల్తోలదు, కెసీలు, హోర్మా,
JOS 15:31 సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,
JOS 15:32 లెబయోతు, షిల్హిం, ఆయిను, రిమ్మోను అనేవి మొత్తం ఇరవై తొమ్మిది పట్టణాలు వాటి గ్రామాలు.
JOS 15:33 పశ్చిమాన కొండ దిగువ ప్రాంతంలో: ఎష్తాయోలు, జోరహు, అష్నా,
JOS 15:34 జానోహ, ఎన్-గన్నీము, తప్పూయ, ఏనము,
JOS 15:35 యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,
JOS 15:36 షరాయిము, అదీతాయిం, గెదేరా (గెదెరోతాయిం), మొత్తం పద్నాలుగు పట్టణాలు వాటి గ్రామాలు.
JOS 15:37 సెనాను, హదాషా, మిగ్దల్-గాదు,
JOS 15:38 దిలాను, మిస్పే, యొక్తియేలు,
JOS 15:39 లాకీషు, బొస్కతు, ఎగ్లోను,
JOS 15:40 కబ్బోను, లహ్మాస్, కిత్లిషు
JOS 15:41 గెదెరోతు, బేత్-దాగోను, నయమా, మక్కేదా మొత్తం పదహారు పట్టణాలు, వాటి గ్రామాలు.
JOS 15:42 లిబ్నా, ఎతెరు, ఆషాను,
JOS 15:43 ఇఫ్తా, అష్నా, నెసీబు,
JOS 15:44 కెయీలా, అక్సీబు, మరేషా మొత్తం పదహారు పట్టణాలు వాటి గ్రామాలు.
JOS 15:45 ఎక్రోను, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, గ్రామాలు;
JOS 15:46 ఎక్రోనుకు పశ్చిమాన, అష్డోదు పరిసరాల్లో ఉన్నవాటన్నిటితో పాటు వాటి గ్రామాలన్నీ ఉన్నాయి;
JOS 15:47 అష్డోదు, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, వాటి గ్రామాలు; దాని ఈజిప్టు వాగువరకు, మహా మధ్యధరా సముద్ర తీరం వరకు గాజా, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, గ్రామాలు.
JOS 15:48 కొండ సీమలో: షామీరు, యత్తీరు, శోకో,
JOS 15:49 దన్నా, కిర్యత్-సన్నా (అంటే, దెబీరు),
JOS 15:50 అనాబు, ఎష్టెమో, అనీము,
JOS 15:51 గోషేను, హోలోను గిలోహు, మొత్తం పదకొండు పట్టణాలు వాటి గ్రామాలు.
JOS 15:52 అరబు, దూమా, ఎషాను,
JOS 15:53 యానీము, బేత్-తప్పూయ, ఆఫెకా,
JOS 15:54 హుమ్తా, కిర్యత్-అర్బా (అదే హెబ్రోను) సీయోరు మొత్తం తొమ్మిది పట్టణాలు వాటి గ్రామాలు.
JOS 15:55 మాయోను, కర్మెలు, జీఫు, యుత్తా,
JOS 15:56 యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ
JOS 15:57 కయీను, గిబియా, తిమ్నా అనేవి మొత్తం పది పట్టణాలు, వారి గ్రామాలు.
JOS 15:58 హల్హూలు, బేత్-సూరు, గెదోరు,
JOS 15:59 మారాతు, బేత్-అనోతు, ఎల్తెకోను అనేవి మొత్తం ఆరు పట్టణాలు, వాటి గ్రామాలు.
JOS 15:60 కిర్యత్-బయలు (అంటే కిర్యత్-యారీము), రబ్బా అనేవి మొత్తం రెండు పట్టణాలు, వాటి గ్రామాలు.
JOS 15:61 అరణ్యంలో: బేత్-అరాబా, మిద్దీను, సెకాకా,
JOS 15:62 నిబ్షాను, ఉప్పు పట్టణం, ఎన్-గేదీ అనేవి మొత్తం ఆరు పట్టణాలు, వాటి గ్రామాలు.
JOS 15:63 యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను యూదా వారు వెళ్లగొట్టలేకపోయారు; నేటి వరకు యెబూసీయులు యూదా ప్రజలతో కలిసి అక్కడ నివసిస్తున్నారు.
JOS 16:1 యోసేపు సంతతివారికి చీట్ల వల్ల వచ్చిన భూభాగం తూర్పున ఉన్న యెరికో నీటి ఊటల దగ్గర యొర్దాను నుండి మొదలై ఎడారి గుండా బేతేలు కొండసీమ లోపలి వరకు ఉంది.
JOS 16:2 అది లూజు అనబడే బేతేలు వరకు వెళ్లి అతారోతులో ఉన్న అర్కీయుల భూభాగం దాటి,
JOS 16:3 దిగువ బేత్-హోరోను ప్రాంతం వరకు పడమటివైపుగా యఫ్లెతీయుల భూభాగం వరకు, మధ్యధరా సముద్రం దగ్గర ముగిసే గెజెరు వరకు దిగారు.
JOS 16:4 అక్కడ యోసేపు వంశస్థులైన మనష్షే, ఎఫ్రాయిం వారి వారసత్వాన్ని పొందారు.
JOS 16:5 ఎఫ్రాయిమీయుల వంశాల ప్రకారం వారి సరిహద్దు ఈ విధంగా: వారి వారసత్వపు సరిహద్దు తూర్పున అతారోత్-అద్దారు నుండి ఎగువ బేత్-హోరోను వరకు వెళ్లి,
JOS 16:6 మధ్యధరా సముద్రం వరకు కొనసాగింది. దానికి ఉత్తరాన ఉన్న మిక్మెతాతు నుండి అది తూర్పున తానత్ షిలోహు వరకు తిరిగి, తూర్పున ఉన్న యానోహ వరకు వెళ్లింది.
JOS 16:7 అది యానోహ నుండి అతారోతు, నయరా వైపుకు దిగి, యెరికోను తాకి, యొర్దాను దగ్గర అంతమయ్యింది.
JOS 16:8 తప్పూయ నుండి ఆ సరిహద్దు కానా కనుమ వరకు పడమటి వైపుగా వెళ్లి సముద్రం దగ్గర అంతమయ్యింది. ఇది ఎఫ్రాయిం గోత్రం వారికి వారి వంశాల ప్రకారం లభించిన వారసత్వము.
JOS 16:9 మనష్షే వారి వారసత్వంలో ఎఫ్రాయిమీయుల కోసం కేటాయించబడిన అన్ని పట్టణాలు, వాటి గ్రామాలు కూడా ఉన్నాయి.
JOS 16:10 గెజెరులో నివసిస్తున్న కనానీయులను వారు వెళ్లగొట్టలేదు; ఈ రోజు వరకు కనానీయులు ఎఫ్రాయిం ప్రజలమధ్య నివసిస్తూ దాసులుగా కష్టపడి పని చేస్తున్నారు.
JOS 17:1 యోసేపు మొదటి సంతానంగా మనష్షే గోత్రానికి కేటాయించబడిన భాగం ఇదే. మనష్షే మొదటి కుమారుడు, గిలాదీయుల పూర్వికుడైన మాకీరుకు గిలాదు, బాషానులు ఇవ్వబడ్డాయి ఎందుకంటే మాకీరీయులు గొప్ప సైనికులు.
JOS 17:2 కాబట్టి ఈ కేటాయింపు మనష్షే వారిలో మిగిలిన ప్రజలైన అబీయెజెరు, హెలెకు, అశ్రీయేలు, షెకెము, హెఫెరు, షెమీదా వారికి ఇవ్వబడింది. వీరు తమ వంశాల ప్రకారం యోసేపు కుమారుడైన మనష్షే మగ సంతానము.
JOS 17:3 మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన గిలాదు కుమారుడైన హెఫెరుకు పుట్టిన సెలోఫెహాదుకు కుమారులు లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారి పేర్లు మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా.
JOS 17:4 వారు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, నాయకుల దగ్గరకు వెళ్లి, “మా బంధువుల మధ్య మాకు వారసత్వం ఇవ్వాలని మోషేకు యెహోవా ఆజ్ఞాపించారు” అని చెప్పారు. కాబట్టి యెహోషువ యెహోవా ఆజ్ఞ ప్రకారం వారి తండ్రి సోదరుల మధ్య వారికి వారసత్వమిచ్చాడు.
JOS 17:5 యొర్దాను నదికి అవతల ఉన్న గిలాదు, బాషానుతో పాటు మనష్షేకు అధనంగా పది వాటాల భూమి వచ్చింది.
JOS 17:6 ఎందుకంటే మనష్షే గోత్రపు కుమారులతో పాటు వారి కుమార్తెలు కూడా వారసత్వాన్ని పొందారు. గిలాదు దేశం మిగతా మనష్షే సంతతివారికి ఇవ్వబడింది.
JOS 17:7 మనష్షే భూభాగం ఆషేరు నుండి షెకెముకు తూర్పున ఉన్న మిక్మెతాతు వరకు దక్షిణాన ఎన్-తప్పూయ నివాసుల వైపుకు వ్యాపించింది.
JOS 17:8 (తప్పూయ భూభాగం మనష్షేకు చెందుతుంది, కానీ మనష్షే సరిహద్దులో ఉన్న తప్పూయ ఎఫ్రాయిమీయులకు చెందినదే.)
JOS 17:9 ఆ సరిహద్దు దక్షిణాన కానా కనుమ వరకు కొనసాగింది. మనష్షే పట్టణాల మధ్య ఎఫ్రాయిముకు చెందిన పట్టణాలు ఉన్నాయి, కానీ మనష్షే సరిహద్దు కనుమకు ఉత్తరం వైపుగా మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది.
JOS 17:10 దక్షిణాన ఉన్న భూమి ఎఫ్రాయిముకు, ఉత్తరాన మనష్షేకు చెందినది. మనష్షే భూభాగం మధ్యధరా సముద్రం వరకు ఉంది. ఉత్తరాన ఆషేరు, తూర్పున ఇశ్శాఖారు సరిహద్దులుగా ఉంది.
JOS 17:11 ఇశ్శాఖారు, ఆషేరులలో మనష్షేకు బేత్-షాను, ఇబ్లెయాము, దోరు, ఎన్-దోరు, తానాకు, మెగిద్దో ప్రజలు, వారి చుట్టూ ఉన్న స్థావరాలు కూడా ఉన్నాయి (జాబితాలో మూడవది నఫోతా).
JOS 17:12 కనానీయులు ఆ ప్రాంతంలో నివసించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు కాబట్టి మనష్షే సంతతివారు ఈ పట్టణాలను ఆక్రమించలేకపోయారు.
JOS 17:13 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బాగా బలం పుంజుకున్నప్పుడు కనాను వారితో వెట్టిచాకిరి చేయించుకున్నారు గాని, వారిని పూర్తిగా వెళ్లగొట్టలేదు.
JOS 17:14 యోసేపు వంశపు వారు యెహోషువతో, “మీరు మాకు ఒక్క వాటా ఒక్క భాగం మాత్రమే వారసత్వంగా ఇచ్చారేంటి? మేము చాలామందిమి, యెహోవా మమ్మల్ని విస్తారంగా దీవించారు” అన్నారు.
JOS 17:15 యెహోషువ, “ఒకవేళ మీరు చాలామంది ఉండి ఎఫ్రాయిం కొండ ప్రాంతం మీకు ఇరుకుగా అనిపిస్తే అడవిలోకి వెళ్లి, పెరిజ్జీయులు రెఫాయీయుల దేశంలో మీ కోసం భూమిని ఖాళీ చేసుకోండి” అని వారికి చెప్పాడు.
JOS 17:16 అందుకు యోసేపు సంతతివారు, “ఈ కొండసీమ మాకు సరిపోదు. మైదాన ప్రాంతంలో అంటే బేత్-షానులో దాని చుట్టూ ఉన్న స్థావరాలలో యెజ్రెయేలు లోయలో ఉంటున్న కనానీయులందరికీ ఇనుప రథాలున్నాయి” అన్నారు.
JOS 17:17 యెహోషువ యోసేపు గోత్రాలతో అనగా ఎఫ్రాయిం మనష్షేలతో, “మీరు చాలామంది ఉన్నారు, మీరు చాలా బలవంతులు. మీకు ఒక్క భాగమే కాదు,
JOS 17:18 అడవులతో ఉన్న ఆ కొండ మీదే. కాబట్టి దానిని నరకండి; అప్పుడు ఆ ప్రదేశం మీది అవుతుంది. కనానీయులకు ఇనుప రథాలు ఉన్నా వారు బలవంతులైనా మీరు వారిని వెళ్లగొట్టగలరు” అన్నాడు.
JOS 18:1 ఇశ్రాయేలీయుల సమాజమంతా షిలోహులో సమావేశమై అక్కడ సమావేశ గుడారాన్ని ఏర్పాటు చేసింది. ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది,
JOS 18:2 కాని ఇంకా ఏడు ఇశ్రాయేలీయుల గోత్రాలకు వారి వారసత్వం కేటాయించబడలేదు.
JOS 18:3 కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశాన్ని స్వాధీనపరచుకోడానికి వెళ్లకుండా మీరు ఎంతకాలం వేచి ఉంటారు?
JOS 18:4 ప్రతి గోత్రం నుండి ముగ్గురు వ్యక్తులను నియమించండి. ఒక్కొక్కరి వారసత్వం ప్రకారం భూమిని పరిశీలించి దాని వివరాలు వ్రాసి నా దగ్గరకు తీసుకురావడానికి నేను వారిని పంపుతాను. అప్పుడు వారు నా దగ్గరకు తిరిగి వస్తారు.
JOS 18:5 మీరు భూమిని ఏడు భాగాలుగా విభజించాలి. యూదా వారు దక్షిణాన ఉన్న తన ప్రాంతంలోనూ, యోసేపు గోత్రాలు ఉత్తరాన ఉన్న తమ ప్రాంతాల్లోనూ ఉండాలి.
JOS 18:6 మీరు భూమి యొక్క ఏడు భాగాల వివరాలు వ్రాసి వాటిని నా దగ్గరకు తీసుకురండి, నేను మన దేవుడైన యెహోవా సన్నిధిలో మీ కోసం చీట్లు వేస్తాను.
JOS 18:7 అయితే లేవీయులు మీ మధ్య భాగాన్ని పొందరు, ఎందుకంటే యెహోవాకు యాజక సేవ చేయడమే వారి వారసత్వము. గాదు, రూబేను, మనష్షే అర్థగోత్రం ఇప్పటికే యొర్దాను తూర్పు వైపున వారి వారసత్వాన్ని పొందారు. యెహోవా సేవకుడైన మోషే దానిని వారికి ఇచ్చాడు.”
JOS 18:8 మనుష్యులు భూమిని పరిశీలించడానికి బయలుదేరేటప్పుడు యెహోషువ వారికి, “మీరు వెళ్లి భూమిని పరిశీలించి దాని వివరాలు వ్రాసి నా దగ్గరకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో యెహోవా సన్నిధిలో మీ కోసం చీట్లు వేస్తాను” అని చెప్పాడు.
JOS 18:9 ఆ మనుష్యులు అక్కడినుండి బయలుదేరి దేశమంతా తిరిగి ఏడు భాగాలుగా పట్టణాలవారీగా దాని వివరాలను ఒక గ్రంథపుచుట్ట మీద వ్రాసి, షిలోహులోని శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు.
JOS 18:10 యెహోవా ఎదుట షిలోహులో యెహోషువ వారి కోసం చీట్లు వేసి, ఇశ్రాయేలు ప్రజలకు వారి గోత్రాల విభజనల ప్రకారం ఆ దేశాన్ని పంచిపెట్టాడు.
JOS 18:11 బెన్యామీను గోత్రానికి వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. వారికి కేటాయించబడిన భూభాగం యూదా, యోసేపు గోత్రాల మధ్య ఉంది.
JOS 18:12 ఉత్తరాన వారి సరిహద్దు యొర్దాను నది దగ్గర మొదలై యెరికోకు ఉత్తరంగా వెళ్లి పడమర వైపుకు కొండ సీమగుండా వెళ్లి, బేత్-ఆవెను అడవి వరకు ఉంది.
JOS 18:13 అక్కడినుండి అది లూజు అనే బేతేలుకు దక్షిణంగా సాగి క్రింది బేత్-హోరోనుకు దక్షిణంగా ఉన్న కొండ దగ్గర అతారోత్-అద్దారు వరకు వెళ్లింది.
JOS 18:14 అక్కడినుండి దక్షిణాన బేత్-హోరోనుకు ఎదురుగా ఉన్న కొండ నుండి పడమటి దిక్కున దక్షిణంగా సాగి యూదా వారి పట్టణమైన కిర్యత్-బయలు అనే కిర్యత్-యారీము దగ్గర అంతమయ్యింది. ఇది పడమటి సరిహద్దు.
JOS 18:15 దక్షిణ సరిహద్దు కిర్యత్-యారీము పొలిమేర నుండి మొదలై పడమటి వైపున నెఫ్తోవ నీళ్ల ఊట వరకు వెళ్లింది.
JOS 18:16 ఆ సరిహద్దు రెఫాయీము లోయకు ఉత్తరాన బెన్ హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ దిగువకు వెళ్లింది. ఇది హిన్నోము లోయ నుండి యెబూసీయుల పట్టణపు దక్షిణ వాలు వెంబడి ఎన్-రోగేలు వరకు కొనసాగింది.
JOS 18:17 అది ఉత్తరం వైపుకు తిరిగి, ఎన్-షెమెషుకు వెళ్లి, అదుమ్మీము కనుమకు ఎదురుగా ఉన్న గెలీలోతు వరకు కొనసాగింది. రూబేను కుమారుడైన బోహాను రాయి దగ్గరకు వెళ్లింది.
JOS 18:18 ఇది బేత్-అరాబా యొక్క ఉత్తర వాలు వరకు అరాబా క్రింది వరకు కొనసాగింది.
JOS 18:19 అది బేత్-హొగ్లా ఉత్తర వాలుకు వెళ్లి దక్షిణాన యొర్దాను ముఖద్వారం దగ్గర మృత సముద్రపు ఉత్తర అఖాతం దగ్గరకు వచ్చింది. ఇది దక్షిణ సరిహద్దు.
JOS 18:20 తూర్పు వైపున యొర్దాను సరిహద్దుగా ఉంది.
JOS 18:21 వారి వారి వంశాల ప్రకారం బెన్యామీను గోత్రం వారి పట్టణాలివి: యెరికో, బేత్-హొగ్లా, యెమెక్-కెసీసు,
JOS 18:22 బేత్-అరాబా, సెమరాయిము, బేతేలు
JOS 18:23 ఆవీము, పారా, ఒఫ్రా
JOS 18:24 కెఫార్-అమ్మోని, ఓఫ్ని, గెబా అనేవి పన్నెండు పట్టణాలు వాటి గ్రామాలు.
JOS 18:25 గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే,
JOS 18:26 మిస్పే, కెఫీరా, మోసా,
JOS 18:27 రేకెము, ఇర్పెయేలు, తరలా,
JOS 18:28 సేలా ఎలెపు, యెబూసి పట్టణం (యెరూషలేము) గిబియా, కిర్యత్ అనేవి పద్నాలుగు పట్టణాలు వాటి గ్రామాలు,
JOS 19:1 రెండవ చీటి షిమ్యోను గోత్రానికి దాని వంశాల ప్రకారం వచ్చింది. వారి వారసత్వం యూదా భూభాగంలో ఉంది.
JOS 19:2 వారి వారసత్వంలో ఇవి కూడా ఉన్నాయి: బెయేర్షేబ (లేదా షేబ), మొలాదా,
JOS 19:3 హజర్-షువలు, బాలా, ఎజెము,
JOS 19:4 ఎల్తోలదు, బేతూలు, హోర్మా,
JOS 19:5 సిక్లగు, బేత్-మర్కాబోతు, హజర్-సూసా,
JOS 19:6 బేత్-లెబయోతు, షారుహెను అనేవి మొత్తం పదమూడు పట్టణాలు, వాటి గ్రామాలు,
JOS 19:7 ఆయిను, రిమ్మోను, ఎతెరు, ఆషాను, మొత్తం నాలుగు పట్టణాలు, వాటి గ్రామాలు.
JOS 19:8 ఈ పట్టణాల చుట్టూరా బాలత్-బెయేరు (దక్షిణాన ఉన్న రామా) వరకు ఉన్న గ్రామాలన్నీ.
JOS 19:9 యూదా వాటా వారికి ఎక్కువగా ఉన్నందున షిమ్యోనీయుల వారసత్వం యూదా వాటా నుండి తీసుకోబడింది. కాబట్టి షిమ్యోనీయులు యూదా భూభాగంలో తమ వారసత్వాన్ని పొందారు.
JOS 19:10 మూడవ చీటి జెబూలూనుకు దాని వంశాల ప్రకారం వచ్చింది: వారి వారసత్వపు సరిహద్దు శారీదు వరకు వెళ్లింది.
JOS 19:11 అది పడమటి వైపుగా మరాలా వరకు వెళ్లి దబ్బేషేతును తాకి, యొక్నీము సమీపంలోని లోయవరకు విస్తరించింది.
JOS 19:12 ఇది శారీదు నుండి సూర్యోదయం వైపు కిస్లోత్-తాబోరు భూభాగానికి తూర్పుగా తిరిగి దాబెరతు, యాఫీయా వరకు వెళ్లింది.
JOS 19:13 తర్వాత తూర్పు వైపు గాత్-హెఫెరు, ఎత్ కాజీను వరకు కొనసాగింది; అది రిమ్మోను దగ్గరకు వచ్చి నేయా వైపు తిరిగింది.
JOS 19:14 అక్కడ సరిహద్దు ఉత్తరాన హన్నాతోను వరకు వెళ్లి ఇఫ్తా ఎల్ లోయ దగ్గర ముగిసింది.
JOS 19:15 కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదాలా, బేత్లెహేము అనే పన్నెండు పట్టణాలు, వాటి గ్రామాలు ఉన్నాయి.
JOS 19:16 ఈ పట్టణాలు, వాటి గ్రామాలు జెబూలూనుకు దాని వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి.
JOS 19:17 నాల్గవ చీటి వారి వంశాల ప్రకారం ఇశ్శాఖారుకు వచ్చింది.
JOS 19:18 వారి భూభాగంలో ఇవి ఉన్నాయి: యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము
JOS 19:19 హపరాయిము, షీయోను, అనహరాతు,
JOS 19:20 రబ్బీతు, కిష్యోను, ఎబెస్
JOS 19:21 రెమెతు, ఎన్-గన్నీము, ఎన్-హద్దా, బేత్-పస్సెసు ఉన్నాయి.
JOS 19:22 దాని సరిహద్దు తాబోరు, షహజుమా, బేత్-షెమెషులను తాకి యొర్దాను నది దగ్గర ముగిసింది. పదహారు పట్టణాలు, వాటి గ్రామాలు ఉన్నాయి.
JOS 19:23 ఈ పట్టణాలు, వాటి గ్రామాలు ఇశ్శాఖారు గోత్రానికి వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి.
JOS 19:24 అయిదవ చీటి వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రానికి వచ్చింది.
JOS 19:25 వారి సరిహద్దులో హెల్కతు, హలి, బెతెను, అక్షఫు,
JOS 19:26 అలమ్మేలెకు, అమాదు, మిషాలు ఉన్నాయి. పడమరగా ఆ సరిహద్దు కర్మెలు షీహోర్ లిబ్నాతు వరకు ఉంది.
JOS 19:27 అది తూర్పున బేత్-దాగోను వైపు తిరిగి, జెబూలూను, ఇఫ్తా ఎల్ లోయను తాకి, ఉత్తరాన బేత్-ఎమెకు, నెయీయేలులకు వెళ్లి ఎడమవైపున కాబూల్ దాటింది.
JOS 19:28 అది మహా సీదోను వరకు అబ్దోను, రెహోబు, హమ్మోను, కానా వరకు వెళ్లింది.
JOS 19:29 ఆ సరిహద్దు రామా వైపు తిరిగి, కోటగోడలు గల పట్టణమైన తూరుకు వెళ్లి, హోసా వైపు తిరిగి, అక్సీబు ప్రాంతంలోని మధ్యధరా సముద్రం దగ్గరకు వచ్చింది.
JOS 19:30 ఉమ్మా, ఆఫెకు, రెహోబు కూడా వారి ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం ఇరవై రెండు పట్టణాలు, వాటి గ్రామాలు.
JOS 19:31 ఈ పట్టణాలు వాటి గ్రామాలు ఆషేరు గోత్రానికి వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి.
JOS 19:32 ఆరో చీటి వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రానికి వచ్చింది.
JOS 19:33 వారి సరిహద్దు హెలెఫు జయనన్నీములోని సింధూర వృక్షం నుండి అదామి నెకెబు, జబ్నీలులను దాటి లక్కూముకు వెళ్లి యొర్దాను దగ్గర ముగిసింది.
JOS 19:34 దాని సరిహద్దు పశ్చిమాన అస్నోత్-తాబోరు గుండా వెళ్లి హుక్కోకు దగ్గరకు వచ్చింది. అది దక్షిణాన జెబూలూను, పశ్చిమాన ఆషేరు, యూదా, తూర్పున యొర్దాను తాకింది.
JOS 19:35 కోటగోడలు గలవారి పట్టణాలు: జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు,
JOS 19:36 అదామా, రామా, హాసోరు,
JOS 19:37 కెదెషు, ఎద్రెయీ, ఎన్-హాసోరు,
JOS 19:38 ఇరోను, మిగ్దల్-ఏలు, హొరేము, బేత్-అనాతు, బేత్-షెమెషు, పందొమ్మిది పట్టణాలు, వారి గ్రామాలు.
JOS 19:39 వారి వంశాల ప్రకారం నఫ్తాలి గోత్రికులు వారసత్వంగా పొందిన పట్టణాలు వాటి గ్రామాలు ఇవి.
JOS 19:40 ఏడవ చీటి వారి వంశాల ప్రకారం దాను గోత్రానికి వచ్చింది.
JOS 19:41 వారి వారసత్వం సరిహద్దు జోరహు, ఎష్తాయోలు ఈర్-షెమెషు,
JOS 19:42 షయల్బీను, అయ్యాలోను, ఇత్లా,
JOS 19:43 ఎలోను, తిమ్నా, ఎక్రోను,
JOS 19:44 ఎల్తెకే, గిబ్బెతోను, బాలతు,
JOS 19:45 యెహూదు, బెనె-బెరకు, గాత్-రిమ్మోను,
JOS 19:46 మే-యర్కోను, రక్కోను, యొప్ప ముందున్న ప్రాంతం.
JOS 19:47 కానీ దాను గోత్రం వారి భూమిని స్వాధీనం చేసుకోవడంలో ఇబ్బంది పడింది, కాబట్టి వారు లెషెము పట్టణంపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకుని, దాని ప్రజలను చంపి అక్కడ స్థిరపడ్డారు. వారు తమ పూర్వికుల పేరు మీదుగా పట్టణానికి దాను అని పేరు పెట్టారు.
JOS 19:48 వారి వంశాల ప్రకారం దాను గోత్రికులు వారసత్వంగా పొందిన పట్టణాలు, వాటి గ్రామాలు ఇవి.
JOS 19:49 వారు సరిహద్దుల ప్రకారం ఆ దేశాన్ని పంచి ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు వారసత్వాన్ని ఇచ్చారు.
JOS 19:50 వారు యెహోవా ఆజ్ఞను అనుసరించి యెహోషువ అడిగిన ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని తిమ్నాత్ సెరహు అనే ఊరు అతనికిచ్చారు. అతడా ఊరిని కట్టించి అక్కడ నివసించాడు.
JOS 19:51 యాజకుడైన ఎలియాజరు, నూను కమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు ప్రజల గోత్రాల వంశాల నాయకులు షిలోహులో యెహోవా ఎదుట సమావేశ గుడారం ద్వారం దగ్గర చీట్లు వేసి పంచి ఇచ్చిన వారసత్వ భూములివి. ఈ విధంగా వారు భూమిని పంచిపెట్టడం ముగించారు.
JOS 20:1 అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పారు:
JOS 20:2 “నేను మోషే ద్వారా మీకు సూచించినట్లు ఆశ్రయ పట్టణాలను నియమించమని ఇశ్రాయేలీయులకు చెప్పు,
JOS 20:3 తద్వార, ఎవరైనా ఒక వ్యక్తిని తెలియక పొరపాటున చంపితే అక్కడికి పారిపోయి ఆ హత్యకు చేసే ప్రతీకారం నుండి ఆశ్రయం పొందవచ్చు.
JOS 20:4 వారు ఈ పట్టణాల్లో ఒక దానికి పారిపోయినప్పుడు, వారు నగర ద్వారం దగ్గర నిలబడి, ఆ పట్టణపు పెద్దల ముందు తమ వాదనను తెలియజేయాలి. అప్పుడు పెద్దలు పారిపోయినవారిని తమ పట్టణంలోకి చేర్చి, వారి మధ్య నివసించడానికి ఒక స్థలాన్ని ఇవ్వాలి.
JOS 20:5 హత్యకు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి వెంబడిస్తూ వస్తే ఆ పెద్దలు వానికి పారిపోయి వచ్చిన వ్యక్తిని అప్పగించకూడదు. ఎందుకంటే పారిపోయిన వ్యక్తి తన పొరుగువారిని అనుకోకుండ చంపాడు కాని పగతో కాదు.
JOS 20:6 వారు సమాజం ముందు విచారణ జరిగే వరకు, ఆ సమయంలో సేవ చేస్తున్న ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఆ పట్టణంలోనే ఉండాలి. తర్వాత వారు తాము పారిపోయి వచ్చిన పట్టణంలోని తమ సొంత ఇంటికి తిరిగి వెళ్లవచ్చు.”
JOS 20:7 కాబట్టి వారు నఫ్తాలి కొండ సీమలోని గలిలయలో ఉన్న కెదెషును, ఎఫ్రాయిం కొండ సీమలోని షెకెమును, యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) ప్రత్యేకపరిచారు.
JOS 20:8 యొర్దానుకు తూర్పున (యెరికో నుండి అవతలి వైపు) వారు రూబేను గోత్రంలో పీఠభూమిలోని అరణ్యంలో బేసెరును, గాదు గోత్రంలో గిలాదులోని రామోతును, మనష్షే గోత్రంలో బాషానులోని గోలానును నిర్ణయించారు.
JOS 20:9 ఇశ్రాయేలీయులలో ఎవరైనా లేదా వారిలో నివసించే విదేశీయులెవరైనా అనుకోకుండ ఎవరినైనా చంపితే వారు ఈ నిర్ణయించబడిన పట్టణాలకు పారిపోవచ్చు, సమాజం ముందు విచారణ జరిగే వరకు రక్తపు పగతో చంపబడరు.
JOS 21:1 తర్వాత లేవీయుల కుటుంబ పెద్దలు కనానులోని షిలోహులో ఉన్న యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువను ఇశ్రాయేలులోని ఇతర గోత్రాల కుటుంబాల పెద్దలను కలిసి,
JOS 21:2 వారితో కనానులోని షిలోహులో వారితో, “మీరు మా పశువులకు పచ్చికబయళ్లతో పాటు మాకు నివసించడానికి పట్టణాలు ఇవ్వమని మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించారు” అన్నారు.
JOS 21:3 కాబట్టి, యెహోవా ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు తమ సొంత వారసత్వంలో నుండి ఈ క్రింది పట్టణాలను, పచ్చికబయళ్లను లేవీయులకు ఇచ్చారు:
JOS 21:4 కహాతీయులకు వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. యాజకుడైన అహరోను సంతతివారైన లేవీయులకు యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.
JOS 21:5 మిగిలిన కహాతు సంతతివారికి ఎఫ్రాయిం, దాను, మనష్షే అర్థ గోత్రాల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు ఇచ్చారు.
JOS 21:6 గెర్షోను సంతతివారికి ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులోని మనష్షే అర్థ గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.
JOS 21:7 మెరారి సంతతివారికి వారి వంశాల ప్రకారం, రూబేను, గాదు, జెబూలూను గోత్రాల నుండి పన్నెండు పట్టణాలు కేటాయించారు.
JOS 21:8 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లుగా ఇశ్రాయేలీయులు లేవీయులకు చీట్ల ద్వారా ఈ పట్టణాలను, వాటి పచ్చికబయళ్లను కేటాయించారు.
JOS 21:9 వారు యూదా, షిమ్యోను గోత్రాల నుండి క్రింద చెప్పిన పట్టణాలను కేటాయించారు.
JOS 21:10 లేవీయులైన కహాతీయుల వంశాల్లోని అహరోను సంతతివారికి ఈ క్రింది పట్టణాలు కేటాయించారు, ఎందుకంటే మొదటి చీటి వారికి పడింది:
JOS 21:11 వారు యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) దాని చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో పాటు వారికి ఇచ్చారు. (అర్బా అనాకు పితరుడు.)
JOS 21:12 అయితే వారు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలను, గ్రామాలను స్వాస్థ్యంగా ఇచ్చారు.
JOS 21:13 కాబట్టి యాజకుడైన అహరోను సంతతివారికి హెబ్రోను (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), లిబ్నా,
JOS 21:14 యత్తీరు, ఎష్తెమోవా,
JOS 21:15 హోలోను, దెబీరు,
JOS 21:16 ఆయిను, యుత్తా, బేత్-షెమెషు వాటి పచ్చికబయళ్లతో పాటు, ఈ రెండు గోత్రాల నుండి తొమ్మిది పట్టణాలిచ్చారు.
JOS 21:17 బెన్యామీను గోత్రం నుండి వారికి ఇచ్చినవి: గిబియోను, గెబా,
JOS 21:18 అనాతోతు, అల్మోను వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.
JOS 21:19 అహరోను సంతతివారైన యాజకులకు పచ్చికబయళ్లతో పాటు ఇచ్చిన పట్టణాలు మొత్తం పదమూడు.
JOS 21:20 లేవీయులైన కహాతీయుల వంశాలలో మిగిలిన వారికి ఎఫ్రాయిం గోత్రం నుండి కేటాయించిన పట్టణాలు:
JOS 21:21 ఎఫ్రాయిం కొండ సీమలో వారికి ఇచ్చినవి: షెకెము (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), గెజెరు,
JOS 21:22 కిబ్సాయిము, బేత్-హోరోను, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.
JOS 21:23 దాను గోత్రం నుండి వారికి ఇచ్చినవి: ఎల్తెకే, గిబ్బెతోను,
JOS 21:24 అయ్యాలోను, గాత్-రిమ్మోను వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.
JOS 21:25 మనష్షే అర్థగోత్రం నుండి వారికి ఇచ్చినవి: తానాకు, గాత్-రిమ్మోను, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం రెండు పట్టణాలు.
JOS 21:26 ఈ పది పట్టణాలు, వాటి పచ్చికబయళ్లు మిగిలిన కహాతీయుల వంశాలకు ఇచ్చారు.
JOS 21:27 గెర్షోనీయుల లేవీ గోత్ర వంశాలకు ఇచ్చినవి: మనష్షే అర్థగోత్రం నుండి: బాషానులోని గోలాను (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), బే యెష్తెరా, వాటి పచ్చికబయళ్లతో పాటు రెండు పట్టణాలు;
JOS 21:28 ఇశ్శాఖారు గోత్రం నుండి: కిష్యోను, దాబెరతు,
JOS 21:29 యర్మూతు, ఎన్-గన్నీము దాని పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;
JOS 21:30 ఆషేరు గోత్రం నుండి: మిషాలు, అబ్దోను,
JOS 21:31 హెల్కతు రెహోబు, వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;
JOS 21:32 నఫ్తాలి గోత్రం నుండి: గలిలయలోని కెదెషు (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), హమ్మోత్-దోరు, కర్తాను, వారి పచ్చికబయళ్లతో పాటు మూడు పట్టణాలు.
JOS 21:33 గెర్షోనీయుల వంశాల పట్టణాల సంఖ్య, వాటి పచ్చికబయళ్లతో కలిపి మొత్తం పదమూడు.
JOS 21:34 మెరారీయ వంశాలకు (లేవీయులలో మిగిలిన వారు) ఇచ్చారు: జెబూలూను గోత్రం నుండి: యొక్నీము, కర్తా,
JOS 21:35 దిమ్న, నహలాలు వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;
JOS 21:36 రూబేను గోత్రం నుండి: బేసెరు, యహజు,
JOS 21:37 కెదేమోతు, మెఫాతు, వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;
JOS 21:38 గాదు గోత్రం నుండి: గిలాదులో ఉన్న రామోతు (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), మహనయీము,
JOS 21:39 హెష్బోను, యాజెరు, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.
JOS 21:40 లేవీయులలో మిగిలిన వారైన మెరారి వంశాలకు కేటాయించిన పట్టణాల సంఖ్య మొత్తం పన్నెండు.
JOS 21:41 ఇశ్రాయేలీయుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని లేవీయుల పట్టణాలు వాటి పచ్చికబయళ్లతో కలిపి మొత్తం నలభై ఎనిమిది.
JOS 21:42 ఈ పట్టణాలన్నిటి చుట్టూ పచ్చికబయళ్లు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటికి అలాగే ఉన్నాయి.
JOS 21:43 కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయులకు వారి పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశమంతా ఇచ్చారు, వారు దానిని స్వాధీనం చేసుకుని అక్కడ స్థిరపడ్డారు.
JOS 21:44 యెహోవా వారి పూర్వికులతో ప్రమాణం చేసినట్లే వారికి అన్నివైపులా విశ్రాంతిని ఇచ్చారు. వారి శత్రువులలో ఒక్కరు కూడా ఇశ్రాయేలీయులకు ఎదురు నిలబడలేకపోయారు; యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించారు.
JOS 21:45 ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మంచి వాగ్దానాలలో నెరవేరకుండా ఒక్కటి కూడా లేదు; ప్రతి ఒక్కటి నెరవేరింది.
JOS 22:1 అప్పుడు యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రం వారిని పిలిపించి,
JOS 22:2 వారితో, “యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేశారు, నేనిచ్చిన ప్రతి ఆజ్ఞకు లోబడ్డారు.
JOS 22:3 చాలా కాలం క్రితం నుండి నేటి వరకు మీరు మీ తోటి ఇశ్రాయేలీయులను విడిచిపెట్టకుండా మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించారు.
JOS 22:4 ఇప్పుడు మీ దేవుడైన యెహోవా తాను వాగ్దానం చేసినట్లు వారికి విశ్రాంతిని ఇచ్చారు కాబట్టి, యొర్దాను అవతలి వైపున యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన దేశంలోని మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి.
JOS 22:5 అయితే మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఆజ్ఞలను పాటించి ఆయనను గట్టిగా అంటిపెట్టుకుని ఆయనను సేవించమని యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన ఆజ్ఞను, ధర్మశాస్త్రాన్ని పాటించేలా జాగ్రత్త వహించాలి” అని చెప్పాడు.
JOS 22:6 అప్పుడు యెహోషువ వారిని ఆశీర్వదించి పంపివేశాడు. వారు తమ ఇళ్ళకు వెళ్లిపోయారు.
JOS 22:7 (మోషే మనష్షే అర్థగోత్రానికి బాషానులో భూమిని ఇచ్చాడు, యెహోషువ మిగిలిన అర్థగోత్రానికి వారి తోటి ఇశ్రాయేలీయులతో పాటు యొర్దానుకు పశ్చిమాన భూమిని ఇచ్చాడు.) యెహోషువ వారిని ఇంటికి పంపినప్పుడు, అతడు వారిని ఆశీర్వదిస్తూ,
JOS 22:8 వారితో, “మీ గొప్ప సంపదతో, పెద్ద పశువుల మందలతో, వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, విస్తారమైన దుస్తులతో మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి. మీ శత్రువుల నుండి దోచుకున్న సొమ్మును మీ తోటి ఇశ్రాయేలీయులతో పంచుకోండి” అని చెప్పాడు.
JOS 22:9 కాబట్టి రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలీయులను కనానులోని షిలోహులో విడిచిపెట్టి, మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తమ సొంత దేశమైన గిలాదుకు తిరిగి వచ్చారు.
JOS 22:10 వారు కనాను దేశంలోని యొర్దానుకు సమీపంలో ఉన్న గెలీలోతుకు వచ్చినప్పుడు, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు యొర్దాను ప్రక్కన ఒక పెద్ద బలిపీఠాన్ని కట్టారు.
JOS 22:11 రూబేనీయులు గాదీయులు మనష్షే అర్థగోత్రపు వారు కనాను సరిహద్దులో యొర్దాను దగ్గర గెలీలోతు దగ్గర బలిపీఠాన్ని కట్టారని ఇశ్రాయేలీయులు విన్నప్పుడు,
JOS 22:12 ఇశ్రాయేలీయులందరు వారితో యుద్ధం చేయడానికి షిలోహులో సమావేశమయ్యారు.
JOS 22:13 కాబట్టి ఇశ్రాయేలీయులు యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును గిలాదు దేశంలో ఉన్న రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రాల వారి దగ్గరకు పంపారు.
JOS 22:14 ఇశ్రాయేలీయుల గోత్రాల్లో ప్రతీదాని నుండి ఒకరు చొప్పున, ఇశ్రాయేలీయుల వంశాలలో తమ పితరుల కుటుంబాలకు నాయకులుగా ఉన్న పదిమందిని అతనితో పాటు పంపారు.
JOS 22:15 గిలాదులో ఉన్న రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారి దగ్గరకు వెళ్లి వారితో ఇలా అన్నారు:
JOS 22:16 “యెహోవా సమాజమంతా ఇలా అన్నారు: ‘మీరు ఇశ్రాయేలు దేవుని పట్ల నమ్మకద్రోహం ఎలా చేస్తారు? మీరు యెహోవాను విడిచిపెట్టి ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఇప్పుడు బలిపీఠాన్ని ఎలా కట్టుకోగలరు?
JOS 22:17 పెయోరులో చేసిన పాపం మనకు సరిపోదా? యెహోవా సమాజం మీదికి తెగులు వచ్చినా, ఈ రోజు వరకు ఆ పాపం నుండి మనం శుద్ధి చేసుకోలేదు!
JOS 22:18 ఇప్పుడు మీరు యెహోవా నుండి దూరంగా వెళ్తున్నారా? “ ‘మీరు ఈ రోజు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే, రేపు ఆయన ఇశ్రాయేలు సమాజమంతటి మీద కోప్పడతారు.
JOS 22:19 మీరు స్వాధీనం చేసుకున్న భూమి అపవిత్రంగా ఉంటే, యెహోవా సమావేశ గుడారం ఉన్న యెహోవా దేశానికి వచ్చి, ఆ దేశాన్ని మాతో పంచుకోండి. కాని మన దేవుడైన యెహోవా బలిపీఠం కాకుండా మీ కోసం ఒక బలిపీఠాన్ని కట్టుకుని యెహోవా మీద గాని మామీద గాని తిరుగుబాటు చేయవద్దు.
JOS 22:20 ప్రతిష్ఠించబడిన వాటి విషయంలో జెరహు కుమారుడైన ఆకాను నమ్మకద్రోహం చేసినప్పుడు, ఇశ్రాయేలు సమాజమంతటిపై ఉగ్రత రాలేదా? అతని పాపానికి అతడు ఒక్కడే చనిపోలేదు.’ ”
JOS 22:21 అప్పుడు రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలు వంశ పెద్దలకు ఇలా జవాబిచ్చారు:
JOS 22:22 “శక్తిమంతుడైన యెహోవా దేవుడు! శక్తిమంతుడైన దేవుడు యెహోవా! అది ఆయనకు తెలుసు! ఇశ్రాయేలుకు తెలియనివ్వండి! ఇది యెహోవా పట్ల ద్రోహంతో గాని తిరుగుబాటుతో గాని చేసివుంటే ఈ రోజు మమ్మల్ని రక్షించవద్దు.
JOS 22:23 యెహోవాను విడిచిపెట్టి దహనబలులు భోజనార్పణలు సమాధానబలులు అర్పించడానికి మేము సొంత బలిపీఠాన్ని కట్టుకున్నట్లయితే, యెహోవాయే స్వయంగా మమ్మల్ని లెక్క అడుగుతారు.
JOS 22:24 “నిజమేమిటంటే, భవిష్యత్తులో మీ సంతతివారు మా సంతతివారితో, ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించడానికి మీకు ఏం హక్కు ఉంది?
JOS 22:25 రూబేనీయులారా, గాదీయులారా, యెహోవా మాకు మీకు మధ్య యొర్దానును సరిహద్దుగా చేశారు! యెహోవాలో మీకు వాటా లేదు’ అని అంటారేమో! మీ సంతతివారు మా సంతతివారిని యెహోవాకు భయపడకుండా చేస్తారేమో!
JOS 22:26 “అందుకే మేము, ‘మనం బలిపీఠం కట్టడానికి సిద్ధపడదాం రండి, అయితే అది దహనబలులు బలులు అర్పించడం కోసం కాదు’ అని అనుకున్నాము.
JOS 22:27 మనం దహనబలులు బలులు సమాధాన బలులతో యెహోవాను ఆయన పరిశుద్ధాలయంలో ఆరాధించాలని చెప్పడానికి అది మాకు మీకు తర్వాతి తరాల వారికి మధ్య సాక్షిగా ఉండాలి. అప్పుడు భవిష్యత్తులో మీ సంతతివారు మా సంతతివారితో, ‘మీకు యెహోవాలో వాటా లేదు’ అని అనలేరు.
JOS 22:28 “మేము, ‘వారు ఎప్పుడైనా మాతో గాని మా వారసులతో గాని ఒకవేళ అంటే, మా పూర్వికులు కట్టిన యెహోవా బలిపీఠం ప్రతిరూపాన్ని చూడండి; దహనబలులు బలులు అర్పించడం కోసం కాదు; అది మీకు మాకు మధ్య సాక్షిగా ఉండాలని కట్టారు’ అని చెప్పాలని అనుకున్నాము.
JOS 22:29 “మన దేవుడైన యెహోవా సమావేశ గుడారం ఎదుట దహనబలులు, భోజనార్పణలు, అర్పణల కొరకైన బలిపీఠం కాక మరొక బలిపీఠం కట్టి, నేడు యెహోవాను విడిచిపెట్టి ఆయన మీద తిరుగుబాటు చేయడం మాకు దూరమవును గాక.”
JOS 22:30 యాజకుడైన ఫీనెహాసు, సమాజ నాయకులు అనగా ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు రూబేను, గాదు, మనష్షే చెప్పింది విని సంతోషించారు.
JOS 22:31 యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు రూబేను, గాదు, మనష్షేలతో ఇలా అన్నాడు, “ఈ విషయంలో మీరు యెహోవాకు నమ్మకద్రోహం చేయలేదు కాబట్టి యెహోవా మనతో ఉన్నాడని ఈ రోజు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మీరు ఇశ్రాయేలీయులను యెహోవా చేతిలో నుండి రక్షించారు.”
JOS 22:32 అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు, నాయకులు గిలాదులోని రూబేనీయులు, గాదీయులను కలిసి కనానుకు తిరిగివచ్చి ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని చెప్పారు.
JOS 22:33 ఇశ్రాయేలీయులు ఆ వార్త విని సంతోషించి దేవున్ని స్తుతించారు. రూబేనీయులు, గాదీయులు నివసించిన దేశాన్ని నాశనం చేయడానికి వారిపై యుద్ధానికి వెళ్లడం గురించి వారు ఇక మాట్లాడలేదు.
JOS 22:34 రూబేనీయులు, గాదీయులు యెహోవాయే దేవుడు అనడానికి ఈ బలిపీఠమే సాక్ష్యం అని చెప్పి దానికి ఏద్ అని పేరు పెట్టారు.
JOS 23:1 యెహోవా ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి వారికి విశ్రాంతిని ఇచ్చారు. అప్పటికి యెహోషువ చాలా వృద్ధుడయ్యాడు.
JOS 23:2 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరిని అనగా వారి పెద్దలను, నాయకులను, న్యాయాధిపతులను, అధికారులను పిలిచి వారితో ఇలా అన్నాడు: “నేను చాలా వృద్ధుడనయ్యాను.
JOS 23:3 మీ దేవుడైన యెహోవా మీ కోసం ఈ దేశాలన్నిటికి చేసినదంతా మీరే చూశారు. మీ కోసం పోరాడినది మీ దేవుడైన యెహోవాయే.
JOS 23:4 నేను జయించిన దేశాలతో పాటు పశ్చిమాన యొర్దాను మధ్యధరా సముద్రం మధ్య మిగిలి ఉన్న దేశాల భూమిని మీ గోత్రాలకు వారసత్వంగా ఎలా కేటాయించానో గుర్తుచేసుకోండి.
JOS 23:5 మీ కోసం మీ దేవుడైన యెహోవా వారిని బయటకు వెళ్లగొడతారు. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసినట్టు ఆయన మీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టినప్పుడు మీరు వారి దేశాన్ని స్వాధీనపరచుకుంటారు.
JOS 23:6 “దృఢంగా ఉండండి; మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా జాగ్రత్తగా పాటించండి.
JOS 23:7 మీ మధ్య ఉన్న ఈ దేశాలతో సహవాసం చేయవద్దు; వారి దేవతల పేర్లు ఎత్తవద్దు; వాటిపై ప్రమాణం చేయవద్దు. మీరు వాటిని సేవించవద్దు లేదా వాటికి నమస్కరించవద్దు.
JOS 23:8 అయితే మీరు ఇప్పటివరకు ఉన్నట్లే మీ దేవుడైన యెహోవాను గట్టిగా పట్టుకుని ఉండాలి.
JOS 23:9 “యెహోవా మీ ఎదుట నుండి శక్తివంతమైన దేశాలను వెళ్లగొట్టారు; ఈ రోజు వరకు ఎవరూ మీ ముందు నిలబడలేకపోతున్నారు.
JOS 23:10 మీ దేవుడైన యెహోవా తాను వాగ్దానం చేసినట్లుగా మీ కోసం పోరాడుతున్నారు కాబట్టి మీలో ఒకడు వెయ్యిమందిని ఓడించాడు.
JOS 23:11 కాబట్టి మీ దేవుడైన యెహోవాను ప్రేమించడంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
JOS 23:12 “అయితే మీరు వెనక్కి తిరిగి, మీ మధ్య మిగిలి ఉన్న ఈ దేశాల్లో జీవించి ఉన్నవారితో పొత్తు పెట్టుకుని, మీరు వారిని పెళ్ళి చేసుకుని, వారితో సహవాసం చేస్తే,
JOS 23:13 మీ దేవుడైన యెహోవా ఇకపై ఈ దేశాలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టడని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానికి బదులుగా, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగా, ఉచ్చులుగా, మీ వీపుపై కొరడాలుగా, మీ కళ్లల్లో ముళ్ళుగా మారుతారు.
JOS 23:14 “ఇప్పుడు మనుష్యులందరు వెళ్లే మార్గంలోనే నేను వెళ్లబోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మంచి వాగ్దానాలలో ఒక్కటి కూడా విఫలం కాలేదని మీ హృదయాలకు మనస్సులకు తెలుసు. ప్రతి వాగ్దానం నెరవేరింది; ఒక్కటి కూడా విఫలం కాలేదు.
JOS 23:15 అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్ని మీకు నెరవేరినట్లే, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మిమ్మల్ని నాశనం చేసే వరకు ఆయన చెప్పిన కీడునంతా మీ మీదికి రప్పిస్తారు.
JOS 23:16 మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన నిబంధనను పాటించకుండా, ఇతర దేవుళ్ళను సేవించి వాటికి నమస్కరిస్తే, యెహోవా కోపం మీపై రగులుకుంటుంది. ఆయన మీకు ఇచ్చిన మంచి దేశంలో నుండి మీరు త్వరగా నశించిపోతారు.”
JOS 24:1 తర్వాత యెహోషువ ఇశ్రాయేలు గోత్రాలన్నిటిని షెకెములో సమావేశపరిచాడు. అతడు ఇశ్రాయేలు పెద్దలను, నాయకులను, న్యాయాధిపతులను, అధికారులను పిలిపించాడు, వారు వచ్చి దేవుని ముందు నిలబడ్డారు.
JOS 24:2 యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘చాలా కాలం క్రితం అబ్రాహాము, నాహోరుల తండ్రియైన తెరహుతో సహా మీ పూర్వికులు యూఫ్రటీసు నది అవతల నివసించి ఇతర దేవుళ్ళను ఆరాధించారు.
JOS 24:3 అయితే నేను మీ తండ్రి అబ్రాహామును యూఫ్రటీసు అవతల ఉన్న దేశం నుండి తీసుకువచ్చి కనానుకు నడిపించి, అతనికి చాలామంది సంతానాన్ని ఇచ్చాను. అయితే నేను అతనికి ఇస్సాకును ఇచ్చాను,
JOS 24:4 ఇస్సాకుకు యాకోబును, ఏశావును ఇచ్చాను. నేను శేయీరు కొండ ప్రాంతాన్ని ఏశావుకు స్వాధీనపరచుకోడానికి ఇచ్చాను, అయితే యాకోబు, అతని కుటుంబం ఈజిప్టుకు వెళ్లిపోయారు.
JOS 24:5 “ ‘నేను మోషే అహరోనులను పంపి, అక్కడ నేను చేసిన కార్యాలతో ఈజిప్టువారిని బాధపెట్టి, మిమ్మల్ని బయటకు రప్పించాను.
JOS 24:6 నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి రప్పించినప్పుడు మీరు సముద్రం దగ్గరకు వచ్చారు. ఈజిప్టువారు రథాలతో, గుర్రాలతో ఎర్ర సముద్రం వరకు వారిని వెంటాడారు.
JOS 24:7 అయితే వారు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టగా ఆయన మీకు, ఈజిప్టువారికి మధ్య చీకటిని కలిగించి, సముద్రాన్ని వారి మీదికి తెచ్చి వారిని కప్పివేశారు. నేను ఈజిప్టువారికి ఏమి చేశానో మీరు మీ కళ్లతో చూశారు. అప్పుడు మీరు చాలా కాలం అరణ్యంలో నివసించారు.
JOS 24:8 “ ‘యొర్దానుకు తూర్పు వైపున ఉండే అమోరీయుల దేశానికి మిమ్మల్ని తీసుకువచ్చినప్పుడు వారు మీతో యుద్ధం చేశారు గాని, నేను వారిని మీ చేతికప్పగించాను. నేను వారిని మీ ముందు ఉండకుండా నాశనం చేయగా మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
JOS 24:9 మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలుతో యుద్ధానికి సిద్ధపడి మిమ్మల్ని శపించమని బెయోరు కుమారుడైన బిలామును పిలిపించాడు.
JOS 24:10 అయితే నేను బిలాము మాట వినలేదు కాబట్టి అతడు మిమ్మల్ని పదే పదే ఆశీర్వదించాడు. నేను మిమ్మల్ని అతని చేతిలో నుండి విడిపించాను.
JOS 24:11 “ ‘తర్వాత మీరు యొర్దాను దాటి యెరికోకు వచ్చారు. యెరికోకు యజమానులైన అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులతో కలిసి యెరికో ప్రజలు కూడా మీతో పోరాడారు, కాని నేను వారిని మీ చేతికి అప్పగించాను.
JOS 24:12 నేను కందిరీగలను మీకు ముందుగా పంపాను. అవే ఇద్దరు అమోరీయుల రాజులను మీ ముందు నుండి తరిమివేశాయి. అంతేకాని మీ ఖడ్గం కాదు మీ విల్లు కాదు.
JOS 24:13 కాబట్టి మీరు కష్టపడని దేశాన్ని, మీరు కట్టని పట్టణాలను నేను మీకు ఇచ్చాను. మీరు వాటిలో నివసిస్తున్నారు. మీరు నాటని ద్రాక్షతోటలు, ఒలీవతోటల నుండి పండ్లు తింటున్నారు.’
JOS 24:14 “ఇప్పుడు యెహోవాకు భయపడి పూర్తి నమ్మకత్వంతో ఆయనను సేవించండి. యూఫ్రటీసు నది అవతల, ఈజిప్టులో మీ పూర్వికులు పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను సేవించండి.
JOS 24:15 అయితే యెహోవాను సేవించడం మీకు అయిష్టంగా అనిపిస్తే మీరు ఎవరిని సేవించాలో, యూఫ్రటీసు నది అవతల మీ పూర్వికులు సేవించిన దేవుళ్ళను సేవించాలో లేదా మీరు నివసిస్తున్న అమోరీయుల దేశంలోని దేవుళ్ళను సేవించాలో ఈ రోజు ఎంచుకోండి. అయితే నేనూ, నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము.”
JOS 24:16 అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవించడం మాకు దూరమవును గాక!
JOS 24:17 మమ్మల్ని, మా తల్లిదండ్రులను దాస్య దేశమైన ఈజిప్టు నుండి రప్పించి, మన కళ్లముందు ఆ గొప్ప సూచకక్రియలను చేసింది మన దేవుడైన యెహోవాయే. మా మొత్తం ప్రయాణంలో, మేము ప్రయాణించిన అన్ని దేశాల మధ్య ఆయన మమ్మల్ని రక్షించాడు.
JOS 24:18 ఆ దేశంలో నివసించే అమోరీయులతో సహా ప్రజలందరినీ యెహోవా మన ముందు వెళ్లగొట్టారు. కాబట్టి మేము కూడా యెహోవానే సేవిస్తాం, ఎందుకంటే ఆయనే మన దేవుడు.”
JOS 24:19 యెహోషువ ప్రజలతో, “మీరు యెహోవాను సేవించలేరు. ఆయన పరిశుద్ధ దేవుడు; ఆయన రోషం గల దేవుడు. మీ తిరుగుబాటును, మీ పాపాలను ఆయన క్షమించడు.
JOS 24:20 ఒకవేళ మీరు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను సేవిస్తే, ఆయన మీకు మేలు చేసినట్టే మీ మీదికి కీడు తెచ్చి మిమ్మల్ని నాశనం చేస్తారు.”
JOS 24:21 అయితే ప్రజలు యెహోషువతో, “లేదు! మేము యెహోవానే సేవిస్తాం” అన్నారు.
JOS 24:22 అప్పుడు యెహోషువ, “మీరు యెహోవాను సేవించడానికి ఎంచుకున్నందుకు మీకు మీరే సాక్షులు” అని అన్నాడు. అందుకు వారు, “అవును, మేము సాక్షులం” అని చెప్పారు.
JOS 24:23 “అలా అయితే, ఇప్పుడు మీ మధ్యనున్న ఇతర దేవుళ్ళను పారవేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మీ హృదయాలను అప్పగించుకోండి” అని యెహోషువ చెప్పాడు.
JOS 24:24 ప్రజలు యెహోషువతో, “మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాం, ఆయనకే లోబడతాం” అన్నారు.
JOS 24:25 ఆ రోజున యెహోషువ ప్రజల కోసం ఒక ఒడంబడిక చేసి షెకెములో వారి కోసం శాసనాలను, చట్టాలను నియమించాడు.
JOS 24:26 యెహోషువ ఈ విషయాలను దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో నమోదు చేసి ఒక పెద్ద రాయిని తీసుకుని దానిని యెహోవా పవిత్ర స్థలం దగ్గర సింధూర వృక్షం క్రింద ప్రతిష్ఠించాడు.
JOS 24:27 యెహోషువ ప్రజలందరితో, “చూడండి! ఈ రాయి మనమీద సాక్షిగా ఉంటుంది. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ అది విన్నది. మీరు మీ దేవుని విడిచిపెడితే అది మీమీద సాక్ష్యంగా ఉంటుంది” అన్నాడు.
JOS 24:28 ఆ తర్వాత యెహోషువ ప్రజలను ఎవరి వారసత్వానికి వారిని పంపివేశాడు.
JOS 24:29 ఈ సంఘటనలు జరిగిన తర్వాత, నూను కుమారుడు, యెహోవా సేవకుడునైన యెహోషువ నూట పదేళ్ల వయస్సులో చనిపోయాడు.
JOS 24:30 ఎఫ్రాయిం కొండ ప్రాంతంలోని గాయషు పర్వతానికి ఉత్తరాన ఉన్న తిమ్నాత్ సెరహులో అతనికి వారసత్వంగా వచ్చిన దేశంలో వారు అతన్ని పాతిపెట్టారు.
JOS 24:31 యెహోషువ జీవించినంత కాలం, అతనికంటే ఎక్కువకాలం జీవించి యెహోవా ఇశ్రాయేలులో చేసిన ప్రతి కార్యాన్ని అనుభవించిన పెద్దలు ఉన్నంతకాలం ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను సేవించారు.
JOS 24:32 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో పాతిపెట్టారు. యాకోబు దానిని షెకెము తండ్రియైన హమోరు కుమారుల నుండి వంద వెండి నాణేలకు కొన్నాడు. ఇది యోసేపు వారసుల వారసత్వంగా మారింది.
JOS 24:33 అహరోను కుమారుడైన ఎలియాజరు చనిపోయినప్పుడు ఎఫ్రాయిం కొండసీమల్లో అతని కుమారుడైన ఫీనెహాసుకు ఇచ్చిన గిబియాలో వారతన్ని పాతిపెట్టారు.
JDG 1:1 యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు, “కనానీయులతో యుద్ధం చేయడానికి మాలో ఎవరు మొదట వెళ్లాలి?” అని యెహోవాను అడిగారు.
JDG 1:2 యెహోవా జవాబిస్తూ, “యూదా వారు వెళ్లాలి; నేను ఆ దేశాన్ని వారి చేతికి అప్పగించాను” అన్నారు.
JDG 1:3 యూదా గోత్రం వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోను గోత్రం వారితో, “మాకు కేటాయించబడిన భూభాగంలో ఉన్న కనానీయులతో యుద్ధానికి మాతో పాటు రండి. అలాగే మీతో పాటు మేము కూడా మీ భూభాగం కోసం వస్తాం” అన్నారు. కాబట్టి షిమ్యోనీయులు వారితో వెళ్లారు.
JDG 1:4 యూదా దాడి చేసినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీయులను వారి చేతికి అప్పగించారు; వారు బెజెకు దగ్గర పదివేలమంది పురుషులను హతం చేశారు.
JDG 1:5 వారు బెజెకు దగ్గర రాజైనా అదోని-బెజెకును చూసి అతనితో యుద్ధం చేసి కనానీయులను, పెరిజ్జీయులను ఓడించారు.
JDG 1:6 అదోని-బెజెకు పారిపోయినప్పుడు వారు అతన్ని తరిమి పట్టుకుని అతని కాలు చేతుల బొటన వ్రేళ్ళను కోసివేశారు.
JDG 1:7 అప్పుడు రాజైన అదోని-బెజెకు, “ఇలా కాలు చేతుల బొటన వ్రేళ్ళు కోయబడిన డెబ్బైమంది రాజులు నా బల్లక్రింద పడిన ముక్కలు ఏరుకునేవారు. నేను వారికి చేసిన దానికి దేవుడు నాకు తగిన ప్రతిఫలమిచ్చారు” అని అన్నాడు. వారు అతన్ని యెరూషలేముకు తీసుకువచ్చారు, అతడక్కడ చనిపోయాడు.
JDG 1:8 యూదా వారు యెరూషలేము మీద దాడి చేసి దానిని పట్టుకుని అక్కడి ప్రజలను ఖడ్గంతో చంపి, వారు పట్టణాన్ని కాల్చివేశారు.
JDG 1:9 ఆ తర్వాత యూదా వారు కొండ సీమలో, దక్షిణ దేశంలో, పశ్చిమ కొండ దిగువ ప్రాంతంలో ఉన్న కనానీయులతో పోరాడటానికి వెళ్లారు.
JDG 1:10 వారు గతంలో కిర్యత్-అర్బా అని పిలువబడిన హెబ్రోనులో ఉన్న కనానీయుల మీదికి వెళ్లి షేషయి అహీమాను తల్మయి అనే వారిని ఓడించారు.
JDG 1:11 అక్కడినుండి వారు గతంలో కిర్యత్-సెఫెరు అని పిలువబడిన దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద దాడి చేశారు.
JDG 1:12 కాలేబు, “కిర్యత్-సెఫెరు మీద దాడి చేసి స్వాధీనపరచుకున్న వ్యక్తికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్ళి చేస్తాను” అని అన్నాడు.
JDG 1:13 కాలేబు సోదరుడూ కెనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని స్వాధీనపరచుకున్నాడు; కాబట్టి కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్ళి చేశాడు.
JDG 1:14 ఒక రోజు ఆమె ఒత్నీయేలు దగ్గరకు వచ్చి తన తండ్రిని ఒక పొలం అడగమని అతన్ని కోరింది. ఆమె తన గాడిదను దిగినప్పుడు కాలేబు, “నేను నీకేమి చేయాలి?” అని ఆమెను అడిగాడు.
JDG 1:15 ఆమె జవాబిస్తూ, “నాకు ప్రత్యేక దీవెన కావాలి. నీవు నాకు దక్షిణం దేశంలో భూమి ఇచ్చావు, ఇప్పుడు నీటి ఊటలు కూడా ఇవ్వు” అని అన్నది. కాబట్టి కాలేబు ఆమెకు ఎగువ, దిగువ నీటి మడుగులను ఇచ్చాడు.
JDG 1:16 కెనీయుడైన మోషే మామ యూదా ప్రజలతో ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా ఎడారికి వెళ్లి అక్కడ ఉన్నవారితో నివసించారు.
JDG 1:17 తర్వాత యూదా వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోనీయులతో వెళ్లి జెఫతులో నివసిస్తున్న కనానీయులపై దాడి చేసి, పట్టణాన్ని పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి ఆ పట్టణానికి హోర్మా అని పేరు పెట్టారు.
JDG 1:18 యూదా వారు గాజాను అష్కెలోనును ఎక్రోనును ఈ పట్టణాల చుట్టూ ఉన్న ప్రదేశాలతో పాటు పట్టుకున్నారు.
JDG 1:19 యెహోవా యూదా మనుష్యులతో ఉన్నారు కాబట్టి వారు కొండ సీమను స్వాధీనం చేసుకున్నారు, కానీ మైదాన ప్రాంతాల్లో ఉన్న వారి దగ్గర ఇనుప రథాలు ఉండినందుకు వారిని తరుమలేకపోయారు.
JDG 1:20 మోషే వాగ్దానం చేసినట్లు కాలేబుకు హెబ్రోను ఇవ్వబడింది, అతడు అనాకు యొక్క ముగ్గురు కుమారులను తరిమేశాడు.
JDG 1:21 అయితే బెన్యామీను గోత్రం వారు యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను తరమలేదు; ఇప్పటివరకు యెబూసీయులు బెన్యామీనీయులతో కలిసి నివసిస్తున్నారు.
JDG 1:22 యోసేపు గోత్రాల వారు బేతేలుపై దాడి చేసినప్పుడు యెహోవా వారితో ఉన్నారు.
JDG 1:23 పూర్వం లూజు అని పిలువబడిన బేతేలును వేగుచూడటానికి వారు యోసేపు ఇంటివారు మనుష్యులను పంపినప్పుడు,
JDG 1:24 ఆ వేగులవారు ఆ పట్టణం నుండి ఒక వ్యక్తి రావడం చూసి అతనితో, “అయ్యా, దయచేసి పట్టణంలోకి ఎలా వెళ్లాలో మాకు చూపించు, మేము నీకు ఏదైనా ఉపకారం చేస్తాం” అని అన్నారు.
JDG 1:25 కాబట్టి అతడు చూపించాడు, వారు అతన్ని, అతని కుటుంబాన్నంతటిని వదిలి పట్టణస్థులందరిని ఖడ్గంతో హతం చేశారు.
JDG 1:26 తర్వాత ఆ వ్యక్తి హిత్తీయుల దేశానికి వెళ్లి, అక్కడ పట్టణం కట్టుకుని దానికి లూజు అనే పేరు పెట్టాడు. నేటి వరకు దాని పేరు అదే.
JDG 1:27 అయితే మనష్షే గోత్రం వారు బేత్-షానును తానాకును దోరును ఇబ్లెయామును మెగిద్దో ప్రజలను, వారి చుట్టూ ఉన్న స్థావరాలను వెళ్లగొట్టలేదు, ఎందుకంటే కనానీయులు అక్కడ నివసించడానికి గట్టిగా పట్టుపట్టారు.
JDG 1:28 ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకున్నారు కాని వారిని ఎప్పుడూ పూర్తిగా వెళ్లగొట్టలేదు.
JDG 1:29 ఎఫ్రాయిం గోత్రం వారు కూడా గెజెరులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు, కనానీయులు వారి మధ్యలోనే నివసించారు.
JDG 1:30 జెబూలూను గోత్రం వారు కూడా కిత్రోను నహలోలులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు, కాబట్టి కనానీయులు వారి మధ్యలోనే నివసించారు. అయితే జెబూలూనీయులు వారితో వెట్టిపనులు చేయించారు.
JDG 1:31 ఆషేరు గోత్రం వారు కూడా అక్కోను సీదోనును అహ్లాబును అక్సీబును హెల్బాను ఆఫెకును రెహోబును వెళ్లగొట్టలేదు.
JDG 1:32 ఆషేరీయులు వారిని వెళ్లగొట్టలేదు కాబట్టి వారు కనానీయ నివాసుల మధ్యలో నివసించారు.
JDG 1:33 నఫ్తాలి గోత్రం వారు కూడా బేత్-షెమెషును బేత్-అనాతులో ఉన్నవారిని వెళ్లగొట్టలేదు; నఫ్తాలీయులు కూడా కనానీయ నివాసుల మధ్యలో నివసించారు, బేత్-షెమెషులో, బేత్-అనాతులో ఉన్నవారు వారికి వెట్టిపనులు చేశారు.
JDG 1:34 అమోరీయులు దాను గోత్రం వారిని మైదానం దిగువకు రాకుండ కొండసీమ ప్రాంతానికి పరిమితం చేశారు.
JDG 1:35 అమోరీయులు హెరెసు పర్వతంలో, అయ్యాలోనులో, షయల్బీములో నివసించడానికి నిశ్చయించుకున్నారు, కానీ యోసేపు గోత్రాల బలం ఎక్కువైనప్పుడు, వారు అమోరీయులతో వెట్టిపనులు చేయించుకొన్నారు.
JDG 1:36 అమోరీయుల సరిహద్దు అక్రబ్బీం నుండి సెల వరకు విస్తరించింది.
JDG 2:1 యెహోవా దూత గిల్గాలు నుండి వెళ్లి బోకీముకు వెళ్లి ఇలా అన్నాడు, “నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి తీసుకువచ్చి మీ పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన వాగ్దాన దేశానికి మిమ్మల్ని నడిపించాను. ‘నేను మీతో చేసిన నా ఒడంబడికను ఎన్నడు మీరను,
JDG 2:2 మీరు ఈ దేశస్థులతో నిబంధన చేసుకోవద్దు, కాని వారి బలిపీఠాలను పడగొట్టాలి’ అని ఆజ్ఞ ఇచ్చాను. అయినా మీరు నా మాట వినలేదు. మీరెందుకు ఇలా చేశారు?
JDG 2:3 అంతేకాక నేను, ‘వారిని మీ ఎదుట నుండి తరమను; వారు మీకు ఉచ్చుగా ఉంటారు, వారి దేవుళ్ళు మీకు ఉరిగా మారుతారు’ అని చెప్పాను.”
JDG 2:4 యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ విషయాలు చెప్పినప్పుడు ప్రజలు బిగ్గరగా ఏడ్చారు,
JDG 2:5 ఆ స్థలానికి బోకీము అని పేరు పెట్టారు. అక్కడ యెహోవాకు బలులు అర్పించారు.
JDG 2:6 యెహోషువ ఇశ్రాయేలీయులను పంపించిన తర్వాత వారు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు తమ వారసత్వ స్థలాలకు వెళ్లారు.
JDG 2:7 యెహోషువ జీవించినంత కాలం, అతనికంటే ఎక్కువకాలం జీవించి యెహోవా ఇశ్రాయేలులో చేసిన గొప్ప కార్యాల గురించి తెలిసిన పెద్దలు ఉన్నంతకాలం ప్రజలు యెహోవాను సేవించారు.
JDG 2:8 యెహోవా సేవకుడు, నూను కుమారుడైన యెహోషువ నూటపది సంవత్సరాల వయస్సుగలవాడై చనిపోయాడు.
JDG 2:9 వారు అతన్ని గాయషు పర్వతానికి ఉత్తర దిక్కున ఉన్న ఎఫ్రాయిం కొండ సీమలో ఉన్న తిమ్నత్ హెరెసు అనే తన వారసత్వ భూమిలో పాతిపెట్టారు.
JDG 2:10 ఆ తరమంతా తమ పూర్వికుల దగ్గరకు చేర్చబడిన తర్వాత యెహోవాను, ఆయన ఇశ్రాయేలు కోసం చేసిన కార్యాలు తెలియని వేరే తరం మొదలైంది.
JDG 2:11 ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో చెడు కార్యాలు చేసి బయలు దేవుళ్లను పూజించారు.
JDG 2:12 వారు తమను ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన తమ పూర్వికుల దేవుడైన యెహోవాను తిరస్కరించారు. తమ చుట్టూ ఉన్న జనాంగాల దేవుళ్ళను వెంబడించి పూజించారు. వారు యెహోవాకు కోపం రప్పించారు.
JDG 2:13 వారు యెహోవాను విడిచి, బయలు అష్తారోతు ప్రతిమలను సేవించారు.
JDG 2:14 యెహోవా ఇశ్రాయేలుపై కోపం వచ్చి, వారిని దోచుకునేవారి చేతికి అప్పగించారు. ఆయన వారి చుట్టూ ఉన్న శత్రువుల చేతికి వారిని అమ్మివేశారు, వారు ఆ శత్రువుల ఎదుట నిలువలేకపోయారు.
JDG 2:15 ఇశ్రాయేలు పోరాడడానికి వెళ్లినప్పుడు, యెహోవా వారికి ప్రమాణం చేసినట్టు వారిని ఓడించడానికి ఆయన హస్తం వారికి విరుద్ధంగా ఉండేది. వారు ఎంతో బాధపడ్డారు.
JDG 2:16 అప్పుడు యెహోవా న్యాయాధిపతులను పుట్టించారు. కాబట్టి వారు దోచుకునేవారి చేతిలో నుండి వారిని కాపాడారు.
JDG 2:17 అయినప్పటికీ వారు న్యాయాధిపతుల మాట వినక ఇతర దేవుళ్ళతో వ్యభిచారం చేసి వాటిని పూజించారు. యెహోవా ఆజ్ఞలకు విధేయులైన తమ పూర్వికుల మార్గాల నుండి వారు వెంటనే తప్పిపోయారు.
JDG 2:18 యెహోవా వారి కోసం న్యాయాధిపతిని పుట్టించినప్పుడు, ఆయన ఆ న్యాయాధిపతితో ఉంటూ, అతడు జీవించినంత కాలం వారిని తమ శత్రువుల చేతిలో నుండి రక్షించారు; ఎందుకంటే శత్రువులు వారిని అణచివేస్తూ బాధిస్తుండగా యెహోవా వారి వేదన చూసి జాలిపడ్డారు.
JDG 2:19 అయితే న్యాయాధిపతి చనిపోయిన తర్వాత, ప్రజలు ఇతర దేవుళ్ళను సేవిస్తూ పూజిస్తూ తమ పూర్వికులకంటే మరి ఎక్కువ చెడు మార్గాల్లో నడిచారు. వారి చెడు విధానాలు, మొండి మార్గాలు విడవడాన్ని తిరస్కరించారు.
JDG 2:20 కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయులపై చాలా కోప్పడి, “ఈ ప్రజలు నేను వారి పూర్వికులతో చేసిన నా నిబంధనను మీరి నా మాట వినలేదు కాబట్టి,
JDG 2:21 యెహోషువ చనిపోయినప్పుడు అతడు జయించకుండా మిగిలిన ఏ జనాన్నైనా వారి ఎదుట నుండి నేను వెళ్లగొట్టను.
JDG 2:22 ఇశ్రాయేలీయులు తమ పూర్వికులు జీవించిన ప్రకారం యెహోవా మార్గాలను పాటిస్తారో లేదో అని పరీక్షించడానికి ఆ జనులను వాడుకుంటాను” అన్నారు.
JDG 2:23 ఆ కారణంగానే ఆ జనులను యెహోవా యెహోషువ చేతికి అప్పగించి వెంటనే వెళ్లగొట్టకుండా వారిని ఉండనిచ్చారు.
JDG 3:1 కనానులో యుద్ధాలను అనుభవించని ఆ ఇశ్రాయేలీయులందరిని పరీక్షించడానికి యెహోవా విడిచిపెట్టిన దేశాలు ఇవి
JDG 3:2 ఆయన యుద్ధం చేసే పూర్వ అనుభవంలేని ఇశ్రాయేలీయుల సంతానానికి యుద్ధం నేర్పించడానికి మాత్రమే ఇలా చేశారు:
JDG 3:3 ఫిలిష్తీయుల అయిదుగురు పరిపాలకులు, కనానీయులందరూ, సీదోనీయులు, బయల్-హెర్మోను నుండి లెబో హమాతు వరకు ఉన్న లెబానోను పర్వతాల్లో ఉండే హివ్వీయులు.
JDG 3:4 యెహోవా మోషే ద్వారా వారి పూర్వికులకు ఇచ్చిన ఆజ్ఞలు వారు అనుసరిస్తారో లేదో చూడడానికి ఇశ్రాయేలీయులను పరీక్షించడానికి వారు అక్కడ ఉంచబడ్డారు.
JDG 3:5 కాబట్టి ఇశ్రాయేలీయులు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయుల మధ్యలో నివసించారు.
JDG 3:6 వారు వారి కుమార్తెలను పెళ్ళి కోసం తీసుకుని తమ కుమార్తెలను వారి కుమారులకు ఇచ్చారు, వారి దేవుళ్ళను సేవించారు.
JDG 3:7 ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో చెడు కార్యాలు చేశారు; తమ దేవుడైన యెహోవాను మరచి బయలు అషేరా ప్రతిమలను సేవించారు.
JDG 3:8 యెహోవా కోపం ఇశ్రాయేలుపై మీద రగులుకున్నందుకు ఆయన వారిని అరాము నహరయీము రాజైన కూషన్-రిషాతాయిముకు వారిని అమ్మేశారు, అతనికి వారు ఎనిమిది సంవత్సరాలు దాసులుగా ఉన్నారు.
JDG 3:9 అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన వారి కోసం రక్షకునిగా కాలేబు తమ్ముడైన కెనజు కుమారుడైన ఒత్నీయేలును నియమించారు, అతడు వారిని రక్షించాడు.
JDG 3:10 యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందుకు అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటూ యుద్ధానికి వెళ్లాడు. యెహోవా ఒత్నీయేలు చేతికి అరాము రాజైన కూషన్-రిషాతాయిమును అప్పగించారు, అతడు అతన్ని ఓడించాడు.
JDG 3:11 కాబట్టి కెనజు కుమారుడైన ఒత్నీయేలు చనిపోయే వరకు నలభై సంవత్సరాలు దేశం సమాధానంతో ఉంది.
JDG 3:12 ఇశ్రాయేలీయులు మరలా యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, వారు చెడు కార్యాలు చేసినందుకు యెహోవా మోయాబు రాజైన ఎగ్లోనుకు ఇశ్రాయేలుపై బలం ఇచ్చారు.
JDG 3:13 అతడు అమ్మోనీయులను అమాలేకీయులను పోగుచేసుకుని ఇశ్రాయేలీయులను ఓడించి ఖర్జూర చెట్ల పట్టణాన్ని స్వాధీనపరచుకున్నాడు.
JDG 3:14 ఇశ్రాయేలీయులు పద్దెనిమిది సంవత్సరాలు మోయాబు రాజైన ఎగ్లోనుకు దాసులుగా ఉన్నారు.
JDG 3:15 మరలా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు, ఆయన బెన్యామీనీయుడైన గెరా కుమారుడు, ఎడమ చేతివాటం గలవాడైన ఏహూదును రక్షకునిగా వారి కోసం నియమించారు. అతన్ని ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు పన్ను చెల్లించడానికి పంపారు.
JDG 3:16 ఏహూదు మూరెడు పొడవు ఉన్న రెండంచుల ఖడ్గాన్ని చేసికొని దానిని కుడి తొడకు కట్టుకుని తన బట్టలు క్రింద కప్పుకున్నాడు.
JDG 3:17 అతడు ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు చెల్లించాడు; ఎగ్లోను చాలా లావుపాటి మనిషి.
JDG 3:18 ఏహూదు కప్పము చెల్లించిన తర్వాత దానిని మోసిన మనుష్యులను పంపించేశాడు.
JDG 3:19 గిల్గాలు దగ్గరున్న రాతి ప్రతిమల దగ్గరకు వచ్చిన తర్వాత అతడు తిరిగి ఎగ్లోను దగ్గరకు వెళ్లి, “రాజా, మీకు ఒక రహస్య సందేశం చెప్పాలి” అని అన్నాడు. రాజు తన సేవకులతో, “మమ్మల్ని విడిచి వెళ్లండి!” అని చెప్పాడు, వారందరు వెళ్లిపోయారు.
JDG 3:20 అతడు తన రాజభవనంలో మేడ గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు ఏహూదు అతన్ని సమీపించి, “నా దగ్గర దేవుని నుండి మీకొక సందేశం ఉంది” అని అన్నాడు. రాజు తన సింహాసనం మీద నుండి లేస్తున్నప్పుడు,
JDG 3:21 ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ ఖడ్గాన్ని తీసి రాజు పొట్టలో పొడిచాడు.
JDG 3:22 ఖడ్గం పిడి కూడ పొట్టలోనికి వెళ్లింది. ఏహూదు ఖడ్గాన్ని బయటకు లాగలేదు, ఖడ్గం పైనుండి క్రొవ్వు చుట్టుకుంది.
JDG 3:23 అప్పుడు ఏహూదు వాకిలి వైపు వెళ్లి తన వెనుక ఆ మేడగది తలుపులు వేసి వాటికి తాళం వేశాడు.
JDG 3:24 అతడు వెళ్లిన తర్వాత సేవకులు వచ్చి మేడగది తలుపులకు తాళం వేసి ఉందని చూశారు. వారు, “చల్లని గదిలో మూత్ర విసర్జనకు వెళ్లాడేమో” అనుకున్నారు.
JDG 3:25 వారు విసుగు చెందేటంత వేచి చూశారు, కాని అతడు తలుపులు తెరవలేదు కాబట్టి వారు ఒక తాళపుచెవితో తాళం తీశారు. అక్కడ తమ ప్రభువు నేలపై పడి చనిపోయి ఉండడం చూశారు.
JDG 3:26 వారు వేచి ఉన్నప్పుడు ఏహూదు వెళ్లిపోయాడు. అతడు రాతి ప్రతిమలను దాటి శేయీరాకు పారిపోయాడు.
JDG 3:27 అక్కడికి చేరినప్పుడు, అతడు వచ్చి ఎఫ్రాయిం కొండ సీమలో బూరను ఊదాడు, అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో కొండల దిగువకు వెళ్లారు, అతడు వారి నాయకుడయ్యాడు.
JDG 3:28 “నన్ను వెంబడించండి, యెహోవా మీ శత్రువైన మోయాబును మీ చేతికి అప్పగించారు” అని అతడు ఆదేశించాడు. కాబట్టి వారతన్ని వెంబడించి, మోయాబు వైపు నడిపించే యొర్దాను రేవులను స్వాధీనపరచుకున్నారు; ఏ ఒక్కరినైన దాటి వెళ్లడానికి వారు అనుమతించలేదు.
JDG 3:29 ఆ సమయంలో వారు శూరులైన బలమైన పదివేలమంది మోయాబీయులను హతం చేశారు; ఏ ఒక్కరు తప్పించుకోలేదు.
JDG 3:30 ఆ రోజు మోయాబీయులను ఇశ్రాయేలీయులు పాలించారు, దేశము ఎనభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
JDG 3:31 ఏహూదు తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు వచ్చాడు, పశువులను తోలే ములుకోలుతో ఆరువందలమంది ఫిలిష్తీయులను హతం చేశాడు. అతడు కూడా ఇశ్రాయేలీయులను కాపాడాడు.
JDG 4:1 ఏహూదు మరణించిన తర్వాత ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు.
JDG 4:2 కాబట్టి యెహోవా వారిని హాసోరులో పరిపాలించే కనాను రాజైన యాబీను చేతికి అప్పగించారు. అతని సేనాధిపతి హరోషెత్-హగ్గోయిములో నివసించిన సీసెరా.
JDG 4:3 అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలున్నాయి, అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను క్రూరంగా హింసించాడు, కాబట్టి వారు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నారు.
JDG 4:4 ఆ కాలంలో లప్పీదోతు భార్యయైన దెబోరా అనే ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది.
JDG 4:5 ఆమె ఎఫ్రాయిం కొండ సీమలో రామాకు బేతేలుకు మధ్యనున్న దెబోరా ఖర్జూర చెట్టు క్రింద తీర్పులు తీర్చడానికి కూర్చుండేది, ఇశ్రాయేలీయులు వారి వివాదాలు పరిష్కరించుకోడానికి ఆమె దగ్గరకు వచ్చేవారు.
JDG 4:6 ఆమె నఫ్తాలిలోని కెదెషు నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలిపించి, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఇలా ఆజ్ఞాపిస్తున్నారు: ‘నీవు వెళ్లి నఫ్తాలి జెబూలూను గోత్రాల నుండి పదివేలమంది మనుష్యులను తాబోరు పర్వతం దగ్గరకు పిలిపించు.
JDG 4:7 యాబీను సేనాధిపతియైన సీసెరాను, అతని రథాలను, అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నడిపించి నీ చేతికి అతన్ని అప్పగిస్తాను.’ ”
JDG 4:8 బారాకు ఆమెతో, “నీవు నాతో వస్తే నేను వెళ్తాను నీవు రాకపోతే వెళ్లను” అన్నాడు.
JDG 4:9 అప్పుడు దెబోరా, “నీతో నేను తప్పకుండా వస్తాను, అయితే నీ ప్రయాణం వలన నీకు ఘనత రాదు, ఎందుకంటే యెహోవా ఒక స్త్రీకి సీసెరాను అప్పగిస్తారు” అని చెప్పి ఆమె బారాకుతో కలిసి కెదెషుకు వెళ్లింది.
JDG 4:10 బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది పురుషులు అతనితో వెళ్లారు. దెబోరా కూడా అతనితో వెళ్లింది.
JDG 4:11 కెనీయుడైన హెబెరు మోషే మామయైన హోబాబు సంతతివారైన వారైన కెనీయులను విడిచిపెట్టి కెదెషు దగ్గర ఉన్న జయనన్నీములోని మస్తకిచెట్టు దగ్గర తన గుడారం వేసుకున్నాడు.
JDG 4:12 అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు పర్వతం మీదికి వెళ్లాడని సీసెరాకు చెప్పినప్పుడు,
JDG 4:13 సీసెరా హరోషెత్-హగ్గోయిము నుండి కీషోను వాగువరకు తన సైన్యమంతటిని, తన తొమ్మిది వందల ఇనుప రథాలను పిలిపించుకున్నాడు.
JDG 4:14 అప్పుడు దెబోరా బారాకుతో, “వెళ్లు! ఈ రోజు యెహోవా నీ చేతికి సీసెరాను అప్పగించారు. యెహోవా నీకు ముందుగా వెళ్లలేదా?” అని అడిగినప్పుడు బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు పర్వతం నుండి దిగి వెళ్లాడు.
JDG 4:15 బారాకు దాడి చేసినప్పుడు యెహోవా సీసెరాను, అతని రథాలన్నిటిని, అతని సైన్యాన్ని ఖడ్గంతో హతం చేయగా సీసెరా తన రథాన్ని దిగి కాలినడకన పారిపోయాడు.
JDG 4:16 బారాకు ఆ రథాలను, సైన్యాన్ని హరోషెత్-హగ్గోయిము వరకు వెంటాడగా సీసెరా సైన్యమంతా ఖడ్గంతో చంపబడ్డారు; ఏ ఒక్కరు మిగల్లేదు.
JDG 4:17 హాసోరు రాజైన యాబీనుకు, కెనీయుడైన హెబెరు కుటుంబానికి మధ్య స్నేహబంధం ఉండేది కాబట్టి సీసెరా కాలినడకన కెనీయుడైన హెబెరు భార్యయైన యాయేలు గుడారానికి పారిపోయాడు.
JDG 4:18 యాయేలు సీసెరాను కలుసుకోడానికి బయటకు వెళ్లి, “నా ప్రభువా, లోనికి రండి. భయపడకండి” అని అన్నది. కాబట్టి అతడు గుడారంలోకి వెళ్లగా ఆమె దుప్పటితో అతన్ని కప్పింది.
JDG 4:19 “నాకు దాహంగా ఉంది, దయచేసి కొంచెం నీళ్లు ఇవ్వు” అని అతడు అన్నాడు. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతడు త్రాగడానికి ఇచ్చి అతన్ని తిరిగి కప్పింది.
JDG 4:20 అతడు ఆమెతో, “గుడార ద్వారం దగ్గర నిలబడు, ఎవరైనా వచ్చి, ‘లోపల ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు” అన్నాడు.
JDG 4:21 అయితే హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు సుత్తిని తీసుకుని, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని దగ్గరకు నెమ్మదిగా వెళ్లింది. ఆమె ఆ మేకును అతని కణతలలో నుండి నేలలోకి దిగగొట్టగా అతడు చనిపోయాడు.
JDG 4:22 అప్పుడు బారాకు సీసెరాను తరుముతూ వెళ్తునప్పుడు యాయేలు అతన్ని ఎదుర్కొని, “రండి, మీరు వెదుకుతున్న మనిషిని నేను చూపిస్తాను” అని అన్నది. అతడు ఆమెతో లోనికి వచ్చినప్పుడు, అక్కడ సీసెరా కణతలలో మేకుతో చచ్చి పడి ఉన్నాడు.
JDG 4:23 ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును ఓడించారు.
JDG 4:24 ఇశ్రాయేలీయులు కనాను రాజైన యాబీనును సంపూర్ణంగా నాశనం చేసే వరకు వారి హస్తం అంతకంతకు కఠినం అయ్యింది.
JDG 5:1 ఆ రోజు దెబోరా, అబీనోయము కుమారుడైన బారాకు ఈ పాట పాడారు:
JDG 5:2 ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు, ప్రజలు స్వచ్ఛందంగా అర్పించుకున్నప్పుడు, యెహోవాను స్తుతించండి!
JDG 5:3 రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి! నేను యెహోవాకు కీర్తన పాడతాను, నేను పాడతాను; ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తనలో స్తుతిస్తాను.
JDG 5:4 యెహోవా, మీరు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, మీరు ఎదోము ప్రాంతం నుండి బయలుదేరినప్పుడు, భూమి కంపించింది, ఆకాశం కుమ్మరించింది, మేఘాలు నీళ్లు కుమ్మరించాయి.
JDG 5:5 అద్వితీయుడైన యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎదుట సీనాయి కంపించింది.
JDG 5:6 అనాతు కుమారుడైన షమ్గరు రోజుల్లో, యాయేలు రోజుల్లో రాజమార్గాలు నిర్జనమయ్యాయి; ప్రయాణికులు ప్రక్క త్రోవల్లో నడిచారు.
JDG 5:7 ఇశ్రాయేలులో ఉన్న గ్రామస్థులు పోరాడలేరు; దెబోరా అనే నేను లేచేవరకు, ఇశ్రాయేలులో తల్లిగా నేను లేచేవరకు వారు వెనకడుగు వేశారు.
JDG 5:8 ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంచుకున్నారు, యుద్ధం పట్టణ ద్వారాల దగ్గరకు వచ్చింది, కాని నలభై వేలమంది ఇశ్రాయేలీయులలో ఒక డాలు గాని ఈటె గాని కనిపించలేదు.
JDG 5:9 నా హృదయం ఇశ్రాయేలు నాయకులతో, యుద్ధానికి స్వచ్ఛందంగా వచ్చిన వారితో ఉన్నది. యెహోవాను స్తుతించండి!
JDG 5:10 తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారలారా, తివాచీల మీద కూర్చునే వారలారా, త్రోవలో నడిచే వారలారా, ఇది గమనించండి!
JDG 5:11 పశువులు నీళ్లు త్రాగే చోట గాయకులు చేసే స్వరాన్ని వినండి. వారు యెహోవా నీతిక్రియల గురించి, ఇశ్రాయేలులో ఆయన యొక్క గ్రామస్థుల జయాల గురించి చెప్తున్నారు. “అప్పుడు యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల దగ్గరకు వెళ్లారు.
JDG 5:12 ‘మేలుకో, మేలుకో, దెబోరా! మేలుకో, మేలుకో, కీర్తన పాడు! బారాకూ లే! అబీనోయము కుమారుడా, చెరపట్టిన వారిని చెరపట్టు.’
JDG 5:13 “ప్రాణాలతో మిగిలిన అధిపతులు వచ్చారు; శూరులకు వ్యతిరేకంగా యెహోవా ప్రజలు నా దగ్గరకు వచ్చారు.
JDG 5:14 కొందరు అమాలేకులో స్థిరపడినవారు ఎఫ్రాయిం నుండి వచ్చారు; నీ వెంట వచ్చిన వారిలో బెన్యామీను వారు ఉన్నారు. మాకీరు నుండి అధిపతులు వచ్చారు, జెబూలూను నుండి అధికారుల దండం మోసేవారు వచ్చారు.
JDG 5:15 ఇశ్శాఖారు అధిపతులు దెబోరాతో ఉన్నారు; ఇశ్శాఖారు మనుష్యులు బారాకుతో ఉన్నారు, అతని ఆదేశాన్ని బట్టి లోయలోనికి పంపబడ్డారు. రూబేను ప్రాంతాల్లో తీవ్ర హృదయాన్వేషణ కలిగింది.
JDG 5:16 గొర్రెల మందల కోసం వేసే ఈలలు వినడానికి నీవెందుకు గొర్రెల దొడ్ల మధ్య ఉన్నావు? రూబేను ప్రాంతాల్లో తీవ్ర హృదయాన్వేషణ కలిగింది.
JDG 5:17 గిలాదువారు యొర్దాను అవతల నివసించారు. దానీయులు ఓడల దగ్గర ఎందుకు తిరుగుతున్నారు? ఆషేరీయులు సముద్రతీరాన తమ ఓడరేవుల్లో ఉన్నారు.
JDG 5:18 జెబూలూను ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టుకున్నారు; యుద్ధభూమిలో నఫ్తాలి ప్రజలు కూడా అలాగే చేశారు.
JDG 5:19 “రాజులు వచ్చారు, పోరాడారు, కనాను రాజులు పోరాడారు. మెగిద్దో జలాల దగ్గర ఉన్న తానాకులో వారు వెండిని దోచుకోలేదు.
JDG 5:20 నక్షత్రాలు ఆకాశం నుండి పోరాడాయి, తమ ఆకాశమార్గాల్లో నుండి సీసెరాతో విరుద్ధంగా పోరాడాయి.
JDG 5:21 కీషోను వాగు, పురాతన వాగు, కీషోను వాగు వారిని తుడిచి వేసింది. నా ప్రాణమా, బలం తెచ్చుకుని సాగిపో!
JDG 5:22 గుర్రాల డెక్కల శబ్దాలు దద్దరిల్లాయి, బలమైన గుర్రాలు వేగంగా దూసుకెళ్లాయి.
JDG 5:23 యెహోవా దూత, ‘మేరోసును శపించండి, దాని ప్రజలను తీవ్రంగా శపించండి. ఎందుకంటే యెహోవాకు సహాయంగా వారు రాలేదు, శక్తిగల శూరులకు విరుద్ధంగా యెహోవాకు సహాయంగా వారు రాలేదు’ అన్నారు.
JDG 5:24 “కెనీయుడైన హెబెరు భార్య యాయేలు, స్త్రీలలో ఎక్కువ దీవించబడుతుంది, గుడారాల్లో నివసించే స్త్రీలందరిలో ఎక్కువ దీవించబడుతుంది.
JDG 5:25 అతడు నీళ్లు అడిగాడు, ఆమె పాలు ఇచ్చింది; అధిపతుల పాత్రతో ఆమె అతనికి వెన్న తెచ్చి ఇచ్చింది.
JDG 5:26 ఆమె తన చేతితో గుడారపు మేకు కోసం చేయి చాచింది, పనివాని సుత్తి కోసం ఆమె కుడిచేయి చాచింది. ఆమె సీసెరాను కొట్టింది, ఆమె అతని తల చితక్కొట్టింది. ఆమె అతని తలను బద్దలు చేసింది.
JDG 5:27 ఆమె కాళ్ల దగ్గర అతడు కూలిపోయాడు, అతడు పడిపోయాడు; జీవం లేనట్లుగా పడి ఉన్నాడు, ఆమె కాళ్ల దగ్గర అతడు కూలిపోయాడు, అతడు పడిపోయాడు; అతడు కూలిపోయిన చోటులో పడి చనిపోయాడు.
JDG 5:28 “సీసెరా తల్లి కిటికీలో నుండి చూస్తూ ఉంది; అల్లిక కిటికీలో నుండి చూస్తూ ఏడుస్తుంది, ‘అతని రథం తిరిగి రావడానికి ఎందుకు ఇంత సమయం పడుతోంది? అతని రథాల చప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది?’
JDG 5:29 ఆమె దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన స్త్రీలు ఆమెకు జవాబిచ్చారు; నిజానికి, ఆమె తనకు తాను చెప్పుకుంటూనే ఉంటుంది.
JDG 5:30 ‘దోపుడుసొమ్ము వారికి దొరకలేదా, వారు పంచుకోలేదా: ప్రతి మనిషికి ఒకరు, లేదా ఇద్దరు స్త్రీలను తీసుకుంటారు, సీసెరాకు దోపుడు సొమ్ముగా రంగువేసిన వస్త్రాలు, కుట్టుపని చేసిన రంగుల వస్త్రాలు, వారి మెడలకు తగిన రెండు వైపులా రంగులు అద్దిన కుట్టుపని చేసిన వస్త్రాలు ఇదంతా దోపుడు సొమ్ముగా తీసుకోలేదా?’
JDG 5:31 “యెహోవా, మీ శత్రువులందరూ అలాగే నశించాలి! అయితే మిమ్మల్ని ప్రేమించే వారందరు తన బలంతో ఉదయించే సూర్యునిలా ఉండాలి.” తర్వాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
JDG 6:1 ఇశ్రాయేలీయులు యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, కాబట్టి యెహోవా వారిని ఏడు సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించారు.
JDG 6:2 మిద్యానీయులు తమను చాలా క్రూరంగా అణచివేయడంతో ఇశ్రాయేలీయులు తమ కోసం పర్వతాల్లో, గుహల్లో, బలమైన కోటలలో సురక్షితమైన స్థలాలు సిద్ధపరచుకున్నారు.
JDG 6:3 ఇశ్రాయేలీయులు పంటలు వేసినప్పుడు మిద్యానీయులు, అమాలేకీయులు, ఇతర తూర్పున ఉండే ప్రజలు ఆ దేశం మీద దాడి చేసేవారు.
JDG 6:4 వారికి ఎదురుగా గుడారాలు వేసుకుని గాజా వరకు పంటను పాడుచేసి ఇశ్రాయేలీయులకు ఒక గొర్రెను గాని, పశువును గాని, గాడిదను గాని మరి ఏ జీవిని విడిచిపెట్టలేదు.
JDG 6:5 వారు తమ పశువులతో, గుడారాలతో మిడతల దండులా వచ్చారు. వారిని, వారి ఒంటెలును లెక్కించడం అసాధ్యం; భూమిని నాశనం చేయడానికి దానిని ఆక్రమించుకున్నారు.
JDG 6:6 మిద్యానీయులు ఇశ్రాయేలీయులను ఎంతో బాధించారు కాబట్టి సహాయం కోసం వారు యెహోవాను వేడుకున్నారు.
JDG 6:7 మిద్యానును బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాను వేడుకున్నప్పుడు,
JDG 6:8 ఆయన వారి కోసం ఒక ప్రవక్తను పంపారు. అతడు ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: నేను బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చాను.
JDG 6:9 ఈజిప్టువారి చేతి నుండి మిమ్మల్ని రక్షించాను. మిమ్మల్ని బాధపెట్టిన వారందరి చేతిలో నుండి విడిపించాను; మీ ఎదుట నుండి వారిని తరిమేసి వారి దేశాన్ని మీకిచ్చాను.
JDG 6:10 నేను మీతో, ‘మీ దేవుడనైన యెహోవాను నేనే; మీరు నివసించే అమోరీయుల దేశంలో వారి దేవుళ్ళకు భయపడకూడదు’ అని చెప్పాను కాని మీరు నా మాట వినలేదు.”
JDG 6:11 యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకిచెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా ద్రాక్షగానుగ చాటున గోధుమలను దుళ్లగొడుతున్నాడు.
JDG 6:12 యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై, “పరాక్రమంగల యోధుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నారు” అన్నాడు.
JDG 6:13 అందుకు గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, ఒకవేళ యెహోవా మాకు తోడుంటే, ఇదంతా మాకెందుకు జరిగింది? మా పూర్వికులు, ‘యెహోవా ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకురాలేదా?’ అని చెప్పిన ఆ అద్భుతాలన్ని ఎక్కడా? కాని ఇప్పుడు యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించారు” అన్నాడు.
JDG 6:14 అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి అన్నారు, “నీకున్న బలంతో వెళ్లి మిద్యాను చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడు. నేనే కదా నిన్ను పంపిస్తుంది?”
JDG 6:15 గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, నేనెలా ఇశ్రాయేలును కాపాడగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో బలహీనమైనది, నా కుటుంబంలో నేను అందరికంటే చిన్నవాడను.”
JDG 6:16 యెహోవా అతనితో, “నేను నీతో ఉంటాను, నీవు ఒక్కడివే ఓడిస్తున్నట్టు మిద్యానీయులందరిని ఓడిస్తావు” అన్నారు.
JDG 6:17 అందుకు గిద్యోను అన్నాడు, “మీ దృష్టిలో నా పట్ల దయ ఉంటే, మీరు నిజంగా నాతో మాట్లాడుతున్నట్లు నాకొక గుర్తు ఇవ్వండి.
JDG 6:18 నేను తిరగి వచ్చి, నా అర్పణ తెచ్చి, మీ ముందు పెట్టే వరకు మీరు వెళ్లకండి.” అందుకు యెహోవా అన్నారు, “నీవు తిరిగి వచ్చేవరకు నేను ఇక్కడ ఉంటాను.”
JDG 6:19 గిద్యోను లోనికి వెళ్లి ఒక మేకపిల్లను సిద్ధపరచి, తూమెడు పిండితో పులియని రొట్టెల చేసి, మాంసాన్ని గంపలో, రసాన్ని కుండలో పెట్టుకొని తెచ్చి, మస్తకిచెట్టు క్రింద ఆయనకు అర్పించాడు.
JDG 6:20 దేవుని దూత అతనితో, “మాంసాన్ని, పులియని రొట్టెలను తీసుకుని ఈ రాతి మీద పెట్టి, ఆ రసం దాని మీద పోయి” అన్నాడు. గిద్యోను అలాగే చేశాడు.
JDG 6:21 అప్పుడు యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని కొనతో మాంసాన్ని ఆ పులియని రొట్టెలను తాకినప్పుడు, అగ్ని ఆ రాతిలో నుండి బయటకు వచ్చి ఆ మాంసాన్ని రొట్టెలను కాల్చివేసింది, యెహోవా దూత అదృశ్యం అయ్యాడు.
JDG 6:22 వెంటనే అతడు యెహోవా దూత అని గిద్యోను గ్రహించినప్పుడు, “అయ్యో, ప్రభువైన యెహోవా! నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూశాను!” అని ఆశ్చర్యపోయాడు.
JDG 6:23 అయితే యెహోవా అతనితో, “నీకు సమాధానం, భయపడకు. నీవు చావవు” అన్నారు.
JDG 6:24 కాబట్టి గిద్యోను అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దానికి యెహావా సమాధానకర్త అని పేరు పెట్టాడు. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.
JDG 6:25 ఆ రాత్రే యెహోవా అతనితో ఇలా అన్నారు, “నీ తండ్రి మందలో నుండి ఏడు సంవత్సరాల వయస్సున్న రెండవ కోడెను తీసుకో. నీ తండ్రి కట్టిన బయలు దేవత బలిపీఠాన్ని పడగొట్టు, దాని ప్రక్కనున్న అషేరా స్తంభాన్ని విరగ్గొట్టు.
JDG 6:26 తర్వాత ఈ దుర్గం పైన సరియైన విధంగా నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టు. నీవు విరగ్గొట్టిన అషేరా స్తంభం కర్రను వాడుతూ ఆ రెండవ కోడెను దహనబలిగా అర్పించు.”
JDG 6:27 కాబట్టి గిద్యోను తన సేవకులలో పదిమందిని తీసుకెళ్లి యెహోవా తనతో చెప్పింది చేశాడు. కాని తన కుటుంబానికి, నగర ప్రజలకు భయపడి పగటి వేళలో కాకుండా రాత్రి వేళలో చేశాడు.
JDG 6:28 ఉదయం ఆ నగర ప్రజలు లేచినప్పుడు పడిపోయిన బయలు బలిపీఠం, దాని ప్రక్కన విరిగిపోయిన అషేరా స్తంభం, క్రొత్తగా కట్టబడిన బలిపీఠం మీద రెండవ కోడె అర్పించబడి ఉండడం చూశారు.
JDG 6:29 వారు, “ఎవరు ఇది చేశారు?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. వారు జాగ్రతగా విచారణ చేసినప్పుడు, “యోవాషు కుమారుడైన గిద్యోను దానిని చేశాడు” అని వారికి తెలిసింది.
JDG 6:30 నగర ప్రజలు యోవాషుతో, “నీ కుమారుడు బయలు బలిపీఠాన్ని పడగొట్టి, దాని ప్రక్కనున్న అషేరా స్తంభాన్ని పడద్రోసాడు కాబట్టి అతడు చావాలి. అతన్ని బయటకు తీసుకురా” అన్నారు.
JDG 6:31 యోవాషు తన చుట్టూ చేరి గొడవ చేస్తున్న గుంపుతో, “మీరు బయలు పక్షాన ఉన్నారా? అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? వాని పక్షాన వాదించేవారు తెల్లవారక ముందే చావాలి! ఒకవేళ బయలు నిజంగా దేవుడైతే, ఎవరైనా తన బలిపీఠం పడగొట్టినప్పుడు తాను పోరాడతాడు కదా” అని చెప్పాడు.
JDG 6:32 గిద్యోను బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు కాబట్టి ఆ రోజున అతనికి యెరుబ్-బయలు అని పేరు పెట్టి, “బయలును అతనితో వాదించుకోని” అని అన్నారు.
JDG 6:33 మిద్యానీయులందరు, అమాలేకీయులందరు, ఇతర తూర్పున ఉన్న ప్రజలందరూ కలిసివచ్చి యొర్దాను దాటి యెజ్రెయేలు లోయలో బస చేశారు.
JDG 6:34 అప్పుడు యెహోవా ఆత్మ గిద్యోను మీదికి రాగా, అతడు బూర ఊది అబీయెజెరు వంశస్థులను తనను వెంబడించుమని పిలుపునిచ్చాడు.
JDG 6:35 అతడు మనష్షే వారి దగ్గరికి దూతను పంపి తనను కలవమని చెప్పాడు, అలాగే ఆషేరు, జెబూలూను, నఫ్తాలి వారి దగ్గరకు కూడా దూతలను పంపాడు.
JDG 6:36 గిద్యోను దేవునితో, “మీరు వాగ్దానం చేసినట్టు నా ద్వారా ఇశ్రాయేలును రక్షించాలనుకుంటే,
JDG 6:37 చూడండి, నేను నూర్పిడి కళ్ళం మీద గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడి నేలంతా పొడిగా ఉంటే, మీరు చెప్పినట్టు నా ద్వారా మీరు ఇశ్రాయేలును రక్షిస్తారని గ్రహిస్తాను” అన్నాడు.
JDG 6:38 అలాగే జరిగింది. గిద్యోను మరుసటిరోజు ప్రొద్దున లేచి ఆ బొచ్చు మీద ఉన్న మంచును పిండినప్పుడు ఓ పాత్ర నిండా నీళ్లు వచ్చాయి.
JDG 6:39 అప్పుడు గిద్యోను దేవునితో, “నా మీద కోప్పడకండి, ఇంకొక్కటే అడుగుతాను. గొర్రెబొచ్చుతో ఇంకొక పరీక్షకు నన్ను అనుమతించండి. అయితే ఈసారి గొర్రెబొచ్చు పొడిగా ఉండి నేలంతా మంచు పడాలి” అన్నాడు.
JDG 6:40 ఆ రాత్రి దేవుడు అలానే చేశారు. నేలంతా మంచు పడింది కాని బొచ్చు పొడిగా ఉంది.
JDG 7:1 అప్పుడు యెరుబ్-బయలు, అనగా గిద్యోను, అతని మనుష్యులందరు పెందలకడనే లేచి హరోదు బుగ్గ దగ్గర గుడారాలు వేసుకున్నారు. మిద్యానీయుల శిబిరం లోయలో మోరె కొండ దగ్గర వారికి ఉత్తరాన ఉంది.
JDG 7:2 యెహోవా గిద్యోనుతో, “నీతో ఎక్కువ మంది మనుష్యులు ఉన్నారు కాబట్టి నేను మిద్యానును వారి చేతులకు అప్పగించను. ఒకవేళ అప్పగిస్తే వారు, ‘మా బాహుబలమే మమ్మల్ని రక్షించింది’ అని ఇశ్రాయేలీయులు అతిశయిస్తారు.
JDG 7:3 కాబట్టి నీవు, ‘ఎవరు భయంతో వణకుతున్నారో, వారు వెంటనే గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవచ్చు అని ప్రకటించు’ ” అని చెప్పారు. అప్పుడు ఇరవైరెండువేలమంది తిరిగి వెళ్లిపోగా పదివేలమంది మిగిలారు.
JDG 7:4 మరల యెహోవా గిద్యోనుతో, “మనుష్యులు ఇంకా ఎక్కువే ఉన్నారు. వారిని నీళ్ల దగ్గరకు తీసుకెళ్లు అక్కడ నీకోసం వారిని పరీక్షిస్తాను. ‘ఇతడు నీతో వెళ్తాడు’ అని నేను చెప్తే అతడు వెళ్లాలి; ఒకవేళ ‘ఇతడు నీతో వెళ్లడు’ అని నేను చెప్తే అతడు వెళ్లకూడదు” అని ఆజ్ఞాపించారు.
JDG 7:5 కాబట్టి గిద్యోను మనుష్యులను నీళ్ల దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అక్కడ యెహోవా అతనితో, “కుక్క గతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికే వారిని త్రాగడానికి మోకాళ్లమీద ఉన్నవారిని వేరు చేయి” అన్నారు.
JDG 7:6 వారిలో చేతితో నోటికందించుకొని కుక్కల్లా గతికిన వారు మూడువందలమంది. మిగితా అందరు మోకాళ్లమీద వంగి నీళ్లు త్రాగారు.
JDG 7:7 అప్పుడు యెహోవా గిద్యోనుతో, “గతికిన మూడువందల మనుష్యులతో నేను మిమ్మల్ని రక్షించి, మిద్యానీయులను మీ చేతులకు అప్పగిస్తాను. మిగిలినవారం తిరిగి వెళ్లిపోవాలి” అని ఆజ్ఞాపించారు.
JDG 7:8 కాబట్టి గిద్యోను మిగితా ఇశ్రాయేలీయులను ఇంటికి పంపించాడు, అయితే మూడువందలమంది మనుష్యులు ఆహారాన్ని, బూరలను పట్టుకున్నారు. మిద్యాను దండు అతనికి క్రింద లోయలో దిగారు.
JDG 7:9 ఆ రాత్రి యెహోవా గిద్యోనుతో, “నీవు లేచి మిద్యాను దండుపై దాడి చేయి, నేను నీ చేతులకు వారిని అప్పగిస్తున్నాను.
JDG 7:10 ఒకవేళ దాడి చేయడానికి నీవు భయపడితే, నీ పనివాడైన పూరాయుతో వెళ్లు,
JDG 7:11 వారు ఏం చెప్పుకుంటున్నారో విను. తర్వాత దండుపై దాడి చేయడానికి నీకు ధైర్యం వస్తుంది” అన్నారు. కాబట్టి అతడు, అతని పనివాడైన పూరా ఆ పాళెంలో ఉన్న స్థావరాల దగ్గరకు వెళ్లారు
JDG 7:12 మిద్యానీయులు, అమాలేకీయులు, ఇతర తూర్పు జనాంగాలు లెక్కకు మిడతలవలె లోయలో విడిది చేశారు. వారి ఒంటెలు సముద్రతీరంలో ఇసుక రేణువుల్లా లెక్కించలేనంత ఉన్నాయి.
JDG 7:13 గిద్యోను వచ్చినప్పుడు ఒక వ్యక్తి తాను కనిన కలను తన స్నేహితునికి చెబుతూ, “నాకు ఒక కల వచ్చింది. గుండ్రని యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లుకుంటు వెళ్లి బలంగా గుడారానికి తగలగానే గుడారం తలక్రిందులై కూలిపోయింది” అని అన్నాడు.
JDG 7:14 అతని స్నేహితుడు జవాబిస్తూ, “అది ఇశ్రాయేలీయుడైనా యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని ఇంకొకటి కాదు. దేవుడు మిద్యానీయుల దండు అంతటిని అతని చేతులకు అప్పగించారు” అన్నాడు.
JDG 7:15 గిద్యోను ఆ కలను దాని భావాన్ని విని తలవంచి నమస్కరించి ఇశ్రాయేలు దండు దగ్గరకు తిరిగివెళ్లి, “లేవండి, యెహోవా మిద్యానీయుల సైన్యాన్ని మీకు అప్పగించారు” అని చెప్పాడు.
JDG 7:16 ఆ మూడువందల మందిని మూడు గుంపులుగా చేసి, వారందరి చేతుల్లో బూరను ఖాళీ కుండను, ప్రతి కుండలో దివిటీని పెట్టి ఇచ్చాడు.
JDG 7:17 గిద్యోను వారితో, “నన్ను గమనించి వెంబడించండి, నేను దండును సమీపించినప్పుడు నేను చేసినట్లే మీరూ చేయండి.
JDG 7:18 నేను, నాతో ఉన్నవారందరు మా బూరలు ఊదినప్పుడు, దండు చుట్టూ ఉన్న మీరు మీ బూరలు ఊదుతూ, ‘యెహోవా కోసం, గిద్యోను కోసం’ అంటూ కేకలు వేయండి.”
JDG 7:19 నడి జాము వేళ మొదటి జాము కావలివారు మారే సమయంలో గిద్యోను, అతనితో ఉన్న వందమంది దండును సమీపించారు. వారు బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగులగొట్టారు.
JDG 7:20 ఆ మూడు గుంపులవారు కూడా తమ బూరలను ఊది కుండలను పగులగొట్టారు. వారి ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో బూరలను పట్టుకుని, “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం!” అని కేకలు వేశారు.
JDG 7:21 దండు చుట్టూ ప్రతి మనుష్యుడు తన స్థానంలో ఉండగా మిద్యాను సైన్యం కేకలువేస్తూ పారిపోయింది.
JDG 7:22 మూడువందలమంది బూరలు ఊదినప్పుడు, యెహోవా ఆ దండులోని వారందరు తమ ఖడ్గాలతో ఒకరినొకరు చంపుకొనేలా చేశారు. ఆ సైన్యం సెరేరా వైపు ఉన్న బేత్-షిత్తాకు, తబ్బాతు దగ్గరున్న ఆబేల్-మెహోలా సరిహద్దు వరకు పారిపోయారు.
JDG 7:23 నఫ్తాలి, ఆషేరు, మనష్షే గోత్రాల నుండి పిలువబడిన ఇశ్రాయేలీయులు వచ్చి మిద్యానీయులను తరిమారు.
JDG 7:24 గిద్యోను ఎఫ్రాయిం కొండసీమ దేశమంతటికి దూతలను పంపి, “క్రిందికి రండి, మిద్యానీయులను జయించడానికి వచ్చి బేత్-బారా వరకు యొర్దాను నీళ్లను వారికి ముందున్న స్వాధీనపరచుకోండి” అని చెప్పాడు. కాబట్టి ఎఫ్రాయిం గోత్రికులందరు వచ్చి యొర్దాను నీళ్లను బేత్-బారా వరకు స్వాధీనపరచుకున్నారు.
JDG 7:25 వారు మిద్యాను నాయకుల్లో ఓరేబు, జెయేబు అనే ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబును చంపారు, జెయేబు ద్రాక్షతోట దగ్గర జెయేబును చంపారు. వారు మిద్యానీయులను వెంటాడి, యొర్దాను అవతల ఉన్న గిద్యోను దగ్గరకు ఓరేబు, జెయేబు తలలను తెచ్చారు.
JDG 8:1 అయితే ఎఫ్రాయిమీయులు, “నీవు మా పట్ల ఇలా ఎందుకు చేశావు? మిద్యానీయులతో యుద్ధం చెయ్యడానికి నీవు వెళ్లినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలువలేదు?” అని గిద్యోనుతో తీవ్రంగా వాదించారు.
JDG 8:2 అయితే అతడు, “మీతో పోల్చుకుంటే నేను సాధించింది ఏంటి? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా?
JDG 8:3 దేవుడు మిద్యానీయుల నాయకులైన ఓరేబు, జెయేబులను మీకు అప్పగించారు. మీతో పోల్చుకుంటే నేనేమి చేయగలిగాను?” అని అన్నాడు. అతడు అలా చెప్పినప్పుడు అతని మీద వారి కోపం తగ్గింది.
JDG 8:4 గిద్యోను, అతనితో ఉన్న మూడువందలమంది అలసిపోయిన కూడా శత్రువులను తరుముతూ యొర్దాను దగ్గరకు వచ్చి, దానిని దాటారు.
JDG 8:5 అతడు సుక్కోతు వారితో, “నా సైనికులకు కొంత ఆహారం ఇవ్వండి; వారు అలసిపోయి ఉన్నారు, నేను ఇంకా మిద్యాను రాజులైన జెబహును, సల్మున్నాను తరుముతున్నాను” అన్నాడు.
JDG 8:6 కాని సుక్కోతు అధికారులు, “జెబహు, సల్మున్నా అనే వారిని మీరు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేమెందుకు ఆహారమివ్వాలి?” అన్నారు.
JDG 8:7 అందుకు గిద్యోను, “జెబహు సల్మున్నాను యెహోవా మా చేతికి ఇచ్చిన తర్వాత, ముళ్ళపొదలతోను, ఎడారి కంపలతోను మీ శరీరాలను చీరేస్తాను” అని చెప్పాడు.
JDG 8:8 అక్కడినుండి అతడు పెనూయేలుకు వెళ్లి వారిని కూడా ఆహారం కోసం అలాగే అడిగినప్పుడు, వారు కూడా సుక్కోతు వారిలా జవాబిచ్చారు,
JDG 8:9 కాబట్టి అతడు పెనూయేలు మనుష్యులతో, “నేను సమాధానంతో తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురాన్ని పడగొడతాను” అని చెప్పాడు.
JDG 8:10 అప్పుడు జెబహు, సల్మున్నా, ఇంచుమించు పదిహేను వేలమంది బలగంతో, అనగా తూర్పు ప్రజల సైన్యమంతటిలో మిగిలిన వారితో కర్కోరులో ఉన్నారు; లక్షా ఇరవై వేలమంది సైనికులు అప్పటికే చనిపోయారు.
JDG 8:11 అప్పుడు గిద్యోను నోబహుకు, యొగ్బెహకు తూర్పున, గుడారవాసుల మార్గం గుండా వెళ్లి క్షేమంగా ఉన్న శత్రు సైన్యం మీద దాడి చేశాడు.
JDG 8:12 ఇద్దరు మిద్యాను రాజులైన జెబహు, సల్మున్నా పారిపోయారు, కాని అతడు వారిని వెంటాడి పట్టుకుని వారి సైన్యమంతటిని ఓడించాడు.
JDG 8:13 యోవాషు కుమారుడైన గిద్యోను యుద్ధం నుండి హెరెసు కనుమ నుండి తిరిగి వచ్చాడు.
JDG 8:14 అతడు ఒక సుక్కోతు యువకుడిని పట్టుకుని విచారించగా ఆ యువకుడు సుక్కోతు పెద్దలైన డెబ్బై ఏడు అధిపతుల పేర్లు వ్రాసి ఇచ్చాడు.
JDG 8:15 అప్పుడు గిద్యోను సుక్కోతు వారి దగ్గరకు వచ్చి, “నన్ను హేళన చేస్తూ, ‘జెబహు, సల్మున్నాలను నీవు ఇంకా జయించలేదు కదా? నీ అలిసిపోయిన నీ సైన్యానికి మేమెందుకు రొట్టెలివ్వాలి?’ అని మీరు ఎవరి గురించి అన్నారో ఆ సెబహు, సల్మున్నాలు వీరే.”
JDG 8:16 ఆ ఊరిపెద్దలను పట్టుకుని ఎడారి ముళ్ళతో, ముళ్ళపొదలతో శిక్షించి సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు.
JDG 8:17 అతడు పెనూయేలు గోపురాన్ని కూడా పడగొట్టి ఆ పట్టణస్థులను చంపాడు.
JDG 8:18 గిద్యోను, “మీరు తాబోరులో ఎలాంటి మనుష్యులను చంపారు?” అని జెబహును సల్మున్నాను అడిగాడు. అందుకు వారు, “నీలాంటి వారినే, వారంతా రాజకుమారుల్లా ఉన్నారు” అన్నారు.
JDG 8:19 అందుకు గిద్యోను, “వారు నా సోదరులు, నా సొంత తల్లి కుమారులు. మీరు వారిని బ్రతకనిచ్చి ఉంటే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను మిమ్మల్ని చంపేవాడిని కాదు” అన్నాడు.
JDG 8:20 అతడు తన పెద్దకుమారుడైన యెతెరును చూసి, “వారిని చంపు!” అన్నాడు కాని యెతెరు చిన్నవాడు కాబట్టి భయపడి తన ఖడ్గాన్ని దూయలేదు.
JDG 8:21 అప్పుడు జెబహు సల్మున్నాలు, “రా, నీవే చేయు, మనిషిని బట్టి అతని శక్తి ఉంటుంది” అన్నారు. గిద్యోను ముందుకు వెళ్లి వారిని చంపి, వారి ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారాలను తీసుకున్నాడు.
JDG 8:22 అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, “నీవు మిద్యానీయుల చేతి నుండి మమ్మల్ని రక్షించావు కాబట్టి మమ్మల్ని నీవు, నీ కుమారుడు, నీ మనుమడు పాలించండి” అన్నారు.
JDG 8:23 అయితే గిద్యోను వారితో, “నేను మిమ్మల్ని పాలించను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పాలించడు. యెహోవాయే మిమ్మల్ని పరిపాలిస్తారు” అన్నాడు.
JDG 8:24 గిద్యోను ఇంకా మాట్లాడుతూ, “నేను చేసే మనవి ఒక్కటే, మీలో ప్రతి ఒక్కరు తన దోపుడు సొమ్ములో ఉన్న ఒక చెవి పోగును నాకు ఇవ్వండి” అన్నాడు. (మిద్యానీయులు ఇష్మాయేలీయులు కాబట్టి వారి ఆచారం చెవులకు పోగులు పెట్టుకోవడము.)
JDG 8:25 వారు జవాబిస్తూ, “సంతోషంగా మేము వాటిని నీకు ఇస్తాం” అన్నారు. కాబట్టి వారు ఒక బట్ట పరచి, ప్రతి ఒక్కరు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను దానిలో వేశారు.
JDG 8:26 మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారాలు ఆభరణాలు ఊదా దుస్తులు వారి ఒంటెల మెడలకున్న గొలుసులు కాకుండా అతడు కోరిన బంగారు పోగుల బరువు పదిహేడు వందల షెకెళ్ళ బంగారం అయ్యింది.
JDG 8:27 గిద్యోను ఆ బంగారాన్ని ఏఫోదులా చేసి దానిని తన సొంత పట్టణమైన ఒఫ్రాలో ఉంచాడు. కాబట్టి ఇశ్రాయేలీయులందరు అక్కడికి వెళ్లి దానికి మొక్కి వ్యభిచారం చేశారు. అది గిద్యోనుకు అతని కుటుంబానికి ఉచ్చుగా మారింది.
JDG 8:28 మిద్యానీయులను ఇశ్రాయేలీయులు అణచివేసిన తర్వాత వారు మరలా తల ఎత్తలేకపోయారు. గిద్యోను కాలంలో దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
JDG 8:29 యోవాషు కుమారుడు గిద్యోను తన సొంత ఇంట్లో నివసించడానికి తిరిగి వెళ్లిపోయాడు.
JDG 8:30 గిద్యోనుకు చాలామంది భార్యలు ఉన్నారు కాబట్టి అతనికి పుట్టిన కుమారులు డెబ్బైమంది ఉన్నారు.
JDG 8:31 షెకెములో ఉన్న తన ఉంపుడుగత్తెకు కూడా ఒక కుమారుడు పుట్టినప్పుడు అతనికి అబీమెలెకు అని పేరు పెట్టాడు.
JDG 8:32 యోవాషు కుమారుడైన గిద్యోను మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు, అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్న తన తండ్రి యోవాషు సమాధిలో అతడు పాతిపెట్టబడ్డాడు.
JDG 8:33 గిద్యోను చనిపోయిన వెంటనే ఇశ్రాయేలీయులు తిరిగి బయలుతో వ్యభిచారం చేశారు. వారు బయల్-బెరీతును తమ దేవునిగా చేసుకున్నారు,
JDG 8:34 అన్నివైపులా ఉన్న తమ శత్రువులందరి చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోలేదు.
JDG 8:35 వారు యెరుబ్-బయలు (అంటే గిద్యోను) ఇశ్రాయేలీయుల కోసం చేసిన ఉపకారాలన్నీ మరచిపోయి అతని కుటుంబానికి ఇచ్చిన మాటను నమ్మకంగా నెరవేర్చలేదు.
JDG 9:1 యెరుబ్-బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సోదరుల దగ్గరకు వెళ్లి వారితో, తన తల్లి కుటుంబీకులందరితో ఇలా అన్నాడు,
JDG 9:2 “షెకెము యజమానులను అడగండి, ‘మీకు ఏది మంచిది: యెరుబ్-బయలు డెబ్బైమంది కుమారులు మిమ్మల్ని పాలించడమా లేదా ఒక్కడు పాలించడమా?’ అని అడగండి. నన్ను గుర్తుంచుకోండి నేను మీ సమీప రక్తసంబంధిని.”
JDG 9:3 అతని తల్లి సోదరులు అతని గురించి షెకెము పౌరులకు చెప్పినప్పుడు వారు, “అతడు మా బంధువు” అని, అబీమెలెకును అనుసరించడానికి మొగ్గు చూపారు.
JDG 9:4 వారు బయల్-బెరీతు క్షేత్రం నుండి డెబ్బై షెకెళ్ళ వెండితెచ్చి అబీమెలెకుకు ఇవ్వగా వాటితో అతడు అల్లరిమూకను కూలికి పెట్టుకున్నాడు, వారు అతని అనుచరులయ్యారు.
JDG 9:5 అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లి, తన అన్నదమ్ములైన డెబ్బైమంది యెరుబ్-బయలు కుమారులను ఒకే బండ మీద చంపాడు. అయితే యెరుబ్-బయలు చిన్న కుమారుడైన యోతాము తప్పించుకుని దాక్కున్నాడు.
JDG 9:6 తర్వాత షెకెము, బేత్-మిల్లో పౌరులందరూ కలిసివచ్చి షెకెములో స్తంభం ఉన్న మస్తకిచెట్టు క్రింద అబీమెలెకును రాజుగా నియమించారు.
JDG 9:7 అది యోతాముకు తెలిసినప్పుడు అతడు గెరిజీము పర్వత శిఖరం ఎక్కి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు, “షెకెము పౌరులారా, మీరు చెప్పేది దేవుడు వినాలంటే, నేను చెప్పేది మీరు వినాలి.
JDG 9:8 ఒక రోజు చెట్లన్నీ తమకు ఒక రాజును అభిషేకించుకోవాలని బయలుదేరి వెళ్లి ఒలీవ చెట్టుతో, ‘మాకు రాజుగా ఉండు’ అన్నాయి.
JDG 9:9 “అయితే ఒలీవచెట్టు, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం దేవుడిని మానవులను గౌరవించడానికి వాడే నా తైలాన్ని నేను వదిలేయాలా?’ అన్నది.
JDG 9:10 “తర్వాత చెట్లు అంజూర చెట్టుతో, ‘రా, మాకు రాజుగా ఉండు’ అన్నాయి.
JDG 9:11 “అయితే అంజూర చెట్టు, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం మధురుమైన నా మంచి ఫలాలను వదిలేయాలా?’ అన్నది.
JDG 9:12 “తర్వాత చెట్లు ద్రాక్షవల్లితో అన్నాయి, ‘రా, మా రాజుగా ఉండు.’
JDG 9:13 “అయితే ద్రాక్షవల్లి, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం దేవునికి మనుష్యులకు సంతోషాన్ని ఇచ్చే నా ద్రాక్షరసాన్ని ఇవ్వడం మానివేయాలా?’ అన్నది.
JDG 9:14 “చివరికి చెట్లన్నీ ముళ్ళపొదతో, ‘నీవు వచ్చి మాకు రాజుగా ఉండు’ అని అడిగాయి.
JDG 9:15 “ముళ్ళపొద చెట్లతో, ‘మీరు నిజంగా నన్ను మీ రాజుగా అభిషేకించాలనుకుంటే రండి, నా నీడలో ఆశ్రయం తీసుకోండి; లేదా ముళ్ళపొద నుండి అగ్ని వచ్చి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయును గాక!’ అన్నది.
JDG 9:16 “అబీమెలెకును రాజుగా చేసి మీరు మర్యాదగా సరిగా వ్యవహరించారా? మీరు యెరుబ్-బయలుకు, అతని కుటుంబానికి న్యాయం చేశారా? మీరు అతని పట్ల సరియైన విధంగా వ్యవహరించారా?
JDG 9:17 నా తండ్రి మీ కోసం పోరాడి మిద్యాను చేతి నుండి మిమ్మల్ని కాపాడడానికి తన ప్రాణం పణంగా పెట్టాడని జ్ఞాపకం చేసుకోండి.
JDG 9:18 అయితే మీరు నా తండ్రి కుటుంబానికి విరోధంగా లేచారు. ఒకే బండ మీద అతని డెబ్బైమంది కుమారులను చంపిన అతని దాసి కుమారుడైన అబీమెలెకు మీకు బంధువు కాబట్టి షెకెము పౌరుల మీద రాజుగా నియమించారు.
JDG 9:19 యెరుబ్-బయలు, అతని కుటుంబంపట్ల సత్యంగా యథార్థంగా ఉన్నారా? ఒకవేళ మీరు అలా ఉంటే, అబీమెలెకును బట్టి సంతోషించండి అతడు మిమ్మల్ని బట్టి సంతోషించును గాక!
JDG 9:20 లేకపోతే, అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని అనగా షెకెము, బేత్-మిల్లో పౌరులను కాల్చివేయును గాక. మీ నుండి అనగా షెకెము, బేత్-మిల్లో పౌరుల నుండి అగ్ని వచ్చి అబీమెలెకును కాల్చివేయును గాక!”
JDG 9:21 తర్వాత యోతాము తన సోదరుడైన అబీమెలెకుకు భయపడి పారిపోయి బెయేర్‌కు వెళ్లి అక్కడ నివసించాడు.
JDG 9:22 అబీమెలెకు మూడేళ్ళు ఇశ్రాయేలు మీద పాలించిన తర్వాత,
JDG 9:23 దేవుడు అబీమెలెకుకు, షెకెము పౌరులకు వైరం కలిగించారు, కాబట్టి వారు అబీమెలెకుకు ద్రోహం చేశారు.
JDG 9:24 యెరుబ్-బయలు డెబ్బైమంది కుమారులను చంపి వారికి చేసిన ద్రోహానికి, వారిని చంపిన వారి సోదరుడైన అబీమెలెకు మీదికి, తన సోదరులను చంపడానికి అతనికి సహాయం చేసిన షెకెము పౌరుల మీదికి ప్రతిఫలం వచ్చేలా దేవుడు చేశారు.
JDG 9:25 అతనికి వ్యతిరేకంగా ఈ షెకెము పౌరులు దారిలో వెళ్లే వారందరి మీద దాడి చేసి దోచుకునేలా కొండ శిఖరాల మీద మనుషులను ఉంచారు. ఇది అబీమెలెకుకు తెలిసింది.
JDG 9:26 ఎబెదు కుమారుడైన గాలు అతని సోదరులతో షెకెముకు వెళ్లగా షెకము నాయకులు అతనిపై నమ్మకం ఉంచారు.
JDG 9:27 వారు పొలాలలోనికి వెళ్లి ద్రాక్షపండ్లను ఏరుకుని వాటిని త్రొక్కిన తర్వాత, తమ దేవుని గుడిలో పండగ చేసుకున్నారు. వారు తింటూ, త్రాగుతూ అబీమెలెకును శపించారు.
JDG 9:28 అప్పుడు ఎబెదు కుమారుడైన గాలు ఇలా అన్నాడు, “మనం సేవ చేయడానికి అబీమెలెకు ఎవరు, షెకెము ఎవరు? అతడు యెరుబ్-బయలు కుమారుడు కాడా? జెబూలు తన క్రింది అధికారి కాడా? మనం షెకెము తండ్రియైన హమోరు కుటుంబానికి సేవ చేద్దాం! అబీమెలెకుకు ఎందుకు మనం సేవ చేయాలి?
JDG 9:29 ఈ ప్రజలు నా ఆధీనంలో ఉండి ఉంటే నేను అతన్ని తొలగించేవాన్ని. ‘నీ సైన్యమంతటిని పిలిపించు!’ అని అబీమెలెకుకు చెప్పేవాన్ని.”
JDG 9:30 పట్టణ అధికారియైన జెబూలు ఎబెదు కుమారుడైన గాలు మాటలను విన్నప్పుడు అతడు చాలా కోప్పడ్డాడు.
JDG 9:31 రహస్యంగా అబీమెలెకు దగ్గరకు దూతలను పంపి, “ఎబెదు కుమారుడైన గాలు అతని సోదరులు షెకెముకు వచ్చి నీ మీదికి పట్టణాన్ని రెచ్చగొడుతున్నారు.
JDG 9:32 కాబట్టి రాత్రివేళ నీవు, నీ మనుష్యులు వచ్చి పొలాల్లో దాక్కొని ఉండండి.
JDG 9:33 ఉదయం సూర్యోదయ సమయంలో పట్టణం మీద దాడి చేయండి. గాలు అతని మనుష్యులు నీ మీదికి వచ్చినప్పుడు అవకాశం చూసి వారిపై దాడి చేయి” అని చెప్పాడు.
JDG 9:34 కాబట్టి అబీమెలెకు, అతని మనుష్యులంతా రాత్రివేళ వచ్చి షెకెము దగ్గర దాక్కొని నాలుగు గుంపులుగా సిద్ధంగా ఉన్నారు.
JDG 9:35 ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, అబీమెలెకు, అతని మనుష్యులు దాక్కున్న స్థలం నుండి బయటకు వచ్చారు.
JDG 9:36 గాలు వారిని చూసినప్పుడు జెబూలుతో, “చూడు, ప్రజలు పర్వత శిఖరాల నుండి వస్తున్నారు!” అన్నాడు. అందుకు జెబూలు, “పర్వతాల నీడలు నీకు మనుష్యులుగా కనబడుతున్నాయి” అన్నాడు.
JDG 9:37 అయితే గాలు మళ్ళీ, “చూడు, దేశపు ఎత్తైన స్థలం నుండి మనుష్యులు దిగివస్తున్నారు, ఓ గుంపు భవిష్యవాణి చెప్పేవారి మస్తకిచెట్టు త్రోవ నుండి వస్తుంది.”
JDG 9:38 అప్పుడు జెబూలు అతనితో, “ ‘మనం అతన్ని సేవించడానికి అబీమెలెకు ఎవడు?’ అని నీవు చెప్పిన గొప్పలు ఏమయ్యాయి, నీవు హేళన చేసింది వీరిని కాదా? ఇప్పుడు లేచి వెళ్లి వారితో పోరాడు!” అన్నాడు.
JDG 9:39 కాబట్టి గాలు షెకెము పౌరులను నడిపిస్తూ వెళ్లి అబీమెలెకుతో పోరాడాడు.
JDG 9:40 అబీమెలెకు అతన్ని ద్వారం వరకు వెంటాడగా వారు పారిపోతూ చాలామంది చంపబడ్డారు.
JDG 9:41 తర్వాత అబీమెలెకు అరుమలో నివసించాడు. జెబూలు గాలును అతని సోదరులను షెకెము నుండి తరిమివేశాడు.
JDG 9:42 మరుసటిరోజు షెకెము ప్రజలు పొలాలలోనికి వెళ్లారు, ఈ విషయం అబీమెలెకుకు తెలిసింది.
JDG 9:43 కాబట్టి అతడు దాడి చేయడానికి పొలాల్లో తన మనుష్యులను మూడు గుంపులుగా చేశాడు. ప్రజలు పట్టణం నుండి రావడం చూసి అతడు లేచి వారిపై దాడి చేశాడు.
JDG 9:44 అబీమెలెకు, అతనితో ఉన్న గుంపులు, ముందుకు వెళ్లి పట్టణ ద్వారం దగ్గర నిలిచి ఉన్నప్పుడు, ఆ రెండు గుంపులు పొలాల్లో ఉన్నవారిపై దాడి చేసి వారిని చంపారు.
JDG 9:45 ఆ రోజంతా అబీమెలెకు పట్టణంపై దాడి చేసి, ముట్టడిచేసి, దాని ప్రజలను చంపాడు. తర్వాత పట్టణాన్ని నాశనం చేసి దానిపై ఉప్పు చల్లాడు.
JDG 9:46 ఈ వార్త విని, షెకెము గోపుర పౌరులు ఏల్-బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడ్డారు.
JDG 9:47 షెకెము గోపుర పౌరులు అక్కడ గుమికూడారని అబీమెలెకు విన్నప్పుడు,
JDG 9:48 అతడు, అతనితో ఉన్న మనుష్యులందరు, సల్మోను కొండ ఎక్కారు. అబీమెలెకు ఒక గొడ్డలి తీసుకుని కొన్ని కొమ్మలను నరికి, తన భుజంపై పెట్టుకున్నాడు. తన మనుష్యులను ఆదేశిస్తూ, “త్వరపడండి! నేను ఏమి చేస్తున్నానో అదే మీరు చేయండి!” అన్నాడు.
JDG 9:49 కాబట్టి ఆ మనుష్యులందరు కొమ్మలు నరికి అబీమెలెకును వెంబడించారు. వారు బలమైన కోటను ముట్టడిచేసి ప్రజలు అందులో ఉన్నప్పుడే దానిని కాల్చారు. కాబట్టి షెకెము గోపురంలో ఉన్న దాదాపు వేయిమంది పురుషులు స్త్రీలు చనిపోయారు.
JDG 9:50 తర్వాత అబీమెలెకు తేబేసుకు వెళ్లి దాని మీద దాడి చేసి దానిని వశపరచుకున్నాడు.
JDG 9:51 అయితే ఆ పట్టణం మధ్యలో బలమైన గోపురం ఉంది. స్త్రీలు, పురుషులు, నాయకులు అందరు దానిలోకి వెళ్లారు. వారు లోనికి వెళ్లి, తాళం వేసుకుని గోపురం కప్పుమీదికి ఎక్కారు.
JDG 9:52 అబీమెలెకు ఆ గోపురం దగ్గరకు వెళ్లి, దానిపై దాడి చేసి దాన్ని కాల్చివేయడానికి ఆ గోపుర ద్వారం దగ్గరకు వెళ్లినప్పుడు,
JDG 9:53 ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరగలి రాతిని పడవేయడంతో అతని కపాలం పగిలింది.
JDG 9:54 అతడు తన ఆయుధాలు మోసేవాన్ని కంగారుగా పిలిచి, “ ‘అబీమెలెకును ఒక స్త్రీ చంపింది’ అని ఎవరూ చెప్పుకోకుండా నీ కత్తి తీసి నన్ను చంపు” అన్నాడు. కాబట్టి అతని దాసుడు అతన్ని పొడవగా అతడు చనిపోయాడు.
JDG 9:55 అబీమెలెకు చనిపోయాడని ఇశ్రాయేలీయులు చూసి తమ గృహాలకు వెళ్లారు.
JDG 9:56 ఈ విధంగా అబీమెలెకు తన డెబ్బైమంది సోదరులను చంపి తన తండ్రికి చేసిన ద్రోహాన్ని దేవుడు తిరిగి అతని మీదికి రప్పించారు.
JDG 9:57 అంతేకాదు, షెకెము వారు కూడా తమ చెడు కార్యాలన్నిటికి వెల చెల్లించేలా దేవుడు చేశారు. యెరుబ్-బయలు కుమారుడైన యోతాము శాపం వారి మీదికి వచ్చింది.
JDG 10:1 అబీమెలెకు చనిపోయిన తర్వాత ఇశ్శాఖారు గోత్రం నుండి దోదో మనుమడు, పువా కుమారుడైన తోలా ఇశ్రాయేలును రక్షించడానికి లేచాడు. అతడు ఎఫ్రాయిం కొండసీమలో, షామీరులో నివసించాడు.
JDG 10:2 అతడు ఇరవై మూడు సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు; తర్వాత అతడు చనిపోయి షామీరులో పాతిపెట్టబడ్డాడు.
JDG 10:3 అతని తర్వాత గిలాదు వాడైన యాయీరు లేచాడు, అతడు ఇరవై రెండు సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు.
JDG 10:4 అతనికి ముప్పైమంది కుమారులున్నారు, వారు ముప్పై గాడిదల మీద తిరిగేవారు. వారికి గిలాదులో ముప్పై పట్టణాలు ఉన్నాయి, ఇప్పటికి వాటిని హవ్వోత్ యాయీరు పట్టణాలు అని పిలుస్తారు.
JDG 10:5 యాయీరు చనిపోయినప్పుడు అతన్ని కామోనులో పాతిపెట్టారు.
JDG 10:6 ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు. వారు బయలు, అష్తారోతు, అరాము, సీదోను, మోయాబు, అమ్మోనీయుల, ఫిలిష్తీయుల దేవుళ్ళను పూజించారు. ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచి ఆయనను సేవించడం మానుకున్నారు.
JDG 10:7 యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోప్పడి వారిని ఫిలిష్తీయులకు, అమ్మోనీయులకు అప్పగించారు,
JDG 10:8 వారు ఆ సంవత్సరం నుండి పద్దెనిమిది సంవత్సరాలు యొర్దాను తూర్పున ఉన్న గిలాదులో, అమోరీయుల దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరిని బాధించి అణచివేశారు.
JDG 10:9 అమ్మోనీయులు కూడా యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం ప్రజలతో యుద్ధం చేయడానికి యొర్దానును దాటారు; ఇశ్రాయేలీయులు ఎంతో శ్రమ అనుభవించారు.
JDG 10:10 అప్పుడు ఇశ్రాయేలీయులు, “మేము మా దేవున్ని విడిచి బయలు ప్రతిమలను సేవిస్తూ, మీకు విరోధంగా పాపం చేశాం” అని యెహోవాకు మొరపెట్టారు.
JDG 10:11 యెహోవా ఇశ్రాయేలీయులకు జవాబిస్తూ, “ఈజిప్టువారు, అమోరీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు,
JDG 10:12 సీదోనీయులు, అమాలేకీయులు, మయోనీయుల మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు నేను మిమ్మల్ని వారి చేతుల్లో నుండి కాపాడలేదా?
JDG 10:13 అయితే మీరు నన్ను విడిచి ఇతర దేవుళ్ళను సేవించారు కాబట్టి నేను మిమ్మల్ని ఇక కాపాడను.
JDG 10:14 వెళ్లండి, మీరు ఎంచుకున్న దేవుళ్ళకు వేడుకోండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు అవే మిమ్మల్ని కాపాడతాయేమో!” అని అన్నారు.
JDG 10:15 అయితే ఇశ్రాయేలీయులు యెహోవాతో, “మేము పాపం చేశాము. మీ ఇష్ట ప్రకారం మాకు చేయండి, కాని ఇప్పుడు దయచేసి మమ్మల్ని కాపాడండి” అని విన్నవించుకున్నారు.
JDG 10:16 తర్వాత ఇశ్రాయేలీయులు తమ మధ్యలో ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించి యెహోవాను సేవించారు. యెహోవా వారు అనుభవిస్తున్న శ్రమను ఇక సహించలేకపోయారు.
JDG 10:17 ఆ సమయంలో అమ్మోనీయుల సైన్యాలు యుద్ధానికి సమావేశమై గిలాదులో బస చేశారు, ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో బస చేశారు.
JDG 10:18 గిలాదు నాయకులు ఒకరితో ఒకరు, “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మనలను ఎవరు నడిపిస్తారో, అతడు గిలాదు నివాసులందరి మీద అధికారిగా ఉంటాడు” అని అనుకున్నారు.
JDG 11:1 గిలాదు వంశానికి చెందిన యెఫ్తా బలమైన యోధుడు. యెఫ్తా తండ్రి గిలాదు; అతని తల్లి ఓ వేశ్య.
JDG 11:2 గిలాదుకు అతని భార్య కుమారులను కన్నది, వారు పెద్దవారైనప్పుడు యెఫ్తాను తరిమేశారు. “నీవు ఇతర స్త్రీకి పుట్టిన వాడవు కాబట్టి మా కుటుంబంలో నీకు ఆస్తి వాటా రాదు” అని వారు అతనితో అన్నారు.
JDG 11:3 కాబట్టి యెఫ్తా తన సోదరుల దగ్గర నుండి వెళ్లి టోబు దేశంలో స్థిరపడ్డాడు, అక్కడ పోకిరీల గుంపు అతనితో ఉంటూ అతన్ని వెంబడించారు.
JDG 11:4 కొంతకాలం తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో పోరాడుతున్నప్పుడు, గిలాదు పెద్దలు టోబు దేశంలో ఉన్న యెఫ్తాను తీసుకురావడానికి వెళ్లారు.
JDG 11:6 యెఫ్తాతో వారు, “రా, వచ్చి మా దళాధిపతిగా ఉండు, అప్పుడు మేము అమ్మోనీయులతో పోరాడగలం” అన్నారు.
JDG 11:7 యెఫ్తా గిలాదు పెద్దలతో అన్నాడు, “మీరు నన్ను ద్వేషించి, నా తండ్రి ఇంటి నుండి నన్ను తరిమి వేయలేదా? ఇప్పుడు మీకు కష్టం వచ్చిందని నా దగ్గరకు ఎందుకు వచ్చారు?”
JDG 11:8 గిలాదు పెద్దలు అతనితో, “అయినాసరే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాము; అమ్మోనీయులతో పోరాడడానికి మాతో రా, నీవు గిలాదులో మా అందరికి అధిపతిగా ఉంటావు” అని యెఫ్తాతో అన్నారు.
JDG 11:9 యెఫ్తా గిలాదు పెద్దలకు జవాబిస్తూ, “ఒకవేళ నేను అమ్మోనీయులతో పోరాడడానికి నన్ను మీరు తీసుకుంటే, యెహోవా నాకు వారిని ఇస్తే, అప్పుడు నేను మీ అధిపతిగా ఉంటానా?” అని అడిగాడు.
JDG 11:10 అందుకు గిలాదు పెద్దలు, “యెహోవా మాకు సాక్షి; నీవు చెప్పినట్లు తప్పకుండ మేము చేస్తాము” అని యెఫ్తాతో అన్నారు.
JDG 11:11 కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో వెళ్లాడు, ప్రజలు అతన్ని ప్రధానిగా, దళాధిపతిగా నియమించారు. అతడు మిస్పాలో యెహోవా సన్నిధిలో తన మాటలన్నీ తిరిగి తెలిపాడు.
JDG 11:12 తర్వాత యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరకు ఈ ప్రశ్నను అడగడానికి దూతలను పంపాడు: “నా దేశం మీద దాడి చేయడానికి నీకు నాకు విరుద్ధంగా ఉన్నది ఏంటి?”
JDG 11:13 అమ్మోనీయుల రాజు యెఫ్తా దూతలతో, “ఇశ్రాయేలు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు, వారు అర్నోను నుండి యబ్బోకు వరకు, యొర్దాను వరకు ఉన్న నా దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు నాకు సమాధానంతో దానిని తిరిగి ఇచ్చేయాలి” అన్నాడు.
JDG 11:14 యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరకు దూతలను తిరిగి పంపించి,
JDG 11:15 “యెఫ్తా చెప్పేది ఇది: ఇశ్రాయేలు మోయాబు దేశాన్ని లేదా అమ్మోనీయుల దేశాన్ని తీసుకోలేదు.
JDG 11:16 ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు, వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేషుకు వచ్చారు.
JDG 11:17 అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజు దగ్గరకు దూతలను పంపి, ‘మీ దేశం గుండా వెళ్లడానికి మమ్మల్ని అనుమతించండి’ అని అడిగినప్పుడు, ఎదోము రాజు వినలేదు. వారు మోయాబు రాజును కూడా అడిగారు, అతడు తిరస్కరించాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు కాదేషులో నివాసం ఉన్నారు.
JDG 11:18 “తర్వాత వారు అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఎదోము, మోయాబు దేశాల చుట్టూ తిరిగి, మోయాబుకు తూర్పుదిక్కు దాటి అర్నోను అవతలి వైపున మకాం వేశారు. అర్నోను మోయాబుకు సరిహద్దు కాబట్టి వారు మోయాబు సరిహద్దులోనికి ప్రవేశించలేదు.
JDG 11:19 “తర్వాత ఇశ్రాయేలీయులు హెష్బోనులో ఏలే అమోరీయుల రాజైన సీహోను దగ్గరకు దూతలను పంపి, ‘మా స్థలానికి వెళ్లడానికి మీ దేశం గుండా మమ్మల్ని వెళ్లనివ్వండి’ అని అడిగారు.
JDG 11:20 అయినప్పటికీ సీహోను ఇశ్రాయేలు తమ సరిహద్దు గుండా వెళ్లడం నమ్మలేదు. అతడు తన సైన్యాన్ని సమకూర్చుకొని, యహజు దగ్గర శిబిరం ఏర్పరచుకొని, అక్కడినుండి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు.
JDG 11:21 “అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సీహోనును, అతని సైన్యమంతటిని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించారు, వారు వారిని ఓడించారు. ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశమంతటిని, ఆ దేశంలో నివసించేవారిని స్వాధీనం చేసుకుని,
JDG 11:22 అర్నోను నుండి యబ్బోకు వరకు, అరణ్యం నుండి యొర్దాను వరకు అమోరీయుల భూభాగాన్ని ఆక్రమించుకున్నారు.
JDG 11:23 “కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన ప్రజలైన ఇశ్రాయేలు ఎదుట తరిమివేశారు, ఇప్పుడు దానిని తీసుకోవడానికి నీకు ఏమి హక్కు ఉంది?
JDG 11:24 మీ దేవుడైన కెమోషు మీకు ఇచ్చేది మీరు తీసుకోరా? అలాగే మా దేవుడైన యెహోవా మాకు ఏది ఇచ్చినా దానిని మేము స్వాధీనం చేసుకుంటాము.
JDG 11:25 మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు కంటే నీవు గొప్పవాడివా? అతడు ఇశ్రాయేలుతో ఎప్పుడైనా వాదన కాని పోరాటం కాని చేశాడా?
JDG 11:26 మూడువందల సంవత్సరాలు ఇశ్రాయేలు హెష్బోను, అరోయేరు, చుట్టుప్రక్కల స్థావరాలను, అర్నోనులో ఉన్న అన్ని పట్టణాలను ఆక్రమించింది. ఆ సమయంలో మీరు వాటిని ఎందుకు తిరిగి తీసుకోలేదు?
JDG 11:27 నేను నీ పట్ల తప్పు చెయ్యలేదు, నీవే నా మీదికి యుద్ధానికి వస్తూ నా పట్ల తప్పు చేస్తున్నావు. న్యాయాధిపతియైన యెహోవా ఈ రోజు ఇశ్రాయేలీయులకు, అమ్మోనీయులకు న్యాయం తీర్చును గాక.”
JDG 11:28 అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనకు పంపిన వర్తమానాన్ని లెక్కచేయలేదు.
JDG 11:29 తర్వాత యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి వచ్చినప్పుడు, అతడు గిలాదు, మనష్షే నుండి దాటి, గిలాదు యొక్క మిస్పే నుండి వెళ్లి అక్కడినుండి అమ్మోనీయుల మీదికి వెళ్లాడు.
JDG 11:30 అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మ్రొక్కుబడి చేశాడు: “మీరు అమ్మోనీయులను నా చేతికి అప్పగిస్తే,
JDG 11:31 నేను అమ్మోనీయుల దగ్గర నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, నా ఇంటి నుండి నన్ను కలుసుకోడానికి మొదలు ఏది బయటకు వస్తే, అది యెహోవాకు చెందినది, దానిని నేను దహనబలిగా అర్పిస్తాను.”
JDG 11:32 తర్వాత యెఫ్తా అమ్మోనీయులతో పోరాడడానికి వెళ్లాడు, యెహోవా వారని అతని చేతికి అప్పగించారు.
JDG 11:33 అతడు అరోయేరు నుండి మిన్నీతు వరకు, అలా ఆబేల్-కెరామీము వరకు ఇరవై పట్టణాలను నాశనం చేశాడు. ఇలా ఇశ్రాయేలు అమ్మోనును లోబరచుకుంది.
JDG 11:34 యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు, అతని కుమార్తె తంబురలతో నాట్యం చేస్తూ అతన్ని ఎదుర్కోడానికి వచ్చింది. అతనికి ఆమె ఒక్కతే కుమార్తె. ఆమె తప్ప అతనికి కుమారుడు కాని కుమార్తె కాని లేరు.
JDG 11:35 అతడు ఆమెను చూడగానే తన బట్టలు చింపుకొని ఏడుస్తూ, “ఓ నా బిడ్డా, నన్ను కృంగదీశావు, నేను నాశనం అయిపోయాను. నేను యెహోవాకు మ్రొక్కుబడి చేశాను, దానిని మీరలేను” అన్నాడు.
JDG 11:36 ఆమె అతనితో, “నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చావు. నీవు ప్రమాణం చేసిన ప్రకారం నాకు చేయు, ఎందుకంటే యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగతీర్చుకున్నారు.
JDG 11:37 అయితే ఈ ఒక్క కోరిక తీర్చు. నేను ఇక పెళ్ళి చేసుకోను, కాబట్టి రెండు నెలలు నా స్నేహితులతో కొండల్లో సంచరిస్తూ ప్రలాపించనివ్వు.”
JDG 11:38 అందుకతడు, “నీవు వెళ్లవచ్చు” అని ఆమెతో అన్నాడు. రెండు నెలల వరకు అతడు ఆమెను వెళ్లనిచ్చాడు. ఆమె తన స్నేహితులతో కొండల్లోకి వెళ్లి తాను ఇక పెళ్ళి చేసుకోలేదని ప్రలాపించింది.
JDG 11:39 ఆ రెండు నెలల తర్వాత ఆమె తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చింది, అతడు తన మ్రొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు. ఆమె కన్యగానే ఉండిపోయింది. దీని నుండి ఇశ్రాయేలీయుల వచ్చిన ఆచారం ఏంటంటే
JDG 11:40 ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు యువతులు నాలుగు రోజులపాటు బయటకు వెళ్లి, గిలాదు వంశస్థుడైన యెఫ్తా కుమార్తె జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు.
JDG 12:1 ఎఫ్రాయిం ప్రజలు సమకూడి సఫోనును దాటి వెళ్లి యెఫ్తాతో, “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మమ్మల్ని పిలువకుండా నీవెందుకు వెళ్లావు? ఇప్పుడు నీవుంటున్న నీ ఇంటిని నీతో పాటు కాల్చివేస్తాము.”
JDG 12:2 యెఫ్తా జవాబిస్తూ, “నాకు, నా ప్రజలకు అమ్మోనీయులతో పెద్ద తగాదా వచ్చినప్పుడు, నేను మిమ్మల్ని పిలిచాను గాని మీరు వారి చేతి నుండి నన్ను కాపాడలేదు.
JDG 12:3 మీరు సహాయం చేయరని తెలుసుకొని, నేను నా ప్రాణం అరచేతిలో పెట్టుకొని అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్లాను. యెహోవా వారి మీద నాకు జయం ఇచ్చారు. ఇప్పుడు మీరెందుకు నాతో పోట్లాడడానికి ఈ రోజు వచ్చారు?” అని అన్నాడు.
JDG 12:4 యెఫ్తా గిలాదు మనుష్యులను కూర్చుకుని ఎఫ్రాయిం వారితో యుద్ధం చేశాడు. ఎఫ్రాయిమీయులను, “గిలాదీయులైన మీరు ఎఫ్రాయిం మనష్షేల ఎదుట నిలబడలేక పారిపోయారు” అని అన్నారు.
JDG 12:5 కాబట్టి గిలాదీయులు ఎఫ్రాయిం ఎదురుగా ఉన్న యొర్దాను రేవును ఆక్రమించారు, ఎఫ్రాయిం వారిలో పారిపోతున్న వారెవరైనా వచ్చి, “నన్ను దాటి వెళ్లనివ్వండి” అని అంటే, గిలాదు మనుష్యులు, “నీవు ఎఫ్రాయిం వాడవా?” అని అడిగేవారు. అతడు, “కాదు” అని అంటే,
JDG 12:6 వారు, “సరే, ‘షిబ్బోలెత్’ అని పలుకు” అనేవారు. అతడు, ఆ పదం సరిగా పలుకలేక, “సిబ్బోలెతు” అని పలికితే, వారు అతన్ని పట్టుకుని యొర్దాను రేవు దగ్గర చంపేవారు. ఆ కాలంలో నలభై రెండువేలమంది ఎఫ్రాయిమీయులు చంపబడ్డారు.
JDG 12:7 యెఫ్తా ఆరేళ్ళు ఇశ్రాయేలును నడిపించాడు. తర్వాత గిలాదీయుడైన యెఫ్తా చనిపోయాడు, గిలాదులో ఒక పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.
JDG 12:8 యెఫ్తా తర్వాత, బేత్లెహేము వాడైన ఇబ్సాను ఇశ్రాయేలును నడిపించాడు.
JDG 12:9 అతనికి ముప్పైమంది కుమారులు, ముప్పైమంది కుమార్తెలు ఉన్నారు. అతడు తన కుమార్తెలను వేరే గోత్రం వారికి ఇచ్చి పెళ్ళి చేశాడు, అలాగే తన కుమారులకు తన గోత్రానికి చెందని ముప్పైమంది యువతులతో పెళ్ళిళ్ళు చేశాడు. ఇబ్సాను ఏడు సంవత్సరాలు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉన్నాడు.
JDG 12:10 తర్వాత ఇబ్సాను చనిపోయాడు, బేత్లెహేములో పాతిపెట్టబడ్డాడు.
JDG 12:11 అతని తర్వాత, జెబూలూను వాడైన ఎలోను ఇశ్రాయేలును పది సంవత్సరాలు నడిపించాడు.
JDG 12:12 తర్వాత ఎలోను చనిపోయాడు, జెబూలూను ప్రదేశంలో అయ్యాలోనులో పాతిపెట్టబడ్డాడు.
JDG 12:13 అతని తర్వాత, పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడైన అబ్దోను ఇశ్రాయేలును నడిపించాడు.
JDG 12:14 అతనికి నలభైమంది కుమారులు, ముప్పైమంది మనుమలు ఉన్నారు. వారు డెబ్బై గాడిదల మీద స్వారీ చేసేవారు. అతడు ఎనిమిది సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు.
JDG 12:15 తర్వాత హిల్లేలు కుమారుడైన అబ్దోను చనిపోయాడు. అమాలేకీయుల కొండసీమలో ఉన్న ఎఫ్రాయిం ప్రదేశంలోని పిరాతోనులో అతడు పాతిపెట్టబడ్డాడు.
JDG 13:1 ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, కాబట్టి యెహోవా వారిని నలభై సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించారు.
JDG 13:2 జోరహులో దాను వంశానికి చెందిన మనోహ అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య గొడ్రాలు కాబట్టి ఆమెకు పిల్లలు లేరు.
JDG 13:3 యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, “నీవు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు, అయితే నీవు గర్భం ధరించి కుమారునికి జన్మనిస్తావు.
JDG 13:4 కాబట్టి నీవు ద్రాక్షరసం కాని మద్యం కాని త్రాగకుండ జాగ్రతపడాలి, అపవిత్రమైనది ఏది తినకూడదు.
JDG 13:5 నీవు గర్భవతివై కుమారుని కంటావు, ఆ బాలుని జుట్టు ఎప్పటికీ కత్తిరించకూడదు ఎందుకంటే పుట్టుక నుంచే అతడు నాజీరుగా, దేవునికి ప్రతిష్ఠ చేయబడతాడు. ఫిలిష్తీయుల చేతుల్లో నుండి అతడు ఇశ్రాయేలును రక్షించడం ప్రారంభిస్తాడు.”
JDG 13:6 అప్పుడు ఆ స్త్రీ తన భర్త దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది: “ఓ దైవజనుడు నా దగ్గరకు వచ్చాడు, అతడు దేవుని దూతలా చాలా భయం పుట్టించేవానిలా ఉన్నాడు. అతడు ఎక్కడ నుండి వచ్చాడో నేను అడగలేదు, అతడు నాకు తన పేరు చెప్పలేదు.
JDG 13:7 అయితే అతడు నాతో, ‘నీవు గర్భవతివై కుమారుని కంటావు. నీవు ద్రాక్షరసం కాని మద్యం కాని త్రాగకూడదు, అపవిత్రమైనదేది తినకూడదు ఎందుకంటే ఆ బాలుడు పుట్టుక నుండి చనిపోయే దినం వరకు దేవునికి నాజీరుగా ఉంటాడు.’ ”
JDG 13:8 అప్పుడు మనోహ యెహోవాకు, “ప్రభువా, మీ దాసునిపై దయ చూపించండి. పుట్టబోయే బాలున్ని ఎలా పెంచాలో మాకు బోధించడానికి మీరు పంపిన దైవజనున్ని మళ్ళీ పంపమని వేడుకుంటున్నాను” అని ప్రార్ధించాడు.
JDG 13:9 దేవుడు మనోహ ప్రార్ధన విన్నారు. ఆ స్త్రీ పొలంలో ఉన్నప్పుడు ఆ దేవదూత మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చాడు; కాని అప్పుడు తన భర్త మనోహ ఆమెతో లేడు.
JDG 13:10 ఆ స్త్రీ తన భర్త దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “ఆ రోజు నాకూ ప్రత్యక్షమైన వ్యక్తి మళ్ళీ కనిపించాడు” అని చెప్పింది.
JDG 13:11 మనోహ లేచి తన భార్య వెంట వెళ్లి ఆ మనిషి, ఆ మనిషి దగ్గరకు వచ్చి, “నా భార్యతో మాట్లాడినది నీవేనా?” అని చెప్పాడు. “నేనే” అని అతడు అన్నాడు.
JDG 13:12 కాబట్టి మనోహ, “నీవు చెప్పింది జరిగాక ఆ బాలుడు ఎలా జీవించాలి, ఏమి చేయాలి?” అని అతన్ని అడిగాడు.
JDG 13:13 యెహోవా దూత, “నేను నీ భార్యతో చెప్పినదంతా ఆమె చేయాలి.
JDG 13:14 ఆమె ద్రాక్షావల్లి నుండి వచ్చేది ఏదీ తినకూడదు, ద్రాక్షరసం మద్యం పుచ్చుకోకూడదు, అసలు అపవిత్రమైనదేది తినకూడదు. నేను ఆజ్ఞాపించిన ప్రతిదీ ఆమె చేయాలి” అన్నాడు.
JDG 13:15 మనోహ యెహోవా దూతతో, “మేము నీకోసం మేకపిల్లను సిద్ధపరచే వరకు దయచేసి ఇక్కడ ఉండండి” అన్నాడు.
JDG 13:16 అందుకు యెహోవా దూత, “మీరు ఆపినా సరే, నేను మీ ఆహారంలో ఏది తినను. అయితే మీరు దహనబలి సిద్ధపరిస్తే, అది యెహోవాకు అర్పించాలి” అన్నాడు (అతడు యెహోవా దూత అని మనోహ గ్రహించలేదు.)
JDG 13:17 అప్పుడు మనోహ యెహోవా దూతను, “నీవు చెప్పింది జరిగాక మేము నిన్ను గౌరవించాలి కాబట్టి నీ పేరేంటి?”
JDG 13:18 యెహోవా దూత జవాబిస్తూ, “నా పేరెందుకు అడుగుతున్నావు, అది నీ గ్రహింపుకు మించింది” అన్నాడు.
JDG 13:19 మనోహ భోజనార్పణతో పాటు ఒక మేకపిల్లను తెచ్చి రాతి మీద యెహోవాకు అర్పించాడు. అప్పుడు మనోహ, అతని భార్య చూస్తూ ఉండగా యెహోవా దూత అద్భుతం చేశాడు.
JDG 13:20 ఆ బలిపీఠం నుండి మంటలు ఆకాశం వైపు లేస్తూవుంటే, ఆ మంటలతో పాటు యెహోవా దూత పైకి వెళ్లిపోయాడు. ఇది చూసి మనోహ, అతని భార్య నేల మీద సాష్టాంగపడ్డారు.
JDG 13:21 ఆ తర్వాత యెహోవా దూత మనోహకు, అతని భార్యకు మళ్ళీ ప్రత్యక్షం కాలేదు. అతడు యెహోవా దూత అని మనోహ గ్రహించాడు.
JDG 13:22 “మనం చచ్చిపోతాం! మనం దేవున్ని చూశాం!” అని మనోహ తన భార్యతో అన్నాడు.
JDG 13:23 అయితే అతని భార్య, “యెహోవా మనలను చంపాలని అనుకుంటే, మన చేతులతో అర్పించిన దహనబలిని గాని భోజనార్పణను గాని ఆయన అంగీకరించేవారు కారు, వీటన్నిటిని మనకు చూపించేవారు కారు, ఇప్పుడిది మనకు చెప్పేవారు కారు” అని చెప్పింది.
JDG 13:24 ఆ స్త్రీకి ఒక బాలుడు పుట్టగా అతనికి సంసోను అని పేరు పెట్టింది. అతడు పెద్దయ్యాక యెహోవా అతన్ని ఆశీర్వదించారు.
JDG 13:25 అతడు జోరహు, ఎష్తాయోలు మధ్యలో మహెనుదాను అనే స్థలంలో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతన్ని పురికొల్పడం మొదలుపెట్టాడు.
JDG 14:1 సంసోను తిమ్నాకు వెళ్లాడు, అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు.
JDG 14:2 అతడు తిరగి వచ్చి, తన తండ్రితో, తల్లితో, “నేను తిమ్నాలో ఒక ఫిలిష్తీ యువతిని చూశాను; ఇప్పుడు ఆమెను నాకు భార్యగా తీసుకురండి” అని అన్నాడు.
JDG 14:3 అతని తండ్రి, తల్లి జవాబిస్తూ, “నీ బంధువుల్లో గాని మన ప్రజలందరిలో నీకు తగిన అమ్మాయి దొరకలేదా? భార్యను తీసుకురావడానికి నీవు సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాలా?” అన్నారు. కాని సంసోను తన తండ్రితో ఇలా అన్నాడు, “నా కోసం ఆమెను తీసుకురండి, ఆమె నాకు సరియైనది.”
JDG 14:4 (ఇది యెహోవా నుండి వచ్చిందని, ఫిలిష్తీయులను ఎదుర్కొనే అవకాశం కోసం ఆయన చూస్తున్నారని అతని తల్లిదండ్రులకు తెలియదు; ఆ సమయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలును పరిపాలిస్తున్నారు.)
JDG 14:5 సంసోను తన తల్లిదండ్రులతో కలిసి తిమ్నాతుకు వెళ్లాడు. వారు తిమ్నాతు ద్రాక్షతోటలను సమీపించినప్పుడు, అకస్మాత్తుగా ఒక కొదమసింహం గర్జిస్తూ అతనివైపు వచ్చింది.
JDG 14:6 యెహోవా ఆత్మ అతని మీదికి బలంగా వచ్చినందుకు అతడు మేకపిల్లను చీల్చినట్టు, వట్టి చేతులతో సింహాన్ని చీల్చేశాడు. అయితే తాను చేసింది తన తండ్రికి గాని తల్లికి గాని చెప్పలేదు.
JDG 14:7 తర్వాత సంసోను తిమ్నాతుకు వెళ్లి ఆ యువతితో మాట్లాడాడు, ఆమెను ఇష్టపడ్డాడు.
JDG 14:8 కొంతకాలం తర్వాత, ఆమెను పెళ్ళి చేసుకోవడానికి అతడు తిరిగి వెళ్లినప్పుడు, ఆ సింహం కళేబరాన్ని చూద్దామని ప్రక్కకు తిరిగాడు. ఆ కళేబరంలో తేనెటీగ గుంపును, కొంచెం తేనెను అతడు చూశాడు.
JDG 14:9 అతడు కొంచెం తేనెను చేతుల్లోకి తీసుకుని తింటూ ముందుకు వెళ్లాడు. అతడు తన తల్లిదండ్రులను తిరిగి కలుసుకున్నప్పుడు, వారికి కొంచెం ఇచ్చాడు, వారు కూడా తిన్నారు. అయితే సింహం కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి మాత్రం వారితో చెప్పలేదు.
JDG 14:10 అతని తండ్రి ఆ అమ్మాయిని చూడటానికి వెళ్లాడు. సంసోను అక్కడ ఒక విందు ఏర్పాటు చేశాడు, పెళ్ళికుమారుడు అలా చేయడం అక్కడి ఆనవాయితి.
JDG 14:11 ప్రజలు అతన్ని చూడగానే వారు అతనికి తోడుగా ఉండడానికి ముప్పైమంది యువకులను తీసుకువచ్చారు.
JDG 14:12 సంసోను వారితో అన్నాడు, “మీకు ఒక పొడవు కథ చెప్తాను, ఈ విందు జరిగే ఏడు రోజుల్లో మీరు దాని జవాబు చెప్తే, ముప్పై సన్నని నారబట్టలు, ముప్పై జతల దుస్తులు ఇస్తాను.
JDG 14:13 ఒకవేళ మీరు జవాబు చెప్పలేకపోతే, ముప్పై సన్నటి నారబట్టలు, ముప్పై జతల దుస్తులు మీరు నాకు ఇవ్వాలి.” వారు అన్నారు, “నీ పొడుపు కథ చెప్పు, మేము వింటాము.”
JDG 14:14 అందుకు అతడు అన్నాడు, “తినే దానిలో నుండి తిండి వచ్చింది, బలమైన దానిలో నుండి తియ్యనిది వచ్చింది.” మూడు రోజుల వరకు వారు దానికి జవాబివ్వలేకపోయారు.
JDG 14:15 నాల్గవ రోజున వారు సంసోను భార్యతో అన్నారు, “ఆ పొడుపు కథ అర్థమేమిటో మాకు చెప్పమని నీ భర్తను ఒప్పించు లేకపోతే నిన్ను, నీ తండ్రి ఇంటివారిని దహించి వేస్తాము. మా స్వాస్థ్యాన్ని కాజేయడానికి మమ్మల్ని ఆహ్వానించారా?”
JDG 14:16 అప్పుడు సంసోను భార్య అతనిపై పడి ఏడుస్తూ, “నీవు నన్ను ద్వేషిస్తున్నావు, నేనంటే నీకు ప్రేమ లేదు. నా ప్రజలకు ఒక పొడుపు కథ వేశావు, కానీ దాని అర్థం నాకు చెప్పలేదు” అన్నది. అతడు అన్నాడు, “దాని అర్థం నా తండ్రికి కాని తల్లికి గాని చెప్పలేదు, కాబట్టి నీకెందుకు దానిని వివరించాలి?”
JDG 14:17 విందు జరిగిన ఏడు రోజులు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుస్తూ, అతన్ని ఇంకా విసిగిస్తున్నందుకు ఏడవ రోజున అతడు దాని అర్థం చెప్పాడు, ఆమె ఆ పొడుపు కథను తన ప్రజలకు వివరించింది.
JDG 14:18 ఏడవ రోజు సూర్యాస్తమయం కాకముందు, ఆ నగరవాసులు అతనితో అన్నారు, “తేనె కంటే తియ్యగా ఉండేదేంటి? సింహం కంటే బలమైనదేది?” అందుకు సంసోను, “మీరు నా దూడ దున్నకపోతే నా పొడుపు కథను చెప్పే వారే కాదు” అన్నాడు.
JDG 14:19 అప్పుడు యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు అష్కెలోను పట్టణానికి వెళ్లి, అక్కడి వారి ముప్పైమందిని చంపి, వారి వస్త్రాలను దోచుకొని పొడుపు కథ అర్థం చెప్పిన వారికిచ్చాడు. కోపంతో మండి పడుతూ అతడు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాడు.
JDG 14:20 సంసోను భార్యను ఆ విందుకు వచ్చిన సంసోను స్నేహితుల్లో ఒకనికి ఇచ్చి పెళ్ళి చేశారు.
JDG 15:1 కొంతకాలం తర్వాత, గోధుమ పంట కోతకాలంలో, సంసోను ఒక మేకపిల్లను తీసుకుని భార్యను చూడడానికి వెళ్లాడు. “నా భార్యను చూడడానికి తన గదిలోకి వెళ్తాను” అని అతడు అనుకున్నాడు. కాని ఆమె తండ్రి అతన్ని లోపలికి వెళ్లనివ్వలేదు.
JDG 15:2 ఆమె తండ్రి, “నీకు ఆమె అస్సలు ఇష్టం లేదు అనుకుని ఆమెను నీ స్నేహితునికి ఇచ్చాను. ఆమె చెల్లెలు ఆమెకంటే అందంగా ఉంటుంది ఆమెను చేసుకో” అని అన్నాడు.
JDG 15:3 అప్పుడు సంసోను, “నేను ఇప్పుడు ఫిలిష్తీయులకు ఏదైనా కీడు చేసినా నిర్దోషినే” అని,
JDG 15:4 సంసోను బయటకు వెళ్లి మూడువందల నక్కలను పట్టుకుని, రెండేసి నక్కల తోకలను ఒకదానికొకటి ముడివేసి ఆ రెండు తోకల మధ్య ఒక దివిటీని కట్టి,
JDG 15:5 ఆ దివిటీలను వెలిగించి ఫిలిష్తీయుల గోధుమ పంట చేలల్లోకి ఆ నక్కలను వదిలాడు. ఇలా అతడు పనల కుప్పలను పైరును ద్రాక్ష ఒలీవ తోటలను తగలబెట్టాడు.
JDG 15:6 ఫిలిష్తీయులు, “ఇలా ఎవరు చేశారు?” అని అడిగినప్పుడు, “తిమ్నా అల్లుడైన సంసోను; తన భార్యను తన స్నేహితునికి ఇచ్చినందుకు అలా చేశాడు” అని చెప్పారు. అందుకు ఫిలిష్తీయులు వెళ్లి ఆమెను, ఆమె తండ్రిని కాల్చి చంపారు.
JDG 15:7 అప్పుడు సంసోను వారితో, “మీరిలా చేశారు కాబట్టి మీమీద పగతీర్చుకునే వరకు నేను ఊరుకోను” అంటూ,
JDG 15:8 అతడు వారిపై దాడి చేసి తొడలనూ తుంటి ఎముకలను విరగ్గొట్టి వారిలో చాలామందిని చంపేశాడు. తర్వాత అతడు వెళ్లి, ఏతాము బండ సందులో నివసించాడు.
JDG 15:9 అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా ప్రదేశంలో దిగి సైన్య శిబిరాన్ని లేహి వరకు ఏర్పరచుకున్నారు.
JDG 15:10 యూదా ప్రజలు వారిని, “మీరెందుకు మా మీదికి వచ్చారు?” అని అడిగారు. అందుకు వారు, “మేము సంసోను మాకెలా చేశాడో మేము కూడ అతనికి అలాగే చేయడానికి వచ్చాం, మేము అతన్ని బంధించి తీసుకెళ్లడానికి వచ్చాం” అని జవాబిచ్చారు.
JDG 15:11 అప్పుడు యూదా నుండి మూడువేలమంది పురుషులు ఏతాము బండలో ఉన్న గుహలోకి దిగి, సంసోనుతో, “ఫిలిష్తీయులు మనలను పరిపాలిస్తున్నారని నీకు తెలియదా? మా మీదికి ఇంత ప్రమాదాన్ని ఎందుకు తెచ్చిపెట్టావు?” అని అన్నాడు. అతడు వారితో, “వారు నాకు ఏమి చేశారో నేను వారికి అదే చేశాను!” అన్నాడు.
JDG 15:12 అందుకు వారు అతనితో, “సరే, నిన్ను బంధించి ఫిలిష్తీయులకు అప్పగించడానికి మేము వచ్చాం” అన్నాడు. అందుకు సంసోను, “మీరు మాత్రం నన్ను చంపరని నాకు ప్రమాణం చేయండి” అని వారితో అన్నాడు.
JDG 15:13 “సరే, మేము కేవలం నిన్ను బంధించి వారికి అప్పగిస్తాం మేము నిన్ను చంపము” అని వారు జవాబిచ్చారు. అలా వారు అతన్ని రెండు క్రొత్త త్రాళ్లతో బంధించి బండ దగ్గర నుండి తీసుకువచ్చారు.
JDG 15:14 అతడు లేహిని సమీపించినప్పుడు, ఫిలిష్తీయులు కేకలువేస్తూ అతని దగ్గరకు వచ్చారు. యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి రాగా అతని చేతులకున్న త్రాళ్లు కాలిపోయిన నారపీచులై అతని చేతుల నుండి తెగిపడిపోయాయి.
JDG 15:15 అక్కడే అతనికి గాడిద పచ్చి దవడ ఎముక ఒకటి దొరికింది. అతడు దాన్ని చేతపట్టుకుని దానితో వేయిమందిని చంపేశాడు.
JDG 15:16 అప్పుడు సంసోను, “గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, రెండు కుప్పలను చంపాను. గాడిద దవడ ఎముకతో వేయిమందిని చంపాను” అని,
JDG 15:17 అతడు మాట్లాడడం ముగించిన తర్వాత, ఆ దవడ ఎముకను పారవేశాడు; ఆ స్థలం రామత్ లేహి అని పిలువబడింది.
JDG 15:18 అతనికి బాగా దాహం వేయడంతో యెహోవాకు మొరపెట్టి, “మీ సేవకుడనైన నాకు ఈ గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఇప్పుడు నేను దాహంతో చచ్చి సున్నతిలేనివారి చేతుల్లో పడాలా?” అన్నాడు.
JDG 15:19 అప్పుడు దేవుడు లేహిలో ఉన్న ఒక బోలు స్థలం తెరవగా దానిలో నుండి నీళ్లు వచ్చాయి. సంసోను నీరు త్రాగగానే అతనికి బలం తిరిగివచ్చి అతని ప్రాణం తెప్పరిల్లింది. కాబట్టి ఆ ఊట ఎన్-హక్కోరె అని పిలువబడింది. అది ఇప్పటికి లేహిలో ఉంది.
JDG 15:20 ఫిలిష్తీయుల రోజుల్లో సంసోను ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు.
JDG 16:1 ఒక రోజు సంసోను గాజాకు వెళ్లి, అక్కడ ఒక వేశ్యను చూసి రాత్రి ఆమెతో గడపడానికి ఆమె దగ్గర ఉండిపోయాడు.
JDG 16:2 “సంసోను ఇక్కడ ఉన్నాడు!” అని గాజా ప్రజలకు తెలిసినప్పుడు వారు ఆ స్థలాన్ని చుట్టుముట్టి, “తెల్లవారినప్పుడు అతన్ని చంపుదాం” అని అనుకుని పట్టణ ద్వారం దగ్గర రాత్రంతా అక్కడినుండి కదలకుండా అతని కోసం కాపలా ఉన్నారు.
JDG 16:3 అయితే సంసోను మధ్యరాత్రి వరకు మాత్రమే అక్కడ పడుకున్నాడు. తర్వాత అతడు లేచి, పట్టణ ద్వారం తలుపులను వాటి అడ్డకర్రలతో సహా ఊడబెరికి తన భుజాల మీద ఎత్తుకుని హెబ్రోనుకు ఎదురుగా కొండ మీదికి వాటిని మోసుకెళ్లాడు.
JDG 16:4 కొంతకాలం తర్వాత అతడు శోరేకు లోయకు చెందిన దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు.
JDG 16:5 ఫిలిష్తీయుల నాయకులు ఆమె దగ్గరకు వెళ్లి, “మేము అతన్ని కట్టిపడేసి లొంగదీసుకోడానికి నీవు అతన్ని ఆకర్షించుకుని అతని గొప్ప బలం యొక్క రహస్యం ఏమిటో, అతన్ని మేము ఎలా గెలవగలమో తెలుసుకో! అప్పుడు మాలో ప్రతి ఒక్కరూ నీకు పదకొండు వందల వెండి షెకెళ్లు ఇస్తాం” అని అన్నారు.
JDG 16:6 కాబట్టి దెలీలా సంసోనుతో, “నీ గొప్ప బలం యొక్క రహస్యం ఏంటో నాకు చెప్పవా, నిన్ను కట్టి లోబరుచుకోవడం ఎలా?” అని అడిగింది.
JDG 16:7 అందుకు సంసోను ఆమెతో, “ఎవరైనా నన్ను తడి ఆరని ఏడు పచ్చి క్రొత్త వింటినారలతో కట్టేస్తే, నా బలం పోయి నేను మామూలు మనుష్యుల్లా అవుతాను” అని జవాబిచ్చాడు.
JDG 16:8 అప్పుడు ఫిలిష్తీయుల నాయకులు తడి ఆరని ఏడు పచ్చి వింటినారలు ఆమె తెచ్చి ఇవ్వగా, ఆమె వాటితో అతన్ని కట్టేసింది.
JDG 16:9 లోపలి గదిలో మనుష్యులు దాక్కొని ఉన్నప్పుడు అతనితో, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని ఆమె అతనితో అనగా అతడు నూలు పోగును మంట దగ్గర పెడితే తెగిపోయినట్లు ఆ వింటినారలను తెంపేశాడు. కాబట్టి అతని బలం యొక్క రహస్యం వెల్లడి కాలేదు.
JDG 16:10 అప్పుడు దెలీలా సంసోనుతో, “నీవు నన్ను మోసం చేశావు; నాకు అబద్ధం చెప్పావు. సరే ఇప్పుడైనా నిజం చెప్పు” అని అన్నది.
JDG 16:11 అప్పుడు సంసోను, “ఎవరైనా నన్ను ఎప్పుడు వాడని క్రొత్త త్రాళ్లతో కట్టేస్తే, నేను ఇతర మనుష్యుల్లా బలహీనమవుతాను” అని జవాబిచ్చాడు.
JDG 16:12 కాబట్టి దెలీలా క్రొత్త త్రాళ్లు తెచ్చి వాటితో అతన్ని కట్టేసి గదిలో మనుష్యులతో దాక్కొని ఉండగా, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని చెప్పింది. అయితే అతడు త్రాళ్లను నూలుపోగుల వలె తెంపేశాడు.
JDG 16:13 అప్పుడు దెలీలా సంసోనుతో, “అప్పుడు దెలీలా సంసోనుతో, ఈసారి కూడా నీవు నన్ను మోసం చేసి అబద్ధం చెప్పావు. నిన్ను ఎలా బంధించవచ్చో చెప్పు” అని అన్నది. అతడు జవాబిస్తూ, “బహుశ నా జుట్టును ఏడు జడలుగా మగ్గంతో అల్లితే వాటిని అనపసూదితో కట్టేస్తే నేను అందరు మనుష్యుల్లా బలహీనుడను అయిపోతాను” అని అన్నాడు కాబట్టి అతడు పడుకున్నప్పుడు దెలీలా అతని జుట్టును ఏడు జడలుగా మగ్గంతో అల్లి,
JDG 16:14 మేకు పెట్టి బిగించింది. అప్పుడు సంసోనుతో, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని అనగానే అతడు నిద్ర మేల్కొని అనపసూదిని మగ్గాన్ని లాగివేశాడు.
JDG 16:15 అప్పుడు ఆమె, “నామీద నమ్మకం లేకుండా నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్తావు? నీ గొప్ప బలం యొక్క రహస్యం నాకు చెప్పకుండా నన్ను మోసం చేయడం ఇది మూడవసారి” అని అన్నది.
JDG 16:16 ఇలా ఆమె ప్రతిరోజు అతన్ని వేధించడంతో అతడు చస్తే బాగుండేది అనుకున్నాడు.
JDG 16:17 అతడు ఆమెకు మొత్తం చెప్పేశాడు, “నేను పుట్టినప్పటి నుండి దేవునికి నాజీరుగా ప్రతిష్ఠించబడ్డాను. నా తలమీద ఇంతవరకు ఎన్నడు మంగల కత్తి పడలేదు. నా తలవెంట్రుకలు పూర్తిగా తీసివేస్తే నా బలం తొలగిపోయి నేను అందరు మనుష్యుల్లా బలహీనమవుతాను” అని చెప్పాడు.
JDG 16:18 అతడు తనకు మొత్తం చెప్పాడని దెలీలా గ్రహించి, ఫిలిష్తీ నాయకులకు, “మరోసారి మీరు రండి; అతడు నాకు మొత్తం చెప్పాడు” అని కబురు పంపింది. కాబట్టి ఫిలిష్తీయుల నాయకులు తమతో వెండిని తీసుకువచ్చారు.
JDG 16:19 ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒకని పిలిపించి, సంసోను ఏడు జడలను క్షౌరం చేయించి అతన్ని ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టింది. అతని బలం అతన్ని విడిచిపోయింది.
JDG 16:20 అప్పుడు ఆమె, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని అన్నది. అతడు నిద్ర మేల్కొని, “నేను ఎప్పటిలాగే లేచి బయటకు వెళ్లి రెచ్చిపోతాను” అని అనుకున్నాడు, కానీ యెహోవా తనను విడిచిపెట్టారని అతనికి తెలియలేదు.
JDG 16:21 తర్వాత ఫిలిష్తీయులు అతన్ని బంధించి కళ్లు ఊడదీసి గాజాకు తీసుకెళ్లారు. అతన్ని ఇత్తడి గొలుసులతో బంధించి చెరసాలలో ధాన్యం విసరడానికి పెట్టారు.
JDG 16:22 అయితే క్షౌరం చేయబడిన అతని తలమీద వెంట్రుకలు పెరగడం మొదలయ్యాయి.
JDG 16:23 ఫిలిష్తీయుల నాయకులు, “మన దేవుడు మన శత్రువైన సంసోనును మన చేతికప్పగించాడు” అని చెప్పుకుంటూ తమ దేవుడైన దాగోనుకు గొప్ప బలిగా అర్పించి పండుగ చేసుకోడానికి ఒకచోట చేరారు.
JDG 16:24 ఆ ప్రజలు అతన్ని చూసి, “మన దేవుడు మన శత్రువును మన చేతులకు అప్పగించాడు, మన దేశాన్ని పాడు చేసినవాన్ని, మన వారినెంతో మందిని చంపినవాన్ని మనకప్పగించాడు” తమ దేవున్ని పొగిడారు,
JDG 16:25 వారి హృదయాలు సంతోషంతో నిండిపోయి, “మనకు వినోదం కలిగించడానికి సంసోనును బయటకు తీసుకురండి!” అని కేకలు వేశారు. వారు సంసోనును చెరసాల నుండి పిలిపించి వారి ముందు నిలబెట్టినప్పుడు అతడు వారికి వినోదం కలిగించాడు. వారు అతన్ని స్తంభాల మధ్య నిలబెట్టినప్పుడు,
JDG 16:26 తన చేయి పట్టుకున్న దాసునితో సంసోను, “ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? నేను వాటిని ఆనుకుని నిలబడతాను” అని అడిగాడు.
JDG 16:27 ఆ గుడి స్త్రీ పురుషులతో నిండిపోయింది. ఫిలిష్తీయుల నాయకులందరు అక్కడే ఉన్నారు, సంసోను చేస్తున్న వినోదాన్ని గుడి కప్పు మీది నుండి దాదాపు మూడువేలమంది స్త్రీ పురుషులు చూస్తున్నారు.
JDG 16:28 అప్పుడు సంసోను, “ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవా దయచేసి ఒక్కసారి నన్ను బలపరచండి, నా రెండు కళ్లు పెరికివేసిన ఫిలిష్తీయుల మీద ఒక్కసారి ప్రతీకారం తీర్చుకుంటాను” అని ప్రార్థన చేశాడు.
JDG 16:29 తర్వాత సంసోను గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో కుడిచేతితో ఒకదాన్ని ఎడమచేతితో ఒకదాన్ని పట్టుకుని,
JDG 16:30 సంసోను, “నేను నాతోపాటు ఫిలిష్తీయులు కలిసి చస్తాం” అంటూ బలంగా ముందుకు వంగాడు! అంతే ఆ గుడి దానిలో ఉన్న అధికారులు ప్రజలు అందరి మీదా కూలి, అతడు బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారికంటే చనిపోయేటప్పుడు ఎక్కువమందిని చంపాడు.
JDG 16:31 అప్పుడు అతని సోదరులు, తండ్రి ఇంటివారందరు అతన్ని మోసికొనివచ్చి అతన్ని జోరహుకును ఎష్తాయోలుకును మధ్యలో ఉన్న అతని తండ్రి మనోహ సమాధిలో పాతిపెట్టారు. సంసోను ఇశ్రాయేలును ఇరవై సంవత్సరాలు నడిపించాడు.
JDG 17:1 ఎఫ్రాయిం కొండ సీమలో మీకా అనే ఒక వ్యక్తి నివసిస్తున్నాడు.
JDG 17:2 అతడు తన తల్లితో, “నీ దగ్గర నుండి తీసుకున్న పదకొండు వందల షెకెళ్ళ వెండి గురించి నీవు పెట్టిన శాపనార్థాలను నేను విన్నాను. ఆ వెండి నా దగ్గరే ఉంది, నేనే దానిని తీసుకున్నాను” అని అన్నాడు. అందుకు అతని తల్లి, “నా కుమారుడా! యెహోవా నిన్ను దీవించును గాక” అని అన్నది.
JDG 17:3 అతడు ఆ పదకొండు వందల షెకెళ్ళ వెండిని తన తల్లికి తిరిగి ఇచ్చేసినప్పుడు ఆమె, “నేను నా వెండిని యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, నా కుమారుడు వెండితో పొదిగించిన ఒక విగ్రహం తయారుచేసిన తర్వాత అది తిరిగి నీకు ఇచ్చేస్తాను” అని అన్నది.
JDG 17:4 కాబట్టి అతడు తన తల్లికి ఆ వెండి తిరిగి ఇచ్చేసిన తర్వాత ఆమె దానిలో రెండువందల షెకెళ్ళ వెండి తీసి, కంసాలికి ఇచ్చింది. అతడు దానితో ఒక విగ్రహం చెక్కి పూత విగ్రహం తయారుచేశాడు. వాటిని మీకా ఇంట్లో పెట్టారు.
JDG 17:5 మీకా అనే ఈ వ్యక్తికి క్షేత్రం ఒకటి ఉన్నది, అతడు ఒక ఏఫోదును, మరికొన్ని గృహ దేవుళ్ళ విగ్రహాలను చేయించి, తన కుమారులలో ఒకనిని తన యాజకునిగా నియమించాడు.
JDG 17:6 ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు; ప్రతి ఒక్కరూ తమకు సరియైనదని అనిపించింది చేసేవారు.
JDG 17:7 యూదా ప్రాంతంలోని బేత్లెహేములో యూదా కుటుంబీకులతో నివసిస్తున్న ఒక లేవీ యువకుడు,
JDG 17:8 యూదాలోని బేత్లెహేము పట్టణాన్ని విడిచి, తాను నివసించడానికి స్థలం వెదకడానికి వెళ్లాడు. ఆ పనిమీద వెళ్తూ అతడు ఎఫ్రాయిం కొండ సీమలోని మీకా ఇంటికి వచ్చాడు.
JDG 17:9 మీకా అతన్ని, “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు. అతడు, “నేను యూదాలోని బేత్లెహేములో ఉంటున్న లేవీయుడను. నివసించడానికి స్థలం వెదకుతున్నాను” అన్నాడు.
JDG 17:10 అప్పుడు మీకా ఆ లేవీయునితో, “నీవు నాతో నివసిస్తూ, నా తండ్రిగా, యాజకునిగా ఉండిపో. నేను సంవత్సరానికి పది షెకెళ్ళ వెండి, బట్టలు, భోజనం ఇస్తాను” అన్నాడు.
JDG 17:11 కాబట్టి ఆ లేవీయుడు అతనితో ఉండడానికి ఒప్పుకున్నాడు, ఆ యువకుడు తన కుమారులలో ఒకనిగా అయ్యాడు.
JDG 17:12 మీకా ఆ లేవీయున్ని నియమించగా ఆ యువకుడు యాజకునిగా ఉంటూ ఆ ఇంట్లో నివసించాడు.
JDG 17:13 మీకా, “ఈ లేవీయుడు నా యాజకుడయ్యాడు, కాబట్టి ఇప్పుడు యెహోవా నాకు మేలు చేస్తారని నాకు తెలుసు” అన్నాడు.
JDG 18:1 ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు. ఆ రోజుల్లో దాను గోత్రికులు తాము స్థిరపడడానికి ఒక స్థలం కోసం వెదుకుతున్నారు, ఎందుకంటే ఇశ్రాయేలు గోత్రాల్లో అప్పటికింకా వారికి వారసత్వం లభించలేదు.
JDG 18:2 కాబట్టి దానీయులు తమ వంశాల నుండి అయిదుగురు సమర్థులైన యోధులను ఎన్నుకుని దానీయులందరి తరుపున జోరహు నుండి ఎష్తాయోలు నుండి దేశాన్ని పరిశీలించడానికి పంపి వారితో, “మీరు వెళ్లి దేశాన్ని పరిశీలించి రండి” అని అన్నారు. కాబట్టి వారు ఎఫ్రాయిం కొండసీమకు వెళ్లి మీకా ఇంటికి వచ్చి అక్కడే ఆ రాత్రి గడిపారు.
JDG 18:3 వారు మీకా ఇంటిని సమీపించినప్పుడు, యువకుడైన లేవీయుని స్వరం గుర్తుపట్టి, అతని దగ్గరకు వెళ్లి అతనితో, “నిన్ను ఇక్కడకు ఎవరు తీసుకువచ్చారు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?” అని అడిగారు.
JDG 18:4 అతడు మీకా తనకు చేసిందంతా వారికి చెప్తూ, “అతడు నన్ను జీతానికి పెట్టుకున్నాడు, నేను అతని యాజకుడిని” అని అన్నాడు.
JDG 18:5 అప్పుడు వారు అతనితో, “మా ప్రయాణం సఫలమవుతుందో లేదో దయచేసి దేవుని దగ్గర విచారించి మాకు చెప్పు” అని అన్నారు.
JDG 18:6 యాజకుడు వారికి జవాబిస్తూ, “క్షేమంగా వెళ్లండి, మీ ప్రయాణానికి యెహోవా యొక్క ఆమోదం ఉంది” అన్నాడు.
JDG 18:7 కాబట్టి ఆ అయిదుగురు మనుష్యులు ప్రయాణిస్తూ లాయిషుకు వచ్చి అక్కడి ప్రజలు సీదోనీయుల్లా సమాధానం భద్రత కలిగి క్షేమంగా జీవించడం చూశారు. ఆ దేశాన్ని ఆక్రమించుకుని వారిని బాధించేవారు ఎవరూ లేరని, వారు వృద్ధి చెందుతున్నారని చూశారు. అంతేకాక వారు సీదోనీయులకు దూరంగా ఉంటూ ఎవరితో సంబంధం లేకుండా ఉండడం చూశారు.
JDG 18:8 వారు జోరహుకు ఎష్తాయోలుకు తిరిగి వచ్చినప్పుడు, వారి తోటి దానీయులు, “మీరు ఏం తెలుసుకున్నారు?” అని వారిని అడిగారు.
JDG 18:9 వారు జవాబిస్తూ, “పదండి, వారి మీద దాడి చేద్దాం! ఆ ప్రాంతాన్ని చూశాం, అది చాలా బాగుంది. ఇంకా వేచి ఉండడం ఎందుకు? వెళ్లి స్వాధీనం చేసుకోవడానికి ఆలస్యం చేయవద్దు,
JDG 18:10 మీరు అక్కడికి చేరిన తర్వాత ధైర్యంగా ఉన్న జనాన్ని విశాల ప్రదేశాన్ని, ఏ కొరత లేని స్థలాన్ని మీరు చూస్తారు, దానిని దేవుడు మీ చేతులకు అప్పగిస్తారు” అన్నారు.
JDG 18:11 అప్పుడు దాను గోత్రం నుండి ఆరువందలమంది యుద్ధం చేయడానికి ఆయుధాలు ధరించి జోరహు, ఎష్తాయోలు నుండి బయలుదేరారు.
JDG 18:12 వారు ప్రయాణమై యూదాలోని కిర్యత్-యారీము దగ్గర మకాం చేశారు. అందుకు ఈనాటికీ కిర్యత్-యారీముకు పడమరగా ఉన్న స్థలాన్ని మహానే-దాను అంటారు.
JDG 18:13 వారు అక్కడినుండి ఎఫ్రాయిం కొండ సీమకు వెళ్లి మీకా ఇంటికి వచ్చారు.
JDG 18:14 అప్పుడు లాయిషు ప్రాంతానికి వేగులవారిగా వెళ్లిన ఆ అయిదుగురు తమ తోటి దానీయులతో, “ఈ ఇళ్ళలో ఒక ఇంట్లో ఏఫోదు, కొన్ని గృహదేవతలు, వెండితో పొదిగించిన విగ్రహం ఉన్నాయని మీకు తెలుసా? ఇప్పుడు ఏమి చేయాలో ఆలోచించండి” అన్నారు.
JDG 18:15 కాబట్టి వారు తిరిగి ఆ లేవీ యువకుడు నివసిస్తున్న మీకా ఇంటికి వెళ్లి, అతన్ని క్షేమసమాచారం అడిగారు.
JDG 18:16 ద్వారం దగ్గర యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది దానీయులు నిలబడ్డారు.
JDG 18:17 యాజకుడు, యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, దేశాన్ని పరిశోధించడానికి వెళ్లిన ఆ అయిదుగురు మనుష్యులు లోనికి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును గృహదేవతలను తీసుకున్నారు.
JDG 18:18 ఆ అయిదుగురు మీకా ఇంట్లోకి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును, గృహదేవతలను తీసుకున్నప్పుడు, ఆ యాజకుడు, “మీరు ఏం చేస్తున్నారు?” అని వారిని అడిగాడు.
JDG 18:19 వారు అతనితో, “నోరు మూసుకో! ఒక్క మాట మాట్లాడకుండ మాతో వచ్చి మాకు తండ్రిగా యాజకునిగా ఉండు. ఒక మనిషి కుటుంబానికి మాత్రమే యాజకునిగా ఉండడం కంటే ఇశ్రాయేలులో ఒక గోత్రమంతటికి, కుటుంబానికి యాజకునిగా ఉండడం మంచిది కాదా?” అన్నారు.
JDG 18:20 యాజకుడు చాలా సంతోషించాడు. అతడు ఏఫోదును, గృహదేవతలను, విగ్రహాన్ని తీసుకుని ఆ ప్రజలతో వెళ్లాడు.
JDG 18:21 వారు తమ చిన్న పిల్లలను, పశువులను, ఆస్తులను ముందుగా పెట్టుకొని అక్కడినుండి బయలుదేరారు.
JDG 18:22 వారు మీకా ఇంటి నుండి కొంత దూరం వెళ్లాక, మీకా పొరుగువారు సమకూడి దానీయుల వెంటపడ్డారు.
JDG 18:23 వారు కేకలు వేస్తుండగా, దానీయులు తిరిగి మీకాను, “నీ మనుష్యులను పోరాడడానికి పిలిచావు, నీకేమి కావాలి?” అని అడిగారు.
JDG 18:24 మీకా జవాబిస్తూ, “నేను చేసిన దేవుళ్ళను, నా యాజకుని మీరు తీసుకెళ్లారు. ఇక నా దగ్గర ఏముంది? ‘ఏంటి విషయం?’ అని నన్ను అడుగుతారేంటి?” అన్నాడు.
JDG 18:25 దానీయులు అతనితో అన్నారు, “మాతో వాదించకు; కోపంతో మా మనుష్యుల్లో కొందరు నీపై దాడి చేసి నిన్ను నీ కుటుంబాన్ని చంపుతారు.”
JDG 18:26 కాబట్టి దానీయులు తమ దారిన తాము వెళ్లిపోయారు. వారు అతనికంటే బలంగా ఉన్నారని గ్రహించి, మీకా తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు.
JDG 18:27 దానీయులు మీకా తయారుచేసుకున్న వాటిని, అతని యాజకుడిని తీసుకుని లాయిషుపై, సమాధాన భద్రతలతో ఉన్న ప్రజలను చేరుకున్నారు. వారిపై ఖడ్గంతో దాడి చేసి, పట్టణాన్ని తగలబెట్టారు.
JDG 18:28 ఆ ప్రజలు సీదోనుకు దూరంగా ఉండడం, ఎవరితో సంబంధం లేకపోవడం చేత వారిని కాపాడే మనుష్యులే లేరు. ఆ పట్టణం బేత్-రెహోబు దగ్గర లోయలో ఉంది. దానీయులు ఆ పట్టణాన్ని పునర్నిర్మించి అక్కడ స్థిరపడ్డారు.
JDG 18:29 దానికి ఇశ్రాయేలు కుమారుడైన దాను అని తమ పూర్వికుడైన దాను పేరు పెట్టారు; మొదట ఆ పట్టణం లాయిషు అని పిలువబడేది.
JDG 18:30 అక్కడ దానీయులు తమ కోసం ఆ విగ్రహాన్ని నిలుపుకున్నారు. దేశం చెరగా అయ్యేవరకు, మోషే కుమారుడు గెర్షోము యొక్క కుమారుడైన యోనాతాను, అతని కుమారులు దాను గోత్రానికి యాజకులుగా ఉన్నారు.
JDG 18:31 షిలోహులో దేవుని మందిరం ఉన్న కాలమంతా వారు మీకా చేసిన విగ్రహాన్ని పూజించారు.
JDG 19:1 ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు. అప్పుడు ఎఫ్రాయిం కొండ సీమలో మారుమూల ప్రాంతంలో నివసించే లేవీయుడు ఒకడు యూదాలోని బేత్లెహేముకు లో ఒక ఉంపుడుగత్తెను తెచ్చుకున్నాడు.
JDG 19:2 కాని ఆ ఉంపుడుగత్తె ఒక నమ్మకద్రోహి. ఆమె అతన్ని వదిలి యూదా బేత్లెహేములోని తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ ఆమె నాలుగు నెలలు ఉన్న తర్వాత,
JDG 19:3 ఆమె భర్త తనను బ్రతిమాలి తీసుకువద్దామని ఆమె దగ్గరకు వెళ్లాడు. అతడు వెళ్తూ తనతో తన పనివాన్ని, రెండు గాడిదలను తీసుకెళ్లాడు. ఆమె అతన్ని తన తండ్రి ఇంట్లోకి తీసుకెళ్లినప్పుడు ఆమె తండ్రి అతన్ని చూసి సంతోషంగా అతన్ని ఆహ్వానించాడు.
JDG 19:4 ఆమె తండ్రి అనగా అతని మామ అతన్ని ఉండమని బలవంతం చేశాడు; కాబట్టి అతడు మూడు రోజులు అతని దగ్గరే తింటూ, త్రాగుతూ, పడుకుంటూ అక్కడే ఉన్నాడు.
JDG 19:5 నాలుగవ రోజు వారు ప్రొద్దున్నే లేచి లేవీయుడు వెళ్లడానికి సిద్ధపడ్డాడు కాని ఆమె తండ్రి తన అల్లుడితో, “భోజనం చేసి సేదతీరిన తర్వాత వెళ్లవచ్చు” అన్నాడు.
JDG 19:6 కాబట్టి వారిద్దరు కూర్చుని కలిసి తిని త్రాగారు. తర్వాత ఆమె తండ్రి తన అల్లునితో, “దయచేసి ఈ రాత్రి సరదాగా గడుపు” అని అన్నాడు.
JDG 19:7 ఆ మనుష్యుడు వెళ్లడానికి లేచినప్పుడు, తన మామ బలవంతం చేశాడు కాబట్టి అతడు ఆ రాత్రి అక్కడే ఉన్నాడు.
JDG 19:8 అయిదవ రోజు ప్రొద్దున అతడు వెళ్లడానికి లేచినప్పుడు, ఆమె తండ్రి, “మధ్యాహ్నం వరకు ఉండి కొంచెం సేద తీర్చుకో” అన్నాడు. కాబట్టి వారిద్దరు కలిసి భోజనం చేశారు.
JDG 19:9 తర్వాత అతడు తన ఉంపుడుగత్తె, తన పనివానితో కలిసి వెళ్లడానికి లేచినప్పుడు, అతని మామ, “ఇదిగో చూడు, సాయంత్రం అవుతుంది, రాత్రి ఇక్కడ గడిపి ప్రొద్దున్నే లేచి మీ దారిన మీ ఇంటికి వెళ్లవచ్చు” అన్నాడు.
JDG 19:10 కాని ఇంకొక రాత్రి ఉండడానికి అతడు ఒప్పుకోకుండా తన ఉంపుడుగత్తెను తీసుకుని కట్టిన రెండు గాడిదలతో యెబూసు అనగా యెరూషలేము వైపు వెళ్లాడు.
JDG 19:11 వారు యెబూసును సమీపించినప్పటికి దాదాపు రోజు గడిచింది. పనివాడు తన యజమానితో, “ఈ యెబూసీయుల పట్టణంలో ఆగి ఈ రాత్రి గడుపుదాం” అన్నాడు.
JDG 19:12 తన యాజమాని జవాబిస్తూ, “లేదు, ఇశ్రాయేలీయులు కాని ఏ ప్రజల పట్టణంలోకి వెళ్లక మనం గిబియాకు వెళ్దాం” అన్నాడు.
JDG 19:13 “మనం గిబియాకు గాని రామాకు గాని చేరి ఒకచోట రాత్రి గడుపుదాం” అన్నాడు.
JDG 19:14 కాబట్టి వారు ముందుకు వెళ్తూ ఉండగా బెన్యామీనులోని గిబియాను చేరుకునేటప్పటికి సూర్యాస్తమయం అయ్యింది.
JDG 19:15 వారు ఆ రాత్రి గడపడానికి గిబియాలో ఆగారు. వారు వెళ్లి పట్టణం మధ్యలో కూర్చున్నారు కాని ఆ రాత్రి ఎవరూ వారిని తమ ఇంట్లోకి ఆహ్వానించలేదు.
JDG 19:16 ఆ సాయంత్రం గిబియాలో నివసిస్తున్న ఎఫ్రాయిం కొండ సీమకు చెందిన ఒక వృద్ధుడు పొలాల్లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు (ఆ పట్టణంలో నివసిస్తున్నవారు బెన్యామీనీయులు).
JDG 19:17 ఆ వృద్ధుడు ఊరి మధ్యలో ప్రయాణికున్ని చూసి, “మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ నుండి వస్తున్నారు?” అని అడిగాడు.
JDG 19:18 అందుకతడు, “మేము యూదాలోని బేత్లెహేము నుండి ప్రయాణమై నేను నివసించే ఎఫ్రాయిం కొండసీమలో ఉన్న మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాం, నేను అక్కడివాడను. నేను యూదాలోని బేత్లెహేముకు వెళ్లి వస్తున్నాను. ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్తున్నాను. ఎవరూ నన్ను ఇంటికి చేర్చుకోలేదు.
JDG 19:19 మా గాడిదలకు గడ్డి, ఎండుగడ్డి మేత మా దగ్గర ఉంది. నాకు మీ దాసికి, మాతో ఉన్న యువకుడికి రొట్టె, ద్రాక్షరసం కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మాకెలాంటి ఇబ్బంది లేదు” అన్నాడు.
JDG 19:20 ఆ వృద్ధుడు, “మీకు క్షేమం కలుగును గాక! మీరు మా ఇంటికి రండి, మీకు అవసరమైంది నేను చూసుకుంటాను. ఇలా రాత్రివేళ వీధిలో మాత్రం గడపకండి” అని అన్నాడు.
JDG 19:21 అతడు వారిని ఇంటికి తీసుకెళ్లి తమ గాడిదలకు మేత వేశాడు. వారు తమ కాళ్లు కడుక్కున్న తర్వాత భోజనపానీయాలు పుచ్చుకున్నారు.
JDG 19:22 అలా వారు ఆనందిస్తూ ఉండగా, ఆ పట్టణంలో ఉన్న కొందరు దుష్టులు ఆ ఇంటి చుట్టూ చేరి తలుపును తడుతూ ఆ ఇంటి యజమానియైన ఆ వృద్ధునితో, “నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకురా, మేము అతనితో పడుకుంటాం” అని బిగ్గరగా అరిచారు.
JDG 19:23 అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకు వెళ్లి వారితో అన్నాడు, “అలా అనవద్దు. నా సోదరులారా, అంత నీచానికి దిగజారకండి, ఈ మనిషి నా అతిథి కాబట్టి ఇంత అవమానకరమైన పని చేయవద్దు.
JDG 19:24 ఇదిగో, కన్యగా ఉన్న నా కుమార్తె అతని ఉంపుడుగత్తె ఉన్నారు, వారిని బయటకు తెస్తాను, మీరు వారిని వాడుకొని ఏమి చేయాలనుకుంటే అది చేసుకోండి. అయితే ఈ మనిషి పట్ల ఇంత అవమానకరమైన పని చేయకండి.”
JDG 19:25 అయితే ఆ మనుష్యులు అతని మాట వినలేదు. కాబట్టి ఆ మనుష్యుడు తన ఉంపుడుగత్తెను బయటకు వారి దగ్గరకు పంపాడు, వారు ఆమెను మానభంగం చేస్తూ, రాత్రంతా వేదిస్తూ ఉన్నారు. తెల్లవారినప్పుడు వారు ఆమెను వెళ్లనిచ్చారు.
JDG 19:26 ప్రొద్దున్నే ఆమె తన యజమాని ఉంటున్న ఇంటికి తిరిగివెళ్లి ద్వారం దగ్గర వెలుగు వచ్చేవరకు పడి ఉంది.
JDG 19:27 ప్రొద్దున ఆమె యజమాని లేచి, ఇంటి తలుపు తీసి తన దారిన వెళ్లడానికి బయటకు వచ్చి చూస్తే, అక్కడ ఇంటి ద్వార మార్గంలో తన ఉంపుడుగత్తె తన చేతులు గడప మీద పెట్టుకొని పడి ఉన్నది.
JDG 19:28 అతడు ఆమెతో అన్నాడు, “లే, మనం వెళ్దాము.” అయితే ఆమె నుండి జవాబు రాలేదు. అప్పుడు ఆ మనిషి ఆమెను తన గాడిద మీద ఉంచి ఇంటికి బయలుదేరాడు.
JDG 19:29 అతడు ఇంటికి చేరుకుని ఒక కత్తి తీసుకుని తన ఉంపుడుగత్తెను పన్నెండు ముక్కలుగా ఏ అవయవానికి ఆ అవయవం కోసి, ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిటికీ పంపాడు.
JDG 19:30 అది చూసినవారందరు, “ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన రోజు నుండి ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఈ విషయమై ఆలోచించండి! మనం ఏమి చేయాలో తెలుపండి!” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
JDG 20:1 అప్పుడు ఇశ్రాయేలీయులందరు, దాను నుండి బెయేర్షేబ వరకు ఉన్నవారు, గిలాదు ప్రదేశంలో ఉన్నవారు, అంతా ఏకమై మిస్పా దగ్గర యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు.
JDG 20:2 ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నాయకులు, నాలుగు లక్షలమంది ఆయుధాలు కలిగి దేవుని ప్రజల సమావేశానికి హాజరయ్యారు.
JDG 20:3 ఇశ్రాయేలీయులు మిస్పాకు వెళ్లారని బెన్యామీనీయులు విన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఈ నీచమైన పని ఎలా జరిగిందో మాకు చెప్పండి” అన్నారు.
JDG 20:4 చంపబడిన స్త్రీ భర్తయైన లేవీయుడు మాట్లాడుతూ అన్నాడు, “నేను, నా ఉంపుడుగత్తె రాత్రి గడుపుదామని బెన్యామీనులోని గిబియాకు వచ్చాము.
JDG 20:5 రాత్రివేళ గిబియా నాయకులు నా వెంటపడి నన్ను చంపాలనుకొని ఇంటిని చుట్టుముట్టారు. వారు నా ఉంపుడుగత్తెను మానభంగం చేయగా ఆమె చనిపోయింది.
JDG 20:6 ఇశ్రాయేలులో ఇలాంటి దుర్మార్గం, అవమానకరమైన పనివారు చేశారు కాబట్టి నా ఉంపుడుగత్తెను తీసుకెళ్లి ఆమెను ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్కను ఇశ్రాయేలీయుల వారసత్వ ప్రాంతాలకు పంపాను.
JDG 20:7 ఇప్పుడు, ఇశ్రాయేలీయులైన మీరంతా మాట్లాడి ఏమి చేయాలని నిర్ణయించారో చెప్పండి” అన్నాడు.
JDG 20:8 అప్పుడు ప్రజలంతా ఏకమై లేచి, “మనలో ఎవ్వరూ తమ గుడారానికి గాని ఇళ్ళకు గాని తిరిగి వెళ్లరు.
JDG 20:9 అయితే గిబియాకు మనం చేసేది ఇది: చీట్లు వేసి దాని ప్రకారం మనం గిబియా మీద దాడి చేద్దాము.
JDG 20:10 ఆహారం తీసుకురావడానికి ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నుండి వందమందికి పదిమందిని, వెయ్యిమందికి వందమందిని, పదివేలమందికి వెయ్యిమందిని ఎన్నుకుందాము. అప్పుడు సైన్యం బెన్యామీనులోని గెబాకు చేరుకుంటారు, ఇశ్రాయేలులో వారు చేసిన అవమానకరమైన పనిని బట్టి వారిని శిక్షిస్తారు” అని అన్నారు.
JDG 20:11 కాబట్టి ఇశ్రాయేలీయులందరు ఏకమై లేచి పట్టణానికి వ్యతిరేకంగా కూడుకున్నారు.
JDG 20:12 ఇశ్రాయేలు గోత్రాల వారు బెన్యామీను గోత్రమంతటికి దూతలను పంపి అన్నారు, “మీ మధ్య జరిగిన ఈ నీచమైన నేరం సంగతి ఏమిటి?
JDG 20:13 ఇప్పుడు గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించండి, మేము వారిని చంపి ఇశ్రాయేలులో ఈ దుష్టత్వం లేకుండా చేస్తాము.” కాని బెన్యామీనీయులు తమ తోటి ఇశ్రాయేలీయుల మాట వినలేదు.
JDG 20:14 ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి, బెన్యామీనీయులు తమ పట్టణాల నుండి గిబియా దగ్గరకు కలిసి వచ్చారు.
JDG 20:15 ఆ రోజు గిబియాలో నివసిస్తున్న ఏడువందలమంది శూరులకు అధనంగా బెన్యామీనీయులు తమ పట్టణాల నుండి కత్తియుద్ధం చేయగలిగే ఇరవై ఆరు వేలమందిని పోగుచేసుకున్నారు.
JDG 20:16 వీరందరిలో ఎడమచేతి వాటంగల వారు ఏడువందలమంది ప్రత్యేకమైన వారున్నారు, ఒక్కొక్కరు వడిసెలలో రాయి పెట్టి, తల వెంట్రుకలనైనా గురి తప్పకుండా కొట్టగలరు.
JDG 20:17 బెన్యామీను వారు కాకుండా, ఇశ్రాయేలు వారు కత్తియుద్ధం చేయగలిగే, అనుభవజ్ఞులైన నాలుగు లక్షల మందిని పోగుచేసుకున్నారు.
JDG 20:18 ఇశ్రాయేలీయులు బేతేలుకు వెళ్లి దేవుని దగ్గర విచారణ చేస్తూ, “బెన్యామీనీయుల మీద యుద్ధానికి మాలో ఎవరు ముందు వెళ్లాలి?” అని అడిగారు. యెహోవా జవాబిస్తూ, “యూదా వారే ముందు వెళ్లాలి” అన్నారు.
JDG 20:19 మరుసటిరోజు ఉదయం ఇశ్రాయేలీయులు లేచి గిబియా దగ్గర మకాం వేశారు.
JDG 20:20 ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి గిబియా దగ్గర వారికి ఎదురుగా బారులు తీరారు.
JDG 20:21 ఆ రోజు బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి, యుద్ధభూమిలో ఇరవైరెండువేలమంది ఇశ్రాయేలీయులను హతం చేశారు.
JDG 20:22 అయితే ఇశ్రాయేలీయులు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని మొదట రోజున ఉన్న చోటనే మళ్ళీ యుద్ధానికి బారులు తీరారు.
JDG 20:23 ఇశ్రాయేలీయులు వెళ్లి యెహోవా ఎదుట సాయంత్రం వరకు ఏడ్చి, “మా తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీనీయుల మీదికి మళ్ళీ యుద్ధానికి వెళ్లాలా?” అని అడిగారు. యెహోవా జవాబిస్తూ, “వారి మీదికి వెళ్లండి” అన్నారు.
JDG 20:24 అప్పుడు రెండవ రోజు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను సమీపించారు.
JDG 20:25 ఈసారి వారిని ఎదుర్కోడానికి గిబియా నుండి వచ్చిన బెన్యామీనీయులు పద్దెనిమిదివేలమందిని ఇశ్రాయేలీయులను, హతం చేశారు, వారంతా ఆయుధాలు కలవారు.
JDG 20:26 అప్పుడు ఇశ్రాయేలీయులందరు, సైన్యమంతా బేతేలుకు వెళ్లి అక్కడ యెహోవా సన్నిధిలో కూర్చుని ఏడ్చారు. వారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి దహనబలులు సమాధానబలులు యెహోవాకు అర్పించారు.
JDG 20:27 ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర విచారణ చేశారు. (ఆ రోజుల్లో దేవుని నిబంధన మందసం అక్కడ ఉండేది,
JDG 20:28 అహరోను కుమారుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు దాని ముందు నిలబడి సేవ చేసేవాడు.) వారు అడిగారు, “మేము వెళ్లి మా తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీనీయుల మీద యుద్ధానికి వెళ్లాల వద్దా?” యెహోవా జవాబిస్తూ, “వెళ్లండి, రేపు వారిని మీ చేతికి అప్పగిస్తాను” అన్నారు.
JDG 20:29 ఆ తర్వాత ఇశ్రాయేలు వారు గిబియా చుట్టూ మాటు వేశారు.
JDG 20:30 మూడవ రోజు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి వెళ్లి, మునుపటిలా గిబియాను ఎదురుగా యుద్ధానికి బారులు తీరారు.
JDG 20:31 వారిని ఎదిరించడానికి బెన్యామీనీయులు బయటకు వచ్చి వారిని తరుముతూ పట్టణం నుండి దూరంగా వెళ్లారు. మునుపటిలా వారు ఇశ్రాయేలీయులలో గాయపడిన వారిని చంపడం మొదలుపెట్టి, బేతేలుకు గిబియాకు వెళ్లే రహదారుల్లో, మైదానాల్లో సుమారు ముప్పైమంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.
JDG 20:32 “మునుపటిలా మనం వారిని ఓడిస్తున్నాం” అని బెన్యామీనీయులు అనేటప్పుడు ఇశ్రాయేలీయులు, “మనం పరుగెత్తి వారు తమ పట్టణం నుండి బయటకు వచ్చేలా చేద్దాం” అని చెప్పుకున్నారు.
JDG 20:33 ఇశ్రాయేలు వారందరు తామున్న చోట్ల నుండి బయలుదేరి బయల్-తామారు దగ్గర బారులు తీరారు. అప్పుడు మాటున ఉన్న ఇశ్రాయేలీయులు తమ స్థలం నుండి గెబాకు పడమటి వైపు నుండి దాడి చేశారు.
JDG 20:34 అప్పుడు ఇశ్రాయేలీయులలో పదివేలమంది శూరులైన యువకులు గిబియా ఎదురుగా వచ్చి దాడి చేశారు. యుద్ధం ఎంతో తీవ్రంగా ఉండడంతో బెన్యామీనీయులు తమకు ఆపద రాబోతుందని గ్రహించలేదు.
JDG 20:35 యెహోవా ఇశ్రాయేలీయుల చేతిలో బెన్యామీనీయులను ఓడించారు. ఆ రోజు ఇశ్రాయేలీయులు 25,100 మంది బెన్యామీనీయులను చంపారు. వారంతా కత్తి పట్టినవారే.
JDG 20:36 అప్పుడు తాము ఓటమి పాలయ్యామని బెన్యామీనీయులు తెలుసుకున్నారు. ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు దారి ఇచ్చారు.
JDG 20:37 మాటులో ఉన్నవారు గిబియాలో అకస్మాత్తుగా చొరబడి వారు పట్టణంలోని వారందరిని ఖడ్గంతో చంపారు.
JDG 20:38 పట్టణంలో నుండి పెద్ద మేఘంలా పొగను రాజేయాలని మాటున దాక్కున్న వారికి ఇశ్రాయేలీయులకు మధ్య సంకేతం ఏర్పాటు చేసుకున్నారు,
JDG 20:39 అప్పుడు ఇశ్రాయేలీయులు తిరిగి యుద్ధం చేశారు. బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులకు (దాదాపు ముప్పైమందిని) ప్రాణనష్టం కలిగిస్తూ, “మొదటి యుద్ధంలా మనం వారిని ఓడిస్తున్నాం” అని అన్నారు.
JDG 20:40 అయితే పట్టణంలో నుండి పొగ పైకి లేవడం ఆరంభమైనప్పుడు, బెన్యామీనీయులు పట్టణమంతా ఆకాశం వైపు వెళ్తున్న పొగను చూశారు.
JDG 20:41 అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదురు దాడి చేశారు, విపత్తు తమను సమీపించిందని తెలుసుకొని బెన్యామీనీయులు హడలిపోయారు.
JDG 20:42 కాబట్టి వారు ఇశ్రాయేలీయుల నుండి అరణ్యం వైపు పారిపోయారు, కానీ వారు యుద్ధం తప్పించుకోలేకపోయారు. పట్టణాల్లో నుండి వచ్చిన ఇశ్రాయేలీయులు వారిని అక్కడ హతం చేశారు.
JDG 20:43 వారు బెన్యామీనీయులను చట్టుముట్టి ఆగకుండా వారిని తరిమి గిబియాకు తూర్పుదిక్కు ప్రాంతం దగ్గర ఓడించారు.
JDG 20:44 పద్దెనిమిది వేలమంది బెన్యామీనీయులు పడిపోయారు, వారంతా యుద్ధవీరులు.
JDG 20:45 మిగిలిన వారు అరణ్యం వైపు, రిమ్మోను బండ వైపు పారిపోతున్నప్పుడు, ఇశ్రాయేలీయులు రహదారుల వెంట అయిదువేల మందిని హతం చేశారు. వారింకా బెన్యామీనీయులను గిదోము వరకు తరుముతూ ఇంకొక రెండువేలమందిని హతం చేశారు.
JDG 20:46 ఆ రోజు ఇరవై అయిదువేల బెన్యామీనీయులు కూలారు. వారంతా యుద్ధవీరులు.
JDG 20:47 అయితే వారిలో ఆరువందలమంది మాత్రం తప్పించుకు వెళ్లి అరణ్యంలో ఉన్న రిమ్మోను బండ దగ్గరకు పారిపోయి అక్కడ నాలుగు నెలలు ఉండిపోయారు.
JDG 20:48 ఇశ్రాయేలీయులు బెన్యామీను ప్రదేశానికి తిరగి వెళ్లి పట్టణాల మీద పడి పశువులను, కనిపించిన దాన్నంతా ఖడ్గంతో హతం చేశారు. వారికి కనబడిన ప్రతి పట్టణాన్ని తగుల బెట్టారు.
JDG 21:1 ఇశ్రాయేలీయులు మిస్పాలో, “మనలో ఎవ్వరూ బెన్యామీనీయులకు తమ కుమార్తెలను పెళ్ళికి ఇవ్వకూడదు” అని ప్రమాణం చేసుకున్నారు.
JDG 21:2 ప్రజలు బేతేలుకు వెళ్లి అక్కడ సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో కూర్చుని ఎంతగానో ఏడ్చారు.
JDG 21:3 “యెహోవా! ఇశ్రాయేలు దేవా! ఇశ్రాయేలుకు ఇలా ఎందుకు జరిగింది? ఈ రోజు ఇశ్రాయేలు గోత్రాల్లో ఎందుకని ఒక గోత్రం అంతరించిపోవలసి వచ్చింది?” అంటూ ఏడ్చారు.
JDG 21:4 మరుసటిరోజు ప్రొద్దున్నే వారు ఒక బలిపఠం కట్టి దాని మీద దహనబలులు, సమాధానబలులు అర్పించారు.
JDG 21:5 అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని వారున్నారా?” అని అడిగారు. ఎందుకంటే ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాకపోతే వారికి మరణశిక్ష విధించాలని శపథం చేశారు.
JDG 21:6 అప్పుడు వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీను గోత్రం గురించి బాధపడుతూ, “ఇశ్రాయేలులో ఈ రోజు ఒక గోత్రం అంతరించి పోయింది.
JDG 21:7 వారికి మన కుమార్తెలను ఇవ్వవద్దని మనం యెహోవా పేరట శపథం చేశాం, మరి మిగిలిన వారికి భార్యలను ఎక్కడ చూడగలం?” అనుకున్నారు.
JDG 21:8 తర్వాత వారు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని గోత్రమేది?” అని అడిగారు. చివరకు యాబేషు గిలాదు నుండి ఎవ్వరూ సమావేశానికి రాలేదని తెలుసుకున్నారు.
JDG 21:9 ప్రజలందరినీ లెక్కపెట్టినప్పుడు, యాబేషు గిలాదు నుండి ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు.
JDG 21:10 అప్పుడు సమాజం పన్నెండువేలమంది యుద్ధవీరులను యాబేషు గిలాదుకు పంపతూ, అక్కడికి వెళ్లి అక్కడి వారినందరిని, స్త్రీలు పిల్లలతో సహితం ఖడ్గంతో చంపాలని ఆదేశించారు.
JDG 21:11 వారు, “మీరు ఏం చేయాలంటే, ప్రతి పురుషుని, కన్య కాని ప్రతి స్త్రీని నాశనం చేయండి” అని వారు అన్నారు.
JDG 21:12 వారు అక్కడ యాబేషు గిలాదు ప్రజల్లో పురుషులతో పడుకోని నాలుగువందలమంది యువతులను కనుగొన్నారు, వారిని కనానులోని షిలోహు దగ్గర ఉన్న శిబిరానికి తీసుకెళ్లారు.
JDG 21:13 అప్పుడు సమాజమంతా రిమ్మోను బండ దగ్గర ఉన్న బెన్యామీనీయులతో సమాధానపడదాం అని కబురు పంపారు.
JDG 21:14 ఆ సమయంలో బెన్యామీనీయులు తిరిగి వచ్చారు, యాబేషు గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చినవారిని వారికిచ్చి పెళ్ళిళ్ళు చేశారు. అయితే వారందరికీ ఆ స్త్రీలు సరిపోలేదు.
JDG 21:15 యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో లోపం కలుగజేశారని ప్రజలు బెన్యామీను విషయం బాధపడ్డారు.
JDG 21:16 అప్పుడు సమాజపెద్దలు, “బెన్యామీను గోత్రంలో స్త్రీలు లేకుండా నాశనమై పోయినందుకు, వారిలో మిగిలిన వారిని భార్యలను ఎలా తేగలం?
JDG 21:17 ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రం తుడిచిపెట్టుకుపోకుండ బెన్యామీను గోత్రంలో మిగిలిన వారికి వారసులుండాలి.
JDG 21:18 వారికి మన కుమార్తెలను భార్యలుగా ఇవ్వలేం, ఎందుకంటే ఇశ్రాయేలీయులమైన మనం, ‘ఎవరైనా బెన్యామీనీయునికి తమ కుమార్తెను భార్యగా ఇస్తే వారు శాపగ్రస్తులు’ అని ప్రమాణం చేశాము.
JDG 21:19 అయితే చూడండి, షిలోహులో యెహోవాకు సంవత్సర పండుగ జరుగుతుంది; షిలోహు బేతేలుకు ఉత్తరాన, బేతేలు నుండి షెకెముకు వెళ్లే దారికి తూర్పున, లెబోనాకు దక్షిణాన ఉన్న షిలోహులో యెహోవాకు సంవత్సర పండుగ జరుగుతుంది” అని అన్నారు.
JDG 21:20 అప్పుడు వారు బెన్యామీనీయులను ఇలా ఆదేశించారు: “అక్కడికి వెళ్లి ద్రాక్షతోటల్లో దాక్కుని
JDG 21:21 వేచి ఉండండి. షిలోహు నుండి యువతులు నాట్యంలో పాల్గొనడానికి వస్తున్నప్పుడు, మీరు ద్రాక్షతోటల్లో నుండి త్వరగా వచ్చి, ప్రతివాడును షిలోహు యువతులలో ఒక యువతిని పెళ్ళి చేసుకోడానికి తీసుకెళ్లండి. తర్వాత బెన్యామీను ప్రదేశానికి తిరిగి వెళ్లండి.
JDG 21:22 వారి తండ్రులు గాని సోదరులు గాని మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే, మేము వారితో, ‘యుద్ధ సమయంలో వారికి మేము భార్యలను తీసుకురాలేదు, కాబట్టి మీరు మా పట్ల దయచూపి వారికి సహాయం చెయ్యండి. మీ అంతట మీరు మీ కుమార్తెలను వారికివ్వలేదు, కాబట్టి మీరు ప్రమాణం విషయంలో అపరాధులు కారు’ అని చెప్తాము.”
JDG 21:23 కాబట్టి బెన్యామీనీయులు అలాగే చేశారు. యువతులు నాట్యం చేస్తూ ఉంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క యువతిని పట్టుకుని తనకు భార్యగా చేసుకున్నాడు. తర్వాత వారు తమ వారసత్వ భూమికి తిరిగివెళ్లి పట్టణాలను మళ్ళీ కట్టి వాటిలో స్థిరపడ్డారు.
JDG 21:24 ఆ తర్వాత ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరు అక్కడినుండి తమ తమ గోత్రాలకు, వంశాలకు, తమ వారసత్వ భూమికి వెళ్లిపోయారు.
JDG 21:25 ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు; ప్రతి ఒక్కరూ తమకు సరియైనదని అనిపించింది చేసేవారు.
RUT 1:1 న్యాయాధిపతులు పరిపాలించిన రోజుల్లో దేశంలో కరువు వచ్చింది. కాబట్టి యూదాలోని బేత్లెహేము నుండి ఒక వ్యక్తి తన భార్యను, తన ఇద్దరు కుమారులను తీసుకుని, మోయాబు దేశంలో కొంతకాలం ఉండడానికి వెళ్లాడు.
RUT 1:2 అతని పేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదాలోని బేత్లెహేము వాసులైన ఎఫ్రాతీయులు. వారు మోయాబుకు వెళ్లి అక్కడ నివసించారు.
RUT 1:3 కొంతకాలం తర్వాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. ఆమె, తన ఇద్దరు కుమారులు మిగిలారు.
RUT 1:4 వారు మోయాబు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు, వారిలో ఒకామె పేరు ఓర్పా, మరో ఆమె పేరు రూతు. వారు దాదాపు పది సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత,
RUT 1:5 మహ్లోను కిల్యోను ఇద్దరు చనిపోయారు. నయోమి, తన భర్తను ఇద్దరు కుమారులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది.
RUT 1:6 యెహోవా తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి వారిని దర్శించారని నయోమి విన్నప్పుడు, ఆమె, తన ఇద్దరు కోడళ్ళతో కలిసి మోయాబు విడిచి స్వదేశానికి వెళ్లడానికి సిద్ధపడింది.
RUT 1:7 తన ఇద్దరు కోడళ్ళతో కలిసి తాను ఉంటున్న స్థలం విడిచి యూదా దేశానికి వెళ్లే మార్గంలో బయలుదేరింది.
RUT 1:8 అయితే దారిలో నయోమి తన ఇద్దరు కోడళ్ళతో, “మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్లండి. నా మీద, చనిపోయిన మీ భర్తల మీద మీరు దయ చూపించినట్లు యెహోవా మీమీద దయ చూపును గాక.
RUT 1:9 మీరు మళ్ళీ పెళ్ళి చేసుకుని మీ భర్తల ఇండ్లలో నెమ్మది పొందేలా యెహోవా దయచేయును గాక” అన్నది. తర్వాత వారికి ముద్దు పెట్టింది, వారు బిగ్గరగా ఏడ్చి,
RUT 1:10 ఆమెతో, “మేము నీతో నీ ప్రజల దగ్గరకు వస్తాం” అని అన్నారు.
RUT 1:11 కాని నయోమి, “నా కుమార్తెలారా, మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి, నాతో ఎందుకు వస్తారు? మీకు భర్తలుగా ఉండడానికి నేను ఇంకా కుమారులను కనగలనా?
RUT 1:12 నా బిడ్డలారా, ఇళ్ళకు తిరిగి వెళ్లండి; నేను వృద్ధురాలిని, నేను మళ్ళీ పెళ్ళి చేసుకునే వయస్సులో లేను, ఒకవేళ అది సాధ్యమే అని ఆశించి, ఈ రాత్రి నేను పెళ్ళి చేసుకుని, కుమారులను కన్నా,
RUT 1:13 వారు ఎదిగే వరకు మీరు వేచి ఉంటారా? వారి కోసం పెళ్ళి చేసుకోకుండ ఉంటారా? వద్దు, నా బిడ్డలారా, యెహోవా హస్తం నాకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీకంటే ఎక్కువ బాధ నాకు ఉంది!” అని జవాబిచ్చింది.
RUT 1:14 అలా అనగానే వారు బిగ్గరగా ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్లిపోయింది, కాని రూతు తన అత్తను అంటిపెట్టుకునే ఉంది.
RUT 1:15 నయోమి రూతుతో, “చూడు, నీ తోడి కోడలు తన ప్రజల దగ్గరకు, తన దేవుళ్ళ దగ్గరకు తిరిగి వెళ్తుంది. నీవు తనతో వెళ్లు” అన్నది.
RUT 1:16 అందుకు రూతు, “నిన్ను విడవమని లేదా తిరిగి వెళ్లిపొమ్మని నన్ను బలవంతం చేయకు. నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను, నీవు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు.
RUT 1:17 నీవు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, అక్కడే పాతిపెట్టబడతాను. చావు తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను విడదీస్తే యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించును గాక.”
RUT 1:18 రూతు తనతో కూడ వెళ్లడానికి నిశ్చయించుకుందని నయోమి గ్రహించి, ఆమెను బలవంత పెట్టడం మానేసింది.
RUT 1:19 కాబట్టి ఆ ఇద్దరు స్త్రీలు వారు బేత్లెహేము వరకు ప్రయాణించి బేత్లెహేముకు చేరినప్పుడు, ఆ పట్టణమంతా వారిని చూసి అక్కడికి వచ్చి, “ఈమె నయోమి కదా?” అని స్త్రీలు ఆశ్చర్యం వ్యక్తపరిచారు.
RUT 1:20 ఆమె వారితో, “నన్ను నయోమి అని పిలువకండి, మారా అని పిలువండి, ఎందుకంటే సర్వశక్తుడు నాకు జీవితాన్ని చాలా చేదుగా మార్చారు.
RUT 1:21 నేను సమృద్ధి కలదానిగా వెళ్లాను, అయితే యెహోవా నన్ను ఏమి లేనిదానిగా తీసుకువచ్చారు. ఎందుకు నన్ను నయోమి అని పిలుస్తారు? యెహోవా నాకు శ్రమ కలుగజేశారు; సర్వశక్తుడు నాకు బాధ కలిగించారు” అన్నది.
RUT 1:22 అలా నయోమి మోయాబీయురాలైన తన కోడలు రూతుతో మోయాబు నుండి యవల కోత ఆరంభంలో బేత్లెహేముకు చేరుకుంది.
RUT 2:1 నయోమికి తన భర్త ఎలీమెలెకు వంశం యొక్క బంధువు ఉన్నాడు, అతని పేరు బోయజు.
RUT 2:2 మోయాబీయురాలైన రూతు నయోమితో, “నేను పొలాలకు వెళ్లి ఎవరి దృష్టిలో దయ పొందితే అతని వెనుక అతని పొలంలో పరిగె ఏరుకు వస్తాను” అని చెప్పింది. అందుకు నయోమి, “నా కుమారీ, వెళ్లు” అన్నది.
RUT 2:3 కాబట్టి ఆమె వెళ్లి, ఒక పొలంలో కోతకోస్తున్న పనివారి వెనుక పరిగె ఏరుకోవడం ప్రారంభించింది. అలా ఆమె పని చేసిన పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుకు చెందినది.
RUT 2:4 అప్పుడే బోయజు బేత్లెహేము నుండి వచ్చి, “యెహోవా మీకు తోడై ఉండును గాక!” అని పనివారితో అన్నాడు. “యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక!” అని వారు జవాబిచ్చారు.
RUT 2:5 అప్పుడు బోయజు కోతపనివారి మీద నియమించబడిన తన సేవకునితో, “ఈ యువతి ఎవరికి సంబంధించినది?” అని అడిగాడు.
RUT 2:6 సేవకుడు జవాబిస్తూ అన్నాడు, “ఆమె మోయాబు నుండి నయోమితో కూడ తిరిగివచ్చిన మోయాబీయురాలు.
RUT 2:7 ‘దయచేసి నేను పనివారి వెనుక వెళ్లి పనల మధ్య పరిగెను ఏరుకోనివ్వండి’ అని ఆమె అన్నది. ఉదయం నుండి ఇప్పటివరకు ఏరుకుంటూ ఉన్నది, కొంతసేపు మాత్రమే ఆమె ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంది.”
RUT 2:8 కాబట్టి బోయజు రూతుతో అన్నాడు, “నా కుమారీ, నా మాట విను. ఏరుకోడానికి వేరే పొలంలోకి వెళ్లకు, దీనిని విడిచి వెళ్లకు. నా కోసం పని చేసే స్త్రీలతో ఉండు.
RUT 2:9 పురుషులు పంట కోస్తున్నప్పుడు కనిపెట్టి స్త్రీల వెంట వెళ్లు. నిన్ను ఇబ్బంది కలిగించవద్దని పురుషులకు చెప్పాను. నీకు దాహం వేస్తే, పురుషులు నింపిన కుండల దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగు.”
RUT 2:10 అందుకు ఆమె తలవంచి సాష్టాంగపడి, “నేను పరదేశిని, మీరు నన్ను గమనించేటంత దయ మీ దృష్టిలో ఎలా సంపాదించుకున్నాను?” అని ఆమె అతన్ని అడిగింది.
RUT 2:11 అందుకు బోయజు ఆమెతో అన్నాడు, “నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నీవు చేసినదంతా అనగా ఎలా నీవు నీ తండ్రిని తల్లిని, నీ కుటుంబాన్ని, నీ స్వదేశాన్ని విడిచి ఇంతకుముందు నీకు తెలియని ఈ ప్రజల మధ్యకు వచ్చావో నేను విన్నాను.
RUT 2:12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును గాక. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును గాక.”
RUT 2:13 అందుకు ఆమె, “నా ప్రభువా, నేను మీ పనివారిలో ఒకదాన్ని కానప్పటికి, మీరు నన్నాదరించి దయతో మాట్లాడారు. నేను మీ దృష్టిలో దయ సంపాదించుకోవడం కొనసాగాలి” అన్నది.
RUT 2:14 భోజన సమయంలో బోయజు ఆమెతో, “నీవిక్కడికి రా, భోజనం చేసి, పులిసిన ద్రాక్షరసంలో రొట్టె ముంచి తిను” అన్నాడు. ఆమె పనివారితో కూర్చున్నప్పుడు, అతడు ఆమెకు కాల్చిన ధాన్యం కొంత ఇచ్చాడు. ఆమె తృప్తిగా తిని కొంత మిగిల్చింది.
RUT 2:15 ఆమె ఏరుకోడానికి లేచినప్పుడు, బోయజు తన మగ పనివారితో, “ఆమె పనల మధ్య ఏరుకోనివ్వండి, ఆమెను అభ్యంతర పెట్టకండి.
RUT 2:16 ఆమె కోసం కొన్ని కంకులు పనల నుండి పడేయండి, ఆమె వాటిని ఏరుకునేలా విడిచిపెట్టండి, ఆమెను గద్దించకండి” అని అంటూ హెచ్చరించాడు.
RUT 2:17 కాబట్టి రూతు సాయంత్రం వరకు పరిగె ఏరుకుంది. తర్వాత తాను సేకరించుకున్న యవలను దుళ్లగొట్టింది, అది దాదాపు తూమెడు అయ్యింది.
RUT 2:18 ఆమె వాటిని పట్టణానికి తీసుకెళ్లింది, తన అత్త ఆమె ఎంత సేకరించిందో చూసింది. రూతు తాను తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన దానిని కూడ తెచ్చి ఆమెకు ఇచ్చింది.
RUT 2:19 ఆమె అత్త ఆమెతో, “ఈ రోజు నీవెక్కడ ఏరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నిన్ను గమనించిన మనిషి ధన్యుడు!” అని అన్నది. అప్పుడు రూతు ఆమె ఏ స్థలంలో పని చేస్తూ ఉన్నదో చెప్తూ, “నేను బోయజు అని పేరుగల మనిషి దగ్గర ఈ రోజు పని చేశాను” అన్నది.
RUT 2:20 నయోమి తన కోడలితో, “యెహోవా అతన్ని ఆశీర్వదించును గాక! అతడు బ్రతికి ఉన్నవారికి, చచ్చినవారికి దయ చూపడం మానలేదు” అన్నది. “ఆ మనుష్యుడు మనకు సమీపబంధువు; అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు” అని కూడా చెప్పింది.
RUT 2:21 అప్పుడు మోయాబీయురాలైన రూతు అన్నది, “అతడు నాతో, ‘నా పనివారు పంటంతా కోసే వరకు వారితో ఇక్కడే ఉండు’ అని కూడా అన్నాడు.”
RUT 2:22 నయోమి తన కోడలైన రూతుతో, “నా కుమారీ, అతని పనికత్తెలతోనే వెళ్లడం మంచిది, ఎందుకంటే ఇతరుల పొలంలో నీకు హాని కలుగవచ్చు” అని అన్నది.
RUT 2:23 కాబట్టి రూతు పరిగె ఏరుకోడానికి, యవల కోత గోధుమల కోత ముగిసేవరకు బోయజు పనికత్తెలకు దగ్గరగా ఉంది. ఆమె తన అత్తతో నివసించింది.
RUT 3:1 ఒక రోజు రూతు అత్తయైన నయోమి, “నా కుమారీ, నేను నీకోసం ఒక ఇంటిని వెదకాలి, అక్కడ నీకు మంచి జరుగుతుంది.
RUT 3:2 నీవు ఎవరి పనికత్తెలతో పని చేస్తున్నావో, ఆ బోయజు మనకు బంధువు. ఈ రాత్రి అతడు నూర్పిడి కళ్ళంలో యవలు చెరిగిస్తూ ఉంటాడు.
RUT 3:3 నీవు స్నానం చేసి నూనె రాసుకుని మంచి బట్టలు కట్టుకుని ఆ నూర్పిడి కళ్ళం దగ్గరకు వెళ్లు. అతడు భోజనం చేసే వరకు నీవు అక్కడ ఉన్నావని అతనికి తెలియనీయకు.
RUT 3:4 అతడు పడుకున్నప్పుడు అతడు పడుకున్న స్థలం గమనించు. తర్వాత లోపలికి వెళ్లి, అతని కాళ్లమీద ఉన్న బట్ట తీసి పడుకో. నీవు ఏం చేయాలో అతడు నీకు చెప్తాడు” అని చెప్పింది.
RUT 3:5 అందుకు రూతు, “నీవు చెప్పింది నేను చేస్తాను” అని జవాబిచ్చింది.
RUT 3:6 కాబట్టి ఆమె ఆ నూర్పిడి కళ్ళం దగ్గరకు వెళ్లి, తన అత్త చెప్పినదంతా చేసింది.
RUT 3:7 బోయజు తృప్తిగా భోజనం చేసి పడుకోడానికి ధాన్యం కుప్ప దగ్గరకు వెళ్లాడు. రూతు మెల్లగా వెళ్లి, అతని కాళ్ల మీదున్న దుప్పటి తీసి పడుకుంది.
RUT 3:8 మధ్యరాత్రి అతడు ఉలిక్కిపడి తిరిగి చూసినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్ల దగ్గర పడుకుని కనిపించింది.
RUT 3:9 “ఎవరు నీవు?” అని అతడు అడిగాడు. రూతు జవాబిస్తూ, “నేను రూతును, మీ దాసురాలిని, మీరు నన్ను విడిపించగల సమీపబంధువు కాబట్టి నా మీద మీ వస్త్రం కప్పండి” అన్నది.
RUT 3:10 అతడు, “నా కుమారీ, యెహోవా నిన్ను దీవించును గాక. నీవు చూపించే ఈ మంచితనం ఇంతకుముందు కన్నా ఇంకా గొప్పది: ధనికులైనా పేదలైనా సరే, నీవు ఏ యువకుల వెంటపడలేదు.
RUT 3:11 నా కుమారీ, భయపడకు. నీవు అడిగినదంతా నీకు చేస్తాను. నీవు గుణవతివని నా పట్టణంలో ఉన్న ప్రజలందరికి తెలుసు.
RUT 3:12 నేను నిన్ను విడిపించగల సమీపబంధువును అనే సంగతి నిజమే కాని, నా కంటే సమీపబంధువు ఒకడు ఉన్నాడు.
RUT 3:13 ఈ రాత్రి ఇక్కడ ఉండు, ప్రొద్దున అతడు నీకు బంధువుని ధర్మం జరిగిస్తే మంచిది; అతడు నిన్ను విడిపిస్తాడు. అయితే అతడు ఒప్పుకోకపోతే, సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడిపిస్తాను. ఉదయం వరకు ఇక్కడ పడుకో” అని చెప్పాడు.
RUT 3:14 కాబట్టి ఆమె ఉదయం వరకు అతని పాదాల దగ్గర పడుకుని, ఇంకా ఒకనిని ఒకరు గుర్తుపట్టేటంత వెలుగు రాకముందే లేచింది; “ఒక స్త్రీ నూర్పిడి కళ్ళం లోనికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు” అని బోయజు అన్నాడు.
RUT 3:15 అంతేకాక, “నీవు కప్పుకున్న దుప్పటి తీసుకువచ్చి దాన్ని పట్టుకో” అని చెప్పాడు. ఆమె అలా చేసినప్పుడు, అతడు ఆరు కొలతల యవలను పోసి ఆమెపై పెట్టాడు. తర్వాత అతడు పట్టణానికి తిరిగి వెళ్లాడు.
RUT 3:16 రూతు తన అత్త ఇంటికి వచ్చినప్పుడు, నయోమి, “నా కుమారీ, నీవు వెళ్లిన పని ఏమైంది?” అని అడిగింది. అప్పుడు ఆమె బోయజు తన కోసం చేసినదంతా చెప్పింది.
RUT 3:17 అంతేకాక, “ ‘నీవు వట్టి చేతులతో నీ అత్త దగ్గరకు వెళ్లకు’ అని చెప్తూ, అతడు ఈ ఆరు కోలల యవలను నాకిచ్చాడు” అని చెప్పింది.
RUT 3:18 అపుడు నయోమి, “నా కుమారీ, ఏమి జరుగుతుందో నీవు తెలుసుకునే వరకు వేచి ఉండు. ఈ సంగతి ఈ రోజు తేలేవరకు ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకోడు” అని అన్నది.
RUT 4:1 బోయజు పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి అక్కడ కూర్చున్నప్పుడు, అతడు చెప్పిన సమీపబంధువు అక్కడికి వచ్చాడు. “నా స్నేహితుడా, ఇక్కడకు వచ్చి కూర్చో” అని బోయజు అన్నాడు. కాబట్టి అతడు వెళ్లి కూర్చున్నాడు.
RUT 4:2 బోయజు ఆ పట్టణ పెద్దలలో పదిమందిని తీసుకుని వచ్చి, “ఇక్కడ కూర్చోండి” అని చెప్పాడు, వారు కూర్చున్నారు.
RUT 4:3 అతడు ఆ బంధువుతో అన్నాడు, “మోయాబు నుండి తిరిగివచ్చిన నయోమి, మన బంధువైన ఎలీమెలెకుకు చెందిన భూమిని అమ్మి వేస్తుంది.
RUT 4:4 ఈ విషయం నీ దృష్టికి తీసుకురావాలని, నీవు నా ప్రజల పెద్దల ఎదుట దానిని కొనాలని నేను అనుకున్నాను. నీవు విడిపిస్తే విడిపించు. కాని ఒకవేళ నీవు విడిపించకపోతే నాకు చెప్పు, నేను తీసుకుంటాను. ఎందుకంటే నీకు తప్ప ఇంకెవరికీ ఆ హక్కు లేదు, నీ తర్వాత నేను ఉన్నాను.” “నేను విడిపిస్తాను” అని అతడు అన్నాడు.
RUT 4:5 అప్పుడు బోయజు అన్నాడు, “నయోమి దగ్గర నీవు ఆ భూమిని కొన్న రోజు, చనిపోయిన వాని భార్య, మోయాబీయురాలైన రూతు నీకు చెందుతుంది, ఈ విధంగా చనిపోయిన వాని స్వాస్థ్యంతో అతని సంతతిని నిలబెడతావు.”
RUT 4:6 ఇది విని, ఆ బంధువు, “అయితే నేను దానిని విడిపించలేను, ఎందుకంటే నా స్వాస్థ్యాన్ని కోలిపోతానేమో. నీవే దానిని విడిపించు. నేను చేయలేను” అని అన్నాడు.
RUT 4:7 (ఇప్పుడు ఇశ్రాయేలులో పూర్వకాలంలో, ఆస్తిని విడిపించడం గాని బదిలీ చేయడం గాని నిర్ధారణ చేయడానికి, ఒక పక్షం వాడు తన చెప్పు తీసి ఇతర పక్షం వానికి ఇచ్చేవాడు. ఇశ్రాయేలులో లావాదేవీలను చట్టబద్ధం ఇలాగే చేసేవారు.)
RUT 4:8 కాబట్టి ఆ సమీపబంధువు బోయజుతో, “నీవే దానిని కొనుక్కో” అని చెప్పి, తన చెప్పును తీశాడు.
RUT 4:9 అప్పుడు బోయజు పెద్దలకు, ప్రజలందరికి ఇలా ప్రకటించాడు, “ఎలీమెలెకు, కిల్యోను, మహ్లోనులకు చెందిన ఆస్తినంతా నయోమి దగ్గర నుండి నేను కొనుక్కున్నాను. ఈ రోజు దీనికి మీరు సాక్షులు.
RUT 4:10 అంతేకాక, చనిపోయిన మహ్లోను యొక్క విధవరాలు, మోయాబీయురాలైన రూతును నా భార్యగా స్వీకరిస్తున్నాను. ఈ విధంగా చనిపోయినవాడి స్వాస్థ్యం మీద అతని పేరు స్థిరంగా ఉంటుంది, అతని కుటుంబం నుండి, అతని స్వస్థలం నుండి కొట్టివేయబడదు. ఈ రోజు మీరు సాక్షులు!”
RUT 4:11 అప్పుడు పెద్దలు, పట్టణ ద్వారం దగ్గర ఉన్న ప్రజలందరు, “మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వస్తున్న స్త్రీని, ఇశ్రాయేలీయుల వంశాన్ని కట్టిన రాహేలు, లేయాల వలె చేయును గాక. ఎఫ్రాతాలో నీవు ఘనత పొంది, బేత్లెహేములో ఖ్యాతి నొందుదువు గాక.
RUT 4:12 యెహోవా ఈ యువతి ద్వారా నీకు ఇచ్చే సంతానం ద్వారా, నీ కుటుంబం తామారు యూదాకు కనిన పెరెసు వలె ఉండును గాక!” అని అన్నారు.
RUT 4:13 బోయజు రూతును చేర్చుకున్నాడు, ఆమె తన భార్య అయ్యింది. ఆమెతో పడుకున్నప్పుడు, యెహోవా ఆమె గర్భవతి అయ్యేలా దీవించారు, ఆమె ఒక కుమారున్ని కన్నది.
RUT 4:14 అప్పుడు స్త్రీలు నయోమితో అన్నారు: “ఈ రోజున నిన్ను విడిపించే సమీపబంధువు ఉండేలా చేసిన యెహోవా స్తుతినొందును గాక. ఇశ్రాయేలులో అతనికి ఖ్యాతి కలుగును గాక!
RUT 4:15 అతడు నీ జీవితాన్ని నూతనపరచి, నీ వృద్ధాప్యంలో నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించే, ఏడుగురు కుమారుల కంటే ఉత్తమమైన నీ కోడలు, అతనికి జన్మనిచ్చింది.”
RUT 4:16 నయోమి ఆ బాలున్ని తన చేతుల్లోకి తీసుకుని వానికి దాదిగా ఉన్నది.
RUT 4:17 అక్కడ నివసిస్తున్న ఆమె పొరుగు స్త్రీలు, “నయోమికి కుమారుడు ఉన్నాడు!” అని అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. అతడు దావీదు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రి.
RUT 4:18 ఇది పెరెసు వంశావళి: పెరెసు కుమారుడు హెస్రోను
RUT 4:19 హెస్రోను కుమారుడు రాము. రాము కుమారుడు అమ్మీనాదాబు,
RUT 4:20 అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను.
RUT 4:21 శల్మాను కుమారుడు బోయజు, బోయజు కుమారుడు ఓబేదు.
RUT 4:22 ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.
1SA 1:1 రామతాయిముకు చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు, అతడు ఎఫ్రాయిం కొండ సీమలోని ఒక సూఫీయుడు, అతని పేరు ఎల్కానా, అతని తండ్రి యెరోహాము. యెరోహాము ఎలీహు కుమారుడు, ఎలీహు తోహు కుమారుడు. తోహు ఎఫ్రాయిమీయుడైన సూఫు కుమారుడు.
1SA 1:2 అతనికి ఇద్దరు భార్యలు; ఒకరు హన్నా మరొకరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు.
1SA 1:3 ఏలీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసు యెహోవా యాజకులుగా ఉన్న షిలోహులో సైన్యాల యెహోవాను ఆరాధించడానికి, బలి అర్పించడానికి అతడు తన పట్టణం నుండి ప్రతి సంవత్సరం వెళ్లేవాడు.
1SA 1:4 ఎల్కానా బలి అర్పించే రోజు వచ్చినప్పుడెల్లా, అతడు తన భార్య పెనిన్నాకు, ఆమె కుమారులు, కుమార్తెలందరికి మాంసంలో భాగాలను ఇచ్చేవాడు.
1SA 1:5 అయితే అతడు హన్నాను ప్రేమించాడు కాబట్టి ఆమెకు రెండంతలు ఇస్తూ వచ్చాడు, యెహోవా ఆమె గర్భాన్ని మూసివేశారు.
1SA 1:6 యెహోవా ఆమెకు పిల్లలు పుట్టకుండా చేశారు, కాబట్టి పెనిన్నా హన్నాకు చిరాకు కలిగించాలని ఎత్తిపొడుపు మాటలతో రెచ్చగొట్టేది.
1SA 1:7 ఇది ఏటేటా కొనసాగింది. హన్నా యెహోవా మందిరానికి వెళ్లినప్పుడెల్లా, ఆమె ఏడుస్తూ తినడం మానివేసేలా పెనిన్నా ఆమెను రెచ్చగొట్టేది.
1SA 1:8 ఆమె భర్త ఎల్కానా ఆమెతో, “హన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? నీవెందుకు తినడం లేదు? నీవెందుకు క్రుంగిపోతున్నావు? నీకు పదిమంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా?” అని అన్నాడు.
1SA 1:9 ఒకసారి వారు షిలోహులో భోజనం చేసిన తర్వాత హన్నా లేచి నిలబడింది. అప్పుడు యాజకుడైన ఏలీ యెహోవా ఆలయ గుమ్మం దగ్గర తన కుర్చీపై కూర్చున్నాడు.
1SA 1:10 హన్నా తీవ్ర వేదనలో ఏడుస్తూ యెహోవాకు ప్రార్థించింది.
1SA 1:11 ఆమె, “సైన్యాల యెహోవా, మీరు మీ సేవకురాలినైన కష్టాలను చూసి నన్ను గుర్తుంచుకుని, మీ సేవకురాలినైన నన్ను మరచిపోకుండా నాకు ఒక కుమారున్ని ఇస్తే, అతడు బ్రతికే దినాలన్ని యెహోవాకే ఇస్తాను, అతని తలపై క్షౌరపుకత్తి ఎప్పుడూ ఉపయోగించబడదు” అని అంటూ ఒక మ్రొక్కుబడి చేసింది.
1SA 1:12 ఆమె యెహోవాకు ప్రార్థిస్తూ ఉండగా, ఏలీ ఆమె నోటిని గమనించాడు.
1SA 1:13 హన్నా తన హృదయంలో ప్రార్థన చేస్తోంది, ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ ఆమె స్వరం వినబడలేదు. ఏలీ ఆమె త్రాగి ఉందని భావించి,
1SA 1:14 ఏలీ ఆమెతో, “ఎంతకాలం నీవు మత్తులో ఉంటావు? నీ ద్రాక్షరసాన్ని దూరం పెట్టు” అన్నాడు.
1SA 1:15 అందుకు హన్నా, “అలా కాదు, నా ప్రభువా, నేను చాలా బాధలో ఉన్నాను. నేను ద్రాక్షరసం గాని మద్యం గాని త్రాగలేదు; నేను నా ఆత్మను యెహోవా దగ్గర క్రుమ్మరిస్తున్నాను.
1SA 1:16 నీ సేవకురాలిని చెడ్డదానిగా భావించవద్దు; నేను చాలా వేదనతో దుఃఖంతో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను” అన్నది.
1SA 1:17 అందుకు ఏలీ, “నీవు సమాధానంగా వెళ్లు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొన్న మనవిని ఆయన నీకు దయచేయును గాక” అని ఆమెతో చెప్పాడు.
1SA 1:18 ఆమె అతనితో, “నీ దాసురాలు నీ దయ పొందును గాక” అన్నది. తర్వాత ఆమె తన దారిన వెళ్లి భోజనం చేసింది; ఆ రోజు నుండి ఆమె ఎన్నడు దుఃఖపడుతూ కనబడలేదు.
1SA 1:19 మరుసటిరోజు తెల్లవారుజామున వారు లేచి యెహోవా ఎదుట ఆరాధించి రామాలో ఉన్న తమ ఇంటికి తిరిగి వెళ్లారు. ఎల్కానా తన భార్యయైన హన్నాను లైంగికంగా కలుసుకున్నప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు.
1SA 1:20 అలా కొంతకాలం గడిచాక హన్నా గర్భవతియై ఒక కుమారుని కన్నది. “నేను అతని కోసం యెహోవాను అడిగాను” అని అంటూ ఆమె అతనికి సమూయేలు అని పేరు పెట్టింది.
1SA 1:21 ఆమె భర్త ఎల్కానా తన కుటుంబ సభ్యులందరితో కలిసి యెహోవాకు వార్షిక బలిని అర్పించడానికి, తన మ్రొక్కుబడిని చెల్లించడానికి వెళ్లినప్పుడు,
1SA 1:22 హన్నా వెళ్లలేదు. ఆమె తన భర్తతో ఇలా చెప్పింది: “బాలుడు పాలు విడిచిన తర్వాత, నేను అతన్ని తీసుకెళ్లి యెహోవా ముందు ఉంచుతాను, ఇక అతడు ఎప్పుడూ అక్కడే ఉంటాడు.”
1SA 1:23 “నీకు ఏది మంచిదో అది చేయి, వానిని పాలు మాన్పించేవరకు నీవు ఇక్కడే ఉండు; యెహోవా తన మాట నెరవేర్చును గాక” అని ఆమె భర్తయైన ఎల్కానా ఆమెతో చెప్పాడు. కాబట్టి ఆ స్త్రీ తన కుమారుని పాలు మాన్పించేవరకు ఇంట్లోనే ఉండి వానిని పోషించింది.
1SA 1:24 వాడు పాలు విడిచిన తర్వాత, వాడు చిన్నవాడిగా ఉండగానే ఆమె తనతో పాటు మూడు సంవత్సరాల ఎద్దును, ఒక ఏఫా పిండిని, ద్రాక్షతిత్తిని తీసుకుని షిలోహులో ఉన్న యెహోవా మందిరానికి తీసుకెళ్లింది.
1SA 1:25 ఎద్దును బలి అర్పించిన తర్వాత, వారు ఆ బాలున్ని ఏలీ దగ్గరకు తీసుకెళ్లి,
1SA 1:26 ఆమె అతనితో, “నా ప్రభువా, నన్ను క్షమించండి. మీ జీవం తోడు ఇక్కడ మీ ప్రక్కన నిలబడి యెహోవాకు ప్రార్థించిన స్త్రీని నేనే.
1SA 1:27 నేను ఈ బిడ్డ కోసం ప్రార్థించాను, నేను యెహోవాను ఏమి అడిగానో, ఆయన నాకు అదే ఇచ్చారు.
1SA 1:28 కాబట్టి ఇప్పుడు నేను ఈ బిడ్డను తిరిగి యెహోవాకు ఇస్తున్నాను. వాడు జీవించినంత కాలం యెహోవాకు ప్రతిష్ఠితుడై ఉంటాడు” అని చెప్పింది. అప్పుడు ఆ చిన్నవాడు అక్కడే యెహోవాను ఆరాధించాడు.
1SA 2:1 హన్నా ప్రార్థనచేసి ఇలా అన్నది: “నా హృదయం యెహోవాలో సంతోషిస్తుంది; యెహోవాను బట్టి నా కొమ్ము పైకెత్తబడింది. నా శత్రువులపై నా నోరు గొప్పలు పలుకుతుంది, మీ విడుదలలో నాకు ఆనందము.
1SA 2:2 “యెహోవా లాంటి పరిశుద్ధుడు ఒక్కడూ లేడు; మీరు తప్ప మరి ఎవరు లేరు; మన దేవునిలాంటి ఆశ్రయదుర్గం లేదు.
1SA 2:3 “అంత గర్వంగా మాట్లాడకండి మీ నోటిని గర్వంగా మాట్లాడనివ్వకండి, ఎందుకంటే యెహోవా అన్నీ తెలిసిన దేవుడు ఆయన మీ క్రియలను పరిశీలిస్తారు.
1SA 2:4 “శూరుల విల్లులు విరిగిపోయాయి, కాని తడబడినవారు బలాన్ని పొందుకున్నారు.
1SA 2:5 తృప్తిగా భోజనం చేసినవారు ఆహారం కోసం కూలికి వెళ్తారు, కాని ఆకలితో ఉన్నవారు ఇక ఆకలితో ఉండరు. గొడ్రాలిగా ఉన్న స్త్రీ ఏడుగురు పిల్లలను కన్నది, కాని అనేకమంది పిల్లలను కన్న స్త్రీ కృశించిపోతుంది.
1SA 2:6 “మరణాన్ని జీవాన్ని ఇచ్చేది యెహోవాయే; పాతాళం క్రిందకు దింపేది పైకి లేవనెత్తేది ఆయనే.
1SA 2:7 పేదరికాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేసేది యెహోవాయే; తగ్గించేది హెచ్చించేది ఆయనే.
1SA 2:8 దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే; వారిని అధికారులతో కూర్చునేలా చేసేది ఘనత కలిగిన సింహాసనాన్ని స్వతంత్రింపజేసేది ఆయనే. “భూమి పునాదులు యెహోవాకు చెందినవి; ఆయన వాటి మీద లోకాన్ని నిలిపారు.
1SA 2:9 ఆయన తన నమ్మకమైన సేవకుల పాదాలను కాపాడతారు, అయితే దుర్మార్గులు చీకటిలో మౌనులుగా చేయబడతారు. “బలం వలన ఎవరూ గెలవలేరు;
1SA 2:10 యెహోవాను వ్యతిరేకించేవారు నాశనమవుతారు. పరలోకం నుండి మహోన్నతుడు ఉరుములా గర్జిస్తారు; భూదిగంతాలకు యెహోవా తీర్పు తీరుస్తారు. “ఆయన తన రాజుకు బలాన్నిస్తారు తాను అభిషేకించిన వాని కొమ్మును హెచ్చిస్తారు.”
1SA 2:11 తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు, కాని ఆ బాలుడు యాజకుడైన ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేస్తూ ఉండిపోయాడు.
1SA 2:12 ఏలీ కుమారులు చాలా దుర్మార్గులు; వారికి యెహోవా అంటే గౌరవం లేదు.
1SA 2:13 ప్రజల విషయంలో యాజకులు చేస్తూ వచ్చిన పని ఏంటంటే, ఎవరైనా బలి అర్పిస్తే, దాని మాంసం ఉడుకుతుండగా యాజకుని సేవకులు మూడు ముళ్ళ కొంకి గరిటెను తీసుకువచ్చి,
1SA 2:14 పెనంలో గాని కడాయిలోగాని పాత్రలోగాని కుండలోగాని దానిని గుచ్చినప్పుడు ఆ కొంకితో పాటు బయటకు వచ్చిన మాంసమంతా యాజకుడు తన కోసం తీసుకుంటాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులందరికి వీరు ఇలాగే చేస్తూ వచ్చారు.
1SA 2:15 అయితే క్రొవ్వును దహించకముందే యాజకుని సేవకుడు వచ్చి బలి అర్పించిన వారితో, “యాజకునికి కాల్చడానికి కొంత మాంసం ఇవ్వు; ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకోడు పచ్చి మాంసమే కావాలి” అని చెప్పేవాడు.
1SA 2:16 అయితే వారు అతనితో, “మొదట క్రొవ్వును దహించనివ్వండి, తర్వాత మీ ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు” అని చెప్తే ఆ సేవకుడు, “అలా కుదరదు, ఇప్పుడే ఇవ్వాలి; నీవు ఇవ్వకపోతే నేనే బలవంతంగా తీసుకుంటాను” అని అనేవాడు.
1SA 2:17 ఆ యువకుల ఈ పాపం యెహోవా దృష్టిలో చాలా ఘోరమైనది, ఎందుకంటే వారిని బట్టి ప్రజలు యెహోవాకు అర్పణ అర్పించడానికి అసహ్యించుకున్నారు.
1SA 2:18 అయితే బాలుడైన సమూయేలు నారతో చేసిన ఏఫోదు ధరించుకొని యెహోవా ఎదుట పరిచర్య చేస్తున్నాడు.
1SA 2:19 ప్రతి సంవత్సరం అతని తల్లి తన భర్తతో కలిసి వార్షిక బలి అర్పించడానికి వెళ్లినప్పుడు అతనికి ఒక చిన్న వస్త్రాన్ని తయారుచేసి తీసుకెళ్లేది.
1SA 2:20 అప్పుడు ఏలీ, ఎల్కానాను, అతని భార్యను, “ఈ స్త్రీ యెహోవాకు ప్రతిష్ఠించిన బిడ్డ స్థానంలో యెహోవా ఈమె ద్వారా మీకు పిల్లలను ప్రసాదించుగాక” అని అంటూ దీవించాడు.
1SA 2:21 యెహోవా హన్నా మీద దయ చూపించాడు; ఆమె ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలను కన్నది. అదే సమయంలో, బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదిగాడు.
1SA 2:22 ఇక చాలా ముసలివాడై ఏలీ, ఇశ్రాయేలీయులందరి పట్ల తన కుమారులు చేస్తున్న వాటి గురించి, వారు సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారనే విషయాన్ని గురించి విన్నాడు.
1SA 2:23 కాబట్టి అతడు వారితో, “మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? మీరు చేసిన ఈ దుష్టమైన పనుల గురించి ప్రజలందరి నోటి నుండి నేను విన్నాను.
1SA 2:24 నా కుమారులారా, ఇలా చేయవద్దు. నేను విన్న ఈ విషయం యెహోవా ప్రజల మధ్యలో వ్యాపించడం మంచిది కాదు.
1SA 2:25 ఒక వ్యక్తి మరో వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేస్తే, దేవుడు ఆ అపరాధికి మధ్యవర్తిత్వం చేయవచ్చు; గాని ఎవరైనా యెహోవాకే వ్యతిరేకంగా పాపం చేస్తే వారి కోసం ఎవరు విజ్ఞాపన చేస్తారు?” అన్నాడు. అయితే వారిని చంపడం యెహోవా చిత్తం, కాబట్టి వారు తమ తండ్రి గద్దింపు వినలేదు.
1SA 2:26 మరోవైపు బాలుడైన సమూయేలు యెహోవా దయలో మనుష్యుల దయలో ఎదుగుతూ ఉన్నాడు.
1SA 2:27 తర్వాత ఒక దైవజనుడు ఏలీ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీ పూర్వికుల కుటుంబం ఈజిప్టులో ఫరో క్రింద ఉన్నప్పుడు నన్ను నేను వారికి బయలుపరచుకోలేదా?
1SA 2:28 అతడు నా సన్నిధిలో నాకు యాజకునిగా ఉండి ఏఫోదు ధరించి, నా బలిపీఠం దగ్గరకు వెళ్లి ధూపం వేయడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నుండి నేను నీ పూర్వికున్ని ఏర్పరచుకున్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమబలులన్నిటిని నీ పూర్వికుని కుటుంబానికి ఇచ్చాను.
1SA 2:29 నా నివాసం కోసం నేను నిర్దేశించిన నా బలిని, అర్పణను ఎందుకు తృణీకరిస్తున్నారు? నా ప్రజలైన ఇశ్రాయేలీయులు అర్పించే ప్రతి అర్పణలో శ్రేష్ఠమైన భాగాలతో క్రొవ్వెక్కేలా చేసుకుని ఎందుకు నీవు నా కంటే నీ కుమారులను ఎక్కువగా గౌరవిస్తున్నావు?’
1SA 2:30 “కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ‘నీ కుటుంబం, నీ పితరుల కుటుంబం నా సన్నిధిలో నిత్యం సేవ చేస్తారని నేను వాగ్దానం చేశాను’ అని చెప్పారు కాని ఇప్పుడు యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: ‘అది నా నుండి దూరమవును గాక! నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకరించబడతారు.
1SA 2:31 వృద్ధాప్యం వచ్చేవరకు ఎవరూ దానిలో ఉండకుండ నేను నీ బలాన్ని నీ యాజక కుటుంబ బలాన్ని తగ్గించే సమయం రాబోతుంది,
1SA 2:32 నా నివాసంలో అపాయం రావడం నీవు చూస్తావు. ఇశ్రాయేలుకు మేలు జరిగినప్పటికీ, మీ కుటుంబంలో ఎవరూ వృద్ధాప్యానికి చేరుకోరు.
1SA 2:33 నా బలిపీఠం దగ్గర ఎవరూ సేవ చేయకుండా నేను నాశనం చేసే నీ వారి వలన నీ కళ్ళు మసకబారతాయి, నీ బలం క్షీణించిపోతుంది. నీ సంతానమంతా యవ్వన వయస్సులో ఉండగానే చస్తారు.
1SA 2:34 “ ‘మీ ఇద్దరు కుమారులు హొఫ్నీ ఫీనెహాసులకు ఏమి జరుగుతుందో తెలియడానికి ఒక సూచనగా వారిద్దరు ఒకేరోజున చనిపోతారు.
1SA 2:35 తర్వాత నా హృదయంలో, మనస్సులో ఉన్నదాని ప్రకారం చేసే నమ్మకమైన యాజకుడిని నా కోసం నేను లేవనెత్తుతాను. నేను అతని యాజక కుటుంబాన్ని స్థిరపరుస్తాను, వారు ఎల్లప్పుడూ నా అభిషిక్తుని ఎదుట సేవ చేస్తారు.
1SA 2:36 అప్పుడు మీ కుటుంబంలో మిగిలిన ప్రతి ఒక్కరూ వచ్చి ఒక వెండి ముక్క కోసం రొట్టె కోసం అతని ముందు నమస్కరించి, “నాకు తినడానికి ఆహారం లేక కష్టంగా ఉంది, నన్ను ఏదైనా యాజక సేవలో నియమించండి” ’ అని వేడుకుంటారు.”
1SA 3:1 బాలుడైన సమూయేలు ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేశాడు. ఆ రోజుల్లో యెహోవా వాక్కు అరుదుగా వచ్చేది; దర్శనాలు ఎక్కువగా ఉండేవి కావు.
1SA 3:2 ఒక రాత్రి, కళ్ళు మసకబారి స్పష్టంగా చూడలేకపోతున్న ఏలీ, తాను ఎప్పుడు పడుకునే స్థలంలో పడుకుని ఉన్నాడు.
1SA 3:3 అదే సమయంలో యెహోవా దీపం ఆరిపోక ముందు, యెహోవా మందిరంలో దేవుని మందసం ఉన్నచోట సమూయేలు పడుకుని ఉన్నాడు.
1SA 3:4 అప్పుడు యెహోవా సమూయేలును పిలిచారు. అందుకు సమూయేలు, “నేను ఇక్కడే ఉన్నాను” అంటూ,
1SA 3:5 అతడు ఏలీ దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “మీరు నన్ను పిలిచారా? నేను ఇక్కడే ఉన్నాను” అని అన్నాడు. అందుకు ఏలీ, “నేను పిలువలేదు; వెళ్లి పడుకో” అని చెప్పగానే అతడు వెళ్లి పడుకున్నాడు.
1SA 3:6 మళ్ళీ యెహోవా, “సమూయేలూ!” అని పిలిచారు. అప్పుడు సమూయేలు లేచి ఏలీ దగ్గరకు వెళ్లి, “నేను ఇక్కడే ఉన్నాను; మీరు నన్ను పిలిచారా?” అని అడిగాడు. అయితే ఏలీ, “నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు; వెళ్లి పడుకో” అన్నాడు.
1SA 3:7 అప్పటికి సమూయేలుకు ఇంకా యెహోవా తెలియదు; యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు.
1SA 3:8 యెహోవా మూడవసారి, “సమూయేలూ!” అని పిలిచినప్పుడు, అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్లి, “నేను ఇక్కడే ఉన్నాను; మీరు నన్ను పిలిచారా?” అని అడిగాడు. యెహోవాయే ఆ బాలుని పిలిచారని ఏలీ గ్రహించాడు.
1SA 3:9 కాబట్టి ఏలీ సమూయేలుతో, “నీవు వెళ్లి పడుకో, ఎవరైనా మళ్ళీ పిలిస్తే, ‘యెహోవా, చెప్పండి, మీ సేవకుడనైన నేను వింటున్నాను’ అని చెప్పు” అన్నాడు. కాబట్టి సమూయేలు వెళ్లి తన స్థలంలో పడుకున్నాడు.
1SA 3:10 తర్వాత యెహోవా వచ్చి అక్కడ నిలబడి, “సమూయేలూ! సమూయేలూ!” అని మళ్ళీ పిలిచారు. వెంటనే సమూయేలు, “చెప్పండి, మీ సేవకుడనైన నేను వింటున్నాను” అన్నాడు.
1SA 3:11 అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా చెప్పారు: “ఇశ్రాయేలీయులలో నేను ఒక పని చేయబోతున్నాను; దాని గురించి విన్నవారి చెవులు గింగురుమంటాయి.
1SA 3:12 ఆ రోజున ఏలీ ఇంటివారికి వ్యతిరేకంగా నేను మాట్లాడినదంతా మొదటి నుండి చివరి వరకు వారి మీదికి రప్పిస్తాను.
1SA 3:13 ఎందుకంటే అతనికి తెలిసిన పాపం కారణంగా నేను అతని కుటుంబానికి ఎప్పటికీ తీర్పు తీరుస్తానని అతనితో చెప్పాను; అతని కుమారులు దేవున్ని దూషించారు, అతడు వారిని అరికట్టలేక పోయాడు.
1SA 3:14 కాబట్టి, ‘ఏలీ ఇంటివారి దోషానికి బలుల వలన గాని, అర్పణల వలన గాని ఎప్పటికీ ప్రాయశ్చిత్తం జరుగదు’ అని ఏలీ ఇంటివారికి నేను ప్రమాణం చేశాను.”
1SA 3:15 తర్వాత సమూయేలు ఉదయమయ్యే వరకు పడుకుని లేచి, యెహోవా మందిర తలుపులను తెరిచాడు. అయితే తనకు వచ్చిన దర్శనం గురించి ఏలీతో చెప్పడానికి భయపడ్డాడు.
1SA 3:16 కాని ఏలీ సమూయేలును, “సమూయేలూ, నా కుమారుడా” అని పిలిచాడు. అందుకు సమూయేలు, “నేనిక్కడే ఉన్నాను” అన్నాడు.
1SA 3:17 అప్పుడు ఏలీ, “యెహోవా నీతో ఏమి చెప్పారు? వాటిలో ఏదీ నా దగ్గర దాచవద్దు. ఆయన నీతో చెప్పిన సంగతుల్లో ఏదైనా నీవు దాచిపెడితే దేవుడు నిన్ను తీవ్రంగా శిక్షించును గాక” అన్నాడు.
1SA 3:18 కాబట్టి సమూయేలు ఏ విషయం దాచిపెట్టకుండా అంతా అతనితో చెప్పాడు. అది విని ఏలీ, “అది చెప్పింది యెహోవాయే; ఆయన దృష్టికి ఏది మంచిదో ఆయన అదే చేస్తారు” అన్నాడు.
1SA 3:19 సమూయేలు పెరిగి పెద్దవాడవుతూ ఉండగా, యెహోవా అతనికి తోడుగా ఉండి, సమూయేలు మాటల్లో ఏదీ నేల మీద వ్యర్థంగా పడనివ్వలేదు.
1SA 3:20 కాబట్టి సమూయేలు యెహోవా ప్రవక్తగా స్థిరపడ్డాడని దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలీయులందరు గుర్తించారు.
1SA 3:21 యెహోవా మరలా షిలోహులో దర్శనమివ్వడం ప్రారంభించి, అక్కడ ఆయన తన వాక్కు ద్వారా సమూయేలుకు ప్రత్యక్షపరుచుకున్నారు.
1SA 4:1 సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరికి వ్యాపించింది. ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఇశ్రాయేలీయులు ఎబెనెజెరులో, ఫిలిష్తీయులు ఆఫెకులో శిబిరం ఏర్పరచుకున్నారు.
1SA 4:2 ఇశ్రాయేలీయుల మీదికి వెళ్లడానికి ఫిలిష్తీయులు తమ బలగాలను మోహరించారు. యుద్ధం ముమ్మరమైనప్పుడు ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయి యుద్ధభూమిలోనే సుమారు నాలుగు వేలమంది మరణించారు.
1SA 4:3 సైనికులు శిబిరం దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయుల పెద్దలు, “ఈ రోజు యెహోవా ఫిలిష్తీయుల ముందు ఎందుకు మనలను ఓడిపోయేలా చేశారు? మనం యెహోవా నిబంధన మందసాన్ని షిలోహులో నుండి తీసుకువద్దాం, అప్పుడు ఆయన మనతో వెళ్లి మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షిస్తారు” అని అన్నారు.
1SA 4:4 కాబట్టి ప్రజలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడినుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాల యెహోవా యొక్క నిబంధన మందసాన్ని తెప్పించారు. దేవుని నిబంధన మందసంతో పాటు ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసు అక్కడే ఉన్నారు.
1SA 4:5 యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి రాగానే ఇశ్రాయేలీయులందరు భూమి దద్దరిల్లేంత పెద్దగా కేకలు వేశారు.
1SA 4:6 ఆ కేకల ధ్వని ఫిలిష్తీయులు విని, “హెబ్రీయుల శిబిరంలో ఆ పెద్ద కేకలు ఏంటి?” అనుకున్నారు. యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి వచ్చిందని వారు తెలుసుకొని,
1SA 4:7 ఫిలిష్తీయులు భయపడి, “ఒక దేవుడు శిబిరంలోనికి వచ్చాడు; అయ్యో! ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుగలేదు.
1SA 4:8 మనకు శ్రమ! బలాఢ్యుడైన ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో అనేక రకాల తెగుళ్ళతో ఈజిప్టువారిని నాశనం చేసిన దేవుడు ఈయనే.
1SA 4:9 ఫిలిష్తీయులారా, ధైర్యంగా ఉండండి! మగవారిగా ఉండండి, లేదా వారు మీకు బానిసలైనట్టు మీరు హెబ్రీయులకు బానిసలు కాకుండ మగవారిగా బలాఢ్యులై పోరాడండి!” అని చెప్పుకొన్నారు.
1SA 4:10 కాబట్టి ఫిలిష్తీయులు యుద్ధం చేశారు, ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ గుడారాలకు పారిపోయారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది; ఇశ్రాయేలీయులలో ముప్పైవేలమంది సైనికులు చనిపోయారు.
1SA 4:11 దేవుని మందసం స్వాధీనం చేసుకోబడింది, ఏలీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసులు చనిపోయారు.
1SA 4:12 ఆ రోజే ఒక బెన్యామీనీయుడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తుకుని వచ్చి చినిగిన బట్టలతో తలమీద దుమ్ముతో షిలోహులోనికి వచ్చాడు.
1SA 4:13 అతడు వచ్చేటప్పటికి, ఏలీ మార్గం ప్రక్కన తన కుర్చీలో చూస్తూ కూర్చున్నాడు, ఎందుకంటే అతని హృదయం దేవుని మందసాన్ని గురించిన భయంతో నిండింది. ఆ వ్యక్తి పట్టణంలోకి ప్రవేశించి జరిగిన విషయం చెప్పగానే పట్టణమంతా కేకలు వేసింది.
1SA 4:14 ఏలీ ఆ కేకలు విని, “ఈ కేకలకు అర్థమేంటి?” అని అడిగాడు. ఆ వ్యక్తి వెంటనే ఏలీ దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు.
1SA 4:15 ఏలీకి తొంభై ఎనిమిది సంవత్సరాల వయస్సు, అతనికి చూపు మందగించి చూడలేకపోయేవాడు.
1SA 4:16 అతడు ఏలీతో, “యుద్ధభూమి నుండి వచ్చినవాన్ని నేనే, ఈ రోజే నేను యుద్ధంలో నుండి పరుగెత్తుకొని వచ్చాను” అని చెప్పాడు. అప్పుడు ఏలీ, “నా కుమారుడా, ఏమి జరిగింది?” అని అడిగాడు.
1SA 4:17 అందుకు ఆ వార్త తెచ్చిన అతడు, “ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలబడలేక పారిపోయారు. సైన్యంలో అనేకమంది చంపబడ్డారు. నీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ ఫీనెహాసులు కూడా చంపబడ్డారు. దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారు” అని చెప్పాడు.
1SA 4:18 దేవుని మందసం గురించి అతడు చెప్పగానే, ఏలీ గుమ్మం దగ్గర ఉన్న తన కుర్చీమీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు ముసలివాడు, భారీకాయుడు. అతడు నలభై సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.
1SA 4:19 ఏలీ కోడలైన ఫీనెహాసు భార్య ప్రసవ సమయం దగ్గరపడిన గర్భవతి. దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారని, తన మామ, తన భర్త చనిపోయారని ఆమె విని, పురిటినొప్పులు వచ్చి, మోకాళ్లమీద కూలబడి ప్రసవించింది. ఆమె ఆ పురిటినొప్పులు తట్టుకోలేకపోయింది.
1SA 4:20 ఆమె చనిపోతుండగా, అక్కడ నిలబడి ఉన్న స్త్రీలు ఆమెతో, “భయపడకు, నీకు కుమారుడు పుట్టాడు” అని చెప్పారు, కాని ఆమె జవాబు ఇవ్వలేదు, ఆ మాటలు పట్టించుకోలేదు.
1SA 4:21 ఆమె దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారని, తన మామ, తన భర్త చనిపోయారని తెలుసుకొని, “ఇశ్రాయేలీయులలో నుండి మహిమ వెళ్లిపోయింది” అని అంటూ తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టింది.
1SA 4:22 “దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకోవడం వలన, ఇశ్రాయేలీయులలో నుండి మహిమ వెళ్లిపోయింది” అని ఆమె చెప్పింది.
1SA 5:1 ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వారు దానిని ఎబెనెజెరు నుండి అష్డోదుకు తీసుకువచ్చారు.
1SA 5:2 వారు దేవుని మందసాన్ని దాగోను గుడిలోనికి తీసుకువచ్చి దానిని దాగోను ప్రక్కన ఉంచారు.
1SA 5:3 అయితే మరుసటిరోజు ప్రొద్దుటే అష్డోదు ప్రజలు లేచి చూడగా, యెహోవా మందసం ఎదుట దాగోను నేలపై బోర్లా పడి ఉంది. కాబట్టి వారు దాగోనును లేపి తిరిగి దాని స్థానంలో నిలబెట్టారు.
1SA 5:4 ఆ మరుసటి ఉదయం అష్డోదు ప్రజలు లేచి చూడగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలపై బోర్లా పడి ఉంది. దాగోను తల రెండు చేతులు నరికివేయబడి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రమే మిగిలి ఉంది.
1SA 5:5 కాబట్టి ఆ రోజు నుండి నేటి వరకు దాగోను యాజకులు గాని దాగోను గుడికి వచ్చేవారు గాని అష్డోదులోని దాగోను గుడిలో అడుగుపెట్టరు.
1SA 5:6 యెహోవా హస్తం అష్డోదు ప్రజల మీద దాని చుట్టుప్రక్కల ప్రాంతాల మీద భారంగా ఉంది; ఆయన వారి పైకి వినాశనం తెచ్చి గడ్డలతో వారిని బాధించారు.
1SA 5:7 అష్డోదు ప్రజలు జరిగిన దానిని చూసి, “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండకూడదు, ఎందుకంటే దానిని బట్టి ఆయన హస్తం మనమీద, మన దేవుడైన దాగోను మీద భారంగా ఉంది” అన్నారు.
1SA 5:8 కాబట్టి వారు ఫిలిష్తీయుల పాలకులందరినీ పిలిచి, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం?” అని వారిని అడిగారు. అందుకు వారు, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడినుండి గాతు పట్టణానికి పంపించండి” అని చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడినుండి తీసుకెళ్లారు.
1SA 5:9 కానీ వారు దానిని తరలించిన తర్వాత, యెహోవా హస్తం ఆ పట్టణానికి వ్యతిరేకంగా ఉండి, వారిని చాలా భయాందోళనలకు గురిచేసింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పట్టణంలోని ప్రజలకు ఆయన గడ్డలు పుట్టించి బాధించారు.
1SA 5:10 కాబట్టి వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపించారు. దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోను ప్రజలు, “మనలను మన ప్రజలను నాశనం చేయడానికి వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరకు తీసుకువచ్చారు” అని కేకలు వేశారు.
1SA 5:11 కాబట్టి వారు ఫిలిష్తీయుల పాలకులందరినీ పిలిచి, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడినుండి పంపివేయండి; దాని చోటికి దానిని పంపివేయండి” అన్నారు. ఎందుకంటే, ఆ పట్టణమంతా భయంతో నిండిపోయింది; దేవుని హస్తం దానిపైన చాలా భారంగా ఉంది.
1SA 5:12 చనిపోకుండా ఉన్నవారు గడ్డల చేత బాధించబడ్డారు. ఆ పట్టణ ప్రజల కేకలు ఆకాశం వరకు వినబడ్డాయి.
1SA 6:1 యెహోవా మందసం ఏడు నెలలు ఫిలిష్తీయుల స్థావరంలో ఉన్న తర్వాత,
1SA 6:2 ఫిలిష్తీయులు యాజకులను, సోదె చెప్పేవారిని పిలిపించి, “మనం యెహోవా మందసం గురించి ఏం చేద్దాం? దాని చోటికి తిరిగి దానిని ఎలా పంపించాలో మాకు చెప్పండి?” అని అడిగారు.
1SA 6:3 అందుకు వారు, “మీరు ఇశ్రాయేలు దేవుని మందసాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటే, బహుమతి లేకుండా ఆయనకు తిరిగి పంపవద్దు; ఆయనకు అపరాధపరిహార అర్పణ పంపాలి. అప్పుడు మీరు స్వస్థత పొందుతారు, ఆయన చేయి మీమీద నుండి ఎందుకు తీసివేయబడలేదో మీకు తెలుస్తుంది” అన్నారు.
1SA 6:4 అప్పుడు ఫిలిష్తీయులు, “మనం ఆయనకు అపరాధ పరిహారార్పణగా ఏమి పంపుదాం?” అని అడిగారు. అందుకు వారు అన్నారు, “మీరు, మీ నాయకులందరు ఒకే రకమైన తెగులుతో బాధించబడ్డారు కాబట్టి, ఫిలిష్తీయుల పాలకుల లెక్క ప్రకారం అయిదు బంగారపు గడ్డల రూపాలు, అయిదు బంగారపు ఎలుకల రూపాలు అర్పించాలి.
1SA 6:5 మీకు వచ్చిన గడ్డలకు దేశాన్ని పాడు చేస్తున్న ఎలుకలకు సూచనగా ఈ గడ్డలు, ఎలుకల రూపాలు తయారుచేసి పంపించి ఇశ్రాయేలు దేవున్ని మహిమపరచాలి. అప్పుడు మీమీద నుండి, మీ దేవుళ్ళ మీద నుండి, మీ దేశం మీద నుండి ఆయన తన హస్తాన్ని తీసివేయవచ్చు.
1SA 6:6 ఈజిప్టువారు, ఫరో తమ హృదయాలను కఠినం చేసుకున్నట్లు మీరెందుకు కఠినం చేసుకుంటున్నారు? ఇశ్రాయేలీయుల దేవుడు వారితో కఠినంగా వ్యహరించినప్పుడు, వారు ఇశ్రాయేలీయులను వెళ్లనిచ్చారు; అప్పుడు ఇశ్రాయేలీయులు తమ దారిని తాము వెళ్లిపోలేదా?
1SA 6:7 “కాబట్టి, మీరు క్రొత్త బండి ఒకటి తయారుచేయించి, ఇంతవరకు కాడి మోయని రెండు పాడి ఆవులను తెచ్చి బండికి కట్టాలి. కాని వాటి దూడలను వాటి దగ్గర నుండి దొడ్డికి తోలివేయాలి.
1SA 6:8 యెహోవా మందసాన్ని బండిపైన ఉంచి, దాని ప్రక్కన అపరాధ పరిహారార్థబలిగా మీరు పంపుతున్న బంగారు వస్తువులు ఉన్న పెట్టెను పెట్టండి. దాని మార్గాన దాన్ని పంపండి,
1SA 6:9 కాని దానిని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. అది తన సొంత ప్రాంతమైన బేత్-షెమెషు వైపుకు వెళ్తే యెహోవా మన మీదికి ఈ గొప్ప విపత్తు తెచ్చారని, అలా జరుగకపోతే మన మీదికి వచ్చిన విపత్తు ఆయన హస్తం వలన కాదని ఇది అనుకోకుండ మనకు జరిగిందని మనకు తెలుస్తుంది.”
1SA 6:10 కాబట్టి వారు అలాగే చేశారు. రెండు పాడి ఆవులను తోలుకొచ్చి బండికి కట్టి వాటి దూడలను దొడ్డికి పంపి,
1SA 6:11 యెహోవా మందసాన్ని దానితో పాటు బంగారు ఎలుకలు, గడ్డల రూపాలు ఉన్న పెట్టెను వారు బండిపైన పెట్టారు.
1SA 6:12 అప్పుడు ఆ ఆవులు దారిలో తిన్నగా వెళ్తూ, అరుస్తూ తిన్నగా బేత్-షెమెషు దారిలో నడిచాయి; అవి కుడికి గాని ఎడమకు గాని తిరగలేదు. ఫిలిష్తీయుల పాలకులు బేత్-షెమెషు సరిహద్దు వరకు వాటిని వెంబడిస్తూ వెళ్లారు.
1SA 6:13 బేత్-షెమెషు ప్రజలు లోయలో తమ గోధుమపంటను కోస్తున్నారు. వారు కళ్ళెత్తి చూసినప్పుడు మందసం కనబడింది, వారు దాన్ని చూసి సంతోషించారు.
1SA 6:14 ఆ బండి బేత్-షెమెషుకు చెందిన యెహోషువ పొలంలోనికి వచ్చి, అక్కడ ఉన్న ఒక పెద్ద బండ ప్రక్కన ఆగింది. ప్రజలు ఆ బండి కర్రలను నరికి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించారు.
1SA 6:15 లేవీయులు యెహోవా మందసాన్ని, బంగారపు వస్తువులు ఉన్న ఆ చిన్న పెట్టెను దించి వాటిని ఆ పెద్ద బండ మీద పెట్టారు. ఆ రోజే బేత్-షెమెషు ప్రజలు యెహోవాకు దహనబలులు అర్పించి, బలులు వధించారు.
1SA 6:16 అయిదుగురు ఫిలిష్తీయుల పాలకులు అదంతా చూసి ఆ రోజే ఎక్రోనుకు తిరిగి వెళ్లిపోయారు.
1SA 6:17 ఫిలిష్తీయులు యెహోవాకు అపరాధపరిహార అర్పణగా పంపిన బంగారు గడ్డలు అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోనులకు ఒక్కొక్కటి.
1SA 6:18 బంగారు ఎలుకల సంఖ్య అయిదుగురు ఫిలిష్తీయుల పాలకులకు చెందిన కోటగోడలు గల పట్టణాలు చుట్టుప్రక్కల గ్రామాల లెక్క ప్రకారం ఉంది. బేత్-షెమెషులోని యెహోషువ పొలంలో లేవీయులు యెహోవా మందసాన్ని పెట్టిన పెద్ద బండ నేటికీ సాక్షిగా ఉంది.
1SA 6:19 బేత్-షెమెషు ప్రజలు యెహోవా మందసాన్ని తెరిచి చూసిన కారణంగా దేవుడు వారిలో డెబ్బై మందిని హతం చేశారు. యెహోవా వారిని బలంగా దెబ్బ కొట్టడం వలన ప్రజలు ఎంతో దుఃఖించారు.
1SA 6:20 అప్పుడు బేత్-షెమెషు ప్రజలు, “ఈ పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిలో ఎవరు నిలబడగలరు? ఇక్కడినుండి మందసం ఎవరి దగ్గరకు వెళ్లాలి?” అని అడిగారు.
1SA 6:21 తర్వాత వారు కిర్యత్-యారీము ప్రజల దగ్గరకు దూతలను పంపించి, “ఫిలిష్తీయులు యెహోవా మందసాన్ని తిరిగి ఇచ్చారు. వచ్చి దానిని మీ పట్టణానికి తీసుకెళ్లండి” అని కబురు పంపారు.
1SA 7:1 అప్పుడు కిర్యత్-యారీము ప్రజలు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకెళ్లారు. వారు దానిని కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటికి తీసుకువచ్చి యెహోవా మందసానికి కాపాడడానికి అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు.
1SA 7:2 యెహోవా మందసం కిర్యత్-యారీములో ఇరవై సంవత్సరాలు ఉంది. ఇశ్రాయేలు ప్రజలంతా మళ్ళీ యెహోవా వైపు తిరిగారు.
1SA 7:3 కాబట్టి సమూయేలు ఇశ్రాయేలీయులతో, “మీ పూర్ణహృదయంతో యెహోవా దగ్గరకు మీరు తిరిగి వస్తే, ఇతర దేవుళ్ళను, అష్తారోతు విగ్రహాలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదలతో యెహోవా వైపు మీ హృదయాలను త్రిప్పి ఆయనను మాత్రమే సేవించండి. అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తారు” అన్నాడు.
1SA 7:4 అప్పుడు ఇశ్రాయేలీయులు బయలు ప్రతిమలను, అష్తారోతు విగ్రహాలను తీసివేసి కేవలం యెహోవాను మాత్రమే సేవించారు.
1SA 7:5 అప్పుడు సమూయేలు, “ఇశ్రాయేలీయులందరిని మిస్పా దగ్గర సమకూర్చండి, నేను మీ అందరి పక్షంగా యెహోవాకు విజ్ఞాపన చేస్తాను” అన్నాడు.
1SA 7:6 వారు మిస్పాకు చేరుకుని వారు నీళ్లు తీసుకువచ్చి యెహోవా సన్నిధిలో కుమ్మరించారు. ఆ రోజున వారు ఉపవాసం ఉండి, “యెహోవాకు వ్యతిరేకంగా మేము పాపం చేశాము” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా సేవ చేస్తున్నాడు.
1SA 7:7 ఇశ్రాయేలీయులు మిస్పాకు చేరుకున్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు, ఫిలిష్తీయుల పాలకులు వారి మీద దాడి చేయడానికి వచ్చారు. ఇది విన్న ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు భయపడ్డారు.
1SA 7:8 వారు సమూయేలుతో, “మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించేలా మాకోసం ఆయనకు ప్రార్థన చేయడం మానవద్దు” అని మనవి చేశారు.
1SA 7:9 అప్పుడు సమూయేలు పాలు త్రాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సంపూర్ణమైన దహనబలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతనికి జవాబిచ్చారు.
1SA 7:10 సమూయేలు దహనబలి అర్పిస్తుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల మీదికి వచ్చారు. అయితే ఆ రోజు యెహోవా ఫిలిష్తీయుల మీద గొప్ప ఉరుములు ఉరిమించి వారిని చెదరగొట్టడంతో వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు.
1SA 7:11 ఇశ్రాయేలీయులు మిస్పా నుండి బయలుదేరి ఫిలిష్తీయులను తరుముతూ బేత్-కారు వరకు వెంటాడి వారిని చంపారు.
1SA 7:12 అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసుకుని మిస్పాకు షేనుకు మధ్య దానిని నిలబెట్టి, “ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశారు” అని చెప్తూ దానికి ఎబెనెజెరు అని పేరు పెట్టాడు.
1SA 7:13 ఈ విధంగా ఫిలిష్తీయులు అణచివేయబడి ఇశ్రాయేలీయుల సరిహద్దులోనికి మళ్ళీ రావడం మానివేశారు. సమూయేలు బ్రతికిన కాలమంతా యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధంగా ఉంది.
1SA 7:14 ఇశ్రాయేలీయులు నుండి ఫిలిష్తీయులు ఆక్రమించుకున్న పట్టణాలు అనగా ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న అన్ని పట్టణాలు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చాయి. పొరుగున ఉన్న గ్రామాలను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించారు. అమోరీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య సమాధానం ఏర్పడింది.
1SA 7:15 సమూయేలు తాను బ్రతికిన రోజులన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.
1SA 7:16 ప్రతి సంవత్సరం అతడు బేతేలు నుండి గిల్గాలుకు అక్కడినుండి మిస్పాకు ప్రయాణిస్తూ ఆ స్థలాల్లో ఇశ్రాయేలీయులకు న్యాయం తీరుస్తూ వచ్చాడు.
1SA 7:17 అయితే అతని ఇల్లు రామాలో ఉంది కాబట్టి అక్కడికి తిరిగివచ్చి అక్కడ కూడా ఇశ్రాయేలీయులకు న్యాయం తీరుస్తూ వచ్చాడు. అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.
1SA 8:1 సమూయేలు ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు.
1SA 8:2 అతని మొదటి కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా; వారు బెయేర్షేబలో న్యాయాధిపతులుగా ఉన్నారు.
1SA 8:3 అయితే అతని కుమారులు అతని మార్గాన్ని అనుసరించలేదు. వారు అక్రమ సంపాదన కోసం లంచాలు తీసుకుని న్యాయాన్ని తారుమరు చేసేవారు.
1SA 8:4 కాబట్టి ఇశ్రాయేలీయుల పెద్దలందరు ఒక్కటిగా కలిసి రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చారు.
1SA 8:5 వారతనితో, “నీవు ముసలివాడవు, నీ కుమారులు నీ మార్గాన్ని అనుసరించుట లేదు; కాబట్టి ఇతర దేశాలకు రాజు ఉన్నట్లే మాకు న్యాయం చేయడానికి ఒక రాజును నియమించు” అని అడిగారు.
1SA 8:6 అయితే వారు, “మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక రాజు కావాలి” అని అడగడం సమూయేలుకు నచ్చలేదు; కాబట్టి అతడు యెహోవాకు ప్రార్థన చేశాడు.
1SA 8:7 అందుకు యెహోవా సమూయేలుతో, “ప్రజలు నీతో చెప్పేదంతా విను; వారు తిరస్కరించింది నిన్ను కాదు, వారికి రాజుగా ఉండకుండా నన్ను తిరస్కరించారు.
1SA 8:8 వారు నన్ను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవిస్తూ, ఈజిప్టులో నుండి నేను వారిని బయటకు రప్పించిన రోజు నుండి ఇప్పటివరకు అలాగే చేశారు. నీ పట్ల కూడా అలాగే చేస్తున్నారు.
1SA 8:9 వారు చెప్పేది విను; అయితే వారిని పరిపాలించబోయే రాజు హక్కులు ఎలాంటివో వారికి స్పష్టంగా వివరించి హెచ్చరించు” అని చెప్పారు.
1SA 8:10 తమకు రాజు కావాలని అడిగిన ప్రజలందరికి సమూయేలు యెహోవా మాటలన్నిటిని చెప్పాడు.
1SA 8:11 అతడు వారితో, “మిమ్మల్ని పరిపాలించబోయే రాజు హక్కులు ఇవే: అతడు మీ కుమారులను తీసుకెళ్లి తన రథాలను గుర్రాలను చూసుకోవడానికి వారిని నియమిస్తాడు. వారు అతని రథాల ముందు పరుగెత్తుతారు.
1SA 8:12 కొందరిని తన సైన్యంలో వేయిమందిపై సహస్రాధిపతులుగా, యాభైమందిపై పంచదశాధిపతులుగా నియమిస్తాడు. మరికొందరిని తన భూమిని దున్నడానికి, తన పంటలు కోయడానికి, యుద్ధానికి ఆయుధాలను, తన రథాలకు పరికరాలను తయారుచేయడానికి నియమిస్తాడు.
1SA 8:13 మీ ఆడపిల్లలను పరిమళద్రవ్యాలు తయారుచేయడానికి వంటచేయడానికి రొట్టెలు కాల్చడానికి నియమిస్తాడు.
1SA 8:14 అతడు మీ ద్రాక్షతోటల నుండి ఒలీవతోటల నుండి శ్రేష్ఠమైన వాటిని తీసుకుని తన సహాయకులకు ఇస్తాడు.
1SA 8:15 మీ ధాన్యంలో ద్రాక్షపండ్లలో పదవ భాగాన్ని తీసుకుని తన అధికారులకు సహాయకులకు ఇస్తాడు.
1SA 8:16 మీ సేవకులను సేవకురాళ్లను మీ పశువుల్లో గాడిదలలో శ్రేష్ఠమైన వాటిని తన కోసం వాడుకుంటాడు.
1SA 8:17 మీ గొర్రెల మందలలో పదవ భాగాన్ని తీసుకుంటాడు, అంతేకాదు స్వయంగా మీరే అతనికి బానిసలవుతారు.
1SA 8:18 అలాంటి రోజు వచ్చినప్పుడు, మీరు కావాలని కోరుకున్న రాజు నుండి విడిపించమని మీరే మొరపెడతారు. కాని ఆ రోజు యెహోవా మీకు జవాబివ్వరు” అని వివరించాడు.
1SA 8:19 అయితే ప్రజలు సమూయేలు మాటలు పట్టించుకోకుండా, “అలా ఏం కాదు! మాకు రాజు కావల్సిందే.
1SA 8:20 ఇతర దేశాలకు ఉన్నట్లే మాకు రాజు ఉండాలి, అతడు మాకు న్యాయం చేస్తూ మాకు ముందు నడుస్తూ మా యుద్ధాలన్నిటిలో పోరాడతాడు” అన్నారు.
1SA 8:21 సమూయేలు ప్రజలు చెప్పిన మాటలన్నిటిని విని వాటిని యెహోవాకు వినిపించాడు.
1SA 8:22 అప్పుడు యెహోవా, “నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించు” అన్నారు. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులతో, “మీరందరూ మీ సొంత పట్టణాలకు వెళ్లండి” అని చెప్పాడు.
1SA 9:1 ధనవంతుడై, పలుకుబడి కలిగిన ఒక బెన్యామీనీయుడు ఉండేవాడు. అతని పేరు కీషు, అతడు అబీయేలు కుమారుడు. అబీయేలు సెరోరు కుమారుడు, సెరోరు బెకోరతు కుమారుడు, బెకోరతు అఫియా కుమారుడు.
1SA 9:2 కీషుకు సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు చాలా అందంగా ఉంటాడు. ఇశ్రాయేలీయులలో అతనిలాంటి అందమైన యువకులు లేరు, అతడు భుజాలు పైనుండి ఇతరులకంటే ఎత్తుగా ఉంటాడు.
1SA 9:3 ఒక రోజు సౌలు తండ్రియైన కీషు యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు, కీషు సౌలును పిలిచి, “మన సేవకులలో ఒకరిని తీసుకెళ్లి గాడిదలను వెదకు” అని చెప్పాడు.
1SA 9:4 అతడు వెళ్లి ఎఫ్రాయిం కొండ ప్రాంతమంతా తిరిగి షాలిషా దేశమంతా వెదికాడు కాని అవి కనబడలేదు. తర్వాత వారు షయలీము దేశం దాటి వెదికినా ఆ గాడిదలు దొరకలేదు. బెన్యామీనీయుల ప్రాంతంలో తిరిగి చూశారు కాని అవి దొరకలేదు.
1SA 9:5 వారు సూఫు ప్రాంతానికి వచ్చినప్పుడు, “మనం వెనుకకు వెళ్దాం, లేకపోతే నా తండ్రి గాడిదల గురించి ఆలోచించడం మాని మన కోసం కంగారుపడతాడు” అని సౌలు తనతో వచ్చిన సేవకునితో అన్నాడు.
1SA 9:6 అందుకు ఆ సేవకుడు, “చూడండి, ఈ పట్టణంలో ఒక దైవజనుడున్నాడు. అతడు ఎంతో గొప్పవాడు, అతడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. మనం అక్కడికి వెళ్దాము. మనం ఎక్కడికి వెళ్లాలో బహుశ అతడు మనకు చెప్పవచ్చు” అన్నాడు.
1SA 9:7 అందుకు సౌలు, “ఒకవేళ మనం అతని దగ్గరకు వెళ్తే అతనికి మనం ఏమివ్వగలం? మన సంచుల్లో ఉన్న ఆహారమంతా అయిపోయింది. ఆ దైవజనునికి కానుకగా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేవు. మరెలా?” అని సేవకుడిని అడిగాడు.
1SA 9:8 ఆ సేవకుడు మళ్ళీ సౌలుతో, “చూడండి, నా దగ్గర పావు షెకెల్ వెండి ఉంది. మనం వెళ్లవలసిన దారిని మనకు చెప్పడానికి దాన్ని ఆ దైవజనునికి ఇస్తాను” అన్నాడు.
1SA 9:9 (గతంలో ఇశ్రాయేలీయులలో ఎవరైనా దేవుని దగ్గర ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే వారు, “మనం దీర్ఘదర్శి దగ్గరకు వెళ్దాం రండి” అని అనేవారు. ఇప్పుడు ప్రవక్తలని పిలిచేవారిని, ఒకప్పుడు దీర్ఘదర్శి అని పిలిచేవారు.)
1SA 9:10 సౌలు తన సేవకునితో, “సరే, పద వెళ్దాం” అన్నాడు. వారు బయలుదేరి దైవజనుడున్న పట్టణానికి వెళ్లారు.
1SA 9:11 వారు కొండ ఎక్కి ఆ పట్టణానికి వెళ్తుండగా, నీళ్లు తోడుకోడానికి వస్తున్న యువతులు ఎదురయ్యారు, అప్పుడు వారు, “ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా?” అని వారిని అడిగారు.
1SA 9:12 అందుకు వారు, “అతడు మీకు దగ్గరలోనే ఉన్నాడు. త్వరగా వెళ్లి కలవండి; ఎందుకంటే ఈ రోజు క్షేత్రంలో ప్రజల కోసం బలి అర్పించబడుతుంది, అందుకు ఈ రోజే మా ఊరికి వచ్చాడు.
1SA 9:13 అతడు భోజనం చేయడానికి ఉన్నత స్థలానికి వెళ్లకముందే మీరు పట్టణంలోకి వెళ్లండి. అతడు వచ్చేవరకు ప్రజలు తినరు. అతడు బలిని దీవించిన తర్వాత ఆహ్వానించబడిన వారు తింటారు. మీరు ఇప్పుడే పైకి వెళ్లండి; ఈపాటికి మీరు అతన్ని కలుసుకోవల్సింది” అన్నారు.
1SA 9:14 అప్పుడు వారు ఆ పట్టణం వరకు వెళ్లారు. వారు పట్టణంలోనికి వెళ్లబోతుండగా ఉన్నత స్థలానికి వెళ్తున్న సమూయేలు వారికి ఎదురు వచ్చాడు.
1SA 9:15 సౌలు రావడానికి ఒక రోజు ముందే యెహోవా సమూయేలుకు,
1SA 9:16 “రేపు ఈ సమయానికి బెన్యామీను ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపిస్తాను. అతన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద పాలకునిగా అభిషేకించు; నా ప్రజల మొర నాకు విని వారివైపు చూశాను. అతడే వారిని ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపిస్తాడు” అని చెప్పారు.
1SA 9:17 సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా అతనితో, “ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి; ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు” అని చెప్పారు.
1SA 9:18 సౌలు గుమ్మం దగ్గర సమూయేలును కలుసుకొని, “దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడో దయచేసి నాకు చెప్పరా?” అని అడిగాడు.
1SA 9:19 అందుకు సమూయేలు సౌలుతో, “నేనే దీర్ఘదర్శిని, ఉన్నత స్థలానికి నా కంటే ముందు వెళ్లండి, ఈ రోజు మీరు నాతో భోజనం చేయాలి. ఉదయాన నీ హృదయంలో ఉన్నదంతా నీకు చెప్పి నిన్ను పంపిస్తాను.
1SA 9:20 మూడు రోజుల క్రితం తప్పిపోయిన నీ గాడిదల గురించి బాధపడకు, అవి దొరికాయి. ఇశ్రాయేలీయులు కోరుకుంటుంది నిన్ను నీ కుటుంబమంతటిని గాక, ఇంకెవరిని?” అన్నాడు.
1SA 9:21 అందుకు సౌలు, “నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలీయుల్లోని చిన్న గోత్రం కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు వంశాలన్నిటిలో నా వంశం చిన్నది కాదా? నాతో ఇలా ఎందుకు అంటున్నారు?” అన్నాడు.
1SA 9:22 అప్పుడు సమూయేలు సౌలును అతని సేవకుడిని భోజనశాలలోనికి తీసుకెళ్లి, ప్రత్యేకంగా పిలువబడ్డ సుమారు ముప్పైమంది ఉన్న ప్రధాన స్థలంలో వారిని కూర్చోబెట్టాడు.
1SA 9:23 సమూయేలు వంటమనిషితో, “నేను నీ దగ్గర ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన మాంసపు భాగాన్ని తీసుకురా” అని చెప్పాడు.
1SA 9:24 వంటమనిషి మాంసంతో ఉన్న తొడను తెచ్చి సౌలు ముందు పెట్టాడు. అప్పుడు సమూయేలు సౌలుతో, “ఇదిగో నీకోసం దాచిపెట్టింది, ఇది తిను ఎందుకంటే ‘నేను అతిథులను ఆహ్వానించాను’ అని వంటమనిషితో చెప్పి దీన్ని నీ కోసం తీసి ఉంచమన్నాను” అన్నాడు. ఆ రోజు సౌలు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.
1SA 9:25 వారు ఉన్నత స్థలం నుండి పట్టణంలోకి దిగి వచ్చినప్పుడు సమూయేలు తన ఇంటిపైన సౌలుతో మాట్లాడాడు.
1SA 9:26 తర్వాతి రోజు ఉదయమే వారు లేచిన తర్వాత సమూయేలు సౌలును పిలిచి, “నేను నీ దారిన నిన్ను పంపిస్తాను, సిద్ధపడు” అని చెప్పాడు. సౌలు సిద్ధమవగానే, అతడు సమూయేలు కలిసి బయలుదేరారు.
1SA 9:27 వారు పట్టణ శివారుకు వెళ్తుండగా సమూయేలు సౌలుతో, “దాసుని మనకంటే ముందు వెళ్లమను” అని చెప్పగానే ఆ దాసుడు వెళ్లిపోయాడు. అప్పుడతడు సౌలుతో, “నీవిక్కడే ఉండు, దేవుడు నీతో చెప్పమని నాకు చెప్పింది నీకు చెప్తాను” అన్నాడు.
1SA 10:1 అప్పుడు సమూయేలు ఒలీవనూనె బుడ్డి తీసుకుని సౌలు తలమీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని ఇలా అన్నాడు, “యెహోవా తన వారసత్వమైన ప్రజల మీద పాలకునిగా నిన్ను అభిషేకించారు.
1SA 10:2 ఈ రోజు నీవు నా దగ్గరి నుండి వెళ్లిన తర్వాత, బెన్యామీను సరిహద్దులో సెల్సహులో ఉన్న రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనబడతారు. వారు నీతో, ‘నీవు వెదకుతున్న గాడిదలు దొరికాయి. నీ తండ్రి వాటి గురించి ఆలోచించడం మాని నీకోసం కంగారు పడుతూ, “నా కుమారుని గురించి నేనేమి చేయాలి?” అని అడుగుతున్నాడు’ అని చెప్తారు.
1SA 10:3 “తర్వాత నీవు అక్కడినుండి తాబోరు సింధూర వృక్షం వరకు వెళ్తావు. అక్కడ బేతేలులో దేవుని ఆరాధించడానికి వెళ్తున్న ముగ్గురు మనుష్యులు నీకు ఎదురవుతారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను, మరొకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ఒక్క ద్రాక్షరసపు తిత్తిని మోస్తుంటారు.
1SA 10:4 వారు నీ క్షేమసమాచారాన్ని తెలుసుకుని రెండు రొట్టెలు ఇస్తారు, నీవు వాటిని తీసుకోవాలి.
1SA 10:5 “ఆ తర్వాత నీవు దేవుని గిబియాకు వెళ్తావు, అక్కడ ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఉంది. నీవు పట్టణం దగ్గరకు చేరుకుంటుండగా, వీణలు, కంజరలు, పిల్లనగ్రోవులు, సితారాలు వాయిస్తున్నవారి వెనుక, ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల ఊరేగింపు నీకు కనబడుతుంది. వారు ప్రవచిస్తూ వస్తారు.
1SA 10:6 యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగి వచ్చినప్పడు, నీవు కూడా వారితో కలిసి ప్రవచిస్తావు; నీవు క్రొత్త వ్యక్తిగా మారతావు.
1SA 10:7 ఈ సూచనలు నెరవేరిన తర్వాత నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి, దేవుడు నీకు తోడుగా ఉంటారు.
1SA 10:8 “నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్లు. దహనబలులు సమాధానబలులు అర్పించడానికి నేను తప్పక నీ దగ్గరకు వస్తాను. అయితే నేను వచ్చి నీవు ఏం చేయాలో నీకు చెప్పే వరకు, నీవు ఏడు రోజులు అక్కడే వేచి ఉండాలి.”
1SA 10:9 సౌలు సమూయేలు దగ్గరి నుండి వెళ్లడానికి వెనుకకు తిరగ్గానే దేవుడు సౌలు హృదయాన్ని మార్చారు, ఆ రోజే ఈ సూచనలన్నీ నెరవేరాయి.
1SA 10:10 అతడు, అతని సేవకుడు గిబియా దగ్గరకు చేరుకున్నప్పుడు, ప్రవక్తల ఊరేగింపు అతనికి ఎదురైంది; దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చి, అతడు వారితో కలిసి ప్రవచించాడు.
1SA 10:11 గతంలో అతన్ని తెలిసిన వారందరు అతడు ప్రవక్తలతో కలిసి ప్రవచించడం చూసి, “కీషు కుమారునికి ఏమైంది? సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు.
1SA 10:12 అక్కడ నివసించే ఒక వ్యక్తి, “వారి నాయకుడు ఎవరు?” అన్నాడు. అందువల్ల, “సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా?” అనే సామెత పుట్టింది.
1SA 10:13 సౌలు ప్రవచించడం ఆపిన తర్వాత అతడు ఉన్నత స్థలానికి వెళ్లాడు.
1SA 10:14 సౌలు చిన్నాన్న అతన్ని అతని సేవకుడిని చూసి, “మీరు ఎక్కడికి వెళ్లారు?” అని అడిగాడు. అందుకతడు, “గాడిదలను వెదకడానికి వెళ్లాం, అవి కనబడలేదని సమూయేలు ప్రవక్త దగ్గరకు వెళ్లాం” అని చెప్పాడు.
1SA 10:15 అందుకు సౌలు చిన్నాన్న, “సమూయేలు నీతో ఏమి చెప్పాడో నాతో చెప్పు” అని అన్నాడు.
1SA 10:16 సౌలు, “గాడిదలు దొరికాయని అతడు మాకు హామీ ఇచ్చాడు” అని తన చిన్నాన్నకు చెప్పాడు. అయితే రాజ్యాధికారం గురించి సమూయేలు చెప్పిన విషయాన్ని అతడు తన మామకు చెప్పలేదు.
1SA 10:17 తర్వాత సమూయేలు మిస్పాలో యెహోవా దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలను పిలిపించి,
1SA 10:18 వారితో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తెలియజేసింది ఇదే: ‘నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి ఈజిప్టువారి అధికారం నుండి, మిమ్మల్ని బాధపెట్టిన అన్ని దేశాల నుండి విడిపించాను.’
1SA 10:19 అయితే మీ కష్టాలన్నిటి నుండి ఆపదలన్నిటి నుండి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడిని మీరు ఇప్పుడు తిరస్కరించారు. ‘మామీద రాజుగా ఒకరిని నియమించు’ అని ఆయనను అడిగారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు మీ కుటుంబాల ప్రకారం మీరు యెహోవా సన్నిధికి రావాలి.”
1SA 10:20 సమూయేలు ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిని సమకూర్చినప్పుడు చీటిలో బెన్యామీను గోత్రం ఎంపిక చేయబడింది.
1SA 10:21 బెన్యామీను గోత్రం వారిని వారి కుటుంబాల ప్రకారం సమకూర్చినప్పుడు చీటిలో మత్రీ కుటుంబం ఎంపిక చేయబడింది. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఎంపిక చేయబడ్డాడు. అయితే వారు అతని కోసం వెదికినప్పుడు అతడు కనబడలేదు.
1SA 10:22 కాబట్టి వారు, “అతడు ఇక్కడ ఉన్నాడా?” అని యెహోవా దగ్గర విచారణ చేశారు. అందుకు యెహోవా, “అవును, అతడు సామాన్లలో దాక్కున్నాడు” అని చెప్పారు.
1SA 10:23 వారు పరుగెత్తుకు వెళ్లి అతన్ని బయటకు తీసుకువచ్చారు; అతడు ప్రజల మధ్యలో నిలబడినప్పుడు అతని తల భుజాలు అందరికంటే ఎత్తుగా ఉన్నాయి.
1SA 10:24 అప్పుడు సమూయేలు ప్రజలందరితో, “యెహోవా ఏర్పరచిన వానిని మీరు చూశారా? ఇశ్రాయేలీయులందరిలో అతనివంటివాడు మరొకడు లేడు” అని చెప్పాడు. అప్పుడు ప్రజలు, “రాజు దీర్ఘకాలం జీవించు గాక” అని కేకలు వేశారు.
1SA 10:25 తర్వాత సమూయేలు రాజ్యపాలన హక్కులను పద్ధతిని ప్రజలకు వివరించి, వాటిని ఒక గ్రంథంలో వ్రాసి యెహోవా సన్నిధిలో ఉంచాడు. తర్వాత సమూయేలు ప్రజలందరినీ వారి వారి ఇళ్ళకు పంపివేశాడు.
1SA 10:26 సౌలు కూడా గిబియాలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. దేవుని చేత హృదయంలో ప్రేరేపణ పొందిన వీరులు అతని వెంట వెళ్లారు.
1SA 10:27 అయితే పనికిమాలినవారు కొందరు, “ఈ వ్యక్తి మనలను ఎలా రక్షించగలడు?” అని అంటూ అతన్ని తృణీకరించి అతనికి కానుకలు తీసుకురాలేదు. అయినా సౌలు మౌనంగా ఉన్నాడు.
1SA 11:1 అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్-గిలాదును ముట్టడించినప్పుడు యాబేషు వారందరు అతనితో, “మాతో ఒప్పందం చేసుకో, మేము నీకు సేవకులమై ఉంటాము” అన్నారు.
1SA 11:2 అయితే, “ఇశ్రాయేలీయులందరికి అవమానం కలిగేలా మీ అందరి కుడి కళ్లు పెరికివేస్తాననే ఒకే ఒక షరతు మీద మీతో ఒప్పందం చేసుకుంటాను” అని అమ్మోనీయుడైన నాహాషు జవాబిచ్చాడు.
1SA 11:3 అందుకు యాబేషు పెద్దలు అతనితో, “మేము ఇశ్రాయేలు అంతటా రాయబారులను పంపడానికి మాకు ఏడు రోజుల సమయం ఇవ్వు; మమ్మల్ని రక్షించడానికి ఎవరూ రాకపోతే మేము నీకు లొంగిపోతాము” అన్నారు.
1SA 11:4 రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకు వచ్చి ఆ షరతు గురించి ప్రజలకు తెలియజేసినప్పుడు వారందరు గట్టిగా ఏడ్చారు.
1SA 11:5 సౌలు పొలం నుండి పశువులను తోలుకొని వస్తూ, “ప్రజలందరికి ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నారు?” అని అడిగినప్పుడు, వారు యాబేషు నుండి వచ్చిన వ్యక్తి తెచ్చిన వార్తను అతనికి చెప్పారు.
1SA 11:6 సౌలు ఆ వార్త వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలంగా వచ్చింది. అతడు కోపంతో మండిపడ్డాడు.
1SA 11:7 ఒక జత ఎడ్లను తీసుకుని వాటిని ముక్కలుగా చేసి ఇశ్రాయేలు దేశమంతటికి రాయబారులచేత వాటిని పంపి, “సౌలుతోను సమూయేలుతోను చేరకుండ ఉండే ప్రతిఒక్కరి ఎడ్లు ఇలాగే చేయబడతాయి” అని ప్రకటించాడు. అప్పుడు ప్రజలందరిలో యెహోవా భయం కలిగింది కాబట్టి అందరు ఒక్కటిగా కలసివచ్చారు.
1SA 11:8 సౌలు బెజెకులో వారిని లెక్కపెట్టినప్పుడు మూడు లక్షలమంది ఇశ్రాయేలీయులు, ముప్పైవేలమంది యూదా వారు ఉన్నారు.
1SA 11:9 అప్పుడు వారు, “రేపు సూర్యుడు వేడెక్కే సమయానికి మీరు రక్షించబడతారు” అని వచ్చిన రాయబారులతో చెప్పారు. ఆ రాయబారులు వెళ్లి యాబేషు గిలాదు వారికి ఈ వార్త తెలియజేసినప్పుడు వారు సంతోషించారు.
1SA 11:10 కాబట్టి యాబేషు వారు అమ్మోనీయులతో, “రేపు మేము నీకు లొంగిపోతాము, నీవు ఏమి చేయాలనుకుంటున్నావో అది మాకు చేయవచ్చు” అన్నారు.
1SA 11:11 తర్వాత రోజు సౌలు తన ప్రజలను మూడు గుంపులుగా చేసిన తర్వాత వారు తెల్లవారే సమయాన అమ్మోనీయుల శిబిరంలోనికి చొచ్చుకొని వెళ్లారు. ఆ రోజు సూర్యుడు వేడెక్కే సమయానికి వారందరిని హతం చేశాడు. ప్రాణాలతో బయటపడిన వారు చెల్లాచెదురుగా ఉన్నారు, తద్వారా వారిలో ఇద్దరు కలిసి మిగిలిపోలేదు.
1SA 11:12 అప్పుడు ప్రజలు సమూయేలుతో, “సౌలు మనలను పరిపాలిస్తాడా అని అడిగిన వారేరి? మేము వారిని చంపడానికి వారిని తీసుకురండి” అన్నారు.
1SA 11:13 అయితే సౌలు, “ఈ రోజు యెహోవా ఇశ్రాయేలీయులను రక్షించారు కాబట్టి ఈ రోజు ఎవరిని చంపవద్దు” అన్నాడు.
1SA 11:14 అప్పుడు సమూయేలు ప్రజలతో, “మనం గిల్గాలుకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా ఏర్పరచుకుందాము” అన్నాడు.
1SA 11:15 కాబట్టి ప్రజలందరు గిల్గాలుకు వచ్చి యెహోవా సన్నిధిలో సౌలును రాజుగా చేసి అక్కడ యెహోవా ఎదుట వారు సమాధానబలులు అర్పించారు. సౌలు ఇశ్రాయేలీయులందరు ఎంతో సంతోషించారు.
1SA 12:1 అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో, “మీరు నాతో చెప్పిన వాటన్నిటిని నేను విని మీమీద ఒకరిని రాజుగా నియమించాను.
1SA 12:2 మిమ్మల్ని ముందుండి నడిపించడానికి మీకు ఒక రాజు ఉన్నాడు. నేనైతే తలనెరిసి ముసలివాడినయ్యాను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. చిన్ననాటి నుండి ఈ రోజు వరకు నేను మిమ్మల్ని నడిపించాను.
1SA 12:3 ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎవరి ఎద్దునైనా తీసుకున్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకున్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధ పెట్టానా? న్యాయాన్ని చూడకుండ కళ్లు మూసుకోవడానికి ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా? నేను అలా చేసి ఉంటే యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వారు నా మీద సాక్ష్యం చెప్పండి, అప్పుడు నేను మీకు వాటిని తిరిగి ఇచ్చేస్తాను” అన్నాడు.
1SA 12:4 అందుకు వారు, “నీవు మాకు ఏ అన్యాయం చేయలేదు ఏ బాధ కలిగించలేదు; ఎవరి దగ్గర నుండి నీవు దేన్ని తీసుకోలేదు” అని చెప్పారు.
1SA 12:5 అప్పుడు సమూయేలు వారితో, “అటువంటిది నా దగ్గర ఏదీ మీకు దొరకదని యెహోవా ఆయన అభిషేకం చేయించిన వాడు ఈ రోజు మీమీద సాక్షులుగా ఉన్నారు” అన్నాడు. “యెహోవాయే సాక్షి” అని వారు జవాబిచ్చారు.
1SA 12:6 అప్పుడు సమూయేలు ప్రజలతో ఇలా అన్నాడు, “మోషేను అహరోనును నియమించి మీ పూర్వికులను ఈజిప్టు దేశంలో నుండి తీసుకువచ్చింది యెహోవాయే గదా.
1SA 12:7 కాబట్టి యెహోవా మీకు మీ పూర్వికులకు చేసిన నీతి కార్యాలను బట్టి యెహోవా సన్నిధిలో నేను మీతో వాదించడానికి మీరు ఇక్కడే ఉండండి.
1SA 12:8 “యాకోబు ఈజిప్టుకు వచ్చిన తర్వాత, వారు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టగా యెహోవా మోషే అహరోనులను పంపారు. వారు మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చి ఈ స్థలంలో స్థిరపరిచారు.
1SA 12:9 “అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు; ఆయన వారిని హాసోరు సేనాధిపతియైన సీసెరా చేతికి ఫిలిష్తీయుల చేతికి మోయాబు రాజు చేతికి అప్పగించినప్పుడు వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు.
1SA 12:10 అప్పుడు వారు, ‘మేము యెహోవాను వదిలిపెట్టి బయలు, అష్తారోతు ప్రతిమలను పూజించి పాపం చేశాము. మా శత్రువుల చేతిలో నుండి మీరు మమ్మల్ని విడిపించండి, మేము మిమ్మల్ని సేవిస్తాం’ అని యెహోవాకు మొరపెట్టారు.
1SA 12:11 అప్పుడు యెహోవా యెరుబ్-బయలు, బెదాను, యెఫ్తా సమూయేలు అనే వారిని పంపి, మీ చుట్టూ ఉన్న మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడం వలన మీరు నిర్భయంగా నివసిస్తున్నారు.
1SA 12:12 “అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి రావడం మీరు చూసినప్పుడు, మీ దేవుడైన యెహోవా మీకు రాజుగా ఉన్నప్పటికీ, ‘ఆయన కాదు, మమ్మల్ని పాలించడానికి ఒక రాజు మాకు కావాలని’ మీరు నాతో చెప్పారు.
1SA 12:13 కాబట్టి మీరు అడిగిన మీరు ఎంచుకున్న రాజు ఇక్కడ ఉన్నాడు. యెహోవా ఇతనిని మీమీద రాజుగా నిర్ణయించారు.
1SA 12:14 మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనకు లోబడి ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా మీరు మిమ్మల్ని పరిపాలించే రాజు మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మీరు వృద్ధిచెందుతారు.
1SA 12:15 అలా కాకుండా మీరు యెహోవాకు లోబడకుండా ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే యెహోవా హస్తం మీ పూర్వికులకు వ్యతిరేకంగా ఉన్నట్లే మీకు కూడా వ్యతిరేకంగా ఉంటుంది.
1SA 12:16 “మీ కళ్ళెదుట యెహోవా జరిగించే ఈ గొప్ప పనులను మీరు నిలబడి చూడండి.
1SA 12:17 గోధుమ కోతకాలం ఇది కాదా? ఉరుములు వర్షం పంపమని నేను యెహోవాను వేడుకుంటున్నాను. అప్పుడు మీరు రాజును ఏర్పాటు చేయమని అడిగి యెహోవా దృష్టిలో ఎంత పెద్ద పాపం చేశారో మీరు గ్రహిస్తారు.”
1SA 12:18 సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములను వర్షాన్ని పంపారు. అప్పుడు ప్రజలందరు యెహోవాకు సమూయేలుకు ఎంతో భయపడ్డారు.
1SA 12:19 ప్రజలందరు సమూయేలుతో, “మేము రాజు కావాలని అడిగి మా పాపాలన్నిటి కంటే ఎక్కువ చెడు చేశాం కాబట్టి మేము చనిపోకుండా నీ సేవకులమైన మాకోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి” అన్నారు.
1SA 12:20 అప్పుడు సమూయేలు ప్రజలతో, “భయపడకండి, మీరు ఈ చెడు చేశారనేది నిజమే కాని యెహోవాను విడిచిపెట్టకుండా మీ పూర్ణహృదయంతో యెహోవాను సేవించండి.
1SA 12:21 వ్యర్థమైన విగ్రహాలవైపు తిరుగకండి. అవి మీకు ఏ మేలు చేయలేవు, మిమ్మల్ని విడిపించలేవు ఎందుకంటే అవి పనికిరాని విగ్రహాలు.
1SA 12:22 యెహోవా మిమ్మల్ని తన సొంత ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి తన గొప్ప నామం కోసం యెహోవా తన ప్రజలను విడిచిపెట్టరు.
1SA 12:23 నాకైతే, నేను మీ కోసం ప్రార్ధన చేయడంలో విఫలమవ్వడం వలన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినవాడనవుతాను. అది నాకు దూరమవ్వాలి. మంచిదైన సరియైన మార్గాన్ని నేను మీకు బోధిస్తాను.
1SA 12:24 అయితే మీరు ఖచ్చితంగా యెహోవా పట్ల భయభక్తులు కలిగి నమ్మకంగా మీ పూర్ణహృదయంతో ఆయనను సేవించాలి. ఆయన మీ కోసం చేసిన గొప్ప పనులను జ్ఞాపకం చేసుకోండి.
1SA 12:25 అయినప్పటికీ మీరు చెడు చేయడం కొనసాగిస్తే మీరు, మీ రాజు నాశనమవుతారు.”
1SA 13:1 సౌలు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై సంవత్సరాలు. అతడు నలభై రెండు సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించాడు.
1SA 13:2 సౌలు ఇశ్రాయేలీయులలో మూడువేలమందిని ఏర్పరచుకున్నాడు. వీరిలో రెండువేలమంది మిక్మషులో బేతేలు కొండ ప్రాంతంలో సౌలు దగ్గర ఉన్నారు; మిగిలిన వేయిమంది బెన్యామీనీయుల ఊరైన గిబియాలో యోనాతాను దగ్గర ఉన్నారు. మిగిలినవారిని వారి గుడారాలకు పంపివేశాడు.
1SA 13:3 యోనాతాను గెబాలో ఉన్న ఫిలిష్తీయుల సైనిక స్థావరాల మీద దాడి చేశాడు, ఆ విషయం ఫిలిష్తీయులకు తెలిసింది; అప్పుడు సౌలు దేశమంతట బూర ఊదించి, “హెబ్రీయులారా వినండి” అని చెప్పాడు.
1SA 13:4 సౌలు ఫిలిష్తీయుల సైనిక స్థావరాల మీద దాడిచేశాడని, దాని వలన ఇశ్రాయేలీయులంటే ఫిలిష్తీయులకు అసహ్యం కలిగిందని ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు ప్రజలందరు గిల్గాలులో సౌలు దగ్గర సమావేశమయ్యారు.
1SA 13:5 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మూడువేల రథాలు, ఆరువేల గుర్రపురౌతులు, సముద్రపు ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సైనికులను సమకూర్చుకున్నారు. వీరు బయలుదేరి బేత్-ఆవెనుకు తూర్పున ఉన్న మిక్మషులో శిబిరం ఏర్పరచుకున్నారు.
1SA 13:6 ఇశ్రాయేలీయులు తాము క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నామని తమ సైన్యమంతా ఒత్తిడిలో ఉన్నారని తెలుసుకొని గుహల్లో ముళ్ళపొదల్లో బండ సందుల్లో గుంటల్లో నీళ్లతొట్టెల్లో దాక్కున్నారు.
1SA 13:7 కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశానికి గిలాదు దేశానికి వెళ్లిపోయారు. సౌలు ఇంకా గిల్గాలులో ఉన్నాడు; అతనితో ఉన్న దళాలు అన్ని భయంతో వణుకుతూ ఉన్నాయి.
1SA 13:8 సమూయేలు చెప్పినట్లు అతడు ఏడు రోజులు ఎదురుచూశాడు; సమూయేలు ఇంకా గిల్గాలుకు రాకపోవడంతో, అతని ప్రజలు చెదిరిపోవడం ప్రారంభించారు.
1SA 13:9 కాబట్టి సౌలు, “దహనబలులు సమాధానబలులు నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పి దహనబలి అర్పించాడు.
1SA 13:10 అతడు దహనబలి అర్పించడం ముగించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతన్ని కలిసికొని అతనికి వందనం చేయడానికి బయలుదేరాడు.
1SA 13:11 అయితే సమూయేలు అతన్ని, “నీవు చేసిన పని ఏమిటి?” అని అడిగాడు. అందుకు సౌలు, “నిర్ణయించిన సమయానికి నీవు రాకపోవడం, ప్రజలు నా దగ్గర నుండి చెదిరిపోవడం, ఫిలిష్తీయులు మిక్మషులో సమావేశమవ్వడం చూసి,
1SA 13:12 ‘నేను ఇంకా యెహోవా దయను పొందక ముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద దాడిచేస్తారేమో’ అని అనుకున్నాను. కాబట్టి బలవంతంగా నేనే దహనబలి అర్పించాను” అన్నాడు.
1SA 13:13 అందుకు సమూయేలు, “నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను పాటించకుండా నీవు బుద్ధిలేని పని చేశావు; నీ రాజ్యాన్ని ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచాలని యెహోవా తలంచారు.
1SA 13:14 అయితే ఇప్పుడు నీ రాజ్యం నిలబడదు. ఎందుకంటే యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు చేయలేదు. కాబట్టి యెహోవా ఒక మనుష్యుని కనుగొన్నాడు, అతడు తన హృదయానుసారుడైన మనుష్యుడు. ఆయన అతన్ని తన ప్రజల మీద రాజుగా నియమించారు” అన్నాడు.
1SA 13:15 తర్వాత సమూయేలు గిల్గాలు విడిచిపెట్టి బెన్యామీనీయుల గిబియాకు వచ్చాడు; సౌలు తన దగ్గర ఉన్న మనుష్యులను లెక్కపెట్టగా వారు దాదాపు ఆరువందలమంది ఉన్నారు.
1SA 13:16 సౌలు అతని కుమారుడైన యోనాతాను, వారితో ఉన్న ప్రజలతో కలిసి బెన్యామీనీయుల గెబాలో ఉన్నారు; ఫిలిష్తీయులు మిక్మషులో శిబిరం ఏర్పరచుకున్నారు.
1SA 13:17 ఫిలిష్తీయుల శిబిరం నుండి దోచుకునేవారు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశానికి ఒఫ్రా మీదుగా వెళ్లే మార్గంలో తిరుగులాడారు.
1SA 13:18 రెండవ గుంపు బేత్-హోరోనుకు వెళ్లే మార్గంలో మూడవ గుంపు అరణ్యానికి ఎదురుగా ఉన్న జెబోయిము లోయ సరిహద్దు వెళ్లే మార్గంలో వెళ్లారు.
1SA 13:19 ఇశ్రాయేలీయుల దేశమంతటిలో కమ్మరివారు లేకుండ చేశారు, ఎందుకంటే, “హెబ్రీయులు కత్తులు ఈటెలు తయారుచేయించకూడదు” అని ఫిలిష్తీయులు అనుకున్నారు.
1SA 13:20 కాబట్టి ఇశ్రాయేలీయులందరు తమ నాగలి నక్కులు, పారలు, గొడ్డళ్లు, కొడవళ్లకు పదును పెట్టించడానికి ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లవలసి వచ్చేది.
1SA 13:21 నాగలి కొనలు పారల పదునుకు షెకెలులో మూడింట రెండు వంతులు, ముండ్ల కొంకులు, గొడ్డళ్ళ పదునుకు, ములికోలు సరిచేయడానికి ఒక షెకెలులో మూడవ వంతు చెల్లించాలి.
1SA 13:22 కాబట్టి యుద్ధం జరిగే రోజున సౌలుతో యోనాతానుతో ఉన్న ప్రజల్లో ఒకరి చేతిలోనూ కత్తి గాని ఈటె గాని లేదు; కేవలం సౌలుకు అతని కుమారుడైన యోనాతానుకు మాత్రమే ఉన్నాయి.
1SA 13:23 ఫిలిష్తీయుల సైన్యపు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చారు.
1SA 14:1 ఆ రోజు సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పకుండా, తన ఆయుధాలను మోసే యువకుని పిలిచి, “అవతల ఉన్న ఫిలిష్తీయుల పహారా కాచే సైన్యాన్ని చంపడానికి వెళ్దాం రా” అని అన్నాడు.
1SA 14:2 సౌలు గిబియా పొలిమేరల్లో మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద ఉన్నాడు, అతనితో పాటు సుమారు ఆరువందలమంది ఉన్నారు.
1SA 14:3 అహీయా ఏఫోదు ధరించుకొని వారి మధ్య ఉన్నాడు. అతడు షిలోహులో యెహోవాకు యాజకుడైన ఏలీ కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదుకు సోదరుడైన అహీటూబుకు పుట్టాడు. యోనాతాను వెళ్లిన సంగతి ఎవరికీ తెలియలేదు.
1SA 14:4 ఫిలిష్తీయుల సైనిక స్థావరాలను చేరడానికి యోనాతాను వెళ్లవలసిన దారికి ఇరువైపులా అటు ఒక చిన్న కొండ ఇటు ఒక చిన్న కొండ ఉన్నాయి. వాటిలో ఒకదాని పేరు బొసేసు రెండవ దాని పేరు సెనే.
1SA 14:5 మిక్మషుకు ఉత్తరం వైపు ఒక కొండ శిఖరం, గెబాకు దక్షిణం వైపు రెండవ కొండ శిఖరం ఉన్నాయి.
1SA 14:6 యోనాతాను తన ఆయుధాలను మోసే యువకునితో, “ఈ సున్నతిలేనివారి సైనిక స్థావరాల మీదికి వెళ్దాం రా, బహుశా యెహోవా మన కోసం కార్యం చేయవచ్చు. ఎక్కువ మంది నుండైనా కొద్దిమంది నుండైనా రక్షించడానికి యెహోవాకు ఏది అడ్డు కాదు” అని అన్నాడు.
1SA 14:7 అందుకు ఆ యువకుడు, “మీ మనస్సులో ఏముందో అది చెయ్యండి; పదండి, మీ నిర్ణయమేదైనా నేను మీతోనే ఉంటాను” అన్నాడు.
1SA 14:8 అప్పుడు యోనాతాను, “మనం వారి దగ్గరకు వెళ్లి వారు మనలను చూసేలా చేద్దాము.
1SA 14:9 వారు మనలను చూసి, మేము మీ దగ్గరకు వచ్చేవరకు అక్కడ ఉండమని చెప్తే, వారి దగ్గరకు వెళ్లకుండా మనమున్న చోటనే ఉందాము.
1SA 14:10 మా దగ్గరకు రండని వారు చెప్తే మనం పైకి ఎక్కుదాము. ఎందుకంటే యెహోవా వారిని మన చేతికి అప్పగించారనడానికి మనకు అదే గుర్తు” అన్నాడు.
1SA 14:11 వీరిద్దరు కావాలనే ఫిలిష్తీయుల సైనిక స్థావరాలకు కనిపించారు. అప్పుడు ఫిలిష్తీయులు, “చూడండి, తాము దాక్కున్న గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వస్తున్నారు” అన్నారు.
1SA 14:12 సైనిక స్థావరంలో నుండి ఒకడు యోనాతానును అతని ఆయుధాలను మోసేవాన్ని పిలిచి, “మీరైతే పైకి రండి, మీకు పాఠం నేర్పిస్తాం” అన్నాడు. యోనాతాను తన ఆయుధాలను మోసేవానితో, “నా వెనుకనే నీవు పైకి ఎక్కు; యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించారు” అని చెప్పాడు.
1SA 14:13 యోనాతాను, అతని ఆయుధాలను మోసేవాడు తమ చేతులు కాళ్లను ఉపయోగించి పైకి ఎక్కారు. యోనాతాను దెబ్బకు ఫిలిష్తీయులు పడిపోగా అతని వెనుక వస్తున్న అతని ఆయుధాలను మోసేవాడు వారిని చంపాడు.
1SA 14:14 యోనాతాను, అతని ఆయుధాలను మోసేవాడు చేసిన ఆ మొదటి దాడిలో దాదాపుగా ఇరవైమంది చనిపోయారు; అర ఎకరం నేలలో అది జరిగింది.
1SA 14:15 శిబిరంలో పొలంలో ఉన్న సైన్యమంతటిలో భయాందోళనలు అలుముకున్నాయి. సైనిక స్థావరంలో ఉన్నవారు, దోచుకునేవారు భయపడ్డారు, భూమి కంపించింది. అది దేవుని వలన కలిగిన భయము.
1SA 14:16 బెన్యామీనులోని గిబియాలో ఉన్న సౌలు గూఢాచారులు సైన్యం అన్నివైపులకు చెదిరిపోవడం చూశారు.
1SA 14:17 సౌలు తనతో ఉన్న ప్రజలతో, “మన బలగంలో ఎవరు లేరో చూడండి” అన్నాడు. యోనాతాను, అతని ఆయుధాలను మోసేవాడు లేరని వారు తెలుసుకున్నారు.
1SA 14:18 సౌలు అహీయాతో, “దేవుని మందసాన్ని ఇక్కడకు తీసుకురా” అని చెప్పాడు. ఆ సమయంలో దేవుని మందసం ఇశ్రాయేలీయుల దగ్గరే ఉంది.
1SA 14:19 సౌలు యాజకునితో మాట్లాడుతుండగా ఫిలిష్తీయుల శిబిరంలో గందరగోళం మరి ఎక్కువ అయ్యింది. కాబట్టి సౌలు యాజకునితో, “నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పాడు.
1SA 14:20 సౌలు, అతని దగ్గర ఉన్నవారంతా కలిసి యుద్ధానికి వెళ్లారు. అక్కడ ఫిలిష్తీయులు ఎంతో కలవరపడి తమ కత్తులతో ఒకరినొకరు చంపుకోవడం చూశారు.
1SA 14:21 అంతకుముందు ఫిలిష్తీయుల స్వాధీనంలో ఉన్నవారు, వారితో పాటు శిబిరానికి వచ్చిన హెబ్రీయులు సౌలు యోనాతానులతో ఉన్న ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చి వారితో కలిసిపోయారు.
1SA 14:22 అంతేకాక ఎఫ్రాయిం కొండ ప్రాంతంలో దాక్కున్న ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు పారిపోయారని విని వారిని తరమడానికి యుద్ధంలో చేరారు.
1SA 14:23 ఆ రోజే యెహోవా ఇశ్రాయేలీయులను రక్షించారు, యుద్ధం బేత్-ఆవెను అవతల వరకు సాగింది.
1SA 14:24 “సాయంత్రం అయ్యేవరకు, నేను నా శత్రువుల మీద పగతీర్చుకునే వరకు ఎవరైనా భోజనం చేస్తే వారు శపించబడతారు” అని సౌలు ప్రజలచేత ప్రమాణం చేయించాడు. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలీయులందరు ఏమీ తినలేదు.
1SA 14:25 సైన్యమంతా అడవిలోకి వచ్చినప్పుడు అక్కడ నేల మీద తేనె కనపడింది.
1SA 14:26 వారు ఆ అడవిలోకి వెళ్లగా తేనె ధారలుగా కారుతూ ఉంది కాని ప్రజలు తాము చేసిన ప్రమాణానికి భయపడి ఒకరు కూడా చేయి నోటిలో పెట్టుకోలేదు.
1SA 14:27 అయితే యోనాతాను తన తండ్రి ప్రజలతో చేయించిన ప్రమాణాన్ని వినలేదు కాబట్టి తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని అంచును తేనెతెట్టెలో ముంచి తన చేయి నోటిలో పెట్టుకున్నప్పుడు అతని కళ్లు ప్రకాశించాయి.
1SA 14:28 అప్పుడు ఒక సైనికుడు అతనితో, “ ‘ఈ రోజు భోజనం చేసినవారు శపించబడతారు’ అని మీ తండ్రి సైన్యంతో ఖచ్చితమైన ప్రమాణాన్ని చేయించాడు; అందుకే ప్రజలంతా అలసిపోయి ఉన్నారు” అని చెప్పాడు.
1SA 14:29 అందుకు యోనాతాను, “దేశం కష్టపడడానికి నా తండ్రి కారణమయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్లు ఎంత ప్రకాశిస్తున్నాయో చూడు.
1SA 14:30 ప్రజలు తమ శత్రువుల నుండి దోచుకున్న దానిలో నుండి కొంచెం తిని ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు మనం ఇంకా ఎక్కువ మంది ఫిలిష్తీయులను జయించేవారం కదా!” అన్నాడు.
1SA 14:31 ఆ రోజు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు చంపి చాలా అలసిపోయారు.
1SA 14:32 ప్రజలు దోపుడుసొమ్ము మీద ఎగబడి గొర్రెలను, ఎడ్లను దూడలను తీసుకుని నేల మీద పడవేసి వధించి రక్తంతో కలిపి తిన్నారు.
1SA 14:33 అప్పుడు ఒకడు సౌలుతో, “ప్రజలు రక్తంతో ఉన్న మాంసాన్ని తిని యెహోవా దృష్టిలో పాపం చేస్తున్నారు” అని చెప్పాడు. సౌలు, “మీరు విశ్వాసఘాతకులయ్యారు; ఒక పెద్ద రాయిని నా దగ్గరకు దొర్లించి తీసుకురండి.”
1SA 14:34 తర్వాత అతడు, “మీరు ప్రజల మధ్యకు వెళ్లి, ‘మీలో ప్రతి ఒక్కరు తమ ఎద్దులను గొర్రెలను నా దగ్గరకు తీసుకువచ్చి ఇక్కడే వధించి వాటిని తినాలి. రక్తంతో ఉన్న మాంసం తిని యెహోవా దృష్టిలో పాపం చేయకూడదని వారితో చెప్పండి’ ” అని చెప్పి కొందరిని పంపించాడు. కాబట్టి ప్రజలందరు ఆ రాత్రి తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించారు.
1SA 14:35 అప్పుడు సౌలు యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టించాడు. అతడు యెహోవాకు కట్టించిన మొదటి బలిపీఠం అదే.
1SA 14:36 ఆ తర్వాత సౌలు, “మనం ఈ రాత్రి ఫిలిష్తీయులను వెంటాడుతూ వెళ్లి తెల్లవారే వరకు వారిని దోచుకొని, వారిలో ఎవరూ ప్రాణాలతో మిగులకుండా చేద్దాం రండి” అన్నాడు. అందుకు వారు, “నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి” అన్నారు. కాని యాజకుడు, “దేవుని దగ్గర విచారణ చేద్దాం” అన్నాడు.
1SA 14:37 సౌలు, “నేను ఫిలిష్తీయుల వెనుక వెంటాడుతూ వెళ్లితే నీవు వారిని ఇశ్రాయేలీయు చేతికి అప్పగిస్తావా?” అని దేవుని అడిగాడు కాని దేవుడు అతనికి ఆ రోజు సమాధానం ఇవ్వలేదు.
1SA 14:38 కాబట్టి సౌలు, “సైన్యాధిపతులు నా దగ్గరకు రండి, ఈ రోజు ఏ పాపం జరిగిందో మనం తెలుసుకుందాము.
1SA 14:39 నా కుమారుడైన యోనాతాను వలన అది జరిగినా సరే వాడు తప్పక మరణించాలని ఇశ్రాయేలీయుల ప్రాణాలను రక్షించు సజీవుడైన యెహోవా పేరిట నేను ప్రమాణం చేస్తున్నాను” అన్నాడు. కాని ప్రజల్లో ఎవరు ఒక్క మాటకూడా మాట్లాడలేదు.
1SA 14:40 అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరితో, “మీరందరు ఆ ప్రక్కన నిలబడండి; నేను నా కుమారుడైన యోనాతాను ఈ ప్రక్కన నిలబడతాం” అన్నాడు. అందుకు వారు, “నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి” అన్నారు.
1SA 14:41 అప్పుడు సౌలు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ఈ రోజు మీ దాసునికి నీవెందుకు సమాధానం చెప్పలేదు? ఒకవేళ నాలోగాని నా కుమారుడైన యోనాతానులో గాని లోపం ఉంటే ఊరీముతో, ఇశ్రాయేలు ప్రజల్లో దోషం ఉంటే తుమ్మీముతో జవాబు చెప్పండి” అని ప్రార్థించాడు. అప్పుడు సౌలు పేరిట యోనాతాను పేరిట చీటి వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలు నిర్దోషులుగా తప్పించుకున్నారు.
1SA 14:42 “నాకు నా కుమారుడైన యోనాతానుకు చీట్లు వేయండి” అని సౌలు ఆజ్ఞ ఇవ్వగా యోనాతాను పేరిట చీటి వచ్చింది.
1SA 14:43 అప్పుడు సౌలు, “నీవు ఏమి చేశావో నాకు చెప్పు” అని యోనాతానుతో అన్నాడు. అందుకు యోనాతాను, “నా చేతికర్ర అంచుతో కొంచెం తేనె రుచి చూశాను. కాబట్టి నేను ఖచ్చితంగా చనిపోవలసిందే” అన్నాడు.
1SA 14:44 అందుకు సౌలు, “యోనాతానూ, నీవు ఖచ్చితంగా చనిపోవాలి లేకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షిస్తారు” అన్నాడు.
1SA 14:45 అయితే ప్రజలు సౌలుతో, “ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప విడుదల ఇచ్చిన యోనాతాను చనిపోవాలా? అలా ఎన్నటికి జరుగకూడదు. దేవుని సహాయంతోనే అతడు ఈ రోజు మనకు విజయాన్ని అందించాడు. సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అతని తలవెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదు” అని చెప్పి యోనాతాను మరణించకుండా ప్రజలు అతన్ని రక్షించారు.
1SA 14:46 అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరమడం మానివేయగా వారు తమ స్వదేశానికి వెళ్లిపోయారు.
1SA 14:47 సౌలు ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి అధికారం పొందిన తర్వాత, అన్నివైపులా ఉన్న వారి శత్రువులతో అనగా, మోయాబీయులతో అమ్మోనీయులతో ఎదోమీయులతో సోబాదేశపు రాజులతో ఫిలిష్తీయులతో అతడు యుద్ధం చేశాడు. ఎవరి మీదికి అతడు యుద్ధానికి వెళ్లాడో వారినందరిని ఓడించాడు.
1SA 14:48 అతడు ధైర్యంగా పోరాడి అమాలేకీయులను హతం చేసి ఇశ్రాయేలీయులను దోచుకున్నవారి చేతిలో నుండి వారిని విడిపించాడు.
1SA 14:49 సౌలు కుమారుల పేర్లు యోనాతాను, ఇష్వీ, మల్కీ-షూవ. అతని పెద్దకుమార్తె పేరు మేరబు చిన్నదాని పేరు మీకాలు.
1SA 14:50 సౌలు భార్యపేరు అహీనోయము. ఈమె అహిమయస్సు కుమార్తె. సౌలు సేనాధిపతి పేరు అబ్నేరు. అతడు నేరు కుమారుడు. నేరు సౌలు చిన్నాన్న.
1SA 14:51 సౌలు తండ్రి కీషు, అబ్నేరు తండ్రి నేరు ఇద్దరూ అబీయేలు కుమారులు.
1SA 14:52 సౌలు జీవించినంత కాలం ఫిలిష్తీయులతో తీవ్రమైన యుద్ధం జరుగుతూనే ఉంది. సౌలు తాను చూసిన బలవంతులను ధైర్యవంతులను తీసుకువచ్చి తనకు సేవ చేయడానికి పెట్టుకునేవాడు.
1SA 15:1 ఒక రోజు సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు, “యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్ను పంపించారు; ఇప్పుడు యెహోవా పంపిన సందేశాన్ని విను.
1SA 15:2 సైన్యాల యెహోవా చెప్పింది ఇదే, ‘ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు అమాలేకీయులు దారిలో వారిని అడ్డగించినందుకు నేను వారిని శిక్షిస్తాను.
1SA 15:3 కాబట్టి నీవు ఇప్పుడు వెళ్లి అమాలేకీయుల మీద దాడిచేసి వారికి చెందిన వాటన్నిటిని నాశనం చేయాలి. వారిని విడిచిపెట్టవద్దు; పురుషులను స్త్రీలను, పిల్లలను చంటిబిడ్డలను, పశువులను గొర్రెలను, ఒంటెలను, గాడిదలనన్నిటిని చంపివేయాలి.’ ”
1SA 15:4 కాబట్టి సౌలు ప్రజలను పిలిపించి తెలాయీములో వారిని లెక్కించగా కాల్బలం రెండు లక్షలమంది యూదా వారు పదివేలమంది ఉన్నారు.
1SA 15:5 అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణానికి వచ్చి ఒక కనుమలో పొంచి ఉన్నాడు.
1SA 15:6 అప్పుడు సౌలు కెనీయులతో, “ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు మీరు వారందరి పట్ల దయ చూపించారు కాబట్టి నేను అమాలేకీయులతో పాటు మిమ్మల్ని నాశనం చేయకుండా మీరు అమాలేకీయులను విడిచిపెట్టి వెళ్లిపొండి” అని చెప్పినప్పుడు కెనీయులు అమాలేకీయులలో నుండి వెళ్లిపోయారు.
1SA 15:7 తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఈజిప్టు దేశపు సరిహద్దుకు దగ్గరగా ఉన్న షూరు వరకు తరిమి చంపి,
1SA 15:8 అమాలేకీయుల రాజైన అగగును ప్రాణాలతో పట్టుకుని అతని ప్రజలందరినీ కత్తితో పూర్తిగా నాశనం చేశాడు.
1SA 15:9 అయితే సౌలు అతని సైన్యం అగగును, గొర్రెలలో పశువుల్లో మంచివాటిని క్రొవ్విన దూడలను గొర్రెపిల్లలను నాశనం చేయక పనికిరాని వాటిని బలహీనమైన వాటిని పూర్తిగా నాశనం చేశారు.
1SA 15:10 అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు,
1SA 15:11 “సౌలు నా నుండి దూరమై నేను చెప్పిన దానిని చేయలేదు కాబట్టి నేను సౌలును రాజుగా చేసినందుకు విచారిస్తున్నాను.” అందుకు సమూయేలు కోపం తెచ్చుకుని రాత్రంతా యెహోవాకు మొరపెట్టాడు.
1SA 15:12 ఉదయాన్నే సమూయేలు లేచి సౌలును కలవడానికి వెళ్లగా, “సౌలు కర్మెలుకు వెళ్లాడు. అక్కడ తన విజయానికి గుర్తుగా స్థూపాన్ని నిలబెట్టి తిరిగి గిల్గాలుకు వెళ్లాడు” అని చెప్పారు.
1SA 15:13 తర్వాత సమూయేలు సౌలు దగ్గరకు వచ్చినప్పుడు సౌలు, “యెహోవా నిన్ను దీవిస్తారు! యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను” అన్నాడు.
1SA 15:14 అందుకు సమూయేలు, “అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి?” అని అడిగాడు.
1SA 15:15 అందుకు సౌలు, “అమాలేకీయుల దగ్గర నుండి సైన్యం వాటిని తీసుకువచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి వారు గొర్రెలలో పశువుల్లో మంచి వాటిని వేరుగా ఉంచారు; మిగిలిన వాటన్నిటిని మేము పూర్తిగా నాశనం చేశాము” అని జవాబు ఇచ్చాడు.
1SA 15:16 సమూయేలు, “నీవు మాట్లాడే అవసరం లేదు. గత రాత్రి యెహోవా నాతో చెప్పిన మాట నీకు చెప్తాను విను” అన్నాడు. సౌలు చెప్పమని అన్నాడు.
1SA 15:17 అప్పుడు సమూయేలు, “నీ దృష్టికి నీవు అల్పమైనవానిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రాలకు ముఖ్యుడవయ్యావు కదా? యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించారు.
1SA 15:18 అలాగే యెహోవా, ‘నీవు వెళ్లి దుష్టులైన అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయి; వారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు వారితో యుద్ధం చేయి’ అని చెప్పి నీకు ఒక కర్తవ్యాన్ని అప్పగించి పంపారు.
1SA 15:19 నీవెందుకు యెహోవాకు లోబడలేదు? ఎందుకు దోపుడుసొమ్ము మీద పడి యెహోవా దృష్టికి కీడు చేశావు” అన్నాడు.
1SA 15:20 అందుకు సౌలు సమూయేలుతో, “ఆ మాట అనవద్దు: నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గంలో వెళ్లి నేను అమాలేకీయులనందరిని పూర్తిగా నాశనం చేసి అమాలేకీయుల రాజైన అగగును తీసుకువచ్చాను.
1SA 15:21 అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి సైనికులు దోచుకున్న గొర్రెలలో పశువుల్లో మంచివి, దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వాటిని తీసుకువచ్చారు” అని చెప్పాడు.
1SA 15:22 అందుకు సమూయేలు ఇలా అన్నాడు: “ఒకడు తన మాటకు లోబడితే యెహోవా సంతోషించినంతగా, దహనబలులు బలులు అర్పిస్తే ఆయన సంతోషిస్తారా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినడం ఎంతో మంచిది
1SA 15:23 తిరుగుబాటు చేయడం భవిష్యవాణి చెప్పడమనే పాపంతో సమానం అహంకారం విగ్రహారాధనలోని చెడుతనంతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు తిరస్కరించావు కాబట్టి ఆయన నిన్ను రాజుగా తిరస్కరించారు.”
1SA 15:24 అప్పుడు సౌలు సమూయేలుతో, “నేను పాపం చేశాను. నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను పాటించలేదు. ప్రజలకు భయపడి వారి మాట విన్నాను.
1SA 15:25 కాబట్టి నీవు నా పాపాన్ని క్షమించి నేను యెహోవాకు పూజించేలా నాతో కూడా తిరిగి రమ్మని వేడుకుంటున్నాను” అన్నాడు.
1SA 15:26 అందుకు సమూయేలు అతనితో, “నీతో కూడ నేను తిరిగి రాను. నీవు యెహోవా మాటను తిరస్కరించావు కాబట్టి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను తిరస్కరించారు” అని చెప్పాడు.
1SA 15:27 సమూయేలు వెళ్లిపోవాలని వెనుకకు తిరిగినప్పుడు సౌలు అతని వస్త్రపు అంచు పట్టుకోవడంతో అది చినిగింది.
1SA 15:28 అప్పుడు సమూయేలు అతనితో, “ఈ రోజు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని చింపి నీ చేతిలో నుండి తీసివేసి నీ కంటే మంచివాడైన నీ పొరుగువానికి దానిని అప్పగించారు.
1SA 15:29 ఇశ్రాయేలీయులకు మహిమగా ఉన్నవాడు అబద్ధమాడడు మనస్సు మార్చుకోడు; మనస్సు మార్చుకోడానికి ఆయన నరుడు కాడు.”
1SA 15:30 అందుకు సౌలు, “నేను పాపం చేశాను. అయినప్పటికీ దయచేసి నా ప్రజల పెద్దల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నన్ను గౌరవించు; మీ దేవుడైన యెహోవాను నేను ఆరాధించడానికి నాతో తిరిగి రా” అని అడిగాడు.
1SA 15:31 కాబట్టి సమూయేలు సౌలుతో వెళ్లాడు, సౌలు యెహోవాను ఆరాధించాడు.
1SA 15:32 అప్పుడు సమూయేలు, “అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు. సంకెళ్ళతో ఉన్న అగగు అతని దగ్గరకు వచ్చి, “ఖచ్చితంగా మరణభయం నా నుండి తొలగిపోయింది” అనుకున్నాడు.
1SA 15:33 అయితే సమూయేలు, “నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసినట్లు, స్త్రీల మధ్యలో నీ తల్లికి సంతానం లేకుండా పోతుంది” అని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిలో అగగును ముక్కలుగా నరికాడు.
1SA 15:34 అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయాడు కాని సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్లాడు.
1SA 15:35 అప్పటినుండి సౌలు చనిపోయే వరకు సమూయేలు అతన్ని చూడటానికి వెళ్లలేదు గాని సౌలును గురించి దుఃఖపడేవాడు. సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేసినందుకు యెహోవా విచారించారు.
1SA 16:1 యెహోవా సమూయేలుతో, “ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలు గురించి నీవెంత కాలం దుఃఖపడతావు? నీ కొమ్మును నూనెతో నింపి నీవు బయలుదేరు; బేత్లెహేమీయుడైన యెష్షయి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా ఏర్పరచుకున్నాను” అన్నారు.
1SA 16:2 అయితే సమూయేలు, “నేను ఎలా వెళ్లను? నేను వెళ్లిన సంగతి సౌలు వింటే అతడు నన్ను చంపేస్తాడు” అన్నాడు. అందుకు యెహోవా, “నీతో పాటు ఒక లేగదూడను తీసుకెళ్లి, ‘యెహోవాకు బలివ్వడానికి వచ్చాను’ అని చెప్పు.
1SA 16:3 ఆ బలికి యెష్షయిని రమ్మను, అప్పుడు నీవు ఏం చేయాలో నేను నీకు చెప్తాను. నేను సూచించే వాన్ని నీవు అభిషేకించాలి” అని చెప్పారు.
1SA 16:4 యెహోవా చెప్పిన ప్రకారం సమూయేలు చేశాడు. అతడు బేత్లెహేముకు చేరుకున్నప్పుడు, ఆ పట్టణ పెద్దలు అతడు రావడం చూసి భయపడి, “సమాధానంగా వస్తున్నావా?” అని అడిగారు.
1SA 16:5 అందుకు సమూయేలు, “అవును, సమాధానంగానే వచ్చాను, యెహోవాకు బలి అర్పించడానికి వచ్చాను. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని నాతోకూడ బలి ఇవ్వడానికి రండి” అని చెప్పి, యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలివ్వడానికి వారిని పిలిచాడు.
1SA 16:6 వారు వచ్చినప్పుడు సమూయేలు ఏలీయాబును చూసి, “ఖచ్చితంగా యెహోవా అభిషేకించినవాడు యెహోవా ఎదుట నిలబడ్డాడు” అనుకున్నాడు.
1SA 16:7 అయితే యెహోవా సమూయేలుతో, “అతని రూపాన్ని ఎత్తును చూసి అలా అనుకోవద్దు, నేను అతన్ని తిరస్కరించాను. మనుష్యులు చూసే వాటిని యెహోవా చూడరు. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు కాని యెహోవా హదృయాన్ని చూస్తారు” అన్నారు.
1SA 16:8 యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుట నిలబెట్టాడు కాని సమూయేలు, “యెహోవా ఇతన్ని ఎంచుకోలేదు” అన్నాడు.
1SA 16:9 అప్పుడు యెష్షయి షమ్మాను పిలిచాడు కాని సమూయేలు, “ఇతన్ని కూడా యెహోవా ఎంచుకోలేదు” అన్నాడు.
1SA 16:10 అలా యెష్షయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుట నిలబెట్టాడు కాని సమూయేలు, “యెహోవా వీరెవరిని ఎంచుకోలేదు” అని చెప్పి,
1SA 16:11 నీ కుమారులంతా వీరేనా? అని యెష్షయిని అడిగాడు. అందుకు యెష్షయి, ఇంకా చివరివాడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడని చెప్పాడు. అందుకు సమూయేలు, “అతన్ని పిలిపించు; అతడు వచ్చేవరకు మనం భోజనం చేయము” అన్నాడు.
1SA 16:12 కాబట్టి యెష్షయి అతన్ని పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు ఎర్రగా అందమైన కళ్లతో మంచి రూపంతో ఉన్నాడు. అప్పుడు యెహోవా, “నేను ఎన్నుకున్నది ఇతన్నే, నీవు లేచి అతన్ని అభిషేకించు” అన్నారు.
1SA 16:13 కాబట్టి సమూయేలు నూనె కొమ్మును తీసుకుని అతని సోదరుల ఎదుట అతన్ని అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చేది. ఆ తర్వాత సమూయేలు రామాకు వెళ్లిపోయాడు.
1SA 16:14 యెహోవా ఆత్మ సౌలును విడిచివెళ్లి, యెహోవా దగ్గర నుండి వచ్చిన దురాత్మ అతన్ని బాధించింది.
1SA 16:15 అప్పుడు సౌలు సేవకులు, “యెహోవా దగ్గర నుండి వచ్చిన దురాత్మ నిన్ను బాధిస్తుంది.
1SA 16:16 మా ప్రభువైన నీవు నీ సేవకులకు ఆజ్ఞ ఇస్తే సితారా చక్కగా వాయించగల ఒకనిని వెదికి తీసుకువస్తాము. దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా వాయించడం వలన నీకు బాగవుతుంది” అన్నారు.
1SA 16:17 కాబట్టి సౌలు తన సేవకులతో, “బాగా వాయించే వానిని వెదికి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.
1SA 16:18 అప్పుడు సౌలు సేవకులలో ఒకడు, “బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారులలో ఒకనిని చూశాను. అతడు వీణ వాయిస్తాడు. అతడు ధైర్యవంతుడు యుద్ధవీరుడు వివేకం గలవాడు, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు.
1SA 16:19 సౌలు యెష్షయి దగ్గరకు దూతలను పంపి, “గొర్రెల దగ్గర ఉన్న నీ కుమారుడైన దావీదును నా దగ్గరకు పంపు” అని కబురు పంపాడు.
1SA 16:20 అప్పుడు యెష్షయి ఒక గాడిద మీద రొట్టెలు ద్రాక్షరసపు తిత్తిని ఒక మేకపిల్లను ఉంచి వాటిని తన కుమారుడైన దావీదుతో పాటు సౌలు దగ్గరకు పంపించాడు.
1SA 16:21 దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా సౌలు అతన్ని చాలా ఇష్టపడ్డాడు. దావీదు సౌలు ఆయుధాలను మోసేవారిలో ఒకనిగా నియమించబడ్డాడు.
1SA 16:22 తర్వాత సౌలు, “దావీదు అంటే నాకు ఇష్టం ఏర్పడింది కాబట్టి అతడు నా దగ్గర ఉండి సేవ చేయడానికి ఒప్పుకో” అని యెష్షయికి కబురు పంపాడు.
1SA 16:23 దేవుని దగ్గర నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చినప్పుడెల్లా దావీదు సితారా పట్టుకుని వాయించేవాడు, అప్పుడు దురాత్మ సౌలును విడిచివెళ్లి అతనికి నెమ్మది కలిగేది.
1SA 17:1 ఫిలిష్తీయులు తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చి యూదాలోని శోకోలో సమీకరించి ఎఫెస్-దమ్మీము దగ్గర శోకోకు అజేకాకు మధ్యన శిబిరం ఏర్పరచుకున్నారు.
1SA 17:2 సౌలు ఇశ్రాయేలీయులు కలిసివచ్చి ఏలహు లోయలో శిబిరం ఏర్పరచుకొని ఫిలిష్తీయులకు ఎదురుగా పోరాడడానికి యుద్ధవరుసలు ఏర్పరచుకున్నారు.
1SA 17:3 ఫిలిష్తీయులు ఒక కొండను, ఇశ్రాయేలీయులు మరొక కొండను ఆక్రమించుకున్నారు, వాటి మధ్య లోయ ఉంది.
1SA 17:4 గాతుకు చెందిన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల శిబిరం నుండి బయలుదేరాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జేన.
1SA 17:5 అతని తలమీద ఇత్తడి శిరస్త్రాణం ఉంది, అతడు 5,000 షెకెళ్ళ బరువుగల ఇత్తడి యుద్ధకవచాన్ని ధరించాడు.
1SA 17:6 అతని కాళ్లకు ఇత్తడి తొడుగు అతని వీపు మీద ఒక ఇత్తడి బల్లెం ఉన్నాయి.
1SA 17:7 అతని ఈటె నేతపనివాని కర్రంత పెద్దది. అతని ఈటె కొనలో ఉన్న ఇనుము బరువు ఆరువందల షెకెళ్ళు. అతని డాలు మోసేవాడు అతని ముందు నడుస్తున్నాడు.
1SA 17:8 గొల్యాతు నిలబడి ఇశ్రాయేలీయుల సైన్యంతో, “మీరు వచ్చి యుద్ధం చేయడానికి ఎందుకు బారులు తీరి నిలబడ్డారు? నేను ఫిలిష్తీయుడను కానా మీరు సౌలు దాసులు కారా? మీ వైపు నుండి ఒకరిని ఎంచుకుని నాతో యుద్ధం చేయడానికి పంపండి.
1SA 17:9 అతడు నాతో పోరాడి నన్ను చంపగలగితే మేము మీకు లోబడి ఉంటాం; కాని నేను అతన్ని జయించి చంపితే మీరు మాకు లోబడి మాకు సేవ చేయాలి” అన్నాడు.
1SA 17:10 ఆ ఫిలిష్తీయుడు ఇంకా, “ఈ రోజు నేను ఇశ్రాయేలీయుల సైన్యానికి సవాలు విసురుతున్నాను. మీరు ఒకడిని పంపిస్తే మేమిద్దరం ఒకరితో ఒకరం పోరాడతాం” అన్నాడు.
1SA 17:11 ఆ ఫిలిష్తీయుని మాటలు విని సౌలు ఇశ్రాయేలీయులందరు చాలా దిగులుపడి భయపడ్డారు.
1SA 17:12 దావీదు యూదాలోని బేత్లెహేముకు చెందిన ఎఫ్రాతీయుడైన యెష్షయి కుమారుడు. యెష్షయికి ఎనిమిది మంది కుమారులు. సౌలు కాలంలో అతడు చాలా ముసలివాడు.
1SA 17:13 యెష్షయి ముగ్గురు పెద్దకుమారులు సౌలుతో పాటు యుద్ధానికి వెళ్లారు. వారిలో మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా.
1SA 17:14 దావీదు చివరివాడు. పెద్దవారైన ముగ్గురు సౌలుతో పాటు వెళ్లారు.
1SA 17:15 అయితే దావీదు బేత్లెహేములో తన తండ్రి గొర్రెలు మేపడానికి, అలాగే సౌలు దగ్గరకు వెళ్లి వస్తుండేవాడు.
1SA 17:16 ఆ ఫిలిష్తీయుడు నలభైరోజుల వరకు ప్రతి ఉదయం సాయంత్రం వచ్చి నిలబడేవాడు.
1SA 17:17 యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, “నీ అన్నల కోసం ఒక ఏఫా వేయించిన గోధుమలు, ఈ పది రొట్టెలను తీసుకుని శిబిరంలో ఉన్న నీ అన్నల దగ్గరకు తొందరగా వెళ్లు.
1SA 17:18 అలాగే ఈ పది జున్నుముక్కలు తీసుకెళ్లి వారి సేనాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమాన్ని తెలుసుకొని రా.
1SA 17:19 వారు సౌలుతో ఉన్నారు; ఇశ్రాయేలీయులందరు ఏలహు లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు” అని చెప్పి పంపించాడు.
1SA 17:20 దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపరికి గొర్రెలు అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకు చెప్పిన ప్రకారం బయలుదేరి వెళ్లాడు. అయితే అతడు యుద్ధభూమి దగ్గరకు వచ్చేసరికి సైన్యమంతా బారులు తీరి నినాదాలు చేస్తూ యుద్ధభూమికి వస్తున్నారు.
1SA 17:21 ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఒకరికి ఎదురుగా ఒకరు నిలబడి యుద్ధానికి సిద్ధపడుతున్నారు.
1SA 17:22 దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాన్లు భద్రపరిచేవానికి అప్పగించి పరుగెత్తి వెళ్లి యుద్ధభూమిలో ఉన్న తన అన్నలను వారి క్షేమం అడిగాడు.
1SA 17:23 అతడు వారితో మాట్లాడుతుండగా గాతుకు చెందిన ఫిలిష్తీయుడైన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి రోజు చేసినట్లే ఆ రోజు కూడా సవాలు చేస్తూ ఉండగా దావీదు విన్నాడు.
1SA 17:24 ఇశ్రాయేలీయులందరు అతన్ని చూసి చాలా భయపడి అతని దగ్గర నుండి పారిపోయారు.
1SA 17:25 ఇశ్రాయేలీయులలో ఒకడు, “వస్తున్న ఆ వ్యక్తిని చూశారా, ఇశ్రాయేలీయులను ఎదిరించడానికే అతడు వస్తున్నాడు. అయితే అతన్ని చంపినవాన్ని రాజు గొప్ప ధనవంతునిగా చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి అతని కుటుంబం ఇశ్రాయేలులో పన్నులు కట్టే అవసరం లేకుండ చేస్తారు” అని చెప్పాడు.
1SA 17:26 అప్పుడు దావీదు తన దగ్గర నిలబడినవారిని, “సజీవుడైన దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి సున్నతిలేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ అవమానాన్ని తొలగించిన వానికి ఏ బహుమతి ఇస్తారు?” అని అడిగాడు.
1SA 17:27 అందుకు ఆ సైనికులు, “వానిని చంపినవానికి ఇలా చేస్తారు” అని అతనికి చెప్పారు.
1SA 17:28 దావీదు వారితో మాట్లాడిన మాటలు అతని పెద్దన్న ఏలీయాబు విని దావీదు మీద కోప్పడి అతనితో, “నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు? అరణ్యంలో ఉన్న ఆ చిన్న గొర్రెల మందను ఎవరికి అప్పగించావు? నీకు ఎంత అహంకారమో నీది ఎంత చెడ్డ హృదయమో నాకు తెలుసు! యుద్ధం చూడడానికే గదా నీవు వచ్చావు” అన్నాడు.
1SA 17:29 అందుకు దావీదు, “నేనేమి చేశాను? నేనేమి మాట్లాడకూడదా?” అని అడిగి,
1SA 17:30 అతని దగ్గర నుండి వెళ్లి మరొకరిని మరలా అదే ప్రశ్న అడిగాడు. వారు కూడా అదే జవాబిచ్చారు.
1SA 17:31 దావీదు మాటలు విన్న మరికొందరు వాటిని సౌలుకు చెప్పినప్పుడు అతడు దావీదును పిలిపించాడు.
1SA 17:32 దావీదు సౌలుతో, “ఈ ఫిలిష్తీయుని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ సేవకుడనైన నేను వెళ్లి వానితో పోరాడతాను” అన్నాడు.
1SA 17:33 అందుకు సౌలు దావీదుతో, “ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోరాడటానికి నీ బలం సరిపోదు. నీవు ఇంకా చిన్నపిల్లవాడివి! అతడు చిన్నప్పటి నుండే యుద్ధవీరుడు” అని చెప్పాడు.
1SA 17:34 అందుకు దావీదు సౌలుతో, “మీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తుండగా ఒక సింహం ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతుంటే,
1SA 17:35 నేను దానిని తరిమి చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రెను విడిపించాను. అది నా మీద దాడి చేసినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను.
1SA 17:36 మీ సేవకుడనైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను. సజీవుడైన దేవుని సైన్యాలను అవమానిస్తున్న ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దానిలా అవుతాడు.
1SA 17:37 దావీదు ఇంకా మాట్లాడుతూ, సింహపు పంజానుండి ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తారు” అన్నాడు. అప్పుడు సౌలు, “వెళ్లు, యెహోవా నీకు తోడుగా ఉంటారు” అని దావీదుతో అన్నాడు.
1SA 17:38 సౌలు తన యుద్ధ వస్త్రాలను, యుద్ధకవచాన్ని దావీదుకు తొడిగించి ఇత్తడి శిరస్త్రాణం అతని తలపై పెట్టాడు.
1SA 17:39 దావీదు ఆ యుద్ధకవచం వేసుకుని కత్తి పట్టుకుని నడవడానికి ప్రయత్నించాడు కాని అవి అతనికి అలవాటు లేకపోవడం వలన అతడు నడవలేకపోయాడు. అందుకతడు, “ఇవి నాకు అలవాటు లేదు కాబట్టి వీటితో నేను వెళ్లలేను” అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు.
1SA 17:40 అతడు తన చేతికర్రను పట్టుకుని ఏటిలో నుండి అయిదు సన్నని రాళ్లు ఏరుకుని తన దగ్గర ఉన్న చిన్న సంచిలో వేసుకుని తన వడిసెల పట్టుకుని ఆ ఫిలిష్తీయుని దగ్గరకు వెళ్లాడు.
1SA 17:41 తన డాలు మోసేవాడు తనకు ముందు నడుస్తుండగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదుకు దగ్గరగా వచ్చి,
1SA 17:42 ఎర్రగా, అందంగా ఉన్న దావీదును చూసి చిన్నపిల్లవాడని అతన్ని పట్టించుకోలేదు.
1SA 17:43 అతడు దావీదుతో, “కర్ర తీసుకుని నా మీదికి వస్తున్నావు నేనేమైనా కుక్కనా?” అని చెప్పి తన దేవుళ్ళ పేరట దావీదును శపించాడు.
1SA 17:44 ఆ ఫిలిష్తీయుడు దావీదుతో, “నా దగ్గరకు రా, నీ మాంసాన్ని పక్షులకు మృగాలకు వేస్తాను!” అన్నాడు.
1SA 17:45 అందుకు దావీదు ఆ ఫిలిష్తీయునితో, “నీవు కత్తి ఈటె బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు కాని నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాల దేవుడును సైన్యాల అధిపతియైన యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను.
1SA 17:46 ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తారు; నేను నిన్ను చంపి నీ తల నరికివేస్తాను. నేను ఈ రోజే ఫిలిష్తీయుల కళేబరాలను పక్షులకు అడవి జంతువులకు వేస్తాను. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకుంటుంది.
1SA 17:47 అప్పుడు యెహోవా కత్తితో గాని ఈటెతో గాని రక్షించేవాడు కాడని ఇక్కడ ఉన్నవారందరు తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే, ఆయనే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తారు” అన్నాడు.
1SA 17:48 ఆ ఫిలిష్తీయుడు దావీదుపై దాడి చేయడానికి ముందుకు రాగానే దావీదు అతన్ని ఎదుర్కోడానికి సైన్యం వైపు పరుగెత్తి వెళ్లాడు.
1SA 17:49 దావీదు తన సంచిలో నుండి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి విసిరి ఆ ఫిలిష్తీయుని నుదిటి మీద కొట్టాడు. ఆ రాయి అతని నుదిటి లోపలికి చొచ్చుకొని పోగా గొల్యాతు నేలపై బోర్లాపడ్డాడు.
1SA 17:50 అలా దావీదు ఆ ఫిలిష్తీయుని కేవలం ఒక వడిసెల ఒక రాయితో జయించాడు; తన చేతిలో కత్తి లేకుండానే ఆ ఫిలిష్తీయుని పడగొట్టాడు.
1SA 17:51 అప్పుడు దావీదు పరుగెత్తుకొని వెళ్లి ఆ ఫిలిష్తీయుని మీద నిలబడి వాని ఒరలో ఉన్న కత్తిని తీసి ఆ కత్తితోనే వాని చంపి, వాని తల నరికివేశాడు. ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి పారిపోయారు.
1SA 17:52 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు లేచి జయధ్వనులు చేస్తూ లోయవరకు ఎక్రోను ద్వారాల వరకు ఫిలిష్తీయులను వెంటాడారు. చనిపోయిన ఫిలిష్తీయులు షరాయిము దారిలో గాతు ఎక్రోను పట్టణాల వరకు పడి ఉన్నారు.
1SA 17:53 ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను వెంటాడడం ఆపి, తిరిగివచ్చి వారి డేరాలను దోచుకున్నారు.
1SA 17:54 దావీదు ఆ ఫిలిష్తీయుని తలను యెరూషలేముకు తీసుకువచ్చాడు. ఫిలిష్తీయుని ఆయుధాలను తన సొంత డేరాలో ఉంచాడు.
1SA 17:55 దావీదు ఆ ఫిలిష్తీయుని ఎదుర్కోడానికి వెళ్లడం చూసి సౌలు తన సేనాధిపతియైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, ఈ యువకుడు ఎవరి కుమారుడు” అని అడిగాడు. అందుకు అబ్నేరు, “రాజా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు తెలియదు” అన్నాడు.
1SA 17:56 అందుకు రాజు, “ఈ యువకుడు ఎవరి కుమారుడో తెలుసుకోండి” అని ఆజ్ఞాపించాడు.
1SA 17:57 దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలిచి ఫిలిష్తీయుని తల అతని చేతిలో ఉండగానే దావీదును సౌలు దగ్గరకు తీసుకువచ్చాడు.
1SA 17:58 సౌలు అతన్ని, “చిన్నవాడా, నీవెవరి కుమారుడవు?” అని అడిగాడు. అందుకు దావీదు, “నేను నీ సేవకుడు బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడను” అని సమాధానమిచ్చాడు.
1SA 18:1 దావీదు సౌలుతో మాట్లాడడం పూర్తయిన తర్వాత యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదును ప్రాణానికి ప్రాణంగా భావించి అతన్ని ప్రేమించాడు.
1SA 18:2 ఆ రోజు నుండి సౌలు దావీదును తన దగ్గరే ఉంచుకుని అతన్ని తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్లనివ్వలేదు.
1SA 18:3 యోనాతాను దావీదును తన ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి అతడు దావీదుతో ఒక నిబంధన చేసుకున్నాడు.
1SA 18:4 యోనాతాను తాను కప్పుకుని ఉన్న వస్త్రాన్ని, దానితో పాటు తన కత్తిని విల్లును నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.
1SA 18:5 దావీదు సౌలు తనను పంపిన ప్రతి చోటుకు వెళ్లి, విజయం సాధించేవాడు కాబట్టి సౌలు అతనికి సైన్యంలో ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. అది సైనికులందరికి, సౌలు అధికారులకు సంతోషం కలిగించింది.
1SA 18:6 దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వస్తున్నప్పుడు, ఇశ్రాయేలు పట్టణాలలోని స్త్రీలందరు చాలా ఆనందంతో తంబురలు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును కలుసుకోడానికి ఎదురువచ్చారు.
1SA 18:7 ఆ స్త్రీలు నాట్యం చేస్తూ వాయిద్యాలు వాయిస్తూ, “సౌలు వేయిమందిని దావీదు పదివేలమందిని చంపారు” అని పాడారు.
1SA 18:8 ఆ మాటలు సౌలుకు నచ్చలేదు కాబట్టి అతడు చాలా కోపం తెచ్చుకుని, “వారు దావీదుకు పదివేలమంది, నాకు వేయిమంది అంటున్నారు; రాజ్యం కాకుండా అతడు మరేం తీసుకోగలడు?” అనుకున్నాడు.
1SA 18:9 అప్పటినుండి సౌలు దావీదును అసూయతో చూడడం మొదలుపెట్టాడు.
1SA 18:10 తర్వాత రోజు దేవుని దగ్గర నుండి దురాత్మ ఒకటి సౌలు మీదికి బలంగా వచ్చి అతడు ఇంట్లో ప్రవచిస్తున్నప్పుడు దావీదు ఎప్పటిలాగానే వీణ పట్టుకుని వాయించాడు. సౌలు చేతిలో ఒక ఈటె ఉంది.
1SA 18:11 సౌలు, “దీనితో నేను దావీదును గోడకు వ్రేలాడదీస్తాను” అని తనలో తాను అనుకుని దావీదు మీదికి ఈటె విసిరాడు కాని దావీదు రెండు సార్లు తప్పించుకున్నాడు.
1SA 18:12 యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదుకు భయపడ్డాడు.
1SA 18:13 కాబట్టి సౌలు దావీదును తన దగ్గర నుండి తీసివేసి సహస్రాధిపతిగా నియమించాడు; దావీదు యుద్ధాలలో సైన్యాన్ని ముందుండి నడిపించాడు.
1SA 18:14 యెహోవా దావీదుకు తోడుగా ఉన్నారు కాబట్టి అతడు చేసిన వాటన్నిటిలో విజయాన్ని సాధించాడు.
1SA 18:15 దావీదు సాధిస్తున్న విజయాలను చూసి సౌలు అతనంటే మరింత భయపడ్డాడు.
1SA 18:16 దావీదు యుద్ధాలలో సైన్యాన్ని ముందుండి నడిపించాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు అతన్ని ప్రేమించారు.
1SA 18:17 సౌలు తనలో తాను, “నా చేయి అతని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చేయి అతని మీద పడాలి” అనుకుని దావీదుతో, “ఈమె నా పెద్దకుమార్తె మేరబు; ఆమెను నీకు భార్యగా చేస్తాను. అయితే నీవు నా కోసం యుద్ధవీరునిగా ఉండి యెహోవా యుద్ధాలను చేస్తూ ఉండాలి” అన్నాడు.
1SA 18:18 అందుకు దావీదు సౌలుతో, “రాజుకు అల్లుడు అవడానికి నేను ఎంతటివాడను? నా కుటుంబం గాని, ఇశ్రాయేలులో నా వంశం గాని ఏపాటిది?” అన్నాడు.
1SA 18:19 అయితే దావీదుకు పెళ్ళి చేస్తానన్న సౌలు కుమార్తె మేరబుకు పెళ్ళి సమయం వచ్చినప్పుడు సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రీయేలుకు ఇచ్చి పెళ్ళి చేశాడు.
1SA 18:20 అయితే తన కుమార్తె మీకాలు దావీదును ప్రేమించింది. ఆ విషయం తనకు తెలిసినప్పుడు సౌలు సంతోషించాడు.
1SA 18:21 “ఆమెను అతనికి ఇచ్చి పెళ్ళి చేస్తాను అప్పుడు ఆమె అతనికి ఉరిగా మారి ఫిలిష్తీయుల చేయి అతని మీద పడుతుంది” అనుకుని సౌలు దావీదుతో, “నీవు నా అల్లుడు అవ్వడానికి నీకు మరో అవకాశం ఉంది” అన్నాడు.
1SA 18:22 సౌలు తన సేవకులను పిలిచి, “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి, ‘రాజుకు నీవంటే ఇష్టం, అలాగే అతని సేవకులందరు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నీవు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పమని” వారిని ఆజ్ఞాపించాడు.
1SA 18:23 సౌలు సేవకులు ఆ మాటలే దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు, “రాజుకు అల్లుడు కావడం చిన్న విషయమా? నేను ఒక పేదవాన్ని అంతగా గుర్తింపులేనివాన్ని” అన్నాడు.
1SA 18:24 సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు సౌలుకు తెలియజేశారు.
1SA 18:25 అందుకు సౌలు, “రాజు వధువుకు కట్నంగా ఏమి కోరడంలేదు గాని రాజు శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకువస్తే సరిపోతుందని దావీదుతో చెప్పండి” అన్నాడు. దావీదు ఫిలిష్తీయుల చేతిలో పడాలనేదే సౌలు పన్నాగము.
1SA 18:26 సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు చెప్పినప్పుడు తాను రాజుకు అల్లుడు అవ్వడానికి అంగీకరించాడు. కాబట్టి ఇచ్చిన సమయం కన్నా ముందే,
1SA 18:27 దావీదు తన మనుష్యులను తీసుకెళ్లి రెండువందలమంది ఫిలిష్తీయులను చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చాడు. రాజుకు అల్లుడు అవ్వడానికి కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగించగా సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్ళి చేశాడు.
1SA 18:28 యెహోవా దావీదుకు తోడుగా ఉండడం, తన కుమార్తె మీకాలు అతని ప్రేమించడం చూసి,
1SA 18:29 సౌలు దావీదుకు మరి ఎక్కువగా భయపడ్డాడు. అతడు జీవించినంతకాలం దావీదును శత్రువుగానే చూశాడు.
1SA 18:30 ఫిలిష్తీయుల దళాధిపతులు తరచూ యుద్ధానికి వచ్చేవారు. వారు వచ్చినప్పుడెల్లా దావీదు మిగిలిన సౌలు అధికారులందరికంటే ఎక్కువ విజయాన్ని సాధించేవాడు; కాబట్టి అతనికి ఎంతో పేరు వచ్చింది.
1SA 19:1 సౌలు దావీదును చంపమని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితో చెప్పాడు. అయితే యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టము.
1SA 19:2 కాబట్టి యోనాతాను దావీదును హెచ్చరిస్తూ, “నా తండ్రియైన సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నీవు ఉదయానే జాగ్రత్తపడి రహస్య స్ధలంలో దాక్కొని ఉండు.
1SA 19:3 నేను బయటకు వెళ్లి నీవు ఉన్న పొలంలో మా నాన్నతో పాటు నిలబడి అతనితో నీ గురించి మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్న వాటిని నీకు చెప్తాను” అని అన్నాడు.
1SA 19:4 యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదు గురించి మంచిగా మాట్లాడి, “నీ సేవకుడైన దావీదు నీ పట్ల ఏ తప్పు చేయలేదు గాని ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నీవు అతనికి ఏ హాని చేయవద్దు.
1SA 19:5 అతడు తన ప్రాణాలకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులందరికి గొప్ప విజయాన్ని ఇచ్చారు; అది చూసి నీవు కూడా సంతోషించావు. అకారణంగా దావీదువంటి నిరపరాధిని చంపిన పాపం నీకెందుకు?” అని అన్నాడు.
1SA 19:6 సౌలు యోనాతాను మాటలు విని, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అతనికి మరణశిక్ష విధించను” అని చెప్పాడు.
1SA 19:7 అప్పుడు యోనాతాను దావీదును పిలిచి అన్ని సంగతులను అతనికి చెప్పి, దావీదును సౌలు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు గతంలో ఉన్నట్లే దావీదు అతని దగ్గర ఉన్నాడు.
1SA 19:8 మరొకసారి యుద్ధం వచ్చినప్పుడు దావీదు వెళ్లి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి చాలామందిని చంపినప్పుడు వారు అతని దగ్గర నుండి పారిపోయారు.
1SA 19:9 యెహోవా దగ్గర నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చింది. అప్పుడు సౌలు చేతిలో ఈటె పట్టుకుని తన ఇంట్లో కూర్చున్నాడు. దావీదు సితారా వాయిస్తుండగా,
1SA 19:10 సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు వ్రేలాడదీయాలనుకుని ఈటె విసిరాడు. దావీదు ప్రక్కకు తప్పుకోగా సౌలు విసిరిన ఈటె గోడకు గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రే తప్పించుకుని పారిపోయాడు.
1SA 19:11 ఉదయానే దావీదును చంపాలని అతన్ని పట్టుకోమని చెప్పి సౌలు అతని ఇంటికి దూతలను పంపించాడు. అయితే దావీదు భార్యయైన మీకాలు, “ఈ రాత్రి నీవు పారిపోయి ప్రాణం కాపాడుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు” అని హెచ్చరించి,
1SA 19:12 మీకాలు దావీదును కిటికీ గుండా క్రిందకు దింపితే అతడు తప్పించుకుని పారిపోయాడు.
1SA 19:13 తర్వాత మీకాలు ఒక విగ్రహాన్ని తీసుకువచ్చి మంచం మీద పెట్టి తల దగ్గర మేక వెంట్రుకలు ఉంచి దుప్పటితో దానిని కప్పింది.
1SA 19:14 సౌలు దావీదును పట్టుకోడానికి దూతలను పంపినప్పుడు మీకాలు, “అతడు అనారోగ్యంగా ఉన్నాడు” అని చెప్పింది.
1SA 19:15 సౌలు దావీదును చూడడానికి మళ్ళీ దూతలను పంపుతూ వారితో, “అతన్ని మంచంతో సహా తీసుకురండి నేను అతన్ని చంపుతాను” అన్నాడు.
1SA 19:16 అయితే ఆ దూతలు లోపలికి వచ్చి చూసినప్పుడు తల దగ్గర మేక వెంట్రుకలు ఉన్న ఒక విగ్రహం మంచం మీద కనబడింది.
1SA 19:17 అప్పుడు సౌలు, “నా శత్రువు తప్పించుకునేలా అతన్ని పంపించివేసి ఎందుకు నన్ను మోసం చేశావు?” అని మీకాలును అడిగాడు. అందుకు మీకాలు, “నేనెందుకు నిన్ను చంపాలి? నన్ను వెళ్లనివ్వు” అని దావీదు తనతో అన్నాడని సౌలుతో చెప్పింది.
1SA 19:18 అలా దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చి సౌలు తనకు చేసినదంతా అతనికి చెప్పాడు. అప్పుడు అతడు అతనితో పాటు సమూయేలు బయలుదేరి నాయోతుకు వచ్చి అక్కడ నివసించారు.
1SA 19:19 దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకు వార్త వచ్చినప్పుడు,
1SA 19:20 దావీదును పట్టుకోడానికి సౌలు దూతలను పంపాడు. వారు వచ్చి అక్కడ ప్రవక్తలు గుంపుగా చేరి ప్రవచించడం వారికి నాయకునిగా సమూయేలు నిలబడి ఉండడం చూసినప్పుడు దేవుని ఆత్మ సౌలు పంపిన సైనికుల మీదికి వచ్చి వారు కూడా ప్రవచించడం మొదలుపెట్టారు.
1SA 19:21 ఈ సంగతి విన్న సౌలు మరి కొంతమందిని పంపించగా వారు కూడా ప్రవచించడం మొదలుపెట్టారు. సౌలు మూడవసారి కూడా దూతలను పంపాడు గాని వారు కూడా ప్రవచిస్తూ ఉన్నారు.
1SA 19:22 చివరిగా, తానే రామాకు బయలుదేరి వెళ్లి సేకు దగ్గర ఉన్న పెద్ద బావి దగ్గరకు వచ్చి, “సమూయేలు, దావీదు ఎక్కడ ఉన్నారు?” అని అడిగాడు. వారు అతనితో, “రామా దగ్గర ఉన్న నాయోతులో ఉన్నారు” అని చెప్పారు.
1SA 19:23 అతడు రామా దగ్గర ఉన్న నాయోతుకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి కూడా వచ్చినందున అతడు నాయోతు చేరుకునేంత వరకు ప్రవచిస్తూనే నడిచాడు.
1SA 19:24 అతడు తన వస్త్రాలను తీసివేసి సమూయేలు ఎదుటనే ప్రవచించాడు. అతడు ఆ రోజు రాత్రి పగలు పై బట్ట లేకుండా పడి ఉన్నాడు. అందువల్లనే, “సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా?” అనే సామెత పుట్టింది.
1SA 20:1 తర్వాత దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరకు వచ్చి, “నేనేమి చేశాను? నా నేరమేంటి? నా ప్రాణం తీయడానికి వెదికేంతగా నీ తండ్రి పట్ల నేను చేసిన పాపమేంటి?” అని అడిగాడు.
1SA 20:2 అందుకు యోనాతాను, “నీవలా ఎప్పుడూ మాట్లాడకు! నా తండ్రి చిన్న పనైనా పెద్ద పనైనా నాకు చెప్పకుండా చేయడు. నా తండ్రి ఈ విషయం నా దగ్గర ఎందుకు దాస్తాడు?” అన్నాడు.
1SA 20:3 అప్పుడు దావీదు, “నేను నీ దయ పొందానని నీ తండ్రికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి అతడు ‘యోనాతాను బాధపడతాడు కాబట్టి అతనికి తెలియకూడదు’ అని అనుకుని ఉంటాడు. అయితే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నిజంగా నాకు మరణానికి మధ్య ఒక్క అడుగు మాత్రమే ఉంది” అని ప్రమాణం చేసి చెప్పాడు.
1SA 20:4 యోనాతాను, “నీకోసం నేను ఏం చేయాలో చెప్పు అది నేను చేస్తాను” అని దావీదుతో చెప్పాడు.
1SA 20:5 అందుకు దావీదు యోనాతానుతో, “రేపు అమావాస్య, అప్పుడు నేను తప్పకుండా రాజుతో పాటు కలిసి భోజనం చేయాలి; కాని ఎల్లుండి సాయంత్రం వరకు పొలంలో దాక్కోడానికి నాకు అనుమతి ఇవ్వు.
1SA 20:6 నీ తండ్రీ నేను లేనని గమనించినప్పుడు నీవు అతనితో, ‘దావీదు వంశంవారు ప్రతి సంవత్సరం బలి అర్పించడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అతడు తన ఊరైన బేత్లెహేముకు వెళ్లడానికి నా అనుమతి కోసం నన్ను బ్రతిమాలాడు’ అని చెప్పు.
1SA 20:7 అప్పుడు అతడు, ‘అలాగే’ అని చెప్తే నీ సేవకుడనైన నేను క్షేమము. కానీ ఒకవేళ అతడు నా మీద తీవ్రంగా కోపపడితే అతడు నాకు హాని చేసే ఉద్దేశం కలిగి ఉన్నట్లు నీవు తెలుసుకుంటావు.
1SA 20:8 నీ దాసుడైన నా మీద దయ చూపించు, ఏంటంటే యెహోవా ఎదుట నీతో నిబంధన చేయడానికి నీవు నీ సేవకుడైన నన్ను రప్పించావు. నన్ను నీ తండ్రి చేతికి ఎందుకు అప్పగిస్తావు? నాలో తప్పు ఉంటే నీవే నన్ను చంపు!” అన్నాడు.
1SA 20:9 యోనాతాను, “అలా ఎప్పుడూ అనవద్దు. నా తండ్రి నీకు హాని చేయాలని చూస్తున్నట్టు నాకు తెలిస్తే నీతో చెప్పకుండా ఉంటానా?” అన్నాడు.
1SA 20:10 అందుకు దావీదు యోనాతానును, “నీ తండ్రి నీతో కఠినంగా మాట్లాడితే దానిని నాకు ఎవరు చెప్తారు?” అని అడిగాడు.
1SA 20:11 యోనాతాను దావీదుతో, “పొలంలోనికి వెళ్దాం రా” అన్నప్పుడు ఇద్దరు కలిసి పొలంలోనికి వెళ్లారు.
1SA 20:12 తర్వాత యోనాతాను దావీదుతో, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సాక్షి, రేపుగాని ఎల్లుండి గాని ఈ సమయానికి నా తండ్రిని కలుసుకుంటాను. అతడు నీ పట్ల సానుకూలంగా ఉంటే ఆ విషయాన్ని నీకు తెలియచేయకుండా ఉంటానా?
1SA 20:13 అయితే నా తండ్రి నీకు హాని చేసే ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు తెలిసి కూడా నీకు చెప్పి నిన్ను క్షేమంగా పంపించకపోతే యెహోవా యోనాతానుకు గొప్ప హాని కలిగించును గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉండును గాక.
1SA 20:14 అయితే నేనింకా బ్రతికి ఉంటే నేను చనిపోకుండా యెహోవా దయ చూపినట్లు నాపై దయ చూపించు.
1SA 20:15 యెహోవా దావీదు శత్రువులలో ఒక్కరిని కూడా భూమి మీద నిలువకుండా నిర్మూలం చేసిన తర్వాత కూడా నీవు నా సంతానం పట్ల దయ చూపించకపోతే యెహోవా నిన్ను విడిచిపెడతారు” అన్నాడు.
1SA 20:16 “యెహోవా దావీదు యొక్క శత్రువులు లెక్క అప్పగించేలా చేయును గాక” అని చెప్తూ యోనాతాను దావీదు కుటుంబంతో నిబంధన చేశాడు.
1SA 20:17 యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించాడు కాబట్టి తనకున్న ప్రేమను బట్టి దావీదు చేత మరల ప్రమాణం చేయించాడు.
1SA 20:18 యోనాతాను దావీదుతో, “రేపు అమావాస్య. నీ చోటు ఖాళీగా ఉంటుంది కాబట్టి నీవు లేవని తెలుస్తుంది గదా.
1SA 20:19 నీవు మూడు రోజులు ఆగి ఇదంతా మొదలైనప్పుడు నీవు దాక్కున్న స్ధలానికి త్వరగా వెళ్లి ఏసెలు అనే బండ దగ్గర ఉండు.
1SA 20:20 గురి చూసి కొట్టినట్లుగా నేను మూడు బాణాలను దాని ప్రక్కకు వేస్తాను.
1SA 20:21 ‘వెళ్లి బాణాలను వెదకు’ అని ఒక పనివాన్ని పంపుతాను. నేను అతనితో, ‘ఇటువైపు ఉన్న బాణాలు చూడు; వాటిని తీసుకురా’ అని చెప్తే నీవు రావచ్చు; ఎందుకంటే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీకు ఏ ప్రమాదం ఉండదు నీవు క్షేమంగా ఉంటావు.
1SA 20:22 అయితే బాణాలను నీకు అవతల వైపు ఉన్నాయని నేను వానితో చెప్తే పారిపొమ్మని యెహోవా చెప్తున్నారని తెలుసుకొని నీవు ప్రయాణమై వెళ్లిపోవాలి.
1SA 20:23 అయితే మనమిద్దరం మాట్లాడుకున్న సంగతులు జ్ఞాపకం ఉంచుకో, నీకు నాకు మధ్య ఎల్లప్పుడు యెహోవాయే సాక్షి” అన్నాడు.
1SA 20:24 కాబట్టి దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనానికి కూర్చున్నాడు.
1SA 20:25 ఎప్పటిలాగానే రాజు గోడ దగ్గర ఉన్న తన స్థానంలో యోనాతానుకు ఎదురుగా కూర్చున్నాడు. అబ్నేరు సౌలు ప్రక్కన కూర్చున్నాడు. అయితే దావీదు కూర్చునే చోటు ఖాళీగా ఉంది.
1SA 20:26 “దావీదుకు ఏదో జరిగి అతడు ఆచారరీత్య అపవిత్రమై ఉంటాడు; ఖచ్చితంగా అతడు అపవిత్రుడు” అని సౌలు అనుకుని ఆ రోజు ఏమీ మాట్లాడలేదు.
1SA 20:27 అయితే అమావాస్య తర్వాతి రోజు అనగా నెలలో రెండవ రోజున దావీదు చోటు ఖాళీగా ఉండడం చూసి సౌలు, “నిన్న, ఈ రోజు యెష్షయి కుమారుడు భోజనానికి ఎందుకు రాలేదు?” అని యోనాతానును అడిగాడు.
1SA 20:28 అందుకు యోనాతాను, “బేత్లెహేము వెళ్లడానికి అనుమతి ఇవ్వమని నన్ను దావీదు ఎంతో ప్రాధేయపడి,
1SA 20:29 ‘దయచేసి నన్ను వెళ్లనివ్వు, నా పట్టణంలో మా వంశస్థులు బలి ఇవ్వబోతున్నారు కాబట్టి నేను కూడా అక్కడ ఉండాలని నా అన్న నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి నాపై దయచూపించి నేను వెళ్లి నా అన్నలను కలుసుకునేలా నన్ను వెళ్లనివ్వు’ అని నన్ను అడిగి వెళ్లాడు. ఆ కారణంగానే అతడు రాజు బల్ల దగ్గరకు రాలేదు” అని చెప్పాడు.
1SA 20:30 అప్పుడు సౌలు యోనాతాను మీద చాలా కోప్పడి, “వక్రబుద్ధితో తిరుగుబాటుచేసేదాని కుమారుడా, నీకు నిన్ను కన్న తల్లికి అవమానం కలిగేలా నీవు యెష్షయి కుమారుని పక్షం ఉన్నావని నాకు తెలియదనుకున్నావా?
1SA 20:31 యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలం నీవు గాని నీ రాజ్యం గాని స్ధిరపడదు. కాబట్టి నీవు ఎవరినైనా పంపి అతన్ని నా దగ్గరకు రప్పించు, అతడు తప్పక చావాల్సిందే” అని చెప్పాడు.
1SA 20:32 అప్పుడు యోనాతాను, “అతడు మరణశిక్ష ఎందుకు పొందాలి? అతడు ఏమి చేశాడు?” అని సౌలును అడిగాడు.
1SA 20:33 కానీ సౌలు అతన్ని చంపడానికి ఈటె విసిరాడు. తన తండ్రి దావీదును చంపాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడని అప్పుడు యోనాతాను గ్రహించాడు.
1SA 20:34 యోనాతాను తీవ్రమైన కోపంతో బల్ల దగ్గర నుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందుకు అతని కోసం దుఃఖిస్తూ, ఆ అమావాస్య పండుగ మరుసటిరోజు అతడు భోజనం చేయలేదు.
1SA 20:35 ఉదయాన యోనాతాను దావీదును కలుసుకోడానికి ఒక పనివానిని తీసుకుని పొలంలోనికి వెళ్లాడు.
1SA 20:36 అతడు వానితో, “నీవు పరుగెత్తుకొని వెళ్లి నేను వేసే బాణాలను వెదుకు” అని చెప్పి వాడు పరుగెత్తుతున్నప్పుడు బాణం వాని అవతలకు వేశాడు.
1SA 20:37 అయితే వాడు యోనాతాను వేసిన బాణం పడ్డ చోటికి వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి, “నీ అవతల బాణం ఉంది కదా?
1SA 20:38 నీవు ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్లు” అన్నాడు. పనివాడు బాణాలను ఏరుకుని తన యాజమాని దగ్గరకు వాటిని తీసుకువచ్చాడు.
1SA 20:39 విషయం ఏమీ వానికి తెలియదు. యోనాతానుకు దావీదుకు మాత్రమే ఆ విషయం తెలుసు.
1SA 20:40 యోనాతాను తన ఆయుధాలను వాని చేతికిచ్చి వీటిని పట్టణానికి తీసుకెళ్లమని చెప్పి వానిని పంపివేశాడు.
1SA 20:41 వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు బండ దక్షిణ దిక్కునుండి బయటకి వచ్చి యోనాతాను ఎదుట మూడుసార్లు మోకరించి తలవంచి నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఏడ్చారు. ఇలా ఉండగా దావీదు మరింత గట్టిగా ఏడ్చాడు.
1SA 20:42 అప్పుడు యోనాతాను, “యెహోవా నీకు నాకు మధ్య, నీ సంతానానికి నా సంతానానికి మధ్య ఎప్పటికీ సాక్షిగా ఉండును గాక. మనమిద్దరం యెహోవా నామాన్ని బట్టి ప్రమాణం చేసుకున్నాం కాబట్టి మనస్సులో నెమ్మది కలిగి వెళ్లు” అని దావీదుతో చెప్పగా దావీదు బయలుదేరి వెళ్లిపోయాడు. యోనాతాను పట్టణానికి తిరిగి వెళ్లాడు.
1SA 21:1 దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చాడు. అయితే అహీమెలెకు దావీదు రావడం చూసి భయపడి, “నీతో ఎవరూ లేకుండా నీవు ఒక్కడివే వచ్చావెందుకు?” అని అతన్ని అడిగాడు.
1SA 21:2 అందుకు దావీదు యాజకుడైన అహీమెలెకుతో, “రాజు నాకు ఒక పని అప్పగించి, ‘నేను నిన్ను పంపిన పని గురించి ఎవరికి తెలియకూడదు’ అన్నాడు. నేను నా మనుష్యులతో ఒక చోటికి వెళ్లి అక్కడ ఉండమని చెప్పాను.
1SA 21:3 నీ దగ్గర ఏముంది? అయిదు రొట్టెలు గాని మరేమైనా గాని ఉంటే అవి నాకు ఇవ్వు” అన్నాడు.
1SA 21:4 ఆ యాజకుడు దావీదుతో, “సాధారణ రొట్టె నా దగ్గర లేదు; నీ మనుష్యులు స్త్రీలకు దూరంగా ఉన్నట్లయితే వారు ఇక్కడ ఉన్న ప్రతిష్ఠిత రొట్టెలు తినవచ్చు” అని చెప్పాడు.
1SA 21:5 అందుకు దావీదు, “ఖచ్చితంగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు రోజులు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. వారి దేహాలు పవిత్రంగానే ఉన్నాయి. సాధారణ పనిమీద వెళ్లినప్పుడే ఈ మనుష్యులు పవిత్రంగా ఉంటే, ఈ రోజు ఇంకెంత పవిత్రంగా ఉంటారు!”
1SA 21:6 యాజకుడు అతనికి వెచ్చని రొట్టెలు వేసే రోజున తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను ఇచ్చాడు, ఎందుకంటే అక్కడ యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప వేరే లేవు.
1SA 21:7 ఆ రోజు సౌలు సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిలో ఉన్నాడు; అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు, అతడు సౌలు యొక్క బలవంతుడైన కాపరి.
1SA 21:8 దావీదు అహీమెలెకును, “రాజు అప్పగించిన పని తొందరలో నేను నా కత్తిని ఇతర ఆయుధాలను తీసుకురాలేదు, నీ దగ్గర కత్తి గాని ఈటె గాని ఉందా?” అని అడిగాడు.
1SA 21:9 అందుకు యాజకుడు, “ఏలహు లోయలో నీవు చంపిన గొల్యాతు అనే ఫిలిష్తీయుని కత్తి ఇక్కడ ఉంది. అది ఏఫోదు వెనుక బట్టతో చుట్టి ఉంది. అది తప్ప ఇక్కడ మరి ఏ కత్తి లేదు, నీకు కావాలంటే అది తీసుకో” అన్నాడు. దావీదు, “దానికి సాటియైనది మరొకటి లేదు; అది నాకు ఇవ్వు” అన్నాడు.
1SA 21:10 దావీదు సౌలుకు భయపడి ఆ రోజే బయలుదేరి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరకు వచ్చాడు.
1SA 21:11 అయితే ఆకీషు సేవకులు అతనితో, “ఈ దావీదు ఆ దేశపు రాజు కాదా? వారు నాట్యం చేస్తూ పాటలు పాడుతూ, “ ‘సౌలు వేలమందిని చంపాడు. దావీదు పదివేలమందిని చంపారని చెప్పింది ఇతని గురించే కదా’?” అన్నారు.
1SA 21:12 దావీదు ఈ మాటలు గుర్తుపెట్టుకుని గాతు రాజైన ఆకీషుకు చాలా భయపడ్డాడు.
1SA 21:13 కాబట్టి దావీదు వారి ఎదుట తన ప్రవర్తన మార్చుకొని పిచ్చివానిలా నటిస్తూ గుమ్మాల తలుపుల మీద గీతలు గీస్తూ, ఉమ్మి తన గడ్డం మీదికి కారనిస్తుండేవాడు. వారు అతన్ని పట్టుకున్నప్పుడు అతడు పిచ్చి చేష్టలు చేస్తుండేవాడు.
1SA 21:14 కాబట్టి ఆకీషు రాజు తన సేవకులతో, “అతన్ని చూడండి! అతడు పిచ్చివాడు. అతన్ని నా దగ్గరకు ఎందుకు తీసుకువచ్చారు?
1SA 21:15 పిచ్చి చేష్టలు చేసేవానితో నాకేమి పని? నా ఎదుట పిచ్చి చేష్టలు చేయడానికి ఇతన్ని ఎందుకు తీసుకువచ్చారు? ఇలాంటివాడు నా ఇంట్లోకి రావాలా?” అన్నాడు.
1SA 22:1 దావీదు అక్కడినుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని వెళ్లాడు. అతని అన్నదమ్ములు అతని తండ్రి ఇంటివారందరు ఆ విషయం విని అతని దగ్గరకు వచ్చారు.
1SA 22:2 ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులలో ఉన్నవారు, అసంతృప్తితో ఉన్నవారందరు అతని దగ్గరకు రాగా అతడు వారికి అధిపతి అయ్యాడు. సుమారు నాలుగువందలమంది అతని దగ్గర ఉన్నారు.
1SA 22:3 దావీదు అక్కడినుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, “నా పట్ల దేవుని చిత్తం ఏమిటో నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులను వచ్చి మీ దగ్గర ఉండనివ్వగలరా?” అని మోయాబు రాజును అడిగాడు.
1SA 22:4 అతడు వారిని మోయాబు రాజు దగ్గర విడిచి వెళ్లాడు. దావీదు కొండల్లో దాక్కొని ఉన్నంత కాలం వారు అక్కడే ఉన్నారు.
1SA 22:5 అయితే గాదు ప్రవక్త వచ్చి దావీదుతో, “బలమైన కోటలలో ఉండవద్దు, యూదా దేశానికి పారిపో” అని చెప్పాడు. కాబట్టి దావీదు హెరెతు అడవిలోకి వెళ్లాడు.
1SA 22:6 ఒక రోజు దావీదు అతని మనుష్యులు ఎక్కడ ఉన్నారో సౌలుకు తెలిసింది. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షం క్రింద ఈటె పట్టుకుని కూర్చున్నాడు. అతని సేవకులు అతని చుట్టూ నిలబడి ఉన్నారు.
1SA 22:7 సౌలు వారితో, “బెన్యామీనీయులారా వినండి, యెష్షయి కుమారుడు మీకు పొలాలు ద్రాక్షతోటలు ఇస్తాడా? మిమ్మల్ని వేలమంది మీద వందలమంది మీద అధిపతులుగా చేస్తాడా?
1SA 22:8 అందుకని మీరు నా మీద కుట్ర చేస్తున్నారా? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధన చేసుకున్న సంగతి మీరెవరు నాకు చెప్పలేదు. ఈ రోజు జరుగుతున్నట్లుగా నా కోసం పొంచి ఉండేలా నా కుమారుడు నా సేవకుని ప్రేరేపించినా, నా గురించి మీలో ఎవరికి చింతలేదు” అన్నాడు.
1SA 22:9 అప్పుడు సౌలు సేవకుల దగ్గర నిలబడి ఉన్న ఎదోమీయుడైన దోయేగు, “యెష్షయి కుమారుడు నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రావడం నేను చూశాను.
1SA 22:10 అహీమెలెకు అతని తరపున యెహోవా దగ్గర విచారణ చేసి, ఆహారాన్ని ఫిలిష్తీయుడైన గొల్యాతు కత్తిని అతనికి ఇచ్చాడు” అని చెప్పాడు.
1SA 22:11 అప్పుడు రాజు, యాజకుడును అహీటూబు కుమారుడునైన అహీమెలెకును నోబులో ఉన్న అతని తండ్రి ఇంటివారైన యాజకులందరిని పిలుచుకురమ్మని పంపించాడు. వారు రాజు దగ్గరకు వచ్చినప్పుడు,
1SA 22:12 సౌలు, “అహీటూబు కుమారుడా, విను” అని అన్నాడు. అందుకతడు, “చిత్తం ప్రభువా” అని జవాబిచ్చాడు.
1SA 22:13 సౌలు అతనితో, “నీవూ యెష్షయి కుమారుడు కలిసి ఎందుకు నా మీద కుట్ర చేశారు? నీవు అతనికి ఆహారాన్ని ఖడ్గాన్ని ఇచ్చి అతని తరపున దేవుని దగ్గర విచారణ చేశావు, అందుకు అతడు నా మీద తిరుగుబాటు చేస్తూ ఇలా ఈ రోజు నా కోసం పొంచి ఉన్నాడు” అని అన్నాడు.
1SA 22:14 అందుకు అహీమెలెకు, “రాజా, దావీదువంటి నమ్మకమైనవాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతడు రాజుకు అల్లుడు, నీ అంగరక్షకుల నాయకుడు, నీ కుటుంబంలో ఎంతో గౌరవం ఉన్నవాడు.
1SA 22:15 అతని తరపున నేను దేవుని దగ్గర విచారణ చేయడం ఈ రోజే ప్రారంభించానా? కాదు కదా! ఈ విషయం గురించి నీ సేవకుడనైన నాకు ఏమాత్రం తెలియదు కాబట్టి రాజు తన సేవకుని మీద గాని అతని తండ్రి ఇంటివారి మీద నేరం మోపకూడదు” అన్నాడు.
1SA 22:16 అయితే రాజు, “అహీమెలెకూ, నీవు నీ తండ్రి ఇంటివారందరు తప్పక చస్తారు” అన్నాడు.
1SA 22:17 తర్వాత, “యెహోవా యాజకులైన వీరు దావీదు పక్షం ఉన్నారు. అతడు పారిపోయిన విషయం తెలిసినా నాకు చెప్పలేదు కాబట్టి మీరు వెళ్లి వీరందరిని చంపండి” అని తన చుట్టూ నిలబడి ఉన్న సైనికులకు ఆజ్ఞాపించాడు. అయితే రాజు అధికారులు యెహోవా యాజకులను చంపడానికి ఒప్పుకోలేదు.
1SA 22:18 కాబట్టి రాజు దోయేగుతో, “నీవు ఈ యాజకుల మీద పడి చంపు” అన్నాడు. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి నార ఏఫోదు ధరించి ఉన్న ఎనభై అయిదుగురిని ఆ రోజున చంపాడు.
1SA 22:19 అతడు యాజకుల పట్టణమైన నోబులో ఉంటున్న వారందరిని అనగా మగవారిని ఆడవారిని పిల్లలను చంటి పిల్లలను పశువులను గాడిదలను గొర్రెలను కత్తితో చంపాడు.
1SA 22:20 అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనే ఒకడు తప్పించుకుని పారిపోయి దావీదు దగ్గరకు వచ్చి, సౌలు యెహోవా యాజకులను చంపించిన విషయం దావీదుకు చెప్పాడు.
1SA 22:22 అప్పుడు దావీదు అబ్యాతారుతో, “ఆ రోజు ఎదోమీయుడైన దోయేగు అక్కడే ఉన్నాడు కాబట్టి వాడు సౌలుకు ఖచ్చితంగా ఈ విషయం చెప్తాడని నేను అనుకున్నాను. నీ తండ్రి ఇంటివారందరు చనిపోవడానికి నేను కారణమయ్యాను.
1SA 22:23 నీవు భయపడకుండా నా దగ్గర ఉండు, నిన్ను చంపడానికి చూస్తున్నవాడే నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. నా దగ్గరే నీవు క్షేమంగా ఉంటావు” అని చెప్పాడు.
1SA 23:1 “చూడండి, ఫిలిష్తీయులు కెయీలాతో పోరాడి నూర్పిడి కళ్ళాలను దోచుకుంటున్నారు” అని దావీదుకు చెప్పినప్పుడు,
1SA 23:2 దావీదు, “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను చంపనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేసి కెయీలాను రక్షించు” అని అతనికి జవాబిచ్చారు.
1SA 23:3 దావీదుతో ఉన్న మనుష్యులు, “మేము యూదా దేశంలో ఉన్నా మాకు భయంగా ఉంది. ఒకవేళ మేము ఫిలిష్తీయుల సైన్యాలకు ఎదురుగా కెయీలాకు వెళ్తే మరింత భయం వేస్తుంది గదా” అన్నారు.
1SA 23:4 దావీదు మరోసారి యెహోవా దగ్గర విచారణ చేసినప్పుడు, “నీవు లేచి కెయీలాకు వెళ్లు, నేను ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తాను” అని యెహోవా జవాబిచ్చారు.
1SA 23:5 కాబట్టి దావీదు అతని ప్రజలు కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారందరిని చంపి వారి పశువులను దోచుకున్నారు. ఇలా దావీదు ఫిలిష్తీయులకు భారీనష్టం కలిగించి కెయీలా ప్రజలను రక్షించాడు.
1SA 23:6 (అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు పారిపోయి కెయీలాలో ఉన్న దావీదు దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఏఫోదు తీసుకుని వచ్చాడు.)
1SA 23:7 దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని, “ద్వారాలు అడ్డు గడియలు ఉన్న పట్టణం లోపలికి వెళ్లి దావీదు అందులో బందీ అయ్యాడు కాబట్టి దేవుడు అతన్ని నా చేతికి అప్పగించారు” అనుకున్నాడు.
1SA 23:8 కాబట్టి సౌలు కెయీలాకు వెళ్లి దావీదును అతని ప్రజలను ముట్టడించాలని తన సైన్యాన్నంతా యుద్ధానికి పిలిచాడు.
1SA 23:9 సౌలు తనకు కీడు చేయాలని కుట్ర చేస్తున్నాడని తెలుసుకున్న దావీదు యాజకుడైన అబ్యాతారుతో, “ఏఫోదు తీసుకురా” అని చెప్పాడు.
1SA 23:10 అప్పుడు దావీదు, “ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నా కారణంగా పట్టణాన్ని నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నాడని మీ దాసుడనైన నాకు ఖచ్చితంగా తెలిసింది.
1SA 23:11 కెయీలా పౌరులు నన్ను అతని చేతికి అప్పగిస్తారా? మీ సేవకుడనైన నేను విన్నట్లుగా సౌలు వస్తాడా? ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, దయచేసి మీ సేవకుడనైన నాకు చెప్పండి” అని ప్రార్థించాడు. “అతడు వస్తాడు” అని యెహోవా జవాబిచ్చారు.
1SA 23:12 దావీదు మరల, “కెయీలా పౌరులు నన్ను నా ప్రజలను సౌలు చేతికి అప్పగిస్తారా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “వారు నిన్ను అప్పగిస్తారు” అని జవాబిచ్చారు.
1SA 23:13 కాబట్టి దావీదు, అతని మనుష్యులు దాదాపు ఆరువందలమంది కెయీలాను విడిచి ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్లారు. దావీదు కెయీలా నుండి పారిపోయాడని సౌలుకు తెలిసి అక్కడికి వెళ్లలేదు.
1SA 23:14 అయితే దావీదు అరణ్యంలో, బలమైన కోటలలో, జీఫు అడవి కొండల్లో నివసించాడు. ప్రతిరోజు సౌలు అతన్ని వెదికాడు కాని దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు.
1SA 23:15 తన ప్రాణం తీయడానికి సౌలు బయలుదేరాడని తెలుసుకుని దావీదు జీఫు ఎడారిలోని హోరేషులో ఉన్నాడు.
1SA 23:16 అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను హోరేషులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి దేవుని బట్టి అతన్ని బలపరుస్తూ,
1SA 23:17 “భయపడకు, నా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకోలేడు నీవు ఇశ్రాయేలీయులకు రాజవుతావు; నీ తర్వాతి స్థానంలో నేను ఉంటాను. ఇది నా తండ్రియైన సౌలుకు కూడా తెలుసు” అని చెప్పాడు.
1SA 23:18 వీరిద్దరు యెహోవా ఎదుట నిబంధన చేసుకున్న తర్వాత యోనాతాను ఇంటికి వెళ్లిపోయాడు కాని దావీదు హోరేషులోనే ఉన్నాడు.
1SA 23:19 జీఫీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు దగ్గరకు వచ్చి, “యెషీమోనుకు దక్షిణంగా ఉన్న హకీలా కొండమీద హోరేషు బలమైన కోటల దగ్గర మా మధ్య దావీదు దాక్కున్నాడా హోరేషు కొండ దగ్గర మా మధ్య దావీదు దాక్కున్నాడు?
1SA 23:20 రాజా, మీకు ఇష్టమైతే మాతో రండి, రాజైన మీ చేతికి అతన్ని అప్పగించే బాధ్యత మాది” అన్నారు.
1SA 23:21 అప్పుడు సౌలు వారితో, “మీకు నాపై ఉన్న కనికరాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
1SA 23:22 మీరు వెళ్లి ఇంకా సమాచారం తెలుసుకోండి. దావీదు ఎక్కడ ఉంటున్నాడో, అతన్ని ఎవరు చూశారో తెలుసుకోండి. అతడు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడని నాకు తెలిసింది.
1SA 23:23 అతడు దాక్కున్న స్థలాలన్నిటిని కనిపెట్టి ఆ వివరాలు తీసుకుని నా దగ్గరకు మళ్ళీ రండి. అప్పుడు నేను మీతో కూడా వచ్చి అతడు దేశంలో ఎక్కడ ఉన్నా యూదా వంశస్థుల అందరిలో నేను అతన్ని వెదికి పట్టుకుంటాను” అన్నాడు.
1SA 23:24 వారు బయలుదేరి సౌలు కంటే ముందు జీఫుకు తిరిగి వెళ్లారు. దావీదు అతని ప్రజలు యెషీమోనుకు దక్షిణాన ఉన్న అరాబాలో మాయోను ఎడారిలో ఉన్నారు.
1SA 23:25 సౌలు అతని మనుష్యులు తనను వెదకడం మొదలుపెట్టారని దావీదుకు తెలిసినప్పుడు కొండ శిఖరం దిగి మాయోను ఎడారిలో నివసించాడు. సౌలు అది విని దావీదును తరుముతూ మాయోను ఎడారిలోనికి వెళ్లాడు.
1SA 23:26 అయితే పర్వతానికి ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు అతని ప్రజలు వెళ్తుండగా దావీదు సౌలు నుండి తప్పించుకోవాలని తొందరపడుతున్నాడు. సౌలు అతని ప్రజలు దావీదును అతని ప్రజలను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు.
1SA 23:27 అప్పుడు ఒక దూత సౌలు దగ్గరకు వచ్చి, “త్వరగా రా, దేశం మీదకి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు” అని చెప్పాడు.
1SA 23:28 సౌలు దావీదును తరమడం మాని ఫిలిష్తీయులను ఎదుర్కోడానికి వెనుకకు తిరిగి వెళ్లాడు. కాబట్టి ఆ స్థలానికి సెలా హమ్మలెకోతు అని ఆ పేరు పెట్టారు.
1SA 23:29 తర్వాత దావీదు అక్కడినుండి బయలుదేరి ఎన్-గేదీకి వచ్చి కొండ ప్రాంతంలో నివసించాడు.
1SA 24:1 సౌలు ఫిలిష్తీయులను తరమడం ఆపి తిరిగివచ్చిన తర్వాత, “దావీదు ఎన్-గేదీ ఎడారిలో ఉన్నాడు” అని అతనికి వార్త వచ్చింది.
1SA 24:2 కాబట్టి సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి మూడువేలమంది యువకులను ఏర్పరచుకొని కొండమేకలు ఉండే రాతి గుట్టలలో దావీదును అతని ప్రజలను వెదకడానికి బయలుదేరాడు.
1SA 24:3 దారిలో గొర్రెల దొడ్ల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక గుహ ఉంది. సౌలు మూత్ర విసర్జన కోసం దాని లోపలికి వెళ్లాడు. ఆ గుహలో చాలా లోపల దావీదు అతని మనుష్యులు ఉన్నారు.
1SA 24:4 ఆ మనుష్యులు, “ ‘నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తాను’ అని యెహోవా నీతో చెప్పిన రోజు ఇదే” అన్నారు. అప్పుడు దావీదు ప్రాకుతూ ముందుకు వెళ్లి సౌలు వస్త్రపు అంచును కత్తిరించాడు.
1SA 24:5 కాని తర్వాత, సౌలు పైవస్త్రపు అంచును కోసినందుకు దావీదుకు మనస్సులో ఎంతో బాధ కలిగి,
1SA 24:6 “ఇతడు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువుకు నేను ఈ పని చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను” అని తన ప్రజలతో చెప్పాడు.
1SA 24:7 ఈ మాటలు చెప్పి దావీదు తన ప్రజలను గద్దించి సౌలు మీద దాడి చేయకుండ వారిని ఆపాడు. సౌలు ఆ గుహ నుండి బయటకు వచ్చి తన దారిలో వెళ్లిపోయాడు.
1SA 24:8 అప్పుడు దావీదు గుహ నుండి బయటకు వచ్చి, “నా ప్రభువా రాజా!” అని పిలిచాడు. సౌలు అతని వెనుక చూసినప్పుడు దావీదు నేలకు సాష్టాంగపడి ఉన్నాడు.
1SA 24:9 అతడు సౌలుతో ఇలా అన్నాడు, “ ‘దావీదు నీకు హాని చేస్తాడు’ అని మనుష్యులు చెప్పిన మాటలు నీవెందుకు వింటున్నావు?
1SA 24:10 గుహలో యెహోవా నిన్ను నా చేతికి ఎలా అప్పగించారో ఈ రోజు మీరు మీ కళ్లతో చూశారు. కొందరు నిన్ను చంపమని నన్ను ప్రోత్సహించారు, కాని నేను నిన్ను వదిలేశాను; ‘ఎందుకంటే నా ప్రభువు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి నేను ఆయన మీద చేయి వేయను’ అని చెప్పాను.
1SA 24:11 చూడు, నా తండ్రీ, నా చేతిలో ఉన్న నీ వస్త్రాన్ని చూడు! నేను మీ వస్త్రపు అంచును కత్తిరించాను, కానీ నిన్ను చంపలేదు. నేను తప్పు చేశాను అనడానికి గాని తిరుగుబాటు చేశాను అని సూచించడానికి నా చేతిలో ఏమీ లేదని చూడండి. నేను నీకు అన్యాయం చేయలేదు, కానీ నీవు నా ప్రాణం తీయడానికి నన్ను తరుముతున్నావు.
1SA 24:12 నీకు నాకు మధ్య యెహోవా న్యాయం తీరుస్తారు. నీవు నా పట్ల చేసినవాటికి యెహోవాయే ప్రతీకారం చేస్తారు కాని నా చేయి నిన్ను తాకదు.
1SA 24:13 పాత సామెత చెప్పినట్లుగా, ‘దుర్మార్గుల నుండి దుర్మార్గమైనవే వస్తాయి’ కాబట్టి నా చేయి నిన్ను తాకదు.
1SA 24:14 “ఇశ్రాయేలు రాజు ఎవరి మీదికి వచ్చాడు? మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? చచ్చిన కుక్కనా? ఈగనా?
1SA 24:15 యెహోవా మనకు న్యాయమూర్తిగా ఉండి మన మధ్య తీర్పు తీర్చును గాక. ఆయన నా విషయాన్ని పరిశీలించి నా తరుపున దానిని సమర్థిస్తారు; నీ చేతి నుండి నన్ను విడిపించి ఆయనే నాకు న్యాయం చేస్తారు” అన్నాడు.
1SA 24:16 దావీదు ఇలా చెప్పడం ముగించినప్పుడు సౌలు, “దావీదూ, నా కుమారుడా, అది నీ స్వరమా?” అని అడిగి బిగ్గరగా ఏడ్చాడు,
1SA 24:17 అతడు దావీదుతో, “నీవు నాకన్నా నీతిమంతుడవు; నీవు నాకు మేలే చేశావు కాని నేను నీకు చాలా కీడు చేశాను.
1SA 24:18 నీవు నాకు చేసిన మంచి గురించి ఈ రోజు నాకు చెప్పావు; యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ నీవు నన్ను చంపలేదు.
1SA 24:19 ఒకడు తన శత్రువును కనుగొన్నప్పుడు, అతడు అతన్ని క్షేమంగా తప్పించుకోనిస్తాడా? ఈ రోజు నీవు నాతో ప్రవర్తించిన తీరుకు యెహోవా నీకు మంచి ప్రతిఫలమివ్వాలి.
1SA 24:20 తప్పకుండా నీవు రాజవుతావని, ఇశ్రాయేలీయుల రాజ్యం నీకు స్ధిరపరచబడుతుందని నాకు తెలుసు.
1SA 24:21 కాబట్టి నీవు నా సంతానాన్ని చంపనని నా తండ్రి కుటుంబం నుండి నా పేరును కొట్టివేయనని యెహోవా పేరిట నాకు ప్రమాణం చేయి” అన్నాడు.
1SA 24:22 అప్పుడు దావీదు సౌలుకు ప్రమాణం చేశాడు. ఆ తర్వాత సౌలు ఇంటికి తిరిగి వచ్చాడు; దావీదు అతని ప్రజలు తామున్న కొండ ప్రాంతాలకు వెళ్లిపోయారు.
1SA 25:1 కొంతకాలానికి సమూయేలు చనిపోయాడు, ఇశ్రాయేలీయులందరు ఒకచోట చేరి అతని కోసం ఏడ్చారు; రామాలో అతని ఇంటి దగ్గర అతన్ని సమాధి చేసిన తర్వాత దావీదు బయలుదేరి పారాను ఎడారిలోనికి వెళ్లాడు.
1SA 25:2 కర్మెలులో ఆస్తులు ఉన్న ఒక వ్యక్తి మాయోనులో ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు, అతనికి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలు ఉన్నాయి. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్లాడు.
1SA 25:3 అతని పేరు నాబాలు, అతని భార్యపేరు అబీగయీలు. ఆమె చాలా తెలివైనది అందమైనది. అయితే అతడు తన పనులలో చాలా కఠినంగా దుర్మార్గంగా వ్యవహరించేవాడు. అతడు కాలేబు సంతతికి చెందిన వాడు.
1SA 25:4 నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని అరణ్యంలో ఉన్న దావీదు విని,
1SA 25:5 దావీదు తన పనివారిలో పదిమంది యువకులను పిలిచి వారితో ఇలా చెప్పాడు, “మీరు కర్మెలులో ఉన్న నాబాలు దగ్గరకు వెళ్లి నేను అడిగినట్టుగా క్షేమసమాచారం అడగండి.
1SA 25:6 అతనితో ఇలా చెప్పండి, ‘నీకు దీర్ఘాయువు కలుగును గాక! నీకు నీ ఇంటివారికి నీకు చెందినవాటన్నిటికి క్షేమం కలుగును గాక!
1SA 25:7 “ ‘ఇది గొర్రెల బొచ్చు కత్తిరించే సమయమని నేను విన్నాను. నీ గొర్రెల కాపరులు మాతో ఉన్నప్పుడు మేము వారికి ఏ హాని చేయలేదు. కర్మెలులో ఉన్నంత కాలం వారు ఏదీ పోగొట్టుకోలేదు.
1SA 25:8 నీ సేవకులను అడిగితే వారు నీకు చెప్తారు. పండుగ సమయంలో మేము వచ్చాం, నా మనుష్యుల మీద దయ చూపించు. దయచేసి నీకు ఏది ఇవ్వాలనిపిస్తే అదే నీ సేవకులకు నీ కుమారుడైన దావీదుకు ఇవ్వు.’ ”
1SA 25:9 దావీదు సేవకులు వచ్చి వారు నాబాలుకు దావీదు పంపిన వర్తమానాన్ని చెప్పి వేచి ఉన్నారు.
1SA 25:10 నాబాలు దావీదు సేవకులతో, “దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? ఈ రోజుల్లో చాలామంది తమ యజమానులను విడిచిపెట్టి వెళ్లి పోతున్నారు.
1SA 25:11 నా ఆహారాన్ని నీటిని, నా గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్న వారి కోసం నేను సిద్ధం చేసిన మాంసాన్ని ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియని వారికి నేను ఎందుకు ఇవ్వాలి?” అన్నాడు.
1SA 25:12 దావీదు సేవకులు వచ్చిన దారినే తిరిగివెళ్లి నాబాలు చెప్పిన మాటలన్నీ అతనికి చెప్పారు.
1SA 25:13 అప్పుడు దావీదు వారితో, “మీరందరు మీ ఖడ్గాలు ధరించుకోండి” అని చెప్పగా వారు తమ ఖడ్గాలు ధరించుకున్నారు. దావీదు కూడా కత్తి ధరించాడు. దావీదుతో పాటు దాదాపు నాలుగువందలమంది పురుషులు వెళ్లగా రెండువందలమంది సామాగ్రితో ఉండిపోయారు.
1SA 25:14 సేవకులలో ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో, “అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానికి శుభాలు చెప్పమని దూతలను పంపితే అతడు వారిని అవమానించి మాట్లాడాడు.
1SA 25:15 అయితే ఆ మనుష్యులు మా పట్ల చాలా మంచిగా ఉన్నారు. మేము పొలంలో వారి మధ్య ఉన్నంత కాలం మాకు ఏ హాని చేయలేదు, మేమేమి పోగొట్టుకోలేదు.
1SA 25:16 వారి దగ్గర మేము గొర్రెలను మేపుతున్నంత కాలం వారు రాత్రి పగలు మా చుట్టూ ఒక గోడలా ఉన్నారు.
1SA 25:17 ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే మా యజమానికి అతని ఇంటివారికందరికి కీడు పొంచి ఉంది. అతడు దుర్మార్గుడు, అతనితో ఎవరూ మాట్లాడలేరు” అని చెప్పాడు.
1SA 25:18 అప్పుడు అబీగయీలు ఆలస్యం చేయకుండా వెంటనే రెండువందల రొట్టెలు, రెండు ద్రాక్షరసం తిత్తులు, వండిన అయిదు గొర్రెల మాంసం, అయిదు మానికల వేయించిన ధాన్యం, వంద ద్రాక్షగుత్తులు, రెండువందల అంజూర పండ్ల ముద్దలు తీసుకుని గాడిదల మీద ఎక్కించింది.
1SA 25:19 ఆమె తన సేవకులతో, “మీరు ముందు వెళ్లండి, నేను మీ వెనుక వస్తాను” అని చెప్పింది. అయితే ఆమె తన భర్తయైన నాబాలుతో ఏమీ చెప్పలేదు.
1SA 25:20 ఆమె తన గాడిద మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వస్తుండగా, దావీదు అతని మనుష్యులు ఆమెకు ఎదురువచ్చారు. అప్పుడు ఆమె వారిని కలిసింది.
1SA 25:21 అంతకుముందే దావీదు, “నాబాలు ఆస్తులలో ఏది అతడు పోగొట్టుకోకూడదని ఈ అరణ్యంలో నేను కష్టపడి కాపలా ఉన్నదంతా వృధానే కదా! నేను అతనికి మేలు చేస్తే అతడు నాకు కీడు చేశాడు.
1SA 25:22 రేపు ఉదయం తెల్లవారేసరికి అతని ఇంటివారిలో ఒక్కడు బ్రతికినా దేవుడు దావీదును తీవ్రంగా శిక్షించును గాక!” అని అన్నాడు.
1SA 25:23 అబీగయీలు దావీదును చూసి, వెంటనే గాడిద దిగి దావీదు ఎదుట వంగి నేల మీద సాష్టాంగపడింది.
1SA 25:24 ఆమె అతని పాదాల మీద పడి, “నా ప్రభువా, తప్పంతా నాదేనని ఒప్పుకుంటున్నాను; మీ సేవకురాలినైన నన్ను మాట్లాడనివ్వండి, మీ సేవకురాలి మాట వినండి.
1SA 25:25 నా ప్రభువా, దుర్మార్గుడైన నాబాలును పట్టించుకోవద్దు. అతని పేరుకు అర్థం మూర్ఖుడు; నిజంగానే అతనిలో మూర్ఖత్వం ఉంది. ఇక నా విషయానికొస్తే, నా ప్రభువైన మీరు పంపిన మీ సేవకులను నేను చూడలేదు.
1SA 25:26 నా ప్రభువా, మీ దేవుడైన యెహోవా పేరిట, మీ జీవం తోడు, రక్తం చిందించకుండ మీ చేతులతో మీరే పగతీర్చుకోకుండా యెహోవా మిమ్మల్ని ఆపారు. మీ శత్రువులు నా ప్రభువైన మీకు కీడు చేయాలనుకునే వారికి నాబాలు గతే పడుతుంది.
1SA 25:27 మీ సేవకురాలినైన నేను నా ప్రభువైన మీకు తెచ్చిన ఈ కానుకను మీ వెంట ఉన్న మీ సేవకులకు ఇవ్వనివ్వండి.
1SA 25:28 “మీ సేవకురాలి పాపాన్ని క్షమించండి. నా ప్రభువైన మీరు యెహోవా యుద్ధాలను చేస్తున్నారు కాబట్టి నా ప్రభువు యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తారు. మీరు జీవించినంతకాలం మీకు కీడు కలుగదు.
1SA 25:29 మిమ్మల్ని బాధించాలని, ప్రాణం తీయాలని ఎవరైనా ప్రయత్నిస్తే, నా ప్రభువైన మీ ప్రాణం మీ దేవుడైన యెహోవా దగ్గర ఉన్న జీవపు మూటలో భద్రంగా కట్టబడుతుంది. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లుగా ఆయన మీ శత్రువుల ప్రాణాలను విసిరివేస్తారు.
1SA 25:30 యెహోవా నా ప్రభువైన మీకు వాగ్దానం చేసినదంతటిని నెరవేర్చి మిమ్మల్ని ఇశ్రాయేలీయుల మీద పాలకునిగా నియమిస్తారు.
1SA 25:31 నిష్కారణంగా మీరు రక్తం చిందించారన్న లేదా స్వయంగా మీరే పగతీర్చుకున్నారన్న హృదయ వేదన గాని దుఃఖం గాని నా ప్రభువైన మీకు కలుగకూడదు. యెహోవా నా ప్రభువైన మీకు విజయాన్ని ఇచ్చినప్పుడు మీరు మీ సేవకురాలినైన నన్ను జ్ఞాపకం చేసుకోండి” అని మనవి చేసుకుంది.
1SA 25:32 అందుకు దావీదు అబీగయీలుతో, “నన్ను కలుసుకోడానికి నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక.
1SA 25:33 నీవు సమయోచితంగా మంచి పని చేసి ఈ రోజు రక్తపాతం చిందించకుండ నన్ను కాపాడావు నా సొంత చేతులతో నేను పగతీర్చుకోకుండ నన్ను అడ్డుకున్నావు కాబట్టి నీవు దీవించబడుదువు గాక.
1SA 25:34 ఒకవేళ నీవు త్వరగా వచ్చి నన్ను కలిసి ఉండకపోతే, నీకు హాని చేయకుండ నన్ను ఆపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవం తోడు, రేపు తెల్లవారేసరికి నాబాలుకు సంబంధించిన మగవారిలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండేవాడు కాదు” అన్నాడు.
1SA 25:35 తర్వాత దావీదు తన కోసం ఆమె తెచ్చిన వాటిని ఆమె చేతితో తీసుకుని, “నీ మాటలు నేను విని నీ మనవి అంగీకరించాను, సమాధానంతో ఇంటికి వెళ్లు” అని ఆమెతో చెప్పాడు.
1SA 25:36 అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరకు వచ్చినప్పుడు, రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి, బాగా త్రాగుతూ ఆనందిస్తూ మత్తులో మునిగిపోయాడు కాబట్టి తెల్లవారే వరకు అతనితో ఆమె ఏమీ మాట్లాడలేదు.
1SA 25:37 ఉదయాన నాబాలు మత్తు వదిలిన తర్వాత అతని భార్య అతనితో ఆ సంగతులన్ని చెప్పినప్పుడు భయంతో అతని గుండె ఆగి రాయిలా బిగుసుకుపోయాడు.
1SA 25:38 పది రోజుల తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు.
1SA 25:39 నాబాలు చనిపోయాడని దావీదు విన్నప్పుడు, “నాబాలు నా పట్ల అవమానకరంగా ప్రవర్తించినందుకు నా పక్షాన పగతీర్చుకున్న యెహోవాకు స్తుతి కలుగును గాక. ఆయన తన సేవకుడు తప్పు చేయకుండ కాపాడాడు, నాబాలు చేసిన తప్పును అతని తలపైకి తెచ్చాడు” అని అన్నాడు. తర్వాత దావీదు తనను పెండ్లి చేసుకోమని అబీగయీలును అడగడానికి ఆమె దగ్గరకు కబురు పంపించాడు.
1SA 25:40 దావీదు సేవకులు కర్మెలులో ఉన్న అబీగయీలు దగ్గరకు వచ్చి, “దావీదు నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నిన్ను తీసుకురమ్మని మమ్మల్ని పంపాడు” అని చెప్పారు.
1SA 25:41 ఆమె లేచి మోకరించి తల నేలపై ఆనించి, “నా ప్రభుని ఇష్టం; నా ప్రభుని సేవకులకు సేవ చేసి కాళ్లు కడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది.
1SA 25:42 వెంటనే అబీగయీలు లేచి గాడిద మీద తన అయిదుగురు సేవకురాళ్లను వెంటబెట్టుకుని దావీదు దూతలతో వెళ్లి దావీదును పెళ్ళి చేసుకుంది.
1SA 25:43 దావీదు యెజ్రెయేలుకు చెందిన అహీనోయమును కూడా పెళ్ళి చేసుకున్నాడు, వారిద్దరు అతని భార్యలు.
1SA 25:44 అయితే సౌలు తన కుమార్తె దావీదు భార్యయైన మీకాలును గల్లీముకు చెందిన లాయిషు కుమారుడైన పల్తీయేలుకు ఇచ్చాడు.
1SA 26:1 జీఫీయులు గిబియాలో ఉన్న సౌలు దగ్గరకు వెళ్లి, “దావీదు యెషీమోను ఎదురుగా ఉన్న హకీలా కొండలో దాక్కోలేదా?” అని అన్నారు.
1SA 26:2 కాబట్టి సౌలు బయలుదేరి ఇశ్రాయేలీయులలో ఎంపిక చేయబడిన మూడువేలమంది సైన్యంతో దావీదును వెదకడానికి జీఫు అరణ్యానికి వెళ్లాడు.
1SA 26:3 సౌలు యెషీమోనుకు ఎదురుగా ఉన్న హకీలా కొండ ప్రాంతంలో దారి ప్రక్కన బసచేశాడు, అయితే దావీదు అరణ్యంలోనే నివసించాడు. తనను వెంబడిస్తూ సౌలు అరణ్యానికి వచ్చాడని విని,
1SA 26:4 దావీదు తన వేగులవారిని పంపి, సౌలు నిజంగానే వచ్చాడని తెలుసుకున్నాడు.
1SA 26:5 తర్వాత దావీదు బయలుదేరి సౌలు బసచేసిన చోటికి వెళ్లి, సౌలు, సేనాధిపతియైన నేరు కుమారుడు అబ్నేరు ఎక్కడ పడుకున్నారో చూశాడు. సౌలు శిబిరం లోపల పడుకున్నాడు, సైన్యమంతా అతని చుట్టూ ఉంది.
1SA 26:6 అప్పుడు దావీదు, “శిబిరంలోనికి సౌలు దగ్గరకు నాతో పాటు ఎవరు వస్తారు?” అని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడైన యోవాబుకు సోదరుడైన అబీషైని అడిగాడు. అందుకు, “నీతో నేను వస్తాను” అని అబీషై అన్నాడు.
1SA 26:7 దావీదు, అబీషై రాత్రివేళ ఆ సైన్యం దగ్గరకు వెళ్లినప్పుడు సౌలు శిబిరం లోపల పడుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని తల దగ్గర నేలమీద గుచ్చి ఉంది. అబ్నేరు, సైన్యం అతని చుట్టూ పడుకుని ఉన్నారు.
1SA 26:8 అప్పుడు అబీషై దావీదుతో, “దేవుడు ఈ రోజు నీ శత్రువును నీకప్పగించారు. కాబట్టి నీవు ఒప్పుకుంటే ఆ ఈటెతో ఒక పోటు పొడిచి నేనతడిని భూమిలో దిగేలా చేస్తాను, రెండవ పోటు పొడిచే అవసరం కూడా ఉండదు” అన్నాడు.
1SA 26:9 అయితే దావీదు అబీషైతో, “అతన్ని చంపవద్దు, యెహోవా అభిషేకించిన వానిని చంపినవారు నిర్దోషులుగా ఉండగలరా?
1SA 26:10 దావీదు ఇంకా మాట్లాడుతూ, సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, యెహోవాయే అతన్ని శిక్షిస్తారు. అతని సమయం వచ్చినప్పుడు అతడే చనిపోతాడు లేదా యుద్ధంలో నశిస్తాడు.
1SA 26:11 అయితే యెహోవా అభిషేకించిన వానిపైకి నేను చేయి ఎత్తకుండ యెహోవా నన్ను ఆపివేయును గాక. అతని తల దగ్గర ఉన్న ఈటెను నీళ్ల కూజాను తీసుకుని మనం వెళ్లిపోదాం రా” అని చెప్పాడు.
1SA 26:12 దావీదు సౌలు తల దగ్గర ఉన్న ఈటెను నీళ్ల కూజాను తీసుకున్నాడు, అప్పుడు వారిద్దరు వెళ్లిపోయారు. యెహోవా వారికి గాఢనిద్ర కలుగజేశారు కాబట్టి వారందరు నిద్రలో ఉన్నారు. ఎవరూ వచ్చిన వారిని చూడలేదు, జరిగింది వారికి తెలియదు.
1SA 26:13 తర్వాత దావీదు అవతలి వైపుకు వెళ్లి దూరంగా కొండమీద నిలబడ్డాడు, వారిద్దరి మధ్య చాలా దూరం ఉంది.
1SA 26:14 దావీదు సైన్యాన్ని, నేరు కుమారుడైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, నీవు నాకు జవాబివ్వవా?” అని అన్నాడు. అప్పుడు అబ్నేరు, “రాజును నిద్ర లేపుతున్న నీవు ఎవరివి?” అని అడిగాడు.
1SA 26:15 అందుకు దావీదు, “అబ్నేరూ, నీవు మగాడివి కావా? ఇశ్రాయేలీయులలో నీలాంటి వారెవరు? నీ ప్రభువైన రాజుకు నీవెందుకు కాపలా కాయలేదు? నీ ప్రభువైన రాజును చంపడానికి ఒకడు దగ్గరకు వచ్చాడు.
1SA 26:16 నీవు చేసింది సరియైనది కాదు, యెహోవా అభిషేకించిన నీ యజమానికి నీవు రక్షణ ఇవ్వలేకపోయావు కాబట్టి సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీవు నీ మనుష్యులు తప్పకుండా చావాలి. రాజు తల దగ్గర ఉండాల్సిన అతని ఈటె, నీళ్ల కూజా ఎక్కడ ఉన్నాయి?” అన్నాడు.
1SA 26:17 సౌలు దావీదు స్వరం గుర్తుపట్టి, “దావీదూ నా కుమారుడా, ఇది నీ స్వరమేనా?” అని అడిగాడు. అందుకు దావీదు, “నా ప్రభువా, రాజా, అవును ఇది నా స్వరమే.
1SA 26:18 నా ప్రభువు తన సేవకుడిని ఎందుకు తరుముతున్నాడు? నేనేమి చేశాను? నేను చేసిన తప్పేంటి?
1SA 26:19 ఇప్పుడు నా ప్రభువైన రాజు తన సేవకుని మాటలు వినాలి. ఒకవేళ యెహోవాయే మిమ్మల్ని నా మీదికి రెచ్చగొట్టి ఉంటే, ఆయన నా అర్పణను అంగీకరించును గాక. కానీ ఒకవేళ ఇది మనుష్యుల కుట్ర అయితే అందులో ఉన్నవారిని యెహోవా శపించును గాక! ఈ రోజు వారు యెహోవా వారసత్వంలో నా వాటా నుండి నన్ను వెలివేసి, ‘వెళ్లి ఇతర దేవుళ్ళను సేవించు’ అని అన్నారు.
1SA 26:20 యెహోవా సన్నిధికి దూరంగా నా రక్తం నేలపై పడకూడదు. ఒకడు పర్వతాల్లో కౌజుపిట్టను వేటాడినట్లు ఇశ్రాయేలు రాజు ఈగను వెదకడానికి బయటకు వచ్చాడు” అని అన్నాడు.
1SA 26:21 అందుకు సౌలు, “నేను పాపం చేశాను. దావీదూ నా కుమారుడా, తిరిగి రా. ఈ రోజు నీవు నా ప్రాణాన్ని విలువైనదిగా గుర్తించావు, కాబట్టి నేను మరలా నీకు హాని చేయడానికి ప్రయత్నించను. నేను ఒక మూర్ఖునిలా చాలా భయంకరమైన తప్పు చేశాను” అన్నాడు.
1SA 26:22 అప్పుడు దావీదు, “రాజా, ఇదిగో రాజు ఈటె ఇక్కడ ఉంది, నీ పనివారిలో ఒకడు వచ్చి దానిని తీసుకెళ్లవచ్చు.
1SA 26:23 యెహోవా ప్రతిఒక్కరికి వారి నీతికి నమ్మకత్వానికి బహుమానం ఇస్తారు. యెహోవా ఈ రోజు నిన్ను నా చేతికి అప్పగించారు కాని, యెహోవా అభిషేకించిన వాని మీద నేను చేయి వేయను.
1SA 26:24 ఈ రోజు నీ ప్రాణానికి విలువను ఇచ్చినందుకు యెహోవా నా ప్రాణానికి విలువనిచ్చి అన్ని బాధలనుండి నన్ను విడిపించును గాక” అని చెప్పాడు.
1SA 26:25 అందుకు సౌలు దావీదుతో, “దావీదూ, నా కుమారుడా, నీవు దీవించబడుదువు గాక; నీవు గొప్ప పనులు చేస్తావు, ఖచ్చితంగా విజయం పొందుతావు” అన్నాడు. తర్వాత దావీదు తన దారిన తాను వెళ్లిపోయాడు, సౌలు తన రాజభవనానికి తిరిగి వెళ్లాడు.
1SA 27:1 అయితే దావీదు తనలో తాను, “ఏదో ఒక రోజు నేను సౌలు చేతిలో నాశనమవుతాను. నేను చేయగలిగిన ఉత్తమమైన పనేంటంటే ఫిలిష్తీయుల దేశానికి తప్పించుకు పోవడమే. అప్పుడు సౌలు ఇశ్రాయేలు దేశంలో నన్ను వెదకడం మానేస్తాడు, కాబట్టి నేను అతని చేతిలో నుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు.
1SA 27:2 కాబట్టి దావీదు తనతో ఉన్న ఆరువందలమంది పురుషులతో బయలుదేరి మాయోకు కుమారుడు గాతు రాజైన ఆకీషు దగ్గరకు వెళ్లాడు.
1SA 27:3 దావీదు అతని మనుష్యులు ఆకీషుతో పాటు గాతులో స్థిరపడ్డారు. ప్రతిఒక్కరు తమ తమ కుటుంబాలతో ఉన్నారు. అలాగే దావీదు ఇద్దరు భార్యలు: యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన అబీగయీలు (నాబాలు విధవరాలు) అతనితో ఉన్నారు.
1SA 27:4 దావీదు గాతుకు పారిపోయాడని సౌలుకు తెలిసిన తర్వాత అతడు దావీదును వెదకడం మానివేశాడు.
1SA 27:5 అప్పుడు దావీదు ఆకీషుతో, “రాజనగరంలో నీతో పాటు నీ సేవకుడనైన నేను ఉండడం ఎందుకు? నీకు నాపై దయ ఉంటే నేను నివసించడానికి బయట పట్టణాల్లో ఒకదానిలో నాకు స్థలం ఇవ్వండి” అని అడిగాడు.
1SA 27:6 కాబట్టి ఆకీషు ఆ రోజే సిక్లగు అనే పట్టణాన్ని అతనికిచ్చాడు. అప్పటినుండి నేటివరకు సిక్లగు యూదా రాజులకు చెందినదిగానే ఉంది.
1SA 27:7 దావీదు ఫిలిష్తీయుల దేశంలో ఒక సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాడు.
1SA 27:8 తర్వాత దావీదు అతని మనుష్యులు బయలుదేరి గెషూరీయులమీద గెజెరీయులమీద, అమాలేకీయుల మీద దాడి చేశారు. (పూర్వం నుండి ఈ ప్రజలు షూరు, ఈజిప్టు వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో నివసించారు.)
1SA 27:9 దావీదు ఎక్కడ దాడి చేసినా అక్కడ మగవారిని ఆడవారిని ఎవరిని ప్రాణాలతో విడిచిపెట్టేవాడు కాదు, కాని గొర్రెలను ఎద్దులను గాడిదలను ఒంటెలను వస్త్రాలను దోచుకుని తిరిగి ఆకీషు దగ్గరకు వచ్చేవాడు.
1SA 27:10 ఆకీషు, “ఈ రోజు మీరెక్కడ దాడి చేశారు?” అని అడిగినప్పుడు, దావీదు, “యూదా దేశానికి యెరహ్మెయేలు దేశానికి కెనీయుల దేశానికి దక్షిణంగా ఉన్న చోటుపై దాడి చేశాం” అని చెప్పాడు.
1SA 27:11 దావీదు ఇలా చేస్తున్నాడని తమ గురించి సమాచారం అందిస్తారని భావించిన దావీదు గాతుకు తీసుకురావడానికి పురుషులను గాని స్త్రీలను గాని ప్రాణాలతో విడిచిపెట్టలేదు. అతడు ఫిలిష్తీయుల దేశంలో ఉన్నంతకాలం అలాగే చేస్తూ ఉన్నాడు.
1SA 27:12 దావీదును నమ్మిన ఆకీషు, “ఇతనికి తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద చాలా అసహ్యం ఏర్పడింది, కాబట్టి ఇతడు జీవితాంతం నాకు సేవకునిగా ఉంటాడు” అని అనుకున్నాడు.
1SA 28:1 ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని తమ సైన్యాలను సమకూర్చుకున్నారు. ఆకీషు దావీదుతో, “నీవు, నీ మనుష్యులు నాతో పాటు యుద్ధానికి రావాలని నీవు గ్రహించాలి” అన్నాడు.
1SA 28:2 అందుకు దావీదు, “నీ సేవకుడు ఏమి చేయగలడో నీవు చూస్తావు” అన్నాడు. ఆ మాటకు జవాబుగా ఆకీషు, “చాలా మంచిది, అప్పుడు నిన్ను జీవితాంతం నా అంగరక్షకునిగా నియమిస్తాను” అన్నాడు.
1SA 28:3 సమూయేలు చనిపోగా ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులు అతని గురించి దుఃఖించి అతని పట్టణమైన రామాలో అతన్ని సమాధి చేశారు. గతంలో సౌలు మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని దేశం నుండి వెళ్లగొట్టాడు.
1SA 28:4 ఫిలిష్తీయులు దండెత్తివచ్చి షూనేములో శిబిరం ఏర్పాటు చేసుకున్నప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిని సమకూర్చి గిల్బోవలో శిబిరం ఏర్పాటు చేశాడు.
1SA 28:5 సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినప్పుడు అతని హృదయం భయంతో నిండిపోయింది.
1SA 28:6 సౌలు యెహోవా దగ్గర విచారణ చేశాడు కాని కలల ద్వారా గాని ఊరీము ద్వారా గాని ప్రవక్తల ద్వారా గాని అతనికి సమాధానం రాలేదు.
1SA 28:7 సౌలు తన సహాయకులకు, “మీరు వెళ్లి మృతుల ఆత్మలతో మాట్లాడే స్త్రీని వెదకండి, అప్పుడు నేను వెళ్లి ఆమె దగ్గర విచారణ చేస్తాను” అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వారు, “ఎన్-దోరులో ఒక స్త్రీ ఉంది” అని చెప్పారు.
1SA 28:8 కాబట్టి సౌలు మారువేషం వేసుకుని వేరే బట్టలు ధరించి ఇద్దరు మనుష్యులతో పాటు బయలుదేరి రాత్రివేళ ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, “చనిపోయినవారి ఆత్మతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పేవాన్ని రప్పించు” అని అడిగాడు.
1SA 28:9 అయితే ఆ స్త్రీ అతనితో, “సౌలు ఏమి చేశాడో నీకు తెలుసు కదా; అతడు మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని దేశంలో ఉండకుండ వారిని తొలగించాడు. నాకు మరణం వచ్చేలా నా ప్రాణానికి ఎందుకు ఉచ్చు బిగిస్తున్నావు?” అన్నది.
1SA 28:10 అందుకు సౌలు ఆమెతో, “సజీవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్న, ఇలా చేసినందుకు నీవు శిక్షించబడవు” అని యెహోవాను బట్టి ప్రమాణం చేశాడు.
1SA 28:11 అప్పుడు ఆ స్త్రీ, “నీతో మాట్లాడడానికి నేనెవరిని రప్పించాలి?” అని అడిగింది. అందుకతడు, “సమూయేలును రప్పించు” అన్నాడు.
1SA 28:12 ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు చాలా గట్టిగా కేక వేసి, “నీవు సౌలువే కదా నీవు నన్నెందుకు మోసం చేశావు?” అని సౌలును అడిగింది.
1SA 28:13 అందుకు రాజు ఆమెతో, “భయపడకు, నీకు ఏమి కనబడింది?” అని అడిగాడు. ఆమె, “దేవుళ్ళలో ఒకడు భూమిలో నుండి పైకి రావడం నేను చూశాను” అని చెప్పింది.
1SA 28:14 అందుకు, “అతని రూపం ఎలా ఉంది?” అని అడిగాడు. ఆమె, “దుప్పటి కప్పుకున్న ఒక ముసలివాడు పైకి వస్తున్నాడు” అన్నది. సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని మోకరించి సాష్టాంగపడ్డాడు.
1SA 28:15 అప్పుడు సమూయేలు సౌలును, “నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపెట్టావు?” అని అడిగాడు. అందుకు సౌలు, “నేను చాలా బాధల్లో ఉన్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వస్తే దేవుడు నా నుండి దూరమయ్యారు. ప్రవక్తల ద్వారా గాని కలల ద్వారా గాని ఆయన నాకు ఏ సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఏం చేయాలో నాకు చెప్తావని నిన్ను పిలిచాను” అన్నాడు.
1SA 28:16 అందుకు సమూయేలు, “యెహోవా నిన్ను విడిచిపెట్టి నీకు శత్రువైనప్పుడు నీవు నన్ను ఎందుకు అడుగుతావు?
1SA 28:17 యెహోవా నా ద్వారా ప్రవచించిన దానిని నెరవేర్చారు. యెహోవా నీ చేతి నుండి రాజ్యాన్ని తీసివేసి దానిని నీ పొరుగువాడైన దావీదుకు ఇచ్చారు.
1SA 28:18 నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకుండా అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపాన్ని అమలు చేయలేదు కాబట్టి యెహోవా ఈ రోజు నీకు ఈ విధంగా చేస్తున్నారు.
1SA 28:19 యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తారు, రేపు నీవు నీ కుమారులు నాతో పాటు ఉంటారు. యెహోవా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని కూడా ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తారు” అని సౌలుతో చెప్పాడు.
1SA 28:20 సమూయేలు మాటలకు చాలా భయపడిన సౌలు వెంటనే నేలపై నిలువుగా పడిపోయాడు. అతడు ఆ రోజంతా పగలు రాత్రి భోజనం చేయకపోవడంతో చాలా బలహీనమయ్యాడు.
1SA 28:21 అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు భయభ్రాంతులకు గురవ్వడం చూసి, “నా ప్రభువా, నీ సేవకురాలినైన నేను నీ ఆజ్ఞకు లోబడ్డాను. నా ప్రాణాన్ని నా చేతిలో పెట్టుకుని నీవు నాతో చెప్పిన మాటలు విని అలాగే చేశాను.
1SA 28:22 ఇప్పుడు నీ సేవకురాలినైన నేను చెప్పే మాటలు విను, నేను నీకు కొంత ఆహారం ఇస్తాను, నీవు భోజనం చేసి బయలుదేరి వెళ్లడానికి బలం తెచ్చుకో” అని అతనితో చెప్పింది.
1SA 28:23 కాని అతడు ఒప్పుకోకుండా, “భోజనం చేయను” అని చెప్పాడు. అతని సేవకులు ఆ స్త్రీతో పాటు కలిసి అతని బలవంతం చేసినప్పుడు అతడు వారి మాట విని నేల మీద నుండి లేచి మంచం మీద కూర్చున్నాడు.
1SA 28:24 ఆ స్త్రీ తన ఇంట్లో ఉన్న క్రొవ్విన మగ దూడను తెచ్చి త్వరగా వండి పిండి తెచ్చి పిసికి పులియని రొట్టెలు కాల్చింది.
1SA 28:25 వాటిని తెచ్చి సౌలుకు అతని సేవకులకు వడ్డించగా వారు భోజనం చేసి ఆ రాత్రే బయలుదేరి వెళ్లిపోయారు.
1SA 29:1 ఫిలిష్తీయులు తమ సైన్యాన్నంతా సమకూర్చుకొని ఆఫెకులో దిగారు; ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని నీటి ఊట ప్రక్కన బసచేశారు.
1SA 29:2 ఫిలిష్తీయుల రాజులు తమ సైన్యాలతో వందమంది చొప్పున వెయ్యిమంది చొప్పున వస్తుండగా దావీదు అతని మనుష్యులు ఆకీషుతో కలసి సైన్యం వెనుక వస్తున్నారు.
1SA 29:3 ఫిలిష్తీయుల సేనాధిపతులు, “ఈ హెబ్రీయులు ఎందుకు వస్తున్నారు?” అని ఆకీషును అడిగారు. అందుకు ఆకీషు, “ఇతడు ఇశ్రాయేలు రాజైన సౌలు యొక్క అధికారియైన దావీదు కాదా? ఇతడు ఇప్పటికే ఒక సంవత్సరం పాటు నాతో ఉన్నాడు ఇతడు సౌలును విడిచిపెట్టిన రోజు నుండి ఇప్పటివరకు, నేను ఇతనిలో ఎటువంటి తప్పును చూడలేదు” అని వారికి జవాబిచ్చాడు.
1SA 29:4 అందుకు ఫిలిష్తీయుల సేనాధిపతులు ఆకీషుమీద కోప్పడి, “నీవు ఇతనికి కేటాయించిన పట్టణానికి ఇతన్ని తిరిగి పంపించు. ఇతడు మనతో పాటు యుద్ధానికి రాకూడదు, ఒకవేళ వస్తే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మనకే వ్యతిరేకంగా మారతాడేమో! ఇతడు తన యజమాని దయను తిరిగి పొందడానికి మనవారి తలలు తీసుకెళ్లడంకన్నా వేరే మంచి మార్గం ఏముంటుంది?
1SA 29:5 “ ‘సౌలు వేయిమందిని దావీదు పదివేలమందిని చంపారు’ అని వారు నాట్యం చేస్తూ పాటలు పాడింది ఈ దావీదు గురించే కాదా?” అని అతనితో అన్నారు.
1SA 29:6 కాబట్టి ఆకీషు దావీదును పిలిచి అతనితో, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీవు నిజంగా యథార్థవంతుడవు; సైన్యంలో నీవు నాతో పాటు కలిసి పని చేయడం నాకు ఇష్టమే. నీవు నా దగ్గరకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నిజాయితీగా ఉన్నావు, కానీ ఈ అధికారులు నిన్ను తీసుకెళ్లడానికి అంగీకరించడం లేదు.
1SA 29:7 కాబట్టి నీవు తిరిగి నీ స్థలానికి సమాధానంగా వెళ్లు; ఫిలిష్తీయుల అధికారులకు కోపం తెప్పించేది ఏది చేయకు” అని అన్నాడు.
1SA 29:8 అందుకు దావీదు ఆకీషుతో, “కానీ నేను ఏమి చేశాను? నేను మీ దగ్గరకు వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు నీ సేవకునికి వ్యతిరేకంగా నీకు ఏమి దొరికింది? నేను వెళ్లి నా ప్రభువైన రాజు శత్రువులతో ఎందుకు పోరాడలేను?”
1SA 29:9 అందుకు ఆకీషు దావీదుతో, “నీవు నా కంటికి దేవదూతలా మంచిగా కనబడుతున్నావు; కాని ఫిలిష్తీయుల దళాధిపతులు, ‘ఇతడు మనతో పాటు యుద్ధానికి రాకూడదు’ అని అంటున్నారు.
1SA 29:10 కాబట్టి ఉదయం నీవు, నీతో పాటు వచ్చిన నీ యజమాని సేవకులు త్వరగా లేచి, వెలుగు రాగానే వెళ్లండి” అని అన్నాడు.
1SA 29:11 కాబట్టి దావీదు అతని మనుష్యులు ఉదయం త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్లారు, మరోవైపు ఫిలిష్తీయులు యెజ్రెయేలుకు వెళ్లారు.
1SA 30:1 దావీదు అతని మనుష్యులు మూడవ రోజున సిక్లగుకు చేరుకున్నారు. అంతలో అమాలేకీయులు దక్షిణదేశం మీద సిక్లగు మీద దాడిచేసి సిక్లగును దోచుకొని దానిని కాల్చివేశారు.
1SA 30:2 ఆడవారిని, చిన్నవారి నుండి పెద్దవారి వరకు అక్కడున్న అందరిని బందీలుగా పట్టుకుని, వారిని చంపకుండా తమతో పాటు తీసుకెళ్లారు.
1SA 30:3 దావీదు అతని మనుష్యులు సిక్లగు పట్టణం చేరుకున్నప్పుడు అది కాలిపోయి ఉండడం, వారి భార్యలు కుమారులు కుమార్తెలు బందీలుగా కొనిపోబడినట్లు చూశారు.
1SA 30:4 ఏడ్వడానికి శక్తి హరించిపోయే వరకు దావీదు అతని మనుష్యులు గట్టిగా ఏడ్చారు.
1SA 30:5 దావీదు ఇద్దరు భార్యలు యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన నాబాలు విధవరాలు అబీగయీలు కూడా బందీలుగా కొనిపోబడ్డారు.
1SA 30:6 అక్కడున్న మనుష్యులు తమ కుమారులు కుమార్తెల గురించి తీవ్రంగా దుఃఖపడి ఆ బాధతో దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకోవడంతో దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. కాని దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.
1SA 30:7 తర్వాత దావీదు అహీమెలెకు కుమారుడును యాజకుడునైన అబ్యాతారుతో, “నాకు ఏఫోదు తీసుకురా” అని చెప్పినప్పుడు అబ్యాతారు దాన్ని తెచ్చాడు.
1SA 30:8 అప్పుడు దావీదు, “నేను ఈ గుంపును వెంటాడితే వారిని పట్టుకోగలనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోవా, “నీవు వెంటాడు, ఖచ్చితంగా నీవు వారిని పట్టుకుని నీ వారినందరిని విడిపించడంలో విజయం పొందుతావు” అని జవాబిచ్చారు.
1SA 30:9 కాబట్టి దావీదు అతనితో ఉన్న ఆరువందలమంది బయలుదేరి బెసోరు వాగు దగ్గరకు రాగా వారిలో రెండువందలమంది వెనుక ఉండిపోయారు.
1SA 30:10 ఆ రెండువందలమంది అలసిపోయి బెసోరు వాగు దాటలేక ఆగిపోయారు కానీ దావీదు నాలుగువందలమంది ఇంకా తరుముతూ వెళ్లారు.
1SA 30:11 పొలంలో ఒక ఈజిప్టువాడు కనబడగా వారు అతన్ని దావీదు దగ్గరకు తీసుకువచ్చి వానికి త్రాగడానికి నీళ్లు తినడానికి ఆహారం ఇచ్చారు.
1SA 30:12 అంజూర ముద్దలో ముక్క రెండు ద్రాక్షగుత్తులు ఇచ్చారు. అతడు మూడు పగళ్ళు మూడు రాత్రులు తిండిలేకుండా ఉండడంతో వాటిని తిన్న తర్వాత అతడు కోలుకున్నాడు.
1SA 30:13 అప్పుడు దావీదు, “నీది ఏ దేశం? ఎక్కడ నుండి వచ్చావు?” అని అతన్ని అడిగాడు. అందుకు అతడు, “ఈజిప్టుకు చెందిన నేను ఒక అమాలేకీయునికి బానిసను. మూడు రోజుల క్రితం నాకు ఆరోగ్యం బాగోలేదని నా యజమాని నన్ను వదిలేశాడు.
1SA 30:14 మేము దాడిచేసి కెరేతీయుల దక్షిణ దేశాన్ని యూదా దేశాన్ని కాలేబు దక్షిణ దేశాన్ని దోచుకొని సిక్లగును కాల్చివేశాము” అని చెప్పాడు.
1SA 30:15 “ఆ దోపిడి మూక దగ్గరకు నీవు నాకు దారి చూపిస్తావా?” అని దావీదు అడిగాడు. అప్పుడు వాడు, “నీవు నన్ను చంపవని నా యజమానికి అప్పగించనని దేవుని మీద నాకు ప్రమాణము చేస్తే ఆ గుంపును కలుసుకోడానికి నీకు దారి చూపిస్తాను” అన్నాడు.
1SA 30:16 తర్వాత వాడు దావీదును వారున్న చోటికి తీసుకెళ్లగా, వారంతా ఆ ప్రాంతంలో చెదిరిపోయి ఫిలిష్తీయుల దేశంలో యూదా దేశంలో తాము దోచుకున్న సొమ్ముతో తింటూ త్రాగుతూ ఆటపాటలలో మునిగిపోయారు.
1SA 30:17 దావీదు సాయంత్రం మొదలుపెట్టి మరునాటి సాయంత్రం వరకు వారిని చంపుతూ ఉంటే, ఒంటెల మీద ఎక్కి పారిపోయిన నాలుగువందలమంది యువకులు తప్ప మరియెవరూ తప్పించుకోలేకపోయారు.
1SA 30:18 దావీదు అమాలేకీయులు దోచుకున్న ప్రతిదాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. తన ఇద్దరు భార్యలను కూడా రక్షించాడు.
1SA 30:19 చిన్నవారు పెద్దవారు, కుమారులు కుమార్తెలు లేదా వారు దోచుకున్న వాటన్నిటిలో ఏదీ తక్కువ కాకుండా దావీదు అన్నిటిని తిరిగి తీసుకువచ్చాడు.
1SA 30:20 దావీదు అమాలేకీయుల గొర్రెలు పశువులన్నిటిని తీసుకున్నాడు; “ఇది దావీదు దోపుడుసొమ్ము” అని చెబుతూ అతని మనుష్యులు వాటిని మిగిలిన పశువులకు ముందుగా తోలారు.
1SA 30:21 అలసిపోయి దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర ఆగిపోయిన ఆ రెండువందలమంది దగ్గరకు దావీదు రాగా వారు దావీదును అతనితో ఉన్న మనుష్యులను కలుసుకోడానికి వచ్చారు. దావీదు వారి దగ్గరకు వచ్చి వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు.
1SA 30:22 కాని దావీదుతో పాటు వెళ్లిన వారిలో ఉన్న కొందరు దుర్మార్గులు ఇబ్బందులు కలుగజేసేవారు, “వీరు మనతో పాటు రాలేదు కాబట్టి వారి భార్యలను, పిల్లలను తప్ప మనం తిరిగి తెచ్చిన దోపుడు సొమ్ములో వీరికి ఏ భాగం ఇవ్వనవసరం లేదు” అన్నారు.
1SA 30:23 అందుకు దావీదు వారితో, “నా సోదరులారా; యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దోపిడి మూకను మనకు అప్పగించి మనకు దయ చేసిన దాని విషయంలో మీరు ఇలా చేయకూడదు.
1SA 30:24 మీరు చెప్పింది ఎవరు ఒప్పుకుంటారు? యుద్ధానికి వెళ్లిన వారికి ఎంత భాగం వస్తుందో సామాను దగ్గర ఉన్నవారికి అంతే భాగం వస్తుంది కదా! కాబట్టి అందరికి సమానభాగాలు వస్తాయి” అన్నాడు.
1SA 30:25 ఆ రోజు నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలుకు దానిని ఒక కట్టడగాను, నియమంగాను చేశాడు.
1SA 30:26 దావీదు సిక్లగుకు వచ్చినప్పుడు దోచుకున్న సొమ్ములో కొంత తీసి, “యెహోవా శత్రువుల దగ్గర నేను దోచుకున్న సొమ్ములో కొంత మీకు ఒక కానుకగా ఇస్తున్నాను” అని చెప్పి తన స్నేహితులైన యూదా పెద్దలకు పంపించాడు.
1SA 30:27 దావీదు దానిని బేతేలులో దక్షిణ రామోతులో యత్తీరులో ఉన్నవారికి,
1SA 30:28 అరోయేరులో, షిప్మోతులో, ఎష్తెమోవాలో ఉన్నవారికి,
1SA 30:29 రాకాలులో యెరహ్మెయేలీయుల కెనీయుల పట్టణాల్లో ఉన్నవారికి,
1SA 30:30 హోర్మాలో బోర్-ఆషానులో అతాకులో ఉన్నవారికి,
1SA 30:31 హెబ్రోనులో ఉన్నవారికి, దావీదు అతని మనుష్యులు తిరిగిన అన్ని స్థలాల్లో ఉన్న పెద్దలకు పంపించాడు.
1SA 31:1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు; వారి ఎదుట నుండి ఇశ్రాయేలీయులు పారిపోయారు. చాలామంది గిల్బోవ పర్వతం మీద చచ్చి పడిపోయారు.
1SA 31:2 ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి అతని కుమారులైన యోనాతాను అబీనాదాబు మల్కీ-షూవలను చంపేశారు.
1SA 31:3 సౌలు చుట్టూ యుద్ధం తీవ్రమయ్యింది, బాణాలు వేసేవారు అతన్ని చూసి అతన్ని గాయపరిచారు.
1SA 31:4 సౌలు తన ఆయుధాలు మోసేవానితో, “నీ కత్తి దూసి నన్ను పొడవు, లేకపోతే సున్నతిలేని వీరు వచ్చి నన్ను దూషిస్తారు” అని అన్నాడు. కాని ఆ ఆయుధాలు మోసేవాడు చాలా భయపడి దానికి ఒప్పుకోలేదు; కాబట్టి సౌలు తన కత్తి తీసుకుని దాని మీద పడ్డాడు.
1SA 31:5 ఆయుధాలు మోసేవాడు సౌలు చనిపోయాడని చూసి అతడు కూడా తన కత్తి మీద పడి చనిపోయాడు.
1SA 31:6 ఇలా సౌలు అతని ముగ్గురు కుమారులు అతని ఆయుధాలను మోసేవాడు అతని మనుష్యులందరు ఒకేసారి చనిపోయారు.
1SA 31:7 ఇశ్రాయేలు సైన్యం పారిపోయిందని, సౌలు అతని కుమారులు చనిపోయారని లోయలో ఉన్న ఇశ్రాయేలీయులు, యొర్దాను అవతల ఉన్నవారు తెలుసుకున్నప్పుడు, వారు తమ పట్టణాలను విడిచి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిని ఆక్రమించుకున్నారు.
1SA 31:8 మరుసటిరోజు చనిపోయినవారిని దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు, వారు గిల్బోవ పర్వతం మీద పడి ఉన్న సౌలును, అతని ముగ్గురు కుమారులను చూశారు.
1SA 31:9 అతని తల నరికి అతని ఆయుధాలను తీసుకెళ్లి, తమ విగ్రహాలున్న గుడిలో, తమ ప్రజలమధ్య ఈ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నలుదిక్కులకు దూతలను పంపారు.
1SA 31:10 వారు అతని ఆయుధాలను అష్తారోతు దేవి గుడిలో పెట్టి అతని శవాన్ని బేత్-షాను పట్టణపు గోడకు తగిలించారు.
1SA 31:11 అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు ప్రజలు విన్నప్పుడు,
1SA 31:12 వారి బలశాలులంతా లేచి బేత్-షాను వరకు రాత్రంతా నడిచి వెళ్లి సౌలు శవాన్ని అతని కుమారుల శవాలను బేత్-షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషుకు తీసుకువచ్చి వారిని దహనం చేశారు.
1SA 31:13 తర్వాత వారి ఎముకలు తీసుకుని యాబేషులోని పిచుల వృక్షం క్రింద పాతిపెట్టి ఏడు రోజులు ఉపవాసమున్నారు.
2SA 1:1 సౌలు మరణించిన తర్వాత, దావీదు అమాలేకీయులను ఓడించి తిరిగివచ్చి సిక్లగులో రెండు రోజులు ఉన్నాడు.
2SA 1:2 మూడవ రోజు సౌలు శిబిరం నుండి ఒక వ్యక్తి చిరిగిన బట్టలు వేసుకుని తలమీద దుమ్ముతో వచ్చాడు. అతడు దావీదు దగ్గరకు వచ్చి గౌరవంతో నేలమీద పడి నమస్కారం చేశాడు.
2SA 1:3 “ఎక్కడి నుండి వచ్చావు?” అని దావీదు అతన్ని అడిగాడు. అందుకతడు, “ఇశ్రాయేలు శిబిరం నుండి తప్పించుకుని వచ్చాను” అన్నాడు.
2SA 1:4 “ఏ జరిగిందో నాకు చెప్పు” అని దావీదు అడిగాడు. అప్పుడతడు, “యుద్ధరంగం నుండి సైనికులంతా పారిపోయారు. వారిలో ఎంతోమంది చనిపోయారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను కూడా చనిపోయారు” అని సమాధానం ఇచ్చాడు.
2SA 1:5 అందుకు దావీదు, “సౌలు, అతని కుమారుడు యోనాతాను కూడా చనిపోయారని నీకెలా తెలుసు?” అని వార్త తెచ్చిన యువకుని అడిగాడు.
2SA 1:6 ఆ యువకుడు, “అనుకోకుండ నేను గిల్బోవ పర్వతం మీదికి వెళ్లినప్పుడు అక్కడ సౌలు తన ఈటె మీద అనుకుని ఉన్నాడు, రథాలు దాని రౌతులు అతని తరుముతూ వెనుక వస్తూ ఉన్నారు.
2SA 1:7 అతడు వెనుకకు తిరిగినప్పుడు నన్ను చూసి, నన్ను పిలిచాడు. అందుకు నేను, ‘నన్ను ఏమి చేయమంటారు?’ అని అడిగాను.
2SA 1:8 “అందుకతడు, ‘నీవెవరు?’ అని అడిగాడు. “అందుకు నేను, ‘నేను అమాలేకీయుడను’ అని జవాబిచ్చాను.
2SA 1:9 “అప్పుడతడు నాతో, ‘నా ప్రాణం పోకుండా మరణవేదనతో నా తల తిరుగుతుంది. నా దగ్గరకు వచ్చి నిలబడి నన్ను చంపెయ్యి’ అన్నాడు.
2SA 1:10 “అంతగా గాయపడిన అతడు ఇక బ్రతకడని భావించి నేను అతని ప్రక్కన నిలబడి అతన్ని చంపేశాను. అతని తలమీద ఉన్న కిరీటం, చేతికున్న కంకణం తీసి నా ప్రభువైన మీకు అప్పగిద్దామని తెచ్చాను” అని అన్నాడు.
2SA 1:11 ఆ వార్త వినగానే దావీదు అతని మనుష్యులు దుఃఖంతో బట్టలు చింపుకున్నారు.
2SA 1:12 సౌలు, అతని కుమారుడు యోనాతాను, యెహోవా సైన్యం ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఖడ్గంతో చంపబడ్డారని విని, వారి కోసం సాయంకాలం వరకు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉపవాసం ఉన్నారు.
2SA 1:13 తనకు వార్త తీసుకువచ్చిన యువకునితో దావీదు, “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు. “నేను విదేశీయుని కుమారుడను, నా తండ్రి అమాలేకీయుడు” అని చెప్పాడు.
2SA 1:14 అందుకు దావీదు, “యెహోవా అభిషేకించినవాన్ని చంపడానికి నీకు భయం వేయలేదా?” అని అడిగాడు.
2SA 1:15 దావీదు తన మనుష్యుల్లో ఒకని పిలిచి, “వెళ్లి అతన్ని చంపు” అని చెప్పాడు.
2SA 1:16 వెంటనే అతడు వాన్ని కొట్టి చంపాడు. ఎందుకంటే దావీదు ఆ యువకునితో, “ ‘నేను యెహోవా అభిషేకించినవాన్ని చంపాను’ అని నీ నోరే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది కాబట్టి నీ చావుకు నీవే బాధ్యుడవు” అన్నాడు.
2SA 1:17 సౌలు గురించి అతని కుమారుడైన యోనాతాను గురించి దావీదు ఒక శోకగీతాన్ని వ్రాసి,
2SA 1:18 యూదావారందరికి ఆ విల్లు విలాపగీతాన్ని నేర్పించాలని అతడు ఆదేశించాడు. ఇది యాషారు అనగా యథార్థవంతులు అనే గ్రంథంలో వ్రాయబడి ఉంది:
2SA 1:19 “ఇశ్రాయేలూ, నీ ఉన్నతస్థలాల మీద నీ వైభవం గలవారు చంపబడ్డారు. బలవంతులు ఎలా పడిపోయారు కదా!
2SA 1:20 “ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు సున్నతిలేనివారి కుమార్తెలు ఆనందించకూడదు. కాబట్టి ఈ వార్త గాతులో చెప్పకండి, అష్కెలోను వీధుల్లో దీనిని ప్రకటించకండి.
2SA 1:21 “గిల్బోవ పర్వతాల్లారా, మీమీద మంచు గాని వర్షం గాని కురవకుండును గాక, అర్పణల కోసం ధాన్యాన్ని ఇచ్చే పొలాలపై జల్లులు పడకుండును గాక. ఎందుకంటే అక్కడ బలవంతుల డాలు అవమానపరచబడింది, ఇకపై సౌలు డాలు నూనెతో పూయబడదు.
2SA 1:22 “హతుల రక్తం ఒలికించకుండా, బలవంతుల శరీరంలో చొచ్చుకుపోకుండా, యోనాతాను విల్లు వెనుదిరగలేదు, సౌలు ఖడ్గం అసంతృప్తిగా వెనుదిరగలేదు.
2SA 1:23 సౌలు యోనాతానులు తమ బ్రతుకంతా ప్రేమ కలిగి దయ కలిగినవారిగా ఉన్నారు. చావులోనూ ఒకరిని ఒకరు విడిచిపెట్టలేదు. వారు గ్రద్దల కన్నా వేగం గలవారు, సింహాల కన్నా బలవంతులు.
2SA 1:24 “ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలు గురించి ఏడవండి, అతడు, మీకు విలాసవంతమైన ఎర్రని వస్ర్తాలు ధరింపచేశాడు, మీ వస్త్రాలను బంగారు ఆభరణాలతో అలంకరించాడు.
2SA 1:25 “యుద్ధరంగంలో బలవంతులు ఎలా పడిపోయారో కదా! నీ పర్వతాలమీద యోనాతాను హతమైపోయాడు.
2SA 1:26 నా సోదరుడా, యోనాతానా! నీకోసం నేనెంతో దుఃఖిస్తున్నాను; నీవు నాకెంతో ప్రియమైనవాడవు. నాపై నీకున్న ప్రేమ ఎంతో అద్భుతమైనది, అది స్త్రీలు చూపించే దానికన్నా అద్భుతమైనది.
2SA 1:27 “బలవంతులు ఎలా పడిపోయారు కదా! యుద్ధ ఆయుధాలు నశించిపోయాయి.”
2SA 2:1 కొంతకాలం తర్వాత దావీదు యెహోవా దగ్గర విచారణ చేసి, “యూదా పట్టణాలకు నేను వెళ్ల వచ్చా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు” అని చెప్పారు. “ఎక్కడికి వెళ్లాలి?” అని దావీదు అడిగాడు. అందుకు యెహోవా, “హెబ్రోనుకు వెళ్లు” అని చెప్పారు.
2SA 2:2 దావీదు తన ఇద్దరు భార్యలైన యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన నాబాలు విధవరాలు అబీగయీలును తీసుకుని అక్కడికి వెళ్లాడు.
2SA 2:3 దావీదు తనతో ఉన్నవారందరిని వారి వారి కుటుంబాలతో పాటు తనతో తీసుకెళ్లగా వారు హెబ్రోను పట్టణాల్లో స్థిరపడ్డారు.
2SA 2:4 యూదా మనుష్యులు హెబ్రోనుకు వచ్చి దావీదును యూదా గోత్రానికి రాజుగా అభిషేకించారు. సౌలును యాబేషు గిలాదుకు చెందినవారు పాతిపెట్టారని దావీదుకు తెలిసినప్పుడు,
2SA 2:5 దావీదు యాబేషు గిలాదు ప్రజల దగ్గరకు దూతను పంపి, “మీ ప్రభువైన సౌలును పాతిపెట్టి అతని పట్ల మీకున్న దయ చూపించారు కాబట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
2SA 2:6 యెహోవా మీకు తన దయను నమ్మకత్వాన్ని చూపించును గాక, మీరు చేసిన ఈ పనిని బట్టి నేను కూడా మీమీద అదే దయను చూపిస్తాను.
2SA 2:7 మీ రాజైన సౌలు చనిపోయాడు కాని యూదా ప్రజలు తమపై రాజుగా నన్ను అభిషేకించారు కాబట్టి మీరు దృఢంగా ధైర్యంగా ఉండండి” అని కబురు పంపాడు.
2SA 2:8 ఆ సమయంలో, నేరు కుమారుడును సౌలు సేనాధిపతియైన అబ్నేరు అనేవాడు సౌలు కుమారుడైన ఇష్-బోషెతును మహనయీముకు తీసుకెళ్లాడు.
2SA 2:9 అతన్ని గిలాదు, అషూరీ, యెజ్రెయేలు, ఎఫ్రాయిం బెన్యామీను, ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా చేశాడు.
2SA 2:10 సౌలు కుమారుడైన ఇష్-బోషెతు ఇశ్రాయేలుకు రాజైనప్పుడు అతని వయస్సు నలభై సంవత్సరాలు, అతడు రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అయితే యూదా ప్రజలు నమ్మకంగా దావీదు పక్షం ఉన్నారు.
2SA 2:11 దావీదు హెబ్రోనులో యూదా వారిని రాజుగా పరిపాలించిన కాలం ఏడు సంవత్సరాల ఆరు నెలలు.
2SA 2:12 నేరు కుమారుడైన అబ్నేరు, సౌలు కుమారుడైన ఇష్-బోషెతు మనుష్యులతో కలిసి మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు వెళ్లారు.
2SA 2:13 సెరూయా కుమారుడైన యోవాబు, దావీదు మనుష్యులతో కలిసి బయలుదేరి వెళ్లి వారిని గిబియోను కొలను దగ్గర కలుసుకున్నారు. ఒక గుంపు కొలనుకు ఈ ప్రక్కన మరో గుంపు కొలనుకు ఆ ప్రక్కన కూర్చున్నారు.
2SA 2:14 అప్పుడు అబ్నేరు యోవాబుతో, “కొంతమంది సైనికులు మన ముందుకు వచ్చి మల్లయుద్ధం చేస్తారు” అని అన్నాడు. అందుకు యోవాబు, “సరే, చేయనిద్దాం” అన్నాడు.
2SA 2:15 సౌలు కుమారుడైన ఇష్-బోషెతుకు చెందిన బెన్యామీనీయులు పన్నెండుమంది, దావీదుకు చెందిన పన్నెండుమంది లేచి నిలబడ్డారు.
2SA 2:16 ప్రతి ఒక్కరూ తమ ప్రత్యర్థి తల పట్టుకుని వాని ప్రక్కలో కత్తితో పొడవగా అందరు ఒకేసారి చనిపోయారు. అందుకే ఆ స్థలానికి హెల్కత్ హన్సూరీము అని పేరు వచ్చింది. అది గిబియోనులో ఉంది.
2SA 2:17 ఆ రోజు భయంకరమైన యుద్ధం జరిగింది. అబ్నేరు, ఇశ్రాయేలీయులు దావీదు సైన్యం ముందు ఓడిపోయారు.
2SA 2:18 సెరూయా ముగ్గురు కుమారులైన యోవాబు, అబీషై, అశాహేలు అక్కడే ఉన్నారు. అశాహేలు అడవిలేడిలా చాలా వేగంగా పరుగెత్తగలడు.
2SA 2:19 అశాహేలు కుడికైనా ఎడమకైనా తిరగకుండా అబ్నేరును వెంటాడాడు.
2SA 2:20 అబ్నేరు వెనుకకు తిరిగి చూసి, “అశాహేలు నువ్వేనా?” అని అడిగాడు. అందుకు అతడు, “అవును నేనే” అన్నాడు.
2SA 2:21 అప్పుడు అబ్నేరు అతనితో, “కుడికైనా ఎడమకైనా తిరిగి యువకులలో ఒకన్ని పట్టుకుని వాని ఆయుధాలను దోచేయ్” అని చెప్పాడు. కాని అశాహేలు అటు ఇటు తిరగకుండా అతన్ని వెంటాడుతూనే ఉన్నాడు.
2SA 2:22 మరొకసారి అబ్నేరు అశాహేలును హెచ్చరించి, “నన్నెందుకు వెంటాడుతావు? నేను నిన్ను నేలకు కొట్టి చంపితే నీ సోదరుడైన యోవాబు ముఖాన్ని ఎలా చూడగలను?” అన్నాడు.
2SA 2:23 అయినా అశాహేలు ఆగిపోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు అబ్నేరు ఈటె పిడి యొక్క అంచుతో అతన్ని పొట్టలో పొడవడంతో అతని వీపులో నుండి ఈటె బయటకు వచ్చి అక్కడికక్కడే అతడు పడి చనిపోయాడు. అశాహేలు చనిపోయి పడి ఉన్న చోటికి వచ్చిన వారందరూ అక్కడే ఆగిపోయారు.
2SA 2:24 కాని యోవాబు, అబీషై ఇద్దరూ కలిసి అబ్నేరును వెంటాడారు. సూర్యాస్తమయం అవుతుండగా వారు గిబియోను అరణ్యమార్గంలోని గియా దగ్గరగా ఉన్న అమ్మహు అనే కొండ దగ్గరకు వచ్చారు.
2SA 2:25 అప్పుడు బెన్యామీనీయులు అబ్నేరు వెనుక గుంపుగా ఏర్పడి కొండ శిఖరంపై నిలబడ్డారు.
2SA 2:26 అప్పుడు అబ్నేరు బిగ్గరగా, “కత్తి ఎప్పుడూ నాశనం చేస్తూనే ఉండాలా? అది చివరకు ద్వేషంతోనే ముగుస్తుందని నీకు తెలియదా? తోటి ఇశ్రాయేలీయులను తరమడం ఆపమని నీ మనుష్యులకు చెప్పకుండా ఎంతకాలం ఉంటావు?” అని యోవాబుతో అన్నాడు.
2SA 2:27 అందుకు యోవాబు, “సజీవుడైన దేవుని పేరిట, నీవు ఈ మాటలు చెప్పకపోతే వీరు తన సోదరులను ఉదయం వరకు తరుముతూనే ఉండేవారు” అన్నాడు.
2SA 2:28 అప్పుడు యోవాబు బూర ఊదినప్పుడు, అందరు ఇశ్రాయేలీయులను వెంటాడడం, యుద్ధం చేయడం ఆపివేశారు.
2SA 2:29 అబ్నేరు అతని మనుష్యులు ఆ రాత్రంతా అరాబా గుండా ప్రయాణం చేశారు. వారు యొర్దాను నదిని దాటి, ఉదయ కాలంలో ప్రయాణం కొనసాగించి మహనయీముకు చేరుకున్నారు.
2SA 2:30 అప్పుడు యోవాబు అబ్నేరును తరమడం ఆపి సైన్యాన్నంతా సమావేశపరిచాడు. అశాహేలు కాకుండా దావీదు మనుష్యుల్లో పందొమ్మిది మంది తగ్గారు.
2SA 2:31 అయితే దావీదు సైన్యం అబ్నేరుతో ఉన్న బెన్యామీనీయులలో మూడువందల అరవై మందిని చంపేశారు.
2SA 2:32 వారు అశాహేలును తీసుకెళ్లి బేత్లెహేములో ఉన్న అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు. తర్వాత, యోవాబు, అతని మనుష్యులు రాత్రంతా నడిచి తెల్లవారేసరికి హెబ్రోనుకు చేరుకున్నారు.
2SA 3:1 సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య చాలా కాలం యుద్ధం జరుగుతూనే ఉంది. దావీదు అంతకంతకు బలపడుతుంటే సౌలు కుటుంబం బలహీనమవుతూ వచ్చింది.
2SA 3:2 దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు: యెజ్రెయేలుకు చెందిన అహీనోయముకు పుట్టిన అమ్నోను అతని మొదటి కుమారుడు;
2SA 3:3 కర్మెలుకు చెందిన నాబాలుకు భార్యగా ఉన్న అబీగయీలుకు పుట్టిన కిల్యాబు అతని రెండవ కుమారుడు; గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవ కుమారుడు;
2SA 3:4 హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవ కుమారుడు; అబీటలు కుమారుడైన షెఫట్యా అయిదవ కుమారుడు;
2SA 3:5 దావీదు భార్య ఎగ్లా ద్వారా పుట్టిన ఇత్రెయాము ఆరవ కుమారుడు.
2SA 3:6 సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అబ్నేరు సౌలు కుటుంబంలో తన స్థానాన్ని బలపరచుకున్నాడు.
2SA 3:7 అయ్యా కుమార్తె రిస్పా సౌలుకు ఉంపుడుగత్తెగా ఉండేది. “నా తండ్రి ఉంపుడుగత్తెతో నీవెందుకు శారీరక సంబంధం పెట్టుకున్నావు?” అని ఇష్-బోషెతు అబ్నేరును అడిగాడు.
2SA 3:8 ఇష్-బోషెతు అన్న మాటకు అబ్నేరుకు చాలా కోపం వచ్చి, “నేనేమైనా యూదా పక్షాన చేరిన కుక్కతో సమానమా? ఈ రోజు వరకు నీ తండ్రియైన సౌలు కుటుంబానికి, అతని బంధువులకు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉన్నాను. నేను నిన్ను దావీదు చేతికి అప్పగించలేదు. అయినా నీవు ఈ స్త్రీ కారణంగా నా మీద నిందవేస్తున్నావు.
2SA 3:9 యెహోవా దావీదుకు ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసినట్టుగా సౌలు ఇంటి నుండి రాజ్యాన్ని తీసివేసి, దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలు మీద యూదా మీద దావీదు సింహాసనాన్ని నేను స్థాపించకపోతే, దేవుడు అబ్నేరుతో కఠినంగా వ్యవహరించును గాక” అని అన్నాడు.
2SA 3:11 దానితో ఇష్-బోషెతు అబ్నేరుకు భయపడి అతన్ని మరో మాట అనడానికి సాహసించలేదు.
2SA 3:12 అప్పుడు అబ్నేరు దావీదు దగ్గరకు దూతలను పంపించి, “ఈ దేశం ఎవరిది? నాతో ఒప్పందం చేసుకో, ఇశ్రాయేలు రాజ్యమంతా నీది కావడానికి నేను నీకు సహాయం చేస్తాను” అని కబురు చేశాడు.
2SA 3:13 అప్పుడు దావీదు, “మంచిది, నీతో ఒక ఒప్పందానికి వస్తాను కాని నీవు ఒక పని చేయాలి. నీవు నన్ను చూడడానికి వచ్చేటప్పుడు సౌలు కుమార్తె మీకాలును నా దగ్గరకు తీసుకువస్తేనే నీవు నన్ను చూడగలవు” అని చెప్పాడు.
2SA 3:14 ఆ తర్వాత దావీదు సౌలు కుమారుడైన ఇష్-బోషెతు దగ్గరకు దూతలను పంపించి, “వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తెచ్చి వెల చెల్లించి నేను పెండ్లి చేసుకున్న నా భార్య మీకాలును నాకు అప్పగించు” అని కబురు చేశాడు.
2SA 3:15 ఇష్-బోషెతు మనుష్యులను పంపి ఆమె భర్త లాయిషు కుమారుడైన పల్తీయేలు దగ్గర నుండి ఆమెను తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.
2SA 3:16 ఆమె భర్త ఆమె వెంట ఏడుస్తూ బహూరీము వరకు వచ్చాడు. అయితే అబ్నేరు అతన్ని వెనుకకు వెళ్లిపొమ్మని చెప్పడంతో అతడు వెళ్లిపోయాడు.
2SA 3:17 అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి, “గతంలో మీరు దావీదు మీకు రాజుగా ఉండాలని కోరుకున్నారు గదా!
2SA 3:18 ‘నా సేవకుడైన దావీదు ద్వారా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విడిపిస్తాను’ అని యెహోవా దావీదుకు ప్రమాణం చేశారు, కాబట్టి ఇప్పుడు మీ కోరిక నెరవేర్చుకోండి” అన్నాడు.
2SA 3:19 అలాగే అబ్నేరు బెన్యామీనీయులతో స్వయంగా మాట్లాడాడు. ఆ తర్వాత అతడు హెబ్రోనుకు వెళ్లి ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులు అనుకున్న దాన్నంతా దావీదుకు తెలియజేశాడు.
2SA 3:20 అబ్నేరు తనతో కూడా ఇరవైమంది మనుష్యులను వెంటపెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చినప్పుడు అతనికి అతనితో ఉన్నవారందరికి దావీదు గొప్ప విందు ఏర్పాటు చేశాడు.
2SA 3:21 అప్పుడు అబ్నేరు దావీదుతో, “నేను వెంటనే వెళ్లి ఇశ్రాయేలీయులందరిని నా ప్రభువైన రాజు కోసం సమావేశపరచి, వారు మీతో నిబంధన చేసేలా మీరు కోరుకున్న విధంగా మీరు వారిని పరిపాలించేలా చేస్తాను” అని చెప్పాడు. కాబట్టి దావీదు అబ్నేరును పంపించగా, అతడు సమాధానంతో వెళ్లాడు.
2SA 3:22 దాని తర్వాత దావీదు మనుష్యులు, యోవాబు తిరిగివస్తూ తమతో పాటు పెద్ద మొత్తంలో దోపుడుసొమ్మును తీసుకువచ్చారు. కాని వారు వచ్చేసరికి అబ్నేరు హెబ్రోనులో దావీదు దగ్గర లేడు. ఎందుకంటే దావీదు అతన్ని పంపివేశాడు, అతడు సమాధానంతో వెళ్లిపోయాడు.
2SA 3:23 యోవాబు అతనితో ఉన్న సైనికులందరూ వచ్చినప్పుడు నేరు కుమారుడైన అబ్నేరు రాజు దగ్గరకు వచ్చాడని, రాజు అతన్ని పంపివేయగా అతడు సమాధానంతో వెళ్లిపోయాడని యోవాబుకు తెలిసింది.
2SA 3:24 కాబట్టి యోవాబు రాజు దగ్గరకు వెళ్లి, “నీవు ఏమి చేశావు? అబ్నేరు నీ దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని ఎందుకు వెళ్లనిచ్చావు? ఇప్పుడు అతడు వెళ్లిపోయాడు!
2SA 3:25 నేరు కుమారుడైన అబ్నేరు ఎలాంటివాడో నీకు తెలుసు. నిన్ను మోసం చేయడానికి నీ కదలికలు గమనించడానికి నీవు ఏం చేస్తున్నావో తెలుసుకోవడానికే అతడు వచ్చాడు” అన్నాడు.
2SA 3:26 యోవాబు దావీదు దగ్గర నుండి వెళ్లి అబ్నేరును వెనుకకు పిలుచుకురమ్మని దూతలను పంపాడు. వారు వెళ్లి అతన్ని సిరా అనే బావి దగ్గరకు తీసుకువచ్చారు. అయితే ఇదంతా దావీదుకు తెలియదు.
2SA 3:27 అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు ఎవరూ వినకుండా అతనితో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి అతన్ని లోపలికి తీసుకెళ్లి తన సోదరుడైన అశాహేలును చంపినందుకు ప్రతీకారంగా యోవాబు అబ్నేరు పొట్టలో కత్తితో పొడవగా అతడు చనిపోయాడు.
2SA 3:28 తర్వాత ఈ సంగతి తెలిసిన దావీదు, “నేరు కుమారుడైన అబ్నేరు రక్తం విషయంలో నేను నా రాజ్యం ఎప్పటికీ యెహోవా దృష్టిలో నిర్దోషులమే.
2SA 3:29 ఈ హత్యచేసిన పాపం యోవాబు మీద అతని కుటుంబమంతటి మీదనే ఉంటుంది. యోవాబు కుటుంబంలో ఎప్పుడూ పుండ్లు పడినవారు, కుష్ఠురోగులు, కర్ర సహాయంతో నడిచేవారు, కత్తితో చంపబడినవారు, తిండిలేనివారు ఉంటారు” అని చెప్పాడు.
2SA 3:30 (గిబియోను యుద్ధంలో అబ్నేరు తన సోదరుడైన అశాహేలును చంపినందుకు యోవాబు అతని సోదరుడైన అబీషై కలిసి పగతీర్చుకున్నారు.)
2SA 3:31 దావీదు, “మీ బట్టలు చింపుకుని గోనెబట్ట వేసుకుని అబ్నేరు ముందు నడుస్తూ దుఃఖించండి” అని యోవాబుకు అతనితో ఉన్న ప్రజలందరికి ఆజ్ఞాపించి, రాజైన దావీదు కూడా పాడె వెంట నడిచాడు.
2SA 3:32 వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టారు. రాజు అబ్నేరు సమాధి దగ్గర గట్టిగా ఏడ్చాడు, ప్రజలందరూ ఏడ్చారు.
2SA 3:33 రాజు అబ్నేరు గురించి ఒక శోకగీతం పాడాడు: “అబ్నేరు ఒక దుర్మార్గుడు చనిపోయినట్లుగా చనిపోవాలా?
2SA 3:34 నీ చేతులకు కట్లులేవు, కాళ్లకు సంకెళ్ళు లేవు దుష్టుని ముందు ఒకడు పడినట్లుగా నీవు పడ్డావు.” ఇది విని ప్రజలందరూ అతని కోసం మరింత గట్టిగా ఏడ్చారు.
2SA 3:35 ఇంకా వెలుగుగా ఉన్నప్పుడే ప్రజలందరూ దావీదు దగ్గరకు వచ్చి భోజనం చేయమని బ్రతిమిలాడారు కాని దావీదు ఒట్టు పెట్టుకుని, “సూర్యాస్తమయానికి ముందు నేను ఏమైనా ఆహారం తింటే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షించును గాక” అన్నాడు.
2SA 3:36 ప్రజలందరు అది తెలుసుకుని సంతోషించారు; నిజానికి రాజు చేసిన ప్రతిదీ వారికి సంతోషాన్ని కలిగించింది.
2SA 3:37 నేరు కుమారుడైన అబ్నేరు హత్యతో రాజుకు ఎటువంటి సంబంధం లేదని ప్రజలందరికి, ఇశ్రాయేలీయులందరికి ఆ రోజు తెలిసింది.
2SA 3:38 రాజు తన సేవకులతో, “ఈ రోజు ఇశ్రాయేలు ఒక గొప్ప దళాధిపతిని, ఒక గొప్పవాన్ని కోల్పోయిందని మీకు తెలుసా?
2SA 3:39 నేను రాజుగా అభిషేకించబడినా ఈ రోజు నేను బలహీనుడిని అయిపోయాను. ఈ సెరూయా కుమారులు నా కంటే బలవంతులు. ఈ చెడ్డ పని చేసినవాడికి యెహోవాయే తగిన శిక్ష విధించి ప్రతీకారం చేస్తారు” అన్నాడు.
2SA 4:1 సౌలు కుమారుడైన ఇష్-బోషెతుకు హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడని తెలిసినప్పుడు అతడు భయపడ్డాడు. ఇశ్రాయేలీయులందరు ఆందోళన చెందారు.
2SA 4:2 సౌలు కుమారునికి ఇద్దరు సైన్యాధికారులు ఉన్నారు; ఒకని పేరు బయనా రెండవ వాని పేరు రేకాబు; వారు బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులు. బెయేరోతు బెన్యామీనీయుల దేశానికి చెందిన భూభాగము.
2SA 4:3 అయితే బెయేరోతు ప్రజలు గిత్తయీముకు పారిపోయి విదేశీయులుగా నేటి వరకు అక్కడే స్థిరపడి ఉన్నారు.
2SA 4:4 (సౌలు కుమారుడైన యోనాతానుకు రెండు కాళ్లు కుంటివైన ఒక కుమారుడు ఉన్నాడు. యెజ్రెయేలు నుండి సౌలు గురించి యోనాతాను గురించి వార్త వచ్చినప్పుడు వానికి అయిదు సంవత్సరాలు. అతని ఆయా వానిని తీసుకుని పారిపోయే తొందరలో ఉన్నప్పుడు అతడు క్రిందపడి కుంటివాడయ్యాడు. వాని పేరు మెఫీబోషెతు.)
2SA 4:5 బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులైన రేకాబు, బయనా ఇష్-బోషెతు ఇంటికి బయలుదేరారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో అతడు విశ్రాంతి తీసుకుంటుండగా వారు అక్కడికి వచ్చారు.
2SA 4:6 వారు గోధుమలు తెస్తున్నట్లు నటించి ఇంటి లోపలికి వెళ్లి పడుకున్న ఇష్-బోషెతు కడుపులో పొడిచారు. రేకాబు అతని సోదరుడు బయనా తప్పించుకుని పారిపోయారు.
2SA 4:7 అతడు తన మంచంపై పడుకుని నిద్రపోతున్నప్పుడు వారు ఇంటి లోపలికి వెళ్లారు. వారు అతన్ని పొడిచి చంపిన తర్వాత అతని తల నరికి తమతో తీసుకెళ్లి రాత్రంతా అరాబా గుండా ప్రయాణం చేశారు.
2SA 4:8 హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు ఇష్-బోషెతు తల తీసుకువచ్చి రాజుతో, “రాజా! నిన్ను చంపాలనుకున్న నీ శత్రువు సౌలు కుమారుడైన ఇష్-బోషెతు తల ఇదిగో. ఈ రోజున నా ప్రభువు రాజువైన నీ పక్షంగా సౌలుకు అతని సంతానానికి యెహోవా ప్రతీకారం చేశారు” అన్నాడు.
2SA 4:9 దావీదు బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులైన రేకాబు, అతని సోదరుడు బయనాకు ఇలా జవాబిచ్చాడు: “నిశ్చయంగా, అన్ని కష్టాల నుండి నన్ను విడిపించిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న,
2SA 4:10 మంచివార్త తెచ్చాననుకుని ఒకడు నాతో సౌలు చనిపోయాడని చెప్పినప్పుడు నేను అతన్ని పట్టుకుని సిక్లగులో చంపించాను. ఇదే నేను అతనికి ఇచ్చిన బహుమానము.
2SA 4:11 అలాంటప్పుడు, దుర్మార్గులైన మీరు ఒక అమాయకున్ని అతని ఇంట్లోనే అతని మంచంపైనే చంపితే, మీరు చేసిన హత్యకు శిక్షించకుండా ఉంటానా? మిమ్మల్ని ఈ లోకం నుండి తుడిచివేయకుండా ఉంటానా?”
2SA 4:12 వెంటనే దావీదు తన సైనికులకు ఆజ్ఞ ఇవ్వగా వారు ఆ ఇద్దరిని చంపేశారు. వారి కాళ్లు చేతులు నరికి వారి శవాలను హెబ్రోను కొలను దగ్గర తగిలించారు. ఇష్-బోషెతు తల తీసుకెళ్లి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు.
2SA 5:1 ఇశ్రాయేలు గోత్రాలన్నీ హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చి, “మేము నీ రక్తసంబంధులము.
2SA 5:2 గతంలో సౌలు మాపై రాజుగా ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు సైన్యాన్ని నీవే నడిపించావు. యెహోవా నీతో, ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు కాపరిగా ఉంటావు, వారిని పరిపాలిస్తావు’ అని చెప్పారు” అని అన్నారు.
2SA 5:3 ఇశ్రాయేలు పెద్దలందరు హెబ్రోనులో ఉన్న రాజైన దావీదు దగ్గరకు వచ్చినప్పుడు, రాజు హెబ్రోనులో యెహోవా ఎదుట వారితో ఒక ఒడంబడిక చేశాడు; వారు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారు.
2SA 5:4 దావీదు ముప్పై సంవత్సరాల వయస్సులో రాజై నలభై సంవత్సరాలు పరిపాలించాడు.
2SA 5:5 హెబ్రోనులో యూదా వారిని ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించగా యెరూషలేములో ఇశ్రాయేలు, యూదా వారిని ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.
2SA 5:6 యెబూసీయుల మీద దాడి చేయడానికి రాజు, అతని మనుష్యులు యెరూషలేముకు వెళ్లారు. దావీదు లోపలికి రాలేడని భావించిన యెబూసీయులు దావీదుతో, “నీవు లోపలికి రాలేవు; ఇక్కడున్న గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తరిమివేస్తారు” అన్నారు.
2SA 5:7 అయినా దావీదు సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు. దానిని దావీదు పట్టణం అంటారు.
2SA 5:8 ఆ రోజే దావీదు, “యెబూసీయుల మీద దాడి చేయాలనుకునేవారు నీటి సొరంగం గుండా వెళ్లి దావీదు శత్రువులైన గ్రుడ్డివారిని కుంటివారిని చంపాలి” అన్నాడు. ఆ కారణంగానే, “గ్రుడ్డివారు కుంటివారు రాజభవనం లోపలికి రాలేరు” అనే సామెత పుట్టింది.
2SA 5:9 దావీదు కోటలో నివాసం ఏర్పరచుకున్నాడు, దానికి దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. అతడు మిద్దె నుండి ఆ స్థలం లోపల కోట కట్టించాడు.
2SA 5:10 సైన్యాల యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి దావీదు అంతకంతకు శక్తిమంతుడయ్యాడు.
2SA 5:11 తూరు రాజైన హీరాము దావీదు దగ్గరకు దూతలను, వారితో పాటు దేవదారు దుంగలను, వడ్రంగివారిని, రాళ్లతో పనిచేసే మేస్త్రీలను పంపాడు. వారు దావీదుకు రాజభవనం నిర్మించారు.
2SA 5:12 ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరిచారని, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం తన రాజ్యాన్ని గొప్ప చేశారని దావీదు గ్రహించాడు.
2SA 5:13 హెబ్రోను నుండి వచ్చిన తర్వాత దావీదు యెరూషలేములో మరికొందరిని భార్యలుగా ఉపపత్నులుగా చేసుకున్న తర్వాత ఇంకా చాలామంది కుమారులు కుమార్తెలు పుట్టారు.
2SA 5:14 యెరూషలేములో అతనికి పుట్టిన పిల్లల పేర్లు ఇవి: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,
2SA 5:15 ఇభారు, ఎలీషువ, నెఫెగు, యాఫీయ,
2SA 5:16 ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు.
2SA 5:17 ఇశ్రాయేలు అంతటి మీద దావీదును రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు విని, అతన్ని పట్టుకోవడానికి సైన్యమంతటితో బయలుదేరి వచ్చారు, అయితే దావీదు ఆ సంగతి విని సురక్షిత స్థలానికి వెళ్లాడు.
2SA 5:18 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయను విస్తరించారు.
2SA 5:19 అప్పుడు దావీదు, “నేను వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేయాలా? మీరు నాకు వారిని అప్పగిస్తారా?” అని యెహోవాను అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు, నేను వారిని తప్పకుండా నీ చేతికి అప్పగిస్తాను” అని అతనికి జవాబిచ్చారు.
2SA 5:20 కాబట్టి దావీదు బయల్-పెరాజీముకు వెళ్లి వారిని ఓడించాడు. అతడు, “నీళ్లు కొట్టుకుపోయినట్లుగా యెహోవా నా శత్రువులను నా ఎదుట ఉండకుండా నాశనం చేశారు” అని చెప్పి ఆ స్థలానికి బయల్-పెరాజీము అని పేరు పెట్టాడు.
2SA 5:21 ఫిలిష్తీయులు తమ విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి పారిపోగా దావీదు అతని మనుష్యులు వాటిని పట్టుకెళ్లారు.
2SA 5:22 మరోసారి ఫిలిష్తీయులు లేచి రెఫాయీము లోయలో గుమికూడారు.
2SA 5:23 కాబట్టి దావీదు యెహోవా దగ్గర విచారణ చేసినప్పుడు యెహోవా, “నీవు తిన్నగా వెళ్లకుండా చుట్టూ తిరిగివెళ్లి వారి వెనుక నుండి కంబళి చెట్లకు ఎదురుగా వారిమీద దాడి చేయి.
2SA 5:24 కంబళి చెట్ల కొనల్లో అడుగుల శబ్దం వినబడగానే వేగంగా కదులు ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని నాశనం చేయడానికి యెహోవా నీకు ముందుగా వెళ్లారని దాని అర్థం” అని అతనికి జవాబిచ్చారు.
2SA 5:25 కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే దావీదు చేశాడు, అతడు గిబియోను నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముతూ వారిని హతం చేశాడు.
2SA 6:1 దావీదు మరలా ఇశ్రాయేలీయులలో ముప్పైవేలమంది సామర్థ్యంగల యువకులను సమకూర్చుకున్నాడు.
2SA 6:2 కెరూబుల మధ్య ఆసీనుడైన సైన్యాల యెహోవా అని పిలువబడే దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు, అతనితో ఉన్న మనుష్యులందరు యూదాలోని బయలాకు వెళ్లారు.
2SA 6:3 వారు కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటి నుండి దేవుని మందసాన్ని క్రొత్త బండిమీద ఎక్కించారు. అబీనాదాబు కుమారులైన ఉజ్జా, అహియోలు ఆ బండిని తోలుతుండగా అహియో దాని ముందు నడిచాడు.
2SA 6:5 దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, దేవదారు కర్రతో చేసిన చిరతలు, సితారలు, వీణలు, తంబురలు, డప్పులు, తాళాలు వాయిస్తూ తమ శక్తి అంతటితో యెహోవా ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.
2SA 6:6 వారు నాకోను నూర్పిడి కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు, ఎడ్లు తడబడినందుకు ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు.
2SA 6:7 ఉజ్జా చేసిన తప్పును బట్టి యెహోవా కోపం అతని మీద రగులుకుని దేవుడు అతన్ని మొత్తగా అతడు దేవుని మందసం ప్రక్కనే పడి చనిపోయాడు.
2SA 6:8 యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకున్నందుకు దావీదుకు కోపం వచ్చింది కాబట్టి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకు దానికి అదే పేరు.
2SA 6:9 ఆ రోజు దావీదు యెహోవాకు భయపడి, “యెహోవా మందసాన్ని నా దగ్గరకు ఎలా తెచ్చుకోవాలి?” అని అనుకున్నాడు.
2SA 6:10 యెహోవా మందసాన్ని తనతో పాటు దావీదు పట్టణానికి తీసుకెళ్లడానికి అతడు ఇష్టపడలేదు, కాబట్టి దావీదు దానిని గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంటికి తీసుకెళ్లాడు.
2SA 6:11 యెహోవా మందసం గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంట్లోనే మూడు నెలలు ఉంది. యెహోవా అతన్ని, అతని ఇంటి వారినందరిని దీవించారు.
2SA 6:12 “దేవుని మందసం ఇంట్లో ఉండడం వల్ల ఓబేద్-ఎదోము కుటుంబమంతటిని అతనికి ఉన్న వాటినన్నిటిని యెహోవా ఆశీర్వదించారు” అని రాజైన దావీదుకు తెలిసింది. దేవుని మందసాన్ని ఓబేద్-ఎదోము ఇంటి నుండి దావీదు పట్టణానికి ఉత్సాహంతో తీసుకురావడానికి దావీదు వెళ్లాడు.
2SA 6:13 యెహోవా మందసాన్ని మోస్తున్న వ్యక్తులు నడిచేటప్పుడు దావీదు ప్రతి ఆరు అడుగులకు ఒక ఎద్దును, క్రొవ్విన దూడను బలిగా అర్పించాడు.
2SA 6:14 దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించి తన శక్తంతటితో యెహోవా సన్నిధిలో నాట్యం చేశాడు.
2SA 6:15 ఇలా దావీదు, ఇశ్రాయేలీయులందరు ఆనందోత్సాహాలతో బూరల ధ్వనితో యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు.
2SA 6:16 యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోనికి వస్తుండగా, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో రాజైన దావీదు గంతులు వేస్తూ నాట్యం చేయడం చూసి తన మనస్సులో అతన్ని నీచంగా చూసింది.
2SA 6:17 వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి, దావీదు దాని కోసం వేసిన గుడారంలో దానిని ఉంచారు, దావీదు యెహోవా సన్నిధిలో దహనబలులు సమాధానబలులు అర్పించాడు.
2SA 6:18 అతడు దహనబలులు సమాధానబలులు అర్పించిన తర్వాత, దావీదు సైన్యాల యెహోవా పేరిట ప్రజలను దీవించాడు.
2SA 6:19 అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరికి ప్రతి స్త్రీకి పురుషునికి ఒక రొట్టె, కొంత మాంసం, ఒక ఖర్జూర పండ్ల రొట్టె, ఒక ద్రాక్షపండ్ల రొట్టె ఇచ్చాడు. తర్వాత ప్రజలంతా ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు.
2SA 6:20 తన ఇంటివారిని దీవించడానికి దావీదు ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు సౌలు కుమార్తె మీకాలు ఎదురు వచ్చి అతనితో, “ఇశ్రాయేలు రాజు తన సేవకులైన బానిస అమ్మాయిలు చూస్తుండగా ఒక పిచ్చివాడు చేసినట్లుగా ఈ రోజు బట్టలు విప్పి అర్థనగ్నంగా ఎంత గొప్పగా కనబడ్డాడో!” అని హేళనగా మాట్లాడింది.
2SA 6:21 అందుకు దావీదు మీకాలుతో, “నీ తండ్రిని నీ తండ్రి ఇంటివారిని కాదని నన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించిన యెహోవా సన్నిధిలో నేను ఆనందిస్తూ నాట్యం చేశాను.
2SA 6:22 నేను ఇంతకన్నా ఎక్కువ అవమానపడినా నా దృష్టికి నేను తక్కువ వాడినైనా ఫర్వాలేదు, కాని నీవు చెప్తున్న బానిస అమ్మాయిల దృష్టిలో గౌరవించబడతాను” అన్నాడు.
2SA 6:23 సౌలు కుమార్తె మీకాలుకు ఆమె చనిపోయే వరకు పిల్లలు పుట్టలేదు.
2SA 7:1 నాలుగు వైపులా ఉన్న అతని శత్రులమీద యెహోవా అతనికి విజయాన్ని ఇచ్చి నెమ్మది కలిగించిన తర్వాత రాజు తన రాజభవనంలో స్థిరపడిన తర్వాత,
2SA 7:2 రాజు నాతాను ప్రవక్తతో, “ఇదిగో దేవుని మందసం గుడారంలో ఉంటుండగా నేను దేవదారు చెక్కలతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను” అన్నాడు.
2SA 7:3 అందుకు నాతాను రాజుతో, “యెహోవా నీకు తోడుగా ఉన్నారు కాబట్టి నీ మనస్సులో ఏముందో అది చేయి” అన్నాడు.
2SA 7:4 అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతాను దగ్గరకు ఇలా వచ్చింది:
2SA 7:5 “నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు: ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నివసించడానికి ఒక మందిరాన్ని కట్టించేది నీవా?
2SA 7:6 ఈజిప్టు నుండి నేను ఇశ్రాయేలీయులను తీసుకువచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నేను మందిరంలో నివసించలేదు. గుడారంలో నివసిస్తూ ఒకచోట నుండి మరో చోటికి తిరుగుతున్నాను.
2SA 7:7 ఇశ్రాయేలీయులందరితో నేను ఎక్కడికి వెళ్లినా, నా ఇశ్రాయేలు ప్రజలను కాయుమని నేను ఆజ్ఞాపించిన వారి పాలకుల్లో ఎవరితోనైనా, “నా కోసం దేవదారు కర్రలతో మందిరాన్ని ఎందుకు కట్టించలేదు” అని అడిగానా?’
2SA 7:8 “కాబట్టి ఇప్పుడు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, ‘సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: పచ్చిక మైదానంలో గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను తీసుకువచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు పాలకునిగా నియమించాను.
2SA 7:9 నీవెక్కడికి వెళ్లినా నేను నీకు తోడుగా ఉండి, నీ ఎదుట నిలబడకుండా నీ శత్రువులందరిని నాశనం చేశాను. ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవారికున్న పేరులాంటి గొప్ప పేరు నీకు ఇస్తాను.
2SA 7:10 నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎలాంటి తొందర లేకుండా వారి స్వస్థలంలో నివసించేలా వారిని అందులో నాటుతాను. గతంలో వారు చేసినట్లుగా దుర్మార్గులు వారిని ఇక బాధించరు,
2SA 7:11 అంతేకాదు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన కాలం నుండి జరిగినట్టు దుర్మార్గులు ఇక వారిని బాధించరు. నీ శత్రువులందరి నుండి నీకు నెమ్మది కలుగజేస్తాను. “ ‘యెహోవా నీకు చెప్పేది ఏంటంటే, యెహోవాయే నీ వంశాన్ని స్థిరపరుస్తారు.
2SA 7:12 నీ దినాలు ముగిసి నీవు నీ పూర్వికుల దగ్గరకు వెళ్లినప్పుడు నీ స్థానంలో నీ సంతానాన్ని, నీ సొంత కుమారులలో ఒకరిని నేను లేవనెత్తి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.
2SA 7:13 నా కోసం ఒక మందిరాన్ని కట్టేవాడు అతడే. నేను అతని రాజ్యసింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.
2SA 7:14 నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు. అతడు తప్పు చేసినప్పుడు మనుష్యుల దండంతో మనుష్యుల చేతుల దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను.
2SA 7:15 నీ ముందు నుండి నేను తొలగించిన సౌలుకు దూరం చేసినట్లుగా అతనికి నా ప్రేమను దూరం చేయను.
2SA 7:16 నా ఎదుట నీ ఇల్లు, నీ రాజ్యం ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. నీ సింహాసనం శాశ్వతంగా స్థాపించబడుతుంది.’ ”
2SA 7:17 నాతాను ఈ దర్శనంలోని మాటలన్నిటిని దావీదుకు చెప్పాడు.
2SA 7:18 అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్లి, యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు: “ప్రభువైన యెహోవా! మీరు నన్ను ఈ స్థితిలోనికి తీసుకురావడానికి నేనెంతటివాన్ని? నా కుటుంబం ఏపాటిది?
2SA 7:19 ప్రభువైన యెహోవా! మీ దృష్టిలో ఇది చాలదన్నట్టు మీ సేవకుని కుటుంబ భవిష్యత్తు గురించి కూడా తెలియజేశారు. ప్రభువైన యెహోవా! మామూలు మనుష్యుల పట్ల మీరు ఇంత కార్యం చేస్తారా?
2SA 7:20 “దావీదు మీతో ఇంతకన్నా ఎక్కువ ఏమి చెప్పగలడు? ప్రభువైన యెహోవా! మీ సేవకుని గురించి మీకు తెలుసు.
2SA 7:21 మీ మాట కోసం మీ చిత్తప్రకారం మీరు ఈ గొప్ప కార్యాన్ని చేసి మీ సేవకునికి తెలియజేశారు.
2SA 7:22 “ప్రభువైన యెహోవా! మీరు ఎంత గొప్పవారు! మా చెవులతో మేము విన్నట్లుగా మీలాంటి వారు లేరు, మీరు తప్ప వేరే దేవుడు లేడు.
2SA 7:23 మీ కోసం మీరు విడిపించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు వంటి ప్రజలు ఎవరు ఉన్నారు? వారి దేవుడవైన మీరు వారిని ఈజిప్టులో నుండి విడిపించి, మీ ప్రజల ఎదుట నుండి ఇతర దేశాలను వారి దేవుళ్ళను వెళ్లగొట్టినప్పుడు గొప్ప అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేసి మీకు గొప్ప పేరు తెచ్చుకున్నారు.
2SA 7:24 మీరు ఇశ్రాయేలు ప్రజలను నిత్యం మీ సొంత ప్రజలుగా స్థిరపరచి యెహోవావైన మీరు వారికి దేవుడయ్యారు.
2SA 7:25 “ఇప్పుడు దేవా, యెహోవా! మీ సేవకునికి అతని కుటుంబానికి మీరు చేసిన వాగ్దానాన్ని ఎల్లకాలం స్థిరపరచండి. మీరు వాగ్దానం చేసినట్టు చేయండి;
2SA 7:26 తద్వారా మీ పేరు ఎప్పటికీ గొప్పగా ఉంటుంది. అప్పుడు ప్రజలు, ‘సైన్యాల యెహోవాయే ఇశ్రాయేలీయుల దేవుడు’ అని అంటారు. మీ సేవకుడైన దావీదు వంశం మీ ఎదుట స్థిరపరచబడుతుంది.
2SA 7:27 “సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు దేవా, ‘నేను నీకు రాజవంశాన్ని స్థాపిస్తాను’ అని మీరు ఈ విషయాన్ని మీ సేవకునికి తెలియజేశారు. కాబట్టి మీకు ఈ ప్రార్థన ప్రార్థించడానికి మీ సేవకునికి ధైర్యం కలిగింది.
2SA 7:28 ప్రభువైన యెహోవా, మీరే దేవుడు! మీ మాటలు నమ్మదగినవి. మీ సేవకునికి ఈ మంచి విషయాలను వాగ్దానం చేశారు.
2SA 7:29 మీ సేవకుని వంశం నిత్యం మీ సన్నిధిలో ఉండేలా దీవించండి; ప్రభువైన యెహోవా, మీరు చెప్పినట్లుగా మీ దీవెనలతో మీ సేవకుని కుటుంబం శాశ్వతంగా దీవించబడుతుంది.”
2SA 8:1 కాలక్రమేణా దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోబరచుకున్నాడు, వారి ఆధీనంలో ఉన్న మెతెగ్ అమ్మాను స్వాధీనం చేసుకున్నాడు.
2SA 8:2 అలాగే దావీదు మోయాబీయులను కూడా ఓడించాడు. అతడు పట్టుకున్న వారిని నేలపై పడుకోబెట్టి త్రాడుతో వారిని కొలిపించాడు. అతడు వారిలో ప్రతి రెండు త్రాళ్ల పొడవున్న వారిని చంపి, మూడవ తాడు కొలతలో ఉన్నవారిని బ్రతకనిచ్చాడు. కాబట్టి మోయాబీయులు దావీదుకు లోబడి అతనికి కప్పం చెల్లించారు.
2SA 8:3 రెహోబు కుమారుడు సోబా రాజైన హదదెజెరు యూఫ్రటీసు నది దగ్గర తన స్థూపాన్ని నిలబెట్టడానికి బయలుదేరినప్పుడు దావీదు అతన్ని ఓడించాడు.
2SA 8:4 దావీదు అతని దగ్గర నుండి 1,000 రథాలను, 7,000 రథసారధులను, 20,000 మంది సైనికులను పట్టుకున్నాడు. వాటిలో వంద రథాలకు సరిపడా గుర్రాలను ఉంచుకుని మిగతా వాటికి చీలమండల నరాలు తెగగొట్టాడు.
2SA 8:5 సోబా రాజైన హదదెజెరుకు సహాయం చేయడానికి దమస్కులో ఉన్న అరామీయులు వచ్చినప్పుడు, దావీదు వారిలో 22,000 మందిని చంపాడు.
2SA 8:6 దమస్కులో ఉన్న అరామీయుల దేశంలో అతడు తన సైనిక దళాలను ఉంచగా, అరామీయులు అతనికి దాసులై కప్పం చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయాన్ని ఇచ్చారు.
2SA 8:7 దావీదు హదదెజెరు సైన్యాధిపతులకు చెందిన బంగారు డాళ్లను తీసుకుని వాటిని యెరూషలేముకు తెచ్చాడు.
2SA 8:8 హదదెజెరుకు చెందిన తెబా బెరోతయి అనే పట్టణాల నుండి రాజైన దావీదు పెద్ద మొత్తంలో ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు.
2SA 8:9 హదదెజెరు సైన్యమంతటిని దావీదు ఓడించిన సంగతి హమాతు రాజైన తోయు విన్నప్పుడు,
2SA 8:10 అతడు తన కుమారుడైన యోరామును రాజైన దావీదు దగ్గరకు అతని క్షేమం గురించి తెలుసుకుని అతనికి శుభాకాంక్షలు చెప్పడానికి పంపాడు, ఎందుకంటే హదదెజెరుకు తోయుకు మధ్య విరోధం ఉంది. యోరాము బంగారం వెండి ఇత్తడితో చేసిన అన్ని రకాల వస్తువులను తెచ్చాడు.
2SA 8:11 రాజైన దావీదు ఈ వస్తువులను తాను జయించిన అన్ని దేశాలు నుండి, అనగా ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు, అమాలేకీయుల దేశాల నుండి స్వాధీనం చేసుకున్న వెండి బంగారాలను ప్రతిష్ఠించిన విధంగానే యెహోవాకు ప్రతిష్ఠించాడు. అంతేకాక, రెహోబు కుమారుడు సోబా రాజైన హదదెజెరు నుండి స్వాధీనం చేసుకున్న వాటిని యెహోవాకు ప్రతిష్ఠించాడు.
2SA 8:13 దావీదు ఉప్పు లోయలో 18,000 మంది ఎదోమీయులను చంపి తిరిగివచ్చిన తర్వాత అతడు చాలా పేరు గడించాడు.
2SA 8:14 అతడు ఎదోము దేశమంతటా సైనిక దళాలను ఉంచాడు. ఎదోమీయులంతా దావీదుకు లొంగిపోయారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయమిచ్చారు.
2SA 8:15 దావీదు ఇశ్రాయేలంతటిని పరిపాలిస్తూ తన ప్రజలందరికి న్యాయాన్ని ధర్మాన్ని జరిగించాడు.
2SA 8:16 సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల మీద అధికారి.
2SA 8:17 అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులు; శెరాయా కార్యదర్శి.
2SA 8:18 యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకు పెలేతీయులకు అధిపతి. దావీదు కుమారులు యాజకులు.
2SA 9:1 ఒకసారి దావీదు, “యోనాతాను బట్టి నేను దయ చూపించడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు.
2SA 9:2 సౌలు కుటుంబానికి సీబా అనే సేవకుడు ఉండేవాడు. వారు అతన్ని పిలిపించి దావీదు ఎదుట నిలబెట్టినప్పుడు రాజు అతన్ని, “నీవు సీబావా?” అని అడిగాడు. అందుకు వాడు, “అవును, రాజా” అన్నాడు.
2SA 9:3 అప్పుడు రాజు, “దేవుడు నాకు దయచూపించినట్లుగా నేను దయచూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు. అందుకు సీబా రాజుతో, “యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు; అతని రెండు కాళ్లు కుంటివి” అని చెప్పాడు.
2SA 9:4 “అతడెక్కడ ఉన్నాడు?” అని రాజు అడిగాడు. అందుకు సీబా, “అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంట్లో ఉన్నాడు” అని చెప్పాడు.
2SA 9:5 అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపించి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించాడు.
2SA 9:6 సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు దగ్గరకు వచ్చి అతని ఎదుట తల నేలకు వంచి నమస్కరించాడు. దావీదు, “మెఫీబోషెతూ!” అని పిలిచాడు. అతడు, “నేను నీ సేవకుడిని” అని సమాధానం ఇచ్చాడు.
2SA 9:7 దావీదు అతనితో, “భయపడకు, నీ తండ్రి యోనాతాను బట్టి నేను నీ మీద దయ చూపిస్తాను. నీ తాత సౌలుకు చెందిన భూమంతటిని నీకు మరలా ఇప్పిస్తాను, నీవు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు” అన్నాడు.
2SA 9:8 అప్పుడు మెఫీబోషెతు నమస్కారం చేసి, “చచ్చిన కుక్కలాంటి నా పట్ల నీవు దయ చూపడానికి నీ సేవకుడనైన నేను ఎంతటివాన్ని?” అన్నాడు.
2SA 9:9 అప్పుడు రాజైన దావీదు సౌలు సహాయకుడైన సీబాను పిలిపించి, “సౌలుకు అతని కుటుంబానికి చెందిన సమస్తాన్ని నీ యజమాని మనుమడికి ఇప్పించాను.
2SA 9:10 నీవు, నీ కుమారులు నీ పనివారు అతని కోసం ఆ భూమిని సాగుచేసి నీ యాజమాని మనుమడికి కావలసిన ఆహారాన్ని ఆ పంట నుండి తీసుకురావాలి. కాని నీ యాజమాని మనుమడైన మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు” అని చెప్పాడు. (సీబాకు పదిహేను మంది కుమారులు, ఇరవైమంది పనివారున్నారు.)
2SA 9:11 అప్పుడు సీబా, “నా ప్రభువైన రాజు తన సేవకుడనైన నాకు చేయమని ఆజ్ఞాపించిన దాన్నంతా చేస్తాను” అన్నాడు. అప్పటినుండి మెఫీబోషెతు ఒక రాకుమారునిలా రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ వచ్చాడు.
2SA 9:12 మెఫీబోషెతుకు చిన్నకుమారుడు ఉన్నాడు. అతని పేరు మీకా. సీబా ఇంట్లో ఉన్నవారందరు మెఫీబోషెతుకు సేవకులు.
2SA 9:13 మెఫీబోషెతు యెరూషలేములో నివసించి నిత్యం రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉన్నాడు. అతని రెండు కాళ్లు కుంటివి.
2SA 10:1 కొంతకాలం తర్వాత అమ్మోనీయుల రాజు చనిపోగా, అతని స్థానంలో అతని కుమారుడు హానూను రాజయ్యాడు.
2SA 10:2 అప్పుడు దావీదు, “హానూను తండ్రియైన నాహాషు నా మీద దయ చూపించినట్లే నేను హామాను మీద దయ చూపిస్తాను” అని అనుకున్నాడు. కాబట్టి అతని తండ్రి విషయంలో తన సానుభూతి తెలుపడానికి దావీదు తన ప్రతినిధులను పంపించాడు. దావీదు మనుష్యులు అమ్మోనీయుల దేశానికి చేరుకున్నపుడు,
2SA 10:3 అమ్మోనీయుల దళాధిపతులు తమ ప్రభువైన హానూనుతో, “నీ తండ్రిని గౌరవించడానికి నీకు సానుభూతి తెలుపాలని దావీదు దూతలను పంపాడని అనుకుంటున్నావా? దావీదు వారిని పంపింది కేవలం పట్టణాన్ని పరిశోధించి, దాన్ని వేగుచూసి పడగొట్టడానికి కాదా?” అని అన్నారు.
2SA 10:4 అందువల్ల హానూను దావీదు దూతలను పట్టుకుని ఒక్కొక్కరికి సగం గడ్డం గీసి, పిరుదుల దగ్గర వారి వస్త్రాలు కత్తిరించి పంపించేశాడు.
2SA 10:5 ఈ సంగతి దావీదుకు తెలిసినప్పుడు, వారు చాలా అవమానించబడ్డారని గ్రహించి, వారి దగ్గరకు మనుష్యులను పంపించాడు. రాజు, “మీ గడ్డాలు పెరిగే వరకు యెరికో పట్టణంలో ఉండి, ఆ తర్వాత రండి” అని చెప్పాడు.
2SA 10:6 దావీదుకు తాము కోపం తెప్పించామని అమ్మోనీయులు గ్రహించి, బేత్-రెహోబు నుండి సోబా నుండి 20,000 మంది అరామీయుల కాల్బలాన్ని, అలాగే మయకా రాజును, అతని నుండి 1,000 మంది సైనికులను, టోబు నుండి 12,000 మంది సైనికులను కిరాయికి తీసుకున్నారు.
2SA 10:7 ఇది విన్న దావీదు యోవాబును యుద్ధ సైనికులందరితో సహా పంపించాడు.
2SA 10:8 అమ్మోనీయులు బయటకు వచ్చి తమ పట్టణ ద్వారం దగ్గర యుద్ధ పంక్తులు తీర్చారు. సోబా, రెహోబు నుండి వచ్చిన అరామీయులు, అలాగే టోబు, మయకా నుండి వచ్చినవారు విడివిడిగా పొలాల్లో ఉన్నారు.
2SA 10:9 యోవాబు తన ముందు వెనుకా యుద్ధ పంక్తులు ఉండడం చూశాడు; ఇశ్రాయేలులో కొందరు అత్యుత్తమ దళాలను ఎంపికచేసి, వారిని అరామీయులకు ఎదురుగా మోహరించాడు.
2SA 10:10 మిగిలిన వారిని తన సోదరుడైన అబీషై ఆధీనంలో ఉంచి వారిని అమ్మోనీయులకు ఎదురుగా మోహరించాడు.
2SA 10:11 యోవాబు, “అరామీయులను ఎదుర్కోవడం నాకు కష్టమైనప్పుడు నన్ను రక్షించడానికి నీవు రావాలి. అమ్మోనీయులను ఎదుర్కోవడం నీకు కష్టమైనప్పుడు నిన్ను రక్షించడానికి నేను వస్తాను.
2SA 10:12 ధైర్యంగా ఉండు. మన ప్రజల కోసం, మన దేవుని పట్టణాల కోసం ధైర్యంగా పోరాడదాం. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తారు” అని అబీషైతో చెప్పాడు.
2SA 10:13 అప్పుడు యోవాబు అతనితో ఉన్న దళాలు అరామీయులతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్లగా, అతన్ని ఎదుర్కోలేక వారు పారిపోయారు.
2SA 10:14 అరామీయులు పారిపోయారని గ్రహించిన అమ్మోనీయులు అబీషై ఎదుట నుండి పారిపోయి పట్టణంలోకి వెళ్లారు. అమ్మోనీయులతో పోరాటం మాని యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
2SA 10:15 తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని గ్రహించిన అరామీయులు మళ్ళీ గుంపుగా కలిశారు.
2SA 10:16 హదదెజరు యూఫ్రటీసు నది అవతల ఉన్న అరామీయులను పిలిపించాడు; వారు హేలాముకు వెళ్లారు. హదదెజెరు సేనాధిపతియైన షోబకు వారిని నడిపించాడు.
2SA 10:17 దావీదుకు ఈ సంగతి తెలిసినప్పుడు, అతడు ఇశ్రాయేలు అంతటిని సమకూర్చి యొర్దాను నది దాటి హేలాముకు వెళ్లాడు. దావీదును ఎదుర్కొని యుద్ధం చేయడానికి అరామీయులు యుద్ధరంగంలోనికి దిగి అతనితో యుద్ధం చేశారు.
2SA 10:18 అయితే అరామీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువలేక పారిపోయారు. దావీదు వారిలో 700 మంది రథసారధులను 40,000 మంది సైనికులను చంపాడు. అలాగే వారి సైన్యాధిపతియైన షోబకును కూడా చంపాడు.
2SA 10:19 హదదెజెరు సేవకులైన సామంత రాజులందరూ తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతున్నామని గ్రహించి వారితో సమాధానపడి లొంగిపోయారు. అప్పటినుండి అరామీయులు అమ్మోనీయులకు సహాయం చేయడానికి భయపడ్డారు.
2SA 11:1 వసంతకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, దావీదు యోవాబును తన మనుష్యులతో ఇశ్రాయేలు సైన్యమంతటితో పంపించగా, వారు అమ్మోనీయులను నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించారు. కాని దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు.
2SA 11:2 ఒక రోజు సాయంత్రం దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం పైకప్పు మీద నడుస్తూ, అక్కడినుండి ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆ స్త్రీ చాలా అందంగా ఉంది.
2SA 11:3 ఆమె గురించి వివరాలు తెలుసుకొని రమ్మని దావీదు ఒక వ్యక్తిని పంపించాడు. అతడు వచ్చి, “ఆమె ఎలీయాము కుమార్తెయైన బత్షెబ, హిత్తీయుడైన ఊరియాకు భార్య” అని చెప్పాడు.
2SA 11:4 ఆమెను తీసుకురావడానికి దావీదు తన మనుష్యులను పంపించాడు. ఆమె అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఆమెతో పడుకున్నాడు. ఆమె తనకు కలిగిన అపవిత్రతను శుద్ధి చేసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది.
2SA 11:5 ఆ స్త్రీ గర్భం ధరించగా, “నేను గర్భవతినయ్యాను” అని దావీదుకు కబురు పంపింది.
2SA 11:6 అప్పుడు దావీదు, “హిత్తీయుడైన ఊరియాను నా దగ్గరకు పంపించు” అని యోవాబుకు కబురు చేయగా యోవాబు అతన్ని దావీదు దగ్గరకు పంపాడు.
2SA 11:7 ఊరియా తన దగ్గరకు వచ్చినప్పుడు దావీదు అతన్ని, యోవాబు ఎలా ఉన్నాడో సైనికులు ఎలా ఉన్నారో యుద్ధం ఎలా జరుగుతుందో అడిగాడు.
2SA 11:8 తర్వాత దావీదు ఊరియాతో, “నీవు ఇంటికి వెళ్లి పాదాలు కడుక్కో” అని చెప్పాడు. ఊరియా రాజభవనం నుండి వెళ్లిపోయాడు. అతని వెనుక రాజు అతనికి కానుక పంపించాడు.
2SA 11:9 అయితే ఊరియా తన ఇంటికి వెళ్లకుండా తన రాజు సేవకులందరితో కలిసి రాజభవన ద్వారం దగ్గరే నిద్రపోయాడు.
2SA 11:10 ఊరియా ఇంటికి వెళ్లలేదని దావీదు విని ఊరియాను పిలిచి, “నీవు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చావు కదా! ఇంటికి ఎందుకు వెళ్లలేదు?” అని అడిగాడు.
2SA 11:11 అందుకు ఊరియా దావీదుతో, “మందసం, ఇశ్రాయేలీయులు, యూదా వారు గుడారాల్లోనే ఉంటున్నారు. నా దళాధిపతియైన యోవాబు, నా ప్రభువు యొక్క సైనికులు పొలిమేరల్లో ఉన్నారు. అలాంటప్పుడు నేను ఇంటికి వెళ్లి తిని త్రాగి, నా భార్యతో ఎలా సంతోషించగలను? నీ జీవం తోడు, నేను అలా చేయను” అన్నాడు.
2SA 11:12 అందుకు దావీదు, “సరే, ఈ రోజు కూడా ఇక్కడే ఉండు. రేపు నేను నిన్ను వెనుకకు పంపిస్తాను” అని ఊరియాతో చెప్పాడు. కాబట్టి ఊరియా ఆ రోజు, మరుసటిరోజు యెరూషలేములోనే ఉండిపోయాడు.
2SA 11:13 దావీదు అతన్ని పిలిపించి, అతనితో కలిసి తిని త్రాగి అతనికి బాగా మత్తెక్కేలా త్రాగించాడు. అయినా సాయంకాలం అతడు ఇంటికి వెళ్లకుండా తన రాజు సేవకుల మధ్యలో తన పడక మీద పడుకున్నాడు.
2SA 11:14 ఉదయానే దావీదు యోవాబుకు ఉత్తరం వ్రాసి ఊరియా చేత పంపించాడు.
2SA 11:15 ఆ ఉత్తరంలో అతడు, “యుద్ధం తీవ్రంగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టు. అతడు దెబ్బతిని చనిపోయేలా చేసి నీవు అక్కడినుండి వెళ్లిపో” అని వ్రాశాడు.
2SA 11:16 యోవాబు పట్టణాన్ని ముట్టడిస్తుండగా బలమైన శత్రుసైనికులు ఉన్న చోటికి అతడు ఊరియాను పంపాడు.
2SA 11:17 ఆ పట్టణస్థులు బయటకు వచ్చి యోవాబుతో యుద్ధం చేసినప్పుడు దావీదు సైనికుల్లో కొంతమంది చనిపోయారు. హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు.
2SA 11:18 యోవాబు యుద్ధ సమాచారమంతా దావీదుకు పంపించాడు.
2SA 11:19 అతడు ఆ దూతకు ఇచ్చిన ఆదేశమేమిటంటే, “నీవు రాజుకు యుద్ధ సమాచారమంతా చెప్పిన తర్వాత,
2SA 11:20 రాజు కోపం తెచ్చుకుని, ‘యుద్ధం చేయడానికి పట్టణానికి అంత దగ్గరగా మీరెందుకు వెళ్లారు? వారు గోడ పైనుండి బాణాలు వేస్తారని మీకు తెలియదా?
2SA 11:21 యెరుబ్-బెషెతు కుమారుడైన అబీమెలెకును ఎవరు చంపారు? ఒక స్త్రీ గోడ పైనుండి అతనిపై తిరగలి రాయి వేసినందుకు అతడు తేబేసు దగ్గర చనిపోయాడు గదా? మీరు గోడ దగ్గరకు ఎందుకు వెళ్లారు?’ అని అడిగితే నీవు, ‘మీ సేవకుడూ హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని చెప్పు” అన్నాడు.
2SA 11:22 ఆ దూత వెళ్లి యోవాబు పంపించిన సమాచారమంతా దావీదుకు చెప్పాడు.
2SA 11:23 ఆ దూత దావీదుతో, “ఆ మనుష్యులు మమ్మల్ని తరుముతూ పొలంలో మాపై దాడి చేశారు, కాని మేము వారిని పట్టణపు ద్వారం వరకు తరిమి కొట్టాము.
2SA 11:24 అప్పుడు గోడ పైనుండి విలుకాండ్రు మీ సేవకులపై బాణాలు వేయడంతో రాజు సైనికుల్లో కొంతమంది చనిపోయారు. మీ సేవకుడూ హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు” అన్నాడు.
2SA 11:25 దావీదు ఆ దూతతో, “నీవు యోవాబుతో ఇలా చెప్పు: ‘జరిగినదాన్ని బట్టి నీవు కంగారుపడకు; ఖడ్గం ఒకసారి ఒకరిని మరోసారి ఇంకొకరిని చంపుతుంది. ఆ పట్టణం మీద మీరు ముమ్మరంగా దాడిచేసి దానిని నాశనం చేయండి’ అని చెప్పి యోవాబును ధైర్యపరచు” అన్నాడు.
2SA 11:26 తన భర్త చనిపోయిన సంగతి విని ఊరియా భార్య అతని కోసం దుఃఖించింది.
2SA 11:27 దుఃఖ సమయం ముగిసిన తర్వాత దావీదు ఆమెను తన రాజభవనానికి రప్పించుకున్నాడు. ఆమె అతనికి భార్యయై ఒక కుమారుని కన్నది. అయితే దావీదు చేసిన పని యెహోవా దృష్టికి అసహ్యమైనది.
2SA 12:1 కాబట్టి యెహోవా నాతానును దావీదు దగ్గరకు పంపించారు. అతడు దావీదు దగ్గరకు వచ్చి అతనితో, “ఒక ఊరిలో ఇద్దరు మనుష్యులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు మరొకడు పేదవాడు.
2SA 12:2 ధనవంతునికి పెద్ద సంఖ్యలో గొర్రెలు, పశువులు ఉన్నాయి.
2SA 12:3 అయితే పేదవానికి తాను కొనుక్కున్న చిన్న ఆడ గొర్రెపిల్ల మాత్రమే ఉంది. అతడు దాన్ని పెంచుకున్నాడు. అది అతని దగ్గర అతని పిల్లల దగ్గర పెరుగుతూ, అతని చేతి ముద్దలు తింటూ, అతని గిన్నెలోనిది త్రాగుతూ అతని చేతుల మీద పడుకునేది. అది అతనికి కుమార్తెలా ఉండేది.
2SA 12:4 “ఒక రోజు ఒక బాటసారి ధనవంతుని దగ్గరకు వచ్చాడు. తన దగ్గరకు వచ్చిన ఆ బాటసారికి విందు చేయడానికి తన గొర్రెలను పశువులను ఉపయోగించడానికి అతడు ఇష్టపడలేదు. దానికి బదులు అతడు ఆ పేదవాని ఆడ గొర్రెను తీసుకుని తన దగ్గరకు వచ్చిన వానికి విందు చేశాడు” అని చెప్పాడు.
2SA 12:5 అది విని దావీదు ఆ ధనవంతునిపై తీవ్ర కోపం తెచ్చుకుని నాతానుతో, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న; ఆ పని చేసినవాడు తప్పనిసరిగా చావాలి!
2SA 12:6 వాడు జాలి లేకుండ అలాంటి పని చేసినందుకు వాడు ఆ గొర్రెపిల్లకు బదులుగా నాలుగు గొర్రెపిల్లలు ఇవ్వాలి” అన్నాడు.
2SA 12:7 అప్పుడు నాతాను దావీదుతో, “ఆ మనిషివి నీవే! ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాను. సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించాను.
2SA 12:8 నీ యజమాని ఇంటిని నీకు అప్పగించాను, అతని భార్యలను నీ కౌగిటిలోనికి చేర్చాను. ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను నీకు అప్పగించాను. ఇవన్నీ చాలవని నీవు అనుకుంటే నేను నీకు మరిన్ని ఇచ్చి ఉండేవాన్ని.
2SA 12:9 యెహోవా దృష్టికి చెడ్డదైన పనిని చేసి ఆయన మాటను ఎందుకు తృణీకరించావు? హిత్తీయుడైన ఊరియాను ఖడ్గంతో చనిపోయేలా చేసి అతని భార్యను నీ సొంతం చేసుకున్నావు. అమ్మోనీయుల ఖడ్గంతో అతడు చనిపోయేలా చేశావు.
2SA 12:10 నీవు నన్ను నిర్లక్ష్యం చేసి హిత్తీయుడైన ఊరియా భార్యను నీ సొంతం చేసుకున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని ఖడ్గం ఎన్నడూ విడిచిపెట్టదు.’
2SA 12:11 “యెహోవా చెప్పిన మాట ఇదే: ‘నీ సొంత కుటుంబంలో నుండే నేను నీమీదికి గొప్ప ఆపద రప్పిస్తాను. నీవు చూస్తూ ఉండగానే నేను నీ భార్యలను నీకు సన్నిహితులైన వారికి అప్పగిస్తాను. పట్టపగలే అతడు నీ భార్యలతో పడుకుంటాడు.
2SA 12:12 నీవు రహస్యంగా చేశావు గాని, నేనైతే దీన్ని పట్టపగలు ఇశ్రాయేలీయులందరి ముందే జరిగేలా చేస్తాను’ ” అని చెప్పాడు.
2SA 12:13 అప్పుడు దావీదు నాతానుతో, “నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను” అన్నాడు. అందుకు నాతాను, “యెహోవా నీ పాపాన్ని తొలగించారు. నీవు చావవు.
2SA 12:14 కానీ నీవు ఇలా చేయడం వల్ల యెహోవాను పూర్తిగా ధిక్కరించావు కాబట్టి, నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు” అని చెప్పాడు.
2SA 12:15 తర్వాత నాతాను తన ఇంటికి వెళ్లిపోయాడు, యెహోవా ఊరియా భార్య ద్వార దావీదుకు పుట్టిన బిడ్డను మొత్తగా ఆ బిడ్డకు జబ్బుచేసింది.
2SA 12:16 దావీదు బిడ్డ కోసం దేవున్ని వేడుకున్నాడు. అతడు ఉపవాసం ఉండి రాత్రులు గోనెపట్టలో నేలపై పడుకున్నాడు.
2SA 12:17 అతని ఇంట్లోని పెద్దలు అతని ప్రక్కన నిలబడి నేలపై నుండి అతన్ని లేపడానికి ప్రయత్నించారు కాని అతడు ఒప్పుకోలేదు, వారితో కలిసి భోజనం చేయలేదు.
2SA 12:18 ఏడవ రోజు ఆ బిడ్డ చనిపోయాడు. దావీదు సలహాదారులు, “బిడ్డ బ్రతికి ఉన్నప్పుడే అతడు మనం చెప్పిన ఏ మాట వినలేదు. బిడ్డ చనిపోయిన విషయం అతనికి ఎలా చెప్పగలం? చెప్తే తనకు తాను ఏదైనా హాని చేసుకుంటాడేమో” అనుకుని బిడ్డ చనిపోయిన విషయం అతనికి చెప్పడానికి భయపడ్డారు.
2SA 12:19 తన సలహాదారులు తమలో తాము గుసగుసలాడుకోవడం దావీదు చూసి, బిడ్డ చనిపోయాడని గ్రహించి, “బిడ్డ చనిపోయాడా?” అని అడిగాడు. వారు, “అవును చనిపోయాడు” అని జవాబిచ్చారు.
2SA 12:20 వెంటనే దావీదు నేలపై నుండి లేచి స్నానం చేసి నూనె రాసుకుని బట్టలు మార్చుకుని యెహోవా మందిరంలోనికి వెళ్లి ఆరాధించాడు. తర్వాత అతడు తన ఇంటికి తిరిగివచ్చి భోజనం తెమ్మని చెప్పాడు. వారు భోజనం వడ్డించగానే అతడు తిన్నాడు.
2SA 12:21 అతని సలహాదారులు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు మీరు ఉపవాసముండి ఏడ్చారు. కాని ఇప్పుడేమో ఆ బిడ్డ చనిపోయాక లేచి భోజనం చేస్తున్నారు. మీరు ఎందుకిలా చేస్తున్నారు?” అని అతన్ని అడిగారు.
2SA 12:22 అందుకతడు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు ‘ఒకవేళ యెహోవా నా మీద జాలి చూపించి బ్రతకనిస్తాడేమో’ అనుకుని ఉపవాసముండి ఏడ్చాను.
2SA 12:23 ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. నేనెందుకు ఉపవాసముండాలి? నేను అతన్ని మళ్ళీ బ్రతికించగలనా? నేనే వాని దగ్గరకు వెళ్లాలి తప్ప, వాడు నా దగ్గరకు తిరిగి రాడు కదా!” అని జవాబిచ్చాడు.
2SA 12:24 తర్వాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చాడు. అతడు ఆమెతో కలువగా ఆమె కుమారుని కన్నది. దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా అతన్ని ప్రేమించారు;
2SA 12:25 యెహోవా అతన్ని ప్రేమించారు కాబట్టి అతనికి యెదీద్యా అని పేరు పెట్టమని నాతాను ప్రవక్త ద్వారా కబురు పంపారు.
2SA 12:26 ఇంతలో యోవాబు అమ్మోనీయుల పట్టణమైన రబ్బామీద యుద్ధం చేసి రాజభవనాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
2SA 12:27 యోవాబు దూతల ద్వార ఈ వార్త దావీదుకు పంపిస్తూ, “నేను రబ్బామీద యుద్ధం చేసి ఆ పట్టణపు నీళ్ల సరఫరాను స్వాధీనం చేసుకున్నాను.
2SA 12:28 ఇప్పుడు నీవు మిగిలిన సైన్యాన్ని పంపి పట్టణాన్ని ముట్టడించి దానిని స్వాధీనం చేసుకో. లేకపోతే నేను ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాను అప్పుడు దానికి నా పేరు పెట్టబడుతుంది” అని కబురు పంపాడు.
2SA 12:29 కాబట్టి దావీదు సైన్యాన్నంతా తీసుకుని రబ్బాకు వెళ్లి దానిపై దాడిచేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు.
2SA 12:30 దావీదు వారి రాజు తలమీద నుండి కిరీటాన్ని తీసి తన తలమీద పెట్టుకున్నాడు. అది ఒక తలాంతు బరువు కలిగి ఉండి, ప్రశస్తమైన రాళ్లతో పొదిగించబడి ఉంది. దావీదు ఆ పట్టణం నుండి పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము తీసుకెళ్లాడు.
2SA 12:31 అక్కడి ప్రజలను బయటకు తీసుకువచ్చి రంపతో, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్ళతో కఠినమైన పని చేయించాడు. ఇటుక బట్టీలలో వారితో పని చేయించాడు. దావీదు అమ్మోనీయుల పట్టణాలన్నిటికి ఈ విధంగా చేశాడు. తర్వాత అతడు అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగి వచ్చారు.
2SA 13:1 దావీదు కుమారుడైన అబ్షాలోముకు తామారు అనే అందమైన చెల్లి ఉండగా దావీదు కుమారుడైన అమ్నోను తామారును గాఢంగా ప్రేమించాడు.
2SA 13:2 అమ్నోనుకు తన చెల్లి తామారుపై ఉన్న వ్యామోహంతో అతడు అనారోగ్యం పాలయ్యాడు. ఆమె కన్య కాబట్టి ఆమెను ఏమైన చేయడం సాధ్యం కాదని అతనికి అనిపించింది.
2SA 13:3 అమ్నోనుకు యెహోనాదాబు అనే ఒక సలహాదారుడు ఉన్నాడు. అతడు దావీదు అన్న షిమ్యా కుమారుడు. యెహోనాదాబు చాలా యుక్తిపరుడు.
2SA 13:4 అతడు అమ్నోనును చూసి, “రాజకుమారుడవైన నీవు రోజు రోజుకు ఎందుకు చిక్కిపోతున్నావు? విషయమేంటో నాకు చెప్పవా?” అని అడిగాడు. అమ్నోను అతనితో, “నేను నా సోదరుడైన అబ్షాలోము చెల్లి తామారును ప్రేమిస్తున్నాను” అన్నాడు.
2SA 13:5 అందుకు యెహోనాదాబు, “నీకు అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తూ మంచం మీద పడుకో. నీ తండ్రి నిన్ను చూడడానికి వచ్చినప్పుడు, ‘నా చెల్లి తామారు వచ్చి నాకు తినడానికి ఏదైనా ఇస్తే బాగుండేది. నా కళ్లముందు ఆమె భోజనం సిద్ధం చేసి, తన చేతితో నాకు తినిపించనివ్వండి’ అని నీ తండ్రితో చెప్పు” అన్నాడు.
2SA 13:6 కాబట్టి తనకు అనారోగ్యంగా ఉన్నట్లు నటిస్తూ అమ్నోను పడుకున్నాడు. రాజు అతన్ని చూడడానికి వచ్చినప్పుడు అమ్నోను, “నేను నా చెల్లి తామారు చేతితో తినేలా ఆమె వచ్చి నేను చూస్తుండగా నా కోసం ప్రత్యేకంగా రెండు రొట్టెలు చేయమని చెప్పండి” అని అడిగాడు.
2SA 13:7 కాబట్టి దావీదు తామారుకు, “నీ అన్న అమ్నోను ఇంటికి వెళ్లి, అతని కోసం భోజనం సిద్ధం చేయి” అని ఇంట్లో ఉన్న తామారుకు కబురు పంపాడు.
2SA 13:8 తామారు తన అన్న అమ్నోను ఇంటికి వెళ్లింది. అతడు ఇంకా పడుకునే ఉన్నాడు. ఆమె కొంత పిండి తీసుకుని కలిపి అతడు చూస్తుండగా రొట్టెలు చేసి కాల్చింది.
2SA 13:9 ఆమె ఆ రొట్టెలు వడ్డిస్తూ ఉంటే అతడు తినడానికి ఒప్పుకోలేదు. అమ్నోను, “అందరు బయటకు వెళ్లండి” అని చెప్పగానే అక్కడున్న వారందరు బయటకు వెళ్లిపోయారు.
2SA 13:10 అప్పుడు అమ్నోను తామారుతో, “భోజనం నా పడకగదిలోనికి తెచ్చి నీ చేతితో తినిపించు” అన్నాడు. తామారు తాను తయారుచేసిన రొట్టెలు తీసుకుని పడకగదిలో ఉన్న తన అన్న అమ్నోను దగ్గరకు వచ్చింది.
2SA 13:11 ఆమె అతనికి తినడానికి భోజనం తీసుకువచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, “నా చెల్లి, వచ్చి నాతో పడుకో” అన్నాడు.
2SA 13:12 ఆమె, “అన్నా, వద్దు నన్ను బలవంతం చేయవద్దు! ఇశ్రాయేలులో ఇలాంటిది చేయకూడదు! ఈ దుర్మార్గపు పని చేయవద్దు.
2SA 13:13 నేను ఏమైపోతాను? ఈ అవమానాన్ని నేను ఎలా భరించగలను? ఇశ్రాయేలీయులలో నీవు ఒక దుర్మార్గుడివి అవుతావు. రాజుతో మాట్లాడు. ఆయన నీకు నాతో పెళ్ళి చేయకుండా ఉండడు” అని చెప్పింది.
2SA 13:14 కాని అతడు ఆమె మాట వినకుండా ఆమెను బలవంతంగా లొంగదీసుకుని అత్యాచారం చేశాడు.
2SA 13:15 తర్వాత అమ్నోనుకు ఆమె పట్ల విపరీతమైన ద్వేషం కలిగింది. ఇంతకుముందు ఆమెను ఎంత ప్రేమించాడో దానికన్నా ఎక్కువగా అతడు ఆమెను ద్వేషించాడు. అమ్నోను ఆమెతో, “లేచి వెళ్లిపో!” అన్నాడు.
2SA 13:16 అందుకు ఆమె, “వద్దు, నీవు నన్ను బయటకు త్రోసివేస్తే అది నీవు నాకిప్పుడు చేసిన దానికన్నా పెద్ద తప్పు అవుతుంది” అని అన్నది. కాని అతడు ఆమె మాట వినలేదు.
2SA 13:17 అతడు తన వ్యక్తిగత సేవకుని పిలిచి, “ఈమెను నా దగ్గర నుండి వెళ్లగొట్టి, తలుపు గడియ వేయి” అని ఆజ్ఞాపించాడు.
2SA 13:18 ఆ సేవకుడు ఆమెను బయటకు గెంటి తలుపు గడియ వేశాడు. కన్యలైన రాజకుమార్తెలు ధరించే ఒక అందమైన వస్త్రాన్ని తామారు ధరించి ఉంది.
2SA 13:19 తామారు తన తలపై బూడిద వేసుకుని తాను వేసుకున్న వస్త్రాన్ని చింపుకుని తలమీద చేతులు పెట్టుకుని గట్టిగా ఏడుస్తూ వెళ్లిపోయింది.
2SA 13:20 ఆమె అన్న అబ్షాలోము ఆమెను చూసి, “నీ అన్న అమ్నోను కదా నీతో ఉన్నది? నా చెల్లీ, నెమ్మదిగా ఉండు; అతడు నీ అన్న. బాధపడకు” అన్నాడు. తామారు తన అన్న అబ్షాలోము ఇంట్లో ఒంటరిగానే ఉండిపోయింది.
2SA 13:21 ఇదంతా రాజైన దావీదు విన్నప్పుడు అతడు చాలా కోపంతో మండిపడ్డాడు.
2SA 13:22 అబ్షాలోము తన అన్న అమ్నోనుతో మంచి గాని చెడు గాని ఏమి మాట్లాడలేదు; తన చెల్లియైన తామారును అవమానపరిచాడు కాబట్టి అతడు అమ్నోనును ద్వేషించాడు.
2SA 13:23 రెండు సంవత్సరాల తర్వాత, అబ్షాలోము యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించేవారు ఎఫ్రాయిం సరిహద్దు దగ్గర ఉన్న బయల్-హసోరులో ఉన్నప్పుడు, అతడు రాజకుమారులందరినీ అక్కడికి విందుకు పిలిచాడు.
2SA 13:24 అబ్షాలోము రాజు దగ్గరకు వచ్చి, “మీ సేవకుని యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. రాజు రాజ సేవకులు నాతో పాటు వస్తారా?” అన్నాడు.
2SA 13:25 “లేదు, నా కుమారుడా, మేమందరం రావద్దు; మేము నీకు ఎక్కువ భారం అవుతాం” అని రాజు అన్నాడు. అబ్షాలోము రాజును బ్రతిమాలినా అతడు వెళ్లడానికి నిరాకరించి అతన్ని దీవించాడు.
2SA 13:26 అప్పుడు అబ్షాలోము, “నీవు రాకపోతే నా అన్నయైన అమ్నోనును మాతో పంపించు” అన్నాడు. అందుకు రాజు, “అతడు మీతో ఎందుకు వెళ్లాలి?” అని అడిగాడు.
2SA 13:27 అయితే అబ్షాలోము అతన్ని చాలా బ్రతిమిలాడాడు, కాబట్టి రాజు అమ్నోనును, మిగిలిన రాజకుమారులను అతనితో పంపాడు.
2SA 13:28 తర్వాత అబ్షాలోము తన సేవకులను పిలిచి, “వినండి, అమ్నోను బాగా త్రాగి మత్తు ఎక్కినప్పుడు నేను మీతో, ‘అమ్నోనును కొట్టి చంపండి’ అని చెప్తాను. అప్పుడు మీరు అతన్ని చంపండి. భయపడకండి! మీకు ఆజ్ఞ ఇచ్చింది నేను కాదా? కాబట్టి ధైర్యంగా ఉండండి” అని ఆదేశించాడు.
2SA 13:29 అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే అతని సేవకులు అమ్నోనును చంపేశారు. అప్పుడు రాజకుమారులంతా లేచి తమ కంచరగాడిదల మీద ఎక్కి పారిపోయారు.
2SA 13:30 వారు ఇంకా దారిలో ఉండగానే, “అబ్షాలోము రాజకుమారుల్లో ఒక్కరు మిగులకుండా అందరిని చంపేశాడు” అనే వార్త దావీదుకు చేరింది.
2SA 13:31 రాజు లేచి నిలబడి తన బట్టలు చింపుకుని నేల మీద పడుకున్నాడు. అతని సేవకులందరు తమ బట్టలు చింపుకుని దగ్గర నిలబడ్డారు.
2SA 13:32 కానీ దావీదు అన్న షిమ్యా కుమారుడైన యెహోనాదాబు, “నా ప్రభువా, వారు రాజకుమారులందరినీ చంపేశారని అనుకోవద్దు; అమ్నోను మాత్రమే చనిపోయాడు. అతడు అబ్షాలోము చెల్లి తామారును అత్యాచారం చేసిన రోజు నుండే అతన్ని చంపాలనే పగతో అబ్షాలోము ఉన్నాడని అతని మాటలు చెప్తున్నాయి.
2SA 13:33 కాబట్టి రాజకుమారులందరూ చనిపోయారని భావించి నా ప్రభువైన రాజు బాధపడవద్దు. అమ్నోను మాత్రమే చనిపోయాడు” అని చెప్పాడు.
2SA 13:34 ఈలోగా, అబ్షాలోము పారిపోయాడు. కాపలాగా నిలబడి ఉన్న వ్యక్తి పైకి చూసేటప్పటికి అతనికి పశ్చిమాన ఉన్న రహదారిపై చాలామంది ప్రజలు కొండ వైపుకు రావడం కనిపించింది. కావలివాడు వెళ్లి రాజుతో, “హొరొనయీము దిశలో, కొండ వైపున మనుష్యులు కనబడుతున్నారు” అని చెప్పాడు.
2SA 13:35 యెహోనాదాబు, “అదిగో రాజకుమారులు వస్తున్నారు; మీ సేవకుడనైన నేను చెప్పినట్టే జరిగింది” అని రాజుతో చెప్పాడు.
2SA 13:36 అతడు చెప్పడం ముగిస్తూ ఉండగానే, రాజకుమారులు వచ్చి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టారు. అది చూసి రాజు అతని సేవకులందరూ చాలా బిగ్గరగా ఏడ్చారు.
2SA 13:37 అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడు, గెషూరు రాజైన తల్మయి దగ్గరకు చేరాడు. రాజైన దావీదు చాలా రోజుల వరకు తన కుమారుని కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు.
2SA 13:38 అబ్షాలోము పారిపోయి గెషూరుకు వెళ్లి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు.
2SA 13:39 అమ్నోను మరణం విషయంలో ఓదార్పు పొందిన రాజైన దావీదు, అబ్షాలోము దగ్గరకు వెళ్లాలని కోరాడు.
2SA 14:1 రాజు అబ్షాలోము మీద మనస్సు పెట్టుకున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు.
2SA 14:2 కాబట్టి యోవాబు తెకోవాకు ఒకరిని పంపించి అక్కడినుండి ఒక తెలివైన స్త్రీని తెప్పించాడు. అతడు ఆమెతో, “నీవు దుఃఖంలో ఉన్నట్లు నటించు, దుఃఖ వస్త్రాలను ధరించు, ఎలాంటి సౌందర్య అలంకరణలను ఉపయోగించవద్దు. చనిపోయినవారి కోసం దుఃఖిస్తూ చాలా రోజులు గడిపిన స్త్రీలా నటించు.
2SA 14:3 రాజు దగ్గరకు వెళ్లి అతనితో ఈ మాటలు చెప్పు” అని చెప్పి ఏమి మాట్లాడాలో యోవాబు ఆమెకు నేర్పాడు.
2SA 14:4 ఆ తెకోవా స్త్రీ రాజు దగ్గరకు వెళ్లి తన తల నేలకు ఆనించి నమస్కారం చేసి, “ఓ రాజా! నాకు సహాయం చేయండి!” అని వేడుకొంది.
2SA 14:5 “నీకు వచ్చిన కష్టం ఏంటి?” అని రాజు ఆమెను అడిగాడు. అందుకామె, “నేను విధవరాలిని; నా భర్త చనిపోయాడు.
2SA 14:6 నీ సేవకురాలినైన నాకు ఇద్దరు కుమారులు. వారు పొలంలో ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. వారిని వేరు చేయడానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఒకడు ఇంకొకడిని కొట్టి చంపేశాడు.
2SA 14:7 ఇప్పుడు నా కుటుంబమంతా నీ సేవకురాలినైన నా మీదికి లేచి, ‘తన సోదరుని కొట్టి చంపినవాన్ని మాకు అప్పగించు. వాడు తన సోదరుని చంపాడు కాబట్టి మేము వాన్ని చంపాలి: అప్పుడు వారసుడే లేకుండ పోతాడు’ అని వారు అంటున్నారు. వారు నా భర్త పేరును గాని వారసులను గాని భూమి మీద మిగలకుండా, నా దగ్గర మిగిలి ఉన్న ఏకైక మండే బొగ్గును చల్లార్చాలని చూస్తున్నారు” అని చెప్పింది.
2SA 14:8 అందుకు రాజు, “నీవు ఇంటికి వెళ్లు, నీ గురించి నేను ఆజ్ఞ ఇస్తాను” అని ఆమెతో చెప్పాడు.
2SA 14:9 అప్పుడు తెకోవా స్త్రీ, “నా ప్రభువైన రాజు నన్ను నా కుటుంబాన్ని క్షమించును గాక, రాజు, వారి సింహాసనం నిర్దోషంగా ఉండును గాక” అని రాజుతో చెప్పింది.
2SA 14:10 అందుకు రాజు, “ఎవరైనా దీని గురించి నిన్ను ఏమైనా అంటే వారిని నా దగ్గరకు తీసుకురా, వారు మరలా నిన్ను ఇబ్బంది పెట్టరు” అన్నాడు.
2SA 14:11 ఆమె, “అయితే, రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు ఇంకెక్కువ నాశనం చేయకుండా నిరోధించడానికి రాజు తన దేవున్ని ప్రార్థించాలి, తద్వార నా కుమారుడు నాశనానికి గురి కాకుండా ఉంటాడు” అని చెప్పింది. అందుకు రాజు, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీ కుమారుని తలవెంట్రుకలలో ఒకటి కూడా నేల రాలదు” అన్నాడు.
2SA 14:12 అప్పుడు ఆమె, “నా ప్రభువైన రాజుతో మీ సేవకురాలినైన నన్ను ఒక మాట చెప్పనివ్వండి” అన్నాడు. అప్పుడు రాజు, “చెప్పు” అన్నాడు.
2SA 14:13 ఆ స్త్రీ ఇలా చెప్పింది, “మీరు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి పని ఎందుకు చేశారు? రాజు ఇలా చెప్పినప్పుడు, బహిష్కరించబడిన తన కుమారున్ని రాజు తిరిగి తీసుకురాలేదు కాబట్టి తాను దోషి కావడం లేదా?
2SA 14:14 మనమందరం చనిపోతాం గదా. ఒకసారి నేల మీద ఒలికిన తర్వాత మరలా ఎత్తలేని నీళ్లలా ఉన్నాము. అయితే దేవుడు కోరుకునేది ఇది కాదు; వెలివేయబడినవారు తన దగ్గరకు తిరిగి రావడానికి ఆయన మార్గాలు ఏర్పరుస్తారు.
2SA 14:15 “నా ప్రజలు నన్ను భయపెట్టారు కాబట్టి నేను నా ప్రభువైన రాజుకు దీని గురించి చెప్పడానికి వచ్చాను. నీ సేవకురాలు ఏమనుకుందంటే, ‘నేను రాజుతో మాట్లాడతాను. ఆయన తన సేవకురాలి మనవిని వింటారు.
2SA 14:16 రాజు నా మనవి అంగీకరించి, దేవుడిచ్చిన వారసత్వాన్ని నేను, నా ఇద్దరు కుమారులు అనుభవించకుండ మమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించేవారి చేతిలో నుండి నన్ను విడిపించడానికి ఒప్పుకుంటాడు.’
2SA 14:17 “నీ సేవకురాలినైన నేను చెప్పేది ఏంటంటే, ‘మంచి చెడులను విచారించడంలో నా ప్రభువైన రాజు దేవుని దూతవంటివాడు కాబట్టి నా ప్రభువైన రాజు మాట నా వారసత్వాన్ని కాపాడును గాక. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును గాక’ ” అని చెప్పింది.
2SA 14:18 అప్పుడు రాజు ఆమెతో, “నేను నిన్ను ఒక విషయం అడుగుతాను. ఏదీ దాచకుండా చెప్పాలి” అన్నాడు. అందుకు ఆమె, “నా ప్రభువైన రాజా ఏమిటో అడగండి” అన్నది.
2SA 14:19 రాజు, “దీనంతటి వెనకాల యోవాబు హస్తమేమైన ఉందా?” అని అడిగాడు. అప్పుడు ఆమె, “నా ప్రభువైన రాజు జీవం తోడు, నా ప్రభువైన రాజు చెప్పినదాని నుండి ఎవరూ కుడికి గాని ఎడమకు గాని తిరుగరు. నిజమే, ఇలా చేయమని నీ సేవకుడైన యోవాబు నాకు చెప్పాడు. నేను చెప్పిన మాటలన్నీ అతడు చెప్పినవే.
2SA 14:20 ప్రస్తుత పరిస్థితులను మార్చడానికి మీ సేవకుడైన యోవాబు ఇలా చేశాడు. దేశంలో జరుగుతున్నదంతా తెలుసుకోవడానికి నా ప్రభువుకు దేవుని దూతవంటి జ్ఞానం ఉన్నది” అన్నది.
2SA 14:21 అప్పుడు రాజు యోవాబుతో, “సరే, నీ విన్నపం ప్రకారం నేను చేస్తాను. నీవు వెళ్లి, యువకుడైన అబ్షాలోమును తీసుకురా” అన్నాడు.
2SA 14:22 యోవాబు తన తల నేలకు ఆనించి నమస్కారం చేసి రాజును దీవిస్తూ ఇలా అన్నాడు, “నా ప్రభువైన రాజా! నీవు నీ సేవకుడైన నా మనవి అంగీకరించావు కాబట్టి నా ప్రభువైన రాజు దృష్టిలో నీ సేవకుడనైన నేను దయ పొందానని ఈ రోజు నాకు తెలిసింది.”
2SA 14:23 అప్పుడు యోవాబు గెషూరు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకువచ్చాడు.
2SA 14:24 అయితే రాజు, “అతడు తన ఇంటికి వెళ్లాలి; అతడు నా ముఖాన్ని చూడకూడదు” అన్నాడు కాబట్టి అబ్షాలోము రాజు ముఖాన్ని చూడకుండ తన సొంత ఇంటికి వెళ్లాడు.
2SA 14:25 ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము వంటి అందమైనవారు ఇంకెవరు లేరు. అరికాలు నుండి నడినెత్తి వరకు అతనిలో ఏ లోపం లేదు.
2SA 14:26 అతని తలవెంట్రుకలు చాలా భారంగా ఉండడంతో సంవత్సరానికి ఒకసారి తన తలవెంట్రుకలు కత్తిరించేవాడు. వాటి తూకం రాజు ఆమోదించిన తూనిక ప్రకారం రెండువందల షెకెళ్ళు ఉండేది.
2SA 14:27 అబ్షాలోముకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె పుట్టారు. అతని కుమార్తె పేరు తామారు. ఆమె చాలా అందమైనది.
2SA 14:28 రాజు ముఖాన్ని చూడకుండ అబ్షాలోము రెండు సంవత్సరాలు యెరూషలేములో నివసించాడు.
2SA 14:29 అప్పుడు యోవాబును రాజు దగ్గరకు పంపించాలని అబ్షాలోము అతన్ని పిలిచాడు కాని యోవాబు అతని దగ్గరకు రావడానికి ఒప్పుకోలేదు. అతన్ని రెండవసారి పిలిచినా సరే యోవాబు రావడానికి ఒప్పుకోలేదు.
2SA 14:30 అప్పుడు అబ్షాలోము తన సేవకులతో, “చూడండి, యోవాబు పొలం నా పొలం ప్రక్కనే ఉంది, అతని పొలంలో యవల పంట ఉంది. మీరు వెళ్లి దానిని తగలబెట్టండి” అన్నాడు. కాబట్టి అబ్షాలోము పనివారు ఆ పొలాన్ని తగలబెట్టారు.
2SA 14:31 అప్పుడు యోవాబు అబ్షాలోము ఇంటికి వెళ్లి, “నీ పనివారు నా పొలాన్ని ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు.
2SA 14:32 అందుకు అబ్షాలోము యోవాబుతో, “నీవు రావాలని నేను కబురు పంపాను. ‘గెషూరు నుండి నేను ఎందుకు వచ్చాను? నేనక్కడే ఉండడం నాకు మంచిది గదా!’ అని నీ చేత రాజుతో చెప్పించడానికి నిన్ను రాజు దగ్గరకు పంపాలని నిన్ను పిలిచాను. నేను రాజు ముఖాన్ని చూడాలి. నేను దోషినైతే రాజు నన్ను చంపించవచ్చు” అన్నాడు.
2SA 14:33 కాబట్టి యోవాబు రాజు దగ్గరకు వెళ్లి ఆ సంగతి చెప్పాడు. అప్పుడు రాజు అబ్షాలోమును పిలిపించగా అతడు రాజు దగ్గరకు వచ్చి తన తల నేలకు ఆనించి రాజుకు నమస్కారం చేశాడు. రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు.
2SA 15:1 కొంతకాలం తర్వాత అబ్షాలోము ఒక రథాన్ని, గుర్రాలను తన ముందు పరుగెత్తడానికి యాభైమంది పురుషులను అంగరక్షకులుగా సమకూర్చుకున్నాడు.
2SA 15:2 అతడు ఉదయాన్నే లేచి పట్టణ ద్వారానికి వెళ్లే దారి ప్రక్కన నిలబడేవాడు. రాజు తీర్పు పొందడానికి ఎవరైనా ఫిర్యాదులతో వస్తే అబ్షాలోము వారిని పిలిచి, “మీది ఏ ఊరు?” అని అడిగేవాడు. “నీ సేవకుడైన నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఫలాన దానికి చెందిన వాడినని” ఆ వ్యక్తి చెప్పినప్పుడు,
2SA 15:3 అప్పుడు అబ్షాలోము, “చూడు, నీ ఫిర్యాదులు విలువైనవి, సరియైనవే కాని, వాటిని వినడానికి రాజు ప్రతినిధులెవరు లేరు” అని అనేవాడు.
2SA 15:4 ఇంకా అబ్షాలోము, “నేను ఈ దేశానికి న్యాయమూర్తిగా నియమించబడి ఉంటే బాగుండేది! అప్పుడు ఎవరైనా ఫిర్యాదులతో వివాదాలతో నా దగ్గరకు వస్తే, వారికి న్యాయం జరిగేలా చూసేవాన్ని” అని చెప్పేవాడు.
2SA 15:5 అలాగే, ఎవరైనా తనకు నమస్కారం చేయడానికి వచ్చినప్పుడు అబ్షాలోము తన చేయి చాచి, అతన్ని పట్టుకుని ముద్దు పెట్టుకునేవాడు.
2SA 15:6 తీర్పు కోసం రాజు దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలీయులందరితో అబ్షాలోము ఇలానే మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.
2SA 15:7 ఇలా నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్షాలోము రాజు దగ్గరకు వెళ్లి, “నేను హెబ్రోనుకు వెళ్లి యెహోవాకు నేను చేసిన మ్రొక్కుబడిని తీర్చుకోనివ్వండి.
2SA 15:8 నీ సేవకుడు అరాములోని గెషూరులో ఉన్నప్పుడు, ‘ఒకవేళ యెహోవా నన్ను తిరిగి యెరూషలేముకు తీసుకెళ్తే నేను హెబ్రోనులో యెహోవాను ఆరాధిస్తాను’ అని మ్రొక్కుబడి చేశాను” అని మనవి చేశాడు.
2SA 15:9 రాజు అతనితో, “సమాధానంగా వెళ్లు” అని చెప్పి అనుమతి ఇచ్చాడు. కాబట్టి అతడు హెబ్రోనుకు వెళ్లాడు.
2SA 15:10 అబ్షాలోము, “మీరు బూరల ధ్వని వినగానే, ‘హెబ్రోనులో అబ్షాలోము రాజు’ అని కేకలు వేయండి” అని చెప్పడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటికి రహస్యంగా దూతలను పంపాడు.
2SA 15:11 యెరూషలేము నుండి 200 మంది పురుషులు అబ్షాలోముతో పాటు వచ్చారు. అతడు వారిని అతిథులుగా రమ్మని పిలిచినప్పుడు, వారు విషయం తెలియక అమాయకంగా వెళ్లారు.
2SA 15:12 అబ్షాలోము బలులు అర్పిస్తున్నప్పుడు, దావీదు సలహాదారుడైన గిలోనీయుడైన అహీతోపెలును తన స్వగ్రామమైన గిలోహు నుండి రమ్మని పిలిపించాడు. అబ్షాలోము అనుచరులు పెరుగుతూనే ఉండడంతో కుట్ర మరింత బలపడింది.
2SA 15:13 ఒక దూత వచ్చి దావీదుతో, “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోము పక్షంగా ఉన్నారు” అనే వార్త చెప్పాడు.
2SA 15:14 దావీదు తనతో పాటు యెరూషలేములో ఉన్న తన అధికారులందరితో, “రండి, మనం పారిపోవాలి, లేకపోతే అబ్షాలోము నుండి మనలో ఎవరమూ తప్పించుకోలేము. మనం వెంటనే వెళ్లిపోవాలి లేదంటే అతడు త్వరగా వచ్చి మనలను పట్టుకుని మనలను మన పట్టణాన్ని ఖడ్గంతో నాశనం చేస్తాడు” అని చెప్పాడు.
2SA 15:15 అందుకు రాజు అధికారులు, “మా ప్రభువైన రాజు ఏం చెప్పినా చేయడానికి మీ సేవకులమైన మేము సిద్ధంగా ఉన్నాం” అని జవాబిచ్చారు.
2SA 15:16 అప్పుడు రాజు రాజభవనాన్ని కనిపెట్టుకుని ఉండడానికి పదిమంది ఉంపుడుగత్తెలను ఉంచి, తన పరివారమంతటితో కలిసి బయలుదేరి వెళ్లాడు.
2SA 15:17 రాజు తన పరివారమంతటితో కాలినడకను బయలుదేరి వెళ్లి పట్టణం చివరి ఉన్న ఇంట్లో బసచేశాడు.
2SA 15:18 రాజు సేవకులందరూ రాజుకు ఇరువైపులా నడిచారు. కెరేతీయులు, పెలేతీయులు, గాతు నుండి అతనితో వచ్చిన ఆరువందలమంది గిత్తీయులు రాజుకు ముందుగా నడిచారు.
2SA 15:19 రాజు గిత్తీయుడైన ఇత్తయితో, “నీవు మాతో పాటు రావడం ఎందుకు? తిరిగివెళ్లి అబ్షాలోము రాజుతో పాటు ఉండు. నీవు బందీగా ఉన్న విదేశీయుడవు.
2SA 15:20 నీవు నిన్ననే వచ్చావు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియనప్పుడు నీవు మాతో తిరగడం ఎందుకు? నీ ప్రజలను తీసుకుని నీవు తిరిగి వెళ్లిపో. యెహోవా నీ మీద దయను నమ్మకత్వాన్ని చూపిస్తారు” అన్నాడు.
2SA 15:21 అందుకు ఇత్తయి రాజుతో, “నా ప్రభువైన రాజు ఎక్కడ ఉంటాడో నీ సేవకుడైన నేను మరణించినా బ్రతికినా అక్కడే ఉంటానని సజీవుడైన యెహోవా మీద, నా ప్రభువైన రాజు జీవం మీద ప్రమాణం చేస్తున్నాను” అన్నాడు.
2SA 15:22 దావీదు ఇత్తయితో, “సరే, నీవు మాతో రావచ్చు” అన్నాడు. కాబట్టి గిత్తీయుడైన ఇత్తయి అతనితో ఉన్న మనుష్యులు, కుటుంబాలు ముందుకు నడిచారు.
2SA 15:23 వారందరూ వెళ్లి పోతుంటే ప్రజలంతా గట్టిగా ఏడ్చారు. ఇలా వారందరూ రాజుతో కలిసి కిద్రోనువాగు దాటి అరణ్యమార్గంలో కదిలారు.
2SA 15:24 సాదోకు అతనితో ఉన్న లేవీయులందరు దేవుని నిబంధన మందసాన్ని మోస్తూ వచ్చారు. తర్వాత వారు మందసాన్ని క్రిందికి దించినప్పుడు ప్రజలందరూ పట్టణాన్ని దాటి వచ్చేవరకు అబ్యాతారు బలులు అర్పించాడు.
2SA 15:25 అప్పుడు రాజు సాదోకును పిలిచి, “దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోనికి తీసుకెళ్లు. యెహోవా నా పట్ల దయ చూపిస్తే ఆయన నన్ను మరలా తీసుకువచ్చి ఆయన మందసాన్ని, ఆయన నివాస స్థలాన్ని నేను మళ్ళీ చూసేలా చేస్తారు.
2SA 15:26 ఒకవేళ ఆయన, ‘నీపై నాకు దయలేదు’ అని చెప్పినా సరే నేను అందుకు సిద్ధమే; ఆయనకు ఏది న్యాయం అనిపిస్తే నా పట్ల అదే చేస్తారు” అని చెప్పాడు.
2SA 15:27 రాజు యాజకుడైన సాదోకుతో, “నీవు దీర్ఘదర్శివి గదా! నీవు నా దీవెనతో సమాధానంగా పట్టణానికి తిరిగి వెళ్లు. నీతో పాటు నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును తీసుకెళ్లు. నీవు అబ్యాతారు మీరిద్దరూ మీ ఇద్దరు కుమారులతో తిరిగి వెళ్లండి.
2SA 15:28 నీ దగ్గర నుండి నాకు కబురు వచ్చేవరకు నేను అరణ్యంలో ఉన్న రేవుల దగ్గర ఎదురుచూస్తూ ఉంటాను” అన్నాడు.
2SA 15:29 కాబట్టి సాదోకు అబ్యాతారులు దేవుని మందసాన్ని యెరూషలేముకు తిరిగి తీసుకెళ్లి అక్కడే ఉండిపోయారు.
2SA 15:30 దావీదు ఒలీవల కొండ ఎక్కుతూ ఏడ్చాడు. తన తల కప్పుకుని, చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్లాడు. అతనితో ఉన్నవారందరు తల కప్పుకుని ఏడుస్తూ కొండ ఎక్కారు.
2SA 15:31 ఇంతలో ఒకడు వచ్చి, “అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా భాగం ఉంది” అని దావీదుతో చెప్పాడు. కాబట్టి దావీదు, “యెహోవా! అహీతోపెలు ఆలోచనలను అవివేకంగా మార్చండి” అని ప్రార్థించాడు.
2SA 15:32 ప్రజలు దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండమీద ఉండేది. దావీదు అక్కడికి చేరుకున్నప్పుడు అర్కీయుడైన హూషై తన పైవస్త్రాన్ని చింపుకుని తలమీద బూడిద పోసుకున్నాడు.
2SA 15:33 దావీదు అతన్ని చూసి, “నీవు నాతో పాటు వస్తే నాకు భారంగా ఉంటుంది.
2SA 15:34 నీవు పట్టణానికి తిరిగివెళ్లి అబ్షాలోముతో, ‘రాజా! నేను నీకు సేవకునిగా ఉంటాను. గతంలో మీ తండ్రికి సేవకునిగా ఉన్నాను కాని ఇకపై నీకు సేవకునిగా సేవ చేస్తాను’ అని చెప్పు, అప్పుడు నీవు నా తరుపున అక్కడ ఉండి అహీతోపెలు చేసే సలహాలను చెడగొట్టగలవు.
2SA 15:35 యాజకులైన సాదోకు అబ్యాతారులు నీతో అక్కడ ఉంటారు. రాజభవనంలో నీవు విన్నవాటినన్ని వారికి చెప్పు.
2SA 15:36 వారి ఇద్దరు కుమారులు, సాదోకు కుమారుడైన అహిమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అక్కడ వారితో పాటు ఉన్నారు. నీవు ఏది విన్నా, వారి ద్వారా నాకు తెలియజేయి” అని చెప్పాడు.
2SA 15:37 కాబట్టి అబ్షాలోము యెరూషలేముకు వస్తున్నప్పుడే దావీదు స్నేహితుడైన హూషై పట్టణానికి తిరిగి వెళ్లాడు.
2SA 16:1 దావీదు కొండమీద కొంత దూరం వెళ్లినప్పుడు, మెఫీబోషెతు సేవకుడైన సీబా అతన్ని కలవడానికి వేచి ఉన్నాడు. అతడు కళ్లకు గంతలు కట్టివున్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. వాటి మీద 200 రొట్టెలు, 100 ఎండు ద్రాక్ష గెలలు, 100 అంజూర పండ్లు ఉన్న కొమ్మలు, ఒక ద్రాక్షరసపు తిత్తి ఉన్నాయి.
2SA 16:2 రాజు సీబాను చూసి, “వీటిని ఎందుకు తెచ్చావు?” అని అడిగాడు. అందుకు సీబా, “గాడిదలు రాజు ఇంటివారు ఎక్కి వెళ్లడానికి, రొట్టె పండ్లు మీతో ఉన్నవారు తినడానికి, ద్రాక్షరసం అరణ్యంలో అలసిపోయిన వారు త్రాగడానికి” అని జవాబిచ్చాడు.
2SA 16:3 అప్పుడు రాజు, “నీ యజమాని మనుమడు ఎక్కడున్నాడు?” అని అడిగాడు. అందుకు సీబా రాజుతో, “ఈ రోజు ఇశ్రాయేలీయులు మా తాత రాజ్యాన్ని నాకు తిరిగి ఇస్తారనుకుని అతడు యెరూషలేములోనే ఉన్నాడు” అని జవాబిచ్చాడు.
2SA 16:4 అప్పుడు రాజు సీబాతో, “మెఫీబోషెతుకు చెందినదంతా ఇప్పుడు నీది” అని అన్నాడు. అందుకు సీబా, “నా ప్రభువా రాజా, మీ దయ నాపై ఉండును గాక, మీకు నా దండాలు” అన్నాడు.
2SA 16:5 రాజైన దావీదు బహూరీముకు వచ్చినప్పుడు, సౌలు కుటుంబ వంశానికి చెందిన ఒక వ్యక్తి అక్కడినుండి బయటకు వచ్చాడు. అతడు గెరా కుమారుడైన షిమీ. అతడు బయటకు వస్తూ దావీదును శపిస్తున్నాడు.
2SA 16:6 సైనికులు బలాఢ్యులు దావీదుకు ఇరువైపులా ఉన్నప్పటికీ అతడు రాజైన దావీదు మీదికి అతని అధికారులందరి మీదికి రాళ్లు విసిరాడు.
2SA 16:7 అంతేకాక షిమీ అతన్ని శపిస్తూనే, “వెళ్లిపో, వెళ్లిపో, హంతకుడా, దుర్మార్గుడా!
2SA 16:8 నీవు ఎవరి స్థానంలో పరిపాలించావో, ఆ సౌలు ఇంటివారి రక్తాన్ని నీవు చిందించినందుకు యెహోవా నీకు ప్రతిఫలమిచ్చారు. యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించారు. నీవు హంతకుడివి కాబట్టే నీవు పతనానికి దగ్గరలో ఉన్నావు” అని దూషించాడు.
2SA 16:9 అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై రాజుతో, “ఈ చచ్చిన కుక్క రాజైన నా ప్రభువును ఎందుకు శపించాలి? నేను వెళ్లి అతని తల నరికివేయనివ్వండి” అన్నాడు.
2SA 16:10 అందుకు రాజు, “సెరూయా కుమారులారా! ఈ విషయంతో మీకేమి సంబంధం? ‘దావీదును శపించు’ అని ఒకవేళ యెహోవా అతనితో చెప్పినందుకు అతడు శపిస్తున్నాడేమో, అలాంటప్పుడు, ‘నీవు ఎందుకిలా చేస్తున్నావు’ అని ఎవరు అడగగలరు?” అన్నాడు.
2SA 16:11 తర్వాత దావీదు అబీషైతో, తనతో ఉన్నవారందరితో, “నా రక్తం పంచుకుని పుట్టిన నా కుమారుడే నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటప్పుడు ఈ బెన్యామీనీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యమేముంది? అతన్ని వదిలేయండి, శపించమని యెహోవా వానికి చెప్పారు, కాబట్టి శపించనివ్వండి.
2SA 16:12 యెహోవా నా బాధ చూసి, ఈ రోజు ఇతడు పలికిన శాపాలకు బదులుగా నాకు మంచి చేస్తాడేమో!” అని అన్నాడు.
2SA 16:13 దావీదు, అతని మనుష్యులు తమ దారిన ముందుకు వెళ్తుండగా, షిమీ అతనికి ఎదురుగా కొండ ప్రక్క నుండి వెళ్తూ, దావీదును శపిస్తూ, అతని మీదికి రాళ్లు విసురుతూ, అతని మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు.
2SA 16:14 రాజు, అతనితో ఉన్నవారందరు తమ గమ్యాన్ని చేరుకునే సరికి అలసిపోయారు కాబట్టి అక్కడ వారు అలసట తీర్చుకున్నారు.
2SA 16:15 ఇంతలో అబ్షాలోము ఇశ్రాయేలు వారందరు యెరూషలేముకు వచ్చారు. అహీతోపెలు కూడా అతనితో ఉన్నాడు.
2SA 16:16 అప్పుడు దావీదు స్నేహితుడు అర్కీయుడైన హూషై అబ్షాలోము దగ్గరకు వచ్చి అతనితో, “రాజు చిరకాలం జీవించు గాక! రాజు చిరకాలం జీవించు గాక!” అన్నాడు.
2SA 16:17 అబ్షాలోము, “నీ స్నేహితుడైన దావీదుకు నీవు చూపించే ప్రేమ ఇదేనా? అతడు నీ స్నేహితుడే కదా, అతనితో పాటు నీవెందుకు వెళ్లలేదు?” అని హూషైను అడిగాడు.
2SA 16:18 అందుకు హూషై అబ్షాలోముతో, “యెహోవా, ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులందరు కలిసి ఎవరిని ఎంచుకుంటారో అతనికి చెందిన వాడనై అతనితోనే నేను ఉంటాను.
2SA 16:19 అంతేకాదు నేను ఎవరికి సేవ చేయాలి? అతని కుమారునికి నేను సేవ చేయకూడదా? మీ తండ్రికి సేవ చేసినట్లే నీకు కూడా నేను సేవ చేస్తాను” అన్నాడు.
2SA 16:20 తర్వాత అబ్షాలోము అహీతోపెలుతో, “మనమేమి చేద్దాం? సలహా ఇవ్వు” అన్నాడు.
2SA 16:21 అందుకు అహీతోపెలు అబ్షాలోముతో, “రాజభవనానికి కాపలాగా మీ తండ్రి ఉంచిన అతని ఉంపుడుగత్తెలతో పడుకోండి. అప్పుడు మీ తండ్రికి మీరు మరింత అసహ్యులు అయ్యారని ఇశ్రాయేలీయులందరు తెలుసుకుంటారు. మీ పక్షాన ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా శక్తిమంతులవుతారు” అన్నాడు.
2SA 16:22 కాబట్టి వారు అబ్షాలోము కోసం మేడమీద ఒక గుడారం వేశారు. ఇశ్రాయేలీయులు చూస్తుండగా అబ్షాలోము తన తండ్రి ఉంపుడుగత్తెలతో గడిపాడు.
2SA 16:23 ఆ రోజుల్లో అహీతోపెలు ఏదైనా సలహా చెప్తే అది దేవుని నుండి వచ్చిన మాటలా ఉండేది. దావీదు, అబ్షాలోము కూడా అలానే భావించేవారు.
2SA 17:1 ఇంకా అహీతోపెలు అబ్షాలోముతో, “నేను పన్నెండువేలమంది సైనికులను ఎంపిక చేసుకుని ఈ రాత్రే రాజైన దావీదును వెంటాడడానికి బయలుదేరి వెళ్లనివ్వండి.
2SA 17:2 అతడు అలసిపోయి బలహీనంగా ఉన్నప్పుడు నేను అతనిపై దాడిచేసి అతన్ని భయపెడతాను. అప్పుడు అతనితో ఉన్నవారంతా పారిపోతారు. నేను రాజును మాత్రమే చంపి,
2SA 17:3 ప్రజలందరినీ నీ దగ్గరకు తీసుకువస్తాను. నీవు వెదకే మనిషి ప్రాణానికి బదులుగా ప్రజలందరు తిరిగి నీ దగ్గరకు వస్తారు. ప్రజలంతా క్షేమంగా ఉంటారు” అన్నాడు.
2SA 17:4 ఈ మాట అబ్షాలోముకు ఇశ్రాయేలీయుల పెద్దలందరికి నచ్చింది.
2SA 17:5 అప్పుడు అబ్షాలోము, “అర్కీయుడైన హూషైను పిలిపించు. అతడు చెప్పేది కూడా మనం విందాం” అన్నాడు.
2SA 17:6 హూషై అబ్షాలోము దగ్గరకు వచ్చినప్పుడు, “అహీతోపెలు మాకు ఈ సలహా ఇచ్చాడు. అతడు చెప్పింది చేయాలా? ఒకవేళ వద్దంటే, నీ అభిప్రాయమేంటో చెప్పు” అన్నాడు.
2SA 17:7 అందుకు హూషై అబ్షాలోముతో, “ఈసారి అహీతోపెలు ఇచ్చిన సలహా మంచిది కాదు.
2SA 17:8 హూషై ఇంకా మాట్లాడుతూ, నీ తండ్రి గురించి అతని మనుష్యుల గురించి నీకు తెలుసు; వారు యుద్ధవీరులు, కూనలను పోగొట్టుకున్న అడవి ఎలుగుబంటిలా భయంకరులు. అంతేకాక నీ తండ్రి అనుభవజ్ఞుడైన యుద్ధవీరుడు; అతడు సైన్యంతో రాత్రి గడపడు.
2SA 17:9 ఇప్పుడు కూడా అతడు గుహలోనో మరో స్థలంలోనో దాక్కొని ఉంటాడు. అతడు కాబట్టి నీ దళాల మీద మొదట దాడి చేయాల్సివస్తే, దాని గురించి విన్నవారందరు, ‘అబ్షాలోమును అనుసరించే దళాల మధ్య వధ జరిగింది’ అని అంటారు.
2SA 17:10 అప్పుడు సింహపు గుండె లాంటి గుండె కలిగిన మహా ధైర్యవంతులైన సైనికులు కూడా భయంతో కరిగిపోతారు, ఎందుకంటే నీ తండ్రి గొప్ప యుద్ధవీరుడని అతనితో ఉన్నవారంతా ధైర్యవంతులని ఇశ్రాయేలీయులందరికి తెలుసు.
2SA 17:11 “కాబట్టి నా సలహా ఏంటంటే, దాను నుండి బెయేర్షేబ వరకు సముద్రపు ఇసుకరేణువులంత అసంఖ్యాకంగా ఇశ్రాయేలీయులందరు నీ దగ్గర సమకూడాలి. నీవే స్వయంగా వారిని యుద్ధంలో నడిపించాలి.
2SA 17:12 అప్పుడతడు ఎక్కడ కనబడినా మనం అతనిపై దాడి చేద్దాం; నేల మీద మంచు పడినట్లుగా మనం అతని మీద దాడి చేస్తే అతడు గాని అతని మనుష్యులు కాని ప్రాణాలతో తప్పించుకోలేరు.
2SA 17:13 ఒకవేళ అతడు ఏదైన పట్టణానికి వెళ్తే, ఇశ్రాయేలీయులందరు ఆ పట్టణానికి త్రాళ్లు తీసుకువచ్చి, అక్కడ చిన్న రాయి కూడా మిగులకుండా ఆ పట్టణాన్ని లోయలోకి లాగివేస్తారు” అన్నాడు.
2SA 17:14 అబ్షాలోము ఇశ్రాయేలీయులందరు అది విని, “అర్కీయుడైన హూషై చెప్పిన సలహా అహీతోపెలు చెప్పిన దానికంటే బాగుంది” అన్నారు. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదికి ఆపద రప్పించడానికి అహీతోపెలు చెప్పిన మంచి ఆలోచనను భగ్నం చేయాలని నిశ్చయించుకున్నారు.
2SA 17:15 అప్పుడు హూషై వెళ్లి యాజకులైన సాదోకు, అబ్యాతారులతో, “అబ్షాలోముకు ఇశ్రాయేలు పెద్దలందరికి అహీతోపెలు ఇలా చేయండి అని సలహా ఇచ్చాడు, అయితే నేను అలా కాదు ఇలా చేయండి అని సలహా ఇచ్చాను.
2SA 17:16 కాబట్టి వెంటనే దావీదుకు, ‘ఈ రోజు రాత్రి అరణ్యంలో రేవుల దగ్గర గడపవద్దు; అక్కడినుండి వెంటనే అటువైపు దాటి వెళ్లండి, లేకపోతే రాజు అతనితో పాటు ఉన్నవారందరు చంపబడతారు’ అని కబురు పంపించండి” అని చెప్పాడు.
2SA 17:17 యోనాతాను అహిమయస్సు తాము పట్టణంలోనికి వచ్చిన సంగతి ఎవరికీ తెలియకూడదని వారు ఎన్-రోగేలు దగ్గర ఉన్నారు. ఒక సేవకురాలు వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి చెప్పగా వారు వెళ్లి రాజైన దావీదుకు ఆ సంగతి చెప్పారు.
2SA 17:18 కాని ఒక యువకుడు వారిని చూసి అబ్షాలోముకు చెప్పాడు. కాబట్టి వారిద్దరు వెంటనే బయలుదేరి బహూరీములో ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి అతని ఇంటి ప్రాంగణంలో ఉన్న బావి లోపలికి దిగి దాక్కున్నారు.
2SA 17:19 అతని భార్య ఒక మూతను తెచ్చి దానిపై గుడ్డను పరచి తెచ్చి బావి మీద పరచి దాని మీద ధాన్యం ఆరబోసింది. కాబట్టి వారు అక్కడ దాక్కున్నారని ఎవరికీ తెలియదు.
2SA 17:20 తర్వాత అబ్షాలోము మనుష్యులు ఆ ఇంటి దగ్గరకు వచ్చి, “అహిమయస్సు, యోనాతానులు ఎక్కడ ఉన్నారు?” అని ఆమెను అడిగారు. అందుకామె, “వారు ఆ వాగు దాటి వెళ్లారు” అని చెప్పింది. ఆ మనుష్యులు వెదికారు గాని ఎవ్వరూ కనబడలేదు, కాబట్టి వారు యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
2SA 17:21 ఆ మనుష్యులు వెళ్లిపోయిన తర్వాత యోనాతాను అహిమయస్సులు బావిలో నుండి బయటకు వచ్చి రాజైన దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “మీకు వ్యతిరేకంగా అహీతోపెలు ఆలోచన చేశాడు కాబట్టి మీరు వెంటనే బయలుదేరి యొర్దాను నది దాటి వెళ్లిపోవాలి” అని చెప్పారు.
2SA 17:22 కాబట్టి దావీదు, అతనితో ఉన్నవారందరు బయలుదేరి యొర్దాను నది దాటారు. తెల్లవారేసరికి ఒక్కరూ మిగలకుండా అందరు యొర్దాను నది దాటి వెళ్లారు.
2SA 17:23 అహీతోపెలు తాను చెప్పిన సలహాను పాటించకపోవడం చూసి, తన గాడిదకు గంతకట్టి తన ఊరిలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. తన ఇంటి విషయాలు చక్కబెట్టుకున్న తర్వాత ఉరివేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అహీతోపెలు పాతిపెట్టబడ్డాడు.
2SA 17:24 దావీదు మహనయీముకు చేరుకున్నాడు. అబ్షాలోము ఇశ్రాయేలీయులతో కలిసి యొర్దాను నది దాటి వెళ్లిపోయారు.
2SA 17:25 అబ్షాలోము యోవాబుకు బదులుగా అమాశాను సైన్యాధిపతిగా నియమించాడు. అమాశా తండ్రి ఇష్మాయేలీయుడైన యెతెరు. అతని తల్లి అబీగయీలు యోవాబు తల్లియైన సెరూయాకు సోదరియైన నాహాషు కుమార్తె.
2SA 17:26 అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు ప్రాంతంలో శిబిరం ఏర్పరచుకున్నారు.
2SA 17:27 దావీదు మహనయీముకు చేరుకున్నప్పుడు అమ్మోనీయుల పట్టణమైన రబ్బాకు చెందిన నాహాషు కుమారుడైన షోబీ, లోదెబారుకు చెందిన అమ్మీయేలు కుమారుడైన మాకీరు, రోగెలీముకు చెందిన గిలాదీయుడైన బర్జిల్లయిలు,
2SA 17:28 పరుపులు, వంట పాత్రలు, కుండలు తీసుకువచ్చారు. ఆహారంగా గోధుమలు, యవలు, పిండి, వేయించిన ధాన్యం, చిక్కుడు కాయలు, పప్పులు,
2SA 17:29 తేనె, పెరుగు, గొర్రెలు, ఆవు పాల జున్ను దావీదు, అతనితో ఉన్న ప్రజల కోసం తెచ్చారు. ఎందుకంటే, “అరణ్యంలో ప్రజలు అలసిపోయి, ఆకలితో దాహంతో ఉన్నారు” అని వారు గ్రహించారు.
2SA 18:1 దావీదు తనతో ఉన్న సైన్యాన్ని సమకూర్చి, వారిలో ప్రతి వేయిమందికి సహస్రాధిపతులను, ప్రతి వందమందికి శతాధిపతులను నియమించాడు.
2SA 18:2 దావీదు తన సైన్యాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని యోవాబు ఆధీనంలో, మరొక భాగాన్ని యోవాబు సోదరుడు, సెరూయా కుమారుడైన అబీషై ఆధీనంలో, ఇంకొక భాగాన్ని గిత్తీయుడైన ఇత్తయి ఆధీనంలో ఉంచాడు. రాజు తన సేనలను పంపుతూ వారితో, “నేనే స్వయంగా మీతో వస్తున్నా” అని చెప్పాడు.
2SA 18:3 అయితే వారు, “మీరు రాకూడదు. ఒకవేళ మేము పారిపోవలసి వస్తే, ప్రజలు మా గురించి పట్టించుకోరు. మాలో సగం మంది చనిపోయినా ప్రజలు పట్టించుకోరు. కాని మీరు మాలాంటి పదివేలమందితో సమానము. కాబట్టి మీరు పట్టణంలో ఉండి మాకు సహాయం అందిస్తే మేలు” అన్నారు.
2SA 18:4 అందుకు రాజు, “మీకు ఏది మంచిదో నేను అదే చేస్తాను” అని చెప్పాడు. రాజు గుమ్మం దగ్గర నిలబడి ఉండగా వారందరూ వందల గుంపులుగా వేల గుంపులుగా బయలుదేరి వెళ్లారు.
2SA 18:5 రాజు యోవాబు, అబీషై, ఇత్తయిలను, “నన్ను బట్టి యువకుడైన అబ్షాలోముపై దయ చూపించండి” అని ఆదేశించాడు. అబ్షాలోము గురించి రాజు దళాధిపతులందరికి ఆజ్ఞ ఇవ్వడం సైన్యమంతా విన్నారు.
2SA 18:6 దావీదు సైన్యం ఇశ్రాయేలీయులతో పోరాడడానికి యుద్ధ స్థలానికి వెళ్లింది. యుద్ధం ఎఫ్రాయిం అడవిలో జరిగింది.
2SA 18:7 అక్కడ ఇశ్రాయేలీయుల సైన్యం దావీదు సైన్యం చేతిలో ఓడిపోయారు. ఆ రోజు చాలా ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది అంటే ఇరవై వేలమంది సైనికులు చంపబడ్డారు.
2SA 18:8 యుద్ధం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఆ రోజున ఖడ్గం వలన కంటే అడవిలో చిక్కుకుని చనిపోయినవారే ఎక్కువ.
2SA 18:9 అబ్షాలోము కంచరగాడిద ఎక్కి వెళ్తూ దావీదు సైన్యానికి ఎదురయ్యాడు. ఆ కంచరగాడిద గుబురైన కొమ్మలు ఉన్న ఒక సింధూర వృక్షం క్రింది నుండి వెళ్తున్నప్పుడు అబ్షాలోము జుట్టు చెట్టు కొమ్మల్లో చిక్కుకుంది. అయితే ఆ కంచరగాడిద అలాగే ముందుకు వెళ్లిపోవడంతో అతడు గాలిలో వ్రేలాడుతూ ఉండిపోయాడు.
2SA 18:10 అది చూసిన ఒకడు యోవాబు దగ్గరకు వెళ్లి, “అబ్షాలోము సింధూర వృక్షానికి వ్రేలాడుతూ ఉండడం నేను చూశాను” అని చెప్పాడు.
2SA 18:11 యోవాబు ఆ విషయం చెప్పిన వానితో, “ఏంటి! నీవతన్ని చూశావా? మరి వెంటనే అతన్ని నేలమీద పడేలా ఎందుకు కొట్టలేదు? నీవలా చేసి ఉంటే పది షెకెళ్ళ వెండిని ఒక యోధుల నడికట్టును నీకు ఇచ్చి ఉండేవాన్ని” అన్నాడు.
2SA 18:12 కాని అతడు యోవాబుతో, “నా చేతిలో వెయ్యి షెకెళ్ళ వెండి పెట్టినా, రాజు కుమారునిపై నేను చేయి వేయను. యువకుడైన అబ్షాలోముకు ఎవరూ హాని చేయకుండా కాపాడమని మాకందరికి వినిపించేలా రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి ఆజ్ఞ ఇచ్చాడు.
2SA 18:13 ఒకవేళ నేను మోసం చేసి అతని ప్రాణానికి హాని చేస్తే రాజు తప్పనిసరిగా తెలుసుకుంటాడు. అప్పుడు నీవే నాకు వ్యతిరేకంగా మారతావు” అన్నాడు.
2SA 18:14 అందుకు యోవాబు, “నీవు చేసే వరకు నేను ఇలా ఎదురుచూస్తూ ఉండను” అని చెప్పి, మూడు ఈటెలు పట్టుకుని వెళ్లి, ఇంకా ప్రాణాలతో ఆ సింధూర వృక్షానికి వ్రేలాడుతున్న అబ్షాలోము గుండెల్లోకి దిగేలా కొట్టాడు.
2SA 18:15 అలాగే యోవాబు ఆయుధాలు మోసేవారు పదిమంది అబ్షాలోమును చుట్టుముట్టి, అతన్ని కొట్టి చంపారు.
2SA 18:16 తర్వాత ఇశ్రాయేలీయులను వెంటాడటం ఆపమని యోవాబు బూరధ్వని చేయగానే, సైన్యం తరమడం ఆపి తిరిగి వచ్చింది.
2SA 18:17 వారు అబ్షాలోము మృతదేహాన్ని తీసుకెళ్లి అడవిలో లోతైన గోతిలో పడవేసి దానిలో పెద్ద రాళ్లకుప్ప పేర్చి, ఇశ్రాయేలీయులందరు తమ ఇళ్ళకు పారిపోయారు.
2SA 18:18 “నా పేరును కొనసాగించడానికి నాకు కుమారుడు లేడు” అని ఆలోచించిన అబ్షాలోము తాను బ్రతికి ఉన్నప్పుడే ఒక స్తంభం తీసుకెళ్లి తన పేరిట రాజుల లోయలో నిలబెట్టి, ఆ స్తంభానికి తన పేరు పెట్టుకున్నాడు, అది నేటి వరకు అబ్షాలోము స్థూపం అని పిలువబడుతుంది.
2SA 18:19 తర్వాత సాదోకు కుమారుడైన అహిమయస్సు, “నేను రాజు దగ్గరకు పరుగెత్తి వెళ్లి, యెహోవా రాజును తన శత్రువుల చేతిలో నుండి విడిపించి రాజుకు న్యాయం చేశారని చెప్పనివ్వండి” అని అడిగాడు.
2SA 18:20 అందుకు యోవాబు, “ఈ వార్తను ఈ రోజు నీవు మోసుకెళ్లవద్దు ఎందుకంటే తన కుమారుడు చనిపోవడం రాజుకు శుభవార్త కాదు కదా! నీవు మరోసారి నా దూతగా వార్తను మోసుకెళ్దువులే” అని అతనితో చెప్పాడు.
2SA 18:21 తర్వాత యోవాబు కూషీయున్ని పిలిచి, “నీవు వెళ్లి, నీవు చూసిన దానిని రాజుకు చెప్పు” అని చెప్పాడు. ఆ కూషీయుడు యోవాబుకు నమస్కారం చేసి పరిగెత్తుకొని వెళ్లాడు.
2SA 18:22 అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబును, “ఏమైనా కానివ్వండి, నేను కూషీయుని వెంట పరుగెడతాను; నన్ను వెళ్లనివ్వండి” అని మరోసారి వేడుకున్నాడు. కాని యోవాబు, “నా కుమారుడా, నీవెందుకు వెళ్లాలనుకుంటున్నావు? నీకు బహుమతిని తెచ్చే వార్తేమి నీ దగ్గర లేదు” అన్నాడు.
2SA 18:23 అయితే అతడు, “ఏది ఏమైనా సరే, నేను వెళ్తాను” అన్నాడు. కాబట్టి యోవాబు, “సరే పరుగెత్తు” అన్నాడు. అహిమయస్సు మైదానం మీదుగా పరుగెత్తుకొని వెళ్లి కూషీయుని కంటే ముందుగా చేరుకున్నాడు.
2SA 18:24 దావీదు రెండు గుమ్మాల మధ్యలో కూర్చుని ఉన్నాడు. కావలివాడు గుమ్మం పైనున్న గోడ మీదికి ఎక్కి చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తి ఒంటరిగా పరుగెత్తుకొని రావడం కనిపించింది.
2SA 18:25 కావలివాడు గట్టిగా అరిచి రాజుకు ఆ సంగతి చెప్పాడు. రాజు, “అతడు ఒంటరిగా వస్తున్నాడంటే ఒకవేళ మంచివార్తనే తెస్తున్నాడేమో” అన్నాడు. పరుగెడుతూ వస్తున్నవాడు మరింత దగ్గరకు వచ్చాడు.
2SA 18:26 అప్పుడు కావలివాడు మరొక వ్యక్తి పరిగెత్తుకు రావడం చూసి ద్వారపాలకునితో, “అదిగో, మరొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు” అని గట్టిగా చెప్పాడు. రాజు, “అతడు కూడా మంచివార్తనే తెస్తున్నాడేమో” అన్నాడు.
2SA 18:27 కావలివాడు, “మొదట పరుగెత్తుకొని వస్తున్నవాడు సాదోకు కుమారుడైన అహిమయస్సులా పరుగెడుతున్నట్టుంది” అని అన్నాడు. అందుకు రాజు, “అతడు మంచివాడు, మంచివార్తనే తెస్తున్నాడేమో” అని అన్నాడు.
2SA 18:28 అహిమయస్సు, “అంతా క్షేమమే” అని అరుస్తూ, రాజు నేలకు తలవంచి నమస్కారం చేసి, “మీ దేవుడైన యెహోవాకు స్తోత్రం! నా ప్రభువైన రాజుకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఆయన మనకు అప్పగించారు” అన్నాడు.
2SA 18:29 అందుకు రాజు, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు అహిమయస్సు, “యోవాబు మీ సేవకుడనైన నన్ను, రాజు సేవకున్ని పంపుతున్నప్పుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు నేను చూశాను, అయితే అది ఏంటి అనేది నాకు తెలియదు” అని జవాబిచ్చాడు.
2SA 18:30 రాజు, “ప్రక్కకు జరిగి, అక్కడే ఉండు” అన్నాడు. కాబట్టి అతడు ప్రక్కకు జరిగి అక్కడే నిలబడ్డాడు.
2SA 18:31 అంతలో కూషీయుడు వచ్చి, “నా ప్రభువా రాజా! శుభవార్త వినండి! ఈ రోజు యెహోవా మీ మీదికి లేచిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి నీకు న్యాయం చేశారు” అని చెప్పాడు.
2SA 18:32 రాజు కూషీయున్ని, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు కూషీయుడు, “నా ప్రభువైన రాజు యొక్క శత్రువులకు, రాజుకు హాని చేయాలనుకున్న వారందరికి ఆ యువకునికి పట్టిన గతే పట్టాలి” అన్నాడు.
2SA 18:33 అప్పుడు రాజు చాలా కలత చెంది గుమ్మానికి పైన ఉన్న గది లోనికి వెళ్లి, “నా కుమారుడా అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా అబ్షాలోమా! నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగుండేది. అబ్షాలోమా! నా కుమారుడా! నా కుమారుడా” అని అంటూ ఏడ్చాడు.
2SA 19:1 “రాజు అబ్షాలోము గురించి ఏడుస్తూ దుఃఖిస్తున్నాడు” అని ఎవరో యోవాబుకు చెప్పారు.
2SA 19:2 “రాజు తన కుమారుని గురించి దుఃఖిస్తున్నాడు” అని సైనికులు విన్నారు కాబట్టి ఆ రోజు విజయం సైన్యమంతటికి దుఃఖంగా మారింది.
2SA 19:3 యుద్ధం నుండి పారిపోయినందుకు సిగ్గుపడుతున్న సైనికులు ఆ రోజు దొంగల్లా పట్టణంలోకి ప్రవేశించారు.
2SA 19:4 రాజు ముఖం కప్పుకుని, “నా కుమారుడా అబ్షాలోమా! అబ్షాలోమా నా కుమారుడా! నా కుమారుడా!” అని గట్టిగా ఏడ్చాడు.
2SA 19:5 యోవాబు రాజభవనానికి వెళ్లి, “ఈ రోజు మీరు మీ ప్రాణాలను మీ కుమారుల కుమార్తెల ప్రాణాలను మీ భార్యల, ఉంపుడుగత్తెల ప్రాణాలను రక్షించిన మీ సైన్యమంతటిని అవమానపరిచారు.
2SA 19:6 మిమ్మల్ని ద్వేషించేవారిని ప్రేమిస్తూ మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషిస్తున్నారు. మీ సేనాధిపతులు వారి సైన్యం మీకు ముఖ్యం కాదని ఈ రోజు మీరు స్పష్టం చేశారు. మేమందరం చనిపోయి అబ్షాలోము ఒక్కడే బ్రతికి ఉంటే మీ దృష్టికి సరియైనదిగా ఉండేది, మీరు సంతోషించేవారని నాకర్థమయ్యింది.
2SA 19:7 ఇప్పుడు మీరు లేచి బయటకు వచ్చి మీ సైన్యాన్ని ప్రోత్సహించండి. మీరు ఇప్పుడు బయటకు రాకపోతే ఈ రాత్రి వారిలో ఒక్కడూ మీ దగ్గర ఉండరని యెహోవా పేరిట ఒట్టు పెట్టి చెప్తున్నాను. అది మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు మీకు వచ్చిన కష్టాల కన్నా తీవ్రంగా ఉంటుంది” అని అన్నాడు.
2SA 19:8 కాబట్టి రాజు లేచి వచ్చి గుమ్మం దగ్గర కూర్చున్నాడు. రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడని విన్న ప్రజలందరూ రాజును కలవడానికి వచ్చారు. ఇంతలో ఇశ్రాయేలీయులు తమ ఇళ్ళకు పారిపోయారు.
2SA 19:9 అప్పుడు ఇశ్రాయేలు గోత్రాల్లో ప్రజలందరు తమలో తాము వాదించుకుంటూ, “మనలను శత్రువుల చేతిలో నుండి విడిపించింది రాజు; మనలను ఫిలిష్తీయుల చేతిలో నుండి కాపాడింది కూడా అతడే. కాని ఇప్పుడు అతడు అబ్షాలోము కారణంగా దేశం విడిచి పారిపోయాడు.
2SA 19:10 అయితే మనం మనమీద రాజుగా అభిషేకించిన అబ్షాలోము యుద్ధంలో చనిపోయాడు. కాబట్టి మన రాజును తిరిగి ఎందుకు తీసుకురాకూడదు?” అని చెప్పుకున్నారు.
2SA 19:11 అప్పుడు ఆ సంగతి విన్న రాజైన దావీదు యాజకులైన సాదోకు అబ్యాతారులకు ఇలా కబురు పంపించాడు: “ ‘ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకుంటున్న విషయం రాజభవనంలో ఉన్న రాజుకు చేరింది. మరి రాజును తన భవనానికి తీసుకురావడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు?
2SA 19:12 మీరు నా సోదరులు నా రక్త సంబంధులు! రాజును తిరిగి తీసుకురావడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు?’ అని యూదా పెద్దలను అడగండి.
2SA 19:13 తర్వాత అమాశాతో, ‘నీవు నాకు రక్త సంబంధివి కదా! యోవాబు స్థానంలో నిన్ను నా సేనాధిపతిగా నేను చేయకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షిస్తాడు’ అని చెప్పండి” అన్నాడు.
2SA 19:14 అతడు వెళ్లి యూదావారందరు ఒక్క మాట మీద ఉండేలా వారందరి హృదయాలను గెలుచుకున్నాడు. అప్పుడు వారు, “మీరు మీ సైన్యం తిరిగి రండి” అని రాజుకు కబురు పంపించారు.
2SA 19:15 రాజు తిరిగి రావడానికి బయలుదేరి యొర్దాను ఒడ్డుకు చేరుకున్నాడు. యూదా వారు రాజును కలవడానికి, రాజును నది ఇవతలికి తీసుకురావడానికి గిల్గాలుకు వచ్చారు.
2SA 19:16 బహూరీముకు చెందిన బెన్యామీనీయుడైన గెరా కుమారుడైన షిమీ త్వరత్వరగా రాజైన దావీదును కలుసుకోడానికి యూదా వారితో పాటు వచ్చాడు.
2SA 19:17 అతనితో వెయ్యిమంది బెన్యామీనీయులు ఉన్నారు. అంతేకాక సౌలు కుటుంబ సేవకుడైన సీబా, అతని పదిహేను మంది కుమారులు, అతని ఇరవైమంది సేవకులు కూడా వచ్చారు. వారు యొర్దాను ఒడ్డున ఉన్న రాజు దగ్గరకు త్వరగా వెళ్లారు.
2SA 19:18 రాజు కుటుంబీకులను ఇవతలకు దాటించడానికి, రాజు కోరినట్లు చేయడానికి రేవు పడవను ఇవతలకు తెచ్చి పెట్టారు. రాజు యొర్దాను దాటిన తర్వాత గెరా కుమారుడైన షిమీ అతనికి సాష్టాంగ నమస్కారం చేసి,
2SA 19:19 “నా రాజా! నేను చేసిన దాని బట్టి నా మీద నేరం మోపవద్దు. నా ప్రభువు రాజువైన నీవు యెరూషలేము విడిచివెళ్తున్నప్పుడు నేను చేసిన తప్పును జ్ఞాపకం చేసుకోవద్దు. దానిని మనస్సులో ఉంచుకోవద్దు.
2SA 19:20 ఎందుకంటే నేను పాపం చేశానని నీ సేవకుడైన నాకు తెలుసు, కానీ ఈ రోజు నేను యోసేపు గోత్రాల నుండి మొదటివానిగా వచ్చి నా ప్రభువైన రాజును కలుసుకున్నాను” అని చెప్పాడు.
2SA 19:21 అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై, “యెహోవా అభిషేకించినవాన్ని శపించిన ఈ షిమీకి మరణశిక్ష విధించాలి?” అన్నాడు.
2SA 19:22 అందుకు దావీదు, “సెరూయా కుమారులారా! దీనితో మీకు ఉన్న సంబంధం ఏమిటి? దీనిలో కల్పించుకోడానికి మీకు ఏమి హక్కు? ఇలాంటి సమయంలో మీరు నాకు శత్రువులవుతారా? ఈ రోజు ఇశ్రాయేలులో ఎవరికైనా మరణశిక్ష విధించడం సరియైనదేనా? ఈ రోజే నేను ఇశ్రాయేలుకు రాజును అని మీకు తెలియదా?” అని చెప్పి,
2SA 19:23 “నీకు మరణశిక్ష విధించను” అని షిమీతో రాజు ప్రమాణం చేశాడు.
2SA 19:24 సౌలు మనుమడు మెఫీబోషెతు కూడా రాజును కలుసుకోడానికి వచ్చాడు. రాజు వెళ్లిన రోజు నుండి అతడు క్షేమంగా తిరిగివచ్చిన రోజు వరకు మెఫీబోషెతు తన కాళ్లు కడుక్కోలేదు. గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు.
2SA 19:25 దావీదును కలుసుకోవటానికి అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు రాజు, “మెఫీబోషెతూ, నీవు నాతో కూడా ఎందుకు వెళ్లలేదు?” అని అతన్ని అడిగాడు.
2SA 19:26 అందుకతడు, “నా ప్రభువైన నా రాజా! మీ సేవకుడనైన నేను కుంటివాన్ని కాబట్టి గాడిద మీద జీను వేయించుకుని ఎక్కి రాజుతో కలిసి వెళ్లిపోవాలని అనుకున్నాను. కాని నా సేవకుడైన సీబా నన్ను మోసం చేశాడు.
2SA 19:27 అంతేకాక సీబా నీ సేవకుడనైన నా విషయంలో కూడా నీకు అబద్ధాలు చెప్పాడు. నా ప్రభువైన నా రాజు దేవదూత వంటివాడు. కాబట్టి నీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయి.
2SA 19:28 నా తాతగారి వారసులందరూ నా ప్రభువైన రాజు నుండి మరణానికి మాత్రమే పాత్రులు, కానీ మీరు మీ బల్ల దగ్గర భోజనం చేసేవారిలో మీ సేవకునికి స్థానం ఇచ్చారు. అలాంటప్పుడు రాజుగారికి మనవి చేయడానికి నాకు ఏ హక్కు ఉంది?” అన్నాడు.
2SA 19:29 అప్పుడు రాజు, “నీవెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీవు, సీబా ఆ భూమిని చెరిసగం పంచుకోమని చెప్పాను గదా” అన్నాడు.
2SA 19:30 అందుకు మెఫీబోషెతు, “నా ప్రభువైన రాజు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చాడు కాబట్టి అతడే అంతా తీసుకోవచ్చు” అన్నాడు.
2SA 19:31 గిలాదీయుడైన బర్జిల్లయి కూడా రాజుతో పాటు యొర్దాను దాటి, నది అవతలి నుండి అతన్ని సాగనంపడానికి రోగెలీము నుండి వచ్చాడు.
2SA 19:32 బర్జిల్లయి ఎనభై సంవత్సరాల ముసలివాడు. అతడు చాలా ధనవంతుడు కాబట్టి రాజు మహనయీములో ఉన్నప్పుడు అతనికి భోజన పదార్ధాలు సరఫరా చేసేవాడు.
2SA 19:33 రాజు, “నాతో పాటు నది దాటి యెరూషలేములో నా దగ్గరే ఉండిపో, నేను నిన్ను పోషిస్తాను” అని బర్జిల్లయితో చెప్పాడు.
2SA 19:34 అందుకు బర్జిల్లయి రాజుతో, “రాజైన నీతో కూడా యెరూషలేము వచ్చి అక్కడ ఉండడానికి నేనెంతకాలం బ్రతుకుతాను.
2SA 19:35 నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు. సుఖదుఃఖాల మధ్య తేడాను నేను చెప్పగలనా? మీ సేవకుడు భోజన పదార్ధాల రుచి చూడగలడా? నేను ఇంకా గాయనీగాయకుల స్వరాలను వినగలనా? నా ప్రభువును రాజువునైన మీకు మీ సేవకుడు ఎందుకు అధనపు భారం కావాలి?
2SA 19:36 నీ సేవకుడనైన నేను యొర్దాను నది దాటి రాజుతో కలిసి కొంత దూరం వస్తాను. కానీ నా ప్రభువైన రాజుకు నీ సేవకుడనైన నేనెందుకు భారమవ్వాలి?
2SA 19:37 నేను నా ఊరిలో నా తలిదండ్రుల సమాధి దగ్గరే చనిపోవడానికి మీ సేవకుడనైన నన్ను తిరిగి వెళ్లనివ్వండి. అయితే ఇక్కడ నా సేవకుడైన కింహాము ఉన్నాడు. అతన్ని నా ప్రభువైన రాజుతో కలిసి నది దాటనివ్వండి. మీకు ఏది మంచిదనిపిస్తే అది అతనికి చెయ్యండి” అని అన్నాడు.
2SA 19:38 అప్పుడు రాజు, “కింహాము నాతో పాటు రావచ్చు. నీకు ఏది మంచిదనిపిస్తే అది అతనికి చేస్తాను. అంతేకాక, నీవు నా నుండి ఏమి కోరుకుంటున్నావో అదంతా నేను నీకు చేస్తాను” అని హామీ ఇచ్చాడు.
2SA 19:39 అప్పుడు ప్రజలందరు, రాజు యొర్దాను నది దాటారు. రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించాడు. తర్వాత బర్జిల్లయి తన ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.
2SA 19:40 రాజు గిల్గాలు వెళ్లినప్పుడు రాజుతో పాటు కింహాము కూడా వెళ్లాడు. యూదా సైన్యమంతా ఇశ్రాయేలు సైన్యంలో సగం మంది రాజుతో పాటు వచ్చారు.
2SA 19:41 అప్పుడు ఇశ్రాయేలు వారందరూ రాజైన దావీదు దగ్గరకు వచ్చి అతనితో, “మా సహోదరులైన యూదా వారు రాజును ఎత్తుకెళ్లి, నిన్ను నీ ఇంటివారిని నీ సేవకులను యొర్దాను ఇవతలకు ఎందుకు తీసుకువచ్చారు?” అని అడిగారు.
2SA 19:42 అందుకు యూదా వారు, “రాజు మీకు చాలా దగ్గరి బంధువు కాబట్టి మేమిలా చేశాము. మీకు కోపమెందుకు? మేము రాజు ఆహారంలో ఏమైనా తిన్నామా? మేము మాకోసం ఏమైనా తీసుకున్నామా?” అని ఇశ్రాయేలువారితో అన్నారు.
2SA 19:43 అప్పుడు ఇశ్రాయేలీయులు, “రాజులో మాకు పది భాగాలు ఉన్నాయి. కాబట్టి దావీదు మీద మీకంటే మాకే ఎక్కువ హక్కు ఉంది. రాజును తిరిగి తీసుకురావడం గురించి మొదట మాట్లాడింది మేమే గదా! మరి మమ్మల్నెందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు?” అని యూదా వారితో అన్నారు. అయితే యూదా వారి మాటలు ఇశ్రాయేలువారి మాటలకంటే కఠినంగా ఉన్నాయి.
2SA 20:1 బెన్యామీను గోత్రానికి చెందిన బిక్రి కుమారుడైన షేబ అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. అతడు బూర ఊది, “దావీదుతో మనకు ఏ భాగం లేదు, యెష్షయి కుమారునిలో ఏ వాటా లేదు, ఇశ్రాయేలీయులారా! ప్రతిఒక్కరు మీ గుడారానికి వెళ్లండి!” అని బిగ్గరగా అరిచి చెప్పాడు.
2SA 20:2 కాబట్టి ఇశ్రాయేలు వారంతా దావీదును విడిచిపెట్టి బిక్రి కుమారుడైన షేబను వెంబడించారు. కాని యూదావారైతే యొర్దాను నుండి యెరూషలేము వరకు తమ రాజు దగ్గరే ఉండిపోయారు.
2SA 20:3 రాజైన దావీదు యెరూషలేములో తన భవనానికి వచ్చి ఆ భవనాన్ని చూసుకోవడానికి ఉంచిన పదిమంది ఉంపుడుగత్తెలను తీసుకెళ్లి కాపలా ఉన్న ఇంట్లో పెట్టి వారిని పోషించాడు కాని వారితో ఎలాంటి లైంగిక సంబంధం పెట్టుకోలేదు. వారు చచ్చే వరకు విధవరాండ్రుగా జీవించారు.
2SA 20:4 తర్వాత రాజు అమాశాతో, “మూడు రోజుల్లో యూదావారందరిని పిలిపించి వారితో పాటు నీవు కూడా ఇక్కడకు రావాలి” అని చెప్పాడు.
2SA 20:5 అమాశా యూదా వారిని పిలిపించడానికి వెళ్లాడు గాని, రాజు అతనికిచ్చిన సమయానికి రాలేదు.
2SA 20:6 దావీదు అబీషైని పిలిచి, “అబ్షాలోము కంటే ఈ బిక్రి కుమారుడైన షేబ మనకు ఎక్కువ కీడు చేస్తాడు. నీవు నీ రాజు సేవకులను తీసుకెళ్లి అతన్ని వెంటాడి పట్టుకో లేకపోతే కోటగోడలున్న పట్టణాల్లో దాక్కుని మన నుండి తప్పించుకుంటాడు” అని చెప్పాడు.
2SA 20:7 కాబట్టి యోవాబు మనుష్యులు కెరేతీయులు పెలేతీయులు యుద్ధ వీరులందరు అబీషై నాయకత్వంలో యెరూషలేము నుండి బయలుదేరి బిక్రి కుమారుడైన షేబను వెంటాడటానికి వెళ్లారు.
2SA 20:8 వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు చేరుకున్నపుడు, అమాశా వారిని కలుసుకోడానికి అక్కడికి వచ్చాడు. యోవాబు యుద్ధ వస్త్రాలు ధరించాడు దానిపైన ఉన్న నడికట్టుకు వ్రేలాడుతున్న ఒరలో కత్తి ఉంది. అతడు ముందుకు అడుగు వేసినప్పుడు ఒరలో నుండి కత్తి జారిపడింది.
2SA 20:9 యోవాబు, “నా సోదరుడా! క్షేమమా?” అని అమాశాను అడిగి అతన్ని ముద్దు పెట్టుకుంటున్నట్లు కుడిచేతితో అతని గడ్డం పట్టుకున్నాడు.
2SA 20:10 యోవాబు ఎడమ చేతిలో ఉన్న కత్తిని అమాశా చూడలేదు కాబట్టి అజాగ్రత్తగా ఉన్నాడు. యోవాబు కత్తి తీసి అతని కడుపులో పొడవగానే అమాశా ప్రేగులు బయటకు వచ్చి నేల మీద పడి అక్కడే అతడు చనిపోయాడు. అప్పుడు యోవాబు అతని తమ్ముడైన అబీషైలు బిక్రి కుమారుడైన షేబను వెంటాడుతూ వెళ్లారు.
2SA 20:11 యోవాబు మనుష్యుల్లో ఒకడు అమాశా మృతదేహం దగ్గర నిలబడి, “యోవాబును ఇష్టపడేవారు, దావీదు వైపు ఉన్నవారందరు యోవాబును వెంబడించండి” అన్నాడు.
2SA 20:12 అమాశా మార్గం మధ్యలో రక్తంతో కొట్టుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన సైనికులందరూ అక్కడే ఆగిపోవడం ఆ వ్యక్తి చూసి, అమాశా శవాన్ని దారిలో నుండి పొలంలోకి లాక్కెళ్లి ఆ దారిన వచ్చినవారు నిలబడి చూడకుండ ఆ శవం మీద బట్ట కప్పాడు.
2SA 20:13 అమాశా శవాన్ని దారిలో నుండి తీసిన తర్వాత అందరు బిక్రి కుమారుడైన షేబను వెంటాడడానికి యోవాబు వెంట వెళ్లారు.
2SA 20:14 షేబ ఇశ్రాయేలు గోత్రాల వారందరి దగ్గరకు, ఆబేల్ బేత్ మయకా వారి దగ్గరకు బెరీయుల దగ్గరకు వెళ్లగా వారంతా కలిసికట్టుగా వచ్చి అతన్ని వెంబడించారు.
2SA 20:15 యోవాబుతో ఉన్న సైన్యమంత వచ్చి, ఆబేల్-బేత్-మయకాలో షేబను ముట్టడించి పట్టణ గోడలకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టారు. యోవాబు సైన్యమంతా గోడ పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే,
2SA 20:16 ఆ పట్టణంలో ఉన్న ఒక తెలివైన స్త్రీ బిగ్గరగా, “వినండి! వినండి! నేను యోవాబుతో మాట్లాడాలి. అతన్ని ఇక్కడకు రమ్మనండి” అని చెప్పింది.
2SA 20:17 యోవాబు ఆమె దగ్గరకు వెళ్లగా ఆమె, “యోవాబు నీవేనా?” అని అడిగింది. అతడు, “నేనే” అన్నాడు. ఆమె, “నీ సేవకురాలు నీతో చెప్పేది వినండి” అని అన్నది. అతడు, “చెప్పు వింటాను” అన్నాడు.
2SA 20:18 అప్పుడు ఆమె, “పూర్వం ప్రజలు ‘ఏదైనా సమస్య ఉంటే ఆబేలులో పరిష్కరించుకోండి’ అనేవారు. అలా వారు పరిష్కారం పొందేవారు.
2SA 20:19 మేము ఇశ్రాయేలులో నెమ్మదస్తులం నమ్మకమైనవారము. మీరు ఇశ్రాయేలు పట్టణాల్లో ప్రధానమైన పట్టణాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. యెహోవా వారసత్వాన్ని మీరెందుకు నిర్మూలం చేస్తారు?” అని నిలదీసింది.
2SA 20:20 అందుకు యోవాబు, “నేను నాశనం చేయాలని నిర్మూలం చేయాలని అనుకోవడం లేదు.
2SA 20:21 అసలు విషయం అది కాదు. బిక్రి కుమారుడైన షేబ అనే ఎఫ్రాయిం కొండ ప్రాంతానికి చెందిన ఒకడు రాజైన దావీదు మీద తిరుగుబాటు చేశాడు. ఆ ఒక్కడిని మీరు మాకు అప్పగిస్తే, నేను ఈ పట్టణాన్ని విడిచివెళ్తాను” అని చెప్పాడు. అప్పుడు ఆమె, “సరే, వాని తల గోడ పైనుండి పడవేస్తాం” అని చెప్పింది.
2SA 20:22 ఆమె వెళ్లి, తాను తెలివిగా యోవాబుతో మాట్లాడిన మాటలు పట్టణ ప్రజలకు చెప్పినప్పుడు వారు బిక్రి కుమారుడైన షేబ తల నరికి యోవాబు దగ్గర పడవేశారు. వెంటనే అతడు బూరధ్వని చేశాడు. అతని మనుష్యులందరు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేములో ఉన్న రాజు దగ్గరకు తిరిగి వెళ్లాడు.
2SA 20:23 యోవాబు ఇశ్రాయేలు సైన్యమంతటికి అధిపతి; కెరేతీయులకు పెలేతీయులకు యెహోయాదా కుమారుడైన బెనాయా అధిపతి;
2SA 20:24 అదోనిరాము వెట్టిపనులు చేసేవారిమీద అధికారి; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల పర్యవేక్షణ అధికారి;
2SA 20:25 షెవా కార్యదర్శి; సాదోకు అబ్యాతారులు యాజకులు;
2SA 20:26 యాయీరీయుడైన ఈరా దావీదుకు వ్యక్తిగత యాజకుడు.
2SA 21:1 దావీదు పాలనలో మూడు సంవత్సరాలు వరుసగా కరువు రాగా దావీదు యెహోవాకు మనవి చేశాడు. అందుకు యెహోవా, “సౌలు గిబియోనీయులను చంపాడు; అతడు, అతని కుటుంబం రక్తం చిందించిన కారణంగా ఈ కరువు వచ్చింది” అన్నారు.
2SA 21:2 రాజు గిబియోనీయులను పిలిపించి వారితో మాట్లాడాడు. (ఈ గిబియోనీయులు ఇశ్రాయేలీయులకు సంబంధించినవారు కారు; వారు అమోరీయుల జాతిలో మిగిలినవారు. ఇశ్రాయేలీయులు మిమ్మల్ని చంపమని వారికి ప్రమాణం చేశారు కాని సౌలుకు ఇశ్రాయేలు, యూదా వారి పట్ల ఉన్న ఆసక్తితో వారిని చంపుతూ వచ్చాడు.)
2SA 21:3 దావీదు గిబియోనీయులను, “మీరు యెహోవా వారసత్వాన్ని దీవించేలా మీ కోసం ప్రాయశ్చిత్తంగా నేను ఏం చేయాలి?” అని అడిగాడు.
2SA 21:4 అందుకు గిబియోనీయులు, “సౌలు అతని కుటుంబం నుండి వెండి బంగారాలను గాని ఇశ్రాయేలులో ఎవరినైనా చంపమని గాని అడగడం లేదు” అని అన్నారు. దావీదు, “నేనేం చేయాలో చెప్పండి అది మీకు చేస్తాను” అన్నాడు.
2SA 21:5 అప్పుడు వారు రాజుతో, “మాకు శత్రువుగా మారి మేము నాశనం అవ్వాలని ఇశ్రాయేలు సరిహద్దులలో లేకుండా నిర్మూలం చేయాలని కుట్రపన్నిన సౌలు సంతతివారిలో ఏడుగురు మగవారిని మాకు అప్పగించండి.
2SA 21:6 యెహోవా ఏర్పరచుకున్న సౌలు పట్టణమైన గిబియాలో యెహోవా సమక్షంలో వారిని ఉరితీస్తాం” అన్నారు. అందుకు రాజు, “సరే, నేను వారిని మీకు అప్పగిస్తాను” అన్నాడు.
2SA 21:7 దావీదు సౌలు కుమారుడైన యోనాతానుతో యెహోవా ఎదుట చేసిన ప్రమాణం కారణంగా సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును రాజు వారికి అప్పగించలేదు.
2SA 21:8 అయితే రాజు సౌలుకు అయ్యా కుమార్తె రిస్పాకు పుట్టిన ఇద్దరు కుమారులైన అర్మోని మెఫీబోషెతులను, సౌలు కుమార్తె మెరాబుకు మెహోలతీయుడైన బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలుకు పుట్టిన అయిదుగురు కుమారులను తీసుకువచ్చాడు.
2SA 21:9 వారిని గిబియోనీయులకు అప్పగించాడు. వారు ఈ ఏడుగురిని యెహోవా ఎదుట కొండమీద ఉరితీసి చంపారు. ఆ ఏడుగురు ఒకేసారి చనిపోయారు. కోతకాలం మొదటి రోజున యవల కోత మొదలు పెడుతున్నప్పుడు వారిని చంపారు.
2SA 21:10 అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకుని ఒక బండ మీద దానిని పరచుకొని కోతకాలం ప్రారంభం నుండి ఆ శవాల మీద ఆకాశం నుండి వర్షం కురిసేవరకు పగలు పక్షులు వాటిని ముట్టకుండా రాత్రి అడవి జంతువులు వాటిని తినకుండా కాపలా కాస్తూ ఆమె అక్కడే ఉండిపోయింది.
2SA 21:11 అయ్యా కుమార్తె సౌలు ఉంపుడుగత్తెయైన రిస్పా చేసింది దావీదుకు తెలిసినప్పుడు,
2SA 21:12 దావీదు వెళ్లి యాబేషు గిలాదువారి దగ్గరి నుండి సౌలు, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తీసుకువచ్చాడు. (గిల్బోవలో ఫిలిష్తీయులు సౌలు యోనాతానులను చంపి బేత్-షాను పట్టణపు వీధుల్లో వ్రేలాడదీసినప్పుడు యాబేషు గిలాదువారు వారి మృతదేహాలను దొంగిలించారు.)
2SA 21:13 దావీదు వారి దగ్గర నుండి సౌలు అతని కుమారుడైన యోనాతాను ఎముకలు తెప్పించాడు. రాజాజ్ఞ ప్రకారం ఉరితీయబడిన ఆ ఏడుగురి ఎముకలు కూడా సమకూర్చారు.
2SA 21:14 సౌలు అతని కుమారుడైన యోనాతాను ఎముకలు తీసుకుని బెన్యామీనీయుల దేశంలోని సేలాలో ఉన్న సౌలు తండ్రి కీషు సమాధిలో పాతిపెట్టారు. రాజు ఆజ్ఞ ప్రకారం ప్రతిదీ వారు చేసిన తర్వాత దేశం కోసం వారు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చారు.
2SA 21:15 తర్వాత మరోసారి ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరిగింది. దావీదు తన సైనికులతో కలిసి వెళ్లి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి అలసిపోయాడు.
2SA 21:16 అక్కడ రాఫా సంతతివాడైన ఇష్బి-బెనోబు అనేవాడు క్రొత్త ఖడ్గం, మూడువందల షెకెళ్ళ బరువు ఉన్న ఇత్తడి ఈటె పట్టుకుని, “దావీదును చంపుతాను” అని అన్నాడు.
2SA 21:17 అయితే సెరూయా కుమారుడైన అబీషై దావీదును కాపాడి ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. అప్పుడు దావీదు మనుష్యులు, “ఇశ్రాయేలీయుల దీపమైన నీవు ఆరిపోకుండా ఉండేలా నీవు ఇకపై మాతో పాటు యుద్ధానికి రావద్దు” అని దావీదుతో ప్రమాణం చేయించారు.
2SA 21:18 కొంతకాలం తర్వాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో మరోసారి యుద్ధం జరిగింది. ఆ సమయంలో హుషాతీయుడైన సిబ్బెకై రాఫా వారసులలో ఒకడైన సఫును చంపాడు.
2SA 21:19 గోబు దగ్గర ఫిలిష్తీయులతో జరిగిన మరో యుద్ధంలో బేత్లెహేమీయుడైన యాయీరు కుమారుడు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సోదరున్ని చంపాడు. అతని ఈటె నేతపనివాని అడ్డకర్రంత పెద్దది.
2SA 21:20 గాతు దగ్గర జరిగిన మరో యుద్ధంలో చాలా పొడవైన వాడొకడు ఉన్నాడు. అతని రెండు చేతులకు కాళ్లకు ఆరు వ్రేళ్ళ చొప్పున మొత్తం ఇరవైనాలుగు వ్రేళ్ళు ఉన్నాయి. అతడు కూడా రాఫా సంతతివాడు.
2SA 21:21 అతడు ఇశ్రాయేలీయులను దూషించినప్పుడు, దావీదు సోదరుడు, షిమ్యా కుమారుడైన యోనాతాను అతన్ని చంపాడు.
2SA 21:22 ఈ నలుగురు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు.
2SA 22:1 యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి, సౌలు చేతి నుండి విడిపించినప్పుడు దావీదు యెహోవా సన్నిధిలో ఈ పాట పాడాడు.
2SA 22:2 అతడు ఇలా పాడాడు: “యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు;
2SA 22:3 నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు, నా రక్షణ కొమ్ము. ఆయన నా బలమైన కోట, నా ఆశ్రయం, నా రక్షకుడు హింసించేవారి నుండి నన్ను రక్షిస్తారు.
2SA 22:4 “స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను, నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను.
2SA 22:5 మరణపు అలలు నన్ను చుట్టుకున్నాయి; దుష్టులు వరదల్లా నన్ను ముంచెత్తుతారు.
2SA 22:6 సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; మరణపు ఉచ్చులు నన్ను బంధించాయి.
2SA 22:7 “నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన చెవులకు చేరింది.
2SA 22:8 అప్పుడు భూమి కంపించి అదిరింది, పరలోకపు పునాదులు కదిలాయి. ఆయన కోపానికి అవి వణికాయి.
2SA 22:9 ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది; ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది, దానిలో నిప్పులు మండుతున్నాయి.
2SA 22:10 ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు; ఆయన పాదాల క్రింద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.
2SA 22:11 ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు. ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు.
2SA 22:12 ఆయన చీకటిని తన చుట్టూ పందిరిగా, కారు మేఘాలను పందిరిగా చేసుకున్నారు.
2SA 22:13 ఆయన సన్నిధి కాంతి నుండి పిడుగులు వచ్చాయి.
2SA 22:14 యెహోవా పరలోకం నుండి ఉరిమారు. మహోన్నతుని స్వరం ప్రతిధ్వనించింది.
2SA 22:15 ఆయన తన బాణాలు విసిరి శత్రువును చెదరగొట్టారు, మెరుస్తున్న గొప్ప పిడుగులతో వారిని తరిమికొట్టారు.
2SA 22:16 యెహోవా గద్దింపుకు, ఆయన నాసికా రంధ్రాల్లో నుండి వచ్చే బలమైన ఊపిరికి సముద్రపు అగాధాలు కనబడ్డాయి, భూమి పునాదులు బయటపడ్డాయి.
2SA 22:17 “ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు.
2SA 22:18 శక్తివంతమైన నా శత్రువు నుండి, నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు.
2SA 22:19 నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నారు.
2SA 22:20 ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు; ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు.
2SA 22:21 “నా నీతిని బట్టి యెహోవా నాతో వ్యవహరించారు; నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చారు.
2SA 22:22 నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు.
2SA 22:23 ఆయన న్యాయవిధులన్ని నా ముందే ఉన్నాయి; ఆయన శాసనాల నుండి నేను తొలగిపోలేదు.
2SA 22:24 ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను, నేను పాపానికి దూరంగా ఉన్నాను.
2SA 22:25 నా నీతిని బట్టి ఆయన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చారు.
2SA 22:26 “నమ్మకస్థులకు మిమ్మల్ని మీరు నమ్మకస్థులుగా కనుపరచుకుంటారు, యథార్థంగా ఉండే వారికి మిమ్మల్ని మీరు యథార్థవంతులుగా కనుపరచుకుంటారు,
2SA 22:27 నిష్కళంకులకు మీరు నిష్కళంకంగా కనుపరచుకుంటారు, కాని వంచకులకు మిమ్మల్ని మీరు వివేకిగా కనుపరచుకుంటారు.
2SA 22:28 మీరు దీనులను రక్షిస్తారు, అహంకారులపై మీ దృష్టి ఉంచి వారిని అణచివేస్తారు.
2SA 22:29 యెహోవా! మీరు నాకు దీపము; యెహోవా నా చీకటిని వెలుగుగా మారుస్తారు.
2SA 22:30 మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను; నా దేవుని తోడుతో నేను గోడను దాటుతాను.
2SA 22:31 “దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది; యెహోవా వాక్కు లోపం లేనిది; ఆయనను ఆశ్రయించిన వారందరిని ఆయన కాపాడతారు.
2SA 22:32 యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు?
2SA 22:33 బలంతో నన్ను సాయుధునిగా చేసేది, నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే.
2SA 22:34 నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు; ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతారు.
2SA 22:35 నా చేతులను యుద్ధానికి సిద్ధపరుస్తారు; నా చేతులు ఇత్తడి విల్లును వంచగలవు.
2SA 22:36 మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు, మీ సహాయం నన్ను గొప్ప చేస్తుంది.
2SA 22:37 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు.
2SA 22:38 “నేను నా శత్రువులను వెంటాడి వారిని నాశనం చేశాను; వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు.
2SA 22:39 వారు మళ్ళీ లేవకుండా వారిని పూర్తిగా నలుగగొట్టాను; వారు నా పాదాల క్రింద పడ్డారు.
2SA 22:40 మీరు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపచేశారు; మీరు నా విరోధులను నా ముందు అణచివేశారు.
2SA 22:41 మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు, నేను నా విరోధులను నాశనం చేశాను.
2SA 22:42 వారు సాయం కోసం మొరపెట్టారు కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు.
2SA 22:43 భూమి మీద ఉండే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను; వీధుల్లోని బురదలా నేను వారిని తొక్కాను.
2SA 22:44 “జనాల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు; జనులకు నాయకునిగా మీరు నన్ను స్థిరపరిచారు. నాకు తెలియని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు.
2SA 22:45 విదేశీయులు నా ముందు భయపడుతున్నారు; నా గురించి వినగానే వారు నాకు లోబడుతున్నారు.
2SA 22:46 వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు.
2SA 22:47 “యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి! నా రక్షణ ఆశ్రయమైన దేవునికి మహిమ!
2SA 22:48 నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే, దేశాలను నాకు లోబరచేది ఆయనే.
2SA 22:49 నా శత్రువుల నుండి నన్ను రక్షించేది ఆయనే. నా విరోధులకు పైగా మీరు నన్ను హెచ్చించారు; హింసాత్మక వ్యక్తుల నుండి మీరు నన్ను విడిపించారు.
2SA 22:50 అందుకే యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీ నామ సంకీర్తన చేస్తాను.
2SA 22:51 “ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు; ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి, తన మారని దయను చూపిస్తారు.”
2SA 23:1 దావీదు చివరి మాటలు: “యెష్షయి కుమారుడైన దావీదు పలికిన దైవావేశ మాటలు, సర్వోన్నతునిచే హెచ్చింపబడినవాడును, యాకోబు దేవునిచే అభిషేకించబడినవాడును, ఇశ్రాయేలు కీర్తనల మధుర గాయకుడునైన దావీదు పలికిన మాటలు.
2SA 23:2 “యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడారు; ఆయన మాట నా నాలుక మీద ఉంది.
2SA 23:3 ఇశ్రాయేలు దేవుడు మాట్లాడారు, ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం నాతో ఇలా అన్నారు: ‘మనుష్యుల మధ్య నీతిగా పాలించేవాడు, దేవుని భయం కలిగి పాలించేవాడు,
2SA 23:4 అతడు మబ్బులు లేని ఉదయాన సూర్యోదయపు వెలుగులాంటివాడు, వాన వెలిసిన తర్వాతి వచ్చే తేజస్సులాంటివాడు; అది భూమి నుండి గడ్డిని మొలిపిస్తుంది.’
2SA 23:5 “ఒకవేళ నా కుటుంబం దేవునితో సరిగా లేకపోయినా, నిజంగా ఆయన నాతో శాశ్వతమైన నిబంధన చేసి ఉండరు కదా, ఆ నిబంధన అన్నివిధాల పరిపూర్ణమైనది స్థిరమైనది; నిజంగా ఆయన నా రక్షణను ఫలవంతం చేసి ఉండరు, నా ప్రతి కోరికను ఇచ్చి ఉండరు.
2SA 23:6 అయితే చేతులతో పోగుచేయలేని ముళ్ళలా, దుష్టులందరు పారవేయబడాలి.
2SA 23:7 ముళ్ళను పట్టుకునేవారు ఇనుప పనిముట్టునైనా లేదా బల్లెపు పిడినైనా ఉపయోగిస్తారు; అవి పడిన చోటనే కాల్చివేయబడతాయి.”
2SA 23:8 దావీదు దగ్గర ఉన్న పరాక్రమ యోధుల పేర్లు ఇవే: తక్మోనీయుడైన యోషేబ్-బష్షెబెతు ముగ్గురిలో మొదటివాడు. అతడు ఒకే యుద్ధంలో తన ఈటెతో ఎనిమిదివందల మందిని చంపాడు.
2SA 23:9 అతని తర్వాత శ్రేణిలో అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు ఉన్నాడు. ముగ్గురు యోధులలో ఒక్కడైన ఇతడు పస్ దమ్మీములో యుద్ధానికి వచ్చిన ఫిలిష్తీయులను ఎదిరించినప్పుడు దావీదుతో పాటు ఉన్నాడు. ఇశ్రాయేలీయులు వెనుకకు తగ్గినప్పుడు,
2SA 23:10 ఎలియాజరు యుద్ధరంగంలో నిలబడి చేయి తిమ్మిరెక్కి కత్తికి అతుక్కుపోయేదాకా ఫిలిష్తీయులను చంపుతూనే ఉన్నాడు. ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ఇచ్చారు. దోపుడుసొమ్ము పట్టుకోవడానికి మాత్రమే సైన్యం అతని దగ్గరకు తిరిగి వచ్చింది.
2SA 23:11 అతని తర్వాత హరారీయుడైన అగీ కుమారుడైన షమ్మా ఉన్నాడు. అలచందల నిండి ఉన్న పొలం దగ్గర ఫిలిష్తీయులను చూసి ఇశ్రాయేలు దళాలు పారిపోయారు.
2SA 23:12 కాని షమ్మా పొలం మధ్యలో నిలబడి దాన్ని కాపాడి ఫిలిష్తీయులను చంపాడు. యెహోవా వారికి గొప్ప విజయాన్ని ఇచ్చారు.
2SA 23:13 కోతకాలంలో ముప్పైమంది ముఖ్య యోధులలో ముగ్గురు అదుల్లాము గుహ దగ్గర ఉన్న దావీదు దగ్గరకు వచ్చారు. అప్పుడు ఫిలిష్తీయుల సైనికుల గుంపు రెఫాయీము లోయలో శిబిరం ఏర్పరచుకుంది.
2SA 23:14 ఆ సమయంలో దావీదు సురక్షితమైన స్థావరంలో ఉన్నాడు, ఫిలిష్తీయుల దండు బేత్లెహేములో ఉంది.
2SA 23:15 దావీదు నీళ్ల కోసం ఆరాటపడుతూ, “బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బాగుండేది!” అన్నాడు.
2SA 23:16 అప్పుడు ఆ ముగ్గురు వీరులు ఫిలిష్తీయుల శిబిరం గుండా చొరబడి బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు తోడుకొని దావీదుకు తెచ్చి ఇచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగడానికి నిరాకరించాడు; బదులుగా వాటిని యెహోవాకు అర్పణగా పారబోశాడు.
2SA 23:17 “యెహోవా! ఈ నీళ్లు నేను త్రాగగలనా? వీరు తమ ప్రాణాలకు తెగించి తెచ్చిన నీళ్లు వారి రక్తంతో సమానం కాదా?” అని చెప్పి వాటిని త్రాగలేదు. ఆ ముగ్గురు పరాక్రమ యోధులు చేసిన సాహసాలు ఇలాంటివి.
2SA 23:18 సెరూయా కుమారుడు, యోవాబు సోదరుడైన అబీషై ఆ ముగ్గురికి నాయకుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడువందల మందిని చంపాడు, కాబట్టి అతడు ఆ ముగ్గురిలా ప్రసిద్ధి పొందాడు.
2SA 23:19 అతడు ఆ ముగ్గురికంటే గొప్ప గౌరవాన్ని పొంది వారి దళాధిపతి అయ్యాడు కాని వారిలో ఒకనిగా చేర్చబడలేదు.
2SA 23:20 గొప్ప పోరాట వీరుడు, కబ్సెయేలుకు చెందిన యెహోయాదా కుమారుడైన బెనాయా గొప్ప సాహస కార్యాలను చేశాడు. అతడు మోయాబు యొక్క పరాక్రమశాలులైన ఇద్దరిని చంపాడు. అంతేకాక, మంచుపడే కాలంలో ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు.
2SA 23:21 అతడు ఒక భారీ ఈజిప్టు వానిని చంపాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో ఈటె ఉన్నప్పటికీ బెనాయా దుడ్డుకర్ర పట్టుకుని వాని మీదికి పోయాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో ఉన్న ఈటెను లాక్కుని దానితోనే అతన్ని చంపాడు.
2SA 23:22 యెహోయాదా కుమారుడైన బెనాయా సాహస కార్యాలు ఇలాంటివి; అతడు కూడా ఆ ముగ్గురు గొప్ప యోధులతో పాటు ప్రసిద్ధి పొందాడు.
2SA 23:23 ఆ ముప్పైమందిలో ఘనతకెక్కాడు గాని, ఆ ముగ్గురి జాబితాలో చేర్చబడలేదు. దావీదు అతన్ని తన అంగరక్షకుల నాయకునిగా నియమించాడు.
2SA 23:24 ఆ ముప్పైమంది వీరే: యోవాబు తమ్ముడైన అశాహేలు, బేత్లెహేముకు చెందిన దోదో కుమారుడైన ఎల్హానాను.
2SA 23:25 హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
2SA 23:26 పత్తీయుడైన హేలెస్సు, తెకోవాకు చెందిన ఇక్కేషు కుమారుడైన ఈరా.
2SA 23:27 అనాతోతుకు చెందిన అబీయెజెరు, హుషాతీయుడైన సిబ్బెకై
2SA 23:28 అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై.
2SA 23:29 నెటోపాతీయుడైన బయనా కుమారుడు హేలెదు, బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి.
2SA 23:30 పిరాతోనీయుడైన బెనాయా, గాయషు కనుమలకు చెందిన హిద్దయి
2SA 23:31 అర్బాతీయుడైన అబీ-అల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,
2SA 23:32 షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కుమారులలో యోనాతాను,
2SA 23:33 హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు కుమారుడు అహీయాము,
2SA 23:34 మయకాతీయుడైన అహస్బయి కుమారుడు ఎలీఫెలెతు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడు ఎలీయాము,
2SA 23:35 కర్మెలీయుడైన హెజ్రో, అర్బీయుడైన పయరై,
2SA 23:36 సోబావాడైన నాతాను కుమారుడు ఇగాలు, గాదీయుడైన బానీ,
2SA 23:37 అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలను మోసేవాడు.
2SA 23:38 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు.
2SA 23:39 హిత్తీయుడైన ఊరియా.
2SA 24:1 యెహోవాకు మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల మీద కోపం రాగా ఆయన, “వెళ్లి ఇశ్రాయేలువారి యూదావారి జనాభాను లెక్కించు” అని దావీదును వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టారు.
2SA 24:2 కాబట్టి రాజు యోవాబును, అతనితో ఉన్న సైన్యాధిపతులను పిలిచి, “యుద్ధానికి వెళ్లగలిగిన వారి సంఖ్య నాకు తెలిసేలా దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలు గోత్రాలన్నిటి దగ్గరకు వెళ్లి జనాభా లెక్క తీసుకురండి” అని చెప్పాడు.
2SA 24:3 కాని యోవాబు రాజుతో, “మీ దేవుడైన యెహోవా సైన్యాన్ని వందరెట్లు ఎక్కువ చేయడం నా ప్రభువైన రాజా మీరే చూస్తారు. కానీ నా ప్రభువు రాజు అలాంటి పని ఎందుకు చేయాలనుకుంటున్నాడు?” అని అన్నాడు.
2SA 24:4 అయితే రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞకు తిరుగులేదు కాబట్టి వారు రాజు ఎదుట నుండి ఇశ్రాయేలీయుల జనాభా లెక్కించడానికి బయలుదేరి వెళ్లారు.
2SA 24:5 యొర్దాను దాటి గాదు లోయ పట్టణానికి దక్షిణంగా అరోయేరులో శిబిరం ఏర్పరచుకున్నారు. అక్కడినుండి గాదు ప్రాంతం గుండా యాజెరుకు వెళ్లారు.
2SA 24:6 అక్కడినుండి గిలాదు, తహ్తీము హొద్షీ ప్రాంతానికి వచ్చి దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు.
2SA 24:7 అక్కడినుండి కోటలున్న తూరు పట్టణానికి హివ్వీయుల, కనానీయుల పట్టణాలన్నిటికి వచ్చారు. చివరిగా యూదా దేశానికి దక్షిణాన ఉన్న బెయేర్షేబ వరకు వచ్చారు.
2SA 24:8 ఇలా వారు దేశమంతా తిరిగి తొమ్మిది నెలల ఇరవై రోజులకు యెరూషలేముకు చేరుకున్నారు.
2SA 24:9 యోవాబు యుద్ధం చేయగలవారి సంఖ్య రాజుకు తెలియజేశాడు. ఇశ్రాయేలులో కత్తి తిప్పగలవారు ఎనిమిది లక్షలమంది ఉన్నారు, యూదా వారిలో అయిదు లక్షలమంది ఉన్నారు.
2SA 24:10 సైన్యాన్ని లెక్కించిన తర్వాత దావీదు తప్పు చేశానని మనస్సాక్షి గద్దింపు పొంది, అతడు యెహోవాకు, “నేను ఈ పని చేసి ఘోరపాపం చేశాను. యెహోవా, మీ సేవకుని దోషాన్ని తొలగించమని బ్రతిమాలుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను” అని ప్రార్థన చేశాడు.
2SA 24:11 తర్వాతి రోజు ఉదయాన్నే దావీదు నిద్ర లేవడానికి ముందే దావీదుకు దీర్ఘదర్శిగా, ప్రవక్తగా ఉన్న గాదుతో యెహోవా ఇలా చెప్పారు:
2SA 24:12 “వెళ్లి దావీదుతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీకు మూడు ఎంపికలు ఇస్తున్నాను. వాటిలో ఒకదాన్ని ఎంచుకో, దానిని నీమీదికి రప్పిస్తాను.’ ”
2SA 24:13 కాబట్టి గాదు దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “నీ దేశంలో మూడు సంవత్సరాల కరువు రావాలని కోరుకుంటావా? నీ శత్రువులు నిన్ను వెంటాడగా, వారిని ఎదుర్కోలేక మూడు నెలలు పారిపోతావా? నీ దేశంలో మూడు రోజులు తెగులు వ్యాపించాలని కోరుకుంటావా? ఇప్పుడు, నన్ను పంపిన వ్యక్తికి నేనేమి జవాబివ్వాలో ఆలోచించి నిర్ణయించుకో” అన్నాడు.
2SA 24:14 అందుకు దావీదు గాదుతో, “నేను తీవ్ర బాధలో ఉన్నాను. యెహోవా కనికరం ఎంతో గొప్పది కాబట్టి ఆయన చేతిలోనే మేము పడాలి; కాని మనుష్యుల చేతిలో నేను పడకూడదు” అని అన్నాడు.
2SA 24:15 కాబట్టి యెహోవా ఉదయం నుండి నియమించబడిన సమయం పూర్తయ్యే వరకు ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించారు. అప్పుడు దాను నుండి బెయేర్షేబ వరకు డెబ్బైవేలమంది చనిపోయారు.
2SA 24:16 యెరూషలేమును నాశనం చేయడానికి దేవదూత చేయి చాపినప్పుడు జరిగిన కీడుకు యెహోవా మనస్సు కరిగి ప్రజలను నాశనం చేస్తున్న దూతతో, “ఇక చాలు! నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పారు. అప్పుడు యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాకు చెందిన నూర్పిడి కళ్ళం దగ్గర ఉన్నాడు.
2SA 24:17 నాశనం చేస్తున్న దూతను చూసిన దావీదు, “గొర్రెల కాపరినైన నేను పాపం చేశాను! వీరు గొర్రెల వంటి వారు, వీరేమి చేశారు? ఈ ప్రజలు ఏమి చేశారు? మీ చేతులు నా మీద నా కుటుంబం మీద పడనివ్వండి” అని యెహోవాకు ప్రార్థన చేశాడు.
2SA 24:18 అదే రోజు గాదు దావీదు దగ్గరకు వచ్చి, “యెబూసీయుడైన అరౌనా నూర్పిడి కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించు” అని చెప్పాడు.
2SA 24:19 గాదు ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞమేరకు దావీదు బయలుదేరి వెళ్లాడు.
2SA 24:20 రాజు, అతని అధికారులు తన వైపు రావడం చూసిన అరౌనా రాజుకు ఎదురు వెళ్లి తన తల నేలకు వంచి రాజుకు నమస్కారం చేశాడు.
2SA 24:21 అరౌనా, “నా ప్రభువైన రాజా, తన సేవకుని దగ్గరకు రావడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. అందుకు దావీదు, “ప్రజల మీద ఉన్న తెగులు ఆగిపోవడానికి యెహోవాకు బలిపీఠం కట్టడానికి, నీ నూర్పిడి కళ్ళం కొనాలని వచ్చాను” అని అన్నాడు.
2SA 24:22 అందుకు అరౌనా దావీదుతో, “నా ప్రభువైన రాజు తనకు కావల్సింది తీసుకుని బలి అర్పించవచ్చు. దహనబలి కోసం ఇక్కడ ఎద్దులు ఉన్నాయి. కట్టెలకు నూర్చే కర్రలు ఎద్దు కాడెలు ఉన్నాయి.
2SA 24:23 రాజా, ఇవన్నీ అరౌనా అనే నేను రాజుకు ఇస్తున్నాను” అని చెప్పి, “నీ దేవుడైన యెహోవా నీ ప్రార్థన అంగీకరించును గాక” అని అన్నాడు.
2SA 24:24 అయితే రాజు అరౌనాతో, “లేదు, నీకు వెల చెల్లించి కొంటాను. ఉచితంగా తీసుకున్న దానిని నేను నా దేవుడైన యెహోవాకు దహనబలి అర్పించను” అన్నాడు. కాబట్టి దావీదు ఆ నూర్పిడి కళ్ళాన్ని ఎడ్లను యాభై షెకెళ్ళ వెండికి కొన్నాడు.
2SA 24:25 దావీదు అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దహనబలులు సమాధానబలులు అర్పించాడు. అప్పుడు యెహోవా దేశం కోసం అతడు చేసిన ప్రార్థన అంగీకరించగా ఇశ్రాయేలీయులకు వచ్చిన తెగులు తొలగిపోయింది.
1KI 1:1 రాజైన దావీదు చాలా వృద్ధుడైనప్పుడు, సేవకులు అతనికి ఎన్ని దుప్పట్లు కప్పినా అతడు చలి తట్టుకోలేకపోయాడు.
1KI 1:2 కాబట్టి అతని సేవకులు అతనితో, “రాజును చూసుకుంటూ అతనికి సేవ చేయడానికి మేము ఒక యువ కన్యను వెదికి తీసుకువస్తాము. మా ప్రభువైన రాజుకు వెచ్చగా ఉండేలా ఆమె మీ ప్రక్కన పడుకుంటుంది” అన్నారు.
1KI 1:3 అప్పుడు వారు ఒక అందమైన యువతి కోసం ఇశ్రాయేలు దేశమంతా వెదికి షూనేమీయురాలైన అబీషగును చూసి ఆమెను రాజు దగ్గరకు తీసుకువచ్చారు.
1KI 1:4 ఆ యువతి చాలా అందమైనది; ఆమె రాజును చూసుకుంటూ సేవ చేస్తూ ఉండేది, కాని రాజు ఆమెతో శారీరకంగా కలవలేదు.
1KI 1:5 అప్పుడు దావీదు హగ్గీతుల కుమారుడైన అదోనియా గర్వంతో, “నేనే రాజునవుతాను” అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి అతడు రథాలను, గుర్రపురౌతులను, తనకు ముందుగా పరుగెత్తడానికి యాభైమంది మనుష్యులను ఏర్పరచుకున్నాడు.
1KI 1:6 (అతని తండ్రి, “నీవెందుకు ఇలా చేస్తున్నావు?” అని ఎప్పుడు అతన్ని గద్దించలేదు. అతడు అబ్షాలోము తర్వాత పుట్టినవాడు, అతడు కూడా చాలా అందగాడు.)
1KI 1:7 అదోనియా సెరూయా కుమారుడైన యోవాబుతో, యాజకుడైన అబ్యాతారుతో చర్చించాడు. వారు అతనికి తమ సహకారం అందించారు.
1KI 1:8 కాని యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, ప్రవక్తయైన నాతాను, షిమీ, రేయీ దావీదు వ్యక్తిగత శూరులు అదోనియాతో కలవలేదు.
1KI 1:9 అదోనియా ఎన్-రోగేలు వాగు దగ్గర ఉండే సోహెలేతు రాయి దగ్గర గొర్రెలను, పశువులను, క్రొవ్విన దూడలను బలిగా అర్పించి, తన సోదరులైన రాజకుమారులందరిని, యూదాలో రాజు అధికారులందరిని ఆహ్వానించాడు,
1KI 1:10 కాని ప్రవక్తయైన నాతానును గాని బెనాయాను గాని దావీదు వ్యక్తిగత శూరులను గాని తన తమ్ముడైన సొలొమోనును గాని ఆహ్వానించలేదు.
1KI 1:11 అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబను ఇలా అడిగాడు, “హగ్గీతు కుమారుడైన అదోనియా రాజయ్యాడని, మన యజమాని దావీదుకు ఈ విషయం తెలియదని నీవు వినలేదా?
1KI 1:12 కాబట్టి ఇప్పుడు నీ ప్రాణాన్ని, నీ కుమారుడైన సొలొమోను ప్రాణాన్ని కాపాడుకోడానికి నేను నీకొక సలహా ఇస్తాను.
1KI 1:13 నీవు రాజైన దావీదు దగ్గరకు వెళ్లి, ‘నా ప్రభువా, రాజా, “నా తర్వాత నా కుమారుడైన సొలొమోను రాజు అవుతాడు, అతడు నా సింహాసనం మీద ఆసీనుడవుతాడు” అని మీరు నాకు ప్రమాణం చేయలేదా? ఇప్పుడు అదోనియా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు.
1KI 1:14 నీవు ఇంకా రాజుతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపలికి వచ్చి మీ మాటలను బలపరుస్తాను” అని సలహా ఇచ్చాడు.
1KI 1:15 కాబట్టి బత్షెబ తన గదిలో ఉన్న వృద్ధుడైన రాజు దగ్గరకు వెళ్లింది. అక్కడ షూనేమీయురాలైన అబీషగు రాజుకు సేవ చేస్తూ ఉంది.
1KI 1:16 బత్షెబ రాజు ఎదుట తలవంచి, సాగిలపడింది. “నీకేమి కావాలి?” అని రాజు అడిగాడు.
1KI 1:17 ఆమె అతనితో ఇలా అన్నది, “నా ప్రభువా, మీరు మీ దేవుడైన యెహోవా పేరిట మీ దాసురాలనైన నాతో ఇలా ప్రమాణం చేసి, ‘నా తర్వాత నీ కుమారుడైన సొలొమోను రాజుగా నా సింహాసనం మీద కూర్చుంటాడు’ అని అన్నారు.
1KI 1:18 కాని ఇప్పుడు అదోనియా రాజయ్యాడు, నా ప్రభువా, రాజువైన మీకు దీని గురించి తెలియదు.
1KI 1:19 అతడు విస్తారమైన పశువులను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలి అర్పించి, రాజకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును, సేనాధిపతియైన యోవాబును ఆహ్వానించాడు కాని మీ సేవకుడైన సొలొమోనును ఆహ్వానించలేదు.
1KI 1:20 నా ప్రభువా నా రాజా, మీ తర్వాత మీ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారో తెలుసుకోవడానికి ఇశ్రాయేలీయులందరు ఎదురుచూస్తున్నారు.
1KI 1:21 అంతేకాక, నా ప్రభువైన రాజు మరణించి తన పూర్వికులను చేరిన వెంటనే, నేను నా కుమారుడైన సొలొమోను నేరస్థులుగా పరిగణించబడతాము.”
1KI 1:22 ఆమె రాజుతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే, ప్రవక్తయైన నాతాను వచ్చాడు.
1KI 1:23 “నాతాను ప్రవక్త ఇక్కడకు వచ్చాడు” అని రాజుకు తెలియజేశారు. అతడు రాజు ఎదుటకు వెళ్లి తలవంచి సాష్టాంగపడ్డాడు.
1KI 1:24 నాతాను, “నా ప్రభువా, నా రాజా, అదోనియా మీ తర్వాత రాజవుతాడని, మీ సింహాసనం మీద కూర్చుంటాడని మీరు ప్రకటించారా?
1KI 1:25 ఈ రోజు అతడు వెళ్లి విస్తారమైన పశువులను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలి ఇచ్చాడు. రాజకుమారులందరినీ, సేనాధిపతులను, యాజకుడైన అబ్యాతారును ఆహ్వానించాడు. ఇప్పుడు వారు అతనితో తింటూ త్రాగుతూ, ‘రాజైన అదోనియా చిరకాలం జీవించు గాక!’ అని అంటున్నారు.
1KI 1:26 కాని మీ సేవకుడనైన నన్ను, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైనా బెనాయాను, మీ సేవకుడైన సొలొమోనును అతడు ఆహ్వానించలేదు.
1KI 1:27 నా ప్రభువైన రాజు తన తర్వాత సింహాసనంపై ఎవరు కూర్చోవాలో తన సేవకులకు చెప్పకుండా ఇలా చేస్తారా?” అన్నాడు.
1KI 1:28 అప్పుడు రాజైన దావీదు, “బత్షెబను లోపలికి పిలువండి” అన్నాడు. ఆమె రాజు సముఖానికి వచ్చి అతని ఎదుట నిలబడింది.
1KI 1:29 అపుడు రాజు ప్రమాణం చేసి, “నన్ను ప్రతి ఆపద నుండి కాపాడిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న,
1KI 1:30 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీద నేను చేసిన ప్రమాణాన్ని ఖచ్చితంగా ఈ రోజు నెరవేరుస్తాను: నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత రాజవుతాడు, అతడు నా సింహాసనం మీద నా స్థానంలో కూర్చుంటాడు” అన్నాడు.
1KI 1:31 అప్పుడు బత్షెబ తలవంచి, రాజు ఎదుట సాష్టాంగపడి, “నా ప్రభువా, రాజైన దావీదు చిరకాలం జీవించును గాక!” అని అన్నది.
1KI 1:32 రాజైన దావీదు, “యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువండి” అన్నాడు. వారు రాజు దగ్గరకు వచ్చినప్పుడు,
1KI 1:33 రాజు వారితో, “మీ ప్రభు సేవకులను మీతో తీసుకెళ్లి, నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి దిగువనున్న గిహోనుకు తీసుకెళ్లండి.
1KI 1:34 అక్కడ యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను అతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకిస్తారు. అప్పుడు బూర ఊది, ‘రాజైన సొలొమోను చిరకాలం జీవించు గాక!’ అని బిగ్గరగా కేకలు వేయండి.
1KI 1:35 అప్పుడు మీరు అతని వెంట వెళ్లాలి, అతడు వచ్చి నా సింహాసనం మీద ఆసీనుడై నా స్థానంలో పరిపాలిస్తాడు. ఇశ్రాయేలు మీద యూదా మీద నేను అతన్ని పాలకునిగా నియమించాను” అని అన్నాడు.
1KI 1:36 అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో, “ఆమేన్! నా ప్రభువు దేవుడైన యెహోవా దానిని స్థిరపరచును గాక!
1KI 1:37 యెహోవా రాజైన నా ప్రభువుతో ఉన్నట్లు సొలొమోనుతో ఉండి, అతని సింహాసనాన్ని నా ప్రభువును రాజునైన దావీదు సింహాసనం కంటే గొప్ప దానిగా చేయును గాక!” అన్నాడు.
1KI 1:38 కాబట్టి యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను, యెహోయాదా కుమారుడైన బెనాయా, వ్యక్తిగత సేవకులుగా ఉన్నా కెరేతీయులు, పెలేతీయులు రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనుకు తీసుకెళ్లారు.
1KI 1:39 యాజకుడైన సాదోకు పరిశుద్ధ గుడారంలో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనును అభిషేకించాడు. అప్పుడు వారు బూర ఊదగా ప్రజలందరు, “రాజైన సొలొమోను చిరకాలం జీవించును గాక!” అని అంటూ కేకలు వేశారు.
1KI 1:40 ప్రజలందరు పిల్లన గ్రోవులు ఊదుతూ ఎంతో ఆనందిస్తూ అతని వెంట వెళ్లారు. ఆ శబ్దానికి భూమి అదిరింది.
1KI 1:41 అదోనియా, అతనితో ఉన్న అతిథులందరు తమ విందు ముగింపులో ఆ ధ్వని విన్నారు. ఆ బూరధ్వని విని యోవాబు, “పట్టణంలో ఈ శబ్దమేంటి?” అని అడిగాడు.
1KI 1:42 అతడు ఇంకా మాట్లాడుతుండగా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చాడు. అదోనియా, “లోపలికి రా, నీలాంటి ప్రాముఖ్యమైన వ్యక్తి మంచి వార్తను తెస్తాడు” అన్నాడు.
1KI 1:43 అందుకు యోనాతాను అదోనియాతో, “కానే కాదు, మన ప్రభువా, రాజైన దావీదు సొలొమోనును రాజుగా చేశాడు.
1KI 1:44 రాజు యాజకుడైన సాదోకును, ప్రవక్తయైన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, కెరేతీయులను, పెలేతీయులను అతనితో పాటు పంపాడు. వారు అతన్ని రాజు కంచరగాడిద మీద ఎక్కించారు.
1KI 1:45 యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను గిహోను దగ్గర అతన్ని రాజుగా అభిషేకించారు. అక్కడినుండి వారు సంతోషిస్తూ వెళ్లారు. అందుకే పట్టణం సందడిగా ఉంది. మీరు వినే శబ్దం అదే.
1KI 1:46 అంతేకాక సొలొమోను రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు.
1KI 1:47 రాజ్యాధికారులు కూడా తమ ప్రభువైన దావీదు రాజుతో, ‘మీ దేవుడు సొలొమోనుకు మీకంటే ఎక్కువ ఖ్యాతి కలిగేలా, అతని సింహాసనాన్ని మీకంటే గొప్ప దానిగా చేయును గాక!’ అంటూ అభినందించారు. అప్పుడు రాజు తన మంచం మీద సాగిలపడి నమస్కరించి,
1KI 1:48 ‘ఈ రోజు నా సింహాసనం మీద ఒక వారసుడు కూర్చోవడం నేను కళ్లారా చూసేలా చేసిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక’ అన్నాడు” అని చెప్పాడు.
1KI 1:49 అందుకు అదోనియా అతిథులు భయపడి లేచి వెళ్లిపోయారు.
1KI 1:50 అయితే అదోనియా సొలొమోనుకు భయపడి వెళ్లి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు.
1KI 1:51 అప్పుడు, “అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. అతడు, ‘రాజైన సొలొమోను తన దాసుడనైన నన్ను ఖడ్గంతో చంపకుండా ఈ రోజు నాకు ప్రమాణం చేయాలి’ అని అంటున్నాడు” అని సొలొమోనుకు తెలిసింది.
1KI 1:52 అందుకు సొలొమోను, “అతడు తనను తాను యోగ్యునిగా కనుపరచుకుంటే, తన తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలదు; కాని ఒకవేళ అతనిలో దోషం కనబడితే అతడు చస్తాడు” అన్నాడు.
1KI 1:53 అప్పుడు రాజైన సొలొమోను మనుష్యులను పంపగా వారు అదోనియాను బలిపీఠం దగ్గర నుండి తీసుకువచ్చారు. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాగిలపడ్డాడు, సొలొమోను అతనితో, “నీ ఇంటికి వెళ్లు” అన్నాడు.
1KI 2:1 దావీదు మరణించే సమయం సమీపించినప్పుడు, అతడు తన కుమారుడైన సొలొమోనును ఇలా ఆదేశించాడు.
1KI 2:2 అతడు అన్నాడు, “మనుష్యులందరు వెళ్లవలసిన మార్గంలో నేను వెళ్తున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని స్థిరంగా ఉండు.
1KI 2:3 నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన మార్గాలను అనుసరిస్తే అంటే మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగా, ఆయన శాసనాలు, ఆజ్ఞలు, చట్టాలు, నిబంధనలు అనుసరిస్తే నీవు ఏ పని మొదలుపెట్టినా ఎక్కడకు వెళ్లినా అన్నిటిలో వివేకంగా ప్రవర్తిస్తావు.
1KI 2:4 అప్పుడు ‘నీ సంతతివారు తాము జీవించే విధానం పట్ల జాగ్రత్తగా ఉండి, నా ఎదుట తమ పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో నమ్మకంగా నడుచుకుంటే ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చునే వారసుడు నీకు ఉండక మానడు’ అని యెహోవా నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు.
1KI 2:5 “సెరూయా కుమారుడు యోవాబు నాకు ఏమి చేశాడో నీకే తెలుసు. ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కుమారుడైన అబ్నేరుకు, యెతెరు కుమారుడైన అమాశాకు ఏమి చేశాడో నీకు తెలుసు. సమాధానం కాలంలో వారిని యుద్ధ కాలంలో చంపినట్లు చంపి రక్తపాతం చేసి, తన నడికట్టుపై చెప్పులపై రక్తపు మరకలు చేసుకున్నాడు.
1KI 2:6 నీకు తోచిన ప్రకారం అతనికి చేయవచ్చు, అయితే నెరిసిన తలవెంట్రుకలతో సమాధానంతో సమాధికి వెళ్లనివ్వకు.
1KI 2:7 “అయితే గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుల పట్ల దయ చూపించు, నీ బల్ల దగ్గర భోజనం చేసేవారిలో వారిని ఉండనివ్వు. నేను మీ సోదరుడు అబ్షాలోము నుండి పారిపోయినప్పుడు వీరు నా పక్షాన నిలబడ్డారు.
1KI 2:8 “బాగా గుర్తుంచుకో, నేను మహనయీముకు పారిపోయే రోజు, బహూరీము వాడైన బెన్యామీనీయుడు, గెరా కుమారుడైన షిమీ నన్ను ఘోరంగా శపించాడు. అతడు నన్ను కలుసుకోడానికి యొర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు, నేను యెహోవా పేరిట ‘నేను నిన్ను కత్తితో చంపను’ అని అతనికి ప్రమాణం చేశాను.
1KI 2:9 అయితే ఇప్పుడు అతన్ని నిర్దోషిగా పరిగణించకు. నీవు జ్ఞానంగల వాడవు; అతనికి ఏం చేయాలో నీకు తెలుసు. అతని నెరసిన తలను రక్తంతో సమాధికి తీసుకెళ్లు.”
1KI 2:10 ఆ తర్వాత దావీదు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేర్చబడి, దావీదు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.
1KI 2:11 దావీదు ఇశ్రాయేలును నలభై సంవత్సరాలు పరిపాలించాడు. హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.
1KI 2:12 అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని పాలనాధికారం స్థిరపరచబడింది.
1KI 2:13 హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియైన బత్షెబ దగ్గరకు వెళ్లాడు. బత్షెబ అతన్ని, “నీవు సమాధానంగా వచ్చావా?” అని అడిగింది. అతడు, “అవును, సమాధానంగా వచ్చాను” అన్నాడు.
1KI 2:14 తర్వాత అతడు, “నేను నీతో ఓ విషయం చెప్పాలి” అని అన్నాడు. ఆమె జవాబిస్తూ, “నీవు చెప్పవచ్చు” అన్నది.
1KI 2:15 అప్పుడతడు, “నీకు తెలిసినట్లు, రాజ్యం నాకు చెందాల్సింది. ఇశ్రాయేలీయులంతా నన్ను తమ రాజుగా చూశారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, రాజ్యం నాది కాక నా సోదరునిది అయ్యింది; ఎందుకంటే అది యెహోవా నుండి అతనికి వచ్చింది.
1KI 2:16 ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేస్తాను కాదు అనవద్దు” అన్నాడు. ఆమె, “నీ మనవి ఏంటో చెప్పు” అన్నది.
1KI 2:17 కాబట్టి అతడు మాట్లాడుతూ, “రాజైన సొలొమోనును షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా ఇమ్మని అడుగు. అతడు నీ మాట కాదు అనడు” అన్నాడు.
1KI 2:18 అందుకు బత్షెబ, “మంచిది, నీ గురించి రాజుతో మాట్లాడతాను” అన్నది.
1KI 2:19 బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకు అదోనియా తరుపున మాట్లాడడానికి వెళ్లినప్పుడు, రాజు ఆమెను కలుసుకోడానికి లేచి ఆమెకు నమస్కారం చేసి తన సింహాసనం మీద కూర్చున్నాడు. రాజు తల్లి కోసం సింహాసనం ఒకటి తెప్పించాడు, ఆమె అతని కుడి ప్రక్కన కూర్చుంది.
1KI 2:20 ఆమె, “నేను ఒక చిన్న మనవి చేయాలనుకున్నాను, నీవు కాదు అనకు” అన్నది. రాజు జవాబిస్తూ, “అమ్మా, చెప్పు, నీ మాట కాదు అనను” అన్నాడు.
1KI 2:21 అప్పుడు ఆమె, “షూనేమీయురాలైన అబీషగును నీ సోదరుడైన అదోనియాను పెళ్ళి చేసుకోనివ్వు” అన్నది.
1KI 2:22 అందుకు రాజైన సొలొమోను తన తల్లితో, “అదోనియా కోసం షూనేమీయురాలైన అబీషగును ఎందుకు అడుగుతున్నావు? ఎంతైనా అతడు నాకు అన్న కాబట్టి అతని కోసం యాజకుడైన అబ్యాతారు కోసం సెరూయా కుమారుడైన యోవాబు కోసం రాజ్యాన్ని కూడా అడగవచ్చు కదా” అన్నాడు.
1KI 2:23 అప్పుడు రాజైన సొలొమోను యెహోవా పేరిట ఇలా ప్రమాణం చేశాడు: “ఈ మనవి కోసం అదోనియా తన ప్రాణం చెల్లించకపోతే యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించును గాక!
1KI 2:24 నన్ను స్థిరపరచి, నా తండ్రియైన దావీదు సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి, తన వాగ్దానం ప్రకారం నా కోసం రాజవంశాన్ని స్థాపించిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అదోనియా ఈ రోజు చనిపోవలసిందే!”
1KI 2:25 కాబట్టి రాజైన సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను ఆదేశించగా అతడు అదోనియాను కొట్టాడు. అతడు చనిపోయాడు.
1KI 2:26 తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారుతో, “అనాతోతులో నీ పొలాలకు తిరిగి వెళ్లు. నీవు మరణానికి పాత్రుడవు కాని నీవు నా తండ్రియైన దావీదు ముందు ప్రభువైన యెహోవా మందసాన్ని మోసి, నా తండ్రికి కలిగిన శ్రమలన్నిటిలో పాలుపంచుకున్నావు కాబట్టి నేను ఇప్పుడు నిన్ను చంపను” అన్నాడు.
1KI 2:27 కాబట్టి సొలొమోను అబ్యాతారును యెహోవా యాజకుని పదవి నుండి తొలగించాడు. ఇలా షిలోహులో యెహోవా ఏలీ కుటుంబీకుల గురించి చెప్పిన మాట నెరవేరింది.
1KI 2:28 గతంలో అబ్షాలోముతో కాకపోయినా అదోనియాతో కలిసి కుట్రపన్నిన యోవాబుకు ఈ వార్త చేరగానే అతడు యెహోవా గుడారానికి పారిపోయి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు.
1KI 2:29 యోవాబు పారిపోయి యెహోవా గుడారంలో బలిపీఠం దగ్గర ఉన్నాడని రాజైన సొలొమోనుకు తెలిసింది. అప్పుడు సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను, “వెళ్లు, అతన్ని చంపు!” అని ఆదేశించాడు.
1KI 2:30 కాబట్టి బెనాయా యెహోవా గుడారంలోకి ప్రవేశించి యోవాబుతో, “రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు” అని చెప్పాడు. అయితే అతడు, “లేదు, నేను ఇక్కడే చస్తాను” అన్నాడు. బెనాయా యోవాబు తనతో చెప్పిన మాటను రాజుకు తెలియజేశాడు.
1KI 2:31 అప్పుడు రాజు బెనాయాతో, “అతడు చెప్పినట్లే కానివ్వు. అతన్ని కొట్టి చంపి పాతిపెట్టు. అలా యోవాబు చిందించిన నిరపరాధ రక్తం గురించి నా మీద నా కుటుంబమంతటి మీద ఆ దోషం ఉండదు.
1KI 2:32 అతడు చిందించిన రక్తానికి యెహోవా అతనికి ప్రతిఫలమిస్తారు. ఎందుకంటే అతనికంటే మంచివారు, ఉత్తములు అయిన నేరు కుమారుడు ఇశ్రాయేలు సేనాధిపతియైన అబ్నేరు, యెతెరు కుమారుడు యూదా సేనాధిపతియైన అమాశా అనే ఇద్దరిపై అతడు నా తండ్రియైన దావీదుకు తెలియకుండా దాడి చేసి వారిని ఖడ్గంతో చంపాడు.
1KI 2:33 వారి రక్తం యొక్క అపరాధం యోవాబు మీద అతని సంతతివారి మీద ఎల్లప్పుడు ఉండును గాక. కాని దావీదు, అతని సంతతివారు, అతని ఇల్లు, అతని సింహాసనం మీద యెహోవా సమాధానం ఎల్లప్పుడు ఉండును గాక” అని చెప్పాడు.
1KI 2:34 కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వెళ్లి యోవాబును కొట్టి చంపగా అతడు అరణ్యంలో తన ఇంటి దగ్గర పాతిపెట్టబడ్డాడు.
1KI 2:35 రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాను యోవాబు స్థానంలో సైన్యాధిపతిగా, సాదోకును అబ్యాతారు స్థానంలో యాజకునిగా నియమించాడు.
1KI 2:36 తర్వాత రాజు షిమీని పిలిపించి అతనితో, “నీకోసం యెరూషలేములో ఇల్లు కట్టుకుని అక్కడ నివసించు, ఇంకెక్కడికీ వెళ్లకు.
1KI 2:37 ఏ రోజైతే నీవు వెళ్లి కిద్రోను లోయను దాటుతావో, నీవు ఖచ్చితంగా చస్తావు; నీ ప్రాణానికి నీవే బాధ్యుడవు” అన్నాడు.
1KI 2:38 షిమీ రాజుతో, “మీరు చెప్పింది మంచిది, మీ దాసుడననైన నేను నా ప్రభువైన రాజు చెప్పినట్లు చేస్తాను” అన్నాడు. కాబట్టి షిమీ యెరూషలేములో కొంతకాలం నివసించాడు.
1KI 2:39 అయితే మూడేళ్ళ తర్వాత షిమీ దాసులలో ఇద్దరు పారిపోయి గాతు రాజు, మయకా కుమారుడైన ఆకీషు దగ్గరకు వెళ్లారు. “మీ దాసులు గాతులో ఉన్నారు” అని షిమీకి చెప్పబడింది.
1KI 2:40 వెంటనే షిమీ తన గాడిదకు జీను కట్టుకుని తన దాసులను వెదకడానికి గాతులో ఉన్న ఆకీషు దగ్గరకు వెళ్లాడు. షిమీ వెళ్లి గాతు నుండి తన దాసులను తీసుకువచ్చాడు.
1KI 2:41 షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి, తిరిగివచ్చిన సంగతి సొలొమోనుకు తెలిసినప్పుడు,
1KI 2:42 రాజు షిమీని పిలిపించి అతనితో, “ ‘నీవు ఉన్నచోట నుండి ఎక్కడికి వెళ్లినా నీవు ఖచ్చితంగా చస్తావు’ అని యెహోవా పేరిట ప్రమాణం చేయించి నిన్ను హెచ్చరించలేదా? అప్పుడు నీవు నాతో, ‘మీరు చెప్పింది మంచిది. నేను లోబడతాను’ అని అన్నావు.
1KI 2:43 మరి ఎందుకు యెహోవా పేరిట నీవు చేసిన ప్రమాణాన్ని, నేను జారీ చేసిన ఆజ్ఞను పాటించలేదు?” అని అన్నాడు.
1KI 2:44 రాజు షిమీతో ఇంకా మాట్లాడుతూ, “నీవు నా తండ్రియైన దావీదుకు చేసిన కీడు గురించి నీకు తెలుసు. ఇప్పుడు నీవు చేసిన చెడుకు యెహోవా నీకు తిరిగి చెల్లిస్తారు.
1KI 2:45 కాని రాజైన సొలొమోను ఆశీర్వదించబడతాడు, దావీదు సింహాసనం యెహోవా ఎదుట నిరంతరం సుస్థిరంగా ఉంటుంది” అని అన్నాడు.
1KI 2:46 తర్వాత రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు ఆజ్ఞ ఇవ్వగా అతడు బయటకు వెళ్లి షిమీని కొట్టాడు. అతడు చనిపోయాడు. రాజ్యం సొలొమోను చేతుల్లో సుస్థిరమైంది.
1KI 3:1 సొలొమోను ఈజిప్టు రాజైన ఫరోతో పొత్తు పెట్టుకుని అతని కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. అతడు తన సొంత రాజభవనాన్ని, యెహోవాకు దేవాలయాన్ని, యెరూషలేము చుట్టూ ప్రాకారం నిర్మించే వరకు ఆమెను దావీదు పట్టణానికి తీసుకువచ్చాడు.
1KI 3:2 యెహోవా నామం కోసం అప్పటికి దేవాలయం నిర్మించబడలేదు కాబట్టి ప్రజలు ఇంకా క్షేత్రాల దగ్గర బలులు అర్పించేవారు.
1KI 3:3 సొలొమోను తన తండ్రియైన దావీదు హెచ్చరికల ప్రకారం జీవిస్తూ, యెహోవా పట్ల తన ప్రేమను కనుపరిచాడు. అయితే అతడు క్షేత్రాల మీద మాత్రం బలులు అర్పిస్తూ, ధూపం వేసేవాడు.
1KI 3:4 కొండల్లో గిబియోను చాలా ప్రాముఖ్యమైన ఉన్నత స్థలం కాబట్టి రాజైన సొలొమోను బలులు అర్పించడానికి అక్కడికి వెళ్లి ఆ బలిపీఠం మీద వెయ్యి దహనబలులు అర్పించాడు.
1KI 3:5 గిబియోనులో రాత్రివేళ కలలో యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై, “నేను నీకు ఏమివ్వాలో అడుగు” అన్నారు.
1KI 3:6 సొలొమోను జవాబిస్తూ ఇలా అన్నాడు, “మీ దాసుడు, నా తండ్రియైన దావీదు మీ పట్ల నమ్మకంగా, నీతి నిజాయితీ కలిగి ఉండేవాడు కాబట్టి మీరు అతనిపై ఎంతో దయను చూపించారు. మీరు అదే గొప్ప కనికరాన్ని తన పట్ల కొనసాగిస్తూ, ఈ రోజు అతని సింహాసనం మీద అతనికి కుమారుని కూర్చోబెట్టారు.
1KI 3:7 “ఇప్పుడు యెహోవా, నా దేవా! నా తండ్రియైన దావీదుకు బదులుగా మీరు మీ దాసుడనైన నన్ను రాజుగా నియమించారు. అయితే నేను చిన్న బాలున్ని, నా విధులు ఎలా నిర్వర్తించాలో నాకు తెలియదు.
1KI 3:8 మీ దాసుడనైన నేను మీరు ఎన్నుకున్న మీ ప్రజలమధ్య ఉన్నాను, వారు గొప్ప ప్రజలు, లెక్కించలేనంత ఎక్కువగా ఉన్నారు.
1KI 3:9 కాబట్టి మీ ప్రజలను పాలించడానికి, మంచి చెడ్డల భేదం తెలుసుకోవడానికి వివేచన హృదయం మీ దాసునికి ఇవ్వండి. ఎందుకంటే, మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?”
1KI 3:10 సొలొమోను యొక్క ఈ మనవి ప్రభువుకు నచ్చింది.
1KI 3:11 కాబట్టి దేవుడు అతనితో ఇలా అన్నారు, “నీవు నీకోసం దీర్ఘాయువును గాని, ధనాన్ని గాని, నీ శత్రువుల చావును గాని అడగకుండా న్యాయంగా పరిపాలించడానికి వివేచనను అడిగావు కాబట్టి,
1KI 3:12 నీవు అడిగింది నేను ఇస్తాను. నేను నీకు జ్ఞానం కలిగిన వివేచన హృదయాన్ని ఇస్తాను. నీలాంటి వారు నీకంటే ముందు ఎవరూ లేరు, నీ తర్వాత ఎవరూ ఉండరు.
1KI 3:13 అంతేకాక నీవు అడగని ఐశ్వర్యాన్ని ఘనతను నీకిస్తాను. తద్వారా నీ జీవితకాలమంతా రాజులలో నీకు ఎవరూ సాటి ఉండరు.
1KI 3:14 నీ తండ్రియైన దావీదులా నీవు నా మార్గాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను, ఆజ్ఞలను పాటిస్తే, నేను నీకు దీర్ఘాయువు ఇస్తాను.”
1KI 3:15 తర్వాత సొలొమోను మేల్కొని, అది కల అని గ్రహించాడు. అతడు యెరూషలేముకు తిరిగివెళ్లి, యెహోవా నిబంధన మందసం ఎదుట నిలబడి, దహనబలులు, సమాధానబలులు అర్పించాడు. తర్వాత తన సేవకులందరికి విందు చేశాడు.
1KI 3:16 కొంతకాలం తర్వాత ఇద్దరు వేశ్యలు రాజు దగ్గరకు వచ్చి అతని ముందు నిలబడ్డారు.
1KI 3:17 వారిలో ఒక స్త్రీ అన్నది, “నా ప్రభువా, దయచేసి వినండి. ఈ స్త్రీ, నేను ఒకే ఇంట్లో ఉంటాము. ఈమె నాతో ఉన్నప్పుడు నేను శిశువును కన్నాను.
1KI 3:18 నాకు శిశువు పుట్టిన మూడవ రోజు ఈమెకు కూడ శిశువు పుట్టాడు. మేము ఒంటరిగా ఉన్నాము; మేము తప్ప ఇంట్లో మరొకరు లేరు.
1KI 3:19 “రాత్రివేళ ఈమె తన కుమారుని మీదికి దొర్లింది, వాడు చనిపోయాడు.
1KI 3:20 కాబట్టి మధ్యరాత్రి ఈమె లేచి, మీ దాసురాలైన నేను పడుకోని ఉన్నప్పుడు, నా ప్రక్కన ఉన్న నా కుమారుని తీసుకుని తన ప్రక్కన పెట్టుకొని, చనిపోయిన తన కుమారుని నా ప్రక్కన పెట్టింది.
1KI 3:21 ప్రొద్దున నా కుమారునికి పాలు ఇవ్వడానికి చూస్తే వాడు చనిపోయి ఉన్నాడు! అయితే నేను ఉదయకాలపు వెలుగులో గమనించి చూస్తే, వాడు నేను జన్మనిచ్చిన వాడు కాదు.”
1KI 3:22 ఇంకొక స్త్రీ అన్నది, “లేదు! బ్రతికి ఉన్నవాడు నా కుమారుడు; చనిపోయినవాడు నీ వాడు.” మొదటి స్త్రీ అన్నది, “లేదు! చనిపోయినవాడు నీ వాడు; బ్రతికి ఉన్నవాడు నావాడు.” ఇంకా రాజు ముందు వారు వాదించుకున్నారు.
1KI 3:23 రాజు అన్నాడు, “ఈమె అంటుంది, ‘నా కుమారుడు బ్రతికి ఉన్నాడు, నీ కుమారుడు చనిపోయాడు’ ఆమె అంటుంది, ‘లేదు! నీ కుమారుడు చనిపోయాడు, నావాడు బ్రతికి ఉన్నాడు.’ ”
1KI 3:24 అప్పుడు రాజు అన్నాడు, “నాకొక ఖడ్గం తీసుకురండి.” కాబట్టి వారు ఖడ్గం రాజు దగ్గరకు తెచ్చారు.
1KI 3:25 అప్పుడు రాజు వారికి ఇలా ఆదేశించాడు: “బ్రతికి ఉన్న బిడ్డను రెండు ముక్కలు చేసి, ఈమెకు సగం ఆమెకు సగం ఇవ్వండి.”
1KI 3:26 అందుకు బ్రతికి ఉన్న శిశువు యొక్క తల్లి తన కుమారుని పట్ల జాలితో కరిగిపోయి రాజుతో అన్నది, “దయచేసి, నా ప్రభువా, ఆమెకు బ్రతికి ఉన్న శిశువును ఇచ్చేయండి! అతన్ని చంపకండి!” అయితే ఇంకొక స్త్రీ అన్నది, “అతడు నీకు గాని, నాకు గాని దక్కకూడదు. అతన్ని రెండు ముక్కలు చేయండి!”
1KI 3:27 అప్పుడు రాజు తన తీర్పు ఇచ్చాడు: “బ్రతికి ఉన్న శిశువును మొదటి స్త్రీకి ఇవ్వండి. అతన్ని చంపకండి; ఆమె అతని తల్లి.”
1KI 3:28 రాజు ఇచ్చిన తీర్పు గురించి ఇశ్రాయేలీయులందరు విన్నప్పుడు, రాజును ఎంతో గౌరవించారు, ఎందుకంటే తీర్పు తీర్చడానికి దేవుని దగ్గరనుండి అతడు జ్ఞానం పొందుకున్నాడని వారు గ్రహించారు.
1KI 4:1 రాజైన సొలొమోను ఇశ్రాయేలు అంతటిని పరిపాలించాడు.
1KI 4:2 అతని ప్రముఖ అధికారులు వీరు: సాదోకు కుమారుడు యాజకుడైన అజర్యా;
1KI 4:3 షీషా కుమారులైన ఎలీహోరేపు, అహీయా న్యాయస్థాన కార్యదర్శులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు దస్తావేజుల అధికారి;
1KI 4:4 యెహోయాదా కుమారుడైన బెనాయా సేనాధిపతి; సాదోకు, అబ్యాతారు యాజకులు;
1KI 4:5 నాతాను కుమారుడైన అజర్యా జిల్లా అధికారులకు అధికారి; నాతాను కుమారుడైన జాబూదు యాజకుడు రాజుకు సలహాదారుడు;
1KI 4:6 అహీషారు రాజభవన నిర్వాహకుడు; అబ్దా కుమారుడైన అదోనిరాము వెట్టిచాకిరి చేసేవారిపై అధికారి.
1KI 4:7 సొలొమోనుకు ఇశ్రాయేలు రాజ్యం అంతటి మీద పన్నెండుమంది జిల్లా అధికారులు ఉన్నారు, వారు రాజుకు అతని ఇంటివారికి ఆహారం సరఫరా చేసేవారు. ఒక్కొక్కరు సంవత్సరంలో ఒక్కొక్క నెల చొప్పున ఆహారం సమకూర్చేవారు.
1KI 4:8 వారి అధికారుల పేర్లు ఇవి: ఎఫ్రాయిం కొండ సీమకు బెన్-హూరు అధికారి;
1KI 4:9 మాకస్సు, షయల్బీము, బేత్-షెమెషులో, ఎలోన్-బేత్-హనానులకు బెన్-దెకెరు అధికారి;
1KI 4:10 అరుబ్బోతుకు బెన్-హెసెదు అధికారి (శోకో, హెఫెరు ప్రదేశమంతా ఇతనికి అప్పగించబడ్డాయి);
1KI 4:11 నఫోత్ దోరుకు బెన్-అబీనాదాబు అధికారి (ఇతడు సొలొమోను కుమార్తెయైన టఫాతును పెళ్ళి చేసుకున్నాడు);
1KI 4:12 తానాకుకు, మెగిద్దోకు యెజ్రెయేలు దిగువన ఉన్న సారెతాను తర్వాత ఉన్న బేత్-షాను ప్రాంతం అంతా, బేత్-షాను నుండి ఆబేల్-మెహోలా యొక్మీము అవతలి వరకు అహీలూదు కుమారుడైన బయనా అధికారి;
1KI 4:13 రామోత్ గిలాదుకు బెన్-గెబెరు అధికారి; (ఇతనికి గిలాదులో ఉన్న మనష్షే కుమారుడైన యాయీరు గ్రామాలు, బాషానులో ఉన్న అర్గోబు ప్రాంతం, దాని యొక్క పెద్ద ప్రాకారాలు ఇత్తడి ద్వారబంధాలు కలిగిన అరవై పట్టణాలు అప్పగించబడ్డాయి);
1KI 4:14 మహనయీముకు ఇద్దో కుమారుడైన అహీనాదాబు అధికారి;
1KI 4:15 నఫ్తాలికి అహిమయస్సు అధికారి (ఇతడు సొలొమోను యొక్క మరొక కుమార్తె బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు);
1KI 4:16 ఆషేరుకు, బెయాలోతుకు హూషై కుమారుడైన బయనా అధికారి;
1KI 4:17 ఇశ్శాఖారుకు పరూయహు కుమారుడైన యెహోషాపాతు అధికారి;
1KI 4:18 బెన్యామీనుకు ఏలా కుమారుడైన షిమీ అధికారి;
1KI 4:19 గిలాదుకు ఊరి కుమారుడైన గెబెరు అధికారి (అమోరీయుల రాజైన సీహోను దేశం, బాషాను రాజైన ఓగు యొక్క దేశం). ఈ జిల్లా మీద ఇతడు ఒక్కడే అధికారి.
1KI 4:20 యూదా, ఇశ్రాయేలు ప్రజలు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులంత విస్తారంగా ఉండి తిని త్రాగుతూ సంతోషిస్తూ ఉన్నారు.
1KI 4:21 సొలొమోను యూఫ్రటీసు నది నుండి ఫిలిష్తీయ దేశం, ఈజిప్టు సరిహద్దు వరకు ఉన్న అన్ని రాజ్యాలను పరిపాలించాడు. ఆ దేశ ప్రజలు సొలొమోనుకు పన్ను చెల్లిస్తూ, అతడు బ్రతికి ఉన్నంత కాలం అతనికి సేవ చేస్తూ ఉన్నారు.
1KI 4:22 సొలొమోను యొక్క ప్రతిదిన ఆహారపదార్థాలు, ముప్పై కోరుల సన్నని గోధుమ పిండి, అరవై కోరుల ముతక పిండి,
1KI 4:23 పది దొడ్లలో మేపే పశువులు, ఇరవై పచ్చికల్లో మేసే పశువులు, వంద గొర్రెలు, మేకలు, అంతేకాక జింకలు దుప్పులు, లేళ్ళు, క్రొవ్విన బాతులు.
1KI 4:24 అతడు యూఫ్రటీసు నదికి పడమరగా, తిఫ్సహు నుండి గాజా వరకు ఉన్న రాజ్యాలన్నిటినీ పరిపాలించాడు. ఆ సమయంలో అన్ని వైపుల నెమ్మది ఉండింది.
1KI 4:25 సొలొమోను జీవితకాలంలో దాను నుండి బెయేర్షేబ వరకు యూదా, ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా, ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద నిర్భయంగా నివసించారు.
1KI 4:26 సొలొమోను రథాల కోసం వాటిని లాగే గుర్రాల కోసం నాలుగువేల గుర్రపు శాలలు, పన్నెండు వేల రథసారధులు ఉన్నారు.
1KI 4:27 జిల్లా అధికారులు ఒక్కొక్కరు తమకు నియమించిన నెలలో రాజైన సొలొమోనుకు, అతని బల్ల దగ్గర కూర్చునే అందరికి ఏ కొరత లేకుండ ఆహారపదార్థాలు సరఫరా చేసేవారు.
1KI 4:28 అంతేకాక, రథాలు లాగే గుర్రాలు, ఇతర గుర్రాలు ఉన్న చోట్లకు తమకు నిర్ణయించబడిన ప్రకారం యవలను, ఎండు గడ్డిని తెచ్చేవారు.
1KI 4:29 దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్ని గొప్ప వివేచనను, సముద్రతీరంలోని కొలవలేని ఇసుకరేణువులంత ప్రసాదించారు.
1KI 4:30 సొలొమోను జ్ఞానం తూర్పు దేశాల వారందరి జ్ఞానం కంటే, ఈజిప్టులోని జ్ఞానమంతటి కంటే గొప్పది.
1KI 4:31 అతడు మనుష్యులందరి కంటే జ్ఞాని, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద కంటే జ్ఞాని. అతని కీర్తి చుట్టూ ఉన్న అన్ని దేశాలకు వ్యాపించింది.
1KI 4:32 అతడు 3,000 సామెతలు పలికాడు, 1,005 కీర్తనలు వ్రాశాడు.
1KI 4:33 అతడు లెబానోనులో ఉండే దేవదారు చెట్ల నుండి, గోడల నుండి మొలిచే హిస్సోపు మొక్కల వరకు చెట్ల గురించి వివరించాడు. అతడు జంతువులు, పక్షులు, ప్రాకే జంతువులు, చేపల గురించి కూడా వివరించాడు.
1KI 4:34 అతని జ్ఞానం గురించి విన్న భూరాజులందరి ద్వారా అన్ని దేశాల నుండి రాయబారులు వచ్చి సొలొమోను జ్ఞాన వాక్కులను వినేవారు.
1KI 5:1 సొలొమోను తన తండ్రియైన దావీదు తర్వాత రాజుగా అభిషేకించబడ్డాడని తూరు రాజైన హీరాము విని సొలొమోను దగ్గరకు తన రాయబారులను పంపాడు; ఎందుకంటే అతడు దావీదుతో ఎల్లప్పుడూ స్నేహంగా ఉండేవాడు.
1KI 5:2 సొలొమోను హీరాముకు ఇలా సందేశం పంపాడు:
1KI 5:3 “యెహోవా, నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదాల క్రింద అణచే వరకు అతడు అన్ని వైపుల నుండి యుద్ధాలు చేశాడు. కాబట్టి అతడు తన దేవుడైన యెహోవా నామం కోసం ఒక దేవాలయాన్ని కట్టలేకపోయాడు.
1KI 5:4 అయితే ఇప్పుడు నా దేవుడైన యెహోవా ప్రతి వైపు నాకు విశ్రాంతి కలుగజేశారు, నాకు విరోధి లేరు, విపత్తులు లేవు.
1KI 5:5 కాబట్టి నా తండ్రియైన దావీదుతో, ‘నీ స్థానంలో సింహాసనం మీద నీ కుమారున్ని కూర్చోబెడతాను, అతడు నా నామం కోసం దేవాలయం కడతాడు’ అని ఆయన అన్నట్లు, నేను నా దేవుడైన యెహోవా నామంలో దేవాలయం కట్టడానికి నిర్ణయించుకున్నాను.
1KI 5:6 “కాబట్టి నా కోసం లెబానోనులో దేవదారు చెట్లను నరకమని ఆదేశాలు ఇవ్వండి. నా పనివారు మీ పనివారితో కలసి పనిచేస్తారు, మీ పనివారికి మీరు ఎంత జీతం నిర్ణయిస్తే అంత మీకిస్తాను, ఎందుకంటే సీదోనీయుల్లా మ్రాను నరికే నిపుణులు మా దగ్గర లేరని మీకు తెలుసు.”
1KI 5:7 హీరాము సొలొమోను చెప్పింది విన్నప్పుడు ఎంతో సంతోషించి, “ఈ గొప్ప దేశాన్ని ఏలడానికి ఈ రోజు దావీదుకు జ్ఞానంగల కుమారుని ఇచ్చిన యెహోవాకు స్తుతి కలుగును గాక” అన్నాడు.
1KI 5:8 హీరాము సొలొమోనుకు ఇలా జవాబిచ్చాడు: “మీరు నాకు పంపిన సందేశం అంగీకరించాను, నేను మీరు కోరినట్టు దేవదారు, సరళవృక్షాల మ్రానులను ఇస్తాను.
1KI 5:9 నా పనివారు వాటిని లెబానోను నుండి మధ్యధరా సముద్రతీరానికి తెస్తారు. అక్కడినుండి మీరు చెప్పే స్థలానికి తెప్పలుగా కట్టించి సముద్రం మీదుగా పంపుతాను. అక్కడ వాటిని మీకు అందించే ఏర్పాటు నేను చేస్తాను, మీరు వాటిని తీసుకోవచ్చు. నా కోరిక ప్రకారం మీరు జరిగించి నా రాజకుటుంబానికి ఆహారాన్ని అందించండి.”
1KI 5:10 ఇలా హీరాము సొలొమోనుకు అతడు కోరిన దేవదారు, సరళవృక్షాల మ్రానులు అన్ని ఇచ్చాడు.
1KI 5:11 సొలొమోను హీరాముకు అతని ఇంటివారికి ఆహారంగా 20,000 కోరుల గోధుమలను, 20,000 బాతుల స్వచ్ఛమైన ఒలీవ నూనెను ఇచ్చాడు. సొలొమోను హీరాముకు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇచ్చాడు.
1KI 5:12 యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం ప్రకారం అతనికి జ్ఞానాన్ని ప్రసాదించారు. హీరాము సొలొమోనులు సమాధానంతో ఒక ఒప్పందం చేసుకున్నారు.
1KI 5:13 రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిలో నుండి ముప్పైవేల మందిని వెట్టిపనులు చేయడానికి ఏర్పాటు చేశాడు.
1KI 5:14 వారిని వంతు ప్రకారం నెలకు పదివేలమందిని లెబానోనుకు పంపేవాడు. వారు లెబానోనులో ఒక నెల, ఇంటి దగ్గర రెండు నెలలు గడిపేవారు. నిర్భంద కూలీల మీద అదోనిరాము అధికారి.
1KI 5:15 సొలొమోనుకు కొండల్లో బరువులు మోసేవారు డెబ్బైవేలమంది, రాళ్లు కొట్టేవారు ఎనభైవేలమంది ఉన్నారు.
1KI 5:16 అంతేకాక, ఆ పనివారిచేత పని చేయించడానికి మూడువేల మూడువందలమంది అధికారులు ఉన్నారు.
1KI 5:17 రాజు ఆజ్ఞమేరకు దేవాలయ పునాదిని చెక్కిన రాళ్లతో వేయడానికి గనులలో నుండి చాలా విలువైన రాళ్లను తవ్వి తెప్పించారు.
1KI 5:18 సొలొమోను, హీరాములు పంపిన శిల్పకారులును గెబాలీయుల ప్రదేశం నుండి వచ్చిన పనివారును మందిరాన్ని కట్టడానికి మ్రానులను రాళ్లను సిద్ధం చేశారు.
1KI 6:1 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల తర్వాత, సొలొమోను ఇశ్రాయేలును పరిపాలిస్తున్న నాలుగవ సంవత్సరం, జీప్ అనే రెండవ నెలలో, సొలొమోను యెహోవా మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు.
1KI 6:2 రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరం పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ముప్పై మూరలు.
1KI 6:3 మందిరంలో విశాల గది ముందు మంటపం ఉంది, మందిరం యొక్క వెడల్పును బట్టి దాని పొడవు ఇరవై మూరలు, మందిరం ముందుకు పది మూరల వెడల్పు.
1KI 6:4 అతడు మందిర గోడలలో పై భాగంలో ఇరుకైన కిటికీలు చేయించాడు.
1KI 6:5 ఆలయ విశాల గది గర్భాలయం యొక్క గోడల చుట్టూరా ప్రక్క గదులు కట్టించాడు.
1KI 6:6 క్రింది అంతస్తు వెడల్పు అయిదు మూరలు, రెండవ అంతస్తు గదుల వెడల్పు ఆరు మూరలు, మూడవ అంతస్తు గదుల వెడల్పు ఏడు మూరలు. గదుల దూలాలు మందిర గోడల్లోకి చొచ్చుకుపోకుండా, మందిర బయటి గోడలకు చిమ్మురాళ్లు పెట్టించాడు.
1KI 6:7 మందిరం కట్టడానికి ముందుగానే చెక్కిన రాళ్లు వాడారు, అది కడుతున్నప్పుడు సుత్తి, గొడ్డలి, మరి ఏ ఇతర ఇనుప పనిముట్ల శబ్దం వినబడలేదు.
1KI 6:8 క్రింది అంతస్తు గుమ్మం మందిరానికి దక్షిణ వైపున ఉంది; రెండవ అంతస్తుకు, అక్కడినుండి మూడవ అంతస్తుకు ఎక్కడానికి మెట్లు ఉన్నాయి.
1KI 6:9 అతడు మందిరం కట్టించి దూలాలు, దేవదారు పలకలతో కప్పు వేయించి పూర్తి చేశాడు.
1KI 6:10 అతడు మందిరం చుట్టూ గదులు కట్టించాడు. వీటి ఎత్తు అయిదు మూరలు, అవి మందిరానికి దేవదారు దూలాలతో జత చేయబడ్డాయి.
1KI 6:11 యెహోవా వాక్కు సొలొమోనుతో,
1KI 6:12 “నీవు కట్టించే ఈ మందిరం విషయంలో, నీవు నా శాసనాలను అనుసరిస్తూ, నా న్యాయనిర్ణయాలు పాటిస్తూ, నా ఆజ్ఞలన్నిటికి లోబడితే, నేను నీ తండ్రియైన దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ ద్వారా నెరవేరుస్తాను.
1KI 6:13 ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాను, నా ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టను” అని చెప్పారు.
1KI 6:14 సొలొమోను మందిరం కట్టించడం ముగించాడు.
1KI 6:15 మందిరం లోపలి గోడలను, అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలతో కట్టించాడు. లోపలి గోడలకు దేవదారు పలకలను, నేలను సరళవృక్షాల పలకలను పరిచారు.
1KI 6:16 అతడు మందిరం వెనుక భాగంలో నేల నుండి పైకప్పు వరకు దేవదారు పలకలతో ఇరవై మూరల ఎత్తు గర్భాలయాన్ని అనగా అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు.
1KI 6:17 అతి పరిశుద్ధ స్థలానికి ముందున్న విశాల గది పొడవు నలభై మూరలు.
1KI 6:18 మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుండ్రని పండ్లు, విచ్చుకున్న పువ్వులు చెక్కారు; అంతా దేవదారు కర్ర పనే ఉంది గాని రాయి ఒక్కటి కూడా కనిపించదు.
1KI 6:19 అతడు మందిరం లోపల యెహోవా నిబంధన మందసం పెట్టడానికి గర్భాలయాన్ని సిద్ధపరిచాడు.
1KI 6:20 గర్భాలయం పొడవు ఇరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు ఇరవై మూరలు. దాని లోపలంతా మేలిమి బంగారంతో పొదిగించాడు, దేవదారు కర్రతో చేసిన బలిపీఠాన్ని కూడా చేయించాడు.
1KI 6:21 సొలొమోను మందిరం లోపలి భాగమంతా మేలిమి బంగారంతో పొదిగించాడు, గర్భాలయం ముందు భాగానికి బంగారు గొలుసుల తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు.
1KI 6:22 మందిరం లోపలి భాగం పూర్తిగా బంగారంతో పొదిగించాడు. గర్భాలయానికి సంబంధించిన బలిపీఠాన్ని కూడా బంగారంతో పొదిగించాడు.
1KI 6:23 గర్భాలయం కోసం అతడు ఒలీవ కర్రతో పది మూరల ఎత్తున్న కెరూబుల జతను చేయించాడు, ఒక్కొక్కటి పది మూరల ఎత్తు గలవి.
1KI 6:24 మొదటి కెరూబుకు ఒక్కో రెక్క పొడవు అయిదు మూరలు, ఒక రెక్క కొన నుండి ఇంకొక రెక్క కొన వరకు పది మూరలు.
1KI 6:25 రెండవ కెరూబు పొడవు కూడా పది మూరలు. రెండు కెరూబులు ఒకే కొలతతో ఒకే ఆకారంతో ఉన్నాయి.
1KI 6:26 ఒక్కో కెరూబు ఎత్తు పది మూరలు.
1KI 6:27 అతడు ఆ కెరూబులను గర్భాలయంలో ఉంచాడు. వాటి రెక్కలు పూర్తిగా విప్పుకొని ఉన్నాయి. ఒక కెరూబు రెక్క ఒక గోడను, మరో కెరూబు రెక్క ఇంకొక గోడను తాకుతూ గది మధ్యలో వాటి రెక్కలు ఒకదానికొకటి తాకుతూ ఉన్నాయి.
1KI 6:28 అతడు కెరూబులను బంగారంతో పొదిగించాడు.
1KI 6:29 గర్భాలయంలో, దాని బయట ఉన్న గదుల గోడల మీద అతడు కెరూబులు, ఖర్జూర చెట్లు, విచ్చుకున్న పువ్వులను చెక్కించాడు.
1KI 6:30 అతడు గర్భాలయం నేల మీద, బయటి గది నేల మీద కూడా బంగారంతో పొదిగించాడు.
1KI 6:31 గర్భాలయం ప్రవేశ ద్వారానికి అతడు ఒలీవ చెక్కతో చేయించిన తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మి నిలువు కమ్మిల వెడల్పు పరిశుద్ధాలయం వెడల్పులో అయిదవ వంతు ఉన్నాయి.
1KI 6:32 ఒలీవ కర్రతో చేసిన ఆ రెండు తలుపుల మీద అతడు కెరూబులు, ఖర్జూర చెట్లు, విచ్చుకున్న పువ్వులను చెక్కించాడు, ఆ కెరూబుల మీద, చెట్లమీద బంగారంతో పొదిగించాడు.
1KI 6:33 అదే రీతిలో ప్రధాన మందిర ప్రవేశ ద్వారానికి ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో నాలుగో వంతు ఉంది.
1KI 6:34 అంతేకాక అతడు రెండు తలుపులు సరళవృక్షాల కర్రతో చేయించాడు, ఆ రెండిటికి రెండేసి మడత రెక్కలు ఉన్నాయి.
1KI 6:35 అతడు తలుపుల మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, విచ్చుకున్న పువ్వులు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు.
1KI 6:36 లోపలి ఆవరణాన్ని మూడు వరసల్లో చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.
1KI 6:37 నాలుగవ సంవత్సరం జీప్ నెలలో యెహోవా ఆలయానికి పునాది వేశారు.
1KI 6:38 పదకొండవ సంవత్సరంలో బూలు అనే ఎనిమిదవ నెలలో మందిరాన్ని, దాని భాగాలన్నిటినీ దాని నమూనా ప్రకారం ముగించారు. దానిని కట్టించడానికి సొలొమోనుకు ఏడు సంవత్సరాలు పట్టింది.
1KI 7:1 సొలొమోనుకు తన రాజభవనాన్ని కట్టించుకోడానికి పదమూడేళ్ళు పట్టింది.
1KI 7:2 అతడు కట్టించుకున్న లెబానోను అరణ్య రాజభవనం పొడవు వంద మూరలు, వెడల్పు యాభై మూరలు, ఎత్తు ముప్పై మూరలు, నాలుగు వరుసల దేవదారు స్తంభాల మీద దేవదారు దూలాలను వేయించాడు.
1KI 7:3 స్తంభాల మీది దూలాల పైకప్పును దేవదారుతో చేశారు. ఒక్కో వరుసలో పదిహేను స్తంభాల చొప్పున మూడు వరుసల్లో నలభై అయిదు స్తంభాలు ఉన్నాయి.
1KI 7:4 దాని కిటికీలు మూడు వరుసల్లో ఒకదానికొకటి ఎదురుగా ఉంచారు.
1KI 7:5 అన్ని తలుపుల, కిటికీల గుమ్మాలు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి; అవి ముందు భాగంలో మూడు వరుసల్లో ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.
1KI 7:6 సొలొమోను స్తంభాలతో ఒక మండపాన్ని కట్టించాడు, దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ముప్పై మూరలు, దానికి ముందు స్తంభాలతో కట్టిన వసారా ఉంది.
1KI 7:7 అతడు తీర్పు తీర్చడానికి సింహాసన గదిని, న్యాయస్థాన గదిని కట్టించాడు. దానిని అడుగు నుండి పైకప్పు వరకు దేవదారుతో కప్పించాడు.
1KI 7:8 దాని లోపలి ఆవరణంలో అతడు నివసించే రాజభవనాన్ని ఆ విధంగానే కట్టించాడు. సొలొమోను తాను పెళ్ళి చేసుకున్న ఫరో కుమార్తెకు కూడా ఇలాంటి భవనాన్నే కట్టించాడు.
1KI 7:9 ఈ నిర్మాణాలన్ని, బయట నుండి గొప్ప ఆవరణం వరకు, పునాది నుండి పైకప్పు వరకు, లోపల బయట సరియైన కొలతలతో ఇనుప పనిముట్లతో చెక్కిన విలువైన రాళ్లతో చేశారు.
1KI 7:10 పునాదిని నాణ్యమైన పెద్ద రాళ్లతో వేశారు. వాటిలో కొన్ని పది మూరలు, కొన్ని ఎనిమిది మూరల రాళ్లు ఉన్నాయి.
1KI 7:11 పైభాగంలో చెక్కబడిన విలువైన రాళ్లు, దేవదారు దూలాలు ఉన్నాయి.
1KI 7:12 గొప్ప ఆవరణానికి చుట్టూ మూడు వరుసల చెక్కిన రాళ్లు, ఒక వరుస దేవదారు దూలాలు ఉన్నాయి. యెహోవా మందిరపు లోపలి ఆవరణం కట్టినట్లే రాజభవనపు మండపం కూడా కట్టారు.
1KI 7:13 సొలొమోను రాజు తూరు నుండి హూరాము అనే అతన్ని పిలిపించాడు.
1KI 7:14 అతని తల్లి నఫ్తాలి గోత్రానికి చెందిన విధవరాలు, అతని తండ్రి తూరు వాసి, ఇత్తడి పనిలో నైపుణ్యత కలవాడు. హూరాము అన్ని రకాల ఇత్తడి పనులలో జ్ఞానం, సామర్థ్యం, తెలివిగలవాడు. అతడు రాజైన సొలొమోను దగ్గరకు వచ్చి తనకు అప్పగించిన పని అంతా చేశాడు.
1KI 7:15 అతడు రెండు ఇత్తడి స్తంభాలను పోత పోశాడు. ఒక్కొక్క దాని ఎత్తు పద్దెనిమిది మూరలు, చుట్టుకొలత పన్నెండు మూరలు.
1KI 7:16 ఆ స్తంభాల మీద ఉంచడానికి అతడు రెండు ఇత్తడి పీటలను కూడా పోత పోశాడు. ఒక్కొక్క దాని ఎత్తు అయిదు మూరలు.
1KI 7:17 స్తంభాల మీద ఉన్న పీటలకు అల్లిన గొలుసులతో, ప్రతి పీటకు ఏడు అల్లిన గొలుసులను వేశాడు.
1KI 7:18 ఆ స్తంభాలను మీది పీటలను అలంకరించడానికి చుట్టూ రెండు వరుసల దానిమ్మపండ్లు చేశాడు.
1KI 7:19 మండపం స్తంభాల మీది పీటలపై నాలుగు మూరల ఎత్తు తామర పువ్వుల్లా చెక్కారు.
1KI 7:20 ఆ రెండు స్తంభాల మీది పీటల మీద అల్లికపని ఉన్న గిన్నెలాంటి భాగం పైన రెండువందల దానిమ్మపండ్లు వరుసగా చుట్టూరా ఉన్నాయి.
1KI 7:21 అతడు దేవాలయ మంటపంలో ఆ స్తంభాలను నిలబెట్టాడు. దక్షిణాన ఉన్న దానికి యాకీను అని, ఉత్తరాన ఉన్న దానికి బోయజు అని పేరు పెట్టాడు.
1KI 7:22 ఆ స్తంభాల పైభాగాలు తామర పువ్వుల రూపంలో ఉన్నాయి. అలా స్తంభాలు కట్టే పని పూర్తి అయింది.
1KI 7:23 అతడు పోతపోసిన ఒక గుండ్రని నీళ్ల తొట్టె చేయించాడు. అది ఈ అంచు నుండి ఆ అంచు వరకు పది మూరలు, దాని ఎత్తు అయిదు మూరలు. దాని చుట్టుకొలత ముప్పై మూరలు.
1KI 7:24 దాని అంచు క్రింద మూరకు పది చొప్పున చుట్టూ గుండ్రని పండ్లు ఉన్నాయి. నీళ్ల తొట్టెను పోత పోసినప్పుడు ఆ గుండ్రని పండ్లను రెండు వరుసలుగా పోత పోశారు.
1KI 7:25 ఆ నీళ్ల తొట్టె పన్నెండు ఎడ్ల మీద అమర్చబడింది, వాటిలో మూడు ఉత్తరం వైపు, మూడు పశ్చిమ వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపు ఉన్నాయి. నీళ్ల తొట్టె వాటిపై ఉంచబడింది, వాటి వెనుకటి భాగాలు లోపలి వైపుకు ఉన్నాయి.
1KI 7:26 అది బెత్తెడు మందం కలిగి ఉండి, దాని అంచు పాత్ర అంచులా, తామర పువ్వులా ఉంది. దానిలో రెండువేల బాతుల నీళ్లు పడతాయి.
1KI 7:27 అతడు కదిలే పది ఇత్తడి స్తంభాలను కూడా చేయించాడు; ప్రతి దాని పొడవు నాలుగు మూరలు, వెడల్పు నాలుగు మూరలు, ఎత్తు మూడు మూరలు.
1KI 7:28 ఆ స్తంభాలు ఇలా చేయబడ్డాయి: వాటికి ప్రక్క పలకలు ఉన్నాయి, ఆ పలకలు మధ్య చట్రాలు అమర్చారు.
1KI 7:29 ఆ చట్రాల మధ్య ఉన్న పలకల మీద చట్రాల మీద సింహాలు, ఎడ్లు, కెరూబు ఆకారాలు ఉన్నాయి. సింహాలకు, ఎడ్లకు పైన క్రింద పూదండలు చెక్కారు.
1KI 7:30 ప్రతి స్తంభానికి నాలుగు ఇత్తడి ఇరుసులతో పాటు ఇత్తడి చక్రాలు ఉన్నాయి. ప్రతి దానికి నాలుగు మూలల్లో దిమ్మలు ఉన్నాయి. వాటి ప్రతి వైపున పోతపోసిన పూదండలు ఉన్నాయి.
1KI 7:31 స్తంభం పై భాగంలో దాని మూతి ఉంది. దాని మూతి గుండ్రంగా, ఒక మూర లోతు ఉంది. మూతి గుండ్రంగా ఉండి దాని ఎత్తు ఒక మూరన్నర. ఆ మూతి మీద కూడ చిత్రాలు చెక్కారు. దాని చట్రం గుండ్రంగా గాక, నలుచదరంగా ఉంది.
1KI 7:32 చట్రాల క్రింద నాలుగు చక్రాలు ఉన్నాయి. వాటి ఇరుసులు స్తంభాలతో కలిపారు, చక్రాల అడ్డుకొలత మూరన్నర.
1KI 7:33 ఈ చక్రాలు రథచక్రాల్లా చేశారు; వాటి ఇరుసులు, అంచులు, అడ్డు కర్రలు, చక్రం యొక్క మధ్య భాగాలు, అన్నీ పోత పనితో చేశారు.
1KI 7:34 ప్రతి స్తంభానికి నాలుగు మూలలకు నాలుగు దిమ్మెలు ఉన్నాయి, వాటిని స్తంభాలతో కలిపి పోత పోశారు.
1KI 7:35 స్తంభం పైన చుట్టూ జానెడు ఎత్తుగల గుండ్రని బొద్దు ఉంది. స్తంభం, దానిపై ఉన్న చట్రాలు, పలకలు ఒకటిగా పోత పోయబడ్డాయి.
1KI 7:36 అతడు పలకల మీద, చట్రాల మీద స్థలమున్న ప్రతీ చోట కెరూబు, సింహాలు, ఖర్జూర వృక్షాల ఆకారాలను, వాటి చుట్టూ పూదండలతో పాటు చెక్కించాడు.
1KI 7:37 ఈ విధంగా ఆ పది స్తంభాలు చేయించాడు, అన్నిటికీ ఒకే పోత, ఒకే కొలత, ఒకే ఆకారము.
1KI 7:38 తర్వాత అతడు పది ఇత్తడి తొట్లు చేయించాడు. ప్రతి తొట్టి అడ్డుకొలత నాలుగు మూరలు. ప్రతి తొట్టిలో నలభై బాతులు పట్టేది, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కో తొట్టి పెట్టారు.
1KI 7:39 అతడు దేవాలయానికి కుడివైపు అయిదు స్తంభాలను, ఎడమవైపు అయిదు స్తంభాలను పెట్టించాడు. నీళ్ల తొట్టెను దక్షిణం వైపు దేవాలయానికి కుడి ప్రక్క ఆగ్నేయ దిక్కుగా పెట్టించాడు.
1KI 7:40 అతడు కుండలను, చేటలను, చిలకరించడానికి వాడే గిన్నెలను కూడా చేయించాడు. కాబట్టి హూరాము యెహోవా ఆలయానికి రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారం పనంతా చేసి ముగించాడు:
1KI 7:41 రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న గిన్నెలాంటి రెండు పీటలు, గిన్నెలాంటి పీటలను కప్పడానికి రెండు అల్లికలు,
1KI 7:42 స్తంభాలపై ఉన్న గిన్నెలాంటి పీటలను అలంకరిస్తూ ఒక్కొక్క అల్లికకు రెండేసి వరుసల చొప్పున ఆ రెండు అల్లికలకు నాలుగు వందల దానిమ్మపండ్లు,
1KI 7:43 పది పీటలు వాటిపై ఉన్న పది తొట్లు,
1KI 7:44 నీళ్ల తొట్టె దాని క్రింద ఉన్న పన్నెండు ఎడ్లు,
1KI 7:45 కుండలు, చేటలు, చిలకరించడానికి వాడే గిన్నెలు. హూరాము యెహోవా ఆలయానికి సొలొమోను రాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడితో తయారుచేశాడు.
1KI 7:46 రాజు వీటన్నిటిని యొర్దాను సమతల మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టితో పోతపోయించాడు.
1KI 7:47 ఆ ఇత్తడి వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి సొలొమోను వాటిని తూకం వేయించలేదు; ఆ ఇత్తడి బరువు ఎంతో తెలుసుకోడానికి లేదు.
1KI 7:48 యెహోవా మందిరానికి సొలొమోను చేయించిన తక్కిన వస్తువులు: బంగారు బలిపీఠం; సన్నిధి రొట్టెలు పెట్టే బంగారు బల్ల;
1KI 7:49 మేలిమి బంగారు దీపస్తంభాలు (గర్భాలయం ఎదుట కుడి ప్రక్కన అయిదు, ఎడమ ప్రక్కన అయిదు); బంగారు పుష్పాలు దీపాలు పట్టుకారులు;
1KI 7:50 అలాగే మేలిమి బంగారు పళ్లాలు, వత్తులు కత్తిరించే కత్తెరలు, చిలకరించే గిన్నెలు, పాత్రలు, ధూపకలశాలు; అనే అతి పరిశుద్ధ స్థలమైన గర్భాలయ తలుపులకు, మందిర ప్రధాన గది తలుపులకు, బంగారు బందులు చేయించాడు.
1KI 7:51 రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేసిన పని అంతా ముగిసిన తర్వాత, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారు, వస్తువులను తెప్పించి యెహోవా మందిర ఖజానాలో పెట్టాడు.
1KI 8:1 అప్పుడు రాజైన సొలొమోను దావీదు పట్టణమైన సీయోను నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాల పెద్దలను, ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులందరిని యెరూషలేములో తన దగ్గరకు పిలిపించాడు.
1KI 8:2 ఏతనీము అనే ఏడవ నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులందరు రాజైన సొలొమోను ఎదుట సమావేశమయ్యారు.
1KI 8:3 ఇశ్రాయేలు పెద్దలందరు వచ్చాక, యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని తీసుకుని,
1KI 8:4 వారు యెహోవా మందసాన్ని, సమావేశ గుడారాన్ని, అందులోని పవిత్ర వస్తువులన్నీ తీసుకువచ్చారు. యాజకులు, లేవీయులు వాటిని పైకి మోసుకెళ్లారు.
1KI 8:5 రాజైన సొలొమోను, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మందసం ముందు సమావేశమై, లెక్కలేనన్ని గొర్రెలను పశువులను బలి ఇచ్చారు.
1KI 8:6 తర్వాత యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని మందిరంలోని గర్భాలయం అనే అతి పరిశుద్ధ స్థలంలో దాని స్థలానికి తీసుకువచ్చి, కెరూబుల రెక్కల క్రింద పెట్టారు.
1KI 8:7 కెరూబుల రెక్కలు మందసం ఉన్న స్థలం మీదుగా చాపబడి మందసాన్ని, దానిని మోసే కర్రలను కప్పివేశాయి.
1KI 8:8 ఈ మోతకర్రలు చాలా పొడవుగా ఉండడం వల్ల, వాటి అంచులు గర్భాలయానికి ముందున్న పరిశుద్ధ స్థలంలో నుండి కనబడతాయి, కాని పరిశుద్ధస్థలం బయట నుండి కనబడవు; ఈనాటికీ అవి అక్కడే ఉన్నాయి.
1KI 8:9 మోషే హోరేబులో ఉన్నప్పుడు, అనగా ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత యెహోవా వారితో నిబంధన చేసినప్పుడు మందసంలో పెట్టిన రెండు రాతిపలకలు తప్ప మరేమీ దానిలో లేవు.
1KI 8:10 యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయటకు వచ్చినప్పుడు యెహోవా మందిరాన్ని మేఘం కమ్ముకుంది.
1KI 8:11 యెహోవా మహిమ ఆయన మందిరం నిండ కమ్ముకున్న ఆ మేఘాన్ని బట్టి యాజకులు తమ సేవ చేయలేకపోయారు.
1KI 8:12 అప్పుడు సొలొమోను, “యెహోవా తాను చీకటి మేఘంలో నివసిస్తారని ఆయన చెప్పారు;
1KI 8:13 నేను మీ కోసం ఘనమైన మందిరాన్ని కట్టించాను, అది మీరు ఎల్లకాలం నివసించగలిగే స్థలం” అని అన్నాడు.
1KI 8:14 ఇశ్రాయేలు సమాజమంతా అక్కడ నిలబడి ఉండగా రాజు వారివైపు తిరిగి, వారిని దీవించాడు.
1KI 8:15 అప్పుడతడు ఇలా అన్నాడు: “నా తండ్రియైన దావీదుకు మాట ఇచ్చి తన స్వహస్తంతో దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆయన ఇలా అన్నారు:
1KI 8:16 ‘ఈజిప్టు నుండి నేను నా ప్రజలను తీసుకువచ్చిన రోజు నుండి, నా పేరిట మందిరం కట్టించుకోడానికి ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన పట్టణాల్లో దేనినీ నేను ఎన్నుకోలేదు, కాని నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నాను.’
1KI 8:17 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరం కట్టించాలనే ఆశ నా తండ్రి దావీదు హృదయంలో ఉండింది.
1KI 8:18 కాని, యెహోవా నా తండ్రియైన దావీదుతో, ‘నా పేరున మందిరాన్ని కట్టించాలనే ఆశ నీ హృదయంలో ఉండడం మంచిదే.
1KI 8:19 అయితే కట్టించేది నీవు కాదు, నీ రక్తం పంచుకుని పుట్టే కుమారుడు నా పేరున మందిరాన్ని కట్టిస్తాడు’ అన్నారు.
1KI 8:20 “యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నారు; యెహోవా వాగ్దానం చేసినట్లే, నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజ సింహాసనం ఎక్కాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరాన్ని కట్టించాను.
1KI 8:21 యెహోవా మన పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చినప్పుడు, ఆయన వారితో చేసిన నిబంధనను తెలిపే మందసం కోసం మందిరంలో స్థలం ఏర్పాటు చేశాను.”
1KI 8:22 అప్పుడు సొలొమోను యెహోవా బలిపీఠం ముందు, ఇశ్రాయేలు సమాజమంతటి సమక్షంలో నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి,
1KI 8:23 ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని, మీలాంటి దేవుడు మరొకడు లేడు. మీ మార్గంలో హృదయమంతటితో కొనసాగే మీ సేవకుల పట్ల మీ ప్రేమ నిబంధనను నెరవేరుస్తారు.
1KI 8:24 మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు; మీ నోటితో చేసిన వాగ్దానాన్ని ఈ రోజున కనబడుతున్నట్టుగా మీ చేతులతో నెరవేర్చారు.
1KI 8:25 “ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో, ‘నీ వారసులు తమ ప్రవర్తన విషయంలో జ్రాగత్తగా ఉంటూ, నీలా నా ఎదుట నమ్మకంగా జీవిస్తే, ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ సంతానంలో ఉండక పోడు’ అని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చండి.
1KI 8:26 ఇప్పుడు ఇశ్రాయేలు దేవా! మీ సేవకుడైన నా తండ్రి దావీదుతో మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి.
1KI 8:27 “దేవుడు భూమి మీద నిజంగా నివాసం చేస్తారా? ఆకాశ మహాకాశం మీకు సరిపోవు, నేను కట్టించిన ఈ మందిరం ఏం సరిపోతుంది!
1KI 8:28 అయినా యెహోవా నా దేవా, మీ దాసుడైన నేను చేసే ప్రార్థన, కనికరం కోసం చేసే విన్నపం ఆలకించండి. ఈ రోజు మీ దాసుడు మీ సన్నిధిలో చేసే మొరను, ప్రార్థనను వినండి.
1KI 8:29 నా పేరు అక్కడ ఉంటుందని మీరు ఈ మందిరాన్ని గురించి అన్నారు. కాబట్టి మీ దాసుడు ఈ స్థలం వైపు తిరిగి చేసే ప్రార్థన మీరు వినేలా రాత్రింబగళ్ళు మీ కనుదృష్టి ఈ మందిరంపై ఉంచండి.
1KI 8:30 మీ దాసుడు, మీ ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి విన్నపం ఆలకించండి. మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి, మీరు విన్నప్పుడు క్షమించండి.
1KI 8:31 “ఎవరైనా తన పొరుగువారి పట్ల తప్పు చేశారని ఆరోపించబడి వారు ప్రమాణం చేయాల్సివస్తే ఈ మందిరంలో మీ బలిపీఠం ముందు ఆ ప్రమాణం చేసినప్పుడు,
1KI 8:32 మీరు ఆకాశం నుండి విని మీ దాసులకు న్యాయం తీర్చండి. దోషులను వారి దోషం బట్టి శిక్షిస్తూ, నిర్దోషుల నిర్దోషత్వాన్ని బట్టి వారి నిర్దోషత్వాన్ని నిర్ధారించండి.
1KI 8:33 “మీ ఇశ్రాయేలు ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు వారి శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు మీ వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఈ మందిరంలో మిమ్మల్ని వేడుకున్నప్పుడు,
1KI 8:34 మీరు పరలోకం నుండి విని, మీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని క్షమించి, వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశానికి వారిని మళ్ళీ తీసుకురండి.
1KI 8:35 “మీ ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు, ఆకాశం మూయబడి వర్షం లేనప్పుడు, వారు తమకు కలిగిన శ్రమ వలన తమ పాపం విడిచిపెట్టి ఈ స్థలం వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ, ప్రార్థిస్తే,
1KI 8:36 మీరు పరలోకం నుండి విని, మీ దాసులు, మీ ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని క్షమించండి. సరైన మార్గాన్ని అనుసరిస్తూ జీవించాలని వారికి బోధించండి, మీ ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో వర్షం కురిపించండి.
1KI 8:37 “దేశంలో కరువు గాని తెగులు గాని వడగాలి గాని నాచు గాని మిడతలు గాని పురుగులు గాని వచ్చినా, వారి శత్రువు వారి పట్టణాల్లో వారిని ముట్టడి చేసినా, ఏదైనా విపత్తు గాని రోగం గాని వచ్చినా,
1KI 8:38 మీ ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా తమ హృదయాల వేదనలు తెలుసుకొని, ఈ మందిరం వైపు తమ చేతులను చాచి ప్రార్థన విన్నపం చేస్తే,
1KI 8:39 ప్రతి మనిషి హృదయం మీకు తెలుసు కాబట్టి మీ నివాసస్థలమైన పరలోకం నుండి విని క్షమించి, ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమివ్వండి (ఎందుకంటే ప్రతి మానవ హృదయం మీకు తెలుసు),
1KI 8:40 అప్పుడు మీరు మా పూర్వికులకిచ్చిన ఈ దేశంలో వారు బ్రతికి ఉన్నంత కాలం మీకు భయపడతారు.
1KI 8:41 “మీ ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించని విదేశీయులు, మీ పేరును బట్టి దూరదేశం నుండి వచ్చినవారు,
1KI 8:42 మీ గొప్ప నామం గురించి మీ బలమైన బాహువును గురించి వారు విని, వారు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,
1KI 8:43 మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి. విదేశీయులు మిమ్మల్ని ఏమి అడిగినా అది వారికి చేయండి. అప్పుడు భూలోక ప్రజలు మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లా మీ పేరు తెలుసుకొని మీకు భయపడతారు. నేను కట్టిన ఈ మందిరం మీ పేరు కలిగి ఉందని తెలుసుకుంటారు.
1KI 8:44 “మీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు, మీరు వారిని ఎక్కడికి పంపినా, మీరు ఎన్నుకున్న పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి, వారు యెహోవాకు ప్రార్థన చేస్తే,
1KI 8:45 అప్పుడు పరలోకం నుండి వారి ప్రార్థన విన్నపం విని వారి పక్షాన ఉండండి.
1KI 8:46 “పాపం చేయని మనుష్యులు లేరు కాబట్టి వారు మీకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు, మీరు వారిపై కోప్పడి శత్రువులకు అప్పగిస్తే, వారు వీరిని దూరంగా లేదా దగ్గరగా ఉన్న తమ దేశానికి బందీలుగా తీసుకెళ్తారు;
1KI 8:47 అప్పుడు వారు బందీలుగా ఉన్న దేశంలో ఉన్నప్పుడు వారి హృదయాలు మారి పశ్చాత్తాపపడి, ‘మేము తప్పు చేసి దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాం’ అని వారు వేడుకుంటే,
1KI 8:48 తాము బందీగా ఉన్న దేశంలో వారు తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో మరలా మీ వైపు తిరిగి, వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశం వైపు, మీరు ఎన్నుకున్న పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,
1KI 8:49 అప్పుడు మీ నివాసస్థలమైన పరలోకం నుండి వారి ప్రార్థన, వారి విన్నపం విని, వారి పక్షాన ఉండండి.
1KI 8:50 మీకు విరుద్ధంగా పాపం చేసిన మీ ప్రజలను క్షమించండి; మీకు విరుద్ధంగా వారు చేసిన తప్పులన్నిటిని క్షమించి, వారిని బందీగా తీసుకెళ్లిన వారు వీరిని కరుణించేలా చేయండి;
1KI 8:51 ఎందుకంటే వారు మీ ప్రజలు, మీ స్వాస్థ్యం, మీరు వారిని ఈజిప్టు నుండి ఆ ఇనుప కొలిమి మధ్యలో నుండి బయట తీసుకువచ్చారు.
1KI 8:52 “కాబట్టి మీ కనుదృష్టి మీ దాసుని మీద, ఇశ్రాయేలు ప్రజల విన్నపం మీద ఉండును గాక, వారు మీకు మొరపెట్టినప్పుడు మీరు విందురు గాక.
1KI 8:53 ఎందుకంటే ప్రభువైన యెహోవా, మీరు మా పూర్వికులను ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు మీ సేవకుడైన మోషే ద్వారా ప్రకటించినట్లుగానే, లోకంలోని జనాంగాలన్నిటి నుండి వారిని మీ సొంత వారసత్వంగా చేసుకున్నారు కదా.”
1KI 8:54 సొలొమోను యెహోవాకు ఈ ప్రార్థనలు, విన్నపాలు అన్ని చేసిన తర్వాత, యెహోవా బలిపీఠం ముందు మోకరించి ఆకాశం వైపు చేతులు చాచిన ఆ స్థలం నుండి లేచాడు.
1KI 8:55 అతడు నిలబడి ఇశ్రాయేలు సమాజమంతటిని దీవిస్తూ, స్వరమెత్తి ఇలా అన్నాడు:
1KI 8:56 “యెహోవాకు స్తుతి కలుగును గాక! తన వాగ్దానం ప్రకారం ఆయన తన ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలుగజేశారు. ఆయన తన సేవకుడైన మోషేకు ఇచ్చిన మంచి వాగ్దానాలన్నిటిలో ఒక్కటి కూడా తప్పలేదు.
1KI 8:57 మన పూర్వికులతో ఉన్నట్లు మన దేవుడైన యెహోవా మనతో ఉండును గాక; ఆయన మనలను విడువక త్రోసివేయక ఉండును గాక.
1KI 8:58 ఆయన మార్గాన్ని అనుసరిస్తూ, ఆయన మన పూర్వికులకు ఇచ్చిన ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటించడానికి, ఆయన వైపు మన హృదయాలను త్రిప్పాలి.
1KI 8:59 ఆయన తన దాసుని పక్షాన, తన ఇశ్రాయేలు ప్రజల పక్షాన అనుదిన అవసరత ప్రకారం కార్యాన్ని జరిగించేలా నేను యెహోవా ఎదుట ప్రార్థన చేస్తూ మాట్లాడిన ఈ మాటలు, మన దేవుడైన యెహోవా ఎదుట రాత్రింబగళ్ళు నిలిచి ఉండాలి!
1KI 8:60 అప్పుడు ప్రపంచంలోని అన్ని జనాంగాలు యెహోవాయే దేవుడని, వేరెవరు లేరని తెలుసుకుంటారు.
1KI 8:61 మీ హృదయాలు ఇప్పుడున్నట్లుగా దేవుడైన యెహోవాకు పూర్తిగా సమర్పించుకొని, ఆయన శాసనాలు ప్రకారం జీవిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఉండును గాక.”
1KI 8:62 తర్వాత రాజు, అతనితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా యెహోవా ఎదుట బలులు అర్పించారు.
1KI 8:63 సొలొమోను యెహోవాకు సమాధానబలులుగా 22,000 పశువులు, 1,20,000 గొర్రెలు, మేకలు అర్పించాడు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులందరు యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించారు.
1KI 8:64 యెహోవా సమక్షంలో ఉన్న ఇత్తడి బలిపీఠం మీద అర్పించలేనంత ఎక్కువగా ఆ దహనబలులు, భోజనార్పణలు, సమాధానబలుల క్రొవ్వు ఉంది కాబట్టి అదే రోజు రాజు యెహోవా ఆలయానికి ముందున్న ఆవరణం మధ్య భాగాన్ని అతడు పవిత్రపరచి, దహనబలులు, భోజనార్పణలు, సమాధానబలుల క్రొవ్వును అర్పించాడు.
1KI 8:65 ఆ సమయంలో సొలొమోను అతనితో ఇశ్రాయేలు ప్రజలంతా పండుగ చేశారు. లెబో హమాతుకు వెళ్లే మార్గం నుండి ఈజిప్టు వాగువరకు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలు గొప్ప సమూహంగా వచ్చి దేవుడైన యెహోవా ఎదుట ఏడు రోజులే కాకుండ మరి ఏడు రోజులు, మొత్తం పద్నాలుగు రోజులు పండుగ చేసుకున్నారు.
1KI 8:66 తర్వాత రోజు అతడు ప్రజలను పంపించేశాడు. వారు రాజును దీవిస్తూ, యెహోవా తన సేవకుడైన దావీదుకు, తన ప్రజలైన ఇశ్రాయేలుకు చేసిన మంచి వాటినన్నిటిని బట్టి హృదయంలో ఆనందంతో, సంతోషంతో తమ ఇళ్ళకు వెళ్లారు.
1KI 9:1 సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని కట్టించి తాను కోరుకున్నదంతా సాధించిన తర్వాత,
1KI 9:2 యెహోవా గిబియోనులో సొలొమోనుకు ప్రత్యక్షమైనట్లు రెండవసారి అతనికి ప్రత్యక్షమయ్యారు.
1KI 9:3 యెహోవా అతనితో ఇలా అన్నారు: “నా సమక్షంలో నీవు చేసిన ప్రార్థన విన్నపం విన్నాను; నీవు కట్టించిన ఈ మందిరంలో నా పేరు ఎప్పటికీ ఉండాలని నేను దీనిని ప్రతిష్ఠించాను. నా కనుదృష్టి, నా హృదయం ఎల్లప్పుడు దీనిపై ఉంటాయి.
1KI 9:4 “నీ మట్టుకైతే, నీ తండ్రి దావీదులా నమ్మకంగా యథార్థత నిజాయితీగల హృదయంతో జీవిస్తూ, నేను ఆజ్ఞాపించినదంతా చేసి, నా శాసనాలను నియమాలను పాటిస్తే,
1KI 9:5 నీ తండ్రి దావీదుకు, ‘ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతివారు ఎప్పటికీ కూర్చుంటారు’ అని వాగ్దానం చేసినట్లు నీ రాజ్యసింహాసనాన్ని ఎల్లకాలం ఇశ్రాయేలు మీద స్థాపిస్తాను.
1KI 9:6 “అయితే ఒకవేళ మీరు గాని మీ సంతానం గాని నాకు విరుద్ధంగా తిరిగి, నేను మీకు ఇచ్చిన శాసనాలు, ఆజ్ఞలు పాటించకుండా ఇతర దేవుళ్ళను సేవిస్తూ పూజిస్తే,
1KI 9:7 అప్పుడు నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన ఈ దేశంలో వారిని లేకుండా చేస్తాను. నా నామం కోసం ప్రతిష్ఠించుకున్న ఈ మందిరాన్ని తిరస్కరిస్తాను. అప్పుడు ఇశ్రాయేలీయులు సర్వజనాంగాల మధ్య ఒక సామెతగా హేళనకు కారణంగా మారతారు.
1KI 9:8 ఈ మందిరం శిథిలాల కుప్పగా మారుతుంది. దాటి వెళ్లేవారంతా ఆశ్చర్యపడి, అపహాస్యం చేస్తూ, ‘యెహోవా ఈ దేశానికి, ఈ ఆలయానికి ఇలా ఎందుకు చేశారో?’ అని అడుగుతారు.
1KI 9:9 అప్పుడు ప్రజలు, ‘వారు తమ పూర్వికులను ఈజిప్టు దేశం నుండి తీసుకువచ్చిన తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి వేరే దేవుళ్ళను హత్తుకుని పూజిస్తూ వాటికి సేవ చేశారు, అందుకే యెహోవా వారిపై ఈ విపత్తును తెచ్చారు’ అని జవాబిస్తారు.”
1KI 9:10 సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని కట్టించడానికి తీసుకున్న ఇరవై సంవత్సరాలు ముగిసిన తర్వాత,
1KI 9:11 సొలొమోనుకు కావలసిన అన్ని దేవదారు దూలాలు, సరళవృక్షపు చెట్లు, బంగారం, తూరు రాజైన హీరాము సరఫరాచేశాడు కాబట్టి సొలొమోను గలిలయ ప్రదేశంలోని ఇరవై పట్టణాలను హీరాముకు ఇచ్చాడు.
1KI 9:12 సొలొమోను తనకు ఇచ్చిన ఆ పట్టణాలను చూడడానికి హీరాము తూరు నుండి వెళ్లాడు, కాని అవి అతనికి నచ్చలేదు.
1KI 9:13 అతడు, “నా సోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణాలు ఎలాంటివి?” అని అడిగాడు. అతడు వాటికి కాబూల్ ప్రాంతం అని పేరు పెట్టాడు, ఈనాటికీ దానికి అదే పేరు.
1KI 9:14 హీరాము రాజుకు సుమారు 120 తలాంతుల బంగారం పంపాడు.
1KI 9:15 రాజైన సొలొమోను యెహోవా మందిరాన్ని, తన రాజభవనాన్ని, మేడలను, యెరూషలేము ప్రాకారాన్ని, హాసోరు, మెగిద్దో, గెజెరు పట్టణాలు కట్టడానికి నియమించిన వెట్టి పని చేసిన వారి వివరాలు.
1KI 9:16 (ఈజిప్టు రాజైన ఫరో దాడి చేసి గెజెరును పట్టుకుని తగుల బెట్టాడు. ఆ పట్టణంలో నివసించే కనానీయులను చంపి, తన కుమార్తెయైన సొలొమోను భార్యకు పెళ్ళి కానుకగా ఇచ్చాడు.
1KI 9:17 సొలొమోను గెజెరును మళ్ళీ కట్టించాడు.) అతడు దిగువ బేత్-హోరోనును,
1KI 9:18 బయలతు, తన దేశంలోని ఎడారిలో ఉన్న తద్మోరును,
1KI 9:19 తన ధాన్యాగారాలను, తన రథాలకు గుర్రాలకు పట్టణాలను, యెరూషలేములో లెబానోనులో తాను పరిపాలించే ప్రదేశమంతటిలో తాను కట్టించాలనుకున్న వాటన్నిటిని సొలొమోను కట్టించాడు.
1KI 9:20 అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు (ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు కాదు) ఇంకా అక్కడ మిగిలి ఉన్నారు.
1KI 9:21 ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండ వదిలిన ఈ ప్రజలందరి వారసులను సొలొమోను బానిసలుగా పని చేయడానికి నిర్బంధించాడు. నేటికీ వారు అలాగే ఉన్నారు.
1KI 9:22 అయితే సొలొమోను ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరిని బానిసలుగా చేయలేదు; వారు అతని సైనికులు, ప్రభుత్వ అధికారులు, అధికారులు, దళాధిపతులు, రథాలకు, రథసారధులకు అధిపతులు.
1KI 9:23 అంతేకాక, సొలొమోను చేయించే పనిమీద 550 మంది ముఖ్య అధికారులు కూడా ఉన్నారు, వారు పనివారి మీది అధికారులు.
1KI 9:24 ఫరో కుమార్తె దావీదు పట్టణం నుండి సొలొమోను తన కోసం కట్టించిన భవనానికి వచ్చిన తర్వాత సొలొమోను మేడలను కట్టించాడు.
1KI 9:25 సొలొమోను తాను యెహోవాకు కట్టించిన బలిపీఠం మీద సంవత్సరానికి మూడుసార్లు దహనబలులు, సమాధానబలులు అర్పిస్తూ, వాటితో యెహోవా సముఖంలో ధూపం వేస్తూ మందిర నియమాలను నెరవేర్చాడు.
1KI 9:26 రాజైన సొలొమోను ఎదోములోని ఎర్ర సముద్రతీరాన ఏలతు దగ్గర ఉన్న ఎసోన్-గెబెరు దగ్గర ఓడలను కూడా కట్టించాడు.
1KI 9:27 హీరాము సముద్రం గురించి తెలిసిన తన నావికులను సొలొమోను మనుష్యులతో పాటు పని చేయడానికి పంపించాడు.
1KI 9:28 వారు ఓఫీరుకు ప్రయాణం చేసి వెళ్లి 420 తలాంతుల బంగారాన్ని తెచ్చి రాజైన సొలొమోనుకు అందజేశారు.
1KI 10:1 షేబ దేశపు రాణి సొలొమోను యొక్క ఖ్యాతి గురించి యెహోవాతో అతనికి ఉన్న సంబంధం గురించి విని చిక్కు ప్రశ్నలతో సొలొమోనును పరీక్షిద్దామని వచ్చింది.
1KI 10:2 ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది.
1KI 10:3 సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటికి జవాబులిచ్చాడు; వివరించలేనంత కష్టమైనది రాజుకు ఏది లేదు.
1KI 10:4 షేబ రాణి సొలొమోనుకు ఉన్న జ్ఞానమంతటిని, అతడు కట్టించిన రాజభవనాన్ని,
1KI 10:5 అతని భోజనబల్ల మీద ఆహారాన్ని, అతని అధికారుల కూర్చునే విధానాన్ని, ప్రత్యేక వస్త్రాలు ధరించి పరిచారం చేసే దాసులను, అతనికి పాత్ర అందించేవారిని, యెహోవా మందిరం వద్ద అతడు అర్పించే దహనబలులను చూసి ఆమె ఆశ్చర్యపడింది.
1KI 10:6 ఆమె రాజుతో, “మీరు సాధించిన వాటి గురించి, మీ జ్ఞానం గురించి నా దేశంలో నేను విన్నది నిజమే.
1KI 10:7 అయితే నేను వచ్చి కళ్ళారా చూసే వరకు వారి మాటలు నమ్మలేకపోయాను. నిజానికి, ఇక్కడున్న వాటిలో సగం కూడా నాకు చెప్పలేదు; జ్ఞానంలోను, ధనంలోను నేను విన్నదానికంటే మీరు ఎంతో గొప్పగా ఉన్నారు.
1KI 10:8 మీ ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో! మీ ముందు నిలబడి మీ జ్ఞానాన్ని వింటున్న మీ అధికారులు ఎంత సంతోషంగా ఉంటారో!
1KI 10:9 మీలో ఆనందిస్తూ, మిమ్మల్ని ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టిన మీ దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక! ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న నిత్యమైన ప్రేమను బట్టి నీతిన్యాయాల ప్రకారం కార్యాలు జరిగించడానికి యెహోవా మిమ్మల్ని రాజుగా చేశారు” అని అభినందించింది.
1KI 10:10 ఆమె రాజుకు 120 తలాంతుల బంగారం, చాలా సుగంధద్రవ్యాలు, వెలగల రాళ్లు ఇచ్చింది. షేబ రాణి ఇచ్చినంత సుగంధద్రవ్యాలు రాజైన సొలొమోనుకు మరెప్పుడూ రాలేదు.
1KI 10:11 (హీరాము ఓడలు ఓఫీరు నుండి బంగారాన్ని తెచ్చాయి; అక్కడినుండి వారు చాలా ఎర్ర చందనం చెక్కలు, వెలగల రాళ్లు తెచ్చారు.
1KI 10:12 ఆ చందనం వాడి, వాటితో రాజు యెహోవా మందిరానికి, రాజభవనానికి స్తంభాలను, సంగీతకారులకు సితారలు వీణలు చేయించాడు. ఆ రోజు నుండి ఇంతవరకు అలాంటి చందనం దొరకలేదు కనబడలేదు.)
1KI 10:13 రాజైన సొలొమోను షేబ రాణికి తన రాజ నిధి నుండి ఇచ్చింది మాత్రమే కాక, ఆమె కోరిందంతా, అడిగినదంతా ఇచ్చాడు. తర్వాత ఆమె తన పరివారంతో తన స్వదేశానికి వెళ్లిపోయింది.
1KI 10:14 సొలొమోనుకు సంవత్సరానికి వచ్చే బంగారం బరువు 666 తలాంతులు,
1KI 10:15 అది వర్తకులు, వ్యాపారుల నుండి వచ్చింది కాక, అరేబియా రాజులందరి నుండి, దేశ అధికారుల నుండి కూడా రాబడి వస్తుంది.
1KI 10:16 రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారంతో రెండువందల పెద్ద డాళ్లను చేయించాడు; ప్రతి డాలుకు ఆరువందల షెకెళ్ళ బంగారం వినియోగించారు.
1KI 10:17 సాగగొట్టిన బంగారంతో అతడు మూడువందల చిన్న డాళ్లు కూడా చేయించాడు, ప్రతి డాలుకు మూడు మీనాల బంగారం వినియోగించారు. రాజు వాటిని లెబానోను వనం అనే తన రాజభవనంలో ఉంచాడు.
1KI 10:18 తర్వాత రాజు దంతంతో పెద్ద సింహాసనం చేయించి మేలిమి బంగారంతో పొదిగించాడు.
1KI 10:19 సింహాసనానికి ఆరు మెట్లున్నాయి, దాని వెనుక భాగం గుండ్రంగా ఉంటుంది. సింహాసనానికి రెండు వైపులా చేతులు పెట్టుకోవడానికి ఉన్నాయి. వాటి దగ్గర రెండు సింహాలు నిలబడి ఉన్నాయి.
1KI 10:20 ఆరు మెట్లమీద మెట్టుకు రెండు చొప్పున పన్నెండు సింహాలు ఇరువైపుల నిలబడి ఉన్నాయి. అలాంటిది మరే రాజ్యంలో తయారుచేయబడలేదు.
1KI 10:21 రాజైన సొలొమోను పానపాత్రలన్నీ బంగారంతో చేసినవి, లెబానోను వనపు రాజభవనంలో ఉన్న పాత్రలన్నీ మేలిమి బంగారంతో చేసినవి. వెండితో ఒక్కటి కూడా చేయలేదు, ఎందుకంటే సొలొమోను కాలంలో వెండికి విలువలేదు.
1KI 10:22 రాజుకు సముద్రంలో హీరాము ఓడలతో పాటు తర్షీషు నౌకలు కూడా ఉన్నాయి. అవి మూడేళ్ళకు ఒకసారి బంగారం, వెండి, దంతాలు, కోతులను, నెమళ్ళను తీసుకువస్తుండేవి.
1KI 10:23 రాజైన సొలొమోను సంపదలో, జ్ఞానంలో లోకంలోని రాజులందరికంటే గొప్పవాడు.
1KI 10:24 దేవుడు అతనికిచ్చిన జ్ఞానాన్ని వినడానికి లోకంలోని ప్రజలందరూ సొలొమోనును చూడాలని కోరుకున్నారు.
1KI 10:25 ప్రతీ సంవత్సరం అతని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కానుకలుగా వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వస్త్రాలు, యుద్ధాయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలు తెచ్చేవారు.
1KI 10:26 సొలొమోను రథాలను, గుర్రాలను సమకూర్చుకున్నాడు. అతనికి 1,400 రథాలు, 12,000 గుర్రాలు ఉన్నాయి, వీటిని రథాల పట్టణాల్లో, యెరూషలేములో తన దగ్గర ఉంచాడు.
1KI 10:27 రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా చేశాడు. దేవదారు మ్రానులను కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలా అతి విస్తారంగా ఉంచాడు.
1KI 10:28 సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, క్యూ నుండి దిగుమతి చేసుకున్నారు. రాజ వర్తకులు తగిన ధర చెల్లించి వాటిని క్యూ దగ్గర కొనుగోలు చేశారు.
1KI 10:29 వారు ఈజిప్టు నుండి ఒక్కో రథానికి ఆరువందల షెకెళ్ళ వెండిని, ఒక్కో గుర్రానికి నూట యాభై షెకెళ్ళ వెండిని ఇచ్చి దిగుమతి చేశారు. హిత్తీయుల రాజులందరికి, సిరియా రాజులకు వాటిని ఎగుమతి కూడ చేశారు.
1KI 11:1 రాజైన సొలొమోను ఫరో కుమార్తెతో పాటు చాలామంది పరదేశి స్త్రీలను అనగా మోయాబు, ఎదోము, అమ్మోను, సీదోను, హిత్తీ ప్రజల్లోని స్త్రీలను ప్రేమించాడు.
1KI 11:2 “మీరు వారితో పెళ్ళి చేసుకోవద్దు, ఎందుకంటే వారు ఖచ్చితంగా మీ హృదయాలను వారి దేవుళ్ళ వైపు త్రిప్పుతారు” అని యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో ఈ దేశాల వారి గురించే చెప్పారు. అయినప్పటికీ, సొలొమోను వారిని చాలా ప్రేమించాడు.
1KI 11:3 అతనికి రాజకుమార్తెలైన ఏడువందలమంది భార్యలు, మూడువందలమంది ఉంపుడుగత్తెలు ఉన్నారు. అతని భార్యలు అతన్ని తప్పుదారి పట్టించారు.
1KI 11:4 సొలొమోను వృద్ధుడైనప్పుడు, అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళ వైపు మళ్ళించారు. అతని హృదయం తన తండ్రియైన దావీదు హృదయంలా తన దేవుడైన యెహోవాకు పూర్తిగా అంకితం కాలేదు.
1KI 11:5 సొలొమోను సీదోనీయుల దేవత అష్తారోతునూ, అమ్మోనీయుల అసహ్యమైన దేవత మిల్కోమును అనుసరించాడు.
1KI 11:6 కాబట్టి సొలొమోను యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు; తన తండ్రియైన దావీదులా యెహోవాను సంపూర్ణంగా వెంబడించలేదు.
1KI 11:7 సొలొమోను మోయాబీయుల అసహ్యమైన కెమోషు దేవునికి, అమ్మోనీయుల అసహ్యమైన మోలెకు దేవునికి యెరూషలేము తూర్పున ఉన్న కొండమీద క్షేత్రాలను కట్టించాడు.
1KI 11:8 తన పరదేశి భార్యలు తమ దేవుళ్ళకు ధూపం వేస్తూ బలులు అర్పించడానికి ఇలా చేశాడు.
1KI 11:9 సొలొమోనుకు రెండుసార్లు ప్రత్యక్షమైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను అనుసరించక, తన హృదయం త్రిప్పుకున్నందుకు యెహోవా అతని మీద చాలా కోప్పడ్డారు.
1KI 11:10 ఇతర దేవుళ్ళను అనుసరించకూడదు అని సొలొమోనుతో యెహోవా చెప్పినా, సొలొమోను ఆయన ఆజ్ఞను పాటించలేదు.
1KI 11:11 కాబట్టి యెహోవా సొలొమోనుతో ఇలా అన్నారు, “నీ వైఖరి ఇలా ఉన్నది కాబట్టి, నేను నీకు ఆజ్ఞాపించిన నా నిబంధనను, నా శాసనాలను పాటించలేదు కాబట్టి, నేను ఖచ్చితంగా నీ నుండి ఈ రాజ్యాన్ని తీసివేసి నీ పనివారిలో ఒకనికి ఇస్తాను.
1KI 11:12 అయినాసరే, నీ తండ్రియైన దావీదును బట్టి, నీ జీవితకాలంలో అలా చేయను, నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేస్తాను.
1KI 11:13 అయితే అతని నుండి రాజ్యాన్నంతా తీసివేయను కాని నా సేవకుడైన దావీదును బట్టి, నేను ఎన్నుకున్న యెరూషలేమును బట్టి, నేను నీ కుమారునికి ఒక్క గోత్రం ఇస్తాను.”
1KI 11:14 తర్వాత యెహోవా ఎదోము రాజవంశానికి చెందిన ఎదోమీయుడైన హదదును సొలొమోనుకు విరోధిగా లేపారు.
1KI 11:15 గతంలో దావీదు ఎదోము మీద యుద్ధం చేస్తున్నప్పుడు సేనాధిపతి యోవాబు చనిపోయినవారిని పాతిపెట్టడానికి వెళ్లినప్పుడు, అతడు ఎదోములోని మగవారందరినీ చంపాడు.
1KI 11:16 ఎదోములో ఉన్న మగవారందరు నిర్మూలం చనిపోయే వరకు యోవాబు ఇశ్రాయేలు వారందరితో పాటు ఆరు నెలలు అక్కడ ఉండిపోయాడు.
1KI 11:17 అయితే అప్పుడు హదదు చిన్నవాడు, అతడు తన తండ్రి సేవకులైన కొంతమంది ఎదోమీయుల అధికారులతో ఈజిప్టుకు పారిపోయాడు.
1KI 11:18 వారు మిద్యాను నుండి బయలుదేరి పారానుకు వెళ్లారు. తర్వాత పారాను నుండి కొందరిని వెంటబెట్టుకొని ఈజిప్టు రాజైన ఫరో దగ్గరకు వెళ్లారు, ఫరో హదదుకు ఇల్లు, ఆహారం, భూమి ఇచ్చాడు.
1KI 11:19 ఫరోకు హదదు అంటే చాలా ఇష్టం కలిగి అతనికి తన భార్య తహ్పెనేసు రాణి యొక్క సోదరిని ఇచ్చి పెళ్ళి చేశాడు.
1KI 11:20 తహ్పెనేసు సోదరికి హదదుకు గెనుబతు అనే కుమారుడు పుట్టాడు. తహ్పెనేసు రాజభవనంలో అతన్ని పెంచింది. గెనుబతు ఫరో సొంత పిల్లలతో కలిసి పెరిగాడు.
1KI 11:21 దావీదు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడని, అతని సేనాధిపతియైన యోవాబు కూడా చనిపోయాడని హదదు ఈజిప్టులో ఉన్నప్పుడు విన్నాడు. అప్పుడు హదదు ఫరోతో, “నా స్వదేశానికి తిరిగి వెళ్లడానికి నన్ను అనుమతించండి” అన్నాడు.
1KI 11:22 అందుకు ఫరో, “నా దగ్గర నీకేం తక్కువైందని నీవు నీ స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నావు?” అని అడిగాడు. అందుకు హదదు, “ఏమీ తక్కువ కాలేదు కాని దయచేసి మీరు నన్ను వెళ్లనివ్వండి” అన్నాడు.
1KI 11:23 దేవుడు సొలొమోను మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అనే ఇంకొక విరోధిని లేపారు; ఇతడు తన యజమాని సోబా రాజైన హదదెజెరు నుండి పారిపోయిన వాడు.
1KI 11:24 దావీదు సోబా సైన్యాన్ని నిర్మూలం చేసినప్పుడు, రెజోను కొంతమంది తిరుగుబాటుదారుల గుంపు పోగుచేసుకుని వారికి నాయకునిగా ఉన్నాడు; వారు దమస్కుకు వెళ్లి స్థిరపడి, ఆ పట్టణాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్నారు.
1KI 11:25 హదదు ఇశ్రాయేలుకు చేసిన కీడు కాకుండా సొలొమోను జీవించిన కాలమంతా రెజోను ఇశ్రాయేలుకు శత్రువుగా ఉన్నాడు. రెజోను సిరియాను పరిపాలించాడు, ఇశ్రాయేలును అసహ్యించుకునేవాడు.
1KI 11:26 నెబాతు కుమారుడైన యరొబాము కూడా రాజుపై తిరుగుబాటు చేశాడు. అతడు సొలొమోను సేవకులలో ఒకడు, జెరేదా వాడైన ఎఫ్రాయిమీయుడు. అతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు.
1KI 11:27 యరొబాము రాజు మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఇది: సొలొమోను మేడలను కట్టించాడు, తన తండ్రి దావీదు పట్టణ ప్రాకారంలో ఉన్న బీటలను బాగుచేయించాడు.
1KI 11:28 యరొబాము సమర్థుడు, ఆ యువకుడు మంచిగా పని చేయడాన్ని సొలొమోను చూసి, యోసేపు గోత్రానికి చెందిన ప్రదేశంలో వెట్టి పని చేసేవారిమీద అతన్ని అధికారిగా నియమించాడు.
1KI 11:29 ఆ సమయంలో యరొబాము యెరూషలేము విడిచి వెళ్తుండగా, త్రోవలో షిలోహు వాడైన అహీయా ప్రవక్త క్రొత్త వస్త్రం ధరించుకొని అతన్ని కలిశాడు. వారిద్దరు తప్ప ఆ పొలంలో ఇంకెవరు లేరు.
1KI 11:30 అప్పుడు అహీయా తాను వేసుకున్న ఆ క్రొత్త వస్త్రాన్ని తీసి పన్నెండు ముక్కలుగా చింపాడు.
1KI 11:31 అప్పుడు అతడు యరొబాముతో, “నీవు పది ముక్కలు తీసుకో, ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘సొలొమోను చేతిలో నుండి నేను రాజ్యం చీల్చి పది గోత్రాలు నీకు ఇవ్వబోతున్నాను.
1KI 11:32 కాని నా సేవకుడైన దావీదును బట్టి, నా కోసం ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి ఎన్నుకున్న యెరూషలేము పట్టణాన్ని బట్టి అతడు ఒక గోత్రం కలిగి ఉంటాడు.
1KI 11:33 నేనిలా చేయడానికి కారణం వారు సొలొమోను తండ్రియైన దావీదులా నా మార్గాలను అనుసరించక నన్ను విడిచిపెట్టి సీదోనీయుల అష్తారోతు దేవతను, మోయాబీయుల కెమోషు దేవున్ని, అమ్మోనీయుల మిల్కోము దేవున్ని పూజిస్తూ, నా దృష్టికి సరియైనది చేయలేదు, నా శాసనాలను నియమాలను పాటించలేదు.
1KI 11:34 “ ‘అయితే నేను సొలొమోను చేతిలో నుండి రాజ్యాన్నంతా తీసివేయను; నా కోసం ఎన్నుకున్న నా సేవకుడు, నా ఆజ్ఞలకు, శాసనాలకు లోబడిన దావీదును బట్టి, సొలొమోనును తన జీవితకాలమంతా పాలకునిగా నియమించాను.
1KI 11:35 అతని కుమారుని చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి పది గోత్రాలను నీకు ఇస్తాను.
1KI 11:36 నా పేరు అక్కడ ఉండాలని నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణంలో నా సేవకుడైన దావీదు కోసం నా సన్నిధిలో ఒక దీపం ఎల్లప్పుడు ఉండడం కోసం నేను అతని కుమారునికి ఒక గోత్రాన్ని ఇస్తాను.
1KI 11:37 నేను నిన్ను అంగీకరించాను కాబట్టి నీవు కోరుకున్న ప్రకారం నీవు పరిపాలిస్తావు ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటావు.
1KI 11:38 నేను ఆజ్ఞాపించేదంతా నీవు చేసి, నా మార్గాలను అనుసరిస్తే, నా సేవకుడైన దావీదులా నా శాసనాలు ఆజ్ఞలు పాటిస్తూ, నా దృష్టిలో సరియైనది చేస్తే నేను నీతో ఉంటాను. నేను దావీదు పట్ల చేసినట్లు నీ రాజ్యాన్ని స్థిరపరచి నీకు ఇశ్రాయేలును ఇస్తాను.
1KI 11:39 వారు చేసిన దానికి నేను దావీదు సంతానాన్ని శిక్షిస్తాను కాని ఎప్పటికి కాదు.’ ”
1KI 11:40 సొలొమోను యరొబామును చంపే ప్రయత్నం చేశాడు కాని, యరొబాము ఈజిప్టుకు షీషకు రాజు దగ్గరకు పారిపోయి సొలొమోను చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు.
1KI 11:41 సొలొమోను పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన వాటన్నిటి గురించి, అతని జ్ఞానం గురించి సొలొమోను చరిత్ర గ్రంథంలో వ్రాయబడినవి.
1KI 11:42 సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలంతటిని నలభై సంవత్సరాలు పరిపాలించాడు.
1KI 11:43 తర్వాత సొలొమోను చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతన్ని అతని తండ్రి దావీదు పట్టణంలో సమాధి చేశారు. సొలొమోను తర్వాత అతని కుమారుడు రెహబాము రాజయ్యాడు.
1KI 12:1 రెహబామును రాజుగా చేయడానికి ఇశ్రాయేలు ప్రజలంతా షెకెముకు వెళ్లగా రెహబాము అక్కడికి వెళ్లాడు.
1KI 12:2 రాజైన సొలొమోను దగ్గరి నుండి ఈజిప్టుకు పారిపోయి అక్కడే నివాసం చేస్తున్న నెబాతు కుమారుడైన యరొబాము ఇది విని, ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడు.
1KI 12:3 కాబట్టి ప్రజలు యరొబామును పిలిపించారు. అతడు, ఇశ్రాయేలు సమాజమంతా రెహబాము దగ్గరకు వెళ్లి అతనితో ఇలా అన్నారు:
1KI 12:4 “మీ తండ్రి మామీద బరువైన కాడిని మోపాడు. అయితే మీ తండ్రి పెట్టిన కఠినమైన దాసత్వాన్ని, మామీద ఉంచిన బరువైన కాడిని తేలిక చేయండి, అప్పుడు మేము మీకు సేవ చేస్తాము.”
1KI 12:5 రెహబాము జవాబిస్తూ, “మీరు వెళ్లి, మూడు రోజుల తర్వాత మళ్ళీ రండి” అన్నాడు. కాబట్టి ప్రజలు వెళ్లిపోయారు.
1KI 12:6 అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతనికి సేవలందించిన పెద్దలను సంప్రదించి “ఈ ప్రజలకు ఎలా జవాబివ్వాలో చెప్పండి” అని అడిగాడు.
1KI 12:7 అందుకు వారు, “ఈ రోజు నీవు ఈ ప్రజలకు దాసునిగా ఉంటూ సేవ చేస్తూ, వారికి అనుకూలంగా జవాబు చెప్తే, వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు” అని చెప్పారు.
1KI 12:8 కాని రెహబాము పెద్దలు ఇచ్చిన సలహాను తిరస్కరించి, తనతో పెరిగి పెద్దవారై తనకు సేవలందిస్తున్న యువకులను సంప్రదించాడు.
1KI 12:9 అతడు వారిని, “మీ సలహా ఏంటి? ‘మీ తండ్రి పెట్టిన కాడిని తేలిక చేయండి’ అని నాతో అంటున్న ఈ ప్రజలకు నేనేమి జవాబివ్వాలి?” అని అడిగాడు.
1KI 12:10 అతనితో పాటు పెరిగి పెద్దవారైన ఆ యువకులు జవాబిస్తూ, “ఈ ప్రజలు నీతో, ‘మీ తండ్రి మామీద బరువైన కాడి ఉంచాడు, కాని మీరు దాన్ని తేలిక చేయండి’ అని అన్నారు. కాని నీవు వారితో, ‘నా తండ్రి నడుముకంటే నా చిటికెన వేలు పెద్దది.
1KI 12:11 నా తండ్రి మీమీద బరువైన కాడి ఉంచాడు; నేను దానిని ఇంకా బరువు చేస్తాను. నా తండ్రి కొరడాలతో కొట్టాడు; నేను తేళ్లతో కొడతాను’ అని చెప్పాలి” అన్నారు.
1KI 12:12 రాజు, “మూడు రోజుల తర్వాత నా దగ్గరకు రండి” అని చెప్పిన ప్రకారం, మూడు రోజుల తర్వాత యరొబాము ప్రజలంతా రెహబాము దగ్గరకు వచ్చారు.
1KI 12:13 రాజు పెద్దలు చెప్పిన సలహాను తిరస్కరించి, ఆ ప్రజలకు కఠినంగా జవాబిచ్చాడు.
1KI 12:14 అతడు యువకులు ఇచ్చిన సలహా ప్రకారం, “నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాడు; నేను మరి ఎక్కువ బరువుగా చేస్తాను. నా తండ్రి కొరడాలతో శిక్షించాడు; నేను తేళ్లతో శిక్షిస్తాను” అని అన్నాడు.
1KI 12:15 రాజు ప్రజల మాట వినిపించుకోలేదు, ఎందుకంటే యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో చెప్పిన మాట నెరవేర్చడానికి ఈ సంఘటనలు యెహోవా ఇలా జరిగించారు.
1KI 12:16 రాజు తమ మాట అంగీకరించలేదని తెలుసుకున్న ఇశ్రాయేలీయులంతా రాజుకు ఇలా జవాబిచ్చారు: “దావీదులో మాకేం భాగం ఉంది, యెష్షయి కుమారునిలో మాకేం స్వాస్థ్యం ఉంది? ఇశ్రాయేలీయులారా, మీ గుడారాలకు వెళ్లిపొండి! దావీదూ, నీ సొంత ఇంటి సంగతి చూసుకో!” కాబట్టి ఇశ్రాయేలీయులు తమ గుడారాలకు వెళ్లిపోయారు.
1KI 12:17 కాని యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలీయుల మీద మాత్రం రెహబాము పరిపాలన చేశాడు.
1KI 12:18 రాజైన రెహబాము వెట్టి పనివారి మీద అధికారిగా ఉన్న అదోనిరామును పంపాడు, కాని ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. అయితే రాజైన రెహబాము తప్పించుకుని తన రథమెక్కి యెరూషలేముకు పారిపోయాడు.
1KI 12:19 కాబట్టి నేటికీ ఇశ్రాయేలీయులు దావీదు వంశం మీద తిరుగబడుతూనే ఉన్నారు.
1KI 12:20 యరొబాము ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడని ఇశ్రాయేలీయులంతా విని, వారు సమావేశమై అతన్ని పిలిపించి, అతన్ని ఇశ్రాయేలంతటి మీద రాజుగా నియమించారు. యూదా గోత్రం వారు మాత్రమే దావీదు వంశానికి నమ్మకంగా ఉన్నారు.
1KI 12:21 రెహబాము యెరూషలేము చేరుకొని యూదా బెన్యామీను గోత్రాల వారినందరిని, అనగా 1,80,000 మంది ఉత్తములైన సైనికులను పోగుచేసుకుని, ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి, సొలొమోను కుమారుడైన రెహబాముకు రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అనుకున్నాడు.
1KI 12:22 అయితే దైవజనుడైన షెమయాకు దేవుని నుండి ఈ వాక్కు వచ్చింది:
1KI 12:23 “సొలొమోను కుమారుడును యూదా రాజైన రెహబాముతో, యూదా, బెన్యామీను వారందరితో, మిగితా ప్రజలతో,
1KI 12:24 ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు మీ సోదరులైన ఇశ్రాయేలీయులతో యుద్ధానికి వెళ్లకండి. ఇది నేను చేస్తున్నది కాబట్టి మీరంతా ఇళ్ళకు వెళ్లండి.’ ” కాబట్టి వారు యెహోవా మాట విని, యెహోవా ఆదేశించినట్లు తమ ఇళ్ళకు తిరిగి వెళ్లారు.
1KI 12:25 తర్వాత యరొబాము ఎఫ్రాయిం కొండ సీమలో కోటగోడలు గల షెకెము పట్టణం కట్టించుకుని అక్కడ నివసించాడు. అక్కడినుండి వెళ్లి పెనీయేలు కట్టించాడు.
1KI 12:26 యరొబాము తనలో తాను అనుకున్నాడు, “ఈ రాజ్యం దావీదు వంశానికి తిరిగి దక్కుతుంది.
1KI 12:27 ఒకవేళ ఈ ప్రజలు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలో బలులు అర్పించడానికి వెళ్తే, వారు మరల తమ ప్రభు, యూదా రాజైన రెహబాముకు తమ నమ్మకత్వాన్ని చూపుతారు. వారు నన్ను చంపి, రెహబాము రాజు వైపు తిరుగుతారు” అనుకున్నాడు.
1KI 12:28 సలహా తీసుకున్న తర్వాత రాజు రెండు బంగారు దూడలను చేయించాడు. అతడు ప్రజలతో, “యెరూషలేముకు వెళ్లడం మీకు చాలా కష్టము. ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించిన మీ దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు” అని చెప్పాడు.
1KI 12:29 అతడు ఒకదాన్ని బేతేలులో, ఇంకొక దానిని దానులో పెట్టాడు.
1KI 12:30 కాని ఇది ఒక పాపంగా మారింది; ప్రజలు బేతేలులో ఉన్నదానిని పూజించారు, దూరమైనా సరే దానుకు వెళ్లి అక్కడ ఉన్నదానిని పూజించారు.
1KI 12:31 యరొబాము ఎత్తైన స్థలాల మీద క్షేత్రాలు కట్టించి, లేవీయులు కాకపోయినా సరే, సాధారణ ప్రజలనే యాజకులుగా నియమించాడు.
1KI 12:32 యూదాలో జరిగిన పండుగలాంటి ఒక పండుగను యరొబాము ఎనిమిదవ నెల పదిహేనవ రోజున ఏర్పాటు చేసి, బలిపీఠం మీద బలులు అర్పించాడు. అలా అతడు బేతేలులో తాను చేయించిన దూడలకు బలి అర్పించుట ద్వార చేశాడు. అంతేకాదు బేతేలులో తాను చేయించిన క్షేత్రాల్లో యాజకులను కూడా నియమించాడు.
1KI 12:33 తాను స్వయంగా నిర్ణయించిన ప్రకారం ఎనిమిదవ నెల పదిహేనవ రోజు బేతేలులో తాను కట్టించిన బలిపీఠం మీద బలులు అర్పించాడు. కాబట్టి అతడు ఇశ్రాయేలీయుల కోసం పండుగను నిర్ణయించి, ధూపం వేయడానికి బలిపీఠం దగ్గరకు వెళ్లాడు.
1KI 13:1 యరొబాము బలి అర్పించడానికి బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, యెహోవా వాక్కు ద్వారా ఒక దైవజనుడు యూదా నుండి బేతేలుకు వచ్చాడు.
1KI 13:2 యెహోవా వాక్కు ప్రకారం అతడు బలిపీఠానికి వ్యతిరేకంగా బిగ్గరగా ఇలా అన్నాడు: “బలిపీఠమా, బలిపీఠమా! యెహోవా చెప్పే మాట ఇదే: ‘దావీదు కుటుంబంలో యోషీయా అనే కుమారుడు జన్మిస్తాడు. అతడు క్షేత్రాల మీద బలులు అర్పించే యాజకులను నీ మీద వధిస్తాడు, మనుష్యుల ఎముకలు నీ మీద కాల్చబడతాయి.’ ”
1KI 13:3 అదే రోజు ఆ దైవజనుడు ఒక సూచన ఇచ్చాడు: “యెహోవా చెప్పిన సూచన ఇదే: బలిపీఠం బద్దలై దాని మీదున్న బూడిద ఒలికి పోతుంది.”
1KI 13:4 రాజైన యరొబాము బేతేలులో ఉన్న బలిపీఠం గురించి దైవజనుడు ప్రకటించిన మాట విని, బలిపీఠం మీద నుండి తన చేయి చాపి, “అతన్ని పట్టుకోండి!” అన్నాడు. అయితే అతడు చాపిన చేయి తిరిగి వెనుకకు తీసుకోలేకుండా అది ఎండిపోయింది.
1KI 13:5 అంతేకాక, యెహోవా వాక్కు ద్వారా దైవజనుడు ఇచ్చిన సూచన ప్రకారం బలిపీఠం బద్దలై దానిమీది నుండి బూడిద ఒలికిపోయింది.
1KI 13:6 అప్పుడు రాజు ఆ దైవజనునితో, “నా మీద దయచూపి నా చేయి బాగుపడేలా నా కోసం నీ దేవుడైన యెహోవాకు విజ్ఞాపన ప్రార్థన చేయి” అన్నాడు. దైవజనుడు యెహోవాను వేడుకున్నప్పుడు రాజు చేయి పూర్తిగా బాగుపడి ముందులా అయ్యింది.
1KI 13:7 అప్పుడు రాజు దైవజనునితో, “భోజనం చేయడానికి నాతో ఇంటికి రా, నీకు బహుమానం ఇస్తాను” అన్నాడు.
1KI 13:8 అయితే దైవజనుడు రాజుకు జవాబిస్తూ అన్నాడు, “నీ ఆస్తిలో సగం నాకు ఇచ్చినా సరే, నేను నీతో వెళ్లను, నేను ఇక్కడ భోజనం చేయను, నీళ్లు త్రాగను.
1KI 13:9 ఎందుకంటే ‘నీవు భోజనం చేయవద్దు, నీళ్లు త్రాగవద్దు, వచ్చిన దారిన తిరిగి వెళ్లవద్దు’ అని యెహోవా నాకు ఆజ్ఞాపించారు.”
1KI 13:10 కాబట్టి అతడు బేతేలుకు వచ్చిన దారిన కాక, మరో దారిన తిరిగి వెళ్లాడు.
1KI 13:11 ఆ కాలంలో బేతేలులో ఒక వృద్ధుడైన ప్రవక్త ఉండేవాడు. అతని కుమారులు వచ్చి ఆ రోజు అక్కడ ఆ దైవజనుడు చేసిందంతా అతనికి చెప్పారు. అతడు రాజుతో ఏమి చెప్పాడో కూడా తమ తండ్రికి చెప్పారు.
1KI 13:12 వారి తండ్రి వారిని, “అతడు ఏ దారిన వెళ్లాడు?” అని అడిగాడు. అతని కుమారులు యూదా నుండి వచ్చిన దైవజనుడు వెళ్లిన దారి చూపించారు.
1KI 13:13 కాబట్టి అతడు తన కుమారులతో, “గాడిదకు జీను వేయండి” అని చెప్పాడు. వారు అతని కోసం గాడిద మీద జీను వేశారు, అతడు గాడిదను ఎక్కి,
1KI 13:14 ఆ దైవజనుని వెదుకుతూ వెళ్లాడు. అతడు సింధూర వృక్షం క్రింద కూర్చుని ఉండడం చూసి ఆ ప్రవక్త, “యూదా నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా?” అని అడిగాడు. “నేనే” అని అతడు జవాబిచ్చాడు.
1KI 13:15 కాబట్టి ప్రవక్త అతనితో, “నాతో ఇంటికి వచ్చి భోజనం చేయి” అన్నాడు.
1KI 13:16 అందుకు ఆ దైవజనుడు, “నేను తిరిగి మీతో రాలేను, మీతో కలిసి ఈ స్థలంలో భోజనం గాని, నీళ్లు గాని పుచ్చుకోలేను.
1KI 13:17 యెహోవా వాక్కు ద్వారా నేను ఇలా ఆదేశించబడ్డాను: ‘నీవు అక్కడ భోజనం చేయవద్దు, నీళ్లు త్రాగవద్దు, నీవు వచ్చిన దారిన తిరిగి వెళ్లవద్దు’ అని యెహోవా వాక్కు ద్వారా నేను ఆదేశించబడ్డాను” అన్నాడు.
1KI 13:18 ఆ వృద్ధుడైన ప్రవక్త జవాబిస్తూ, “నీలాగే నేను కూడా ప్రవక్తనే. యెహోవా వాక్కు ద్వారా దేవదూత నాతో, ‘అతడు భోజనం చేసి నీళ్లు త్రాగేలా అతన్ని నీతో పాటు నీ ఇంటికి తీసుకురా’ అన్నాడు” అని చెప్పాడు. (కాని అతడు అబద్ధమాడాడు.)
1KI 13:19 కాబట్టి ఆ దైవజనుడు అతనితో పాటు తిరిగివెళ్లి అతని ఇంట్లో అన్నపానాలు పుచ్చుకున్నాడు.
1KI 13:20 వారు ఇంకా బల్ల దగ్గర కూర్చుని ఉండగానే అతన్ని తీసుకువచ్చిన వృద్ధుడైన ప్రవక్త దగ్గరకు యెహోవా వాక్కు వచ్చింది.
1KI 13:21 యూదా నుండి వచ్చిన దైవజనునితో అతడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీవు యెహోవా మాటను ధిక్కరించావు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను పాటించలేదు.
1KI 13:22 నీవు భోజనం గాని నీళ్లు గాని తీసుకోవద్దు అని ఆయన ఏ స్థలాన్ని గురించి ఆజ్ఞాపించారో, ఆ స్థలంలో నీవు భోజనం, నీళ్లు తీసుకున్నావు. కాబట్టి నీ శవం నీ పూర్వికుల సమాధిలో పాతిపెట్టబడదు’ ” అని చెప్పాడు.
1KI 13:23 దైవజనుడు భోజనం చేసి నీళ్లు త్రాగిన తర్వాత, అతన్ని తీసుకువచ్చిన ప్రవక్త అతని కోసం గాడిద మీద జీను వేశాడు.
1KI 13:24 అతడు తన దారిన వెళ్తున్నప్పుడు ఒక సింహం ఎదురై అతన్ని చంపేసింది. అతని శవం త్రోవలోనే పడి ఉంది. దాని ప్రక్కన గాడిద సింహం నిలబడి ఉన్నాయి.
1KI 13:25 బాటసారులు కొందరు శవం దారిలో పడి ఉండడం, శవం దగ్గర సింహం నిలబడి ఉండడం చూసి, వెళ్లి ఆ వృద్ధుడైన ప్రవక్త ఉన్న పట్టణంలో ఆ సంగతి చెప్పారు.
1KI 13:26 ప్రయాణం నుండి అతన్ని వెనుకకు తీసుకువచ్చిన ప్రవక్త దాని గురించి విని, “అతడు యెహోవా మాటను ధిక్కరించిన దైవజనుడు. యెహోవా వాక్కు అతన్ని హెచ్చరించిన ప్రకారం సింహం అతన్ని చీల్చి చంపింది” అని అన్నాడు.
1KI 13:27 ఆ ప్రవక్త తన కుమారులను పిలిచి, “నా కోసం గాడిద మీద జీను వేయండి” అని అన్నాడు, వారు అలాగే చేశారు.
1KI 13:28 అప్పుడు అతడు బయటకు వెళ్లి, దారిలో శవం పడి ఉండడం, శవం దగ్గర గాడిద సింహం నిలబడి ఉండడం చూశాడు. సింహం శవాన్ని తినలేదు, గాడిదను చీల్చివేయలేదు.
1KI 13:29 ఆ ప్రవక్త దైవజనుని శవాన్ని ఎత్తి గాడిద మీద వేసుకుని, అతని కోసం విలపించడానికి, అతని శవాన్ని పాతిపెట్టడానికి దానిని తన పట్టణానికి తిరిగి తీసుకువచ్చాడు.
1KI 13:30 అతడు తన సమాధిలో ఆ శవాన్ని ఉంచగా వారు, “అయ్యో, సోదరుడా!” అని అంటూ ఏడ్చారు.
1KI 13:31 అతన్ని పాతిపెట్టిన తర్వాత, అతడు తన కుమారులతో, “నేను చనిపోయినప్పుడు ఆ దైవజనుని పాతిపెట్టిన సమాధిలోనే నన్ను పాతిపెట్టండి; నా ఎముకలను అతని ఎముకల దగ్గరే పెట్టండి.
1KI 13:32 ఎందుకంటే, బేతేలులో ఉన్న బలిపీఠానికి వ్యతిరేకంగా, సమరయ పట్టణాల్లో ఉన్న ఎత్తైన స్థలాల మీద క్షేత్రాలన్నింటికి వ్యతిరేకంగా యెహోవా వాక్కు ప్రకారం అతడు ప్రకటించింది తప్పక జరుగుతుంది.”
1KI 13:33 దీని తర్వాత కూడా యరొబాము తన దుర్మార్గాలను విడిచిపెట్టలేదు, కాని మరోసారి క్షేత్రాలకు అని రకాల ప్రజలను యాజకులుగా నియమించాడు. ఎవరైనా యాజకునిగా ఉండాలనుకుంటే వారిని ఆ క్షేత్రాలకు యాజకులుగా ప్రతిష్ఠించాడు.
1KI 13:34 ఈ పాపం యరొబాము కుటుంబ పతనానికి వారు భూమి మీద ఉండకుండా నాశనమవ్వడానికి కారణమైంది.
1KI 14:1 ఆ కాలంలో యరొబాము కుమారుడైన అబీయాకు జబ్బుచేసింది.
1KI 14:2 యరొబాము తన భార్యతో, “నీవు యరొబాము భార్యవని ఎవ్వరూ గుర్తుపట్టకుండా, మారువేషం వేసుకుని షిలోహుకు వెళ్లు. అక్కడ నేను ఈ ప్రజల మీద రాజునవుతానని నాకు చెప్పిన అహీయా ప్రవక్త ఉంటాడు.
1KI 14:3 పది రొట్టెలు, కొన్ని అప్పములు, జాడీలో తేనె తీసుకుని అతని దగ్గరకు వెళ్లు. బాలునికి ఏమి జరుగుతుందో అతడు నీకు చెప్తాడు” అన్నాడు.
1KI 14:4 యరొబాము భార్య అతడు చెప్పినట్లు చేసింది. ఆమె షిలోహులో ఉన్న అహీయా ఇంటికి వెళ్లింది. అహీయాకు వృద్ధాప్యం వలన చూపు పోయింది.
1KI 14:5 అయితే యెహోవా అహీయాతో, “యరొబాము కుమారునికి జబ్బుచేసింది కాబట్టి అతని భార్య తన కుమారుని గురించి సంప్రదించడానికి నీ దగ్గరకు వస్తుంది. నీవు ఆమెతో నేను చెప్పే విధంగా జవాబివ్వాలి. ఆమె మారువేషం వేసుకుని మరో స్త్రీలా నటిస్తుంది” అని చెప్పారు.
1KI 14:6 కాబట్టి ఆమె గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు, అహీయాకు ఆమె అడుగుల శబ్దం వినిపించి ఆమెతో ఇలా అన్నాడు, “యరొబాము భార్యా, లోపలికి రా. ఎందుకు ఈ నటన? దుర్వార్త నీకు చెప్పడానికి నేను ఆదేశించబడ్డాను.
1KI 14:7 నీవు వెళ్లి యరొబాముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారని చెప్పు: ‘నేను నిన్ను ప్రజల్లో నుండి లేవనెత్తి నా ప్రజలైన ఇశ్రాయేలు మీద పాలకునిగా నియమించాను.
1KI 14:8 దావీదు వంశం నుండి రాజ్యాన్ని తీసివేసి నీకిచ్చాను. అయితే నీవు నా సేవకుడైన దావీదులా ప్రవర్తించలేదు, అతడు నా ఆజ్ఞలను పాటిస్తూ, తన హృదయమంతటితో నన్ను అనుసరిస్తూ, నా దృష్టికి ఏవి సరియైనవో అవే చేశాడు.
1KI 14:9 నీవు నీకన్నా ముందు జీవించిన వారందరికంటే ఎక్కువ చెడు చేశావు. నీకోసం ఇతర దేవుళ్ళను, పోతపోసిన విగ్రహాలను చేసుకున్నావు; నాకు కోపం రేపుతూ నన్ను తృణీకరించావు.
1KI 14:10 “ ‘దీనిని బట్టి నేను యరొబాము వంశం మీదికి కీడు రప్పించబోతున్నాను. నేను ఇశ్రాయేలులో బానిసలు స్వతంత్రులు అని లేకుండా యరొబాము వంశంలోని మగవారినందరిని నిర్మూలం చేస్తాను. ఒకరు పెంటను కాల్చినట్లు యరొబాము వంశాన్ని పూర్తిగా దహించివేస్తాను.
1KI 14:11 యరొబాముకు చెందిన వారిలో పట్టణంలో చనిపోయేవారిని కుక్కలు తింటాయి, పొలంలో చనిపోయేవారిని పక్షులు తింటాయి. ఇది యెహోవా వాక్కు!’
1KI 14:12 “నీవైతే ఇంటికి తిరిగి వెళ్లు. నీవు పట్టణంలో అడుగు పెట్టగానే నీ కుమారుడు చనిపోతాడు.
1KI 14:13 ఇశ్రాయేలీయులందరు అతని కోసం ఏడ్చి అతన్ని పాతిపెడతారు. యరొబాముకు చెందినవారి ఇంట్లో అతడు మాత్రమే సమాధి చేయబడతాడు, ఎందుకంటే యరొబాము ఇంటివారిలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎవరిలోనైనా మంచిని కనుగొన్నారా అంటే అది కేవలం అతనిలో మాత్రమే.
1KI 14:14 “యెహోవా తన కోసం ఇశ్రాయేలు మీద రాజును లేవనెత్తుతారు, అతడు యరొబాము వంశాన్ని నిర్మూలం చేస్తాడు. ఇది ఇప్పటికే మొదలయ్యింది.
1KI 14:15 నీటిలో రెల్లు ఊగిసలాడినట్లు యెహోవా ఇశ్రాయేలును అల్లాడిస్తారు. ఆయన ఇశ్రాయేలు పూర్వికులకు ఇచ్చిన ఈ మంచి నేల నుండి వారిని తొలగించి యూఫ్రటీసు నది అవతలికి చెదరగొడతారు, ఎందుకంటే వారు అషేరా స్తంభాలను నిలబెట్టి యెహోవాకు కోపం రేపారు.
1KI 14:16 యరొబాము చేసిన పాపాలను బట్టి, అతడు ఇశ్రాయేలు ప్రజలచేత చేయించిన పాపాన్ని బట్టి ఆయన ఇశ్రాయేలును వదిలేస్తారు.”
1KI 14:17 అప్పుడు యరొబాము భార్య లేచి బయలుదేరి తిర్సాకు వెళ్లింది. ఆమె గడపలో అడుగుపెట్టిన వెంటనే ఆ బాలుడు చనిపోయాడు.
1KI 14:18 యెహోవా తన సేవకుడైన అహీయా ప్రవక్త ద్వారా చెప్పినట్లే, వారు అతన్ని సమాధి చేశారు, ఇశ్రాయేలు ప్రజలందరు అతని కోసం దుఃఖించారు.
1KI 14:19 యరొబాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతని యుద్ధాలు, అతడు ఎలా పరిపాలించాడనేది ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
1KI 14:20 యరొబాము ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతడు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని తర్వాత అతని కుమారుడు నాదాబు రాజయ్యాడు.
1KI 14:21 సొలొమోను కుమారుడైన రెహబాము యూదాలో రాజుగా ఉన్నాడు. అతడు రాజైనప్పుడు అతని వయస్సు నలభై ఒక సంవత్సరాలు. తన నామం ఉంచడానికి యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి ఎన్నుకున్న పట్టణమైన యెరూషలేములో అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు. రెహబాము తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు.
1KI 14:22 యూదా వారు యెహోవా దృష్టిలో చెడు చేశారు. వారు తమ ముందున్న వారికన్నా ఎక్కువ పాపాలు చేసి ఆయనకు ఎక్కువ రోషం పుట్టించారు.
1KI 14:23 వారు తమ కోసం ప్రతి ఎత్తైన కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద, క్షేత్రాలను, పవిత్ర రాళ్లను, అషేరా స్తంభాలను కూడా నిలిపారు.
1KI 14:24 అంతేకాక, దేశంలో ఉన్న క్షేత్రాల్లో మగ వ్యభిచారులు కూడా ఉన్నారు; యెహోవా ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి వెళ్లగొట్టిన జనాంగాలు చేసిన హేయక్రియలు యూదా వారు చేశారు.
1KI 14:25 రాజైన రెహబాము పాలనలో అయిదవ సంవత్సరం, ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీద దాడి చేశాడు.
1KI 14:26 అతడు యెహోవా మందిరంలోని నిధిని, రాజభవనంలో నిధిని దోచుకున్నాడు. అతడు సమస్తాన్ని, సొలొమోను చేయించిన అన్ని బంగారు డాళ్లతో పాటు తీసుకెళ్లాడు.
1KI 14:27 కాబట్టి రాజైన రెహబాము ఆ డాళ్లకు బదులు ఇత్తడి డాళ్ళను చేయించి వాటిని రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల అధిపతులకు అప్పగించాడు.
1KI 14:28 రాజు యెహోవా ఆలయానికి వచ్చినప్పుడెల్లా భటులు ఆ డాళ్లు మోసుకెళ్లేవారు. తర్వాత వాటిని కాపలా ఉన్న గదిలో ఉంచేవారు.
1KI 14:29 రెహబాము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
1KI 14:30 రెహబాముకు యరొబాముకు మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉండేది.
1KI 14:31 రెహబాము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని తన పూర్వికుల దగ్గర సమాధి చేశారు. అతని తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు. అతని తర్వాత అతని కుమారుడు అబీయా రాజయ్యాడు.
1KI 15:1 నెబాతు కుమారుడు యరొబాము పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో అబీయా యూదా దేశానికి రాజయ్యాడు,
1KI 15:2 అతడు యెరూషలేములో మూడేళ్ళు పరిపాలించాడు. అతని తల్లి పేరు మయకా, ఆమె అబీషాలోము కుమార్తె.
1KI 15:3 అతడు గతంలో తన తండ్రి చేసిన పాపాలన్నీ చేశాడు; అతని హృదయం తన పితరుడైన దావీదు హృదయంలా తన దేవుడైన యెహోవాకు పూర్తిగా అంకితం కాలేదు.
1KI 15:4 అయినా, అతని దేవుడైన యెహోవా దావీదును బట్టి, అతని సంతానం అతన్ని తర్వాత కొనసాగడానికి, యెరూషలేమును బలపరచడానికి యెరూషలేములో అతన్ని దీపంలా ఇచ్చారు.
1KI 15:5 ఎందుకంటే దావీదు తాను బ్రతికిన కాలమంతా యెహోవా దృష్టిలో సరియైనది చేస్తూ, ఆయన ఆజ్ఞలలో దేనికి అవిధేయుడు కాలేదు. హిత్తీయుడైన ఊరియా విషయంలో మాత్రం అతడు తప్పిపోయాడు.
1KI 15:6 అబీయా బ్రతికిన కాలమంతా అతనికి యరొబాముకు మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది.
1KI 15:7 అబీయా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? అబీయాము యరొబాముకు యుద్ధం జరిగేది.
1KI 15:8 అబీయా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు ఆసా రాజయ్యాడు.
1KI 15:9 ఇశ్రాయేలు రాజైన యరొబాము పరిపాలనలోని ఇరవయ్యవ సంవత్సరంలో, ఆసా యూదా దేశానికి రాజయ్యాడు.
1KI 15:10 అతడు యెరూషలేములో నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు. అబీషాలోము కుమార్తె మయకా అతని అవ్వ.
1KI 15:11 ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
1KI 15:12 క్షేత్రాల్లోని మగ వ్యభిచారులను దేశం నుండి వెళ్లగొట్టాడు, అతని పూర్వికులు చేసిన విగ్రహాలన్నిటిని తొలగించాడు.
1KI 15:13 అతని అవ్వ మయకా అషేరాను పూజించడానికి ఒక అసహ్యమైన ప్రతిమను చేయించింది కాబట్టి ఆమెను రాజమాత స్థానం నుండి తొలగించాడు. ఆసా ఆ ప్రతిమను కూలగొట్టి, కిద్రోను లోయలో దానిని తగలబెట్టాడు.
1KI 15:14 అతడు క్షేత్రాలను మాత్రం తొలగించనప్పటికీ, ఆసా బ్రతికిన కాలమంతా యెహోవాకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు.
1KI 15:15 అతడు, తాను తన తండ్రి ప్రతిష్ఠించిన బంగారం వెండి పాత్రలను యెహోవా ఆలయానికి తెచ్చాడు.
1KI 15:16 ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు వారు బ్రతికిన కాలమంతా యుద్ధం జరుగుతూనే ఉండేది.
1KI 15:17 ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీదికి వెళ్లి యూదా రాజైన ఆసా సరిహద్దులోనికి రాకపోకలు లేకుండ రామా పట్టణాన్ని పటిష్టం చేశాడు.
1KI 15:18 అప్పుడు ఆసా యెహోవా మందిరంలో, తన భవనంలో ఉన్న ఖజానాల్లో మిగిలిన వెండి బంగారాలంతా తీసి తన అధికారులకు అప్పగించి, దమస్కులో పరిపాలిస్తున్న తబ్రిమ్మోను కుమారుడు, హెజ్యోను మనుమడు, సిరియా రాజైన బెన్-హదదుకు పంపాడు.
1KI 15:19 అతడు, “నా తండ్రికి నీ తండ్రికి మధ్య ఒప్పందం ఉన్నట్లు, నీకు నాకు మధ్య ఒప్పందం ఉండాలి. చూడు, నేను వెండి బంగారాలను కానుకగా పంపిస్తున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీ ఒప్పందం తెంచుకో” అని అన్నాడు.
1KI 15:20 రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. అతడు ఈయోను, దాను, ఆబేల్-బేత్-మయకా, కిన్నెరెతు పరిసరాలన్నీ, నఫ్తాలి ప్రదేశమంతా జయించాడు.
1KI 15:21 బయెషా ఈ వార్త విని రామాను కట్టించడం మానేసి తిర్సాకు వెళ్లిపోయాడు.
1KI 15:22 అప్పుడు రాజైన ఆసా ఎవరినీ మినహాయించకుండా, యూదా వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో రాజైన ఆసా బెన్యామీను ప్రాంతంలో గెబాను, మిస్పాను కట్టించాడు.
1KI 15:23 ఆసా పరిపాలన గురించిన ఇతర విషయాలు అతని విజయాలు అతడు చేసిందంతా అతడు కట్టించిన పట్టణాల గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? అతని వృద్ధాప్యంలో అతని పాదాలకు వ్యాధి సోకింది.
1KI 15:24 తర్వాత ఆసా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, తన పితరుడైన దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోషాపాతు రాజయ్యాడు.
1KI 15:25 యూదా దేశంలో రాజైన ఆసా పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యరొబాము కుమారుడైన నాదాబు ఇశ్రాయేలు దేశానికి రాజయ్యాడు. అతడు రెండేళ్ళు ఇశ్రాయేలును పరిపాలించాడు.
1KI 15:26 అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతని తండ్రి మార్గాలను అనుసరిస్తూ, అతని తండ్రి ఇశ్రాయేలు ప్రజలను పాపంలోకి నడిపించినట్లు అతడు కూడా చేశాడు.
1KI 15:27 నాదాబు మీద ఇశ్శాఖారు గోత్రికుడు, అహీయా కుమారుడైన బాషా కుట్రపన్ని, ఇశ్రాయేలు వారంతా ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును ముట్టడిస్తున్న సమయంలో గిబ్బెతోనులో బయెషా నాదాబును చంపేశాడు.
1KI 15:28 యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో బయెషా నాదాబును చంపి, అతని తర్వాత రాజయ్యాడు.
1KI 15:29 అతడు రాజైన వెంటనే యరొబాము వంశం వారినందరిని చంపేశాడు. యరొబాము వంశంలో ప్రాణంతో ఉన్న ఏ ఒక్కని కూడా వదిలిపెట్టకుండా వారందరిని నిర్మూలం చేశాడు. యెహోవా తన సేవకుడు, షిలోహు వాడైన అహీయా ద్వారా ప్రకటించిన వాక్కు ప్రకారం ఇది జరిగింది.
1KI 15:30 యరొబాము పాపం చేసి ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారకుడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు కాబట్టి ఇలా జరిగింది.
1KI 15:31 నాదాబు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
1KI 15:32 ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు వారు బ్రతికిన కాలమంతా యుద్ధం జరుగుతూనే ఉండేది.
1KI 15:33 యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో, అహీయా కుమారుడైన బయెషా తిర్సాలో ఇశ్రాయేలంతటికి రాజయ్యాడు. అతడు ఇరవైనాలుగు సంవత్సరాలు పరిపాలించాడు.
1KI 15:34 అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, యరొబాము జీవిత విధానాన్ని అనుసరిస్తూ, యరొబాము ఇశ్రాయేలు ప్రజలను పాపంలోకి నడిపించినట్లు అతడు కూడా చేశాడు.
1KI 16:1 బయెషా గురించి హనానీ కుమారుడైన యెహుకు యెహోవా నుండి వచ్చిన వాక్కు:
1KI 16:2 “నేను నిన్ను మట్టిలో నుండి పైకి లేవనెత్తి నా ప్రజలైన ఇశ్రాయేలు మీద పాలకునిగా చేశాను. అయితే నీవు యరొబాము విధానాలను అనుసరించి, నా ప్రజలైన ఇశ్రాయేలు పాపం చేసేలా చేసి, వారి పాపాలను బట్టి నాకు కోపం రేపావు.
1KI 16:3 కాబట్టి నేను బయెషాను, అతని వంశాన్ని తుడిచివేస్తాను. నీ ఇంటిని నెబాతు కుమారుడైన యరొబాము ఇంటిలా చేస్తాను.
1KI 16:4 బయెషాకు సంబంధించిన వారిలో ఎవరు పట్టణంలో చనిపోతారో వారిని కుక్కలు తింటాయి, పొలంలో చనిపోయేవారిని పక్షులు తింటాయి.”
1KI 16:5 బయెషా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసింది, అతడు సాధించిన విజయాలు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
1KI 16:6 బయెషా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. తిర్సాలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు ఏలహు రాజయ్యాడు.
1KI 16:7 అంతేకాక బయెషాకు, అతని వంశానికి వ్యతిరేకంగా యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహు ప్రవక్త ద్వారా వచ్చింది. ఎందుకంటే యెహోవా దృష్టిలో అతడు చెడు చేసినందుకు, యరొబాము కుటుంబాన్ని నిర్మూలం చేసినందుకు అతడు యెహోవాకు కోపం రేపాడు.
1KI 16:8 యూదా రాజైన ఆసా పరిపాలనలోని ఇరవై ఆరవ సంవత్సరంలో బయెషా కుమారుడైన ఏలహు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు తిర్సాలో రెండేళ్ళు పరిపాలించాడు.
1KI 16:9 ఏలహు యొక్క రథాలు సగభాగం మీద అధికారి, అతని సేవకులలో ఒకడైన జిమ్రీ, అతని మీద కుట్రపన్నాడు. ఆ సమయంలో ఏలహు, తిర్సాలో అతని గృహనిర్వాహకుడైన అర్సా ఇంట్లో, బాగా త్రాగుతూ ఉన్నాడు.
1KI 16:10 జిమ్రీ లోపలికి వచ్చి, అతన్ని మొత్తి చంపాడు, అతని తర్వాత అతడు రాజయ్యాడు. ఇది యూదా రాజైన ఆసా ఇరవై ఏడవ ఏట పరిపాలనలో జరిగింది.
1KI 16:11 జిమ్రీ సింహాసనం ఎక్కి పరిపాలించడం మొదలుపెట్టగానే అతడు బయెషా కుటుంబం వారందరినీ చంపేశాడు. అతని బంధువుల్లో, మిత్రులలో మగవారిని ఒక్కరిని కూడ వదలకుండా చంపాడు.
1KI 16:12 యెహోవా యెహు ప్రవక్త ద్వారా ప్రకటించిన వాక్కు ప్రకారం జిమ్రీ బయెషా వంశం అంతటిని నిర్మూలం చేశాడు.
1KI 16:13 బయెషా అతని కుమారుడైన ఏలహు చేసిన పాపాలన్నిటిని బట్టి, వారు ఇశ్రాయేలుతో చేయించిన పాపాన్ని బట్టి, వారి అయోగ్యమైన విగ్రహాలనుబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపారు.
1KI 16:14 ఏలహు పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
1KI 16:15 యూదా రాజైన ఆసా పరిపాలనలోని ఇరవై ఏడవ సంవత్సరంలో జిమ్రీ తిర్సాలో ఏడు రోజులు పరిపాలించాడు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోను అనే పట్టణం ముట్టడించారు.
1KI 16:16 జిమ్రీ కుట్రపన్ని రాజును చంపేశాడని ఇశ్రాయేలీయులు విన్నప్పుడు సేనాధిపతియైన ఒమ్రీని ఇశ్రాయేలుకు రాజుగా చేశారు.
1KI 16:17 అప్పుడు ఒమ్రీ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులంతా గిబ్బెతోనును విడిచివెళ్లి తిర్సాను ముట్టడించారు.
1KI 16:18 పట్టణం ఆక్రమించబడిందని జిమ్రీ చూసి, అతడు రాజభవనం లోనికి వెళ్లి, తనతోపాటు దాన్ని తగలబెట్టి చనిపోయాడు.
1KI 16:19 యరొబాము జీవిత విధానాన్ని అనుసరిస్తూ యెహోవా దృష్టిలో పాపం చేసి, యరొబాములా ఇశ్రాయేలు ప్రజల పాపం చేయడానికి అతడు కారణమయ్యాడు కాబట్టి ఇలా జరిగింది.
1KI 16:20 జిమ్రీ పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతని తిరుగుబాటు వివరాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
1KI 16:21 అప్పుడు ఇశ్రాయేలు రాజ్యంలో ప్రజలు రెండు వర్గాలయ్యారు; సగం మంది గీనతు కుమారుడైన తిబ్నీ రాజుగా ఉండాలని, మరో సగం ఒమ్రీ రాజుగా ఉండాలని ఆశించారు.
1KI 16:22 అయితే ఒమ్రీ వైపు ఉన్నవారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షం వారి మీద యుద్ధం చేసి గెలిచారు. కాబట్టి తిబ్నీ చనిపోయాడు, ఒమ్రీ రాజయ్యాడు.
1KI 16:23 యూదా రాజైన ఆసా పరిపాలన యొక్క ముప్పై ఒకటవ సంవత్సరంలో ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజై పన్నెండు సంవత్సరాల పరిపాలనలో ఆరు సంవత్సరాలు తిర్సాలో పరిపాలన చేశాడు.
1KI 16:24 అతడు షెమెరు దగ్గర సమరయ కొండను రెండు తలాంతుల వెండికి కొని దాని మీద పట్టణం కట్టించి, ఆ కొండకు మునుపటి యజమానియైన షెమెరు పేరిట దానికి సమరయ అని పేరు పెట్టాడు.
1KI 16:25 అయితే ఒమ్రీ యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అతని ముందున్న వారందరికంటే ఇంకా ఎక్కువ పాపం చేశాడు.
1KI 16:26 అతడు నెబాతు కుమారుడైన యరొబాము ఎలా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమై తమ అయోగ్యమైన విగ్రహాలను పెట్టుకుని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడో అదే విధానాన్ని అనుసరించాడు.
1KI 16:27 ఒమ్రీ పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతని విజయాలు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
1KI 16:28 ఒమ్రీ చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని సమరయలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు అహాబు రాజయ్యాడు.
1KI 16:29 యూదా రాజైన ఆసా పరిపాలనలోని ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో ఇశ్రాయేలు మీద ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు.
1KI 16:30 ఒమ్రీ కుమారుడైన అహాబు అతని ముందున్న వారందరికంటే యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తించాడు.
1KI 16:31 అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను తక్కువగా పరిగణించడమే కాకుండా, సీదోను రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును పెళ్ళి చేసుకుని బయలును సేవించి పూజించడం ప్రారంభించాడు.
1KI 16:32 అతడు సమరయలో బయలు గుడిని కట్టించి, అందులో బయలుకు బలిపీఠాన్ని నిర్మించాడు.
1KI 16:33 అహాబు అషేరా స్తంభాలను కూడా నిలిపి, ముందు ఉన్న ఇశ్రాయేలు రాజులందరికి కంటే ఎక్కువగా పాపం చేసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు.
1KI 16:34 అహాబు కాలంలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణాన్ని మళ్ళీ కట్టించాడు. దాని పునాది వేసినప్పుడు అతని పెద్దకుమారుడైన అబీరాము చనిపోయాడు, దానికి గుమ్మాలు పెట్టినప్పుడు అతని చిన్నకుమారుడు సెగూబు చనిపోయాడు. ఈ విధంగా నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది.
1KI 17:1 గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామవాసియైన ఏలీయా అహాబుతో అన్నాడు, “నేను సేవించే ఇశ్రాయేలీయుల సజీవుడైన దేవుడు, యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, రాబోయే కొన్ని సంవత్సరాలు, నేను చెప్తేనే తప్ప, మంచు గాని, వర్షం గాని కురవదు.”
1KI 17:2 తర్వాత యెహోవా వాక్కు ఏలీయాకు వచ్చింది:
1KI 17:3 “ఈ స్థలం విడిచి, తూర్పు వైపుకు వెళ్లి, యొర్దానుకు తూర్పున, కెరీతు వాగు దగ్గర దాక్కో.
1KI 17:4 నీవు ఆ వాగు నీళ్లు త్రాగు, అక్కడ నీకు ఆహారం అందించాలని కాకులకు ఆదేశించాను.”
1KI 17:5 కాబట్టి యెహోవా చెప్పినట్లు ఏలీయా చేశాడు, అతడు యొర్దానుకు తూర్పున ఉన్న కెరీతు వాగు దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నాడు.
1KI 17:6 ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కాకులు అతనికి మాంసం, రొట్టెలు తెచ్చేవి, అతడు ఆ వాగు నీళ్లు త్రాగేవాడు.
1KI 17:7 కొంతకాలానికి దేశంలో వర్షం లేకపోవడం వలన ఆ వాగు ఎండిపోయింది.
1KI 17:8 అప్పుడు యెహోవా వాక్కు అతనికి వచ్చింది:
1KI 17:9 “నీవు లేచి, సీదోనుకు చెందిన సారెపతుకు వెళ్లి, అక్కడ ఉండు. అక్కడ ఆహారం పెట్టాలని ఒక విధవరాలికి ఆదేశించాను.”
1KI 17:10 కాబట్టి అతడు లేచి సారెపతుకు వెళ్లాడు. పట్టణ ద్వారం దగ్గరకు చేరగానే, అక్కడ ఒక విధవరాలు కట్టెలు ఏరుకుంటూ కనిపించింది. అతడు ఆమెను పిలిచి, “త్రాగడానికి నాకు గిన్నెలో నీళ్లు తెస్తావా?” అని అడిగాడు.
1KI 17:11 ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంటే, అతడు పిలిచి, “దయచేసి ఒక రొట్టె ముక్క కూడా తీసుకురా” అన్నాడు.
1KI 17:12 అందుకు ఆమె జవాబిస్తూ, “సజీవుడు, మీ దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా దగ్గర రొట్టె ఒక్కటి కూడా లేదు, కేవలం జాడీలో పిడికెడు పిండి, కూజలో కొంచెం నూనె ఉన్నాయి. నేను కొన్ని కట్టెలు ఏరుకుని ఇంటికి వెళ్లి నాకు నా కుమారునికి చివరి వంట చేసుకుని, తిని చనిపోతాము” అని అన్నది.
1KI 17:13 ఏలీయా ఆమెతో, “భయపడకు. ఇంటికి వెళ్లి నేను నీకు చెప్పినట్లు చేయు. మొదట నా కోసం చిన్న రొట్టె చేసి తీసుకురా, తర్వాత నీకు, నీ కుమారునికి చేసుకో.
1KI 17:14 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘దేశం మీద యెహోవా వర్షం కురిపించే వరకు, ఆ జాడీలో పిండి తగ్గిపోదు, కూజలో నూనె అయిపోదు’ ” అని చెప్పాడు.
1KI 17:15 ఆమె వెళ్లి ఏలీయా చెప్పినట్లు చేసింది. కాబట్టి ప్రతిరోజు ఏలీయాకు, ఆ స్త్రీకి, తన కుటుంబానికి ఆహారం ఉండేది.
1KI 17:16 ఎందుకంటే ఏలీయా ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం జాడీలో పిండి తరిగిపోలేదు, కూజలో నూనె అయిపోలేదు.
1KI 17:17 కొంతకాలం తర్వాత ఇంటి యజమానురాలి కుమారునికి జబ్బుచేసింది. ఆ జబ్బు తీవ్రమైనందుకు అతడు ప్రాణం విడిచాడు.
1KI 17:18 ఆమె ఏలీయాతో అన్నది, “దైవజనుడా, మీరు నాకు చేసిందేంటి? నా పాపం నాకు జ్ఞాపకంచేసి నా కుమారున్ని చంపడానికి వచ్చారా?”
1KI 17:19 ఏలీయా జవాబిస్తూ, “నీ కుమారున్ని నాకు ఇవ్వు” అన్నాడు. ఆమె చేతిలో నుండి అతన్ని తీసుకుని, తాను ఉంటున్న మేడ గదికి తీసుకెళ్లి, తన పడక మీద పడుకోబెట్టాడు.
1KI 17:20 తర్వాత అతడు యెహోవాకు మొరపెడుతూ అన్నాడు, “యెహోవా నా దేవా, నేను ఎవరి ఇంట్లో అతిథిగా ఉంటున్నానో ఆ విధవరాలి కుమారున్ని చనిపోయేలా చేసి, ఆమెకు కూడా విషాదాన్ని కలిగించారా?”
1KI 17:21 తర్వాత అతడు ఆ బాలుని మీద మూడుసార్లు చాచుకొని, “యెహోవా, నా దేవా! ఈ బాలునికి ప్రాణం తిరిగి రానివ్వండి!” అని యెహోవాకు మొరపెట్టాడు.
1KI 17:22 ఏలీయా చేసిన ప్రార్థన యెహోవా విన్నారు, బాలునికి ప్రాణం తిరిగి వచ్చింది, అతడు బ్రతికాడు.
1KI 17:23 ఏలీయా ఆ బాలున్ని ఎత్తుకుని ఆ గది నుండి క్రింద ఇంట్లోకి తీసుకువచ్చి, ఆ బాలుని తల్లి చేతికి ఇస్తూ, “చూడు, నీ కుమారుడు సజీవంగా ఉన్నాడు” అన్నాడు.
1KI 17:24 అప్పుడు ఆ స్త్రీ ఏలీయాతో, “ఇప్పుడు మీరు దైవజనులని, మీ నోట ఉన్న యెహోవా వాక్కు సత్యమని నాకు తెలిసింది” అన్నది.
1KI 18:1 చాలాకాలం తర్వాత కరువులో మూడవ సంవత్సరం యెహోవా వాక్కు ఏలీయాకు వచ్చింది: “నీవు వెళ్లి అహాబుకు కనబడు, నేను దేశం మీద వర్షం కురిపిస్తాను.”
1KI 18:2 కాబట్టి అహాబుకు కనబడటానికి ఏలీయా వెళ్లాడు. ఆ సమయంలో సమరయలో కరువు తీవ్రంగా ఉంది.
1KI 18:3 కాబట్టి అహాబు తన రాజభవన నిర్వాహకుడైన ఓబద్యాను పిలిపించాడు. (ఓబద్యా యెహోవా పట్ల భయభక్తులు గలవాడు.
1KI 18:4 యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపిస్తూ ఉన్నప్పుడు, ఓబద్యా వందమంది ప్రవక్తలను తీసుకెళ్లి వారిని దాచిపెట్టి, వారిని యాభైమంది చొప్పున రెండు గుహల్లో ఉంచి వారికి అన్నపానాలు అందించాడు.)
1KI 18:5 అహాబు ఓబద్యాతో, “దేశంలో తిరిగి పర్యటిస్తూ అన్ని ఊటలను, వాగులను చూడు. మన గుర్రాలు, కంచరగాడిదలు చావకుండ వాటికి గడ్డి దొరుకుతుందేమో అప్పుడు కొన్ని పశువులనైనా చావకుండ చూడగలం” అన్నాడు.
1KI 18:6 కాబట్టి వారు దేశమంతా తిరిగి చూడడానికి వీలుగా ఒకవైపు అహాబు, మరోవైపు ఓబద్యా వెళ్లారు.
1KI 18:7 ఓబద్యా దారిన వెళ్తుండగా ఏలీయా అతనికి ఎదురయ్యాడు. ఓబద్యా అతన్ని గుర్తుపట్టి సాష్టాంగపడి, “నా ప్రభువా ఏలీయా, నిజంగా మీరేనా?” అన్నాడు.
1KI 18:8 ఏలీయా అతనితో, “అవును నేనే. నీవు వెళ్లి, ఏలీయా ఇక్కడ ఉన్నాడని నీ యజమానితో చెప్పు” అన్నాడు.
1KI 18:9 అందుకు ఓబద్యా, “నేను చనిపోయేలా మీ దాసుడనైన నన్ను అహాబుకు అప్పగించడానికి నేను ఏ చెడ్డపని చేశాను?
1KI 18:10 సజీవుడైన మీ దేవుడు, యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా యజమాని అహాబు మీకోసం వెదకడానికి అన్ని దేశాలకు, రాజ్యాలకు మనుష్యులను పంపాడు. ఏ దేశం వారైనా ఏలీయా లేడని చెప్పినప్పుడు మిమ్మల్ని ఆ దేశం వారు చూడలేదని వారి చేత ఒట్టు పెట్టించుకున్నాడు.
1KI 18:11 ఇప్పుడు నన్ను వెళ్లి నా యజమానితో, ‘ఏలీయా ఇక్కడ ఉన్నాడు’ అని చెప్పమంటున్నారు.
1KI 18:12 నేను మిమ్మల్ని విడిచి వెళ్లిన తర్వాత, యెహోవా ఆత్మ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు. నేను అహాబుకు చెప్పినప్పుడు, ఒకవేళ అతనికి మీరు కనబడకపోతే అతడు నన్ను చంపేస్తాడు. అది సరికాదు; మీ సేవకుడనైన నేను కూడ బాల్యం నుండే యెహోవాను ఆరాధించే వాన్ని.
1KI 18:13 నా ప్రభువా, యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపిస్తూ ఉన్నప్పుడు నేను ఏమి చేశానో మీరు వినలేదా? యెహోవా ప్రవక్తల్లో వందమందిని రెండు గుహల్లో దాచాను, ఒక్కొక్క గుహలో యాభైమంది లెక్కన ఉంచి వారికి భోజనం పెట్టి పోషించాను.
1KI 18:14 మరి మీరేమో నన్ను నా యజమాని దగ్గరకు వెళ్లి, ‘ఏలీయా ఇక్కడ ఉన్నాడు’ అని చెప్పమంటున్నారు. అతడు నన్ను చంపుతాడు!” అన్నాడు.
1KI 18:15 అందుకు ఏలీయా, “నేను సేవించే సజీవుడైన సైన్యాల యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు ఖచ్చితంగా నేను అహాబుకు కనబడతాను.”
1KI 18:16 ఓబద్యా అహాబును కలుసుకోడానికి వెళ్లి ఈ విషయం తెలియజేయగా అహాబు ఏలీయాను కలుసుకోడానికి వెళ్లాడు.
1KI 18:17 అహాబు ఏలీయాను చూడగానే అతనితో, “ఇశ్రాయేలును కష్టపెట్టేవాడివి నీవే గదా?” అన్నాడు.
1KI 18:18 అందుకు ఏలీయా, “నేను కాదు; నీవు, నీ తండ్రి కుటుంబం యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను తిరస్కరించి, బయలును అనుసరించి మీరే ఇశ్రాయేలును కష్టపెట్టారు.
1KI 18:19 ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులందరిని కర్మెలు పర్వతం మీద నన్ను కలవమని పిలిపించు. యెజెబెలు బల్ల దగ్గర తినే నాలుగు వందల యాభై బయలు ప్రవక్తలను, నాలుగు వందల అషేరా ప్రవక్తలను కూడా రమ్మను” అని జవాబిచ్చాడు.
1KI 18:20 కాబట్టి అహాబు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించాడు. ఆ ప్రవక్తలను కూడా కర్మెలు పర్వతం మీద సమావేశపరిచాడు.
1KI 18:21 ఏలీయా ప్రజల దగ్గరకు వెళ్లి, “మీరు ఎంతకాలం రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే అతన్ని అనుసరించండి” అని అన్నాడు. అయితే ప్రజలు ఏమి బదులు చెప్పలేదు.
1KI 18:22 అప్పుడు ఏలీయా వారితో, “యెహోవా ప్రవక్తల్లో నేనొక్కడినే మిగిలాను, కాని బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభైమంది ఉన్నారు.
1KI 18:23 మాకు రెండు ఎడ్లను తీసుకురండి, వారు ఆ ఎడ్లలో ఒకదాన్ని బయలు ప్రవక్తలు తీసుకుని దానిని ముక్కలుగా కోసి, క్రింద నిప్పు అంటించకుండా కట్టెల మీద పేర్చాలి. ఇంకొక ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద నిప్పు అంటించకుండా కట్టెల మీద పేరుస్తాను.
1KI 18:24 మీరు మీ దేవుని పేరిట ప్రార్థన చేయండి, నేను యెహోవా పేరిట ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే అగ్నిని పంపి జవాబిస్తాడో ఆయనే నిజమైన దేవుడు” అని అన్నాడు. అప్పుడు ప్రజలంతా, “నీవు చెప్పింది బాగుంది” అన్నారు.
1KI 18:25 ఏలీయా బయలు ప్రవక్తలతో, “మీరు చాలామంది ఉన్నారు కాబట్టి ముందు మీరు ఒక ఎద్దును తీసుకుని దానిని సిద్ధం చేయండి. మీ దేవుని పేరిట ప్రార్థన చేయండి, అయితే నిప్పు అంటించకూడదు” అన్నాడు.
1KI 18:26 కాబట్టి వారు ఒక ఎద్దును తీసుకుని సిద్ధం చేశారు. తర్వాత వారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, “బయలా! మాకు జవాబివ్వు!” అని అంటూ బయలు పేరెత్తి బిగ్గరగా మొరపెట్టారు. కాని ఏ స్పందన లేదు; ఎవరూ జవాబివ్వలేదు. వారు సిద్ధం చేసిన బలిపీఠం చుట్టూ నాట్యం చేయడం మొదలుపెట్టారు.
1KI 18:27 మధ్యాహ్న సమయంలో ఏలీయా వారిని గేలి చేస్తూ, “బిగ్గరగా అరవండి! అతడు నిజంగా దేవుడే కదా! బహుశ అతడు ఏదైన ఆలోచనలో నిమగ్నమై ఉన్నాడేమో, లేదా పనిలో ఉన్నాడేమో లేదా ప్రయాణంలో ఉన్నాడేమో. బహుశ పడుకున్నాడేమో, అతన్ని నిద్ర లేపాలేమో” అన్నాడు.
1KI 18:28 కాబట్టి వారు ఇంకా బిగ్గరగా కేకలువేస్తూ వారి అలవాటు ప్రకారం రక్తం ధారలుగా కారే వరకు కత్తులతో, ఈటెలతో తమను తాము కోసుకున్నారు.
1KI 18:29 మధ్యాహ్నం దాటింది, సాయంత్రం బలి సమయం వరకు వారు తమ వెర్రి ప్రవచనాలను కొనసాగించారు. అయినా స్పందన లేదు, ఎవరు జవాబివ్వలేదు, ఎవరూ పట్టించుకోలేదు.
1KI 18:30 అప్పుడు ఏలీయా ప్రజలందరితో, “ఇక్కడకు నా దగ్గరకు రండి” అన్నాడు. వారతని దగ్గరకు రాగా అతడు పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని తిరిగి నిర్మించాడు.
1KI 18:31 అప్పుడు ఏలీయా, “నీ పేరు ఇశ్రాయేలు” అని యెహోవా వాగ్దానం పొందుకున్న యాకోబు గోత్రాల లెక్క చొప్పున పన్నెండు రాళ్లు తీసుకున్నాడు.
1KI 18:32 రాళ్లతో యెహోవా పేరున బలిపీఠం కట్టి, దాని చుట్టూ రెండు శేయల గింజలు పట్టేటంత పెద్దగా కందకం తవ్వాడు.
1KI 18:33 అతడు బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఎద్దును ముక్కలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచాడు. తర్వాత వారితో, “నాలుగు పెద్ద జాడీలు నీళ్లతో నింపి, అర్పణ మీద కట్టెల మీద పోయండి” అన్నాడు.
1KI 18:34 అతడు, “మళ్ళీ అలాగే చేయండి” అని చెప్పగా వారు మళ్ళీ అలాగే చేశారు. అతడు, “మూడవసారి కూడా అలాగే చేయండి” అనగానే వారు మళ్ళీ దహనబలి పశుమాంసం మీద కట్టెల మీద నీళ్లు పోశారు.
1KI 18:35 నీళ్లు బలిపీఠం మీద నుండి చుట్టూ పారుతూ కందకం కూడా నిండిపోయింది.
1KI 18:36 అర్పణ సమయంలో, ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరగా వెళ్లి ఇలా ప్రార్థించాడు: “యెహోవా! అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా! ఇశ్రాయేలులో మీరే దేవుడని, నేను మీ సేవకుడినని, మీ ఆజ్ఞ ప్రకారమే ఇవన్నీ చేశానని ఈ రోజు వెల్లడి చేయండి.
1KI 18:37 యెహోవా, నాకు జవాబివ్వండి; మీరే దేవుడైన యెహోవా అని, మీరు వారి హృదయాలను నీ వైపుకు త్రిప్పుకుంటున్నారని ప్రజలు తెలుసుకునేలా నాకు జవాబివ్వండి.”
1KI 18:38 అప్పుడు యెహోవా అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి బలిని, కట్టెలను, రాళ్లను, మట్టిని దహించి కందకంలో ఉన్న నీళ్లు కూడా ఇంకిపోయేలా చేసింది.
1KI 18:39 ప్రజలంతా ఇది చూసి సాష్టాంగపడి, “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు!” అని అంటూ కేకలు వేశారు.
1KI 18:40 అప్పుడు ఏలీయా, “బయలు ప్రవక్తలను పట్టుకోండి! వారిలో ఒక్కడు కూడా తప్పించుకోకూడదు!” అని వారికి ఆజ్ఞాపించాడు. ప్రజలు వారిని పట్టుకున్నారు, ఏలీయా వారిని కీషోను లోయలోకి తీసుకెళ్లి అక్కడ చంపాడు.
1KI 18:41 తర్వాత ఏలీయా అహాబుతో, “భారీ వర్షం వచ్చే ధ్వని వస్తుంది, నీవు వెళ్లి అన్నపానాలు పుచ్చుకో” అన్నాడు.
1KI 18:42 కాబట్టి అహాబు అన్నపానాలు పుచ్చుకోడానికి వెళ్లాడు, కాని ఏలీయా కర్మెలు పర్వత శిఖరం మీదికి వెళ్లి, అక్కడ అతడు నేల మీద పడి ముఖం మోకాళ్ల మధ్య పెట్టుకున్నాడు.
1KI 18:43 తర్వాత అతడు తన సేవకుని పిలిచి, “నీవు వెళ్లి సముద్రం వైపు చూడు” అన్నాడు. అతడు వెళ్లి చూశాడు. “అక్కడ ఏమి లేదు” అని అతడు జవాబిచ్చాడు. ఏలీయా ఏడుసార్లు, “వెళ్లి చూడు” అని చెప్పాడు.
1KI 18:44 ఏడవసారి సేవకుడు వచ్చి, “మనిషి చేయి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి లేస్తూ ఉంది” అని చెప్పాడు. అందుకు ఏలీయా, “నీవు వెళ్లి అహాబుతో, ‘వర్షం నిన్ను ఆపక ముందే నీ రథం సిద్ధం చేసుకుని వెళ్లు’ అని చెప్పు” అన్నాడు.
1KI 18:45 అంతలో ఆకాశం మబ్బులతో చీకటిగా మారింది, గాలి వీచింది, భారీ వర్షం కురవడం మొదలయ్యింది. అహాబు రథమెక్కి యెజ్రెయేలుకు వెళ్లాడు.
1KI 18:46 యెహోవా హస్తం ఏలీయాను బలపరచగా అతడు తన నడుము బిగించుకుని, అహాబు కంటే ముందే పరుగెత్తుకొని వెళ్లి యెజ్రెయేలు చేరుకున్నాడు.
1KI 19:1 అహాబు వెళ్లి, ఏలీయా చేసిందంతా ప్రవక్తలందరినీ ఖడ్గంతో చంపిన సంగతంతా యెజెబెలుకు చెప్పాడు.
1KI 19:2 అందుకు యెజెబెలు, “రేపు ఈ సమయానికి నీవు వారిని చంపినట్లు నేను నిన్ను చంపకపోతే దేవుళ్ళు నన్ను ఇంతకంటే తీవ్రంగా శిక్షించుదురు గాక” అని ఒక దూతతో ఏలీయాకు కబురు పంపింది.
1KI 19:3 ఏలీయా భయపడి, తన ప్రాణం కాపాడుకోడానికి పారిపోయాడు. అతడు యూదాలోని బెయేర్షేబకు చేరి, అక్కడ తన సేవకుడిని విడిచిపెట్టి,
1KI 19:4 అతడు మాత్రం ఎడారిలోకి రోజంతా ప్రయాణం చేశాడు. ఒక బదరీచెట్టు క్రింద కూర్చుని చనిపోవాలని కోరుతూ, “యెహోవా, నా ప్రాణం తీసుకోండి; నేను నా పూర్వికులకంటే గొప్పవాన్ని కాను” అని ప్రార్థించాడు.
1KI 19:5 తర్వాత అతడు ఆ బదరీచెట్టు క్రింద పడుకుని నిద్రపోయాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక దేవదూత అతన్ని తట్టి, “లేచి తిను” అన్నాడు.
1KI 19:6 అతడు కళ్లు తెరిచి చూస్తే అతని తల దగ్గర సీసాలో నీళ్లు నిప్పుల మీద కాల్చిన రొట్టె కనిపించాయి. అతడు తిని త్రాగి మళ్ళీ పడుకున్నాడు.
1KI 19:7 తర్వాత యెహోవా దూత రెండవసారి వచ్చి అతన్ని తట్టి, “లేచి తిను ఎందుకంటే నీవు దూర ప్రయాణం చేయాల్సి ఉంది” అన్నాడు.
1KI 19:8 కాబట్టి అతడు లేచి తిని నీళ్లు త్రాగాడు. ఆ ఆహారం వల్ల బలం పొందుకొని నలభై రాత్రింబగళ్ళు ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబును చేరుకున్నాడు.
1KI 19:9 అక్కడ అతడు ఒక గుహలో ఆ రాత్రి గడిపాడు. యెహోవా వాక్కు, “ఏలీయా, ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అతన్ని అడిగింది.
1KI 19:10 అతడు జవాబిస్తూ, “నేను సైన్యాల యెహోవా దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను తిరస్కరించారు, మీ బలిపీఠాలను పడగొట్టారు, మీ ప్రవక్తలను ఖడ్గంతో చంపారు. నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను, ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు” అని చెప్పాడు.
1KI 19:11 అందుకు యెహోవా, “బయటకు వెళ్లి, పర్వతం మీద యెహోవా సమక్షంలో నిలబడు, ఎందుకంటే యెహోవా అక్కడినుండి దాటి వెళ్లబోతున్నారు” అన్నారు. అప్పుడు ఒక గొప్ప బలమైన గాలి వచ్చి పర్వతాలను చీల్చింది, యెహోవా ఎదుట బండలను బద్దలు చేసింది, అయితే యెహోవా ఆ గాలిలో లేరు. గాలి తర్వాత భూకంపం వచ్చింది, కాని యెహోవా ఆ భూకంపంలో లేరు.
1KI 19:12 భూకంపం తర్వాత అగ్ని వచ్చింది, కాని యెహోవా ఆ అగ్నిలో లేరు. అగ్ని తర్వాత మెల్లని స్వరం వినిపించింది.
1KI 19:13 ఏలీయా ఆ స్వరం వినగానే, తన వస్ర్తంతో ముఖం కప్పుకుని వెళ్లి ఆ గుహ ద్వారం దగ్గర నిలబడ్డాడు. అప్పుడు అతనికి, “ఏలీయా ఇక్కడ ఏమి చేస్తున్నావు?” అనే స్వరం వినిపించింది.
1KI 19:14 అతడు జవాబిస్తూ, “నేను సైన్యాల యెహోవా దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను తిరస్కరించారు, మీ బలిపీఠాలను పడగొట్టారు, మీ ప్రవక్తలను ఖడ్గంతో చంపారు. నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను. ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు” అని చెప్పాడు.
1KI 19:15 అప్పుడు యెహోవా అతనితో, “నీవు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లు, దమస్కు ఎడారికి వెళ్లు. అక్కడికి వెళ్లాక, హజాయేలును అరాము మీద రాజుగా అభిషేకించు.
1KI 19:16 తర్వాత ఇశ్రాయేలు మీద నిమ్షీ కుమారుడైన యెహును రాజుగా, ఆబేల్-మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను నీ తర్వాత ప్రవక్తగా అభిషేకించు.
1KI 19:17 హజాయేలు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని యెహు చంపుతాడు, యెహు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని ఎలీషా చంపుతాడు.
1KI 19:18 అయినా ఇశ్రాయేలులో బయలుకు మోకరించని, వాన్ని ముద్దుపెట్టుకోని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచాను” అని చెప్పారు.
1KI 19:19 కాబట్టి ఏలీయా అక్కడినుండి వెళ్లి, షాపాతు కుమారుడైన ఎలీషాను కనుగొన్నాడు. ఎలీషా పన్నెండు జతల ఎడ్లతో పొలం దున్నిస్తూ స్వయంగా అతడు పన్నెండవ జతను నడుపుతూ ఉన్నప్పుడు, ఏలీయా అతని దగ్గరకు వెళ్లి తన దుప్పటి తీసి అతని మీద వేశాడు.
1KI 19:20 అప్పుడు ఎలీషా ఎడ్లను విడిచిపెట్టి ఏలీయా వెంబడి పరుగెత్తి, “నేను వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వీడ్కోలు చెప్పి మీ వెంట వస్తాను” అని అన్నాడు. అందుకు ఏలీయా, “వెనుకకు వెళ్లు. కాని నేను నీకు చేసిన దాని గురించి ఆలోచించు” అన్నాడు.
1KI 19:21 కాబట్టి ఎలీషా అతన్ని విడిచి వెనుకకు వెళ్లి ఆ జత ఎడ్లను వధించి వాటి మాంసాన్ని కాడి మ్రానులతో వంట చేసి ప్రజలకు వడ్డించాడు. వారు తినిన తర్వాత అతడు లేచి ఏలీయా వెంట వెళ్లి అతని సేవకుడయ్యాడు.
1KI 20:1 తర్వాత అరాము రాజైన బెన్-హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకున్నాడు. అతనితో ముప్పై రెండు మంది రాజులు తమ గుర్రాలు రథాలతో ఉన్నారు. అతడు వచ్చి సమరయను ముట్టడించి దాడి చేశాడు.
1KI 20:2 అతడు పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరకు దూతలను పంపి, “బెన్-హదదు చెప్పేది ఇదే: ‘నీ వెండి బంగారాలు నావే, నీ భార్యల్లో నీ పిల్లల్లో ఉత్తమమైన వారు నా వారే’ ” అని కబురు పంపాడు.
1KI 20:4 అందుకు ఇశ్రాయేలు రాజు, “నా ప్రభువా, రాజా, మీరు చెప్పినట్టే నేనూ, నాకు కలిగినదంతా మీ వశంలో ఉన్నాం” అని జవాబిచ్చాడు.
1KI 20:5 తర్వాత బెన్-హదదు దూతలు తిరిగివచ్చి ఇలా చెప్పారు: “బెన్-హదదు చెప్పేదేంటంటే, ‘నీ వెండిని, నీ బంగారాన్ని, నీ భార్యలను, నీ పిల్లలను నా స్వాధీనం చేయాలని నేను కబురు పంపాను.
1KI 20:6 అయితే రేపు ఇదే వేళకు, నా సేవకులను నీ దగ్గరకు పంపిస్తాను. వారు నీ రాజభవనాన్ని, నీ అధికారుల ఇళ్ళను వెదుకుతారు, నీకు విలువైన ప్రతిదాన్ని వారు తీసుకెళ్తారు.’ ”
1KI 20:7 అప్పుడు ఇశ్రాయేలు రాజు ఆ దేశంలోని పెద్దలందరినీ పిలిపించి వారితో అన్నాడు, “ఈ మనిషి ఎలా కీడును తలపట్టాడో చూడండి! నా భార్యలు, నా పిల్లలు, నా వెండి బంగారాలు కావాలంటూ నాకు కబురు పంపినప్పుడు, నేను కాదనలేదు.”
1KI 20:8 పెద్దలు, ప్రజలు అందరు, “మీరు అతని మాట వినకండి, అతడు అడిగిన వాటికి ఒప్పుకోకండి” అని అన్నారు.
1KI 20:9 కాబట్టి అతడు బెన్-హదదు యొక్క దూతలతో ఇలా అన్నాడు, “నా ప్రభువా, రాజుతో చెప్పండి, ‘మీ సేవకుడనైన నాకు మీరు మొదట చెప్పిన మాట ప్రకారం చేస్తాను. కాని, ఈసారి మీరు కోరినట్టు నేను చేయలేను.’ ” వారు వెళ్లి బెన్-హదదుతో ఆ వార్త చెప్పారు.
1KI 20:10 అప్పుడు బెన్-హదదు అహాబుకు ఇంకొక వార్త పంపాడు: “నా సైనికుల్లో ప్రతి ఒకరు తీసుకెళ్లడానికి సమరయలో పిడికెడు ధూళి మిగిలితే, దేవుళ్ళు నన్ను ఇంతగా, ఇంతకంటే తీవ్రంగా శిక్షించును గాక.”
1KI 20:11 అందుకు ఇశ్రాయేలు రాజు అన్నాడు, “అతనికి చెప్పండి: ‘యుద్ధానికి ఆయుధాలు ధరించినవాడు, యుద్ధం తర్వాత వాటిని తీసివేసే వానిలా అతిశయించకూడదు.’ ”
1KI 20:12 ఈ వార్త వచ్చినప్పుడు బెన్-హదదు, అతనితో ఉన్న రాజులు తమ గుడారాల్లో త్రాగుతూ ఉన్నారు. అతడు తన మనుష్యులతో, “దాడికి సిద్ధపడండి” అని ఆదేశించాడు. కాబట్టి వారు పట్టణం మీద దాడి చేయడానికి సిద్ధపడ్డారు.
1KI 20:13 ఈలోగా, ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరకు ఒక ప్రవక్త వచ్చి, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘ఈ గొప్ప సైన్యాన్ని చూస్తున్నావా? దానిని ఈ రోజు నీ చేతికి అప్పగిస్తాను, అప్పుడు యెహోవాను నేనని నీవు తెలుసుకుంటావు’ ” అని ప్రకటించాడు.
1KI 20:14 “కాని ఇది ఎవరు చేస్తారు?” అని అహాబు అడిగాడు. అందుకు ప్రవక్త అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే యువ అధికారులు చేస్తారు.’ ” “ఎవరు యుద్ధం ఆరంభిస్తారు?” అని అహాబు అడిగాడు. “నీవే” అని ప్రవక్త జవాబిచ్చాడు.
1KI 20:15 కాబట్టి అహాబు ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే 232 యువ అధికారులను పిలిపించాడు. తర్వాత అతడు మిగితా ఇశ్రాయేలీయులను, మొత్తం 7,000 మందిని సమకూర్చాడు.
1KI 20:16 మధ్యాహ్నం వారు బయలుదేరి వెళ్లారు, అప్పుడు బెన్-హదదు, అతనికి అండగా వచ్చిన ఆ ముప్పై రెండు మంది రాజులు గుడారాల్లో త్రాగుతూ మత్తులో ఉన్నారు.
1KI 20:17 ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే యువ అధికారులు మొదట బయటకు వెళ్లారు. బెన్-హదదు కొందరు సైనికులను పంపించినప్పుడు వారు, “సమరయ నుండి మనుష్యులు ఎదురుగా వస్తున్నారు” అని చెప్పారు.
1KI 20:18 అందుకతడు అన్నాడు, “వారు సమాధానం కోరి వస్తే ప్రాణాలతో వారిని పట్టుకోండి; వారు యుద్ధానికి వస్తే, ప్రాణాలతో వారిని పట్టుకోండి.”
1KI 20:19 ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే యువ అధికారులు, పట్టణం బయటకు వెళ్లారు, సైన్యం వారి వెనుక వెళ్లింది.
1KI 20:20 ప్రతి ఒకడు తన ప్రత్యర్థిని కూలగొట్టాడు. అకస్మాత్తుగా ఇశ్రాయేలీయులు తరుముతూ ఉంటే, అరామీయులు పారిపోయారు. అరాము రాజైన బెన్-హదదు గుర్రమెక్కి కొంతమంది రౌతులతో పాటు తప్పించుకున్నాడు.
1KI 20:21 అప్పుడు ఇశ్రాయేలు రాజు నగరం నుండి వెళ్లి గుర్రాలను, రథాలను స్వాధీనం చేసుకుని, అరామీయులను చాలామందిని హతం చేశాడు.
1KI 20:22 తర్వాత ఇశ్రాయేలు రాజు దగ్గరకు ఆ ప్రవక్త వచ్చి అన్నాడు, “ధైర్యం తెచ్చుకుని నీవు ఏం చేయాలో నిర్ణయించుకో, ఎందుకంటే, వచ్చే వసంతకాలంలో అరాము రాజు మళ్ళీ నీ మీద దాడి చేస్తాడు.”
1KI 20:23 ఇంతలో అరాము రాజు పరివారం అతనితో, “ఇశ్రాయేలు దేవుళ్ళు కొండల దేవుళ్ళు. అందుకే వారు మనకంటే బలంగా ఉన్నారు. కాని మనం సమతల మైదాన ప్రాంతంలో వారితో పోరాడితే మనం తప్పనిసరిగా గెలుస్తాము.
1KI 20:24 ఇలా చేయండి: రాజులందరినీ తొలగించి వారికి బదులు అధిపతులను నియమించండి.
1KI 20:25 మీరు పోగొట్టుకున్న సైన్యంలాంటి మరో సైన్యాన్ని సమకూర్చండి అంటే గుర్రానికి గుర్రం, రథానికి రథం. తద్వారా ఇశ్రాయేలుతో మైదాన ప్రాంతంలో యుద్ధం చేయవచ్చు. అప్పుడు మనం వారిపై గెలుస్తాం” అని చెప్పారు. అతడు వారి సలహా అంగీకరించి అల చేశాడు.
1KI 20:26 మరుసటి వసంతకాలంలో, బెన్-హదదు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి అరాము సైన్యాన్ని పోగుచేసి, ఆఫెకు ప్రాంతానికి వెళ్లాడు.
1KI 20:27 ఇశ్రాయేలీయులు కూడా తమ సైన్యాన్ని పోగుచేసుకుని సామాగ్రి పొందుకున్నప్పుడు, వారిని ఎదుర్కోడానికి వెళ్లారు. ఇశ్రాయేలీయులు రెండు చిన్న మేకల మందలా వారికి ఎదురుగా బస చేశారు, మరోవైపు అరామీయులు గ్రామీణ ప్రాంతాల్లో నిండి ఉన్నారు.
1KI 20:28 దైవజనుడు ఒకడు ఇశ్రాయేలు రాజు దగ్గరకు వచ్చి అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెహోవా కొండ దేవుడే గాని లోయ దేవుడు కాదని అరామీయులు అనుకుంటున్నారు కాబట్టి, ఈ గొప్ప సైన్యాన్ని మీ చేతికి అప్పగిస్తాను, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
1KI 20:29 వారు ఏడు రోజులు ఎదురెదురుగా గుడారాలు వేసుకుని ఉన్నారు, ఏడవ రోజున యుద్ధం ఆరంభమైంది. ఆ ఒక్క రోజున ఇశ్రాయేలీయులు అరాము కాల్బలంలో లక్ష మందికి ప్రాణనష్టం కలిగించారు.
1KI 20:30 మిగతావారు ఆఫెకు పట్టణముకు పారిపోయారు, వారిలో ఇరవై ఏడు వేలమంది మీద ప్రాకారం కూలింది. బెన్-హదదు పట్టణానికి పారిపోయి లోపలి గదిలో చొరబడ్డాడు.
1KI 20:31 అతని అధికారులు అతనితో అన్నారు, “చూడండి, ఇశ్రాయేలు రాజులు దయ గలవారని విన్నాము. ఇప్పుడు మేము నడుముకు గోనెపట్ట కట్టుకుని, తల చుట్టూ త్రాళ్లు వేసుకుని, ఇశ్రాయేలు రాజు దగ్గరకు వెళ్తాము. బహుశ అతడు మిమ్మల్ని బ్రతుకనీయవచ్చు.”
1KI 20:32 వారు నడుముకు గోనెపట్ట కట్టుకుని, తలమీద త్రాళ్లు వేసుకుని, ఇశ్రాయేలు రాజు దగ్గరకు వెళ్లి అన్నారు, “మీ సేవకుడైన బెన్-హదదు ఇలా చెప్తున్నాడు: ‘దయచేసి నన్ను బ్రతకనివ్వండి.’ ” రాజు జవాబిస్తూ, “అతడు ఇంకా ప్రాణంతో ఉన్నాడా? అతడు నా సోదరుడు” అని అన్నాడు.
1KI 20:33 ఆ మనుష్యులు దీనిని మంచి సూచనగా తీసుకుని, అతని మాటను త్వరగా అందుకున్నారు. “అవును, బెన్-హదదు మీ సోదరుడు” అని వారు అన్నారు. అప్పుడు రాజు, “మీరు వెళ్లి అతన్ని తీసుకురండి” అన్నాడు. బెన్-హదదు బయటకు వచ్చినప్పుడు, అహాబు అతన్ని తన రథంలో ఎక్కించుకున్నాడు.
1KI 20:34 అప్పుడు బెన్-హదదు, “మీ తండ్రి నుండి నా తండ్రి తీసుకున్న పట్టణాలను మీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి సమరయలో చేసినట్టుగా మీరు దమస్కులో మీ సొంత వ్వాపార కేంద్రాలు ఏర్పరచుకోవచ్చు” అని అన్నాడు. అందుకు అహాబు, “ఈ ఒప్పందం మీద నేను నిన్ను విడుదల చేస్తాను” అని అన్నాడు. కాబట్టి అతడు ఒప్పందం చేసుకుని అతన్ని పంపించాడు.
1KI 20:35 యెహోవా మాటచేత, ప్రవక్త బృందంలో ఒకడు తన తోటి ప్రవక్తతో, “నీ ఆయుధంతో నన్ను కొట్టు” అన్నాడు, కాని అతడు నిరాకరించాడు.
1KI 20:36 కాబట్టి ప్రవక్త అన్నాడు, “నీవు యెహోవాకు లోబడలేదు కాబట్టి నన్ను విడిచి వెళ్లిన వెంటనే సింహం నిన్ను చంపుతుంది.” ఆ మనిషి వెళ్లిన తర్వాత ఒక సింహం అతనిపై దాడి చేసి అతన్ని చంపింది.
1KI 20:37 ఆ ప్రవక్త మరొకరి కనుగొని అతనితో, “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. ఆ మనిషి అతని కొట్టి గాయపరచాడు.
1KI 20:38 అప్పుడు ఆ ప్రవక్త వెళ్లి, దారి ప్రక్కన నిలబడి, రాజు కోసం ఎదురుచూశాడు. అతడు తన కళ్లకు గుడ్డ కట్టుకుని మారువేషం వేసుకున్నాడు.
1KI 20:39 రాజు దారిన వెళ్తుండగా, ప్రవక్త రాజును పిలిచి, “మీ సేవకుడనైన నేను యుద్ధం మధ్యలోకి వెళ్లాను. అక్కడ ఒకడు ఒక బందీని తీసుకుని నా దగ్గరకు వచ్చి, ‘ఈ వ్యక్తిని చూసుకోండి. ఒకవేళ అతడు తప్పిపోతే, వాడి ప్రాణానికి బదులుగా నీ ప్రాణం పెట్టాలి. లేదా నీవు ఒక తలాంతు వెండి ఇవ్వాలి’ అని చెప్పాడు.
1KI 20:40 మీ సేవకుడు అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉన్నప్పుడు, వాడు కనిపించకుండా పోయాడు” అని చెప్పాడు. ఇశ్రాయేలు రాజు అతనితో, “అది నీ తప్పు, నీ మీదికి నీవే తీర్పు తెచ్చుకున్నావు” అన్నాడు.
1KI 20:41 అప్పుడు ప్రవక్త తన కళ్లకు కట్టుకున్న గుడ్డ త్వరగా తీసివేశాడు, అతడు ప్రవక్తల్లో ఒకడని ఇశ్రాయేలు రాజు అతన్ని గుర్తించాడు.
1KI 20:42 ప్రవక్త రాజుతో అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘చంపబడాలని నేను నిశ్చయించిన మనిషిని నీవు వెళ్లిపోనిచ్చావు. కాబట్టి అతని ప్రాణానికి నీ ప్రాణం, అతని ప్రజలకు బదులు నీ ప్రజలను అర్పిస్తావు.’ ”
1KI 20:43 ఇశ్రాయేలు రాజు విచారంతో, కోపంతో సమరయలో ఉన్న తన భవనానికి వెళ్లిపోయాడు.
1KI 21:1 కొంతకాలం తర్వాత, యెజ్రెయేలు వాడైన నాబోతుకు చెందిన ద్రాక్షతోటకు సంబంధించి ఒక సంఘటన జరిగింది. యెజ్రెయేలులో సమరయ రాజైన అహాబు భవనానికి సమీపంగా ఒక ద్రాక్షతోట ఉంది.
1KI 21:2 అహాబు నాబోతుతో, “నీ ద్రాక్షతోట నా భవనానికి దగ్గర ఉంది కాబట్టి, నీ ద్రాక్షతోటను నాకు ఇవ్వు, నేను దానిని కూరగాయల తోటగా వాడుకుంటాను. దానికి బదులుగా, నీ తోట కంటే ఇంకా మంచి ద్రాక్షతోటను నీకు ఇస్తాను, లేదా నీకిష్టమైతే దానికి తగిన వెల చెల్లిస్తాను” అన్నాడు.
1KI 21:3 అందుకు నాబోతు అహాబుతో, “నా పూర్వికుల వారసత్వాన్ని మీకు ఇవ్వకుండ యెహోవా తప్పించును గాక” అని అన్నాడు.
1KI 21:4 యెజ్రెయేలీయుడైన నాబోతు, “నా పూర్వికుల వారసత్వాన్ని నేను మీకు ఇవ్వను” అని చెప్పడంతో అహాబు విచారంతో, కోపంతో తన భవనానికి వెళ్లిపోయాడు. అతడు ముఖం మాడ్చుకుని ఏమీ తినకుండ తన పరుపు మీద పడుకున్నాడు.
1KI 21:5 అతని భార్య యెజెబెలు అతని దగ్గరకు వచ్చి, “ఎందుకు నీవు విచారంగా ఉన్నావు? ఎందుకు నీవు తినట్లేదు?” అని అడిగింది.
1KI 21:6 అందుకతడు, “నేను యెజ్రెయేలీయుడైన నాబోతుతో, ‘నీ ద్రాక్షతోటను నాకు వెండికి అమ్ము; లేదా నీకిష్టమైతే నీ తోటకు బదులుగా నేను నీకు ఇంకొక తోట ఇస్తాను’ అని అన్నాను. కాని అతడు, ‘నా ద్రాక్షతోట మీకివ్వను’ అన్నాడు” అని చెప్పాడు.
1KI 21:7 అతని భార్య యెజెబెలు, “నీవు ఇశ్రాయేలుకు రాజువు కావా? లేచి తిను! సంతోషంగా ఉండు. ఆ యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను నేనే నీకు ఇప్పిస్తాను” అన్నది.
1KI 21:8 కాబట్టి ఆమె అహాబు పేరున ఉత్తర్వులు వ్రాసి వాటి మీద అతని ముద్రను ముద్రించి, వాటిని నాబోతు నివసించే పట్టణ పెద్దలకు, సంస్థానాధిపతులకు శాసనాలు పంపింది.
1KI 21:9 ఆ ఉత్తర్వులలో ఆమె ఇలా వ్రాసింది: “ఉపవాస దినం ఒకటి ప్రకటించి నాబోతును ప్రజలమధ్య ప్రముఖ స్థానంలో కూర్చోబెట్టండి.
1KI 21:10 అయితే అతనికి ఎదురుగా ఇద్దరు దుర్మార్గులను కూర్చోబెట్టి అతడు దేవున్ని రాజును శపించాడని వారితో నేరారోపణ చేయించండి. తర్వాత అతన్ని బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపండి.”
1KI 21:11 యెజెబెలు తమకు పంపిన ఆ ఉత్తర్వులలో వ్రాసిన దాని ప్రకారం నాబోతు పట్టణంలో ఉన్న పెద్దలు, సంస్థానాధిపతులు చేశారు.
1KI 21:12 వారు ఉపవాసం ప్రకటించి నాబోతును ప్రజల ఎదుట ప్రముఖ స్థలంలో కూర్చోబెట్టారు.
1KI 21:13 అప్పుడు ఇద్దరు దుర్మార్గులు వచ్చి అతనికి ఎదురుగా కూర్చుని ప్రజల ముందు, “నాబోతు దేవున్ని రాజును శపించాడు” అని అంటూ నాబోతు మీద నేరం మోపారు. కాబట్టి వారు అతన్ని పట్టణం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు.
1KI 21:14 “నాబోతు రాళ్లతో కొట్టబడి చనిపోయాడు” అని యెజెబెలుకు వారు కబురు పంపారు.
1KI 21:15 నాబోతును రాళ్లతో కొట్టి చంపిన సంగతి యెజెబెలు తెలుసుకొని అహాబుతో, “లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు వెండికి కూడా నీకు అమ్మనని చెప్పిన ద్రాక్షతోటను నీ వశం చేసుకో! నాబోతు ఇక ప్రాణంతో లేడు, చనిపోయాడు” అని చెప్పింది.
1KI 21:16 నాబోతు చనిపోయాడని అహాబు వినగానే, యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను వశం చేసుకోవడానికి అతడు లేచి వెళ్లాడు.
1KI 21:17 అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు వచ్చింది:
1KI 21:18 “సమరయలో పరిపాలిస్తున్న ఇశ్రాయేలు రాజైన అహాబును వెళ్లి కలుసుకో. ఇప్పుడతడు నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు, దానిని వశం చేసుకోవడానికి అతడు వెళ్లాడు.
1KI 21:19 అతనితో చెప్పు, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నీవు ఒక మనుష్యుని హత్య చేసి అతని ఆస్తిని ఆక్రమించలేదా? యెహోవా చెప్పే మాట ఇదే: ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో, ఆ స్థలంలోనే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి.’ ”
1KI 21:20 అహాబు ఏలీయాతో, “నా శత్రువా, నీవు నన్ను పట్టుకున్నావు కదా!” అన్నాడు. అందుకతడు, “నేను నిన్ను పట్టుకున్నాను, ఎందుకంటే యెహోవా దృష్టికి చెడు చేయడానికి నిన్ను నీవే అమ్ముకున్నావు అన్నాడు.
1KI 21:21 ఆయన, ‘నేను నీ మీదికి విపత్తును తీసుకురాబోతున్నాను. నీ సంతానాన్ని తుడిచివేస్తాను. ఇశ్రాయేలులో బానిసలు స్వతంత్రులు అని లేకుండా అహాబు వంశంలోని మగవారినందరిని నిర్మూలం చేస్తాను.
1KI 21:22 నీ వంశాన్ని నెబాతు కుమారుడైన యరొబాము వంశంలా, అహీయా కుమారుడైన బయెషా వంశంలా చేస్తాను, ఎందుకంటే నీవు నాకు కోపం రేపావు, ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమయ్యావు’ అని అన్నారు.
1KI 21:23 “అంతేకాక యెజెబెలు గురించి యెహోవా ఇలా చెప్తున్నారు: ‘యెజ్రెయేలు ప్రాకారం దగ్గరే యెజెబెలును కుక్కలు తింటాయి.’
1KI 21:24 “అహాబుకు చెందిన వారిలో పట్టణంలో చనిపోయేవారిని కుక్కలు తింటాయి, దేశంలో చనిపోయేవారిని పక్షులు తింటాయి.”
1KI 21:25 (తన భార్య యెజెబెలు ప్రేరేపణకు లొంగిపోయి యెహోవా దృష్టిలో చెడు చేయడానికి తనను తానే అమ్ముకున్న అహాబులాంటి వారు ముందెన్నడూ ఎవ్వడూ లేరు.
1KI 21:26 అహాబు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించేవాడు, ఇశ్రాయేలు ముందు నుండి యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల్లా అతడు చేశాడు.)
1KI 21:27 అహాబు ఆ మాటలు విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నాడు. గోనెపట్ట మీదే పడుకుంటూ దీనంగా తిరిగాడు.
1KI 21:28 అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు వచ్చింది:
1KI 21:29 “అహాబు నా ఎదుట ఎలా తగ్గించుకున్నాడో గమనించావా? అతడు తనను తాను తగ్గించుకున్నందుకు అతని జీవితకాలంలో ఈ విపత్తును తీసుకురాను, కాని అతని వంశం మీద తన కుమారుని కాలంలో దానిని తెస్తాను.”
1KI 22:1 అరాము, ఇశ్రాయేలు మధ్య మూడు సంవత్సరాలు యుద్ధం జరగలేదు.
1KI 22:2 మూడవ సంవత్సరంలో యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబును సందర్శించడానికి వెళ్లాడు.
1KI 22:3 ఇశ్రాయేలు రాజు తన అధికారులతో, “రామోత్ గిలాదు మనదే అయినప్పటికీ దానిని అరాము రాజు చేతిలో నుండి తిరిగి తీసుకోవడానికి మనం ఏ ప్రయత్నం చేయడం లేదని మీకు తెలీదా?” అని అన్నాడు.
1KI 22:4 కాబట్టి అతడు యెహోషాపాతును, “నాతో కూడా రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వస్తావా?” అని అడిగాడు. అందుకు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, “నేను మీవాన్ని, నా ప్రజలు మీ ప్రజలు, నా గుర్రాలు మీ గుర్రాలు” అన్నాడు.
1KI 22:5 అయితే యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, “మొదట యెహోవా సలహాను తీసుకుందాం” అని కూడా అన్నాడు.
1KI 22:6 కాబట్టి ఇశ్రాయేలు రాజు సుమారు నాలుగువందలమంది ప్రవక్తలను పిలిపించి, “నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా? లేదా వెళ్లొద్దా?” అని వారిని అడిగాడు. “వెళ్లండి! దానిని యెహోవా రాజు వశం చేస్తారు” అని వారు జవాబిచ్చారు.
1KI 22:7 అయితే యెహోషాపాతు, “మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త ఒక్కడు కూడా ఇక్కడ లేడా?” అని అడిగాడు.
1KI 22:8 అందుకు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “ఇంకొక ప్రవక్త ఉన్నాడు, అతని ద్వారా యెహోవా దగ్గర విచారణ చేయవచ్చు. కాని, నాకు అతడంటే అయిష్టం, ఎందుకంటే అతడు నా గురించి ఎప్పుడూ మంచిని ప్రవచించడు, ఎప్పుడూ చెడ్డగానే ప్రవచిస్తాడు. అతడు ఇమ్లా కుమారుడైన మీకాయా” అని చెప్పాడు. అందుకు యెహోషాపాతు, “రాజా, మీరు అలా అనవద్దు” అన్నాడు.
1KI 22:9 అప్పుడు ఇశ్రాయేలు రాజు తన అధికారులలో ఒకరిని పిలిచి, “వెంటనే వెళ్లి ఇమ్లా కుమారుడైన మీకాయాను తీసుకురా” అని చెప్పాడు.
1KI 22:10 ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకొని సమరయ నగర ద్వారం దగ్గర ఉన్న నూర్పిడి కళ్ళం దగ్గరలో ప్రవక్తలంతా ప్రవచిస్తూ ఉండగా, తమ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు.
1KI 22:11 అప్పుడు కెనాన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేసుకుని వచ్చి, “యెహోవా చెప్పే మాట ఇదే; ‘అరామీయులు నాశనమయ్యే వరకు మీరు వీటితో వారిని పొడుస్తారు’ ” అని చెప్పాడు.
1KI 22:12 ఇతర ప్రవక్తలంతా కూడా అదే విషయాన్ని ప్రవచించారు. “రామోత్ గిలాదు మీద దాడి చేయండి విజయం పొందండి, ఎందుకంటే యెహోవా దాన్ని రాజు చేతికి అప్పగిస్తారు” అని వారన్నారు.
1KI 22:13 మీకాయాను పిలువడానికి వెళ్లిన దూత మీకాయాతో, “చూడు, ఇతర ప్రవక్తలందరు రాజుకు విజయం కలుగుతుందని చెప్తున్నారు. వారి మాటతో నీ మాట ఏకమై, అనుకూలంగా పలుకాలి” అన్నాడు.
1KI 22:14 అయితే మీకాయా, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నా, యెహోవా నాకు చెప్పేది మాత్రమే నేను అతనికి చెప్పగలను” అని అన్నాడు.
1KI 22:15 అతడు వచ్చినప్పుడు రాజు అతన్ని, “మీకాయా, మేము రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా, లేదా?” అని అడిగాడు. అందుకతడు, “దాడి చేయండి, విజయం పొందండి, ఎందుకంటే యెహోవా దానిని రాజు చేతికి అప్పగిస్తారు” అని జవాబిచ్చాడు.
1KI 22:16 రాజు అతనితో, “యెహోవా పేరిట నాకు సత్యమే చెప్పమని నేనెన్నిసార్లు నీ చేత ప్రమాణం చేయించాలి?” అని అన్నాడు.
1KI 22:17 అప్పుడు మీకాయా జవాబిస్తూ, “ఇశ్రాయేలీయులందరు కాపరి లేని గొర్రెల్లా కొండలమీద చెదిరిపోయినట్లు దర్శనం చూశాను. ‘ఈ ప్రజలకు యజమాని లేడు. ప్రతి ఒక్కరు సమాధానంగా ఇంటికి వెళ్లాలి’ అని యెహోవా చెప్తున్నారు” అన్నాడు.
1KI 22:18 ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “నా గురించి ఇతడు ఎన్నడు మంచిని ప్రవచించడు, చెడు మాత్రమే ప్రవచిస్తాడు అని మీతో చెప్పలేదా?” అని అన్నాడు.
1KI 22:19 మీకాయా ఇంకా ఇలా అన్నాడు, “కాబట్టి యెహోవా మాట వినండి: యెహోవా తన సింహాసనంపై కూర్చుని ఉండగా తన చుట్టూ తన కుడి ఎడమలు పరలోక సమూహాలన్ని నిలబడి ఉండడం నేను చూశాను.
1KI 22:20 అప్పుడు యెహోవా, ‘అహాబు రామోత్ గిలాదు మీదికి వెళ్లి అక్కడ చచ్చేలా అతన్ని ఎవరు ప్రలోభపెడతారు?’ అని అడిగారు. “ఒకడు ఒక విధంగా ఇంకొకడు ఇంకొక విధంగా చెప్పారు.
1KI 22:21 చివరికి ఒక ఆత్మ ముందుకు వచ్చి యెహోవా సమక్షంలో నిలబడి, ‘నేను అతన్ని ప్రలోభపెడతాను’ అన్నాడు.
1KI 22:22 “ ‘ఎలా?’ అని యెహోవా అడిగారు. “ ‘నేను వెళ్లి అతని ప్రవక్తలందరి నోట మోసగించే ఆత్మగా ఉంటాను’ అని అతడు చెప్పాడు. “అందుకు యెహోవా, ‘నీవు అతన్ని ప్రలోభపెట్టడంలో విజయం సాధిస్తావు. వెళ్లు అలాగే చేయి’ అన్నారు.
1KI 22:23 “కాబట్టి యెహోవా నీ ఈ ప్రవక్తలందరి నోట మోసపరచే ఆత్మను ఉంచారు. యెహోవా ఈ విపత్తును నీకోసం నిర్ణయించారు.”
1KI 22:24 అప్పుడు కెనాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి మీకాయాను చెంపమీద కొట్టాడు. “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా నుండి వెళ్లినప్పుడు ఏ మార్గాన వెళ్లాడు?” అని అతడు అడిగాడు.
1KI 22:25 మీకాయా జవాబిస్తూ, “నీవు దాక్కోడానికి లోపలి గదిలోకి చొరబడే రోజున నీవు తెలుసుకుంటావు” అన్నాడు.
1KI 22:26 అప్పుడు ఇశ్రాయేలు రాజు, “మీకాయాను నగర పాలకుడైన ఆమోను దగ్గరకు, అలాగే రాకుమారుడైన యోవాషు దగ్గరకు తీసుకెళ్లి,
1KI 22:27 వారితో ఇలా చెప్పండి, ‘రాజు ఇలా అన్నారు: నేను క్షేమంగా తిరిగి వచ్చేవరకు, ఇతన్ని చెరసాలలో ఉంచి అతనికి రొట్టె, నీరు తప్ప ఏమి ఇవ్వకండి’ ” అని ఆదేశించాడు.
1KI 22:28 మీకాయా, “ఒకవేళ మీరు క్షేమంగా వస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడలేదని అర్థం. ప్రజలారా, మీరంతా నా మాట గుర్తు పెట్టుకోండి!” అని ప్రకటించాడు.
1KI 22:29 కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్ గిలాదు మీదికి వెళ్లారు.
1KI 22:30 ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “యుద్ధంలో ప్రవేశించేటప్పుడు నేను మారువేషంలో యుద్ధానికి వెళ్తాను, మీరు మాత్రం మీ రాజవస్త్రాలు ధరించుకోండి” అని అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు మారువేషంలో యుద్ధానికి వెళ్లాడు.
1KI 22:31 సిరియా రాజు తన ముప్పై రెండు మంది రథాధిపతులకు, “మీరు ఇశ్రాయేలు రాజు ఒక్కనితో తప్ప, చిన్నవారితో గాని గొప్పవారితో గాని యుద్ధం చేయకూడదు” అని ఆదేశించాడు.
1KI 22:32 అయితే ఆ రథాధిపతులు యెహోషాపాతును చూసి, “ఖచ్చితంగా ఇతడే ఇశ్రాయేలు రాజు” అనుకుని, అతనిపై దాడి చేయడానికి అతని మీదికి రాగా యెహోషాపాతు బిగ్గరగా కేక వేసినప్పుడు,
1KI 22:33 అతడు ఇశ్రాయేలు రాజు కాడని రథాధిపతులు తెలుసుకొని అతన్ని తరమడం ఆపివేశారు.
1KI 22:34 అయితే ఒకడు విల్లెక్కుపెట్టి గురి చూడకుండ బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజుకు కవచం అతుకు మధ్యలో గుచ్చుకుంది. రాజు తన రథసారధితో, “రథం వెనుకకు త్రిప్పి నన్ను యుద్ధం నుండి బయటకు తీసుకెళ్లు, నేను గాయపడ్డాను” అని అన్నాడు.
1KI 22:35 ఆ రోజంతా హోరాహోరీగా యుద్ధం జరిగింది, రాజు అరామీయులకు ఎదురుగా తన రథం మీద ఉన్నాడు. అతని గాయం నుండి కారిన రక్తం రథం అడుగు భాగానికి చేరింది. ఆ సాయంకాలం అతడు చనిపోయాడు.
1KI 22:36 సూర్యాస్తమయం అవుతున్నప్పుడు, “ప్రతి ఒక్కరు తన పట్టణానికి వెళ్లాలి, ప్రతి ఒక్కడు తన దేశానికి వెళ్లాలి!” అనే వార్త సైన్యమంతా వ్యాపించింది.
1KI 22:37 అలా రాజు చనిపోయాడు. వారు అతన్ని సమరయకు తీసుకువచ్చి అక్కడే అతన్ని సమాధి చేశారు.
1KI 22:38 వారు సమరయలో ఒక చెరువు దగ్గర అతన్ని రథాన్ని కడిగారు (అక్కడ వేశ్యలు స్నానం చేసేవారు). యెహోవా చెప్పినట్లే కుక్కలు వచ్చి అతని రక్తం నాకాయి.
1KI 22:39 అహాబు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, దంతంతో అతడు కట్టించుకున్న భవనం గురించి, అతడు పటిష్టం చేసుకున్న పట్టణాల గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
1KI 22:40 అహాబు చనిపోయి తన పూర్వికుల దగ్గర చేరాడు. అతని తర్వాత అతని కుమారుడైన అహజ్యా రాజయ్యాడు.
1KI 22:41 ఇశ్రాయేలు రాజైన అహాబు పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో ఆసా కుమారుడైన యెహోషాపాతు యూదాకు రాజయ్యాడు.
1KI 22:42 యెహోషాపాతు యూదాకు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తె.
1KI 22:43 ప్రతీ విషయంలో అతడు తన తండ్రి ఆసా విధానాలను అనుసరించాడు, వాటినుండి తొలగిపోలేదు; అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు, ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
1KI 22:44 అంతేకాక యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి కలిగి ఉన్నాడు.
1KI 22:45 యెహోషాపాతు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతని విజయాలు, యుద్ధం విన్యాసాలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
1KI 22:46 అతడు తన తండ్రి ఆసా పాలన తర్వాత కూడా అక్కడ మిగిలిపోయిన ఆలయాలలో ఉన్న పురుష వేశ్యలను దేశంలో నుండి తొలగించాడు.
1KI 22:47 ఆ రోజుల్లో ఎదోము దేశానికి రాజు లేడు; ఒక ప్రాంతీయ అధికారి పరిపాలించేవాడు.
1KI 22:48 యెహోషాపాతు బంగారం తెప్పించాలని ఓఫీరుకు వెళ్లడానికి తర్షీషు ఓడలను నిర్మించాడు కాని అవి సముద్రయానం చేయకుండానే ఎసోన్-గెబెరు దగ్గర బద్దలైపోయాయి.
1KI 22:49 అప్పుడు అహాబు కుమారుడైన అహజ్యా యెహోషాపాతుతో, “నా మనుష్యులను మీ మనుష్యులతో పాటు ఓడలో ప్రయాణం చెయ్యనివ్వండి” అన్నాడు కాని యెహోషాపాతు ఒప్పుకోలేదు.
1KI 22:50 తర్వాత యెహోషాపాతు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, తన తండ్రి దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు.
1KI 22:51 యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలోని పదిహేడవ సంవత్సరంలో అహాబు కుమారుడైన అహజ్యా ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు. అతడు ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పరిపాలించాడు.
1KI 22:52 అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు తన తల్లిదండ్రుల విధానాలను ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము జీవిత విధానాలను అనుసరించాడు.
1KI 22:53 అతడు బయలును సేవిస్తూ పూజిస్తూ, తన తండ్రిలా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు.
2KI 1:1 అహాబు చనిపోయిన తర్వాత, మోయాబు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేసింది.
2KI 1:2 ఆ కాలంలో ఒక రోజు అహజ్యా రాజు సమరయలో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు, “నేను ఈ గాయం నుండి కోలుకుంటానో లేదో మీరు వెళ్లి, ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయండి” అని దూతలకు చెప్పి పంపించాడు.
2KI 1:3 అయితే యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో, “నీవు వెళ్లి, సమరయ రాజు పంపిన దూతలను కలిసి, ‘ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నారా?’
2KI 1:4 అయితే యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీవు పడుకున్న మంచం దిగవు, నీవు తప్పక చస్తావు!’ అని చెప్పు.” కాబట్టి ఏలీయా ఈ వార్త చెప్పడానికి వెళ్లాడు.
2KI 1:5 ఆ దూతలు రాజు దగ్గరకు తిరిగి వెళ్లగా అతడు వారిని, “మీరు ఎందుకు తిరిగి వచ్చారు?” అని అడిగాడు.
2KI 1:6 అందుకు వారు, “ఒక మనుష్యుడు మాకు ఎదురయ్యాడు” అన్నారు. “అందుకతడు మాతో ఇలా అన్నాడు, ‘మీరు వెనక్కి వెళ్లి మిమ్మల్ని పంపించిన రాజుకు ఇలా చెప్పండి, “యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి దూతలను పంపారా? నీవు చేసిన దాన్ని బట్టి నీవు ఎక్కిన మంచం దిగవు, నీవు తప్పక చస్తావు!” ’ ”
2KI 1:7 రాజు వారిని, “మిమ్మల్ని కలుసుకోడానికి వచ్చి ఈ మాటలు చెప్పిన మనిషి ఎలా ఉంటాడు?” అని అడిగాడు.
2KI 1:8 అందుకు వారు, “అతడు గొంగళి కప్పుకున్నాడు, నడుముకు తోలుతో చేసిన నడికట్టు కట్టుకున్నాడు” అని చెప్పారు. అప్పుడు రాజు, “అతడు తిష్బీయుడైన ఏలీయా” అని అన్నాడు.
2KI 1:9 అప్పుడు రాజు ఒక అధిపతిని, తనతో పాటు యాభైమంది మనుష్యులను ఏలీయా దగ్గరకు పంపాడు. ఒక కొండమీద కూర్చుని ఉన్న ఏలీయా దగ్గరకు ఆ అధిపతి ఎక్కి వెళ్లి, “దైవజనుడా, ‘క్రిందికి రా!’ అని రాజు చెప్తున్నారు” అని చెప్పాడు.
2KI 1:10 ఏలీయా అధిపతికి జవాబిస్తూ అన్నాడు, “నేనే దైవజనుడనైతే, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ యాభైమంది మనుష్యులను దహించును గాక!” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ అధిపతిని అతని యాభైమంది మనుష్యులను దహించివేసింది.
2KI 1:11 అందుకు రాజు వేరొక అధిపతిని, అతనితో పాటు యాభైమంది మనుష్యులను ఏలీయా దగ్గరకు పంపాడు. ఆ అధిపతి, “దైవజనుడా! రాజు నీతో, ‘వెంటనే క్రిందికి రా!’ అని అన్నారు” అని చెప్పాడు.
2KI 1:12 ఏలీయా జవాబిస్తూ, “నేనే దైవజనుడనైతే, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ యాభైమంది మనుష్యులను దహించును గాక!” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ అధిపతిని అతని యాభైమంది మనుష్యులను దహించివేసింది.
2KI 1:13 రాజు మూడవ అధిపతిని అతనితో పాటు యాభైమంది మనుష్యులను పంపాడు. ఈ మూడవ అధిపతి కొండెక్కి వెళ్లి, ఏలీయా ముందు మోకాళ్లమీద ఉండి, “దైవజనుడా” అని వేడుకున్నాడు, “నా ప్రాణాన్ని మీ సేవకులైన ఈ యాభైమంది ప్రాణాలను కాపాడండి!
2KI 1:14 చూడండి, ఆకాశం నుండి అగ్ని దిగి ముందు వచ్చిన అధిపతులిద్దరిని వారితో పాటు వచ్చిన మనుష్యులందరిని దహించివేసింది. దయచేసి నా ప్రాణాన్ని కాపాడండి” అని అతడు బ్రతిమిలాడాడు.
2KI 1:15 యెహోవా దూత ఏలీయాతో, “అతనితో దిగి వెళ్లు; అతనికి భయపడకు” అని చెప్పినప్పుడు ఏలీయా లేచి అతనితో కొండ దిగి రాజు దగ్గరకు వెళ్లాడు.
2KI 1:16 అతడు రాజుతో, “యెహోవా చెప్పే మాట ఇదే: ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి దూతలను పంపించావా? నీవు చేసిన దాన్ని బట్టి నీవు ఎక్కిన మంచం మళ్ళీ దిగవు, అక్కడే చస్తావు!” అని అన్నాడు.
2KI 1:17 కాబట్టి ఏలీయా చెప్పిన యెహోవా వాక్కు ప్రకారమే అతడు చనిపోయాడు. అహజ్యాకు కుమారుడు లేనందుకు, యూదాలో రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యోరాము రాజయ్యాడు.
2KI 1:18 అహజ్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
2KI 2:1 యెహోవా ఏలీయాను ఆకాశంలోకి సుడిగాలిలో తీసుకెళ్లే సమయం ఆసన్నమైనప్పుడు ఏలీయా, ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరారు.
2KI 2:2 అప్పుడు ఏలీయా ఎలీషాతో, “నీవు ఇక్కడే ఉండు; యెహోవా నన్ను బేతేలుకు వెళ్లమన్నారు” అని చెప్పాడు. అయితే ఎలీషా, “సజీవుడైన యెహోవా మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడువను” అన్నాడు. కాబట్టి వారు బేతేలుకు వెళ్లారు.
2KI 2:3 బేతేలులో ఉన్న ప్రవక్తల బృందం వారు ఎలీషా దగ్గరకు వచ్చి, “ఈ రోజు యెహోవా నీ గురువును నీ దగ్గరనుండి తీసుకెళ్తున్నారని నీకు తెలుసా?” అని అడిగారు. ఎలీషా జవాబిస్తూ, “నాకు తెలుసు, ఊరుకోండి” అన్నాడు.
2KI 2:4 తర్వాత ఏలీయా అతనితో అన్నాడు, “ఎలీషా, నీవు ఇక్కడ ఉండు. యెహోవా నన్ను యెరికోకు వెళ్లమన్నారు.” అతడు జవాబిస్తూ అన్నాడు, “సజీవుడైన యెహోవా మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడువను.” కాబట్టి వారు యెరికోకు వెళ్లారు.
2KI 2:5 యెరికోలో ఉన్న ప్రవక్తల బృందం వారు ఎలీషా దగ్గరకు వచ్చి, “ఈ రోజు యెహోవా నీ గురువును నీ దగ్గర నుండి తీసుకెళ్తున్నారని నీకు తెలుసా?” అని అడిగారు. ఎలీషా జవాబిస్తూ, “నాకు తెలుసు, ఊరుకోండి” అన్నాడు.
2KI 2:6 తర్వాత ఏలీయా అతనితో, “ఎలీషా, నీవు ఇక్కడే ఉండు. యెహోవా నన్ను యొర్దానుకు వెళ్లమన్నారు” అని చెప్పాడు. కాని అతడు, “సజీవుడైన యెహోవా మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడువను” అన్నాడు. కాబట్టి ఆ ఇద్దరు నడుచుకుంటూ వెళ్లారు.
2KI 2:7 ప్రవక్త బృందంలో నుండి యాభైమంది మనుష్యులు యొర్దాను దగ్గర ఆగిన ఏలీయా, ఎలీషాలకు ఎదురుగా నిలబడ్డారు.
2KI 2:8 ఏలీయా తన పైవస్త్రాన్ని తీసి, మడతపెట్టి నీళ్లను కొట్టాడు, నీళ్లు కుడి వైపుకు, ఎడమవైపుకు చీలిపోయాయి, వారిద్దరు పొడినేల మీద నడిచివెళ్లారు.
2KI 2:9 వారు దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, “నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్లక ముందు, నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు” అన్నాడు. అందుకు ఎలీషా అన్నాడు, “నీ మీద ఉన్న ఆత్మ నా మీద రెండంతలుగా నేను పొందుకోనివ్వు.”
2KI 2:10 అందుకు ఏలీయా, “నీవు అడిగింది కష్టమైనది, అయితే నన్ను తీసుకువెళ్లే సమయంలో నీవు నన్ను చూస్తే నీవు దానిని పొందుకుంటావు, చూడకపోతే నీవు పొందుకోవు” అని చెప్పాడు.
2KI 2:11 వారు కలిసి మాట్లాడుతూ నడుస్తూ వెళ్తున్నప్పుడు, అకస్మాత్తుగా అగ్ని గుర్రాలతో ఉన్న అగ్ని రథం వచ్చి వారిద్దరిని వేరు చేసింది. ఏలీయా సుడిగాలిలో ఆకాశంలోకి పైకి వెళ్లిపోయాడు.
2KI 2:12 ఎలీషా అది చూస్తూ, “నా తండ్రీ! నా తండ్రీ! ఇశ్రాయేలు రథాలు, రౌతులు నీవే!” అని కేక పెట్టాడు. ఎలీషా అతన్ని మరలా చూడలేదు. అప్పుడు అతడు తాను వేసుకున్న బట్టలు రెండుగా చింపుకున్నాడు.
2KI 2:13 ఎలీషా, ఏలీయా మీద నుండి క్రిందపడ్డ అతని పైవస్త్రాన్ని తీసుకుని తిరిగి యొర్దాను ఒడ్డుకు వచ్చి నిలబడ్డాడు.
2KI 2:14 ఎలీషా ఏలీయా మీద నుండి క్రిందపడ్డ పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీళ్లను కొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?” అన్నాడు. అతడు ఆ నీళ్లను కొట్టినప్పుడు ఆ నీళ్లు కుడి వైపుకు ఎడమవైపుకు విడిపోగా అతడు అవతలి ఒడ్డుకు వెళ్లాడు.
2KI 2:15 దీనిని చూస్తున్న యెరికోలో ఉన్న ప్రవక్తల బృందం వారు, “ఏలీయా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది” అని చెప్పి అతన్ని కలుసుకోడానికి వెళ్లి అతని ఎదుట సాష్టాంగపడ్డారు.
2KI 2:16 వారు అన్నారు, “చూడండి, మీ సేవకులైన మా దగ్గర సమర్థులైన యాభైమంది మనుష్యులు ఉన్నారు. వారు వెళ్లి మీ గురువును వెదుకుతారు. బహుశ యెహోవా ఆత్మ అతన్ని తీసుకెళ్లి, ఏదైనా కొండమీదో లేదా ఏదైన లోయలోనో వదిలి ఉండవచ్చు” అన్నారు. అందుకు ఎలీషా, “వద్దు, వారిని పంపకండి” అన్నాడు.
2KI 2:17 అతడు విసిగిపోయేంతగా వారు పట్టుబట్టినందుకు అతడు, “పంపండి” అన్నాడు. వారు యాభైమంది మనుష్యులను పంపారు, వారు ఏలీయా కోసం మూడు రోజులు గాలించారు కాని అతన్ని కనుగొనలేకపోయారు.
2KI 2:18 వారు యెరికోలో నివసిస్తున్న ఎలీషా దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు, అతడు వారితో, “మీరు వెళ్లవద్దని నేను చెప్పలేదా?” అన్నాడు.
2KI 2:19 పట్టణ వాసులు ఎలీషాతో, “చూడండి, మా ప్రభువా, ఈ పట్టణం మంచి స్థలంలో ఉంది, కాని నీళ్లు మంచివి కావు, భూమి నిస్సారంగా ఉంది” అన్నారు.
2KI 2:20 అతడు, “క్రొత్త గిన్నెలో ఉప్పు వేసి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు. వారు దానిని అతని దగ్గరకు తెచ్చారు.
2KI 2:21 అప్పుడు అతడు ఊట దగ్గరకు వెళ్లి అందులో ఆ ఉప్పు వేసి, “యెహోవా చెప్పే మాట ఇదే: నేను ఈ నీళ్లను బాగుచేశాను. ఇక మీద ఇది చావును తీసుకురాదు; భూమిని నిస్సారంగా చేయదు” అని అన్నాడు.
2KI 2:22 ఎలీషా చెప్పిన మాట ప్రకారం ఈ రోజు వరకు ఆ నీరు ఆరోగ్యకరంగా ఉంది.
2KI 2:23 అక్కడినుండి ఎలీషా బేతేలుకు వెళ్లాడు. అతడు దారిన వెళ్తుండగా పట్టణంలో నుండి కొంతమంది బాలురు వచ్చి, “బోడివాడా, ఇక్కడినుండి వెళ్లిపో! బోడివాడా, ఇక్కడినుండి వెళ్లిపో!” అంటూ అతని గేలి చేశారు.
2KI 2:24 అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా పేరిట వారిని శపించాడు. అప్పుడు రెండు ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలభై రెండు మందిని ముక్కలు ముక్కలుగా చీల్చాయి.
2KI 2:25 అతడు అక్కడినుండి కర్మెలు పర్వతానికి వెళ్లి, అక్కడినుండి సమరయకు తిరిగి వెళ్లాడు.
2KI 3:1 యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో అహాబు కుమారుడైన యోరాము సమరయలో ఇశ్రాయేలు మీద రాజయ్యాడు. అతడు పన్నెండు సంవత్సరాలు పరిపాలించాడు.
2KI 3:2 అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు కాని తన తల్లిదండ్రులు చేసినట్లు చేయలేదు. తన తండ్రి నిలబెట్టిన బయలు పవిత్ర రాతిని తీసివేశాడు.
2KI 3:3 అయితే ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలనే ఇతడు కూడా చేస్తూ వచ్చాడు.
2KI 3:4 మోయాబు రాజైన మేషాకు చాలా గొర్రెలు ఉండేవి. అతడు ఇశ్రాయేలు రాజుకు లక్ష గొర్రెపిల్లలను, లక్ష పొట్టేళ్ళ ఉన్నిని పన్నుగా చెల్లిస్తూ వచ్చాడు.
2KI 3:5 అయితే అహాబు చనిపోయిన తర్వాత, మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగబడ్డాడు.
2KI 3:6 కాబట్టి ఆ సమయంలో రాజైన యెహోరాము సమరయ నుండి బయలుదేరి ఇశ్రాయేలంతటిని సమకూర్చాడు.
2KI 3:7 అతడు యూదా రాజైన యెహోషాపాతుకు, “మోయాబు రాజు నా మీద తిరుగబడ్డాడు, మీరు నాతో కూడా మోయాబు మీదికి యుద్ధానికి వస్తారా?” అని కబురు పంపాడు. అందుకు యెహోషాపాతు, “నేను మీలాంటి వాడినే, నా ప్రజల మీ ప్రజలు, నా గుర్రాలు మీ గుర్రాలు” అని అన్నాడు.
2KI 3:8 యెహోషాపాతు, “ఏ దారి నుండి మనం దాడి చేద్దాం?” అని అడిగాడు. అందుకు, “ఎదోము ఎడారి దారి నుండి” అని యోరాము జవాబిచ్చాడు.
2KI 3:9 కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదారాజు, ఎదోము రాజు కలిసి బయలుదేరి ఏడు రోజులు చుట్టూ తిరిగి ప్రయాణించిన తర్వాత సైన్యానికి పశువులకు వారి దగ్గర నీళ్లు మిగల్లేదు.
2KI 3:10 ఇశ్రాయేలు రాజైన యోరాము ఆతురతతో, “అయ్యో! యెహోవా మోయాబుకు అప్పగించడానికి మన ముగ్గురు రాజులను పిలిచారా?” అని అన్నాడు.
2KI 3:11 అయితే యెహోషాపాతు, “యెహోవా దగ్గర విచారించడానికి ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా?” అని అడిగాడు. ఇశ్రాయేలు రాజు పరివారంలో ఒకడు, “షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడు. అతడు ఏలీయా చేతుల మీద నీళ్లు పోసేవాడు” అని చెప్పాడు.
2KI 3:12 యెహోషాపాతు, “అతని దగ్గర యెహోవా వాక్కు ఉంది” అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతు, ఎదోము రాజు ముగ్గురు అతని దగ్గరకు వెళ్లారు.
2KI 3:13 ఎలీషా ఇశ్రాయేలు రాజుతో, “నా దగ్గరకు ఎందుకు వచ్చావు? నీ తండ్రి ప్రవక్తల దగ్గరకు, నీ తల్లి ప్రవక్తల దగ్గరకు వెళ్లు” అన్నాడు. ఇశ్రాయేలు రాజు జవాబిస్తూ, “లేదు, యెహోవా మా ముగ్గురు రాజులను మోయాబుకు అప్పగించడానికి పిలిచారు” అన్నాడు.
2KI 3:14 అందుకు ఎలీషా ఇలా అన్నాడు, “నేను సేవించే సజీవుడైన సైన్యాల యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్నాను, యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవించకపోతే, అసలు నీవైపు చూసేవాన్ని కూడా కాదు.
2KI 3:15 సరే, ఒక తంతివాద్యం వాయించేవాన్ని నా దగ్గరకు తీసుకురా.” తంతివాద్యం వాయించేవాడు వాయిస్తూ ఉన్నప్పుడు, యెహోవా హస్తం ఎలీషా మీదికి వచ్చింది.
2KI 3:16 అప్పుడతడు, “యెహోవా చెప్పే మాట ఇదే: నేను ఈ లోయను నీటి గుంటలతో నింపుతాను.
2KI 3:17 ఎందుకంటే యెహోవా చెప్పే మాట ఇదే: గాలి గాని వాన గాని మీరు చూడరు, అయినా నీళ్ల గుంటలతో ఈ లోయ నిండిపోతుంది. మీరు మీ మందలు ఇతర జంతువులు త్రాగడానికి నీళ్లు ఉంటాయి.
2KI 3:18 యెహోవా దృష్టికి ఇది తేలికైన పని; ఆయన మోయాబును కూడ మీ చేతులకు అప్పగిస్తారు.
2KI 3:19 మీరు కోటగోడలు గల ప్రతి పట్టణాన్ని, ప్రతి ప్రధాన పట్టణాన్ని పడగొడతారు. అలాగే మీరు ప్రతి మంచి చెట్టును నరికి ఊటలన్నిటిని పూడ్చి ప్రతి మంచి పొలాన్ని రాళ్లతో నింపి పాడుచేస్తారు” అని చెప్పాడు.
2KI 3:20 మరుసటి ఉదయం బలి అర్పించే సమయంలో, ఎదోము వైపు నుండి నీళ్లు వచ్చాయి. ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది.
2KI 3:21 రాజులు తమతో యుద్ధం చేయడానికి వచ్చారని మోయాబీయులు విని యువకులు మొదలుకొని వృద్ధుల వరకు ఆయుధాలు ధరించగలిగిన వారంతా సరిహద్దు దగ్గర గుమికూడారు.
2KI 3:22 ఉదయం వారు లేచినప్పుడు సూర్యకిరణాలు నీళ్ల మీద పడగా, మోయాబీయులకు తమ ఎదురుగా ఉన్న నీళ్లు రక్తంలా ఎర్రగా కనబడ్డాయి.
2KI 3:23 వారు, “అది రక్తం! రాజులు ఒకడితో ఒకడు యుద్ధం చేసుకుని ఒకనినొకడు చంపుకొని ఉంటారు. ఇప్పుడు మోయాబు వారలారా! రండి దోపుడుసొమ్ము పట్టుకుందాం” అని చెప్పుకున్నారు.
2KI 3:24 మోయాబీయులు ఇశ్రాయేలు శిబిరం చేరినప్పుడు, ఇశ్రాయేలీయులు లేచి వారితో పోరాడగా వారు నిలబడలేక పారిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీయులు మోయాబును ఆక్రమించుకుని మోయాబీయులను హతం చేశారు.
2KI 3:25 వారి పట్టణాలు పడగొట్టారు, ప్రతి మంచి పొలాన్ని రాళ్లతో నింపివేయడానికి ప్రతి మనిషి ఒక రాయిని వేశాడు. వారు ఊటలన్నిటిని మూసి, ప్రతి మంచి చెట్టును నరికివేశారు. కీర్ హరెశెతు పట్టణాన్ని మాత్రం దాని ప్రాకారంతో ఉండనిచ్చారు. కాని వడిసెలతో ఉన్నవారు దానిని కూడా చుట్టుముట్టి దాడి చేశారు.
2KI 3:26 మోయాబు రాజు యుద్ధం తన చేజారిపోతుందని గ్రహించి, ఖడ్గం దూసే ఏడు వందల మందిని వెంటబెట్టుకొని ఎదోము రాజు దగ్గరకు చేధించుకొని వెళ్లాలని చూశాడు కాని అది సాధ్యం కాలేదు.
2KI 3:27 అప్పుడు అతడు తన తర్వాత రాజు కావలసిన తన పెద్ద కుమారుని తీసుకెళ్లి పట్టణ ప్రాకారం మీద బలిగా అర్పించాడు. ఇశ్రాయేలువారి మీద తీవ్రమైన కోపం కలిగింది; వారు అతన్ని విడిచిపెట్టి తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు.
2KI 4:1 ఒక రోజు ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, “మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు, అతడు యెహోవా పట్ల భక్తి కలవాడని మీకు తెలుసు. అయితే ఇప్పుడు అతనికి అప్పిచ్చినవాడు నా ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకెళ్లడానికి వస్తున్నాడు” అని మొరపెట్టింది.
2KI 4:2 ఎలీషా, “నేను నీకెలా సహాయం చేయాలి? నీ ఇంట్లో ఏముందో చెప్పు” అన్నాడు. “నీ సేవకురాలి దగ్గర ఒక చిన్న పాత్రలో కొంచెం ఒలీవనూనె తప్ప ఇంకేమి లేదు” అని ఆమె చెప్పింది.
2KI 4:3 అప్పుడు ఎలీషా, “నీవు వెళ్లి, నీ పొరుగు వారందరి దగ్గర ఖాళీ పాత్రలను అడుగు. ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకో.
2KI 4:4 అప్పుడు నీవు, నీ కుమారులు ఇంట్లోకి వెళ్లి తలుపు మూసి ఆ పాత్రలన్నిట్లో నూనె పోసి నిండినవాటిని ప్రక్కన పెట్టండి” అని చెప్పాడు.
2KI 4:5 ఆమె అతని దగ్గర నుండి వెళ్లి, తన కుమారులతో లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. వారు ఆమె దగ్గరకు తెచ్చిన పాత్రలన్నిట్లో ఆమె నూనె పోస్తూ ఉంది.
2KI 4:6 పాత్రలన్నీ నిండినప్పుడు ఆమె తన కుమారునితో, “ఇంకొకటి తీసుకురా” అన్నది. అతడు, “ఇంకొక పాత్ర లేదు” అని జవాబిచ్చాడు. అప్పుడు నూనె ప్రవాహం ఆగిపోయింది.
2KI 4:7 ఆమె వెళ్లి దైవజనునికి చెప్పగా అతడు, “వెళ్లు, ఆ నూనె అమ్మి, నీ అప్పు తీర్చుకో. మిగిలిన దానితో నీవు, నీ కుమారులు జీవనం కొనసాగించండి” అన్నాడు.
2KI 4:8 ఒక రోజు ఎలీషా షూనేముకు వెళ్లాడు. అక్కడ ఒక ధనికురాలు ఉండేది, ఆమె భోజనానికి రావాలని అతన్ని ప్రాధేయపడింది. కాబట్టి అతడు ఆ దారిన వెళ్లేటప్పుడు అక్కడ భోజనం చేయడానికి ఆగేవాడు.
2KI 4:9 ఆమె తన భర్తతో, “మన దారిలో వస్తూ వెళ్తూ ఉండే ఈ మనిషి పరిశుద్ధుడైన దైవజనుడని నాకు తెలుసు.
2KI 4:10 మనం పైకప్పు మీద చిన్న గది కట్టి అందులో పడక, బల్ల, కుర్చీ, దీపం ఉంచుదాము. మన దగ్గరకు అతడు వచ్చినప్పుడెల్లా, అతడు ఆ గదిలో ఉండవచ్చు” అని చెప్పింది.
2KI 4:11 ఒక రోజు ఎలీషా అక్కడికి వచ్చి ఆ మేడ గదిలో పడుకున్నాడు.
2KI 4:12 తర్వాత అతడు తన సేవకుడైన గేహజీతో, “షూనేమీయురాలిని పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలువగానే ఆమె వచ్చి అతని ముందు నిలబడింది.
2KI 4:13 ఎలీషా అతనితో, “ఆమెతో చెప్పు, ‘మాకోసం ఈ శ్రమంతా తీసుకున్నారు, ఇప్పుడు మీ కోసం ఏం చెయ్యాలో చెప్పండి. మేము మీ తరపున రాజుతో గాని సైన్యాధిపతితో గాని మాట్లాడాలా?’ ” అని అన్నాడు. అందుకామె, “నేను నా స్వజనుల మధ్య నివసిస్తున్నాను” అన్నది.
2KI 4:14 ఎలీషా, “మరి ఆమె కోసం ఏం చేస్తే బాగుంటుంది?” అని అడిగాడు. గేహజీ, “ఆమెకు కుమారుడు లేడు, ఆమె భర్త వృద్ధుడు” అని జవాబిచ్చాడు.
2KI 4:15 అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలువగా ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది.
2KI 4:16 అప్పుడు ఎలీషా, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు” అని చెప్పాడు. అందుకామె, “వద్దు, నా ప్రభువా! దయచేసి, దైవజనుడా, మీ సేవకురాలితో అబద్ధం చెప్పకండి!” అని అన్నది.
2KI 4:17 తర్వాత ఆమె గర్భవతియై మరుసటి సంవత్సరం ఎలీషా చెప్పినట్లే కుమారుని కన్నది.
2KI 4:18 ఆ బాలుడు పెరిగిన తర్వాత ఒక రోజు కోత కోసేవారి దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరకు వెళ్లాడు.
2KI 4:19 అకస్మాత్తుగా అతడు తన తండ్రితో, “నా తల! నా తల!” అన్నాడు. అతని తండ్రి తన సేవకులలో ఒకనితో, “బాలున్ని అతని తల్లి దగ్గరకు తీసుకెళ్లు” అని చెప్పాడు.
2KI 4:20 సేవకుడు బాలున్ని ఎత్తుకుని అతని తల్లి దగ్గరకు తీసుకెళ్లాడు, బాలుడు ఆమె ఒడిలో మధ్యాహ్నం వరకు కూర్చుని ఆ తర్వాత చనిపోయాడు.
2KI 4:21 ఆమె బాలున్ని తీసుకెళ్లి దైవజనుడైన ఎలీషా మంచం మీద పడుకోబెట్టి తలుపు మూసి బయటకు వెళ్లింది.
2KI 4:22 ఆమె తన భర్తను పిలిచి, “దయచేసి నా కోసం ఒక పనివాన్ని ఒక గాడిదను పంపించండి, నేను తొందరగా దైవజనుని దగ్గరకు వెళ్లి రావాలి” అని అన్నది.
2KI 4:23 అందుకతడు, “అతని దగ్గరకు ఈ రోజు ఎందుకు వెళ్తావు? ఇది అమావాస్య కాదు సబ్బాతు దినం కాదు కదా” అన్నాడు. అందుకామె, “అంతా సమాధానంగానే ఉంటుంది” అన్నది.
2KI 4:24 ఆమె గాడిద మీద జీను వేసుకుని పనివానితో, “త్వరగా నడిపించు; నేను చెప్పే వరకు నెమ్మదిగా వెళ్లకు” అని చెప్పింది.
2KI 4:25 కాబట్టి ఆమె బయలుదేరి కర్మెలు పర్వతం మీద ఉన్న దైవజనుని దగ్గరకు వచ్చింది. ఆమెను దూరం నుండి చూసి, ఆ దైవజనుడు తన సేవకుడైన గేహజీతో, “చూడు! అదిగో షూనేమీయురాలు!
2KI 4:26 ఆమెను కలుసుకోడానికి పరిగెత్తి వెళ్లి, ‘మీరు క్షేమమా? మీ భర్త క్షేమమా! మీ బాలుడు క్షేమమా?’ అని అడుగు” అన్నాడు. ఆమె, “అంతా క్షేమమే” అన్నది.
2KI 4:27 ఆమె పర్వతం మీద ఉన్న దైవజనుని చేరుకొని, అతని పాదాలు పట్టుకుంది. గేహజీ ఆమెను అవతలకు నెట్టాలని దగ్గరకు వచ్చాడు, కాని దైవజనుడు, “ఆమెను వదిలేయి! ఆమె వేదనతో ఉన్నది కాని యెహోవా ఈ విషయం నాకు చెప్పకుండా మరుగు చేశారు” అని అన్నాడు.
2KI 4:28 ఆమె, “నా ప్రభువా, మిమ్మల్ని కుమారుడు కావాలని అడిగానా? నాతో అబద్ధం చెప్పకండి అని నేను అనలేదా?” అని అన్నది.
2KI 4:29 ఎలీషా గేహజీతో, “నీ నడికట్టు బిగించుకుని, నా దండం చేతపట్టుకుని పరుగెత్తు. నీకు ఎవరైనా ఎదురైతే పలకరించవద్దు, ఎవరైనా పలకరిస్తే, జవాబివ్వకు. నా దండం బాలుని ముఖం మీద పెట్టు” అని చెప్పాడు.
2KI 4:30 అయితే ఆ బాలుని తల్లి, “సజీవుడైన యెహోవా మీద, మీమీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను మిమ్మల్ని విడిచిపెట్టను” అన్నది. కాబట్టి అతడు లేచి ఆమె వెంట వెళ్లాడు.
2KI 4:31 గేహజీ వారికంటే ముందే వెళ్లి బాలుని ముఖం మీద ఆ దండం ఉంచాడు, అయితే ఏ శబ్దం కాని స్పందన కాని లేదు. కాబట్టి గేహజీ ఎలీషాను కలుసుకోడానికి వెళ్లి అతనితో, “బాలుడు మేలుకోలేదు” అని చెప్పాడు.
2KI 4:32 ఎలీషా ఇంటికి వెళ్లి తన మంచం మీద చనిపోయి ఉన్న బాలుని చూశాడు.
2KI 4:33 అతడు గదిలోకి వెళ్లి వారిద్దరే లోపల ఉండగా తలుపు మూసి యెహోవాకు ప్రార్థన చేశాడు.
2KI 4:34 తర్వాత మంచం ఎక్కి, బాలుని నోటి మీద తన నోరు, కళ్ల మీద తన కళ్లు, చేతుల మీద చేతులు ఉంచి బాలుని మీద పడుకున్నాడు. అతడు వాడి మీద బోర్లా పడుకున్నప్పుడు బాలుని శరీరంలో వేడి పుట్టింది.
2KI 4:35 ఎలీషా మంచం దిగి గదిలో ఒకసారి అటూ ఇటూ నడిచి మరలా మంచం ఎక్కి బాలుని మీద బోర్లా పడుకున్నప్పుడు బాలుడు ఏడుసార్లు తుమ్మి కళ్లు తెరిచాడు.
2KI 4:36 ఎలీషా గేహజీని పిలిపించి, “షూనేమీయురాలిని పిలువు” అన్నాడు, అతడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చినప్పుడు అతడు, “నీ కుమారుని తీసుకో” అన్నాడు.
2KI 4:37 ఆమె లోపలికి వచ్చి, అతని కాళ్ల దగ్గర పడి నమస్కరించింది. తర్వాత ఆమె తన కుమారుని తీసుకుని బయటకు వెళ్లింది.
2KI 4:38 తర్వాత ఎలీషా గిల్గాలుకు తిరిగి వెళ్లాడు, అప్పుడు ఆ ప్రాంతంలో కరువు ఉంది. ప్రవక్తల బృందం ఎలీషాను కలుస్తున్నప్పుడు, అతడు తన సేవకునితో, “పెద్దకుండ పొయ్యిమీద పెట్టి ఈ ప్రవక్తలకు వంటకం చేయి” అన్నాడు.
2KI 4:39 వారిలో ఒకడు కూర ఆకుల కోసం పొలాలకు వెళ్లాడు, వెర్రి ద్రాక్ష అతనికి దొరికింది, దాని తీగెలు కోసి అతడు తన వస్త్రం నిండ నింపుకున్నాడు. అవి విషపూరితమైనవని అతనికి తెలియక వాటిని తరిగి కూర కుండలో వేశాడు.
2KI 4:40 ఆ కూరను తినడానికి అక్కడ వారికి వడ్డించారు. వారు దానిని రుచి చూసి, “దైవజనుడా! కుండలో విషం ఉంది!” అని కేకలు పెట్టారు. వారు దానిని తినలేకపోయారు.
2KI 4:41 ఎలీషా, “పిండి కొంచెం తీసుకురండి” అన్నాడు. అతడు పిండిని కుండలో వేసి, “ప్రజలు తినడానికి దానిని వారికి వడ్డించండి” అన్నాడు. అప్పుడు కుండలో హానికరమైనదేది లేదు.
2KI 4:42 ఒక రోజు ఓ వ్యక్తి బయల్-షాలిషా నుండి దైవజనుని దగ్గరకు వస్తూ, ఒక సంచిలో తన ప్రథమ పంటలో యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలు, క్రొత్త ధాన్యం కంకులు కొన్ని తెచ్చాడు. అయితే ఎలీషా, “ప్రజలకు తినడానికి ఇవ్వు” అని చెప్పాడు.
2KI 4:43 అయితే అతని సేవకుడు, “దీన్ని వందమందికి ఎలా పెట్టగలను?” అని అడిగాడు. అందుకు ఎలీషా, “ ‘వారు తినగా ఇంకా మిగలుతుంది’ అని యెహోవా చెప్పారు కాబట్టి నీవైతే వారికి వడ్డించు” అని అన్నాడు.
2KI 4:44 అప్పుడు అతడు వారికి వడ్డించాడు, యెహోవా చెప్పిన మాట ప్రకారం అందరు తినగా కొంత మిగిలింది.
2KI 5:1 అరాము రాజు సైన్యాధిపతి నయమాను. అతడు తన యజమాని దృష్టిలో గొప్పవాడు, గౌరవనీయుడు, ఎందుకంటే యెహోవా అతని చేత అరామీయులకు విజయం ప్రసాదించారు. అతడు మహాశూరుడు, కానీ కుష్ఠురోగి.
2KI 5:2 అరామీయులు గుంపులు గుంపులుగా ఇశ్రాయేలు మీదికి దోపిడికి వెళ్లేవారు, ఒకసారి వారు ఒక చిన్నదాన్ని బందీగా తీసుకువచ్చారు, ఆమె నయమాను భార్యకు పరిచారం చేసేది.
2KI 5:3 ఆమె తన యజమానురాలితో, “నా యజమాని సమరయలో ఉన్న ప్రవక్తను కలిస్తే బాగుండేది! ఆయన అతని కుష్ఠురోగాన్ని పూర్తిగా నయం చేస్తాడు” అని చెప్పింది.
2KI 5:4 నయమాను తన యజమాని దగ్గరకు వెళ్లి, ఆ ఇశ్రాయేలు అమ్మాయి చెప్పిన మాటలు అతనికి చెప్పాడు.
2KI 5:5 అందుకు అరాము రాజు, “సరే వెళ్లు, నేను ఇశ్రాయేలు రాజుకు ఉత్తరం పంపిస్తాను” అన్నాడు. కాబట్టి నయమాను తనతో పది తలాంతుల వెండి, ఆరువేల షెకెళ్ళ బంగారం, పది జతల దుస్తులు తీసుకుని వెళ్లాడు.
2KI 5:6 అతడు ఇశ్రాయేలు రాజు దగ్గరకు తీసుకెళ్లిన ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: “ఈ ఉత్తరంతో పాటు నా సేవకుడైన నయమానును నీ దగ్గరకు పంపిస్తున్నాను, అతనికి ఉన్న కుష్ఠును మీరు బాగుచేయాలని కోరుతున్నాను.”
2KI 5:7 ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే తన బట్టలు చింపుకొని, “చంపడానికి బ్రతికించడానికి నేనేమైనా దేవుడనా? కుష్ఠును బాగుచేయాలని ఇతడు ఒక వ్యక్తిని నా దగ్గరకు ఎందుకు పంపాడు? ఇతడు నాతో ఎలా వాదం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో చూడండి!” అన్నాడు.
2KI 5:8 దైవజనుడైన ఎలీషా, ఇశ్రాయేలు రాజు తన బట్టలు చించుకొన్నాడని విన్నప్పుడు, ఈ సందేశం అతనికి పంపాడు: “నీ బట్టలు ఎందుకు చించుకొన్నావు? ఆ వ్యక్తిని ఇప్పుడు నా దగ్గరకు పంపు, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు.”
2KI 5:9 కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలతో వెళ్లి ఎలీషా ఇంటి గుమ్మం దగ్గర ఆగాడు.
2KI 5:10 ఎలీషా, “నీవు వెళ్లి, యొర్దానులో ఏడుసార్లు స్నానం చేయి; అప్పుడు నీ శరీరం మామూలుగా మారి నీవు శుద్ధుడవవుతావు” అని అతనికి చెప్పమని ఒక దూతను పంపాడు.
2KI 5:11 అయితే నయమాను కోపంతో వెళ్లి, “అతడు తప్పకుండా నా కోసం బయటకు వచ్చి, నిలబడి, అతని దేవుడైన యెహోవా పేరిట ప్రార్థనచేసి, తన చేయి రోగం ఉన్నచోట అల్లాడించి కుష్ఠును నయం చేస్తాడనుకున్నాను.
2KI 5:12 ఇశ్రాయేలు నీళ్ల కంటే దమస్కులో ఉన్న అబానా, ఫర్పరు నదుల నీళ్లు మంచివి కావా? నేను వాటిలో కడుక్కుని పవిత్రపరచబడనా?” అని అంటూ ఆగ్రహంతో వెనుకకు తిరిగి వెళ్లాడు.
2KI 5:13 నయమాను సేవకులు అతని దగ్గరకు వెళ్లి, “నా తండ్రి, ఒకవేళ ఆ ప్రవక్త మిమ్మల్ని ఏదైనా గొప్ప పని చేయమని చెప్తే మీరు చేయకుండా ఉంటారా? ‘స్నానం చేసి పవిత్రపరచబడండి!’ అన్నమాట దానికంటే ఇంకా మంచిది కదా!” అని అన్నాడు.
2KI 5:14 కాబట్టి అతడు వెళ్లి దైవజనుడు చెప్పినట్లు యొర్దానులో ఏడుసార్లు మునిగాడు, వెంటనే అతని శరీరం శుద్ధి చేయబడి, పసివాడి దేహంలా మారింది.
2KI 5:15 అప్పుడు నయమాను, అతని సేవకులందరు దైవజనుని దగ్గరకు తిరిగి వెళ్లారు. నయమాను అతని ఎదుట నిలబడి, “ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకంలో మరో దేవుడు లేడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి దయచేసి మీ దాసుడనైన నేను ఇచ్చే ఈ కానుక అంగీకరించండి.”
2KI 5:16 ప్రవక్త, “నేను సేవించే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేనేమి తీసుకోను” అని జవాబిచ్చాడు. నయమాను ఎంత బలవంతం చేసినా అతడు తీసుకోలేదు.
2KI 5:17 నయమాను ఇలా అన్నాడు, “ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే, దయచేసి మీ దాసుడనైన నాకు కంచరగాడిదలు మోసేటంత మట్టి ఇప్పించండి, ఎందుకంటే యెహోవాకే దహనబలులు, అర్పణలు, అర్పిస్తాను గాని, మరి ఏ దేవునికి అర్పించను.
2KI 5:18 అయితే ఒక్క విషయంలో యెహోవా మీ దాసుడనైన నన్ను క్షమించాలి: నా యజమానుడు మ్రొక్కుకోడానికి రిమ్మోను గుడిలోకి వెళ్తూ నా చేయి మీద ఆనుకున్నప్పుడు నేను కూడా రిమ్మోను గుడిలో వంగి నమస్కారం చేయాల్సి వస్తుంది. కాబట్టి మీ దాసుడనైన నన్ను యెహోవా క్షమించును గాక” అని అన్నాడు.
2KI 5:19 ఎలీషా అన్నాడు, “సమాధానంతో వెళ్లు.” నయమాను కొద్ది దూరం వెళ్లిన తర్వాత,
2KI 5:20 ఎలీషా సేవకుడు గేహజీ, “నా యజమాని అరామీయుడైన నయమాను తెచ్చిన కానుక తీసుకోకుండా ఊరికే వెళ్లనిచ్చాడు. సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను అతని వెంట పరిగెత్తి అతని నుండి ఏదైనా తీసుకుంటాను” అని తన మనస్సులో అనుకున్నాడు.
2KI 5:21 కాబట్టి గేహజీ నయమాను వెనకే త్వరగా వెళ్లాడు. నయమాను తన వెనుక ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ రావడం గమనించి రథం దిగి అతన్ని కలుసుకొని, “అంతా క్షేమమేనా?” అని అడిగాడు.
2KI 5:22 గేహజీ, “అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపి, ‘ప్రవక్తల బృందంలో ఇద్దరు యువకులు ఎఫ్రాయిం కొండసీమ నుండి నా దగ్గరకు ఇప్పుడే వచ్చారు. దయచేసి వారికి ఒక తలాంతు వెండి, రెండు జతల దుస్తులు ఇవ్వండి’ అని చెప్పమన్నాడు” అన్నాడు.
2KI 5:23 అందుకు నయమాను, “నీకిష్టమైతే రెండు తలాంతుల వెండి తీసుకో” అని చెప్పి గేహజీని బలవంతంగా ఒప్పించి రెండు సంచుల్లో నుండి రెండు తలాంతుల వెండి, రెండు జతల దుస్తులు పెట్టి, తన సేవకులలో ఇద్దరికి ఇస్తే వారు గేహజీకి ఇవ్వడానికి మోసుకెళ్లారు.
2KI 5:24 గేహజీ కొండ దగ్గరకు చేరగానే అతడు వాటిని ఆ సేవకుల దగ్గర నుండి తీసుకుని వెళ్లి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత అతడు ఆ మనుష్యులను పంపించేశాడు.
2KI 5:25 అతడు లోపలికి వెళ్లి తన యజమాని ముందు నిలబడినప్పుడు, ఎలీషా అతన్ని, “గేహజీ ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు. “మీ దాసుడనైన నేను ఎక్కడికి వెళ్లలేదు” అని గేహజీ జవాబిచ్చాడు.
2KI 5:26 అయితే ఎలీషా అతనితో అన్నాడు, “ఆ మనిషి నిన్ను కలుసుకోడానికి రథం దిగి నీ దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు నా ఆత్మ నీతో కూడా లేదా? డబ్బు, దుస్తులు, ఒలీవచెట్లు, ద్రాక్షతోటలు, మందలు, పశువులు, దాసదాసీలు తీసుకోవడానికి ఇది సమయమా?
2KI 5:27 నయమాను కుష్ఠు నీకు, నీ సంతానానికీ నిత్యం ఉంటుంది” అని అన్నాడు. వెంటనే గేహజీ చర్మమంతా కుష్ఠు వచ్చి మంచులా తెల్లగా అయ్యింది. అతడు ఎలీషా దగ్గర నుండి వెళ్లిపోయాడు.
2KI 6:1 ప్రవక్తల బృందం వారు ఎలీషాతో, “చూడండి, మిమ్మల్ని కలుసుకునే ఈ స్థలం ఇరుకుగా ఉంది.
2KI 6:2 మీరు ఒప్పుకుంటే మేము యొర్దానుకు వెళ్లి తలా ఒక దూలం తీసుకువచ్చి మనం కలుసుకోవడానికి ఒక స్థలాన్ని కడతాం” అన్నారు. ఎలీషా, “వెళ్లండి” అన్నాడు.
2KI 6:3 అప్పుడు వారిలో ఒకడు, “దయచేసి మీ దాసులైన మాతో కూడా రండి” అన్నాడు. ఎలీషా, “నేను వస్తాను” అన్నాడు.
2KI 6:4 కాబట్టి అతడు వారితో వెళ్లాడు. వారు యొర్దానుకు వెళ్లి చెట్లు నరకడం ప్రారంభించారు.
2KI 6:5 వారిలో ఒకడు చెట్టు నరుకుతుండగా గొడ్డలి ఊడి నీళ్లలో పడింది. అతడు, “అయ్యో, నా ప్రభువా! అది అద్దెకు తెచ్చుకున్నది!” అని కేక పెట్టాడు.
2KI 6:6 దైవజనుడు, “అది ఎక్కడ పడింది?” అని అడిగాడు. అది పడ్డ స్థలం అతడు చూపించగా ఎలీషా ఒక కర్రను నరికి అక్కడ విసరగా ఆ ఇనుప గొడ్డలి నీటిపై తేలింది.
2KI 6:7 అప్పుడతడు, “దాన్ని బయటకు తీయి” అన్నాడు. అతడు చేయి చాపి దాన్ని తీసుకున్నాడు.
2KI 6:8 అరాము రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అతడు తన అధికారులతో చర్చించిన తర్వాత, “నేను ఫలాన స్థలాల్లో నా శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను” అన్నాడు.
2KI 6:9 దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు సందేశం పంపి, “ఫలాన స్థలానికి వెళ్లవద్దు, ఎందుకంటే అక్కడ అరామీయులు తమ బలగాలను ఉంచారు” అని తెలియజేశాడు.
2KI 6:10 కాబట్టి ఇశ్రాయేలు రాజు దైవజనుడు చెప్పిన స్థలానికి మనుషులను పంపి అది నిజమని తెలుసుకున్నాడు. ఎలీషా పదే పదే రాజును హెచ్చరించగా అతడు అలాంటి ప్రదేశాల్లో జాగ్రత్త వహించాడు.
2KI 6:11 ఇది అరాము రాజుకు కోపం కలిగించింది. అతడు తన అధికారులను పిలిపించి, “నాకు చెప్పండి! ఎవరు మనలో ఇశ్రాయేలు రాజు పక్షాన ఉన్నారు?” అని అడిగాడు.
2KI 6:12 “మాలో ఎవరు లేరు, నా ప్రభువా, కానీ ఇశ్రాయేలులో ఉన్న ఎలీషా ప్రవక్త మీరు మీ పడకగదిలో మాట్లాడే మాటలను ఇశ్రాయేలు రాజుకు చెప్తాడు” అని అతని అధికారులలో ఒకడు చెప్పాడు.
2KI 6:13 “వెళ్లండి, అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి. అప్పుడు అతన్ని పట్టుకోడానికి నేను మనుష్యులను పంపిస్తాను” అని రాజు ఆదేశించాడు. అతడు దోతానులో ఉన్నాడని వార్త వచ్చింది.
2KI 6:14 అప్పుడు అతడు గుర్రాలను, రథాలను, గొప్ప బలగాన్ని అక్కడికి పంపాడు. వారు రాత్రి వెళ్లి ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు.
2KI 6:15 మరుసటిరోజు దైవజనుని సేవకుడు పెందలకడ లేచి బయటకు వెళ్లినప్పుడు, పట్టణం చుట్టూ గుర్రాలు, రథాలు కలిగిన సైన్యం ఉండడం చూశాడు. “అయ్యో, నా ప్రభువా! మనం ఏం చేద్దాం?” అని ఆ సేవకుడు అడిగాడు.
2KI 6:16 అందుకు ప్రవక్త, “భయపడకు, మనతో ఉన్నవారు వారికంటే ఎక్కువ మంది” అన్నాడు.
2KI 6:17 అప్పుడు ఎలీషా, “యెహోవా, ఇతడు చూచేటట్టు ఇతడి కళ్లు తెరవండి” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ సేవకుని కళ్లు తెరిపించగా ఎలీషా చుట్టూరా కొండ మీదంతా నిప్పులాంటి గుర్రాలు, రథాలు అతనికి కనిపించాయి.
2KI 6:18 శత్రువు అతనివైపు వస్తుండగా, ఎలీషా యెహోవాకు ప్రార్థన చేస్తూ, “ఈ ప్రజలకు గుడ్డితనం కలుగజేయండి” అని అన్నాడు. కాబట్టి యెహోవా ఎలీషా అడిగినట్టుగా వారికి గుడ్డితనం కలుగజేశారు.
2KI 6:19 ఎలీషా వారితో, “ఇది దారి కాదు, ఇది పట్టణం కాదు. నా వెంబడి రండి, మీరు వెదికే మనిషి దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్తాను” అని అన్నాడు. అతడు వారిని సమరయకు తీసుకెళ్లాడు.
2KI 6:20 వారు పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఎలీషా, “యెహోవా, వీరు చూచేటట్టు వీరి కళ్లు తెరవండి” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా వారి కళ్లు తెరవగా తాము సమరయలో ఉన్నట్లు వారు గ్రహించారు.
2KI 6:21 ఇశ్రాయేలు రాజు వారిని చూసి, “వీరిని చంపనా, నా తండ్రి? వీరిని చంపనా?” అని ఎలీషాను అడిగాడు.
2KI 6:22 అందుకు అతడు, “నీవు వారిని చంపకూడదు, నీ ఖడ్గంతో, వింటితో బందీలుగా తెచ్చిన వారిని చంపుతావా? వారికి భోజనం పెట్టి వారు తిని త్రాగి తమ యజమాని దగ్గరికి వెళ్లేలా వారికి భోజనం పెట్టి, నీళ్ళు ఇవ్వు” అని చెప్పాడు.
2KI 6:23 కాబట్టి అతడు వారికి గొప్ప విందు చేసి వారు తిని త్రాగిన తర్వాత వారిని పంపించాడు. వారు తమ యజమాని దగ్గరకు తిరిగి వెళ్లారు. ఆ తర్వాత అరామీయుల దోపిడి మూకలు ఇశ్రాయేలు సరిహద్దులను ఆక్రమించడం మానుకొన్నాయి.
2KI 6:24 కొంతకాలం తర్వాత, అరాము రాజైన బెన్-హదదు తన సైన్యం అంతటిని పోగుచేసి, సమరయను ముట్టండించాడు.
2KI 6:25 సమరయలో తీవ్రమైన కరువు వచ్చింది; గాడిద తలను ఎనభై షెకెళ్ళ వెండికి, పావు కాబ్ గువ్వ రెట్టను అయిదు షెకెళ్ళ వెండికి అమ్మారు.
2KI 6:26 ఒక రోజు ఇశ్రాయేలు రాజు ప్రాకారం దగ్గర నడుస్తూ ఉంటే, ఒక స్త్రీ, “నా ప్రభువా, రాజా, నాకు సహాయం చేయండి!” అంటూ కేక పెట్టింది.
2KI 6:27 రాజు జవాబిస్తూ, “యెహోవా నీకు సహాయం చేయకపోతే, నేనెక్కడి నుండి సహాయం చేసేది? నూర్పిడి కళ్ళంలో నుంచా? లేదా ద్రాక్ష గానుగ నుంచా?” అన్నాడు.
2KI 6:28 తర్వాత రాజు ఆమెను, “నీ సమస్య ఏంటి?” అని అడిగాడు. ఆమె, “ఒకామె నాతో, ‘నీ కుమారుని ఇవ్వు, ఈ రోజు వాన్ని తిందాం, రేపు నా కుమారుని తిందాం’ అని చెప్పింది.
2KI 6:29 కాబట్టి నా కుమారుని వండుకుని తిన్నాము. మరుసటిరోజు నేను ఆమెతో, ‘నీ కుమారుని ఇవ్వు వాన్ని తిందాం’ అన్నాను, కాని ఆమె తన కుమారుని దాచుకుంది” అని చెప్పింది.
2KI 6:30 రాజు ఆ స్త్రీ చెప్పింది విన్నప్పుడు, తన బట్టలు చించుకున్నాడు. అతడు ప్రాకారం దగ్గర నడుస్తూ వెళ్తున్నప్పుడు, ప్రజలు అతనిపై వస్త్రం లోపల గోనెపట్ట ఉండడం చూశారు.
2KI 6:31 అతడు, “ఈ రోజు షాపాతు కుమారుడైన ఎలీషా మెడమీద అతని తల ఉంటే, దేవుడు నాకు చాలా కీడు చేయును గాక!” అన్నాడు.
2KI 6:32 అప్పుడు ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు, అతనితో పెద్దలు కూర్చుని ఉన్నారు. రాజు ఒక దూతను పంపాడు, కాని అతడు ఎలీషాను చేరకముందే, ఎలీషా ఆ పెద్దలతో, “ఆ హంతకుడు నా తల నరకమని మనిషిని పంపిస్తున్నాడని మీరు చూడట్లేదా? చూడండి, ఆ దూత రాగానే తలుపు మూసి అతన్ని లోపలికి రానివ్వకండి. అతని వెంట అతని యజమాని పాదాల శబ్దం వస్తుంది కదా” అని చెప్పాడు.
2KI 6:33 ఎలీషా వారితో ఇంకా మాట్లాడుతుండగానే, ఆ దూత అతని దగ్గరకు వచ్చాడు. రాజు, “ఈ ఆపద యెహోవా నుండి వచ్చింది. నేను యెహోవా కోసం ఇంకా ఎందుకు కనిపెట్టాలి?” అన్నాడు.
2KI 7:1 అందుకు ఎలీషా రాజుతో, “యెహోవా మాట విను. యెహోవా చెప్పే మాట ఇదే: రేపు ఇదే వేళకు షెకెల్ వెండికి ఒక మానిక సన్నని గోధుమ పిండి, షెకెల్ వెండికి రెండు మానికల యవలు సమరయ ద్వారం దగ్గర అమ్ముతారు” అని చెప్పాడు.
2KI 7:2 రాజు ఏ అధిపతి చేతి మీద ఆనుకుని ఉన్నాడో ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరచినా కూడా, ఇది జరగుతుందా?” అని అన్నాడు. అందుకు ఎలీషా, “నీవు నీ సొంత కళ్లతో చూస్తావు కాని, దానిలో ఏమీ తినవు” అన్నాడు.
2KI 7:3 అప్పుడు పట్టణ ప్రవేశ ద్వారం దగ్గర నలుగురు కుష్ఠురోగులు ఉన్నారు, వారు ఒకరితో ఒకరు, “మనం చచ్చేంతవరకు ఎందుకు ఇక్కడ ఉండాలి?
2KI 7:4 ఒకవేళ మనం పట్టణంలోనికి వెళ్తే అక్కడ కరువుతో చస్తాము. ఇలా ఇక్కడే ఉన్నా మనం చస్తాము. కాబట్టి మనం అరామీయుల శిబిరానికి వెళ్లి వారి దగ్గర లొంగిపోదాము. వారు మనలను బ్రతకనిస్తే బ్రతుకుతాం చంపితే చస్తాం” అనుకున్నారు.
2KI 7:5 సంధ్యా సమయంలో వారు లేచి అరామీయుల శిబిరానికి వెళ్లారు. వారు ఆ శిబిరం పొలిమేరకు వెళ్లగా అక్కడ ఎవరూ లేరు.
2KI 7:6 ఎందుకంటే యెహోవా అరాము సైన్యానికి రథాలు, గుర్రాలు, గొప్ప సైన్యం వస్తున్న శబ్దం వినిపించేటట్టు చేశారు, అందువల్ల వారు ఒకరితో ఒకరు, “చూడండి, ఇశ్రాయేలు రాజు మనమీద దాడి చేయడానికి హిత్తీయుల రాజులను, ఈజిప్టు రాజులను తోడు తెచ్చుకున్నాడు!” అని చెప్పుకున్నారు.
2KI 7:7 కాబట్టి వారు తమ ప్రాణాలు దక్కించుకోవాలని తమ గుడారాలను, గుర్రాలను, గాడిదలను ఎక్కడివి అక్కడే శిబిరంలో వదిలిపెట్టి తెల్లవారక ముందే చీకట్లోనే పారిపోయారు.
2KI 7:8 ఆ కుష్ఠురోగులు శిబిరం దగ్గరకు వచ్చి ఒక గుడారంలోకి వెళ్లి అందులో తిని త్రాగారు. తర్వాత వారు వెండి, బంగారం, దుస్తులను తీసుకెళ్లి దాచారు. వారు తిరిగివచ్చి ఇంకొక గుడారంలోకి వెళ్లి, అందులో నుండి వస్తువులు తీసుకెళ్లి వాటిని దాచిపెట్టారు.
2KI 7:9 అప్పుడు వారు ఒకరితో ఒకరు, “మనం చేసేది మంచిది కాదు. ఇది శుభవార్త కలిగిన రోజు, మనం ఎవరితో పంచుకోవడం లేదు! ఒకవేళ తెల్లవారే వరకు మనం ఆగితే, శిక్షకు గురవుతాము. కాబట్టి ఇప్పుడే వెళ్లి రాజభవనంలో ఈ విషయం తెలియజేద్దాం” అని చెప్పుకొన్నారు.
2KI 7:10 కాబట్టి వారు వెళ్లి పట్టణ ద్వారపాలకులను పిలిచి, “మేము అరామీయుల శిబిరానికి వెళ్లాము. అక్కడ ఎవరూ లేరు, మనిషి చప్పుడు కూడా లేదు, గుర్రాలు, గాడిదలు, గుడారాలు ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి” అని చెప్పారు.
2KI 7:11 ఆ ద్వారపాలకులు, ఆ వార్త బిగ్గరగా కేకలువేస్తూ రాజభవనంలో ఉన్నవారికి తెలియజేశారు.
2KI 7:12 రాజు రాత్రివేళ లేచి తన అధికారులతో, “మనకు వ్యతిరేకంగా అరామీయులు చేసేది చెప్తాను వినండి, మనం ఆకలితో అలమటిస్తున్నామని వారికి తెలుసు; కాబట్టి ‘వారు ఖచ్చితంగా బయటకు వస్తారు, అప్పుడు వారిని ప్రాణాలతో పట్టుకుని, నగరంలో చొరబడదాం’ అని అనుకుని వారు శిబిరం విడిచిపెట్టి వెళ్లి పొలాల్లో దాక్కున్నారు” అని చెప్పాడు.
2KI 7:13 అతని అధికారులలో ఒకడు, “పట్టణంలో మిగిలిన అయిదు గుర్రాలను తీసుకుని కొంతమందిని అక్కడికి వెళ్లనివ్వండి, వారి పరిస్థితి, మిగిలిన ఇశ్రాయేలీయులందరి పరిస్థితి ఒక్కటే, అందరం చనిపోతాము. కాబట్టి ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వారిని పంపుదాం” అని అన్నాడు.
2KI 7:14 కాబట్టి వారు రెండు రథాలను, వాటి గుర్రాలను తీసుకున్నారు. రాజు వారిని అరాము సైన్యం వెనుక పంపుతూ, “మీరు వెళ్లి ఏమి జరిగిందో తెలుసుకోండి” అని వారిని ఆదేశించాడు.
2KI 7:15 వారు అరాము సైన్యం వెంట యొర్దాను వరకు వెళ్లారు, దారి పొడవున అరామీయులు పారిపోయే తొందరలో బట్టలు సామాన్లు పారవేసి వెళ్లారు. కాబట్టి రాజు పంపిన దూతలు తిరిగివచ్చి ఆ విషయం రాజుకు తెలిపారు.
2KI 7:16 అప్పుడు ప్రజలు బయటకు వెళ్లి అరామీయుల శిబిరాన్ని దోచుకున్నారు. యెహోవా చెప్పిన మాట ప్రకారమే, షెకెల్ వెండికి ఒక మానిక సన్నని గోధుమ పిండి, షెకెల్ వెండికి రెండు మానికల యవలు అమ్మబడింది.
2KI 7:17 రాజు ఏ అధిపతి చేతి మీద ఆనుకున్నాడో, ఆ అధిపతిని ముఖ్య ద్వారపాలకునిగా నియమించాడు, ద్వారం దగ్గర ప్రజలు అతన్ని త్రొక్కగా అతడు చనిపోయాడు. రాజు తన ఇంటికి దగ్గరకు వచ్చినప్పుడు దైవజనుడు చెప్పినట్టే ఇది జరిగింది.
2KI 7:18 దైవజనుడు రాజుతో, “రేపు ఇదే సమయానికి సమరయ పట్టణ ద్వారం దగ్గర ఒక షెకెల్ వెండికి మానిక సన్నని గోధుమ పిండి, ఒక షెకెల్ వెండికి రెండు మానికల యవలు అమ్ముతారు” అని చెప్పాడు.
2KI 7:19 అంతకుముందు, ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరిచినా కూడా, ఇది జరుగుతుందా?” అని అన్నాడు. దైవజనుడు జవాబిస్తూ, “నీవు నీ కళ్లారా చూస్తావు కాని దానిలో ఏమి తినవు” అన్నాడు.
2KI 7:20 ఆ అధిపతికి అదే జరిగింది, ఎందుకంటే ప్రజలు ద్వారం దగ్గర అతన్ని త్రొక్కివేశారు, అతడు చనిపోయాడు.
2KI 8:1 ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బాలుని తల్లితో ఇలా అన్నాడు, “యెహోవా కరువు రప్పిస్తున్నారు, అది ఈ దేశంలో ఏడు సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి నీవు, నీ కుటుంబం బయలుదేరి మీకు అనువైన చోటికి వెళ్లి కొంతకాలం ఉండండి.”
2KI 8:2 దైవజనుడు చెప్పినట్టు ఆ స్త్రీ చేసింది. ఆమె, ఆమె కుటుంబం, ఫిలిష్తీయ దేశానికి వెళ్లి అక్కడ ఏడు సంవత్సరాలు నివసించారు.
2KI 8:3 ఏడు సంవత్సరాలు ముగిసిన తర్వాత, ఆమె ఫిలిష్తీయ దేశం నుండి తిరిగి వచ్చింది, తన ఇల్లు భూమి కోసం మనవి చేసుకోవడానికి ఆమె రాజు దగ్గరకు వెళ్లింది.
2KI 8:4 ఆ సమయంలో, దైవజనుని సేవకుడైన గేహజీతో రాజు మాట్లాడుతూ, “ఎలీషా చేసిన గొప్పకార్యాలు నాకు చెప్పు” అన్నాడు.
2KI 8:5 ఎలీషా ఎలా చచ్చినవాన్ని బ్రతికించాడో గేహజీ రాజుకు చెప్తూ ఉండగానే, అతడు బ్రతికించిన బాలుని తల్లి తన ఇల్లు అలాగే భూమి కోసం రాజుకు మనవి చేసుకోవడానికి వచ్చింది. గేహజీ, “నా ప్రభువా, రాజా, ఈవిడే ఆ స్త్రీ, ఇతడే ఎలీషా బ్రతికించిన ఈ స్త్రీ కుమారుడు” అని అన్నాడు.
2KI 8:6 రాజు దాని గురించి ఆమెను అడిగినప్పుడు, ఆమె ఆ విషయం వివరించింది. అప్పుడు రాజు ఆమె కోసం ఒక అధికారిని నియమించి, “ఆమెకు చెందినదంతా, ఆమె దేశం విడిచి వెళ్లిన రోజు నుండి ఇప్పటివరకు ఆమె భూమివల్ల వచ్చిన రాబడితో సహా ఆమెకు ఇప్పించు” అని అతనికి చెప్పాడు.
2KI 8:7 ఎలీషా దమస్కుకు వెళ్లాడు, అప్పుడు అరాము రాజైన బెన్-హదదుకు జబ్బుచేసింది. అప్పుడు, “దైవజనుడు ఇక్కడకు వచ్చాడు” అని రాజుకు చెప్పినప్పుడు,
2KI 8:8 రాజు హజాయేలుతో, “నీవు కానుక పట్టుకుని వెళ్లి దైవజనున్ని కలువు. అతని ద్వారా యెహోవాను సంప్రదించి ‘నేను ఈ జబ్బు నుండి కోలుకుంటానా?’ అని అడుగు” అన్నాడు.
2KI 8:9 హజాయేలు బహుమానంగా దమస్కులోని శ్రేష్టమైన వస్తువులను తీసుకుని నలభై ఒంటెల మీద ఎక్కించి ఎలీషాను కలవడానికి వెళ్లాడు. అతడు వెళ్లి ఎలీషా ఎదుట నిలబడి, “మీ కుమారుడు, అరాము రాజైన బెన్-హదదు, ‘నేను ఈ జబ్బు నుండి కోలుకుంటానా?’ అని అడగమని నన్ను పంపాడు” అని చెప్పాడు.
2KI 8:10 అందుకు ఎలీషా, “నీవు వెళ్లి, అతడు తప్పకుండ కోలుకుంటాడని చెప్పు. కానీ అతడు ఖచ్చితంగా చనిపోతాడని యెహోవా నాకు తెలియజేశారు” అన్నాడు
2KI 8:11 హజాయేలు ఇబ్బందిపడేంతగా దైవజనుడు అతన్ని చూస్తూ ఏడ్వడం మొదలుపెట్టాడు.
2KI 8:12 అప్పుడు హజాయేలు, “నా ప్రభువా ఎందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాడు. అందుకతడు, “ఎందుకంటే మీరు ఇశ్రాయేలీయులకు చేసే కీడు నాకు తెలుసు. మీరు వారి కోటగోడలకు నిప్పంటిస్తారు, వారి యువకులను ఖడ్గంతో చంపుతారు, వారి చిన్న పిల్లలను నేలకు కొడతారు, వారి గర్భవతుల కడుపులు చీల్చివేస్తారు” అన్నాడు.
2KI 8:13 అందుకు హజాయేలు, “మీ దాసుడు, కుక్కలాంటి వాడు, ఇంతటి సాహసం ఎలా చేస్తాడు?” అన్నాడు. ఎలీషా జవాబిస్తూ, “నీవు అరాము దేశానికి రాజవుతావని యెహోవా నాకు తెలియజేశారు” అని చెప్పాడు.
2KI 8:14 అప్పుడు హజాయేలు ఎలీషాను విడిచి తన యజమాని దగ్గరకు తిరిగి వెళ్లాడు. బెన్-హదదు, “ఎలీషా నీతో ఏం చెప్పాడు” అని బెన్-హదదు అడిగినప్పుడు, హజాయేలు, “మీరు తప్పకుండా కోలుకుంటారు” అని జవాబిచ్చాడు.
2KI 8:15 మరుసటిరోజు హజాయేలు మందమైన గుడ్డను తీసుకుని నీళ్లలో ముంచి రాజు ముఖం మీద పరచగా రాజు చనిపోయాడు. అప్పుడు హజాయేలు అతని స్థానంలో రాజయ్యాడు.
2KI 8:16 అహాబు కుమారుడు, ఇశ్రాయేలు రాజైన యోరాము పరిపాలనలోని అయిదవ సంవత్సరంలో, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యూదాలో రాజయ్యాడు.
2KI 8:17 అతడు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.
2KI 8:18 అతడు అహాబు కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు, కాబట్టి అహాబు ఇంటివారిలా ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు. యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
2KI 8:19 అయితే, యెహోవా తన సేవకుడైన దావీదును బట్టి యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. దావీదుకు, అతని వారసులకు ఒక దీపం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుందని ఆయన వాగ్దానం చేశారు.
2KI 8:20 యెహోరాము కాలంలో ఎదోమీయులు యూదాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ సొంత రాజును నియమించుకున్నారు.
2KI 8:21 కాబట్టి యెహోరాము తన రథాలన్నిటితో జాయీరుకు వెళ్లాడు. ఎదోమీయులు అతన్ని, అతని రథసారధులను చుట్టుముట్టారు, కాని అతడు రాత్రిలో లేచి వారిపై దాడి చేశాడు; అతని సైన్యం తమ గుడారాలకు పారిపోయారు.
2KI 8:22 ఈనాటికీ ఎదోము యూదాను వ్యతిరేకిస్తూ ఉంది. అదే సమయంలో లిబ్నా తిరుగబడింది.
2KI 8:23 యెహోరాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 8:24 యెహోరాము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో వారి దగ్గర అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు అహజ్యా రాజయ్యాడు.
2KI 8:25 ఇశ్రాయేలు రాజు, అహాబు కుమారుడైన యోరాము పరిపాలనలోని పన్నెండవ సంవత్సరంలో యూదారాజు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజయ్యాడు.
2KI 8:26 అహజ్యా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు. అతని తల్లి పేరు అతల్యా, ఆమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ మనుమరాలు.
2KI 8:27 అహజ్యా అహాబు ఇంటి అల్లుడు కాబట్టి అతడు అహాబు ఇంటివారి మార్గాలను అనుసరించి అహాబు కుటుంబంలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
2KI 8:28 అహజ్యా అహాబు కుమారుడైన యోరాముతో కలిసి, అరాము రాజైన హజాయేలు మీద యుద్ధం చేయడానికి రామోత్ గిలాదుకు వెళ్లగా అరామీయులు యోరామును గాయపరిచారు.
2KI 8:29 కాబట్టి రాజైన యోరాము రామోతు దగ్గర అరాము రాజైన హజాయేలుతో చేసిన యుద్ధంలో అరామీయులు తనకు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహోరాము కుమారుడు యూదా రాజైన అహజ్యా గాయపడి ఉన్న అహాబు కుమారుడైన యోరామును చూడడానికి యెజ్రెయేలుకు వెళ్లాడు.
2KI 9:1 ఎలీషా ప్రవక్త ప్రవక్తల బృందంలో ఒకరిని పిలిచి ఇలా అన్నాడు, “నీ నడికట్టు బిగించుకుని, సీసాలో ఒలీవనూనె పట్టుకుని రామోత్ గిలాదుకు వెళ్లు.
2KI 9:2 అక్కడికి వెళ్లి నిమ్షీ మనుమడు, యెహోషాపాతు కుమారుడైన యెహు కోసం వెదుకు. అతని దగ్గరకు వెళ్లి తన స్నేహితుల మధ్య నుండి పిలిచి అతన్ని లోపలి గదిలోకి తీసుకెళ్లు.
2KI 9:3 అప్పుడు ఈ నూనె సీసా తీసుకుని నూనె అతని తలమీద పోసి, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలపై రాజుగా అభిషేకించాను’ అని చెప్పి వెంటనే ఆలస్యం చేయకుండ తలుపు తెరిచి పారిపో!”
2KI 9:4 కాబట్టి ఆ యువ ప్రవక్త రామోత్ గిలాదుకు వెళ్లాడు.
2KI 9:5 అతడు చేరినప్పుడు, సైన్య అధికారులు ఒకచోట కూర్చుని ఉన్నారు. అతడు, “మీతో ఒక మాట చెప్పాలి” అని సైన్యాధిపతితో అన్నాడు. అందుకు యెహు, “మాలో ఎవరికి?” అని అడిగాడు. అందుకతడు, “అధిపతీ మీకే” అని జవాబిచ్చాడు.
2KI 9:6 యెహు లేచి ఇంట్లోకి వెళ్లాడు. అప్పుడు, ఆ ప్రవక్త అతని తలమీద నూనె పోసి అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: ‘నేను ఇశ్రాయేలు ప్రజలు మీద నిన్ను రాజుగా అభిషేకించాను.
2KI 9:7 నీవు నీ యజమాని అహాబు వంశీకులను హతం చేయాలి, యెజెబెలు ద్వారా నా సేవకులైన ప్రవక్తలు, యెహోవా సేవకులందరి రక్తం చిందింపబడింది కాబట్టి నేను ప్రతీకారం తీసుకుంటాను.
2KI 9:8 అహాబు వంశం పూర్తిగా నశిస్తుంది. ఇశ్రాయేలులో అహాబుకు చెందిన ప్రతి చివరి మగవారిని వారు బానిసలైనా పౌరులైనా నిర్మూలం చేస్తాను.
2KI 9:9 నేను నెబాతు కుమారుడైన యరొబాము వంశాన్ని, అహీయా కుమారుడైన బయెషా వంశాన్ని చేసినట్టే, అహాబు వంశాన్ని చేస్తాను.
2KI 9:10 యెజెబెలును యెజ్రెయేలు ప్రాంతంలో కుక్కలు తింటాయి, ఎవరూ ఆమెను సమాధి చేయరు.’ ” తర్వాత అతడు తలుపు తెరిచి పరుగెత్తాడు.
2KI 9:11 యెహు తన తోటి అధికారుల దగ్గరకు వెళ్లినప్పుడు, వారిలో ఒకరు, “అంతా క్షేమమేనా? ఆ వెర్రివాడు నీ దగ్గరకు ఎందుకు వచ్చాడు?” అని అడిగాడు. అందుకు యెహు అన్నాడు, “అతడు, అతని మాటలు మీకు తెలుసు కదా.”
2KI 9:12 వారు అన్నారు, “అది నిజం కాదు, అసలేం జరిగిందో మాకు చెప్పు.” యెహు అన్నాడు, “అతడు నాతో ఇలా అన్నాడు: ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా అభిషేకించాను.’ ”
2KI 9:13 వెంటనే వారు తమ వస్త్రాలను తీసి యెహు కాళ్లక్రింద పరిచారు. తర్వాత వారు బూర ఊది, “యెహు రాజయ్యాడు” అని కేకలు వేశారు.
2KI 9:14 నిమ్షీ మనుమడు, యెహోషాపాతు కుమారుడైన యెహు యోరాము మీద కుట్ర చేశాడు. (ఆ సమయంలో యోరాము, ఇశ్రాయేలీయులంతా అరాము రాజైన హజాయేలు నుండి రామోత్ గిలాదును కాపలా కాస్తూ ఉన్నారు,
2KI 9:15 కాని, రాజైన యెహోరాము అరాము రాజైన హజాయేలుతో యుద్ధంలో అరామీయుల వల్ల తగిలిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలు పట్టణానికి తిరిగి వెళ్లాడు.) అప్పుడు యెహు, “మీరు నన్ను రాజుగా చేయాలనుకుంటే, ఈ విషయాన్ని యెజ్రెయేలుకు వెళ్లి చెప్పడానికి ఇక్కడినుండి ఎవరూ తప్పించుకుని వెళ్లకుండా చూడండి” అన్నాడు.
2KI 9:16 అప్పుడు యెహు తన రథం ఎక్కి యెజ్రెయేలుకు వెళ్లాడు, ఎందుకంటే అక్కడ యోరాము విశ్రాంతి తీసుకుంటున్నాడు, యూదా రాజైన అహజ్యా అతన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్లాడు.
2KI 9:17 యెజ్రెయేలు గోపురం మీద నిలుచున్న కావలివాడు యెహు, అతని సైనికుల గుంపు రావడం చూసి, “నాకు సైనికులు కొంతమంది వస్తున్నట్లు కనిపిస్తుంది” అని బిగ్గరగా అరిచాడు. అందుకు యెహోరాము, “ఒక రౌతును పిలిపించి, వారిని కలవడానికి పంపించు, అతడు వారితో, ‘సమాధానంగా వస్తున్నారా?’ అని అడుగు” అని ఆదేశించాడు.
2KI 9:18 ఆ గుర్రాన్ని స్వారీ చేసేవాడు యెహుకు ఎదురుగా వెళ్లి, “రాజు ఇలా అడుగుతున్నారు: ‘మీరు సమాధానంతో వస్తున్నారా?’ ” “సమాధానంతో నీకేం పని?” అని యెహు జవాబిచ్చాడు. “నా వెనుకకు వచ్చి నన్ను వెంబడించు.” కావలివాడు, “ఆ దూత వారిని చేరుకున్నాడు, కాని అతడు తిరిగి రావడం లేదు” అని చెప్పాడు.
2KI 9:19 కాబట్టి రాజు ఇంకొక గుర్రపురౌతును పంపించాడు. అతడు వారి దగ్గరకు వెళ్లి, “రాజు ఇలా అడుగుతున్నాడు: ‘మీరు సమాధానంతో వస్తున్నారా?’ ” అని అన్నాడు. అందుకు యెహు, “సమాధానంతో నీకేం పని? నా వెనుకకు వచ్చి నన్ను వెంబడించు” అన్నాడు.
2KI 9:20 కావలివాడు, “అతడు వారిని చేరుకున్నాడు, కాని అతడు కూడా తిరిగి రావడం లేదు. ఆ రథాలు నడవడం నిమ్షీ మనుమడు యెహు నడిచినట్లు ఉంది, వెర్రిపట్టినవానిలా తోలుతున్నాడు” అని తెలియజేశాడు.
2KI 9:21 యెహోరాము, “నా రథం సిద్ధం చెయ్యండి” అని ఆదేశించాడు. అది సిద్ధం అయినప్పుడు, ఇశ్రాయేలు రాజైన యెహోరాము, యూదా రాజైన అహజ్యా యెహును ఎదుర్కోడానికి తమ రథాలతో బయలుదేరారు. వారు అతన్ని యెజ్రెయేలు పట్టణస్థుడైన నాబోతుకు చెందిన పొలంలో కలుసుకున్నారు.
2KI 9:22 యెహోరాము యెహును చూడగానే, “సమాధానంతో వచ్చావా, యెహు?” అని అడిగాడు. అందుకు యెహు, “మీ తల్లి యెజెబెలు విగ్రహారాధనను మంత్రవిద్యను ప్రోత్సహిస్తున్నంత కాలం, సమాధానం ఎలా ఉంటుంది?” అని జవాబిచ్చాడు.
2KI 9:23 యెహోరాము అహజ్యాతో, “అహజ్యా, ఇది మోసం!” అని అంటూ తన రథం త్రిప్పి పారిపోయాడు.
2KI 9:24 అయితే యెహు తన విల్లు ఎక్కుపెట్టి గురి చూసి యెహోరాము భుజాల మధ్యకు కొట్టాడు. ఆ బాణం అతని గుండెను చీల్చుకుంటూ పోవడం వలన అతడు తన రథంలో వాలిపోయాడు.
2KI 9:25 అప్పుడు యెహు తన రథసారధియైన బిద్కరుతో అన్నాడు, “అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు పొలంలో పడవేయి. ఒకసారి మనమిద్దరం రథమెక్కి అతని తండ్రి అహాబు వెంట పడుతున్నప్పుడు, యెహోవా అహాబు గురించి చెప్పిన ప్రవచనం జ్ఞాపకం చేసుకో:
2KI 9:26 ‘నిన్నటి రోజు నేను నాబోతు రక్తం అతని కుమారుల రక్తం చూశాను, ఖచ్చితంగా ఈ పొలంలోనే నీకు ప్రతీకారం చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.’ కాబట్టి ఇప్పుడు అతన్ని ఎత్తి ఆ పొలంలో పడవెయ్యి.”
2KI 9:27 జరిగినదంతా యూదా రాజైన అహజ్యా చూసినప్పుడు, అతడు బేత్-హగ్గాన్ మార్గం గుండా పారిపోయాడు. యెహు అతని వెంటపడి, “అతన్ని కూడా చంపండి!” అని ఆజ్ఞాపించాడు. వారు గూరుకు పోయే త్రోవలో ఇబ్లెయాము దగ్గర అతన్ని తన రథంలో గాయపరిచారు, అయితే అతడు మెగిద్దోకు తప్పించుకుని వెళ్లి అక్కడ మృతిచెందాడు.
2KI 9:28 అతని సేవకులు అతన్ని రథంలో యెరూషలేముకు తీసుకెళ్లి, దావీదు పట్టణంలో అతని పూర్వికుల దగ్గర అతన్ని సమాధి చేశారు.
2KI 9:29 (అహాబు కుమారుడైన యోరాము పరిపాలన యొక్క పదకొండవ సంవత్సరంలో అహజ్యా యూదాకు రాజయ్యాడు.)
2KI 9:30 తర్వాత యెహు యెజ్రెయేలుకు వెళ్లాడు. ఆ సంగతి యెజెబెలు విన్నప్పుడు, ఆమె తన కళ్లకు కాటుక పెట్టుకొని, తలను అలంకరించుకుని, కిటికీలో నుండి చూస్తూ ఉంది.
2KI 9:31 యెహు ద్వారంలో ప్రవేశించగానే, యెజెబెలు అతనితో, “తన యజమానుని హత్యచేసిన జిమ్రీ లాంటివాడా, సమాధానంగా వస్తున్నావా?” అని అడిగింది.
2KI 9:32 అతడు తన తల పైకెత్తి కిటికీవైపు చూసి, “నా పక్షంగా ఉన్నవారెవరు?” అని అరవగానే ఇద్దరు, ముగ్గురు నపుంసకులు క్రిందికి అతనివైపు చూశారు.
2KI 9:33 అప్పుడు యెహు వారితో, “ఆమెను క్రిందికి త్రోసివేయండి” అని అరిచాడు. వెంటనే వారు ఆమెను త్రోసివేయగా ఆమె నేల మీద పడి, ఆమె రక్తం గోడపైన గుర్రాలపైన చిమ్మింది, యెహు తన రథాన్ని ఆమెపైకి ఎక్కించాడు.
2KI 9:34 తర్వాత యెహు లోపలికి వెళ్లి భోజనం చేశాడు. అతడు వారికి, “ఈ శపితమైన స్త్రీ సంగతి చూడండి, ఈమె రాజకుమార్తె కాబట్టి ఈమె శవాన్ని పాతిపెట్టండి” అని ఆదేశించాడు.
2KI 9:35 వెంటనే వారు ఆమెను పాతిపెట్టడానికి వెళ్లారు గాని ఆమె కపాలం, పాదాలు, అరచేతులు తప్ప ఏమీ కనిపించలేదు.
2KI 9:36 వారు తిరిగివచ్చి యెహుకు విషయం చెప్పినప్పుడు, అతడు ఇలా జవాబిచ్చాడు, “యెహోవా తన సేవకుడైన తిష్బీయుడైన ఏలీయా ద్వారా చెప్పిన మాట ఇది: యెజ్రెయేలులో ఈ నేల మీద యెజెబెలు శరీరాన్ని కుక్కలు తింటాయి.
2KI 9:37 ‘ఈమె యెజెబెలు’ అని ఎవరూ అనుకోకుండ ఈమె శవం యెజ్రెయేలు పొలంలో నేలమీది పేడలా అవుతుంది.”
2KI 10:1 అహాబు కుమారులు డెబ్బైమంది సమరయలో ఉన్నారు. కాబట్టి యెహు ఉత్తరాలు వ్రాసి సమరయలో ఉన్న యెజ్రెయేలు అధిపతులకు, నగర పెద్దలకు, అహాబు సంతతి సంరక్షకులకు పంపి ఇలా చెప్పాడు,
2KI 10:2 “మీ యజమాని కుమారులు మీతోనే ఉన్నారు, మీకు రథాలు గుర్రాలు, కోటగోడలు గల పట్టణం, ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉత్తరం మీకు చేరిన వెంటనే,
2KI 10:3 మీ యజమాని కుమారులలో తగినవాడును ఉత్తముడునైన ఒక కుమారుని ఎన్నుకుని తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టండి. తర్వాత మీ యజమాని వంశం కోసం పోరాడండి!”
2KI 10:4 అయితే వారు భయపడి అన్నారు, “ఇద్దరు రాజులు అతని ముందు నిలువలేకపోయారు, అలాంటప్పుడు మనం ఎలా నిలువగలం”? అని చెప్పుకున్నారు.
2KI 10:5 కాబట్టి రాజభవన అధికారి, పట్టణ అధికారి, పెద్దలు, సంరక్షకులు యెహుకు, “మేము మీ దాసులం, మీ ఆజ్ఞలన్నీ పాటిస్తాము. మేము ఎవరినీ రాజుగా నియమించము; మీకు ఏది మంచిదని అనిపిస్తుందో అది చేయండి” అని కబురు పంపారు.
2KI 10:6 అప్పుడు యెహు రెండవ ఉత్తరం వ్రాసి వారికి పంపాడు. అందులో అతడు, “మీరు నా పక్షంగా ఉండి నాకు లోబడితే రేపు ఈ వేళకు యెజ్రెయేలులో నా దగ్గరకు మీ యజమాని కుమారుల తలలు తీసుకురండి” అన్నాడు. ఆ డెబ్బైమంది రాజకుమారులు వారిని పెంచుతున్న పట్టణపు పెద్దల దగ్గర ఉన్నారు.
2KI 10:7 ఆ ఉత్తరం వారికి చేరినప్పుడు వారు డెబ్బైమంది రాజకుమారులను పట్టుకుని వారినందరిని చంపి వారి తలలు బుట్టల్లో పెట్టి యెజ్రెయేలులో ఉన్న యెహుకు పంపారు.
2KI 10:8 దూత వచ్చి యెహుతో, “వారు రాజకుమారుల తలలు తెచ్చారు” అని చెప్పాడు. అప్పుడు యెహు, “వాటిని ఉదయం వరకు నగర ద్వారం దగ్గర రెండు కుప్పలుగా పెట్టండి” అని ఆదేశించాడు.
2KI 10:9 మరుసటిరోజు ఉదయం యెహు బయటకు వచ్చి ప్రజలందరి ఎదుట నిలబడి, “మీరు నిర్దోషులు. నేను నా యజమానిపై కుట్రచేసి అతన్ని చంపాను నిజమే, కానీ, వీరందరిని చంపింది ఎవరు?
2KI 10:10 కాబట్టి ఒక విషయం తెలుసుకోండి, యెహోవా అహాబు వంశాన్ని గురించి చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా నెరవేరకుండా ఉండదు, యెహోవా తన సేవకుడైన ఏలీయా ద్వారా చెప్పిన మాట ప్రకారం ఇది జరిగించారు” అన్నాడు.
2KI 10:11 కాబట్టి యెహు యెజ్రెయేలులో మిగిలిన అహాబు వంశీయులందరినీ, అహాబు పక్షం ఉన్న ప్రముఖులను అతని సన్నిహిత మిత్రులను అతని యాజకులతో పాటు చంపాడు. అతని పక్షం వారెవ్వవరినీ వదిలిపెట్టలేదు.
2KI 10:12 తర్వాత యెహు బయలుదేరి సమరయ వైపు వెళ్లాడు. కాపరుల బేత్-ఎకెద్ దగ్గర,
2KI 10:13 యెహు యూదా రాజైన అహజ్యా బంధువులు కొందరిని కలిసి వారిని, “మీరెవరు?” అని అడిగాడు. వారు, “మేము అహజ్యా బంధువులము. మేము రాజు, రాజమాత కుటుంబాలను పలకరించడానికి వెళ్తున్నాం” అన్నారు.
2KI 10:14 అతడు, “వీరిని ప్రాణాలతో పట్టుకోండి” అని ఆదేశించగా వారు వారిని ప్రాణాలతో పట్టుకుని బేత్-ఎకెదు బావి దగ్గర వారిలో ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా నలభై రెండు మందిని చంపారు.
2KI 10:15 అతడు అక్కడినుండి బయలుదేరిన తర్వాత, తనను కలుసుకోడానికి వస్తున్న రేకాబు కుమారుడైన యెహోనాదాబును చూశాడు. యెహు అతనికి శుభమని చెప్పి, “నేను నీతో యథార్థంగా ఉన్నట్లు నీవు నాతో ఉన్నావా?” అని అడిగాడు. అందుకు యెహోనాదాబు, “ఉన్నాను” అని జవాబిచ్చాడు. “అలాగైతే, నీ చేయి ఇవ్వు” అని యెహు అనగానే అతడు తన చేయి అందించగా యెహు అతన్ని రథంలోకి ఎక్కించుకున్నాడు.
2KI 10:16 యెహు, “నాతో వచ్చి యెహోవా కోసం నేను ఎంత రోషం కలిగి ఉన్నానో చూడు” అని చెప్పి తన రథంలో అతన్ని తీసుకెళ్లాడు.
2KI 10:17 యెహు సమరయకు వచ్చినప్పుడు, అక్కడ మిగిలి ఉన్న అహాబు వంశం వారినందరిని చంపాడు; ఏలీయాతో యెహోవా చెప్పిన మాట ప్రకారం అతడు వారిని నిర్మూలం చేశాడు.
2KI 10:18 తర్వాత యెహు ప్రజలందరినీ సమకూర్చి, “అహాబు బయలుకు కొంచెం సేవ చేశాడు; కాని యెహు మరి ఎక్కువ సేవ చేస్తాడు.
2KI 10:19 కాబట్టి ఇప్పుడు బయలు ప్రవక్తలందరినీ, అతని సేవకులందరినీ, అతని పూజారులందరినీ పిలిపించండి. ఎవరూ మానకుండా అందరు ఉండేలా చూడండి. ఎందుకంటే, నేను బయలుకు గొప్ప బలి అర్పిస్తాను. రాని వారిని బ్రతకనివ్వను” అని వారితో అన్నాడు. అయితే బయలు సేవకులను నాశనం చేద్దామని యెహు ఇలా యుక్తిగా చేశాడు.
2KI 10:20 యెహు, “బయలుకు పవిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేయండి” అని చెప్పగా వారలాగే ప్రకటించారు.
2KI 10:21 తర్వాత యెహు ఇశ్రాయేలంతటికి కబురు పంపాడు, బయలు సేవకులంతా వచ్చారు; ఏ ఒక్కడు రాకుండా లేడు. వారంతా బయలు గుడిలో ప్రవేశించగా బయలు గుడి ఈ చివర నుండి ఆ చివర వరకు వారితో నిండిపోయింది.
2KI 10:22 యెహు దుస్తుల గది మీద అధికారితో, “బయలు సేవకులందరికీ అంగీలు తీసుకురా” అని చెప్పాడు. అతడు వారి కోసం అంగీలు తెచ్చాడు.
2KI 10:23 తర్వాత యెహు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు బయలు గుడిలోకి వెళ్లారు. యెహు బయలు సేవకులతో, “ఇక్కడ మీ మధ్య యెహోవా సేవకులు ఎవరూ లేకుండా చూడండి, బయలు సేవకులు మాత్రమే ఉండాలి” అని చెప్పాడు.
2KI 10:24 కాబట్టి వారు బలులు, దహనబలులు అర్పించడానికి లోనికి వెళ్లారు. అప్పుడు యెహు తన వారిలో ఎనభైమంది కావలి వారును పిలిచి, ఇలా హెచ్చరించాడు: “మీలో ఎవరైనా నేను మీకు అప్పగించే వారిలో ఎవరినైన తప్పించుకుపోనిస్తే, అతని ప్రాణం కోసం మీ ప్రాణం పెట్టాలి” అని హెచ్చరించాడు.
2KI 10:25 దహనబలి అర్పించడం ముగించాక, యెహు కావలివారితో అధికారులతో, “లోపలికి వెళ్లి వారిని చంపండి; ఎవరిని తప్పించుకోనివ్వకండి” అన్నాడు. కాబట్టి వారు వారిని ఖడ్గంతో చంపారు. కావలివారు, అధికారులు వారి శవాలను బయట పారవేశారు. అప్పుడు వారు బయలు గర్భగుడిలోకి ప్రవేశించారు.
2KI 10:26 వారు బయలు గుడిలో ఉన్న పవిత్ర రాతిని బయటకు తెచ్చి దానిని తగలబెట్టారు.
2KI 10:27 వారు బయలు పవిత్ర స్తంభాన్ని పడగొట్టారు, బయలు గుడిని నేలమట్టం చేసి దానిని మరుగు దొడ్డిగా వాడారు. అది ఇప్పటికీ అలాగే ఉంది.
2KI 10:28 ఇలా యెహు బయలును ఇశ్రాయేలులో లేకుండా చేశాడు.
2KI 10:29 అయితే, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము పాపాలు చేస్తూ యెహు బేతేలులో దానులో ఉన్న బంగారు దూడలను పూజించడం మానలేదు.
2KI 10:30 యెహోవా యెహుతో, “నా మనస్సులో ఉన్నదంతా అహాబు వంశానికి చేసి నీవు నా దృష్టిలో సరియైనది చేశావు కాబట్టి నీ సంతానం నాలుగవ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారు” అన్నారు
2KI 10:31 అయినా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం యెహు మనసారా పాటించడానికి జాగ్రత పడలేదు. ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలు చేస్తూనే ఉన్నాడు.
2KI 10:32 ఆ రోజుల్లో యెహోవా ఇశ్రాయేలు సరిహద్దును తగ్గించడం ప్రారంభించారు. హజాయేలు గిలాదు ప్రాంతమంతట్లో యొర్దానుకు తూర్పున ఉన్న ఇశ్రాయేలీయుల సరిహద్దును (గాదు, రూబేను, మనష్షేల ప్రాంతమంతా), అర్నోను లోయలో ఉన్న అరోయేరు నుండి, గిలాదు నుండి బాషాను వరకు స్వాధీనం చేసుకున్నాడు.
2KI 10:34 యెహు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 10:35 యెహు చనిపోయి తన పూర్వికులను చేరాడు, సమరయలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాహాజు రాజయ్యాడు.
2KI 10:36 యెహు ఇశ్రాయేలు ప్రజలపై సమరయలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేశాడు.
2KI 11:1 అహజ్యా తల్లి అతల్యా, తన కుమారుడు చనిపోయాడని తెలుసుకుని రాజకుటుంబం వారందరినీ నాశనం చేయడానికి పూనుకుంది.
2KI 11:2 కాని, అహజ్యా సోదరీ రాజైన యెహోరాము కుమార్తెయైన యెహోషేబ అహజ్యా కుమారుడైన యోవాషును, చావవలసిన రాకుమారుల నుండి రహస్యంగా తప్పించి అతన్ని, అతని దాదిని ఒక పడకగదిలో ఉంచి అతన్ని అతల్యా నుండి దాచిపెట్టింది; కాబట్టి అతడు చంపబడలేదు.
2KI 11:3 అతల్యా దేశాన్ని పరిపాలించే కాలంలో అతడు ఆరేళ్ళు యెహోవా మందిరంలో అతని దాదితో దాగి ఉన్నాడు.
2KI 11:4 ఏడవ సంవత్సరంలో యెహోయాదా రాజభవనం శతాధిపతులను, కేరీతీయులను, సంరక్షకులను పిలిపించి వారిని యెహోవా మందిరంలో తీసుకెళ్లి వారితో నిబంధన చేసి వారిచేత యెహోవా మందిరం దగ్గర ప్రమాణం చేయించిన తర్వాత వారికి రాజు కుమారున్ని చూపెట్టాడు.
2KI 11:5 అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు, “మీరు చేయాల్సింది ఇదే: సబ్బాతు దినాన విధులకు వెళ్లే వారిలో మూడవ వంతు వచ్చి రాజభవనాన్ని కాపలా కాయాలి.
2KI 11:6 ఇంకొక మూడవ భాగం సూరు ద్వారం దగ్గర, మరో మూడవ భాగం కాపలాకు వెనుక ఉన్న ద్వారం దగ్గర ఉండాలి.
2KI 11:7 మీలో సబ్బాతు దినాన్న పనిలో లేనివారు యెహోవా మందిరాన్ని, రాజును కాపలా కాయాలి.
2KI 11:8 మీలో ప్రతి ఒక్కరూ ఆయుధాలు చేతపట్టుకుని రాజు చుట్టూ ఉండాలి. ఎవరైనా మీ వరుసలోకి వస్తే వారిని చంపేయాలి. రాజు ఎక్కడికి వెళ్లినా అతనికి దగ్గరగా ఉండాలి.”
2KI 11:9 యాజకుడైన యెహోయాదా ఆదేశించినట్లే ఆ శతాధిపతులు చేశారు. ప్రతి ఒక్కరు సబ్బాతు దినం విధులకు వెళ్లేవారిని, సబ్బాతు దినం విధులకు వెళ్లని వారితో పాటు యాజకుడైన యెహోయాదా దగ్గరకు తీసుకువచ్చారు.
2KI 11:10 అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరంలో ఉన్న రాజైన దావీదుకు చెందిన ఈటెలు, డాళ్లు ఆ శతాధిపతులకు ఇచ్చాడు.
2KI 11:11 కావలివారు ప్రతి ఒక్కరూ ఆయుధం చేతపట్టుకుని, యెహోవా మందిరం దక్షిణ వైపు నుండి ఉత్తర వైపు వరకు, బలిపీఠం దగ్గర రాజు చుట్టూ నిలబడ్డారు.
2KI 11:12 యెహోయాదా రాకుమారున్ని బయటకు తీసుకువచ్చి, అతని తలమీద కిరీటం పెట్టాడు; అతడు నిబంధన ప్రతిని అతనికి అందించి, అతన్ని రాజుగా ప్రకటించాడు. వారు అతన్ని అభిషేకించారు, ప్రజలు చప్పట్లు కొడుతూ, “రాజు చిరకాలం జీవించు గాక!” అని కేకలు వేశారు.
2KI 11:13 కావలివారు, ప్రజలు చేసే శబ్దాన్ని అతల్యా విన్నప్పుడు, ఆమె యెహోవా మందిరం దగ్గర ఉన్న ప్రజల దగ్గరకు వెళ్లింది.
2KI 11:14 ఆమె చూడగా, అక్కడ ఆచారం ప్రకారం రాజు అధికార స్తంభం దగ్గర నిలబడి ఉన్నాడు. అధిపతులు, బూరలు ఊదేవారు రాజు ప్రక్కన ఉన్నారు, దేశ ప్రజలంతా సంబరపడుతూ, బూరలు ఊదుతూ ఉన్నారు. అప్పుడు అతల్యా తన వస్త్రాలు చింపుకొని, “ద్రోహం! ద్రోహం!” అని అరిచింది.
2KI 11:15 అప్పుడు యాజకుడైన యెహోయాదా దళాల మీద అధికారులుగా ఉన్న శతాధిపతులను, “మీ వరుసల మధ్య నుండి ఆమెను బయటకు తీసుకురండి, ఎవరైనా ఆమె వెంట వస్తే ఖడ్గంతో చంపేయండి” అని ఆదేశించాడు. ఎందుకంటే యాజకుడు, “యెహోవా మందిరం దగ్గర ఆమె చంపబడకూడదు” అని చెప్పాడు.
2KI 11:16 కాబట్టి ఆమె గుర్రాలు రాజభవన ఆవరణంలోనికి ప్రవేశించే స్థలానికి చేరుకోగానే వారు ఆమెను పట్టుకుని చంపేశారు.
2KI 11:17 అప్పుడు యెహోయాదా తాను, ప్రజలంతా యెహోవా ప్రజలుగా ఉంటారని యెహోవాకు, రాజుకు, ప్రజలకు మధ్య నిబంధన చేశాడు. రాజుకు ప్రజలకు మధ్య కూడా నిబంధన చేశాడు.
2KI 11:18 దేశ ప్రజలందరూ బయలు గుడి దగ్గరకు వెళ్లి దానిని పడగొట్టారు. వారు బలిపీఠాలను, విగ్రహాలను ముక్కలుగా పగులగొట్టారు, బలిపీఠాల ముందున్న బయలు యాజకుడైన మత్తానును చంపారు. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా ఆలయానికి కావలివారిని నియమించాడు.
2KI 11:19 అతడు తనతో శతాధిపతులను, సంరక్షకులను, కేరీతీయులను, దేశ ప్రజలందరినీ వెంటబెట్టుకొని రాజును యెహోవా మందిరం నుండి రాజభవనానికి తీసుకువచ్చాడు. వారు కావలివారి ద్వారం గుండా వచ్చారు. అప్పుడు రాజు రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు.
2KI 11:20 అతల్యాను రాజభవనం దగ్గర చంపిన తర్వాత పట్టణం ప్రశాంతంగా ఉంది, దేశ ప్రజలంతా సంబరపడ్డారు.
2KI 11:21 యెహోయాషు రాజైనప్పుడు అతని వయస్సు ఏడు సంవత్సరాలు.
2KI 12:1 యెహు పరిపాలనలోని ఏడవ సంవత్సరంలో యెహోయాషు రాజయ్యాడు. అతడు యెరూషలేములో నలభై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా; ఆమె బెయేర్షేబకు చెందినది.
2KI 12:2 యెహోయాషు యాజకుడైన యెహోయాదా తనకు ఉపదేశిస్తూ ఉన్న కాలమంతా యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
2KI 12:3 అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
2KI 12:4 యెహోయాషు యాజకులతో ఇలా అన్నాడు, “యెహోవా ఆలయానికి పవిత్రమైన కానుకలుగా తెచ్చే డబ్బును అనగా పన్నుగా చెల్లించే డబ్బు, యెహోవా ఆలయానికి ప్రజలు స్వేచ్ఛగా తెచ్చే వ్యక్తిగత మ్రొక్కుబడుల డబ్బును సేకరించండి.
2KI 12:5 ప్రతి యాజకుడు కోశాధికారులలో ఒకరి దగ్గర ఆ డబ్బును తీసుకుని, తర్వాత మందిరంలో ఉన్న దెబ్బతిన్న భాగాలు మరమ్మత్తు చేయాలి.”
2KI 12:6 అయితే రాజైన యెహోయాషు పరిపాలిస్తున్న ఇరవై మూడవ సంవత్సరం వరకు యాజకులు దేవాలయానికి ఎలాంటి మరమ్మత్తు చేయలేదు.
2KI 12:7 కాబట్టి అప్పుడు రాజైన యెహోయాషు యెహోయాదాను, మిగతా యాజకులను పిలిపించి, “మీరెందుకు దేవాలయంలో దెబ్బతిన్న వాటిని మరమ్మత్తు చెయ్యలేదు? ఇక మీ కోశాధికారుల నుండి డబ్బు తీసుకోకండి కాని దేవాలయ మరమ్మత్తు కోసం తీసుకున్న దానిని అప్పగించండి” అన్నాడు.
2KI 12:8 అందుకు యాజకులు తాము దేవాలయ మరమ్మత్తు చేయడం లేదు కాబట్టి ప్రజల నుండి డబ్బు తీసుకోవడం మానేస్తామని అంగీకరించారు.
2KI 12:9 యెహోయాదా ఒక పెట్టె తెచ్చి దాని మూతకు రంధ్రం చేసి దానిని బలిపీఠం దగ్గర యెహోవా మందిరంలోనికి వచ్చే వారికి కుడి వైపున ఉంచాడు. ప్రజలు యెహోవా ఆలయానికి తెచ్చే డబ్బంతా ద్వారం దగ్గర ఉండే యాజకుడు ఆ పెట్టెలో వేశాడు.
2KI 12:10 పెట్టె నిండిందని వారు చెప్పినప్పుడు రాజ కార్యదర్శి, ప్రధాన యాజకుడు వచ్చి యెహోవా మందిరంలో ఉన్న ఆ డబ్బంతా లెక్కపెట్టి సంచుల్లో కట్టారు.
2KI 12:11 ఆ డబ్బును లెక్కించిన తర్వాత, యెహోవా మందిరం మరమ్మత్తు పనులు చేయించేవారికి ఆ డబ్బు పంచి ఇచ్చేవారు. వీరు ఆ డబ్బు మందిరంలో పని చేసే వడ్రంగులకు, కట్టేవారికి,
2KI 12:12 తాపీ మేస్త్రీలకు, రాళ్లు కొట్టే వారికి ఇచ్చారు. యెహోవా మందిరం మరమ్మత్తు చేయటానికి దూలాలు, మలిచిన రాళ్లు కొన్నారు. ఆలయ పునరుద్ధరణ కోసం కావలసిన వాటన్నిటి కోసం డబ్బు ఖర్చు చేశారు.
2KI 12:13 యెహోవా మందిరం కోసం వెండి గిన్నెలు, వత్తులు కత్తిరించే కత్తెరలు, పాత్రలు, బూరలు లేదా ఇతర బంగారు, వెండి పరికరాలకు మందిరంలోకి తెచ్చే డబ్బును ఖర్చు చేయలేదు;
2KI 12:14 అది యెహోవా మందిరాన్ని మరమ్మత్తు చేస్తున్న పనివారికి ఇవ్వబడింది.
2KI 12:15 ఆ డబ్బు తీసుకుని పనుల మీద పైవిచారణ చేసేవారు సంపూర్ణ నమ్మకమైనవారు కాబట్టి, వారు పనివారికి పంచి ఇచ్చిన డబ్బు విషయంలో ఎవరూ లెక్క అడగలేదు.
2KI 12:16 అపరాధబలులు, పాపపరిహార బలుల వల్ల వచ్చే డబ్బు యెహోవా మందిరంలోనికి తీసుకురాలేదు; అది యాజకునికి చెందినది.
2KI 12:17 ఆ సమయంలో అరాము రాజైన హజాయేలు వెళ్లి గాతుపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత యెరూషలేము మీద దాడి చేయాలనుకున్నాడు.
2KI 12:18 అయితే యూదా రాజైన యెహోయాషు తన పూర్వికులు, యూదా రాజులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరంలో, అలాగే రాజభవనంలో ఉన్న ఖజానాలోని బంగారమంతా అరాము రాజైన హజాయేలుకు పంపాడు. కాబట్టి హజాయేలు యెరూషలేము నుండి వెళ్ళిపోయాడు.
2KI 12:19 యోవాషు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 12:20 యోవాషు సేవకులు కుట్రచేసి, సిల్లాకు వెళ్లే త్రోవలో ఉన్న బేత్-మిల్లోలో అతన్ని చంపారు.
2KI 12:21 అతన్ని చంపిన అధికారులు షిమాతు కుమారుడైన యోజాబాదు, షోమేరు కుమారుడైన యెహోజాబాదు. అతడు చనిపోయినప్పుడు దావీదు పట్టణంలో తన పూర్వికులతో దగ్గర అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన అమజ్యా రాజయ్యాడు.
2KI 13:1 యూదారాజు అహజ్యా కుమారుడైన యోవాషు పరిపాలనలోని ఇరవై మూడవ సంవత్సరంలో యెహు కుమారుడు యెహోయాహాజు ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు, అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు.
2KI 13:2 అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలనే చేస్తూ వచ్చాడు.
2KI 13:3 కాబట్టి యెహోవాకు ఇశ్రాయేలు మీద కోపం రగులుకుంది, చాలాసార్లు ఆయన వారిని అరాము రాజైన హజాయేలు, అతని కుమారుడు బెన్-హదదు చేతులకు అప్పగించారు.
2KI 13:4 అప్పుడు యెహోయాహాజు యెహోవాను వేడుకోగా, యెహోవా అతన్ని ప్రార్థన విన్నారు, ఎందుకంటే అరాము రాజు ఇశ్రాయేలును ఎలా తీవ్రంగా హింసిస్తున్నాడో చూశారు.
2KI 13:5 యెహోవా ఇశ్రాయేలుకు ఒక రక్షకుని ప్రసాదించారు, అతని ద్వారా వారు అరాము అధికారం నుండి తప్పించుకున్నారు. కాబట్టి మునుపటిలా ఇశ్రాయేలీయులు తమ ఇళ్ళలో నివసించారు.
2KI 13:6 అయితే వారు ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన యరొబాము కుటుంబీకులు చేసిన పాపాలను చేస్తూనే ఉన్నారు. అంతేకాక, అషేరా స్తంభం అలాగే సమరయలో నిలిచి ఉంది.
2KI 13:7 యెహోయాహాజు సైన్యంలో మిగిలింది యాభై రౌతులు, పది రథాలు, పదివేలమంది కాల్బలం మాత్రమే. ఎందుకంటే అరాము రాజు మిగతా వారిని కళ్ళం దగ్గర దుళ్ళగొట్టిన దుమ్ములా చేశాడు.
2KI 13:8 యెహోయాహాజు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, అతని విజయాలు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 13:9 యెహోయాహాజు చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని సమరయలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాషు రాజయ్యాడు.
2KI 13:10 యూదా రాజైన యోవాషు పరిపాలనలోని ముప్పై ఏడవ సంవత్సరంలో యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు, పదహారు సంవత్సరాలు పరిపాలించాడు.
2KI 13:11 అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను చేస్తూనే ఉన్నాడు.
2KI 13:12 యెహోయాషును పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, అతని విజయాలు, యూదా రాజైన అమజ్యాతో చేసిన యుద్ధం, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 13:13 యెహోయాషు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, యరొబాము అతని స్థానంలో సింహాసనం ఎక్కాడు. యెహోయాషును సమరయలో ఇశ్రాయేలు రాజులతో పాటు సమాధి చేశారు.
2KI 13:14 ఆ కాలంలో ఎలీషాకు జబ్బుచేసింది, దానిని బట్టి తర్వాత అతడు చనిపోతాడు. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతన్ని చూడడానికి వచ్చి అతన్ని చూసి, “నా తండ్రీ! నా తండ్రీ! ఇశ్రాయేలు రథాలు, రౌతులు!” అని అంటూ ఏడ్చాడు.
2KI 13:15 అతనితో ఎలీషా, “విల్లు, కొన్ని బాణాలు తీసుకో” అని చెప్పగా అతడు అలా చేశాడు.
2KI 13:16 అతడు ఇశ్రాయేలు రాజుతో, “నీ చేతుల్లో విల్లును ఎక్కుపెట్టు” అన్నాడు. అతడు ఎక్కుపెట్టిన తర్వాత ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద ఉంచాడు.
2KI 13:17 ఎలీషా, “తూర్పున ఉన్న కిటికీ తెరువు” అన్నాడు, అతడు తెరిచాడు. ఎలీషా, “బాణం విసురు” అన్నాడు, రాజు బాణం విసిరాడు. ఎలీషా, “ఇది యెహోవా విజయ బాణం, అరాము మీద విజయ బాణం! నీవు ఆఫెకు దగ్గర అరామీయులను పూర్తిగా నాశనం చేస్తావు” అని ప్రకటించాడు.
2KI 13:18 తర్వాత అతడు, “బాణాలు చేత పట్టుకో” అన్నాడు, రాజు వాటిని తీసుకున్నాడు. ఎలీషా ఇశ్రాయేలు రాజుతో, “వాటితో నేలను కొట్టు” అన్నాడు. అతడు నేలను మూడుసార్లు కొట్టి ఆగాడు.
2KI 13:19 దైవజనుడు అతని మీద కోప్పడి, “నీవు అయిదు లేదా ఆరు సార్లు కొట్టివుంటే, నీవు అరాము దేశాన్ని ఓడించి పూర్తిగా నాశనం చేసి ఉండేవాడివి. కాని, ఇప్పుడు దానిని మూడుసార్లు మాత్రమే ఓడిస్తావు” అని అన్నాడు.
2KI 13:20 తర్వాత ఎలీషా చనిపోయాడు, అతన్ని సమాధి చేశారు. అయితే ప్రతి వసంతకాలంలో మోయాబు దోపిడి మూకలు దేశంలోకి వచ్చేవారు.
2KI 13:21 ఒకసారి కొంతమంది ఇశ్రాయేలీయులు ఒక శవాన్ని సమాధి చేస్తుండగా అకస్మాత్తుగా దోపిడి మూకను చూసి ఆ మనిషి శవాన్ని ఎలీషా సమాధిలో పడేశారు. ఆ శవం ఎలీషా ఎముకలకు తగలగానే, ఆ మనిషి తిరిగి బ్రతికి లేచి తన కాళ్లమీద నిలబడ్డాడు.
2KI 13:22 యెహోయాహాజు పరిపాలన అంతటిలో, అరాము రాజైన హజాయేలు ఇశ్రాయేలు ప్రజలను బాధించాడు.
2KI 13:23 అయితే యెహోవా తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబుతో చేసిన నిబంధనను బట్టి వారి మీద జాలిపడి దయ చూపారు. ఈనాటి వరకు యెహోవా వారిని తన సముఖం నుండి వెళ్లగొట్టడానికి ఇష్టపడలేదు.
2KI 13:24 అరాము రాజైన హజాయేలు చనిపోయాడు, అతని తర్వాత అతని కుమారుడైన బెన్-హదదు రాజయ్యాడు.
2KI 13:25 అప్పుడు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు అంతకుముందు హజాయేలు యెహోయాహాజుతో యుద్ధం చేసి స్వాధీనం చేసుకున్న పట్టణాలను హజాయేలు కుమారుడైన బెన్-హదదు నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. మూడుసార్లు యెహోయాషు అతన్ని ఓడించి ఇశ్రాయేలు పట్టణాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.
2KI 14:1 ఇశ్రాయేలు రాజు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యూదారాజు యోవాషు కుమారుడైన అమజ్యా పరిపాలన ఆరంభించాడు.
2KI 14:2 అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను; ఆమె యెరూషలేముకు చెందినది.
2KI 14:3 అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కాని తన పితరుడైన దావీదులా కాదు. అన్ని విషయాల్లో అతని తండ్రియైన యోవాషు మాదిరిని అనుసరించాడు.
2KI 14:4 అయితే క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
2KI 14:5 రాజ్యం తన వశంలో స్థిరమైన తర్వాత అతడు రాజైన తన తండ్రిని చంపిన ఆ అధికారులను చంపించాడు.
2KI 14:6 అయితే అతడు ఆ హంతకుల సంతానాన్ని చంపలేదు. మోషే వ్రాసిన ధర్మశాస్త్రంలో, “తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందుకోవద్దు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందుకోవద్దు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు” అని యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అతడు చేశాడు.
2KI 14:7 అమజ్యా ఉప్పు లోయలో యుద్ధం చేసి పదివేలమంది ఎదోమీయులను చంపి, సెల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దానికి యొక్తియేలు అనే పేరు పెట్టాడు. ఈనాటికి దాని పేరు అదే.
2KI 14:8 తర్వాత అమజ్యా ఇశ్రాయేలు రాజూ యెహు మనుమడును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు దగ్గరకు దూతలను పంపి, “మనం యుద్ధంలో ఒకరితో ఒకరు తలపడదాం, రండి” అని సవాలు చేశాడు.
2KI 14:9 అయితే ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలా జవాబిచ్చాడు: “లెబానోను అడవిలోని ముళ్ళపొద ఒకటి లెబానోను దేవదారుకు, ‘నీ కుమార్తెను నా కుమారునికి భార్యగా ఇవ్వు’ అని సందేశం పంపిందట. అప్పుడు లెబానోను అడవి మృగం ఒకటి ఆ వైపుకు వచ్చి ఆ ముళ్ళను త్రొక్కి పాడుచేసింది.
2KI 14:10 నీవు ఎదోమును ఓడించి గర్విస్తున్నావు, నీ విజయంతో తృప్తిపడి ఇంటి దగ్గరే ఉండు. నీవు ఎందుకు నీతో పాటు యూదావారు నాశనమవడానికి కారణమవుతావు?”
2KI 14:11 అయితే అమజ్యా వినలేదు, కాబట్టి ఇశ్రాయేలు రాజైన యెహోయాషు దాడి చేశాడు. అతడు, యూదా రాజైన అమజ్యా, యూదాకు చెందిన బేత్-షెమెషు దగ్గర ఒకరినొకరు ఎదుర్కొన్నారు.
2KI 14:12 ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయింది, ప్రతి ఒక్కరు తమ ఇళ్ళకు పారిపోయారు.
2KI 14:13 ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బేత్-షెమెషులో అహజ్యా మనుమడు, యోవాషు కుమారుడు, యూదా రాజైన అమజ్యాను పట్టుకున్నాడు. అప్పుడు యెహోయాషు యెరూషలేముకు వచ్చి ప్రాకారాన్ని, ఎఫ్రాయిం ద్వారం నుండి మూల ద్వారం వరకు దాదాపు నాలుగు వందల మూరలు పడగొట్టాడు.
2KI 14:14 అతడు యెహోవా మందిరంలో, రాజభవనం ఖజానాలో కనిపించిన వెండి బంగారమంతటిని, ఇతర వస్తువులన్నిటిని తీసుకున్నాడు. అతడు బందీలను కూడా తీసుకుని సమరయకు తిరిగి వెళ్లాడు.
2KI 14:15 యెహోయాషు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసింది, అతని విజయాలు, యూదా రాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధం, ఇశ్రాయేలు రాజుల చర్రిత గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 14:16 యెహోయాషు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని సమరయలో ఇశ్రాయేలు రాజులతో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన యరొబాము రాజయ్యాడు.
2KI 14:17 యెహోయాహాజు కుమారుడు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు మృతి తర్వాత, యూదారాజు, యోవాషు కుమారుడైన అమజ్యా ఇంకా పదిహేను సంవత్సరాలు బ్రతికాడు.
2KI 14:18 అమజ్యా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 14:19 యెరూషలేములో కొందరు అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషుకు పారిపోయాడు, కాని వారు అతని వెంట లాకీషుకు మనుష్యులను పంపి అతన్ని అక్కడ చంపారు.
2KI 14:20 అప్పుడు వారు గుర్రం మీద అతని శవాన్ని తెప్పించి, యెరూషలేములో అతని పూర్వికుల దగ్గర దావీదు పట్టణంలో పాతిపెట్టారు.
2KI 14:21 అప్పుడు యూదా ప్రజలంతా పదహారు సంవత్సరాల వయస్సుగల అమజ్యా కుమారుడైన అజర్యాను అతని తండ్రి స్థానంలో రాజుగా చేశారు.
2KI 14:22 అమజ్యా రాజు చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరిన తర్వాత, అజర్యా ఏలతు పట్టణాన్ని తిరిగి కట్టించి దానిని తిరిగి యూదా ఆధీనంలోకి చేర్చాడు.
2KI 14:23 యోవాషు కుమారుడు యూదా రాజైన అమజ్యా పరిపాలనలోని పదిహేనవ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కుమారుడైన యరొబాము సమరయలో రాజయ్యాడు, అతడు నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు.
2KI 14:24 అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలనే చేస్తూ వచ్చాడు.
2KI 14:25 అతడు లెబో హమాతు నుండి మృత సముద్రం వరకు ఇశ్రాయేలు సరిహద్దులను మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అమిత్తయి కుమారుడు, గాత్-హెఫెరు నివాసియైన తన సేవకుడైన యోనా ప్రవక్త ద్వారా పలికిన వాక్కు ప్రకారం ఇది జరిగింది.
2KI 14:26 యెహోవా ఇశ్రాయేలులో అందరు అంటే బానిసలు స్వతంత్రులు ఎంత ఘోరంగా బాధ పడుతున్నారో చూశారు; వారికి సహాయం చేయడానికి ఎవరూ లేరు.
2KI 14:27 ఇశ్రాయేలు పేరు ఆకాశం క్రింద లేకుండా తుడిచి వేస్తానని యెహోవా చెప్పలేదు, కాబట్టి వారిని యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా రక్షించాడు.
2KI 14:28 యరొబాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, అతని సైనిక విజయాలు, ఇశ్రాయేలు కోసం అతడు యూదాకు చెందని దమస్కును, హమాతును ఎలా పునరుద్ధరించాడో, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 14:29 యరొబాము తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులతో పాటు నిద్రించాడు, అతని తర్వాత అతని కుమారుడైన జెకర్యా రాజయ్యాడు.
2KI 15:1 ఇశ్రాయేలు రాజు యరొబాము పరిపాలన యొక్క ఇరవై ఏడవ సంవత్సరంలో, యూదారాజు అమజ్యా కుమారుడైన అజర్యా పరిపాలన ఆరంభించాడు.
2KI 15:2 అతడు రాజైనప్పుడు అతని వయస్సు పదహారు సంవత్సరాలు, అతడు యెరూషలేములో యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా; ఆమె యెరూషలేముకు చెందినది.
2KI 15:3 అతడు తన తండ్రి అమజ్యా చేసినట్లు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
2KI 15:4 అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.
2KI 15:5 యెహోవా రాజును కుష్ఠరోగంతో బాధించారు, అది అతడు చనిపోయే దినం వరకు ఉంది. అతడు వేరుగా ఒక గృహంలో నివసించాడు. రాజకుమారుడైన యోతాము రాజభవన అధికారిగా ఉంటూ దేశ ప్రజలను పరిపాలించాడు.
2KI 15:6 అజర్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 15:7 అజర్యా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యోతాము రాజయ్యాడు.
2KI 15:8 యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో, యరొబాము కుమారుడైన జెకర్యా ఇశ్రాయేలుకు సమరయలో రాజయ్యాడు, అతడు ఆరు నెలలు పరిపాలించాడు.
2KI 15:9 అతడు తన పూర్వికులు చేసినట్లు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
2KI 15:10 యాబేషు కుమారుడైన షల్లూము జెకర్యా మీద కుట్రచేసి, ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని తర్వాత రాజయ్యాడు.
2KI 15:11 జెకర్యా గురించిన ఇతర విషయాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
2KI 15:12 కాబట్టి యెహోవా యెహుతో చెప్పిన ఈ మాట నెరవేర్చబడింది: “నీ సంతానం నాలుగు తరాల వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారు.”
2KI 15:13 యూదా రాజైన ఉజ్జియా పరిపాలన యొక్క ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో, యాబేషు కుమారుడైన షల్లూము రాజయ్యాడు, అతడు సమరయలో నెలరోజులు పరిపాలించాడు.
2KI 15:14 అప్పుడు గాదీ కుమారుడైన మెనహేము తిర్సా నుండి బయలుదేరి సమరయకు వచ్చాడు. అతడు సమరయలో యాబేషు కుమారుడైన షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
2KI 15:15 షల్లూము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన కుట్ర గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
2KI 15:16 ఆ సమయంలో మెనహేము తిర్సా నుండి బయలుదేరి తిప్సహును, ఆ పట్టణంలో ఆ పరిసరాల్లో ఉన్న ప్రజలందరిపై దాడి చేశాడు, ఎందుకంటే వారు తమ తలుపులు తెరవడానికి నిరాకరించారు. అతడు తిప్సహును కొల్లగొట్టాడు, అందులో ఉన్న గర్భవతుల గర్భాలన్నిటిని చీరేశాడు.
2KI 15:17 యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో, గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో పది సంవత్సరాలు పరిపాలించాడు.
2KI 15:18 అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. తన ఏలుబడి అంతటిలో, ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
2KI 15:19 తర్వాత అష్షూరు రాజైన పూలు దేశాన్ని ఆక్రమించాడు, మెనహేము రాజ్యం మీద తన బలం నిలకడగా ఉండునట్లు, అష్షూరు రాజు సహాయం కోరుతూ అతనికి వెయ్యి తలాంతుల వెండిని ఇచ్చాడు.
2KI 15:20 ఈ మొత్తం అష్షూరు రాజుకు ఇవ్వడానికి మెనహేము ఇశ్రాయేలులో ఉన్న ధనవంతులందరి దగ్గరా, యాభై షెకెళ్ళ వెండి చొప్పున వసూలు చేశాడు. కాబట్టి అష్షూరు రాజు విడిచి, ఇశ్రాయేలు దేశంలో ఇక ఉండలేదు.
2KI 15:21 మెనహేము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 15:22 మెనహేము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతని తర్వాత అతని కుమారుడైన పెకహ్యా రాజయ్యాడు.
2KI 15:23 యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క యాభైయవ సంవత్సరంలో, మెనహేము కుమారుడైన పెకహ్యా సమరయలో ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు రెండు సంవత్సరాలు పరిపాలించాడు.
2KI 15:24 పెకహ్యా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
2KI 15:25 అతని ప్రముఖ అధిపతులలో ఒకడు, రెమల్యా కుమారుడైన పెకహు అతని మీద కుట్ర చేశాడు, అతడు తనతో యాభైమంది గిలాదు వారిని వెంటబెట్టుకొని అర్గోబు, అరీహే అనేవారితో పాటు, పెకహ్యాను సమరయ రాజభవనంలో ఉన్న కోటలో చంపేశాడు. కాబట్టి పెకహు పెకహ్యాను చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
2KI 15:26 పెకహ్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
2KI 15:27 యూదా రాజైన అజర్యా పరిపాలన యొక్క యాభై రెండవ సంవత్సరంలో, రెమల్యా కుమారుడైన పెకహు సమరయలో ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు.
2KI 15:28 అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము పాపాల నుండి తొలగిపోలేదు.
2KI 15:29 ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు.
2KI 15:30 తర్వాత ఏలా కుమారుడైన హోషేయ రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేశాడు. ఉజ్జియా కుమారుడైన యోతాము పరిపాలన యొక్క ఇరవయ్యవ సంవత్సరంలో అతడు పెకహు మీద దాడి చేసి, అతన్ని చంపి, అతని స్థానంలో రాజయ్యాడు.
2KI 15:31 పెకహు పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 15:32 ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడైన పెకహు పరిపాలన యొక్క రెండవ సంవత్సరంలో, యూదారాజు, ఉజ్జియా కుమారుడైన యోతాము పరిపాలించడం ఆరంభించాడు.
2KI 15:33 అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెరూష, ఆమె సాదోకు కుమార్తె.
2KI 15:34 అతడు తన తండ్రి ఉజ్జియా చేసినట్లే యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
2KI 15:35 అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు; ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు. యోతాము యెహోవా ఆలయానికి పై ద్వారాన్ని తిరిగి కట్టించాడు.
2KI 15:36 యోతాము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 15:37 (ఆ రోజుల్లో యెహోవా యూదా మీదికి అరాము రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును పంపించడం మొదలుపెట్టారు.)
2KI 15:38 యోతాము చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని దావీదు పట్టణంలో, తన తండ్రి పట్టణంలో, వారితో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన ఆహాజు రాజయ్యాడు.
2KI 16:1 రెమల్యా కుమారుడైన పెకహు పరిపాలనలోని పదిహేడవ సంవత్సరంలో యూదారాజు, యోతాము కుమారుడైన ఆహాజు రాజయ్యాడు.
2KI 16:2 ఆహాజు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. తన పితరుడైన దావీదులా కాకుండా, అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో సరియైనది చేయలేదు.
2KI 16:3 అతడు ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా ఏ జనాలనైతే వెళ్లగొట్టారో, ఆ జనాల హేయక్రియలు చేసి, తన కుమారున్ని అగ్నిలో బలి ఇచ్చాడు.
2KI 16:4 అతడు క్షేత్రాల్లో, కొండలమీద, పచ్చని ప్రతి చెట్టు క్రింద బలులు అర్పిస్తూ ధూపం వేసేవాడు.
2KI 16:5 అప్పుడు అరాము రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడైన పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి ఆహాజును ముట్టడించారు కాని, అతన్ని జయించలేకపోయారు.
2KI 16:6 ఆ సమయంలో అరాము రాజైన రెజీను, అరాము కోసం ఏలతును తిరిగి పట్టుకుని, దానిలో నుండి యూదా వారిని వెళ్లగొట్టాడు. అప్పుడు ఎదోమీయులు ఏలతుకు వెళ్లి నేటి వరకు అక్కడే నివసిస్తున్నారు.
2KI 16:7 ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరుకు దూతలను పంపి, “నేను మీ దాసున్ని మీ బానిసను. మీరు వచ్చి, నాపై దాడి చేస్తున్న అరాము ఇశ్రాయేలు రాజుల నుండి నన్ను రక్షించండి” అని చెప్పాడు.
2KI 16:8 ఆహాజు యెహోవా మందిరంలో నుండి రాజభవనం ఖజానాలో నుండి వెండి బంగారాలు అష్షూరు రాజుకు కానుకగా పంపించాడు.
2KI 16:9 అష్షూరు రాజు అతని మాట అంగీకరించి, దమస్కు మీద దండెత్తి, దానిని స్వాధీనపరచుకున్నాడు. దాని ప్రజలను కీరుకు బందీలుగా తీసుకెళ్లాడు, రెజీనును చంపాడు.
2KI 16:10 రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరును కలుసుకోడానికి దమస్కు పట్టణానికి వెళ్లాడు. దమస్కు పట్టణంలో ఒక బలిపీఠాన్ని చూసి, దాని పోలిక, నమూనా, దాని నిర్మాణ విధానం అంతా యాజకుడైన ఊరియాకు పంపాడు.
2KI 16:11 కాబట్టి యాజకుడైన ఊరియా ఆహాజు రాజు దమస్కు నుండి పంపిన నమూనా ప్రకారం బలిపీఠం ఒకటి కట్టించి, రాజైన ఆహాజు తిరిగి రాకముందే దాన్ని ఏర్పాటు చేశాడు.
2KI 16:12 రాజు దమస్కు నుండి తిరిగివచ్చి ఆ బలిపీఠాన్ని చూసి, దానిని సమీపించి, దాని మీద బలి అర్పించాడు.
2KI 16:13 దాని మీద దహనబలిని, భోజనార్పణను అర్పించాడు, పానార్పణాన్ని పోశాడు, సమాధానబలి రక్తాన్ని బలిపీఠం మీద చల్లాడు.
2KI 16:14 యెహోవా సముఖంలో ఉన్న ఇత్తడి బలిపీఠాన్ని మందిరం ఎదుట నుండి అనగా తాను కట్టించిన నూతన బలిపీఠానికి యెహోవా ఆలయానికి మధ్య నుండి తీసి, నూతన బలిపీఠానికి ఉత్తర దిక్కున దానిని ఉంచాడు.
2KI 16:15 ఆహాజు రాజ యాజకుడైన ఊరియాకు ఇలా ఆదేశాలిచ్చాడు: “నూతన పెద్ద బలిపీఠం మీద ఉదయకాలపు దహనబలి, సాయంకాలపు భోజనార్పణ, రాజు దహనబలి, దేశ ప్రజల దహనబలులు, భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. ఈ బలిపీఠం మీద దహనబలులు ఇతర బలులన్నిటి రక్తాన్ని చల్లాలి. అయితే నేను ఇత్తడి బలిపీఠాన్ని విచారణ కోసం వాడుకుంటాను.”
2KI 16:16 రాజైన ఆహాజు ఆదేశించినట్లే యాజకుడైన ఊరియా చేశాడు.
2KI 16:17 రాజైన ఆహాజు పీఠాలకున్న ప్రక్క పలకలను, పీఠాల నుండి గంగాళాన్ని తీయించాడు. ఇత్తడి ఎడ్ల మీద పెద్ద నీళ్ల తొట్టిని తీసేసి పరచిన రాళ్లమీద దానిని ఉంచాడు.
2KI 16:18 మందిరం దగ్గర కట్టబడిన సబ్బాతు మంటపాలను, యెహోవా మందిరం బయట రాజు ద్వారాన్ని తీయించాడు. ఇది అష్షూరు రాజుకు భయపడి ఇదంతా చేశాడు.
2KI 16:19 ఆహాజు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసింది, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 16:20 ఆహాజు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతన్ని దావీదు పట్టణంలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన హిజ్కియా రాజయ్యాడు.
2KI 17:1 యూదా రాజైన ఆహాజు పరిపాలనలోని పన్నెండవ సంవత్సరంలో ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు. అతడు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు.
2KI 17:2 అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, అయితే తనకు ముందున్న ఇశ్రాయేలు రాజుల మాదిరిగా కాదు.
2KI 17:3 అష్షూరు రాజైన షల్మనేసెరు హోషేయ మీద దాడి చేయడానికి రాగా హోషేయ అతనికి లొంగిపోయి అతనికి పన్ను చెల్లించాడు.
2KI 17:4 అయితే హోషేయ కుట్ర చేస్తున్నట్టు అష్షూరు రాజు పసిగట్టాడు, ఎందుకంటే హోషేయ, ఈజిప్టు రాజైన సో దగ్గరకు దూతలను పంపి ప్రతి సంవత్సరం అష్షూరు రాజుకు చెల్లించే పన్ను చెల్లించడం మానేశాడు; కాబట్టి షల్మనేసెరు అతన్ని పట్టుకుని చెరసాలలో వేశాడు.
2KI 17:5 అప్పుడు అష్షూరు రాజు దేశానంతా ఆక్రమించి, సమరయ మీదికి దండెత్తి దాన్ని మూడేళ్ళ వరకు ముట్టడించాడు.
2KI 17:6 హోషేయ పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు సమరయను పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరుకు బందీలుగా తీసుకెళ్లాడు. హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.
2KI 17:7 ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి రాజైన ఫరో బలం నుండి విడిపించి, వారిని బయటకు తీసుకువచ్చిన తమ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా వారు పాపం చేశారు. వారు ఇతర దేవుళ్ళను పూజిస్తూ,
2KI 17:8 తమ ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన జనాల ఆచారాలను, ఇశ్రాయేలు రాజులు ప్రవేశపెట్టిన ఆచారాలను పాటించారు.
2KI 17:9 ఇశ్రాయేలీయులు తమ దేవుడు యెహోవాకు వ్యతిరేకంగా, రహస్యంగా చెడు కార్యాలు చేశారు. కావలికోట నుండి కోటగోడలు గల పట్టణం వరకు, తమ పట్టణాల్లో క్షేత్రాలను కట్టుకున్నారు.
2KI 17:10 వారు ప్రతీ ఎత్తైన కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద, పవిత్ర రాళ్లను, అషేరా స్తంభాలను నిలబెట్టారు.
2KI 17:11 తమ ఎదుట నిలబడకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల ఆచారాల ప్రకారం క్షేత్రాల్లో ధూపం వేశారు. చెడుపనులు చేస్తూ యెహోవాకు కోపం రేపారు.
2KI 17:12 యెహోవా వారికి, “మీరు ఇలా చేయకూడదు” అని చెప్పినప్పటికి వారు విగ్రహాలను సేవించారు.
2KI 17:13 యెహోవా ఇశ్రాయేలును, యూదాను తన ప్రవక్తలందరి ద్వారా, దీర్ఘదర్శులందరి ద్వారా, “మీ చెడు మార్గాలను విడిచిపెట్టండి. మీ పూర్వికులకు ఆజ్ఞాపించిన, నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అప్పగించిన నా ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నా ఆజ్ఞలను, శాసనాలను పాటించండి” అని హెచ్చరించారు.
2KI 17:14 అయితే వారు వినలేదు, తమ దేవుడైన యెహోవాపై నమ్మకముంచని తమ పూర్వికుల్లా మొండిగా ఉన్నారు.
2KI 17:15 ఆయన శాసనాలను, ఆయన తమ పూర్వికులతో చేసిన నిబంధనను, ఆయన పాటించమని హెచ్చరించిన ధర్మశాస్త్రాన్ని వారు నిరాకరించారు. అయోగ్యమైన విగ్రహాలను అనుసరించి అయోగ్యులయ్యారు. యెహోవా వారికి, “వారు చేసినట్లు మీరు చేయకూడదు” అని చెప్పినప్పటికి తమ చుట్టూ ఉన్న ప్రజల విధానాలను వారు అనుసరించారు.
2KI 17:16 తమ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నీ విడిచిపెట్టి, తమ కోసం పోతపోసిన రెండు దూడలను, అషేరా స్తంభాన్ని చేసుకున్నారు. వారు నక్షత్రాలకు నమస్కరించి బయలును సేవించారు.
2KI 17:17 తమ కుమారులను, కుమార్తెలను అగ్నిలో బలి ఇచ్చారు. భవిష్యవాణి, సోదె చెప్పించడం చేసి, యెహోవా దృష్టిలో చెడు చేయడానికి తమను తాము అమ్ముకుని ఆయనకు కోపం రేపారు.
2KI 17:18 కాబట్టి యెహోవా ఇశ్రాయేలు మీద చాలా కోప్పడి, తన సముఖం నుండి వారిని తొలగించారు. యూదా గోత్రం మాత్రమే మిగిలింది.
2KI 17:19 యూదా వారు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించలేదు. ఇశ్రాయేలు ప్రవేశపెట్టిన ఆచారాలను వారు అనుసరించారు.
2KI 17:20 కాబట్టి యెహోవా ఇశ్రాయేలు ప్రజలందరినీ తిరస్కరించారు; ఆయన వారిని బాధకు గురిచేసి, తన సముఖం నుండి వారిని త్రోసివేసే వరకు వారిని దోపిడి మూకలకు అప్పగించారు.
2KI 17:21 ఆయన ఇశ్రాయేలును దావీదు రాజవంశం నుండి విడగొట్టినప్పుడు, వారు నెబాతు కుమారుడైన యరొబామును తమ రాజుగా చేసుకున్నారు. వారు యెహోవాను అనుసరించకుండా ఘోరమైన పాపం చేయడానికి యరొబాము కారణమయ్యాడు.
2KI 17:22 ఇశ్రాయేలీయులు యరొబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే చేస్తూ వచ్చారు.
2KI 17:23 చివరికి యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరి ద్వారా హెచ్చరించినట్లు, వారిని తన సముఖం నుండి త్రోసివేశారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తమ స్వదేశం నుండి బందీలుగా అష్షూరుకు వెళ్లారు, ఈనాటికీ వారక్కడ ఉన్నారు.
2KI 17:24 అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెఫర్వయీము నుండి మనుష్యులను తీసుకువచ్చి, సమరయ పట్టణాల్లో ఇశ్రాయేలీయులకు బదులుగా వారిని ఉంచాడు. వారు సమరయను స్వాధీనం చేసుకుని దాని పట్టణాల్లో నివసించారు.
2KI 17:25 వారు మొదట అక్కడ నివసించినప్పుడు, వారు యెహోవాకు భయపడలేదు; కాబట్టి ఆయన వారి మధ్యకు సింహాలను పంపించారు, అవి వారిలో కొంతమందిని చంపాయి.
2KI 17:26 అష్షూరు రాజుకు, “మీరు తీసుకువచ్చి సమరయ పట్టణాల్లో ఉంచిన ప్రజలకు ఈ దేశం యొక్క దేవుని నియమాలు తెలియవు. ఆయనకు ఏం కావాలో ప్రజలకు తెలియదు కాబట్టి సింహాలు వారిని చంపుతూ ఉన్నాయని వారు అష్షూరు రాజుకు చెప్పారు.”
2KI 17:27 అప్పుడు అష్షూరు రాజు, “సమరయ నుండి బందీలుగా తీసుకువచ్చిన యాజకులలో ఒకడిని అక్కడికి వెళ్లి అక్కడ నివసిస్తూ ఆ దేశ దేవుని నియమాలను ఆ ప్రజలకు బోధించడానికి పంపించండి” అని ఆజ్ఞాపించాడు.
2KI 17:28 కాబట్టి సమరయ నుండి బందీలుగా వెళ్లిన యాజకులలో ఒకడు బేతేలులో నివసించడానికి వచ్చి, యెహోవాను భయభక్తులతో ఎలా ఆరాధించాలో వారికి బోధించాడు.
2KI 17:29 అయినా కొంతమంది ప్రజలు తాము స్థిరపడ్డ అనేక పట్టణాల్లో తమ సొంత దేవుళ్ళను చేసుకుని, ఎత్తైన స్థలాల దగ్గర సమరయ ప్రజలు కట్టుకున్న క్షేత్రాల్లో వాటిని నిలబెట్టారు.
2KI 17:30 బబులోనువారు సుక్కోత్-బెనోతు, కూతు వారు నెర్గలును, హమాతు వారు అషీమా విగ్రహాన్ని చేశారు;
2KI 17:31 ఆవీయులు నిబ్హజును, తర్తాకును విగ్రహాలుగా చేసుకున్నారు. సెఫర్వీయులు తమ పిల్లలను ఆద్రమ్మెలెకు, అనెమ్మెలెకు అనే సెఫర్వయీము దేవుళ్ళకు అగ్నిలో బలిగా అర్పించారు.
2KI 17:32 వారు యెహోవాను ఆరాధించారు కాని ఎత్తైన స్థలాల్లో ఉన్న క్షేత్రాల్లో అన్ని రకాల ప్రజలను యాజకులుగా చేసుకున్నారు.
2KI 17:33 వారు యెహోవాను ఆరాధించారు కాని వారు తాము ఏ దేశాల నుండి వచ్చారో, ఆ దేశాల ఆచారాల ప్రకారం తమ దేవుళ్ళను కూడా సేవించారు.
2KI 17:34 వారు ఈనాటి వరకు తమ పూర్వాచారాలను పాటిస్తున్నారు. యెహోవా ఇశ్రాయేలు అని పేరుపెట్టబడిన యాకోబు సంతానం ఆయనను ఆరాధించలేదు, ఆయన శాసనాలను, నిబంధనలను, నియమాలను, ఆజ్ఞలను అనుసరించలేదు.
2KI 17:35 యెహోవా ఇశ్రాయేలీయులతో నిబంధన చేసినప్పుడు, ఆయన వారికి ఇలా ఆజ్ఞాపించారు: “మీరు ఏ ఇతర దేవుళ్ళను పూజించకూడదు; వాటికి మొక్కకూడదు, సేవించకూడదు వాటికి బలులు అర్పించకూడదు.
2KI 17:36 ఎవరైతే మిమ్మల్ని ఈజిప్టు దేశం నుండి గొప్ప బలప్రభావాలతో, చాచిన హస్తంతో బయటకు తెచ్చారో, ఆ యెహోవాను మీరు ఆరాధించాలి. ఆయనకు మొక్కి, ఆయనకు బలులు అర్పించాలి.
2KI 17:37 ఆయన మీకోసం వ్రాసిన శాసనాలను, నిబంధనలను, నియమాలను, ఆజ్ఞలను పాటించడంలో జాగ్రత వహించాలి. ఇతర దేవుళ్ళను పూజించకూడదు.
2KI 17:38 నేను మీతో చేసిన నిబంధన మరచిపోవద్దు, ఇతర దేవుళ్ళను పూజించకూడదు.
2KI 17:39 కాని మీ దేవుడైన యెహోవాను భయభక్తులతో ఆరాధించాలి; ఆయనే మీ శత్రువులందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తారు.”
2KI 17:40 అయితే వారు ఆయన మాట వినకుండా, తమ పూర్వాచారాలను అనుసరించారు.
2KI 17:41 ఈ ప్రజలు యెహోవాను ఆరాధిస్తున్ననూ, విగ్రహాలను కూడా సేవించారు. ఈనాటికీ వారి పిల్లలు, పిల్లల పిల్లలు వారి పూర్వికులు చేసినట్టే చేస్తున్నారు.
2KI 18:1 ఇశ్రాయేలు రాజు, ఏలా కుమారుడైన హోషేయ పరిపాలన యొక్క మూడవ సంవత్సరంలో యూదారాజు, ఆహాజు కుమారుడైన హిజ్కియా పరిపాలన ప్రారంభించాడు.
2KI 18:2 అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా, ఆమె జెకర్యా కుమార్తె.
2KI 18:3 అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు, యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
2KI 18:4 అతడు క్షేత్రాలను తొలగించి, పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు, ఎందుకంటే ఆ కాలం వరకు ఇశ్రాయేలీయులు దానికి ధూపం వేసేవారు. (అది నెహుష్టాను అని పిలువబడేది.)
2KI 18:5 హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయందు నమ్మకం ఉంచాడు. అతని ముందు గాని అతని తర్వాత గాని వచ్చిన యూదా రాజులలో, ఎవరూ అతని వంటివారు లేరు.
2KI 18:6 అతడు యెహోవాకు నమ్మకంగా ఉండి, ఆయనను వెంబడించడం మానేయలేదు; యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞలను అతడు పాటించాడు.
2KI 18:7 యెహోవా అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి హిజ్కియా చేసిన వాటన్నిటిలో జయం పొందాడు. అతడు అష్షూరు రాజుకు సేవచేయకుండ అతని మీద తిరగబడ్డాడు.
2KI 18:8 కావలికోట నుండి కోటగోడలు గల పట్టణం వరకు, గాజా దాని సరిహద్దుల వరకు ఫిలిష్తీయులను ఓడించాడు.
2KI 18:9 రాజైన హిజ్కియా పరిపాలన యొక్క నాలుగవ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు, ఏలా కుమారుడైన హోషేయ పరిపాలన యొక్క ఏడవ సంవత్సరంలో, అష్షూరు రాజైన షల్మనేసెరు సమరయ మీదికి దండెత్తి దాన్ని ముట్టడించాడు.
2KI 18:10 మూడు సంవత్సరాల ముగింపులో అష్షూరీయులు దాన్ని చేజిక్కించుకున్నారు. కాబట్టి హిజ్కియా పరిపాలన యొక్క ఆరవ సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజైన హోషేయ పరిపాలన యొక్క తొమ్మిదవ సంవత్సరంలో సమరయ స్వాధీనపరచుకోబడింది.
2KI 18:11 అష్షూరు రాజు ఇశ్రాయేలును చెరగా తీసుకెళ్లి, హాలహులో, హాబోరు నది ప్రాంతంలో ఉన్న గోజానులో, మాదీయుల పట్టణాల్లో వారిని ఉంచాడు.
2KI 18:12 వారు తమ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకుండా, ఆయన నిబంధనను, యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిందంతటిని ఉల్లంఘించినందుకు ఇలా జరిగింది. వారు ఆజ్ఞలను వినలేదు, పాటించలేదు.
2KI 18:13 రాజైన హిజ్కియా పాలన యొక్క పద్నాలుగవ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని కోటగోడలున్న పట్టణాలన్నిటి మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు.
2KI 18:14 కాబట్టి యూదా రాజైన హిజ్కియా, లాకీషు పట్టణంలో ఉన్న అష్షూరు రాజు దగ్గరకు, “నేను తప్పు చేశాను. నా దగ్గర నుండి నీవు వెనుకకు వెళ్లిపో, నీవు నా నుండి ఏమి కోరిన అది ఇస్తాను” అని సందేశం పంపాడు. అష్షూరు రాజు మూడువందలు తలాంతుల వెండి, ముప్పై తలాంతుల బంగారం యూదా రాజైన హిజ్కియా చెల్లించాలని విధించాడు.
2KI 18:15 కాబట్టి హిజ్కియా యెహోవా మందిరంలో, రాజభవన ధననిధిలో, వస్తువుల రూపంలో ఉన్న వెండి అంతా అతనికి ఇచ్చాడు.
2KI 18:16 ఇంకా ఆ కాలంలో యూదా రాజైన హిజ్కియా యెహోవా ఆలయ తలుపులకున్న బంగారం, తలుపు స్తంభాలకున్న బంగారం తీయించి అష్షూరు రాజుకిచ్చాడు.
2KI 18:17 అష్షూరు రాజు తన ప్రధాన సైన్యాధిపతిని, ముఖ్య అధికారిని, సైన్యాధిపతిని, పెద్ద సైన్యంతో, లాకీషు నుండి యెరూషలేములో ఉన్న రాజైన హిజ్కియా దగ్గరకు పంపాడు. వారు యెరూషలేముకు దండెత్తి చాకలి రేవు దారిలో ఉన్న పై కోనేటి కాలువ దగ్గర ఆగారు.
2KI 18:18 వారు రాజును పిలిపించారు; హిల్కీయా కుమారుడు, రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, కార్యదర్శియైన షెబ్నా, ఆసాపు కుమారుడు రాజ్య లేఖికుడైన యోవాహు వారి దగ్గరకు వెళ్లారు.
2KI 18:19 అప్పుడు సైన్యాధిపతి వారితో అన్నాడు, “హిజ్కియాకు చెప్పండి: “ ‘మహారాజు, అష్షూరు రాజు చెప్పే మాట ఇది: దేన్ని చూసుకుని నీకు ఈ ధైర్యం?
2KI 18:20 యుద్ధం విషయంలో నీకు ఆలోచన, బలం ఉంది అంటావు, కాని నీవు మాట్లాడేవి వట్టి మాటలే. నీవు ఎవరిని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేస్తున్నావు?
2KI 18:21 చూడు, నీవు నలిగిన రెల్లులాంటి ఈజిప్టును నమ్ముకుంటున్నావు, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. ఈజిప్టు రాజైన ఫరోను నమ్ముకునే వారందరికి అతడు చేసేది అదే.
2KI 18:22 అయితే, “మా దేవుడైన యెహోవా మీద మేము ఆధారపడుతున్నాం” అని మీరు నాతో అంటే, “యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మీరు ఆరాధించాలి” అని యూదా వారితో యెరూషలేము వారితో చెప్పిన ఆయన ఉన్నత స్థలాలను, బలిపీఠాలనే కదా హిజ్కియా పడగొట్టింది?
2KI 18:23 “ ‘ఇప్పుడు రండి, నా యజమానియైన అష్షూరు రాజుతో బేరం కుదుర్చుకోండి: మీ దగ్గర సరిపడే రౌతులు ఉంటే, నేను మీకు రెండువేల గుర్రాలు ఇస్తాను!
2KI 18:24 రథాలు, రౌతుల కోసం ఈజిప్టు రాజును నమ్ముకున్నా, మీరు నా యజమాని అధికారులలో అతి అల్పుడైన ఒక్క అధికారినైనా ఎలా ఎదిరించగలరు?
2KI 18:25 యెహోవా నుండి మాట రాకుండానే ఈ స్థలంపై దాడి చేసి నాశనం చేయడానికి వచ్చానా? ఈ దేశంపై దాడి చేసి నాశనం చేయమని స్వయాన యెహోవాయే చెప్పారు.’ ”
2KI 18:26 అప్పుడు హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా, యోవాహు సైన్యాధిపతితో, “నీ దాసులమైన మాకు అరామిక్ భాష అర్థం అవుతుంది కాబట్టి ఆ భాషలో మాట్లాడండి. గోడ మీద ఉన్న ప్రజలకు వినిపించేలా హెబ్రీ భాషలో మాట్లాడకండి” అన్నారు.
2KI 18:27 అయితే సైన్యాధిపతి జవాబిస్తూ, “ఈ విషయాలు కేవలం మీకు, మీ యజమానికి మాత్రమే చెప్పటానికి నా యజమాని నన్ను పంపాడని, గోడ మీద కూర్చున్న ప్రజలకు కాదనుకున్నారా? వారు కూడా మీలాగే తమ మలం తింటూ తమ మూత్రం త్రాగాల్సిందే” అని అన్నాడు.
2KI 18:28 అప్పుడు సైన్యాధిపతి నిలబడి బిగ్గరగా హెబ్రీ భాషలో ఇలా అన్నాడు, “మహారాజైన అష్షూరు రాజు మాట వినండి!
2KI 18:29 రాజు చెప్పే మాట ఇదే: హిజ్కియా మిమ్మల్ని మోసం చేయకుండ చూసుకోండి. నా చేతిలో నుండి అతడు మిమ్మల్ని విడిపించలేడు.
2KI 18:30 హిజ్కియా, ‘యెహోవా మనల్ని తప్పక విడిపిస్తారు; ఈ పట్టణం అష్షూరు రాజు చేతికి చిక్కదు’ అని చెప్తూ యెహోవా మీద నమ్మకం ఉంచేలా ప్రేరేపించనివ్వకండి.
2KI 18:31 “హిజ్కియా మాటలు వినకండి. అష్షూరు రాజు చెప్పే మాట ఇదే: నాతో సమాధాన ఒప్పందం చేసుకుని, నా దగ్గరకు రండి. అప్పుడు నేను వచ్చేవరకు, మీలో ప్రతి ఒక్కరూ మీ ద్రాక్షచెట్టు పండ్లు, మీ అంజూర చెట్టు పండ్లు తింటూ, మీ బావి నీళ్లు త్రాగుతారు.
2KI 18:32 తర్వాత నేను వచ్చి మిమ్మల్ని మీ సొంత దేశం లాంటి దేశానికి తీసుకెళ్తాను. అది ధాన్యాలు, క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశం, రొట్టె, ద్రాక్షతోటలు ఉన్న దేశము. ఒలీవచెట్లు, తేనె ఉన్న దేశము. మరణాన్ని కాదు, జీవాన్ని ఎంచుకోండి. “హిజ్కియా, ‘యెహోవా మనలను విడిపిస్తారు’ అంటూ మిమ్మల్ని నమ్మిస్తున్నాడు, అతని మాటలు వినకండి.
2KI 18:33 ఇతర దేశ దేవుడు ఎవరైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించాడా?
2KI 18:34 హమాతు, అర్పదు దేవుళ్ళు ఎక్కడ? సెఫర్వయీము, హేన, ఇవ్వా దేవుళ్ళు ఎక్కడ? వారు నా చేతిలో నుండి సమరయను రక్షించగలిగారా?
2KI 18:35 ఈ దేశాల దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని నా చేతిలో నుండి రక్షించగలిగారా? అలాగైతే, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును ఎలా విడిపిస్తారు?”
2KI 18:36 అయితే, “అతనికి జవాబివ్వకండి” అని రాజు వారికి ఆజ్ఞాపించడంతో ప్రజలు ఏమి జవాబివ్వకుండా మౌనంగా ఉన్నారు.
2KI 18:37 అప్పుడు హిల్కీయా, రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, కార్యదర్శియైన షెబ్నా, ఆసాపు కుమారుడు, రాజ్య లేఖికుడైన యోవాహు, తమ బట్టలు చింపుకొని హిజ్కియా దగ్గరకు వెళ్లి, అష్షూరు సైన్యాధిపతి చెప్పింది అతనికి తెలియజేశారు.
2KI 19:1 ఇది విని రాజైన హిజ్కియా తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరంలోకి వెళ్లాడు.
2KI 19:2 అతడు రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీమును, కార్యదర్శియైన షెబ్నాను, యాజకులలో పెద్దవారిని ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా దగ్గరకు పంపాడు, వారంత గోనెపట్ట కట్టుకున్నారు.
2KI 19:3 వారు అతనితో ఇలా అన్నారు, “హిజ్కియా చెప్పిన మాట ఇదే: ఈ రోజు బాధ, చీవాట్లు, అవమానం ఉన్న రోజు, బిడ్డ పుట్టడానికి సమయం దగ్గరకు వచ్చినా కనే శక్తిలేని స్త్రీలా ఉంది.
2KI 19:4 జీవంగల దేవున్ని దూషించడానికి అష్షూరు రాజు తన సేవకుడైన సైన్యాధిపతి పంపించాడు. అతడు పలికిన మాటలన్నీ మీ దేవుడైన యెహోవా విని అతని మాటలనుబట్టి మీ దేవుడైన యెహోవా అష్షూరు రాజును గద్దిస్తారేమో, కాబట్టి ఇక్కడ మిగిలే వారి కోసం ప్రార్థించండి.”
2KI 19:5 రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరకు వచ్చినప్పుడు,
2KI 19:6 యెషయా వారితో ఇలా అన్నాడు, “మీ యజమానికి చెప్పండి, ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు విన్న వాటికి అనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషిస్తూ మాట్లాడిన మాటలకు భయపడకండి.
2KI 19:7 వినండి! అతడు ఒక వదంతి విని తన దేశానికి వెళ్ళిపోయేలా నేను చేస్తాను, అక్కడ అతడు ఖడ్గం చేత చనిపోయేలా చేస్తాను.’ ”
2KI 19:8 అంతలో అష్షూరు రాజు లాకీషును విడిచి వెళ్లాడని అతని సైన్యాధిపతి విని, అతడు తిరిగివెళ్లి రాజు లిబ్నాతో పోరాడుతున్నాడని తెలుసుకున్నాడు.
2KI 19:9 అప్పుడు సన్హెరీబు, కూషు రాజైన తిర్హాకా తన మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడనే వార్త విన్నాడు. కాబట్టి అతడు మరలా దూతలను హిజ్కియా దగ్గరకు పంపాడు:
2KI 19:10 “యూదా రాజైన హిజ్కియాకు ఇలా చెప్పండి: నీవు నమ్ముకున్న నీ దేవుడు, ‘యెరూషలేము అష్షూరు రాజు చేతికి ఇవ్వబడదు’ అని చెప్పే మోసపు మాటలకు మోసపోవద్దు.
2KI 19:11 అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీవు ఖచ్చితంగా వినే ఉంటావు. మీరు మాత్రం తప్పించుకోగలరా?
2KI 19:12 గోజాను, హారాను, రెజెపు, తెలశ్శారు పట్టణంలో ఉండే ఏదెను ప్రజలను నా పూర్వికులు నాశనం చేసినప్పుడు, ఆ జనాల దేవుళ్ళు వారిని విడిపించారా?
2KI 19:13 హమాతు రాజు, అర్పదు రాజు ఎక్కడ? లాయిరు, సెఫర్వయీము, హేన, ఇవ్వా పట్టణాల రాజులు ఏమయ్యారు?”
2KI 19:14 హిజ్కియా దూతల నుండి లేఖ తీసుకుని దానిని చదివాడు. తర్వాత యెహోవా ఆలయానికి వెళ్లి, యెహోవా సముఖంలో ఆ ఉత్తరాన్ని తెరిచాడు.
2KI 19:15 హిజ్కియా యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా! ఇశ్రాయేలు దేవా! కెరూబుల మధ్యలో సింహాసనాసీనుడా! ఈ లోక రాజ్యాలకు మీరు మాత్రమే దేవుడు. మీరు భూమ్యాకాశాలను సృష్టించారు.
2KI 19:16 యెహోవా, శ్రద్ధగా వినండి; యెహోవా, కళ్లు తెరచి చూడండి. జీవంగల దేవున్ని దూషించడానికి సన్హెరీబు చెప్పి పంపిన మాటలు వినండి.
2KI 19:17 “యెహోవా, అష్షూరు రాజులు ఈ జనాలను, వారి దేశాలను నాశనం చేశారన్నది వాస్తవం.
2KI 19:18 వారు వారి దేవుళ్ళను అగ్నిలో వేసి నాశనం చేశారు, ఎందుకంటే అవి దేవుళ్ళు కాదు, కేవలం మనుషుల చేతులతో చేసిన కర్ర, రాళ్లు మాత్రమే.
2KI 19:19 ఇప్పుడు యెహోవా, మా దేవా, మమ్మల్ని అతని చేతిలో నుండి విడిపించండి. అప్పుడు ఈ లోక రాజ్యాలన్ని యెహోవాయైన మీరే దేవుడని తెలుసుకుంటారు.”
2KI 19:20 అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు ఇలా సందేశం పంపాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నీవు అష్షూరు రాజైన సన్హెరీబును గురించి నాకు చేసిన ప్రార్థన విన్నాను.
2KI 19:21 అతని గురించి యెహోవా చెప్పిన మాట ఇదే: “ ‘కన్యయైన సీయోను కుమార్తె నిన్ను తృణీకరించి ఎగతాళి చేస్తుంది. యెరూషలేము కుమార్తె నీవు పారిపోతుంటే తల ఊపుతుంది.
2KI 19:22 నీవు ఎవరిని నిందించి దూషించావు? ఎవరి మీద నీవు అరిచి గర్వంతో నీ కళ్ళెత్తి చూశావు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే గదా!
2KI 19:23 నీవు పంపిన దూతల ద్వారా ప్రభువును దూషించావు. నీవు అన్నావు, “నా అనేక రథాల చేత, పర్వత శిఖరాల మీదికి ఎక్కాను, లెబానోను ఎత్తైన స్థలాలను ఎక్కాను. దాని పొడువైన దేవదారులను నరికివేశాను, శ్రేష్ఠమైన సరళ వృక్షాలను నరికివేశాను. దాని చివరి సరిహద్దులను చేరుకున్నాను, దాని సారవంతమైన అడవులను చేరుకున్నాను.
2KI 19:24 నేను పరదేశి నేలలో బావులు త్రవ్వి అక్కడి నీళ్లు త్రాగాను. నా అరికాలితో ఈజిప్టు నది ప్రవాహాలన్నీ ఎండిపోయేలా చేశాను.”
2KI 19:25 “ ‘చాలా కాలం క్రితం నేనే నిర్ణయించానని, నీవు వినలేదా? పూర్వకాలంలో నేను సంకల్పించాను; ఇప్పుడు నేను అలా జరిగేలా చేశాను, నీవు కోటగోడలు గల పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేసేలా చేశాను.
2KI 19:26 వారి ప్రజలు బలహీనులై, భయాక్రాంతులై అవమానం పాలయ్యారు. వారు పొలంలో మొక్కల్లా, పచ్చని మొక్కల్లా, ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా పెరగక ముందే వాడిపోయినట్టు ఉన్నారు.
2KI 19:27 “ ‘అయితే నీవు ఎక్కడ ఉన్నావో ఎప్పుడు వస్తావో ఎప్పుడు వెళ్తావో నా మీద ఎంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు.
2KI 19:28 నీవు నాకు వ్యతిరేకంగా లేస్తున్నందుకు, నీ అహంకారం నా చెవిని చేరినందుకు, నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, నా కళ్లెం నీ నోటిలో వేస్తాను. నీవు వచ్చిన దారిలోనే నీవు తిరిగి వెళ్లేలా చేస్తాను.’
2KI 19:29 “హిజ్కియా, దానికి నీకిదే సూచన: “ఈ సంవత్సరం దాని అంతట అదే పండే పంటను మీరు తింటారు, రెండవ ఏట దాని నుండి కలిగే ధాన్యాన్ని మీరు తింటారు. అయితే మూడవ ఏట విత్తనాలు చల్లి కోత కోస్తారు, ద్రాక్షతోటలు నాటి వాటి ఫలాలు మీరు తింటారు.
2KI 19:30 యూదా రాజ్యంలో శేషం మరోసారి క్రిందికి వేర్లు తన్ని చిగురించి ఫలిస్తుంది.
2KI 19:31 యెరూషలేము నుండి శేషం వస్తుంది, సీయోను పర్వతం నుండి తప్పించుకున్నవారు వస్తారు. “సైన్యాల యెహోవా రోషం దీన్ని సాధిస్తుంది.
2KI 19:32 “కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: “ ‘అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు ఒక్క బాణమైనా వేయడు. ఒక్క డాలును దానికి చూపించడు దాని ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు.
2KI 19:33 అతడు వచ్చిన దారినే తిరిగి వెళ్లిపోతాడు. అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు అని యెహోవా ప్రకటిస్తున్నారు.
2KI 19:34 నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.’ ”
2KI 19:35 ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు శిబిరంలో లక్ష ఎనభై అయిదు వేలమంది సైనికులను హతం చేశాడు. ప్రొద్దున ప్రజలు లేచి చూస్తే వారంతా శవాలుగా పడి ఉన్నారు.
2KI 19:36 అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి వెళ్లిపోయాడు, నీనెవెకు తిరిగివెళ్లి అక్కడ ఉండిపోయాడు.
2KI 19:37 ఒక రోజు అతడు నిస్రోకు అనే తన దేవుని గుడిలో పూజ చేస్తుండగా అతని కుమారులు ఆద్రమ్మెలెకు, షెరెజరు ఖడ్గంతో అతన్ని చంపి అరారతు ప్రాంతానికి పారిపోయారు. అతని తర్వాత అతని కుమారుడైన ఏసర్హద్దోను రాజయ్యాడు.
2KI 20:1 ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త అతని దగ్గరకు వెళ్లి, “యెహోవా చెప్పే మాట ఇదే: నీవు చనిపోబోతున్నావు; నీవు కోలుకోవు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో” అన్నాడు.
2KI 20:2 హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకుని యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు,
2KI 20:3 “యెహోవా, నేను నమ్మకంగా, యథార్థ హృదయంతో మీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, మీ దృష్టిలో సరియైనది ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోండి.” హిజ్కియా భారంగా ఏడ్చాడు.
2KI 20:4 యెషయా మధ్య ప్రాంగణం విడిచి వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి వచ్చింది:
2KI 20:5 “నీవు వెనుకకు తిరిగివెళ్లి నా ప్రజల అధిపతియైన హిజ్కియాకు ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీ ప్రార్థన విని నీ కన్నీరు చూశాను; నేను నిన్ను స్వస్థపరుస్తాను. మూడవ రోజున నీవు యెహోవా ఆలయానికి వెళ్తావు.
2KI 20:6 నీ జీవితంలో ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను. అంతేకాక, నిన్ను, ఈ పట్టణాన్ని, అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాను. నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ పట్టణాన్ని కాపాడతాను.’ ”
2KI 20:7 తర్వాత యెషయా, “అంజూర పండ్ల ముద్ద తయారుచేయండి” అని చెప్పగా వారు దానిని తెచ్చి ఆ పుండుకు రాసారు. హిజ్కియా కోలుకున్నాడు.
2KI 20:8 హిజ్కియా యెషయాను, “యెహోవా నన్ను బాగు చేస్తారని, మూడవ రోజు నేను యెహోవా ఆలయానికి వెళ్తాను అనడానికి గుర్తు ఏంటి?” అని అడిగాడు.
2KI 20:9 అందుకు యెషయా, “యెహోవా చెప్పిన మాట నెరవేరుస్తారని ఆయన నీకు ఇచ్చిన సూచన ఇదే: గడియారం మీద నీడ పది అంకెలు ఇప్పుడు ముందుకు వెళ్లాలా లేదా వెనుకకు వెళ్లాలా?” అన్నాడు.
2KI 20:10 హిజ్కియా, “నీడ పది అంకెలు ముందుకు వెళ్లడం సులభమే. కాబట్టి నీడ పది అంకెలు వెనుకకు వెళ్లునట్లు చేయండి” అన్నాడు.
2KI 20:11 అప్పుడు యెషయా ప్రవక్త యెహోవాకు ప్రార్ధించాడు. ఆహాజు చేయించిన గడియారపు పలక మీద నీడ పది అంకెలు వెనుకకు పోయేటట్టు యెహోవా చేశారు.
2KI 20:12 ఆ కాలంలో బలదాను కుమారుడును బబులోనుకు రాజును అయిన మర్దూక్-బలదాను హిజ్కియాకు జబ్బుచేసిందని విని ఉత్తరాలు, కానుక అతనికి పంపాడు.
2KI 20:13 హిజ్కియా రాయబారులను ఆహ్వానించి, వారికి తన భవనంలో ఉన్న ఖజానాలోని వెండి, బంగారం, సుగంధద్రవ్యాలు, ఒలీవనూనెతో సహా ఆయుధాలు, ధనాగారాలలో ఉన్నవన్నీ వారికి చూపించాడు. తన భవనంలో గాని, రాజ్యమంతట్లో గాని హిజ్కియా వారికి చూపించనిదేది లేదు.
2KI 20:14 తర్వాత రాజైన హిజ్కియా దగ్గరకు ప్రవక్తయైన యెషయా వెళ్లి, “ఆ మనుష్యులు ఏమి చెప్పారు? ఎక్కడి నుండి నీ దగ్గరకు వచ్చారు?” అని అడిగాడు. అందుకు హిజ్కియా, “వారు బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు” అని జవాబిచ్చాడు.
2KI 20:15 “నీ భవనంలో వారు ఏమేమి చూశారు?” అని ప్రవక్త అడిగాడు. హిజ్కియా, “నా భవనంలో ఉన్నవన్నీ చూశారు. నా ధనాగారంలో ఏదీ మరుగు చేయక అన్నీ వారికి చూపించాను” అన్నాడు.
2KI 20:16 అప్పుడు యెషయా హిజ్కియాతో, “యెహోవా వాక్కు విను:
2KI 20:17 ఒక సమయం రాబోతుంది, నీ భవనంలో ఉన్నవన్నీ ఈనాటి వరకు మీ పూర్వికుల కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఏమీ మిగలదని యెహోవా చెప్తున్నారు.
2KI 20:18 నీకు పుట్టబోయే నీ సంతానంలో కొంతమంది బబులోనుకు కొనిపోబడి బబులోను రాజు యొక్క రాజభవనంలో నపుంసకలుగా అవుతారు.”
2KI 20:19 హిజ్కియా యెషయాతో, “నీవు చెప్పిన యెహోవా వాక్కు మంచిదే” అని అన్నాడు. ఎందుకంటే అతడు, “నా జీవితకాలంలో సమాధానం సత్యం ఉంటాయి కదా” అని అనుకున్నాడు.
2KI 20:20 హిజ్కియా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు సాధించినవన్నీ, అతడు కొలను త్రవ్వించి, కాలువ కట్టించి, నీటిని పట్టణానికి సరఫరా చేసిన సంగతి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 20:21 హిజ్కియా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని తర్వాత అతని కుమారుడు మనష్షే రాజయ్యాడు.
2KI 21:1 మనష్షే రాజైనప్పుడు అతని వయస్సు పన్నెండేళ్ళు, అతడు యెరూషలేములో యాభై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హెఫ్సిబా.
2KI 21:2 అతడు యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన జనాలు చేసే హేయక్రియలు చేశాడు.
2KI 21:3 తన తండ్రి హిజ్కియా పడగొట్టిన క్షేత్రాలను అతడు తిరిగి కట్టించాడు; ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్టు అతడు బయలు బలిపీఠాలను కట్టి, అషేరా స్తంభాన్ని చేశాడు. అతడు నక్షత్ర సమూహమంతటికి మ్రొక్కి వాటిని పూజించాడు.
2KI 21:4 యెహోవా తన మందిరాన్ని ఉద్దేశించి, “యెరూషలేములో నా పేరు ఉంచుతాను” అని చెప్పిన ఆ యెహోవా మందిరంలో అతడు బలిపీఠాలను కట్టించాడు.
2KI 21:5 యెహోవా మందిరంలో ఉన్న రెండు ఆవరణాల్లో నక్షత్ర సమూహమంతటికి అతడు బలిపీఠాలు కట్టించాడు.
2KI 21:6 అతడు తన సొంత కుమారుడిని అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం రేపాడు.
2KI 21:7 అతడు చెక్కించిన అషేరా స్తంభాన్ని తీసి ఆలయంలో నిలిపాడు. ఆ ఆలయం గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడైన సొలొమోనుకు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో, ఈ దేవాలయంలో నా పేరు నిత్యం ఉంచుతాను.
2KI 21:8 నేను వారికి నా సేవకుడైన మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రమంతటిని ఆచరిస్తూ నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా వారు పాటిస్తే, వారి పూర్వికులకు ఇచ్చిన దేశంలో నుండి నేను ఇశ్రాయేలీయుల పాదాలను తిరిగి వెళ్లనివ్వను” అని చెప్పారు.
2KI 21:9 అయితే ప్రజలు మాట వినలేదు. మనష్షే వారిని తప్పుదారి పట్టించాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండ యెహోవా నాశనం చేసిన దేశాల కంటే ఎక్కువ చెడు చేశారు.
2KI 21:10 యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలా మాట్లాడారు:
2KI 21:11 “యూదా రాజైన మనష్షే ఈ అసహ్యకరమైన పాపాలు చేశాడు. అతనికంటే ముందు ఉన్న అమోరీయుల కంటే మించి చెడు చేశాడు, అతడు విగ్రహాలతో యూదాను తప్పుదారి పట్టించాడు.
2KI 21:12 కాబట్టి ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను యెరూషలేము మీదికి, యూదా మీదికి విపత్తు రప్పిస్తాను. ఆ విపత్తును గురించి విన్న వారందరి చెవులు గింగురుమంటాయి.
2KI 21:13 నేను సమరయకు వ్యతిరేకంగా ఉపయోగించిన కొలమానాన్ని, అహాబు ఇంటిపై ఉపయోగించిన మట్టపు గుండును యెరూషలేము మీద వ్రేలాడదీస్తాను. ఒకడు గిన్నె తుడిచి బోర్లించినట్టు నేను యెరూషలేమును తుడిచివేస్తాను.
2KI 21:14 వారసత్వంగా ఉన్న నా ప్రజల్లో మిగిలిన వారి చేయి విడిచి, వారిని శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు తమ శత్రువులందరిచేత దోచుకోబడతారు;
2KI 21:15 వారి పూర్వికులు ఈజిప్టు నుండి వచ్చిన రోజు నుండి ఈ ఒక రోజు వరకు నా దృష్టిలో చెడుగా ప్రవర్తిస్తూ నాకు కోపం రేపారు.”
2KI 21:16 యూదా వారు యెహోవా దృష్టిలో తప్పుగా ప్రవర్తించేటట్టు మనష్షే వారిని తప్పుదారి పట్టించడమే గాక, చాలామంది నిరపరాధుల రక్తాన్ని, యెరూషలేము ఆ చివర నుండి ఈ చివర వరకు చిందించాడు.
2KI 21:17 మనష్షే పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన పాపం గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 21:18 మనష్షే చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. ఉజ్జా తోటలో అతని రాజభవన తోటలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన ఆమోను రాజయ్యాడు.
2KI 21:19 ఆమోను రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో రెండేళ్ళు పరిపాలించాడు. అతని తల్లి హారూసు కుమార్తెయైన మెషుల్లెమెతు; ఆమె యోత్బా పట్టణానికి చెందినది.
2KI 21:20 అతడు తన తండ్రి మనష్షేలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
2KI 21:21 అతడు తన తండ్రి జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరిస్తూ, తన తండ్రి కొలిచిన విగ్రహాలను కొలిచి పూజించేవాడు.
2KI 21:22 అతడు తన పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు, ఆయన మార్గాలను అనుసరించలేదు.
2KI 21:23 ఆమోను సేవకులు అతని మీద కుట్రపన్ని, అతని సొంత భవనంలోనే రాజును చంపారు.
2KI 21:24 అప్పుడు యూదా దేశ ప్రజలు ఆమోను రాజు మీద కుట్రపన్నిన వారినందరిని చంపేశారు. అతని స్థానంలో అతని కుమారుడైన యోషీయాను రాజుగా చేశారు.
2KI 21:25 ఆమోనును పరిపాలన గురించిన ఇతర విషయాలు అతడు చేసినవి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
2KI 21:26 వారు అతన్ని ఉజ్జా తోటలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన యోషీయా రాజయ్యాడు.
2KI 22:1 యోషీయా రాజైనప్పుడు అతని వయస్సు ఎనిమిది సంవత్సరాలు. అతడు యెరూషలేములో ముప్పై ఒక సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి అదాయా కుమార్తెయైన యెదీదా; ఆమె బొస్కతు గ్రామస్థురాలు.
2KI 22:2 అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అతడు తన పితరుడైన దావీదు జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరించాడు, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోలేదు.
2KI 22:3 అతని పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో రాజైన యోషీయా మెషుల్లాము మనుమడును అజల్యా కుమారుడును, కార్యదర్శియునైన షాఫానును యెహోవా మందిరాన్ని బాగుచేయించడానికి పంపాడు. అతడు ఇలా చెప్పాడు:
2KI 22:4 “నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరకు వెళ్లి, యెహోవా ఆలయానికి వచ్చే ప్రజల నుండి ద్వారపాలకులు వసూలు చేసిన డబ్బు మొత్తం సిద్ధంగా ఉంచమని అతనితో చెప్పు.
2KI 22:5 వారు ఆ డబ్బును యెహోవా మందిర పనులు చేయించడానికి నియమించబడిన మనుష్యులకు ఇవ్వాలి. వారు ఆ డబ్బును మరమ్మత్తు పని చేసేవారికి అనగా వడ్రంగి వారికి, కట్టేవారికి, తాపీ మేస్త్రీలకు ఇవ్వాలి. వారు ఆలయ మరమ్మత్తు కోసం కలపమ్రాను, చెక్కిన రాళ్లు కొనడానికి ఆ డబ్బును వాడాలి.
2KI 22:7 అయితే వారి చేతికి అప్పగించే డబ్బుకు వారు లెక్కలు చూపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు తమ వ్యవహారాలలో నమ్మకమైనవారు.”
2KI 22:8 ప్రధాన యాజకుడైన హిల్కీయా కార్యదర్శియైన షాఫానుతో, “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని చెప్పి దానిని షాఫానుకు ఇచ్చాడు.
2KI 22:9 తర్వాత కార్యదర్శియైన షాఫాను రాజు దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు: “మీ సేవకులు యెహోవా మందిరంలో ఉన్న డబ్బు జమచేసి, మందిరంలో పని చేస్తున్న వారికి, వారి పై అధికారుల చేతికి అప్పగించారు.”
2KI 22:10 అప్పుడు కార్యదర్శియైన షాఫాను, “యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు” అని రాజుకు చెప్పి రాజు సముఖంలో దాని నుండి చదివాడు.
2KI 22:11 రాజు ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు విన్నప్పుడు తాను వేసుకున్న బట్టలు చింపుకొన్నాడు.
2KI 22:12 తర్వాత రాజు యాజకుడైన హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకాయా కుమారుడైన అక్బోరుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు:
2KI 22:13 “మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలో వ్రాసిన మాటల గురించి నా కోసం, ప్రజల కోసం యూదా అంతటి కోసం, యెహోవా దగ్గర విచారణ చేయండి. యెహోవా కోపాగ్ని మనమీద అధికంగా రగులుకొని ఉంది. ఎందుకంటే, మన పూర్వికులు ఈ గ్రంథంలోని మాటలకు లోబడలేదు; మనలను ఉద్దేశించి అందులో వ్రాయబడిన ప్రకారం వారు చేయలేదు.”
2KI 22:14 యాజకుడైన హిల్కీయా, అహీకాము, అక్బోరు, షాఫాను, అశాయా హుల్దా ప్రవక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె వస్త్రశాల తనిఖీదారుడైన హర్షషుకు పుట్టిన తిక్వా కుమారుడైన షల్లూము భార్య, యెరూషలేములో నూతన భాగంలో నివసించేది.
2KI 22:15 ఆమె వారితో, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: మిమ్మల్ని నా దగ్గరకు పంపిన వ్యక్తికి చెప్పండి,
2KI 22:16 ‘యెహోవా చెప్పే మాట ఇదే: యూదారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడిన కీడంతటిని నేను ఈ స్థలం మీదికి, దీని ప్రజలమీదికి రప్పిస్తాను.
2KI 22:17 ఎందుకంటే, ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేశారు. వారు చేతులతో చేసిన విగ్రహాలన్నిటి బట్టి నాకు కోపం రేపారు, నా కోపం ఈ స్థలంపై రగులుకుంటుంది, అది చల్లారదు.’
2KI 22:18 యెహోవా దగ్గర విచారణ చేయడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుతో ఇలా చెప్పండి, ‘నీవు విన్న మాటల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే:
2KI 22:19 వారు శపించబడి నాశనమవుతారని ఈ స్థలం గురించి ఈ ప్రజల గురించి నే చెప్పిన మాటలు విని నీ హృదయం స్పందించి నీవు యెహోవా ఎదుట తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో ఏడ్చావు కాబట్టి, నేను కూడా నీ మనవి విన్నానని యెహోవా చెప్తున్నారు.
2KI 22:20 కాబట్టి నేను నిన్ను నీ పూర్వికుల దగ్గరకు చేరుస్తాను, సమాధానంతో నీవు సమాధి చేయబడతావు. నేను ఈ స్థలం మీదికి రప్పించే విపత్తును నీ కళ్లు చూడవు’ ” అని చెప్పింది. అప్పుడు వారు ఆమె జవాబును రాజు దగ్గరకు తీసుకెళ్లారు.
2KI 23:1 అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు.
2KI 23:2 అతడు యూదా ప్రజలతో, యెరూషలేము వాసులతో, యాజకులతో, ప్రవక్తలతో, అల్పుల నుండి ఘనులైన ప్రజలందరితో కలిసి యెహోవా ఆలయానికి వెళ్లాడు. అక్కడ రాజు, వారంతా వినేటట్టు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివి వినిపించాడు.
2KI 23:3 రాజు ఒక స్తంభం దగ్గర నిలబడి, తన పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో యెహోవాను అనుసరిస్తానని, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు పాటిస్తానని, యెహోవా సన్నిధిలో నిబంధనను పునరుద్ధరించాడు, తద్వారా ఈ గ్రంథంలో వ్రాయబడిన నిబంధన మాటలన్నీ నిర్ధారించాడు. అప్పుడు ప్రజలందరు ఆ నిబంధనకు సమ్మతించారు.
2KI 23:4 రాజు ప్రధాన యాజకుడైన హిల్కీయాను, తర్వాత స్థాయి యాజకులను, ద్వారపాలకులను పిలిపించి బయలుకు, అషేరాకు, నక్షత్ర సమూహాలన్నిటి కోసం చేయబడిన వస్తువులన్నిటిని, యెహోవా మందిరం నుండి తీసివేయాలని ఆదేశించాడు. అతడు వాటిని యెరూషలేము బయట కిద్రోను లోయలో కాల్చివేసి, ఆ బూడిద బేతేలుకు తీసుకెళ్లాడు.
2KI 23:5 అంతకుముందు యూదా పట్టణాల్లో, యెరూషలేము చుట్టూ క్షేత్రాల్లో ధూపం వేయడానికి యూదా రాజులు నియమించిన విగ్రహాల పూజారుల బృందాన్ని అతడు తొలగించాడు. వారు బయలుకు, సూర్యునికి, చంద్రునికి, నక్షత్ర సమూహాలన్నిటికి వేసేవారు.
2KI 23:6 అతడు యెహోవా మందిరం నుండి యెరూషలేము బయట ఉన్న కిద్రోను లోయ దగ్గరకు అషేరా స్తంభాన్ని తెప్పించి, అక్కడ దానిని కాల్చివేశాడు. అతడు దానిని పొడిగా నలుగగొట్టి ఆ పొడిని సాధారణ ప్రజల సమాధుల మీద చల్లాడు.
2KI 23:7 అతడు యెహోవా మందిరంలో ఉన్న పురుష వ్యభిచారుల గదులను పడగొట్టించాడు, అక్కడ స్త్రీలు అషేరాకు వస్త్రాలను అల్లేవారు.
2KI 23:8 యోషీయా యూదా పట్టణాల్లో ఉన్న యాజకులందరిని యెరూషలేముకు తెప్పించి ఆ యాజకులు ధూపం వేసే క్షేత్రాలను గెబా నుండి బెయేర్షేబ వరకు అపవిత్రపరచాడు. అతడు యెరూషలేము నగర అధికారియైన యెహోషువ ఇంటి ద్వారం ఎడమవైపు ఉన్న క్షేత్రాలను పడగొట్టించాడు.
2KI 23:9 క్షేత్రాల దగ్గర సేవ చేసిన ఆ యాజకులు యెరూషలేములో ఉన్న యెహోవా బలిపీఠం దగ్గర సేవ చేయలేదు, కాని వారు తమ తోటి యాజకుల దగ్గర పులియని రొట్టెలు తినేవారు.
2KI 23:10 తర్వాత ఎవరు కూడా తన కుమారుని గాని, కుమార్తెను గాని మోలెకు విగ్రహం ముందు అగ్నిగుండం దాటించకుండా ఉండేలా అతడు బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతు అనే స్థలాన్ని అపవిత్రపరచాడు.
2KI 23:11 యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను అతడు యెహోవా ఆలయ ద్వారం నుండి తొలగించాడు. అవి నాతాన్-మెలెకు అనే అధికారి గదికి సమీపంలో ఉన్న ఆవరణంలో ఉన్నాయి. యోషీయా సూర్యునికి అంకితం చేయబడిన రథాలను కాల్చివేశాడు.
2KI 23:12 అతడు ఆహాజు మేడమీది పైకప్పు మీద యూదా రాజులు కట్టించిన బలిపీఠాన్ని, యెహోవా మందిరం యొక్క రెండు ఆవరణాల్లో మనష్షే కట్టించిన బలిపీఠాన్ని పడగొట్టాడు. వాటిని అక్కడినుండి తీసివేసి, ముక్కలు ముక్కలుగా చేసి, ఆ ముక్కలను కిద్రోను లోయలో పారవేశాడు.
2KI 23:13 గతంలో ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెరూషలేముకు ఎదురుగా ఉన్న అవినీతి పర్వతానికి దక్షిణం వైపు సీదోనీయుల హేయ దేవత అష్తారోతుకు, మోయాబీయుల హేయ దేవుడైన కెమోషుకు, అమ్మోనీయుల హేయ దేవుడైన మిల్కోముకు కట్టించిన క్షేత్రాలను అపవిత్రం చేశాడు.
2KI 23:14 యోషీయా పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టాడు, ఆ స్థలాలను మనుష్యుల ఎముకలతో నింపాడు.
2KI 23:15 బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము కట్టిన పూజా స్థలాన్ని కూడా అతడు పడగొట్టాడు. ఆ క్షేత్రాన్ని కాల్చివేసి పొడి చేశాడు, అషేరా స్తంభాన్ని కూడా కాల్చివేశాడు.
2KI 23:16 అప్పుడు యోషీయా చూడగా ఆ కొండమీద, అతనికి ఆ కొండమీద సమాధులు కనిపించినప్పుడు, అతనికి ఆ సమాధుల్లో నుండి ఎముకలను తీయించి, బలిపీఠాన్ని అపవిత్ర పరచడానికి వాటిని దాని మీద కాల్చివేశాడు. గతంలో దైవజనుడు చాటించిన యెహోవా వాక్కు ప్రకారం ఇది జరిగింది.
2KI 23:17 రాజు, “నాకు కనిపిస్తున్న ఆ సమాధి రాయి ఏంటి?” అని అడిగాడు. అందుకు ఆ పట్టణస్థులు చెప్పారు, “అది యూదా నుండి వచ్చిన దైవజనుని సమాధి. మీరు బేతేలులో ఉన్న బలిపీఠానికి చేసిన దాని గురించి ప్రకటించింది అతడే” అని చెప్పారు.
2KI 23:18 యోషీయా, “అది అలాగే ఉంచండి. ఆయన ఎముకలను తీయనీయకండి” అని చెప్పగా వారు అతని ఎముకలను సమరయ నుండి వచ్చిన ప్రవక్త ఎముకలతో పాటు అలానే ఉండనిచ్చారు.
2KI 23:19 అతడు బేతేలులో ఎలా చేశాడో అలాగే, ఇశ్రాయేలు రాజులు సమరయ పట్టణాల్లో కట్టి యెహోవాకు కోపం రేపిన ఎత్తైన స్థలాల్లో ఉన్న క్షేత్రాలన్నిటినీ యోషీయా తీసివేశాడు.
2KI 23:20 యోషీయా ఆ క్షేత్రాల పూజారులందరినీ బలిపీఠాల మీద వధించాడు, మనుష్యుల ఎముకలను వాటి మీద కాల్చివేశాడు. తర్వాత అతడు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
2KI 23:21 రాజు ప్రజలందరికి, “నిబంధన గ్రంథంలో వ్రాయబడినట్టు, మీరు మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించండి” అని ఆజ్ఞ ఇచ్చాడు.
2KI 23:22 అలాంటి పస్కా పండుగ ఇశ్రాయేలు ప్రజలను న్యాయం తీర్చిన న్యాయాధిపతుల కాలం నుండి ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు పరిపాలించిన కాలం వరకు ఎన్నడూ ఆచరించలేదు.
2KI 23:23 అయితే యోషీయా రాజు పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో యెరూషలేములో ఈ పస్కా పండుగ యెహోవాకు జరిగింది.
2KI 23:24 అంతేకాక యోషీయా కర్ణపిశాచులను, ఆత్మలతో మాట్లాడేవారిని, గృహదేవతలు, విగ్రహాలు, యూదాలో యెరూషలేములో కనిపించే ఇతర అసహ్యకరమైన వస్తువులన్నిటిని తీసివేసి యాజకుడైన హిల్కీయాకు యెహోవా మందిరంలో దొరికిన గ్రంథంలో వ్రాయబడిన ధర్మశాస్త్ర విధులను నెరవేర్చడానికి అతడు ఇలా చేశాడు.
2KI 23:25 అతడు పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణబలంతో యెహోవా వైపు తిరిగి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించాడు. అతనికంటే ముందు కాని అతని తర్వాత కాని, అతనిలాంటి రాజు ఎవరూ లేరు.
2KI 23:26 అయినా యెహోవాకు యూదా మీద ఉన్న మహా కోపం తగ్గలేదు, ఎందుకంటే మనష్షే చేసినదంతటిని బట్టి ఆయన కోపం రగులుకుంది.
2KI 23:27 కాబట్టి యెహోవా అన్నారు, “నేను ఇశ్రాయేలు ప్రజలను చేసినట్టు యూదా ప్రజలను కూడా నా సముఖంలో లేకుండా చేస్తాను. నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణాన్ని, ‘నా పేరు అక్కడ ఉంటుంది’ అని చెప్పిన మందిరాన్ని విసర్జిస్తాను” అన్నారు.
2KI 23:28 యోషీయా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 23:29 యోషీయా రాజుగా ఉన్నప్పుడు, ఈజిప్టు రాజైన ఫరో నెకో యూఫ్రటీసు నది దగ్గర అష్షూరు రాజుకు యుద్ధంలో సహాయపడడానికి వెళ్లాడు. రాజైన యోషీయా అతన్ని ఎదుర్కోబోయాడు, అయితే నెకో అతన్ని మెగిద్దో దగ్గర చంపాడు.
2KI 23:30 యెషీయా సేవకులు అతని మృతదేహాన్ని మెగిద్దో నుండి యెరూషలేముకు రథంలో తీసుకువచ్చి అతని సమాధిలో పాతిపెట్టారు. దేశ ప్రజలు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అభిషేకించి, అతని తండ్రి స్థానంలో అతన్ని రాజుగా చేశారు.
2KI 23:31 యెహోయాహాజు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు. అతని తల్లి యిర్మీయా కుమార్తెయైన హమూటలు, ఆమె లిబ్నా పట్టణస్థురాలు.
2KI 23:32 అతడు తన పూర్వికులు చేసినట్టే యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
2KI 23:33 అతడు యెరూషలేములో పరిపాలించకుండా ఫరో నెకో అతన్ని హమాతు ప్రదేశంలో ఉన్న రిబ్లాలో ఖైదీగా చేశాడు, యూదా మీద వంద తలాంతుల వెండిని, ఒక తలాంతు బంగారాన్ని పన్నుగా విధించాడు.
2KI 23:34 ఫరో నెకో యోషీయా కుమారుడైన ఎల్యాకీమును యోషీయా స్థానంలో రాజుగా చేసి, అతని పేరును యెహోయాకీముగా మార్చాడు. అయితే యెహోయాహాజును ఈజిప్టుకు తీసుకెళ్లాడు, అతడు అక్కడ చనిపోయాడు.
2KI 23:35 ఫరో నెకో నిర్ణయించిన ఆ వెండి బంగారాలు యెహోయాకీము అతనికి ఇచ్చాడు. అలా చేయడానికి దేశం మీద పన్ను నిర్ణయించి దేశ ప్రజల నుండి వెండి బంగారాలు వసూలు చేయించాడు.
2KI 23:36 యెహోయాకీము రాజైనప్పుడు, అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి, పెదాయా కుమార్తెయైన జెబూదా, ఆమె రూమా పట్టణస్థురాలు.
2KI 23:37 అతడు తన పూర్వికులు చేసినట్టే యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
2KI 24:1 యెహోయాకీము పరిపాలన కాలంలో బబులోను రాజైన నెబుకద్నెజరు దేశం మీదికి వచ్చాడు, యెహోయాకీము అతనికి లొంగిపోయి, మూడేళ్ళు సామంతుడిగా ఉన్నాడు. తర్వాత అతడు నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేశాడు.
2KI 24:2 అయితే యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి యెహోవా దాని మీదికి బబులోనీయుల, అరామీయుల, మోయాబీయుల, అమ్మోనీయుల దోపిడి మూకను పంపించాడు. ఇది యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా చెప్పినట్లు జరిగింది.
2KI 24:3 ఇవి మనష్షే పాపాలు, అతడు చేసిన పనులన్నిటిని బట్టి, నిరపరాధుల రక్తం చిందించినందుకు, యూదా ప్రజలను తన సముఖంలో లేకుండా చేయాలని యెహోవా ఆజ్ఞ ప్రకారం జరిగాయి. ఎందుకంటే అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపాడు, అది క్షమించడానికి యెహోవా ఇష్టపడలేదు.
2KI 24:5 యెహోయాకీము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
2KI 24:6 యెహోయాకీము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాకీను రాజయ్యాడు.
2KI 24:7 ఈజిప్టు వాగు నుండి యూఫ్రటీసు నది వరకు ఈజిప్టు రాజు వంశంలో ఉన్న ప్రదేశాలన్నిటినీ బబులోను రాజు స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి అతడు తన సొంత దేశాన్ని విడిచి బయటకు రాలేదు.
2KI 24:8 యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు. అతని తల్లి ఎల్నాతాను కుమార్తెయైన నెహుష్తా; ఈమె యెరూషలేము నగరవాసి.
2KI 24:9 అతడు తన తండ్రి చేసినట్టే యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
2KI 24:10 ఆ కాలంలో బబులోను రాజైన నెబుకద్నెజరు సైన్యాధికారులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణానికి ముట్టడి వేశారు,
2KI 24:11 వారు పట్టణాన్ని ముట్టడిస్తూ ఉంటే బబులోను రాజు నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చాడు.
2KI 24:12 యూదా రాజైన యెహోయాకీను, అతని తల్లి, అతని పరివారం, అతని క్రింద సంస్థానాధిపతులు, అతని అధికారులు బబులోను రాజుకు లొంగిపోయారు. బబులోను రాజు పరిపాలన యొక్క ఎనిమిదవ సంవత్సరంలో, అతడు యెహోయాకీనును ఖైదీగా తీసుకెళ్లాడు.
2KI 24:13 యెహోవా ప్రకటించినట్లు, నెబుకద్నెజరు యెహోవా మందిరంలో నుండి, రాజభవనంలో నుండి విలువైన వస్తువులన్నిటిని బయటకు తెప్పించాడు, ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా మందిరం కోసం చేయించిన బంగారు పాత్రలన్నిటిని బబులోను రాజు ముక్కలు చేశాడు.
2KI 24:14 అతడు యెరూషలేము నగరవాసులందరినీ అనగా దేశంలో ఉన్న బీదలను తప్ప అధికారులందరిని యుద్ధవీరులను హస్తకళాకారులను కంసాలివారిని మొత్తం పదివేలమంది బందీలుగా తీసుకెళ్లాడు.
2KI 24:15 నెబుకద్నెజరు యెహోయాకీనును బందీగా బబులోనుకు తీసుకెళ్లాడు. అతడు యెరూషలేము నుండి రాజు తల్లిని, రాజు భార్యలను, రాజభవన అధికారులను, దేశంలోని ప్రముఖులను కూడా తీసుకెళ్లాడు.
2KI 24:16 బబులోను రాజు ఏడు వేలమంది యుద్ధములలో ఆరితేరిన బలాఢ్యులైన పరాక్రమశాలులందరిని, వేయిమంది హస్తకళాకారులను, కంసాలివారిని కూడా తీసుకెళ్లాడు.
2KI 24:17 బబులోను రాజు యెహోయాకీను పినతండ్రియైన మత్తన్యాను అతని స్థానంలో రాజుగా నియమించి, అతని పేరును సిద్కియా అని మార్చాడు.
2KI 24:18 సిద్కియా రాజైనప్పుడు అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు; ఆమె యిర్మీయా కుమార్తె; ఆమె లిబ్నా పట్టణస్థురాలు.
2KI 24:19 యెహోయాకీము చేసినట్టే అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
2KI 24:20 యెహోవా తీవ్రమైన కోపంతో వారిని తన సన్నిధి నుండి త్రోసివేసేంతగా ఈ చెడుతనం యెరూషలేము, యూదాల్లో జరిగింది. తర్వాత సిద్కియా బబులోను రాజుపై తిరుగుబాటు చేశాడు.
2KI 25:1 కాబట్టి సిద్కియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం, పదవనెల పదవ రోజున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి బయలుదేరి పట్టణం బయట శిబిరం వేసుకుని దాని చుట్టూ ముట్టడి దిబ్బలు నిర్మించాడు.
2KI 25:2 సిద్కియా రాజు ఏలుబడిలో పదకొండవ సంవత్సరం వరకు పట్టణం ముట్టడిలో ఉంది.
2KI 25:3 నాలుగవ నెల తొమ్మిదవ రోజున కరువు పట్టణంలో మరీ తీవ్రంగా ఉండడంతో ప్రజలకు ఆహారం లేకుండా పోయింది.
2KI 25:4 పట్టణ గోడలు పడగొట్టి బబులోనీయులు పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు, సైన్యమంతా రాత్రివేళ రాజు తోట సమీపంలోని రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా వారు పట్టణాన్ని విడిచిపోయారు. వారు అరాబా వైపు పారిపోయారు.
2KI 25:5 అయితే బబులోను సైన్యం రాజును వెంటాడి యెరికో సమతల మైదానంలో అతన్ని పట్టుకుంది. అతని సైనికులందరూ అతని నుండి చెదిరిపోయారు.
2KI 25:6 అతడు పట్టుబడ్డాడు. అతన్ని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు.
2KI 25:7 అతడు సిద్కియా కుమారులను అతని కళ్లముందే చంపించాడు. తర్వాత అతని కళ్లు ఊడదీసి, అతన్ని ఇత్తడి సంకెళ్ళతో బంధించి బబులోనుకు తీసుకెళ్లాడు.
2KI 25:8 బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలనలోని పందొమ్మిదవ సంవత్సరం, అయిదవ నెల, ఏడవ రోజున బబులోను రాజు సేవకుడును రాజ రక్షక దళాధిపతియునైన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు.
2KI 25:9 అతడు యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని యెరూషలేములోని ఇళ్ళన్నిటిని తగలబెట్టాడు. అతడు ప్రతి ప్రాముఖ్య భవనాన్ని తగలబెట్టాడు.
2KI 25:10 రాజ రక్షక దళాధిపతి క్రింద ఉన్న బబులోను సైన్యమంతా యెరూషలేము చుట్టూ ఉన్న గోడలను పడగొట్టారు.
2KI 25:11 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను పట్టణంలో మిగిలినవారిని, బబులోను రాజు పక్షం చేరిన వారిని, మిగిలిన సామాన్య ప్రజలతో పాటు బందీలుగా తీసుకెళ్లాడు.
2KI 25:12 అయితే అతడు ద్రాక్షతోటల్లో, పొలాల్లో పని చేయడానికి దేశంలోని కొంతమంది నిరుపేద ప్రజలను విడిచిపెట్టాడు.
2KI 25:13 బబులోనీయులు యెహోవా మందిరం దగ్గర ఉన్న ఇత్తడి స్తంభాలను, కదిలే పీటలను ఇత్తడి గంగాళాన్ని పగలగొట్టి, ఆ ఇత్తడినంతటిని బబులోనుకు తీసుకెళ్లారు.
2KI 25:14 వారు కుండలు, గడ్డపారలు, వత్తులు కత్తిరించే కత్తెరలను, గిన్నెలు ఆలయ సేవలో ఉపయోగించే అన్ని ఇత్తడి వస్తువులను కూడా తీసుకెళ్లారు.
2KI 25:15 రాజ రక్షక దళాధిపతి ధూపార్తులను, చిలకరింపు పాత్రలను తీసుకెళ్లాడు. అవన్నీ మేలిమి బంగారంతో వెండితో చేసినవి.
2KI 25:16 యెహోవా మందిరం కోసం సొలొమోను చేయించిన రెండు స్తంభాలు, గంగాళం, కదిలే పీటలకున్న ఇత్తడి తూకం వేయలేనంత ఎక్కువ బరువు కలవి.
2KI 25:17 ఒక్కో స్తంభం ఎత్తు పద్దెనిమిది మూరలు. ఒక స్తంభం మీద ఉన్న ఇత్తడి పీట ఎత్తు మూడు మూరలు, దాని చుట్టూ అల్లికపనితో, ఇత్తడితో చేసిన దానిమ్మ పండ్లతో అలంకరించబడింది. ఇంకొక స్తంభం కూడా, అల్లికతో అలాగే ఉంది.
2KI 25:18 రాజ రక్షక దళాధిపతి ముఖ్య యాజకుడైన శెరాయాను, ఆ తర్వాతి స్థానంలో ఉన్న యాజకుడైన జెఫన్యాను, ముగ్గురు ద్వారపాలకులను ఖైదీలుగా తీసుకెళ్లాడు.
2KI 25:19 పట్టణంలో ఇంకా ఉన్నవారిలో నుండి, అతడు సైనికుల అధికారిని, అయిదుగురు రాజ సలహాదారులను తీసుకెళ్లాడు. అంతేకాక, దేశప్రజలను సైన్యంలో చేర్చే ప్రధాన అధికారిగా ఉన్న కార్యదర్శిని, పట్టణంలో దొరికిన అరవైమంది ప్రముఖులను పట్టుకుని తీసుకెళ్లాడు.
2KI 25:20 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను వారందరినీ పట్టుకుని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తీసుకెళ్లాడు.
2KI 25:21 హమాతు దేశంలోని రిబ్లాలో బబులోను రాజు వారిని చంపించాడు. కాబట్టి యూదా తన దేశానికి దూరంగా బందీగా కొనిపోబడింది.
2KI 25:22 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాలో కొంతమందిని ఉండనిచ్చాడు. వారిమీద అతడు షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడు.
2KI 25:23 బబులోను రాజు గెదల్యాను అధికారిగా నియమించాడని సైన్య అధిపతులందరు, వారి మనుష్యులు విని, మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారుడైన యోహానాను, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడైన శెరాయా, మయకాతీయుని కుమారుడైన యాజన్యా వారి మనుష్యులు వచ్చారు.
2KI 25:24 గెదల్యా వారికి, వారి మనుష్యులకు ఇలా ప్రమాణం చేశాడు, “బబులోను అధికారులకు భయపడకండి. దేశంలో స్థిరపడి, బబులోను రాజుకు సేవ చేయండి, మీకు అంతా మంచే జరుగుతుంది.”
2KI 25:25 అయితే ఏడవ నెలలో రాజవంశానికి చెందిన ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొని గెదల్యా దగ్గరకు వచ్చి అతన్ని, మిస్పాలో అతనితో ఉన్న యూదా వారిని, బబులోనీయులను చంపాడు.
2KI 25:26 అప్పుడు బబులోనీయుల భయానికి చిన్నవారి నుండి గొప్పవారి వరకు, సైనికులు అధిపతులతో సహా ప్రజలంతా ఈజిప్టుకు పారిపోయారు.
2KI 25:27 యూదా రాజైన యెహోయాకీను బందీగా ఉన్న ముప్పై ఏడవ సంవత్సరం, పన్నెండవ నెల, ఇరవై ఏడవ రోజున ఆవిల్-మెరోదకు బబులోనుకు రాజైన సంవత్సరంలో, అతడు యూదా రాజైన యెహోయాకీనును చెరసాల నుండి విడిపించాడు.
2KI 25:28 అతడు యెహోయాకీనుతో దయగా మాట్లాడాడు. బబులోనులో తనతో ఉన్న ఇతర రాజుల స్థాయి కంటే ఉన్నత స్థాయిని అతనికిచ్చాడు.
2KI 25:29 కాబట్టి యెహోయాకీను తన జైలు దుస్తులు తీసివేసి, ఇక తన జీవితాంతం రాజు బల్ల దగ్గర భోజనం చేశాడు.
2KI 25:30 అతడు బ్రతికి ఉన్నంత కాలం, రాజు ప్రతిరోజు క్రమంగా యెహోయాకీనుకు బత్తెం ఇచ్చాడు.
1CH 1:1 ఆదాము, షేతు, ఎనోషు,
1CH 1:2 కేయినాను, మహలలేలు, యెరెదు,
1CH 1:3 హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు.
1CH 1:4 నోవహు కుమారులు: షేము, హాము, యాపెతు.
1CH 1:5 యాపెతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషెకు, తీరసు.
1CH 1:6 గోమెరు కుమారులు: అష్కెనజు, రీఫతు, తోగర్మా.
1CH 1:7 యవాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
1CH 1:8 హాము కుమారులు: కూషు, ఈజిప్టు, పూతు, కనాను.
1CH 1:9 కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తెకా. రాయమా కుమారులు: షేబ, దేదాను.
1CH 1:10 కూషు నిమ్రోదుకు తండ్రి, ఇతడు భూమిపై మొదటి బలమైన యోధుడు అయ్యాడు.
1CH 1:11 ఈజిప్టు కుమారులు: లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు,
1CH 1:12 పత్రూసీయులు, కస్లూహీయులు (వీరినుండి ఫిలిష్తీయులు వచ్చారు) కఫ్తోరీయులు.
1CH 1:13 కనాను కుమారులు: మొదటి కుమారుడగు సీదోను, హిత్తీయులు,
1CH 1:14 యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,
1CH 1:15 హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు,
1CH 1:16 అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు.
1CH 1:17 షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మెషెకు.
1CH 1:18 అర్పక్షదు షేలహుకు తండ్రి, షేలహు ఏబెరుకు తండ్రి.
1CH 1:19 ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు: ఒకనికి పెలెగు అని పేరు పెట్టారు, ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు.
1CH 1:20 యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
1CH 1:21 హదోరము, ఊజాలు, దిక్లా,
1CH 1:22 ఓబాలు, అబీమాయేలు, షేబ,
1CH 1:23 ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు.
1CH 1:24 షేము, అర్పక్షదు, షేలహు,
1CH 1:25 ఏబెరు, పెలెగు, రయూ,
1CH 1:26 సెరూగు, నాహోరు, తెరహు,
1CH 1:27 అబ్రాము (అనగా అబ్రాహాము).
1CH 1:28 అబ్రాహాము కుమారులు: ఇస్సాకు, ఇష్మాయేలు.
1CH 1:29 వీరు వారి సంతానం: ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, కేదారు, అద్బీయేలు, మిబ్శాము,
1CH 1:30 మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
1CH 1:31 యెతూరు, నాపీషు, కెదెమా.
1CH 1:32 అబ్రాహాము ఉంపుడుగత్తె కెతూరాకు పుట్టిన కుమారులు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యొక్షాను కుమారులు: షేబ, దేదాను.
1CH 1:33 మిద్యాను కుమారులు: ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా.
1CH 1:34 అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారులు: ఏశావు, ఇశ్రాయేలు.
1CH 1:35 ఏశావు కుమారులు: ఎలీఫజు, రెయూయేలు, యూషు, యాలాము, కోరహు.
1CH 1:36 ఎలీఫజు కుమారులు: తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు; తిమ్నా ద్వారా అమాలేకు.
1CH 1:37 రెయూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.
1CH 1:38 శేయీరు కుమారులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.
1CH 1:39 లోతాను కుమారులు: హోరీ, హోమాము. లోతాను సోదరి తిమ్నా.
1CH 1:40 శోబాలు కుమారులు: అల్వాను, మనహతు, ఏబాలు, షెఫో, ఓనాము. సిబ్యోను కుమారులు: అయ్యా, అనా.
1CH 1:41 అనా కుమారుడు: దిషోను. దిషోను కుమారులు: హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
1CH 1:42 ఏసెరు కుమారులు: బిల్హాను, జవాను, ఆకాను. దిషాను కుమారులు: ఊజు, అరాను.
1CH 1:43 ఏ రాజు ఇశ్రాయేలీయులను పరిపాలించక ముందు ఎదోమును పరిపాలించిన రాజులు వీరు: బెయోరు కుమారుడైన బేల, అతని పట్టణానికి దిన్హాబా అని పేరు.
1CH 1:44 బేల చనిపోయిన తర్వాత, జెరహు కుమారుడు బొస్రావాడైన యోబాబు అతని స్థానంలో రాజయ్యాడు.
1CH 1:45 యోబాబు చనిపోయిన తర్వాత, తేమానీయుల దేశస్థుడైన హుషాము అతని స్థానంలో రాజయ్యాడు.
1CH 1:46 హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది.
1CH 1:47 హదదు చనిపోయిన తర్వాత, మశ్రేకావాడైన శమ్లా అతని స్థానంలో రాజయ్యాడు.
1CH 1:48 శమ్లా చనిపోయిన తర్వాత, నది తీరాన ఉన్న రహెబోతువాడైన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు.
1CH 1:49 షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు.
1CH 1:50 బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు. అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె.
1CH 1:51 హదదు కూడా చనిపోయాడు. ఎదోము వంశ నాయకులు: తిమ్నా, అల్వా, యతేతు,
1CH 1:52 ఒహోలీబామా, ఏలహు, పీనోను,
1CH 1:53 కనజు, తేమాను, మిబ్సారు,
1CH 1:54 మగ్దీయేలు, ఈరాము.
1CH 2:1 ఇశ్రాయేలు కుమారులు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,
1CH 2:2 దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
1CH 2:3 యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన బత్-షుయ కుమార్తెకు జన్మించారు. యూదాకు మొదటి కుమారుడైన ఏరు యెహోవా దృష్టిలో చెడ్డవానిగా ఉన్నాడు కాబట్టి ఆయన వానిని చంపారు.
1CH 2:4 యూదా కోడలు తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహులు పుట్టారు.
1CH 2:5 పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు.
1CH 2:6 జెరహు కుమారులు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార. వీరు అయిదుగురు.
1CH 2:7 కర్మీ కుమారుడు: ఆకారు, అతడు ప్రత్యేకపరచబడిన వాటిని ముట్టకూడదని నిషేధించబడిన కొన్నిటిని తీసుకుని ఇశ్రాయేలుకు బాధను తీసుకువచ్చాడు.
1CH 2:8 ఏతాను కుమారుడు: అజర్యా.
1CH 2:9 హెస్రోనుకు జన్మించిన కుమారులు: యెరహ్మెయేలు, రాము, కాలేబు.
1CH 2:10 రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. అతడు యూదా ప్రజల నాయకుడు.
1CH 2:11 నయస్సోను కుమారుడు శల్మాను. శల్మాను కుమారుడు బోయజు.
1CH 2:12 బోయజు కుమారుడు ఓబేదు. ఓబేదు కుమారుడు యెష్షయి.
1CH 2:13 యెష్షయి కుమారులు: మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షిమ్యా,
1CH 2:14 నాలుగవవాడు నెతనేలు, అయిదవవాడు రద్దయి,
1CH 2:15 ఆరవవాడు ఓజెము, ఏడవవాడు దావీదు.
1CH 2:16 సెరూయా, అబీగయీలు వారి సహోదరీలు. సెరూయా కుమారులు ముగ్గురు: అబీషై, యోవాబు, అశాహేలు.
1CH 2:17 అబీగయీలు అమాశా తల్లి. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశా తండ్రి.
1CH 2:18 హెస్రోను కుమారుడైన కాలేబుకు అతని భార్య అజూబా ద్వారా (యెరీయోతు ద్వారా) పిల్లలు కలిగారు. ఆమె కుమారులు వీరు: యేషెరు, షోబాబు, అర్దోను.
1CH 2:19 అజూబా చనిపోయాక కాలేబు ఎఫ్రాతాను పెళ్ళి చేసుకున్నాడు, ఆమె ద్వారా అతనికి హూరు పుట్టాడు.
1CH 2:20 హూరు కుమారుడు ఊరి. ఊరి కుమారుడు బెసలేలు.
1CH 2:21 తర్వాత, హెస్రోను అరవై సంవత్సరాల వయస్సులో గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను పెళ్ళి చేసుకుని ఆమెతో శయనించినప్పుడు ఆమె ద్వారా అతనికి సెగూబు పుట్టాడు.
1CH 2:22 సెగూబు కుమారుడు యాయీరు. యాయీరుకు గిలాదులో ఇరవై మూడు పట్టణాలున్నాయి.
1CH 2:23 (అయితే గెషూరు, అరాము, హవ్వోత్ యాయీరును, కెనాతును దానికి చెందిన పట్టణాలను మొత్తం అరవై పట్టణాలను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు.)
1CH 2:24 కాలేబు ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తర్వాత, అతని భార్య అబీయా ద్వారా అతనికి తెకోవాకు తండ్రియైన అష్షూరు పుట్టాడు.
1CH 2:25 హెస్రోను మొదటి కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు: మొదటి వాడైన రాము, బూనా, ఓరెను, ఓజెము, అహీయా.
1CH 2:26 యెరహ్మెయేలుకు అటారా అనే మరో భార్య ఉంది. ఆమె ఓనాముకు తల్లి.
1CH 2:27 యెరహ్మెయేలుకు మొదటి కుమారుడైన రాము కుమారులు: మయజు, యామీను, ఏకెరు.
1CH 2:28 ఓనాము కుమారులు: షమ్మయి యాదా. షమ్మయి కుమారులు: నాదాబు, అబీషూరు.
1CH 2:29 అబీషూరు భార్యపేరు అబీహయిలు, ఆమె ద్వారా అతనికి అహ్బాను, మొలీదులు పుట్టారు.
1CH 2:30 నాదాబు కుమారులు: సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు లేకుండానే చనిపోయాడు.
1CH 2:31 అప్పయీము కుమారుడు: ఇషీ, ఇషీ కుమారుడు షేషాను. షేషాను కుమారుడు అహ్లయి.
1CH 2:32 షమ్మయి సోదరుడైన యాదా కుమారులు: యెతెరు, యోనాతాను. యెతెరు పిల్లలు లేకుండానే చనిపోయాడు.
1CH 2:33 యోనాతాను కుమారులు: పేలెతు, జాజా.
1CH 2:34 షేషానుకు కుమారులు లేరు, కుమార్తెలే ఉన్నారు. షేషానుకు ఈజిప్టు వాడైన యర్హా అనే సేవకుడున్నాడు.
1CH 2:35 షేషాను తన కుమార్తెను తన సేవకుడైన యర్హాకు ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆమె ద్వారా అతనికి అత్తయి పుట్టాడు.
1CH 2:36 అత్తయి కుమారుడు నాతాను, నాతాను కుమారుడు జాబాదు,
1CH 2:37 జాబాదు కుమారుడు ఎప్లాలు, ఎప్లాలు కుమారుడు ఓబేదు,
1CH 2:38 ఓబేదు కుమారుడు యెహు, యెహు కుమారుడు అజర్యా,
1CH 2:39 అజర్యా కుమారుడు హేలెస్సు, హేలెస్సు కుమారుడు ఎల్యాశా,
1CH 2:40 ఎల్యాశా కుమారుడు సిస్మాయీ, సిస్మాయీ కుమారుడు షల్లూము,
1CH 2:41 షల్లూము కుమారుడు యెకమ్యా, యెకమ్యా కుమారుడు ఎలీషామా.
1CH 2:42 యెరహ్మెయేలు సోదరుడైన కాలేబు కుమారులు: మొదటి కుమారుడు జీఫు తండ్రియైన మేషా, హెబ్రోను తండ్రియైన మారేషా.
1CH 2:43 హెబ్రోను కుమారులు: కోరహు, తప్పూయ, రేకెము, షెమ.
1CH 2:44 షెమ కుమారుడు రహము, రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి.
1CH 2:45 షమ్మయి కుమారుడు మాయోను, మాయోను కుమారుడు బేత్-సూరు.
1CH 2:46 కాలేబు ఉంపుడుగత్తె ఏఫాకు పుట్టినవారు: హారాను, మోజా, గాజేజు. హారాను కుమారుడు గాజేజు.
1CH 2:47 యహ్దయి కుమారులు: రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏఫా, షయపు.
1CH 2:48 కాలేబు ఉంపుడుగత్తె మయకాకు పుట్టినవారు: షెబెరు, తిర్హనా.
1CH 2:49 ఆమెకు మద్మన్నా తండ్రియైన షయపు, మక్బేనా, గిబియాలకు తండ్రియైన షెవా కూడా పుట్టారు. కాలేబు కుమార్తె అక్సా.
1CH 2:50 వీరు కాలేబు సంతానము. ఎఫ్రాతా మొదటి కుమారుడైన హూరు కుమారులు: కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు,
1CH 2:51 బేత్లెహేము తండ్రియైన శల్మా, బేత్-గాదేరు తండ్రియైన హారేపు.
1CH 2:52 కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు సంతానం: హారోయే, మెనుహోతీయుల్లో సగం మంది,
1CH 2:53 కిర్యత్-యారీము వంశస్థులు: ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు. వీరినుండి సొరాతీయులు, ఎష్తాయులీయులు వచ్చారు.
1CH 2:54 శల్మా వారసులు: బేత్లెహేము, నెటోపాతీయులు, అత్రోత్-బేత్-యోవాబు, మనహతీయుల్లో సగభాగంగా ఉన్న జారీయులు,
1CH 2:55 యబ్బేజులో నివసించే లేఖికుల వంశాలు: తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులు. వీరు రేకాబీయులకు తండ్రియైన హమాతుకు నుండి వచ్చిన కెనీయులు.
1CH 3:1 దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు వీరు: యెజ్రెయేలుకు చెందిన అహీనోయముకు పుట్టిన అమ్నోను మొదటి కుమారుడు; కర్మెలుకు చెందిన అబీగయీలుకు పుట్టిన దానియేలు రెండవ కుమారుడు;
1CH 3:2 గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకా కుమారుడైన అబ్షాలోము మూడవ కుమారుడు; హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవ కుమారుడు;
1CH 3:3 అబీటలు కుమారుడైన షెఫట్యా అయిదవ కుమారుడు; దావీదు భార్య ఎగ్లా ద్వారా పుట్టిన ఇత్రెయాము ఆరవ కుమారుడు.
1CH 3:4 ఈ ఆరుగురు దావీదుకు హెబ్రోనులో పుట్టినవారు. అక్కడ అతడు ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించాడు.
1CH 3:5 యెరూషలేములో అతనికి పుట్టినవారు వీరు: అమ్మీయేలు కుమార్తెయైన బత్షెబకు పుట్టిన షమ్మువ, షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కుమారులు.
1CH 3:6 ఇభారు, ఎలీషువ, ఎలీఫెలెతు,
1CH 3:7 నోగహు, నెఫెగు, యాఫీయ,
1CH 3:8 ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు. మొత్తం తొమ్మిదిమంది ఇతర కుమారులు.
1CH 3:9 ఉంపుడుగత్తెల ద్వారా దావీదుకు పుట్టిన కుమారులు కాకుండా వీరందరు దావీదు కుమారులు. తామారు వీరికి సోదరి.
1CH 3:10 సొలొమోను కుమారుడు రెహబాము, అతని కుమారుడు అబీయా, అతని కుమారుడు ఆసా, అతని కుమారుడు యెహోషాపాతు,
1CH 3:11 అతని కుమారుడు యెహోరాము, అతని కుమారుడు అహజ్యా, అతని కుమారుడు యోవాషు,
1CH 3:12 అతని కుమారుడు అమజ్యా, అతని కుమారుడు అజర్యా, అతని కుమారుడు యోతాము,
1CH 3:13 అతని కుమారుడు ఆహాజు, అతని కుమారుడు హిజ్కియా, అతని కుమారుడు మనష్షే,
1CH 3:14 అతని కుమారుడు ఆమోను, అతని కుమారుడు యోషీయా.
1CH 3:15 యోషీయా కుమారులు: మొదటి కుమారుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాలుగవవాడు షల్లూము.
1CH 3:16 యెహోయాకీము వారసులు: యెహోయాకీను, అతని సోదరుడు సిద్కియా.
1CH 3:17 ఖైదీగా ఉన్న యెహోయాకీను సంతానం: అతని కుమారుడు షయల్తీయేలు,
1CH 3:18 మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా.
1CH 3:19 పెదాయా కుమారులు: జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కుమారులు: మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వారికి సోదరి.
1CH 3:20 మరో అయిదుగురు కూడా ఉన్నారు: హషుబా, ఒహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్-హెసెదు.
1CH 3:21 హనన్యా వారసులు: పెలట్యా, యెషయా, రెఫాయా కుమారులు, అర్నాను కుమారులు, ఓబద్యా కుమారులు, షెకన్యా కుమారులు.
1CH 3:22 షెకన్యా వారసులు: షెమయా, అతని కుమారులు: హట్టూషు, ఇగాలు, బారియహు, నెయర్యా, షాపాతు మొత్తం ఆరుగురు.
1CH 3:23 నెయర్యా కుమారులు: ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము మొత్తం ముగ్గురు.
1CH 3:24 ఎల్యోయేనై కుమారులు: హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా, అనాని మొత్తం ఏడుగురు.
1CH 4:1 యూదా వారసులు: పెరెసు, హెస్రోను, కర్మీ, హూరు, శోబాలు.
1CH 4:2 శోబాలు కుమారుడైన రెవాయాకు యహతు పుట్టాడు, యహతుకు అహూమై, లహదు పుట్టారు. ఇవి సొరాతీయుల వంశాలు.
1CH 4:3 ఏతాము కుమారులు వీరు: యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సోదరి పేరు హజ్జెలెల్పోని.
1CH 4:4 గెదోరు తండ్రి పెనూయేలు, హూషా తండ్రి ఏజెరు. వీరు హూరు సంతానం, బేత్లెహేముకు తండ్రియైన ఎఫ్రాతాకు మొదటి కుమారుడు హూరు.
1CH 4:5 తెకోవా తండ్రియైన అష్షూరుకు హెలా, నయరా అనే ఇద్దరు భార్యలున్నారు.
1CH 4:6 నయరా వలన అతనికి అహుజాము, హెఫెరు, తేమనీ, హాయహష్తారీ పుట్టారు. వీరు నయరా సంతానము.
1CH 4:7 హెలా కుమారులు: జెరెతు, సోహరు, ఎత్నాను,
1CH 4:8 అనూబు, హజోబేబా, హారూము కుమారుడైన అహర్హేలు వంశాలకు తండ్రియైన కోజు.
1CH 4:9 యబ్బేజు తన సోదరులకంటే ఘనత పొందాడు. అతని తల్లి, “వేదనతో ఇతన్ని కన్నాను” అని చెప్పి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది.
1CH 4:10 యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, “మీరు నన్ను ఖచ్చితంగా దీవించి నా సరిహద్దులను విశాలపరచండి! మీ చేయి నాకు తోడుగా ఉంచి, నాకు బాధ కలుగకుండా కీడు నుండి నన్ను తప్పించండి” అని ప్రార్థించాడు. దేవుడు అతని మనవి అంగీకరించి దాని ప్రకారం జరిగించారు.
1CH 4:11 కెలూబు షూవహుకు సోదరుడు మెహీరుకు తండ్రి, మెహీరు ఎష్తోనుకు తండ్రి.
1CH 4:12 ఎష్తోను బేత్-రాఫాకు పాసెయకు ఈర్-నహాషు తండ్రియైన తెహిన్నాకు తండ్రి. వీరు రేకా వారసులు.
1CH 4:13 కెనజు కుమారులు: ఒత్నీయేలు, శెరాయా. ఒత్నీయేలు కుమారులు: హతతు, మెయానొతై.
1CH 4:14 మెయానొతై ఒఫ్రాకు తండ్రి. శెరాయా యోవాబుకు తండ్రి, యోవాబు గె-హరషీముకు తండ్రి, ఆ ప్రాంతంలో నిపుణులైన పనివారు ఉండేవారు కాబట్టి అలా పిలువబడింది.
1CH 4:15 యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు: ఈరూ, ఏలా, నయము, ఏలా కుమారుడు: కనజు.
1CH 4:16 యెహల్లెలేలు కుమారులు: జీఫు జీఫా, తీర్యా, అశర్యేలు.
1CH 4:17 ఎజ్రా కుమారులు: యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్యల్లో ఒకరికి పుట్టిన వారు మిర్యాము, షమ్మయి, ఎష్టెమో తండ్రియైన ఇష్బాహు.
1CH 4:18 మెరెదు పెళ్ళి చేసుకున్న ఫరో కుమార్తెయైన బిత్యా ద్వారా పుట్టిన కుమారులు వీరే. యూదు గోత్రీకురాలైన అతని భార్యకు గెదోరు తండ్రియైన యెరెదు, శోకోకు తండ్రియైన హెబెరు, జానోహ తండ్రియైన యెకూతీయేలు పుట్టారు.
1CH 4:19 నహము సోదరియైన హూదీయా భార్యకు పుట్టిన కుమారులు: గర్మీయుడైన కెయీలా తండ్రి, మయకాతీయుడైన ఎష్టెమో.
1CH 4:20 షీమోను కుమారులు: అమ్నోను, రిన్నా, బెన్-హనాను, తీలోను. ఇషీ సంతానం: జోహేతు, బెన్-జోహేతు.
1CH 4:21 యూదా కుమారుడైన షేలా కుమారులు: లేకా తండ్రియైన ఏరు, మరేషా తండ్రియైన లద్దా, సన్నని నారబట్టలు నేసే బేత్-అష్బేయ వంశీకులు,
1CH 4:22 యోకీము, కోజేబా వారు, యోవాషు, శారాపు, మోయాబులో, యాషూబిలెహెములో పరిపాలన చేశారు. (ఇవి పూర్వకాలంలో వ్రాసి పెట్టిన సంగతులు.)
1CH 4:23 వారు నెతాయీములో, గెదేరాలో నివసించిన కుమ్మరులు. వారు అక్కడే నివసించి రాజు కోసం పని చేశారు.
1CH 4:24 షిమ్యోను వారసులు: నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు;
1CH 4:25 షావూలు కుమారుడు షల్లూము, షల్లూము కుమారుడు మిబ్శాము, మిబ్శాము కుమారుడు మిష్మా.
1CH 4:26 మిష్మా సంతానం: మిష్మా కుమారుడు హమ్మూయేలు, అతని కుమారుడు జక్కూరు, అతని కుమారుడు షిమీ.
1CH 4:27 షిమీకి పదహారుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు కాని అతని సోదరులకు ఎక్కువ మంది పిల్లలు లేరు; కాబట్టి యూదా వారు వృద్ధి చెందినట్లుగా వారి వంశం మొత్తం వృద్ధి చెందలేదు.
1CH 4:28 వారు బెయేర్షేబ, మొలాదా, హజర్-షువలు,
1CH 4:29 బిల్హా, ఎజెము, తోలాదు,
1CH 4:30 బెతూయేలు, హోర్మా, సిక్లగు,
1CH 4:31 బేత్-మర్కాబోతు, హజర్-సూసీము, బేత్-బీరి, షరాయిము అనే పట్టణాల్లో నివసించారు. దావీదు పరిపాలన వరకు వారి పట్టణాలు ఇవే.
1CH 4:32 ఏతాము, ఆయిను, రిమ్మోను, తోకెను, ఆషాను అనే అయిదు గ్రామాలు వారి చుట్టూ ఉండేవి,
1CH 4:33 బయలు వరకు ఆ పట్టణాల చుట్టూ ఉన్న గ్రామాలన్నీ వారివి. ఇవి వారి నివాసస్థలాలు.
1CH 4:34 మెషోబాబు, యమ్లేకు; అమజ్యా కుమారుడైన యోషా;
1CH 4:35 యోవేలు; అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడు యెహు;
1CH 4:36 ఎల్యోయేనై; యహకోబా; యెషోహాయా; అశాయా; అదీయేలు; యెశీమీయేలు; బెనాయా;
1CH 4:37 షెమయా కుమారుడైన షిమ్రీకి పుట్టిన యెదాయా కుమారుడైన అల్లోనుకు పుట్టిన షిపి కుమారుడు జీజా.
1CH 4:38 పైన పేర్లు పేర్కొన్న వారు తమ తమ వంశాలకు నాయకులు. వీరి కుటుంబాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి,
1CH 4:39 వారు తమ మందల కోసం మేత వెదకడానికి లోయలో తూర్పుగా ఉన్న గెదోరు పొలిమేర వరకు వెళ్లారు.
1CH 4:40 వారికి అక్కడ మంచి పుష్టికరమైన మేత దొరికింది. ఆ ప్రాంతం విశాలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంది. గతంలో హాము వంశీయులు కొంతమంది అక్కడ నివసించారు.
1CH 4:41 జాబితాలో పేర్లు వ్రాయబడిన వీరు యూదా రాజైన హిజ్కియా కాలంలో అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న హాము వంశీయుల మెయునీయుల నివాసాలపై దాడి చేసి వారిని పూర్తిగా నాశనం చేసి, ఈ రోజు వరకు వారు అక్కడే స్థిరపడ్డారు, ఎందుకంటే వారి మందలకు సరిపోయేంత పచ్చిక అక్కడ ఉంది.
1CH 4:42 ఈ షిమ్యోను వంశీయులలో అయిదువందల మంది శేయీరు కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇషీ కుమారులైన పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు వారికి నాయకులు.
1CH 4:43 అమాలేకీయులలో తప్పించుకున్న మిగిలిన వారందరిని చంపి, ఈ రోజు వరకు వారక్కడ నివసించారు.
1CH 5:1 ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు. (అతడు మొదటి కుమారుడు, కాని అతడు తన తండ్రి పడక ఎక్కి దాన్ని అపవిత్రం చేశాడు కాబట్టి, అతని జ్యేష్ఠత్వపు హక్కులు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడ్డాయి; కాబట్టి జన్మహక్కుల ప్రకారం వంశావళిలో అతడు నమోదు కాలేదు.
1CH 5:2 యూదా తన అన్నదమ్ములకంటే బలవంతుడు, అతని వంశంలో నుండి పరిపాలకుడు వచ్చాడు, అయినా కూడా జ్యేష్ఠత్వపు హక్కులు యోసేపుకు వచ్చాయి.)
1CH 5:3 ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు వీరు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.
1CH 5:4 యోవేలు సంతానం: అతని కుమారుడు షెమయా, అతని కుమారుడు గోగు, అతని కుమారుడు షిమీ,
1CH 5:5 అతని కుమారుడు మీకా, అతని కుమారుడు రెవాయా, అతని కుమారుడు బయలు,
1CH 5:6 అతని కుమారుడు బెయేర, ఇతన్ని అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు బందీగా తీసుకెళ్లాడు. బెయేర రూబేనీయులకు నాయకుడు.
1CH 5:7 వారి వంశావళిలో పేర్కొన్న కుటుంబాల ప్రకారం వారి బంధువులు: నాయకుడైన యెహీయేలు, జెకర్యా,
1CH 5:8 యోవేలు కుమారుడైన షెమ కుమారుడైన ఆజాజు కుమారుడైన బేల. వారు అరోయేరు నుండి నెబో వరకు, బయల్-మెయోను వరకు నివసించారు.
1CH 5:9 వారి పశువులు గిలాదులో విస్తారంగా వృద్ధిచెందడంతో, తూర్పున యూఫ్రటీసు నది దగ్గర నుండి ఎడారి సరిహద్దు వరకు వారు నివసించారు.
1CH 5:10 సౌలు పాలిస్తున్నప్పుడు వారు హగ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. వారు గిలాదుకు తూర్పుగా ఉన్న ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయీల నివాస స్థలాలను స్వాధీనం చేసుకున్నారు.
1CH 5:11 గాదీయులు వారికి ఎదురుగా బాషానులో సలేకా వరకు నివసించారు.
1CH 5:12 వారికి యోవేలు నాయకుడు. అతని తర్వాత షాపాము, తర్వాత యహనై, షాపాతు, వీరు బాషానులో ఉండేవారు.
1CH 5:13 వారి కుటుంబాల ప్రకారం వారి బంధువులు: మిఖాయేలు, మెషుల్లాము, షేబ, యోరై, యకాను, జీయ, ఏబెరు మొత్తం ఏడుగురు.
1CH 5:14 వీరు హూరీ కుమారుడైన అబీహయిలు కుమారులు: హూరీ యరోయ కుమారుడు, యరోయ గిలాదు కుమారుడు, గిలాదు మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు యెషీషై కుమారుడు, యెషీషై యహదో కుమారుడు, యహదో బూజు కుమారుడు.
1CH 5:15 గూనీ కుమారుడైన అబ్దీయేలుకు పుట్టిన అహీ వారి కుటుంబ పెద్ద.
1CH 5:16 గాదు వంశస్థులు బాషానులో గిలాదులో, చుట్టుప్రక్కల గ్రామాల్లో, షారోను సరిహద్దుల వరకు ఉన్న పచ్చని మైదానాల్లో నివసించారు.
1CH 5:17 వీరందరు యూదా రాజైన యోతాము రోజుల్లో ఇశ్రాయేలు రాజైన యరొబాము రోజుల్లో వంశావళి పత్రాలలో నమోదయ్యారు.
1CH 5:18 రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారిలో డాలు కత్తి పట్టుకోవడంలో నేర్పుగలవారు, విల్లు ఉపయోగించగలవారు, యుద్ధశిక్షణ తీసుకున్నవారు 44,760 మంది ఉన్నారు.
1CH 5:19 వారు హగ్రీయీలతో, యెతూరువారితో, నాపీషువారితో, నోదాబువారితో యుద్ధం చేశారు.
1CH 5:20 వారు యుద్ధ సమయంలో దేవునికి మొరపెట్టారు కాబట్టి దేవుడు వారికి సహాయం చేసి ఆ హగ్రీయీలను, వారితో ఉన్నవారందరిని వారి చేతికి అప్పగించారు. వారు ఆయన మీద నమ్మకముంచారు కాబట్టి ఆయన వారి ప్రార్థన అంగీకరించారు.
1CH 5:21 వారు హగ్రీయీలకు చెందిన యాభైవేల ఒంటెలు, రెండు లక్షల యాభైవేల గొర్రెలు, రెండువేల గాడిదలను పట్టుకున్నారు. అలాగే లక్ష మంది మనుష్యులను బందీలుగా తీసుకెళ్లారు.
1CH 5:22 ఇంకా చాలామంది శత్రువులను చంపారు ఎందుకంటే ఆ యుద్ధం దేవునిది. చెరకు వెళ్లేవరకు వారు అక్కడే నివసించారు.
1CH 5:23 మనష్షే అర్థగోత్రీకులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు; వారు బాషాను నుండి, బయల్-హెర్మోను వరకు, అంటే శెనీరు వరకు (హెర్మోను పర్వతం) నివసించారు.
1CH 5:24 వారి కుటుంబ పెద్దలు వీరే: ఏఫెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహదీయేలు. వీరు ధైర్యవంతులైన వీరులు, ప్రసిద్ధి చెందినవారు వారి కుటుంబ పెద్దలు.
1CH 5:25 అయితే వారు తమ పూర్వికుల దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు, దేవుడు తమ ఎదుట నాశనం చేసిన దేశ ప్రజల దేవుళ్ళను పూజిస్తూ, వాటితో వ్యభిచారులగా ప్రవర్తించారు.
1CH 5:26 కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును (అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు) పురికొల్పగా, అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రీకులను బందీలుగా తీసుకెళ్లాడు. అతడు వారిని హాలహు, హాబోరు, హారా, గోజాను అనే నదీ ప్రాంతాలకు తీసుకెళ్లాడు. ఈ రోజు వరకు వారు అక్కడే ఉన్నారు.
1CH 6:1 లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.
1CH 6:2 కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
1CH 6:3 అమ్రాము పిల్లలు: అహరోను, మోషే, మిర్యాము. అహరోను కుమారులు: నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
1CH 6:4 ఎలియాజరు ఫీనెహాసుకు తండ్రి, ఫీనెహాసు అబీషూవకు తండ్రి,
1CH 6:5 అబీషూవ బుక్కీకి తండ్రి, బుక్కీ ఉజ్జీకి తండ్రి,
1CH 6:6 ఉజ్జీ జెరహ్యాకు తండ్రి, జెరహ్యా మెరాయోతుకు తండ్రి,
1CH 6:7 మెరాయోతు అమర్యాకు తండ్రి, అమర్యా అహీటూబుకు తండ్రి,
1CH 6:8 అహీటూబు సాదోకుకు తండ్రి, సాదోకు అహిమయస్సుకు తండ్రి,
1CH 6:9 అహిమయస్సు అజర్యాకు తండ్రి, అజర్యా యోహానానుకు తండ్రి,
1CH 6:10 యోహానాను అజర్యాకు తండ్రి, సొలొమోను యెరూషలేములో కట్టించిన దేవాలయంలో యాజకునిగా అజర్యా సేవ చేశాడు.
1CH 6:11 అజర్యా అమర్యాకు తండ్రి, అమర్యా అహీటూబుకు తండ్రి,
1CH 6:12 అహీటూబు సాదోకుకు తండ్రి, సాదోకు షల్లూముకు తండ్రి,
1CH 6:13 షల్లూము హిల్కీయాకు తండ్రి, హిల్కీయా అజర్యాకు తండ్రి,
1CH 6:14 అజర్యా శెరాయాకు తండ్రి, శెరాయా యెహోజాదాకుకు తండ్రి.
1CH 6:15 యెహోవా నెబుకద్నెజరుచేత యూదా వారిని, యెరూషలేము వాసులను బందీలుగా పంపించినప్పుడు యెహోజాదాకు బందీగా వెళ్లాడు.
1CH 6:16 లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.
1CH 6:17 గెర్షోను కుమారుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ.
1CH 6:18 కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
1CH 6:19 మెరారి కుమారులు: మహలి, మూషి.
1CH 6:20 గెర్షోను: అతని కుమారుడు లిబ్నీ, అతని కుమారుడు యహతు, అతని కుమారుడు జిమ్మా,
1CH 6:21 అతని కుమారుడు యోవాహు, అతని కుమారుడు ఇద్దో, అతని కుమారుడు జెరహు, అతని కుమారుడు యెయతిరయి.
1CH 6:22 కహాతు సంతానం: అతని కుమారుడు అమ్మీనాదాబు, అతని కుమారుడు కోరహు, అతని కుమారుడు అస్సీరు,
1CH 6:23 అతని కుమారుడు ఎల్కానా, అతని కుమారుడు ఎబ్యాసాపు, అతని కుమారుడు అస్సీరు,
1CH 6:24 అతని కుమారుడు తాహతు, అతని కుమారుడు ఊరియేలు, అతని కుమారుడు ఉజ్జియా, అతని కుమారుడు షావూలు.
1CH 6:25 ఎల్కానా సంతానం: అమాశై, అహీమోతు,
1CH 6:26 అతని కుమారుడు ఎల్కానా, అతని కుమారుడు జోఫై, అతని కుమారుడు నహతు,
1CH 6:27 అతని కుమారుడు ఏలీయాబు, అతని కుమారుడు యెరోహాము, అతని కుమారులు ఎల్కానా, అతని కుమారుడు సమూయేలు.
1CH 6:28 సమూయేలు కుమారులు: మొదటివాడు యోవేలు రెండవవాడు అబీయా.
1CH 6:29 మెరారి సంతానం: మహలి, అతని కుమారుడు లిబ్నీ, అతని కుమారుడు షిమీ, అతని కుమారుడు ఉజ్జా,
1CH 6:30 అతని కుమారుడు షిమ్యా, అతని కుమారుడు హగ్గీయా, అతని కుమారుడు అశాయా.
1CH 6:31 నిబంధన మందసం యెహోవా మందిరంలో ఉంచబడిన తర్వాత, అక్కడ సంగీత సేవకు దావీదు నియమించిన వారు వీరు.
1CH 6:32 సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టించేవరకు, వీరు సమావేశ గుడారం ఎదుట సంగీత సేవ చేశారు. వారికి ఇచ్చిన నియమాల ప్రకారం తమ విధులు నిర్వహించేవారు.
1CH 6:33 తమ కుమారులతో కలిసి సేవ చేసినవారు వీరు: కహాతీయుల నుండి: సంగీతకారుడైన హేమాను, హేమాను యోవేలు కుమారుడు, అతడు సమూయేలు కుమారుడు,
1CH 6:34 అతడు ఎల్కానా కుమారుడు, అతడు యెరోహాము కుమారుడు, అతడు ఎలీయేలు కుమారుడు, అతడు తోయహు కుమారుడు,
1CH 6:35 అతడు సూఫు కుమారుడు, అతడు ఎల్కానా కుమారుడు, అతడు మహతు కుమారుడు అతడు అమాశై కుమారుడు,
1CH 6:36 అతడు ఎల్కానా కుమారుడు, అతడు యోవేలు కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు జెఫన్యా కుమారుడు,
1CH 6:37 అతడు తాహతు కుమారుడు, అతడు అస్సీరు కుమారుడు, అతడు ఎబ్యాసాపు కుమారుడు, అతడు కోరహు కుమారుడు,
1CH 6:38 అతడు ఇస్హారు కుమారుడు, అతడు కహాతు కుమారుడు, అతడు లేవీ కుమారుడు, అతడు ఇశ్రాయేలు కుమారుడు;
1CH 6:39 హేమాను సహచరుడైన ఆసాపు అతని కుడి ప్రక్కన సేవ చేశాడు. అతని వంశావళి: ఆసాపు బెరెక్యా కుమారుడు, అతడు షిమ్యా కుమారుడు,
1CH 6:40 అతడు మిఖాయేలు కుమారుడు, అతడు బయశేయా కుమారుడు, అతడు మల్కీయా కుమారుడు,
1CH 6:41 అతడు యెత్నీ కుమారుడు, అతడు జెరహు కుమారుడు, అతడు అదాయా కుమారుడు,
1CH 6:42 అతడు ఏతాను కుమారుడు, అతడు జిమ్మా కుమారుడు, అతడు షిమీ కుమారుడు,
1CH 6:43 అతడు యహతు కుమారుడు, అతడు గెర్షోను కుమారుడు, అతడు లేవీ కుమారుడు;
1CH 6:44 హేమాను ఎడమ ప్రక్కన మెరారీయులు సేవ చేశారు: ఏతాను కీషీ కుమారుడు, అతడు అబ్దీ కుమారుడు, అతడు మల్లూకు కుమారుడు,
1CH 6:45 అతడు హషబ్యా కుమారుడు, అతడు అమజ్యా కుమారుడు, అతడు హిల్కీయా కుమారుడు,
1CH 6:46 అతడు అమ్జీ కుమారుడు, అతడు బానీ కుమారుడు, అతడు షమెరు కుమారుడు,
1CH 6:47 అతడు మహలి కుమారుడు, అతడు మూషి కుమారుడు, అతడు మెరారి కుమారుడు, అతడు లేవీ కుమారుడు.
1CH 6:48 వారి తోటి లేవీయులు దేవుని మందిరమనే ప్రత్యక్షగుడారంలో జరగాల్సిన ఇతర పనులన్నిటి కోసం నియమించబడ్డారు.
1CH 6:49 అయితే అహరోను అతని సంతానం దహనబలిపీఠం మీద ధూపవేదిక మీద అర్పణలు అర్పించడానికి, అతి పరిశుద్ధ స్థలంలో చేయవలసిన వాటన్నిటిని చేయడానికి, దేవుని సేవకుడైన మోషే ఆదేశించిన ప్రకారం ఇశ్రాయేలు కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నియమించబడ్డారు.
1CH 6:50 వీరు అహరోను సంతానం: అహరోను కుమారుడు ఎలియాజరు, అతని కుమారుడు ఫీనెహాసు, అతని కుమారుడు అబీషూవ,
1CH 6:51 అతని కుమారుడు బుక్కీ, అతని కుమారుడు ఉజ్జీ, అతని కుమారుడు జెరహ్యా,
1CH 6:52 అతని కుమారుడు మెరాయోతు, అతని కుమారుడు అమర్యా, అతని కుమారుడు అహీటూబు,
1CH 6:53 అతని కుమారుడు సాదోకు, అతని కుమారుడు అహిమయస్సు.
1CH 6:54 అహరోను సంతతివారైన కహాతీయులకు మొదటి చీటి పడింది, కాబట్టి సరిహద్దులతో వారికి కేటాయించబడిన నివాసస్థలాలు ఇవి:
1CH 6:55 యూదాలోని హెబ్రోను, దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలు.
1CH 6:56 (అయితే పట్టణం చుట్టూ ఉన్న పొలాలు, గ్రామాలు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడ్డాయి.)
1CH 6:57 అహరోను సంతానానికి ఇవ్వబడిన పట్టణాలు ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా, యత్తీరు, ఎష్తెమోవా,
1CH 6:58 హీలేను, దెబీరు,
1CH 6:59 ఆషాను, యుత్తా, బేత్-షెమెషు, వాటి దాని పచ్చిక మైదానాలతో ఇవ్వబడ్డాయి.
1CH 6:60 బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో, గిబియోను, గెబా, అల్లెమెతు, అనాతోతు వాటి పచ్చిక మైదానాలతో పాటు ఇవ్వబడ్డాయి.
1CH 6:61 కహాతు సంతానంలో మిగిలిన వారికి మనష్షే అర్ధగోత్ర వంశస్థుల నుండి చీట్ల ద్వారా పది పట్టణాలు కేటాయించబడ్డాయి.
1CH 6:62 గెర్షోను సంతానం, వారి వంశాల ప్రకారం చీట్ల ద్వారా ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి గోత్రాల ప్రదేశాల నుండి బాషానులో ఉన్న మనష్షే గోత్ర ప్రదేశాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించబడ్డాయి.
1CH 6:63 మెరారి సంతానం, వారి వంశాల ప్రకారం చీట్లు వేయడం వలన రూబేను, గాదు, జెబూలూను గోత్రాల ప్రదేశాల నుండి పన్నెండు పట్టణాలు కేటాయించబడ్డాయి.
1CH 6:64 ఈ విధంగా ఇశ్రాయేలీయులు, లేవీయులకు ఈ పట్టణాలను వాటి పచ్చిక మైదానాలను ఇచ్చారు.
1CH 6:65 యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల ప్రదేశాల్లో, పై చెప్పిన పట్టణాలు చీట్ల ద్వార వారికి కేటాయించబడ్డాయి.
1CH 6:66 కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిం గోత్ర ప్రదేశాల నుండి సరిహద్దు పట్టణాలు ఇవ్వబడ్డాయి.
1CH 6:67 ఎఫ్రాయిం కొండ సీమలో ఆశ్రయ పట్టణమైన షెకెము, గెజెరు,
1CH 6:68 యొక్మెయాము, బేత్-హోరోను,
1CH 6:69 అయ్యాలోను, గాత్-రిమ్మోను, వాటి పచ్చిక మైదానాలతో పాటు ఇవ్వబడ్డాయి.
1CH 6:70 మనష్షే అర్ధగోత్రీకుల దగ్గర నుండి ఇశ్రాయేలీయులు ఆనేరు, బిలియాము వాటి పచ్చిక మైదానాలతో పాటు కహాతీయుల వంశాలలో మిగిలిన వారికి ఇచ్చారు.
1CH 6:71 గెర్షోనీయులకు లభించిన పట్టణాలు: మనష్షే అర్ధగోత్ర ప్రదేశంలో నుండి బాషానులో ఉన్న గోలాను, అష్తారోతు, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
1CH 6:72 ఇశ్శాఖారు గోత్ర ప్రదేశంలో నుండి కెదెషు, దాబెరతు,
1CH 6:73 రామోతు, అనేము, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
1CH 6:74 ఆషేరు గోత్ర ప్రదేశంలో నుండి మాషాలు, అబ్దోను,
1CH 6:75 హుక్కోకు, రెహోబు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
1CH 6:76 నఫ్తాలి గోత్ర ప్రదేశంలో నుండి గలిలయలో ఉన్న కెదెషు, హమ్మోను, కిర్యతాయిము వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు.
1CH 6:77 లేవీయులలో మిగిలిన వారైన మెరారీయులకు లభించిన పట్టణాలు: జెబూలూను గోత్ర ప్రదేశంలో నుండి యొక్నెయాము, కర్తహు, రిమ్మోను, తాబోరు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
1CH 6:78 యెరికోకు తూర్పుగా యొర్దాను నది అవతల ఉన్న రూబేను గోత్ర ప్రదేశంలో నుండి ఎడారిలో ఉన్న బేసెరు, యహజు,
1CH 6:79 కెదేమోతు, మెఫాతు, వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు;
1CH 6:80 గాదు గోత్ర ప్రదేశంలో నుండి గిలాదులో ఉన్న రామోతు, మహనయీము,
1CH 6:81 హెష్బోను, యాజెరు వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు.
1CH 7:1 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువా, యాషూబు, షిమ్రోను మొత్తం నలుగురు.
1CH 7:2 తోలా కుమారులు: ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, ఇబ్శాము, సమూయేలు. వీరు తమ కుటుంబాలకు పెద్దలు. దావీదు పాలనలో తోలా సంతానం యుద్ధవీరులుగా లెక్కించబడ్డారు. వీరి సంఖ్య 22,600.
1CH 7:3 ఉజ్జీ కుమారుడు: ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు: మిఖాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షీయా. ఈ అయిదుగురు పెద్దలు.
1CH 7:4 వారికి చాలామంది భార్యలు, పిల్లలు ఉండడం వల్ల వారి వంశావళి ప్రకారం వారిలో యుద్ధవీరుల సంఖ్య 36,000.
1CH 7:5 ఇశ్శాఖారు వంశాలన్నిటికి చెందిన వీరి బంధువుల నుండి వారి వంశావళి ప్రకారం యుద్ధవీరుల సంఖ్య 87,000.
1CH 7:6 బెన్యామీనుకు కుమారులు ముగ్గురు: బేల, బెకెరు, యెదీయవేలు.
1CH 7:7 బేల కుమారులు: ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరీ మొత్తం అయిదుగురు. వీరు కుటుంబ పెద్దలు. తమ వంశావళి ప్రకారం యుద్ధవీరుల సంఖ్య 22,034.
1CH 7:8 బెకెరు కుమారులు: జెమీరా, యోవాషు, ఎలీయెజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు. వీరందరు బెకెరు కుమారులు.
1CH 7:9 తమ వంశావళి ప్రకారం వీరు కుటుంబ పెద్దలు; యుద్ధవీరుల సంఖ్య 20,200.
1CH 7:10 యెదీయవేలు కుమారుడు: బిల్హాను. బిల్హాను కుమారులు: యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు.
1CH 7:11 యెదీయవేలు కుమారులైన వీరందరు తమ కుటుంబాలకు పెద్దలు. వీరిలో యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న యుద్ధవీరుల సంఖ్య 17,200.
1CH 7:12 ఈరు వారసులు షుప్పీము, హుప్పీము. హూషీయులు అహేరు వారసులు.
1CH 7:13 నఫ్తాలీయులైన బిల్హా వారసులు: యహజీయేలు, గూనీ, యేజెరు, షిల్లేము.
1CH 7:14 మనష్షే వారసులు: అరాము దేశస్థురాలైన ఉంపుడుగత్తె ద్వారా అశ్రీయేలు అతనికి వారసుడు అయ్యాడు.ఆమె గిలాదు తండ్రియైన మాకీరుకు జన్మనిచ్చింది.
1CH 7:15 మాకీరు షుప్పీము, హుప్పీముల సోదరిని పెళ్ళి చేసుకున్నాడు. వారి సోదరి పేరు మయకా. మరో వారసుని పేరు సెలోఫెహాదు. అతనికి కుమార్తెలు మాత్రమే పుట్టారు.
1CH 7:16 మాకీరు భార్యయైన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అనే పేరు పెట్టింది. అతని తమ్ముని పేరు షెరెషు. అతని కుమారులు ఊలాము, రాకెము.
1CH 7:17 ఊలాము కుమారుడు: బెదాను. వీరు మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన గిలాదు కుమారులు.
1CH 7:18 మాకీరు సోదరి హమ్మోలెకెతుకు ఇషోదు, అబీయెజెరు, మహలాలు పుట్టారు.
1CH 7:19 షెమీదా కుమారులు: అహెయాను, షెకెము, లికీ, అనీయాము.
1CH 7:20 ఎఫ్రాయిం వారసులు: ఎఫ్రాయిం కుమారుడు షూతలహు, అతని కుమారుడు బెరెదు, అతని కుమారుడు తాహతు, అతని కుమారుడు ఎల్యాదా, అతని కుమారుడు తాహతు,
1CH 7:21 అతని కుమారుడు జాబాదు, అతని కుమారుడు షూతలహు. (అతని కుమారులైన ఏజెరు ఎల్యాదులు తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకోడానికి వెళ్లినప్పుడు, గాతీయులు వారిని చంపారు.
1CH 7:22 వారి తండ్రియైన ఎఫ్రాయిం చాలా రోజులు దుఃఖపడ్డాడు, అతని బంధువులు వచ్చి అతన్ని ఓదార్చారు.
1CH 7:23 ఆ తర్వాత అతడు తన భార్యను కలుసుకోగా ఆమె గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. తన కుటుంబంలో జరిగిన కీడును బట్టి ఎఫ్రాయిం అతనికి బెరీయా అనే పేరు పెట్టాడు.
1CH 7:24 అతని కుమార్తెయైన షెయెరా దిగువ బేత్-హోరోను, ఎగువ బేత్-హోరోను, ఉజ్జెన్-షెయెరా అనే పట్టణాలను కట్టించింది.)
1CH 7:25 ఎఫ్రాయిం కుమారుడు రెపహు, అతని కుమారుడు రెషెపు, అతని కుమారుడు తెలహు, అతని కుమారుడు తహను,
1CH 7:26 అతని కుమారుడు లద్దాను, అతని కుమారుడు అమీహూదు, అతని కుమారుడు ఎలీషామా,
1CH 7:27 అతని కుమారుడు నూను, అతని కుమారుడు యెహోషువ.
1CH 7:28 వారి ప్రదేశాలు నివాసస్థలాలు ఏవంటే, బేతేలు దాని చుట్టుప్రక్కల గ్రామాలు, తూర్పున ఉన్న నహరాను, పడమర ఉన్న గెజెరు దాని గ్రామాలు, షెకెము దాని గ్రామాలు, అయ్యా దాని గ్రామాల వరకు ఉన్న ప్రాంతాలు.
1CH 7:29 మనష్షే సరిహద్దులలో ఉన్న బేత్-షాను, తానాకు, మెగిద్దో, దోరు, వాటి గ్రామాలతో పాటు వారివే. ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు వారసులు ఈ పట్టణాల్లో నివసించారు.
1CH 7:30 ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు.
1CH 7:31 బెరీయా కుమారులు: హెబెరు, బిర్జాయీతు తండ్రియైన మల్కీయేలు.
1CH 7:32 హెబెరు యప్లేటు, షోమేరు, హోతాము, వారి సోదరియైన షూయాలకు తండ్రి.
1CH 7:33 యప్లేటు కుమారులు: పాసకు, బింహాలు, అష్వాతు.
1CH 7:34 షోమేరు కుమారులు: అహీ, రోగా, యెహుబ్బా, అరాము.
1CH 7:35 అతని సోదరుడైన హేలెము కుమారులు: జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు.
1CH 7:36 జోపహు కుమారులు: సూయ, హర్నెఫెరు, షూయాలు, బేరీ, ఇమ్రా,
1CH 7:37 బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేర.
1CH 7:38 ఎతెరు కుమారులు: యెఫున్నె, పిస్పా, అరా.
1CH 7:39 ఉల్లా కుమారులు: ఆరహు హన్నియేలు రిజెయా
1CH 7:40 ఆషేరు వారసులైన వీరందరు తమ కుటుంబాలకు పెద్దలు, ప్రసిద్ధి చెందిన పరాక్రమశాలులు, గొప్ప నాయకులు. వారి వంశావళిలో నమోదు చేయబడినట్లుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి సంఖ్య 26,000.
1CH 8:1 బెన్యామీను వీరికి తండ్రి: మొదటివాడు బేల, రెండవవాడు అష్బేలు, మూడవవాడు అహరహు,
1CH 8:2 నాలుగవవాడు నోహా, అయిదవవాడు రాపా.
1CH 8:3 బేల కుమారులు: అద్దారు, గెరా, అబీహూదు,
1CH 8:4 అబీషూవ, నయమాను, అహోయహు,
1CH 8:5 గెరా, షెపూపాను, హూరాము.
1CH 8:6 వీరు ఏహూదు వారసులు, గెబాలో నివసిస్తున్న కుటుంబాలకు పెద్దలు. వీరు బలవంతంగా మనహతుకు తరలి వెళ్లాల్సి వచ్చింది:
1CH 8:7 నయమాను, అహీయా, గెరా అనేవారు, వారిని మనహతుకు బందీలుగా తీసుకెళ్లారు. గెరా, ఉజ్జా, అహీహూదుల తండ్రి.
1CH 8:8 షహరయీము తన భార్యలైన హుషీము, బయారాలను విడాకులు ఇచ్చిన తర్వాత అతనికి మోయాబు దేశంలో కుమారులు పుట్టారు.
1CH 8:9 తన భార్యయైన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,
1CH 8:10 యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. అతని కుమారులైన వీరు తమ కుటుంబాలకు పెద్దలు.
1CH 8:11 హుషీము ద్వారా అతనికి అబీటూబు, ఎల్పయలు పుట్టారు.
1CH 8:12 ఎల్పయలు కుమారులు: ఏబెరు, మిషాము, షెమెదు (ఓనో, లోదు అనే ఊళ్ళను వాటి చుట్టూ ఉన్న గ్రామాలను కట్టించిన వాడు),
1CH 8:13 బెరీయా, షెమ. వీరు అయ్యాలోనులో నివసిస్తున్నవారి కుటుంబాలకు పెద్దలు, గాతు పట్టణస్థులను వెళ్లగొట్టారు.
1CH 8:14 అహ్యో, షాషకు, యెరేమోతు,
1CH 8:15 జెబద్యా, అరాదు, ఏదెరు,
1CH 8:16 మిఖాయేలు, ఇష్పా, యోహా అనేవారు బెరీయా కుమారులు.
1CH 8:17 జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,
1CH 8:18 ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు అనేవారు ఎల్పయలు కుమారులు.
1CH 8:19 యాకీము, జిఖ్రీ, జబ్ది,
1CH 8:20 ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,
1CH 8:21 అదాయా, బెరాయా, షిమ్రాతు అనేవారు షిమీ కుమారులు.
1CH 8:22 ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,
1CH 8:23 అబ్దోను, జిఖ్రీ, హానాను,
1CH 8:24 హనన్యా, ఏలాము, అంతోతీయా,
1CH 8:25 ఇఫెదయా, పెనూయేలు అనేవారు షాషకు కుమారులు.
1CH 8:26 షంషెరై, షెహర్యా, అతల్యా,
1CH 8:27 యయరెష్యా, ఏలీయా, జిఖ్రీ అనేవారు యెరోహాము కుమారులు.
1CH 8:28 వీరందరు తమ వంశావళి ప్రకారం కుటుంబాలకు పెద్దలు, ప్రముఖులు; వీరు యెరూషలేములో నివసించారు.
1CH 8:29 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా.
1CH 8:30 అతని మొదటి కుమారుడు అబ్దోను. తర్వాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
1CH 8:31 గెదోరు, అహ్యో, జెకెరు,
1CH 8:32 షిమ్యా తండ్రియైన మిక్లోతు పుట్టారు. వీరు కూడా యెరూషలేములో తమ బంధువులకు దగ్గరలో నివసించారు.
1CH 8:33 నేరు కీషుకు తండ్రి, కీషు సౌలుకు తండ్రి, యోనాతాను, మల్కీ-షూవ, అబీనాదాబు, ఎష్-బయలు అనేవారు సౌలు కుమారులు.
1CH 8:34 యోనాతాను కుమారుడు: మెరీబ్-బయలు, ఇతడు మీకాకు తండ్రి.
1CH 8:35 మీకా కుమారులు: పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు.
1CH 8:36 ఆహాజు యెహోయాదాకు తండ్రి, ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీలకు తండ్రి, జిమ్రీ మోజా అనేవారు యెహోయాదా కుమారులు.
1CH 8:37 మోజా బిన్యాకు తండ్రి; అతని కుమారుడు రాపా, అతని కుమారుడు ఎలాశా, అతని కుమారుడు ఆజేలు.
1CH 8:38 ఆజేలు కుమారులు ఆరుగురు, వారి పేర్లు ఇవి: అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హనాను. వీరందరు ఆజేలు కుమారులు.
1CH 8:39 అతని సోదరుడైన ఏషెకు కుమారులు: మొదటివాడు ఊలాము, రెండవవాడు యెహూషు, మూడవవాడు ఎలీఫెలెతు.
1CH 8:40 ఊలాము కుమారులు పరాక్రమశాలులు, విల్లువిద్యలో ప్రవీణులు. వారికి నూటయాభైమంది కుమారులు, మనుమలు ఉన్నారు. వీరందరు బెన్యామీను వారసులు.
1CH 9:1 ఇశ్రాయేలు ప్రజలందరి పేర్లు తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. వారు చేసిన నమ్మకద్రోహాన్ని బట్టి వారు బబులోనుకు బందీలుగా కొనిపోబడ్డారు.
1CH 9:2 తమ సొంత పట్టణాల్లో తమ స్వాస్థ్యంలో మొదట నివసించిన వారెవరంటే, కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు.
1CH 9:3 యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం మనష్షే వారిలో యెరూషలేము పట్టణంలో నివసించినవారు:
1CH 9:4 యూదా కుమారుడైన పెరెసు వారసుడు బానీ కుమారుడైన ఇమ్రీకి పుట్టిన ఒమ్రీ కుమారుడైన అమీహూదు పుట్టిన ఊతై.
1CH 9:5 షేలానీయుల నుండి: మొదట కుమారుడైన అశాయా, అతని కుమారులు.
1CH 9:6 జెరహు వారిలో నుండి: యెవుయేలు.
1CH 9:7 బెన్యామీనీయుల నుండి: హస్సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడైన సల్లు;
1CH 9:8 యెరోహాము కుమారుడైన ఇబ్నియా; మిక్రి కుమారుడైన ఉజ్జీకి పుట్టిన ఏలా; ఇబ్నెయా కుమారుడైన రెయూయేలుకు పుట్టిన షెఫట్యా కుమారుడైన మెషుల్లాము.
1CH 9:9 తమ వంశావళి ప్రకారం బెన్యామీను నుండి ప్రజలు మొత్తం 956 మంది. వీరందరు తమ తమ కుటుంబాలకు పెద్దలు.
1CH 9:10 యాజకుల నుండి: యెదాయా; యెహోయారీబు; యాకీను;
1CH 9:11 అహీటూబు కుమారుడైన మెరాయోతుకు పుట్టిన సాదోకు కుమారుడు మెషుల్లాము పుట్టిన హిల్కీయా కుమారుడైన అజర్యా; ఇతడు దేవుని మందిరంలో ప్రముఖ అధిపతి;
1CH 9:12 మల్కీయా కుమారుడైన పషూరుకు పుట్టిన యెరోహాము కుమారుడు అదాయా; ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమీతుకు పుట్టిన మెషుల్లాము కుమారుడైన యహజెరాకు పుట్టిన అదీయేలు కుమారుడైన మశై;
1CH 9:13 తమ కుటుంబాలకు పెద్దలుగా ఉన్న యాజకుల సంఖ్య 1,760. వారు దేవుని మందిరంలో సేవలు అందించే బాధ్యత కలిగిన సమర్థులు.
1CH 9:14 లేవీయుల నుండి: మెరారీయుడైన హషబ్యా కుమారుడైన అజ్రీకాముకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా;
1CH 9:15 బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడైన జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా;
1CH 9:16 యెదూతూను కుమారుడైన గాలాలుకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా; ఎల్కానాకు పుట్టిన ఆసా కుమారుడైన బెరెక్యా; ఇతడు నెటోపాతీయుల గ్రామాల్లో నివసించాడు.
1CH 9:17 ద్వారపాలకులు: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను, వారి తోటి లేవీయులు. వీరిలో షల్లూము పెద్ద.
1CH 9:18 వారు తూర్పున ఉన్న రాజు ద్వారం దగ్గర ఇప్పటివరకు సేవ చేస్తున్నారు. వీరందరు లేవీయుల సమూహానికి చెందిన ద్వారపాలకులు.
1CH 9:19 కోరహు కుమారుడైన ఎబ్యాసాపుకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూము, తన కోరహీయుల వంశంలోని తన తోటి ద్వారపాలకులు, తమ పూర్వికులు యెహోవా శిబిరానికి కావలివారిగా ఉన్నట్లుగా, వారు ఆలయద్వారాన్ని కాపలా కాసేవారు.
1CH 9:20 పూర్వకాలంలో ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ద్వారపాలకుల మీద అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నారు.
1CH 9:21 మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమావేశ గుడారపు ద్వారానికి ద్వారపాలకుడు.
1CH 9:22 ద్వారాల దగ్గర ద్వారపాలకులుగా ఎన్నుకోబడినవారు 212 మంది. వారు తమ గ్రామాల్లో తమ వంశాల ప్రకారం నమోదు చేయబడ్డారు. వారు నమ్మకమైన వారని దావీదు, దీర్ఘదర్శియైన సమూయేలు వారిని ఆ స్థానాల్లో నియమించారు.
1CH 9:23 వారు వారి వారసులు సమావేశపు గుడారం అని పిలువబడే యెహోవా మందిరపు ద్వారాలకు కాపలా కాసే బాధ్యత కలిగి ఉన్నారు.
1CH 9:24 ద్వారపాలకులు నలువైపులా ఉన్నారు అనగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు ఉన్నారు.
1CH 9:25 వారి గ్రామాల్లో ఉండే వారి తోటి లేవీయులు క్రమంగా వస్తూ ఏడు రోజులపాటు తమ విధులను పంచుకునేవారు.
1CH 9:26 అయితే లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు నమ్మకమైనవారు కాబట్టి దేవుని మందిరపు గదులకు, ఖజానాకు సంబంధించిన బాధ్యత వారికి ఇవ్వబడింది.
1CH 9:27 వారు దేవుని ఆలయానికి కావలివారు కాబట్టి దాని దగ్గరే రాత్రంతా ఉండేవారు; ప్రతి ఉదయం దాని తలుపులు తెరిచే బాధ్యత వారిదే.
1CH 9:28 వారిలో కొందరికి ఆలయ సేవలో ఉపయోగించే వస్తువుల బాధ్యత ఇవ్వబడింది; వాటిని లోపలికి తెచ్చినప్పుడు బయటకు తీసుకెళ్లినప్పుడు వారు వాటిని లెక్కించేవారు.
1CH 9:29 ఇతరులకు ఉపకరణాలు, పరిశుద్ధాలయంలో ఉన్న ఇతర వస్తువులన్నిటి బాధ్యత ఇవ్వబడింది. వాటితో పాటు సన్నని పిండి, ద్రాక్షరసం, ఒలీవనూనె, ధూపద్రవ్యాలు, సుగంధద్రవ్యాలు వారి ఆధీనంలోనే ఉంటాయి.
1CH 9:30 అయితే యాజకులలో కొంతమంది సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని చేసేవారు.
1CH 9:31 కోరహు వంశీయుడైన షల్లూము మొదటి కుమారుడైన మత్తిత్యా అనే లేవీయుడు నమ్మకమైనవాడు కాబట్టి అతనికి అర్పణల రొట్టెలు తయారుచేసే బాధ్యత ఇవ్వబడింది.
1CH 9:32 వారి తోటి లేవీయులైన కహాతీయులలో కొందరికి ప్రతి సబ్బాతు దినం కోసం బల్లపై ఉంచే రొట్టెలు సిద్ధం చేసే బాధ్యత ఇవ్వబడింది.
1CH 9:33 లేవీయుల కుటుంబ పెద్దలలో సంగీతకారులు దేవాలయపు గదుల్లో ఉండేవారు. వారు రాత్రింబగళ్ళు పని చేయాలి కాబట్టి వారికి వేరే ఏ పని అప్పగించబడలేదు.
1CH 9:34 వీరందరు లేవీయుల కుటుంబ పెద్దలు, తమ వంశం ప్రకారం నాయకులు. వారు యెరూషలేములో నివసించారు.
1CH 9:35 గిబియోను తండ్రియైన యెహీయేలు గిబియోనులో నివసించాడు. అతని భార్యపేరు మయకా.
1CH 9:36 అతని మొదటి కుమారుడు అబ్దోను, తర్వాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
1CH 9:37 గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు పుట్టారు.
1CH 9:38 మిక్లోతు షిమ్యాముకు తండ్రి. వీరు కూడా యెరూషలేములో తమ బంధువులకు దగ్గరలో నివసించారు.
1CH 9:39 నేరు కీషుకు తండ్రి, కీషు సౌలుకు తండ్రి, యోనాతాను, మల్కీ-షూవ, అబీనాదాబు, ఎష్-బయలు అనేవారు సౌలు కుమారులు.
1CH 9:40 యోనాతాను కుమారుడు: మెరీబ్-బయలు, ఇతడు మీకాకు తండ్రి.
1CH 9:41 మీకా కుమారులు: పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు.
1CH 9:42 ఆహాజు యదాకు తండ్రి, ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీలకు తండ్రి. జిమ్రీ మోజా అనేవారు యదా కుమారులు.
1CH 9:43 మోజా బిన్యాకు తండ్రి; బిన్యా కుమారుడు రెఫాయా, అతని కుమారుడు ఎలాశా, అతని కుమారుడు ఆజేలు.
1CH 9:44 ఆజేలు కుమారులు ఆరుగురు. వారి పేర్లు ఇవి: అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హనాను. వీరు ఆజేలు కుమారులు.
1CH 10:1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు; వారి ఎదుట నుండి ఇశ్రాయేలీయులు పారిపోయారు, చాలామంది గిల్బోవ పర్వతం మీద చచ్చి పడిపోయారు.
1CH 10:2 ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి అతని కుమారులైన యోనాతాను, అబీనాదాబు, మల్కీ-షూవలను చంపేశారు.
1CH 10:3 సౌలు చుట్టూ యుద్ధం తీవ్రమయ్యింది, బాణాలు వేసేవారు అతన్ని చూసి అతన్ని గాయపరిచారు.
1CH 10:4 సౌలు తన ఆయుధాలు మోసేవానితో, “నీ కత్తి దూసి నన్ను పొడవు, లేకపోతే సున్నతిలేని వీరు వచ్చి నన్ను దూషిస్తారు” అని అన్నాడు. కాని ఆ ఆయుధాలు మోసేవాడు చాలా భయపడి దానికి ఒప్పుకోలేదు; కాబట్టి సౌలు తన కత్తి తీసుకుని దాని మీద పడ్డాడు.
1CH 10:5 ఆయుధాలు మోసేవాడు సౌలు చనిపోయాడని చూసి అతడు కూడా తన కత్తి మీద పడి చనిపోయాడు.
1CH 10:6 సౌలు, అతని ముగ్గురు కుమారులు, అతని ఇంటివారందరు ఒకేసారి చనిపోయారు.
1CH 10:7 సైన్యం పారిపోయిందని, సౌలు అతని కుమారులు చనిపోయారని లోయలో ఉన్న ఇశ్రాయేలీయులందరు తెలుసుకున్నప్పుడు, వారు తమ పట్టణాలను విడిచి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిని ఆక్రమించుకున్నారు.
1CH 10:8 మరుసటిరోజు చనిపోయినవారిని దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు, వారు గిల్బోవ పర్వతం మీద పడి ఉన్న సౌలును, అతని కుమారులను చూశారు.
1CH 10:9 వారు అతన్ని దోచుకుని అతని తలను, అతని ఆయుధాలను తీసుకెళ్లి, తమ విగ్రహాల మధ్య, తమ ప్రజలమధ్య ఈ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నలుదిక్కులకు దూతలను పంపారు.
1CH 10:10 వారు అతని ఆయుధాలను తమ దేవుళ్ళ గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో వ్రేలాడదీశారు.
1CH 10:11 ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు వాసులందరు విన్నప్పుడు,
1CH 10:12 వారి బలశాలులంతా వెళ్లి సౌలు శవాన్ని, అతని కుమారుల శవాలను యాబేషుకు తీసుకువచ్చి వారి ఎముకలు తీసుకుని యాబేషులోని సింధూర వృక్షం క్రింద పాతిపెట్టి, ఏడు రోజులు ఉపవాసమున్నారు.
1CH 10:13 యెహోవాకు నమ్మకద్రోహిగా ఉన్నందుకు సౌలు చనిపోయాడు; అతడు యెహోవా వాక్కును పాటించకుండా సలహా కోసం ఆత్మలతో మాట్లాడేవారి దగ్గరకు వెళ్లాడు.
1CH 10:14 యెహోవా దగ్గర విచారణ చేయలేదు. కాబట్టి యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యాన్ని యెష్షయి కుమారుడైన దావీదుకు అప్పగించారు.
1CH 11:1 ఇశ్రాయేలీయులందరు హెబ్రోనులో దావీదు దగ్గరకు వచ్చి, “మేము నీ రక్తసంబంధులము.
1CH 11:2 గతంలో సౌలు రాజుగా ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు సైన్యాన్ని నీవే నడిపించావు. నీ దేవుడైన యెహోవా నీతో, ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు కాపరిగా ఉంటావు, వారిని పరిపాలిస్తావు’ అని చెప్పారు” అని అన్నారు.
1CH 11:3 ఇశ్రాయేలు పెద్దలందరు హెబ్రోనులో ఉన్న రాజైన దావీదు దగ్గరకు వచ్చినప్పుడు, అతడు హెబ్రోనులో యెహోవా ఎదుట వారితో ఒక ఒడంబడిక చేశాడు. యెహోవా సమూయేలు ద్వారా వాగ్దానం చేసినట్టే వారు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారు.
1CH 11:4 దావీదు ఇశ్రాయేలీయులందరు యెబూసు అని కూడా పిలువబడే యెరూషలేముకు వెళ్లారు. యెబూసీయులు అక్కడ నివసిస్తున్నారు.
1CH 11:5 అప్పుడు యెబూసీయులు దావీదుతో, “నీవు లోపలికి రాలేవు” అన్నారు. అయినా దావీదు సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు. దానిని దావీదు పట్టణం అంటారు.
1CH 11:6 దావీదు, “ఎవడు మొదట యెబూసీయులపై దాడి చేస్తాడో వాడు ప్రముఖ సైన్యాధిపతి అవుతాడు” అని అన్నప్పుడు సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా దాడి చేసి అధిపతి అయ్యాడు.
1CH 11:7 దావీదు కోటలో నివాసం ఏర్పరచుకున్నాడు కాబట్టి దానికి దావీదు పట్టణం అని పేరు వచ్చింది.
1CH 11:8 అతడు మిద్దె నుండి దాని చుట్టూ పట్టణాన్ని కట్టించగా యోవాబు మిగతా పట్టణ భాగాలను బాగుచేయించాడు.
1CH 11:9 సైన్యాల యెహోవా అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి దావీదు అంతకంతకు శక్తిమంతుడయ్యాడు.
1CH 11:10 ఇశ్రాయేలుకు యెహోవా వాగ్దానం చేసిన ప్రకారం దావీదును ఆ ప్రాంతమంతటికి రాజుగా చేయడానికి అతనికి ఇశ్రాయేలు వారందరితో కలిసి సహాయం చేసిన వీరులలో ప్రధానులు వీరు.
1CH 11:11 ఇది దావీదు యొక్క పరాక్రమశాలుల జాబితా: అధికారులలో ముఖ్యుడు, హక్మోనీయుడైన కుమారుడైన యషోబీము; అతడు తన ఈటెతో ఒకే యుద్ధంలో మూడువందల మందిని చంపాడు.
1CH 11:12 అతని తర్వాత శ్రేణిలో అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు, ఇతడు ముగ్గురు యోధులలో ఒకడు.
1CH 11:13 ఒకసారి ఫిలిష్తీయులు పస్ దమ్మీములో యుద్ధానికి వచ్చినప్పుడు అతడు దావీదుతో పాటు ఉన్నాడు. యవలు నిండి ఉన్న పొలం దగ్గర ఫిలిష్తీయులను చూసి ఇశ్రాయేలు దళాలు పారిపోయారు.
1CH 11:14 కాని వీరు పొలం మధ్యలో నిలబడి, దానిని కాపాడి ఫిలిష్తీయులను చంపారు. యెహోవా వారికి గొప్ప విజయాన్ని ఇచ్చారు.
1CH 11:15 ముప్పైమంది ప్రముఖులలో ముగ్గురు అదుల్లాము అనే రాతి గుహలో ఉన్న దావీదు దగ్గరకు వచ్చారు. అప్పుడు ఫిలిష్తీయుల సైనికుల గుంపు రెఫాయీము లోయలో శిబిరం ఏర్పరచుకుంది.
1CH 11:16 ఆ సమయంలో దావీదు సురక్షితమైన స్థావరంలో ఉన్నాడు. ఫిలిష్తీయుల దండు బేత్లెహేములో ఉంది.
1CH 11:17 దావీదు నీళ్ల కోసం ఆరాటపడుతూ, “బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బాగుండేది!” అన్నాడు.
1CH 11:18 అప్పుడు ఆ ముగ్గురు ఫిలిష్తీయుల శిబిరం గుండా చొరబడి బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు తోడుకొని దావీదుకు తెచ్చి ఇచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగడానికి నిరాకరించాడు; బదులుగా వాటిని యెహోవాకు అర్పణగా పారబోశాడు.
1CH 11:19 “నేను ఈ నీళ్లు త్రాగకుండా నా దేవుడు నన్ను కాపాడును గాక! ప్రాణానికి తెగించి వెళ్లి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తాన్ని నేను త్రాగాలా?” అన్నాడు. వాటిని తీసుకురావడానికి వారు తమ ప్రాణాలకు తెగించి తెచ్చారు కాబట్టి దావీదు ఆ నీళ్లు త్రాగలేదు. ఆ ముగ్గురు పరాక్రమ యోధులు చేసిన సాహసాలు ఇలాంటివి.
1CH 11:20 యోవాబు సోదరుడైన అబీషై ఆ ముగ్గురికి నాయకుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడువందల మందిని చంపాడు కాబట్టి అతడు ఆ ముగ్గురిలా ప్రసిద్ధి పొందాడు.
1CH 11:21 అతడు ఆ ముగ్గురికంటే రెండింతలు గౌరవించబడి వారి దళాధిపతి అయ్యాడు కాని వారిలో ఒకనిగా చేర్చబడలేదు.
1CH 11:22 గొప్ప పోరాట వీరుడు, కబ్సెయేలుకు చెందిన యెహోయాదా కుమారుడైన బెనాయా గొప్ప సాహస కార్యాలను చేశాడు. అతడు మోయాబు యొక్క పరాక్రమశాలులైన ఇద్దరిని చంపాడు. అంతేకాక, మంచుపడే కాలంలో ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు.
1CH 11:23 అతడు అయిదు మూరల ఎత్తున్న ఈజిప్టు వానిని చంపాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో నేతపనివాని కర్రలాంటి ఈటె ఉన్నప్పటికీ, బెనాయా దుడ్డుకర్ర పట్టుకుని వాని మీదికి పోయాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో ఉన్న ఈటెను లాక్కుని దానితోనే అతన్ని చంపాడు.
1CH 11:24 యెహోయాదా కుమారుడైన బెనాయా సాహస కార్యాలు ఇలాంటివి; అతడు కూడా ఆ ముగ్గురు గొప్ప యోధులతో పాటు ప్రసిద్ధి పొందాడు.
1CH 11:25 ఆ ముప్పైమందిలో ఘనతకెక్కాడు గాని, ఆ ముగ్గురి జాబితాలో చేర్చబడలేదు. దావీదు అతన్ని తన అంగరక్షకుల నాయకునిగా నియమించాడు.
1CH 11:26 పరాక్రమముగల బలాఢ్యులు వీరే: యోవాబు తమ్ముడైన అశాహేలు, బేత్లెహేముకు చెందిన దోదో కుమారుడైన ఎల్హానాను,
1CH 11:27 హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,
1CH 11:28 తెకోవాకు చెందిన ఇక్కేషు కుమారుడైన ఈరా, అనాతోతుకు చెందిన అబీయెజెరు,
1CH 11:29 హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,
1CH 11:30 నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడు హేలెదు,
1CH 11:31 బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా,
1CH 11:32 గాయషు కనుమలకు చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,
1CH 11:33 బహరూమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యహ్బా,
1CH 11:34 గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడైన యోనాతాను,
1CH 11:35 హరారీయుడైన శాకారు కుమారుడైన అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,
1CH 11:36 మెకేరాతీయుడైన హెఫెరు, పెలోనీయుడైన అహీయా,
1CH 11:37 కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,
1CH 11:38 నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీ కుమారుడైన మిబ్హారు,
1CH 11:39 అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, ఇతడు సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలను మోసేవాడు,
1CH 11:40 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
1CH 11:41 హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,
1CH 11:42 రూబేనీయుడైన షీజా కుమారుడు రూబేనీయులకు పెద్దయైన అదీనా, అతనితో ఉన్న ముప్పైమంది,
1CH 11:43 మయకా కుమారుడైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు,
1CH 11:44 ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరోయేరీయుడైన హోతాము కుమారులైన షామా, యెహీయేలు,
1CH 11:45 షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, అతని సోదరుడు తిజీయుడైన యోహా,
1CH 11:46 మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,
1CH 11:47 ఎలీయేలు, ఓబేదు, మెజోబాయా వాడైన యయశీయేలు.
1CH 12:1 కీషు కుమారుడైన సౌలు దగ్గర నుండి బహిష్కరించబడి దావీదు సిక్లగులో ఉన్నప్పుడు అతని దగ్గరకు వచ్చినవారు వీరు (అతనికి యుద్ధంలో సహాయపడిన వీరులలో ఉన్నవారు;
1CH 12:2 వీరు బాణాలు ధరించి కుడిచేతితో ఎడమచేతితో బాణాలు వేయడంలో, వడిసెలతో రాళ్లు రువ్వడంలో సమర్థులు; వీరు బెన్యామీను గోత్రం నుండి వచ్చిన సౌలు బంధువులు):
1CH 12:3 నాయకుడైన అహీయెజెరు, యోవాషు; వీరు గిబియోనీయుడైన షెమాయా కుమారులు; అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు; బెరాకా, అనాతోతీయుడైన యెహు,
1CH 12:4 ముప్పైమందిలో పరాక్రమశాలి, ముప్పైమందికి నాయకుడు, గిబియోనీయుడైన ఇష్మయా; యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు,
1CH 12:5 ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫట్యా;
1CH 12:6 కోరహీయులైన ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యషోబీము;
1CH 12:7 గెదోరు వాడైన యెరోహాము కుమారులైన యోహేలా, జెబద్యా.
1CH 12:8 కొంతమంది గాదీయులు తమ కూటమిని మార్చుకొని అరణ్యంలో సురక్షితమైన స్థలంలో ఉన్న దావీదు దగ్గర చేరారు. వారు పరాక్రమశాలులు, యుద్ధానికి సిద్ధపడినవారు, డాలు ఈటెలను వాడే సమర్థులు, వారు సింహం ముఖంలాంటి ముఖాలు కలిగి కొండల్లో ఉండే జింకలంత వేగంగా పరుగెత్తగలరు.
1CH 12:9 వారెవరంటే, నాయకుడైన ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,
1CH 12:10 నాలుగవవాడు మిష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,
1CH 12:11 ఆరవవాడు అత్తయి, ఏడవవాడు ఎలీయేలు,
1CH 12:12 ఎనిమిదవ వాడు యోహానాను, తొమ్మిదవ వాడు ఎల్జాబాదు,
1CH 12:13 పదవ వాడు యిర్మీయా, పదకొండవ వాడు మక్బన్నయి.
1CH 12:14 ఈ గాదీయులు సైన్యాధిపతులు; వీరిలో చివరివాడు వందమందికి, అత్యధికుడు వెయ్యిమందికి అధిపతులుగా ఉన్నారు.
1CH 12:15 యొర్దాను నది గట్లమీదుగా పొర్లి పారుతున్నప్పుడు, మొదటి నెలలో దానిని దాటి వెళ్లి లోయల్లో తూర్పు నుండి పడమర వరకు ఉన్నవారినందరిని తరిమివేసింది వీరే.
1CH 12:16 ఇతర బెన్యామీనీయులు, కొంతమంది యూదా వారు కూడా దావీదు ఉన్న సురక్షిత స్థలానికి వచ్చారు.
1CH 12:17 దావీదు వారిని కలుసుకోడానికి బయలుదేరి వెళ్లి వారితో, “మీరు సమాధానంతో నాకు సహాయం చేయడానికి నా దగ్గరకు వస్తే, మిమ్మల్ని నాతో చేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నా వలన మీకు ప్రమాదమేమి లేదని తెలుసుకుని మీరు నన్ను శత్రువులకు అప్పగించడానికి వచ్చి ఉంటే, మన పూర్వికుల దేవుడు దానిని చూసి మీకు తీర్పు తీర్చును గాక” అన్నాడు.
1CH 12:18 అప్పుడు ముప్పైమందికి నాయకుడైన అమాశై మీదికి ఆత్మ రాగా అతడు అన్నాడు: “దావీదూ, మేము నీ వారము! యెష్షయి కుమారుడా! మేము నీతో ఉన్నాము. నీకు సమాధానం, సమాధానం, నీ సహాయకులకు సమాధానం కలుగును, నీ దేవుడే నీకు సహాయం చేస్తారు.” కాబట్టి దావీదు వారిని చేర్చుకొని తన బలగాలకు నాయకులుగా నియమించాడు.
1CH 12:19 సౌలు మీద యుద్ధం చేయడానికి ఫిలిష్తీయులతో పాటు దావీదు బయలుదేరినప్పుడు, మనష్షే గోత్రంలోని కొంతమంది అతని పక్షం చేరారు. (దావీదు అతని మనుష్యులు ఫిలిష్తీయులకు సహాయం చేయలేదు, ఎందుకంటే ఫిలిష్తీయుల నాయకులు, “అతడు మళ్ళీ తన యజమానియైన సౌలు పక్షం చేరితే మనకు ప్రాణాపాయం కలుగుతుంది” అని భావించి దావీదును పంపివేశారు.)
1CH 12:20 దావీదు సిక్లగుకు వెళ్లినప్పుడు దావీదు దగ్గర చేరిన మనష్షే గోత్రికులు వీరు: వేయిమంది సైన్యానికి అధిపతులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై.
1CH 12:21 వారందరు పరాక్రమశాలులు కాబట్టి దావీదు సైన్యంలో అధిపతులుగా ఉండి దోపిడి మూకలను ఎదుర్కోడానికి దావీదుకు సహాయం చేశారు.
1CH 12:22 ప్రతిరోజు దావీదుకు సహాయం చేయడానికి మనుష్యులు వస్తుండడంతో, అతని సైన్యం దేవుని సైన్యంవలె మహా సైన్యంగా మారింది.
1CH 12:23 యెహోవా చెప్పినట్లు, సౌలు రాజ్యాన్ని దావీదు వశం చేయడానికి హెబ్రోనులో అతని దగ్గరకు ఆయుధాలు ధరించి వచ్చిన యుద్ధవీరుల లెక్కలు ఇవే:
1CH 12:24 యూదా వారిలో డాలు, ఈటె పట్టుకుని యుద్ధానికి సిద్ధపడినవారు 6,800 మంది;
1CH 12:25 షిమ్యోనీయులలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వీరులు 7,100 మంది;
1CH 12:26 లేవీయులలో 4,600 మంది,
1CH 12:27 అహరోను కుటుంబానికి నాయకుడైన యెహోయాదా, అతనితో ఉన్న 3,700 మంది,
1CH 12:28 పరాక్రమవంతుడైన సాదోకు అనే యువకునితో పాటు అతని కుటుంబానికి చెందిన అధిపతులు 22 మంది;
1CH 12:29 సౌలు గోత్రమైన బెన్యామీనీయులలో 3,000 మంది, అప్పటివరకు వారిలో చాలామంది సౌలు ఇంటికి నమ్మకంగా ఉన్నవారు;
1CH 12:30 ఎఫ్రాయిం నుండి తమ వంశాలలో పేరు పొందిన పరాక్రమశాలులైన 20,800 మంది;
1CH 12:31 మనష్షే అర్థగోత్రం నుండి, దావీదును రాజుగా చేయడానికి రావాలని పేరుపేరున నియమించబడినవారు 18,000 మంది;
1CH 12:32 ఇశ్శాఖారీయుల్లో సమయోచిత జ్ఞానం కలిగి, ఇశ్రాయేలీయులు ఏం చేయాలో తెలిసిన 200 మంది అధిపతులు, వారి ఆజ్ఞకు లోబడి ఉండే వారి బంధువులందరు;
1CH 12:33 జెబూలూనీయులలో అన్ని రకాల యుద్ధ ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్లగలిగిన యుద్ధ నైపుణ్యం కలవారు, దావీదుకు నమ్మకంగా ఉండి యుద్ధం చేయగలవారు 50,000 మంది;
1CH 12:34 నఫ్తాలీయులలో 1,000 అధికారులు, వారితో పాటు డాలు, ఈటె పట్టుకున్నవారు 37,000 మంది;
1CH 12:35 దానీయులలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు 28,600 మంది;
1CH 12:36 ఆషేరీయులలో నైపుణ్యం కలిగి యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు 40,000 మంది;
1CH 12:37 ఇంకా యొర్దాను నది తూర్పున ఉండే రూబేనీయులలో, గాదీయులలో, మనష్షే అర్ధగోత్రపు వారిలో అన్ని రకాల ఆయుధాలను ధరించగలిగిన వారు 1,20,000 మంది.
1CH 12:38 ఈ వీరులందరు సైన్యంలో పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరంతా హృదయంలో దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా చేయాలని సంపూర్ణంగా తీర్మానించుకొని ఆయుధాలు ధరించి హెబ్రోనుకు వచ్చారు. ఇశ్రాయేలులో మిగిలిన వారందరూ దావీదును రాజుగా చేయాలని ఏకమనస్సుతో కోరుకున్నారు.
1CH 12:39 వారి కుటుంబాలు వారి కోసం భోజనపదార్థాలు సిద్ధం చేశారు, కాబట్టి వారు అక్కడే తిని త్రాగి దావీదుతో పాటు మూడు రోజులు ఉన్నారు.
1CH 12:40 ఇశ్రాయేలీయులు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి సరిహద్దు ప్రాంతాల నుండి వారి పొరుగువారు గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు, ఎడ్ల మీద ఆహారపదార్థాలు తీసుకువచ్చారు. వాటిలో పిండి వంటకాలు, అంజూర పండ్ల ముద్దలు, ద్రాక్షపండ్ల ముద్దలు, ద్రాక్షరసం, ఒలీవనూనె, పశువులు, గొర్రెలు సమృద్ధిగా ఉన్నాయి.
1CH 13:1 దావీదు వేయిమందికి వందమందికి అధిపతులుగా ఉన్నవారందరిని సంప్రదించాడు.
1CH 13:2 తర్వాత అతడు ఇశ్రాయేలు సమాజమంతటితో, “ఈ ఆలోచన మీకు మంచిదనిపిస్తే, ఇది మన దేవుడైన యెహోవా చిత్తమైతే, ఇశ్రాయేలు దేశమంతటా మిగిలి ఉన్న మన ప్రజలందరు, అలాగే వారి పట్టణాల్లో పచ్చిక మైదానాల్లో వారితో పాటు ఉంటున్న యాజకులు, లేవీయులు వచ్చి మనతో చేరాలని వారికి కబురు పంపండి.
1CH 13:3 మన దేవుని నిబంధన మందసాన్ని తిరిగి తీసుకువద్దాము. సౌలు పాలనలో దాని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నాం” అన్నాడు.
1CH 13:4 సమాజమంత దీనికి అంగీకరించింది, ఎందుకంటే వారందరికి అది మంచిదనిపించింది.
1CH 13:5 కాబట్టి దావీదు దేవుని మందసాన్ని కిర్యత్-యారీము నుండి తీసుకురావడానికి ఈజిప్టులో ఉన్న షీహోరు నది నుండి లెబో హమాతు వరకు ఉన్న ఇశ్రాయేలీయులందరిని సమకూర్చాడు.
1CH 13:6 కెరూబుల మధ్య ఆసీనుడైన దేవుడు అని పిలువబడే యెహోవా దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు, ఇశ్రాయేలీయులందరు యూదాలోని కిర్యత్-యారీము అని పిలువబడే బాలాకు వెళ్లారు.
1CH 13:7 వారు దేవుని మందసాన్ని క్రొత్త బండిమీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి బయలుదేరారు, ఉజ్జా, అహియోలు ఆ బండిని తోలారు.
1CH 13:8 దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, సితారలు, వీణలు, తంబురలు, తాళాలు, బూరలు వాయిస్తూ తమ శక్తి అంతటితో దేవుని ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.
1CH 13:9 వారు కీదోను నూర్పిడి కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు, ఎడ్లు తడబడినందుకు దేవుని మందసాన్ని పట్టుకోడానికి ఉజ్జా చేయి చాపాడు.
1CH 13:10 ఉజ్జా మందసం మీద చేయి వేసినందుకు యెహోవా కోపం అతని మీద రగులుకుని ఆయన అతన్ని మొత్తగా అతడు అక్కడే దేవుని ఎదుట చనిపోయాడు.
1CH 13:11 యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకున్నందుకు దావీదుకు కోపం వచ్చింది కాబట్టి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకు దానికి అదే పేరు.
1CH 13:12 ఆ రోజు దావీదు దేవునికి భయపడి, “దేవుని మందసాన్ని నా దగ్గరకు ఎలా తెచ్చుకోవాలి?” అని అడిగాడు.
1CH 13:13 దేవుని మందసాన్ని తన దగ్గర పెట్టుకోడానికి దావీదు పట్టణానికి తీసుకెళ్లకుండా, అతడు దాన్ని గిత్తీయుడైన ఓబేద్-ఎదోము ఇంటికి తీసుకెళ్లాడు.
1CH 13:14 దేవుని మందసం ఓబేద్-ఎదోము ఇంట్లో అతని కుటుంబం దగ్గర మూడు నెలలు ఉంది. యెహోవా అతన్ని, అతని ఇంటివారిని అతనికి కలిగిన సమస్తాన్ని దీవించారు.
1CH 14:1 తూరు రాజైన హీరాము దావీదు దగ్గరకు దూతలను, వారితో పాటు దావీదుకు రాజభవనం నిర్మించడానికి దేవదారు దుంగలను, వడ్రంగివారిని, రాళ్లతో పనిచేసే మేస్త్రీలను పంపాడు.
1CH 14:2 ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరిచారని, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం తన రాజ్యాన్ని ఎంతో గొప్ప చేశారని దావీదు గ్రహించాడు.
1CH 14:3 దావీదు యెరూషలేములో మరికొందరిని భార్యలుగా చేసుకుని ఇంకా చాలామంది కుమారులకు కుమార్తెలకు తండ్రి అయ్యాడు.
1CH 14:4 యెరూషలేములో అతనికి పుట్టిన పిల్లల పేర్లు ఇవి: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,
1CH 14:5 ఇభారు, ఎలీషువ, ఎల్పెలెతు,
1CH 14:6 నోగహు, నెఫెగు, యాఫీయ,
1CH 14:7 ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు.
1CH 14:8 ఇశ్రాయేలు అంతటి మీద దావీదును రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు విని, అతన్ని పట్టుకోవడానికి సైన్యమంతటితో బయలుదేరి వచ్చారు, అయితే దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కోడానికి వెళ్లాడు.
1CH 14:9 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దాడి చేశారు.
1CH 14:10 అప్పుడు దావీదు, “నేను వెళ్లి ఫిలిష్తీయుల మీద దాడి చేయాలా? మీరు నాకు వారిని అప్పగిస్తారా?” అని దేవుని అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు, నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను” అని అతనికి జవాబిచ్చారు.
1CH 14:11 కాబట్టి దావీదు తన మనుష్యులతో బయల్-పెరాజీముకు వెళ్లి వారిని ఓడించాడు. అతడు, “నీళ్లు కొట్టుకుపోయినట్లుగా దేవుడు నా శత్రువులను నా ఎదుట ఉండకుండ నా చేత నాశనం చేశారు” అని చెప్పి ఆ స్థలానికి బయల్-పెరాజీము అని పేరు పెట్టారు.
1CH 14:12 ఫిలిష్తీయులు తమ దేవతల విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి పారిపోగా దావీదు వాటిని అగ్నిలో కాల్చివేయమని ఆజ్ఞాపించాడు.
1CH 14:13 మరోసారి ఫిలిష్తీయులు అదే లోయలో దాడి చేశారు.
1CH 14:14 కాబట్టి దావీదు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు, “నీవు నేరుగా వారి వెనుక వెళ్లకుండా చుట్టూ తిరిగివెళ్లి, కంబళి చెట్లకు ఎదురుగా వారిమీద దాడి చేయి.
1CH 14:15 కంబళి చెట్ల కొనల్లో అడుగుల శబ్దం వినబడగానే, యుద్ధానికి బయలుదేరు. ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని నాశనం చేయడానికి దేవుడు నీ ముందుగా వెళ్లారని దాని అర్థం” అని జవాబిచ్చారు.
1CH 14:16 కాబట్టి దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లే దావీదు చేశాడు, వారు గిబియోను నుండి గెజెరు వరకు ఫిలిష్తీయుల సైన్యాన్ని తరుముతూ వారిని హతం చేశారు.
1CH 14:17 కాబట్టి దావీదు కీర్తి అన్ని దేశాలకు వ్యాపించింది. యెహోవా ఇతర దేశాలన్నీ అతనికి భయపడేలా చేశారు.
1CH 15:1 దావీదు తన కోసం దావీదు పట్టణంలో భవనాలు కట్టించుకున్న తర్వాత, అతడు దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి దాని కోసం గుడారం వేయించాడు.
1CH 15:2 తర్వాత దావీదు, “దేవుని మందసాన్ని మోయడానికి నిత్యంగా తనకు సేవ చేయడానికి యెహోవా లేవీయులను ఎన్నుకున్నారు కాబట్టి వారు తప్ప ఇంకెవరు యెహోవా మందసాన్ని మోయకూడదు” అని చెప్పాడు.
1CH 15:3 యెహోవా మందసాన్ని తాను సిద్ధపరచిన స్థలానికి తీసుకురావడానికి దావీదు ఇశ్రాయేలీయులందరిని యెరూషలేములో సమావేశపరిచాడు.
1CH 15:4 అప్పుడు అహరోను వారసులను, లేవీయులను పిలిపించాడు, వారు వీరే:
1CH 15:5 కహాతు వారసులలో నుండి, వారి నాయకుడైన ఊరియేలు, అతని బంధువుల్లో 120 మంది;
1CH 15:6 మెరారి వారసులలో నుండి వారి నాయకుడైన అశాయాను, అతని బంధువుల్లో 220 మంది;
1CH 15:7 గెర్షోను వారసులలో నుండి వారి నాయకుడైన యోవేలు, అతని బంధువుల్లో 130 మంది;
1CH 15:8 ఎలీషాపాను వారసులలో నుండి వారి నాయకుడైన షెమయా, అతని బంధువుల్లో 200 మంది;
1CH 15:9 హెబ్రోను వారసులలో నుండి వారి నాయకుడైన ఎలీయేలు, అతని బంధువుల్లో 80 మంది;
1CH 15:10 ఉజ్జీయేలు వారసులలో నుండి వారి నాయకుడైన అమ్మీనాదాబు, అతని బంధువుల్లో 112 మంది.
1CH 15:11 తర్వాత దావీదు యాజకులైన సాదోకు అబ్యాతారులను, లేవీయులైన ఊరియేలు, అశాయాను, యోవేలు, షెమయాను, ఎలీయేలు, అమ్మీనాదాబులను పిలిపించాడు.
1CH 15:12 అతడు వారితో ఇలా అన్నాడు, “మీరు లేవీయుల కుటుంబ పెద్దలు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని, నేను సిద్ధపరచిన స్థలానికి తీసుకురావడానికి మీరు, మీ బంధువులు, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి.
1CH 15:13 లేవీయులైన మీరు ఇంతకుముందు మన దేవుడైన యెహోవా మందసాన్ని మోయలేదు కాబట్టి మన దేవుడైన యెహోవా కోపంతో మనమీద విరుచుకుపడ్డారు. మనం ఎలా చేయాలో నియమించబడిన విధానం ప్రకారం ఆయనను అడగలేదు.”
1CH 15:14 అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని తీసుకురావడానికి యాజకులు, లేవీయులు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు.
1CH 15:15 యెహోవా చెప్పిన మాట ప్రకారం మోషే ఆజ్ఞాపించినట్లు లేవీయులు దేవుని మందసాన్ని దాని మోతకర్రలతో తమ భుజాల మీదికి ఎత్తుకున్నారు.
1CH 15:16 తమ తోటి లేవీయులను సితారలు, వీణలు, తాళాలు మొదలైన వాయిద్యాలతో సంతోషకరమైన ధ్వని చేయమని సంగీతకారులుగా నియమించమని లేవీ నాయకులకు దావీదు ఆదేశించాడు.
1CH 15:17 కాబట్టి లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును నియమించారు; అతని బంధువుల్లో బెరెక్యా కుమారుడైన ఆసాపు; వారి బంధువులైన మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతాను;
1CH 15:18 వారితో పాటు రెండవ వరుసలో ఉన్న తమ బంధువులు: జెకర్యా, బేను, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీఫెలెహు, మిక్నేయాహులు, ద్వారపాలకులైన ఓబేద్-ఎదోము, యెహీయేలు.
1CH 15:19 సంగీతకారులైన హేమాను, ఆసాపు, ఏతానులు ఇత్తడి తాళాలను వాయించాలి;
1CH 15:20 జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయాలు అలామోతు శైలిలో వీణలు వాయించాలి,
1CH 15:21 మత్తిత్యా, ఎలీఫెలెహు, మిక్నేయాహు, ఓబేద్-ఎదోము, యెహీయేలు, అజజ్యాహులు షెమినిత్ సితారలు వాయించాలి.
1CH 15:22 లేవీయుల నాయకుడైన కెనన్యా సంగీత నిర్వహణలో నైపుణ్యత గలవాడు కాబట్టి గాయకుల బృందానికి నాయకునిగా నియమించబడ్డాడు.
1CH 15:23 బెరెక్యా, ఎల్కానా దేవుని మందసానికి కావలివారిగా నియమించబడ్డారు.
1CH 15:24 షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులు దేవుని మందసం ముందు బూరలు ఊదడానికి నియమించబడ్డారు. ఓబేద్-ఎదోము, యెహీయా దేవుని మందసానికి కావలివారిగా కూడ నియమించబడ్డారు.
1CH 15:25 కాబట్టి యెహోవా నిబంధన మందసాన్ని ఓబేద్-ఎదోము ఇంటి నుండి ఉత్సాహంతో తీసుకురావడానికి దావీదు, ఇశ్రాయేలీయుల పెద్దలు, సహస్రాధిపతులు వెళ్లారు.
1CH 15:26 ఎందుకంటే యెహోవా నిబంధన మందసాన్ని మోస్తున్న లేవీయులకు దేవుడు సహాయం చేశారు, వారు ఏడు ఎడ్లను, ఏడు పొట్టేళ్ళను బలిగా అర్పించారు.
1CH 15:27 దావీదు, మందసాన్ని మోసిన లేవీయులందరు, సంగీతకారులు, సంగీత నాయకుడు కెనన్యా సన్నని నారతో నేసిన వస్ర్తాలు ధరించారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును కూడా ధరించాడు.
1CH 15:28 ఇశ్రాయేలీయులందరు ఆనందోత్సాహాలతో పొట్టేళ్ల కొమ్ము బూరల ధ్వనితో, తాళాలు వీణలు సితారలు వాయిస్తూ, యెహోవా నిబంధన మందసాన్ని తీసుకువచ్చారు.
1CH 15:29 యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోనికి వస్తుండగా, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. రాజైన దావీదు ఆనందోత్సాహాలతో నాట్యం చేయడం చూసి తన మనస్సులో అతన్ని నీచంగా చూసింది.
1CH 16:1 వారు దేవుని మందసాన్ని తీసుకువచ్చి, దావీదు దాని కోసం వేసిన గుడారంలో దానిని ఉంచి వారు దేవుని సన్నిధిలో దహనబలులు సమాధానబలులు అర్పించారు.
1CH 16:2 దావీదు దహనబలులు సమాధానబలులు అర్పించిన తర్వాత, అతడు యెహోవా పేరిట ప్రజలను దీవించాడు.
1CH 16:3 అప్పుడతడు ఇశ్రాయేలీయులలో ప్రతి పురుషునికి, స్త్రీకి ఒక రొట్టె, ఒక ఖర్జూర పండ్ల రొట్టె, ఒక ద్రాక్షపండ్ల రొట్టె ఇచ్చాడు.
1CH 16:4 తర్వాత అతడు యెహోవా మందసం దగ్గర సేవ చేయడానికి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను కీర్తించడానికి స్తుతించడానికి, కృతజ్ఞతలు అర్పించడానికి లేవీయులలో కొంతమందిని నియమించాడు.
1CH 16:5 వారిలో ఆసాపు నాయకుడు, అతని తర్వాతి నాయకుడు జెకర్యా, తర్వాత యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేద్-ఎదోము, యెహీయేలు. వారు వీణలు, సితారలు వాయించడానికి నియమించబడ్డారు. ఆసాపు తాళాలను వాయించేవాడు.
1CH 16:6 యాజకులైన బెనాయా, యహజీయేలు దేవుని నిబంధన మందసం ఎదుట క్రమంగా బూరలు ఊదేవారు.
1CH 16:7 ఆ రోజు దావీదు యెహోవాను స్తుతించడానికి మొదటిసారిగా ఆసాపు, అతని తోటివారికి ఇలా పాడమని చెప్పాడు:
1CH 16:8 యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి; ఆయన చేసిన వాటిని దేశాల్లో తెలియజేయండి.
1CH 16:9 ఆయనకు పాడండి, ఆయనకు స్తుతి పాడండి; ఆయన అద్భుత కార్యాలన్నిటిని గురించి చెప్పండి.
1CH 16:10 ఆయన పరిశుద్ధ నామం గురించి గొప్పగా చెప్పండి; యెహోవాను వెదికేవారి హృదయాలు ఆనందించును గాక.
1CH 16:11 యెహోవాను, ఆయన బలాన్ని చూడండి; ఆయన ముఖాన్ని ఎల్లప్పుడు వెదకండి.
1CH 16:12 ఆయన సేవకులైన ఇశ్రాయేలు వారసులారా! ఆయన ఎన్నుకున్న యాకోబు సంతానమా! ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను, ఆయన అద్భుతాలను, ఆయన ప్రకటించిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.
1CH 16:14 ఆయన మన దేవుడైన యెహోవా; ఆయన తీర్పులు భూమి అంతటా ఉన్నాయి.
1CH 16:15 ఆయన తన నిబంధనను, తాను చేసిన వాగ్దానాన్ని వెయ్యి తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటారు.
1CH 16:16 అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధనను ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణాన్ని ఎప్పటికీ జ్ఞాపకముంచుకుంటారు.
1CH 16:17 ఆయన దానిని యాకోబుకు శాసనంగా, ఇశ్రాయేలుకు శాశ్వతమైన నిబంధనగా స్థిరపరిచారు:
1CH 16:18 “నేను మీకు కనాను దేశాన్ని ఇస్తాను మీరు వారసత్వంగా పొందుకునే భాగంగా ఇస్తాను.”
1CH 16:19 వారు లెక్కకు కొద్దిమంది ఉన్నప్పుడు, ఆ కొద్దిమంది ఆ దేశంలో పరాయివారిగా ఉన్నప్పుడు,
1CH 16:20 వారు దేశం నుండి దేశానికి, ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి తిరిగారు.
1CH 16:21 ఆయన ఎవరినీ వారికి హాని చేయనివ్వలేదు; వారి కోసం ఆయన రాజులను మందలించారు:
1CH 16:22 “నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు; నా ప్రవక్తలకు హాని చేయకూడదు.”
1CH 16:23 సమస్త భూలోకమా! యెహోవాకు పాడండి; అనుదినం ఆయన రక్షణను ప్రకటించండి.
1CH 16:24 దేశాల్లో ఆయన మహిమను, సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి.
1CH 16:25 యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు; దేవుళ్ళందరికంటే ఆయన భయపడదగిన వారు.
1CH 16:26 ఇతర దేశాల దేవుళ్ళందరు వట్టి విగ్రహాలు, కాని యెహోవా ఆకాశాలను సృష్టించారు.
1CH 16:27 వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి. బలం, ఆనందం ఆయన నివాసస్థలంలో ఉన్నాయి.
1CH 16:28 ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి, మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి.
1CH 16:29 యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకు చెల్లించండి. అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి. తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి.
1CH 16:30 సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి, లోకం స్థిరంగా స్థాపించబడింది, అది కదలదు.
1CH 16:31 ఆకాశాలు ఆనందించాలి, భూమి సంతోషించాలి; “యెహోవా పరిపాలిస్తున్నారు!” అని దేశాల్లో ప్రకటించబడాలి.
1CH 16:32 సముద్రం, దానిలోని సమస్తం ఘోషించాలి; పొలాలు వాటిలోని సమస్తం ఆనంద ధ్వనులు చేయాలి!
1CH 16:33 అడవి చెట్లు పాటలు పాడాలి, అవి యెహోవా ఎదుట ఆనందంతో పాటలు పాడాలి, యెహోవా భూమికి తీర్పు తీర్చడానికి వస్తున్నారు.
1CH 16:34 యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం నిలుస్తుంది.
1CH 16:35 ఇలా మొరపెట్టండి: “దేవా, మా రక్షకా! మమ్మల్ని రక్షించండి; ఇతర దేశాల మధ్య నుండి మమ్మల్ని సమకూర్చి, విడిపించండి, అప్పుడు మేము మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం, మిమ్మల్ని స్తుతించడంలో అతిశయిస్తాము.”
1CH 16:36 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక! అని అనగానే ప్రజలంతా, “ఆమేన్, యెహోవాకు స్తుతి” అని చెప్పారు.
1CH 16:37 యెహోవా నిబంధన మందసం ఎదుట ప్రతిరోజు క్రమంగా సేవ చేయడానికి, దావీదు దాని దగ్గర ఆసాపును, అతని తోటి వారిని నియమించాడు.
1CH 16:38 అలాగే ఓబేద్-ఎదోమును, అతని అరవై ఎనిమిది మంది తోటి వారిని కూడా అక్కడ నియమించాడు. యెదూతూను కుమారుడైన ఓబేద్-ఎదోము, హోసా అనేవారు ద్వారపాలకులు.
1CH 16:39 దావీదు యాజకుడైన సాదోకును, అతని తోటి యాజకులను గిబియోనులోని ఆరాధన స్థలంలో ఉన్న యెహోవా సమావేశ గుడారం దగ్గర ఉంచాడు.
1CH 16:40 యెహోవా ఇశ్రాయేలీయులకు ఆదేశించిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం, ప్రతిరోజు ఉదయ సాయంత్రాల్లో క్రమంగా బలిపీఠం మీద దహనబలి యెహోవాకు అర్పించడానికి దావీదు వారిని నియమించాడు.
1CH 16:41 “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అంటూ ఆయనకు కృతజ్ఞతలు అర్పించడానికి వారితో కూడ హేమాను, యెదూతూను, పేర్లు చెప్పి ఎన్నుకున్న మరి కొంతమందిని అతడు నియమించాడు.
1CH 16:42 బూరధ్వని చేయడానికి, తాళాలు వాయించడానికి, దేవున్ని స్తుతించడానికి ఇతర వాయిద్యాలను వాయించడానికి హేమాను, యెదూతూనులను నియమించాడు. యెదూతూను కుమారులను ద్వారపాలకులుగా నియమించాడు.
1CH 16:43 తర్వాత ప్రజలంతా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. దావీదు తన కుటుంబాన్ని దీవించడానికి తన ఇంటికి తిరిగి వెళ్లాడు.
1CH 17:1 దావీదు తన రాజభవనంలో స్థిరపడిన తర్వాత, అతడు నాతాను ప్రవక్తతో, “ఇదిగో, యెహోవా నిబంధన మందసం గుడారంలో ఉంటుండగా నేను దేవదారు చెక్కలతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను” అన్నాడు.
1CH 17:2 అందుకు నాతాను దావీదుతో, “దేవుడు నీకు తోడుగా ఉన్నారు, కాబట్టి నీ మనస్సులో ఏముందో అది చేయి” అన్నాడు.
1CH 17:3 అయితే ఆ రాత్రి దేవుని వాక్కు నాతాను దగ్గరకు ఇలా వచ్చింది:
1CH 17:4 “నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు: ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నివసించడానికి ఒక మందిరాన్ని కట్టించేది నీవు కాదు.
1CH 17:5 ఈజిప్టు నుండి నేను ఇశ్రాయేలీయులను తీసుకువచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నేను మందిరంలో నివసించలేదు. ఒక గుడారం నుండి మరో గుడారానికి, ఒక నివాసస్థలం నుండి మరో స్థలానికి మారుతూ వచ్చాను.
1CH 17:6 ఇశ్రాయేలీయులందరితో నేను ఎక్కడికి వెళ్లినా, నా ప్రజలను కాయుమని నేను ఆజ్ఞాపించిన వారి నాయకుల్లో ఎవరితోనైనా, “నా కోసం దేవదారు కర్రలతో మందిరాన్ని ఎందుకు కట్టించలేదు” అని అడిగానా?’
1CH 17:7 “కాబట్టి ఇప్పుడు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: పచ్చిక మైదానంలో గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను తీసుకువచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు పాలకునిగా నియమించాను.
1CH 17:8 నీవెక్కడికి వెళ్లినా నేను నీకు తోడుగా ఉండి, నీ ఎదుట నిలబడకుండా నీ శత్రువులందరిని నాశనం చేశాను. ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవారికున్న పేరులాంటి పేరు నీకు ఇస్తాను.
1CH 17:9 నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎలాంటి తొందర లేకుండా వారి స్వస్థలంలో నివసించేలా వారిని అందులో నాటుతాను. గతంలో వారు చేసినట్లుగా దుర్మార్గులు వారిని ఇక బాధించరు,
1CH 17:10 అంతేకాదు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన కాలం నుండి జరిగినట్టు దుర్మార్గులు ఇక వారిని బాధించరు. నీ శత్రువులందరి నుండి నీకు నెమ్మది కలుగజేస్తాను. “ ‘యెహోవా నీకు రాజవంశాన్ని ఇస్తారని నేను నీకు ప్రకటిస్తున్నాను:
1CH 17:11 నీ దినాలు ముగిసి నీ పూర్వికుల దగ్గరకు నీవు వెళ్లినప్పుడు, నీ స్థానంలో నీ సంతానాన్ని, నీ సొంత కుమారులలో ఒకరిని నేను లేవనెత్తుతాను, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.
1CH 17:12 నా కోసం ఒక మందిరాన్ని కట్టేవాడు అతడే. నేను అతని సింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.
1CH 17:13 నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు. నీకంటే ముందున్న వానికి నేను నా ప్రేమను దూరం చేసినట్లుగా అతనికి ఎప్పుడూ దూరం చేయను.
1CH 17:14 నా ఇంటి మీద, నా రాజ్యం మీద నేను అతన్ని నిత్యం స్థిరపరుస్తాను; అతని సింహాసనం శాశ్వతంగా స్థాపించబడుతుంది.’ ”
1CH 17:15 నాతాను ఈ దర్శనంలోని మాటలన్నిటిని దావీదుకు చెప్పాడు.
1CH 17:16 అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్లి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు: “దేవా యెహోవా, మీరు నన్ను ఈ స్థితిలోనికి తీసుకురావడానికి నేనెంతటివాన్ని? నా కుటుంబం ఏపాటిది?
1CH 17:17 ఇది మీ దృష్టికి చాలదన్నట్టు నా దేవా, మీ సేవకుని కుటుంబ భవిష్యత్తు గురించి కూడా తెలియజేశారు. దేవా యెహోవా, మీరు నన్ను మనుష్యుల్లో చాలా గొప్పవానిగా చూశారు.
1CH 17:18 “మీ సేవకుని ఘనపరుస్తున్నందుకు దావీదు మీతో ఇంకేం చెప్పగలడు? మీ సేవకుని గురించి మీకు తెలుసు.
1CH 17:19 యెహోవా! మీ సేవకుని కోసం మీ చిత్తప్రకారం మీరు ఈ గొప్ప కార్యాన్ని చేసి ఈ గొప్ప వాగ్దానాలన్నిటిని తెలియజేశారు.
1CH 17:20 “యెహోవా! మా చెవులతో మేము విన్నట్లుగా మీలాంటి వారు లేరు, మీరు తప్ప వేరే దేవుడు లేడు.
1CH 17:21 మీ కోసం మీరు విడిపించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు వంటి ప్రజలు ఎవరు ఉన్నారు? వారి దేవుడవైన మీరు వారిని ఈజిప్టులో నుండి విడిపించి, మీ ప్రజల ఎదుట నుండి ఇతర దేశాలను వెళ్లగొట్టినప్పుడు గొప్ప అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేసి మీకు గొప్ప పేరు తెచ్చుకున్నారు.
1CH 17:22 మీ ఇశ్రాయేలు ప్రజలను నిత్యం మీ సొంత ప్రజలుగా స్థిరపరచి యెహోవావైన మీరు వారికి దేవుడయ్యారు.
1CH 17:23 “ఇప్పుడు యెహోవా, మీ సేవకుడనైన నా గురించి నా కుటుంబం గురించి మీరు చేసిన వాగ్దానం ఎల్లకాలం స్థిరపరచబడాలి. మీరు వాగ్దానం చేసినట్టు చేయండి,
1CH 17:24 అప్పుడు అది సుస్థిరమై మీ పేరు ఎప్పటికీ గొప్పగా ఉంటుంది. అప్పుడు ప్రజలు, ‘సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు మీద దేవుడే ఇశ్రాయేలీయుల దేవుడు!’ అని అంటారు. మీ సేవకుడైన దావీదు వంశం మీ ఎదుట స్థిరపరచబడుతుంది.
1CH 17:25 “నా దేవా! నా కోసం రాజవంశాన్ని స్థాపిస్తాను అని మీరు మీ సేవకునికి తెలియజేశారు. కాబట్టి మీకు ప్రార్థించడానికి మీ సేవకునికి ధైర్యం కలిగింది.
1CH 17:26 యెహోవా, మీరే దేవుడు! మీ సేవకునికి ఈ మంచి విషయాలను వాగ్దానం చేశారు.
1CH 17:27 ఇప్పుడు మీ సేవకుని వంశం నిత్యం మీ సన్నిధిలో ఉండేలా దీవించడం మీకు ఇష్టమైనది; ఎందుకంటే యెహోవా, మీరు దానిని దీవిస్తే అది శాశ్వతంగా దీవించబడుతుంది.”
1CH 18:1 కాలక్రమేణా దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోబరచుకున్నాడు, వారి ఆధీనంలో నుండి గాతును, దాని చుట్టూ ఉన్న గ్రామాలను స్వాధీనం చేసుకున్నాడు.
1CH 18:2 దావీదు మోయాబీయులను కూడా ఓడించాడు, వారు లొంగిపోయి అతనికి కప్పం చెల్లించారు.
1CH 18:3 అంతేకాక, సోబా రాజైన హదదెజెరు యూఫ్రటీసు నది వరకు తన స్థూపాన్ని నిలబెట్టడానికి బయలుదేరినప్పుడు హమాతు పరిసరాల్లో దావీదు అతన్ని ఓడించాడు.
1CH 18:4 దావీదు అతని దగ్గర నుండి 1,000 రథాలను, 7,000 రథసారధులను, 20,000 మంది సైనికులను పట్టుకున్నాడు. వాటిలో వంద రథాలకు సరిపడా గుర్రాలను ఉంచుకుని మిగతా వాటికి చీలమండల నరాలు తెగగొట్టాడు.
1CH 18:5 సోబా రాజైన హదదెజెరుకు సహాయం చేయడానికి దమస్కులో ఉన్న అరామీయులు వచ్చినప్పుడు, దావీదు వారిలో 22,000 మందిని చంపాడు.
1CH 18:6 దమస్కులో ఉన్న అరామీయుల దేశంలో అతడు తన సైనిక దళాలను ఉంచగా అరామీయులు అతనికి దాసులై, అతనికి కప్పం చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయాన్ని ఇచ్చారు.
1CH 18:7 దావీదు హదదెజెరు సైన్యాధిపతులు ధరించిన బంగారు డాళ్లను తీసుకుని, వాటిని యెరూషలేముకు తెచ్చాడు.
1CH 18:8 హదదెజెరుకు చెందిన తెబా కూను అనే పట్టణాల నుండి దావీదు చాలా మొత్తంలో ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ ఇత్తడితో సొలొమోను ఇత్తడి నీళ్ల తొట్టెను, స్తంభాలను, ఇతర ఇత్తడి వస్తువులను చేయించాడు.
1CH 18:9 సోబా రాజైన హదదెజెరు సైన్యమంతటిని దావీదు ఓడించిన సంగతి హమాతు రాజైన తోయు విన్నప్పుడు,
1CH 18:10 అతడు తన కుమారుడైన హదోరామును రాజైన దావీదు దగ్గరకు అతని క్షేమం గురించి తెలుసుకుని అతనికి శుభాకాంక్షలు చెప్పడానికి పంపాడు, ఎందుకంటే హదదెజెరుకు తోయుకు మధ్య విరోధం ఉంది. హదోరాము బంగారం వెండి ఇత్తడితో చేసిన అన్ని రకాల వస్తువులను తెచ్చాడు.
1CH 18:11 రాజైన దావీదు ఈ వస్తువులను, ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు, అమాలేకీయుల దేశాల నుండి స్వాధీనం చేసుకున్న వెండి బంగారాలను ప్రతిష్ఠించిన విధంగానే యెహోవాకు ప్రతిష్ఠించాడు.
1CH 18:12 సెరూయా కుమారుడైన అబీషై ఉప్పు లోయలో 18,000 మంది ఎదోమీయులను చంపాడు.
1CH 18:13 అతడు ఎదోము దేశంలో సైనిక దళాలను ఉంచాడు. ఎదోమీయులంతా దావీదుకు లొంగిపోయారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయమిచ్చారు.
1CH 18:14 దావీదు ఇశ్రాయేలంతటిని పరిపాలిస్తూ తన ప్రజలందరికి న్యాయాన్ని ధర్మాన్ని జరిగించాడు.
1CH 18:15 సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల మీద అధికారి;
1CH 18:16 అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులు; షవ్షా కార్యదర్శి;
1CH 18:17 యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు అధిపతి; దావీదు కుమారులు రాజు ప్రధాన అధికారులు.
1CH 19:1 కొంతకాలం తర్వాత అమ్మోనీయుల రాజు నాహాషు చనిపోయాడు, అతని స్థానంలో అతని కుమారుడు రాజయ్యాడు.
1CH 19:2 అప్పుడు దావీదు, “హానూను తండ్రియైన నాహాషు నా మీద దయ చూపించాడు కాబట్టి నేను హామాను మీద దయ చూపిస్తాను” అని అనుకున్నాడు. కాబట్టి అతని తండ్రి విషయంలో తన సానుభూతి తెలుపడానికి దావీదు తన ప్రతినిధులను పంపించాడు. దావీదు దూతలు అతనికి సానుభూతి తెలుపడానికి అమ్మోనీయుల దేశంలో ఉన్న హానూను దగ్గరకు వచ్చినప్పుడు,
1CH 19:3 అమ్మోనీయుల దళాధిపతులు హానూనుతో, “నీ తండ్రిని గౌరవించడానికి నీకు సానుభూతి తెలుపాలని దావీదు దూతలను పంపాడని అనుకుంటున్నావా? అతని దూతలు ఈ దేశాన్ని జయించడానికి గూఢాచారులుగా రాలేదా?” అన్నారు.
1CH 19:4 అందువల్ల హానూను దావీదు దూతలను పట్టుకుని వారి జుట్టు గొరిగించి, పిరుదుల దగ్గర వారి వస్త్రాలు కత్తిరించి పంపించేశాడు.
1CH 19:5 కొంతమంది, ఆ మనుష్యుల సంగతి దావీదుకు చెప్పినప్పుడు, వారు చాలా అవమానించబడినట్లు గ్రహించిన రాజు వారి దగ్గరకు మనుష్యులను పంపి, “మీ గడ్డాలు పెరిగే వరకు యెరికో పట్టణంలో ఉండి, ఆ తర్వాత రండి” అని చెప్పాడు.
1CH 19:6 దావీదుకు తాము కోపం తెప్పించామని అమ్మోనీయులు గ్రహించి, హానూను అమ్మోనీయులు వేయి తలాంతుల వెండిని పంపి అరాము నహరయీము నుండి, అరాము మయకా నుండి, సోబా నుండి రథాలను, రథసారధులను కిరాయికి తీసుకున్నారు.
1CH 19:7 వారు 32,000 రథాలను, రథసారధులను, మయకా రాజును, అతని సైన్యాన్ని కిరాయికి తీసుకున్నారు. వారు మెదెబా దగ్గరలో శిబిరం ఏర్పరచుకున్నారు, ఆ సమయంలో అమ్మోనీయులు తమ పట్టణాల నుండి సమకూడి యుద్ధం చేయడానికి వెళ్లారు.
1CH 19:8 ఇది విన్న దావీదు యోవాబును యుద్ధ సైనికులందరితో సహా పంపించాడు.
1CH 19:9 అమ్మోనీయులు బయటకు వచ్చి తమ పట్టణ ద్వారం దగ్గర యుద్ధ పంక్తులు తీర్చారు. అక్కడికి వచ్చిన రాజులు విడిగా పొలాల్లో ఉన్నారు.
1CH 19:10 యోవాబు తన ముందు వెనుకా యుద్ధ పంక్తులు ఉండడం చూశాడు; ఇశ్రాయేలులో కొందరు అత్యుత్తమ దళాలను ఎంపికచేసి, వారిని అరామీయులకు ఎదురుగా మోహరించాడు.
1CH 19:11 మిగిలిన వారిని తన సోదరుడైన అబీషై ఆధీనంలో ఉంచాడు, వారిని అమ్మోనీయులకు ఎదురుగా మోహరించాడు.
1CH 19:12 యోవాబు, “అరామీయులను ఎదుర్కోవడం నాకు కష్టమైనప్పుడు నన్ను రక్షించడానికి నీవు రావాలి; అమ్మోనీయులను ఎదుర్కోవడం నీకు కష్టమైనప్పుడు నిన్ను నేను రక్షిస్తాను.
1CH 19:13 ధైర్యంగా ఉండు, మన ప్రజల కోసం, మన దేవుని పట్టణాల కోసం ధైర్యంగా పోరాడదాం. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తారు” అని అబీషైతో చెప్పాడు.
1CH 19:14 అప్పుడు యోవాబు అతనితో ఉన్న దళాలు అరామీయులతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్లగా, అతన్ని ఎదుర్కోలేక వారు పారిపోయారు.
1CH 19:15 అరామీయులు పారిపోయారని గ్రహించిన అమ్మోనీయులు కూడా యోవాబు సోదరుడైన అబీషై ఎదుట నుండి పారిపోయి పట్టణంలోకి వెళ్లారు. అప్పుడు యోవాబు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
1CH 19:16 తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని గ్రహించిన అరామీయులు దూతలను పంపి, యూఫ్రటీసు నది అవతల ఉన్న అరామీయులను పిలిపించారు. హదదెజెరు సేనాధిపతియైన షోఫకు వారిని నడిపించాడు.
1CH 19:17 దావీదుకు ఈ సంగతి తెలిసినప్పుడు, అతడు ఇశ్రాయేలు అంతటిని సమకూర్చి యొర్దాను నది దాటి వెళ్లాడు; వారికి ఎదురుగా యుద్ధ పంక్తులు ఏర్పరిచాడు. దావీదు అరామీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు ఏర్పరిచాక వారు అతనితో యుద్ధం చేశారు.
1CH 19:18 అయితే అరామీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోయారు. దావీదు వారిలో 7,000 మంది రథసారధులను 40,000 సైనికులను చంపాడు. అలాగే వారి సైన్యాధిపతియైన షోఫకును కూడా చంపాడు.
1CH 19:19 హదదెజెరు సేవకులు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతున్నామని గ్రహించి దావీదుతో సమాధానపడి అతనికి లొంగిపోయారు. అప్పటినుండి ఇంకెప్పుడు అరామీయులు అమ్మోనీయులకు సహాయం చేయడానికి ఇష్టపడలేదు.
1CH 20:1 వసంతకాలంలో, రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, యోవాబు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అతడు అమ్మోనీయుల దేశాన్ని నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. అయితే దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. యోవాబు రబ్బాపై దాడి చేసి దానిని నాశనం చేశాడు.
1CH 20:2 దావీదు వారి రాజు తలమీద నుండి కిరీటాన్ని తీసుకున్నాడు, అది ఒక తలాంతు బరువు కలిగి ఉండి, ప్రశస్తమైన రాళ్లతో పొదిగించబడి ఉంది. దాన్ని దావీదు తలమీద పెట్టుకున్నాడు. అతడు ఆ పట్టణం నుండి పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము తీసుకెళ్లాడు.
1CH 20:3 అక్కడి ప్రజలను బయటకు తీసుకువచ్చి రంపతో, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్ళతో కఠినమైన పని చేయించాడు. దావీదు అమ్మోనీయుల పట్టణాలన్నిటికి ఈ విధంగా చేశాడు. తర్వాత దావీదు అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగి వచ్చారు.
1CH 20:4 కొంతకాలం తర్వాత, గెజెరు దగ్గర ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. ఆ సమయంలో హుషాతీయుడైన సిబ్బెకై, రెఫాయీయుల వారసుడైన సిప్పయి అనే వాన్ని చంపగా ఫిలిష్తీయులు లొంగిపోయారు.
1CH 20:5 ఫిలిష్తీయులతో జరిగిన మరో యుద్ధంలో యాయీరు కుమారుడు ఎల్హానాను, గిత్తీయుడైన గొల్యాతు సోదరుడైన లహ్మీని చంపాడు. అతని ఈటె నేతపనివాని అడ్డకర్రంత పెద్దది.
1CH 20:6 గాతు దగ్గర జరిగిన మరో యుద్ధంలో చాలా పొడవైన వాడొకడు ఉన్నాడు. అతని రెండు చేతులకు కాళ్లకు ఆరు వ్రేళ్ళ చొప్పున మొత్తం ఇరవైనాలుగు వ్రేళ్ళు ఉన్నాయి. అతడు కూడా రాఫా సంతతివాడు.
1CH 20:7 అతడు ఇశ్రాయేలీయులను దూషించినప్పుడు, దావీదు సోదరుడు, షిమ్యా కుమారుడైన యోనాతాను అతన్ని చంపాడు.
1CH 20:8 వీరు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు.
1CH 21:1 సాతాను ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లేచి, వారి జనాభా లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు.
1CH 21:2 కాబట్టి దావీదు యోవాబుతో, సైన్యాధిపతులతో, “మీరు వెళ్లి బెయేర్షేబ నుండి దాను వరకు ఉన్న ఇశ్రాయేలీయులను లెక్కించండి. వారి సంఖ్య నాకు తెలిసేలా ఆ వివరాలు నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.
1CH 21:3 కాని యోవాబు రాజుతో, “యెహోవా తన సైన్యాన్ని వందరెట్లు పెంచు గాక! నా ప్రభువా, రాజా, వారంతా నా ప్రభువుకు సేవకులే కదా? నా ప్రభువు ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నాడు? అతడు ఇశ్రాయేలు మీదికి దోషం ఎందుకు తేవాలి?” అని అన్నాడు.
1CH 21:4 అయితే రాజు యోవాబుపై తన మాట సాధించుకున్నాడు; కాబట్టి యోవాబు వెళ్లి, ఇశ్రాయేలు దేశమంతా తిరిగి యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
1CH 21:5 యోవాబు యుద్ధం చేయగలవారి సంఖ్య దావీదుకు తెలియజేశాడు. ఇశ్రాయేలు అంతటిలో కత్తి తిప్పగలవారు పదకొండు లక్షలమంది ఉన్నారు, యూదా వారిలో నాలుగు లక్షల డెబ్బైవేలమంది ఉన్నారు.
1CH 21:6 రాజాజ్ఞ యోవాబుకు అభ్యంతరకరంగా ఉంది కాబట్టి అతడు లేవీ బెన్యామీను వారిని లెక్కలలో చేర్చలేదు.
1CH 21:7 ఈ ఆజ్ఞ దేవుని దృష్టిలో కూడా చెడ్డగా ఉంది; కాబట్టి ఆయన ఇశ్రాయేలును శిక్షించారు.
1CH 21:8 అప్పుడు దావీదు దేవునితో, “నేను ఇది చేసి ఘోరపాపం చేశాను. మీ సేవకుని దోషాన్ని తొలగించమని బ్రతిమాలుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను” అని ప్రార్థన చేశాడు.
1CH 21:9 యెహోవా, దావీదుకు దీర్ఘదర్శిగా ఉన్న గాదుతో ఇలా అన్నారు,
1CH 21:10 “వెళ్లి దావీదుతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీకు మూడు ఎంపికలు ఇస్తున్నాను. వాటిలో ఒకదాన్ని ఎంచుకో, దానిని నీమీదికి రప్పిస్తాను.’ ”
1CH 21:11 కాబట్టి గాదు దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘వీటిలో ఒకదాన్ని ఎంచుకో:
1CH 21:12 మూడు సంవత్సరాల కరువు, మూడు నెలలు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరిమితే వారి ఎదుట నుండి పారిపోవడం, లేదా మూడు రోజులపాటు దేశంలో యెహోవా ఖడ్గం అనగా తెగులు వ్యాపించడం ద్వారా యెహోవా దేవదూత ఇశ్రాయేలీయుల దేశమంతటిని నాశనం చేయడం.’ ఇప్పుడు, నన్ను పంపిన వ్యక్తికి నేనేమి జవాబివ్వాలో నిర్ణయించుకో” అన్నాడు.
1CH 21:13 అందుకు దావీదు గాదుతో, “నేను తీవ్ర బాధలో ఉన్నాను. యెహోవా కనికరం ఎంతో గొప్పది కాబట్టి ఆయన చేతిలోనే నేను పడాలి; కాని మనుష్యుల చేతిలో నేను పడకూడదు” అని అన్నాడు.
1CH 21:14 కాబట్టి యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించారు, డెబ్బైవేలమంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.
1CH 21:15 దేవుడు యెరూషలేమును నాశనం చేయడానికి ఒక దూతను పంపారు. అయితే ఆ దూత దానిని నాశనం చేస్తున్నప్పుడు, జరిగిన కీడును చూసి యెహోవా మనస్సు కరిగి ప్రజలను నాశనం చేస్తున్న దూతతో, “ఇక చాలు! నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పారు. ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళం దగ్గర నిలబడ్డాడు.
1CH 21:16 దావీదు పైకి చూసినప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడి, కత్తి పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపి ఉంచిన యెహోవా దూత అతనికి కనిపించాడు. అప్పుడు దావీదు, పెద్దలు గోనెపట్ట కట్టుకుని సాష్టాంగపడ్డారు.
1CH 21:17 దావీదు దేవునితో, “యుద్ధవీరులను లెక్కించమని ఆదేశించింది నేనే కదా? గొర్రెల కాపరినైన నేను పాపం చేశాను! వీరు గొర్రెల వంటి వారు, వీరేమి చేశారు? యెహోవా! నా దేవా, మీ చేతులు నా మీద నా కుటుంబం మీద పడనివ్వండి, కాని మీ ప్రజలమీదికి ఈ తెగులు రానివ్వకండి” అన్నాడు.
1CH 21:18 అప్పుడు యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించాలని దావీదుకు చెప్పమని గాదుకు ఆజ్ఞాపించాడు.
1CH 21:19 కాబట్టి యెహోవా పేరిట గాదు చెప్పిన మాటకు లోబడి దావీదు బయలుదేరి వెళ్లాడు.
1CH 21:20 ఒర్నాను గోధుమలు నూరుస్తున్నప్పుడు, అతడు వెనుకకు తిరిగి ఆ దేవదూతను చూసి అతడు, అతనితో ఉన్న అతని నలుగురు కుమారులు దాక్కున్నారు.
1CH 21:21 అప్పుడు దావీదు వస్తూంటే, ఒర్నాను అతన్ని చూసి నూర్పిడి కళ్ళంలో నుండి బయటకు వచ్చి తలను నేలకు వంచి దావీదుకు నమస్కారం చేశాడు.
1CH 21:22 దావీదు ఒర్నానుతో, “ప్రజల మీద ఉన్న తెగులు ఆగిపోవడానికి ఈ నూర్పిడి కళ్ళం ఉన్న స్థలంలో నేను యెహోవాకు బలిపీఠం కట్టడానికి పూర్తి ఖరీదుకు దానిని నాకు అమ్ము” అని అన్నాడు.
1CH 21:23 అందుకు ఒర్నాను దావీదుతో, “నా ప్రభువా, రాజా తీసుకోండి! మీకు ఏది ఇష్టమో అది చేయండి. చూడండి, దహనబలులకు ఎద్దులు, నూర్చే కర్రలు కట్టెలు, భోజనార్పణ కోసం గోధుమలిస్తాను. ఇదంతా ఇచ్చేస్తాను” అని అన్నాడు.
1CH 21:24 అయితే రాజైన దావీదు ఒర్నానుతో, “లేదు, నీకు పూర్తి వెల చెల్లించి కొంటాను. నేను నీ వాటిని యెహోవా కోసం ఉచితంగా తీసుకోను లేదా నాకు ఖర్చు కాని దానితో దహనబలి అర్పించను” అన్నాడు.
1CH 21:25 కాబట్టి దావీదు ఆ స్థలానికి ఆరువందల షెకెళ్ళ బంగారాన్ని ఒర్నానుకు ఇచ్చాడు.
1CH 21:26 దావీదు అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దహనబలులు సమాధానబలులు అర్పించాడు. అప్పుడు అతడు యెహోవాకు ప్రార్థించగా, యెహోవా పరలోకం నుండి బలిపీఠం మీదికి అగ్నిని పంపి అతనికి జవాబిచ్చారు.
1CH 21:27 అప్పుడు యెహోవా దూతతో మాట్లాడగా అతడు తన కత్తిని తిరిగి ఒరలో పెట్టాడు.
1CH 21:28 ఆ సమయంలో యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళంలో యెహోవా తనకు జవాబిచ్చాడని గ్రహించి దావీదు అక్కడ బలులర్పించాడు.
1CH 21:29 మోషే అరణ్యంలో చేయించిన యెహోవా సమావేశ గుడారం, దహనబలి బలిపీఠం ఆ కాలంలో గిబియోనులోని ఎత్తైన స్థలంలో ఉన్నాయి.
1CH 21:30 అయితే దావీదు యెహోవా దూత యొక్క ఖడ్గానికి భయపడి, దేవుని దగ్గర విచారణ చేయడానికి ఆ స్థలానికి వెళ్లలేదు.
1CH 22:1 తర్వాత దావీదు, “దేవుడైన యెహోవా మందిరం, ఇశ్రాయేలు కోసం దహనబలులు అర్పించే బలిపీఠం ఇక్కడ ఉండాలి” అని అన్నాడు.
1CH 22:2 కాబట్టి దావీదు ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్న విదేశీయులను సమావేశపరచమని ఆజ్ఞాపించాడు. అతడు వారిలో కొందరిని దేవుని మందిరం కట్టించడానికి రాళ్లు చెక్కే పనికి నియమించాడు.
1CH 22:3 దావీదు ద్వారాల తలుపులకు కావలిసిన మేకులు, బందుల కోసం చాలా ఇనుమును తూయలేనంత ఇత్తడిని సమకూర్చాడు.
1CH 22:4 సీదోనీయులు, తూరీయులు దావీదుకు పెద్ద సంఖ్యలో దేవదారు మ్రానులను తీసుకురావడం వల్ల, వాటిని కూడా లెక్కపెట్టలేనంతగా సమకూర్చాడు.
1CH 22:5 దావీదు, “నా కుమారుడైన సొలొమోను చిన్నవాడు, అనుభవం లేనివాడు, యెహోవాకు కట్టవలసిన మందిరపు కీర్తి, వైభవం బట్టి అది అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందాలి. కాబట్టి దాని నిర్మాణానికి కావలసిన వాటిని నేను సిద్ధం చేస్తాను” అని చెప్పి దావీదు చనిపోవడానికి ముందే విస్తారంగా సామాగ్రిని సిద్ధం చేశాడు.
1CH 22:6 తర్వాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరం కట్టాలని అతన్ని ఆదేశించాడు.
1CH 22:7 దావీదు సొలొమోనుతో ఇలా అన్నాడు: “నా కుమారుడా, నా దేవుడైన యెహోవా నామం కోసం మందిరాన్ని కట్టించాలని నా హృదయంలో అనుకున్నాను.
1CH 22:8 అయితే యెహోవా మాట నాతో ఇలా చెప్పింది: ‘నీవు చాలా రక్తం చిందించి, చాలా యుద్ధాలు చేశావు. నా ఎదుట నీవు నేల మీద చాలా రక్తాన్ని చిందించావు, కాబట్టి నీవు నా పేరిట మందిరాన్ని కట్టించకూడదు.
1CH 22:9 అయితే నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, అతడు సమాధానం, విశ్రాంతి కలిగిన వ్యక్తిగా ఉంటాడు. అన్నివైపులా అతని శత్రువులందరి నుండి నేనతనికి విశ్రాంతిని ఇస్తాను. అతనికి సొలొమోను అనే పేరు పెడతారు. అతని కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తాను.
1CH 22:10 అతడే నా పేరిట ఒక మందిరాన్ని కట్టిస్తాడు. అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేనతనికి తండ్రినై ఉంటాను. ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్యసింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.’
1CH 22:11 “నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉంటారు, నీవు విజయం సాధించి, నీ దేవుడైన యెహోవా నీ గురించి చెప్పిన ప్రకారం నీవు ఆయనకు మందిరాన్ని కట్టిస్తావు.
1CH 22:12 నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని నీవు అనుసరించేలా ఆయన నిన్ను ఇశ్రాయేలీయుల మీద పాలకునిగా నియమించినప్పుడు, యెహోవా నీకు వివేకాన్ని జ్ఞానాన్ని ఆయన ఇచ్చును గాక.
1CH 22:13 అప్పుడు ఇశ్రాయేలీయుల గురించి యెహోవా మోషేకు ఇచ్చిన నియమనిబంధనలను నీవు జాగ్రత్తగా పాటిస్తే, నీవు విజయం సాధిస్తావు. ధైర్యంగా దృఢంగా ఉండు. భయపడకు, నిరుత్సాహపడకు.
1CH 22:14 “యెహోవా మందిరం కట్టడానికి కావలసిన వాటిని సమకూర్చడం కోసం నేను చాలా శ్రమపడ్డాను. దాని కోసం లక్ష తలాంతుల బంగారాన్ని, పది లక్షల తలాంతుల వెండిని, తూయలేనంత ఇత్తడిని, ఇనుమును సమకూర్చాను. చెక్క, రాళ్లు కూడా సమకూర్చాను. నీవింకా వాటికి కలుపవచ్చు.
1CH 22:15 నీ దగ్గర చాలామంది నైపుణ్యం కలిగిన పనివారు అనగా శిల్పకారులు, తాపీ పనివారు, వడ్రంగులు, అన్ని రకాల పనులు చేసేవారు,
1CH 22:16 బంగారం, వెండి, ఇత్తడి, ఇనుములతో పని చేసే శిల్పకారులు సంఖ్యకు మించి ఉన్నారు. కాబట్టి ఇక పని మొదలుపెట్టు. యెహోవా నీకు తోడుగా ఉండును గాక!”
1CH 22:17 తర్వాత తన కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయాలని దావీదు ఇశ్రాయేలీయుల నాయకులందరికి ఆదేశించాడు.
1CH 22:18 అతడు వారితో ఇలా అన్నాడు, “మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నారు కదా? అన్నివైపులా ఆయన మీకు విశ్రాంతి ఇచ్చారు కదా? ముందున్న దేశవాసులను ఆయన నా చేతికి అప్పగించారు కాబట్టి ఇప్పుడు దేశం యెహోవాకు, ఆయన ప్రజలకు స్వాధీనం అయింది.
1CH 22:19 ఇప్పుడు మనసారా మీ దేవుడైన యెహోవాను వెదకండి. యెహోవా నిబంధన మందసాన్ని, దేవుని సంబంధమైన పవిత్ర వస్తువులను, ఆయన పేరున కట్టబడే మందిరంలోకి చేర్చేటట్టు మీరు దేవుడైన యెహోవా పరిశుద్ధాలయాన్ని కట్టడం మొదలుపెట్టండి.”
1CH 23:1 దావీదు వృద్ధుడై వయస్సు నిండినవాడై ఉన్నప్పుడు, అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు.
1CH 23:2 అతడు ఇశ్రాయేలు నాయకులందరిని, యాజకులను, లేవీయులను సమకూర్చాడు.
1CH 23:3 ముప్పై సంవత్సరాలు అంతకు పైవయస్సు లేవీయులు లెక్కించబడ్డారు. వారు మొత్తం ముప్పై ఎనిమిది వేలమంది మనుష్యులు.
1CH 23:4 దావీదు, “వీరిలో ఇరవైనాలుగు వేలమంది యెహోవా ఆలయ పని బాధ్యత తీసుకోవాలి, ఆరు వేలమంది అధికారులుగా, న్యాయాధిపతులుగా ఉండాలి.
1CH 23:5 నాలుగు వేలమంది ద్వారపాలకులుగా ఉండాలి, నాలుగు వేలమంది ఉద్దేశ్యం కలిగి నేను చేయించిన సంగీత వాయిద్యాలతో యెహోవాను కీర్తించాలి” అని చెప్పాడు.
1CH 23:6 లేవీ కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి వంశాల ప్రకారం దావీదు లేవీయులను వేరుచేసి మూడు విభాగాలు చేశాడు.
1CH 23:7 గెర్షోనీయులకు చెందినవారు: లద్దాను, షిమీ.
1CH 23:8 లద్దాను కుమారులు: యెహీయేలు, జేతాము, యోవేలు మొత్తం ముగ్గురు.
1CH 23:9 షిమీ కుమారులు: షెలోమీతు, హజీయేలు, హారాను మొత్తం ముగ్గురు. (వీరు లద్దాను కుటుంబాల పెద్దలు.)
1CH 23:10 షిమీ కుమారులు: యహతు, జీనా, యూషు, బెరీయా. వీరు షిమీ కుమారులు మొత్తం నలుగురు.
1CH 23:11 (యహతు పెద్దవాడు, జీజా రెండవవాడు, అయితే యూషుకు, బెరీయాకు కుమారులు ఎక్కువ మంది లేరు; కాబట్టి తమ కర్తవ్యం విషయంలో వారిని ఒక్క కుటుంబంగానే లెక్కించారు.)
1CH 23:12 కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు మొత్తం నలుగురు.
1CH 23:13 అమ్రాము కుమారులు: అహరోను, మోషే. అహరోను, అతని వారసులు నిత్యం అతి పరిశుద్ధ వస్తువులను ప్రతిష్ఠించడానికి, యెహోవా సన్నిధిలో బలులు అర్పించడానికి, ఆయన సన్నిధిలో సేవ చేయడానికి, ఆయన నామాన్ని బట్టి ప్రజలను దీవించడానికి ప్రత్యేకించబడ్డారు.
1CH 23:14 దైవజనుడైన మోషే కుమారులు లేవీ గోత్రం వారిలో లెక్కించబడ్డారు.
1CH 23:15 మోషే కుమారులు: గెర్షోము, ఎలీయెజెరు.
1CH 23:16 గెర్షోము వారసులు: షెబూయేలు మొదటివాడు.
1CH 23:17 ఎలీయెజెరు వారసులు: రెహబ్యా మొదటివాడు. (ఎలీయెజెరుకు ఇక కుమారులెవరు లేరు, కాని రెహబ్యాకు చాలామంది కుమారులున్నారు.)
1CH 23:18 ఇస్హారు కుమారులు: షెలోమీతు మొదటివాడు.
1CH 23:19 హెబ్రోను కుమారులు: యెరీయా మొదటివాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.
1CH 23:20 ఉజ్జీయేలు కుమారులు: మీకా మొదటివాడు, ఇష్షీయా రెండవవాడు.
1CH 23:21 మెరారి కుమారులు: మహలి, మూషి. మహలి కుమారులు: ఎలియాజరు, కీషు.
1CH 23:22 (ఎలియాజరు కుమారులు లేకుండానే చనిపోయాడు: అతనికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారి బంధువులైన కీషు కుమారులు వారిని పెళ్ళి చేసుకున్నారు.)
1CH 23:23 మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరీమోతు మొత్తం ముగ్గురు.
1CH 23:24 వీరు కుటుంబాల ప్రకారం లేవీ వారసులు; పేర్ల నమోదు ప్రకారం కుటుంబ పెద్దలైన వీరు ఇరవై సంవత్సరాలు అంతకు పైవయస్సు కలిగి, తమ తమ పేర్లను బట్టి ఒక్కొక్కరుగా లెక్కించబడి యెహోవా మందిరంలో సేవ చేయడానికి నియమించబడ్డారు.
1CH 23:25 ఎందుకంటే దావీదు, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలకు నెమ్మది ప్రసాదించి, శాశ్వతంగా యెరూషలేములో నివసించడానికి వచ్చారు కాబట్టి,
1CH 23:26 ఇకపై లేవీయులకు సమావేశ గుడారాన్ని, దాని సేవకు ఉపయోగించే వస్తువులను మోసే పనిలేదు” అని చెప్పాడు.
1CH 23:27 దావీదు ఇచ్చిన చివరి ఆదేశాల ప్రకారం, లేవీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైవయస్సు వారిని లెక్కించారు.
1CH 23:28 యెహోవా ఆలయ సేవలలో అహరోను వారసులకు సహాయం చేయడమే వారికి అప్పగించబడిన బాధ్యత: ప్రాంగణాలు, ప్రక్క గదుల బాధ్యత, పవిత్ర వస్తువులన్నిటిని శుద్ధి చేయడం, దేవుని మందిరంలో ఇతర పనులు చేయడము.
1CH 23:29 బల్లమీద సన్నిధి రొట్టెలుంచడం, భోజనార్పణల కోసం ప్రత్యేక పిండిని చూడడం, పులియని అప్పడాలు చేయడం, కాల్చడం, కలపడం, అన్ని రకాల పరిమాణాలు కొలతల్లో సిద్ధపరచడము.
1CH 23:30 వారు ప్రతిరోజు ఉదయం, సాయంకాలం నిలబడి యెహోవాను స్తుతించాలి. వారు సాయంకాలంలో, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, నియమించబడిన పండుగల్లో, యెహోవాకు దహనబలులు అర్పించే సమయాలన్నిటిలో వారు ఆయనను స్తుతించాలి. వారికి నియమించబడిన విధానం ప్రకారం క్రమంగా యెహోవా సముఖంలో సేవ చేయాలి.
1CH 23:32 కాబట్టి లేవీయులు సమావేశపు గుడారానికి, పరిశుద్ధ స్థలానికి బాధ్యత వహిస్తూ, యెహోవా ఆలయ సేవ కోసం తమ బంధువులైన అహరోను వారసుల క్రింద వారు సేవ చేశారు.
1CH 24:1 ఇవి అహరోను వారసుల విభాగాలు: అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
1CH 24:2 నాదాబు, అబీహు కుమారులు లేకుండానే తమ తండ్రి కంటే ముందే చనిపోయారు; కాబట్టి ఎలియాజరు, ఈతామారు యాజకులుగా సేవ చేశారు.
1CH 24:3 ఎలియాజరు వారసుడైన సాదోకు, ఈతామారు వారసుడైన అహీమెలెకు సహాయంతో, వారికి నియమించబడిన సేవా క్రమంలో, దావీదు వారిని విభాగించాడు.
1CH 24:4 ఈతామారు వారసులలో కంటే ఎలియాజరు వారసులలో ఎక్కువ మంది నాయకులు ఉన్నారు కాబట్టి దాని ప్రకారం ఎలియాజరు వారసులలో పదహారుగురు కుటుంబ పెద్దలు, ఈతామారు వారసులలో ఎనిమిది మంది కుటుంబ పెద్దలుగా నియమించబడ్డారు.
1CH 24:5 ఎలియాజరు వారసులలో, ఈతామారు వారసులలో పరిశుద్ధాలయ అధికారులుగా, దేవుని సేవకులుగా ఉన్నారు కాబట్టి, పక్షపాతం లేకుండా చీట్లు వేసి వారిని విభాగించారు.
1CH 24:6 లేవీయులలో లేఖికునిగా ఉన్న నెతనేలు కుమారుడైన షెమయా, వారి పేర్లను రాజు, అతని అధికారులు యాజకుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు, యాజకుల కుటుంబ పెద్దలు, లేవీయుల ఎదుట నమోదు చేశాడు. ఒక కుటుంబం ఎలియాజరు నుండి, తర్వాత మరొక కుటుంబం ఈతామారు నుండి తీసుకోబడింది.
1CH 24:7 మొదటి చీటి యెహోయారీబుకు, రెండవది యెదాయాకు,
1CH 24:8 మూడవది హారీముకు, నాలుగవది శెయొరీముకు,
1CH 24:9 అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,
1CH 24:10 ఏడవది హక్కోజుకు, ఎనిమిదవది అబీయాకు,
1CH 24:11 తొమ్మిదవది యెషూవకు, పదవది షెకన్యాకు,
1CH 24:12 పదకొండవది ఎల్యాషీబుకు, పన్నెండవది యాకీముకు,
1CH 24:13 పదమూడవది హుప్పాకు, పద్నాలుగవది యెషెబాబుకు,
1CH 24:14 పదిహేనవది బిల్గాకు, పదహారవది ఇమ్మేరుకు,
1CH 24:15 పదిహేడవది హెజీరుకు, పద్దెనిమిదవది హప్పిస్సేసుకు,
1CH 24:16 పందొమ్మిదవది పెతహయాకు, ఇరవయ్యవది యెహెజ్కేలుకు,
1CH 24:17 ఇరవై ఒకటవది యాకీనుకు, ఇరవై రెండవది గామూలుకు,
1CH 24:18 ఇరవై మూడవది దెలాయ్యాకు, ఇరవై నాలుగవది మయజ్యాకు వచ్చాయి.
1CH 24:19 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారం, అహరోను వారికి నియమించిన నిబంధనల ప్రకారం, వారు యెహోవా మందిరంలో ప్రవేశించినప్పుడు వారు చేయాల్సిన సేవా క్రమం ఇది.
1CH 24:20 లేవీ వారసులలో మిగిలినవారు: అమ్రాము కుమారుల నుండి: షూబాయేలు; షూబాయేలు కుమారుల నుండి: యెహెద్యాహు.
1CH 24:21 రెహబ్యాకు కుమారుల నుండి పెద్దవాడైన ఇష్షీయా.
1CH 24:22 ఇస్హారీయుల్లో నుండి: షెలోమోతు; షెలోమోతు కుమారుల నుండి: యహతు.
1CH 24:23 హెబ్రోను కుమారులు: యెరీయా మొదటివాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.
1CH 24:24 ఉజ్జీయేలు కుమారుడు: మీకా; మీకా కుమారుల నుండి: షామీరు.
1CH 24:25 మీకా సోదరుడు: ఇష్షీయా; ఇష్షీయా కుమారుల నుండి: జెకర్యా.
1CH 24:26 మెరారి కుమారులు: మహలి, మూషి. యహజీయాహు కుమారుడు: బెనో.
1CH 24:27 మెరారి కుమారులు: యహజీయాహు నుండి: బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.
1CH 24:28 మహలికి నుండి: ఎలియాజరు, ఇతనికి కుమారులు లేరు.
1CH 24:29 కీషు నుండి: కీషు కుమారుడు: యెరహ్మెయేలు.
1CH 24:30 మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరీమోతు.
1CH 24:31 వీరు తమ బంధువులైన అహరోను వారసులు చేసినట్టు, రాజైన దావీదు, సాదోకు, అహీమెలెకు, యాజకులు లేవీయుల కుటుంబ పెద్దలు ఎదుట చీట్లు వేసుకున్నారు. పెద్ద సోదరుని కుటుంబాలు చిన్న సోదరుని కుటుంబాలు కలిసి చీట్లు వేసుకున్నారు.
1CH 25:1 దావీదు, తన సైన్యాధిపతులతో కలిసి ఆసాపు, హేమాను, యెదూతూను అనేవారి కుమారులలో కొందరిని సితారాలు, వీణలు, తాళాలు వాయిస్తూ ప్రవచించే పరిచర్య కోసం నియమించారు. ఈ సేవకు నియమించబడినవారి జాబితా ఇది:
1CH 25:2 ఆసాపు కుమారుల నుండి: జక్కూరు, యోసేపు, నెతన్యా, అషరేలా. వీరు రాజు పర్యవేక్షణలో ప్రవచిస్తూ, ఆసాపు పర్యవేక్షణలో ఉన్న ఆసాపు కుమారులు.
1CH 25:3 యెదూతూను కుమారుల నుండి: గెదల్యా, జెరీ, యెషయా, షిమ్యా, హషబ్యా, మత్తిత్యా, మొత్తం ఆరుగురు, వీరు స్తుతి పాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి వీణ వాయిస్తూ ప్రవచించే తమ తండ్రియైన యెదూతూను పర్యవేక్షణలో ఉన్నవారు.
1CH 25:4 హేమాను కుమారుల నుండి: బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు; హనన్యా, హనానీ, ఎలీయాతా, గిద్దల్తీ, రోమమ్తీ-యెజెరు; యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు.
1CH 25:5 (వీరంతా రాజుకు దీర్ఘదర్శిగా ఉన్న హేమాను కుమారులు. తన వాగ్దానాల ప్రకారం హేమానును గొప్ప చేయడానికి దేవుడు హేమానుకు పద్నాలుగు మంది కుమారులను, ముగ్గురు కుమార్తెలను ఇచ్చారు.)
1CH 25:6 వీరందరు తమ తండ్రుల పర్యవేక్షణలో ఉండి, యెహోవా మందిరంలో తాళాలు, వీణలు, సితారాలు వాయిస్తూ, పాటలు పాడుతూ దేవుని మందిరం దగ్గర సేవ చేసేవారు. ఆసాపు, యెదూతూను, హేమానులు రాజు పర్యవేక్షణలో ఉండేవారు.
1CH 25:7 యెహోవాకు పాటలు పాడడంలో నైపుణ్యం ఉన్న వీరి బంధువులందరితో కలిపి వీరి సంఖ్య 288.
1CH 25:8 చిన్నా, పెద్దా, గురువు శిష్యుడు అనే భేదం లేకుండా చీట్లు వేసి విధులు నిర్ణయించుకున్నారు.
1CH 25:9 మొదటి చీటి ఆసాపు వంశంలో ఉన్న యోసేపు పేరిట వచ్చింది, రెండవది గెదల్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:10 మూడవది జక్కూరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:11 నాలుగవది యిజ్రీ పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:12 అయిదవది నెతన్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:13 ఆరవది బక్కీయాహు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:14 ఏడవది యెషర్యేలా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:15 ఎనిమిదవది యెషయా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:16 తొమ్మిదవది మత్తన్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:17 పదవది షిమీ పేరట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:18 పదకొండవది అజరేలు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:19 పన్నెండవది హషబ్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:20 పదమూడవది షూబాయేలు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:21 పద్నాలుగవది మత్తిత్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:22 పదిహేనవది యెరేమోతు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:23 పదహారవది హనన్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:24 పదిహేడవది యొష్బెకాషా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:25 పద్దెనిమిదవది హనానీ పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:26 పందొమ్మిదవది మల్లోతి పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:27 ఇరవయ్యవది ఎలీయాతా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:28 ఇరవై ఒకటవది హోతీరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:29 ఇరవై రెండవది గిద్దల్తీ పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:30 ఇరవై మూడవది మహజీయోతు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 25:31 ఇరవై నాలుగవది రోమమ్తీ-యెజెరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
1CH 26:1 ద్వారపాలకుల విభాగాలు: కోరహీయుల నుండి: ఆసాపు కుమారులలో ఒక్కడైన కోరే కుమారుడైన మెషెలెమ్యా.
1CH 26:2 మెషెలెమ్యాకు కుమారులు ఉన్నారు: జెకర్యా మొదటివాడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాలుగవవాడు,
1CH 26:3 ఏలాము అయిదవవాడు, యెహోహనాను ఆరవవాడు, ఎల్యోయేనై ఏడవవాడు.
1CH 26:4 ఓబేద్-ఎదోముకు కూడా కుమారులు ఉన్నారు: షెమయా మొదటివాడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాలుగవవాడు, నెతనేలు అయిదవవాడు,
1CH 26:5 అమ్మీయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై ఎనిమిదవ వాడు. (దేవుడు ఓబేద్-ఎదోమును ఆశీర్వదించారు.)
1CH 26:6 ఓబేద్-ఎదోము కుమారుడైన షెమయాకు కూడా కుమారులు ఉన్నారు, వారు చాలా సమర్థులు కాబట్టి తమ తండ్రి కుటుంబంలో నాయకులుగా ఉన్నారు.
1CH 26:7 షెమయా కుమారులు: ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు; అతని బంధువులు ఎలీహు, సెమక్యాలు కూడా బలవంతులు.
1CH 26:8 వీరందరు ఓబేద్-ఎదోము వారసులు; వారు వారి కుమారులు వారి బంధువుల్లో పని చేయగల బలసామర్థ్యం గలవారు మొత్తం 62 మంది.
1CH 26:9 మెషెలెమ్యాకు కుమారులు, బంధువులు ఉన్నారు, వారిలో మొత్తం 18 మంది సమర్థులు.
1CH 26:10 మెరారీయుడైన హోసాకు కుమారులు ఉన్నారు: షిమ్రీ మొదటివాడు (అతడు మొదట పుట్టినవాడు కాకపోయినా, అతని తండ్రి అతన్ని మొదటివానిగా నియమించాడు),
1CH 26:11 హిల్కీయా రెండవవాడు, టెబల్యాహు మూడవవాడు, జెకర్యా నాలుగవవాడు,
1CH 26:12 వారి నాయకులకు అనుగుణంగా, ఇలా ఏర్పాటైన ద్వారపాలకుల విభాగాలకు తమ బంధువులు చేసినట్లే యెహోవా మందిరంలో సేవ చేయడానికి బాధ్యతలు అప్పగించారు.
1CH 26:13 చిన్నవారికి పెద్దవారికి ఒకే విధంగా తమ కుటుంబాల ప్రకారం, ప్రతి ఒక్క ద్వారం దగ్గర కావలివారిగా ఉండడానికి చీట్లు వేశారు.
1CH 26:14 తూర్పు వైపు ద్వారం షెలెమ్యాకు వచ్చింది. తర్వాత తెలివిగల సలహాదారుడైన అతని కుమారుడైన జెకర్యాకు కూడా చీటి వేయగా అతనికి ఉత్తరం వైపు ద్వారం వచ్చింది.
1CH 26:15 ఓబేద్-ఎదోముకు దక్షిణం వైపు ద్వారం వచ్చింది, గిడ్డంగుల కాపలా అతని కుమారులకు వచ్చింది.
1CH 26:16 పడమటి వైపు ద్వారం, ఎత్తైన రహదారిలో ఉన్న షల్లెకెతు ద్వారం కాపలా షుప్పీముకు, హోసాకు వచ్చింది.
1CH 26:17 ప్రతిరోజు తూర్పున ఆరుగురు లేవీయులు, ఉత్తరాన నలుగురు, దక్షిణాన నలుగురు, గిడ్డంగి దగ్గర ఇద్దరిద్దరు ఉన్నారు.
1CH 26:18 పడమటి ఆవరణం విషయానికి వస్తే, దగ్గర ఉన్న రాజమార్గం దగ్గర నలుగురు, ఆవరణం దగ్గర ఇద్దరు ఉన్నారు.
1CH 26:19 కోరహు, మెరారి వారసులైన ద్వారపాలకుల విభాగాలు ఇవి.
1CH 26:20 అహీయా నాయకత్వంలో నడిపించబడిన ఇతర లేవీయులు, దేవుని మందిరంలోని ఖజానాలకు యెహోవాకు సమర్పించబడిన కానుకల ఖజానాలకు బాధ్యత వహించారు.
1CH 26:21 గెర్షోనీయుడైన లద్దానుకు చెందిన కుటుంబాల పెద్దలైన గెర్షోనీయుడైన లద్దాను వారసులు యెహీయేలీ,
1CH 26:22 యెహీయేలీ కుమారులు, జేతాము అతని సోదరుడైన యోవేలు. వీరికి యెహోవా ఆలయ ఖజానాల బాధ్యత అప్పగించబడింది.
1CH 26:23 అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అనేవారి నుండి:
1CH 26:24 మోషే కుమారుడైన గెర్షోము వారసుడు షెబూయేలు ఖజానా మీద ప్రధానిగా నియమించబడ్డాడు.
1CH 26:25 ఎలీయెజెరు ద్వారా అతని బంధువులు: ఎలీయెజెరు కుమారుడైన రెహబ్యా, అతని కుమారుడైన యెషయా, అతని కుమారుడైన యోరాము, అతని కుమారుడైన జిఖ్రీ, అతని కుమారుడైన షెలోమీతు.
1CH 26:26 (రాజైన దావీదు, సహస్రాధిపతులు, శతాధిపతులు యైన కుటుంబ పెద్దలు ఇతర సైన్యాధిపతులు ప్రతిష్ఠించిన వస్తువులున్న ఖజానాలన్నిటి బాధ్యత షెలోమీతుకు, అతని బంధువులకు అప్పగించబడింది.
1CH 26:27 వారు యుద్ధంలో స్వాధీనం చేసుకున్న సొమ్ములో కొంత భాగాన్ని యెహోవా ఆలయ మరమత్తు కోసం ప్రతిష్ఠించారు.
1CH 26:28 దీర్ఘదర్శి సమూయేలు, కీషు కుమారుడైన సౌలు, నేరు కుమారుడైన అబ్నేరు, సెరూయా కుమారుడైన యోవాబు ప్రతిష్ఠించినవన్నీ, ఇతర ప్రతిష్ఠితమైన వస్తువులన్నీ షెలోమీతు అతని బంధువుల సంరక్షణలో ఉన్నాయి.)
1CH 26:29 ఇస్హారీయుల నుండి: కెనన్యా అతని కుమారులు మందిరపు బయటి పనులు చేయడానికి ఇశ్రాయేలీయులకు అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించబడ్డారు.
1CH 26:30 హెబ్రోనీయుల నుండి: హషబ్యా, అతని బంధువులు పదిహేడు వందల మంది సమర్థులైన వారికి యొర్దాను నదికి పడమర వైపున ఉన్న ఇశ్రాయేలు ప్రాంతంలో యెహోవాకు చేసే మొత్తం సేవ రాజుకు చేసే సేవ బాధ్యత అప్పగించబడింది.
1CH 26:31 హెబ్రోనీయులలో వారి కుటుంబ వంశావళుల ప్రకారం, యెరీయా వారికి ప్రధాన నాయకుడు. (దావీదు పరిపాలనలోని నలభైయవ సంవత్సరంలో వంశావళులను పరిశీలించినప్పుడు, గిలాదులోని యాజెరులో ఉన్న హెబ్రోనీయులలో పరాక్రమశాలులు ఉన్నారని తెలిసింది.
1CH 26:32 కుటుంబ పెద్దలుగా ఉన్న సమర్థులైన యెరీయా బంధువులు రెండువేల ఏడువందలమంది. రాజైన దావీదు వారిని దేవుని విషయాలన్నిటిలో, రాజ వ్యవహారాలలో రూబేనీయులమీద, గాదీయులమీద, మనష్షే అర్థగోత్రం వారిమీద నియమించాడు.)
1CH 27:1 ఇది ఇశ్రాయేలీయుల కుటుంబ నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వివిధ విషయాల్లో రాజుకు సేవలందించే అధికారుల జాబితా. వీరిలో ప్రతి విభాగం సంవత్సరంలో ఒక నెల చొప్పున సేవ చేస్తారు. ఒక్కొక్క విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
1CH 27:2 మొదటి నెలలో మొదటి విభాగం మీద జబ్దీయేలు కుమారుడైన యషోబీము అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
1CH 27:3 అతడు పెరెసు వారసుడు, మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉన్నాడు.
1CH 27:4 రెండవ నెల విభాగం మీద అహోహీయుడైన దోదైది అధిపతిగా ఉన్నాడు; అతని విభాగానికి నాయకుడు మిక్లోతు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
1CH 27:5 మూడవ నెలకు యాజకుడైన యెహోయాదా కుమారుడైన బెనాయా మూడవ సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
1CH 27:6 ఈ బెనాయా పరాక్రమశాలి, ముప్పైమంది వీరులలో ఒకనిగా, ఆ ముప్పైమందికి అధిపతిగా ఉన్నాడు. అతని కుమారుడైన అమ్మీజాబాదు అతని విభాగంలో అధిపతిగా ఉన్నాడు.
1CH 27:7 నాలుగవ నెలకు యోవాబు సోదరుడైన అశాహేలు నాలుగో విభాగం మీద అధిపతిగా ఉన్నాడు; అతని తర్వాత, అతని కుమారుడైన జెబద్యా అధిపతి అయ్యాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
1CH 27:8 అయిదవ నెలకు ఇశ్రాహేతీయుడైన షంహూతు అయిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
1CH 27:9 ఆరవ నెలకు తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడైన ఈరా, ఆరవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
1CH 27:10 ఏడవ నెలకు ఎఫ్రాయిమీయుడు పెలోనీయుడైన హేలెస్సు ఏడవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
1CH 27:11 ఎనిమిదవ నెలకు జెరహీయుల బంధువైన హుషాతీయుడైన సిబ్బెకై ఎనిమిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
1CH 27:12 తొమ్మిదవ నెలకు బెన్యామీనీయుడు అనాతోతీయుడైన అబీయెజెరు తొమ్మిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
1CH 27:13 పదవ నెలకు జెరహీయుడు, నెటోపాతీయుడైన మహరై పదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
1CH 27:14 పదకొండవ నెలకు ఎఫ్రాయిమీయుడు పిరాతోనీయుడునైన బెనాయా పదకొండవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
1CH 27:15 పన్నెండవ నెలకు నెటోపాతీయుడునైన ఒత్నీయేలు వంశస్థుడైన హెల్దయి పన్నెండవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
1CH 27:16 ఇశ్రాయేలీయుల గోత్రాల నాయకులు: రూబేనీయులమీద: జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు; షిమ్యోనీయుల మీద: మయకా కుమారుడైన షెఫట్యా;
1CH 27:17 లేవీయుల మీద: కెమూయేలు కుమారుడైన హషబ్యా; అహరోనీయుల మీద: సాదోకు;
1CH 27:18 యూదా వారి మీద: దావీదు సోదరుడైన ఎలీహు; ఇశ్శాఖారీయుల మీద: మిఖాయేలు కుమారుడైన ఒమ్రీ;
1CH 27:19 జెబూలూనీయుల మీద: ఓబద్యా కుమారుడైన ఇష్మయా; నఫ్తాలీయుల మీద: అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు;
1CH 27:20 ఎఫ్రాయిమీయుల మీద: అజజ్యాహు కుమారుడైన హోషేయ; మనష్షే అర్థగోత్రం మీద: పెదాయా కుమారుడైన యోవేలు;
1CH 27:21 గిలాదులోని మనష్షే అర్థగోత్రం మీద: జెకర్యా కుమారుడైన ఇద్దో; బెన్యామీనీయుల మీద: అబ్నేరు కుమారుడైన యయశీయేలు;
1CH 27:22 దానీయుల మీద: యెరోహాము కుమారుడైన అజరేలు.
1CH 27:23 ఇశ్రాయేలును ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా వాగ్దానం చేశారు, కాబట్టి ఇరవై సంవత్సరాలు, అంతకన్నా తక్కువ వయస్సున్న వారిని దావీదు లెక్కించలేదు.
1CH 27:24 సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు వ్రాయడానికి ఆరంభించాడు కాని దానిని ముగించలేదు. జనాభా లెక్కలు వ్రాయడం వలన ఇశ్రాయేలు మీదికి దేవుని ఉగ్రత వచ్చింది కాబట్టి ఆ జనసంఖ్య రాజైన దావీదు చరిత్ర గ్రంథంలో నమోదు కాలేదు.
1CH 27:25 రాజ్య గిడ్డంగులకు అదీయేలు కుమారుడైన అజ్మావెతు అధికారి. పల్లెప్రాంతాలలో, పట్టణాల్లో గ్రామాల్లో కోటలలో ఉన్న గిడ్డంగులకు ఉజ్జియా కుమారుడైన యోనాతాను అధికారి.
1CH 27:26 పొలాల్లో పని చేసేవారిమీద, భూమి దున్నే వారి మీద కెలూబు కుమారుడైన ఎజ్రీ అధికారి.
1CH 27:27 ద్రాక్షతోటల మీద రామతీయుడైన షిమీ అధికారి. ద్రాక్షతోటల నుండి ఉత్పత్తి అయ్యే ద్రాక్షరసాన్ని నిల్వజేసే తొట్టెల మీద షిప్మీయుడైన జబ్ది అధికారి.
1CH 27:28 పశ్చిమ దిగువ ప్రాంతంలో ఉన్న ఒలీవచెట్లు, మేడిచెట్ల మీద గెదేరీయుడైన బయల్-హనాను అధికారి. ఒలీవనూనె గిడ్డంగులకు యోవాషు అధికారి.
1CH 27:29 షారోనులో మేసే పశువులమీద షారోనీయుడైన షిట్రయి అధికారి. లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపాతు అధికారి.
1CH 27:30 ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు అధికారి. గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు అధికారి.
1CH 27:31 మందల మీద హగ్రీయుడైన యాజీజు అధికారి.
1CH 27:32 దావీదు పినతండ్రియైన యోనాతాను సలహాదారుడు, వివేకం ఉన్నవాడు, లేఖికుడు. హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజకుమారుల సంరక్షకుడు.
1CH 27:33 అహీతోపెలు రాజు యొక్క సలహాదారుడు. అర్కీయుడైన హూషై రాజుకు సన్నిహితుడైన మిత్రుడు.
1CH 27:34 అహీతోపెలు తర్వాత బెనాయా కుమారుడైన యెహోయాదా, అబ్యాతారులు అతని స్థానంలో సలహాదారులయ్యారు. రాజ్య సైన్యానికి యోవాబు అధిపతి.
1CH 28:1 దావీదు ఇశ్రాయేలీయుల అధికారులందరిని అనగా, గోత్రాల అధికారులను, రాజు సేవలో ఉన్న సైన్యాల విభాగాల అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజుకు రాజకుమారులకు ఉన్న ఆస్తి మీద, పశువులన్నిటి మీద ఉన్న అధికారులను, రాజపరివారాన్ని, పరాక్రమశాలులను, యుద్ధ వీరులందరిని యెరూషలేములో సమావేశపరిచాడు.
1CH 28:2 రాజైన దావీదు లేచి నిలబడి ఇలా అన్నాడు: “నా తోటి ఇశ్రాయేలీయులారా, నా ప్రజలారా, వినండి. మన దేవునికి పాదపీఠంగా యెహోవా నిబంధన మందసాన్ని ఉంచే మందిరాన్ని నేను నిర్మించాలని నా హృదయంలో అనుకున్నాను, దాన్ని కట్టడానికి సన్నాహాలు చేశాను.
1CH 28:3 అయితే దేవుడు నాతో, ‘నీవు యుద్ధాలు చేసి రక్తం చిందించావు కాబట్టి, నీవు నా పేరిట మందిరాన్ని కట్టించకూడదు’ అని చెప్పారు.
1CH 28:4 “అయినా, ఇశ్రాయేలీయుల మీద ఎప్పుడు రాజుగా ఉండడానికి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నన్ను, నా కుటుంబమంతటి నుండి ఎన్నుకున్నారు. ఆయన యూదా గోత్రాన్ని, యూదా గోత్రంలో నా తండ్రి కుటుంబాన్ని ఎన్నుకుని, నా తండ్రి కుమారులలో నుండి నన్ను ఇశ్రాయేలు అంతటి మీద రాజుగా చేయడానికి ఇష్టపడ్డారు.
1CH 28:5 యెహోవా నాకు అనేక కుమారులను ఇచ్చారు. వారందరి నుండి, ఇశ్రాయేలీయులపై యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చోడానికి ఆయన నా కుమారుడైన సొలొమోనును ఎన్నుకున్నారు.
1CH 28:6 ఆయన నాతో ఇలా అన్నారు: ‘నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఎన్నుకున్నాను, నేను అతనికి తండ్రిగా ఉంటాను కాబట్టి అతడు నా మందిరాన్ని, ఆవరణాలను కట్టిస్తాడు.
1CH 28:7 ఈ రోజుల్లో జరుగుతున్నట్లుగానే, అతడు నా ఆజ్ఞలను న్యాయాన్ని స్థిరంగా అనుసరిస్తే, నేనతని రాజ్యాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.’
1CH 28:8 “కాబట్టి ఇప్పుడు యెహోవా సమాజంగా చేరిన ఇశ్రాయేలీయులందరు చూస్తుండగా, మన దేవుడు వింటుండగా, నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఈ మంచి దేశాన్ని స్వాధీనపరచుకుని, మీ తర్వాత మీ వారసులకు దానిని శాశ్వతమైన వారసత్వంగా అందించేలా మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా పాటించండి.
1CH 28:9 “సొలొమోనూ, నా కుమారుడా! నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తారు, ఆలోచనల ఉద్దేశాలన్నిటిని గ్రహిస్తారు కాబట్టి నీవు ఆయనను తెలుసుకుని పూర్ణహృదయంతో చిత్తశుద్ధితో ఆయనను సేవించు. నీవు ఆయనను వెదికితే, ఆయన నీకు దొరుకుతారు; అయితే నీవు ఆయనను విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తారు.
1CH 28:10 పరిశుద్ధాలయంగా ఉండేలా ఒక ఇల్లు కట్టడానికి యెహోవా నిన్ను ఎన్నుకున్నారు అనే సంగతిని గ్రహించి ధైర్యంగా ఉండి పని చేయి.”
1CH 28:11 అప్పుడు దావీదు తన కుమారుడైన సొలొమోనుకు, దేవాలయ మంటపము, దాని భవనాలకు, గిడ్డంగులకు, దాని పైభాగానికి, దాని లోపలి గదులకు, ప్రాయశ్చిత్త స్థలానికి సంబంధించిన నమూనాలు ఇచ్చాడు.
1CH 28:12 దేవుని ఆత్మ దావీదు హృదయంలో పెట్టిన నమూనాలను అతడు సొలొమోనుకు ఇచ్చాడు. యెహోవా మందిర ఆవరణాలకు, చుట్టూ ఉండే గదులకు, దేవుని ఆలయ ఖజానాలకు, సమర్పించబడిన వస్తువుల ఖజానాలకు నమూనాలు అతడు ఇచ్చాడు.
1CH 28:13 యాజకుల లేవీయుల విభాగాల గురించి, యెహోవా మందిరంలో జరగాల్సిన సేవలన్నిటి గురించి, అలాగే దాని సేవలో ఉపయోగించబడే పాత్రల గురించి కూడా దావీదు అతనికి నియమాలు తెలియజేశాడు.
1CH 28:14 వివిధ సేవలలో ఉపయోగించబడే బంగారు ఉపకరణాలను చేయడానికి కావలసినంత బంగారాన్ని, వివిధ సేవలలో ఉపయోగించబడే వెండి ఉపకరణాలను చేయడానికి కావలసినంత వెండిని దావీదు అతనికి అప్పగించాడు.
1CH 28:15 బంగారు దీపస్తంభాలకు వాటి దీపాలకు ఒక్కొక్క దీపస్తంభానికి దీపాలకు కావలసిన బరువు ప్రకారం బంగారాన్ని, వెండి దీపస్తంభాలకు వాటి దీపాలకు ఒక్కొక్క దీపస్తంభానికి దీపాలకు కావలసిన బరువు ప్రకారం వెండిని;
1CH 28:16 దేవుని సన్నిధిలో రొట్టెలుంచే ఒక్కొక్క బంగారు బల్లకు కావలసిన బంగారాన్ని; వెండి బల్లలకు కావలసిన వెండిని;
1CH 28:17 కొంకులు, గిన్నెలు, పాత్రలకు కావలసిన మేలిమి బంగారాన్ని; ఒక్కొక్క బంగారు పాత్రకు కావలసిన బరువు ప్రకారం బంగారాన్ని; ఒక్కొక్క వెండి పాత్రకు కావలసిన బరువు ప్రకారం వెండిని;
1CH 28:18 ధూపవేదికకు కావలసిన స్వచ్ఛమైన బంగారాన్ని దావీదు అతనికి ఇచ్చాడు. తమ రెక్కలు విప్పి యెహోవా నిబంధన మందసాన్ని కప్పివుంచే బంగారు కెరూబుల రథం యొక్క నమూనాను కూడా దావీదు అతనికిచ్చాడు.
1CH 28:19 అప్పుడు దావీదు, “ఇదంతా యెహోవా తన చేతిని నా మీద ఉంచడం వలన నేను వీటన్నిటిని వ్రాశాను, ఈ నమూనా వివరాలన్ని నేను గ్రహించగలిగేలా ఆయన చేశారు” అని చెప్పాడు.
1CH 28:20 దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇంకా మాట్లాడుతూ ఇలా చెప్పాడు, “దృఢంగా, ధైర్యంగా ఉంటూ పని చేయి. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటారు కాబట్టి భయపడకు దిగులుపడకు. యెహోవా ఆలయ సేవకు సంబంధించిన పనులన్నీ ముగిసేవరకు ఆయన నిన్ను ఏమాత్రం విడిచిపెట్టరు.
1CH 28:21 దేవుని ఆలయ సేవ అంతటి కోసం యాజకులు, లేవీయుల విభాగాల ప్రకారం ఏర్పాటయ్యారు. ఈ పనులన్నీ చేయడానికి రకరకాల పనులలో నైపుణ్యం గలవారు మనస్పూర్తిగా నీకు సహాయం చేస్తారు. అధిపతులు, ప్రజలందరూ నీ ప్రతి ఆజ్ఞకు లోబడతారు.”
1CH 29:1 అప్పుడు రాజైన దావీదు సమావేశంలో ఉన్నవారందరితో ఇలా అన్నాడు: “దేవుడు ఎన్నుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకా చిన్నవాడు, అనుభవం లేనివాడు. మందిరం నిర్మించేది మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవా కోసం, కాబట్టి పని చాలా గొప్పది.
1CH 29:2 నాకున్న శక్తికొలది నా దేవుని మందిరానికి కావలసిన బంగారు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, చెక్క పనికి చెక్కను, పెద్ద మొత్తంలో గోమేధికపురాళ్లను, వైడూర్యాలను, రకరకాల రంగుల రాళ్లను, అన్ని రకాల జాతి మేలిమి రాళ్లను, పాలరాతిని సమృద్ధిగా సమకూర్చి పెట్టాను.
1CH 29:3 పరిశుద్ధ మందిరం కోసం నేను సమకూర్చినవన్నీ కాకుండా, ఇప్పుడు నా దేవుని మందిరం పట్ల నాకున్న నిబద్ధతను చూపించడానికి నా సొంత ఖజానాలో ఉన్న బంగారాన్ని, వెండిని, నా దేవుని మందిరానికి ఇస్తున్నవి:
1CH 29:4 భవనాల గోడలకు పూత వేయడానికి, బంగారపు పనికి, వెండి పనికి, పనివారు చేసే ప్రతి పనికి మూడువేల తలాంతుల ఓఫీరు బంగారం, ఏడువేల తలాంతుల శుద్ధి చేసిన వెండి. ఇప్పుడు, యెహోవాకు మనస్పూర్తిగా సమర్పించుకునే వారు మీలో ఎవరైనా ఉన్నారా?”
1CH 29:6 అప్పుడు కుటుంబ నాయకులు, ఇశ్రాయేలు గోత్రాల అధికారులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పనుల మీద నియమించబడిన అధికారులు అందరు ఇష్టపూర్వకంగా సమర్పించారు.
1CH 29:7 వారు దేవుని మందిరం పనికి అయిదువేల తలాంతుల బంగారాన్ని, పదివేల డారిక్కుల బంగారాన్ని, పదివేల తలాంతుల వెండిని, పద్దెనిమిది వేల తలాంతుల ఇత్తడిని, లక్ష తలాంతుల ఇనుమును ఇచ్చారు.
1CH 29:8 ప్రశస్తమైన రాళ్లు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిర ఖజానాకు అధికారిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు.
1CH 29:9 తమ నాయకులు హృదయమంతటితో స్వేచ్ఛగా యెహోవాకు సమర్పించడం చూసి ప్రజలు వారిని బట్టి సంతోషించారు. రాజైన దావీదు కూడా చాలా సంతోషించాడు.
1CH 29:10 దావీదు, అక్కడ సమావేశమైన వారందరి ఎదుట యెహోవాను ఇలా స్తుతించాడు: “యెహోవా, మా తండ్రియైన ఇశ్రాయేలు దేవా! యుగయుగాల వరకు మీకు స్తుతి కలుగును గాక.
1CH 29:11 యెహోవా! మహాత్మ్యం, ప్రభావం, వైభవం, తేజస్సు, మహిమ మీకే చెందుతాయి. ఎందుకంటే భూమ్యాకాశాల్లో ఉన్నవన్నీ మీవే. యెహోవా రాజ్యం మీదే; మీరు అందరి మీద అధిపతిగా హెచ్చింపబడ్డారు.
1CH 29:12 ఐశ్వర్యం, ఘనత మీ మూలంగా వస్తాయి; మీరు సమస్తానికి పాలకులు. అందరిని హెచ్చించి, బలపరచడానికి మీ చేతిలో బలం, శక్తి ఉన్నాయి.
1CH 29:13 మా దేవా! మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాము.
1CH 29:14 “అయితే, ఇంత ధారాళంగా ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండడానికి నేను ఏపాటివాన్ని? నా ప్రజలు ఏపాటివారు? అన్నీ మీ నుండే వస్తాయి. మీ చేతి నుండి వచ్చిన దానిలో నుండే మేము మీకు ఇచ్చాము.
1CH 29:15 మా పూర్వికుల్లా మేము మీ దృష్టిలో విదేశీయులం, అపరిచితులము. భూమిమీద మా జీవితకాలం నిరీక్షణలేని నీడలాంటిది.
1CH 29:16 యెహోవా, మా దేవా, నీ పరిశుద్ధ నామం కోసం మందిరాన్ని కట్టించడానికి మేము సమకూర్చిన ఈ సంపదంతా మీ చేతి నుండి వచ్చేదే, దానిలో సమస్తం మీకు చెందినదే.
1CH 29:17 నా దేవా! మీరు హృదయాన్ని పరిశోధిస్తారని, నిజాయితీ అంటే మీకు ఇష్టమని నాకు తెలుసు. నేను ఇవన్నీ ఇష్టపూర్వకంగా నిజాయితితో ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ ప్రజలు కూడా మీకు ఇష్టపూర్వకంగా ఇవ్వడం చూసి నేను సంతోషిస్తున్నాను.
1CH 29:18 యెహోవా! మా పూర్వికులైన అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఈ ఆశలు, తలంపులు మీ ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ఉండేలా, వారి హృదయాలు మీ పట్ల నమ్మకంగా ఉండేలా చేయండి.
1CH 29:19 నా కుమారుడైన సొలొమోను మీ ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటిస్తూ, నేను ఆలయ నిర్మాణం కోసం సమకూర్చిన వాటితో అతడు కట్టించడానికి అతడు పూర్ణహృదయంతో భక్తి కలిగి ఉండునట్లు చేయండి.”
1CH 29:20 తర్వాత దావీదు సమావేశమైన వారందరితో, “మీ దేవుడైన యెహోవాను స్తుతించండి” అని చెప్పాడు. అప్పుడు వారందరూ తమ పూర్వికుల దేవుడైన యెహోవాను స్తుతించి, యెహోవా ఎదుట, రాజు ఎదుట తలలు వంచి, సాగిలపడ్డారు.
1CH 29:21 మరుసటిరోజు వారు యెహోవాకు అర్పణలు ఇచ్చి దహనబలులు అర్పించారు: వెయ్యి ఎద్దులు, వెయ్యి పొట్టేళ్లు, వెయ్యి మగ గొర్రెపిల్లలు, వాటితో పాటు పానార్పణలను ఇశ్రాయేలీయులందరి పక్షాన సరిపడా ఇతర బలులు అర్పించారు.
1CH 29:22 ఆ రోజు వారు యెహోవా సన్నిధిలో చాలా ఆనందంతో విందు చేసుకున్నారు. అప్పుడు వారు దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పాలకునిగా, సాదోకును యాజకునిగా అభిషేకించారు.
1CH 29:23 కాబట్టి సొలొమోను రాజుగా తన తండ్రియైన దావీదు స్థానంలో యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు. అతడు అన్నిటిలో వృద్ధి చెందాడు, ఇశ్రాయేలీయులందరు అతనికి విధేయులయ్యారు.
1CH 29:24 అధిపతులందరు, యుద్ధ వీరులందరు, రాజైన దావీదు కుమారులందరు, సొలొమోను రాజుకు విధేయత చూపించారు.
1CH 29:25 యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ఎదుట ఎంతో ఉన్నతంగా చేసి, అతనికి ముందున్న ఇశ్రాయేలీయుల రాజులలో ఏ రాజుకు కలగని రాజ వైభవాన్ని అతనికి ప్రసాదించారు.
1CH 29:26 యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలు అంతటి మీద రాజుగా ఉన్నాడు.
1CH 29:27 అతడు ఇశ్రాయేలును నలభై సంవత్సరాలు అంటే హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.
1CH 29:28 అతడు దీర్ఘకాలం జీవించి ఐశ్వర్యాన్ని ఘనతను పొంది మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు. అతని స్థానంలో అతని కుమారుడైన సొలొమోను రాజయ్యాడు.
1CH 29:29 రాజైన దావీదుకు సంబంధించిన ఇతర వివరాలన్నీ మొదటి నుండి చివరి వరకు, అతని పాలనకు అధికారానికి సంబంధించిన వివరాలు, అతడు, ఇశ్రాయేలీయులు ఇతర దేశాల రాజ్యాలు ఎదుర్కొన్న పరిస్థితుల వివరాలు దీర్ఘదర్శి సమూయేలు, నాతాను ప్రవక్త, దీర్ఘదర్శి గాదు వ్రాసిన చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి.
2CH 1:1 దావీదు కుమారుడు సొలొమోను తన రాజ్యంలో రాజుగా స్థిరపడ్డాడు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండి అతన్ని గొప్పగా హెచ్చించాడు.
2CH 1:2 అప్పుడు సొలొమోను ఇశ్రాయేలీయులందరితో అంటే సహస్రాధిపతులతో, శతాధిపతులతో, న్యాయాధిపతులతో, ఇశ్రాయేలులోని నాయకులందరితో, కుటుంబాల పెద్దలతో మాట్లాడాడు.
2CH 1:3 సొలొమోను సమాజమంతా గిబియోనులోని ఉన్నత స్థలానికి వెళ్లారు, ఎందుకంటే యెహోవా సేవకుడైన మోషే అరణ్యంలో ఏర్పాటుచేసిన దేవుని యొక్క సమావేశ గుడారం అక్కడ ఉంది.
2CH 1:4 దావీదు దేవుని మందసాన్ని కిర్యత్-యారీము నుండి దాని కోసం సిద్ధపరచిన స్థలానికి తీసుకువచ్చాడు, ఎందుకంటే అతడు యెరూషలేములో దాని కోసం ఒక గుడారాన్ని వేశాడు.
2CH 1:5 అయితే హూరు మనుమడు ఊరి కుమారుడైన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం గిబియోనులో యెహోవా సమావేశ గుడారం ముందు ఉంది; కాబట్టి సొలొమోను సమాజం అక్కడ అతని గురించి విచారణ చేశారు.
2CH 1:6 సొలొమోను సమావేశ గుడారంలో ఉన్న యెహోవా సన్నిధి ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరకు వెళ్లి దానిమీద వెయ్యి దహనబలులు అర్పించాడు.
2CH 1:7 ఆ రాత్రివేళ దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, “నేను నీకు ఏమివ్వాలో అడుగు” అన్నారు.
2CH 1:8 అందుకు సొలొమోను దేవునితో, “మీరు నా తండ్రియైన దావీదు మీద ఎంతో దయను చూపించారు, అంతేకాక ఆయన స్థానంలో నన్ను రాజుగా చేశారు.
2CH 1:9 యెహోవా దేవా, నా తండ్రియైన దావీదుకు మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి. భూమిమీది ధూళియంత విస్తారమైన ప్రజలకు నన్ను రాజుగా చేశారు.
2CH 1:10 నేను ఈ ప్రజలను నడిపించడానికి నాకు జ్ఞానాన్ని, వివేచనను ఇవ్వండి. లేకపోతే మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?”
2CH 1:11 దేవుడు సొలొమోనుతో, “ఇది నీ హృదయ కోరిక, నీవు సంపదలు, ఆస్తులు గాని గౌరవాన్ని గాని నీ శత్రువుల మరణాన్ని గాని నీవు కోరలేదు, నీవు సుదీర్ఘ జీవితాన్ని కోరలేదు, కానీ ఏ ప్రజల మీద నిన్ను రాజుగా చేశానో, ఆ నా ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానం కోరావు,
2CH 1:12 కాబట్టి నీకు జ్ఞాన వివేకాలు ఇస్తాను. అంతే కాకుండా నీకు ముందున్న ఏ రాజుకు నీ తర్వాత వచ్చే రాజులకు ఉండనంత సంపదలు, ఆస్తులు, గౌరవాన్ని నేను నీకు ఇస్తాను” అని చెప్పారు.
2CH 1:13 తర్వాత సొలొమోను గిబియోనులో ఉన్న సమావేశ గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుండి యెరూషలేముకు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు.
2CH 1:14 సొలొమోను రథాలను, గుర్రాలను సమకూర్చుకున్నాడు. అతనికి 1,400 రథాలు, 12,000 గుర్రాలు ఉన్నాయి, వీటిని రథాల పట్టణాల్లో యెరూషలేములో తన దగ్గర ఉంచాడు.
2CH 1:15 రాజు యెరూషలేములో వెండి బంగారాలను రాళ్లంత విస్తారంగా చేశాడు, దేవదారు మ్రానులను కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలా అతి విస్తారంగా ఉంచాడు.
2CH 1:16 సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, క్యూ నుండి దిగుమతి చేసుకున్నారు. రాజ వర్తకులు తగిన ధర చెల్లించి వాటిని క్యూ దగ్గర కొనుగోలు చేశారు.
2CH 1:17 వారు ఈజిప్టు నుండి ఒక్కో రథానికి ఆరువందల షెకెళ్ళ వెండిని ఒక్కో గుర్రానికి నూట యాభై షెకెళ్ళ వెండిని ఇచ్చి దిగుమతి చేశారు. హిత్తీయుల రాజులందరికి సిరియా రాజులకు వాటిని ఎగుమతి కూడ చేశారు.
2CH 2:1 సొలొమోను యెహోవా పేరిట ఒక మందిరం, తమ కోసం ఒక రాజభవనం కట్టాలని ఆజ్ఞాపించాడు.
2CH 2:2 సొలొమోను 70,000 మందిని బరువులు మోయడానికి, 80,000 మందిని కొండల్లో రాళ్లు త్రవ్వడానికి ఏర్పాటు చేశాడు. ఆ పని తనిఖీ చేయడానికి వారిమీద 3,600 మంది అధికారులను కూడా నియమించాడు.
2CH 2:3 తూరు రాజైన హీరాముకు సొలొమోను ఇలా కబురు పంపాడు. “నా తండ్రియైన దావీదుకు నివాసంగా ఒక భవనం కట్టడానికి మీరు దేవదారు మ్రానులను పంపినట్లే నాకు కూడ పంపించండి.
2CH 2:4 ఎందుకంటే, నా దేవుడైన యెహోవా పేరిట మందిరం కట్టిస్తాను. ఆయన సన్నిధిలో పరిమళ ధూపం వేయడం కోసం, ఎల్లప్పుడూ సన్నిధి రొట్టెలు పెట్టడంకోసం, ప్రతి ఉదయం సాయంకాలం, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, మా దేవుడైన యెహోవాకు నియమించబడిన పండుగ సమయాల్లో దహనబలులు అర్పించడం కోసం మందిరాన్ని ఆయనకు ప్రతిష్ఠ చేస్తాను. ఇవన్నీ ఇశ్రాయేలుకు నిత్య కట్టుబాట్లుగా ఉంటాయి.
2CH 2:5 “మా దేవుడు ఇతర దేవుళ్ళందరికంటే గొప్పవాడు. కాబట్టి నేను కట్టించే మందిరం గొప్పగా ఉంటుంది.
2CH 2:6 అయితే ఆకాశ మహాకాశాలు కూడా ఆయనకు సరిపోవు. ఆయనకు మందిరం ఎవరు నిర్మించగలరు? ఆయనకు మందిరం కట్టించడానికి నా సామర్థ్యం ఏపాటిది? ఆయన సన్నిధానంలో ధూపం వేయడం కోసం ఒక స్థలాన్ని నిర్మిస్తాను.
2CH 2:7 “యెరూషలేములోను యూదాదేశంలోను నా దగ్గర నేర్పరులైన పనివారున్నారు. వారిని నా తండ్రి దావీదు నియమించాడు. వారితో కలిసి, బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, ఎరుపు ఊదా నూలుతోను, నీలి నూలుతోను చేసేపని, అన్ని రకాల చెక్కడం పనులు నిర్వహించడానికి నేర్పుగల ఒక మనిషిని పంపండి.
2CH 2:8 “లెబానోను అడవుల్లో మ్రానులు నరకడంలో మీ పనివారు నేర్పరులని నాకు తెలుసు. కాబట్టి లెబానోను నుండి నాకు సరళ వృక్షం దూలాలు, దేవదారు దూలాలు, చందనం దూలాలు పంపించండి. నా పనివారు మీ పనివారితో కలిసి పని చేస్తారు.
2CH 2:9 నేను కట్టే దేవాలయం విశాలంగా, అద్భుతంగా ఉండాలి కాబట్టి చాలా దూలాలు కావాలి.
2CH 2:10 దూలాలు నరికే మీ పనివాళ్ళకు ఆహారంగా 20,000 కోరుల గోధుమ పిండిని, 20,000 కోరుల యవలు, 20,000 బాతుల ద్రాక్షరసం, 20,000 బాతుల ఒలీవనూనె ఇస్తాను.”
2CH 2:11 దానికి జవాబుగా తూరు రాజైన హీరాము సొలొమోనుకు ఒక లేఖ వ్రాశాడు. “యెహోవా తన ప్రజలను ప్రేమగా చూస్తున్నాడు. అందుకే నిన్ను వారిమీద రాజుగా నియమించాడు.”
2CH 2:12 అందుకు హీరాము, “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా భూమిని ఆకాశాలను సృజించిన దేవుడు. ఆయన స్తుతిపాత్రుడు! ఆయన రాజైన దావీదుకు బుద్ధిగల కుమారున్ని ఇచ్చారు. ఆ కుమారుడు జ్ఞానం, వివేకం గలవాడై, యెహోవా పేరిట మందిరం, తనకు రాజభవనం కట్టిస్తాడు.
2CH 2:13 “మీ దగ్గరకు హూరాము-అబి అనే జ్ఞానంగల వ్యక్తిని పంపిస్తున్నాను. అతడు గొప్ప నేర్పుగలవాడు.
2CH 2:14 అతని తల్లి దాను వంశీయురాలు. తండ్రి తూరుకు చెందిన వాడు. బంగారం వెండి ఇత్తడి ఇనుము రాళ్లు దూలాలతో పని చేయడం అతనికి బాగా తెలుసు. ఊదా నీలి సన్నని నూలుతో ఎరుపు నూలుతో పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల చెక్కడపు పనిలో నైపుణ్యం ఉన్నవాడు, నాకు యజమాని నీకు తండ్రియైన దావీదు, మీరు ఏర్పాటుచేసిన పనివారితో అతడు పని చేస్తాడు.
2CH 2:15 “నా యజమానులైన మీరు చెప్పినట్టే ఇప్పుడు గోధుమలు, యవలు, నూనె, ద్రాక్షరసం మీ సేవకులకిచ్చి పంపించండి.
2CH 2:16 మీరు కావాలన్న దూలాలను మేము లెబానోను అడవుల నుండి నరికి సముద్రం మీద తెప్పలుగా కట్టి, యొప్ప పట్టణం దాకా తెస్తాము. అక్కడినుండి మీరు వాటిని యెరూషలేముకు తీసుకెళ్లవచ్చు.”
2CH 2:17 సొలొమోను ఇశ్రాయేలులో ఉంటున్న పరాయి దేశస్థుల జనాభా లెక్కలు తీయించాడు. తన తండ్రియైన దావీదు చేయించిన లెక్కల ప్రకారం అలాంటి వారికి లెక్కించినప్పుడు మొత్తం 1,53,600 మంది ఉన్నారు.
2CH 2:18 వారిలో బరువులు మోయడానికి 70,000 మందిని కొండల్లో రాళ్లు త్రవ్వడానికి 80,000 మందిని నియమించాడు. పని సక్రమంగా జరిగేటట్టు చూడడానికి 3,600 మందిని పనివారి మీద అధికారులుగా నియమించాడు.
2CH 3:1 ఆ తర్వాత సొలొమోను యెరూషలేములో ఉన్న మోరీయా కొండమీద యెహోవా మందిరాన్ని కట్టడం ఆరంభించాడు. అక్కడే యెహోవా సొలొమోను తండ్రియైన దావీదుకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను మందిరం కట్టించిన స్థలం అంతకుముందు యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళం ఉంది. దావీదు దానిని సిద్ధం చేశాడు.
2CH 3:2 అతడు తన పాలనలోని నాలుగవ సంవత్సరం రెండవ నెల రెండవ రోజున కట్టడం ప్రారంభించాడు.
2CH 3:3 సొలొమోను దేవుని ఆలయానికి పునాది వేయించాడు. పూర్వంలో ఉపయోగించిన మూర కొలత ప్రకారం, దాని పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు.
2CH 3:4 మందిరం విశాల గదికి ముందు మంటపం ఉంది. దాని పొడవు ఇరవై మూరలు, ఎత్తు నూట ఇరవై మూరలు. లోపలిభాగాన్ని అతడు మేలిమి బంగారంతో పొదిగించాడు.
2CH 3:5 అతడు ప్రధాన గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారం పొదిగించి, పైభాగాన ఖర్జూరపు చెట్లు, గొలుసుల్లాంటివి చెక్కించాడు.
2CH 3:6 మందిరాన్ని ప్రశస్తమైన రాళ్లతో అలంకరించాడు. అతడు ఉపయోగించిన బంగారం పర్వయీము నుండి తెచ్చింది.
2CH 3:7 మందిర దూలాలను, స్తంభాలను, గోడలను, తలుపులను బంగారంతో పొదిగించాడు. గోడ మీద కెరూబు చెక్కించాడు.
2CH 3:8 అతడు మందిరంలో అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. మందిరం వెడల్పు బట్టి దాని పొడవు ఇరవై మూరలు. వెడల్పు కూడా ఇరవై మూరలు. దాన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. అందుకు సుమారు 20,000 కిలోగ్రాముల బంగారం పట్టింది.
2CH 3:9 బంగారు మేకు బరువు యాభై షెకెళ్ళు, మందిర పైభాగాలను కూడా బంగారంతో పొదిగించాడు.
2CH 3:10 అతి పరిశుద్ధ స్థలంలో రెండు కెరూబులను చెక్కించాడు. వాటిని బంగారంతో పొదిగించాడు.
2CH 3:11 ఆ కెరూబులకు రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కల పొడవు మొత్తం ఇరవై మూరలు. ఒక్కొక్క రెక్క అయిదు మూరల పొడవు మొదటి రెక్క గోడకు తాకుతూ ఉంది. రెండవ రెక్క దానికి జతగా ఉన్న కెరూబు తాకుతూ ఉంది.
2CH 3:12 అదే విధంగా రెండవ కెరూబు ఒక రెక్క అయిదు మూరల పొడవు. అది ఆలయ గోడకు తాకుతూ ఉంది. దాని మరొక రెక్క అయిదు మూరల పొడవు, మొదటి కెరూబు రెక్కను తాకుతూ ఉంది.
2CH 3:13 ఆ విధంగా ఆ కెరూబుల రెక్కలు ఇరవై మూరలు వ్యాపించాయి. కెరూబుల ముఖాలు ప్రధాన మందిరం వైపుకు తిరిగి ఉన్నాయి. కెరూబులు కాళ్లమీద నిలబడి ఉన్నాయి.
2CH 3:14 సొలొమోను నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో సన్నని నారతో ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను అల్లించాడు.
2CH 3:15 మందిరం ముందు స్థలానికి రెండు స్తంభాలు చేయించాడు. వాటి ఎత్తు ముప్పై అయిదు మూరలు. వాటి మీద అయిదు మూరల ఎత్తుగల పీటలు కూడా చేయించాడు.
2CH 3:16 అతడు అల్లిన గొలుసులు చేయించి స్తంభాల పైభాగంలో పెట్టాడు. వంద దానిమ్మపండ్లు కూడా చేసి గొలుసులకు తగిలించాడు.
2CH 3:17 మందిరం ముందు భాగంలో స్తంభాలను ఒకటి దక్షిణం వైపు ఒకటి ఉత్తరం వైపు నిలబెట్టాడు. దక్షిణాన ఉన్న దానికి యాకీను అని, ఉత్తరాన ఉన్న దానికి బోయజు అని పేరు పెట్టాడు.
2CH 4:1 హూరాము-అబి ఇత్తడి బలిపీఠం చేశాడు. దాని పొడవు ఇరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు, ఎత్తు పది మూరలు.
2CH 4:2 అతడు పోతపోసిన ఒక గుండ్రని నీళ్ల తొట్టె చేయించాడు. అది ఈ అంచు నుండి ఆ అంచు వరకు పది మూరలు, దాని ఎత్తు అయిదు మూరలు. దాని చుట్టుకొలత ముప్పై మూరలు.
2CH 4:3 దాని అంచు క్రింద మూరకు పది చొప్పున చుట్టూ ఎడ్ల రూపాలు ఉన్నాయి. నీళ్ల తొట్టెను పోత పోసినప్పుడు ఆ ఎడ్లు రెండు వరుసలుగా పోత పోశారు.
2CH 4:4 ఆ నీళ్ల తొట్టె పన్నెండు ఎడ్ల మీద అమర్చబడింది, వాటిలో మూడు ఉత్తరం వైపు, మూడు పశ్చిమ వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపు ఉన్నాయి. నీళ్ల తొట్టె వాటిపై ఉంచబడింది, వాటి వెనుకటి భాగాలు లోపలి వైపుకు ఉన్నాయి.
2CH 4:5 అది బెత్తెడు మందం కలిగి ఉండి, దాని అంచు పాత్ర అంచులా, తామర పువ్వులా ఉంది. దానిలో మూడు వేల బాతుల నీళ్లు పడతాయి.
2CH 4:6 దహనబలుల కోసం వాడే వాటిని కడగడానికి అతడు పది చిన్న గంగాళాలు చేయించి, దక్షిణ వైపున అయిదు, ఉత్తర వైపున అయిదింటిని పెట్టాడు. వాటిలో దహనబలుల కోసం వాడే వాటిని కడుగబడతాయి, అయితే పెద్ద గంగాళం యాజకులు కడుక్కోడానికి మాత్రమే ఉపయోగిస్తారు.
2CH 4:7 అతడు వాటి వివరాల ప్రకారం పది బంగారు దీపస్తంభాలను తయారుచేసి వాటిని మందిరంలో అయిదు దక్షిణం వైపు అయిదు ఉత్తరం వైపు ఉంచాడు.
2CH 4:8 పది బల్లలను చేయించి మందిరంలో దక్షిణ వైపున అయిదు, ఉత్తర వైపున అయిదు ఉంచాడు. బంగారంతో నూరు గిన్నెలను చేయించాడు.
2CH 4:9 యాజకుల ఆవరణాన్ని, పెద్ద ఆవరణాన్ని చేయించాడు, ఆ ఆవరణాలకు తలుపులు చేయించి వాటిని ఇత్తడితో పొదిగించాడు.
2CH 4:10 గంగాళాన్ని మందిరానికి దక్షిణ వైపున ముఖాన్ని ఆగ్నేయ దిక్కుకు త్రిప్పి ఉంచాడు.
2CH 4:11 హూరాము కుండలను, చేటలను, చిలకరించడానికి వాడే గిన్నెలను కూడా చేయించాడు. కాబట్టి హూరాము యెహోవా ఆలయానికి రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారం పనంతా చేసి ముగించాడు:
2CH 4:12 రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న గిన్నెలాంటి రెండు పీటలు, గిన్నెలాంటి ఆ రెండు పీటలను కప్పడానికి రెండు అల్లికలు,
2CH 4:13 స్తంభాలపై ఉన్న గిన్నెలాంటి పీటలను అలంకరిస్తూ ఒక్కొక్క అల్లికకు రెండేసి వరుసల చొప్పున ఆ రెండు అల్లికలకు నాలుగు వందల దానిమ్మపండ్లు,
2CH 4:14 ఆ పీటలు వాటిపై ఉన్న తొట్లు,
2CH 4:15 నీళ్ల తొట్టె దాని క్రింద ఉన్న పన్నెండు ఎడ్లు,
2CH 4:16 కుండలు, చేటలు, ముండ్ల కొంకులు మొదలైన పాత్రలు. హూరాము యెహోవా ఆలయానికి సొలొమోను రాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడితో తయారుచేశాడు.
2CH 4:17 రాజు వీటన్నిటిని యొర్దాను సమతల మైదానంలో, సుక్కోతుకు సారెతానుకు మధ్య ఉన్న బంకమట్టితో పోతపోయించాడు.
2CH 4:18 సొలొమోను చేయించిన ఇత్తడి వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ. ఆ ఇత్తడి బరువు ఎంతో ఎవరూ నిర్ణయించలేదు.
2CH 4:19 దేవుని మందిరానికి సొలొమోను చేయించిన తక్కిన వస్తువులు: బంగారు బల్ల, సన్నిధి రొట్టెలు పెట్టే బల్లలు,
2CH 4:20 గర్భాలయం ఎదుట వెలుతురు ఉండడానికి మేలిమి బంగారు దీపస్తంభాలు, వాటి దీపాలు,
2CH 4:21 వాటి బంగారు పుష్పాలు దీపాలు కత్తెరలు పట్టుకారులు,
2CH 4:22 మేలిమి బంగారు చేసిన వత్తులు కత్తిరించే కత్తెరలు, చిలకరించే గిన్నెలు, పాత్రలు, ధూపకలశాలు; మందిర బంగారు తలుపులు: అతి పరిశుద్ధ స్థలానికి లోపలి తలుపులు, ప్రధాన గది తలుపులు.
2CH 5:1 రాజైన సొలొమోను యెహోవా మందిరానికి చేసిన పని అంతా ముగిసిన తర్వాత, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారు, వస్తువులను తెప్పించి, యెహోవా మందిర ఖజానాలో పెట్టాడు.
2CH 5:2 అప్పుడు సొలొమోను దావీదు పట్టణమైన సీయోను నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాల పెద్దలను, ఇశ్రాయేలీయుల కుటుంబాల నాయకులందరిని యెరూషలేముకు పిలిపించాడు.
2CH 5:3 ఏడవ నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులందరు రాజు ఎదుట సమావేశమయ్యారు.
2CH 5:4 ఇశ్రాయేలు పెద్దలందరు వచ్చాక, లేవీయులు నిబంధన మందసాన్ని తీసుకుని,
2CH 5:5 మందసాన్ని, సమావేశ గుడారాన్ని, అందులోని పవిత్ర వస్తువులన్నీ తీసుకువచ్చారు. లేవీయులైన యాజకులు వాటిని పైకి మోసుకెళ్లారు;
2CH 5:6 రాజైన సొలొమోను, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మందసం ముందు సమావేశమై, లెక్కలేనన్ని గొర్రెలను పశువులను బలి ఇచ్చారు.
2CH 5:7 తర్వాత యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని మందిరంలోని గర్భాలయం అనే అతి పరిశుద్ధ స్థలంలో దాని స్థలానికి తీసుకువచ్చి, కెరూబుల రెక్కల క్రింద పెట్టారు.
2CH 5:8 కెరూబుల రెక్కలు మందసం ఉన్న స్థలం మీదుగా చాపి మందసాన్ని దానిని మోసే కర్రలను కప్పివేశాయి.
2CH 5:9 ఈ మోతకర్రలు చాలా పొడవుగా ఉండడం వల్ల, వాటి అంచులు మందసం నుండి విస్తరించి, గర్భాలయానికి ముందున్న పరిశుద్ధ స్థలంలో నుండి కనబడతాయి, కాని పరిశుద్ధస్థలం బయట నుండి కనబడవు; ఈనాటికీ అవి అక్కడే ఉన్నాయి.
2CH 5:10 మోషే హోరేబులో ఉన్నప్పుడు, అనగా ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత యెహోవా వారితో నిబంధన చేసినప్పుడు మందసంలో పెట్టిన రెండు రాతిపలకలు తప్ప మరేమీ దానిలో లేవు.
2CH 5:11 తర్వాత యాజకులు పరిశుద్ధాలయం నుండి బయటకు వచ్చారు. అంతకుముందు అక్కడ ఉన్న యాజకులందరు తమ విభాగాలతో నిమిత్తం లేకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు.
2CH 5:12 సంగీతకారులైన లేవీయులంతా, అంటే ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కుమారులు, బంధువులు సన్నని నారబట్టలను ధరించి తాళాలు, తంతి వాయిద్యాలు, స్వరమండలాలు చేతపట్టుకుని బలిపీఠానికి తూర్పు వైపున నిలబడి ఉన్నారు. వారితో కలిసి బూరల ధ్వని చేయడానికి నూట ఇరవైమంది యాజకులు ఉన్నారు.
2CH 5:13 బూరలు ఊదేవారు, సంగీతకారులు ఏకకంఠంతో యెహోవాకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించడానికి జత కలిశారు. వారికి జతగా బూరలు, తాళాలు, ఇతర వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, పాటలు పాడేవారు యెహోవాను స్తుతించడానికి తమ స్వరాలెత్తి: “యెహోవా మంచివాడు. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని పాడారు. అప్పుడు యెహోవా మందిరం మేఘంతో నిండిపోయింది.
2CH 5:14 యెహోవా మహిమ దేవుని మందిరం నిండ కమ్ముకున్న ఆ మేఘాన్ని బట్టి యాజకులు తమ సేవ చేయలేకపోయారు.
2CH 6:1 అప్పుడు సొలొమోను, “యెహోవా తాను చీకటి మేఘంలో నివసిస్తారని ఆయన చెప్పారు;
2CH 6:2 నేను మీ కోసం ఘనమైన మందిరాన్ని కట్టించాను. అది మీరు ఎల్లకాలం నివసించగలిగే స్థలం” అని అన్నాడు.
2CH 6:3 ఇశ్రాయేలు సమాజమంతా అక్కడ నిలబడి ఉండగా రాజు వారివైపు తిరిగి, వారిని దీవించాడు.
2CH 6:4 అప్పుడతడు ఇలా అన్నాడు: “నా తండ్రియైన దావీదుకు మాట ఇచ్చి తన హస్తంతో దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆయన ఇలా అన్నారు:
2CH 6:5 ‘ఈజిప్టు నుండి నేను నా ప్రజలను తీసుకువచ్చిన రోజు నుండి, నా పేరిట మందిరం కట్టించుకోడానికి ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన పట్టణాల్లో దేనినీ నేను ఎన్నుకోలేదు, నా ప్రజలను పరిపాలించడానికి ఏ రాజును నేను ఎన్నుకోలేదు.
2CH 6:6 అయితే ఇప్పుడు నా పేరు ఉండేలా యెరూషలేమును ఎన్నుకున్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నాను.’
2CH 6:7 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరం కట్టించాలనే ఆశ నా తండ్రి దావీదు హృదయంలో ఉండింది.
2CH 6:8 కాని యెహోవా నా తండ్రియైన దావీదుతో, ‘నా పేరున మందిరాన్ని కట్టించాలనే ఆశ నీ హృదయంలో ఉండడం మంచిదే.
2CH 6:9 అయితే కట్టించేది నీవు కాదు, నీ రక్తం పంచుకుని పుట్టే కుమారుడు నా పేరున మందిరాన్ని కట్టిస్తాడు’ అన్నారు.
2CH 6:10 “యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకున్నారు; యెహోవా వాగ్దానం చేసినట్లే, నేను నా తండ్రి దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజ సింహాసనం ఎక్కాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున మందిరాన్ని కట్టించాను.
2CH 6:11 యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనను తెలిపే మందసాన్ని మందిరంలో అక్కడ పెట్టాను.”
2CH 6:12 అప్పుడు సొలొమోను యెహోవా బలిపీఠం ముందు ఇశ్రాయేలు సమాజమంతటి సమక్షంలో నిలబడి చేతులు చాపి ప్రార్థన చేశాడు.
2CH 6:13 తర్వాత సొలొమోను అయిదు మూరల పొడవు, అయిదు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తుతో ఒక ఇత్తడి వేదికను తయారుచేసి, బయటి ఆవరణ మధ్యలో ఉంచాడు. అతడు వేదికపై నిలబడి, ఇశ్రాయేలు సమాజమంతటి సమక్షంలో మోకరిల్లి, ఆకాశం వైపు చేతులు చాపాడు.
2CH 6:14 అతడు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని, మీలాంటి దేవుడు మరొకడు లేడు. మీ మార్గంలో హృదయమంతటితో కొనసాగే మీ సేవకుల పట్ల మీ ప్రేమ నిబంధనను నెరవేరుస్తారు.
2CH 6:15 మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు; మీ నోటితో చేసిన వాగ్దానాన్ని ఈ రోజున కనబడుతున్నట్టుగా మీ చేతులతో నెరవేర్చారు.
2CH 6:16 “ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీరు మీ సేవకుడూ, నా తండ్రియైన దావీదుతో, ‘నీ వారసులు తమ ప్రవర్తన విషయంలో జ్రాగత్తగా ఉంటూ, నీలా నా ఎదుట నా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తే, ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ సంతానంలో ఉండక పోడు’ అని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చండి.
2CH 6:17 ఇప్పుడు యెహోవా! ఇశ్రాయేలు దేవా! మీ సేవకుడైన దావీదుతో మీరు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచండి.
2CH 6:18 “అయితే దేవుడు భూమి మీద మనుష్యులతో నిజంగా నివాసం చేస్తారా? ఆకాశ మహాకాశాలు మీకు సరిపోవు. నేను కట్టించిన ఈ మందిరం ఏం సరిపోతుంది?
2CH 6:19 అయినా యెహోవా నా దేవా, మీ దాసుడైన నేను చేసే ప్రార్థన, కనికరం కోసం చేసే విన్నపం ఆలకించండి. మీ దాసుడు మీ సన్నిధిలో చేసే మొరను, ప్రార్థనను వినండి.
2CH 6:20 మీ పేరు అక్కడ ఉంటుందని మీరు చెప్పిన స్థలం వైపు తిరిగి మీ దాసుడు చేసే ప్రార్థన మీరు వినేలా రాత్రింబగళ్ళు మీ కనుదృష్టి ఈ మందిరంపై ఉండును గాక.
2CH 6:21 మీ దాసుడు, మీ ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి విన్నపాలు ఆలకించండి. మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి; మీరు విన్నప్పుడు క్షమించండి.
2CH 6:22 “ఎవరైనా తన పొరుగువారి పట్ల తప్పు చేశారని ఆరోపించబడి వారు ప్రమాణం చేయాల్సివస్తే ఈ మందిరంలో మీ బలిపీఠం ముందు ఆ ప్రమాణం చేసినప్పుడు,
2CH 6:23 మీరు ఆకాశం నుండి విని మీ దాసులకు న్యాయం తీర్చండి. దోషులను వారి దోషం బట్టి శిక్షిస్తూ, నిర్దోషుల నిర్దోషత్వాన్ని బట్టి వారి నిర్దోషత్వాన్ని నిర్ధారించండి.
2CH 6:24 “మీ ఇశ్రాయేలు ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు వారి శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు మీ వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఈ మందిరం ఎదుట మిమ్మల్ని వేడుకున్నప్పుడు,
2CH 6:25 మీరు పరలోకం నుండి విని, మీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని క్షమించి, వారికి వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశానికి వారిని మళ్ళీ తీసుకురండి.
2CH 6:26 “మీ ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు, ఆకాశం మూయబడి వర్షం లేనప్పుడు, వారు తమకు కలిగిన శ్రమ వలన తమ పాపం విడిచిపెట్టి ఈ స్థలం వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తే,
2CH 6:27 మీరు పరలోకం నుండి విని, మీ దాసులు, మీ ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని క్షమించండి. సరైన మార్గాన్ని అనుసరిస్తూ జీవించాలని వారికి బోధించండి, మీ ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో వర్షం కురిపించండి.
2CH 6:28 “దేశంలో కరువు గాని తెగులు గాని వడగాలి గాని నాచు గాని మిడతలు గాని పురుగులు గాని వచ్చినా, వారి శత్రువు వారి పట్టణాల్లో వారిని ముట్టడి చేసినా, ఏదైనా విపత్తు గాని రోగం గాని వచ్చినా,
2CH 6:29 మీ ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా తమ వేదన బాధలు తెలుసుకొని ఈ మందిరం వైపు తమ చేతులను చాచి ప్రార్థన విన్నపం చేస్తే,
2CH 6:30 ప్రతి మనిషి హృదయం మీకు తెలుసు కాబట్టి మీ నివాసస్థలమైన పరలోకం నుండి విని క్షమించి, ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమివ్వండి (ఎందుకంటే ప్రతి మానవ హృదయం మీకు తెలుసు),
2CH 6:31 అప్పుడు మీరు మా పూర్వికులకిచ్చిన ఈ దేశంలో వారు బ్రతికి ఉన్నంత కాలం మీకు భయపడి, మీకు విధేయులై మీ మార్గంలో వారు నడుస్తారు.
2CH 6:32 “మీ ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించని విదేశీయులు, మీ గొప్ప పేరును బట్టి, మీ బలమైన బాహువును చాచిన మీ చేతులను బట్టి దూరదేశం నుండి వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,
2CH 6:33 మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి. విదేశీయులు మిమ్మల్ని ఏమి అడిగినా అది వారికి చేయండి. అప్పుడు భూలోక ప్రజలు మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లా మీ పేరు తెలుసుకొని మీకు భయపడతారు. నేను కట్టిన ఈ మందిరం మీ పేరు కలిగి ఉందని తెలుసుకుంటారు.
2CH 6:34 “మీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు, మీరు వారిని ఎక్కడికి పంపినా, మీరు ఎన్నుకున్న ఈ పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి, వారు మీకు ప్రార్థన చేస్తే,
2CH 6:35 అప్పుడు పరలోకం నుండి వారి ప్రార్థన విన్నపం విని వారి పక్షాన ఉండండి.
2CH 6:36 “పాపం చేయని మనుష్యులు లేరు కాబట్టి వారు మీకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు, మీరు వారిపై కోప్పడి శత్రువులకు అప్పగిస్తే, వారు వీరిని దూరంగా లేదా దగ్గరగా ఉన్న దేశానికి బందీలుగా తీసుకెళ్తారు;
2CH 6:37 అప్పుడు వారు బందీగా ఉన్న దేశంలో వారి హృదయాలు మారి పశ్చాత్తాపపడి, ‘మేము తప్పు చేసి దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాం’ అని వారు వేడుకుంటే,
2CH 6:38 తాము బందీగా ఉన్న దేశంలో వారు తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో మరలా మీ వైపు తిరిగి, వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశం వైపు, మీరు ఎన్నుకున్న పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,
2CH 6:39 అప్పుడు మీ నివాసస్థలమైన పరలోకం నుండి వారి ప్రార్థన, వారి విన్నపాలను విని వారి పక్షాన ఉండండి. మీకు విరుద్ధంగా పాపం చేసిన మీ ప్రజలను క్షమించండి;
2CH 6:40 “నా దేవా! ఈ స్థలంలో చేసిన ప్రార్థనపై మీ కనుదృష్టి ఉంచండి. చెవులారా ఆలకించండి.
2CH 6:41 “యెహోవా దేవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో,
2CH 6:42 యెహోవా దేవా! మీ అభిషిక్తుని తిరస్కరించకండి.
2CH 7:1 సొలొమోను ప్రార్థన ముగించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహనబలిని, బలులను దహించివేసింది. యెహోవా మహిమ మందిరాన్ని నింపింది.
2CH 7:2 ఆలయమంతా యెహోవా మహిమతో నిండడంతో యాజకులు లోపలికి ప్రవేశించలేకపోయారు.
2CH 7:3 అగ్ని దిగి రావడం, యెహోవా మహిమ మందిరం మీద ఉండడం ఇశ్రాయేలీయులు చూసినప్పుడు, వారు కాలిబాట మీద సాష్టాంగపడి, “యెహోవా మంచివాడు; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అంటూ ఆయనను ఆరాధించి కృతజ్ఞత చెల్లించారు.
2CH 7:4 తర్వాత రాజు, ప్రజలంతా యెహోవా ఎదుట బలులు అర్పించారు.
2CH 7:5 సొలొమోను రాజు 22,000 పశువులు, 1,20,000 గొర్రెలు, మేకలు బలిగా అర్పించాడు. ఈ విధంగా రాజు, ప్రజలందరు దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారు.
2CH 7:6 యాజకులు తమ స్థలాల్లో నిలబడి ఉండగా, రాజైన దావీదు యెహోవాను స్తుతించడానికి, “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉండును గాక!” అంటూ ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లించడానికి దావీదు యెహోవా కోసం తయారుచేసిన వాయిద్యాలు వాయిస్తూ గీతాలను పాడుతూ లేవీయులు కూడా తమ స్థలాలలో నిలబడ్డారు. లేవీయులకు ఎదురుగా యాజకులు నిలబడి బూరలు ఊదుతుండగా ఇశ్రాయేలీయులంతా నిలబడి ఉన్నారు.
2CH 7:7 సొలొమోను చేసిన ఇత్తడి బలిపీఠం మీద అర్పించలేనంత ఎక్కువగా ఆ దహనబలులు, భోజనార్పణలు, సమాధానబలుల క్రొవ్వు ఉంది కాబట్టి అతడు యెహోవా ఆలయానికి ముందున్న ఆవరణం మధ్య భాగాన్ని అతడు పవిత్రపరచి, దహనబలులు, భోజనార్పణలు, క్రొవ్వు పదార్థాలు అర్పించాడు.
2CH 7:8 ఆ సమయంలో ఏడు రోజులు సొలొమోను అతనితో ఇశ్రాయేలు ప్రజలంతా పండుగ చేశారు. లెబో హమాతుకు వెళ్లే మార్గం నుండి ఈజిప్టు వాగువరకు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలు గొప్ప సమూహంగా వచ్చారు.
2CH 7:9 ఎనిమిదవ రోజున వారు సమావేశాన్ని నిర్వహించారు, ఎందుకంటే ఏడు రోజులు బలిపీఠాన్ని ప్రతిష్ఠించి మరో ఏడు రోజులు పండుగ జరుపుకున్నారు.
2CH 7:10 ఏడవ నెల ఇరవై మూడవ రోజున, అతడు ప్రజలను తమ ఇళ్ళకు పంపివేశాడు. యెహోవా దావీదుకు, సొలొమోనుకు, తన ప్రజలైన ఇశ్రాయేలుకు చేసిన మంచి వాటిని బట్టి హృదయంలో ఆనందంతో, సంతోషంతో వెళ్లారు.
2CH 7:11 సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని పూర్తి చేసి, యెహోవా మందిరంలో, తన సొంత భవనంలో తాను కోరుకున్నదంతా పూర్తి చేసినప్పుడు,
2CH 7:12 ఒక రాత్రి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నీ ప్రార్థన విన్నాను, ఈ స్థలాన్ని నా కోసం బలులు అర్పించే మందిరంగా ఎన్నుకున్నాను.
2CH 7:13 “వాన కురవకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు గాని భూమిని మ్రింగివేయమని మిడతలను ఆజ్ఞాపించినప్పుడు గాని నా ప్రజల మధ్యకు తెగులును పంపినప్పుడు గాని,
2CH 7:14 ఒకవేళ నా పేరుతో పిలువబడే నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థనచేసి నా వైపు తిరిగి తమ చెడు మార్గాలను వదిలి వేస్తే, పరలోకం నుండి నేను వారి ప్రార్థన వింటాను. వారి పాపాలను క్షమించి, వారి దేశాన్ని బాగుచేస్తాను.
2CH 7:15 ఇప్పటినుండి ఈ స్థలంలో చేసే ప్రార్థనలపై నా దృష్టి ఉంటుంది నా చెవులతో వింటాను.
2CH 7:16 ఇక్కడ నా పేరు ఎప్పటికీ ఉండాలని నేను ఈ మందిరాన్ని ఎన్నుకుని ప్రతిష్ఠించాను. నా కనుదృష్టి, నా హృదయం ఎల్లప్పుడు దీనిపై ఉంటాయి.
2CH 7:17 “నీ మట్టుకైతే, నీ తండ్రి దావీదులా నమ్మకంగా జీవిస్తూ, నేను ఆజ్ఞాపించినదంతా చేసి, నా శాసనాలను నియమాలను పాటిస్తే,
2CH 7:18 నీ తండ్రి దావీదుకు, ‘ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతివారు ఎప్పటికీ కూర్చుంటారు’ అని నిబంధన చేసినట్లు నీ రాజ సింహాసనం ఎల్లకాలం స్థాపిస్తాను.
2CH 7:19 “అయితే ఒకవేళ మీరు నన్ను అనుసరించుట మాని, నేను మీకు ఇచ్చిన శాసనాలు, ఆజ్ఞలు విడిచి ఇతర దేవుళ్ళను సేవిస్తూ పూజిస్తే,
2CH 7:20 అప్పుడు నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన నా దేశం నుండి వారిని పెళ్లగించి నా నామం కోసం ప్రతిష్ఠించుకున్న ఈ మందిరాన్ని తిరస్కరిస్తాను. నేను దాన్ని ప్రజలందరిలో సామెతగా, హేళనకు కారణంగా చేస్తాను.
2CH 7:21 ఈ మందిరం శిథిలాల కుప్పగా మారుతుంది. దాటి వెళ్లేవారంతా ఆశ్చర్యపడి, ‘యెహోవా ఈ దేశానికి, ఈ ఆలయానికి ఇలా ఎందుకు చేశారో?’ అని అడుగుతారు.
2CH 7:22 అప్పుడు ప్రజలు, ‘వారు తమను ఈజిప్టు దేశం నుండి తీసుకువచ్చిన తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి వేరే దేవుళ్ళను హత్తుకుని, పూజిస్తూ వాటికి సేవ చేశారు, అందుకే యెహోవా వారిపై ఈ విపత్తును తెచ్చారు’ అని జవాబిస్తారు.”
2CH 8:1 సొలొమోను యెహోవా మందిరాన్ని, తన సొంత భవనాన్ని కట్టించడానికి తీసుకున్న ఇరవై సంవత్సరాలు ముగిసిన తర్వాత,
2CH 8:2 హీరాము అతనికి ఇచ్చిన గ్రామాలను సొలొమోను మరలా కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను స్థిరపరిచాడు.
2CH 8:3 తర్వాత సొలొమోను హమాత్-సోబా పట్టణం మీదికి వెళ్లి, దానిని స్వాధీనపరచుకున్నాడు.
2CH 8:4 అతడు ఎడారిలో తద్మోరును, హమాతులో తాను కట్టించిన దుకాణ పట్టణాలన్నిటిని కూడా నిర్మించాడు.
2CH 8:5 ఎగువ బేత్-హోరోనును, దిగువ బేత్-హోరోనును కోటగోడలతో, ద్వారాలతో, అడ్డగడియలతో కోటగోడలు గల పట్టణాలుగా కట్టించాడు.
2CH 8:6 అలాగే బయలతు, తన ధాన్యాగారాలను, తన రథాలకు, గుర్రాలకు పట్టణాలను, యెరూషలేములో, లెబానోనులో, తాను పరిపాలించే ప్రదేశమంతటిలో తాను కట్టించాలనుకున్న వాటన్నిటిని సొలొమోను కట్టించాడు.
2CH 8:7 హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు (ఈ ప్రజలు ఇశ్రాయేలీయులు కాదు) ఇంకా అక్కడ మిగిలి ఉన్నారు.
2CH 8:8 ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండ వదిలిన ఈ ప్రజలందరి వారసులను సొలొమోను ఈనాటికీ బానిసలుగా పని చేయడానికి నిర్బంధించాడు.
2CH 8:9 అయితే సొలొమోను ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరిని తన పని కోసం బానిసలుగా చేయలేదు; వారు అతని సైనికులు, అతని సేనాధిపతుల అధిపతులు, రథాలకు, రథసారధులకు అధిపతులుగా ఉన్నారు.
2CH 8:10 అంతేకాక, వారిలో రెండువందల యాభైమంది సొలొమోను రాజు ప్రజల మీద నియమించిన ముఖ్య అధికారులు కూడా ఉన్నారు.
2CH 8:11 సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి ఆమె కోసం కట్టించిన భవనానికి తీసుకువచ్చాడు. ఎందుకంటే, ఆయన, “ఇశ్రాయేలీయుల రాజైన దావీదు భవనంలో నా భార్య నివసించకూడదు. ఎందుకంటే యెహోవా మందసం ప్రవేశించిన స్థలాలు పరిశుద్ధమైనవి” అనుకున్నాడు.
2CH 8:12 తర్వాత సొలొమోను తాను మంటపం ముందు కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించాడు.
2CH 8:13 మోషే ఇచ్చిన ఆజ్ఞ ననుసరించి ప్రతిరోజు పాటించవలసిన విధి ప్రకారం సబ్బాతు దినాల్లో, అమావాస్యలప్పుడు పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ, గుడారాల పండుగ అనే మూడు వార్షిక పండుగలప్పుడు యెహోవాకు దహనబలులు అర్పించేవాడు.
2CH 8:14 తన తండ్రి దావీదు శాసనానికి అనుగుణంగా, అతడు వారి సేవలను జరిగించడానికి యాజకుల విభాగాలను, ప్రతిరోజు అవసరాన్ని బట్టి యాజకులకు సహాయం చేయడానికి, స్తుతి చేయడానికి లేవీయులను నియమించాడు. ప్రతి ద్వారానికి వంతు ప్రకారం ద్వారపాలకులుగా ఉండడానికి మనుష్యులను నియమించాడు. అతడు వివిధ ద్వారాలకు విభాగాల ప్రకారం ద్వారపాలకులను నియమించాడు. ఎందుకంటే ఇలా చేయాలని దైవజనుడైన దావీదు ఆదేశించాడు.
2CH 8:15 వారు యాజకులకు లేవీయులకు సంబంధించిన విషయాల్లో, ఖజానాల విషయంతో సహా ఏ విషయంలోనూ రాజు ఆజ్ఞలను మీరలేదు.
2CH 8:16 యెహోవా మందిరం పునాది వేయబడ్డప్పటి నుండి మందిరం పని మొత్తం ముగిసేవరకు సొలొమోను పనినంతా చేయించాడు. యెహోవా మందిరం పూర్తి అయింది.
2CH 8:17 అప్పుడు సొలొమోను ఎదోము యొక్క సముద్రతీరాన ఉన్న ఏలతు దగ్గర ఉన్న ఎసోన్-గెబెరు ప్రాంతానికి వెళ్లాడు.
2CH 8:18 హీరాము తన సేవకుల ద్వారా ఓడలను, సముద్రం గురించి తెలిసిన తన నావికులను పంపించాడు. వారు సొలొమోను మనుష్యులతో పాటు బయలుదేరి ఓఫీరుకు చేరి అక్కడినుండి సుమారు 450 తలాంతుల బంగారాన్ని తెచ్చి రాజైన సొలొమోనుకు అందజేశారు.
2CH 9:1 షేబ దేశపు రాణి సొలొమోను ఖ్యాతి గురించి విన్నప్పుడు, చిక్కు ప్రశ్నలతో అతన్ని పరీక్షిద్దామని ఆమె యెరూషలేముకు వచ్చింది. ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది.
2CH 9:2 సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటికి జవాబులిచ్చాడు. వివరించలేనంత కష్టమైనది అతనికి ఏది లేదు.
2CH 9:3 షేబ రాణి సొలొమోనుకు ఉన్న జ్ఞానాన్ని, అతడు కట్టించిన రాజభవనాన్ని,
2CH 9:4 అతని భోజనబల్ల మీద ఆహారాన్ని, అతని అధికారుల కూర్చునే విధానాన్ని, ప్రత్యేక వస్త్రాలు ధరించి పరిచారం చేసే దాసులను, తమ ప్రత్యేక వస్త్రాల్లో ఉన్న పాత్ర అందించేవారిని, యెహోవా మందిరం వద్ద అతడు అర్పించే దహనబలులను చూసి ఆమె ఆశ్చర్యపడింది.
2CH 9:5 ఆమె రాజుతో, “మీరు సాధించిన వాటి గురించి, మీ జ్ఞానం గురించి నా దేశంలో నేను విన్నది నిజమే.
2CH 9:6 అయితే నేను వచ్చి కళ్ళారా చూసే వరకు వారి మాటలు నమ్మలేకపోయాను. నిజానికి, మీ జ్ఞానం యొక్క గొప్పతనం గురించి సగం కూడా నాకు చెప్పలేదు; నేను విన్నదానికంటే మీరు ఎంతో గొప్పగా ఉన్నారు.
2CH 9:7 మీ ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో! మీ ముందు నిలబడి మీ జ్ఞానాన్ని వింటున్న మీ అధికారులు ఎంత సంతోషంగా ఉంటారో!
2CH 9:8 మీలో ఆనందిస్తూ, మిమ్మల్ని తన సింహాసనం మీద కూర్చోబెట్టిన మీ దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక! ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి, వారిని శాశ్వతంగా సుస్థిరం చేయాలని ఆయనకున్న కోరికను బట్టి, నీతిన్యాయాల ప్రకారం కార్యాలు చేయడానికి యెహోవా మిమ్మల్ని వారిమీద రాజుగా చేశారు” అని అభినందించింది.
2CH 9:9 తర్వాత ఆమె రాజుకు 120 తలాంతుల బంగారం, చాలా సుగంధద్రవ్యాలు, వెలగల రాళ్లు ఇచ్చింది. షేబ రాణి సొలొమోను రాజుకు ఇచ్చిన సుగంధద్రవ్యాలు వంటివి మరెప్పుడూ రాలేదు.
2CH 9:10 (హీరాము సేవకులు, సొలొమోను సేవకులు ఓఫీరు నుండి బంగారం తెచ్చారు; వారు చందనం, దూలాలు, వెలగల రాళ్లు కూడా తెచ్చారు.
2CH 9:11 ఆ చందనం వాడి, వాటితో రాజు యెహోవా మందిరానికి, రాజభవనానికి మెట్లను, సంగీతకారులకు సితారలు వీణలు చేయించాడు. అంతకుముందు అలాంటివి యూదా ప్రదేశంలో ఎన్నడూ కనిపించలేదు.)
2CH 9:12 రాజైన సొలొమోను షేబ రాణి కోరిందంతా, అడిగినదంతా ఇచ్చాడు; ఆమె అతనికి తెచ్చిన వాటికంటే ఎక్కువగా ఆమెకు ఇచ్చాడు. తర్వాత ఆమె తన పరివారంతో తన స్వదేశానికి వెళ్లిపోయింది.
2CH 9:13 సొలొమోనుకు సంవత్సరానికి వచ్చే బంగారం బరువు 666 తలాంతులు.
2CH 9:14 అది వర్తకులు వ్యాపారులు తెచ్చిన ఆదాయం కాక, అరేబియా రాజులందరూ, దేశ అధికారుల నుండి సొలొమోనుకు బంగారం, వెండి తెచ్చారు.
2CH 9:15 రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారంతో రెండువందల పెద్ద డాళ్లను చేయించాడు; ప్రతి డాలుకు ఆరువందల షెకెళ్ళ బంగారం వినియోగించారు.
2CH 9:16 సాగగొట్టిన బంగారంతో అతడు మూడువందల చిన్న డాళ్లు కూడా చేయించాడు. ప్రతి డాలుకు మూడువందల షెకెళ్ళ బంగారం వినియోగించారు. రాజు వాటిని లెబానోను వనం అనే తన రాజభవనంలో ఉంచాడు.
2CH 9:17 తర్వాత రాజు దంతంతో పెద్ద సింహాసనం చేయించి మేలిమి బంగారంతో పొదిగించాడు.
2CH 9:18 సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. దానికి ఒక బంగారు పాదపీఠం కట్టి ఉంది. సింహాసనానికి రెండు వైపులా చేతులు పెట్టుకోవడానికి ఉన్నాయి. వాటి దగ్గర రెండు సింహాలు నిలబడి ఉన్నాయి.
2CH 9:19 ఆరు మెట్లమీద మెట్టుకు రెండు చొప్పున పన్నెండు సింహాలు ఇరువైపుల నిలబడి ఉన్నాయి. అలాంటిది మరే రాజ్యంలో తయారుచేయబడలేదు.
2CH 9:20 రాజైన సొలొమోను పానపాత్రలన్నీ బంగారంతో చేసినవి, లెబానోను వనపు రాజభవనంలో ఉన్న పాత్రలన్నీ మేలిమి బంగారంతో చేసినవి. వెండితో ఒక్కటి కూడా చేయలేదు, ఎందుకంటే సొలొమోను కాలంలో వెండికి విలువలేదు.
2CH 9:21 హీరాము మనుష్యులతో పాటు రాజు ఓడలు సముద్రంలో తర్షీషు వెళ్లి, మూడేళ్ళకు ఒకసారి బంగారం, వెండి, దంతాలు, కోతులను, నెమళ్ళను తీసుకువస్తుండేవి.
2CH 9:22 రాజైన సొలొమోను సంపదలో, జ్ఞానంలో లోకంలోని రాజులందరికంటే గొప్పవాడు.
2CH 9:23 దేవుడు అతనికిచ్చిన జ్ఞానాన్ని వినడానికి భూలోక రాజులందరూ సొలొమోనును చూడాలని కోరారు.
2CH 9:24 ప్రతీ సంవత్సరం అతని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కానుకలుగా వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వస్త్రాలు, యుద్ధాయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలు తెచ్చేవారు.
2CH 9:25 గుర్రాల కోసం, రథాల కోసం రాజైన సొలొమోనుకు నాలుగువేల శాలలు ఉన్నాయి. పన్నెండువేలమంది గుర్రపు రౌతులున్నారు. రథాలలో కొన్నిటిని రౌతులలో కొందరిని వాటికోసం కట్టిన పట్టణాల్లో ఉంచాడు. కొన్ని యెరూషలేములో తన దగ్గర ఉంచాడు.
2CH 9:26 యూఫ్రటీసు నది ఒడ్డునుండి ఫిలిష్తీయుల దేశం వరకు, ఈజిప్టు సరిహద్దు వరకు ఉండే రాజులందరిపై అతడు పరిపాలన చేసేవాడు.
2CH 9:27 రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా చేశాడు, దేవదారు మ్రానులను కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలా అతి విస్తారంగా ఉంచాడు.
2CH 9:28 సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, ఇతర అన్ని దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు.
2CH 9:29 సొలొమోను పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, మొదటి నుండి చివరి వరకు నాతాను ప్రవక్త వ్రాసిన గ్రంథంలో, షిలోనీయుడైన అహీయా ప్రవచన గ్రంథంలో, దీర్ఘదర్శియైన ఇద్దో నెబాతు కుమారుడైన యరొబాము గురించి వ్రాసిన గ్రంథంలో వ్రాయబడలేదా?
2CH 9:30 సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలందరి మీదా నలభై సంవత్సరాలు పరిపాలించాడు.
2CH 9:31 తర్వాత సొలొమోను చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని అతని తండ్రి దావీదు పట్టణంలో సమాధి చేశారు, సొలొమోను తర్వాత అతని కుమారుడు రెహబాము రాజయ్యాడు.
2CH 10:1 రెహబామును రాజుగా చేయడానికి ఇశ్రాయేలు ప్రజలంతా షెకెముకు వెళ్లగా రెహబాము అక్కడికి వెళ్లాడు.
2CH 10:2 రాజైన సొలొమోను దగ్గరి నుండి ఈజిప్టుకు పారిపోయి అక్కడే నివాసం చేస్తున్న నెబాతు కుమారుడైన యరొబాము ఇది విని, ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడు.
2CH 10:3 కాబట్టి ప్రజలు యరొబామును పిలిపించారు. అతడు, ఇశ్రాయేలీయులు అంతా కలిసి రెహబాము దగ్గరకు వెళ్లి అతనితో ఇలా అన్నారు:
2CH 10:4 “మీ తండ్రి మామీద బరువైన కాడిని మోపాడు, అయితే మీ తండ్రి పెట్టిన కఠినమైన దాసత్వాన్ని, మామీద ఉంచిన బరువైన కాడిని తేలిక చేయండి, అప్పుడు మేము మీకు సేవ చేస్తాము.”
2CH 10:5 అందుకు రెహబాము జవాబిస్తూ, “మీరు మూడు రోజులయ్యాక మళ్ళీ రండి” అన్నాడు. కాబట్టి ప్రజలు వెళ్లిపోయారు.
2CH 10:6 అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతనికి సేవలందించిన పెద్దలను సంప్రదించి, “ఈ ప్రజలకు ఎలా జవాబివ్వాలో చెప్పండి” అని అడిగాడు.
2CH 10:7 అందుకు వారు, “ఈ రోజు నీవు ఈ ప్రజల మీద దయచూపి వారిని సంతోషపరచి వారికి అనుకూలంగా జవాబు చెప్తే, వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు” అని చెప్పారు.
2CH 10:8 కాని రెహబాము పెద్దలు ఇచ్చిన సలహాను తిరస్కరించి, తనతో పెరిగి పెద్దవారై తనకు సేవలందిస్తున్న యువకులను సంప్రదించాడు.
2CH 10:9 అతడు వారిని, “మీ సలహా ఏంటి? ‘మీ తండ్రి పెట్టిన కాడిని తేలిక చేయండి’ అని నాతో అంటున్న ఈ ప్రజలకు నేనేమి జవాబివ్వాలి?” అని అడిగాడు.
2CH 10:10 అతనితో పాటు పెరిగి పెద్దవారైన ఆ యువకులు జవాబిస్తూ, “ఈ ప్రజలు నీతో, ‘మీ తండ్రి మామీద బరువైన కాడి ఉంచాడు, కాని మీరు దాన్ని తేలిక చేయండి’ అని అన్నారు. కాని నీవు వారితో, ‘నా తండ్రి నడుముకంటే నా చిటికెన వేలు పెద్దది.
2CH 10:11 నా తండ్రి మీమీద బరువైన కాడి ఉంచాడు; నేను దానిని ఇంకా బరువు చేస్తాను. నా తండ్రి కొరడాలతో కొట్టాడు; నేను తేళ్లతో కొడతాను’ అని చెప్పాలి” అన్నారు.
2CH 10:12 రాజు, “మూడు రోజుల తర్వాత నా దగ్గరకు రండి” అని చెప్పిన ప్రకారం మూడు రోజుల తర్వాత యరొబాము ప్రజలంతా రెహబాము దగ్గరకు వచ్చారు.
2CH 10:13 రెహబాము రాజు పెద్దలు చెప్పిన సలహాను తిరస్కరించి, వారికి కఠినంగా జవాబిచ్చాడు.
2CH 10:14 అతడు యువకులు ఇచ్చిన సలహా ప్రకారం, “నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాడు; నేను మరి ఎక్కువ బరువుగా చేస్తాను. నా తండ్రి కొరడాలతో శిక్షించాడు; నేను తేళ్లతో శిక్షిస్తాను” అని అన్నాడు.
2CH 10:15 రాజు ప్రజల మాట వినిపించుకోలేదు, ఎందుకంటే యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో చెప్పిన మాట నెరవేర్చడానికి ఈ సంఘటనలు దేవుడు ఇలా జరిగించారు.
2CH 10:16 రాజు తమ మాట అంగీకరించలేదని తెలుసుకున్న ఇశ్రాయేలీయులంతా రాజుకు ఇలా జవాబిచ్చారు: “దావీదులో మాకేం భాగం ఉంది, యెష్షయి కుమారునిలో మాకేం స్వాస్థ్యం ఉంది? ఇశ్రాయేలీయులారా, మీ గుడారాలకు వెళ్లిపొండి! దావీదూ, నీ సొంత ఇంటి సంగతి చూసుకో!” కాబట్టి ఇశ్రాయేలీయులంతా గుడారాలకు వెళ్లిపోయారు.
2CH 10:17 కాని యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలీయుల మీద మాత్రం రెహబాము పరిపాలన చేశాడు.
2CH 10:18 రాజైన రెహబాము వెట్టి పనివారి మీద అధికారిగా ఉన్న అదోనిరామును పంపాడు, కాని ఇశ్రాయేలీయులు అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. అయితే రాజైన రెహబాము తప్పించుకుని తన రథమెక్కి యెరూషలేముకు పారిపోయాడు.
2CH 10:19 కాబట్టి నేటికీ ఇశ్రాయేలీయులు దావీదు వంశం మీద తిరుగబడుతూనే ఉన్నారు.
2CH 11:1 రెహబాము యెరూషలేము చేరుకొని యూదా బెన్యామీను గోత్రాల వారినందరిని, అనగా 1,80,000 మంది ఉత్తములైన సైనికులను పోగుచేసుకుని, ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి, రెహబాముకు రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అనుకున్నాడు.
2CH 11:2 అయితే దైవజనుడైన షెమయాకు యెహోవా నుండి ఈ వాక్కు వచ్చింది:
2CH 11:3 “సొలొమోను కుమారుడును యూదా రాజైన రెహబాముతో, యూదా బెన్యామీనులో ఉన్న ఇశ్రాయేలీయులందరితో చెప్పు,
2CH 11:4 ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు మీ తోటి ఇశ్రాయేలీయులతో యుద్ధానికి వెళ్లకండి. ఇది నేను చేస్తున్నది కాబట్టి మీరంతా ఇళ్ళకు వెళ్లండి.’ ” కాబట్టి వారు యెహోవా మాటలు విని, యరొబాముతో యుద్ధానికి వెళ్లడం మాని తిరిగి వెళ్లారు.
2CH 11:5 రెహబాము యెరూషలేములో నివాసముండి యూదాలో రక్షణ కోసం ఈ పట్టణాలను కట్టించాడు:
2CH 11:6 బేత్లెహేము, ఏతాము, తెకోవా,
2CH 11:7 బేత్-సూరు, శోకో, అదుల్లాము,
2CH 11:8 గాతు, మరేషా, జీఫు,
2CH 11:9 అదోరయాము, లాకీషు, అజేకా,
2CH 11:10 జోరహు, అయ్యాలోను, హెబ్రోను. ఇవన్నీ యూదా, బెన్యామీనులో కోటగోడలు గల పట్టణాలు ఉన్నాయి.
2CH 11:11 అతడు వాటి కోటగోడలను బలంగా చేసి, వాటిలో అధిపతులను ఉంచాడు. వారికి ఆహారపదార్థాలు, నూనె, ద్రాక్షరసం సరఫరాచేశాడు.
2CH 11:12 ఆ పట్టణాల్లో డాళ్లను, ఈటెలను ఉంచి వాటిని చాలా బలమైన పట్టణాలుగా చేశాడు. ఈ విధంగా యూదా, బెన్యామీను వారంతా అతని వశంలో ఉండిపోయాయి.
2CH 11:13 ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్న యాజకులు లేవీయులు తమ ప్రాంతాలన్నిటి నుండి వచ్చి రెహబాము దగ్గరకు చేరారు.
2CH 11:14 యరొబాము, అతని కుమారులు లేవీయులను యెహోవా యాజకులుగా ఉండకుండా తిరస్కరించి, అతడు క్షేత్రాలకు మేక దూడ విగ్రహాలకు తన సొంత పూజారులను నియమించినప్పుడు, లేవీయులు తమ పచ్చికబయళ్లను, ఆస్తిని కూడా విడిచిపెట్టి యూదాకు యెరూషలేముకు వచ్చారు.
2CH 11:16 ఇలా ఉండగా, ఇశ్రాయేలులోని అన్ని గోత్రాల్లో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకడానికి తమ హృదయాల్లో నిర్ణయించుకున్న వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి యెరూషలేముకు వెళ్తున్న లేవీయులను వెంబడించారు.
2CH 11:17 వారు యూదా రాజ్యాన్ని బలపరిచారు; ఈ సమయంలో వారు దావీదు సొలొమోనుల మార్గాలను అనుసరించి మూడు సంవత్సరాలు సొలొమోను కుమారుడైన రెహబాముకు మద్ధతు ఇచ్చారు.
2CH 11:18 రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయైన మహలతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమె తల్లి యెష్షయి కుమారుడు ఏలీయాబు కుమార్తెయైన అబీహయిలు.
2CH 11:19 రెహబాముకు యూషు, షెమర్యా, జహము అనే కుమారులు పుట్టారు.
2CH 11:20 ఆ తర్వాత అతడు అబ్షాలోము కుమార్తె మయకాను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి అబీయా, అత్తయి, జీజా, షెలోమీతు పుట్టారు.
2CH 11:21 రెహబాముకు పద్దెనిమిది మంది భార్యలు, అరవైమంది ఉంపుడుగత్తెలు ఉన్నారు. ఇరవై ఎనిమిది మంది కుమారులు, అరవైమంది కుమార్తెలు పుట్టారు. తన భార్యలందరిలో, ఉంపుడుగత్తెలందరిలో అబ్షాలోము కుమార్తె మయకా అంటే రెహబాముకు ఎక్కువ ప్రేమ.
2CH 11:22 మయకా కుమారుడైన అబీయాను రాజుగా చేయాలనుకొని, రెహబాము అతన్ని తన సోదరులపైన ప్రముఖునిగా నాయకునిగా నియమించాడు.
2CH 11:23 రెహబాము వివేకంతో ప్రవర్తిస్తూ, తక్కిన తన కుమారులను యూదాలో, బెన్యామీనులో వేరు ప్రాంతాలకు, కోటగోడలు గల పట్టణాలకు పంపాడు. వారికి విస్తారమైన ధనం ఇచ్చి వారికి అనేక పెళ్ళిళ్ళు చేశాడు.
2CH 12:1 రెహబాము రాజ్యం స్థిరపడి బలపడిన తర్వాత అతడు, ఇశ్రాయేలీయులంతా యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు.
2CH 12:2 వారు యెహోవా పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు కాబట్టి, రాజైన రెహబాము పాలనలోని అయిదవ సంవత్సరం ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీద దాడి చేశాడు.
2CH 12:3 అతనితో పాటు 1,200 రథాలు, 60,000 మంది రౌతులు, లెక్కలేనంత మంది లిబియానీయులు సుక్కీయులు కూషీయులు ఈజిప్టు నుండి వచ్చారు.
2CH 12:4 షీషకు యూదా దేశంలో కోటగోడలు గల పట్టణాలను పట్టుకుని, తర్వాత యెరూషలేము వరకు వచ్చాడు.
2CH 12:5 అప్పుడు షెమయా ప్రవక్త రెహబాము దగ్గరకు, షీషకుకు భయపడి యెరూషలేముకు వచ్చి చేరిన యూదా అధిపతుల దగ్గరకు వచ్చి వారితో, “యెహోవా చెప్పేదేమిటంటే, మీరు నన్ను విడిచిపెట్టారు. కాబట్టి నేను మిమ్మల్ని షీషకు చేతికి అప్పగించాను” అని చెప్పాడు.
2CH 12:6 రాజు ఇశ్రాయేలు అధికారులు తమను తాము తగ్గించుకొని, “యెహోవా న్యాయం గలవాడు” అని ఒప్పుకున్నారు.
2CH 12:7 వారు అలా తగ్గించుకోవడం యెహోవా చూశారు. కాబట్టి యెహోవా నుండి ఈ వాక్కు షెమయాకు వచ్చింది, “వారు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చెయ్యను. త్వరలో వారిని శిక్షిస్తాను. షీషకు ద్వారా నా కోపాగ్ని యెరూషలేము మీద కుమ్మరించను.
2CH 12:8 కాని, నాకు సేవచేయడంలో ఇతర దేశాల రాజులకు సేవచేయడంలో ఉన్న తేడా వారు గ్రహించాలి కాబట్టి వారు షీషకుకు దాసులవుతారు.”
2CH 12:9 ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చినప్పుడు, అతడు యెహోవా మందిరంలోని నిధిని, రాజభవనంలో నిధిని దోచుకున్నాడు. అతడు సమస్తాన్ని, సొలొమోను చేయించిన బంగారు డాళ్లతో పాటు తీసుకెళ్లాడు.
2CH 12:10 కాబట్టి రాజైన రెహబాము ఆ డాళ్లకు బదులు ఇత్తడి డాళ్ళను చేయించి వాటిని రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల అధిపతులకు అప్పగించాడు.
2CH 12:11 రాజు యెహోవా ఆలయానికి వచ్చినప్పుడెల్లా భటులు ఆ డాళ్లు మోసుకెళ్లేవారు. తర్వాత వాటిని కాపలా గదిలో ఉంచేవారు.
2CH 12:12 రెహబాము తనను తగ్గించుకున్నందుకు, యూదాలో కొన్ని మంచి విషయాలు కనిపించినందుకు యెహోవా అతన్ని పూర్తిగా నాశనం చేయక, అతని మీద నుండి తన కోపం మళ్ళించుకున్నాడు.
2CH 12:13 రాజైన రెహబాము యెరూషలేములో సుస్థిరంగా ఉండి రాజుగా పరిపాలిస్తూ వచ్చాడు. అతడు రాజైనప్పుడు అతని వయస్సు నలభై ఒక సంవత్సరాలు. తన నామం ఉంచడానికి యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి ఎన్నుకున్న పట్టణమైన యెరూషలేములో అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు, రెహబాము తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు.
2CH 12:14 రెహబాము యెహోవాను వెదకడం మీద మనస్సు నిలుపుకోలేదు, కాబట్టి చెడుగా ప్రవర్తించేవాడు.
2CH 12:15 రెహబాము పరిపాలనకు సంబంధించిన విషయాలు, మొదటి నుండి చివరి వరకు షెమయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో దీర్ఘదర్శియైన ఇద్దో వ్రాసిన వంశవృక్షాల విషయమైన గ్రంథంలో వ్రాయబడలేదా? రెహబాముకు యరొబాముకు మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉండేది.
2CH 12:16 రెహబాము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని తన పూర్వికుల దగ్గర సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు అబీయా రాజయ్యాడు.
2CH 13:1 యరొబాము పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో అబీయా యూదా దేశానికి రాజయ్యాడు.
2CH 13:2 అతడు యెరూషలేములో మూడేళ్ళు పరిపాలించాడు. అతని తల్లి పేరు మయకా; ఈమె గిబియా పట్టణం వాడైన ఊరియేలు కుమార్తె. అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది.
2CH 13:3 అబీయా నాలుగు లక్షలమంది సమర్థులైన సైనికులతో యుద్ధానికి వెళ్తే, యరొబాము ఎనిమిది లక్షలమంది సమర్థులైన సైనికులతో అతనికి వ్యతిరేకంగా యుద్ధ వ్యూహం రచించాడు.
2CH 13:4 అబీయా ఎఫ్రాయిం కొండ సీమలో ఉన్న సెమరాయిము కొండమీద నిలబడి ఇలా అన్నాడు, “యరొబామా, సర్వ ఇశ్రాయేలు ప్రజలారా, నేను చెప్పేది వినండి!
2CH 13:5 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉప్పు ఒడంబడిక చేసి, ఇశ్రాయేలు రాజ్యపరిపాలనను శాశ్వతంగా దావీదు వారసులకు ఇచ్చాడు. ఈ సంగతి మీకు తెలియదా?
2CH 13:6 అయినాసరే దావీదు కుమారుడైన సొలొమోను సేవకుడును నెబాతు కుమారుడునైన యరొబాము తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు.
2CH 13:7 సొలొమోను కుమారుడైన రెహబాము యువకుడై నిర్ణయాలు తీసుకోలేనివాడై, వారిని ఎదిరించే శక్తి లేనివానిగా ఉన్నప్పుడు, కొందరు పనికిమాలిన పోకిరీలు అతని చుట్టూ చేరి, అతని మీదికి యుద్ధానికి వెళ్లారు.
2CH 13:8 “ఇక ఇప్పుడేమో దావీదు వారసుల చేతుల్లో ఉన్న యెహోవా రాజ్యాన్ని ఎదిరించాలని మీరు ఆలోచిస్తున్నారు. నిజానికి మీరు మహా సైన్యంగా ఉన్నారు. మీతో యరొబాము మీకు దేవుళ్ళుగా చేయించిన బంగారు దూడలు ఉన్నాయి.
2CH 13:9 అయితే మీరు అహరోను కుమారులైన యెహోవా యాజకులను, లేవీయులను వెళ్లగొట్టి, ఇతర దేశాల ప్రజల్లా మీ సొంత యాజకులను నియమించుకోలేదా? ఒక కోడెతో ఏడు పొట్టేళ్లతో తనను తాను పవిత్రం చేసుకోవడానికి వచ్చిన ప్రతివాడు దేవుళ్ళు కాని వాటికి యాజకులవుతున్నారు.
2CH 13:10 “మా విషయానికొస్తే యెహోవాయే మా దేవుడు, మేము ఆయనను విడిచిపెట్టలేదు. యెహోవాకు సేవచేసే యాజకులు అహరోను కుమారులు; లేవీయులు వారికి సహాయం చేస్తారు.
2CH 13:11 ప్రతి ఉదయం సాయంత్రం వారు యెహోవాకు దహనబలులు అర్పిస్తారు, పరిమళ ధూపం వేస్తారు. వారు ఆచారం ప్రకారం వారు పవిత్రమైన బల్లపై రొట్టెలు పెట్టి, ప్రతి సాయంత్రం బంగారు దీపస్తంభంపై దీపాలను వెలిగిస్తారు. మేము మా దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటిస్తున్నాము. కాని మీరు ఆయనను విడిచిపెట్టారు.
2CH 13:12 దేవుడు మాతో ఉన్నారు; ఆయన మా నాయకుడు. ఆయన యాజకులు తమ బూరలతో మీమీద యుద్ధనాదం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వికుల దేవుడైన యెహోవాతో పోరాడకండి, ఎందుకంటే మీరు గెలువలేరు.”
2CH 13:13 కాని యరొబాము కొంత సైన్యాన్ని వెనుకకు పంపాడు. అతడు యూదా వారికి ముందు ఉన్నప్పుడు మాటుగాండ్రు వారి వెనుక ఉండేలా చేశాడు.
2CH 13:14 యూదా వారు, తాము ముందు వెనుక ముట్టడి చేయబడ్డామని తెలుసుకుని యెహోవాకు మొరపెట్టారు. యాజకులు తమ బూరలు ఊదగా,
2CH 13:15 యూదా వారు యుద్ధనాదం చేశారు. వారు చేసిన యుద్ధనాదం వినబడడంతోనే దేవుడు అబీయా ఎదుట యూదా వారి ఎదుట యరొబామును ఇశ్రాయేలు సైన్యమంతటిని తరిమివేశారు.
2CH 13:16 ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయారు. దేవుడు ఇశ్రాయేలు వారిని యూదా వారి చేతులకు అప్పగించారు.
2CH 13:17 అబీయా అతని సేనలు వారికి భారీ ప్రాణనష్టం కలిగించగా ఇశ్రాయేలీయుల సమర్థులలో అయిదు లక్షలమంది సైనికులు మరణించారు.
2CH 13:18 ఈ విధంగా ఇశ్రాయేలీయులు అణచివేయబడ్డారు. యూదా ప్రజలు తమ పూర్వికుల దేవుడైన యెహోవాపై ఆధారపడ్డారు కాబట్టి వారు విజయం సాధించారు.
2CH 13:19 అబీయా యరొబామును వెంటాడి, అతని వశంలో నుండి బేతేలును దాని పట్టణాలను, యెషానాను ఎఫ్రోనునూ వాటి చుట్టూ ఉన్న గ్రామాలను స్వాధీనపరచుకున్నాడు.
2CH 13:20 అబీయా రోజుల్లో యరొబాము మళ్ళీ బలపడలేదు. యెహోవా అతన్ని మొత్తాడు కాబట్టి అతడు చనిపోయాడు.
2CH 13:21 కానీ అబీయా బలాభివృద్ధి చెందాడు. అతడు పద్నాలుగు మంది స్త్రీలను పెళ్ళి చేసుకున్నాడు; అతనికి ఇరవై రెండు మంది కుమారులు, పదహారు మంది కుమార్తెలు.
2CH 13:22 అబీయా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు ఏమి చేశాడో ఏమి చెప్పాడో, అవన్నీ ప్రవక్తయైన ఇద్దో రచించిన వ్యాఖ్యాన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి.
2CH 14:1 అబీయా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు ఆసా రాజయ్యాడు. అతని రోజుల్లో దేశం పది సంవత్సరాలు ప్రశాంతంగా ఉండింది.
2CH 14:2 ఆసా యెహోవా దృష్టిలో మంచిది, సరియైనది చేశాడు.
2CH 14:3 అతడు ఇతర దేవుళ్ళ బలిపీఠాలను, క్షేత్రాలను తొలగించాడు. అషేరా దేవి స్తంభాలను పడగొట్టించాడు.
2CH 14:4 అతడు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వారు తెలుసుకొని, ఆయన నియమాలను ఆజ్ఞలను అనుసరించాలని యూదా ప్రజలకు ఆజ్ఞాపించాడు.
2CH 14:5 అతడు యూదాలోని ప్రతి పట్టణంలోని ఉన్నత క్షేత్రాలను, ధూపవేదికలను తొలగించాడు. అతని పరిపాలనలో దేశం ప్రశాంతంగా ఉంది.
2CH 14:6 దేశం ప్రశాంతంగా ఉన్నప్పుడు అతడు యూదాలో కోటగోడలు గల పట్టణాలు కట్టించాడు. యెహోవా అతనికి విశ్రాంతి ఇవ్వగా ఆ సంవత్సరాల్లో అతనితో ఎవరూ యుద్ధం చేయలేదు.
2CH 14:7 ఆసా యూదా వారితో, “మనం యెహోవాను వెదికి అనుసరించాం కాబట్టి ఈ దేశం ఇంకా మన స్వాధీనంలోనే ఉంది. ఆయనను వెదకి అనుసరించాం కాబట్టి మనం ఈ పట్టణాలను కట్టి, వాటికి చుట్టూ గోడలు, గోపురాలు, ద్వారాలు, అడ్డగడియలు అమర్చుదాం” అన్నాడు. అలాగే వారు పట్టణాలను కట్టి వర్థిల్లారు.
2CH 14:8 ఆసాకు యూదా వారిలో 3,00,000 మంది సైనికులు ఉన్నారు. వారికి పెద్ద డాళ్లు ఈటెలు ఉన్నాయి. అతనికి బెన్యామీనీయులలో 2,80,000 మంది సైనికులున్నారు. వారికి చిన్న డాళ్లు, విల్లులు ఉన్నాయి. వీరంతా పోరాట యోధులు.
2CH 14:9 తర్వాత కూషు వాడైన జెరహు వేవేల సైన్యంతో, మూడువందల రథాలతో వారిపైకి దండెత్తి మరేషా పట్టణం వరకు వచ్చాడు.
2CH 14:10 ఆసా అతన్ని ఎదుర్కోడానికి వెళ్లాడు. వారు మరేషాకు దగ్గరలో ఉన్న జెపాతా లోయలో బారులు తీరారు.
2CH 14:11 అప్పుడు ఆసా యెహోవాకు, “యెహోవా, బలవంతులతో యుద్ధంలో బలహీనులకు సహాయం చేయడానికి మీరు తప్ప ఇంకెవరు లేరు. యెహోవా, మా దేవా! మేము మీమీద నమ్మకం పెట్టుకున్నాము. మీ పేర మేము ఈ మహా సైన్యాన్ని ఎదిరించడానికి వచ్చాం కాబట్టి సాయం చేయండి. యెహోవా మీరే మా దేవుడు. మానవమాత్రులను మీకు వ్యతిరేకంగా నిలువనీయకండి” అని ప్రార్థన చేశాడు.
2CH 14:12 ఆసా ఎదుట యూదా వారి ఎదుట యెహోవా కూషువారిని మొత్తగా వారు పారిపోయారు.
2CH 14:13 ఆసా, అతనితో ఉన్నవారు వారిని గెరారు వరకు వెంటాడారు. కూషు వారిలో చాలామంది కూలారు, కాబట్టి వారు మళ్ళీ బలాన్ని కూడగట్టుకోలేక యెహోవా ఎదుట ఆయన సైన్యం ఎదుట నుండి పారిపోయారు. యూదా వారు అధిక మొత్తంలో దోపుడుసొమ్ము దోచుకున్నారు.
2CH 14:14 గెరారు చుట్టూరా ఉన్న గ్రామాలను యెహోవా భయం ఆవరించింది కాబట్టి యూదా వారు వాటన్నిటిని ఓడించి దోచుకొని, చాలా దోపుడుసొమ్ము తీసుకున్నారు.
2CH 14:15 వారు పశువుల కాపరుల గుడారాలపై కూడా దాడి చేశారు. అంతేకాదు గొర్రెలు, మేకలు ఒంటెల మందలను కూడా తీసుకెళ్లారు. తర్వాత వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు.
2CH 15:1 దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి దిగిరాగా,
2CH 15:2 అతడు ఆసాను కలుసుకోడానికి వెళ్లి అతనితో ఇలా చెప్పాడు, “ఆసా, సర్వ యూదా ప్రజలారా, బెన్యామీనీయులారా, నేను చెప్పేది వినండి. మీరు యెహోవాతో ఉంటే ఆయన మీతో ఉంటారు. మీరు ఆయనను వెదికితే, ఆయన మీకు కనిపిస్తారు. ఒకవేళ మీరు ఆయనను విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతారు.
2CH 15:3 ఎందుకంటే చాలా కాలం వరకు ఇశ్రాయేలు ప్రజలు నిజమైన దేవుడు గాని, బోధించడానికి యాజకులు గాని, ధర్మశాస్త్రం గాని లేకుండానే గడిపారు.
2CH 15:4 అయితే తమ బాధలో వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయనను వెదికారు. ఆయన వారికి దొరికారు.
2CH 15:5 ఆ రోజుల్లో ప్రయాణం చేయడం క్షేమం కాదు, ఎందుకంటే దేశాల వాసులంతా గొప్ప కలవరంలో ఉన్నారు.
2CH 15:6 ఒక దేశం మరొక దేశాన్ని, ఒక పట్టణం మరొక నగరాన్ని నాశనం చేసుకుంటున్నాయి, ఎందుకంటే దేవుడు వారిని అన్ని రకాల బాధలతో ఇబ్బంది పెడుతున్నారు.
2CH 15:7 అయితే మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, ఆశ వదులుకోవద్దు, ఎందుకంటే మీ పనికి ప్రతిఫలం లభిస్తుంది.”
2CH 15:8 ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా విని ధైర్యం తెచ్చుకున్నాడు. యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి, ఎఫ్రాయిం కొండ సీమలో తాను వశం చేసుకున్న పట్టణాల్లో ఉన్న విగ్రహాలను, అసహ్యమైన వాటన్నిటిని తీసివేశాడు. యెహోవా ఆలయ ఆవరణంలో ఉన్న బలిపీఠాలన్ని మరమ్మత్తు చేయించాడు.
2CH 15:9 అతని దేవుడైన యెహోవా ఆసాకు తోడుగా ఉండడం చూసి పెద్ద సంఖ్యలో ఇశ్రాయేలు రాజ్యాన్ని విడచి అతని పక్షం చేరారు. ఆసా తన దగ్గరకు యూదా వారందరినీ బెన్యామీను వారందరినీ వారి మధ్య నివసిస్తున్న ఎఫ్రాయిం, మనష్షే, షిమ్యోను గోత్రాల వారిని సమకూర్చాడు.
2CH 15:10 ఆసా పరిపాలిస్తున్న పదిహేనో సంవత్సరం మూడవ నెల వారు యెరూషలేములో సమకూడారు.
2CH 15:11 ఆ రోజు వారు యెహోవాకు 700 ఎద్దులు, 7,000 గొర్రెలు బలిగా అర్పించారు. ఇవన్నీ వారు దోపిడిగా తీసుకువచ్చిన వాటిలోనివి.
2CH 15:12 వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు మనస్పూర్తిగా హృదయపూర్వకంగా వెదికి అనుసరిస్తామని ఒడంబడిక చేశారు.
2CH 15:13 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకనివారు స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా చిన్నలైనా, వారికి మరణశిక్ష విధించాలని నిర్ణయించారు.
2CH 15:14 వారు కంఠమెత్తి పెద్దగా కేకలువేస్తూ బూరలు, కొమ్ములు ఊదుతూ, యెహోవా సమక్షంలో ప్రమాణం చేశారు.
2CH 15:15 ఆ విధంగా యూదా వారంతా హృదయమంతటితో ప్రమాణం చేశారు కాబట్టి ఆ ప్రమాణం విషయం అందరు సంతోషించారు. వారు మనస్పూర్తిగా యెహోవాను వెదికారు. ఆయన వీరికి దొరికాడు. అన్ని దిశలా వారికి నెమ్మదిని ఇచ్చారు.
2CH 15:16 రాజైన ఆసా అతని అవ్వ మయకా అషేరాను పూజించడానికి ఒక అసహ్యమైన ప్రతిమను చేయించింది కాబట్టి ఆమెను రాజమాత స్థానం నుండి తొలగించాడు. ఆసా ఆ ప్రతిమను కూలగొట్టి విరగ్గొట్టి, కిద్రోను లోయలో దానిని తగలబెట్టాడు.
2CH 15:17 అతడు ఇశ్రాయేలు నుండి క్షేత్రాలను మాత్రం తొలగించనప్పటికీ, ఆసా బ్రతికిన కాలమంతా యెహోవాకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు.
2CH 15:18 అతడు, తాను తన తండ్రి ప్రతిష్ఠించిన బంగారం వెండి పాత్రలను దేవుని ఆలయానికి తెచ్చాడు.
2CH 15:19 ఆసా పరిపాలనలో ముప్పై అయిదవ సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదు.
2CH 16:1 ఆసా పరిపాలిస్తున్న ముప్పై ఆరవ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీదికి వెళ్లి యూదా రాజైన ఆసా సరిహద్దులోనికి రాకపోకలు లేకుండ రామా పట్టణాన్ని పటిష్టం చేశాడు.
2CH 16:2 అప్పుడు ఆసా యెహోవా మందిరంలో, తన భవనంలో ఉన్న ఖజానాల్లో నుండి వెండి బంగారాలు తీసి దమస్కులో పరిపాలిస్తున్న సిరియా రాజైన బెన్-హదదుకు పంపాడు.
2CH 16:3 అతడు, “నా తండ్రికి నీ తండ్రికి మధ్య ఒప్పందం ఉన్నట్లు, నీకు నాకు మధ్య ఒప్పందం ఉండాలి. చూడు, నేను వెండి బంగారాలను పంపిస్తున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీ ఒప్పందం తెంచుకో” అని అన్నాడు.
2CH 16:4 రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. వారు ఈయోను, దాను, ఆబేల్-మయీము, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాలలోని కొట్లను జయించారు.
2CH 16:5 బయెషా ఈ వార్త విని రామాను కట్టించడం మానేసి తన పనిని నిలిపి వేశాడు.
2CH 16:6 అప్పుడు రాజైన ఆసా యూదా మనుష్యులందరిని సమకూర్చాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో ఆసా గెబాను, మిస్పాను కట్టించాడు.
2CH 16:7 ఆ సమయంలో హనానీ అనే దీర్ఘదర్శి యూదా రాజైన ఆసా దగ్గరకు వచ్చి అతనితో ఇలా అన్నాడు, “నీవు నీ దేవుడు యెహోవాపై ఆధారపడక సిరియా రాజు ఆరాముపై ఆధారపడ్డావు. అందుచేతే అరాము రాజు సైన్యం నీ చేతిలో పడకుండా తప్పించుకుంది.
2CH 16:8 కూషీయులు లిబియానీయులు మహా సైన్యంగా చాలా రథాలలో రౌతులతో వచ్చారు గదా! అయినా, నీవు యెహోవాపై ఆధారపడినందున ఆయన వారిని నీ వశం చేశాడు.
2CH 16:9 తన పట్ల యథార్థంగా హృదయం ఉన్నవారికి సాయం చేయడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఆ విషయంలో నీవు తెలివితక్కువగా ప్రవర్తించావు. ఇకనుండి నీకు ఎప్పుడూ యుద్ధాలే.”
2CH 16:10 ఆసాకు ఆ దీర్ఘదర్శిమీద కోపం వచ్చి అతని మీద మండిపడి ఖైదులో వేశాడు. ఆ సమయంలో ప్రజల్లో కొందరిని ఆసా అణచివేశాడు.
2CH 16:11 ఆసా పరిపాలన గురించిన విషయాలు మొదటి నుండి చివరి వరకు యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.
2CH 16:12 ఆసా పరిపాలిస్తున్న ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అతనికి పాదాల్లో జబ్బు పుట్టింది. దానివలన అతడు చాలా బాధ పడినా దాని గురించి కూడా యెహోవాను వెదకలేదు గాని వైద్యులను సహాయం కోరాడు.
2CH 16:13 తాను పరిపాలిస్తున్న నలభై ఒకటో సంవత్సరంలో ఆసా నిద్రపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు.
2CH 16:14 తన కోసం అతడు దావీదు పట్టణంలో తొలిపించుకొన్న సమాధిలో ప్రజలు అతన్ని పాతిపెట్టారు. సుగంధ ద్రవ్యాలతో, రకరకాల పరిమళాలతో నిండిన పాడెమీద అతన్ని ఉంచి, అతని అంత్యక్రియలు ఘనంగా జరిగించారు.
2CH 17:1 ఆసా స్థానంలో అతని కుమారుడు యెహోషాపాతు రాజయ్యాడు. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తనను తాను బలపరచుకున్నాడు.
2CH 17:2 కోటగోడలు గల యూదా పట్టణాలన్నిటిలో అతడు సైన్యాలను ఉంచాడు. యూదాలోనూ, తన తండ్రి ఆసా పట్టుకున్న ఎఫ్రాయిం ప్రాంత పట్టణాల్లోనూ రక్షక దళాలను ఏర్పాటు చేశాడు.
2CH 17:3 యెహోషాపాతు తన పితరుడైన దావీదు ఆరంభ దినాల్లో అనుసరించిన విధానాలను అనుసరించాడు. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోషాపాతు బయలును అనుసరించలేదు.
2CH 17:4 అతడు ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు చేయక తన తండ్రి యొక్క దేవున్ని వెదికి, ఆయన ఆజ్ఞలు అనుసరించాడు.
2CH 17:5 కాబట్టి యెహోవా అతని ఆధీనంలో రాజ్యాన్ని సుస్థిరం చేశారు. యూదా ప్రజలంతా యెహోషాపాతుకు పన్ను చెల్లిస్తూ ఉండేవారు కాబట్టి అతనికి ఎంతో గౌరవం, ఐశ్వర్యం చేకూరాయి.
2CH 17:6 యెహోవా మార్గాల్లో నడవాలని అతడు తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. అతడు క్షేత్రాలను అషేరా స్తంభాలను యూదా దేశంలో లేకుండా తొలగించాడు.
2CH 17:7 తాను పరిపాలిస్తున్న మూడవ సంవత్సరంలో యూదా పట్టణాల్లో ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతడు బెన్-హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా అనే నాయకులను పంపాడు.
2CH 17:8 వారితో పాటు షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబీయా, టోబ్-అదోనియా అనే లేవీయులను యాజకులైన ఎలీషామా, యెహోరాము అనే వారిని పంపాడు.
2CH 17:9 వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చేతపట్టుకుని యూదా అంతటా బోధించారు. వారు యూదాపట్టణాలన్నిటికి సంచారం చేస్తూ ప్రజలకు బోధించారు.
2CH 17:10 యూదా చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నిటినీ యెహోవా భయం ఆవరించింది కాబట్టి అవి యెహోషాపాతుపై యుద్ధం చేయలేదు.
2CH 17:11 ఫిలిష్తీయులలో కొంతమంది యెహోషాపాతుకు కానుకలు, పన్నుగా వెండిని తెచ్చేవారు. అరబీయులు అతనికి 7,700 పొట్టేళ్లు, 7,700 మేకపోతులు తెచ్చేవారు.
2CH 17:12 యెహోషాపాతు అధికంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. అతడు యూదాలో కోటలు, సామాగ్రి నిల్వజేసే గిడ్డంగుల పట్టణాలు కట్టించాడు.
2CH 17:13 యూదా పట్టణాల్లో అతనికి చాలా సంపద చేకూరింది. అతని దగ్గర యెరూషలేములో అనుభవం కలిగిన పోరాట వీరులున్నారు.
2CH 17:14 వారి పూర్వికుల వంశాల ప్రకారం వారి సంఖ్య ఇలా ఉంది: యూదా గోత్రాల్లో వేయిమందికి అధిపతులుగా ఉన్నవారికి అద్నా అనేవాడు సేనాధిపతి: అతనితో 3,00,000 మంది యుద్ధవీరులున్నారు,
2CH 17:15 తర్వాత సేనాధిపతియైన యెహోహనాను, అతనితో 2,80,000 మంది ఉన్నారు,
2CH 17:16 తర్వాత, జిఖ్రీ కుమారుడు అమస్యా. అతడు యెహోవాకు హృదయపూర్వకంగా సమర్పించుకున్నవాడు. అతనితో 2,00,000 మంది యుద్ధవీరులున్నారు.
2CH 17:17 బెన్యామీను గోత్రంలో: ఎల్యాదా అనే యుద్ధవీరుడు ఉండేవాడు. అతనితో విల్లు, డాలు పట్టుకునేవారు 2,00,000 మంది ఉన్నారు,
2CH 17:18 తర్వాత, యెహోజాబాదు, అతనితో 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులున్నారు.
2CH 17:19 వీరంతా రాజుకు కొలువు చేసినవారు. వీరు కాక రాజు యూదా అంతటా కోటగోడలు గల పట్టణాల్లో కొంతమందిని ఉంచాడు.
2CH 18:1 యెహోషాపాతుకు ఎంతో ఐశ్వర్యం, ఘనత ఉన్నాయి. అతడు అహాబుతో వియ్యమందాడు.
2CH 18:2 కొన్ని సంవత్సరాల తర్వాత అతడు సమరయలో అహాబును సందర్శించడానికి వెళ్లాడు. అహాబు అతని కోసం, అతని వెంట వచ్చిన వారి కోసం చాలా గొర్రెలు, పశువులు వధించి, ఆపైన రామోత్ గిలాదుపై దాడి చేయమని అతన్ని ప్రేరేపించాడు.
2CH 18:3 ఇశ్రాయేలు రాజైన అహాబు యూదా రాజైన యెహోషాపాతును, “నాతో కూడా రామోత్ గిలాదు మీదికి వస్తావా?” అని అడిగాడు. అందుకు యెహోషాపాతు, “నేను మీవాన్ని, నా ప్రజలు మీ ప్రజలు, నా గుర్రాలు మీ గుర్రాలు; మేము మీతో యుద్ధంలో పాల్గొంటాం” అని జవాబిచ్చాడు.
2CH 18:4 అయితే యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, “మొదట యెహోవా సలహాను తీసుకుందాం” అని కూడా అన్నాడు.
2CH 18:5 కాబట్టి ఇశ్రాయేలు రాజు సుమారు నాలుగువందలమంది ప్రవక్తలను పిలిపించి, “నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా? వద్దా?” అని వారిని అడిగాడు. “వెళ్లండి! దానిని యెహోవా రాజు వశం చేస్తారు” అని వారు జవాబిచ్చారు.
2CH 18:6 అయితే యెహోషాపాతు, “మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త ఒక్కడు కూడా ఇక్కడ లేడా?” అని అడిగాడు.
2CH 18:7 అందుకు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “ఇంకొక ప్రవక్త ఉన్నాడు, అతని ద్వారా యెహోవా దగ్గర విచారణ చేయవచ్చు. కాని, నాకు అతడంటే అయిష్టం, ఎందుకంటే అతడు నా గురించి ఎప్పుడూ మంచిని ప్రవచించడు, ఎప్పుడూ చెడ్డగానే ప్రవచిస్తాడు. అతడు ఇమ్లా కుమారుడైన మీకాయా” అని చెప్పాడు. అందుకు యెహోషాపాతు, “రాజా మీరు అలా అనవద్దు” అన్నాడు.
2CH 18:8 అప్పుడు ఇశ్రాయేలు రాజు తన అధికారులలో ఒకరిని పిలిచి, “వెంటనే వెళ్లి, ఇమ్లా కుమారుడైన మీకాయాను తీసుకురా” అని చెప్పాడు.
2CH 18:9 ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకొని సమరయ నగర ద్వారం దగ్గర ఉన్న నూర్పిడి కళ్ళం దగ్గరలో ప్రవక్తలంతా ప్రవచిస్తూ ఉండగా, తమ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు.
2CH 18:10 అప్పుడు కెనాన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేసుకుని వచ్చి, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘అరామీయులు నాశనమయ్యే వరకు మీరు వీటితో వారిని పొడుస్తారు’ ” అని చెప్పాడు.
2CH 18:11 ఇతర ప్రవక్తలంతా కూడా అదే విషయాన్ని ప్రవచించారు. “రామోత్ గిలాదు మీద దాడి చేయండి విజయం పొందండి, ఎందుకంటే యెహోవా దాన్ని రాజు చేతికి అప్పగిస్తారు” అని వారన్నారు.
2CH 18:12 మీకాయాను పిలువడానికి వెళ్లిన దూత మీకాయాతో, “చూడు, ఇతర ప్రవక్తలందరు రాజుకు విజయం కలుగుతుందని చెప్తున్నారు. వారి మాటతో నీ మాట ఏకమై, అనుకూలంగా పలుకాలి” అన్నాడు.
2CH 18:13 అయితే మీకాయా, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నా, యెహోవా నాకు చెప్పేది మాత్రమే నేను అతనికి చెప్పగలను” అని అన్నాడు.
2CH 18:14 అతడు వచ్చినప్పుడు, రాజు అతన్ని, “మీకాయా, మేము రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా, వెళ్లొద్దా?” అని అడిగాడు. అందుకతడు, “దాడి చేయండి విజయం పొందండి, ఎందుకంటే వారు మీ చేతికి అప్పగించబడతారు” అని జవాబిచ్చాడు.
2CH 18:15 రాజు అతనితో, “యెహోవా పేరిట నాకు సత్యమే చెప్పమని నేనెన్నిసార్లు నీ చేత ప్రమాణం చేయించాలి?” అని అన్నాడు.
2CH 18:16 అప్పుడు మీకాయా జవాబిస్తూ, “ఇశ్రాయేలీయులందరు కాపరి లేని గొర్రెల్లా కొండలమీద చెదిరిపోయినట్లు దర్శనం చూశాను. ‘ఈ ప్రజలకు యజమాని లేడు. ప్రతి ఒక్కరు సమాధానంగా ఇంటికి వెళ్లాలి’ అని యెహోవా చెప్తున్నారు” అన్నాడు.
2CH 18:17 ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “నా గురించి ఇతడు ఎన్నడు మంచిని ప్రవచించడు, చెడు మాత్రమే ప్రవచిస్తాడు అని మీతో చెప్పలేదా?” అని అన్నాడు.
2CH 18:18 మీకాయా ఇంకా ఇలా అన్నాడు, “కాబట్టి యెహోవా మాట వినండి: యెహోవా తన సింహాసనంపై కూర్చుని ఉండగా తన కుడి ఎడమలు పరలోక సమూహాలన్ని నిలబడి ఉండడం నేను చూశాను.
2CH 18:19 అప్పుడు యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్ గిలాదు మీదికి వెళ్లి అక్కడ చచ్చేలా అతన్ని ఎవరు ప్రలోభపెడతారు?’ అని అడిగారు. “ఒకడు ఒక విధంగా ఇంకొకడు ఇంకొక విధంగా చెప్పారు.
2CH 18:20 చివరికి ఒక ఆత్మ ముందుకు వచ్చి, యెహోవా సమక్షంలో నిలబడి, ‘నేను అతన్ని ప్రలోభపెడతాను’ అన్నాడు. “ ‘ఎలా?’ అని యెహోవా అడిగారు.
2CH 18:21 “ ‘నేను వెళ్లి అతని ప్రవక్తలందరి నోట మోసగించే ఆత్మగా ఉంటాను’ అని అతడు చెప్పాడు. “అందుకు యెహోవా, ‘నీవు అతన్ని ప్రలోభపెట్టడంలో విజయం సాధిస్తావు, వెళ్లు అలాగే చేయి’ అన్నారు.
2CH 18:22 “కాబట్టి యెహోవా నీ ఈ ప్రవక్తల నోట మోసపరచే ఆత్మను ఉంచారు. యెహోవా ఈ విపత్తును నీకోసం నిర్ణయించారు.”
2CH 18:23 అప్పుడు కెనాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి మీకాయాను చెంపమీద కొట్టాడు. “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా నుండి వెళ్లినప్పుడు ఏ మార్గాన వెళ్లాడు?” అని అతడు అడిగాడు.
2CH 18:24 మీకాయా జవాబిస్తూ, “నీవు దాక్కోడానికి లోపలి గదిలోకి చొరబడే రోజున నీవు తెలుసుకుంటావు” అన్నాడు.
2CH 18:25 అప్పుడు ఇశ్రాయేలు రాజు, “మీకాయాను నగర పాలకుడైన ఆమోను దగ్గరకు, అలాగే రాకుమారుడైన యోవాషు దగ్గరకు తీసుకెళ్లి,
2CH 18:26 వారితో ఇలా చెప్పండి, ‘రాజు ఇలా అన్నారు: నేను క్షేమంగా తిరిగి వచ్చేవరకు, ఇతన్ని చెరసాలలో ఉంచి అతనికి రొట్టె, నీరు తప్ప ఏమి ఇవ్వకండి’ ” అని ఆదేశించాడు.
2CH 18:27 మీకాయా, “ఒకవేళ మీరు క్షేమంగా వస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడలేదని అర్థం. ప్రజలారా, మీరంతా నా మాట గుర్తు పెట్టుకోండి!” అని ప్రకటించాడు.
2CH 18:28 కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్ గిలాదు మీదికి వెళ్లారు.
2CH 18:29 ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “యుద్ధంలో ప్రవేశించేటప్పుడు నేను మారువేషంలో యుద్ధానికి వెళ్తాను, మీరు మాత్రం మీ రాజవస్త్రాలు ధరించుకోండి” అని అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు మారువేషంలో యుద్ధానికి వెళ్లాడు.
2CH 18:30 సిరియా రాజు తన రథాధిపతులకు, “మీరు ఇశ్రాయేలు రాజు ఒక్కనితో తప్ప, చిన్నవారితో గాని గొప్పవారితో గాని యుద్ధం చేయకూడదు” అని ఆదేశించాడు.
2CH 18:31 అయితే ఆ రథాధిపతులు యెహోషాపాతును చూసి, “ఇతడే ఇశ్రాయేలు రాజు” అనుకుని అతనిపై దాడి చేయడానికి అతని మీదికి రాగా యెహోషాపాతు బిగ్గరగా కేక వేశాడు. అప్పుడు యెహోవా అతనికి సహాయం చేశారు. దేవుడే వారిని అతని దగ్గర నుండి తరిమివేశారు.
2CH 18:32 ఎలాగంటే, అతడు ఇశ్రాయేలు రాజు కాడని రథాధిపతులు తెలుసుకొని వారు అతన్ని తరమడం ఆపివేశారు.
2CH 18:33 అయితే ఎవడో ఒకడు విల్లెక్కుపెట్టి బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజుకు కవచం అతుకు మధ్యలో గుచ్చుకుంది. రాజు తన రథసారధితో, “రథం వెనుకకు త్రిప్పి నన్ను యుద్ధం నుండి బయటకు తీసుకెళ్లు, నేను గాయపడ్డాను” అని అన్నాడు.
2CH 18:34 రోజంతా హోరాహోరీగా యుద్ధం జరిగింది. ఇశ్రాయేలు రాజు సాయంత్రం వరకు అరామీయులకు ఎదురుగా తన రథాన్ని ఆసరాగా చేసుకున్నాడు. సూర్యాస్తమయ సమయంలో అతడు చనిపోయాడు.
2CH 19:1 యూదా రాజైన యెహోషాపాతు క్షేమంగా యెరూషలేములో తన భవనానికి తిరిగి వస్తున్నప్పుడు,
2CH 19:2 హనానీ కుమారుడు, దీర్ఘదర్శియైన యెహు అతన్ని కలుసుకోడానికి వెళ్లి రాజైన యెహోషాపాతుతో, “మీరు దుర్మార్గులకు సహాయం చేస్తూ యెహోవాను ద్వేషించేవారిని ప్రేమిస్తారా? యెహోవాకు మీమీద కోపం వచ్చింది.
2CH 19:3 అయితే మీలో కొంత మంచి కూడా ఉంది, మీరు దేశం నుండి అషేరా స్తంభాలను తొలగించి, యెహోవాను వెదికి ఆయనను అనుసరించడానికి హృదయపూర్వకంగా నిశ్చయించుకున్నారు” అని అన్నాడు.
2CH 19:4 యెహోషాపాతు యెరూషలేములో ఉంటూ, బెయేర్షేబ నుండి ఎఫ్రాయిం కొండసీమవరకు ప్రజల మధ్యకు వెళ్లి వారిని మరల వారి పూర్వికుల దేవుడైన యెహోవా వైపుకు త్రిప్పాడు.
2CH 19:5 యూదా దేశంలో కోటగోడలు గల అన్ని పట్టణాల్లో అతడు న్యాయాధిపతులను నియమించాడు.
2CH 19:6 అతడు వారితో ఇలా అన్నాడు, “మీరు ఏమి చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించండి, ఎందుకంటే మీరు కేవలం మనుష్యుల కోసం కాదు, మీరు ఎప్పుడు తీర్పు ఇచ్చినా మీకు తోడుగా ఉన్న యెహోవా కోసం తీర్పు ఇస్తున్నారు.
2CH 19:7 యెహోవా భయం మీమీద ఉండాలి. జాగ్రత్తగా తీర్పు తీర్చండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవా అన్యాయం చేయరు, పక్షపాతం చూపించరు, లంచం తీసుకోరు.”
2CH 19:8 యెహోషాపాతు, యెరూషలేములో కూడా కొంతమంది లేవీయులను, యాజకులను ఇశ్రాయేలీయుల కుటుంబ పెద్దలను యెహోవా ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, వివాదాలను పరిష్కరించడానికి నియమించాడు. వారు యెరూషలేములో నివసించారు.
2CH 19:9 అతడు వారికి ఈ ఆజ్ఞలు జారీ చేశాడు: “యెహోవాయందు భయం కలిగి, మీరు నమ్మకంగా యధార్థహృదయంతో సేవ చేయాలి.
2CH 19:10 పట్టణాల్లో నివసించే మీ ప్రజలు మీ దగ్గరకు తెచ్చే ప్రతి ఫిర్యాదు అంటే అది హత్యకు సంబంధించినవైనా లేదా ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, శాసనాలు, నిబంధనలకు సంబంధించిన ఇతర విషయాలైనా, వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పాపం చేయవద్దని మీరు వారిని హెచ్చరించాలి; లేకపోతే ఆయన కోపం మీ మీదికి మీ ప్రజలమీదికి వస్తుంది. ఇలా చేస్తే, మీరు అపరాధులు కారు.
2CH 19:11 “యెహోవాకు సంబంధించిన ప్రతి విషయంలోను ముఖ్య యాజకుడైన అమర్యా మీమీద అధికారిగా ఉంటాడు, అలాగే రాజుకు సంబంధించిన ప్రతి విషయంలోను యూదా గోత్ర నాయకుడు ఇష్మాయేలు కుమారుడైన జెబద్యా మీమీద అధికారిగా ఉంటాడు, లేవీయులు మీ ఎదుట అధికారులుగా ఉండి సేవ చేస్తారు. ధైర్యంగా ఉండండి, మంచిని జరిగించే వారికి యెహోవా తోడుగా ఉండును గాక.”
2CH 20:1 ఇలా జరిగాక మోయాబీయులు, అమ్మోనీయులు మెయునీయులలో కొందరితో కలిసి యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి వచ్చారు.
2CH 20:2 కొంతమంది మనుష్యులు వచ్చి యెహోషాపాతుతో, “మృత సముద్రం అవతలి వైపున ఉన్న ఎదోము నుండి గొప్ప సైన్యం మీ మీదికి వస్తూ ఉంది. వారు ఇప్పటికే హససోన్ తామారులో (అనగా ఎన్-గేదీ) ఉన్నారు” అని చెప్పారు.
2CH 20:3 యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారణ చేద్దామని నిశ్చయించుకున్నాడు, అంతేగాక యూదా ప్రజలంతా ఉపవాసం ఉండాలని ప్రకటన చేయించాడు.
2CH 20:4 సాయం చేయమని యెహోవాను ప్రాధేయపడడానికి యూదా ప్రజలంతా సమకూడారు; ఆయనను సహాయం అడగడానికి యూదాలోని ప్రతి పట్టణం నుండి ప్రజలు వచ్చారు.
2CH 20:5 అప్పుడు యెహోషాపాతు యూదా, యెరూషలేము సమాజంలో క్రొత్త ప్రాంగణం ముందు ఉన్న యెహోవా మందిరంలో నిలబడి,
2CH 20:6 ఇలా ప్రార్థించాడు: “యెహోవా మా పూర్వికుల దేవా, పరలోకంలో ఉన్న దేవుడు మీరు కాదా? మీరు ప్రజల రాజ్యాలన్నిటినీ పరిపాలిస్తున్నారు. బలప్రభావాలు మీ చేతిలో ఉన్నాయి, మీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు.
2CH 20:7 మా దేవా! మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశంలో కాపురమున్న వారిని మీరు వెళ్లగొట్టి, మీ స్నేహితుడైన అబ్రాహాము వారసులకు శాశ్వతంగా ఈ దేశాన్ని ఇవ్వలేదా?
2CH 20:8 వారు ఇక్కడ నివాసముండి మీ పేరట ఇక్కడ పరిశుద్ధాలయం కట్టారు.
2CH 20:9 వారు, ‘ఒకవేళ మా మీదికి విపత్తుగానీ, తీర్పు అనే ఖడ్గమే గాని తెగులే గాని కరువే గాని వస్తే మీ నామం కలిగిన ఈ మందిరం ముందు మేము మీ సన్నిధిలో నిలబడి మా ఆపదలో మీకు మొరపెడితే మీరు మా మొర విని మమ్మల్ని రక్షిస్తారు’ అన్నారు.
2CH 20:10 “అయితే ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు వారిని అమ్మోను, మోయాబు, శేయీరు పర్వతం నుండి వచ్చిన వారితో యుద్ధం చేయడానికి మీరు అనుమతించలేదు; కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చేయకుండా వారి నుండి వెళ్లిపోయారు.
2CH 20:11 మీరు మాకు వారసత్వంగా ఇచ్చిన స్వాస్థ్యం నుండి వారు మమ్మల్ని తోలివేయడానికి వచ్చి వారు మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి.
2CH 20:12 మా దేవా, మీరు వారికి తీర్పు తీర్చరా? ఎందుకంటే మాపై దాడి చేస్తున్న ఈ మహా సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి మాకు లేదు. ఏం చేయాలో మాకు తెలియదు, కానీ మీ సహాయం కోసమే చూస్తున్నాము.”
2CH 20:13 యూదా వారంతా తమ భార్యాపిల్లలు, పసివారితో సహా అక్కడ యెహోవా ముందు నిలబడి ఉన్నారు.
2CH 20:14 అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు పుట్టిన జెకర్యా కుమారుడును లేవీయుడునైన ఆసాపు సంతతివాడైన యహజీయేలు మీదికి యెహోవా ఆత్మ వచ్చాడు.
2CH 20:15 అప్పుడు యహాజీయేలు ఇలా ప్రకటించాడు: “యెహోషాపాతు రాజా, యూదా యెరూషలేము నివాసులారా మీరందరు వినండి! యెహోవా మీతో చెప్పే మాట ఇదే: ‘ఈ మహా సైన్యాన్ని చూసి భయపడకండి, నిరుత్సాహపడకండి. ఎందుకంటే యుద్ధం మీది కాదు, దేవునిది.
2CH 20:16 రేపు వారిని ఎదుర్కోడానికి వెళ్లండి. వారు జీజు ఎగువ దారిన వస్తూ ఉంటారు, మీరు వారిని యెరుయేలు ఎడారిలో కొండగట్టు చివరిలో కనుగొంటారు.
2CH 20:17 అయితే ఈ యుద్ధంలో మీరు పోరాడనవసరం ఉండదు. మీరు మీ స్థలాల్లో నిలబడి ఉండండి; యెహోవా మీకిచ్చే విడుదలను మీరు నిలబడి చూడండి. యూదా, యెరూషలేమా, మీరు భయపడవద్దు, కలవరపడవద్దు. రేపు వారిని ఎదుర్కోడానికి వెళ్లండి. యెహోవా మీతో ఉంటారు.’ ”
2CH 20:18 అప్పుడు యెహోషాపాతు నేలకు సాష్టాంగపడి నమస్కరించాడు; యూదా, యెరూషలేము ప్రజలందరూ యెహోవా సన్నిధిలో ఆరాధించారు.
2CH 20:19 కహాతు వంశానికి, కోరహీయుల వంశానికి చెందిన లేవీయులు కొందరు లేచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను పెద్ద స్వరంతో స్తుతించారు.
2CH 20:20 తెల్లవారుజామున వారు తెకోవా ఎడారికి బయలుదేరారు. వారు బయలుదేరినప్పుడు, యెహోషాపాతు నిలబడి, “యూదా, యెరూషలేము ప్రజలారా, నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచండి, అప్పుడు మీరు స్థిరంగా నిలబడతారు; అతని ప్రవక్తలపై విశ్వాసముంచండి, మీరు విజయం సాధిస్తారు”
2CH 20:21 ప్రజలతో మాట్లాడిన తర్వాత యెహోషాపాతు, యెహోవాకు ఇలా పాడటానికి, ఆయన పవిత్రత యొక్క వైభవాన్ని స్తుతించడానికి మనుష్యులను నియమించాడు, వారు సైన్యానికి ముందుగా నడిచారు: “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.”
2CH 20:22 వారు అలా పాటలు పాడడం, స్తుతించడం మొదలుపెట్టినప్పుడు యెహోవా యూదా వారి మీద దండెత్తుతున్న అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయీరు కొండసీమవారి మీదా మాటుగాండ్రు ఉండేలా చేశారు. కాబట్టి వారు ఓడిపోయారు.
2CH 20:23 ఎలాగంటే, అమ్మోనీయులు, మోయాబీయులు శేయీరు కొండసీమవారి మీద దాడి చేసి వారిని హతమార్చి నాశనం చేశారు. శేయీరు కొండసీమవారిని హతమార్చిన తర్వాత వారు ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు.
2CH 20:24 యూదా మనుష్యులు ఎడారి వైపున ఉన్న ప్రదేశానికి వచ్చి విస్తారమైన సైన్యం వైపు చూసినప్పుడు, వారికి నేలమీద పడి ఉన్న మృతదేహాలు మాత్రమే కనిపించాయి; ఎవరూ తప్పించుకోలేదు.
2CH 20:25 కాబట్టి యెహోషాపాతు అతని మనుష్యులు వారి దోపుడుసొమ్మును దోచుకోవడానికి వెళ్లి, అక్కడ వారి మధ్య చాలా సామాగ్రి, వస్త్రాలు విలువైన వస్తువులు ఉండడం చూశారు. అవి వారు మోయలేనంతగా ఉన్నాయి. ఆ వస్తువులన్నీ పోగుచేయడానికి మూడు రోజులు పట్టింది.
2CH 20:26 నాలుగో రోజు వారు బెరాకా లోయలో సమకూడి యెహోవాను స్తుతించారు. అందుకే ఆ చోటు నేటి వరకు బెరాకాలోయ అని పిలువబడుతుంది.
2CH 20:27 అప్పుడు, యెహోషాపాతు నేతృత్వంలో, యూదా యెరూషలేము ప్రజలందరూ సంతోషంగా యెరూషలేముకు తిరిగి వచ్చారు, ఎందుకంటే వారి శత్రువులపై యెహోవా వారికి విజయాన్ని ఇచ్చారు.
2CH 20:28 వారు యెరూషలేములో ప్రవేశించి, రకరకాల సితార వీణలతో, బూరలతో యెహోవా ఆలయానికి చేరుకున్నారు.
2CH 20:29 ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా ఎలా పోరాడారో విన్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నిటికీ దేవుని భయం కలిగింది.
2CH 20:30 యెహోషాపాతు రాజ్యం సమాధానంతో ఉంది, ఎందుకంటే యెహోషాపాతు యొక్క దేవుడు అతనికి అన్నివైపులా విశ్రాంతి ఇచ్చారు.
2CH 20:31 యెహోషాపాతు యూదాను పరిపాలించాడు. అతడు యూదాకు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు.అతడు యెరూషలేములో ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తె.
2CH 20:32 అతడు తన తండ్రి ఆసా విధానాలను అనుసరించాడు, వాటినుండి తొలగిపోలేదు; అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
2CH 20:33 అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు, ప్రజలు తమ పూర్వికుల దేవుని అనుసరించాలని హృదయపూర్వకంగా ఇంకా నిశ్చయించుకోలేదు.
2CH 20:34 యెహోషాపాతు పరిపాలన గురించిన ఇతర విషయాలు, మొదటి నుండి చివరి వరకు, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో నమోదు చేయబడిన హనానీ కుమారుడైన యెహు చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
2CH 20:35 తర్వాత యూదా రాజైన యెహోషాపాతు, దుష్ట మార్గాల్లో నడిచే ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో సంధి చేసుకున్నాడు.
2CH 20:36 అతడు తర్షీషు ఓడలను నిర్మించడానికి అతనితో అంగీకరించాడు. ఎసోన్-గెబెరు దగ్గర అవి నిర్మించబడిన తర్వాత,
2CH 20:37 మరేషాకు చెందిన దోదవహు కుమారుడైన ఎలీయెజెరు యెహోషాపాతుకు వ్యతిరేకంగా, “నీవు అహజ్యాతో పొత్తు పెట్టుకున్నావు కాబట్టి, నీవు చేసిన దాన్ని యెహోవా నాశనం చేస్తారు” అని ప్రవచించాడు. ఓడలు బద్దలయ్యాయి, వాణిజ్యానికి తర్షీషుకు వెళ్లలేకపోయాయి.
2CH 21:1 తర్వాత యెహోషాపాతు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు.
2CH 21:2 వీరు యెహోరాము సహోదరులు, అంటే యెహోషాపాతు కుమారులు: అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్యా. వీరంతా ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు.
2CH 21:3 వారి తండ్రి వారికి అనేక వెండి, బంగారం విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చాడు, వాటితో పాటు యూదాలో కోటగోడలు గల పట్టణాలు కూడా ఇచ్చాడు. అయితే యెహోరాము తనకు ప్రథమ పుత్రుడు, కాబట్టి అతనికి రాజ్యం ఇచ్చాడు.
2CH 21:4 యెహోరాము తన తండ్రి రాజ్యం మీద తన పరిపాలనను సుస్థిరం చేసుకున్న తర్వాత అతడు తన సోదరులందరినీ, ఇశ్రాయేలు అధికారులలో కొందరిని ఖడ్గంతో చంపేశాడు.
2CH 21:5 యెహోరాము రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.
2CH 21:6 అతడు అహాబు కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు, కాబట్టి అహాబు ఇంటివారిలా ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు. యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
2CH 21:7 అయినప్పటికీ, యెహోవా దావీదుతో చేసిన ఒడంబడిక కారణంగా, దావీదు ఇంటిని నాశనం చేయడానికి యెహోవా ఇష్టపడలేదు. దావీదుకు, అతని వారసులకు ఒక దీపం ఎల్లప్పుడు వెలుగుతూ ఉంటుందని ఆయన వాగ్దానం చేశారు.
2CH 21:8 యెహోరాము కాలంలో, ఎదోమీయులు యూదాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ సొంత రాజును నియమించుకున్నారు.
2CH 21:9 కాబట్టి యెహోరాము తన సేనాధిపతులతో రథాలన్నిటితో అక్కడికి వెళ్లాడు. ఎదోమీయులు అతన్ని, అతని రథసారధులను చుట్టుముట్టారు, కాని అతడు రాత్రిలో లేచి వారిపై దాడి చేశాడు.
2CH 21:10 ఈనాటికీ ఎదోము యూదాను వ్యతిరేకిస్తూ ఉంది. అదే సమయంలో లిబ్నా తిరుగబడింది, ఎందుకంటే యెహోరాము తన పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు.
2CH 21:11 అంతే కాదు, అతడు యూదా కొండల పైన క్షేత్రాలను కట్టించి, యెరూషలేము ప్రజలను వ్యభిచారుల్లా ప్రవర్తించేలా చేశాడు, యూదావారిని తప్పుత్రోవ పట్టించాడు.
2CH 21:12 అప్పుడు యెహోరాముకు ప్రవక్తయైన ఏలీయా నుండి ఈ లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది: “మీ తండ్రియైన దావీదుకు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘నీవు నీ తండ్రియైన యెహోషాపాతు జీవిత విధానాలను యూదా రాజైన ఆసా జీవిత విధానాలను అనుసరించలేదు.
2CH 21:13 అయితే నీవు ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించి, అహాబు ఇంటివారు చేసినట్లుగా, నీవు యూదా వారిని, యెరూషలేము వారిని వ్యభిచరించేలా చేశావు. నీవు నీ సొంత సోదరులను, నీ సొంత కుటుంబ సభ్యులను, నీ కంటే మెరుగైన పురుషులను కూడా హత్య చేశావు.
2CH 21:14 కాబట్టి గొప్ప తెగులుతో నీ ప్రజలను, నీ కుమారులను, భార్యలను, నీకు చెందినదంతటిని యెహోవా దెబ్బతో కొడతారు.
2CH 21:15 మీరు ప్రేగులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో అనారోగ్యం పాలవుతారు, ఆ వ్యాధిని బట్టి మీ ప్రేగులు జారిపోతాయి.’ ”
2CH 21:16 యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, కూషీయులకు దగ్గరలో ఉన్న అరబీయులను పురికొల్పారు.
2CH 21:17 వారు యూదా పైకి దండెత్తివచ్చి, రాజభవనంలో ఉన్న వస్తువులన్నిటిని, అతని కుమారులను భార్యలను తీసుకెళ్లారు. అతని కుమారులలో చిన్నవాడైన యెహోయాహాజు ఒక్కడే మిగిలాడు.
2CH 21:18 ఇదంతా జరిగాక, యెహోవా యెహోరామును ప్రేగులలో నయంకాని జబ్బుతో మొత్తారు.
2CH 21:19 రోజు రోజుకు జబ్బు ఎక్కువవుతూ వచ్చింది. రెండేళ్ళ తర్వాత ఆ జబ్బువలన అతని ప్రేగులు బయటకు వచ్చాయి. మహాబాధతో అతడు చనిపోయాడు. అతని ప్రజలు అతని పూర్వికులకు చేసినట్టు అతనికి అంత్యక్రియలు జరిగించలేదు.
2CH 21:20 యెహోరాము రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలిస్తూ ఉండగా చనిపోయాడు అతని మృతికి ఎవరూ విచారపడలేదు. రాజుల సమాధుల్లో కాకుండ దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు.
2CH 22:1 యెరూషలేము ప్రజలు అతని స్థానంలో యెహోరాము చిన్న కుమారుడైన అహజ్యాను రాజుగా చేశారు, ఎందుకంటే అరబీయులతో పాటు శిబిరంలోకి వచ్చిన దోపిడి మూకలు పెద్ద కుమారులందరిని చంపారు. కాబట్టి యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలడం ప్రారంభించాడు.
2CH 22:2 అహజ్యా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు అతడు యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు, అతని తల్లి పేరు అతల్యా ఆమె ఒమ్రీ మనుమరాలు.
2CH 22:3 అతని తల్లి అతనికి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది కాబట్టి అతడు కూడా అహాబు ఇంటివారి మార్గాలను అనుసరించాడు.
2CH 22:4 అహాబు కుటుంబంలా అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఎందుకంటే అతని తండ్రి చనిపోయిన తర్వాత వారు అతనికి సలహాదారులయ్యారు. ఇది అతని పతనానికి కారణమైంది.
2CH 22:5 ఇశ్రాయేలు రాజైన అహాబు కుమారుడైన యోరాముతో కలిసి అరాము రాజైన హజాయేలు మీద యుద్ధం చేయడానికి రామోత్ గిలాదుకు వెళ్లినప్పుడు కూడా అతడు వారి సలహాను పాటించాడు. అరామీయులు యోరామును గాయపరిచారు;
2CH 22:6 కాబట్టి అతడు రామోతు దగ్గర అరాము రాజైన హజాయేలుతో చేసిన యుద్ధంలో తనకు చేసిన గాయాల నుండి కోలుకోవడానికి యెజ్రెయేలుకు తిరిగి వచ్చాడు. అప్పుడు యెహోరాము కుమారుడు యూదా రాజైన అహజ్యా, గాయపడి ఉన్న అహాబు కుమారుడైన యోరామును చూడడానికి యెజ్రెయేలుకు వెళ్లాడు.
2CH 22:7 అహజ్యా యోరామును దర్శించడం ద్వారా దేవుడు అహజ్యాను పతనానికి తెచ్చారు. అహజ్యా చేరుకున్నప్పుడు, అహాబు ఇంటిని నాశనం చేయడానికి యెహోవా అభిషేకించిన నిమ్షీ కుమారుడైన యెహు మీదికి అతడు యెహోరాముతో కలిసి వెళ్లాడు.
2CH 22:8 యెహు అహాబు ఇంటిపై తీర్పును అమలు చేస్తున్నప్పుడు, అతడు యూదా అధికారులను, అహజ్యాకు సేవ చేస్తున్న అహజ్యా బంధువుల కుమారులను చూసి వారిని చంపాడు.
2CH 22:9 తర్వాత అతడు అహజ్యాను వెదకడానికి వెళ్లాడు. అహజ్యా సమరయలో దాక్కుని ఉండగా యెహు మనుష్యులు అతన్ని పట్టుకున్నారు. వారు అతన్ని యెహు దగ్గరకు తీసుకువచ్చి చంపారు. వారు, “ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెదికిన యెహోషాపాతు సంతానంలో ఒకడు” అని అంటూ అతన్ని సమాధి చేశారు. ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలించే సామర్థ్యంగల వాడెవడూ అహజ్యా కుటుంబంలో మిగల్లేదు.
2CH 22:10 అహజ్యా తల్లి అతల్యా తన కుమారుడు చనిపోయాడని తెలుసుకుని ఆమె యూదా రాజకుటుంబం వారందరినీ నాశనం చేయడానికి పూనుకుంది.
2CH 22:11 కాని, రాజైన యెహోరాము కుమార్తెయైన యెహోషేబ అహజ్యా కుమారుడైన యోవాషును, చావవలసిన రాకుమారుల నుండి రహస్యంగా తప్పించి అతన్ని, అతని దాదిని ఒక పడకగదిలో ఉంచింది. రాజైన యెహోరాము కుమార్తె, యాజకుడైన యెహోయాదా భార్యయైన ఈ యెహోషేబ అహజ్యాకు సోదరి కాబట్టి ఆ పసివాన్ని అతల్యా నుండి దాచిపెట్టింది; కాబట్టి అతడు చంపబడలేదు.
2CH 22:12 అతల్యా దేశాన్ని పరిపాలించే కాలంలో అతడు ఆరేళ్ళు దేవుని మందిరంలో వారితో దాక్కుని ఉన్నాడు.
2CH 23:1 ఏడవ సంవత్సరంలో యెహోయాదా తనను బలపరచుకొని యెరోహాము కుమారుడైన అజర్యా, యెహోహనాను కుమారుడైన ఇష్మాయేలు, ఓబేదు కుమారుడైన అజర్యా, అదాయా కుమారుడైన మయశేయా, జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతు అనే శతాధిపతులతో నిబంధన చేశాడు.
2CH 23:2 వారు వెళ్లి యూదా అంతటా తిరుగుతూ అన్ని పట్టణాల నుండి లేవీయులను, ఇశ్రాయేలు కుటుంబాల నాయకులను సమకూర్చారు. వారంతా యెరూషలేముకు వచ్చినప్పుడు,
2CH 23:3 సమాజమంతా దేవుని మందిరంలో రాజుతో ఒక నిబంధన చేశారు. యెహోయాదా వారితో ఇలా అన్నాడు: “దావీదు వంశస్థుల విషయంలో యెహోవా వాగ్దానం చేసినట్లుగా రాజు కుమారుడు పరిపాలన చేయాలి.
2CH 23:4 ఇప్పుడు మీరు చేయాల్సింది ఇదే: సబ్బాతు దినాన విధులకు వెళ్లే యాజకులలో లేవీయులలో మూడవ వంతు మంది తలుపుల దగ్గర కాపలాగా ఉండాలి.
2CH 23:5 ఇంకొక మూడవ భాగం రాజభవనం దగ్గర, మరో మూడవ భాగం పునాది ద్వారం దగ్గర కాపలా కాయాలి. మిగతావారంతా యెహోవా ఆలయ ఆవరణాల్లో ఉండాలి.
2CH 23:6 విధుల్లో ఉన్న యాజకులు, లేవీయులు తప్ప ఇంకెవరు యెహోవా మందిరంలో ప్రవేశించకూడదు. యాజకులు, లేవీయులు ప్రతిష్ఠించబడ్డ వారు కాబట్టి వారు ప్రవేశించవచ్చు, అయితే మిగతావారంతా లోనికి ప్రవేశించకూడదనే యెహోవా ఆజ్ఞను పాటించాలి.
2CH 23:7 లేవీయులు తమ ఆయుధాలు చేతపట్టుకుని రాజు చుట్టూ ఉండాలి. ఎవరైనా మందిరంలోకి వస్తే వారిని చంపేయాలి. రాజు ఎక్కడికి వెళ్లినా అతనికి దగ్గరగా ఉండాలి.”
2CH 23:8 యాజకుడైన యెహోయాదా ఆదేశించినట్లే లేవీయులు, యూదా వారంతా చేశారు. ప్రతి ఒక్కరు సబ్బాతు దినం విధులకు వెళ్లేవారిని, సబ్బాతు దినం విధులకు వెళ్లని వారిని తీసుకువచ్చారు. ఎందుకంటే యాజకుడైన యెహోయాదా ఏ విభాగాల వారికి సెలవియ్యలేదు.
2CH 23:9 అప్పుడు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరంలో ఉన్న రాజైన దావీదుకు చెందిన ఈటెలు, పెద్ద డాళ్లు, చిన్న డాళ్లు, ఆ శతాధిపతులకు ఇచ్చాడు.
2CH 23:10 అతడు ఆయుధాలను పట్టుకుని ఉన్న సైనికులందరిని యెహోవా మందిరం దక్షిణ వైపు నుండి ఉత్తర వైపు వరకు బలిపీఠం దగ్గర, మందిరం దగ్గర, రాజు చుట్టూ ఉండేలా నిలబెట్టాడు.
2CH 23:11 అప్పుడు యెహోయాదా, అతని కుమారులు రాకుమారున్ని బయటకు తీసుకువచ్చి అతని తలమీద కిరీటం పెట్టి ధర్మశాస్త్రాన్ని అతనికి అందించి, వారు అతన్ని రాజుగా ప్రకటించారు. వారు అతన్ని రాజుగా అభిషేకించి, “రాజు చిరకాలం జీవించు గాక!” అని కేకలు వేశారు.
2CH 23:12 ప్రజలు పరుగులు పెడుతూ రాజును పొగుడుతూ చేసే ధ్వనిని అతల్యా విని, ఆమె యెహోవా మందిరం దగ్గర ఉన్న వారి దగ్గరకు వెళ్లింది.
2CH 23:13 ఆమె చూడగా, అక్కడ రాజు తన అధికార స్తంభం దగ్గర నిలబడి ఉన్నాడు. అధిపతులు బూరలు ఊదేవారు రాజు ప్రక్కన ఉన్నారు దేశ ప్రజలంతా సంబరపడుతూ బూరలు ఊదుతూ ఉన్నారు సంగీతకారులు తమ వాయిద్యాలతో స్తుతి పాటలు పాడడం చూసి అతల్యా తన వస్త్రాలు చింపుకొని, “ద్రోహం! ద్రోహం!” అని అరిచింది.
2CH 23:14 అప్పుడు యాజకుడైన యెహోయాదా సైన్యంలో శతాధిపతులైన వారిని పంపించి, “మీ వరుసల మధ్య నుండి ఆమెను బయటకు తీసుకురండి, ఆమె వెంట వచ్చేవారిని ఖడ్గంతో చంపేయండి” అని అన్నాడు. ఎందుకంటే యాజకుడు, “ఆమెను యెహోవా మందిరం దగ్గర చంపవద్దు” అని చెప్పాడు.
2CH 23:15 కాబట్టి ఆమె రాజభవన ఆవరణంలో గుర్రపు ద్వారం యొక్క ప్రవేశం దగ్గరకు చేరుకోగానే వారు ఆమెను పట్టుకుని చంపేశారు.
2CH 23:16 అప్పుడు యెహోయాదా, తాను ప్రజలు రాజు యెహోవా ప్రజలుగా ఉండాలని నిబంధన చేశాడు.
2CH 23:17 ప్రజలందరూ బయలు గుడి దగ్గరకు వెళ్లి దానిని పడగొట్టారు. వారు బలిపీఠాలను, విగ్రహాలను పగులగొట్టారు, బలిపీఠాల ముందున్న బయలు యాజకుడైన మత్తానును చంపారు.
2CH 23:18 అప్పుడు యెహోయాదా, దావీదు ఆదేశించిన ప్రకారం, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టు సంతోషంతో పాడుతూ, యెహోవాకు దహనబలులను అర్పించడానికి, మందిరంలో దావీదు నియమించిన లేవీయులకు యాజకులకు యెహోవా ఆలయ పర్యవేక్షణ అప్పగించాడు.
2CH 23:19 ఏ విధంగానైనా అపవిత్రంగా ఉన్నవారు ఎవరూ లోపలికి రాకుండా అతడు యెహోవా ఆలయ ద్వారాల దగ్గర ద్వారపాలకులను కూడా నిలబెట్టాడు.
2CH 23:20 అతడు తనతో శతాధిపతులను, ప్రధానులను, ప్రజల అధికారులను, దేశ ప్రజలందరినీ వెంటబెట్టుకొని రాజును యెహోవా మందిరం నుండి రాజభవనానికి తీసుకువచ్చాడు. వారు పై ద్వారం గుండా ప్రవేశించి, రాజ్యసింహాసనం మీద రాజును కూర్చోబెట్టారు.
2CH 23:21 అతల్యాను ఖడ్గంతో చంపిన తర్వాత పట్టణం ప్రశాంతంగా ఉంది, దేశ ప్రజలంతా సంబరపడ్డారు.
2CH 24:1 యోవాషు రాజైనప్పుడు అతని వయస్సు ఏడు సంవత్సరాలు. అతడు యెరూషలేములో నలభై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా; ఆమె బెయేర్షేబకు చెందినది.
2CH 24:2 యాజకుడైన యెహోయాదా బ్రతికిన కాలమంతా యోవాషు యెహోవా దృష్టికి సరియైనదే చేశాడు.
2CH 24:3 యెహోయాదా యోవాషుకు ఇద్దరు స్త్రీలతో పెళ్ళి చేశాడు, అతనికి కుమారులు కుమార్తెలు ఉన్నారు.
2CH 24:4 కొంతకాలం తర్వాత యోవాషు యెహోవా మందిరాన్ని మరమ్మత్తు చేయాలని నిర్ణయించుకున్నాడు.
2CH 24:5 అతడు యాజకులను, లేవీయులను పిలిపించి, “మీ దేవుని మందిరాన్ని మరమ్మత్తు చేయాలి కాబట్టి మీరు యూదా పట్టణాలకు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరనుండి ప్రతి సంవత్సరం రావలసిన డబ్బును సేకరించండి. అది వెంటనే చేయండి” అని ఆదేశించాడు. కాని లేవీయులు వెంటనే చేయలేదు.
2CH 24:6 కాబట్టి రాజు ముఖ్య యాజకుడైన యెహోయాదాను పిలిచి, “నిబంధన గుడారం కొరకై ఇశ్రాయేలీయుల సమాజానికి యెహోవా సేవకుడైన మోషే విధించిన పన్నును యూదా నుండి యెరూషలేము నుండి లేవీయులు వెళ్లి తీసుకురావాలని నీవెందుకు అడగలేదు?” అని అన్నాడు.
2CH 24:7 ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరంలోకి చొరబడి దానిలోని పవిత్ర వస్తువులను కూడా బయలు కోసం ఉపయోగించారు.
2CH 24:8 రాజు ఆజ్ఞ ప్రకారం, ఒక పెట్టెను తయారుచేసి యెహోవా మందిర ద్వారం బయట ఉంచారు.
2CH 24:9 దేవుని సేవకుడైన మోషే అరణ్యంలో ఇశ్రాయేలీయులకు విధించిన పన్నును వారు యెహోవాకు తీసుకురావాలని యూదాలో యెరూషలేములో ప్రకటించారు.
2CH 24:10 దానికి అధికారులంతా ప్రజలంతా సంతోషించి, వారి కానుకలు తెచ్చి పెట్టె నిండేవరకు అందులో వేశారు.
2CH 24:11 అప్పుడప్పుడు లేవీయులు ఆ పెట్టెను రాజు అధికారుల దగ్గరకు తెచ్చేవారు. పెట్టెలో చాలా డబ్బు కనబడితే రాజు కార్యదర్శి, ముఖ్య యాజకుని అధికారి వచ్చి, పెట్టె ఖాళీచేసి దాని స్థలంలో దానిని మళ్ళీ ఉంచేవారు. ఇలా వారు ప్రతిదినం చేయడం వలన వారు చాలా డబ్బు పోగుచేశారు.
2CH 24:12 రాజు యెహోయాదా ఆ డబ్బును యెహోవా మందిరంలో అవసరమైన పనులు చేసేవారికి ఇచ్చారు. యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి తాపీ మేస్త్రీలను, వడ్లవారిని, మందిరాన్ని మరమ్మత్తు చేయడానికి ఇనుముతో ఇత్తడితో పనిచేసేవారిని జీతానికి తీసుకున్నారు.
2CH 24:13 పనివారు శ్రద్ధగా పని చేస్తుంటే వారి ఆధ్వర్యంలో మరమ్మత్తులు ముందుకు కొనసాగాయి. వారు దేవుని మందిరాన్ని దాని అసలు నమూనా ప్రకారం పునర్నిర్మించి దానిని పటిష్టం చేశారు.
2CH 24:14 పని ముగించిన తర్వాత వారు మిగతా డబ్బును రాజు దగ్గరకు, యెహోయాదా దగ్గరకు తెచ్చారు. ఆ డబ్బుతో యెహోవా ఆలయానికి సంబంధించిన వస్తువులు సేవా సంబంధమైన వస్తువులు, దహనబలికి ఉపయోగపడే వస్తువులు, గరిటెలు, వేరువేరు వెండి బంగారు వస్తువులు చేయించారు. యెహోయాదా బ్రతికి ఉన్నంతకాలం యెహోవా మందిరంలో ప్రతిరోజు దహనబలులు అర్పించబడ్డాయి.
2CH 24:15 యెహోయాదా వయస్సు నిండి ముసలితనంలో చనిపోయాడు. అప్పుడు అతని వయస్సు నూట ముప్పై సంవత్సరాలు.
2CH 24:16 అతడు ఇశ్రాయేలులో దేవునికి, ఆయన మందిరానికి చేసిన మేలును బట్టి దావీదు పట్టణంలో రాజులతో పాటు పాతిపెట్టబడ్డాడు.
2CH 24:17 యెహోయాదా మరణించిన తర్వాత, యూదా అధికారులు వచ్చి రాజుకు నమస్కరించగా అతడు వారి మాట విన్నాడు.
2CH 24:18 అప్పుడు వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి అషేరా స్తంభాలకు, విగ్రహాలకు పూజ చేశారు. వారు చేసిన ఈ అపరాధం కారణంగా దేవుని కోపం యూదా వారిమీదికి, యెరూషలేము వారిమీదికి వచ్చింది.
2CH 24:19 అయినా, వారిని తన వైపుకు మళ్ళించాలని యెహోవా తన ప్రవక్తలను వారి దగ్గరకు పంపాడు. ప్రవక్తలు సాక్ష్యమిస్తూ వారిని హెచ్చరించారు కాని వారు ప్రవక్త మాటలు పెడచెవిని పెట్టారు.
2CH 24:20 ఆ సమయంలో దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా అతడు ప్రజలు ముందు నిలబడి, “దేవుడు చెప్పే మాట ఇదే: ‘యెహోవా ఆజ్ఞలను మీరెందుకు మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టారు’ ” అన్నాడు.
2CH 24:21 అయితే వారు అతని మీద కుట్రపన్ని అతన్ని యెహోవా ఆలయ ఆవరణంలో రాళ్లతో కొట్టి చంపారు. రాజు జారీ చేసిన ఆజ్ఞ ప్రకారమే అలా జరిగింది.
2CH 24:22 జెకర్యా తండ్రియైన యెహోయాదా తనపై చూపిన దయను యోవాషు రాజు మరచిపోయే, అతని కుమారున్ని చంపించాడు. జెకర్యా చనిపోతూ చివరిగా, “యెహోవా ఇది చూసి విచారణ చేస్తారు” అన్నాడు.
2CH 24:23 ఆ సంవత్సరం చివరిలో సిరియా సైన్యం యోవాషు మీదికి దండెత్తి వచ్చింది. వారు యూదాపై యెరూషలేముపై దాడిచేసి ప్రజల నాయకులందరిని చంపారు. కొల్లసొమ్మంతా దమస్కులో ఉన్న వారి రాజుకు పంపారు.
2CH 24:24 వచ్చిన సిరియా సైన్యం చిన్నదే అయినా చాలా పెద్ద సైన్యాన్ని యెహోవా వారి వశం చేశాడు. యూదా తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి అలా జరిగింది. యోవాషు కూడా తీర్పుకు గురి అయ్యాడు.
2CH 24:25 సిరియావారు తిరిగి వెళ్లేటప్పుడు గాయాలతో ఉన్న యోవాషును వదిలేశారు. యాజకుడైన యెహోయాదా కుమారుడిని చంపినందుకు అతని అధికారులు అతనిపై కుట్రపన్ని అతన్ని అతని మంచం మీద చంపారు. కాబట్టి అతడు చనిపోయి దావీదు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు, అయితే రాజుల సమాధుల్లో కాదు.
2CH 24:26 అతనిపై అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడైన జాబాదు, మోయాబురాలైన షిమ్రీతు కుమారుడైన యెహోజాబాదు కుట్రపన్నారు.
2CH 24:27 యోవాషు కుమారుల గురించి, అతని గురించి చెప్పిన ప్రవచనాల విషయం, దేవుని మందిరాన్ని పూర్వస్థితికి తెచ్చిన విషయం రాజు గ్రంథ వ్యాఖ్యానంలో వ్రాసి ఉన్నాయి. అతని తర్వాత అతని కుమారుడైన అమజ్యా రాజయ్యాడు.
2CH 25:1 అమజ్యా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను; ఆమె యెరూషలేముకు చెందినది.
2CH 25:2 అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కానీ హృదయమంతటితో ఆయనను అనుసరించలేదు.
2CH 25:3 రాజ్యం తన ఆధీనంలో స్థిరపడిన తర్వాత అతడు రాజైన తన తండ్రిని చంపిన ఆ అధికారులను చంపించాడు.
2CH 25:4 అయితే అతడు వారి సంతానాన్ని చంపలేదు. మోషే వ్రాసిన ధర్మశాస్త్రంలో “తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందుకోవద్దు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందుకోవద్దు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు” అని యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అతడు చేశాడు.
2CH 25:5 అమజ్యా యూదా వారిని పిలిపించి, వారి కుటుంబాల ప్రకారం వారిని యూదా, బెన్యామీను వారందరికి సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను నియమించాడు. తర్వాత అతడు ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిని లెక్కిస్తే ఈటె డాలు పట్టుకుని యుద్ధానికి వెళ్లగలవారు 3,00,000 మంది ఉన్నారు.
2CH 25:6 అతడు ఇశ్రాయేలు నుండి వంద తలాంతుల వెండికి లక్ష మంది పోరాట యోధులను కిరాయికి తీసుకున్నాడు.
2CH 25:7 అయితే ఒక దైవజనుడు అమజ్యా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, “రాజా, ఇశ్రాయేలు సైనికులు నీతో తీసుకెళ్లకు. ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలీయులతో గాని, ఎఫ్రాయిం వారిలో ఎవ్వరితో గాని లేరు.
2CH 25:8 ఒకవేళ మీరు వెళ్లి ధైర్యంగా యుద్ధం చేసినా, దేవుడు మిమ్మల్ని శత్రువుల ముందు కూల్చివేస్తారు, ఎందుకంటే సహాయం చేయడానికైనా, కూల్చివేయడానికైనా దేవునికే శక్తి ఉంది.”
2CH 25:9 అమజ్యా దైవజనుని చూసి, “కాని ఇశ్రాయేలు సైనికుల కోసం నేను చెల్లించిన వంద తలాంతుల సంగతేంటి?” అని అడిగాడు. అందుకు దైవజనుడు, “యెహోవా అంతకంటే ఎక్కువ నీకివ్వగలరు” అని జవాబిచ్చాడు.
2CH 25:10 కాబట్టి అమజ్యా ఎఫ్రాయిం నుండి తన దగ్గరకు వచ్చిన సైన్యాన్ని వేరుచేసి ఇంటికి పంపివేశాడు. అందుకు వారు యూదా మీద కోప్పడి తీవ్ర కోపంతో ఇంటికి వెళ్లిపోయారు.
2CH 25:11 తర్వాత అమజ్యా బలం కూడగట్టుకొని తన సైన్యాన్ని ఉప్పు లోయకు నడిపించి అక్కడ 10,000 మంది శేయీరు వారిని చంపాడు.
2CH 25:12 అంతేగాక యూదా సైన్యం మరో 10,000 మందిని ప్రాణాలతో పట్టుకుని, వారిని ఒక కొండచరియపైకి తీసుకెళ్లి అక్కడినుండి క్రిందికి పడవేశారు. వారంతా ముక్కలైపోయారు.
2CH 25:13 ఈలోగా అమజ్యా తనతో కూడా యుద్ధానికి రానివ్వకుండా పంపివేసిన ఇశ్రాయేలు సైనికులు సమరయ నుండి బేత్-హోరోను వరకు ఉన్న యూదా పట్టణాల మీద దాడిచేశారు. వారు 3,000 మందిని చంపి, పెద్ద మొత్తంలో దోపుడుసొమ్మును ఎత్తుకెళ్లారు.
2CH 25:14 అమజ్యా ఎదోమీయులను హతమార్చి తిరిగి వచ్చినప్పుడు తమతో కూడా శేయీరు ప్రజల దేవుళ్ళను తెచ్చాడు. వాటిని తన సొంత దేవుళ్ళుగా నిలిపి, వాటి ఎదుట సాష్టాంగపడి వాటికి బలులు అర్పించాడు.
2CH 25:15 అందువల్ల అమజ్యా మీద యెహోవాకు కోపం రగులుకుంది. యెహోవా ఒక ప్రవక్తను అమజ్యా దగ్గరకు పంపాడు. అతడు అమజ్యాతో, “ఈ దేవుళ్ళు తమ సొంత ప్రజలనే నీ చేతిలో పడకుండా కాపాడలేకపోయారు. నీవు వారి దేవుళ్ళ మీద ఎందుకు ఆధారపడుతున్నావు?” అని అడిగాడు.
2CH 25:16 ప్రవక్త తనతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజు, “నిన్ను రాజుకు సలహాదారునిగా నియమించామా? ఆపు! ఎందుకు చావాలనుకుంటున్నావు?” అని అన్నాడు. అప్పుడు ప్రవక్త, “నీవు అప్పుడు అలా చేసి, ఇప్పుడు నా సలహా అంగీకరించలేదు కాబట్టి దేవుడు నిన్ను నాశనం చేయడానికి నిర్ణయించాడని నాకు తెలుసు” అని చెప్పి ఊరుకున్నాడు.
2CH 25:17 యూదా రాజైన అమజ్యా ఇతరులతో ఆలోచన చేశాక, “మనం యుద్ధంలో ఒకరితో ఒకరు తలపడదాం, రండి” అని యెహు మనుమడును యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోయాషుకు సవాలు విసిరాడు.
2CH 25:18 అయితే ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలా జవాబిచ్చాడు: “లెబానోను అడవిలోని ముళ్ళపొద ఒకటి లెబానోను దేవదారుకు, ‘నీ కుమార్తెను నా కుమారునికి భార్యగా ఇవ్వు’ అని సందేశం పంపిందట. అప్పుడు లెబానోను అడవి మృగం ఒకటి ఆ వైపుకు వచ్చి ఆ ముళ్ళను త్రొక్కి పాడుచేసింది.
2CH 25:19 నీవు ఎదోమును ఓడించి నీలో నీవు గర్విస్తున్నావు. అయితే ఇంటి దగ్గరే ఉండు. నీవు ఎందుకు నీతో పాటు యూదావారు నాశనమవడానికి కారణమవుతావు?”
2CH 25:20 అయితే అమజ్యా వినలేదు, ఎందుకంటే వారు ఎదోము దేవుళ్ళను వెదకడం వల్ల దేవుడు వారిని యెహోయాషు చేతికి అప్పగించబడేలా చేశారు.
2CH 25:21 కాబట్టి ఇశ్రాయేలు రాజైన యెహోయాషు దాడి చేశాడు. అతడు, యూదా రాజైన అమజ్యా యూదాకు చెందిన బేత్-షెమెషు దగ్గర ఒకరినొకరు ఎదుర్కొన్నారు.
2CH 25:22 ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయింది, ప్రతి ఒక్కరు తమ ఇళ్ళకు పారిపోయారు.
2CH 25:23 ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బేత్-షెమెషులో అహజ్యా మనుమడు, యోవాషు కుమారుడు, యూదా రాజైన అమజ్యాను పట్టుకున్నాడు. అప్పుడు యెహోయాషు అతన్ని యెరూషలేముకు తెచ్చి ప్రాకారాన్ని, ఎఫ్రాయిం ద్వారం నుండి మూల ద్వారం వరకు దాదాపు నాలుగు వందల మూరలు పడగొట్టాడు.
2CH 25:24 అతడు దేవుని మందిరంలో ఓబేద్-ఎదోము సంరక్షణలో ఉన్న కనిపించిన వెండి బంగారమంతటిని, ఇతర వస్తువులన్నిటిని, రాజభవన ఖజానాను బందీలను తీసుకుని సమరయకు తిరిగి వెళ్లాడు.
2CH 25:25 యెహోయాహాజు కుమారుడు, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు మృతి తర్వాత, యూదారాజు, యోవాషు కుమారుడైన అమజ్యా ఇంకా పదిహేను సంవత్సరాలు బ్రతికాడు.
2CH 25:26 అమజ్యా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు మొదటి నుండి చివరి వరకు, యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడలేదా?
2CH 25:27 అమజ్యా యెహోవాను వెంబడించడం మానివేసిన సమయం నుండి ప్రజలు యెరూషలేములో కొందరు అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషుకు పారిపోయాడు, కాని వారు అతని వెంట లాకీషుకు మనుష్యులను పంపి అతన్ని అక్కడ చంపారు.
2CH 25:28 అప్పుడు వారు గుర్రం మీద అతని శవాన్ని తెప్పించి, యూదా పట్టణంలో అతని పూర్వికుల దగ్గర పాతిపెట్టారు.
2CH 26:1 అప్పుడు యూదా ప్రజలందరూ పదహారు సంవత్సరాల వయస్సు వాడైన ఉజ్జియాను అతని తండ్రియైన అమజ్యా స్థానంలో రాజుగా చేశారు.
2CH 26:2 రాజైన అమజ్యా చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరిన తర్వాత ఉజ్జియా ఏలతును పునర్నిర్మించి తిరిగి యూదాకు కలిపాడు.
2CH 26:3 ఉజ్జియా రాజైనప్పుడు అతని వయస్సు పదహారు సంవత్సరాలు, అతడు యెరూషలేములో యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా. ఆమె యెరూషలేముకు చెందినది.
2CH 26:4 అతడు తన తండ్రి అమజ్యా చేసినట్లు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
2CH 26:5 దేవుని భయం కలిగి ఉండాలని తనకు బోధించిన జెకర్యా దినాల్లో అతడు దేవున్ని అనుసరించాడు. అతడు యెహోవాను అనుసరించినంత కాలం దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చారు.
2CH 26:6 అతడు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్లి గాతు, జబ్నె, అష్డోదు పట్టణాల గోడలు పడగొట్టాడు. అష్డోదు ప్రాంతంలో, ఫిలిష్తీయుల మధ్య ఉన్న పట్టణాలను తిరిగి కట్టించాడు.
2CH 26:7 ఫిలిష్తీయులతో గూర్-బయలులో ఉన్న అరబీయులతో మెయునీయులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశారు.
2CH 26:8 అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను చెల్లించేవారు. అతడు చాలా శక్తివంతంగా అభివృద్ధి చెందాడు కాబట్టి, అతని గొప్పతనం ఈజిప్టు సరిహద్దు వరకు వ్యాపించింది.
2CH 26:9 ఉజ్జియా యెరూషలేములో మూల ద్వారం దగ్గర, లోయ ద్వారం దగ్గర, ప్రాకారం మూల దగ్గర బురుజులు నిర్మించి వాటిని పటిష్టం చేశాడు.
2CH 26:10 అతడు అరణ్యంలో బురుజులు కూడా నిర్మించాడు అనేక తొట్టెలను తవ్వాడు, ఎందుకంటే అతనికి పర్వత ప్రాంతాల్లో మైదానంలో చాలా పశువులు ఉన్నాయి. అతడు మట్టిని ప్రేమిస్తున్నందున కొండల్లో సారవంతమైన భూములలో తన పొలాలను ద్రాక్షతోటలను పని చేసేవారిని కలిగి ఉన్నాడు.
2CH 26:11 ఉజ్జియాకు సుశిక్షితులైన సైన్యం ఉంది, రాజ అధికారులలో ఒకరైన హనన్యా ఆధ్వర్యంలో కార్యదర్శియైన యెహీయేలు అధికారియైన మయశేయా వారిని లెక్కించిన ప్రకారం విభాగాలుగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.
2CH 26:12 ఆ యుద్ధవీరులపై 2,600 మంది అధికారులున్నారు. వారంతా పూర్వికుల కుటుంబాల పెద్దలు.
2CH 26:13 యుద్ధానికి బాగా శిక్షణ పొందిన 3,07,500 మంది వారి చేతి క్రింద ఉన్నారు. రాజుకు అతని శత్రువు పోరాడడానికి సహాయం చేయగల బలమైన సైన్యం అది.
2CH 26:14 ఉజ్జియా సైన్యమంతటికి డాళ్లు, ఈటెలు, శిరస్త్రాణాలు, కవచాలు, విల్లులు, వడిసెలు సరఫరాచేశాడు.
2CH 26:15 యెరూషలేములో సైనికులు బాణాలు వేయడానికి గోడల నుండి పెద్ద రాళ్లను విసిరేందుకు వీలుగా అతడు బురుజులపై మూలల రక్షణ కోసం కనిపెట్టిన పరికరాలను తయారుచేశాడు. అతని కీర్తి చాలా దూరం వ్యాపించింది, ఎందుకంటే అతడు స్థిరపడేవరకు యెహోవా అతనికి ఎంతో సహాయం చేశారు.
2CH 26:16 ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు విర్రవీగి పతనం అయ్యాడు. తన దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసి యెహోవా మందిరంలో ధూపవేదిక మీద ధూపం వేయడానికి ప్రవేశించాడు.
2CH 26:17 యాజకుడైన అజర్యా ఎనభైమంది ఇతర ధైర్యవంతులైన యెహోవా యాజకులతో అతన్ని అనుసరించాడు.
2CH 26:18 వారు ఉజ్జియా రాజును ఎదిరించి, “ఉజ్జియా, యెహోవాకు ధూపం వెయ్యడం నీ పని కాదు. అహరోను వారసులైన యాజకులే ఆ పని చేయాలి. ధూపం వేయడానికి వారే ప్రతిష్ఠించబడ్డారు. పరిశుద్ధాలయం నుండి వెళ్లు. నీవు నమ్మకద్రోహిగా ఉన్నావు. దానివలన యెహోవా దేవుని వలన ఘనపరచబడవు” అన్నారు.
2CH 26:19 ధూపం వేయడానికి చేతిలో ధూపం పెట్టుకున్న ఉజ్జియాకు కోపం వచ్చింది. అతడు యెహోవా మందిరంలో ధూపవేదిక ముందు యాజకుల సమక్షంలో వారి మీద విరుచుకుపడుతుండగా, అతని నుదుటిపై కుష్ఠురోగం వచ్చింది.
2CH 26:20 ముఖ్య యాజకుడైన అజర్యా ఇతర యాజకులందరు అతనివైపు చూసినప్పుడు, అతని నుదిటిపై కుష్ఠురోగం ఉందని వారు చూసి, అతన్ని త్వరితంగా బయటకు తీశారు. నిజమే, యెహోవా అతన్ని బాధపెట్టారు కాబట్టి అతడు స్వయంగా బయలుదేరడానికి ఆసక్తిగా ఉన్నాడు.
2CH 26:21 ఉజ్జియా రాజు చనిపోయే రోజు వరకు కుష్ఠు వ్యాధితో ఉన్నాడు. అతనికున్న కుష్ఠురోగాన్ని బట్టి అతడు యెహోవా మందిరంలోనికి వెళ్లకుండ నిషేధించబడ్డాడు. కాబట్టి అతడు వేరుగా ఒక గృహంలో నివసించాడు. అతని కుమారుడైన యోతాము రాజభవన అధికారిగా ఉంటూ దేశ ప్రజలను పరిపాలించాడు.
2CH 26:22 ఉజ్జియా పరిపాలన గురించిన ఇతర విషయాలు, ప్రారంభం నుండి చివరి వరకు, ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్తచేత నమోదు చేయబడ్డాయి.
2CH 26:23 ఉజ్జియా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, రాజులకు చెందిన స్మశానవాటికలో వారి సమీపంలో పాతిపెట్టబడ్డాడు, ఎందుకంటే, “అతనికి కుష్ఠువ్యాధి ఉంది” అని ప్రజలు అన్నారు. అతని తర్వాత అతని కుమారుడు యోతాము రాజయ్యాడు.
2CH 27:1 యోతాము రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెరూష. ఆమె సాదోకు కుమార్తె.
2CH 27:2 అతడు తన తండ్రి ఉజ్జియా చేసినట్లే యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కానీ అతనిలా యెహోవా మందిరంలోకి ప్రవేశించలేదు. ప్రజలు మాత్రం తమ అవినీతి అక్రమాలను కొనసాగించారు.
2CH 27:3 యోతాము యెహోవా ఆలయానికి పై ద్వారాన్ని తిరిగి కట్టించాడు. ఓఫెలు కొండ దగ్గర గోడను చాలా వరకు కట్టించాడు.
2CH 27:4 అతడు యూదా కొండ ప్రాంతంలో పట్టణాలు అడవుల్లో కోటలు బురుజులు నిర్మించాడు.
2CH 27:5 యోతాము అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి వారిని జయించాడు. ఆ సంవత్సరం అమ్మోనీయులు అతనికి నూరు తలాంతుల వెండి, పదివేల కోరుల గోధుమలు, పదివేల కోరుల యవలు చెల్లించారు. అమ్మోనీయులు రెండవ మూడవ సంవత్సరాల్లో కూడా అదే మొత్తాన్ని అతనికి తీసుకువచ్చారు.
2CH 27:6 యోతాము తన దేవుడు యెహోవా దృష్టిలో యధార్థంగా ప్రవర్తించినందుచేత అతడు బలాభివృద్ధి చెందాడు.
2CH 27:7 యోతాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు అతడు చేసిన యుద్ధాలన్నీ, అతడు చేసిన ఇతర కార్యాలన్ని ఇశ్రాయేలు, యూదారాజు చర్రిత గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.
2CH 27:8 అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు.
2CH 27:9 యోతాము చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరాడు. ప్రజలు దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన ఆహాజు రాజయ్యాడు.
2CH 28:1 ఆహాజు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. తన పితరుడైన దావీదులా కాకుండా, అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేయలేదు.
2CH 28:2 అతడు ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు, అతడు బయలును పూజించడానికి విగ్రహాలు చేయించాడు.
2CH 28:3 అతడు బెన్ హిన్నోము లోయలో బలులను కాల్చివేసి, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా ఏ జనాలనైతే వెళ్లగొట్టారో, ఆ జనాలు చేసిన హేయక్రియలు చేసి, తన కుమారులను అగ్నిలో బలి ఇచ్చాడు.
2CH 28:4 అతడు క్షేత్రాల్లో, కొండలమీద, పచ్చని ప్రతి చెట్టు క్రింద బలులు అర్పిస్తూ ధూపం వేసేవాడు.
2CH 28:5 కాబట్టి అతని దేవుడైన యెహోవా అతన్ని సిరియా రాజు చేతికి అప్పగించారు. సిరియనులు అతన్ని ఓడించి, అతని ప్రజల్లో చాలామందిని బందీలుగా పట్టుకుని దమస్కుకు తీసుకెళ్లారు. అతడు ఇశ్రాయేలు రాజు చేతికి కూడా అప్పగించబడ్డాడు, అతడు ఆహాజుకు భారీ ప్రాణనష్టాన్ని కలిగించాడు.
2CH 28:6 రెమల్యా కుమారుడైన పెకహు ఒకేరోజున యూదాలో 1,20,000 మంది సైనికులను చంపాడు, అలా జరగడానికి కారణం యూదా వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టడమే.
2CH 28:7 ఎఫ్రాయిమీయుల యోధుడైన జిఖ్రీ, రాజకుమారుడైన మయశేయాను, రాజభవనానికి అధికారియైన అజ్రీకామును, రాజు తర్వాత రెండవ స్థాయి వాడైన ఎల్కానాను చంపాడు.
2CH 28:8 ఇశ్రాయేలీయులు తమ తోటి ఇశ్రాయేలీయుల నుండి రెండు లక్షలమంది భార్యలను, కుమారులను, కుమార్తెలను యూదా నుండి బందీలుగా తీసుకున్నారు. వారు గొప్ప దోపుడుసొమ్మును దోచుకుని తిరిగి సమరయకు తీసుకెళ్లారు.
2CH 28:9 అయితే యెహోవా ప్రవక్తయైన ఓదేదు అనే ఒకడు అక్కడ ఉన్నాడు. అతడు సమరయకు వస్తున్న సైన్యాన్ని కలుసుకోడానికి వెళ్లి వారితో ఇలా చెప్పాడు, “మీ పూర్వికుల దేవుడైన యెహోవాకు యూదా వారి మీద కోపం వచ్చి, వారిని మీ చేతికి అప్పగించారు. కానీ మీరు ఆకాశాన్నంటే క్రోధంతో వారిని చంపేశారు.
2CH 28:10 ఇప్పుడు యూదా, అలాగే యెరూషలేములోని స్త్రీ పురుషులను మీ బానిసలుగా చేసుకోవాలనేది మీ ఆలోచన. అయితే మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు కూడా అపరాధులు కారా?
2CH 28:11 ఇప్పుడు నా మాట వినండి! మీరు బందీలుగా పట్టుకున్న మీ తోటి ఇశ్రాయేలీయులను తిరిగి పంపించండి, ఎందుకంటే యెహోవా తీవ్రమైన కోపం మీపై ఉంది.”
2CH 28:12 ఎఫ్రాయిమీయుల పెద్దలైన యెహోహనాను కుమారుడైన అజర్యా, మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లాయి కుమారుడైన అమాశా అనేవారు యుద్ధం నుండి తిరిగివస్తున్న వారికి ఎదురుగా నిలబడి.
2CH 28:13 వారితో, “మీరు ఈ బందీలను ఇక్కడకు తీసుకురాకూడదు, యెహోవా ఎదుట మేము దోషులమవుతాము. మీరు మా పాపాలను దోషాలను ఇంకా ఎక్కువ వేయాలనుకుంటున్నారా? ఇప్పటికే మా దోషం ఎంతో ఎక్కువగా ఉంది, యెహోవా రగులుతున్న కోపం ఇశ్రాయేలు మీద ఉంది” అని చెప్పారు.
2CH 28:14 కాబట్టి సైనికులు ఆ బందీలను, దోపుడుసొమ్మును అధికారులు, సమాజమంతటి సమక్షంలో విడిచిపెట్టారు.
2CH 28:15 పేరు బట్టి నియమితులైన వారు దోపిడిలో నుండి వస్త్రాలు, చెప్పులు తీసి నగ్నంగా ఉన్న బందీలకు ఇచ్చారు. తినడానికి ఆహారం, త్రాగడానికి నీరు, ఔషధ తైలాన్ని ఇచ్చారు. నీరసించిన వారిని గాడిదల మీద ఎక్కించారు. అప్పుడు బందీలను ఖర్జూరపు చెట్ల పట్టణం అనే పేరున్న యెరికోకు తీసుకెళ్లి వారి స్వదేశస్థుల దగ్గర వదిలి, తిరిగి సమరయకు వచ్చారు.
2CH 28:16 ఆ కాలంలో అష్షూరుదేశపు రాజులను సాయం చేయమని ఆహాజు రాజు కబురు పంపాడు.
2CH 28:17 ఎందుకంటే, మరోసారి ఎదోమీయులు యూదా మీదికి దండెత్తివచ్చి, కొందరిని బందీలుగా పట్టుకుపోయారు.
2CH 28:18 ఫిలిష్తీయులు యూదాలోని దక్షిణ పర్వత ప్రాంతాలలోని పట్టణాలపై దాడి చేశారు. వారు బేత్-షెమెషు, అయ్యాలోను గెదెరోతు, అలాగే శోకో, తిమ్నా గిమ్జో వాటి చుట్టుప్రక్కల గ్రామాలను స్వాధీనం చేసుకుని ఆక్రమించారు.
2CH 28:19 ఆహాజు యూదా ప్రజల్లో దుష్టత్వం పెరిగేలా చేసి యెహోవాకు నమ్మకద్రోహం చేశాడు, కాబట్టి ఇశ్రాయేలు రాజైన ఆహాజు కారణంగా యెహోవా యూదా రాజ్యాన్ని అణచివేశారు.
2CH 28:20 అష్షూరు రాజు తిగ్లత్-పిలేసెరు ఆహాజుకు సహాయం చేయడానికి వచ్చాడు గాని, అతని ద్వారా ఆహాజుకు కష్టమే కలిగింది కాని లాభం కాదు.
2CH 28:21 ఆహాజు యెహోవా మందిరంలో నుండి రాజభవనంలో నుండి, అధిపతుల దగ్గరనుండి కొంత సొమ్ము తీసి అష్షూరు రాజుకు ఇచ్చాడు. కాని, దానివలన కూడా సాయం దొరకలేదు.
2CH 28:22 ఆ ఆపదకాలంలో ఆహాజు రాజు యెహోవా పట్ల ఇంకా నమ్మకద్రోహం చేశాడు.
2CH 28:23 తనను ఓడించిన దమస్కు నగరవాసులకున్న దేవుళ్ళకు బలులు అర్పించాడు. “సిరియా రాజులకు వారి దేవుళ్ళు సహాయం చేసినట్లు నాకూ సాయం చేసేలా నేను వాటికి బలులు అర్పిస్తాను” అని అనుకున్నాడు. అయితే ఆ దేవుళ్ళ వలన అతనికి ఇశ్రాయేలు ప్రజలందరికి పతనం కలిగింది.
2CH 28:24 ఆహాజు యెహోవా మందిరంలో ఉన్న సామాగ్రిని పోగుచేయించి వాటిని ముక్కలు చేశాడు. యెహోవా ఆలయ ద్వారాలు మూసివేసి, యెరూషలేము అంతా బలిపీఠాలను కట్టించాడు.
2CH 28:25 యూదా దేశంలోని పట్టణాలన్నిటిలో అతడు ఇతర దేవుళ్ళకు ధూపం వేయడానికి బలిపీఠాలను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం తెప్పించారు.
2CH 28:26 ఆహాజు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతని విధానాలన్నీ, మొదటి నుండి చివరి వరకు, యూదా, ఇశ్రాయేలు రాజు గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.
2CH 28:27 ఆహాజు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతన్ని యెరూషలేము పట్టణంలో పాతిపెట్టారు గాని, ఇశ్రాయేలు రాజు సమాధుల్లో కాదు. అతని తర్వాత అతని కుమారుడైన హిజ్కియా రాజయ్యాడు.
2CH 29:1 హిజ్కియా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా, ఆమె జెకర్యా కుమార్తె.
2CH 29:2 అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు, యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
2CH 29:3 అతడు తన పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెలలో యెహోవా ఆలయ ద్వారాలను తెరిచి వాటికి మరమ్మత్తు చేయించాడు.
2CH 29:4 అతడు యాజకులను, లేవీయులను పిలిపించి, వారిని ఆలయానికి తూర్పున ఉన్న విశాల స్థలంలో సమకూర్చి,
2CH 29:5 వారితో ఇలా చెప్పాడు: “లేవీయులారా! నేను చెప్పేది వినండి! ఇప్పుడు మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకుని, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మందిరాన్ని పవిత్రపరచండి. పరిశుద్ధాలయంలో నుండి అపవిత్రమైన ప్రతిదీ తీసివేయండి.
2CH 29:6 మన తండ్రులు నమ్మకద్రోహులుగా ఉన్నారు; మన దేవుడైన యెహోవా దృష్టికి ఏది చెడ్డదో అదే చేసి, వారు ఆయనను విడిచిపెట్టారు. ఆయన నివాసస్థలం వైపు నుండి ముఖం త్రిప్పుకొని వారు ఆయనను నిర్లక్ష్యం చేశారు.
2CH 29:7 వారు మండపం తలుపులు మూసివేసి, దీపాలను ఆర్పివేశారు. వారు ఇశ్రాయేలు దేవునికి పరిశుద్ధాలయం దగ్గర ధూపం వేయలేదు, దహనబలులు అర్పించలేదు.
2CH 29:8 కాబట్టి యెహోవా కోపం యూదా, యెరూషలేము మీద రగులుకుంది. మీరు కళ్ళారా చూస్తున్నట్లుగా ఆయన వారిని భయాందోళనలకు నిందకు గురి చేశారు.
2CH 29:9 అందుకే మన తండ్రులు కత్తివేటుకు గురయ్యారు, మన కుమారులు, కుమార్తెలు మన భార్యలు వారికి బందీలుగా ఉన్నారు.
2CH 29:10 ఇప్పుడు ఆయన కోపం మనమీద నుండి మళ్ళేలా ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవాతో ఒడంబడిక చేయాలని ఉద్దేశించాను.
2CH 29:11 నా కుమారులారా! మీరు ఆయనకు పరిచారకులుగా ఉండి ధూపం వేయాలని తన ఎదుట నిలబడి సేవ జరిగించాలని యెహోవా మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఈ సమయంలో మీరు అశ్రద్ధ చూపకండి.”
2CH 29:12 అప్పుడు ఈ లేవీయులు పనికి నియమించబడ్డారు: కహాతీయుల నుండి: అమాశై కుమారుడైన మహతు, అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయుల నుండి: అబ్దీ కుమారుడైన కీషు, యెహల్లెలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయుల నుండి: జిమ్మా కుమారుడైన యోవాహు, యోవాహు కుమారుడైన ఏదెను.
2CH 29:13 ఎలీషాపాను సంతతి నుండి: షిమ్రీ యెహీయేలు, ఆసాపు సంతతి నుండి: జెకర్యా, మత్తన్యా,
2CH 29:14 హేమాను సంతతి నుండి: యెహీయేలు, షిమీ, యెదూతూను సంతతి నుండి: షెమయా, ఉజ్జీయేలు.
2CH 29:15 వారు తమ సోదరులను తోటి లేవీయులను సమకూర్చి తమను పవిత్రం చేసుకున్నారు. అప్పుడు రాజు ఆదేశించిన ప్రకారం యెహోవా వాక్కును అనుసరించి, యెహోవా మందిరం శుద్ధి చేయడానికి లోపలికి వెళ్లారు.
2CH 29:16 యెహోవా గర్భాలయాన్ని శుద్ధి చేయడానికి యాజకులు లోనికి వెళ్లారు. యెహోవా మందిరంలో కనిపించిన అపవిత్రమైన ప్రతిదాన్ని వారు యెహోవా మందిరం నుండి ఆవరణంలోకి తెచ్చారు. లేవీయులు దాన్నంతా కిద్రోను లోయకు తీసుకెళ్లి పారవేశారు.
2CH 29:17 మొదటి నెల మొదటి రోజున పవిత్రం చేయడం వారు ఆరంభించారు. ఆ నెల ఎనిమిదో రోజున యెహోవా మంటపం వరకు చేరారు. మరో ఎనిమిది రోజులు వారు యెహోవా మందిరాన్ని పవిత్రం చేస్తూ వచ్చారు. మొదటి నెల పదహారో రోజు ఆ పని ముగించారు.
2CH 29:18 అప్పుడు వారు రాజైన హిజ్కియా దగ్గరకు వెళ్లి ఇలా చెప్పారు, “యెహోవా ఆలయమంతా మేము శుద్ధి చేశాము. దహనబలిపీఠాన్ని, దాని సామాగ్రిని, సన్నిధి రొట్టెలు ఉంచే బల్లను, దాని సామాగ్రిని శుద్ధి చేశాము.
2CH 29:19 ఆహాజు రాజు తన పరిపాలనలో నమ్మకద్రోహం చేసి తొలగించిన వస్తువులన్నిటిని కూడా సిద్ధం చేసి పవిత్రపరచాము. అవి ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు ఉన్నాయి.”
2CH 29:20 మరుసటిరోజు ఉదయమే లేచి రాజైన హిజ్కియా నగర అధికారులను సమకూర్చి యెహోవా ఆలయానికి వెళ్లాడు.
2CH 29:21 వారు రాజ్యం కోసం, పరిశుద్ధాలయం కోసం, యూదా వారి కోసం బలిగా ఏడు కోడెలు, ఏడు పొట్టేళ్లు, ఏడు గొర్రెలు, ఏడు మేకపోతులు తెచ్చారు. అది పాపపరిహారబలిగా తెచ్చారు. అహరోను వారసులైన యాజకులను, “యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించాలి” అని రాజు ఆదేశించాడు.
2CH 29:22 అప్పుడు వారు కోడెలను వధించారు. యాజకులు వాటి రక్తం తీసుకుని బలిపీఠం మీద చల్లారు. తర్వాత పొట్టేళ్ళను వధించి వాటి రక్తం బలిపీఠం మీద చల్లారు. గొర్రెపిల్లలను కూడా వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు.
2CH 29:23 పాపపరిహారబలిగా ఉన్న మేకపోతులను రాజు ఎదుట సమకూడినవారి ఎదుటకు తెచ్చారు. వారు వాటి మీద చేతులుంచారు.
2CH 29:24 అప్పుడు యాజకులు వాటిని వధించి, ఇశ్రాయేలు ప్రజలు బలిగా వాటి రక్తం బలిపీఠం మీద పోశారు. ఇశ్రాయేలు ప్రజలందరి ప్రాయశ్చిత్తంగా దహనబలి, పాపపరిహారబలి అర్పించాలని రాజు ఆదేశించాడు, కాబట్టి వారు అలా చేశారు.
2CH 29:25 మునుపు దావీదు రాజు, అతని దీర్ఘదర్శియైన గాదు, ప్రవక్తయైన నాతాను ఆదేశించిన ప్రకారం, హిజ్కియా లేవీయులను తాళాలతో, స్వరమండలాలతో, తంతి వాయిద్యాలతో యెహోవా మందిరంలో ఉంచాడు. ఇలా చేయాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించాడు.
2CH 29:26 దావీదు చేయించిన వాయిద్యాలను లేవీయులు, బూరలను యాజకులు చేతపట్టుకుని నిలబడ్డారు.
2CH 29:27 బలిపీఠం మీద దహనబలులను అర్పించమని హిజ్కియా ఆజ్ఞాపించాడు. బలిపీఠం మీద దహనబలులు అర్పించడం ఆరంభం కాగానే బూరలతో, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యాలతో యెహోవాకు స్తుతి పాటలు పాడడం ఆరంభమైంది.
2CH 29:28 గాయకులు పాటలు పాడుతూ, సంగీతకారులు వాయిద్యాలు వాయిస్తూ, బూరల ఊదుతూ ఉండగా సమాజమంతా తలలు వంచి ఆరాధించారు. దహనబలి అర్పణ ముగిసేవరకు ఇదంతా జరుగుతూ ఉండింది.
2CH 29:29 దహనబలులు ముగిసినప్పుడు రాజు, అతనితో ఉన్నవారంతా మోకరించి ఆరాధన చేశారు.
2CH 29:30 దావీదు, దీర్ఘదర్శియైన ఆసాపు వ్రాసిన కీర్తనలు పాడి యెహోవాను స్తుతించాలని లేవీయులకు హిజ్కియారాజు అధికారులు ఆదేశించారు. వారు ఆనందంతో స్తుతిగానం చేస్తూ తలలు వంచి ఆరాధించారు.
2CH 29:31 అప్పుడు హిజ్కియా ప్రజలతో, “యెహోవాకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకున్నారు, దగ్గరకు రండి, యెహోవా ఆలయానికి బలులు, కృతజ్ఞతార్పణలు తీసుకురండి” అన్నాడు, హిజ్కియా అలాగే సమకూడినవారు బలులు, కృతజ్ఞతార్పణలు తెచ్చారు. ఇష్టమున్న వారంతా దహనబలులు కూడా తెచ్చారు.
2CH 29:32 సమకూడినవారు తెచ్చిన దహనబలులు డెబ్బై కోడెలు, నూరు పొట్టేళ్లు, రెండు వంద గొర్రెపిల్లలు. అవన్నీ యెహోవాకు దహనబలులు.
2CH 29:33 బలి అర్పించబడిన జంతువులు ఆరువందల కోడెలు మూడు వేల గొర్రెలు మేకలు.
2CH 29:34 యాజకులు కొద్దిమందే ఉన్నారు కాబట్టి దహనబలిగా దహనబలి పశువులన్నిటి చర్మం ఒలువలేకపోయారు. పనంతా పూర్తయ్యే వరకు, ఇతర యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకునే వరకు, వారి వంశీయులు లేవీయులు సాయం చేశారు. యాజకులకంటే లేవీయులే ప్రతిష్ఠించుకునే విషయంలో యథార్థంగా ఉన్నారు.
2CH 29:35 సమృద్ధిగా దహనబలి పశువుల సమాధానబలుల ఉన్నాయి, దానితో పాటు దహనబలుల క్రొవ్వు దహనబలులతో పాటు పానార్పణలు ఉన్నాయి. ఆ విధంగా యెహోవా మందిరంలో సేవ మళ్ళీ ప్రారంభించడం జరిగింది.
2CH 29:36 అదంతా త్వరగానే జరిగింది కాబట్టి దేవుడు ప్రజలకు జరిగించిన దానిని చూసి హిజ్కియా, ప్రజలంతా ఆనందించారు.
2CH 30:1 ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించడానికి యెరూషలేములో యెహోవా ఆలయానికి రమ్మని హిజ్కియా ఇశ్రాయేలు ప్రజలకు యూదా ప్రజలకు అందరికి కబురు పంపాడు. ఎఫ్రాయిం, మనష్షే గోత్రాలకు కూడా లేఖలు వ్రాసి పంపాడు.
2CH 30:2 రాజు, అతని అధికారులు, యెరూషలేములో ఉన్న సమాజమంతా రెండవ నెలలో పస్కాను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
2CH 30:3 ఎందుకంటే, తగినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకోకపోవడం, ప్రజలు యెరూషలేములో సమావేశం కాకపోవడం వలన ఎప్పుడు జరిపే సమయంలో వారు పండుగ జరుపుకోలేకపోయారు.
2CH 30:4 ఆ విషయం రాజుకు సమాజం వారందరికి అంగీకారంగా ఉంది.
2CH 30:5 ప్రజలంతా యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపుకోవాలని బెయేర్షేబ నుండి దాను వరకు ఇశ్రాయేలు అంతటా ప్రకటించాలని వారు నిర్ణయించుకున్నారు. చాలాకాలంగా వ్రాయబడిన ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రజలు పండుగ జరుపుకోలేదు.
2CH 30:6 రాజు, అతని అధికారుల నుండి ఉత్తరాలు తీసుకుని వార్తాహరులు రాజాజ్ఞ ప్రకారం యూదా, ఇశ్రాయేలు దేశమంతా వెళ్లారు. ఆ ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపుకు తిరగండి. అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకుని మిగిలి ఉన్న మీ దగ్గరకు ఆయన తిరిగి వస్తారు.
2CH 30:7 తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసిన మీ తల్లిదండ్రుల్లా మీ తోటి ఇశ్రాయేలీయుల్లా ఉండకండి. మీరు చూస్తున్నట్లుగా ఆయన వారిని నాశనానికి అప్పగించారు.
2CH 30:8 మీ పూర్వికుల్లా మూర్ఖంగా ప్రవర్తించకుండ యెహోవాకు లోబడండి. ఆయన శాశ్వతంగా పవిత్రం చేసి ప్రత్యేకించుకున్న పరిశుద్ధాలయంలోకి రండి. మీ దేవుడైన యెహోవాను సేవించండి, అప్పుడు ఆయన తీవ్రమైన కోపం మీమీద నుండి మళ్ళవచ్చు.
2CH 30:9 మీరు యెహోవా వైపు తిరిగితే మీ తోటి ఇశ్రాయేలీయులపై మీ పిల్లలపై వారిని బందీలుగా తీసుకువెళ్లిన వారికి కనికరం కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దయ కరుణ గలవారు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ నుండి తన ముఖం త్రిప్పుకోరు.”
2CH 30:10 వార్తాహరులు జెబూలూను ప్రదేశం వరకు ఎఫ్రాయిం మనష్షేల దేశాల్లోని ప్రతి పట్టణానికి వెళ్లారు. అయితే ప్రజలు వారిని తృణీకరించి నవ్వులపాలు చేశారు.
2CH 30:11 కాని, ఆషేరు, మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకొని యెరూషలేముకు వచ్చారు.
2CH 30:12 యెహోవా ఆదేశం ప్రకారం రాజు, అతని అధికారులు ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేటట్టు యెహోవా హస్తం యూదా వారి మీద ఉంది. ఆయన వారికి ఏక మనస్సు కలిగించారు.
2CH 30:13 రెండవ నెలలో పులియని రొట్టె పండుగ ఆచరించడానికి ప్రజలు గొప్ప సమూహంగా యెరూషలేములో సమకూడారు.
2CH 30:14 యెరూషలేములో ఉన్న ఇతర బలిపీఠాలను వారు తొలగించారు. ధూపవేదికలు తీసివేసి కిద్రోను లోయలో పడవేశారు.
2CH 30:15 రెండవ నెల పద్నాలుగవ రోజున వారు పస్కాబలి గొర్రెపిల్లను వధించారు. యాజకులు లేవీయులు సిగ్గుపడి, తమను పవిత్రం చేసుకుని యెహోవా ఆలయానికి దహనబలులు తెచ్చారు.
2CH 30:16 దైవజనుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం వారికి నియమించిన స్థలంలో యధావిధిగా వారు నిలబడ్డారు. లేవీయులు యాజకుల చేతికి రక్తం అందించగా వారు దానిని బలిపీఠం మీద చల్లారు.
2CH 30:17 ఆ గుంపులో తమను పవిత్రం చేసుకోని వారు చాలామంది ఉన్నారు. అలా అపవిత్రంగా ఉండి తమ పస్కాబలి గొర్రెపిల్లలను యెహోవాకు ప్రతిష్ఠ చేయలేని ఆ వ్యక్తులందరి కోసం లేవీయులు వాటిని వధించవలసి వచ్చింది.
2CH 30:18 ఎఫ్రాయిం మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను ప్రదేశాల నుండి వచ్చిన వారిలో చాలామంది తమను పవిత్రం చేసుకోలేదు. అయినా లేఖనాలకు విరుద్ధంగా వారు పస్కాను తిన్నారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు: “మంచివారైన యెహోవా, ప్రతి ఒక్కరిని క్షమించును గాక!
2CH 30:19 పరిశుద్ధాలయ నియమాల ప్రకారం అపవిత్రంగా ఉన్నప్పటికీ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వెదికితే అలాంటి వారందరినీ యెహోవా క్షమించును గాక.”
2CH 30:20 యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజలను బాగుచేశారు.
2CH 30:21 యెరూషలేములో హాజరైన ఇశ్రాయేలు వారు మహానందంతో పులియని రొట్టె పండుగ ఏడు రోజులు ఆచరించారు. ప్రతిరోజు లేవీయులు, యాజకులు యెహోవాకు పాటలు పాడారు. యెహోవాను స్తుతిస్తూ వాయిద్యాలు వాయించారు.
2CH 30:22 యెహోవా సేవ విషయంలో మంచి తెలివితేటలు చూపిన లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడాడు. ఏడు రోజులు వారు తమ నియమిత భాగాలు తింటూ, సమాధానబలులు అర్పిస్తూ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లించారు.
2CH 30:23 సమాజమంతా మరో ఏడు రోజులు పండుగ జరుపుకోవాలని నిశ్చయించుకొని మరో ఏడు రోజులు ఆనందంగా జరుపుకున్నారు.
2CH 30:24 యూదా రాజైన హిజ్కియా సభకు 1,000 కోడెలను 7,000 గొర్రెలను మేకలను అందించాడు, అధికారులు వారికి 1,000 ఎద్దులను 10,000 గొర్రెలు మేకలను అందించారు. పెద్ద సంఖ్యలో యాజకులు తమను తాము పవిత్రం చేసుకున్నారు.
2CH 30:25 అప్పుడు యాజకులు, లేవీయులు, యూదావారిలో నుండి ఇశ్రాయేలీయులలో నుండి వచ్చిన సమాజపువారందరు, ఇశ్రాయేలు దేశం నుండి వచ్చి యూదాలో నివసిస్తున్న విదేశీయులు కూడా సంతోషించారు.
2CH 30:26 యెరూషలేమంతా ఎంతో సంతోషంగా ఉంది. ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడైన సొలొమోను కాలం నుండి అంతవరకు యెరూషలేములో ఇలాంటిది జరుగలేదు.
2CH 30:27 లేవీయులైన యాజకులు లేచి ప్రజలను దీవించారు. వారి ప్రార్థన దేవుడు పవిత్ర నివాసమైన పరలోకానికి చేరింది. ఆయన వారి ప్రార్థన విన్నారు.
2CH 31:1 ఇదంతా ముగిసిన తర్వాత అక్కడున్న ఇశ్రాయేలీయులు యూదా పట్టణాలకు వెళ్లి పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టారు. వారు యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం, మనష్షేలలో ఉన్న క్షేత్రాలను బలిపీఠాలను నాశనం చేశారు. వాటన్నిటినీ నాశనం చేసిన తర్వాత, ఇశ్రాయేలీయులు తమ సొంత పట్టణాలకు వారి సొంత స్వాస్థ్యాలకు తిరిగి వచ్చారు.
2CH 31:2 హిజ్కియా ఎవరి సేవలను వారు జరిగించడానికి యాజకులను లేవీయులను వారి వారి వరుసల ప్రకారంగా నియమించాడు; దహనబలులు సమాధానబలులు అర్పించడానికి, ఇతర సేవలు జరిగించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, యెహోవా నివాసస్థలం యొక్క ద్వారాల దగ్గర స్తుతులు చెల్లించడానికి హిజ్కియా యాజకులను లేవీయులను నియమించాడు.
2CH 31:3 యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం ఉదయం, సాయంకాలం అర్పించిన వలసిన దహనబలుల కోసం, సబ్బాతు దినాలు అమావాస్య రోజులు నియమించబడిన పండుగ కాలాలు అర్పించవలసిన దహనబలుల కోసం రాజు తన ఆస్తినుండి ఇచ్చాడు.
2CH 31:4 యాజకులు, లేవీయులు యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాసియున్న సేవ శ్రద్ధగా జరిగించేటట్టు, వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని రాజు యెరూషలేము నగరవాసులను ఆదేశించాడు.
2CH 31:5 అలా ఆజ్ఞ జారీచేయడంతోనే ఇశ్రాయేలు ప్రజలు కానుకలు ధారాళంగా ఇచ్చారు. ధాన్యంలో మొదటి పంట, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో, తేనెలో, పొలంలో పండే వాటిలో, కలిగిన వాటన్నిటిలో పదవ భాగాన్ని వారు తెచ్చారు. అది చాలా పెద్ద మొత్తము.
2CH 31:6 యూదా పట్టణాల్లో కాపురం ఉంటున్న యూదా వారు, ఇశ్రాయేలీయులు తమ పశువుల మందలో నుండి, గొర్రెల, మేకలమందలలో నుండి పదవ భాగాన్ని తెచ్చారు. తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువులలో నుండి కూడా పదవ భాగాన్ని తెచ్చారు. వాటిని కుప్పలుగా పేర్చారు.
2CH 31:7 ఈ విధంగా చేయడం వారు మూడవ నెలలో ఆరంభించారు. ఏడవ నెలలో ముగించారు.
2CH 31:8 హిజ్కియా, అతని అధికారులు వచ్చి ఆ కుప్పలు చూసి యెహోవాను స్తుతించి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను దీవించారు.
2CH 31:9 హిజ్కియా యాజకులను, లేవీయులను ఆ కుప్పలను గురించి అడిగాడు.
2CH 31:10 సాదోకు సంతతివాడు ముఖ్య యాజకుడైన అజర్యా అతనికి ఇలా జవాబిచ్చాడు, “యెహోవా తన ప్రజలను ఆశీర్వదించారు కాబట్టి ఇంత పెద్ద మొత్తం మిగిలిపోయింది, అవే ఈ కుప్పలు.”
2CH 31:11 అప్పుడు యెహోవా మందిరంలో గిడ్డంగులు కట్టాలని హిజ్కియా ఆదేశించాడు. వారు అలాగే చేశారు.
2CH 31:12 ఆ తర్వాత కానుకలను, పదవ భాగాలను, ప్రతిష్ఠచేసిన వస్తువులను నమ్మకంగా లోపలికి తెచ్చారు. వాటి మీద లేవీయుడైన కొనన్యా అధికారిగా ఉన్నాడు. అతని సోదరుడైన షిమీ అతని తర్వాత స్థానంలో ఉన్నాడు.
2CH 31:13 కొనన్యా చేతి క్రింద, అతని సోదరుడు షిమీ చేతి క్రింద తనిఖీ చేసేవారిగా యెహీయేలు అజజ్యాహు, నహతు, అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మక్యాహు మహతు బెనాయా అనే వారున్నారు. వీరిని రాజైన హిజ్కియా, దేవుని మందిరానికి అధికారియైన అజర్యా నియమించారు.
2CH 31:14 ఇమ్నా కుమారుడైన కోరే అనే లేవీయుడు తూర్పు ద్వారానికి పాలకుడు. ప్రజలు దేవునికి స్వేచ్ఛగా అర్పించిన అర్పణ మీద అతడు అధికారిగా ఉన్నాడు. ప్రజలు యెహోవాకు తెచ్చిన కానుకలను, అతిపరిశుద్ధమైనవాటిని పంచిపెట్టడం అతని పని.
2CH 31:15 అతని చేతి క్రింద ఏదెను, మిన్యామీను, యెషూవ, షెమయా, అమర్యా, షెకన్యా అనే నమ్మకమైనవారు ఉన్నారు. యాజకుల పట్టణాల్లో తమ సాటి యాజకులని పెద్దలని పిన్నలని భేదం చూపకుండ వారి వారి వరసక్రమాల ప్రకారం వారి భాగాలను నమ్మకంగా పంచిపెట్టారు.
2CH 31:16 అంతేకాక, మూడేళ్ళు, ఆపైన వయస్సుండి, వంశావళిలో నమోదైన మగపిల్లలకు కూడా వారు పంచిపెట్టారు. వారి వారి వరుస ప్రకారం, బాధ్యత ప్రకారం సేవ చేయడానికి ప్రతిరోజు యెహోవా మందిరంలోకి వచ్చేవారందరికీ కూడా వారి భాగాలు పంచిపెట్టారు.
2CH 31:17 వారి వారి పూర్వికుల కుటుంబాల ప్రకారం వంశావళిలో నమోదైన యాజకులకు, వారి వారి పనుల ప్రకారం, వరుస ప్రకారం, ఇరవై సంవత్సరాలు, అంతకంటే పై వయస్సున్న లేవీయులకు కూడా వారు పంచిపెట్టారు.
2CH 31:18 వారు నమ్మకంగా తమను దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నారు కాబట్టి ఆ వంశావళిలో ఉన్న వారందరి చిన్నపిల్లలు, భార్యలు, కుమారులు, కుమార్తెల కోసం కూడా పంచిపెట్టారు.
2CH 31:19 తమ పట్టణాల చుట్టుప్రక్కల భూములలో, ఇతర పట్టణాల్లో అహరోను వారసులైన యాజకులు కొందరు కాపురముండేవారు. వారిలో మగవారందరికీ వంశావళిలో నమోదైన లేవీయులందరికి వారి భాగాలను పంచడానికి పేరుపేరున మనుష్యులు నియమించాడు.
2CH 31:20 హిజ్కియా ఆ విధంగా యూదా అంతటా చేశాడు. యెహోవా దృష్టిలో మంచిగా, సరియైన విధంగా, నమ్మకంగా ప్రవర్తించాడు.
2CH 31:21 యెహోవా ఆలయ సేవ కోసం, ధర్మశాస్త్రం, ఆజ్ఞ కోసం మొదలుపెట్టిన ప్రతి పనిలోను అతడు తన దేవుని వెదికి అనుసరించాడు. మనస్పూర్తిగా పని చేశాడు కాబట్టి వర్ధిల్లాడు.
2CH 32:1 హిజ్కియా ఈ పనులను నమ్మకంగా జరిగించిన తర్వాత, అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశం మీదికి దండెత్తి వచ్చాడు. అతడు తన కోసం స్వాధీనం చేసుకోవాలని ఆలోచించి, కోటగోడలున్న పట్టణాలను ముట్టడించాడు.
2CH 32:2 సన్హెరీబు వచ్చాడని, అతడు యెరూషలేముపై యుద్ధం చేయాలనుకున్నాడని హిజ్కియా చూసినప్పుడు,
2CH 32:3 అతడు తన అధికారులను, సైన్యాధిపతులను సంప్రదించాడు. పట్టణం బయట ఉన్న నీటి ఊటల నుండి నీరు సరఫరా కాకుండా చేయాలని వారు నిర్ణయించారు. వారు అతనికి తోడుగా నిలిచారు.
2CH 32:4 వారు పెద్ద గుంపుగా చేరి, “అష్షూరు రాజులు వచ్చి ఇక్కడ పుష్కలమైన నీరు ఉన్నట్లు తెలుసుకోవడం ఎందుకు?” అనుకుని ఆ ప్రాంతం గుండా ప్రవహించే నీటి ఊటలన్నిటిని, ప్రవాహాన్ని అడ్డుకున్నారు.
2CH 32:5 అప్పుడు అతడు గోడలో విరిగిన భాగాలన్నిటినీ మరమ్మత్తు చేసి, దానిపై బురుజులను నిర్మించాడు. అతడు దాని బయట మరొక గోడను కట్టించి, దావీదు నగరం మిద్దెలను బలోపేతం చేశాడు. అతడు పెద్ద సంఖ్యలో ఆయుధాలు డాళ్ళు కూడా తయారు చేయించాడు.
2CH 32:6 అతడు ప్రజలపై సైనిక అధికారులను నియమించి పట్టణ ద్వారం దగ్గర ఉన్న కూడలిలో తన ముందుకు వారిని పిలిపించి వారినిలా హెచ్చరించాడు:
2CH 32:7 “బలంగా ధైర్యంగా ఉండండి. అష్షూరు రాజును అతనితో ఉన్న పెద్ద సైన్యాన్ని చూసి భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు. అతని దగ్గర కన్నా మన దగ్గర గొప్ప శక్తి ఉంది.
2CH 32:8 అతనికి కేవలం మానవ బలం మాత్రమే ఉంది, కానీ మనకు సహాయం చేయడానికి, మన యుద్ధాలలో పోరాడడానికి మన దేవుడైన యెహోవా మనతో ఉన్నారు” అని చెప్పాడు. అప్పుడు ప్రజలు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలనుబట్టి ధైర్యం తెచ్చుకున్నారు.
2CH 32:9 తర్వాత, అష్షూరు రాజైన సన్హెరీబు అతని సైన్యాలన్నీ లాకీషును ముట్టడించినప్పుడు, అతడు యూదా రాజైన హిజ్కియాకు అక్కడ ఉన్న యూదా ప్రజలందరికి ఈ సందేశం ఇవ్వడానికి తన అధికారులను యెరూషలేముకు పంపాడు:
2CH 32:10 “అష్షూరు రాజు సన్హెరీబు ఇలా అంటున్నాడు: మీరు ముట్టిడిలో ఉన్న యెరూషలేములో ఉన్నారు. దేన్ని చూసుకుని మీకు ఈ ధైర్యం?
2CH 32:11 హిజ్కియా, ‘మన దేవుడైన యెహోవా మనలను అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాడు’ అని చెప్తున్నాడంటే, మీరు ఆకలితో దాహంతో చనిపోయేలా అతడు మిమ్మల్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాడు.
2CH 32:12 హిజ్కియా స్వయంగా ఈ దేవుని ఉన్నత స్థలాలను బలిపీఠాలను తొలగించి, యూదా వారితో యెరూషలేము వారితో, ‘మీరు ఒక్క బలిపీఠం దగ్గర ఆరాధించి దానిపై బలులు అర్పించాలి’ అని చెప్పలేదా?
2CH 32:13 “నేను నా పూర్వికులు ఇతర దేశాల ప్రజలందరికి ఏమి చేశామో మీకు తెలియదా? ఆ దేశాల దేవుళ్ళు ఎప్పుడైనా తమ దేశాన్ని నా చేతిలో నుండి విడిపించుకోగలిగారా?
2CH 32:14 ఈ దేశాల దేవుళ్ళలో ఎవరైనా తమ ప్రజలను నా నుండి రక్షించగలిగారా? అలాంటప్పుడు మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుండి ఎలా విడిపించగలడు?
2CH 32:15 ఇప్పుడు హిజ్కియా మిమ్మల్ని మోసం చేసి ఇలా తప్పుత్రోవ పట్టనివ్వకండి. అతన్ని నమ్మవద్దు, ఎందుకంటే ఏ దేశానికి ఏ రాజ్యానికి చెందిన ఏ దేవుడు కూడా తన ప్రజలను నా చేతిలో నుండి గాని నా పూర్వికుల చేతి నుండి గాని రక్షించలేకపోయాడు. అలాంటప్పుడు మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడం అసాధ్యం!”
2CH 32:16 సన్హెరీబు అధికారులు దేవుడైన యెహోవాకు ఆయన సేవకుడైన హిజ్కియాకు వ్యతిరేకంగా ఇంకా మాట్లాడారు.
2CH 32:17 రాజు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను హేళన చేస్తూ ఉత్తరాలు వ్రాసి ఆయనకు వ్యతిరేకంగా ఇలా అన్నాడు: “ఇతర దేశాల ప్రజల దేవతలు తమ ప్రజలను నా చేతిలో నుండి రక్షించనట్లే, హిజ్కియా దేవుడు తన ప్రజలను నా చేతి నుండి రక్షించలేడు.”
2CH 32:18 అప్పుడు వారు పట్టణాన్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో, గోడమీదున్న యెరూషలేముకు ప్రజలను బెదిరించడానికి భయపెట్టడానికి హెబ్రీ భాషలో బిగ్గరగా వారితో మాట్లాడారు.
2CH 32:19 వారు భూమిమీద ఇతర జనాంగాల కోసం మనుష్యులు తయారుచేసిన దేవతల గురించి మాట్లాడినట్లు యెరూషలేము యొక్క దేవుని గురించి మాట్లాడారు.
2CH 32:20 రాజైన హిజ్కియా, ఆమోజు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా ఈ విషయం గురించి ప్రార్థించి ఆకాశం వైపు మొరపెట్టారు.
2CH 32:21 యెహోవా ఒక దూతను పంపారు. అతడు అష్షూరు రాజు శిబిరంలో ఉన్న పోరాట యోధులందరినీ, అధిపతులను, అధికారులందరినీ నాశనం చేశాడు. కాబట్టి అష్షూరురాజు అవమానంతో తన దేశానికి వెళ్లిపోయాడు. అతడు తన దేవుని గుడిలోకి వెళ్లినప్పుడు, అతని కుమారులలో కొందరు ఖడ్గంతో అతన్ని నరికివేశారు.
2CH 32:22 కాబట్టి యెహోవా హిజ్కియాను, యెరూషలేము ప్రజలను అష్షూరు రాజు సన్హెరీబు చేతి నుండి ఇతరులందరి చేతిలో నుండి రక్షించారు. ఆయన అన్ని వైపుల నుండి వారిని కాపాడారు.
2CH 32:23 చాలామంది యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు విలువైన వస్తువులు తెచ్చారు. అందువల్ల అతడు అప్పటినుండి అన్ని రాజ్యాల దృష్టిలో ఘనత పొందాడు.
2CH 32:24 ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. అతడు యెహోవాకు ప్రార్థించగా ఆయన అతనితో మాట్లాడి, అతనికి ఒక అద్భుతమైన సూచన ఇచ్చాడు.
2CH 32:25 అయితే హిజ్కియా గర్వించి తన పట్ల చూపిన దయకు తగినట్లు ప్రవర్తించలేదు. కాబట్టి అతని మీదికీ యూదా యెరూషలేము మీదికీ యెహోవా కోపం వచ్చింది.
2CH 32:26 అయితే చివరకు హిజ్కియా తన హృదయ గర్వాన్ని విడిచిపెట్టి తాను యెరూషలేము నివాసులు తమను తాము తగ్గించుకున్నారు. కాబట్టి హిజ్కియా రోజుల్లో యెహోవా కోపం ప్రజలమీదికి రాలేదు.
2CH 32:27 హిజ్కియాకు గొప్ప సంపదలు ఘనత లభించాయి. వెండి, బంగారం, ప్రశస్తమైన రాళ్లు, సుగంధద్రవ్యాలు, డాళ్లు, అన్ని రకాల విలువైన వస్తువులు భద్రం చేయడానికి గదులు కట్టించాడు.
2CH 32:28 ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, నూనె నిల్వ ఉంచడానికి గిడ్డంగులు కట్టించాడు. వివిధ రకాల పశువులకు శాలలు, మందలకు దొడ్లు కట్టించాడు.
2CH 32:29 దేవుడు అతనికి అతివిస్తారమైన సంపద ఇచ్చారు కాబట్టి అతడు పట్టణాలను కూడా కట్టించుకున్నాడు. ఎన్నో గొర్రెల మందలు పశువుల మందలు అతడు సంపాదించాడు.
2CH 32:30 ఈ హిజ్కియా గిహోను ఊట కాలువకు ఎగువన ఆనకట్ట వేయించి దావీదు పట్టణపు పడమరగా దాన్ని మళ్ళించాడు. హిజ్కియా జరిగించిన ప్రతి పనిలోను వర్ధిల్లాడు.
2CH 32:31 అయితే, అతని దేశంలో జరిగిన అద్భుతమైన ప్రగతి గురించి తెలుసుకోవడానికి బబులోను పాలకులు అతని దగ్గరకు రాయబారులను పంపారు. అతని హృదయంలో ఉన్నదంతా తెలుసుకోవాలని దేవుడు అతన్ని పరీక్షకు విడిచిపెట్టారు.
2CH 32:32 హిజ్కియా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, భక్తితో అతడు చేసిన పనులు ఆమోజు కుమారుడు ప్రవక్తయైన యెషయాకు కలిగిన దర్శనాల గ్రంథంలోనూ యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలోనూ వ్రాయబడ్డాయి.
2CH 32:33 హిజ్కియా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. ప్రజలు దావీదు వారసుల శ్మశానభూమిలోని పై భాగంలో అతన్ని పాతిపెట్టారు. అతడు చనిపోయినప్పుడు యూదా వారంతా యెరూషలేము నివాసులంతా అతని అంత్యక్రియలు ఘనంగా జరిగించారు. అతని తర్వాత అతని కుమారుడు మనష్షే రాజయ్యాడు.
2CH 33:1 మనష్షే రాజైనప్పుడు అతని వయస్సు పన్నెండేళ్ళు. అతడు యెరూషలేములో యాభై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు.
2CH 33:2 అతడు యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన జనాలు చేసే హేయక్రియలు చేశాడు.
2CH 33:3 తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన క్షేత్రాలను అతడు తిరిగి కట్టించాడు. బయలు దేవతకు బలిపీఠాలను కట్టించాడు. అషేరా స్తంభాలను నిలిపాడు. అతడు ఆకాశనక్షత్రాలకు మ్రొక్కి వాటిని పూజించాడు.
2CH 33:4 యెహోవా తన మందిరాన్ని ఉద్దేశించి, “యెరూషలేములో నా పేరు నిత్యం ఉంటుంది” అని చెప్పిన ఆ యెహోవా మందిరంలో అతడు బలిపీఠాలను కట్టించాడు.
2CH 33:5 యెహోవా మందిరంలో ఉన్న రెండు ఆవరణాల్లో నక్షత్ర సమూహమంతటికి అతడు బలిపీఠాలు కట్టించాడు.
2CH 33:6 అతడు తన పిల్లలను బెన్ హిన్నోము లోయలో అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని, చేతబడిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ, ఆయనకు కోపం రేపాడు.
2CH 33:7 అతడు చెక్కించిన విగ్రహాన్ని ఆ ఆలయంలో నిలిపాడు. ఆ ఆలయం గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడైన సొలొమోనుకు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో, ఈ దేవాలయంలో నా పేరు నిత్యం ఉంచుతాను.
2CH 33:8 నేను ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ఇచ్చిన చట్టాలు, శాసనాలు, నిబంధనలను గురించి నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా వారు పాటిస్తే, నేను మీ పూర్వికులకు నియమించిన దేశంలో నుండి ఇశ్రాయేలీయుల పాదాలను తిరిగి వెళ్లనివ్వను” అని చెప్పారు.
2CH 33:9 కానీ మనష్షే యూదా వారిని, యెరూషలేము ప్రజలను తప్పుదారి పట్టించాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల ఎదుట యెహోవా నాశనం చేసిన దేశాల కంటే ఎక్కువ చెడు చేశారు.
2CH 33:10 యెహోవా మనష్షేతో, అతని ప్రజలతో మాట్లాడారు గాని వారు పెడచెవిని పెట్టారు.
2CH 33:11 అందువల్ల యెహోవా అష్షూరు రాజు సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు. వారు మనష్షేను బందీగా పట్టుకుని, అతని ముక్కుకు గాలం తగిలించి, ఇత్తడి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకెళ్లారు.
2CH 33:12 బాధలో అతడు తన పూర్వికుల దేవుని ఎదుట తనను తాను చాలా తగ్గించుకుని తన దేవుడైన యెహోవాను దయచూపమని ప్రాధేయపడ్డాడు.
2CH 33:13 అతడు ప్రార్థించినప్పుడు యెహోవా అతని విన్నపం ఆలకించి అతని ప్రార్థన అంగీకరించారు. అతడు యెరూషలేముకు అతని రాజ్యానికి తిరిగి వచ్చేలా చేశాడు. అప్పుడు యెహోవాయే దేవుడు అని మనష్షే తెలుసుకున్నాడు.
2CH 33:14 ఇది జరిగిన తర్వాత మనష్షే లోయలోని గిహోను ఊటకు పడమరగా ఉన్న దావీదు నగర ప్రాకారాన్ని చేప ద్వారం వరకు, ఓఫెలు కొండ చుట్టూ కట్టించాడు. దానిని చాలా ఎత్తు చేయించాడు. యూదాలో కోటగోడలు గల ప్రతి పట్టణంలో అతడు సేనాధిపతులను నియమించాడు.
2CH 33:15 అతడు యెహోవా మందిరంలో నుండి ఇతర దేవుళ్ళ విగ్రహాలను తొలగించాడు. యెరూషలేములో, యెహోవా మందిర కొండమీద తాను కట్టించిన బలిపీఠాలు తీసివేసి పట్టణం బయట వాటిని పారవేయించాడు.
2CH 33:16 అప్పుడతడు యెహోవా బలిపీఠాలన్ని మరమ్మత్తు చేయించి, వాటి మీద సమాధానబలులు కృతజ్ఞతార్పణలు అర్పించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు.
2CH 33:17 అయినా ప్రజలు ఇంకా క్షేత్రాల్లో బలులు అర్పిస్తూనే ఉన్నారు అయితే అవి వారి దేవుడైన యెహోవాకే అర్పించారు.
2CH 33:18 మనష్షే పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు తన దేవునికి చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా పేరున అతనితో మాట్లాడిన దీర్ఘదర్శి మాటలు, అవన్నీ ఇశ్రాయేలు రాజు గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.
2CH 33:19 అతడు చేసిన ప్రార్థన, దేవుడు అతని విన్నపం ఎలా ఆలకించింది, తనను తగ్గించుకోక ముందు అతడు చేసిన పాపాలు, అతడు చేసిన నమ్మకద్రోహం, కట్టించిన క్షేత్రాలను, అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను గురించి దీర్ఘదర్శులు వ్రాసిన గ్రంథాల్లో ఉన్నాయి.
2CH 33:20 మనష్షే నిద్రపోయి (చనిపోయి) తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని పట్టణంలోనే అతన్ని సమాధి చేశారు. అతని స్థానంలో అతని కుమారుడు ఆమోను రాజయ్యాడు.
2CH 33:21 ఆమోను రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు. అతడు యెరూషలేములో రెండేళ్ళు పరిపాలించాడు.
2CH 33:22 అతడు తన తండ్రి మనష్షేలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. తన తండ్రి మనష్షే చేయించిన విగ్రహాలన్నిటికి ఆమోను బలులు అర్పిస్తూ పూజిస్తూ ఉండేవాడు.
2CH 33:23 తన తండ్రి మనష్షేలా ఆమోను యెహోవా ఎదుట తనను తగ్గించుకోలేదు. పైగా అతడు తన దోషాన్ని పెంచుకున్నాడు.
2CH 33:24 ఆమోను సేవకులు అతని మీద కుట్రపన్ని, తన సొంత భవనంలోనే అతన్ని చంపారు.
2CH 33:25 అప్పుడు యూదా దేశ ప్రజలు ఆమోను రాజు మీద కుట్రపన్నిన వారినందరిని చంపేశారు, అతని స్థానంలో అతని కుమారుడైన యోషీయాను రాజుగా చేశారు.
2CH 34:1 యోషీయా రాజైనప్పుడు అతని వయస్సు ఎనిమిది సంవత్సరాలు. అతడు యెరూషలేములో ముప్పై ఒక సంవత్సరాలు పరిపాలించాడు.
2CH 34:2 అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అతడు తన పితరుడైన దావీదు జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరించాడు, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోలేదు.
2CH 34:3 అతడు పాలిస్తున్న ఎనిమిదో సంవత్సరంలో ఇంకా యువకునిగా ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని వెదకడం మొదలుపెట్టాడు. పన్నెండవ సంవత్సరంలో ఉన్నత స్థలాలను అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను తీసివేయడం, యూదాను యెరూషలేమును పవిత్రం చేయడం మొదలుపెట్టాడు.
2CH 34:4 అతని ఆదేశాల మేరకు ప్రజలు బయలు బలిపీఠాలను పడగొట్టారు. వాటికి పైగా ఉన్న ధూపవేదికలను సూర్యదేవతా విగ్రహాలను అతడు కూలగొట్టించాడు. అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను ముక్కలు చేయించాడు. వాటిని చూర్ణం చేయించి, వాటికి బలులర్పించినవారి సమాధుల మీద చల్లివేశాడు.
2CH 34:5 ఆ దేవత పూజారుల ఎముకలను వారి బలిపీఠాల మీద కాల్పించాడు. ఈ విధంగా అతడు యూదాను, యెరూషలేమును పవిత్రం చేశాడు.
2CH 34:6 మనష్షే, ఎఫ్రాయిం, షిమ్యోను, నఫ్తాలి పట్టణాల వరకు వాటి చుట్టూ ఉన్న శిథిలాల్లో,
2CH 34:7 అతడు బలిపీఠాలను అషేరా స్తంభాలనూ, చెక్కిన విగ్రహాలను దేవతాస్తంభాలను ధ్వంసం చేశాడు. ఇశ్రాయేలు దేశమంతట్లో ధూపవేదికలన్నిటినీ సూర్య దేవత విగ్రహాలన్నిటిని ముక్కలుగా నరికి వేయించాడు. ఆ తర్వాత అతడు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.
2CH 34:8 యోషీయా పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో దేశాన్ని, మందిరాన్ని పవిత్రం చేద్దామని తన దేవుడైన యెహోవా మందిరాన్ని బాగుచేయించడానికి అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణ అధిపతియైన మయశేయా, లేఖికుడును యోవాహాజు కుమారుడునైన యోవాహును పంపాడు.
2CH 34:9 వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరకు వెళ్లి, అంతకుముందు దేవుని ఆలయానికి తెచ్చిన డబ్బును అతనికి అప్పగించారు. ఆ డబ్బును మనష్షేవారు, ఎఫ్రాయిమీయుల, ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారందరు, యూదా వారు, బెన్యామీనీయులు, యెరూషలేము నగరవాసులు ఇస్తూ ఉంటే, ద్వారపాలకులైన లేవీయులు దానిని జమచేశారు.
2CH 34:10 అప్పుడు వారు ఆ డబ్బును యెహోవా మందిర పనులు చేయించడానికి నియమించబడిన మనుష్యులకు అప్పచెప్పారు. వారు మందిరాన్ని మరమ్మతు చేస్తూ బాగుచేస్తున్న వారికి ఆ డబ్బును జీతంగా ఇచ్చారు.
2CH 34:11 వారు యూదా రాజులు పాడుచేసిన భవనాలకు చెక్కిన రాళ్లు, చెక్కలు, దూలాలను కొనడానికి, వడ్రంగి వారికి, నిర్మించేవారికి ఆ డబ్బు ఇచ్చారు.
2CH 34:12 ఆ మనుష్యులు నమ్మకంగా పని చేశారు. వారితో పని చేయించడానికి నియమించబడిన వారెవరంటే, మెరారీయులైన లేవీయులు యహతు, ఓబద్యా, కహాతు వంశంవారు జెకర్యా, మెషుల్లాము. పని చేయించడానికి నియమించబడిన లేవీయులందరు వాయిద్యాలు వాయించడంలో నైపుణ్యం కలవారు.
2CH 34:13 వారు బరువులు మోసేవారి మీద, ప్రతి విధమైన పని చేసేవారి మీదా తనిఖీదారులుగా ఉన్నారు. లేవీయులలో కొంతమంది లేఖికులుగా, కార్యదర్శులుగా, ద్వారపాలకులుగా సేవ చేసేవారు.
2CH 34:14 యెహోవా మందిరంలోకి తేబడిన డబ్బును వారు బయటకు తీసుకువస్తున్నప్పుడు, యెహోవా మోషే ద్వారా అనుగ్రహించిన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం యాజకుడైన హిల్కీయాకు కనిపించింది.
2CH 34:15 హిల్కీయా కార్యదర్శియైన షాఫానుతో, “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అన్నాడు. అతడు దానిని షాఫానుకు ఇచ్చాడు.
2CH 34:16 షాఫాను ఆ గ్రంథాన్ని రాజు దగ్గరకు తీసుకెళ్లి ఇలా చెప్పాడు: “మీ అధికారులకు మీరు అప్పచెప్పిన పనులన్నీ చేస్తున్నారు.
2CH 34:17 వారు యెహోవా మందిరంలో ఉన్న డబ్బు జమచేసి, మందిరంలో పని చేస్తున్న వారికి, వారి పై అధికారుల చేతికి అప్పగించారు.”
2CH 34:18 అప్పుడు కార్యదర్శియైన షాఫాను, “యాజకుడైన హిల్కీయా ఈ గ్రంథాన్ని నాకు ఇచ్చాడు” అని రాజుకు చెప్పాడు. షాఫాను దానిని రాజు సముఖంలో చదివాడు.
2CH 34:19 ధర్మశాస్త్రంలోని మాటలు విన్నప్పుడు రాజు తన బట్టలు చింపుకున్నాడు.
2CH 34:20 తర్వాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకా కుమారుడైన అబ్దోనుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు:
2CH 34:21 “మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలో వ్రాసిన మాటల గురించి నా కోసం, ఇశ్రాయేలు యూదాలో శేషించిన వారి కోసం, యెహోవా దగ్గర విచారణ చేయండి. యెహోవా కోపాగ్ని మనమీద అధికంగా రగులుకొని ఉంది. ఎందుకంటే, మన పూర్వికులు యెహోవా మాటను పాటించలేదు; ఈ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం ప్రవర్తించలేదు.”
2CH 34:22 అప్పుడు హిల్కీయా, రాజు పంపినవారు హుల్దా అనే ప్రవక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె షల్లూము భార్య, అతడు తోఖతు కుమారుడు, వస్త్రశాల తనిఖీదారుడైన హస్రా మనుమడు. ఆమె యెరూషలేములో నూతన భాగంలో నివసించేది. వారు ఆమెతో విషయం చెప్పారు.
2CH 34:23 ఆమె వారితో ఇలా అన్నది, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: మిమ్మల్ని నా దగ్గరకు పంపిన వ్యక్తికి చెప్పండి,
2CH 34:24 ‘యెహోవా చెప్పే మాట ఇదే: యూదారాజు సమక్షంలో చదివించిన గ్రంథంలో వ్రాసి ఉన్న శాపాలన్నిటిని అలాగే విపత్తును నేను ఈ స్థలం మీదికి, దీని ప్రజలమీదికి రప్పిస్తాను.
2CH 34:25 ఎందుకంటే ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళకు ధూపం వేశారు, వారు చేతులతో చేసిన వాటన్నిటి బట్టి నాకు కోపం రేపారు. నా కోపం ఈ స్థలంపై కుమ్మరించబడుతుంది, అది చల్లారదు.’
2CH 34:26 యెహోవా దగ్గర విచారణ చేయడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుతో ఇలా చెప్పండి, ‘నీవు విన్న మాటల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే:
2CH 34:27 వారు ఈ స్థలం గురించి ఈ ప్రజల గురించి నే చెప్పిన మాటలు విని నీ హృదయం మెత్తబడి నిన్ను నీవు యెహోవా ఎదుట తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో ఏడ్చావు కాబట్టి, నేను కూడా నీ మనవి విన్నానని యెహోవా చెప్తున్నారు.
2CH 34:28 నేను నిన్ను నీ పూర్వికుల దగ్గరకు చేరుస్తాను, సమాధానంతో నీవు సమాధి చేయబడతావు. నేను ఈ స్థలం మీదికి, ఇక్కడ నివసించేవారి మీదికి రప్పించే విపత్తును నీ కళ్లు చూడవు.’ ” అప్పుడు వారు ఆమె జవాబును రాజు దగ్గరకు తీసుకెళ్లారు.
2CH 34:29 అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు.
2CH 34:30 అతడు యూదా ప్రజలతో, యెరూషలేము వాసులతో, యాజకులతో, లేవీయులతో, అల్పుల నుండి ఘనులైన ప్రజలందరితో కలిసి యెహోవా ఆలయానికి వెళ్లాడు. అక్కడ రాజు, వారంతా వినేటట్టు యెహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివి వినిపించాడు.
2CH 34:31 రాజు తన స్తంభం దగ్గర నిలబడి, తన పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో యెహోవాను అనుసరిస్తానని, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు పాటిస్తానని, ఈ గ్రంథంలో వ్రాయబడిన నిబంధన మాటలకు లోబడతానని యెహోవా సన్నిధిలో నిబంధనను పునరుద్ధరించాడు.
2CH 34:32 అప్పుడు యెరూషలేములో, బెన్యామీనులో ఉన్నవారందరిని ఆ నిబంధనకి సమ్మతించేటట్టు చేశాడు. యెరూషలేమువారు తమ పూర్వికుల దేవుని నిబంధన ప్రకారం అలా చేశారు.
2CH 34:33 యోషీయా ఇశ్రాయేలు ప్రజలకు చెందిన ప్రాంతమంతటిలో నుండి విగ్రహాలన్నిటిని తీసివేశాడు. అవి అసహ్యమైన విగ్రహాలన్నిటినీ తీసివేశాడు. ఇశ్రాయేలులో ఉన్నవారందరు తమ దేవుడైన యెహోవాను సేవించేటట్టు చేశాడు. అతడు బ్రతికినన్నాళ్ళు వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు.
2CH 35:1 యోషీయా యెరూషలేములో యెహోవాకు పస్కా పండుగ ఆచరించాడు. మొదటి నెల పద్నాలుగవ రోజు ప్రజలు పస్కా గొర్రెపిల్లను వధించారు.
2CH 35:2 యోషీయా యాజకులను వారి విధులకు నియమించి యెహోవా ఆలయ సేవను జరిగించేలా వారిని ప్రోత్సహించాడు.
2CH 35:3 ఇశ్రాయేలీయులందరికి బోధించిన, యెహోవాకు ప్రతిష్ఠించబడిన లేవీయులతో అతడు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరంలో పవిత్ర మందసాన్ని ఉంచండి. ఇది మీ భుజాలపై మోయకూడదు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవాకు, ఆయన ప్రజలైన ఇశ్రాయేలుకు సేవ చేయండి.
2CH 35:4 ఇశ్రాయేలు రాజైన దావీదు అతని కుమారుడు సొలొమోను వ్రాసిన సూచనల ప్రకారం, మీ కుటుంబాల విభాగాల ప్రకారం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.
2CH 35:5 “మీ తోటి ఇశ్రాయేలీయులు, సామాన్య ప్రజల కుటుంబాల్లోని ప్రతి ఉపవిభాగం కోసం లేవీయుల సమూహంతో పరిశుద్ధ స్థలంలో నిలబడండి.
2CH 35:6 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు, పస్కా గొర్రెపిల్లలను వధించి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. మీ తోటి ఇశ్రాయేలీయుల కోసం గొర్రెపిల్లలను సిద్ధం చేయండి.”
2CH 35:7 యోషీయా రాజు అక్కడున్న సామాన్యులందరికీ తన సొంత ఆస్తుల నుండి పస్కా అర్పణల కోసం మొత్తం 30,000 గొర్రెపిల్లలు మేకలను అందించాడు, అలాగే 3,000 కోడెలను అందించాడు.
2CH 35:8 అతని అధికారులు కూడా ప్రజలకు, యాజకులకు లేవీయులకు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. దేవుని ఆలయ బాధ్యత వహించిన హిల్కీయా, జెకర్యా, యెహీయేలు, యాజకులకు 2,600 గొర్రెపిల్లలు మేకలను పస్కా అర్పణలుగా అందించాడు, అలాగే 300 కోడెలను అందించాడు.
2CH 35:9 కొనన్యా, అతని సహోదరులైన షెమయా, నెతనేలు, లేవీయుల నాయకులైన హషబ్యా, యెహీయేలు, యోజాబాదులు లేవీయుల కోసం 5,000 గొర్రెపిల్లలు మేకలు 500 కోడెలను పస్కా అర్పణలుగా ఇచ్చారు.
2CH 35:10 సేవకు అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పుడు రాజు ఆజ్ఞ ప్రకారం యాజకులు స్థలాల్లో లేవీయులు తమ వరుసల్లో నిలబడ్డారు.
2CH 35:11 పస్కా గొర్రెపిల్లలు వధించబడ్డాయి, లేవీయులు జంతువుల చర్మం తీస్తూ ఉండగా, యాజకులు వాటి రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు.
2CH 35:12 మోషే గ్రంథంలో వ్రాయబడినట్లుగా, యెహోవాకు అర్పించడానికి ప్రజల కుటుంబాల యొక్క ఉపవిభాగాలకు ఇవ్వడానికి వారు దహనబలులను ప్రక్కన పెట్టారు. పశువుల విషయంలోను అలాగే చేశారు.
2CH 35:13 నిర్దేశించబడిన ప్రకారం వారు పస్కా జంతువులను నిప్పుమీద కాల్చారు, అలాగే వారు పరిశుద్ధ అర్పణలను కుండల్లో, బానలలో, కడాయిలలో ఉడకబెట్టి, ప్రజలందరికి త్వరగా వడ్డించారు.
2CH 35:14 దీని తర్వాత, వారు తమ కోసం యాజకుల కోసం సిద్ధం చేశారు. ఎందుకంటే అహరోను వంశస్థులైన యాజకులు రాత్రి ప్రొద్దుపోయే వరకు దహనబలులను క్రొవ్వు భాగాలను అర్పించారు. కాబట్టి లేవీయులు తమ కోసం అహరోను యాజకుల కోసం సిద్ధం చేసుకున్నారు.
2CH 35:15 దావీదు, ఆసాపు, హేమాను, రాజుకు దీర్ఘదర్శియైన యెదూతూను నియమించిన ప్రకారం, ఆసాపు వారసులైన సంగీతకారులు తమ స్థలాల్లో ఉన్నారు. ప్రతి ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకులు తమ సేవను విడిచి రాకుండ వారి బంధువులైన లేవీయులు వారి కోసం మాంసం సిద్ధం చేశారు.
2CH 35:16 ఈ విధంగా రాజైన యోషీయా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆ రోజు వారు పస్కా పండుగ ఆచరించాడు. యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించారు. యెహోవా సేవ ఏమీ లోపం లేకుండా జరిగింది.
2CH 35:17 అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఆ సమయంలో పస్కా పండుగను పులియని రొట్టెల పండుగను ఏడు రోజులపాటు జరుపుకున్నారు.
2CH 35:18 సమూయేలు ప్రవక్త రోజులనుండి ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనంగా జరగలేదు. యాజకులు, లేవీయులు, హాజరైన యూదా వారందరూ, ఇశ్రాయేలు వారందరూ, యెరూషలేము కాపురస్థులందరితో కలిసి యోషీయా పస్కా ఆచరించిన విధంగా ఇశ్రాయేలు రాజులు ఎన్నడూ ఆచరించలేదు.
2CH 35:19 యోషీయా పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ పస్కా పండుగ జరిగింది.
2CH 35:20 ఇదంతా జరిగిన తర్వాత, యోషీయా మందిరాన్ని చక్కబెట్టిన తర్వాత ఈజిప్టు రాజైన నెకో యూఫ్రటీసు నది ఒడ్డున ఉన్న కర్కెమీషు మీదికి యుద్ధానికి వెళ్తుండగా యోషీయా అతని మీదికి బయలుదేరాడు.
2CH 35:21 కానీ నెకో అతని దగ్గరకు దూతలను పంపి, “యూదా రాజా, నీకు నాకూ మధ్య ఎలాంటి గొడవ ఉంది? ఈ సమయంలో నేను దాడి చేస్తున్నది మీపై కాదు, నేను యుద్ధం చేస్తున్న ఇంటిపై. దేవుడు నాకు త్వర పడమని చెప్పాడు; కాబట్టి నాతో ఉన్న దేవున్ని ఎదిరించడం మానేయండి, లేదంటే ఆయనే నిన్ను నాశనం చేస్తాడు” అని చెప్పాడు.
2CH 35:22 అయితే యోషీయా అతని దగ్గర నుండి వెళ్లడానికి ఇష్టపడలేదు. అతనితో యుద్ధం చేయాలని మారువేషం వేసుకుని దేవుని ఆజ్ఞగా నెకో చెప్పిన దానిని వినక, మెగిద్దోను మైదానాల్లో యుద్ధం చేయడానికి వెళ్లాడు.
2CH 35:23 విలుకాండ్రు రాజైన యోషీయా మీద బాణాలు వేశారు. రాజు తన అధికారులతో, “నేను తీవ్రంగా గాయపడ్డాను. ఇక్కడినుండి నన్ను తీసుకెళ్లండి” అని చెప్పాడు.
2CH 35:24 అతని సేవకులు అతన్ని తన రథం మీద నుండి దించి అతనికున్న వేరే రథం మీద ఉంచి యెరూషలేముకు తీసుకువచ్చారు. అక్కడ అతడు చనిపోయాడు. అతని పూర్వికుల సమాధుల మధ్య యోషీయాను పాతిపెట్టారు. అతని మృతికి యూదా, యెరూషలేము ప్రజలంతా దుఃఖించారు.
2CH 35:25 యిర్మీయా యోషీయా గురించి శోకగీతాన్ని రచించాడు. ఈ రోజు వరకు గాయనీ గాయకులందరు తమ విలాపవాక్కులలో యోషీయాను జ్ఞాపకం చేసుకుంటూ ఆలపిస్తారు. ఇలా చేయడం ఇశ్రాయేలులో ఒక ఆచారంగా మారింది.
2CH 35:26 యోషీయాను గురించిన ఇతర విషయాలు యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాసిన మాట అనుసరించి అతడు దయతో చేసిన పనులు,
2CH 35:27 మొదటి నుండి చివరి వరకు అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.
2CH 36:1 అప్పుడు దేశ ప్రజలు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అతని తండ్రి స్థానంలో యెరూషలేములో రాజుగా చేశారు.
2CH 36:2 యెహోయాహాజు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు.
2CH 36:3 తర్వాత ఈజిప్టు రాజు యెరూషలేములో అతన్ని పదవి నుండి తొలగించి, యూదాపై వంద తలాంతుల వెండిని, ఒక తలాంతు బంగారాన్ని పన్నుగా విధించాడు.
2CH 36:4 ఈజిప్టు రాజు యెహోయాహాజు సోదరుడైన ఎల్యాకీమును యూదా యెరూషలేము మీద రాజుగా చేసి, అతని పేరును యెహోయాకీముగా మార్చాడు. అయితే నెకో ఎల్యాకీము సోదరుడైన యెహోయాహాజును ఈజిప్టుకు తీసుకెళ్లాడు.
2CH 36:5 యెహోయాకీము రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
2CH 36:6 బబులోను రాజైన నెబుకద్నెజరు అతని మీద దాడి చేసి అతన్ని ఇత్తడి సంకెళ్ళతో బంధించి బబులోనుకు తీసుకెళ్లాడు.
2CH 36:7 అంతేకాక యెహోవా మందిరంలో ఉన్న వస్తువులను నెబుకద్నెజరు బబులోనుకు తీసుకెళ్లి అక్కడున్న తన దేవుని క్షేత్రంలో పెట్టాడు.
2CH 36:8 యెహోయాకీము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన అసహ్యకరమైనవి, అతనికి వ్యతిరేకంగా కనిపించినవన్నీ ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాకీను రాజయ్యాడు.
2CH 36:9 యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలల పది రోజులు పరిపాలించాడు. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
2CH 36:10 వసంతకాలం వచ్చినప్పుడు నెబుకద్నెజరు రాజు మనుష్యులను పంపి అతన్ని, అతనితో పాటు యెహోవా మందిరంలో ఉన్న విలువైన వస్తువులను బబులోనుకు రప్పించాడు. అతడు యెహోయాకీను పినతండ్రియైన సిద్కియాను యూదా, యెరూషలేము మీద రాజుగా చేశాడు.
2CH 36:11 సిద్కియా రాజైనప్పుడు అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు.
2CH 36:12 అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. యెహోవా వాక్కు పలికిన యిర్మీయా ప్రవక్త ముందు అతడు తగ్గించుకోలేదు.
2CH 36:13 అతడు దేవుని పేరిట తనతో ప్రమాణం చేయించిన రాజైన నెబుకద్నెజరు మీద కూడా తిరుగుబాటు చేశాడు. అతడు మెడవంచని వాడై తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగలేదు.
2CH 36:14 ఇంకా, యాజకుల నాయకులందరు, ప్రజలందరు ఇతర దేశాల అసహ్యమైన ఆచారాలన్నిటిని అనుసరించి, యెరూషలేములో ఆయన ప్రతిష్ఠించిన యెహోవా మందిరాన్ని అపవిత్రం చేస్తూ మరింతగా నమ్మకద్రోహులయ్యారు.
2CH 36:15 వారి పూర్వికుల దేవుడైన యెహోవా తన ప్రజల మీద, తన నివాసస్థలం మీద జాలిపడి, వారికి తన దూతల ద్వారా పదే పదే సందేశాలు పంపించారు.
2CH 36:16 కానీ వారు దేవుని దూతలను ఎగతాళి చేశారు, ఆయన మాటలను తృణీకరించారు, ఆయన ప్రజలపైకి నివారించలేని యెహోవా ఉగ్రత వచ్చేవరకు వారు ఆయన ప్రవక్తలను అపహాస్యం చేశారు.
2CH 36:17 యెహోవా వారి మీదికి బబులోనీయుల రాజును రప్పించారు. అతడు వారి పరిశుద్ధాలయంలో వారి యువకులను కత్తితో చంపాడు. యువకులను గాని యువతులను గాని వృద్ధులను గాని బలహీనులను గాని విడిచిపెట్టలేదు. దేవుడు వారందరినీ నెబుకద్నెజరు చేతికి అప్పగించారు.
2CH 36:18 అతడు యెహోవా మందిరం నుండి పెద్దవి చిన్నవి అని తేడా లేకుండా అన్ని వస్తువులను, యెహోవా మందిరం నిధులు, రాజు నిధులు, అతని అధికారుల నిధులన్నింటిని బబులోనుకు తీసుకెళ్లాడు.
2CH 36:19 వారు దేవుని ఆలయానికి నిప్పంటించి యెరూషలేము గోడలను పడగొట్టారు; వారు రాజభవనాలన్నిటిని తగలబెట్టి, అక్కడ విలువైన ప్రతీదానిని నాశనం చేశారు.
2CH 36:20 ఖడ్గం నుండి తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు. పర్షియా రాజ్యం అధికారంలోకి వచ్చేవరకు వారు అక్కడే ఉండి అతనికి అతని కుమారులకు దాసులుగా ఉన్నారు.
2CH 36:21 దేశం తన సబ్బాతు దినాలను ఆనందంగా గడిపింది; యిర్మీయా చెప్పిన యెహోవా వాక్కు నెరవేరేలా డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యే వరకు అది పాడైన సమయమంతా విశ్రాంతి తీసుకుంది.
2CH 36:22 పర్షియా రాజైన కోరెషు పాలన మొదటి సంవత్సరంలో, యిర్మీయా చెప్పిన యెహోవా మాటను నెరవేర్చడానికి, తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేసేలా, దానిని వ్రాతపూర్వకంగా ఉంచేలా యెహోవా పర్షియా రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించారు:
2CH 36:23 “పర్షియా రాజైన కోరెషు చెప్పేది ఇదే: “ ‘పరలోకపు దేవుడైన యెహోవా నాకు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఇచ్చారు. యూదాలోని యెరూషలేములో తనకు మందిరాన్ని నిర్మించడానికి నన్ను నియమించారు. మీ మధ్య ఉన్న ఆయన ప్రజల్లో ఎవరైనా అక్కడికి వెళ్లవచ్చు, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక.’ ”
EZR 1:1 పర్షియా రాజైన కోరెషు పాలన మొదటి సంవత్సరంలో, యిర్మీయా చెప్పిన యెహోవా మాటను నెరవేర్చడానికి, తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేసేలా దానిని వ్రాతపూర్వకంగా ఉంచేలా యెహోవా పర్షియా రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించారు:
EZR 1:2 “పర్షియా రాజైన కోరెషు చెప్పేది ఇదే: “ ‘పరలోకపు దేవుడైన యెహోవా నాకు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఇచ్చారు. యూదాలోని యెరూషలేములో తనకు మందిరాన్ని నిర్మించడానికి నన్ను నియమించారు.
EZR 1:3 మీ మధ్య ఉన్న ఆయన ప్రజల్లో ఎవరైనా యూదాలోని యెరూషలేముకు వెళ్లి మందిరాన్ని నిర్మించవచ్చు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, యెరూషలేములో ఉన్న దేవుడైన వారి దేవుడు వారికి తోడుగా ఉండును గాక.
EZR 1:4 మిగిలి ఉన్నవారు ఇప్పుడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతం ప్రజలు వారికి వెండి, బంగారాలను, సామాగ్రిని, పశువులను యెరూషలేములోని దేవుని ఆలయానికి స్వేచ్ఛార్పణలు ఇవ్వాలి.’ ”
EZR 1:5 అప్పుడు యూదా, బెన్యామీనీయుల కుటుంబ పెద్దలు, యాజకులు, లేవీయులు, దేవునిచే ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరు యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టేందుకు వెళ్లడానికి సిద్ధపడ్డారు.
EZR 1:6 వారి పొరుగువారందరు తమ స్వేచ్ఛార్పణలతో పాటు వెండి, బంగారం, సామాగ్రి, పశువులు, విలువైన కానుకలు ఇచ్చి వారికి సహాయం చేశారు.
EZR 1:7 అంతేకాదు, నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకెళ్లి తన దేవుని గుడిలో ఉంచిన యెహోవా ఆలయానికి సంబంధించిన వస్తువులను రాజైన కోరెషు బయటకు తెప్పించాడు.
EZR 1:8 పర్షియా రాజైన కోరెషు తన కోశాధికారియైన మిత్రిదాతుతో వాటిని తెప్పించి, అతడు వాటిని లెక్కించి, వాటిని యూదా నాయకుడైన షేష్బజ్జరుకు అప్పగించాడు.
EZR 1:9 ఆ జాబితాలో ఉన్న వస్తువులు: బంగారు పాత్రలు 30; వెండి పాత్రలు 1,000; వెండి కడాయిలు 29;
EZR 1:10 బంగారు గిన్నెలు 30; వెండి గిన్నెలు 410; ఇతర వస్తువులు 1,000.
EZR 1:11 వెండి బంగారు వస్తువులు అన్ని కలిపి మొత్తం 5,400. షేష్బజ్జరు వీటన్నిటితో పాటు బబులోనులో బందీలుగా ఉండి విడిపించబడిన వారందరిని తీసుకుని యెరూషలేముకు వెళ్లాడు.
EZR 2:1 బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు చెరగా తీసుకెళ్లిన వారు, చెరలో నుండి యెరూషలేముకు, యూదా దేశానికి తమ తమ పట్టణాలకు తిరిగి వెళ్లడానికి,
EZR 2:2 జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరే, బిగ్వయి, రెహూము, బయనా అనేవారితో పాటు వెళ్లినవారు వీరు:
EZR 2:3 పరోషు వారసులు 2,172;
EZR 2:4 షెఫట్యా వారసులు 372;
EZR 2:5 ఆరహు వారసులు 775;
EZR 2:6 పహత్-మోయాబు వారసులు (యెషూవ యోవాబు వారసులతో కలిపి) 2,812;
EZR 2:7 ఏలాము వారసులు 1,254;
EZR 2:8 జత్తూ వారసులు 945;
EZR 2:9 జక్కయి వారసులు 760;
EZR 2:10 బానీ వారసులు 642;
EZR 2:11 బేబై వారసులు 623;
EZR 2:12 అజ్గాదు వారసులు 1,222;
EZR 2:13 అదోనీకాము వారసులు 666;
EZR 2:14 బిగ్వయి వారసులు 2,056;
EZR 2:15 ఆదీను వారసులు 454;
EZR 2:16 అటేరు వారసులు (హిజ్కియా ద్వారా) 98;
EZR 2:17 బేజయి వారసులు 323;
EZR 2:18 యోరా వారసులు 112;
EZR 2:19 హాషుము వారసులు 223;
EZR 2:20 గిబ్బారు వారసులు 95;
EZR 2:21 బేత్లెహేము వారసులు 123;
EZR 2:22 నెటోపా వారసులు 56;
EZR 2:23 అనాతోతు వారసులు 128;
EZR 2:24 అజ్మావెతు వారసులు 42;
EZR 2:25 కిర్యత్-యారీము, కెఫీరా, బెయేరోతు వారసులు 743;
EZR 2:26 రామా, గెబా వారసులు 621;
EZR 2:27 మిక్మషు వారసులు 122;
EZR 2:28 బేతేలు, హాయి వారసులు 223;
EZR 2:29 నెబో వారసులు 52;
EZR 2:30 మగ్బీషు వారసులు 156;
EZR 2:31 మరొక ఏలాము వారసులు 1,254;
EZR 2:32 హారీము వారసులు 320;
EZR 2:33 లోదు, హదీదు, ఓనో వారసులు 725;
EZR 2:34 యెరికో వారసులు 345;
EZR 2:35 సెనాయా వారసులు 3,630.
EZR 2:36 యాజకులు: యెషూవ కుటుంబీకుడైన యెదాయా వారసులు 973;
EZR 2:37 ఇమ్మేరు వారసులు 1,052;
EZR 2:38 పషూరు వారసులు 1,247;
EZR 2:39 హారీము వారసులు 1,017.
EZR 2:40 లేవీయులు: యెషూవ కద్మీయేలు వారసులు (హోదవ్యా కుటుంబం నుండి) 74.
EZR 2:41 సంగీతకారులు: ఆసాపు వారసులు 128.
EZR 2:42 ఆలయ ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వారసులు 139.
EZR 2:43 ఆలయ సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయోతు వారసులు,
EZR 2:44 కేరోసు, సీయహా, పాదోను వారసులు,
EZR 2:45 లెబానా, హగాబా, అక్కూబు వారసులు,
EZR 2:46 హాగాబు, షల్మయి, హానాను వారసులు,
EZR 2:47 గిద్దేలు, గహరు, రెవాయా వారసులు,
EZR 2:48 రెజీను, నెకోదా, గజ్జాము వారసులు,
EZR 2:49 ఉజ్జా, పాసెయ, బేసాయి వారసులు,
EZR 2:50 అస్నా, మెహూనీము, నెఫూసీము వారసులు,
EZR 2:51 బక్బూకు, హకూపా, హర్హూరు వారసులు,
EZR 2:52 బజ్లూతు, మెహీదా, హర్షా వారసులు,
EZR 2:53 బర్కోసు, సీసెరా, తెమహు వారసులు,
EZR 2:54 నెజీయహు, హటీపా వారసులు.
EZR 2:55 సొలొమోను సేవకుల వారసులు: సొటయి, హస్సోఫెరెతు, పెరూదా వారసులు,
EZR 2:56 యహలా, దర్కోను, గిద్దేలు వారసులు,
EZR 2:57 షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, అమీ వారసులు.
EZR 2:58 ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392.
EZR 2:59 తేల్ మెలహు, తేల్ హర్షా, కెరూబు, అద్దోను, ఇమ్మేరు అనే పట్టణాల నుండి కొందరు వచ్చారు. అయితే వీరు తమ కుటుంబాలు ఇశ్రాయేలు నుండి వచ్చినట్లు రుజువు చూపలేకపోయారు:
EZR 2:60 దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు, మొత్తం 652.
EZR 2:61 యాజకుల వారసులు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వారసులు (ఇతడు గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకుని ఆ పేరుతో పిలువబడ్డాడు).
EZR 2:62 వీరు వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు.
EZR 2:63 ఊరీము, తుమ్మీము ధరించే యాజకుని నియామకం జరిగే వరకు వారు అతిపరిశుద్ధమైన దేన్ని తినకూడదని అధిపతి వారిని ఆదేశించాడు.
EZR 2:64 సమూహం మొత్తం సంఖ్య 42,360,
EZR 2:65 వీరు కాకుండా వీరి దాసదాసీలు 7,337; గాయనీ గాయకులు 200 మంది.
EZR 2:66 వారికి 736 గుర్రాలు, 245 కంచరగాడిదలు,
EZR 2:67 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి.
EZR 2:68 వారు యెరూషలేములో యెహోవా ఆలయానికి చేరుకున్నప్పుడు, కుటుంబ పెద్దలలో కొందరు ఆ స్థలంలో దేవుని మందిరాన్ని పునర్నిర్మించడానికి స్వేచ్ఛార్పణలు ఇచ్చారు.
EZR 2:69 వారు ఈ పని కోసం తమ శక్తి కొద్ది 61,000 డారిక్కుల బంగారం, 5,000 మీనాల వెండిని, యాజకులకు 100 వస్త్రాలను ఇచ్చారు.
EZR 2:70 యాజకులు, లేవీయులు, సంగీతకారులు, ద్వారపాలకులు, ఆలయ సేవకులు, తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఇతర ప్రజల్లో కొంతమంది మిగిలిన ఇశ్రాయేలీయులతో పాటు తమ పట్టణాల్లో స్థిరపడ్డారు.
EZR 3:1 ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమ పట్టణాల్లో స్థిరపడినప్పుడు, ప్రజలు ఒక్కటిగా యెరూషలేములో సమావేశమయ్యారు.
EZR 3:2 అప్పుడు యోజాదాకు కుమారుడైన యెషూవ, అతని తోటి యాజకులు, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, అతని తోటి పనివారు దైవజనుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారంగా దహనబలులు అర్పించడానికి ఇశ్రాయేలీయుల దేవునికి బలిపీఠాన్ని కట్టడం మొదలుపెట్టారు.
EZR 3:3 వీరికి అక్కడి ప్రజల భయం ఉన్నా, బలిపీఠాన్ని దాని పునాదుల మీదనే కట్టి, ఉదయ సాయంత్రాల్లో యెహోవాకు దహనబలులు క్రమంగా అర్పిస్తూ వచ్చారు.
EZR 3:4 తర్వాత ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విధంగా గుడారాల పండుగ చేసుకుని నియమించబడిన సంఖ్య ప్రకారం ప్రతిరోజు దహనబలులు అర్పించారు.
EZR 3:5 దాని తర్వాత క్రమంగా దహనబలులు, అమావాస్య బలులు, యెహోవా యొక్క పరిశుద్ధ పండుగలకు అర్పించవలసిన బలులు, అదే విధంగా ఒక్కొక్కరు తీసుకువచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పించారు.
EZR 3:6 యెహోవా ఆలయానికి ఇంకా పునాది వేయనప్పటికి, ఏడవ నెల మొదటి రోజు నుండి వారు యెహోవాకు దహనబలులు అర్పించడం మొదలుపెట్టారు.
EZR 3:7 అప్పుడు వారు తాపీ మేస్త్రీలకు, వడ్రంగులకు డబ్బులు ఇచ్చారు. పర్షియా రాజైన కోరెషు ఆదేశం ప్రకారం దేవదారు మ్రానులను సముద్రం ద్వారా లెబానోను నుండి యొప్ప పట్టణానికి చేర్చడానికి సీదోనీయులకు, తూరువారికి భోజనపదార్థాలు, ఒలీవనూనె ఇచ్చారు.
EZR 3:8 యెరూషలేములోని దేవుని ఆలయానికి వారు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ యాజకులు, ఇతర ప్రజలు (యాజకులు, లేవీయులు, బందీ నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చిన వారందరు) పని ప్రారంభించారు. లేవీయులలో ఇరవై సంవత్సరాలకన్నా ఎక్కువ వయస్సున్న వారిని యెహోవా మందిరపు పనిని పర్యవేక్షించడానికి నియమించారు.
EZR 3:9 వీరితో పాటు యెషూవ అతని కుమారులు, అతని సోదరులు, కద్మీయేలు అతని కుమారులు (యూదా వారసులు), హేనాదాదు కుమారులు, వారి సోదరులైన లేవీయులందరు దేవుని మందిరపు పనిని పర్యవేక్షించడానికి నియమించబడ్డారు.
EZR 3:10 నిర్మించేవారు యెహోవా ఆలయానికి పునాది వేసినప్పుడు ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన ప్రకారం యాజకులు ప్రత్యేక వస్త్రాలను ధరించి బూరలు పట్టుకుని, ఆసాపు కుమారులైన లేవీయులు తాళాలు పట్టుకుని యెహోవాను కీర్తించడానికి తమ తమ స్థానాల్లో నిలబడ్డారు.
EZR 3:11 కృతజ్ఞతా స్తుతులతో వారు యెహోవాకు ఈ పాట పాడారు: “ఆయన మంచివారు. ఇశ్రాయేలీయులపై ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.” యెహోవా మందిర పునాది వేస్తున్నప్పుడు ప్రజలందరు బిగ్గరగా గొంతెత్తి యెహోవాను స్తుతించారు.
EZR 3:12 అయితే గతంలో ఉన్న మందిరాన్ని తమ కళ్లతో చూసిన వృద్ధులైన యాజకులు, లేవీయులు, నాయకులు చాలామంది, ఇప్పుడు వేస్తున్న మందిర పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. మరికొందరు సంతోషంతో కేకలు వేశారు.
EZR 3:13 అక్కడ ఉన్న ప్రజలు చాలా పెద్దగా శబ్దం చేయడంతో సంతోషంతో వేసిన కేకలకు, దుఃఖంతో వేసిన కేకలకు తేడా తెలుసుకోలేకపోయారు. ఆ శబ్దం చాలా దూరం వరకు వినబడింది.
EZR 4:1 చెర నుండి వచ్చినవారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కడుతున్నారని యూదా, బెన్యామీనీయుల శత్రువులు విని,
EZR 4:2 జెరుబ్బాబెలు దగ్గరకు, కుటుంబ పెద్దల దగ్గరకు వచ్చి, “అష్షూరు రాజైన ఏసర్హద్దోను మమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చినప్పటి నుండి మీలాగే మేము కూడా మీ దేవుని వెదకుతున్నాం, ఆయనకు బలులు అర్పిస్తూ ఉన్నాం కాబట్టి నిర్మాణంలో మేము మీకు సహాయం చేస్తాం” అన్నారు.
EZR 4:3 అయితే జెరుబ్బాబెలు, యెషూవ, మిగిలిన కుటుంబ పెద్దలు, “మా దేవుని ఆలయ నిర్మాణంలో మీకు పాలు లేదు. పర్షియా రాజైన కోరెషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరాన్ని మేమే కడతాం” అన్నారు.
EZR 4:4 అప్పుడు ఆ దేశ ప్రజలు యూదా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ కడుతున్నవారిని భయపెట్టారు.
EZR 4:5 పర్షియా రాజైన కోరెషు పరిపాలించిన కాలం నుండి పర్షియా రాజైన దర్యావేషు పరిపాలించిన కాలం వరకు యూదా వారి ప్రణాళికలను చెడగొట్టడానికి వారు అధికారులకు లంచాలు ఇచ్చారు.
EZR 4:6 అహష్వేరోషు పరిపాలన ఆరంభంలో యూదా వారి మీద, యెరూషలేము వారిమీద ఫిర్యాదు చేస్తూ ఉత్తరం వ్రాసి పంపారు.
EZR 4:7 పర్షియా రాజైన అర్తహషస్త పరిపాలిస్తున్న సమయంలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు వారి సహచరులు అర్తహషస్తకు ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరం అరామిక్ లిపిలో, అరామిక్ భాషలో వ్రాయబడింది.
EZR 4:8 ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, యెరూషలేము వారి మీద ఫిర్యాదు చేస్తూ రాజైన అర్తహషస్తకు ఇలా ఉత్తరం వ్రాశారు:
EZR 4:9 ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, వారి తోటి ఉద్యోగులు అనగా పర్షియా, ఎరెకు, బబులోను, షూషనుకు చెందిన ఏలామీయుల న్యాయాధిపతులు, అధికారులు,
EZR 4:10 గొప్పవాడు గౌరవనీయుడైన ఆస్నప్పరు విడుదల చేయగా, సమరయ పట్టణంలో యూఫ్రటీసు నదిని అవతల నివసించే ఇతర ప్రజలు వ్రాస్తున్న ఉత్తరము.
EZR 4:11 (ఇది వారు రాజుకు వ్రాసిన ఉత్తరానికి నకలు.) రాజైన అర్తహషస్తకు, యూఫ్రటీసు నది అవతల ఉంటున్న మీ సేవకులు వ్రాస్తున్న ఉత్తరము.
EZR 4:12 రాజైన మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీ దగ్గర నుండి మా దగ్గరకు వచ్చిన యూదులు యెరూషలేముకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడ్డ పట్టణాన్ని తిరిగి కడుతున్నారు. వారు గోడలను మరలా కడుతూ పునాదులను మరమ్మత్తు చేస్తున్నారు.
EZR 4:13 అంతేకాక, మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, ఒకవేళ వీరే ఈ పట్టణాన్ని కట్టి దాని ప్రాకారాలు తిరిగి నిర్మిస్తే వారు పన్నులు గాని కప్పం గాని లేదా సుంకం గాని చెల్లించరు. తద్వారా రాజ్య ఆదాయానికి నష్టం కలుగుతుంది.
EZR 4:14 మేము రాజుకు కట్టుబడి ఉన్నాం కాబట్టి రాజుకు అవమానం జరిగితే చూడలేము. అందుకే రాజుకు ఈ సమాచారాన్ని చేరవేస్తున్నాము.
EZR 4:15 మీ పూర్వికులు వ్రాసిన చరిత్రను పరిశీలన చేయండి. వాటిలో ఈ పట్టణస్థులు తిరుగుబాటుదారులని, రాజులకు దేశాలకు హాని చేశారని, దేశద్రోహులని తెలుస్తుంది. ఆ కారణంగానే ఆ పట్టణం నాశనం అయ్యింది.
EZR 4:16 వీరు ఈ పట్టణాన్ని కట్టి దాని గోడలను మరలా కడితే, యూఫ్రటీసు నది అవతలి ప్రాంతంలో ఏది కూడా మీ ఆధీనంలో ఉండదని రాజుకు తెలియజేస్తున్నాము.
EZR 4:17 దానికి రాజు ఇచ్చిన సమాధానం ఇది: ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, సమరయలో యూఫ్రటీసు నది అవతలి ప్రాంతంలో నివసించేవారి సహోద్యోగులకు: శుభాలు.
EZR 4:18 మీరు మాకు పంపిన ఉత్తరాన్ని నా ఎదుట చదివి అనువదించారు.
EZR 4:19 నా ఆజ్ఞ ప్రకారం పరిశోధించగా ఈ పట్టణానికి రాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సుదీర్ఘ చరిత్ర ఉందని, అది తిరుగుబాటుకు దేశద్రోహానికి స్థానమని తెలిసింది.
EZR 4:20 గతంలో యెరూషలేమును పరిపాలించిన బలమైన రాజుల ఆధీనంలోనే యూఫ్రటీసు నది అవతలి ప్రాంతమంతా ఉండేది. వారికి పన్నులు, కప్పం, సుంకం చెల్లించేవారు.
EZR 4:21 ఇప్పుడు అక్కడ ఉన్నవారు తమ పనిని వెంటనే ఆపి మరలా నేను ఆజ్ఞ ఇచ్చేవరకు ఆ పట్టణాన్ని తిరిగి కట్టకూడదని ఆదేశం జారీ చేయండి.
EZR 4:22 ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. రాజ్య ప్రయోజనాలకు నష్టం వాటిల్లే ప్రమాదం జరగడానికి ఎందుకు అనుమతించాలి?
EZR 4:23 రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరం నకలు రెహూము, షింషయి వారి తోటి ఉద్యోగులకు చదివి వినిపించిన వెంటనే వారు యెరూషలేములోని యూదుల దగ్గరకు వెళ్లి పని చేయడం ఆపమని బలవంతం చేశారు.
EZR 4:24 కాబట్టి యెరూషలేములో జరుగుతున్న దేవుని మందిరం పని ఆగిపోయింది. పర్షియా రాజైన దర్యావేషు హయాములో రెండవ సంవత్సరం వరకు పని ఆగిపోయింది.
EZR 5:1 ప్రవక్తయైన హగ్గయి ఇద్దోకు వారసుడు, ప్రవక్తయైన జెకర్యా యూదాలో, యెరూషలేములో ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రవచించారు.
EZR 5:2 అప్పుడు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ, యెరూషలేములో దేవుని మందిరాన్ని మళ్ళీ కట్టించడం మొదలుపెట్టారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి మద్ధతు ఇచ్చారు.
EZR 5:3 ఆ సమయంలో యూఫ్రటీసు నది అవతల అధిపతిగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు వారి దగ్గరకు వెళ్లి, “ఈ మందిరాన్ని మరలా కట్టి దానిని పూర్తి చేయడానికి మీకు ఎవరు అనుమతిచ్చారు?” అని వారిని ప్రశ్నించారు.
EZR 5:4 అంతే కాకుండా, “ఈ భవనాన్ని కడుతున్న వారి పేర్లు ఏమిటి?” అని కూడా అడిగారు.
EZR 5:5 అయితే వారి దేవుని దృష్టి యూదుల పెద్దలను కాపాడుతూ ఉంది కాబట్టి ఈ సమాచారం దర్యావేషుకు చేరి అతని దగ్గర నుండి వ్రాతపూర్వక జవాబు వచ్చేవరకు వారు పని చేయడం ఆపలేదు.
EZR 5:6 యూఫ్రటీసు నది అవతల అధిపతిగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు రాజైన దర్యావేషుకు పంపిన ఉత్తరం నకలు ఇది.
EZR 5:7 వారు పంపిన సమాచారం ఇలా ఉంది: రాజైన దర్యావేషుకు: హృదయపూర్వక శుభాలు.
EZR 5:8 రాజు తెలుసుకోవలసింది ఏంటంటే, మేము యూదా జిల్లాకు అక్కడ ఉన్న గొప్ప దేవుని ఆలయానికి వెళ్లాము. ప్రజలు దానిని పెద్ద రాళ్లతో కడుతున్నారు, గోడలకు దూలాలు అమరుస్తున్నారు. వారి ఆధ్వర్యంలో పనులు శ్రద్ధతో, శరవేగంగా జరుగుతున్నాయి.
EZR 5:9 మేము అక్కడి పెద్దలను, “ఈ మందిరాన్ని తిరిగి కట్టడానికి, దానిని పూర్తి చేయడానికి మీకు అనుమతి ఎవరు ఇచ్చారు?” అని ప్రశ్నించాము.
EZR 5:10 అంతే కాకుండా వారి నాయకుల పేర్లు వివరాలు మీకు అందించడానికి వారి పేర్లను కూడా అడిగి తెలుసుకున్నాము.
EZR 5:11 వారు మాకిచ్చిన జవాబు ఇది: “మేము భూమ్యాకాశాల దేవుని సేవకులము. చాలా సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాము.
EZR 5:12 మా పూర్వికులు పరలోక దేవునికి కోపం తెప్పించారు కాబట్టి ఆయన వారిని బబులోను రాజు, కల్దీయుడైన నెబుకద్నెజరు చేతికి అప్పగించారు, అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బందీలుగా బబులోను తీసుకెళ్లాడు.
EZR 5:13 “అయినా, బబులోను రాజైన కోరెషు హయాములో మొదటి సంవత్సరంలో రాజైన కోరెషు ఈ దేవుని మందిరాన్ని మరలా కట్టడానికి శాసనం జారీ చేశాడు.
EZR 5:14 అంతేకాదు గతంలో నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి బబులోను క్షేత్రానికి తీసుకెళ్లిన దేవుని మందిరపు వెండి బంగారు వస్తువులను రాజైన కోరెషు బబులోను క్షేత్రంలో నుండి తెప్పించి, తాను అధిపతిగా నియమించిన షేష్బజ్జరుకు వాటిని ఇచ్చి,
EZR 5:15 అతనితో అన్నాడు, ‘నీవు ఈ వస్తువులను తీసుకెళ్లి యెరూషలేములోని మందిరంలో ఉంచాలి. ఆ స్థలంలో దేవుని మందిరాన్ని తిరిగి కట్టించాలి.’
EZR 5:16 “కాబట్టి ఈ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో దేవుని ఆలయానికి పునాది వేశాడు. అప్పటినుండి నేటివరకు దాన్ని కడుతున్నాము కాని అది ఇంకా పూర్తి కాలేదు.”
EZR 5:17 ఇది రాజుకు ఇష్టమైతే, యెరూషలేములో దేవుని మందిరాన్ని నిర్మించడానికి రాజైన కోరెషు ఆదేశం ఇచ్చాడో లేదో తెలుసుకోవడానికి బబులోను రాజ్య దస్తావేజులను పరిశోధించండి. అప్పుడు ఈ విషయంలో రాజు నిర్ణయాన్ని మాకు తెలియచేయాలని కోరుతున్నాము.
EZR 6:1 అప్పుడు రాజైన దర్యావేషు ఆదేశించగా వారు బబులోను ఖజానాలోని రాజ్య దస్తావేజులన్ని పరిశోధించారు.
EZR 6:2 మాదీయ ప్రాంతంలో ఉన్న ఎక్బతానా కోటలో ఒక గ్రంథపుచుట్ట దొరికింది. దాని మీద ఇలా వ్రాసి ఉంది: వ్రాతపూర్వక సందేశము:
EZR 6:3 రాజైన కోరెషు పాలనలో మొదటి సంవత్సరంలో యెరూషలేములోని దేవుని దేవాలయం గురించి రాజు జారీ చేసిన శాసనం: బలులు అర్పించే స్థలంగా మందిరాన్ని తిరిగి కట్టాలి, దాని పునాదులు వేయాలి. దాని ఎత్తు అరవై మూరలు, వెడల్పు అరవై మూరలు ఉండాలి.
EZR 6:4 పెద్ద రాళ్లతో మూడు వరుసలు, క్రొత్త కలపతో ఒక వరుస పెట్టి కట్టాలి. దానికయ్యే ఖర్చు రాజ్య ఖజానా నుండి చెల్లించాలి.
EZR 6:5 అంతేకాక, నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి బబులోనుకు తీసుకువచ్చిన దేవుని ఆలయానికి సంబంధించిన వెండి బంగారు వస్తువులను తిరిగి యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లి వాటి స్థానాల్లో పెట్టాలి; వాటిని దేవుని మందిరంలోనే ఉంచాలి.
EZR 6:6 అందుకు ఇప్పుడు, యూఫ్రటీసు నది అవతల అధిపతియైన తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు దీనికి దూరంగా ఉండాలి.
EZR 6:7 దేవుని ఆలయ పనికి ఆటంకం కలిగించకూడదు. యూదుల అధిపతిని, యూదుల పెద్దలను దేవుని మందిరాన్ని దాని స్థానంలో కట్టనివ్వండి.
EZR 6:8 అంతేకాక, దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి ఈ యూదుల పెద్దలకు మీరు అందించవలసిన సహాయం గురించి కూడా నేను మీకు ఆదేశం ఇస్తున్నాను: యూఫ్రటీసు నది అవతల నుండి రాజ ఖజానాకు వచ్చిన పన్నుల నుండి వారి ఖర్చులన్నిటిని చెల్లించాలి, తద్వారా వారి పని ఆగదు.
EZR 6:9 వారికి అవసరమైన వాటిని అనగా పరలోక దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు యెరూషలేములోని యాజకులు అడిగే గోధుమలు, ఉప్పు, ద్రాక్షరసం, ఒలీవనూనె, ప్రతిరోజు క్రమం తప్పకుండా వారికి అందించాలి.
EZR 6:10 తద్వారా వారు బలులు అర్పించి పరలోక దేవుని సంతోషపరచి రాజు, అతని కుమారుల క్షేమం గురించి ప్రార్థిస్తారు.
EZR 6:11 అంతేకాక, నా ఆదేశం ఏంటంటే, ఎవరైనా ఈ ఆజ్ఞ పాటించకపోతే వారి ఇంటి నుండి దూలాన్ని తీసి దానికి వారిని ఉరితీయాలి. ఈ నేరం బట్టి వారి ఇంటిని చెత్తకుప్పగా చేయాలి.
EZR 6:12 ఏ రాజైన ఏ ప్రజలైనా ఈ ఆజ్ఞను మీరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే తన నామాన్ని అక్కడ ఉంచిన దేవుడు వారిని పడగొట్టును గాక. దర్యావేషు అనే నేను ఆదేశిస్తున్నాను. దీనిని ఖచ్చితంగా శ్రద్ధతో పాటించాలి.
EZR 6:13 తర్వాత, రాజైన దర్యావేషు పంపించిన శాసనం ప్రకారం, యూఫ్రటీసు నది అవతలి అధిపతియైన తత్తెనై, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు పని చేయించారు.
EZR 6:14 ప్రవక్తయైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జెకర్యాల ప్రవచనాలను బట్టి యూదుల పెద్దలు పనిని సక్రమంగా కొనసాగించారు. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ప్రకారం పర్షియా రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆదేశాలను అనుసరించి వారు మందిరాన్ని కట్టడం ముగించారు.
EZR 6:15 రాజైన దర్యావేషు పాలనలోని ఆరవ సంవత్సరంలో అదారు నెల మూడవ రోజున మందిరం పూర్తి అయ్యింది.
EZR 6:16 అప్పుడు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు చెర నుండి విడుదలై వచ్చిన వారందరు కలిసి ఆనందంతో మందిరాన్ని ప్రతిష్ఠించారు.
EZR 6:17 దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించడానికి వారు ఆ రోజున వంద ఎడ్లు, రెండువందల పొట్టేళ్లు, నాలుగువందల గొర్రెపిల్లలు, ఇశ్రాయేలీయులందరి కోసం పాపపరిహారబలిగా ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున పన్నెండు మేకపోతులను బలి అర్పించారు.
EZR 6:18 యెరూషలేములో దేవుని సేవ చేయడానికి మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం వారి వారి తరగతుల ప్రకారం యాజకులను వారివారి వరుసల ప్రకారం లేవీయులను నియమించారు.
EZR 6:19 చెర నుండి విడుదలై వచ్చినవారు మొదటి నెల పద్నాలుగవ రోజు పస్కాపండుగ చేసుకున్నారు.
EZR 6:20 యాజకులు, లేవీయులు తమను తాము శుద్ధి చేసుకుని పవిత్రులయ్యారు. లేవీయులు చెర నుండి విడుదలైన వారందరి కోసం, తమ బంధువులైన యాజకుల కోసం, తమ కోసం పస్కా గొర్రెపిల్లను వధించారు.
EZR 6:21 చెర నుండి విడుదలై వచ్చిన ఇశ్రాయేలీయులు, దేశంలో పొరుగు ప్రజల అపవిత్ర ప్రవర్తను నుండి తమను తాము ప్రత్యేకించుకొని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను కొలిచే వారంతా కలిసి పస్కాను తిన్నారు.
EZR 6:22 ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనిలో సహకరించేలా యెహోవా అష్షూరు రాజు హృదయాన్ని మార్చి వారికి సంతోషాన్ని కలిగించినందుకు వారు ఏడు రోజులు పులియని రొట్టెల పండుగను ఆనందంతో జరుపుకున్నారు.
EZR 7:1 ఈ విషయాలన్ని జరిగిన తర్వాత, పర్షియా రాజైన అర్తహషస్త పరిపాలిస్తున్న కాలంలో ఎజ్రా బబులోను నుండి యెరూషలేముకు వచ్చాడు. ఎజ్రా శెరాయా కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు హిల్కీయా కుమారుడు,
EZR 7:2 అతడు షల్లూము కుమారుడు, అతడు సాదోకు కుమారుడు, అతడు అహీటూబు కుమారుడు,
EZR 7:3 అతడు అమర్యా కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు మెరాయోతు కుమారుడు,
EZR 7:4 అతడు జెరహ్యా కుమారుడు, అతడు ఉజ్జీ కుమారుడు, అతడు బుక్కీ కుమారుడు,
EZR 7:5 అతడు అబీషూవ కుమారుడు, అతడు ఫీనెహాసు కుమారుడు, అతడు ఎలియాజరు కుమారుడు, అతడు ముఖ్య యాజకుడైన అహరోను కుమారుడు.
EZR 7:6 ఈ ఎజ్రా బబులోను నుండి తిరిగి వచ్చాడు. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇచ్చిన మోషే ధర్మశాస్త్రంలో ఆరితేరిన శాస్త్రి. తన దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు అడిగిన వాటన్నిటిని రాజు అతనికి ఇచ్చాడు.
EZR 7:7 రాజైన అర్తహషస్త పరిపాలనలో ఏడవ సంవత్సరంలో కొందరు ఇశ్రాయేలీయులు, వారితో పాటు యాజకులు, లేవీయులు, సంగీతకారులు, ద్వారపాలకులు, ఆలయ సేవకులు యెరూషలేముకు వచ్చారు.
EZR 7:8 రాజు పరిపాలనలోని ఏడవ సంవత్సరం అయిదవ నెలలో, అయిదవ నెలలో ఎజ్రా యెరూషలేము చేరుకున్నాడు.
EZR 7:9 తన దేవుని కరుణాహస్తం అతనికి తోడుగా ఉన్నందుకు అతడు మొదటి నెల మొదటి రోజున బబులోను నుండి బయలుదేరి, అయిదవ నెల మొదటి రోజున యెరూషలేము చేరుకున్నాడు.
EZR 7:10 యెహోవా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని ప్రకారం చేయాలని, ఇశ్రాయేలీయులకు దాని శాసనాలను, న్యాయవిధులను నేర్పించాలని ఎజ్రా నిశ్చయించుకున్నాడు.
EZR 7:11 యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన శాసనాలు ఆజ్ఞల విషయంలో ధర్మశాస్త్ర శాస్త్రి, యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త పంపిన ఉత్తరం నకలు ఇది:
EZR 7:12 రాజులకు రాజైన అర్తహషస్త, యాజకుడును ఆకాశమందున్న దేవుని ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రాకు వ్రాయునది, శుభములు.
EZR 7:13 నా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీయులలో, యాజకులలో, లేవీయులలో, యెరూషలేము వెళ్లడానికి ఇష్టపడినవారు నీతో పాటు వెళ్లవచ్చని నేను ఆదేశిస్తున్నాను.
EZR 7:14 నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రం ప్రకారం యూదా గురించి యెరూషలేము గురించి పరిశీలించడానికి రాజు అతని ఏడుగురు సలహాదారులు నిన్ను పంపించారు.
EZR 7:15 అంతేకాక, యెరూషలేములో నివాసం ఉన్న ఇశ్రాయేలు దేవునికి రాజు అతని సలహాదారులు ఇష్టపూర్వకంగా ఇచ్చిన వెండి బంగారాలను నీతో తీసుకెళ్లాలి.
EZR 7:16 వాటితో పాటు బబులోను ప్రాంతమంతటిలో నీకు లభించిన వెండి బంగారాలను, యెరూషలేములో ఉన్న తమ దేవుని ఆలయానికి ప్రజలు, యాజకులు ఇచ్చిన కానుకలను నీవు తీసుకెళ్లాలి.
EZR 7:17 ఆ డబ్బుతో నీవు బలి అర్పించడానికి కావలసిన ఎడ్లు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు, వాటి భోజనార్పణలు, పానార్పణలతో పాటు కొని, యెరూషలేములోని నీ దేవుని ఆలయ బలిపీఠం మీద వాటిని అర్పించాలి.
EZR 7:18 మిగిలిన వెండి బంగారాలను నీ దేవుని చిత్తప్రకారం నీకు, నీ తోటి ఇశ్రాయేలీయులకు సమ్మతమైన విధంగా వాడండి.
EZR 7:19 నీ దేవుని మందిరంలో ఆరాధన కోసం నీకు అప్పగించిన అన్ని వస్తువులను యెరూషలేములోని దేవుని సన్నిధిలో అందించాలి.
EZR 7:20 నీ దేవుని ఆలయానికి ఇంకా అవసరమైనవి ఏమైనా నీవు కావాలంటే, రాజ ఖజానా నుండి అవి నీకు అందించబడతాయి.
EZR 7:21 రాజునైన అర్తహషస్త అనే నేను, యూఫ్రటీసు నది అవతలి కోశాధికారులకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, పరలోక దేవుని ధర్మశాస్త్ర బోధకుడు, యాజకుడైన ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగితే, దానిని శ్రద్ధతో మీరు అందించాలి.
EZR 7:22 వంద తలాంతుల వెండి, వెయ్యి తూముల వరకు గోధుమలు, వంద బాతుల ద్రాక్షరసం, వంద బాతుల ఒలీవ నూనె, లెక్కలేనంత ఉప్పు సరఫరా చెయ్యండి.
EZR 7:23 పరలోక దేవుడు నిర్దేశించిన ప్రకారం పరలోక దేవుని మందిరం కోసం శ్రద్ధగా చేయాలి. రాజు అతని కుమారుల సామ్రాజ్యం మీదికి దేవుని కోపం ఎందుకు రావాలి?
EZR 7:24 అంతేకాక, యాజకులలో, లేవీయులలో, సంగీతకారులలో, ద్వారపాలకుల్లో, దేవాలయ సేవకులలో లేదా ఇతర పనివారిలో ఎవరి మీద హోదా పన్ను గాని, కప్పం గాని, సుంకం గాని, విధించే అధికారం మీకు లేదని గ్రహించండి.
EZR 7:25 ఎజ్రా! నీవు నీకున్న నీ దేవుని జ్ఞానంతో, యూఫ్రటీసు నది అవతలి ప్రజలకు న్యాయం తీర్చడానికి, నీ దేవుని న్యాయవిధులు తెలిసినవారిని నీవే అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించు. అవి తెలియని వారికి నీవు వాటిని బోధించాలి.
EZR 7:26 నీ దేవుని ధర్మశాస్త్రాన్ని, రాజు చట్టాన్ని అతిక్రమించిన వారికి తప్పనిసరిగా మరణశిక్ష, దేశ బహిష్కరణ, ఆస్తుల జప్తు లేదా జైలు శిక్ష విధించాలి.
EZR 7:27 యెరూషలేములో ఉన్న యెహోవా ఆలయానికి ఈ విధంగా ఘనత చేకూర్చేందుకు రాజు హృదయాన్ని కదిలించిన మన పూర్వికుల దేవుడైన యెహోవాకు స్తుతి!
EZR 7:28 రాజుకు, అతని సహాయకులకు రాజు యొక్క శక్తివంతులైన నాయకులకు నా మీద దయ కలిగేలా ఆయన తన దయ నాపై చూపించారు. నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి, నేను ధైర్యం చేసి నాతో రావడానికి ఇశ్రాయేలీయుల నాయకులను సమకూర్చాను.
EZR 8:1 రాజైన అర్తహషస్త పాలనలో నాతో కూడా బబులోను నుండి వచ్చిన కుటుంబ పెద్దలు వారితో పాటు నమోదైన వారి వివరాలు:
EZR 8:2 ఫీనెహాసు వారసుల నుండి: గెర్షోము; ఈతామారు వారసుల నుండి: దానియేలు; దావీదు వారసుల నుండి: హట్టూషు
EZR 8:3 షెకన్యా వారసుల నుండి వచ్చినవాడు; పరోషు వారసుల నుండి: జెకర్యా, అతనితో పాటు నమోదైన 150 మంది పురుషులు;
EZR 8:4 పహత్-మోయాబు వారసుల నుండి: జెరహ్యా కుమారుడైన ఎల్యోయేనై, అతనితో పాటు నమోదైన 200 మంది పురుషులు;
EZR 8:5 జట్టు వారసుల నుండి: షెకన్యా కుమారుడైన యహజీయేలు, అతనితో పాటు నమోదైన 300 మంది పురుషులు;
EZR 8:6 ఆదీను వారసుల నుండి: యోనాతాను కుమారుడైన ఎబెదు, అతనితో పాటు నమోదైన 50 మంది పురుషులు;
EZR 8:7 ఏలాము వారసుల నుండి: అతల్యా కుమారుడైన యెషయా, అతనితో పాటు నమోదైన 70 మంది పురుషులు;
EZR 8:8 షెఫట్యా వారసుల నుండి: మిఖాయేలు కుమారుడైన జెబద్యా, అతనితో పాటు నమోదైన 80 మంది పురుషులు;
EZR 8:9 యోవాబు వారసుల నుండి: యెహీయేలు కుమారుడైన ఓబద్యా, అతనితో పాటు నమోదైన 218 మంది పురుషులు;
EZR 8:10 బానీ వారసుల నుండి: షెలోమీతు కుమారుడైన యోసిప్యా, అతనితో పాటు నమోదైన 160 మంది పురుషులు;
EZR 8:11 బేబై వారసుల నుండి: బేబై కుమారుడైన జెకర్యా, అతనితో పాటు నమోదైన 28 మంది పురుషులు;
EZR 8:12 అజ్గాదు వారసుల నుండి: హక్కాటాను కుమారుడైన యోహానాను, అతనితో పాటు నమోదైన 110 మంది పురుషులు;
EZR 8:13 అదోనీకాము వారసుల నుండి: చివరి వారైన ఎలీఫెలెతు, యెహీయేలు, షెమయా, వారితో పాటు నమోదైన 60 మంది పురుషులు;
EZR 8:14 బిగ్వయి వారసుల నుండి: ఊతై, జక్కూరు, వారితో పాటు నమోదైన 70 మంది పురుషులు.
EZR 8:15 అహవా వైపు ప్రవహించే ఓ కాలువ దగ్గర నేను వీరందరిని సమావేశపరిచాను. అక్కడ మేము మూడు రోజులు బస చేశాము. అక్కడ ఉన్న ప్రజలను యాజకులను పరిశీలించి నేను గ్రహించింది ఏంటంటే వారిలో లేవీయులెవ్వరూ లేరు.
EZR 8:16 కాబట్టి నేను నాయకులైన ఎలీయెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము అనే వారిని, అలాగే వివేచన కలిగిన యోయారీబు ఎల్నాతానులను పిలిపించి,
EZR 8:17 కాసిప్యా ప్రాంతంలో నాయకుడైన ఇద్దో దగ్గరకు వెళ్లమని ఆదేశించాను. వారు మా దేవుని మందిర సేవకులను మా దగ్గరకు తీసుకువచ్చేలా ఇద్దో అతని తోటి లేవీయులైన ఆలయ సేవకులకు ఏమి చెప్పాలో వారికి చెప్పాను.
EZR 8:18 మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందుకు, వారు ఇశ్రాయేలు కుమారుడైన లేవీకి పుట్టిన మహలి వారసుడు, సమర్థుడైన షేరేబ్యాను, అతని కుమారులు, సహోదరులతో కలిపి మొత్తం 18 మందిని తీసుకువచ్చారు;
EZR 8:19 హషబ్యాను, అతనితో మెరారి వారసుడైన యెషయాను, అతని సోదరులను, వారి కుమారులను మొత్తం 20 మందిని తీసుకువచ్చారు.
EZR 8:20 వారితో పాటు లేవీయులకు సహాయంగా దావీదు అతని అధికారులు నిర్ణయించిన ఆలయ సేవకులలో నుండి 220 మందిని తీసుకువచ్చారు. వారందరి పేర్లు నమోదు చేయబడి ఉన్నాయి.
EZR 8:21 అప్పుడు అక్కడ అహవా కాలువ దగ్గర, మనమందరం ఉపవాసం ఉండి, మన దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకుని మనకు మన పిల్లలకు మన ఆస్తి అంతటికి క్షేమకరమైన ప్రయాణాన్ని ఇవ్వమని వేడుకుందామని నేను ప్రకటించాను.
EZR 8:22 మేము రాజుతో, “మా దేవున్ని వెదికే ప్రతి ఒక్కరిపై ఆయన కరుణాహస్తం ఉంటుంది. ఆయనను విడిచిపెట్టినవారి మీద ఆయన తీవ్రమైన కోపం కుమ్మరించబడుతుంది” అని చెప్పాము కాబట్టి, దారిలో ఎదురయ్యే శత్రువులు నుండి కాపాడడానికి సైనికులు, గుర్రపురౌతులను మాకు సహాయంగా పంపమని రాజును అడగడానికి నేను సిగ్గుపడ్డాను.
EZR 8:23 కాబట్టి మేము ఉపవాసముండి, దీని గురించి మా దేవునికి మొరపెట్టగా, ఆయన మా ప్రార్థనకు జవాబిచ్చారు.
EZR 8:24 నేను యాజకులలో నుండి ముఖ్యమైన పన్నెండుమందిని అనగా, షేరేబ్యా, హషబ్యా, వారి సోదరులలో పదిమందిని ఎంపిక చేశాను.
EZR 8:25 రాజు అతని సలహాదారులు అధికారులు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరు మన దేవుని మందిరానికి విరాళంగా ఇచ్చిన వెండి బంగారాన్ని వస్తువులను తూచి నేను వారికి ఇచ్చాను.
EZR 8:26 నేను 650 తలాంతుల వెండి, 100 తలాంతుల వెండి పాత్రలు, 100 తలాంతుల బంగారం
EZR 8:27 1,000 డారిక్కుల బరువుగల 20 బంగారు గిన్నెలు, మేలిమి బంగారమంతా విలువైన రెండు మెరిసే ఇత్తడి పాత్రలు తూచి ఇచ్చాను.
EZR 8:28 నేను వారితో, “మీరు, ఈ వస్తువులతో పాటు యెహోవాకు ప్రతిష్ఠించబడ్డారు, ఈ వెండి బంగారాలు మీ పూర్వికుల దేవుడైన యెహోవాకు ఇష్టపూర్వకంగా ఇచ్చిన అర్పణ.
EZR 8:29 యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదుల్లో ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల కుటుంబ పెద్దల సమక్షంలో వీటిని తూచి అప్పగించే వరకు వీటిని జాగ్రత్తగా కాపాడండి” అని చెప్పాను.
EZR 8:30 అప్పుడు యాజకులు, లేవీయులు, యెరూషలేములోని దేవుని ఆలయానికి తీసుకుని వెళ్లడానికి తూచిన వెండి బంగారాలను, పవిత్ర పాత్రలను తీసుకున్నారు.
EZR 8:31 అహవా కాలువ దగ్గర నుండి మొదటి నెల పన్నెండవ రోజున మేము యెరూషలేముకు రావాలని బయలుదేరాము. మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి, శత్రువుల నుండి, దారిలో పొంచి ఉండే బందిపోట్లు నుండి ఆయన మమ్మల్ని కాపాడారు.
EZR 8:32 కాబట్టి మేము యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడే బస చేశాము.
EZR 8:33 నాలుగవ రోజున మా దేవుని మందిరంలో, వెండి బంగారాలను, పవిత్ర పాత్రలను తూకం వేసి, యాజకుడును ఊరియా కుమారుడునైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో పాటు ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు, లేవీయులైన యెషూవ కుమారుడైన యోజాబాదు, బిన్నూయి కుమారుడైన నోవద్యా ఉన్నారు.
EZR 8:34 ఆ సమయంలో ప్రతిదాన్ని సంఖ్య ప్రకారం, బరువు ప్రకారం లెక్కించారు, వాటి మొత్తం బరువును నమోదు చేశారు.
EZR 8:35 తర్వాత చెర నుండి విడుదలై తిరిగివచ్చిన ప్రవాసులు ఇశ్రాయేలీయుల దేవునికి దహనబలిగా ఇశ్రాయేలీయులందరి కోసం పన్నెండు ఎడ్లు, తొంభై ఆరు పొట్టేళ్లు, డెబ్బై ఏడు గొర్రెపిల్లలను పాపపరిహారబలిగా పన్నెండు మేకపోతులను అర్పించారు. ఇదంతా యెహోవాకు అర్పించిన దహనబలి.
EZR 8:36 వారు రాజు ఆదేశాలను రాజు అధికారులకు, యూఫ్రటీసు నది అవతలనున్న అధిపతులకు అప్పగించిన తర్వాత, వారందరు ప్రజలకు, దేవుని మందిర పనికి సహాయపడ్డారు.
EZR 9:1 ఈ విషయాలన్ని జరిగిన తర్వాత నాయకులు నా దగ్గరకు వచ్చి, “ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, అందరు తమ పొరుగువారైన కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఈజిప్టువారు, అమోరీయుల నుండి వేరుగా ఉండకుండా వారితో కలిసిపోయి, వారు చేసే అసహ్యకరమైన ఆచారాలను పాటించారు.
EZR 9:2 వారి కుమార్తెలను తమకు, తమ కుమారులకు భార్యలుగా చేసుకుంటూ, పరిశుద్ధజాతిగా ఉండకుండా తమ చుట్టూ ఉన్నవారితో కలిసిపోయారు. నాయకులు అధికారులు ఈ విషయంలో అపనమ్మకంగా ఉన్నారు” అని చెప్పారు.
EZR 9:3 ఇది విని నేను నా చొక్కా, పై వస్త్రం చింపుకుని, తలవెంట్రుకలు, గడ్డం పీక్కుని దిగ్భ్రాంతితో కూర్చుండిపోయాను.
EZR 9:4 అప్పుడు చెర నుండి వచ్చినవారు చేసిన ఈ నమ్మకద్రోహాన్ని బట్టి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన ప్రతిఒక్కరు నా చుట్టూ చేరారు. సాయంత్రపు బలి అర్పించే సమయం వరకు నేను దిగ్భ్రాంతితో అక్కడ కూర్చున్నాను.
EZR 9:5 తర్వాత, సాయంత్రపు బలి అర్పించే సమయానికి నేను నా అవమానం నుండి లేచి, చినిగిన చొక్కా పై వస్ర్తంతోనే మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవా వైపు చేతులెత్తి
EZR 9:6 ఇలా ప్రార్థించాను: “నా దేవా, నా ముఖాన్ని మీ వైపు ఎత్తడానికి నాకు చాలా సిగ్గుగా, అవమానంగా ఉంది. మా పాపాలు మా తల కన్న ఎత్తుగా ఉన్నాయి, మా అపరాధం ఆకాశాన్ని అంటింది.
EZR 9:7 మా పూర్వికుల రోజులనుండి నేటివరకు మేము చాలా ఘోరమైన అపరాధాలు చేశాము. మా పాపం కారణంగా ఈ రోజు ఉన్నట్లు మేము, మా రాజులు, యాజకులు పరాయి రాజుల చేతి అప్పగించబడి ఖడ్గానికి, బానిసత్వానికి, దోపిడికి, అవమానానికి గురైయ్యాము.
EZR 9:8 “అయితే ఇప్పుడు, మా దేవుడైన యెహోవా ప్రార్థనకు జవాబుగా మా కళ్ళకు వెలుగిచ్చి మా బానిసత్వం నుండి కొంత ఉపశమనం కలిగేలా మాలో కొందరిని తప్పించి, తన పరిశుద్ధాలయంలో స్థిరమైన స్థలాన్ని ఇచ్చి, మా దేవుడు కొంతమట్టుకు మా పట్ల దయ చూపించారు.
EZR 9:9 మేము బానిసలుగా ఉన్నప్పటికీ, మా దేవుడు మా దాస్యంలో మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన పర్షియా రాజుల ఎదుట మామీద దయ చూపించారు. దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి, దానికి మరమ్మత్తు చేయడానికి, ఆయన మాకు నూతన జీవాన్ని ఇచ్చారు. యూదాలో, యెరూషలేములో ఆయన మాకు రక్షణ గోడగా ఉన్నారు.
EZR 9:10 “అయితే ఇప్పుడు, మా దేవా, ఇంత జరిగిన తర్వాత మేము ఏమి చెప్పగలము? మీ సేవకులైన ప్రవక్తల ద్వారా మీరు ఇచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టాము. వారు, ‘మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం అక్కడి ప్రజల అపవిత్రత వలన కలుషితమైపోయింది. తమ అసహ్యకరమైన ఆచారాలతో వారు దేశాన్ని ఆ చివర నుండి ఈ చివర వరకు నింపేశారు.
EZR 9:12 కాబట్టి మీ కుమార్తెలకు వారి కుమారులతో గాని, మీ కుమారులకు వారి కుమార్తెలతో గాని పెళ్ళి చేయవద్దు. ఎప్పటికీ వారితో స్నేహ ఒప్పందం కోరవద్దు, అప్పుడు మీరు బలవంతులుగా ఉండి, ఆ దేశంలోని మంచి వాటిని తిని, మీ పిల్లలకు శాశ్వతమైన వారసత్వంగా దానిని అప్పగిస్తారు’ అని చెప్పారు.
EZR 9:13 “మేము చేసిన చెడు పనులకు, మా గొప్ప అపరాధానికి ఫలితంగా ఇలా మాకు జరిగింది. అయినప్పటికీ, మా దేవుడవైన మీరు మా దోషాలకు తగిన పూర్తి శిక్షను మాకు విధించకుండా ఈ విధంగా కొంతమందిని దాస్యం నుండి తప్పించారు.
EZR 9:14 ఇంత జరిగాక, మేము మరలా మీ ఆజ్ఞలు పాటించకుండా ఇలాంటి అసహ్యకరమైన ఆచారాలు పాటించే ప్రజలతో వియ్యమందుతామా? మాలో ఒక్కరు తప్పించుకుని మిగిలిపోకుండ మీరు మమ్మల్ని నాశనం చేసేంతగా కోప్పడతారు గదా?
EZR 9:15 యెహోవా, ఇశ్రాయేలు దేవా, మీరు నీతిమంతులు! ఈ రోజున మేము కొద్ది మందిమి మిగిలాము. మేము మీ ముందు నిలబడడానికి మేమెవరం అర్హులం కాకపోయిన, మీ ఎదుట మా అపరాధంలో నిలబడ్డాము.”
EZR 10:1 ఎజ్రా దేవుని మందిరం ఎదుట నేలమీద పడి ఏడుస్తూ పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయులలో స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు పెద్ద సమూహంగా అతని చుట్టూ చేరి వారు కూడా బిగ్గరగా ఏడ్చారు.
EZR 10:2 అప్పుడు ఏలాము వారసులలో ఒకడైన యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో, “మా చుట్టూ ఉన్న ప్రజల నుండి పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకుని మన దేవుని పట్ల నమ్మకద్రోహం చేశాము. అయినా ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తన మార్చుకుంటారనే నిరీక్షణ ఉంది.
EZR 10:3 నా ప్రభువు సలహా ప్రకారం మన దేవుని ఆజ్ఞలకు భయపడేవారి సలహా ప్రకారం, ఈ స్త్రీలను వారి పిల్లలందరిని పంపించి వేయడానికి మన దేవుని ఎదుట ఒక నిబంధన చేద్దాము. ధర్మశాస్త్రం ప్రకారం ఇది జరగాలి.
EZR 10:4 లెండి; ఈ పని మీ చేతిలోనే ఉంది. మేము మీకు మద్ధతు ఇస్తాం కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి” అన్నాడు.
EZR 10:5 అప్పుడు ఎజ్రా లేచి, ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులందరు ఆ మాట ప్రకారం చేసేలా వారితో ప్రమాణం చేయించాడు. వారు ప్రమాణం చేశారు.
EZR 10:6 అప్పుడు ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి బయలుదేరి ఎల్యాషీబు కుమారుడైన యెహోహనాను గదిలోకి వెళ్లాడు. అతడు అక్కడ ఉన్నప్పుడు, ఎజ్రా అన్నపానాలు పుచ్చుకోలేదు ఎందుకంటే, చెరగొనిపోబడిన వారి నమ్మకద్రోహాన్ని బట్టి దుఃఖించాడు.
EZR 10:7 చెర నుండి విడుదలై వచ్చిన వారంతా యెరూషలేములో సమావేశం కావాలని యూదాలో, యెరూషలేములో ప్రకటన చేశారు.
EZR 10:8 ఎవరైనా మూడు రోజుల లోపు అధికారులు, పెద్దల నిర్ణయం ప్రకారం రాకపోతే, వారి ఆస్తి జప్తు చేయబడుతుంది. వారు చెర నుండి విడుదలై వచ్చిన వారి సమాజంలో నుండి వెలివేయబడతారు.
EZR 10:9 మూడు రోజుల్లో, యూదా, బెన్యామీను పురుషులందరు యెరూషలేములో సమకూడారు. తొమ్మిదవ నెల ఇరవయ్యవ రోజున ప్రజలందరు దేవుని మందిరం ఎదురుగా ఉన్న కూడలిలో కూర్చుని భారీ వర్షంలో తడుస్తూ ఈ విషయాన్ని బట్టి ఎంతో దిగులుతో ఉన్నారు.
EZR 10:10 అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి నిలబడి వారితో, “మీరు నమ్మకద్రోహులుగా ఉన్నారు; పరాయి స్త్రీలను పెళ్ళి చేసుకుని ఇశ్రాయేలీయుల దోషాన్ని ఇంకా ఎక్కువ చేశారు.
EZR 10:11 ఇప్పుడు మీ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించండి, ఆయన చిత్తం చేయండి. మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రజల నుండి, మీ పరాయి దేశపు భార్యల నుండి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి” అని చెప్పాడు.
EZR 10:12 అప్పుడు అక్కడ చేరి ఉన్నవారందరు స్పందిస్తూ బిగ్గరగా ఇలా అన్నారు: “నీవు చెప్పింది సరియైనది! నీవు చెప్పినట్లు మేము చేయాలి.
EZR 10:13 అయితే ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, ఇప్పుడు చాలా పెద్ద వర్షం కురుస్తుండడం వలన మేము బయట నిలబడలేము. అంతేకాక, ఇది ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే విషయం కాదు ఎందుకంటే, ఈ విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేశాము.
EZR 10:14 కాబట్టి ఈ సమాజమంతటి పక్షంగా మా అధికారులు నిలబడాలి. అప్పుడు ఈ విషయంలో మన దేవుని తీవ్రమైన కోపం మన నుండి తొలగిపోయే వరకు మన పట్టణాల్లో పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న ప్రతివారు నిర్ణయించిన సమయంలో ప్రతి పట్టణపు పెద్దలతో, న్యాయాధిపతులతో రావాలి.”
EZR 10:15 దీనిని కేవలం అశాహేలు కుమారుడైన యోనాతాను, తిక్వా కుమారుడైన యహజ్యాలు మెషుల్లాము, లేవీయుడైన షబ్బెతై అనేవారి మద్దతుతో దీన్ని వ్యతిరేకించారు.
EZR 10:16 కాబట్టి నిర్ణయించిన ప్రకారం చెర నుండి విడుదలైన వారు చేశారు. అప్పుడు యాజకుడైన ఎజ్రా, కుటుంబ పెద్దలైన వారిని ప్రతి కుటుంబం నుండి ఒకరు చొప్పున, వారి వారి పేర్లను బట్టి ఎన్నుకున్నాడు. ఈ విషయం పరిశీలించటానికి పదవనెల మొదటి రోజున వారంతా కూర్చున్నారు.
EZR 10:17 మొదటి నెల మొదటి రోజుకి పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న వారందరి విషయాన్ని పరిష్కరించడం జరిగింది.
EZR 10:18 యాజకుల వారసులలో పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్న వారు వీరు: యోజాదాకు కుమారుడైన యెషూవ వారసులు, అతని సహోదరుల నుండి: మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా.
EZR 10:19 (వీరంతా తమ భార్యలను పంపివేస్తామని మాట ఇచ్చారు. తమ దోషాన్ని బట్టి అపరాధపరిహారబలిగా ఒక్కొక్కరు మందలో ఒక్కొక్క పొట్టేలు అర్పించారు.)
EZR 10:20 ఇమ్మేరు వారసుల నుండి: హనానీ, జెబద్యా.
EZR 10:21 హారీము వారసుల నుండి: మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.
EZR 10:22 పషూరు వారసుల నుండి: ఎల్యోయేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా.
EZR 10:23 లేవీయుల నుండి: యోజాబాదు, షిమీ, కెలిథా అనే కెలాయా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.
EZR 10:24 సంగీతకారుల నుండి: ఎల్యాషీబు. ద్వారపాలకుల నుండి: షల్లూము, తెలెము, ఊరి.
EZR 10:25 ఇతర ఇశ్రాయేలీయుల నుండి: పరోషు వారసుల నుండి: రమ్యా, ఇజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియాజరు, మల్కీయా, బెనాయా.
EZR 10:26 ఏలాము వారసుల నుండి: మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలీయా.
EZR 10:27 జత్తూ వారసుల నుండి: ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా.
EZR 10:28 బేబై వారసుల నుండి: యెహోహనాను, హనన్యా, జబ్బయి, అత్లాయి.
EZR 10:29 బానీ వారసుల నుండి: మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు షెయాలు, యెరేమోతు.
EZR 10:30 పహత్-మోయాబు వారసుల నుండి: అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే.
EZR 10:31 హారీము వారసుల నుండి: ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా, షిమ్యోను,
EZR 10:32 బెన్యామీను, మల్లూకు, షెమర్యా.
EZR 10:33 హాషుము వారసుల నుండి: మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీఫెలెతు, యెరేమై, మనష్షే, షిమీ.
EZR 10:34 బానీ వారసుల నుండి: మయదై, అమ్రాము, ఊయేలు,
EZR 10:35 బెనాయా, బేద్యా, కెలూహు,
EZR 10:36 వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు
EZR 10:37 మత్తన్యా, మత్తెనై, యయశావు.
EZR 10:38 బానీ బిన్నూయి వారసుల నుండి: షిమీ,
EZR 10:39 షెలెమ్యా, నాతాను, అదాయా,
EZR 10:40 మక్నద్బయి, షాషై, షారాయి,
EZR 10:41 అజరేలు, షెలెమ్యా, షెమర్యా,
EZR 10:42 షల్లూము, అమర్యా, యోసేపు.
EZR 10:43 నెబో వారసుల నుండి: యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా.
EZR 10:44 వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు. వారిలో కొందరికి ఈ భార్యల వలన పిల్లలు కూడా పుట్టారు.
NEH 1:1 హకల్యా కుమారుడైన నెహెమ్యా మాటలు: ఇరవయ్యవ సంవత్సరం కిస్లేవు నెలలో నేను షూషను కోటలో ఉన్నప్పుడు,
NEH 1:2 నా సోదరులలో ఒకడైన హనానీ మరి కొంతమందితో కలిసి యూదా నుండి వచ్చారు. అప్పుడు చెరలోకి రాకుండా బయటపడి మిగిలి ఉన్న యూదుల గురించి, యెరూషలేము గురించి నేను వారిని అడిగాను.
NEH 1:3 వారు నాతో, “చెరలో పడకుండ బయటపడ్డవారు మన దేశంలోనే ఉన్న ఎంతో శ్రమను అవమానాన్ని అనుభవిస్తున్నారు. యెరూషలేము గోడ కూలిపోయింది. దాని గుమ్మాలు అగ్నితో కాల్చబడ్డాయి” అని చెప్పారు.
NEH 1:4 ఈ మాటలు విన్నప్పుడు నేను క్రింద కూర్చుని ఏడ్చాను. కొన్ని రోజుల వరకు దుఃఖంతో ఉపవాసముండి పరలోకంలో ఉన్న దేవునికి ప్రార్థించాను.
NEH 1:5 నేను ఆయనకు ఇలా ప్రార్థించాను: “యెహోవా పరలోకపు దేవా, అద్భుతమైన గొప్ప దేవా, మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల మీ ప్రేమ ఒడంబడికను మీరు నెరవేరుస్తారు,
NEH 1:6 మీ సేవకులైన ఇశ్రాయేలు ప్రజల కోసం మీ సేవకుడు పగలు రాత్రి మీ ఎదుట చేస్తున్న ప్రార్థనను వినడానికి మీ చెవిని మీ కళ్లను తెరవండి. నేను, నా తండ్రి కుటుంబంతో సహా ఇశ్రాయేలీయులమైన మేము మీకు వ్యతిరేకంగా చేసిన పాపాలను నేను ఒప్పుకుంటున్నాను.
NEH 1:7 మేము మీ పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాము. మీరు మీ సేవకుడైన మోషేకు ఇచ్చిన ఆజ్ఞలకు, శాసనాలకు చట్టాలకు మేము లోబడలేదు.
NEH 1:8 “మీరు మీ సేవకుడైన మోషేకు ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, మీరేమన్నారంటే, ‘మీరు నా పట్ల నమ్మకద్రోహులుగా ప్రవర్తిస్తే, దేశాల మధ్యలోకి మిమ్మల్ని చెదరగొడతాను,
NEH 1:9 కానీ ఒకవేళ మీరు నా వైపు తిరిగి, నా ఆజ్ఞలను అనుసరిస్తే చెరగొనిపోబడిన మీ ప్రజలు ఎంత దూరంలో ఉన్నా నేను వారిని అక్కడినుండి సమకూర్చి నా పేరు కోసం నేను నివాసంగా ఎంచుకున్న ప్రదేశానికి వారిని తీసుకువస్తాను.’
NEH 1:10 “వారు మీ సేవకులైన మీ ప్రజలు, మీ గొప్ప బలంతో, శక్తిగల మీ హస్తంతో మీరు విమోచించిన ప్రజలు.
NEH 1:11 ప్రభువా, మీ సేవకుడనైన నా ప్రార్థనను మీ నామం పట్ల భయభక్తులు కలిగి ఉండడంలో ఆనందించే నీ సేవకుల ప్రార్థనను మీ చెవులతో శ్రద్ధగా వినండి. ఈ రోజు ఈ వ్యక్తికి నాపై దయ పుట్టించి మీ సేవకుడనైన నాకు విజయం ఇవ్వండి.” ఆ సమయంలో నేను రాజుకు గిన్నె అందించే వానిగా ఉన్నాను.
NEH 2:1 అర్తహషస్త రాజు పాలనలో ఇరవయ్యవ సంవత్సరం నీసాను నెలలో, రాజు కోసం ద్రాక్షరసం తీసుకువచ్చినప్పుడు నేను ద్రాక్షారసాన్ని తీసుకుని రాజుకు ఇచ్చాను. అంతకుముందు నేను వారి ముందు ఎప్పుడు బాధపడలేదు.
NEH 2:2 కాబట్టి రాజు, “నీవు అనారోగ్యంగా లేవు కదా, మరి నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది? ఇది హృదయంలో ఉన్న విచారమే తప్ప మరొకటి కాదు” అని అన్నారు. అప్పుడు నేను చాలా భయపడ్డాను, కాని
NEH 2:3 నేను రాజుతో, “రాజు చిరకాలం జీవించును గాక! నా పూర్వికులను పాతిపెట్టిన పట్టణం శిథిలావస్థలో ఉండి, దాని ద్వారాలు అగ్నికి ఆహుతి అయినప్పుడు నా ముఖం ఎందుకు విచారంగా కనిపించకూడదు?” అన్నాను.
NEH 2:4 అప్పుడు రాజు, “నీకు ఏమి కావాలి?” అని అడిగాడు. నేను పరలోకపు దేవునికి ప్రార్థనచేసి,
NEH 2:5 రాజుతో, “రాజా, మీకు ఇష్టమైతే మీ సేవకుడనైన నాపై దయ చూపించండి. మా పూర్వికుల సమాధులున్న పట్టణాన్ని తిరిగి కట్టడానికి నన్ను యూదా దేశానికి పంపండి” అని అడిగాను.
NEH 2:6 అప్పుడు రాణి తన ప్రక్కన కూర్చుని ఉండగా రాజు, “నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు?” అని అడిగాడు. నేను ఎన్ని రోజులో చెప్పినప్పుడు రాజు నన్ను పంపడానికి ఇష్టపడ్డాడు.
NEH 2:7 అప్పుడు నేను రాజును, “రాజుకు ఇష్టమైతే నేను యూదా దేశం చేరుకునేవరకు నేను క్షేమంగా ప్రయాణించడానికి యూఫ్రటీసు నది అవతలి అధిపతులకు ఉత్తరాలు ఇవ్వండి.
NEH 2:8 పట్టణ గోడకు, ఆలయానికి సంబంధించిన కోట గుమ్మాలకు, నేను ఉండబోయే ఇంటికి దూలాలు, మ్రానులు ఇచ్చేలా రాజు అడవులపై అధికారియైన ఆసాపుకు ఉత్తరం ఇవ్వండి” అని అడిగాను. నా దేవుని కృప హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి రాజు నా అభ్యర్థన విన్నాడు.
NEH 2:9 కాబట్టే నేను బయలుదేరి వెళ్లి యూఫ్రటీసు నది అవతలి అధిపతులకు రాజు ఉత్తరాలు ఇచ్చాను. రాజు నాతో పాటు సేనాధిపతులను గుర్రపు సేనను పంపించాడు.
NEH 2:10 హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ అధికారియైన టోబీయా అనేవాడు ఇది విని ఇశ్రాయేలు ప్రజలకు ప్రయోజనం కలిగించడానికి ఎవరో వచ్చారని తెలిసి వారు చాలా కలవరపడ్డారు.
NEH 2:11 నేను యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడే ఉండి,
NEH 2:12 రాత్రివేళ నేను నాతో ఉన్న కొంతమంది పురుషులతో కలిసి బయలుదేరాను. యెరూషలేము గురించి దేవుడు నా హృదయంలో ఉంచిన ఆలోచన ఎవరికి చెప్పలేదు. నేను ఎక్కిన జంతువు తప్ప నా దగ్గర మరో జంతువు లేదు.
NEH 2:13 రాత్రివేళలో నేను లోయ ద్వారం గుండా ఘటసర్పం బావి వైపు పెంట ద్వారం దగ్గరకు వెళ్లి కూల్చబడిన యెరూషలేము గోడలు, అగ్నితో కాల్చబడిన దాని గుమ్మాలను పరిశీలించాను.
NEH 2:14 అక్కడినుండి నీటి ఊట గుమ్మానికి రాజు కొలను దగ్గరకు వెళ్లాను కాని నేను ఎక్కిన జంతువు వెళ్లడానికి ఆ దారి చాలా ఇరుకుగా ఉంది.
NEH 2:15 రాత్రివేళలో నేను లోయ గుండా వెళ్లి గోడను పరిశీలించి తిరిగి లోయ గుమ్మం గుండా వెనుకకు వచ్చాను.
NEH 2:16 నేను ఎక్కడ వెళ్లానో ఏమి చేస్తున్నానో అధికారులకు తెలియదు. యూదులకు గాని యాజకులకు గాని సంస్థానాధిపతులకు గాని ఇతర అధికారులకు గాని నేను ఆ విషయం చెప్పలేదు.
NEH 2:17 నేను వారితో, “మనకున్న సమస్యను మీరు చూశారు. యెరూషలేము పాడైపోయింది దాని గుమ్మాలు కాలిపోయాయి. రండి, ఇకపై ఈ నింద మనమీద ఉండకుండా యెరూషలేమును తిరిగి కడదాం” అన్నాను.
NEH 2:18 అంతే కాకుండా దేవుని కృపాహస్తమే నాకు తోడుగా ఉండడం గురించి రాజు నాతో చెప్పినవన్నీ వారితో చెప్పాను. అందుకు వారు, “మనం పునర్నిర్మాణం మొదలుపెడదాం” అని చెప్పి ఈ మంచి పనిని ప్రారంభించారు.
NEH 2:19 హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ అధికారియైన సేవకుడు టోబీయా, అరబీయుడైన గెషెము ఈ సంగతి విని మమ్మల్ని వేళాకోళం చేశారు. “మీరేం చేస్తున్నారు? రాజు మీద తిరుగుబాటు చేస్తారా?” అని మమ్మల్ని అడిగారు.
NEH 2:20 అందుకు నేను, “పరలోకపు దేవుడే మాకు విజయాన్ని ఇస్తారు కాబట్టి ఆయన సేవకులమైన మేము పునర్నిర్మాణం మొదలుపెడతాము. మీకు యెరూషలేములో భాగం గాని, చారిత్రాత్మకమైన హక్కు గాని లేదు” అని వారితో చెప్పాను.
NEH 3:1 ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు అతని సోదరులైన యాజకులును వెళ్లి గొర్రెల గుమ్మాన్ని కట్టి ప్రతిష్ఠించి దాని తలుపులు నిలబెట్టారు. వందవ గోపురం వరకు, హనానేలు గోపురం వరకు వారు నిర్మించి ప్రతిష్ఠించారు.
NEH 3:2 ఆ ప్రక్కనే యెరికో పట్టణస్థులు కట్టారు. వారి ప్రక్కన ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టాడు.
NEH 3:3 చేప గుమ్మాన్ని హస్సెనాయా కుమారులు తిరిగి కట్టారు. వారు దానికి దూలాలు పెట్టి, తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు అమర్చారు.
NEH 3:4 వారి ప్రక్క భాగంలో హక్కోజుకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు మరమ్మత్తు చేశాడు. అతని తర్వాత మెషేజబేలుకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లాము, ఆ ప్రక్కన బయనా కుమారుడైన సాదోకు వరుసగా బాగుచేశారు.
NEH 3:5 ఆ ప్రక్క భాగాన్ని తెకోవాకు చెందినవారు బాగుచేశారు. అయితే తమ అధిపతుల క్రింద పనిని చేయడానికి వారి అధికారులు ఒప్పుకోలేదు.
NEH 3:6 యెషానా గుమ్మాన్ని పాసెయ కుమారుడైన యెహోయాదా బెసోద్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేశారు. వారు దానికి దూలాలు పెట్టి, తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు బిగించారు.
NEH 3:7 ఆ ప్రక్క నుండి గిబియోను, మిస్పా పట్టణస్థులైన గిబియోనీయుడైన మెలట్యా, మేరోనోతీయుడైన యాదోను బాగుచేశారు. యూఫ్రటీసు నది అవతలి అధిపతుల ఆధీనంలో ఉన్న స్థలాల వరకు వారు బాగుచేశారు.
NEH 3:8 ఆ ప్రక్క భాగాన్ని కంసాలివాడైన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేశాడు. అతని ప్రక్కనే పరిమళద్రవ్యాలు తయారుచేసేవారిలో ఒకడైన హనన్యా బాగుచేశాడు. వారు విశాల గోడ వరకు యెరూషలేమును తిరిగి కట్టారు.
NEH 3:9 వీరి ప్రక్క భాగాన్ని యెరూషలేములో సగభాగానికి అధిపతియైన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేశాడు.
NEH 3:10 వారిని ఆనుకుని తన ఇంటికి ఎదురుగా ఉన్న భాగాన్ని హరూమపు కుమారుడైన యెదాయా బాగుచేశాడు. అతని ప్రక్కనే హషబ్నెయా కుమారుడైన హట్టూషు బాగుచేశాడు.
NEH 3:11 రెండవ భాగాన్ని, బట్టీల గోపురాన్ని హారీము కుమారుడైన మల్కీయా, పహత్-మోయాబు కుమారుడైన హష్షూబు బాగుచేశారు.
NEH 3:12 వారి ప్రక్క భాగంలో యెరూషలేములో సగభాగానికి అధిపతియైన హల్లోహేషు కుమారుడైన షల్లూము అతని కుమార్తెల సహాయంతో బాగుచేశారు.
NEH 3:13 లోయ గుమ్మాన్ని హానూను, జానోహలో నివసిస్తున్నవారు బాగుచేశారు. వారు దానిని బాగుచేసి తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు బిగించారు. అంతే కాకుండా పెంట గుమ్మం వరకు వెయ్యి మూరల గోడ కట్టారు.
NEH 3:14 పెంట గుమ్మాన్ని బేత్-హక్కెరెము ప్రదేశానికి అధిపతియైన రేకాబు కుమారుడైన మల్కీయా బాగుచేశాడు. అతడు దానికి మరమ్మత్తులు చేసి తలుపులు నిలబెట్టి తాళాలు గడియలు బిగించాడు.
NEH 3:15 నీటి ఊట గుమ్మాన్ని మిస్పా ప్రదేశానికి అధిపతియైన కొల్-హోజె కుమారుడైన షల్లూము బాగుచేశాడు. అతడు దానిని బాగుచేసి పైకప్పు వేసి తలుపులు నిలబెట్టి తాళాలు గడియలు అమర్చాడు. అంతే కాకుండా దావీదు పట్టణం నుండి క్రిందకు వెళ్లే మెట్ల వరకు రాజుగారి తోట దగ్గర సిలోయము కొలను గోడను అతడే నిర్మించాడు.
NEH 3:16 అతని ప్రక్క భాగం నుండి దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న ప్రాంతం వరకు కట్టి ఉన్న కోనేరు వరకు, యుద్ధవీరుల ఇళ్ళ వరకు బేత్-సూరులో సగభాగానికి అధిపతియైన అజ్బూకు కుమారుడైన నెహెమ్యా బాగుచేశాడు.
NEH 3:17 అతని ప్రక్కనే లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేశాడు. అతని తర్వాతి భాగాన్ని కెయీలాలో సగభాగానికి అధిపతియైన హషబ్యా బాగుచేశాడు.
NEH 3:18 అతని ప్రక్క భాగాన్ని వారి బంధువులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేశాడు. అతడు కెయీలాలో సగభాగానికి అధిపతిగా ఉన్నాడు.
NEH 3:19 అతని తర్వాతి భాగాన్ని ఆయుధశాల మార్గానికి ఎదురుగా ఉన్న గోడ మలుపు ప్రక్కన మరొక భాగాన్ని మిస్పాకు అధిపతి యెషూవ కుమారుడైన ఏజెరు బాగుచేశాడు.
NEH 3:20 అతని ప్రక్కనే ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి గుమ్మం వరకు జక్కయి కుమారుడైన జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తిగా పని చేశాడు
NEH 3:21 ఆ ప్రక్కనే మరొక భాగాన్ని ఎల్యాషీబు ఇంటి గుమ్మం నుండి ఆ ఇంటి చివరి వరకు హక్కోజుకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేశాడు.
NEH 3:22 అతని ప్రక్కనే చుట్టుప్రక్కల ఉన్న యాజకులు బాగుచేశారు.
NEH 3:23 వారి ప్రక్కనే బెన్యామీను హష్షూబు అనేవారు తమ ఇంటి ఎదుట ఉన్న భాగాన్ని మరమ్మత్తు చేశారు. వారి ప్రక్కనే అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా తన ఇంటి ప్రక్కన ఉన్న భాగాన్ని బాగుచేశాడు.
NEH 3:24 అతని ప్రక్కనే అజర్యా ఇంటి నుండి గోడ మలుపు మూల వరకు ఉన్న భాగాన్ని హేనాదాదు కుమారుడైన బిన్నూయి బాగుచేశాడు.
NEH 3:25 ఆ ప్రక్క భాగాన్ని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజభవనం ఉండే మహా గోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేశాడు. దాని ప్రక్కన పరోషు కుమారుడైన పెదాయా బాగుచేశాడు.
NEH 3:26 ఓఫెలులో నివసిస్తున్న ఆలయ సేవకులు తూర్పున ఉన్న నీటిగుమ్మం ప్రక్కన, గోపురం దగ్గర బాగుచేశారు.
NEH 3:27 వారి తర్వాతి భాగాన్ని, గొప్ప గోపురానికి ఎదురుగా ఉన్న భాగం నుండి ఓఫెలు గోడ వరకు తెకోవాకు చెందినవారు బాగుచేశారు.
NEH 3:28 గుర్రపు గుమ్మానికి పైన తమ ఇళ్ళకు ఎదురుగా ఉన్న భాగాలను యాజకులందరు బాగుచేశారు.
NEH 3:29 వారి తర్వాత తన ఇంటికి ఎదురుగా ఉన్న భాగాన్ని ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేశాడు. ఆ ప్రక్క భాగాన్ని తూర్పు గుమ్మాన్ని కాపలా కాసే షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేశాడు.
NEH 3:30 ఆ తర్వాత షెలెమ్యా కుమారుడైన హనన్యా, జాలాపు ఆరవ కుమారుడైన హానూను మరొక భాగాన్ని బాగుచేశారు. వారి తర్వాత తన గదికి ఎదురుగా ఉన్న భాగాన్ని బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేశాడు.
NEH 3:31 అతని ప్రక్కనే ఆలయ సేవకుల ఇంటి నుండి, పరిశీలన గుమ్మానికి ఎదురుగా ఉన్న వ్యాపార కూడలి మూల వరకు కంసాలివాడైన మల్కీయా బాగుచేశాడు.
NEH 3:32 మూలన ఉన్న పై గది నుండి గొర్రెల గుమ్మం మధ్య వరకు కంసాలివారు, వ్యాపారులు బాగుచేశారు.
NEH 4:1 మేము గోడ తిరిగి కడుతున్నామని విన్న సన్బల్లటు తీవ్రమైన కోపంతో ఊగిపోతూ యూదులను అవహేళన చేస్తూ,
NEH 4:2 తన స్నేహితుల ఎదుట సమరయ సైనికుల ఎదుట మాట్లాడుతూ, “ఈ బలహీనమైన యూదులు ఏం చేయగలరు? తమంతట తామే ఈ పని చేయగలరా? వారే బలి అర్పిస్తారా? ఒక రోజులోనే పనంతా చేసేస్తారా? కాలిపోయి చెత్తకుప్పగా పడి ఉన్న రాళ్లతో మళ్ళీ కడతారా?” అన్నాడు.
NEH 4:3 అతని ప్రక్కన నిలబడి ఉన్న అమ్మోనీయుడైన టోబీయా, “వారు కట్టిన గోడ మీదికి నక్క ఎక్కితే అది కూలిపోతుంది” అన్నాడు.
NEH 4:4 మా దేవా! ప్రార్థన వినండి, మేము తిరస్కరించబడిన వారము. వారి నిందలు వారి తలల మీదికే త్రిప్పండి. వారే పరాయి దేశానికి బందీలుగా పోవాలి!
NEH 4:5 వారు కడుతున్నవారిని అడ్డుకుని నీకు కోపం పుట్టించారు కాబట్టి వారి దోషాలను కప్పివేయకండి వారి పాపాలను తుడిచివేయకండి.
NEH 4:6 ప్రజలు హృదయపూర్వకంగా పనిచేశారు కాబట్టి సగం ఎత్తు వరకు గోడలు కట్టగలిగాము.
NEH 4:7 సన్బల్లటు, టోబీయా, అరబీయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు యెరూషలేము గోడలు బాగుచేసే పని కొనసాగుతుందని, బీటలన్నిటిని మూసివేస్తున్నారని విన్నప్పుడు వారు చాలా కోప్పడ్డారు.
NEH 4:8 యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి పనిని అడ్డుకోవాలని వారంతా కలిసి కుట్రపన్నారు.
NEH 4:9 అయితే మేము మా దేవునికి ప్రార్థించి వారి నుండి కాపాడుకోడానికి రాత్రింబగళ్ళు కాపలా ఉంచాము.
NEH 4:10 అప్పుడు యూదా వారు, “పనివారి బలం తగ్గిపోతుంది. చెత్త చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక మేము గోడ కట్టలేం” అన్నారు.
NEH 4:11 మా శత్రువులు, “వారికి తెలిసేలోపు మనలను చూడకముందే, మనం వారి మధ్యకు వెళ్లి వారిని చంపి పని ఆపివేద్దాం” అని ఆలోచన చేశారు.
NEH 4:12 మా శత్రువులకు దగ్గరలో నివసించే యూదులు వచ్చి, “మీరు ఎటు తిరిగినా వారు మాపై దాడి చేస్తారు” అని పది కన్న ఎక్కువసార్లు చెప్పారు.
NEH 4:13 అందువల్ల గోడ వెనుక దిగువ ప్రాంతాల్లో పైనున్న స్థలాల్లో కుటుంబాల ప్రకారం వారికి కత్తులు ఈటెలు విల్లులు ఇచ్చి కాపలా కాయడానికి నియమించాను.
NEH 4:14 అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత నేను లేచి సంస్థానాధిపతులతో, అధికారులతో మిగిలిన ప్రజలందరితో, “మీరు భయపడకండి. గొప్పవాడు, అద్భుతమైన వాడైన ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాల కోసం మీ కుమారులు కుమార్తెల కోసం, మీ భార్యల కోసం మీ ఇళ్ళ కోసం పోరాడండి” అని చెప్పాను.
NEH 4:15 తమ కుట్ర గురించి మాకు తెలిసిందని దేవుడు వారి కుట్ర భంగం చేశారని మా శత్రువులు వినగానే, మాలో ప్రతి ఒక్కరు తమ పని చేయడానికి గోడ దగ్గరకు వచ్చారు.
NEH 4:16 ఆ రోజు నుండి నా పనివారిలో సగం మంది పని చేస్తుండగా మిగతా సగం మంది ఈటెలు డాళ్లు విండ్లు కవచాలు ధరించి వచ్చారు. గోడ కట్టే యూదా కుటుంబాలన్నిటి వెనుక అధికారులు నిలబడి ఉన్నారు.
NEH 4:17 బరువులు మోసేవారు ఒక చేతితో తమ పని చేస్తూ మరో చేతితో ఆయుధం పట్టుకున్నారు.
NEH 4:18 కట్టే ప్రతి ఒక్కరు కడుతున్నప్పుడు తన కత్తి నడుముకు బిగించుకుని ఉన్నారు. బూర ఊదేవాడు నా దగ్గరే నిలబడ్డాడు.
NEH 4:19 అప్పుడు నేను సంస్థానాధిపతులతో, అధికారులతో, మిగిలిన వారితో, “మనం చేస్తున్న పని చాలా విస్తారమైనది. గోడ మీద పని చేస్తూ మనం ఒకరికి ఒకరం చాలా దూరంగా ఉన్నాము.
NEH 4:20 కాబట్టి మీకు ఎక్కడ నుండి బూరధ్వని వినబడుతుందో అక్కడికి మీరందరు వచ్చి మాతో కలవాలి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తారు” అన్నాను.
NEH 4:21 ఆ విధంగా మేము పని చేశాము; మాలో సగం మంది ఉదయం నుండి రాత్రి నక్షత్రాలు కనిపించే వరకు ఈటెలు పట్టుకుని నిలబడ్డారు.
NEH 4:22 ఆ సమయంలో నేను ప్రజలతో, “ప్రతి వ్యక్తి తన పనివారితో కలసి రాత్రివేళ యెరూషలేములోనే ఉండాలి. అప్పుడు వారు రాత్రి మాకు కాపలాగా ఉంటారు, పగలు పని చేస్తారు” అని చెప్పాను.
NEH 4:23 ఈ విధంగా నేను గాని నా బంధువులు గాని నా సేవకులు గాని, నా వెంట ఉన్న కావలివారు గాని బట్టలు విప్పలేదు. నీరు త్రాగడానికి వెళ్లినప్పుడు కూడా ఎవరూ ఆయుధాన్ని వదిలిపెట్టలేదు.
NEH 5:1 తర్వాత ప్రజలు వారి భార్యలు తమ తోటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణ చేశారు.
NEH 5:2 కొందరు, “మేమూ, మా కుమారులు కుమార్తెలు కలిపి చాలామంది ఉన్నాము కాబట్టి మేము తిని బ్రతకడానికి మాకు ధాన్యం ఇవ్వండి” అన్నారు.
NEH 5:3 మరికొందరు, “కరువు సమయంలో ధాన్యం పొందడానికి మేము మా పొలాలను ద్రాక్షతోటలను మా ఇళ్ళను తాకట్టు పెడుతున్నాం” అన్నారు.
NEH 5:4 ఇంకా కొందరు, “రాజుకు పన్ను చెల్లించడానికి మా పొలాలు ద్రాక్షతోటల మీద డబ్బు అప్పుగా తీసుకున్నాము.
NEH 5:5 మా శరీరం రక్తం మా తోటి యూదుల శరీరం రక్తం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లల్లాంటివారు కారా? అయినా మా కుమారులను మా కుమార్తెలను బానిసలుగా ఉంచాల్సి వచ్చింది. ఇప్పటికే మా కుమార్తెలలో కొందరు బానిసలుగా ఉన్నారు కాని మా పొలాలు ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వారిని విడిపించడానికి మాకు శక్తి లేదు” అన్నారు.
NEH 5:6 వారి నిరసనలు ఫిర్యాదులు విని నేనెంతో కోప్పడ్డాను.
NEH 5:7 అయితే నేను వీటి గురించి జాగ్రత్తగా ఆలోచించి సంస్థానాధిపతులను, అధికారులను పిలిచి, “మీరు సోదరుల నుండి వడ్డీ తీసుకుంటున్నారు” అని చెప్పి వారిని గద్దించి, వారి గురించి వెంటనే పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి,
NEH 5:8 “యూదేతరులకు అమ్మివేయబడిన మన తోటి యూదులను మా శక్తికొలది మేము విడిపించాము. మీరు మీ సొంత ప్రజలను అమ్ముతున్నారు; వారు మరలా మనకు అమ్మబడవచ్చా?” అని అడిగినప్పుడు వారేమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు.
NEH 5:9 నేను ఇంకా మాట్లాడుతూ, “మీరు చేస్తున్న పని సరియైనది కాదు. యూదేతరులైన శత్రువుల నిందలు తప్పించుకోడానికి మన దేవునికి భయపడకుండా నడుచుకుంటారా?
NEH 5:10 నేను, నా సోదరులు నా పనివారు కూడా ప్రజలకు డబ్బు ధాన్యం అప్పుగా ఇచ్చాము. కాని ఆ అప్పులన్నీ రద్దు చేస్తున్నాము.
NEH 5:11 ఈ రోజే మీరు వారి దగ్గర నుండి తీసుకున్న పొలాలు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు, ఇల్లు వారికి తిరిగి ఇచ్చేయండి. అలాగే వారి నుండి వసూలు చేసిన వడ్డీ డబ్బులు ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో నూనెలో ఒక శాతం వారికి అప్పగించండి” చెప్పాను.
NEH 5:12 అందుకు వారు, “మేము అన్ని తిరిగి ఇచ్చేస్తాము. వారి నుండి ఇక ఏమి ఆశించము. నీవు చెప్పినట్లే చేస్తాం” అన్నారు. అప్పుడు నేను యాజకులను పిలిపించి వారు చేసిన వాగ్దానం ప్రకారం చేస్తామని చెప్పి సంస్థానాధిపతులతో, అధికారులతో ప్రమాణం చేయించాను.
NEH 5:13 నేను కూడా నా బట్టలు దులిపి వారితో, “ఈ విధంగా దేవుడు తమ వాగ్దానాన్ని నెరవేర్చి వారందరిని వారి ఇళ్ళ నుండి ఆస్తినుండి దులిపి వేస్తారు. అప్పుడు వాడు ఏమి లేనివానిగా అవుతాడు” అని చెప్పాను. అప్పుడు అక్కడ సమావేశమైన వారంతా ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించారు. ప్రజలంతా తమ వాగ్దానం ప్రకారం చేశారు.
NEH 5:14 నేను యూదా దేశంలో వారికి అధిపతిగా నియమించబడినప్పటి నుండి అనగా అర్తహషస్త రాజు పాలనలో ఇరవయ్యవ సంవత్సరం నుండి ముప్పై రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరాలు నేను గాని నా సోదరులు గాని అధిపతికి ఇచ్చే ఆహారాన్ని తీసుకోలేదు.
NEH 5:15 నాకన్నా ముందు అధిపతులుగా ఉన్నవారు ప్రజలపై భారాన్ని మోపి వారి నుండి నలభై షెకెళ్ళ వెండిని, ఆహారాన్ని ద్రాక్షరసాన్ని తీసుకునేవారు. వారి సహాయకులు కూడా ప్రజల మీద భారం మోపారు. అయితే దేవుని భయం ఉన్న నేను అలా చేయలేదు.
NEH 5:16 నేను శ్రద్ధగా గోడ పని చేశాను. నా పనివారు అంతా కలిసి అదే పని చేశారు. మేము భూమి సంపాదించుకోలేదు.
NEH 5:17 అంతేకాక, నా భోజనపు బల్ల దగ్గర చుట్టుప్రక్కల దేశాలవారు కాకుండా నూటయాభైమంది యూదులు భోజనం చేసేవారు.
NEH 5:18 ప్రతిరోజు ఒక ఎద్దు, ఆరు ఎంపిక చేసిన గొర్రెలు, కొన్ని కోళ్లు నా కోసం సిద్ధం చేసేవారు, పదిరోజులకు ఒకసారి అనేక రకాల ద్రాక్షరసాలను సమృద్ధిగా అందించేవారు. ఈ ప్రకారం చేసినా ప్రజల పని చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి కాకుండా అధిపతికి ఇచ్చే ఆహారాన్ని నేను ఆశించలేదు.
NEH 5:19 నా దేవా, ఈ ప్రజల కోసం నేను చేసినదంతా నన్ను దయతో గుర్తుంచుకోండి.
NEH 6:1 అప్పటికి నేను గుమ్మాలకు తలుపులు నిలబెట్టక పోయినప్పటికి, ఏ బీటలు లేకుండా గోడను పునర్నిర్మించానని సన్బల్లటు, టోబీయా, అరబీయుడైన గెషెము, మరికొందరు మా మిగతా శత్రువులు విన్నారు.
NEH 6:2 సన్బల్లటు గెషెము, “రండి, మనం ఓనో సమతల మైదానంలో ఉన్న ఒక గ్రామంలో కలుసుకుందాం” అని నాకు సందేశం పంపారు. అయితే వారు నాకు హాని చేయాలని కుట్రపన్నారు;
NEH 6:3 కాబట్టి నేను వారికి, “నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, దానిని విడిచిపెట్టి మీ దగ్గరకు ఎందుకు రావాలి? లేను రాలేను” అని చెప్పి దూతతో కబురు పంపాను.
NEH 6:4 వారదే పనిగా నాలుగు సార్లు కబురు పంపారు. నేను ప్రతిసారి అదే జవాబు ఇచ్చాను.
NEH 6:5 అప్పుడు అయిదవసారి సన్బల్లటు తన పనివాని చేతికి తెరిచి ఉన్న ఒక ఉత్తరం ఇచ్చి పంపించాడు.
NEH 6:6 దానిలో ఈ విధంగా వ్రాసి ఉంది: “నీవు యూదులతో కలిసి రాజు మీద తిరుగుబాటు చేయాలనే ఆలోచనతో గోడ కడుతున్నావని ప్రజల మధ్యలో వదంతి ఉంది. దానిని గెషెము నిరూపించాడు. అంతే కాకుండా దాని ప్రకారం నీవు వారికి రాజు కావాలని చూస్తున్నావు.
NEH 6:7 యూదాలో రాజు ఉన్నాడని యెరూషలేములో నీ గురించి ప్రకటించడానికి నీవు ప్రవక్తలను కూడా నియమించావు. ఈ విషయాలు రాజుకు తెలుస్తాయి కాబట్టి నీవు వస్తే ఈ విషయం గురించి మనం కలిసి మాట్లాడుకోవచ్చు.”
NEH 6:8 అప్పుడు నేను ఈ విధంగా జవాబు పంపించాను: “నీవు చెప్పినట్లుగా ఇక్కడ ఏమి జరుగలేదు; అవన్నీ మీరు ఊహించి కల్పించినవే” అని వారికి జవాబు పంపాను.
NEH 6:9 “వారి చేతులు పని చేసి బలహీనమైపోయి ఇక వారు ఆ పని చేయలేరు” అని భావించి వారు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు. అయితే నేను, “ఇప్పుడు నా చేతులను బలపరచు” అని ప్రార్థించాను.
NEH 6:10 ఒక రోజు నేను మెహేతబేలుకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయా ఇంటికి వెళ్లాను. అతడు ఇంట్లోనే ఉన్నాడు. అతడు, “రాత్రివేళ నిన్ను చంపడానికి వారు వస్తున్నారు కాబట్టి మనం దేవుని మందిరం దగ్గర కలుసుకొని గర్భాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకుందాం” అని చెప్పాడు.
NEH 6:11 కాని నేను, “నాలాంటివాడు పారిపోవాలా? లేదా నా లాంటివాడు ప్రాణాలు కాపాడుకోడానికి గర్భాలయంలోకి వెళ్లి దాక్కోవాలా? నేను వెళ్లను” అన్నాను.
NEH 6:12 దేవుడు అతన్ని పంపించలేదని నేను గ్రహించాను. నాకు వ్యతిరేకంగా ప్రవచించడానికి టోబీయా సన్బల్లటు అతనికి లంచం ఇచ్చారు.
NEH 6:13 నేను భయపడి అతడు చెప్పినట్లు చేసి పాపం చేస్తే వారు నన్ను నిందించి నాకు చెడ్డ పేరు తీసుకురావాలని లంచమిచ్చి అతన్ని నియమించుకున్నారు.
NEH 6:14 నా దేవా, టోబీయా సన్బల్లటు చేసిన దానిని బట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి; నన్ను బెదిరించడానికి ప్రయత్నించిన ఈ ప్రవక్తలను, నోవద్యా అనే ప్రవక్తిని కూడా జ్ఞాపకం చేసుకోండి.
NEH 6:15 ఈ విధంగా ఏలూలు నెల ఇరవై అయిదవ తేదీన అనగా యాభై రెండు రోజులకు గోడ కట్టడం పూర్తయ్యింది.
NEH 6:16 ఈ సంగతి విన్న మా శత్రువులు చుట్టుప్రక్కల దేశాలు మా దేవుని సహాయంతో పని పూర్తయ్యిందని గ్రహించి చాలా భయపడి ధైర్యం కోల్పోయారు.
NEH 6:17 ఆ రోజుల్లో యూదా సంస్థానాధిపతులు టోబీయాకు పదే పదే ఉత్తరాలు పంపుతూ ఉండేవారు. టోబీయా కూడా వారికి జవాబులు పంపేవాడు.
NEH 6:18 అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. అంతే కాకుండా అతని కుమారుడైన యెహోహనాను బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. కాబట్టి యూదా వారిలో చాలామంది అతనికి విధేయులుగా ఉంటామని ప్రమాణం చేశారు.
NEH 6:19 అంతేకాక వారు నా దగ్గరకు వచ్చి అతని గురించి పొగుడుతూ నేను చెప్పేవాటన్నిటిని అతనికి చేరవేసేవారు. నన్ను బెదిరించడానికే టోబీయా ఉత్తరాలు పంపేవాడు.
NEH 7:1 నేను గోడ కట్టిన తర్వాత తలుపులు నిలబెట్టి, ద్వారపాలకులను సంగీతకారులను, లేవీయులను నియమించాను.
NEH 7:2 నా సోదరుడైన హనానీతో పాటు కోటకు అధిపతియైన హనన్యాను యెరూషలేముపై అధికారులుగా నియమించాను. హనన్యా నమ్మకమైనవాడు, అందరికంటే ఎక్కువగా దేవుని భయం ఉన్నవాడు.
NEH 7:3 నేను వారితో, “బాగా ప్రొద్దెక్కే వరకు యెరూషలేము గుమ్మాల తలుపులు తీయకూడదు. ప్రజలు దగ్గర నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి అడ్డగడియలు పెట్టాలి. అలాగే యెరూషలేములో నివసించేవారు వారంతా తమ తమ ఇళ్ళకు ఎదురుగా కాపలా కాసేలా నియమించాలి” అని చెప్పాను.
NEH 7:4 అప్పుడు ఆ పట్టణమెంతో విశాలంగా పెద్దగా ఉండేది కాని అక్కడ కొంతమందే ఉండేవారు. ఇంకా ఎవరూ ఇల్లు కట్టుకోలేదు.
NEH 7:5 కుటుంబాల ప్రకారం నమోదు చేయాలనే ఆలోచన దేవుడు నాకు పుట్టించగా నేను సంస్థానాధిపతులను అధికారులను ప్రజలను సమకూర్చాను. అంతలో ముందు వచ్చినవారి కుటుంబ వివరాలు ఉన్న ఒక గ్రంథం నాకు దొరికింది. దానిలో ఉన్న వివరాలు:
NEH 7:6 బబులోను రాజైన నెబుకద్నెజరు రాజు చెరగా తీసుకెళ్లిన వారు, చెరలో నుండి యెరూషలేముకు, యూదా దేశానికి తమ తమ పట్టణాలకు తిరిగి వెళ్లడానికి,
NEH 7:7 జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా అనేవారితో పాటు వెళ్లినవారు వీరు:
NEH 7:8 పరోషు వారసులు 2,172;
NEH 7:9 షెఫట్యా వారసులు 372;
NEH 7:10 ఆరహు వారసులు 652;
NEH 7:11 పహత్-మోయాబు వారసులు (యెషూవ యోవాబు వారసులతో కలిపి) 2,818;
NEH 7:12 ఏలాము వారసులు 1,254;
NEH 7:13 జత్తూ వారసులు 845;
NEH 7:14 జక్కయి వారసులు 760;
NEH 7:15 బిన్నూయి వారసులు 648;
NEH 7:16 బేబై వారసులు 628;
NEH 7:17 అజ్గాదు వారసులు 2,322;
NEH 7:18 అదోనీకాము వారసులు 667;
NEH 7:19 బిగ్వయి వారసులు 2,067;
NEH 7:20 ఆదీను వారసులు 655;
NEH 7:21 అటేరు వారసులు (హిజ్కియా ద్వారా) 98;
NEH 7:22 హాషుము వారసులు 328;
NEH 7:23 బేజయి వారసులు 324;
NEH 7:24 హారీపు వారసులు 112;
NEH 7:25 గిబియోను వారసులు 95.
NEH 7:26 బేత్లెహేము వారసులు: నెటోపా వారసులు 188;
NEH 7:27 అనాతోతు వారసులు 128;
NEH 7:28 బేత్-అజ్మావెతు వారసులు 42;
NEH 7:29 కిర్యత్-యారీము, కెఫీరా బెయేరోతు వారసులు 743;
NEH 7:30 రామా, గెబా వారసులు 621;
NEH 7:31 మిక్మషు వారసులు 122;
NEH 7:32 బేతేలు, హాయి వారసులు 123;
NEH 7:33 రెండవ నెబో వారసులు 52;
NEH 7:34 మరొక ఏలాము వారసులు 1,254;
NEH 7:35 హారీము వారసులు 320;
NEH 7:36 యెరికో వారసులు 345;
NEH 7:37 లోదు, హదీదు, ఓనో వారసులు 721;
NEH 7:38 సెనాయా వారసులు 3,930.
NEH 7:39 యాజకులు: యెషూవ కుటుంబీకుడైన యెదాయా వారసులు 973;
NEH 7:40 ఇమ్మేరు వారసులు 1,052;
NEH 7:41 పషూరు వారసులు 1,247;
NEH 7:42 హారీము వారసులు 1,017.
NEH 7:43 లేవీయులు: యెషూవ వారసులు (హోదవ్యా కుటుంబం, కద్మీయేలు కుటుంబం నుండి) 74.
NEH 7:44 సంగీతకారులు: ఆసాపు వారసులు 148.
NEH 7:45 ఆలయ ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనేవారి వారసులు 138.
NEH 7:46 ఆలయ సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయోతు వారసులు,
NEH 7:47 కేరోసు, సీయహా, పాదోను వారసులు,
NEH 7:48 లెబానా, హగాబా, షల్మయి వారసులు,
NEH 7:49 హానాను, గిద్దేలు, గహరు వారసులు,
NEH 7:50 రెవాయా, రెజీను, నెకోదా వారసులు,
NEH 7:51 గజ్జాము, ఉజ్జా, పాసెయ వారసులు,
NEH 7:52 బేసాయి, మెహూనీము, నెఫూసీము వారసులు,
NEH 7:53 బక్బూకు, హకూపా, హర్హూరు వారసులు,
NEH 7:54 బజ్లూతు, మెహీదా, హర్షా వారసులు,
NEH 7:55 బర్కోసు, సీసెరా, తెమహు వారసులు,
NEH 7:56 నెజీయహు, హటీపా వారసులు.
NEH 7:57 సొలొమోను సేవకుల వారసులు: సొటయి, సోఫెరెతు, పెరీదా వారసులు
NEH 7:58 యహలా, దర్కోను, గిద్దేలు వారసులు,
NEH 7:59 షెఫట్యా, హట్టీలు, పొకెరెత్-హజెబయీము, ఆమోను వారసులు.
NEH 7:60 ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు అందరు కలిసి మొత్తం 392.
NEH 7:61 తేల్ మెలహు, తేల్ హర్షా, కెరూబు, అద్దోను, ఇమ్మేరు అనే పట్టణాల నుండి కొందరు వచ్చారు, అయితే వీరు తమ కుటుంబాలు ఇశ్రాయేలు నుండి వచ్చినట్లు రుజువు చూపలేకపోయారు:
NEH 7:62 దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు మొత్తం 642.
NEH 7:63 యాజకుల వారసులు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి (ఇతడు గిలాదీయుడైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకుని ఆ పేరుతో పిలువబడ్డాడు) వారసులు.
NEH 7:64 వీరు తమ వంశావళి వివరాల కోసం వెదికారు కాని అవి వారికి దొరకలేదు. అందుకే వారిని అపవిత్రులుగా ఎంచి యాజకుల నుండి వేరుచేశారు.
NEH 7:65 కాబట్టి ఊరీము, తుమ్మీము ధరించే యాజకుని నియామకం జరిగే వరకు వారు అతిపరిశుద్ధమైన దేన్ని తినకూడదని అధిపతి వారిని ఆదేశించాడు.
NEH 7:66 సమూహం మొత్తం సంఖ్య 42,360,
NEH 7:67 వీరు కాకుండా వీరి దాసదాసీలు 7,337; గాయనీ గాయకులు 245 మంది.
NEH 7:68 వారి గుర్రాలు 736, కంచరగాడిదలు 245,
NEH 7:69 ఒంటెలు 435, గాడిదలు 6,720.
NEH 7:70 కుటుంబ పెద్దలలో కొందరు పనికి సహాయపడ్డారు. అధిపతి ఖజానాకు 1,000 డారిక్కుల బంగారం, 50 పళ్లాలు, 530 యాజక వస్త్రాలు ఇచ్చాడు.
NEH 7:71 కుటుంబ పెద్దలలో కొంతమంది పని కోసం ఖజానాకు 20,000 డారిక్కుల బంగారం, 2,200 మీనాల వెండి ఇచ్చారు.
NEH 7:72 మిగిలినవారంతా కలిసి 20,000 డారిక్కుల బంగారం 2,000 మీనాల వెండి, 67 యాజక వస్త్రాలు ఇచ్చారు.
NEH 7:73 యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు, కొంతమంది ప్రజలతో పాటు మిగిలిన ఇశ్రాయేలీయులు తమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఇశ్రాయేలీయులంతా ఏడవ నెల రాగానే తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు,
NEH 8:1 ప్రజలంతా ఏకమనస్సుతో నీటిగుమ్మం ఎదుట ఉన్న చావడికి వచ్చారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకురమ్మని వారు ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రాతో చెప్పారు.
NEH 8:2 యాజకుడైన ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున విని గ్రహించగలిగిన స్త్రీలు పురుషులందరు ఉన్న సమాజం ఎదుటకు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకువచ్చాడు.
NEH 8:3 అతడు నీటిగుమ్మం ఎదుట ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అక్కడ ఉన్న విని గ్రహించగలిగిన స్త్రీలు పురుషులందరికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని బిగ్గరగా చదివి వినిపించాడు. వారందరు ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా విన్నారు.
NEH 8:4 అప్పుడు ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా చెక్కతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడ్డాడు. అతని కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవారు ఉన్నారు; ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవారు ఉన్నారు.
NEH 8:5 ప్రజలందరికి కనిపించేలా వారందరి కన్నా ఎత్తులో ఎజ్రా నిలబడి గ్రంథాన్ని తెరిచాడు. అతడు గ్రంథాన్ని విప్పగానే ప్రజలంతా లేచి నిలబడ్డారు.
NEH 8:6 ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించగా ప్రజలందరు చేతులెత్తి, “ఆమేన్! ఆమేన్!” అని అంటూ తమ తలలు నేలకు వంచి యెహోవాను ఆరాధించారు.
NEH 8:7 ప్రజలందరు నిలబడి ఉండగా లేవీయులైన యెషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలిథా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా మొదలగు వారందరు కలిసి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించారు.
NEH 8:8 వారు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి ప్రజలు దానిని గ్రహించేలా దాని అర్థాన్ని వివరించారు.
NEH 8:9 ప్రజలందరు ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు వినగానే ఏడ్వడం మొదలుపెట్టారు. అప్పుడు అధిపతియైన నెహెమ్యా, యాజకుడూ ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా, ప్రజలు గ్రహించేలా బోధించి లేవీయులు వారందరితో, “ఈ రోజు మన దేవుడైన యెహోవాకు పరిశుద్ధ దినం కాబట్టి మీరు దుఃఖపడకండి ఏడవకండి” అని చెప్పారు.
NEH 8:10 నెహెమ్యా వారితో, “వెళ్లి, రుచికరమైన ఆహారాన్ని తిని మధురమైన వాటిని త్రాగి ఆనందించండి. తమ కోసం ఏమి సిద్ధం చేసుకోని వారికి కొంత భాగాన్ని పంపించండి. ఈ రోజు యెహోవాకు పరిశుద్ధ దినము. యెహోవాలో ఆనందించడమే మీ బలం కాబట్టి మీరు దుఃఖపడకండి” అన్నాడు.
NEH 8:11 లేవీయులు ప్రజలందరినీ ఓదార్చుతూ, “మీరు నిశ్శబ్దంగా ఉండండి. ఇది పరిశుద్ధమైన రోజు కాబట్టి దుఃఖపడకండి” అన్నారు.
NEH 8:12 ఆ తర్వాత ప్రజలందరు తమకు తెలియజేసిన మాటలన్నీ గ్రహించారు కాబట్టి తినడానికి త్రాగడానికి లేనివారికి పంపించడానికి, గొప్ప సంతోషాన్ని అనుభవించడానికి ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు.
NEH 8:13 నెలలో రెండవ రోజున కుటుంబ పెద్దలు యాజకులు లేవీయులతో కలిసి ధర్మశాస్త్ర బోధకుడైన ఎజ్రా దగ్గరకు ధర్మశాస్త్రంలోని మాటల నుండి జ్ఞానం పొందాలని వచ్చారు.
NEH 8:14 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రంలో ఏడవ నెల పండుగ సమయంలో ఇశ్రాయేలీయులు తాత్కాలిక నివాసాల్లో నివసించాలని వ్రాయబడి ఉండడం చూసి,
NEH 8:15 వెంటనే వారు తమ పట్టణాల్లో యెరూషలేములో ఈ విధంగా ప్రకటించారు: “మీరు పర్వత ప్రాంతానికి వెళ్లి ఒలీవ చెట్ల కొమ్మలు, అడవి ఒలీవ చెట్ల కొమ్మలు, గొంజి చెట్టు కొమ్మలు, ఈత చెట్టు కొమ్మలు, గుబురుగా ఉండే చెట్టు కొమ్మలు తీసుకువచ్చి వ్రాయబడిన విధంగా తాత్కాలిక నివాసాలు నిర్మించాలి.”
NEH 8:16 అలాగే ప్రజలందరు వెళ్లి కొమ్మలు తెచ్చి తమ ఇళ్ళ కప్పుల మీద, తమ వాకిటిలో, దేవుని ఆలయ ఆవరణంలో, నీటి గుమ్మపు వీధిలో, ఎఫ్రాయిం గుమ్మపు వీధిలో తాత్కాలిక నివాసాలు కట్టుకున్నారు.
NEH 8:17 చెర నుండి తిరిగి వచ్చినవారి సమూహం తాత్కాలిక నివాసాలు కట్టుకుని వాటిలో నివసించారు. నూను కుమారుడైన యెహోషువ కాలం నుండి ఆ రోజు వరకు ఇశ్రాయేలీయులు ఎప్పుడు అలా చేయలేదు. వారు గొప్ప సంతోషాన్ని అనుభవించారు.
NEH 8:18 మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ప్రతిరోజు ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ వచ్చాడు. వారు ఏడు రోజులు పండుగ చేసుకుని నియమించిన ప్రకారం ఎనిమిదవ రోజున పరిశుద్ధ సంఘంగా కూడుకున్నారు.
NEH 9:1 అదే నెల ఇరవై నాలుగవ రోజున ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకుని తలమీద బూడిద వేసుకుని వచ్చారు.
NEH 9:2 ఇశ్రాయేలీయులు విదేశీయులకు వేరుగా నిలబడి తమ పాపాలను తమ పూర్వికుల పాపాలను ఒప్పుకున్నారు.
NEH 9:3 వారు ఉన్న చోటే నిలబడి ఒక పూటంతా తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. మరో పూట తమ పాపాలు ఒప్పుకుంటూ తమ దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ గడిపారు.
NEH 9:4 లేవీయులలో యెషూవ, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ అనేవారు మెట్ల మీద నిలబడి తమ దేవుడైన యెహోవాకు బిగ్గరగా మొరపెట్టారు.
NEH 9:5 అప్పుడు లేవీయులైన యెషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయా, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహయా అనేవారు మెట్ల మీద నిలబడి, “లేచి నిలబడండి, మీకు నిత్యం దేవునిగా ఉన్న యెహోవాను స్తుతించండి” అని చెప్పి ఇలా స్తుతించారు: “మీ దివ్యమైన నామం స్తుతించబడుతుంది. సమస్త ఆశీర్వాదాలకు స్తుతులకు మించి హెచ్చింపబడుతుంది.
NEH 9:6 మీరు మాత్రమే యెహోవా. మీరే మహాకాశాలను, ఆకాశాలను, వాటి నక్షత్ర సమూహాలన్నిటిని, భూమిని, దానిలో ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించారు. వాటన్నిటికి జీవాన్ని ఇచ్చారు. పరలోక సమూహాలన్ని మిమ్మల్ని ఆరాధిస్తున్నాయి.
NEH 9:7 “యెహోవా దేవా, అబ్రామును ఏర్పరచుకుని, అతన్ని కల్దీయుల ఊరు అనే చోటు నుండి బయటకు తీసుకువచ్చి అతనికి అబ్రాహాము అని పేరు పెట్టింది మీరే.
NEH 9:8 అతని హృదయం మీ పట్ల నమ్మకంగా ఉందని గుర్తించి కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయుల దేశాన్ని అతని వారసులకు ఇస్తానని అతనితో నిబంధన చేశారు. మీరు నీతిమంతులు కాబట్టి మీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
NEH 9:9 “మా పూర్వికులు ఈజిప్టులో శ్రమపడడం మీరు చూశారు; ఎర్ర సముద్రం దగ్గర వారి మొర విన్నారు.
NEH 9:10 ఫరో, అతని సేవకులు, అతని దేశ ప్రజలందరు ఇశ్రాయేలీయుల పట్ల ఎంత అహంకారంతో ప్రవర్తించారో మీకు తెలుసు కాబట్టి మీరు వారి ఎదుట అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకక్రియలు చేశారు. ఈ రోజు వరకు మీ నామాన్ని ఘనపరిచేలా చేశారు.
NEH 9:11 మీ ప్రజల ఎదుట సముద్రాన్ని రెండుగా చీల్చగా వారు పొడినేల మీద నడిచివెళ్లారు. లోతైన నీళ్లలో రాయి వేసినట్లుగా మీ ప్రజలను వెంటాడుతూ వచ్చిన వారిని అగాధ జలాల్లో పడేశారు.
NEH 9:12 మీరు పగలు మేఘస్తంభంలా రాత్రి వారు వెళ్లే మార్గంలో వెలుగు ఇవ్వడానికి అగ్ని స్తంభంలా వారిని నడిపించారు.
NEH 9:13 “మీరు సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి పరలోకం నుండి వారితో మాట్లాడారు. వారికి న్యాయమైన సరియైన నియమాలు, చట్టాలు మేలైన శాసనాలు, ఆజ్ఞలు ఇచ్చారు.
NEH 9:14 పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని ఆచరించాలని మీరు వారికి తెలియజేశారు. మీ సేవకుడైన మోషే ద్వారా ఆజ్ఞలు, శాసనాలు, ధర్మశాస్త్రాన్ని నియమించారు.
NEH 9:15 మీరు వారి ఆకలి తీర్చడానికి పరలోకం నుండి ఆహారాన్ని ఇచ్చి దాహం తీర్చడానికి బండలో నుండి నీళ్లు రప్పించారు; మీరు వారికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి వెళ్లి స్వాధీనం చేసుకోమని చెప్పారు.
NEH 9:16 “అయితే మా పూర్వికులు అహంకారంతో ప్రవర్తించి మీ ఆజ్ఞలకు లోబడకుండా తిరుగుబాటు చేశారు.
NEH 9:17 మీకు అవిధేయులుగా ఉండి, మీరు వారి మధ్య చేసిన అద్భుతాలను మరచిపోయారు. ఈజిప్టులో తమ బానిసత్వానికి తిరిగి వెళ్లడానికి ఒక నాయకుని ఏర్పరచుకుని తిరుగుబాటు చేశారు. అయితే మీరు క్షమించే దేవుడవు దయా కనికరం ఉన్నవారు, త్వరగా కోప్పడరు, అపరిమితమైన ప్రేమ ఉన్నవారు కాబట్టి వారిని విడిచిపెట్టలేదు.
NEH 9:18 వారు పోతపోసిన దూడను తయారుచేసి, ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన దేవుడు ఇదే అని చెప్పినా తీవ్రమైన దేవదూషణ చేసినా మీరు వారిని విడిచిపెట్టలేదు.
NEH 9:19 “మీ గొప్ప కనికరాన్ని బట్టి ఎడారిలో మీరు వారిని విడిచిపెట్టలేదు. పగలు మేఘస్తంభం దారి చూపడం ఆపలేదు; రాత్రి అగ్నిస్తంభం వారి మార్గాలకు వెలుగివ్వడం మానలేదు.
NEH 9:20 వారికి బోధించడానికి మీరు మీ దయగల ఆత్మను ఇచ్చారు. మీరు వారికి ఇచ్చిన మన్నాను ఇవ్వడం మానలేదు. వారికి నీళ్లు ఇచ్చి వారి దాహం తీర్చారు.
NEH 9:21 మీరు నలభై సంవత్సరాల పాటు వారిని పోషించారు. ఎడారిలో కూడా వారికి ఏమీ తక్కువ కాలేదు. వారి బట్టలు చిరిగిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు.
NEH 9:22 “మీరు వారికి రాజ్యాలను దేశాలను ఇచ్చారు. మారుమూల సరిహద్దులను కూడా వారికి కేటాయించారు. వారు హెష్బోను రాజు సీహోను దేశాన్ని బాషాను రాజు ఓగు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
NEH 9:23 మీరు వారి పిల్లలను నక్షత్రాలంత విస్తారంగా చేసి, వారి పితరులకు మీరు వెళ్లి స్వాధీనం చేసుకుంటారని వాగ్దానం చేసిన దేశంలోకి వారిని తీసుకువచ్చారు.
NEH 9:24 వారి పిల్లలు ఆ దేశంలోనికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకున్నారు. మీరు ఆ దేశంలో నివసిస్తున్న కనానీయులను వారి ఎదుట అణచివేశారు. తమకు నచ్చిన విధంగా చేయడానికి కనానీయులను వారి రాజులతో ఆ దేశ ప్రజలతో కలిపి వారి చేతికి అప్పగించారు.
NEH 9:25 వారు కోటగోడలు ఉన్న పట్టణాలను సారవంతమైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. అన్ని రకాల మంచి వస్తువులతో నిండిన ఇల్లు, త్రవ్విన బావులు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు, విస్తారమైన పండ్లచెట్లు స్వాధీనపరచుకున్నారు. వారు తిని తృప్తి చెందారు. మీ గొప్ప మంచితనాన్ని చూసి ఆనందించారు.
NEH 9:26 “అయినా వారు మీ పట్ల అవిధేయత చూపించి మీపై తిరుగుబాటు చేశారు; మీ ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు. మీ వైపు తిరగాలని వారిని హెచ్చరించిన ప్రవక్తలను చంపారు; ఘోరమైన దేవదూషణ చేశారు.
NEH 9:27 కాబట్టి మీరు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించారు. వారు బాధించబడిన సమయంలో మీకు మొరపెట్టినప్పుడు పరలోకంలో నుండి మీరు వారి మొర విన్నారు. మీ గొప్ప కృపను బట్టి వారిని శత్రువు చేతిలో నుండి విడిపించడానికి వారికి విమోచకులను ఇచ్చారు.
NEH 9:28 “వారికి విశ్రాంతి లభించిన వెంటనే మీ ఎదుట చెడు చేశారు కాబట్టి శత్రువులు వారి మీద ప్రభుత్వం చేసేలా వారిని తిరిగి శత్రువు చేతికే అప్పగించారు. వారు తిరిగి మీకు మొరపెట్టినప్పుడు పరలోకంలో నుండి మీరు వారి మొర విన్నారు. కరుణ చూపించి అనేకసార్లు వారిని విడిపించారు.
NEH 9:29 “వారిని మీ ధర్మశాస్త్రం వైపు మరలించడానికి మీరు వారిని హెచ్చరించారు, అయితే వారు గర్వించి మీ ఆజ్ఞలకు లోబడక ‘వాటిని పాటించే మనుష్యులు వాటి ద్వారా జీవిస్తాడు’ అని మీరు చెప్పిన మీ శాసనాలకు వ్యతిరేకంగా వారు పాపం చేశారు.
NEH 9:30 మీరు వారిని ఎన్నో సంవత్సరాలు ఓర్పుతో సహించారు. మీ ఆత్మ చేత ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించారు. అయినా వారు మీ మాట వినలేదు, కాబట్టి మీరు వారిని వారి పొరుగు దేశాలకు అప్పగించారు.
NEH 9:31 అయితే మీ గొప్ప కనికరాన్ని బట్టి మీరు వారిని పూర్తిగా నాశనం చేయలేదు, విడిచిపెట్టలేదు. మీరు దయా కనికరంగల దేవుడవు.
NEH 9:32 “మా దేవా! గొప్ప దేవా! మహా బలవంతుడా! పరిస్థితులతో సంబంధం లేకుండా మీరు చేసిన మీ ప్రేమ నిబంధన నెరవేరుస్తున్నారు. అష్షూరు రాజుల కాలం నుండి ఈ రోజు వరకు మా మీదికి, మా రాజులు నాయకుల మీదికి, మా యాజకులు ప్రవక్తల మీదికి, మా పూర్వికుల మీదికి మీ ప్రజలందరి మీదికి వచ్చిన శ్రమలు మీ దృష్టికి చిన్న విషయంగా ఉండకూడదు.
NEH 9:33 మాకు జరిగినదాని అంతటిలో మీరు నీతిమంతులుగానే ఉన్నారు; మేము దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు మీరు నమ్మకంగా ప్రవర్తించారు.
NEH 9:34 మా రాజులు, మా నాయకులు, మా యాజకులు, మా పూర్వికులు మీ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు; మీరు పాటించమని హెచ్చరించిన మీ ఆజ్ఞలు శాసనాలను లక్ష్యపెట్టలేదు.
NEH 9:35 వారు తమ రాజ్య పరిపాలనలోను మీరు వారికిచ్చిన విశాలమైన సారవంతమైన దేశంలో మీరు వారిపట్ల చేసిన గొప్ప మేలులు అనుభవిస్తూ కూడా వారు మిమ్మల్ని సేవించలేదు, తమ దుష్టత్వాన్ని విడిచి మీ వైపు తిరగలేదు.
NEH 9:36 “ఇదిగో ఈ రోజు మేము బానిసలుగా ఉన్నాము, దాని ఫలాలను తిని దానిలో ఉన్న మంచి వాటన్నిటిని అనుభవించమని మా పూర్వికులకు మీరిచ్చిన దేశంలో మేము బానిసలుగా ఉన్నాము.
NEH 9:37 మా పాపాల కారణంగా దాని అపారమైన పంటంతా మీరు మామీద నియమించిన రాజులు అనుభవిస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు మా శరీరాల మీద మా పశువులమీద అధికారం చెలాయిస్తున్నారు. మేము చాలా శ్రమ అనుభవిస్తున్నాము.
NEH 9:38 “వీటన్నిటిని బట్టి మేము వ్రాతపూర్వకంగా ఒక్క ఖచ్చితమైన ఒప్పందాన్ని చేసుకున్నాము; మా నాయకులు మా లేవీయులు మా యాజకులు దానిపై తమ ముద్రలు వేసి ఆమోదించారు.”
NEH 10:1 ముద్ర వేసినవారు వీరే: అధిపతి: హకల్యా కుమారుడైన నెహెమ్యా. సిద్కియా,
NEH 10:2 శెరాయా, అజర్యా, యిర్మీయా,
NEH 10:3 పషూరు, అమర్యా, మల్కీయా,
NEH 10:4 హట్టూషు, షెబన్యా, మల్లూకు,
NEH 10:5 హారీము, మెరేమోతు, ఓబద్యా,
NEH 10:6 దానియేలు, గిన్నెతోను, బారూకు,
NEH 10:7 మెషుల్లాము, అబీయా, మీయామిను,
NEH 10:8 మయజ్యా, బిల్గయి, షెమయా. వీరంతా యాజకులు.
NEH 10:9 లేవీయులు: అజన్యా కుమారుడైన యెషూవ, హేనాదాదు కుమారులు బిన్నూయి, కద్మీయేలు,
NEH 10:10 వారి బంధువులు షెబన్యా, హోదీయా, కెలిథా, పెలాయా, హానాను,
NEH 10:11 మీకా, రెహోబు, హషబ్యా,
NEH 10:12 జక్కూరు, షేరేబ్యా, షెబన్యా,
NEH 10:13 హోదీయా, బానీ, బెనీను.
NEH 10:14 ప్రజల నాయకుల నుండి: పరోషు, పహత్-మోయాబు, ఏలాము, జత్తూ, బానీ,
NEH 10:15 బున్నీ, అజ్గాదు, బేబై,
NEH 10:16 అదోనియా, బిగ్వయి, ఆదీను,
NEH 10:17 అటేరు, హిజ్కియా, అజ్జూరు,
NEH 10:18 హోదీయా, హాషుము, బేజయి,
NEH 10:19 హారీపు, అనాతోతు, నేబై,
NEH 10:20 మగ్పీయాషు, మెషుల్లాము, హెజీరు,
NEH 10:21 మెషేజబేలు, సాదోకు, యద్దూవ,
NEH 10:22 పెలట్యా, హానాను, అనాయా,
NEH 10:23 హోషేయ, హనన్యా, హష్షూబు,
NEH 10:24 హల్లోహేషు, పిల్హా, షోబేకు,
NEH 10:25 రెహూము, హషబ్నా, మయశేయా,
NEH 10:26 అహీయా, హానాను, ఆనాను,
NEH 10:27 మల్లూకు, హారీము, బయనా.
NEH 10:28 మిగిలిన ప్రజలు అనగా, యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు దేవుని ధర్మశాస్త్రం బట్టి తమను ఆ దేశ ప్రజల నుండి వేరు చేసుకున్న వారందరు గ్రహించగలిగిన తమ భార్యలు కుమారులు కుమార్తెలతో పాటు,
NEH 10:29 తమ బంధువులైన అధిపతులతో కలిసివచ్చి దేవుని సేవకుడైన మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తామని, మా ప్రభువైన యెహోవా ఆజ్ఞలకు నిబంధనలకు శాసనాలకు లోబడతామని శపథం చేసి ప్రమాణం చేశారు.
NEH 10:30 “పొరుగు దేశ ప్రజలతో మా కుమార్తెలకు పెళ్ళి చేయము, వారి కుమార్తెలతో మా కుమారులకు పెళ్ళి చేయము.
NEH 10:31 “పొరుగు దేశ ప్రజలు విశ్రాంతి దినాన వారి వస్తువులు గాని ధాన్యం గాని అమ్మడానికి తెస్తే విశ్రాంతి దినాన కాని పరిశుద్ధ దినాన గాని మేము వాటిని కొనము. ప్రతి ఏడవ సంవత్సరం భూమిని దున్నకుండా వదిలివేస్తాము, అన్ని అప్పులు రద్దు చేస్తాము.
NEH 10:32 “మన దేవుని ఆలయ సేవ కోసం ప్రతి సంవత్సరం ఒక షెకెలు వెండిలో మూడవ వంతు ఇస్తామని నిబంధన చేసుకున్నాము.
NEH 10:33 ఈ డబ్బును బల్ల మీద పెట్టే రొట్టెలకు; నిత్యం అర్పించే ధాన్యార్పణలకు దహనబలులకు; విశ్రాంతి దినాల్లో, అమావాస్య పండుగ నియమించబడిన పండుగల్లో అర్పణలకు; పరిశుద్ధ అర్పణలకు; ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం కలగడానికి పాపపరిహార బలులకు; మన దేవుని ఆలయ పనులకు ఖర్చు చేస్తాము.
NEH 10:34 “మా కుటుంబాలలో వంతు ప్రకారం ప్రతి సంవత్సరం నిర్ణయించబడిన సమయంలో ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం మన దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహించడానికి కావలసిన కట్టెలు ఎవరెవరు తీసుకురావాలో నిర్ణయించడానికి మేము అనగా యాజకులు లేవీయులు ప్రజలు చీట్లు వేసుకున్నాము.
NEH 10:35 “ప్రతి సంవత్సరం పంటలో ప్రథమ ఫలాన్ని అన్ని పండ్లచెట్ల ప్రథమ ఫలాలను యెహోవా ఆలయానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాము.
NEH 10:36 “అలాగే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం మా కుమారులలో మొదట పుట్టినవాన్ని, మా పశువుల్లో, మందలలో గొర్రెలలో మొదట పుట్టిన వాటిని యెహోవా ఆలయానికి అక్కడ పరిచర్య చేస్తున్న యాజకుని దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము.
NEH 10:37 “అంతే కాకుండా, మా పిండిలో, భోజన అర్పణలలో, అన్ని రకాల మా పండ్లచెట్ల ఫలాల్లో, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో అన్నిటిలో ప్రథమ ఫలాన్ని మన దేవుని మందిరపు గిడ్డంగులకు యాజకుని దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. పదవ భాగాన్ని లేవీయుల దగ్గరకి తీసుకురావాలని, మేము పని చేసే అన్ని పట్టణాల్లో పదవ భాగాన్ని సేకరించి లేవీయులకు ఇవ్వాలని నిర్ణయించాము.
NEH 10:38 లేవీయులు పదవ భాగాన్ని తీసుకునేటప్పుడు వారితో పాటు అహరోను వారసుడైన ఒక యాజకుడు ఉండాలని, లేవీయులు ఆ పదవ భాగాలన్నిటిలో పదవ భాగాన్ని మన దేవుని ఆలయ గిడ్డంగులకు ఖజానాకు తీసుకురావాలి.
NEH 10:39 ఇశ్రాయేలీయులు, లేవీయులతో సహా ధాన్యాన్ని, క్రొత్త ద్రాక్షరసాన్ని, నూనెను విరాళంగా తీసుకువచ్చినప్పుడు పరిచర్య చేసే యాజకులు, ద్వారపాలకులు సంగీతకారులు వాటిని తీసుకుని పరిశుద్ధాలయపు ఉపకరణాలు ఉండే గిడ్డంగులలో ఉంచాలి. “మేము మా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నాము.”
NEH 11:1 ప్రజల నాయకులు యెరూషలేములో స్థిరపడ్డారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకరు మాత్రమే పరిశుద్ధ యెరూషలేములో నివసించేలా మిగతా తొమ్మిదిమంది తమ సొంత పట్టణాల్లోనే నివసించేలా చీట్లు వేశారు.
NEH 11:2 యెరూషలేములో నివసించడానికి ఇష్టపూర్వకంగా వచ్చిన వారిని ప్రజలు దీవించారు.
NEH 11:3 యెరూషలేములో స్థిరపడిన ప్రాంతీయ నాయకులు వీరే, (ఇశ్రాయేలీయులలో కొంతమంది, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు యూదా పట్టణాల్లో వివిధ పట్టణాల్లో ఉన్న తమ సొంత స్థలాల్లో నివసించారు,
NEH 11:4 యూదా, బెన్యామీను వారిలో మరికొంతమంది యెరూషలేములో నివసించారు): యూదా వారసుల నుండి: అతాయా, ఇతడు పెరెసు వారసుడైన మహలలేలు కుమారుడైన షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడైన జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడు;
NEH 11:5 మయశేయా, ఇతడు షేలా వారసుడైన జెకర్యా కుమారుడైన యోయారీబుకు పుట్టిన అదాయా కుమారుడైన హజాయాకు పుట్టిన కొల్-హోజె కుమారుడైన బారూకు కుమారుడు.
NEH 11:6 యెరూషలేములో నివసించిన పెరెసు వారసులు 468 మంది, వీరంతా అసాధారణమైన పోరాట యోధులు.
NEH 11:7 బెన్యామీను వారసుల నుండి: సల్లు, ఇతడు యెషయా కుమారుడైన ఇతీయేలుకు పుట్టిన మయశేయా కుమారుడైన కోలాయాకు పుట్టిన పెదాయా కుమారుడైన యోవేదుకు పుట్టిన మెషుల్లాము కుమారుడు,
NEH 11:8 అతని అనుచరులైన గబ్బయి సల్లయి అనేవారితో కలిపి 928 మంది.
NEH 11:9 జిఖ్రీ కుమారుడైన యోవేలు వీరి అధికారి; హస్సెనూయా కుమారుడైన యూదా ఆ పట్టణపు నూతన భాగానికి ముఖ్య అధికారి.
NEH 11:10 యాజకుల నుండి: యోయారీబు కుమారుడైన యెదాయా, యాకీను;
NEH 11:11 శెరాయా దేవుని ఆలయానికి అధికారిగా ఉన్నాడు. ఇతడు అహీటూబు కుమారుడైన మెరాయోతుకు పుట్టిన సాదోకు కుమారుడైన మెషుల్లాముకు పుట్టిన హిల్కీయా కుమారుడు;
NEH 11:12 ఆలయ పని చేసే వీరి బంధువులు 822 మంది; అదాయా, ఇతడు మల్కీయా కుమారుడైన పషూరుకు పుట్టిన జెకర్యా కుమారుడైన అమ్జీకు పుట్టిన పెలల్యా కుమారుడైన యెరోహాము కుమారుడు.
NEH 11:13 కుటుంబ పెద్దలుగా ఉన్న వీరి బంధువులు 242 మంది. అమష్షయి, ఇతడు ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమోతుకు పుట్టిన అహజై కుమారుడైన అజరేలు కుమారుడు.
NEH 11:14 అతని బంధువులు 128 మంది, వీరు అసాధారణ పోరాట యోధులు. హగ్గేదోలిము కుమారుడైన జబ్దీయేలు వీరి ముఖ్య అధికారి.
NEH 11:15 లేవీయుల నుండి: షెమయా, ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కుమారుడైన అజ్రీకాముకు పుట్టిన హష్షూబు కుమారుడు.
NEH 11:16 దేవుని మందిరంలో బయటి పనులకు పర్యవేక్షకులుగా ఉన్న లేవీయుల పెద్దలు షబ్బెతై, యోజాబాదు;
NEH 11:17 కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన నడిపించే నాయకుడు ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా; అతని సహకారులలో రెండవవాడైన బక్బుక్యా; యెదూతూను కుమారుడైన గాలాలుకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దా.
NEH 11:18 పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీయుల సంఖ్య 284 మంది.
NEH 11:19 ద్వారపాలకుల్లో: అక్కూబు, టల్మోను గుమ్మాలను కాపలా కాసేవారి సహాయకులు 172 మంది.
NEH 11:20 మిగిలిన ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు యూదా పట్టణాల్లో తమకు కేటాయించిన స్వాస్థ్యంలో నివసించారు.
NEH 11:21 ఆలయ సేవకులు ఓఫెలు కొండమీద నివసించారు. వీరికి జీహా, గిష్పా అధికారులు.
NEH 11:22 యెరూషలేములోని లేవీయులకు ఉజ్జీ అధికారి; ఇతడు మీకా కుమారుడైన మత్తన్యాకు పుట్టిన హషబ్యా కుమారుడైన బానీ కుమారుడు. దేవుని ఆలయ సేవల బాధ్యత వహించిన సంగీతకారులైన ఆసాపు వారసులలో ఒకడు ఉజ్జీ.
NEH 11:23 సంగీతకారులు రాజు ఆదేశాల ప్రకారం పని చేయాలి, కాబట్టి వారి దినచర్య క్రమబద్ధం చేయబడింది.
NEH 11:24 యూదా కుమారుడైన జెరహు వారసులలో ఒక్కడైన మెషేజబేలు కుమారుడైన పెతహయా ప్రజలకు సంబంధించిన అన్ని వ్యవహారాలలో రాజుకు సలహాదారునిగా ఉన్నాడు.
NEH 11:25 ఇక గ్రామాలు వాటి పొలాలకు సంబంధించి యూదా ప్రజల్లో కొంతమంది కిర్యత్-అర్బాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో, దీబోనులో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో, యెకబ్సెయేలులో దాని గ్రామాల్లో,
NEH 11:26 యెషూవలో, మొలాదాలో, బేత్-పెలెతులో,
NEH 11:27 హజర్-షువలులో, బెయేర్షేబలో వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో,
NEH 11:28 సిక్లగులో, మెకోనాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో,
NEH 11:29 ఎన్-రిమ్మోనులో, జోరహులో, యర్మూతులో,
NEH 11:30 జానోహలో, అదుల్లాములో వాటి గ్రామాల్లో, లాకీషులో దానికి పొలాల్లో అజేకాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో నివసించారు. వారు బెయేర్షేబ నుండి హిన్నోము లోయవరకు నివసించారు.
NEH 11:31 గెబాలో స్థిరపడిన బెన్యామీనీయులు మిక్మషులో, అయ్యాలో, బేతేలు వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో,
NEH 11:32 అనాతోతులో, నోబులో, అనన్యాలో,
NEH 11:33 హాసోరులో, రామాలో, గిత్తయీములో,
NEH 11:34 హదీదులో, సెబోయిములో, నెబల్లాటులో,
NEH 11:35 లోదులో, పనివారి లోయ అని పిలిచే ఓనోలో నివసించారు.
NEH 11:36 యూదాలోని లేవీయులలో కొన్ని గుంపులు బెన్యామీనులో నివసించారు.
NEH 12:1 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో యెషూవతో పాటు వచ్చిన యాజకులు లేవీయులు వీరే: శెరాయా, యిర్మీయా, ఎజ్రా,
NEH 12:2 అమర్యా, మల్లూకు, హట్టూషు,
NEH 12:3 షెకన్యా, రెహూము, మెరేమోతు,
NEH 12:4 ఇద్దో, గిన్నెతోయి, అబీయా,
NEH 12:5 మీయామిను, మయద్యా, బిల్గా,
NEH 12:6 షెమయా, యోయారీబు, యెదాయా,
NEH 12:7 సల్లు ఆమోకు హిల్కీయా యెదాయా.
NEH 12:8 లేవీయులలో యెషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా కృతజ్ఞత పాటలకు నాయకత్వం వహించే మత్తన్యా అతని సహాయకులు.
NEH 12:9 పరిచర్యలలో బక్బుక్యా, ఉన్నీ, వారి సహాయకులు వారికి ఎదురు వరుసలో నిలబడేవారు.
NEH 12:10 యోయాకీము తండ్రి యెషూవ, ఎల్యాషీబు తండ్రి యోయాకీము, యోయాదాను తండ్రి ఎల్యాషీబు,
NEH 12:11 యోనాతాను తండ్రి యోయాదా, యద్దూవ తండ్రి యోనాతాను.
NEH 12:12 యోయాకీము సమయంలో యాజకుల కుటుంబాలకు పెద్దలుగా ఉన్నవారు: శెరాయా కుటుంబానికి మెరాయా; యిర్మీయా కుటుంబానికి హనన్యా;
NEH 12:13 ఎజ్రా కుటుంబానికి మెషుల్లాము; అమర్యా కుటుంబానికి యెహోహనాను;
NEH 12:14 మెలీకూ కుటుంబానికి యోనాతాను, షెకన్యా కుటుంబానికి యోసేపు;
NEH 12:15 హారీము కుటుంబానికి అద్నా; మెరాయోతు కుటుంబానికి హెల్కయి;
NEH 12:16 ఇద్దో కుటుంబానికి జెకర్యా; గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాము;
NEH 12:17 అబీయా కుటుంబానికి జిఖ్రీ; మిన్యామీను, మోవద్యా కుటుంబాలకు పిల్టయి;
NEH 12:18 బిల్గా కుటుంబానికి షమ్మూయ; షెమయా కుటుంబానికి యెహోనాతాను;
NEH 12:19 యోయారీబు కుటుంబానికి మత్తెనై; యెదాయా కుటుంబానికి ఉజ్జీ;
NEH 12:20 సల్లు కుటుంబానికి కల్లయి; ఆమోకు కుటుంబానికి ఏబెరు;
NEH 12:21 హిల్కీయా కుటుంబానికి హషబ్యా; యెదాయా కుటుంబానికి నెతనేలు.
NEH 12:22 ఎల్యాషీబు సమయంలో లేవీయులలో కుటుంబ పెద్దలుగా ఉన్నవారు యోయాదా, యోహానాను, యద్దూవ. పర్షియా రాజైన దర్యావేషు పాలనలో వీరే యాజక కుటుంబాలలో పెద్దలుగా నమోదయ్యారు.
NEH 12:23 ఎల్యాషీబు కుమారుడైన యోహానాను సమయం వరకు కుటుంబ పెద్దలుగా లేవీ వారసుల పేర్లు దినచర్య గ్రంథంలో నమోదు చేయబడ్డాయి.
NEH 12:24 లేవీయుల నాయకులైన హషబ్యా, షేరేబ్యా, కద్మీయేలు కుమారుడైన యెషూవ, వారి బంధువులు దైవజనుడైన దావీదు నిర్దేశించిన ప్రకారం వంతులవారీగా ఎదురెదురుగా నిలబడి కృతజ్ఞతా స్తుతి గీతాలు పాడడానికి నియమించబడ్డారు.
NEH 12:25 మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనేవారు గుమ్మాల దగ్గర ఉన్న గిడ్డంగులను కాపలా కాసే ద్వారపాలకులు.
NEH 12:26 వీరంతా యోజాదాకు పుట్టిన యెషూవ కుమారుడైన యోయాకీము సమయంలో, అధిపతియైన నెహెమ్యా సమయంలో, ధర్మశాస్త్ర బోధకుడు యాజకుడైన ఎజ్రా సమయంలో సేవ చేశారు.
NEH 12:27 యెరూషలేము గోడ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు కృతజ్ఞతా స్తుతి గీతాలతో తాళాలు, వీణలు సితారలు వాయిస్తూ సంతోషంగా చేసుకోవడానికి అన్ని ప్రాంతాల నుండి లేవీయులను యెరూషలేముకు తీసుకువచ్చే పని మొదలుపెట్టారు.
NEH 12:28 సంగీతకారులను యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, నెటోపాతీయుల గ్రామాల నుండి తీసుకువచ్చారు.
NEH 12:29 యెరూషలేము చుట్టూ సంగీతకారులు తమ కోసం గ్రామాలు నిర్మించుకున్నారు కాబట్టి బేత్-గిల్గాలు నుండి, గెబా అజ్మావెతు ప్రాంతాల నుండి వచ్చారు.
NEH 12:30 యాజకులు, లేవీయులు తమను తాము పవిత్రపరచుకున్న తర్వాత ప్రజలను, గుమ్మాలను, గోడను పవిత్రపరిచారు.
NEH 12:31 నేను యూదా నాయకులను గోడ మీదికి తీసుకువచ్చాను. కృతజ్ఞతలు చెల్లించడానికి రెండు పెద్ద గాయక బృందాలను నియమించాను. వాటిలో ఒక బృందం గోడ మీద కుడి వైపుగా పెంట ద్వారం వైపు నడిచారు.
NEH 12:32 హోషయా, యూదా నాయకుల్లో సగం మంది వారితో పాటు వెళ్లారు.
NEH 12:33 వారితో అజర్యా, ఎజ్రా, మెషుల్లాము,
NEH 12:34 యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా అనేవారు వెళ్లారు.
NEH 12:35 అలాగే బూరలు ఊదుతూ కొంతమంది యాజకులు వెళ్లారు. ఆసాపు కుమారుడైన జక్కూరుకు పుట్టిన మీకాయా కుమారుడైన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానుకు పుట్టిన జెకర్యా,
NEH 12:36 అతని సహాయకులైన షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ అనేవారు దేవుని సేవకుడైన దావీదు నిర్దేశించిన సంగీత వాయిద్యాలు వాయిస్తూ వెళ్లారు. ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా వారిని నడిపించాడు.
NEH 12:37 ఊట గుమ్మం దగ్గర వారు నేరుగా దావీదు పట్టణం గోడ మెట్ల మీదుగా దావీదు ఇంటిని దాటి తూర్పున ఉన్న నీటిగుమ్మం దగ్గరకు వెళ్లారు.
NEH 12:38 కృతజ్ఞతాగీతాలు పాడే గాయకుల రెండవ బృందం వారికి ఎదురుగా వెళ్లారు. మిగిలిన సగం మంది ప్రజలతో పాటు కలిసి నేను అగ్ని గుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ వరకు వెళ్లాము.
NEH 12:39 వారు ఎఫ్రాయిం ద్వారం మీదగా వెళ్లి, యెషానా గుమ్మాన్ని, చేప గుమ్మాన్ని, హనానేలు గోపురాన్ని, వందవ గోపురాన్ని దాటి గొర్రెల గుమ్మం వరకు వెళ్లి కాపలా గుమ్మం దగ్గర ఆగారు.
NEH 12:40 అప్పుడు కృతజ్ఞతాగీతాలు పాడే గాయకుల రెండు బృందాలు, నేను, నాతో పాటు ఉన్న అధికారులలో సగం మంది దేవుని మందిరంలో నిలబడ్డాము.
NEH 12:41 అలాగే యాజకులైన ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యాలు తమ బూరలు పట్టుకుని ఉన్నారు.
NEH 12:42 మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహనాను, మల్కీయా, ఏలాము, ఏజెరులు అక్కడే ఉన్నారు. ఇజ్రహయా సారథ్యంలో గాయకులు గట్టిగా పాటలు పాడారు.
NEH 12:43 ఆ రోజు దేవుడు తమకు గొప్ప ఆనందాన్ని ఇచ్చినందుకు వారు గొప్ప బలులు అర్పించి సంతోషించారు. స్త్రీలు పిల్లలు కూడా సంతోషించారు. యెరూషలేములోని ఈ సంతోష ధ్వనులు చాలా దూరం వరకు వినిపించాయి.
NEH 12:44 ఆ సమయంలో ప్రజలిచ్చే ప్రథమ ఫలాలు, పదవ భాగాలు కానుకలకు సంబంధించిన గిడ్డంగులకు అధికారులుగా కొంతమంది నియమించబడ్డారు. పరిచర్య చేస్తున్న యాజకులు లేవీయులను బట్టి యూదా ప్రజలు సంతోషించారు కాబట్టి యాజకులు లేవీయుల కోసం ధర్మశాస్త్రంలో నిర్దేశించబడిన వంతులను పట్టణాల చుట్టూ ఉన్న పొలాల నుండి గిడ్డంగులకు చేరవేయడానికి వారు నియమించబడ్డారు.
NEH 12:45 దావీదు అతని కుమారుడైన సొలొమోను ఆజ్ఞల ప్రకారం వారంతా సంగీతకారులు ద్వారపాలకులతో కలిసి తమ దేవుని సేవ, శుద్ధీకరణ సేవ చేశారు.
NEH 12:46 చాలా కాలం క్రితం దావీదు, ఆసాపు కాలంలో సంగీతకారులను దేవునికి కృతజ్ఞతా స్తుతి గీతాలను నడిపించేవారు ఉండేవారు.
NEH 12:47 అయితే జెరుబ్బాబెలు, నెహెమ్యా సమయంలో ఇశ్రాయేలీయులందరు సంగీతకారులకు, ద్వారపాలకులకు ప్రతిరోజు ఆహారం ఇచ్చేవారు. అలాగే ఇతర లేవీయులకు కూడా ఒక భాగం ప్రత్యేకంగా ప్రక్కన ఉంచేవారు. లేవీయులు అహరోను వారసులకు ఒక భాగం ప్రత్యేకంగా ప్రక్కన ఉంచేవారు.
NEH 13:1 ఆ రోజున ప్రజల వినికిడిలో మోషే గ్రంథం బిగ్గరగా చదువుతూ ఉండగా; అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని సమాజంలోకి ప్రవేశించకూడదని వ్రాయబడిన భాగం కనబడింది,
NEH 13:2 ఎందుకంటే వారు అరణ్యంలో ఇశ్రాయేలీయులకు ఆహారం గాని నీరు గాని తీసుకెళ్లి ఇవ్వలేదు పైగా వారిని శపించడానికి బిలామును నియమించుకున్నారు. అయితే దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చారు.
NEH 13:3 ప్రజలు ఈ ధర్మశాస్త్రం విన్నప్పుడు, వారు ఇశ్రాయేలు నుండి పరదేశి సంతతికి చెందిన వారందరినీ వెలివేశారు.
NEH 13:4 దీనికి ముందు, యాజకుడైన ఎల్యాషీబు మా దేవుని మందిరానికి సంబంధించిన గిడ్డంగులకు అధికారిగా ఉన్నాడు. ఇతడు టోబీయాకు దగ్గరి బంధువు,
NEH 13:5 అంతేకాదు, అతడు గతంలో భోజనార్పణలు, ధూపద్రవ్యాలు, ఆలయ వస్తువులను, లేవీయులు, సంగీతకారులు ద్వారపాలకుల కోసం కేటాయించిన ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో పదవ వంతును, అలాగే యాజకులకు ఇవ్వవలసిన విరాళాలను నిల్వ ఉంచే స్థలం దగ్గర ఒక పెద్ద గదిని టోబీయాకు ఏర్పాటు చేశాడు.
NEH 13:6 అయితే ఇవన్నీ జరుగుతున్న సమయంలో నేను యెరూషలేములో లేను. ఎందుకంటే బబులోను దేశపు రాజైన అర్తహషస్త పాలన ముప్పై రెండవ సంవత్సరంలో నేను రాజు దగ్గరకు తిరిగి వెళ్లాను. కొంతకాలం తర్వాత నేను రాజు అనుమతి తీసుకుని,
NEH 13:7 యెరూషలేముకు తిరిగి వచ్చాను. దేవుని ఆలయ ఆవరణంలో టోబీయాకు గది ఏర్పాటు చేసి ఎల్యాషీబు కీడు చేశాడని నేను గ్రహించాను.
NEH 13:8 నాకు చాలా కోపం వచ్చి, నేను ఆ గదిలో నుండి టోబీయా వస్తువులన్నిటిని తీసి బయట పడవేశాను.
NEH 13:9 గదులన్నీ శుద్ధి చేయమని ఆజ్ఞ ఇచ్చి, తర్వాత దేవుని ఆలయానికి సంబంధించిన వస్తువులు, భోజనార్పణలు, ధూపద్రవ్యాలను మరలా ఆ గదిలో పెట్టాను.
NEH 13:10 లేవీయులకు ఇవ్వవలసిన భాగాలు వారికి ఇవ్వలేదని, సేవ చేయవలసిన లేవీయులు, సంగీతకారులు తమ పొలాల్లో పని చేసుకోవడానికి తిరిగి వెళ్లిపోయారని నేను తెలుసుకున్నాను.
NEH 13:11 కాబట్టి నేను అధికారులను గద్దించి, “దేవుని మందిరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు?” అని అడిగాను. తర్వాత నేను వారందరిని ఒక్క దగ్గరికి పిలిచి వారిని వారి స్థానాల్లో మరలా నియమించాను.
NEH 13:12 యూదా ప్రజలందరు ధాన్యంలో, ద్రాక్షరసంలో, నూనెలో పదవ వంతులను గిడ్డంగులకు తెచ్చారు.
NEH 13:13 యాజకుడైన షెలెమ్యా, శాస్త్రియైన సాదోకు, లేవీయుడైన పెదాయాలను గిడ్డంగుల మీద అధికారులుగా నియమించాను. అలాగే వారికి సహాయంగా జక్కూరు కుమారుడును, మత్తన్యా మనుమడునైన హానానును నియమించాను ఎందుకంటే వీరంతా నమ్మకస్థులుగా పేరు పొందారు. తమ తోటి లేవీయులకు ఆహారం పంచి ఇవ్వాల్సిన బాధ్యత అప్పగించబడింది.
NEH 13:14 నా దేవా, వీటిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా దేవుని మందిరం కోసం దాని సేవల కోసం నేను నమ్మకంగా చేసిన వాటిని తుడిచివేయకండి.
NEH 13:15 ఆ రోజుల్లో యూదాలో కొంతమంది విశ్రాంతి దినాన ద్రాక్షలను ద్రాక్షగానుగలో తొక్కడం, ధాన్యం, ద్రాక్షరసం, ద్రాక్షలు, అంజూర పండ్లు అన్ని రకాల మూటలు తీసుకువచ్చి గాడిదల మీద పెట్టి విశ్రాంతి దినాన యెరూషలేముకు తీసుకురావడం నేను చూశాను. కాబట్టి ఆ రోజు ఆహారం అమ్మకూడదని నేను వారిని హెచ్చరించాను.
NEH 13:16 యెరూషలేములో నివసిస్తున్న తూరుకు చెందిన ప్రజలు చేపలు, అన్ని రకాల సరుకులు తీసుకువచ్చి విశ్రాంతి దినాన యూదాలోని ప్రజలకు అమ్ముతున్నారు.
NEH 13:17 అందుకు నేను యూదా సంస్థానాధిపతులను మందలించి, “సబ్బాతు దినాన్ని అపవిత్రం చేస్తూ మీరు చేస్తున్న ఈ చెడ్డ పని ఏమిటి?
NEH 13:18 మీ పూర్వికులు ఇలా చేసినందుకే మన దేవుడు మన మీదికి, ఈ పట్టణం మీదికి ఈ విపత్తు రప్పించలేదా? మీరు విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేసి ఇశ్రాయేలీయుల మీదికి కోపాన్ని మరింతగా రప్పిస్తున్నారు.”
NEH 13:19 సబ్బాతుకు ముందు రోజు యెరూషలేము గుమ్మాలపై సాయంకాలపు నీడలు పడగానే యెరూషలేము తలుపులు మూసివేసి విశ్రాంతి దినం గడిచేవరకు తలుపులు తెరవకూడదని నేను ఆజ్ఞాపించాను. సబ్బాతు దినాన ఏ బరువులు లోపలికి రాకుండా నా మనుష్యుల్లో కొందరిని కాపలా ఉంచాను.
NEH 13:20 వ్యాపారులు, రకరకాల వస్తువులు అమ్మేవారు ఒకటి రెండు సార్లు యెరూషలేము బయట రాత్రంతా గడిపారు.
NEH 13:21 అయితే నేను వెళ్లి వారిని గద్దించి, “మీరు రాత్రంతా గోడ దగ్గర ఎందుకు ఉన్నారు? మరోసారి ఇలా చేస్తే మిమ్మల్ని పట్టుకుంటాను” అని చెప్పాను. అప్పటినుండి వారు మళ్ళీ విశ్రాంతి దినాన రాలేదు.
NEH 13:22 అప్పుడు తమను తాము పవిత్రపరచుకుని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి వెళ్లి గుమ్మాలను కనిపెట్టుకుని ఉండాలని లేవీయులను ఆజ్ఞాపించాను. నా దేవా, వీటిని బట్టి కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి! మీ మహా ప్రేమను బట్టి నా మీద దయ చూపించండి.
NEH 13:23 అంతే కాకుండా, ఆ రోజుల్లో అష్డోదు, అమ్మోను, మోయాబులకు చెందిన స్త్రీలను పెళ్ళి చేసుకున్న యూదా పురుషులను నేను చూశాను.
NEH 13:24 వారి పిల్లల్లో సగం మంది అష్డోదు భాషను గాని పరాయి ప్రజల భాషను గాని మాట్లాడేవారు కాని యూదా భాషలో ఎలా మాట్లాడాలో వారికి తెలియదు.
NEH 13:25 నేను వారిని గద్దించి శపించాను. ఆ పురుషులలో కొంతమందిని కొట్టి వారి జుట్టు పెరికించాను. నేను వారితో దేవుని పేరిట ప్రమాణం చేయించి, “మీరు మీ కుమార్తెలకు వారి కుమారులతో పెళ్ళి చేయకూడదు, వారి కుమార్తెలతో మీరు మీ కుమారులు పెళ్ళి చేసుకోకూడదు.
NEH 13:26 ఇలాంటి పెళ్ళిళ్ళను బట్టి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక దేశాల్లో అతని వంటి రాజు మరొకడు లేడు. అతడు తన దేవునిచే ప్రేమించబడి దేవుడు అతన్ని ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా చేశాడు కాని యూదేతరుల స్త్రీలు అతనిచేత పాపం చేయించారు.
NEH 13:27 ఈ ఘోరమైన చెడునంతా చేస్తూ యూదేతరుల స్త్రీలను పెళ్ళి చేసుకుని మన దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉండి పాపం చేస్తున్న మీలాంటి వారి మాటలు మేము వినాలా?” అన్నాను.
NEH 13:28 ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కుమారుడైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటుకు అల్లుడు. అతన్ని నా దగ్గర నుండి దూరంగా వెళ్లగొట్టాను.
NEH 13:29 నా దేవా! వారు యాజకత్వ వృత్తిని, యాజక నిబంధనలను, లేవీయుల నిబంధనను అపవిత్రం చేశారు కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి.
NEH 13:30 కాబట్టి యాజకులు లేవీయులు ఏ విదేశీయులతో కలిసిపోకుండ వారిని శుద్ధి చేసి వారిలో ప్రతి ఒక్కరికి వారి సొంత పనిని అప్పగించాను.
NEH 13:31 నేను నిర్ణీత సమయాల్లో కట్టెలు, ప్రథమ ఫలాలు తెచ్చేలా ఏర్పాటు చేశాను. నా దేవా! దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి.
EST 1:1 ఇండియా నుండి కూషు దేశం వరకు 127 సంస్థానాలను పరిపాలించిన రాజైన అహష్వేరోషు కాలంలో జరిగిన సంఘటనలు ఇవి.
EST 1:2 ఆ సమయంలో అహష్వేరోషు రాజ సింహాసనం ఉన్న షూష కోట నుండి పరిపాలించాడు.
EST 1:3 అతని పరిపాలనలోని మూడవ సంవత్సరంలో తన సంస్థానాధిపతులకు, అధికారులకు అందరికి విందు ఏర్పాటు చేశాడు. పర్షియా, మెదీయ సేనాధిపతులు, రాకుమారులు, సంస్థానాధిపతులు విందుకు హాజరయ్యారు.
EST 1:4 నూట ఎనభై రోజులు పాటు అతడు తనకున్న విస్తారమైన రాజ్య ఐశ్వర్యం, వైభవం, ఘనత, తేజస్సు ప్రదర్శించాడు.
EST 1:5 ఈ రోజులు గడిచిన తర్వాత, ఏడు రోజులపాటు రాజభవన తోటలో రాజు విందు చేశాడు, షూషనులో ఉన్న అల్పుల నుండి ఘనుల వరకు, ప్రజలందరికి అతడు విందు చేశాడు.
EST 1:6 ఆ తోటలో పాలరాతి స్తంభాలకున్న వెండి ఉంగరాలకు తెలుపు నార త్రాళ్లు ఊదా రంగు పట్టీలతో తగిలించి ఉన్నాయి. తెరలు కట్టడానికి వాటి మీద వెండి కమ్ములు, అవిసెనార త్రాళ్లకు తెరలు వ్రేలాడుతున్నాయి. చలువ రాయి పాల రాయి ముత్యం ఇతర విలువైన రాళ్లు పరచిన నేల మీద వెండి బంగారాలతో అలంకరించబడిన పరుపులు ఉన్నాయి.
EST 1:7 అతిథులకు బంగారు పాన పాత్రల్లో ద్రాక్షరసం వడ్డించారు, ఒక్కో పాత్ర ఒక్కో దానికి భిన్నమైనది, రాజు ధారాళ స్వభావం గలవాడు కాబట్టి ద్రాక్షరసం సమృద్ధిగా ఉంది.
EST 1:8 రాజు ఆజ్ఞను బట్టి ప్రతి అతిథి కూడా ఎలాంటి పరిమితి లేకుండా త్రాగవచ్చు ఎందుకంటే వారందరికి కోరినంతగా ద్రాక్షరసం అందించమని వడ్డించే వారిని రాజు ఆదేశించాడు.
EST 1:9 వష్తి రాణి కూడా తన రాజైన అహష్వేరోషు యొక్క రాజ్య భవనంలో ఉన్న స్త్రీలందరికి విందు ఏర్పాటు చేసింది.
EST 1:10 ఏడవ రోజున, రాజైన అహష్వేరోషు ద్రాక్షరసంతో ఉల్లాసంగా ఉన్నప్పుడు, తనకు సేవచేసే మెహుమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే ఏడుగురు నపుంసకులకు రాణియైన వష్తిని తన రాజకిరీటాన్ని ధరింపజేసి తన అందాన్ని ప్రజలకు, సంస్థానాధిపతులకు చూపించడానికి, తన ముందుకు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది.
EST 1:12 అయితే ఆ నపుంసకులు రాజు ఆజ్ఞను రాణియైన వష్తికి తెలియజేసినప్పుడు, ఆమె రావడానికి ఒప్పుకోలేదు. అప్పుడు రాజు ఆగ్రహంతో, కోపంతో మండిపడ్డాడు.
EST 1:13 చట్టం, న్యాయం విషయాల్లో రాజు నిపుణులను సంప్రదించడం ఆచారం కాబట్టి, కాలాలను అర్థం చేసుకునే జ్ఞానులతో,
EST 1:14 కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెసు, మర్సెనా మెముకాను అనే ఏడుగురు రాజుకు సన్నిహితులు. రాజు దగ్గర ప్రత్యేక హోదాలో రాజ్యంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్న పర్షియా, మెదీయకు చెందిన ఈ ఏడుగురు సంస్థానాధిపతులతో రాజు మాట్లాడాడు.
EST 1:15 “చట్టం ప్రకారం రాణియైన వష్తిపై ఏం చర్య తీసుకోవాలి?” అని రాజు అడిగాడు. “రాజైన అహష్వేరోషు అనే నేను నపుంసకుల ద్వారా పంపిన ఆజ్ఞకు రాణియైన వష్తి లోబడలేదు.”
EST 1:16 అప్పుడు మెముకాను రాజు ఎదుట సంస్థానాధిపతుల ఎదుట జవాబిస్తూ, “వష్తి రాణి తప్పు చేసింది, రాజు పట్ల మాత్రమే కాదు కాని అహష్వేరోషు రాజు పరిపాలిస్తున్న అన్ని సంస్థానాధిపతుల ఎదుట, ప్రజలందరి ఎదుట తప్పు చేసింది.
EST 1:17 రాణి ప్రవర్తన స్త్రీలందరికి తెలిసిపోతుంది, అప్పుడు వారు తమ భర్తలను చులకన చేస్తూ, ‘రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన ముందుకు రమ్మని ఆజ్ఞాపిస్తే ఆమె రాలేదు’ అంటారు.
EST 1:18 రాణి ప్రవర్తన గురించి విన్న పర్షియా మెదీయ సంస్థానాధిపతుల భార్యలు ఈ రోజే రాణి అన్నట్లే రాజ అధిపతులందరితో అంటారు. దీనివలన అంతులేని తిరస్కారం కోపం కలుగుతుంది.
EST 1:19 “కాబట్టి రాజుకు ఇష్టమైతే, రాజైన అహష్వేరోషు ముందుకు వష్తి రాణి ఇక ఎన్నడూ రాకూడదని రాజాజ్ఞ జారీ చేయండి. అది రద్దు కాకుండా ఉండడానికి దానిని పర్షియా మెదీయ శాసన గ్రంథాల్లో వ్రాయాలి. అంతేకాక, ఆమెకంటే యోగ్యురాలికి రాణి స్థానాన్ని ఇవ్వాలి.
EST 1:20 అప్పుడు రాజు నిర్ణయాన్ని అతని మహారాజ్యమంతా ప్రకటిస్తే, అల్పుల నుండి ఘనుల వరకు స్త్రీలందరూ తమ భర్తలను గౌరవిస్తారు” అన్నాడు.
EST 1:21 ఈ సలహా రాజుకు, అతని సంస్థానాధిపతులకు నచ్చింది, కాబట్టి మెముకాను ప్రతిపాదించినట్లు రాజు చేశాడు.
EST 1:22 అప్పుడు రాజు, ప్రతి పురుషుడు తన కుటుంబానికి తానే యజమానిగా ఉండాలని ఆజ్ఞాపిస్తూ తన రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు ప్రతి సంస్థానానికి ప్రజలందరికి వారివారి భాషల్లో వ్రాయించి తాకీదులు పంపాడు.
EST 2:1 తర్వాత రాజైన అహష్వేరోషు కోపం తగ్గినప్పుడు, అతడు వష్తిని, ఆమె చేసిన దానిని, ఆమె గురించి ఎలాంటి శాసనం ఇచ్చాడో జ్ఞాపకం చేసుకున్నాడు.
EST 2:2 రాజ వ్యక్తిగత పరిచారకులు, “రాజు కోసం అందమైన యువ కన్యకలను వెదకడం జరగాలి.
EST 2:3 రాజు తన సామ్రాజ్యంలో ఉన్న ప్రతి దేశంలో ఈ అందమైన యువ కన్యకలను షూషను కోటలో ఉన్న అంతఃపురంలోకి తీసుకురావడానికి ప్రతినిధులను నియమించాలి. ఆ యువ కన్యకలు రాజు యొక్క నపుంసకుడైన హేగై సంరక్షణలో ఉంచాలి; ఆ స్త్రీలకు అందం కోసం సుగంధద్రవ్యాలు అందించాలి.
EST 2:4 తర్వాత వారందరిలో ఏ కన్య రాజుని ఆకర్షిస్తుందో, ఆమె వష్తి స్థానంలో రాణి అవుతుంది” అని ప్రతిపాదించారు. ఈ సలహా రాజు ఆమోదం పొందింది, అతడు దానిని పాటించాడు.
EST 2:5 ఆ సమయంలో షూషను కోటలో బెన్యామీను గోత్రానికి చెందిన కీషుకు పుట్టిన షిమీ యొక్క కుమారుడైన యాయీరుకు పుట్టిన మొర్దెకై అనే యూదుడు ఉండేవాడు,
EST 2:6 బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము నుండి చెరకు తీసుకెళ్లిన యూదా రాజైన యెహోయాకీనుతో పాటు ఉన్నవారిలో ఇతడు ఉన్నాడు.
EST 2:7 మొర్దెకై యొక్క పినతండ్రి యొక్క కుమార్తె, హదస్సా అనే బంధువు ఉన్నది, ఆమెకు తల్లిదండ్రులు లేనందుకు అతడే ఆమెను పెంచాడు. ఎస్తేరు అని కూడ పిలువబడే ఈ యువతి మంచి రూపం కలిగి, అందంగా ఉండేది. ఆమె తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మొర్దెకై ఆమెను తన సొంత కుమార్తెగా దత్తత తీసుకున్నాడు.
EST 2:8 రాజు ఆజ్ఞ అంతా ప్రకటించబడింది, చాలామంది యువతులను, షూషను కోటకు తెచ్చారు, హేగై అనే ఆ అంతఃపురం యొక్క అధికారి ఆధీనంలో వారిని ఉంచారు, ఎస్తేరును కూడా రాజభవనానికి తీసుకెళ్లి హేగైకు అప్పగించారు.
EST 2:9 ఎస్తేరు అతనికి నచ్చింది, దయ పొందుకుంది. వెంటనే పరిమళద్రవ్యాలు ఆమెకు అందించి, ప్రత్యేక ఆహారం ఆమెకు ఏర్పాటు చేశాడు. అతడు ఆమె కోసం రాజభవనం నుండి ఏర్పరచబడిన ఏడుగురు స్త్రీ పరిచారకులను నియమించాడు, ఆమెను, ఆమె పరిచారకులను అంతఃపురంలోని శ్రేష్ఠమైన స్థలంలోనికి పంపించాడు.
EST 2:10 ఎస్తేరు తన జాతిని, తన కుటుంబ నేపధ్యాన్ని బయలుపరచలేదు, ఎందుకంటే అవి చెప్పకూడదని మొర్దెకై ఆమెకు ఆదేశించాడు.
EST 2:11 ఎస్తేరు ఎలా ఉందో, ఆమె క్షేమం తెలుసుకోవడానికి మొర్దెకై ప్రతిరోజు అంతఃపురం ఆవరణం దగ్గరే అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు.
EST 2:12 ఒక యువతి రాజైన అహష్వేరోషు దగ్గరకు వెళ్లే సమయం రాకముందు, ఆమె ఆరు నెలలు పాటు గోపరస తైలం, మరో ఆరు నెలలు వివిధ పరిమళద్రవ్యాలు వాడాలి.
EST 2:13 ఈ విధంగా ఒక యువతి రాజు దగ్గరకు వెళ్లాలి: అంతఃపురం నుండి రాజు సముఖంలోకి వెళ్లేటప్పుడు, ఆమెకు ఏది కావాలో అది తనకు ఇవ్వబడుతుంది.
EST 2:14 సాయంత్రం ఆమె అక్కడికి వెళ్తుంది, ఉదయం అంతఃపురంలో ఇంకొక భాగముకు, ఉపపత్నులపై అధికారిగా ఉన్న షయష్గజు యొక్క సంరక్షణకు తిరిగి వెళ్తుంది. రాజుకు ఆమె నచ్చి, తన పేరు పెట్టి పిలిపిస్తే తప్ప ఆమె అతని దగ్గరకు తిరిగి వెళ్లదు.
EST 2:15 రాజు దగ్గరకు వెళ్లడానికి ఎస్తేరు యొక్క వంతు వచ్చినప్పుడు (ఈమె మొర్దెకై పినతండ్రి అబీహయిలు కుమార్తె, మొర్దెకై ఈమెను దత్తత తీసుకున్నాడు), ఆమె రాజు యొక్క నపుంసకుడు, అంతఃపురం యొక్క అధికారియైన హేగై ప్రతిపాదించింది తప్ప మరి ఏవి అడగలేదు. ఎస్తేరును చూసిన వారందరికి ఆమె అంటే ఇష్టం కలిగింది.
EST 2:16 అలా ఎస్తేరు రాజైన అహష్వేరోషు పరిపాలనలోని ఏడవ సంవత్సరంలో టెబేతు అనే పదవ నెలలో రాజభవనంలోకి వెళ్లింది.
EST 2:17 రాజు ఇతర స్త్రీలందరికంటే ఎస్తేరును ఎక్కువ ప్రేమించాడు, ఆమె ఇతర కన్యకలందరికంటే రాజు దయను, ఆమోదాన్ని పొందుకుంది. కాబట్టి అతడు ఆమె తలమీద రాజ కిరీటం పెట్టి, వష్తి స్థానంలో ఎస్తేరును రాణిగా నియమించాడు.
EST 2:18 రాజు తన సంస్థానాధిపతులు, అధికారులైన అందరికి ఎస్తేరు గౌరవార్థం గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అతడు సంస్థానాలలో సెలవు ప్రకటించి రాజ ఔదార్యంతో వరాలు ఇచ్చాడు.
EST 2:19 కన్యకలు రెండవసారి సమావేశమైనప్పుడు, మొర్దెకై రాజ ద్వారం దగ్గర కూర్చున్నాడు.
EST 2:20 అయితే ఎస్తేరు మొర్దెకై చెప్పినట్లు తన కుటుంబ నేపథ్యం, తన జాతి గురించి రహస్యంగా ఉంచింది, మొర్దెకై తనను పెంచుతున్నప్పుడు ఉన్నట్లే అతని హెచ్చరికలు పాటించింది.
EST 2:21 మొర్దెకై రాజు ద్వారం దగ్గర కూర్చుని ఉన్న సమయంలో, రాజు యొక్క ద్వారా సంరక్షకులుగా ఉన్న బిగ్తాన్, తెరెషు అనే ఇద్దరు రాజు అధికారులు రాజైన అహష్వేరోషు మీద కోప్పడి అతన్ని చంపాలని కుట్రపన్నారు.
EST 2:22 అయితే మొర్దెకై ఈ కుట్ర గురించి విని ఎస్తేరు రాణికి చెప్పాడు, ఆమె మొర్దెకై పేరిట, రాజుకు తెలియజేసింది.
EST 2:23 ఆ సమాచారం గురించి విచారణ జరిపించినప్పుడు అది నిజమే అని తెలిసింది, ఆ ఇద్దరు అధికారులు స్తంభాలకు ఉరితీయబడ్డారు. ఇదంతా రాజు సమక్షంలో చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడింది.
EST 3:1 ఈ సంఘటనలు జరిగిన తర్వాత, రాజైన అహష్వేరోషు అగగీయుడైన హమ్మెదాతా కుమారుడైన హామానుకు ఇతర సంస్థానాధిపతులందరికన్నా ఉన్నత స్థానాన్ని ఇచ్చి అతన్ని గౌరవించాడు.
EST 3:2 రాజ ద్వారం దగ్గర ఉండే రాజ్యాధికారులంతా మోకరించి రాజాజ్ఞ ప్రకారం హామానుకు నమస్కరించారు. అయితే మొర్దెకై హామాను ముందు మోకరించి నమస్కరించలేదు.
EST 3:3 అప్పుడు రాజ ద్వారం దగ్గర ఉన్న రాజ్య అధికారులు మొర్దెకైని, “ఎందుకు నీవు రాజాజ్ఞకు లోబడట్లేదు?” అని అడిగారు.
EST 3:4 ప్రతిరోజు వారు అతన్ని అడుగుతున్నా అతడు ఖాతరు చేయలేదు. మొర్దెకై తాను యూదుడని వారికి చెప్పాడు కాబట్టి అతడు తాను చెప్పిన దానిపై నిలబడతాడో లేదో చూడాలని ఈ విషయం హామానుకు చెప్పారు.
EST 3:5 మొర్దెకై తన ఎదుట మోకరించడం లేదని, గౌరవించడం లేదని చూసి హామానుకు చాలా కోపం వచ్చింది.
EST 3:6 మొర్దెకై ఏ జాతివాడో తెలుసుకుని, అతన్ని ఒక్కడినే చంపితే సరిపోదు అని అతడు అనుకున్నాడు. బదులుగా హామాను, అహష్వేరోషు రాజ్యమంతటిలో ఉన్న మొర్దెకై ప్రజలను అనగా యూదులందరిని నాశనం చేసే మార్గం కోసం ఆలోచించాడు.
EST 3:7 రాజైన అహష్వేరోషు పరిపాలనలోని పన్నెండవ ఏట, మొదటి నెల అయిన నీసానులో హామాను సమక్షంలో ఏ నెల ఏ రోజున అలా చేయాలో అని పర్షియా భాషలో పూరు, అనగా చీటి వేశారు. ఆ చీటిలో అదారు అనే పన్నెండవ నెల వచ్చింది.
EST 3:8 అప్పుడు హామాను రాజైన అహష్వేరోషుతో ఇలా అన్నాడు, “మీ రాజ్యంలోని సంస్థానాలన్నిటిలో ఉండే ప్రజల్లో ఉన్న ఒక జాతి ప్రజలు వేరుగా ఉంటున్నారు. వారి చట్టాలు ఇతర ప్రజల చట్టాలకు వేరుగా ఉన్నాయి; వారు రాజు శాసనాలను పాటించరు; అలా వారిని సహించడం రాజుకు అంత మంచిది కాదు.
EST 3:9 ఒకవేళ రాజుకు ఇష్టమైతే, వారిని నాశనం చేయడానికి ఓ శాసనం జారీ చేయండి, నేను పదివేల తలాంతుల వెండిని రాజ్య ఖజానా కోసం రాజ నిర్వాహకులకు ఇస్తాను.”
EST 3:10 కాబట్టి రాజు తన చేతికున్న ముద్ర ఉంగరం తీసి అగగీయుడైన హమ్మెదాతా కుమారుడైన హామానుకు ఇచ్చాడు, ఇతడు యూదులకు శత్రువు.
EST 3:11 రాజు హామానుతో, “డబ్బు నీ దగ్గర పెట్టుకో, నీకు ఏది ఇష్టమో, అది ప్రజలకు చేయి” అన్నాడు.
EST 3:12 తర్వాత మొదటి నెల పదమూడవ రోజున రాజ కార్యదర్శులను పిలిపించారు. వారు హామాను ఆజ్ఞలన్నిటిని రాజు సంస్థానాధిపతులకు, సంస్థానాధికారులకు, ఆ సంస్థానాల్లోని ప్రజల అధిపతులకు, అధికారులకు వారి వారి లిపిలో వారి భాషలో వ్రాసి పంపాలని ఆజ్ఞాపించారు. వాటిని రాజైన అహష్వేరోషు పేరిట వ్రాసి వాటిపై రాజు ఉంగరంతో ముద్ర వేశారు.
EST 3:13 అదారు అనే పన్నెండవ నెల పదమూడవ రోజున యువకుల నుండి ముసలివారి వరకూ స్త్రీలు, పిల్లలు అని తేడా లేకుండా ఒకే రోజులోనే యూదులనందరిని చంపి నాశనం చేసి, వారి ఆస్తులను దోచుకోవాలని శాసనాలు వార్తాహరుల ద్వారా రాజు సంస్థానాలన్నిటికి పంపబడ్డాయి.
EST 3:14 ఆ రోజు కోసం అందరు సిద్ధంగా ఉండేలా ఆ ఆజ్ఞ ఉన్న ప్రతులను ప్రతి సంస్థానంలో ఉన్న ప్రజలందరికి పంపించారు.
EST 3:15 అది రాజాజ్ఞ కాబట్టి వార్తాహరులు వెంటనే బయలుదేరి వెళ్లారు. ఆ ఆజ్ఞ షూషను కోటలో అందించడం జరిగింది. రాజు, హామాను త్రాగడానికి కూర్చుకున్నారు, కాని షూషను పట్టణం ఆందోళనగా ఉంది.
EST 4:1 మొర్దెకై జరిగిందంతా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని వేదనతో గట్టిగా ఏడుస్తూ పట్టణంలోనికి వెళ్లాడు.
EST 4:2 అయితే అతడు రాజభవన ద్వారం వరకు మాత్రమే వెళ్లాడు, ఎందుకంటే గోనెపట్ట కట్టుకున్న వారెవరికి భవనం లోనికి వెళ్లడానికి అనుమతి లేదు.
EST 4:3 రాజు శాసనం, ఆదేశం వెళ్లిన ప్రతి సంస్థానంలో ఉన్న యూదులంతా ఉపవాసం ఉండి ఏడుస్తూ వేదనతో తీవ్రమైన దుఃఖంతో ఉన్నారు. చాలామంది గోనెపట్ట కట్టుకుని బూడిద పోసుకొని ఉన్నారు.
EST 4:4 ఎస్తేరు రాణి యొక్క నపుంసకులు, చెలికత్తెలు వచ్చి మొర్దెకై గురించి చెప్పినప్పుడు ఆమె తీవ్ర వేదనకు గురైంది. గోనెపట్ట తీసివేయమని చెప్పి కట్టుకోవడానికి అతనికి బట్టలు పంపించింది, కాని అతడు వాటిని తీసుకోలేదు.
EST 4:5 అప్పుడు ఎస్తేరు, మొర్దెకైను అంత బాధ పెడుతున్న విషయం ఏమిటో తెలుసుకోమని రాజు ఆమె కోసం నియమించిన నపుంసకులలో హతాకు అనే అతన్ని పంపింది.
EST 4:6 కాబట్టి హతాకు రాజభవన ద్వారం ఎదురుగా నగర వీధిలో ఉన్న మొర్దెకై దగ్గరకు వెళ్లాడు.
EST 4:7 మొర్దెకై తనకు జరిగిందంతా చెప్పాడు, యూదులను నాశనం చేయడానికి హామాను రాజు ఖజానాకు ఇస్తానన్న డబ్బు మొత్తం ఎంతో అతనికి తెలిపాడు.
EST 4:8 తమను నిర్మూలం చేయమని షూషనులో ప్రకటించిన శాసనం యొక్క నకలు కూడా అతనికి ఇచ్చి దానిని ఎస్తేరుకు చూపించి వివరించమని చెప్పాడు; ఆమె రాజు సముఖానికి వెళ్లి తన ప్రజల పట్ల దయ చూపించేలా రాజును వేడుకోమని చెప్పమని మొర్దెకై అతనితో చెప్పాడు.
EST 4:9 హతాకు తిరిగివెళ్లి, మొర్దెకై చెప్పిందంతా ఎస్తేరుకు చెప్పాడు.
EST 4:10 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఇలా చెప్పమని హతాకును పంపించింది:
EST 4:11 “రాజు పిలువకుండా పురుషుడు గాని స్త్రీ గాని రాజు యొక్క అంతఃపురం లోనికి వెళ్తే, రాజు తన బంగారు దండాన్ని వారివైపు చాపి వారిని బ్రతకనిస్తే తప్ప లేకపోతే వారు చంపబడాలి అనే ఒక చట్టం ఉందని రాజు అధికారులందరికి, రాజ్య సంస్థానాలలో ఉన్న ప్రజలందరికి తెలుసు. అయితే ముప్పై రోజులుగా నేను రాజు దగ్గరకు వెళ్లడానికి నాకు పిలుపు రాలేదు.”
EST 4:12 ఎస్తేరు చెప్పిన మాటలు మొర్దెకైకి తెలియజేయబడినప్పుడు,
EST 4:13 మొర్దెకై ఎస్తేరుకు మళ్ళీ ఈ జవాబు పంపాడు: “నీవు రాజభవనంలో ఉన్నావు కాబట్టి యూదులందరిలో నీవు మాత్రమే రక్షింపబడతావు అని అనుకోకు.
EST 4:14 నీవు మౌనంగా ఉంటే, యూదులకు ఉపశమనం, విడుదల వేరే స్థలం నుండి వస్తుంది, అయితే నీవు, నీ తండ్రి కుటుంబం నశిస్తుంది. నీవు ఇలాంటి సమయం కొరకే నీ రాజ్య స్థానంలోనికి వచ్చావేమో ఎవరికి తెలుసు?”
EST 4:15 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకు ఈ జవాబు పంపింది:
EST 4:16 “వెళ్లండి, షూషనులో ఉన్న యూదులందరిని సమకూర్చి నా కోసం ఉపవాసం ఉండమని చెప్పండి. మూడు రోజులపాటు ఏమీ తినవద్దు త్రాగవద్దు. నేను, నా సేవకులు కూడా మీరు చేసినట్లు ఉపవాసం పాటిస్తాము. ఇలా చేసిన తర్వాత నేను రాజు దగ్గరకు వెళ్తాను అది చట్టానికి విరుద్ధమైనా ఫర్వాలేదు. నేను చస్తే చస్తాను.”
EST 4:17 కాబట్టి మొర్దెకై వెళ్లి ఎస్తేరు తనకు చెప్పినట్లే చేశాడు.
EST 5:1 మూడవ రోజు ఎస్తేరు తన రాజవస్త్రాలు ధరించి, రాజభవనం లోపలి ఆవరణంలో రాజు గది దగ్గర నిలబడింది. ద్వారానికి ఎదురుగా రాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు.
EST 5:2 ఆవరణంలో ఎస్తేరు రాణి నిలబడి ఉండడం రాజు చూసినప్పుడు, అతనికి ఆమె పట్ల ఇష్టం కలిగి, తన చేతిలో ఉన్న బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఎస్తేరు సమీపించి, ఆ దండం యొక్క అంచును ముట్టుకుంది.
EST 5:3 అప్పుడు రాజు, “ఎస్తేరు రాణి, ఏంటి విషయం? నీ మనవి ఏంటి? రాజ్యంలో సగమైనా సరే, నీకు ఇవ్వబడుతుంది” అని అన్నాడు.
EST 5:4 ఎస్తేరు జవాబిస్తూ, “రాజుకు ఇష్టమైతే, ఈ రోజు నేను రాజు కోసం సిద్ధం చేయించిన విందుకు మీరు హామానుతో పాటు రావాలి” అన్నది.
EST 5:5 రాజు తన సేవకులతో, “ఎస్తేరు అడిగింది జరిగేలా వెంటనే హామానును తీసుకురండి” అన్నాడు. కాబట్టి రాజు, హామాను, ఎస్తేరు చేయించిన విందుకు వెళ్లారు.
EST 5:6 వారు ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు రాజు మరలా ఎస్తేరుతో, “నీ విన్నపం ఏంటి? అది నీకు ఇస్తాను. నీ మనవి ఏంటి? రాజ్యంలో సగం అడిగినా సరే నీకు ఇస్తాను” అన్నాడు.
EST 5:7 ఎస్తేరు జవాబిస్తూ, “నా విన్నపం, నా మనవి ఇది:
EST 5:8 రాజుకు నాపై దయ కలిగి, నా అభ్యర్థనను మన్నించి నా మనవిని నెరవేరుస్తానంటే, నేను మీకోసం రేపు ఏర్పాటు చేసే విందుకు రాజైన మీరు, హామాను రావాలి. అప్పుడు నేను రాజు ప్రశ్నకు జవాబిస్తాను” అన్నది.
EST 5:9 హామాను ఆ రోజు మహానందంతో బయటకు వెళ్లాడు. కాని, రాజభవన ద్వారం దగ్గర ఉన్న మొర్దెకై తనను చూసి కూడా లేచి నిలబడలేదని తన ఎదుట ఎలాంటి భయం చూపించలేదని చూసి అతనికి మొర్దెకై మీద తీవ్రమైన కోపం వచ్చింది.
EST 5:10 అయినా హామాను తనను తాను నిగ్రహించుకొని ఇంటికి వెళ్లాడు. తన స్నేహితులను, తన భార్యయైన జెరెషును పిలిచి,
EST 5:11 హామాను గర్వంగా తనకున్న విస్తారమైన ఐశ్వర్యం గురించి, తనకున్న ఎంతోమంది కుమారుల గురించి, రాజు తనను ఎన్ని విధాలుగా ఘనపరిచాడో, ఎలా తనను ఇతర సంస్థానాధిపతుల ఎదుట గౌరవించాడో వారికి గొప్పగా చెప్పుకున్నాడు.
EST 5:12 హామాను ఇంకా మాట్లాడుతూ, “అంతేకాదు, ఎస్తేరు రాణి, తాను ఇస్తున్న విందుకు రాజుతో పాటు రమ్మని నన్ను మాత్రమే పిలిచింది. రేపు విందుకు రాజుతో రమ్మని నన్ను ఆహ్వానించింది.
EST 5:13 అయితే, రాజ ద్వారం దగ్గర కూర్చున్న యూదుడైన మొర్దెకైను చూసినంత కాలం ఇదంతా నాకు సంతృప్తినివ్వదు” అని అన్నాడు.
EST 5:14 అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరు, “యాభై మూరల ఎత్తుగల ఉరికంబం చేయించు. రేపు ఉదయం మొర్దెకైను దాని మీద ఉరి తీయమని రాజుకు చెప్పు. తర్వాత రాజుతో పాటు విందుకు వెళ్లి ఆనందించు” అని అతనికి చెప్పారు. ఈ సలహా హామానుకు నచ్చింది, కాబట్టి అతడు ఉరికంబం చేయించాడు.
EST 6:1 ఆ రాత్రి రాజుకు నిద్రపట్టలేదు; కాబట్టి తన పాలన గురించి ఉన్న రాజ్య చరిత్ర గ్రంథం తెప్పించి, చదివించుకున్నాడు.
EST 6:2 అందులో రాజభవన ద్వారపాలకులైన బిగ్తాన్, తెరెషు అనే ఇద్దరు రాజ్యాధికారులు అహష్వేరోషు రాజును చంపడానికి కుట్రపన్నిన సంగతిని మొర్దెకై తెలియజేసినట్లు వ్రాయబడి ఉంది.
EST 6:3 రాజు, “దీని కోసం మొర్దెకై పొందుకున్న ఘనత, గుర్తింపు ఏంటి?” అని అడిగాడు. అందుకు అతని సేవకులు, “అతని కోసం ఏమి చేయలేదు” అన్నారు.
EST 6:4 రాజు, “ఆవరణంలో ఉన్నది ఎవరు?” అని అడిగాడు. అప్పుడే హామాను, తాను సిద్ధపరచిన ఉరికంబం మీద మొర్దెకైను ఉరితీయడం గురించి రాజుతో మాట్లాడడానికి బయట ఆవరణంలోకి ప్రవేశించాడు.
EST 6:5 రాజు సేవకులు, “హామాను ఆవరణంలో నిలబడ్డాడు” అని చెప్పారు. వెంటనే, “అతన్ని లోనికి తీసుకురండి” అని రాజు ఆదేశించాడు.
EST 6:6 హామాను లోపలికి వచ్చినప్పుడు, “రాజు ఒకరిని సన్మానం చేయాలని ఇష్టపడితే ఆ మనిషికి ఏమి చేయాలి?” అని రాజు అతన్ని అడిగాడు. హామాను, “నన్ను కాకుండా రాజు ఇంకెవరిని సన్మానిస్తాడు?” అని తనలో తాను అనుకున్నాడు.
EST 6:7 కాబట్టి హామాను రాజుతో, “రాజు సన్మానించాలని అనుకునే వ్యక్తి కోసం,
EST 6:8 రాజు ధరించుకునే రాజవస్ర్తాలను, రాజు స్వారీ చేసే గుర్రాన్ని, రాజు తలమీద పెట్టుకునే రాజకిరీటాన్ని తీసుకురావాలి.
EST 6:9 తర్వాత ఆ రాజవస్త్రాన్ని ఆ గుర్రాన్ని రాజు యొక్క అత్యంత ఘనులైన ఓ అధిపతికి అప్పగించాలి. రాజు సన్మానించాలని అనుకున్న ఆ వ్యక్తికి ఆ రాజ వస్త్రం వేయించి ఆ గుర్రం మీద నగర వీధుల్లో త్రిప్పుతూ, ‘రాజు ఒక వ్యక్తిని సన్మానించాలని ఇష్టపడితే ఆ వ్యక్తికి ఇలా చేయబడుతుంది!’ అని అంటూ ఆ వ్యక్తి ఎదుట చాటాలి” అని అన్నాడు.
EST 6:10 అందుకు రాజు, “త్వరగా వెళ్లు, నీవు చెప్పినట్టే రాజ వస్త్రం, గుర్రం తీసుకుని, రాజ ద్వారం దగ్గర కూర్చుని ఉండే యూదుడైన మొర్దెకైకి చేయి. నీవు చెప్పింది ఏదైన మానకు” అని హామానుకు ఆజ్ఞాపించాడు.
EST 6:11 కాబట్టి హామాను రాజవస్త్రాలు, గుర్రం తీసుకువచ్చి మొర్దెకైకు ఆ వస్త్రాలు ధరింపజేసి గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి నగర వీధుల్లో వెళ్తూ, “రాజు ఓ వ్యక్తిని సన్మానించాలని ఇష్టపడితే ఇలా అతనికి చేయబడుతుంది!” అని అంటూ ఊరేగింపు చేశాడు.
EST 6:12 తర్వాత మొర్దెకై రాజ ద్వారం దగ్గరకు తిరిగి వచ్చాడు. కాని హామాను దుఃఖంతో తల కప్పుకుని వేగంగా ఇంటికి వెళ్లి,
EST 6:13 హామాను తనకు జరిగిందంతా తన భార్య జెరషుకు, తన స్నేహితులందరికి తెలియజేశాడు. అతని సలహాదారులు, అతని భార్య జెరెషు అతనితో అన్నారు, “ఎవరి ఎదుట నీ పతనం ప్రారంభమైందో, ఆ మొర్దెకై యూదుడు కాబట్టి, అతని ఎదుట నీవు నిలబడలేవు, నీవు ఖచ్చితంగా పడిపోతావు.”
EST 6:14 వారింకా మాట్లాడుకుంటున్నప్పుడు, రాజు యొక్క నపుంసకులు వచ్చి, ఎస్తేరు రాణి చేయించిన విందుకు రమ్మని హామానును తొందరపెట్టారు.
EST 7:1 కాబట్టి రాజు హామాను ఇద్దరూ కలిసి, ఎస్తేరు రాణి యొక్క విందుకు వెళ్లారు.
EST 7:2 వారు రెండవ రోజు ద్రాక్షరసం త్రాగుతుండగా రాజు మరలా, “ఎస్తేరు రాణి, నీ విన్నపం ఏంటి? అది నీకు ఇస్తాను. నీ మనవి ఏంటి? రాజ్యంలో సగమైనా సరే, నీకు ఇవ్వబడుతుంది” అని అన్నాడు.
EST 7:3 అప్పుడు ఎస్తేరు రాణి, “ఒకవేళ రాజుకు నా మీద దయ కలిగితే మీకు సరే అనిపిస్తే, నా విన్నపాన్ని బట్టి నా ప్రాణాన్ని, నా మనవిని బట్టి నా ప్రజలను వదిలేయండి.
EST 7:4 ఎందుకంటే నేను, నా ప్రజలు నాశనం చేయబడడానికి, చంపబడడానికి, నిర్మూలించబడడానికి అమ్మబడ్డాము. ఒకవేళ మేము కేవలం దాసదాసీలుగా అమ్మబడి ఉంటే, నేను మౌనంగా ఉండేదాన్ని, ఎందుకంటే అలాంటి బాధ కోసం రాజును అభ్యంతర పెట్టడం భావ్యం కాదు” అని అన్నది.
EST 7:5 అందుకు రాజైన అహష్వేరోషు ఎస్తేరు రాణిని, “అలా చేయడానికి తెగించినవాడు ఎవడు? వాడెక్కడ?” అని అడిగాడు.
EST 7:6 అందుకు ఎస్తేరు అన్నది, “ఆ విరోధి, శత్రువు, ఈ దుష్టుడైన హామానే!” అప్పుడు హామాను, రాజు రాణి ముందు భయంతో వణికిపోయాడు.
EST 7:7 రాజు ఆవేశంతో లేచి, ద్రాక్షరసం వదిలి రాజభవన తోటలోకి వెళ్లాడు. అయితే రాజు తనకు హాని చేయాలని నిర్ణయించాడని గ్రహించిన హామాను తన ప్రాణాల కోసం ఎస్తేరు రాణిని బ్రతిమాలడానికి అక్కడే ఉండిపోయాడు.
EST 7:8 తోటలో నుండి రాజు విందుశాలకు వచ్చాడు, ఆ సమయంలో హామాను ఎస్తేరు రాణి కూర్చున్న మంచం పైన పడి ఉండడం చూశాడు. రాజు ఆవేశంతో, “ఇంట్లో రాణి నాతో ఉండగానే వీడు రాణి మీద అత్యాచారం చేస్తాడా?” అని అన్నాడు. రాజు నోటి నుండి ఆ మాట రావడంతోనే సైనికులు హామాను ముఖానికి ముసుగు వేశారు.
EST 7:9 రాజు సేవచేసే నపుంసకులలో హర్బోనా అనే ఒకడు, “నిజానికి, రాజు తరపున మాట్లాడిన మొర్దెకైని చంపించడానికి హామాను తన ఇంటి వద్ద యాభై మూరల ఒక ఉరికంబాన్ని చేయించాడు” అని చెప్పాడు. వెంటనే రాజు, “దానిమీదే అతన్ని ఉరితీయండి” అని అన్నాడు.
EST 7:10 మొర్దెకై కోసం హామాను చేయించిన ఉరికంబం మీద హామానును ఉరితీశారు. అప్పుడు రాజు కోపం చల్లారింది.
EST 8:1 అదే రోజు రాజైన అహష్వేరోషు యూదుల శత్రువైన హామాను ఇంటిని ఎస్తేరు రాణికి ఇచ్చాడు. మొర్దెకైతో తనకున్న బంధుత్వం గురించి ఎస్తేరు రాజుకు చెప్పింది. మొర్దెకై రాజు సముఖంలోకి వచ్చాడు.
EST 8:2 రాజు హామాను నుండి తిరిగి తీసుకున్న తన ముద్ర ఉగరం తీసి మొర్దెకైకి ఇచ్చాడు. ఎస్తేరు అతన్ని హామాను ఆస్తుల మీద అధికారిగా నియమించింది.
EST 8:3 ఎస్తేరు రాజు పాదాల మీద పడి ఏడుస్తూ, తిరిగి మనవి చేసింది. అగగీయుడైన హామాను యూదులకు విరుద్ధంగా చేసిన కీడు ప్రణాళికను భంగం చేయాలని వేడుకొంది.
EST 8:4 అప్పుడు రాజు తన బంగారు రాజదండం ఎస్తేరు వైపు చూపాడు, ఆమె లేచి అతని ఎదుట నిలబడింది.
EST 8:5 ఆమె, “ఒకవేళ రాజుకు ఇష్టమైతే, నాపై దయ కలిగితే, అలా చేయడం సరియైనదని రాజు అనుకుంటే, అగగీయుడు, హమ్మెదాతా కుమారుడైన హామాను కుట్రపన్ని, రాజు సంస్థానాలలో ఉన్న యూదులను నిర్మూలం చేయాలని వ్రాయించిన తాకీదులను రద్దు చేయడానికి ఆజ్ఞ ఇవ్వండి.
EST 8:6 ఎందుకంటే, నా ప్రజలమీదికి రాబోతున్న కీడును, నా వంశం మీదికి వచ్చే నాశనాన్ని నేనెలా ఎలా భరించగలను?” అన్నది.
EST 8:7 రాజైన అహష్వేరోషు ఎస్తేరు రాణికి, యూదుడైన మొర్దెకైకి జవాబిస్తూ అన్నాడు, “హామాను యూదులపై దాడి చేసినందుకు నేను అతని ఆస్తిని ఎస్తేరుకు ఇచ్చాను. అతడు సిద్ధం చేసిన స్తంభానికి అతన్ని వ్రేలాడదీశారు.
EST 8:8 రాజు పేరిట వ్రాయబడి అతని ఉంగరంతో ముద్ర వేసిన ఏ తాకీదు రద్దు చేయబడదు. కాబట్టి మీకు నచ్చినట్లు యూదుల పక్షాన రాజు పేరిట మరొక శాసనాన్ని వ్రాసి రాజముద్ర వేయండి.”
EST 8:9 సీవాను అనే మూడవ నెల ఇరవై మూడవ రోజున రాజ్య లేఖికులు రు. వారు మొర్దెకై ఆదేశాల ప్రకారం, ఇండియా నుండి కూషు వరకు ఉన్న మొత్తం నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న యూదులకు, సంస్థానాధిపతులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రముఖులకు వారి వారి భాషలో లిపిలో, యూదులకు కూడా వారి సొంత లిపిలో భాషలో తాకీదులు వ్రాశారు.
EST 8:10 మొర్దెకై రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులను వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి, రాజు సేవకు ప్రత్యేకంగా ఉపయోగించే గుర్రాలపై వేగంగా స్వారీ చేసే వార్తాహరులతో వాటిని పంపాడు.
EST 8:11 రాజు ఆదేశం, యూదులు ప్రతి పట్టణంలో తమను తాము కాపాడుకునే హక్కు కలిగించింది; వారి మీద, వారి స్త్రీల మీద, పిల్లల మీద దాడి చేసే ఏ జాతి వారినైనా, ఏ సంస్థానం వారినైనా, వారు నాశనం చేయవచ్చు, చంపవచ్చు, నిర్మూలించవచ్చు, వారి శత్రువుల ఆస్తిని కొల్లగొట్టవచ్చు.
EST 8:12 రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో యూదులు ఇలా చేయడానికి నియమించబడిన రోజు అదారు నెల అనే పన్నెండవ నెల, పదమూడవ రోజు.
EST 8:13 ఆ రోజున యూదులు తమ శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడేలా ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి అన్ని సంస్థానాలలో ఉన్న ప్రజలందరికి పంపాలని ఆజ్ఞ ఇవ్వబడింది.
EST 8:14 రాజాజ్ఞ ప్రకారం వార్తాహరులు, రాజ్య గుర్రాల మీద వేగంగా స్వారీ చేస్తూ వెళ్లి, ఆ శాసనాలను షూషను కోటలో అందజేశారు.
EST 8:15 మొర్దెకై రాజు దగ్గర నుండి బయలుదేరినప్పుడు, అతడు నీలి తెలుపు రంగుల రాజ వస్త్రం పెద్ద బంగారు కిరీటం శ్రేష్ఠమైన ఊదా రంగు సన్నని నారతో చేయబడిన వస్త్రం ధరించాడు. షూషను పట్టణం ఎంతో ఆనందంతో సంబరపడింది.
EST 8:16 యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం.
EST 8:17 రాజు తాకీదులు అందిన ప్రతి సంస్థానంలో, ప్రతి పట్టణంలో యూదులలో ఆనందం, ఉత్సాహం ఉంది, వారు విందు చేసుకుని సంబరపడ్డారు. ఇతర దేశాల ప్రజలు ఎంతోమంది యూదుల భయం పట్టుకుని యూదులుగా మారారు.
EST 9:1 అదారు అనే పన్నెండవ నెల, పదమూడవ రోజున, రాజు శాసనం అమల్లోకి వచ్చింది. ఈ రోజున యూదుల శత్రువులు వారిని జయించగలమని నిరీక్షించారు కాని దానికి భిన్నంగా జరిగింది, యూదులు తమను ద్వేషించేవారి మీద పైచేయి కలిగి ఉన్నారు.
EST 9:2 యూదులు రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో తమ పట్టణాల్లో సమావేశమై, వారిని నాశనం చేయాలని నిర్ణయించుకున్న వారిపై దాడి చేశారు. వారి ఎదుట ఎవరూ నిలువలేకపోయారు, ఎందుకంటే ఇతర దేశాల ప్రజలందరు వారికి భయపడ్డారు.
EST 9:3 సంస్థానాధిపతులు, సామంత రాజులు, ప్రభుత్వ అధికారులు, రాజ్య అధికారులు, అందరు మొర్దెకై అంటే భయంతో యూదులకు సహాయపడ్డారు.
EST 9:4 మొర్దెకై రాజభవనంలో ప్రముఖుడయ్యాడు; అతని కీర్తి సంస్థానాలన్నిటిలో వ్యాపించింది, అతడు అంతకంతకు శక్తిగలవాడయ్యాడు.
EST 9:5 యూదులు తమ శత్రువులందరి మీద ఖడ్గంతో దాడి చేసి చంపి నాశనం చేసి, తమను ద్వేషించిన వారికి తమకు ఇష్టమైనట్టుగా చేశారు.
EST 9:6 షూషను కోటలో యూదులు అయిదువందల మంది మనుష్యులను చంపి నాశనం చేశారు.
EST 9:7 వారు పర్షందాతా దల్ఫోను అస్పాతా పోరాతా అదల్యా అదీదాతా పర్మష్తా అరీసై అరీదై వైజాతాలను కూడా చంపారు.
EST 9:10 ఈ పదిమంది యూదుల శత్రువైన హమ్మెదాతా కుమారుడైన హామాను కుమారులు. అయితే వారు వారి దోపుడుసొమ్మును ముట్టలేదు.
EST 9:11 షూషను కోటలో చంపబడినవారి సంఖ్య ఆ రోజే రాజుకు చెప్పారు.
EST 9:12 రాజు ఎస్తేరు రాణితో, “యూదులు షూషను కోటలో అయిదువందల మందిని హామాను పదిమంది కుమారులను చంపారు. రాజు యొక్క ఇతర సంస్థానాలలో ఏమి జరిగింది? ఇప్పుడు నీ మనవి ఏంటి? అది నీకు ఇస్తాను. నీ కోరిక ఏంటి? అది కూడా చేస్తాను” అన్నాడు.
EST 9:13 ఎస్తేరు జవాబిస్తూ, “ఒకవేళ రాజుకు ఇష్టమైతే, ఈ శాసనం రేపు కూడా షూషనులో ఉన్న యూదులు చేసేలా అనుమతి ఇచ్చి హామాను పదిమంది కుమారులు ఉరికంబం మీద వ్రేలాడదీయబడేలా చేయండి” అని చెప్పింది.
EST 9:14 కాబట్టి అలా చేయమని రాజు ఆజ్ఞాపించాడు. షూషనులో ఆజ్ఞ జారీ చేయబడింది, వారు హామాను యొక్క పదిమంది కుమారులను ఉరితీశారు.
EST 9:15 అదారు నెల పద్నాలుగవ రోజున యూదులు షూషనులో సమకూడి, షూషనులో మూడువందలమంది మనుష్యులను చంపారు. కాని వారి దోపుడుసొమ్మును ముట్టలేదు.
EST 9:16 అంతలో, రాజు సంస్థానాలలో ఉన్న మిగితా యూదులు కూడా తమను తాము కాపాడుకోడానికి సమకూడి శత్రువుల నుండి ఉపశమనం పొందుకున్నారు.వారు డెబ్బై అయిదువేల మందిని చంపారు కాని వారి దోపుడుసొమ్మును ముట్టలేదు.
EST 9:17 ఇది అదారు నెల పదమూడవ రోజున జరిగింది. పద్నాలుగవ రోజు వారు విశ్రమించి ఆ రోజున విందు చేసుకుని ఆనందించారు.
EST 9:18 అయితే షూషనులో ఉన్న యూదులు పదమూడు, పద్నాలుగవ రోజులు కూడుకుని, పదిహేనవ రోజున విశ్రమించి, ఆ రోజున విందు చేసుకుని ఆనందించారు.
EST 9:19 గ్రామాల్లో నివసించే పల్లెవాసులైన యూదులు అదారు నెల పద్నాలుగవ రోజున విందు చేసుకుని ఆనందించే రోజుగా జరుపుకుంటారు, ఆ రోజు ఒకరికి ఒకరు బహుమానాలు ఇచ్చుకుంటారు.
EST 9:20 మొర్దెకై ఈ సంగతులన్ని నమోదు చేసి, రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటికి దగ్గరలో దూరంలో నివసిస్తున్న యూదులందరికి ఉత్తరాలు పంపాడు.
EST 9:21 యూదులు తమ శత్రువుల నుండి ఉపశమనం పొందుకున్నారు, తమ బాధ సంతోషంగా మారింది, తమ దుఃఖం ఆనందించే రోజుగా మారింది కాబట్టి ప్రతి ఏట అదారు నెల పద్నాలుగు, పదిహేను రోజుల్లో వార్షిక పండగ జరుపుకోవాలని అతడు వ్రాశాడు. ఆ రోజులు విందు చేసుకుని ఆనందించే రోజులుగా, ఒకరికి ఒకరు ఆహార బహుమానాలు ఇచ్చుకునే రోజులుగా, పేదలకు బహుమానాలు ఇచ్చే రోజులుగా జరుపుకోవాలాని అతడు వారికి వ్రాశాడు.
EST 9:23 కాబట్టి యూదులు మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారం తాము ప్రారంభించిన ఉత్సవం కొనసాగిస్తామని ఒప్పుకున్నారు.
EST 9:24 యూదులందరికి శత్రువైన అగగీయుడు హమ్మెదాతా కుమారుడైన హామాను యూదులను నాశనం చేయడానికి కుట్రపన్ని, వారిని నాశనం చేసి, నిర్మూలించడానికి పూరు (అనగా, చీట్లు) వేశాడు.
EST 9:25 అయితే ఈ కుట్ర గురించి రాజుకు తెలిసినప్పుడు, అతడు హామాను యూదులకు వ్యతిరేకంగా తలపెట్టిన కీడు అతని మీదికే వచ్చేలా చేసి, అతన్ని అతని కుమారులను ఉరికంబాలకు వ్రేలాడదీయాలని రాజు వ్రాతపూర్వక ఆదేశాలు జారీ చేశాడు.
EST 9:26 (అందువల్ల ఈ రోజులకు పూరు అనే పదం నుండి వచ్చిన పూరీము అని పేరు వచ్చింది.) ఈ ఉత్తరంలో వ్రాయబడిన ప్రతి విషయం బట్టి, వారు చూసిన, తమకు జరిగిన వాటిని బట్టి, వారు ఏమి చూశారో, వారికి ఏమి జరిగిందో దానిని బట్టి,
EST 9:27 యూదులు ప్రతి సంవత్సరం ఈ రెండు రోజులను ఒక ఆచారంగా నిర్ణయించిన విధానంలో నియమించిన సమయంలో తాము తమ వారసులు, తమతో కలిసే వారందరితో ఖచ్చితంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
EST 9:28 తరతరాల వరకు ప్రతి సంస్థానంలో, ప్రతి పట్టణంలో, ప్రతి కుటుంబం ద్వారా వచ్చే ప్రతి తరం వారు ఈ రోజులను జ్ఞాపకం చేసుకుని ఉత్సవంగా జరుపుకోవాలి. యూదులు ఈ పూరీము రోజులు పాటించకుండా ఉండకూడదు. ఈ రోజుల జ్ఞాపకం వారి వారసులు ఎన్నడూ మరచిపోకూడదు.
EST 9:29 కాబట్టి అబీహయిలు కుమార్తెయైన ఎస్తేరు రాణి, యూదుడైన మొర్దెకైతో కలిసి పూరీము గురించి ఈ రెండవ లేఖను ధృవీకరించడానికి పూర్తి అధికారంతో వ్రాశారు.
EST 9:30 అహష్వేరోషు సామ్రాజ్యంలో 127 సంస్థానాలలో ఉన్న యూదులందరికి క్షేమం, నమ్మకం కలిగించే మాటలతో కూడిన ఉత్తరాన్ని మొర్దెకై పంపాడు.
EST 9:31 యూదుడైన మొర్దెకై ఎస్తేరు రాణి శాసించిన విధంగా పూరీము దినాలను వాటి సమయాల్లో జరిగేలా నిర్ధారించినట్లే వారు తమ కోసం తమ వారసుల కోసం ఉపవాస విలాప దినాలను పాటించే బాధ్యత తీసుకున్నారు.
EST 9:32 ఎస్తేరు శాసనం వలన పూరీము గురించిన ఈ నిబంధనలు నిర్ధారించబడి చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడ్డాయి.
EST 10:1 అహష్వేరోషు రాజు తన సామ్రాజ్యమంతట, సముద్ర తీరాల వరకు కప్పం విధించాడు.
EST 10:2 అతని బలప్రభావాలుగల చర్యలు, రాజు హెచ్చించిన మొర్దెకై యొక్క గొప్పతనం యొక్క పూర్తి వివరాలు, మాదీయులు, పర్షియా రాజుల చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడలేదా?
EST 10:3 రాజైన అహష్వేరోషుకు రెండవ స్థానంలో యూదుడైన మొర్దెకై ఉన్నాడు, అతడు యూదులలో ప్రముఖునిగా, తన తోటి యూదులైన ఎంతోమంది ద్వారా గౌరవం పొందుకున్నాడు, ఎందుకంటే తన ప్రజల క్షేమాన్ని విచారిస్తూ, యూదులందరి యొక్క శ్రేయస్సు కోసం మాట్లాడేవాడు.
JOB 1:1 ఊజు దేశంలో యోబు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు నిర్దోషమైనవాడు, యథార్థవంతుడు; దేవుడంటే భయం కలిగి చెడుకు దూరంగా ఉండేవాడు.
JOB 1:2 అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు,
JOB 1:3 అతనికి ఏడువేల గొర్రెలు, మూడువేల ఒంటెలు, అయిదువందల జతల ఎద్దులు, అయిదువందల ఆడగాడిదలు ఉన్నాయి, అతనికి ఎందరో సేవకులు ఉన్నారు. తూర్పున ఉన్నవారందరిలో యోబు చాలా గొప్పవాడు.
JOB 1:4 అతని కుమారులు తమ ఇళ్ళలో ప్రత్యేక సందర్భాలలో విందులు చేసుకునేవారు తమతో కలిసి తిని త్రాగడానికి తమ ముగ్గురు అక్కచెల్లెళ్లను కూడా పిలిచేవారు.
JOB 1:5 విందులు ముగిసిన వెంటనే యోబు, “నా పిల్లలు పాపం చేసి తమ హృదయాల్లో దేవుని శపించారేమో” అని అనుకుని వారందరిని పిలిపించి పవిత్రపరచడానికి ఏర్పాట్లు చేసేవాడు. తెల్లవారుజామునే తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం దహనబలి అర్పించేవాడు. యోబు నిత్యం అలా చేస్తూ ఉండేవాడు.
JOB 1:6 ఒక రోజు దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు, సాతాను కూడా వారితో కలిసి వచ్చాడు.
JOB 1:7 యెహోవా, “నీవెక్కడ నుండి వస్తున్నావు?” అని సాతానును అడిగారు. సాతాను, “భూమి మీద అటూ ఇటూ తిరుగుతూ భూమంతా తిరిగి వస్తున్నాను” అని జవాబిచ్చాడు.
JOB 1:8 అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు గమనించావా? అతనిలాంటి వ్యక్తి భూమిమీద లేడు; అతడు నిందలేనివాడు, యథార్థవంతుడు, దేవుని భయం కలిగి చెడుకు దూరంగా ఉంటాడు” అన్నారు.
JOB 1:9 సాతాను, “యోబు ఏమి లేకుండానే దేవుని పట్ల భయం కలిగి ఉన్నాడా?
JOB 1:10 అతని చుట్టూ అతని కుటుంబం చుట్టూ, అతడు కలిగి ఉన్న దానంతటి చుట్టూ మీరు కంచె వేయలేదా? అతని చేతి పనులను మీరు దీవించడం వలన అతని పశువులు, మందలు దేశమంతా విస్తరించాయి.
JOB 1:11 అయితే ఇప్పుడు చేయి చాపి అతని సర్వస్వాన్ని మొత్తి చూడండి, తప్పకుండా మిమ్మల్ని మీ ముఖంపై శపిస్తాడు” అని జవాబిచ్చాడు.
JOB 1:12 అందుకు యెహోవా, “మంచిది, అతనికున్నదంతటి మీద నీకు అనుమతి ఉంది. అతనికి మాత్రం హాని చేయకు” అని అన్నారు. అప్పుడు సాతాను యెహోవా సన్నిధిలో నుండి వెళ్లిపోయాడు.
JOB 1:13 ఒక రోజు యోబు పెద్ద కుమారుడి ఇంట్లో అతని కుమారులు కుమార్తెలు కలిసి భోజనం చేస్తూ ద్రాక్షరసం త్రాగుతూ ఉండగా,
JOB 1:14 ఒక దూత యోబు దగ్గరకు వచ్చి, “ఎద్దులు పొలం దున్నుతుండగా గాడిదలు వాటికి దగ్గరలోనే మేస్తుండగా,
JOB 1:15 షెబాయీయులు దాడిచేసి పశువులన్నిటిని పట్టుకుపోయారు. ఖడ్గంతో సేవకులను చంపేశారు; ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు.
JOB 1:16 అతడు ఇంకా మాట్లాడుతుండగానే మరొకడు వచ్చి, “దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను సేవకులను కాల్చివేసింది. ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు.
JOB 1:17 అతడు ఇంకా మాట్లాడుతుండగానే మరొకడు వచ్చి, “కల్దీయులు మూడు గుంపులుగా వచ్చి మీ ఒంటెలను దోచుకుపోయారు. ఖడ్గంతో సేవకులను చంపేశారు. ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు.
JOB 1:18 అతడు ఇంకా మాట్లాడుతుండగానే మరొకడు వచ్చి, “మీ కుమారులు కుమార్తెలు కలిసి మీ పెద్ద కుమారుని ఇంట్లో భోజనం చేస్తూ ద్రాక్షరసం త్రాగుతుండగా,
JOB 1:19 అరణ్యమార్గం నుండి పెద్ద సుడిగాలి వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగానే అది వారి మీద కూలి వారంతా చనిపోయారు. ఈ సంగతి చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని అన్నాడు.
JOB 1:20 అప్పుడు యోబు పైకి లేచి తన పైవస్త్రాన్ని చింపుకొని గుండు చేసుకుని అప్పుడు నేలమీద సాష్టాంగపడి ఆరాధిస్తూ,
JOB 1:21 ఇలా అన్నాడు: “నేను తల్లి గర్భంలోనుండి దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. యెహోవాయే ఇచ్చారు యెహోవాయే తీసుకున్నారు; యెహోవా నామం స్తుతింపబడును గాక.”
JOB 1:22 జరిగిన ఈ సంఘటనలలో ఏ విషయంలోను యోబు పాపం చేయలేదు, దేవున్ని నిందించలేదు.
JOB 2:1 దేవదూతలు యెహోవా సమక్షంలో నిలబడవలసిన రోజున, యెహోవా ఎదుట నిలబడడానికి వారితో పాటు సాతాను కూడా వచ్చాడు.
JOB 2:2 యెహోవా, “ఎక్కడ నుండి వస్తున్నావు?” అని సాతానును అడిగాడు. “భూమి మీద అటూ ఇటూ తిరుగుతూ భూమంతా తిరిగి వస్తున్నాను” అని సాతాను చెప్పాడు.
JOB 2:3 అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు గమనించావా? అతనిలాంటి వ్యక్తి భూమి మీద లేడు; అతడు నిర్దోషమైనవాడు, యథార్థవంతుడు, దేవుడంటే భయం కలిగి, చెడుకు దూరంగా ఉండేవాడు. ఏ కారణం లేకుండా నీవు అతన్ని నాశనం చేయడానికి నన్ను ఒప్పించినా అతడు తన యథార్థతను విడువక స్థిరంగా ఉన్నాడు” అని అన్నారు.
JOB 2:4 అప్పుడు సాతాను, “తన చర్మం కాపాడుకోడానికి చర్మాన్ని ఇస్తాడు! మనిషి తన ప్రాణం కోసం తనకున్నదంతా ఇచ్చేస్తాడు.
JOB 2:5 అయితే ఇప్పుడు మీ చేయి చాపి అతని శరీరాన్ని ఎముకలను కొట్టి చూడండి, అతడు ఖచ్చితంగా మీ ముఖం మీద మిమ్మల్ని శపిస్తాడు” అని జవాబిచ్చాడు.
JOB 2:6 యెహోవా, “మంచిది, ఇదిగో యోబు నీ చేతిలో ఉన్నాడు కాని అతని ప్రాణం మాత్రం తీయకూడదు” అని సాతానుతో అన్నారు.
JOB 2:7 కాబట్టి సాతాను యెహోవా సమక్షంలో నుండి వెళ్లి, అరికాలు నుండి నడినెత్తి వరకు బాధకరమైన కురుపులతో యోబును బాధించాడు.
JOB 2:8 అప్పుడు అతడు ఒళ్ళంతా చిల్లపెంకుతో గోక్కుంటూ బూడిదలో కూర్చున్నాడు.
JOB 2:9 అతని భార్య వచ్చి, “నీవు ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా? దేవుని శపించి చనిపోవచ్చు కదా!” అని అన్నది.
JOB 2:10 అందుకతడు, “నీవు ఒక మూర్ఖురాలిగా మాట్లాడుతున్నావు. దేవుని దగ్గర నుండి మేలును మాత్రమే అంగీకరించాలా, కీడును అంగీకరించకూడదా?” అని సమాధానం ఇచ్చాడు. ఈ సంగతుల్లో ఏ విషయంలోను మాటల ద్వారా యోబు పాపం చేయలేదు.
JOB 2:11 తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి వచ్చిన కష్టాలన్నిటి గురించి విని తమ స్నేహితుడిని కలిసి సానుభూతి చూపించి ఆదరించడానికి వెళ్లాలని వారు నిర్ణయించుకొని, తమ ఇళ్ళ నుండి బయలుదేరి వచ్చారు.
JOB 2:12 వారు దూరం నుండి చూసినప్పుడు యోబును సరిగా గుర్తుపట్టలేకపోయారు; దానితో వారు బట్టలు చింపుకొని తమ తలలపై దుమ్ము వేసుకుంటూ గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టారు.
JOB 2:13 వారు ఏడు రోజులు రాత్రింబగళ్ళు అతనితో పాటు నేలమీద కూర్చుండిపోయారు. అతడు పడుతున్న తీవ్రమైన బాధను చూసి అతనితో ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
JOB 3:1 ఆ తర్వాత, యోబు మాట్లాడడం మొదలుపెట్టి తాను పుట్టిన రోజును శపించాడు.
JOB 3:2 యోబు ఇలా అన్నాడు:
JOB 3:3 “నేను పుట్టిన రోజు, ‘మగ శిశువు పుట్టాడని!’ చెప్పిన ఆ రాత్రి లేకపోవును గాక.
JOB 3:4 ఆ రోజు చీకటి అగును గాక; పైనున్న దేవుడు దాన్ని లెక్కచేయకుండును గాక; దాని మీద వెలుగు ప్రకాశించకూడదు.
JOB 3:5 చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరకు తీసుకొనును గాక; మేఘం దాన్ని కమ్మును గాక; పగటిని కమ్మే అంధకారం దాన్ని భయపెట్టును గాక.
JOB 3:6 కటిక చీకటి ఆ రాత్రిని పట్టుకొనును గాక; సంవత్సరపు రోజుల్లో ఒకరోజుగా అది లెక్కించబడకపోవును గాక, ఏ నెలలోను అది చేర్చబడకపోవును గాక.
JOB 3:7 ఆ రాత్రి గొడ్రాలిగా ఉండును గాక; దానిలో సంతోష ధ్వని వినిపించకపోవును గాక.
JOB 3:8 రోజులను శపించేవారు, లెవియాథన్ రెచ్చగొట్టే అనుభవం గలవారు ఆ రోజును శపించుదురు గాక.
JOB 3:9 దాని అరుణోదయ నక్షత్రాలు చీకటిమయం అగును గాక; వెలుగు కోసం అది ఎదురుచూడడం వృధా అవ్వాలి, ఉదయ కిరణాలు దానికి కనపడకూడదు.
JOB 3:10 ఎందుకంటే అది నా కళ్ళ నుండి బాధను దాచిపెట్టడానికి నా తల్లి గర్భద్వారాలను మూయలేదు.
JOB 3:11 “పుట్టగానే నేనెందుకు చావలేదు? గర్భం నుండి రాగానే నేనెందుకు మరణించలేదు?
JOB 3:12 నన్నెందుకు మోకాళ్లమీద పడుకోబెట్టుకున్నారు నేనెందుకు తల్లిపాలు త్రాగాను?
JOB 3:13 నేను పుట్టినప్పుడే చనిపోయి ఉంటే; నేను ఈపాటికి నిద్రించి నాకు విశ్రాంతి కలిగియుండేవాన్ని,
JOB 3:14 తమ కోసం భవనాలు కట్టుకున్న భూరాజులతో పాలకులతో,
JOB 3:15 బంగారం సంపాదించుకుని వెండితో తమ ఇళ్ళు నింపుకొన్న అధిపతులతో నేనూ ప్రశాంతంగా నిద్రించి ఉండేవాన్ని.
JOB 3:16 లేదా చనిపోయి పుట్టిన పిండంవలె ఎప్పుడు వెలుగు చూడని శిశువు వలె నేను ఎందుకు నేలలో దాచబడలేదు?
JOB 3:17 అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపెట్టరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు.
JOB 3:18 చెరలో ఉన్నవారు కూడా అక్కడ నెమ్మది అనుభవిస్తారు, యాజమానుల స్వరాలు వారికిక వినబడవు.
JOB 3:19 పేదవారు గొప్పవారు అక్కడ ఉన్నారు, దాసులు తమ యాజమానుల నుండి విముక్తి పొందుతారు.
JOB 3:20 “దురవస్థలో ఉన్నవారికి వెలుగెందుకు? ఆత్మలో చేదుననుభవిస్తున్న వారికి జీవమెందుకు?
JOB 3:21 వారు రాని మరణం కోసం ఆశతో ఎదురుచూస్తారు, దాచబడిన ధననిధి కంటే ఎక్కువగా దాని కోసం వెదకుతారు, కాని అది రాదు.
JOB 3:22 వారు సమాధిని చేరినప్పుడు ఆనందంతో నింపబడి సంతోషిస్తారు.
JOB 3:23 మరుగుచేయబడిన మార్గంగలవానికి దేవుడు చుట్టూ కంచెవేసినవానికి జీవం ఎందుకు ఇవ్వబడింది?
JOB 3:24 నిట్టూర్పే నా అనుదిన భోజనంగా మారింది. నా మూలుగులు నీళ్లలా పారుతున్నాయి.
JOB 3:25 దేనికి భయపడ్డానో అదే నా మీదికి వచ్చింది; దేని గురించి దిగులుపడ్డానో అదే నాకు కలిగింది.
JOB 3:26 నాకు నెమ్మది లేదు సుఖం లేదు; విశ్రాంతి లేదు, ఉన్నది ఆందోళన మాత్రమే.”
JOB 4:1 అందుకు తేమానీయుడైన ఎలీఫజు ఇలా అన్నాడు:
JOB 4:2 ఎవరైనా నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నీవు సహించలేవా? కాని మాట్లాడకుండా ఎవరు ఉండగలరు?
JOB 4:3 ఎలా నీవు చాలామందికి బుద్ధి నేర్పావో, ఎలా బలహీనమైన చేతులు బలపరిచావో ఆలోచించు.
JOB 4:4 తొట్రిల్లినవారిని నీ మాటలు ఆదుకున్నాయి; క్రుంగిన మోకాళ్లను నీవు బలపరిచావు.
JOB 4:5 అలాంటి నీకు ఇప్పుడు కష్టం కలిగితే నీవు నిరుత్సాహపడుతున్నావు; అది నిన్ను తాకగానే నీవు భయపడుతున్నావు.
JOB 4:6 నీ దైవభక్తి నీకు ధైర్యం కాదా? నీ నిర్దోష ప్రవర్తన నీ నిరీక్షణ కాదా?
JOB 4:7 “ఇప్పుడు ఆలోచించు: నిర్దోషిగా ఉన్నవాడు ఎప్పుడైనా నశించాడా? యథార్థవంతులు ఎప్పుడైనా నాశనమయ్యారా?
JOB 4:8 నేను చూసినంత వరకు చెడును దున్ని కీడును నాటేవారు దానినే కోస్తారు.
JOB 4:9 దేవుని శ్వాసకు వారు నశిస్తారు; ఆయన ధ్వంసం చేయు కోపం ద్వారా వారు ఇక ఉండరు.
JOB 4:10 సింహాలు గర్జిస్తాయేమో కొదమసింహాలు కేకలు వేస్తాయేమో, అయినా అలాంటి బలమైన సింహాల కోరలు విరిగిపోతాయి.
JOB 4:11 సింహం తిండి దొరకక నశిస్తుంది, సింహం యొక్క కూనలు చెదిరిపోతాయి.
JOB 4:12 “నాకొక విషయం రహస్యంగా తెలిసింది, నా చెవులు దాని గుసగుసను విన్నాయి.
JOB 4:13 ప్రజలు గాఢనిద్రలో ఉన్నప్పుడు, రాత్రి వచ్చి కలవరపెట్టే కలలలో అది తెలిసింది,
JOB 4:14 భయం వణకు నన్ను చుట్టుకొని నా ఎముకలన్నీ కదిలేలా చేశాయి.
JOB 4:15 ఒక ఆత్మ నా ముఖాన్ని తాకుతూ వెళ్లింది, నా శరీర రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
JOB 4:16 అది నా దగ్గర నిలిచింది, కాని అది ఏమిటో నేను చెప్పలేను. ఒక రూపం నా కళ్ళ ముందు నిలబడింది, మెల్లగా ఒక స్వరం నాకు వినిపించింది.
JOB 4:17 ‘మానవుడు దేవుని కన్నా నీతిమంతుడు అవుతాడా? మానవుడు తన సృష్టికర్త కన్నా పవిత్రుడు కాగలడా?
JOB 4:18 దేవుడు తన సేవకులనే నమ్మనప్పుడు, తన దూతల్లోనే లోపాలను కనుగొన్నప్పుడు,
JOB 4:19 మట్టి ఇళ్ళలో నివసిస్తూ, దుమ్ములో పునాదులు గలవారిని, చిమ్మెట కన్నా సులువుగా చితికిపోయేవారిని ఇంకెలా చూస్తారో!
JOB 4:20 ఉదయం నుండి సాయంకాలం వరకు ఉన్నవారు ముక్కలుగా చేయబడి, గుర్తింపు పొందకుండానే శాశ్వతంగా నాశనమవుతారు.
JOB 4:21 వారి డేరా తాడు తెంపివేయబడుతుంది, జ్ఞానం లేకుండానే వారు చనిపోతారు.’
JOB 5:1 “నీవు మొరపెట్టు, కాని నీకు సమాధానం ఎవరిస్తారు? పరిశుద్ధులలో ఎవరు నీకు సహాయం చేస్తారు?
JOB 5:2 ఆగ్రహం మూర్ఖులను చంపుతుంది. అసూయ బుద్ధిహీనులను చంపుతుంది.
JOB 5:3 మూర్ఖులు వేరుపాదుకోవడం నేను చూశాను, కాని హఠాత్తుగా వారి ఇల్లు శపించబడింది.
JOB 5:4 వారి పిల్లలకు క్షేమం దూరమవుతుంది, వారి పక్షంగా వాదించేవారు లేక న్యాయస్థానంలో వారు నలిగిపోతారు.
JOB 5:5 ఆకలితో ఉన్నవారు వారి పంటను తినివేస్తారు, ముండ్ల మధ్యలో ఉన్నవాటిని కూడా వారు తీసుకుంటారు, దాహంతో ఉన్నవారు వారి ఆస్తి కోసం కాచుకుని ఉంటారు.
JOB 5:6 కష్టం దుమ్ములో నుండి పుట్టదు. బాధ భూమిలో నుండి మొలకెత్తదు.
JOB 5:7 నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు బాధల కోసమే పుడుతున్నారు.
JOB 5:8 “ఒకవేళ నేనే నువ్వైతే, నేను దేవునికే మొరపెడతాను; ఆయన ఎదుట నా వాదన చెప్పుకుంటాను.
JOB 5:9 పరిశోధించలేని మహాకార్యాలను లెక్కించలేని అద్భుత క్రియలను ఆయన చేస్తారు.
JOB 5:10 ఆయన భూమిపై వాన కురిపిస్తారు; పొలాలకు నీటిని పంపిస్తారు.
JOB 5:11 ఆయన దీనావస్థలోనున్న వారిని పైకి లేపుతారు, దుఃఖపడేవారిని క్షేమానికి లేవనెత్తుతారు.
JOB 5:12 వంచకుల చేతులు విజయం సాధించకుండ, ఆయన వారి ఆలోచనలను తలక్రిందులు చేస్తారు.
JOB 5:13 జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు, వంచకుల ఆలోచనలు తుడిచివేయబడతాయి.
JOB 5:14 పగటివేళ వారి మీదికి చీకటి వస్తుంది; రాత్రిలో తడుముకున్నట్లు వారు మధ్యాహ్న వేళలో తడుముకుంటారు.
JOB 5:15 వారి నోటి నుండి వచ్చే పదునైన మాటల నుండి ఆయన బీదలను రక్షిస్తారు; బలవంతుల చేతిలో నుండి ఆయన వారిని రక్షిస్తారు.
JOB 5:16 కాబట్టి బీదలకు నిరీక్షణ ఉంది, అన్యాయం తన నోరు మూసుకుంటుంది.
JOB 5:17 “దేవుడు సరిదిద్దేవారు ధన్యులు; కాబట్టి సర్వశక్తిమంతుని క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయకు.
JOB 5:18 గాయం చేసేది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే; ఆయన గాయపరుస్తారు, కాని ఆయన చేతులే స్వస్థపరుస్తాయి.
JOB 5:19 ఆరు ఆపదల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తారు; ఏడు బాధల్లో ఏ హాని నిన్ను తాకదు.
JOB 5:20 కరువు కాలంలో చావు నుండి, యుద్ధంలో ఖడ్గం అంచు నుండి ఆయన నిన్ను తప్పిస్తారు.
JOB 5:21 కొరడాలవంటి నోటిమాటల నుండి నిన్ను కాపాడతారు, నాశనం వచ్చినా నీవు భయపడవు.
JOB 5:22 కరువు నాశనం వచ్చినప్పుడు నీవు నవ్వుతావు, అడవి మృగాలకు నీవు భయపడే అవసరం లేదు.
JOB 5:23 ఎందుకంటే పొలం లోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు, అడవి జంతువులు నీతో సమాధానంగా ఉంటాయి.
JOB 5:24 నీ గుడారం క్షేమనివాసమని నీవు తెలుసుకుంటావు; నీ ఆస్తులను లెక్క చూడగా వాటిలో ఒకటి కూడా పోదు.
JOB 5:25 నీకు చాలామంది పిల్లలు ఉంటారని, నీ సంతానం భూమిమీది గడ్డిని పోలి ఉంటుందని నీవు తెలుసుకుంటావు.
JOB 5:26 పంట కాలంలో ధాన్యం సేకరించబడినట్లు పూర్తి వయస్సు నిండిన తర్వాత నీవు సమాధికి చేరతావు.
JOB 5:27 “మేము ఇది పరిశీలించాము, ఇది నిజము. కాబట్టి ఈ మాటలు విని నీ మంచి కోసం తెలుసుకో.”
JOB 6:1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
JOB 6:2 “కేవలం నా వేదనను తూకం వేసి, నా కష్టాలన్నీ త్రాసులో ఉంచి లెక్కిస్తే,
JOB 6:3 సముద్రాల ఇసుక కంటే అవి బరువుగా ఉంటాయి, కాబట్టి నా మాటలు ఉద్వేగభరితంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు.
JOB 6:4 సర్వశక్తిమంతుడైన దేవుని బాణాలు నాకు గుచ్చుకున్నాయి, నా ఆత్మ వాటికున్న విషం త్రాగింది; దేవుని భయంకరకార్యాలు నాకు వ్యతిరేకంగా మోహరించి ఉన్నాయి.
JOB 6:5 గడ్డి దొరికితే అడవి గాడిద అరుస్తుందా, మేత దొరికితే ఎద్దు రంకెవేస్తుందా?
JOB 6:6 ఉప్పు లేకుండ రుచిలేని ఆహారం ఎవరైనా తింటారా? గుడ్డులోని తెలుపుకు రుచి ఉంటుందా?
JOB 6:7 నేను దాన్ని తాకను, అలాంటి ఆహారం తింటే నా ఆరోగ్యం పాడవుతుంది.
JOB 6:8 “నా అభ్యర్థన నెరవేరి, దేవుడే నా కోరికను అనుగ్రహించియుంటే బాగుండేది,
JOB 6:9 దేవుడు ఇష్టపూర్వకంగా నన్ను నలిపివేసి, తన చేయి జాడించి నా ప్రాణాన్ని తీసివేస్తే బాగుండేది!
JOB 6:10 అప్పుడు నేను ఈ ఆదరణ కలిగి ఉంటాను, భరించలేని బాధలో ఉన్నప్పటికీ, పరిశుద్ధుని మాటలు నేను తిరస్కరించలేదని ఆనందిస్తాను.
JOB 6:11 “నేను ఇంకా నిరీక్షణ కలిగి ఉండడానికి నాకున్న బలమెంత? నేను ఓపికగా ఉండడానికి నా అంతం ఏపాటిది?
JOB 6:12 రాయికున్నంత బలం నాకుందా? నాదేమైనా ఇత్తడి శరీరమా?
JOB 6:13 నాకు నేను సహాయం చేసుకోగల శక్తి నాలో ఏమైన ఉన్నదా? నా శక్తి నన్ను పూర్తిగా విడిచిపెట్టింది.
JOB 6:14 “స్నేహితునికి దయ చూపనివాడు సర్వశక్తిమంతుడైన దేవుని భయం విడిచిపెట్టినవాడు.
JOB 6:15 కాని నా సహోదరులు నమ్మదగని జలప్రవాహాల్లా ఉన్నారు, ఉప్పొంగే వాగుల్లా ఆధారపడదగనివారుగా ఉన్నారు,
JOB 6:16 అవి కరిగిపోతున్న మంచుగడ్డలతో, వాటి మీద కురిసిన మంచుతో అవి నల్లబారాయి.
JOB 6:17 కాని వేసవికాలంలో వాటి ప్రవాహం ఆగిపోతుంది, వేడికి వాటి స్థలాల్లోనే అవి ఆవిరైపోతాయి.
JOB 6:18 అవి ప్రవహించే మార్గాల నుండి ప్రక్కకు తిరుగుతాయి; అవి బంజరు భూమిలో వెళ్లి నశించిపోతాయి.
JOB 6:19 తేమా వర్తకుల గుంపు నీటి కోసం వెదకుతారు, షేబ వ్యాపారులు వాటికోసం ఆశతో చూస్తారు.
JOB 6:20 వారు నమ్మకంగా ఉన్నందుకు వారు దుఃఖపడుతున్నారు, అక్కడికి వచ్చి వారు నిరాశ చెందారు.
JOB 6:21 ఇప్పుడు మీరు కూడా ఏ సహాయం ఇవ్వలేరని నిరూపించారు; మీరు ఆపదను చూసి భయపడుతున్నారు.
JOB 6:22 నేను ఎప్పుడైనా, ‘నాకేమైనా ఇవ్వండి అని అడిగానా? మీ ఆస్తిలో నుండి నాకేమైనా బహుమానం తెమ్మని అడిగానా?
JOB 6:23 శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించమని, క్రూరుల బారి నుండి నన్ను తప్పించండి’ అని అడిగానా?
JOB 6:24 “నాకు బోధించండి, నేను మౌనంగా ఉంటాను; నా తప్పేంటో నేను గ్రహించేలా నాకు చూపించండి.
JOB 6:25 యథార్థమైన మాటలు ఎంతో బాధాకరమైనవి, కాని మీ వాదనలు ఏమి నిరూపిస్తున్నాయి?
JOB 6:26 నేను చెప్పే మాటలను సరిచేయాలని చూస్తున్నారా, నిరాశతో కూడిన నా మాటలు గాలివంటివే అని అనుకుంటున్నారా?
JOB 6:27 మీరు తండ్రిలేనివారిని కొనడానికి చీట్లు వేస్తారు, మీ స్నేహితుని మీద బేరమాడతారు.
JOB 6:28 “అయితే ఇప్పుడు నన్ను దయతో చూడండి, మీ ముఖాలు చూస్తూ అబద్ధం చెప్పగలనా?
JOB 6:29 పశ్చాత్తాపపడండి, అన్యాయం చేయకండి; మరలా విచారించండి ఎందుకంటే నాలో ఇంకా యథార్థత ఉంది.
JOB 6:30 నా పెదవుల మీద దుష్టత్వం ఉందా? నా నోరు దుర్మార్గాన్ని గ్రహించలేదా?
JOB 7:1 “భూమి మీద మానవులకు ఉండేది కఠినమైన సేవ కాదా? వారి రోజులన్నీ కూలివారి రోజులవంటివి కావా?
JOB 7:2 చల్లనినీడ కోసం ఎంతో ఆశపడే దాసునిలా, కూలిడబ్బుల కోసం ఎదురు చూసే కూలివానిలా,
JOB 7:3 నిరర్థకమైన నెలలు నాకు కేటాయించబడ్డాయి, దుఃఖంతో నిండిన రాత్రులు నాకు నియమించబడ్డాయి.
JOB 7:4 నేను పడుకున్నప్పుడు ‘నేను ఎప్పుడు లేస్తాను రాత్రి ఎప్పుడు ముగుస్తుంది?’ అని ఆలోచిస్తాను తెల్లవారే వరకు నేను అటూ ఇటూ దొర్లుతూ ఉంటాను.
JOB 7:5 నా శరీరం పురుగులతో కురుపులతో కప్పబడింది, నా చర్మం పగిలి చీము పట్టింది.
JOB 7:6 “నేతగాని మగ్గం కంటే వేగంగా నా రోజులు గడుస్తున్నాయి, నిరీక్షణ లేకుండానే అవి ముగిసిపోతున్నాయి.
JOB 7:7 దేవా! నా జీవం వట్టి ఊపిరి వంటిదేనని జ్ఞాపకం చేసుకోండి; నా కళ్లు మంచిని మరలా చూడలేవు.
JOB 7:8 ఇప్పుడు నన్ను చూస్తున్నవారి కన్ను ఇకమీదట నన్ను చూడదు; మీరు నా కోసం చూసినా నేను ఇక ఉండను.
JOB 7:9 మేఘం విడిపోయి మాయమైపోయిట్లు, సమాధిలోనికి దిగిపోయినవాడు మరలా తిరిగి రాడు.
JOB 7:10 అతడు తన ఇంటికి మరలా తిరిగి రాడు; అతని స్వస్థలం అతన్ని మరచిపోతుంది.
JOB 7:11 “కాబట్టి నేను మౌనంగా ఉండను; నా ఆత్మలోని వేదన బట్టి మాట్లాడతాను. నా మనస్సులోని బాధను బట్టి నేను ఫిర్యాదు చేస్తాను.
JOB 7:12 మీరు నాకు కాపలా పెట్టడానికి నేనేమైనా సముద్రాన్నా లేదా సముద్రపు క్రూరజంతువునా?
JOB 7:13 నా పడక నాకు ఆదరణ ఇస్తుందని నా మంచం నా బాధను తగ్గిస్తుందని నేను అనుకుంటే,
JOB 7:14 అప్పుడు కూడా కలలతో మీరు నన్ను బెదిరిస్తున్నారు. దర్శనాలతో నన్ను భయపెడుతున్నారు.
JOB 7:15 ఈ శరీరంతో ఇలా జీవించడం కంటే ఊపిరాడకుండా చనిపోవడాన్నే నేను కోరుకుంటాను.
JOB 7:16 నా జీవితాన్ని తృణీకరిస్తున్నాను; నేను ఎల్లకాలం బ్రతకను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి; నా దినాలు అర్థం లేకుండా ఉన్నాయి.
JOB 7:17 “మీరు మానవులను ఘనపరచడానికి, వారిపై మీరు అంతగా శ్రద్ధ చూపించడానికి,
JOB 7:18 ప్రతి ఉదయం వారిని దర్శించడానికి, అనుక్షణం వారిని పరీక్షించడానికి వారెంతటివారు?
JOB 7:19 ఎంతకాలం మీరు నన్ను చూడడం మానకుండ ఉంటారు? నా ఉమ్మిని మ్రింగేంత వరకు కూడ నన్ను విడిచిపెట్టరా?
JOB 7:20 మనుష్యులను గమనించేవాడా, నేను పాపం చేస్తే, మీకు నేను ఏమి చేశాను? మీరెందుకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు? మీకు నేనే భారమైపోయానా?
JOB 7:21 ఎందుకు మీరు నా అపరాధాలను క్షమించరు? ఎందుకు నా పాపాలను తీసివేయరు? త్వరలోనే నేను మట్టిలో కలిసిపోతాను, మీరు నా కోసం వెదికినా నేనిక ఉండను.”
JOB 8:1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా అన్నాడు:
JOB 8:2 “ఎంతకాలం నీవు ఇలాంటి మాటలు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలా ఉన్నాయి.
JOB 8:3 దేవుడు న్యాయాన్ని తలక్రిందులు చేస్తారా? సర్వశక్తిమంతుడు ధర్మాన్ని వక్రీకరిస్తారా?
JOB 8:4 నీ పిల్లలు ఆయనకు విరోధంగా పాపం చేసి ఉండవచ్చు, అందుకే ఆయన వారి పాపానికి తగ్గ శిక్షకు వారిని అప్పగించారు.
JOB 8:5 కాని నీవు జాగ్రత్తగా దేవుని వెదికితే, సర్వశక్తిమంతుడైన దేవుని వేడుకుంటే,
JOB 8:6 నీవు పవిత్రంగా యథార్థంగా ఉంటే, ఇప్పుడే ఆయన నీ పక్షాన లేస్తారు, నీ సంపన్న స్థితిని తిరిగి ఇస్తారు.
JOB 8:7 నీ స్థితి మొదట మామూలుగా ఉన్నా, చివరకు అది ఎంతో అభివృద్ధి చెందుతుంది.
JOB 8:8 “గత తరం వారిని అడుగు, వారి పూర్వికులు చేసిన శోధనను గమనించు,
JOB 8:9 ఎందుకంటే మనం నిన్న పుట్టినవారం, మనకు ఏమి తెలియదు, భూమిపై మన రోజులు నీడ వంటివి.
JOB 8:10 వారు నీకు బోధించి చెప్పరా? వారు తమ అనుభవంతో మాట్లాడరా?
JOB 8:11 బురద లేకుండ జమ్ము పెరుగుతుందా? నీళ్లు లేకుండ రెల్లు ఎదుగుతుందా?
JOB 8:12 అవి కోయకముందు పచ్చగా ఉంటాయి గడ్డి కంటే త్వరగా వాడిపోతాయి.
JOB 8:13 దేవుడిని మరచిపోయే వారందరి గతి ఇలాగే ఉంటుంది; భక్తిహీనుల ఆశ అడుగంటిపోతుంది.
JOB 8:14 వారు నమ్మేది పెళుసుగా ఉంటుంది. వారి ఆశ్రయం సాలెగూడు వంటిది.
JOB 8:15 వారు సాలెగూడును ఆశ్రయిస్తారు కాని అది నిలబడదు, వారు దానిని అంటిపెట్టుకుంటారు కాని అది విడిపోతుంది.
JOB 8:16 వారు సూర్యరశ్మిలో సమృద్ధి నీరు కలిగిన వాటిలా పచ్చగా ఉంటూ, వాటి తీగలు వారి తోటమీద అల్లుకుంటూ విస్తరిస్తారు.
JOB 8:17 దాని వేర్లు రాళ్ల చుట్టూ చుట్టుకొని, రాళ్ల మధ్యకు చొచ్చుకుపోవాలని చూస్తుంది.
JOB 8:18 ఆ చోటు నుండి అది తెంచివేయబడినప్పుడు, ఆ చోటు ‘నేను నిన్నెప్పుడు చూడలేదు’ అంటూ దానిని నిరాకరిస్తుంది.
JOB 8:19 ఖచ్చితంగా అది వాడిపోతుంది, భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి.
JOB 8:20 “దేవుడు నిర్దోషిని త్రోసివేయరు దుర్మార్గుల చేతులను బలపరచరు.
JOB 8:21 ఆయన నీ నోటిని నవ్వుతో, నీ పెదవులను ఆనంద ధ్వనులతో నింపుతారు.
JOB 8:22 నీ శత్రువులు అవమానాన్ని ధరిస్తారు, దుర్మార్గుల గుడారాలు ఇక ఉండవు.”
JOB 9:1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
JOB 9:2 “అవును, ఇదంతా నిజమని నాకు తెలుసు. అయితే నశించే మానవులు దేవుని ఎదుట తమ నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలరు?
JOB 9:3 వారు ఆయనతో వాదించాలనుకుంటే, వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనా వారు ఆయనకు జవాబు చెప్పలేరు.
JOB 9:4 ఆయన అత్యంత జ్ఞానవంతుడు మహాబలవంతుడు. ఆయనతో పోరాడి సురక్షితంగా వచ్చినవారు ఎవరు?
JOB 9:5 ఆయన పర్వతాలను వాటికి తెలియకుండానే కదిలిస్తారు, కోపంతో వాటిని తలక్రిందులు చేస్తారు.
JOB 9:6 ఆయన భూమిని దాని స్థలంలో నుండి కదిలించి దాని స్తంభాలు అదిరేలా చేస్తారు.
JOB 9:7 ఆయన సూర్యుని ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాల కాంతిని కనబడకుండ చేస్తారు.
JOB 9:8 ఆయనే ఆకాశాన్ని విశాలపరుస్తారు సముద్రపు అలలను అణచివేస్తారు.
JOB 9:9 స్వాతి, మృగశీర్ష, కృతిక అనే నక్షత్రాలను దక్షిణ నక్షత్రరాసులను ఆయన సృజించారు.
JOB 9:10 ఆయన ఎవరు గ్రహించలేని మహాకార్యాలను లెక్కలేనన్ని అద్భుతాలను చేస్తారు.
JOB 9:11 ఆయన నా ప్రక్కన నుండే వెళ్తారు కాని నేను ఆయనను చూడలేను, ఆయన వెళ్తున్నప్పుడు ఆయనను గమనించలేను.
JOB 9:12 ఆయన లాక్కుంటే ఎవరు ఆయనను ఆపగలరు? ‘మీరు ఏమి చేస్తున్నారు?’ అని ఆయనను ఎవరు అడగగలరు?
JOB 9:13 దేవుడు తన కోపాన్ని అణచుకోరు; రాహాబు సహాయకులు ఆయన పాదాల దగ్గర లొంగిపోయారు.
JOB 9:14 “కాబట్టి దేవునికి నేను ఎలా జవాబివ్వగలను? ఆయనతో వాదించడానికి ఎలాంటి పదాలను నేను ఉపయోగించగలను?
JOB 9:15 నేను నిర్దోషినైనప్పటికి ఆయనకు బదులు చెప్పలేను. కరుణించమని మాత్రమే నా న్యాయమూర్తిని వేడుకుంటాను.
JOB 9:16 నేను పిలిచినప్పుడు ఆయన సమాధానం ఇచ్చిన కూడా, ఆయన నా మాట వింటారని నేను నమ్మలేను.
JOB 9:17 తుఫానుతో ఆయన నన్ను నలుగగొడతారు, ఏ కారణం లేకుండా నా గాయాలను ఎక్కువ చేస్తారు.
JOB 9:18 ఆయన నన్ను ఊపిరి తీసుకోనివ్వరు కాని చేదైన వాటిని నాకు తినిపిస్తారు.
JOB 9:19 బలం విషయానికొస్తే, ఆయన మహాబలవంతుడు! న్యాయం విషయానికొస్తే, ఆయనకు ప్రతివాదిగా ఎవరు ఉండగలరు?
JOB 9:20 నేను నిర్దోషినైనా కూడా నా నోరే నన్ను నిందిస్తుంది; నేను నిర్దోషినైనా అదే నన్ను దోషిగా ప్రకటిస్తుంది.
JOB 9:21 “నేను నిర్దోషినినైనా నా గురించి నాకు శ్రద్ధ లేదు. నా ప్రాణాన్ని నేను తృణీకరిస్తున్నాను.
JOB 9:22 ఏమి చేసినా ఒక్కటే; అందుకే నేను, దేవుడు నిర్దోషులని దుర్మార్గులని ఏ తేడా లేకుండ నాశనం చేస్తారు అని అంటున్నాను.
JOB 9:23 ఉపద్రవం అకస్మాత్తుగా వచ్చి నాశనం చేస్తే, నిర్దోషుల దురవస్థను చూసి దేవుడు వెక్కిరిస్తారు.
JOB 9:24 భూమి దుష్టుల చేతికి ఇవ్వబడినప్పుడు, ఆయన దాని న్యాయాధిపతుల కళ్లను మూసివేస్తారు. ఆయన కాక ఈ పని ఇంకెవరు చేస్తారు?
JOB 9:25 “పరుగెత్తేవాని కంటే నా రోజులు వేగంగా పరుగెడుతున్నాయి; ఏ సంతోషం లేకుండానే అవి ఎగిరిపోతున్నాయి.
JOB 9:26 రెల్లు పడవలు దాటిపోతున్నట్లు, గ్రద్ద తన ఎరను తన్నుకుపోయినట్లు అవి గడిచిపోతున్నాయి.
JOB 9:27 నా ఫిర్యాదు మరచిపోయి, నా విచారం విడిచిపెట్టి సంతోషంగా ఉంటానని నేను అనుకుంటే,
JOB 9:28 నా బాధలన్నిటికి భయపడతాను ఎందుకంటే మీరు నన్ను నిర్దోషిగా ప్రకటించరని నాకు తెలుసు.
JOB 9:29 నేను దోషినని తేలినప్పుడు, నాకెందుకు ఈ వృధా ప్రయాస?
JOB 9:30 సబ్బుతో నన్ను నేను కడుక్కున్నా, శుభ్రం చేసే పొడితో నా చేతులు కడుక్కున్నా,
JOB 9:31 మీరు నన్ను బురద గుంటలో ముంచుతారు, అప్పుడు నా బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.
JOB 9:32 “నేను జవాబివ్వడానికి, ఒకరిపై ఒకరం న్యాయస్థానంలో పోరాడడానికి దేవుడు నాలాంటి మనిషి కాదు.
JOB 9:33 మా మధ్య మధ్యవర్తిత్వం చేసేవారు, మమ్మల్ని కలపగల వారు మాకు లేరు,
JOB 9:34 దేవుని దండాన్ని నా మీద నుండి తీసివేయగలిగిన వారు ఉంటే బాగుండేది, అప్పుడు ఆయన భయం నన్ను ఇక బెదిరించదు.
JOB 9:35 అప్పుడు నిర్భయంగా నేను ఆయనతో మాట్లాడగలను, కాని ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను అలా చేయలేను.
JOB 10:1 “నా బ్రతుకును నేను అసహ్యించుకొంటున్నాను; కాబట్టి నేను స్వేచ్ఛగా ఫిర్యాదు చేస్తాను నా మనస్సులోని బాధను బట్టి మాట్లాడతాను.
JOB 10:2 నేను దేవునితో ఇలా అంటాను: నన్ను దోషిగా భావించకండి, కాని నా మీద మీకున్న ఆరోపణలు నాకు చెప్పండి.
JOB 10:3 నన్ను హింసించడం, మీ చేతిపనిని త్రోసివేయడం, దుర్మార్గుల ప్రణాళికలను చూసి సంతోషించడం మీకు ఇష్టమా?
JOB 10:4 మీ కళ్లు మనుష్యుల కళ్లలాంటివా? మనుష్యులు చూసేటట్లు మీరు చూస్తారా?
JOB 10:5 మీ రోజులు మానవుల రోజుల వంటివా మీ సంవత్సరాలు బలమైన మనుష్యుల సంవత్సరాల వంటివా?
JOB 10:6 నేను దోషిని కానని మీ చేతిలో నుండి నన్ను ఎవరూ విడిపించలేరని మీకు తెలిసినప్పటికీ నా అపరాధాలను మీరు వెదకుతున్నారు? నా పాపాలను మీరు పరిశోధిస్తున్నారు?
JOB 10:8 “మీ చేతులు నన్ను రూపొందించి తయారుచేశాయి. ఇప్పుడు మీరు నన్ను తిరిగి నాశనం చేస్తారా?
JOB 10:9 బంకమట్టిలా నన్ను రూపొందించారని జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు నన్ను తిరిగి మట్టిలా మారుస్తారా?
JOB 10:10 పాలు పోసినట్లు మీరు నన్ను పోయలేదా, జున్నుగడ్డ పేరబెట్టినట్లు నన్ను చేయలేదా,
JOB 10:11 చర్మంతో మాంసంతో నన్ను కప్పి ఎముకలు నరాలతో కలిపి అల్లలేదా?
JOB 10:12 మీరు నాకు జీవాన్ని ఇచ్చి దయ చూపించారు, మీ సంరక్షణతో నా ఆత్మను కాపాడారు.
JOB 10:13 “అయితే ఇది మీ హృదయంలో దాచుకున్నారు, ఇది మీ మనస్సులో ఉన్నదని నాకు తెలుసు:
JOB 10:14 నేను పాపం చేస్తే, మీరు నన్ను చూస్తుంటారు, నా నేరానికి శిక్ష వేయకుండ వదలరు.
JOB 10:15 నేను దోషినైతే నాకు శ్రమ! నేను నిర్దోషినైనప్పటికి నా తల పైకెత్తలేను, ఎందుకంటే నేను అవమానంతో నిండుకొని నా బాధలో మునిగి ఉన్నాను.
JOB 10:16 నా తలను పైకెత్తితే సింహం వలె మీరు నన్ను వేటాడతారు, నాకు వ్యతిరేకంగా మీ మహాబలాన్ని మరలా ప్రదర్శిస్తారు.
JOB 10:17 మీరు నాకు వ్యతిరేకంగా మరలా సాక్షులను తీసుకువస్తారు నా మీద మీకు కోపం పెరిగిపోతుంది; ఒకదాని తర్వాత ఒకటిగా మీ సైన్యాలు నామీదికి వస్తాయి.
JOB 10:18 “అసలు గర్భం నుండి నన్నెందుకు బయటకు తీసుకువచ్చారు? ఎవరు నన్ను చూడకముందే నేను చనిపోయి ఉంటే బాగుండేది.
JOB 10:19 అప్పుడు నేను ఉండేవాడిని కాదు, గర్భం నుండి నేరుగా సమాధికి వెళ్లేవాన్ని.
JOB 10:20 నాకున్న కొన్ని రోజులు దాదాపు ముగియలేదా? నేను సంతోష గడియలు కలిగి ఉండేలా,
JOB 10:21 తిరిగి రాలేని స్థలానికి నేను వెళ్లక ముందు, చీకటి, అంధకారం గల దేశానికి వెళ్లక ముందు నన్ను వదిలేయండి.
JOB 10:22 అంధకారం గల చిమ్మచీకటి గందరగోళంగా ఉండే స్థలానికి నన్ను వెళ్లనివ్వండి, అక్కడ వెలుగు కూడా చీకటిలా ఉంటుంది.”
JOB 11:1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:
JOB 11:2 “ఈ మాటలన్నిటికి జవాబు చెప్పాలి కదా? ఈ వదరుబోతు నిర్దోషిగా గుర్తించబడాలా?
JOB 11:3 నీ వ్యర్థమైన మాటలు విని ఇతరులు మౌనంగా ఉండాలా? నీవు ఎగతాళి చేసినప్పుడు నిన్నెవరు మందలించరా?
JOB 11:4 నీవు దేవునితో, ‘నా నమ్మకాలు నిర్దోషమైనవి, మీ దృష్టికి నేను పవిత్రుడను’ అని చెప్తున్నావు.
JOB 11:5 అయితే దేవుడు నీతో మాట్లాడాలని, ఆయన నీతో వాదించాలని,
JOB 11:6 జ్ఞాన రహస్యాలు ఆయనే నీకు తెలియజేయాలని నేను ఎంతో కోరుతున్నాను, ఎందుకంటే, నిజమైన జ్ఞానం నీ ఆలోచనకు మించింది. నీ పాపాల్లో కొన్నిటిని దేవుడు మరచిపోయారని తెలుసుకో.
JOB 11:7 “దేవుని రహస్యాలను నీవు గ్రహించగలవా? సర్వశక్తిమంతుడైన దేవుని గురించి పూర్తిగా తెలుసుకోగలవా?
JOB 11:8 అవి పైనున్న ఆకాశాలకన్నా ఉన్నతమైనవి, నీవు ఏమి చేయగలవు? అవి పాతాళం కంటే లోతైనవి, నీవు ఏమి తెలుసుకోగలవు?
JOB 11:9 అవి భూమి కంటే పొడవైనవి, సముద్రం కంటే విశాలమైనవి.
JOB 11:10 “ఆయన వచ్చి, నిన్ను చెరసాలలో బంధిస్తే న్యాయసభను ఏర్పాటుచేస్తే, ఆయనను ఎవరు అడ్డగించగలరు?
JOB 11:11 మోసగాళ్లు ఎవరో ఆయనకు తెలుసు; చెడుతనాన్ని చూసిప్పుడు, ఆయన దానిని గమనించడా?
JOB 11:12 అడవి గాడిదపిల్ల మనిషిగా పుడుతుందేమో కాని, తెలివిలేనివాడు తెలివైనవానిగా మారడం కష్టము.
JOB 11:13 “నీవు నీ హృదయాన్ని సమర్పించుకొని, నీ చేతులు ఆయన వైపు చాపితే,
JOB 11:14 నీ చేతిలో ఉన్న పాపాన్ని నీవు విడిచిపెడితే నీ గుడారంలో చెడుకు చోటివ్వకపోతే,
JOB 11:15 అప్పుడు నిర్దోషిగా నీ ముఖాన్ని పైకెత్తుతావు; భయం లేకుండా స్థిరంగా నిలబడతావు.
JOB 11:16 నీ కష్టాన్ని తప్పకుండా నీవు మరచిపోతావు. పారుతూ దాటిపోయిన నీటిలా మాత్రమే నీవు దాన్ని గుర్తుచేసుకుంటావు.
JOB 11:17 అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల ప్రకాశం కన్నా ఎక్కువ ప్రకాశిస్తుంది. చీకటి ఉన్నా అది ఉదయపు వెలుగులా ఉంటుంది.
JOB 11:18 అప్పుడు నిరీక్షణ ఉంటుంది కాబట్టి నీవు భద్రత కలిగి ఉంటావు. నీ ఇంటిని పరిశోధించి సురక్షితంగా పడుకుంటావు.
JOB 11:19 ఎవరి భయం లేకుండా నీవు విశ్రమిస్తావు. చాలామంది నీ సహాయాన్ని కోరుకుంటారు.
JOB 11:20 కాని దుర్మార్గుల చూపు మందగిస్తుంది. తప్పించుకొనే చోటు వారికి దొరకదు; ప్రాణం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తారు.”
JOB 12:1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
JOB 12:2 నిస్సందేహంగా లోకంలో మీరే జ్ఞానులు, మీతో పాటే జ్ఞానం అంతరిస్తుంది!
JOB 12:3 అయినా మీకున్నట్లే నాకు కూడా గ్రహించే మనస్సు ఉంది, నేను మీకేమి తీసిపోను. ఈ విషయాలు తెలియనివారు ఎవరు?
JOB 12:4 నేను దేవునికి ప్రార్థించగా ఆయన సమాధానం ఇచ్చినప్పటికీ, నా స్నేహితుల ముందు నేను నవ్వులపాలయ్యాను, నీతిగా నిందారహితంగా ఉన్న నేను నవ్వులపాలయ్యాను.
JOB 12:5 నిశ్చింతగా ఉన్నవారు అభాగ్యులను తిరస్కరిస్తారు, పాదాలు జారిపోతున్న వారి విధిని చూసి ఎగతాళి చేస్తారు.
JOB 12:6 బందిపోటు దొంగల గుడారాలు ప్రశాంతంగా ఉంటాయి, దేవునికి కోపం పుట్టించే వారు సురక్షితంగా ఉంటారు, వారి దేవుడు వారి చేతిలోనే ఉన్నాడు.
JOB 12:7 కాని జంతువులను అడగండి అవి మీకు బోధిస్తాయి, ఆకాశంలోని పక్షులను అడగండి అవి మీకు చెప్తాయి.
JOB 12:8 భూమితో మాట్లాడండి అది మీకు బోధిస్తుంది, సముద్రంలోని చేపలు మీకు తెలియచేస్తాయి.
JOB 12:9 వీటన్నిటిని యెహోవా హస్తం చేసిందని తెలుసుకోలేనివారు ఎవరు?
JOB 12:10 ఆయన చేతిలో జీవులన్నిటి ప్రాణం మానవులందరి ఊపిరి ఉంది.
JOB 12:11 నాలుక ఆహారం రుచిని చూసినట్లు చెవి మాటలను పరిశీలించదా?
JOB 12:12 వృద్ధుల దగ్గర జ్ఞానం దొరకదా? దీర్ఘాయువు గ్రహింపును తీసుకురాదా?
JOB 12:13 జ్ఞానం శక్తి దేవునికి చెందినవి; ఆలోచన గ్రహింపు ఆయనవే.
JOB 12:14 దేవుడు పడగొట్టిన దానిని తిరిగి కట్టలేరు; ఆయన బంధించిన వారిని ఎవరూ విడిపించలేరు.
JOB 12:15 ఆయన జలాలను ఆపేస్తే అవి ఎండిపోతాయి; ఆయన వాటిని వదిలేస్తే అవి భూమిని వరదలతో నాశనం చేస్తాయి.
JOB 12:16 బలం వివేకం ఆయనకు చెందినవే; మోసపోయేవారు మోసగించేవారు ఆయన వారే.
JOB 12:17 ఆయన ఆలోచనకర్తలను దిగంబరులుగా నడిపిస్తారు, న్యాయాధిపతులను బుద్ధిహీనులుగా చేస్తారు.
JOB 12:18 ఆయన రాజులు వేసిన సంకెళ్ళు తీసివేస్తారు వారి నడుము చుట్టూ తాడు కడతాడు.
JOB 12:19 యాజకులను దిగంబరులుగా చేసి నడిపిస్తారు, స్థిరంగా పాతుకుపోయిన అధికారులను పడగొడతారు.
JOB 12:20 నమ్మకమైన సలహాదారుల మాటలను నిరర్థకం చేస్తారు, పెద్దల వివేచనను తీసివేస్తారు.
JOB 12:21 ఆయన అధిపతుల మీద అవమానాన్ని కురిపిస్తారు, బలవంతులను నిరాయుధులనుగా చేస్తారు.
JOB 12:22 ఆయన చీకటిలోని లోతైన విషయాలను వెల్లడిస్తారు చిమ్మ చీకటిని వెలుగులోకి తెస్తారు.
JOB 12:23 ఆయన దేశాలను గొప్ప చేస్తారు వాటిని నాశనం చేస్తారు; దేశాలను విశాలపరుస్తారు వాటిని చెదరగొడతారు.
JOB 12:24 ఆయన భూలోక నాయకుల గ్రహింపును తీసివేస్తారు; వారు దారిలేని ఎడారిలో తిరుగులాడేలా చేస్తారు.
JOB 12:25 వారు వెలుగు లేదా చీకటిలో తడబడతారు; ఆయన వారిని త్రాగుబోతు తూలినట్లు తూలేలా చేస్తారు.
JOB 13:1 నా కళ్లు ఇదంతా చూశాయి, నా చెవులు విని గ్రహించాయి.
JOB 13:2 మీకు తెలిసింది నాకు కూడా తెలుసు. మీకు నేనేమి తీసిపోను.
JOB 13:3 అయినా, సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని దేవునితోనే వాదించాలని కోరుతున్నాను.
JOB 13:4 అయితే మీరు అబద్ధాలను పుట్టిస్తారు. మీరంతా ఎందుకు పనికిరాని వైద్యులు!
JOB 13:5 మీరందరు మౌనంగా ఉంటే మంచిది, మీకు అదే జ్ఞానము.
JOB 13:6 ఇప్పుడు నా వాదన వినండి; నా వాదనలు ఆలకించండి.
JOB 13:7 దేవుని పక్షంగా మీరు దుర్మార్గంగా మాట్లాడగలరా? ఆయన కోసం వంచనగా మాట్లాడగలరా?
JOB 13:8 ఆయన పట్ల పక్షపాతం చూపిస్తారా? దేవుని పక్షంగా మీరు వాదిస్తారా?
JOB 13:9 ఒకవేళ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తే బాగుంటుందా? ఒక మనిషిని మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేయగలరా?
JOB 13:10 మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని గద్దిస్తారు.
JOB 13:11 దేవుని వైభవం మిమ్మల్ని భయపెట్టదా? ఆయన భయం మీ మీదికి రాదా?
JOB 13:12 మీ నీతిమాటలు బూడిదలాంటి సామెతలు, మీ వాదనలు మట్టి వాదనలు.
JOB 13:13 మౌనంగా ఉండండి నన్ను మాట్లాడనివ్వండి; అప్పుడు నా మీదికి ఏది రావాలో అది వస్తుంది.
JOB 13:14 నేనెందుకు ప్రమాదంలో పడాలి? నా ప్రాణాన్ని ఎందుకు నా చేతుల్లో పెట్టుకోవాలి?
JOB 13:15 ఆయన నన్ను చంపినా సరే ఆయనలోనే నిరీక్షిస్తాను; నా మార్గం గురించి నేరుగా ఆయనతో వాదిస్తాను.
JOB 13:16 ఇది నాకు విడుదలలా మారుతుంది, ఎందుకంటే భక్తిహీనులు దేవుని ముందుకు రావడానికి తెగించలేరు!
JOB 13:17 నా మాటలను శ్రద్ధగా వినండి. మీ చెవుల్లో నా మాటలు మారుమ్రోగాలి.
JOB 13:18 ఇప్పుడు నా వ్యాజ్యెం సిద్ధంగా ఉంది కాబట్టి, నేను నిర్దోషినని రుజువవుతానని నాకు తెలుసు.
JOB 13:19 ఎవరైనా నాపై ఆరోపణలు చేయగలరా? ఒకవేళ చేయగలిగితే, నేను మౌనంగా ఉండి చనిపోతాను.
JOB 13:20 దేవా! కేవలం రెండింటిని నాకు అనుగ్రహించండి, అప్పుడు మీ నుండి నేను దాగను.
JOB 13:21 మీ చేతిని నా మీద నుండి తీసివేయండి, మీ భయంతో నన్ను భయపెట్టకండి.
JOB 13:22 అప్పుడు నన్ను పిలిస్తే నేను జవాబిస్తాను. నన్ను మాట్లాడనిచ్చి మీరు జవాబివ్వండి.
JOB 13:23 నేను ఎన్ని దోషాలను పాపాలను చేశాను? నా అతిక్రమాన్ని నా పాపాన్ని నాకు చూపించండి.
JOB 13:24 ఎందుకు మీ ముఖాన్ని దాచుకుంటున్నారు? ఎందుకు నన్ను శత్రువుగా భావిస్తున్నారు?
JOB 13:25 గాలికి ఎగిరే ఆకును మీరు వేధిస్తారా? ఎండిన చెత్తను మీరు తరుముతారా?
JOB 13:26 మీరు నాకు కఠిన శిక్ష విధించారు యవ్వనకాలంలో చేసిన పాపాల ప్రతిఫలం అనుభవించేలా చేశారు.
JOB 13:27 సంకెళ్ళతో నా కాళ్లు బిగించారు. నా అరికాళ్ల చుట్టూ గీత గీసి, నా ప్రవర్తనంతటిని జాగ్రత్తగా కనిపెడుతున్నారు.
JOB 13:28 మురిగి కుళ్ళిపోతున్న దానిలా, చిమ్మెటలు కొట్టిన వస్త్రంలా మనిషి నాశనమవుతాడు.
JOB 14:1 “స్త్రీకి పుట్టిన మనుష్యులు, ఉండేది కొంతకాలమే అయినా ఎన్నో శ్రమలు పొందుతారు.
JOB 14:2 వారు పువ్వులా వికసించి వాడిపోతారు; నిలకడలేని నీడలా వారు స్థిరంగా ఉండరు.
JOB 14:3 అలాంటివారి మీద మీ దృష్టిని నిలిపారా? తీర్పు తీర్చడానికి వారిని మీ ఎదుటికి తీసుకువస్తారా?
JOB 14:4 అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని ఎవరు తీసుకురాగలరు? ఎవరు తీసుకురాలేరు!
JOB 14:5 మనుష్యులు బ్రతికే రోజులు నిశ్చయించబడ్డాయి; వారు ఎన్ని నెలలు బ్రతుకుతారో మీరు శాసించారు వారు దాటలేని పరిధిని మీరు నియమించారు.
JOB 14:6 కూలివారిలా వారు తమ పని ముగించే వరకు మీరు వారివైపు చూడకండి, వారిని అలా వదిలేయండి.
JOB 14:7 “కనీసం చెట్టుకైనా నిరీక్షణ ఉంది: దాన్ని నరికివేసినా అది మరలా చిగురిస్తుంది, దానికి లేత కొమ్మలు ఖచ్చితంగా వస్తాయి.
JOB 14:8 దాని వేర్లు భూమిలో ఎండిపోయినా దాని మోడు మట్టిలో చనిపోయినా,
JOB 14:9 నీటి వాసన తగిలితే చాలు అది చిగురిస్తుంది. లేత మొక్కలా కొమ్మలు వేస్తుంది.
JOB 14:10 కాని నరులు చనిపోయి కదలకుండ పడి ఉంటారు; చివరి శ్వాస విడిచిన తర్వాత వారు ఇక ఉండరు.
JOB 14:11 సముద్రంలోని నీరు ఆవిరైపోయినట్లుగా, నదీ తీరం హరించి ఎండిపోయినట్లుగా,
JOB 14:12 మానవులు నిద్రిస్తారు, తిరిగి లేవరు; ఆకాశం గతించేవరకు వారు మేలుకోరు వారి నిద్ర నుండి తిరిగి లేవరు.
JOB 14:13 “మీరు నన్ను సమాధిలో దాచిపెడితే, మీ కోపాగ్ని చల్లారే వరకు నన్ను దాచి ఉంచితే ఎంత బాగుండేది! మీరు నాకు కొంతకాలం నియమించి ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుంటే బాగుండేది!
JOB 14:14 ఎవరైనా చనిపోతే వారు మరలా బ్రతుకుతారా? అలా అయితే నేను కష్టపడి పనిచేసే రోజులన్నీ నా విడుదల కోసం నేను ఎదురుచూస్తాను.
JOB 14:15 అప్పుడు మీరు పిలుస్తారు నేను జవాబిస్తాను; మీ చేతులు చేసిన వాటిని మీరు ఇష్టపడతారు.
JOB 14:16 అప్పుడు ఖచ్చితంగా మీరు నా అడుగులను లెక్కిస్తారు కాని నా పాపాలను గుర్తించరు.
JOB 14:17 నా అతిక్రమాలు సంచిలో మూసివేయబడతాయి; మీరు నా పాపాన్ని కప్పివేస్తారు.
JOB 14:18 “పర్వతాలు క్షీణించి ముక్కలైనట్లుగా కొండలు వాటి స్థానం తప్పునట్లుగా,
JOB 14:19 నీళ్లు రాళ్లను అరగదీసినట్లుగా ప్రవాహాలు మట్టిని కడిగివేసినట్లు, మీరు మనిషి యొక్క నిరీక్షణను నాశనం చేస్తారు.
JOB 14:20 మీరు వారిని ఒకేసారి జయిస్తారు, వారు గతించిపోతారు; మీరు వారి ముఖం తీరు మార్చివేసి వారిని వెళ్లగొడతారు.
JOB 14:21 ఒకవేళ వారి పిల్లలు గౌరవించబడినా అది వారికి తెలియదు; వారి సంతానం అణచివేయబడినా వారు గ్రహించలేరు.
JOB 14:22 వారు తమ శరీరంలోని బాధను మాత్రమే అనుభవిస్తారు తమ కోసం మాత్రమే దుఃఖపడతారు.”
JOB 15:1 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు:
JOB 15:2 “జ్ఞానం కలవారు వ్యర్థమైన తెలివితో సమాధానం ఇస్తారా? తూర్పు గాలితో తమ కడుపు నింపుకొంటారా?
JOB 15:3 పనికిరాని పదాలతో విలువలేని మాటలతో వారు వాదిస్తారా?
JOB 15:4 నీవు భక్తిని విడిచిపెట్టి దేవుని గురించిన ధ్యానాన్ని అడ్డగిస్తున్నావు.
JOB 15:5 నీ నోరు నీ పాపాలను తెలియజేస్తుంది; కపటంగా మాట్లాడేవారిలా నీవు మాట్లాడుతున్నావు.
JOB 15:6 నేను కాదు, నీ నోరే నిన్ను ఖండిస్తుంది; నీ పెదవులే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నాయి.
JOB 15:7 “నీవేమైన మొదట పుట్టిన పురుషునివా? కొండలు ఏర్పడక ముందే నీవు ఉన్నావా?
JOB 15:8 దేవుని ఆలోచనసభలో నీవు ఉన్నావా? జ్ఞానం నీకొక్కడికే సొంతమా?
JOB 15:9 నీకు తెలిసినది మాకు తెలియనిది ఏమిటి? నీవు గ్రహించగలిగింది మేము గ్రహించలేనిది ఏమిటి?
JOB 15:10 తల నెరసినవారు వృద్ధులైనవారు మా వైపు ఉన్నారు, వారు వయస్సులో నీ తండ్రి కంటే పెద్దవారు.
JOB 15:11 దేవుని ఓదార్పులు నీకు సరిపోవడం లేదా? ఆయన మృదువైన మాటలు సరిపోవడం లేదా?
JOB 15:12 దేవుని మీద కోప్పడి, ఇలాంటి మాటలు నీ నోటి నుండి వచ్చేలా, నీ హృదయం ఎందుకు క్రుంగిపోయింది నీ కళ్లు ఎందుకు ఎర్రబడ్డాయి?
JOB 15:14 “పవిత్రులుగా ఉండడానికి మనుష్యులు ఏపాటివారు? నీతిమంతులుగా ఉండడానికి స్త్రీకి పుట్టిన వారు ఏపాటివారు?
JOB 15:15 దేవుడు తన పవిత్రులను కూడా నమ్మకపోతే, ఆయన దృష్టిలో ఆకాశాలు కూడా పవిత్రం కాకపోతే,
JOB 15:16 ఇక చెడును నీటిలా త్రాగే నీచులు, అవినీతిపరులు, ఆయన దృష్టికి ఇంకెంత అల్పులు!
JOB 15:17 “నా మాట విను, నేను నీకు వివరిస్తాను; నేను చూసిన దానిని నీకు చెప్తాను.
JOB 15:18 జ్ఞానులు తమ పూర్వికుల దగ్గర నుండి సంపాదించి దానిలో ఏమీ దాచకుండా చెప్పిన బోధ నీకు చెప్తాను.
JOB 15:19 ఇతర ప్రజలు వారి మధ్య లేనప్పుడు ఆ దేశం స్వాస్థ్యంగా ఇవ్వబడిన జ్ఞానులు చెప్పిన బోధ నీకు చెప్తాను.
JOB 15:20 దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధ అనుభవిస్తాడు. క్రూరమైనవాడు తనకు నియమించిన సంవత్సరాలన్నీ బాధ అనుభవిస్తాడు.
JOB 15:21 భయంకరమైన శబ్దాలు వాని చెవుల్లో మ్రోగుతాయి. అంతా క్షేమంగా ఉన్నప్పుడు నాశనం చేసేవారు అతనిపై దాడి చేస్తారు.
JOB 15:22 చీకటిని తప్పించుకుంటాడనే నమ్మకం అతనికి లేదు; అతడు ఖడ్గం పాలవుతాడు.
JOB 15:23 అతడు ఆహారం కోసం రాబందులా చుట్టూ తిరుగుతాడు; చీకటి రోజులు సమీపించాయని అతనికి తెలుసు.
JOB 15:24 శ్రమ వేదన అతన్ని భయపెడతాయి; యుద్ధానికి సిద్ధమైన రాజులా అవి అతన్ని ముంచెత్తుతాయి,
JOB 15:25 ఎందుకంటే, అతడు దేవునికి విరోధంగా చేయి చాపాడు సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల గర్వంగా ప్రవర్తించాడు.
JOB 15:26 అతడు మందంగా ఉన్న బలమైన డాలుతో ధిక్కారంగా దేవుని మీదికి దండెత్తుతాడు.
JOB 15:27 “వాని ముఖం క్రొవ్వుపట్టి ఉన్నప్పటికీ అతని నడుము క్రొవ్వుతో ఉబ్బినప్పటికి,
JOB 15:28 అతడు పాడైపోయిన పట్టణాల్లో ఎవరు నివసించని ఇళ్ళలో, శిధిలమైపోతున్న ఇళ్ళలో నివసిస్తాడు.
JOB 15:29 ఇక ఎప్పటికీ అతడు ధనవంతునిగా ఉండడు అతని సంపద నిలబడదు. అతని ఆస్తులు భూమిలో విస్తరించవు.
JOB 15:30 అతడు చీకటిని తప్పించుకోలేడు అతని లేత మొక్కలను అగ్ని కాల్చివేస్తుంది, దేవుని నోటి ఊపిరిచేత అతడు చనిపోతాడు.
JOB 15:31 అతడు వ్యర్థమైన దానిని నమ్మి తనను తాను మోసగించుకోవద్దు ఎందుకంటే అతనికి ప్రతిఫలం ఏమి ఉండదు.
JOB 15:32 అతని కాలం పూర్తి కాక ముందే వాడిపోతాడు, అతని కొమ్మలు వృద్ధిచెందవు.
JOB 15:33 పిందెలు రాలిపోయే ద్రాక్ష చెట్టులా, పువ్వులు రాలిపోయే ఒలీవ చెట్టులా అతడు ఉంటాడు.
JOB 15:34 భక్తిలేనివారి సహచరులు నిస్సారంగా ఉంటారు, లంచాలు ప్రేమించేవారి గుడారాలను అగ్ని కాల్చివేస్తుంది.
JOB 15:35 వారు దుష్టత్వాన్ని గర్భం ధరించి చెడును కంటారు. వారి కడుపున మోసం పుడుతుంది.”
JOB 16:1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
JOB 16:2 నేను ఇలాంటి విషయాలెన్నో విన్నాను; మీరందరు నీచంగా ఓదార్చేవారు.
JOB 16:3 మీ గాలిమాటలకు అంతం లేదా? మీరు ఇలాంటి సమాధానం ఇచ్చేలా ఏది మిమ్మల్ని బలవంతం చేస్తుంది?
JOB 16:4 నేనున్న స్థానంలో మీరు ఉంటే, నేనూ మీలాగే మాట్లాడగలను; మీకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడి మిమ్మల్ని చూసి తల ఊపుతూ ఎగతాళి చేయగలను.
JOB 16:5 కాని నా నోటి మాట మిమ్మల్ని బలపరుస్తుంది; నా పెదవుల నుండి వచ్చే ఆదరణ మీకు ఉపశమనం కలిగిస్తుంది.
JOB 16:6 అయితే నేను మాట్లాడినప్పటికి నా బాధకు ఉపశమనం లేదు; మౌనంగా ఉన్నా నా బాధ తీరదు.
JOB 16:7 దేవా, నాకు అలసట కలిగించారు; నా కుటుంబమంతటిని వినాశనం చేశారు.
JOB 16:8 మీరు నన్ను అస్థిపంజరంలా చేశారు అది నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది; బక్కచిక్కిన నా దేహం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది.
JOB 16:9 దేవుడు తన కోపంలో నా మీద దాడి చేసి నన్ను చీల్చివేశారు; ఆయన నా వైపు చూస్తూ పళ్ళు కొరుకుతున్నారు; నాకు శత్రువై నాపై కన్నెర్ర చేసి నావైపు కోపంగా చూస్తున్నారు.
JOB 16:10 ప్రజలు నన్ను ఎత్తిపొడవడానికి వారి నోళ్ళు తెరిచారు; నన్ను తిట్టి చెంపదెబ్బలు కొడుతున్నారు. నాకు వ్యతిరేకంగా వారంతా ఒక్కటైయ్యారు.
JOB 16:11 దేవుడు నన్ను భక్తిహీనులకు అప్పగించారు. దుర్మార్గుల చేతుల్లో నన్ను పడవేశారు.
JOB 16:12 నేను నెమ్మది కలిగి ఉండేవాన్ని, కాని ఆయన నన్ను ముక్కలుగా చేశారు; నా మెడ పట్టుకుని విదిలించి నన్ను నలిపేశారు. ఆయన నన్ను తన గురిగా పెట్టుకున్నారు;
JOB 16:13 ఆయన బాణాలు నన్ను చుట్టుకున్నాయి జాలి లేకుండ ఆయన నా మూత్రపిండాల గుండా గుచ్చారు నా పైత్యరసాన్ని నేలపై పారబోశారు.
JOB 16:14 పదే పదే ఆయన నన్ను విరుచుకుపడ్డారు; శూరునిలా పరుగున నా మీద పడ్డారు.
JOB 16:15 నా చర్మం మీద గోనెపట్ట కుట్టుకున్నాను నా నుదిటిని దుమ్ములో ఉంచాను.
JOB 16:16 ఏడ్పుచేత నా ముఖం ఎరుపెక్కింది నా కనురెప్పల మీద చీకటి నీడలు ఉన్నాయి;
JOB 16:17 అయినా నా చేతులు దౌర్జన్యానికి దూరంగా ఉన్నాయి, నా ప్రార్థనలు యథార్థంగా ఉన్నాయి.
JOB 16:18 భూమీ, నా రక్తాన్ని కప్పివేయకు; నా మొర ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలి.
JOB 16:19 ఇప్పుడు కూడా నా సాక్షి పరలోకంలో ఉన్నాడు; నా న్యాయవాది పైన ఉన్నాడు.
JOB 16:20 నా కళ్లు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుండగా నా మధ్యవర్తి నా స్నేహితుడు
JOB 16:21 ఒకడు స్నేహితుని కోసం వేడుకున్నట్లు అతడు నరుని పక్షాన దేవున్ని వేడుకుంటాడు.
JOB 16:22 ముందున్నవి ఇంకా కొన్ని సంవత్సరాలే తర్వాత నేను తిరిగి రాలేని మార్గంలో వెళ్తాను.
JOB 17:1 “నా ప్రాణం క్రుంగిపోయింది, నా రోజులు కుదించబడ్డాయి. సమాధి నా కోసం ఎదురుచూస్తుంది.
JOB 17:2 ఎగతాళి చేసేవారు నన్ను చుట్టుముట్టారు; నేను చూస్తూ ఉండగానే వారు వివాదం రేపుతున్నారు.
JOB 17:3 “దేవా, మీరే నా కోసం జామీనుగా నిలవండి. ఇంకెవరు నాకు భద్రత ఇవ్వగలరు?
JOB 17:4 గ్రహించకుండా మీరు వారి హృదయాలను మూసివేశారు. కాబట్టి మీరు వారిని విజయం పొందనివ్వరు.
JOB 17:5 స్వలాభం కోసం తమ స్నేహితులను ఎవరైనా మోసం చేస్తే వారి పిల్లల కళ్లు మసకబారతాయి.
JOB 17:6 “దేవుడు నన్ను ప్రజలందరికి ఒక సామెతగా చేశారు, నా ముఖం మీద ప్రజలు ఉమ్మివేస్తారు.
JOB 17:7 దుఃఖంతో నా చూపు మందగించింది. నా అవయవాలు నీడలా మారాయి.
JOB 17:8 యథార్థవంతులు దీనినిచూసి ఆశ్చర్యపడతారు; నిర్దోషులు భక్తిహీనులను చూసి ఆందోళన చెందుతారు.
JOB 17:9 అయితే నీతిమంతులు తమ మార్గాలను విడిచిపెట్టరు, నిరపరాధులు బలాన్ని పొందుకుంటారు.
JOB 17:10 “మీరందరు మరోసారి రండి, మరలా ప్రయత్నించండి! నాకు మీలో జ్ఞానవంతుడు ఒక్కడు కూడా కనిపించలేదు.
JOB 17:11 నా రోజులు గతించిపోయాయి, నా ఆలోచనలు వ్యర్థమయ్యాయి. నా హృదయ వాంఛలు భంగమయ్యాయి.
JOB 17:12 ఈ మనుష్యులు రాత్రిని పగలని, చీకటి కమ్ముకున్నప్పుడు వెలుగు వచ్చిందని వాదిస్తారు.
JOB 17:13 నాకున్న ఆశ ఏంటంటే సమాధి నాకు ఇల్లు అవ్వాలి, చీకటిలో నా పరుపు పరచుకోవాలి.
JOB 17:14 నేను అవినీతితో, ‘నీవే నా తండ్రివి’ అని, పురుగుతో, ‘నా తల్లివి’ లేదా ‘నా సోదరివి’ అని అంటే,
JOB 17:15 అప్పుడు నా నిరీక్షణ ఎక్కడున్నట్టు! నా గురించి ఎవరికైనా నిరీక్షణ ఉంటుందా?
JOB 17:16 అది మరణపు తలుపుల దగ్గరకు దిగిపోతుందా? నాతో పాటు మట్టిలో కలిసిపోదా?”
JOB 18:1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబిచ్చాడు:
JOB 18:2 “నీవు ఈ మాటలు మాట్లాడడం ఎప్పుడు మానేస్తావు? కొంచెం ఆలోచించు, అప్పుడు మేము మాట్లాడతాము.
JOB 18:3 నీ దృష్టికి మేము ఎందుకు పశువులుగా తెలివితక్కువ వారిగా కనబడుతున్నాము?
JOB 18:4 కోపంలో నిన్ను నీవే ముక్కలు చేసుకున్నవాడవు, నీకోసం భూమంతా విడిచిపెట్టబడాలా? నీకోసం కొండలు వాటి స్థానం తప్పాలా?
JOB 18:5 “దుర్మార్గుల దీపం ఆర్పివేయబడుతుంది; వారి అగ్నిజ్వాలలు మండవు.
JOB 18:6 వారి గుడారంలో వెలుగు చీకటిగా అవుతుంది; వారి దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది.
JOB 18:7 వారి బలమైన అడుగులు బలహీనపడతాయి; వారి సొంత ఆలోచనలే వారిని పడగొడతాయి.
JOB 18:8 వారి కాళ్లు వారిని వలలోనికి నడిపిస్తాయి; వారు వలలో పడతారు.
JOB 18:9 బోను వారి మడమను పట్టుకుంటుంది; ఉచ్చు వారిని గట్టిగా పట్టుకుంటుంది.
JOB 18:10 వారి కోసం నేల మీద ఉరి అమర్చబడింది; వారి దారిలో ఉచ్చు ఉంది.
JOB 18:11 భయాలు ప్రతి దిక్కునుండి వారిని ఆవరిస్తాయి, అడుగడుగునా వారిని వెంటాడతాయి.
JOB 18:12 విపత్తు వారి కోసం ఆకలితో ఉంది; వారు పడిపోతే ఆపద వారి కోసం సిద్ధంగా ఉంది.
JOB 18:13 అది వారి చర్మ భాగాలను తినివేస్తుంది; మరణం యొక్క మొదటి సంతానం వారి అవయవాలను మ్రింగివేస్తుంది.
JOB 18:14 వారి గుడారంలో ఉన్న భద్రత నుండి వారు పెరికివేయబడ్డారు. భయం కలిగించే రాజు దగ్గరకు కొనిపోబడతారు.
JOB 18:15 అగ్ని వారి గుడారంలో నివసిస్తుంది. వారి నివాసం మీద మండే గంధకం చెదిరిపోతుంది.
JOB 18:16 క్రింద వారి వేర్లు ఎండిపోతాయి పైన వారి కొమ్మలు వాడిపోతాయి.
JOB 18:17 భూమి మీద వారి జ్ఞాపకం నశించిపోతుంది; నేలమీద వారి పేరే ఉండదు.
JOB 18:18 వెలుగులో నుండి చీకటిలోకి వారు నడిపించబడతారు లోకం నుండి వారు తరిమివేయబడతారు.
JOB 18:19 తమ ప్రజల్లో వారికి సంతానం గాని వారసులు గాని ఉండరు, ఒకప్పుడు వారు నివాసమున్న స్థలాల్లో బ్రతికి ఉన్నవారు ఎవరు లేరు.
JOB 18:20 వారి దుస్థితిని చూసిన పశ్చిమ ప్రజలు ఆందోళన చెందుతారు; తూర్పున ఉన్నవారు భయంతో నిండి ఉంటారు.
JOB 18:21 ఖచ్చితంగా దుర్మార్గుల నివాసం ఇలాగే ఉంటుంది; దేవుని ఎరుగనివారి స్థలం కూడా ఇలానే ఉంటుంది.”
JOB 19:1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
JOB 19:2 “ఎంతకాలం మీరు నన్ను వేధించి మాటలతో నలుగగొడతారు?
JOB 19:3 ఇప్పటికి పదిసార్లు మీరు నన్ను నిందించారు; సిగ్గులేకుండా మీరు నాపై దాడి చేశారు.
JOB 19:4 ఒకవేళ నేను తప్పు చేసినట్లైతే నా తప్పు నా మీదికే వస్తుంది.
JOB 19:5 మిమ్మల్ని మీరు నా కంటే హెచ్చించుకొని నా మీద నా అవమానాన్ని మోపితే,
JOB 19:6 దేవుడు నాకు అన్యాయం చేశారని నా చుట్టూ ఆయన తన వల వేశారని తెలుసుకోండి.
JOB 19:7 “నాపై ‘దౌర్జన్యం జరుగుతుంది’ అని నేను మొరపెట్టినా నాకు జవాబు రాదు; సహాయం చేయమని అడిగినా నాకు న్యాయం జరుగదు.
JOB 19:8 నేను దాటకుండా ఆయన నా దారిని మూసివేశారు; నా త్రోవలను చీకటితో కప్పివేశారు.
JOB 19:9 ఆయన నా గౌరవాన్ని తొలగించారు. నా తలపై నుండి కిరీటాన్ని తీసివేశారు.
JOB 19:10 నేను నశించే వరకు అన్నివైపులా ఆయన నన్ను విరగ్గొట్టారు; చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణను పెల్లగించారు.
JOB 19:11 నా మీద ఆయన కోపం రగులుకుంది; ఆయన నన్ను తన శత్రువుగా భావించారు.
JOB 19:12 ఆయన సైన్యాలన్నీ ఒక్కటిగా వచ్చి, నాకు విరోధంగా ముట్టడి దిబ్బలు వేసి నా గుడారం చుట్టూ మకాం వేశారు.
JOB 19:13 “ఆయన నా సహోదరులను నాకు దూరం చేశారు; నా పరిచయస్థులందరూ నాకు పూర్తిగా పరాయివారయ్యారు.
JOB 19:14 నా బంధువులు నా నుండి దూరంగా వెళ్లిపోయారు; నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయారు.
JOB 19:15 నా అతిథులకు నా ఇంటి పనికత్తెలకు నేను విదేశీయునిగా ఉన్నాను; పరాయివానిగా చూసినట్లు వారు నన్ను చూస్తున్నారు.
JOB 19:16 నేను పనివాన్ని పిలిచినా, నేను వాన్ని బ్రతిమాలినా, వాడు పలకడం లేదు.
JOB 19:17 నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది; నా కుటుంబం నన్ను అసహ్యించుకుంటుంది.
JOB 19:18 చిన్నపిల్లలు కూడా నన్ను దూషిస్తున్నారు; నేను కనిపిస్తే నన్ను ఎగతాళి చేస్తున్నారు.
JOB 19:19 నా ప్రాణస్నేహితులంతా నన్ను అసహ్యించుకుంటున్నారు; నేను ప్రేమించినవారు నా మీద తిరగబడుతున్నారు.
JOB 19:20 నేను అస్థిపంజరంలా తయారయ్యాను. నా పళ్ల చిగుళ్ళ పైచర్మం మాత్రమే మిగిలి ఉంది.
JOB 19:21 “జాలి పడండి, నా స్నేహితులారా, నాపై జాలి చూపండి ఎందుకంటే దేవుని హస్తం నన్ను మొత్తింది.
JOB 19:22 దేవుడు వెంటాడినట్లు మీరు కూడా నన్నెందుకు వెంటాడుతున్నారు? నా శరీరం నాశనమైపోయింది, ఇది చాలదా?
JOB 19:23 “నా మాటలు ఒక గ్రంథపుచుట్టలో, వ్రాయబడి ఉంటే బాగుండేది!
JOB 19:24 అవి నిత్యం ఉండేలా ఇనుపగంటతో రాతి మీద చెక్కి సీసంతో నింపితే బాగుండేది!
JOB 19:25 నా విమోచకుడు సజీవుడని, తుదకు ఆయన భూమి మీద నిలబడతారని నాకు తెలుసు.
JOB 19:26 నా చర్మం నాశనమైపోయిన తర్వాత నా శరీరంతో నేను దేవుని చూస్తాను.
JOB 19:27 మరొకరు కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా దేవుని చూస్తాను. నా హృదయం నాలో ఎంత ఆరాటపడుతుంది!
JOB 19:28 “ఒకవేళ మీరు, ‘దీనికంతటికి మూలకారణం అతనిలోనే ఉంది, అతన్ని మనమెలా వేటాడాలి’ అని అనుకుంటే,
JOB 19:29 మీరు ఖడ్గానికి భయపడాలి; ఎందుకంటే కోపమనే ఖడ్గం శిక్షను విధిస్తుంది, అప్పుడు మీరు తీర్పు ఉందని తెలుసుకుంటారు.”
JOB 20:1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:
JOB 20:2 “నేను చాలా ఆందోళన చెందగా, జవాబివ్వాలని నా ఆలోచనలు నన్ను తొందర చేస్తున్నాయి.
JOB 20:3 నాకు అవమానం కలిగించే నిందను నేను విన్నాను, కాబట్టి నా వివేకం జవాబు చెప్పేలా నన్ను ప్రేరేపిస్తుంది.
JOB 20:4 “అనాది కాలం నుండి ఎలా ఉందో నీకు తెలుసు, భూమి మీద నరుడు ఉంచబడినప్పటి నుండి ఏమి జరుగుతున్నది నీకు తెలుసు.
JOB 20:5 దుర్మార్గుల ఉల్లాసం కొద్దిసేపే అని, భక్తిహీనుల సంతోషం ఒక క్షణమే ఉంటుందని నీకు తెలుసు.
JOB 20:6 భక్తిహీనుల గర్వం ఆకాశాలను అంటినా వారి తల మేఘాలను తాకినా,
JOB 20:7 వారి మలంలా వారు కూడా ఎప్పటికి కనబడకుండా నశిస్తారు; వారిని చూసినవారు, ‘వారెక్కడ ఉన్నారు?’ అని అడుగుతారు.
JOB 20:8 కలలా వారు చెదిరిపోయి కనుమరుగవుతారు, రాత్రి స్వప్నంలా వారు చెదిరిపోతారు.
JOB 20:9 వారిని చూసిన కన్ను మరలా వారిని చూడదు; వారి స్థలం వారిని మరలా చూడదు.
JOB 20:10 వారి పిల్లలు పేదవారి సహాయం అడుగుతారు; వారి చేతులు తమ ఆస్తిని తిరిగి ఇచ్చేస్తాయి.
JOB 20:11 వారి ఎముకల్లో నిండి ఉన్న యవ్వన బలం వారితో పాటు మట్టిపాలవుతుంది.
JOB 20:12 “చెడుతనం వారి నోటికి తీయగా ఉన్నా, నాలుక క్రింద వారు దాన్ని దాచినా,
JOB 20:13 భరించలేకపోయినా దాన్ని విడిచిపెట్టలేదు తమ నోటిలో భద్రం చేసుకున్నారు,
JOB 20:14 వారి ఆహారం వారి కడుపులో పులిసిపోతుంది; అది వారిలో నాగుపాముల విషంలా మారుతుంది.
JOB 20:15 వారు మ్రింగిన ఐశ్వర్యాన్ని కక్కివేస్తారు; దేవుడు వారి కడుపు లోనిది కక్కిస్తారు.
JOB 20:16 వారు నాగుపాముల విషాన్ని పీల్చుకుంటారు; పాము కోరలు వారిని చంపుతాయి.
JOB 20:17 నదిలా ప్రవహించే తేనె మీగడలు చూసి, వారు ఆనందించలేరు.
JOB 20:18 వారు కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించకుండానే తిరిగి ఇచ్చేస్తారు; తమ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని వారు ఆస్వాదించరు.
JOB 20:19 ఎందుకంటే వారు పేదలను వేధించి వారిని దిక్కులేనివారిగా చేశారు; తాను కట్టని ఇళ్ళను వారు ఆక్రమించారు.
JOB 20:20 “వారి అత్యాశకు అంతం ఉండదు; వారికున్న సంపదలతో తమను తాము రక్షించుకోలేడు.
JOB 20:21 వారు మ్రింగివేయడానికి వారికి ఏమి మిగల్లేదు; వారి అభివృద్ధి నిలబడదు.
JOB 20:22 వారికి సమృద్ధి కలిగినప్పుడు ఇబ్బందిపడతారు; కష్టాల భారం వారి మీద పడుతుంది.
JOB 20:23 వారు తమ కడుపు నింపుకునేప్పుడు, దేవుడు తన కోపాగ్నిని వారి మీద కురిపిస్తారు, వారి మీద కష్టాలను కురిపిస్తారు.
JOB 20:24 ఇనుప ఆయుధం నుండి వారు తప్పించుకున్నా ఇత్తడి విల్లు నుండి బాణం వారి గుండా దూసుకుపోతుంది.
JOB 20:25 దానిని వెనుక నుండి బయటకు తీయగా మెరుస్తున్న ఆ బాణం అంచు వారి కాలేయాన్ని ముక్కలు చేస్తుంది. మరణభయం వారిని కమ్ముకుంటుంది;
JOB 20:26 వారి సంపదలు చీకటిమయం అవుతాయి, ఎవరూ ఊదకుండానే మంటలు రాజుకొని వారిని దహించి వేసి, వారి గుడారాల్లో మిగిలినదంతా నాశనం చేస్తుంది.
JOB 20:27 ఆకాశాలు వారి అపరాధాన్ని బయటపెడతాయి; భూమి వారి మీదికి లేస్తుంది.
JOB 20:28 దేవుని కోపదినాన ప్రవహించే నీటిలో, వారి ఇళ్ళు కొట్టుకుపోతాయి.
JOB 20:29 దుష్టులకు దేవుడు నియమించిన, వారసత్వం ఇదే.”
JOB 21:1 అప్పుడు యోబు ఇలా అన్నాడు:
JOB 21:2 “నేను శ్రద్ధగా వినండి; ఇదే మీరు నాకిచ్చే ఓదార్పు అవనివ్వండి.
JOB 21:3 నేను మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఓర్చుకోండి, నేను మాట్లాడిన తర్వాత, మీరు ఎగతాళి చేయవచ్చు.
JOB 21:4 “నేను మనుష్యులకు ఫిర్యాదు చేశానా? అలాంటప్పుడు నేను ఎందుకు ఆతురపడకూడదు?
JOB 21:5 నా వైపు చూసి నివ్వెరపోండి; మీ నోటిమీద చేయి వేసుకోండి.
JOB 21:6 దీని గురించి ఆలోచించినప్పుడు, నేను హడలిపోతున్నాను; నా శరీరంలో వణుకు పుడుతుంది.
JOB 21:7 దుష్టులు ఎందుకు బ్రతుకుతూ ఉన్నారు, పెద్దవారిగా ఎదుగుతూ వారు బలాభివృద్ధి చెందుతున్నారు?
JOB 21:8 తమ పిల్లలు స్థిరపడడం వారు చూస్తారు, వారు మనవళ్ళుమనవరాళ్లతో ఆనందిస్తారు.
JOB 21:9 వారి ఇళ్ళు భయం లేకుండ క్షేమంగా ఉన్నాయి; దేవుని శిక్షాదండం వారి మీదికి రాలేదు.
JOB 21:10 వారి ఎద్దులు సంతానోత్పత్తిలో ఎప్పుడూ విఫలం కావు; వారి ఆవులు దూడలను ఈనుతాయి గర్భస్రావం చేయవు.
JOB 21:11 వారు తమ పిల్లలను మందగా పంపిస్తారు; వారి చిన్నారులు నాట్యమాడతారు.
JOB 21:12 కంజర తంతి వాయిద్యాలు మోగిస్తూ పాడతారు; పిల్లనగ్రోవి ఊదుతూ ఆనందిస్తారు.
JOB 21:13 వారు తమ సంవత్సరాలు శ్రేయస్సులో గడుపుతారు సమాధానంతో సమాధికి వెళ్తారు.
JOB 21:14 అయినప్పటికీ వారు దేవునితో, ‘మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి! మీ మార్గాల గురించి తెలుసుకోవాలని మాకు ఆశ లేదు.
JOB 21:15 మేము ఆయనను సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు? మేము ఆయనకు ప్రార్థిస్తే మాకే లాభం కలుగుతుంది?’ అంటారు.
JOB 21:16 అయితే వారి వృద్ధి వారి స్వహస్తాలలో లేదు, కాబట్టి నేను దుష్టుల ప్రణాళికలకు దూరంగా ఉంటాను.
JOB 21:17 “అయినా ఎంత తరచుగా దుర్మార్గుల దీపం ఆరిపోతుంది? దేవుడు తన కోపంలో కేటాయించిన, విపత్తు ఎంత తరచుగా వారి మీదికి వస్తుంది?
JOB 21:18 వారు ఎంత తరచుగా గాలి ముందు ఉనకలా, తుఫానుకు కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు?
JOB 21:19 ‘దేవుడు దుష్టుల శిక్షను వారి పిల్లల కోసం దాచి ఉంచుతాడు’ అని చెప్పబడింది. వారు చేసిన దానిని వారే అనుభవించేలా, దుష్టులకు ఆయనను తిరిగి చెల్లించనివ్వండి.
JOB 21:20 వారి కళ్లు వారి నాశనాన్ని చూడాలి; సర్వశక్తిమంతుని ఉగ్రత పాత్రను వారు త్రాగాలి.
JOB 21:21 వారికి నియమించబడిన నెలలు ముగిసిపోయినప్పుడు వారు విడిచి వెళ్లే తమ కుటుంబాల గురించి వారేమి శ్రద్ధ తీసుకోగలరు?
JOB 21:22 “అత్యంత ఉన్నతమైన వారికి ఆయన తీర్పు తీరుస్తారు, అలాంటి దేవునికి తెలివిని ఎవరైనా బోధించగలరా?
JOB 21:23 ఒక వ్యక్తి పూర్ణ శక్తి, సంపూర్ణ భద్రత, అభివృద్ధి,
JOB 21:24 బాగా పోషించబడిన శరీరం, ఎముకల్లో సమృద్ధి మూలిగ కలిగి ఉండి చస్తాడు.
JOB 21:25 మరొకరు ఎన్నడు ఏ మంచిని అనుభవించకుండానే, మనోవేదనతో చనిపోతారు.
JOB 21:26 మట్టిలో వారు ఒకరి ప్రక్కన ఒకరు పడుకుంటారు, వారిద్దరిని పురుగులు కప్పివేస్తాయి.
JOB 21:27 “మీరేమి ఆలోచిస్తున్నారో, నామీద ఏ కుట్రలు చేస్తున్నారో నాకు తెలుసు.
JOB 21:28 ‘ఇప్పుడు గొప్పవారి గృహం ఎక్కడ, దుష్టులు నివసించిన గుడారాలు ఎక్కడ?’ అని మీరంటారు.
JOB 21:29 ప్రయాణం చేసేవారిని మీరు ఎప్పుడు అడగలేదా? వారు చెప్పినవాటిని మీరు గుర్తుపట్టలేదా?
JOB 21:30 అవేమంటే, విపత్తు దినం నుండి దుష్టులు వదిలి వేయబడతారు, ఉగ్రత దినం నుండి ఎలా తప్పించుకుంటారు?
JOB 21:31 వారి ముఖం మీదనే వారి ప్రవర్తన గురించి ఎవరు ఖండిస్తారు? వారు చేసిన వాటికి ఎవరు వారికి తిరిగి చెల్లిస్తారు?
JOB 21:32 వారు సమాధికి మోయబడతారు, వారి సమాధులపై నిఘా పెట్టబడుతుంది.
JOB 21:33 లోయలోని మట్టి వారికి తీపి; మనుష్యులంతా వారిని వెంబడిస్తారు, అలాగే లెక్కలేనంత జనసమూహం వారికి ముందుగా వెళ్తారు.
JOB 21:34 “కాబట్టి మీ అర్థంలేని మాటలతో నన్నెలా ఓదార్చగలరు? మీ సమాధానాలలో అబద్ధం తప్ప మరేమీ లేదు!”
JOB 22:1 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు:
JOB 22:2 “ఒక మనిషి దేవునికేమైనా ప్రయోజనం చేయగలడా? ఒక జ్ఞానియైన వ్యక్తైనా సరే ఆయనకు ప్రయోజనం చేయగలడా?
JOB 22:3 నీవు నీతిమంతుడవైతే సర్వశక్తిమంతునికి కలిగే ఆనందమేమిటి? నీ మార్గాలు నిందలేనివైతే ఆయనకు వచ్చే లాభం ఏమిటి?
JOB 22:4 “నీకున్న భయభక్తులను బట్టి ఆయన నిన్ను గద్దిస్తారా? దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తారా?
JOB 22:5 నీ దుష్టత్వం గొప్పది కాదా? నీ పాపాలు అంతులేనివి కావా?
JOB 22:6 ఏ కారణం లేకుండానే నీ సోదరుల దగ్గర తాకట్టు తీసుకున్నావు; నీవు ప్రజల బట్టలు లాక్కుని, వారిని నగ్నంగా వదిలివేసావు.
JOB 22:7 సొంత భూమి కలిగి ఉండి, నీవు అధికారంలో ఉండి, ఒక గౌరవం కలిగినవాడవై, స్థాయికి తగినట్టుగా జీవిస్తూ కూడా, నీవు అలసిపోయినవారికి నీళ్లు ఇవ్వలేదు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టకుండ వెనుకకు తీసుకున్నావు.
JOB 22:9 విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసావు తండ్రిలేనివారి బలాన్ని అణగద్రొక్కావు.
JOB 22:10 అందుకే ఉరులు నిన్ను చుట్టుకున్నాయి, ఆకస్మిక ప్రమాదం నిన్ను భయపెడుతుంది.
JOB 22:11 అందుకే ఏమీ చూడలేనంతగా చీకట్లు నిన్ను కమ్ముకున్నాయి, వరదనీరు పొంగి నిన్ను ముంచేస్తున్నాయి.
JOB 22:12 “దేవుడు ఎత్తైన ఆకాశాల్లో లేరా? పైనున్న నక్షత్రాలను చూడు అవి ఎంత ఉన్నతంగా ఉన్నాయి!
JOB 22:13 అయినా నీవు, ‘దేవునికేమి తెలుసు? గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయం చెప్పగలడా?
JOB 22:14 ఆకాశమండలం పైన ఆయన తిరుగుచున్నాడు కాబట్టి మేఘాలు ఆయనను కప్పివేశాయి ఆయన చూడలేడు’ అని అంటున్నావు.
JOB 22:15 దుష్టులు నడిచిన పాత మార్గంలోనే నీవు కూడా నడుస్తావా?
JOB 22:16 తమ గడువు తీరకముందే వారు కొనిపోబడ్డారు, వారి పునాదులు వరదల్లో కొట్టుకుపోయాయి.
JOB 22:17 దేవుడు వారి గృహాలను మంచివాటితో నింపినప్పటికి వారు దేవునితో, ‘మమ్మల్ని విడిచిపో!
JOB 22:18 సర్వశక్తిమంతుడైన దేవుడు మాకేమి చేయగలడు?’ అంటారు కాబట్టి దుర్మార్గుల ప్రణాళికలకు నేను దూరంగా ఉంటాను.
JOB 22:19 ‘మన పగవారు నాశనమైపోయారు, వారి సంపదను అగ్ని కాల్చివేసిందని’ చెప్పుకుంటూ, ఖచ్చితంగా నీతిమంతులు వారి నాశనాన్ని చూసి సంతోషిస్తారు; నిర్దోషులు వారిని ఎగతాళి చేస్తారు.
JOB 22:21 “దేవునికి లొంగి ఆయనతో నీవు సమాధానంగా ఉండు; దీనివలన నీకు వృద్ధి కలుగుతుంది.
JOB 22:22 ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అంగీకరించు ఆయన మాటలను నీ హృదయంలో నిలుపుకో.
JOB 22:23 ఒకవేళ నీవు సర్వశక్తిమంతుని వైపు తిరిగితే, నీవు మళ్ళీ పునరుద్ధరించబడతావు: నీ గుడారంలో నుండి దుష్టత్వాన్ని నీవు తొలగించి
JOB 22:24 నీ బంగారాన్ని మట్టిలో ఓఫీరు బంగారాన్ని కనుమల రాళ్లలో పారవేస్తే,
JOB 22:25 అప్పుడు సర్వశక్తిమంతుడు నీకు బంగారం, నీకు ప్రశస్తమైన వెండి అవుతాడు.
JOB 22:26 అప్పుడు నీవు ఖచ్చితంగా సర్వశక్తిమంతునిలో ఆనందిస్తావు దేవుని వైపు నీ ముఖాన్ని ఎత్తుతావు.
JOB 22:27 నీవు ఆయనకు ప్రార్థన చేస్తావు, ఆయన నీ మనవి వింటారు, నీవు నీ మ్రొక్కుబడులను చెల్లిస్తావు.
JOB 22:28 నీవు ఏది నిర్ణయించుకొంటే అది నీకు జరుగుతుంది, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది.
JOB 22:29 ప్రజలు తగ్గించబడినప్పుడు, ‘వారిని పైకి లేవనెత్తు!’ అని నీవు అంటావు అప్పుడు ఆయన దీనులను రక్షిస్తారు.
JOB 22:30 నిర్దోషి కాని వానిని కూడా ఆయన విడిపిస్తారు, నీ చేతుల శుద్ధి కారణంగా వారికి విడుదల కలుగుతుంది.”
JOB 23:1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
JOB 23:2 ఈ రోజు కూడా నా ఫిర్యాదు తీవ్రంగానే ఉంది; నా మూల్గుల కంటే ఆయన హస్తం నా మీద భారంగా ఉంది.
JOB 23:3 నేను ఆయన నివాసస్థలానికి వెళ్లగలిగేలా; ఆయన ఎక్కడ కనిపిస్తాడో నాకు తెలిస్తే బాగుండేది కదా!
JOB 23:4 ఆయన ఎదుటే నా ఫిర్యాదేమిటో చెప్పుకుంటాను వాదోపవాదాలతో నా నోటిని నింపుకుంటాను.
JOB 23:5 ఆయన నాకు ఏమి జవాబు ఇస్తారో తెలుసుకుంటాను, ఆయన నాకు చెప్పేవాటిని గ్రహిస్తాను.
JOB 23:6 ఆయన తన మహాబలంతో నాతో వాదిస్తారా? లేదు, ఆయన నా మనవి వింటారు.
JOB 23:7 అక్కడ యథార్థవంతులు ఆయన ముందు వాదించగలరు, నేను నా న్యాయాధిపతి నుండి శాశ్వతంగా విడుదల పొందుతాను.
JOB 23:8 కాని నేను తూర్పుకు వెళ్లినా ఆయన అక్కడ లేరు; పడమరకు వెళ్లినా నేను ఆయన ఉన్నట్లు గ్రహించలేదు.
JOB 23:9 ఆయన ఉత్తరాన పని చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్లినా నేను ఆయనను చూడలేదు; ఆయన దక్షిణ వైపుకు తిరిగినప్పుడు, నేనాయనను చూడలేదు.
JOB 23:10 కాని నేను నడిచేదారి ఆయనకు తెలుసు; ఆయన నన్ను పరీక్షించినప్పుడు నేను బంగారంలా బయటకు వస్తాను.
JOB 23:11 ఆయన అడుగుజాడల్లోనే నా పాదాలు నడిచాయి; ప్రక్కకు తొలగకుండా ఆయన మార్గాన్నే అనుసరించాను.
JOB 23:12 ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞలను నేను విడిచిపెట్టలేదు; నేను నా అనుదిన ఆహారం కంటే ఆయన నోటి మాటలకే ఎక్కువ విలువనిచ్చాను.
JOB 23:13 కాని ఆయన మారనివాడు, ఆయనను ఎవరు మార్చగలరు? తనకిష్టమైనదే ఆయన చేస్తారు.
JOB 23:14 నాకు వ్యతిరేకంగా తన శాసనాన్ని ఆయన కొనసాగిస్తారు, ఇలాంటి ఎన్నో ప్రణాళికలు ఆయన దగ్గర ఉన్నాయి.
JOB 23:15 కాబట్టి నేను ఆయన ఎదుట భయపడుతున్నాను, వీటన్నిటిని ఆలోచించినప్పుడు నేను ఆయనకు భయపడుతున్నాను.
JOB 23:16 దేవుడే నా హృదయం క్రుంగిపోయేలా చేశారు; సర్వశక్తిమంతుడు నన్ను భయపెట్టారు.
JOB 23:17 చీకటి నన్ను చుట్టుముట్టినా, దట్టమైన చీకటి నా ముఖాన్ని కమ్మినా నేను నాశనమవ్వలేదు.
JOB 24:1 “సర్వశక్తిమంతుడు తీర్పుకాలాలను ఎందుకు నియమించరు? ఆయనను ఎరిగినవారు ఆ కాలాలను ఎందుకు చూడడం లేదు?
JOB 24:2 సరిహద్దు రాళ్లను తీసివేసేవారున్నారు; వారు దొంగిలించిన మందలను వారు మేపుతారు.
JOB 24:3 తండ్రిలేనివారి గాడిదను తోలుకుపోతారు విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకెళ్తారు.
JOB 24:4 వారు నిరుపేదలను దారి నుండి గెంటివేస్తారు. దేశంలో ఉన్న పేదలందరిని దాక్కునేలా చేస్తారు.
JOB 24:5 అరణ్యంలోని అడవి గాడిదలు తిరిగినట్లు పేదవారు ఆహారాన్ని వెదుకుతూ తిరుగుతారు; బంజరు భూమి వారి పిల్లలకు ఆహారాన్ని ఇస్తుంది.
JOB 24:6 వారు పొలాల్లో పశుగ్రాసం సేకరిస్తారు దుష్టుల ద్రాక్షతోటల్లో రాలిపోయిన వాటిని ఏరుకుంటారు.
JOB 24:7 బట్టలు లేదా, రాత్రంతా దిగంబరంగా గడుపుతారు; చలికి కప్పుకోడానికి వారికి ఏమి లేదు.
JOB 24:8 పర్వతాలపై జడివానలో వారు తడిసిపోతారు. నిలువనీడ కోసం బండలను కౌగిలించుకుంటారు.
JOB 24:9 దుష్టుడు తండ్రిలేని పిల్లలను రొమ్ము నుండి లాగివేస్తాడు; వారు పేదవారి శిశువును తాకట్టుగా తీసుకుంటారు.
JOB 24:10 బట్టలు లేకుండ దిగంబరంగా తిరుగుతారు; పనలు మోస్తారు కాని ఆకలితోనే ఉంటారు.
JOB 24:11 వారు ఒలీవ చెట్ల వరుసల మధ్య ఒలీవనూనె గానుగను ఆడిస్తారు; ద్రాక్షగానుగను త్రొక్కుతారు కాని వారు దప్పికతోనే ఉంటారు.
JOB 24:12 పట్టణంలో మరణమూలుగులు వినబడతాయి, గాయపడినవారి ప్రాణాలు సహాయం కోసం మొరపెడతారు. అయితే దేవుడు వారి మీద నేరారోపణ చేయడు.
JOB 24:13 “వెలుగుమీద తిరుగుబాటు చేసేవారున్నారు, వారికి దాని మార్గాలు తెలియవు దాని బాటలో వారు నిలువరు.
JOB 24:14 హంతకుడు చీకటి పడగానే లేస్తాడు బీదలను నిరుపేదలను చంపుతాడు, రాత్రివేళ దొంగలా దోచుకొంటాడు.
JOB 24:15 వ్యభిచారి కన్ను సందెచీకటి కోసం ఎదురుచూస్తుంది; ముఖానికి ముసుగు వేసుకుని, ‘నన్ను ఎవరు చూడరు’ అని అనుకుంటాడు.
JOB 24:16 దొంగలు రాత్రివేళ ఇళ్ళకు కన్నం వేస్తారు, పగటివేళ లోపల దాక్కుంటారు; వారికి వెలుగుతో సంబంధం లేదు.
JOB 24:17 వారందరికి, మధ్యరాత్రే వారి ఉదయం; వారు చీకటి భయాలతో స్నేహం చేస్తారు.
JOB 24:18 “అయినాసరే వారు నీటి మీద నురుగులా ఉన్నారు; వారి భూభాగం శపించబడింది, కాబట్టి ఎవరు వారి ద్రాక్షతోట వైపు వెళ్లరు.
JOB 24:19 వేడి కరువు కరిగిన మంచును లాగివేసినట్టు, పాతాళం పాపం చేసిన వారిని లాగివేస్తుంది.
JOB 24:20 గర్భం వారిని మరచిపోతుంది, పురుగు వారిపై విందు చేసుకుంటుంది; దుష్టులు ఇక జ్ఞాపకంలో ఉండరు, కాని చెట్టు విరిగినట్లు వారు విరిగిపోతారు.
JOB 24:21 వారు గొడ్రాళ్లను పిల్లలు కనని స్త్రీలను బాధితురాళ్లుగా చేస్తారు, విధవరాలి మీద దయ చూపరు.
JOB 24:22 కానీ దేవుడు తన శక్తితో బలవంతులను లాగుతాడు; వారు స్థిరపడినప్పటికీ, వారికి జీవితం మీద నమ్మకం లేదు.
JOB 24:23 భద్రతా భావనతో ఆయన వారిని విశ్రాంతి తీసుకోనిస్తారు, కాని వారి మార్గాలపై ఆయన దృష్టి ఉంచుతారు.
JOB 24:24 వారు కొద్దిసేపు కోసం హెచ్చింపబడతారు, తర్వాత కనుమరుగవుతారు; వారు పతనం చేయబడి అందరిలాగే పోగుచేయబడతారు; పండిన వెన్నులా వారు కోయబడతారు.
JOB 24:25 “ఒకవేళ ఇదిలా కానట్లైతే, నేను అబద్ధికుడనని నా మాటలు వట్టివని ఎవరు రుజువు చేయగలరు?”
JOB 25:1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబిచ్చాడు:
JOB 25:2 “అధికారం భీకరత్వం దేవునివే; ఉన్నత స్థలాల్లో సమాధానాన్ని కలుగజేస్తారు.
JOB 25:3 ఆయన సైన్యాలు లెక్కించబడగలవా? ఎవరి మీద ఆయన వెలుగు ఉదయించదు?
JOB 25:4 అలాంటప్పుడు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడు కాగలడు? అలాంటప్పుడు స్త్రీకి పుట్టిన ఒకడు ఎలా పవిత్రుడు కాగలడు?
JOB 25:5 ఒకవేళ దేవుని దృష్టిలో చంద్రుడు కాంతివంతుడు కానప్పుడు; నక్షత్రాలు పవిత్రమైనవి కానప్పుడు.
JOB 25:6 పురుగువంటి మనుష్యుడు క్రిమివంటి మనుష్యుడు ఆయన దృష్టిలో పవిత్రుడు కాలేడు కదా!”
JOB 26:1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
JOB 26:2 “శక్తిలేనివారికి నీవు ఎంత సహాయం చేశావు! బలహీనమైన చేతిని నీవు రక్షించావా?
JOB 26:3 జ్ఞానం లేనివారికి నీవు ఎలాంటి ఆలోచన చెప్పావు? ఎంత చక్కగా వివరించావు?
JOB 26:4 ఈ మాటలు చెప్పడానికి నీకు ఎవరు సహాయం చేశారు? ఎవరి మనస్సులోని మాటలు నీ నోటి నుండి వచ్చాయి?
JOB 26:5 “జలాల క్రింద, వాటిలో జీవించే జీవుల క్రింద ఉన్న మృతులు, మృతులు వణుకుతున్నారు.
JOB 26:6 పాతాళలోకం దేవుని ఎదుట తెరిచి ఉంది; నరకం ఆయనకు తేటగా కనిపిస్తుంది.
JOB 26:7 శూన్యమండలంపైన ఉత్తరాన ఆకాశాలను ఆయన విశాలపరిచారు; శూన్యంలో భూమిని వేలాడదీసారు.
JOB 26:8 ఆయన తన మేఘాలలో నీళ్లను బంధించారు అయినా వాటి బరువుకు మేఘాలు చినిగిపోవు.
JOB 26:9 దాని మీద మేఘాలను వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచారు.
JOB 26:10 వెలుగు చీకట్ల సరిహద్దు వరకు జలాలకు ఆయన హద్దును నియమించారు.
JOB 26:11 ఆయన గద్దింపుకు ఆకాశాల స్తంభాలు కంపిస్తాయి.
JOB 26:12 ఆయన బలం చేత సముద్రం ఉప్పొంగుతుంది; తన జ్ఞానం చేత రాహాబును ముక్కలుగా చేస్తారు.
JOB 26:13 ఆయన ఊపిరిచే ఆకాశాలు అలంకరించబడతాయి; ఆయన చేయి పారిపోతున్న సర్పాన్ని పొడిచింది.
JOB 26:14 ఇవన్నీ ఆయన చేసినపనులలో కొంతవరకు మాత్రమే; మనం ఆయన గురించి విన్నది కేవలం గుసగుస ధ్వని వంటిది మాత్రమే! అలాంటప్పుడు ఆయన శక్తి యొక్క ఉరుమును గ్రహించగలిగిన వారెవరు?”
JOB 27:1 యోబు ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నాడు:
JOB 27:2 “నాకు న్యాయం నిరాకరించిన సజీవుడైన దేవుని మీద, నా జీవితాన్ని చేదుగా మార్చిన సర్వశక్తిమంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను,
JOB 27:3 నాలో ప్రాణం ఉన్నంత వరకు, నా నాసికా రంధ్రాల్లో దేవుని ఊపిరి ఉన్నంత వరకు,
JOB 27:4 నా పెదవులు చెడుదేది మాట్లాడవు, నా నాలుక అబద్ధాలు పలకదు.
JOB 27:5 మీరు చెప్పేది సరియైనదంటే నేనొప్పుకోను; నేను చనిపోయే వరకు, నా నిజాయితీని విడిచిపెట్టను.
JOB 27:6 నేను నా నిర్దోషత్వాన్ని కొనసాగిస్తాను దానిని ఎప్పటికీ వదలను; నేను బ్రతికిన కాలమంతా నా మనస్సాక్షి నన్ను నిందించదు.
JOB 27:7 “నా శత్రువు దుష్టునిలా, నా విరోధి అన్యాయస్థునిలా ఉండును గాక!
JOB 27:8 భక్తిహీనులు కొట్టివేయబడిన తర్వాత, దేవుడు వారి ప్రాణాలను తీసివేసిన తర్వాత వారికి ఇంకేమి ఆశ ఉంది?
JOB 27:9 వారి మీదికి ఆపద వచ్చినప్పుడు దేవుడు వారి మొర ఆలకిస్తారా?
JOB 27:10 సర్వశక్తిమంతునిలో వారు ఆనందం పొందుతారా? అన్నివేళల్లో వారు దేవునికి మొరపెడతారా?
JOB 27:11 “దేవుని శక్తిని గురించి నేను మీకు ఉపదేశిస్తాను; సర్వశక్తిమంతుని మార్గాలను నేను దాచిపెట్టను.
JOB 27:12 మీరే దానిని చూశారు. అలాంటప్పుడు ఈ అర్థంలేని సంభాషణ ఎందుకు?
JOB 27:13 “దుష్టులైన మనుష్యులకు దేవుడు ఇచ్చే భాగం; సర్వశక్తుని నుండి వారు పొందే వారసత్వం:
JOB 27:14 వారికి ఎంతమంది పిల్లలున్నా, ఖడ్గం వారి గతి; వారి సంతతికి కడుపునిండా తిండి దొరకదు.
JOB 27:15 వారికి మిగిలిన వారు తెగులుచేత పాతిపెట్టబడతారు, వారి విధవరాండ్రు వారి కోసం రోదించరు.
JOB 27:16 దుమ్ము పోగుచేసినట్లు వెండిని పోగుచేసినా మట్టివలె బట్టలను కుప్పగా వేసినా
JOB 27:17 వారు పోగుచేసిన వాటిని నీతిమంతులు ధరిస్తారు, నిర్దోషులు వారి వెండిని పంచుకుంటారు.
JOB 27:18 వారు కట్టుకునే ఇల్లు పురుగుల గూడులా, కావలివారు వేసుకునే గుడిసెలా ఉంటాయి.
JOB 27:19 వారు ధనవంతులుగా పడుకుంటారు, కాని వారు మేల్కొన్నప్పుడు వారి సంపద అంతా పోయిందని వారు కనుగొంటారు.
JOB 27:20 భీభత్సం వారిని వరదలా ముంచెత్తుతుంది; తుఫాను రాత్రివేళ వారిని లాక్కుని పోతుంది.
JOB 27:21 తూర్పు గాలి వారిని తీసుకెళ్తే, వారిక ఉండరు; అది వారి స్థలం నుండి వారిని తుడిచివేస్తుంది.
JOB 27:22 వారు దాని శక్తి నుండి తలక్రిందులుగా పారిపోతున్నప్పుడు అది దయ లేకుండా వారికి వ్యతిరేకంగా తిరుగుతుంది.
JOB 27:23 అది ఎగతాళి చేస్తూ చప్పట్లు కొడుతుంది వారి స్థలం నుండి వారిని ఊదివేస్తుంది.”
JOB 28:1 వెండికి గని ఉన్నది బంగారాన్ని పుటం వేయడానికి ఒక స్థలం ఉన్నది.
JOB 28:2 ఇనుము మట్టిలో నుండి తీయబడుతుంది, ధాతువు కరిగించి రాగి తీస్తారు.
JOB 28:3 చీకటిలో కాంతిని ఎలా ప్రకాశింప చేయాలో మానవులకు తెలుసు; ధాతువు కోసం చీకటిలో శోధిస్తున్నప్పుడు భూమి యొక్క సుదూర ప్రాంతాలను అన్వేషిస్తారు.
JOB 28:4 మనుష్యుల నివాస స్థలాలకు దూరంగా, మానవ అడుగులు పడని చోట్లలో; వ్రేలాడుతూ ఊగుతూ సొరంగాలు త్రవ్వుతారు.
JOB 28:5 భూమిపై ఆహారం పెంచబడుతుంది, కాని దాని లోపలి భాగం అగ్నికి కరిగిపోయి ఉంటుంది.
JOB 28:6 దాని రాళ్లల్లో నీలమణులుంటాయి. దాని మట్టిలో బంగారం ఉంటుంది.
JOB 28:7 దాని త్రోవ ఏ గ్రద్దకు తెలియదు, డేగ కన్ను కూడా దానిని చూడలేదు.
JOB 28:8 గర్వంగల క్రూరమృగాలు ఆ దారిలో అడుగుపెట్టలేదు, ఏ సింహం అక్కడ నడవలేదు.
JOB 28:9 మనుష్యులు తమ చేతులతో చెకుముకిరాయి మీద దాడి చేస్తారు. కొండలను వాటి పునాదులతో సహా పెకిలించి వేస్తారు.
JOB 28:10 బండలో వారు సొరంగం త్రవ్వుతారు. దాని నిధులను వారి కళ్లు పసిగడుతుంది.
JOB 28:11 వారు నదుల మూలాలను శోధిస్తారు, మరుగున పడి ఉన్నవాటిని వెలుగులోనికి తెస్తారు.
JOB 28:12 అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? అవగాహన ఎక్కడ నివసిస్తుంది?
JOB 28:13 ఏ మానవుడు దాని విలువను అర్థం చేసుకోడు; అది సజీవుల దేశంలో దొరకదు.
JOB 28:14 “అది నాలో లేదు” అని అగాధం అంటుంది; “అది నాలో లేదు” అని సముద్రం అంటుంది.
JOB 28:15 మేలిమి బంగారంతో దానిని కొనలేము, దాని వెలకు సరిపడా వెండిని తూచలేము.
JOB 28:16 ఓఫీరు బంగారంతోనైనా విలువైన గోమేధికంతోనైనా నీలమణితోనైనా దానిని కొనలేము.
JOB 28:17 బంగారాన్ని కాని స్ఫటికాన్ని కాని దానితో పోల్చలేము; బంగారు ఆభరణాలతో కూడా దాన్ని పొందలేము.
JOB 28:18 పగడము చంద్రకాంత శిల ప్రస్తావించదగినవి కావు; జ్ఞానం యొక్క ధర మాణిక్యాలకు మించినది.
JOB 28:19 కూషుదేశపు విలువైన రాయిని దానితో పోల్చలేము; శుద్ధమైన బంగారంతో కూడా దానిని కొనలేము.
JOB 28:20 అలాగైతే జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? అవగాహన ఎక్కడ నివసిస్తుంది?
JOB 28:21 అది జీవులన్నిటి కళ్ళ నుండి దాచబడింది, ఆకాశపక్షుల నుండి కూడా అది దాచిపెట్టబడింది.
JOB 28:22 “కేవలం దాని గురించిన వదంతిని విన్నాము” నరకము మృత్యువు అంటాయి.
JOB 28:23 దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తారు అది ఎక్కడుండేది ఆయనకే తెలుసు.
JOB 28:24 ఎందుకంటే ఆయన భూమి అంచుల వరకు చూస్తున్నారు ఆకాశాల క్రింద ఉన్న ప్రతిదీ ఆయన చూస్తున్నారు.
JOB 28:25 ఆయన గాలి ప్రభావాన్ని స్థాపించినప్పుడు జలములను కొలిచినప్పుడు,
JOB 28:26 వర్షపాతానికి శాసనాన్ని విధించినప్పుడు ఉరుములతో కూడిన మెరుపులకు దారిని ఏర్పరచినప్పుడు,
JOB 28:27 అప్పుడు ఆయన జ్ఞానం వైపు చూశాడు దానిని అంచనా వేశాడు; ఆయన దానిని ధృవీకరించారు పరీక్షించారు.
JOB 28:28 అంతేకాక మనుష్యజాతితో, “యెహోవాకు భయపడడమే జ్ఞానం దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం” అని అన్నాడు.
JOB 29:1 యోబు ఇంకా ఈ విధంగా మాట్లాడాడు:
JOB 29:2 “గడచిన నెలల్లో ఉన్నట్లు, దేవుడు నన్ను కాపాడిన రోజుల్లో ఉన్నట్లు నేను ఉంటే ఎంత బాగుండేది,
JOB 29:3 ఆయన దీపం నా తలపై వెలిగినప్పుడు ఆయన వెలుగును బట్టి చీకటిలో నేను నడిచాను!
JOB 29:4 నేను నా అత్యంత ఉత్పాదక సమయంలో ఉన్నాను, దేవుని సన్నిహిత స్నేహం నా ఇంటిని దీవించినప్పుడు,
JOB 29:5 సర్వశక్తిమంతుడు ఇంకా నాతో ఉన్నప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు.
JOB 29:6 నా అడుగులు మీగడలో మునిగాయి, బండ నుండి నా కోసం ఒలీవనూనె ప్రవహించేది.
JOB 29:7 “నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లినప్పుడు, రాజవీధిలో నా స్థానంలో కూర్చున్నప్పుడు,
JOB 29:8 యువకులు నన్ను చూసి తప్పుకునేవారు వృద్ధులు లేచి నిలబడేవారు;
JOB 29:9 అధికారులు మాట్లాడడం ఆపివేసి, తమ చేతులతో నోటిని కప్పుకునేవారు;
JOB 29:10 ప్రధానులు మౌనంగా ఉండేవారు. వారి నాలుకలు వారి అంగిటికి అంటుకుపోయాయి.
JOB 29:11 నా గురించి విన్న వారు నన్ను ప్రశంసించారు, నన్ను చూసినవారు నా గురించి చెప్పారు,
JOB 29:12 ఎందుకంటే సహాయం కోసం మొరపెట్టిన బీదలను, తమను చూసుకోవడానికి ఎవరూ లేని తండ్రిలేనివారిని నేను రక్షించాను.
JOB 29:13 చనిపోబోతున్నవారు నన్ను దీవించారు; విధవరాండ్ర హృదయాలు సంతోషించేలా చేశాను.
JOB 29:14 నేను నీతిని నా దుస్తులుగా ధరించాను; న్యాయం నాకు వస్త్రం నా తలపాగా అయ్యింది.
JOB 29:15 గ్రుడ్డివారికి నేను కళ్లలా కుంటివారికి పాదాల్లా ఉన్నాను.
JOB 29:16 నిరుపేదలకు నేను తండ్రిగా ఉన్నాను; అపరిచితుల పక్షంగా వాదించడానికి ఒప్పుకున్నాను.
JOB 29:17 దుష్టుల కోరలు విరగ్గొట్టాను వారి పళ్ళ నుండి బాధితులను విడిపించాను.
JOB 29:18 “అప్పుడు నేను ఇలా అనుకున్నాను, ‘నా ఇంట్లోనే నేను చనిపోతాను, నా రోజులు ఇసుక రేణువుల్లా ఉంటాయి.
JOB 29:19 నా వేర్లు నీటిని తాకుతాయి, నా కొమ్మల మీద రాత్రంతా మంచు కురుస్తుంది.
JOB 29:20 నా ఘనత ఎప్పటికీ తగ్గదు; నా చేతిలో నా విల్లు ఎప్పుడూ క్రొత్తదిగానే ఉంటుంది.’
JOB 29:21 “ప్రజలు నేను చెప్పేది ఆశగా వినేవారు, నా సలహా కోసం మౌనంగా ఎదురు చూసేవారు.
JOB 29:22 నేను మాట్లాడిన తర్వాత, వారికిక ఏమి మాట్లాడలేదు; నా మాటలు మృదువుగా వారి చెవులకు చేరాయి.
JOB 29:23 వర్షం కోసం చూసినట్లు వారు నా కోసం ఎదురు చూశారు, కడవరి వర్షంలా వారు నా మాటలు త్రాగారు.
JOB 29:24 నేను వారిని చూసి నవ్వినప్పుడు; వారు కష్టంగా దాన్ని నమ్మారు; నా ముఖకాంతి వారికి ప్రశస్తమైనది.
JOB 29:25 వారికి నేనే పెద్దగా కూర్చుని వారి కోసం మార్గం ఏర్పరిచాను; సైన్యం మధ్యలో ఉండే రాజులా, దుఃఖంలో ఉన్నవారిని ఆదరించేవానిగా నేనున్నాను.
JOB 30:1 “అయితే ఇప్పుడు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, నాకన్నా చిన్నవారు, ఎవరి తండ్రులను నేను నా గొర్రెలు కాసే కుక్కలతో పెట్టడానికి అసహ్యించుకునేవాన్ని.
JOB 30:2 వారి చేతుల బలం వల్ల నాకేమి ఉపయోగం? వారు బలం నశించిపోయిన పురుషులు.
JOB 30:3 లేమితో ఆకలితో బక్కచిక్కినవారై, పొడిగా ఉన్న భూమిపై తిరుగులాడారు రాత్రివేళ నిర్జనమైన బంజరు భూములలో.
JOB 30:4 ఆకుల పొదల్లో ఉప్పు మూలికలు సేకరించారు, బదరీ వేర్లు వారికి ఆహారము.
JOB 30:5 వారు మానవ సమాజం మధ్య నుండి వెళ్లగొట్టబడ్డారు, వారు దొంగలైనట్టు వారిపై కేకలు వేశారు.
JOB 30:6 కాబట్టి ఇప్పుడు వారు భయపెట్టే లోయల్లో, బండల మధ్య గుహల్లో నివసిస్తున్నారు.
JOB 30:7 వారు పొదల మధ్య విరుచుకుపడ్డారు ముండ్లకంపల క్రింద ఒక్కటిగా పోగయ్యారు.
JOB 30:8 పేరు లేని బుద్ధిహీనుల కుమారులు వారు దేశం నుండి తరిమివేయబడ్డారు.
JOB 30:9 “అలాంటి వారికి నేను హేళన పాట అయ్యాను; వారికి నేను ఓ సామెతను అయ్యాను.
JOB 30:10 వారు నన్ను చూసి అసహ్యించుకుని దూరంగా జరుగుతున్నారు; నా ముఖం మీద ఉమ్మివేయడానికి కూడా వెనుకాడరు.
JOB 30:11 దేవుడు నా విల్లును విప్పి నన్ను బాధపెట్టారు, వారు నా సమక్షంలో సంయమనాన్ని వదిలేశారు.
JOB 30:12 నా కుడి వైపున తెగ దాడులు; వారు నా పాదాలకు వలలు వేస్తారు, నాకు వ్యతిరేకంగా తమ నాశన ప్రయత్నాలను చేస్తున్నారు.
JOB 30:13 నా మార్గాన్ని పాడుచేస్తున్నారు; నన్ను నాశనం చేయడంలో వారు విజయం సాధించారు. వారిని అడ్డుకునేవారు లేరు.
JOB 30:14 గండిపడిన పెద్ద ప్రవాహంవలె వారు వస్తారు; పతనంలా వారు దొర్లుతూ వస్తారు.
JOB 30:15 భయాలు నన్ను ముంచెత్తుతాయి; నా గౌరవం గాలిలా తరిమివేయబడింది, నా భద్రత మేఘంలా అదృశ్యమవుతుంది.
JOB 30:16 “ఇప్పుడు నా జీవితం దూరమవుతుంది; శ్రమ దినాలు నన్ను పట్టుకున్నాయి.
JOB 30:17 రాత్రి నా ఎముకలను పొడుస్తూ ఉంది; నన్ను కొరికివేస్తున్న నొప్పి ఆగడమే లేదు.
JOB 30:18 తన గొప్ప శక్తితో దేవుడు నాకు దుస్తుల్లా అవుతాడు; నా చొక్కా మెడవలె ఆయన నన్ను బంధిస్తారు.
JOB 30:19 ఆయన నన్ను బురదలో పడవేశారు, నేను దుమ్ము బూడిదగా అయ్యాను.
JOB 30:20 “దేవా, నేను మీకు మొరపెడతాను, కాని మీరు జవాబు ఇవ్వరు; నేను నిలబడతాను అయినా మీరు నన్ను ఊర్కెనే చూస్తారు.
JOB 30:21 నా పట్ల మీరు కఠినంగా మారారు; మీ బాహువు బలం చేత నా మీద దాడి చేస్తావు.
JOB 30:22 నీవు నన్ను లాక్కుని గాలి ముందు నడిపిస్తావు; నీవు తుఫానులో నన్ను విసిరివేస్తావు.
JOB 30:23 సజీవులందరి కోసం నియమించబడిన స్థలమైన, మరణానికి నీవు నన్ను రప్పిస్తావని నాకు తెలుసు.
JOB 30:24 “విరిగిన వ్యక్తి తన బాధలో సహాయం కోసం కేకలు వేసినప్పుడు ఖచ్చితంగా ఎవరూ చేయి వేయరు.
JOB 30:25 ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం నేను ఏడవలేదా? పేదవారిని చూసి నా ప్రాణం దుఃఖపడలేదా?
JOB 30:26 అయినాసరే నేను మేలు జరుగుతుందని ఆశిస్తే, కీడు జరిగింది; నేను వెలుగు కోసం చూస్తే, చీకటి వచ్చింది.
JOB 30:27 నా లోపల చిందరవందర ఎప్పుడూ ఆగదు; శ్రమ దినాలు నాకెదురయ్యాయి.
JOB 30:28 నేను నల్లబడతాను, కాని సూర్యుని ద్వారా కాదు; నేను సమాజంలో నిలబడి సహాయం కోసం మొరపెడతాను.
JOB 30:29 నేను నక్కలకు సోదరుడనయ్యాను, గుడ్లగూబలకు సహచరుడనయ్యాను.
JOB 30:30 నా చర్మం నల్లబడి రాలిపోతుంది; నా శరీరం జ్వరంతో కాలిపోతుంది.
JOB 30:31 నా వీణ దుఃఖానికి, నా పిల్లనగ్రోవి రోదన ధ్వనికి శ్రుతి చేయబడింది.
JOB 31:1 “యవ్వనస్త్రీని కామదృష్టితో చూడనని నేను నా కళ్లతో ఒడంబడిక చేసుకున్నాను.
JOB 31:2 పైనున్న దేవుని నుండి మనకు ఉన్న భాగం, ఉన్నతస్థలంలోని సర్వశక్తిమంతుని నుండి మన వారసత్వమేమి?
JOB 31:3 అది దుష్టులకు పతనం, తప్పు చేసేవారికి విపత్తు కాదా?
JOB 31:4 ఆయన నా మార్గాలను చూడరా నా ప్రతి అడుగును లెక్కించరా?
JOB 31:5 “ఒకవేళ నేను అబద్ధంతో నడచి ఉంటే మోసం వైపు నా పాదం తొందరపడి ఉంటే
JOB 31:6 దేవుడు నన్ను న్యాయ త్రాసులో తూచును గాక, అప్పుడు నేను నిందారహితుడనని ఆయన తెలుసుకుంటారు.
JOB 31:7 ఒకవేళ నా అడుగులు త్రోవ నుండి తొలగి ఉంటే, ఒకవేళ నా హృదయం నా కళ్ల చేత నడిపించబడి ఉంటే, నా చేతులు అపవిత్రం అయి ఉంటే,
JOB 31:8 అప్పుడు నేను విత్తిన దానిని ఇతరులు తిందురు గాక, నా పంటలు పెరికివేయబడును గాక.
JOB 31:9 “ఒకవేళ నా హృదయంలో నేను పరస్త్రీని చేత మోహించినా, నేను నా పొరుగువాని తలుపు దగ్గర వాని భార్య కోసం పొంచి ఉంటే,
JOB 31:10 నా భార్య వేరొకని ధాన్యాన్ని రుబ్బును గాక, ఇతర పురుషులు ఆమెతో పడుకొందురు గాక.
JOB 31:11 ఎందుకంటే అది దుష్టత్వం అవుతుంది, ఒక శిక్షించవలసిన పాపము.
JOB 31:12 అది నాశనమయ్యే వరకు దహించివేసే అగ్ని; అది నా ఆదాయాన్ని సమూలంగా నాశనం చేసి ఉండేది.
JOB 31:13 “ఒకవేళ నా పనివారిలో ఎవరికైనా, ఆడవారికైనా లేదా మగవారికైనా నా మీద ఆయాసం ఉన్నప్పుడు, నేను వారికి న్యాయం నిరాకరించి ఉంటే,
JOB 31:14 దేవుడు నన్ను నిలదీసినప్పుడు నేను ఏమి చేస్తాను? లెక్క అప్పగించడానికి నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబు చెప్తాను?
JOB 31:15 గర్భంలో నన్ను సృజించినవాడే వారిని కూడా సృజించలేదా? మా తల్లుల గర్భాల్లో మమ్మల్ని రూపించినవాడు ఒకడు కాదా?
JOB 31:16 “ఒకవేళ పేదవారికి సాయం చేయకుండ నేను బిగబట్టినా విధవరాండ్ర కళ్లు అలసిపోయేలా చేసినా,
JOB 31:17 ఒకవేళ అనాధలకు పెట్టకుండా నేనే ఒంటరిగా భోజనం చేసినా
JOB 31:18 కాని నా యవ్వనకాలం నుండి నేను వారిని తండ్రిలా పోషించాను, నేను పుట్టినప్పటి నుండి విధవరాండ్రకు దారి చూపించాను;
JOB 31:19 ఎవరైనా వేసుకోవడానికి బట్టలు లేక, కప్పుకోడానికి వస్త్రాలు లేక చావడం నేను చూసినప్పుడు,
JOB 31:20 నా గొర్రెల బొచ్చుతో వారికి వేడి కలిగించాను, అయినా వారి హృదయాలు నన్ను దీవించలేదు,
JOB 31:21 నాకు న్యాయస్థానంలో పలుకుబడి ఉందని తెలిసి, ఒకవేళ అనాధలకు వ్యతిరేకంగా నేను నా చేయి ఎత్తితే,
JOB 31:22 అప్పుడు నా చేతులు భుజాల నుండి పడిపోవును గాక, దాని కీళ్ల దగ్గర విడిపోవును గాక.
JOB 31:23 దేవుని నుండి వచ్చే నాశనానికి భయపడి, ఆయన మహాత్మ్యం పట్ల ఉన్న భయాన్ని బట్టి నేను అలాంటి వాటిని చేయలేదు.
JOB 31:24 “నేను బంగారంపై నా నమ్మకాన్ని ఉంచినా, ‘నీవే నా భద్రత’ అని మేలిమి బంగారంతో చెప్పినా,
JOB 31:25 ఒకవేళ నా గొప్ప ఆస్తిని బట్టి, నా చేతులు సంపాదించిన ఐశ్వర్యాన్ని బట్టి నేను సంతోషిస్తే,
JOB 31:26 నేను సూర్యుడిని దాని ప్రకాశంలో చంద్రుడు వైభవంలో కదులుతున్నట్లు భావించి,
JOB 31:27 నా హృదయం రహస్యంగా ఆకర్షించబడి నా చేతితో గౌరవ సూచకమైన ముద్దు ఇచ్చి ఉంటే,
JOB 31:28 అప్పుడు అవి కూడా తీర్పుకు తగిన పాపాలు అవుతాయి, ఎందుకంటే పైనున్న దేవునికి నేను నమ్మకద్రోహిని అవుతాను.
JOB 31:29 “ఒకవేళ నా శత్రువు నాశనాన్ని బట్టి నేను సంతోషిస్తే వారికి ఏర్పడిన ఇబ్బందిని బట్టి నేను ఆనందిస్తే,
JOB 31:30 వారి జీవితానికి వ్యతిరేకంగా శాపం పెట్టడం ద్వారా నా నోటిని పాపానికి అనుమతించలేదు
JOB 31:31 ‘యోబు పెట్టిన ఆహారం తిని తృప్తి పొందనివారే ఉన్నారు?’ అని నా ఇంటివారు ఎన్నడు అనలేదా
JOB 31:32 ఏ అపరిచితున్ని రాత్రివేళ వీధుల్లో గడపనివ్వలేదు, ఎందుకంటే బాటసారులకు నా ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది
JOB 31:33 మనుష్యులు చేసినట్లు, నేను నా దోషాన్ని నా హృదయంలో కప్పిపుస్తూ, నేను నా పాపాన్ని దాచే ప్రయత్నం చేశానా?
JOB 31:34 నేను గుంపులకు భయపడి గాని వంశాల ధిక్కారానికి బెదిరిపోయి గాని నేను బయటకు వెళ్లకుండా మౌనంగా ఉండిపోయానా?
JOB 31:35 “ఓహో, నేను చెప్తుంది వినడానికి నాకు ఎవరైనా ఉంటే బాగుండేది! నా ప్రతిపాదన మీద సంతకం పెట్టాను, సర్వశక్తిమంతుడు నాకు జవాబు చెప్పును గాక; నన్ను నిందించేవాడు తన అభియోగాన్ని వ్రాసి ఇచ్చును గాక.
JOB 31:36 ఖచ్చితంగా నేను దానిని నా భుజం మీద ధరిస్తాను, నేను దానిని కిరీటంగా పెట్టుకుంటాను.
JOB 31:37 ఆయనకు నా ప్రతి అడుగును గురించిన లెక్క అప్పగిస్తాను, పాలకునికి అయినట్టుగా నేను దానిని ఆయనకు సమర్పిస్తాను.
JOB 31:38 “నా భూమి నాకు వ్యతిరేకంగా ఆక్రందన చేసి ఉంటే దున్నిన నేలంతా దాని కన్నీటితో తడిసిపోయి ఉంటే,
JOB 31:39 వెల చెల్లించకుండా దాని పంటను మ్రింగివేసినా దాని యజమానులకు ప్రాణాపాయం తల పెట్టినా,
JOB 31:40 అప్పుడు గోధుమలకు బదులుగా ముళ్ళపొదలు యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక.” యోబు తన మాటలు ముగించాడు.
JOB 32:1 యోబు తన దృష్టిలో తాను నీతిమంతునిగా ఉన్నాడని గ్రహించిన ఆ ముగ్గురూ అతనికి సమాధానం ఇవ్వడం మానేశారు.
JOB 32:2 దేవుని కంటే తాను ఎక్కువ నీతిమంతుడని చెప్పుకుంటున్నాడని, రాము వంశస్థుడును, బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు యోబు మీద చాలా కోప్పడ్డాడు.
JOB 32:3 అతడు ముగ్గురు మిత్రులపై కూడా కోపంగా ఉన్నాడు, ఎందుకంటే వారు యోబు తప్పు అని నిరూపించడం చేతకాకపోయినా, వారు అతన్ని ఖండించారు.
JOB 32:4 వారందరు తనకన్నా పెద్దవారు కాబట్టి యోబుతో మాట్లాడాలని ఎలీహు ఎదురుచూశాడు.
JOB 32:5 కాని ఆ ముగ్గురు స్నేహితులు ఇంకేమి మాట్లాడకపోవడంతో అతనికి చాలా కోపం వచ్చింది.
JOB 32:6 బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు ఇలా అన్నాడు: నేను వయస్సులో చిన్నవాన్ని, మీరు పెద్దవారు; అందుకే నేను భయపడ్డాను, నేను అనుకున్నది మీతో చెప్పడానికి ధైర్యం చేయలేదు.
JOB 32:7 ముందుగా వయస్సు మాట్లాడాలి; గడచిన సంవత్సరాలు జ్ఞానం బోధించాలని నేననుకున్నాను.
JOB 32:8 అయితే అది ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ, సర్వశక్తిమంతుని ఊపిరి వారికి వివేచన కలిగిస్తుంది.
JOB 32:9 కేవలం వృద్ధులే జ్ఞానులు కారు, పెద్ద వయస్సు వారే వివేచన గలవారని కాదు.
JOB 32:10 కాబట్టి నేను చెప్తున్న: నేను చెప్పేది వినండి; నాకు తెలిసింది మీకు చెప్తాను.
JOB 32:11 మాట్లాడడానికి మీరు మాటల కోసం వెదకుతున్నప్పుడు, మీ మాటల కోసం నేను వేచి ఉన్నాను; నేను మీ అభిప్రాయాలను విన్నాను,
JOB 32:12 మీరు చెప్పేవాటిని నేను జాగ్రత్తగా విన్నాను; అయితే మీలో ఒక్కరు కూడా యోబు తప్పు అని నిరూపించలేదు; అతని వాదనలకు ఎవరూ జవాబు చెప్పలేదు.
JOB 32:13 మాకు జ్ఞానం లభించింది; మనుష్యులు కాదు, దేవుడే అతన్ని తప్పు అని నిరూపించాలని మీరు అనకండి.
JOB 32:14 కాని యోబు నాతో వాదించలేదు, మీ వాదనలతో నేను అతనికి జవాబు ఇవ్వను.
JOB 32:15 వారు ఆశ్చర్యపడి ఇక ఏమి చెప్పలేదు; వారికి మాటలు దొరకలేదు.
JOB 32:16 వారు జవాబేమి చెప్పలేదా అలా ఉండిపోయారు, వారు మౌనంగా ఉండగా నేను ఇంకా వేచి ఉండాలా?
JOB 32:17 నేను కూడా చెప్పాల్సింది చెప్తాను; నేను కూడా నాకు తెలిసింది చెప్తాను.
JOB 32:18 ఎందుకంటే నా మనస్సునిండ మాటలున్నాయి, నాలోని ఆత్మ నన్ను బలవంతం చేస్తోంది.
JOB 32:19 నా అంతరంగం మూసివేసిన ద్రాక్షరసం తిత్తిలా ఉంది, క్రొత్త తిత్తివలె అది పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది.
JOB 32:20 నేను మాట్లాడి ఉపశమనం పొందాలి; నా నోరు తెరచి సమాధానం ఇస్తాను.
JOB 32:21 నేను పక్షపాతం చూపించను, ఏ మనుష్యుని పొగడను;
JOB 32:22 ఎలా పొగడాలో నాకు చేతకాదు. ఒకవేళ నేను అలా పొగిడితే వెంటనే నా సృష్టికర్త నన్ను చంపుతారు.
JOB 33:1 “యోబూ, ఇప్పుడు నా మాటలు విను; నేను చెప్పే ప్రతిదాన్ని ఆలకించు.
JOB 33:2 నేను నోరు తెరిచి మాట్లాడబోతున్నాను; నా మాటలు నా నాలుక చివర ఉన్నాయి.
JOB 33:3 యథార్థమైన హృదయం నుండి నా మాటలు వస్తున్నాయి; నాకు తెలిసిన దానిని నా పెదవులు నిష్కపటంగా పలుకుతాయి.
JOB 33:4 దేవుని ఆత్మ నన్ను సృష్టించింది; సర్వశక్తిమంతుని ఊపిరి నాకు జీవమిచ్చింది.
JOB 33:5 నీకు చేతనైతే నాకు జవాబు చెప్పు; నా ముందు నిలబడి నీ వాదన వినిపించు.
JOB 33:6 దేవుని దృష్టిలో నీవెంతో నేను అంతే; నేను కూడా మట్టితో చేయబడ్డాను.
JOB 33:7 నా భయం నిన్ను భయపెట్టకూడదు, నా చేయి నీ మీద భారంగా ఉండకూడదు.
JOB 33:8 “నేను వింటుండగా నీవు మాట్లాడావు నీ మాటలు నేను విన్నాను.
JOB 33:9 అవేమిటంటే, ‘నేను పవిత్రుడను, ఏ తప్పు చేయలేదు; నేను శుద్ధుడను పాపం లేనివాడను.
JOB 33:10 అయినా దేవుడు నాలో తప్పును కనుగొన్నారు; నన్ను తన శత్రువుగా భావిస్తున్నారు.
JOB 33:11 నా కాళ్లకు సంకెళ్ళు బిగించాడు. నా మార్గాలన్నిటిని దగ్గర నుండి గమనిస్తున్నాడు.’
JOB 33:12 “కాని ఈ విషయంలో నీవు తప్పు, ఎందుకంటే దేవుడు మానవుల కంటే గొప్పవాడు.
JOB 33:13 ఒకని మాటలకు ఆయన స్పందించరని ఎందుకు నీవు ఆయనకు ఫిర్యాదు చేస్తావు?
JOB 33:14 ఎందుకంటే దేవుడు ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడతారు, అయితే ఎవరు దానిని గ్రహించలేరు.
JOB 33:15 ప్రజలు పడకపై పడుకుని, గాఢనిద్రలో ఉన్నప్పుడు, రాత్రి వచ్చే కలలో,
JOB 33:16 నరులను గర్విష్ఠులు కాకుండచేయాలని వారు చేయదలచిన తప్పులను చేయకుండా వారిని ఆపడానికి, గోతిలో పడకుండ వారిని కాపాడడానికి, ఖడ్గం ద్వార వారి ప్రాణాలు పోకుండ వారిని తప్పించాలని ఆయన వారి చెవుల్లో మాట్లాడవచ్చు హెచ్చరికలతో వారిని భయపెట్టవచ్చు.
JOB 33:19 “లేదా ఒకరు ఎముకల్లో నిరంతరం బాధ కలిగి నొప్పితో మంచం పట్టడం ద్వారా శిక్షించబడతారు.
JOB 33:20 అప్పుడు వారికి అన్నం సహించదు వారికి ఇష్టమైన భోజనమైనా సరే అసహ్యంగా ఉంటుంది.
JOB 33:21 వారి మాంసం కృషించిపోయి, ఇంతకుముందు కనిపించని ఎముకలు ఇప్పుడు బయటకు కనబడతాయి.
JOB 33:22 వారు సమాధికి దగ్గరవుతారు, వారి ప్రాణాలు మరణ దూతలకు దగ్గరవుతాయి.
JOB 33:23 అయినాసరే వారికి ఒక దేవదూత ఉంటే, వేలాది దేవదూతల్లో ఒక దూతను, మనుష్యులు యథార్థంగా ఎలా ఉండాలో చెప్పడానికి పంపితే,
JOB 33:24 ఆ దూతకు వారిపై దయ కలిగి దేవునితో, ‘వారిని సమాధిలోనికి దిగిపోకుండా కాపాడండి; వారి కోసం క్రయధనం నాకు దొరికిందని చెప్తాడు.
JOB 33:25 అప్పుడు వారి దేహం చిన్నపిల్లల దేహంలా ఉంటుంది; వారికి తమ యవ్వనకాలం తిరిగి వస్తుంది.’
JOB 33:26 అప్పుడు వారు దేవునికి ప్రార్థించి ఆయన దయను పొందవచ్చు, వారు దేవుని ముఖం చూసి ఆనందంతో కేకలు వేస్తారు; ఆయన వారి నీతిని వారికి తిరిగి ఇస్తారు.
JOB 33:27 వారు ఇతరుల దగ్గరకు వెళ్లి ఇలా చెప్తారు, ‘నేను పాపం చేశాను, సరియైన దానిని వంకరగా మార్చాను, అయినా దానికి తగిన శిక్ష నాకు విధించబడలేదు.
JOB 33:28 సమాధికి వెళ్లకుండ దేవుడు నా ప్రాణాన్ని విమోచించారు. జీవిత వెలుగును ఆస్వాదించడానికి నేను బ్రతుకుతాను.’
JOB 33:29 “జీవిత వెలుగు వారి మీద ప్రకాశించేలా వారిని సమాధి నుండి తప్పించడానికి, దేవుడు మానవుల కోసం వీటన్నిటిని రెండు, మూడు సార్లైనా చేస్తారు.
JOB 33:31 “యోబూ, నా మాటలు విను; శ్రద్ధగా ఆలకించు, మౌనంగా ఉండు, నేను మాట్లాడతాను.
JOB 33:32 నీవు చెప్పవలసినది ఏదైనా ఉంటే నాతో చెప్పు; మాట్లాడు, నీ దోషమేమీ లేదని నేను నిరూపించదలిచాను.
JOB 33:33 కాని ఒకవేళ ఏమిలేకపోతే, నేను చెప్పేది విను; మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను.”
JOB 34:1 అప్పుడు ఎలీహు అన్నాడు:
JOB 34:2 “జ్ఞానులారా, మీరు నా మాటలు వినండి; అనుభవజ్ఞులారా, నేను చెప్పేది వినండి.
JOB 34:3 నాలుక ఆహారాన్ని రుచి చూసినట్లు. చెవి మాటలను పరిశీలిస్తుంది.
JOB 34:4 మనకు న్యాయమైన దానిని వివేచిద్దాం; మనకు మేలైన దానిని తెలుసుకుందాము.
JOB 34:5 “యోబు, ‘నేను నిర్దోషిని, కాని దేవుడు నాకు న్యాయం చేయలేదు.
JOB 34:6 నేను న్యాయంగా ఉన్నప్పటికీ నన్ను అబద్ధికునిగా చూస్తున్నారు; నా దోషం ఏమి లేనప్పటికి ఆయన బాణాలు నయంకాని గాయం నాకు కలిగింది’ అన్నాడు.
JOB 34:7 యోబువంటి వారు ఎవరైనా ఉన్నారా? తిరస్కారాన్ని మంచి నీళ్లలా అతడు త్రాగుతున్నాడు.
JOB 34:8 కీడు చేసేవారితో అతడు స్నేహంగా ఉంటాడు; దుర్మార్గులతో నడచుకుంటున్నాడు.
JOB 34:9 అతడు అన్నాడు, ‘దేవుని సంతోషపెట్టడం వలన మనుష్యునికి ఏ లాభం లేదని’ అని.
JOB 34:10 “వివేకంగల మనుష్యులారా, నా మాటలు వినండి. దేవుడు ఎన్నడూ చెడు చేయడు. సర్వశక్తిమంతుడు ఎన్నడూ తప్పు చేయడు.
JOB 34:11 వారందరికి చేసిన వాటికి తగిన ప్రతిఫలాన్ని ఆయన వారికిస్తారు; ఎవరి నడతకు తగ్గఫలాన్ని ఆయన వారికి ముట్టచెప్తారు.
JOB 34:12 దేవుడు ఎన్నడూ దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు.
JOB 34:13 భూమి మీద ఆయనను నియమించింది ఎవరు? సర్వలోకానికి ఆయనను అధిపతిగా చేసింది ఎవరు?
JOB 34:14 దేవుడే కాబట్టి స్వార్థపరుడై ఉండి తన ఆత్మను ఊపిరిని తొలగించి వేస్తే,
JOB 34:15 మనుష్యులంతా ఒకేసారి నశించిపోతారు, మానవులు తిరిగి దుమ్ములో కలిసిపోతారు.
JOB 34:16 “నీవు జ్ఞానం కలిగి ఉంటే, ఇది విను; నేను చెప్పేది ఆలకించు.
JOB 34:17 న్యాయాన్ని ద్వేషించేవాడు పరిపాలించగలడా? బలాఢ్యుడైన న్యాయవంతుడైన దేవుని మీద నీవు నేరం మోపుతావా?
JOB 34:18 ‘మీరు పనికిమాలినవారు’ అని రాజులతో, ‘మీరు దుష్టులు’ అని సంస్థానాధిపతులతో చెప్పేవాడు ఈయన కాడా,
JOB 34:19 ఆయన అధికారులంటే పక్షపాతం లేదు ఆయన బీదలను కాదని ధనవంతులకు దయచూపించడు, అందరు ఆయన చేతుల్లో సృష్టించబడినవారే కదా.
JOB 34:20 వారు నిమిషంలోనే మధ్యరాత్రిలోనే చనిపోతారు; వారు కదిలించబడి మరణిస్తారు; మానవ ప్రమేయం లేకుండానే బలవంతులు తీసుకెళ్తారు.
JOB 34:21 “మానవుల మార్గాలన్నిటిని ఆయన చూస్తున్నారు. వారి ప్రతి అడుగును ఆయన గమనిస్తున్నారు.
JOB 34:22 చెడు చేసేవారు దాక్కోవడానికి చీకటియైనా మరణాంధకారమైనా లేదు.
JOB 34:23 ఒకరు దేవుని ఎదుట న్యాయవిచారణలోకి రాకముందే, వానిని ఎక్కువగా విచారణ చేయనవసరం ఆయనకు లేదు.
JOB 34:24 విచారణలేకుండానే ఆయన బలవంతులను ముక్కలుగా చేస్తారు వారి స్థానంలో ఇతరులను నియమిస్తారు.
JOB 34:25 ఎందుకంటే వారి పనులెలాంటివో ఆయనకు తెలుసు, రాత్రివేళలో ఆయన వారిని పడద్రోయగా వారు నలుగగొట్టబడతారు.
JOB 34:26 అందరు చూస్తూ ఉండగానే వారి దుర్మార్గాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తారు.
JOB 34:27 ఎందుకంటే, వారు ఆయనను అనుసరించుట మానుకున్నారు, ఆయన మార్గాల్లో దేన్ని వారు గ్రహించలేదు.
JOB 34:28 బీదలు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టేలా వారు చేశారు; అవసరతలో ఉన్న వారి మొరను ఆయన ఆలకిస్తారు.
JOB 34:29 ఆయన మౌనంగా ఉంటే ఆయనకు శిక్ష విధించగలవారెవరు? ఆయన తన ముఖం దాచుకొంటే ఆయనను చూడగలవారెవరు? ఒక్క వ్యక్తికైనా దేశమంతటికైనా ఆయన విధానం ఒక్కటే,
JOB 34:30 భక్తిహీనులు పరిపాలించకుండ చేయడం, మనుష్యులకు ఉచ్చులు బిగించకుండా వారిని అడ్డుకోవడము.
JOB 34:31 “ఒకవేళ ఎవరైనా దేవునితో, ‘నేను శిక్షను భరించాను ఇకమీదట నేరం చేయను.
JOB 34:32 నేను చూడలేనిది నాకు చూపించు; నేనేదైనా తప్పు చేసివుంటే ఇకమీదట అలాంటిది చేయను’ అనవచ్చు.
JOB 34:33 నీవు పశ్చాత్తాపపడేందుకు నిరాకరించినప్పుడు దేవుడు నీ షరతుల ప్రకారం నీకు ప్రతిఫలమిస్తాడా? నేను కాదు, నీవే నిర్ణయించుకోవాలి; నీకు తెలిసింది నాకు చెప్పు.
JOB 34:34 “వివేకంగలవారు, జ్ఞానంగలవారు నా మాటలు విని నాతో ఇలా చెప్తారు,
JOB 34:35 ‘యోబు తెలివిలేని లేకుండ మాట్లాడుతున్నాడు; అతని మాటల్లో వివేకం లోపించింది.’
JOB 34:36 యోబు దుష్టునిలా జవాబిచ్చినందుకు చివరి వరకు అతడు పరీక్షించబడుతూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను.
JOB 34:37 అతడు తన పాపానికి తిరుగుబాటును జతచేశాడు; అతడు మన మధ్య తిరస్కారంతో చప్పట్లు కొట్టి దేవునికి విరుద్ధంగా ఎన్నో మాటలు మాట్లాడాడు.”
JOB 35:1 ఇంకా ఎలీహు అన్నాడు:
JOB 35:2 “ఇది న్యాయమని నీవనుకుంటున్నావా? ‘నా నీతి దేవుని నీతి కన్నా గొప్పది.’
JOB 35:3 అయితే, నా పాపం వలన నాకు లాభమేంటి? ‘పాపం చేయకపోవడం వలన నేను పొందేదేంటి?’ అని నీవు అడుగుతున్నావు.
JOB 35:4 “నేను నీ స్నేహితులకు నీకు జవాబు చెప్పాలనుకుంటున్నాను.
JOB 35:5 ఆకాశం వైపు తేరి చూడండి; మీకన్నా ఎంతో ఎత్తుగా ఉన్న మేఘాల వైపు చూడండి.
JOB 35:6 నీవు పాపం చేస్తే, అది ఆయన మీద ఎలా ప్రభావం చూపుతుంది? నీ పాపాలు ఎక్కువగా ఉంటే, అది ఆయనకేమి చేస్తుంది?
JOB 35:7 నీవు నీతిమంతుడవైతే, నీవు ఆయనకేమి ఇస్తావు, నీ చేతి నుండి ఆయన ఏం పొందుకుంటారు?
JOB 35:8 నీ దుష్టత్వం నీలాంటి మనుష్యుల మీద, నీ నీతి ఇతరుల మీద మాత్రమే ప్రభావం చూపుతుంది.
JOB 35:9 “ఒత్తిళ్ళ భారాన్ని బట్టి ప్రజలు ఆక్రందన చేస్తారు; బలవంతుల చేతి నుండి విడుదల కోసం విన్నవించుకొంటారు.
JOB 35:10 అయితే, ‘రాత్రివేళ పాటలు ఇచ్చే, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బోధించే, ఆకాశపక్షుల కన్నా మనలను జ్ఞానవంతులుగా చేసే, నా సృష్టికర్తయైన దేవుడు ఎక్కడున్నాడు?’ అని ఎవరు అనరు.
JOB 35:12 దుర్మార్గుల గర్వం కారణంగా ప్రజలు మొరపెట్టినా ఆయన జవాబివ్వరు.
JOB 35:13 నిజానికి, వారి ఖాళీ మనవిని దేవుడు వినరు; సర్వశక్తిమంతుడు వాటిని లెక్క చేయడు.
JOB 35:14 అయితే, మీరు అతన్ని చూడలేదని, మీ వాదన అతని ముందు ఉందని, మీరు అతని కోసం వేచి ఉండాలని,
JOB 35:15 ఇంకా ఎంత తక్కువ చెప్పినా అతడు వింటాడా? అతని కోపం ఎప్పుడూ శిక్షించదు అతడు దుర్మార్గాన్ని కనీసం పట్టించుకోడు.
JOB 35:16 కాబట్టి యోబు వ్యర్థంగా మాట్లాడుతున్నాడు; తెలివి లేకుండా ఎన్నో మాటలు పలికాడు.”
JOB 36:1 ఎలీహు ఇంకా మాట్లాడుతూ:
JOB 36:2 “ఇంకొంచెం సేపు నన్ను భరించండి దేవుని పక్షాన చెప్పాల్సింది చాలా ఉందని మీకు తెలియజేస్తాను.
JOB 36:3 నేను నా తెలివిని దూరం నుండి పొందాను; నేను నా సృష్టికర్తకు న్యాయం ఆపాదిస్తాను.
JOB 36:4 నా మాటలు అబద్ధం కాదని నమ్మండి; పరిపూర్ణ జ్ఞాని మీతో ఉన్నాడు.
JOB 36:5 “దేవుడు మహాబలవంతుడు, కాని ఎవరిని త్రోసివేయరు; ఆయన శక్తిమంతుడు, తన ఉద్దేశ్యంలో దృఢంగా ఉంటారు.
JOB 36:6 ఆయన దుష్టులను బ్రతకనివ్వరు కాని బాధితులకు న్యాయం చేస్తారు.
JOB 36:7 నీతిమంతులను ఆయన చూడకపోరు; వారిని రాజులతో పాటు సింహాసనంపై కూర్చోబెట్టి నిత్యం వారిని ఘనపరుస్తారు.
JOB 36:8 ప్రజలు గొలుసులతో బంధించబడి, బాధ అనే త్రాళ్లతో కట్టబడి ఉంటే,
JOB 36:9 వారు అహంకారంతో పాపం చేశారని ఆయన వారు చేసిన దానిని వారికి చెప్తారు.
JOB 36:10 దిద్దుబాటును వినేలా చేస్తారు తమ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపపడాలని వారిని ఆజ్ఞాపిస్తారు.
JOB 36:11 ఒకవేళ వారు లోబడి ఆయనను సేవిస్తే, వారు తమ మిగిలిన రోజులు క్షేమంగా తమ సంవత్సరాలు సంతృప్తిగా గడుపుతారు.
JOB 36:12 అయితే వారు వినకపోతే, వారు ఖడ్గం చేత నశిస్తారు జ్ఞానం లేకుండానే చనిపోతారు.
JOB 36:13 “హృదయంలో భక్తిలేనివారు కోపాన్ని ఉంచుకుంటారు; ఆయన వారిని బంధించినప్పుడు వారు సహాయం కోసం మొరపెట్టరు.
JOB 36:14 వారు తమ యవ్వనకాలంలో చనిపోతారు, పుణ్యక్షేత్రాల మగ వ్యభిచారుల మధ్య వారి జీవితం ముగుస్తుంది.
JOB 36:15 బాధపడుతున్నవారిని ఆయన వారి బాధలనుండి విడిపిస్తారు; బాధల్లో ఆయన వారితో మాట్లాడతారు.
JOB 36:16 “ఆయన నిన్ను బాధల్లో నుండి తప్పించి పరిమితి లేని విశాలమైన ప్రదేశానికి, మంచి ఆహారంతో నిండిన బల్ల దగ్గరకు నిన్ను తీసుకువస్తారు.
JOB 36:17 కానీ ఇప్పుడు నీవు దుష్టుల తీర్పుతో నిండి ఉన్నావు; తీర్పు న్యాయం నిన్ను పట్టుకున్నాయి.
JOB 36:18 ధనంతో ఎవరు నిన్ను మభ్యపెట్టకుండ జాగ్రత్తపడు; అధిక లంచం నిన్ను దారి తప్పించకుండ చూసుకో.
JOB 36:19 మీ సంపదలు మీ శక్తివంతమైన ప్రయత్నాలు బాధలో ఉండకుండా మిమ్మల్ని తప్పిస్తాయా?
JOB 36:20 ప్రజలను వారి ఇళ్ళలో నుండి దూరంగా లాగివేయాలని, రాత్రి కోసం ఎదురుచూడవద్దు.
JOB 36:21 చెడు వైపు తిరుగకుండ జాగ్రత్త వహించండి, ఎందుకంటే మీరు బాధల్లో పరీక్షించబడతారు.
JOB 36:22 “దేవుడు శక్తిమంతుడైన గొప్పవాడు. ఆయనలాంటి బోధకుడెవరు?
JOB 36:23 ఆయనకు మార్గాలను ఎవరు నిర్దేశించారు, ‘నీవు తప్పు చేశావు’ అని ఆయనతో ఎవరు చెప్పారు?
JOB 36:24 ప్రజలు పాటలతో కీర్తించిన ఆయన కార్యాలను ఘనపరచాలని నీవు జ్ఞాపకముంచుకో.
JOB 36:25 మనుష్యులందరు వాటిని చూశారు; మనుష్యులు దూరంగా ఉండి వాటిని చూశారు.
JOB 36:26 దేవుడు ఎంత గొప్పవాడో మనం గ్రహించలేము! ఆయన సంవత్సరాలను లెక్కించలేనివి.
JOB 36:27 “అతడు నీటి బిందువులను పైకి తీసుకుంటారు, అవే ప్రవాహాలకు వర్షంలాగా కురుస్తుంది;
JOB 36:28 మేఘాలు వాటి తేమను కురిపిస్తాయి మనుష్యులపై అవి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి.
JOB 36:29 ఆయన మేఘాలను ఎలా వ్యాపింప చేస్తారో ఆయన ఆవరణం నుండి ఎలా ఉరుము వస్తుందో ఎవరు గ్రహించగలరు?
JOB 36:30 ఆయన మెరుపులను తన చుట్టూ ఎలా వ్యాపింప చేస్తారో అవి సముద్ర అడుగుభాగాన్ని ఎలా కప్పివేసారో చూడండి.
JOB 36:31 వీటిని బట్టి ఆయన ప్రజలకు తీర్పు తీరుస్తారు సమృద్ధిగా ఆహారం ఇస్తారు.
JOB 36:32 ఆయన తన చేతులతో మెరుపులను పట్టుకుని గురికి తగలాలని వాటికి ఆజ్ఞాపిస్తారు.
JOB 36:33 ఉరుము రాబోయే తుఫానును ప్రకటిస్తుంది; పశువులకు కూడ దాని రాకడ తెలుస్తుంది.
JOB 37:1 “వీటన్నిబట్టి నా హృదయం వణికిపోతుంది, దాని స్థలం నుండి దూకుతుంది.
JOB 37:2 ఆయన స్వరం గర్జించడం వినండి, ఆయన నోటి నుండి వచ్చే ఉరుమును వినండి.
JOB 37:3 ఆయన తన మెరుపును ఆకాశమంతటి క్రింద విప్పుతారు దానిని భూమి చివర్లకు పంపుతారు.
JOB 37:4 దాని తర్వాత ఆయన గర్జన శబ్దం వినిపిస్తుంది; ఆయన తన గంభీరమైన స్వరంతో ఉరుముతారు. ఆయన స్వరం ప్రతిధ్వనిస్తున్నప్పుడు, ఆయన ఏది వెనుకకు తీసుకోరు.
JOB 37:5 దేవుని స్వరం అద్భుతమైన విధానాల్లో ఉరుముతుంది; మనం గ్రహించలేని గొప్ప వాటిని ఆయన చేస్తారు.
JOB 37:6 ఆయన మంచుతో, ‘భూమిపై పడు’ వాన జల్లుతో, ‘కుండపోత వర్షంగా కురువు’ అని ఆజ్ఞాపిస్తారు.
JOB 37:7 తద్వార మనుష్యులందరు ఆయన కార్యాన్ని తెలుసుకుంటారు, ఆయన ప్రజలందరినీ తమ ప్రయాసం నుండి విరమింపజేస్తారు.
JOB 37:8 జంతువులు వాటి గుహల్లోకి వెళ్లి వాటిలో దాక్కుని అక్కడే నివసిస్తాయి.
JOB 37:9 తుఫాను దాని స్థానం నుండి బయటకు వస్తుంది, వీచే గాలుల నుండి చలి వస్తుంది.
JOB 37:10 దేవుని ఊపిరి మంచును పుట్టిస్తుంది, మహా సముద్ర ఉపరితలాలు గడ్డకడతాయి.
JOB 37:11 ఆయన దట్టమైన మేఘాలను తేమతో నింపుతారు; మేఘాలలో తన మెరుపులను వ్యాపింపజేస్తారు.
JOB 37:12 భూమి అంతటి ఉపరితలం మీద ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేయడానికి, ఆయన నిర్దేశించిన మార్గంలో అవి చుట్టూ తిరుగుతాయి.
JOB 37:13 ప్రజలను శిక్షించడానికి లేదా తన భూమికి నీళ్లు పోయడానికి, తన ప్రేమను చూపించడానికి ఆయన మేఘాలను రప్పిస్తారు.
JOB 37:14 “యోబూ, ఇది విను; ఆగి దేవుని అద్భుతాలను గురించి ఆలోచించు.
JOB 37:15 దేవుడు మేఘాలను ఎలా అదుపు చేస్తారో తన మెరుపులను ఎలా ప్రకాశింపజేస్తారో నీకు తెలుసా?
JOB 37:16 మేఘాలు ఎలా సమతుల్యంగా వ్రేలాడుతున్నాయో, పరిపూర్ణ జ్ఞానం గలవాని అద్భుతకార్యాలు నీకు తెలుసా?
JOB 37:17 దక్షిణపుగాలికి భూమి ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ బట్టలలో మీకు చెమట పడుతుంది,
JOB 37:18 ఇత్తడితో పోతపోసిన అద్దంలా, ఆకాశాలను విస్తరింపజేయడంలో ఆయనతో నీవు జత కలుస్తావా?
JOB 37:19 “మేము ఆయనతో ఏమి మాట్లాడాలో మాకు చెప్పు; మా చీకటిని బట్టి మా వాదనను సరిగా వినిపించలేము.
JOB 37:20 నేను మాట్లాడతాను అని ఆయనకు చెప్పబడాలా? మ్రింగివేయబడటానికి ఎవరైనా అడుగుతారా?
JOB 37:21 గాలి వీచి మేఘాలు తొలగిపోయి తేటగా ఉన్నప్పుడు ఆకాశాల్లో ప్రకాశిస్తున్న సూర్యుడిని ఏ ఒక్కరు చూడలేరు.
JOB 37:22 అలాగే ఉత్తర దిక్కునుండి బంగారు తేజస్సుతో ఆయన వస్తున్నారు; భీకరమైన మహిమతో దేవుడు వస్తున్నారు.
JOB 37:23 సర్వశక్తిమంతుడు మనకు మించినవాడు శక్తిలో ఉన్నతమైనవాడు; తన న్యాయం గొప్ప నీతిని బట్టి, ఆయన అణచివేయడు.
JOB 37:24 కాబట్టి ప్రజలు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారు, తమకు జ్ఞానముందని అనుకునేవారిని ఆయన లెక్కచేయరు.”
JOB 38:1 అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు:
JOB 38:2 “తెలివిలేని మాటలతో నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు?
JOB 38:3 పురుషునిగా నీ నడుము కట్టుకో; నేను నిన్ను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబు చెప్పాలి.
JOB 38:4 “నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు? నీకు వివేకము ఉంటే, నాకు జవాబు చెప్పు.
JOB 38:5 దాని కొలమానాన్ని ఎవరు నిర్ణయించారు? నీకు ఖచ్చితంగా తెలుసు! దాని చుట్టూ కొలత రేఖను వేసిందెవరు?
JOB 38:6 వేకువ చుక్కలన్ని కలిసి గానం చేస్తుంటే దేవదూతలంతా ఆనంద కేకలు వేస్తుంటే దాని పాదాలు దేనిపై మోపబడ్డాయి? దానికి మూలరాయి వేసింది ఎవరు?
JOB 38:8 “భూగర్భం నుండి సముద్రం పొంగి వచ్చినప్పుడు తలుపుల వెనుక దానిని మూసి ఉంచింది ఎవరు?
JOB 38:9 నేను మేఘాలను దానికి వస్త్రంగా చేసి కటిక చీకటిలో దానిని చుట్టిపెట్టినప్పుడు,
JOB 38:10 నేను దానికి హద్దులను నిర్ణయించి తలుపులు గడియలు అమర్చినప్పుడు,
JOB 38:11 ఇక్కడి వరకు నీవు రావచ్చు ఇంతకు మించి కాదు; నీ అహంకార అలలు ఇక్కడే ఆగిపోవాలి,
JOB 38:12 “భూమి అంచుల వరకు వ్యాపించి దానిలో నుండి దుష్టులను దులిపివేసేలా నీవెపుడైనా ఉదయాన్ని ఆజ్ఞాపించావా? తెల్లవారుజాముకు దాని స్థలమేదో ఎప్పుడైనా తెలియచేశావా?
JOB 38:14 ముద్ర వేయబడిన బంకమట్టిలా భూమి రూపం మారుతుంది; దాని లక్షణాలు వస్త్రం యొక్క లక్షణాల్లా ఉంటాయి.
JOB 38:15 దుర్మార్గుల దగ్గర నుండి వారి వెలుగు తొలగించబడింది, పైకెత్తబడిన వారి చేయి విరగ్గొట్టబడింది.
JOB 38:16 “నీవెప్పుడైనా సముద్రపు ఊటలలోనికి ప్రవేశించావా? సముద్రపు అడుగుభాగంలో నడిచావా?
JOB 38:17 మృత్యుద్వారాలు నీకు చూపించబడ్డాయా? లోతైన చీకటి ద్వారాలను నీవు చూశావా?
JOB 38:18 భూమి వైశాల్యం ఎంతో నీకు గ్రహించగలవా? ఒకవేళ ఇవన్నీ నీకు తెలిస్తే, నాకు చెప్పు.
JOB 38:19 “వెలుగు నివసించే చోటికి వెళ్లే మార్గం ఏది? చీకటి ఎక్కడ నివసిస్తుంది?
JOB 38:20 దానిని దాని చోటికి నీవు తీసుకెళ్లగలవా? దాని నివాస స్థలాలకు మార్గం నీవు వివేచించగలవా?
JOB 38:21 నీకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే అప్పటికే నీవు పుట్టావు! నీవు అనేక సంవత్సరాలు జీవించావు!
JOB 38:22 “మంచు నిల్వ ఉండే స్థలాలకు నీవు వెళ్లవా? వడగండ్లు నిల్వ ఉండే స్థలాలను నీవు చూశావా?
JOB 38:23 వాటిని నేను కష్టకాలం కోసం, యుద్ధం కోసం యుద్ధ దినాల కోసం దాచిపెట్టాను.
JOB 38:24 వెలుగు విభజించబడే చోటుకు మార్గం ఏది? తూర్పుగాలులు ఎక్కడ నుండి వచ్చి భూమంతటా వ్యాపిస్తాయి?
JOB 38:25 ఎవరూ నివసించని భూమికి, మనుష్యులే నివసించని ఎడారికి నీరు పెట్టడానికి, పాడైపోయిన బీడుభూమిని తృప్తిపరచి అందులో లేతగడ్డి మొక్కలను ఎవరు మొలిపిస్తున్నారు? కుండపోతగా కురిసే వర్షానికి ఎవరు కాలువలు ఏర్పాటు చేశారు? ఉరుములు మెరుపులకు ఎవరు మార్గమేర్పరిచారు?
JOB 38:28 వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను ఎవరు పుట్టిస్తారు?
JOB 38:29 ఎవరి గర్భం నుండి మంచుగడ్డ వచ్చింది? పైనుండి దిగివచ్చే మంచును ఎవరు పుట్టించారు?
JOB 38:30 నీళ్లు రాయిలా ఎప్పుడు గడ్డకట్టుకుపోతాయి, లోతైన నీళ్ల ఉపరితలం ఎప్పుడు గట్టిపడుతుంది?
JOB 38:31 “కృత్తిక నక్షత్రాలను నీవు సంకెళ్ళతో బంధించగలవా? మృగశీర్ష నక్షత్రం యొక్క కట్లు విప్పగలవా?
JOB 38:32 నక్షత్ర రాశులను వాటి వాటి కాలాల్లో వచ్చేలా నీవు చేయగలవా? సప్తరుషి నక్షత్రాలను వాటి ఉప నక్షత్రాలను నీవు నడిపించగలవా?
JOB 38:33 ఆకాశం యొక్క చట్టాలు నీకు తెలుసా? నీవు భూమిపై దేవుని ఆధిపత్యాన్ని ఏర్పాటు చేయగలవా?
JOB 38:34 “నిన్ను నీటి వరదతో కప్పి వేయమని నీ స్వరాన్ని ఎత్తి నీవు మేఘాలకు చెప్పగలవా?
JOB 38:35 నీవు మెరుపులను వాటి మార్గాల్లో పంపుతావా? మేము ఇక్కడ ఉన్నాము అని అవి నీతో చెప్తాయా?
JOB 38:36 హృదయానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? మనస్సుకు వివేచన కలిగించింది ఎవరు?
JOB 38:37 దుమ్ము గట్టిగా మారినప్పుడు మట్టిగడ్డలు ఒకదాన్ని ఒకటి అతుక్కున్నప్పుడు మేఘాలను లెక్కించు జ్ఞానం ఎవరికుంది? ఆకాశపు నీటి పాత్రలను బోర్లించగలరు?
JOB 38:39 “సింహపుపిల్లలు గుహలో పడుకుని ఉన్నప్పుడు, అవి పొదలో పొంచి ఉన్నప్పుడు, ఆడసింహం కోసం నీవు ఎరను వేటాడి వాటి ఆకలిని తీర్చగలవా?
JOB 38:41 కాకిపిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక తిరుగుతున్నప్పుడు కాకికి ఆహారం ఇచ్చేది ఎవరు?
JOB 39:1 “కొండమీద తిరిగే అడవి మేకలు ఎప్పుడు ఈనుతాయో నీకు తెలుసా? లేళ్లు పిల్లలను కంటున్నప్పుడు నీవు చూశావా?
JOB 39:2 అవి ఎన్ని నెలల వరకు మోస్తాయో నీవు లెక్కపెడతావా? అవి పిల్లలను కనే సమయం నీకు తెలుసా?
JOB 39:3 అవి వంగి తమ పిల్లలకు జన్మనిస్తాయి; వాటి పురుటినొప్పులు అంతలోనే ఆగిపోతాయి.
JOB 39:4 వాటి పిల్లలు అడవిలో పెరిగి బలపడతాయి. అవి తల్లిని విడిచిపోయి మరలా తిరిగి రావు.
JOB 39:5 “అడవి గాడిదను స్వేచ్ఛగా వెళ్లనిచ్చేది ఎవరు? దాని కట్లను విప్పింది ఎవరు?
JOB 39:6 బంజరు భూమిని దానికి ఇల్లుగా ఉప్పు పర్రలను నివాస స్థలంగా ఇచ్చాను.
JOB 39:7 అది పట్టణంలోని సందడిని చూసి నవ్వుతుంది; తోలేవాని కేకలు అది వినదు.
JOB 39:8 దాని పచ్చిక కోసం అది పర్వతాల్లో తిరుగుతుంది, ఏదైన పచ్చని దాని కోసం వెదకుతుంది.
JOB 39:9 “నీకు సేవ చేయడానికి అడవి ఎద్దు అంగీకరిస్తుందా? రాత్రివేళ అది నీ పశువుల దొడ్డిలో ఉంటుందా?
JOB 39:10 నీవు అడవి ఎద్దుకు పగ్గం వేసి నాగటికి కట్టి నడిపించగలవా? నీ వెనుక నడుస్తూ అది లోయ భూములను దున్ని చదును చేస్తుందా?
JOB 39:11 దాని బలం గొప్పదని దాన్ని నమ్ముతావా? నీ పెద్ద పనిని దానికి అప్పగిస్తావా?
JOB 39:12 అది నీ ధాన్యాన్ని ఇంటికి మోసుకొనివచ్చి, అది నీ నూర్పిడి కళ్ళంలో కూర్చుతుందని నీవు నమ్మగలవా?
JOB 39:13 “నిప్పుకోడి రెక్కలు సంతోషంతో ఆడిస్తుంది, అయినా కొంగకున్న రెక్కలు ఈకలతో అవి పోల్చబడకపోయినా.
JOB 39:14 అది నేలమీద గుడ్లు పెడుతుంది ఇసుకలో వాటిని పొదుగుతుంది.
JOB 39:15 ఏ పాదమో వాటిని నలిపివేస్తుందని, ఏ అడవి జంతువో వాటిని త్రొక్కివేస్తుందని అది ఆలోచించదు.
JOB 39:16 తన పిల్లలు తనవి కానట్టు, వాటిని కఠినంగా చూస్తుంది; తన ప్రసవ వేదనంతా వృధా అయినా అది పట్టించుకోదు.
JOB 39:17 ఎందుకంటే దేవుడు దానికి జ్ఞానం ఇవ్వలేదు దానికి గ్రహింపు ఇవ్వలేదు.
JOB 39:18 అయినా పరుగెత్తడానికి అది తన రెక్కలను చాపినప్పుడు, అది గుర్రాన్ని దాని రౌతును చూసి నవ్వుతుంది.
JOB 39:19 “గుర్రానికి దాని బలాన్ని నీవిస్తావా? దాని మెడ మీద జూలు పెట్టింది నీవా?
JOB 39:20 దాని భీకరమైన గురకతో భయాన్ని సృష్టించే మిడతలా, మీరు దానిని దూకేలా చేస్తారా?
JOB 39:21 అది తన బలాన్నిబట్టి సంతోషిస్తూ, ఆగ్రహంతో నేలను దువ్వి, పోరాడటానికి పరుగెడుతుంది.
JOB 39:22 అది భయాన్ని చూసి నవ్వుతుంది, దేనికి భయపడదు; ఖడ్గాన్ని చూసినా వెనుతిరుగదు.
JOB 39:23 మెరుస్తున్న ఈటెలు బరిసెలతో పాటు దాని అంబులపొది గలగలలాడుతుంది,
JOB 39:24 పిచ్చి కోపంలో అది నేల మీద కాలు దువ్వుతుంది; బూరధ్వని విన్నప్పుడు అది ప్రశాంతంగా నిలబడలేదు.
JOB 39:25 బూర మ్రోగగానే అది, ‘ఆహా!’ అని అంటుంది దూరం నుండే యుద్ధవాసన, సేనాధిపతుల కేకలు యుద్ధఘోష పసిగడుతుంది.
JOB 39:26 “దక్షిణదిక్కు వైపుకు తన రెక్కలు చాపి ఎలా ఎగరాలో డేగకు నీ జ్ఞానంతో నేర్పించావా?
JOB 39:27 నీ ఆజ్ఞను బట్టే గ్రద్ద పైకెగిరిపోయి, తన గూడు ఎత్తైన చోటులో కట్టుకుంటుందా?
JOB 39:28 ఎవరు ఎక్కలేని కొండచరియలో నివసిస్తుంది రాత్రివేళ అక్కడే గడుపుతుంది; ఏటవాలుగా ఉన్న బండ దానికి బలమైన కోట.
JOB 39:29 అక్కడి నుండే ఆహారం కోసం చూస్తుంది; దాని కళ్లు దూరం నుండే దానిని కనిపెడతాయి.
JOB 39:30 దాని పిల్లలు రక్తాన్ని త్రాగుతాయి, మృతదేహాలు ఎక్కడ ఉంటాయో అక్కడే అది ఉంటుంది.”
JOB 40:1 యెహోవా యోబుతో ఈ విధంగా అన్నారు:
JOB 40:2 “సర్వశక్తిమంతునితో పోరాడేవారు ఆయనను సరిచేయగలరా? దేవునితో నిందించేవారు ఆయనకు జవాబు చెప్పాలి!”
JOB 40:3 అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు:
JOB 40:4 “నేను అయోగ్యుడను, మీకెలా జవాబు చెప్పగలను? నా చేతితో నా నోరు మూసుకుంటాను.
JOB 40:5 ఒకసారి మాట్లాడాను, కాని నా దగ్గర జవాబు లేదు; రెండు సార్లు, ఇక నేను ఏమి చెప్పను.”
JOB 40:6 అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు:
JOB 40:7 “పురుషునిగా నీ నడుము కట్టుకో; నేను నిన్ను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబు చెప్పాలి.
JOB 40:8 “నీవు నా న్యాయాన్ని కించపరుస్తావా? నిన్ను నీవు సమర్థించుకోడానికి నన్ను ఖండిస్తావా?
JOB 40:9 దేవుని బాహువులాంటిది నీకుందా? ఆయన స్వరంలా నీ స్వరం ఉరుమగలదా?
JOB 40:10 అలాగైతే మహిమ వైభవంతో నిన్ను నీవే అలంకరించుకో! ఘనత ప్రభావాలను ధరించుకో!
JOB 40:11 నీ మహా కోపాన్ని ప్రవాహంలా కుమ్మరించు, గర్విష్ఠులందరిని చూసి వారిని పడగొట్టు,
JOB 40:12 గర్విష్ఠులందరిని చూసి వారిని అణచివేయి, వారున్న చోటులోనే దుష్టులను నలగ్గొట్టు.
JOB 40:13 వారందరినీ దుమ్ములో పూడ్చిపెట్టు; వారిని సమాధిలో బంధించు.
JOB 40:14 అప్పుడు నీ సొంత కుడి చేయి నిన్ను రక్షించగలదని నేనే నీ ముందు ఒప్పుకుంటాను.
JOB 40:15 “నీటిగుర్రాన్ని చూడు, నిన్ను చేసినట్లే దానిని కూడా సృజించాను అది ఎద్దులా గడ్డిమేస్తుంది.
JOB 40:16 దాని బలం దాని నడుములో ఉంది, దాని శక్తి దాని కడుపు కండరాల్లో ఉంది!
JOB 40:17 దాని తోక దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు వంగుతుంది; దాని తొడనరాలు గట్టిగా అతికి ఉన్నాయి.
JOB 40:18 దాని ఎముకలు ఇత్తడి గొట్టాలు, దాని ప్రక్కటెముకలు ఇనుప కడ్డీల్లాంటివి.
JOB 40:19 దేవుని కార్యాల్లో అది మొదటి స్థానంలో ఉంటుంది, అయినా దాని సృష్టికర్తే దానిని తన ఖడ్గంతో సమీపించగలడు.
JOB 40:20 కొండలు దానికి ఆహారం అందిస్తాయి, అడవి జంతువులన్నీ దగ్గరలోనే ఆడుకుంటాయి.
JOB 40:21 తామర మొక్కల క్రింద అది పడుకుంటుంది, బురదనేలలోని రెల్లు మధ్యలో అది దాక్కుంటుంది.
JOB 40:22 తామరచెట్లు వాటి నీడలో దానిని కప్పుతాయి; కాలువలోని నిరవంజి చెట్లు దానిని చుట్టుకొని ఉంటాయి.
JOB 40:23 నది పొంగిపొర్లినా అది భయపడదు. యొర్దాను నది పొంగి దాని నోటి వరకు నీరు వచ్చినా అది ధైర్యంగా ఉంటుంది.
JOB 40:24 అది మెలకువగా ఉన్నప్పుడు ఎవరైనా దానిని బంధించగలరా, దానికి వలవేసి ముక్కుకు తాడువేయగలరా?
JOB 41:1 “లెవియాథన్ ను చేపగాలంతో లాగగలవా? త్రాడుతో దాని నాలుకను కట్టగలవా?
JOB 41:2 దాని జమ్ము తాడును ముక్కుకు వేయగలవా? దవడకు గాలం ఎక్కించగలవా?
JOB 41:3 దయచూపమని అది నిన్ను వేడుకుంటుందా? మృదువైన మాటలు నీతో మాట్లాడుతుందా?
JOB 41:4 జీవితాంతం నీవు దానిని బానిసగా ఉంచుకునేలా అది నీతో ఒప్పందం చేసుకుంటుందా?
JOB 41:5 ఒక పక్షితో ఆడుకున్నట్లు నీవు దానితో ఆడుకుంటావా? నీ ఇంట్లోని అమ్మాయిలు ఆడుకోడానికి దానిని కట్టి ఉంచగలవా?
JOB 41:6 వ్యాపారులు దానితో పరివర్తకం చేస్తారా? వారు దానిని ముక్కలుగా కోసి వ్యాపారులకు అమ్ముతారా?
JOB 41:7 దాని చర్మం నిండా బల్లెములను గుచ్చగలవా? చేపలను పట్టే ఈటెలతో దాని తల నిండా పొడవగలవా?
JOB 41:8 నీవు దాని మీద చేయి వేసి చూడు, దానితో చేసే పోరాటాన్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అలా చేయవు.
JOB 41:9 దానిని వశపరుచుకోవాలనే ఆశ అబద్ధం; కేవలం దానిని చూస్తే చాలు ఎవరైనా భయపడిపోతారు.
JOB 41:10 దానిని లేపే సాహసం ఎవరు చేయలేరు. అలాంటప్పుడు నా ఎదుట ఎవరు నిలబడగలరు?
JOB 41:11 నేను తిరిగి చెల్లించవలసి ఉందని ఎవరు నన్ను అడగగలరు? ఆకాశం క్రింద ఉన్నదంతా నాదే.
JOB 41:12 “లెవియాథన్ అవయవాల గురించి, దానికున్న అధిక బలాన్ని గురించి, దాని మనోహరమైన రూపాన్ని గురించి చెప్పకుండా ఉండలేను.
JOB 41:13 దానిపై కవచాన్ని ఎవరు లాగివేయగలరు? దాని రెండంతల కవచంలోకి ఎవరు చొచ్చుకోగలరు?
JOB 41:14 భయంకరమైన పళ్ళ వరుస గల, దాని నోటిద్వారాన్ని తెరవడానికి ఎవరు సాహసం చేస్తారు?
JOB 41:15 దాని వీపుమీది పొలుసులు చాలా గట్టివి; అవి దగ్గరగా బిగుసుగా కూర్చబడ్డాయి.
JOB 41:16 గాలికూడా వాటి మధ్యలోనికి చొరబడలేనంత ప్రతిదీ దాని తర్వాత దానికి చాలా దగ్గరగా ఉంటుంది.
JOB 41:17 ఒక దానితో ఒకటి అతుక్కుని ఉన్నాయి, అవి అంటిపెట్టుకుని ఉంటాయి వాటిని ఎవరు వేరు చేయలేరు.
JOB 41:18 దాని గురక కాంతి వెలుగులను విసురుతుంది; దాని కళ్లు ఉదయపు కిరణాల్లా ఉన్నాయి.
JOB 41:19 దాని నోటి నుండి అగ్నిజ్వాలలు ప్రవహిస్తాయి; నిప్పు కణాలు ఎగిరివస్తాయి.
JOB 41:20 జమ్ము మంట పై ఉడికే కుండలో నుండి పొగ వచ్చినట్లు దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ వస్తుంది.
JOB 41:21 దాని ఊపిరి నిప్పు కణాలను రాజేస్తుంది, దాని నోటి నుండి మంటలు బయలుదేరతాయి.
JOB 41:22 బలం దాని మెడలో ఉంటుంది; నిరాశ దాని ముందర నడుస్తుంది.
JOB 41:23 దాని మాంసం యొక్క మడతలు దగ్గరగా కలుపబడ్డాయి; అవి దృఢంగా అంటుకుని ఉంటాయి.
JOB 41:24 దాని రొమ్ము బండలా గట్టిగా, తిరుగటిరాయి క్రింది దిమ్మలా ఉంటుంది.
JOB 41:25 అది లేచినప్పుడు, బలవంతులు భయపడతారు; అది కొట్టకుండానే పారిపోతారు.
JOB 41:26 ఖడ్గంతో దాడి చేసినా ప్రభావం ఉండదు, ఈటెలు బాణాలు బరిసెలు దాని మీద పని చేయవు.
JOB 41:27 దానికి ఇనుము అంటే తుక్కుతో ఇత్తడి అంటే పుచ్చిపోయిన చెక్కతో సమానము.
JOB 41:28 బాణాలు దానిని పారిపోయేలా చేయలేవు; వడిసెల రాళ్లు దానికి పొట్టుతో సమానము.
JOB 41:29 దుడ్డుకర్ర దానికి తుక్కు ముక్కలా ఉంటుంది; వడిగా వెళ్తున్న ఈటెను చూసి నవ్వుతుంది.
JOB 41:30 దాని దిగువ భాగం పగిలిన కుండపెంకుల వలె గరుకుగా ఉంటాయి, బురద మీద నూర్పిడి కర్రను పోలిన గుర్తులను ఏర్పరుస్తుంది.
JOB 41:31 అది దాని గందరగోళంతో నీటిని మరిగేలా చేస్తుంది. అది సముద్రాన్ని కదిలించి నూనె మరుగుతున్న కుండలా చేస్తుంది.
JOB 41:32 అది వెళ్లిన దారంతా మెరుస్తున్న నురుగును వదలుతుంది; అది చూసేవారికి సముద్రానికి తెల్ల వెంట్రుకలు ఉన్నాయేమో అనిపిస్తుంది.
JOB 41:33 భూమి మీద దానికి సమానమైనదేదీ లేదు; ఒక భయంలేని సృష్టి.
JOB 41:34 అహంకారం కలిగిన వాటన్నిటిని చిన్న చూపు చూస్తుంది; గర్వపడే వాటన్నిటికి అది రాజు.”
JOB 42:1 అప్పుడు యోబు యెహోవాకు ఇలా సమాధానం ఇచ్చాడు:
JOB 42:2 “నీవు సమస్తం చేయగలవని నాకు తెలుసు; నీ ఉద్దేశాలలో ఏది నిష్ఫలం కాదు.
JOB 42:3 ‘తెలివిలేని మాటలతో నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు? అని నీవడిగావు.’ అవును, అర్థం చేసుకోలేని విషయాల గురించి నేను మాట్లాడాను. అవి నా బుద్ధికి మించినవి నేను గ్రహించలేనివి.
JOB 42:4 “మీరు అన్నారు, ‘నేను మాట్లాడతాను, నీవు విను; నేను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబివ్వాలి.’
JOB 42:5 గతంలో నా చెవులు మీ గురించి విన్నాయి కాని ఇప్పుడైతే నా కళ్లు మిమ్మల్ని చూశాయి.
JOB 42:6 కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని దుమ్ములో బూడిదలో పడి పశ్చాత్తాపపడుతున్నాను.”
JOB 42:7 యెహోవా యోబుతో ఈ విషయాలు చెప్పిన తర్వాత, ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో, “నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా గురించి సత్యాలను మాట్లాడలేదు. కాబట్టి నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను.
JOB 42:8 కాబట్టి మీరంతా ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసుకుని, నా సేవకుడైన యోబు దగ్గరకు వెళ్లి మీ కోసం దహనబలిని అర్పించాలి. నా సేవకుడైన యోబు మీ కోసం ప్రార్థన చేస్తాడు, నేను అతని ప్రార్థన అంగీకరించి మీ అవివేకాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించను” అన్నారు. నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు నా గురించి సత్యాలను మాట్లాడలేదు.
JOB 42:9 కాబట్టి తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేశారు; అప్పుడు యెహోవా యోబు ప్రార్థన అంగీకరించారు.
JOB 42:10 యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించిన తర్వాత యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళీ అతనికి ఇచ్చారు. అతనికి గతంలో ఉన్నదానికన్నా రెండింతలు అధికంగా ఇచ్చారు.
JOB 42:11 అప్పుడు అతని సోదరీ సోదరులందరు, గతంలో అతనికి పరిచయం ఉన్న ప్రతిఒక్కరు వచ్చి అతని ఇంట్లో అతనితో కలిసి భోజనం చేశారు. యెహోవా అతని మీదికి రప్పించిన బాధ గురించి వారు దుఃఖపడి అతన్ని ఓదార్చారు. అంతేకాక ఒక్కొక్కరు ఒక వెండి నాణాన్ని, ఒక బంగారు ఉంగరాన్ని అతనికి ఇచ్చారు.
JOB 42:12 యెహోవా యోబు జీవితాన్ని గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఆశీర్వదించారు. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లు, 1,000 ఆడగాడిదలు ఉన్నాయి.
JOB 42:13 అలాగే అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు పుట్టారు.
JOB 42:14 యోబు పెద్దకుమార్తెకు యెమీమా అని రెండవ కుమార్తెకు కెజీయా అని మూడవ కుమార్తెకు కెరెంహప్పుకు అని పేర్లు పెట్టాడు.
JOB 42:15 దేశమంతటిలో యోబు కుమార్తెలంత అందమైనవారు ఎవరూ లేరు. వారి తండ్రి వారి అన్నదమ్ములతో పాటు వారికి కూడా వారసత్వాన్ని పంచి ఇచ్చాడు.
JOB 42:16 దీని తర్వాత, యోబు నూట నలభై సంవత్సరాలు జీవించాడు. అతడు తన కుమారులను వారి కుమారులను నాలుగు తరాల వరకు చూశాడు.
JOB 42:17 చివరికి యోబు సంవత్సరాలు నిండి పండు ముసలివాడై చనిపోయాడు.
PSA 1:1 దుష్టుల సలహాను పాటించక పాపులు కోరుకునే మార్గంలో నిలబడక ఎగతాళి చేసేవారి గుంపుతో కూర్చోక,
PSA 1:2 యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులు.
PSA 1:3 వారు నీటికాలువల ప్రక్కన నాటబడి, ఆకులు వాడిపోకుండ, సరియైన కాలంలో ఫలమిచ్చే చెట్టులా ఉంటారు వారు చేసేవాటన్నిటిలో వృద్ధిచెందుతారు.
PSA 1:4 అయితే దుష్టులు అలా ఉండరు! వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు.
PSA 1:5 కాబట్టి న్యాయతీర్పులో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలబడరు.
PSA 1:6 నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది.
PSA 2:1 దేశాలు ఎందుకు కుట్ర చేస్తున్నాయి? ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు?
PSA 2:2 యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచి పాలకులందరు ఒకటిగా చేరి,
PSA 2:3 “మనం వారి గొలుసులను తెంపుదాం వారి సంకెళ్ళను విసిరి పారేద్దాం” అంటున్నారు.
PSA 2:4 ఆకాశంలో ఆసీనులై ఉన్న ప్రభువు నవ్వుతున్నారు; ఆయన వారిని చూసి ఎగతాళి చేస్తున్నారు.
PSA 2:5 ఆయన కోపంతో వారిని గద్దించి తన తీవ్రమైన ఉగ్రతతో వారిని భయకంపితులను చేసి ఇలా అన్నారు,
PSA 2:6 “నా పవిత్ర పర్వతమైన సీయోనును నా రాజు ఏలుతున్నారు.”
PSA 2:7 నేను యెహోవా శాసనాన్ని ప్రకటిస్తాను: ఆయన నాతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.
PSA 2:8 నన్ను అడిగితే, నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా, భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను.
PSA 2:9 ఇనుపదండంతో నీవు వారిని నలగ్గొడతావు; పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.”
PSA 2:10 కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి.
PSA 2:11 యెహోవాను భయంతో సేవించండి వణుకుతూ ఆనందించండి.
PSA 2:12 ఆయన కుమారున్ని ముద్దాడండి, లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.
PSA 3:1 దావీదు కీర్తన. తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు వ్రాసినది. యెహోవా, నాకు ఎంతోమంది శత్రువులు! నామీదికి ఎంతోమంది లేస్తారు!
PSA 3:2 “దేవుడు అతన్ని విడిపించడు” అని అనేకులు నా గురించి చెప్తున్నారు. సెలా
PSA 3:3 కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.
PSA 3:4 నేను యెహోవాకు మొరపెడతాను, ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు. సెలా
PSA 3:5 నేను పడుకుని నిద్రపోతాను; యెహోవా నన్ను సంరక్షిస్తారు కాబట్టి నేను మళ్ళీ మేల్కొంటాను.
PSA 3:6 అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను.
PSA 3:7 యెహోవా, లెండి! నా దేవా, నన్ను విడిపించండి! నా శత్రువులందరిని దవడపై కొట్టండి; దుష్టుల పళ్ళు విరగ్గొట్టండి.
PSA 3:8 రక్షణ యెహోవా నుండి వస్తుంది. మీ ప్రజలపై మీ ఆశీర్వాదం ఉండును గాక. సెలా
PSA 4:1 సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. నీతిమంతుడవైన నా దేవా, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు నాకు జవాబు ఇవ్వండి. నా బాధ నుండి నాకు ఉపశమనం ఇవ్వండి; నాపై దయచూపి నా ప్రార్థన వినండి.
PSA 4:2 ఓ ప్రజలారా, మీరు ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? మీరు ఎంతకాలం భ్రమలను ప్రేమిస్తూ అబద్ధాలను అనుసరిస్తారు? సెలా
PSA 4:3 యెహోవా తన నమ్మకమైన సేవకున్ని తన కోసం ప్రత్యేకించుకున్నారని తెలుసుకోండి; నేను మొరపెట్టినప్పుడు యెహోవా వింటారు.
PSA 4:4 వణకండి, పాపం చేయకండి. మీరు మీ పడకలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. సెలా
PSA 4:5 నీతియుక్తమైన బలులను అర్పించి యెహోవాపై నమ్మకముంచండి.
PSA 4:6 యెహోవా, “మాకు అభివృద్ధి ఎవరు తెస్తారు?” అని అనేకులు అడుగుతున్నారు మీ ముఖకాంతిని మామీద ప్రకాశించనీయండి.
PSA 4:7 ధాన్యం క్రొత్త ద్రాక్షరసం సమృద్ధిగా గలవారికి ఉండే సంతోషం కన్నా ఎక్కువ సంతోషాన్ని మీరు నా హృదయానికి ఇచ్చారు.
PSA 4:8 నేను ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే యెహోవా, మీరు మాత్రమే నన్ను క్షేమంగా నివసించేలా చేస్తారు.
PSA 5:1 సంగీత దర్శకునికి. పిల్లన గ్రోవులతో పాడదగినది.దావీదు కీర్తన. యెహోవా, నా మాటలు ఆలకించండి, నా నిట్టూర్పు గురించి ఆలోచించండి.
PSA 5:2 నా రాజా నా దేవా, సాయం కోసం నేను చేసే మొరను వినండి, మీకే నేను ప్రార్థిస్తున్నాను.
PSA 5:3 యెహోవా, ఉదయాన మీరు నా స్వరం వింటారు; ఉదయాన నేను నా మనవులు మీ ముందుంచి ఆశతో వేచి ఉంటాను.
PSA 5:4 మీరు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కారు; చెడు చేసేవారికి మీ దగ్గర చోటు లేదు.
PSA 5:5 అహంకారులు మీ సన్నిధిలో నిలువలేరు; చెడు చేసేవారందరిని మీరు ద్వేషిస్తారు, అబద్ధాలాడే వారిని
PSA 5:6 మీరు నాశనం చేస్తారు. రక్తపిపాసులను మోసగాండ్రను, యెహోవా అసహ్యించుకుంటారు.
PSA 5:7 కాని నేనైతే మీ మారని ప్రేమను బట్టి మీ మందిరంలోనికి రాగలను; మీ పరిశుద్ధాలయం వైపు తిరిగి నేను భక్తితో నమస్కరిస్తాను.
PSA 5:8 యెహోవా, నా శత్రువులను బట్టి మీ నీతిలో నన్ను నడిపించండి. మీ మార్గాన్ని నాకు స్పష్టం చేయండి.
PSA 5:9 వారి నోటి నుండి వచ్చే ఒక్క మాట కూడా నమ్మదగినది కాదు. వారి హృదయం అసూయతో నిండి ఉంది. వారి గొంతు తెరిచిన సమాధి; వారు నాలుకలతో అబద్ధాలు చెప్తారు.
PSA 5:10 ఓ దేవా! వారిని దోషులుగా ప్రకటించండి, వారి పన్నాగాలే వారి పతనానికి కారణం అవ్వాలి. వారు చేసిన అనేక పాపాలను బట్టి వారిని వెళ్లగొట్టండి, వారు మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
PSA 5:11 అయితే మిమ్మల్ని ఆశ్రయించిన వారందరు సంతోషిస్తారు; వారు ఎల్లప్పుడు ఆనంద గానం చేస్తారు. మీ నామాన్ని ప్రేమించేవారు మీలో ఆనందించేలా, మీరు వారిని కాపాడండి.
PSA 5:12 యెహోవా, నీతిమంతులను మీరు తప్పక దీవిస్తారు; డాలుతో కప్పినట్లు మీరు వారిని దయతో కప్పుతారు.
PSA 6:1 సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది.బహుశ షమినీతు ఎనిమిది తంతుల వాయిద్యం కావచ్చు.దావీదు కీర్తన. యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి మీ ఉగ్రతలో నన్ను శిక్షించకండి.
PSA 6:2 యెహోవా, నేను బలహీనుడను, నాపై దయ చూపండి; యెహోవా, నా ఎముకలు వేదనలో ఉన్నాయి, నన్ను బాగుచేయండి.
PSA 6:3 నా ప్రాణం తీవ్ర వేదనలో ఉంది. ఎంతకాలం, యెహోవా, ఇంకెంత కాలం?
PSA 6:4 యెహోవా, తిరిగి రండి, నన్ను విడిపించండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను రక్షించండి.
PSA 6:5 మృతులు ఉండే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోరు సమాధి నుండి ఎవరు మీకు స్తుతులు చెల్లిస్తారు?
PSA 6:6 మూలుగుతూ నేను అలిసిపోయాను. రాత్రంతా నేను కార్చిన కన్నీటిలో నా పరుపు తడిసిపోతుంది కన్నీటిలో నా మంచం మునిగిపోతుంది.
PSA 6:7 విచారంతో నా కళ్లు మసకబారుతున్నాయి. నా శత్రువులందరిని బట్టి అవి క్షీణిస్తున్నాయి.
PSA 6:8 యెహోవా నా మొర ఆలకించారు, కాబట్టి చెడు చేసేవారలారా, నా నుండి దూరంగా వెళ్లండి.
PSA 6:9 కనికరం కోసం చేసిన నా మొరను యెహోవా ఆలకించారు; యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తారు.
PSA 6:10 నా శత్రువులందరు సిగ్గుపడి అధిక వేదన పొందుతారు; వారు హఠాత్తుగా సిగ్గుపడి వెనుదిరుగుతారు.
PSA 7:1 దావీదు వీణతో పాడిన కీర్తన. బెన్యామీనీయుడైన కూషు విషయంలో దావీదు యెహోవాకు పాడిన కీర్తన. యెహోవా నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను; నన్ను వెంటాడే వారందరి నుండి నన్ను రక్షించి విడిపించండి,
PSA 7:2 లేకపోతే వారు సింహంలా చీల్చివేస్తారు ఎవరు విడిపించలేనంతగా నన్ను ముక్కలు చేస్తారు.
PSA 7:3 యెహోవా నా దేవా, ఒకవేళ నేను అన్యాయమైన చర్యలకు పాల్పడితే
PSA 7:4 నాతో సమాధానంగా ఉన్నవానికి కీడు చేస్తే కారణం లేకుండ నా శత్రువును నేను దోచుకుంటే
PSA 7:5 అప్పుడు నా శత్రువు నన్ను వెంటాడి పట్టుకొనును గాక; నా ప్రాణాన్ని నేల మీద అణగద్రొక్కి నా ప్రతిష్ఠను మట్టిపాలు చేయును గాక. సెలా
PSA 7:6 యెహోవా, కోపంతో లేవండి; నా శత్రువుల ఆగ్రహానికి వ్యతిరేకంగా లేవండి. నా దేవా, మేల్కొనండి; న్యాయాన్ని శాసించండి.
PSA 7:7 మీరు వారికి పైగా ఉన్నత సింహాసనంపై ఆసీనులై ఉండగా, ఆయా జాతుల ప్రజలు మీ చుట్టూ గుమికూడనివ్వండి.
PSA 7:8 యెహోవా జనులకు తీర్పు తీర్చును గాక. యెహోవా, నా నీతిని బట్టి, ఓ మహోన్నతుడా, నా యథార్థతను బట్టి నాకు శిక్షావిముక్తి చేయండి.
PSA 7:9 మనస్సులను హృదయాలను పరిశీలించే, నీతిమంతుడవైన దేవా, దుష్టుల దుర్మార్గాన్ని అంతం చేసి, నీతిమంతులను భద్రపరచండి.
PSA 7:10 యథార్థ హృదయులను కాపాడే సర్వోన్నతుడైన దేవుడే నాకు డాలు.
PSA 7:11 దేవుడు నీతిగల న్యాయమూర్తి, ఆయన దుష్టులపై ప్రతిరోజు తన ఉగ్రతను చూపిస్తారు.
PSA 7:12 ఒకవేళ ఎవరైనా పశ్చాత్తాపపడకపోతే, దేవుడు తన ఖడ్గాన్ని పదునుపెడతారు; ఆయన తన విల్లు ఎక్కుపెట్టి బాణం సిద్ధపరుస్తారు.
PSA 7:13 ఆయన తన మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారు; ఆయన తన అగ్ని బాణాలు సిద్ధం చేసుకుంటారు.
PSA 7:14 దుష్టులు చెడును గర్భం దాలుస్తారు, కీడును గర్భంలో మోసి అబద్ధాలకు జన్మనిస్తారు.
PSA 7:15 ఇతరుల కోసం గుంటను త్రవ్వుతారు తాము త్రవ్విన గుంటలో వారే పడతారు.
PSA 7:16 వారు చేసిన కీడు వారికే చుట్టుకుంటుంది; వారు చేసిన హింస వారి తల మీదికే వస్తుంది.
PSA 7:17 యెహోవా నీతిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; మహోన్నతుడైన యెహోవా నామానికి నేను స్తుతులు పాడతాను.
PSA 8:1 సంగీత దర్శకునికి. గిత్తీతు రాగములో పాడదగినది. దావీదు కీర్తన. యెహోవా, మా ప్రభువా, భూలోకమంతట మీ నామం ఎంతో ప్రభావవంతమైనది! మీరు ఆకాశాల్లో మీ మహిమను ఉంచారు.
PSA 8:2 చిన్నపిల్లల చంటిబిడ్డల స్తుతుల ద్వారా, మీ శత్రువుల పగవారి నోరు మూయించడానికి మీ శత్రువులకు వ్యతిరేకంగా మీరు బలమైన కోటను స్థాపించారు.
PSA 8:3 మీ చేతి పనియైన మీ ఆకాశాలను, మీరు వాటి వాటి స్థానాల్లో ఉంచిన చంద్ర నక్షత్రాలను నేను చూసినప్పుడు,
PSA 8:4 మీరు మానవులను జ్ఞాపకం చేసుకోడానికి వారు ఏపాటివారు? మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు?
PSA 8:5 మీరు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశారు, మహిమ ఘనతను వారికి కిరీటంగా పెట్టారు.
PSA 8:6 మీ చేతిపనుల మీద వారికి అధికారం ఇచ్చారు; మీరు సమస్తాన్ని అనగా:
PSA 8:7 గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి జంతువులను, ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను, సముద్ర మార్గంలో తిరిగే ప్రాణులను వారి పాదాల క్రింద ఉంచారు.
PSA 8:9 యెహోవా, మా ప్రభువా, భూమి అంతట మీ నామం ఎంతో ఘనమైనది!
PSA 9:1 సంగీత దర్శకునికి. “కుమారుని మరణం” అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన. యెహోవా, నేను నా హృదయమంతటితో మిమ్మల్ని స్తుతిస్తాను; మీ అద్భుతమైన క్రియల గురించి నేను చెప్తాను.
PSA 9:2 మీలో నేను ఆనందించి సంతోషిస్తాను; ఓ మహోన్నతుడా, మీ నామాన్ని బట్టి నేను స్తుతులు పాడతాను.
PSA 9:3 నా శత్రువులు వెనుకకు తిరుగుతారు; మీ ముందు వారు తడబడి నశిస్తారు.
PSA 9:4 నీతిమంతుడవైన న్యాయమూర్తిగా సింహాసనంపై కూర్చుని, నా పక్షంగా న్యాయం తీర్చుతున్నారు.
PSA 9:5 మీరు దేశాలను మందలించి దుష్టులను నిర్మూలం చేశారు; మీరు వారి పేరును ఎప్పటికీ లేకుండ తుడిచివేశారు.
PSA 9:6 అంతులేని పతనం నా శత్రువులు పతనమై పూర్తిగా నశిస్తారు, మీరు వారి పట్టణాలను పెల్లగించారు; వాటి జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది.
PSA 9:7 యెహోవా నిరంతరం పరిపాలిస్తారు; తీర్పు కోసం ఆయన తన సింహాసనాన్ని స్థాపించారు.
PSA 9:8 ఆయన నీతితో లోకాన్ని పరిపాలిస్తారు ఆయన దేశాలను న్యాయంగా తీర్పు తీరుస్తారు.
PSA 9:9 అణచివేయబడిన వారికి యెహోవా ఆశ్రయం, కష్ట సమయాల్లో బలమైన కోట.
PSA 9:10 మీ నామం తెలిసిన వారు మీమీద నమ్మకం ఉంచుతారు, ఎందుకంటే యెహోవా, మిమ్మల్ని వెదికే వారిని మీరు ఎన్నడూ విడువరు.
PSA 9:11 సీయోనులో సింహాసనాసీనుడైయున్న యెహోవాను గురించి స్తుతులు పాడండి; దేశాల మధ్య ఆయన చేసిన వాటిని ప్రకటించండి.
PSA 9:12 ఎందుకంటే రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు జ్ఞాపకముంచుకుంటాడు; బాధితుల మొరను ఆయన విస్మరించరు.
PSA 9:13 యెహోవా, నా శత్రువులు నన్ను ఎలా హింసించారో చూడండి! నన్ను కరుణించి మరణ ద్వారాల నుండి నన్ను తప్పించండి,
PSA 9:14 తద్వార నేను మీ స్తుతులను సీయోను కుమారీ ద్వారాల దగ్గర ప్రకటిస్తాను, మీ రక్షణలో నేనానందిస్తాను.
PSA 9:15 తాము త్రవ్విన గోతిలోనే దేశాలు పడిపోయాయి; తాము పన్నిన వలలోనే వారి పాదాలు చిక్కుకున్నాయి.
PSA 9:16 తన న్యాయమైన క్రియల ద్వార యెహోవా బయలుపరచబడతారు; దుష్టులు తాము చేసిన దానిలోనే చిక్కుకుంటారు. సెలా
PSA 9:17 దుష్టులు పాతాళంలో పడిపోతారు, దేవున్ని మరచిపోయే దేశాలు కూడా అంతే.
PSA 9:18 కాని అవసరతలో ఉన్నవారిని దేవుడు ఎన్నడూ మరచిపోరు; బాధితుల నిరీక్షణ ఎప్పటికీ నశించదు.
PSA 9:19 యెహోవా, లెండి, మనుష్యులను గెలువనీయకండి; మీ సమక్షంలో రాజ్యాలకు తీర్పు తీర్చండి.
PSA 9:20 యెహోవా, వారిని భయభ్రాంతులకు గురి చేయండి; తాము కేవలం మానవమాత్రులే అని దేశాలను తెలుసుకోనివ్వండి. సెలా
PSA 10:1 యెహోవా, ఎందుకు దూరంగా నిలిచి ఉన్నారు? నేను కష్టంలో ఉన్నప్పుడు మీరెందుకు దాక్కుంటారు?
PSA 10:2 దుష్టులు తమ అహంకారంలో దీనులను వేటాడతారు, వారు ఇతరుల కోసం పన్నిన కుట్రలో వారే చిక్కుకుంటారు.
PSA 10:3 వారు తమ హృదయ కోరికలను బట్టి అతిశయిస్తారు; వారు అత్యాశపరులను దీవిస్తారు, యెహోవాను దూషిస్తారు.
PSA 10:4 దుష్టులు తమ అహంకారంలో దేవున్ని వెదకరు; వారి ఆలోచనల్లో దేవునికి చోటు లేదు.
PSA 10:5 వారి మార్గాలు ఎప్పటికీ క్షేమంగా ఉంటాయి; వారు మీ న్యాయవిధులను తిరస్కరించారు; వారు తమ శత్రువులందరినీ హేళనగా చూస్తారు.
PSA 10:6 “ఏదీ మమ్మల్ని ఎప్పటికీ కదిలించలేదు ఎవరు మాకు హాని చేయలేరు” అని వారు తమలో తాము అనుకుంటారు.
PSA 10:7 వారి నోటి నిండా శాపాలు, మోసాలు, బెదిరింపులు ఉన్నాయి; ఇబ్బంది, కీడు వారి నాలుక క్రింద ఉంటాయి.
PSA 10:8 వారు గ్రామాల సమీపంలో పొంచి ఉంటారు; చాటైన స్థలాల్లో వారు నిర్దోషులను చంపుతారు. నిస్సహాయులైన వారి కోసం వారి కళ్లు వెదకుతాయి;
PSA 10:9 గుహలో సింహంలా వారు వేచి ఉంటారు. నిస్సహాయులను పట్టుకోడానికి వారు ఎదురుచూస్తూ ఉంటారు; వారు నిస్సహాయులను తమ వలలోనికి లాగి పట్టుకుంటారు.
PSA 10:10 బాధితులు నలిగి కుప్పకూలిపోతారు; వారు వారి బలత్కారం వల్ల పతనమవుతారు.
PSA 10:11 “దేవుడు ఎప్పటికీ గమనించరు; ఆయన తన ముఖాన్ని కప్పుకున్నారు ఇక ఎప్పుడు చూడరు” అని వారు తమలో తాము అనుకుంటారు.
PSA 10:12 యెహోవా, లెండి! ఓ దేవా, మీ చేయి పైకెత్తండి. నిస్సహాయులను మరువకండి.
PSA 10:13 దుష్టులు ఎందుకు దేవున్ని దూషిస్తారు? “దేవుడు నన్ను లెక్క అడగరు” అని వారు తమలో తాము ఎందుకు అనుకుంటారు?
PSA 10:14 దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు; వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు. నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు; తండ్రిలేనివారికి మీరే సహాయకులు.
PSA 10:15 దుష్టుల చేతిని విరగ్గొట్టండి. కీడు చేసేవారిని వారి దుష్టత్వాన్ని బట్టి లెక్క అడగండి ఒక్కడు మిగులకుండ వారిని వెంటాడి నిర్మూలం చేయండి.
PSA 10:16 యెహోవా నిరంతరం రాజై ఉన్నారు; దేశాల ప్రజలు ఆయన భూభాగంలో నుండి నశిస్తారు.
PSA 10:17 యెహోవా, మీరు బాధపడేవారి కోరిక విన్నారు; మీరు వారి ప్రార్థనను ఆలకించి వారిని ప్రోత్సహిస్తారు.
PSA 10:18 తండ్రిలేనివారిని అణచివేయబడిన వారిని మీరు రక్షిస్తారు, అప్పుడు మానవులెవ్వరు ఎన్నడు భయాన్ని కలిగించరు.
PSA 11:1 సంగీత దర్శకునికి.దావీదు కీర్తన. నేను యెహోవాను ఆశ్రయించాను. “పక్షిలా మీ కొండ మీదికి పారిపో.
PSA 11:2 దుష్టులు తమ విల్లును ఎక్కుపెట్టారు, చీకటిలో పొంచి ఉండి యథార్థ హృదయుల పైకి వేయడానికి బాణాలు సిద్ధం చేస్తున్నారు.
PSA 11:3 పునాదులు నాశనమై పోతుంటే, నీతిమంతులు ఏం చేయగలరు?” అని నాతో మీరెలా అంటారు?
PSA 11:4 యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు; యెహోవా తన పరలోక సింహాసనంపై ఆసీనులై ఉన్నారు; ఆయన భూమి మీద నరులను పరిశీలిస్తున్నారు; ఆయన కళ్లు వారిని పరీక్షిస్తున్నాయి.
PSA 11:5 యెహోవా నీతిమంతులను పరీక్షిస్తారు, కాని దుష్టులను, దౌర్జన్యాన్ని ప్రేమించేవారిని ఆయన అసహ్యించుకుంటారు.
PSA 11:6 దుష్టుల మీద ఆయన నిప్పు కణాలు అగ్ని గంధకం కురిపిస్తారు; వడగాలి వారి భాగం అవుతుంది.
PSA 11:7 యెహోవా నీతిమంతుడు, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తారు; యథార్థవంతులు ఆయన ముఖాన్ని చూస్తారు.
PSA 12:1 సంగీత దర్శకునికి. షెమినీతు వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. యెహోవా, సహాయం చేయండి, ఎందుకంటే ఒక్కరైన నమ్మకమైనవారు లేరు; నమ్మకమైనవారు మనుష్యజాతి నుండి గతించిపోయారు.
PSA 12:2 ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడుతున్నారు; వారు తమ హృదయాల్లో మోసం పెట్టుకుని తమ పెదవులతో పొగడుతారు.
PSA 12:3 పొగిడే ప్రతి పెదవిని గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకను యెహోవా మౌనం చేయును గాక.
PSA 12:4 “మా నాలుకలతో మేము గెలుస్తాం; మా పెదవులు మమ్మల్ని కాపాడతాయి; మామీద ప్రభువెవరు?” అని వారంటారు.
PSA 12:5 “దీనులు దోపిడికి గురవుతున్నారు, అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక, నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను” అని యెహోవా అంటున్నారు.
PSA 12:6 యెహోవా మాటలు నిర్దోషమైనవి, అవి మట్టి మూసలో శుద్ధి చేసిన వెండిలా పవిత్రమైనవి, ఏడుసార్లు శుద్ధి చేయబడిన బంగారం లాంటివి.
PSA 12:7 యెహోవా, అవసరంలో ఉన్నవారిని మీరు క్షేమంగా ఉంచుతారు ఈ చెడ్డతరం వారి నుండి నిత్యం కాపాడతారు,
PSA 12:8 మానవులలో నీచ ప్రవర్తన ఎక్కువైనప్పుడు, దుష్టులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు.
PSA 13:1 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతారు? ఎంతకాలం మీ ముఖాన్ని నా నుండి దాచిపెడతారు?
PSA 13:2 ఎంతకాలం నా ఆలోచనలతో నేను పెనుగులాడాలి? ఎంతకాలం నా హృదయంలో నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువు నాపై విజయం సాధిస్తాడు?
PSA 13:3 యెహోవా నా దేవా, నన్ను చూసి జవాబివ్వండి, నా కళ్లకు వెలుగివ్వండి, లేకపోతే నేను మరణంలో నిద్రపోతాను.
PSA 13:4 “మేము అతన్ని ఓడించాము” అని నా శత్రువులు చెప్పుకోనివ్వకండి, నేను పడిపోయినప్పుడు నా శత్రువులను ఆనందించనివ్వకండి.
PSA 13:5 అయితే నేను మారని మీ ప్రేమను నమ్ముతున్నాను; మీ రక్షణలో నా హృదయం సంతోషిస్తుంది.
PSA 13:6 యెహోవా నా మీద దయ చూపారు, కాబట్టి నేను ఆయనకు స్తుతి పాడతాను.
PSA 14:1 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. “దేవుడు లేడు” అని మూర్ఖులు తమ హృదయంలో అనుకుంటారు. వారు అవినీతిపరులు, వారి క్రియలు నీచమైనవి; మంచి చేసేవారు ఒక్కరు లేరు.
PSA 14:2 వివేకం కలిగి దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని యెహోవా పరలోకం నుండి మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు.
PSA 14:3 అందరు దారి తప్పి చెడిపోయారు; మంచి చేసేవారు ఎవరూ లేరు. ఒక్కరు కూడా లేరు.
PSA 14:4 కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; వారు ఎన్నడు యెహోవాకు మొరపెట్టరు.
PSA 14:5 వారు అక్కడ, భయంతో మునిగిపోయి ఉన్నారు, ఎందుకంటే దేవుడు నీతిమంతుల గుంపులో ఉన్నారు.
PSA 14:6 కీడుచేసేవారైన మీరు పేదల ఆలోచనలకు భంగం కలుగజేస్తారు, కాని యెహోవా వారి ఆశ్రయము.
PSA 14:7 సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది; యెహోవా తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు, యాకోబు సంతోషించును గాక ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!
PSA 15:1 దావీదు కీర్తన. యెహోవా, మీ పవిత్ర గుడారంలో ఉండగలవారు ఎవరు? మీ పరిశుద్ధ పర్వతంపై నివసించగలవారు ఎవరు?
PSA 15:2 నిందారహితంగా నడుచుకొనేవారు, నీతిని జరిగించేవారు, తమ హృదయం నుండి సత్యాన్ని మాట్లాడేవారు;
PSA 15:3 తమ నాలుకతో అపవాదులు వేయనివారు, పొరుగువారికి కీడు చేయనివారు, స్నేహితుల గురించి చెడుగా మాట్లాడనివారు;
PSA 15:4 నీచులను అసహ్యించుకుని యెహోవాకు భయపడేవారిని గౌరవించేవారు; తమకు బాధ కలిగినా తాము చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునేవారు, తమ మనస్సు మార్చుకొననివారు;
PSA 15:5 వడ్డీ తీసుకోకుండ బీదలకు డబ్బు అప్పిచ్చేవారు; నిర్దోషులకు వ్యతిరేకంగా లంచం తీసుకోనివారు. వీటిని చేసేవారు ఎన్నటికి కదిలించబడరు.
PSA 16:1 దావీదు శ్రేష్ఠమైన కీర్తన. నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను, నన్ను కాపాడండి.
PSA 16:2 యెహోవాతో నేను, “మీరు నా ప్రభువు; మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు” అని చెప్తాను.
PSA 16:3 భూమి మీద ఉన్న పరిశుద్ధ ప్రజల గురించి నేను ఇలా చెప్తాను, “వారు మహనీయులు, వారిలోనే నా ఆనందం అంతా ఉంది.”
PSA 16:4 వేరే దేవుళ్ళ వెంటపడేవారికి కష్టాలు ఎక్కువవుతాయి. వారి రక్తార్పణలలో నేను పాల్గొనను నా పెదవులతో వారి పేర్లు కూడా పలకను.
PSA 16:5 యెహోవా మీరు మాత్రమే నా భాగము, నా పాత్ర. మీరు నా భాగాన్ని భద్రపరుస్తారు.
PSA 16:6 మనోహరమైన స్థలాల్లో నా కోసం హద్దులు గీసి ఉన్నాయి; ఖచ్చితంగా నాకు ఆనందకరమైన వారసత్వం ఉంది.
PSA 16:7 నాకు ఆలోచన చెప్పే యెహోవాను నేను స్తుతిస్తాను, రాత్రివేళలో కూడా నా హృదయం నాకు హితవు చెప్తుంది.
PSA 16:8 ఎల్లప్పుడు నేను నా ఎదుట యెహోవాను చూస్తున్నాను. ఆయన నా కుడి ప్రక్కనే ఉన్నారు, కాబట్టి నేను కదల్చబడను.
PSA 16:9 కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది; నా శరీరం కూడా క్షేమంగా విశ్రమిస్తుంది.
PSA 16:10 ఎందుకంటే, మీరు నన్ను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు, మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.
PSA 16:11 మీరు నాకు జీవమార్గాన్ని తెలియజేస్తారు; మీ సన్నిధిలోని ఆనందంతో మీ కుడిచేతి వైపున నిత్య ఆనందాలతో నన్ను నింపుతారు.
PSA 17:1 దావీదు ప్రార్థన. యెహోవా, న్యాయమైన నా మనవి వినండి; నా మొర ఆలకించండి. నా ప్రార్థన వినండి అది మోసపూరితమైన పెదవుల నుండి రాలేదు.
PSA 17:2 నాకు న్యాయమైన తీర్పు మీ నుండి రావాలి; మీ కళ్లు సరియైన దాన్ని చూడాలి.
PSA 17:3 మీరు నా హృదయాన్ని పరిశీలించినప్పటికి, రాత్రివేళ మీరు నన్ను పరిశీలించి పరీక్షించినప్పటికీ, నాలో ఏ చెడు ఉద్దేశం మీకు కనబడలేదు; నా నోరు అతిక్రమించి మాట్లాడలేదు.
PSA 17:4 మనుష్యులు నాకు లంచం ఇవ్వాలని ప్రయత్నించినా, మీ పెదవులు ఆజ్ఞాపించిన దానిని బట్టి నేను హింసాత్మక మార్గాలకు దూరంగా ఉన్నాను.
PSA 17:5 నా అడుగులు మీ మార్గాల్లో నిలిచి ఉన్నాయి; నా పాదాలు తడబడలేదు.
PSA 17:6 నా దేవా! నేను మీకు మొరపెడతాను, మీరు నాకు జవాబిస్తారు; మీ చెవి నా వైపు త్రిప్పి నా ప్రార్థన ఆలకించండి.
PSA 17:7 మారని మీ ప్రేమలోని అద్భుతాలను నాకు చూపించండి, తమ శత్రువుల నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఆశ్రయించే వారిని మీ కుడిచేతితో మీరు రక్షిస్తారు.
PSA 17:8 నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుష్టుల నుండి, నన్ను చుట్టుముట్టి నా ప్రాణం తీయాలనుకుంటున్న శత్రువుల నుండి మీ కనుపాపలా నన్ను కాపాడండి; మీ రెక్కల నీడలో నన్ను దాచండి.
PSA 17:10 వారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు, వారి నోళ్ళు అహంకారంతో మాట్లాడతాయి.
PSA 17:11 వారు నన్ను పసిగట్టి నన్ను చుట్టుముట్టారు, నన్ను నేలకూల్చాలని చూస్తున్నారు.
PSA 17:12 వేట కోసం ఆకలిగొని ఉన్న సింహంలా, చాటున పొంచి ఉన్న కొదమసింహంలా వారు ఉన్నారు.
PSA 17:13 యెహోవా, లెండి, వారిని ఎదిరించండి, వారిని కూలద్రోయండి; మీ ఖడ్గంతో దుష్టుల నుండి నన్ను విడిపించండి.
PSA 17:14 ఈ జీవితకాలంలో మాత్రమే సంపదలు ఉన్న ఈ లోకసంబంధుల నుండి యెహోవా, మీ చేతితో నన్ను రక్షించండి. మీరు దుష్టుల కొరకు దాచిన దానితో వారి కడుపులను నింపుతారు; వారి పిల్లలు దానితో సంతృప్తి చెందుతారు, మిగిలిన దానిని తమ పిల్లలకు విడిచిపెడతారు.
PSA 17:15 నేనైతే, నీతిగలవాడనై మీ ముఖాన్ని చూస్తాను; నేను మేల్కొనినప్పుడు, మీ స్వరూపాన్ని చూస్తూ తృప్తి పొందుతాను.
PSA 18:1 సంగీత దర్శకునికి. యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి సౌలు చేతి నుండి విడిపించినప్పుడు అతడు పాడిన పాట. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. యెహోవా నా బలమా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.
PSA 18:2 యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు; నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు నా రక్షణ కొమ్ము, నా బలమైన కోట.
PSA 18:3 స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను, నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను.
PSA 18:4 మరణపు ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; దుష్టులు వరదలా పొంగి నన్ను ముంచెత్తుతారు.
PSA 18:5 సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; మరణపు ఉచ్చులు నన్ను బంధించాయి.
PSA 18:6 నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; సహాయం కోసం నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరింది.
PSA 18:7 భూమి కంపించి అదిరింది, పర్వతాల పునాదులు కదిలాయి; ఆయన కోపానికి అవి వణికాయి.
PSA 18:8 ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది; ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది, దానిలో నిప్పులు మండుతున్నాయి.
PSA 18:9 ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు; ఆయన పాదాల క్రింద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.
PSA 18:10 ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు; ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు.
PSA 18:11 ఆయన చీకటిని తన కప్పుగా, కారు మేఘాలను తన చుట్టూ పందిరిగా చేసుకున్నారు.
PSA 18:12 ఆయన సన్నిధి కాంతి నుండి మేఘాలు, వడగండ్లు, మండుతున్న నిప్పులు కురిసాయి.
PSA 18:13 యెహోవా పరలోకం నుండి ఉరిమారు; మహోన్నతుని స్వరం ప్రతిధ్వనించింది.
PSA 18:14 ఆయన తన బాణాలు విసిరి శత్రువును చెదరగొట్టారు, మెరుస్తున్న గొప్ప పిడుగులతో వారిని తరిమికొట్టారు.
PSA 18:15 యెహోవా, మీ గద్దింపుకు, మీ నాసికా రంధ్రాల్లో నుండి వచ్చే బలమైన ఊపిరికి, సముద్రపు అగాధాలు కనబడ్డాయి భూమి పునాదులు బయటపడ్డాయి.
PSA 18:16 ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు; లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు.
PSA 18:17 శక్తివంతమైన నా శత్రువు నుండి, నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు.
PSA 18:18 నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నారు.
PSA 18:19 ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు; ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు.
PSA 18:20 నా నీతిని బట్టి యెహోవా నాతో వ్యవహరించారు; నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చారు.
PSA 18:21 నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు.
PSA 18:22 ఆయన న్యాయవిధులన్ని నా ముందే ఉన్నాయి; ఆయన శాసనాల నుండి నేను తొలగిపోలేదు.
PSA 18:23 ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను, నేను పాపానికి దూరంగా ఉన్నాను.
PSA 18:24 నా నీతిని బట్టి, ఆయన దృష్టిలో నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి, యెహోవా నాకు ప్రతిఫలమిచ్చారు.
PSA 18:25 నమ్మకస్థులకు మిమ్మల్ని మీరు నమ్మకస్థులుగా కనుపరచుకుంటారు. యథార్థంగా ఉండే వారికి మిమ్మల్ని మీరు యథార్థవంతులుగా కనుపరచుకుంటారు,
PSA 18:26 నిష్కళంకులకు మీరు నిష్కళంకంగా కనుపరచుకుంటారు, కాని వంచకులకు మిమ్మల్ని మీరు వివేకిగా కనుపరచుకుంటారు.
PSA 18:27 మీరు దీనులను రక్షిస్తారు కాని అహంకారులను అణిచివేస్తారు.
PSA 18:28 యెహోవా, నా దీపాన్ని వెలిగించేది మీరే; నా దేవుడు నా చీకటిని వెలుగుగా మారుస్తారు.
PSA 18:29 మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను; నా దేవుని తోడుతో నేను గోడను దాటుతాను.
PSA 18:30 దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది; యెహోవా వాక్కు లోపం లేనిది; ఆయనను ఆశ్రయించిన వారందరిని ఆయన కాపాడతారు.
PSA 18:31 యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు?
PSA 18:32 బలంతో నన్ను సాయుధునిగా చేసేది, నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే.
PSA 18:33 నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు; ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతారు.
PSA 18:34 నా చేతులను యుద్ధానికి సిద్ధపరుస్తారు; నా చేతులు ఇత్తడి విల్లును వంచగలవు.
PSA 18:35 మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు, మీ కుడిచేయి నన్ను ఆదరిస్తుంది; మీ సహాయం నన్ను గొప్ప చేస్తుంది.
PSA 18:36 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు.
PSA 18:37 నేను నా శత్రువులను వెంటాడి పట్టుకున్నాను; వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు.
PSA 18:38 వారు మళ్ళీ లేవకుండా వారిని నలుగగొట్టాను; వారు నా పాదాల క్రింద పడ్డారు.
PSA 18:39 మీరు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపచేశారు; మీరు నా విరోధులను నా ముందు అణచివేశారు.
PSA 18:40 మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు, నేను నా విరోధులను నాశనం చేశాను.
PSA 18:41 వారు సాయం కోసం మొరపెట్టారు కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు.
PSA 18:42 గాలికి కొట్టుకుపోయే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను; వీధుల్లోని బురదలా నేను వారిని తొక్కాను
PSA 18:43 ప్రజల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు; జనులకు నాయకునిగా మీరు నన్ను స్థిరపరిచారు. నాకు తెలియని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు.
PSA 18:44 విదేశీయులు నా ముందు భయపడుతున్నారు; నా గురించి వినగానే వారు నాకు లోబడుతున్నారు.
PSA 18:45 వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు.
PSA 18:46 యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి! నా రక్షకుడైన దేవునికి మహిమ!
PSA 18:47 నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే, దేశాలను నాకు లోబరచేది ఆయనే.
PSA 18:48 నా శత్రువుల నుండి నన్ను రక్షించేది ఆయనే. నా విరోధులకు పైగా మీరు నన్ను హెచ్చించారు; హింసాత్మక వ్యక్తుల నుండి మీరు నన్ను విడిపించారు.
PSA 18:49 అందుకే యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను; మీ నామ సంకీర్తన చేస్తాను.
PSA 18:50 ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు; ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి, తన మారని ప్రేమను చూపిస్తారు.
PSA 19:1 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి; అంతరిక్షం ఆయన చేతిపనిని చాటుతుంది.
PSA 19:2 పగటికి పగలు బోధ చేస్తుంది; రాత్రికి రాత్రి జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది.
PSA 19:3 వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు; వాటి స్వరం వినబడదు.
PSA 19:4 అయినా వాటి స్వరం భూమి అంతటికి, వాటి మాటలు భూదిగంతాలకు వెళ్తాయి. దేవుడు ఆకాశంలో సూర్యునికి డేరా వేశారు.
PSA 19:5 సూర్యుడు తన మంటపంలో నుండి బయటకు వస్తున్న పెండ్లికుమారునిలా, తన పందెం పరుగెత్తడంలో ఆనందిస్తున్న వీరునిలా వస్తున్నాడు.
PSA 19:6 ఆకాశంలో ఒక చివర ఉదయించి మరొక చివర వరకు దాని చుట్టూ తిరిగి వస్తాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.
PSA 19:7 యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది. యెహోవా కట్టడలు నమ్మదగినవి, అవి సామాన్యులకు జ్ఞానాన్ని ఇస్తాయి.
PSA 19:8 యెహోవా కట్టడలు సరియైనవి, హృదయానికి ఆనందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశవంతమైనవి, కళ్లకు కాంతి కలిగిస్తాయి.
PSA 19:9 యెహోవా పట్ల భయం స్వచ్ఛమైనది, నిరంతరం నిలుస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి, అవన్నీ నీతియుక్తమైనవి.
PSA 19:10 అవి బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైనవి; తేనె కంటే, తేనెపట్టు నుండి వచ్చే ధారల కంటే మధురమైనవి.
PSA 19:11 వాటి వల్ల మీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు; వాటిని పాటించడం వలన గొప్ప బహుమానం దొరుకుతుంది.
PSA 19:12 తమ తప్పిదాలను ఎవరు తెలుసుకోగలరు? నేను దాచిన తప్పులను క్షమించండి.
PSA 19:13 కావాలని చేసే పాపాల నుండి మీ సేవకున్ని తప్పించండి; అవి నా మీద పెత్తనం చేయకుండా అరికట్టండి. అప్పుడు నేను యథార్థవంతుడనై ఘోరమైన అతిక్రమాలు చేయకుండ నిర్దోషిగా ఉంటాను.
PSA 19:14 యెహోవా, నా కొండ, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక.
PSA 20:1 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. కష్టకాలంలో యెహోవా మీకు జవాబిచ్చును గాక; యాకోబు దేవుని నామం మిమ్మల్ని కాపాడును గాక.
PSA 20:2 తన పరిశుద్ధస్థలం నుండి ఆయన మీకు సహాయం పంపాలి, సీయోను నుండి మీకు మద్ధతు ఇవ్వాలి.
PSA 20:3 మీ అర్పణలను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి మీ దహనబలులను అంగీకరించాలి. సెలా
PSA 20:4 ఆయన మీ హృదయ వాంఛను తీర్చాలి, మీ ప్రణాళికలన్నిటిని సఫలం చేయాలి.
PSA 20:5 యెహోవా మీ రక్షణను బట్టి మేము ఆనందంతో కేకలు వేయాలి, మా దేవుని పేరట విజయపతాకాలు ఎగరవేయాలి. యెహోవా మీ మనవులన్నిటిని అనుగ్రహించాలి.
PSA 20:6 యెహోవా తన అభిషిక్తునికి విజయాన్ని ఇస్తారని ఇప్పుడు నాకు తెలిసింది. రక్షణ కలిగించే తన కుడిచేతి మహాబలంతో ఆయన తన పరలోకపు పరిశుద్ధాలయం నుండి అతనికి జవాబిస్తారు.
PSA 20:7 కొందరు రథాలను కొందరు గుర్రాలను నమ్ముతారు, కాని మేమైతే మా దేవుడైన యెహోవా నామాన్ని నమ్ముతాము.
PSA 20:8 వారు పూర్తిగా పతనం చేయబడ్డారు, కాని మేము లేచి స్థిరంగా నిలబడతాము.
PSA 20:9 యెహోవా, రాజుకు విజయం ఇవ్వండి! మేము మొరపెట్టినప్పుడు మాకు జవాబివ్వండి!
PSA 21:1 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. యెహోవా! మీ బలంలోనే రాజు ఆనందిస్తాడు. మీ రక్షణను బట్టి అతడు ఎంతో సంతోషిస్తాడు!
PSA 21:2 అతని హృదయ కోరికను మీరు తీర్చారు అతని పెదవుల నుండి వచ్చిన మనవిని మీరు ఇవ్వక మానలేదు. సెలా
PSA 21:3 మీరు అతనిని గొప్పగా ఆశీర్వదించారు మేలిమి బంగారు కిరీటం అతని తలపై పెట్టారు.
PSA 21:4 అతడు మిమ్మల్ని ఆయుష్షును అడుగగా, మీరు అతనికి శాశ్వతకాలం ఉండే దీర్ఘాయువును ఇచ్చారు.
PSA 21:5 మీరు ఇచ్చిన విజయాల వలన అతని గొప్ప కీర్తి కలిగింది; మీరు ఘనతా ప్రభావాలతో అతడిని అలంకరించారు.
PSA 21:6 నిశ్చయంగా మీరు అతనికి శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇచ్చారు మీ సన్నిధిలోని ఆనందంతో అతన్ని సంతోష పెట్టారు.
PSA 21:7 రాజు యెహోవాను నమ్ముతాడు; మహోన్నతుని మారని ప్రేమను బట్టి అతడు కదలకుండ స్థిరంగా ఉంటాడు.
PSA 21:8 మీ చేయి మీ శత్రువులందరినీ పట్టుకుంటుంది; మీ కుడిచేయి మీ శత్రువులను ఆక్రమిస్తుంది.
PSA 21:9 మీరు యుద్ధం చేయడానికి ప్రత్యక్షమైనప్పుడు, మీరు వారిని అగ్నిగుండంలో కాల్చివేస్తారు. యెహోవా తన ఉగ్రతతో వారిని మ్రింగివేస్తారు, ఆయన అగ్ని వారిని దహించి వేస్తుంది.
PSA 21:10 భూమి మీద వారి సంతానాన్ని మీరు నిర్మూలం చేస్తారు, నరులలో వారి సంతతిని నిర్మూలం చేస్తారు.
PSA 21:11 వారు మీకు వ్యతిరేకంగా కీడు చేయాలని కుట్రపన్నినా దుష్ట పన్నాగాలు వేసినా, వారు విజయం సాధించలేరు.
PSA 21:12 మీరు వారివైపు గురి చూసి విల్లు ఎక్కుపెట్టి వారు వెనుతిరిగి వెళ్లేలా చేయగలరు.
PSA 21:13 యెహోవా, మీ బలంలో మీరు లేవండి; మీ శక్తిని గురించి మేము పాడి స్తుతిస్తాము.
PSA 22:1 సంగీత దర్శకునికి. “ఉదయకాలపు జింక పిల్ల” అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన నా దేవా, నా దేవా! నన్ను ఎందుకు విడిచిపెట్టారు? నన్ను రక్షించకుండ ఎందుకంత దూరంగా ఉన్నారు, వేదనతో కూడిన నా మొరలకు ఎందుకు దూరంగా ఉన్నారు?
PSA 22:2 నా దేవా, పగలు నేను మొరపెడుతున్నాను, కాని మీరు జవాబివ్వడం లేదు, రాత్రి నేను మౌనంగా ఉండడం లేదు.
PSA 22:3 మీరు పరిశుద్ధులు; ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనులై ఉన్నారు.
PSA 22:4 మా పూర్వికులు మిమ్మల్ని విశ్వసించారు; వారి నమ్మకాన్ని బట్టి మీరు వారిని విడిపించారు.
PSA 22:5 వారు మీకు మొరపెట్టి విడుదల పొందారు; మీపట్ల వారు నమ్మకముంచి సిగ్గుపడలేదు.
PSA 22:6 నేను మనిషిని కాను ఒక పురుగును, మనుష్యుల చేత తిరస్కరించబడి, ప్రజలచే అవమానించబడ్డాను.
PSA 22:7 నన్ను చూసినవారందరు నన్ను ఎగతాళి చేస్తారు; వారు వెక్కిరిస్తూ, తలలు ఊపుతూ ఎగతాళి చేస్తారు.
PSA 22:8 “వాడు యెహోవాను నమ్మాడు, యెహోవా వాన్ని విడిపించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తాడు కాబట్టి, ఆయనే వాన్ని విడిపించనివ్వండి” అని వారంటున్నారు.
PSA 22:9 నా తల్లి గర్భం నుండి మీరే నన్ను బయటకు తెచ్చారు; నా తల్లి రొమ్మున ఉన్నప్పుడే మీపై నమ్మకం పుట్టించారు.
PSA 22:10 నేను పుట్టినప్పుడే మీమీద ఆధారపడ్డాను; నా తల్లి గర్భంలో ఉన్నప్పటినుండే మీరే నా దేవుడు.
PSA 22:11 శ్రమ నాకు సమీపంగా ఉంది, నాకు సహాయం చేయడానికి ఒక్కరు లేరు, నాకు దూరంగా ఉండవద్దు.
PSA 22:12 ఎన్నో ఎద్దులు నన్ను చుట్టుముట్టాయి; బాషాను బలమైన ఎద్దులు నన్ను చుట్టూ మూగాయి.
PSA 22:13 గర్జిస్తూ ఎరను చీల్చే సింహాల్లా వారు తమ నోరు పెద్దగా తెరిచారు.
PSA 22:14 నేను నీటిలా పారబోయబడ్డాను, నా ఎముకలు కీళ్ళ నుండి తప్పాయి. నా హృదయం మైనంలా; నాలో కరిగిపోయింది.
PSA 22:15 నా బలం ఎండిన కుండపెంకులా అయింది, నా నాలుక నా అంగిలికి అంటుకుపోయింది; మీరు నన్ను మరణ ధూళిలో పడవేశారు.
PSA 22:16 కుక్కలు నా చుట్టూ గుమికూడాయి, దుష్టుల మూక నా చుట్టూ మూగింది; వారు నా చేతుల్లో నా పాదాల్లో పొడిచారు.
PSA 22:17 నా ఎముకలన్నీ బయటకు కనబడుతున్నాయి; ప్రజలు నన్ను చూస్తూ ఎగతాళిగా నవ్వుతున్నారు.
PSA 22:18 నా వస్త్రాలు పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేస్తారు.
PSA 22:19 అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి. మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి.
PSA 22:20 ఖడ్గం నుండి నన్ను విడిపించండి, కుక్కల బలం నుండి నా విలువైన ప్రాణాన్ని కాపాడండి.
PSA 22:21 సింహాల నోటి నుండి నన్ను కాపాడండి; అడవి దున్నల కొమ్ముల నుండి నన్ను విడిపించండి.
PSA 22:22 నేను మీ నామాన్ని నా ప్రజలకు ప్రకటిస్తాను; సమాజంలో మిమ్మల్ని స్తుతిస్తాను.
PSA 22:23 యెహోవాకు భయపడేవారలారా, ఆయనను స్తుతించండి. యాకోబు సర్వ వంశస్థులారా, ఆయనను ఘనపరచండి! ఇశ్రాయేలు సర్వ వంశస్థులారా, ఆయనను పూజించండి.
PSA 22:24 బాధితుల శ్రమను ఆయన తృణీకరించలేదు వారిని చూసి అసహ్యపడలేదు; ఆయన ముఖం వారి నుండి దాచలేదు. ఆయన వారి మొర ఆలకించారు.
PSA 22:25 మహా సమాజంలో మీకే నేను స్తుతి చెల్లిస్తాను; మీకు భయపడు వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెలిస్తాను.
PSA 22:26 దీనులు తృప్తిగా భోజనం చేస్తారు; యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు, మీ హృదయాలు నిత్యం ఆనందిస్తాయి.
PSA 22:27 భూనివాసులందరూ యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరుగుతారు, దేశాల్లోని కుటుంబాలన్నీ ఆయనకు నమస్కారం చేస్తాయి.
PSA 22:28 రాజ్యాధికారం యెహోవాదే ఆయనే దేశాలను పరిపాలిస్తారు.
PSA 22:29 లోకంలోని ధనికులంతా విందు చేస్తూ ఆరాధిస్తారు; తమ ప్రాణాలు కాపాడుకోలేక మట్టిలో కలిసిపోయే వారంతా ఆయన ఎదుట మోకరిస్తారు.
PSA 22:30 ఒక తరం వారు ఆయనను సేవిస్తారు; రాబోయే తరాలకు ప్రభువు గురించి చెబుతారు.
PSA 22:31 వారు వచ్చి ఆయన చేసిన కార్యాల గురించి, ఇంకా పుట్టని ప్రజలకు చెప్పి ఆయన నీతిని తెలియజేస్తారు!
PSA 23:1 దావీదు కీర్తన యెహోవా నా కాపరి, నాకు ఏ కొరత లేదు.
PSA 23:2 పచ్చిక ఉన్నచోట ఆయన నన్ను పడుకోనిస్తారు. ప్రశాంత జలాల ప్రక్కన ఆయన నన్ను నడిపిస్తారు.
PSA 23:3 ఆయన నా ప్రాణానికి సేదదీరుస్తారు. ఆయన తన నామం కోసం నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తారు.
PSA 23:4 మృత్యు నీడలా ఉన్న లోయలో నేను నడిచినా, ఏ కీడుకు భయపడను, ఎందుకంటే మీరు నాతో ఉన్నారు; మీ దండం మీ చేతికర్ర నన్ను ఆదరిస్తాయి.
PSA 23:5 నా శత్రువులు ఉన్న చోటనే మీరు నాకు బల్ల సిద్ధం చేస్తారు. నూనెతో నా తల అభిషేకించారు; నా పాత్ర నిండి పొర్లుతుంది.
PSA 23:6 నిశ్చయంగా నా జీవితకాలమంతా మీ మంచితనం మీ మారని ప్రేమ నావెంటే ఉంటాయి. నేను నిరంతరం యెహోవా మందిరంలో నివసిస్తాను.
PSA 24:1 దావీదు కీర్తన. భూమి, దానిలో ఉండే సమస్తం, లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు.
PSA 24:2 ఆయన సముద్రంపై భూమికి పునాది వేశారు. జలాల మీద ఆయన దాన్ని స్థాపించారు.
PSA 24:3 యెహోవా పర్వతాన్ని అధిరోహించగల వారెవరు? ఆయన పవిత్ర స్థలంలో నిలువగలవారెవరు?
PSA 24:4 ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో, ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో, ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు చేయరో, వారే కదా!
PSA 24:5 వారు యెహోవా నుండి దీవెన పొందుతారు వారి రక్షకుడైన దేవునిచే నీతిమంతులుగా తీర్చబడతారు.
PSA 24:6 ఆయనను వెదికే తరం ఇదే, యాకోబు దేవా, మీ ముఖకాంతిని వెదకేవారు అలాంటివారే. సెలా
PSA 24:7 గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి; మహిమగల రాజు ప్రవేశించేలా పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.
PSA 24:8 ఈ మహిమగల రాజు ఎవరు? శక్తిమంతుడు బలశాలియైన యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా.
PSA 24:9 గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి; మహిమగల రాజు ప్రవేశించేలా పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.
PSA 24:10 ఈ మహిమగల రాజు ఎవరు? సైన్యాలకు అధిపతియైన యెహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు. సెలా
PSA 25:1 దావీదు కీర్తన. యెహోవా, నా దేవా, నేను మీపై నమ్మిక ఉంచాను.
PSA 25:2 నా దేవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; నాకు అవమానం కలగనివ్వకండి, నా శత్రువులకు నాపై విజయాన్ని ఇవ్వకండి.
PSA 25:3 మీ కోసం ఎదురు చూసే వారెవరూ ఎన్నటికి సిగ్గుపరచబడరు; ఎన్నడూ ఆశాభంగం చెందరు, కారణం లేకుండ ద్రోహం చేసేవారి మీదకు అవమానం వస్తుంది.
PSA 25:4 యెహోవా, మీ మార్గాలేవో నాకు చూపండి. మీ పద్ధతులను నాకు ఉపదేశించండి.
PSA 25:5 మీ సత్యంలో నన్ను నడిపించి నాకు బోధించండి, మీరే నా రక్షకుడవైన నా దేవుడవు, మీ కోసమే రోజంతా నిరీక్షిస్తాను.
PSA 25:6 యెహోవా, మీ కరుణ, మీ మారని ప్రేమ జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే, అవి అనాది కాలంనాటి నుండి ఉన్నాయి.
PSA 25:7 యవ్వనంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను జ్జాపకముంచుకోండి. ఎందుకంటే యెహోవా మీరు మంచివారు.
PSA 25:8 యెహోవా మంచివాడు యథార్థవంతుడు; కాబట్టి తన మార్గాలను పాపులకు బోధిస్తారు.
PSA 25:9 న్యాయమైన మార్గాల్లో దీనులను నడిపిస్తారు, తన మార్గాలను వారికి బోధిస్తారు.
PSA 25:10 తన నిబంధనలను శాసనాలను పాటించేవారి విషయంలో యెహోవా మార్గాలు, ఆయన మారని ప్రేమ నమ్మదగినవి.
PSA 25:11 యెహోవా, నా దోషం ఘోరమైనది మీ నామం కోసం నా దోషాన్ని క్షమించండి.
PSA 25:12 అప్పుడు యెహోవాకు భయపడేవారికి వారు కోరుకోవలసిన మార్గాలను ఆయన బోధిస్తారు.
PSA 25:13 వారు క్షేమం కలిగి జీవిస్తారు, వారి వారసులు భూమిని వారసత్వంగా పొందుతారు.
PSA 25:14 ఆయన పట్ల భయభక్తులు గలవారికి యెహోవా రహస్యాలు తెలుస్తాయి; ఆయన తన నిబంధనను వారికి తెలియపరుస్తారు.
PSA 25:15 నా కళ్లు ఎప్పుడూ యెహోవా మీద ఉన్నాయి, ఎందుకంటే ఆయన మాత్రమే వలలో నుండి నా పాదాలు విడిపిస్తారు.
PSA 25:16 నా వైపు తిరిగి నాపై దయ చూపండి, నేను ఒంటరి వాడను, బాధింపబడ్డాను.
PSA 25:17 నా హృదయంలో ఉన్న ఇబ్బందులు తొలగించండి నా వేదన నుండి విడిపించండి.
PSA 25:18 నా వేదన బాధను చూడండి నా పాపాలన్నిటిని క్షమించండి.
PSA 25:19 నా శత్రువులు ఎంతమంది ఉన్నారో చూడండి వారు ఎంత తీవ్రంగా నన్ను ద్వేషిస్తున్నారో చూడండి!
PSA 25:20 నా ప్రాణాన్ని కాపాడండి నన్ను రక్షించండి; నాకు అవమానం కలగనివ్వకండి, ఎందుకంటే నేను మిమ్మల్నే ఆశ్రయించాను.
PSA 25:21 నా నిరీక్షణ యెహోవాలోనే ఉంది, కాబట్టి నా నిజాయితీ యథార్థత నన్ను కాపాడతాయి.
PSA 25:22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను వారి ఇబ్బందులన్నిటి నుండి విడిపించండి.
PSA 26:1 దావీదు కీర్తన. యెహోవా, నేను నిందారహితునిగా జీవించాను, నాకు న్యాయం తీర్చండి; నేను ఏ సందేహం లేకుండ యెహోవాను నమ్మాను.
PSA 26:2 యెహోవా, నన్ను పరిశీలించండి, నన్ను పరీక్షించండి, నా హృదయాన్ని నా మనస్సును పరీక్షించండి;
PSA 26:3 నేను నిరంతరం మీ మారని ప్రేమను జ్ఞాపకముంచుకుంటాను మీ సత్యానికి అనుగుణంగా నడుచుకుంటాను.
PSA 26:4 నేను మోసగాళ్ళతో కూర్చోను, వేషధారులతో నేను సహవాసం చేయను.
PSA 26:5 కీడుచేసేవారి గుంపు నాకు అసహ్యం దుష్టులతో నేను కూర్చోను.
PSA 26:6 యెహోవా, నిర్దోషినని నా చేతులు కడుక్కుని, బిగ్గరగా మీ స్తుతిని ప్రకటిస్తూ మీ అద్భుత క్రియలన్నిటిని గురించి చెబుతూ మీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను.
PSA 26:8 యెహోవా, మీరు నివసించే ఆవరణం, మీ మహిమ నివసించే స్థలం అంటే నాకు ఇష్టము.
PSA 26:9 పాపులతో పాటు నా ప్రాణాన్ని నరహంతకులతో పాటు నా బ్రతుకును తుడిచివేయకండి.
PSA 26:10 వారి చేతుల్లో దుష్ట పన్నాగాలు ఉన్నాయి, వారి కుడి చేతులు లంచాలతో నిండి ఉన్నాయి.
PSA 26:11 నేను నిందారహితంగా బ్రతుకుతాను; నన్ను విమోచించండి నన్ను కరుణించండి.
PSA 26:12 నా పాదాలను సమతలమైన నేల మీద నిలిపాను; గొప్ప సమాజాలలో నేను యెహోవాను స్తుతిస్తాను.
PSA 27:1 దావీదు కీర్తన. యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ నేను ఎవరికి భయపడతాను? దేవుడే నా జీవితానికి బలమైన కోట నేను ఎవరికి భయపడతాను?
PSA 27:2 నన్ను మ్రింగివేయాలని దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నా శత్రువులు నా పగవారు తూలి పడిపోతారు.
PSA 27:3 సైన్యం నన్ను ముట్టడించినా, నా హృదయం భయపడదు; నా మీదికి యుద్ధానికి వచ్చినా, నేను ధైర్యం కోల్పోను.
PSA 27:4 యెహోవాను ఒకటి అడిగాను, నేను కోరింది ఇదే; యెహోవా ప్రసన్నతను చూస్తూ ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.
PSA 27:5 ఆపద సంభవించిన దినాన ఆయన తన ఆశ్రయంలో నన్ను క్షేమంగా ఉంచుతారు; తన పవిత్ర గుడారంలో ఆయన నన్ను దాచిపెడతారు, ఎత్తైన బండ మీద నన్ను నిలుపుతారు.
PSA 27:6 నన్ను చుట్టూ ముట్టిన శత్రువుల కంటే, నా తల పైకెత్తబడుతుంది ఆయన పవిత్ర గుడారం దగ్గర ఆనంద బలులర్పిస్తాను; నేను పాడి యెహోవాను స్తుతిస్తాను.
PSA 27:7 యెహోవా, నేను మొరపెట్టినప్పుడు నా స్వరాన్ని ఆలకించండి; నాపై కరుణ చూపించి నాకు జవాబివ్వండి.
PSA 27:8 “ఆయన ముఖాన్ని వెదకు!” అని నా హృదయం మీ గురించి అంటుంది, యెహోవా, మీ ముఖాన్ని నేను వెదకుతాను.
PSA 27:9 మీ ముఖాన్ని నా నుండి దాచకండి, కోపంతో మీ దాసున్ని త్రోసివేయకండి; మీరే నాకు సహాయము. దేవా నా రక్షకా, నన్ను త్రోసివేయకండి నన్ను విడిచిపెట్టకండి.
PSA 27:10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తారు.
PSA 27:11 యెహోవా, మీ మార్గం నాకు బోధించండి; నాకు విరోధులు మాటున పొంచి ఉన్నారు, కాబట్టి మీరే నన్ను సరియైన దారిలో నడిపించాలి.
PSA 27:12 నా శత్రువుల కోరికకు నన్ను అప్పగించకండి, ఎందుకంటే అబద్ధ సాక్షులు నామీదికి లేచి, హానికరమైన ఆరోపణలను చేస్తున్నారు.
PSA 27:13 నేను దీనిపై నమ్మకంగా ఉన్నాను: సజీవులన్న చోట నేను యెహోవా మంచితనాన్ని చూస్తాను.
PSA 27:14 యెహోవా కోసం కనిపెట్టండి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి యెహోవా కోసం కనిపెట్టండి.
PSA 28:1 దావీదు కీర్తన. యెహోవా, నేను మీకు మొరపెట్టుకుంటున్నాను; మీరు నా కొండయై ఉన్నారు, నా మొరను నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ మీరు మౌనంగా ఉంటే, నేను గుంటలోకి దిగిపోయే వారిలా అవుతాను.
PSA 28:2 నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులెత్తి, కరుణ కొరకై నేను చేసే మొర సహాయం కొరకై నేను చేసే ప్రార్థన ఆలకించండి.
PSA 28:3 దుష్టులతో, చెడు చేసేవారితో పాటు నన్ను లాక్కు వెళ్లకండి. వారు పొరుగువారితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు కాని, వారి హృదయాల్లో దుర్మార్గం పెట్టుకుంటారు.
PSA 28:4 వారి క్రియలకు వారి చెడు పనికి తగ్గట్టుగా చెల్లించండి. చేతులార వారు చేసిందానికి ప్రతీకారం చేయండి; వారికి తగిన ప్రతిఫలమివ్వండి.
PSA 28:5 యెహోవా క్రియలను గాని ఆయన తన చేతులతో చేసిన వాటిని గాని వారు గ్రహించరు, కాబట్టి ఆయన వారిని పడగొడతారు మరలా వారిని నిలబెట్టరు.
PSA 28:6 యెహోవా నా విజ్ఞాపన మొర విన్నారు కాబట్టి ఆయనకు స్తుతి కలుగును గాక.
PSA 28:7 యెహోవాయే నా బలం నా డాలు; హృదయపూర్వకంగా ఆయనను నమ్మాను, నాకు సాయం దొరికింది. నా హృదయం సంతోషంతో ఉప్పొంగి పోతుంది. నా పాటతో నేను ఆయనను స్తుతిస్తాను.
PSA 28:8 యెహోవాయే తన ప్రజలకు బలము. తన అభిషిక్తుడికి ఆయనే రక్షణ దుర్గము.
PSA 28:9 మీ ప్రజలను రక్షించండి మీ వారసత్వాన్ని దీవించండి; వారికి కాపరివై ఎల్లప్పుడూ వారిని మోయండి.
PSA 29:1 దావీదు కీర్తన. దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి, మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి.
PSA 29:2 యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే ఆపాదించండి; ఆయన పరిశుద్ధ వైభవాన్ని బట్టి యెహోవాను ఆరాధించండి.
PSA 29:3 యెహోవా స్వరం సముద్రం మీద ప్రతిధ్వనిస్తుంది; మహిమగల దేవుడు ఉరుముతారు మహాజలాల మీద యెహోవా స్వరం ప్రతిధ్వనిస్తోంది.
PSA 29:4 యెహోవా స్వరం శక్తివంతమైనది; యెహోవా స్వరం ఘనమైనది.
PSA 29:5 యెహోవా స్వరానికి దేవదారు చెట్లు విరిగి పడిపోతాయి; లెబానోను దేవదారు చెట్లను యెహోవా ముక్కలుగా చేస్తారు.
PSA 29:6 ఆయన లెబానోను పర్యతాలను దూడలా, షిర్యోనును అడవి దూడలా చెంగున గంతులు వేసేలా చేస్తారు.
PSA 29:7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను పుట్టిస్తుంది;
PSA 29:8 యెహోవా స్వరం ఎడారిని వణికిస్తుంది. యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తారు.
PSA 29:9 యెహోవా స్వరం లేళ్లను ఈనజేస్తుంది అడవిలోని ఆకులు రాలిపోయేలా చేస్తుంది. ఆయన ఆలయంలోని సమస్తం ఆయనకే, “మహిమ” అంటున్నాయి.
PSA 29:10 యెహోవా ప్రళయజలాల మీద ఆసీనులయ్యారు; ఆయనే నిరంతరం రాజుగా పరిపాలిస్తున్నారు.
PSA 29:11 యెహోవా తన ప్రజలకు బలాన్ని దయచేస్తారు; యెహోవా సమాధానంతో తన ప్రజలను ఆశీర్వదిస్తారు.
PSA 30:1 దేవాలయ ప్రతిష్ఠ కొరకైన పాట; దావీదు కీర్తన. యెహోవా, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, ఎందుకంటే నా శత్రువులు నాపై విజయం సాధించకుండ మీరు నన్ను పైకి లేవనెత్తారు.
PSA 30:2 యెహోవా, నా దేవా, సహాయం కోసం నేను మీకు మొరపెట్టగా, మీరు నన్ను స్వస్థపరిచారు.
PSA 30:3 యెహోవా, పాతాళం నుండి నా ప్రాణానికి పైకి లేవనెత్తారు; సమాధిలోనికి వెళ్లకుండా నన్ను కాపాడారు.
PSA 30:4 యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించండి; ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించండి.
PSA 30:5 ఆయన కోపం క్షణికం, కాని ఆయన దయ జీవితాంతం వరకు ఉంటుంది; రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ, ఉదయాన్నే ఆనంద కలుగుతుంది.
PSA 30:6 నేను క్షేమంగా ఉన్నప్పుడు, “నేను ఎప్పటికీ కదల్చబడను” అని అన్నాను.
PSA 30:7 యెహోవా, మీ దయతో నన్ను పర్వతంలా స్థిరపరిచారు. కాని మీరు మీ ముఖాన్ని దాచినప్పుడు నేను కలవరపడ్డాను.
PSA 30:8 యెహోవా నేను మీకు మొరపెట్టాను; ప్రభువా కరుణ కోసం నేను మీకు మొరపెట్టాను:
PSA 30:9 “నేను నా రక్తాన్ని కార్చితే ఏమి లాభం? సమాధిలోనికి వెళ్తే ఏమి లాభం? మట్టి మిమ్మల్ని స్తుతిస్తుందా? అది మీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తుందా?
PSA 30:10 యెహోవా! ఆలకించండి కరుణించండి. యెహోవా, నాకు సహాయంగా ఉండండి.”
PSA 30:11 మీరు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చారు; మీరు నా గోనెపట్టను తీసివేసి ఆనంద వస్త్రాన్ని తొడిగించారు.
PSA 30:12 నా హృదయం మౌనంగా ఉండక మీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను మిమ్మల్ని ఎల్లప్పుడు స్తుతిస్తాను.
PSA 31:1 ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి; మీ నీతిని బట్టి నన్ను విడిపించండి.
PSA 31:2 మీరు నా వైపు చెవియొగ్గి, నన్ను విడిపించడానికి త్వరగా రండి; నా ఆశ్రయదుర్గమై, బలమైన కోటవై నన్ను కాపాడండి.
PSA 31:3 మీరు నా కొండ, నా కోట; మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి.
PSA 31:4 నా కోసం ఏర్పాటు చేయబడిన ఉచ్చులో పడకుండ నన్ను తప్పించండి, ఎందుకంటే మీరు నా ఆశ్రయమై ఉన్నారు.
PSA 31:5 మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. యెహోవా నా నమ్మకమైన దేవా, నన్ను విడిపించండి.
PSA 31:6 విగ్రహాలను వెంబడించే వారిని నేను అసహ్యించుకుంటాను; నేనైతే యెహోవాలో నమ్మకముంచాను.
PSA 31:7 మీ మారని ప్రేమలో నేను ఆనందించి సంతోషిస్తాను, నా బాధను మీరు చూశారు నా వేదన మీకు తెలుసు.
PSA 31:8 మీరు నన్ను శత్రువుల చేతికి అప్పగించలేదు నా పాదాలను విశాలమైన స్థలంలో ఉంచారు.
PSA 31:9 యెహోవా, నేను బాధలో ఉన్నాను నన్ను కరుణించండి; నా కళ్లు విచారంతో బలహీనం అవుతున్నాయి, నా ప్రాణం దేహం దుఃఖంతో క్షీణిస్తున్నాయి.
PSA 31:10 నా బ్రతుకు వేదనలో గడుస్తుంది నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి. నా పాపాన్ని బట్టి నా బలమంతా హరించుకు పోతోంది, నా ఎముకల్లో సత్తువలేదు.
PSA 31:11 నా శత్రువులందరి కారణంగా పొరుగువారు నన్ను ఎగతాళి చేస్తున్నారు నన్ను చూసి నా స్నేహితులు భయపడుతున్నారు వీధిలో నన్ను చూసేవారు నా నుండి పారిపోతున్నారు.
PSA 31:12 చనిపోయిన వాడిగా నన్ను మరచిపోయారు; నేను పగిలిన కుండలా అయ్యాను.
PSA 31:13 అనేకమంది గుసగుసలాడడం నేను విన్నాను, “అన్నివైపులా భయమే!” నామీద వారు దురాలోచన చేస్తున్నారు నా ప్రాణం తీయాలని కుట్ర పన్నుతున్నారు.
PSA 31:14 కాని యెహోవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; “మీరే నా దేవుడు” అని నేను చెప్తాను.
PSA 31:15 నా బ్రతుకంతా మీ చేతిలోనే ఉంది; నన్ను వెంటాడే వారి నుండి, నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించండి.
PSA 31:16 మీ దాసుని మీద మీ ముఖకాంతిని ప్రకాశించనీయండి; మీ మారని ప్రేమతో నన్ను రక్షించండి.
PSA 31:17 యెహోవా, నేను మీకు మొరపెట్టాను, నన్ను సిగ్గుపడనీయకండి; అయితే దుష్టులు అవమానపరచబడాలి వారు పాతాళంలో మౌనంగా ఉండాలి.
PSA 31:18 అహంకారంతో ధిక్కారంతో గర్వంతో నీతిమంతులను దూషించే వారి అబద్ధపు పెదవులు మూయబడాలి.
PSA 31:19 మీకు భయపడేవారి కోసం మీరు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మీలో ఆశ్రయం పొందినవారికి మనుష్యులందరు చూస్తుండగా, మీరు ఇచ్చిన సమృద్ధి ఎంత గొప్పది!
PSA 31:20 మనుష్యుల కుట్రలకు గురికాకుండ మీ సన్నిధి గుడారంలో వారిని దాచిపెడతారు; నిందించే నాలుకల నుండి తప్పించి వారిని మీ నివాసంలో భద్రంగా ఉంచుతారు.
PSA 31:21 యెహోవాకు స్తుతి, ఎందుకంటే ముట్టడించబడిన పట్టణంలో నేను ఉన్నప్పుడు తన మార్పుచెందని ప్రేమలోని అద్భుతాలను ఆయన నాకు చూపించారు.
PSA 31:22 “మీ దృష్టి నుండి తొలగించబడ్డాను” అని నేను ఆందోళన చెందాను. సాయం చేయమనే ప్రాధేయపడి వేడుకున్నప్పుడు నా విన్నపాన్ని విన్నారు.
PSA 31:23 యెహోవా భక్తులారా, ఆయనను ప్రేమించండి. యెహోవాను నమ్మినవారిని ఆయన కాపాడతారు. గర్విష్ఠులకు గొప్ప ప్రతీకారం చేస్తారు.
PSA 31:24 యెహోవాలో నిరీక్షించే ప్రజలారా! నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండండి.
PSA 32:1 దావీదు ధ్యానకీర్తన. తమ పాపాలు క్షమించబడినవారు తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.
PSA 32:2 యెహోవాచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు ఆత్మలో మోసం లేనివారు ధన్యులు.
PSA 32:3 నేను మౌనంగా ఉండి, రోజంతా మూలుగుతూ ఉన్నందుకు నా ఎముకలు కృశించాయి.
PSA 32:4 రాత్రింబగళ్ళు మీ చేయి నాపై భారంగా ఉంది; వేసవిలో నీరు ఎండిపోయినట్లు నాలో సారం యింకి పోయింది. సెలా
PSA 32:5 అప్పుడు నేను నా పాపాన్ని మీ దగ్గర ఒప్పుకున్నాను నా దోషాన్ని నేను దాచుకోలేదు. “యెహోవా ఎదుట నా అతిక్రమాలను ఒప్పుకుంటాను” అని ఒప్పుకున్నాను. అప్పుడు నా అతిక్రమాన్ని మీరు క్షమించారు. సెలా
PSA 32:6 మీరు దొరికే సమయంలోనే నమ్మకమైన వారంతా మీకు ప్రార్థించుదురు గాక; జలప్రవాహాలు ఉప్పొంగినా వారిని చేరవు.
PSA 32:7 నా దాగుచోటు మీరే; కష్టాల నుండి మీరే నన్ను కాపాడతారు విమోచన గీతాలతో నా చుట్టూ ఆవరించారు. సెలా
PSA 32:8 మీరు నడవాల్సిన మార్గాన్ని నేను మీకు ఉపదేశించి నేర్పుతాను; మీమీద దృష్టిపెట్టి నేను మీకు సలహా ఇస్తాను.
PSA 32:9 వివేచనలేని గుర్రంలా కంచరగాడిదలా ప్రవర్తించకండి కళ్లెంతో పగ్గంతో వాటిని అదుపు చేయాలి లేకపోతే మీరు వాటిని వశపరచుకోలేరు.
PSA 32:10 దుష్టులకు చాలా బాధలు కలుగుతాయి, కాని యెహోవాను నమ్ముకున్న వారి చుట్టూ ఆయన మారని ప్రేమ ఆవరించి ఉంటుంది.
PSA 32:11 నీతిమంతులారా యెహోవాలో ఆనందించి సంతోషించండి. యథార్థ హృదయులారా, మీరు పాడండి.
PSA 33:1 నీతిమంతులారా, యెహోవాకు ఆనందంతో పాడండి; ఆయనను స్తుతించడం యథార్థవంతులకు తగినది.
PSA 33:2 సితారాతో యెహోవాను స్తుతించండి; పది తంతుల వీణతో ఆయనను కీర్తించండి.
PSA 33:3 ఆయనకు క్రొత్త పాట పాడండి; నైపుణ్యతతో వాయించండి, ఆనందంతో కేకలు వేయండి.
PSA 33:4 యెహోవా వాక్కు న్యాయమైనది; ఆయన చేసే ప్రతిదీ నమ్మకమైనది.
PSA 33:5 యెహోవా నీతిన్యాయాలను ప్రేమిస్తారు; భూమంతా ఆయన మారని ప్రేమతో నిండిపోయింది.
PSA 33:6 యెహోవా మాటతో ఆకాశాలు చేయబడ్డాయి, ఆయన నోటి శ్వాసతో నక్షత్ర కూటమి కలిగింది.
PSA 33:7 ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూర్చుతారు; అగాధాలను ఆయన గోదాములలో ఉంచుతారు.
PSA 33:8 భూమంతా యెహోవాకు భయపడును గాక; లోక ప్రజలందరు ఆయనను గౌరవించుదురు గాక.
PSA 33:9 ఆయన మాట్లాడారు అది జరిగింది; ఆయన ఆజ్ఞాపించారు అది దృఢంగా నిలబడింది.
PSA 33:10 యెహోవా దేశాల ప్రణాళికలను విఫలం చేస్తారు; ప్రజల ఉద్దేశాలను ఆయన అడ్డుకుంటారు.
PSA 33:11 కానీ యెహోవా ప్రణాళికలు శాశ్వతంగా నిలుస్తాయి, ఆయన హృదయ ఉద్దేశాలు అన్ని తరాల వరకు ఉంటాయి.
PSA 33:12 యెహోవాను దేవునిగా కలిగిన దేశం ధన్యమైనది. తన వారసత్వంగా ఆయన తన కోసం ఎంచుకున్న ప్రజలు ధన్యులు.
PSA 33:13 ఆకాశం నుండి యెహోవా క్రిందకు చూస్తున్నారు ఆయన మనుష్యులందరిని కనిపెడుతున్నారు.
PSA 33:14 ఆయన తన నివాసస్థలం నుండి భూమిపై నివసించే వారందరినీ పరిశీలిస్తున్నారు.
PSA 33:15 అందరి హృదయాలను రూపించింది ఆయనే, వారు చేసే ప్రతిదీ ఆయన గమనిస్తారు.
PSA 33:16 ఏ రాజు తన సైనిక బలంతో రక్షించబడడు; ఏ యోధుడు తన గొప్ప శక్తితో తప్పించుకోడు.
PSA 33:17 విడుదల పొందడానికి గుర్రం ఉపయోగపడదు; దానికి గొప్ప బలం ఉన్నా అది ఎవరిని రక్షించలేదు.
PSA 33:18 కానీ యెహోవా కళ్లు ఆయనకు భయపడే వారిపైన, తన మారని ప్రేమలో ఆశ పెట్టుకున్న వారిపైన ఉన్నాయి.
PSA 33:19 ఆయన మరణం నుండి వారి ప్రాణాన్ని తప్పిస్తారు, కరువు సమయంలో వారిని సజీవులుగా ఉంచుతారు.
PSA 33:20 మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం; మనకు సహాయం మనకు డాలు ఆయనే.
PSA 33:21 మన హృదయాలు ఆయనలో ఆనందిస్తాయి, ఎందుకంటే మనం ఆయన పరిశుద్ధ నామాన్ని నమ్ముకున్నాము.
PSA 33:22 యెహోవా, మేము మా నిరీక్షణ మీలో ఉంచాం కాబట్టి, యెహోవా, మీ మారని ప్రేమ మాతో ఉండును గాక.
PSA 34:1 అబీమెలెకు ఎదుట వెర్రి వానిలా ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత దావీదు వ్రాసిన కీర్తన. నేను అన్ని వేళలా యెహోవాను కీర్తిస్తాను; ఆయన స్తుతి నిత్యం నా పెదవులపై ఉంటుంది.
PSA 34:2 నేను యెహోవాలో అతిశయిస్తాను. బాధించబడినవారు ఇది విని సంతోషించుదురు గాక!
PSA 34:3 నాతో కలిసి యెహోవాను మహిమపరచండి; మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం.
PSA 34:4 నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు; నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు.
PSA 34:5 ఆయన వైపు చూసేవారికి వెలుగు కలుగుతుంది; వారి ముఖాలు ఎప్పుడూ సిగ్గుపడవు.
PSA 34:6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు కష్టాలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించారు.
PSA 34:7 యెహోవా దూత ఆయనకు భయపడేవారి చుట్టూ ఉండి, వారిని విడిపిస్తాడు.
PSA 34:8 యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి; ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు.
PSA 34:9 యెహోవా పరిశుద్ధ జనమా, ఆయనకు భయపడండి, ఆయనకు భయపడేవారికి ఏ కొదువ ఉండదు.
PSA 34:10 సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు, కాని యెహోవాను వెదికేవారికి ఏ మేలు కొరతగా ఉండదు.
PSA 34:11 నా పిల్లలారా, రండి, నా మాట వినండి; నేను మీకు యెహోవా పట్ల భయాన్ని బోధిస్తాను.
PSA 34:12 మీలో ఎవరైతే జీవితాన్ని ప్రేమిస్తారో ఎవరు ఎక్కువ మంచి రోజులను చూడాలనుకుంటారో
PSA 34:13 మీరు చెడు పలుకకుండ మీ నాలుకను, అబద్ధాలు చెప్పకుండ తమ పెదవులను అదుపులో పెట్టుకోవాలి.
PSA 34:14 కీడు చేయడం మాని మేలు చేయాలి; సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.
PSA 34:15 యెహోవా కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి మొరను వింటాయి;
PSA 34:16 అయితే కీడుచేసేవారి జ్ఞాపకాన్ని భూమి మీద లేకుండా చేయడానికి యెహోవా ముఖం వారికి విరోధంగా ఉన్నది.
PSA 34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తారు; వారి ఇబ్బందులన్నిటి నుండి ఆయన వారిని విడిపిస్తారు.
PSA 34:18 విరిగిన హృదయం గలవారికి యెహోవా సమీపంగా ఉంటారు. ఆత్మలో నలిగినవారిని ఆయన రక్షిస్తారు.
PSA 34:19 నీతిమంతులకు అనేక శ్రమలు కలుగవచ్చు, కాని, యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపిస్తారు.
PSA 34:20 వారి ఎముకలన్నిటిని ఆయన కాపాడతారు, ఒక్క ఎముక కూడా విరగదు.
PSA 34:21 చెడుతనం దుష్టులను నాశనం చేస్తుంది; నీతిమంతుల శత్రువులు శిక్షింపబడతారు.
PSA 34:22 యెహోవా తన సేవకులను విడిపిస్తారు; ఆయనను ఆశ్రయించిన వారిలో ఎవరూ శిక్షింపబడరు.
PSA 35:1 దావీదు కీర్తన. యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి; నాతో పోరాడే వారితో పోరాడండి.
PSA 35:2 కవచం ధరించి, డాలు తీసుకుని యుద్ధానికి సిద్ధపడి, నాకు సాయం చేయడానికి రండి.
PSA 35:3 నన్ను వెంటాడుతున్న వారి మీదికి, మీ ఈటెను విసరండి “నేనే మీ రక్షణ” అని మీరు నాతో చెప్పండి.
PSA 35:4 నా ప్రాణాన్ని తీయాలని చూసేవారు అవమానపాలై సిగ్గుపడుదురు గాక; నా పతనానికి కుట్రపన్నిన వారు భయపడుదురు గాక.
PSA 35:5 యెహోవా దూత వారిని తరుముతుండగా వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉందురు గాక.
PSA 35:6 యెహోవా దూత వారిని తరుముతుండగా వారి మార్గం చీకటిమయమై జారేదిగా ఉండును గాక.
PSA 35:7 కారణం లేకుండా వారు తమ వలను నా కోసం దాచారు నన్ను చిక్కించుకోడానికి వారు ఒక గొయ్యి తవ్వారు.
PSA 35:8 వారికి తెలియకుండానే వారి పైకి నాశనం వచ్చును గాక వారు నా కోసం దాచిన వలలో వారే చిక్కుకొందురు గాక! నా కోసం త్రవ్విన గొయ్యిలో వారే పడుదురు గాక.
PSA 35:9 నా ప్రాణం యెహోవాలో ఆనందిస్తుంది ఆయన రక్షణలో సంతోషిస్తుంది.
PSA 35:10 “యెహోవా, నిన్ను పోలినవారెవరు? బలవంతుల చేతిలో నుండి మీరు బాధితులను విడిపిస్తారు, దోపిడి దొంగల నుండి మీరు దీనులను నిరుపేదలను విడిపిస్తారు” అని నా శక్తి అంతటితో నేను అంటాను.
PSA 35:11 అబద్ధ సాక్షులు బయలుదేరుతున్నారు; నాకు తెలియని విషయాలను గురించి వారు నన్ను ప్రశ్నిస్తారు.
PSA 35:12 మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తారు, నేను ఒంటరి వాడినయ్యాను.
PSA 35:13 అయినాసరే వారికి జబ్బు చేసినప్పుడు, నేను గోనెపట్ట చుట్టుకున్నాను, ఉపవాసముండి నన్ను నేను తగ్గించుకున్నాను. నా ప్రార్థనలకు జవాబు రానప్పుడు,
PSA 35:14 వారు నా స్నేహితులో సోదరులో అన్నట్లు నేను దుఃఖించాను. నా తల్లి కోసం ఏడుస్తున్నట్లు నేను దుఃఖంతో క్రుంగిపోయాను.
PSA 35:15 నేను తడబడినప్పుడు వారు సంతోషంతో సమకూడారు; నాకు తెలియకుండానే దుండగులు నా మీదికి వచ్చారు. ఆపకుండ వారు నా మీద అపవాదు వేశారు.
PSA 35:16 భక్తిహీనుల్లా వారు ద్వేషం వెళ్లగ్రక్కుతూ ఎగతాళి చేశారు; వారు నన్ను చూసి పళ్ళు కొరికారు.
PSA 35:17 ప్రభువా, ఎంతకాలం మీరిలా చూస్తూ ఉంటారు? వారి విధ్వంసం నుండి నన్ను కాపాడి, ఈ సింహాల నుండి నా విలువైన ప్రాణాన్ని విడిపించండి.
PSA 35:18 మహా సమాజంలో నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; అనేకమంది ప్రజలమధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
PSA 35:19 కారణం లేకుండా నాకు శత్రువులైనవారిని నన్ను చూసి సంతోషించనివ్వకండి. కారణం లేకుండా నన్ను ద్వేషించేవారు దురుద్దేశంతో కన్నుగీట నివ్వకండి.
PSA 35:20 వారు సమాధానంగా మాట్లాడరు, దేశంలో ప్రశాంతంగా నివసించే వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తారు.
PSA 35:21 వారు నన్ను వెక్కిరిస్తూ “ఆహా! ఆహా! మా కళ్లతో మేము చూశాం” అని అంటారు.
PSA 35:22 యెహోవా, ఇదంతా మీరు చూశారు; మౌనంగా ఉండకండి. ప్రభువా, నాకు దూరంగా ఉండకండి.
PSA 35:23 మేల్కొనండి, నన్ను రక్షించడానికి లేవండి! నా దేవా, నా ప్రభువా, నా పక్షాన వాదించండి.
PSA 35:24 యెహోవా, నా దేవా! మీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చండి; నన్ను బట్టి వారిని ఆనందించనివ్వకండి.
PSA 35:25 “ఆహా, మేము కోరుకున్నదే జరిగింది!” అని అనుకోనివ్వకండి, “మేము అతన్ని మ్రింగివేశాం” అని అననివ్వకండి.
PSA 35:26 నా బాధను చూసి ఆనందిస్తున్న వారందరు అవమానంతో సిగ్గుపడాలి; నా మీద గర్వించే వారందరు సిగ్గుతో అపకీర్తి పాలవుదురు గాక.
PSA 35:27 నా నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవారు ఆనంద సంతోషాలతో కేకలు వేయుదురు గాక; “తన సేవకుని క్షేమాన్ని చూసి ఆనందించే యెహోవా ఘనపరచబడును గాక” అని వారు నిత్యం అందురు గాక.
PSA 35:28 నా నాలుక మీ నీతిని ప్రకటిస్తుంది, దినమంతా మిమ్మల్ని స్తుతిస్తుంది.
PSA 36:1 సంగీత దర్శకునికి. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. దుష్టుల పాప స్వభావాన్ని గురించి నా హృదయంలో నేను దేవుని నుండి వర్తమానం పొందుకున్నాను; వారి కళ్లలో దేవుని భయం లేదు.
PSA 36:2 తమ పాపం బయటపడి దాన్ని ద్వేషించే వరకు వారు తమను తాము పొగడుకొంటారు.
PSA 36:3 వారి నోటి మాటల్లో దుష్టత్వం, మోసం నిండి ఉన్నాయి; వారు తెలివిగా వ్యవహరించడంలో, మంచి చేయడంలో విఫలమవుతారు.
PSA 36:4 వారి పడకలపై ఉండగానే చెడుకు కుట్ర చేస్తారు; వారు తమ పాప మార్గాల్లో వెళ్తారు తప్పును తిరస్కరించరు.
PSA 36:5 యెహోవా! మీ మారని ప్రేమ ఆకాశాన్ని మీ విశ్వాస్యత అంతరిక్షాన్ని తాకుతుంది.
PSA 36:6 మీ నీతి దేవుని ఉన్నత పర్వతాల్లా, మీ న్యాయం అగాధ సముద్రంలా ఉన్నాయి. యెహోవా! మీరు మనుష్యులను జంతువులను సంరక్షిస్తున్నారు.
PSA 36:7 దేవా! మీ మారని ప్రేమ ఎంత అమూల్యమైనది! నరులు మీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు.
PSA 36:8 మీ మందిరంలోని సమృద్ధి వల్ల వారు సంతృప్తి పొందుతున్నారు; మీ ఆనంద నది నుండి మీరు వారికి త్రాగడానికి ఇస్తారు.
PSA 36:9 ఎందుకంటే మీ దగ్గర జీవపుఊట ఉంది; మీ వెలుగులోనే మేము వెలుగును చూడగలము.
PSA 36:10 మిమ్మల్ని ఎరిగిన వారిపైన మీ మారని ప్రేమను, యథార్థ హృదయులపై మీ నీతిని కొనసాగించండి.
PSA 36:11 గర్విష్ఠుల పాదం నాపైకి రానివ్వకండి, దుష్టుల చేతులు నన్ను తరుమనివ్వకండి.
PSA 36:12 కీడుచేసేవారు ఎలా కూలిపోయారో, క్రిందకు త్రోయబడి, మళ్ళీ లేవలేకుండ ఎలా ఉన్నారో చూడండి!
PSA 37:1 దావీదు కీర్తన. దుష్టులను బట్టి బాధపడకు తప్పు చేసేవారిని చూసి అసూయపడకు;
PSA 37:2 గడ్డిలా వారు త్వరలోనే వాడిపోతారు, పచ్చ మొక్కల్లా వారు త్వరలోనే ఎండిపోతారు.
PSA 37:3 యెహోవా మీద నమ్మకం ఉంచి మంచి చేయి; దేశంలో నివసించి సురక్షితమైన క్షేమకరమైన పచ్చికను ఆస్వాదించు.
PSA 37:4 యెహోవాయందు ఆనందించు, ఆయన నీ హృదయ కోరికలు తీరుస్తారు.
PSA 37:5 నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించండి; ఆయనపై నమ్మకం ఉంచితే ఆయన నీకు సహాయం చేస్తారు.
PSA 37:6 ఆయన నీ నీతిని తెల్లవారు వెలుగులా ప్రకాశింపజేస్తారు, నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్న సూర్యునిలా ప్రకాశింపజేస్తారు.
PSA 37:7 యెహోవా ముందు మౌనంగా ఉండు ఆయన కోసం ఓర్పుతో వేచి ఉండు. ప్రజలు వారి మార్గాల్లో విజయవంతమైనప్పుడు వారు తమ దుష్ట పన్నాగాలు అమలు చేసినప్పుడు చింతించకు.
PSA 37:8 కోపం మాని ఆగ్రహాన్ని విడిచిపెట్టు; చింతించకు అది కీడుకే దారి తీస్తుంది.
PSA 37:9 చెడ్డవారు నాశనం చేయబడతారు, కాని యెహోవా కోసం నిరీక్షించే వారు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
PSA 37:10 దుష్టులు కొంతకాలం తర్వాత కనుమరుగవుతారు; వారి కోసం వెదకినా వారు కనబడరు.
PSA 37:11 కాని సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు సమాధానం అభివృద్ధి కలిగి జీవిస్తారు.
PSA 37:12 దుష్టులు నీతిమంతుల మీద కుట్రలు పన్నుతారు, వారిని చూసి పళ్ళు కొరుకుతారు.
PSA 37:13 వారి సమయం దగ్గరపడింది, కాబట్టి ప్రభువు దుష్టులను చూసి నవ్వుతారు.
PSA 37:14 దుష్టులు కత్తి దూసి, విల్లు ఎక్కుపెట్టి, అవసరతలో ఉన్న దీనులను నిరుపేదలను పతనం చేయాలని యథార్థవంతులను హతమార్చాలని చూస్తారు.
PSA 37:15 వారి ఖడ్గాలు వారి గుండెల్లోకే దూసుకుపోతాయి, వారి విండ్లు విరిగిపోతాయి.
PSA 37:16 అనేకమంది దుష్టుల ధనం కంటే నీతిమంతుల దగ్గర ఉన్న కొంచెం మేలు.
PSA 37:17 దుష్టుల చేతులు విరిగిపోతాయి, నీతిమంతులను యెహోవా సంరక్షిస్తారు.
PSA 37:18 నిందారహితులు తమ రోజులు యెహోవా సంరక్షణలో గడుపుతారు, వారి వారసత్వం శాశ్వతంగా ఉంటుంది.
PSA 37:19 విపత్తు సమయాల్లో వారు వాడిపోరు; కరువు దినాల్లో వారు సమృద్ధిని అనుభవిస్తారు.
PSA 37:20 కాని దుష్టులు నశిస్తారు: యెహోవా శత్రువులు పొలంలో ఉండే పూవుల్లా ఉన్నా, వారు కాల్చబడతారు పొగలా పైకి వెళ్తారు.
PSA 37:21 దుష్టులు అప్పు తెచ్చుకుంటారు కాని తీర్చరు, కాని నీతిమంతులు దయ కలిగి ఇస్తారు.
PSA 37:22 యెహోవా ఆశీర్వదించినవారు భూమిని స్వాధీనపరచుకుంటారు, కాని ఆయన శపించినవారు నాశనమౌతారు.
PSA 37:23 తనను బట్టి ఆనందించేవారి అడుగులను యెహోవా స్థిరపరుస్తారు;
PSA 37:24 యెహోవా వారి చేతిని పట్టుకుంటారు, కాబట్టి వారు తొట్రిల్లినా పడిపోరు.
PSA 37:25 ఒకప్పుడు నేను యవ్వనస్థుడను ఇప్పుడు ముసలివాడినయ్యాను, అయినాసరే నీతిమంతులు విడిచిపెట్టబడడం వారి పిల్లలు ఆహారం అడుక్కోవడం నేనెప్పుడు చూడలేదు.
PSA 37:26 వారు ఎల్లప్పుడు దయ గలవారై ఉచితంగా అప్పు ఇస్తారు; వారి పిల్లలు దీవెనకరంగా ఉంటారు.
PSA 37:27 కీడు చేయడం మాని మేలు చేయి; అప్పుడు నీవు శాశ్వతంగా దేశంలో నివసిస్తావు.
PSA 37:28 యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు తన నమ్మకస్థులను ఆయన విడిచిపెట్టరు. ఆయన వారిని శాశ్వతంగా భద్రపరుస్తారు; కాని దుష్టుల సంతానం నశిస్తుంది.
PSA 37:29 నీతిమంతులు భూమిని వారసత్వంగా పొందుకొని అందులో చిరకాలం నివసిస్తారు.
PSA 37:30 నీతిమంతుల నోరు జ్ఞానాన్ని పలుకుతుంది, వారి నాలుక న్యాయమైనది మాట్లాడుతుంది.
PSA 37:31 వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయాల్లో ఉంది; వారి పాదాలు జారవు.
PSA 37:32 దుష్టులు నీతిమంతులను చంపాలని దారిలో పొంచి ఉంటారు.
PSA 37:33 కాని యెహోవా వారిని దుష్టుల చేతికి అప్పగించరు, వారు విచారణకు వచ్చినప్పుడు వారిని శిక్షింపబడనీయరు.
PSA 37:34 యెహోవాయందు నిరీక్షణ ఉంచి ఆయన మార్గాన్ని అనుసరించు. భూమిని వారసత్వంగా పొందేలా ఆయన నిన్ను హెచ్చిస్తారు; దుష్టులు నాశనమైనప్పుడు నీవు చూస్తావు.
PSA 37:35 నేను దుష్టులను, క్రూరులైన మనుష్యులను చూశాను; వారు స్వస్థలంలో ఏపుగా పెరుగుతున్న చెట్టులా ఉన్నారు.
PSA 37:36 కాని అంతలోనే వారు గతించిపోయారు; నేను వారి కోసం వెదికినా వారు కనబడలేదు.
PSA 37:37 నిర్దోషులను గమనించు, యథార్థ హృదయులను గమనించు; సమాధానం వెదకే వారి కోసం భవిష్యత్తు వేచి ఉంది.
PSA 37:38 కాని పాపులందరు నశిస్తారు, దుష్టులకు భవిష్యత్తు ఉండదు.
PSA 37:39 నీతిమంతుల రక్షణ యెహోవా నుండి వస్తుంది; కష్ట సమయంలో ఆయన వారికి బలమైన కోట.
PSA 37:40 యెహోవా వారికి సాయం చేసి వారిని విడిపిస్తారు; వారు ఆయనను ఆశ్రయిస్తారు కాబట్టి, దుష్టుల చేతి నుండి ఆయన వారిని విడిపించి రక్షిస్తారు.
PSA 38:1 దావీదు దేవునికి విన్నవించుకున్న కీర్తన యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి ఉగ్రతలో నన్ను శిక్షించకండి.
PSA 38:2 మీ బాణాలు నాకు గుచ్చుకున్నాయి, మీ చేయి నా మీద బరువుగా పడింది.
PSA 38:3 మీ ఉగ్రత వల్ల నా శరీరంలో ఆరోగ్యం లేదు; నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో నెమ్మది లేదు.
PSA 38:4 నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది.
PSA 38:5 నా బుద్ధిహీనతతో చేసిన పాపాల వల్ల నా గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి.
PSA 38:6 నేను చాలా క్రుంగిపోయాను; దినమంతా దుఃఖంలోనే ఉన్నాను.
PSA 38:7 నా వీపు తీవ్రమైన బాధతో ఉంది నా శరీరం అనారోగ్యంతో క్షీణించింది,
PSA 38:8 నేను బలహీనంగా ఉన్నాను పూర్తిగా నలిగిపోయాను; నేను హృదయ వేదనతో మూలుగుతున్నాను.
PSA 38:9 ప్రభువా, నా కోరికలన్నీ మీ ముందు ఉన్నాయి; నా నిట్టూర్పు మీ నుండి ఉంది.
PSA 38:10 నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా బలం క్షీణిస్తూ ఉంది; నా కంటి చూపు తగ్గిపోతుంది.
PSA 38:11 నా గాయాల వల్ల నా స్నేహితులు నా సహచరులు నన్ను దూరం పెడుతున్నారు; నా పొరుగువారు నన్ను దూరంగా ఉంచుతున్నారు.
PSA 38:12 నన్ను చంపాలనుకున్నవారు ఉచ్చులు బిగుస్తున్నారు, నాకు హాని కలిగించేవారు నా పతనం గురించి మాట్లాడుతున్నారు; రోజంతా వారు కుట్రలు చేస్తున్నారు.
PSA 38:13 చెవిటివానిలా నేను వినక ఉన్నాను, మూగవానిలా మాట్లాడక ఉన్నాను;
PSA 38:14 నేను వినలేనివానిగా అయ్యాను, జవాబు చెప్పలేనివానిగా ఉన్నాను.
PSA 38:15 యెహోవా, నేను మీ కోసం ఎదురుచూస్తున్నాను; ప్రభువా నా దేవా, మీరు జవాబిస్తారు.
PSA 38:16 నేను, “నా కాలు జారితే వారు సంతోషించవద్దు వారు నాపై రెచ్చిపోవద్దు” అని ప్రార్థించాను.
PSA 38:17 నేను పడిపోయేలా ఉన్నాను, నా బాధ నిత్యం నాతోనే ఉంది.
PSA 38:18 నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను; నా పాపాన్ని గురించి బాధపడుతున్నాను.
PSA 38:19 కారణం లేకుండ అనేకులు నాకు శత్రువులయ్యారు; కారణం లేకుండ అనేకులు నన్ను ద్వేషిస్తున్నారు;
PSA 38:20 నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారు, నేను మంచిని మాత్రమే అనుసరిస్తున్నా సరే, వారు నన్ను వ్యతిరేకిస్తున్నారు.
PSA 38:21 యెహోవా, నన్ను విడువకండి; నా దేవా, నాకు దూరంగా ఉండకండి.
PSA 38:22 నా ప్రభువా నా రక్షకా, త్వరగా వచ్చి నాకు సాయం చేయండి.
PSA 39:1 సంగీత దర్శకుడైన యెదూతూనుకు. దావీదు కీర్తన. నేను, “నేను నా నాలుకతో పాపం చేయకుండా ఉండడానికి నా మార్గాలను సరిచూసుకుంటాను; దుష్టులు నా దగ్గర ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను” అని అన్నాను.
PSA 39:2 అందువల్ల నేను ఏమీ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండిపోయాను. కానీ నా వేదన అధికమయ్యింది;
PSA 39:3 నా గుండె నాలో వేడెక్కింది. నేను ధ్యానిస్తూ ఉండగా మంట రగులుకుంది; అప్పుడు నోరు తెరచిమాట్లాడాను:
PSA 39:4 “యెహోవా, నా జీవిత ముగింపు నా రోజుల సంఖ్యను నాకు చూపించండి; నా జీవితం ఎంత అనిశ్చయమైనదో నాకు తెలియజేయండి.
PSA 39:5 మీరు నా దినాలను కేవలం బెత్తెడంత చేశారు; నా జీవితకాలం మీ ఎదుట శూన్యము. భద్రత గలవారిగా అనిపించినా, మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా
PSA 39:6 “నిశ్చయంగా మనుష్యులు కేవలం నీడలా తిరుగుతున్నారు; వారి ధనం ఎవరికి దక్కుతుందో తెలియకుండానే వారు వ్యర్థంగా ధనం సమకూర్చుకుంటారు.
PSA 39:7 “కాని ప్రభువా, ఇప్పుడు నేను దేనికోసం చూస్తున్నాను? మీలోనే నా నిరీక్షణ.
PSA 39:8 నా అతిక్రమాలన్నిటి నుండి నన్ను విడిపించండి; మూర్ఖులు ఎగతాళి చేయడానికి నన్ను లక్ష్యంగా చేయకండి.
PSA 39:9 ఇదంతా చేసింది మీరే కాబట్టి నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను.
PSA 39:10 దయచేసి నన్ను కొట్టడం ఆపేయండి; మీ చేతి దెబ్బలకు నేను అలసిపోతున్నాను.
PSA 39:11 మీరు మనుష్యులను వారి పాపం విషయంలో మందలించినప్పుడు, చిమ్మెటలా మీరు వారి సంపదను హరించివేస్తారు. మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా
PSA 39:12 “యెహోవా, నా ప్రార్థన వినండి, నా మొర ఆలకించండి. నా ఏడ్పును చూసి కూడా పట్టనట్లుగా ఉండకండి. నా పూర్వికుల్లాగే నేను కూడా ఓ పరదేశిగా ఉన్నాను.
PSA 39:13 నేను గతించిపోకముందు మళ్ళీ ఆనందించేలా మీ చూపును నా నుండి త్రిప్పివేయండి.”
PSA 40:1 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. యెహోవా కోసం ఓర్పుతో ఎదురుచూశాను; ఆయన నా వైపు తిరిగి నా మొరను ఆలకించారు.
PSA 40:2 నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి లేపారు, బురద ఊబిలో నుండి లేపి నా పాదాలను బండ మీద నిలిపారు. నిలబడడానికి నాకు స్థిరమైన స్థలాన్ని ఇచ్చారు.
PSA 40:3 మన దేవునికి ఒక స్తుతి పాటను, ఆయన నా నోట ఒక క్రొత్త పాట ఉంచారు. అనేకులు ఆయన చేసింది చూసి ఆయనకు భయపడతారు. వారు యెహోవాలో నమ్మకం ఉంచుతారు.
PSA 40:4 గర్విష్ఠుల వైపు చూడక అబద్ధ దేవుళ్ళ వైపు తిరుగక, యెహోవాలో నమ్మకముంచినవారు ధన్యులు.
PSA 40:5 యెహోవా నా దేవా, మీరు మాకోసం ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ప్రణాళికలు వేశారు. మీతో పోల్చదగిన వారు లేరు; మీ క్రియల గురించి నేను చెప్పాలనుకుంటే అవి లెక్కకు మించినవి.
PSA 40:6 బలిని అర్పణను మీరు కోరలేదు, కాని మీరు నా చెవులు తెరిచారు, హోమాలు పాపపరిహార బలులు మీరు కోరలేదు.
PSA 40:7 అప్పుడు నేను ఇలా అన్నాను, “ఇదిగో నేను ఉన్నాను. గ్రంథపుచుట్టలో నా గురించి వ్రాసి ఉంది.
PSA 40:8 నా దేవా, మీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం; మీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది.”
PSA 40:9 యెహోవా! మీకు తెలిసినట్టుగా, నేను నా పెదవులు మూసుకోకుండ మహా సమాజంలో మీ నీతిని గురించిన సువార్త ప్రకటించాను.
PSA 40:10 మీ నీతిని నా హృదయంలో నేనేమి దాచుకోను; మీ విశ్వసనీయతను మీ రక్షణ సహాయాన్ని గురించి నేను మాట్లాడతాను. మీ మారని ప్రేమను, మీ నమ్మకత్వాన్ని గురించి మహా సమాజానికి చెప్పకుండ దాచిపెట్టను.
PSA 40:11 యెహోవా, మీ కరుణను నాకు దూరం చేయకండి; మీ మారని ప్రేమ మీ విశ్వాస్యత నిత్యం నన్ను కాపాడును గాక.
PSA 40:12 లెక్కలేనన్ని ఆపదలు నన్ను చుట్టి ఉన్నాయి; నా పాపాలు నన్ను పట్టుకున్నాయి, నేనేమి చూడలేని స్థితిలో ఉన్నాను. అవి నా తలవెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి, నా గుండె చెదిరిపోతుంది.
PSA 40:13 యెహోవా, సంతోషంగా నన్ను రక్షించడానికి, యెహోవా నాకు సాయం చేయడానికి త్వరగా రండి.
PSA 40:14 నా ప్రాణం తీయాలని కోరేవారందరు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.
PSA 40:15 నన్ను చూసి, “ఆహా! ఆహా!” అనేవారు వారికి కలిగే అవమానానికి ఆశ్చర్యానికి గురి కావాలి.
PSA 40:16 అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి.
PSA 40:17 కాని నా మట్టుకైతే, నేను దీనుడను, అవసరతలో ఉన్నవాడను; ప్రభువు నా గురించి ఆలోచించుదురు గాక. మీరే నా సహాయం, నా విమోచకుడు; మీరే నా దేవుడు, ఆలస్యం చేయకండి.
PSA 41:1 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. పేదవారిపై శ్రద్ధచూపువారు ధన్యులు; అలాంటి వారిని యెహోవా కష్ట దినాన విడిపిస్తారు.
PSA 41:2 యెహోవా వారిని కాపాడి సజీవంగా ఉంచుతారు, వారు దేశంలో ఆశీర్వదింపబడిన వారుగా పిలువబడతారు. ఆయన వారిని తమ శత్రువుల కోరికకు అప్పగించరు.
PSA 41:3 యెహోవా వారి రోగ పడక మీద వారికి స్వస్థత కలిగిస్తారు; వారి అనారోగ్యం నుండి మీరు వారికి స్వస్థత కలుగ చేస్తారు.
PSA 41:4 “యెహోవా, నన్ను కరుణించండి; నన్ను స్వస్థపరచండి, మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను.”
PSA 41:5 నా శత్రువులు, “వీడెప్పుడు చస్తాడు, వీని పేరు ఎప్పుడు చెరిగిపోతుంది?” అని నా గురించి చెప్పుకుంటున్నారు.
PSA 41:6 నన్ను చూడటానికి వచ్చి అబద్ధాలాడతారు, వారు తమ హృదయంలో దుష్టత్వం నింపుకొని వస్తారు; వారు బయటకు వెళ్లినప్పుడు దానిని చెప్తారు.
PSA 41:7 నా శత్రువులంతా ఏకమై నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతున్నారు; నాకు కీడును తలపెడుతున్నారు.
PSA 41:8 “దుష్టమైన వ్యాధి అతనికి కలిగింది; కాబట్టి వాడు పడక నుండి మళ్ళీ లేవడు” అంటున్నారు.
PSA 41:9 నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు, నా ఆహారం తిన్నవాడే, నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు.
PSA 41:10 యెహోవా, నన్ను కరుణించి; వారి మీద ప్రతీకారం తీర్చుకొనేలా నన్ను పైకి లేవనెత్తండి.
PSA 41:11 నా శత్రువు నాపై విజయం సాధించలేదు కాబట్టి, నేనంటే మీకు ఇష్టమని నేను తెలుసుకున్నాను.
PSA 41:12 నా నిజాయితీని బట్టి మీరు నన్ను నిలబెట్టారు, మీరు నన్ను నిత్యం మీ సన్నిధిలో స్థిరపరిచారు.
PSA 41:13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతింపబడును గాక!
PSA 42:1 సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. నీటి వాగుల కోసం దుప్పి ఆశపడునట్లు, నా దేవా, మీ కోసం నా ప్రాణం ఆశపడుతుంది.
PSA 42:2 నా ప్రాణం దేవుని కోసం సజీవుడైన దేవుని కోసం దప్పికతో ఉన్నది. నేనెప్పుడు ఆయన సన్నిధికి వెళ్లి ఆయనను కలుస్తాను?
PSA 42:3 “మీ దేవుడు ఎక్కడున్నాడు?” అని నా శత్రువులు నాతో అంటూ ఉంటే రాత్రింబగళ్ళు, నా కన్నీరే నాకు ఆహారం అవుతున్నాయి.
PSA 42:4 ఒకప్పుడు జనసమూహంతో కలిసి పెద్ద ఊరేగింపుగా, ఆనందోత్సాహాలతో స్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరానికి ఎలా వెళ్లేవాడినో జ్ఞాపకం చేసుకుని నా ప్రాణం నాలో క్రుంగిపోతుంది.
PSA 42:5 నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు, నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.
PSA 42:6 నా దేవా, ఈ బరువు మోయలేక నా మనస్సు క్రుంగిపోయింది; యొర్దాను ప్రాంతం నుండి హెర్మోను పర్వత శిఖరాల నుండి మిసారు గుట్టలపై నుండి నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.
PSA 42:7 మీ ప్రవాహాల గర్జనతో అగాధం అగాధాన్ని పిలుస్తుంది; మీ తరంగాలు అలలు నా మీదుగా పొర్లి పారుతున్నాయి.
PSA 42:8 పగటివేళ యెహోవా తన మారని ప్రేమ కుమ్మరిస్తారు, రాత్రివేళ ఆయన పాట నాకు తోడై ఉండి నా జీవదాతయైన దేవునికి ఒక ప్రార్థనగా ధ్వనిస్తుంది.
PSA 42:9 నా కొండ అయిన దేవునితో, “మీరు నన్నెందుకు మరచిపోయారు? శత్రువులు నన్ను అణగద్రొక్కుతుంటే శోకంతో నేనెందుకిలా వెళ్లాలి?” అని మొరపెట్టాను.
PSA 42:10 రోజుంతా అదే పనిగా నా విరోధులు, “మీ దేవుడెక్కడ?” అని అంటూ నన్ను గేలి చేస్తూ ఉంటే నా ఎముకలు మరణ బాధ అనుభవిస్తున్నాయి.
PSA 42:11 నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.
PSA 43:1 నా దేవా, నాకు న్యాయం తీర్చండి, భక్తిహీనులైన ప్రజలకు వ్యతిరేకంగా నా పక్షంగా వాదించి, మోసగాళ్ల నుండి దుష్టుల నుండి నన్ను విడిపించండి.
PSA 43:2 మీరే దేవుడు, నా బలమైన కోట. నన్నెందుకు ఇలా తిరస్కరించారు? శత్రువులచేత అణచివేయబడుతూ నేనెందుకు దుఃఖంతో గడపాలి?
PSA 43:3 మీ వెలుగును మీ సత్యాన్ని పంపండి; అవి నన్ను మీ పరిశుద్ధ పర్వతానికి మీ నివాసస్థలానికి నడిపిస్తాయి.
PSA 43:4 అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకు వెళ్తాను, నా ఆనందం సంతోషం కలిగించే దేవుని దగ్గరకు వెళ్తాను. దేవా! నా దేవా! వీణతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
PSA 43:5 నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.
PSA 44:1 సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. ఓ దేవా! మా పూర్వికుల రోజుల్లో పురాతన కాలంలో మీరు చేసినదంతా మా పితరులు మాకు చెప్పారు.
PSA 44:2 మీ స్వహస్తంతో దేశాలను వెళ్లగొట్టారు మా పూర్వికులను అక్కడ నిలబెట్టారు; ఆయా జాతుల ప్రజలను నాశనం చేసి మా పూర్వికులను వర్ధిల్లేలా చేశారు.
PSA 44:3 తమ ఖడ్గంతో ఈ దేశాన్ని వారు వశం చేసుకోలేదు, తమ భుజబలంతో విజయం సాధించలేదు; మీరు వారిని ప్రేమించారు కాబట్టి మీ కుడిచేయి మీ భుజబలం మీ ముఖకాంతియే వారికి విజయాన్ని ఇచ్చింది.
PSA 44:4 మీరే మా రాజు, మీరే మా దేవుడు, యాకోబు ప్రజలకు విజయం కలగాలని ఆజ్ఞాపిస్తారు.
PSA 44:5 మీ వలన విరోధులను పడగొట్టగలం; మా మీదికి ఎగబడే వారిని మీ పేరట అణచివేయగలము.
PSA 44:6 మా ధనస్సు మీద మాకు నమ్మకం లేదు, మా ఖడ్గం మాకు విజయం ఇవ్వదు.
PSA 44:7 మా విరోధులపై మాకు విజయమిచ్చేది మీరే, మీరే పగవారికి సిగ్గుపడేలా చేశారు.
PSA 44:8 దేవుని యందు మేము దినమంతా అతిశయిస్తాం మీ నామాన్ని నిత్యం స్తుతిస్తాము. సెలా
PSA 44:9 కాని ఇప్పుడైతే మీరు మమ్మల్ని త్రోసివేసి అవమానపరిచారు; మా సైన్యంతో మీరు రావడం లేదు.
PSA 44:10 శత్రువుల ముందు పారిపోవలసి వచ్చింది, పగవారు మమ్మల్ని దోచుకున్నారు.
PSA 44:11 గొర్రెలను ఆహారంగా ఇచ్చినట్లు మమ్మల్ని వారికిచ్చారు దేశాల మధ్యకు మమ్మల్ని చెదరగొట్టారు.
PSA 44:12 లాభం చూసుకోకుండా నీ ప్రజలను, తక్కువ వెలకు అమ్మేశారు.
PSA 44:13 పొరుగువారు మమ్మల్ని నిందించేలా చేశారు; మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని ఎగతాళి చేసేలా చేశారు.
PSA 44:14 మమ్మల్ని జనాల నోట సామెతలా చేశారు; జనాంగాలు తలలూపుతూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు.
PSA 44:15 నిందిస్తూ హేళన చేసేవారి కారణంగా పగ తీర్చుకోవాలనుకునే శత్రువుల కారణంగా శత్రువులు మా ఎదుటకు వస్తే, దినమంతా మాకు అవమానమే; సిగ్గు మా ముఖాన్ని కమ్మివేసింది.
PSA 44:17 ఇదంతా మా మీదికి వచ్చిపడినా, మేము మిమ్మల్ని మరవలేదు; మీ నిబంధన విషయం నమ్మకద్రోహులం కాలేదు.
PSA 44:18 మా హృదయం వెనుదీయలేదు; మా పాదాలు మీ మార్గం నుండి తొలగిపోలేదు.
PSA 44:19 నక్కలు తిరిగే చోట మీరు మమ్మల్ని నలగ్గొట్టి పడేశారు; చావు నీడ మమ్మల్ని ఆవరించి ఉన్నది.
PSA 44:20 ఒకవేళ మేము మా దేవుని పేరు మరచినా, పరదేశి దేవుని వైపు చేతులు చాపినా,
PSA 44:21 హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఆ విషయాన్ని తెలుసుకోకుండ ఉంటారా?
PSA 44:22 అయినా రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.
PSA 44:23 ప్రభువా, లెండి! ఎందుకీ నిద్ర? లెండి మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టకండి.
PSA 44:24 మీ ముఖాన్ని మా నుండి ఎందుకు దాచుకుంటున్నారు? నా బాధను నా హింసను మరచిపోయారా?
PSA 44:25 మేము క్రుంగి నేలకు ఒరిగిపోయాము; మా దేహాలు నేలకు అంటుకుపోయాయి.
PSA 44:26 లేచి మాకు సాయం చేయండి; మారని మీ ప్రేమతో మమ్మల్ని విడిపించండి.
PSA 45:1 సంగీత దర్శకునికి. షోషనీయులను రాగం మీద పాడదగినది. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. పెళ్ళి గీతము. నేను రాజు కోసం వ్రాసిన పద్యాలు వల్లించేటప్పుడు, నా హృదయం ఓ మంచి అంశంతో ఉప్పొంగింది; నా నాలుక నైపుణ్యం కలిగిన రచయిత కలము.
PSA 45:2 మీరు మనుష్యుల్లో అత్యంత అద్భుతమైనవారు మీ పెదవులపై దయ నిండి ఉంది, దేవుడు మిమ్మల్ని నిత్యం ఆశీర్వదిస్తారు.
PSA 45:3 బలాఢ్యుడా, మీ ఖడ్గాన్ని నడుముకు కట్టుకోండి; వైభవం ప్రభావాలను ధరించుకోండి.
PSA 45:4 సత్యం, వినయం, న్యాయం కోసం మీ వైభవంతో విజయవంతంగా ముందుకు సాగిపోండి. మీ కుడిచేయి భీకరమైన క్రియలు సాధించాలి.
PSA 45:5 పదునైన మీ బాణాలు శత్రురాజుల గుండెలను చీల్చుకునిపోతాయి. మీ పాదాల క్రింద జనాలు కూలి పడతారు.
PSA 45:6 ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; మీ న్యాయ దండమే మీ రాజ్య దండం.
PSA 45:7 మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషిస్తారు; కాబట్టి దేవుడు, మీ దేవుడు ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి, మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు.
PSA 45:8 మీరు ధరించిన వస్త్రాలన్ని గోపరసం, అగరు, లవంగపట్ట సుగంధంతో గుభాళిస్తున్నాయి. దంతం చేత అలంకరించబడిన భవనాలలో నుండి తంతి వాయిద్యాలు మోగుతూ ఉంటే మీకెంతో ఆనందము.
PSA 45:9 ఘనత వహించిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. ఓఫీరు దేశపు సువర్ణాభరణాలతో అలంకరించుకుని రాణి మీ కుడి ప్రక్కన నిలిచి ఉంది.
PSA 45:10 కుమారీ, విను, శ్రద్ధగా ఈ మాటలు విను: నీ సొంత ప్రజలను నీ పుట్టింటిని మరచిపో.
PSA 45:11 రాజు నీ అందానికి పరవశించును గాక; ఆయన నీ ప్రభువు, ఆయనను ఘనపరచు.
PSA 45:12 తూరు నగర కుమారి కానుకలతో మీ దగ్గరకు వస్తుంది, ధనికులు మీ దయ కోసం చూస్తారు.
PSA 45:13 అంతఃపురంలో రాజకుమారి వైభవంలో నిండుతనం ఉంది. ఆమె ధరించిన ఖరీదైన వస్త్రాలు బంగారంతో బుట్టా వేసినవి.
PSA 45:14 అందమైన కుట్టుపని చేసిన వస్త్రాలు ఆమె ధరించింది. ఆమెను రాజు దగ్గరకు తీసుకువస్తారు; ఆమె వెంట చెలికత్తెలు కన్యలు వస్తారు.
PSA 45:15 వారిని ఆనందోత్సాహాలతో తీసుకురాగా, వారు రాజభవనంలో ప్రవేశిస్తారు.
PSA 45:16 నీ కుమారులు నీ పూర్వికుల స్థానాన్ని తీసుకుంటారు; వారిని దేశమంతట అధికారులుగా నియమిస్తావు.
PSA 45:17 నీ నామం తరతరాలు జ్ఞాపకం ఉండేలా చేస్తాను; ఈ కారణంగా జనములు నిత్యం నీకు కృతజ్ఞతలు చెప్తారు.
PSA 46:1 సంగీత దర్శకునికి. అలామోతు రాగంలో కోరహు కుమారుల గీతము. దేవుడు మనకు ఆశ్రయం బలం, ఇబ్బందిలో ఎప్పుడు ఉండే సహాయం
PSA 46:2 కాబట్టి భూమి మార్పుచెందినా, నడిసముద్రంలో పర్వతాలు మునిగినా, మేము భయపడము.
PSA 46:3 జలాలు గర్జించినా నురుగు కట్టినా పర్వతాలు వాటి పెరుగుదలతో కదిలినా మేము భయపడము. సెలా
PSA 46:4 అది ఒక నది. దాని శాఖలు దేవుని పట్టణాన్ని సంతోషపెడతాయి, అది మహోన్నతుడు నివసించే పరిశుద్ధస్థలము.
PSA 46:5 అందులో దేవుడున్నారు, అది కూలదు; తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తారు.
PSA 46:6 దేశాలు గందరగోళంలో ఉన్నాయి, రాజ్యాలు కూలిపోతాయి; దేవుని స్వరం ఉరుముతుంది, భూమి కరుగుతుంది.
PSA 46:7 సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా
PSA 46:8 రండి యెహోవా చేసిన క్రియలను చూడండి, లోకంలో నాశనాన్ని ఆయన ఎలా తెస్తారో చూడండి.
PSA 46:9 ఆ కొన నుండి ఈ కొనదాకా భూమి మీద యుద్ధాలు జరగకుండా ఆయనే ఆపివేస్తారు. విల్లును విరుస్తారు, ఈటెను ముక్కలు చేస్తారు; రథాలను అగ్నితో కాల్చేస్తారు.
PSA 46:10 “ఊరకుండండి, నేనే దేవున్ని అని తెలుసుకోండి; దేశాల్లో నేను హెచ్చింపబడతాను, భూమి మీద నేను హెచ్చింపబడతాను.”
PSA 46:11 సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా
PSA 47:1 సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన. సర్వ దేశాల్లారా, చప్పట్లు కొట్టండి; దేవునికి ఆనందంతో కేకలు వేయండి.
PSA 47:2 మహోన్నతుడైన యెహోవా భయంకరుడు, భూమి అంతటికి ఆయన గొప్ప రాజు.
PSA 47:3 ఆయన దేశాలను మన వశం చేశారు, జనాలను మన పాదాల క్రింద ఉంచారు.
PSA 47:4 మన వారసత్వాన్ని మన కోసం ఏర్పాటు చేశారు. అది తాను ప్రేమించిన యాకోబు గర్వకారణము. సెలా
PSA 47:5 దేవుడు జయధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు, యెహోవా బూరధ్వనుల మధ్య ఆరోహణమయ్యారు.
PSA 47:6 దేవునికి స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి; మన రాజుకు స్తుతి గానాలు చేయండి, స్తుతులు పాడండి.
PSA 47:7 దేవుడు భూమి అంతటికి రాజు; ఆయనకు స్తుతికీర్తన పాడండి.
PSA 47:8 దేవుడు దేశాలను పరిపాలిస్తున్నారు; దేవుడు తన పవిత్ర సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు.
PSA 47:9 దేశాల అధిపతులు సమకూడతారు అబ్రాహాము దేవుని ప్రజలుగా సమకూడతారు భూమి మీద డాళ్లు దేవునికి చెందినవి; ఆయన గొప్పగా హెచ్చింపబడ్డారు.
PSA 48:1 ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన. మన దేవుని పట్టణంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద యెహోవా గొప్పవాడు, అధిక స్తోత్రార్హుడు.
PSA 48:2 మహారాజు పట్టణమైన సీయోను పర్వతం సాఫోన్ ఎత్తైన స్థలంలా అందంగా కనిపిస్తూ సర్వలోకానికి ఆనందం కలిగిస్తుంది.
PSA 48:3 దేవుడు ఆమె కోటలలో ఉన్నారు; ఆయనే దానికి కోట అని చూపించారు.
PSA 48:4 రాజులు దళాలతో కలిసి, వారు ముందుకు వచ్చినప్పుడు,
PSA 48:5 వారు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు; వారు భయంతో పారిపోయారు.
PSA 48:6 వారిలో వణుకు పుట్టింది, ప్రసవ వేదనలాంటి బాధ వారికి కలిగింది.
PSA 48:7 తూర్పు గాలితో బద్దలైన తర్షీషు ఓడల్లా మీరు వారిని నాశనం చేశారు.
PSA 48:8 మనం విన్నదే, మనం చూశాం; సైన్యాల యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో, దేవుడు దాన్ని నిత్యం సుస్థిరంగా ఉండేలా చేస్తారు. సెలా
PSA 48:9 దేవా! మీ మందిరం మధ్యలో మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము.
PSA 48:10 ఓ దేవా, మీ పేరులా, మీ స్తుతి భూదిగంతాలకు చేరుతుంది; మీ కుడిచేయి నీతితో నిండి ఉంది.
PSA 48:11 మీ తీర్పులను బట్టి సీయోను పర్వతం ఆనందిస్తుంది యూదా పట్టణాలు సంతోషంగా ఉన్నాయి.
PSA 48:12 సీయోను వైపు వెళ్లండి, దాని చుట్టూ నడవండి, దాని బురుజులెన్నో లెక్కించండి.
PSA 48:13 ఆమె గురించి రాబోయే తరం వారికి మీరు చెప్పగలిగేలా, దాని కోటగోడలను పరిశీలించండి, దాని కోటలను చూడండి.
PSA 48:14 ఈ దేవుడు ఎప్పటికీ మన దేవుడు; ఆయన చివరి వరకు నడిపిస్తారు.
PSA 49:1 సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన. సర్వజనులారా, ఈ విషయం వినండి; సర్వ లోకవాసులారా, ఆలకించండి,
PSA 49:2 సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి:
PSA 49:3 నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది; నా హృదయ ధ్యానం మీకు అవగాహన ఇస్తుంది.
PSA 49:4 నేను నా చెవిని సామెత వైపు త్రిప్పుతాను వీణతో నేను నా పొడుపు కథను విప్పుతాను:
PSA 49:5 దుర్దినాలు వచ్చినప్పుడు, నా శత్రువుల పాపం నన్ను చుట్టుముట్టినప్పుడు నేనెందుకు భయపడాలి?
PSA 49:6 వారు తమ సంపదను నమ్మి, తమ ఐశ్వర్యాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటారు.
PSA 49:7 ఎవరు మరొకరి ప్రాణాన్ని విడిపించలేరు వారి కోసం దేవునికి క్రయధనం చెల్లించలేరు.
PSA 49:8 వారు కుళ్లు చూడక, నిత్యం బ్రతకాలంటే వారి ప్రాణ విమోచన వెల చాలా ఎక్కువ అది ఎన్నటికి చెల్లించబడలేదు.
PSA 49:10 తమ సంపదను ఇతరులకు వదిలేసి జ్ఞానులు చనిపోవడం, మూర్ఖులు తెలివిలేనివారు నశించడం అందరు చూస్తారు.
PSA 49:11 వారు తమ భూములకు తమ పేర్లే పెట్టుకున్నప్పటికి సమాధే వారి నిత్య నివాసము అక్కడే వారు నిత్యం నివసిస్తారు.
PSA 49:12 మనుష్యులు ఎంత సంపద ఉన్నా నశించకుండ ఉండలేరు; నశించే జంతువుల్లా వారు ఉన్నారు.
PSA 49:13 తమను తాము నమ్ముకొనే బుద్ధిహీనులకు, వారు చెప్పేది వింటూ వారిని అనుసరించేవారికి ఇదే గతి. సెలా
PSA 49:14 వారు గొర్రెల్లా ఉండి మరణానికి నడిపించబడతారు; మరణమే వారికి కాపరి. యథార్థవంతులు ఉదయం వారిని పరిపాలిస్తారు. వారి రాజభవనాలకు దూరంగా, సమాధిలో వారి మృతదేహాలు కుళ్ళిపోతాయి.
PSA 49:15 కానీ దేవుడు పాతాళం నుండి నన్ను విడిపిస్తారు; ఆయన తప్పకుండ నన్ను తన దగ్గరకు తీసుకెళ్తారు. సెలా
PSA 49:16 కాబట్టి ఇతరులు ధనవంతులుగా ఎదిగినప్పుడు, వారి ఇండ్ల వైభవం అధికమైనప్పుడు భయపడవద్దు.
PSA 49:17 ఎందుకంటే వారు చనిపోయినప్పుడు వారు తమతో ఏమీ తీసుకెళ్లరు, వారి వైభవం వారి వెంట దిగిపోదు.
PSA 49:18 వారు బ్రతికి ఉన్నప్పుడు ఆశీర్వదింపబడిన వారిగా తమను తాము పిలుచుకున్నా, వారు అభివృద్ధి చెందినప్పుడు ప్రజలు వారిని పొగిడినా,
PSA 49:19 వారు తమకంటే ముందుగా వెళ్లిపోయినవారిని చేరుకుంటారు, వారు మరి ఎన్నడూ జీవపు వెలుగును చూడరు.
PSA 49:20 సంపద ఉండి వివేకంలేని మనుష్యులు నశించే జంతువుల్లాంటి వారు.
PSA 50:1 ఆసాపు కీర్తన. దేవుడైన యెహోవా, బలాఢ్యుడు, భూమితో మాట్లాడతారు, సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు వారందరిని పిలుస్తారు.
PSA 50:2 సౌందర్యంలో పరిపూర్ణమైన, సీయోను నుండి, దేవుడు ప్రకాశిస్తారు.
PSA 50:3 మన దేవుడు వస్తారు మౌనంగా ఉండరు; ఆయన ముందు మ్రింగివేసే అగ్ని ఉంది ఆయన చుట్టూ బలమైన తుఫాను చెలరేగుతుంది.
PSA 50:4 తన ప్రజలకు తీర్పు ఇవ్వడానికి పైన ఉన్న ఆకాశాలను, క్రింద భూమిని పిలుస్తారు.
PSA 50:5 “బలి అర్పణల వల్ల నాతో నిబంధన చేసుకున్న భక్తులను నా ఎదుట సమావేశపరచండి.”
PSA 50:6 ఆకాశాలు దేవుని నీతిని ప్రకటిస్తాయి, ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు. సెలా
PSA 50:7 “నా ప్రజలారా! వినండి. నేను మాట్లాడతాను; ఇశ్రాయేలు, మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాను: నేను దేవుడను, మీ దేవుడను.
PSA 50:8 మీ బలుల గురించి లేదా ఎప్పుడు నా ఎదుటే ఉండే మీ దహనబలుల గురించి, నేను మీకు వ్యతిరేకంగా ఎటువంటి ఆరోపణలు చేయను.
PSA 50:9 మీ శాలలోనుండి మీరు తెచ్చే ఎద్దులు నాకవసరం లేదు. మీ దొడ్డిలోని మేకపోతులు నాకవసరం లేదు.
PSA 50:10 అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే వేయి కొండలపై ఉన్న పశువులు నావే.
PSA 50:11 పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు, పొలాల్లో ఉన్న జంతువులు నావే.
PSA 50:12 నాకు ఆకలిగా ఉంటే నేను మీకు చెప్పను, లోకం నాది, అందులో ఉన్నవన్నీ నావి.
PSA 50:13 ఎడ్ల మాంసం నేను తింటానా? మేకపోతుల రక్తం త్రాగుతానా?
PSA 50:14 “దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించాలి మహోన్నతునికి మీ మ్రొక్కుబడులు చెల్లించండి.
PSA 50:15 ఆపద్దినాన నన్ను పిలువండి; నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను ఘనపరుస్తారు.”
PSA 50:16 దుష్టులతో దేవుడు ఇలా అంటున్నారు: “నా న్యాయవిధులు ఉచ్చరించే నా నిబంధనను మీ పెదాల మీదికి తీసుకునే హక్కు మీకెక్కడిది?
PSA 50:17 నా సూచనను మీరు అసహ్యించుకుంటారు, నా మాటల్ని మీ వెనుకకు పారవేస్తారు.
PSA 50:18 మీరు ఒక దొంగను చూస్తే, వాడితో కలిసిపోతారు; మీ భాగాన్ని వ్యభిచారులతో పంచుకొంటారు.
PSA 50:19 మీ నోటిని చెడుకు వాడుతారు మీ నాలుకను మోసానికి ఉపయోగిస్తారు.
PSA 50:20 మీరు కూర్చుని మీ సోదరునికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు, మీ సొంత తల్లి కుమారుని మీద అభాండాలు వేస్తారు.
PSA 50:21 మీరు ఇవి చేసినప్పుడు నేను మౌనంగా ఉన్నాను, నేను మీలాంటి వాణ్ణే అని మీరనుకున్నారు. కాని నేనిప్పుడు మిమ్మల్ని నిలదీస్తున్నాను, నా ఆరోపణలను మీ ముందు పెడుతున్నాను.
PSA 50:22 “దేవున్ని మరచే మీరు, కొంచెం ఆలోచించండి, లేకపోతే మిమ్మల్ని ఎవరు విడిపించలేనంతగా చీల్చి ముక్కలు చేస్తాను:
PSA 50:23 కృతజ్ఞతార్పణలు అర్పించేవారు నన్ను ఘనపరుస్తారు, నిందారహితులకు దేవుని రక్షణ చూపిస్తాను.”
PSA 51:1 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. దావీదు బత్షెబతో వ్యభిచరించిన తర్వాత నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చిన సందర్భంలో వ్రాశాడు. ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి నన్ను కరుణించండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి, నా పాపాలను తుడిచివేయండి.
PSA 51:2 నా దోషాలన్నింటిని కడిగి, నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి.
PSA 51:3 నా అతిక్రమాలు నాకు తెలుసు నా పాపం ఎల్లప్పుడు నా కళ్లెదుటే ఉంది.
PSA 51:4 కేవలం మీకు, మీకే విరోధంగా నేను పాపం చేశాను, మీ దృష్టికి చెడు చేశాను; మీ తీర్పులో మీరు సరిగ్గా ఉంటారు మీరు తీర్పు తీర్చునప్పుడు న్యాయసమ్మతంగా ఉంటుంది.
PSA 51:5 నేను పాపిగా పుట్టాను, నా తల్లి నన్ను గర్భం దాల్చినప్పుడు నేను పాపిని.
PSA 51:6 మీరు అంతరంగంలో నిజాయితీ కోరతారు; ఆ రహస్య ప్రదేశంలో మీరు నాకు జ్ఞానం బోధించారు.
PSA 51:7 హిస్సోపుతో నన్ను శుద్ధీకరించండి, నేను శుద్ధునిగా ఉంటాను; నన్ను కడగండి, నేను హిమము కంటే తెల్లగా ఉంటాను.
PSA 51:8 నన్ను ఆనందాన్ని సంతోషాన్ని విననివ్వండి; మీరు విరిచిన ఎముకలను సంతోషించనివ్వండి.
PSA 51:9 నా పాపముల నుండి మీ ముఖాన్ని దాచండి నా దోషమంతటిని తుడిచివేయండి.
PSA 51:10 ఓ దేవా, నాలో శుద్ధహృదయాన్ని సృష్టించండి, నాలో స్థిరమైన ఆత్మను నూతనంగా పుట్టించండి.
PSA 51:11 మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి, మీ పరిశుద్ధాత్మను నా నుండి తొలగించకండి.
PSA 51:12 మీ రక్షణానందం నాకు తిరిగి చేకూర్చండి, నన్ను సంరక్షించడానికి నాకు సమ్మతిగల ఆత్మను ఇవ్వండి.
PSA 51:13 అప్పుడు అతిక్రమం చేసేవారికి మీ మార్గాలను బోధిస్తాను, తద్వార పాపులు మీ దగ్గరకు తిరిగి వస్తారు.
PSA 51:14 మీరు దేవుడు, నా రక్షకుడు, ఓ దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపించండి, నా నాలుక మీ నీతిని గురించి పాడుతుంది.
PSA 51:15 ప్రభువా, నా పెదవులను తెరవండి, నా నోరు మీ స్తుతిని ప్రకటిస్తుంది.
PSA 51:16 మీరు బలులను బట్టి ఆనందించరు, లేకపోతే నేను తెచ్చేవాన్ని; మీరు దహనబలులను ఇష్టపడరు.
PSA 51:17 విరిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి; పశ్చాత్తాపంతో విరిగిన హృదయాన్ని దేవా, మీరు నిరాకరించరు.
PSA 51:18 మీ దయతో సీయోనుకు మంచి చేయండి; యెరూషలేము గోడలు కట్టించండి.
PSA 51:19 అప్పుడు మీరు నీతిమంతుల బలులలో, దహన బలులలో, సర్వాంగ హోమములలో ఆనందిస్తారు; అప్పుడు మీ బలిపీఠం మీద ఎద్దులు అర్పించబడతాయి.
PSA 52:1 సంగీత దర్శకునికి. దావీదు ధ్యానకీర్తన. ఎదోమీయుడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి–దావీదు అహీమెలెకు ఇంటికి వెళ్లాడని అతనితో చెప్పినప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడు. బలాఢ్యుడా, చేసిన కీడు గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు? దేవుని దృష్టిలో అవమానకరమైన నీవు, రోజంతా ఎందుకు ప్రగల్భాలు పలుకుతావు?
PSA 52:2 మోసం చేసేవాడా, నీ నాలుక పదునైన క్షౌరం చేసే కత్తి; అది నాశనాన్ని చేస్తుంది.
PSA 52:3 మేలు కంటే కీడు చేయడం, నీతి కంటే అబద్ధం చెప్పడమే నీకు ఇష్టం. సెలా
PSA 52:4 మోసపూరితమైన నాలుక గలవాడా, నీకు హానికరమైన మాటలే ఇష్టం.
PSA 52:5 ఖచ్చితంగా దేవుడు నిన్ను నిత్యనాశనానికి గురి చేస్తారు: ఆయన నిన్ను మీ గుడారంలో నుండి పెరికివేస్తారు; సజీవుల దేశంలో నుండి నిన్ను పెరికివేస్తారు. సెలా
PSA 52:6 నీతిమంతులు ఇదంతా చూసి భయభక్తులతో వారు నవ్వుతూ ఇలా అంటారు,
PSA 52:7 “ఇతన్ని చూడండి, దేవున్ని తన బలమైన కోటగా చేసుకోకుండ తనకున్న సంపదలను నమ్ముకుని ఇతరులను నాశనం చేస్తూ బలపడ్డాడు!”
PSA 52:8 కానీ నేను దేవుని నివాసంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నాను; నేను ఎల్లప్పుడు, మారని దేవుని ప్రేమను నమ్ముతాను.
PSA 52:9 మీరు చేసిందానికి నేను ఎల్లప్పుడు మీ భక్తుల ఎదుట మిమ్మల్ని స్తుతిస్తాను. మీ నామం ఉత్తమమైనది, కాబట్టి నేను మీ నామంలో నిరీక్షణ కలిగి ఉన్నాను.
PSA 53:1 సంగీత దర్శకునికి. మహలతు అనే రాగం మీద పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. వారు అవినీతిపరులు, వారి మార్గాలు నీచమైనవి; మంచి చేసేవారు ఒక్కరు లేరు.
PSA 53:2 అర్థం చేసుకునేవారు, దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు పరలోకం నుండి మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు
PSA 53:3 ప్రతిఒక్కరు దారి తప్పి చెడిపోయారు; మంచి చేసేవారు ఎవరూ లేరు ఒక్కరు కూడా లేరు.
PSA 53:4 కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; వారు ఎన్నడు దేవునికి మొరపెట్టరు.
PSA 53:5 అయితే భయపడడానికి ఏమిలేని దగ్గర, వారు, భయంతో మునిగిపోయి ఉన్నారు. మీమీద దాడి చేసిన వారి ఎముకలను దేవుడు చెదరగొట్టారు; దేవుడు వారిని తృణీకరించారు, కాబట్టి మీరు వారిని సిగ్గుపడేలా చేశారు.
PSA 53:6 సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది! దేవుడు తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు, యాకోబు సంతోషించును గాక! ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!
PSA 54:1 సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. జీఫీయులు వచ్చి–దావీదు మాలో దాగి ఉండడం లేదా? అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించినది. ఓ దేవా, మీ నామమును బట్టి నన్ను రక్షించండి; మీ బలాన్నిబట్టి శిక్షా విముక్తిని చేయండి.
PSA 54:2 ఓ దేవా! నా ప్రార్థన వినండి; నా నోటి మాటలను ఆలకించండి.
PSA 54:3 అపరిచితులు నాపై దాడి చేస్తున్నారు; దయలేని మనుష్యులు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు వారు దేవుడంటే గౌరవం లేని మనుష్యులు. సెలా
PSA 54:4 ఖచ్చితంగా దేవుడే నాకు సహాయం; ప్రభువే నన్ను సంరక్షించేవారు.
PSA 54:5 నన్ను దూషించే వారు భయంతో వెనుకకు మరలి వెళ్లిపోవాలి; మీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నిర్మూలం చేయండి.
PSA 54:6 యెహోవా, నేను మీకు స్వేచ్ఛార్పణలు అర్పిస్తాను; మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే అది మంచిది.
PSA 54:7 మీరు ఇబ్బందులన్నిటి నుండి నన్ను విడిపించారు, నా కళ్లు నా శత్రువుల మీదికి విజయోత్సాహంతో చూశాయి.
PSA 55:1 సంగీత దర్శకునికి.తంతివాద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. ఓ దేవా! నా ప్రార్థన ఆలకించండి, నా విజ్ఞప్తిని విస్మరించకండి;
PSA 55:2 నా మనవి విని నాకు జవాబివ్వండి. నా ఆలోచనలతో నాకు నెమ్మది లేదు.
PSA 55:3 నా శత్రువు నాతో అంటున్న దాన్ని బట్టి, దుష్టుల బెదిరింపులను బట్టి నాకు నెమ్మది లేదు; వారు నన్ను శ్రమ పెడుతున్నారు వారు వారి కోపంలో నా మీద దాడి చేస్తున్నారు.
PSA 55:4 నా హృదయం నాలో వేదన పడుతుంది; మరణభయం నన్ను చుట్టుకుంది.
PSA 55:5 భయం వణుకు నన్ను చుట్టుముట్టాయి; భీతి నన్ను ముంచేస్తుంది.
PSA 55:6 “ఆహా, పావురంలా నాకూ రెక్కలుంటే! ఎగిరిపోయి హాయిగా ఉండేవాన్ని కదా!
PSA 55:7 నేను దూరంగా ఎగిరిపోయి ఎడారిలో ఉండేవాన్ని. సెలా
PSA 55:8 గాలివానకు తుఫానుకు దూరంగా, నా ఆశ్రయ స్థలానికి తప్పించుకుని త్వరగా వెళ్తాను.”
PSA 55:9 నాకు పట్టణంలో హింస, గొడవలు కనబడుతున్నాయి, ప్రభువా, దుష్టులను గందరగోళానికి గురి చేయండి, వారి మాటలను తారుమారు చేయండి.
PSA 55:10 రాత్రింబగళ్ళు పట్టణ గోడల మీద శత్రువులు తిరుగుతున్నారు; అయితే అక్కడ దుష్టత్వం విధ్వంసం ఉన్నాయి.
PSA 55:11 పట్టణంలో విధ్వంసక శక్తులు పని చేస్తున్నాయి; బెదిరింపులు మోసాలు దాని వీధుల్లో నిత్యం ఉంటాయి.
PSA 55:12 ఒకవేళ ఒక శత్రువు నన్ను అవమానిస్తుంటే, నేను దానిని భరించగలను; నాకు వ్యతిరేకంగా శత్రువు లేస్తున్నట్లయితే, నేను దాక్కోగలను.
PSA 55:13 కాని ఆ పని చేసిన నీవు నాలాంటి మనిషివి, నా సహచరుడవు, నా ప్రియ స్నేహితుడవు
PSA 55:14 ఒకప్పుడు దేవుని మందిరానికి ఆరాధికులతో పాటు ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు మనం మధురమైన సహవాసం కలిగి ఉన్నాము.
PSA 55:15 చెడుతనం నా శత్రువుల నివాసాల్లో వారి హృదయాల్లో ఉంది; కాబట్టి మరణం ఆకస్మికంగా వారి మీదికి వచ్చును గాక, ప్రాణంతోనే వారు క్రింద పాతాళానికి దిగిపోవుదురు గాక.
PSA 55:16 నేను మాత్రం, దేవునికి మొరపెడతాను, యెహోవా నన్ను రక్షిస్తారు.
PSA 55:17 సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను బాధలో మొరపెడతాను, ఆయన నా స్వరం వింటారు.
PSA 55:18 అనేకులు నన్ను వ్యతిరేకించినప్పటికి, నాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం నుండి నా ప్రాణాన్ని సమాధానంలో విమోచిస్తారు.
PSA 55:19 పూర్వం నుండి సింహాసనాసీనుడైయున్న మారని దేవుడు, అది విని వారిని అణచివేస్తారు, సెలా వారు మారడానికి ఒప్పుకోరు ఎందుకంటే వారికి దేవుని భయం లేదు.
PSA 55:20 నా సహచరుడు తన స్నేహితుల మీద దాడి చేసి; వారితో తాను చేసిన నిబంధనకు తానే భంగం కలిగిస్తాడు.
PSA 55:21 అతని మాటలు వెన్నలా మృదువుగా ఉంటాయి, కాని అతని హృదయంలో యుద్ధం ఉంటుంది; అతని మాటలు నూనె కన్న నున్నగా ఉంటాయి కానీ అవి దూసిన ఖడ్గాల్లాంటివి.
PSA 55:22 మీ భారాన్ని యెహోవాపై మోపండి ఆయన మిమ్మల్ని సంరక్షిస్తారు; నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనివ్వరు.
PSA 55:23 కాని దేవా, మీరు దుష్టులను నాశనకూపంలో పడవేస్తారు; రక్తపిపాసులు మోసగాళ్లు వారి ఆయుష్షులో సగం కూడ జీవించరు. కానీ నేనైతే మిమ్మల్ని నమ్ముకున్నాను.
PSA 56:1 సంగీత దర్శకునికి. “దూరపు సింధూర వృక్షాల మీద ఉన్న ఒక పావురం” అనే రాగం మీద పాడదగినది. శ్రేష్ఠమైన దావీదు కీర్తన. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. నా దేవా! నాపై దయ చూపండి, ఎందుకంటే నా శత్రువులు వేగంగా వెంటాడుతున్నారు; రోజంతా వారు తమ దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు.
PSA 56:2 నా విరోధులు రోజంతా నన్ను వెంటాడుతున్నారు; వారి అహంకారంలో అనేకులు నా మీద దాడి చేస్తున్నారు.
PSA 56:3 నాకు భయం వేసినప్పుడు, నేను మీయందు నమ్మకం ఉంచుతాను.
PSA 56:4 దేవునిలో ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను దేవునిలో నేను నమ్ముతాను భయపడను. మానవమాత్రులు నన్నేమి చేయగలరు?
PSA 56:5 రోజంతా వారు నా మాటలను వక్రీకరిస్తారు; వారి పథకాలన్నీ నా పతనం కొరకే.
PSA 56:6 నా ప్రాణం తీయాలనే ఆశతో వారు కుట్ర చేస్తారు, పొంచి ఉంటారు, నా కదలికలు గమనిస్తారు.
PSA 56:7 వారి దుష్టత్వాన్ని బట్టి వారు తప్పించుకోనివ్వకండి; దేవా, మీ కోపంలో వారి దేశాలను కూలద్రోయండి.
PSA 56:8 నా బాధలను లెక్కించండి; నా కన్నీటిని మీ తిత్తిలో నింపండి అవి మీ గ్రంథంలో వ్రాయబడలేదా?
PSA 56:9 నేను మీకు మొరపెట్టినప్పుడు నా శత్రువులు వెనుకకు తగ్గుతారు. దాన్ని బట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నేను తెలుసుకుంటాను.
PSA 56:10 దేవునిలో, ఆయన వాగ్దానాన్ని స్తుతిస్తాను, అవును, యెహోవాయందు, ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను.
PSA 56:11 నేను దేవునిలో నమ్ముకున్నాను నేను భయపడను. మనుష్యులు నన్నేమి చేయగలరు?
PSA 56:12 నా దేవా, నేను మీకు మ్రొక్కుబడులను చెల్లించాల్సి ఉంది; నా కృతజ్ఞత అర్పణలను మీకు చెల్లిస్తాను.
PSA 56:13 ఎందుకంటే మీరు మరణం నుండి నన్ను విడిపించారు తొట్రిల్లకుండ నా పాదాలను దేవుని ఎదుట నేను జీవపువెలుగులో నడవడానికి శక్తినిచ్చారు.
PSA 57:1 సంగీత దర్శకునికి. “నాశనం చేయకు” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. గుహలో దావీదు సౌలు నుండి పారిపోయినప్పుడు, అతడు రచించినది. నా దేవా, నన్ను కరుణించండి, నన్ను కరుణించండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశ్రయించాను. విపత్తు గడిచేవరకు నేను మీ రెక్కల నీడలో ఆశ్రయం పొందుతాను.
PSA 57:2 నా కార్యం సఫలపరచే, మహోన్నతుడైన దేవునికి మొరపెట్టుకుంటాను.
PSA 57:3 పరలోకం నుండి సాయం పంపి నన్ను విడిపిస్తారు, నన్ను దిగమ్రింగాలని చూస్తూ నా మీద చాడీలు పలికే వారి బారి నుండి నన్ను తప్పిస్తారు. సెలా దేవుడు తన మారని ప్రేమను, నమ్మకత్వాన్ని పంపుతారు.
PSA 57:4 నేను సింహాల మధ్య ఉన్నాను; నేను క్రూరమైన జంతువుల మధ్య నివసిస్తున్నాను వారు ఈటెలు బాణాల వంటి పళ్ళు కలిగిన మనుష్యులు, వారి నాలుకలు పదునైన కత్తుల వంటివి.
PSA 57:5 దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి. భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.
PSA 57:6 నా పాదాల చుట్టూ వలలు వేశారు, నేను బాధతో క్రుంగి ఉన్నాను నా దారిలో వారు గుంట త్రవ్వారు కాని అందులో వారే పడ్డారు. సెలా
PSA 57:7 ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది, నా హృదయం స్థిరంగా ఉంది; నేను పాడతాను సంగీతం వాయిస్తాను,
PSA 57:8 నా ప్రాణమా, మేలుకో! సితారా వీణా, మేలుకోండి! ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను.
PSA 57:9 ప్రభువా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను జనాంగాల మధ్య మీ గురించి నేను పాడతాను.
PSA 57:10 ఎందుకంటే మీ మారని ప్రేమ, ఆకాశాలను అంటుతుంది; మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది.
PSA 57:11 దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి. భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.
PSA 58:1 సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. పాలకులారా, నిజంగా మీరు న్యాయంగా మాట్లాడతారా? మీరు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తారా?
PSA 58:2 లేదు, మీ హృదయంలో అన్యాయం చేస్తున్నారు, దేశంలో హింసను పెంచుతున్నారు.
PSA 58:3 ఈ దుష్టులు పుట్టుకతోనే దారి తప్పినవారు; గర్భం నుండే వారు అబద్ధాలాడుతారు.
PSA 58:4 వారి విషం భయంకరమైన పాముల విషం లాంటిది చెవులు మూసుకున్న నాగుపాములా వారున్నారు
PSA 58:5 పాములు ఆడించేవారు ఎంత నైపుణ్యంగా వాయించినా ఆ సంగీతాన్ని వినని పాముల్లా వారున్నారు.
PSA 58:6 దేవా! వారి నోటి పళ్ళు విరగ్గొట్టండి; యెహోవా! ఈ కొదమ సింహాల కోరలను ఊడదీయండి.
PSA 58:7 ప్రవహించే నీటిలా వారు మాయమవుదురు గాక; వారు విల్లు ఎక్కుపెట్టినప్పుడు వారి బాణాలు గురిని చేరకుండును గాక.
PSA 58:8 వారు నడుస్తూ కరిగి నశించిపోయే నత్తల్లా వారుంటారు. గర్భస్రావమై వెలుగు చూడని పిండంలా వారవుతారు.
PSA 58:9 మీ కుండలకు ముండ్లకంపల సెగ తగలకముందే, పచ్చివైనా ఎండినవైనా అంటే చిన్నా పెద్దా తేడా లేకుండ దుష్టులు తుడిచివేయబడతారు.
PSA 58:10 ప్రతీకారం జరిగినప్పుడు నీతిమంతులు సంతోషిస్తారు, దుష్టుల రక్తంలో వారు కాళ్లు కడుక్కుంటారు.
PSA 58:11 తర్వాత ప్రజలు అది చూసి, “నీతిమంతులకు తప్పక బహుమానం ఉంటుంది; ఖచ్చితంగా ఈ లోకంలో తీర్పు తీర్చే దేవుడు ఉన్నారు” అంటారు.
PSA 59:1 సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగం మీద పాడదగినది. ఒక మిక్తము. దావీదును చంపడానికి సౌలు పంపినవారు అతని ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు వ్రాసినది. దేవా! నా శత్రువుల నుండి నన్ను విడిపించండి; నా మీద దాడి చేసేవారికి వ్యతిరేకంగా నా కోటగా ఉండండి.
PSA 59:2 కీడుచేసేవారి నుండి నన్ను విడిపించండి, హంతకుల నుండి నన్ను రక్షించండి.
PSA 59:3 నా కోసం వారు ఎలా పొంచి ఉన్నారో చూడండి! యెహోవా, చేయని నేరం గాని పాపం గాని లేకుండానే భయంకరమైన పురుషులు నాపై కుట్ర చేస్తున్నారు.
PSA 59:4 నేను ఏ తప్పు చేయలేదు, అయినా నా మీద దాడి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నాకు సహాయం చేయడానికి లేవండి; నా దుస్థితిని చూడండి!
PSA 59:5 సైన్యాల యెహోవా దేవా, ఇశ్రాయేలు దేవా! సర్వ దేశాలను శిక్షించడానికి లేవండి; దుష్టులైన దేశద్రోహులకు దయ చూపకండి. సెలా
PSA 59:6 వారు సాయంకాలం మళ్ళీ వస్తారు, కుక్కల్లా మొరుగుతూ, వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు.
PSA 59:7 వారు వారి నోటి నుండి ఏమి చిమ్ముతారో చూడండి; వారి పెదవుల నుండి వచ్చే మాటలు పదునైన ఖడ్గాల్లాంటివి, “మా మాటలు ఎవరు వింటారు?” అని వారనుకుంటారు.
PSA 59:8 కాని యెహోవా! మీరు వారిని చూసి నవ్వుతారు; ఆ దేశాలన్నిటిని చూసి, పరిహసిస్తారు.
PSA 59:9 మీరే నా బలం, మీ కోసమే నేను వేచి ఉంటాను; దేవా, మీరు, నాకు ఎత్తైన కోట,
PSA 59:10 తన మారని ప్రేమను బట్టి, నా దేవుడు నాతో ఉంటారు. ఆయన నాకు ముందుగా వెళ్తారు నన్ను అపవాదు చేసిన వారిపై నేను సంతోషించేలా చేస్తారు.
PSA 59:11 కాని వారిని చంపకండి, ప్రభువా మా డాలు, వారు చస్తే నా ప్రజలు మరచిపోతారు. మీ బలముతో వారిని వేర్లతో పెకిలించి వారిని అణచివేయండి.
PSA 59:12 వారి నోళ్ళ పాపాల కోసం, వారి పెదవుల మాటల కోసం, వారి గర్వంలో వారు పట్టబడుదురు గాక. వారు పలికే శాపాలు అబద్ధాలను బట్టి,
PSA 59:13 మీ ఉగ్రతలో వారిని దహించివేయండి, వారు ఇక లేకుండునంతగా వారిని దహించివేయండి. అప్పుడు దేవుడు యాకోబును పరిపాలిస్తున్నారని భూదిగంతాల వరకు తెలియపరచబడుతుంది. సెలా
PSA 59:14 వారు సాయంకాలం మళ్ళీ వస్తారు, కుక్కల్లా మొరుగుతూ, వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు.
PSA 59:15 వారు ఆహారం కోసం తిరుగుతారు సంతృప్తి చెందకపోతే కేకలు వేస్తారు.
PSA 59:16 కానీ నేను మీ బలాన్ని గురించి పాడతాను, ఉదయం మీ ప్రేమను గురించి పాడతాను; ఎందుకంటే మీరు నా కోట, కష్ట సమయాల్లో నా ఆశ్రయము.
PSA 59:17 మీరు నా బలం, నేను మీకు స్తుతిగానం చేస్తున్నాను; దేవా, మీరు, నా కోట, నన్ను ప్రేమించే నా దేవుడు.
PSA 60:1 సంగీత దర్శకునికి. “నిబంధన పుష్పం” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. దావీదు అరాము నహరయీము వారితోను అరాము సోబా వారితోను యుద్ధము చేయగా యోవాబు ఉప్పు లోయలో పన్నెండువేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు వ్రాసినది. దేవా, మీరు మమ్మల్ని తిరస్కరించారు, మాపై విరుచుకుపడ్డారు; మీరు కోపంగా ఉన్నారు మమ్మల్ని మళ్ళీ బాగుచేయండి!
PSA 60:2 మీరు దేశాన్ని కంపింపజేసి దానిని చీల్చివేశారు; దాని పగుళ్లను పూడ్చండి, ఎందుకంటే అది కంపిస్తూ ఉంది.
PSA 60:3 మీరు మీ ప్రజలకు కఠిన సమయాలను చూపించారు; మమ్మల్ని తడబడేలా చేసే మద్యాన్ని మీరు మాకు ఇచ్చారు.
PSA 60:4 సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి మీకు భయపడేవారికి మీరొక జెండాను ఇచ్చారు. సెలా
PSA 60:5 మీరు ప్రేమించేవారు విడిపించబడేలా, మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి.
PSA 60:6 దేవుడు తన పరిశుద్ధాలయం నుండి మాట్లాడిన మాట: “విజయంతో నేను షెకెమును పంచుతాను సుక్కోతు లోయను కొలుస్తాను.
PSA 60:7 గిలాదు నాది, మనష్షే నాది; ఎఫ్రాయిం నా శిరస్త్రాణం, యూదా నా రాజదండం.
PSA 60:8 మోయాబు నా కాళ్లు కడుక్కునే పళ్లెం, ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను, ఫిలిష్తియా గురించి విజయధ్వని చేస్తాను.”
PSA 60:9 కోటగోడలు గల పట్టణానికి నన్నెవరు తీసుకెళ్తారు? ఎదోముకు నన్నెవరు నడిపిస్తారు?
PSA 60:10 దేవా, ఇప్పుడు మమ్మల్ని విసర్జించింది మీరు కాదా? మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా?
PSA 60:11 శత్రువుకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి, ఎందుకంటే మనుష్యుల సహాయం పనికిరానిది.
PSA 60:12 దేవునితో కలిసి మేము విజయం సాధిస్తాం, ఆయన మా శత్రువులను అణగద్రొక్కుతారు.
PSA 61:1 సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన. ఓ దేవా! నా మనవి వినండి; నా ప్రార్థన ఆలకించండి.
PSA 61:2 భూదిగంతాలలో నుండి నేను మీకు మొరపెడతాను, నా హృదయం క్రుంగినప్పుడు నేను మొరపెడతాను; నాకన్నా ఎత్తైన కొండ వైపు నన్ను నడిపించండి.
PSA 61:3 ఎందుకంటే మీరే నాకు ఆశ్రయం, శత్రువులు చేరుకోలేని ఒక బలమైన గోపురము.
PSA 61:4 మీ గుడారంలో చిరకాలం నివసించాలని మీ రెక్కల చాటున ఆశ్రయం పొందాలని నేను ఆశపడుతున్నాను. సెలా
PSA 61:5 దేవా! మీరు, నా మ్రొక్కుబడులు విన్నారు; మీ నామానికి భయపడేవారి స్వాస్థ్యం మీరు నాకు ఇచ్చారు.
PSA 61:6 రాజు జీవితకాల దినాలను పొడిగించండి, అనేక తరాలకు అతని సంవత్సరాలు తరతరాలకు కొనసాగించండి.
PSA 61:7 అతడు శాశ్వతంగా దేవుని సన్నిధిలో సింహాసనాసీనుడై ఉంటారు; మీ మారని ప్రేమ, మీ నమ్మకత్వం అతన్ని కాపాడాలి.
PSA 61:8 అప్పుడు నేను ఎడతెగక మీ నామాన్ని బట్టి స్తుతి పాడతాను దినదినం నా మ్రొక్కుబడులు నెరవేరుస్తాను.
PSA 62:1 సంగీత దర్శకునికి. యెదూతూను అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన. నేను దేవునిలోనే విశ్రాంతి పొందుతాను; ఆయన నుండి నాకు రక్షణ కలుగుతుంది.
PSA 62:2 ఆయనే నా కొండ నా రక్షణ; ఆయన నా బలమైన దుర్గం, నేను ఎప్పటికీ కదల్చబడను.
PSA 62:3 ఎంతకాలం మీరు ఒక్కడి మీద దాడి చేస్తారు? వాలుతున్న గోడను, పడిపోతున్న కంచెను పడద్రోసినట్లు మీరంతా నన్ను పడద్రోస్తారు?
PSA 62:4 ఖచ్చితంగా వారు నన్ను నా ఉన్నత స్థానం నుండి పడగొట్టాలని నిర్ణయించారు; వారు అబద్ధాలు చెప్పడంలో ఆనందిస్తారు. వారు నోటితో దీవిస్తారు, కాని వారి హృదయాల్లో శపిస్తారు. సెలా
PSA 62:5 అవును, నా ఆత్మ దేవునిలోనే విశ్రాంతి పొందుతుంది; ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది.
PSA 62:6 ఆయన నా కొండ నా రక్షణ; ఆయన నా కోట, నేను కదల్చబడను.
PSA 62:7 నా రక్షణ నా ఘనత దేవుని పైనే ఆధారపడి ఉన్నాయి; ఆయన నాకు శక్తివంతమైన కొండ, నా ఆశ్రయము.
PSA 62:8 ప్రజలారా, ఎల్లప్పుడూ ఆయనను నమ్మండి; మీ హృదయాలను ఆయన ఎదుట క్రుమ్మరించండి, ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయము. సెలా
PSA 62:9 సామాన్య మనుష్యులు ఊపిరిలాంటివారు, ఉన్నత గోత్రం కేవలం మాయ త్రాసులో పెట్టి తూస్తే వారిద్దరు కలిసి ఊపిరి కంటే తేలికగా ఉంటారు.
PSA 62:10 బలాత్కారాన్ని నమ్ముకోకండి దోపిడీలు చేసి ధనవంతులై విర్రవీగకండి. ధనం ఎక్కువైనా సరే, దాని మీద మనస్సు పెట్టకండి.
PSA 62:11 దేవుడు ఒక్క సంగతి మాట్లాడారు, రెండు సార్లు విన్నాను: “దేవా, శక్తి మీకే చెందుతుంది,
PSA 62:12 ప్రభువా, మీరు మారని ప్రేమగలవారు; మీరు మనుష్యులందరికి వారి క్రియలను తగ్గట్టుగా ప్రతిఫలమిస్తారు.”
PSA 63:1 దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. దేవా, మీరు నా దేవుడు, నేను ఆశగా మిమ్మల్ని వెదకుతున్నాను; నీరు లేక ఎండిపోయి పొడిగా ఉన్న దేశంలో, నేను మీ కోసం దప్పిగొన్నాను, నా శరీరమంతా మీ కోసం ఆశపడుతుంది.
PSA 63:2 పరిశుద్ధాలయంలో నేను మిమ్మల్ని చూశాను. మీ ఘనతా మహిమను తేరి చూశాను
PSA 63:3 మీ మారని ప్రేమ జీవం కంటే ఉత్తమం నా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తాయి.
PSA 63:4 నా జీవితకాలమంతా నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీ పేరును బట్టి నా చేతులు ఎత్తుతాను.
PSA 63:5 శ్రేష్ఠమైన ఆహారం దొరికినట్లు నేను సంతృప్తి పొందుతాను; సంతోషించే పెదవులతో నా నోరు మిమ్మల్ని స్తుతిస్తుంది.
PSA 63:6 పడక మీద నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను; రాత్రి జాముల్లో నేను మీ గురించి ఆలోచిస్తాను.
PSA 63:7 మీరు నాకు సహాయం కాబట్టి మీ రెక్కల నీడలో నేను ఆనందంతో పాడతాను.
PSA 63:8 నేను మీకు అంటిపెట్టుకుని ఉంటాను; మీ కుడిచేయి నన్ను ఆదుకుంటుంది.
PSA 63:9 నన్ను ఎవరు చంపాలని చూస్తారో వారే నాశనం అవుతారు; వారు భూమి అగాధ స్థలాలకు దిగిపోతారు.
PSA 63:10 వారు ఖడ్గానికి అప్పగించబడి నక్కలకు ఆహారం అవుతారు.
PSA 63:11 కాని రాజు దేవునియందే ఆనందిస్తాడు; దేవుని మీద ప్రమాణం చేసే వారందరు ఆయనయందు అతిశయిస్తారు. కాని అబద్ధికుల నోళ్ళు మౌనంగా ఉంటాయి.
PSA 64:1 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. నా దేవా, నా ఫిర్యాదు వినండి; శత్రువు భయం నుండి నా జీవితాన్ని కాపాడండి.
PSA 64:2 దుష్టుల కుట్ర నుండి, కీడుచేసేవారి పన్నాగాల నుండి నన్ను దాచండి.
PSA 64:3 వారు తమ నాలుకలను ఖడ్గాల్లా పదునుపెడతారు మరణకరమైన బాణాల వంటి క్రూరమైన పదాలను లక్ష్యంగా చేసుకుంటారు.
PSA 64:4 చాటున ఉండి నిర్దోషుల మీదికి బాణాలు విసురుతారు. వారు భయం లేకుండా, అకస్మాత్తుగా బాణాలు విసురుతారు.
PSA 64:5 కీడు తలపెట్టడంలో వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు. వారు తమ వలలను దాచడం గురించి మాట్లాడతారు; వారంటారు, “దీన్ని ఎవరు చూస్తారు?”
PSA 64:6 వారు అన్యాయాలను రూపొందించి అంటారు, “మేము ఒక సంపూర్ణ ప్రణాళికను రూపొందించాము!” నిశ్చయంగా మానవుల మనస్సు హృదయం మోసపూరితమైనవి.
PSA 64:7 కాని, దేవుడు తన బాణాలను వాళ్ళ మీదికి విసురుతారు; వారు అకస్మాత్తుగా కొట్టబడతారు.
PSA 64:8 ఆయన వారి సొంత నాలుకలను వారికే వ్యతిరేకంగా మార్చి వారిని పతనానికి తెస్తారు; వారిని చూసేవారందరూ ఎగతాళిగా తలాడిస్తారు.
PSA 64:9 మనుష్యులందరు భయపడతారు; దేవుడు చేసిన క్రియలను వారు ప్రకటిస్తారు ఆయన చేసిన దానిని గ్రహిస్తారు.
PSA 64:10 నీతిమంతులు యెహోవాయందు ఆనందించుదురు గాక. ఆయననే ఆశ్రయించెదరు గాక. యథార్థ హృదయులను ఆయన ఘనపరచుదురు గాక!
PSA 65:1 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. ఒక గీతము. మా దేవా, సీయోనులో మీరు స్తుతికి యోగ్యులు; మా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాము.
PSA 65:2 మీరు ప్రార్థనకు జవాబు ఇచ్చేవారు, ప్రజలందరు మీ దగ్గరకే వస్తారు.
PSA 65:3 మేము పాపాల్లో మునిగి ఉన్నప్పుడు, మీరు మా అతిక్రమాలను క్షమించారు.
PSA 65:4 మీ ఆవరణాల్లో నివసించడానికి మీరు ఎన్నుకుని మీ దగ్గరకు తెచ్చుకున్న వారు ధన్యులు! మీ పరిశుద్ధ మందిరం యొక్క, మీ గృహంలోని ఆశీర్వాదాలతో మేము తృప్తిచెందుతాం.
PSA 65:5 మీరు భీకరమైన నీతి క్రియలతో మాకు జవాబు ఇస్తారు, దేవా మా రక్షకా, భూదిగంతాలన్నిటికి సుదూర సముద్రాలకు మీరే నిరీక్షణ.
PSA 65:6 బలమును ఆయుధంగా ధరించుకొని, మీరు మీ మహాశక్తితో పర్వతాలను సృజించారు.
PSA 65:7 సముద్రం యొక్క హోరును, అలల యొక్క ఘోషను దేశాల్లోని కలకలాన్ని నిమ్మళం చేసేవారు ఆయనే.
PSA 65:8 భూదిగంతాలలో నివసించే వారందరు మీ అద్భుతాలకు భయంతో నిండి ఉన్నారు; ఉదయం సాయంత్రాలను మీరు ఆనందంతో కేకలు వేసేలా చేస్తారు.
PSA 65:9 మీరు భూమిని గమనించి నీరు పోస్తారు; మీరు దానిని సమృద్ధిగా సుసంపన్నం చేస్తారు. ప్రజలకు ధాన్యాన్ని అందించడానికి దేవుని ప్రవాహాలు నీటితో నిండి ఉన్నాయి ఎందుకంటే దానిని మీరు అలా నియమించారు.
PSA 65:10 మీరు దున్నిన భూమిని వర్షంతో తడిపి, గడ్డలను కరిగించి, గట్లు సమం చేస్తారు. మీరు వానజల్లులతో భూమిని మృదువుగా చేసి, దాని పంటలను ఆశీర్వదిస్తారు.
PSA 65:11 మీరు మీ దయతో సంవత్సరానికి కిరీటం ధరింపచేస్తారు, మార్గాలు కూడ సమృద్ధితో పొంగిపోతాయి.
PSA 65:12 అరణ్యం యొక్క తుక్కు భూములు పొంగిపొర్లుతాయి; కొండలు ఆనందాన్ని ధరించుకొని ఉన్నాయి.
PSA 65:13 పచ్చికబయళ్లు మందల చేత కప్పబడ్డాయి లోయలు ధాన్యంతో కప్పబడి ఉన్నాయి; వారు ఆనందంతో కేక వేస్తూ పాడతారు.
PSA 66:1 సంగీత దర్శకునికి. ఒక కీర్తన. ఒక గీతము. సర్వలోకమా! ఆనందంతో దేవునికి కేకలు వేయండి!
PSA 66:2 ఆయన నామాన్ని కీర్తించండి ఆయనను స్తుతించి మహిమపరచండి.
PSA 66:3 దేవునితో ఇలా అనండి, “మీ క్రియలు ఎంత అద్భుతం! మీ శక్తి ఎంతో గొప్పది కాబట్టి మీ శత్రువులు భయంతో మీకు లొంగిపోతారు.
PSA 66:4 సర్వ లోకం మీకు నమస్కరిస్తుంది; మీకు స్తుతి పాడతారు మీ నామాన్ని స్తుతిస్తారు.” సెలా
PSA 66:5 దేవుడు ఏం చేశారో వచ్చి చూడండి, మనుషులకు ఆయన చేసిన భీకరమైన క్రియలు చూడండి!
PSA 66:6 సముద్రాన్ని ఆరిన నేలగా చేశారు, వారు కాలినడకన నది దాటి వెళ్లారు రండి, మనం ఆయనలో ఆనందిస్తాము.
PSA 66:7 ఆయన తన శక్తితో నిత్యం పరిపాలిస్తారు, ఆయన కళ్లు దేశాలను చూస్తాయి, తిరుగుబాటు చేసేవారు తమను తాము హెచ్చించుకోకూడదు. సెలా
PSA 66:8 సర్వజనులారా, మన దేవున్ని స్తుతించండి, ఆయనను స్తుతిస్తున్న ధ్వని వినబడును గాక;
PSA 66:9 ఆయన మనల్ని సజీవంగా ఉంచారు మన పాదాలు జారిపోకుండ చేశారు.
PSA 66:10 దేవా, మీరు మమ్మల్ని పరీక్షించారు; వెండిలా మమ్మల్ని శుద్ధి చేశారు.
PSA 66:11 మీరు మమ్మల్ని వలలో బంధించారు, మా నడుముల మీద భారాన్ని మోపారు.
PSA 66:12 మీరు మా తలలపై స్వారీ చేయడానికి ప్రజలను అనుమతించారు; అగ్ని జలాల గుండా మేము వెళ్లాము, అయినా మీరు మమ్మల్ని సమృద్ధిగల స్థలంలోనికి తెచ్చారు.
PSA 66:13 దహన బలులతో మీ ఆలయానికి వచ్చి నా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాను.
PSA 66:14 నేను శ్రమల్లో ఉన్నప్పుడు నా పెదవులు ప్రమాణం చేసిన, నా నోరు పలికిన మ్రొక్కుబడులు చెల్లిస్తాను.
PSA 66:15 నేను మీకు క్రొవ్విన జంతువులను పొట్టేళ్ళను సువాసనగల దహనబలిగా అర్పిస్తాను; నేను ఎద్దులను మేకలను అర్పిస్తాను. సెలా
PSA 66:16 దేవుడంటే భయం భక్తి ఉన్నవారలారా, మీరంతా రండి వినండి; ఆయన నా కోసం ఏం చేశారో మీకు చెప్తాను.
PSA 66:17 నేను నా నోటితో ఆయనకు మొరపెట్టాను; ఆయన స్తుతి నా నాలుక మీద ఉంది.
PSA 66:18 నా హృదయంలో దుష్టత్వం ఉంటే, ప్రభువు నా ప్రార్థన వినేవారు కాదు.
PSA 66:19 కాని దేవుడు నిశ్చయంగా ఆలకించారు నా ప్రార్థన విన్నారు.
PSA 66:20 నా ప్రార్థనను త్రోసివేయని తన మారని ప్రేమను నా నుండి తొలగించని, దేవునికి స్తుతి కలుగును గాక!
PSA 67:1 ప్రధాన గాయకునికి. తంతివాద్యాలతో పాడదగినది. ఒక కీర్తన. ఒక గీతము. దేవుడు మామీద దయచూపి దీవించును గాక, ఆయన ముఖం మాపై ప్రకాశించును గాక. సెలా
PSA 67:2 తద్వార భూమి మీద మీ మార్గాలు దేశాలన్నిటికి మీ రక్షణ తెలుస్తాయి,
PSA 67:3 దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.
PSA 67:4 దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక, ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారు భూమి మీద దేశాలను పాలిస్తారు. సెలా
PSA 67:5 దేవా, జనాంగాలు మిమ్మల్ని స్తుతించును గాక; సర్వ జనులు మిమ్మల్ని స్తుతించుదురు గాక.
PSA 67:6 భూమి దాని పంటను ఇస్తుంది; దేవుడు, మా దేవుడు, మమ్మల్ని దీవిస్తారు.
PSA 67:7 అవును, దేవుడు మనల్ని దీవించును గాక, తద్వార భూదిగంతాలలో ఉన్న ప్రజలంతా ఆయనకు భయపడుదురు గాక.
PSA 68:1 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన గీతము. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక; ఆయన విరోధులు ఆయన ఎదుట నుండి పారిపోవుదురు గాక.
PSA 68:2 మీరు వారిని పొగలా ఊదివేయండి; మైనం అగ్నికి కరిగి పోయినట్టు దుష్టులు దేవుని ఎదుట నశించెదరు గాక.
PSA 68:3 కాని నీతిమంతులు సంతోషించి దేవుని ఎదుట ఆనందించుదురు గాక వారు సంతోషంగా ఆనందంగా ఉందురు గాక.
PSA 68:4 దేవునికి పాడండి, ఆయన నామాన్ని బట్టి స్తుతి పాడండి, మేఘాల మీద స్వారీ చేసే ఆయనను కీర్తించండి; ఆయన పేరు యెహోవా; ఆయన ఎదుట ఆనందించండి.
PSA 68:5 తన పరిశుద్ధ నివాసంలో ఉన్న దేవుడు, తండ్రిలేనివారికి తండ్రి, విధవరాండ్రకు సంరక్షుడు.
PSA 68:6 దేవుడు ఒంటరిగా ఉన్నవారిని కుటుంబాలలో ఉంచుతారు, బందీలను విడిపించి వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తారు; కాని తిరుగుబాటుదారులు ఎండిన భూమిలో నివసిస్తారు.
PSA 68:7 దేవా! మీ ప్రజలకు ముందుగా మీరు వెళ్లారు, అరణ్యం గుండా మీరు నడిచారు. సెలా
PSA 68:8 సీనాయి యొక్క ఏకైక దేవుని ముందు, ఇశ్రాయేలు దేవుని ముందు, భూమి కంపించింది, ఆకాశాలు వాన కురిపించాయి.
PSA 68:9 దేవా, మీరు స్వచ్ఛందంగా సమృద్ధి వర్షాన్ని ఇచ్చారు; నీరసించిన మీ వారసత్వాన్ని మీరు ఉత్తేజపరచారు.
PSA 68:10 మీ జనులు అందులో స్థిరపడ్డారు, దేవా, మీ దయతో పేదలకు అవసరమైనవి ఇచ్చారు.
PSA 68:11 ప్రభువు తన మాటను చాటించారు, స్త్రీలు శుభవార్తను ప్రకటిస్తారు:
PSA 68:12 “శత్రు రాజులు సైన్యాలు త్వరపడి పారిపోతారు; ఇంటి పట్టున ఉన్న స్త్రీలు దోపుడుసొమ్ము పంచుకుంటారు.
PSA 68:13 గొర్రెల దొడ్ల మధ్యలో మీరు పడుకున్నప్పుడు కూడా, నా పావురం యొక్క రెక్కలు వెండితో, దాని ఈకలు మెరిసే బంగారంతో కప్పబడి ఉంటాయి.”
PSA 68:14 సర్వశక్తిమంతుడు ఈ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను కొండమీద మంచు కురిసినట్లు కనిపించింది.
PSA 68:15 దేవుని పర్వతమా, పర్వత శిఖరమా, బాషాను పర్వతమా, కఠినమైన పర్వతమా,
PSA 68:16 కఠినమైన పర్వతమా, దేవుడు పరిపాలించడానికి ఎన్నుకున్న పర్వతం వైపు ఎల్లకాలమూ యెహోవా నివసించే స్థలం వైపు ఎందుకు అసూయతో చూస్తావు?
PSA 68:17 దేవుని రథాలు వేలాది కొలది కోట్ల కొలదిగా ఉన్నాయి; వాటి మధ్యలో, ప్రభువు సీనాయి పర్వతం నుండి తన పరిశుద్ధాలయానికి వచ్చి ఉన్నారు.
PSA 68:18 యెహోవా దేవా, మీరు నిత్యం పాలించడానికి పైకి ఆరోహణమైనప్పుడు, మీరు అనేకమందిని చెరపట్టి తీసుకెళ్లారు; మీరు మనుష్యుల నుండి ఈవులు స్వీకరించారు, తిరుగుబాటుదారుల నుండి కూడా స్వీకరించారు.
PSA 68:19 అనుదినం మన భారాలు భరించే మన రక్షకుడైన దేవునికి, ప్రభువునకు స్తుతి కలుగును గాక. సెలా
PSA 68:20 మన దేవుడు రక్షించే దేవుడు; ప్రభువైన యెహోవా నుండి మరణ విడుదల కలుగుతుంది.
PSA 68:21 దేవుడు ఖచ్చితంగా తన శత్రువుల తలలను చితకగొడతారు, అపరాధ మార్గాలను ప్రేమించేవారి నడినెత్తులను చితకగొడతారు.
PSA 68:22 ప్రభువు అంటున్నారు, “బాషానులో నుండి మిమ్మల్ని రప్పిస్తాను; సముద్రం లోతుల్లో నుండి మిమ్మల్ని తెస్తాను.”
PSA 68:23 మీ శత్రువుల రక్తంలో తమ పాదాలు ముంచుతారు, మీ కుక్కలు నాలుకలతో నాకుతాయి.
PSA 68:24 దేవా! మీ ఊరేగింపు కనబడుతుంది, పరిశుద్ధాలయం లోనికి వస్తున్న నా రాజైన దేవుని యొక్క ఊరేగింపు.
PSA 68:25 ముందు గాయకులు, తర్వాత సంగీతకారులు; వారితో ఉన్నారు కంజరలు వాయిస్తున్న యవ్వన స్త్రీలు.
PSA 68:26 మహా సమాజాలలో దేవుని స్తుతించండి; ఇశ్రాయేలు సమాజంలో యెహోవాను స్తుతించండి.
PSA 68:27 చిన్నదైన బెన్యామీను గోత్రం వారిని నడిపిస్తుంది, యూదా నాయకుల గొప్ప సమూహం, జెబూలూను నఫ్తాలి నాయకులు కూడా ఉన్నారు.
PSA 68:28 దేవా, మీ శక్తిని రమ్మని పిలువండి; ఇంతకుముందు మీరు చేసినట్టుగా, మా దేవా, మీ బలాన్ని మాకు చూపండి,
PSA 68:29 యెరూషలేములో ఉన్న మీ దేవాలయాన్ని బట్టి రాజులు మీకు కానుకలు తెస్తారు.
PSA 68:30 దేవా! రెల్లు మధ్యలో ఉండే మృగాన్ని, అడవి జంతువుల లాంటి దేశాల మధ్యలో ఉన్న ఎడ్ల గుంపును గద్దించండి. అవి తగ్గించబడి వెండి కడ్డీలను పన్నుగా తెచ్చును గాక యుద్ధాలంటే ఇష్టపడే దేశాలను చెదరగొట్టండి.
PSA 68:31 ఈజిప్టు నుండి రాయబారులు వస్తారు. కూషు తనను తాను దేవునికి సమర్పించుకుంటుంది.
PSA 68:32 భూలోక రాజ్యాల్లారా, దేవునికి పాడండి, ప్రభువుకు స్తుతి పాడండి. సెలా
PSA 68:33 అనాది కాలం నుండి మహా ఆకాశాల్లో స్వారీ చేసే, తన స్వరంతో ఉరిమే ఆయనను కీర్తించండి.
PSA 68:34 దేవుని శక్తిని ప్రకటించండి, ఆయన ప్రభావం ఇశ్రాయేలుపై ఉన్నది, ఆయన శక్తి అంతరిక్షంలో ఉంది.
PSA 68:35 దేవా, మీరు మీ పరిశుద్ధాలయంలో భీకరులు; ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు బల ప్రభావాన్ని ఇస్తారు. దేవునికే స్తుతి కలుగును గాక!
PSA 69:1 సంగీత దర్శకునికి. “కలువ పువ్వులు” అనే రాగము మీద పాడదగినది. దావీదు కీర్తన. దేవా, నన్ను రక్షించండి, నీళ్లు నా మెడ వరకు పొంగి వచ్చాయి.
PSA 69:2 లోతైన ఊబిలో నేను దిగబడిపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను. నేను అగాధ జలాల్లో ఉన్నాను; వరదలు నన్ను ముంచేస్తున్నాయి.
PSA 69:3 సాయం కోసం అరిచి అలసిపోయాను; నా గొంతు ఆరిపోయింది. నా దేవుని కోసం చూస్తూ, నా కళ్లు క్షీణిస్తున్నాయి.
PSA 69:4 నిష్కారణంగా నన్ను ద్వేషించేవారు నా తలవెంట్రుకల కన్నా ఎక్కువగా ఉన్నారు. నాకు చాలామంది శత్రువులు ఉన్నారు, వారు నిష్కారణంగా నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. నేను దొంగతనం చేయని దానిని నేను బలవంతంగా తిరిగి ఇవ్వవలసి వచ్చింది.
PSA 69:5 దేవా! నా బుద్ధిహీనత మీకు తెలుసు; నా అపరాధాలు మీ నుండి దాచబడలేదు.
PSA 69:6 సైన్యాల అధిపతియైన యెహోవా, మీలో నిరీక్షణ ఉంచినవారు నా వలన అవమానానికి గురికావద్దు; ఇశ్రాయేలు దేవా, మిమ్మల్ని వెదకేవారు నా వలన సిగ్గుపడకూడదు.
PSA 69:7 మీ కోసం నేను నిందల పాలయ్యాను, సిగ్గు నా ముఖాన్ని కప్పేసింది.
PSA 69:8 నా కుటుంబానికే నేను పరాయివాడిని అయ్యాను, నా సొంత తల్లి కుమారులకే నేను అపరిచితుని అయ్యాను;
PSA 69:9 మీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను దహించి వేస్తుంది, మిమ్మల్ని అవమానపరచే వారి అవమానాలు నా మీద పడును గాక.
PSA 69:10 నేను ఉపవాసముండి ఏడ్చినప్పుడు అది నా నిందకు కారణమైంది.
PSA 69:11 నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు నన్ను హేళనకు సామెతగా చేశారు.
PSA 69:12 గుమ్మం దగ్గర కూర్చునేవారు నన్ను ఎగతాళి చేస్తారు, త్రాగుబోతులు నా గురించి పాటలు పాడుతున్నారు.
PSA 69:13 అయితే యెహోవా, ఇది మీ దయ చూపే సమయమని నేను మీకు ప్రార్థిస్తున్నాను. దేవా, మీ గొప్ప ప్రేమతో, మీ నమ్మకమైన రక్షణతో నాకు జవాబు ఇవ్వండి.
PSA 69:14 ఊబిలో నుండి నన్ను విడిపించండి, నన్ను మునిగి పోనివ్వకండి; నన్ను ద్వేషించేవారి నుండి లోతైన నీటిలో నుండి నన్ను కాపాడండి.
PSA 69:15 వరదలు నన్ను ముంచనీయకండి, అగాధాలు నన్ను మ్రింగనివ్వకండి గుంటలో నన్ను పడనివ్వకండి.
PSA 69:16 యెహోవా, మీ ప్రేమలోని మంచితనంతో నాకు జవాబు ఇవ్వండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి నా వైపు తిరగండి.
PSA 69:17 మీ సేవకుని నుండి మీ ముఖాన్ని దాచకండి; నేను ఇబ్బందిలో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వండి.
PSA 69:18 నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడండి; నా శత్రువుల నుండి నన్ను విడిపించండి.
PSA 69:19 నన్ను ఎలా హేళన చేశారో, అవమానపరిచారో, సిగ్గుపరిచారో మీకు తెలుసు; నా శత్రువులంతా మీ ఎదుటే ఉన్నారు.
PSA 69:20 వారు చేసిన అవమానాలకు నా గుండె బద్దలయ్యింది. నేను నిరాశలో ఉన్నాను; నేను సానుభూతి కోసం చూశాను, కానీ ఎవరూ లేరు ఆదరించేవారి కోసం చూశాను, కానీ ఒక్కరూ దొరకలేదు.
PSA 69:21 నా ఆహారంలో వారు చేదు కలిపారు దాహమైతే పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు.
PSA 69:22 వారి ఎదుట ఉన్న భోజనబల్ల వారికి ఉరి అవును గాక; వారి క్షేమం వారికి ఉచ్చు అవును గాక.
PSA 69:23 వారు చూడకుండ వారి కళ్లకు చీకటి కమ్మును గాక, వారి నడుములు శాశ్వతంగా వంగిపోవును గాక.
PSA 69:24 మీ ఉగ్రతను వారి మీద కుమ్మరించండి; మీ కోపాగ్ని వారిని తాకనివ్వండి.
PSA 69:25 వారి స్థలం పాడైపోవును గాక; వారి డేరాలలో ఎవరు నివసించకుందురు గాక.
PSA 69:26 మీరు గాయం చేసిన వారిని వారు హింసిస్తారు మీరు బాధపెట్టిన వారి బాధ గురించి మాట్లాడతారు.
PSA 69:27 నేరం మీద నేరం వారిపై మోపండి; మీ నీతిలో వారిని పాలు పంచుకోనివ్వకండి.
PSA 69:28 జీవగ్రంథంలో నుండి వారు తుడిచివేయబడుదురు గాక, నీతిమంతుల జాబితాలో వారి నమోదు చేయబడకుండును గాక.
PSA 69:29 కాని నా మట్టుకైతే నేను బాధించబడి వేదనలో ఉన్నాను, దేవా! మీ రక్షణ నన్ను కాపాడును గాక.
PSA 69:30 నేను పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తాను. కృతజ్ఞత చెల్లించి ఆయనను కీర్తిస్తాను.
PSA 69:31 ఎద్దును, కొమ్ములు డెక్కలు కలిగిన కోడెను అర్పించడం కంటే, ఆయనను స్తుతించడం యెహోవాకు ఇష్టము.
PSA 69:32 దీనులు చూసి ఆనందిస్తారు; దేవున్ని వెదికేవారి హృదయాలు తిరిగి బ్రతుకును గాక.
PSA 69:33 అవసరత ఉన్నవారి మొర యెహోవా వింటారు, బందీగా ఉన్న తన ప్రజలను ఆయన అలక్ష్యం చేయరు.
PSA 69:34 ఆకాశం భూమి ఆయనను స్తుతించును గాక, సముద్రాలు వాటిలో ఉండే జలచరాలన్నీ ఆయనను స్తుతించును గాక.
PSA 69:35 ఎందుకంటే దేవుడు సీయోనును రక్షిస్తారు, యూదా పట్టణాలను తిరిగి కడతారు. అప్పుడు ప్రజలు అక్కడ నివసించి దానిని స్వాధీనం చేసుకుంటారు.
PSA 69:36 దేవుని సేవకుల సంతానం ఆ భూమిని వారసత్వంగా పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించేవారు అక్కడ నివసిస్తారు.
PSA 70:1 సంగీత దర్శకునికి. దావీదు అభ్యర్థన కీర్తన. దేవా, నన్ను రక్షించడానికి త్వరపడండి; యెహోవా, నాకు సాయం చేయడానికి, త్వరగా రండి.
PSA 70:2 నా ప్రాణం తీయాలని కోరేవారు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.
PSA 70:3 నన్ను చూసి, “ఆహా! ఆహా!” అని నాతో అనేవారు సిగ్గుపడి ఆశాభంగం పొందాలి.
PSA 70:4 అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి.
PSA 70:5 కాని నా మట్టుకైతే, నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను; దేవా! నా దగ్గరకు త్వరగా రండి, మీరే నా సహాయం, నా విమోచకుడు; యెహోవా, ఆలస్యం చేయకండి.
PSA 71:1 యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి.
PSA 71:2 మీ నీతిని బట్టి నన్ను రక్షించి విడిపించండి; నా వైపు చెవి ఉంచి నన్ను రక్షించండి.
PSA 71:3 నేను ఎల్లప్పుడూ వెళ్లగలిగే, నా ఆశ్రయదుర్గంగా ఉండండి; మీరు నా కొండ నా కోట కాబట్టి, నన్ను రక్షించేందుకు ఆజ్ఞ ఇవ్వండి.
PSA 71:4 నా దేవా, దుష్టుల చేతి నుండి, చెడ్డవారు, క్రూరుల పట్టు నుండి నన్ను విడిపించండి.
PSA 71:5 ప్రభువైన యెహోవా, మీరే నా నిరీక్షణ, నా యవ్వనం నుండి మీరే నా ధైర్యం.
PSA 71:6 పుట్టినప్పటి నుండి నేను మీమీద ఆధారపడ్డాను; నన్ను తల్లి గర్భం నుండి బయటకు తెచ్చింది మీరే. నేను నిత్యం మిమ్మల్ని స్తుతిస్తాను.
PSA 71:7 అనేకులకు నేనొక సూచనగా ఉన్నాను; మీరే నాకు బలమైన ఆశ్రయం.
PSA 71:8 నా నోరు మీ స్తుతితో నిండి ఉంది; నేను రోజంతా మీ వైభవాన్ని ప్రకటిస్తాను.
PSA 71:9 నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నన్ను త్రోసివేయకండి; నా బలం తగ్గిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టకండి.
PSA 71:10 నా శత్రువులు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు; నన్ను చంపాలని చూసేవారంతా కలిసి కుట్ర చేస్తున్నారు.
PSA 71:11 “దేవుడు అతన్ని విడిచిపెట్టారు; అతన్ని విడిపించడానికి ఒక్కరు లేరు, అతన్ని వెంటాడి పట్టుకోండి” అని వారంటారు.
PSA 71:12 నా దేవా, నాకు దూరంగా ఉండకండి; దేవా, సాయం చేయడానికి త్వరగా రండి.
PSA 71:13 నాపై నేరం మోపేవారు సిగ్గుతో నశించుదురు గాక; నాకు హాని చేయాలని కోరేవారు ఎగతాళిచేయబడి అవమానపరచబడుదురు గాక.
PSA 71:14 నా మట్టుకైతే, నేనెల్లప్పుడు నిరీక్షణ కలిగి ఉంటాను; నేను ఇంకా ఎక్కువగా మిమ్మల్ని స్తుతిస్తాను.
PSA 71:15 రోజంతా నా నోరు మీ నీతిక్రియలను గురించి, రక్షణక్రియలను గురించి చెప్తుంది. అవి నా గ్రహింపుకు అందనివి.
PSA 71:16 ప్రభువైన యెహోవా, నేను వచ్చి మీ గొప్ప కార్యాలను ప్రకటిస్తాను; కేవలం మీ నీతిక్రియలను మాత్రమే నేను ప్రకటిస్తాను.
PSA 71:17 దేవా! నా యవ్వనం నుండి మీరు నాకు బోధించారు, ఈ రోజు వరకు నేను మీ అద్భుత క్రియలను ప్రకటిస్తున్నాను.
PSA 71:18 నేను వృద్ధుడనై తల నెరసినప్పటికి, నా దేవా, తర్వాత తరానికి మీ శక్తిని, రాబోయే వారందరికి మీ గొప్ప కార్యాలను ప్రకటించే వరకు నన్ను విడిచిపెట్టకండి.
PSA 71:19 దేవా, మీ నీతి ఎత్తయిన ఆకాశాలకు ఉన్నతమైనది, మీరు గొప్ప వాటిని చేశారు. దేవా, మీలాంటి వారెవరు?
PSA 71:20 మీరు నన్ను అనేకమైన ఇబ్బందులు, చేదైన వాటిని చూసేలా చేసినప్పటికీ, మీరు నన్ను మళ్ళీ జీవించేలా చేస్తారు; భూమి యొక్క లోతుల నుండి మీరు నన్ను మళ్ళీ పైకి తెస్తారు.
PSA 71:21 మీరు నా గౌరవాన్ని పెంచుతారు మరోసారి నన్ను ఓదార్చుతారు.
PSA 71:22 నా దేవా, మీ నమ్మకత్వాన్ని బట్టి నేను సితారాతో మిమ్మల్ని స్తుతిస్తాను; ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడా, నేను వీణతో మిమ్మల్ని స్తుతిస్తాను.
PSA 71:23 మీరు విడిపించిన నేను మీకు స్తుతి పాడినప్పుడు నా పెదవులు ఆనందంతో కేకలు వేస్తాయి.
PSA 71:24 రోజంతా నా నాలుక మీ నీతిక్రియలను గురించి చెప్తుంది, ఎందుకంటే నాకు హాని చేయాలని కోరుకున్నవారు అవమానం పొంది గందరగోళానికి గురి అయ్యారు.
PSA 72:1 సొలొమోను కీర్తన. ఓ దేవా, రాజుకు మీ న్యాయాన్ని, రాకుమారునికి మీ నీతిని ప్రసాదించండి.
PSA 72:2 ఆయన మీ ప్రజలకు నీతితో బాధితులకు న్యాయంతో తీర్పు తీర్చును గాక.
PSA 72:3 పర్వతాలు ప్రజలకు వృద్ధిని, కొండలు నీతి ఫలములు ఇచ్చును గాక.
PSA 72:4 ప్రజల్లో బాధపడుతున్నవారిని ఆయన రక్షించును గాక అవసరతలో ఉన్న వారి పిల్లలను రక్షించును గాక; బాధించేవారిని త్రొక్కివేయును గాక.
PSA 72:5 సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం, అన్ని తరాల వరకు వారు ఆయనకు భయపడుదురు గాక.
PSA 72:6 ఆయన కోయబడిన తుక్కుపై కురిసే వర్షంలా, భూమిని తడిపే నీటి జల్లులా ఉండును గాక.
PSA 72:7 ఆయన రోజుల్లో నీతిమంతులు వృద్ధిచెందుతారు చంద్రుడు లేకుండ పోయే వరకు అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది.
PSA 72:8 సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నుండి భూమ్యంతాల వరకు ఆయన పరిపాలిస్తారు.
PSA 72:9 ఎడారిలో నివసించే ప్రజలు ఆయన ముందు తలవంచుతారు. తన శత్రువులు మట్టిని నాకుతారు.
PSA 72:10 తర్షీషు రాజులు దూర దేశపు రాజులు, ఆయనకు పన్నులు చెల్లిస్తారు. షేబ సెబా రాజులు కానుకలు తెస్తారు.
PSA 72:11 రాజులందరూ ఆయనకు నమస్కరించుదురు గాక దేశాలన్నీ ఆయనకు సేవలు చేయును గాక.
PSA 72:12 అవసరతలో ఉండి మొరపెట్టే వారిని, సహాయపడడానికి ఎవరు లేని బాధితులను ఆయన విడిపిస్తారు.
PSA 72:13 ఆయన బలహీనులపై పేదవారిపై జాలి చూపుతారు, పేదవారిని మరణం నుండి రక్షిస్తారు.
PSA 72:14 ఆయన వారిని అణచివేత నుండి హింస నుండి విడిపిస్తారు, ఎందుకంటే ఆయన దృష్టిలో వారి రక్తం విలువైనది.
PSA 72:15 రాజు దీర్ఘకాలం జీవించును గాక! షేబ నుండి ఆయనకు బంగారం ఇవ్వబడును గాక. ప్రజలు నిత్యం ఆయన కోసం ప్రార్థించుదురు గాక. రోజంతా ఆయనను స్తుతించుదురు గాక.
PSA 72:16 దేశం అంతటా ధాన్యం సమృద్ధిగా ఉండును గాక; కొండల పైభాగాన అది ఆడించబడును గాక. పండ్లచెట్లు లెబానోను చెట్లలా వర్ధిల్లును గాక ప్రజలు పొలం లోని పచ్చికబయళ్లుగా వృద్ధి చెందును గాక.
PSA 72:17 ఆయన పేరు నిరంతరం ఉండును గాక; అది సూర్యుడు ఉండే వరకు కొనసాగును గాక. అప్పుడు ఆయన ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయి, వారు ఆయనను ధన్యుడు అని పిలుస్తారు.
PSA 72:18 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవునికి స్తుతి, ఆయన మాత్రమే అద్భుతాలు చేస్తారు.
PSA 72:19 ఆయన మహిమగల నామం సదాకాలం స్తుతింపబడును గాక; భూమంతా ఆయన మహిమతో నింపబడును గాక.
PSA 72:20 దీనితో యెష్షయి కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిశాయి.
PSA 73:1 ఆసాపు కీర్తన. ఇశ్రాయేలుకు, శుద్ధ హృదయులకు దేవుడు ఖచ్చితంగా మంచివాడు.
PSA 73:2 కానీ నా మట్టుకైతే, నా పాదాలు దాదాపు జారిపోయాయి; నా పాదం దాదాపు పట్టును కోల్పోయింది.
PSA 73:3 దుష్టుల క్షేమం నేను చూసినప్పుడు నేను అహంకారుల మీద అసూయ పడ్డాను.
PSA 73:4 వారికి ఏ బాధలు లేవు; వారి శరీరాలు ఆరోగ్యంగా బలంగా ఉన్నాయి.
PSA 73:5 సాధారణంగా మనుష్యులకు ఉండే భారాలు వారికి లేవు; మనుష్యులకు కలిగే అనారోగ్యమనే తెగులు వారికి లేదు.
PSA 73:6 కాబట్టి గర్వం వారికి కంఠహారంగా ఉంది; హింసను వారు వస్త్రంగా ధరించారు.
PSA 73:7 వారి కఠిన హృదయాల నుండి దోషం బయటికి వస్తుంది, వారి చెడు ఊహలకు హద్దులు లేవు.
PSA 73:8 వారు ఎగతాళి చేస్తారు, దురుద్దేశంతో మాట్లాడతారు; అహంకారంతో అణచివేస్తామని బెదిరిస్తారు.
PSA 73:9 వారి నోళ్ళు పరలోకంలో పాలిస్తున్నట్లు మాట్లాడుతాయి, వారి నాలుకలు భూమిపై ఆధిపత్యమున్నట్లు ప్రకటిస్తాయి.
PSA 73:10 అందువల్ల వారి ప్రజలు వారివైపు తిరుగుతారు వారి మాటలను మంచినీరు త్రాగినట్లు త్రాగుతారు.
PSA 73:11 “దేవునికి ఎలా తెలుస్తుంది? మహోన్నతునికి ఏదైనా తెలుసా?” అని వారనుకుంటారు.
PSA 73:12 దుష్టులు ఇలా ఉంటారు. ఎప్పుడూ ఏ జాగ్రత్తలు లేకుండ సంపద కూడబెట్టుకుంటారు.
PSA 73:13 నేను నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే నేను నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే.
PSA 73:14 రోజంతా నేను బాధింపబడ్డాను, ప్రతి ఉదయం నూతన శిక్షలు వస్తున్నాయి.
PSA 73:15 నేను అలా మాట్లాడాలని అనుకుని ఉంటే, నేను మీ పిల్లలను మోసం చేసినట్టే.
PSA 73:16 ఇదంతా నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, నేను దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించే వరకు అది నన్ను గాఢంగా ఇబ్బంది పెట్టింది; అప్పుడు నేను వారి చివరి గమ్యమేంటో గ్రహించాను.
PSA 73:18 ఖచ్చితంగా మీరు వారిని జారే నేలపై ఉంచారు; మీరు వారిని పతనానికి పడవేస్తారు.
PSA 73:19 వారు అకస్మాత్తుగా నాశనమవుతారు, వారు భయంతో పూర్తిగా నశిస్తారు!
PSA 73:20 ప్రభువా, మీరు లేచినప్పుడు, ఒకరు మేల్కొన్నప్పుడు ఒక కలలో చూసినవి మరచినట్లు; మీరు వారి ఉనికిని తృణీకరిస్తారు.
PSA 73:21 నా హృదయం దుఃఖించినప్పుడు నా ఆత్మ నీరసించినప్పుడు,
PSA 73:22 నేను తెలివిలేని వాడను, అజ్ఞానిని; మీ ఎదుట నేను క్రూరమైన మృగంలా ఉన్నాను.
PSA 73:23 అయినా నేనెల్లప్పుడు మీతో ఉన్నాను; మీరు నా కుడిచేయి పట్టుకున్నారు.
PSA 73:24 మీ ఆలోచనచేత నన్ను నడిపిస్తున్నారు, తర్వాత నన్ను పరలోక మహిమలో చేర్చుకుంటారు.
PSA 73:25 పరలోకంలో మీరు తప్ప నాకెవరున్నారు? మీరు తప్ప ఈ లోకంలో నాకేమి అక్కర్లేదు.
PSA 73:26 నా శరీరం నా హృదయం నీరసిస్తాయేమో, కాని నిత్యం నా దేవుడు నా హృదయానికి బలం నిత్యం నా స్వాస్థ్యం.
PSA 73:27 మీకు దూరంగా ఉన్నవారు నశిస్తారు; మిమ్మల్ని విడిచి వ్యభిచారులుగా ప్రవర్తించే వారందరినీ మీరు నాశనం చేస్తారు.
PSA 73:28 కాని నా మట్టుకైతే, నేను దేవునికి సమీపంగా ఉంటాను. నేను ప్రభువైన యెహోవాను ఆశ్రయంగా చేసుకున్నాను; మీ క్రియలన్నిటిని గురించి నేను ప్రకటిస్తాను.
PSA 74:1 ఆసాపు ధ్యానకీర్తన. దేవా, మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు తిరస్కరించారు? మీ పచ్చికలోని గొర్రెల మీద మీ కోపం ఎందుకు రగులుకొంది?
PSA 74:2 మీ స్వాస్థ్య గోత్రాన్ని మీరు పూర్వం సంపాదించుకుని విమోచించిన మీ వారసత్వ సమాజాన్ని, మీరు నివసించిన సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకోండి.
PSA 74:3 ఈ నిత్య శిధిలాల వైపు, శత్రువు పరిశుద్ధాలయం మీదికి తెచ్చిన ఈ విధ్వంసం అంతటి వైపు మీ అడుగులు తిప్పండి.
PSA 74:4 మీరు మాతో కలిసిన ప్రదేశంలో మీ శత్రువులు గర్జించారు; వారు తమ ధ్వజాలను సంకేతాలుగా ఏర్పరచుకున్నారు.
PSA 74:5 దట్టమైన పొదలను నరికే పురుషుల్లా వారు గొడ్డళ్ళు పట్టుకున్నారు.
PSA 74:6 చెక్కిన పలకను వారు తమ గొడ్డళ్ళతో చేతిగొడ్డళ్ళతో పగల కొట్టారు.
PSA 74:7 మీ పవిత్రాలయానికి నిప్పు పెట్టి నేలమట్టం చేశారు; మీ నామం కలిగియున్న నివాస స్థలాన్ని అపవిత్రం చేశారు.
PSA 74:8 వారు తమ హృదయాల్లో, “దేవుని ఆరాధన స్థలాలను పూర్తిగా ధ్వంసం చేద్దాం!” అనుకుని, దేశంలో దేవుడు ఆరాధించబడే ప్రతీ స్థలాన్ని తగలబెట్టారు.
PSA 74:9 దేవుని నుండి మాకు ఏ సంకేతాలు లేవు; ప్రవక్తలు లేరు గతించిపోయారు, ఇదంతా చివరికి ఏమవుతుందో చెప్పే వాడెవడూ మా మధ్యలేడు.
PSA 74:10 దేవా, ఎంతకాలం శత్రువు మిమ్మల్ని వెక్కిరిస్తాడు? శత్రువు శాశ్వతంగా మీ పేరును దూషిస్తాడా?
PSA 74:11 మీరు ఎందుకు మీ కుడిచేతిని వెనక్కి తీసుకున్నారు? జీవబల ప్రభావాలను ఎందుకు ఉపసంహరించుకున్నారు? పిడికిలి బిగించి, చేయి చాచి వారిని దెబ్బకొట్టు. నాశనం చేయి!
PSA 74:12 అతి ప్రాచీన కాలం నుండి దేవుడే నా రాజు; దేశమంతా మీరే నాకు మహారక్షణ అనుగ్రహించావు.
PSA 74:13 ఎర్ర సముద్రాన్ని మీ బలం చేత రెండు పాయలుగా విభజించావు, సముద్ర దేవత తలల్ని చితకకొట్టావు.
PSA 74:14 లెవియాథన్ తలలను చితక్కొట్టింది మీరే మహా మొసలి తల చితుక కొట్టావు.
PSA 74:15 మీ ఆజ్ఞమేరకు నీటిబుగ్గలు నదులు ప్రజలకు మీరు సరఫరా చేశారు. జీవనది యొర్దాను ప్రవాహాన్ని ఇంకి పోయేట్టు చేసి వారికి దారి ఏర్పరచింది.
PSA 74:16 పగలు మీదే. రాత్రి కూడా మీదే. వెలిగే నక్షత్రాలు మీవే! సూర్యున్ని మీరే చేశారు.
PSA 74:17 సమస్త ప్రకృతి మీ చేతుల్లో ఉంది. మీరే వేసవికాలం చలికాలం ఏర్పరిచారు.
PSA 74:18 దేవా! ఈ శత్రువులు నిన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారో చూడు. ఓ యెహోవా దేవా! ఈ మూర్ఖపు జనం మీ నామాన్ని దూషించారు జ్ఞాపకం తెచ్చుకోండి.
PSA 74:19 మీ పావురపు ప్రాణాన్ని అడవి జంతువులకు అప్పగించవద్దు; నీ బాధించబడిన ప్రజల జీవితాలను ఎప్పటికీ మరచిపోవద్దు.
PSA 74:20 మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, దేశమంతా చీకటితో నిండి ఉంది. క్రూరులతో నిండి ఉంది.
PSA 74:21 నలిగినవారిని మరల అపకీర్తి పాలు కానివ్వకండి. బీదలు అవసరతలో ఉన్న ఈ ప్రజలు మీ నామం స్తుతించుదురు గాక.
PSA 74:22 దేవా, లేచి, మీ కారణాన్ని సమర్థించండి; బుద్ధిహీనులు రోజంతా మిమ్మల్ని ఎగతాళి చేసేది జ్ఞాపకముంచుకోండి.
PSA 74:23 మీ విరోధుల గొడవను, నిరంతరం పెరిగే మీ శత్రువుల గందరగోళాన్ని విస్మరించవద్దు.
PSA 75:1 సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగము మీద పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము. దేవా, మేము మిమ్మల్ని స్తుతిస్తాము; మీ పేరు సమీపంగా ఉన్నదని మేము మిమ్మల్ని స్తుతిస్తాం; ప్రజలు మీ అద్భుతమైన కార్యాలను గురించి చెప్పుతారు.
PSA 75:2 “నేను నిర్ణీత సమయంలో; న్యాయంగా తీర్పు తీరుస్తాను.
PSA 75:3 భూమి దాని ప్రజలంతా భయంతో వణికినప్పుడు, దాని స్తంభాలను గట్టిగా పట్టుకున్నది నేనే. సెలా
PSA 75:4 అహంకారులతో అహంకారంగా ఉండవద్దు అని దుష్టులతో, ‘మీ కొమ్ములను ఎత్తకండి.
PSA 75:5 ఆకాశం వైపు మీ కొమ్ము ఎత్తకండి; అంత గర్వంగా మాట్లాడకండి’ ” అని మీరంటారు.
PSA 75:6 తూర్పు నుండి కాని పడమర నుండి కాని అరణ్యం నుండి కాని ఎవరూ తమను తాము హెచ్చించుకోలేరు.
PSA 75:7 దేవుడే తీర్పు తీరుస్తారు: ఆయన ఒకని తగ్గిస్తారు, మరొకని హెచ్చిస్తారు.
PSA 75:8 యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది అందులో సుగంధద్రవ్యాలు కలిపిన పొంగుతున్న ద్రాక్షరసం ఉంది; ఆయన దాన్ని బయటకు కుమ్మరిస్తారు, భూమిలోని దుష్టులందరు మడ్డితో సహా దాన్ని త్రాగివేస్తారు.
PSA 75:9 నేనైతే నిత్యం ప్రకటిస్తాను; యాకోబు దేవునికి నేను స్తుతి పాడతాను.
PSA 75:10 ఎందుకంటే, “దుష్టులందరి కొమ్ములను నేను విరగ్గొడతాను, కాని నీతిమంతుల కొమ్ములు హెచ్చిస్తాను” అని ఆయన అంటారు.
PSA 76:1 సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము. యూదాలో దేవుడు ప్రఖ్యాతి గాంచారు; ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది.
PSA 76:2 షాలేములో ఆయన గుడారం ఉంది. సీయోనులో ఆయన నివాసస్థలం ఉంది.
PSA 76:3 అక్కడ ఆయన మెరుస్తున్న బాణాలు, డాళ్లు, ఖడ్గాలు, యుద్ధ ఆయుధాలు విరిచివేశారు. సెలా
PSA 76:4 వేటకు ప్రసిద్ధి చెందిన పర్వతాల కంటే, మీరు గొప్ప వెలుగుతో ప్రకాశిస్తున్నారు.
PSA 76:5 బలవంతులు దోపిడి చేయబడ్డారు, వారు నిద్రపోయారు. ఏ ఒక్క యోధుడు మాకు వ్యతిరేకంగా చేయి ఎత్తలేడు.
PSA 76:6 యాకోబు దేవా! మీరు గద్దిస్తే గుర్రం రథం మరణ నిద్రలో పడి ఉంటాయి.
PSA 76:7 మీ ఒక్కరికే భయపడాలి. మీరు కోప్పడినప్పుడు మీ ఎదుట ఎవరు నిలవగలరు?
PSA 76:8 పరలోకం నుండి మీరు తీర్పు ప్రకటించారు, దేశం భయపడి మౌనం వహించింది.
PSA 76:9 ఎందుకంటే దేవా, దేశంలో అణగారిన వారినందరిని రక్షించడానికి, తీర్పు తీర్చడానికి మీరు లేచారు. సెలా
PSA 76:10 మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది, మీ ఉగ్రత నుండి తప్పించుకున్న వారిని మీరు ఆయుధంగా ధరించుకుంటారు.
PSA 76:11 దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లించండి; పొరుగు దేశాలన్నీ భయపడదగినవానికి బహుమతులు తెచ్చుదురు గాక.
PSA 76:12 పాలకుల పొగరును ఆయన అణచివేస్తారు; భూరాజులు ఆయనను చూసి భయపడాలి.
PSA 77:1 సంగీత దర్శకుడైన యెదూతూనుకు. ఒక ఆసాపు కీర్తన. నేను సహాయం కోసం దేవునికి మొరపెట్టాను; ఆయన వింటాడని నేను దేవునికి మొరపెట్టాను.
PSA 77:2 నేను బాధలో ఉన్నప్పుడు నేను ప్రభువును ఆశ్రయించాను; అలసిపోకుండా రాత్రంతా నేను చేతులు చాచాను, నాకు ఆదరణ కలుగలేదు.
PSA 77:3 దేవా, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దుఃఖించాను; నేను ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ సొమ్మసిల్లింది. సెలా
PSA 77:4 మీరు నా కనురెప్పలు తెరిచి ఉంచారు నేను మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాను.
PSA 77:5 మునుపటి రోజులను గురించి, చాలా కాలంనాటి సంవత్సరాలను గురించి నేను ఆలోచించాను.
PSA 77:6 రాత్రివేళ నేను నా పాటలు జ్ఞాపకం చేసుకున్నాను. నా హృదయం ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ అడిగింది:
PSA 77:7 “ప్రభువు నన్ను శాశ్వతంగా తృణీకరిస్తారా? ఆయన ఎప్పటికీ తన దయను చూపించరా?
PSA 77:8 ఆయన మారని ప్రేమ శాశ్వతంగా పోయినట్లేనా? ఆయన వాగ్దానం ఎప్పటికీ నెరవేరదా?
PSA 77:9 దేవుడు కరుణించడం మరచిపోయారా? ఆయన తన కోపంలో కనికరాన్ని చూపకుండ ఉంటారా?” సెలా
PSA 77:10 అప్పుడు నేను ఇలా అనుకున్నాను, “ఇది నా విధి: మహోన్నతుడు నాకు వ్యతిరేకంగా చేయి ఎత్తారు.
PSA 77:11 యెహోవా కార్యాలను గుర్తు చేసుకుంటాను; అవును, చాలా కాలంనాటి మీ అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను.
PSA 77:12 మీ కార్యాలన్నిటిని నేను తలంచుకుంటాను, మీ గొప్ప క్రియలన్నిటిని నేను ధ్యానిస్తాను.”
PSA 77:13 దేవా, మీ మార్గాలు పరిశుద్ధమైనవి. మన దేవునిలాంటి గొప్ప దేవుడెవరున్నారు?
PSA 77:14 మీరు అద్భుతాలు చేసే దేవుడు; మీరు ప్రజలమధ్య మీ శక్తిని చూపిస్తారు.
PSA 77:15 మీ శక్తివంతమైన చేతితో యాకోబు, యోసేపు సంతతివారైన మీ ప్రజలను విమోచించారు. సెలా
PSA 77:16 దేవా, జలాలు మిమ్మల్ని చూశాయి, జలాలు మిమ్మల్ని చూసి త్రుళ్ళిపడ్డాయి; అగాధాలు వణికిపోయాయి.
PSA 77:17 మేఘాలు వర్షించాయి. ఆకాశాలు ఉరుములతో ప్రతిధ్వనించాయి. మీ బాణాలు అన్నివైపులా తళుక్కుమన్నాయి.
PSA 77:18 మీ ఉరుము సుడిగాలిలో వినిపించింది, మీ మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది; భూమి వణికి కంపించింది.
PSA 77:19 మీ అడుగుజాడలు కనిపించనప్పటికీ, మీ మార్గం సముద్రం గుండా, శక్తివంతమైన జలాల గుండా వెళ్లింది.
PSA 77:20 మోషే అహరోనుల ద్వార మీరు మీ ప్రజలను మందలా నడిపించారు.
PSA 78:1 ఆసాపు ధ్యానకీర్తన. నా ప్రజలారా! నా ఉపదేశం వినండి; నా నోటి మాటలు వినండి.
PSA 78:2 నేను ఉపమానం చెప్పడానికి నా నోరు తెరుస్తాను; పూర్వకాలం నుండి దాచబడి ఉన్న విషయాలను నేను తెలియజేస్తాను.
PSA 78:3 మనం విన్నవి మనకు తెలిసినవి మన పూర్వికులు మనకు చెప్పిన సంగతులను చెప్తాను.
PSA 78:4 వారి వారసులకు తెలియకుండా వాటిని దాచిపెట్టము; యెహోవా చేసిన స్త్రోత్రార్హమైన కార్యాలను, ఆయన శక్తిని, ఆయన చేసిన అద్భుతాలను గురించి తర్వాతి తరానికి మేము చెప్తాం.
PSA 78:5 ఆయన యాకోబుకు చట్టాలు విధించారు ఇశ్రాయేలులో నిబంధనలను స్థాపించారు, వారి పిల్లలకు దానిని బోధించుమని మన పూర్వికులకు ఆజ్ఞాపించారు.
PSA 78:6 తద్వార తర్వాతి తరం వాటిని తెలుసుకుంటారు, ఇంకా పుట్టబోయే పిల్లలు కూడా తెలుసుకుంటారు, వారు వారి పిల్లలకు బోధిస్తారు.
PSA 78:7 అప్పుడు వారు దేవునిలో నమ్మకం ఉంచుతారు ఆయన కార్యాలను మరచిపోరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు.
PSA 78:8 వారు తమ పితరుల్లా అనగా మొండితనం తిరుగుబాటు స్వభావం కలిగిన తరం గాను, దేవుని పట్ల నమ్మకమైన హృదయాలు లేనివారిగాను ఆయన పట్ల విశ్వసనీయత లేని ఆత్మలు గలవారి గాను ఉండరు.
PSA 78:9 ఎఫ్రాయిం వారు విల్లులను ఆయుధాలుగా ధరించినప్పటికీ, యుద్ధ దినాన వెనుకకు తిరిగారు;
PSA 78:10 వారు దేవుని నిబంధనను పాటించలేదు, ఆయన న్యాయవిధుల ప్రకారం జీవించడానికి నిరాకరించారు.
PSA 78:11 వారు ఆయన చేసిన కార్యాలు, ఆయన వారికి చూపిన అద్భుతాలను మరచిపోయారు.
PSA 78:12 ఆయన వారి పూర్వికుల ఎదుట ఈజిప్టు దేశంలో, సోయను ప్రాంతంలో అద్భుతకార్యాలు చేశారు.
PSA 78:13 ఆయన సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మధ్యలో వారిని నడిపించారు; ఆయన నీటిని గోడలా నిలబడేలా చేశారు.
PSA 78:14 పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వారికి దారి చూపారు.
PSA 78:15 అరణ్యంలో బండలు చీల్చి త్రాగడానికి నీరిచ్చారు. సముద్రమంత సమృద్ధిగా వారికి నీటిని ఇచ్చారు.
PSA 78:16 ఆయన రాతిలో నుండి ప్రవాహాలను తెచ్చారు నీటిని నదుల్లా ప్రవహింపజేశారు.
PSA 78:17 కాని వారు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు అరణ్యంలో మహోన్నతుని మీద తిరుగుబాటు చేశారు.
PSA 78:18 తాము ఆశపడిన ఆహారాన్ని అడుగుతూ వారు ఉద్దేశపూర్వకంగా దేవున్ని పరీక్షించారు.
PSA 78:19 వారు దేవునికి ప్రతికూలంగా మాట్లాడారు; వారు, “ఈ ఎడారిలో దేవుడు మనకు భోజనం సరఫరా చేయగలడా?
PSA 78:20 నిజమే, ఆయన బండరాయిని కొట్టారు, నీరు బయటకు వచ్చింది, ప్రవాహాలు సమృద్ధిగా ప్రవహించాయి, కాని ఆయన మనకు రొట్టె కూడా ఇవ్వగలరా? ఆయన తన ప్రజలకు మాంసం అందించగలడా?” అన్నారు.
PSA 78:21 యెహోవా వారి మాట విని కోపగించారు; ఆయన అగ్ని యాకోబుకు వ్యతిరేకంగా రగులుకొంది, ఆయన ఉగ్రత ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచింది.
PSA 78:22 ఎందుకంటే వారు దేవునిలో విశ్వాసముంచలేదు. ఆయన ఇచ్చే విడుదలలో నమ్మకముంచలేదు.
PSA 78:23 అయినా ఆయన పైనున్న ఆకాశాలను ఆకాశద్వారాలు తెరిచారు.
PSA 78:24 తినడానికి ప్రజలకు ఆయన మన్నా కురిపించారు. పరలోకం నుండి ధాన్యం ఇచ్చారు.
PSA 78:25 మానవులు దేవదూతల ఆహారం తిన్నారు; ఆయన వారికి సమృద్ధిగా ఆహారం పంపారు.
PSA 78:26 ఆకాశం నుండి ఆయన తూర్పు గాలిని వదిలారు. తన శక్తితో దక్షిణ గాలి విసిరేలా చేశారు.
PSA 78:27 ఆయన ధూళి అంత విస్తారంగా మాంసాన్ని, సముద్రపు ఇసుక రేణువుల్లా పక్షుల్ని వారి మీద కుమ్మరించారు.
PSA 78:28 ఆయన వాటిని వారి దండులో వారి గుడారాల చుట్టూ వంగేలా చేశారు.
PSA 78:29 వారడిగిందే దేవుడిచ్చాడు, వారు కడుపునిండా తిన్నారు.
PSA 78:30 కానీ వారి ఆశ తీరకముందే, ఇంకా ఆహారం వారి నోటిలో ఉండగానే,
PSA 78:31 దేవుని కోపం వారి మీదికి రగులుకొంది; వారిలో బలిష్ఠులను ఆయన హతమార్చారు, ఇశ్రాయేలీయులలో యువకులను సంహరించారు.
PSA 78:32 ఇంత జరిగినా వారింకా పాపం చేస్తూనే ఉన్నారు; ఆయన అద్భుతాలు చేస్తున్నా వారు నమ్మలేదు.
PSA 78:33 అందువల్ల ఆయన వారి రోజులను నిష్ఫలంగా వారి సంవత్సరాలు భయంలో ముగిసిపోయేలా చేశారు.
PSA 78:34 దేవుడు వారిని చంపినప్పుడల్లా వారు ఆయనను వెదికారు; వారు మరలా ఆసక్తిగా ఆయన వైపు తిరిగారు.
PSA 78:35 దేవుడు తమకు కొండ అని, సర్వోన్నతుడైన దేవుడు తమ విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు.
PSA 78:36 అయితే వారు ఆయనను నోటితో పొగడుతూ తమ నాలుకలతో ఆయనకు అబద్ధాలు చెప్పారు;
PSA 78:37 వారి హృదయాలు దేవుని పట్ల విధేయతగా లేవు, వారు ఆయన నిబంధన పట్ల నమ్మకంగా లేరు.
PSA 78:38 అయినా దేవుడు దయ చూపించి; వారి పాపాలను క్షమించారు వారిని నాశనం చేయలేదు. మాటిమాటికి ఆయన తన కోపాన్ని అదుపు చేసుకున్నారు ఆయన పూర్తి ఉగ్రతను రేపలేదు.
PSA 78:39 వారు కేవలం శరీరులే అని, విసరి వెళ్లి మరలి రాని గాలి లాంటి వారని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు.
PSA 78:40 అరణ్యంలో వారు ఆయన మీద అనేకసార్లు తిరుగుబాటు చేశారు, ఎడారిలో ఆయన హృదయాన్ని దుఃఖపెట్టారు.
PSA 78:41 పదే పదే వారు దేవున్ని పరీక్షించారు; వారు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని బాధపెట్టారు.
PSA 78:42 వారు ఆయన శక్తిని గాని, శత్రువుల నుండి వారిని విడిపించిన దినాన్ని కాని,
PSA 78:43 ఆయన ఈజిప్టులో చేసిన సూచకక్రియలను, సోయను ప్రాంతంలో అద్భుతక్రియలు చూపించిన దినాన్ని వారు జ్ఞాపకం ఉంచుకోలేదు.
PSA 78:44 ఆయన వారి నైలు నది కాలువలను రక్తంగా మార్చారు; వారు తమ ప్రవాహాల నుండి త్రాగలేకపోయారు.
PSA 78:45 ఆయన జోరీగల గుంపులను పంపగా అవి వారిని మ్రింగివేశాయి, కప్పలు వారిని నాశనం చేశాయి.
PSA 78:46 ఆయన వారి చేలను పురుగులకు, వారి పంటలను మిడతలకు అప్పగించారు.
PSA 78:47 వడగండ్లతో వారి ద్రాక్షతీగెలను, మంచుతో వారి మేడిచెట్లను ఆయన నాశనం చేశారు.
PSA 78:48 ఆయన వారి పశువులను వడగండ్లకు, వారి మందలను పిడుగులకు అప్పగించారు.
PSA 78:49 నాశనం కలుగచేసే దూతల సేనను పంపినట్లు ఆయన వారి మీదికి తన కోపాన్ని తన ఉగ్రతను, ఆగ్రహాన్ని క్రోధాన్ని పంపారు.
PSA 78:50 ఆయన తన కోపానికి మార్గాన్ని సిద్ధపరచారు; ఆయన వారిని మరణం నుండి తప్పించకుండ, వారి ప్రాణాలను తెగుళ్ళకు అప్పగించారు.
PSA 78:51 ఆయన ఈజిప్టులో జ్యేష్ఠులందరిని, హాము గుడారాల్లో వారి పురుషత్వానికి గుర్తుగా ఉన్న మొదటి సంతానాన్ని చంపారు.
PSA 78:52 అయితే ఆయన తన ప్రజలను గొర్రెల మందలా బయటకు తెచ్చారు; గొర్రెలను నడిపించినట్లు అరణ్యం గుండా ఆయన వారిని నడిపించారు.
PSA 78:53 ఆయన వారిని క్షేమంగా నడిపించారు, కాబట్టి వారు భయం లేకుండ ఉన్నారు; సముద్రంలో వారి శత్రువులను ముంచివేశారు.
PSA 78:54 ఆయన వారిని తన పవిత్ర దేశ సరిహద్దుకు, ఆయన కుడి హస్తం సంపాదించిన కొండ ప్రదేశానికి తీసుకువచ్చారు.
PSA 78:55 వారి ఎదుట నుండి ఇతర దేశాలను తరిమివేసి, ఆయన వారి భూములను వారికి వారసత్వంగా కేటాయించారు; ఆయన ఇశ్రాయేలు గోత్రాలను వారి నివాసాల్లో స్థిరపరిచారు.
PSA 78:56 కాని వారు దేవున్ని పరీక్షించారు మహోన్నతుని మీద తిరగబడ్డారు; వారు ఆయన శాసనాలను పాటించలేదు.
PSA 78:57 వారి పూర్వికుల్లా వారు ద్రోహులు అపనమ్మకస్తులు, పనికిరాని విల్లులా నిష్ప్రయోజకులు.
PSA 78:58 వారి క్షేత్రాలతో దేవునికి కోపం తెప్పించారు; వారు విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం పుట్టించారు.
PSA 78:59 దేవుడు వారి కేకలు విన్నప్పుడు, ఆయన ఆగ్రహించారు; ఆయన ఇశ్రాయేలును పూర్తిగా త్రోసివేశారు.
PSA 78:60 షిలోహు ప్రత్యక్ష గుడారాన్ని, మనుష్యుల మధ్య ఆయన వేసుకున్న గుడారాన్ని విడిచిపెట్టారు.
PSA 78:61 ఆయన తన బలానికి సూచనగా ఉన్న మందసాన్ని బందీఖానాకు, తన వైభవాన్ని శత్రువుల చేతికి అప్పగించారు.
PSA 78:62 ఆయన తన ప్రజలను ఖడ్గానికి అప్పగించారు; ఆయన తన వారసత్వం మీద ఆగ్రహించారు.
PSA 78:63 అగ్ని వారి యువకులను దహించివేసింది, వారి యువతులకు పెళ్ళి పాటలు లేవు;
PSA 78:64 వారి యాజకులు ఖడ్గానికి అప్పగించబడ్డారు వారి విధవరాండ్రు ఏడవలేకపోయారు.
PSA 78:65 అప్పుడు నిద్ర నుండి లేచినవానిలా, ద్రాక్షారస మత్తు నుండి మేల్కొన్న యోధునిలా దేవుడు మేల్కొన్నారు.
PSA 78:66 ఆయన తన శత్రువుల మీద ప్రతి దాడి చేశారు; వారికి నిత్య అవమానాన్ని కలిగించారు.
PSA 78:67 అప్పుడు ఆయన యోసేపు గుడారాలను నిరాకరించారు, ఆయన ఎఫ్రాయిం గోత్రాన్ని ఏర్పరచుకోలేదు;
PSA 78:68 కాని ఆయన యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను కొండనే ఎన్నుకున్నారు.
PSA 78:69 ఆయన పరిశుద్ధాలయాన్ని ఆకాశమంత ఎత్తుగా, భూమిలా దృఢంగా శాశ్వతంగా నిర్మించుకున్నారు.
PSA 78:70 ఆయన తన సేవకుడైన దావీదును ఎన్నుకుని, గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిపించారు;
PSA 78:71 గొర్రెలను మేపుతుండగా అతన్ని తీసుకువచ్చి తన ప్రజలైన యాకోబు మీద, తన వారసత్వమైన ఇశ్రాయేలు మీద కాపరిగా నియమించారు.
PSA 78:72 దావీదు యథార్థ హృదయంతో వారిని పాలించాడు; జ్ఞానం కలవాడై వారిని నడిపించాడు.
PSA 79:1 ఆసాపు కీర్తన. ఓ దేవా, పరదేశులు స్వాస్థ్యాన్ని ఆక్రమించుకున్నారు; అవి మీ పవిత్ర మందిరాన్ని అపవిత్రం చేశారు, యెరూషలేమును పాడు దిబ్బగా చేశారు.
PSA 79:2 వారు మీ సేవకుల కళేబరాలను ఆకాశపక్షులకు ఆహారంగా, మీ సొంత ప్రజల మాంసాన్ని అడవి మృగాలకు ఆహారంగా వదిలేశారు.
PSA 79:3 వారు యెరూషలేము చుట్టూ రక్తాన్ని నీటిలా పారబోశారు, చనిపోయినవారిని పాతిపెట్టడానికి ఎవరూ లేరు.
PSA 79:4 మా పొరుగువారికి మేము అసహ్యులం అయ్యాం, మా చుట్టుపక్కల వారు మమ్మల్ని వెక్కిరించి హేళన చేస్తున్నారు.
PSA 79:5 ఎంతకాలం, యెహోవా? మీరు ఎప్పటికీ కోప్పడతారా? ఎంతకాలం మీ రోషం అగ్నిలా మండుతుంది?
PSA 79:6 మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరట మొరపెట్టని, రాజ్యాల మీద, మీ ఉగ్రతను కుమ్మరించండి.
PSA 79:7 వారు యాకోబును మ్రింగివేశారు అతని నివాసాన్ని నాశనం చేశారు.
PSA 79:8 గత తరాల పాపాలను మాకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసుకోకండి; మీ కరుణను త్వరగా మాపై చూపండి, ఎందుకంటే మేము చాలా కష్టాల్లో ఉన్నాము.
PSA 79:9 దేవా మా రక్షకా, మీ నామ మహిమార్థమై మాకు సాయం చేయండి; మీ నామాన్ని బట్టి మమ్మల్ని విడిపించి మా పాపాలను క్షమించండి.
PSA 79:10 “వారి దేవుడు ఎక్కడ?” అని ఇతర దేశాలు ఎందుకు అనాలి? మీ సేవకుల రక్తానికి మీరు ప్రతీకారం తీర్చుకుంటారని మా కళ్ళెదుట ఇతర దేశాల వారికి తెలియజేయండి.
PSA 79:11 ఖైదీల నిట్టూర్పులు మీ ఎదుటకు వచ్చును గాక; మీ బలమైన చేతితో మరణశిక్ష విధించబడిన వారిని కాపాడండి.
PSA 79:12 ప్రభువా, మా పొరుగువారు మీమీద చూపిన ధిక్కారణకు ప్రతిగా వారి ఒడిలోకి ఏడంతలు తిరిగి చెల్లించండి.
PSA 79:13 అప్పుడు మీ ప్రజలు, మీరు మేపే గొర్రెలమైన మేము, మిమ్మల్ని నిత్యం స్తుతిస్తాము; తరతరాలకు మీ కీర్తిని ప్రకటిస్తాం.
PSA 80:1 సంగీత దర్శకునికి. “నిబంధన కలువలు” అనే రాగము మీద పాడదగినది. ఆసాపు కీర్తన. ఇశ్రాయేలు ప్రజల కాపరీ, యోసేపును మందగా నడిపిస్తున్నవాడా, మమ్మల్ని ఆలకించండి. కెరూబుల మధ్య సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా,
PSA 80:2 ఎఫ్రాయిం, బెన్యామీను, మనష్షే గోత్రాల ఎదుట ప్రకాశించండి. మీ పరాక్రమాన్ని చూపించండి; వచ్చి మమ్మల్ని రక్షించండి.
PSA 80:3 ఓ దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి; మేము రక్షింపబడేలా మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
PSA 80:4 సైన్యాల యెహోవా దేవా, ఎంతకాలం మీ ప్రజల ప్రార్థనలకు వ్యతిరేకంగా మీ కోపం మండుతుంది?
PSA 80:5 మీరు వారికి కన్నీటిని ఆహారంగా ఇచ్చారు; మీరు వారిని గిన్నె నిండ కన్నీరు త్రాగేలా చేశారు.
PSA 80:6 మమ్మల్ని మా పొరుగువారికి హాస్యాస్పదంగా చేశారు. మా శత్రువులు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు.
PSA 80:7 సైన్యాలకు అధిపతియైన దేవా, మమ్మల్ని పునరుద్ధరించండి; మేము రక్షింపబడేలా మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
PSA 80:8 మీరు ఈజిప్టు నుండి తెచ్చిన ద్రాక్షతీగను నాటారు; మీరు దేశాలను వెళ్లగొట్టి దాన్ని నాటారు.
PSA 80:9 మీరు దాని కోసం భూమిని శుభ్రం చేశారు, అది వేళ్ళూనుకొని భూమిని నింపింది.
PSA 80:10 దాని నీడ పర్వతాలను కప్పింది, దాని తీగలు దేవదారు చెట్లను కప్పాయి.
PSA 80:11 దాని కొమ్మలు సముద్రం వరకు, దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకు వ్యాపించాయి.
PSA 80:12 దారిని వెళ్లేవారంతా దాని ద్రాక్షలు తెంపేలా దాని కంచెలను మీరెందుకు పడగొట్టారు?
PSA 80:13 అడవి పందులు దానిని నాశనం చేస్తున్నాయి, పొలాల నుండి వచ్చే కీటకాలు దానిని తింటున్నాయి.
PSA 80:14 సైన్యాలకు అధిపతియైన దేవా, మా దగ్గరకు తిరిగి రండి! ఆకాశం నుండి ఇటు చూడండి! ఈ ద్రాక్షవల్లిని గమనించండి.
PSA 80:15 అది మీ కుడి హస్తం నాటిన వేరు, మీ కోసం మీరు పెంచుకొన్న కుమారుడు.
PSA 80:16 మా ద్రాక్షవల్లి నరకబడి అగ్నితో కాల్చబడింది; మీ గద్దింపుకు మీ ప్రజలు నశిస్తారు.
PSA 80:17 మీ కుడి వైపున ఉన్న మనుష్యుని మీద, మీ కోసం మీరు పెంచిన మనుష్యకుమారుని మీద మీ హస్తాన్ని ఉంచండి.
PSA 80:18 అప్పుడు మేము మీ దగ్గర నుండి వెళ్లము; మమ్మల్ని ఉజ్జీవింపచేయండి, మీ పేరట మేము ప్రార్థిస్తాము.
PSA 80:19 సైన్యాల యెహోవా, దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి; మేము రక్షింపబడేలా, మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
PSA 81:1 సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. ఆసాపు కీర్తన. మనకు బలంగా ఉన్న దేవునికి ఆనంద గానం చేయండి; యాకోబు దేవునికి బిగ్గరగా కేకలు వేయండి!
PSA 81:2 సంగీతం మొదలుపెట్టండి, కంజర వాయించండి. మధురంగా సితారా వీణ మీటండి.
PSA 81:3 అమావాస్య దినాన కొమ్ము ఊదండి, పౌర్ణమి పండుగ దినాన కొమ్ము ఊదండి;
PSA 81:4 ఇశ్రాయేలీయులకు ఇది శాసనం; ఇది యాకోబు దేవుడు ఇచ్చిన నియమము.
PSA 81:5 దేవుడు ఈజిప్టు మీదికి దండెత్తినప్పుడు, ఆయన దానిని యోసేపుకు శాసనంలా స్థాపించారు. తెలియని స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను:
PSA 81:6 “నేను వారి భుజాల మీది నుండి భారం తొలగించాను; వారి చేతులు గంపలెత్తుట నుండి విడిపించబడ్డాయి.
PSA 81:7 మీ బాధలో మీరు మొరపెట్టగా నేను మిమ్మల్ని రక్షించాను, ఉరుములతో కూడిన మేఘంలో నుండి నేను మీకు జవాబు ఇచ్చాను; మెరీబా జలాల దగ్గర నేను మిమ్మల్ని పరీక్షించాను. సెలా
PSA 81:8 నా ప్రజలారా, నా మాట వినండి, నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను ఇశ్రాయేలీయులారా, మీరు నా మాట మాత్రం వింటే ఎంత మేలు!
PSA 81:9 మీ మధ్య ఇతర దేవుడు ఉండకూడదు; మీరు నన్ను తప్ప వేరే ఏ దేవున్ని పూజించకూడదు.
PSA 81:10 నేను మీ దేవుడనైన యెహోవాను, మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన వాడను. మీ నోరు బాగా తెరవండి నేను దాన్ని నింపుతాను.
PSA 81:11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు; ఇశ్రాయేలు నాకు లోబడలేదు.
PSA 81:12 కాబట్టి వారి సొంత ఉపాయాలను అనుసరిస్తే ఎంత మేలు! నేను వారి మొండి హృదయాలకు వారిని అప్పగించాను.
PSA 81:13 “నా ప్రజలు నా మాట మాత్రమే వింటే, ఇశ్రాయేలు నా మార్గాలను మాత్రమే అనుసరిస్తే,
PSA 81:14 అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచివేసేవాన్ని, వారి శత్రువులపై నా చేయి ఎత్తేవాన్ని!
PSA 81:15 యెహోవాను ద్వేషించేవారు ఆయన ఎదుట భయంతో దాక్కుంటారు, వారి శిక్ష శాశ్వతంగా ఉంటుంది.
PSA 81:16 కానీ మిమ్మల్ని నేను శ్రేష్ఠమైన గోధుమలతో పోషిస్తాను; బండ నుండి తీసిన తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను.”
PSA 82:1 ఆసాపు కీర్తన. దేవుడు గొప్ప సభలో నిలబడి ఉన్నారు; ఆయన దైవముల మధ్య తీర్పు ఇస్తారు:
PSA 82:2 “మీరు ఎంతకాలం అన్యాయాలను సమర్థిస్తారు దుష్టులకు పక్షపాతం చూపిస్తారు? సెలా
PSA 82:3 బలహీనులు, తండ్రిలేనివారి పక్షం వహించండి; పేదలకు అణచివేయబడిన వారికి న్యాయం చేయండి.
PSA 82:4 బలహీనులను అవసరతలో ఉన్నవారిని కాపాడండి; దుష్టుల చేతి నుండి వారిని విడిపించండి.
PSA 82:5 “వారికి ఏమి తెలియదు, వారు ఏమి గ్రహించరు. వారు చీకటిలో తిరుగుతారు; భూమి పునాదులు కదిలిపోయాయి.
PSA 82:6 “ ‘మీరు “దేవుళ్ళు”; మీరంతా మహోన్నతుని కుమారులు.’
PSA 82:7 అయితే మీరు ఇతర మనుష్యుల్లా చస్తారు; ఇతర పాలకుల్లా మీరు కూలిపోతారు, అని నేనన్నాను.”
PSA 82:8 ఓ దేవా, లేవండి, భూమికి తీర్పు తీర్చండి, ఎందుకంటే అన్ని దేశాలు మీ వారసత్వంగా ఉన్నాయి.
PSA 83:1 ఒక గీతము. ఆసాపు కీర్తన. ఓ దేవా! మౌనంగా ఉండకండి; ఓ దేవా, మమ్మల్ని పెడచెవిని పెట్టకండి, నిశ్చలంగా ఉండకండి.
PSA 83:2 మీ శత్రువులు ఎలా కేకలు వేస్తున్నారో చూడండి, మిమ్మల్ని ద్వేషించేవారు తలలు పైకెత్తుతున్నారు.
PSA 83:3 వారు మీ ప్రజలకు హాని చేయాలని చూస్తున్నారు; మీరు ఆదరించే వారికి వ్యతిరేకంగా వారు కుట్రలు చేస్తారు.
PSA 83:4 “రండి, వారి దేశాన్ని లేకుండ నాశనం చేద్దాం అప్పుడు ఇశ్రాయేలీయుల పేరు ఇక జ్ఞాపకం ఉండదు” అని వారు అంటున్నారు.
PSA 83:5 వారు ఏకమనస్సుతో కుట్ర చేశారు; వారు మీకు వ్యతిరేకంగా ఒప్పందం చేసుకున్నారు.
PSA 83:6 గుడారాల్లో నివసించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, హగ్రీయీలు,
PSA 83:7 గెబాలు, అమ్మోను అమాలేకు, ఫిలిష్తియా, తూరు ప్రజలతో ఒప్పందం చేసుకున్నారు.
PSA 83:8 లోతు వారసులను బలోపేతం చేయడానికి అష్షూరు కూడా వారితో చేరింది. సెలా
PSA 83:9 మిద్యానుకు చేసినట్లుగా, కీషోను నది దగ్గర సీసెరా యాబీనుకు చేసినట్లుగా వారికి చేయండి.
PSA 83:10 వారు ఎన్-దోరు దగ్గర నశించారు నేల మీద పేడలా అయ్యారు.
PSA 83:11 ఓరేబుకు జెయేబుకు చేసినట్లు వారి సంస్థానాధిపతులకు జెబహుకు సల్మున్నాకు వారి యువరాజులందరికి చేయండి.
PSA 83:12 వారు, “దేవుని పచ్చికబయళ్లను స్వాధీనం చేసుకుందాం” అని అన్నారు.
PSA 83:13 నా దేవా, వారిని సుడి తిరిగే దుమ్ములా, గాలి ముందు కొట్టుకుపోయే పొట్టులా చేయండి.
PSA 83:14 అగ్ని అడవిని దహించునట్లు కారుచిచ్చు పర్వతాలను తగలబెట్టినట్లు,
PSA 83:15 మీ తుఫానుతో వారిని వెంటాడండి మీ సుడిగాలితో వారిని భయపెట్టండి.
PSA 83:16 వారు మీ నామాన్ని వెదకునట్లుగా, యెహోవా, సిగ్గుతో వారి ముఖాలు కప్పండి.
PSA 83:17 వారు ఎప్పటికీ సిగ్గుపడాలి భయపడాలి; వారు అవమానంలో నశించెదరు గాక.
PSA 83:18 యెహోవా అనే నామం గల మీరు భూమి మీద అందరిలో మహోన్నతుడవని వారు తెలుసుకోవాలి.
PSA 84:1 సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. కోరహు కుమారుల కీర్తన. సైన్యాల యెహోవా, మీ నివాసస్థలం ఎంత అందంగా ఉందో!
PSA 84:2 యెహోవా ఆలయ ఆవరణంలో ప్రవేశించాలని, నా ప్రాణం ఎంతగానో కోరుతుంది సొమ్మసిల్లుతుంది; సజీవుడైన దేవుని కోసం నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నాయి.
PSA 84:3 సైన్యాల యెహోవా, నా రాజా నా దేవా, మీ బలిపీఠం దగ్గరే, పిచ్చుకలకు నివాసం దొరికింది, వాన కోయిలకు గూడు దొరికింది, అక్కడే అది తన పిల్లలను పెంచుతుంది.
PSA 84:4 మీ మందిరంలో నివసించేవారు ధన్యులు; వారు నిత్యం మిమ్మల్ని స్తుతిస్తారు. సెలా
PSA 84:5 మీ నుండి బలం పొందే మనుష్యులు ధన్యులు, వారి హృదయాలు సీయోనుకు వెళ్లే రహదారుల మీదే ఉంటాయి.
PSA 84:6 వారు బాకా లోయ గుండా వెళ్తున్నప్పుడు, వారు దానిని ఊటల ప్రదేశంగా మారుస్తారు; తొలకరి వాన దానిని ఆశీర్వాదాలతో కప్పివేస్తుంది.
PSA 84:7 వారిలో ప్రతిఒక్కరు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడే వరకు వారి బలం అధికమవుతుంది.
PSA 84:8 సైన్యాల యెహోవా దేవా, నా ప్రార్థన వినండి; యాకోబు దేవా, ఆలకించండి. సెలా
PSA 84:9 మా డాలువైన ఓ దేవా! మా వైపు చూడండి; మీ అభిషిక్తునిపై దయ చూపండి.
PSA 84:10 బయట గడిపిన వెయ్యి దినాలకంటే మీ మందిరంలో ఒక్కరోజు గడపడం మేలు. దుష్టుల గుడారాల్లో నివసించడం కంటే నేను నా దేవుని మందిరంలో ఒక ద్వారపాలకునిగా ఉండడం నాకిష్టము.
PSA 84:11 యెహోవా దేవుడు మాకు సూర్యుడు డాలు; యెహోవా దయను ఘనతను అనుగ్రహిస్తారు; నిందారహితులుగా నడుచుకునే వారికి ఆయన ఏ మేలు చేయకుండ మానరు.
PSA 84:12 సైన్యాల యెహోవా, మీయందు నమ్మకముంచే మనుష్యులు ధన్యులు.
PSA 85:1 సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన. యెహోవా, మీ దేశానికి మీరు దయ చూపారు; యాకోబును చెర నుండి తిరిగి తీసుకువచ్చారు.
PSA 85:2 మీరు మీ ప్రజల దోషాన్ని క్షమించారు వారి పాపాలన్నీ కప్పివేశారు. సెలా
PSA 85:3 మీ ఉగ్రతను మీరు ప్రక్కన పెట్టారు మీ భయంకర కోపాగ్నిని చల్లార్చుకున్నారు.
PSA 85:4 మా రక్షకుడవైన దేవా, మమ్మల్ని మరల పునరుద్ధరించండి. మామీద ఉన్న మీ కోపాన్ని విడిచిపెట్టండి.
PSA 85:5 ఎప్పటికీ మీరు మామీద కోప్పడతారా? తరతరాల వరకు మామీద మీరు కోప్పడుతూనే ఉంటారా?
PSA 85:6 మీ ప్రజలు మీలో ఆనందించేలా మీరు మమ్మల్ని మరల బ్రతికించరా?
PSA 85:7 యెహోవా, మీ మారని ప్రేమను మా పట్ల చూపించండి, మీ రక్షణ మాకు అనుగ్రహించండి.
PSA 85:8 దేవుడైన యెహోవా చెప్తున్నదంతా నేను ఆలకిస్తాను; ఆయన తన ప్రజలకు, నమ్మకమైన దాసులకు సమాధానాన్ని వాగ్దానం చేస్తారు; అయితే వారు బుద్ధిహీనత వైపు తిరుగకుందురు గాక.
PSA 85:9 మన దేశంలో ఆయన మహిమ నివసించేలా, ఆయనకు భయపడేవారికి ఆయన రక్షణ ఎంతో సమీపంగా ఉంటుంది.
PSA 85:10 మారని ప్రేమ నమ్మకత్వం కలుసుకుంటాయి; నీతి సమాధానం పరస్పరం ముద్దు పెట్టుకుంటాయి.
PSA 85:11 నమ్మకత్వం భూమిలో నుండి మొలుస్తుంది, నీతి ఆకాశం నుండి తొంగి చూస్తుంది.
PSA 85:12 యెహోవా మేలైనది అనుగ్రహిస్తారు, మన భూమి తన పంటనిస్తుంది.
PSA 85:13 ఆయనకు ముందుగా నీతి వెళ్తూ ఆయన అడుగు జాడలకు మార్గం సిద్ధం చేస్తుంది.
PSA 86:1 ఒక దావీదు ప్రార్థన. యెహోవా, చెవియొగ్గి ఆలకించండి, నాకు జవాబివ్వండి, ఎందుకంటే నేను దీనుడను నిరుపేదను.
PSA 86:2 మీపట్ల విశ్వాసంగా ఉన్న నా ప్రాణాన్ని కాపాడండి; మీయందు నమ్మకం ఉంచిన సేవకుడిని రక్షించండి. మీరే నా దేవుడు;
PSA 86:3 ప్రభువా! నాపై దయచూపండి. దినమంతా నేను మీకు మొరపెడుతున్నాను.
PSA 86:4 ప్రభువా, మీ సేవకునికి ఆనందం ప్రసాదించండి, ఎందుకంటే నేను మీయందు నమ్మకం ఉంచాను.
PSA 86:5 ప్రభువా, మీరు మంచివారు క్షమించేవారు, మీకు మొరపెట్టే వారందరి పట్ల మారని ప్రేమ కలిగి ఉన్నారు.
PSA 86:6 యెహోవా, నా ప్రార్థన వినండి; నా మనవుల ధ్వని ఆలకించండి.
PSA 86:7 నేను బాధలో ఉన్నప్పుడు మీకు మొరపెడతాను, మీరు నాకు జవాబిస్తారు.
PSA 86:8 ప్రభువా, దేవుళ్ళలో మీవంటి వారు లేరు; మీ క్రియలకు ఏది సాటిలేదు.
PSA 86:9 ప్రభువా, మీరు సృజించిన దేశాలన్నీ వచ్చి మీ ముందు ఆరాధిస్తారు; వారు మీ నామానికి కీర్తి తెస్తారు.
PSA 86:10 మీరు గొప్ప దేవుడు. మీ అద్భుతాలు గొప్పవి; మీరే ఏకైక దేవుడు.
PSA 86:11 యెహోవా, మీ సత్యాన్ని అనుసరించి జీవించేలా, మీ మార్గాలు మాకు బోధించండి, నేను మీ నామానికి భయపడేలా నా హృదయానికి ఏకాగ్రత దయచేయండి.
PSA 86:12 ప్రభువా నా దేవా, నా పూర్ణహృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను; నేను మీ నామాన్ని నిరంతరం మహిమపరుస్తాను.
PSA 86:13 ఎందుకంటే నా పట్ల మీ మారని ప్రేమ ఎంతో గొప్పది; అగాధాల్లో నుండి, పాతాళంలో నుండి మీరు నన్ను విడిపించారు.
PSA 86:14 ఓ దేవా, గర్విష్ఠులైన శత్రువులు నాపై దాడి చేస్తున్నారు; క్రూరులైన ప్రజలు నన్ను చంపాలని గుమికూడుతున్నారు వారు మిమ్మల్ని లక్ష్యపెట్టరు.
PSA 86:15 కాని ప్రభువా, మీరు కనికరం, కరుణ గల దేవుడు, త్వరగా కోప్పడరు, మారని ప్రేమ, నమ్మకత్వం కలిగి ఉన్నారు.
PSA 86:16 నా వైపు తిరగండి నా మీద కరుణ చూపండి; మీ సేవకునికి మీ బలాన్ని ప్రసాదించండి; నన్ను రక్షించండి, ఎందుకంటే నేను మీ దాసురాలి కుమారుడను.
PSA 86:17 నాకు మీ ఆదరణ గుర్తు ఇవ్వండి, నన్ను ద్వేషించేవారు అది చూసి సిగ్గుపడతారు, ఎందుకంటే యెహోవా, మీరు నాకు సహాయం చేశారు నన్ను ఆదరించారు.
PSA 87:1 కోరహు కుమారుల కీర్తన. ఒక గీతము. యెహోవా తన పట్టణాన్ని పరిశుద్ధ పర్వతంపై స్థాపించారు.
PSA 87:2 యాకోబు ఇతర నివాసాలన్నిటికంటె యెహోవా సీయోను గుమ్మాలను ఎక్కువగా ప్రేమిస్తారు.
PSA 87:3 దేవుని పట్టణమా, నీ గురించి గొప్ప విషయాలు చెప్పబడ్డాయి. సెలా
PSA 87:4 “నేను రాహాబు బబులోనును నన్ను గుర్తించిన వారిగా లెక్కిస్తాను అలాగే ఫిలిష్తియా, తూరు కూషు కూడా, ‘ఇది సీయోనులో పుట్టింది’ ” అని వారంటారు.
PSA 87:5 నిజమే, సీయోను గురించి ఇలా అంటారు, “ఇది అది కూడా ఆమెలోనే జన్మించాయి, మహోన్నతుడు తానే సీయోనును స్థాపిస్తారు.”
PSA 87:6 యెహోవా పౌరుల పేర్లు నమోదు చేసేటప్పుడు “ఇది సీయోనులో జన్మించింది” అని గుర్తిస్తారు. సెలా
PSA 87:7 వారు వాయిద్యాలు వాయిస్తుండగా, “నా ఊటలన్నీ మీలోనే ఉన్నాయి” అని వారు పాడతారు.
PSA 88:1 ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన. సంగీత దర్శకునికి. మహలతు లయన్నోత్ అనే రాగం మీద పాడదగినది. ఎజ్రాహీయుడైన హేమాను ధ్యానకీర్తన. యెహోవా, మీరు నన్ను రక్షించే దేవుడు; రాత్రింబగళ్ళు నేను మీకు మొరపెడతాను.
PSA 88:2 నా ప్రార్థనలు మీ ఎదుటకు వచ్చును గాక; చెవియొగ్గి నా మొర ఆలకించండి.
PSA 88:3 నేను ఇబ్బందుల్లో మునిగి ఉన్నాను నా ప్రాణం మరణానికి చేరువగా ఉంది.
PSA 88:4 సమాధికి వెళ్లే వారితో నేను లెక్కించబడ్డాను; నేను బలం లేనివాడిలా ఉన్నాను.
PSA 88:5 సమాధిలో పడి ఉన్న హతులైనవారిలా, నేను చచ్చినవారితో విడిచిపెట్టబడ్డాను, వారిని మీరు ఎన్నటికి జ్ఞాపకముంచుకోరు, వారు మీ సంరక్షణ నుండి తొలగిపోయారు.
PSA 88:6 మీరు నన్ను లోతైన గుంటలో, చీకటి గుంటలో ఉంచారు.
PSA 88:7 మీ ఉగ్రత నా మీద భారంగా ఉంది; మీ అలలతో నన్ను ముంచివేశారు. సెలా
PSA 88:8 నా దగ్గరి స్నేహితులను నా నుండి దూరం చేశారు నన్ను వారికి అసహ్యమైన వానిగా చేశారు. నేను నిర్బంధించబడ్డాను నేను తప్పించుకోలేను;
PSA 88:9 దుఃఖంతో నా కళ్లు మసకబారాయి. యెహోవా, ప్రతిరోజు నేను మీకు మొరపెడుతున్నాను; మీ వైపు నా చేతులు చాచాను.
PSA 88:10 మృతులకు మీరు అద్భుతాలు చూపిస్తారా? వారి ఆత్మలు లేచి మిమ్మల్ని స్తుతిస్తాయా? సెలా
PSA 88:11 సమాధిలో మీ మారని ప్రేమ ప్రకటించబడుతుందా? నాశనకూపంలో మీ నమ్మకత్వం ప్రకటించబడుతుందా?
PSA 88:12 చీకటి స్థలంలో మీ అద్భుతాలు తెలుస్తాయా? మరుపుకు గురియైన దేశంలో మీ నీతి క్రియలు తెలుస్తాయా?
PSA 88:13 కాని యెహోవా, నేను సహాయం కోసం మీకు మొరపెడతాను; ఉదయం నా ప్రార్థన మీ ఎదుటకు వస్తుంది.
PSA 88:14 యెహోవా, మీరు ఎందుకు నన్ను తృణీకరిస్తూ నా నుండి మీ ముఖాన్ని దాచుకుంటున్నారు?
PSA 88:15 నా యవ్వనం నుండి నేను బాధను అనుభవించి మరణానికి దగ్గరగా ఉన్నాను; నేను మీ భయాలను భరించి నిరాశలో ఉన్నాను.
PSA 88:16 మీ ఉగ్రత నన్ను ముంచేసింది; మీ భయాలు నన్ను నిర్మూలం చేశాయి.
PSA 88:17 అవి రోజంతా ప్రవాహంలా నన్ను చుట్టుముట్టాయి; అవి నన్ను పూర్తిగా ముంచేశాయి.
PSA 88:18 నా స్నేహితులను నా పొరుగువారిని నాకు దూరం చేశారు చీకటే నాకు దగ్గరి స్నేహితుడు.
PSA 89:1 ఎజ్రాహీయుడైన ఏతాను ధ్యానకీర్తన. యెహోవా యొక్క మారని ప్రేమను గురించి నేను ఎల్లప్పుడూ పాడతాను; నా నోటితో మీ నమ్మకత్వాన్ని అన్ని తరాలకు తెలియజేస్తాను.
PSA 89:2 మీ ప్రేమ ఎల్లప్పుడు దృఢంగా నిలిచి ఉంటుందని, మీ నమ్మకత్వాన్ని మీరు పరలోకంలోనే స్థాపించారని నేను ప్రకటిస్తాను.
PSA 89:3 “నేను ఏర్పరచుకున్న వానితో నేను ఒడంబడిక చేశాను, నా సేవకుడైన దావీదుకు ప్రమాణం చేశాను.
PSA 89:4 ‘మీ వంశాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను మీ సింహాసనాన్ని అన్ని తరాలకు స్థిరపరుస్తాను’ ” అని మీరన్నారు. సెలా
PSA 89:5 యెహోవా, ఆకాశాలు మీ అద్భుతాలను స్తుతిస్తున్నాయి, అలాగే పరిశుద్ధుల సభలో మీ నమ్మకత్వం స్తుతించబడుతుంది.
PSA 89:6 అంతరిక్షాల్లో యెహోవాతో పోల్చదగిన వారు ఎవరు? దైవపుత్రులలో ఆయనకు సాటి ఎవరు?
PSA 89:7 పరిశుద్ధుల సభలో దేవుడు మహా భీకరుడు; తన చుట్టూ ఉన్న వారందరికంటే ఆయన అధిక గౌరవనీయుడు.
PSA 89:8 సైన్యాల యెహోవా దేవా, మీలాంటి వారెవరు? యెహోవా మీరు మహా బలాఢ్యులు, మీ నమ్మకత్వం మీ చుట్టూ ఆవరించి ఉంది.
PSA 89:9 పొంగే సముద్రాన్ని మీరు అదుపులో ఉంచుతారు; అలలను మీరు అణచివేస్తారు.
PSA 89:10 చచ్చిన దానితో సమానంగా మీరు రాహాబును నలగ్గొట్టారు; మీ బలమైన బాహువు శత్రువులను చెదరగొట్టింది.
PSA 89:11 ఆకాశాలు మీవే, భూమి కూడ మీదే; లోకాన్ని దానిలో ఉన్నదంతా మీరే స్థాపించారు.
PSA 89:12 ఉత్తర దక్షిణ దిక్కులను మీరే సృజించారు; తాబోరు హెర్మోను పర్వతాలు మీ నామాన్ని బట్టి ఆనంద గానం చేస్తున్నాయి.
PSA 89:13 మీ బాహువు శక్తి కలది; మీ చేయి బలమైనది, మీ కుడిచేయి ఘనమైనది.
PSA 89:14 నీతి న్యాయం మీ సింహాసనానికి పునాదులు; మారని ప్రేమ, నమ్మకత్వం మీ ఎదుట నడుస్తాయి.
PSA 89:15 యెహోవా, మీ గురించి ఆనంద కేకలు వేసేవారు ధన్యులు, మీ సన్నిధి కాంతిలో వారు నడుస్తారు.
PSA 89:16 రోజంతా మీ నామాన్ని బట్టి వారు ఆనందిస్తారు; మీ నీతిని బట్టి వారు హర్షిస్తారు.
PSA 89:17 ఎందుకంటే వారి మహిమ వారి బలం మీరే, మీ దయతో మా కొమ్మును హెచ్చిస్తారు.
PSA 89:18 నిజానికి, మా డాలు యెహోవాకు చెందినది, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధునికి చెందిన వాడు.
PSA 89:19 ఒకనాడు మీరు దర్శనంలో మాట్లాడుతూ, మీకు నమ్మకమైన వారితో మీరిలా అన్నారు: “నేను వీరుడికి సాయం చేశాను. ఒక యువకుడిని ప్రజల్లో నుండి లేవనెత్తాను.
PSA 89:20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను; నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.
PSA 89:21 అతనికి నా చేయి తోడుగా ఉంది; నా బాహువు అతన్ని బలపరుస్తుంది.
PSA 89:22 శత్రువు అతని నుండి పన్ను వసూలు చేయలేడు; దుష్టులు అతన్ని అణచివేయలేరు.
PSA 89:23 అతని ఎదుటనే అతని పగవారిని పడగొడతాను, అతన్ని ద్వేషించేవారిని మొత్తుతాను.
PSA 89:24 నా నమ్మకత్వం నా మారని ప్రేమ అతనితో ఉంటాయి, నా నామాన్ని బట్టి అతని కొమ్ము హెచ్చంపబడుతుంది.
PSA 89:25 నేను అతని చేతిని సముద్రం మీద, అతని కుడి హస్తాన్ని నదుల మీద ఉంచుతాను.
PSA 89:26 ‘మీరు నా తండ్రి, నా దేవుడు నా కొండ, నా రక్షకుడు’ అని అతడు నాకు మొరపెడతాడు.
PSA 89:27 అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చూసుకుంటాను, భూరాజులందరిలో అతన్ని మహా ఉన్నతమైనవానిగా చేస్తాను.
PSA 89:28 నేను అతని పట్ల నా మారని ప్రేమను నిత్యం కొనసాగిస్తాను, అతనితో నా నిబంధన స్థిరమైనది.
PSA 89:29 అతని వంశాన్ని నిత్యం స్థాపిస్తాను, అతని సింహాసనం ఆకాశాలు ఉన్నంత వరకు ఉంటుంది.
PSA 89:30 “అతని కుమారులు నా న్యాయవిధుల నుండి తొలగిపోయినా నా చట్టాలను పాటించకపోయినా
PSA 89:31 ఒకవేళ వారు నా శాసనాలను ఉల్లంఘించినా నా ఆజ్ఞలను గైకొనకపోయినా,
PSA 89:32 నేను వారి పాపాన్ని దండంతో, వారి దోషాన్ని దెబ్బలతోను శిక్షిస్తాను;
PSA 89:33 అయితే వారికి నా ప్రేమను పూర్తిగా దూరం చేయను, నా నమ్మకత్వాన్ని ఎన్నటికి విడిచిపెట్టను.
PSA 89:34 నా నిబంధనను నేను భంగం కానివ్వను. నేను చెప్పినదానిలో ఒక మాట కూడా తప్పిపోదు.
PSA 89:35 నా పరిశుద్ధత తోడని ప్రమాణం చేశాను, నేను దావీదుతో అబద్ధం చెప్పను.
PSA 89:36 అతని వంశం నిత్యం ఉంటుందని, సూర్యుడు ఉన్నంత వరకు అతని సింహాసనం నా ఎదుట ఉంటుందని;
PSA 89:37 ఆకాశంలో విశ్వసనీయమైన సాక్ష్యంగా ఉన్న చంద్రునిలా, అది శాశ్వతంగా స్థిరపరచబడి ఉంటుంది” అని అన్నాను. సెలా
PSA 89:38 కాని మీరు నన్ను తిరస్కరించి త్రోసివేశారు, మీరు అభిషేకించిన వానిపై మీరు చాలా కోపంగా ఉన్నారు.
PSA 89:39 మీరు మీ సేవకునితో చేసిన ఒడంబడికను విడిచిపెట్టి, అతని కిరీటాన్ని ధూళిలో పడవేసి అపవిత్రం చేశారు.
PSA 89:40 మీరు అతని ప్రాకారపు గోడలు పడగొట్టారు అతని బలమైన కోటలను పాడుచేశారు.
PSA 89:41 దారిన వెళ్లే వారందరూ అతన్ని దోచుకున్నారు; అతని పొరుగువారు అతడిని అపహాస్యం చేశారు.
PSA 89:42 మీరు అతని శత్రువుల కుడిచేతిని బలపరిచారు; అతని శత్రువులందరు ఆనందించేలా చేశారు.
PSA 89:43 నిజానికి, మీరు అతని ఖడ్గం అంచును వెనుకకు తిప్పారు యుద్ధంలో అతనికి సాయం చేయలేదు.
PSA 89:44 మీరు అతని వైభవాన్ని అంతం చేశారు అతని సింహాసనాన్ని నేలమీద పడవేశారు.
PSA 89:45 అతని యవ్వన దినాలను తగ్గించారు; అవమానంతో అతన్ని కప్పారు. సెలా
PSA 89:46 ఎంతకాలం, యెహోవా? ఎప్పటికీ మీరు మరుగై ఉంటారా? ఎంతకాలం మీ ఉగ్రత అగ్నిలా మండుతూ ఉంటుంది?
PSA 89:47 నా ఆయుష్షు ఎంత నిలకడలేనిదో జ్ఞాపకం చేసుకోండి, వ్యర్థంగా మీరు మనుష్యులందరిని సృష్టించారు కదా!
PSA 89:48 మరణం చూడకుండ ఎవరు బ్రతకగలరు? సమాధి బలం నుండి మనిషిని ఎవరు రక్షించగలరు? సెలా
PSA 89:49 ప్రభువా, మీ నమ్మకత్వంతో మీరు దావీదుకు వాగ్దానం చేసి మీరు మొదట చూపిన ఆ మారని ప్రేమ ఎక్కడ?
PSA 89:50 ప్రభువా, మీ సేవకులు ఎలా ఎగతాళి చేయబడ్డారో, అన్ని దేశాల నిందలను నేను నా హృదయంలో ఎలా భరిస్తున్నానో
PSA 89:51 యెహోవా, అవి మీ శత్రువులు ఎగతాళిగా చేసిన నిందలు, అడుగడుగునా మీ అభిషిక్తుని వారు చేసిన ఎగతాళి జ్ఞాపకం తెచ్చుకోండి.
PSA 89:52 యెహోవాకే నిత్యం స్తుతి కలుగును గాక!
PSA 90:1 దైవజనుడైన మోషే చేసిన ఒక ప్రార్థన. ప్రభువా, తరతరాల నుండి మీరే మా నివాస స్థలంగా ఉన్నారు.
PSA 90:2 పర్వతాలు పుట్టక ముందే, మీరు లోకమంతటిని చేయక ముందే నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు మీరే దేవుడు.
PSA 90:3 “మనుష్యులారా, మీరు మంటికి తిరిగి వెళ్లండి” అని అంటూ, మీరు ప్రజలను ధూళి వైపుకు తిరిగి త్రిప్పుతారు.
PSA 90:4 మీ దృష్టిలో వెయ్యి సంవత్సరాలు ఇప్పుడే గడిచిన రోజులా, రాత్రి జాముల్లా ఉన్నాయి.
PSA 90:5 అయినప్పటికీ మీరు మరణ నిద్రలో ప్రజలను ప్రవాహంలా తుడిచివేస్తారు; వారు ప్రొద్దున్నే మొలిచిన గడ్డిలా ఉన్నారు.
PSA 90:6 అది ఉదయం క్రొత్తగా పుడుతుంది, సాయంకాలానికల్లా వాడి ఎండిపోతుంది.
PSA 90:7 మేము మీ కోపాగ్నికి దహించుకు పోతున్నాము మీ ఆగ్రహానికి భయపడుతున్నాము.
PSA 90:8 మీరు మా దోషాలను మీ ఎదుట, మా రహస్య పాపాలను మీ సన్నిధి కాంతిలో ఉంచారు.
PSA 90:9 మా దినాలన్ని మీ ఉగ్రత లోనే గడిచిపోయాయి; మేము మా సంవత్సరాలను మూలుగుతో ముగిస్తాము.
PSA 90:10 మా ఆయుష్షు డెబ్బై సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు; అయినా వాటి వైభవం నాశనం దుష్టత్వం, అవి త్వరగా గడచిపోతాయి, మేము ఎగిరిపోతాం.
PSA 90:11 ఒకవేళ మీ కోపం యొక్క శక్తి ఎవరు గ్రహించగలరు! మీ ఉగ్రత మీకు చెందిన భయంలా భీకరంగా ఉంటుంది.
PSA 90:12 మా దినాలను లెక్కించడం మాకు నేర్పండి, తద్వార మేము జ్ఞానంగల హృదయాన్ని సంపాదించగలము.
PSA 90:13 యెహోవా, మా దగ్గరకు తిరిగి రండి! ఇంకెంత కాలం? మీ దాసుల మీద కనికరం చూపండి.
PSA 90:14 ఉదయం మీ మారని ప్రేమతో మమ్మల్ని తృప్తిపరచండి, తద్వార బ్రతికినన్నాళ్ళు ఆనంద గానం చేస్తూ ఆనందిస్తాము.
PSA 90:15 మమ్మల్ని బాధించినన్ని దినాలు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినన్నాళ్ళు మమ్మల్ని సంతోషింపజేయండి.
PSA 90:16 మీ క్రియలు మీ సేవకులకు, మీ ప్రభావము వారి పిల్లలకు కనుపరచబడును గాక.
PSA 90:17 మన ప్రభువైన దేవుని దయ మనమీద ఉండును గాక; మా చేతి పనులను మాకోసం స్థిరపరచండి, అవును, మా చేతి పనులను స్థిరపరచండి.
PSA 91:1 మహోన్నతుడైన దేవుని చాటున నివసించేవారు సర్వశక్తిమంతుని నీడలో స్థిరంగా ఉంటారు.
PSA 91:2 యెహోవా గురించి నేను చెప్పేదేమంటే, “ఆయనే నా ఆశ్రయం నా కోట, నా దేవుడు, ఆయననే నేను నమ్ముకున్నాను.”
PSA 91:3 వేటగాని వల నుండి, మరణకరమైన తెగులు నుండి, ఆయన తప్పక విడిపిస్తారు.
PSA 91:4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతారు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం; ఆయన నమ్మకత్వం నీకు డాలుగాను గోడగాను ఉంటుంది.
PSA 91:5 రాత్రి భయాలకు గాని, పగటి పూట ఎగిరి వచ్చే బాణాలకు గాని,
PSA 91:6 చీకటిలో సంచరించే తెగులుకు గాని, మధ్యహ్నం హఠాత్తుగా కలిగే నాశనానికి గాని, నీవు భయపడాల్సిన అవసరం లేదు.
PSA 91:7 నీ ప్రక్కన వేయిమంది, నీ కుడి ప్రక్కన పదివేలమంది కూలవచ్చు, అయినా, అది నీ దగ్గరకు రాదు.
PSA 91:8 నీవు నీ కళ్లతో గమనిస్తావు దుష్టులు శిక్ష పొందడం నీవు చూస్తావు.
PSA 91:9 “యెహోవా నాకు ఆశ్రయం” అని ఒకవేళ నీవు అని, మహోన్నతుని నీకు నివాసంగా చేసుకుంటే,
PSA 91:10 ఏ హాని నీ మీదికి రాదు, ఏ తెగులు నీ గుడారానికి దగ్గరగా రాదు.
PSA 91:11 నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడమని నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు.
PSA 91:12 నీ పాదాలకు రాయి తగలకుండ, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు.
PSA 91:13 నీవు సింహం మీద నాగుపాము మీద నడిచి వెళ్తావు; కొదమ సింహాన్ని సర్పాన్ని త్రొక్కివేస్తావు.
PSA 91:14 “అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి నేను అతన్ని విడిపిస్తాను” అని యెహోవా అంటున్నారు; అతడు నా నామాన్ని గుర్తిస్తాడు, కాబట్టి నేను అతన్ని కాపాడతాను.
PSA 91:15 అతడు నాకు మొరపెడతాడు, నేను అతనికి జవాబిస్తాను; కష్టాల్లో నేనతనిని ఆదుకుంటాను, అతన్ని విడిపిస్తాను ఘనపరుస్తాను.
PSA 91:16 దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను.
PSA 92:1 సబ్బాతు దినానికి తగిన కీర్తన. ఒక గీతము. యెహోవాను స్తుతించడం మంచిది. మహోన్నతుడా, మీ నామాన్ని కీర్తించడం మంచిది.
PSA 92:2 ఉదయకాలం మీ మారని ప్రేమను రాత్రివేళ మీ నమ్మకత్వాన్ని పది తంతుల వీణ సితారా మాధుర్యంతో ప్రకటించడం మంచిది.
PSA 92:4 ఎందుకంటే యెహోవా, మీ కార్యముల చేత నాకు సంతోషం కలిగిస్తారు; మీ చేతులు చేసిన వాటిని బట్టి నేను ఆనంద గానం చేస్తాను.
PSA 92:5 యెహోవా, మీ క్రియలు ఎంత గొప్పవి, మీ ఆలోచనలు ఎంత గంభీరమైనవి!
PSA 92:6 దుష్టులు గడ్డిలా మొలకెత్తినా, కీడుచేసేవారంతా వర్ధిల్లుతున్నా, వారు శాశ్వతంగా నాశనమవుతారని, తెలివిలేనివారికి తెలియదు, మూర్ఖులు గ్రహించరు.
PSA 92:8 కాని యెహోవా, మీరు శాశ్వతంగా హెచ్చింపబడి ఉన్నారు.
PSA 92:9 యెహోవా, మీ శత్రువులు, నిజంగా మీ శత్రువులు నశిస్తారు; కీడుచేసేవారంతా చెదరిపోతారు.
PSA 92:10 మీరు నా కొమ్మును అడవి ఎద్దులా హెచ్చించారు; చక్కని నూనెలు నాపై పోయబడ్డాయి.
PSA 92:11 నా విరోధుల ఓటమిని నేను కళ్లారా చూశాను; నా దుష్టుల పూర్తి పరాజయాన్ని నా చెవులారా విన్నాను.
PSA 92:12 నీతిమంతులు తాటి చెట్లలా చిగురు పెడతారు, లెబానోనులో వారు దేవదారు చెట్టులా హుందాగా పెరుగుతారు.
PSA 92:13 వారు యెహోవా దేవాలయంలో నాటబడి, మన దేవుని ఆవరణాల్లో వర్థిల్లుతారు.
PSA 92:14 వారు వృద్ధాప్యంలో కూడా సఫలమైన జీవితంలో సారవంతంగా హాయిగా బ్రతుకుతారు,
PSA 92:15 “యెహోవా యథార్థవంతుడు, ఆయన నా కొండ, ఆయనయందు ఏ దుష్టత్వం లేదు” అని వారు ప్రకటిస్తూ ఉంటారు.
PSA 93:1 యెహోవా పరిపాలిస్తున్నారు, ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నారు; యెహోవా ప్రభావాన్ని వస్త్రంగా బలాన్ని ఆయుధంగా ధరించుకున్నారు; నిజానికి, ప్రపంచం దృఢంగా క్షేమంగా స్థాపించబడింది.
PSA 93:2 మీ సింహాసనం ఆది నుండి సుస్థిరమే. అనాది కాలం నుండి మీరున్నారు.
PSA 93:3 యెహోవా, నదులలో వరదలు లేచాయి, నదులు ఉరుములా గర్జిస్తున్నాయి, అలలు చెలరేగుతున్నాయి.
PSA 93:4 జలప్రవాహాల ఘోష కన్నా బలమైన సముద్ర తరంగాల కన్నా, యెహోవా బలాఢ్యుడై ఉన్నాడు.
PSA 93:5 యెహోవా, మీ శాసనాలు స్థిరమైనవి; యెహోవా మీ మందిరం అంతం లేనన్ని దినాలు పరిశుద్ధతతో అలంకరించబడుతుంది.
PSA 94:1 యెహోవా ప్రతీకారం చేసే దేవుడు. ప్రతీకారం సాధించే దేవా, ప్రకాశించండి.
PSA 94:2 లోక న్యాయాధిపతి, లేవండి; గర్విష్ఠులకు తగ్గ ప్రతిఫలం ఇవ్వండి.
PSA 94:3 యెహోవా, ఎంతకాలం దుష్టులు, ఎంతకాలం దుష్టులు ఆనందిస్తారు?
PSA 94:4 వారు అహంకారపు మాటలు మాట్లాడతారు; కీడుచేసేవారంతా గొప్పలు చెప్పుకుంటారు.
PSA 94:5 యెహోవా, వారు మీ ప్రజలను నలిపివేస్తారు; మీ వారసత్వాన్ని అణచివేస్తారు.
PSA 94:6 విధవరాండ్రను విదేశీయులను చంపేస్తారు; వారు తండ్రిలేనివారిని హత్య చేస్తారు.
PSA 94:7 వారంటారు, “యెహోవా చూడడం లేదు; యాకోబు దేవుడు గమనించడంలేదు.”
PSA 94:8 ప్రజల్లో తెలివిలేని మీరు, గమనించండి; అవివేకులారా, మీరు ఎప్పుడు జ్ఞానులవుతారు?
PSA 94:9 చెవులిచ్చినవాడు వినడా? కళ్ళిచ్చిన వాడు చూడడా?
PSA 94:10 దేశాలను శిక్షణ చేసేవాడు మిమ్మల్ని శిక్షించడా? నరులకు బోధించేవానికి తెలివిలేదా?
PSA 94:11 మనుష్యుల ప్రణాళికలన్నీ యెహోవాకు తెలుసు; అవి వ్యర్థమైనవి అని ఆయనకు తెలుసు.
PSA 94:12 యెహోవా శిక్షణ చేసినవారు ధన్యులు, వారికి మీ ధర్మశాస్త్రం నుండి మీరు బోధిస్తారు.
PSA 94:13 దుష్టుని కోసం గొయ్యి త్రవ్వబడే వరకు, ఇబ్బంది దినాల నుండి మీరు వారికి ఉపశమనం కలిగిస్తారు.
PSA 94:14 యెహోవా తన ప్రజలను తృణీకరించరు; ఆయన తన వారసత్వాన్ని ఎన్నడు విడిచిపెట్టరు.
PSA 94:15 తీర్పు మళ్ళీ నీతి మీద స్థాపించబడుతుంది, యథార్థవంతులందరు దానిని అనుసరిస్తారు.
PSA 94:16 నా కోసం దుష్టునికి వ్యతిరేకంగా ఎవరు లేస్తారు? కీడు చేసేవారిని నా కోసం ఎవరు వ్యతిరేకిస్తారు?
PSA 94:17 యెహోవా నాకు సాయం చేసి ఉండకపోతే, నేను మౌన నిద్రలో నివసించేవాన్ని.
PSA 94:18 “నా కాలు జారింది” అని నేను అన్నప్పుడు, యెహోవా, మీ మారని ప్రేమ నన్ను ఎత్తి పట్టుకున్నది.
PSA 94:19 ఆందోళన కలిగించే తలంపులు ఎక్కువ అవుతున్నాయి. మీ ఓదార్పు నాకు ఆనందాన్ని కలిగించింది.
PSA 94:20 శాసనాల ద్వారా కష్టాలు తెచ్చే అవినీతి సింహాసనం మీతో పొత్తు పెట్టుకోగలదా?
PSA 94:21 నీతిమంతుల ప్రాణాలు తియ్యటానికి దుష్టులు దుమ్మీగా వచ్చి పైకి ఎగబడతారు. నిర్దోషులపై నేరాలు మోపి మరణశిక్ష విధిస్తారు.
PSA 94:22 యెహోవా నాకు ఎత్తైన కోట. నా దేవుడు నేను ఆశ్రయించే కొండ.
PSA 94:23 వారి పాపాలకు ఆయన వారికి తిరిగి చెల్లిస్తారు వారి దుష్టత్వాన్ని బట్టి వారిని నాశనం చేస్తారు; మన దేవుడైన యెహోవా వారిని నాశనం చేస్తారు.
PSA 95:1 రండి! యెహోవాను గురించి ఆనంద గానం చేద్దాం; రక్షణ కొండయైన దేవునికి ఆనంద కేకలు వేద్దాము.
PSA 95:2 కృతజ్ఞతార్పణతో ఆయన సన్నిధికి వద్దాం, సంగీత గానంతో ఆయనను కీర్తిద్దాము.
PSA 95:3 యెహోవా గొప్ప దేవుడు, దైవములందరి పైన గొప్ప రాజు.
PSA 95:4 భూమి యొక్క అగాధాలు ఆయన చేతిలో ఉన్నాయి, పర్వత శిఖరాలు ఆయనకు చెందినవే.
PSA 95:5 సముద్రం ఆయనదే, ఆయనే దాన్ని చేశారు, ఆయన హస్తాలు ఆరిన నేలను రూపొందించాయి.
PSA 95:6 రండి, సాగిలపడి ఆరాధించుదాం, మన సృష్టికర్తయైన యెహోవాకు మోకరించుదాం;
PSA 95:7 ఎందుకంటే ఆయన మన దేవుడు మనం ఆయన పచ్చికలోని ప్రజలం, ఆయన శ్రద్ధచూపే మంద. నేడు, ఆయన స్వరాన్ని ఒకవేళ మీరు వింటే మంచిది,
PSA 95:8 “మీరు మెరీబా దగ్గర చేసినట్టుగా, అరణ్యంలో మస్సా దగ్గర చేసినట్టుగా మీ హృదయాలను కఠినం చేసుకోకండి.
PSA 95:9 అక్కడ మీ పూర్వికులు నన్ను సందేహించారు; నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా నన్ను పరీక్షించారు.
PSA 95:10 నలువది సంవత్సరాలు నేను ఆ తరం వారిపై కోప్పడి ఇలా అన్నాను: ‘వారు హృదయాలు పెడత్రోవ పట్టిన ప్రజలు, వారు నా మార్గాలను తెలుసుకోలేదు’
PSA 95:11 కాబట్టి, ‘వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’ అని నేను కోపంలో ప్రమాణం చేశాను.”
PSA 96:1 యెహోవాను గురించి క్రొత్త పాట పాడండి; సమస్త భూలోకమా, యెహోవాకు పాడండి.
PSA 96:2 యెహోవాకు పాడండి, ఆయన నామాన్ని స్తుతించండి; అనుదినం ఆయన రక్షణను ప్రకటించండి.
PSA 96:3 దేశాల్లో ఆయన మహిమను, సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి.
PSA 96:4 యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు; దేవుళ్ళందరికంటే ఆయన భయపడదగిన వారు.
PSA 96:5 ఇతర దేశాల దేవుళ్ళందరు వట్టి విగ్రహాలు, కాని యెహోవా ఆకాశాలను సృజించారు.
PSA 96:6 వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి; బలం, మహిమ ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాయి.
PSA 96:7 ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి, మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి.
PSA 96:8 యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే చెల్లించండి. అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి.
PSA 96:9 తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి; సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి.
PSA 96:10 “యెహోవా పరిపాలిస్తారు” అని జనాంగాలలో ప్రకటించండి, లోకం స్థిరంగా స్థాపించబడింది, అది కదలదు; ఆయన జనాంగాలకు న్యాయంగా తీర్పు తీరుస్తారు.
PSA 96:11 ఆకాశాలు ఆనందించాలి, భూమి సంతోషించాలి; సముద్రం, దానిలోని సమస్తం ఘోషించాలి. ఆయన మహిమను ప్రచురించాలి.
PSA 96:12 పొలాలు వాటిలోని సమస్తం ఆనంద ధ్వనులు చేయాలి. అడవి చెట్లు ఆనందంతో పాటలు పాడాలి.
PSA 96:13 యెహోవా రాబోతున్నారు. భూలోకానికి తీర్పు తీరుస్తారు. నీతిని బట్టి లోకానికి, తన నమ్మకత్వాన్ని బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తారు.
PSA 97:1 యెహోవా పరిపాలిస్తారు, భూతలం ఆనందిస్తుంది; ద్వీపాలు, సముద్ర తీర ప్రదేశాలు సంతోషిస్తాయి.
PSA 97:2 ఆయన చుట్టూరా మోఘాలు సాంద్రమైన చీకటితో ఆవరించి ఉన్నాయి; ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు పునాదులు.
PSA 97:3 ఆయన ఎదుట నుండి మంటలు బయలుదేరి చుట్టూరా చేరి ఉన్న శత్రువులను దహించి వేస్తాయి.
PSA 97:4 ఆయన మెరుపులు లోకాన్ని వెలుగిస్తాయి; అది చూసి భూమి కంపిస్తుంది.
PSA 97:5 యెహోవా సమక్షంలో పర్వతాలు మైనంలా కరిగిపోతాయి, ఆయన సర్వప్రపంచానికీ ప్రభువు.
PSA 97:6 ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తాయి, ప్రజలంతా ఆయన మహిమను చూస్తారు.
PSA 97:7 వ్యర్థ విగ్రహాలనుబట్టి గొప్పలు చెప్తూ, చెక్కిన ప్రతిమలను పూజించేవారందరు సిగ్గుపడతారు సకల దేవుళ్ళారా, యెహోవా ఎదుట సాగిలపడండి!
PSA 97:8 యెహోవా! మీ తీర్పులను బట్టి సీయోను విని సంతోషిస్తూ ఉంది యూదా కుమార్తెలు ఆనందిస్తున్నారు.
PSA 97:9 యెహోవా, భూమి అంతటికి పైగా ఉన్నావు; దేవుళ్ళందరి పైన మీరు మహోన్నతులు.
PSA 97:10 యెహోవాను ప్రేమించేవారు కీడును ద్వేషించుదురు గాక, ఎందుకంటే తన నమ్మకమైన వారి జీవితాలను ఆయన కావలి కాస్తారు దుష్టుల చేతి నుండి ఆయన విడిపిస్తారు.
PSA 97:11 నీతిమంతుల మీద వెలుగు యథార్థవంతుల మీద ఆనందం ప్రకాశిస్తాయి.
PSA 97:12 నీతిమంతులారా, యెహోవాయందు ఆనందించండి, ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పుకోండి.
PSA 98:1 ఒక కీర్తన. యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారు; ఆయన కుడిచేయి ఆయన పవిత్రమైన బాహువు విజయాన్ని కలిగిస్తాయి.
PSA 98:2 యెహోవా రక్షణను వెల్లడించారు. దేశాల ఎదుట తన నీతిని వెల్లడించారు.
PSA 98:3 ఇశ్రాయేలుకు తన ప్రేమను నమ్మకత్వాన్ని చూపాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు; మన దేవుని రక్షణ భూమ్యంతాల వరకు కనపడింది.
PSA 98:4 భూ సమస్తమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయి, సంగీతంతో ఉత్సాహ గానం చేయి;
PSA 98:5 వీణతో యెహోవాకు సంగీత నాదం చేయి, వీణతో, గాన ధ్వనితో,
PSA 98:6 బూరలు, పొట్టేలు కొమ్ము ఊదుతూ, రాజైన యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చేయి.
PSA 98:7 సముద్రం, అందులో ఉన్నదంతా, లోకం, అందులో జీవించేవారంతా ప్రతిధ్వని చేయును గాక.
PSA 98:8 యెహోవా సన్నిధిలో నదులు చప్పట్లు కొడతాయి. పర్వతాలు ఆనందంగా పాడతాయి.
PSA 98:9 యెహోవా లోకానికి తీర్పరిగా, రాజుగా రాబోతున్నారు. ఆయన పరిపాలన ఆయన తీర్పులు న్యాయసమ్మతమైనవి.
PSA 99:1 యెహోవా పరిపాలిస్తారు, ప్రజలు భయభక్తులతో వణికి పోతున్నారు; కెరూబులకు పైగా సింహాసనాసీనుడై దేవుడు కనిపిస్తున్నారు, భూమి కంపించాలి.
PSA 99:2 సీయోను పట్టణంలో యెహోవా వైభవోపేతంగా అందరికంటే పైన ఉన్నారు.
PSA 99:3 వారు మీ భీకరమైన గొప్ప నామాన్ని స్తుతిస్తారు, మీరు పరిశుద్ధులు.
PSA 99:4 రాజు నిజాయితీ కలిగి న్యాయాన్ని ప్రేమిస్తాడు కాబట్టి మీరు అతన్ని సుస్థిరంగా నిలబెడతారు; యాకోబు ప్రజల పట్ల అంటే ఇశ్రాయేలీయుల పట్ల నీతి నాయ్యాలు జరిగిస్తారు.
PSA 99:5 మన దేవుడైన యెహోవాను మహిమపరచండి ఆయన పాదపీఠం దగ్గర ఆరాధించండి; ఆయన పవిత్రులు.
PSA 99:6 దేవునికి చెందిన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు, యెహోవా నామాన ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు; వారు దేవునికి ప్రార్థన చేశారు, ఆయన జవాబిచ్చారు.
PSA 99:7 మేఘస్తంభంలో నుండి ఆయన మాట్లాడారు. వారు ఆయన చట్టాలు పాటించారు ఆయన ఇచ్చిన శాసనాలను వారు అమలుచేశారు.
PSA 99:8 యెహోవా మా దేవా, మీరు వారికి జవాబిచ్చారు. మీరు వారికి క్షమించే దేవుడు, కాని వారు తప్పు చేసినప్పుడు మీరు వారిని శిక్షించారు.
PSA 99:9 మన దేవుడైన యెహోవాను ఘనపరచండి ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గర ఆయనను ఆరాధించండి. ఎందుకంటే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు.
PSA 100:1 స్తుతి అర్పణ కీర్తన భూలోకమంతా యెహోవాను స్తుతిస్తూ ఆనంద ధ్వనులు చేయాలి.
PSA 100:2 సంతోష పూర్వకంగా యెహోవాను సేవించండి; పాడుతూ ఆయన సన్నిధిలోకి రండి.
PSA 100:3 యెహోవాయే దేవుడని గ్రహించండి. ఆయనే మన సృష్టికర్త, మనం ఆయన వారం; మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం.
PSA 100:4 కృతజ్ఞతతో ఆయన ద్వారాల గుండా ప్రవేశించండి, స్తుతితో ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి; ఆయనకు వందనాలు చెల్లించండి, ఆయన నామమును స్తుతించండి.
PSA 100:5 యెహోవా మంచివారు ఆయన మారని ప్రేమ శాశ్వతమైనది; ఆయన నమ్మకత్వం తరతరాలకు ఉంటుంది.
PSA 101:1 దావీదు కీర్తన. యెహోవా మీకు స్తుతిగానం చేస్తాను; మీ మారని ప్రేమను న్యాయాన్ని గురించి పాడతాను.
PSA 101:2 నేను నింద లేకుండ జీవించేలా వివేకంతో ప్రవర్తిస్తాను, మీరు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు? నేను నిందారహితమైన హృదయంతో నా ఇంటి వ్యవహారాలను నిర్వహిస్తాను.
PSA 101:3 నీచమైన దేనినైనా సరే నేను నా కళ్లెదుట ఉంచను. విశ్వాసం లేనివారు చేసేది నాకు అసహ్యం; అందులో నేను పాలుపంచుకోను.
PSA 101:4 కుటిల హృదయం నాకు దూరమై పోవాలి; చెడుతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు.
PSA 101:5 రహస్యంగా తమ పొరుగువారిపై అభాండాలు వేసేవారిని, నేను నాశనం చేస్తాను. అహంకారపు కళ్లు, గర్వించే హృదయం గలవారిని నేను సహించను.
PSA 101:6 నా కళ్లు దేశంలోని నమ్మకస్థులపై ఉంటాయి, వారు నాతో నివసించాలని; నిందారహితంగా జీవించేవారు నాకు సేవ చేస్తారని.
PSA 101:7 మోసం చేసే వారెవరూ నా భవనంలో నివసించరు; అబద్ధాలాడే వారెవరూ నా ఎదుట నిలబడరు.
PSA 101:8 ప్రతి ఉదయం దేశంలోని దుష్టులందరిని నేను మౌనంగా ఉంచుతాను; యెహోవా పట్టణంలో నుండి కీడు చేసేవారిని పంపివేస్తాను.
PSA 102:1 దుఃఖముచేత ప్రాణము సొమ్మసిల్లినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. యెహోవా, నా ప్రార్థన వినండి; సాయం కోసం నేను పెడుతున్న నా మొర మీకు చేరును గాక.
PSA 102:2 నేను కష్టంలో ఉన్నప్పుడు మీ ముఖాన్ని నాకు మరుగు చేయకండి. మీ చెవి నా వైపు త్రిప్పండి; నేను మొరపెట్టినప్పుడు, త్వరగా జవాబివ్వండి.
PSA 102:3 నా దినాలు పొగలా కనుమరుగు అవుతున్నాయి; నా ఎముకలు నిప్పుకణాల్లా కాలిపోతున్నాయి.
PSA 102:4 దెబ్బకు వాడిన గడ్డిలా ఉంది నా హృదయం; నేను భోజనం చేయడం మరచిపోతున్నాను.
PSA 102:5 నా బాధలో నేను గట్టిగా మూలుగుతూ ఉన్నందుకు నేను అస్థిపంజరంలా ఉన్నాను.
PSA 102:6 నేను ఎడారి గుడ్లగూబలా, శిధిలాల మధ్య బిగ్గరగా అరిచే గుడ్లగూబలా ఉన్నాను.
PSA 102:7 నేను మేల్కొని ఉన్నాను; ఇంటికప్పు మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలా ఉన్నాను.
PSA 102:8 రోజంతా నా శత్రువులు నన్ను తిడతారు; నన్ను ఎగతాళి చేసేవారు నా పేరును శాపంగా ఉపయోగిస్తారు.
PSA 102:9 నేను బూడిదను ఆహారంగా తింటున్నాను పానీయంలో కన్నీరు కలిపి త్రాగుతున్నాను.
PSA 102:10 మీ ఉగ్రతను బట్టి; మీరు నన్ను ఎత్తి అవతల విసిరివేశారు.
PSA 102:11 నా రోజులు సాయంకాలపు నీడలా ఉన్నాయి; నేను గడ్డిలా వాడిపోతున్నాను.
PSA 102:12 కాని యెహోవా, మీరు ఎప్పటికీ ఆసీనులై ఉంటారు; మీ జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది.
PSA 102:13 మీరు లేచి సీయోనుపై కనికరం చూపిస్తారు, ఎందుకంటే ఆమెపై దయ చూపే సమయం వచ్చింది; నిర్ణీత సమయం వచ్చింది.
PSA 102:14 దాని రాళ్లు మీ సేవకులకు ఇష్టమైనవి; దుమ్ము వారికి దయ కలిగించింది.
PSA 102:15 జనులు యెహోవా నామానికి భయపడతారు, భూరాజులంతా మీ మహిమ ఎదుట వణకుతారు.
PSA 102:16 ఎందుకంటే యెహోవా సీయోనును పునర్నిర్మించి తన మహిమతో ప్రత్యక్షమవుతారు.
PSA 102:17 దిక్కులేని దరిద్రులు ప్రార్థిస్తే ఆయన వింటారు; ఆయన వారి మనవులను త్రోసివేయరు.
PSA 102:18 ఇది రాబోయే తరాల కోసం వ్రాయబడును గాక, ఇంకా సృజించబడని ప్రజలు యెహోవాను స్తుతించుదురు గాక:
PSA 102:19 “బందీల మూలుగులు వినడానికి మరణశిక్ష విధించబడిన వారిని విడుదల చేయడానికి, యెహోవా ఎత్తైన పరిశుద్ధాలయం నుండి క్రిందికి వంగిచూశారు, పరలోకంలో నుండి భూమిని చూశారు.”
PSA 102:21 ఈ విధంగా ఎప్పుడైతే ప్రజలు రాజ్యాలు యెహోవాను ఆరాధించడానికి సమాజముగా కూడుతారో అప్పుడు సీయోనులో యెహోవా నామం ప్రకటించబడుతుంది యెరూషలేములో ఆయన స్తుతించబడతారు.
PSA 102:23 నా జీవిత గమనంలో నా బలాన్ని కృంగదీశారు; ఆయన నా రోజుల్ని తగ్గించారు.
PSA 102:24 అందుకు నేనన్నాను: నా దేవా, నా దినాల మధ్యలో నన్ను తీసుకెళ్లకండి; మీ సంవత్సరాలు తరతరాలకు సాగిపోతూనే ఉంటాయి.
PSA 102:25 ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు, ఆకాశాలు మీ చేతి పని.
PSA 102:26 అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు; ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి. మీరు వాటిని దుస్తుల్లా మార్చి వేస్తారు అవి అంతరిస్తాయి.
PSA 102:27 కాని మీరు అలాగే ఉంటారు, మీ సంవత్సరాలకు అంతం ఉండదు.
PSA 102:28 మీ సేవకుల పిల్లలు మీ సన్నిధిలో నివాసం చేస్తారు; వారి పిల్లలు మీ సమక్షంలో స్థిరంగా ఉంటారు.
PSA 103:1 దావీదు కీర్తన. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు; నాలోని సమస్తమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.
PSA 103:2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన ఉపకారాలలో ఏదీ మరచిపోవద్దు.
PSA 103:3 ఆయన నీ పాపాలను క్షమిస్తారు, నీ రోగాలను స్వస్థపరుస్తారు.
PSA 103:4 నరకంలో నుండి నీ ప్రాణాన్ని విడిపిస్తారు నీ తలపై ప్రేమ వాత్సల్య కిరీటం ధరింపచేస్తారు,
PSA 103:5 నీ యవ్వనం గ్రద్ద యవ్వనంలా క్రొత్తగా ఉండేలా, మంచి ఈవులతో నీ కోరికలను తృప్తిపరుస్తారు.
PSA 103:6 అణగారిన వారికందరికి యెహోవా నీతిని న్యాయాన్ని జరిగిస్తారు.
PSA 103:7 ఆయన మోషేకు తన మార్గాలను, ఇశ్రాయేలీయులకు తన క్రియలను తెలియజేశారు.
PSA 103:8 యెహోవా కృపా కనికరం గలవారు, త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు.
PSA 103:9 ఆయన ఎల్లప్పుడూ మనమీద నేరారోపణ చేయరు, శాశ్వతంగా కోపం పెట్టుకోరు;
PSA 103:10 మన పాపాలకు తగినట్లుగా ఆయన మనతో వ్యవహరించలేదు మన దోషాలకు ప్రతిగా మనకు తిరిగి చెల్లించలేదు.
PSA 103:11 భూమికంటె ఆకాశం ఎంత ఎత్తున ఉందో, తనకు భయపడేవారి పట్ల ఆయన ప్రేమ అంత ఉన్నతం.
PSA 103:12 పడమటికి తూర్పు ఎంత దూరమో, అంత దూరం ఆయన మన అతిక్రమాలను తొలగించారు.
PSA 103:13 తండ్రి తన పిల్లల మీద కనికరం కలిగి ఉన్నట్లు, తనకు భయపడేవారి పట్ల యెహోవా కనికరం కలిగి ఉన్నారు;
PSA 103:14 మనం ఎలా రూపించబడ్డామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.
PSA 103:15 మానవుల జీవితం గడ్డిలాంటిది, పొలంలో పువ్వు పూసినట్లు పూస్తారు;
PSA 103:16 దాని మీద గాలి వీస్తే అది లేకుండా పోతుంది, దాని చోటుకు అది జ్ఞాపకం కూడా ఉండదు.
PSA 103:17 ఆయనకు భయపడేవారి పట్ల యెహోవా మారని ప్రేమ వారి పిల్లల పట్ల ఆయన నీతి నిత్యం నిలిచి ఉంటుంది,
PSA 103:18 ఆయన నిబంధనను పాటించేవారిపట్ల, ఆయన కట్టడలను అనుసరించేవారి పట్ల ఉంటుంది.
PSA 103:19 యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశారు, ఆయన రాజ్యం అందరి మీద పరిపాలన చేస్తున్నారు.
PSA 103:20 యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలను ఆలకించి, ఆయన మాటలను నెరవేర్చే బలశూరులైన దూతలారా, ఆయనను స్తుతించండి.
PSA 103:21 యెహోవా సైన్యమా, ఆయన చిత్తం నెరవేర్చే సేవకులారా, మీరంతా యెహోవాను స్తుతించండి.
PSA 103:22 ప్రతిచోట ఆయన పరిపాలనలో ఉన్న సర్వ సృష్టి యెహోవాను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.
PSA 104:1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. యెహోవా నా దేవా, మీరు చాలా గొప్పవారు; ఘనత ప్రభావాన్ని ధరించుకున్నారు.
PSA 104:2 యెహోవా వెలుగును వస్త్రంలా ధరిస్తారు; ఆయన ఒక గుడారంలా ఆకాశాన్ని విస్తరించి
PSA 104:3 తన గదుల కిరణాలను వాటి నీటిపై వేస్తారు. ఆయన మేఘాలను తన రథంగా చేసుకుని వాయు రెక్కలపై స్వారీ చేస్తారు.
PSA 104:4 ఆయన వాయువులను తనకు దూతలుగా, అగ్ని జ్వాలలను తనకు సేవకులుగా చేస్తారు.
PSA 104:5 భూమిని దాని పునాదులపై నిలిపారు; అది ఎన్నటికి కదలదు.
PSA 104:6 మీరు దానిని ఒక వస్త్రంలా నీటి అగాధాలతో కప్పారు; జలాలు పర్వతాలకు పైగా నిలిచాయి.
PSA 104:7 మీ మందలింపుతో జలాలు పారిపోయాయి, మీ ఉరుముల ధ్వనికి పలాయనం చిత్తగించాయి;
PSA 104:8 అవి పర్వతాలకు మీదుగా వెళ్లాయి, అవి లోయల్లోకి దిగిపోయాయి, వాటికి మీరు నిర్ణయించిన చోటుకు అవి చేరుకున్నాయి.
PSA 104:9 అవి దాటలేని సరిహద్దును మీరు ఏర్పరిచారు; అవి ఎన్నటికి భూమిని ముంచివేయవు.
PSA 104:10 ఆయన ఊటలను కనుమలలోకి నీటిని కుమ్మరింపజేస్తారు; అవి పర్వతాల మధ్య ప్రవహిస్తున్నాయి.
PSA 104:11 అవి పొలాలలోని అడవి మృగాలకు నీరు అందిస్తాయి; అడవి గాడిదలు తమ దాహం తీర్చుకుంటాయి.
PSA 104:12 ఆ జలాల ప్రక్కన ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి; కొమ్మల మధ్య అవి పాడతాయి.
PSA 104:13 తన ఆకాశ గదుల్లో నుండి ఆయన పర్వతాలను తడుపుతారు; ఆయన క్రియా ఫలం చేత భూమి తృప్తి చెందుతుంది.
PSA 104:14 ఆయన పశువుల కోసం గడ్డి పెరిగేలా చేస్తున్నారు, మనుష్యులు శ్రమించి సాగుచేయడానికి మొక్కలను మొలిపిస్తున్నారు, అలా భూమి నుండి ఆహారాన్ని పుట్టిస్తున్నారు:
PSA 104:15 మానవ హృదయాలకు సంతోషం కలిగించడానికి ద్రాక్షరసాన్ని, వారి ముఖాలను ప్రకాశించేలా చేయడానికి నూనెను, వారి హృదయాలను బలపరిచే ఆహారాన్ని ఇస్తున్నారు.
PSA 104:16 యెహోవా వృక్షాలు, లెబానోనులో దేవదారు చెట్లు చాలినంత నీరు కలిగి ఉన్నాయి.
PSA 104:17 అక్కడ పక్షులు వాటిలో గూళ్ళు కట్టుకుంటాయి; కొంగలు సరళ వృక్షాలపై నివాసముంటాయి.
PSA 104:18 అడవి మేకపోతులు ఎత్తైన పర్వతాలమీద మేస్తూ ఉంటాయి; కుందేళ్ళు బండ సందులను ఆశ్రయిస్తాయి.
PSA 104:19 రుతువుల్ని సూచించడానికి ఆయన చంద్రుని చేశారు, ఎప్పుడు అస్తమించాలో సూర్యునికి తెలుసు.
PSA 104:20 మీరు చీకటి కలుగజేస్తారు, అది రాత్రి అవుతుంది, అడవి మృగాలన్నీ వేట కోసం సంచరిస్తాయి.
PSA 104:21 సింహాలు వాటి వేట కోసం గర్జిస్తాయి, అవి దేవుని నుండి ఆహారం వెదకుతాయి.
PSA 104:22 సూర్యుడు ఉదయించగానే, అవి వెళ్లిపోతాయి; అవి గుహలకు వెళ్లి పడుకుంటాయి.
PSA 104:23 అప్పుడు మనుష్యులు వారి పనులకు వెళ్లిపోతారు, సాయంకాలం వరకు వారు కష్టపడతారు.
PSA 104:24 యెహోవా! మీ కార్యాలు ఎన్నో! మీ జ్ఞానంతో మీరు వాటన్నిటిని చేశారు; భూమి అంతా మీ సృష్టితో నిండి ఉంది.
PSA 104:25 అదిగో విశాలమైన, మహా సముద్రం, అందులో లెక్కలేనన్ని జలచరాలు దానిలో జీవులు చిన్నవి పెద్దవి ఉన్నాయి.
PSA 104:26 అందులో ఓడలు ఇటు అటు తిరుగుతాయి, సముద్రంలో ఆడుకోడానికి మీరు సృజించిన లెవియాథన్ అక్కడ ఉంది.
PSA 104:27 సకాలంలో మీరు వాటికి వాటి ఆహారం పెడతారని, జీవులన్నీ మీ వైపే చూస్తున్నాయి.
PSA 104:28 మీరు దానిని వారికి ఇచ్చినప్పుడు, అవి సమకూర్చుకుంటాయి; మీరు గుప్పిలి విప్పి పెడుతుంటే అవి తిని తృప్తి చెందుతాయి.
PSA 104:29 మీ ముఖం మరుగైతే అవి కంగారు పడతాయి; మీరు వాటి ఊపిరిని ఆపివేసినప్పుడు, అవి చనిపోయి మట్టి పాలవుతాయి.
PSA 104:30 మీరు మీ ఆత్మను పంపినప్పుడు, అవి సృజించబడ్డాయి, మీరే భూతలాన్ని నూతనపరుస్తారు.
PSA 104:31 యెహోవా మహిమ నిరంతరం ఉండును గాక; యెహోవా తన క్రియలలో ఆనందించును గాక.
PSA 104:32 ఆయన భూమిని చూస్తే, అది కంపిస్తుంది, ఆయన పర్వతాలను తాకితే, అవి పొగలు గ్రక్కుతాయి.
PSA 104:33 నా జీవితకాలమంతా నేను యెహోవాకు పాడతాను; నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి నేను స్తుతిగానం చేస్తాను.
PSA 104:34 నేను యెహోవాయందు ఆనందిస్తుండగా, నా ధ్యానము ఆయనకు ఇష్టమైనదిగా ఉండును గాక.
PSA 104:35 అయితే పాపులు భూమి మీద నుండి పూర్తిగా తుడిచివేయబడుదురు గాక దుష్టులు ఇక ఉండక పోవుదురు గాక. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. యెహోవాను స్తుతించు.
PSA 105:1 యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి; ఆయన చేసిన వాటిని దేశాల్లో తెలియజేయండి.
PSA 105:2 ఆయనకు పాడండి, ఆయనకు స్తుతి పాడండి; ఆయన అద్భుత కార్యాలన్నిటిని గురించి చెప్పండి.
PSA 105:3 ఆయన పరిశుద్ధ నామం గురించి గొప్పగా చెప్పండి; యెహోవాను వెదికేవారి హృదయాలు ఆనందించును గాక
PSA 105:4 యెహోవాను, ఆయన బలాన్ని చూడండి; ఆయన ముఖాన్ని ఎల్లప్పుడు వెదకండి.
PSA 105:5 ఆయన సేవకులైన అబ్రాహాము సంతానమా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతానమా, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను, ఆయన అద్భుతాలను, ఆయన ప్రకటించిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.
PSA 105:7 ఆయన మన దేవుడైన యెహోవా; ఆయన తీర్పులు భూమి అంతటా ఉన్నాయి.
PSA 105:8 ఆయన తన నిబంధనను, తాను చేసిన వాగ్దానాన్ని వెయ్యి తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటారు,
PSA 105:9 అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధనను, ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణాన్ని ఎప్పటికీ జ్ఞాపకముంచుకుంటారు.
PSA 105:10 ఆయన దానిని యాకోబుకు శాసనంగా, ఇశ్రాయేలుకు శాశ్వతమైన నిబంధనగా స్థిరపరిచారు:
PSA 105:11 “నేను మీకు కనాను దేశాన్ని ఇస్తాను మీరు వారసత్వంగా పొందుకునే భాగంగా ఇస్తాను.”
PSA 105:12 వారు లెక్కకు కొద్దిమంది ఉన్నప్పుడు, ఆ కొద్దిమంది ఆ దేశంలో పరాయివారిగా ఉన్నప్పుడు,
PSA 105:13 వారు దేశం నుండి దేశానికి, ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి తిరిగారు.
PSA 105:14 ఆయన ఎవరినీ వారికి హాని చేయనివ్వలేదు; వారి కోసం ఆయన రాజులను మందలించారు:
PSA 105:15 “నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు; నా ప్రవక్తలకు హాని చేయకూడదు.”
PSA 105:16 ఆయన భూమిపై కరువును పిలిచారు వారి ఆహార సరఫరా అంతా నాశనం చేశారు;
PSA 105:17 వారికి ముందుగా ఒక మనుష్యుని పంపారు, ఒక బానిసగా అమ్మబడిన యోసేపును,
PSA 105:18 తాను చెప్పింది జరిగే వరకు, యెహోవా యోసేపు ప్రవర్తనను పరీక్షించారు, వారు అతని పాదాలను సంకెళ్ళతో గాయపరిచారు, అతని మెడ సంకెళ్ళలో ఉంచబడింది.
PSA 105:20 రాజు కబురుపెట్టి, అతన్ని విడుదల చేశాడు, జనాంగాల పాలకుడు అతన్ని విడిపించాడు.
PSA 105:21 అతడు యోసేపును తన ఇంటి యజమానిగా, తన స్వాస్థ్యమంతటి మీద పాలకునిగా చేశాడు, తనకు నచ్చిన విధంగా తన యువరాజులకు సూచించడానికి పెద్దలకు జ్ఞానాన్ని బోధించడానికి అధికారం ఇచ్చాడు.
PSA 105:23 యాకోబు అనబడిన ఇశ్రాయేలు ఆ తర్వాత హాము దేశమైన ఈజిప్టుకు వెళ్లి, అక్కడే ప్రవాసం చేశాడు.
PSA 105:24 యెహోవా తన ప్రజలకు అధిక సంతాన మిచ్చాడు; వారిని శత్రువుల కన్నా బలవంతులుగా చేశారు.
PSA 105:25 తన ప్రజలను వారు ద్వేషించేలా ఆయన వారి హృదయాలు మార్చివేశారు, తన సేవకులకు వ్యతిరేకంగా కుట్ర చేసేలా వారిని పురికొల్పారు.
PSA 105:26 ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపారు.
PSA 105:27 ఈజిప్టువారి మధ్య సూచక క్రియలు, హాము దేశంలో అద్భుతాలు జరిగించారు.
PSA 105:28 యెహోవా చీకటిని పంపి చీకటి కమ్మేలా చేశారు; వారు ఆయన మాటలను వ్యతిరేకించలేదు.
PSA 105:29 ఆయన వారి జలాలను రక్తంగా మార్చారు, వారి చేపలన్నిటిని చనిపోయేలా చేశారు.
PSA 105:30 వారి దేశం కప్పలతో నిండిపోయింది, వారి రాజుల గదుల్లోకి కూడా వెళ్లాయి.
PSA 105:31 ఆయన ఆజ్ఞ ఇవ్వగా, జోరీగలు వచ్చాయి, వారి దేశమంతటా దోమలు వచ్చాయి.
PSA 105:32 దేశమంతటా ఆయన మెరుపులు మెరిపిస్తూ, వడగండ్ల వాన కురిపించారు.
PSA 105:33 ఆయన వారి ద్రాక్షతీగెలను అంజూర చెట్లను పడగొట్టారు వారి దేశంలోని వృక్షాలను విరగ్గొట్టారు.
PSA 105:34 ఆయన ఆజ్ఞ ఇవ్వగా మిడతలు, లెక్కలేనన్ని చీడ పురుగులు వచ్చి పడ్డాయి.
PSA 105:35 ఆ దేశంలో కూరగాయల మొక్కలన్నిటినీ పురుగులు తినేశాయి, భూమి పంటలను తినేశాయి.
PSA 105:36 వారి దేశంలో ఉన్న జ్యేష్ఠులందరిని వారి ప్రథమ సంతానమంతటిని ఆయన హతమార్చారు.
PSA 105:37 ఇశ్రాయేలీయులను వెండి బంగారములతో దేవుడు బయిటకి రప్పించాడు. ఆయన ఇశ్రాయేలు గోత్రాల్లో ఎవరూ తొట్రుపడరు.
PSA 105:38 వారంటే ఈజిప్టువారికి భయం పట్టుకుంది, వారు వెళ్లి పోతుంటే, వీరు సంతోషించారు.
PSA 105:39 దేవుడు పరచిన మేఘపు దుప్పి వారిని కప్పింది, రాత్రివేళ వెలుగు కోసం అగ్ని నిచ్చాడు దేవుడు.
PSA 105:40 వారు కోరుకున్నట్లే దేవుడు పూరేడుపిట్టలను పంపించాడు. ఆకాశం నుండి వచ్చే ఆహారంతో వారంతా తృప్తి చెందారు.
PSA 105:41 దేవుడు బండను చీల్చాడు. అందులో నుండి నీరు ఉబికి బయటకు వచ్చింది. ఆ మీరు నదీ ప్రవాహంలా ఎడారి స్థలాల్లో పారింది.
PSA 105:42 ఆయన తన సేవకుడైన అబ్రాహాముకు చేసిన పరిశుద్ధ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.
PSA 105:43 తన ప్రజలను సంతోషంతో బయిటకి తెచ్చాడు. తాను ఎన్నుకున్న ప్రజలను ఆనంద ధ్వనులతో రప్పించాడు.
PSA 105:44 ఆయన వారికి దేశాల భూములను ఇచ్చారు, ఇతరులు శ్రమించినదానికి వారు వారసులయ్యారు.
PSA 105:45 వారు ఆయన కట్టడలను అనుసరించాలని ఆయన న్యాయవిధులను పాటించాలని. యెహోవాను స్తుతించండి!
PSA 106:1 యెహోవాను స్తుతించండి. యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం నిలుస్తుంది.
PSA 106:2 యెహోవా యొక్క గొప్ప కార్యాలను ఎవరు ప్రచురించగలరు? ఆయన స్తుతిని సంపూర్ణంగా ఎవరు ప్రకటిస్తారు?
PSA 106:3 న్యాయంగా ప్రవర్తించేవారు ధన్యులు, వారు ఎల్లప్పుడు సరియైనది చేస్తారు.
PSA 106:4 యెహోవా, మీ ప్రజలపై మీరు దయ చూపినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీరు వారిని రక్షించినప్పుడు నాకు సాయం చేయడానికి రండి,
PSA 106:5 మీరు ఏర్పరచుకున్న వారి అభివృద్ధిని నేను ఆస్వాదించగలను, మీ దేశము యొక్క ఆనందంలో పాలుపంచుకోగలను మిమ్మల్ని స్తుతించడంలో మీ వారసులతో చేరతాను.
PSA 106:6 మా పూర్వికుల్లాగే మేమూ పాపాలు చేశాము; మేము తప్పు చేశాం దుష్టత్వంతో ప్రవర్తించాం.
PSA 106:7 మా పూర్వికులు ఈజిప్టులో ఉన్నప్పుడు నేను చేసిన అద్భుతాలను గ్రహించలేదు; మీ దయాసమృద్ధిని వారు తలపోయ లేదు, ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేశారు.
PSA 106:8 అయినా ఆయన తన బలప్రభావాలను తెలియపరచడానికి, తన పేరు కోసం వారిని రక్షించాడు.
PSA 106:9 ఎర్ర సముద్రాన్ని గద్దించాడు. అది ఎండిపోయింది; ఎడారిలో నడిచినట్లే జలాగాధంలో వారు నడిచారు. దేవుడు వారిని నడిపించాడు.
PSA 106:10 పగవారి బారి నుండి దేవుడే వారిని తప్పించాడు; విడుదల ప్రసాదించాడు.
PSA 106:11 విరోధులంతా నీటిలో మునిగి చచ్చారు. ఒక్కడూ మిగల్లేదు.
PSA 106:12 ఇశ్రాయేలీయులు అప్పుడు కాని దేవుని మాట నమ్మలేదు. స్తుతిస్తూ పాటలు పాడారు.
PSA 106:13 దేవుని క్రియలు వారు త్వరలోనే మరచిపోయారు. ఆయన సలహాలను వారు లక్ష్యపెట్టు వారు కారు.
PSA 106:14 ఎడారిలో పేరాశకు లోనయ్యారు; పాడు ప్రదేశమది. దేవుడిని శోధించారు.
PSA 106:15 దేవుడు వారి కోరిక తీర్చాడు, అయినా వారి ప్రాణాలు క్షీణించిపోయాయి.
PSA 106:16 దండులో మోషే మీద, యెహోవాకు పరిశుద్ధుడైన, అహరోను మీద అసూయ ఏర్పడింది.
PSA 106:17 భూమి నోరు తెరిచి దాతానును మ్రింగివేసింది; అబీరాము గుంపును కప్పేసింది.
PSA 106:18 వారి అనుచరులలో మంటలు చెలరేగాయి; ఒక జ్వాల దుష్టులను కాల్చివేసింది.
PSA 106:19 హోరేబు పర్వతం దగ్గర వారు దూడ విగ్రహం చేయించుకున్నారు. పోత విగ్రహం ముందు విగ్రహారాధన చేశారు.
PSA 106:20 వారు మహిమగల దేవునికి బదులు తుక్కు మేసే ఎద్దు బొమ్మను ఉంచారు.
PSA 106:21 వారిని రక్షించిన దేవున్ని, ఈజిప్టులో ఆయన చేసిన గొప్ప కార్యాలను వారు మరచిపోయారు,
PSA 106:22 హాము దేశంలో అద్భుతకార్యాలు ఎర్ర సముద్రం ఒడ్డున ఆయన చేసిన భీకర క్రియలు.
PSA 106:23 “వీరిని నాశనం చేస్తాను” అన్నాడు దేవుడు. మోషే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఆయన వచ్చి దేవుని ఎదుట సందులో నిలిచి విజ్ఞాపన చేస్తే ఆయన ఉగ్రత వారిని ధ్వంసం చేయకుండా ఆపింది.
PSA 106:24 మనోహరమైన దేశాన్ని వారు తిరస్కరించారు; వారాయన మాట నమ్మలేదు.
PSA 106:25 యెహోవా మాట వినక, డేరాలలో సణగ సాగారు.
PSA 106:26 కాబట్టి ఆయన తన చేయెత్తి, వారిని ఎడారిలో పతనమయ్యేలా చేస్తాను,
PSA 106:27 వారి సంతతివారిని దేశాల మధ్య పతనమయ్యేలా చేస్తాను, దేశాలకు వారిని చెదరగొడతాను, అని ప్రమాణం చేశారు.
PSA 106:28 వారు బయల్-పెయోరు దగ్గరి విగ్రహం దగ్గర చేరారు. నిర్జీవ విగ్రహాలకు పెట్టిన నైవేద్య బలులు తిన్నారు.
PSA 106:29 తమ దుష్ట చర్యల చేత వారు దేవునికి కోపం రేపారు. అందుకు వారి మధ్యకు తెగులు మొదలైంది.
PSA 106:30 ఫీనెహాసు నిలిచి, న్యాయం చెప్పాడు. అపరాధులను శిక్షించాడు. తెగులు ఆగిపోయింది.
PSA 106:31 అది అంతులేని తరాలకు అతనికి నీతిగా ఎంచబడింది.
PSA 106:32 మెరీబా నీళ్ల దగ్గర వారంతా దేవుని కోపాగ్ని రేపారు, వారి మూలంగా మోషేకు బాధ.
PSA 106:33 వారు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, అతని పెదవుల వెంట కాని మాటలు వచ్చాయి.
PSA 106:34 యెహోవా నాశనం చేస్తానన్న జాతులను వీరు విడిచిపెట్టారు.
PSA 106:35 ఇతర జనాంగాలలో కలిసిపోయి, వారి జీవిత విధానాలు నేర్చుకున్నారు.
PSA 106:36 వారి విగ్రహాలను పూజించారు. అవే వారికి ఉరి అయ్యాయి.
PSA 106:37 తమ కుమారులను, కుమార్తెలను దయ్యానికి బలి ఇచ్చారు.
PSA 106:38 నిరపరాధుల రక్తం, తమ కుమారుల రక్తం, కుమార్తెల రక్తం వారు చిందించారు. కనాను దేశపు విగ్రహాలకు తమ సొంత పిల్లల్ని బలి ఇచ్చారు. ఈ రక్తపాతం చేత దేశమంతా అపవిత్రమైనది.
PSA 106:39 వారు తమ దుష్ట క్రియల చేత అపవిత్రులయ్యారు; విగ్రహాల మీద వారికి గల ప్రేమ యెహోవా దృష్టిలో వ్యభిచారము చేశారు.
PSA 106:40 యెహోవా కోపం వారి మీదికి వచ్చింది, తన వారసత్వం తన ప్రజలు అయినా వారంటే ఆయనకు అసహ్యం వేసింది.
PSA 106:41 ఇతర దేశాలకు వారిని అప్పగించాడు. అయినా వారి మీద ప్రభుత్వం చేశారు.
PSA 106:42 శత్రువులే వారిని అణగద్రొక్కారు వారి చేతి క్రింద తల వొగ్గారు.
PSA 106:43 చాలాసార్లు ఆయన విడిపించాడు, అయినా వారి తిరుగుబాటు ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. తిరగబడి, అపరాధులై, దురవస్థ చెందారు.
PSA 106:44 అయినా వారు మొరపెట్టగానే ఆయన విన్నాడు. వారి కష్టంను చూచాడు.
PSA 106:45 దేవుడు తన నిబంధనను తలచుకొన్నాడు. వారి నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాడు. తన మారని ప్రేమను బట్టి వారిని కనికరించాడు.
PSA 106:46 చెరపట్టిన వారికి వీరి మీద జాలి కలిగింది. అది దైవనిర్ణయమే.
PSA 106:47 మా దేవా యెహోవా, మమ్మల్ని రక్షించండి; ఇతర దేశాల మధ్య నుండి మమ్మల్ని సమకూర్చండి, అప్పుడు మేము మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం, మిమ్మల్ని స్తుతించడంలో అతిశయిస్తాం.
PSA 106:48 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక! ప్రజలంతా, “ఆమేన్!” అనాలి. యెహోవాను స్తుతించండి!
PSA 107:1 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివారు; ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.
PSA 107:2 యెహోవాచేత విమోచింపబడినవారు, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినవారు,
PSA 107:3 వివిధ దేశాల నుండి, తూర్పు పడమర, ఉత్తర దక్షిణాల నుండి ఆయన సమకూర్చినవారు వారి కథను చెప్పుదురు గాక.
PSA 107:4 కొందరు ఏకాంతంగా ఎడారిలో తిరిగారు; నివాసయోగ్యమైన పట్టణం ఒక్కటి వారికి కనిపించలేదు.
PSA 107:5 వారు ఆకలి దప్పికతో ఉన్నారు, వారి ప్రాణాలు సొమ్మసిల్లాయి.
PSA 107:6 అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధలనుండి విడిపించారు.
PSA 107:7 ఆయన వారిని తిన్నని బాటలో నివాసయోగ్యమైన పట్టణానికి నడిపించారు.
PSA 107:8 యెహోవా యొక్క మారని ప్రేమ కోసం నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
PSA 107:9 దాహంతో ఉన్న వారి దాహాన్ని ఆయన తీరుస్తారు, మేలైన వాటితో ఆయన ఆకలి తీర్చుతారు.
PSA 107:10 కొందరు కష్టాల ఇనుప గొలుసుల్లో బంధించబడి, చీకటిలో, కటిక చీకటిలో కూర్చుని ఉన్నారు,
PSA 107:11 వారు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, మహోన్నతుని ప్రణాళికలను తృణీకరించారు.
PSA 107:12 కాబట్టి ఆయన వారిని వెట్టిచాకిరికి అప్పగించారు; వారు తొట్రిల్లారు సాయం చేసేవాడు ఒక్కడూ లేడు.
PSA 107:13 అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు.
PSA 107:14 ఆయన వారిని చీకటి, కటిక చీకటిలో నుండి బయటకు తెచ్చారు, వారి సంకెళ్ళను తుత్తునియలుగా చేశారు.
PSA 107:15 యెహోవా యొక్క మారని ప్రేమ కోసం నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
PSA 107:16 ఎందుకంటే ఆయన ఇత్తడి ద్వారాలను పగలగొడతారు ఇనుప గడియలను విరగ్గొడతారు.
PSA 107:17 కొందరు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా మూర్ఖులయ్యారు వారి దోషాల వల్ల బాధలు అనుభవించారు.
PSA 107:18 వారు ఆహారాన్ని అసహ్యించుకున్నారు మరణ ద్వారాల దగ్గరకు వచ్చారు.
PSA 107:19 అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు.
PSA 107:20 తన వాక్కును పంపి దేవుడు వారిని స్వస్థపరిచాడు.
PSA 107:21 యెహోవా యొక్క మారని ప్రేమ కోసం మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
PSA 107:22 కృతజ్ఞతార్పణలు అర్పించాలి. ఆనంద ధ్వనులతో దేవుని క్రియలను ప్రకటించాలి.
PSA 107:23 ఓడలలో సముద్ర ప్రయాణం చేస్తూ మహాజలాల మీద వెళుతూ, కొందరు వ్యాపారం చేస్తారు.
PSA 107:24 వారంతా యెహోవా చేసిన క్రియలు చూచారు, సముద్రంలో యెహోవా చేసిన అద్భుతాలు చూచారు.
PSA 107:25 దైవాజ్ఞకు తుఫాను లేచింది, అలలు రేగాయి.
PSA 107:26 వారు ఆకాశానికి పైకి ఎక్కారు, జలాగాధంలోకి దిగిపోయారు; వారి జీవం దురవస్థ చేత కరిగిపోయింది.
PSA 107:27 వారు త్రాగుబోతుల్లా తూలుతూ, అటూ ఇటూ ఊగుతూ ఉన్నారు; వారు తెలివి తప్పి ఉన్నారు.
PSA 107:28 అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు ఆయన వారిని వారి బాధ నుండి విడిపించారు.
PSA 107:29 అతడు తుఫానును గుసగుసలాడేలా చేశాడు, సముద్ర తరంగాలు సద్దుమణిగాయి.
PSA 107:30 అలలు తగ్గాయి వారెంతో సంతోషించారు. వారు వెళ్లాలనుకున్న రేవుకు దేవుడు వారిని చేర్చాడు.
PSA 107:31 యెహోవా యొక్క మారని ప్రేమ కోసం మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
PSA 107:32 ప్రజా సమాజాలలో ఆయనకే మహిమ. పెద్దల సభలలో ఆయనకే ప్రఖ్యాతి!
PSA 107:33 అక్కడ ఉన్న మనుష్యుల దుష్టత్వాన్ని బట్టి, ఆయన అక్కడి నదులను ఎడారిగా మార్చారు. మీ ఊటలను ఎండిన నేలగా మార్చారు. సారవంతమైన భూమిని చవి నేలగా మార్చారు.
PSA 107:35 అలాగే ఎడారులు నీటి మడుగులయ్యాయి. ఎండిన భూమి నీటి ఊటల స్థలమైంది.
PSA 107:36 ఆయన ఆకలిగొనిన వారిని అక్కడ నివసించడానికి తీసుకువచ్చారు, వారు అక్కడ నివాసయోగ్యమైన పట్టణాన్ని ఏర్పరచుకున్నారు.
PSA 107:37 వారు పొలాల్లో విత్తారు ద్రాక్షతోటలు నాటారు. ఫలసాయం బాగా దొరికింది.
PSA 107:38 దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారు అధికంగా అభివృద్ధి చెందారు. పశుసంపద ఏమాత్రం తగ్గలేదు.
PSA 107:39 వారి మీదికి ఎంతో ఒత్తిడి వచ్చింది. తెగుళ్ళు, బాధ, శోకము. వారంతా కృశించి పోయారు. సంఖ్యకూడా క్షీణించింది.
PSA 107:40 సంస్థానాధిపతులపై ధిక్కారం క్రుమ్మరించేవాడు వారిని గుర్తించలేని వ్యర్థంలో వారు తిరిగేలా చేశారు.
PSA 107:41 కానీ ఆయన అవసరతలో ఉన్నవారిని వారి కష్టాల నుండి పైకి లేవనెత్తారు గొర్రెల మందల్లా వృద్ధి వారి కుటుంబాలు వృద్ధిచేశారు.
PSA 107:42 యథార్థవంతులకు ఇదంతా చూస్తే ఆనందము. దుష్టులంతా నోరు మూసుకోవాలి.
PSA 107:43 జ్ఞానులు ఈ విషయాలను ఆలోచిస్తారు, యెహోవా ప్రేమా క్రియలను తలపోస్తారు.
PSA 108:1 ఒక గీతము. దావీదు కీర్తన. ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది; నా ప్రాణమంతటితో నేను పాడతాను సంగీతం వాయిస్తాను.
PSA 108:2 సితారా వీణా, మేలుకోండి! ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను.
PSA 108:3 యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను; జనాంగాల మధ్య మీ గురించి నేను పాడతాను.
PSA 108:4 ఎందుకంటే మీ మారని ప్రేమ గొప్పది, అది ఆకాశాల కంటే ఎత్తైనది; మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది.
PSA 108:5 దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి; భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.
PSA 108:6 మీరు ప్రేమించేవారు విడిపించబడేలా, మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి.
PSA 108:7 దేవుడు తన పరిశుద్ధాలయం నుండి మాట్లాడిన మాట: “విజయంతో నేను షెకెమును పంచుతాను సుక్కోతు లోయను కొలుస్తాను.
PSA 108:8 గిలాదు నాది, మనష్షే నాది; ఎఫ్రాయిం నా శిరస్త్రాణం, యూదా నా రాజదండం.
PSA 108:9 మోయాబు నా కాళ్లు కడుక్కునే పళ్లెం, ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను; ఫిలిష్తియా గురించి విజయధ్వని చేస్తాను.”
PSA 108:10 కోటగోడలు గల పట్టణానికి నన్నెవరు తీసుకెళ్తారు? ఎదోముకు నన్నెవరు నడిపిస్తారు?
PSA 108:11 దేవా, మమ్మల్ని విసర్జించిన మీరు కాదా? మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా?
PSA 108:12 శత్రువుకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి, ఎందుకంటే మనుష్యుల సహాయం పనికిరానిది.
PSA 108:13 దేవునితో కలిసి మేము విజయం సాధిస్తాం, ఆయన మా శత్రువులను అణగద్రొక్కుతారు.
PSA 109:1 సంగీత దర్శకునికి. దావీదు కీర్తన నేను స్తుతించే, నా దేవా, మౌనంగా ఉండకండి,
PSA 109:2 ఎందుకంటే దుష్టులు మోసగాళ్ళు నాకు వ్యతిరేకంగా తమ నోళ్ళు తెరిచి; అబద్ధాలాడే నాలుకలతో వారు నాకు వ్యతిరేకంగా మాట్లాడారు.
PSA 109:3 ద్వేషపూరిత మాటలతో వారు నన్ను చుట్టుముడతారు; వారు కారణం లేకుండా నా మీద దాడి చేస్తారు.
PSA 109:4 వారు నా ప్రేమకు ప్రతిగా నా మీద ఆరోపణలు చేస్తారు, కాని నేనైతే ప్రార్థిస్తూ ఉంటాను.
PSA 109:5 నేను చేసిన మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తారు. నా ప్రేమకు ప్రతిగా ద్వేషం చూపుతారు.
PSA 109:6 నా శత్రువు మీద ఒక దుష్టుని నియమించండి; అతని కుడి ప్రక్కన ఒక నేరం మోపేవాడు నిలబడాలి.
PSA 109:7 తీర్పు సమయంలో అతడు దోషిగా వెల్లడి కావాలి, అప్పుడు అతని ప్రార్థనలు పాపంగా లెక్కించబడతాయి.
PSA 109:8 అతడు బ్రతికే రోజులు కొద్దివిగా ఉండును గాక; అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక.
PSA 109:9 అతని పిల్లలు తండ్రిలేనివారు కావాలి, అతని భార్య విధవరాలు అవ్వాలి.
PSA 109:10 అతని పిల్లలు బిక్షకులై తిరుగుదురు గాక, వారు పాడుబడిన నివాసాల తోలివేయబడుదురు గాక.
PSA 109:11 అప్పిచ్చేవాడు అతని దగ్గర ఉన్నవన్నీ స్వాధీనం చేసుకోవాలి; అపరిచితులు అతని కష్టార్జితాన్ని దోచుకోవాలి.
PSA 109:12 అతని మీద ఎవరు దయ చూపకూడదు, తన తండ్రిలేని పిల్లలపై ఎవరికీ కనికరం చూపకూడదు.
PSA 109:13 అతని వంశం అంతరించాలి, వచ్చేతరం నుండి వారి పేర్లు తుడిచివేయబడాలి.
PSA 109:14 అతని పూర్వికుల దోషాలు యెహోవా మరువకూడదు, అతని తల్లి పాపాన్ని దేవుడు ఎన్నటికి తుడిచివేయకూడదు.
PSA 109:15 వారి పాపాలన్నీ ఎప్పుడూ యెహోవా ఎదుట ఉండాలి, తద్వార భూమి మీద నుండి అతని పిల్లల జ్ఞాపకాన్ని ఆయన తుడిచివేస్తారు.
PSA 109:16 దయ చూపించాలని అతడు ఎప్పుడూ అనుకోలేదు; కాని అతడు నలిగినవారిని పేదవారిని వేధించాడు ధైర్యము కోల్పోయిన వారిని హతమార్చాడు.
PSA 109:17 శపించటం అతనికి ఇష్టం కాబట్టి అది అతని మీదికే వచ్చింది. అతడు ఎవరినీ ఆశీర్వదించాలని కోరలేదు కాబట్టి అతడు ఆశీర్వాదాన్ని అనుభవించలేదు.
PSA 109:18 అతడు శాపాన్ని వస్త్రంగా ధరించాడు; అది నీరులా అతని కడుపులోకి, నూనెలా అతని ఎముకల్లోకి చొచ్చుకు పోయింది.
PSA 109:19 అది అతని చుట్టూ చుట్టబడిన వస్త్రంలా, అది నడుము దట్టిలా నిత్యం అతని చుట్టూ ఉండును గాక.
PSA 109:20 నా మీద నేరం మోపేవారికి నా గురించి చెడుగా మాట్లాడేవారికి, యెహోవా వారికి జీతం చెల్లించును గాక.
PSA 109:21 అయితే, ప్రభువైన యెహోవా, మీ నామ ఘనత కోసం నాకు సహాయం చేయండి; శ్రేష్ఠమైన మీ మారని ప్రేమను బట్టి, నన్ను విడుదలచేయండి.
PSA 109:22 ఎందుకంటే నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను, నా హృదయం నాలో గాయపడి ఉంది.
PSA 109:23 నేను సాయంత్రం నీడలా మసకబారుతున్నాను; మిడతలా నేను దులిపివేయబడ్డాను.
PSA 109:24 ఉపవాసాలు ఉండి నా మోకాళ్లు వణికిపోతున్నాయి; నేను అస్థిపంజరంలా అయ్యాను.
PSA 109:25 నా మీద నేరం మోపేవారికి నేను ఎగతాళి హాస్యాస్పదం అయ్యాను; వారు నన్ను చూసినప్పుడు, వారు వెటకారంగా వారి తలలాడిస్తారు.
PSA 109:26 యెహోవా, నా దేవా! నాకు సాయం చేయండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను కాపాడండి.
PSA 109:27 ఇది చేసింది మీ హస్తమేనని, యెహోవాయే చేశారని వారికి తెలియనివ్వండి.
PSA 109:28 వారు నన్ను శపించినప్పుడు మీరు నన్ను దీవిస్తారు; వారు నాపై దాడి చేసినప్పుడు వారు అవమానానికి గురవుతారు, కాని మీ సేవకుడు సంతోషించును గాక.
PSA 109:29 నా మీద నేరం మోపేవారు అవమానాన్ని వస్త్రంగా ధరించుదురు గాక ఒక వస్త్రంలో అయినట్టుగా సిగ్గుతో చుట్టబడతారు.
PSA 109:30 నేను నోరార యెహోవాను కీర్తిస్తాను; ఆరాధికుల గొప్ప సమూహంలో నేను ఆయనను స్తుతిస్తాను.
PSA 109:31 ఎందుకంటే అవసరతలో ఉన్న వారి పక్షాన ఆయన నిలబడతారు, వారికి తీర్పు తీర్చే వారి నుండి వారి ప్రాణాలను కాపాడడానికి.
PSA 110:1 దావీదు కీర్తన. యెహోవా నా ప్రభువుతో చెప్పిన మాట: “నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేసే వరకు నీవు నా కుడిచేతి వైపున కూర్చో.”
PSA 110:2 యెహోవా, “నీ శత్రువుల మధ్య పరిపాలించు!” అని అంటూ, సీయోను నుండి మీ శక్తివంతమైన రాజదండాన్ని విస్తరిస్తూ, అంటారు,
PSA 110:3 మీ యుద్ధ దినాన మీ దళాలు ఇష్టపూర్వకంగా వస్తాయి. పవిత్ర వైభవాన్ని ధరించుకున్నవారై ఉదయపు గర్భం నుండి మంచులా మీ యువకులు మీ దగ్గరకు వస్తారు.
PSA 110:4 “మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు” అని యెహోవా ప్రమాణం చేశారు ఆయన తన మనస్సు మార్చుకోరు.
PSA 110:5 ప్రభువు మీ కుడి ప్రక్కనే ఉన్నాడు; తన ఉగ్రత దినాన ఆయన రాజులను తుత్తునియలుగా చేస్తాడు.
PSA 110:6 అతడు దేశాలను శిక్షిస్తాడు వారి భూములను శవాలతో నింపుతాడు; అతడు సర్వ భూమిపై పాలకులను ముక్కలు చేస్తాడు.
PSA 110:7 దారిలో అతడు వాగు నీళ్లు త్రాగుతాడు, కాబట్టి అతడు తల పైకెత్తుతాడు.
PSA 111:1 యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో సమాజంలో నేను హృదయమంతటితో యెహోవాను స్తుతిస్తాను.
PSA 111:2 యెహోవా కార్యాలు గొప్పవి; వాటిలో ఆనందించే వారందరు వాటి గురించి ధ్యానిస్తారు.
PSA 111:3 ఆయన క్రియలు కీర్తనీయమైనవి ప్రభావవంతమైనవి, ఆయన నీతి నిరంతరం ఉంటుంది.
PSA 111:4 మనుష్యులకు జ్ఞాపకముండేటట్లు ఆయన అద్భుతాలు చేస్తారు; యెహోవా దయామయుడు. కనికరం గలవారు.
PSA 111:5 భయభక్తులు గలవారిని పోషిస్తారు. ఆయన తన నిబంధన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారు.
PSA 111:6 తన ప్రజలకు ఇతర దేశాలను వారసత్వంగా ఇచ్చి, తన క్రియలలోని బలప్రభావాలను వారికి వెల్లడించారు.
PSA 111:7 ఆయన చేతుల పనులు విశ్వసనీయమైనవి న్యాయమైనవి; ఆయన కట్టడలు నమ్మదగినవి.
PSA 111:8 అవి శాశ్వతంగా స్థాపించబడ్డాయి, నమ్మకత్వంతో యథార్థతతో అవి చేయబడ్డాయి.
PSA 111:9 ఆయన తన ప్రజలకు విమోచన సమకూర్చారు; ఆయన తన ఒడంబడికను శాశ్వతంగా నియమించారు, ఆయన నామం పరిశుద్ధమైనది భీకరమైనది.
PSA 111:10 యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం; ఆయన కట్టడలను పాటించేవారు మంచి గ్రహింపు కలిగి ఉంటారు. స్తుతి నిత్యం ఆయనకే చెందును.
PSA 112:1 యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడేవారు ధన్యులు, వారు ఆయన ఆజ్ఞలలో అధిక ఆనందాన్ని పొందుతారు.
PSA 112:2 వారి పిల్లలు భూమిపై బలవంతులుగా ఉంటారు; యథార్థవంతుల తరం దీవించబడుతుంది.
PSA 112:3 వారి ఇళ్ళలో ధనం, ఐశ్వర్యం ఉన్నాయి, వారి నీతి నిత్యం నిలిచి ఉంటుంది.
PSA 112:4 దయ కనికరం గలవారికి నీతిమంతులకు, యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు ఉదయిస్తుంది.
PSA 112:5 దయతో అప్పు ఇచ్చేవారికి, తమ వ్యాపారాన్ని న్యాయంగా నిర్వహించే వారికి మేలు కలుగుతుంది.
PSA 112:6 నీతిమంతులు ఎప్పటికీ కదల్చబడరు; వారు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు.
PSA 112:7 దుర్వార్తల వలన వారు భయపడరు; యెహోవా అందలి నమ్మకం చేత వారి హృదయం స్థిరంగా ఉంటుంది.
PSA 112:8 వారి హృదయాలు భద్రంగా ఉన్నాయి, వారికి భయం ఉండదు; చివరికి వారు తమ శత్రువులపై విజయంతో చూస్తారు.
PSA 112:9 వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు, వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది; వారి కొమ్ము ఘనత పొంది హెచ్చింపబడుతుంది.
PSA 112:10 దుష్టులు చూసి విసుగుచెందుతారు, వారు పండ్లు కొరుకుతూ క్షీణించి పోతారు; దుష్టుల ఆశలు విఫలమవుతాయి.
PSA 113:1 యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి; యెహోవా నామాన్ని స్తుతించండి.
PSA 113:2 ఇప్పుడు ఎల్లప్పుడు సదా యెహోవా నామం స్తుతింపబడును గాక.
PSA 113:3 సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు, యెహోవా నామం స్తుతింపబడును గాక.
PSA 113:4 దేశాలన్నిటికి పైగా యెహోవా హెచ్చింపబడ్డారు, ఆయన మహిమ ఆకాశాలకు పైగా విస్తరించి ఉంది.
PSA 113:5 మన దేవుడైన యెహోవా లాంటి వారెవరు, ఎత్తైన సింహాసనంపై ఆసీనులై ఉన్నవారు,
PSA 113:6 అక్కడినుండి ఆకాశాన్ని, భూమిని వంగి చూడగలవారెవరు?
PSA 113:7 దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే;
PSA 113:8 ఆయన వారిని రాకుమారులతో, తన ప్రజల రాకుమారులతో కూర్చోబెడతారు.
PSA 113:9 అతడు సంతానం లేని స్త్రీని తన ఇంట్లో సంతోషంగా ఉన్న తల్లిగా స్థిరపరుస్తారు. యెహోవాను స్తుతించండి.
PSA 114:1 ఇశ్రాయేలు ఈజిప్టు నుండి, యాకోబు పర భాష మాట్లాడే ప్రజలమధ్య నుండి బయటకు వచ్చాక,
PSA 114:2 యూదా దేవునికి పరిశుద్ధాలయం అయ్యింది, ఇశ్రాయేలు ఆయన రాజ్యమైంది.
PSA 114:3 అది చూసి ఎర్ర సముద్రం పారిపోయింది, యొర్దాను వెనుకకు తిరిగింది;
PSA 114:4 పర్వతాలు పొట్టేళ్లలా, కొండలు గొర్రెపిల్లల్లా గంతులేశాయి.
PSA 114:5 సముద్రమా, నీవెందుకు పారిపోయావు? యొర్దాను, నీవెందుకు వెనుకకు తిరిగావు?
PSA 114:6 పర్వతాల్లారా, మీరు పొట్టేళ్లలా, కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లా ఎందుకు గంతులేశారు?
PSA 114:7 ఓ భూమి, ప్రభువు సన్నిధిలో యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి.
PSA 114:8 ఆయన బండను నీటి ఊటగా మార్చేవారు, చెకుముకి రాతిని నీటి బుగ్గగా మార్చేవారు.
PSA 115:1 మాకు కాదు, యెహోవా, మాకు కాదు, మీ మారని ప్రేమ, నమ్మకత్వాన్ని బట్టి, మీ నామానికే మహిమ కలగాలి.
PSA 115:2 “వారి దేవుడు ఎక్కడ?” అని జనులు ఎందుకు అంటున్నారు?
PSA 115:3 మన దేవుడు పరలోకంలో ఉన్నారు; ఆయనకు ఇష్టమైనదే ఆయన చేస్తారు.
PSA 115:4 అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు.
PSA 115:5 వాటికి నోళ్ళున్నాయి, కాని మాట్లాడలేవు, కళ్లున్నాయి, కాని చూడలేవు.
PSA 115:6 వాటికి చెవులున్నాయి, కాని వినలేవు, ముక్కులున్నాయి, కాని వాసన చూడలేవు.
PSA 115:7 వారికి చేతులు ఉన్నాయి, కానీ అనుభూతి చెందవు, పాదాలున్నాయి, కాని నడవలేవు, కనీసం వాటి గొంతులతో శబ్దం చేయలేవు.
PSA 115:8 వాటిని తయారుచేసేవారు, వాటిని నమ్మేవారు వాటి లాగే ఉంటారు.
PSA 115:9 సర్వ ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.
PSA 115:10 అహరోను వంశమా, యెహోవాను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.
PSA 115:11 యెహోవాకు భయపడు వారలారా ఆయనను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.
PSA 115:12 యెహోవా మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు మనల్ని దీవిస్తారు: ఆయన ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తారు, అహరోను వంశాన్ని దీవిస్తారు.
PSA 115:13 యెహోవాకు భయపడేవారిని అనగా పిల్లలను పెద్దలను ఆయన దీవిస్తారు.
PSA 115:14 యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను, వృద్ధి చేయును గాక.
PSA 115:15 ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవాచేత, మీరు దీవించబడుదురు గాక.
PSA 115:16 ఎత్తైన ఆకాశాలు యెహోవాకు చెందినవి, అయితే భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చారు.
PSA 115:17 యెహోవాను స్తుతించేది చనిపోయినవారు కాదు, నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లేవారు కాదు;
PSA 115:18 మనమే యెహోవాను కీర్తించేవారం, ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము. యెహోవాను స్తుతించండి.
PSA 116:1 నేను యెహోవాను ప్రేమిస్తాను, ఎందుకంటే ఆయన నా స్వరం విన్నారు; కరుణ కోసం నేను పెట్టిన మొరను ఆయన విన్నారు.
PSA 116:2 ఆయన తన చెవిని నా వైపు త్రిప్పారు కాబట్టి, నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఆయనకు మొరపెడుతుంటాను.
PSA 116:3 మరణపాశాలు నన్ను చుట్టివేశాయి, సమాధి వేదన నా మీదికి వచ్చింది. బాధ దుఃఖం నన్ను అధిగమించాయి.
PSA 116:4 అప్పుడు నేను యెహోవా నామమున మొరపెట్టాను: “యెహోవా, నన్ను రక్షించండి!”
PSA 116:5 యెహోవా దయగలవాడు నీతిమంతుడు; మన దేవుడు కనికరం కలవాడు.
PSA 116:6 యెహోవా సామాన్యులను కాపాడతారు; నేను దుర్దశలో ఉన్నప్పుడు, ఆయన నన్ను రక్షించారు.
PSA 116:7 నా ప్రాణమా, నీ విశ్రాంతికి తిరిగి వెళ్లు, ఎందుకంటే యెహోవా నీ పట్ల గొప్పగా వ్యవహరించారు.
PSA 116:8 యెహోవా, మీరు, మరణం నుండి నన్ను, కన్నీటి నుండి నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను విడిపించారు.
PSA 116:9 నేను సజీవుల భూమిలో యెహోవా ఎదుట నడుస్తాను.
PSA 116:10 “నేను చాలా బాధింపబడ్డాను” అని నేను చెప్పినప్పుడు, నేను యెహోవాపై నమ్మకం ఉంచాను;
PSA 116:11 నా కంగారులో నేను, “మనుష్యులంతా అబద్ధికులు” అన్నాను.
PSA 116:12 యెహోవా నాకు చేసిన అంతటిని బట్టి నేను ఆయనకు తిరిగి ఏమివ్వగలను?
PSA 116:13 నేను రక్షణ పాత్రను పైకెత్తి యెహోవా పేరట మొరపెడతాను.
PSA 116:14 ఆయన ప్రజలందరి సమక్షంలో, నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు తీర్చుకుంటాను.
PSA 116:15 యెహోవా దృష్టిలో విలువైనది ఆయన నమ్మకమైన సేవకుల మరణము.
PSA 116:16 యెహోవా, నేను మీ సేవకుడిని మీ పనిమనిషి కుమారున్ని, నా తల్లి చేసినట్లే నేను మీకు సేవ చేస్తాను; మీరు నా సంకెళ్ళ నుండి నన్ను విడిపించారు.
PSA 116:17 నేను మీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను యెహోవా నేను మీ పేరట మొరపెడతాను.
PSA 116:18 ఆయన ప్రజలందరి సమక్షంలోను, యెహోవా మందిర ఆవరణాల్లోను, యెరూషలేమా, మీ మధ్యను, నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి.
PSA 117:1 సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి; సర్వజనులారా, ఆయనను కీర్తించండి.
PSA 117:2 మన పట్ల ఆయన మారని ప్రేమ గొప్పది, ఆయన నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది. యెహోవాను స్తుతించండి.
PSA 118:1 యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
PSA 118:2 “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని ఇశ్రాయేలీయులు చెప్పుదురు గాక.
PSA 118:3 “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అహరోను వంశం చెప్పుదురు గాక.
PSA 118:4 “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని యెహోవాకు భయపడేవారు చెప్పుదురు గాక.
PSA 118:5 నేను ఇరుకులో ఉండి యెహోవాకు మొరపెట్టాను; ఆయన నాకు జవాబిచ్చి నన్ను విశాల స్థలంలోకి తెచ్చారు.
PSA 118:6 యెహోవా నా పక్షాన ఉన్నారు; నేను భయపడను. నరమాత్రులు నన్నేమి చేయగలరు?
PSA 118:7 యెహోవా నా పక్షాన ఉన్నారు; ఆయన నా సహాయకుడు. నా శత్రువుల వైపు నేను విజయం పొందినవానిగా చూస్తాను.
PSA 118:8 మనుష్యులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.
PSA 118:9 రాజులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మంచిది.
PSA 118:10 దేశాలన్నీ నన్ను చుట్టుముట్టాయి, కాని యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.
PSA 118:11 వారు ప్రతి వైపు నుండి నన్ను చుట్టుముట్టారు, కాని యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.
PSA 118:12 వారు కందిరీగల్లా నా చుట్టూ తిరిగారు, కాని మండుతున్న ముళ్ళపొదల్లా వారు త్వరగా కాలిపోయారు; యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.
PSA 118:13 శత్రువు నన్ను బలంగా గెంటివేశాడు, నేను పడిపోయి ఉండే వాడినే కాని యెహోవా నాకు సహాయం చేశారు.
PSA 118:14 యెహోవా నా శక్తి, నా బలం; ఆయనే నా రక్షణ అయ్యారు.
PSA 118:15 నీతిమంతుల గుడారాల్లో రక్షణానంద కేకలు ప్రతిధ్వనిస్తాయి: “యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!
PSA 118:16 యెహోవా కుడి హస్తం పైకి ఎత్తబడింది; యెహోవా కుడి హస్తం పరాక్రమమైన వాటిని చేసింది!”
PSA 118:17 నేను చావను కాని బ్రతికి ఉండి, యెహోవా చేసిన దానిని ప్రకటిస్తాను.
PSA 118:18 యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించారు, కాని ఆయన నన్ను చావుకు అప్పగించలేదు.
PSA 118:19 నా కొరకు నీతిమంతుల గుమ్మాలను తెరవండి; నేను లోపలికి ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తాను.
PSA 118:20 ఇది యెహోవా గుమ్మం నీతిమంతులు దీని గుండా ప్రవేశిస్తారు.
PSA 118:21 మీరు నాకు జవాబిచ్చారు, కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; మీరు నాకు రక్షణ అయ్యారు.
PSA 118:22 ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది;
PSA 118:23 ఇది యెహోవా చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.
PSA 118:24 ఇది యెహోవా చేసిన దినం ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.
PSA 118:25 యెహోవా, మమ్మల్ని రక్షించండి! యెహోవా, మాకు విజయం ప్రసాదించండి!
PSA 118:26 యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక! యెహోవా మందిరం నుండి మేము మిమ్మల్ని దీవిస్తాము.
PSA 118:27 యెహోవాయే దేవుడు, ఆయన తన వెలుగును మనమీద ప్రకాశింపజేశారు. త్రాళ్లతో అర్పణను బలిపీఠం కొమ్ములకు కట్టెయ్యండి.
PSA 118:28 మీరు నా దేవుడు, నేను మిమ్మల్ని స్తుతిస్తాను; మీరు నా దేవుడు, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను.
PSA 118:29 యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
PSA 119:1 నిందారహిత మార్గాలను అనుసరిస్తూ, యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు.
PSA 119:2 ఆయన శాసనాలను పాటిస్తూ తమ హృదయమంతటితో ఆయనను వెదకేవారు ధన్యులు,
PSA 119:3 వారు అన్యాయం చేయక ఆయన మార్గాలను అనుసరిస్తారు.
PSA 119:4 అత్యంత జాగ్రత్తగా పాటించాలని మీరు వారికి శాసనాలిచ్చారు.
PSA 119:5 మీ శాసనాలను అనుసరించుటలో నా మార్గాలు సుస్థిరమై ఉంటే ఎంత బాగుండేది!
PSA 119:6 అప్పుడు మీ ఆజ్ఞలను లక్ష్యపెట్టినప్పుడు నేను అవమానపాలు కాను.
PSA 119:7 నేను మీ నీతి న్యాయవిధులను తెలుసుకున్న కొలది యథార్థ హృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
PSA 119:8 నేను మీ శాసనాలకు లోబడతాను. దయచేసి నన్ను పూర్తిగా ఎడబాయకండి.
PSA 119:9 యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు? మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే.
PSA 119:10 నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను; మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి.
PSA 119:11 నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను.
PSA 119:12 యెహోవా, మీకు స్తుతి కలుగును గాక; మీ శాసనాలను నాకు బోధించండి.
PSA 119:13 మీ నోట నుండి వచ్చే న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరిస్తాను.
PSA 119:14 ఒకడు గొప్ప ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించునట్లు నేను మీ శాసనాలను పాటించడంలో సంతోషిస్తాను.
PSA 119:15 మీ శాసనాలను నేను ధ్యానిస్తాను మీ మార్గాలను పరిగణిస్తాను.
PSA 119:16 మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను.
PSA 119:17 నేను బ్రతికి ఉండి మీ వాక్యానికి లోబడేలా, మీ సేవకునిపట్ల దయగా ఉండండి.
PSA 119:18 మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన వాటిని నేను చూడగలిగేలా నా కళ్లు తెరవండి.
PSA 119:19 ఈ లోకంలో నేను అపరిచితున్ని; మీ ఆజ్ఞలను నా నుండి దాచిపెట్టకండి.
PSA 119:20 అన్నివేళల్లో మీ న్యాయవిధుల కోసం తపిస్తూ నా ప్రాణం క్షీణించిపోతుంది.
PSA 119:21 శపించబడినవారైన అహంకారులను మీరు గద్దిస్తారు, వారు మీ ఆజ్ఞల నుండి తొలగిపోయినవారు.
PSA 119:22 నేను మీ శాసనాలను పాటిస్తున్నాను, వారి అపహాస్యాన్ని ధిక్కారాన్ని నా నుండి తొలగించండి.
PSA 119:23 పాలకులు కలిసి కూర్చుని నన్ను అపవాదు చేసినప్పటికీ, మీ సేవకుడు మీ శాసనాలను ధ్యానిస్తాడు.
PSA 119:24 మీ శాసనాలే నాకు ఆనందం; అవి నాకు ఆలోచన చెప్తాయి.
PSA 119:25 నేను నేల మీద పడిపోయాను; మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి.
PSA 119:26 నా జీవిత పరిస్థితులను మీకు వివరించాను, మీరు నాకు జవాబిచ్చారు; మీ శాసనాలు నాకు బోధించండి.
PSA 119:27 నేను మీ కట్టడల అర్థాన్ని గ్రహించేలా చేయండి, తద్వారా మీ అద్భుత కార్యాలను నేను ధ్యానిస్తాను.
PSA 119:28 దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది; మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి.
PSA 119:29 మోసపూరిత మార్గాల నుండి నన్ను తప్పించండి; నా మీద దయచూపి మీ ధర్మశాస్త్రం నాకు బోధించండి.
PSA 119:30 నేను నమ్మకత్వం అనే మార్గం ఎంచుకున్నాను; మీ న్యాయవిధులపై నా హృదయాన్ని నిలుపుకున్నాను.
PSA 119:31 యెహోవా, మీ శాసనాలను గట్టిగా పట్టుకుని ఉంటాను; నాకు అవమానం కలగనివ్వకండి.
PSA 119:32 మీ ఆజ్ఞల మార్గాన నేను పరుగెడతాను, ఎందుకంటే మీరు నా గ్రహింపును విశాలపరిచారు.
PSA 119:33 యెహోవా, మీ శాసనాల విధానాన్ని నాకు బోధించండి, అంతం వరకు నేను వాటిని అనుసరిస్తాను.
PSA 119:34 మీ ధర్మశాస్త్రం నేను అనుసరించేలా హృదయపూర్వకంగా వాటికి విధేయత చూపేలా, నాకు గ్రహింపు దయచేయండి.
PSA 119:35 మీ ఆజ్ఞల మార్గాన నన్ను నడిపించండి, అక్కడే నాకు ఆనందము.
PSA 119:36 నా హృదయాన్ని అన్యాయపు లాభం వైపు కాక మీ శాసనాల వైపుకు త్రిప్పండి.
PSA 119:37 పనికిరాని వాటినుండి నా కళ్లను త్రిప్పండి; మీ మార్గాల ద్వార నా జీవితాన్ని కాపాడండి.
PSA 119:38 మీ సేవకునిపట్ల మీ మాటను నెరవేర్చండి, తద్వారా ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు.
PSA 119:39 నాకు భయం కలిగిస్తున్న అవమానాన్ని తొలగించండి, ఎందుకంటే మీ న్యాయవిధులు మేలైనవి.
PSA 119:40 మీ కట్టడల కోసం నేను ఎంతగా తహతహ లాడుతున్నాను! మీ నీతిలో నా జీవితాన్ని కాపాడండి.
PSA 119:41 యెహోవా, మీ మారని ప్రేమ, మీ వాగ్దాన ప్రకారం, మీ రక్షణ నాకు వచ్చును గాక.
PSA 119:42 అప్పుడు నన్ను నిందించే వారెవరికైనా నేను సమాధానం చెప్పగలను, ఎందుకంటే మీ మాట మీద నాకు నమ్మకము.
PSA 119:43 మీ సత్య వాక్యాన్ని ఎప్పుడూ నా నోటి నుండి తీసివేయకండి, ఎందుకంటే నేను మీ న్యాయవిధులలో నా నిరీక్షణ ఉంచాను.
PSA 119:44 నేను ఎల్లప్పుడు అంటే నిరంతరం, మీ ధర్మశాస్త్రానికి లోబడతాను.
PSA 119:45 నేను మీ కట్టడలను వెదికాను, కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను.
PSA 119:46 రాజుల ఎదుట కూడా నేను మీ శాసనాల గురించి మాట్లాడతాను నేను సిగ్గుపడను,
PSA 119:47 నేను మీ ఆజ్ఞలలో ఆనందిస్తాను ఎందుకంటే అవంటే నాకు ప్రేమ.
PSA 119:48 నేను ప్రేమించే మీ ఆజ్ఞల వైపు నా చేతులెత్తుతాను, తద్వారా నేను మీ శాసనాలను ధ్యానిస్తాను.
PSA 119:49 మీ సేవకునికి మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మీరు నాకు నిరీక్షణ కలిగించారు.
PSA 119:50 నా శ్రమలో నా ఆదరణ ఇదే: మీ వాగ్దానం నన్ను బ్రతికిస్తుంది.
PSA 119:51 అహంకారులు కనికరం లేకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు, కాని నేను మీ ధర్మశాస్త్రం నుండి తిరిగిపోను.
PSA 119:52 యెహోవా, మీ అనాది న్యాయవిధులు నాకు జ్ఞాపకం ఉన్నాయి, వాటిలో నాకెంతో ఆదరణ.
PSA 119:53 మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన దుష్టులను బట్టి, నాకు చాలా కోపం వస్తుంది.
PSA 119:54 నేను ఎక్కడ బస చేసినా మీ శాసనాలే నా పాటల సారాంశము.
PSA 119:55 యెహోవా, నేను నీ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి రాత్రివేళ మీ పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాను.
PSA 119:56 నేను మీ కట్టడలకు విధేయత చూపుతాను ఇది నాకు అభ్యాసంగా ఉన్నది.
PSA 119:57 యెహోవా, మీరే నా వాటా; మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను.
PSA 119:58 నేను నా హృదయపూర్వకంగా మీ దయ కోసం వెదికాను; మీ వాగ్దానం మేరకు నా మీద దయచూపండి.
PSA 119:59 నేను నా మార్గాలను గమనించి నా అడుగులను మీ శాసనాల వైపుకు త్రిప్పుకున్నాను.
PSA 119:60 మీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను ఆలస్యం చేయకుండ త్వరపడతాను.
PSA 119:61 దుష్టులు నన్ను త్రాళ్లతో ఉచ్చులా బిగించినా, నేను మీ ధర్మశాస్త్రం మరచిపోను.
PSA 119:62 మీ నీతిగల న్యాయవిధులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి నేను మధ్యరాత్రి లేస్తున్నాను.
PSA 119:63 మీకు భయపడేవారందరికి, మీ కట్టడలను అనుసరించే వారందరికి నేను స్నేహితుడను.
PSA 119:64 యెహోవా, ఈ లోకమంతా మీ మారని ప్రేమ చేత నిండి ఉంది; మీ శాసనాలు నాకు బోధించండి.
PSA 119:65 యెహోవా, మీ మాట ప్రకారం మీ సేవకునికి మేలు చేయండి.
PSA 119:66 నేను మీ ఆజ్ఞలను నమ్ముకున్నాను, నాకు సరియైన వివేచనను గ్రహింపును బోధించండి.
PSA 119:67 నాకు బాధ కలుగకముందు నేను త్రోవ తప్పి తిరిగాను, కాని ఇప్పుడు నేను మీ వాక్కుకు లోబడుతున్నాను.
PSA 119:68 మీరు మంచివారు, మీరు మంచి చేస్తారు; మీ శాసనాలు నాకు బోధించండి.
PSA 119:69 అహంకారులు నన్ను అబద్ధాలతో అరిచినప్పటికీ, నేను హృదయపూర్వకంగా మీ కట్టడలను అనుసరిస్తాను.
PSA 119:70 వారి హృదయాలు క్రొవ్వులా మందగించాయి, కాని నేను మీ ధర్మశాస్త్రంలోనే ఆనందిస్తాను.
PSA 119:71 నాకు బాధ కలగడం మేలైంది తద్వారా నేను మీ శాసనాలు నేర్చుకోగలను.
PSA 119:72 వేలాది వెండి బంగారు నాణేలకంటే మీ నోట నుండి వచ్చిన ధర్మశాస్త్రం నాకు అమూల్యమైనది.
PSA 119:73 మీ హస్తములు నన్ను నిర్మించి నన్ను రూపించాయి; మీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు గ్రహింపును ఇవ్వండి.
PSA 119:74 మీకు భయపడేవారు నన్ను చూసినప్పుడు సంతోషించుదురు గాక, ఎందుకంటే నేను మీ మాటలో నా నిరీక్షణ ఉంచాను.
PSA 119:75 యెహోవా, మీ న్యాయవిధులు నీతిగలవని నాకు తెలుసు, నమ్మకత్వంలో మీరు నన్ను బాధించారని నాకు తెలుసు.
PSA 119:76 మీ సేవకునికి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారం, మీ మారని ప్రేమ నాకు ఆదరణ కలిగిస్తుంది.
PSA 119:77 నేను బ్రతికేలా మీ కనికరం నా దగ్గరకు రానివ్వండి, మీ ధర్మశాస్త్రంలోనే నాకు ఆనందము.
PSA 119:78 కారణం లేకుండా నాకు అన్యాయం చేసినందుకు అహంకారులు అవమానపరచబడుదురు గాక; కాని నేను మీ కట్టడలను ధ్యానిస్తాను.
PSA 119:79 మీకు భయపడేవారు, మీ శాసనాలు గ్రహించేవారు నా వైపు తిరుగుదురు గాక.
PSA 119:80 నేను అవమానానికి గురి కాకుండ, మీ శాసనాలను పూర్ణహృదయంతో అనుసరించి నిందారహితునిగా ఉంటాను.
PSA 119:81 మీరు కలిగించే రక్షణ కోసం ఎదురుచూస్తూ నా ప్రాణం సొమ్మసిల్లి పోతుంది; కాని నేను మీ మాట మీద నిరీక్షణ కలిగి ఉన్నాను.
PSA 119:82 మీ వాగ్దానం కోసం ఎదురుచూస్తూ నా కళ్లు క్షీణిస్తున్నాయి; “మీరు నన్ను ఎప్పుడు ఆదరిస్తారు?” అని నేను అంటాను.
PSA 119:83 నేను పొగలో ఆరిన ద్రాక్ష తిత్తిలా ఉన్నా, నేను మీ శాసనాలను మరువను.
PSA 119:84 మీ సేవకుడు ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? నన్ను హింసించేవారిని మీరు ఎప్పుడు శిక్షిస్తారు?
PSA 119:85 అహంకారులు మీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు.
PSA 119:86 మీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి; నేను నిష్కారణంగా హింసింపబడుచున్నాను, నాకు సహాయం చేయండి.
PSA 119:87 వారు దాదాపు నన్ను ఈ భూమి మీద లేకుండ చేసేసారు, అయితే నేను మీ కట్టడలను విడిచిపెట్టలేదు.
PSA 119:88 మీ మారని ప్రేమతో నా జీవితాన్ని కాపాడండి, తద్వార మీ నోటి శాసనాలను నేను పాటిస్తాను.
PSA 119:89 యెహోవా! మీ వాక్కు శాశ్వతం; అది పరలోకంలో సుస్థిరంగా ఉంది.
PSA 119:90 మీ నమ్మకత్వం తరతరాలకు నిలుస్తుంది. మీరు భూమిని స్థాపించారు, అది సుస్థిరంగా ఉంటుంది.
PSA 119:91 మీ న్యాయవిధులు ఈ రోజు వరకు కొనసాగుతాయి, ఎందుకంటే అన్ని మీకు సేవ చేస్తాయి.
PSA 119:92 ఒకవేళ మీ ధర్మశాస్త్రం నా ఆనందమై ఉండకపోతే, నేను బాధలో నశించి పోయి ఉండేవాన్ని.
PSA 119:93 నేను మీ కట్టడలు ఎన్నడు మరువను, ఎందుకంటే వాటి ద్వార మీరు నా జీవితాన్ని కాపాడారు.
PSA 119:94 నేను మీ వాడను, నన్ను రక్షించండి; నేను మీ కట్టడలను వెదికాను.
PSA 119:95 దుష్టులు నన్ను చంపాలని కాచుకుని ఉన్నారు, కాని నేనైతే మీ శాసనాలను గురించి ఆలోచిస్తాను.
PSA 119:96 సంపూర్ణతకు కూడా ఉంది పరిమితి! కానీ, మీ ధర్మశాస్త్రోపదేశం అపరిమితము.
PSA 119:97 ఓ, మీ ధర్మశాస్త్రం అంటే నాకెంత ఇష్టమో! నేను రోజంతా దానిని ధ్యానిస్తాను.
PSA 119:98 మీ ఆజ్ఞలు ఎల్లప్పుడు నాతో ఉండి నా శత్రువుల కన్నా నన్ను జ్ఞానిగా చేస్తాయి.
PSA 119:99 నేను మీ శాసనాలను ధ్యానిస్తాను కాబట్టి నా ఉపదేశకులందరి కంటే నేను ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నాను.
PSA 119:100 నేను మీ కట్టడలను ఆచరిస్తాను కాబట్టి వృద్ధులకు మించిన గ్రహింపు నేను కలిగి ఉన్నాను.
PSA 119:101 మీ వాక్యం చెప్పినట్లే చేద్దామని చెడు మార్గాల నుండి నా పాదాలు తొలగించుకున్నాను.
PSA 119:102 నేను మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, ఎందుకంటే మీరే నాకు బోధించారు.
PSA 119:103 మీ వాక్కులు నా నోటికి ఎంతో మధురం, అవి తేనెకంటె తియ్యనివి!
PSA 119:104 మీ కట్టడల వల్ల నేను గ్రహింపు పొందాను; కాబట్టి తప్పుడు త్రోవలంటే నాకు అసహ్యము.
PSA 119:105 మీ వాక్కు నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు.
PSA 119:106 నేను మీ నీతిగల న్యాయవిధులను పాటిస్తానని ప్రమాణం చేసి ధృవీకరించాను.
PSA 119:107 యెహోవా, నేను చాలా బాధపడ్డాను; మీ వాక్కు ప్రకారం నా జీవితాన్ని కాపాడండి.
PSA 119:108 యెహోవా, నా నోటి యొక్క ఇష్టపూర్వకమైన స్తుతిని స్వీకరించండి, మీ న్యాయవిధులు నాకు బోధించండి.
PSA 119:109 నేను నిరంతరం నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పటికీ, నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవను.
PSA 119:110 దుష్టులు నన్ను చిక్కించుకోవాలని ఉరులు ఒడ్డారు, అయినా నేను మాత్రం మీ కట్టడల నుండి తొలగిపోలేదు.
PSA 119:111 మీ శాసనాలు నాకు శాశ్వత వారసత్వం; అవి నా హృదయానికి ఆనందం.
PSA 119:112 అంతం వరకు మీ శాసనాలను పాటించాలని నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను.
PSA 119:113 ద్విమనస్కులంటే నాకు అసహ్యం, కాని మీ ధర్మశాస్త్రం నాకు ఇష్టం.
PSA 119:114 మీరు నా ఆశ్రయం నా డాలు; నేను మీ మాటలో నిరీక్షణ ఉంచాను.
PSA 119:115 నేను నా దేవుని ఆజ్ఞలను పాటించేలా, కీడుచేసేవారలారా, నాకు దూరంగా ఉండండి!
PSA 119:116 మీ వాగ్దానం ప్రకారం నన్నాదుకోండి, నేను బ్రతుకుతాను; నా నిరీక్షణను బద్దలు కానివ్వకండి.
PSA 119:117 నన్ను ఎత్తిపట్టుకోండి, నేను విడిపించబడతాను; మీ శాసనాలను నేను ఎల్లప్పుడు గౌరవిస్తాను.
PSA 119:118 మీ శాసనాల నుండి తప్పుకున్న వారిని మీరు తిరస్కరిస్తారు, వారి భ్రమలు ఏమీ కాకుండా పోతాయి.
PSA 119:119 భూమి మీద ఉన్న దుష్టులందరిని మీరు లోహపు మడ్డిలా విస్మరిస్తారు; కాబట్టి నేను మీ శాసనాలను ప్రేమిస్తాను.
PSA 119:120 మీ భయానికి నా శరీరం వణకుతుంది; మీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను.
PSA 119:121 నేను నీతియుక్తమైనది న్యాయమైనది చేశాను; నన్ను బాధించేవారికి నన్ను వదిలేయకండి.
PSA 119:122 మీ సేవకుడి శ్రేయస్సుకు హామీ ఇవ్వండి; అహంకారులు నన్ను అణచివేయనివ్వకండి.
PSA 119:123 మీ నీతియుక్తమైన వాగ్దానం కోసం, మీ రక్షణ కోసం ఎదురుచూస్తూ, నా కళ్లు క్షీణిస్తున్నాయి.
PSA 119:124 మీ మారని ప్రేమకు తగినట్టుగా మీ సేవకునితో వ్యవహరించండి అలాగే మీ శాసనాలు నాకు బోధించండి.
PSA 119:125 నేను మీ సేవకుడను; మీ శాసనాలు నేను గ్రహించేలా నాకు వివేచన ఇవ్వండి.
PSA 119:126 మీ ధర్మశాస్త్రం ఉల్లంఘించబడుతుంది; యెహోవా, మీరు చర్య తీసుకోవలసిన సమయం ఇదే.
PSA 119:127 ఎందుకంటే నేను మీ ఆజ్ఞలను బంగారం కంటే, మేలిమి బంగారం కంటే ఎక్కువ ప్రేమిస్తాను,
PSA 119:128 నేను మీ కట్టడలన్నిటిని యథార్థమైనవిగా పరిగణిస్తాను, ప్రతి తప్పుడు మార్గం నాకసహ్యము.
PSA 119:129 మీ శాసనాలు అద్భుతం; కాబట్టి నేను వాటికి లోబడతాను.
PSA 119:130 మీ వాక్కులు వెల్లడి అవడంతోనే వెలుగు ప్రకాశిస్తుంది. అది సామాన్యులకు గ్రహింపునిస్తుంది.
PSA 119:131 మీ ఆజ్ఞల కోసం ఆరాటపడుతూ, నేను నా నోరు తెరిచి రొప్పుతున్నాను.
PSA 119:132 మీ పేరును ఇష్టపడేవారికి మీరు ఎప్పుడూ చేసినట్టు, నా వైపు తిరిగి నాపై దయచూపండి.
PSA 119:133 మీ వాక్కు ప్రకారం నా అడుగుజాడలను నిర్దేశించండి; ఏ దుష్టత్వం నన్ను ఏలకుండును గాక.
PSA 119:134 నేను మీ కట్టడలకు లోబడేలా, మనుష్యుల దౌర్జన్యం నుండి విడిపించండి.
PSA 119:135 మీ సేవకుడి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపనివ్వండి మీ శాసనాలను నాకు బోధించండి.
PSA 119:136 ప్రజలు మీ ధర్మశాస్త్రానికి లోబడకపోవడం చూసి, నా కళ్ల నుండి కన్నీరు ప్రవహిస్తుంది.
PSA 119:137 యెహోవా, మీరు నీతిమంతులు, మీ న్యాయవిధులు యథార్థమైనవి.
PSA 119:138 మీరు విధించిన శాసనాలు నీతియుక్తమైనవి; అవి పూర్తిగా నమ్మదగినవి.
PSA 119:139 నా శత్రువులు మీ మాటలను విస్మరిస్తారు కాబట్టి, నా ఆసక్తి నన్ను తినేస్తుంది.
PSA 119:140 మీ వాగ్దానాలు పూర్తిగా పరీక్షించబడ్డాయి, మీ సేవకుడు వాటిని ప్రేమిస్తాడు.
PSA 119:141 నేను అల్పుడనైనా, తృణీకరించబడినా, నేను మీ కట్టడలు మరచిపోను.
PSA 119:142 మీ నీతి శాశ్వతమైనది మీ ధర్మశాస్త్రం సత్యమైనది.
PSA 119:143 ఇబ్బంది, బాధ నా మీదికి వచ్చాయి, కాని మీ ఆజ్ఞలు నాకు ఆనందాన్ని ఇస్తాయి.
PSA 119:144 మీ శాసనాలు ఎల్లప్పుడు నీతియుక్తమైనవి; నేను బ్రతికేలా నాకు గ్రహింపు ఇవ్వండి.
PSA 119:145 యెహోవా, నా హృదయమంతటితో నేను మొరపెడుతున్నాను; నాకు జవాబివ్వండి, నేను మీ శాసనాలకు లోబడతాను.
PSA 119:146 నేను మీకు మొరపెడతాను; నన్ను రక్షించండి నేను మీ శాసనాలను పాటిస్తాను.
PSA 119:147 నేను తెల్లవారక ముందే లేచి సహాయం కోసం మొరపెడతాను; నేను మీ వాక్కులలో నిరీక్షణ ఉంచాను.
PSA 119:148 మీ వాగ్దానాలను నేను ధ్యానించేలా, రాత్రి జాములంతా నా కళ్లు తెరిచి ఉంటాయి.
PSA 119:149 మీ మారని ప్రేమను బట్టి నా స్వరాన్ని వినండి; యెహోవా, మీ న్యాయవిధుల ప్రకారం నా జీవితాన్ని కాపాడండి.
PSA 119:150 దుష్ట పథకాలను రూపొందించే వారు దగ్గరలో ఉన్నారు, కాని వారు మీ ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నారు.
PSA 119:151 అయినాసరే యెహోవా, మీరు నా దగ్గరే ఉన్నారు, మీ ఆజ్ఞలన్నీ నిజం.
PSA 119:152 మీ శాసనాలు నిత్యం నిలిచి ఉండేలా మీరు స్థాపించారని, చాలా కాలం క్రితం నేను తెలుసుకున్నాను.
PSA 119:153 నా శ్రమను చూసి నన్ను విడిపించండి, ఎందుకంటే నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవలేదు.
PSA 119:154 నా కారణాన్ని సమర్థించి నన్ను విమోచించండి; మీ వాగ్దాన ప్రకారం నా జీవితాన్ని కాపాడండి.
PSA 119:155 రక్షణ దుష్టులకు దూరం, ఎందుకంటే వారు మీ శాసనాలు వెదకరు.
PSA 119:156 యెహోవా, మీ కనికరం గొప్పది; మీ న్యాయవిధులను బట్టి నా జీవితాన్ని కాపాడండి.
PSA 119:157 నన్ను హింసించే శత్రువులు చాలామంది, అయినా నేను మీ శాసనాల నుండి తప్పుకోలేదు.
PSA 119:158 నేను ద్రోహులను అసహ్యంగా చూస్తాను, ఎందుకంటే వారు మీ వాక్కుకు లోబడరు.
PSA 119:159 నేను మీ కట్టడలు ఎంతగా ప్రేమిస్తున్నానో చూడండి; యెహోవా, మీ మారని ప్రేమ చేత, నా జీవితాన్ని కాపాడండి.
PSA 119:160 మీ వాక్కులన్నీ నిజం; మీ నీతియుక్తమైన న్యాయవిధులు నిత్యం నిలుస్తాయి.
PSA 119:161 కారణం లేకుండ అధికారులు నన్ను హింసిస్తున్నారు, అయినా నా హృదయం మీ వాక్కుకు వణికిపోతుంది.
PSA 119:162 ఒకడు దోపుడుసొమ్మును చూసి సంతోషించినట్లు నేను మీ వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తాను.
PSA 119:163 అబద్ధం అంటే నాకు అసహ్యం ద్వేషం కాని మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
PSA 119:164 రోజుకు ఏడుసార్లు మిమ్మల్ని స్తుతిస్తాను ఎందుకంటే మీ న్యాయవిధులు నీతియుక్తమైనవి.
PSA 119:165 మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు గొప్ప సమాధానం కలిగి ఉంటారు, ఏదీ వారిని తొట్రిల్లేలా చేయలేదు.
PSA 119:166 యెహోవా! మీ రక్షణ కోసం నేను ఎదురుచూస్తాను, నేను మీ ఆజ్ఞలను అనుసరిస్తాను.
PSA 119:167 నేను మీ శాసనాలను పాటిస్తాను, ఎందుకంటే నేను వాటిని ఎంతగానో ప్రేమిస్తాను.
PSA 119:168 నేను మీ కట్టడలకు మీ శాసనాలకు లోబడతాను, ఎందుకంటే నా మార్గాలన్నీ మీకు తెలుసు.
PSA 119:169 యెహోవా, నా మొర మీ సన్నిధికి చేరును గాక; మీ మాట ప్రకారం నాకు గ్రహింపును దయచేయండి.
PSA 119:170 నా విన్నపం మీ సన్నిధికి చేరును గాక; మీ వాగ్దానం ప్రకారం నన్ను విడిపించండి.
PSA 119:171 నా పెదవులు స్తుతితో పొంగిపారును గాక, ఎందుకంటే మీరు మీ శాసనాలను నాకు బోధిస్తారు.
PSA 119:172 నా నాలుక మీ మాటను పాడును గాక, ఎందుకంటే మీ ఆజ్ఞలన్నియు నీతియుక్తమైనవి.
PSA 119:173 మీ చేయి నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండును గాక, ఎందుకంటే నేను మీ కట్టడలను ఎంచుకున్నాను.
PSA 119:174 యెహోవా, నేను మీ రక్షణ కోసం ఆశతో ఎదురు చూస్తున్నాను, మీ ధర్మశాస్త్రం నాకెంతో ఆనందాన్నిస్తుంది.
PSA 119:175 నేను మిమ్మల్ని స్తుతించేలా నన్ను బ్రతకనివ్వండి, మీ న్యాయవిధులు నన్ను సంరక్షిస్తాయి.
PSA 119:176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరుగుతున్నాను. మీ సేవకుడిని వెదకండి, నేను మీ ఆజ్ఞలను మరవలేదు.
PSA 120:1 యాత్రకీర్తన. నా బాధలో యెహోవాకు మొరపెడతాను, ఆయన నాకు జవాబిస్తారు.
PSA 120:2 యెహోవా, అబద్ధమాడే పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నన్ను రక్షించండి.
PSA 120:3 ఓ మోసకరమైన నాలుకా, దేవుడు నీకేం చేస్తారు? ఆయన ఇంతకన్నా ఎక్కువగా నీకేం చేస్తారు?
PSA 120:4 వీరుల పదునైన బాణాలతో, మండుతున్న బదరీ మొక్కల నిప్పులతో ఆయన నిన్ను శిక్షిస్తారు.
PSA 120:5 నేను మెషెకులో నివసించినందుకు, కేదారు గుడారాల మధ్యలో జీవించినందుకు నాకు శ్రమ!
PSA 120:6 సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలో చాలా కాలం నివసించాను.
PSA 120:7 నేను సమాధానం కోరుతున్నాను; కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు.
PSA 121:1 యాత్రకీర్తన. కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది?
PSA 121:2 ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది.
PSA 121:3 ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు, నిన్ను కాపాడేవాడు కునుకడు.
PSA 121:4 నిజానికి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కునుకడు న్రిదపోడు.
PSA 121:5 యెహోవా నిన్ను కాపాడతారు, యెహోవా మీ కుడి వైపున మీకు నీడగా ఉంటారు.
PSA 121:6 పగటివేళ సూర్యుడు కాని లేదా, రాత్రివేళ చంద్రుడు కాని మీకు హాని చేయరు.
PSA 121:7 సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు.
PSA 121:8 ఇప్పటినుండి నిరంతరం నీ రాకపోకలలో యెహోవా నిన్ను కాపాడును.
PSA 122:1 దావీదు యాత్రకీర్తన. “యెహోవా ఆలయానికి వెళ్దాం” అని నాతో అన్న వారితో నేను సంతోషించాను.
PSA 122:2 ఓ యెరూషలేమా, మీ గుమ్మాల్లో మా పాదాలు నిలిచి ఉన్నాయి.
PSA 122:3 యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణము; అది దగ్గరగా కుదించబడింది.
PSA 122:4 ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన శాసనం ప్రకారం యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారి గోత్రాలు అనగా యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కి వెళ్తాయి.
PSA 122:5 అక్కడ తీర్పు కొరకైన సింహాసనాలు ఉన్నాయి, అవి దావీదు ఇంటివారి సింహాసనాలు.
PSA 122:6 యెరూషలేము యొక్క సమాధానం కోసం ప్రార్థించండి. “యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు క్షేమంగా ఉందురు గాక!
PSA 122:7 మీ ప్రాకారాలలో సమాధానం మీ కోట గోడలలో అభివృద్ధి ఉండును గాక!”
PSA 122:8 నా సోదరులు నా స్నేహితుల కోసం “మీలో సమాధానం ఉండును గాక” అని నేను అంటాను.
PSA 122:9 మన దేవుడైన యెహోవా మందిరం కోసం మీ వృద్ధిని నేను కోరతాను.
PSA 123:1 యాత్రకీర్తన. పరలోకంలో సింహాసనాసీనుడైన దేవా, మీ వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను.
PSA 123:2 దాసుల కళ్లు తమ యజమాని చేతివైపు చూసినట్లు, దాసురాలి కళ్లు తన యజమానురాలి చేతివైపు చూసినట్లు, మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించే వరకు మన కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి.
PSA 123:3 మాపై దయచూపండి, యెహోవా, మాపై దయచూపండి, ఎందుకంటే మేము అంతులేని ధిక్కారాన్ని భరించాము.
PSA 123:4 మేము గర్విష్ఠుల అంతులేని ఎగతాళిని, అహంకారుల ధిక్కారాన్ని భరించాము.
PSA 124:1 దావీదు యాత్రకీర్తన. మనుష్యులు మనపై దాడి చేసినప్పుడు వారి కోపం మనపై రగులుకొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే వారు మనల్ని సజీవంగానే మ్రింగివేసేవారు; వరద మన మీదుగా పొర్లి ఉండేది, జలప్రవాహం మనల్ని ముంచేసి జలప్రవాహాల పొంగు మనల్ని తుడిచిపెట్టి ఉండేది అని ఇశ్రాయేలు చెప్పును గాక.
PSA 124:6 వారి పళ్లు మనల్ని చీల్చివేయటానికి అనుమతించని యెహోవాకు స్తుతి చెల్లును గాక.
PSA 124:7 వేటగాని ఉరి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా మనం తప్పించుకున్నాము; ఉరి తెగిపోయింది, మనం తప్పించుకున్నాము.
PSA 124:8 భూమ్యాకాశాలను సృజించిన యెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది.
PSA 125:1 యాత్రకీర్తన. యెహోవాపై నమ్మకము ఉంచేవారు కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.
PSA 125:2 యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు, ఇప్పుడు ఎల్లప్పుడు యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు.
PSA 125:3 నీతిమంతులకు కేటాయించబడిన భూమి మీద దుష్టుల రాజదండం మీద నిలిచి ఉండదు, లేకపోతే నీతిమంతులు పాపం చేయడానికి తమ చేతులను ఉపయోగిస్తారు.
PSA 125:4 యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి.
PSA 125:5 అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారిని దుష్టులతో పాటు బహిష్కరిస్తారు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.
PSA 126:1 యాత్రకీర్తన. యెహోవా సీయోను భాగ్యాలను పునరుద్ధరించినప్పుడు, మనం కలలుగన్న వారిలా ఉన్నాము.
PSA 126:2 మన నోరు నవ్వుతో నింపబడింది, మన నాలుకలు సంతోషగానాలతో నిండి ఉన్నాయి. “యెహోవా వీరి కోసం గొప్పకార్యాలు చేశారు” అని ఇతర దేశాలు చెప్పుకున్నాయి.
PSA 126:3 యెహోవా మన కోసం గొప్పకార్యాలు చేశారు, మనం ఆనందభరితులం అయ్యాము.
PSA 126:4 దక్షిణ దేశంలో ప్రవాహాలు ప్రవహించేలా, యెహోవా, మా భాగ్యాలను తిరిగి రప్పించండి.
PSA 126:5 కన్నీటితో విత్తేవారు సంతోషగానాలతో పంట కోస్తారు.
PSA 126:6 విత్తనాలను పట్టుకుని, ఏడుస్తూ విత్తడానికి వెళ్లినవారు, సంతోషగానాలతో పనలు మోసుకువస్తారు.
PSA 127:1 సొలొమోను యాత్రకీర్తన. యెహోవా ఇల్లు కడితేనే తప్ప దానిని కట్టే వారి శ్రమ అంతా వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కావలి ఉండకపోతే దాన్ని కాపలా కాసేవారు నిలబడి కాయడం వ్యర్థమే.
PSA 127:2 మీరు ప్రొద్దున్నే లేచి ఆలస్యంగా పడుకొంటూ, కష్టపడి పని చేస్తూ ఆహారం తినడం వ్యర్థమే. ఆయన ప్రేమించేవారు నిద్రిస్తునప్పుడు కూడా యెహోవా సమకూరుస్తారు.
PSA 127:3 పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.
PSA 127:4 యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు వీరుని చేతిలో బాణాలవంటివారు.
PSA 127:5 వారితో తన అంబులపొదిని నింపుకున్నవాడు ధన్యుడు. గుమ్మంలో తమ విరోధులను ఎదుర్కొన్నప్పుడు వారు అవమానం పొందరు.
PSA 128:1 యాత్రకీర్తన. యెహోవా పట్ల భయం కలిగి, ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.
PSA 128:2 మీరు మీ కష్టార్జితాన్ని తింటారు; ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది.
PSA 128:3 మీ ఇంట్లో మీ భార్య ఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది; మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారు.
PSA 128:4 యెహోవా పట్ల భయం కలవారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు.
PSA 128:5 సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు; మీ జీవితకాలమంతా యెరూషలేము అభివృద్ధిని చూస్తారు.
PSA 128:6 మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.
PSA 129:1 యాత్రకీర్తన. “నా యవ్వనకాలం నుండి పగవారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు” అని ఇశ్రాయేలు అనాలి;
PSA 129:2 “నా యవ్వనకాలం నుండి వారు నన్ను ఎంతో హింసిస్తూ ఉన్నారు, కాని వారు నాపై విజయాన్ని పొందలేరు.
PSA 129:3 దున్నువారు దున్నినట్లు నా వీపుపై పొడవైన చాళ్ళలాంటి గాయాలు చేశారు.
PSA 129:4 అయితే యెహోవా నీతిమంతుడు; దుష్టులు కట్టిన తాళ్లను తెంచి ఆయన నన్ను విడిపించారు.”
PSA 129:5 సీయోనును ద్వేషించే వారందరు సిగ్గుపడి వెనుకకు తిరుగుదురు గాక.
PSA 129:6 వారు ఎదగక ముందే ఎండిపోయిన ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా అవుదురు గాక.
PSA 129:7 దానితో కోత కోసేవారు తమ చేతిని గాని పనలు కట్టేవారు తమ ఒడిని గాని నింపుకోరు.
PSA 129:8 “యెహోవా ఆశీర్వాదం మీమీద ఉండును గాక; యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని బాటసారులు అనకుందురు గాక.
PSA 130:1 యాత్రకీర్తన. యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను;
PSA 130:2 ప్రభువా, నా స్వరం వినండి. దయ కోసం నేను చేసే మొర మీ చెవులు శ్రద్ధతో విననివ్వండి.
PSA 130:3 యెహోవా, మీరు పాపాలను లెక్కిస్తే, ప్రభువా, ఎవరు నిలవగలరు?
PSA 130:4 కాని మీ దగ్గర క్షమాపణ లభిస్తుంది, కాబట్టి మేము భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించగలము.
PSA 130:5 యెహోవా కోసం నేను ఉన్నాను, ఆయన కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది, ఆయన మాటలో నేను నిరీక్షణ ఉంచాను.
PSA 130:6 కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా అవును, కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా, నేను ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాను.
PSA 130:7 ఓ ఇశ్రాయేలూ, యెహోవా మీద నీ నిరీక్షణ ఉంచు, ఎందుకంటే యెహోవా దగ్గర మారని ప్రేమ లభిస్తుంది ఆయన దగ్గర పూర్తి విమోచన దొరుకుతుంది.
PSA 130:8 ఆయనే ఇశ్రాయేలీయులను వారి అన్ని పాపాల నుండి విడిపిస్తారు.
PSA 131:1 దావీదు యాత్రకీర్తన. యెహోవా, నా హృదయం గర్వం కలిగిలేదు, నా కళ్లు అహంకారం కలిగిలేవు. నేను గ్రహించలేని గొప్ప విషయాలను నాకు అసాధ్యమైన విషయాలను నేను పట్టించుకోను.
PSA 131:2 పాలు విడచిన బిడ్డ సంతృప్తిగా ఉన్నట్లు, అవును, పాలు విడచిన బిడ్డ తన తల్లి ఒడిలో సంతృప్తిగా ఉన్నట్లు, నన్ను నేను నెమ్మదిపరచుకొని ప్రశాంతంగా ఉన్నాను.
PSA 131:3 ఓ ఇశ్రాయేలు, ఇప్పటినుండి నిరంతరం యెహోవా పైనే నీ నిరీక్షణ ఉంచు.
PSA 132:1 యాత్రకీర్తన. యెహోవా, దావీదును, అతనికి కలిగిన అన్ని బాధలను జ్ఞాపకము చేసుకోండి.
PSA 132:2 అతడు యెహోవాకు ప్రమాణం చేశాడు, యాకోబు యొక్క బలవంతునికి మ్రొక్కుబడి చేశాడు:
PSA 132:3 “యెహోవాకు నేను ఒక స్థలం కనుగొనేవరకు, యాకోబు యొక్క బలవంతునికి ఒక నివాసస్థలం చూచే వరకు, నేను నా ఇంట్లోకి ప్రవేశించను, నా మంచం మీద పడుకోను, నా కళ్ళకు నిద్ర లేదా నా కనురెప్పలకు కునుకు రానివ్వను.”
PSA 132:6 దాని గురించి ఎఫ్రాతాలో మేము విన్నాం, యాయరు పొలాల్లో అది మాకు దొరికింది.
PSA 132:7 “ఆయన నివాసస్థలానికి వెళ్దాం రండి, ఆయన పాదపీఠం ఎదుట ఆరాధిద్దాం రండి.
PSA 132:8 ‘యెహోవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో, మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి.
PSA 132:9 మీ యాజకులు మీ నీతిని ధరించుకొందురు గాక; నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషగానం చేయుదురు గాక.’ ”
PSA 132:10 మీ సేవకుడైన దావీదు నిమిత్తం, మీ అభిషిక్తుని తిరస్కరించకండి.
PSA 132:11 యెహోవా దావీదుకు ఇలా ప్రమాణం చేశారు, అది నమ్మదగింది, ఆయన మాట తప్పనివారు: “మీ సంతానంలో ఒకనిని మీ సింహాసనం మీద కూర్చోబెడతాను.
PSA 132:12 మీ కుమారులు నా ఒడంబడికను వారికి బోధించిన చట్టాలను పాటిస్తే, వారి కుమారులు కూడా నిత్యం మీ సింహాసనం మీద కూర్చుంటారు” అని చెప్పారు.
PSA 132:13 యెహోవా సీయోనును ఏర్పరచుకున్నారు, దానిని తన నివాస స్థలంగా ఆయన కోరుకున్నారు.
PSA 132:14 “ఇది నిత్యం నాకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది; ఇక్కడ నేను సింహాసనాసీనుడనవుతాను, ఎందుకంటే నేను దీనిని కోరుకున్నాను.
PSA 132:15 ఆమెను సమృద్ధి ఆహారంతో దీవిస్తాను; ఆమెలోని పేదవారిని ఆహారంతో తృప్తిపరుస్తాను.
PSA 132:16 ఆమె యాజకులకు రక్షణ వస్త్రాలను ధరింపచేస్తాను, ఆమెలో నమ్మకస్థులైన ప్రజలు నిత్యం సంతోషగానం చేస్తారు.
PSA 132:17 “అక్కడ దావీదుకు కొమ్ము మొలిచేలా చేస్తాను నా అభిషిక్తుని కోసం ఒక దీపం సిద్ధపరుస్తాను.
PSA 132:18 అతని శత్రువులకు అవమాన వస్త్రాలను ధరింపచేస్తాను, కాని అతని తల ప్రకాశవంతమైన కిరీటంతో అలంకరించబడుతుంది.”
PSA 133:1 దావీదు యాత్రకీర్తన సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు! ఎంత మనోహరం!
PSA 133:2 అది అహరోను తలమీద పోయబడి అతని గడ్డం మీదుగా కారుతూ, వస్త్రపు అంచు వరకు కారిన ప్రశస్తమైన తైలం వంటిది.
PSA 133:3 అది సీయోను కొండలమీదికి దిగివచ్చే హెర్మోను మంచులా ఉంటుంది. యెహోవా తన ఆశీర్వాదాన్ని, జీవాన్ని కూడా నిరంతరం అక్కడ కుమ్మరిస్తారు.
PSA 134:1 యాత్రకీర్తన. యెహోవా మందిరంలో రాత్రంతా సేవించే యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి.
PSA 134:2 పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించండి.
PSA 134:3 ఆకాశాన్ని భూమిని సృష్టించిన యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని దీవించును గాక.
PSA 135:1 యెహోవాను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి; యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి,
PSA 135:2 యెహోవా మందిరంలో, మన దేవుని మందిర ఆవరణాల్లో సేవ చేసేవారలారా, ఆయనను స్తుతించండి.
PSA 135:3 యెహోవా మంచివాడు కాబట్టి యెహోవాను స్తుతించండి; ఆయన నామానికి స్తుతులు పాడండి, అది మనోహరమైనది.
PSA 135:4 యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నారు. ఇశ్రాయేలును తన విలువైన స్వాస్థ్యంగా ఎన్నుకున్నారు.
PSA 135:5 యెహోవా గొప్పవాడని, దేవుళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడని నాకు తెలుసు.
PSA 135:6 ఆకాశాల్లో భూమిమీద, సముద్రాల్లో జలాగాధాలలో, యెహోవా తనకిష్టమైన దానిని జరిగిస్తారు.
PSA 135:7 ఆయన భూమి అంచుల నుండి మేఘాలను లేచేలా చేస్తారు; వర్షంతో పాటు మెరుపులను పంపిస్తారు తన కోటలో నుండి గాలిని బయటకు పంపిస్తారు.
PSA 135:8 ఈజిప్టులో మొదటి సంతానాన్ని ఆయన మొత్తారు, మనుష్యుల పశువుల మొదటి సంతానాన్ని ఆయన హతం చేశారు.
PSA 135:9 ఓ ఈజిప్టు, మీ మధ్యలో ఫరోకు, అతని సేవకులకు వ్యతిరేకంగా ఆయన ఆశ్చర్యకార్యాలను అద్భుతాలను పంపారు.
PSA 135:10 ఆయన అనేక జాతులను మొత్తారు బలాఢ్యులైన రాజులను హతం చేశారు.
PSA 135:11 అమోరీయుల రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు, కనాను రాజులందరూ,
PSA 135:12 ఆయన వారి దేశాన్ని వారసత్వంగా, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చారు.
PSA 135:13 యెహోవా, మీ నామం నిత్యం ఉంటుంది. యెహోవా, మీ కీర్తి తరతరాలులో నిలిచి ఉంటుంది.
PSA 135:14 యెహోవా తన ప్రజలకు శిక్ష విముక్తి జరిగిస్తారు, ఆయన సేవకులపై దయ కలిగి ఉంటారు.
PSA 135:15 దేశాల విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు.
PSA 135:16 వాటికి నోళ్ళున్నాయి కాని మాట్లాడలేవు, కళ్లున్నాయి కాని చూడలేవు.
PSA 135:17 చెవులున్నాయి కాని వినలేవు, వాటి నోళ్లలో ఊపిరి ఏమాత్రం లేదు.
PSA 135:18 వాటిని తయారుచేసేవారు, వాటిని నమ్మేవారు వాటి లాగే ఉంటారు.
PSA 135:19 ఓ ఇశ్రాయేలు గృహమా, యెహోవాను స్తుతించు; ఓ అహరోను గృహమా, యెహోవాను స్తుతించు;
PSA 135:20 ఓ లేవీ గృహమా, యెహోవాను స్తుతించు; యెహోవాకు పట్ల భయము కలవారలారా, యెహోవాను స్తుతించండి.
PSA 135:21 సీయోనులో నుండి యెహోవా స్తుతించబడును గాక, ఆయన యెరూషలేములో నివసిస్తారు. యెహోవాను స్తుతించండి.
PSA 136:1 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు.
PSA 136:2 దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
PSA 136:3 ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞత చెల్లించండి:
PSA 136:4 మహాద్భుతాలు చేసేది ఆయన ఒక్కడే,
PSA 136:5 ఆయన తన జ్ఞానం చేత ఆకాశాలను కలుగజేశారు,
PSA 136:6 నీటిపై భూమిని పరిచిన దేవునికి స్తుతులు చెల్లించండి.
PSA 136:7 మహాజ్యోతులను నిర్మించిన దేవునికి స్తుతులు,
PSA 136:8 పగటిని ఏలడానికి సూర్యుని చేసింది ఆయనే,
PSA 136:9 రాత్రిని యేలడానికి చంద్రుని, నక్షత్రాలను చేసిన దేవునికి స్తుతులు,
PSA 136:10 ఈజిప్టు తొలిసంతానాన్ని ఆయన సంహరించారు,
PSA 136:11 వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించారు,
PSA 136:12 చేయి చాచి తన బలమైన హస్తంతో వారిని రప్పించింది ఆయనే,
PSA 136:13 ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవునికి స్తుతులు చెల్లించండి,
PSA 136:14 దాని మధ్యలో నుండి ఇశ్రాయేలీయులను దాటించింది ఆయనే,
PSA 136:15 ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసింది ఆయనే,
PSA 136:16 అరణ్యం గుండా తన ప్రజలను నడిపించిన దేవునికి స్తుతులు చెల్లించండి,
PSA 136:17 గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి,
PSA 136:18 బలాఢ్యులైన రాజులను చంపింది ఆయనే
PSA 136:19 అమోరీయుల రాజైన సీహోనును చంపింది ఆయనే,
PSA 136:20 బాషాను రాజైన ఓగును చంపింది ఆయనే
PSA 136:21 వారి దేశాన్ని వారసత్వంగా ఇచ్చింది ఆయనే,
PSA 136:22 తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని వారసత్వంగా ఇచ్చింది ఆయనే,
PSA 136:23 మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంది ఆయనే,
PSA 136:24 మన శత్రువుల నుండి మనల్ని విడిపించింది ఆయనే,
PSA 136:25 ప్రతి జీవికి ఆహారం ఇచ్చేది ఆయనే,
PSA 136:26 పరలోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి,
PSA 137:1 బబులోను నదుల దగ్గర మనం కూర్చుని సీయోను పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము.
PSA 137:2 దాని మధ్యన ఉన్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించాము.
PSA 137:3 మనల్ని పట్టుకున్నవారు పాటలు పాడమని మనల్ని అడిగారు, మనల్ని బాధించినవారు సంతోష గానాలు కోరారు; “సీయోను పాటల్లో ఒకటి పాడండి” అని అన్నారు.
PSA 137:4 పరాయి దేశంలో ఉండగా యెహోవా పాటలు మనం ఎలా పాడగలము?
PSA 137:5 యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే, నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి.
PSA 137:6 నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, యెరూషలేము నాకు ఎక్కువ సంతోషం కలిగించేది అని నేను భావించకపోతే నా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి.
PSA 137:7 యెహోవా, యెరూషలేము పడిపోయిన రోజున ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకోండి. “దానిని నాశనం చేయండి. పునాదుల వరకు దానిని ధ్వంసం చేయండి!” అని వారు అరిచారు.
PSA 137:8 త్వరలో నాశనమవ్వబోతున్న బబులోను కుమారీ, నీవు మాకు చేసిన కీడును బట్టి నీకు ప్రతీకారం చేసేవాడు ధన్యుడు.
PSA 137:9 మీ పసిపిల్లల్ని పట్టుకుని వారిని బండకువేసి కొట్టేవాడు ధన్యుడు.
PSA 138:1 దావీదు కీర్తన. యెహోవా, నా పూర్ణహృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను; “దేవుళ్ళ” ఎదుట నేను మీకు స్తుతులు పాడతాను.
PSA 138:2 మీ పరిశుద్ధాలయం వైపు నమస్కరిస్తూ, మీ మారని ప్రేమను బట్టి మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే మీ ప్రఖ్యాతి కంటే మీ శాసనాలను మీరు అధికంగా ఘనపరిచారు.
PSA 138:3 నేను మొరపెట్టినప్పుడు మీరు నాకు జవాబిచ్చారు; మీరు నన్ను ధైర్యపరిచారు.
PSA 138:4 యెహోవా, భూరాజులందరూ మీ నోటి నుండి మీ శాసనాలు విన్నప్పుడు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
PSA 138:5 యెహోవా మహిమ గొప్పది కాబట్టి, వారు యెహోవా యొక్క మార్గాల గురించి పాడుదురు గాక.
PSA 138:6 యెహోవా మహోన్నతుడైనప్పటికి ఆయన దీనులపై దయ చూపిస్తారు; ఆయన దూరం నుండే గర్విష్ఠులను పసిగడతారు.
PSA 138:7 నేను కష్టంలో చిక్కుకున్నా మీరు నా జీవితాన్ని కాపాడండి. నా శత్రువుల కోపం నుండి నన్ను కాపాడడానికి మీ చేతిని చాచారు; మీ కుడిచేతితో నన్ను రక్షిస్తారు.
PSA 138:8 యెహోవా నాకు శిక్ష విముక్తి చేస్తారు; యెహోవా, మీ మారని ప్రేమ శాశ్వతమైనది, మీ చేతిపనిని వదిలిపెట్టకండి.
PSA 139:1 ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. యెహోవా మీరు నన్ను పరిశోధించారు, మీరు నన్ను తెలుసుకొన్నారు.
PSA 139:2 నేను కూర్చోవడం నేను లేవడం మీకు తెలుసు; దూరం నుండే నా తలంపులు మీరు గ్రహించగలరు.
PSA 139:3 నేను బయటకు వెళ్లడాన్ని పడుకోవడాన్ని మీరు పరిశీలిస్తారు; నా మార్గాలన్నీ మీకు బాగా తెలుసు.
PSA 139:4 యెహోవా, నా నాలుక మాట పలుకక ముందే, అదేమిటో మీకు పూర్తిగా తెలుసు.
PSA 139:5 నా వెనుక నా ముందు మీరు చుట్టి ఉంటారు, మీ దయగల చేతిని నా మీద ఉంచుతారు.
PSA 139:6 అటువంటి జ్ఞానం నా గ్రహింపుకు మించింది, నేను అందుకోలేనంత ఎత్తులో అది ఉంది.
PSA 139:7 మీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్లగలను? మీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను?
PSA 139:8 ఒకవేళ నేను ఆకాశానికి ఎక్కి వెళ్తే, అక్కడా మీరు ఉన్నారు; నేను పాతాళంలో నా పడకను సిద్ధం చేసుకుంటే, అక్కడా మీరు ఉన్నారు.
PSA 139:9 ఒకవేళ నేను ఉదయపు రెక్కలపై ఎగిరిపోయి, నేను సముద్రం యొక్క సుదూరాన స్థిరపడితే,
PSA 139:10 అక్కడ కూడా మీ చేయి నన్ను నడిపిస్తుంది, మీ కుడిచేయి నన్ను గట్టిగా పట్టుకుంటుంది.
PSA 139:11 “చీకటి నన్ను దాచివేస్తుంది, నా చుట్టూ ఉన్న వెలుగు రాత్రిగా మారుతుంది” అని నేననుకుంటే,
PSA 139:12 చీకటి కూడ మీకు చీకటి కాదు; రాత్రి పగటివలె మెరుస్తుంది, ఎందుకంటే చీకటి మీకు వెలుగు లాంటిది.
PSA 139:13 నా అంతరంగాన్ని మీరు సృష్టించారు; నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు.
PSA 139:14 నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి, అది నాకు పూర్తిగా తెలుసు.
PSA 139:15 రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు, భూమి అగాధ స్థలాల్లో నేను ఒక్కటిగా అల్లబడినప్పుడు, నా రూపము మీ నుండి మరుగు చేయబడలేదు.
PSA 139:16 నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి; నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి.
PSA 139:17 దేవా, మీ ఆలోచనలు నాకెంతో అమూల్యమైనవి! వాటి మొత్తం ఎంత విస్తారమైనది!
PSA 139:18 వాటిని లెక్కించడానికి నేను ప్రయత్నిస్తే, అవి ఇసుకరేణువుల కంటే లెక్కకు మించినవి, నేను మేల్కొనినప్పుడు నేను ఇంకా మీ దగ్గరే ఉన్నాను.
PSA 139:19 ఓ దేవా, మీరే దుష్టులను హతం చేస్తే మంచిది; హంతకులారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి.
PSA 139:20 వారు చెడు ఉద్దేశ్యంతో మీ గురించి మాట్లాడతారు; మీ శత్రువులు మీ నామాన్ని దుర్వినియోగం చేస్తారు.
PSA 139:21 యెహోవా, మిమ్మల్ని ద్వేషించేవారిని నేను ద్వేషించనా, మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిని అసహ్యించుకోనా?
PSA 139:22 వారి పట్ల ద్వేషము తప్ప ఇంకొకటి లేదు; వారిని నా శత్రువులుగా లెక్కగడతాను.
PSA 139:23 దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకోండి; నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోండి.
PSA 139:24 చెడుమార్గమేదైనా నాలో ఉన్నదేమో చూడండి, నిత్యమైన మార్గంలో నన్ను నడిపించండి.
PSA 140:1 ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. యెహోవా, కీడుచేసే మనుష్యుల నుండి నన్ను రక్షించండి; హింసించేవారి నుండి నన్ను కాపాడండి,
PSA 140:2 వారు హృదయాల్లో చెడు విషయాలే కల్పించుకుంటారు రోజు యుద్ధము రేపుతారు.
PSA 140:3 వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు; వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది. సెలా
PSA 140:4 యెహోవా, దుష్టుల చేతుల నుండి నన్ను కాపాడండి; దౌర్జన్యపరుల నుండి నన్ను కాపాడండి, నా కాళ్లను పట్టుకోవాలని పన్నాగాలు చేస్తున్నారు.
PSA 140:5 అహంకారులు చాటుగా వల ఉంచారు; వారు వల దాడులు పరచారు, నా మార్గం వెంట ఉచ్చులు పెట్టారు. సెలా
PSA 140:6 నేను యెహోవాతో, “నా దేవుడు మీరే” అని చెప్తాను. యెహోవా, దయతో మొరను ఆలకించండి.
PSA 140:7 ప్రభువైన యెహోవా, బలాడ్యుడవైన నా రక్షకా, యుద్ధ దినాన మీరు నా తలను రక్షిస్తారు.
PSA 140:8 యెహోవా, దుష్టుల కోరికలను వారికి ఇవ్వకండి; వారి ప్రణాళికలు విజయవంతం కానివ్వకండి. సెలా
PSA 140:9 నన్ను చుట్టుముట్టినవారు గర్వముతో తలలు ఎత్తుతారు; వారి పెదవుల కీడు వారిని మ్రింగివేయాలి.
PSA 140:10 మండుతున్న నిప్పు రవ్వలు వారిపై పడాలి; వారు అగ్నిలో పడవేయబడాలి, తిరిగి లేవకుండా మట్టి గొయ్యిలో పడవేయబడాలి.
PSA 140:11 దూషకులు భూమి మీద స్థిరపడకుందురు గాక; విపత్తులు, దౌర్జన్యపరులను వేటాడతాయి.
PSA 140:12 యెహోవా దరిద్రులకు న్యాయం చేకూరుస్తారని, అవసరతలో ఉన్నవారికి న్యాయం సమకూరుస్తారని నాకు తెలుసు.
PSA 140:13 నిశ్చయంగా నీతిమంతులు మీ నామాన్ని స్తుతిస్తారు, యథార్థవంతులు మీ సన్నిధిలో ఉంటారు.
PSA 141:1 దావీదు కీర్తన. యెహోవా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, నా దగ్గరకు త్వరగా రండి; నా స్వరాన్ని ఆలకించండి.
PSA 141:2 నా ప్రార్థన దూపమువలే మీకు అంగీకారమగును గాక; నా చేతులు పైకెత్తడం సాయంకాల నైవేద్యంలా ఉండును గాక.
PSA 141:3 యెహోవా నా నోటికి కావలి పెట్టండి; నా పెదవులు వాకిట కావలి ఉంచండి.
PSA 141:4 కీడు చేసేవారితో కలిసి వారి దుష్ట క్రియలలో నేను పాల్గొనకుండునట్లు, నా హృదయాన్ని చెడు వైపు తిరగనివ్వకండి; వారి రుచిగల పదార్థాలు నేను తినకుండ ఉండనివ్వండి!
PSA 141:5 నీతిమంతులు నన్ను కొట్టడం నామీద దయ చూపడమే; వారు నన్ను మందలించడం నాకు తైలాభిషేకమే. నా తల దానిని నిరాకరించదు, కీడుచేసేవారి క్రియలకు విరుద్ధంగా నా ప్రార్థన మాత్రం మానను.
PSA 141:6 వారి పాలకులు కొండలపై నుండి పడద్రోయబడతారు, అప్పుడు వారు నా మాటలు నిజమని గ్రహిస్తారు.
PSA 141:7 “ఒకరు భూమిలో దున్నినట్లు, మా ఎముకలు మృత్యులోక ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి” అని వారంటారు.
PSA 141:8 ప్రభువైన యెహోవా, మీ వైపే నేను చూస్తున్నాను; మీయందు నేను ఆశ్రయించాను; నన్ను మరణానికి అప్పగించకండి.
PSA 141:9 కీడుచేసేవారి ఉచ్చుల నుండి, వారు నా కోసం వేసిన వల నుండి నన్ను క్షేమంగా ఉంచండి.
PSA 141:10 దుష్టులు తమ వలల్లో తామే చిక్కుకుంటారు, నేనైతే తప్పించుకు వెళ్తాను.
PSA 142:1 దావీదు యొక్క ధ్యానకీర్తన; గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. నేను గొంతెత్తి యెహోవాకు ఆక్రందన చేస్తున్నాను; దయ కోసం యెహోవాకు కంఠమెత్తి ప్రాధేయపడుతున్నాను.
PSA 142:2 ఆయన ఎదుట నా ఫిర్యాదు వెల్లడి చేసుకుంటాను; నా కష్టాల గురించి ఆయనకు చెప్పుకుంటాను.
PSA 142:3 నా ఆత్మ నాలో సొమ్మసిల్లినప్పుడు మీరే నా నడకను చూస్తారు. నేను నడచే దారిలో, శత్రువులు రహస్యంగా ఉచ్చులు ఉంచారు.
PSA 142:4 చూడండి, నా కుడివైపు ఎవరు లేరు; ఎవరు నా గురించి పట్టించుకోరు నాకు ఆశ్రయం లేదు; ఒక్కరైన నాపై దయ చూపించరు.
PSA 142:5 యెహోవా, మీకు మొరపెట్టుకుంటున్నాను; “నా ఆశ్రయం మీరే, సజీవుల దేశంలో నా స్వాస్థ్యం మీరే” అని నేనంటాను.
PSA 142:6 నేను చాలా క్రుంగిపోయాను, నా మొరను ఆలకించండి. నన్ను వెంటాడే వారి నుండి రక్షించండి, వారు నాకంటే బలంగా ఉన్నారు.
PSA 142:7 నేను మీ నామాన్ని స్తుతించేలా, చెరసాలలో నుండి నన్ను విడిపించండి. అప్పుడు మీరు చేసిన ఉపకారం చూసి, నీతిమంతులు నా చుట్టూరా చేరతారు.
PSA 143:1 దావీదు కీర్తన. యెహోవా, నా ప్రార్థన వినండి; దయ కోసం నేను చేసే మొరను ఆలకించండి; మీ నమ్మకత్వం నీతిని బట్టి నాకు జవాబివ్వండి.
PSA 143:2 మీ సేవకున్ని తీర్పులోనికి తీసుకురాకండి, ఎందుకంటే సజీవులెవ్వరూ మీ దృష్టిలో నీతిమంతులు కారు.
PSA 143:3 శత్రువు నన్ను వెంటాడుతున్నాడు, అతడు నా జీవితాన్ని నలిపివేస్తాడు; ఎప్పుడో చచ్చిన వారిలా అతడు నన్ను చీకటిలో నివసించేలా చేస్తాడు.
PSA 143:4 నా ఆత్మ నాలో సొమ్మసిల్లిపోయింది; నా హృదయం నాలో బెదిరిపోయింది.
PSA 143:5 వెనుకటి రోజులు జ్ఞాపకము చేసుకుంటున్నాను; మీ క్రియలను గురించి ధ్యానిస్తున్నాను, మీ చేతిపనిని గురించి ఆలోచిస్తాను.
PSA 143:6 మీ వైవు నా చేతులు చాపుతున్నాను; ఎండిపోయిన నేల వలె మీ కోసం దప్పిక కలిగి ఉన్నాను. సెలా
PSA 143:7 యెహోవా, నాకు త్వరగా జవాబివ్వండి; ఆత్మ నీరసించి పోతూ ఉంది. మీ ముఖాన్ని మరుగు చేయకండి, లేకపోతే గొయ్యిలో దిగిపోయిన వారిలా నేనుంటాను.
PSA 143:8 నా నమ్మిక మీలో ఉంచాను కాబట్టి, ఉదయం మీ మారని ప్రేమ గురించి విందును గాక. నా జీవితాన్ని మీకు అప్పగించుకున్నాను, నేను వెళ్లవలసిన మార్గము నాకు చూపించండి.
PSA 143:9 నా కాపుదల కోసం మీ దగ్గరకు పరుగెత్తుతున్నాను, యెహోవా నా శత్రువుల నుండి నన్ను రక్షించండి.
PSA 143:10 మీ చిత్తాన్ని చేయడం నేర్పించండి, మీరు నా దేవుడు; మీ మంచి ఆత్మ సమతల నేల మీద నన్ను నడిపించును గాక.
PSA 143:11 యెహోవా, మీ పేరు కోసం నా జీవితాన్ని కాపాడండి; మీ నీతిలో నా కష్టాల నుండి నన్ను విడిపించండి.
PSA 143:12 మీ మారని ప్రేమను బట్టి నా శత్రువులను మౌనం చేయండి; నేను మీ సేవకుని కాబట్టి, నా శత్రువులను నాశనం చేయండి.
PSA 144:1 దావీదు కీర్తన. నా కొండయైన యెహోవాకు స్తుతి కలుగును గాక, యుద్ధము కోసం నా చేతులకు శిక్షణ, నా వ్రేళ్ళకు పోరాటం నేర్పారు.
PSA 144:2 ఆయన నా ప్రేమగల దేవుడు, నా కోట, నా బలమైన కోట, నన్ను విడిపించేవారు. ఆయనే ప్రజలను నాకు లోబరచే, నా డాలు నా ఆశ్రయము.
PSA 144:3 యెహోవా, మనుష్యులు ఏపాటివారని లక్ష్యపెడుతున్నారు? వారి గురించి ఆలోచించడానికి మనుష్యులు ఏపాటివారు?
PSA 144:4 నరులు కేవలం ఊపిరిలాంటివారు; దాటిపోయే నీడలా వారి రోజులు ఉంటాయి.
PSA 144:5 యెహోవా ఆకాశాలను చీల్చుకొని క్రిందికి దిగిరండి; పర్వతాలు పొగలు వదిలేలా, వాటిని ముట్టండి.
PSA 144:6 మెరుపులు పంపించండి శత్రువులను చెదరగొట్టండి; బాణాలు వేసి వారిని ఓడించండి.
PSA 144:7 పైనుండి మీ చేయి చాపండి; గొప్ప జలాల నుండి, విదేశీయుల చేతుల్లో నుండి, నన్ను విడిపించండి.
PSA 144:8 వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి.
PSA 144:9 నా దేవా, మీకు ఒక క్రొత్త పాట పాడతాను. పదితంతు వీణతో మీకు సంగీతం చేస్తాను.
PSA 144:10 రాజులకు విజయమిచ్చేది, మీ సేవకుడైన దావీదును రక్షించేది మీరే. భయంకరమైన ఖడ్గము నుండి
PSA 144:11 నన్ను విడిపించండి; విదేశీయుల చేతుల నుండి నన్ను కాపాడండి వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి.
PSA 144:12 అప్పుడు మా పిల్లలు పెరిగిన మొక్కల్లా, తమ యవ్వన దశలో ఉంటారు. మా కుమార్తెలు, రాజభవనం అలంకరించడం కోసం చెక్కబడిన స్తంభాల్లా ఉంటారు.
PSA 144:13 మా కొట్లు అన్ని రకాల ధాన్యాలతో నిండి ఉంటాయి. మా పచ్చికబయళ్లలో గొర్రెల మందలు వేలల్లో, పది వేలల్లో విస్తరిస్తాయి.
PSA 144:14 మా ఎద్దులు బాగా బరువులు మోస్తాయి. గోడలు నాశనం కాకూడదు. చెరలోనికి వెళ్లకూడదు దుఃఖ ధ్వని వీధుల్లో వినబడ కూడదు.
PSA 144:15 ఇలాంటి స్థితిని అనుభవించే ప్రజలు ధన్యులు; యెహోవా తమకు దేవునిగా కలిగి ఉండే ప్రజలు ధన్యులు.
PSA 145:1 దావీదు వ్రాసిన స్తుతికీర్తన. నా దేవా, నా రాజా! మిమ్మల్ని ఘనపరుస్తాను. మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను.
PSA 145:2 ప్రతిరోజు మిమ్మల్ని స్తుతిస్తాను మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను.
PSA 145:3 యెహోవా గొప్పవారు ఆయన స్తుతికి ఎంతో అర్హుడు; ఆయన గొప్పతనం ఎవరూ గ్రహించలేరు.
PSA 145:4 ఒక తరం వారు మరో తరానికి మీ క్రియలను కొనియాడుతూ చెపుతారు; మీ బలమైన చర్యలను గురించి చెపుతారు.
PSA 145:5 వారు ఘనమైన మీ మహిమ వైభవం గురించి మాట్లాడతారు, నేను మీ అద్భుత కార్యాలను ధ్యానిస్తాను.
PSA 145:6 వారు మీ అద్భుత కార్యాల శక్తి గురించి చెపుతారు, నేను మీ గొప్ప కార్యాలను ప్రకటిస్తాను.
PSA 145:7 వారు మీ సమృద్ధి మంచితనాన్ని స్తుతిస్తారు, మీ నీతి గురించి సంతోషంగా పాడతారు.
PSA 145:8 యెహోవా కృప కలవారు, దయ గలవారు, త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు.
PSA 145:9 యెహోవా అందరికి మంచివారు; ఆయన చేసిన సృష్టి అంతటి మీద దయ గలవాడు.
PSA 145:10 యెహోవా మీ సృష్టంతా మిమ్మల్ని స్తుతిస్తుంది; నమ్మకమైన మీ ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు.
PSA 145:11 మీ రాజ్య మహిమ గురించి వారు చెపుతారు మీ బలము గురించి మాట్లాడతారు,
PSA 145:12 అప్పుడు మనుష్యులందరు మీ గొప్ప చర్యలను మీ రాజ్యము యొక్క మహిమా వైభవాన్ని తెలుసుకుంటారు.
PSA 145:13 మీ రాజ్యం శాశ్వత రాజ్యం, మీ ఆధిపత్యం తరతరాలకు నిలుస్తుంది. యెహోవా చేసే వాగ్దానాలన్నిటిలో ఆయన నమ్మదగినవాడు ఆయన చేసేవాటన్నిటిలో ఆయన నమ్మదగినవాడు.
PSA 145:14 యెహోవా పడిపోతున్న వారికి సహాయం చేస్తారు, అలిసిపోయిన వారిని లేవనెత్తుతారు.
PSA 145:15 అందరి కళ్లు మీ వైపు చూస్తాయి, సరియైన వేళలో మీరు వారికి ఆహారం ఇస్తారు.
PSA 145:16 మీరు మీ గుప్పిలి విప్పి జీవులన్నిటి కోరికలు తీరుస్తారు.
PSA 145:17 యెహోవా తన మార్గాలన్నిటిలో నీతిమంతుడు. ఆయన క్రియలన్నిటిలో నమ్మకమైనవాడు.
PSA 145:18 ఆయనకు మొరపెట్టు వారందరికి, నిజాయితీగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపంగా ఉంటారు.
PSA 145:19 ఆయనయందు భయము గలవారి కోరికలు తీరుస్తారు; వారి మొర విని వారిని రక్షిస్తారు.
PSA 145:20 యెహోవా తనను ప్రేమించే వారందరిని కాపాడతారు, కాని దుష్టులను ఆయన నాశనం చేస్తారు.
PSA 145:21 నా నోరు యెహోవా స్తుతి పలుకుతుంది. శరీరులంతా ఆయన పవిత్ర నామాన్ని శాశ్వతంగా కీర్తించాలి.
PSA 146:1 యెహోవాను స్తుతించండి, నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.
PSA 146:2 జీవితమంతా యెహోవాను స్తుతిస్తాను; నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి స్తుతి పాడతాను.
PSA 146:3 రాజుల మీద నమ్మకం ఉంచకండి, నరులు మిమ్మల్ని రక్షించలేరు.
PSA 146:4 వారి ఆత్మ వారిని విడిచినప్పుడు, మట్టిలో కలిసిపోతారు; వారి ప్రణాళికలు ఆ రోజే అంతరించిపోతాయి.
PSA 146:5 ఎవరికి యాకోబు యొక్క దేవుడు అండగా ఉంటారో, ఎవరైతే వారి దేవుడైన యెహోవాలో నిరీక్షణ కలిగి ఉంటారో, వారు ధన్యులు.
PSA 146:6 ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు ఆయనే. ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడు.
PSA 146:7 ఆయన అణగారిన వారికి న్యాయం చేకూరుస్తారు, ఆకలిగొనిన వారికి ఆహారం ఇస్తారు. యెహోవా చెరసాలలో ఉన్నవారిని విడిపిస్తారు,
PSA 146:8 యెహోవా గుడ్డివారికి చూపునిస్తారు, యెహోవా క్రుంగి ఉన్నవారిని లేవనెత్తుతారు, యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు.
PSA 146:9 యెహోవా పరదేశీయులను కాపాడతారు. తండ్రిలేని అనాధ పిల్లలను, విధవరాండ్రను ఆదరిస్తారు. కాని దుష్టుల ప్రణాళికలను ఆయన వ్యతిరేకిస్తారు.
PSA 146:10 యెహోవా శాశ్వతకాలం పరిపాలిస్తారు. సీయోను, మీ దేవుడు తరతరాలకు రాజ్యమేలుతారు. యెహోవాను స్తుతించండి.
PSA 147:1 యెహోవాను స్తుతించండి, మన దేవుని స్తుతించడం ఎంత మంచిది, ఆయనను స్తుతించడం ఎంత మనోహరమైనది, తగినది!
PSA 147:2 యెహోవా యెరూషలేమును కట్టిస్తారు; ఇశ్రాయేలు వారిలో నుండి చెరగొనిపోబడిన వారిని ఆయన సమకూరుస్తారు.
PSA 147:3 విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు. వారి గాయాలను నయం చేస్తారు.
PSA 147:4 ఆయన నక్షత్రాలను లెక్కిస్తారు, సమస్తాన్ని పేరు పెట్టి పిలుస్తారు.
PSA 147:5 మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి కలవాడు; ఆయన గ్రహింపుకు పరిమితి లేదు.
PSA 147:6 యెహోవా దీనులను ఆదరిస్తారు కాని దుష్టులను నేలమట్టం చేస్తారు.
PSA 147:7 యెహోవాకు కృతజ్ఞత స్తుతులు పాడండి; సితారా మీటి దేవునికి స్తుతులు పాడండి.
PSA 147:8 ఆయన ఆకాశాన్ని మేఘాలతో కప్పుతారు; భూమికి వర్షమిచ్చి కొండలపై గడ్డి మొలిపిస్తారు.
PSA 147:9 ఆయన పశువులకు కూసే కాకులకు ఆహారం సమకూరుస్తారు.
PSA 147:10 గుర్రం బలాన్నిబట్టి ఆయన సంతోషించరు. యోధుల కాల్బలంలో ఆనందించరు.
PSA 147:11 ఆయనకు భయపడు వారిని బట్టి, ఆయన మారని ప్రేమ యందు నిరీక్షణ గలవారిని బట్టి యెహోవా ఆనందిస్తారు.
PSA 147:12 యెరూషలేమా, యెహోవాను ఘనపరచు; సీయోనూ, నీ దేవుని స్తుతించు.
PSA 147:13 ఆయన మీ గుమ్మాల గడియలు బలపరుస్తారు మీలో మీ ప్రజలను దీవిస్తారు.
PSA 147:14 ఆయన మీ పొలిమేరల్లో సమాధానం అనుగ్రహిస్తారు మంచి గోధుమలతో పంటనిచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తారు.
PSA 147:15 ఆయన భూమిని ఆజ్ఞాపిస్తారు; ఆయన శాసనం వేగంగా పరుగెత్తుకొని పోతుంది.
PSA 147:16 ఆయన మంచును తెల్లని ఉన్నిలా పంపిస్తారు మంచు కణాలను బూడిదలా చెదరగొడతారు.
PSA 147:17 ఆయన వడగండ్లను గులకరాళ్లలా విసిరివేస్తాడు. ఆయన పుట్టించే తీవ్రమైన చలికి ఎవరు తట్టుకోగలరు?
PSA 147:18 ఆయన తన మాటను పంపుతారు, అవన్నీ కరిగిపోతాయి; గాలి వీచేటట్టు చేస్తారు, నీళ్లు పారతాయి.
PSA 147:19 ఆయన యాకోబుకు తన వాక్కును, ఇశ్రాయేలుకు తన న్యాయవిధులను శాసనాలను బయలుపరచారు.
PSA 147:20 ఏ ఇతర జాతికి కూడా ఆయన ఈ విధంగా జరిగించలేదు; ఆయన న్యాయవిధులు వారికి తెలియవు. యెహోవాను స్తుతించండి.
PSA 148:1 యెహోవాను స్తుతించండి. పరలోకము నుండి యెహోవాను స్తుతించండి; ఉన్నత స్థలాల్లో ఆయనను స్తుతించండి.
PSA 148:2 యెహోవా యొక్క సమస్త దేవదూతలారా, ఆయనను స్తుతించండి; పరలోక సైన్యములారా, ఆయనను స్తుతించండి.
PSA 148:3 సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించండి. మెరిసే నక్షత్రాల్లారా, మీరంతా ఆయనను స్తుతించండి.
PSA 148:4 ఉన్నత ఆకాశాల్లారా, అంతరిక్షానికి పైన ఉన్న జలాల్లారా ఆయనను స్తుతించండి.
PSA 148:5 అవి యెహోవా నామాన్ని స్తుతించును గాక, ఎందుకంటే ఆయన ఆజ్ఞమేరకు అవి సృజించబడ్డాయి,
PSA 148:6 ఆయన వాటిని నిత్యం నుండి నిత్యం వరకు స్థాపించారు, ఆయన ఎన్నటికీ రద్దు చేయబడని శాసనం జారీ చేశారు.
PSA 148:7 భూమి మీద ఉన్న గొప్ప సముద్ర జీవులారా యెహోవాను స్తుతించండి, సమస్త సముద్రపు అగాధాల్లారా,
PSA 148:8 మెరుపులు, వడగళ్ళు, మంచు, మేఘాలు, ఈదురు గాలులు,
PSA 148:9 పర్వతాల్లారా, సమస్తమైన కొండలారా, ఫలమిచ్చే చెట్లు, సమస్త దేవదారు వృక్షాల్లారా,
PSA 148:10 మృగాలు, సమస్త పశువులారా, నేలపై ప్రాకే జీవులు ఎగిరే పక్షులారా,
PSA 148:11 భూరాజులారా సమస్త దేశ ప్రజలారా, రాకుమారులారా, పాలకులారా,
PSA 148:12 యువకులారా, కన్యలారా, వృద్ధులారా, పిల్లలారా, యెహోవాను స్తుతించండి.
PSA 148:13 వారు యెహోవా నామాన్ని స్తుతించుదురు గాక. ఆయన నామము మాత్రమే మహోన్నతం; ఆయన వైభవం భూమిపై ఆకాశంపై ఉన్నది.
PSA 148:14 ఆయన తన ప్రజల కోసం ఒక కొమ్మును లేపారు, అది ఇశ్రాయేలులో ఆయనకు నమ్మకమైన సమస్త సేవకులు, ఆయనకు సన్నిహితంగా ఉన్న ప్రజలు యొక్క స్తుతి. యెహోవాను స్తుతించండి.
PSA 149:1 యెహోవాను స్తుతించండి. యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఆయన యొక్క నమ్మకమైన ప్రజల సమాజంలో స్తుతి పాడండి.
PSA 149:2 ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తలో సంతోషించును గాక; సీయోను ప్రజలు తమ రాజులో ఆనందించుదురు గాక.
PSA 149:3 వారు ఆయన నామాన్ని నాట్యం చేస్తూ స్తుతిస్తారు తంబురతో సితారాతో గానం చేస్తారు.
PSA 149:4 యెహోవా తన ప్రజల్లో ఆనందిస్తారు; దీనులకు విజయాన్ని కిరీటంగా ధరింపజేస్తారు.
PSA 149:5 ఆయన యొక్క నమ్మకమైన ప్రజలు ఈ ఘనతలో సంతోషించుదురు గాక. వారు వారి పడకలో ఆనందంతో పాడుదురు గాక.
PSA 149:6 వారి నోళ్ళలో దేవుని స్తుతి వారి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉండును గాక.
PSA 149:7 దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలను శిక్షించడానికి,
PSA 149:8 వారి రాజులను సంకెళ్ళతో, ఉక్కు సంకెళ్ళతో వారి సంస్థానాధిపతులను బంధించడానికి, వారికి వ్యతిరేకంగా వ్రాయబడిన తీర్పు అమలుచేసేలా ఇది ఉంటుంది, ఆయన యొక్క నమ్మకమైన ప్రజలందరికి ఈ ఘనత ఉంటుంది. యెహోవాను స్తుతించండి.
PSA 150:1 యెహోవాను స్తుతించండి. పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించండి; ఆయన గొప్ప ఆకాశంలో దేవున్ని స్తుతించండి.
PSA 150:2 ఆయన శక్తిగల కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి; ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించండి.
PSA 150:3 బూర ధ్వనితో ఆయనను స్తుతించండి, సితారా, వీణలతో ఆయనను స్తుతించండి.
PSA 150:4 కంజరతో, నాట్యంతో ఆయనను స్తుతించండి, తంతి వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి.
PSA 150:5 తాళాలు మ్రోగిస్తూ, గణగణ ధ్వని చేసే తాళాలతో, ఆయనను స్తుతించండి.
PSA 150:6 ఊపిరి ఉన్న ప్రతిదీ యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించండి.
PRO 1:1 దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైన, సొలొమోను యొక్క సామెతలు:
PRO 1:2 జ్ఞానాన్ని ఉపదేశాన్ని పొందడం కోసం; అంతరార్థంతో కూడిన పదాలను గ్రహించడం కోసం;
PRO 1:3 వివేకంతో కూడిన ప్రవర్తన కోసం, సరియైనది, న్యాయమైనది చేయడానికి ఉపదేశం పొందడం కోసం;
PRO 1:4 సామాన్యులకు బుద్ధి కలిగించడం కోసం, యవ్వనస్థులకు తెలివి వివేకం కలిగించడం కోసం,
PRO 1:5 జ్ఞానులు ఈ సామెతలు వింటారు, మరింత తెలివైనవారవుతారు, వివేకంగలవారు ఉపదేశం పొందుకుంటారు.
PRO 1:6 వారు సామెతలు, నీతికథలు, జ్ఞానుల సూక్తులు, చిక్కుప్రశ్నలను గ్రహిస్తారు.
PRO 1:7 యెహోవాయందు భయం తెలివికి మూలం, అయితే మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తృణీకరిస్తారు.
PRO 1:8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని విను నీ తల్లి బోధను త్రోసివేయవద్దు.
PRO 1:9 అవి నీ తలకు చుట్టిన అందమైన మాలగా నీ మెడను అలంకరించే హారంగా ఉంటాయి.
PRO 1:10 నా కుమారుడా, పాపిష్ఠి మనుష్యులు నిన్ను ప్రలోభపెడితే, నీవు వారికి లొంగిపోవద్దు.
PRO 1:11 ఒకవేళ వారు, “మాతో కూడా రా; నిర్దోషుల రక్తాన్ని చిందించడానికి దాగి ఉందాం; హాని చేయని ప్రాణం మీద ఆకస్మిక దాడి చేద్దాం;
PRO 1:12 పాతాళం వలె మనుష్యులు జీవించి ఉండగానే వారిని పూర్తిగా మ్రింగివేద్దాం, సమాధిలోనికి దిగువారి వలె పూర్ణబలంతో ఉండగానే వారిని మ్రింగివేద్దాం;
PRO 1:13 అన్ని రకాల విలువైన వస్తువులు మనం తెచ్చి మన ఇళ్ళను దోపుడు సొమ్ముతో నింపుకొందాం;
PRO 1:14 మాతో చీట్లు వేయండి; మనం దొంగిలించిన దానిని మనమందరం పంచుకుందాము.”
PRO 1:15 నా పిల్లలారా, వారితో కలిసి వెళ్లకండి, వారి దారుల్లో నీ పాదాలు పెట్టకు;
PRO 1:16 కీడు చేయడానికి వారి పాదాలు పరుగెత్తుతాయి, మనుష్యులను చంపడానికి త్వరపడతారు.
PRO 1:17 రెక్కలు గల పక్షులు చూస్తుండగా వల వేయడం నిష్ప్రయోజనం!
PRO 1:18 అయితే ఈ మనుష్యులు తమ నాశనానికే పొంచి ఉంటారు; తమ ప్రాణాన్ని తామే తీసుకోవడానికి వారు దాక్కొని ఉంటారు!
PRO 1:19 అక్రమ సంపాదన వెంటపడే వారందరి దారులు అలాంటివే; అది దానిని సొంతం చేసుకున్న వారి ప్రాణాలు తీస్తుంది.
PRO 1:20 జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తున్నది, అది బహిరంగ స్థలాల్లో తన గొంతు గట్టిగా వినిపిస్తుంది;
PRO 1:21 అధిక రద్దీ ఉండే వీధి చివర్లలో అది కేక వేస్తుంది, పట్టణ ద్వారాల దగ్గర ఆమె తన ప్రసంగం చేస్తుంది:
PRO 1:22 “బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు బుద్ధిహీనుని మార్గాలను ప్రేమిస్తారు? ఎగతాళి చేసేవారు ఎన్నాళ్ళు ఎగతాళి చేస్తూ ఆనందిస్తారు? బుద్ధిహీనులు ఎన్నాళ్ళు తెలివిని అసహ్యించుకుంటారు?
PRO 1:23 నా గద్దింపును విని పశ్చాత్తాపపడండి! అప్పుడు నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాలను మీకు తెలియజేస్తాను.
PRO 1:24 కానీ నేను పిలిచినప్పుడు మీరు వినడానికి నిరాకరించినందున నేను నా చేయి చాచినప్పుడు ఎవరూ పట్టించుకోనందున,
PRO 1:25 మీరు నా సలహాను లెక్కచేయనందున నా గద్దింపును అంగీకరించనందున,
PRO 1:26 ఆపద మిమ్మల్ని తాకినప్పుడు నేను నవ్వుతాను; విపత్తు మిమ్మల్ని అధిగమించినప్పుడు నేను ఎగతాళి చేస్తాను,
PRO 1:27 విపత్తు తుఫానులా మిమ్మల్ని అధిగమించినప్పుడు, ఆపద మిమ్మల్ని తుఫానులా ముంచినప్పుడు, మీకు బాధ ఇబ్బంది కలిగినప్పుడు నేను ఎగతాళి చేస్తాను.
PRO 1:28 “అప్పుడు వారు నాకు మొరపెడతారు కాని నేను జవాబు ఇవ్వను; నా కోసం ఆతురతగా వెదకుతారు కాని నేను కనబడను,
PRO 1:29 వారు జ్ఞానాన్ని అసహ్యించుకున్నారు, యెహోవాకు భయపడాలని వారు కోరలేదు కాబట్టి.
PRO 1:30 వారు నా సలహాను అంగీకరించలేదు నా గద్దింపును కూడా త్రోసివేశారు కాబట్టి,
PRO 1:31 వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు వారి ఆలోచనల ఫలితాలకు వారే విసుగుచెందుతారు.
PRO 1:32 మూర్ఖులు దారితప్పడం వల్ల నశిస్తారు, బుద్ధిహీనుల నిర్లక్ష్యం వారిని నాశనం చేస్తుంది;
PRO 1:33 నా మాటలను వినేవారు క్షేమంగా నివసిస్తారు; కీడు కలుగుతుందనే భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు.”
PRO 2:1 నా కుమారుడా, నీవు నా మాటలను విని నా ఆజ్ఞలను నీలో దాచుకొంటే,
PRO 2:2 జ్ఞానం వైపు నీవు చెవిపెట్టి, హృదయపూర్వకంగా అవగాహన చేసుకోవాలి.
PRO 2:3 నీవు అంతరార్థం కోసం మొరపెడితే, వివేచనకై బిగ్గరగా మనవి చేస్తే,
PRO 2:4 వెండిని వెదికినట్లు దానిని వెదికితే, దాచబడిన నిధులను వెదికినట్లు దానిని వెదికితే,
PRO 2:5 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం గురించి నీవు తెలుసుకుంటావు, దేవుని తెలివిని కనుగొంటావు.
PRO 2:6 ఎందుకంటే యెహోవాయే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు; తెలివి వివేచన ఆయన నోట నుండే వస్తాయి.
PRO 2:7 యథార్థవంతులకు విజయం దాచి ఉంచేది ఆయనే, నిందారహితులుగా నడుచుకొనే వారికి ఆయనే డాలు.
PRO 2:8 ఎందుకంటే న్యాయం యొక్క కాలగతులు కాపాడేది ఆయనే, తన నమ్మకమైన వారిని కాపాడేది ఆయనే.
PRO 2:9 అప్పుడు నీవు నీతిన్యాయాలను యథార్థతను, ప్రతి మంచి మార్గాన్ని గ్రహిస్తావు.
PRO 2:10 జ్ఞానం నీ హృదయంలోకి వస్తుంది, తెలివి నీ ప్రాణానికి సంతోషాన్ని కలిగిస్తుంది.
PRO 2:11 బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేకం నీకు కావలి కాస్తుంది.
PRO 2:12 దుష్టుల చెడు మార్గాల నుండి, మూర్ఖంగా మాట్లాడేవారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది.
PRO 2:13 అలాంటివారు చీకటిదారిలో నడవడానికి, తిన్నని మార్గాలను విడిచిపెడతారు.
PRO 2:14 చెడు చేయడంలో సంతోషిస్తారు, దుర్మార్గుల మూర్ఖత్వాన్ని బట్టి ఆనందిస్తారు.
PRO 2:15 వారి త్రోవలు సరియైనవి కావు వారు వంచనతో ఆలోచిస్తారు.
PRO 2:16 జ్ఞానం నిన్ను వ్యభిచార స్త్రీ నుండి, మోహపు మాట్లాడే దారితప్పిన స్త్రీ నుండి కాపాడుతుంది.
PRO 2:17 అలాంటి స్త్రీ తన యవ్వన కాలపు భర్తను విడిచిపెట్టి దేవుని ఎదుట తాను చేసిన ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేస్తుంది.
PRO 2:18 ఖచ్చితంగా దాని ఇల్లు మరణం దగ్గరకు నడిపిస్తుంది, దాని త్రోవలు చనిపోయినవారి దగ్గరకు దారితీస్తాయి.
PRO 2:19 ఆ స్త్రీ దగ్గరకు వెళ్లిన ఎవరూ తిరిగి రారు జీవమార్గాలను వారు చేరుకోలేరు.
PRO 2:20 కాబట్టి నీవు మంచి మార్గాల్లో నడుచుకోవాలి, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించాలి.
PRO 2:21 యథార్థవంతులు దేశంలో నివసిస్తారు, ఏ తప్పుచేయని వారే దానిలో నిలిచి ఉంటారు.
PRO 2:22 కాని దుర్మార్గులు దేశం నుండి తొలగించబడతారు ద్రోహులు దాని నుండి నిర్మూలం చేయబడతారు.
PRO 3:1 నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోవద్దు, నా ఆజ్ఞలను నీ హృదయంలో భద్రపరచుకో,
PRO 3:2 అవి నీ జీవితకాలాన్ని అనేక సంవత్సరాలు పొడిగిస్తాయి, నీకు సమాధానాన్ని వృద్ధిని కలిగిస్తాయి.
PRO 3:3 ప్రేమ, నమ్మకత్వం ఎన్నడు నిన్ను విడచిపోనివ్వకు; నీ మెడలో వాటిని ధరించుకో, నీ హృదయమనే పలక మీద వాటిని వ్రాసుకో.
PRO 3:4 అప్పుడు నీవు దేవుని దృష్టిలోను మనుష్యుల దృష్టిలోను దయపొంది మంచివాడవని అనిపించుకుంటావు.
PRO 3:5 నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు;
PRO 3:6 నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు, అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు.
PRO 3:7 నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు; యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు.
PRO 3:8 అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు బలం కలుగుతుంది.
PRO 3:9 నీ ధనముతో, నీ పంటలో ప్రథమ ఫలముతో యెహోవాను ఘనపరచు;
PRO 3:10 అప్పుడు నీ ధాన్యాగారాలు నిండి సమృద్ధిగా ఉంటాయి, నీ గానుగ తొట్టెలు క్రొత్త ద్రాక్షరసంతో పొంగిపొర్లుతాయి.
PRO 3:11 నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు ఆయన గద్దింపును అసహ్యించుకోవద్దు.
PRO 3:12 ఎందుకంటే తండ్రి తన కుమారునిలో ఆనందించునట్లు, యెహోవా తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు.
PRO 3:13 జ్ఞానాన్ని కనుగొన్న మనుష్యులు, వివేచన కలిగినవారు ధన్యులు.
PRO 3:14 ఎందుకంటే ఆమె వెండి కంటే ఎక్కువ ప్రయోజనకరం, ఆమె బంగారం కంటే ఎక్కువ లాభం తెస్తుంది.
PRO 3:15 ఆమె పగడాలకంటే శ్రేష్ఠమైనది; నీకు ఇష్టమైనవేవి ఆమెతో సమానం కావు.
PRO 3:16 దాని కుడి చేతిలో దీర్ఘాయువు; ఎడమ చేతిలో ఐశ్వర్యం ఘనతలు ఉన్నాయి.
PRO 3:17 దాని మార్గాలు ఎంతో అనుకూలమైనవి దాని త్రోవలన్ని సమాధానకరమైనవి.
PRO 3:18 ఆమెను కలిగి ఉన్నవారికి అది జీవవృక్షం వంటిది; దానిని స్థిరంగా పట్టుకుని ఉన్నవారు ధన్యులు.
PRO 3:19 యెహోవా జ్ఞానం వలన భూమికి పునాదులు వేశారు, ఆయన తెలివి వలన ఆకాశ విశాలాన్ని ఏర్పరిచారు;
PRO 3:20 ఆయన తెలివి వలన అగాధజలాలు విభజించబడ్డాయి. మేఘాల నుండి మంచు బిందువులు కురుస్తున్నాయి.
PRO 3:21 నా కుమారుడా, జ్ఞానాన్ని వివేకాన్ని నీ దగ్గర భద్రంగా చూచుకో, వాటిని నీ కళ్ళెదుట నుండి తొలగిపోనివ్వకు;
PRO 3:22 అవి నీకు జీవంగా, నీ మెడకు అలంకార ఆభరణంగా ఉంటాయి.
PRO 3:23 అప్పుడు నీ మార్గంలో నీవు క్షేమంగా నడుస్తావు, నీ పాదం తడబడదు.
PRO 3:24 నీవు పడుకున్నప్పుడు, భయపడవు; నీవు పడుకున్నప్పుడు, నీ నిద్ర మధురంగా ఉంటుంది.
PRO 3:25 హఠాత్తుగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవు.
PRO 3:26 యెహోవా నీ ప్రక్కన ఉంటారు, నీ పాదాలు వలలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతారు.
PRO 3:27 నీవు క్రియ చేయగల అధికారం నీవు కలిగి ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా ఉండవద్దు.
PRO 3:28 నీవు నీ పొరుగువానికి ఇప్పుడు సహాయం చేయ కలిగి ఉండి, “రేపు రా నేను ప్రయత్నిస్తాను” అని నీ పొరుగువానితో అనవద్దు.
PRO 3:29 నీ పొరుగువారు నమ్మకంగా నీ దగ్గర జీవిస్తున్నప్పుడు వారికి హాని తలపెట్టవద్దు.
PRO 3:30 నీకు హాని చేయని మనుష్యులతో, కారణం లేకుండా వాదించవద్దు.
PRO 3:31 హింసాత్మకమైనవారిని అసూయ పడకు, వారి మార్గాల్లో వేటిని నీవు ఎంచుకోవద్దు.
PRO 3:32 మూర్ఖులు యెహోవాకు అసహ్యులు కాని యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటారు.
PRO 3:33 దుర్మార్గుల ఇంటి మీదికి యెహోవా శాపం వస్తుంది, కాని నీతిమంతుల ఇంటిని ఆయన ఆశీర్వదిస్తారు.
PRO 3:34 ఎగతాళి చేసేవారిని ఆయన ఎగతాళి చేస్తారు కాని దీనులకు అణగారిన వారికి దయ చూపిస్తారు.
PRO 3:35 జ్ఞానులు ఘనతను పొందుతారు, మూర్ఖులు అవమానాన్ని పొందుతారు.
PRO 4:1 నా కుమారులారా, తండ్రి ఉపదేశాలను ఆలకించండి; వాటిని శ్రద్ధగా ఆలకించండి వివేకం పొందండి.
PRO 4:2 మీకు నేను మంచి ఉపదేశాలను ఇస్తాను, కాబట్టి నా బోధను త్రోసివేయకండి.
PRO 4:3 నేను కూడా నా తండ్రికి కుమారుడను, నా తల్లికి నేను ఏకైక సుకుమారుడను.
PRO 4:4 నా తండ్రి నాకు బోధించి, నాతో చెప్పిందేమిటంటే, “నీ హృదయపూర్వకంగా నా మాటలను గట్టిగా పట్టుకో; నా ఆజ్ఞలను పాటించు, నీవు బ్రతుకుతావు.
PRO 4:5 జ్ఞానాన్ని సంపాదించుకో, వివేకాన్ని సంపాదించుకో; నా మాటలు మరచిపోవద్దు, వాటినుండి తొలగిపోవద్దు.
PRO 4:6 నీవు జ్ఞానాన్ని విడచిపెట్టకు, అది నిన్ను కాపాడుతుంది; నీవు దానిని ప్రేమించు, ఆమె నీకు కావలిదానిగా ఉంటుంది.
PRO 4:7 జ్ఞానానికి ఆరంభం ఇది: జ్ఞానం సర్వోన్నతమైనది, దానిని పొందుకో. నీకున్నదంతా ఖర్చైనా సరే, వివేకాన్ని సంపాదించుకో.
PRO 4:8 దానిని నీవు గారాబం చేస్తే, అది నిన్ను హెచ్చిస్తుంది; దానిని నీవు హత్తుకుంటే అది నీకు ఘనత కలిగిస్తుంది.
PRO 4:9 అది నీ తలపై అందమైన మాలను ఉంచుతుంది అద్భుతమైన కిరీటాన్ని ఇస్తుంది.”
PRO 4:10 నా కుమారుడా, ఆలకించు, నేను చెప్తుంది అంగీకరించు, నీవు దీర్ఘకాలం జీవిస్తావు.
PRO 4:11 నేను జ్ఞాన మార్గంలో నీకు బోధిస్తాను తిన్నని మార్గాల్లో నిన్ను నడిపిస్తాను.
PRO 4:12 నీవు నడుస్తున్నప్పుడు, నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తినప్పుడు, నీ పాదాలు తడబడవు.
PRO 4:13 ఉపదేశాన్ని పట్టుకో, దానిని విడచిపెట్టకు; అది నీకు జీవం కాబట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకో.
PRO 4:14 దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు.
PRO 4:15 దాన్ని నివారించు, దానిపై ప్రయాణించవద్దు; దాని నుండి తొలగిపోయి నీ మార్గంలో సాగిపో.
PRO 4:16 కీడు చేయనిదే వారు నిద్రపోలేరు; ఎదుటివారిని పడవేయనిదే వారికి నిద్రరాదు.
PRO 4:17 వారు దుర్మార్గమనే ఆహారం తింటారు హింస అనే ద్రాక్షరసాన్ని త్రాగుతారు.
PRO 4:18 నీతిమంతుల మార్గం ఉదయించే సూర్యునిలా, పూర్తి పగటి వెలుగు వచ్చేవరకు ప్రకాశిస్తుంది.
PRO 4:19 కాని దుష్టుల మార్గం కటిక చీకటిమయం; వారు దేని చేత తొట్రిల్లుతున్నారో వారికే తెలియదు.
PRO 4:20 నా కుమారుడా! నా మాటలు ఆలకించు; నా వాక్యాలకు నీ చెవియొగ్గు.
PRO 4:21 నీ కళ్ళెదుట నుండి నా మాటలు తొలగిపోనివ్వకు, నీ హృదయంలో నా మాటలు భద్రపరచుకో.
PRO 4:22 వాటిని కనుగొన్నవారికి అవి జీవాన్ని, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి.
PRO 4:23 అన్నిటికి మించి, నీ హృదయాన్ని కాపాడుకో, ఎందుకంటే నీ హృదయంలోనుండి జీవన వనరులు ప్రవహిస్తాయి.
PRO 4:24 నీ నోటిని వక్రబుద్ధికి దూరంగా ఉంచుకో; మోసపూరితమైన మాటలు నీ పెదాలకు దూరంగా ఉంచుకో.
PRO 4:25 నీ కళ్లు నేరుగా చూచును గాక; నీ చూపు నేరుగా నీ ముందు ఉండును గాక.
PRO 4:26 నీ పాదాలకు తిన్నని మార్గాన్ని ఏర్పరచుకో నీ మార్గాలన్ని స్థిరంగా ఉంటాయి.
PRO 4:27 నీవు కుడివైపుకైనా, ఎడమవైపుకైనా తిరుగవద్దు. నీ పాదాలను కీడుకు దూరంగా ఉంచాలి.
PRO 5:1 నా కుమారుడా, జ్ఞానంగల నా మాటలు విను, అంతరార్థం గల నా మాటలకు నీ చెవిని త్రిప్పు,
PRO 5:2 అప్పుడు నీవు విచక్షణ కలిగి ఉంటావు నీ పెదవులు తెలివిని కాపాడతాయి.
PRO 5:3 వ్యభిచారం చేసే స్త్రీ పెదవులు తేనె బిందువులాంటివి, దాని నోరు నూనె కంటే నునుపైనది;
PRO 5:4 కాని చివరకు అది పైత్యరసమంత చేదుగా, రెండంచులు గల ఖడ్గమంత పదునుగా ఉంటుంది.
PRO 5:5 దాని పాదాలు మరణానికి దిగుతాయి; దాని అడుగులు నేరుగా సమాధి వైపుకు వెళ్తాయి.
PRO 5:6 అది జీవన విధానానికి ఎటువంటి ఆలోచన ఇవ్వదు; దాని మార్గాలు లక్ష్యం లేకుండా తిరుగుతాయి, కానీ దానికి ఆ విషయం తెలియదు.
PRO 5:7 నా కుమారులారా, నా మాట ఆలకించండి; నేను చెప్పే వాటినుండి ప్రక్కకు తొలగవద్దు.
PRO 5:8 దానికి దూరంగా ఉన్న దారిలో ఉండండి, దాని ఇంటి తలుపు దగ్గరకు వెళ్లవద్దు,
PRO 5:9 పరులకు మీ వైభవాన్ని ఇవ్వవద్దు, మీ హుందాతనాన్ని క్రూరులకు ఇవ్వవద్దు.
PRO 5:10 అపరిచితులు మీ సంపదను తినివేయకూడదు మీ శ్రమ మరొకరి ఇంటిని సుసంపన్నం చేయకూడదు.
PRO 5:11 మీ జీవితం చివరి దశలో మీ దేహం, మాంసం క్షీణించినప్పుడు మీరు మూల్గుతారు.
PRO 5:12 అప్పుడు మీరంటారు, “నేను క్రమశిక్షణను అసహ్యించుకోవడమేంటి! నా హృదయం దిద్దుబాటును తిరస్కరించడమేంటి!
PRO 5:13 నేను నా బోధకులకు లోబడలేదు, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గ లేదు.
PRO 5:14 సర్వసమాజం మధ్య నేను దాదాపు పతనానికి వచ్చాను అనుకుంటూ బాధపడతారు.”
PRO 5:15 మీ సొంత కుండలోని నీళ్లను త్రాగండి, మీ సొంత బావిలో నుండి వచ్చే నీటినే త్రాగండి.
PRO 5:16 మీ ఊటలు వీధుల్లో పొంగిపోవచ్చునా? వీధుల్లో అవి నీటి కాలువలుగా పారవచ్చునా?
PRO 5:17 వాటిని మీకు మాత్రమే చెందినవిగా ఉండనివ్వండి, అపరిచితులతో ఎన్నడు పంచుకోవద్దు.
PRO 5:18 నీ ఊట ఆశీర్వదించబడును గాక, నీ యవ్వన కాలమందు నీ భార్య యందు సంతోషించు.
PRO 5:19 ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడు తృప్తి కలుగజేయును గాక, ఆమె ప్రేమతో నీవు ఎల్లప్పుడు మత్తులో ఉందువు గాక.
PRO 5:20 ఎందుకు, నా కుమారుడా, మరొకని భార్యతో మత్తులో ఉంటావు? దారితప్పిన స్త్రీ రొమ్ము నీవేల కౌగిలించుకుంటావు?
PRO 5:21 ఎందుకంటే మనుష్యుల మార్గాలు యెహోవా కళ్ళెదుట ఉన్నాయి, ఆయన వారి మార్గాలన్నిటిని పరిశీలిస్తారు.
PRO 5:22 దుష్టుల చెడు క్రియలు వారిని చిక్కుల్లో పెడతాయి; వారి పాపపు త్రాళ్లు వారిని గట్టిగా బిగిస్తాయి.
PRO 5:23 క్రమశిక్షణ లేకపోవడం వల్ల వారు చస్తారు, వారి సొంత అతి మూర్ఖత్వం ద్వార దారి తప్పారు.
PRO 6:1 నా కుమారుడా, నీవు నీ పొరుగువాని రుణానికి భద్రత ఇచ్చివుంటే, చేతిలో చేయి వేసి అపరిచితునికి హామీ ఇచ్చివుంటే,
PRO 6:2 నీవు పలికిన దాని వలన చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు.
PRO 6:3 నా కుమారుడా, నీవు నీ పొరుగువారి చేతుల్లో పడ్డావు, కాబట్టి నిన్ను నీవు విడిపించుకోడానికి ఇలా చేయాలి: వెళ్లి అలసిపోయేవరకు, నీ పొరుగువారికి విశ్రాంతి ఇవ్వకు!
PRO 6:4 నీ కళ్ళకు నిద్ర గాని, నీ కనురెప్పలకు కునుకు గాని రానియ్యకు.
PRO 6:5 వేటగాని చేతి నుండి జింక తప్పించుకున్నట్లుగా, బోయవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా, నీవు తప్పించుకో.
PRO 6:6 సోమరీ, చీమల దగ్గరకు వెళ్లు; అవి నడిచే విధానం చూసి జ్ఞానం తెచ్చుకో.
PRO 6:7 వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు,
PRO 6:8 అయినా అవి వేసవికాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, కోతకాలంలో ధాన్యాన్ని దాచుకుంటాయి.
PRO 6:9 సోమరీ, ఎప్పటి వరకు నీవు పడుకుంటావు? ఎప్పుడు నిద్ర లేస్తావు?
PRO 6:10 ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు, ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను అంటావు.
PRO 6:11 పేదరికం నీ మీదికి దొంగలా, లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.
PRO 6:12 వంకర మాటలు మాట్లాడుతూ తిరిగేవాడు, పనికిరానివాడు దుష్టత్వం నిండిన మనుష్యుడు.
PRO 6:13 వాడు ద్వేషపూరితంగా కన్నుగీటుతూ, తన పాదాలతో సైగలు చేస్తూ తన వ్రేళ్ళతో సంజ్ఞలు చేస్తాడు.
PRO 6:14 అతడు తన హృదయంలో వికృత ఆలోచనలతో కీడును తలపెడతాడు, అతడు అన్ని సమయాల్లో వివాదాన్ని వ్యాప్తి చేస్తాడు.
PRO 6:15 కాబట్టి దుష్టుని మీదికి విపత్తు అకస్మాత్తుగా వస్తుంది; వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే కూలిపోతాడు.
PRO 6:16 యెహోవాకు హేయమైనవి ఆరు, ఆయనకు హేయమైనవి ఏడు కలవు.
PRO 6:17 అవి ఏమనగా, అహంకారపు కళ్లు, అబద్ధమాడే నాలుక, నిర్దోషులను చంపే చేతులు.
PRO 6:18 చెడ్డ పన్నాగాలు చేసే హృదయం, కీడు చేయడానికి త్వరపడే పాదాలు,
PRO 6:19 అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి, సమాజంలో గొడవ రేపే వ్యక్తి.
PRO 6:20 నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు పాటించు నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు.
PRO 6:21 వాటిని ఎప్పుడు నీ హృదయంలో పదిలంగా ఉంచుకో; నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో.
PRO 6:22 నీవు త్రోవను నడిచేటప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి; నీవు నిద్రించేటప్పుడు అవి నిన్ను కాపాడతాయి. నీవు మేలుకొనునప్పుడు అవి నీతో మాట్లాడతాయి.
PRO 6:23 ఈ ఆజ్ఞ దీపంగా ఈ బోధ వెలుగుగా క్రమశిక్షణ కోసమైన దిద్దుబాట్లుగా జీవమార్గాలుగా ఉండి,
PRO 6:24 వ్యభిచార స్త్రీ దగ్గరకు వెళ్లకుండ దారితప్పిన స్త్రీ పలికే మాటలకు లొంగిపోకుండ నిన్ను కాపాడతాయి.
PRO 6:25 నీ హృదయంలో ఆమె అందాన్ని మోహించకు తన కళ్లతో నిన్ను వశపరచుకోనియ్యకు.
PRO 6:26 ఎందుకంటే ఒక వేశ్యను రొట్టె ముక్కకైనా పొందవచ్చు, కానీ మరొకని భార్య నీ జీవితాన్నే వేటాడుతుంది.
PRO 6:27 ఒక మనుష్యుడు తన బట్టలు కాలకుండ తన ఒడిలో అగ్నిని ఉంచుకోగలడా?
PRO 6:28 తన పాదాలు కాలకుండ ఎవరైనా నిప్పుల మీద నడవగలరా?
PRO 6:29 మరొకని భార్యతో పడుకునే వాడు కూడా అంతే; ఆమెను తాకేవాడు శిక్షను తప్పించుకోలేడు.
PRO 6:30 ఆకలితో అలమటిస్తూ ఉండి ఆకలి తీర్చుకోవడానికి దొంగ దొంగతనం చేస్తే ప్రజలు వాన్ని చులకనగా చూడరు.
PRO 6:31 అయినాసరే వాడు దొరికితే, వాడు ఏడంతలు చెల్లించాలి, దానికి తన ఇంటి సంపదంతా ఖర్చైనా సరే.
PRO 6:32 అయితే వ్యభిచారం చేసే ఒక మనిషికి బుద్ధిలేదు; అలా ఎవరు చేసినా వారు తమను తామే నాశనం చేసుకుంటారు.
PRO 6:33 దెబ్బలు, అవమానం వాని భాగం, వానికి కలిగే అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు.
PRO 6:34 ఎందుకంటే అనుమానం భర్తకు రోషాన్ని పుట్టిస్తుంది, ప్రతీకారం తీర్చుకునేటప్పుడు అతడు కనికరం చూపించడు.
PRO 6:35 అతడు ఏ పరిహారాన్ని అంగీకరించడు; ఎంత ఎక్కువైనా సరే, అతడు లంచాన్ని తిరస్కరిస్తాడు.
PRO 7:1 నా కుమారుడా, నా మాటలు పాటించు, నా ఆజ్ఞలను నీలో భద్రపరచుకో.
PRO 7:2 నా ఆజ్ఞలు నీవు పాటిస్తే నీవు బ్రతుకుతావు; నా బోధనలను నీ కనుపాపలా కాపాడు.
PRO 7:3 నీ వ్రేళ్ళకు వాటిని కట్టుకో; నీ హృదయ పలక మీద వ్రాసుకో.
PRO 7:4 జ్ఞానంతో, “నీవు నా సోదరివి” అంతరార్థంతో, “నీవు నాకు బంధువువనియు చెప్పు.”
PRO 7:5 అవి నిన్ను వ్యభిచారిణి నుండి కాపాడతాయి, దారితప్పిన స్త్రీ యొక్క మోహపు మాటల నుండి నిన్ను కాపాడతాయి.
PRO 7:6 నేను నా ఇంటి కిటికీ దగ్గర జాలి గుండా బయటకు చూశాను.
PRO 7:7 బుద్ధిహీనుల మధ్య, యువకుల మధ్య, వివేచనలేని ఒక యువకుని నేను చూశాను.
PRO 7:8 అతడు వ్యభిచారి మూలన ఉండే సందు దగ్గరకు వెళ్తున్నాడు, దాని ఇంటి వైపే నడుస్తున్నాడు
PRO 7:9 అది సాయంత్రం ముగిసి, చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రి.
PRO 7:10 అంతలో వేశ్యలా ముస్తాబై జిత్తులమారి ఉద్దేశంతో, ఒక స్త్రీ అతన్ని కలవడానికి వచ్చింది.
PRO 7:11 (ఆమె కట్టుబాట్లు లేనిది తిరుగుబాటు చేసేది, దాని కాళ్లు దాని ఇంట్లో నిలువవు;
PRO 7:12 అది వీధుల్లో తిరుగుతుంది, ఎవరైనా దొరుకుతారేమోనని ప్రతి సందు దగ్గర అది పొంచి ఉంటుంది.)
PRO 7:13 అది ఆ యవ్వనస్థుని పట్టుకుని ముద్దు పెట్టుకుంది సిగ్గులేని ముఖం పెట్టుకొని ఇలా అన్నది:
PRO 7:14 “నేడు నేను నా మ్రొక్కుబడులు చెల్లించాను, ఇంటి దగ్గర నా సమాధానబలి అర్పణలోని ఆహారం ఉంది.
PRO 7:15 కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని వచ్చాను; నిన్ను వెదుకుతూ బయలుదేరగా నీవే కనబడ్డావు!
PRO 7:16 నా మంచం మీద ఈజిప్టు నుండి తెచ్చిన రంగుల నార దుప్పట్లు పరిచాను.
PRO 7:17 నా పరుపు మీద నేను మంచి సువాసనగల గోపరసం, అగరు, దాల్చిన చెక్కను చల్లాను.
PRO 7:18 తెల్లవారే వరకు వలపు తీర తృప్తి పొందుదాం; మనం హాయిగా అనుభవించుదాం!
PRO 7:19 నా భర్త ఇంట్లో లేడు; దూర ప్రయాణం వెళ్లాడు.
PRO 7:20 అతడు దూర ప్రయాణానికి సరిపడేంత డబ్బు సంచి చేతిలో పట్టుకుని వెళ్లాడు. రెండు వారాల వరకు తిరిగి రాడు.”
PRO 7:21 ఆ యువకుని వశపరచుకోవడానికి ఆ వేశ్య శతవిధాల ప్రయత్నించింది; దాని మృదువైన మాటలు అతన్ని మాయ చేశాయి.
PRO 7:22 అతడు మూర్ఖునిలా ఒక్కసారిగా వధకు వెళ్లే ఎద్దులా, ఉచ్చులోకి దిగిన జింకలా దాని వెంటపడ్డాడు,
PRO 7:23 తన ప్రాణానికి అపాయం ఉందని తెలియక, ఉరి దగ్గరకు పక్షి త్వరపడునట్లు, వాని గుండెను బాణంతో చీల్చే వరకు వాడు దాని వెంట వెళ్లాడు.
PRO 7:24 కాబట్టి ఇప్పుడు నా కుమారుడా, చెవియొగ్గి; నా మాటలు విను.
PRO 7:25 వేశ్య మార్గాల తట్టు నీ హృదయాన్ని వెళ్లనీయకు దారి తప్పి అది వెళ్లే దారిలో వెళ్లకు.
PRO 7:26 అది గాయపరచి చంపినవారు లెక్కలేనంత మంది; అది పడద్రోసిన వారు అనేకులు.
PRO 7:27 దాని ఇల్లు సమాధికే దారి తీస్తుంది, దాని తిన్నగా మరణానికే మార్గాన్ని చూపిస్తుంది.
PRO 8:1 జ్ఞానం ప్రకటించడం లేదా? తెలివి దాని స్వరమును ఎత్తడం లేదా?
PRO 8:2 కొండ శిఖరాల మీదను, మార్గము ప్రక్కగా, దారులు కలిసే చోట ఆమె నిలువబడి ఉన్నది;
PRO 8:3 పట్టణంలోకి వెళ్లే గుమ్మముల ప్రక్కన, ప్రవేశం దగ్గర, జ్ఞానం నిలువబడి, ఇలా కేకలు వేస్తుంది:
PRO 8:4 మనుష్యులారా, మిమ్మల్నే నేను పిలుస్తున్నాను; మనుష్యులందరికి నా కంఠస్వరం వినిపిస్తున్నాను.
PRO 8:5 అజ్ఞానులారా, వివేకాన్ని సంపాదించుకోండి, మూర్ఖులారా; వివేకంపై మనస్సు పెట్టండి.
PRO 8:6 వినండి, నేను ఎంతో మంచి సంగతులను చెప్తున్నాను; నా పెదవులు న్యాయాన్ని మాత్రమే పలుకుతాయి.
PRO 8:7 నా నోరు సత్యం మాట్లాడుతుంది, నా పెదవులు దుష్టత్వాన్ని అసహ్యిస్తాయి.
PRO 8:8 నా నోటి మాటలన్నీ న్యాయమైనవి; వాటిలో క్రూరత్వం గాని అబద్ధం గాని లేవు.
PRO 8:9 నా మాటలు వివేచనగలవానికి యథార్థమైనవిగా; జ్ఞానవంతునికి తేటగా ఉంటాయి.
PRO 8:10 వెండికి ఆశపడక నేను చెప్పు మాటలను అంగీకరించండి, మేలిమి బంగారానికి ఆశపడక తెలివిని సంపాదించండి.
PRO 8:11 జ్ఞానం, ముత్యాల కంటే శ్రేష్ఠమైనది, విలువగల వస్తువులు ఏమియు దానితో సరికావు.
PRO 8:12 “నేను, జ్ఞానం, వివేకంతో కలిసి నివసిస్తాను; నాకు జ్ఞానం, విచక్షణ ఉన్నాయి.
PRO 8:13 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం, చెడును అసహ్యించుకోవడమే; గర్వం, అహంకారం, చెడు పనులను చేయుట, అబద్ధపు మాటలు నాకు అసహ్యము.
PRO 8:14 ఆలోచన చెప్పడం, మంచి జ్ఞానాన్ని ఇవ్వడం నా పని; నేను అంతరార్థం కలిగి ఉన్నాను, పరాక్రమం నాదే.
PRO 8:15 నా వలననే రాజులు రాజ్యాలను పరిపాలిస్తారు; పాలకులు న్యాయాన్ని బట్టి పరిపాలన చేస్తారు.
PRO 8:16 నా వలననే రాజకుమారులు ఏలుతారు, నీతిగల అధిపతులు భూమిమీద ప్రభుత్వం చేస్తారు.
PRO 8:17 నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను వెదకేవారికి దొరుకుతాను.
PRO 8:18 ఐశ్వర్యం, గౌరవం, స్ధిరమైన ఆస్తి, నీతి నా దగ్గర ఉన్నాయి.
PRO 8:19 మేలిమి బంగారముకంటెను నా వలన కలిగే ఫలం మంచిది; శ్రేష్ఠమైన వెండికంటెను నా వలన కలిగే లాభం గొప్పది.
PRO 8:20 నీతి మార్గాల్లోను, న్యాయమైన మార్గాల్లోను నేను నడుస్తూ ఉన్నాను.
PRO 8:21 నన్ను ప్రేమించేవారిని కలిమికి కర్తలుగా చేస్తాను వారి ధనాగారాన్ని సమృద్ధితో నింపుతాను.
PRO 8:22 “యెహోవా తన సృష్టి ఆరంభ దినాన తాను చేసినపనులలో మొదటి పనిగా నన్ను చేశారు;
PRO 8:23 మొదటి నుండి అనగా భూమిని కలుగజేసిన దినం మొదలుకొని నేను నియమించబడ్డాను.
PRO 8:24 ప్రవహించే కాలువలు లేనప్పుడు నీళ్లతో నిండి ఉన్న నీటి ఊటలు లేనప్పుడు నేను పుట్టాను.
PRO 8:25 పర్వతములు సృష్టించబడక ముందు, కొండలు కూడా లేనపుడు,
PRO 8:26 భూమిని, మైదానములను దేవుడు చేయక ముందు, నేల మట్టి కొంచెము కూడా సృష్టించబడక ముందు నేను పుట్టితిని.
PRO 8:27 దేవుడు ఆకాశ, విశాలములను సృష్టించి ఎంతో నీటి మీద మండలమును, సృష్టించినపుడు నేను పుట్టితిని.
PRO 8:28 దేవుడు పైన మేఘాలను చేసినప్పుడు నీటి ధారలను ఆయన చేసినప్పుడు,
PRO 8:29 నీరు తమ హద్దులు దాటి రాకుండా దేవుడు సముద్రానికి పొలిమేరను ఏర్పరచినప్పుడు, ఆయన భూమి యొక్క పునాదులు నిర్ణయించినపుడు.
PRO 8:30 నేను దేవుని యొద్ద నైపుణ్యత కలిగిన పనివానిగా, ప్రతిరోజు సంతోషిస్తూ, ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాను,
PRO 8:31 దేవుడు కలుగజేసిన స్వర్గాన్ని బట్టి సంతోషిస్తూ మనుష్యులను చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను.
PRO 8:32 “కాబట్టి పిల్లలారా, నా మాట వినండి; నా దారిని అనుసరించేవారు ధన్యులు.
PRO 8:33 నా ఉపదేశాన్ని విని జ్ఞానం గలవారిగా ఉండండి; దానిని నిర్లక్ష్యం చేయకండి.
PRO 8:34 ప్రతిదినం నా గడప దగ్గర కనిపెట్టుకొని, నా వాకిటి దగ్గర కాచుకుని నా బోధను వినే మనుష్యులు ధన్యులు.
PRO 8:35 నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు, వారు యెహోవా దయ పొందుకుంటారు.
PRO 8:36 నన్ను కనుగొననివాడు తనకే హాని చేసుకుంటాడు; నేనంటే అసహ్యపడేవాడు మరణాన్ని ప్రేమించినవాడు.”
PRO 9:1 జ్ఞానము తన ఇంటిని నిర్మించుకొని; దానికి ఏడు స్తంభాలు చెక్కుకొనినది.
PRO 9:2 ఆమె మాంసాహారం తయారుచేసి తన ద్రాక్షరసాన్ని కలిపింది; తన భోజనబల్లను సిద్ధము చేసి ఉన్నది.
PRO 9:3 ఆమె తన దాసులను బయటకు పంపి, పట్టణంలోని ఎత్తైన స్థలము మీద నిలువబడి,
PRO 9:4 “సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది! బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది:
PRO 9:5 “రండి, నేను సిద్ధం చేసిన ఆహారం తినండి. నేను కలిపిన ద్రాక్షరసం త్రాగండి.
PRO 9:6 ఇకపై తెలివి లేనివారిగా ఉండకుండా బ్రతుకండి; తెలివిని కలిగించు దారిలో చక్కగా నడపండి.”
PRO 9:7 వెక్కిరించు వానికి బుద్ధి చెప్పు వాడు తనకు అవమానాన్ని తెచ్చుకుంటాడు; దుష్టులు వానిని గద్దించు వారు నిందను తెచ్చుకుంటారు.
PRO 9:8 హేళనగా మాట్లాడు వానిని గద్దించకు లేకపోతే వాడు నిన్ను ద్వేషిస్తాడు; తెలివిగల వానిని గద్దిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు.
PRO 9:9 జ్ఞానం గలవానికి బోధించగా వాడు మరింత జ్ఞానంగలవానిగా ఉంటారు; మంచివానికి బోధ చేయగా వాడు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు.
PRO 9:10 యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం, పవిత్రమైన దేవుని గురించిన తెలివియే మంచి చెడులను గురించి తెలుసుకొనుటకు ఆధారం.
PRO 9:11 జ్ఞానం వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే ఎక్కువవుతాయి.
PRO 9:12 నీవు తెలివి కలిగిన వానివైతే నీ తెలివి వలన నీకే లాభము; జ్ఞానమును ఎగతాళి చేసిన ఎడల దానిని నీవే భరించవలెను.
PRO 9:13 బుద్ధిహీనత అనే స్త్రీ గగ్గోలు పెట్టేది; ఆమె తెలివితక్కువది దానికి ఏమీ తెలియదు.
PRO 9:14 ఆ స్త్రీ తన ఇంటి వాకిటిలో కూర్చుండును, ఊరి ప్రధాన వీధుల్లో కుర్చీమీద అది కూర్చుండును,
PRO 9:15 ఆ దారిలో వెళ్లు వారిని చూసి, తమ మార్గములో చక్కగా వెళ్లు వారిని చూసి,
PRO 9:16 “సామాన్యమైన వారలారా, ఇక్కడకు రండి!” అని పిలుస్తుంది! బుద్ధిలేనివారితో అది ఇలా అంటుంది:
PRO 9:17 “దొంగతనం చేసిన నీళ్లు తీపి, రహస్యంగా చేసిన భోజనం రుచి!”
PRO 9:18 అయితే అక్కడ మృతులు ఉన్నారని, దాని అతిథులు పాతాళంలో ఉన్నారని వారికి కొంతవరకే తెలుసు.
PRO 10:1 సొలొమోను యొక్క సామెతలు: జ్ఞానం కలిగిన పిల్లలు తండ్రికి ఆనందం కలిగిస్తారు, కాని మూర్ఖపు పిల్లలు తమ తల్లికి దుఃఖాన్ని కలిగిస్తారు.
PRO 10:2 అన్యాయపు ధనం యొక్క విలువ నిలువదు, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.
PRO 10:3 యెహోవా నీతిమంతులను ఆకలి గొననివ్వడు, కాని దుష్టుల కోరికను ఆయన పాడుచేస్తారు.
PRO 10:4 సోమరి చేతులు దరిద్రత తెస్తాయి, కాని శ్రద్ధగా పని చేసేవారి చేతులు ధనాన్ని తెస్తాయి.
PRO 10:5 వేసవిలో పంటను కూర్చేవారు వివేకంగల పిల్లలు, అయితే కోతకాలంలో నిద్రించేవారు అవమానాన్ని తెచ్చే పిల్లలు.
PRO 10:6 నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి, కాని దుర్మార్గుల నోరు హింసను దాచిపెడుతుంది.
PRO 10:7 నీతిమంతుల పేరు ఆశీర్వాదాలలో వాడబడుతుంది, కాని దుర్మార్గుల పేరు కుళ్ళిపోతుంది.
PRO 10:8 జ్ఞానంగలవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు, మూర్ఖులు తమకు తానే కష్టాన్ని తెచ్చుకుని నశిస్తారు.
PRO 10:9 యథార్థంగా ప్రవర్తించేవారు క్షేమంగా జీవిస్తారు, కానీ మోసం చేసేవారు పట్టుబడతారు.
PRO 10:10 కళ్లతో సైగ చేసేవారు దుఃఖాన్ని కలిగిస్తారు, వ్యర్థ కబుర్లు చెప్పే మూర్ఖులు నాశనమవుతారు.
PRO 10:11 నీతిమంతుల నోరు జీవపుఊట, కాని దుష్టుల నోరు హింసను దాచిపెడుతుంది.
PRO 10:12 పగ తగాదాలను కలుగజేస్తుంది, ప్రేమ దోషాలన్నిటిని కప్పుతుంది.
PRO 10:13 వివేచన గలవారి పెదవుల మీద జ్ఞానం కనబడుతుంది, కాని తెలివిలేని వారి వీపు మీద బెత్తంతో కొట్టబడతారు.
PRO 10:14 జ్ఞానులు తెలివిని సంపాదించుకుంటారు, బుద్ధిహీనుల నాశనాన్ని ఆహ్వానిస్తుంది.
PRO 10:15 ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం, కాని దరిద్రత పేదవారి నాశనం.
PRO 10:16 నీతిమంతుల కష్టార్జితం జీవం, కాని దుష్టుల సంపాదన పాపం, మరణం.
PRO 10:17 క్రమశిక్షణ పాటించేవారు జీవితానికి మార్గం చూపుతారు, కాని దిద్దుబాటును పట్టించుకోనివారు ఇతరులను దారి తప్పిస్తారు.
PRO 10:18 పగను దాచిపెట్టేవారు అబద్ధికులు, ఇతరుల మీద నిందలు వేసేవారు మూర్ఖులు.
PRO 10:19 విస్తారమైన మాటల్లో పాపానికి అంతం ఉండదు, కాని వివేకులు నాలుకను అదుపులో పెడతారు.
PRO 10:20 నీతిమంతుల నాలుక విలువైన వెండి వంటిది, కాని దుష్టుల హృదయం విలువలేనిది.
PRO 10:21 నీతిమంతుల పెదవులు అనేకులకు మేలు చేస్తాయి, కాని బుద్ధిహీనులు తెలివిలేక చస్తారు.
PRO 10:22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తెస్తుంది, బాధ దుఃఖం దానికి జోడించబడవు.
PRO 10:23 బుద్ధిహీనులు దుష్ట పన్నాగాల్లో ఆనందిస్తారు, కాని వివేకంగలవారు జ్ఞానాన్నిబట్టి ఆనందిస్తారు.
PRO 10:24 దుష్టులు దేనికి భయపడతారో అదే వారి మీదికి వస్తుంది, నీతిమంతులు ఆశించిందే వారికి ఇవ్వబడుతుంది.
PRO 10:25 సుడిగాలి వచ్చినపుడు దుష్టులు లేకుండా పోతారు, కానీ నీతిమంతులు దృఢంగా నిలిచి ఉంటారు.
PRO 10:26 పళ్ళకు పులిసిన ద్రాక్షరసంలా కళ్లకు పొగలా, తమను పంపినవారికి సోమరివారు అలా ఉంటారు.
PRO 10:27 యెహోవాయందలి భయం దీర్ఘాయువును ఇస్తుంది, కాని దుష్టుల సంవత్సరాలు కుదించబడతాయి.
PRO 10:28 నీతిమంతుల ఆశలు ఆనందాన్నిస్తాయి కాని దుష్టుల ఆశలు ఫలించవు.
PRO 10:29 నింద లేనివారికి యెహోవా మార్గం ఒక ఆశ్రయం, కాని కీడు చేసేవారికి అది పతనము.
PRO 10:30 నీతిమంతులు ఎన్నడు కదిలించబడరు, కాని దుష్టులు దేశంలో ఉండరు.
PRO 10:31 నీతిమంతుల నోటి నుండి జ్ఞాన ఫలం వస్తుంది, అయితే వక్ర బుద్ధిగల నాలుక మూసివేయబడుతుంది.
PRO 10:32 నీతిమంతుల నోటికి దయ పొందడం తెలుసు, కాని దుష్టుల నోటికి వక్ర మాటలే తెలుసు.
PRO 11:1 మోసపు త్రాసులను యెహోవా అసహ్యించుకుంటారు, న్యాయమైన తూకం అంటే ఆయనకు ఇష్టము.
PRO 11:2 గర్వము వెంబడి అవమానం వస్తుంది, కాని వినయం వెంట జ్ఞానం వస్తుంది.
PRO 11:3 యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది, కానీ నమ్మకద్రోహులు వారి వంచనతో నాశనమవుతారు.
PRO 11:4 ఉగ్రత దినాన సంపద విలువలేనిది, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.
PRO 11:5 నిందలేనివారి నీతి వారి మార్గాలను తిన్నవిగా చేస్తాయి, కాని దుష్టులు తమ దుష్టత్వాన్ని బట్టి పడిపోతారు.
PRO 11:6 యథార్థవంతుల నీతి వారిని విడిపిస్తుంది, కాని నమ్మకద్రోహులు వారి చెడు కోరికల చేత పట్టబడతారు.
PRO 11:7 దుష్టులైన మనుష్యుల ఆశ వారితోనే చస్తుంది; వారు బలవంతులుగా ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలన్ని శూన్యమవుతాయి.
PRO 11:8 నీతిమంతులు బాధ నుండి తప్పించబడతారు కాని దుష్టులు దానిలో పడతారు.
PRO 11:9 దుష్టులువాడు తన నోటి మాట వలన తన పొరుగువానికి నాశనం కలుగుతుంది, తెలివిచేత నీతిమంతులు తప్పించుకుంటారు.
PRO 11:10 నీతిమంతులు అభివృద్ధి చెందుట పట్టణానికి సంతోషకరం; దుష్టులు నశించినపుడు ఆనంద కేకలు వినబడతాయి.
PRO 11:11 యథార్థవంతుని దీవెన వలన పట్టణం హెచ్చింపబడుతుంది, కాని దుష్టుని నోటి వలన అది నాశనమవుతుంది.
PRO 11:12 తన పొరుగువానిని గేలి చేసేవారు బుద్ధిహీనులు, కాని వివేకులు తమ నాలుకను అదుపులో పెట్టుకుంటారు.
PRO 11:13 పుకారు ఆత్మవిశ్వాసాన్ని మోసం చేస్తుంది, కాని నమ్మదగినవారు రహస్యాలను దాస్తారు.
PRO 11:14 ఎందుకంటే మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల దేశం పడిపోతుంది, కాని అనేక సలహాదారుల ద్వారా విజయం కలుగుతుంది.
PRO 11:15 ఎవరైతే అపరిచితునికి భద్రత కల్పిస్తారో వారు ఖచ్చితంగా నష్టపోతారు, కాని ప్రతిజ్ఞలో చేతులు దులుపుకునేవాడు క్షేమంగా ఉంటాడు.
PRO 11:16 దయ మర్యాద కలిగిన స్త్రీ గౌరవాన్ని సంపాదిస్తుంది, క్రూరులు కేవలం ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు.
PRO 11:17 దయగలవారు తమకు తాము మేలు చేసుకుంటారు, కాని క్రూరులు తమ మీదికి తామే శరీరమునకే పతనం తెచ్చుకుంటారు.
PRO 11:18 దుష్టులు మోసపూరితమైన జీతం పొందుతారు, కానీ నీతిగా జీవించేవారు నిజంగా ప్రతిఫలాన్ని పొందుతారు.
PRO 11:19 నీతిమంతుడు నిజంగా జీవాన్ని పొందుతాడు, చెడును వెంటాడేవాడు మరణాన్ని కనుగొంటాడు.
PRO 11:20 వక్ర హృదయాలు గలవారిని యెహోవా అసహ్యించుకుంటారు, అయితే నిందారహితమైన మార్గాలు గలవారిని బట్టి ఆయన సంతోషిస్తారు.
PRO 11:21 ఇది ఖచ్చితం అని తెలుసుకోండి: దుష్టులు శిక్షించబడకుండా తప్పించుకోరు, నీతిమంతులు విడిపించబడతారు.
PRO 11:22 మంచిచెడులు తెలియని అందమైన స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మివంటిది.
PRO 11:23 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, దుష్టుల కోరిక గర్వంతో నిండి ఉంటుంది.
PRO 11:24 ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందినవారు కలరు; ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇస్తూ దరిద్రులైన వారు కలరు.
PRO 11:25 దీవించే మనస్సు గలవారు వృద్ధిచెందుతారు, నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడతాయి.
PRO 11:26 ధాన్యాన్ని అమ్మకుండా దాచుకునేవాన్ని ప్రజలు శపిస్తారు, వాటిని అమ్మే వాని తల మీదికి దీవెనలు వస్తాయి.
PRO 11:27 మేలు చేయాలని కోరేవారు దయను పొందుతారు, కీడు చేసేవారికి కీడే కలుగుతుంది.
PRO 11:28 సంపదను నమ్ముకునేవారు పాడైపోతారు, నీతిమంతులు చిగురాకువలే అభివృద్ధి పొందుతారు.
PRO 11:29 తన ఇంటివారిని బాధపెట్టేవారు ఏమీ సంపాదించుకోలేరు, మూర్ఖులు జ్ఞానంగలవారికి దాసులుగా ఉంటారు.
PRO 11:30 నీతిమంతుల ఫలం జీవవృక్షంలా ఉంటుంది, జ్ఞానంగలవారు జీవితాలను కాపాడతారు.
PRO 11:31 నీతిమంతులు భూమి మీద తమ ప్రతిఫలం పొందితే, భక్తిహీనులు, పాపాత్ముల గతి ఖచ్చితంగా అలాగే ఉంటుంది కదా!
PRO 12:1 శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించేవాడు, కానీ దిద్దుబాటును అసహ్యించేవాడు మూర్ఖుడు.
PRO 12:2 మంచివారు యెహోవా దయ పొందుతారు, చెడు ఆలోచనలు చేసేవారికి శిక్ష విధిస్తారు.
PRO 12:3 చెడుతనం ద్వారా మనుష్యులు స్ధిరపరచబడరు, అయితే నీతిమంతులు ఎప్పటికిని పెరికివేయబడరు.
PRO 12:4 మంచి భార్య తన భర్తకు కిరీటం వంటిది కానీ అపకీర్తిగల భార్య వాని యెముకల్లో కుళ్ళువంటిది.
PRO 12:5 నీతిమంతుల ఆలోచనలు న్యాయమైనవి దుష్టుల సలహాలు మోసకరమైనవి.
PRO 12:6 దుష్టుల మాటలు ఒక హత్యకు పొంచి ఉన్న వారి లాంటివి, యథార్థవంతుల మాటలు వారిని విడిపిస్తాయి.
PRO 12:7 దుష్టులు చనిపోయి కనుమరుగవుతారు, అయితే నీతిమంతుల ఇల్లు స్థిరంగా నిలుస్తుంది.
PRO 12:8 మనుష్యులు తన వివేకాన్ని బట్టి పొగడబడతాడు, అలాగే వికృతమైన మనస్సు కలవారు తిరస్కరించబడతారు.
PRO 12:9 ఏమీ కాకపోయినా ఏదో గొప్పవానిగా నటిస్తూ ఆహారం కూడా లేని వానికంటె ఏమీ కాని వాడైనా ఒక సేవకుని కలిగి ఉన్నవాడు మేలు.
PRO 12:10 నీతిమంతులు తన పశువులను జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ దుష్టులు చేసే అత్యంత జాలిగల పనులు కౄరంగా ఉంటాయి.
PRO 12:11 తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ పగటి కలల వెంటపడేవారికి బుద్ధి ఉండదు.
PRO 12:12 దుష్టులు కీడుచేసేవారి బలమైన కోటను కోరుకుంటారు, అయితే నీతిమంతుల వేరు చిగురిస్తుంది.
PRO 12:13 కీడుచేసేవారు వారి పాపిష్ఠి మాటచేత చిక్కుకుంటారు, నిర్దోషులు ఆపద నుండి తప్పించుకుంటారు.
PRO 12:14 ప్రజలు తాము చెప్పే మాటల వలన మేలు పొందుతారు, ఎవరు చేసిన పనికి వారికే ప్రతిఫలం కలుగుతుంది.
PRO 12:15 మూర్ఖుల దారి వారి దృష్టికి సరియైనదిగా కనబడుతుంది, కాని జ్ఞానులు సలహాలు వింటారు.
PRO 12:16 మూర్ఖులు తమ కోపాన్ని వెంటనే చూపిస్తారు, కాని వివేకంగలవారు తమకు కలిగిన అవమానాన్ని మౌనంగా భరిస్తారు.
PRO 12:17 నమ్మకమైన సాక్షులు న్యాయం మాట్లాడతారు, కాని అబద్ధ సాక్షులు అబద్ధాలు మాట్లాడతారు.
PRO 12:18 నిర్లక్ష్యపు మాటలు ఖడ్గాల్లా గుచ్చుతాయి, కాని జ్ఞానుల నాలుకలు స్వస్థత కలిగిస్తాయి.
PRO 12:19 నిజాయితీగల పెదవులు శాశ్వతంగా ఉంటాయి, అబద్ధాలు మాట్లాడే నాలుక క్షణికమే ఉంటుంది.
PRO 12:20 కీడును కలిగించువారి హృదయంలో మోసము కలదు సమాధానపరచడానికి ఆలోచన చెప్పువారు సంతోషముగా ఉందురు.
PRO 12:21 నీతిమంతులకు ఏ ఆపద రాదు దుష్టులువాని ఇల్లు కీడుతో నిండి ఉంటుంది.
PRO 12:22 అబద్ధాలు మాట్లాడేవారు యెహోవాకు అసహ్యం నమ్మదగినవారు ఆయనకు ఇష్టులు.
PRO 12:23 వివేకంగల మనుష్యులు తమ తెలివిని దాచిపెడతారు కానీ మూర్ఖులు తమ మూర్ఖత్వాన్ని ప్రచారం చేసుకుంటారు.
PRO 12:24 శ్రద్ధగా పని చేసేవారు అధికారులవుతారు కానీ సోమరులు బానిసలవుతారు.
PRO 12:25 ఒకని హృదయంలో దిగులు వానిని క్రుంగిపోయేలా చేస్తుంది, దయ గల మాటలు వానిని సంతోషపెడతాయి.
PRO 12:26 నీతిమంతులు తమ పొరుగువారికి దారి చూపుతారు, కానీ దుష్టుని ప్రవర్తన వానిని దారి తప్పిస్తుంది.
PRO 12:27 సోమరి మనుష్యులు తాము వేటాడిన మాంసాన్ని కాల్చరు, కానీ శ్రద్ధగల వారు తమకు దొరికిన ప్రతీదానిని ఉపయోగిస్తారు.
PRO 12:28 నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; ఆ మార్గం మరణానికి దారితీయదు.
PRO 13:1 జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రి క్రమశిక్షణ అంగీకరిస్తాడు, కాని ఎగతాళి చేసేవాడు గద్దింపుకు లోబడడు.
PRO 13:2 తమ పెదవుల ఫలం నుండి ప్రజలు మేలైన వాటిని ఆస్వాదిస్తారు, కాని నమ్మకద్రోహులు హింస పట్ల ఆకలిగొని ఉంటారు.
PRO 13:3 తమ పెదవులను కాచుకునేవారు తమ ప్రాణాలు కాపాడుకుంటారు, కాని దురుసుగా మాట్లాడేవారు పతనమవుతారు.
PRO 13:4 సోమరి ఆకలి ఎన్నటికి తీరదు, కాని శ్రద్ధగా పని చేసేవారు తృప్తి చెందుతారు.
PRO 13:5 నీతిమంతులు అబద్ధమైన దానిని అసహ్యించుకుంటారు, దుర్మార్గులు తమను తాము దుర్గంధం చేసుకుంటారు తమ మీదికి అవమానం తెచ్చుకుంటారు.
PRO 13:6 నీతి నిజాయితీగల వ్యక్తిని కాపాడుతుంది, కాని దుష్టత్వం పాపిని పడగొడుతుంది.
PRO 13:7 కొందరు ఏమి లేకపోయినా ధనవంతులుగా నటిస్తారు; మరికొందరు బాగా ధనము కలిగి ఉండి కూడా, పేదవారిగా నటిస్తారు.
PRO 13:8 ఒకని ఐశ్వర్యం వారి ప్రాణాన్ని విమోచించవచ్చు, కాని పేదవాడు బెదిరింపు మాటలను వినడు.
PRO 13:9 నీతిమంతుల వెలుగు అంతకంతకు ప్రకాశించును, కాని దుర్మార్గుల దీపం ఆరిపోతుంది.
PRO 13:10 గర్వము ఉన్నచోట తగాదా ఉంటుంది, కాని సలహా తీసుకునేవారికి జ్ఞానము దొరుకుతుంది.
PRO 13:11 నిజాయితీ లేని డబ్బు తగ్గిపోతుంది, కాని కష్టపడి సంపాదించేవారు డబ్బును దానిని ఎక్కువ చేసుకుంటారు.
PRO 13:12 వాయిదా వేయబడిన ఆశ హృదయానికి జబ్బు కలిగిస్తుంది, అయితే కోరిక తీరుట జీవవృక్షము.
PRO 13:13 బోధను ఎగతాళి చేసేవారు తగిన మూల్యం చెల్లిస్తారు, కాని ఆజ్ఞను గౌరవించేవారు ఫలం పొందుతారు.
PRO 13:14 జ్ఞానుల బోధ ఒక జీవపుఊట, అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది.
PRO 13:15 మంచి తీర్పు దయను గెలుస్తుంది, కాని నమ్మకద్రోహుల మార్గం వారి నాశనానికి దారితీస్తుంది.
PRO 13:16 వివేకులైనవారందరు తెలివితో వ్యవహరిస్తారు, కాని మూర్ఖులు వారి మూర్ఖత్వాన్ని బహిర్గతం చేస్తారు.
PRO 13:17 దుష్టులైన దూతలు కీడు చేయడానికి లోబడతారు, నమ్మకమైన రాయబారులు స్వస్థత కలిగిస్తారు.
PRO 13:18 శిక్షను తిరస్కరించేవారికి అవమానం దారిద్ర్యం కలుగుతాయి అయితే దిద్దుబాటును స్వీకరించేవారు ఘనత పొందుతారు.
PRO 13:19 ఆశ తీరుట వలన ప్రాణానికి తీపి చెడుతనాన్ని విడిచిపెట్టడం బుద్ధిలేనివారికి అసహ్యము.
PRO 13:20 జ్ఞానులతో స్నేహం చేసేవారు జ్ఞానులవుతారు బుద్ధిలేనివారితో స్నేహం చేసేవారు చెడిపోతారు.
PRO 13:21 కష్టం పాపులను వెంటాడుతుంది, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును.
PRO 13:22 మంచివారు తన పిల్లల పిల్లలకు ఆస్తులు ఉంచుతారు, పాపుల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది.
PRO 13:23 దున్నబడని క్రొత్త భూమి పేదవారికి పంటనిస్తుంది కాని అన్యాయస్థులు రు.
PRO 13:24 బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షిస్తాడు.
PRO 13:25 నీతిమంతులు కడుపునిండా భోజనం చేస్తారు, కానీ దుష్టులైన వారి కడుపు నిండదు.
PRO 14:1 జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, కాని మూర్ఖురాలు తన స్వహస్తాలతో తన ఇల్లు కూల్చివేస్తుంది.
PRO 14:2 యెహోవాకు భయపడేవారు యథార్థంగా నడుస్తారు, ఆయనను తృణీకరించేవారు వారి మార్గాల్లో వంచకులు.
PRO 14:3 మూర్ఖుల నోరు అరుస్తుంది, జ్ఞానం గలవారి పెదవులు వారిని కాపాడతాయి.
PRO 14:4 ఎద్దులు లేనిచోట, పశువుల దొడ్డి ఖాళీగా ఉంటుంది, కాని ఒక ఎద్దు బలం చేత విస్తారమైన పంట వస్తుంది.
PRO 14:5 నమ్మకమైన సాక్షులు మోసం చేయరు, కాని అబద్ధ సాక్షులు అబద్ధాలు కుమ్మరిస్తారు.
PRO 14:6 ఎగతాళి చేసేవారు జ్ఞానం వెదకుతారు కాని దొరకదు, అయితే వివేకులకు తెలివి సులభంగా కలుగుతుంది.
PRO 14:7 బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్లిపొమ్ము, జ్ఞానపు మాటలు వానియందు కనబడవు కదా.
PRO 14:8 వివేకవంతుల జ్ఞానం వారి మార్గాలను ఆలోచించడం, కానీ మూర్ఖుల మూర్ఖత్వం మోసము.
PRO 14:9 పాపానికి సవరణలు చేయడంలో మూర్ఖులు ఎగతాళి చేస్తారు, కాని యథార్థవంతులు ఆయన నుండి దయ పొందుతారు.
PRO 14:10 హృదయంలో ఉన్న బాధ దానికే తెలుస్తుంది, దాని సంతోషంలో మరొకరు పాలివారు కాలేరు.
PRO 14:11 దుష్టుల ఇల్లు నాశనమవుతుంది, కాని యథార్థవంతుల గుడారం అభివృద్ధి చెందును.
PRO 14:12 ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.
PRO 14:13 ఒకడు బయటకు నవ్వుతూ కనిపించినా, హృదయంలో బాధ ఉండవచ్చు చివరికి సంతోషం దుఃఖంగా మారుతుంది.
PRO 14:14 విశ్వాసభ్రష్టులు తమ క్రియలకు తగిన మూల్యం పొందుతారు, మంచివారు వారి క్రియలకు తగిన బహుమానం పొందుతారు.
PRO 14:15 బుద్ధిహీనులు దేన్నైనా నమ్ముతారు, కానీ వివేకం కలవారు తన నడవడికను బాగుగా కనిపెడతారు.
PRO 14:16 జ్ఞాని యెహోవాకు భయపడి చెడు నుండి తప్పుకుంటాడు, మూర్ఖులు కోపిష్ఠులై కూడా భద్రంగా ఉన్నట్లు భావిస్తారు.
PRO 14:17 తొందరగా కోప్పడేవారు మూర్ఖమైనవి చేస్తారు, దుష్ట పన్నాగాలు వేసేవారు ద్వేషించబడతారు.
PRO 14:18 జ్ఞానం లేనివారికి వారి మూర్ఖత్వమే ఆస్తి. వివేకంగలవారు తెలివిని కిరీటంగా ధరించుకుంటారు.
PRO 14:19 చెడ్డవారు మంచివారి ఎదుటను, దుష్టులు నీతిమంతుల గుమ్మాల దగ్గర వంగుతారు.
PRO 14:20 పేదవారు తన పొరుగువారికి అసహ్యులు, ధనవంతులను ప్రేమించేవారు అనేకులు.
PRO 14:21 తన పొరుగువానిని తిరస్కరించేవారు పాపులు, బీదలకు దయ చూపేవాడు ధన్యుడు.
PRO 14:22 కీడు తలపెట్టేవారు తప్పిపోతారు? మేలు చేసేవారు, కృపా సత్యములను పొందుతారు.
PRO 14:23 ఏ కష్టం చేసినను లాభమే కలుగును, వట్టిమాటలు దరిద్రమునకు కారణము.
PRO 14:24 జ్ఞానుల ఐశ్వర్యం వారికి కిరీటం, బుద్ధిహీనుల మూర్ఖత్వం మూర్ఖత్వమే.
PRO 14:25 నిజం పలికే సాక్షి ప్రాణాలను రక్షిస్తారు, కానీ అబద్ధసాక్షి వట్టి మోసగాడు.
PRO 14:26 యెహోవాకు భయపడేవారందరికి సురక్షితమైన కోట ఉంది, వారి పిల్లలకు అది ఆశ్రయంగా ఉంటుంది.
PRO 14:27 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవపుఊట, అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది.
PRO 14:28 జనాభా ఎక్కువ ఉండడం చేత రాజులకు ఘనత వస్తుంది, జనులు తగ్గిపోవడం రాజులకు నాశనకరము.
PRO 14:29 ఎక్కువ ఓర్పు కలవారు మహా వివేకులు, త్వరగా కోప్పడేవారు మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తారు.
PRO 14:30 సమాధానం గల హృదయం శరీరానికి జీవం, అసూయ ఎముకలకు కుళ్ళు.
PRO 14:31 పేదవాని బాధపెట్టేవారు వాని సృష్టికర్తను నిందించేవారు, బీదలను కనికరించేవారు ఆయనను ఘనపరిచేవారు.
PRO 14:32 అపాయం వచ్చినప్పుడు దుష్టులు నశిస్తారు, చనిపోయే సమయంలో కూడ నీతిమంతులకు దేవునిలో ఆశ్రయం దొరుకుతుంది.
PRO 14:33 వివేకం గలవాని హృదయంలో జ్ఞానం నివాసం చేస్తుంది, మూర్ఖుల మధ్య కూడా అది తనను తాను తెలియపరచుకుంటుంది.
PRO 14:34 నీతి ఒక దేశాన్ని ఘనతకెక్కేలా చేస్తుంది, పాపం ప్రజలకు అవమానం తెస్తుంది.
PRO 14:35 జ్ఞానంగల సేవకుడు రాజులకు ఇష్టుడు, అవమానకరమైన సేవకుడు రాజుకు కోపం రేపుతాడు.
PRO 15:1 మృదువైన మాట కోపాన్ని చల్లార్చుతుంది, నొప్పించే మాట కోపం రేపుతుంది.
PRO 15:2 జ్ఞానుల నాలుక తెలివితో అలంకరించబడుతుంది, బుద్ధిహీనుని నోరు మూర్ఖత్వాన్ని కుమ్మరిస్తుంది.
PRO 15:3 యెహోవా కళ్లు ప్రతిచోట ఉంటాయి, చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉంటాయి.
PRO 15:4 నెమ్మది గల నాలుక జీవ వృక్షము కాని పనికిమాలిన నాలుక ఆత్మకు భంగము కలుగజేస్తుంది.
PRO 15:5 మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడు కాని దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకాన్ని కనుపరచుతాడు.
PRO 15:6 నీతిమంతుని ఇంట్లో గొప్ప ధననిధి ఉన్నది, కాని దుష్టుని కలుగు వచ్చుబడి కష్టానికి కారణము.
PRO 15:7 జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల హృదయం నిలకడయైనది కాదు.
PRO 15:8 భక్తిలేనివారు అర్పించు బలులు యెహోవాకు అసహ్యం, అయితే యథార్థవంతుల ప్రార్ధన ఆయనకు సంతోషకరము.
PRO 15:9 దుష్టుల మార్గాన్ని యెహోవా అసహ్యించుకుంటారు, నీతిని అనుసరించేవారిని ఆయన ప్రేమిస్తారు.
PRO 15:10 దారితప్పిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు చావునొందుదురు.
PRO 15:11 మరణం, నాశనం యెహోవాకు కనబడతాయి, ఆయనకు మనుష్యుల హృదయాలు ఇంకా తేటగా కనిపిస్తాయి కదా!
PRO 15:12 ఎగతాళి చేసేవారికి సరిదిద్దేవారంటే ఇష్టముండదు, కాబట్టి జ్ఞానుల దగ్గరకు వెళ్లరు.
PRO 15:13 హృదయంలో ఆనందం ముఖాన్ని వికసింపజేస్తుంది, మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.
PRO 15:14 వివేకంగల హృదయం తెలివిని వెదకుతుంది, కాని బుద్ధిహీనునికి మూర్ఖత్వమే ఆహారము.
PRO 15:15 బాధింపబడుచున్న వారి రోజులన్నీ బాధాకరమే, కాని సంతోష హృదయం గలవారికి ఎప్పుడూ విందే.
PRO 15:16 నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే, కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు.
PRO 15:17 ద్వేషం కలిగిన చోట క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే, ప్రేమ ఉన్నచోట ఆకుకూరల భోజనం తినడం మేలు.
PRO 15:18 ఉద్రేకంతో కూడిన కోపం తగాదా రేపుతుంది, దీర్ఘశాంతం తగాదాను శాంతింపజేస్తుంది.
PRO 15:19 సోమరి వాని బాట ముండ్లకంచె, యథార్థవంతుల త్రోవ రహదారి.
PRO 15:20 జ్ఞానంగల పిల్లలు తండ్రిని సంతోషపరుస్తారు, కానీ మూర్ఖపు మనుష్యులు తమ తల్లిని తృణీకరిస్తారు.
PRO 15:21 బుద్ధిహీనుని వానికి అవివేకం ఆనందాన్నిస్తుంది, కాని అవగాహన ఉన్నవాడు చక్కగా నడుచుకొనును.
PRO 15:22 ఆలోచనలు చెప్పువారు లేనిచోట తలంపులు వృధాయగును, ఆలోచన చెప్పువారు ఎక్కువ మంది ఉన్న ఎడల తలంపులు బలపడును.
PRO 15:23 సరిగా జవాబునిచ్చిన వానికి దాని వలన సంతోషము కలుగును, సమయానికి తగిన మాట ఎంతో మంచిది.
PRO 15:24 క్రిందనున్న మరణాన్ని తప్పించుకోవాలని, వివేకవంతులను జీవమార్గం పైకి నడిపిస్తుంది.
PRO 15:25 గర్వించువారి ఇల్లు యెహోవా పెరికివేయును, భర్తలేని స్త్రీ పొలిమేరను ఆయన స్ధాపించును.
PRO 15:26 దుష్టుల ఆలోచనలు యెహోవాకు అసహ్యం, దయగల మాటలు ఆయనకు పవిత్రము.
PRO 15:27 అత్యాశ తన ఇంటివారి మీదికి పతనాన్ని తెస్తుంది, లంచాన్ని అసహ్యించుకునేవారు బ్రతుకుతారు.
PRO 15:28 నీతిమంతుల హృదయం సరియైన జవాబివ్వడానికి ప్రయత్నిస్తుంది, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరిస్తుంది.
PRO 15:29 భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటారు, నీతిమంతుల ప్రార్ధన ఆయన అంగీకరిస్తారు.
PRO 15:30 సంతోషకరమైన చూపు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది, మంచి వార్త ఎముకలకు బలాన్నిస్తుంది.
PRO 15:31 జీవితాన్ని ప్రసాదించే దిద్దుబాటును అంగీకరించేవారు జ్ఞానుల సహవాసంలో ఉంటారు.
PRO 15:32 క్రమశిక్షణను తృణీకరించేవారు తమను తాము తృణీకరిస్తారు, అయితే దిద్దుబాటును అంగీకరించేవారు గ్రహింపు పొందుతారు.
PRO 15:33 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం నేర్చుకోడానికి సాధనము ఘనతకు ముందు వినయం ఉంటుంది.
PRO 16:1 హృదయ ప్రణాళికల మనుష్యులకు చెందినవి, కాని నాలుక యొక్క సరియైన జవాబు యెహోవా నుండి వస్తుంది.
PRO 16:2 ఒక వ్యక్తి యొక్క అన్ని మార్గాలు వారికి సరియైనవిగా కనిపిస్తాయి, అయితే ఉద్దేశాలు తూకం వేయబడతాయి.
PRO 16:3 మీ పనులను యెహోవాకు అప్పగించండి, మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి.
PRO 16:4 యెహోవా ప్రతిదీ దాని దాని పని కోసం కలుగజేశారు నాశన దినానికి ఆయన భక్తిలేని వారిని కలుగజేశారు.
PRO 16:5 గర్వ హృదయులందరిని యెహోవా అసహ్యించుకుంటారు. ఇది నిశ్చయం: వారు శిక్షింపబడకపోరు.
PRO 16:6 ప్రేమ, నమ్మకత్వం వలన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది; యెహోవాయందలి భయం వలన కీడు తొలగిపోతుంది.
PRO 16:7 ఒక వ్యక్తి మార్గాలు యెహోవాకు నచ్చినప్పుడు, అతడు వాని శత్రువులను వానితో సమాధానపరుస్తారు.
PRO 16:8 అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే, నీతితో కూడిన కొంచెము మేలు.
PRO 16:9 మనుష్యులు తాము చేయబోయేది తమ హృదయాల్లో ఆలోచిస్తారు, యెహోవా వారి అడుగులను స్ధిరపరుస్తారు.
PRO 16:10 రాజు పెదవులు దైవ వాక్కులా మాట్లాడతాయి, అతని నోరు న్యాయ ద్రోహం చేయదు.
PRO 16:11 న్యాయమైన త్రాసు, తూనిక రాళ్లు యెహోవా ఏర్పాట్లు, సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించారు.
PRO 16:12 రాజులు చెడ్డపనులు చేయడాన్ని అసహ్యించుకుంటారు, నీతి వలన సింహాసనం స్ధిరపరచబడుతుంది.
PRO 16:13 రాజులు నిజాయితీగల పెదవులను ఇష్టపడతారు, యథార్థంగా మాట్లాడేవారికి వారు విలువనిస్తారు.
PRO 16:14 రాజు ఆగ్రహం మరణ దూత వంటిది, అయితే జ్ఞానులు దాన్ని శాంతింపజేస్తారు.
PRO 16:15 రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది, వారి దయ వసంత రుతువులో వర్షం మేఘం లాంటిది.
PRO 16:16 బంగారం కంటే జ్ఞానాన్ని సంపాదించడం, వెండి కంటే తెలివిని సంపాదించడం ఎంత మేలు!
PRO 16:17 యథార్థవంతుల రాజమార్గం చెడును తప్పిస్తుంది; తమ మార్గాలను కాపాడుకునేవారు తమ ప్రాణాలను కాపాడుకుంటారు.
PRO 16:18 నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి.
PRO 16:19 గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకోవడం కంటే, అణచివేయబడిన వారితో పాటు దీనులుగా ఉండడం మేలు.
PRO 16:20 ఉపదేశాన్ని పాటించేలా జాగ్రత్తవహించేవాడు వర్ధిల్లుతాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు.
PRO 16:21 జ్ఞానంగల హృదయం గలవారు వివేకులు అని పిలువబడతారు, దయగల మాటలు ఒప్పింపజేస్తాయి.
PRO 16:22 వివేకికి వాని వివేకం ఒక జీవపుఊట, కానీ మూర్ఖులకు మూర్ఖత్వం శిక్షను తెస్తుంది.
PRO 16:23 జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగిస్తుంది, వాని పెదవులకు విద్య ఎక్కువయేలా చేస్తుంది.
PRO 16:24 దయ గల మాటలు తేనెతెట్టె వంటివి, అవి ప్రాణానికి తియ్యనివి ఎముకలకు ఆరోగ్యకరమైనవి.
PRO 16:25 ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.
PRO 16:26 కష్టం చేసేవారి ఆకలి వానిచేత కష్టం చేయిస్తుంది, వారి ఆకలి వారిని ముందుకు నడిపిస్తుంది.
PRO 16:27 పనికిమాలినవారు కీడును పన్నాగం వేస్తారు, వారి మాటలు మండుతున్న అగ్నిలాంటివి.
PRO 16:28 మూర్ఖులు తగవు రేపుతారు, పుకార్లు సన్నిహితులైన స్నేహితులను వేరు చేస్తాయి.
PRO 16:29 హింసాత్మకమైన వారు వారి పొరుగువారిని ఆశపెడతారు, సరియైనది కాని మార్గంలో వారిని నడిపిస్తారు.
PRO 16:30 తమ కన్ను గీటేవారు కుట్ర పన్నుతున్నారు; తన పెదవులు బిగబట్టేవారు కీడు వైపు మొగ్గు చూపుతారు.
PRO 16:31 నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం, అది నీతి మార్గంలో సాధించబడుతుంది.
PRO 16:32 యుద్ధవీరునికంటే సహనం గలవాడు, పట్టణాన్ని స్వాధీనం చేసుకునేవానికంటే తన మనస్సును అదుపు చేసుకోగలవాడు మేలు.
PRO 16:33 చీట్లు ఒడిలో వేయబడవచ్చు, కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము.
PRO 17:1 తగాదాలతో కూడిన విందు కలిగి ఉన్న ఇంటి కంటే, సమాధానం నిశ్శబ్దంతో ఎండిన రొట్టె ముక్క తినుట మేలు.
PRO 17:2 వివేకంగల దాసుడు అవమానం తెచ్చే కుమారుని ఏలుతాడు కుటుంబంలో ఒకనిగా వారసత్వ సంపదను పంచుకుంటాడు.
PRO 17:3 వెండికి మూస బంగారానికి కొలిమి తగినది, అయితే హృదయాన్ని యెహోవా పరిశోధిస్తారు.
PRO 17:4 చెడు నడవడి కలవాడు మోసపు మాటలు వినును, అబద్ధికుడు నాశనకరమైన నాలుక మాటలు వింటాడు.
PRO 17:5 పేదవారిని ఎగతాళి చేసేవాడు వారిని చేసిన వానిని నిందించేవాడు, ఆపదను చూసి సంతోషించేవాడు శిక్ష నుండి తప్పించుకోడు.
PRO 17:6 పిల్లల పిల్లలు ముసలివారికి కిరీటం, తల్లిదండ్రులు వారి పిల్లలకు అలంకారము.
PRO 17:7 అనర్గళమైన పెదవులు దైవభక్తి లేని బుద్ధిహీనునికి సరిపోవు, అధికారికి అబద్ధమాడే పెదవులు ఇంకెంత ఘోరం!
PRO 17:8 లంచమిచ్చేవానికి లంచం ఒక మంత్ర రాయిలా ఉంటుంది, ప్రతి మలుపు దగ్గర విజయం వస్తుందని వారు తలస్తారు.
PRO 17:9 ప్రేమను పెంచాలని కోరేవారు నేరాలు దాచిపెడతారు, జరిగిన వాటిని మాటిమాటికి జ్ఞాపకం చేసేవాడు గాఢ స్నేహితులను విడగొడతారు.
PRO 17:10 బుద్ధిహీనునికి పడే వంద దెబ్బల కంటే, వివేకంగల వానికి ఒక గద్దింపు ప్రభావం చూపుతుంది.
PRO 17:11 ఎదిరించువాడు కీడు చేయుటకే కోరును, అట్టివాని వెంట దయలేని దూత పంపబడును.
PRO 17:12 మూర్ఖత్వానికి లొంగిన బుద్ధిహీనుని కలవడం కంటే పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలవడం మేలు.
PRO 17:13 మేలుకు బదులుగా కీడు చేయువాని ఇంట నుండి కీడు ఎన్నటికి తొలిగిపోదు.
PRO 17:14 గొడవ ప్రారంభించడం ఆనకట్టకు గండి కొట్టడం లాంటిది; కాబట్టి వివాదం చెలరేగడానికి ముందే ఆపండి.
PRO 17:15 దోషులను వదిలి వేయడం అమాయకులను ఖండించడం, రెండు యెహోవాకు అసహ్యమే.
PRO 17:16 బుద్ధిహీనులు జ్ఞానాన్నే గ్రహించలేకపోతున్నప్పుడు, వారి విద్యాభ్యాసానికి డబ్బు చెల్లించడం దేనికి?
PRO 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, ఆపదల్లో అట్టి వాడు సహోదరునిగా ఉంటాడు.
PRO 17:18 బుద్ధిలేని మనుష్యుడు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేస్తాడు పొరుగువానికి హామీగా ఉంటాడు.
PRO 17:19 తగాదాను ప్రేమించేవాడు పాపాన్ని ప్రేమిస్తాడు, తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనం వెదుకువాడు.
PRO 17:20 అసూయగలవాడు మేలుపొందడు తెలివితక్కువగా మాట్లాడేవాడు కీడులో పడును.
PRO 17:21 మూర్ఖుని కనిన వానికి విచారం కలుగుతుంది, బుద్ధిహీనుని కనిన తండ్రికి సంతోషం ఉండదు.
PRO 17:22 సంతోషం గల హృదయం ఆరోగ్యకారణం, నలిగిన హృదయం ఎముకలను ఎండిపోజేస్తుంది.
PRO 17:23 న్యాయం తప్పుదారి పట్టించడానికి దుష్టులు రహస్యంగా లంచాలు స్వీకరిస్తారు.
PRO 17:24 వివేకం ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుంటాడు, కాని మూర్ఖుడి కళ్లు భూమి చివర వరకు తిరుగుతాయి.
PRO 17:25 బుద్ధిలేని పిల్లలు తమ తండ్రికి దుఃఖం తెస్తారు, తమను కనిన తల్లికి అట్టివారు శోకం కలిగిస్తారు.
PRO 17:26 అమాయకులకు జరిమానా విధించడం మంచిది కాకపోతే, నిజాయితీగల అధికారులను కొట్టడం సరికాదు.
PRO 17:27 తక్కువగా మాట్లాడేవాడు తెలివిగలవాడు, శాంత గుణముగలవాడు మంచిచెడులు ఎరిగినవాడు.
PRO 17:28 ఒకడు తెలివితక్కువ వాడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞానియని ఎంచబడును, తమ పెదవులను అదుపులో పెట్టుకునేవాడు వివేకిగా ఎంచబడును.
PRO 18:1 స్నేహం లేని వ్యక్తి స్వార్థ ప్రయోజనాలను వెంటాడుతాడు, అన్ని మంచి తీర్పులకు వ్యతిరేకంగా గొడవలు ప్రారంభిస్తాడు.
PRO 18:2 మూర్ఖులు అర్థం చేసుకోవడంలో ఆనందం పొందరు కాని వారి సొంత అభిప్రాయాలను ప్రసారం చేయడంలో ఆనందం పొందుతారు.
PRO 18:3 దుష్టత్వం వచ్చినప్పుడు ధిక్కారం కూడా వస్తుంది, అవమానముతో నింద వస్తుంది.
PRO 18:4 నోటి మాటలు అగాధజలాలు, కాని జ్ఞానం యొక్క ఊట పరుగెత్తే ప్రవాహము.
PRO 18:5 తీర్పుతీర్చుటలో దుష్టుని ఎడల పక్షపాతము చూపుటయు, అమాయకులకు న్యాయం తప్పించుటయు సరికాదు.
PRO 18:6 మూర్ఖుల మాటలు తగాదాకు సిద్ధముగా ఉన్నది, వారి నోళ్ళు దెబ్బలు ఆహ్వానిస్తాయి.
PRO 18:7 మూర్ఖుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణాలకు ఉరి.
PRO 18:8 పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి అవి అంతరంగం లోనికి దిగిపోతాయి.
PRO 18:9 పనిలో అలసత్వం ప్రదర్శించేవాడు, వినాశకునికి సోదరుడు.
PRO 18:10 యెహోవా నామం బలమైన కోట, నీతిమంతుడు అందులోకి పరుగెత్తి క్షేమంగా ఉంటాడు.
PRO 18:11 ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం; వాని కళ్ళకు అది ఎక్కలేనంత ఎత్తైన గోడ.
PRO 18:12 నాశనానికి ముందు హృదయం గర్విస్తుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది.
PRO 18:13 సంగతి వినక ముందే జవాబిచ్చేవాడు తన బుద్ధిహీనతను బయటపెట్టి అవమానం పాలవుతాడు.
PRO 18:14 నరుని ఆత్మ వాని రోగాన్ని సహిస్తుంది, కానీ నలిగిన హృదయాన్ని ఎవరు భరించగలరు?
PRO 18:15 వివేచన గలవారి హృదయం తెలివిని సంపాదిస్తుంది, జ్ఞానం గలవారి చెవులు దాన్ని తెరుచుకుంటాయి.
PRO 18:16 ఒక బహుమతి మార్గం తెరుస్తుంది అది ఇచ్చిన వ్యక్తిని గొప్పవారి ఎదుటకు రప్పిస్తుంది.
PRO 18:17 ప్రతివాది వచ్చి ప్రతివాదన చేసే వరకు, వాదోపవాదాలలో మొదట మాట్లాడేది న్యాయంగా అనిపిస్తుంది.
PRO 18:18 చీట్లు వేయడం వివాదాలను పరిష్కరిస్తుంది బలమైన ప్రత్యర్థులను వేరుగా ఉంచుతుంది.
PRO 18:19 కోటగోడలు గల పట్టణం కంటే అభ్యంతరం చెందిన సహోదరుని తిరిగి గెలవడం కష్టము. వివాదాలు కోటకు అడ్డుగా ఉండే ద్వారాల్లాంటివి.
PRO 18:20 నోటి ఫలం చేత ఒక వ్యక్తి కడుపు నిండుతుంది, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తినొందుతాడు.
PRO 18:21 చావు బ్రతుకులు నాలుక వశంలో ఉన్నాయి, దానిని ప్రేమించేవారు దాని ఫలాన్ని తింటారు.
PRO 18:22 భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, వాడు యెహోవా నుండి దయ పొందుతాడు.
PRO 18:23 పేదవాడు దయ కోసం విజ్ఞప్తి చేస్తాడు, కాని ధనికుడు కఠినంగా సమాధానం ఇస్తారు.
PRO 18:24 నమ్మదగని స్నేహితులను కలిగి ఉన్నవాడు త్వరలోనే పతనానికి సమీపిస్తాడు, కాని ఒక స్నేహితుడు ఉన్నాడు సోదరుడి కంటే దగ్గరగా అంటిపెట్టుకుని ఉండేవాడు.
PRO 19:1 నిజాయితీ లేనివాడు మూర్ఖుడు కావడం కంటే నిజాయితీగా ఉంటే మంచిది.
PRO 19:2 ఒక వ్యక్తి తెలివిలేనివాడుగా ఉండడం మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును.
PRO 19:3 ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వారి నాశనానికి దారితీస్తుంది, వారి హృదయంలో వారికి యెహోవా మీద కోపం వస్తుంది.
PRO 19:4 డబ్బుగల వానికి స్నేహితులు ఎక్కువగా ఉందురు, పేదవాడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు.
PRO 19:5 అబద్ధసాక్షి శిక్షను పొందక పోదు అబద్ధాలాడే వాడు తప్పించుకోడు.
PRO 19:6 అనేకులు గొప్పవారి దయ వెదుకుతారు, బహుమతులు ఇచ్చేవారికి ప్రతి ఒక్కరూ స్నేహితులే.
PRO 19:7 పేదవారిని తమ బంధువులందరు దూరంగా ఉంచుతారు, అలాంటప్పుడు వారి స్నేహితులు ఇంకెంత దూరంగా ఉంచుతారు! పేదవారు బ్రతిమిలాడుతూ వారిని వెంటాడినా, వారు ఎక్కడా కనిపించలేదు.
PRO 19:8 తెలివి సంపాదించుకునేవారు తన ప్రాణమునకు ప్రేమించేవారు; మంచి చెడులను లెక్కచేయువారు మేలు పొందును.
PRO 19:9 అబద్ధపు సాక్షి శిక్షను పొందును, అబద్ధాలాడే వాడు నశించును.
PRO 19:10 భోగములను అనుభవించుట బుద్ధిలేని వానికి తగదు, రాజుల మీద పెత్తనము చెలాయించుట పనివానికి బొత్తిగా తగదు.
PRO 19:11 ఒక వ్యక్తి తెలివి వానికి ఓర్పును కలిగిస్తుంది; ఒక నేరాన్ని పట్టించుకోకపోవడం ఒక వ్యక్తికి ఘనత కలిగిస్తుంది.
PRO 19:12 రాజు కోపం సింహగర్జన వంటిది, అతని దయ తుక్కు మీద కురియు మంచు వంటిది.
PRO 19:13 బుద్ధిహీనుని పిల్లలు తన తండ్రికి నష్టము తెచ్చును, భార్యతోటిపోరు ఆగకుండా పడుచుండు నీటిబొట్లతో సమానము.
PRO 19:14 ఇల్లు సంపద పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, వివేకంగల భార్య యెహోవా యొక్క దానము.
PRO 19:15 సోమరితనం గాఢనిద్ర కలుగజేస్తుంది, సోమరివాడు తిండి లేక ఉంటాడు.
PRO 19:16 ఆజ్ఞను పాటించేవాడు తనను తాను కాపాడుకుంటాడు, కానీ తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తలేనివాడు చస్తాడు.
PRO 19:17 బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారానికి ఆయన తిరిగి ఉపకారం చేస్తారు.
PRO 19:18 ఎందుకంటే అందులో ఆశ ఉన్నప్పుడే మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి; అయితే వాడు మరణించాలని కోరుకోవద్దు.
PRO 19:19 మహా కోపం గలవాడు శిక్ష తప్పించుకోడు, వాని తప్పించినను వాడు మరల కోప్పడుతూనే ఉంటాడు.
PRO 19:20 నీవు ముందుకు జ్ఞానివగుటకై, ఆలోచన విని బోధను అంగీకరించు.
PRO 19:21 ఒక వ్యక్తి హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి, అయితే యెహోవా ఉద్దేశమే స్థిరము.
PRO 19:22 ఒక వ్యక్తి కోరుకునేది నమ్మకమైన ప్రేమను, అబద్ధికునిగా కంటే పేదవానిగా ఉండడం మేలు.
PRO 19:23 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవమునకు దారి; అది కలిగినవాడు తృప్తి కలిగినవాడై అపాయం లేకుండా బ్రతుకును.
PRO 19:24 సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు.
PRO 19:25 ఎగతాళి చేసేవారు శిక్షింపబడగా చూసి సామాన్యులు వివేకం నేర్చుకుంటారు; మంచిచెడులు నెరిగిన వారిని గద్దింపగా వారు తెలివిని అభివృద్ధి చేసికొందురు.
PRO 19:26 తండ్రిని దోచుకునేవాడు, తల్లిని వెళ్లగొట్టేవాడు, అవమానాన్ని అపకీర్తిని కలుగజేసేవాడు.
PRO 19:27 నా కుమారుడా, ఒకవేళ నీవు ఉపదేశాన్ని వినుట మానిన ఎడల, నీవు తెలివిగల మాటల నుండి తప్పిపోతావు.
PRO 19:28 అవినీతిపరుడైన సాక్షి న్యాయాన్ని ఎగతాళి చేస్తాడు, దుష్టుల నోరు పాపాన్ని జుర్రుకొంటుంది.
PRO 19:29 హేళన చేయువారికి తీర్పులును బుద్ధిలేని వారి వీపులకు దెబ్బలను ఏర్పాటు చేయబడినవి.
PRO 20:1 మద్యం సేవించేవారు అపహాసకులు బీరు సేవించేవారు కలహప్రియులు; వాటి ద్వార తూలేవారు జ్ఞానం లేనివారు.
PRO 20:2 రాజు వలన కలుగు భయము సింహగర్జన వంటిది; రాజునకు కోపం పుట్టించు వారు తమకు ప్రాణహాని తెచ్చుకుంటారు.
PRO 20:3 తగవులకు దూరముగా ఉండడం మనుష్యులకు ఘనత, మూర్ఖులు జగడాన్నే కోరును.
PRO 20:4 విత్తనం వేసే సమయంలో సోమరి దున్నడు; కోత సమయంలో పంటను గురించి వాడు తెలుసుకునేసరికి వానికేమియు ఉండదు.
PRO 20:5 మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది, వివేకం గలవాడు దాన్ని పైకి చేదుకుంటాడు.
PRO 20:6 తమకు ఎడతెగని ప్రేమ ఉందని చాలామంది చెప్పుకుంటారు, కానీ నమ్మకమైన మనుష్యులు ఎవరికి కనబడతారు?
PRO 20:7 నీతిమంతులు నిందలేని జీవితాలు జీవిస్తారు; వారి తర్వాత వారి పిల్లలు ధన్యులు.
PRO 20:8 న్యాయసింహాసనంపై కూర్చున్న రాజు, తన కంటి చూపులతో చెడుతనమంతయు చెదరగొడతారు.
PRO 20:9 “నా హృదయాన్ని స్వచ్ఛమైనదిగా ఉంచుకున్నాను; పాపం లేకుండ నేను శుద్ధునిగా ఉన్నాను” అని అనదగిన వారెవరు?
PRO 20:10 తప్పుడు తూనిక రాళ్లు తప్పుడు త్రాసులు, ఈ రెండును యెహోవాకు అసహ్యం.
PRO 20:11 చిన్న పిల్లలు తమ ప్రవర్తన స్వచ్ఛమైనదో కాదో యథార్థమైనదో కాదో తమ చేష్టల ద్వారా తెలియజేస్తారు.
PRO 20:12 వినుటకు చెవి చూచుటకు కన్ను ఈ రెండును యెహోవా కలుగజేసినవే.
PRO 20:13 నిద్రను ప్రేమించకు దరిద్రుడవవుతావు; నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం మిగులుతుంది.
PRO 20:14 కొనేవాడు, “అది బాగోలేదు ఇది బాగోలేదు” అని అంటూ బేరమాడతాడు కాని కొన్న తర్వాత తాను బేరమాడిన దాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటాడు.
PRO 20:15 బంగారం ఉంది సమృద్ధిగా ముత్యాలు ఉన్నాయి, కాని తెలివితో మాట్లాడే పెదవులు అరుదైన ఆభరణం.
PRO 20:16 అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి; ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి.
PRO 20:17 మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుష్యులకు బహు తీపిగా ఉంటుంది. తర్వాత వాని నోరు మట్టితో నింపబడుతుంది.
PRO 20:18 ప్రణాళికలు ఆలోచనచేత బలపరచబడతాయి, మంచిచెడులనెరిగిన నాయకుడవై పోరాడాలి.
PRO 20:19 పుకార్లు చెప్తూ తిరిగేవారు నమ్మకద్రోహం చేసేవారు కాబట్టి ఎక్కువగా మాట్లాడేవారిని దూరం ఉంచాలి.
PRO 20:20 తన తండ్రినైనను తల్లినైనను తిట్టేవాని దీపం కటిక చీకటిలో ఆరిపోతుంది.
PRO 20:21 జీవితంలో చాలా త్వరగా పొందిన వారసత్వం అంతంలో దీవించబడదు.
PRO 20:22 కీడుకు తిరిగి కీడు చేయాలనుకోవద్దు, యెహోవా కోసం వేచియుండు ఆయన నిన్ను రక్షిస్తారు.
PRO 20:23 మోసపు తూనిక రాళ్లు యెహోవాకు అసహ్యం, దొంగత్రాసు ఆయనకు అయిష్టం.
PRO 20:24 ఒక వ్యక్తి అడుగులను నిర్దేశించేవారు యెహోవా, అలాంటప్పుడు తమ మార్గాన్ని వారు ఎట్లు గ్రహించగలరు?
PRO 20:25 మనుష్యులు తొందరపడి దేవునికి మ్రొక్కుబడి చేయడం ఒక ఉచ్చులాంటిది, తర్వాత తెలుస్తుంది దాని మూల్యం ఎంత అనేది.
PRO 20:26 జ్ఞానంగల రాజు దుష్టులను చెదరగొడతాడు అతడు వారి మీదికి చక్రం దొర్లిస్తాడు.
PRO 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది లోపలి భాగాలన్నిటినీ శోధిస్తుంది.
PRO 20:28 దయ, సత్యాలు రాజును కాపాడతాయి దయ వలన అతడు తన సింహాసనాన్ని నిలుపుకుంటాడు.
PRO 20:29 బలము యవ్వనస్థుల కీర్తి నెరసిన వెంట్రుకలు ముసలివారికి సౌందర్యం.
PRO 20:30 బాధపరిచే సంగతులు హృదయంలోకి వెళ్లి చెడుతనాన్ని తొలగిస్తాయి.
PRO 21:1 యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ ఆయనకు ఇష్టులైన వారివైపు దాని త్రిప్పుతారు.
PRO 21:2 ఒకడు తన సొంత మార్గాలు సరియైనవి అనుకుంటాడు, కాని యెహోవా హృదయాలను పరీక్షిస్తారు.
PRO 21:3 మనం బలులు అర్పించడం కంటే మనం సరియైనది, న్యాయమైనది చేయడమే యెహోవాకు ఎక్కువ ఇష్టము.
PRO 21:4 అహంకారపు చూపు గర్వ హృదయం దుష్ట క్రియలన్నీ పాపమే.
PRO 21:5 శ్రద్ధగలవారి ప్రణాళికలు లాభాన్ని కలిగిస్తాయి, తొందరపాటుతనం దారిద్ర్యానికి దారితీస్తుంది.
PRO 21:6 అబద్ధమాడే నాలుక ద్వారా వచ్చే ఐశ్వర్యం క్షణికమైన ఆవిరి ఘోరమైన ఉచ్చు.
PRO 21:7 దుష్టుల దౌర్జన్యం వారిని లేకుండ తుడిచివేస్తుంది, ఎందుకంటే వారు సరియైనది చేయడానికి తిరస్కరిస్తారు.
PRO 21:8 అపరాధి యొక్క మార్గం వంకర, అయితే నిర్దోషుల ప్రవర్తన యథార్థమైనది.
PRO 21:9 గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే, మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు.
PRO 21:10 దుష్టుని హృదయం కీడు చేయాలని కోరుతుంది; తన పొరుగువారి మీద వాడు దయచూపించడు.
PRO 21:11 ఎగతాళి చేసేవాడు శిక్షించబడినప్పుడు, సామాన్యుడు జ్ఞానాన్ని పొందుతాడు; జ్ఞానుల పట్ల శ్రద్ధ చూపడం ద్వారా వారు తెలివి సంపాదిస్తారు.
PRO 21:12 నీతిమంతుడు దుష్టుల ఇంటిని గమనించి, దుష్టులను నాశనం చేస్తాడు.
PRO 21:13 బీదల మొర వినకుండ చెవులు మూసుకునేవాడు, తాను మొరపెట్టినప్పుడు జవాబు రాదు.
PRO 21:14 చాటున ఇచ్చిన బహుమానం కోపాన్ని చల్లార్చుతుంది, ఒడిలో ఉంచబడిన లంచం పగను సమాధానపరుస్తుంది.
PRO 21:15 న్యాయమైన పనులు చేయడం నీతిమంతులకు సంతోషకరం కాని చెడు చేసేవారికి అది భయంకరము.
PRO 21:16 వివేకమైన మార్గం నుండి తొలగిపోయే వ్యక్తి మృతుల గుంపులో అంతమవుతాడు.
PRO 21:17 సుఖభోగాలపై ప్రేమ గలవానికి లేమి కలుగుతుంది; ద్రాక్షారసాన్ని, సుగంధ తైలాన్ని కోరుకునేవానికి ఐశ్వర్యం కలుగుతుంది.
PRO 21:18 నీతిమంతుల కోసం భక్తిలేనివారు, అలాగే యథార్థవంతులకు నమ్మకద్రోహులు క్రయధనమవుతారు.
PRO 21:19 ప్రాణం విసిగించే గయ్యాళి భార్యతో కాపురం చేయడం కంటే అడవిలో నివసించడం మంచిది.
PRO 21:20 జ్ఞానుల నివాసంలో కోరదగిన నిధి ఒలీవనూనె ఉంటాయి, కానీ బుద్ధిలేని మనుష్యులు తాము పొందుకున్నదంతా ఖర్చు చేస్తారు.
PRO 21:21 నీతిని శాశ్వత ప్రేమను వెంటాడేవాడు ప్రాణాన్ని, వృద్ధిని, ఘనతను పొందుతాడు.
PRO 21:22 జ్ఞానియైనవాడు బలవంతుల పట్టణం మీదికి వెళ్లి వారు నమ్ముకున్న బలమైన కోటను కూల్చివేయగలడు.
PRO 21:23 నోటిని నాలుకను భద్రం చేసుకునేవారు కష్టాల నుండి తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు,
PRO 21:24 అహంకారం, గర్వం గలవారికి అపహాసకులని పేరు వారు మిక్కిలి గర్వంతో నడుచుకుంటారు.
PRO 21:25 సోమరుల కోరికలు వారిని చంపుతాయి, ఎందుకంటే వారి చేతులు పని చేయడానికి నిరాకరిస్తాయి.
PRO 21:26 పగలంతా వారు మరింత కావాలని కోరుకుంటారు, కాని నీతిమంతులు మిగుల్చుకోకుండ ఇస్తారు.
PRO 21:27 దుష్టుల బలులు అసహ్యం, చెడు ఉద్దేశంతో అర్పిస్తే ఇంకెంత అసహ్యమో!
PRO 21:28 అబద్ధ సాక్షులు నశిస్తారు, కాని జాగ్రత్తగా వినేవారు నిరాటంకంగా సాక్ష్యమిస్తారు.
PRO 21:29 దుష్టులు తమ ముఖంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు, కాని యథార్థవంతులు తమ మార్గాల గురించి ఆలోచిస్తారు.
PRO 21:30 యెహోవాకు వ్యతిరేకంగా సఫలం కాగల జ్ఞానం గాని, అంతరార్థం గాని, ప్రణాళిక గాని లేదు.
PRO 21:31 యుద్ధ దినానికి గుర్రాలు సిద్ధపరచబడతాయి, కాని విజయం యెహోవా దగ్గర ఉంది.
PRO 22:1 గొప్ప సంపద కంటే మంచి పేరు ఎక్కువ కోరదగినది వెండి బంగారం కంటే దయ ఎక్కువ ఘనపరచదగినవి.
PRO 22:2 ధనికులు పేదవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వారందరిని కలుగజేసినవాడు యెహోవా.
PRO 22:3 వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు, సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు.
PRO 22:4 యెహోవాయందలి భయం వినయం; ఐశ్వర్యం గౌరవం దీర్ఘాయువు దాని వేతనాలు.
PRO 22:5 దుష్టుల మార్గాల్లో వలలు, ఆపదలు ఉన్నాయి, అయితే తమ ప్రాణాలు కాపాడుకునేవారు వాటికి దూరముగా ఉంటారు.
PRO 22:6 మీ పిల్లలను సరియైన మార్గంలో నడవమని నేర్పించండి, వారు పెద్దవారయ్యాక కూడా దాని నుండి తొలగిపోరు.
PRO 22:7 ధనవంతుడు బీదల మీద పెత్తనము చేస్తాడు, అప్పుచేసేవాడు అప్పిచ్చినవానికి బానిస.
PRO 22:8 దుర్మార్గాన్ని విత్తేవాడు కీడు అనే పంటను కోస్తాడు, వారి భీభత్స పాలన అంతం అవుతుంది.
PRO 22:9 ధారాళంగా ఉన్నవారు ధన్యులు, ఎందుకంటే వారు బీదలను పోషిస్తారు.
PRO 22:10 ఎగతాళి చేసేవాన్ని తోలివేస్తే కలహాలు తొలగిపోతాయి; తగాదాలు అవమానాలు ముగిశాయి.
PRO 22:11 శుద్ధహృదయాన్ని ప్రేమించేవాడు దయ గల మాటలు మాట్లాడేవాడు రాజును స్నేహితునిగా కలిగి ఉంటాడు.
PRO 22:12 యెహోవా కళ్లు తెలివిని గమనిస్తూ ఉంటాయి, కాని విశ్వాసం లేనివారి మాటలను ఆయన నిరాశపరుస్తారు.
PRO 22:13 సోమరి అంటాడు, “బయట సింహమున్నది! వీధుల్లో నేను చంపబడతాను!”
PRO 22:14 వ్యభిచార స్త్రీ నోరు ఒక లోతైన గుంట; యెహోవా ఉగ్రత క్రింద ఉన్నవాడు దానిలో పడతాడు.
PRO 22:15 యవ్వనస్థుని హృదయంలో బుద్ధిహీనత ఉంటుంది, క్రమశిక్షణ దండము దానిని వానిలో నుండి దూరంగా తొలగిస్తుంది.
PRO 22:16 లాభము పొందాలని పేదవారికి అన్యాయం చేసేవారికి ధనవంతులకు బహుమానాలు ఇచ్చేవానికి నష్టమే కలుగుతుంది.
PRO 22:17 చెవియొగ్గి జ్ఞానుల సూక్తులను వినండి; నేను ఉపదేశించే దానికి మీ హృదయాన్ని వర్తింపజేయండి.
PRO 22:18 ఎందుకంటే వాటిని మీ హృదయంలో ఉంచడం వాటన్నిటిని మీ పెదవుల మీద ఉంచడం మంచిది.
PRO 22:19 మీ నమ్మకం యెహోవా మీద ఉండాలని, నేను ఈ రోజున వీటిని మీకు, మీకే బోధిస్తున్నాను.
PRO 22:20 మీరు నిజాయితీగా ఉండాలని సత్యాన్ని మాట్లాడాలని తద్వారా మిమ్మల్ని పంపినవారికి మీరు సరియైన నివేదిక ఇవ్వాలని, సలహాలతో తెలివితో కూడిన, ముప్పది సూక్తులను నేను మీ కోసం వ్రాయలేదా?
PRO 22:22 పేదవారు కదా అని పేదవారిని పీడించవద్దు అవసరతలో ఉన్నవారిని ఆవరణంలో అణచివేయవద్దు,
PRO 22:23 యెహోవా వారి వైపున వాదిస్తారు ఎవరైనా వారిని పతనం చేసేవారిని ఆయన పతనం చేస్తారు.
PRO 22:24 కోపిష్ఠియైన వ్యక్తితో స్నేహం చేయవద్దు, ఊరకనే కోప్పడే వ్యక్తితో సహవాసం చేయవద్దు,
PRO 22:25 నీవు వాని మార్గాలను అనుసరించి నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో.
PRO 22:26 చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేసేవారితో గాని అప్పులకు పూటబడే వారితో జత కట్టవద్దు;
PRO 22:27 ఇవ్వడానికి నీయొద్ద ఏమీ లేకపోతే, వాడు నీ క్రిందనుండి నీ పరుపునే తీసుకెళ్తాడు.
PRO 22:28 నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
PRO 22:29 తన పనిలో నేర్పరితనం గల వానిని చూశావా? అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలబడతాడు.
PRO 23:1 మీరు ఒక పాలకుడితో భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, మీ ముందు ఉన్న దాన్ని బాగా గమనించండి.
PRO 23:2 నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో.
PRO 23:3 అతని రుచిగల పదార్థాలకు ఆశపడకు, అవి మోసగించే ఆహారపదార్థాలు.
PRO 23:4 సంపదను పొందడానికి ప్రయాసపడకండి; నీ స్వంత తెలివిని నమ్ముకోవద్దు.
PRO 23:5 కనురెప్పపాటులో ధనం కనుమరుగవుతుంది, ఎందుకంటే అది రెక్కలు ధరించి గ్రద్దలా ఆకాశానికి ఎగిరిపోతుంది.
PRO 23:6 ఎదుటివాని అభివృద్ధి చూసి పిసినారి వానితో కలిసి భోజనము చేయకండి, అతని రుచిగల పదార్థాలకు ఆశపడవద్దు,
PRO 23:7 ఎందుకంటే అట్టి వాడు తన హృదయంలో ఎప్పుడూ ఖరీదు గురించి ఆలోచిస్తాడు. “తినండి త్రాగండి” అని అతడు నీతో చెప్తాడు, కాని అది అతని హృదయంలోనుండి వచ్చుమాట కాదు.
PRO 23:8 నీవు తినిన కొంచెము కక్కివేస్తావు నీవు పలికిన అభినందనలు వృధా అవుతాయి.
PRO 23:9 బుద్ధిహీనులతో మాట్లాడకండి, ఎందుకంటే వారు మీ వివేకవంతమైన మాటలను ఎగతాళి చేస్తారు.
PRO 23:10 పురాతన సరిహద్దు రాయిని కదిలించవద్దు తండ్రిలేనివారి పొలములోనికి చొరబడవద్దు,
PRO 23:11 ఎందుకంటే వారిని కాపాడేవాడు బలవంతుడు; నీకు వ్యతిరేకంగా ఆయన వారి పక్షంగా నీతో పోరాడతారు.
PRO 23:12 ఉపదేశానికి నీ హృదయాన్ని తెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు.
PRO 23:13 నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం మానకుము; ఒకవేళ బెత్తముతో వాని కొట్టినా వారు చావరు.
PRO 23:14 బెత్తముతో వాని శిక్షించి చావు నుండి వారిని కాపాడండి.
PRO 23:15 నా కుమారుడా, నీ హృదయం జ్ఞానం కలిగి ఉంటే, అప్పుడు నా హృదయం సంతోషిస్తుంది;
PRO 23:16 నీ పెదవులు సరియైనది మాట్లాడినప్పుడు, నా అంతరింద్రియం సంతోషిస్తుంది.
PRO 23:17 పాపులను చూసి నీ హృదయాన్ని అసూయపడనీయకు, కాని ఎల్లప్పుడు యెహోవాయందలి భయం పట్ల ఆసక్తి కలిగి ఉండు.
PRO 23:18 నిజంగా నీకు భవిష్యత్ నిరీక్షణ ఉన్నది, నీ నిరీక్షణ తొలగించబడదు.
PRO 23:19 నా కుమారుడా, ఆలకించి జ్ఞానిగా ఉండు నీ హృదయాన్ని సరియైన మార్గంలో నిలుపుకో.
PRO 23:20 అతిగా ద్రాక్షరసం త్రాగువారితోనైను, మాంసం ఎక్కువగా తినే వారితోనైను స్నేహము చేయవద్దు.
PRO 23:21 ఎందుకంటే త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులౌతారు, మగత వారిని దుప్పట్లలో వస్త్రాల్లా ధరిస్తుంది.
PRO 23:22 నీకు జీవితాన్నిచ్చిన, నీ తండ్రి మాటను ఆలకించు, నీ తల్లి ముసలితనంలో ఆమెను నిర్లక్ష్యం చేయకు.
PRO 23:23 సత్యాన్ని కొనుక్కో దాన్ని అమ్మకు జ్ఞానాన్ని, బోధను, అంతరార్థాన్ని కూడా కొని ఉంచుకో.
PRO 23:24 నీతిమంతులైన పిల్లల తండ్రికి గొప్ప ఆనందం; జ్ఞానం గలవానికి తండ్రిగా ఉన్నవాడు వాని వలన సంతోషిస్తాడు.
PRO 23:25 నీ తల్లిదండ్రులు సంతోషించుదురు గాక; నిన్ను కనిన తల్లి ఆనందంగా ఉండును గాక!
PRO 23:26 నా కుమారుడా, నీ హృదయాన్ని నాకివ్వు నీ కళ్లు నా మార్గాలను అనుసరించుట యందు ఆనందించును గాక,
PRO 23:27 ఎందుకంటే ఒక వ్యభిచార స్త్రీ ఒక లోతైన గుంట, దారితప్పిన భార్య ఇరుకైన బావి.
PRO 23:28 బందిపోటులా అది పొంచి ఉంటుంది అది అనేకమంది మనుష్యులను నమ్మకద్రోహులుగా చేస్తుంది.
PRO 23:29 ఎవరికి శ్రమ ఉంది? ఎవరికి దుఃఖం ఉంది? ఎవరికి కలహాలు ఉన్నాయి? ఎవరికి ఫిర్యాదులు ఉన్నాయి? ఎవరికి అవసరంలేని గాయాలు? ఎవరి కళ్లు ఎర్రబడి ఉన్నాయి?
PRO 23:30 మద్యంతో ప్రొద్దుపుచ్చేవారు, నమూనా మద్యమాల మిశ్రమాలను రుచిచూడడానికి వెళ్లేవారు.
PRO 23:31 మద్యం ఎర్రగా ఉన్నప్పుడు, గిన్నెలో తళతళలాడుతూ, గొంతులో పడగానే మంచిగా అనిపిస్తుందేమో అయినా దానివైపు చూడవద్దు!
PRO 23:32 అంతంలో అది పాములా కరుస్తుంది కట్లపాములా విషం చిమ్ముతుంది.
PRO 23:33 నీ కళ్లు వింత దృశ్యాలను చూస్తాయి, నీ మనస్సు గందరగోళమైన వాటిని ఊహిస్తుంది.
PRO 23:34 నీవు నడిసముద్రంలో పడుకునేవానిలా ఉంటావు. స్తంభాన్ని పట్టుకుని ఉన్నావు.
PRO 23:35 “వారు నన్ను కొట్టారు, కాని గాయం కాలేదు! వారు నన్ను కొట్టారు, కాని నాకు తెలియలేదు! మరి కాస్త మద్యం త్రాగడానికి నేనెప్పుడు నిద్ర లేస్తాను?”
PRO 24:1 చెడ్డవారిని చూసి అసూయపడవద్దు, వారి సహవాసం కోరుకోవద్దు;
PRO 24:2 వారి హృదయాలు హింసను చేయాలని యోచిస్తాయి, వారి పెదవులు ఇబ్బంది పెట్టడం గురించి మాట్లాడతాయి.
PRO 24:3 జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, గ్రహింపు వలన అది స్థిరంగా ఉంటుంది.
PRO 24:4 తెలివిచేత దాని గదులు అరుదైన అందమైన నిధులతో నింపబడతాయి.
PRO 24:5 జ్ఞానులు బలవంతులకన్నా శక్తివంతులు, తెలివిగలవారు ఇంకా బలంగా ఎదుగుతారు.
PRO 24:6 ఖచ్చితంగా యుద్ధం చేయడానికి మీకు నడిపించేవారు అవసరం అనేకమంది సలహాదారుల ద్వారా విజయం సాధ్యమవుతుంది.
PRO 24:7 మూర్ఖులకు జ్ఞానం ఎంతో ఎత్తులో ఉంటుంది; సమాజ గవిని దగ్గర వారు మాట్లాడడానికి ఏమి లేదు.
PRO 24:8 కీడు చేయాలని చూసే వ్యక్తి కుట్రలు చేసే వ్యక్తి అని పిలువబడతాడు.
PRO 24:9 మూర్ఖుల పథకాలు పాపం, ఎగతాళి చేసేవారిని నరులు అసహ్యించుకుంటారు.
PRO 24:10 ఒకవేళ మీరు ఇబ్బందుల సమయంలో తడబడితే, మీ బలం ఎంత సూక్ష్మమైనది!
PRO 24:11 చావుకు కొనిపోబడుతున్న వారిని రక్షించు; మరణం వైపు తూగుతున్న వారిని వెనుకకు లాగు.
PRO 24:12 “కాని దీని గురించి మాకు ఏమి తెలియదు” అని నీవంటే, హృదయాలను తూకం వేసేవాడు నీ మాటను గ్రహించడా? నీ ప్రాణాన్ని కాచేవానికి తెలియదా? ప్రతి వ్యక్తికి తన క్రియలకు తగినట్టుగా తిరిగి చెల్లించడా?
PRO 24:13 నా కుమారుడా, తేనె తిను, అది మంచిది; తేనెపట్టు నుండి తేనె తిను అది రుచికి తీపిగా ఉంటుంది.
PRO 24:14 జ్ఞానం నీకు తేనెలాంటిది అని తెలుసుకో: అది నీకు దొరికితే, నీ భవిష్యత్తుకు నిరీక్షణ ఉంటుంది, నీ నిరీక్షణ తొలిగిపోదు.
PRO 24:15 నీతిమంతుల నివాసం దగ్గర దొంగలా పొంచి ఉండవద్దు, వారి నివాస స్థలాన్ని దోచుకోవద్దు;
PRO 24:16 ఎందుకంటే నీతిమంతులు ఏడుమారులు పడినను తిరిగి లేస్తారు, కాని విపత్తు సంభవించినప్పుడు దుష్టులు తడబడతారు.
PRO 24:17 నీ శత్రువు పడినప్పుడు సంతోషించవద్దు; వాడు తడబడినప్పుడు నీ హృదయాన్ని సంతోషించనీయకు,
PRO 24:18 లేదా యెహోవా అది చూసి అయిష్టత కలిగి వారి మీద నుండి తన కోపం చాలించుకుంటారేమో.
PRO 24:19 కీడు చేసేవారిని చూసి నీవు చిరాకుపడకు దుష్టుల ఎడల అసూయ పడకు.
PRO 24:20 ఎందుకంటే కీడు చేసేవారికి భవిష్యత్ నిరీక్షణ లేదు, దుష్టుల దీపము ఆరిపోతుంది.
PRO 24:21 నా కుమారుడా, యెహోవాకు రాజుకు భయపడు, తిరుగుబాటు చేసే అధికారులతో జతకలవకు.
PRO 24:22 ఎందుకంటే అవి రెండు వారి మీదికి హఠాత్ నాశనాన్ని పంపుతాయి, అవి ఎలాంటి ఆపదలు తెస్తాయో ఎవరికి తెలుసు?
PRO 24:23 ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సూక్తులే: న్యాయం తీర్చుటలో పక్షపాతము చూపుట మంచిది కాదు
PRO 24:24 “నీవు అమాయకుడవు” అని దోషులతో చెప్పేవారిని, ప్రజలు శపిస్తారు దేశాలు అసహ్యించుకుంటారు.
PRO 24:25 న్యాయంగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును అధికమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.
PRO 24:26 నిజాయితీగల జవాబు పెదవులపై పెట్టే ముద్దు లాంటిది.
PRO 24:27 ముందుగా నీ బయటి పని చక్క పెట్టుకో నీ పొలాలను సిద్ధపరచుకో; దాని తర్వాత, నీ ఇల్లు కట్టుకో.
PRO 24:28 కారణం లేకుండ నీ పొరుగువానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దు; నీ పెదవులతో తప్పుత్రోవ పట్టిస్తావా?
PRO 24:29 “వారు నాకు చేసినట్లు నేను వారికి చేస్తాను; వారు చేసిన దానికి వారికి తిరిగి చెల్లిస్తాను” అని అనుకోవద్దు.
PRO 24:30 నేను ఒక సోమరివాని చేను దాటి వెళ్లాను, నేను బుద్ధిలేని ఒక వ్యక్తి ద్రాక్షతోటను దాటి వెళ్లాను;
PRO 24:31 అంతట ముళ్ళ కంపలు పెరిగాయి, నేలంతా కలుపు మొక్కల చేత కప్పబడి ఉంది, దాని రాతి గోడ శిథిలావస్థలో ఉంది.
PRO 24:32 నేను దాన్ని చూసి దాని గురించి యోచన చేసి దాని నుండి నేను ఒక పాఠం నేర్చుకున్నాను.
PRO 24:33 ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు, ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను.
PRO 24:34 పేదరికం నీ మీదికి దొంగలా, లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.
PRO 25:1 ఇవి కూడా సొలొమోను యొక్క సామెతలు, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని పోగుచేశారు.
PRO 25:2 ఒక విషయాన్ని దాచిపెట్టడం దేవుని గొప్పతనం; ఒక విషయాన్ని బయటకు లాగడం రాజుల గొప్పతనము.
PRO 25:3 ఆకాశాల ఎత్తు భూమి లోతు ఎలా కనుగొనలేమో, అలాగే రాజుల హృదయాలు కూడా శోధించలేనివి.
PRO 25:4 వెండిలోని లోహపు మడ్డిని తీసివేసి, కంసాలివాడు ఒక పాత్రను తయారుచేయగలడు;
PRO 25:5 రాజు ఎదుట నుండి చెడ్డ అధికారులను తొలగించండి, నీతి ద్వారా ఆయన సింహాసనం స్థాపించబడుతుంది.
PRO 25:6 రాజు ఎదుట నిన్ను నీవు హెచ్చించుకోవద్దు, ఆయన దగ్గర ఉండే గొప్పవారి మధ్య చోటు కావాలని కోరవద్దు.
PRO 25:7 సంస్థానాధిపతుల ముందు రాజు నిన్ను అవమానించడం కంటే, “ఇక్కడకు రండి” అని ఆయన నీతో చెప్పడం బాగుంటుంది కదా. మీరు ఏదో చూసిన దానిని బట్టి,
PRO 25:8 తొందరపడి న్యాయస్థానానికి వెళ్లకండి, ఎందుకంటే ఒకవేళ నీ పొరుగువాడు నిన్ను అవమానపరిస్తే తర్వాత నీవేమి చేస్తావు?
PRO 25:9 ఒకవేళ నీవు నీ పొరుగువాన్ని న్యాయస్థానానికి తీసుకెళ్లినా, ఇంకొకరి గుట్టు బయట పెట్టకు.
PRO 25:10 అది వినినవాడు నిన్ను అవమానపరచవచ్చు, అప్పుడు నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు.
PRO 25:11 సకాలంలో మాట్లాడిన మాట, చిత్రమైన వెండి పళ్ళాల్లో ఉంచబడిన బంగారు ఆపిల్ పళ్ళలాంటిది.
PRO 25:12 బంగారు చెవి పోగు ఎలా ఉంటుందో లేదా మేలిమి బంగారు ఆభరణం ఎలా ఉంటుందో వినే చెవికి జ్ఞానియైన న్యాయమూర్తి యొక్క గద్దింపు అలా ఉంటుంది.
PRO 25:13 నమ్మకమైన పనివాడు తనను పంపువారికి కోతకాలంలో మంచు చల్లదనము వంటివాడు; వాడు తన యజమానుల హృదయాలను తెప్పరిల్లజేస్తాడు.
PRO 25:14 బహుమతి ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వని వ్యక్తి వర్షము కురిపించని మబ్బు గాలి లాంటివాడు.
PRO 25:15 సహనం ద్వారా ఒక పాలకుడిని ఒప్పించవచ్చు, మృదువైన నాలుక ఎముకను విరుగ గొట్ట గలదు.
PRO 25:16 నీకు తేనె దొరికితే సరిపడగా తిను ఎక్కువ తింటే కక్కివేస్తావు.
PRO 25:17 నీ పొరుగువారింటికి మాటిమాటికి వెళ్లకు, వారు నీ వలన విసిగిపోయి నిన్ను ద్వేషించవచ్చు.
PRO 25:18 తన పొరుగువాని మీద అబద్ధసాక్ష్యం చెప్పేవాడు సమ్మెట ఖడ్గము లేదా వాడిగల బాణాన్ని పోలినవాడు.
PRO 25:19 కష్ట సమయంలో నమ్మకద్రోహిని ఆశ్రయించడమంటే విరిగిన పళ్లు లేదా కుంటి పాదం లాంటిది.
PRO 25:20 బాధలోనున్న వానికి పాటలు వినిపించేవాడు, బాగా చలిగా ఉన్నపుడు పై బట్టతీసివేయు వానితోను, పచ్చిపుండు మీద పుల్లని ద్రాక్షరసం పోసేవానితోను సమానము.
PRO 25:21 నీ శత్రువు ఆకలితో ఉంటే, తినడానికి భోజనము పెట్టు; అతడు దాహంతో ఉంటే, త్రాగడానికి నీళ్లు ఇవ్వు.
PRO 25:22 ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తావు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తారు.
PRO 25:23 ఊహించని వర్షాన్ని తెచ్చే ఉత్తర గాలిలా కపటమైన నాలుక భయానకంగా కనిపించేలా చేస్తుంది.
PRO 25:24 గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు.
PRO 25:25 అలసిన ప్రాణానికి చల్లటి నీరు ఎలా ఉంటుందో దూరదేశము నుండి వచ్చిన మంచి వార్త అలా ఉంటుంది.
PRO 25:26 నీతిమంతుడు దుష్టునికి మార్గం ఇవ్వడం ఊటను బురదమయం లేదా బావిని కలుషితం చేయడం లాంటిది.
PRO 25:27 తేనె ఎక్కువగా తినడం మంచిది కాదు, ప్రజలు తమ సొంత కీర్తిని కోరుకోవడం గౌరవప్రదం కాదు.
PRO 25:28 మనస్సు అదుపు చేసుకోలేని వ్యక్తి ప్రాకారాలు కూలిన పట్టణం లాంటివాడు.
PRO 26:1 వేసవికాలంలో మంచు లేదా కోతకాలంలో వర్షం సరిపడవో, అలాగే బుద్ధిలేని వానికి ఘనత కూడా సరిపడదు.
PRO 26:2 ఎలాగైతే రెపరెపలాడే పిచ్చుక, ఇటు అటు ఎగిరే కోయిల కుదురుగా నిలువవో, కారణం లేని శాపం కూడా నిలువదు.
PRO 26:3 గుర్రానికి కొరడా, గాడిదకు కళ్లెం, బుద్ధిహీనుని వీపుకు బెత్తం!
PRO 26:4 వాని మొండితనం ప్రకారం బుద్ధిహీనునికి జవాబు ఇవ్వవద్దు, ఇచ్చిన ఎడల నీవును వాని వలెనే ఉందువు.
PRO 26:5 వాని మూర్ఖత్వం ప్రకారం బుద్ధిహీనునికి సమాధానం చెప్పాలి, లేకపోతే వాడు తన కళ్లకు తాను జ్ఞానిని అని అనుకుంటాడు.
PRO 26:6 బుద్ధిహీనునిచేత వార్తను పంపేవాడు, కాళ్లు తెగగొట్టుకొని విషం త్రాగిన వానితో సమానుడు.
PRO 26:7 కుంటివానికి కాళ్లు ఉన్నా ప్రయోజనం ఉండదు, అలాగే బుద్ధిహీనుని నోట సామెత ఉన్నా ఉపయోగం ఉండదు.
PRO 26:8 బుద్ధిహీనుని గౌరవించువాడు, వడిసెలలోని రాయి కదలకుండ కట్టు వానితో సమానుడు.
PRO 26:9 బుద్ధిహీనుని నోట సామెత, మత్తుడైన వాని చేతిలో ముల్లు గుచ్చుకొన్నట్లుండును.
PRO 26:10 యాదృచ్ఛికంగా గాయపడిన విలుకాడు వలె బుద్ధిహీనుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును.
PRO 26:11 తన మూర్ఖత్వాన్ని మరల కనుపరచు బుద్ధిహీనుడు తను కక్కిన దానికి తిరిగిన కుక్క వంటివాడు.
PRO 26:12 తన కళ్లకు తాను జ్ఞానియైన వాన్ని చూశావా? వానికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ నిరీక్షణ.
PRO 26:13 సోమరి అంటాడు, “దారిలో సింహముంది, వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!”
PRO 26:14 కీలుపై తలుపు తిరుగుతుంది అలాగే సోమరి తన పడకపై తిరుగుతాడు.
PRO 26:15 సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు.
PRO 26:16 కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తన కళ్ళకు తానే జ్ఞానిని అనుకుంటాడు.
PRO 26:17 తనకు కాని తగాదాను బట్టి తొందర పడేవాడు దాటిపోవుచున్న కుక్కచెవులు పట్టుకొను వానితో సమానుడు.
PRO 26:18 తన పొరుగువానిని మోసం చేసి, మరణకరమైన “నేను సరదాగా చేశాను!” అని అనేవాడు మండుతున్న బాణాలు విసిరే ఉన్మాది లాంటివాడు.
PRO 26:20 కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోతుంది; అబద్ధాలు చెప్పేవాడు లేకపోతే తగాదా చల్లారుతుంది.
PRO 26:21 నిప్పు కణాలకు బొగ్గు, అగ్నికి కట్టెలో గొడవలు రేపడానికి గొడవప్రియుడు.
PRO 26:22 పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి అవి అంతరంగం లోనికి దిగిపోతాయి.
PRO 26:23 చెడు హృదయంతో ప్రేమపూర్వకమైన మాటలు మట్టిపాత్రల మీద వెండి లోహపు మడ్డితో పూసినట్టు ఉంటాయి.
PRO 26:24 పగవారు పెదవులతో మాయ మాటలు చెప్పి హృదయాల్లో కపటాన్ని దాచుకుంటారు.
PRO 26:25 వారి మాటలు ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, వాటిని నమ్మవద్దు, వారి హృదయాలు ఏడు అసహ్యకరమైన వాటితో నిండి ఉంటాయి.
PRO 26:26 వారి దుర్మార్గం మోసం ద్వారా దాచబడవచ్చు, కాని వారి దుష్టత్వం సమాజం ముందు బయటపడుతుంది.
PRO 26:27 గుంటను త్రవ్వువాడే దానిలో పడతాడు రాతిని దొర్లించేవారి మీదికే అది తిరిగి దొర్లుతుంది.
PRO 26:28 అబద్ధం చెప్పే నాలుక అది గాయపరచిన వారిని ద్వేషిస్తుంది, అలాగే పొగిడే నోరు నాశనం కలిగిస్తుంది.
PRO 27:1 రేపటిని గురించి గొప్పగా చెప్పుకోవద్దు, ఎందుకంటే ఏ రోజు ఏమి తెస్తుందో నీకు తెలియదు.
PRO 27:2 నీ నోటితో కాదు, మరొకరు నిన్ను పొగడనివ్వండి; నీ పెదవులతో కాదు, ఇతరులు నిన్ను పొగడనివ్వండి.
PRO 27:3 రాయి భారం ఇసుక ఒక భారం, మూర్ఖుని కోపం ఆ రెంటికంటె భారము.
PRO 27:4 కోపం క్రూరమైనది ఆగ్రహం వరదలా పొర్లుతుంది. కానీ అసూయ ముందు ఎవరు నిలబడగలరు?
PRO 27:5 అంతరంగంలో ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు.
PRO 27:6 స్నేహితుడు కలిగించే గాయములు నమ్మదగినవి, కాని పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును.
PRO 27:7 కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. ఆకలిగొనిన వానికి చేదు వస్తువైనను తియ్యగా ఉంటుంది.
PRO 27:8 తన ఇల్లు విడిచి తిరిగేవాడు గూడు విడచి తిరిగే పక్షితో సమానుడు.
PRO 27:9 అత్తరు ధూపం హృదయానికి సంతోషం కలిగిస్తాయి, స్నేహితుని వల్ల కలిగే వినోదం వారి హృదయపూర్వక సలహా ద్వార వస్తుంది.
PRO 27:10 నీ స్నేహితులను గాని నీ కుటుంబ స్నేహితులను గాని విడచిపెట్టకు, నీకు ఆపద కలిగిన రోజున నీ సహోదరుల ఇంటికి వెళ్లకు, దూరంలో ఉన్న సహోదరుల కంటే దగ్గర ఉన్న పొరుగువాడు మేలు.
PRO 27:11 నా కుమారుడా! తెలివిని సంపాదించి నా మనస్సును సంతోషపరచుము; అప్పుడు నిన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.
PRO 27:12 వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు, సామాన్యుడు గ్రుడ్డిగా ముందుకు వెళ్లి తగిన మూల్యం చెల్లిస్తాడు.
PRO 27:13 అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి; ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి.
PRO 27:14 ఎవడైన తెల్లవారు జాముననే లేచి గొప్ప స్వరంతో తన స్నేహితుని దీవిస్తే, అది శాపంగా పరిగణించబడింది.
PRO 27:15 ముసురు రోజున తెంపులేకుండా కారు నీళ్లును గయ్యాళియైన భార్యయు సమానము.
PRO 27:16 దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను తన కుడిచేత నూనె పట్టుకొను వానితోను సమానుడు.
PRO 27:17 ఇనుము చేత ఇనుము పదునైనట్లు ఒక మనుష్యుడు మరొక మనిషి వాడిగా చేస్తాడు.
PRO 27:18 అంజూర చెట్టును పెంచేవాడు దాని ఫలం తింటాడు, తన యజమానుని క్షమించేవాడు ఘనత పొందుతాడు.
PRO 27:19 నీరు ముఖాన్ని ప్రతిబింబించినట్లు, మనుష్యుని జీవితం హృదయాన్ని ప్రతిబింబిస్తుంది.
PRO 27:20 పాతాళానికి, లోతైన గుంటకును తృప్తికానేరదు. అలాగున మనుష్యుల చూపు తృప్తికానేరదు.
PRO 27:21 వెండికి మూస బంగారానికి కొలిమి తగినది, అయితే ప్రజలు తమ కీర్తిచేత పరీక్షించబడతారు.
PRO 27:22 బుద్ధిహీనున్ని రోటిలోని గోధుమలలో వేసి రోకటితో దంచినా సరే వాని మూర్ఖత్వం వదిలిపోదు.
PRO 27:23 నీ గొర్రెల మందల పరిస్థితి జాగ్రత్తగా తెలుసుకో, నీ మందల మీద జాగ్రత్తగా మనస్సు పెట్టు;
PRO 27:24 ఐశ్వర్యం శాశ్వతం కాదు, కిరీటం తరతరాల వరకు ఉండదు.
PRO 27:25 ఎండుగడ్డి తొలగించబడి, క్రొత్తది ఎదగడం కనిపిస్తున్నప్పుడు. కొండ మీది నుండి గడ్డిని పోగుచేసినప్పుడు.
PRO 27:26 నీ బట్టల కోసం గొర్రెపిల్లలు ఉన్నాయి ఒక చేను కొను డబ్బుకు మేకపోతులు సరిపోతాయి.
PRO 27:27 నీ ఆహారానికి, నీ ఇంటివారి ఆహారానికి నీ పనికత్తెల పోషణలు మేకపాలు సమృద్ధి అవుతాయి.
PRO 28:1 ఎవడు వెంటాడకుండానే దుష్టులు పారిపోతారు, కాని నీతిమంతులు సింహంలా ధైర్యంగా నిలబడతారు.
PRO 28:2 ఒక దేశం తిరుగుబాటు చేసినప్పుడు, దానికి చాలామంది పాలకులు ఉంటారు, కానీ వివేచన జ్ఞానంగల మనుష్యులు క్రమాన్ని పాటిస్తారు.
PRO 28:3 పేదలను హింసించే ఒక పేదవాడు పంటను తుడిచిపెట్టుకుపోయే వర్షం లాంటివాడు.
PRO 28:4 బోధనను విడిచిపెట్టిన వారు దుష్టులను పొగడుతారు, కాని దానిని లక్ష్యపెట్టేవారు దుష్టులను వ్యతిరేకిస్తారు.
PRO 28:5 కీడుచేసేవారు సరియైనది గ్రహించరు, కాని యెహోవాను ఆశ్రయించువారు దాన్ని పూర్తిగా గ్రహిస్తారు.
PRO 28:6 మూర్ఖమైన మార్గాలు అనుసరించే ధనికుని కంటే, నిందారహితంగా నడుచుకొనే పేదవాడు మేలు.
PRO 28:7 వివేకవంతుడైన కుమారుడు బోధనకు శ్రద్ధ వహిస్తాడు, కాని తిండిబోతు సహచరుడు తన తండ్రిని అవమానపరుస్తాడు.
PRO 28:8 పేదవాని నుండి వడ్డిచేత గాని లేదా లాభంచేత గాని ఆస్తి పెంచుకొనువాడు పేదవారి పట్ల దయ చూపే మరొకరికి దాన్ని కూడ పెడుతున్నాడు.
PRO 28:9 ఒకవేళ ఎవరైనా నా బోధను పెడచెవిని పెడితే, వారి ప్రార్థనలు కూడా అసహ్యకరమైనవి.
PRO 28:10 యథార్థమైన వారిని చెడు దారిలోకి నడిపించేవారు, తమ ఉచ్చులో తామే పడతారు, కాని నిందారహితులు మంచి వారసత్వాన్ని పొందుకుంటారు.
PRO 28:11 ధనవంతులు తమ కళ్లకు తామే జ్ఞానులు; వివేకంగల పేదవారు వారు ఎంత మోసపూరితమైనవారో చూస్తారు.
PRO 28:12 నీతిమంతులు విజయం సాధించినప్పుడు, గొప్ప ఉల్లాసం ఉంటుంది; కాని దుష్టులైన మనుష్యులు అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రజలు దాక్కుంటారు.
PRO 28:13 తమ పాపాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు, కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు.
PRO 28:14 దేవుని ఎదుట ఎప్పుడూ భయంతో వణికేవారు ధన్యులు, కాని తమ హృదయాలను కఠినం చేసుకొనే వ్యక్తులు ఇబ్బందుల్లో పడతారు.
PRO 28:15 నిస్సహాయ ప్రజలను పైన ఉన్న దుష్ట పాలకుడు గర్జించే సింహం లేదా దాడి చేసే ఎలుగుబంటిలాంటి వాడు.
PRO 28:16 ఒక నిరంకుశ పాలకుడు బలాత్కారాన్ని అభ్యసిస్తాడు, కాని చెడుతో సంపాదించిన లాభాన్ని ద్వేషించేవాడు సుదీర్ఘ పాలనను అనుభవిస్తాడు.
PRO 28:17 హత్యచేసిన అపరాధభావంతో బాధించబడే వారు సమాధిలో ఆశ్రయం వెదకుతారు; ఎవరు వారిని ఆపకూడదు.
PRO 28:18 ఎవరి నడక నిందారహితంగా ఉంటుందో వారు భద్రంగా ఉంచబడతారు, కాని ఎవరి మార్గాలు మూర్ఖంగా ఉంటాయో వారు హఠాత్తుగా గొయ్యిలో పడిపోతారు.
PRO 28:19 తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ పగటి కలల వెంటపడేవారికి దరిద్రత నిండుతుంది.
PRO 28:20 నమ్మకమైన వ్యక్తి అధికంగా దీవించబడతాడు, కాని ధనము సంపాదించాలని ఆరాటపడేవాడు శిక్ష పొందక మానడు.
PRO 28:21 పక్షపాతం చూపడం మంచిది కాదు అయినా రొట్టె ముక్క కోసం మనుష్యులు తప్పు చేస్తారు.
PRO 28:22 పిసినారి ధనం సంపాదించాలని ఆరాటపడతాడు అయితే దరిద్రత వాని కోసం వేచి ఉందని వానికి తెలియదు.
PRO 28:23 నాలుకతో పొగిడే వారికన్నా, మనుష్యులను గద్దించేవారే చివరికి ఎక్కువ ఇష్టమవుతారు.
PRO 28:24 తన తల్లిదండ్రులను దోచుకొని “ఇది ద్రోహం కాదు” అనేవాడు నాశనం చేసేవానికి భాగస్వామి.
PRO 28:25 దురాశ కలవాడు కలహాన్ని రేపుతాడు, కాని యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వృద్ధి చెందుతాడు.
PRO 28:26 తమను తాము నమ్ముకొనేవారు బుద్ధిహీనులు, కాని జ్ఞానం కలిగి నడచుకునేవారు క్షేమంగా ఉంటారు.
PRO 28:27 పేదవారికి ఇచ్చేవారికి ఏదీ కొదువ కాదు, కాని వారి పట్ల కళ్లు మూసుకొనే వారికి అనేక శాపాలు కలుగుతాయి.
PRO 28:28 దుష్టులైన మనుష్యులు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు దాక్కుంటారు; కాని దుష్టులు నశించినప్పుడు నీతిమంతులు వృద్ధిచెందుతారు.
PRO 29:1 ఎన్నిమారులు గద్దించినను మాట విననివాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు.
PRO 29:2 నీతిమంతులు వృద్ధి చెందినప్పుడు ప్రజలు సంతోషిస్తారు; దుష్టులు ఏలునపుడు, ప్రజలు మూల్గుతారు.
PRO 29:3 జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రికి ఆనందం కలిగిస్తాడు, కానీ వేశ్యల సహచరుడు తన సంపదను నాశనం చేస్తాడు.
PRO 29:4 న్యాయం ద్వారా ఒక రాజు దేశానికి స్థిరత్వాన్ని ఇస్తాడు, కాని లంచం కోసం అత్యాశపడేవారు దానిని కూల్చివేస్తారు.
PRO 29:5 పొరుగువారిని పొగడేవారు వారి పాదాలకు వలలు వేస్తున్నారు.
PRO 29:6 కీడుచేసేవారు తమ సొంత పాపం ద్వార చిక్కుకుంటారు, కాని నీతిమంతుడు ఆనందంతో కేకలు వేస్తాడు సంతోషంగా ఉంటాడు.
PRO 29:7 నీతిమంతులు పేదవారికి న్యాయం జరగాలని చూస్తారు, కాని దుష్టులకు అలాంటి ఆలోచించరు.
PRO 29:8 ఎగతాళి చేసేవారు పట్టణాన్ని తల్లడిల్లజేస్తారు, జ్ఞానులు కోపం చల్లార్చెదరు.
PRO 29:9 ఒకవేళ జ్ఞానియైన వ్యక్తి మూర్ఖునితో న్యాయస్థానానికి వెళ్తే, బుద్ధిహీనుడు కోపంతో ఎగతాళి చేస్తాడు, అప్పుడు అక్కడ వారికి సమాధానం ఉండదు.
PRO 29:10 రక్తపిపాసులు నిజాయితీ కల వ్యక్తిని ద్వేషిస్తారు యథార్థవంతులను చంపాలని చూస్తారు.
PRO 29:11 మూర్ఖులు వారి కోపాన్ని వెదజల్లుతారు, కాని జ్ఞానులు చివరికి ప్రశాంతత తెస్తారు.
PRO 29:12 ఒకవేళ పాలకుడు అబద్ధాలు వింటే, తన అధికారులంతా దుష్టులవుతారు.
PRO 29:13 పేదవారు అణగారినవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వీరిద్దరి కళ్లకు చూపు ఇచ్చేవాడు యెహోవా.
PRO 29:14 ఏ రాజు పేదలకు సత్యంగా న్యాయం తీరుస్తాడో, ఆ రాజు సింహాసనం శాశ్వతంగా స్థిరపరచబడుతుంది.
PRO 29:15 బెత్తము గద్దింపు జ్ఞానాన్ని పుట్టిస్తుంది, కానీ క్రమశిక్షణ చేయబడని పిల్లవాడు తన తల్లిని అగౌరపరుస్తాడు.
PRO 29:16 దుష్టులు వృద్ధిచెందునప్పుడు పాపం కూడా వృద్ధిచెందుతుంది, అయితే వారి పతనాన్ని నీతిమంతులు కళ్లారా చూస్తారు.
PRO 29:17 మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి, వారు మీకు నెమ్మదిని కలిగిస్తారు; మీరు కోరుకునే ఆనందాన్ని వారు మీకు ఇస్తారు.
PRO 29:18 దైవిక నడిపింపు లేకపోతే ప్రజలు నిగ్రహాన్ని కోల్పోతారు; కాని జ్ఞానం యొక్క బోధ పట్ల శ్రద్ధ చూపేవాడు ధన్యుడు.
PRO 29:19 సేవకులు కేవలం మాటల ద్వారా సరిదిద్దబడరు; వారు గ్రహించినా సరే స్పందించరు.
PRO 29:20 త్వరపడి మాట్లాడేవాన్ని నీవు చూశావా? వారికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ.
PRO 29:21 చిన్నప్పటి నుండి గారాబం పొందుకున్న దాసుడు పెంకితనం గలవానిగా అవుతాడు.
PRO 29:22 ఒక కోపిష్ఠుడు గొడవలు రేపుతాడు మహా కోపిష్ఠియైన వ్యక్తి అనేక పాపాలు చేస్తాడు.
PRO 29:23 గర్వము ఒక వ్యక్తిని దిగువకు తెస్తుంది, అయితే ఆత్మలో దీనుడైనవాడు గౌరవాన్ని పొందుతారు.
PRO 29:24 దొంగల సహచరుడు తనను తాను గాయపరచుకుంటాడు; మీరు నిజం చెప్పమని ప్రమాణం చేశారు, కాని మీరు సాక్ష్యం చెప్పే ధైర్యం లేదు.
PRO 29:25 మనుష్యుల భయం ఒక ఉచ్చు అని రుజువవుతుంది, కాని యెహోవాయందు నమ్మిక ఉంచేవారు క్షేమంగా ఉంటారు.
PRO 29:26 పాలకునితో ప్రేక్షకులు ఉండాలని చాలామంది కోరుకుంటారు, అయితే న్యాయం యెహోవా నుండి వస్తుంది.
PRO 29:27 నీతిమంతులు నిజాయితీ లేనివారిని అసహ్యించుకుంటారు; దుష్టులు యథార్థవంతులను అసహ్యించుకుంటారు.
PRO 30:1 యాకె కుమారుడైన అగూరు సూక్తులు. ఈ మనుష్యుడు ఇతీయేలుకు చెప్పిన మాట: “దేవా, నేను అలసిపోయాను, కాని నేను గెలుస్తాను.
PRO 30:2 నిజంగా నేను క్రూరమైనవాన్ని, మనుష్యుని కాదు; మనుష్యులకు ఉండే ఇంగిత జ్ఞానం నాకు లేదు.
PRO 30:3 నేను జ్ఞానాన్ని అభ్యాసం చేయలేదు, పరిశుద్ధుని గురించిన తెలివి నాకు లేదు.
PRO 30:4 ఆకాశానికెక్కి మరలా దిగినవారెవరు? తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వారెవరు? బట్టలో నీళ్లు మూట గట్టినవారెవరు? భూమి దిక్కులను నెలకొల్పినది ఎవరు? ఆయన పేరేంటి, ఆయన కుమారుని పేరేంటి? ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి!
PRO 30:5 “దేవుని మాటలు పరీక్షించబడినవి; ఆయనను ఆశ్రయించువారికి ఆయన ఒక డాలు.
PRO 30:6 ఆయన మాటలకు కలపవద్దు, ఆయన నిన్ను గద్దించి నిన్ను అబద్ధికుడవని నిరూపిస్తారు.
PRO 30:7 “యెహోవా, నేను మీ నుండి రెండింటిని అడిగాను; నేను చనిపోకముందు వాటిని నాకు ఇవ్వండి:
PRO 30:8 అసత్యాన్ని అబద్ధాలను నాకు దూరంగా ఉంచండి; దరిద్రతను గాని ధనాన్ని గాని నాకు ఇవ్వకండి, కాని నా వాటాను మాత్రం నాకు ఇవ్వండి.
PRO 30:9 ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి, ‘యెహోవా ఎవరు?’ అని అంటానేమో పేదవాడినైతే దొంగతనం చేసి నా దేవుని నామానికి అవమానం తెస్తానేమో.
PRO 30:10 “పనివారిని గురించి వారి యజమానితో చాడీలు చెప్పవద్దు, వారు నిన్ను శపిస్తారు, మీరు అపరాధులు అవుతారు.
PRO 30:11 “తమ తండ్రిని శపించేవారు తమ తల్లిని దీవించని వారు ఉన్నారు;
PRO 30:12 తమ కళ్లకు తాము పవిత్రులై తమ మలినం కడుగబడని వారు ఉన్నారు;
PRO 30:13 అహంకారపు కళ్లు కలిగిన వారున్నారు, వారి చూపులు అసహ్యం;
PRO 30:14 భూమి మీద ఉండకుండా వారు పేదవారిని మ్రింగుదురు మనుష్యుల్లో బీదలు లేకుండా నశింపజేయుదురు కత్తి వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు.
PRO 30:15 “జలగకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారు ‘ఇవ్వు, ఇవ్వు!’ అని అరుస్తారు. “తృప్తిలేనివి మూడు కలవు, ‘చాలు!’ అననివి నాలుగు కలవు:
PRO 30:16 అవి ఏమనగా పాతాళం, పిల్లలు కనని గర్భం; నీరు చాలు అనని భూమి నీరు చాలు అనని అగ్ని.
PRO 30:17 “తండ్రిని ఎగతాళి చేసి తల్లి మాట వినని వాని కన్ను లోయకాకులు పీకుతాయి పక్షిరాజు పిల్లలు దానిని తింటాయి.
PRO 30:18 “మూడు అద్భుతమైనవి కలవు, నాకు అర్థం కానివి నాలుగు కలవు:
PRO 30:19 అవేమనగా ఆకాశాన గ్రద్ద జాడ, బండ మీద పాము జాడ, అగాధ సముద్రంలో ఓడ నడుచు జాడ, పెండ్లికాని స్త్రీతో పురుషుని జాడ.
PRO 30:20 “వేశ్య యొక్క పనియు అట్టిదే; అది తిని నోరు తుడుచుకుని నేను ఏ చెడు చేయలేదు అని అంటుంది.
PRO 30:21 “భూమిని వణికించునవి మూడు కలవు, అవి భరించలేనివి నాలుగు కలవు.
PRO 30:22 అవి ఏమనగా రాజరికానికి వచ్చిన దాసుడు, తినడానికి పుష్కలంగా ఉన్న దైవభక్తి లేని మూర్ఖుడు,
PRO 30:23 పెళ్ళి చేసుకున్న ధిక్కార స్త్రీ, యజమానురాలి స్థానాన్ని తీసుకున్న చేసికొన్న దాసి.
PRO 30:24 “భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినా అవి మిక్కిలి తెలివిగలవి.
PRO 30:25 చీమలు బలంలేని ప్రాణులైనా, అవి ఎండాకాలంలో ఆహారం కూర్చుకుంటాయి.
PRO 30:26 చిన్న కుందేళ్ళు బలంలేని ప్రాణులైనా, అవి బండ సందుల్లో నివాసాలు ఏర్పరచుకుంటాయి.
PRO 30:27 మిడతలకు రాజు లేడు, అయినా అవి బారులు తీరి సాగిపోతాయి.
PRO 30:28 బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినా రాజుల ఇండ్లలో అది ఉంటుంది.
PRO 30:29 “డంబంగా నడిచేవి మూడు కలవు, బడాయిగా నడిచేవి నాలుగు కలవు:
PRO 30:30 సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది.
PRO 30:31 కోడిపుంజు, మేకపోతు తన సైన్యానికి ముందు నడుచుచున్న రాజు.
PRO 30:32 “నీవు బుద్ధిలేనివాడవై గర్వపడిన యెడల కీడు ఆలోచించిన యెడల నీ చేతితో నోరు మూసుకో.
PRO 30:33 పాలు తరచగా వెన్న వస్తుంది ముక్కు పిండగా రక్తం వస్తుంది కోపం రేపగా తగవు పుడుతుంది.”
PRO 31:1 రాజైన లెమూయేలు సూక్తులు; అతని తల్లి అతనికి బోధించిన ప్రేరేపిత మాటలు.
PRO 31:2 నా కుమారుడా! ఆలకించు, నా గర్భంలో మోసిన నా కుమారుడా, ఆలకించు నా మ్రొక్కుబడులకు జవాబైన నా కుమారుడా, ఆలకించు!
PRO 31:3 నీ బలమును ఆడవారి కోసం ఖర్చు చేయవద్దు, రాజులను పతనము చేసేవారి కోసం నీ శక్తిని ఖర్చు చేయవద్దు.
PRO 31:4 లెమూయేలూ, ఇది రాజులకు తగినది కాదు, మద్యపానం సేవించుట రాజులకు తగినది కాదు, పాలకులు మద్యము కోసం ఆరాటపడకూడదు,
PRO 31:5 ఎందుకంటే వారు త్రాగి, నిర్ణయించిన వాటిని మరచిపోతారు, అణగారిన వారందరి హక్కులను హరించివేస్తారు.
PRO 31:6 నశిస్తున్న వారికి సారా, హృదయ వేదనగల వారికి మద్యము.
PRO 31:7 వారు త్రాగి తమ పేదరికమును మరచిపోతారు తమ కష్టాన్ని ఇక తలంచరు.
PRO 31:8 తమ గురించి తాము మాట్లాడలేని వారి కోసం, నిరాశ్రయులందరి హక్కుల కోసం మాట్లాడండి.
PRO 31:9 మాట్లాడండి న్యాయంగా తీర్పు తీర్చండి; దీనుల, అవసరతలో ఉన్న వారి హక్కులను పరిరక్షించండి.
PRO 31:10 గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యాల కంటే విలువైనది.
PRO 31:11 ఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడు అతనికి లాభం తక్కువకాదు.
PRO 31:12 ఆమె బ్రతుకు దినాలన్ని, అతనికి మేలు చేస్తుంది గాని కీడు చేయదు.
PRO 31:13 ఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని, ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది.
PRO 31:14 ఆమె దూరము నుండి తన ఆహారాన్ని తెచ్చే, వర్తకుల ఓడల లాంటిది.
PRO 31:15 ఆమె ఇంకా చీకటి ఉండగానే లేస్తుంది; తన కుటుంబానికి భోజనము సిద్ధము చేస్తుంది; తన పనికత్తెలకు వారి వాటాను ఇస్తుంది.
PRO 31:16 ఆమె పొలాన్ని చూసి దానిని కొంటుంది; తన సంపాదనల నుండి ఆమె ద్రాక్షతోట ఒకటి నాటుతుంది.
PRO 31:17 ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది, ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి.
PRO 31:18 ఆమె తన వ్యాపారం లాభదాయకంగా ఉండడం చూస్తుంది, రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు.
PRO 31:19 ఆమె పంటను చేత పట్టుకుంటుంది, తన వ్రేళ్ళతో కదురు పట్టుకుని వడుకుతుంది.
PRO 31:20 పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది.
PRO 31:21 మంచు కురిసినప్పుడు ఆమె తన ఇంటివారి గురించి భయపడదు, ఆమె ఇంటివారందరు ఎర్రని రంగు బట్టలు వేసుకున్నవారు.
PRO 31:22 ఆమె పరుపులను తయారుచేసుకుంటుంది, ఆమె బట్టలు సన్నని నారబట్టలు ఎరుపు వస్త్రాలు.
PRO 31:23 ఆమె భర్త పట్టణ ద్వారం దగ్గర గౌరవించబడతాడు, అతడు దేశ పెద్దల మధ్య ఆసీనుడై ఉంటాడు.
PRO 31:24 ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది, వర్తకులకు నడికట్లను అమ్ముతుంది.
PRO 31:25 బలాన్ని, గౌరవాన్ని ఆమె ధరించి ఉంది; ఆమె రాబోయే రోజుల గురించి నవ్వగలదు.
PRO 31:26 ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది, దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది.
PRO 31:27 ఆమె తన ఇంటివారి వ్యవహారాలను చూస్తుంది, పని చేయకుండ ఆమె భోజనం చేయదు.
PRO 31:28 ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు; ఆమె భర్త కూడా, ఆమెను పొగడ్తారు:
PRO 31:29 “చాలామంది స్త్రీలు గొప్ప పనులు చేస్తారు, కాని వారందరినీ నీవు మించినదానవు.”
PRO 31:30 అందం మోసకరం ఆకర్షణ వ్యర్థం; యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ పొగడబడుతుంది.
PRO 31:31 చేసే పనిని బట్టి ఆమెకు గుర్తింపు వస్తుంది, ప్రజల ఎదుట ఆమె పనులు ఆమెను పొగడుతాయి.
ECC 1:1 దావీదు కుమారుడును యెరూషలేము రాజును అయిన ప్రసంగి మాటలు:
ECC 1:2 ఈ ప్రసంగి ఇలా అంటున్నాడు, “అర్థరహితం! అర్థరహితం! అంతా అర్థరహితమే.”
ECC 1:3 సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన వారికి కలిగే లాభం ఏమిటి?
ECC 1:4 తరాలు వస్తాయి తరాలు పోతాయి, కాని ఈ భూమి ఎప్పటికీ ఉంటుంది.
ECC 1:5 సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, తాను ఉదయించే చోటుకు మరలా చేరాలని త్వరపడుతున్నాడు.
ECC 1:6 గాలి దక్షిణం వైపు వీస్తూ అంతలోనే ఉత్తరానికి తిరుగుతుంది; అది సుడులు సుడులుగా తిరుగుతూ, తన దారిలోనే తిరిగి వస్తుంది.
ECC 1:7 నదులన్నీ సముద్రంలోనికే చేరుతాయి, అయినా సముద్రం ఎప్పటికీ నిండదు. నదులు ఎక్కడి నుండి ప్రవహిస్తున్నాయో అక్కడికే తిరిగి వెళ్తాయి.
ECC 1:8 అన్నీ శ్రమపడి అలసిపోతున్నాయి, మనుష్యులు దానిని వివరించలేరు. ఎంత చూసినా కంటికి తృప్తి కలుగదు. ఎంత విన్నా చెవికి సంతృప్తి కలుగదు.
ECC 1:9 ఇంతవరకు ఉన్నదే ఇకముందు కూడా ఉంటుంది, ఇంతవరకు జరిగిందే ఇకముందు జరుగబోతుంది; సూర్యుని క్రింద క్రొత్తది అంటూ ఏదీ లేదు.
ECC 1:10 “చూడండి! ఇది క్రొత్తది” అని ఎవరైనా ఒకదాని గురించి చెప్పడానికి ఏదైనా ఉందా? చాలా కాలం క్రితమే, అది ఉంది; మన కాలానికి ముందే అది ఉంది.
ECC 1:11 పూర్వతరాలు ఎవరికి జ్ఞాపకముండవు, రాబోయే తరాలు కూడా వాళ్ళ తర్వాతి తరం వాళ్ళకు అసలే జ్ఞాపకముండవు.
ECC 1:12 ప్రసంగినైన నేను, యెరూషలేములో ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాను.
ECC 1:13 ఆకాశం క్రింద జరుగుతున్నదంతా అధ్యయనం చేయడానికి జ్ఞానంతో పరిశోధించడానికి దానిపై మనస్సు పెట్టాను. దేవుడు మనుష్యులపై ఎంతో అధికమైన భారం పెట్టారు!
ECC 1:14 సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిని నేను చూశాను; అవన్నీ అర్థరహితమే, అది గాలి కోసం ప్రయాసపడడమే.
ECC 1:15 వంకరగా ఉన్నవాటిని సరి చేయలేము; లేనివాటిని లెక్కపెట్టలేము.
ECC 1:16 “చూడు, యెరూషలేములో నాకన్నా ముందు పాలించిన రాజులందరికంటే నేను గొప్పజ్ఞానిని; ఎంతో జ్ఞానాన్ని తెలివిని సంపాదించాను” అని నాలో నేను అనుకున్నాను.
ECC 1:17 ఏది జ్ఞానమో, ఏది వెర్రితనమో ఏది అవివేకమో గ్రహించాలని ప్రయత్నించాను. కాని అది కూడా, గాలి కోసం ప్రయాసపడడమే అని తెలుసుకున్నాను.
ECC 1:18 జ్ఞానం ఎక్కువవుతూ ఉంటే విచారం కూడా ఎక్కువవుతుంది; ఎంత ఎక్కువ తెలివి ఉంటే అంత ఎక్కువ దుఃఖం కలుగుతుంది.
ECC 2:1 “ఇప్పుడు, మంచి ఏమిటో తెలుసుకోవడానికి సంతోషం చేత నిన్ను పరీక్షిస్తాను” అని నాలో నేను అనుకున్నాను. కాని ఇది కూడా అర్థరహితమేనని తెలిసింది.
ECC 2:2 నవ్వుతో, “నీది వెర్రితనమని”, ఆనందంతో, “నీవు ఏమి సాధిస్తావు?” అని నేను అన్నాను.
ECC 2:3 నా మనస్సు ఇంకా నన్ను జ్ఞానంతో నడిపిస్తూ ఉండగానే, ద్రాక్షరసంతో నన్ను నేను తృప్తిపరుచుకోవాలని, బుద్ధిహీనత వలన ఉపయోగం తెలుసుకోవాలని అనుకున్నాను. ఆకాశం క్రింద తాము జీవించే కొన్ని రోజుల్లో మనుష్యులు ఏమి చేస్తే మంచిదో చూడాలనుకున్నాను.
ECC 2:4 నేను గొప్ప పనులు మొదలుపెట్టాను: నా కోసం భవనాలు కట్టించుకున్నాను ద్రాక్షతోటలు నాటించాను.
ECC 2:5 తోటలు, ఉద్యానవనాలు వేయించి వాటిలో అన్ని రకాల పండ్లచెట్లు నాటించాను.
ECC 2:6 పెరుగుతున్న చెట్లకు నీరు అందించడానికి నేను చెరువులను త్రవ్వించాను.
ECC 2:7 దాసదాసీలను నేను వెల చెల్లించి కొన్నాను, నా ఇంట్లోనే పుట్టిపెరిగిన దాసులు కూడా నాకున్నారు. యెరూషలేములో నాకన్నా ముందు నుండి ఉన్న వారందరికంటే ఎక్కువ పశుసంపద గొర్రెల మందలు నాకున్నాయి.
ECC 2:8 నా కోసం వెండి బంగారం సమకూర్చుకున్నాను. విదేశాల నుండి రాజ సంపదను సేకరించాను. గాయనీ గాయకులను, మనుష్యుల హృదయాన్ని సంతోషపరిచే వాటిని సంపాదించాను; స్త్రీలు కూడా నా దగ్గర ఉన్నారు.
ECC 2:9 నాకన్నా ముందు యెరూషలేములోని వారందరికంటే నేనెంతో గొప్పవాడినై ఎంతో వృద్ధి చెందాను. వీటన్నిటిలో నా జ్ఞానం నాతోనే ఉంది.
ECC 2:10 నా కళ్లు కోరినవాటిలో దేన్ని చూడకుండ నేను నిరాకరించలేదు; సంతోషాలను అనుభవించకుండా నా హృదయాన్ని ఆటంకపరచలేదు. నా పనులన్నిటిని బట్టి నా హృదయం సంతోషించింది. నా శ్రమంతటికి కలిగిన ఫలితం ఇదే.
ECC 2:11 అయితే, నా చేతులు చేసిన పనులన్నిటిని వాటికోసం నేను పడిన శ్రమనంతటి పరిశీలిస్తే, అవన్నీ అర్థరహితమే అని, గాలికి ప్రయాసపడినట్లే అని తెలుసుకున్నాను. సూర్యుని క్రింద లాభకరమైనదేదీ లేదని నేను గ్రహించాను.
ECC 2:12 నేను జ్ఞానం, పిచ్చితనం, బుద్ధిహీనతల గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. రాజు ఇంతకుముందే చేసిన దానికంటే, రాజు తర్వాత వచ్చేవాడు అధికంగా ఇంకేమి చేయగలడు? అనుకున్నాను.
ECC 2:13 చీకటి కంటే వెలుగు మేలు అని, బుద్ధిహీనత కంటే జ్ఞానం మేలు అని నేను చూశాను.
ECC 2:14 జ్ఞానికి తలలో కళ్లు ఉంటాయి. మూర్ఖుడు చీకటిలో నడుస్తాడు. అయినా అందరి విధి ఒకటే అని నేను గ్రహించాను.
ECC 2:15 నాలో నేను అనుకున్నాను మూర్ఖుడికి సంభవించేదే నాకూ సంభవిస్తుంది. నేను ఇంత జ్ఞానం సంపాదించి నాకేం లాభం? “ఇది కూడా అర్థరహితం” అని నాలో నేననుకున్నాను.
ECC 2:16 ఎందుకంటే మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడా ఎక్కువకాలం జ్ఞాపకం ఉండరు; ఇరువురిని మరచిపోయే రోజులు ఇప్పటికే వచ్చాయి. మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడ చస్తారు.
ECC 2:17 ఇదంతా చూస్తూ ఉంటే సూర్యుని క్రింద జరుగుతున్న దాన్ని బట్టి నాకెంతో విచారం కలిగింది, కాబట్టి నేను నా జీవితాన్ని అసహ్యించుకున్నాను. అంతా అర్థరహితమే గాలికి ప్రయాసపడడమే.
ECC 2:18 సూర్యుని క్రింద నేను కష్టపడి సాధించినవన్నీ నా తర్వాత వచ్చే వారికి చెందుతాయని తెలుసుకొని నేను వాటన్నిటిని అసహ్యించుకున్నాను.
ECC 2:19 నా తర్వాత వచ్చేవాడు ఎలాంటివాడో ఎవరికి తెలుసు? అతడు జ్ఞాని కావచ్చు, మూర్ఖుడు కావచ్చు. ఎలాంటి వాడైనా సూర్యుని క్రింద నా శ్రమతో నైపుణ్యతతో సంపాదించినదంతా అతని స్వాధీనమౌతుంది. ఇది కూడా అర్థరహితమే.
ECC 2:20 కాబట్టి సూర్యుని క్రింద నేను పడిన కష్టమంతటి గురించి నేను నిరాశ చెందాను.
ECC 2:21 ఒకరు జ్ఞానంతో తెలివితో నైపుణ్యంతో శ్రమించి పని చేస్తారు, కాని తర్వాత వారు దానిని శ్రమించని మరొకరికి వదిలేయాల్సి వస్తుంది. ఇది కూడా అర్థరహితమే, గొప్ప దురదృష్టకరమే.
ECC 2:22 సూర్యుని క్రింద మనుష్యులు కష్టపడి చేస్తున్న పనులకు వారి శ్రమకు పొందుతున్నది ఏంటి?
ECC 2:23 వారి రోజులన్నిటిలో వారు చేసే పనులన్నీ దుఃఖంతో బాధతో నిండి ఉన్నాయి; రాత్రి కూడా వారి మనస్సులు విశ్రాంతి తీసుకోవు. ఇది కూడా అర్థరహితమే.
ECC 2:24 మనుష్యులు అన్నపానాలు పుచ్చుకుని తమ కష్టార్జితంతో మేలుపొందడం కంటే క్షేమం ఇంకేముంది? అయినా ఇది కూడా దేవుని వలనే కలుగుతుందని నేను తెలుసుకున్నాను.
ECC 2:25 ఆయన అనుమతి లేకుండా, ఎవరు తినగలరు ఆనందాన్ని పొందగలరు?
ECC 2:26 తనను సంతోషపెట్టే వారికి దేవుడు జ్ఞానం, తెలివి, సంతోషాన్ని ఇస్తారు, కాని దేవున్ని సంతోషపెట్టే వారికి కోసం సంపదను పోగుచేసే పని ఆయన పాపికి ఇస్తారు. ఇది కూడా అర్థరహితమే, గాలికి ప్రయాసపడడమే.
ECC 3:1 ప్రతిదానికీ ఒక సమయం ఉంది, ఆకాశాల క్రింద ప్రతీ కార్యకలాపానికి ఒక కాలం ఉంది:
ECC 3:2 పుట్టడానికి సమయం చావడానికి సమయం, నాటడానికి సమయం, పెరికివేయడానికి సమయం,
ECC 3:3 చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం, పడగొట్టడానికి, కట్టడానికి.
ECC 3:4 ఏడ్వడానికి, నవ్వడానికి దుఃఖపడడానికి, నాట్యమాడడానికి,
ECC 3:5 రాళ్లు పారవేయడానికి, కుప్పవేయడానికి, కౌగిలించుకోడానికి, కౌగిలించడం మానడానికి.
ECC 3:6 వెదకడానికి సమయం, పోగొట్టుకోడానికి సమయం, దాచిపెట్టడానికి, పారవేయడానికి,
ECC 3:7 చింపివేయడానికి, కుట్టడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి,
ECC 3:8 ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధం చేయడానికి, సమాధానపడడానికి సమయం ఉంటుంది.
ECC 3:9 కష్టపడేవారికి తమ కష్టానికి పొందే లాభమేంటి?
ECC 3:10 మనుష్యజాతి మీద దేవుడు మోపిన భారం నేను చూశాను.
ECC 3:11 ఆయన ప్రతిదాన్ని దాని సమయానికి తగినట్లుగా ఉండేలా చేశారు. ఆయన మానవ హృదయంలో నిత్యమైన జ్ఞానాన్ని ఉంచారు; దేవుడు చేసిన వాటిని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా ఎవరూ గ్రహించలేరు.
ECC 3:12 మనుష్యులు జీవించినంత కాలం సంతోషంగా ఉంటూ, మంచి చేయడం కంటే ఉత్తమమైనది ఏదీ లేదని నేను తెలుసుకున్నాను.
ECC 3:13 ప్రతి ఒక్కరు తిని త్రాగుతూ తన కష్టార్జితాన్ని ఆస్వాదించడమే దేవుని వరమని నేను తెలుసుకున్నాను.
ECC 3:14 దేవుడు చేసే ప్రతిదీ శాశ్వతంగా ఉంటుందని నాకు తెలుసు; దానికి ఏమీ జోడించలేము దాని నుండి ఏమీ తీసివేయలేము. ప్రజలు ఆయనకు భయపడేలా దేవుడు అలా నియమించారు.
ECC 3:15 ఇప్పుడు జరుగుతున్నది ఇంతకుముందు జరిగిందే. ఇకముందు జరగబోయేది, పూర్వం జరిగి ఉన్నదే. మునుపున్నదాన్నే మళ్ళీ దేవుడు రప్పిస్తారు, జరిగిస్తారు.
ECC 3:16 సూర్యుని క్రింద ఈ భూమి మీద మరో విషయం నేను చూశాను. న్యాయస్థానంలో దుర్మార్గం జరుగుతూ ఉంది. న్యాయానికి బదులు దుర్మార్గమే ప్రబలుతోంది.
ECC 3:17 నేనిలా అనుకున్నాను, “నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడు తీర్పు తీరుస్తారు, ఎందుకంటే ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది ప్రతి పనికి తీర్పు తీర్చడానికి సమయం ఉంది.”
ECC 3:18 నేను ఇంకా ఇలా అనుకున్నాను, “మనుష్యుల తాము జంతువుల్లాంటివారని గ్రహించేలా దేవుడు వారిని పరీక్షిస్తారు.
ECC 3:19 ఖచ్చితంగా జంతువులకు జరిగినట్లే మనుష్యులకు జరుగుతుంది. వారిద్దరి విధి ఒక్కటే; జంతువులు చనిపోతాయి మనుష్యులు చనిపోతారు. అంతా అర్థరహితమే.
ECC 3:20 అంతా వెళ్లేది ఒక చోటికే; సమస్తం మట్టిలో నుండి వచ్చింది, తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది.
ECC 3:21 ఒకవేళ మానవ ఆత్మ పైకి లేస్తుందో లేదో, జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందో లేదో ఎవరికి తెలుసు?”
ECC 3:22 కాబట్టి మనుష్యులు తమ పనిని ఆస్వాదించడం కంటే మెరుగైనది ఏదీ లేదని నేను గ్రహించాను, ఎందుకంటే అదే వారు చేయవలసింది. వారి తర్వాత ఏమి జరుగుతుందో చూడటానికి వారిని ఎవరు వెనక్కి తీసుకురాగలరు?
ECC 4:1 సూర్యుని క్రింద జరుగుతున్న అణచివేతనంతటిని నేను చూశాను: సూర్యుని క్రింద అణగారిన వారి కన్నీటిని నేను చూశాను, కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు; బాధపెట్టేవారు బలవంతులు, వారిని ఆదరించేవారెవరూ లేరు.
ECC 4:2 ఇంకా జీవించి ఉన్నవారి కంటే మునుపే చనిపోయినవారు, సంతోషంగా ఉన్నారని నేను అనుకున్నాను.
ECC 4:3 ఇంకా పుట్టనివారు, సూర్యుని క్రింద జరిగే చెడును చూడనివారు, ఈ ఇరువురి కన్నా ధన్యులు.
ECC 4:4 కష్టమంతటితో సాధించినవన్నీ ఒకరిపట్ల ఒకరికి అసూయ కలిగిస్తున్నాయని నేను చూశాను. ఇది కూడా అర్థరహితమే, గాలికి శ్రమ పడినట్లే.
ECC 4:5 మూర్ఖులు చేతులు ముడుచుకుని తమను తాము పతనం చేసుకుంటారు.
ECC 4:6 రెండు చేతులతో గాలి కోసం శ్రమించడం కంటే ఒక చేతినిండ నెమ్మది ఉంటే అది ఎంతో మేలు.
ECC 4:7 నేను సూర్యుని క్రింద మళ్ళీ అర్థరహితమైన దానిని చూశాను:
ECC 4:8 ఒక ఒంటరివాడు ఉండేవాడు; అతనికి కుమారుడు కాని సోదరుడు కాని లేరు. కాని అతడు నిత్యం కష్టపడుతూనే ఉన్నాడు, అయినప్పటికీ అతని సంపద అతని కళ్లను తృప్తిపరచలేకపోయింది. “నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను? నేను ఎందుకు ఆనందంగా లేను?” అని ప్రశ్నించుకున్నాడు, ఇది కూడా అర్థరహితమే విచారకరమైన క్రియ!
ECC 4:9 ఒకరికంటే ఇద్దరు మేలు, ఎందుకంటే ఇద్దరూ కష్టపడితే మంచి రాబడి ఉంటుంది:
ECC 4:10 ఒకవేళ ఇద్దరిలో ఒకరు పడితే రెండవవాడు ఇతడిని లేవనెత్తగలడు. ఒంటరివాడు పడితే లేవనెత్తేవాడెవడూ ఉండడు.
ECC 4:11 అలాగే, ఇద్దరు కలిసి పడుకుంటే, వారు వెచ్చగా ఉంటారు. అయితే ఒంటరివారు ఎలా వెచ్చగా ఉండగలరు?
ECC 4:12 ఒంటరి వారిని పడద్రోయడం తేలిక, ఇద్దరు కలిసి తమను తాము రక్షించుకోగలరు. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు.
ECC 4:13 మూర్ఖుడై హెచ్చరికలు వినడానికి ఇష్టపడని ముసలి రాజుకంటే బీదవాడైన జ్ఞానంగల యువకుడే నయము.
ECC 4:14 అలాంటి యువకుడు చెరసాలలో నుండి బయటపడి పట్టాభిషేకం పొందవచ్చు. తన దేశంలో దరిద్రుడిగా పుట్టినా రాజు కాగలడు.
ECC 4:15 సూర్యుని క్రింద జీవిస్తూ తిరిగే వారందరూ రాజు బదులు రాజైన ఆ యువకుని అనుసరిస్తారని నేను తెలుసుకున్నాను.
ECC 4:16 అతని అధికారం క్రింద ఉన్న ప్రజలు అసంఖ్యాకులు. కానీ తర్వాత వచ్చినవారు అతని పట్ల సంతోషించరు. ఇది కూడా అర్థరహితమే, గాలికి ప్రయాసపడడమే.
ECC 5:1 నీవు దేవుని ఆలయానికి వెళ్లినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తాము దుర్మార్గపు పనులు చేస్తున్నామని తెలుసుకోకుండా మూర్ఖుల్లా బలి అర్పించడం కన్నా దగ్గరకు వెళ్లి వినడం మంచిది.
ECC 5:2 దేవుని ముందు అనాలోచితంగా మాట్లాడటానికి, నీ హృదయం తొందరపడకుండ నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశంలో ఉన్నారు నీవు భూమిపై ఉన్నావు, కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి.
ECC 5:3 విస్తారమైన పనుల వల్ల కలలు వస్తాయి. ఎక్కువ మాటలు మాట్లాడేవారు మూర్ఖునిలా మాట్లాడతారు.
ECC 5:4 నీ దేవునికి చేసుకున్న మ్రొక్కుబడిని చెల్లించడంలో ఆలస్యం చేయవద్దు. మూర్ఖుల గురించి దేవుడు సంతోషించరు, నీ మ్రొక్కుబడిని చెల్లించు.
ECC 5:5 మ్రొక్కుబడి చేసి చెల్లించక పోవడం కంటే మ్రొక్కుబడి చేయకపోవడమే మంచిది.
ECC 5:6 నీ మాటలు నిన్ను పాపంలోకి పడవేయకుండా చూసుకో. ఆలయ దూతకు, “పొరపాటున మొక్కుబడి చేశాను” అని చెప్పవద్దు. నీ మాటలకు దేవుడు కోప్పడి నీ చేతిపనిని నాశనం చేయడం అవసరమా?
ECC 5:7 ఎక్కువ కలలు ఎక్కువ మాటలు అర్థరహితమే. కాబట్టి దేవునికి భయపడు.
ECC 5:8 ఒక ప్రాంతంలో పేదలను అణచివేయడం, న్యాయాన్ని హక్కులను పాటించకపోవడం లాంటివి నీవు చూస్తే ఆశ్చర్యపడవద్దు; ఎందుకంటే ఒక అధికారి మీద పైఅధికారులు ఉంటారు, వారందరిపైన ఉన్నతాధికారులు ఉంటారు.
ECC 5:9 దేశం అభివృద్ధి చెందినప్పుడు అందరు పంచుకుంటారు; స్వయాన రాజు పొలాల నుండి లబ్ది పొందుతారు.
ECC 5:10 డబ్బును ప్రేమించేవారు ఆ డబ్బుతో తృప్తి పడరు; సంపదను ప్రేమించేవారు తమ ఆదాయంతో ఎప్పుడూ సంతృప్తి చెందరు. ఇది కూడా అర్థరహితము.
ECC 5:11 ఆస్తి ఎక్కువవుతూ ఉంటే, దాన్ని దోచుకునేవారు కూడా ఎక్కువవుతారు. యజమానులకు తమ ఆస్తిని కళ్లతో చూడడం తప్ప, దానివల్ల వారికేమి ప్రయోజనం?
ECC 5:12 శ్రమజీవులు కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా, సుఖంగా నిద్రపోతారు, కానీ ధనికులకున్న సమృద్ధి వారికి నిద్రపట్ట నివ్వదు.
ECC 5:13 సూర్యుని క్రింద బాధాకరమైన ఒక చెడ్డ విషయాన్ని నేను చూశాను: దాచి ఉంచిన సంపద యజమానునికి హాని తెస్తుంది,
ECC 5:14 లేదా దురదృష్టవశాత్తూ వారి సంపద పోతుంది, వారికి పిల్లలు కలిగినప్పుడు వారికి వారసత్వంగా ఏమీ మిగలదు.
ECC 5:15 ప్రతి ఒక్కరు తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చినట్లే దిగంబరిగానే వెళ్లిపోతారు. తాము కష్టపడిన దానిలో నుండి వారు తమ చేతుల్లో ఏమి మోసుకు వెళ్లరు.
ECC 5:16 మరొక చెడ్డ విషయం: ప్రతి ఒక్కరూ ఎలా వస్తారో, వారు అలాగే వెళ్లిపోతారు, వారు గాలికి ప్రయాసపడుతున్నారు కాబట్టి వారు ఏమి పొందుతారు?
ECC 5:17 వారు చాలా నిరాశతో, బాధలతో, కోపంతో, తమ దినాలన్ని చీకటిలో భోజనం చేస్తారు.
ECC 5:18 నేను గమనించిన వాటిలో మంచిది ఏదనగా: దేవుడు తనకిచ్చిన రోజులన్నిటిలో ఒక వ్యక్తి తిని, త్రాగుతూ సూర్యుని క్రింద తాను చేసిన శ్రమతో సంతృప్తి చెందాలి. ఎందుకంటే ఇదే వారు చేయవలసింది.
ECC 5:19 అంతేకాక, దేవుడు ఒక వ్యక్తికి సంపదను ఆస్తులను వాటిని అనుభవించగల సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు, వారు తమ భాగాన్ని తీసుకుని వారి కష్టార్జితంలో వారు ఆనందంగా ఉండాలి; ఇది దేవుని వరము.
ECC 5:20 దేవుడతనికి హృదయంలో ఆనందం కలిగిస్తారు కాబట్టి అతడు తన గతాన్ని సులభంగా మరిచిపోగలుగుతాడు. వారు వారి జీవితపు రోజులను చాలా అరుదుగా ప్రతిబింబిస్తారు.
ECC 6:1 నేను సూర్యుని క్రింద మరొక చెడు చూశాను, అది మనుష్యజాతి మీద ఎంతో భారంగా ఉంది.
ECC 6:2 దేవుడు కొందరికి ధనం, ఆస్తి, గౌరవం ఇస్తారు, తద్వార వారి హృదయాలు కోరుకున్నవేవి వారికి కొదువగా ఉండవు. కాని వాటిని అనుభవించే సామర్థ్యాన్ని వారికి దేవుడు ఇవ్వరు, అపరిచితులు వాటిని అనుభవిస్తారు. ఇదంతా అర్థరహితమే, చెడ్డ విషయమే.
ECC 6:3 ఒకడు వందమంది పిల్లలను కని అనేక సంవత్సరాలు జీవించినప్పటికీ, అతడు బ్రతికినంత కాలం తన అభివృద్ధిని అనుభవించకపోతే, సరియైన రీతిలో సమాధి చేయబడకపోతే, అతనికంటే గర్భస్రావమైపోయిన పిండమే నయము.
ECC 6:4 గర్భస్రావమైన పిండం నిరుపయోగంగా వచ్చి చీకటిలోకి వెళ్లిపోతుంది, చీకటిలో దాని పేరు కప్పబడుతుంది.
ECC 6:5 అది ఎన్నడు సూర్యుని చూడకపోయినా దానికి ఏమి తెలియకపోయినా, ఆ మనిషి కన్నా దానికే ఎక్కువ విశ్రాంతి ఉంది.
ECC 6:6 అతడు రెండువేల సంవత్సరాలు బ్రతికినా తన అభివృద్ధిని అనుభవించలేడు. అందరు వెళ్లేది ఒకే చోటికే కదా?
ECC 6:7 మనుష్యులు పడే శ్రమ అంతా కడుపు కోసమే, అయినా వారి ఆశకు తృప్తి కలగదు.
ECC 6:8 మూర్ఖుల కంటే జ్ఞానులకున్న ప్రయోజనం ఏముంది? ఇతరుల ఎదుట ఎలా జీవించాలో తెలుసుకున్న బీదవారికి లాభం ఏంటి?
ECC 6:9 కోరిక వెంట పడడం కంటే కళ్లకు కనిపించేది మేలు. అయినా ఇది కూడా అర్థరహితమే. గాలికి ప్రయాసపడడమే.
ECC 6:10 ఉనికిలో ఉన్నవన్నీ ఇంతకు ముందు తెలిసినవే. మనుష్యులు ఎలా ఉంటారో పూర్వం నుండి తెలిసిందే; తనకంటే బలవంతుడితో ఎవరు పోరాడలేరు.
ECC 6:11 మాటలు ఎక్కువ అర్థం తక్కువ, దానివల్ల ఎవరికి ప్రయోజనం?
ECC 6:12 నీడలా తమ జీవితకాలాన్ని అర్థరహితంగా గడిపే మనుష్యుల బ్రతుకులో వారికి ఏది క్షేమమో ఎవరికి తెలుసు? వారు గతించాక సూర్యుని క్రింద భూమి మీద ఏం జరుగుతుందో వారికి ఎవరు చెప్తారు?
ECC 7:1 చక్కని పరిమళం కంటే మంచి పేరు మంచిది, జన్మదినం కంటే మరణ దినం మంచిది.
ECC 7:2 విందు జరిగే వారి ఇళ్ళకు వెళ్లే కంటే ఏడ్చేవారి ఇళ్ళకు వెళ్లడం మంచిది. ఎందుకంటే మరణం ప్రతి ఒక్కరికీ వస్తుంది; జీవించి ఉన్నవారు దీనిని హృదయపూర్వకంగా స్వీకరించాలి.
ECC 7:3 నవ్వడం కంటే దుఃఖపడడం మేలు, ఎందుకంటే విచారంగా ఉన్న ముఖం గుండెకు మంచిది.
ECC 7:4 జ్ఞానుల హృదయం దుఃఖపడే వారి గృహంలో ఉంటుంది కాని బుద్ధిహీనుల మనస్సు సంతోషించే వారి ఇంట్లో ఉంటుంది.
ECC 7:5 మూర్ఖుల పాటలు వినడంకంటే, జ్ఞానుల గద్దింపు వినడం మేలు.
ECC 7:6 కుండ క్రింద చిటపటమనే ముండ్ల కంప మంట ఎలాంటిదో, మూర్ఖుల నవ్వు అలాంటిదే. అది కూడా అర్థరహితమే.
ECC 7:7 అన్యాయం జ్ఞానంగల వానిని మూర్ఖునిగా మారుస్తుంది, లంచం హృదయాన్ని పాడుచేస్తుంది.
ECC 7:8 ఆరంభం కంటే అంతం మేలు, అహంకారం కంటే సహనం మేలు.
ECC 7:9 తొందరపడి కోపపడవద్దు ఎందుకంటే కోపం మూర్ఖుల ఒడిలో ఉంటుంది.
ECC 7:10 “ఇప్పుడు ఉన్న రోజుల కన్నా గడిచిపోయిన రోజులే ఎందుకు మంచివి?” అని అనవద్దు అలాంటి ప్రశ్నలు అడగడం తెలివైనది కాదు.
ECC 7:11 జ్ఞానం ఒక వారసత్వంలా ఒక మంచి విషయమే అది సూర్యుని క్రింద బ్రతికి ఉన్నవారికి ప్రయోజనం కలిగిస్తుంది.
ECC 7:12 డబ్బుతో భద్రత లభించినట్లే, జ్ఞానంతో కూడా భద్రత లభిస్తుంది, ప్రయోజనం ఏంటంటే: జ్ఞానం తనను కలిగినవారిని కాపాడుతుంది.
ECC 7:13 దేవుడు చేసిన వాటిని పరిశీలించండి: ఆయన వంకరగా చేసిన దానిని ఎవరు సరిచేయగలరు?
ECC 7:14 సమయం మంచిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి; కానీ సమయం చెడుగా ఉన్నప్పుడు ఇలా ఆలోచించండి: దేవుడు దీన్ని చేశారు అలాగే దాన్ని చేశారు. అందువల్ల, తమ భవిష్యత్తు గురించి ఎవరూ ఏమీ తెలుసుకోలేరు.
ECC 7:15 నా ఈ అర్థరహిత జీవితంలో నేను ఈ రెండు చూశాను; నీతిమంతులు తమ నీతిలో నశించారు, దుష్టులు తమ దుష్టత్వంలో దీర్ఘకాలం జీవించారు.
ECC 7:16 మరీ ఎక్కువ నీతిమంతునిగా ఉండకు, మరీ ఎక్కువ జ్ఞానిగా ఉండకు, నిన్ను నీవే ఎందుకు నాశనం చేసుకొంటావు?
ECC 7:17 మరీ ఎక్కువ దుర్మార్గంగా ఉండకు, మూర్ఖునిగా ఉండకు. సమయం రాకముందే ఎందుకు చనిపోవాలి?
ECC 7:18 ఒకదాన్ని పట్టుకోవడం మరొకదాన్ని విడిచిపెట్టకపోవడం మంచిది. దేవునికి భయపడేవారు అన్ని విపరీతాలను అధిగమిస్తారు.
ECC 7:19 పట్టణంలోని పదిమంది అధికారుల కంటే తెలివైన వ్యక్తికి ఉన్న జ్ఞానం శక్తివంతమైనది.
ECC 7:20 ఎప్పుడూ పాపం చేయకుండా మంచినే చేస్తూ ఉండే, నీతిమంతులు భూమిపై ఒక్కరు లేరు.
ECC 7:21 ప్రజలు చెప్పే ప్రతి మాటను వినవద్దు, లేకపోతే మీ సేవకుడు మిమ్మల్ని శపించడం మీరు వింటారు.
ECC 7:22 ఎందుకంటే మీరే చాలాసార్లు ఇతరులను శపించారని మీకు తెలుసు.
ECC 7:23 నా జ్ఞానంతో ఇదంతా నేను పరిశోధించాను, “నేను జ్ఞానిని కావాలని నిశ్చయించుకున్నాను” కాని అది నావల్ల కాలేదు.
ECC 7:24 జ్ఞానం దూరంగా లోతుగా ఉంది దానిని ఎవరు కనుగొనగలరు?
ECC 7:25 జ్ఞానాన్ని, సంగతుల మూలకారణాన్ని వెదకి తెలుసుకోడానికి, దుష్టత్వంలోని బుద్ధిహీనతను, మూర్ఖత్వంలోని వెర్రితనాన్ని గ్రహించడానికి, నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను.
ECC 7:26 నేను మరణం కన్నా దుఃఖకరమైనది తెలుసుకున్నాను, అది వల వంటిది, ఉచ్చులాంటి మనస్సు కలిగి సంకెళ్ల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని సంతోషపరిచేవారు ఆమె నుండి తప్పించుకుంటారు. కాని ఆమె పాపులను పట్టుకుంటుంది.
ECC 7:27 ప్రసంగి ఇలా అంటున్నాడు, “నేను తెలుసుకున్నది ఇదే: “సంగతుల మూలకారణాలను తెలుసుకోడానికి ఒక దానికి మరొకదాన్ని జోడించాను.
ECC 7:28 నేను ఇంకా వెదకుతున్నాను కాని దొరకడం లేదు, వేయిమంది పురుషులలో ఒక్క యథార్థవంతుడు దొరికాడు, కానీ స్త్రీలందరిలో ఒక్క యథార్థవంతురాలు కూడా దొరకలేదు.
ECC 7:29 నేను తెలుసుకున్నది ఇది ఒక్కటే; దేవుడు మనుష్యజాతిని యథార్థవంతులుగానే సృజించారు, కానీ వారు అనేక చెడు పథకాల వెంటపడుతున్నారు.”
ECC 8:1 జ్ఞానులకు ఎవరు సాటి? విషయాలను ఎవరు వివరించగలరు? ఒకని జ్ఞానం వాని ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది దాని కఠిన రూపాన్ని మారుస్తుంది.
ECC 8:2 నీవు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కాబట్టి రాజాజ్ఞకు లోబడమని నేను చెప్తున్నాను.
ECC 8:3 రాజు సముఖం నుండి తొందరపడి వెళ్లి పోవద్దు. అతడు తనకు ఏది ఇష్టమైతే అది చేస్తాడు కాబట్టి చెడ్డపనులు చేయవద్దు.
ECC 8:4 రాజు మాట మహోన్నతమైనది, “మీరు నీవు ఏం చేస్తున్నావు?” అని రాజును ఎవరు అడగగలరు?
ECC 8:5 అతని ఆజ్ఞను పాటించే వారెవరికి ఏ హాని జరగదు, ఏది సరియైన సమయమో న్యాయమో జ్ఞానుల హృదయానికి తెలుసు.
ECC 8:6 ఒక వ్యక్తి కష్టం అతని మీద అధిక భారంగా ఉన్నప్పటికీ, ప్రతి దానికి సరియైన సమయం విధానం ఉంది.
ECC 8:7 భవిష్యత్తు గురించి ఎవరికి తెలియదు కాబట్టి, ఏది రాబోతుందో ఒకరికి ఎవరు చెప్పగలరు?
ECC 8:8 గాలిని అదుపుచేసే శక్తి ఎవరికీ లేదు, కాబట్టి తమ మరణ సమయం మీద ఎవరికీ అధికారం లేదు. ఎలాగైతే యుద్ధ సమయంలో ఎవరూ విడుదల చేయబడరో, అలాగే దుర్మార్గం దానిని ఆచరించేవారిని విడుదల చేయదు.
ECC 8:9 ఇవన్నీ నేను చూశాను, సూర్యుని క్రింద చేసిన ప్రతిదానికీ నేను నా మనస్సులో ఆలోచించాను. ఒకరు ఇతరులపై ఉన్న అధికారంతో తనకే హాని తెచ్చుకుంటున్నారు.
ECC 8:10 పవిత్ర స్థలానికి తరచూ వెళ్లేవారు ఇప్పుడు ఎక్కడ నేరాలు చేశారో అదే పట్టణంలో పొగడబడతారు. అలాంటి దుర్మార్గులు సక్రమంగా పాతిపెట్టబడడం నేను చూశాను. ఇది కూడా అర్థరహితమే.
ECC 8:11 చేసిన నేరానికి శిక్ష త్వరగా పడకపోతే ప్రజలు భయం లేకుండా చెడుపనులు చేస్తారు.
ECC 8:12 వంద నేరాలకు పాల్పడిన దుర్మార్గుడు ఎక్కువకాలం జీవించినప్పటికీ, దేవునికి భయపడుతూ ఆయన పట్ల భక్తిగలవారి స్థితి మేలు అని నాకు తెలుసు.
ECC 8:13 దుర్మార్గులు దేవునికి భయపడరు కాబట్టి, వారు అభివృద్ధి చెందరు, వారి రోజులు నీడలా ధీర్ఘకాలం ఉండవు.
ECC 8:14 భూమిపై అర్థరహితమైనది మరొకటి ఉంది: దుర్మార్గులు పొందవలసిన దాన్ని నీతిమంతులు, నీతిమంతులు పొందవలసిన దాన్ని దుర్మార్గులు పొందుతున్నారు. ఇది కూడా అర్థరహితమే అని నేను చెప్తున్నాను.
ECC 8:15 కాబట్టి జీవితాన్ని ఆనందించడాన్ని నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే సూర్యుని క్రింద ఉన్నవారు తిని త్రాగి సంతోషించడం కన్నా గొప్పది లేదు. అప్పుడు దేవుడు సూర్యుని క్రింద వారికి ఇచ్చిన జీవితకాలంలో వారి కష్టంలో వారికి తోడుగా ఉండేది ఆ సంతోషమే.
ECC 8:16 జ్ఞానాన్ని పొందడానికి, భూమిపై ప్రజలు పగలు రాత్రి నిద్రలేకుండ చేసే శ్రమను గమనించడానికి నేను నా మనస్సును నిలిపినప్పుడు
ECC 8:17 దేవుడు చేస్తున్నదంతా నేను చూశాను. సూర్యుని క్రింద ఏమి జరుగుతుందో ఎవరూ అర్థం చేసుకోలేరు. దీన్ని వెదకడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, దాని పూర్తిగా గ్రహించలేరు. జ్ఞానులు తమకు తెలుసు అని వాదించినప్పటికీ, వారు దానిని నిజంగా గ్రహించలేరని నేను తెలుసుకున్నాను.
ECC 9:1 దీని అంతటిని పరిశీలించి నేనో నిర్ణయానికి వచ్చాను ఏంటంటే నీతిమంతులు జ్ఞానులు వారు చేసే పనులు దేవుని చేతుల్లో ఉన్నాయని, అయితే వారి కోసం ప్రేమ ఎదురుచూస్తుందా లేదా ద్వేషమా అనేది ఎవరికీ తెలియదు.
ECC 9:2 జరిగేవన్నీ అందరికి ఒకే విధంగా జరుగుతాయి. నీతిమంతులకు దుర్మార్గులకు, మంచివారికి చెడ్డవారికి, అపవిత్రులకు పవిత్రులకు, బలులు అర్పించేవారికి అర్పించని వారికి అందరికి ఒకే విధంగా జరుగుతాయి. మంచివారికి ఎలాగో, పాపాత్ములకు అలాగే జరుగుతుంది; ఒట్టుపెట్టుకునే వారికి, ఒట్టు పెట్టుకోడానికి భయపడేవారికి అలాగే జరుగుతుంది.
ECC 9:3 అందరికి ఒకే విధంగా జరగడం సూర్యుని క్రింద జరిగే వాటన్నిటిలో చాలా చెడ్డ విషయం. అంతేకాక, మనుష్యుల హృదయాలు చెడుతో నిండి ఉన్నాయి, వారు బ్రతికి ఉన్నప్పుడు వారి హృదయాల్లో పిచ్చి ఉంటుంది, తర్వాత వారు చచ్చినవారితో కలిసిపోతారు.
ECC 9:4 బ్రతికి ఉన్నవారి మధ్యలో ఉండే వారికే నిరీక్షణ ఉంటుంది; చనిపోయిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క నయం కదా!
ECC 9:5 బ్రతికి ఉన్నవారికి తాము చనిపోతామని తెలుసు, కాని చనిపోయినవారికి ఏమి తెలియదు; వారికి ఏ బహుమతి లేదు, వారి పేరు కూడా మర్చిపోతారు.
ECC 9:6 వారి ప్రేమ, వారి ద్వేషం వారి అసూయ చాలా కాలం క్రితమే అంతరించిపోయాయి; సూర్యుని క్రింద జరిగే ఏ విషయంలో వారికిక ఏ భాగం ఉండదు.
ECC 9:7 వెళ్లండి, సంతోషంగా మీ ఆహారాన్ని తినండి ఆనందకరమైన హృదయంతో మీ ద్రాక్షరసం త్రాగండి, ఎందుకంటే మీరు చేసే దాన్ని దేవుడు ముందుగానే ఆమోదించారు.
ECC 9:8 ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో, ఎప్పుడూ తలకు నూనె రాసుకో.
ECC 9:9 సూర్యుని క్రింద దేవుడు మీకు ఇచ్చిన ఈ అర్థరహితమైన జీవితకాలమంతా మీరు ప్రేమించే మీ భార్యతో జీవితాన్ని ఆస్వాదించండి; ఎందుకంటే ఇది మీ జీవితంలో సూర్యుని క్రింద మీరు పడిన కష్టంలో మీకు లభించే భాగము.
ECC 9:10 మీ చేతికి వచ్చిన ఏ పనియైనా శక్తివంచన లేకుండా చేయండి. ఎందుకంటే మీరు వెళ్తున్న పాతాళంలో పని చేయడం గాని ప్రణాళిక వేయడం గాని లేదా తెలివి గాని జ్ఞానం గాని ఉండవు.
ECC 9:11 సూర్యుని క్రింద మరొకటి కూడ నేను గమనించాను: వేగంగా ఉన్నవారే పందెం గెలవలేరు బలంగా ఉన్నవారే యుద్ధాన్ని జయించలేరు, జ్ఞానులకు ఆహారం లభించదు తెలివైన వారికే సంపద ఉండదు చదువుకున్న వారికి దయ లభించదు; కాని సమయాన్ని బట్టే అందరికి అవకాశాలు వస్తాయి.
ECC 9:12 అంతేకాక, వాటి సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు: చేపలు వలలో పట్టబడినట్లు, పక్షులు వలలో చిక్కుకున్నట్లు హఠాత్తుగా వారి మీద పడే చెడు కాలంలో ప్రజలు చిక్కుపడతారు.
ECC 9:13 నేను సూర్యుని క్రింద నన్ను బాగా ఆకట్టుకొన్న జ్ఞానం యొక్క ఈ ఉదాహరణను నేను చూశాను:
ECC 9:14 ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే ఉన్న ఒక చిన్న పట్టణం ఉండేది. ఒక శక్తివంతమైన రాజు వచ్చి దానిని చుట్టుముట్టి, దానికి ఎదురుగా భారీ ముట్టడి దిబ్బలు కట్టాడు.
ECC 9:15 ఇప్పుడు ఆ పట్టణంలో ఉండే ఒక పేదవాడు తన జ్ఞానంతో ఆ పట్టణాన్ని కాపాడాడు. కానీ ఆ పేదవాన్ని ఎవరూ జ్ఞాపకం ఉంచుకోలేదు.
ECC 9:16 కాబట్టి నేను ఇలా అనుకున్నాను, “బలం కన్నా జ్ఞానం మేలు” కానీ ఆ పేదవాడి జ్ఞానం తృణీకరించబడింది, అతని మాటలు ఇకపై పట్టించుకోరు.
ECC 9:17 మూర్ఖుల పాలకుడి కేకల కంటే జ్ఞానులు మెల్లగా చెప్పే మాటలు వినడం మంచిది.
ECC 9:18 యుద్ధాయుధాలకంటె జ్ఞానం మేలు, కాని ఒక్క పాపి అనేకమైన మంచి వాటిని నాశనం చేస్తాడు.
ECC 10:1 పరిమళతైలంలో పడిన చచ్చిన ఈగలు దానికి చెడు వాసన తెచ్చినట్లు, కొంచెం మూర్ఖత్వం జ్ఞానాన్ని ఘనతను పాడుచేస్తుంది.
ECC 10:2 జ్ఞాని హృదయం కుడి చేతిలో ఉంటుంది, కాని మూర్ఖుడి హృదయం ఎడమ చేతిలో ఉంటుంది.
ECC 10:3 తెలివిలేనివారు దారిలో సరిగా నడవలేక వారు ఎంత తెలివితక్కువ వారు అనేది అందరికి చూపిస్తారు.
ECC 10:4 వారు ఎంత తెలివితక్కువ వారు అనేది, మీ ఉద్యోగాన్ని వదిలేయవద్దు; ప్రశాంతత గొప్ప నేరాలు జరుగకుండ ఆపుతుంది.
ECC 10:5 నేను సూర్యుని క్రింద ఒక చెడ్డ విషయాన్ని చూశాను, ఒక పాలకుడు పొరపాటున చేసిన అన్యాయం:
ECC 10:6 అదేమిటంటే మూర్ఖులను ఉన్నత పదవులలో, సమర్థులను దిగువ స్థాయిలో ఉంచడమే.
ECC 10:7 నేను బానిసలు గుర్రాలపై, యువరాజులు బానిసల్లా కాలినడకన వెళ్లడం చూశాను.
ECC 10:8 గొయ్యి త్రవ్వినవారే అందులో పడతారు; గోడను పడగొట్టిన వారే పాము కాటుకు గురవుతారు.
ECC 10:9 రాళ్లు దొర్లించేవారు దానివల్ల గాయపడతారు; మొద్దులను చీల్చేవారు వాటి వల్ల ప్రమాదానికి గురి అవుతారు.
ECC 10:10 ఒకవేళ గొడ్డలి మొద్దుబారి దాని అంచుకు పదును పెట్టకపోతే, ఎక్కువ బలం ఉపయోగించాల్సి ఉంటుంది, అయితే జ్ఞానం విజయాన్ని తెస్తుంది.
ECC 10:11 ఒకవేళ లొంగదీయక ముందే పాము కాటేస్తే, పాములు ఆడించేవానికి లాభం ఉండదు.
ECC 10:12 జ్ఞానుల నోటి నుండి వచ్చే మాటలు దయగలవి, కాని మూర్ఖుని పెదవులు వానినే మ్రింగివేస్తాయి.
ECC 10:13 అవివేకంతో మొదలైన వారి మాటలు; దుర్మార్గపు వెర్రితనంతో ముగుస్తాయి;
ECC 10:14 అయినా మూర్ఖులు వాగుతూనే ఉంటారు. ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు వారు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు?
ECC 10:15 మూర్ఖులకు పట్టణానికి వెళ్లడానికి దారి తెలియదు; కాబట్టి తమ శ్రమతో వారు అలసిపోతారు.
ECC 10:16 దాసుడు రాజుగా ఉన్న దేశానికి ఉదయాన్నే విందు చేసుకొనే యువరాజులు ఉన్న దేశానికి శ్రమ.
ECC 10:17 గొప్ప జన్మ కలిగినవాడు రాజుగా ఉన్న దేశం మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో భోజనానికి కూర్చునే అధిపతులు ఉన్న దేశం ధన్యమైనది.
ECC 10:18 ఒకని సోమరితనం వల్ల ఇంటికప్పు కూలిపోతుంది, ఒకని బద్దకం వల్ల ఇల్లు కారిపోతుంది.
ECC 10:19 నవ్వడం కోసం విందు చేస్తారు, ద్రాక్షరసం జీవితానికి సంతోషం కలిగిస్తుంది, డబ్బు ప్రతిదానికీ సమాధానం.
ECC 10:20 మీ ఆలోచనలో కూడా రాజును తిట్టవద్దు, మీ పడకగదిలో కూడా ధనికులను శపించవద్దు, ఎందుకంటే ఆకాశపక్షులు, రెక్కలున్న పక్షులు మీరు చెప్పేవాటిని బయట పెట్టవచ్చు.
ECC 11:1 మీ ధాన్యాన్ని సముద్రం గుండా రవాణ చేయండి; చాలా రోజుల తర్వాత దాని నుండి మీరు లాభం పొందవచ్చు.
ECC 11:2 ఏడు ఎనిమిదింటిలో పెట్టుబడి పెట్టండి; దేశంలో ఎలాంటి విపత్తు వస్తుందో మీకు తెలియదు.
ECC 11:3 ఒకవేళ మేఘాల నిండా నీళ్లు ఉంటే, అవి భూమిపై వర్షిస్తాయి. ఒక చెట్టు దక్షిణంగా కూలినా ఉత్తరంగా కూలినా, అది పడిన చోటనే ఉంటుంది.
ECC 11:4 గాలిని పరిశీలించేవాడు విత్తనాలు చల్లడు; మబ్బులు చూస్తూ ఉండేవాడు పంట కోయడు.
ECC 11:5 మీకు గాలి వీచే దిశ తెలియనట్లుగానే, తల్లి గర్భంలో పిండం ఎలా రూపుదిద్దుకుంటుందో తెలియనట్లుగా, అన్నిటిని చేసినవాడైన దేవుని క్రియలు మీకు అర్థం కావు.
ECC 11:6 ఉదయాన్నే మీ విత్తనాన్ని విత్తండి, సాయంత్రం వరకు మీ చేతులను వెనుకకు తీయకండి, ఎందుకంటే ఇది ఫలిస్తుందో అది ఫలిస్తుందో, లేదా రెండు సమానంగా ఫలిస్తాయో, మీకు తెలియదు.
ECC 11:7 వెలుగు ఆహ్లాదకరమైనది, సూర్యుని చూడడం కళ్లకు సంతోషాన్ని ఇస్తుంది.
ECC 11:8 ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే, అన్ని సంవత్సరాలు వారు ఆనందంగా ఉండాలి. అయితే చీకటి రోజులు చాలా రాబోతున్నాయని వారు జ్ఞాపకముంచుకోవాలి. రాబోయేదంతా అర్థరహితమే.
ECC 11:9 యవ్వనులారా మీరు, మీ యవ్వన దశలో మీరు సంతోషించండి, మీ యవ్వన దినాల్లో మీ హృదయాన్ని సంతోషంగా ఉండనివ్వండి మీ హృదయ కోరుకున్న వాటిని మీ కళ్లు చూసే వాటిని అనుభవించండి, కాని వీటన్నిటిని బట్టి దేవుడు మిమ్మల్ని తీర్పులోకి తెస్తారని తెలుసుకోండి.
ECC 11:10 కాబట్టి, మీ హృదయంలోనుండి ఆందోళన తీసివేయండి, మీ శరీర బాధలను వెళ్లగొట్టండి, ఎందుకంటే యవ్వనం, దాని బలం అర్థరహితమే.
ECC 12:1 కష్ట దినాలు రాకముందే “వాటిలో నాకు సంతోషం లేదు” అని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే, సూర్యచంద్ర నక్షత్రాలను చీకటి కమ్మక ముందే, వర్షం తగ్గి మరలా మేఘాలు కమ్మక ముందే, నీ యవ్వన ప్రాయంలో నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.
ECC 12:3 ఆ రోజు ఇంటి కావలివారు వణుకుతారు, బలిష్ఠులు వంగిపోతారు, తిరగలి విసిరేవారు కొంతమందే ఉండడంతో పని ఆపివేస్తారు, కిటికీలో నుండి చూచేవారి దృష్టి మందగిస్తుంది.
ECC 12:4 వీధి తలుపులు మూసేస్తారు; తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోతుంది పక్షుల కూతకు ప్రజలు మేల్కొంటారు, పాటలు పాడే స్త్రీల గొంతులు తగ్గిపోతాయి.
ECC 12:5 మనుష్యులు ఎత్తైన స్థలాలకు వీధుల్లో అపాయాలకు భయపడతారు; బాదం చెట్టు పూలు పూస్తుంది మిడత తనను తాను ఈడ్చుకు వెళ్తున్నప్పుడు ఇక కోరికలు రేపబడవు. మనుష్యులు శాశ్వత నివాసం చేరుకుంటారు వారి కోసం ఏడ్చేవారు వీధుల్లో తిరుగుతారు.
ECC 12:6 వెండితాడు తెగిపోక ముందే, బంగారు గిన్నె పగిలిపోక ముందే, నీటి ఊట దగ్గర కుండ బద్దలైపోక ముందే, బావి దగ్గర చక్రం విరిగిపోక ముందే, నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో.
ECC 12:7 మట్టితో తయారైంది తిరిగి మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుంది.
ECC 12:8 “అర్థరహితం! అర్థరహితం!” అంటున్నాడు ఈ ప్రసంగి. “ప్రతిదీ అర్థరహితమే!”
ECC 12:9 ప్రసంగి జ్ఞాని మాత్రమే కాదు అతడు ప్రజలకు కూడా జ్ఞానాన్ని అందించాడు. అతడు లోతుగా ఆలోచించి ఎన్నో సామెతలను క్రమపరిచాడు.
ECC 12:10 ఈ ప్రసంగి సరియైన మాటలనే చెప్పాడు; అతడు సత్యమైన యథార్థ వాక్కులు వ్రాశాడు.
ECC 12:11 జ్ఞానుల మాటలు ములికోలు లాంటివి, సేకరించిన సూక్తులు గట్టిగా దిగగొట్టిన మేకుల వంటివి; అవి ఒక కాపరి చేత ఇవ్వబడ్డాయి.
ECC 12:12 నా కుమారుడా, వీటితో పాటు ఇతర వాటి గురించి జాగ్రత్తగా ఉండు. పుస్తకాల రచనకు అంతం లేదు, అధిక చదువు శరీరానికి అలసట కలిగిస్తుంది.
ECC 12:13 ఇవన్నీ విన్న తర్వాత, అన్నిటి ముగింపు ఇదే: దేవునికి భయపడాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఇదే మనుష్యులందరి కర్తవ్యము.
ECC 12:14 దేవుడు ప్రతి పనిని తీర్పులోనికి తెస్తారు, దాచబడిన ప్రతి దానిని, అది మంచిదైనా చెడ్డదైనా సరే తీర్పులోనికి తెస్తారు.
SOL 1:1 సొలొమోను రచించిన పరమ గీతములు.
SOL 1:2 అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకోనివ్వండి, నీ ప్రేమ ద్రాక్షరసం కంటే ఆహ్లాదకరమైనది.
SOL 1:3 మీ పరిమళ ద్రవ్యాల సువాసన హృదయానికి ఆనందాన్నిస్తుంది; మీ పేరు పోయబడిన పరిమళం లాంటిది. కాబట్టి యువతులు నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు!
SOL 1:4 నన్ను మీతో దూరానికి తీసుకెళ్లండి; త్వరగా! రాజు తన అంతఃపురాల్లోకి నన్ను తీసుకెళ్లనివ్వండి. చెలికత్తెలు నీ విషయం మేము గొప్పగా సంతోషిస్తున్నాము; నీ ప్రేమను ద్రాక్షరసం కన్నా ఎక్కువగా పొగడుతాము. యువతి వారు నిన్ను పొగడడం ఎంత మంచి విషయం!
SOL 1:5 యెరూషలేము కుమార్తెలారా, నల్లనిదానను, అయినా నేను సౌందర్యవతిని, కేదారు డేరాలవంటిదానను, సొలొమోను గుడారపు తెరల్లా నేనూ నల్లనిదాన్ని.
SOL 1:6 నల్లపిల్ల అని చెప్పి నన్నిలా తేరిచూస్తారేమి? ఎండకు నేను నల్లగా అయ్యాను. నా తల్లి కుమారులకు నా మీద కోపం నన్ను ద్రాక్షతోటను కావలి కాయడానికి పెట్టారు; అందుకే నా సొంత ద్రాక్షతోటను కాయలేక పోయాను.
SOL 1:7 నేను ప్రేమిస్తున్నవాడా, నీ గొర్రెల మందను ఎక్కడ మేపుతున్నావో మధ్యాహ్నం మీ మందను విశ్రాంతికి ఎక్కడ ఉంచుతున్నావో చెప్పు. మీ స్నేహితుల మందల ప్రక్కన నేను ముసుగు వేసుకున్న స్త్రీలా ఎందుకు ఉండాలి?
SOL 1:8 స్త్రీలలో అత్యంత అందమైనదానా, ఒకవేళ నీకు తెలియకపోతే, మందల అడుగుజాడలను బట్టి వెళ్లు, కాపరుల డేరాల ప్రక్కన నీ మేక పిల్లలను మేపుకో.
SOL 1:9 నా ప్రియురాలా, నీవు అద్భుతం నీవు ఫరో రథం యొక్క గుర్రాల్లా ఉన్నావు.
SOL 1:10 మీ బుగ్గలు చెవిపోగులతో, నీ మెడ హారాలతో అందంగా ఉన్నాయి.
SOL 1:11 బంగారు చెవిపోగులు చేస్తాము వెండి పూసలతో అలంకరిస్తాము.
SOL 1:12 రాజు బల్ల దగ్గర కూర్చుని ఉన్నాడు, నా పరిమళపు సువాసన అంతా గుబాళించింది.
SOL 1:13 నా ప్రియుడు నా స్తనముల మధ్య ఉన్న, బోళం సంచిలా ఉన్నాడు.
SOL 1:14 ఎన్-గేదీ ద్రాక్షవనంలో వికసించిన గోరింట పూలగుత్తి లాంటివాడు నా ప్రియుడు.
SOL 1:15 నా ప్రియురాలా, నీవు ఎంత అందమైనదానవు! ఓ, ఎంతో అందాలరాశివి! నీ కళ్లు గువ్వలు.
SOL 1:16 నా ప్రియుడా! నీవు ఎంత సౌందర్యమూర్తివి! ఓ, నీవు ఎంతో అందమైనవాడవు! మనకు పడక ప్రశాంతము.
SOL 1:17 మన గృహం దేవదారు దూలాలు! మన వాసాలు సరళవృక్షాల మ్రానులు.
SOL 2:1 నేను షారోను పొలంలో పూసిన గులాబిని, లోయల్లో వికసించిన తామర పువ్వును.
SOL 2:2 ముళ్ళ మధ్య తామర పువ్వులా నా ప్రియురాలు ఈ కన్యకల మధ్య కనిపిస్తూ ఉన్నది.
SOL 2:3 అడవి చెట్ల మధ్య ఆపిల్ వృక్షంలా నా ప్రియుడు యువకుల మధ్య ఉన్నాడు, ఆయన నీడలో ఆనందమయినై కూర్చుండిపోయాను, ఆయన ఫలం నా రుచికి మధురము.
SOL 2:4 నన్ను ఆయన విందుశాలకు నడిపించారు, ఆయన నన్ను ప్రేమతో కప్పివేశారు.
SOL 2:5 ఎండు ద్రాక్షపండ్లతో నన్ను బలోపేతం చేయండి, ఆపిల్ పండ్లతో తినిపించండి. ఎందుకంటే నేను ప్రేమతో మూర్ఛపోయాను.
SOL 2:6 ఆయన ఎడమ చేయి నా తల క్రింద ఉంచాడు, కుడిచేతితో నన్ను కౌగిలించుకున్నాడు.
SOL 2:7 యెరూషలేము కుమార్తెలారా! పొలములోని జింకలను బట్టి లేళ్లను బట్టి మీతో ప్రమాణము చేయిస్తున్నాను: సరియైన సమయం వచ్చేవరకు ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి.
SOL 2:8 వినండి! నా ప్రియుడు! చూడండి! ఆయన వచ్చాడు, పర్వతాల మీదుగా గంతులు వేస్తూ, కొండల మీదుగా దూకుతూ.
SOL 2:9 నా ప్రియుడు జింకలాంటి వాడు, లేదా లేడిపిల్ల లాంటివాడు. చూడండి! అక్కడ అతడు మా గోడ వెనుక నిలబడి కిటికీల గుండా చూస్తూ, జాలక గుండా దాచుకుని చూస్తున్నాడు.
SOL 2:10 నా ప్రియుడు మాట్లాడి నాతో అన్నాడు, నా ప్రియురాలా, లే, నా సౌందర్యవతి, నాతో రా.
SOL 2:11 చూడండి! శీతాకాలం గడిచిపోయింది; వర్షాలు అయిపోయాయి.
SOL 2:12 భూమిపై పువ్వులు ప్రత్యక్షమవుతాయి; పాడే రుతువు వచ్చేసింది. మన దేశంలో పావురాల కూత వినిపిస్తూ ఉంది.
SOL 2:13 అంజూర చెట్టు దాని తొలి ఫలాలను కాస్తుంది; ద్రాక్షచెట్లు వికసించి సువాసనను వెదజల్లుతున్నాయి. నా ప్రియురాలా, లేచి, రా, నా సౌందర్యవతి, నాతో రా.
SOL 2:14 బండ సందుల్లో, పర్వత ప్రాంతంలో దాగే స్థలాల్లో ఉన్న నా పావురమా, నీ ముఖాన్ని నాకు చూపించు, నీ స్వరాన్ని విననివ్వు; ఎందుకంటే నీ స్వరం మధురం నీ ముఖం మనోహరము.
SOL 2:15 నక్కలను పట్టుకోండి, గుంట నక్కలను పట్టుకోండి ఎందుకంటే అవి ద్రాక్షతోటలను పాడు చేస్తాయి, మన ద్రాక్షతోట పూతకు వచ్చింది.
SOL 2:16 నా ప్రియుడు నావాడు నేను ఆయన దానను; తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు.
SOL 2:17 తెల్లవారుజాము వచ్చి నీడలు పారిపోకముందు, నా ప్రియుడా, నా దగ్గరకు తిరిగి రా, నీవు జింకలా దుప్పిలా ఎగుడు దిగుడు కొండల మీది నుండి చెంగు చెంగున రా.
SOL 3:1 రాత్రంతా నేను పడుకుని నా హృదయం ప్రేమించేవాని కోసం నేను చూశాను; ఆయన కోసం చూశాను కాని ఆయన రాలేదు.
SOL 3:2 నేను ఇప్పుడే లేచి పట్టణం వైపు వెళ్తాను, పట్టణ వీధుల్లో రహదారుల్లో వెదకుతాను; నా హృదయం ప్రేమిస్తున్నవాని కోసం నేను వెదకుతాను. కాబట్టి నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనపడలేదు.
SOL 3:3 పట్టణంలో గస్తీ తిరుగుతున్న కావలివారు నాకు ఎదురుపడితే “మీరు నా ప్రాణప్రియుని చూశారా?” అని వారినడిగాను.
SOL 3:4 నేను దాదాపుగా వారిని దాటి వెళ్లాను అప్పుడు నా ప్రేమికుడు నాకు కనిపించాడు. ఆయనను గట్టిగా పట్టుకున్నాను ఆయనను నా తల్లి గృహానికి, నన్ను కనిన గది లోనికి తెచ్చే వరకు నేను వదల్లేదు.
SOL 3:5 యెరూషలేము కుమార్తెలారా! పొలములోని జింకలను బట్టి లేళ్లను బట్టి మీతో ప్రమాణము చేయిస్తున్నాను: సరియైన సమయం వచ్చేవరకు ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి.
SOL 3:6 ధూమ స్తంభాకరంలో వర్తకుల దగ్గర సుగంధ చూర్ణాలన్నిటితో తయారుచేయబడిన బోళం పరిమళ వాసనతో అరణ్య మార్గాన నడిచి వస్తున్నదేంటి?
SOL 3:7 చూడండి! ఆ వచ్చేది సొలొమోను పల్లకి, అరవైమంది శూరుల భద్రతలో ఇశ్రాయేలీయులలో అతి జ్ఞానముగల యోధులు,
SOL 3:8 వారిలో అందరు ఖడ్గమును ధరించిన వారు, యుద్ధంలో అనుభవం కలవారు, ప్రతి ఒక్కరు రాత్రి కలిగే దాడులకు సిద్ధపడి, ఖడ్గం ధరించి సన్నద్ధులై వస్తున్నారు.
SOL 3:9 సొలొమోను రాజు చేయించిన పల్లకి అది; లెబానోను మ్రానుతో తయారైన పల్లకి.
SOL 3:10 దాని స్తంభాలు వెండివి, అడుగుభాగం బంగారం, దాని ఆసనం ఊదా రంగు బట్టతో అలంకరించబడింది, దాని లోపలి భాగం యెరూషలేము కుమార్తెల ద్వార ప్రేమతో అలంకరించబడింది.
SOL 3:11 బయటకు రండి, సీయోను కుమార్తెలారా, చూడండి, చూడండి, సొలొమోను రాజు కిరీటాన్ని ధరించారు, ఆ కిరీటం ఆయన పెళ్ళి రోజున ఆయన హృదయం ఆనందించిన దినాన ఆయన తల్లి ఆయనకు ధరింపజేసిన కిరీటము.
SOL 4:1 నా ప్రియురాలా, నీవు ఎంత అందంగా ఉన్నావు! ఓ, ఎంత అందం! మీ ముసుగు వెనుక మీ కళ్లు గువ్వల్లా ఉన్నాయి. నీ శిరోజాలు గిలాదు పర్వతం మీది నుండి దిగివొచ్చే మేకల మందల్లా కనిపిస్తున్నాయి.
SOL 4:2 నీ పళ్ళు అప్పుడే కత్తెర వేయబడి, కడుగబడి పైకి వస్తున్న గొర్రె మందలా ఉన్నాయి. ప్రతిదీ జంటగా ఉన్నాయి, వాటిలో ఒక్కటి కూడా ఒంటరిగా లేదు.
SOL 4:3 నీ పెదవులు ఎర్ర త్రాడులా ఉన్నాయి; నీ నోరు మనోహరము. నీ ముసుగు వెనుక ఉన్న నీ చెక్కిళ్ళు, సగం దానిమ్మ పండులా ఉన్నాయి.
SOL 4:4 నీ మెడ అందంగా నిర్మించబడిన దావీదు గోపురంలా ఉన్నది; దాని మీద వేయి డాళ్లు వ్రేలాడుతున్నాయి; అవన్నీ శూరుల డాళ్లు.
SOL 4:5 నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, తామర పువ్వుల మధ్య మేసే దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి.
SOL 4:6 తెల్లవారుజాము రాకముందు నీడలు పారిపోకముందు, నేను బోళం కొండకు బోళం పర్వతానికి వెళ్తాను.
SOL 4:7 నా ప్రియురాలా, నీవు అధిక మనోహరం; నీలో ఏ కంళంకమూ లేదు.
SOL 4:8 నా వధువు, లెబానోను నుండి నాతో రా, లెబానోను నుండి నాతో రా. అమాన పర్వత శిఖరం నుండి, శెనీరు, హెర్మోను శిఖరాల నుంచీ, సింహాల బోనుల నుండి, చిరుత పులులు సంచరించే కొండల నుండి దిగిరా.
SOL 4:9 నా సోదరీ, నా వధువా, నీవు నా హృదయం దొంగిలించావు; నీ ఒక్క చూపుతో, నీ హారంలోని ఒక్క ఆభరణంతో నీవు నా హృదయాన్ని దొంగిలించావు.
SOL 4:10 నా సోదరీ, నా వధువా, నీ ప్రేమ ఎంత ఆహ్లాదకరం! ద్రాక్షరసం కంటే నీ ప్రేమ ఆనందమయం, నీవు పూసుకున్న పరిమళ తైల సువాసన సుగంధ ద్రవ్యాలన్నిటినీ మించింది!
SOL 4:11 నా వధువు! నీ పెదవులు తేనెతెట్టెలా మాధుర్యాన్ని వదులుతున్నాయి; నీ నాలుక క్రింద పాలు తేనె ఉన్నాయి. నీ వస్త్ర సువాసన లెబానోను సువాసనగా ఉంది.
SOL 4:12 నా సోదరీ, నా వధువు! నీవు మూసివేయబడిన తోటవు నీవు చుట్టబడిన ఊటవు, మూయబడిన సరస్సువు.
SOL 4:13 నీ మొక్కలు ఒక దానిమ్మతోట కోరుకున్న ఫలములతో, గోరింట జటామాంసి చెట్లతో,
SOL 4:14 జటామాంసి కుంకుమ పువ్వు, వోమ దాల్చిన చెక్క, ప్రతి విధమైన పరిమళ చెట్టుతో, బోళం కలబంద, అన్ని సుగంధద్రవ్యాలు.
SOL 4:15 నీవు ఉద్యానవనంలోని జలాశయానివి, లెబానోను నుండి దిగువకు ప్రవహించే, నీటి ఊటలు కల బావివి.
SOL 4:16 ఉత్తర వాయువూ, మేలుకో, దక్షిణ వాయువూ, రా! నా ఉద్యానవనం మీద వీచండి, తద్వారా అందలి పరిమళ వాసన అన్ని వైపుల వ్యాపించాలి. నా ప్రియుడు తన ఉద్యాన వనానికి వచ్చి నచ్చిన పండ్లు రుచి చేయును గాక.
SOL 5:1 నా సోదరీ, నా వధువు, నా ఉద్యాన వనానికి వచ్చేశాను; నా పరిమళాలతో పాటు నా గోపరసాన్ని సేకరించుకున్నాను. నేను తేనెతెట్టె తేనె తిన్నాను; నేను నా ద్రాక్షరసం, నా పాలు త్రాగాను. చెలికత్తెలు స్నేహితులారా, తినండి త్రాగండి; ప్రేమికులారా! తృప్తిగా సేవించండి.
SOL 5:2 నేను నిద్ర పోతున్నానన్న మాటే గాని, నా హృదయం మేలుకొని ఉంది. వినండి! నా ప్రియుడు తలుపు తడుతూ: “తలుపు తియ్యి, నా సోదరీ, నా ప్రియురాలా! నా పావురమా, నిష్కళంకురాలా. నా తల మంచుకు తడిసింది, రాత్రి తేమకు నా వెంట్రుకలన్నీ తడిసిపోయాయి.”
SOL 5:3 నేను నా వస్త్రాన్ని తీసివేశాను దాన్ని మళ్ళీ ధరించాలా? నేను నా కాళ్లు కడుక్కున్నాను మళ్ళీ వాటిని మురికి చేసుకోవాలా?
SOL 5:4 నా ప్రియుడు తలుపు సందులో చేయి పెట్టంగానే; నా గుండె అతని కోసం కొట్టుకోవడం ప్రారంభించింది.
SOL 5:5 నా ప్రియునికి తలుపు తీద్దామని లేచాను. నా చేతులు బోళముతో తడిసి, నా వ్రేళ్ళ నుండి బోళం, తలుపు గడియ మీదికి స్రవించింది.
SOL 5:6 నా ప్రియుడికి, నేను తలుపు తీసేలోగా, ఆయన వెళ్లిపోయాడు. నా ప్రాణం స్పృహ తప్పింది. నేను ఆయన కోసం వెదికాను కాని ఆయన కనబడలేదు. నేను ఆయనను పిలిచాను కాని ఆయన పలుకలేదు.
SOL 5:7 పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకెదురై వారు నన్ను కొట్టి, గాయపరిచారు; నా ముసుగును తొలగించారు, వారు ప్రాకారం మీద కావలివారు.
SOL 5:8 యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనిపిస్తే, ఆయనకు మీరు ఏమి చెప్తారు? ప్రేమను బట్టి నాకు స్పృహ తప్పిందని చెప్తామని ప్రమాణం చేయండి.
SOL 5:9 స్త్రీలలో అత్యంత అందమైనదానా, ఇతరులకంటే నీ ప్రియుడి విశిష్టత యేమి? ఇంతగా మాచేత ప్రమాణం చేయించుకున్నావు, ఇంతకు నీ ప్రియుడి విశేషమేమి?
SOL 5:10 నా ప్రియుడు ప్రకాశమానమైన వాడు ఎర్రని వాడు, పదివేలమంది కన్న గొప్పవాడు.
SOL 5:11 ఆయన తల మేలిమి బంగారం; ఆయనది ఉంగరాల జుట్టు, కాకి నలుపంత నల్లగా ఉన్నాయి.
SOL 5:12 ఆయన నేత్రాలు నదీ తీరాన ఎగిరే గువ్వల్లాంటివి, అవి పాలలో స్నానమాడినట్లున్నాయి, ఆభరణాల్లా చెక్కబడ్డాయి.
SOL 5:13 ఆయన చెక్కిళ్ళు సువాసన ఇచ్చే పరిమళ పడకల్లాంటివి, ఆయన పెదవులు తామరలాంటివి వాటిలో నుండి బోళం స్రవిస్తుంది.
SOL 5:14 ఆయన చేతులు గోమేధికం పొదిగిన బంగారు కడ్డీలు, ఆయన ఉదరం నీలమణి, వైడూర్యం పొదిగిన దంత కళాఖండము.
SOL 5:15 ఆయన కాళ్లు మేలిమి బంగారు దిమ్మల మీద నిలిపిన పాలరాతి స్తంభాలు. ఆయన రూపం లెబానోనులా, దాని దేవదారు వృక్షాలలా ఉంది.
SOL 5:16 ఆయన నోరు అతిమధురం; ఆయన మనోహరము. యెరూషలేము కుమార్తెలారా! ఈయనే నా ప్రియుడు, నా స్నేహితుడు.
SOL 6:1 స్త్రీలలో అత్యంత అందమైనదానా, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్లాడు? నీ ప్రియుడు ఎటువైపు వెళ్లాడు మేమూ నీతో పాటు ఆయనను వెదకడానికి.
SOL 6:2 నా ప్రియుడు తన తోటకు వెళ్లాడు, పరిమళ మొక్కల పాన్పుల దగ్గరకు, తోటలో మందను మేపడానికి, తామరలను ఏరుకోడానికి.
SOL 6:3 నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు; తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు.
SOL 6:4 నా ప్రియురాలా, నీవు తిర్సా పట్టణంలా అందంగా ఉన్నావు, యెరూషలేములా మనోహరంగా ఉన్నావు, జెండాలు పట్టుకున్న సైన్యంలా గంభీరంగా ఉన్నావు.
SOL 6:5 నీ కళ్లను నా వైపు నుండి త్రిప్పు; అవి నన్ను వశపరచుకుంటాయి. నీ శిరోజాలు గిలాదు వంపుల నుండి దిగివస్తున్న మేకల మందల్లా ఉన్నాయి.
SOL 6:6 నీ పళ్ళు అప్పుడే కడుగబడి పైకి వస్తున్న గొర్రె మందలా ఉన్నాయి. ప్రతిదీ జంటగా ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదు.
SOL 6:7 నీ ముసుగు వెనుక ఉన్న నీ చెక్కిళ్ళు, విచ్చిన ఒక దానిమ్మ పండులా ఉన్నాయి.
SOL 6:8 అరవైమంది రాణులు, ఎనభైమంది ఉంపుడుగత్తెలు, అసంఖ్యాకులైన కన్యకలు ఉండవచ్చు;
SOL 6:9 కాని నా పావురం, నా అందాలరాశి, ఒకతే, తన తల్లికి ఒక్కగానొక్క కుమార్తె, తనను కన్నదానికి ఇష్టమైనది. యువతులు ఆమెను చూసి ఆమెను ధన్యురాలు అని పిలిచారు; రాణులు ఉంపుడుగత్తెలు ఆమెను ప్రశంసించారు.
SOL 6:10 తెల్లవారుజాములా, జాబిల్లిలా అందంగా, సూర్యునిలా ప్రకాశవంతంగా, నక్షత్రాల్లా గంభీరంగా కనిపించే ఈమె ఎవరు?
SOL 6:11 లోయలో గుబురుగా పెరిగిన అక్షోట చెట్ల దగ్గరకు లోయలో నూతన చిగురులను చూడాలని, ద్రాక్షచెట్లు చిగిరించాయో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టాయో లేదో చూడాలని వెళ్లాను.
SOL 6:12 నేను గ్రహించేలోపే, నా కోరిక నన్ను ప్రజల్లో ఘనత వహించిన వారి రథాలను మధ్య ఉంచింది.
SOL 6:13 ఓ షూలమ్మీతీ, వెనుకకు రా, వెనుకకు రా; తనివితీర మేము నిన్ను చూసేలా, వెనుకకు రా, వెనుకకు రా! యువకుడు మహనాయీము నాట్యాన్ని చూసినట్లు మీరు ఎందుకలా షూలమ్మీతిని చూస్తారు?
SOL 7:1 ఓ రాకుమారుని కుమార్తె! చెప్పులతో మీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి! మీ అందమైన కాళ్లు ఆభరణాలు వంటివి, నైపుణ్యం కలిగిన హస్తకళాకారుని పని.
SOL 7:2 నీ నాభి గుండ్రని ఒక మద్యపాన పాత్ర అందులో ద్రాక్షరస మిశ్రమం ఎప్పుడూ కొరతగా ఉండదు. నీ నడుము తామరల చేత చుట్టబడిన గోధుమ రాశిలాగ ఉంది.
SOL 7:3 నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి.
SOL 7:4 నీ మెడ దంతపు గోపురం లాంటిది. మీ కళ్లు బాత్-రబ్బీం ద్వారం దగ్గర ఉన్న హెష్బోను కొలనులాంటివి. మీ ముక్కు దమస్కు వైపు చూస్తున్న లెబానోను గోపురం లాంటిది.
SOL 7:5 నీ శిరస్సు కర్మెలు పర్వతము. నీ శిరోజాలు రాజు ధరించే ఊదా వస్త్రంలా ఉన్నాయి; వాటి చుట్టలో రాజు బందీగా పట్టుబడ్డాడు.
SOL 7:6 నా ప్రియులారా, నీకు ఆనందకరమైన వాటితో, నీవు ఎంత అందంగా ఉన్నావు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నావు.
SOL 7:7 నీ రూపం తాటి చెట్టులా నీ స్తనములు గెలల్లా ఉన్నాయి.
SOL 7:8 నేనన్నాను, “నేను తాటి చెట్టు ఎక్కుతాను; దాని ఫలములు పట్టుకుంటాను.” నీ స్తనములు ద్రాక్షవల్లికి ఉండే ద్రాక్ష గెలల్లా ఉండును గాక. నీ శ్వాస యొక్క పరిమళం ఆపిల్ పండ్ల వాసనలా ఉంది.
SOL 7:9 నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షరసంలా ఉంది. యువతి ద్రాక్షరసం పెదవులు పళ్ల మీదుగా సున్నితంగా ప్రవహిస్తూ నా ప్రియుని దగ్గరకు వెళ్లును గాక.
SOL 7:10 నేను నా ప్రియుని దానను, ఆయనకు నా పట్ల వాంఛ.
SOL 7:11 నా ప్రియుడా, రా, మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్దాము, గ్రామాల్లో రాత్రి గడుపుదాము.
SOL 7:12 ప్రొద్దున్నే లేచి, ద్రాక్ష తోటలకు వెళ్లిపోదాం ద్రాక్షవల్లులు చిగిర్చాయేమో, పూలు పూచాయేమో, దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయేయో, చూద్దాము రా! అక్కడ నా ప్రేమ నీకు వ్యక్తం చేస్తాను.
SOL 7:13 పుత్రదాత ఫలం సువాసన ఇస్తున్నది, నా ప్రియుడా, మా ద్వారబంధాల దగ్గరే అనేక రకాల శ్రేష్ఠఫలాలున్నాయి, నీకోసం వాటిని దాచి వుంచాను, క్రొత్తవి పాతవి అందులో ఉన్నాయి.
SOL 8:1 ఒకవేళ నీవు నాకు సోదరుడిలా ఉంటే, నా తల్లి స్తనముల దగ్గర పెంచబడిన వాడవైయుంటే! అప్పుడు, నేను నిన్ను బయట కనుగొని ఉంటే, నిన్ను ముద్దాడేదాన్ని, నన్ను ఎవరూ నిందించేవారు కారు.
SOL 8:2 నేను నిన్ను తోలుకొని నాకు ఉపదేశం చేసిన, నా తల్లి ఇంటికి తీసుకెళ్లేదాన్ని. నీవు త్రాగడానికి నీకు సుగంధద్రవ్యాలు కలిపిన ద్రాక్షరసాన్ని, దానిమ్మపండ్ల మకరందం ఇచ్చేదాన్ని.
SOL 8:3 ఆయన ఎడమ చేయి నా తల క్రింద ఉంచాడు, కుడిచేతితో నన్ను కౌగిలించుకున్నాడు.
SOL 8:4 యెరూషలేము కుమార్తెలారా! మీతో ప్రమాణము చేయిస్తున్నాను: సరియైన సమయం వచ్చేవరకు ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి.
SOL 8:5 తన ప్రియుని ఆనుకుని అరణ్యంలో నుండి నడచి వస్తున్నది ఎవరు? యువకుడు ఆపిల్ చెట్టు క్రింద నేను నిన్ను లేపాను; అక్కడ నీ తల్లి నిన్ను గర్భం దాల్చింది, అక్కడ ప్రసవ వేదనలో ఆమె నీకు జన్మనిచ్చింది.
SOL 8:6 నన్ను నీ హృదయం మీద ఒక ముద్రలా, మీ చేతికి రాజ ముద్రలా ఉంచుకో; ఎందుకంటే ప్రేమ మరణంలా బలమైనది, దాని అసూయ సమాధిలా క్రూరమైనది. ఇది మండుతున్న అగ్నిలా, శక్తివంతమైన మంటలా కాలుతుంది.
SOL 8:7 పెరుగుతున్న జలాలు ప్రేమను అణచివేయలేవు; నదీజలాలు ప్రేమను తుడిచివేయలేవు. ప్రేమకు ప్రతిగా తనకున్నదంతా ఇచ్చినా, దానికి తిరస్కారమే లభిస్తుంది.
SOL 8:8 మాకో చిన్న చెల్లెలుంది, దానికింకా స్తనములు రాలేదు. దానికి పెళ్ళి నిశ్చయమైతే ఏం చేయాలి?
SOL 8:9 ఒకవేళ ఆమె ప్రాకారమైతే, ఆమెపై మేము వెండి గోపురం కట్టిస్తాము. ఒకవేళ ఆమె ద్వారం అయితే, దేవదారు పలకలతో దానికి భద్రత ఏర్పరుస్తాము.
SOL 8:10 నేను ప్రాకారాన్ని, నా స్తనములు గోపురాల్లాంటివి. అందుకే అతని దృష్టికి క్షేమం పొందదగినదానిగా ఉన్నాను.
SOL 8:11 బయల్-హామోను దగ్గర సొలొమోనుకు ద్రాక్షతోట ఉంది; అతడు తన ద్రాక్షతోటను కౌలుకిచ్చాడు. దాని ఫలానికి ఒక్కొక్కడు వెయ్యి వెండి షెకెళ్ళ శిస్తు చెల్లించాలి.
SOL 8:12 కాని, నా ద్రాక్షవనం నా స్వాధీనంలోనే ఉంది; సొలొమోను రాజా, నీ వెయ్యి షెకెళ్ళు నీకే చెందుతాయి. వాటిని చూసుకునే వారికి రెండువందలు షెకెళ్ళు గిట్టుతాయి.
SOL 8:13 ఉద్యానవనాల్లో నివసించేదానా నీ చెలికత్తెలు నీతో ఉండగా, నీ స్వరం విననివ్వు.
SOL 8:14 నా ప్రియుడా, దూరంగా రా, జింకలా, దుప్పిలా పరిమళముల పర్వతాల మీదుగా గంతులు వేస్తూ రా.
ISA 1:1 ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజులుగా ఉన్న కాలంలో యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనము.
ISA 1:2 ఆకాశాల్లారా, నా మాట వినండి! భూమీ శ్రద్ధగా విను! యెహోవా ఇలా చెప్తున్నారు: “నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కాని వారు నా మీద తిరుగబడ్డారు.
ISA 1:3 ఎద్దు తన యజమానిని గుర్తిస్తుంది, గాడిదకు తన యజమానుని పశువుల దొడ్డి తెలుసు, కాని ఇశ్రాయేలుకు వారి యజమాని ఎవరో తెలియదు, నా ప్రజలు గ్రహించరు.”
ISA 1:4 పాపిష్ఠి దేశానికి శ్రమ, ఆ ప్రజల దోషం గొప్పది, వారిది దుష్ట సంతానం, అవినీతికి అప్పగించబడిన పిల్లలు! వారు యెహోవాను విడిచిపెట్టారు; ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుని తృణీకరించారు. వారు ఆయనను విడిచి తొలగిపోయారు.
ISA 1:5 ఎందుకు మీరు ఇంకా దెబ్బలు తింటున్నారు? ఎందుకు మీరు ఇంకా తిరుగుబాటు కొనసాగిస్తున్నారు? మీ తలంతా గాయపరచబడింది, మీ గుండె మొత్తం బాధించబడింది.
ISA 1:6 అరికాలు నుండి నడినెత్తి వరకు పుండు లేనిచోటు లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, వాటిని శుభ్రం చేయలేదు, కట్టు కట్టలేదు, ఒలీవనూనెతో చికిత్స చేయలేదు.
ISA 1:7 మీ దేశం నాశనమైపోయింది. మీ పట్టణాలు అగ్నిచేత కాలిపోయాయి; మీ కళ్లెదుటే మీ పొలాలు విదేశీయులచేత దోచుకోబడ్డాయి, కంటికి కనబడినవాటిని పరాయివారిగా నాశనం చేశారు.
ISA 1:8 ద్రాక్షతోటలోని గుడిసెలా, దోసకాయ పొలంలోని పాకలా, ముట్టడించబడిన పట్టణంలా, సీయోను కుమార్తె విడిచిపెట్టబడింది.
ISA 1:9 సైన్యాల యెహోవా కొద్దిమందిని ప్రాణాలతో మనకు మిగల్చకపోయుంటే, మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.
ISA 1:10 సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి; గొమొర్రా ప్రజలారా! మన దేవుని ఉపదేశాన్ని శ్రద్ధగా వినండి.
ISA 1:11 యెహోవా ఇలా అంటున్నారు, “విస్తారమైన మీ బలులు నాకెందుకు? దహనబలులుగా ఇచ్చిన పొట్టేళ్లు, బాగా క్రొవ్విన జంతువుల క్రొవ్వు నాకు వెగటు కలిగించాయి; ఎద్దుల, గొర్రెపిల్లల, మేకపోతుల రక్తంలో నాకు ఆనందం లేదు.
ISA 1:12 మీరు నా సన్నిధికి వస్తున్నప్పుడు, నా ఆవరణాలను త్రొక్కడానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు?
ISA 1:13 విలువలేని అర్పణలు తీసుకురావడం ఆపండి! మీ ధూపం నాకు అసహ్యం కలిగిస్తుంది. అమావాస్యలు, సబ్బాతులు, ప్రత్యేక సమావేశాలు మీ దుష్ట సమావేశాలు నేను భరించలేను.
ISA 1:14 మీ అమావాస్య ఉత్సవాలు, నియమించబడిన పండుగలు నా పూర్ణాత్మతో నేను అసహ్యిస్తున్నాను. అవి నాకు భారంగా ఉన్నాయి; వాటిని భరించలేక అలిసిపోయాను.
ISA 1:15 ప్రార్థనలో మీరు మీ చేతులు చాచినప్పుడు, మిమ్మల్ని చూడకుండ కళ్లు కప్పుకుంటాను; మీరు చాలా ప్రార్థనలు చేసినా నేను వినను. “మీ చేతులు రక్తంతో నిండిపోయాయి!
ISA 1:16 “మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి. మీ చెడు కార్యాలు నాకు కనిపించకుండా వాటిని తొలగించండి; తప్పు చేయడం మానండి.
ISA 1:17 సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి. అణచివేయబడుతున్న వారి పక్షాన ఉండండి. తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి. విధవరాలి పక్షాన వాదించండి.
ISA 1:18 “రండి, మనం విషయాన్ని పరిష్కరించుకుందాం” అని యెహోవా అంటున్నారు. “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి; కెంపులా ఎర్రగా ఉన్నా, అది ఉన్నిలా తెల్లగా అవుతాయి.
ISA 1:19 మీరు ఇష్టపడి నా మాట వింటే, మీరు భూమి ఇచ్చే మంచి పంటను తింటారు;
ISA 1:20 ఒకవేళ మీరు ఎదిరించి తిరుగుబాటు చేస్తే, మీరు ఖడ్గం చేత నాశనమవుతారు” యెహోవా ఈ మాట చెప్తున్నారు.
ISA 1:21 చూడండి, నమ్మకమైన పట్టణం వేశ్యగా ఎలా అయ్యిందో! ఒక్కప్పుడు అది న్యాయంతో నిండి ఉండేది; నీతి దానిలో నివసించేది, కాని ఇప్పుడు హంతకులు ఉంటున్నారు!
ISA 1:22 నీ వెండి మలినం అయిపోయింది, నీ శ్రేష్ఠమైన ద్రాక్షరసం నీళ్లతో కలిసి పలచబడి పోయింది.
ISA 1:23 నీ పాలకులు తిరుగుబాటుదారులు, దొంగలతో సహవాసం చేస్తారు. వారందరికి లంచాలు ఇష్టం కానుకల వెంటపడతారు. తండ్రిలేనివారి పక్షంగా న్యాయం తీర్చరు. విధవరాలి సమస్యను పరిష్కరించరు.
ISA 1:24 కాబట్టి ప్రభువైన, సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు బలవంతుడు ఇలా చెప్తున్నారు: ఆహా! నా శత్రువులపై నా ఉగ్రతను బయటపెట్టి, నా విరోధుల మీద పగ తీర్చుకుంటాను.
ISA 1:25 నీకు వ్యతిరేకంగా నా చేయి ఉంచుతాను; నీ లోహపు మలినాన్ని శుద్ధి చేసి నీ మలినాలను తొలగిస్తాను.
ISA 1:26 పూర్వం ఉన్నట్లు నీకు న్యాయాధిపతులను, తొలి రోజుల్లో ఉన్నట్లు నీకు పాలకులను నియమిస్తాను. అప్పుడు నీవు నీతిగల పట్టణమని, నమ్మకమైన పట్టణమని పిలువబడతావు.
ISA 1:27 సీయోనుకు న్యాయంతో, పశ్చాత్తాపపడే వారికి నీతితో విడుదల కలుగుతుంది.
ISA 1:28 అయితే తిరుగుబాటుదారులు, పాపులు నలుగగొట్టబడతారు, యెహోవాను విడిచిపెట్టిన వారు నశిస్తారు.
ISA 1:29 “మీరు వేటిని బట్టి ఆనందించారో ఆ పవిత్ర సింధూర వృక్షాల గురించి మీరు సిగ్గుపడతారు; మీరు ఎంచుకున్న సింధూర తోటల గురించి మీరు అవమానించబడతారు.
ISA 1:30 మీరు ఆకులు వాడిపోతున్న సింధూర వృక్షంలా, నీరు లేని తోటలా అవుతారు.
ISA 1:31 బలవంతుడు పీచులా అవుతాడు అతని పని నిప్పురవ్వలా అవుతుంది; అవి రెండూ కలిసి కాలిపోతాయి, మంటను ఆర్పేవారు ఎవరూ ఉండరు.”
ISA 2:1 యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనం:
ISA 2:2 చివరి రోజుల్లో యెహోవా మందిరం పర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది; అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది, జనాంగాలన్నీ దాని దగ్గరకు ప్రవాహంలా వెళ్తారు.
ISA 2:3 చాలా జనాంగాలు వచ్చి ఇలా అంటారు, “రండి, మనం యెహోవా పర్వతం మీదికి, యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము. మనం ఆయన మార్గంలో నడిచేలా, ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.” సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి.
ISA 2:4 ఆయన దేశాల మధ్య తీర్పు తీరుస్తారు, అనేక జనాంగాల వివాదాలను పరిష్కరిస్తారు. వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా, తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు. ఒక దేశం మరొక దేశం మీద ఖడ్గం ఎత్తదు, వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు.
ISA 2:5 యాకోబు వారసులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుద్దాము.
ISA 2:6 యెహోవా, యాకోబు వారసులైన మీ ప్రజలను మీరు విడిచిపెట్టారు. వారు తూర్పు దేశాలకున్న మూఢనమ్మకాలతో నిండి ఉన్నారు; వారు ఫిలిష్తీయుల్లా భవిష్యవాణి చూస్తారు, ఇతరుల ఆచారాలను పాటిస్తారు.
ISA 2:7 వారి దేశం వెండి బంగారాలతో నిండి ఉంది; వారి ధనానికి అంతులేదు. వారి దేశం గుర్రాలతో నిండి ఉంది; వారి రథాలకు అంతులేదు.
ISA 2:8 వారి దేశం విగ్రహాలతో నిండి ఉంది. వారు తమ చేతులతో చేసిన వాటికి, తమ వ్రేళ్లతో చేసిన వాటికి తలవంచి నమస్కరిస్తారు.
ISA 2:9 కాబట్టి ప్రజలు అణచివేయబడతారు ప్రతి ఒక్కరు తగ్గించబడతారు వారిని క్షమించకండి.
ISA 2:10 యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి బండ సందులకు వెళ్లి నేలలో దాక్కోండి.
ISA 2:11 మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది, మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది; ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు.
ISA 2:12 సైన్యాల యెహోవా అహంకారం, గర్వం ఉన్న ప్రతివారి కోసం హెచ్చింపబడిన వాటన్నిటి కోసం ఒక రోజును నియమించారు. (అవి అణచివేయబడతాయి),
ISA 2:13 ఎందుకంటే ఎత్తైన పొడవైన లెబానోను దేవదారు చెట్లన్నిటికి, బాషాను సింధూర వృక్షాలన్నిటికి,
ISA 2:14 పెద్ద పర్వతాలన్నిటికి, ఎత్తైన కొండలన్నిటికి
ISA 2:15 ఉన్నతమైన ప్రతి గోపురానికి ప్రతి కోటగోడకు,
ISA 2:16 ప్రతీ వాణిజ్య నౌకకు మనోహరమైన నౌకలకు ఒక రోజును నియమించారు.
ISA 2:17 మనుష్యుల అహంకారం అణచివేయబడుతుంది మానవుల గర్వం తగ్గించబడుతుంది; ఆ రోజు యెహోవా మాత్రమే ఘనపరచబడతారు.
ISA 2:18 విగ్రహాలు పూర్తిగా అదృశ్యమవుతాయి.
ISA 2:19 యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి పారిపోయి వారు కొండల గుహల్లో నేలలో ఉన్న సందుల్లో దాక్కుంటారు.
ISA 2:20 ఆ రోజున మనుష్యులు తాము పూజించడానికి తయారుచేసుకున్న వెండి విగ్రహాలను బంగారు విగ్రహాలను ఎలుకలకు గబ్బిలాలకు పారేస్తారు.
ISA 2:21 యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి పారిపోయి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి వారు కొండల గుహల్లో బండ బీటల్లో దాక్కుంటారు.
ISA 2:22 తమ నాసికారంధ్రాలలో ఊపిరి తప్ప ఏమీ లేని నరులను నమ్మడం మానండి. వారిని ఎందుకు లక్ష్యపెట్టాలి?
ISA 3:1 చూడండి, ప్రభువును, సైన్యాలకు అధిపతియైన యెహోవా యెరూషలేములో నుండి యూదాలో నుండి జీవనాధారాన్ని, మద్దతును తీసివేయబోతున్నారు: అన్ని ఆహార సరఫరాలు, అన్ని నీటి సరఫరాలు,
ISA 3:2 వీరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, సోదె చెప్పేవారు, పెద్దలు,
ISA 3:3 పంచదశాధిపతులను, ఘనత వహించినవారు, సలహాదారులు, నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు, తెలివిగల మాంత్రికులు, వీరందరిని తీసివేస్తారు.
ISA 3:4 “నేను యవ్వనులను వారికి అధిపతులుగా నియమిస్తాను. పిల్లలు వారిని పరిపాలిస్తారు.”
ISA 3:5 ప్రజలు ఒకరిని ఒకరు ఒకరి మీదికి ఒకరు, పొరుగువారి మీదికి పొరుగువారు. యువకులు పెద్దవారి మీదికి, అనామకులు ఘనుల మీదికి లేస్తారు.
ISA 3:6 ఒకడు తన తండ్రి ఇంట్లో తన సోదరుని పట్టుకుని, “నీకు బట్టలు ఉన్నాయి, నీవు మాకు నాయకునిగా ఉండు; ఈ పాడైపోయిన స్థలం నీ ఆధీనంలోనికి తీసుకో!” అంటాడు.
ISA 3:7 కాని ఆ రోజు అతడు కేక వేసి, “నా దగ్గర పరిష్కారం లేదు. నా ఇంట్లో ఆహారం గాని బట్టలు గాని లేవు; నన్ను ప్రజలకు నాయకునిగా చేయవద్దు” అంటాడు.
ISA 3:8 యెరూషలేము పాడైపోయింది, యూదా పతనమవుతుంది, వారి మాటలు పనులు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆయన మహిమగల సన్నిధిని వారు ధిక్కరించారు.
ISA 3:9 వారి ముఖమే వారి మీద సాక్ష్యమిస్తుంది; వారు తమ పాపాన్ని సొదొమలా ప్రకటిస్తారు; వారు దానిని దాచిపెట్టరు. వారికి శ్రమ! వారు తమ మీద తామే విపత్తు తెచ్చుకున్నారు.
ISA 3:10 మీకు మేలు కలుగుతుందని నీతిమంతులకు చెప్పండి ఎందుకంటే వారు తాము చేసిన క్రియల ప్రతిఫలాన్ని అనుభవిస్తారు.
ISA 3:11 దుష్టులకు శ్రమ! వారికి చెడు జరుగుతుంది! వారి చేతులు చేసిన దాని ప్రతిఫలం వారికి ఇవ్వబడుతుంది.
ISA 3:12 నా ప్రజలను యువకులు అణచివేస్తారు స్త్రీలు వారిని పాలిస్తారు. నా ప్రజలారా, మీ నాయకులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు మార్గం నుండి వారు మిమ్మల్ని తప్పిస్తారు.
ISA 3:13 యెహోవా న్యాయస్థానంలో తన స్థానం తీసుకుంటారు; ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయన లేస్తారు.
ISA 3:14 యెహోవా తన ప్రజల పెద్దలకు నాయకులకు తీర్పు ప్రకటించడానికి వస్తున్నారు: “మీరే నా ద్రాక్షతోటను నాశనం చేశారు; పేదల నుండి దోచుకున్న సొమ్ము మీ ఇళ్ళలో ఉంది.
ISA 3:15 మీరు నా ప్రజలను ఎందుకు నలుగగొడుతున్నారు? పేదల ముఖాలను ఎందుకు నూరుతున్నారు?” అని సైన్యాల అధిపతియైన యెహోవా అంటున్నారు.
ISA 3:16 యెహోవా ఇలా అంటున్నారు, “సీయోను స్త్రీలు గర్విష్ఠులు వారు మెడలు చాచి నడుస్తూ ఓర చూపులు చూస్తూ ఠీవిగా పిరుదులు త్రిప్పుతూ నడుస్తూ తమ కాళ్ల గజ్జలు మ్రోగిస్తున్నారు.
ISA 3:17 కాబట్టి ప్రభువు సీయోను స్త్రీల తలలపై పుండ్లు పుట్టిస్తారు; యెహోవా వారి తలల్ని బోడి చేస్తారు.”
ISA 3:18 ఆ రోజు ప్రభువు వారి సొగసును లాక్కుంటారు: గాజులు, శిరోభూషణాలు, నెలవంక హారాలు,
ISA 3:19 చెవిపోగులు, కడియాలు, మేలి ముసుగులు,
ISA 3:20 తలపాగాలు, కాళ్లపట్టీలు, ఒడ్డాణాలు, సుగంధద్రవ్య బుడ్డీలు, తాయెత్తులు,
ISA 3:21 ఉంగరాలు, ముక్కుపుడకలు,
ISA 3:22 పండుగ వస్త్రాలు, పైవస్త్రాలు, అంగీలు, సంచులు,
ISA 3:23 అద్దాలు, సన్నపునారతో చేసిన ముసుగులు, తలపాగాలు, శాలువాల్ని తీసివేస్తారు.
ISA 3:24 సువాసనకు బదులు దుర్వాసన ఉంటుంది; నడికట్టుకు బదులు తాడు; అల్లిన జడకు బదులు బోడితల; ప్రశస్తమైన పైవస్త్రానికి బదులు గోనెపట్ట; అందానికి బదులు ఖైదీ వాత ఉంటుంది.
ISA 3:25 మీ మనుష్యులు ఖడ్గానికి కూలిపోతారు, మీ వీరులు యుద్ధంలో చనిపోతారు.
ISA 3:26 సీయోను గుమ్మాలు విలపిస్తూ దుఃఖిస్తాయి; ఆమె ఒంటరిదై, నేల మీద కూర్చుంటుంది.
ISA 4:1 ఆ రోజున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని “మేము మా అన్నమే తింటాము, మా బట్టలే మేము కట్టుకుంటాము; నీ పేరు మాత్రం మాకు పెట్టి మా అవమానాన్ని తీసివేయి చాలు!” అని చెప్తారు.
ISA 4:2 ఆ రోజు యెహోవా కొమ్మ అందంగా, మహిమగలదిగా ఉంటుంది; ఇశ్రాయేలులో తప్పించుకున్నవారికి భూమి పంట అతిశయంగా, ఘనతగా ఉంటుంది.
ISA 4:3 సీయోనులో మిగిలిన వారికి, యెరూషలేములో ఉన్నవారికి అనగా యెరూషలేములో నివసించే వారిలో నమోదు చేయబడ్డ ప్రతివారు పరిశుద్ధులని పిలువబడతారు.
ISA 4:4 ప్రభువు సీయోను స్త్రీల మురికిని కడిగివేస్తారు; ఆయన తీర్పు తీర్చు ఆత్మతో, దహించే ఆత్మతో, యెరూషలేము నుండి రక్తం మరకల్ని శుభ్రం చేస్తారు.
ISA 4:5 అప్పుడు యెహోవా సీయోను పర్వతం అంతట, అక్కడ కూడుకునేవారి మీద పగలు పొగతో ఉన్న మేఘాన్ని, రాత్రి మండుతున్న అగ్నిని సృష్టిస్తారు; ప్రతి దాని మీద మహిమ పందిరిగా ఉంటుంది.
ISA 4:6 అది పగలు ఎండ వేడి నుండి ఆశ్రయంగా, నీడగా, తుఫాను, వానల నుండి కాపాడే దాగుచోటుగా ఉంటుంది.
ISA 5:1 నా ప్రియుని గురించి పాడతాను. తన ద్రాక్షతోట గురించి పాట పాడతాను: సారవంతమైన కొండమీద నా ప్రియునికి ఒక ద్రాక్షతోట ఉండేది.
ISA 5:2 ఆయన దానిని త్రవ్వి రాళ్లను ఏరి బాగుచేసి అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలు నాటాడు. దానిలో కాపలా గోపురం కట్టాడు ద్రాక్షతొట్టిని తొలిపించాడు. మంచి ద్రాక్షపండ్లు కాయాలని ఆయన ఎదురుచూశాడు, కాని దానిలో చెడ్డ ద్రాక్షలు కాసాయి.
ISA 5:3 “కాబట్టి యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా, నాకు, నా ద్రాక్షతోటకు మధ్య న్యాయం చేయండి.
ISA 5:4 నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే దానికి ఇంకేమి చేయాలి? మంచి ద్రాక్షపండ్ల కోసం నేను చూస్తే ఎందుకు అది చెడ్డ ద్రాక్షలను కాసింది?
ISA 5:5 నా ద్రాక్షతోటకు నేనేమి చేయబోతున్నానో ఇప్పుడు మీకు చెప్తాను. దాని కంచె నేను తీసివేస్తాను అప్పుడు అది నాశనం అవుతుంది; దాని గోడను పడగొడతాను అప్పుడు అది త్రొక్కబడుతుంది.
ISA 5:6 నేను దానిని బంజరు భూమిలా చేస్తాను, అది త్రవ్వరు, సాగు చేయరు, అక్కడ గచ్చపొదలు ముళ్ళచెట్లు పెరుగుతాయి. దానిపై వర్షం కురిపించవద్దని మేఘాలను ఆజ్ఞాపిస్తాను.”
ISA 5:7 ఇశ్రాయేలు వంశం సైన్యాల యెహోవా ద్రాక్షతోట, యూదా ప్రజలు ఆయన ఆనందించే ద్రాక్షలు. ఆయన న్యాయం కోసం చూడగా రక్తపాతం కనబడింది; నీతి కోసం చూడగా రోదనలు వినబడ్డాయి.
ISA 5:8 చోటు మిగులకుండ మీరు మాత్రమే దేశంలో నివసించేలా ఇంటికి ఇల్లు, పొలానికి పొలం కలుపుకునేవారికి శ్రమ.
ISA 5:9 నేను వినేలా సైన్యాల యెహోవా చెప్పిన మాట: “నిజంగా గొప్ప ఇల్లు ఖాళీగా అయిపోతాయి, చక్కటి భవనాలు నివాసులు లేక పాడైపోతాయి.
ISA 5:10 పది ఎకరాల ద్రాక్షతోట ఒక బాతు ద్రాక్షరసాన్నే ఇస్తుంది. హోమెరు గింజలు ఒక ఏఫా పంట మాత్రమే ఇస్తాయి.”
ISA 5:11 మద్యం త్రాగడానికి ఉదయాన్నే లేచి మత్తెక్కే వరకు చాలా రాత్రివరకు త్రాగే వారికి శ్రమ.
ISA 5:12 వారు సితారాలు, తంతి వాయిద్యాలు, కంజరలు, పిల్లనగ్రోవులు వాయిస్తూ ద్రాక్షరసం త్రాగుతూ విందు చేసుకుంటారు, కాని యెహోవా చేస్తున్న దానిని వారు గుర్తించరు ఆయన చేతిపనిని గౌరవించరు.
ISA 5:13 కాబట్టి నా ప్రజలు తెలివిలేక బందీలుగా వెళ్తున్నారు. వారిలో ఘనులు ఆకలితో చనిపోతారు. సామాన్య ప్రజలు దప్పికతో ఎండిపోతారు.
ISA 5:14 కాబట్టి మరణం తన దవడలను పెద్దగా తన నోరు వెడల్పుగా తెరుస్తుంది. అందులోకి యెరూషలేము సంస్థానాధిపతులు, సామాన్య ప్రజలు, ఆకతాయిలు, ఆనందించేవారు దిగిపోతారు.
ISA 5:15 మనుష్యులు అణగద్రొక్కబడతారు. అందరు తగ్గించబడతారు, గర్విష్ఠుల చూపు తగ్గించబడుతుంది.
ISA 5:16 కాని సైన్యాల యెహోవా తీర్పు తీర్చి మహిమపరచబడతారు, తన నీతి క్రియలనుబట్టి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధునిగా నిరూపించబడతారు.
ISA 5:17 అప్పుడు గొర్రెపిల్లలు తమ పచ్చికబయళ్లలో ఉన్నట్లుగా అక్కడ మేస్తాయి; ధనవంతుల బీడు భూములలో గొర్రెపిల్లలు మేస్తాయి.
ISA 5:18 మోసమనే త్రాళ్లతో పాపాన్ని లాక్కొనే వారికి, బండి త్రాళ్లతో దుర్మార్గాన్ని లాక్కొనే వారికి శ్రమ.
ISA 5:19 “దేవుడు త్వరపడాలి; ఆయన పనిని త్వరగా చేయాలి అప్పుడు ఆయన కార్యాలు మేము చూస్తాము. ఇశ్రాయేలు పరిశుద్ధుని ఆలోచన ఆచరణలోకి రావాలి, అప్పుడు మేము తెలుసుకుంటాము” అనే వారికి శ్రమ.
ISA 5:20 కీడును మేలని, మేలును కీడని చెప్పేవారికి, చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా చేదును తీపిగా తీపిని చేదుగా మార్చేవారికి శ్రమ.
ISA 5:21 తమకు తామే జ్ఞానులమని తమ దృష్టిలో తామే తెలివైనవారమని అనుకునేవారికి శ్రమ.
ISA 5:22 ద్రాక్షరసం త్రాగడంలో పేరు పొందినవారికి మద్యం కలపడంలో నేర్పు గలవారికి శ్రమ.
ISA 5:23 వారు లంచం తీసుకుని దోషులను వదిలేస్తారు, నిర్దోషులకు న్యాయం చేయడానికి నిరాకరిస్తారు.
ISA 5:24 వారు సైన్యాల యెహోవా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్యాన్ని తృణీకరించారు, కాబట్టి మంటలు గడ్డిని కాల్చినట్లుగా ఎండుగడ్డి మంటలో కాలిపోయినట్లుగా వారి వేరులు కుళ్లిపోతాయి, వారి పూలు ధూళిలా ఎగిరిపోతాయి.
ISA 5:25 కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతుంది; ఆయన వారి మీదికి తన చేయి చాచి వారిని కొడతారు. పర్వతాలు వణుకుతాయి, వీధుల్లో వారి శవాలు పెంటలా పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
ISA 5:26 ఆయన దూరంగా ఉన్న దేశాలను పిలువడానికి జెండా ఎత్తుతారు, భూమి అంచుల్లో ఉన్నవారిని రప్పించడానికి ఈల వేస్తారు. చూడండి వారందరు తొందరగా, వేగంగా వస్తున్నారు.
ISA 5:27 వారిలో ఒక్కరు కూడా అలిసిపోరు, తూలిపోరు. వారిలో ఒక్కరు కూడా కునుకరు నిద్రపోరు. వారి నడికట్టు విడిపోదు. వారి చెప్పుల వారు తెగిపోదు.
ISA 5:28 వారి బాణాలు పదునుగా ఉన్నాయి. వారి విల్లులన్ని ఎక్కుపెట్టి ఉన్నాయి; వారి గుర్రాల డెక్కలు చెకుముకి రాళ్లవలె ఉన్నాయి, వారి రథచక్రాలు సుడిగాలి తిరిగినట్టు తిరుగుతాయి.
ISA 5:29 వారి గర్జన సింహగర్జనలా ఉంది. కొదమసింహం గర్జించినట్లు గర్జిస్తారు; వారు తమ వేటను పట్టుకుని ఎత్తుకుపోతారు కాపాడే వారెవరు ఉండరు.
ISA 5:30 వారు ఆ రోజు సముద్ర ఘోషలా తమ శత్రువు మీద గర్జిస్తారు. ఒకవేళ ఎవరైనా భూమివైపు చూస్తే, అక్కడ చీకటి, బాధ మాత్రమే కనబడుతుంది; మేఘాలు కమ్మి వెలుగు కూడా చీకటిగా అవుతుంది.
ISA 6:1 రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు కూర్చుని ఉండడం నేను చూశాను; ఆయన వస్త్రపు అంచు దేవాలయాన్ని నింపింది.
ISA 6:2 ఆయన పైన సెరాపులు ఒక్కొక్కరు ఆరు రెక్కలతో నిలబడి ఉన్నారు; రెండు రెక్కలతో తమ ముఖాలను, రెండింటితో తమ కాళ్లను కప్పుకుని, రెండింటితో ఎగురుతున్నారు.
ISA 6:3 వారు ఒకరితో ఒకరు, “సైన్యాల యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు; సమస్త భూమి ఆయన మహిమతో నిండి ఉంది” అని పాడుతున్నారు.
ISA 6:4 వారి స్వరాల ధ్వనికి ద్వారబంధాలు, పునాదులు కదిలాయి. మందిరం పొగతో నిండిపోయింది.
ISA 6:5 నేను, “నాకు శ్రమ! నేను నశించిపోయాను! ఎందుకంటే నేను అపవిత్ర పెదవులు గలవాడను. అపవిత్ర పెదవులు ఉన్న ప్రజలమధ్య నేను నివసిస్తున్నాను, నా కళ్లు రాజు, సైన్యాల యెహోవాను చూశాయి” అని మొరపెట్టాను.
ISA 6:6 అప్పుడు ఆ సెరాపులలో ఒకడు బలిపీఠం మీద నుండి పటకారుతో తీసిన నిప్పును తన చేతితో పట్టుకుని ఎగురుతూ నా దగ్గరకు వచ్చాడు.
ISA 6:7 దానితో నా నోటిని ముట్టి, “చూడు, ఇది నీ పెదవులను తాకింది; నీ దోషం తీసివేయబడింది, నీ పాపం క్షమించబడింది” అన్నాడు.
ISA 6:8 అప్పుడు ప్రభువు స్వరం, “నేను ఎవరిని పంపాలి? మాకోసం ఎవరు వెళ్తారు?” అని అనడం నేను విన్నాను. నేను, “నేనున్నాను. నన్ను పంపండి!” అన్నాను.
ISA 6:9 అందుకు ఆయన, “నీవు వెళ్లి ఈ ప్రజలతో ఇలా చెప్పు: “ ‘మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు, కాని అర్థం చేసుకోరు; ఎప్పుడు చూస్తూనే ఉంటారు, కాని గ్రహించరు.’
ISA 6:10 వారి హృదయాలను కఠినపరచు; వారి చెవులకు చెవుడు వారి కళ్లకు గుడ్డితనం కలిగించు లేదంటే వారు తమ కళ్లతో చూసి, చెవులతో విని, హృదయాలతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందుతారు.”
ISA 6:11 అందుకు నేను, “ప్రభువా! ఇలా ఎంతకాలం వరకు?” అని అడిగాను. అందుకు ఆయన ఇలా జవాబిచ్చారు: “నివాసులు లేక పట్టణాలు నాశనం అయ్యేవరకు, మనుష్యులు లేక ఇల్లు పాడై విడిచిపెట్టబడే వరకు, భూమి పూర్తిగా నాశనమై బీడుగా అయ్యేవరకు,
ISA 6:12 యెహోవా మనుష్యులను దూరం పంపించే వరకు భూమి పూర్తిగా విడిచిపెట్టబడే వరకు.
ISA 6:13 దానిలో పదవ భాగం మాత్రమే విడిచిపెట్టబడినా అది కూడా నాశనమవుతుంది. అయితే మస్తకి సింధూర చెట్లు నరకబడిన తర్వాత మొద్దులు ఎలా మిగులుతాయో అలాగే పరిశుద్ధ విత్తనం మొద్దులా నేలపై ఉంటుంది.”
ISA 7:1 యూదా రాజైన ఉజ్జియాకు పుట్టిన యోతాము కుమారుడైన ఆహాజు కాలంలో సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చారు కాని అది వారు జయించలేకపోయారు.
ISA 7:2 అప్పుడు దావీదు ఇంటివారికి, “అరాము ఎఫ్రాయిముతో పొత్తు పెట్టుకుంది” అని తెలియజేయబడింది; కాబట్టి గాలికి అడవి చెట్లు కదిలినట్లు ఆహాజు, అతని ప్రజల హృదయాలు వణికాయి.
ISA 7:3 అప్పుడు యెహోవా యెషయాతో ఇలా అన్నారు, “ఆహాజును కలుసుకోడానికి నీవు, నీ కుమారుడైన షెయార్యాషూబు చాకలి రేవుకు వెళ్లే దారిలో ఉన్న పై కోనేటి కాలువ చివరికి వెళ్లండి.
ISA 7:4 అతనితో, ‘జాగ్రత్త, నెమ్మదిగా ఉండు, భయపడకు. పొగరాజుకుంటున్న ఈ రెండు కాగడాలకు అనగా రెజీను, అరాము, రెమల్యా కుమారుడైన పెకహు యొక్క తీవ్రమైన కోపానికి అధైర్యపడకు.
ISA 7:5 అరాము, ఎఫ్రాయిం, రెమల్యా కుమారుడు నీకు కీడు చేయాలని కుట్రపన్ని,
ISA 7:6 “మనం యూదాపై దాడి చేద్దాము; మనం దానిని చీల్చివేసి, మన మధ్యలో పంచుకుందాం, టాబెయేలు కుమారున్ని దానికి రాజుగా చేద్దాం” అని చెప్పుకున్నారు.’ ”
ISA 7:7 అయితే ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “అది నిలబడదు, అలా జరుగదు.
ISA 7:8 ఎందుకంటే అరాము రాజధాని దమస్కు. దమస్కు రాజు రెజీను మాత్రమే. అరవై అయిదు సంవత్సరాలు కాకముందే ఎఫ్రాయిం ఒక జాతిగా ఉండకుండా నాశనం అయిపోతుంది.
ISA 7:9 ఎఫ్రాయిముకు సమరయ రాజధాని, సమరయకు రెమల్యా కుమారుడు రాజు. మీరు మీ విశ్వాసంలో స్థిరంగా ఉండకపోతే మీరు క్షేమంగా ఉండలేరు.”
ISA 7:10 యెహోవా ఆహాజుతో మరలా మాట్లాడుతూ,
ISA 7:11 “నీ దేవుడైన యెహోవాను ఒక సూచన అడుగు. అది పాతాళమంత లోతైనా సరే, ఆకాశమంత ఎత్తైనా సరే” అన్నారు.
ISA 7:12 అయితే ఆహాజు, “నేను అడగను, యెహోవాను పరీక్షించను” అన్నాడు.
ISA 7:13 అప్పుడు యెషయా, “దావీదు కుటుంబమా! వినండి. మనుష్యుల ఓపికను పరీక్షించడం సరిపోదని, నా దేవుని ఓపికను కూడా పరీక్షిస్తున్నారా?
ISA 7:14 కాబట్టి, ప్రభువే స్వయంగా మీకు ఒక సూచన ఇస్తారు: ఇదిగో ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు.
ISA 7:15 తప్పును తిరస్కరించి, సరియైనది ఎంచుకోవడం తెలిసినప్పుడు అతడు పెరుగు, తేనె తింటాడు.
ISA 7:16 ఎందుకంటే తప్పును తిరస్కరించి సరియైనది ఎంచుకునే తెలివి ఆ బాలునికి రాకముందు నిన్ను భయపెట్టే ఆ ఇద్దరు రాజుల దేశాలు పాడుచేయబడతాయి.
ISA 7:17 యెహోవా నీ మీదికి, నీ ప్రజలమీదికి, నీ తండ్రి ఇంటి మీదికి, ఎఫ్రాయిం యూదా నుండి విడిపోయిన రోజు నుండి ఇప్పటివరకు రాని రోజులను రప్పిస్తారు. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పిస్తారు” అని అన్నాడు.
ISA 7:18 ఆ రోజున ఈజిప్టులో నైలు నది పాయల నుండి ఈగలను, అష్షూరు దేశం నుండి కందిరీగలను యెహోవా ఈలవేసి పిలుస్తారు.
ISA 7:19 అవన్నీ వచ్చి మెట్ట కనుమలలో, రాళ్ల పగుళ్లలో, ముళ్ళపొదల్లో, పచ్చికబయళ్లలో నివసిస్తాయి.
ISA 7:20 ఆ రోజున యెహోవా యూఫ్రటీసు నది అవతలి నుండి కూలికి తెచ్చిన మంగలకత్తితో అనగా, అష్షూరు రాజుతో మీ తలవెంట్రుకలు కాళ్లవెంట్రుకలు క్షౌరం చేయిస్తారు. అది మీ గడ్డాలను కూడా గీసివేస్తారు.
ISA 7:21 ఆ రోజున ఒకనికి ఒక చిన్న ఆవు రెండు గొర్రెలు ఉంటాయి.
ISA 7:22 అవి సమృద్ధిగా ఇచ్చిన పాలవలన అతడు తినడానికి పెరుగు ఉంటుంది. ఆ దేశంలో మిగిలిన వారందరు పెరుగు, తేనె తింటారు.
ISA 7:23 ఆ రోజున వెయ్యి వెండి షెకెళ్ళు విలువ కలిగిన వెయ్యి ద్రాక్షతీగెలు ఉన్న ప్రతిచోట గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటాయి.
ISA 7:24 ఆ దేశమంతా గచ్చపొదలు ముళ్ళతో నిండి ఉంటుంది కాబట్టి బాణాలు విల్లులు పట్టుకుని వేటగాళ్లు అక్కడికి వెళ్తారు.
ISA 7:25 గచ్చపొదలకు, ముళ్ళకు భయపడి పారతో సాగుచేసిన కొండలన్నిటికి మీరు దూరంగా ఉంటారు; ఆ స్థలాలు పశువులు తిరగడానికి, గొర్రెలు త్రొక్కడానికి ఉపయోగపడతాయి.
ISA 8:1 యెహోవా నాతో ఇలా అన్నారు, “నీవు పెద్ద పలక తీసుకుని దానిపై మహేర్-షాలాల్-హాష్-బజ్ అని సామాన్యమైన అక్షరాలతో వ్రాయి.
ISA 8:2 నా కోసం నమ్మకమైన సాక్షులుగా ఉండడానికి యాజకుడైన ఊరియాను, యేబెరెక్యా కుమారుడైన జెకర్యాను పిలిచాను.
ISA 8:3 తర్వాత నేను ప్రవక్త్రితో శయనించగా ఆమె గర్భవతియై కుమారునికి జన్మనిచ్చింది. అప్పుడు యెహోవా, ‘అతనికి మహేర్-షాలాల్-హాష్-బజ్ అని పేరు పెట్టు’ అని నాతో చెప్పారు.
ISA 8:4 ఆ పిల్లవాడు నాన్న అమ్మ అని పిలువకముందే, అష్షూరు రాజు దమస్కు సంపదని సమరయ దోపుడుసొమ్మును ఎత్తుకుని పోతాడు.”
ISA 8:5 యెహోవా నాతో మరలా ఇలా మాట్లాడారు:
ISA 8:6 “ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీటిని వద్దు అని, రెజీను గురించి, రెమల్యా కుమారుని గురించి సంతోషిస్తున్నారు,
ISA 8:7 కాబట్టి ప్రభువు భయంకరమైన యూఫ్రటీసు నది వరద నీటిని అనగా అష్షూరు రాజును, అతని బలగమంతటిని వారి మీదికి రప్పించబోతున్నారు. అవి దాని కాలువలన్నిటి నుండి ఉప్పొంగి దాని ఒడ్డులన్నిటి మీది నుండి ప్రవహిస్తాయి.
ISA 8:8 అవి యూదాలోకి వచ్చి పొంగిపొర్లి ప్రవహిస్తూ, గొంతు లోతు వరకు చేరుతాయి. ఇమ్మానుయేలూ, దాని చాచిన రెక్కలు నీ దేశమంతట వ్యాపిస్తాయి.”
ISA 8:9 దేశాల్లారా, మీరు ముక్కలై నాశనమైపోతారు! దూర దేశాల్లారా! మీరందరూ వినండి. యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి! అవును, యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి!
ISA 8:10 మీరు వ్యూహం రచించండి, అది విఫలమవుతుంది; మీ ప్రణాళికను ప్రతిపాదించండి, అది నిలబడదు, ఎందుకంటే దేవుడు మాతో ఉన్నారు.
ISA 8:11 ఈ ప్రజల మార్గాన్ని అనుసరించకూడదని యెహోవా నన్ను హెచ్చరించి నాతో ఖచ్చితంగా చెప్పిన మాట ఇదే:
ISA 8:12 “ఈ ప్రజలు కుట్ర అని చెప్పే ప్రతిదాన్ని కుట్ర అనకండి. వారు భయపడే దానికి భయపడకండి. దానికి బెదిరిపోకండి.
ISA 8:13 సైన్యాల యెహోవాయే పరిశుద్ధుడని మీరు గుర్తించాలి, ఆయనకే మీరు భయపడాలి, ఆయనకే మీరు భయపడాలి.
ISA 8:14 ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటారు; అయితే ఆయన ఇశ్రాయేలుకు, యూదాకు ప్రజలను తడబడేలా చేసే రాయిలా వారిని పడిపోయేలా చేసే బండలా ఉంటారు. ఆయన యెరూషలేము ప్రజలకు బోనుగా, ఉచ్చుగా ఉంటారు.
ISA 8:15 వారిలో అనేకమంది తడబడతారు; వారు పడిపోతారు, గాయపరచబడతారు వారు ఉచ్చులో చిక్కుకుని పట్టబడతారు.”
ISA 8:16 ఈ హెచ్చరిక సాక్ష్యాన్ని కట్టండి దేవుని బోధను నా శిష్యుల మధ్యలో ముద్రించండి.
ISA 8:17 యాకోబు వారసుల నుండి తన ముఖాన్ని దాస్తున్న యెహోవా కోసం నేను ఎదురుచూస్తాను. ఆయనపై నా నమ్మకాన్ని ఉంచుతాను.
ISA 8:18 ఇదిగో నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు, సీయోను కొండమీద నివసించే సైన్యాల యెహోవా వలన సూచనలుగా, గుర్తులుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
ISA 8:19 మీతో ఎవరైనా, గుసగుసలాడే గొణిగే మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించమని చెప్పినప్పుడు, ప్రజలు తమ దేవుని దగ్గరే విచారించాలి కదా? సజీవుల గురించి చచ్చిన వారిని ఎందుకు సంప్రదించాలి?
ISA 8:20 దేవుని బోధను, హెచ్చరిక సాక్ష్యాన్ని దృష్టి నిలపండి. ఈ వాక్యం ప్రకారం మాట్లాడని వారికి ఉదయపు వెలుగు ఉండదు.
ISA 8:21 వారు బాధపడుతూ ఆకలితో దేశమంతా తిరుగుతారు; వారు ఆకలితో ఉన్నప్పుడు వారు కోపంతో పైకి చూస్తూ తమ రాజును, తమ దేవుని శపిస్తారు.
ISA 8:22 వారు భూమివైపు చూడగా వారికి బాధ, చీకటి, భయంకరమైన దుఃఖం మాత్రమే కనబడతాయి. వారు దట్టమైన చీకటిలోకి త్రోయబడతారు.
ISA 9:1 అయినప్పటికీ బాధలో ఉన్నవారికి ఇక చీకటి ఉండదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలను అవమానపరిచారు కాని రాబోయే కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని అనగా యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతాన్ని ఘనపరుస్తారు.
ISA 9:2 చీకటిలో జీవిస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు; చిమ్మచీకటిగల దేశంలో నివసించేవారి మీద ఒక వెలుగు ప్రకాశించింది.
ISA 9:3 మీరు దేశాన్ని విస్తరింపజేశారు వారి సంతోషాన్ని అధికం చేశారు; కోతకాలంలో ప్రజలు సంతోషించినట్లు దోపుడుసొమ్ము పంచుకుంటున్నప్పుడు యుద్ధవీరులు సంతోషించినట్లు వారు మీ ఎదుట సంతోషిస్తున్నారు.
ISA 9:4 మిద్యాను ఓడిపోయిన రోజు జరిగినట్లు, వారికి భారం కలిగించే కాడిని వారి భుజాలమీద ఉన్న కర్రను, వారిని హింసించేవాని కర్రను మీరు విరిచివేశారు.
ISA 9:5 యుద్ధంలో వాడిన వీరుల చెప్పులు రక్తంలో చుట్టబడిన బట్టలు మంటలో వేయబడతాయి అగ్నికి ఇంధనంగా అవుతాయి.
ISA 9:6 ఎందుకంటే మన కోసం ఒక శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన అద్భుతమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి, సమాధానాధిపతి అని పిలువబడతాడు.
ISA 9:7 ఆయన ప్రభుత్వానికి, సమాధానానికి గొప్పతనానికి ముగింపు ఉండదు. ఆయన అప్పటినుండి ఎల్లకాలం వరకు దావీదు సింహాసనం మీద, అతని రాజ్యాన్ని ఏలుతూ, న్యాయంతోను నీతితోను రాజ్యాన్ని స్థాపించి స్థిరంగా ఉంచుతారు. సైన్యాలకు అధిపతియైన యెహోవా ఆసక్తి దీనిని నెరవేరుస్తుంది.
ISA 9:8 ప్రభువు యాకోబుకు వ్యతిరేకంగా ఒక సందేశం పంపారు; అది ఇశ్రాయేలు మీద పడుతుంది.
ISA 9:9 గర్వం, అహంకారంతో నిండిన హృదయం కలిగిన ప్రజలందరు అనగా ఎఫ్రాయిం, సమరయ వాసులు దానిని తెలుసుకుంటారు.
ISA 9:10 “ఇటుకలు పడిపోయాయి, కాని మనం చెక్కిన రాళ్లతో మళ్ళీ కడదాము; రావి చెట్లు నరకబడ్డాయి, వాటికి బదులుగా దేవదారులను వేద్దాం” అని అంటారు.
ISA 9:11 అయితే యెహోవా వారి మీదికి రెజీను విరోధులను లేపారు వారి శత్రువులను పురికొల్పారు.
ISA 9:12 తూర్పు నుండి అరామీయులు, పడమర నుండి ఫిలిష్తీయులు నోరు తెరచి ఇశ్రాయేలును మ్రింగివేశారు. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
ISA 9:13 అయితే ప్రజలు తమను కొట్టినవాడి వైపు తిరుగలేదు, సైన్యాల యెహోవాను వారు వెదకలేదు.
ISA 9:14 కాబట్టి యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటికొమ్మను, జమ్ము రెల్లును ఒకేరోజున తొలగిస్తారు.
ISA 9:15 పెద్దలు ప్రముఖులు తల అయితే, అబద్ధాలు చెప్పే ప్రవక్తలు తోక.
ISA 9:16 ఈ ప్రజలను నడిపించేవారు వారిని తప్పుదారి పట్టిస్తారు; వారిని వెంబడించేవారు చెదిరిపోతారు.
ISA 9:17 కాబట్టి ప్రభువు యువకులను చూసి సంతోషించరు తండ్రిలేనివారి పట్ల, విధవరాండ్ర పట్ల జాలి చూపరు. ఎందుకంటే, ప్రతి ఒక్కరు భక్తిహీనులుగా దుర్మార్గులుగా ఉన్నారు, ప్రతి నోరు మూర్ఖంగా మాట్లాడుతుంది. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
ISA 9:18 ఖచ్చితంగా దుష్టత్వం అగ్నిలా మండుతుంది అది గచ్చపొదలను, ముళ్ళచెట్లను కాల్చివేస్తుంది; అడవి పొదలను దహనం చేసి దట్టమైన పొగలా పైకి లేస్తుంది.
ISA 9:19 సైన్యాల యెహోవా ఉగ్రత వలన భూమి కాలిపోతుంది ప్రజలు అగ్నికి ఇంధనం అవుతారు; వారిలో ఒకరిపై మరొకరికి కనికరం ఉండదు.
ISA 9:20 కుడి ప్రక్కన దానిని వారు మ్రింగుతారు కాని ఇంకా ఆకలితోనే ఉంటారు. ఎడమ ప్రక్కన దానిని తింటారు కాని తృప్తి పొందరు. వారిలో ప్రతిఒక్కరు తన సంతానం యొక్క మాంసాన్ని తింటారు.
ISA 9:21 మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిం మనష్షేను తింటారు. వీరిద్దరు కలిసి యూదా మీద పడతారు. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
ISA 10:1 అన్యాయపు చట్టాలు చేసేవారికి, చెడు శాసనాలు చేసేవారికి శ్రమ.
ISA 10:2 వారు పేదల హక్కులను హరిస్తారు, నా ప్రజల్లో అణచివేయబడిన వారికి న్యాయం చేరనివ్వరు వారు విధవరాండ్రను తమ దోపుడు సొమ్ముగా చేసుకుంటూ తండ్రిలేనివారిని దోచుకుంటారు.
ISA 10:3 తీర్పు తీర్చే రోజున, దూరం నుండి విపత్తు వచ్చినప్పుడు మీరేమి చేస్తారు? సహాయం కోసం ఎవరి దగ్గరకు పరుగెత్తుతారు? మీ సంపదను ఎక్కడ వదిలివేస్తారు?
ISA 10:4 బంధించబడిన వారి మధ్య మోకరిల్లడం చనిపోయినవారి మధ్య పడిపోవడం తప్ప మరేమీ మిగలదు. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.
ISA 10:5 అష్షూరుకు శ్రమ, అతడు నా కోపం అనే దండం నా ఉగ్రత అనే దుడ్డుకర్ర అతని చేతిలో ఉంది.
ISA 10:6 దేవుడు లేని దేశం మీదికి నేను అతన్ని పంపుతాను, దోచుకోడానికి కొల్లగొట్టడానికి, వీధుల్లో మట్టిలా వారిని త్రొక్కడానికి నాకు కోపం కలిగించిన ప్రజల గురించి అతన్ని ఆజ్ఞాపిస్తాను.
ISA 10:7 అయితే ఇది అతడు ఉద్దేశించింది కాదు, ఇది అతని మనస్సులో ఉన్నది అది కాదు. నాశనం చేయాలని, చాలా దేశాలను నిర్మూలించాలన్నది అతని ఉద్దేశము.
ISA 10:8 అతడు, “నా అధిపతులందరు రాజులు కారా?
ISA 10:9 కల్నో, కర్కెమీషులా ఉండలేదా? హమాతు అర్పదులా ఉండలేదా సమరయ దమస్కులా ఉండలేదా?
ISA 10:10 విగ్రహాలను పూజించే రాజ్యాలను నా చేయి పట్టుకున్నట్లు, వాటి విగ్రహాలు యెరూషలేము సమరయుల విగ్రహాల కన్న ఎక్కువగా ఉన్నాయి.
ISA 10:11 నేను సమరయకు దాని విగ్రహాలకు చేసినట్లు యెరూషలేముకు దాని విగ్రహాలకు చేయవద్దా?”
ISA 10:12 ప్రభువు సీయోను పర్వతానికి, యెరూషలేముకు వ్యతిరేకంగా పని ముగించిన తర్వాత ఆయన ఇలా అంటారు, “నేను అష్షూరు రాజుకు ఉన్న హృదయపు గర్వం యొక్క ఫలితం బట్టి అతని కళ్లల్లో ఉన్న అహంకారపు చూపును బట్టి అతన్ని శిక్షిస్తాను.
ISA 10:13 ఎందుకంటే అతడు ఇలా అన్నాడు: “ ‘నేను వివేకిని, నా బాహుబలం చేత, నా జ్ఞానంతో దీన్ని చేశాను. నేను ప్రజల సరిహద్దులు తీసివేశాను, వారి సంపదలు దోచుకున్నాను; బలవంతునిలా వారి రాజులను అణచివేశాను.
ISA 10:14 పక్షి గూటిలోనికి చేరునట్లు నా చేయి దేశాల సంపదను చేరుకుంది; ప్రజలు విడిచిపెట్టిన గుడ్లు ఏరుకున్నట్లుగా, నేను అన్ని దేశాలను సమకూర్చుకున్నాను; ఏ ఒక్కటి రెక్కలు ఆడించలేదు లేదా కిచకిచమనడానికి నోరు తెరవలేదు.’ ”
ISA 10:15 గొడ్డలి తనను ఉపయోగించే వ్యక్తి కన్నా అతిశయపడుతుందా, రంపం దానిని ఉపయోగించే వ్యక్తి మీద ప్రగల్భాలు పలుకుతుందా? కర్ర తనను ఎత్తేవానిని ఆడించినట్లు దుడ్డుకర్ర కర్రకానివాన్ని ఆడిస్తుంది!
ISA 10:16 కాబట్టి, సైన్యాల అధిపతియైన యెహోవా, అష్షూరీయుల బలమైన వీరుల మీదికి పాడుచేసే రోగాన్ని పంపుతారు; వారి మహిమను కాల్చడానికి వారి క్రింద మండుతున్న జ్వాలల వంటి అగ్ని మండుతుంది.
ISA 10:17 ఇశ్రాయేలు వెలుగు అగ్నిగా మారుతుంది, వారి పరిశుద్ధ దేవుడు అగ్నిజ్వాలగా మారుతారు; అతని ముళ్ళచెట్లను, గచ్చపొదలను ఒక రోజులోనే వాటిని కాల్చి, దహించివేస్తుంది.
ISA 10:18 ఒక రోగి ఆరోగ్యం క్షీణించిపోవునట్లు అతని అడవికి, సారవంతమైన పొలాలకు ఉన్న వైభవాన్ని అది పూర్తిగా నాశనం చేస్తుంది.
ISA 10:19 అతని అడవిలో మిగిలిన చెట్లు కొన్నే మిగులుతాయి పిల్లవాడు కూడా వాటిని లెక్కపెట్టవచ్చు.
ISA 10:20 ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవారు యాకోబు కుటుంబంలో తప్పించుకున్నవారు తమను మొత్తిన వానిని ఇక ఆశ్రయించరు కాని ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను వారు నిజంగా ఆశ్రయిస్తారు.
ISA 10:21 మిగిలినవారు తిరిగి వస్తారు, యాకోబులో మిగిలినవారు బలవంతుడైన దేవుని వైపు తిరుగుతారు.
ISA 10:22 నీ ప్రజలైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా, వారిలో మిగిలినవారే తిరుగుతారు. నాశనం శాసించబడింది నీతియుక్తమైన శిక్ష ఉప్పొంగి ప్రవహిస్తుంది.
ISA 10:23 ప్రభువు, సైన్యాల యెహోవా భూమి అంతటా నిర్ణయించబడిన నాశనాన్ని కలుగజేస్తారు.
ISA 10:24 కాబట్టి సైన్యాల అధిపతియైన యెహోవా చెప్పే మాట ఇది: “సీయోనులో నివసిస్తున్న నా ప్రజలారా, ఈజిప్టులో చేసినట్టు కర్రతో మిమ్మల్ని కొట్టి మీమీద తన దుడ్డుకర్ర ఎత్తిన అష్షూరీయులకు భయపడకండి.
ISA 10:25 అతిత్వరలో మీమీద నా కోపం చల్లారుతుంది నా ఉగ్రత వారి నాశనానికి దారి తీస్తుంది.”
ISA 10:26 ఓరేబు బండ దగ్గర మిద్యానును చంపినట్లు సైన్యాల యెహోవా తన కొరడాతో వారిని కొడతారు; ఆయన ఈజిప్టులో చేసినట్టు తన దండాన్ని సముద్రం మీద ఎత్తుతారు.
ISA 10:27 ఆ రోజు వారి భుజాలపై నుండి వారి బరువు తీసివేయబడుతుంది, మీ మెడపై నుండి వారి కాడి కొట్టివేయబడుతుంది. మీరు బలంగా ఉన్నందుకు ఆ కాడి విరిగిపోతుంది.
ISA 10:28 అష్షూరీయులు ఆయాతులో ప్రవేశించారు; మిగ్రోను గుండా వెళ్లారు; మిక్మషులో తమ సామాను ఉంచారు.
ISA 10:29 వారు మార్గం దాటి వెళ్తూ, “మేము గెబాలో రాత్రి బస చేస్తాం” అంటున్నారు. రామా వణకుతుంది; సౌలు గిబియా పారిపోతుంది.
ISA 10:30 గల్లీము కుమార్తె! కేకలు వేయి లాయిషా, విను! అయ్యయ్యో, అనాతోతు!
ISA 10:31 మద్మేనా ప్రజలు పారిపోతారు. గెబీము నివాసులు దాక్కుంటారు.
ISA 10:32 ఈ రోజే వారు నోబులో దిగుతారు; ఈ రోజే సీయోను కుమారి పర్వతం, యెరూషలేము కొండ వైపు వారు తమ పిడికిలి ఆడిస్తారు.
ISA 10:33 చూడండి, ప్రభువు, సైన్యాల అధిపతియైన యెహోవా మహాబలంతో కొమ్మలు నరుకుతారు. ఉన్నతమైన చెట్లు నరకబడతాయి, ఎత్తైనవి పడగొట్టబడతాయి.
ISA 10:34 ఆయన అడవి పొదలను గొడ్డలితో నరుకుతారు; బలవంతుని ఎదుట లెబానోను పడిపోతుంది.
ISA 11:1 యెష్షయి మొద్దు నుండి చిగురు పుడుతుంది; అతని వేరుల నుండి కొమ్మ ఫలిస్తుంది.
ISA 11:2 యెహోవా ఆత్మ జ్ఞానం వివేకం కలిగించే ఆత్మ, ఆలోచనను బలాన్ని ఇచ్చే ఆత్మ, తెలివిని, యెహోవా పట్ల భయం కలిగించే ఆత్మ, అతని మీద ఉంటుంది.
ISA 11:3 యెహోవాయందలి భయంతో అతడు సంతోషిస్తాడు. అతడు తన కళ్లతో చూసిన దానిని బట్టి తీర్పు తీర్చడు, తన చెవులతో విన్నదానిని బట్టి నిర్ణయం తీసుకోడు;
ISA 11:4 కాని నీతిగా పేదలకు తీర్పు తీరుస్తాడు, భూమిపై ఉన్న పేదల కోసం న్యాయంతో నిర్ణయాలు తీసుకుంటాడు. అతడు తన నోటి దండంతో భూమిని కొడతాడు; తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపుతాడు.
ISA 11:5 నీతి అతని నడికట్టుగా ఉంటుంది నమ్మకత్వం అతని తుంటికి నడికట్టుగా ఉంటుంది.
ISA 11:6 తోడేలు గొర్రెపిల్లతో నివసిస్తుంది, చిరుతపులి మేకతో పడుకుంటుంది, దూడ, కొదమసింహం, బలిపశువు కలిసి ఉంటాయి; చిన్న పిల్లవాడు వాటిని నడిపిస్తాడు.
ISA 11:7 ఆవు ఎలుగుబంటి కలిసి మేస్తాయి, వాటి పిల్లలు ఒక్క చోటే పడుకుంటాయి. ఎద్దు మేసినట్లు సింహం గడ్డిమేస్తుంది.
ISA 11:8 పసిపిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడుతుంది. విషసర్పం పుట్టలో చిన్న బిడ్డ తన చేయి పెడుతుంది.
ISA 11:9 నా పరిశుద్ధ పర్వతమంతటా అవి హాని చేయవు, నాశనం చేయవు. నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు యెహోవా జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది.
ISA 11:10 ఆ రోజున యెష్షయి వేరు జనాంగాలకు ధ్వజంగా నిలుస్తుంది; దేశాలు అతనివైపు వస్తాయి, అతని విశ్రాంతి స్థలం మహిమగలదిగా ఉంటుంది.
ISA 11:11 ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు.
ISA 11:12 దేశాల కోసం ఆయన ఒక జెండా పైకి ఎత్తుతారు చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తారు; భూమి నలుదిక్కుల నుండి ఆయన చెదరిపోయిన యూదా ప్రజలను సమకూర్చుతారు.
ISA 11:13 ఎఫ్రాయిముకున్న అసూయ పోతుంది, యూదా శత్రువులు నశిస్తారు. ఎఫ్రాయిం యూదాపై అసూయపడదు, యూదా ఎఫ్రాయింతో విరోధంగా ఉండదు.
ISA 11:14 వారు పడమటి వైపు ఫిలిష్తీయ వాలుల మీద దూకుతారు; వారు కలిసి తూర్పు ప్రజలను దోచుకుంటారు. వారు ఎదోమును, మోయాబును లోబరచుకుంటారు, అమ్మోనీయులు వారికి లోబడతారు.
ISA 11:15 యెహోవా ఈజిప్టు సముద్రపు అగాధాన్ని నాశనం చేస్తారు; తన వేడి గాలితో యూఫ్రటీసు నది మీద తన చేయి ఆడిస్తారు. ఆయన ఏడు కాలువలుగా దానిని చీల్చుతారు చెప్పులు తడువకుండ మనుష్యులు దానిని దాటేలా చేస్తారు.
ISA 11:16 ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన రోజున వారికి దారి ఏర్పడినట్లు అష్షూరు నుండి వచ్చే ఆయన ప్రజల్లో మిగిలిన వారికి రాజమార్గం ఉంటుంది.
ISA 12:1 ఆ రోజున మీరు ఇలా అంటారు: “యెహోవా, నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీరు నాపై కోప్పడినా కూడా మీ కోపం చల్లారింది మీరు నన్ను ఆదరించారు.
ISA 12:2 నిజంగా దేవుడే నా రక్షణ; నేను భయపడను ఆయనను నమ్ముతాను. యెహోవా యెహోవాయే నా బలం, నా ఆత్మరక్షణ; ఆయనే నా రక్షణ అయ్యారు.”
ISA 12:3 మీరు రక్షణ బావులలో నుండి ఆనందంతో నీళ్లు చేదుతారు.
ISA 12:4 ఆ రోజున మీరు ఇలా అంటారు: “యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి; దేశాల్లో ఆయన చేసిన కార్యాలను తెలియజేయండి, ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి.
ISA 12:5 యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన మహిమగల కార్యాలు చేశారు; లోకమంతటికి ఇది తెలియాలి.
ISA 12:6 సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి, ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”
ISA 13:1 బబులోను గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన ప్రవచనం:
ISA 13:2 చెట్లులేని కొండ శిఖరం మీద జెండా నిలబెట్టండి, కేకలు వేసి వారిని పిలువండి; ప్రజల ప్రధానులను గుమ్మాల్లో చేతులతో సైగ చేయండి.
ISA 13:3 నేను యుద్ధానికి ప్రతిష్ఠించిన వారికి ఆజ్ఞ ఇచ్చాను; నా కోపం తీర్చుకోవాలని నా వీరులను పిలిపించాను, నా విజయాన్ని బట్టి సంతోషించేవారిని పిలిపించాను.
ISA 13:4 పెద్ద జనసమూహం ఉన్నట్లుగా కొండల్లో వస్తున్న శబ్దం వినండి! దేశాలు ఒక్కటిగా చేరుతునట్లు రాజ్యాల మధ్య అల్లరి శబ్దం వినండి! సైన్యాల యెహోవా యుద్ధానికి సైన్యాన్ని సమకూరుస్తున్నారు.
ISA 13:5 దేశాన్ని మొత్తం పాడుచేయడానికి, యెహోవా కోపాన్ని తీర్చే ఆయుధాలుగా, వారు దూరదేశం నుండి, ఆకాశపు అంచుల నుండి వస్తున్నారు.
ISA 13:6 యెహోవా దినం దగ్గరలో ఉందని రోదించండి; అది సర్వశక్తుడు దేవుని దగ్గర నుండి వచ్చే నాశనంలా వస్తుంది.
ISA 13:7 దీనిని బట్టి, చేతులన్నీ బలహీనపడతాయి, ప్రతి హృదయం భయంతో కరిగిపోతుంది.
ISA 13:8 భయం వారిని పట్టుకుంటుంది, వేదన బాధలు వారిని గట్టిగా పట్టుకుంటాయి; స్త్రీ ప్రసవ వేదన పడినట్లు వారు వేదన పడతారు. వారు ఒకరిపట్ల ఒకరు విసుగుతో చూసుకుంటారు, వారి ముఖాలు అగ్నిజ్వాలల్లా ఉంటాయి.
ISA 13:9 చూడండి, యెహోవా దినం వస్తుంది. దేశాన్ని పాడుచేయడానికి దానిలో ఉన్న పాపులను పూర్తిగా నాశనం చేయడానికి క్రూరమైన ఉగ్రతతో తీవ్రమైన కోపంతో ఆ రోజు వస్తుంది.
ISA 13:10 ఆకాశ నక్షత్రాలు వాటి నక్షత్రరాసులు తమ వెలుగు ఇవ్వవు. ఉదయించే సూర్యుడు చీకటిగా మారుతాడు చంద్రుడు తన వెలుగునివ్వడు.
ISA 13:11 దాని చెడుతనం బట్టి లోకాన్ని వారి పాపాన్ని బట్టి దుర్మార్గులను నేను శిక్షిస్తాను. గర్విష్ఠుల అహంకారాన్ని అంతం చేస్తాను. క్రూరుల గర్వాన్ని అణచివేస్తాను.
ISA 13:12 నేను మనుష్యులను స్వచ్ఛమైన బంగారం కంటే కొరతగా, ఓఫీరు దేశ బంగారం కంటే అరుదుగా ఉండేలా చేస్తాను.
ISA 13:13 సైన్యాల యెహోవా ఉగ్రత కారణంగా ఆయన కోపం రగులుకున్న రోజున ఆకాశం వణికేలా చేస్తాను; భూమి తన స్థానం నుండి తప్పుకునేలా చేస్తాను.
ISA 13:14 తరుమబడుతున్న జింకలా, కాపరి లేని గొర్రెలా, వారు తమ సొంత ప్రజల వైపు తిరుగుతారు, వారు తమ స్వదేశాలకు పారిపోతారు.
ISA 13:15 పట్టబడిన ప్రతిఒక్కరు కత్తిపోటుకు గురవుతారు; బందీగా పట్టబడిన వారందరు ఖడ్గానికి చస్తారు.
ISA 13:16 వారి కళ్లముందే వారి పసిపిల్లలు ముక్కలుగా నలుగ కొట్టబడతారు; వారి ఇల్లు దోచుకోబడతాయి వారి భార్యలు అత్యాచారం చేయబడతారు.
ISA 13:17 చూడండి, వారి మీద దాడి చేయడానికి నేను మెదీయ వారిని రేపుతాను. వారు వెండిని లెక్కచేయరు. బంగారం మీద వారికి ఆసక్తి లేదు.
ISA 13:18 వారి విల్లులు యవ్వనస్థులను నలగ్గొడతాయి; పసిపిల్లలపై వారు జాలిపడరు. పిల్లలపై వారు దయ చూపరు.
ISA 13:19 అప్పుడు రాజ్యాలకు వైభవంగా, బబులోనీయుల గర్వానికి ఘనతకు కారణంగా ఉన్న బబులోనును సొదొమ గొమొర్రాల వలె దేవుడు పడగొడతారు.
ISA 13:20 ఇకపై దానిలో ఎవరూ నివసించరు తరతరాలకు దానిలో ఎవరూ కాపురముండరు; అరబీయులు అక్కడ తమ డేరాలు వేసుకోరు, గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ విశ్రాంతి తీసుకోనివ్వరు.
ISA 13:21 ఎడారి జీవులు అక్కడ పడుకుంటాయి, వారి ఇళ్ళ నిండ నక్కలు ఉంటాయి; గుడ్లగూబలు అక్కడ నివసిస్తాయి కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి.
ISA 13:22 దాని కోటలలో హైనాలు, దాని విలాసవంతమైన భవనాలలో నక్కలు నివసిస్తాయి. దాని కాలం ముగిసిపోతుంది దాని రోజులు పొడిగించబడవు.
ISA 14:1 యెహోవా యాకోబుపై జాలి చూపుతారు; ఆయన మరలా ఇశ్రాయేలును ఏర్పరచుకొని వారిని వారి స్వదేశంలో స్థిరపరుస్తారు. విదేశీయులు వారిని కలుసుకుంటారు యాకోబు వారసులతో ఏకమై ఉంటారు.
ISA 14:2 ప్రజలు వారిని తీసుకువచ్చి వారి సొంత దేశంలో వారిని చేర్చుతారు. ఇశ్రాయేలు దేశాలను స్వాధీనపరచుకుని యెహోవా దేశంలో వారిని తమ దాసదాసీలుగా చేసుకుంటారు. వారు తమను బందీలుగా పట్టుకెళ్లిన వారిని బందీలుగా పట్టుకుని తమను బాధించిన వారిని పాలిస్తారు.
ISA 14:3 నీ బాధ నుండి వేదన నుండి నీతో బలవంతంగా చేయించిన కఠినమైన పని నుండి యెహోవా నీకు ఉపశమనం ఇచ్చిన రోజున,
ISA 14:4 నీవు బబులోను రాజును హేళన చేస్తూ ఇలా మాట్లాడతావు: బాధ పెట్టినవాడు ఎలా నశించాడు! రేగుతున్న కోపం ఎలా అంతమయ్యింది!
ISA 14:5 దుర్మార్గుల దుడ్డుకర్రను పాలకుల రాజదండాన్ని యెహోవా విరగ్గొట్టారు.
ISA 14:6 వారు కోపంతో ఎడతెగని దెబ్బలతో ప్రజలను క్రూరంగా కొట్టారు, కోపంతో ప్రజలను పరిపాలించి కనికరం లేకుండా వారిని అణచివేశారు.
ISA 14:7 భూమి అంతా విశ్రాంతిలో సమాధానంతో ఉంది; వారు పాడడం మొదలుపెట్టారు.
ISA 14:8 సరళ వృక్షాలు లెబానోను దేవదారు చెట్లు నీ గురించి సంతోషిస్తూ ఇలా అంటాయి, “నీవు పడుకుంటున్నప్పటి నుండి మమ్మల్ని నరకడానికి ఎవరూ రారు.”
ISA 14:9 నీవు వస్తుండగా నిన్ను కలుసుకోడానికి క్రింద పాతాళం నీ గురించి ఆవేశపడుతుంది; అది నిన్ను చూసి చచ్చిన వారి ఆత్మలను అనగా భూమి మీద నాయకులుగా ఉన్నవారందరిని రేపుతుంది; దేశాలకు రాజులుగా ఉన్నవారందరిని తమ సింహాసనాలు నుండి లేపుతుంది.
ISA 14:10 వారందరు నిన్ను చూసి నీతో ఇలా అంటారు, “నీవు కూడా మాలాగే బలహీనమయ్యావు; నీవు కూడా మాలా అయ్యావు.”
ISA 14:11 నీ వీణల సందడితో పాటు నీ ఆడంబరం అంతా క్రింద సమాధిలో పడవేయబడింది; నీ క్రింద పురుగులు వ్యాపిస్తాయి క్రిములు నిన్ను కప్పివేస్తాయి.
ISA 14:12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెలా ఆకాశం నుండి పడ్డావు? దేశాలను పడగొట్టిన నీవు భూమి మీద ఎలా పడవేయబడ్డావు?
ISA 14:13 నీవు నీ హృదయంలో, “నేను ఆకాశాలను ఎక్కుతాను; దేవుని నక్షత్రాల కన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను; ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద, సాఫోన్ పర్వతం యొక్క ఎత్తైన స్థలాల మీద కూర్చుంటాను.
ISA 14:14 మేఘ మండలం మీదికి ఎక్కుతాను. నన్ను నేను మహోన్నతునిగా చేసుకుంటాను” అనుకున్నావు.
ISA 14:15 కాని నీవు పాతాళంలో చచ్చిన వారి స్థలంలో లోతైన గోతిలో త్రోయబడ్డావు.
ISA 14:16 నిన్ను చూసేవారు నిన్ను గమనించి చూస్తూ నీ విధి గురించి ఇలా అనుకుంటారు: “భూమిని కంపింపజేసి రాజ్యాలను వణికించింది ఇతడేనా?
ISA 14:17 లోకాన్ని అడవిగా చేసి దాని పట్టణాలను పాడుచేసినవాడు ఇతడేనా? తాను బంధించిన వారిని తమ ఇళ్ళకు పోనివ్వనివాడు ఇతడేనా?”
ISA 14:18 దేశాల రాజులందరూ ఘనత వహించినవారై తమ తమ సమాధుల్లో నిద్రిస్తున్నారు.
ISA 14:19 అయితే నీవు తిరస్కరించబడిన కొమ్మలా నీ సమాధి నుండి పారవేయబడ్డావు. నీవు చంపబడినవారితో కత్తితో పొడవబడిన వారితో పాతాళంలో ఉన్న రాళ్ల దగ్గరకు దిగిపోయిన వారితో కప్పబడి ఉన్నావు. కాళ్లతో తొక్కబడిన శవంలా ఉన్నావు.
ISA 14:20 నీవు నీ దేశాన్ని పాడుచేసి నీ ప్రజలను చంపేశావు కాబట్టి నీవు సమాధిలో వారితో పాటు కలిసి ఉండవు. దుర్మార్గుని సంతానం ఎప్పుడూ జ్ఞాపకానికి రాదు.
ISA 14:21 వారు పెరిగి భూమిని స్వాధీనం చేసుకుని తమ పట్టణాలతో భూమిని నింపకుండా తమ పూర్వికుల పాపాన్ని బట్టి అతని పిల్లలను వధించడానికి చోటు సిద్ధం చేయండి.
ISA 14:22 “నేను వారి మీదికి లేస్తాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు, “బబులోను పేరును దానిలో మిగిలినవారిని, సంతానాన్ని, వారసులను కొట్టివేస్తాను” అని యెహోవా తెలియజేస్తున్నారు.
ISA 14:23 “నేను దానిని గుడ్లగూబలు ఉండే స్థలంగా చేస్తాను నీటిమడుగులుగా చేస్తాను; నాశనమనే చీపురుకట్టతో దానిని తుడిచివేస్తాను” అని సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.
ISA 14:24 సైన్యాల యెహోవా చేసిన ప్రమాణం ఇదే: “నేను ఉద్దేశించినట్లే అది తప్పక ఉంటుంది, నేను ఆలోచించినట్లే అది జరుగుతుంది.
ISA 14:25 నా దేశంలో అష్షూరును విరగ్గొడతాను; నా పర్వతాలమీద అతన్ని నలగదొక్కుతాను. అతని కాడి నా ప్రజల మీద నుండి తీసివేయబడుతుంది, అతని భారం వారి భుజాలపై నుండి తొలగించబడుతుంది.”
ISA 14:26 లోకమంతటి గురించి నిర్ణయించిన ఆలోచన ఇదే; ప్రజలందరిపై చాపబడిన చేయి ఇదే.
ISA 14:27 సైన్యాల యెహోవా దానిని ఉద్దేశిస్తే ఆయనను అడ్డుకునేవారు ఎవరు? ఆయన చేయి చాచి ఉన్నది, దాన్ని త్రిప్పగలవారెవరు?
ISA 14:28 రాజైన ఆహాజు చనిపోయిన సంవత్సరం వచ్చిన ప్రవచనం:
ISA 14:29 ఫిలిష్తియా, మిమ్మల్ని కొట్టిన కర్ర విరిగిపోయిందని మీరందరు సంతోషించకండి; సర్పమూలం నుండి విషపూరిత పాము పుడుతుంది, దాని సంతానం ఎగిరే విషసర్పము.
ISA 14:30 అప్పుడు అతి బీదవారు భోజనం చేస్తారు, అవసరతలో ఉన్నవారు క్షేమంగా పడుకుంటారు. కాని కరువుతో మీ మూలాన్ని నాశనం చేస్తాను; అది మీలో మిగిలి ఉన్నవారిని చంపేస్తుంది.
ISA 14:31 గుమ్మమా, దుఃఖించు! పట్టణమా, కేకలు వేయి! ఫిలిష్తియా, మీరంతా కరిగిపోవాలి! ఉత్తర దిక్కునుండి పొగలేస్తుంది. పంక్తులు తీరిన సైన్యంలో వెనుదిరిగేవారు ఎవరూ లేరు.
ISA 14:32 ఆ దేశ దూతలకు ఇవ్వవలసిన జవాబు ఏది? “యెహోవా సీయోనును స్థాపించారు, ఆయన ప్రజల్లో శ్రమ పొందినవారు దానిని ఆశ్రయిస్తారు.”
ISA 15:1 మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒక రాత్రిలోనే మోయాబులోని ఆరు పట్టణం పాడై నశిస్తుంది! ఒక రాత్రిలోనే మోయాబులోని కీరు పట్టణం పాడై నశిస్తుంది!
ISA 15:2 దీబోను ఏడ్వడానికి గుడికి తన క్షేత్రాలకు వెళ్తుంది; నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది. ప్రతి తల క్షౌరం చేయబడింది ప్రతివాని గడ్డం గొరిగించబడింది.
ISA 15:3 వారు తమ సంతవీధులలో గోనెపట్ట కట్టుకుంటారు; తమ మేడల మీద, బహిరంగ స్థలాల్లో వారందరు రోదిస్తారు, ఏడుస్తూ కన్నీరు కారుస్తారు.
ISA 15:4 హెష్బోను ఎల్యాలెహు మొరపెడుతున్నారు, యాహాజు వరకు వారి స్వరం వినబడుతుంది. కాబట్టి మోయాబీయుల వీరులు మొరపెడతారు, వారి హృదయాలు క్రుంగిపోతాయి.
ISA 15:5 మోయాబు గురించి నా హృదయం మొరపెడుతుంది; వారిలో పారిపోయినవారు సోయరు వరకు, ఎగ్లత్-షెలీషియా వరకు పారిపోతారు. వారు లూహీతు ఎక్కుతున్నప్పుడు ఆ దారిలో ఏడుస్తూ ఎక్కుతారు; హొరొనయీము వెళ్లే దారిలో తమ నాశనం గురించి విలపిస్తారు.
ISA 15:6 నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి గడ్డి ఎండిపోయింది; వృక్ష సంపద ఉండదు పచ్చదనం ఎక్కడా మిగల్లేదు.
ISA 15:7 కాబట్టి వారు సంపాదించి సమకూర్చుకున్న ఆస్తిని నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని వెళ్తారు.
ISA 15:8 వారి ఆర్తనాదాలు మోయాబు సరిహద్దులలో ప్రతిధ్వనిస్తాయి; వారి రోదన ఎగ్లయీము వరకు వారి ఏడ్పు బెయేర్-ఎలీము వరకు వినబడుతుంది.
ISA 15:9 దీమోను నీళ్లు రక్తంతో నిండిపోయాయి కాని నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పిస్తాను. మోయాబు నుండి తప్పించుకున్నవారి మీదికి ఆ దేశంలో మిగిలిన వారి మీదికి సింహాన్ని రప్పిస్తాను.
ISA 16:1 ఎడారి వైపు ఉన్న సెల నుండి దేశాన్ని పాలించేవానికి కప్పంగా గొర్రెపిల్లలను సీయోను కుమార్తె పర్వతానికి పంపండి.
ISA 16:2 గూటినుండి చెదరగొట్టబడి ఇటు అటు ఎగిరే పక్షుల్లా అర్నోను రేవుల దగ్గర మోయాబు స్త్రీలు ఉంటారు.
ISA 16:3 మోయాబు అంటుంది, “మనస్సు సిద్ధం చేసుకో, నిర్ణయం తీసుకో. చీకటి కమ్మినట్టుగా మిట్టమధ్యాహ్నం నీ నీడ మామీద ఉండనివ్వు. పారిపోయినవారిని దాచి పెట్టు, శరణార్థులకు ద్రోహం చేయకు.
ISA 16:4 పారిపోయిన మోయాబీయులను నీతో ఉండనివ్వు; నాశనం చేసేవాని నుండి కాపాడే ఆశ్రయంగా ఉండు.” హాని చేసేవారు అంతం అవుతారు, విధ్వంసం ఆగిపోతుంది; అణచివేసేవారు భూమి మీద లేకుండా మాయమవుతారు.
ISA 16:5 మారని ప్రేమలో సింహాసనం స్థాపించబడుతుంది; దావీదు కుటుంబం నుండి సత్యవంతుడైన ఒకడు దానిపై కూర్చుని న్యాయంగా తీర్పు తీర్చుతూ నీతిన్యాయాలను జరిగించడానికి త్వరపడతాడు.
ISA 16:6 మోయాబు గర్వం గురించి మేము విన్నాము దాని అహంకారం చాలా ఎక్కువ దాని ప్రగల్భాలు, గర్వం, దౌర్జన్యం గురించి విన్నాం; అయితే దాని ప్రగల్భాలు వట్టివే.
ISA 16:7 కాబట్టి మోయాబీయులు రోదిస్తారు, వారందరూ కలిసి మోయాబు గురించి ఏడుస్తారు. కీర్ హరెశెతుకు ఎండు ద్రాక్షపండ్ల విలపించి దుఃఖిస్తారు.
ISA 16:8 హెష్బోను పొలాలు, షిబ్మా ద్రాక్షతీగెలు కూడా వాడిపోయాయి. యాజెరు వరకు వ్యాపించిన అరణ్యం వరకు ప్రాకిన శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను దేశాల పాలకులు త్రొక్కివేశారు. వాటి తీగెలు విశాలంగా వ్యాపించి సముద్రాన్ని దాటాయి.
ISA 16:9 అందువల్ల యాజెరు ఏడ్చినట్లు నేను షిబ్మా ద్రాక్షతీగెల కోసం ఏడుస్తాను. హెష్బోనూ ఎల్యాలెహు, నా కన్నీటి చేత మిమ్మల్ని తడుపుతాను. నీ పండిన ఫలాల కోసం నీ పంటల కోసం వేసే సంతోషపు కేకలు ఆగిపోయాయి.
ISA 16:10 ఫలభరితమైన పొలాల నుండి ఆనంద సంతోషాలు తీసివేయబడతాయి; ద్రాక్షతోటలో ఎవరూ పాడరు, కేకలు వేయరు; గానుగులలో ద్రాక్షగెలలను ఎవరూ త్రొక్కరు. ఎందుకంటే, నేను వారి సంతోషపు అరుపులు ఆపివేశాను.
ISA 16:11 నా హృదయం వీణలా మోయాబు గురించి, నా అంతరంగం కీర్ హరెశెతు గురించి విలపిస్తుంది.
ISA 16:12 మోయాబు తన క్షేత్రాల దగ్గరకు వెళ్లినప్పుడు అది కేవలం ఆయాసపడుతుంది; ప్రార్ధన చేయడానికి తన క్షేత్రానికి వెళ్లినప్పుడు దానికి ఏమి దొరకదు.
ISA 16:13 యెహోవా మోయాబు గురించి ముందే పలికిన వాక్కు ఇది.
ISA 16:14 అయితే యెహోవా ఇప్పుడు ఇలా చెప్తున్నారు: “మూడు సంవత్సరాల్లో, కూలివాని లెక్క ప్రకారం ఖచ్చితంగా మోయాబు ఘనతతో పాటు దానిలోని అనేకమంది తృణీకరించబడతారు; దానిలో మిగిలినవారు అతితక్కువగా, బలహీనంగా ఉంటారు.”
ISA 17:1 దమస్కుకు వ్యతిరేకంగా ప్రవచనం: “చూడండి, దమస్కు ఒక పట్టణంగా ఇక ఉండదు, కాని అది శిథిలాల కుప్పగా మారుతుంది.
ISA 17:2 అరోయేరు పట్టణాలు నిర్జనమవుతాయి అవి గొర్రెల మందలకు వదిలేయబడతాయి, ఎవరి భయం లేకుండా అవి అక్కడ పడుకుంటాయి.
ISA 17:3 ఎఫ్రాయిములో నుండి కోటగల పట్టణం మాయమవుతుంది, దమస్కు రాజ్యాధికారాన్ని కోల్పోతుంది; ఇశ్రాయేలీయుల ప్రభావానికి జరిగినట్లు అరాములో మిగిలినవారికి జరుగుతుంది” అని సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.
ISA 17:4 “ఆ రోజున యాకోబు ప్రభావం తగ్గిపోతుంది; అతని శరీరం యొక్క క్రొవ్వు తరిగిపోతుంది.
ISA 17:5 అది కోత కోసేవారు ధాన్యం కోసినప్పుడు వారి చేతుల్లో వెన్నులు కోసినట్లుగా ఉంటుంది. రెఫాయీము లోయలో ఒకడు పరిగె ఏరుకున్నట్లుగా ఉంటుంది.
ISA 17:6 అయినా ఒలీవచెట్టు కొమ్మలు దులపగా పై కొమ్మ చివర రెండు మూడు పండ్లు మిగిలినట్లు, ఫలించు చెట్టు కొమ్మల్లో మూడు, నాలుగు పండ్లు మిగిలినట్లు, కొంత పరిగె మిగిలి ఉంటుంది” అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తెలియజేస్తున్నారు.
ISA 17:7 ఆ రోజున మనుష్యులు తమ సృష్టికర్త వైపు చూస్తారు వారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వైపు తమ దృష్టిని మరల్చుకుంటారు.
ISA 17:8 వారు తమ చేతుల పనియైన బలిపీఠాల వైపు చూడరు, తమ చేతివ్రేళ్లు చేసిన అషేరా స్తంభాలను ధూపవేదికలను పట్టించుకోరు.
ISA 17:9 ఆ రోజున ఇశ్రాయేలీయుల కారణంగా వారు విడిచిపెట్టిన బలమైన నిర్మానుష్యంగా పట్టణాలు పొదలు తుప్పలు పెరిగే స్థలాల్లా ఉంటాయి. అవి పాడైపోతాయి.
ISA 17:10 నీ రక్షకుడైన దేవుని నీవు మరచిపోయావు; నీ బలానికి ఆధారమైన బండను గుర్తు చేసుకోలేదు. కాబట్టి నీవు అందమైన తోటలు పెంచినా వాటిలో విదేశీ ద్రాక్షతీగెలు నాటినా,
ISA 17:11 నీవు వాటిని నాటిన రోజున అవి పెరిగేలా నీవు చేసినా, ఉదయాన నీవు వేసిన విత్తనాలు పూలు పూచేలా నీవు చేసినా, రోగం, తీరని దుఃఖం కలిగే రోజున పంట ఏమి లేనట్లుగా ఉంటుంది.
ISA 17:12 ఘోషిస్తున్న అనేక దేశాలకు శ్రమ వారు హోరెత్తిన సముద్రంలా ఘోషిస్తున్నారు! గర్జిస్తున్న ప్రజలకు శ్రమ వారు గొప్ప నీటి ప్రవాహాల్లా గర్జిస్తున్నారు!
ISA 17:13 ఉప్పొంగుతున్న నీటిలా ప్రజలు గర్జించినా ఆయన వారిని బెదిరించగా, వారు దూరంగా పారిపోతారు. కొండల మీది పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు, సుడిగాలికి గిరగిరా తిరుగుతూ ఎగిరిపోయే పిచ్చిమొక్కలా తరమబడతారు.
ISA 17:14 సాయంకాలంలో ఆకస్మిక భయం! ఉదయం కాక ముందే వారు కనుమరుగవుతారు! మమ్మల్ని దోచుకునేవారి భాగం ఇదే, మా సొమ్ము దొంగతనం చేసేవారికి దొరికేది ఇదే.
ISA 18:1 కూషు నదుల అవతల సందడి చేసే రెక్కల దేశమా, నీకు శ్రమ!
ISA 18:2 అది సముద్ర మార్గంలో నీటి మీద జమ్ము పడవలలో దూతలను పంపుతుంది. తొందరపడే దూతలారా! వారు నునుపైన చర్మం గల ఎత్తైన ప్రజల దగ్గరకు, దూరంలోనున్న భయపెట్టే ప్రజల దగ్గరకు, నదులు పారుచున్న దేశం కలిగి దౌర్జన్యం వింత భాష కలిగిన దేశం దగ్గరకు వెళ్లండి.
ISA 18:3 సమస్త లోకవాసులారా, భూలోక నివాసులారా, పర్వతాలమీద ఒక జెండాను ఎత్తినప్పుడు మీరు చూస్తారు, బూర ఊదినప్పుడు మీరు వింటారు.
ISA 18:4 యెహోవా నాతో చెప్పే మాట ఇది: “సూర్యకాంతిలోని తీవ్రమైన వేడిలా, వేసవి కోతకాలంలోని పొగమంచు మేఘంలా, నేను నిశ్శబ్దంగా నా నివాసస్థలం నుండి చూస్తాను.”
ISA 18:5 కోతకాలం రాకముందే, పువ్వు వాడిపోయినప్పుడు పువ్వు ద్రాక్షగా మారుతున్నప్పుడు ఆయన మడ్డికత్తులతో ద్రాక్షతీగెలను కత్తిరించి విస్తరించే తీగెలను తీసివేస్తారు.
ISA 18:6 అవి పర్వత పక్షులకు, భూమిమీది మృగాలకు విడిచిపెట్టబడతాయి; వాటిని వేసవి కాలమంతా పక్షులు, శీతాకాలమంతా భూమిమీది మృగాలు తింటాయి.
ISA 18:7 ఆ కాలంలో ఎత్తైన వారు నునుపైన చర్మం గల ప్రజలు దూరంలోనున్న భయపెట్టే ప్రజలు నదులు పారుచున్న దేశం కలిగి దౌర్జన్యం చేసి వింత భాష కలిగిన దేశం సైన్యాల యెహోవాకు కానుకలు తెస్తారు. సైన్యాల యెహోవా నామానికి నివాసస్థలమైన సీయోను పర్వతానికి ఆ కానుకలు తీసుకువస్తారు.
ISA 19:1 ఈజిప్టుకు వ్యతిరేకంగా ప్రవచనం: చూడండి, యెహోవా వేగంగల మేఘం ఎక్కి ఈజిప్టుకు వస్తున్నారు. ఈజిప్టు విగ్రహాలు ఆయన ఎదుట వణకుతాయి, ఈజిప్టు ప్రజల గుండెలు భయంతో కరిగిపోతాయి.
ISA 19:2 “నేను ఈజిప్టువారి మీదికి ఈజిప్టువారిని రేపుతాను, సోదరుని మీదికి సోదరుడు, పొరుగువారి మీదికి పొరుగువారు, పట్టణం మీదికి పట్టణం, రాజ్యం మీదికి రాజ్యం రేపుతాను.
ISA 19:3 ఈజిప్టువారు ఆత్మస్థైర్యం కోల్పోతారు, వారి ఆలోచనలను నాశనం చేస్తాను; వారు విగ్రహాలను, మరణించిన వారి ఆత్మలను, భవిష్యవాణి చెప్పేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదిస్తారు.
ISA 19:4 నేను ఈజిప్టువారిని క్రూరమైన అధికారి చేతికి అప్పగిస్తాను, భయంకరమైన రాజు వారిని పాలిస్తాడు” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.
ISA 19:5 సముద్రంలో నీళ్లు ఎండిపోతాయి, నదులు ఎండిపోయి పొడినేల అవుతాయి.
ISA 19:6 కాలువలు కంపుకొడతాయి; ఈజిప్టు కాలువలు ఇంకి ఎండిపోతాయి. రెల్లు, గడ్డి వాడిపోతాయి,
ISA 19:7 నైలు నది ప్రాంతంలో దాని ఒడ్డున ఉన్న మొక్కలు కూడా వాడిపోతాయి, నైలు తీరం వెంట ఉన్న ప్రతి పొలం వాడిపోయి దుమ్ములా కొట్టుకు పోయి ఇక కనబడవు.
ISA 19:8 జాలరులు మూల్గుతారు, దుఃఖిస్తారు, నైలు నదిలో గాలాలు వేసే వారందరు ఏడుస్తారు; నీటి మీద వలలు వేసేవారు విలపిస్తారు.
ISA 19:9 దువ్వెనతో చిక్కుతీసి జనపనారతో పని చేసేవారు నిరాశపడతారు, సన్నని నారతో అల్లేవారు నిరీక్షణ కోల్పోతారు.
ISA 19:10 బట్టలు తయారుచేసేవారు నిరుత్సాహపడతారు, కూలిపని చేసే వారందరు మనోవేదన పొందుతారు.
ISA 19:11 సోయను అధిపతులు మూర్ఖులు తప్ప మరేమీ కాదు; ఫరో సలహాదారులు అర్థంలేని సలహాలు ఇస్తారు. “నేను జ్ఞానులలో ఒకడిని, పూర్వపురాజుల శిష్యుడను” అని ఫరోతో మీరెలా చెప్తారు?
ISA 19:12 నీ జ్ఞానులు ఏమయ్యారు? సైన్యాల యెహోవా ఈజిప్టు గురించి నిర్ణయించిన దానిని వారు నీకు చూపించి, తెలియజేయనివ్వు.
ISA 19:13 సోయను అధిపతులు మూర్ఖులయ్యారు, మెంఫిసు నాయకులు మోసపోయారు. ఈజిప్టు గోత్రానికి మూలరాళ్లుగా ఉన్నవారు దానిని దారి తప్పేలా చేశారు.
ISA 19:14 యెహోవా వారి మీద భ్రమపరిచే ఆత్మను కుమ్మరించారు; ఒక త్రాగుబోతు తన వాంతిలో తూలిపడినట్లు, తాను చేసే పనులన్నిటిలో ఈజిప్టు తూలిపడేలా వారు చేస్తారు.
ISA 19:15 తల గాని తోక గాని తాటి మట్ట గాని జమ్ము రెల్లు గాని ఈజిప్టు కోసం ఎవరు ఏమి చేయలేరు.
ISA 19:16 ఆ రోజున ఈజిప్టువారు స్త్రీలలా బలహీనంగా అవుతారు. సైన్యాల యెహోవా వారిపై తన చేయి ఆడించడం చూసి వారు భయంతో వణికిపోతారు.
ISA 19:17 యూదా దేశం ఈజిప్టువారికి భయం కలిగిస్తుంది; తమకు వ్యతిరేకంగా సైన్యాల యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి యూదా గురించి విన్న ప్రతి ఒక్కరు భయపడతారు.
ISA 19:18 ఆ రోజున ఈజిప్టులో ఉండే అయిదు పట్టణాలు కనాను భాష మాట్లాడి, సైన్యాల యెహోవా వారమని ప్రమాణం చేస్తాయి. వాటిలో ఒకదాని పేరు సూర్యుని పట్టణము.
ISA 19:19 ఆ రోజున ఈజిప్టు దేశంలో మధ్యలో యెహోవాకు ఒక బలిపీఠం, దాని సరిహద్దులో యెహోవాకు ఒక స్మారక చిహ్నం ఉంటాయి.
ISA 19:20 అది ఈజిప్టు దేశంలో సైన్యాల యెహోవాకు సూచనగా, సాక్ష్యంగా ఉంటుంది. తమను బాధించేవారిని గురించి వారు దేవునికి మొరపెట్టగా, ఆయన వారిని కాపాడడానికి రక్షకుడిని విమోచకుడిని పంపుతారు, అతడు వారిని రక్షిస్తాడు.
ISA 19:21 ఈజిప్టువారికి యెహోవా తనను తాను బయలుపరచుకుంటారు; ఆ రోజున వారు యెహోవాను తెలుసుకుంటారు. వారు బలులు, భోజనార్పణలు సమర్పించి ఆయనను ఆరాధిస్తారు. వారు యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లిస్తారు.
ISA 19:22 యెహోవా ఈజిప్టును తెగులుతో బాధిస్తారు; వారిని బాధించి వారిని స్వస్థపరుస్తారు. వారు యెహోవా వైపు తిరుగుతారు, ఆయన వారి విన్నపాలు విని వారిని స్వస్థపరుస్తారు.
ISA 19:23 ఆ రోజున ఈజిప్టు నుండి అష్షూరుకు రహదారి ఉంటుంది. అష్షూరీయులు ఈజిప్టుకు, ఈజిప్టువారు అష్షూరుకు వస్తూ పోతుంటారు. ఈజిప్టువారు అష్షూరీయులు కలిసి ఆరాధిస్తారు.
ISA 19:24 ఆ రోజున, ఈజిప్టు అష్షూరుతో పాటు ఇశ్రాయేలు మూడవదిగా ఉండి, భూమిపై ఆశీర్వాదంగా ఉంటుంది.
ISA 19:25 సైన్యాల యెహోవా, “నా ప్రజలైన ఈజిప్టు వారలారా, నా చేతి పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా! మీరు ఆశీర్వదింపబడతారు” అని చెప్పి వారిని ఆశీర్వదిస్తారు.
ISA 20:1 అష్షూరు రాజైన సర్గోను తన సైన్యాధిపతిని పంపిన సంవత్సరంలో అతడు అష్డోదుకు వచ్చి, దానిపై దాడిచేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు.
ISA 20:2 ఆ సమయంలో యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా మాట్లాడారు. ఆయన, “నీ నడుముకున్న గోనె పట్టాను, నీ పాదాలకున్న చెప్పులు తీసివేయి” అన్నారు. అతడు అలాగే చేసి, బట్టలు తీసివేసి చెప్పులు లేకుండా నడిచాడు.
ISA 20:3 అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యెషయా ఈజిప్టు గురించి, కూషు గురించి సూచనగా సంకేతంగా మూడు సంవత్సరాలు బట్టలు, చెప్పులు లేకుండా తిరిగిన విధంగానే
ISA 20:4 అష్షూరు రాజు చెరపట్టబడిన ఈజిప్టువారిని, కూషు బందీలను, పిల్లలను పెద్దలను బట్టలు లేకుండా చెప్పులు లేకుండా తీసుకు పోతాడు. ఈజిప్టువారిని అవమానం కలిగేలా వారి పిరుదుల కనిపించేలా వారిని తీసుకెళ్తాడు.
ISA 20:5 కూషును నమ్ముకుని ఈజిప్టును బట్టి గర్వపడినవారు దిగులుపడి, సిగ్గుపడతారు.
ISA 20:6 ఆ రోజున ఆ తీరప్రాంతంలో నివసించేవారు, ‘అష్షూరు రాజు చేతిలో నుండి విడుదల, సహయం కోసం మనం పారిపోయి ఆశ్రయించిన వారికి ఏమి జరిగిందో చూడండి! ఇప్పుడు మనమెలా తప్పించుకోగలం?’ అని అంటారు.”
ISA 21:1 సముద్రపు తీరాన ఉన్న ఎడారికి వ్యతిరేకంగా ప్రవచనం: దక్షిణ దిక్కున సుడిగాలి వీచినట్లుగా ఎడారిలో నుండి భయంకరమైన దేశం నుండి దోచుకునేవాడు వస్తాడు.
ISA 21:2 భయంకరమైన దర్శనం నాకు వచ్చింది: మోసం చేసేవారు మోసం చేస్తారు, దోచుకొనేవారు దోచుకుంటారు. ఏలామూ, వెళ్లి దాడి చేయి! మెదీయా, ముట్టడించు! దాని మూలుగు అంతటిని నేను ఆపివేస్తాను.
ISA 21:3 కాబట్టి నా నడుము చాలా నొప్పిగా ఉంది, ప్రసవించే స్త్రీ వేదన నాకు కలిగింది; నేను విన్నదానిని బట్టి నేను తడబడ్డాను, నేను చూసిన దానిని బట్టి నేను దిగ్భ్రాంతి చెందాను.
ISA 21:4 నా గుండె దడదడలాడుతుంది భయంతో వణుకు పుడుతుంది; నేను ఇష్టమైన సంధ్యవేళ నాకు భయం పుట్టించింది.
ISA 21:5 వారు భోజనపు బల్లలను సిద్ధం చేశారు, వారు తివాసీలు పరిచారు, వారు తిని త్రాగుతారు! అధిపతులారా! లేవండి డాళ్లకు నూనె రాయండి.
ISA 21:6 ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “వెళ్లి కాపలా పెట్టండి అతడు చూసింది తెలియజేయాలి.
ISA 21:7 అతడు రథాలను గుర్రాల జట్లను గాడిదల మీద వచ్చేవారిని ఒంటెల మీద వచ్చేవారిని చూడగానే అతడు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి.”
ISA 21:8 కావలివాడు సింహంలా కేకలు వేసి “నా ప్రభువా, ప్రతిరోజు పగలంతా కావలి గోపురం మీద నిలబడుతున్నాను; రాత్రంతా కాపలా కాస్తూనే ఉన్నాను.
ISA 21:9 చూడు, జతలు జతలుగా గుర్రపు రౌతులతో కలిసి రథం మీద ఓ మనిషి వస్తున్నాడు అనగా అతడు ఇలా సమాధానం చెప్పాడు: ‘బబులోను కూలిపోయింది, కూలిపోయింది! దాని దేవతల విగ్రహాలన్నీ నేలమీద బద్దలై పడి ఉన్నాయి.’ ”
ISA 21:10 నూర్పిడి కళ్ళాల్లో నలిగిపోతున్న నా ప్రజలారా! సైన్యాల యెహోవా నుండి ఇశ్రాయేలు దేవుని నుండి నేను విన్నది నీకు చెప్తాను.
ISA 21:11 దూమాకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒకడు శేయీరులో నుండి నన్ను పిలుస్తున్నాడు, “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది?”
ISA 21:12 కావలివాడు, “ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. మీరు అడగాలనుకుంటే అడగండి; మరలా తిరిగి రండి” అని సమాధానం ఇస్తాడు.
ISA 21:13 అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం: అరేబియా ఎడారిలో బసచేసే దెదానీయులైన యాత్రికులారా,
ISA 21:14 మీరు దాహంతో ఉన్నవారికి నీళ్లు తీసుకురండి; తేమా దేశ నివాసులారా, పారిపోతున్నవారి కోసం ఆహారం తీసుకురండి.
ISA 21:15 ఖడ్గం నుండి, దూసిన ఖడ్గం నుండి, ఎక్కుపెట్టిన బాణాల నుండి, తీవ్రమైన యుద్ధం నుండి వారు పారిపోతారు.
ISA 21:16 ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “కూలివాని లెక్క ప్రకారం ఒక సంవత్సరంలోనే కేదారు వైభవమంతా ముగిసిపోతుంది.
ISA 21:17 కేదారు వీరులైన విలుకాండ్రలో కొంతమందే మిగిలి ఉంటారు.” ఇలా జరుగుతుందని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పారు.
ISA 22:1 దర్శనపు లోయకు వ్యతిరేకంగా ప్రవచనం: ఏ కారణంగా మీరందరు మేడల మీదికి ఎక్కారు?
ISA 22:2 కల్లోలంతో నిండిన పట్టణమా! కోలాహలం, ఉల్లాసంతో ఉన్న పట్టణమా! నీలో చనిపోయినవారు ఖడ్గం వలన చనిపోలేదు. యుద్ధంలో మరణించలేదు.
ISA 22:3 నీ నాయకులందరు కలిసి పారిపోయారు; విల్లు వాడకుండానే వారు పట్టుబడ్డారు. శత్రువు దూరంగా ఉండగానే పారిపోయిన వారందరిని, మీలో పట్టుబడిన వారందరిని కలిపి బందీలుగా తీసుకెళ్లారు.
ISA 22:4 అప్పుడు నేను, “నా నుండి దూరంగా వెళ్లండి; నన్ను గట్టిగా ఏడవనివ్వండి. నా ప్రజలకు కలిగిన నాశనం గురించి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి” అని చెప్తాను.
ISA 22:5 దర్శనపు లోయలో సైన్యాల అధిపతియైన యెహోవా నియమించిన రోజున కల్లోలం, తొక్కిసలాట, గందరగోళం ఉంటాయి, గోడలు కూలిపోతాయి పర్వతాల వైపు కేకలతో ఏడ్వడం ఉంటుంది.
ISA 22:6 ఏలాము రథసారధులతో గుర్రాలతో తన అంబులపొదిని నింపుకుంది. కీరు మనుష్యులు డాలును బయటకు తీశారు.
ISA 22:7 కాబట్టి మీకు ఇష్టమైన లోయల నిండా రథాలు ఉన్నాయి, గుర్రపురౌతులు పట్టణపు గుమ్మాల దగ్గర తమ స్థానాల్లో ఉన్నారు.
ISA 22:8 ప్రభువు యూదా నుండి రక్షణ కవచాన్ని తీసివేశారు, ఆ రోజున మీరు అరణ్య రాజభవనంలో ఉన్న ఆయుధాల వైపు చూశారు.
ISA 22:9 దావీదు పట్టణపు గోడలు చాలా స్థలాల్లో పాడైనట్లు చూశారు దిగువన ఉన్న కొలనులో మీరు నీటిని సమకూర్చారు.
ISA 22:10 మీరు యెరూషలేములోని భవనాలను లెక్కపెట్టి గోడను పటిష్టం చేయడానికి ఇళ్ళను పడగొట్టారు.
ISA 22:11 పాత కొలనులో నీటి కోసం మీరు రెండు గోడల మధ్య జలాశయం కట్టారు. కాని దానిని నిర్మించిన వ్యక్తి వైపు మీరు చూడలేదు. పూర్వకాలంలో దానిని ఆలోచించిన వ్యక్తిని మీరు లెక్కచేయలేదు.
ISA 22:12 ఆ రోజున ఏడ్వడానికి కన్నీరు కార్చడానికి తలలు గొరిగించుకోడానికి గోనెపట్ట కట్టుకోడానికి సైన్యాల అధిపతియైన యెహోవా మిమ్మల్ని పిలుస్తారు.
ISA 22:13 కాని మీరు, “రేపు చనిపోతాం కాబట్టి మనం తిని త్రాగుదాం” అని చెప్పి, పశువులను నరుకుతూ గొర్రెలను చంపుతూ, మాంసం తింటూ, ద్రాక్షరసం త్రాగుతూ, మీరు సంతోషించి ఉల్లసిస్తారు.
ISA 22:14 ప్రభువు, సైన్యాల యెహోవా బయలుపరిచింది ఇది: “నీ మరణించే రోజు వరకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు” అని సర్వశక్తిమంతుడైన సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.
ISA 22:15 సైన్యాల అధిపతియైన యెహోవా ఇలా అంటున్నారు: “నిర్వాహకుడు, అనగా రాజభవన నిర్వాహకుడైన షెబ్నా దగ్గరకు వెళ్లి అతనితో ఇలా చెప్పు:
ISA 22:16 నీవిక్కడేం చేస్తున్నావు నీకోసం ఇక్కడ సమాధిని ఎందుకు తొలిపించుకున్నావు? నీ సమాధిని ఎత్తైన స్థలంలో తొలిపించుకున్నావు? నీ విశ్రాంతి స్థలాన్ని బండపై ఎందుకు చెక్కించుకున్నావు? నీకు ఎవరు అనుమతి ఇచ్చారు?
ISA 22:17 “ఓ బలవంతుడా, యెహోవా నిన్ను గట్టిగా పట్టుకుని, వేగంగా విసిరివేస్తారు, జాగ్రత్త!
ISA 22:18 ఆయన నిన్ను ఒక బంతిలా దొర్లించి విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేస్తారు. అక్కడ నీవు చనిపోతావు, నీ గొప్ప రథాలు అక్కడే పడి ఉంటాయి; నీ యజమాని ఇంటికి అవమానాన్ని తెస్తావు.
ISA 22:19 నీ పని నుండి నేను నిన్ను తొలగిస్తాను, నీ హోదా నుండి త్రోసివేయబడతావు.
ISA 22:20 “ఆ రోజున నేను, నా సేవకుడైన హిల్కీయా కుమారుడైన ఎల్యాకీమును పిలిపించి,
ISA 22:21 నీ చొక్కా అతనికి తొడిగించి, నీ నడికట్టు అతనికి కట్టి, నీ అధికారాన్ని అతనికి ఇస్తాను. అతడు యెరూషలేములో నివసించేవారికి, యూదా ప్రజలకు తండ్రిగా ఉంటాడు.
ISA 22:22 నేను దావీదు ఇంటి తాళపు చెవిని అతని భుజం మీద ఉంచుతాను; అతడు తెరచిన దానిని ఎవరూ మూయలేరు. అతడు మూసివేసిన దానిని ఎవరూ తెరవలేరు.
ISA 22:23 బలమైన చోట మేకు కొట్టినట్లు నేను అతని స్థిరపరుస్తాను; అతడు తన తండ్రి ఇంటికి గౌరవాన్ని ఘనతను తెచ్చే సింహాసనంగా ఉంటాడు.
ISA 22:24 చిన్న గిన్నెలను పాత్రలను మేకుకు వ్రేలాడదీసినట్టు అతని కుటుంబ ఘనతను అతనిపై వ్రేలాడి ఉంటుంది.
ISA 22:25 “సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, ఆ రోజున బలమైన చోట స్థిరంగా కొట్టబడిన మేకు ఊడిపోయి క్రిందపడిపోతుంది. దానిపై ఉన్న బరువు తెగి క్రిందపడుతుంది.” ఇదే యెహోవా చెప్పిన మాట.
ISA 23:1 తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం: తర్షీషు ఓడలారా! రోదించండి: తూరు నాశనమయ్యింది, అది ఇల్లు గాని ఓడరేవు గాని లేకుండ మిగిలింది. కుప్ర దేశం నుండి ఈ విషయం వారికి తెలియజేయబడింది.
ISA 23:2 సముద్ర తీర వాసులారా, సీదోను వ్యాపారులారా, మౌనంగా ఉండండి, సముద్ర నావికులు మిమ్మల్ని సంపన్నులుగా చేశారు.
ISA 23:3 గొప్ప జలాల మీద షీహోరు ధాన్యం వచ్చింది; నైలు ప్రాంతంలో పండిన పంట తూరుకు ఆదాయం ఇచ్చింది, అది దేశాలకు వాణిజ్య కేంద్రంగా మారింది.
ISA 23:4 సీదోనూ, సముద్రపు కోట సిగ్గుపడండి, సముద్రం ఇలా మాట్లాడింది: “నేను ప్రసవ వేదన పడలేదు, పిల్లలు కనలేదు, కుమారులను పోషించలేదు కుమార్తెలను పెంచలేదు.”
ISA 23:5 వార్త ఈజిప్టుకు చేరినప్పుడు తూరు గురించి వారు వేదన పడతారు.
ISA 23:6 తర్షీషుకు వెళ్లండి; సముద్ర తీర వాసులారా దుఃఖపడండి.
ISA 23:7 మీకు ఉల్లాసం కలిగించిన పట్టణం ఇదేనా? పాతది, ప్రాచీన పట్టణం, దూరదేశంలో నివసించడానికి సుదూర ప్రయాణం చేసింది ఇదేనా?
ISA 23:8 తూరు కిరీటాలు పంచిపెట్టే పట్టణం, దాని వ్యాపారులు రాకుమారులు, దాని వర్తకులు భూమి మీద ప్రసిద్ధులు, అలాంటి తూరుకు వ్యతిరేకంగా ఎవరు ఆలోచన చేశారు?
ISA 23:9 తనకున్న అందాన్ని బట్టి కలిగిన గర్వాన్ని అణచడానికి భూమి మీద ప్రసిద్ధులందరిని అవమానపరచడానికి సైన్యాల యెహోవా ఇలా చేశారు.
ISA 23:10 తర్షీషు కుమారీ, నీ దేశానికి ఇక ఓడరేవు లేదు కాబట్టి నైలు నది దాటునట్లు మీ దేశానికి తిరిగి వెళ్లు.
ISA 23:11 యెహోవా సముద్రం మీద తన చేయి చాపి దాని రాజ్యాలు వణికేలా చేశారు. కనాను కోటలను నాశనం చేయడానికి ఆయన దాని గురించి ఆజ్ఞ ఇచ్చారు.
ISA 23:12 ఆయన ఇలా అన్నారు, “అణచివేతకు గురైన సీదోను కుమార్తె, ఇకపై నీకు సంతోషం ఉండదు. “నీవు లేచి కుప్రకు వెళ్లు, అక్కడ కూడా నీకు విశ్రాంతి దొరకదు.”
ISA 23:13 బబులోనీయుల దేశాన్ని చూడు, వారు తమ గుర్తింపును కోల్పోయారు! అష్షూరీయులు దానిని ఎడారి జీవులకు నివాసంగా చేశారు. వారు దానిలో ముట్టడి గోపురాలు కట్టించి, దాని కోటలు పడగొట్టి శిథిలాలుగా మార్చారు.
ISA 23:14 తర్షీషు ఓడలారా, రోదించండి; మీ కోట నాశనమయ్యింది.
ISA 23:15 ఒక రాజు జీవితకాలంలా డెబ్బై సంవత్సరాలు తూరు గురించి మరచిపోతారు. అయితే డెబ్బై సంవత్సరాలు ముగింపులో వేశ్యల పాటలో ఉన్నట్లుగా తూరుకు జరుగుతుంది:
ISA 23:16 “మరవబడిన వేశ్యా, సితారా తీసుకుని పట్టణంలో తిరుగు; నీవు జ్ఞాపకం వచ్చేలా సితారా మంచిగా వాయిస్తూ చాలా పాటలు పాడు.”
ISA 23:17 డెబ్బై సంవత్సరాల తర్వాత యెహోవా తూరు మీద దయ చూపిస్తారు. కాని అది తన లాభదాయకమైన వ్యభిచారానికి తిరిగివెళ్లి భూమిపై ఉన్న అన్ని రాజ్యాలతో వ్యాపారం చేస్తుంది.
ISA 23:18 అయినా దాని లాభం, దాని సంపాదన యెహోవాకు చెందుతుంది; వాటిని నిల్వ ఉంచరు, కూడబెట్టరు. దాని లాభాలు యెహోవా సన్నిధిలో నివసించేవారికి సమృద్ధి ఆహారం, విలువైన వస్త్రాలు అందించడానికి ఉపయోగించబడతాయి.
ISA 24:1 చూడండి, యెహోవా భూమిని పాడుచేసి నాశనం చేయబోతున్నారు; ఆయన దాని ఉపరితలాన్ని పాడుచేసి దానిలో నివసించేవారిని చెదరగొడతారు.
ISA 24:2 అందరికి ఒకేలా ఉంటుంది; ప్రజలకు కలిగినట్లే యాజకునికి, సేవకునికి కలిగినట్లే యజమానికి, సేవకురాలికి కలిగినట్లే యజమానురాలికి, కొనేవారికి కలిగినట్లే అమ్మేవారికి, అప్పు ఇచ్చేవారికి కలిగినట్లే అప్పు తీసుకునేవారికి, వడ్డీకి ఇచ్చేవారికి కలిగినట్లే వడ్డీకి తీసుకునేవారికి కలుగుతుంది.
ISA 24:3 భూమి పూర్తిగా పాడుచేయబడి పూర్తిగా దోచుకోబడుతుంది. యెహోవా ఈ మాట చెప్పారు.
ISA 24:4 భూమి ఎండిపోయి వాడిపోతుంది, లోకం క్షీణించి వాడిపోతుంది, ఆకాశాలు భూమితో పాటు క్షీణించిపోతాయి.
ISA 24:5 భూప్రజలును బట్టి భూమి అపవిత్రమైంది; వారు చట్టాలకు లోబడలేదు, వారు కట్టడలను ఉల్లంఘించారు వారు నిత్యనిబంధనను భంగం చేశారు.
ISA 24:6 కాబట్టి ఒక శాపం భూమిని మ్రింగివేస్తుంది; దాని ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి. కాబట్టి భూనివాసులు కాలిపోయారు కేవలం కొద్దిమంది మిగిలారు.
ISA 24:7 క్రొత్త ద్రాక్షరసం ఎండిపోతుంది, ద్రాక్షతీగె వాడిపోతుంది; సంతోషంగా ఉన్నవారు మూల్గుతారు.
ISA 24:8 ఆనందంతో చేసే తంబురల ధ్వనులు నిలిచిపోయాయి, కేకలు వేసే వారి ధ్వని ఆగిపోయింది ఆనందంగా ఉన్న సితార నిశ్శబ్దంగా ఉంది.
ISA 24:9 ఇక వారు పాటలు పాడుతూ ద్రాక్షరసం త్రాగరు; మద్యం త్రాగే వారికి అది చేదుగా మారింది.
ISA 24:10 శిథిలమైన పట్టణం నిర్జనంగా ఉంది; ప్రతి ఇంటి గుమ్మం మూయబడింది.
ISA 24:11 ద్రాక్షరసం కోసం వారు వీధుల్లో కేకలు వేస్తున్నారు; ఆనందమంతా దిగులుగా మారుతుంది, దేశం ఆనంద ధ్వనులన్నీ నిషేధించబడ్డాయి.
ISA 24:12 పట్టణం శిథిలాల్లో ఉన్నది, దాని గుమ్మం ముక్కలుగా విరిగిపోయింది.
ISA 24:13 ఒలీవ చెట్టుని దులిపినప్పుడు, ద్రాక్షపండ్ల కోత తర్వాత పరిగె పళ్ళు ఏరుకుంటున్నప్పుడు జరిగినట్లుగా భూమి మీద భూమి మీద ప్రజలందరి మధ్యలో ఇది జరుగుతుంది.
ISA 24:14 వారు తమ స్వరాలెత్తి ఆనందంతో కేకలు వేస్తారు; పశ్చిమ నుండి వారు యెహోవా గొప్పతనాన్ని కొనియాడుతారు.
ISA 24:15 కాబట్టి తూర్పున ఉన్నవారలారా, యెహోవాను ఘనపరచండి. సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి.
ISA 24:16 భూమి అంచుల నుండి మేము ఇలా పాడడం వింటున్నాము: “నీతిమంతునికి ఘనత.” అయితే నేను అన్నాను, “నేను చెడిపోయాను, చెడిపోయాను! నాకు శ్రమ! మోసగాళ్ళు ద్రోహం చేస్తారు, మోసగాళ్ళు మోసంతో ద్రోహం చేస్తారు!”
ISA 24:17 భూలోక ప్రజలారా! మీ కోసం భయం, గుంట, ఉరి వేచి ఉన్నాయి.
ISA 24:18 భయంకరమైన శబ్దం విని ఎవరైతే పారిపోతారో వారు గుంటలో పడతారు; ఎవరైతే గుంటలో నుండి పైకి వస్తారో, వారు ఉరిలో చిక్కుకుంటారు. ఆకాశపు తూములు తెరవబడ్డాయి భూమి పునాదులు కదిలాయి.
ISA 24:19 భూమి బద్దలై పోయింది, భూమి ముక్కలుగా చీలిపోయింది, భూమి భయంకరంగా అదురుతుంది.
ISA 24:20 భూమి త్రాగుబోతులా తూలుతుంది, గాలికి ఊగే పాకలా ఇటు అటు ఊగుతుంది. దాని తిరుగుబాటు అపరాధం దానిపై బరువుగా ఉంది అది ఇక లేవనంతగా పడిపోతుంది.
ISA 24:21 ఆ రోజున యెహోవా పైన ఆకాశాల్లో ఉన్న శక్తులను, భూమి మీద ఉన్న రాజులను శిక్షిస్తారు.
ISA 24:22 చెరసాలలో బంధించబడిన ఖైదీలవలె వారు చెరసాలలో వేయబడతారు. చాలా రోజులు అక్కడ ఉన్న తర్వాత వారు శిక్షించబడతారు.
ISA 24:23 చంద్రుడు దిగులు చెందుతాడు సూర్యుడు సిగ్గుపడతాడు; సైన్యాల యెహోవా సీయోను కొండమీద యెరూషలేములో, దాని పెద్దల ఎదుట గొప్ప మహిమతో రాజ్యమేలుతారు.
ISA 25:1 యెహోవా, మీరే నా దేవుడు; నేను మిమ్మల్ని ఘనపరచి మీ నామాన్ని స్తుతిస్తాను, పరిపూర్ణ నమ్మకత్వంతో మీరు ఎంతో కాలం క్రితం ఆలోచించిన అద్భుతాలను మీరు చేశారు.
ISA 25:2 మీరు పట్టణాన్ని శిథిలాల కుప్పగా కోట ఉన్న పట్టణాన్ని పాడైన దానిగా, విదేశీయుల దుర్గాన్ని పట్టణంగా ఉండకుండా చేశారు; అది ఎప్పటికీ తిరిగి కట్టబడదు.
ISA 25:3 కాబట్టి బలమైన జనాంగాలు మిమ్మల్ని గౌరవిస్తారు; క్రూరమైన దేశాల పట్టణాలు మీకు భయపడతాయి.
ISA 25:4 మీరు పేదవారికి ఆశ్రయంగా ఉన్నారు, అవసరతలో ఉన్నవారికి తమ బాధలో మీరు ఆశ్రయంగా ఉన్నారు, తుఫానులో ఉన్నవారికి ఆశ్రయంగా, వేడి నుండి తప్పించే నీడగా ఉన్నారు. ఎందుకంటే, క్రూరుల శ్వాస గోడకు తాకే తుఫానులా,
ISA 25:5 ఎడారి వేడిలా ఉంటుంది. మీరు విదేశీయుల ప్రగల్భాలను అణచివేశారు; మేఘాల నీడ ద్వారా వేడి తగ్గునట్లు క్రూరుల పాట నిలిపివేయబడుతుంది.
ISA 25:6 ఈ పర్వతం మీద సైన్యాల యెహోవా ప్రజలందరి కోసం క్రొవ్విన వాటిలో విందు సిద్ధం చేస్తారు ఈ విందులో పాత ద్రాక్షరసం ఉంటుంది లేత మాంసం, ఎంపిక చేసిన ద్రాక్షరసం ఉంటాయి.
ISA 25:7 ఈ పర్వతంపై ఆయన ప్రజలందరి ముఖాల మీద ఉన్న ముసుగును సమస్త దేశాల మీద ఉన్న తెరను తీసివేస్తారు;
ISA 25:8 శాశ్వతంగా ఆయన మరణాన్ని మ్రింగివేస్తారు. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది కన్నీటిని తుడిచివేస్తారు; సమస్త భూమి మీద నుండి తన ప్రజల అవమానాన్ని తొలగిస్తారు. యెహోవా ఇది తెలియజేశారు.
ISA 25:9 ఆ రోజున వారు ఇలా అంటారు, “నిజంగా ఈయనే మన దేవుడు ఈయనను మనం నమ్ముకున్నాం, ఈయన మనల్ని రక్షించారు. మనం నమ్మిన యెహోవా ఈయనే; ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆనందిద్దాము.”
ISA 25:10 యెహోవా చేయి ఈ పర్వతంపై నిలిచి ఉంటుంది; అయితే పెంటకుప్పలో గడ్డిని త్రొక్కినట్లు, మోయాబీయులు తమ దేశంలోనే త్రొక్కబడతారు.
ISA 25:11 ఈతగాళ్లు ఈదడానికి తమ చేతులు చాపినట్లు వారు దాని మధ్య తమ చేతులు చాపుతారు. వారి చేతులు యుక్తితో ఉన్నా దేవుడు వారి గర్వాన్ని అణచివేస్తారు.
ISA 25:12 మోయాబూ, నీ ఎత్తైన కోటలను ఆయన పడగొడతారు. వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిలో పడవేస్తారు.
ISA 26:1 ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు: మనకు ఒక బలమైన పట్టణం ఉంది; దేవుడు రక్షణను దానికి గోడలుగా, ప్రాకారాలుగా ఉంచుతారు.
ISA 26:2 నీతిగల దేశం నమ్మదగిన దేశం ప్రవేశించేలా గుమ్మాలు తీయండి.
ISA 26:3 మీరు స్థిరమైన మనస్సుగల వారిని సంపూర్ణ సమాధానంతో కాపాడతారు, ఎందుకంటే వారు మీపై విశ్వాసముంచారు.
ISA 26:4 యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ కాబట్టి నిత్యం యెహోవాను నమ్ముకోండి.
ISA 26:5 ఆయన ఎత్తైన స్ధలంలో నివసించేవారిని అణచివేస్తారు ఎత్తైన కోటలను పడగొడతారు; ఆయన దానిని నేల మట్టుకు పడగొట్టి దానిని ధూళిలో కలుపుతారు.
ISA 26:6 అణచివేయబడినవారి కాళ్లతో పేదవారి అడుగులతో అది త్రొక్కబడుతుంది.
ISA 26:7 నీతిమంతుల దారి సమంగా ఉంటుంది; యథార్థవంతుడా, మీరు నీతిమంతుల మార్గం సరాళం చేస్తావు.
ISA 26:8 అవును యెహోవా, మీ న్యాయవిధుల మార్గాల్లో నడుస్తూ మేము మీ కోసం వేచి ఉన్నాము; మీ నామం మీ కీర్తి మా హృదయాల కోరిక.
ISA 26:9 రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది; ఉదయం నా ఆత్మ మిమ్మల్ని వెదుకుతుంది. మీ తీర్పులు భూమి మీదికి వచ్చినప్పుడు, ఈ లోక ప్రజలు నీతిని నేర్చుకుంటారు.
ISA 26:10 కాని చెడ్డవారికి దయ చూపిస్తే, వారు నీతిని నేర్చుకోరు. యథార్థమైన దేశంలో ఉన్నా కూడా వారు చెడు చేస్తూనే ఉంటారు యెహోవా ఘనతను వారు పట్టించుకోరు.
ISA 26:11 యెహోవా! మీ చేయి ఎత్తుగా ఎత్తబడింది, కాని వారు దానిని చూడరు. మీ ప్రజల పట్ల మీకున్న ఆసక్తి చూసి వారు సిగ్గుపడతారు; మీ శత్రువుల కోసం కేటాయించబడిన అగ్ని వారిని కాల్చివేయాలి.
ISA 26:12 యెహోవా! మీరు మాకు సమాధానాన్ని స్థాపిస్తారు; మేము సాధించిందంతా మీరు మాకోసం చేసిందే.
ISA 26:13 యెహోవా! మా దేవా! మీరు కాకుండా వేరే ప్రభువులు మమ్మల్ని పాలించారు, కాని మేము మీ నామాన్ని మాత్రమే ఘనపరుస్తాము.
ISA 26:14 వారు చనిపోయారు, మరల బ్రతకరు; వారి ఆత్మలు లేవవు. మీరు వారిని శిక్షించి నాశనం చేశారు; మీరు వారి జ్ఞాపకాలన్నిటిని తుడిచివేశారు.
ISA 26:15 యెహోవా, మీరు దేశాన్ని వృద్ధిచేశారు; మీరు దేశాన్ని వృద్ధిచేశారు. మీరు మీకే మహిమ సంపాదించుకున్నారు; మీరు దేశపు సరిహద్దులన్నిటిని విస్తరింపజేశారు.
ISA 26:16 యెహోవా! వారు తమ బాధలో మీ దగ్గరకు వచ్చారు; మీరు వారిని శిక్షించినప్పుడు వారు దీన ప్రార్థనలు చేశారు.
ISA 26:17 గర్భిణి స్త్రీ ప్రసవానికి సిద్ధమైనప్పుడు ఆ నొప్పికి బాధతో కేకలు వేసినట్లు యెహోవా మీ సన్నిధిలో మేము ఉన్నాము.
ISA 26:18 మేము గర్భం ధరించి ప్రసవవేదన పడ్డాము. కాని గాలికి జన్మనిచ్చాము. మేము భూమికి రక్షణను తీసుకురాలేదు, ఈ లోక ప్రజలు పుట్టలేదు.
ISA 26:19 కాని యెహోవా, చనిపోయిన మీ వారు బ్రతుకుతారు; వారి శరీరాలు పైకి లేస్తాయి మట్టిలో నివసిస్తున్నవారు, మేల్కొని సంతోషించాలి. మీ మంచు ఉదయపు మంచు వంటిది; భూమి తన మృతులకు జన్మనిస్తుంది.
ISA 26:20 నా ప్రజలారా! మీ గదిలోకి వెళ్లి మీ వెనక తలుపులు వేసుకోండి; ఆయన ఉగ్రత పోయే వరకు కొంతకాలం మీరు దాక్కోండి.
ISA 26:21 ఇదిగో వారి పాపాలను బట్టి భూప్రజలను శిక్షించడానికి యెహోవా తన నివాసంలో నుండి వస్తున్నారు. భూమి తనపై చిందిన రక్తాన్ని వెల్లడిస్తుంది; భూమి చంపబడిన వారిని ఇకపై దాచదు.
ISA 27:1 ఆ రోజున యెహోవా భయంకరమైన, గొప్పదైన శక్తిగల తన ఖడ్గంతో లెవియాథన్ అనే ఎగిరే పాము, లెవియాథన్ అనే చుట్టుకునే పామును ఆయన శిక్షిస్తారు. ఆయన సముద్రపు మృగాన్ని చంపుతారు.
ISA 27:2 ఆ రోజున “ఫలభరితమైన ద్రాక్షతోట గురించి పాడండి:
ISA 27:3 యెహోవానైన నేను దానిని కాపాడతాను; నేను దానికి క్రమంగా నీరు పెడతాను. ఎవరూ దానిని పాడు చేయకుండ రాత్రి పగలు కాపలా కాస్తాను.
ISA 27:4 నాకు కోపం లేదు. ఒకవేళ గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటే యుద్ధం చేయడానికి వాటికి ఎదురు వెళ్తాను వాటన్నిటిని కాల్చివేస్తాను.
ISA 27:5 ఆశ్రయం కోసం వారు నా దగ్గరకు రానివ్వండి; వారు నాతో సమాధానపడాలి, అవును, వారు నాతో సమాధానపడాలి.”
ISA 27:6 రాబోయే రోజుల్లో యాకోబు వేరు పారుతుంది, ఇశ్రాయేలు చిగురించి వికసించి లోకమంతటిని ఫలంతో నింపుతుంది.
ISA 27:7 ఇశ్రాయేలును కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు, యెహోవా ఇశ్రాయేలును కొట్టారా? ఇశ్రాయేలును చంపినవారిని ఆయన చంపినట్లు ఇశ్రాయేలును చంపరా?
ISA 27:8 మీరు యుద్ధంతో వెళ్లగొట్టి దానిని శిక్షించారు తూర్పు నుండి బలమైన గాలి వీచినట్లు ఆయన తన బలమైన గాలితో దానిని తరిమికొట్టారు.
ISA 27:9 ఈ విధంగా యాకోబు అపరాధం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది, ఇదంతా అతని పాప పరిహారానికి కలిగే సంపూర్ణ ఫలం ఇదే: సున్నపురాయిని ముక్కలుగా నలగ్గొట్టినట్లు, అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని చేసినప్పుడు అషేరా స్తంభాలు కాని ధూప బలిపీఠాలు కాని మిగిలి ఉండవు.
ISA 27:10 బలమైన పట్టణం ఒంటరిగా నిలిచిపోతుంది, పాడుబడిన స్థలంగా మారి అరణ్యంలా విడిపెట్టబడుతుంది. అక్కడ దూడలు మేస్తాయి అక్కడే అవి పడుకుంటాయి; అవి దాని చెట్ల కొమ్మలు తినివేస్తాయి.
ISA 27:11 దాని కొమ్మలు ఎండి విరిగిపోతాయి స్త్రీలు వచ్చి వాటితో మంట పెడతారు. ఎందుకంటే, ఈ ప్రజలు వివేచన లేనివారు; కాబట్టి వారిని రూపించినవాడు వారిపై జాలిపడరు. వారి సృష్టికర్త వారికి దయ చూపించరు.
ISA 27:12 ఆ రోజున యెహోవా పారుతున్న యూఫ్రటీసు నది నుండి ఈజిప్టు వాగువరకు నూర్చుతారు. ఓ ఇశ్రాయేలూ! నీవు ఒక్కొక్కరిగా సమకూర్చబడతావు.
ISA 27:13 ఆ రోజున ఓ గొప్ప బూరధ్వని వినబడుతుంది. అష్షూరులో నశిస్తున్నవారు ఈజిప్టులో చెరపట్టబడినవారు వచ్చి యెరూషలేములోని పరిశుద్ధ పర్వతం మీద యెహోవాను ఆరాధిస్తారు.
ISA 28:1 ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటానికి శ్రమ, వాడిపోతున్న పువ్వు వంటి అతని మహిమగల సౌందర్యానికి శ్రమ, ద్రాక్షరసం మత్తులో పడిపోయిన వారి సంపన్న లోయ తలమీద ఉన్న కిరీటానికి శ్రమ.
ISA 28:2 చూడండి, బలం, పరాక్రమం కలిగిన ఒకడు ప్రభువుకు ఉన్నాడు. వడగండ్లు, తీవ్రమైన గాలులు కుండపోత వర్షం, తీవ్రమైన వరద కొట్టివేసినట్లు ఆయన తన బలంతో దానిని నేలమీద పడవేస్తారు.
ISA 28:3 ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటం కాళ్లతో త్రొక్కబడుతుంది.
ISA 28:4 ఫలవంతమైన లోయ తలపై ఉన్న వాడిపోయిన పువ్వు లాంటి అతని వైభవం కోతకాలం రాకముందే పండిన అంజూర పండులా ఉంటుంది. ప్రజలు వాటిని చూడగానే తమ చేతిలోనికి తీసుకుని వెంటనే వాటిని మ్రింగివేస్తారు.
ISA 28:5 ఆ రోజున సైన్యాల యెహోవా మిగిలిన తన ప్రజలకు తానే మహిమగల కిరీటంగా సుందరమైన పూల కిరీటంగా ఉంటారు.
ISA 28:6 ఆయన న్యాయస్థానంపై కూర్చునే వారికి వివేచన ఆత్మగా గుమ్మం దగ్గరే యుద్ధాన్ని త్రిప్పికొట్టేవారికి బలానికి మూలంగా ఉంటారు.
ISA 28:7 అయితే వీరు కూడ ద్రాక్షరసం త్రాగి తూలుతారు తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు తడబడతారు యాజకులు ప్రవక్తలు మద్యం మత్తులో తూలుతారు ద్రాక్షరసం వలన అయోమయంగా ఉంటారు; మద్యం మత్తులో తడబడతారు దర్శనం వచ్చినప్పుడు తూలుతారు తీర్పు చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు తడబడతారు.
ISA 28:8 వారి బల్లలన్నీ వాంతితో నిండి ఉన్నాయి మురికి లేనిచోటు ఉండదు.
ISA 28:9 “ఆయన ఎవరికి బోధించే ప్రయత్నం చేస్తున్నారు? ఆయన తన సందేశాన్ని ఎవరికి వివరిస్తున్నారు? తల్లి రొమ్ము విడిచిన వారికా, స్తన్యమును విడిచిన వారికా?
ISA 28:10 ఇది చేయండి, అది చేయండి దీనికి ఈ నియమం, దానికి ఆ నియమం; కొంత ఇక్కడ, కొంత అక్కడ” అని వారు అనుకుంటారు.
ISA 28:11 అప్పుడు పరదేశీయుల పెదాలతో వింత భాషలో దేవుడు ఈ ప్రజలతో మాట్లాడతారు.
ISA 28:12 గతంలో ఆయన వారితో, “ఇది విశ్రాంతి స్థలం, అలసిపోయినవారిని విశ్రాంతి తీసుకోనివ్వండి; ఇది నెమ్మది దొరికే స్థలం” అని చెప్పారు కాని వారు వినలేదు.
ISA 28:13 కాబట్టి వారికి యెహోవా వాక్కు ఇలా అవుతుంది: ఇది చేయాలి, అది చేయాలి దీనికి ఆజ్ఞ, దానికి ఆజ్ఞ కొంత ఇక్కడ కొంత అక్కడ అప్పుడు వారు వెళ్తుండగా వెనుకకు పడతారు; వారు గాయపరచబడతారు, ఉచ్చులో పడతారు, పట్టబడతారు.
ISA 28:14 కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ ప్రజలను పాలిస్తున్న ఎగతాళి చేసేవారలారా, యెహోవా వాక్కు వినండి.
ISA 28:15 “మేము చావుతో నిబంధన చేసుకున్నాం, పాతాళంతో ఒప్పందం చేసుకున్నాము. ప్రమాదం ప్రవాహంలా వేగంగా వచ్చినప్పుడు అది మమ్మల్ని తాకదు, ఎందుకంటే అబద్ధాన్ని మాకు అండగా చేసుకున్నాం, అసత్యాన్ని మా దాగు స్థలంగా చేసుకున్నాం” అని మీరు అతిశయిస్తున్నారు.
ISA 28:16 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని, పరీక్షించబడిన రాయిని వేశాను, అది స్థిరమైన పునాదికి అమూల్యమైన మూలరాయి; దానిపై నమ్మకముంచేవారు ఎప్పుడూ భయాందోళనలకు గురికారు.
ISA 28:17 నేను న్యాయాన్ని కొలమానంగా, నీతిని మట్టపు గుండుగా చేస్తాను: వడగండ్లు మీ అబద్ధం అనే ఆశ్రయాన్ని తుడిచివేస్తాయి. మీ దాగుచోటు నీటికి కొట్టుకుపోతుంది.
ISA 28:18 చావుతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది; పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం నిలవదు. ప్రవాహంలా శాపం మీ మీదికి వచ్చినప్పుడు మీరు దానిచే కొట్టబడతారు.
ISA 28:19 అది వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఈడ్చుకెళ్తుంది; ప్రతి ఉదయం, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది ఈడ్చుకెళ్తుంది.” ఈ సందేశాన్ని గ్రహించినప్పుడు చాలా భయం పుడుతుంది.
ISA 28:20 పడుకోడానికి మంచం పొడవు సరిపోదు. కప్పుకోడానికి దుప్పటి వెడల్పు చాలదు.
ISA 28:21 నిజంగా తన పనిని తన ఆశ్చర్యకరమైన పనిని అపూర్వమైన తన పని చేయడానికి ఆయన పెరాజీము అనే కొండమీద లేచినట్లుగా యెహోవా లేస్తారు. గిబియోను లోయలో ఆయన రెచ్చిపోయినట్లు రెచ్చిపోతారు.
ISA 28:22 ఇప్పుడు మీ ఎగతాళి మానండి లేదంటే మీ సంకెళ్ళు మరింత భారమవుతాయి; భూమంతా ఖచ్చితంగా నాశనం చేయబడుతుందని సైన్యాల అధిపతియైన యెహోవా నాకు చెప్పారు.
ISA 28:23 జాగ్రత్తగా నా మాట వినండి; నేను చెప్పేది శ్రద్ధగా వినండి.
ISA 28:24 రైతు నాటడానికి ఎప్పుడూ తన పొలాన్ని దున్నుతూనే ఉంటాడా? అతడు మట్టి పెల్లలు ఎప్పుడూ పగులగొడుతూనే ఉంటాడా?
ISA 28:25 అతడు నేల చదును చేసిన తర్వాత సోంపు, జీలకర్ర విత్తనాలు చల్లడా? గోధుమలను వాటి స్థలంలో నాటడా? యవలను వాటి చోట వేయడా? పొలం అంచుల్లో ధాన్యం నాటడా?
ISA 28:26 అతని దేవుడు అతనికి నేర్పిస్తారు సరిగా ఎలా చేయాలో ఆయనే అతనికి బోధిస్తారు.
ISA 28:27 సోంపును యంత్రంతో నూర్చరు, జీలకర్ర మీద బండి చక్రం నడిపించరు; కర్రతో సోంపును దుడ్డుకర్రతో జీలకర్రను కొట్టి దులుపుతారు.
ISA 28:28 రొట్టె చేయడానికి ధాన్యాన్ని దంచాలి; కాబట్టి ఎప్పుడూ దానిని నూర్చుతూనే ఉండరు. నూర్చే బండి చక్రాలు దానిపై నడిపిస్తారు, కాని వాటిని పిండి చేయడానికి గుర్రాలను ఉపయోగించరు.
ISA 28:29 ఇదంతా సైన్యాల యెహోవా నుండి నేర్చుకుంటారు, ఆయన ఆలోచన అద్భుతం, ఆయన జ్ఞానం గొప్పది.
ISA 29:1 అరీయేలుకు శ్రమ దావీదు శిబిరం వేసుకున్న అరీయేలు పట్టణానికి శ్రమ! సంవత్సరం తర్వాత సంవత్సరం గడవనివ్వండి పండుగలు క్రమంగా జరుగనివ్వండి.
ISA 29:2 అయినా నేను అరీయేలును ముట్టడిస్తాను; అది దుఃఖించి రోదిస్తుంది. అది నాకు అగ్నిగుండంలా అవుతుంది.
ISA 29:3 నీకు వ్యతిరేకంగా అన్నివైపులా నేను శిబిరం ఏర్పాటు చేస్తాను; గోపురాలతో నిన్ను చుట్టుముట్టి నీకు వ్యతిరేకంగా ముట్టడి దిబ్బలు ఏర్పాటు చేస్తాను.
ISA 29:4 అప్పుడు నీవు క్రిందపడి నేలపై నుండి మాట్లాడతావు; నీ మాట ధూళినుండి గొణుగుతున్నట్లు ఉంటుంది. దయ్యం స్వరంలా నీ స్వరం నేల నుండి వస్తుంది; ధూళినుండి నీ మాట గుసగుసలాడుతుంది.
ISA 29:5 కాని నీ శత్రువులు సన్నటి ధూళిలా మారతారు; క్రూరుల గుంపు ఎగిరిపోయే పొట్టులా ఉంటుంది. హఠాత్తుగా ఒక క్షణంలోనే ఇది జరుగుతుంది.
ISA 29:6 ఉరుముతో, భూకంపంతో, గొప్ప శబ్దంతో సుడిగాలి తుఫానుతో దహించే అగ్నిజ్వాలలతో సైన్యాల యెహోవా వస్తారు.
ISA 29:7 అప్పుడు అరీయేలుతో యుద్ధం చేసే అన్ని దేశాల గుంపులు దాని మీద దాడి చేసి దాని కోటను ముట్టడించేవారు ఒక కలలా ఉంటారు రాత్రివేళలో వచ్చే దర్శనంలా ఉంటారు.
ISA 29:8 ఆకలితో ఉన్నవారు తింటున్నట్లు కల కని కాని ఇంకా ఆకలితోనే మేల్కొన్నట్లు, దాహంతో ఉన్నవారు త్రాగినట్లు కల కని ఇంకా అలసిపోయి దాహంతోనే మేల్కొన్నట్లు ఉంటారు. సీయోను కొండకు వ్యతిరేకంగా యుద్ధం చేసే అన్ని దేశాల గుంపులకు ఇలా ఉంటుంది.
ISA 29:9 నివ్వెరపోండి, ఆశ్చర్యపడండి. మిమ్మల్ని మీరు చూపులేని గ్రుడ్డివారిగా చేసుకోండి; ద్రాక్షరసం త్రాగకుండానే మత్తులో ఉండండి, మద్యపానం చేయకుండానే తూలుతూ ఉండండి.
ISA 29:10 యెహోవా మీకు గాఢనిద్ర కలిగించారు: మీకు కళ్లుగా ఉన్న ప్రవక్తలను ఆయన మూసివేశారు; మీ తలలుగా ఉన్న దీర్ఘదర్శులకు ఆయన ముసుగు వేశారు.
ISA 29:11 మీకు ఈ దర్శనమంతా ముద్ర వేసిన గ్రంథంలోని మాటల్లా ఉంది. మీరు దానిని చదవగలిగిన వారికి ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నేను చదవలేను; అది ముద్రించబడింది” అని జవాబిస్తారు.
ISA 29:12 చదవడం రాని వానికి గ్రంథపుచుట్ట ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నాకు చదవడం రాదు” అని జవాబిస్తారు.
ISA 29:13 ప్రభువు ఇలా అంటున్నారు: “ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు. పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కాని వారి హృదయాలు నా నుండి దూరంగా ఉన్నాయి. వారికి బోధించబడిన మానవ నియమాల ప్రకారం మాత్రమే నా పట్ల భయభక్తులు చూపుతున్నారు.
ISA 29:14 కాబట్టి నేను మరొకసారి ఈ ప్రజలను ఆశ్చర్యాలతో ఆశ్చర్యపరుస్తాను; జ్ఞానుల జ్ఞానం నశిస్తుంది వివేకుల వివేకం మాయమైపోతుంది.”
ISA 29:15 తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా దాచడానికి గొప్ప లోతుల్లోకి వెళ్లే వారికి శ్రమ. “మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు తెలుసుకుంటారు?” అని అనుకుని, చీకటిలో తమ పనులు చేసేవారికి శ్రమ.
ISA 29:16 మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు కుమ్మరిని మట్టితో సమానంగా చూస్తారు! చేయబడిన వస్తువు దానిని చేసినవానితో, “నీవు నన్ను చేయలేదు” అని అనవచ్చా? కుండ కుమ్మరితో, “నీకు ఏమి తెలియదు” అని అనవచ్చా?
ISA 29:17 ఇంకా కొంతకాలం తర్వాత లెబానోను సారవంతమైన పొలంగా, సారవంతమైన పొలం అడవిగా మారదా?
ISA 29:18 ఆ రోజున చెవిటివారు గ్రంథంలోని మాటలు వింటారు, చీకటిలో చిమ్మ చీకటిలో గ్రుడ్డివారి కళ్లు చూస్తాయి.
ISA 29:19 మరోసారి దీనులు యెహోవాలో సంతోషిస్తారు; మనుష్యుల్లో పేదవారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిలో ఆనందిస్తారు.
ISA 29:20 దయలేని మనుష్యులు అదృశ్యమవుతారు, హేళన చేసేవారు మాయమవుతారు చెడు చేయడానికి ఇష్టపడేవారందరు,
ISA 29:21 ఒక వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యమిచ్చేవారు, న్యాయస్థానంలో మధ్యవర్తిత్వం చేసేవారిని వలలో వేసుకునేవారు అబద్ధసాక్ష్యంతో అమాయకులకు న్యాయం జరుగకుండా చేసేవారు తొలగించబడతారు.
ISA 29:22 కాబట్టి అబ్రాహామును విడిపించిన యెహోవా యాకోబు వారసుల గురించి చెప్పే మాట ఇదే: “ఇకపై యాకోబు సిగ్గుపడడు; ఇకపై వారి ముఖాలు చిన్నబోవు.
ISA 29:23 వారు వారి పిల్లల మధ్య నేను చేసే కార్యాలను చూసినప్పుడు, వారు నా నామాన్ని పరిశుద్ధపరుస్తారు: యాకోబు పరిశుద్ధ దేవుని ఘనపరుస్తారు, ఇశ్రాయేలు దేవునికి భయపడతారు.
ISA 29:24 ఆత్మలో దారి తప్పినవారు వివేకులవుతారు; సణిగేవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు.”
ISA 30:1 యెహోవా ఇలా అంటున్నారు, “మూర్ఖులైన పిల్లలకు శ్రమ, వారు నావి కాని ఆలోచనలు చేస్తారు, నా ఆత్మ నియమించని పొత్తు చేసుకుంటూ పాపానికి పాపం జత చేస్తున్నారు;
ISA 30:2 వారు నన్ను సంప్రదించకుండా ఈజిప్టుకు వెళ్తారు; వారు సహాయం కోసం ఫరో కాపుదల కోసం చూస్తారు, ఆశ్రయం కోసం ఈజిప్టు నీడ కోసం చూస్తారు.
ISA 30:3 కాని ఫరో ఇచ్చే రక్షణ మీకు సిగ్గు కలిగిస్తుంది, ఈజిప్టు నీడ మీకు అవమానంగా ఉంటుంది.
ISA 30:4 వారి అధిపతులు సోయనులో ఉన్నా, వారి రాయబారులు హనేసు చేరుకున్నా
ISA 30:5 వారికి సహాయకరంగా ఉపయోగకరంగా ఉండకుండా అవమానాన్ని సిగ్గును కలిగించే ప్రజల కారణంగా వారందరు సిగ్గుపరచబడతారు.”
ISA 30:6 దక్షిణ దేశంలోని జంతువుల గురించి ప్రవచనం: సింహాలు ఆడ సింహాలు, నాగుపాములు ఎగిరే సర్పాలు, కష్టాలు బాధలున్న దేశం గుండా రాయబారులు, గాడిదల వీపుల మీద తమ ఆస్తిని ఒంటెల మూపుల మీద తమ సంపదలను ఎక్కించుకొని తమకు లాభం కలిగించని ఆ దేశానికి,
ISA 30:7 సహాయం వలన ప్రయోజనం లేని ఆ ఈజిప్టుకు వెళ్తారు. కాబట్టి నేను దానిని ఏమి చేయని రాహాబు అని పిలుస్తాను.
ISA 30:8 ఇప్పుడు వెళ్లు, రాబోయే రోజుల్లో శాశ్వతమైన సాక్షంగా ఉండేలా వారి కోసం పలక మీద దీనిని వ్రాయి వీటిని గ్రంథస్తం చేయి.
ISA 30:9 ఎందుకంటే వీరు తిరుగుబాటు చేసే ప్రజలు, మోసపూరిత పిల్లలు, యెహోవా హెచ్చరికకు లోబడడానికి ఇష్టపడని పిల్లలు.
ISA 30:10 వారు దీర్ఘదర్శులతో, “ఇకపై దర్శనాలు చూడవద్దు!” అంటారు. అలాగే ప్రవక్తలతో, “సరియైనదాని గురించి ఇకపై దర్శనాలు ఇవ్వవద్దు! అంటారు. మాకు అనుకూలమైన విషయాలు భ్రాంతి కలిగించే ప్రవచనాలు తెలియజేయండి.
ISA 30:11 మా దారిని వదలండి, ఈ మార్గం నుండి తొలగిపోండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి చెప్తూ మమ్మల్ని ఎదుర్కోవడం ఆపండి!”
ISA 30:12 కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు చెప్పిన మాట ఇదే: “మీరు ఈ వర్తమానాన్ని తిరస్కరించారు, బాధించడాన్ని నమ్ముకుని, మోసాన్ని ఆధారం చేసుకున్నారు కాబట్టి,
ISA 30:13 ఈ పాపం మీకు బీటలు తీసి ఉబ్బిపోయిన ఎత్తైన గోడలా ఉండబోతుంది, అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు.
ISA 30:14 అది మట్టికుండలా పగిలిపోతుంది, కరుణ లేకుండా పగులగొట్టబడుతుంది, పొయ్యిలో నుండి నిప్పు తీయడానికి గాని కుండలో నుండి నీళ్లు తీయడానికి గాని దానిలో ఒక్క పెంకు కూడా దొరకదు.”
ISA 30:15 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “పశ్చాత్తాపం, విశ్రాంతిలో మీకు రక్షణ ఉన్నది, ప్రశాంతత, నమ్మకంలో మీకు బలం లభిస్తుంది కానీ మీకు ఇవేవి లభించవు.
ISA 30:16 మీరు, ‘లేదు, మేము గుర్రాల మీద పారిపోతాం’ అన్నారు. కాబట్టి మీరు పారిపోతారు! మీరు, ‘మేము వేగంగా పరుగెత్తే గుర్రాల మీద స్వారీ చేస్తాం’ అన్నారు. కాబట్టి మిమ్మల్ని వెంటాడేవారు వేగంగా తరమబడతారు!
ISA 30:17 పర్వతంపై ఉన్న ఒక జెండా కర్రలా కొండమీద ఉన్న జెండాలా మీరు మిగిలేవరకు ఒకరు గద్దించగా మీలో వెయ్యిమంది పారిపోతారు; అయిదుగురు గద్దించగా మీరందరు పారిపోతారు.”
ISA 30:18 అయినా, యెహోవా మీమీద దయ చూపించాలని కోరుతున్నారు; కాబట్టి మీ పట్ల దయ చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు ఆయన కోసం ఎదురు చూసే వారందరు ధన్యులు!
ISA 30:19 యెరూషలేములో నివసించే సీయోను ప్రజలారా! ఇకపై మీరు ఏడవరు. సహాయం కోసం మీరు చేసే మొరను విని ఆయన దయ చూపిస్తారు. ఆయన విన్న వెంటనే మీకు జవాబు ఇస్తారు.
ISA 30:20 ప్రభువు మీకు శత్రువులనే రొట్టెను బాధలనే నీటిని ఇచ్చినప్పటికీ, మీ బోధకులు దాగి ఉండరు; మీ సొంత కళ్లతో వారిని చూస్తారు.
ISA 30:21 మీరు కుడి వైపుకు గాని ఎడమ వైపుకు గాని తిరిగినా, “ఇదే సరియైన దారి; దీనిలో నడవండి” అని మీ చెవుల వెనుక నుండి ఒక శబ్దం వింటారు.
ISA 30:22 అప్పుడు వెండితో పొదిగిన మీ విగ్రహాలను, బంగారంతో పొదిగిన మీ ప్రతిమలను మీరు అపవిత్రం చేస్తారు; రుతు గుడ్డను పడేసినట్లు వాటిని పడేసి, “ఇక్కడినుండి పొండి” అని వాటితో అంటారు.
ISA 30:23 మీరు భూమిలో నాటే విత్తనాలకు కావలసిన వాన ఆయన కురిపిస్తారు. ఆ భూమి నుండి వచ్చే ఆహారం గొప్పగా, సమృద్ధిగా ఉంటుంది. ఆ రోజున మీ పశువులు విశాలమైన మైదానాల్లో మేస్తాయి.
ISA 30:24 భూమిని దున్నే ఎడ్లు గాడిదలు చేటతో జల్లెడతో చెరిగిన మేత, కుడితి తింటాయి.
ISA 30:25 గోపురాలు కూలిపోయే గొప్ప వధ జరిగే రోజున, ఎత్తైన ప్రతి పర్వతం మీద, ఎత్తైన ప్రతి కొండమీద నీటి వాగులు ప్రవహిస్తాయి.
ISA 30:26 యెహోవా తన ప్రజల గాయాలను కట్టి, వారి దెబ్బలను బాగుచేసిన రోజున, చంద్రుడు సూర్యునిలా ప్రకాశిస్తాడు. సూర్యుని వెలుగు ఏడు రెట్లు, అంటే ఏడు రోజుల పూర్తి వెలుగులా ఉంటుంది.
ISA 30:27 చూడండి, కోపంతో మండుతూ దట్టమైన పొగతో యెహోవా నామం దూరం నుండి వస్తుంది; ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నాయి. ఆయన నాలుక దహించే అగ్నిలా ఉంది.
ISA 30:28 ఆయన ఊపిరి మెడ లోతు వరకు ప్రవహించే ధారలా ఉంది. ఆయన నాశనమనే జల్లెడలో దేశాలను గాలిస్తారు; దారి తప్పించే కళ్లెమును ప్రజల దవడలలో ఆయన అమర్చుతారు.
ISA 30:29 రాత్రివేళ పరిశుద్ధ పండుగను జరుపుకుంటున్నట్లుగా మీరు పాడతారు ఇశ్రాయేలుకు ఆశ్రయ కోటయైన యెహోవా పర్వతానికి పిల్లనగ్రోవి వాయిస్తూ వెళ్లే వారిలా మీ హృదయాలు సంతోషిస్తాయి.
ISA 30:30 యెహోవా తన ప్రభావం గల స్వరాన్ని ప్రజలకు వినిపిస్తారు, భయంకరమైన కోపంతో దహించే అగ్నితో మేఘ విస్పోటంతో, ఉరుముల తుఫానుతో, వడగండ్లతో తన చేయి క్రిందికి రావడాన్ని ప్రజలు చూసేలా చేస్తారు.
ISA 30:31 యెహోవా స్వరం అష్షూరును పడగొడుతుంది; తన దండంతో ఆయన వారిని మొత్తుతారు.
ISA 30:32 యెహోవా తన శిక్షించే దండంతో అష్షూరు మీద వేసే ప్రతి దెబ్బ తంబుర సితారాల సంగీతంతో కలిసి ఉంటుంది. ఆయన తన చేయి ఆడించి యుద్ధం చేస్తారు.
ISA 30:33 చాలా కాలం క్రితమే మండుతున్న స్థలం సిద్ధపరచబడింది; అది రాజు కోసం సిద్ధపరచబడింది. విస్తారమైన అగ్ని, చెక్కతో దాని అగ్ని గుంట లోతుగా విశాలంగా చేయబడింది; యెహోవా ఊపిరి మండుతున్న గంధక ప్రవాహంలా దానిని రగిలిస్తుంది.
ISA 31:1 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లెక్కచేయకుండా యెహోవా నుండి సహాయం కోసం చూడకుండ సహయం కోసం ఈజిప్టుకు వెళ్లే వారికి గుర్రాలపై ఆధారపడేవారికి, తమ రథాల సంఖ్యపై గుర్రపురౌతుల గొప్ప బలం మీద నమ్మకం ఉంచే వారికి శ్రమ.
ISA 31:2 అయినా ఆయన చాలా తెలివైనవారు, వినాశనం తీసుకురాగలరు; ఆయన తన మాట వెనుకకు తీసుకోరు. ఆయన దుష్టప్రజల మీద, కీడు చేసేవారికి సహయపడేవారి మీద లేస్తారు.
ISA 31:3 ఈజిప్టువారు కేవలం మనుష్యులే, దేవుడు కాదు; వారి గుర్రాలు మాంసమే కాని ఆత్మ కాదు. యెహోవా తన చేయి చాపగా సహయం చేసేవారు తడబడతారు, సహయం పొందేవారు పడతారు; వారందరు కలిసి నాశనమవుతారు.
ISA 31:4 యెహోవా నాతో చెప్పే మాట ఇదే: తప్పించడానికి గొర్రెల కాపరులందరు కలిసివచ్చి ఎన్ని శబ్దాలు చేసినా భయపడకుండా వారి కేకలకు కలవరపడకుండా సింహం ఒక కొదమసింహం తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యాల యెహోవా యుద్ధం చేయడానికి సీయోను పర్వతం మీదికి దాని కొండ మీదికి దిగి వస్తారు.
ISA 31:5 అటూ ఇటూ ఎగిరే పక్షుల్లా సైన్యాల యెహోవా యెరూషలేమును కాపాడతారు; ఆయన దానిని కాపాడుతూ విడిపిస్తారు. దాని మీద దాటి వెళ్తూ దానిని రక్షిస్తారు.
ISA 31:6 ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరిపై తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి.
ISA 31:7 మీ పాపిష్ఠి చేతులు తయారుచేసిన వెండి బంగారు విగ్రహాలను ఆ రోజున మీలో ప్రతి ఒక్కరు పారవేస్తారు.
ISA 31:8 “మనుష్యులు చేయని ఖడ్గానికి అష్షూరు పడిపోతుంది. మానవులు చేయని ఖడ్గం వారిని మ్రింగివేస్తుంది. వారు ఖడ్గం ఎదుట నుండి పారిపోతారు వారి యవ్వనస్థులు వెట్టిచాకిరి చేస్తారు.
ISA 31:9 వారి ఆశ్రయ కోట భయంతో పడిపోతుంది; వారి అధిపతులు యుద్ధ జెండా చూసి భయపడిపోతారు” అని యెహోవా ప్రకటించారు. సీయోనులో ఆయన అగ్ని యెరూషలేములో ఆయన కొలిమి ఉన్నాయి.
ISA 32:1 చూడండి, ఒక రాజు నీతిగా రాజ్యపాలన చేస్తాడు అధికారులు న్యాయంగా పాలిస్తారు.
ISA 32:2 వారిలో ప్రతి ఒక్కరు గాలి వీచినప్పుడు దాక్కునే స్థలంలా తుఫానులో ఆశ్రయంగా ఎడారిలో నీటి ప్రవాహాల్లా ఎండిన భూమిలో ఒక గొప్ప కొండ నీడలా ఉంటారు.
ISA 32:3 అప్పుడు చూసేవారి కళ్లు ఎప్పుడూ మూసుకుపోవు, వినేవారి చెవులు వింటాయి.
ISA 32:4 భయంతో ఉండే హృదయం తెలుసుకొని, గ్రహిస్తుంది, నత్తిగల నాలుక చక్కగా, స్పష్టంగా మాట్లాడుతుంది.
ISA 32:5 ఇకపై మూర్ఖులు ఘనులని పిలువబడరు. దుష్టులు ఉన్నతంగా గౌరవించబడరు.
ISA 32:6 మూర్ఖులు మూర్ఖంగా మాట్లాడతారు, వారి హృదయాలు చెడు ఆలోచిస్తాయి; వారు భక్తిహీనతను పాటిస్తూ యెహోవా గురించి తప్పుడు వార్త ప్రకటిస్తారు; ఆకలితో ఉన్నవారికి ఏమి లేకుండా చేస్తారు దప్పికతో ఉన్నవారికి నీళ్లు లేకుండా చేస్తారు.
ISA 32:7 దుష్టులు చెడ్డ పద్ధతులను ఉపయోగిస్తారు, నిరుపేదలు న్యాయమైన అభ్యర్థన చేసినా, అబద్ధాలతో పేదవారిని నాశనం చేయడానికి వారు చెడ్డ ఆలోచనలు చేస్తారు.
ISA 32:8 అయితే గొప్పవారు గొప్ప ఆలోచనలు చేస్తారు, వారు చేసే గొప్ప పనులను బట్టి నిలబడతారు.
ISA 32:9 ఆత్మసంతృప్తితో ఉన్న స్త్రీలారా, లేచి నా మాట వినండి; భద్రంగా ఉన్నారనే భావనలో ఉన్న కుమార్తెలారా, నేను చెప్పే మాట వినండి!
ISA 32:10 ఇక ఒక సంవత్సరంలో, భద్రంగా ఉన్న మీరు భయంతో వణుకుతారు; ద్రాక్ష పంట పడిపోతుంది. పండ్లు పంటకు రావు.
ISA 32:11 ఆత్మసంతృప్తితో ఉన్న స్త్రీలారా వణకండి; భద్రంగా ఉన్నారనే భావనలో ఉన్న కుమార్తెలారా, వణకండి మీ మంచి బట్టలు తీసివేసి మీ నడుముకు గోనెపట్ట కట్టుకోండి.
ISA 32:12 ఆహ్లాదకరమైన పొలాల గురించి ఫలించే ద్రాక్షతీగెల గురించి మీ రొమ్ము కొట్టుకోండి.
ISA 32:13 నా ప్రజల భూమిలో గచ్చపొదలు, ముళ్ళచెట్లు పెరుగుతాయి. ఆనందోత్సాహాలతో ఉన్న ఇళ్ళన్నిటి కోసం ఉల్లాసంతో ఉన్న ఈ పట్టణం కోసం దుఃఖించండి.
ISA 32:14 కోట విడిచిపెట్టబడుతుంది కోలాహలంగా ఉన్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది; కోట, కావలికోట శాశ్వతంగా బంజరు భూమిలా మారుతాయి, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగా, మందలకు పచ్చికబయళ్లుగా ఉంటాయి,
ISA 32:15 పైనుండి మామీద ఆత్మ కుమ్మరించబడేవరకు ఇలా ఉంటాయి. తర్వాత అరణ్యం ఫలభరితమైన భూమిలా, ఫలభరితమైన భూమి అడవిగా మారుతాయి.
ISA 32:16 అప్పుడు యెహోవా న్యాయం అరణ్యంలో నివసిస్తుంది, ఆయన నీతి ఫలభరితమైన భూమిలో ఉంటుంది.
ISA 32:17 సమాధానం ఆ నీతి యొక్క ఫలంగా ఉంటుంది; దాని ఫలితంగా నెమ్మది భద్రత నిత్యం కలుగుతాయి.
ISA 32:18 అప్పుడు నా ప్రజలు సమాధానకరమైన నివాసాల్లో సురక్షితమైన ఇళ్ళలో ఎలాంటి ఆటంకాలు లేని విశ్రాంతి స్థలాల్లో నివసిస్తారు.
ISA 32:19 వడగండ్లు అడవిని నాశనం చేసినా పట్టణం పూర్తిగా నేలమట్టమైనా,
ISA 32:20 మీరు ఎంతో ధన్యులై ఉంటారు, మీరు నీటి ప్రవాహాల ఒడ్డులన్నిటి దగ్గర మీ విత్తనాలు చల్లుతూ, మీ పశువులను గాడిదలను స్వేచ్ఛగా తిరగనిస్తారు.
ISA 33:1 నాశనం చేసేవాడా, ఇంకా నాశనం చేయబడని నీకు శ్రమ! మోసం చేసేవాడా, ఇంకా మోసం చేయబడని నీకు శ్రమ! నీవు నాశనం చేయడం ముగించిన తర్వాతే నీవు నాశనం చేయబడతావు; నీవు మోసగించడం ముగించిన తర్వాతే నీవు మోసగించబడతావు.
ISA 33:2 యెహోవా! మమ్మల్ని కరుణించండి; మీ కోసం ఎదురుచూస్తున్నాము. ప్రతి ఉదయం మాకు బలంగా, శ్రమకాలంలో మాకు రక్షణగా ఉండండి.
ISA 33:3 మీ సైన్యం యొక్క గొప్ప శబ్దాన్ని విని జనాంగాలు పారిపోతాయి. మీరు లేచినప్పుడు దేశాలు చెదిరిపోతాయి.
ISA 33:4 దేశాల్లారా, మిడతలు పంటను తిన్నట్లుగా మీ సొమ్ము దోచుకోబడుతుంది; మిడతల దండులా ప్రజలు దాని మీద పడతారు.
ISA 33:5 యెహోవా ఘనత పొందుతారు, ఆయన ఎత్తైన చోట నివసిస్తారు; ఆయన తన న్యాయంతో, నీతితో సీయోనును నింపుతారు.
ISA 33:6 ఆయన నీ కాలాల్లో స్థిరమైన పునాది, విస్తారమైన రక్షణ బుద్ధి జ్ఞానాలు ఇస్తారు. యెహోవా భయం ఈ సంపదకు మూలము.
ISA 33:7 చూడండి, వారి యోధులు వీధుల్లో ఘోరంగా ఏడుస్తున్నారు; సమాధాన రాయబారులు ఎక్కువగా ఏడుస్తున్నారు.
ISA 33:8 రహదారులు నిర్మానుష్యంగా ఉన్నాయి దారుల్లో ప్రయాణికులు లేరు. ఒప్పందాన్ని మీరారు, పట్టణాలను అవమానపరిచారు, ఏ ఒక్కరూ గౌరవించబడరు.
ISA 33:9 దేశం ఎండిపోయి క్షీణించిపోతుంది, లెబానోను సిగ్గుపడి వాడిపోతుంది; షారోను ఎడారిలా మారింది బాషాను కర్మెలు తమ చెట్ల ఆకులు రాల్చుతాయి.
ISA 33:10 యెహోవా ఇలా అంటున్నారు, “ఇప్పుడు నేను లేస్తాను, ఇప్పుడు నేను ఘనపరచబడతాను; ఇప్పుడు నేను హెచ్చింపబడతాను
ISA 33:11 మీరు పొట్టును గర్భం ధరించి గడ్డికి జన్మనిస్తారు; మీ ఊపిరి అగ్నిలా మిమ్మల్ని కాల్చివేస్తుంది.
ISA 33:12 ప్రజలు కాలి బూడిద అవుతారు; వారు నరకబడిన ముళ్ళపొదల్లా కాల్చబడతారు.”
ISA 33:13 దూరంగా ఉన్నవారలారా, నేను ఏమి చేశానో వినండి; దగ్గరగా ఉన్నవారలారా, నా బలాన్ని గుర్తించండి!
ISA 33:14 సీయోనులో ఉన్న పాపులు భయపడుతున్నారు; భక్తిహీనులకు వణుకు పుడుతుంది. “మనలో ఎవరు దహించే అగ్నితో నివసించగలరు? మనలో ఎవరు నిత్యం మండే అగ్నితో నివసించగలరు?”
ISA 33:15 నీతిగా నడుచుకుంటూ నిజాయితీగా మాట్లాడేవారు, అవినీతి వలన వచ్చే లాభాన్ని విడిచిపెట్టి తమ చేతులతో లంచం తీసుకోకుండ, హత్య చేయాలనే కుట్రలు వినబడకుండ చెవులు మూసుకుని చెడుతనం చూడకుండ కళ్లు మూసుకునేవారు,
ISA 33:16 వారు ఉన్నత స్థలాల్లో నివసిస్తారు, పర్వతాల కోటలు వారికి ఆశ్రయంగా ఉంటాయి. వారికి ఆహారం దొరుకుతుంది, వారికి నీళ్లు శాశ్వతంగా ఉంటాయి.
ISA 33:17 మీ కళ్లు రాజును అతని వైభవంలో చూస్తాయి, విశాలంగా విస్తరించిన దేశాన్ని చూస్తాయి.
ISA 33:18 మీ తలంపులలో మీ గత భయాన్ని గుర్తుచేసుకుంటారు: “ఆ ప్రధానాధికారి ఎక్కడ ఉన్నాడు? ఆదాయాన్ని తీసుకున్నవారు ఎక్కడ? గోపురాల అధికారి ఎక్కడ?”
ISA 33:19 ఆ గర్వించే ప్రజలను మీరు ఇక చూడరు, వారు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే ప్రజలు, వారి భాష వింతగా గ్రహించలేనిదిగా ఉంటుంది.
ISA 33:20 మనం పండుగలు చేసుకునే సీయోను పట్టణాన్ని చూడండి; మీ కళ్లు యెరూషలేమును చూస్తాయి, అది ప్రశాంత నివాసంగా, కదలని గుడారంగా ఉంటుంది; దాని మేకులు ఎప్పటికీ ఊడదీయబడవు, దాని త్రాళ్లలో ఏ ఒక్కటి తెగిపోదు.
ISA 33:21 అక్కడ యెహోవా మన బలాఢ్యుడైన రాజుగా ఉంటారు. అది విశాలమైన నదులు, వాగులు ఉన్న స్థలంగా ఉంటుంది. వాటిలో తెడ్ల ఓడ నడువదు వాటిలో ఏ పెద్ద నౌక ప్రయాణించదు.
ISA 33:22 యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు; మనల్ని రక్షించేది ఆయనే.
ISA 33:23 నీ ఓడ త్రాళ్లు వదులయ్యాయి: ఓడ స్తంభం క్షేమంగా లేదు, తెరచాప విప్పబడలేదు. అప్పుడు విస్తారమైన దోపుడుసొమ్ము విభజించబడుతుంది, కుంటివారు కూడా దోపుడుసొమ్మును తీసుకెళ్తారు.
ISA 33:24 సీయోనులో నివసించేవారెవరూ, “నాకు ఆరోగ్యం బాగోలేదు” అని చెప్పరు; దానిలో నివసించే ప్రజల పాపాలు క్షమించబడతాయి.
ISA 34:1 దేశాల్లారా, నా దగ్గరకు వచ్చి వినండి; ప్రజలారా, మీరు శ్రద్ధగా వినండి! భూమి దానిలోని సమస్తం, లోకం, దాని నుండి వచ్చేవన్ని వినును గాక.
ISA 34:2 సమస్త దేశాల మీద యెహోవా కోపంగా ఉన్నారు; వారి సైన్యాలన్నిటి మీద ఆయన ఉగ్రత ఉంది. ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తారు, వారిని వధకు అప్పగిస్తారు.
ISA 34:3 వారిలో చంపబడినవారు పూడ్చిపెట్టబడరు, వారి శవాలు కంపుకొడతాయి. పర్వతాలు వారి రక్తంతో తడిసిపోతాయి.
ISA 34:4 ఆకాశ నక్షత్రాలన్నీ కరిగిపోతాయి గ్రంథపుచుట్టలా ఆకాశాలు చుట్టబడతాయి; ద్రాక్షతీగె నుండి వాడిన ఆకు రాలినట్లుగా అంజూర చెట్టు నుండి వాడిన కాయ రాలినట్లుగా నక్షత్ర సైన్యమంతా రాలిపోతుంది.
ISA 34:5 ఆకాశంలో నా ఖడ్గం దానికి కావల్సింది త్రాగింది; చూడండి, ఎదోము మీద తీర్పు తీర్చడానికి, నేను పూర్తిగా నాశనం చేసిన ప్రజలు మీదికి అది దిగుతుంది.
ISA 34:6 యెహోవా ఖడ్గం రక్తసిక్తం అవుతుంది, అది క్రొవ్వుతో కప్పబడి ఉంది. గొర్రెపిల్లల, మేకల రక్తంతో, పొట్టేళ్ల మూత్రపిండాల మీది క్రొవ్వుతో కప్పబడి ఉంది. ఎందుకంటే బొస్రాలో యెహోవా బలి జరిగిస్తారు. ఎదోము దేశంలో ఆయన గొప్ప వధ జరిగిస్తారు.
ISA 34:7 వాటితో పాటు అడవి ఎద్దులు, కోడెలు, బలమైన ఎద్దులు చస్తాయి. వారి భూమి రక్తంతో తడుస్తుంది. వారి మట్టి క్రొవ్వులో నానుతుంది.
ISA 34:8 యెహోవా ప్రతీకారం చేయడానికి ఒక రోజును, సీయోను పక్షంగా ప్రాయశ్చిత్తం చేసే ఒక సంవత్సరాన్ని నియమించారు.
ISA 34:9 ఎదోము నీటిప్రవాహాలు కీలుగా దాని మట్టి మండుతున్న గంధకంగా మారుతుంది. దాని భూమి మండుతున్న కీలుగా ఉంటుంది.
ISA 34:10 అది రాత్రింబగళ్ళు ఆరిపోదు; దాని పొగ నిత్యం లేస్తూనే ఉంటుంది. అది తరతరాల వరకు నిర్మానుష్యంగానే ఉంటుంది; దానిగుండా ఎవ్వరూ ఎప్పటికీ ప్రయాణించరు.
ISA 34:11 గూడబాతులు, జీరగపిట్ట దానిని స్వాధీనం చేసుకుంటాయి; గుడ్లగూబ, కాకి దానిలో నివసిస్తాయి. దేవుడు తారుమారనే కొలమానాన్ని శూన్యమనే మట్టపు గుండును ఏదోముపై చాపుతారు.
ISA 34:12 రాజ్యమని ప్రకటించడానికి వారి ఘనులకు అక్కడ ఏమీ మిగలదు, వారి అధిపతులందరు మాయమవుతారు.
ISA 34:13 దాని కోటలలో ముళ్ళచెట్లు, దాని దుర్గాలలో దురదగొండ్లు గచ్చపొదలు పెరుగుతాయి. అది తోడేళ్లకు నివాసంగా గుడ్లగూబలకు ఇల్లుగా ఉంటుంది.
ISA 34:14 ఎడారి జీవులు, హైనాలు అక్కడ కలిసి తిరుగుతాయి అడవి మేకలు ఒకదానిపై ఒకటి విరుచుకుపడతాయి; అక్కడ రాత్రివేళ తిరిగే ప్రాణులు కూడా పడుకుంటాయి అక్కడ అవి వాటికి విశ్రాంతి స్థలాలను కనుగొంటారు.
ISA 34:15 అక్కడ గుడ్లగూబ గూడు కట్టి గుడ్లు పెట్టి, వాటిని పొదిగి, తన రెక్కల నీడలో వాటిని ఉంచి, దాని పిల్లలను పోషిస్తుంది. అక్కడ తెల్ల గద్దలు ప్రతి ఒక్కటి తమ జాతి పక్షులతో జతకడతాయి.
ISA 34:16 యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి: వీటిలో ఏవి తప్పిపోవు, ఏ ఒక్కటి కూడా తన జత లేకుండా ఉండదు. ఎందుకంటే, ఆయన నోరే ఈ ఆదేశాన్ని ఇచ్చింది, ఆయన ఆత్మ వాటిని పోగుచేస్తారు.
ISA 34:17 ఆయన వాటికి వాటి భాగాలు కేటాయిస్తారు; ఆయన చేతి కొలత ప్రకారం వాటికి పంచిపెడుతుంది. అవి శాశ్వతంగా దానిని స్వాధీనం చేసుకుంటాయి తరతరాలు అందులో నివసిస్తాయి.
ISA 35:1 ఎడారి, ఎండిన భూమి సంతోషిస్తాయి; అరణ్యం సంతోషించి పూస్తుంది. అది కుంకుమ పువ్వులా,
ISA 35:2 ఒక్కసారిగా విచ్చుకుంటుంది; అది గొప్పగా సంతోషించి ఆనందంతో కేకలు వేస్తుంది. లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది, కర్మెలు షారోనుల వైభవం దానికి ఉంటుంది; వారు యెహోవా మహిమను మన దేవుని వైభవాన్ని చూస్తారు.
ISA 35:3 బలహీనమైన చేతులను బలపరచండి, వణుకుతున్న మోకాళ్లను స్థిరపరచండి;
ISA 35:4 భయపడేవారితో ఇలా అనండి: “ధైర్యంగా ఉండండి, భయపడకండి; మీ దేవుడు వస్తారు ఆయన ప్రతీకారంతో వస్తారు. దైవిక ప్రతీకారంతో ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.”
ISA 35:5 అప్పుడు గ్రుడ్డివారి కళ్లు తెరవబడతాయి చెవిటి వారి చెవులు వినబడతాయి.
ISA 35:6 అప్పుడు కుంటివారు జింకలా గంతులు వేస్తారు, మూగవాని నాలుక ఆనందంతో కేకలు వేస్తుంది. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి ఎడారిలో కాలువలు పారతాయి.
ISA 35:7 మండుతున్న ఇసుక చెరువులా మారుతుంది ఎండిన నేలలో నీటిబుగ్గలు పుడతాయి. ఒక్కప్పుడు తోడేళ్లు పడుకున్న స్థలంలో గడ్డి, రెల్లు, జమ్ము పెరుగుతాయి.
ISA 35:8 అక్కడ రహదారి ఉంటుంది; అది పరిశుద్ధ మార్గమని పిలువబడుతుంది; అది ఆ మార్గంలో నడిచే వారికి మాత్రమే. అపవిత్రులు ఆ దారిలో వెళ్లకూడదు; దుర్మార్గమైన మూర్ఖులు దానిలో నడవరు.
ISA 35:9 అక్కడ ఏ సింహం ఉండదు, ఏ క్రూర జంతువు ఉండదు; అవి అక్కడ కనబడవు. విమోచన పొందిన వారే అక్కడ నడుస్తారు.
ISA 35:10 యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.
ISA 36:1 రాజైన హిజ్కియా పాలన పద్నాలుగవ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని కోటగోడలున్న పట్టణాలన్నిటి మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు.
ISA 36:2 అప్పుడు అష్షూరు రాజు లాకీషు నుండి యెరూషలేములో ఉన్న రాజైన హిజ్కియా మీదికి గొప్ప సైన్యంతో తన యుద్ధభూమిలో ఉన్న సైన్యాధిపతిని పంపించాడు. ఆ సైన్యాధిపతి చాకలి రేవు దారిలో ఉన్న పై కోనేటి కాలువ దగ్గర ఆగినప్పుడు,
ISA 36:3 హిల్కీయా కుమారుడు రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, ఆసాపు కుమారుడు, రాజ్య లేఖికుడైన యోవాహు అతని దగ్గరకు వెళ్లారు.
ISA 36:4 అప్పుడు సైన్యాధిపతి వారితో ఇలా అన్నాడు, “హిజ్కియాకు చెప్పండి: “ ‘మహారాజు, అష్షూరు రాజు చెప్పే మాట ఇది: దేన్ని చూసుకుని నీకు ఈ ధైర్యం?
ISA 36:5 యుద్ధం విషయంలో నీకు ఆలోచన, బలం ఉంది అంటావు, కాని నీవు మాట్లాడేవి వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేస్తున్నావు?
ISA 36:6 చూడు, నీవు నలిగిన రెల్లులాంటి ఈజిప్టును నమ్ముకుంటున్నావు, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. ఈజిప్టు రాజైన ఫరోను నమ్ముకునే వారందరికి అతడు చేసేది అదే.
ISA 36:7 అయితే, “మా దేవుడైన యెహోవా మీద మేము ఆధారపడుతున్నాం” అని మీరు నాతో అంటే, “ఈ బలిపీఠం దగ్గర మీరు ఆరాధించాలి” అని యూదా వారితో యెరూషలేము వారితో చెప్పిన ఆయన ఉన్నత స్థలాలను, బలిపీఠాలనే కదా హిజ్కియా పడగొట్టింది?
ISA 36:8 “ ‘ఇప్పుడు రండి, నా యజమానియైన అష్షూరు రాజుతో బేరం కుదుర్చుకోండి: మీ దగ్గర రెండువేల గుర్రాలకు సరిపడే రౌతులు ఉంటే, నేను వాటిని మీకు ఇస్తాను!
ISA 36:9 రథాలు రౌతుల కోసం ఈజిప్టు రాజును నమ్ముకున్నా, మీరు నా యజమాని అధికారులలో అతి అల్పుడైన ఒక్క అధికారినైనా ఎలా ఎదిరించగలరు?
ISA 36:10 యెహోవా నుండి అనుమతి లేకుండానే ఈ స్థలంపై దాడి చేసి నాశనం చేయడానికి వచ్చానా? ఈ దేశంపై దాడి చేసి నాశనం చేయమని స్వయాన యెహోవాయే చెప్పారు.’ ”
ISA 36:11 అప్పుడు ఎల్యాకీము, షెబ్నా, యోవాహు సైన్యాధిపతితో, “నీ దాసులమైన మాకు అరామిక్ భాష అర్థం అవుతుంది కాబట్టి ఆ భాషలో మాట్లాడండి. గోడ మీద ఉన్న ప్రజలకు వినిపించేలా హెబ్రీ భాషలో మాట్లాడకండి” అన్నారు.
ISA 36:12 అయితే సైన్యాధిపతి జవాబిస్తూ, “ఈ విషయాలు కేవలం మీకు, మీ యజమానికి మాత్రమే చెప్పటానికి నా యజమాని నన్ను పంపాడని, గోడ మీద కూర్చున్న ప్రజలకు కాదనుకున్నారా? వారు కూడా మీలాగే తమ మలం తింటూ తమ మూత్రం త్రాగాల్సిందే” అని అన్నాడు.
ISA 36:13 అప్పుడు సైన్యాధిపతి నిలబడి బిగ్గరగా హెబ్రీ భాషలో ఇలా అన్నాడు, “మహారాజైన అష్షూరు రాజు మాటలు వినండి!
ISA 36:14 రాజు చెప్పే మాట ఇదే: హిజ్కియా మిమ్మల్ని మోసం చేయకుండ చూసుకోండి. అతడు మిమ్మల్ని విడిపించలేడు.
ISA 36:15 హిజ్కియా, ‘యెహోవా మనల్ని తప్పక విడిపిస్తారు; ఈ పట్టణం అష్షూరు రాజు చేతికి చిక్కదు’ అని చెప్తూ యెహోవా మీద నమ్మకం ఉంచేలా ప్రేరేపించనివ్వకండి.
ISA 36:16 “హిజ్కియా మాటలు వినకండి. అష్షూరు రాజు చెప్పే మాట ఇదే: నాతో సమాధాన ఒప్పందం చేసుకుని, నా దగ్గరకు రండి. అప్పుడు నేను వచ్చేవరకు, మీలో ప్రతి ఒక్కరూ మీ ద్రాక్షచెట్టు పండ్లు, మీ అంజూర చెట్టు పండ్లు తింటూ, మీ బావి నీళ్లు త్రాగుతారు.
ISA 36:17 తర్వాత నేను వచ్చి మిమ్మల్ని మీ సొంత దేశం లాంటి దేశానికి తీసుకెళ్తాను. అది ధాన్యాలు, క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశం.
ISA 36:18 “హిజ్కియా, ‘యెహోవా మనల్ని విడిపిస్తారు’ అని చెప్తూ మిమ్మల్ని తప్పుత్రోవ పట్టనివ్వకండి. ఇతర దేశాల దేవుళ్ళు ఎవరైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించారా?
ISA 36:19 హమాతు, అర్పదు దేవుళ్ళు ఎక్కడ? సెఫర్వయీము దేవుళ్ళు ఎక్కడ? వారు నా చేతిలో నుండి సమరయను రక్షించగలిగారా?
ISA 36:20 ఈ దేశాల దేవుళ్ళలో ఎవరైనా తమ దేశాలను నా చేతిలో నుండి రక్షించగలిగారా? అలాగైతే, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును ఎలా విడిపిస్తారు?”
ISA 36:21 అయితే, “అతనికి జవాబివ్వకండి” అని రాజు వారికి ఆజ్ఞాపించడంతో ప్రజలు ఏమి జవాబివ్వకుండా మౌనంగా ఉన్నారు.
ISA 36:22 అప్పుడు హిల్కీయా, రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, కార్యదర్శియైన షెబ్నా, ఆసాపు కుమారుడు, రాజ్య లేఖికుడైన యోవాహు, తమ బట్టలు చింపుకొని హిజ్కియా దగ్గరకు వెళ్లి అష్షూరు సైన్యాధిపతి చెప్పింది అతనికి తెలియజేశారు.
ISA 37:1 ఇది విని రాజైన హిజ్కియా తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరంలోకి వెళ్లాడు.
ISA 37:2 అతడు రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీమును, కార్యదర్శియైన షెబ్నాను, యాజకులలో పెద్దవారిని ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా దగ్గరకు పంపాడు, వారంత గోనెపట్ట కట్టుకున్నారు.
ISA 37:3 వారు అతనితో ఇలా అన్నారు, “హిజ్కియా చెప్పిన మాట ఇదే: ఈ రోజు బాధ, చీవాట్లు, అవమానం ఉన్న రోజు, బిడ్డ పుట్టడానికి సమయం దగ్గరకు వచ్చినా కనే శక్తిలేని స్త్రీలా ఉంది.
ISA 37:4 జీవంగల దేవున్ని దూషించడానికి అష్షూరు రాజు తన సేవకుడైన సైన్యాధిపతి పంపించాడు. అతడు పలికిన మాటలన్నీ మీ దేవుడైన యెహోవా విని అతని మాటలనుబట్టి మీ దేవుడైన యెహోవా అష్షూరు రాజును గద్దిస్తారేమో, కాబట్టి ఇక్కడ మిగిలే వారి కోసం ప్రార్థించండి.”
ISA 37:5 రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరకు వచ్చినప్పుడు,
ISA 37:6 యెషయా వారితో ఇలా అన్నాడు, “మీ యజమానికి చెప్పండి, ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు విన్న వాటికి అనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషిస్తూ మాట్లాడిన మాటలకు భయపడకండి.
ISA 37:7 వినండి! అతడు ఒక వదంతి విని తన దేశానికి వెళ్ళిపోయేలా నేను చేస్తాను, అక్కడ అతడు ఖడ్గం చేత చనిపోయేలా చేస్తాను.’ ”
ISA 37:8 అంతలో అష్షూరు రాజు లాకీషును విడిచి వెళ్లాడని అతని సైన్యాధిపతి విని, అతడు తిరిగివెళ్లి రాజు లిబ్నాతో పోరాడుతున్నాడని తెలుసుకున్నాడు.
ISA 37:9 అప్పుడు, కూషు రాజైన తిర్హాకా తన మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడనే వార్త సన్హెరీబు విన్నప్పుడు, అతడు దూతలతో హిజ్కియా దగ్గరకు ఇలా సందేశం పంపాడు:
ISA 37:10 “యూదా రాజైన హిజ్కియాకు ఇలా చెప్పండి: నీవు నమ్ముకున్న నీ దేవుడు నీతో, ‘యెరూషలేము అష్షూరు రాజు చేతికి ఇవ్వబడదు’ అని చెప్పే మోసపు మాటలకు మోసపోవద్దు.
ISA 37:11 అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీవు ఖచ్చితంగా వినే ఉంటావు. మీరు మాత్రం తప్పించుకోగలరా?
ISA 37:12 గోజాను, హారాను, రెజెపు, తెలశ్శారు పట్టణంలో ఉండే ఏదెను ప్రజలను నా పూర్వికులు నాశనం చేసినప్పుడు, ఆ జనాల దేవుళ్ళు వారిని విడిపించారా?
ISA 37:13 హమాతు రాజు, అర్పదు రాజు ఎక్కడ? లాయిరు, సెఫర్వయీము, హేన, ఇవ్వా పట్టణాల రాజులు ఏమయ్యారు?”
ISA 37:14 హిజ్కియా దూతల నుండి లేఖ తీసుకుని దానిని చదివాడు. తర్వాత యెహోవా ఆలయానికి వెళ్లి, యెహోవా సముఖంలో ఆ ఉత్తరాన్ని తెరిచాడు.
ISA 37:15 హిజ్కియా యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు:
ISA 37:16 “సైన్యాల యెహోవా! ఇశ్రాయేలు దేవా! కెరూబుల మధ్యలో సింహాసనాసీనుడా! ఈ లోక రాజ్యాలకు మీరు మాత్రమే దేవుడు. మీరు భూమ్యాకాశాలను సృష్టించారు.
ISA 37:17 యెహోవా, శ్రద్ధగా వినండి; యెహోవా, కళ్లు తెరచి చూడండి. జీవంగల దేవున్ని దూషించడానికి సన్హెరీబు చెప్పి పంపిన మాటలన్నిటిని వినండి.
ISA 37:18 “యెహోవా! అష్షూరు రాజులు ఈ ప్రజలందరినీ, వారి దేశాలను నాశనం చేశారన్నది వాస్తవం.
ISA 37:19 వారు వారి దేవుళ్ళను అగ్నిలో వేసి నాశనం చేశారు, ఎందుకంటే అవి దేవుళ్ళు కాదు, కేవలం మనుషుల చేతులతో చేసిన కర్ర, రాళ్లు మాత్రమే.
ISA 37:20 ఇప్పుడు యెహోవా, మా దేవా, మమ్మల్ని అతని చేతిలో నుండి విడిపించండి, అప్పుడు ఈ లోక రాజ్యాలన్ని యెహోవాయైన మీరే దేవుడని తెలుసుకుంటారు.”
ISA 37:21 అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు ఇలా సందేశం పంపాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: అష్షూరు రాజైన సన్హెరీబు గురించి నీవు నాకు ప్రార్థన చేసినందుకు,
ISA 37:22 అతని గురించి యెహోవా చెప్పిన మాట ఇదే: “కన్యయైన సీయోను కుమార్తె నిన్ను తృణీకరించి ఎగతాళి చేస్తుంది. యెరూషలేము కుమార్తె నీవు పారిపోతుంటే తల ఊపుతుంది.
ISA 37:23 నీవు ఎవరిని నిందించి దూషించావు? ఎవరి మీద నీవు అరిచి గర్వంతో నీ కళ్ళెత్తి చూశావు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే గదా!
ISA 37:24 నీవు పంపిన దూతల ద్వారా ప్రభువును దూషించావు. నీవు అన్నావు, ‘నాకున్న అనేక రథాల చేత, పర్వత శిఖరాల మీదికి ఎక్కాను, లెబానోను ఎత్తైన స్థలాలను ఎక్కాను. దాని పొడువైన దేవదారులను నరికివేశాను, శ్రేష్ఠమైన సరళ వృక్షాలను నరికివేశాను. దాని చివరి సరిహద్దులను చేరుకున్నాను, దాని సారవంతమైన అడవులను చేరుకున్నాను.
ISA 37:25 నేను పరదేశి నేలలో బావులు త్రవ్వి అక్కడి నీళ్లు త్రాగాను. నా అరికాలితో ఈజిప్టు నది ప్రవాహాలన్నీ ఎండిపోయేలా చేశాను.’
ISA 37:26 “చాలా కాలం క్రితం నేనే నిర్ణయించానని, నీవు వినలేదా? పూర్వకాలంలో నేను సంకల్పించాను. ఇప్పుడు నేను అలా జరిగేలా చేశాను, నీవు కోటగోడలు గల పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేసేలా చేశాను.
ISA 37:27 వారి ప్రజలు బలహీనులై, భయాక్రాంతులై అవమానం పాలయ్యారు. వారు పొలంలో మొక్కల్లా, పచ్చని మొక్కల్లా, ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా పెరగక ముందే వాడిపోయినట్టు ఉన్నారు.
ISA 37:28 “అయితే నీవు ఎక్కడ ఉన్నావో ఎప్పుడు వస్తావో ఎప్పుడు వెళ్తావో నా మీద ఎంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు.
ISA 37:29 నీవు నాకు వ్యతిరేకంగా లేస్తున్నందుకు, నీ అహంకారం నా చెవిని చేరినందుకు, నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, నా కళ్లెం నీ నోటిలో వేస్తాను. నీవు వచ్చిన దారిలోనే నీవు తిరిగి వెళ్లేలా చేస్తాను.
ISA 37:30 “హిజ్కియా, దానికి నీకిదే సూచన: “ఈ సంవత్సరం దాని అంతట అదే పండే పంటను మీరు తింటారు, రెండవ ఏట దాని నుండి కలిగే ధాన్యాన్ని మీరు తింటారు. అయితే మూడవ ఏట విత్తనాలు చల్లి కోత కోస్తారు, ద్రాక్షతోటలు నాటి వాటి ఫలాలు మీరు తింటారు.
ISA 37:31 యూదా రాజ్యంలో శేషం మరోసారి క్రిందికి వేర్లు తన్ని చిగురించి ఫలిస్తుంది.
ISA 37:32 యెరూషలేము నుండి శేషం వస్తుంది, సీయోను పర్వతం నుండి తప్పించుకున్నవారు వస్తారు. సైన్యాల యెహోవా రోషం దీన్ని సాధిస్తుంది.
ISA 37:33 “కాబట్టి, అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: “అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు ఒక్క బాణమైనా వేయడు. ఒక్క డాలును దానికి చూపించడు దాని ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు.
ISA 37:34 అతడు వచ్చిన దారినే తిరిగి వెళ్లిపోతాడు. అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ISA 37:35 “నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను!”
ISA 37:36 అప్పుడు యెహోవా దూత బయలుదేరి అష్షూరు శిబిరంలో 1,85,000 మంది సైనికులను హతం చేశాడు. ప్రొద్దున ప్రజలు లేచి చూస్తే వారంతా శవాలుగా పడి ఉన్నారు.
ISA 37:37 అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి వెళ్లిపోయాడు, నీనెవెకు తిరిగివెళ్లి అక్కడ ఉండిపోయాడు.
ISA 37:38 ఒక రోజు, అతడు నిస్రోకు అనే తన దేవుని గుడిలో పూజ చేస్తుండగా అతని కుమారులు ఆద్రమ్మెలెకు, షెరెజరు ఖడ్గంతో అతన్ని చంపి, అరారతు ప్రాంతానికి పారిపోయారు. అతని తర్వాత అతని కుమారుడైన ఏసర్హద్దోను రాజయ్యాడు.
ISA 38:1 ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త అతని దగ్గరకు వెళ్లి, “యెహోవా చెప్పే మాట ఇదే: నీవు చనిపోబోతున్నావు; నీవు కోలుకోవు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో” అన్నాడు.
ISA 38:2 హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకుని యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు,
ISA 38:3 “యెహోవా, నేను నమ్మకంగా యథార్థ హృదయంతో, మీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, మీ దృష్టిలో సరియైనది ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోండి.” హిజ్కియా భారంగా ఏడ్చాడు.
ISA 38:4 అప్పుడు యెహోవా వాక్కు యెషయాకు ఇలా వచ్చింది:
ISA 38:5 “నీవు వెళ్లి హిజ్కియాకు ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీ ప్రార్థన విని నీ కన్నీరు చూశాను. నీ జీవితంలో ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను.
ISA 38:6 అంతేకాక, నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాను. నేను ఈ పట్టణాన్ని కాపాడతాను.
ISA 38:7 “ ‘యెహోవా తాను చెప్పిన మాట నెరవేరుస్తారని తెలియజేయడానికి యెహోవా నీకు ఇచ్చే సూచన ఇదే:
ISA 38:8 ఆహాజు ఎండ గడియారం మీద సూర్యకాంతి వలన ముందుకు జరిగిన నీడ మళ్ళీ పది మెట్లు వెనుకకు వెళ్లేలా నేను చేస్తాను.’ ” కాబట్టి సూర్యకాంతి ముందుకు జరిగిన మెట్లలో పది మెట్లు మరలా వెనుకకు జరిగింది.
ISA 38:9 యూదా రాజైన హిజ్కియా అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత అతని రచన:
ISA 38:10 నేను, “నా జీవిత సగభాగంలో నేను మరణ ద్వారం గుండా వెళ్లాలా, నా మిగిలిన జీవితకాలమంతా పొగొట్టుకున్నానా?”
ISA 38:11 నేను, “సజీవుల దేశంలో నేనిక యెహోవాను చూడలేను; నా తోటి మనుష్యులను చూడలేను ఈ లోకంలో ఇప్పుడు నివసించే వారితో ఉండలేను.
ISA 38:12 గొర్రెల కాపరి గుడారంలా నా ఇల్లు పడవేయబడి నా నుండి తీసివేయబడింది. నేతపనివాడు వస్త్రం చుట్టినట్లు నా జీవితాన్ని ముగిస్తున్నాను, ఆయన నన్ను మగ్గం నుండి వేరుచేశారు. ఒక్క రోజులోనే మీరు నాకు ముగింపు తెచ్చారు.
ISA 38:13 ఉదయం వరకు ఓపికగా ఉన్నాను, కాని సింహం విరిచినట్లు ఆయన నా ఎముకలన్నీ విరిచారు; పగలు రాత్రి మీరు నా ముగింపు తెచ్చారు.
ISA 38:14 కొంగలా చిన్న పిట్టలా నేను కిచకిచ అరిచాను, దుఃఖపడే పావురంలా మూలిగాను ఆకాశాల వైపు చూసి నా కళ్లు అలసిపోయాయి. నేను బెదిరిపోయాను; ప్రభువా, నాకు సహాయం చేయండి.”
ISA 38:15 కాని నేనేమి అనగలను? ఆయనే నాకు మాట ఇచ్చారు, ఆయనే ఇది నెరవేర్చారు. నాకు కలిగిన వేదన బట్టి నా సంవత్సరాలన్నీ దీనుడిగా జీవిస్తాను.
ISA 38:16 ప్రభువా! వీటి వలన మనుష్యులు జీవిస్తారు. వాటిలో కూడా నా ఆత్మకు జీవం దొరుకుతుంది. మీరు నాకు ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చారు నన్ను జీవింపచేశారు.
ISA 38:17 నేను అనుభవించిన ఈ వేదన ఖచ్చితంగా నాకు నెమ్మది కలగడానికే. మీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతినుండి విడిపించారు; నా పాపాలన్నిటిని మీ వెనుక పారవేశారు.
ISA 38:18 ఎందుకంటే, సమాధి మిమ్మల్ని స్తుతించలేదు, మరణం మీకు స్తుతులు పాడలేదు. సమాధిలోనికి వెళ్లేవారు మీ నమ్మకత్వం కోసం నిరీక్షించలేరు.
ISA 38:19 నేను ఈ రోజు స్తుతిస్తున్నట్లు, సజీవులు, సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారు; తల్లిదండ్రులు తమ పిల్లలకు మీ నమ్మకత్వాన్ని తెలియజేస్తారు.
ISA 38:20 యెహోవా నన్ను రక్షిస్తారు. మనం బ్రతికినన్ని రోజులు యెహోవా మందిరంలో తంతి వాద్యాలు వాయిస్తూ పాడదాము.
ISA 38:21 యెషయా, “అంజూర పండ్ల ముద్ద తయారుచేసి ఆ పుండుకు రాస్తే అతడు బాగుపడతాడు” అన్నాడు.
ISA 38:22 హిజ్కియా, “నేను యెహోవా ఆలయానికి వెళ్తాను అనడానికి గుర్తు ఏంటి?” అని అడిగాడు.
ISA 39:1 ఆ కాలంలో బలదాను కుమారుడును బబులోను రాజైన మర్దూక్-బలదాను హిజ్కియాకు జబ్బుచేసి, తిరిగి కోలుకున్నాడని విని అతనికి ఉత్తరాలు, కానుక పంపాడు.
ISA 39:2 హిజ్కియా సంతోషంగా ఆ రాయబారులను ఆహ్వానించి, వారికి తన భవనంలో ఉన్న ఖజానాలోని వెండి, బంగారం, సుగంధద్రవ్యాలు, ఒలీవనూనెతో సహా ఆయుధాలు, ధనాగారాలలో ఉన్నవన్నీ వారికి చూపించాడు. తన భవనంలో గాని, రాజ్యమంతట్లో గాని హిజ్కియా వారికి చూపించనిదేది లేదు.
ISA 39:3 తర్వాత రాజైన హిజ్కియా దగ్గరకు ప్రవక్తయైన యెషయా వెళ్లి, “ఆ మనుష్యులు ఏమి చెప్పారు? ఎక్కడి నుండి నీ దగ్గరకు వచ్చారు?” అని అడిగాడు. అందుకు హిజ్కియా, “వారు బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు” అని జవాబిచ్చాడు.
ISA 39:4 “నీ భవనంలో వారు ఏమేమి చూశారు?” అని ప్రవక్త అడిగాడు. హిజ్కియా, “నా భవనంలో ఉన్నవన్నీ చూశారు. నా ధనాగారంలో ఏదీ దాచకుండా అన్నీ వారికి చూపించాను” అన్నాడు.
ISA 39:5 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు, “సైన్యాల యెహోవా వాక్కు విను:
ISA 39:6 ఒక సమయం రాబోతుంది, నీ భవనంలో ఉన్నవన్నీ, ఈనాటి వరకు మీ పూర్వికుల కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఏమీ మిగలదని యెహోవా చెప్తున్నారు.
ISA 39:7 నీకు పుట్టబోయే నీ సంతానంలో కొంతమంది బబులోనుకు కొనిపోబడి బబులోను రాజు యొక్క రాజభవనంలో నపుంసకలుగా అవుతారు.”
ISA 39:8 హిజ్కియా యెషయాతో, “నీవు చెప్పిన యెహోవా వాక్కు మంచిదే. నా జీవితకాలంలో సమాధానం సత్యం ఉంటాయి” అని అన్నాడు.
ISA 40:1 నా ప్రజలను ఓదార్చండి, ఓదార్చండి, అని మీ దేవుడు చెప్తున్నారు.
ISA 40:2 యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి ఆమె యుద్ధకాలం ముగిసిందని ఆమె పాపదోషం తీరిపోయిందని యెహోవా చేతిలో ఆమె పాపాలన్నిటి కోసం రెండింతల ఫలం పొందిందని ఆమెకు తెలియజేయండి.
ISA 40:3 బిగ్గరగా కేక వేస్తున్న ఒక స్వరం: “అరణ్యంలో యెహోవా కోసం మార్గాన్ని సిద్ధపరచండి ఎడారిలో మన దేవునికి రహదారిని సరాళం చేయండి.
ISA 40:4 ప్రతి లోయ ఎత్తు చేయబడుతుంది, ప్రతి పర్వతం ప్రతి కొండ సమం చేయబడుతుంది; వంకర త్రోవ తిన్నగా, గరుకు మార్గాలు నున్నగా చేయబడతాయి.
ISA 40:5 యెహోవా మహిమ వెల్లడవుతుంది. దాన్ని ప్రజలందరు చూస్తారు. యెహోవాయే ఇది తెలియజేశారు.”
ISA 40:6 “మొరపెట్టు” అని ఒక స్వరం అంటుంది, నేను, “నేనేమని మొరపెట్టాలి?” అన్నాను. “ప్రజలందరు గడ్డి వంటివారు, వారి నమ్మకత్వమంతా పొలంలోని పువ్వు వంటిది.
ISA 40:7 గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి ఎందుకంటే యెహోవా తన ఊపిరి వాటి మీద ఊదుతారు. నిజంగా ప్రజలు గడ్డిలా ఉన్నారు.
ISA 40:8 గడ్డి ఎండిపోతుంది, పువ్వులు వాడిపోతాయి, కాని మన దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉంటుంది.”
ISA 40:9 సువార్త ప్రకటిస్తున్న సీయోనూ, ఎత్తైన పర్వతం ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమా, నీ గొంత్తెత్తి బలంగా భయపడకుండా ప్రకటించు; యూదా పట్టణాలకు, “ఇదిగో మీ దేవుడు” అని చెప్పు.
ISA 40:10 చూడండి, ప్రభువైన యెహోవా శక్తితో వస్తున్నారు, తన బలమైన చేతితో పరిపాలిస్తారు. చూడండి, ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉంది, ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయనను అనుసరిస్తుంది.
ISA 40:11 గొర్రెల కాపరిలా ఆయన తన మందను మేపుతారు; తన చేతితో గొర్రెపిల్లలను చేర్చుకుని తన హృదయానికి ఆనించి వాటిని మోస్తారు; పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తారు.
ISA 40:12 తన చేతితో నీటిని కొలిచిన వారెవరు? జేనతో ఆకాశాన్ని కొలిచిన వారెవరు? భూమిలోని మట్టి అంతటిని బుట్టలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతాలను తూచిన వాడెవడు? తూనికతో కొండలను తూచిన వాడెవడు?
ISA 40:13 యెహోవా ఆత్మను తెలుసుకున్న వారెవరు? యెహోవాకు సలహాదారునిగా ఆలోచన చెప్పగలవారెవరు?
ISA 40:14 ఎవరి దగ్గర యెహోవా ఆలోచన అడిగారు? న్యాయ మార్గాన్ని ఆయనకు నేర్పిన వారెవరు? ఆయనకు తెలివిని నేర్పించిన వారెవరు? ఆయనకు బుద్ధి మార్గాన్ని చూపించిన వారెవరు?
ISA 40:15 నిజంగా దేశాలు చేద నుండి జారే నీటి బిందువుల వంటివి. వారు కొలబద్దల మీది ధూళివంటి వారు; ఆయన ద్వీపాలను సన్నటి ధూళిలా కొలుస్తారు.
ISA 40:16 బలిపీఠపు అగ్నికి లెబానోను చెట్లు సరిపోవు, దహనబలికి దాని జంతువులు చాలవు.
ISA 40:17 అన్ని దేశాలు ఆయన ముందు వట్టివే; ఆయన దృష్టికి అవి విలువలేనివిగా శూన్యం కంటే తక్కువగా ఉంటాయి.
ISA 40:18 కాబట్టి మీరు ఎవరితో దేవుని పోలుస్తారు? ఏ రూపంతో ఆయనను పోలుస్తారు?
ISA 40:19 విగ్రహాన్ని ఒక శిల్పి పోతపోస్తాడు, కంసాలి దానికి బంగారు రేకులు పొదిగి దానికి వెండి గొలుసులు చేస్తాడు.
ISA 40:20 అలాంటి విలువైన దానిని అర్పణగా ఇవ్వలేని పేదవారు పుచ్చిపోని చెక్కను ఎంచుకుంటారు; విగ్రహం కదలకుండా నిలబెట్టడానికి వారు నిపుణుడైన పనివానిని వెదుకుతారు.
ISA 40:21 మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరు మీకు చెప్పలేదా? భూమి స్థాపించబడడాన్ని బట్టి మీరు గ్రహించలేదా?
ISA 40:22 ఆయన భూమండలంపై ఆసీనుడై కూర్చున్నారు. ఆయన ముందు ప్రజలు మిడతల్లా ఉన్నారు. తెరను విప్పినట్లు ఆయన ఆకాశాన్ని పరిచి గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలంగా ఏర్పరిచారు.
ISA 40:23 ఆయన రాజులను నిష్ఫలం చేస్తారు ఈ లోక పాలకులను ఏమీ లేకుండా చేస్తారు.
ISA 40:24 వారు నాటబడిన వెంటనే, వారు విత్తబడిన వెంటనే, వారి భూమిలో వేరు పారకముందే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోతారు. సుడిగాలికి పొట్టు ఎగురునట్లు ఆయన వారిని ఎగరగొడతారు.
ISA 40:25 “నన్ను ఎవరితో పోలుస్తారు? నాకు సమానులెవరు?” అని పరిశుద్ధుడైన దేవుడు అడుగుతున్నారు.
ISA 40:26 మీ కళ్లు ఎత్తి ఆకాశం వైపు చూడండి: వీటన్నటిని సృజించింది ఎవరు? నక్షత్ర సమూహాన్ని ఒక్కొక్క దానిని తీసుకువస్తూ, వాటి వాటి పేర్ల ప్రకారం పిలిచేవాడే గదా. తన గొప్ప శక్తినిబట్టి, తనకున్న శక్తివంతమైన బలాన్నిబట్టి వాటిలో ఏ ఒక్క దానిని విడిచిపెట్టలేదు.
ISA 40:27 యాకోబూ, “నా త్రోవ యెహోవాకు మరుగై ఉంది; నా న్యాయాన్ని నా దేవుడు పట్టించుకోలేదు” అని నీవెందుకు అంటున్నావు? ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెప్తున్నావు?
ISA 40:28 నీకు తెలియదా? నీవు వినలేదా? భూమి అంచులను సృష్టించిన యెహోవా నిత్యుడైన దేవుడు. ఆయన సొమ్మసిల్లరు, అలసిపోరు, ఆయన జ్ఞానాన్ని ఎవరూ గ్రహించలేరు.
ISA 40:29 ఆయన అలిసిపోయిన వారికి బలమిస్తారు శక్తిలేనివారికి శక్తిని ఇస్తారు.
ISA 40:30 యువత సొమ్మసిల్లి అలసిపోతారు, యువకులు తడబడి పడిపోతారు.
ISA 40:31 కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు, నూతన బలాన్ని పొందుతారు. వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు; అలసిపోకుండా పరుగెత్తుతారు. సొమ్మసిల్లకుండా నడుస్తారు.
ISA 41:1 ద్వీపాల్లారా, నా ఎదుట మౌనంగా ఉండండి! దేశాలు తమ బలాన్ని నూతన పరచుకోవాలి! వారు ముందుకు వచ్చి మాట్లాడాలి; తీర్పు తీర్చే స్థలం దగ్గర మనం కలుసుకుందాము.
ISA 41:2 “తన సేవ కోసం తూర్పు నుండి ఒకరిని పురికొల్పి నీతిలో పిలిచింది ఎవరు? ఆయన అతనికి దేశాలు అప్పగిస్తారు రాజులను అతని ఎదుట అణచివేస్తారు. అతడు తన ఖడ్గంతో వాటిని ధూళిగా చేస్తాడు, తన విల్లుతో గాలికి ఎగిరే పొట్టులా మారుస్తాడు.
ISA 41:3 అతడు వారిని వెంటాడుతాడు, ఇంతకుముందు తాను వెళ్లని దారైనా క్షేమంగా వెళ్తాడు.
ISA 41:4 ఎవరు దీనిని ఆలోచించి జరిగించారు? మొదటి నుండి తరాలను పిలిచింది ఎవరు? యెహోవానైన నేనే; వారిలో మొదటి వారితో ఉంది నేనే, చివరి వరకు వారితో ఉండేది నేనే.”
ISA 41:5 ద్వీపాలు దానిని చూసి భయపడుతున్నాయి; భూమి అంచులు వణుకుతున్నాయి. వారు వచ్చి చేరుతున్నారు;
ISA 41:6 వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, “ధైర్యంగా ఉండండి!” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు.
ISA 41:7 శిల్పి కంసాలివాన్ని ప్రోత్సహిస్తాడు, సుత్తితో నునుపు చేసేవాడు, “అది బాగుంది” అని అతుకు గురించి చెప్తూ దాగిలి మీద కొట్టే వానిని ప్రోత్సహిస్తాడు. ఇంకొకడు విగ్రహం కదలకుండా మేకులతో దానిని బిగిస్తాడు.
ISA 41:8 “అయితే, నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఏర్పరచుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము వారసులారా,
ISA 41:9 భూమి అంచుల నుండి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను, మారుమూల ప్రాంతాల నుండి పిలుచుకున్నాను. నేను అన్నాను, ‘నీవు నా సేవకుడవు’; నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను త్రోసివేయలేదు.
ISA 41:10 కాబట్టి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను; దిగులుపడకు, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచి నీకు సహాయం చేస్తాను; నీతిగల నా కుడిచేతితో నిన్ను ఆదరిస్తాను.
ISA 41:11 “నీ మీద కోప్పడిన వారందరు ఖచ్చితంగా సిగ్గుపడి అవమానం పొందుతారు; నిన్ను వ్యతిరేకించేవారు కనబడకుండా నశించిపోతారు.
ISA 41:12 నీ శత్రువుల కోసం నీవు వెదకినా, వారు నీకు కనపడరు. నీతో యుద్ధం చేసేవారు ఏమి లేనివారిగా అవుతారు.
ISA 41:13 నీ దేవుడనైన యెహోవాను, నేను నీ కుడిచేతిని పట్టుకుని, భయపడకు అని నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను.
ISA 41:14 భయపడకు, పురుగులాంటి యాకోబూ! కొద్ది మందిగా ఉన్న ఇశ్రాయేలూ, భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను” అని నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్తున్నారు.
ISA 41:15 “చూడు, నేను నిన్ను పదునుగా ఉండి, అనేకమైన పళ్ళు కలిగిన క్రొత్త నూర్చే పలకగా చేస్తాను. నీవు పర్వతాలను నూర్చి నలగ్గొడతావు, కొండలను పొట్టులా చేస్తావు.
ISA 41:16 నీవు వాటిని చెరగగా, గాలికి కొట్టుకుపోతాయి, సుడిగాలి వాటిని చెదరగొడుతుంది. అయితే నీవు యెహోవాలో సంతోషిస్తావు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడతావు.
ISA 41:17 “పేదవారు, దరిద్రులు నీళ్లు వెదకుతారు కాని వారికి నీరు దొరకక వారి నాలుకలు దాహంతో ఎండిపోతాయి. అయితే, యెహోవానైన నేను వారికి జవాబిస్తాను; ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడిచిపెట్టను.
ISA 41:18 నేను చెట్లులేని ఎత్తు స్థలాల మీద నదులను ప్రవహింపచేస్తాను, లోయల మధ్యలో ఊటలు ఉబికేలా చేస్తాను. ఎడారిని నీటి మడుగుగా, ఎండిపోయిన నేలను ఊటలుగా చేస్తాను.
ISA 41:19 నేను ఎడారిలో దేవదారు వృక్షాలు, తుమ్మచెట్లు, గొంజిచెట్లు, ఓలీవ చెట్లు నాటుతాను. అరణ్యంలో సరళ వృక్షాలను, ఈత చెట్లను, నేరేడు చెట్లను కలిపి నాటుతాను.
ISA 41:20 అప్పుడు ప్రజలు అది చూసి యెహోవా చేయి దీనిని చేసిందని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే దీనిని కలుగజేశారని తెలుసుకుని స్పష్టంగా గ్రహిస్తారు.
ISA 41:21 “మీ వాదన చెప్పండి” అని యెహోవా అంటున్నారు. “మీ రుజువులు చూపించండి” అని యాకోబు రాజు అంటున్నారు.
ISA 41:22 “విగ్రహాల్లారా, ఏమి జరుగబోతుందో మాకు చెప్పండి. గతంలో జరిగిన వాటి గురించి చెప్పండి, తద్వారా మేము వాటిని పరిశీలించి అవి ఎలా నెరవేరాయో తెలుసుకుంటాము. జరుగబోయే సంగతులను మాకు తెలియజేయండి,
ISA 41:23 భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో చెప్పండి, అప్పుడు మీరు దేవుళ్ళని మేము గ్రహిస్తాము. మేము దిగులుపడి భయపడేలా మేలైనా కీడైనా, ఏదో ఒకటి చేయండి.
ISA 41:24 కాని మీరు వట్టివారి కంటే తక్కువవారు మీ పనులు ఏమాత్రం విలువలేనివి; మిమ్మల్ని కోరుకునేవారు అసహ్యులు.
ISA 41:25 “ఉత్తరం వైపు నుండి నేను ఒకడిని రేపుతున్నాను. నా పేరిట ప్రార్థించే వాడొకడు సూర్యోదయ దిక్కునుండి వస్తున్నాడు. కుమ్మరి మట్టిని త్రొక్కినట్లు ఒకడు బురదను త్రొక్కినట్లు అతడు పాలకులను త్రొక్కుతాడు.
ISA 41:26 మేము అంగీకరించేలా మొదటి నుండి జరిగిన వాటిని మాకు ఎవరు చెప్పారు? ‘అతడు చేసింది న్యాయమే’ అని మేము చెప్పేలా గతాన్ని ఎవరు చెప్పారు? దాని గురించి చెప్పిన వారెవరూ లేరు, దాని గురించి ముందే ఎవరు చెప్పలేదు. మీ మాటలు విన్న వారెవరూ లేరు.
ISA 41:27 ‘చూడండి, వారిక్కడ ఉన్నారు!’ అని మొదట సీయోనుతో చెప్పింది నేనే. యెరూషలేముకు శుభవార్త చెప్పడానికి నేను ఒక దూతను పంపాను.
ISA 41:28 నేను చూడగా అక్కడ ఎవరూ లేరు, దేవుళ్ళలో సలహా చెప్పడానికి ఎవరూ లేరు, నేను వారిని ప్రశ్నిస్తే జవాబు ఇవ్వడానికి ఎవరూ లేరు.
ISA 41:29 చూడండి, వారందరు మాయాస్వరూపులే వారి క్రియలు మోసమే; వారి పోత విగ్రహాలు వట్టి గాలి అవి శూన్యములే.
ISA 42:1 “ఇదిగో, నేను నిలబెట్టుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.
ISA 42:2 అతడు కేకలు వేయడు, అరవడు, వీధుల్లో ఆయన స్వరం వినబడనీయడు.
ISA 42:3 నలిగిన రెల్లును అతడు విరువడు, మసకగా వెలుగుతున్న వత్తిని ఆర్పడు. అతడు నమ్మకంగా న్యాయాన్ని చేస్తాడు;
ISA 42:4 భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకు అతడు అలసిపోడు నిరుత్సాహపడడు. అతని బోధలో ద్వీపాలు నిరీక్షణ కలిగి ఉంటాయి.”
ISA 42:5 ఆకాశాలను సృష్టించి వాటిని విశాలపరచి, భూమిని దానిలో పుట్టిన సమస్తాన్ని విస్తరింపజేసి, దానిపై ఉన్న ప్రజలకు ఊపిరిని, దానిపై నడిచే వారికి జీవాన్ని ఇస్తున్న దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే:
ISA 42:6 “యెహోవానైన నేను నీతిలో నిన్ను పిలిచాను; నేను నీ చేయి పట్టుకుంటాను. గుడ్డివారి కళ్లు తెరవడానికి, చెరసాలలోని ఖైదీలను విడిపించడానికి, చీకటి గుహల్లో నివసించేవారిని బయటకు తీసుకురావడానికి, నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా, యూదేతరులకు వెలుగుగా చేస్తాను.
ISA 42:8 “నేనే యెహోవాను. అదే నా పేరు! నా మహిమను నేను మరొకరికి ఇవ్వను నాకు రావలసిన స్తుతులను విగ్రహాలకు చెందనివ్వను.
ISA 42:9 చూడండి, గతంలో చెప్పిన సంగతులు జరిగాయి. క్రొత్త సంగతులు నేను తెలియజేస్తున్నాను. అవి జరగకముందే వాటిని మీకు తెలియజేస్తాను.”
ISA 42:10 సముద్రయానం చేసేవారలారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపాల్లారా, వాటిలో నివసించేవారలారా! యెహోవాకు క్రొత్త గీతం పాడండి. భూమి అంచుల నుండి ఆయనను స్తుతించండి.
ISA 42:11 అరణ్యం, దాని పట్టణాలు, తమ స్వరాలు ఎత్తాలి; కేదారు నివాస గ్రామాలు సంతోషించాలి. సెల ప్రజలు ఆనందంతో పాడాలి; పర్వత శిఖరాల నుండి వారు కేకలు వేయాలి.
ISA 42:12 వారు యెహోవాకు మహిమ చెల్లించి ద్వీపాల్లో ఆయన స్తుతిని ప్రకటించాలి.
ISA 42:13 యెహోవా శూరునిలా బయలుదేరతారు యోధునిలా ఆయన తన రోషాన్ని రేకెత్తిస్తారు; ఆయన హుంకరిస్తూ యుద్ధ నినాదం చేస్తూ, తన శత్రువుల మీద గెలుస్తారు.
ISA 42:14 “చాలా కాలం నేను మౌనంగా ఉన్నాను, నేను నిశ్శబ్దంగా ఉంటూ నన్ను నేను అణచుకున్నాను. కాని ఇప్పుడు ప్రసవవేదన పడే స్త్రీలా నేను కేకలువేస్తూ, రొప్పుతూ, ఊపిరి పీల్చుకుంటున్నాను.
ISA 42:15 పర్వతాలను, కొండలను పాడుచేస్తాను. వాటి వృక్ష సంపద అంతటిని ఎండిపోయేలా చేస్తాను; నదులను ద్వీపాలుగా చేస్తాను మడుగులను ఆరిపోయేలా చేస్తాను.
ISA 42:16 గ్రుడ్డివారిని వారికి తెలియని దారుల్లో తీసుకెళ్తాను, తెలియని మార్గాల్లో నేను వారిని నడిపిస్తాను. వారి ఎదుట చీకటిని వెలుగుగా, వంకర దారులను చక్కగా చేస్తాను. నేను ఈ కార్యాలు చేస్తాను; నేను వారిని విడిచిపెట్టను.
ISA 42:17 అయితే చెక్కిన విగ్రహాలను నమ్మినవారు ప్రతిమలతో, ‘మీరు మాకు దేవుళ్ళు’ అని చెప్పేవారు, చాలా సిగ్గుతో వెనుకకు తిరుగుతారు.
ISA 42:18 “చెవిటి వారలారా! వినండి. చూడండి, గ్రుడ్డి వారలారా! చూడండి.
ISA 42:19 నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపిన దూత కాకుండా మరి ఎవడు చెవిటివాడు? నాతో నిబంధన ఉన్నవాని కన్నా ఎవడు గ్రుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?
ISA 42:20 నీవు చాలా సంగతులను చూశావు, కాని నీవు వాటిపై శ్రద్ధ పెట్టవు; నీ చెవులు తెరచి ఉన్నాయి, కాని నీవు వినవు.”
ISA 42:21 యెహోవా తన నీతిని బట్టి తన ధర్మశాస్త్రాన్ని గొప్పగా, మహిమగలదిగా చేయడానికి ఇష్టపడ్డారు.
ISA 42:22 కాని ఈ ప్రజలు దోచుకోబడి కొల్లగొట్టబడ్డారు, వారందరూ గుహల్లో చిక్కుకున్నారు, చెరసాలలో దాచబడ్డారు. వారు దోచుకోబడ్డారు వారిని విడిపించే వారెవరూ లేరు. వారు దోపుడు సొమ్ముగా చేయబడ్డారు, “వారిని వెనుకకు పంపండి” అని చెప్పేవారు ఎవరూ లేరు.
ISA 42:23 మీలో ఎవరు దీనిని వింటారు రాబోయే కాలంలో ఎవరు శ్రద్ధ చూపిస్తారు?
ISA 42:24 యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించింది, ఇశ్రాయేలును దోపిడి చేసేవారికి అప్పగించింది ఎవరు? యెహోవా కాదా, మేము ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు కాదా? వారు ఆయన మార్గాలను అనుసరించలేదు ఆయన ధర్మశాస్త్రానికి లోబడలేదు.
ISA 42:25 కాబట్టి ఆయన వారిమీద తన కోపాగ్నిని యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించారు. అది వారి చుట్టూ మంటలతో చుట్టుకుంది, అయినా వారు గ్రహించలేదు; అది వారిని కాల్చింది, కాని వారు దాన్ని పట్టించుకోలేదు.
ISA 43:1 అయితే యాకోబూ, నిన్ను సృజించిన యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను రూపించినవాడు ఇలా చెప్తున్నారు: “భయపడకు నేను నిన్ను విడిపించాను. పేరు పెట్టి నిన్ను పిలిచాను; నీవు నా వాడవు.
ISA 43:2 నీవు నీళ్లను దాటుతున్నప్పుడు నేను నీతో ఉంటాను; నీవు నదులను దాటుతున్నప్పుడు అవి నిన్ను ముంచవు. నీవు అగ్ని గుండా నడుస్తున్నప్పుడు నీవు కాలిపోవు. మంటలు నిన్ను కాల్చవు.
ISA 43:3 యెహోవానైన నేను నీకు దేవుడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నీ రక్షకుడిని. నీ క్రయధనంగా ఈజిప్టును ఇచ్చాను, నీకు బదులుగా కూషు సెబాలను ఇచ్చాను.
ISA 43:4 నీవు నా దృష్టిలో విలువైనవాడవు, ఘనుడవు కాబట్టి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు బదులుగా మనుష్యులను అప్పగిస్తాను నీ ప్రాణానికి బదులుగా దేశాలను అప్పగిస్తాను.
ISA 43:5 భయపడకు, నేను నీతో ఉన్నాను; తూర్పు నుండి నీ సంతానాన్ని తీసుకువస్తాను, పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను.
ISA 43:6 ‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘వారిని ఆపవద్దు’ అని దక్షిణ దిక్కుకు చెప్తాను. దూరం నుండి నా కుమారులను భూమి అంచుల నుండి నా కుమార్తెలను తీసుకురండి.
ISA 43:7 నా పేరుపెట్టబడిన వారందరిని, నా మహిమ కోసం నేను సృష్టించిన వారిని, నేను రూపించి కలుగజేసిన వారిని తీసుకురండి.”
ISA 43:8 కళ్లుండి గ్రుడ్డివారైన వారిని, చెవులుండి చెవిటివారైన వారిని తీసుకురండి.
ISA 43:9 సర్వ దేశాలు గుమికూడాలి జనములు సమావేశమవ్వాలి. వారిలో ఎవరి దేవుళ్ళు ఇలాంటి సంగతులు మాకు తెలియజేశారు? గతంలో జరిగిన వాటిని ఎవరు మాకు చెప్పారు? తాము నిర్దోషులని నిరూపించడానికి తమ సాక్షులను తీసుకురావాలి, అప్పుడు ఇతరులు విని, “ఇది నిజమే” అని చెప్తారు.
ISA 43:10 “మీరు నా సాక్షులు” అని యెహోవా చెప్తున్నారు, “నేను ఏర్పరచుకున్న నా సేవకుడవు, తద్వారా నీవు నన్ను తెలుసుకొని, నన్ను నమ్మి, నేనే ఆయననని నీవు గ్రహిస్తావు. నాకు ముందుగా ఏ దేవుడు లేడు. నా తర్వాత ఏ దేవుడు ఉండడు.
ISA 43:11 నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.
ISA 43:12 బయలుపరిచింది రక్షించింది ప్రకటించింది నేనే మీ మధ్య ఉన్నది నేనే, ఏ ఇతర దేవుడో కాదు. నేనే దేవుడను మీరు నా సాక్షులు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ISA 43:13 “అవును, పూర్వ రోజులనుండి ఉన్నవాడను నేనే. నా చేతిలో నుండి ఎవరు విడిపించలేరు. నేను చేసే పనిని తిప్పగలవారు ఎవరు?” అని యెహోవా చెప్తున్నారు.
ISA 43:14 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “మీ కోసం నేను బబులోనుకు సైన్యాన్ని పంపి బబులోనీయులందరూ వేటిని బట్టి గర్వించేవారో వారిని ఆ ఓడలలో పారిపోయేలా చేస్తాను.
ISA 43:15 యెహోవానైన నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలును సృజించిన నేనే మీకు రాజును.”
ISA 43:16 యెహోవా ఇలా అంటున్నారు: సముద్రంలో మార్గాన్ని ఏర్పరచినవాడు, గొప్ప జలాల్లో దారిని కలుగజేసినవాడు,
ISA 43:17 రథాలను గుర్రాలను, సైన్యాన్ని వీరులను రప్పించిన యెహోవా చెప్పే మాట ఇదే వారందరు కలిసి పడిపోయారు మరలా ఎప్పటికీ లేవరు, ఆరిపోయిన వత్తిలా వారు నిర్మూలించబడతారు:
ISA 43:18 “పూర్వ విషయాల్ని మరచిపోండి; గత సంగతులను ఆలోచించకండి.
ISA 43:19 చూడండి, నేను ఒక క్రొత్త పని చేస్తున్నాను! ఇప్పుడే అది మొలకెత్తుతుంది; మీరు దానిని గ్రహించలేదా? నేను అరణ్యంలో దారి కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను.
ISA 43:20 నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగడానికి అరణ్యంలో నీళ్లు ఇస్తున్నాను ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను కాబట్టి అడవి జంతువులు, నక్కలు నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి.
ISA 43:21 వారు నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు, వారు నా సుత్తిని ప్రకటిస్తారు.
ISA 43:22 “అయినా యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. ఇశ్రాయేలూ, నా గురించి నీవు విసిగిపోయావు.
ISA 43:23 దహనబలులకు గొర్రెలను నా దగ్గరకు తీసుకురాలేదు, నీ బలులతో నన్ను ఘనపరచలేదు. భోజనార్పణల కోసం నేను నీ మీద భారం మోపలేదు ధూపం వేయమని నిన్ను విసిగించలేదు.
ISA 43:24 నీవు నా కోసం సువాసనగల లవంగపు చెక్కను డబ్బుతో కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వుతో నన్ను తృప్తిపరచలేదు. కాని నీ పాపాలతో నన్ను విసిగించావు నీ దోషాలతో నేను అలసిపోయేలా చేశావు.
ISA 43:25 “నేను నేనే నా ఇష్టానుసారంగా నీ పాపాలను తుడిచివేస్తున్నాను, నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను.
ISA 43:26 నాకు గతంలో జరిగింది గుర్తు చేయి మనం కలిసి వాదించుకుందాం; నిన్ను నీవు నీతిమంతునిగా రుజువు చేసుకో.
ISA 43:27 నీ మూలపురుషుడు పాపం చేశాడు; నీకు బోధించమని నేను పంపినవారు నా మీద తిరుగుబాటు చేశారు.
ISA 43:28 కాబట్టి నేను నీ మందిరంలోని ప్రధానులను అవమానించాను; నేను యాకోబును నాశనానికి ఇశ్రాయేలును దూషణకు అప్పగించాను.
ISA 44:1 “అయితే నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలూ, విను.
ISA 44:2 నిన్ను పుట్టించి, గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసేవాడైన యెహోవా చెప్పే మాట ఇదే: నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకున్న యెషూరూను భయపడకు.
ISA 44:3 నేను దాహంతో ఉన్న దేశం మీద నీళ్లు, ఎండిన భూమి మీద నీటి ప్రవాహాలను కుమ్మరిస్తాను. నీ సంతానంపై నా ఆత్మను, నీ వారసులపై నా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను.
ISA 44:4 వారు మైదానంలో గడ్డిలా పెరుగుతారు, నీటికాలువల దగ్గర నాటిన నిరవంజి చెట్లలా ఎదుగుతారు.
ISA 44:5 కొంతమంది, ‘నేను యెహోవా వాడను’ అని అంటారు; ఇతరులు యాకోబు పేరుతో తమను తాము పిలుచుకుంటారు; ఇంకా కొందరు తమ చేతిపై ‘యెహోవా వారము’ అని రాసుకుని ఇశ్రాయేలు పేరును పెట్టుకుంటారు.
ISA 44:6 “ఇశ్రాయేలీయుల రాజు, విమోచకుడు, సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: నేను మొదటివాడను చివరివాడను; నేను తప్ప ఏ దేవుడు లేడు.
ISA 44:7 నాలా ఎవరు ఉన్నారు? అతడు ప్రకటించాలి. నేను నా మొదటి ప్రజలను నియమించినప్పటి నుండి ఏమి జరిగిందో, ఇంకా ఏమి జరగబోతుందో అతడు తెలియజేయాలి, నా ముందు ఉంచాలి. అవును ఏమి జరగబోతుందో వారు తెలియజేయాలి.
ISA 44:8 మీరు బెదరకండి, భయపడకండి. చాలా కాలం క్రితం నేను ఈ విషయం చెప్పి మీకు ప్రకటించలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప, ఆశ్రయ దుర్గమేదీ లేదు. ఉన్నట్లు నేనెరుగను.”
ISA 44:9 విగ్రహాలను చేసే వారందరు వట్టివారు. వారు నిధిగా ఉంచిన వస్తువులు పనికిరానివి. వారి కోసం మాట్లాడేవారు గ్రుడ్డివారు; వారు తెలివిలేనివారు, వారు సిగ్గుపరచబడతారు.
ISA 44:10 ఎందుకు పనికిరాని విగ్రహాన్ని పోతపోసిన దానినొక దేవునిగా రూపించేవాడు ఎవడు?
ISA 44:11 అలా చేసే ప్రజలందరూ సిగ్గుపరచబడతారు. ఆ శిల్పకారులు కేవలం మనుష్యులే. వారందరు కలిసివచ్చి నిలబడాలి; వారు భయానికి గురై సిగ్గుపడతారు.
ISA 44:12 కమ్మరి తన పనిముట్టు తీసుకుని దానితో నిప్పుల మీద పని చేస్తాడు; సుత్తితో విగ్రహానికి రూపిస్తాడు తన చేతి బలంతో దానిని తయారుచేస్తాడు. అతనికి ఆకలి వేస్తుంది, అతని బలం తగ్గిపోతుంది. అతడు నీళ్లు త్రాగడు, సొమ్మసిల్లిపోతాడు.
ISA 44:13 వడ్రంగి నూలు త్రాడుతో కొలతలు వేసి రూపం యొక్క రూపురేఖలను గుర్తిస్తాడు; అతడు ఉలితో దానిని చెక్కి దిక్సూచితో గుర్తులు పెడతాడు. క్షేత్రంలో అది ఉండడానికి దానికి నర రూపాన్ని ఇచ్చి నర సౌందర్యం కలదానిగా తయారుచేస్తాడు.
ISA 44:14 అతడు దేవదారు చెట్లను నరుకుతాడు సరళ వృక్షాన్ని గాని సింధూర వృక్షాన్ని గాని తీసుకుంటాడు. అతడు అడవి చెట్ల మధ్యలో దానిని ఎదిగేటట్లు చేస్తాడు, దేవదారు చెట్టు నాటుతాడు, వర్షం దానిని పెంచుతుంది.
ISA 44:15 ఒక మనుష్యుడు దాని కట్టెలను మంట పెట్టడానికి ఉపయోగిస్తాడు; అతడు ఆ కట్టెలలో కొన్ని తీసుకుని చలి కాచుకుంటాడు, అవే కట్టెలతో అతడు నిప్పు రాజేసి రొట్టె కాల్చుకుంటాడు. మిగిలిన కర్రతో ఒక దేవున్ని చేసికొని దానిని పూజిస్తాడు; దానితో ఒక విగ్రహాన్ని చేసి దానికి నమస్కారం చేస్తాడు.
ISA 44:16 సగం కట్టెలను నిప్పుతో కాల్చి ఆ కట్టెల మీద తన ఆహారం వండుకుంటాడు. దానిపై అతడు మాంసం వండుకుని తృప్తిగా తింటాడు. అంతేకాదు, అతడు చలి కాచుకుంటూ, “ఆహా! నాకు వెచ్చగా ఉంది; నాకు మంట కనబడుతుంది” అని అనుకుంటాడు.
ISA 44:17 మిగిలిన దానితో అతడు తనకు దేవునిగా ఒక విగ్రహాన్ని చేసుకుంటాడు. అతడు దానికి నమస్కారం చేసి పూజిస్తాడు. “నీవే నా దేవుడవు! నన్ను రక్షించు!” అని దానికి ప్రార్థిస్తాడు.
ISA 44:18 ఈ మనుష్యులకు ఏమీ తెలియదు, దేన్ని గ్రహించరు; చూడకుండ వారి కళ్లు కప్పబడ్డాయి, గ్రహించకుండా వారి మనస్సులు మూయబడ్డాయి.
ISA 44:19 ఎవరూ ఆలోచించడం లేదు, “దీనిలో సగం ఇంధనంగా వాడాను; దాని నిప్పుల మీద రొట్టె కూడా కాల్చాను, నేను మాంసం వండుకుని తిన్నాను. నేను మిగిలిన దానితో అసహ్యమైన దానిని చేయాలా? నేను చెట్టు మొద్దుకు నమస్కారం చేయాలా?” అని ఆలోచించడానికి ఎవరికీ తెలివి గాని వివేచన గాని లేదు.
ISA 44:20 అలాంటివాడు బూడిద తింటాడు; మోసపూరితమైన హృదయం అతన్ని దారి తప్పిస్తుంది; తనను తాను రక్షించుకోలేడు, “నా కుడి చేతిలో ఉన్నది అబద్ధం కాదా?” అని అనలేడు.
ISA 44:21 “యాకోబూ, వీటిని గుర్తు చేసుకో, ఎందుకంటే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. నేను నిన్ను నిర్మించాను, నీవు నా సేవకుడవు; ఇశ్రాయేలూ, నేను నిన్ను మరచిపోను.
ISA 44:22 మేఘం విడిపోవునట్లు నీ దోషాలను ఉదయకాలపు మంచు మబ్బు తొలగిపోయేలా నీ పాపాలను, తుడిచివేశాను. నేను నిన్ను విడిపించాను. నా దగ్గరకు తిరిగి రా.”
ISA 44:23 యెహోవా దీనిని చేశారు కాబట్టి ఆకాశాల్లారా, ఆనందంతో పాడండి; భూమి లోతుల్లారా, బిగ్గరగా అరవండి. పర్వతాల్లారా, అరణ్యమా, నీలో ఉన్న ప్రతి చెట్టు సంగీత నాదం చేయండి. యెహోవా యాకోబును విడిపించారు ఆయన ఇశ్రాయేలులో తన మహిమను చూపిస్తారు.
ISA 44:24 “నిన్ను గర్భంలో రూపించిన నీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “యెహోవాను నేనే అన్నిటిని సృష్టించాను, నేనే ఆకాశాలను విశాలపరిచాను నేను నేనే భూమికి ఆకారమిచ్చాను.
ISA 44:25 నేనే అబద్ధ ప్రవక్తల సూచనలను భంగం చేస్తాను, సోదె చెప్పేవారిని వెర్రివారిగా చేస్తాను. జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి చదువును వ్యర్థం చేసేది నేనే.
ISA 44:26 నా సేవకుని మాటలను స్థిరపరచి నా దూతల ఆలోచనను నెరవేర్చేది నేనే. “యెరూషలేము నివాస స్థలంగా అవుతుందని యూదా పట్టణాలు మరలా కట్టబడతాయని వాటిలో పాడైన స్థలాలను బాగుచేయబడతాయని చెప్పాను.
ISA 44:27 నేను నీటి లోతులతో, ‘ఎండిపో, నీ ప్రవాహాలను ఎండిపోయేటట్లు చేస్తాను’ అని చెప్పాను.
ISA 44:28 నేను కోరెషు గురించి, ‘అతడు నా కాపరి, నా ఇష్టాన్నంతటిని నెరవేరుస్తాడు’ అని చెప్పాను. అతడు, ‘యెరూషలేము తిరిగి కట్టబడాలి’ అని ‘మందిరం పునాదులు వేయబడాలి’ అని చెప్తాడు.”
ISA 45:1 కోరెషు పక్షంగా దేశాలను జయించడానికి రాజులను నిరాయుధులుగా చేయడానికి అతని ఎదుట ద్వారాలు మూయబడకుండా తలుపులు తీయడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. తన అభిషిక్తుడైన ఈ కోరెషుతో యెహోవా చెప్పే మాట ఇదే:
ISA 45:2 నేను నీకు ముందుగా వెళ్లి పర్వతాలను చదును చేస్తాను; ఇత్తడి తలుపుల్ని పగలగొట్టి, ఇనుప గడియలను విరగ్గొడతాను.
ISA 45:3 పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనేనని నీవు తెలుసుకునేలా రహస్య స్థలాల్లో ఉంచిన నిధులను దాచబడిన ధనాన్ని నీకిస్తాను.
ISA 45:4 నా సేవకుడైన యాకోబు కోసం నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు కోసం నేను పేరు పెట్టి నిన్ను పిలిచాను. నీవు నన్ను గుర్తించకపోయినా నీకు గౌరవ బిరుదు ఇచ్చాను.
ISA 45:5 నేను యెహోవాను, వేరే ఏ దేవుడు లేడు; నేను తప్ప ఏ దేవుడు లేడు. నీవు నన్ను గుర్తించకపోయినా నేను నిన్ను బలపరుస్తాను.
ISA 45:6 అప్పుడు సూర్యోదయ దిక్కునుండి సూర్యాస్తమయ స్థలం వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని ప్రజలు తెలుసుకుంటారు. యెహోవాను నేనే; నేను తప్ప వేరే ఎవరూ లేడు.
ISA 45:7 నేను వెలుగును రూపిస్తాను, చీకటిని కలుగజేస్తాను, నేను వృద్ధిని తెస్తాను, విపత్తును కలుగజేస్తాను. యెహోవానైన నేను వీటన్నిటిని చేస్తాను.
ISA 45:8 “పైనున్న ఆకాశాల్లారా, నా నీతిని వర్షింపనివ్వండి; మేఘాలు వాటిని క్రిందికి కురిపించాలి. భూమి విశాలంగా తెరవాలి, రక్షణ మొలవాలి, నీతి దానితో కలిసి వర్ధిల్లాలి; యెహోవానైన నేను దానిని సృష్టించాను.
ISA 45:9 “మట్టి కుండ పెంకులలో ఒక పెంకుగా ఉండి తనను చేసినవానితో వాదించే వారికి శ్రమ. జిగటమన్ను కుమ్మరితో, ‘నీవు ఏం తయారుచేస్తున్నావు?’ అని అంటుందా? అతని పని అతనితో, ‘కుమ్మరికి నైపుణ్యం లేదు’ అని అంటుందా?
ISA 45:10 ‘నీవు కన్నది ఏంటి?’ అని తండ్రితో అనే వానికి, ‘నీ గర్భంలో పుట్టింది ఏంటి?’ అని తల్లితో అనే వానికి శ్రమ.
ISA 45:11 “ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దానిని సృష్టించిన యెహోవా చెప్పే మాట ఇదే: జరుగబోయే వాటి గురించి, నా కుమారుల గురించి నన్ను అడుగుతారా? నా చేతిపనుల గురించి నన్నే ఆజ్ఞాపిస్తారా?
ISA 45:12 భూమిని కలుగచేసింది దాని మీద ఉన్న నరులను సృష్టించింది నేనే. నా సొంత చేతులు ఆకాశాలను విశాలపరిచాయి; నేను వాటి నక్షత్ర సమూహాలను నడిపిస్తాను.
ISA 45:13 నేను నీతిని బట్టి కోరెషును పురికొల్పుతాను: అతని మార్గాలన్నీ తిన్నగా చేస్తాను. అతడు నా పట్టణాన్ని మరలా కడతాడు ఏ వెల ఏ బహుమానం తీసుకోకుండ బందీలుగా ఉన్నవారిని అతడు విడిపిస్తాడు అని సైన్యాల యెహోవా అన్నారు.”
ISA 45:14 యెహోవా చెప్పే మాట ఇదే: “ఈజిప్టు సంపాదన, కూషు వ్యాపార లాభాలు, పొడవైన సెబాయీయులు; నీ దగ్గరకు వచ్చి నీవారవుతారు; సంకెళ్ళతో నీ దగ్గరకు వచ్చి నీ ఎదుట మోకరిస్తారు. ‘నిజంగా దేవుడు నీతో ఉన్నారు, వేరే ఎవరూ లేరు; వేరే ఏ దేవుడు లేడు’ అని నీ ఎదుట నమస్కారం చేసి మనవి చేస్తారు.”
ISA 45:15 ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయంగా మీరు కనబడకుండా చేసుకున్న దేవుడవు.
ISA 45:16 విగ్రహాలను చేసే వారందరు సిగ్గుపడి అవమానపడతారు. వారందరు కలిసి అవమానానికి గురవుతారు.
ISA 45:17 అయితే యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందుతుంది; మీరు మరలా ఎప్పటికీ సిగ్గుపరచబడరు, అవమానం పొందరు.
ISA 45:18 యెహోవా చెప్పే మాట ఇదే: ఆకాశాలను సృష్టించిన యెహోవాయే దేవుడు. ఆయన భూమికి ఆకారమిచ్చి దానిని స్థిరపరిచారు: దానిని శూన్యంగా సృష్టించలేదు కాని, నివాస స్థలంగా దానిని చేశారు. ఆయన అంటున్నారు: “యెహోవాను నేనే మరి వేరే ఎవరూ లేరు.
ISA 45:19 నేను ఎక్కడో చీకటి దేశంలో నుండి రహస్యంగా మాట్లాడలేదు; ‘వ్యర్థంగా నన్ను వెదకండి’ అని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. యెహోవానైన నేను సత్యం మాట్లాడతాను; నేను యథార్థమైనవే తెలియజేస్తాను.
ISA 45:20 “అంతా కలిసి రండి; దేశాల నుండి తప్పించుకు పారిపోయినవారలారా రండి. చెక్క విగ్రహాలను మోస్తూ, రక్షించలేని దేవుళ్ళకు మొరపెట్టే వారికి తెలివిలేదు.
ISA 45:21 నా సన్నిధిలోకి వచ్చి సంగతులు తెలియజేయండి, వారు కలిసి ఆలోచన చేయాలి. పూర్వకాలం నుండి దీనిని తెలియజేసింది ఎవరు? చాలా కాలం క్రితం దానిని ప్రకటించింది ఎవరు? యెహోవానైన నేను కాదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిగల దేవుడను, రక్షకుడను; నేను తప్ప వేరే ఎవరూ లేరు.
ISA 45:22 “భూమి అంచుల్లో నివసించే మీరందరు నా వైపు తిరిగి రక్షణ పొందండి; నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు.
ISA 45:23 నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందని ప్రతి నాలుక నాతోడని ప్రమాణం చేస్తుందని నేను నా పేరిట ప్రమాణం చేశాను. నీతిగల నా నోటి నుండి వచ్చిన మాట ఏదీ వ్యర్థం కాదు.
ISA 45:24 ‘యెహోవాలోనే నీతి, బలము’ అని ప్రజలు నా గురించి చెప్తారు.” ఆయన మీద కోప్పడిన వారందరు ఆయన దగ్గరకు వస్తారు, వారు సిగ్గుపరచబడతారు.
ISA 45:25 అయితే ఇశ్రాయేలు సంతతివారందరు యెహోవాలోనే నీతిమంతులుగా తీర్చబడతారు, వారు ఆయనలోనే అతిశయిస్తారు.
ISA 46:1 బేలు మోకరిస్తుంది, నెబో క్రిందికి వంగుతుంది. వాటి విగ్రహాలను బరువులు మోసే జంతువులు మోస్తాయి. ఆ బరువైన ప్రతిమలను మోయడం కష్టం, అలసిపోయిన పశువులకు భారము.
ISA 46:2 అవన్నీ కలిసి వంగి మోకరిస్తాయి; ఆ బరువును తప్పించుకోలేక అవి కూడా బందీలుగా పట్టుబడతాయి.
ISA 46:3 “యాకోబు వారసులారా, నా మాట వినండి, ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారలారా, నా మాట వినండి, మీ పుట్టుక నుండి నేను మిమ్మల్ని నిలబెట్టాను, మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్మల్ని మోసాను.
ISA 46:4 మీ వృద్ధాప్యం వరకు, వెంట్రుకలు తెల్లగా అయ్యేవరకు నేను, నేనే మిమ్మల్ని నిలబెడతాను. నేనే మిమ్మల్ని చేశాను, నేనే మిమ్మల్ని మోస్తాను. నేనే మిమ్మల్ని నిలబెడతాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను.
ISA 46:5 “మీరు నన్ను ఎవరితో పోలుస్తారు, ఎవరితో సమానంగా ఎంచుతారు? నాతో సమానమని ఎవరిని మీరు నాకు పోటీగా ఉంచుతారు?
ISA 46:6 కొంతమంది తమ సంచుల నుండి బంగారం కుమ్మరించి వెండిని తీసుకువచ్చి బరువు తూచి, తమకు దేవున్ని తయారుచేయడానికి కంసాలిని నియమిస్తారు, తర్వాత దానికి నమస్కరించి పూజిస్తారు.
ISA 46:7 వారు దానిని తమ భుజాలపై ఎత్తుకుని మోస్తారు; దాని చోటులో దానిని నిలబెడతారు, ఆ చోటు నుండి అది కదల్లేదు. ఎవరైనా దానికి మొరపెట్టినా, అది జవాబివ్వలేదు; వారి కష్టాల నుండి వారిని రక్షించలేదు.
ISA 46:8 “దీనిని జ్ఞాపకం ఉంచుకోండి, మనస్సులో పెట్టుకోండి, తిరుగుబాటు చేసే మీరు మీ హృదయంలో పెట్టుకోండి,
ISA 46:9 చాలా కాలం క్రితం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి; నేనే దేవుడను, వేరే ఎవరూ లేరు; నేను దేవుడును, నాలా ఎవరూ లేరు.
ISA 46:10 నేనే మొదటి నుండి చివర కలుగబోయే వాటిని ప్రకటిస్తాను. పూర్వకాలం నుండి రాబోయే వాటిని తెలియజేస్తాను. ‘నా ఉద్దేశం నిలబడుతుంది నాకు ఏది ఇష్టమో, అదంతా చేస్తాను’ అని నేను చెప్తున్నాను.
ISA 46:11 తూర్పు నుండి క్రూరపక్షిని రప్పిస్తాను; దూరదేశం నుండి నా ఉద్దేశాన్ని నెరవేర్చే వానిని పిలుస్తాను. నేను చెప్పిన దానిని నెరవేరుస్తాను; నా ప్రణాళిక ప్రకారం నేను చేస్తాను.
ISA 46:12 మొండి హృదయంతో నా నీతికి దూరంగా ఉన్నవారలారా, నా మాట వినండి.
ISA 46:13 నా నీతిని దగ్గరకు తెస్తున్నాను. అది దూరంగా లేదు; నా రక్షణ ఆలస్యం కాదు. నేను సీయోనుకు రక్షణను ఇశ్రాయేలుకు నా వైభవాన్ని ఇస్తున్నాను.
ISA 47:1 “కన్యయైన బబులోను కుమార్తె, క్రిందికి దిగి ధూళిలో కూర్చో; బబులోనీయుల రాణి పట్టణమా, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో. నీవు సున్నితమైన దానవని సుకుమారివని ఇకపై పిలువబడవు.
ISA 47:2 తిరగలి తీసుకుని పిండి విసురు; నీ ముసుగు తీసివేయి. లంగాలు పైకెత్తి కాలిమీద బట్ట తీసి నదులు దాటు.
ISA 47:3 నీ నగ్నత్వం బయటపడుతుంది నీ సిగ్గు కనబడుతుంది. నేను ప్రతీకారం తీసుకుంటాను; నేను ఎవరిని క్షమించను.”
ISA 47:4 మన విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఆయన పేరు సైన్యాల యెహోవా.
ISA 47:5 “బబులోనీయుల రాణి పట్టణమా, మౌనంగా కూర్చో, చీకటిలోనికి వెళ్లిపో; రాజ్యాలకు రాణివని ఇకపై నీవు పిలువబడవు.
ISA 47:6 నా ప్రజల మీద నేను కోప్పడి నా స్వాస్థ్యాన్ని అపవిత్రపరిచాను; నేను వారిని నీ చేతికి అప్పగించాను, నీవు వారిమీద జాలి చూపలేదు. వృద్ధుల మీద కూడా నీవు చాలా బరువైన కాడిని ఉంచావు.
ISA 47:7 నీవు ‘నేను ఎప్పటికీ నిత్య రాణిగా ఉంటాను!’ అని అనుకున్నావు. కాని వీటి గురించి ఆలోచించలేదు ఏమి జరగబోతుందో తెలుసుకోలేదు.
ISA 47:8 “నీవు సుఖాన్ని ప్రేమిస్తూ క్షేమంగా జీవిస్తూ, ‘నేనే ఉన్నాను, నేను తప్ప వేరే ఎవరూ లేరు. నేను ఎప్పటికీ విధవరాలిని కాను బిడ్డల్ని పోగొట్టుకొని బాధపడను’ అని నీలో నీవు అనుకుంటున్నావు, కాని ఇప్పుడు ఈ మాట విను.
ISA 47:9 ఒక్క క్షణంలోనే ఒక్క రోజులోనే ఈ రెండు నీకు సంభవిస్తాయి: బిడ్డల్ని పోగొట్టుకుంటావు విధవరాలిగా మారతావు. నీవు చాలా శకునాలు చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాల మీద ఆధారపడినా ఈ విషాదాలు నీ మీదికి పూర్తిగా వస్తాయి.
ISA 47:10 నీ చెడుతనాన్ని నీవు నమ్ముకుని ‘ఎవరూ నన్ను చూడరు’ అని అనుకున్నావు. ‘నేనే, నేను తప్ప వేరే ఎవరూ లేరు’ అని నీకు నీవు అనుకున్నప్పుడు నీ జ్ఞానం నీ తెలివి నిన్ను తప్పుదారి పట్టించాయి.
ISA 47:11 విపత్తు నీ మీదికి వస్తుంది, దానిని మాయాజాలంతో ఎలా పోగొట్టాలో నీవు తెలుసుకోలేవు. ఒక కీడు నీ మీద పడుతుంది దానిని నీవు డబ్బుతో నివారించలేవు; నీకు తెలియని నాశనం నీ మీదికి అకస్మాత్తుగా వస్తుంది.
ISA 47:12 “నీ చిన్నప్పటి నుండి నీవు కష్టపడి నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను నీ విస్తారమైన శకునాలను ప్రయోగించుకో బహుశ నీవు విజయం సాధిస్తావేమో, బహుశ నీవు భయం కలిగించగలవేమో.
ISA 47:13 నీవు తీసుకున్న సలహాలన్నీ విని నీవు అలసిపోయావు. నీ జ్యోతిష్యులు, నెలలవారీగా రాశి ఫలాలను చెప్పేవారిని రమ్మను, నీ మీదికి వచ్చే వాటినుండి నిన్ను వారు రక్షించాలి.
ISA 47:14 నిజంగా వారు గడ్డిపరకలా అవుతారు; అగ్ని వారిని కాల్చివేస్తుంది. అగ్ని జ్వాలల నుండి వారు తమను తాము కాపాడుకోలేరు. అవి చలికాచుకోవడానికి వాడే నిప్పులు కాదు; ఎదురుగా కూర్చుని కాచుకునే అగ్ని కూడా కాదు.
ISA 47:15 నీ చిన్నప్పటి నుండి నీవు ఎవరి కోసం శ్రమపడ్డావో వారంతా నిన్ను నిరాశపరుస్తారు. వారంతా తమ తప్పుదారిలో వెళ్లిపోతారు. నిన్ను రక్షించగలిగే వారొక్కరూ ఉండడు.
ISA 48:1 “యాకోబు వారసులారా, ఇశ్రాయేలు అనే పేరుతో పిలువబడి యూదా కుటుంబం నుండి వచ్చే వారలారా వినండి, యెహోవా పేరిట ప్రమాణం చేస్తూ ఇశ్రాయేలు దేవుని వేడుకుంటూ సత్యాన్ని గాని నీతి గాని అనుసరించని వారలారా వినండి.
ISA 48:2 మీ గురించి మీరు పరిశుద్ధ పట్టణస్థులమని చెప్పుకుంటూ ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడుతున్నామని చెప్పుకుంటున్న మీరు వినండి, ఆయన పేరు సైన్యాల యెహోవా:
ISA 48:3 గతంలో జరిగిన వాటి గురించి నేను చాలా కాలం క్రితమే చెప్పాను. నా నోరు వాటిని ప్రకటించింది నేను వాటిని తెలియజేశాను; తర్వాత నేను అకస్మాత్తుగా వాటిని చేయగా అవి జరిగాయి.
ISA 48:4 ఎందుకంటే మీరు ఎంత మొండివారో నాకు తెలుసు; నీ మెడ నరాలు ఇనుపవని, నీ నుదురు ఇత్తడిదని నాకు తెలుసు.
ISA 48:5 కాబట్టి వీటి గురించి నేను చాలా కాలం క్రితం చెప్పాను; ‘నా విగ్రహం ఈ పనులను జరిగించింది నేను చెక్కిన ప్రతిమ, నేను పోతపోసిన విగ్రహం వాటిని నియమించాయి’ అని నీవు ఎప్పుడూ చెప్పకుండా ఉండేలా అవి జరగకముందే నీకు వాటిని ప్రకటించాను.
ISA 48:6 నీవు ఈ సంగతులను విన్నావు; వాటన్నిటిని చూడు. అవి నిజమని నీవు ఒప్పుకోవా? “నీకు తెలియకుండా దాచబడిన క్రొత్త విషయాలను ఇకపై నేను నీకు చెప్తాను.
ISA 48:7 అవి ఇప్పుడే సృజించినవి, ఎప్పుడో చేసినవి కావు; ఈ రోజుకు ముందు నీవు వాటి గురించి వినలేదు. అప్పుడు, ‘అవును, వాటి గురించి నాకు తెలుసు’ అని నీవు చెప్పలేవు.
ISA 48:8 నీవు వాటి గురించి వినలేదు, అవి నీకు తెలియదు; పూర్వం నుండి నీ చెవులు తెరవబడలేదు. నీవు ఎంత ద్రోహివో నాకు తెలుసు; నీ పుట్టుక నుండి తిరుగుబాటుదారుడవు.
ISA 48:9 నేను నిన్ను పూర్తిగా నాశనం చేయకుండా నా నామాన్ని బట్టి నా కోపాన్ని ఆపుకున్నాను; నా కీర్తి కోసం నీ నుండి దానిని నేను నిగ్రహించుకున్నాను.
ISA 48:10 చూడు, నేను నిన్ను శుద్ధి చేశాను, కాని వెండిని చేసినట్లు కాదు; బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను.
ISA 48:11 నా కోసం, నా కొరకే, నేను ఇలా చేస్తాను. నా పేరును ఎలా అపవిత్రం చేయనిస్తాను? నేను నా మహిమను మరొకరికి ఇవ్వను.
ISA 48:12 “యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను. నేనే ఆయనను; నేనే మొదటివాడను నేను చివరివాడను.
ISA 48:13 నా సొంత చేయి భూమికి పునాదులను వేసింది, నా కుడిచేయి ఆకాశాలను విశాలపరిచింది; నేను వాటిని పిలిచినప్పుడు అవన్నీ కలసి నిలబడతాయి.
ISA 48:14 “మీరందరూ కలసి వచ్చి వినండి: విగ్రహాలలో ఏది ఈ విషయాలను ముందే చెప్పింది? యెహోవా స్నేహితునిగా ఎంచుకున్నవాడు ఆయన ఉద్దేశాన్ని బబులోనుకు చేస్తాడు ఆయన చేయి బబులోనీయులకు వ్యతిరేకంగా ఉంటుంది.
ISA 48:15 నేను, నేనే చెప్పాను; అవును, నేనే అతన్ని పిలిచాను. నేను అతన్ని రప్పిస్తాను అతడు తన పనిలో విజయం సాధిస్తాడు.
ISA 48:16 “నా దగ్గరకు వచ్చి ఈ మాట విను: “మొదటి ప్రకటన నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు; అది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను.” ఇప్పుడు ప్రభువైన యెహోవా తన ఆత్మతో నన్ను పంపారు.
ISA 48:17 నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నీ దేవుడనైన యెహోవాను నేనే, నీకు ఏది మంచిదో అది నీకు బోధిస్తాను నీవు వెళ్లవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాను.
ISA 48:18 నీవు నా ఆజ్ఞల పట్ల శ్రద్ధ చూపించి ఉంటే నీ సమాధానం నదిలా నీ నీతి సముద్రపు అలలుగా ఉండేవి.
ISA 48:19 నీ వారసులు ఇసుకలా, నీ పిల్లలు లెక్కించలేని రేణువుల్లా ఉండేవారు. వారి పేరు ఎప్పటికీ కొట్టివేయబడదు ఎప్పుడూ నా ఎదుట నుండి నిర్మూలం కావు.
ISA 48:20 బబులోనును విడిచిపెట్టండి. బబులోనీయుల నుండి పారిపోండి! “యెహోవా తన సేవకుడైన యాకోబును విడిపించారు” అని ఆనంద కేకలతో తెలియజేయండి. దానిని ప్రకటించండి. భూమి అంచుల వరకు దానిని తెలియజేయండి.
ISA 48:21 ఎడారుల గుండా ఆయన వారిని నడిపించినా వారికి దాహం వేయలేదు; ఆయన వారి కోసం బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేశారు. ఆయన బండను చీల్చారు, నీళ్లు ఉప్పొంగుతూ బయటకు వచ్చాయి.
ISA 48:22 “దుర్మార్గులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెప్తున్నారు.
ISA 49:1 ద్వీపాల్లారా, నా మాట వినండి; దూరంగా ఉన్న దేశాల్లారా, ఇది వినండి: నేను పుట్టక ముందే యెహోవా నన్ను పిలిచారు. నా తల్లి గర్భంలో ఉండగానే ఆయన నా పేరు పలికారు.
ISA 49:2 ఆయన నా నోటిని పదునైన ఖడ్గంగా చేశారు, తన చేతి నీడలో నన్ను దాచారు; నన్ను మెరుగుపెట్టిన బాణంలా చేసి తన అంబులపొదిలో నన్ను దాచారు.
ISA 49:3 “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు. నీ ద్వారా నా మహిమను కనుపరుస్తాను” అని ఆయన నాతో చెప్పారు.
ISA 49:4 అయితే నేను, “నేను వృధాగా కష్టపడ్డాను; ఫలితం లేకుండా నా బలాన్ని ఖర్చు చేశాను కాని ఖచ్చితంగా నా తీర్పు యెహోవా దగ్గరే ఉంది, నా బహుమానం నా దేవుని దగ్గరే ఉంది” అని అన్నాను.
ISA 49:5 యెహోవా దృష్టిలో నేను ఘనపరచబడ్డను నా దేవుడే నాకు బలంగా ఉన్నారు తన దగ్గరకు యాకోబును తిరిగి రప్పించడానికి ఇశ్రాయేలును తన కోసం సమకూర్చడానికి తన సేవకునిగా ఉండడానికి నన్ను గర్భంలో నిర్మించిన, యెహోవా ఇలా అంటున్నారు:
ISA 49:6 ఆయన అంటున్నారు: “నీవు యాకోబు గోత్రాలను పునరుద్ధరించడానికి, ఇశ్రాయేలులో నేను తప్పించిన వారిని తిరిగి రప్పించడానికి నా సేవకునిగా ఉండడం నీకు చాలా చిన్న విషయము. నేనిచ్చే రక్షణ భూమి అంచుల వరకు చేరడానికి యూదేతర ప్రజలకు వెలుగుగా నేను నిన్ను చేస్తాను.”
ISA 49:7 రాజ్యాలచేత త్రోసివేయబడి ద్వేషానికి గురైన పాలకుల సేవకునితో ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునైన యెహోవా చెప్పే మాట ఇదే: “యెహోవా నమ్మకమైనవాడు కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు కాబట్టి రాజులు నిన్ను చూసి లేచి నిలబడతారు, యువరాజులు చూసి నమస్కారం చేస్తారు.”
ISA 49:8 యెహోవా చెప్పే మాట ఇదే: “అనుకూల సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను, రక్షణ దినాన నేను నీ మీద దయ చూపిస్తాను; దేశాన్ని పునరుద్ధరించి పాడైన స్వాస్థ్యాలను పంచడానికి బంధించబడిన వారితో, ‘బయలుదేరండి’ అని, చీకటిలో ఉన్నవారితో ‘బయటికి రండి’ అని చెప్పడానికి,
ISA 49:9 నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమిస్తాను. “వారు దారి ప్రక్కన తింటారు చెట్లులేని కొండలమీద పచ్చిక దొరుకుతుంది.
ISA 49:10 వారికి ఆకలి గాని దాహం గాని వేయదు. ఎడారి వేడిగాలి గాని, ఎండ గాని వారికి తగలదు. వారిపట్ల దయగలవాడు వారిని తీసుకెళ్లి నీటి ఊటల ప్రక్క వారిని నడిపిస్తాడు.
ISA 49:11 నా పర్వతాలన్నిటిని దారులుగా చేస్తాను నా రహదారులు ఎత్తు చేయబడతాయి.
ISA 49:12 చూడండి, వారు దూరం నుండి వస్తారు కొందరు ఉత్తరం నుండి కొందరు పడమటి నుండి, కొందరు సీనీయుల దేశం నుండి వస్తారు.”
ISA 49:13 ఆకాశాల్లారా, ఉత్సాహ ధ్వని చేయండి; భూమీ, సంతోషించు; పర్వతాల్లారా, ఆనందంతో పాట పాడండి! ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఓదారుస్తారు, బాధించబడిన తన ప్రజల పట్ల జాలి చూపిస్తారు.
ISA 49:14 అయితే సీయోను, “యెహోవా నన్ను విడిచిపెట్టారు. ప్రభువు నన్ను మరచిపోయారు” అని అన్నది.
ISA 49:15 “తల్లి తన చంటిబిడ్డను మరచిపోతుందా? తాను కన్న బిడ్డ మీద జాలిపడకుండ ఉంటుందా? తల్లియైన మరచిపోవచ్చు కాని నేను నిన్ను మరవను!
ISA 49:16 చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను; నీ గోడలు నిత్యం నా ఎదుట ఉన్నాయి.
ISA 49:17 నీ కుమారులు తొందరగా తిరిగి వస్తారు. నిన్ను నాశనం చేసినవారు నీ నుండి వెళ్లిపోతారు.
ISA 49:18 నీ కళ్ళెత్తి చుట్టూ చూడు; నీ పిల్లలందరు కలిసి నీ దగ్గరకు వస్తున్నారు. ‘వారందరిని నీవు ఆభరణంగా ధరించుకుంటావు; పెళ్ళికుమార్తెలా నీవు వారిని ధరించుకుంటావు. నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ISA 49:19 “నీవు నాశనమై నిర్మానుష్యంగా చేయబడినా నీ దేశం పాడుబడినా నీ భూమి నీ ప్రజలకు ఇరుకుగా ఉంటుంది, నిన్ను మ్రింగివేసినవారు దూరంగా ఉంటారు.
ISA 49:20 నీవు కోల్పోయిన దుఃఖంలో ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు, ‘ఈ స్ధలం మాకు ఇరుకుగా ఉంది. ఇంకా విశాలమైన స్ధలం మాకు ఇవ్వు’ అని నీవు వింటుండగా అంటారు.
ISA 49:21 అప్పుడు నీవు నీ హృదయంలో, ‘వీరిని నా కోసం ఎవరు కన్నారు? నేను నా పిల్లల్ని కోల్పోయిన గొడ్రాలిని; నేను బందీ అయ్యాను, తిరస్కరించబడ్డాను. ఈ పిల్లల్ని ఎవరు పెంచారు? నేను ఒంటరిగా విడిచిపెట్టబడ్డాను. కానీ వీరు ఎక్కడ నుండి వచ్చారు?’ ” అని అనుకుంటావు.
ISA 49:22 ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, నేను దేశాలకు సైగ చేస్తాను, జనాంగాల వైపు నా జెండాను ఎత్తుతాను; వారు నీ కుమారులను తమ చేతుల్లో తీసుకువస్తారు నీ కుమార్తెలను తమ భుజాల మీద మోసుకువస్తారు.
ISA 49:23 రాజులు నిన్ను పోషించే తండ్రులుగా వారి రాణులు నీకు పాలిచ్చే తల్లులుగా ఉంటారు. వారు నీ ఎదుట తమ ముఖాన్ని నేలకు ఆనించి నమస్కారం చేస్తారు; నీ పాదాల దగ్గర ఉన్న దుమ్మును నాకుతారు. అప్పుడు నీవు, నేను యెహోవాను అని, నా కోసం నిరీక్షణతో ఉన్నవారు నిరాశ చెందరని తెలుసుకుంటావు.”
ISA 49:24 యోధుల నుండి దోపుడుసొమ్ము తీసుకోబడుతుందా? నీతిమంతుని నుండి బందీలు విడిపించబడతారా?
ISA 49:25 అయితే యెహోవా చెప్పే మాట ఇదే: “అవును, వీరుల నుండి బందీలు విడిపించబడతారు, క్రూరుల నుండి దోపుడుసొమ్ము తిరిగి వస్తుంది; నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను. నీ పిల్లలను నేను రక్షిస్తాను.
ISA 49:26 నిన్ను బాధించేవారు తమ మాంసాన్ని తామే తినేలా చేస్తాను; ద్రాక్షరసంతో మత్తు ఎక్కినట్లు వారు తమ రక్తాన్ని త్రాగి మత్తులో ఉంటారు. అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు బలవంతుడైన నీ విమోచకుడని మానవులందరూ తెలుసుకుంటారు.”
ISA 50:1 యెహోవా చెప్పే మాట ఇదే: “నేను మీ తల్లిని విడిచిపెట్టి ఇచ్చిన విడాకుల పత్రం ఎక్కడ? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేశాను? మీ పాపాలను బట్టి మీరు అమ్మబడ్డారు; మీ అతిక్రమాలను బట్టి మీ తల్లి పంపివేయబడింది.
ISA 50:2 నేను వచ్చినప్పుడు అక్కడ ఎందుకు ఎవరూ లేరు? నేను పిలిచినప్పుడు ఎందుకు ఎవరూ జవాబివ్వలేదు? నా చేయి నిన్ను విడిపించలేనంత చిన్నగా ఉందా? నిన్ను రక్షించడానికి నాకు బలం లేదా? కేవలం ఒక గద్దింపుతో నేను సముద్రం ఎండిపోయేలా చేస్తాను, నదులను ఎడారిగా చేస్తాను; నీళ్లు లేక వాటి చేపలు కుళ్ళిపోయి దాహంతో చస్తాయి.
ISA 50:3 ఆకాశాలకు చీకటి కమ్మేలా చేస్తాను దానిని గోనెపట్టతో కప్పుతాను.”
ISA 50:4 అలసినవారిని బలపరిచే మాటలు మాట్లాడడానికి చక్కగా ఉపదేశించే నాలుకను ప్రభువైన యెహోవా నాకు ఇచ్చారు. ఆయన ప్రతి ఉదయం నన్ను మేల్కొలుపుతారు, శిష్యునిలా నేను శ్రద్ధగా వినేలా చేస్తారు.
ISA 50:5 ప్రభువైన యెహోవా నా చెవులు తెరిచారు; నేను తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను వెనుతిరగలేదు.
ISA 50:6 నన్ను కొట్టినవారికి నా వీపు అప్పగించాను, నా గడ్డం పెరికినవారికి నా చెంపలు అప్పగించాను; హేళన చేసిన వారి నుండి, ఉమ్మివేసిన వారి నుండి నా ముఖం దాచుకోలేదు.
ISA 50:7 ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు కాబట్టి నేను సిగ్గుపరచబడను. నేను సిగ్గుపరచబడనని నాకు తెలుసు కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలా చేసుకున్నాను.
ISA 50:8 నన్ను నీతిమంతునిగా ఎంచే వాడు సమీపంలోనే ఉన్నాడు. నాపై ఎవరు అభియోగాలు మోగపలరు? మనం కలిసి వాదించుకుందాం! నా ప్రతివాది ఎవడు? అతడు నన్ను ఎదిరించాలి!
ISA 50:9 ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు. నన్ను ఎవరు ఖండిస్తారు? వారందరూ వస్త్రంలా పాతబడిపోతారు. చిమ్మెటలు వారిని తినివేస్తాయి.
ISA 50:10 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వారెవరు? వెలుగు లేకుండా ఉంటూ చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని నమ్మి తన దేవునిపై ఆధారపడాలి.
ISA 50:11 అయితే ఇప్పుడు అగ్నిని ముట్టించి మీ చుట్టూ మండుతున్న దివిటీలను పెట్టుకునే మీరందరు, వెళ్లండి, మీ మంటల వెలుగులో నడవండి మీరు వెలిగించిన దివిటీల మంటల్లో నడవండి. నా చేతి నుండి మీరు పొందుకునేది ఇదే: మీరు వేదనలో పడుకుంటారు.
ISA 51:1 “నీతిని అనుసరిస్తూ యెహోవాను వెదికే వారలారా, నా మాట వినండి: మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో దానివైపు చూడండి, మీరు ఏ గని నుండి తీయబడ్డారో దానివైపు చూడండి;
ISA 51:2 మీ తండ్రియైన అబ్రాహామును, మీకు జన్మనిచ్చిన శారాను చూడండి, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను, అతన్ని ఆశీర్వదించి అతన్ని అనేకమందిగా చేశాను.
ISA 51:3 యెహోవా తప్పకుండా సీయోనును ఓదారుస్తారు దాని శిథిలాలన్నిటిని దయతో చూస్తారు; దాని ఎడారులను ఏదెనులా చేస్తారు. దాని బీడుభూములను యెహోవా తోటలా చేస్తారు. ఆనంద సంతోషాలు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత ధ్వనులు దానిలో కనబడతాయి.
ISA 51:4 “నా ప్రజలారా, మా మాట వినండి; నా దేశమా, నా మాట విను: నా దగ్గర నుండి ఒక హెచ్చరిక వెళ్తుంది; నా న్యాయం దేశాలకు వెలుగుగా మారుతుంది.
ISA 51:5 నా నీతి వేగంగా సమీపిస్తుంది, నా రక్షణ మార్గంలో ఉంది. నా చేయి దేశాలకు తీర్పు తీరుస్తుంది. ద్వీపాలు నా వైపు చూస్తాయి, నిరీక్షణతో నా చేయి కోసం వేచి ఉంటాయి.
ISA 51:6 ఆకాశాల వైపు మీ కళ్ళెత్తి చూడండి, క్రిందున్న భూమిని చూడండి; ఆకాశాలు పొగలా మాయమైపోతాయి, భూమి వస్త్రంలా పాతబడిపోతుంది దాని నివాసులు జోరీగల్లా చనిపోతారు. అయితే నా రక్షణ నిత్యం ఉంటుంది, నా నీతి ఎన్నటికీ విఫలం కాదు.
ISA 51:7 “సరియైనది తెలిసినవారలారా, నా మాట వినండి. నా బోధను హృదయంలో ఉంచుకున్న ప్రజలారా, వినండి: కేవలం మనుష్యులు వేసే నిందలకు భయపడకండి వారి దూషణకు దిగులుపడకండి.
ISA 51:8 వస్త్రాన్ని కొరికినట్లు చిమ్మెట వారిని తినివేస్తుంది; పురుగు బొచ్చును కొరికినట్లు వారిని మ్రింగివేస్తుంది. అయితే నా నీతి నిత్యం ఉంటుంది, నా రక్షణ తరతరాలు ఉంటుంది.”
ISA 51:9 యెహోవా హస్తమా, మేలుకో మేలుకో, బలాన్ని ధరించుకో! పాత తరంలో ఉన్నట్లు గడచిన కాలంలో ఉన్నట్లు లేచిరా. రాహాబును ముక్కలుగా నరికింది నీవే కదా? సముద్రపు మృగాన్ని పొడిచింది నీవే కదా?
ISA 51:10 సముద్రాన్ని లోతైన జలాలను ఎండిపోయేలా చేసింది నీవే కదా, విడిపించబడిన వారు దాటి వెళ్లేలా సముద్ర లోతుల్లో దారి చేసింది నీవే కదా?
ISA 51:11 యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.
ISA 51:12 “నేను నేనే మిమ్మల్ని ఓదార్చుతాను. చనిపోయే మనుష్యులకు గడ్డివంటి మనుష్యులకు మీరు ఎందుకు భయపడతారు?
ISA 51:13 ఆకాశాలను విస్తరింపజేసి భూమి పునాదులను వేసిన మీ సృష్టికర్తయైన యెహోవాను ఎందుకు మరచిపోయారు? బాధించేవాడు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాని కోపాన్ని చూసి ప్రతిరోజు ఎందుకు భయపడుతూ బ్రతుకుతున్నారు? బాధించేవాని కోపం ఏమయ్యింది?
ISA 51:14 క్రుంగిపోయిన ఖైదీలు త్వరలో విడుదల పొందుతారు; వారు తమ చెరసాల గోతిలో చనిపోరు. వారికి ఆహారం తక్కువకాదు.
ISA 51:15 నేను మీ దేవుడనైన యెహోవాను, సముద్రపు అలలు ఘోషించేలా నేను దానిని రేపుతాను. సైన్యాల యెహోవా అని ఆయనకు పేరు.
ISA 51:16 నీ నోటిలో నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను, నేను ఆకాశాలను స్థాపించాను, భూమి పునాదులు వేసినవాడను ‘మీరే నా ప్రజలు’ అని సీయోనుతో చెప్పాను.”
ISA 51:17 యెరూషలేమా లే, మేలుకో, మేలుకో! యెహోవా ఉగ్రత పాత్రను ఆయన చేతి నుండి తీసుకుని నీవు త్రాగావు. ప్రజలను తడబడేలా చేసే పాత్రలోనిది అంతా మడ్డితో సహా పూర్తిగా నీవు త్రాగావు.
ISA 51:18 ఆమెకు పుట్టిన పిల్లలందరిలో తనకు దారి చూపడానికి ఎవరూ లేరు; ఆమె పెంచిన పిల్లలందరిలో తన చేతిని పట్టుకునే వారెవరూ లేరు.
ISA 51:19 ఈ రెండు విపత్తులు నీ మీదికి వచ్చాయి. నిన్ను ఎవరు ఓదార్చగలరు? విధ్వంసం, వినాశనం, కరువు, ఖడ్గం నీ మీదికి వచ్చాయి, నిన్ను ఎవరు ఆదరించగలరు?
ISA 51:20 నీ పిల్లలు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుకున్నట్లు ప్రతి వీధి మూలల్లో వారు పడిపోయారు. యెహోవా ఉగ్రతతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు.
ISA 51:21 ద్రాక్షరసం లేకుండానే మత్తులో మునిగి శ్రమపడినదానా, ఈ మాట విను.
ISA 51:22 తన ప్రజల కోసం వాదించే నీ దేవుడు నీ ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, నిన్ను తడబడేలా చేసే పాత్రను, నా ఉగ్రత పాత్రను నీ చేతిలో నుండి తీసివేశాను. నీవు మరలా దానిని త్రాగవు.
ISA 51:23 ‘మేము మీమీద నడిచేటట్లు క్రింద పడుకో’ అని నీతో చెప్పి నిన్ను బాధపెట్టేవాని చేతుల్లో దానిని పెడతాను, నీవు నీ వీపును నేలకు వంచి నడిచి వెళ్లడానికి ఒక వీధిగా చేశావు.”
ISA 52:1 సీయోనూ, మేలుకో మేలుకో, నీ బలాన్ని ధరించుకో! పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా! నీ సుందరమైన వస్త్రాలను ధరించుకో. సున్నతి పొందనివారు గాని అపవిత్రులు గాని నీ లోనికి మరలా ప్రవేశించరు.
ISA 52:2 నీ దుమ్ము దులుపుకో; యెరూషలేమా, లేచి కూర్చో. బందీగా ఉన్న సీయోను కుమారీ, నీ మెడకున్న సంకెళ్ళు తీసివెయ్యి.
ISA 52:3 యెహోవా చెప్పే మాట ఇదే: “మీరు ఉచితంగా అమ్మబడ్డారు, డబ్బులు ఇవ్వకుండానే మీరు విడిపించబడతారు.”
ISA 52:4 ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “నా ప్రజలు మొదట నివసించడానికి ఈజిప్టుకు వెళ్లారు; తర్వాత అష్షూరు వారిని బాధించింది.
ISA 52:5 “ఇప్పుడు ఇక్కడ నాకున్నది ఏంటి?” అని యెహోవా అంటున్నారు. “నా ప్రజలు ఏ కారణం లేకుండా కొనిపోబడ్డారు. వారిని పాలించేవారు వారిని ఎగతాళి చేస్తున్నారు రోజంతా నా నామం దూషించబడుతుంది” అని యెహోవా అంటున్నారు.
ISA 52:6 “కాబట్టి నా ప్రజలు నా పేరు తెలుసుకుంటారు; కాబట్టి దీని గురించి ముందుగా చెప్పింది నేనని వారు తెలుసుకుంటారు. అవును, అది నేనే.”
ISA 52:7 సువార్త ప్రకటిస్తూ, సమాధానాన్ని చాటిస్తూ, శుభవార్తను తీసుకువస్తూ, రక్షణ గురించి ప్రకటిస్తూ, సీయోనుతో, “నీ దేవుడు పాలిస్తున్నారు” అనే సువార్తను తెచ్చేవారి పాదాలు పర్వతాలమీద ఎంతో అందమైనవి.
ISA 52:8 వినండి! మీ కావలివారు కేకలు వేస్తున్నారు; వారంతా కలిసి సంతోషంతో కేకలు వేస్తున్నారు. యెహోవా సీయోనుకు తిరిగి వచ్చినప్పుడు వారు తమ కళ్లారా చూస్తారు.
ISA 52:9 యెహోవా తన ప్రజలను ఆదరించారు, ఆయన యెరూషలేమును విడిపించారు. కాబట్టి యెరూషలేము శిథిలాల్లారా, కలిసి సంతోషంతో పాటలు పాడండి.
ISA 52:10 అన్ని దేశాలు చూస్తుండగా యెహోవా తన పరిశుద్ధ చేతిని విప్పుతారు. భూమి అంచుల వరకు ఉండేవారంతా మన దేవుని రక్షణను చూస్తారు.
ISA 52:11 వెళ్లండి, వెళ్లండి, అక్కడినుండి వెళ్లండి! అపవిత్రమైన దానిని తాకకండి! యెహోవా మందిరపు ఉపకరణాలను మోసేవారలారా, అక్కడినుండి వెళ్లి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి.
ISA 52:12 యెహోవా మీకు ముందుగా వెళ్తారు, ఇశ్రాయేలు దేవుడు మీ వెనుక కాపలా ఉంటారు. కాని మీరు తొందరగా బయలుదేరి వెళ్లరు. పారిపోతున్నట్లు వెళ్లరు.
ISA 52:13 చూడండి, నా సేవకుడు తెలివిగా ప్రవర్తిస్తాడు; అతడు హెచ్చింపబడి ప్రసిద్ధిచెంది ఉన్నతంగా ఘనపరచబడతాడు.
ISA 52:14 మనుష్యులందరి కంటే అతని ముఖం చాలా వికారమని అతని రూపం మనిషిలా లేదని అతన్ని చూసి అనేకమంది దిగ్భ్రాంతి చెందినట్లు,
ISA 52:15 అతడు అనేక దేశాలను ఆశ్చర్యపడేలా చేస్తారు, అతన్ని బట్టి రాజులు నోళ్ళు మూసుకుంటారు. ఎందుకంటే తమకు తెలియజేయబడని సంగతులను వారు చూస్తారు. తాము వినని వాటిని వారు గ్రహిస్తారు.
ISA 53:1 మా సందేశాన్ని ఎవరు నమ్మారు? యెహోవా హస్తం ఎవరికి వెల్లడయింది?
ISA 53:2 లేత మొక్కలా ఎండిన భూమిలో మొలిచిన మొక్కలా అతడు ఆయన ఎదుట పెరిగాడు. మనల్ని అతనివైపు ఆకర్షించేంత అందం గాని ఘనత గాని అతనికి లేదు, మనం అతన్ని కోరుకునేంతగా మంచి రూపమేమీ అతనికి లేదు.
ISA 53:3 అతడు మనుష్యులచే తృణీకరించబడి తిరస్కరించబడినవానిగా, శ్రమలు అనుభవించినవానిగా, బాధను ఎరిగినవానిగా ఉన్నాడు. ప్రజలు అతన్ని చూడకుండ ముఖం దాచుకుంటారు; అతడు నిర్లక్ష్యం చేయబడ్డాడు, మనం అతన్ని చిన్న చూపు చూశాము.
ISA 53:4 ఖచ్చితంగా అతడు మన బాధలను భరించాడు. మన రోగాలను భరించారు; అయినా అతడు దేవునిచే శిక్షించబడ్డాడని దెబ్బలు బాధలు అనుభవించాడని మనం అనుకున్నాము.
ISA 53:5 అయితే మన అతిక్రమాల కోసం అతడు గాయపడ్డాడు మన దోషాల కారణంగా నలగ్గొట్టబడ్డాడు. మనకు సమాధానం ఇచ్చే శిక్ష అతని మీద పడింది. అతని గాయాల కారణంగా మనం స్వస్థత పొందాము.
ISA 53:6 మనమందరం గొర్రెల్లా దారి తప్పిపోయాము. మనలో ప్రతి ఒక్కరూ తనకిష్టమైన దారిలో తిరిగిపోయారు. యెహోవా మనందరి దోషాన్ని అతని మీద మోపారు.
ISA 53:7 అతడు పీడించబడి బాధించబడినా అతడు తన నోరు తెరవలేదు; వధించబడడానికి తేబడిన గొర్రెపిల్లలా, బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు, ఆయన తన నోరు తెరవలేదు.
ISA 53:8 అన్యాయమైన తీర్పుతో అతన్ని తీసుకెళ్లారు. అయినా అతని తరంలో నిరసన తెలిపింది ఎవరు? సజీవుల భూమి మీద నుండి అతడు తీసివేయబడ్డాడు; అతడు నా ప్రజల పాపాల కోసం శిక్షించబడ్డాడు.
ISA 53:9 అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోటిలో ఏ మోసం లేదు కాని అతడు చనిపోయినప్పుడు దుర్మార్గులతో సమాధి చేశారు, ధనవంతుల సమాధిలో అతన్ని ఉంచారు.
ISA 53:10 అయినా అతన్ని నలగ్గొట్టడం యెహోవాకు ఇష్టమైంది, యెహోవా అతని జీవితాన్ని పాపపరిహారబలిగా అర్పించినా, అతడు తన సంతానాన్ని చూస్తాడు, దీర్ఘకాలం జీవిస్తాడు, యెహోవా చిత్తం అతని హస్తంలో వృద్ధిచెందుతుంది.
ISA 53:11 అతడు శ్రమ పొందిన తర్వాత జీవిత వెలుగును చూసి తృప్తి చెందుతాడు; నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానంతో అనేకమందిని సమర్థిస్తాడు, వారి దోషాలను అతడు భరిస్తాడు.
ISA 53:12 కాబట్టి గొప్పవారితో నేనతనికి భాగం ఇస్తాను. బలవంతులతో కలిసి అతడు దోపుడుసొమ్ము పంచుకుంటాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని మరణం పొందడానికి ధారపోసాడు, అతడు అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు. అతడు అనేకుల పాపభారాన్ని భరిస్తూ, అపరాధుల గురించి విజ్ఞాపన చేశాడు.
ISA 54:1 “గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ప్రసవవేదన పడనిదానా, ఆనందంతో కేకలు వేయి. ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లలకంటే విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువగా ఉంటారు” అని యెహోవా తెలియజేస్తున్నారు.
ISA 54:2 “నీ గుడారపు స్థలాన్ని పెద్దగా చేయి. నీ గుడారపు తెరలను ఆటంకం లేకుండా ముందుకు పొడిగించు నీ త్రాళ్లను పొడవుగా చేయి. నీ మేకుల్ని లోతుగా దిగగొట్టు.
ISA 54:3 నీవు కుడి వైపుకు ఎడమవైపుకు వ్యాపిస్తావు; నీ వారసులు దేశాలను స్వాధీనం చేసుకుని నిర్జనమైన వారి పట్టణాల్లో స్థిరపడతారు.
ISA 54:4 “భయపడకు; నీవు సిగ్గుపరచబడవు అవమానానికి భయపడకు; నీవు అవమానపరచబడవు. నీ యవ్వనపు సిగ్గును నీవు మరచిపోతావు నీ వైధవ్యపు నిందను ఇకపై జ్ఞాపకం చేసుకోవు.
ISA 54:5 నిన్ను సృష్టించినవాడే నీ భర్త ఆయన పేరు సైన్యాల యెహోవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు; ఆయన భూమి అంతటికి దేవుడు.
ISA 54:6 విడిచిపెట్టబడి మనోవేదనకు గురైన భార్యను భర్త పిలిచినట్లు తిరస్కరించబడిన యవ్వనంలో ఉన్న భార్యను భర్త పిలిచినట్లు, యెహోవా నిన్ను తిరిగి పిలుస్తారు” అని నీ దేవుడు చెప్తున్నారు.
ISA 54:7 “కొద్ది కాలం నేను నిన్ను విడిచిపెట్టాను, కానీ గొప్ప జాలితో నేను నిన్ను తిరిగి చేర్చుకుంటాను.
ISA 54:8 తీవ్రమైన కోపంలో కొంతకాలం నీవైపు నేను చూడలేదు కాని నిత్యమైన కృపతో నీపై జాలి చూపిస్తాను” అని నీ విమోచకుడైన యెహోవా అంటున్నారు.
ISA 54:9 “ఇది నాకు నోవహు కాలంలోని జలప్రళయంలా ఉంది, జలప్రళయం భూమి మీదికి ఇకపై రాదని నోవహు కాలంలో నేను ప్రమాణం చేశాను. అలాగే ఇప్పుడు నీ మీద కోప్పడనని, ఎన్నడు నిన్ను గద్దించనని నేను ప్రమాణం చేశాను.
ISA 54:10 పర్వతాలు కదిలినా కొండలు తొలగిపోయినా నా మారని ప్రేమ నిన్ను విడిచిపోదు. నా సమాధాన నిబంధన తొలిగిపోదు” అని నీపై దయ చూపించే యెహోవా చెప్తున్నారు.
ISA 54:11 “తుఫానులతో కొట్టుకుపోతూ ఓదార్పు లేక బాధపడుతున్న పట్టణమా, వైడూర్యాలతో నేను నిన్ను తిరిగి కడతాను, నీలమణులతో నీ పునాదులను వేస్తాను.
ISA 54:12 రత్నాలతో నీ కోట బురుజులపై గోడలు, మెరిసే వజ్రాలతో నీ గుమ్మాలు ప్రశస్తమైన రాళ్లతో నీకు గోడలు కడతాను.
ISA 54:13 యెహోవా నీ పిల్లలందరికి బోధిస్తారు వారికి గొప్ప సమాధానం కలుగుతుంది.
ISA 54:14 నీవు నీతిలో స్థాపించబడతావు: బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. నీవు దేనికి భయపడే అవసరం లేదు. భయం నీకు దూరంగా ఉంటుంది. అది నీ దగ్గరకు రాదు.
ISA 54:15 ఎవరైనా నీ మీద దాడి చేస్తే, అది చేసింది నేను కాదు; నీ మీద దాడి చేసినవారు నీకు లొంగిపోతారు.
ISA 54:16 “చూడు, నిప్పులు ఊది మండించి తన పనికి తగిన ఆయుధాన్ని తయారుచేసే కమ్మరిని సృజించింది నేనే. నాశనం చేయడానికి నాశనం చేసేవాన్ని సృష్టించింది నేనే.
ISA 54:17 నీకు వ్యతిరేకంగా తయారుచేయబడిన ఏ ఆయుధం విజయం సాధించదు, నిన్ను దూషించే ప్రతి నాలుకను నీవు ఖండిస్తావు. యెహోవా సేవకులు పొందే స్వాస్థ్యం ఇదే, నా వలన వారికి కలిగే నిరూపణ ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ISA 55:1 దాహంతో ఉన్నవారలారా, నీళ్ల దగ్గరకు రండి. డబ్బులేని వారలారా, మీరు వచ్చి కొని తినండి! డబ్బు లేకపోయినా ఏమీ చెల్లించకపోయినా, ద్రాక్షరసం, పాలు కొనండి.
ISA 55:2 ఆహారం కాని దాని కోసం మీరెందుకు డబ్బు ఖర్చుపెడతారు? తృప్తి కలిగించని వాటికోసం ఎందుకు కష్టార్జితాన్ని వెచ్చిస్తారు? వినండి, నా మాట వినండి, ఏది మంచిదో దానిని తినండి, అప్పుడు మీరు గొప్ప వాటిని ఆనందిస్తారు.
ISA 55:3 శ్రద్ధగా విని నా దగ్గరకు రండి; మీరు వింటే బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు వాగ్దానం చేసిన నా శాశ్వత ప్రేమను మీకు చూపిస్తాను.
ISA 55:4 చూడండి, నేను అతన్ని జనాంగాలకు సాక్షిగా చేశాను, జనాంగాలకు రాజుగా అధిపతిగా అతన్ని నియమించాను.
ISA 55:5 ఖచ్చితంగా నీకు తెలియని దేశాలను నీవు పిలుస్తావు. యెహోవా నిన్ను మహిమపరచడం చూసి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీవెవరో తెలియని దేశాలు నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాయి.
ISA 55:6 యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి; ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి.
ISA 55:7 దుష్టులు తమ మార్గాలను అవినీతిపరులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి. వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారిపై జాలి పడతారు. మన దేవుడు వారిని ఉచితంగా క్షమిస్తారు.
ISA 55:8 “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు” అని యెహోవా చెప్తున్నారు.
ISA 55:9 “ఆకాశాలు భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గాల కన్నా నా మార్గాలు మీ ఆలోచనల కన్నా నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి.
ISA 55:10 వర్షం మంచు ఆకాశం నుండి క్రిందికి వచ్చి ఎలా తిరిగి వెళ్లకుండా భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని తినేవానికి ఆహారాన్ని ఇవ్వడానికి భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని తినేవానికి ఆహారాన్ని ఇవ్వడానికి అది చిగురించి ఫలించేలా చేస్తాయో,
ISA 55:11 అలాగే నా నోటి నుండి వచ్చిన నా మాట ఉంటుంది: అది వట్టిగా నా దగ్గరకు తిరిగి రాకుండా నేను కోరుకున్న ప్రకారం చేసి నేను దానిని పంపిన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది.
ISA 55:12 మీరు సంతోషంగా బయటకు వెళ్తారు, మీరు సమాధానంగా తీసుకెళ్తారు. మీ ఎదుట పర్వతాలు కొండలు పాటలు పాడడం ప్రారంభిస్తాయి, పొలం లోని చెట్లన్నీ తమ చేతులతో చప్పట్లు కొడతాయి.
ISA 55:13 ముండ్ల చెట్లకు బదులు సరళ వృక్షాలు పెరుగుతాయి, దురదగొండి చెట్లకు బదులు గొంజిచెట్లు ఎదుగుతాయి. ఇది యెహోవా కీర్తిగా నిత్యమైన గుర్తుగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది.”
ISA 56:1 యెహోవా చెప్పే మాట ఇదే: “నా రక్షణ రావడానికి సిద్ధంగా ఉంది, నా నీతి త్వరలో వెల్లడవుతుంది, కాబట్టి న్యాయంగా ఉండండి సరియైనది చేయండి.
ISA 56:2 ఎవరైతే సబ్బాతును అపవిత్రం చేయకుండ దానిని పట్టుదలతో ఆచరించేవారు, ఏ కీడు చేయకుండ, తమ చేతిని బిగబట్టుకునేవారు ధన్యులు.”
ISA 56:3 యెహోవాను వెంబడించే ఏ విదేశీయుడైనా, “యెహోవా తన ప్రజల్లో నుండి నన్ను వెలివేస్తారు” అని అనకూడదు. ఏ నపుంసకుడైనా, “నేను కేవలం ఎండిన చెట్టును” అని అనకూడదు.
ISA 56:4 ఎందుకంటే యెహోవా చెప్పే మాట ఇదే: “నేను నియమించిన సబ్బాతును పాటిస్తూ నాకిష్టమైన వాటిని కోరుకుంటూ నా నిబంధనకు నమ్మకంగా ఉండే నపుంసకులకు,
ISA 56:5 నా మందిరంలో, నా గోడలలో, కుమారులు, కుమార్తెలు కలిగి ఉన్న దానికన్న శ్రేష్ఠమైన జ్ఞాపకార్థాన్ని, పేరును ఇస్తాను. ఎప్పటికీ నిలిచివుండే నిత్యమైన పేరు వారికి నేను ఇస్తాను.
ISA 56:6 యెహోవాకు కట్టుబడి ఉంటూ ఆయనకు సేవ చేస్తూ, యెహోవా నామాన్ని ప్రేమిస్తూ, ఆయన సేవకులుగా ఉంటూ సబ్బాతును అపవిత్రపరచకుండా పాటిస్తూ, నా నిబంధన నమ్మకంగా పాటిస్తున్న విదేశీయులందరిని
ISA 56:7 నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు తీసుకువస్తాను, నా ప్రార్థన మందిరంలో వారికి ఆనందాన్ని ఇస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులు అర్పణలు అంగీకరించబడతాయి; నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది.”
ISA 56:8 ఇశ్రాయేలీయులలో బందీగా కొనిపోబడినవారిని సమకూర్చే ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నారు: “నేను సమకూర్చిన వారే కాకుండా వారితో పాటు ఇతరులను సమకూర్చుతాను.”
ISA 56:9 పొలం లోని సమస్త జంతువులారా, రండి, అడవిలోని సమస్త మృగాల్లారా, వచ్చి తినండి!
ISA 56:10 ఇశ్రాయేలు కావలివారు గ్రుడ్డివారు. వారందరికి తెలివిలేదు; వారందరు మూగ కుక్కలు, వారు మొరగలేరు; వారు పడుకుని కలలు కంటారు, నిద్రంటే వారికి ఇష్టము.
ISA 56:11 వారు తిండి కోసం ఆరాటపడే కుక్కల వంటి వారు. ఎంత తిన్నా వారికి తృప్తి ఉండదు. వారు వివేచనలేని కాపరులుగా ఉన్నారు; వారందరు తమకిష్టమైన దారుల్లో పోతారు, తమ సొంత ప్రయోజనం చూసుకుంటారు.
ISA 56:12 వారు, “రండి, నేను ద్రాక్షరసం తెప్పిస్తాను మనం తృప్తిగా మద్యం త్రాగుదాం! ఈ రోజులానే రేపు ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది” అంటారు.
ISA 57:1 నీతిమంతులు నశిస్తారు, ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోరు; భక్తులు మాయమైపోతారు, కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడడం ఎవరూ గ్రహించరు.
ISA 57:2 యథార్థంగా జీవించేవారు సమాధానంలో ప్రవేశిస్తారు; వారు చనిపోయినప్పుడు వారికి విశ్రాంతి కలుగుతుంది.
ISA 57:3 “అయితే మంత్రగత్తె పిల్లలారా! వ్యభిచారసంతానమా! వేశ్యసంతానమా! ఇక్కడకు రండి.
ISA 57:4 మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? ఎవరిని చూసి వెక్కిరిస్తూ మీ నాలుక చాపుతున్నారు మీరు తిరుగుబాటుదారులు, అబద్ధికుల సంతానం కాదా?
ISA 57:5 మీరు సింధూర వృక్షాల క్రింద పచ్చని ప్రతి చెట్టు క్రింద కామంతో రగిలిపోతున్నారు; మీరు కనుమలలో, రాతిసందుల క్రింద మీ పిల్లలను బలి ఇస్తారు.
ISA 57:6 కనుమలలోని నున్నని రాళ్ల మధ్యలో ఉన్న విగ్రహాలు మీ భాగము; నిజంగా అవే మీకు భాగము. అవును వాటికి మీ పానార్పణలు పోశారు, భోజనార్పణలు చెల్లించారు. ఇదంతా చూసి నేను క్షమించాలా?
ISA 57:7 చాలా ఎత్తైన పర్వతం మీద మీరు మీ పరుపు వేసుకున్నారు; బలులు అర్పించడానికి అక్కడికి ఎక్కి వెళ్లారు.
ISA 57:8 తలుపుల వెనుక ద్వారబంధాల వెనుక మీ యూదేతర గుర్తులు పెట్టారు. నన్ను విడిచిపెట్టి మీ పరుపును పరిచారు దాని మీదకు ఎక్కి దానిని వెడల్పు చేశారు; మీరు వారి మంచాలను ప్రేమించి వారితో నిబంధన చేసుకున్నారు. వారి నగ్న శరీరాలను కామంతో చూశారు.
ISA 57:9 మీరు ఒలీవనూనె తీసుకుని మోలెకు దగ్గరకు వెళ్లారు ఎన్నో సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్లారు. మీరు మీ రాయబారులను దూరప్రాంతానికి పంపించారు; మీరు పాతాళమంత లోతుగా దిగబడిపోయారు!
ISA 57:10 మీరు దూర ప్రయాణాలు చేసి అలసిపోయారు, అయినా ‘అది సాధ్యం కాదు’ అని మీరు అనుకోలేదు. మీరు మీ తిరిగి బలం పొందుకున్నారు కాబట్టి మీరు సొమ్మసిల్లలేదు.
ISA 57:11 “మీరు ఎవరికి జడిసి భయపడి నా పట్ల నిజాయితీగా లేకుండా, నన్ను జ్ఞాపకం చేసుకోకుండా దీనిని పట్టించుకోకుండా ఉన్నారు? చాలా కాలం నేను మౌనంగా ఉన్నానని మీరు నాకు భయపడడం లేదు కదా?
ISA 57:12 నీ నీతిని పనులను నేను బయటపెడతాను అవి మీకు ప్రయోజనకరంగా ఉండవు.
ISA 57:13 మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు మీరు సేకరించిన మీ విగ్రహాలే మిమ్మల్ని రక్షించాలి! గాలి వాటన్నిటిని తీసుకెళ్తుంది, కేవలం ఒకని ఊపిరి వాటిని చెదరగొడుతుంది. అయితే నన్ను ఆశ్రయించినవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.”
ISA 57:14 ఇలా చెప్పబడుతుంది: “కట్టండి, కట్టండి, దారిని సిద్ధపరచండి! నా ప్రజల మార్గంలో నుండి అడ్డుగా ఉన్నవాటిని తీసివేయండి.”
ISA 57:15 ఎందుకంటే మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసియైన దేవుడు ఇలా చెప్తున్నారు: “నేను ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాను, అంతేకాక వినయం గలవారి ఆత్మకు చైతన్యం కలిగించడానికి నలిగినవారి ప్రాణానికి చైతన్యం కలిగించడానికి ఆత్మలో వినయం, దీనమనస్సు గలవారి దగ్గర నివసిస్తాను.
ISA 57:16 నేను వారిని నిత్యం నిందించను, నేను ఎప్పుడు కోపంగా ఉండను ఎందుకంటే నా వలన వారు నీరసించిపోతారు. నేను పుట్టించిన ప్రజలు నీరసించిపోతారు.
ISA 57:17 వారి పాపిష్ఠి దురాశను బట్టి కోప్పడ్డాను నేను వారిని శిక్షించి కోపంతో నా ముఖం త్రిప్పుకున్నాను, అయినా వారు తమకిష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉన్నారు.
ISA 57:18 నేను వారి మార్గాలను చూశాను, కాని వారిని బాగుచేస్తాను; నేను వారిని నడిపించి ఇశ్రాయేలులో దుఃఖించేవారిని ఓదారుస్తూ,
ISA 57:19 వారి పెదవులపై స్తుతి కలుగజేస్తాను. దూరంగా ఉన్నవారికి దగ్గరగా ఉన్నవారికి సమాధానం, సమాధానం” అని యెహోవా అంటున్నారు. “నేను వారిని బాగుచేస్తాను.”
ISA 57:20 దుర్మార్గులు ఎగసిపడే సముద్రం వంటివారు. అది నెమ్మదిగా ఉండలేదు, దాని అలలు బురదను మురికిని పైకి తెస్తాయి.
ISA 57:21 “దుర్మార్గులకు సమాధానం ఉండదు” అని నా దేవుడు చెప్తున్నారు.
ISA 58:1 “గట్టిగా కేకలు వేయండి, ఆపకండి. బూర ఊదినట్లు మీ స్వరం వినిపించండి. నా ప్రజలకు వారు చేసిన తిరుగుబాటును తెలియజేయండి, యాకోబు వారసులకు వారి పాపాలను తెలియజేయండి.
ISA 58:2 ప్రతిరోజు వారు నన్ను వెదకుతారు; తమ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టని వారిగా నీతిని అనుసరించే దేశంగా నా మార్గాలు తెలుసుకోవడానికి అత్యాసక్తి చూపిస్తారు. తమకు న్యాయమైన తీర్పులు ఇవ్వాలని నన్ను అడుగుతారు, దేవుడు తమ దగ్గరకు రావాలని కోరుకుంటారు.
ISA 58:3 వారంటారు, ‘మేము ఉపవాసం ఉండగా మీరెందుకు చూడరు? మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీరెందుకు గమనించరు?’ “అయినా మీరు ఉపవాసం ఉన్న రోజున మీకు నచ్చినట్లుగా చేశారు మీ పనివారినందరిని దోచుకున్నారు.
ISA 58:4 మీ ఉపవాసం గొడవలతో దెబ్బలాటలతో, ఒకరినొకరు పిడికిలితో గుద్దులాడడంతో ముగుస్తుంది. మీ స్వరం పరలోకంలో వినపడాలని మీరు ఈ రోజులా ఉపవాసం ఉండకూడదు.
ISA 58:5 ఇలాంటి ఉపవాసమా నేను కోరుకున్నది? మనుష్యులు ఆ ఒక్కరోజు తమను తాము తగ్గించుకుంటే సరిపోతుందా? ఒకడు జమ్ము రెల్లులా తలవంచుకొని గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చోవడమే ఉపవాసమా? యెహోవాకు ఇష్టమైన ఉపవాసం ఇదేనని మీరనుకుంటున్నారా?
ISA 58:6 “నేను కోరుకునే ఉపవాసం అన్యాయపు సంకెళ్ళను విప్పడం, బరువైన కాడి త్రాళ్లు తీసివేయడం, బాధించబడిన వారిని విడిపించడం, ప్రతీ కాడిని విరగ్గొట్టడం కాదా?
ISA 58:7 మీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారితో పంచుకోవడం, ఇల్లు లేక తిరుగుతున్న పేదలకు ఆశ్రయం కల్పించడం, మీరు ఎవరినైనా నగ్నంగా చూస్తే, వారికి బట్టలు ఇవ్వడం, మీ రక్తసంబంధులకు ముఖం దాచకపోవడమే కదా ఉపవాసం?
ISA 58:8 అప్పుడు మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది. మీకు వెంటనే స్వస్థత కలుగుతుంది; అప్పుడు మీ నీతి మీ ముందుగా నడుస్తుంది యెహోవా మహిమ మీ వెనుక కాపలాగా ఉంటుంది.
ISA 58:9 అప్పుడు మీరు పిలిస్తే యెహోవా జవాబిస్తారు; మీరు మొరపెడితే ఆయన నేనున్నాను అంటారు. “మీరు ఇతరులను బాధించడం, వ్రేలుపెట్టి చూపిస్తూ చెడు మాట్లాడడం మానేస్తే,
ISA 58:10 ఆకలితో ఉన్నవారికి మీ దగ్గర ఉన్నది ఇచ్చి, బాధించబడినవారి అవసరాలను తీరిస్తే, చీకటిలో మీ వెలుగు ప్రకాశిస్తుంది, మీ చీకటి మధ్యాహ్నపు వెలుగుగా మారుతుంది.
ISA 58:11 యెహోవా మిమ్మల్ని నిత్యం నడిపిస్తారు; కరువు కాలంలో ఆయన మిమ్మల్ని తృప్తిపరచి మీ ఎముకలను బలపరుస్తారు. మీరు నీరు పెట్టిన తోటలా ఎప్పుడూ నీరు వచ్చే నీటి ఊటలా ఉంటారు.
ISA 58:12 పూర్వకాలపు శిథిలాలను మీ ప్రజలు కడతారు. అనేక తరాల నాటి పునాదులను మీరు మరల వేస్తారు; మీరు కూలిన గోడలను మరమత్తు చేసే మేస్త్రీగా, నివాసయోగ్యంగా వీధుల్ని బాగు చేసేవారిగా పిలువబడతారు.
ISA 58:13 “నా పరిశుద్ధ దినాన మీకు ఇష్టం వచ్చినట్లు చేయకుండా నా సబ్బాతును పాటిస్తే, సబ్బాతు ఆనందాన్ని కలిగిస్తుందని యెహోవా పరిశుద్ధ దినం ఘనమైనదని అనుకుంటే, దానిని గౌరవించి మీ సొంత మార్గంలో మీరు వెళ్లకుండా, మీకిష్టమైన పనులు చేయకుండా వట్టిమాటలు మాట్లాడకుండా ఉంటే,
ISA 58:14 అప్పుడు మీరు యెహోవాలో ఆనందిస్తారు, దేశంలో ఉన్నతస్థలాల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను, మీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యాన్ని మీరు అనుభవించేలా చేస్తాను.” యెహోవా తెలియజేసిన మాట ఇదే.
ISA 59:1 నిజంగా రక్షించలేనంతగా యెహోవా చేయి కురుచకాలేదు, వినలేనంతగా ఆయన చెవులు మందం కాలేదు.
ISA 59:2 కాని మీ పాపాలు మిమ్మల్ని మీ దేవుని నుండి వేరు చేశాయి; మీ పాపాలు ఆయన ముఖాన్ని మీకు కనబడకుండా చేశాయి, కాబట్టి ఆయన వినడం లేదు.
ISA 59:3 మీ చేతులు రక్తంతో మీ వ్రేళ్లు దోషంతో మలినమయ్యాయి. మీ పెదవులు అబద్ధాలు పలికాయి, మీ నాలుక చెడ్డ మాటలు మాట్లాడింది.
ISA 59:4 న్యాయం గురించి ఎవరూ పట్టించుకోరు; ఎవరూ నిజాయితితో వాదించరు. వారు వట్టి వాదనలను నమ్ముకుని అబద్ధాలు చెప్తారు; వారు హింసను గర్భం దాల్చి చెడును కంటారు.
ISA 59:5 వారు మిడునాగుల గుడ్లను పొదుగుతారు సాలెగూడు నేస్తారు. వారి గుడ్లు తిన్నవారు చనిపోతారు, ఒక గుడ్డు పగిలితే విషపాము పుడుతుంది.
ISA 59:6 వారి సాలెగూళ్లు దుస్తులకు పనికిరావు వారు తయారుచేసిన వాటితో తమను తాము కప్పుకోలేరు. వారి పనులు చెడుపనులు. వారి చేతులతో హింసాత్మక క్రియలు ఉన్నాయి.
ISA 59:7 వారి కాళ్లు పాపంలోకి పరుగెత్తుతాయి; నిరపరాధుల రక్తాన్ని చిందించడానికి వారు త్వరపడతారు. వారు దుష్ట పథకాలు అనుసరిస్తారు. హింస క్రియలు వారి మార్గాల్లో ఉన్నాయి.
ISA 59:8 సమాధాన మార్గం వారికి తెలియదు; వారి మార్గాల్లో న్యాయం ఉండదు. వాటిని వారు వంకర దారులుగా చేశారు; వాటిలో నడిచే వారెవరికి సమాధానం ఉండదు.
ISA 59:9 కాబట్టి న్యాయం మనకు దూరంగా ఉంది, నీతి మనకు అందడం లేదు. మేము వెలుగు కోసం చూస్తున్నాం కాని అంతా చీకటే ఉంది; ప్రకాశం కోసం చూస్తున్నాం కాని కటిక చీకటిలోనే నడుస్తున్నాము.
ISA 59:10 గ్రుడ్డివారిలా గోడ కోసం తడుముకుంటున్నాము, కళ్లులేని వారిలా తడుముకుంటున్నాము. సంధ్య చీకటి అన్నట్టు మధ్యాహ్నం కాలుజారి పడుతున్నాము. బలవంతుల మధ్యలో చచ్చిన వారిలా ఉన్నాము.
ISA 59:11 మేమంతా ఎలుగుబంట్లలా కేకలు వేస్తున్నాము; పావురాల్లా దుఃఖంతో మూలుగుతున్నాము. మేము న్యాయం కోసం చూస్తున్నాం కాని అది దొరకడం లేదు. రక్షణ కోసం చూస్తున్నాం కాని అది మాకు దూరంగా ఉంది.
ISA 59:12 మా అపరాధాలన్నీ మా ఎదుట ఉన్నాయి మా పాపాలు మామీద సాక్ష్యం ఇస్తున్నాయి. మా అపరాధాలన్నీ ఎల్లప్పుడు మాతో ఉన్నాయి, మా దోషాలు మాకు తెలుసు.
ISA 59:13 తిరుగుబాటు చేసి యెహోవాకు ద్రోహం చేశాం, మా దేవునికి విరుద్ధంగా ఉంటూ, తిరుగుబాటును ప్రేరేపించడం బాధపెట్టడం, మా హృదయంలో ఆలోచించుకుని, అబద్ధాలు చెప్పడము.
ISA 59:14 కాబట్టి న్యాయం వెనుకకు నెట్టబడింది, నీతి దూరంగా నిలబడింది. సత్యం వీధుల్లో పడి ఉంది. నిజాయితీ లోపలికి రాలేకపోతుంది.
ISA 59:15 సత్యం ఎక్కడా కనిపించడం లేదు, చెడును విడిచిపెట్టేవాడు దోచుకోబడుతున్నాడు. న్యాయం జరగకపోవడం చూసి యెహోవా అసంతృప్తి చెందారు.
ISA 59:16 ఎవరూ లేరని ఆయన చూశారు, మధ్యవర్తి ఎవరూ లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు; కాబట్టి ఆయన చేయి ఆయనకు సహాయం చేసింది, ఆయన నీతి ఆయనను నిలబెట్టింది.
ISA 59:17 ఆయన నీతిని తన కవచంగా ధరించారు, రక్షణను తన తలమీద శిరస్త్రాణంగా ధరించారు; ఆయన ప్రతీకార వస్త్రాలను ధరించారు పై వస్త్రం ధరించినట్లు ఆయన తనను తాను ఆసక్తితో చుట్టుకున్నారు.
ISA 59:18 వారు చేసిన దానిని బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తారు తన శత్రువులకు కోపం చూపిస్తారు తన విరోధులకు ప్రతీకారం చేస్తారు; ఆయన ద్వీపాలకు తగిన ప్రతిఫలాన్ని చెల్లిస్తారు.
ISA 59:19 పశ్చిమలో ఉన్నవారు యెహోవా నామానికి భయపడతారు. సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమను గౌరవిస్తారు. యెహోవా ఊపిరి తీసుకువచ్చే ఉధృతమైన వరదలా ఆయన వస్తారు.
ISA 59:20 “సీయోను దగ్గరకు, యాకోబులో తమ పాపాలకు పశ్చాత్తాపం చెందినవారి దగ్గరకు విమోచకుడు వస్తాడు,” అని యెహోవా తెలియజేస్తున్నారు.
ISA 59:21 “నేను వారితో చేసే నా నిబంధన ఇదే” అని యెహోవా చెప్తున్నారు. “మీమీద ఉన్న నా ఆత్మ మీ నుండి తొలిగిపోదు, నేను మీ నోటిలో ఉంచిన నా మాటలు, మీ పెదవుల నుండి, మీ పిల్లల పెదవుల నుండి, వారి వారసుల పెదవుల నుండి, ఇప్పటినుండి ఎప్పటికీ తొలగిపోవు” అని యెహోవా తెలియజేస్తున్నారు.
ISA 60:1 “లేచి ప్రకాశించు, నీ వెలుగు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.
ISA 60:2 చూడు, భూమిని చీకటి కమ్ముతుంది కటిక చీకటి జనాంగాలను కమ్ముకుంటుంది. కాని యెహోవా నీ మీద ఉదయిస్తున్నారు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది.
ISA 60:3 దేశాలు నీ వెలుగు దగ్గరకు వస్తాయి, రాజులు నీ ఉదయకాంతి దగ్గరకు వస్తారు.
ISA 60:4 “నీ కళ్లు పైకెత్తి చూడు: అందరు కలిసి నీ దగ్గరకు వస్తున్నారు; నీ కుమారులు దూరం నుండి వస్తున్నారు, నీ కుమార్తెలు చంకనెక్కి వస్తున్నారు.
ISA 60:5 అప్పుడు నీవు చూసి ప్రకాశిస్తావు. నీ గుండె కొట్టుకొంటూ ఆనందంతో పొంగుతుంది; సముద్ర సంపద నీ దగ్గరకు త్రిప్పబడుతుంది, దేశాల సంపద నీ దగ్గరకు వస్తుంది.
ISA 60:6 ఒంటెల మందలు, మిద్యాను ఏఫాల ఒంటె పిల్లలతో నీ దేశం నిండిపోతుంది. వారందరు షేబ నుండి వస్తారు, బంగారం ధూపద్రవ్యాలను తీసుకువస్తారు, యెహోవా స్తుతిని ప్రకటిస్తారు.
ISA 60:7 నీ దగ్గర కేదారు గొర్రె మందలన్నీ సమకూడతాయి. నెబాయోతు పొట్టేళ్లు నీకు సేవ చేస్తాయి; అవి నా బలిపీఠం మీద అర్పణలుగా అంగీకరించబడతాయి. నేను నా మహిమగల మందిరాన్ని అలంకరిస్తాను.
ISA 60:8 “మేఘాల్లా, తమ గూళ్లకు ఎగిరిపోయే పావురాల్లా ఎగిరే వీరెవరు?
ISA 60:9 నిజంగా ద్వీపాలు నా వైపు చూస్తాయి; నీ దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఘనపరచడానికి, తర్షీషు ఓడలు మొదట వస్తున్నాయి, దూరము నుండి నీ పిల్లలను తమ వెండి బంగారాలను తీసుకువస్తున్నాయి, ఎందుకంటే ఆయన నిన్ను వైభవంతో అలంకరించారు.
ISA 60:10 “విదేశీయులు నీ గోడల్ని మరల కడతారు, వారి రాజులు నీకు సేవ చేస్తారు. నేను కోపంలో నిన్ను కొట్టాను కాని, నేను కరుణించి నీ మీద దయ చూపిస్తాను.
ISA 60:11 నీ దగ్గరకు దేశాల సంపద తీసుకురావడానికి, జయోత్సవంతో వారి రాజులను నడిపించడానికి, నీ ద్వారాలు రాత్రింబగళ్ళు మూసివేయకుండా నిత్యం తెరిచే ఉంటాయి.
ISA 60:12 నిన్ను సేవించని దేశమైనా రాజ్యమైనా నాశనమవుతుంది; అది పూర్తిగా నాశనమవుతుంది.
ISA 60:13 “నా పరిశుద్ధాలయాన్ని అలంకరించడానికి లెబానోను యొక్క వైభవమైన దేవదారు వృక్షాలు, సరళ వృక్షాలు, గొంజిచెట్లు నీ దగ్గరకు తీసుకువస్తారు. నేను నా పాదాలు పెట్టే స్థలాన్ని మహిమపరుస్తాను.
ISA 60:14 నిన్ను బాధించినవారి పిల్లలు నీ ఎదుటకు వచ్చి నమస్కరిస్తారు. నిన్ను తృణీకరించిన వారందరు వచ్చి నీ పాదాల దగ్గర మోకరిస్తారు, యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యొక్క సీయోనని వారు నిన్ను పిలుస్తారు.
ISA 60:15 “నీవు విడిచిపెట్టబడి, ద్వేషించబడి నీ మార్గంలో ఎవరూ ప్రయాణించకపోయినా, నేను నిన్ను శాశ్వత ఘనతగా అన్ని తరాలకు ఆనందంగా చేస్తాను.
ISA 60:16 నీవు దేశాల పాలు త్రాగుతావు రాజుల చనుపాలు త్రాగుతావు. అప్పుడు నీవు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు యొక్క బలవంతుడైన నీ విమోచకుడని తెలుసుకుంటావు.
ISA 60:17 నేను ఇత్తడికి బదులు బంగారాన్ని ఇనుముకు బదులు వెండిని నీకు తెస్తాను. నేను కర్రకు బదులు ఇత్తడిని రాళ్లకు బదులు ఇనుమును నీకు తెస్తాను. నేను సమాధానాన్ని నీకు అధిపతిగా నీతిని నీకు పాలకునిగా నియమిస్తాను.
ISA 60:18 ఇకపై నీ దేశంలో హింస అనేది వినబడదు, నీ సరిహద్దులలో నాశనం గాని విధ్వంసం గాని వినపడదు. అయితే నీవు నీ గోడలను రక్షణ అని నీ గుమ్మాలను స్తుతి అని పిలుస్తావు.
ISA 60:19 ఇకమీదట పగలు సూర్యుని వెలుగు నీకు ఉండదు, చంద్రుని వెన్నెల నీపై ప్రకాశించదు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. నీ దేవుడు నీకు మహిమగా ఉంటారు.
ISA 60:20 నీ సూర్యుడికపై అస్తమించడు. నీ చంద్రుడు క్షీణించడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు, నీ దుఃఖ దినాలు అంతమవుతాయి.
ISA 60:21 అప్పుడు నీ ప్రజలందరు నీతిమంతులుగా ఉంటారు; వారు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. నా వైభవం కనుపరచడానికి వారు నేను నాటిన కొమ్మగా నా చేతుల పనిగా ఉంటారు.
ISA 60:22 నీలో చిన్నవాడు వేయిమంది అవుతాడు, కొద్దిగా ఉన్నది బలమైన దేశమవుతుంది. నేను యెహోవాను; సరియైన సమయంలో ఈ పనిని త్వరగా చేస్తాను.”
ISA 61:1 ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించారు. విరిగిన హృదయం గలవారిని బలపరచడానికి బందీలకు విడుదలను ఖైదీలకు చీకటి నుండి విముక్తిని ప్రకటించడానికి,
ISA 61:2 యెహోవా హితవత్సరాన్ని, మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించడానికి దుఃఖిస్తున్న వారందరినీ ఓదార్చడానికి,
ISA 61:3 సీయోనులో దుఃఖిస్తున్న వారికి బూడిదకు బదులుగా అందమైన కిరీటాన్ని దుఃఖానికి బదులు ఆనంద తైలాన్ని భారమైన ఆత్మకు బదులు స్తుతి వస్త్రాన్ని అందించడానికి నన్ను పంపారు. యెహోవా తన వైభవాన్ని కనుపరచడానికి, నీతి అనే సింధూర చెట్లని యెహోవా నాటిన చెట్లని వారు పిలువబడతారు.
ISA 61:4 పురాతన శిథిలాలను వారు మరలా కడతారు గతంలో నాశనమైన స్థలాలను వారు పునరుద్ధరిస్తారు; పాడైపోయిన పట్టణాలను తరతరాల నుండి నాశనమైన ఉన్న స్థలాలను వారు నూతనపరుస్తారు.
ISA 61:5 అపరిచితులు మీ మందల్ని మేపుతారు; విదేశీయులు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పని చేస్తారు.
ISA 61:6 మీరు యెహోవా యాజకులని పిలువబడతారు, మా దేవుని సేవకులు అని మీకు పేరు పెట్టబడుతుంది. దేశాల సంపదను మీరు అనుభవిస్తారు వారి ఐశ్వర్యాన్ని పొంది అతిశయిస్తారు.
ISA 61:7 మీ అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత పొందుతారు. నిందకు బదులుగా మీ స్వాస్థ్యంలో మీరు సంతోషిస్తారు. మీరు మీ దేశంలో రెట్టింపు స్వాస్థ్యాన్ని పొందుతారు, శాశ్వతమైన ఆనందం మీకు కలుగుతుంది.
ISA 61:8 “ఎందుకంటే యెహోవానైన నాకు న్యాయమంటే ఇష్టము; దోపిడి చేయడం, చెడు చేయడం నాకు అసహ్యము. నా నమ్మకత్వాన్ని బట్టి నా ప్రజలకు ప్రతిఫలమిస్తాను వారితో శాశ్వతమైన నిబంధన చేస్తాను.
ISA 61:9 వారి వారసులు దేశాల మధ్య వారి సంతానం జనాంగాల మధ్య ప్రసిద్ధి పొందుతారు. వారు యెహోవా ఆశీర్వదించిన ప్రజలని వారిని చూసినవారందరు గుర్తిస్తారు.”
ISA 61:10 యాజకునిలా తలపాగా ధరించిన పెండ్లికుమారునిలా నగలతో అలంకరించుకున్న పెండ్లికుమార్తెలా ఆయన నాకు రక్షణ వస్త్రాలను ధరింపచేశారు ఆయన నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశారు కాబట్టి యెహోవాలో నేను ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.
ISA 61:11 భూమి మొలకను మొలిపించినట్లు, విత్తనాలు ఎదిగేలా చేసే తోటలా, అన్ని దేశాల ఎదుట ప్రభువైన యెహోవా నీతిని, స్తుతిని మొలకెత్తేలా చేస్తారు.
ISA 62:1 సీయోను నీతి ఉదయకాంతిలా ప్రకాశించే వరకు, దాని రక్షణ కాగడాలా వెలిగే వరకు, సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. యెరూషలేము పక్షంగా నేను ఊరుకోలేను.
ISA 62:2 దేశాలు నీ నీతిని చూస్తాయి. రాజులందరూ నీ మహిమను చూస్తారు. యెహోవా నీకు ఇవ్వబోయే క్రొత్త పేరుతో నీవు పిలువబడతావు.
ISA 62:3 నీవు యెహోవా చేతిలో వైభవ కిరీటంగా, నీ దేవుని చేతిలో రాజకిరీటంగా ఉంటావు.
ISA 62:4 ఇకపై నీవు విడిచిపెట్టబడిన దానివని పిలువబడవు, నీ దేశం పాడైపోయిందని పిలువబడదు. అయితే నీవు హెఫ్సీబా అని నీ దేశం బ్యూలా అని పిలువబడుతుంది; యెహోవా నీలో ఆనందిస్తారు నీ దేశానికి పెళ్ళి అవుతుంది.
ISA 62:5 యువకుడు యువతిని పెళ్ళి చేసుకున్నట్లు నిన్ను కట్టేవాడు నిన్ను చేసుకుంటాడు; పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తెను చూసి సంతోషించినట్లు, నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు.
ISA 62:6 యెరూషలేమా! నీ గోడల మీద నేను కావలివారిని నియమించాను; పగలు గాని రాత్రి గాని వారు మౌనంగా ఉండరు. యెహోవాకు మొరపెట్టే వారలారా విశ్రాంతి తీసుకోకండి,
ISA 62:7 యెరూషలేమును స్థాపించే వరకు భూమి మీద దానికి ప్రసిద్ధి కలుగజేసే వరకు ఆయనకు విశ్రాంతి ఇవ్వకండి.
ISA 62:8 యెహోవా తన కుడిచేతితో తన బలమైన హస్తంతో ఇలా ప్రమాణం చేశారు: “ఇకనుండి ఎప్పుడూ నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా నేనివ్వను. నీవు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని విదేశీయులు ఇక ఎన్నడు త్రాగరు;
ISA 62:9 అయితే పంట పండించిన వారే దానిని తిని యెహోవాను స్తుతిస్తారు. ద్రాక్షలను సమకూర్చిన వారే నా పరిశుద్ధాలయ ఆవరణాల్లో దాని త్రాగుతారు.”
ISA 62:10 రండి, గుమ్మాల ద్వారా రండి! ప్రజలకు మార్గం సిద్ధపరచండి. నిర్మించండి, రహదారిని నిర్మించండి! రాళ్లను తొలగించండి. దేశాలు చూసేలా జెండాను ఎత్తండి.
ISA 62:11 భూమి అంచుల వరకు యెహోవా చేస్తున్న ప్రకటన: “ ‘ఇదిగో నీ రక్షకుడు వస్తున్నాడు! ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గరే ఉంది ఆయన ఇచ్చే జీతం ఆయన దగ్గరే ఉంది’ అని సీయోను కుమార్తెతో చెప్పండి.”
ISA 62:12 వారు పరిశుద్ధ ప్రజలని, యెహోవా విడిపించినవారని పిలువబడతారు; నీవు అందరికి కావలసిన దానివని పాడుబడని పట్టణమని పిలువబడతావు.
ISA 63:1 రక్తపు మరకలు కలిగిన బట్టలు వేసుకుని ఎదోము నుండి బొస్రానుండి వస్తున్న ఇతడెవరు? రాజ వస్త్రాలను ధరించి గంభీరంగా నడుస్తూ గొప్ప బలంతో వస్తున్న ఇతడెవరు? “విజయాన్ని ప్రకటిస్తూ రక్షించగల సమర్థుడనైన నేనే.”
ISA 63:2 నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కేవాని బట్టల్లా ఎర్రగా ఎందుకు ఉన్నాయి?
ISA 63:3 “నేను ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కాను; దేశాల్లో ఏ ఒక్కరూ నాతో లేరు. నా కోపంలో వారిని త్రొక్కివేశాను నా ఉగ్రతలో వారిని అణగద్రొక్కాను; వారి రక్తం నా బట్టలమీద చిందింది, నా బట్టలన్నిటికి మరకలయ్యాయి.
ISA 63:4 అది నేను పగతీర్చుకునే రోజు; నేను విమోచించే సంవత్సరం వచ్చింది.
ISA 63:5 నేను చూశాను కాని సహాయం చేయడానికి ఎవరూ లేరు; ఎవరూ సహకారం అందించకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను; కాబట్టి నా సొంత చేయి నాకు రక్షణ ఇచ్చింది నా కోపమే నన్ను ఆదుకుంది.
ISA 63:6 నేను నా కోపంతో దేశాలను త్రొక్కివేశాను నా ఉగ్రతలో వారు మత్తెక్కేలా చేశాను వారి రక్తాన్ని నేలమీద పారబోశాను.”
ISA 63:7 యెహోవా మనకు చేసినదంతటిని బట్టి, యెహోవా కృపలను, యెహోవా స్తుతులను నేను ప్రకటిస్తాను. అవును, ఆయన తన కనికరాన్ని బట్టి, గొప్ప దయను బట్టి ఇశ్రాయేలుకు ఆయన చేసిన అనేక మేలుల గురించి నేను చెప్తాను.
ISA 63:8 ఆయన అన్నారు, “నిజంగా వారు నా ప్రజలు, నాకు నమ్మకంగా ఉండే పిల్లలు”; కాబట్టి ఆయన వారికి రక్షకుడయ్యారు.
ISA 63:9 వారి బాధంతటిలో ఆయన కూడా బాధ అనుభవించారు, ఆయన సన్నిధి యొక్క దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమతో, జాలితో వారిని విడిపించారు; పూర్వ రోజులన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ, మోస్తూ వచ్చారు.
ISA 63:10 అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. కాబట్టి ఆయన వారికి శత్రువయ్యారు తానే వారితో యుద్ధం చేశారు.
ISA 63:11 అప్పుడు ఆయన ప్రజలు పూర్వ రోజులను, మోషేను తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నారు తన మందకాపరులతో పాటు తమను సముద్రంలో నుండి తీసుకువచ్చిన ఆయనేరి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన ఆయనేరి?
ISA 63:12 మోషే కుడిచేతి వైపు మహిమగల తన చేతిని పంపిన ఆయనేరి? తనకు శాశ్వతమైన కీర్తి రాడానికి వారి ఎదుట నీళ్లను విభజించిన ఆయనేరి?
ISA 63:13 మైదానంలో గుర్రం నడిచినట్లు వారు పడిపోకుండా లోతైన జలాల్లో నడిపించిన ఆయనేరి?
ISA 63:14 లోయలోనికి దిగివెళ్లే పశువుల్లా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసింది. మీకు ఘనమైన పేరు రావాలని మీరు మీ ప్రజలను ఇలా నడిపించారు.
ISA 63:15 పరలోకం నుండి, గంభీరమైన, పరిశుద్ధమైన మహిమగల సింహాసనం నుండి క్రిందికి చూడండి. మీ ఆసక్తి మీ బలము ఏవి? మా పట్ల మీకున్న జాలి కనికరం మా నుండి నిలిపివేయబడ్డాయి.
ISA 63:16 అయితే అబ్రాహాముకు మేము తెలియకపోయినా ఇశ్రాయేలు మమ్మల్ని గుర్తించకపోయినా మాకు తండ్రి మీరే; యెహోవా! మాకు తండ్రి మీరే, పూర్వకాలం నుండి మా విమోచకుడవని మీకు పేరు.
ISA 63:17 యెహోవా! మేము మీ మార్గాల నుండి తొలగిపోయి తిరిగేలా ఎందుకు చేశారు? మిమ్మల్ని భయపడకుండా మా హృదయాల్ని ఎందుకు కఠినపరిచారు? మీ సేవకుల కోసం, మీ స్వాస్థ్యమైన గోత్రాల కోసం తిరిగి రండి.
ISA 63:18 మీ ప్రజలు కొద్ది కాలమే మీ పరిశుద్ధ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు కాని ఇప్పుడు మా శత్రువులు మీ పరిశుద్ధాలయాన్ని త్రొక్కివేశారు.
ISA 63:19 పూర్వం నుండి మేము మీ వారము; కాని మీరెన్నడు వారిని పాలించలేదు, వారు మీ పేరుతో పిలువబడలేదు.
ISA 64:1 మీరు ఆకాశాన్ని చీల్చివేసి దిగివస్తే, పర్వతాలు మీ ఎదుట వణుకుతాయి!
ISA 64:2 మంట ఎండుకొమ్మల్ని కాల్చినప్పుడు, ఆ మంటకు నీళ్లు మరిగినట్లు, మీ శత్రువులకు మీ పేరు తెలిసేలా మీరు దిగిరండి, మీ ఎదుట దేశాలు వణికేలా చేయండి!
ISA 64:3 మేము ఊహించని భయంకరమైన పనులు మీరు చేసినప్పుడు మీరు దిగివచ్చారు, పర్వతాలు మీ ఎదుట వణికాయి.
ISA 64:4 తన కోసం ఎదురు చూసే వారి పక్షంగా కార్యం చేసే మిమ్మల్ని తప్ప అనాది కాలం నుండి ఏ దేవున్ని ఎవరూ చూడలేదు అలాంటి దేవుడు ఉన్నాడని ఎవరూ వినలేదు ఎవరూ గ్రహించలేదు.
ISA 64:5 మీ మార్గాలను గుర్తుచేసుకుంటూ సంతోషంగా సరియైనది చేసేవారికి సహాయం చేయడానికి మీరు వస్తారు. అయితే మేము వాటికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నప్పుడు మీరు కోప్పడ్డారు. అలా అయితే మేము ఎలా రక్షింపబడగలం?
ISA 64:6 మేమందరం అపవిత్రులమయ్యాము, మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డలుగా ఉన్నాయి; మేమందరం ఆకులా వాడిపోయాము, గాలిలా మా పాపాలు మమ్మల్ని తుడిచివేస్తున్నాయి.
ISA 64:7 ఎవరూ మీ పేరిట మొరపెట్టడం లేదు మిమ్మల్ని ఆధారం చేసుకోవడానికి ఆరాటపడడం లేదు. మీరు మా నుండి మీ ముఖం దాచుకున్నారు. మమ్మల్ని మా పాపాలకు అప్పగించారు.
ISA 64:8 అయినా యెహోవా! మీరే మాకు తండ్రి. మేము మట్టి, మీరు కుమ్మరి. మేమందరం మీ చేతి పనిగా ఉన్నాము.
ISA 64:9 యెహోవా! ఎక్కువగా కోప్పడకండి; నిత్యం మా పాపాల్ని జ్ఞాపకం చేసుకోకండి. మేమంతా మీ ప్రజలమే కాబట్టి మా పట్ల దయ చూపించమని ప్రార్థిస్తున్నాము.
ISA 64:10 మీ పరిశుద్ధ పట్టణాలు బంజరు భూమిగా మారాయి; చివరకు సీయోను బంజరు భూమిగా, యెరూషలేము నిర్జనంగా మారాయి.
ISA 64:11 మా పూర్వికులు మిమ్మల్ని స్తుతించిన సుందరమైన మా కీర్తిగల మందిరం అగ్నితో కాల్చబడింది, మా ఆహ్లాదకరమైనవన్నీ నాశనమైపోయాయి.
ISA 64:12 యెహోవా! ఇదంతా జరిగిన తర్వాత, మీరు చూసి ఊరుకుంటారా? మీరు మౌనంగా ఉండి మమ్మల్ని ఇంకా శిక్షిస్తూనే ఉంటారా?
ISA 65:1 “నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకొన్నాను; నన్ను వెదకనివారికి నేను దొరికాను. ‘నేనున్నాను, ఇదిగో నేనున్నాను’ అని నా పేరిట మొరపెట్టని దేశంతో చెప్పాను.
ISA 65:2 తమ ఊహల ప్రకారం చేస్తూ చెడు మార్గంలో నడుస్తూ ఉన్న మూర్ఖులైన ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాపాను.
ISA 65:3 వారు తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల బలిపీఠం మీద ధూపం వేస్తూ నా ముఖం మీద నాకు కోపం తెప్పించిన ప్రజలు;
ISA 65:4 వారు సమాధుల మధ్యలో కూర్చుని రహస్య జాగారం చేస్తూ వారి రాత్రులు గడుపుతారు; వారు పందిమాంసం తింటారు. అపవిత్రమైన మాంసం కూర వారి పాత్రల్లో ఉంది;
ISA 65:5 వారు, ‘నా దగ్గరకు రావద్దు. దూరంగా ఉండండి, మీకంటే నేను ఎంతో పరిశుద్ధున్ని’ అని అంటారు. అలాంటివారు నా నాసిక రంధ్రాలకు పొగలా, రోజంతా మండే నిప్పులా ఉన్నారు.
ISA 65:6 “చూడండి, ఇది నా ఎదుట గ్రంథంలో వ్రాయబడింది: నేను మౌనంగా ఉండను, వారికి పూర్తి ప్రతిఫలం చెల్లిస్తాను; మీ పాపాలకు మీ పూర్వికుల పాపాలకు, నేను వారికి వారి ఒడిలో ప్రతిఫలం చెల్లిస్తాను” అని యెహోవా అంటున్నారు. “ఎందుకంటే, వారు పర్వతాలమీద ధూపం వేశారు, కొండలమీద నన్ను అవమానించారు, గతంలో వారు చేసిన వాటన్నిటికి వారి ఒడిలోనే పూర్ణ ప్రతీకారాన్ని కొలిచి పోస్తాను.”
ISA 65:8 యెహోవా చెప్పే మాట ఇదే: “ద్రాక్షగుత్తిలో ఇంకా రసం కనబడినప్పుడు ప్రజలు, ‘దానిలో ఆశీర్వాదం ఉంది, దానిని నాశనం చేయకండి’ అని చెప్తారు కదా. అలాగే నా సేవకులందరి కోసం చేస్తాను; నేను వారందరిని నాశనం చేయను.
ISA 65:9 యాకోబు నుండి యూదా నుండి వారసుల్ని తీసుకువస్తాను, వారు నా పర్వతాల్ని స్వాధీనపరచుకుంటారు. నేను ఏర్పరచుకున్న ప్రజలు వాటిని స్వతంత్రించుకుంటారు. నా సేవకులు అక్కడ నివసిస్తారు.
ISA 65:10 నన్ను వెదకే నా ప్రజల కోసం షారోను గొర్రెలకు పచ్చికబయళ్లుగా, ఆకోరు లోయ పశువులకు విశ్రాంతి తీసుకునే చోటుగా ఉంటాయి.
ISA 65:11 “అయితే యెహోవాను విడిచి, నా పరిశుద్ధ పర్వతాన్ని మరచి, గాదు దేవునికి బల్లను సిద్ధపరచి, మెనీ దేవునికి ద్రాక్షరస పాత్రలు నింపేవారలారా,
ISA 65:12 నేను ఖడ్గానికి మిమ్మల్ని అప్పగిస్తాను, మీరందరు వధకు గురై కూలిపోతారు; ఎందుకంటే, నేను పిలిస్తే మీరు సమాధానం ఇవ్వలేదు, నేను మాట్లాడితే మీరు వినలేదు. నా దృష్టిలో మీరు చెడుగా ప్రవర్తించి నాకు అయిష్టమైన వాటిని ఎంచుకున్నారు.”
ISA 65:13 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “నా సేవకులు భోజనం చేస్తారు, కాని మీరు ఆకలితో ఉంటారు; నా సేవకులు త్రాగుతారు కాని మీరు దాహంతో ఉంటారు; నా సేవకులు సంతోషిస్తారు కాని మీరు సిగ్గుపరచబడతారు.
ISA 65:14 నా సేవకులు తమ ఆనంద హృదయాలతో పాటలు పాడతారు, మీరు హృదయ వేదనతో ఏడుస్తారు నలిగిన ఆత్మలతో రోదిస్తారు.
ISA 65:15 నేను ఏర్పరచుకున్నవారు వారి శాపవచనాల్లో మీ పేరును ఉపయోగిస్తారు; ప్రభువైన యెహోవా మిమ్మల్ని చంపుతారు. ఆయన తన సేవకులకు మరొక పేరు పెడతారు.
ISA 65:16 దేశంలో ఆశీర్వాదం ఉండాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఏకైక నిజ దేవుని పేరిట ఆశీర్వదించబడాలని కోరుకుంటారు; దేశంలో ప్రమాణం చేసేవారు, ఖచ్చితంగా ఏకైక నిజ దేవుని పేరిట ప్రమాణం చేస్తారు. గతకాలపు సమస్యలన్నీ మరచిపోయాను. అవి నా కళ్ల నుండి దాచబడ్డాయి.
ISA 65:17 “చూడండి, నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టిస్తాను. గత విషయాలు గుర్తు చేసుకోబడవు. వాటి గురించి ఎవరూ ఆలోచించరు.
ISA 65:18 అయితే నేను సృష్టించబోయే వాటి గురించి మీరు ఎప్పుడూ సంతోషించి ఆనందించండి. నేను యెరూషలేమును సంతోషకరమైన స్థలంగా ప్రజలను ఆనందంగా చేస్తాను.
ISA 65:19 నేను యెరూషలేము గురించి సంతోషిస్తాను నా ప్రజల్లో ఆనందిస్తాను; ఏడ్పు రోదన శబ్దం ఇకపై దానిలో వినపడవు.
ISA 65:20 “ఇకపై అక్కడ కొన్ని రోజులు మాత్రమే బ్రతికి ఉండే శిశువులు ఉండరు. తన కాలం పూర్తి కాకుండా చనిపోయే వృద్ధుడు ఉండడు; వంద సంవత్సరాల వయస్సులో చనిపోయేవారిని పిల్లలుగా పరిగణించబడతారు; వంద సంవత్సరాలకన్నా ముందే చనిపోయే పాపిని శాపగ్రస్తుడు అంటారు.
ISA 65:21 వారు ఇల్లు కట్టుకుని వాటిలో నివసిస్తారు; వారు ద్రాక్షతోటలు నాటి వాటి పండ్లు తింటారు.
ISA 65:22 ఇకపై వారు కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు నివసించరు. వారు నాటిన వాటి పండ్లను వేరొకరు తినరు. నా ప్రజల ఆయుష్షు చెట్ల ఆయుష్షంత ఉంటుంది; నేను ఏర్పరచుకున్నవారు తమ చేతిపనిని పూర్తిగా అనుభవిస్తారు.
ISA 65:23 వారు వృధాగా కష్టపడరు, దురదృష్టాన్ని అనుభవించడానికి పిల్లల్ని కనరు; వారు యెహోవాచేత ఆశీర్వదించబడిన ప్రజలుగా, వారు, వారి వారసులు ఉంటారు.
ISA 65:24 వారు మొరపెట్టక ముందే నేను జవాబిస్తాను; వారు ఇంకా మాట్లాడుతుండగానే నేను వింటాను.
ISA 65:25 తోడేలు గొర్రెపిల్ల కలిసి మేస్తాయి, సింహం ఎద్దులా గడ్డి తింటుంది, దుమ్ము సర్పానికి ఆహారమవుతుంది. నా పరిశుద్ధ పర్వతం మీద అవి హానిని గాని నాశనాన్ని గాని చేయవు” అని యెహోవా చెప్తున్నారు.
ISA 66:1 యెహోవా చెప్పే మాట ఇదే: “ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం. మీరు నా కోసం కట్టాలనుకున్న ఇల్లు ఎక్కడ? నా విశ్రాంతి స్థలం ఏది?
ISA 66:2 వీటన్నిటిని చేసింది నా చేయి కాదా, ఈ విధంగా అవి కలిగాయి కదా?” అని యెహోవా తెలియజేస్తున్నారు. “ఎవరైతే వినయంతో పశ్చాత్తాప హృదయం కలిగి నా మాట విని వణుకుతారో, వారికే నేను దయ చూపిస్తాను.
ISA 66:3 అయితే కోడెను బలిచ్చేవారు నరబలి ఇచ్చేవారి వంటివారే, గొర్రెపిల్లను బలిగా అర్పించేవారు, కుక్క మెడను విరిచేవారి వంటివారే; భోజనార్పణ చేసేవారు పందిరక్తం అర్పించేవారి వంటివారే, జ్ఞాపకార్థ ధూపం వేసేవారు విగ్రహాలను పూజించేవారి వంటివారే. వారు తమకిష్టమైన దుష్ట మార్గాలను ఎంచుకున్నారు వారి అసహ్యమైన పనులలో వారు సంతోషిస్తారు;
ISA 66:4 కాబట్టి నేను వారి కోసం కఠినమైన శిక్షను ఎంచుకుంటాను వారు భయపడేవాటిని వారి మీదికి రప్పిస్తాను. ఎందుకంటే, నేను పిలిస్తే ఎవరూ జవాబు ఇవ్వలేదు నేను మాట్లాడితే ఎవరూ వినలేదు. నా దృష్టిలో మీరు చెడుగా ప్రవర్తించి నాకు అయిష్టమైన వాటిని ఎంచుకున్నారు.”
ISA 66:5 యెహోవా మాటకు భయపడేవారలారా, ఆయన మాట వినండి. “మిమ్మల్ని ద్వేషిస్తూ నా నామాన్ని బట్టి మిమ్మల్ని త్రోసివేసే మీ సొంతవారు, ‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు మహిమ కలుగును గాక!’ అని అన్నారు. అయినా వారు సిగ్గుపరచబడతారు.
ISA 66:6 పట్టణం నుండి వచ్చే కోలాహలం వినండి మందిరం నుండి వస్తున్న ఆ శబ్దం వినండి! తన శత్రువులకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తున్న యెహోవా యొక్క శబ్దం అది.
ISA 66:7 “ఆమె ప్రసవవేదన పడక ముందే ఆమె బిడ్డకు జన్మనిస్తుంది; ఆమెకు నొప్పులు రాకముందే కుమారున్ని కంటుంది.
ISA 66:8 అలాంటి సంగతులు ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? అలాంటి సంగతులు ఎవరైనా ఎప్పుడైనా చూశారా? ఒక్క రోజులో దేశం పుడుతుందా ఒక్క నిమిషంలోనే ఒక జనం జన్మిస్తుందా? అయితే సీయోనుకు ప్రసవవేదన కలగగానే ఆమె తన బిడ్డలకు జన్మనిస్తుంది.
ISA 66:9 నేను ప్రసవవేదన కలిగించి జన్మనివ్వకుండా ఉంటానా?” అని యెహోవా అడుగుతున్నారు. “పుట్టుక వరకు తీసుకువచ్చి గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నారు.
ISA 66:10 “యెరూషలేమును ప్రేమించే మీరందరూ ఆమెతో సంతోషించి ఆనందించండి. ఆమె గురించి ఏడ్చే మీరందరూ ఆమెతో గొప్పగా సంతోషించండి.
ISA 66:11 ఆదరణకరమైన ఆమె రొమ్ము పాలు త్రాగి మీరు తృప్తిపొందుతారు. మీరు తృప్తిగా త్రాగి ఆమె సమృద్ధిని అనుభవిస్తూ ఆనందిస్తారు.”
ISA 66:12 యెహోవా చెప్పే మాట ఇదే: “వినండి. ఆమె దగ్గరకు సమాధానం నదిలా ప్రవహించేలా చేస్తాను, దేశాల సంపదలు పొంగిపొర్లే ప్రవాహంలా వస్తాయి; మీరు పోషించబడి ఆమె చంకనెక్కుతారు ఆమె మోకాళ్లమీద ఆడుకుంటారు.
ISA 66:13 తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు.”
ISA 66:14 మీరు ఇది చూసినప్పుడు మీ హృదయం సంతోషిస్తుంది మీరు గడ్డిలా వర్ధిల్లుతారు; యెహోవా యొక్క చేతి బలం తన సేవకులకు తెలియజేయబడుతుంది, కాని ఆయన కోపం తన శత్రువులకు చూపించబడుతుంది.
ISA 66:15 చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నారు, ఆయన రథాలు సుడిగాలిలా వస్తున్నాయి. ఆయన తన కోపాన్ని తీవ్రతతో క్రిందికి తెస్తున్నారు, ఆయన గద్దింపు అగ్ని మంటలతో వస్తుంది.
ISA 66:16 అగ్నితో తన ఖడ్గంతో యెహోవా ప్రజలందరికి తీర్పు అమలుచేస్తారు, యెహోవా ద్వారా అనేకమంది చంపబడతారు.
ISA 66:17 “ఎవరైతే పందిమాంసం, ఎలుకలు, ఇతర అపవిత్రమైన వాటిని తినేవాన్ని అనుసరిస్తూ, పవిత్ర తోటలోకి వెళ్లి పూజించడానికి తమను తాము ప్రతిష్ఠించుకుని శుద్ధి చేసుకుంటారో, వారు తాము అనుసరించే వానితో పాటు నశిస్తారు” అని యెహోవా తెలియజేస్తున్నారు.
ISA 66:18 “వారి యొక్క పనులు వారి ఆలోచనలను బట్టి నేను అన్ని దేశాల ప్రజలను, రకరకాల భాషలు మాట్లాడేవారిని ఒక్కచోట చేర్చడానికి వస్తున్నాను. వారు వచ్చి నా మహిమను చూస్తారు.
ISA 66:19 “నేను వారి ఎదుట ఒక సూచనను పెడతాను. వారిలో తప్పించుకున్న వారిని వేరే దేశాలకు అనగా, తర్షీషు, పూలు, లూదు (ప్రసిద్ధ విల్లుకాండ్రు) అనే దేశాల దగ్గరకు, తుబాలు గ్రీసులకు, నా గురించి నా మహిమ గురించి వినని దూరంగా ఉన్న ద్వీపవాసుల దగ్గరకు పంపిస్తాను. వారు దేశాల మధ్య నా మహిమ గురించి ప్రకటిస్తారు.
ISA 66:20 ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రల్లో భోజనార్పణల్ని యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లు, గుర్రాల మీద, రథాల మీద, బండ్ల మీద, కంచరగాడిదల మీద, ఒంటెల మీద ఎక్కించి అన్ని దేశాల నుండి నా పరిశుద్ధ పర్వతమైన యెరూషలేముకు మీ ప్రజలందరినీ యెహోవాకు అర్పణగా వారు తీసుకువస్తారు” అని యెహోవా చెప్తున్నారు.
ISA 66:21 “యాజకులుగా లేవీయులుగా ఉండడానికి నేను వారిలో కొందరిని ఏర్పరచుకుంటాను” అని యెహోవా చెప్తున్నారు.
ISA 66:22 “నేను చేయబోయే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నా ఎదుట నిత్యం నిలిచి ఉన్నట్లు, నీ పేరు నీ సంతానం నిలిచి ఉంటుంది” అని యెహోవా తెలియజేస్తున్నారు.
ISA 66:23 “ప్రతి అమావాస్య రోజున, ప్రతి సబ్బాతు దినాన నా ఎదుట ఆరాధించడానికి ప్రజలందరూ వస్తారు” అని యెహోవా చెప్తున్నారు.
ISA 66:24 “వారు వెళ్లి నా మీద తిరుగుబాటు చేసిన వారి శవాలను చూస్తారు; వాటిని తినే పురుగులు చావవు, వాటిని కాల్చే అగ్ని ఆరిపోదు, మనుష్యులందరికి అది అసహ్యంగా ఉంటుంది.”
JER 1:1 బెన్యామీను దేశంలో అనాతోతు అనే పట్టణంలో ఉన్న యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడైన యిర్మీయా మాటలు.
JER 1:2 ఆమోను కుమారుడు యూదా రాజైన యోషీయా పాలనలో పదమూడవ సంవత్సరంలో యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చి,
JER 1:3 యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము పాలన నుండి, యోషీయా కుమారుడును యూదా రాజునైన సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం పూర్తయ్యే వరకు అంటే ఆ సంవత్సరం అయిదవ నెలలో యెరూషలేము ప్రజలు చెరలోకి వెళ్లేవరకు యిర్మీయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతూ ఉంది.
JER 1:4 యెహోవా వాక్కు నాకు వచ్చి,
JER 1:5 “గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు, నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను; దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను” అని చెప్పింది.
JER 1:6 అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా, నేను చిన్నవాన్ని, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు” అన్నాను.
JER 1:7 అయితే యెహోవా నాతో, “ ‘నేను చిన్నవాన్ని’ అని నీవు అనవద్దు. నేను నిన్ను ఎవరి దగ్గిరికి పంపితే నీవు వారి దగ్గరికి వెళ్లి నేను ఏది ఆజ్ఞాపించానో అది వారికి చెప్పాలి.
JER 1:8 నీవు వారికి భయపడవద్దు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను అని యెహోవా చెప్తున్నారు.”
JER 1:9 తర్వాత యెహోవా తన చేయి చాపి, నా నోటిని ముట్టి, “నీ నోటిలో నా మాటలు పెట్టాను.
JER 1:10 పెళ్లగించడానికి, కూల్చివేయడానికి, నాశనం చేయడానికి, పడద్రోయడానికి, కట్టడానికి నాటడానికి నిన్ను దేశాల మీద, రాజ్యాల మీద నియమిస్తున్నాను” అని నాతో చెప్పారు.
JER 1:11 తర్వాత యెహోవా నాతో మాట్లాడుతూ, “యిర్మీయా, నీకేం కనబడుతోంది?” అని అడిగారు. అందుకు నేను, “బాదం చెట్టు కొమ్మ కనబడుతోంది” అని జవాబిచ్చాను.
JER 1:12 యెహోవా నాతో, “నీవు సరిగ్గా చూశావు, ఎందుకంటే నా మాట నెరవేరడం చూడాలని నేను కనిపెట్టుకుని ఉన్నాను” అన్నారు.
JER 1:13 మరోసారి యెహోవా నాతో మాట్లాడుతూ, “నీవు ఏం చూస్తున్నావు?” అని అడిగారు. అందుకు నేను, “మసలుతున్న బాన, అది ఉత్తర దిక్కునుండి మన వైపు వంగి ఉంది” అని చెప్పాను.
JER 1:14 అప్పుడు యెహోవా నాతో, “ఉత్తరం నుండి దేశంలో నివసించే వారందరి మీద విపత్తు కుమ్మరించబడుతుంది.
JER 1:15 నేను ఉత్తర రాజ్యాల జనాంగాలన్నిటిని పిలిపించబోతున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “వారి రాజులు వచ్చి తమ సింహాసనాలను యెరూషలేము గుమ్మాల్లో ఏర్పరచుకుంటారు; వారు దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రాకారాలన్నింటి మీద అలాగే యూదా పట్టణాలన్నింటి మీద దాడి చేస్తారు.
JER 1:16 నా ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, వారి చేతులు చేసిన విగ్రహాలను వారు పూజించి, వారు చేసిన దుర్మార్గాన్ని బట్టి నేను నా ప్రజల మీద నా తీర్పులను ప్రకటిస్తాను.
JER 1:17 “నిన్ను నీవు సిద్ధం చేసుకో! లేచి నిలబడి నేను నీకు ఏది ఆజ్ఞాపిస్తే అది వారితో చెప్పు. వారికి భయపడవద్దు, లేకపోతే వారి ముందు నేను నిన్ను భయపెడతాను.
JER 1:18 ఈ రోజు నేను మిమ్మల్ని దేశమంతటికి వ్యతిరేకంగా యూదా రాజులకు, దాని అధికారులకు, యాజకులకు, కోటగోడలు గల పట్టణంగా, ఇనుప స్తంభంగా ఇత్తడి గోడగా చేశాను.
JER 1:19 వారు నీతో యుద్ధం చేస్తారు గాని, నీ మీద విజయం పొందలేరు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 2:1 యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది:
JER 2:2 “నీవు వెళ్లి యెరూషలేము వింటూ ఉండగా ఇలా ప్రకటించు: “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ యవ్వనంలోని నీ భక్తి నాకు జ్ఞాపకముంది, మీ నిశ్చితార్థ కాలం యొక్క ప్రేమ నాకు జ్ఞాపకముంది; నీవు అరణ్యంలో నన్ను వెంబడించావు, విత్తబడని భూమిలో నన్ను వెంబడించావు.
JER 2:3 ఇశ్రాయేలు యెహోవాకు పరిశుద్ధమైనది, వారు ఆయన పంటలోని ప్రథమ ఫలాలు; ఇశ్రాయేలీయులను మ్రింగివేసినవారు శిక్షకు పాత్రులు, విపత్తు వారి మీదికి వస్తుంది’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 2:4 యాకోబు సంతానమా, సర్వ ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మాట వినండి.
JER 2:5 యెహోవా ఇలా చెప్తున్నారు: “మీ పూర్వికులు అంతలా దూరమవడానికి, వారికి నాలో ఏం తప్పు కనిపించింది? వారు విలువలేని విగ్రహాలను పూజించి, వారు విలువలేని వారయ్యారు.
JER 2:6 వారు, ‘ఈజిప్టు నుండి మమ్మల్ని రప్పించి, నిర్జన అరణ్యం గుండా, ఎడారులు, కనుమలు ఉన్న భూమి గుండా, కరువు, చీకటి నిండిన భూమి గుండా, ఎవరూ ప్రయాణించని, ఎవరూ నివసించని భూమి గుండా మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ?’ అని అడిగారు.
JER 2:7 నేను మిమ్మల్ని సారవంతమైన దేశంలోకి, దాని ఫలాలను, శ్రేష్ఠమైన వాటిని తినడానికి తీసుకువచ్చాను. అయితే మీరు వచ్చి నా దేశాన్ని ఆచారరీత్య అపవిత్రం చేసి నా స్వాస్థ్యాన్ని అసహ్యమైనదిగా చేశారు.
JER 2:8 యాజకులు ‘యెహోవా ఎక్కడ ఉన్నారు?’ అని అడగలేదు. ధర్మశాస్త్రాన్ని బోధించే వారికి నేను తెలియదు; నాయకులు నా మీదికి తిరుగబడ్డారు. ప్రవక్తలు పనికిరాని విగ్రహాలను పూజిస్తూ, బయలు పేరిట ప్రవచించారు.
JER 2:9 “కాబట్టి నేను మీమీద మళ్ళీ నేరారోపణ చేస్తాను” మీ పిల్లల పిల్లల మీద కూడా నేరారోపణ చేస్తాను, “అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 2:10 కుప్ర తీరాల అవతలి వైపుకు వెళ్లి చూడండి, కేదారుకు దూతల్ని పంపి దగ్గరి నుండి గమనించండి; ఇలాంటిది ఎప్పుడైనా జరిగి ఉంటుందేమో చూడండి:
JER 2:11 ఏ దేశమైనా తన దేవుళ్ళను ఎప్పుడైనా మార్చుకుందా? అయినా అవి దేవుళ్ళే కావు. కాని నా ప్రజలు పనికిమాలిన విగ్రహాల కోసం తమ మహిమగల దేవున్ని మార్చుకున్నారు.
JER 2:12 ఆకాశమా, దీని గురించి ఆందోళన చెంది, భయంతో వణుకు,” అని యెహోవా చెప్తున్నారు.
JER 2:13 “నా ప్రజలు రెండు చెడు పాపాలు చేశారు: జీవజలపు ఊటనైన నన్ను వారు విసర్జించి, తమ కోసం సొంత తొట్లు తొలిపించుకున్నారు, అవి పగిలిన తొట్లు, వాటిలో నీళ్లు నిలువవు.
JER 2:14 ఇశ్రాయేలు దాసుడా? పుట్టుకతోనే బానిసా? అలాంటప్పుడు అతడు దోపుడుసొమ్ము ఎందుకు అయ్యాడు?
JER 2:15 సింహాలు గర్జించాయి; అవి అతని మీదికి గుర్రుమన్నాయి. వారు అతని దేశాన్ని పాడుచేశారు; అతని పట్టణాలు కాలిపోయి నిర్జనమయ్యాయి.
JER 2:16 అలాగే, మెంఫిసు, తహ్పన్హేసు పట్టణస్థులు, నీ పుర్రె పగులగొట్టారు.
JER 2:17 కానీ నీ దేవుడైన యెహోవా మార్గంలో నిన్ను నడిపిస్తున్నప్పుడు, నీవు ఆయనను విడిచిపెట్టి, నీకు నీవే ఇదంతా నీ మీదికి తెచ్చుకోలేదా?
JER 2:18 నైలు నది నీళ్లు త్రాగడానికి ఈజిప్టుకు ఎందుకు వెళ్లాలి? యూఫ్రటీసు నుండి నీళ్లు త్రాగడానికి అష్షూరుకు ఎందుకు వెళ్లాలి?
JER 2:19 నీ దుర్మార్గం నిన్ను శిక్షిస్తుంది; నీ భక్తిహీనత నిన్ను గద్దిస్తుంది. నీ దేవుడైన యెహోవాను, నీవు విడిచిపెట్టడం, నేనంటే భయం లేకపోవడం, నీకు ఎంత బాధ శ్రమ కలిగిస్తుందో ఆలోచించు, గ్రహించు” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 2:20 “చాలా కాలం క్రితమే నేను నీ కాడిని విరగ్గొట్టాను, నీ బంధకాలను తెంపివేశాను; అయినా నీవు, ‘నేను నీ సేవ చేయను!’ అన్నావు కాని నిజానికి, ప్రతీ ఎత్తైన కొండమీద, ప్రతీ పచ్చని చెట్టు క్రింద నీవు వేశ్యలా పడుకుంటున్నావు.
JER 2:21 నేను నిన్ను శ్రేష్ఠమైన ద్రాక్షవల్లిగా మంచి, నమ్మదగిన మొక్కగా నాటాను. అలాంటప్పుడు నీవు నాకు వ్యతిరేకంగా చెడిపోయిన అడవి ద్రాక్షవల్లిగా ఎలా మారావు?
JER 2:22 నీవు సబ్బుతో నిన్ను నీవు కడుక్కున్నా శుభ్రం చేయడానికి వాడే చూర్ణం వాడినా, నీ అపరాధపు మరక ఇంకా కనిపిస్తుంది,” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 2:23 “నీవు, ‘నేను అపవిత్రం కాలేదు; నేను బయలు విగ్రహాల వెంట పరుగెత్తలేదు’ అని ఎలా అనగలవు? లోయలో నీవు ఎలా ప్రవర్తించావో చూడు; నీవు ఏమి చేశావో కాస్త గమనించు. నీవు ఇటు అటు వేగంగా పరుగెత్తే ఆడ ఒంటెవు,
JER 2:24 ఎడారికి అలవాటు పడిన అడవి గాడిదవు, అది కామంతో గాలిని పసిగడుతుంది, అది తాపంలో ఉన్నప్పుడు దానిని ఎవరు అడ్డుకోగలరు? దాన్ని వెంటాడే మగ గాడిదలకు అలసట రాదు; అది కలుసుకునే సమయంలో అది వారికి కనబడుతుంది.
JER 2:25 నీ పాదాల చెప్పులు అరిగిపోయే వరకు, నీ గొంతు ఆరిపోయే వరకు నీవు పరదేశి దేవుళ్ళ వెంట పరుగెత్తకు. అయితే మీరు ఇలా అన్నారు, ‘మాకు నీవు చెప్పి ప్రయోజనం లేదు! మేము పరదేశి దేవుళ్ళను ప్రేమిస్తున్నాము, మేము వారి వెంట వెళ్లాలి.’
JER 2:26 “దొంగ పట్టుబడినప్పుడు అవమానించబడినట్లు, ఇశ్రాయేలు ప్రజలు అవమానించబడ్డారు; వారు వారి రాజులు వారి అధికారులు, వారి యాజకులు వారి ప్రవక్తలు అవమానించబడ్డారు.
JER 2:27 వారు చెక్కతో, ‘నీవు మా తండ్రివి’ అని, రాయితో, ‘నీవు మాకు జన్మనిచ్చావు’ అంటున్నారు వారు నావైపు వారి ముఖాలు త్రిప్పకుండ, నాకు వెన్ను చూపారు; అయినప్పటికీ వారు కష్టంలో ఉన్నప్పుడు, ‘వచ్చి మమ్మల్ని రక్షించండి!’ అని అంటారు.
JER 2:28 అయితే మీరు మీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడున్నారు? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడగలిగితే రానివ్వండి! యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో, అంతమంది దేవుళ్ళు ఉన్నారు.
JER 2:29 “నా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నావు? మీరందరూ నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 2:30 “నేను వ్యర్థంగా నీ పిల్లలను శిక్షించాను; వారు దిద్దుబాటుకు స్పందించలేదు. నీ ఖడ్గం నీ ప్రవక్తలను, బాగా ఆకలిగా ఉన్న సింహంలా చంపింది.
JER 2:31 “ఈ తరం వారలారా! యెహోవా మాటలు శ్రద్ధగా వినండి: “నేను ఇశ్రాయేలుకు ఎడారిగా మహా చీకటి దేశంగా ఉన్నానా? ఎందుకు నా ప్రజలు, ‘మేము స్వేచ్ఛగా తిరుగుతాము; ఇకపై మేము మీ దగ్గరకు రాము’ అని ఎందుకు అంటున్నారు?
JER 2:32 ఒక యువతి తన నగలు, ఒక వధువు తన పెళ్ళి ఆభరణాలు మరచిపోతుందా? అయినా నా ప్రజలు లెక్కలేనన్ని రోజులు, నన్ను మరచిపోయారు.
JER 2:33 ప్రేమను వెదకడంలో నీవు ఎంత నేర్పరివో! నీచమైన స్త్రీలు నీ నుండి నేర్చుకుంటారు.
JER 2:34 నిర్దోషుల ప్రాణాధారమైన రక్తపు మరక నీ బట్టలపైన ఉంది. వారు లోపలికి చొచ్చుకొని వస్తూ ఉంటే నీవు వారిని పట్టుకోలేదు. ఇంత జరిగినా,
JER 2:35 నీవు, ‘నేను నిర్దోషిని; ఆయనకు నా మీద కోపం రాదు’ అంటున్నావు. ‘నేను పాపం చేయలేదు’ అని అంటున్నావు, కాబట్టి నేను నీ మీద తీర్పు ప్రకటిస్తాను.
JER 2:36 నీ మార్గాలను మార్చుకుంటూ, ఎందుకు అంతలా తిరుగుతున్నావు? నీవు అష్షూరులో నిరాశచెందినట్టుగా ఈజిప్టు విషయంలో కూడా నీవు నిరాశ చెందుతావు.
JER 2:37 నీ తలపై చేతులు పెట్టుకుని ఆ స్థలం నుండి వెళ్లిపోతావు, ఎందుకంటే నీవు నమ్మేవారిని యెహోవా తిరస్కరించారు; నీవు వారి ద్వారా సహాయం పొందలేవు.
JER 3:1 “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇచ్చి, ఆమె అతన్ని విడిచిపెట్టి మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే, అతడు మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్లాలా? దేశమంతా పూర్తిగా అపవిత్రమవదా? అయితే నీవు చాలామంది ప్రేమికులతో వేశ్యగా జీవించావు, ఇప్పుడు నా దగ్గరకు తిరిగి వస్తావా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 3:2 “కళ్లు పైకెత్తి ఆ బంజరు కొండలను చూడు. నీవు అత్యాచారానికి గురి కాని ప్రదేశం ఏదైనా ఉందా? ప్రేమికుల కోసం రోడ్డు ప్రక్కన ఎదురుచూస్తూ కూర్చున్నావు, ఎడారిలో అరబీయునిగా కూర్చున్నావు. నీ వ్యభిచారంతో, దుర్మార్గంతో దేశాన్ని అపవిత్రం చేశావు.
JER 3:3 కాబట్టి వాన జల్లులు ఆగిపోయాయి, వసంత వర్షాలు కురవలేదు. అయినా నీవు వేశ్యలా సిగ్గుపడడానికి తిరస్కరిస్తున్నావు; నీవు సిగ్గుపడడానికి నిరాకరిస్తున్నావు.
JER 3:4 నీవు ఇప్పుడే నన్ను పిలిచి: ‘నా తండ్రీ, నా చిన్నప్పటి నుండి నా స్నేహితుడవు,
JER 3:5 నీవు ఎప్పటికీ కోపంగా ఉంటావా? నీ ఉగ్రత ఎప్పటికీ ఉంటుందా?’ నీవు ఇలా మాట్లాడతావు, కానీ నీవు చేయగలిగిన కీడంతా చేస్తావు.”
JER 3:6 యోషీయా రాజు పాలనలో యెహోవా నాతో ఇలా అన్నారు, “నమ్మకద్రోహియైన ఇశ్రాయేలు ఏమి చేసిందో చూశావా? ఆమె ఎత్తైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు క్రిందికి వెళ్లి, వ్యభిచారం చేసింది.
JER 3:7 ఇదంతా చేసిన తర్వాత ఆమె నా దగ్గరకు తిరిగి వస్తుందని నేను అనుకున్నాను, కానీ ఆమె అలా చేయలేదు, ఆమె నమ్మకద్రోహియైన సోదరి యూదా దానిని చూసింది.
JER 3:8 నేను విశ్వాసంలేని ఇశ్రాయేలుకు తన విడాకుల ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, ఆమె చేసిన వ్యభిచారాలన్నిటిని బట్టి ఆమెను పంపివేసాను. అయినప్పటికీ నమ్మకద్రోహియైన ఆమె సహోదరి యూదాకు భయం లేదని నేను చూశాను; ఆమె కూడా బయటకు వెళ్లి వ్యభిచారం చేసింది.
JER 3:9 ఇశ్రాయేలు అనైతికత ఆమె దృష్టికి చాలా తక్కువ కాబట్టి, ఆమె దేశాన్ని అపవిత్రం చేసింది, రాయితో, కలపతో వ్యభిచారం చేసింది.
JER 3:10 ఇంత జరిగినా, నమ్మకద్రోహియైన తన సహోదరి యూదా తన పూర్ణహృదయంతో నా వైపు తిరగలేదు, కేవలం నటించింది” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 3:11 యెహోవా నాతో ఇలా అన్నారు: “ద్రోహియైన యూదా కంటే విశ్వాసంలేని ఇశ్రాయేలు నీతిమంతురాలు.
JER 3:12 నీవు వెళ్లి, ఉత్తరాన ఈ సందేశం ప్రకటించాలి: “ ‘ద్రోహియైన ఇశ్రాయేలూ, తిరిగి రా’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘ఇకపై నేను నీవైపు కన్నెత్తి చూడను, ఎందుకంటే నేను నమ్మకస్థుడను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నిత్యం కోపంగా ఉండను.
JER 3:13 నీ అపరాధాన్ని ఒప్పుకో నీ దేవుడైన యెహోవా మీద నీవు తిరుగుబాటు చేశావు, నీవు ప్రతి మహా వృక్షం క్రింద పరదేశి దేవుళ్ళకు నీ ఇష్టాన్ని పంచుకున్నావు, నాకు విధేయత చూపలేదు’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 3:14 “విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను నీ భర్తను కాబట్టి నేను నిన్ను ఎంచుకుంటాను ఒక పట్టణం నుండి ఒకనిగా, ఒక వంశం నుండి ఇద్దరినిగా నిన్ను సీయోనుకు తీసుకువస్తాను.
JER 3:15 అప్పుడు నేను నీకు నా హృదయానికి చాలా దగ్గరి వారైన కాపరులను ఇస్తాను, వారు జ్ఞానంతో, అవగాహనతో మిమ్మల్ని నడిపిస్తారు.
JER 3:16 ఆ రోజుల్లో దేశంలో మీ సంఖ్య బాగా పెరిగినప్పుడు” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “ప్రజలు ఇకపై, ‘యెహోవా నిబంధన మందసం’ అని అనరు. అది ఎప్పటికీ వారి మనస్సులోకి ఎక్కదు, జ్ఞాపకంలో ఉండదు; అది తప్పిపోదు, మరొకటి తయారుచేయబడదు.
JER 3:17 ఆ సమయంలో వారు యెరూషలేమును యెహోవా యొక్క సింహాసనం అని పిలుస్తారు, యెహోవా నామాన్ని గౌరవించడానికి అన్ని దేశాలు యెరూషలేములో సమకూడుతాయి. ఇకపై వారు తమ దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరించరు.
JER 3:18 ఆ రోజుల్లో యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉంటారు, వారు కలిసి ఉత్తర దేశం నుండి నేను మీ పూర్వికులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి వస్తారు.
JER 3:19 “నేను నేనే ఇలా అన్నాను, “ ‘మిమ్మల్ని నా పిల్లల్లా చూసుకుంటాను మీకు ఆహ్లాదకరమైన భూమిని, ఏ జాతికి చెందనంత అందమైన వారసత్వాన్ని ఇస్తాను.’ ‘తండ్రీ’ అని నీవు నన్ను పిలుస్తావని అనుకున్నాను నన్ను అనుసరించకుండ దూరంగా వెళ్లవని అనుకున్నాను.
JER 3:20 కానీ తన భర్తకు ద్రోహం చేసిన స్త్రీలా ఇశ్రాయేలూ, నీవు నాకు నమ్మకద్రోహం చేశావు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 3:21 ఇశ్రాయేలు ప్రజలు తమ మార్గాలను తప్పుదారి పట్టించి తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు కాబట్టి, బంజరు కొండలమీద ఇశ్రాయేలు ప్రజల ఏడ్పులు, విన్నపాలు, వినబడుతున్నాయి.
JER 3:22 “విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి. మీ విశ్వాసభ్రష్టత్వాన్ని నేను నయం చేస్తాను.” “అవును, మేము మీ దగ్గరకు వస్తాము, ఎందుకంటే మీరే మా దేవుడైన యెహోవా.
JER 3:23 నిశ్చయంగా కొండలు, పర్వతాలమీద జరుగుతున్న విగ్రహారాధన అల్లకల్లోలం మోసమే; ఖచ్చితంగా మన దేవుడైన యెహోవాలో ఇశ్రాయేలు రక్షణ.
JER 3:24 మన పూర్వికుల శ్రమ ఫలాలను వారి గొర్రెలను, మందలను, వారి కుమారులు, కుమార్తెలను మా యవ్వనం నుండి సిగ్గుమాలిన దేవతలు తినివేశాయి.
JER 3:25 మనం అవమానంలో పడి ఉందాం, మన అవమానాన్ని మనల్ని కప్పివేయనిద్దాము. మన దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మనం పాపం చేశాము, మనమూ, మన పూర్వికులు; మా యవ్వనం నుండి నేటి వరకు మనం మన దేవుడైన యెహోవా మాటకు లోబడలేదు.”
JER 4:1 “ఇశ్రాయేలూ, నీవు తిరిగి వస్తే, నా దగ్గరకు తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీ అసహ్యమైన విగ్రహాలను నా దృష్టికి దూరంగా ఉంచితే ఇక దారి తొలగకుండా ఉంటే,
JER 4:2 మీరు నిజాయితీ, న్యాయం నీతిగల మార్గంలో ఉండి, ‘సజీవుడైన యెహోవా మీద’ అని ప్రమాణం చేస్తే, అప్పుడు నిన్ను బట్టి దేశాలు ఆశీర్వాదాలు పొందుతాయి, వారు యెహోవా పట్ల వారి అభిమానాన్ని చాటుకుంటారు.”
JER 4:3 యూదా వారికి, యెరూషలేముకు యెహోవా ఇలా చెప్తున్నారు: “దున్నబడని నీ నేలను పగులగొట్టు ముళ్ళ మధ్య విత్తవద్దు.
JER 4:4 మిమ్మల్ని మీరు యెహోవాకు సున్నతి చేసుకోండి, మీ హృదయాలను సున్నతి చేసుకోండి, యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, లేకపోతే మీరు చేసిన చెడును బట్టి నా కోపం అగ్నిలా మండుతుంది, ఆర్పడానికి ఎవరూ ఉండరు.
JER 4:5 “యూదాలో ప్రకటించి, యెరూషలేములో ప్రకటించి ఇలా చెప్పు: ‘దేశమంతటా బూరధ్వని చేయండి!’ బిగ్గరగా కేకలువేస్తూ అనండి: ‘ఒక్క దగ్గరికి రండి! కోటలున్న పట్టణాలకు పారిపోదాం!’
JER 4:6 సీయోనుకు కనబడేలా జెండాను ఎత్తండి! ఆలస్యం చేయకుండా క్షేమం కోసం పారిపోండి! నేను ఉత్తరం నుండి విపత్తును, భయంకరమైన నాశనాన్ని కూడా తెస్తున్నాను.”
JER 4:7 ఒక సింహం తన పొద చాటు నుండి బయటకు వచ్చింది; దేశాలను నాశనం చేసేవాడు బయలుదేరాడు. మీ దేశాన్ని పాడుచేయడానికి ఆయన తన స్థలాన్ని విడిచిపెట్టాడు. నీ పట్టణాలు నివాసులు లేకుండా శిథిలావస్థలో ఉంటాయి.
JER 4:8 కాబట్టి గోనెపట్ట ధరించుకుని, విలపించండి, ఏడవండి, యెహోవా యొక్క భయంకరమైన కోపం మనల్ని విడిచిపెట్టలేదు.
JER 4:9 యెహోవా ఇలా అంటున్నాడు, “ఆ రోజు రాజు, అధికారులు ధైర్యం కోల్పోతారు, యాజకులు భయపడతారు, ప్రవక్తలు ఆశ్చర్యపోతారు.”
JER 4:10 అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా! ఖడ్గం మా గొంతు మీద ఉన్నప్పుడు, ‘మీకు సమాధానం కలుగుతుంది’ అని చెప్పి మీరు ఈ ప్రజలను, యెరూషలేమును ఎంత ఘోరంగా మోసం చేశారు!”
JER 4:11 ఆ సమయంలో ఈ ప్రజలకు, యెరూషలేముకు ఇలా ప్రకటించబడుతుంది: “ఎడారిలో బంజరు కొండల నుండి మండే గాలి నా ప్రజల వైపు వీస్తుంది, కానీ పొట్టు చెరగడానికో లేదా శుభ్రం చేయడానికో కాదు.
JER 4:12 అంతకంటే బలమైన గాలి నా మీద వీచింది, యెహోవా చెప్పినట్లు వారి మీదికి నా తీర్పులు ప్రకటిస్తున్నాను.”
JER 4:13 చూడు! అతడు మేఘాల్లా ముందుకు సాగిపోతాడు, అతని రథాలు సుడిగాలిలా వస్తాయి, అతని గుర్రాలు గ్రద్దల కంటే వేగవంతమైనవి. అయ్యో మాకు శ్రమ! మేము నాశనం అయ్యాము!
JER 4:14 యెరూషలేమా, నీ హృదయంలోని చెడును కడిగి రక్షించబడు. మీరు ఎంతకాలం చెడ్డ ఆలోచనలను కలిగి ఉంటారు?
JER 4:15 దాను నుండి ఒక స్వరం, ఎఫ్రాయిం కొండల నుండి కీడు వస్తుందని ప్రకటిస్తుంది.
JER 4:16 “దేశాలకు ఈ విషయం చెప్పండి, యెరూషలేము గురించి ఇలా ప్రకటించండి: ‘దూరదేశం నుండి ముట్టడి చేస్తున్న సైన్యం, యూదా పట్టణాలకు వ్యతిరేకంగా యుద్ధ కేకలు వేస్తుంది.
JER 4:17 పొలంలో కాపలా కాస్తున్న మనుష్యుల్లా వారు ఆమెను చుట్టుముట్టారు, ఎందుకంటే ఆమె నా మీదికి తిరుగుబాటు చేసింది’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 4:18 “మీ ప్రవర్తన మీ క్రియలు దీన్ని మీపైకి తెచ్చాయి. ఇది నీకు శిక్ష. ఎంత చేదుగా ఉంది! అది హృదయాన్ని ఎలా గ్రుచ్చుతుంది!”
JER 4:19 అయ్యో, నా వేదన, నా వేదన! నేను నొప్పితో విలపిస్తున్నాను. అయ్యో, నా హృదయ వేదన! నా గుండె నాలో కొట్టుకుంటుంది, నేను మౌనంగా ఉండలేను. నేను బూరధ్వని విన్నాను; నేను యుద్ధ కేకలు విన్నాను.
JER 4:20 విపత్తు తర్వాత విపత్తు వస్తున్నాయి; దేశం మొత్తం శిథిలావస్థలో ఉంది. వెంటనే నా గుడారాలు ధ్వంసమయ్యాయి, నా ఆశ్రయం క్షణంలో ధ్వంసమయ్యాయి.
JER 4:21 నేను ఎంతకాలం యుద్ధ పతాక సంకేతాన్ని చూడాలి బూరధ్వని వినాలి?
JER 4:22 “నా ప్రజలు మూర్ఖులు; వారికి నేను తెలియదు. వారు బుద్ధిలేని పిల్లలు; వారికి వివేచన లేదు. వారు కీడు చేయడంలో నేర్పరులు; మంచి చేయడం ఎలాగో వారికి తెలియదు.”
JER 4:23 నేను భూమిని చూశాను, అది నిరాకారంగా, శూన్యంగా ఉంది; ఆకాశాల వైపు చూశాను, వాటి కాంతి పోయింది.
JER 4:24 నేను పర్వతాలను చూశాను, అవి వణుకుతున్నాయి. కొండలన్నీ ఊగుతున్నాయి.
JER 4:25 నేను చూశాను, అక్కడ మనుష్యులే లేరు; ఆకాశంలోని ప్రతి పక్షి ఎగిరిపోయింది.
JER 4:26 నేను చూశాను, ఫలవంతమైన భూమి ఎడారి; దాని పట్టణాలన్ని యెహోవా ఎదుట, ఆయన ఉగ్రమైన కోపం ముందు శిథిలమైపోయాయి.
JER 4:27 యెహోవా ఇలా అంటున్నాడు: “నేను దానిని పూర్తిగా నాశనం చేయనప్పటికీ, దేశమంతా పాడైపోతుంది.
JER 4:28 కాబట్టి భూమి దుఃఖిస్తుంది పైనున్న ఆకాశం అంధకారం అవుతుంది, నేను మాట్లాడాను కాబట్టి పశ్చాత్తాపపడను, నేను నిర్ణయించుకున్నాను, కాబట్టి వెనుకకు తిరగను.”
JER 4:29 గుర్రాలు, విలుకాడుల శబ్దానికి ప్రతి ఊరు ఎగిరిపోతుంది. కొందరు పొదల్లోకి వెళ్తారు; కొందరు రాళ్ల మధ్య ఎక్కుతారు. పట్టణాలన్ని నిర్జనమైపోయాయి; వాటిలో ఎవరూ నివసించరు.
JER 4:30 అన్నీ నాశనమవుతుంటే, నీవు ఏం చేస్తున్నావు? ఎర్రని రంగును ధరించి బంగారు ఆభరణాలు ఎందుకు ధరించాలి? మీ కళ్లను అలంకరించుకుని ఎందుకు ఆకర్షణీయంగా చేస్తారు? నిన్ను నీవు వృధాగా అలంకరించుకున్నావు. నీ ప్రేమికులు నిన్ను తృణీకరిస్తారు; వారు నిన్ను చంపాలనుకుంటున్నారు.
JER 4:31 ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ ఏడ్పు, తన మొదటి బిడ్డను కంటూ వేదనపడుతున్న స్త్రీ కేకలు, ఊపిరి కోసం అల్లాడుతూ, సీయోను కుమారి తన చేతులు చాచి, “అయ్యో! నేను మూర్ఛపోతున్నాను; నా ప్రాణం హంతకులకు అప్పగించబడింది,” అంటూ కేకలు వేయడం నాకు వినబడుతుంది.
JER 5:1 “యెరూషలేము వీధుల్లోకి వెళ్లి, చుట్టూ చూసి పరిశీలించండి, దాని కూడళ్లలో వెదకండి. నమ్మకంగా వ్యవహరించే సత్యాన్ని వెదికే ఒక్క వ్యక్తినైనా మీరు కనుగొనగలిగితే, నేను ఈ పట్టణాన్ని క్షమిస్తాను.
JER 5:2 వారు, ‘సజీవుడైన యెహోవా మీద ప్రమాణం’ అని అన్నప్పటికీ, వారు అబద్ధపు ప్రమాణమే చేస్తున్నారు.”
JER 5:3 యెహోవా, మీ కళ్లు నమ్మకత్వాన్ని వెదకడం లేదా? మీరు వారిని మొత్తారు కాని వారికి నొప్పి కలగలేదు; మీరు వారిని చితకబాదారు, కానీ వారు దిద్దుబాటును నిరాకరించారు. వారు తమ ముఖాలను రాయి కంటే కఠినంగా చేసుకున్నారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు.
JER 5:4 నేను ఇలా అనుకున్నాను, “వీరు పేదవారు; వారు బుద్ధిహీనులు, ఎందుకంటే వారికి యెహోవా మార్గం తెలియదు, వారి దేవుడు ఏమి కోరుతున్నారో వారికి తెలియదు.
JER 5:5 కాబట్టి నేను నాయకుల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడతాను; ఖచ్చితంగా యెహోవా మార్గం వారికి తెలుసు, వారి దేవుడు ఏమి కోరుతున్నారో వారికి తెలుసు.” అయితే వారు కూడా ఏకమనస్సుతో కాడిని విరగ్గొట్టారు, బంధకాలను తెంపుకున్నారు.
JER 5:6 కాబట్టి అడవి నుండి సింహం వారిపై దాడి చేస్తుంది, ఎడారి నుండి ఒక తోడేలు వారిని నాశనం చేస్తుంది, ఒక చిరుతపులి వారి పట్టణాల దగ్గర పొంచి ఉంది బయటకు వెళ్లేవారిని ముక్కలు చేయడానికి, ఎందుకంటే వారి తిరుగుబాటు గొప్పది వారి విశ్వాసభ్రష్టత్వం చాలా ఎక్కువ.
JER 5:7 “నేను నిన్ను ఎందుకు క్షమించాలి? మీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని దేవుళ్ళపై ప్రమాణం చేశారు. వారి అవసరాలన్నీ నేను తీర్చాను, అయినప్పటికీ వారు వ్యభిచారం చేశారు వేశ్యల ఇళ్ళకు గుమికూడారు.
JER 5:8 వారు బాగా మేపబడిన, కామంతో నిండిన మగ గుర్రాలు, ప్రతి ఒక్కరు పొరుగువాని భార్యను చూసి సకిలిస్తారు,
JER 5:9 అందుకు నేను వారిని శిక్షించవద్దా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోవద్దా?
JER 5:10 “ఆమె ద్రాక్షతోట వరుసల గుండా వెళ్లి వాటిని నాశనం చేయండి, అయితే వాటిని పూర్తిగా నాశనం చేయవద్దు. వాటి కొమ్మలను తీసివేయండి, ఎందుకంటే ఈ ప్రజలు యెహోవాకు చెందినవారు కారు.
JER 5:11 ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు నా పట్ల పూర్తిగా నమ్మకద్రోహులుగా ఉన్నారు” అని యెహోవా అంటున్నారు.
JER 5:12 వారు యెహోవా గురించి అబద్ధం చెప్పారు; వారు, “ఆయన ఏమీ చేయడు! మాకు ఎలాంటి హాని జరగదు; మేము ఖడ్గం గాని కరువు గాని ఎన్నడూ చూడము.
JER 5:13 ప్రవక్తలు గాలి తప్ప మరొకటి కాదు వారిలో వాక్యం లేదు; కాబట్టి వారు చెప్పేది వారికే జరుగనివ్వండి” అని అన్నారు.
JER 5:14 కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: “ప్రజలు ఈ మాటలు మాట్లాడారు కాబట్టి, నేను నీ నోటిలో నా మాటలను అగ్నిగాను ఈ ప్రజలను అది కాల్చివేసే కలపగాను చేస్తాను.
JER 5:15 ఇశ్రాయేలు ప్రజలారా,” యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను మీ మీదికి దూర దేశాన్ని రప్పిస్తున్నాను, చాలా కాలంనాటి, శాశ్వతమైన దేశం, ఎవరి భాష మీకు తెలియదో, ఎవరి మాట మీకు అర్థం కాదో, అలాంటి ప్రజలను.
JER 5:16 వారి అంబులపొది తెరిచిన సమాధిలా ఉంది; వారందరూ పరాక్రమవంతులు.
JER 5:17 వారు మీ పంటలను, ఆహారాన్ని మ్రింగివేస్తారు, మీ కుమారులను, కుమార్తెలను మ్రింగివేస్తారు; వారు మీ గొర్రెలను, మందలను మ్రింగివేస్తారు, మీ ద్రాక్ష చెట్లను, అంజూర చెట్లను మ్రింగివేస్తారు. మీరు నమ్ముకునే కోటగోడలు గల పట్టణాలను వారు ఖడ్గంతో నాశనం చేస్తారు.
JER 5:18 “అయినప్పటికీ ఆ రోజుల్లో” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయను.
JER 5:19 ఒకవేళ ప్రజలు, ‘మన దేవుడైన యెహోవా మనకు ఎందుకు ఇదంతా చేశారు?’ అని అడిగితే మీరు వారితో ఇలా చెప్తారు, ‘మీరు నన్ను విడిచి మీ స్వదేశంలో పరదేశి దేవుళ్ళను సేవించారు, కాబట్టి ఇప్పుడు మీరు మీది కాని దేశంలో విదేశీయులకు సేవ చేయాలి.’
JER 5:20 “యాకోబు సంతతికి ఈ విషయాన్ని చాటించండి యూదాలో ప్రకటించండి:
JER 5:21 తెలివిలేని బుద్ధిహీనులారా, కళ్లుండి చూడ లేనివారలారా, చెవులుండి వినలేనివారలారా, ఇది వినండి:
JER 5:22 మీరు నాకు భయపడరా?” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు. “నా సన్నిధిలో మీరు వణకరా? నేను సముద్రానికి ఇసుకను ఒక సరిహద్దుగా చేశాను, అది దాటకూడని ఒక నిత్యమైన హద్దు, అలలు ఎగసిపడవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు; అవి గర్జించవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు.
JER 5:23 అయితే ఈ ప్రజలు మొండితనం, తిరుగుబాటుతనం గల హృదయాలు కలిగి ఉన్నారు; వారు ప్రక్కకు తిరిగి వెళ్లిపోయారు.
JER 5:24 ‘మనం మన దేవుడైన యెహోవాకు భయపడదాం, ఆయన తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తారు, నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను గురించి మనకు నిశ్చయత కలిగించేవాడు ఆయనే’ అని వారు తమ హృదయాల్లో అనుకోరు.
JER 5:25 మీ తప్పులు వీటిని దూరం చేశాయి; మీ పాపాలు మీకు మేలు లేకుండా చేశాయి.
JER 5:26 “నా ప్రజలమధ్య దుర్మార్గులు ఉన్నారు వారు పక్షులకు వలలు వేసే మనుష్యుల్లా మనుష్యులను పట్టుకోవడానికి వేటగానిలా పొంచి ఉన్నారు.
JER 5:27 పక్షులతో నిండిన బోనుల్లా, వారి ఇల్లు మోసంతో నిండి ఉన్నాయి; వారు ధనవంతులు శక్తివంతులు
JER 5:28 వారు లావుగా నిగనిగలాడుతూ ఉన్నారు. వారి దుర్మార్గాలకు హద్దు లేదు; వారు న్యాయం కోరరు. వారు తండ్రిలేనివారి వాదనను వాదించరు; వారు పేదల న్యాయమైన కారణాన్ని సమర్థించరు.
JER 5:29 దీని కోసం నేను వారిని శిక్షించకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?
JER 5:30 “భయంకరమైన, దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఒకటి దేశంలో జరిగింది:
JER 5:31 ప్రవక్తలు అబద్ధాలను ప్రవచిస్తున్నారు, యాజకులు తమ సొంత అధికారంతో పరిపాలిస్తున్నారు, నా ప్రజలు ఇలాగే ఇష్టపడుతున్నారు. అయితే చివరికి మీరేం చేస్తారు?
JER 6:1 “బెన్యామీను ప్రజలారా, క్షేమం కోసం పారిపోండి! యెరూషలేము నుండి పారిపోండి! తెకోవాలో బూరధ్వని చేయండి! బేత్-హక్కెరెము మీద సంకేతం కోసం ధ్వజం నిలబెట్టండి! ఎందుకంటే ఉత్తర దిక్కునుండి విపత్తు వస్తుంది, భయంకరమైన విధ్వంసం కూడా వస్తుంది.
JER 6:2 నేను చాలా అందమైన, సున్నితమైన, సీయోను కుమార్తెను నాశనం చేస్తాను.
JER 6:3 రాజులు తమ సైన్యాలతో ఆమెకు వ్యతిరేకంగా వస్తారు; వారు ఆమె చుట్టూ తమ గుడారాలు వేసుకుంటారు, ప్రతి ఒక్కరూ తమ సైన్యం నిర్మూలం చేయడానికి ఒక భాగాన్ని ఎంచుకుంటారు.”
JER 6:4 “ఆమెతో పవిత్ర యుద్ధానికి సిద్ధపడండి! లేచి, మధ్యాహ్న సమయంలో దాడి చేద్దాం! కానీ, అయ్యో, పగటి వెలుతురు తగ్గిపోతుంది, సాయంత్రపు నీడలు పొడవు అవుతున్నాయి.
JER 6:5 కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి దాని కోటలను నాశనం చేద్దాం!”
JER 6:6 సైన్యాల యెహోవా చెప్పేదేమిటంటే: “చెట్లను నరికి యెరూషలేముపై ముట్టడి దిబ్బలను కట్టండి. ఈ పట్టణం శిక్షించబడాలి; ఇందులో అణచివేయడం తప్ప ఏమీ లేదు.
JER 6:7 బావి తన నీళ్లను ఎలా బయటకు ఉబికేలా చేస్తుందో, అలాగే ఆమె తన దుష్టత్వాన్ని కుమ్మరిస్తుంది. హింస, విధ్వంసం ఆమెలో ప్రతిధ్వనిస్తుంది; ఆమె జబ్బులు, గాయాలు నిత్యం నా ముందు ఉన్నాయి.
JER 6:8 యెరూషలేమా, ఈ హెచ్చరికను తీవ్రమైనదిగా తీసుకో, లేకపోతే నేను నిన్ను వదిలేసి నీ దేశాన్ని నిర్జనంగా చేస్తాను అందులో ఎవరూ నివసించలేరు.”
JER 6:9 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మిగిలిన ఇశ్రాయేలీయులను ద్రాక్షపళ్లలా వారిని ఏరుకోనివ్వండి; ఒకడు ద్రాక్ష పళ్లను ఏరుకున్నట్లుగా, మళ్ళీ కొమ్మల మీద నీ చేయి వేయి.”
JER 6:10 నేను ఎవరితో మాట్లాడి హెచ్చరిక ఇవ్వగలను? నా మాట ఎవరు వింటారు? వారి చెవులు మూయబడి ఉన్నాయి కాబట్టి వారు వినలేరు. యెహోవా మాట వారికి అభ్యంతరకరమైనది; వారు దానిలో ఆనందాన్ని పొందలేరు.
JER 6:11 కానీ నేను యెహోవా యొక్క ఉగ్రతతో నిండి ఉన్నాను, నేను దానిని పట్టుకోలేను. “వీధిలో ఉన్న పిల్లల మీద ఒక్కచోట పోగైన యువకుల మీద దానిని కుమ్మరించండి; భార్య భర్తలు, వృద్ధులు, వయస్సు మీరిన వారు అందులో చిక్కుకుంటారు.
JER 6:12 నేను దేశంలో నివసించే వారిపై నా చేయి చాచినప్పుడు వారి ఇల్లు, వారి పొలాలతో పాటు, వారి భార్యలు ఇతరులకు అప్పగించబడతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 6:13 “అల్పుల నుండి గొప్పవారి వరకు, అందరు లాభం కోసం అత్యాశతో ఉన్నారు; ప్రవక్తలు యాజకులు అంతా ఒకటే, అందరు మోసం చేసేవారే.
JER 6:14 నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు దానికి కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, ‘సమాధానం, సమాధానం’ అని వారంటారు.
JER 6:15 వారు తమ అసహ్యమైన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారా? లేదు, వారికి బొత్తిగా సిగ్గు లేదు; ఎలా సిగ్గుపడాలో కూడా వారికి తెలియదు. కాబట్టి వారు పతనమైనవారి మధ్య పడతారు; నేను వారిని శిక్షించినప్పుడు వారు పడద్రోయబడతారు” అని యెహోవా చెప్తున్నారు.
JER 6:16 యెహోవా ఇలా చెప్తున్నారు: “కూడలిలో నిలబడి చూడండి; పురాతన మార్గాలు ఎక్కడ ఉన్నాయో అడగండి, మంచి మార్గం ఎక్కడ ఉందో అడిగి, దానిలో నడవండి, మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. కానీ మీరు ఇలా అన్నారు, ‘మేము దానిలో నడవము.’
JER 6:17 నేను మీపై కావలివారిని నియమించాను వారు మీతో ఇలా చెప్పారు, ‘బూరధ్వని వినండి!’ కాని మీరన్నారు, ‘మేము వినము.’
JER 6:18 కాబట్టి జనులారా, వినండి; సాక్షులైన మీరు, వారికి ఏమి జరుగుతుందో గమనించండి.
JER 6:19 భూమీ, విను: నేను ఈ ప్రజలమీదికి విపత్తు తెస్తున్నాను, అది వారి కుట్రల ఫలం, ఎందుకంటే వారు నా మాటలను వినలేదు, నా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు.
JER 6:20 షేబ నుండి వచ్చే ధూపం గురించి గాని దూరదేశం నుండి వచ్చే మధురమైన సువాసనగల వస గురించి నేను ఏమి పట్టించుకోను? మీ దహనబలులు అంగీకరించదగినవి కావు; మీ బలులు నన్ను ప్రసన్నం చేయవు.”
JER 6:21 కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “ఈ ప్రజల ముందు నేను అడ్డురాళ్లు వేస్తాను. తల్లిదండ్రులు పిల్లలు ఒకే విధంగా వారిపై పొరపాట్లు చేస్తారు; పొరుగువారు స్నేహితులు నశిస్తారు.”
JER 6:22 యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, ఉత్తర దేశం నుండి ఒక సైన్యం వస్తుంది; ఒక గొప్ప దేశం భూదిగంతాల నుండి పురికొల్పబడతారు.
JER 6:23 వారు విల్లు, ఈటె పట్టుకుని ఉన్నారు; వారు కౄరమైనవారు, దయ చూపరు. వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు గర్జించే సముద్రంలా వినిపిస్తారు; సీయోను కుమారీ, నీ మీద దాడి చేయడానికి వారు యుద్ధ వరుసలో ఉన్న సైనికుల్లా వస్తారు.”
JER 6:24 మేము వారి గురించిన వార్తలను విన్నాము, మా చేతులు వణికిపోయాయి. స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి వేదన మమ్మల్ని పట్టుకుంది.
JER 6:25 పొలాల్లోకి వెళ్లకండి రహదారులపై నడవకండి, శత్రువుకు కత్తి ఉంది, ప్రతి వైపు భయం ఉంది.
JER 6:26 నా ప్రజలారా, గోనెపట్ట కట్టుకుని బూడిదలో దొర్లండి. ఒక్కగానొక్క కుమారుని కోసం తీవ్ర రోదనతో దుఃఖించండి, ఎందుకంటే హఠాత్తుగా నాశనం చేసేవాడు మన మీదికి వస్తాడు.
JER 6:27 “నేను నిన్ను లోహాలు పరీక్షించేవానిగా నా ప్రజలను మిశ్రమ లోహంగా చేశాను, మీరు వారి మార్గాలను గమనిస్తారని వాటిని పరీక్షిస్తారని.
JER 6:28 వారంతా మొండి తిరుగుబాటుదారులు, వారు అభాండాలు వేస్తూ తిరుగుతున్నారు. వారు ఇత్తడి, ఇనుము లాంటివారు; వారంతా అవినీతికి పాల్పడుతున్నారు.
JER 6:29 సీసాన్ని నిప్పుతో కాల్చివేయడానికి కొలిమి తిత్తులు తీవ్రంగా ఊదుతున్నారు, కానీ శుద్ధి చేయడం వృధా అవుతుంది; దుష్టులు ప్రక్షాళన చేయబడరు.
JER 6:30 వారు తిరస్కరించబడిన వెండి అని పిలువబడతారు, ఎందుకంటే యెహోవా వారిని తిరస్కరించారు.”
JER 7:1 యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది:
JER 7:2 “యెహోవా ఆలయ ద్వారం దగ్గర నిలబడి, అక్కడ ఈ సందేశాన్ని ప్రకటించండి: “ ‘యెహోవాను ఆరాధించడానికి ఈ ద్వారాల గుండా వచ్చే సర్వ యూదా ప్రజలారా, యెహోవా చెప్తుంది వినండి.
JER 7:3 సైన్యాల యెహోవాయైన ఇశ్రాయేలు దేవుడు ఇలా అంటున్నారు: నీ మార్గాలను, నీ క్రియలను సరిచేసుకో, అప్పుడు నేను నిన్ను ఈ స్థలంలో నివాసం చేయిస్తాను.
JER 7:4 మోసపూరిత మాటలను నమ్మకండి, “ఇది యెహోవా మందిరం, యెహోవా మందిరం, యెహోవా మందిరం!”
JER 7:5 మీరు నిజంగా మీ మార్గాలను, మీ క్రియలను మార్చుకుని ఒకరితో ఒకరు న్యాయంగా వ్యవహరిస్తే,
JER 7:6 మీరు విదేశీయులను, తండ్రిలేనివారిని లేదా విధవరాండ్రను అణచివేయకుండ, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించకుండ, మీకు హాని కలిగించే విధంగా ఇతర దేవుళ్ళను అనుసరించకుండా ఉంటే,
JER 7:7 నేను మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో, అంటే ఈ స్థలంలో, మిమ్మల్ని శాశ్వతంగా నివాసం చేయనిస్తాను.
JER 7:8 కాని చూడండి, మీరు విలువలేని మోసపూరితమైన మాటలు నమ్ముతున్నారు.
JER 7:9 “ ‘నీవు దొంగిలిస్తూ, హత్య చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అబద్ధ ప్రమాణం, దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ, బయలుకు ధూపం వేస్తూ, నీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ,
JER 7:10 తర్వాత వచ్చి నా పేరుతో పిలువబడే ఈ మందిరంలో నా ముందు నిలబడి, “మేము క్షేమంగా ఉన్నాము” ఈ అసహ్యకరమైన వాటన్నిటిని చేయడానికి క్షేమంగా ఉన్నాము అని అంటారా?
JER 7:11 నా పేరు కలిగిన ఈ ఇల్లు మీకు దొంగల గుహ అయ్యిందా? నేను చూస్తూనే ఉన్నాను! అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 7:12 “ ‘షిలోహులో నా పేరు కోసం నేను మొదట నివాసం ఏర్పరచుకున్న ప్రదేశానికి వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల దుష్టత్వాన్ని బట్టి నేను దానికి చేసినది ఏంటో చూడండి.
JER 7:13 మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, నేను మీతో పదే పదే మాట్లాడాను, కానీ మీరు వినలేదు; నేను మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు జవాబివ్వలేదు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 7:14 కాబట్టి, నేను షిలోహుకు చేసినట్టే, నా పేరు కలిగి ఉన్న ఆలయానికి, మీరు నమ్మిన ఆలయానికి, మీకు మీ పూర్వికులకు నేను ఇచ్చిన స్థలానికి ఇప్పుడు చేస్తాను.
JER 7:15 మీ తోటి ఇశ్రాయేలీయులందరిని, ఎఫ్రాయిం ప్రజలందరినీ నేను నా దగ్గర నుండి తరిమివేసినట్టు మిమ్మల్ని తరిమివేస్తాను.’
JER 7:16 “కాబట్టి ఈ ప్రజల కోసం ప్రార్థించవద్దు, వేడుకోవద్దు, ఏ మనవి చేయవద్దు; నా దగ్గర ప్రాధేయపడవద్దు, ఎందుకంటే నేను నీ మాట వినను.
JER 7:17 యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో వారు ఏమి చేస్తున్నారో మీరు చూడడం లేదా?
JER 7:18 పిల్లలు కట్టెలు సేకరిస్తారు, తండ్రులు మంట వెలిగిస్తారు, స్త్రీలు పిండిని పిసికి ఆకాశ రాణికి సమర్పించడానికి రొట్టెలు తయారుచేస్తారు. నా కోపాన్ని రెచ్చగొట్టడానికి వారు ఇతర దేవుళ్ళకు పానార్పణలు పోస్తారు.
JER 7:19 కానీ వారు కోపం రెచ్చగొడుతుంది నన్నా? వారు తమకు అవమానం కలిగేలా, తమకు తాము హాని చేసుకోవడం లేదా? అని యెహోవా అడుగుతున్నారు.
JER 7:20 “ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: నా కోపం నా ఉగ్రత ఈ స్థలంపై మనుష్యులపై మృగాలపై పొలాల్లో ఉన్న చెట్లపై మీ భూమి పంటలపై కుమ్మరించబడతాయి; అది కాలిపోతుంది, దాన్ని ఎవ్వరూ ఆర్పలేరు.
JER 7:21 “ ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీ ఇతర బలులతో పాటు మీ దహనబలులను కలిపి, మాంసాన్ని మీరే తినండి!
JER 7:22 నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చి వారితో మాట్లాడినప్పుడు, నేను వారికి దహనబలులు బలుల గురించి మాత్రమే ఆజ్ఞలు ఇవ్వలేదు,
JER 7:23 నేను వారికి ఈ ఆజ్ఞ ఇచ్చాను: నాకు లోబడండి, నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. మీకు మేలు జరిగేలా నా మార్గాలన్నిటిని అనుసరించండి.
JER 7:24 కానీ వారు వినలేదు, అసలు పట్టించుకోలేదు; పైగా, వారు తమ చెడ్డ హృదయాల్లో ఉన్న మొండి కోరికలను అనుసరించి, వారు ముందుకు వెళ్లకుండా వెనుకకు వెళ్లారు.
JER 7:25 మీ పూర్వికులు ఈజిప్టును విడిచినప్పటి నుండి నేటి వరకు, నేను పదే పదే నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరకు పంపాను.
JER 7:26 కానీ వారు నా మాట వినలేదు, అసలు పట్టించుకోలేదు. వారు మెడ వంగనివారై, వారి పూర్వికులకంటే ఇంకా ఎక్కువ చెడు చేశారు.’
JER 7:27 “నీవు ఇవన్నీ వారికి చెప్పినప్పుడు, వారు నీ మాట వినరు; నీవు వారిని పిలిచినప్పుడు, వారు జవాబివ్వరు.
JER 7:28 కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ఇది దాని దేవుడైన యెహోవాకు లోబడని దిద్దుబాటుకు స్పందించని దేశము. నమ్మకత్వం లేకుండా పోయింది; అది వారి పెదవుల నుండి మాయమై పోయింది.
JER 7:29 “ ‘ప్రతిష్ఠించబడిన మీ వెంట్రుకలు కత్తిరించి పారవేయండి; బంజరు కొండలమీద విలపించండి, ఎందుకంటే యెహోవా తన ఉగ్రత క్రింద ఉన్న ఈ తరాన్ని తిరస్కరించారు, వదిలేశారు.
JER 7:30 “ ‘యూదా ప్రజలు నా దృష్టికి చెడు చేశారు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. వారు నా పేరు కలిగి ఉన్న నా మందిరంలో వారి అసహ్యమైన విగ్రహాలను నిలబెట్టి దానిని అపవిత్రం చేశారు.
JER 7:31 వారు వారి కుమారులను, కుమార్తెలను అగ్నిలో కాల్చడానికి బెన్ హిన్నోము లోయలో ఉన్న తోఫెతులో క్షేత్రాలను నిర్మించారు. అలా చేయమని నేను ఆజ్ఞాపించలేదు నా మనస్సులోకి కూడా రాలేదు.
JER 7:32 కాబట్టి జాగ్రత్త, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ప్రజలు ఇకపై తోఫెతు అని గాని బెన్ హిన్నోము లోయ అని గాని పిలువక, సంహార లోయ అని పిలిచే రోజులు రాబోతున్నాయి, ఎందుకంటే వారు తోఫెతులో స్థలం లేకుండ పోయే వరకు చనిపోయినవారిని పాతిపెడతారు.
JER 7:33 అప్పుడు ఈ ప్రజల కళేబరాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి వాటిని భయపెట్టడానికి ఎవరూ ఉండరు.
JER 7:34 యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ వధూవరుల స్వరాలను, ఆనంద సంతోష ధ్వనులను నేను అంతం చేస్తాను, ఎందుకంటే దేశం నిర్జనమైపోతుంది.
JER 8:1 “ ‘ఆ సమయంలో, యూదా రాజుల, అధికారుల ఎముకలు, యాజకుల, ప్రవక్తల ఎముకలు, అలాగే యెరూషలేము ప్రజల ఎముకలు వారి సమాధుల నుండి తీసివేయబడతాయి అని యెహోవా ప్రకటన చేస్తున్నారు.
JER 8:2 వారు ప్రేమించి సేవించిన వారు అనుసరించిన, సంప్రదించిన పూజించిన సూర్యునికి చంద్రునికి ఆకాశమండలం లోని అన్ని నక్షత్రాలకు బహిర్గతమవుతారు. వారు పోగుచేయబడక, పాతిపెట్టబడక, నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటారు.
JER 8:3 నేను వారిని ఎక్కడికి బహిష్కరించినా, ఈ దుష్ట జనాంగంలో మిగిలినవారంతా బ్రతకడం కంటే చావునే కోరుకుంటారు, అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.’
JER 8:4 “వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘మనుష్యులు పడిపోయినప్పుడు, వారు లేవరా? ఎవరైనా ప్రక్కకు తొలగిపోతే, వారు వెనుకకు తిరిగి రారా?
JER 8:5 అలాంటప్పుడు ఈ ప్రజలు ఎందుకు దారి తప్పారు? యెరూషలేము ఎప్పుడూ ఎందుకు వెనుదిరుగుతుంది? వారు మోసానికి అంటిపెట్టుకుని ఉంటారు; వారు తిరిగి రావడానికి నిరాకరిస్తారు.
JER 8:6 నేను జాగ్రత్తగా విన్నాను, కానీ వారు సరియైనది చెప్పరు. “నేనేం చేశాను?” అని అంటూ, వారిలో ఎవ్వరూ తమ దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపపడరు. యుద్ధంలోకి గుర్రం దూసుకెళ్లినట్లుగా, ప్రతి ఒక్కరూ తమ సొంత మార్గాన్ని వెంటే వెళ్తారు.
JER 8:7 ఆకాశంలోని కొంగకు కూడా తన నిర్ణీత కాలాలు తెలుసు, అలాగే పావురం, వేగంగా ఎగిరే పక్షి, ఓదె అనే పక్షులు తమ వలస సమయాన్ని గమనిస్తాయి. అయితే నా ప్రజలకు యెహోవా న్యాయవిధులు తెలియవు.
JER 8:8 “ ‘శాస్త్రుల అబద్ధాల కలం, దాన్ని అబద్ధాలతో మార్చినప్పుడు, “మేము జ్ఞానులం, ఎందుకంటే మాకు యెహోవా ధర్మశాస్త్రం ఉంది” అని మీరు ఎలా అనగలరు?
JER 8:9 జ్ఞానులు సిగ్గుపడతారు; వారు భయపడి చిక్కుల్లో పడతారు. వారు యెహోవా వాక్యాన్ని తిరస్కరించినప్పుడు, వారికి ఇక జ్ఞానం ఎక్కడుంది?
JER 8:10 కాబట్టి నేను వారి భార్యలను ఇతర పురుషులకు వారి పొలాలను క్రొత్త యజమానులకు ఇస్తాను. అల్పుల నుండి గొప్పవారి వరకు, అందరు లాభం కోసం అత్యాశతో ఉన్నారు; ప్రవక్తలు, యాజకులు అంతా ఒకటే, అందరు మోసం చేసేవారే.
JER 8:11 నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, “సమాధానం, సమాధానం” అని వారంటారు.
JER 8:12 వారు తమ అసహ్యమైన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారా? లేదు, వారికి బొత్తిగా సిగ్గు లేదు; ఎలా సిగ్గుపడాలో కూడా వారికి తెలియదు. కాబట్టి వారు పతనమైనవారి మధ్య పడతారు; వారు శిక్షించబడినప్పుడు వారు పడద్రోయబడతారు, అని యెహోవా చెప్తున్నారు.
JER 8:13 “ ‘నేను వారి పంటకోతను తీసివేస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ద్రాక్షతీగెకు ద్రాక్షపండ్లు ఉండవు. అంజూర చెట్టు మీద అంజూర పండ్లు ఉండవు, వాటి ఆకులు వాడిపోతాయి. నేను వారికి ఇచ్చింది వారి దగ్గరి నుండి తీసివేయబడుతుంది.’ ”
JER 8:14 మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? మనం ఒక్కచోట చేరి, కోటగోడలు గల పట్టణాలకు పారిపోయి అక్కడ నశించుదాం! మన దేవుడైన యెహోవా మనకు నాశనాన్ని విధించి, మనకు త్రాగడానికి విషం కలిపిన నీళ్లు ఇచ్చారు, ఎందుకంటే మనం ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశాము.
JER 8:15 మేము సమాధానం కోసం నిరీక్షించాం, కానీ ఏ మంచి జరగలేదు, స్వస్థత కోసం ఎదురుచూశాము కానీ భయమే కలిగింది.
JER 8:16 శత్రువుల గుర్రాల బుసలు కొట్టడం దాను నుండి వినబడుతుంది; వారి మగ గుర్రాల సకిలింపుకు దేశమంతా వణికిపోతుంది. వారు మ్రింగివేయడానికి భూమిని, అందులోని సమస్తాన్ని, పట్టణాన్ని, అందులో నివసించే వారినందరిని మ్రింగివేయడానికి వచ్చారు.
JER 8:17 “చూడండి, నేను మీ మధ్యకు విషసర్పాలను, అదుపు చేయలేని మిడునాగులను పంపుతాను, అవి మిమ్మల్ని కాటేస్తాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 8:18 దుఃఖంలో నాకు ఆదరణకర్తవు నీవే, నా హృదయం నాలో నీరసించి ఉంది.
JER 8:19 సుదూరదేశం నుండి నా ప్రజల మొరను ఆలకించు: “యెహోవా సీయోనులో లేడా? ఆమె రాజు ఇక ఇప్పుడు అక్కడ లేరా?” “వారు తమ చిత్రాలతో, తమ పనికిమాలిన పరదేశి విగ్రహాలతో ఎందుకు నాకు కోపం రప్పించారు?”
JER 8:20 “కోత సమయం దాటిపోయింది, వేసవికాలం ముగిసింది, అయినా మనం రక్షించబడలేదు.”
JER 8:21 నా ప్రజలు నలిగిపోయారు కాబట్టి, నేనూ నలిగిపోయాను; నేను దుఃఖిస్తున్నాను, భయం నన్ను పట్టుకుంటుంది.
JER 8:22 గిలాదులో ఔషధతైలం లేదా? అక్కడ వైద్యుడు లేడా? ఉంటే నా ప్రజల గాయానికి స్వస్థత ఎందుకు లేదు?
JER 9:1 అయ్యో, నా తల నీటి బావి నా కళ్లు కన్నీటి ఊట అయి ఉంటే బాగుండేది! చంపబడిన నా ప్రజల కోసం నేను పగలు రాత్రి ఏడ్చే వాన్ని.
JER 9:2 అయ్యో, అరణ్యంలో నాకు యాత్రికులు బసచేసే స్థలం ఒకటి ఉంటే బాగుండేది! నా ప్రజలను వదిలి వారికి దూరంగా వెళ్లి అక్కడ ఉండేవాన్ని; ఎందుకంటే వారంతా వ్యభిచారులు, వారిది ఒక నమ్మకద్రోహుల సమూహము.
JER 9:3 “ఒక విలుకాడు బాణాలు వేయడానికి విల్లును సిద్ధం చేసుకున్నట్లు వారు అబద్ధాలు చెప్పడానికి తమ నాలుకను సిద్ధం చేసుకుంటారు; వారి అబద్ధం వల్లనే వారు దేశంలో బలవంతులయ్యారు కాని నాకు నమ్మకస్థులుగా ఉండి కాదు. వారు ఒక పాపం తర్వాత మరొక పాపం చేస్తారు; వారు నన్ను గుర్తించరు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 9:4 “ప్రతి ఒక్కరూ తన పొరుగువారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి; బంధువుల్లో ఎవరినీ కూడా నమ్మవద్దు, ఎందుకంటే వారిలో ప్రతివాడు ఒక మోసగాడు, స్నేహితుడు స్నేహితుని మీద అపనిందలు వేస్తాడు.
JER 9:5 స్నేహితుడు స్నేహితుడిని మోసం చేస్తాడు, ఎవరూ సత్యం మాట్లాడరు. వారు అబద్ధాలు చెప్పడానికి తమ నాలుకలకు శిక్షణ ఇచ్చారు; వారు పాపం చేసి తమను తాము అలసటకు గురిచేసుకుంటారు.
JER 9:6 నీవు మోసం మధ్య జీవిస్తున్నావు; వారి మోసాన్ని బట్టి వారు నన్ను తెలుసుకోవడానికి నిరాకరిస్తున్నారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 9:7 కాబట్టి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను వారిని శుద్ధి చేసి పరీక్షిస్తాను, నా ప్రజల పాపాన్ని బట్టి అంతకన్నా నేనేం చేయగలను?
JER 9:8 వారి నాలుక మరణకరమైన బాణం; అది మోసపూరితంగా మాట్లాడుతుంది. వారంతా తమ పొరుగువారితో సమాధానంగానే మాట్లాడతారు, కాని తమ హృదయాల్లో వారి కోసం ఉచ్చులు బిగిస్తారు.
JER 9:9 అందుకు నేను వారిని శిక్షించకూడదా? ఇలాంటి దేశంపై నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 9:10 నేను పర్వతాల కోసం ఏడుస్తాను, రోదిస్తాను, అరణ్య పచ్చగడ్డి ఉన్న స్థలాల గురించి విలపిస్తాను. అవి నిర్జనమైనవి, ప్రయాణం చేయలేనివి, పశువుల అరుపులు వినబడవు. పక్షులన్నీ పారిపోయాయి జంతువులు వెళ్లిపోయాయి.
JER 9:11 “నేను యెరూషలేమును శిథిలాల కుప్పగా, నక్కల విహారంగా చేస్తాను. నేను యూదా పట్టణాలను నాశనం చేస్తాను, అక్కడ ఎవరూ నివసించలేరు.”
JER 9:12 దీనిని గ్రహించగల జ్ఞాని ఎవరు? యెహోవా నుండి ఉపదేశం పొందుకొని దాన్ని వివరించగల వారెవరు? దేశం ఎందుకు శిథిలమై ఎవరు దాటలేని ఎడారిలా పాడైంది?
JER 9:13 యెహోవా ఇలా అన్నాడు, “నేను వారి ముందుంచిన నా ధర్మశాస్త్రాన్ని వారు విడిచిపెట్టారు; వారు నాకు విధేయత చూపలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు.
JER 9:14 దానికి బదులు, వారు తమ హృదయాల మొండితనాన్ని అనుసరించారు; వారి పూర్వికులు వారికి బోధించినట్లుగా వారు బయలును అనుసరించారు.”
JER 9:15 కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “చూడండి, నేను ఈ ప్రజలను చేదు ఆహారం తినేలా, విషపూరితమైన నీళ్లు త్రాగేలా చేస్తాను.
JER 9:16 వారికి గాని వారి పూర్వికులకు గాని తెలియని దేశాల మధ్య వారిని చెదరగొట్టి, వారిని అంతం చేసే వరకు ఖడ్గంతో వారిని వెంటాడుతాను.”
JER 9:17 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ఇప్పుడు ఆలోచించండి! విలపించే స్త్రీలను పిలిపించండి; వారిలో అత్యంత నైపుణ్యం ఉన్న వారి కోసం పంపండి.
JER 9:18 వారు త్వరగా వచ్చి మన కళ్ల నుండి కన్నీరు పొర్లిపారే వరకు మా కనురెప్పల నుండి నీటి ధారలు వచ్చేవరకు మనల్ని చూసి ఏడుస్తారు.
JER 9:19 సీయోను నుండి రోదిస్తున్న శబ్దం వినబడుతుంది: ‘మనం పూర్తిగా పతనం అయ్యాము! మన ఘోరంగా అవమానపరచబడ్డాము! మన ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి మనం మన దేశాన్ని వదిలిపెట్టాలి.’ ”
JER 9:20 స్త్రీలారా, యెహోవా మాట వినండి; ఆయన నోటి మాటలకు మీ చెవులు తెరవండి. ఏడ్వడం ఎలాగో మీ కుమార్తెలకు నేర్పండి; ఒకరికొకరు ఎలా విలపించాలో బోధించండి.
JER 9:21 మరణం మన కిటికీల గుండా ఎక్కి మన కోటల్లోకి ప్రవేశించింది; అది వీధుల్లో పిల్లలు లేకుండ బహిరంగ కూడళ్లలో యువకులు లేకుండ నాశనం చేస్తుంది.
JER 9:22 ఇలా చెప్పు, “యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “ ‘మృతదేహాలు బహిర్భూమిలో పెంటలా, కోత కోసేవాని వెనుక పడి ఉన్న పనల్లా, వాటిని సేకరించడానికి ఎవరూ ఉండరు.’ ”
JER 9:23 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “జ్ఞానులు తమ జ్ఞానాన్ని గురించి గొప్పలు చెప్పుకోకూడదు బలవంతులు తమ బలం గురించి గొప్పలు చెప్పుకోకూడదు ధనవంతులు తమ ఐశ్వర్యం గురించి గొప్పలు చెప్పుకోకూడదు,
JER 9:24 అయితే గర్వించేవారు దీనిని గురించి గర్వించాలి: నన్ను తెలుసుకునే జ్ఞానం వారికి ఉందని, నేనే యెహోవానని, భూమిపై దయను, న్యాయాన్ని నీతిని అమలు చేసేవాడినని, ఎందుకంటే వీటిని బట్టి నేను సంతోషిస్తున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 9:25 “కేవలం శరీర సంబంధంగా మాత్రమే సున్నతి పొందిన వారందరినీ నేను శిక్షించే రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 9:26 “ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు అరణ్యంలో, సుదూర ప్రాంతాల్లో నివసించే వారందరినీ నేను శిక్షించే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశాలన్నీ నిజంగా సున్నతి పొందలేదు, ఇశ్రాయేలు ఇంటివారందరు కూడా హృదయంలో సున్నతి పొందలేదు.”
JER 10:1 ఇశ్రాయేలు ప్రజలారా! యెహోవా మీతో మాట్లాడుతున్నారు, వినండి.
JER 10:2 యెహోవా ఇలా చెప్తున్నారు: “ఇతర దేశాల విధానాలను నేర్చుకోవద్దు ఆకాశంలో సూచనలను చూసి అవి భయపడినా, మీరు భయపడవద్దు.
JER 10:3 ఎందుకంటే జనాంగాల ఆచారాలు విలువలేనివి; వారు అడవిలో చెట్టు నరికి తెస్తారు, హస్తకళాకారుడు ఉలితో చెక్కుతాడు.
JER 10:4 వారు వెండి బంగారాలతో వాటిని అలంకరిస్తారు; కదలకుండా ఉండేలా, సుత్తితో మేకులు కొట్టి దానిని బిగిస్తారు.
JER 10:5 దోసకాయ పొలంలో దిష్టిబొమ్మలా, వారి విగ్రహాలు మాట్లాడలేవు; అవి నడవలేవు కాబట్టి వాటిని మోయాలి. వాటికి భయపడవద్దు; అవి ఏ హాని చేయలేవు అలాగే ఏ మేలు కూడా చేయలేవు.”
JER 10:6 యెహోవా, మీలాంటి వారు ఎవరు లేరు; మీరు గొప్పవారు, మీ నామం ఘనమైనది.
JER 10:7 దేశాలకు మీరు రాజు, మిమ్మల్ని గౌరవించని వాడెవడు? గౌరవం మీకు చెందినదే. దేశాలకు చెందిన జ్ఞానులైన నాయకులందరిలో వారి రాజ్యాలన్నిటిలో, మీలాంటి వారెవ్వరూ లేరు.
JER 10:8 వారంతా తెలివిలేనివారు, మూర్ఖులు; వారు పనికిరాని చెక్క విగ్రహాల బోధను వింటున్నారు.
JER 10:9 తర్షీషు నుండి సాగగొట్టబడిన వెండి ఊఫజు నుండి బంగారం తీసుకురాబడ్డాయి. హస్తకళాకారుడు, కంసాలివాడు తయారుచేసిన వాటికి నీలం, ఊదా రంగుల వస్త్రాలు ధరింపచేశారు, అవన్నీ నైపుణ్యం కలిగిన పనివారిచేత తయారుచేయబడ్డాయి.
JER 10:10 అయితే యెహోవాయే నిజమైన దేవుడు; ఆయన సజీవుడైన దేవుడు, నిత్య రాజు. ఆయనకు కోపం వచ్చినప్పుడు, భూమి కంపిస్తుంది; ఆయన ఉగ్రతను దేశాలు సహించలేవు.
JER 10:11 “వారితో ఇలా చెప్పు: ‘ఆకాశాన్ని, భూమిని సృజించని ఈ దేవుళ్ళు భూమి మీద నుండి, ఆకాశం క్రిందనుండి నశించిపోతారు.’ ”
JER 10:12 అయితే దేవుడు తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.
JER 10:13 ఆయన ఉరిమినప్పుడు ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.
JER 10:14 మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు.
JER 10:15 అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.
JER 10:16 యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు. ఆయన పేరు సైన్యాల యెహోవా.
JER 10:17 ఆక్రమణలో ఉంటున్నవారలారా, దేశాన్ని విడిచి వెళ్లడానికి మీ వస్తువులను సర్దుకోండి.
JER 10:18 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు: “ఈ సమయంలో నేను ఈ దేశంలో నివసించేవారిని తరిమివేస్తాను. వారు పట్టబడేలా నేను వారి మీదికి కష్టం రప్పిస్తాను.”
JER 10:19 నా గాయం వల్ల నాకు శ్రమ! నా గాయం మానిపోయేది కాదు! అయినా, “ఇది నా జబ్బు, నేను భరించాలి” అని నాలో నేను చెప్పుకున్నాను.
JER 10:20 నా గుడారం నాశనమైంది; దాని త్రాళ్లన్నీ తెగిపోయాయి. నా పిల్లలు నా నుండి వెళ్లిపోయారు, వారిక లేరు; నా గుడారం వేయడానికి నాకు బసను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఎవరూ లేరు.
JER 10:21 కాపరులు తెలివిలేనివారు వారు యెహోవా దగ్గర విచారణ చేయరు; కాబట్టి వారు వర్ధిల్లరు వారి మంద అంతా చెదరిపోయింది.
JER 10:22 వినండి! నివేదిక వస్తుంది ఉత్తర దేశం నుండి ఒక గొప్ప కలకలం! అది యూదా పట్టణాలను నిర్జనంగా, నక్కల విహారంగా చేస్తుంది.
JER 10:23 యెహోవా, మనుష్యుల ప్రాణాలు వారివి కాదని నాకు తెలుసు; తమ అడుగులు నిర్దేశించుకోవడం వారికి చేతకాదు.
JER 10:24 యెహోవా, నన్ను క్రమశిక్షణలో పెట్టు, కానీ న్యాయమైన కొలతతో మాత్రమే మీ కోపంలో కాదు, లేకపోతే మీరు నన్ను పూర్తిగా నాశనం చేస్తారు.
JER 10:25 మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి. వారు యాకోబును మ్రింగివేశారు; వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారు అతని మాతృభూమిని నాశనం చేశారు.
JER 11:1 యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది:
JER 11:2 “ఈ నిబంధనలోని షరతులను విని, యూదా ప్రజలకు, యెరూషలేములో నివసించేవారికి చెప్పండి.
JER 11:3 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఈ నిబంధన నియమాలను పాటించనివాడు శాపగ్రస్తుడు.
JER 11:4 నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి ఇనుమును కరిగించే కొలిమి నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు నేను వారికి ఆజ్ఞాపించిన నిబంధనలు.’ నేను ఇలా అన్నాను, ‘నాకు విధేయత చూపి, నేను మీకు ఆజ్ఞాపించినదంతా చేయండి, మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను దేవునిగా ఉంటాను.
JER 11:5 అప్పుడు నేను మీ పూర్వికులకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను’ అని వారితో చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తాను.” నేను, “ఆమేన్, యెహోవా” అని జవాబిచ్చాను.
JER 11:6 యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నీ ప్రకటించు: ‘ఈ ఒడంబడికలోని నియమాలను విని వాటిని అనుసరించండి.
JER 11:7 నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చినప్పటి నుండి నేటి వరకు, “నాకు లోబడండి” అని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాను.
JER 11:8 అయితే వారు వినలేదు లేదా పట్టించుకోలేదు. బదులుగా, వారు తమ దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరించారు. కాబట్టి నేను వారికి ఆజ్ఞాపించిన నిబంధన శాపాలన్నిటిని వారిపైకి తెచ్చాను, కానీ వారు పాటించలేదు.’ ”
JER 11:9 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా ప్రజల్లోనూ, యెరూషలేములో నివసించేవారిలోనూ కుట్ర ఉంది.
JER 11:10 నా మాటలు వినడానికి నిరాకరించిన తమ పూర్వికుల పాపాలకు వారు తిరిగి వచ్చారు. వారికి సేవ చేసేందుకు ఇతర దేవుళ్ళను అనుసరించారు. ఇశ్రాయేలు యూదా వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను ఉల్లంఘించారు.
JER 11:11 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘వారు తప్పించుకోలేని విపత్తును వాళ్ల మీదికి తెస్తాను. వారు నాకు మొరపెట్టుకున్నా, నేను వినను.
JER 11:12 యూదా పట్టణాలు, యెరూషలేము ప్రజలు వెళ్లి తాము ధూపం వేసే దేవుళ్ళకు మొరపెట్టుకుంటారు, అయితే విపత్తు వచ్చినప్పుడు వారు ఏమాత్రం సహాయం చేయరు.
JER 11:13 యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఆ అవమానకరమైన దేవుడైన బయలుకు ధూపం వేయడానికి మీరు ఏర్పాటుచేసిన బలిపీఠాలు యెరూషలేము వీధులంత విస్తారంగా ఉన్నాయి.’
JER 11:14 “ఈ ప్రజల కోసం ప్రార్థించవద్దు లేదా వారి కోసం ప్రార్థన లేదా విన్నపం చేయవద్దు, ఎందుకంటే నేను చేయను. వారు కష్టకాలంలో నన్ను పిలిచినప్పుడు వినండి.
JER 11:15 “నా ప్రియురాలు నా మందిరంలో ఏమి చేస్తుంది? వారు ఇతరులతో కలిసి తమ దుష్ట పన్నాగాలు పన్నుతూ ఉన్నారు పవిత్రపరచబడిన మాంసం మీ శిక్షను తప్పించగలదా? మీరు మీ దుర్మార్గంలో పాలుపంచుకున్నప్పుడు, మీరు సంతోషిస్తారు.”
JER 11:16 అందమైన పండ్లతో అభివృద్ధి చెందుతున్న ఒలీవచెట్టు అని యెహోవా నిన్ను పిలిచాడు. అయితే పెను తుఫాను గర్జనతో దానికి నిప్పు పెడతాడు, దాని కొమ్మలు విరిగిపోతాయి.
JER 11:17 ఇశ్రాయేలు, యూదా ప్రజలు చెడ్డపనులు చేసి బయలుకు ధూపం వేసి నా కోపాన్ని రేకెత్తించారు కాబట్టి నిన్ను నాటిన సైన్యాల యెహోవా నీకు విపత్తు విధించాడు.
JER 11:18 యెహోవా వారి కుట్రను నాకు తెలియజేశాడు, అది నాకు తెలుసు, ఎందుకంటే ఆ సమయంలో వారు ఏమి చేస్తున్నారో ఆయన నాకు చూపించాడు.
JER 11:19 నేను వధకు దారితీసిన మృదువైన గొర్రెపిల్లలా ఉన్నాను; “చెట్టును, దాని పండ్లను నాశనం చేద్దాం; అతని పేరు ఇకపై జ్ఞాపకం రాకుండా ఉండేలా సజీవుల దేశం నుండి అతన్ని నరికివేద్దాము.”
JER 11:20 అయితే సైన్యాల యెహోవా, నీతిగా తీర్పు తీర్చి, హృదయాన్ని, మనస్సును పరీక్షించే నీవు, నీ ప్రతీకారాన్ని నేను చూసుకోనివ్వు, నీకు నేను నా కర్తవ్యాన్ని అప్పగించాను.
JER 11:21 అందుకే నిన్ను చంపుతానని బెదిరిస్తున్న అనాతోతు ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నారు, “యెహోవా పేరిట ప్రవచించకండి, అలా చేస్తే మా చేతిలోనే చస్తారు.”
JER 11:22 కాబట్టి ఇది సైన్యాల యెహోవా ఇలా అంటున్నాడు: “నేను వారిని శిక్షిస్తాను. వారి యువకులు కత్తిచేత, వారి కుమారులు కుమార్తెలు కరువుచేత మరణిస్తారు.
JER 11:23 అనాతోతు ప్రజలకు శిక్ష విధించే సంవత్సరంలో నేను వారికి విపత్తు తెస్తాను కాబట్టి వారికి మిగిలేది కూడా ఉండదు.”
JER 12:1 యెహోవా, నేను మీ ముందు ఎప్పుడు వాదన వినిపించినా మీరెప్పుడూ నీతిమంతునిగానే ఉంటారు. అయినా మీ న్యాయం గురించి నేను మీతో మాట్లాడతాను: దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? నమ్మకద్రోహులంతా ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు?
JER 12:2 మీరు వారిని నాటారు, వారు వేర్లు పాదుకున్నారు; వారు పెరిగి ఫలిస్తున్నారు. వారెల్లప్పుడూ మీ గురించి మాట్లాడతారు కానీ వారి హృదయాలు మీకు దూరంగా ఉంటాయి.
JER 12:3 అయినా యెహోవా, నేను మీకు తెలుసు; మీరు నన్ను చూస్తున్నారు, మిమ్మల్ని గురించిన నా ఆలోచనలను మీరు పరీక్షిస్తున్నారు. వధకు గొర్రెలు లాగివేయబడునట్లు వారిని లాగివేయండి! వధ దినం కోసం వారిని వేరు చేయండి!
JER 12:4 ఎంతకాలం భూమి ఎండిపోయి ఉండాలి? ఎంతకాలం పొలంలో గడ్డి ఎండిపోతూ ఉండాలి? అందులో నివసించేవారు దుర్మార్గులు కాబట్టి జంతువులు, పక్షులు నశించాయి. “మనకు ఏమి జరుగుతుందో యెహోవా చూడడు” అని ప్రజలు అంటున్నారు.
JER 12:5 “మీరు కాలినడకన వెళ్తున్న వారితో పరుగెడితేనే వారు నిన్ను అలసిపోయేలా చేశారు, అలాంటప్పుడు గుర్రాలతో ఎలా పోటీపడతావు? భద్రతగల దేశం అని మీరనుకునే దేశంలోనే మీరు క్షేమంగా ఉండనప్పుడు, యొర్దాను ఒడ్డున ఉన్న దట్టమైన పొదల్లో ఎలా?
JER 12:6 నీ బంధువులు, నీ సొంత కుటుంబ సభ్యులు కూడా, నీకు నమ్మకద్రోహం చేశారు; వారు నీ మీద పెద్దగా అరుస్తూ మాట్లాడారు. కాబట్టి వారు నీ గురించి మంచిగా మాట్లాడినా వారిని నమ్మవద్దు.
JER 12:7 “నా ఇంటిని విడిచిపెడతాను, నా వారసత్వాన్ని వదిలివేస్తాను; నేను ప్రేమించిన దానిని తన శత్రువుల చేతికి అప్పగిస్తాను.
JER 12:8 నా వారసత్వం నాకు అడవిలోని సింహంలా మారింది. అది నా మీదికి గర్జిస్తుంది; కాబట్టి నేను దానిని ద్వేషిస్తున్నాను.
JER 12:9 నా వారసత్వం నాకు మచ్చలున్న క్రూరపక్షిలా కాలేదా? దాన్ని ఇతర పక్షులు చుట్టుముట్టి దాడి చేస్తాయి వెళ్లి క్రూర మృగాలన్నిటిని పోగు చేయండి; మ్రింగివేయడానికి వాటిని తీసుకురండి.
JER 12:10 చాలామంది కాపరులు నా ద్రాక్షతోటను నాశనం చేశారు నా పొలాన్ని త్రొక్కివేశారు; వారు నాకు ఇష్టమైన పొలాన్ని నిర్జనమైన బంజరు భూమిలా మార్చారు.
JER 12:11 అది నా ఎదుట బంజరు భూమిలా, ఎండిపోయి పాడైపోయింది; పట్టించుకునే వారు లేక దేశమంతా వృధా అవుతుంది.
JER 12:12 ఎడారిలో ఉన్న బంజరు కొండలపైకి నాశనం చేసేవారు గుంపుగా వస్తున్నారు, యెహోవా ఖడ్గం భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు హతం చేస్తుంది; ఎవరూ క్షేమంగా ఉండరు.
JER 12:13 వారు గోధుమలు విత్తుతారు కాని ముళ్ళ పంట కోస్తారు; వారు పనితో అలసిపోతారు కాని లాభం ఉండదు. యెహోవా కోపం కారణంగా కోయడానికి పంట లేక మీరు సిగ్గుపడతారు.”
JER 12:14 యెహోవా ఇలా అంటున్నారు: “నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నేను ఇచ్చిన స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకున్న నా చెడ్డ పొరుగువారిని వారి దేశాల నుండి పెళ్లగిస్తాను, యూదా ప్రజలను వారి మధ్య నుండి పెళ్లగిస్తాను.
JER 12:15 కానీ నేను వారిని పెళ్లగించిన తర్వాత, మళ్ళీ వారి మీద కనికరపడి, వారి వారసత్వాలకు వారి దేశాలకు వారిని తిరిగి రప్పిస్తాను.
JER 12:16 వారు ఒకప్పుడు బయలుపై ప్రమాణం చేయడం నా ప్రజలకు బోధించినట్లే, ఇప్పుడు ‘సజీవుడైన యెహోవా పేరిట’ అని నా పేరు మీద ప్రమాణం చేయడానికి నా ప్రజల మార్గాలను బాగా నేర్చుకుంటే వారు నా ప్రజలమధ్య స్థిరపడతారు.
JER 12:17 అయితే ఒకవేళ ఏ దేశమైనా నా మాట వినకపోతే, నేను ఆ జనాన్ని వేళ్లతో సహా పెళ్లగించి నిర్మూలం చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 13:1 యెహోవా నాతో ఇలా అన్నారు: “నీవు వెళ్లి నార పట్టీ కొని నీ నడుముకు పెట్టుకో, అయితే అది నీళ్లతో తడపవద్దు.”
JER 13:2 కాబట్టి నేను యెహోవా ఆజ్ఞాపించినట్లే నడుముకు నార పట్టీ పెట్టుకున్నాను.
JER 13:3 రెండవసారి యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది:
JER 13:4 “నీవు కొనుక్కుని నడుముకు పెట్టుకున్న పట్టీని తీసుకుని నీవిప్పుడు పేరతు నది ఒడ్డుకు వెళ్లి, అక్కడ బండ సందులో దాన్ని దాచి పెట్టు.”
JER 13:5 కాబట్టి యెహోవా నాకు చెప్పినట్లే నేను వెళ్లి పేరతు దగ్గర దాన్ని దాచి పెట్టాను.
JER 13:6 చాలా రోజుల తర్వాత యెహోవా నాతో ఇలా అన్నారు: “ఇప్పుడే నీవు పేరతు నది ఒడ్డుకు వెళ్లి అక్కడ దాచిపెట్టుమని నేను చెప్పిన పట్టీని తెచ్చుకో.”
JER 13:7 కాబట్టి నేను పేరతు నది ఒడ్డుకు వెళ్లి త్రవ్వి దాచిపెట్టిన స్థలంలో నుండి ఆ పట్టీని తీసుకున్నాను, కానీ ఇప్పుడు అది పాడై, పూర్తిగా పనికిరాకుండా పోయింది.
JER 13:8 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
JER 13:9 “యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా గర్వాన్ని, యెరూషలేము గొప్ప అహంకారాన్ని కూడా అదే విధంగా నాశనం చేస్తాను.
JER 13:10 నా మాటలు వినకుండ, తమ హృదయాల మొండితనాన్ని అనుసరించి, ఇతర దేవుళ్ళను సేవించే, ఆరాధించే ఈ దుష్ట ప్రజలు ఈ పట్టీలా ఎందుకు పనికిరానివారిగా ఉంటారు!
JER 13:11 నడుముకు పట్టీ కట్టినట్లు నేను ఇశ్రాయేలు ప్రజలందరినీ, యూదా ప్రజలందరినీ, నా కీర్తి, స్తుతి ఘనత కోసం నా ప్రజలుగా ఉండడానికి నాకు కట్టుకున్నాను. కానీ వారు వినలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 13:12 “వారితో ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ప్రతి ద్రాక్ష తిత్తి ద్రాక్షరసంతో నింపబడాలి.’ ఒకవేళ వారు నీతో, ‘ప్రతి ద్రాక్ష తిత్తి ద్రాక్షరసంతో నింపబడాలని మాకు తెలీదా?’ అని అంటే,
JER 13:13 వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: దావీదు సింహాసనం మీద ఆసీనులైన రాజులు, యాజకులు, ప్రవక్తలు, యెరూషలేములో నివసిస్తున్న వారందరితో సహా ఈ దేశంలో నివసించే వారందరినీ నేను మత్తులో మునిగేలా చేయబోతున్నాను.
JER 13:14 అప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అలాగే అందరిని ఒకరిపై ఒకరు పడేలా చేస్తాను, వారిపై దయ కరుణ కనికరం లేకుండా నాశనం చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
JER 13:15 వినండి శ్రద్ధ వహించండి, గర్వపడకండి, అని యెహోవా చెప్తున్నారు.
JER 13:16 చీకటి కమ్ముతున్న కొండలమీద మీ పాదాలు తడబడక ముందే, మీ దేవుడైన యెహోవా చీకటి తేక ముందే మీ దేవుడైన యెహోవాను మహిమపరచండి. మీరు వెలుగు కోసం ఎదురుచూస్తారు, కానీ ఆయన దానిని పూర్తిగా చీకటిగా గాఢమైన చీకటిగా మారుస్తారు.
JER 13:17 మీరు వినకపోతే మీ గర్వాన్ని బట్టి నేను రహస్యంగా ఏడుస్తాను; యెహోవా మంద చెరగా కొనిపోబడుతుంది కాబట్టి నా కళ్లు ఎంతగానో ఏడుస్తాయి, కన్నీరు కారుస్తాయి.
JER 13:18 రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు, “మీర మీ సింహాసనాలు దిగిరండి, ఎందుకంటే మీ దివ్యమైన కిరీటాలు మీ తలల నుండి పడిపోతాయి.”
JER 13:19 దక్షిణ వైపు ఉన్న పట్టణాలు మూసివేయబడతాయి, వాటిని తెరవడానికి పట్టించుకునేవారే ఉండరు. యూదా వారంతా బందీగా కొనిపోబడతారు, ఏమి మిగులకుండ పూర్తిగా కొనిపోబడతారు.
JER 13:20 కళ్లు పైకెత్తి ఉత్తరం నుండి వస్తున్న వారిని చూడండి. నీకు అప్పగించబడిన మంద, నీవు గొప్పలు చెప్పుకున్న గొర్రెలు ఎక్కడ?
JER 13:21 నీ ప్రత్యేక మిత్రులుగా నీవు చేసుకొన్న వారిని యెహోవా నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేమంటావు? ప్రసవిస్తున్న స్త్రీ పడే బాధలాంటి బాధ నీకు కలుగదా?
JER 13:22 “నాకే ఎందుకు ఇలా జరిగింది?” అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటే నీ అనేక పాపాల కారణంగానే నీ వస్త్రాలు చింపబడ్డాయి నీ శరీరం అసభ్యంగా తాకబడింది.
JER 13:23 కూషీయుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? అలాగే చెడు చేయడం అలవాటైన మీరు మంచి చేయలేరు.
JER 13:24 “ఎడారి గాలికి కొట్టుకుపోయే పొట్టులా నేను నిన్ను చెదరగొడతాను.
JER 13:25 ఇదే నీ భాగం, నేను నీకు నియమించిన భాగం, ఎందుకంటే నీవు నన్ను మరచిపోయి అబద్ధ దేవుళ్ళపై నమ్మకం ఉంచావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 13:26 “నీ అవమానం కనబడేలా నీ ముఖం మీది బట్టను నేను లాగివేస్తాను.
JER 13:27 నీ వ్యభిచారాలు, కామపు సకిలింపులు, నీ సిగ్గులేని వ్యభిచారం! కొండలమీద, పొలాల్లో నీ హేయమైన పనులు నేను చూశాను. యెరూషలేమా, నీకు శ్రమ! నీవు ఎంతకాలం అపవిత్రంగా ఉంటావు?”
JER 14:1 అనావృష్టి గురించి యిర్మీయాకు వచ్చిన యెహోవా వాక్కు ఇది:
JER 14:2 “యూదా దుఃఖిస్తుంది, ఆమె పట్టణాలు వాడిపోతున్నాయి. వారు భూమి కోసం విలపిస్తున్నారు, యెరూషలేము నుండి కేకలు వినిపిస్తున్నాయి.
JER 14:3 అధిపతులు నీళ్ల కోసం తమ సేవకులను పంపుతారు; వారు నీళ్ల తొట్టెల దగ్గరకు వెళ్తారు కానీ నీళ్లు దొరకవు. వారు ఖాళీ పాత్రలతో తిరిగి వస్తారు; నిరాశ నిస్పృహలతో, వారు తమ తలలను కప్పుకుంటారు.
JER 14:4 దేశంలో వర్షం కురవకపోవడం వల్ల నేల చీలిపోయింది; రైతులు సిగ్గుతో తలలు కప్పుకున్నారు.
JER 14:5 పొలంలో ఉన్న జింక కూడా గడ్డి లేనందున అప్పుడే పుట్టిన తన పిల్లలను విడిచిపెడుతుంది.
JER 14:6 అడవి గాడిదలు బంజరు కొండలమీద నిలబడి నక్కల్లా రొప్పుతాయి. మేత లేకపోవడంతో వాటి కళ్లు క్షీణిస్తున్నాయి.”
JER 14:7 మా పాపాలు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నా, యెహోవా, మీ నామం కోసం ఏదైనా చేయండి. ఎందుకంటే మేము చాలాసార్లు దారితప్పాం; మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాము.
JER 14:8 మీరు ఇశ్రాయేలీయులకు నిరీక్షణ, ఆపద సమయంలో వారికి రక్షకుడవు, దేశంలో నీవు అపరిచితునిలా ఎందుకు ఉన్నావు? ఒక రాత్రి మాత్రమే బసచేసే ప్రయాణికునిలా ఎందుకు ఉన్నావు?
JER 14:9 నీవు ఆందోళనకు గురియైన వ్యక్తిలా ఎందుకు ఉన్నావు? రక్షించడానికి శక్తిలేని యోధునిలా ఎందుకు ఉన్నావు? యెహోవా, మీరు మా మధ్య ఉన్నారు, మేము మీ పేరును కలిగి ఉన్నాము; మమ్మల్ని విడిచిపెట్టకండి!
JER 14:10 ఈ ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నారు: “వారికి తిరగడం అంటే చాలా ఇష్టం; వారు తమ పాదాలను అదుపు చేసుకోరు. కాబట్టి యెహోవా వారిని అంగీకరించరు; ఆయన ఇక వారి దుర్మార్గాన్ని జ్ఞాపకం ఉంచుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తారు.”
JER 14:11 తర్వాత యెహోవా నాతో ఇలా అన్నారు: “ఈ ప్రజల క్షేమం కోసం ప్రార్థించవద్దు.
JER 14:12 వారు ఉపవాసం ఉన్నప్పటికీ నేను వారి మొర వినను; వారు దహనబలులను భోజనార్పణలను అర్పించినప్పటికీ నేను వాటిని అంగీకరించను. నేను వారిని ఖడ్గంతో కరువుతో తెగులుతో నాశనం చేస్తాను.”
JER 14:13 అయితే నేను, “అయ్యో, ప్రభువా యెహోవా! ప్రవక్తలు వారితో, ‘మీరు ఖడ్గాన్ని చూడరు, మీకు కరువు రాదు. నిజానికి, ఈ స్థలంలో నేను మీకు శాశ్వతమైన సమాధానం ఇస్తాను’ అని చెబుతున్నారు.”
JER 14:14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “ప్రవక్తలు నా పేరుతో అబద్ధాలు ప్రవచిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారిని నియమించలేదు, అసలు వారితో మాట్లాడలేదు. వారు మీకు తప్పుడు దర్శనాలు, భవిష్యవాణి, బూటకపు మాటలు వారి సొంత మనస్సు యొక్క భ్రమలు ప్రవచిస్తున్నారు.
JER 14:15 కాబట్టి నా పేరుతో ప్రవచిస్తున్న ప్రవక్తల గురించి యెహోవా ఇలా అంటున్నారు: నేను వారిని పంపలేదు, అయినా వారు, ‘ఖడ్గం గాని కరువు గాని ఈ దేశాన్ని తాకవు’ అని చెప్తున్నారు. అలా ప్రవచిస్తున్న ప్రవక్తలే ఖడ్గం కరువుతో నశిస్తారు.
JER 14:16 వారు ఎవరికి ప్రవచిస్తున్నారో ఆ ప్రజలు కరువు, ఖడ్గం కారణంగా యెరూషలేము వీధుల్లోకి విసిరివేయబడతారు. వారిని, వారి భార్యలను, వారి కుమారులను వారి కుమార్తెలను పాతిపెట్టడానికి ఎవరూ ఉండరు. నేను వారికి తగిన విపత్తును వారిపై కురిపిస్తాను.
JER 14:17 “వారితో ఈ మాట చెప్పు: “ ‘నా కళ్లలో కన్నీరు రాత్రింబగళ్ళు ఆగకుండా పొంగిపారును గాక; ఎందుకంటే, కన్యయైన నా ప్రజల కుమార్తెకు, తీవ్రమైన గాయం తగిలింది, అది ఆమెను నలిపివేస్తుంది.
JER 14:18 నేను పొలాల్లోకి వెళ్తే, ఖడ్గంతో చంపబడినవారు కనబడతారు; నేను పట్టణంలోకి వెళ్తే, కరువు బీభత్సాన్ని చూస్తాను. ప్రవక్త యాజకుడు ఇద్దరూ తమకు తెలియని దేశానికి వెళ్లారు.’ ”
JER 14:19 యెహోవా, మీరు యూదాను పూర్తిగా తిరస్కరించారా? మీరు సీయోనును తృణీకరిస్తున్నారా? మేము స్వస్థత పొందలేనంతగా మమ్మల్ని ఎందుకు బాధించారు? మేము సమాధానం కోసం నిరీక్షించాం కానీ ఏ మంచి జరగలేదు, స్వస్థత జరిగే సమయం కోసం నిరీక్షించాం కానీ కేవలం భయమే ఉండింది.
JER 14:20 యెహోవా, మా దుర్మార్గాన్ని, మా పూర్వికుల అపరాధాన్ని మేము ఒప్పుకుంటున్నాం; మేము మీకు విరోధంగా పాపం చేశాము.
JER 14:21 మీ పేరు కోసం మమ్మల్ని తృణీకరించకండి; మహిమతో నిండిన మీ సింహాసనాన్ని అగౌరపరచకండి. మాతో మీ ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకోండి దానిని భంగం చేయకండి.
JER 14:22 జనాంగాల పనికిమాలిన విగ్రహాలేవైనా వర్షాన్ని కురిపిస్తాయా? ఆకాశాలు వాటంతట అవి జల్లులు కురిపిస్తాయా? లేదు, యెహోవా, మా దేవా మీరే కదా. కాబట్టి మీ మీదనే మా నిరీక్షణ ఉంది, ఎందుకంటే ఇదంతా చేసింది మీరే.
JER 15:1 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “మోషే, సమూయేలు నా ముందు నిలబడినా, నా హృదయం ఈ ప్రజల వైపుకు వెళ్లదు. వారిని నా సన్నిధి నుండి దూరంగా పంపివేయి! వారిని వెళ్లనివ్వు!
JER 15:2 వారు నిన్ను, ‘మేము ఎక్కడికి వెళ్లాలి?’ అని అడిగితే, వారితో చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: “ ‘మరణానికి నిర్ణయించబడినవారు, మరణానికి; ఖడ్గానికి నిర్ణయించబడినవారు, ఖడ్గానికి; ఆకలికి నిర్ణయించబడినవారు, ఆకలికి; చెరకు నిర్ణయించబడినవారు, చెరకు వెళ్లాలి.’
JER 15:3 “నేను నాలుగు రకాల బాధలను వారి మీదికి పంపుతాను. చంపడానికి ఖడ్గాన్ని, చీల్చడానికి కుక్కలను, తిని నాశనం చేయడానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 15:4 యూదా రాజైన హిజ్కియా కుమారుడైన మనష్షే యెరూషలేములో చేసిన దానిని బట్టి భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా చేస్తాను.
JER 15:5 “యెరూషలేమా, నీ మీద ఎవరు జాలి చూపిస్తారు? నీకోసం ఎవరు దుఃఖిస్తారు? నీ క్షేమసమాచారం ఎవరు అడుగుతారు?
JER 15:6 నీవు నన్ను తిరస్కరించావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీవు విశ్వాసభ్రష్టత్వం కొనసాగిస్తూనే ఉన్నావు. కాబట్టి నేను నా చేయి చాపి నిన్ను నాశనం చేస్తాను; నీ మీద జాలి చూపడానికి నేను అలసిపోయాను.
JER 15:7 దేశపు పట్టణ ద్వారం దగ్గర నేను వారిని చేటతో చెరుగుతాను. నా ప్రజలు తమ మార్గాలను మార్చుకోలేదు వారికి బంధువియోగం కలిగించి నాశనం చేస్తాను.
JER 15:8 నేను వారి విధవరాండ్ర సంఖ్యను సముద్రపు ఇసుక కంటే ఎక్కువ చేస్తాను. మధ్యాహ్న సమయంలో నేను వారి యువకులు తల్లుల మీదికి నాశనం చేసేవాన్ని రప్పిస్తాను; అకస్మాత్తుగా నేను వారి మీదికి వేదనను, భయాందోళనను రప్పిస్తాను.
JER 15:9 ఏడుగురు పిల్లల తల్లి మూర్ఛపోయి తుది శ్వాస విడుస్తుంది. పగలు ఉండగానే ఆమెకు ప్రొద్దు గ్రుంకుతుంది; ఆమె అవమానం పాలవుతుంది, కించపరచబడుతుంది. ప్రాణాలతో బయటపడిన వారిని వారి శత్రువుల ముందు ఖడ్గానికి అప్పగిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 15:10 అయ్యో, నా తల్లీ, దేశమంతటితో పోరాటాలు, కలహాలు పెట్టుకునేవానిగా, నీవు నాకు జన్మనిచ్చావు! నేను అప్పు ఇవ్వలేదు, అప్పు తీసుకోలేదు, అయినా ప్రతిఒక్కరు నన్ను శపిస్తున్నారు.
JER 15:11 యెహోవా ఇలా అన్నారు, “ఖచ్చితంగా నేను నిన్ను మంచి ఉద్దేశంతో విడిపిస్తాను; ఆపద సమయాల్లోనూ, కష్ట సమయాల్లోనూ నీ శత్రువులు నిన్ను సాయం కోరేలా నేను చేస్తాను.
JER 15:12 “ఉత్తరానికి చెందిన ఇనుమును గాని ఇత్తడిని గాని ఎవరైనా విరగ్గొట్టగలరా?
JER 15:13 “మీ దేశమంతటా మీరు చేసిన పాపాలన్నిటి కారణంగా మీ సంపదను, మీ ఖజానాను నేను ఎలాంటి రుసుము లేకుండా దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను.
JER 15:14 నీకు తెలియని దేశంలో నీ శత్రువులకు నిన్ను బానిసగా చేస్తాను, నా కోపం మంటలు రేపుతుంది అది నీకు వ్యతిరేకంగా మండుతుంది.”
JER 15:15 యెహోవా, మీరు అర్థం చేసుకోండి; నన్ను జ్ఞాపకముంచుకొని నా పట్ల శ్రద్ధ చూపండి. నన్ను హింసించేవారి మీద నా కోసం ప్రతీకారం తీర్చుకోండి. మీ ఓర్పును బట్టి నన్ను తీసుకెళ్లనివ్వకండి; మీ కోసం నేనెలా నిందలు అనుభవిస్తున్నానో ఆలోచించండి.
JER 15:16 మీ మాటలు దొరికినప్పుడు ఒకడు ఆహారం తిన్నట్లుగా నేను వాటిని తిన్నాను; అవే నాకు ఆనందం నా హృదయానికి సంతోషం, ఎందుకంటే సైన్యాల యెహోవా దేవుడు అనే, మీ పేరును నేను కలిగి ఉన్నాను.
JER 15:17 నేనిప్పుడు ఆనందించే వారితో కలిసి కూర్చోలేదు, వారితో ఎప్పుడూ సంతోషించలేదు. మీ చేయి నా మీద ఉంది మీరు నాలో కోపాన్ని నింపారు కాబట్టి నేను ఒంటరిగా కూర్చున్నాను.
JER 15:18 అలాంటప్పుడు నా బాధ ఎందుకు అంతం కావడం లేదు? నా గాయం ఎందుకు నయం చేయలేనిది? మీ సహాయం నమ్మలేని వాగులా, ఎండిపోయే ఊటలా వంటిది.
JER 15:19 కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “నీవు పశ్చాత్తాపపడితే మీరు నాకు సేవ చేసేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. నీవు పనికిరాని మాటలు కాక, యోగ్యమైన మాటలు మాట్లాడితే, నీవు నా పక్షంగా మాట్లాడే వక్తవవుతావు. ఈ ప్రజలు నీ వైపుకు తిరగాలి, కాని నీవు వారివైపు తిరగకూడదు.
JER 15:20 నిన్ను ఈ ప్రజలకు గోడగా, ఇత్తడి కోటగోడగా చేస్తాను; వారు నీతో పోరాడతారు, కాని నిన్ను జయించలేరు, ఎందుకంటే నిన్ను విడిపించి రక్షించడానికి నేను నీతో ఉన్నాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 15:21 “దుష్టుల చేతుల నుండి నేను నిన్ను రక్షించి క్రూరమైన వారి పట్టు నుండి నిన్ను విడిపిస్తాను.”
JER 16:1 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
JER 16:2 “ఈ స్థలంలో నీవు పెళ్ళి చేసుకుని కుమారులు, కూతుళ్లు కనకూడదు.”
JER 16:3 ఈ దేశంలో పుట్టిన కుమారులు కుమార్తెల గురించి వారి తల్లుల గురించి వారి తండ్రుల గురించి యెహోవా ఇలా అంటున్నారు:
JER 16:4 “వారు ప్రాణాంతకమైన వ్యాధులతో చనిపోతారు. వారి కోసం ఎవరు దుఃఖించరు, వారిని పాతిపెట్టరు, వారి శవాలు నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటాయి. వారు ఖడ్గంతో, కరువుతో నశిస్తారు, వారి శవాలు పక్షులకు అడవి జంతువులకు ఆహారంగా ఉంటాయి.”
JER 16:5 యెహోవా ఇలా అంటున్నారు: “చనిపోయిన దుఃఖంతో ఉన్న ఇంటికి వెళ్లవద్దు; దుఃఖించడానికీ, సానుభూతి చూపడానికి వెళ్లవద్దు, ఎందుకంటే నేను ఈ ప్రజల నుండి నా సమాధానాన్ని, నా ప్రేమను, నా జాలి వదిలేశాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 16:6 “ఈ దేశంలో గొప్పవారు చిన్నవారు అందరు చనిపోతారు. వారు పాతిపెట్టబడరు, వారి కోసం ఎవరు దుఃఖించరు, చనిపోయినవారి కోసం ఎవరూ తమను తాము కోసుకోరు, తల క్షౌరం చేయించుకోరు.
JER 16:7 చనిపోయినవారి కోసం దుఃఖించేవారిని ఓదార్చడానికి ఎవరూ ఆహారం ఇవ్వరు కనీసం తండ్రి తల్లి చనిపోయినా సరే వారిని ఓదార్చేలా త్రాగడానికి ఏమీ ఇవ్వరు.
JER 16:8 “విందు జరుగుతున్న ఇంట్లోకి వెళ్లి తినడానికి, త్రాగడానికి కూర్చోవద్దు.
JER 16:9 ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీ కళ్లముందు, మీ రోజుల్లో నేను ఈ స్థలంలో ఆనంద, సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను అంతం చేస్తాను.
JER 16:10 “నీవు ఈ సంగతులను ఈ ప్రజలకు చెప్పినప్పుడు, ‘యెహోవా మనపై ఇంత పెద్ద విపత్తును ఎందుకు విధించారు? మేము చేసిన తప్పేంటి? మన దేవుడైన యెహోవాకు విరోధంగా మనం ఏమి పాపం చేశాం?’
JER 16:11 అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘మీ పూర్వికులు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని సేవిస్తూ, ఆరాధించారు. వారు నన్ను విడిచిపెట్టారు నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 16:12 అయితే మీరు మీ పూర్వికులకంటే దుర్మార్గంగా ప్రవర్తించారు. మీరందరూ నాకు విధేయత చూపకుండ మీ దుష్ట హృదయాల మొండితనాన్ని ఎలా అనుసరిస్తున్నారో చూసుకోండి.
JER 16:13 కాబట్టి నేను మిమ్మల్ని ఈ దేశం నుండి మీకు గాని మీ పూర్వికులకు గాని తెలియని దేశంలోకి విసిరివేస్తాను, అక్కడ మీరు పగలు రాత్రి ఇతర దేవుళ్ళను సేవిస్తారు, ఎందుకంటే నేను మీకు ఎలాంటి దయ చూపను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 16:14 “అయినా, ఆ రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తూ ఇలా చెప్తున్నారు, “అప్పుడు ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన యెహోవా జీవం తోడు’ అని ఇకపై చెప్పరు,
JER 16:15 అయితే, ‘యెహోవా జీవం తోడు, ఇశ్రాయేలీయులను ఉత్తర దేశం నుండి ఆయన వారిని తరిమేసిన అన్ని దేశాల నుండి బయటకు రప్పించిన యెహోవా జీవం తోడు.’ ఎందుకంటే నేను వారిని వారి పూర్వికులకు నేనిచ్చిన దేశానికి మళ్ళీ రప్పిస్తాను.
JER 16:16 “అయితే వారిని పట్టుకోడానికి నేను చాలామంది చేపలు పట్టేవారిని పిలిపిస్తాను. ఆ తర్వాత వారిని ప్రతి పర్వతం మీద కొండమీద రాళ్ల పగుళ్లలో నుండి వేటాడడానికి చాలామంది వేటగాళ్లను పిలుస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 16:17 వారి మార్గాలన్నిటిపై నా దృష్టి ఉంది; నాకు కనబడకుండ లేదు, వారి పాపం నా కళ్ళకు దాచబడలేదు.
JER 16:18 వారి దుష్టత్వానికి, పాపానికి రెట్టింపు ప్రతిఫలమిస్తాను, ఎందుకంటే వారు నా దేశాన్ని నిర్జీవమైన తమ నీచమైన విగ్రహాలతో అపవిత్రం చేశారు వారి అసహ్యమైన విగ్రహాలతో నా వారసత్వాన్ని నింపారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 16:19 యెహోవా, మీరే నా బలం, నా కోట, ఆపద సమయంలో నాకు ఆశ్రయం, దేశాలు నీ దగ్గరకు భూమి అంచుల నుండి వచ్చి, “మా పూర్వికులు అబద్ధపు దేవుళ్ళు తప్ప మరేమీ కలిగి లేరు. పనికిరాని విగ్రహాలు వారికి ఏ మేలు చేయలేదు.
JER 16:20 మనుష్యులు తమ దేవుళ్ళను చేసుకుంటారా? అవును, కానీ వారు దేవుళ్ళు కాదు!”
JER 16:21 “అందుకే నేను వారికి బోధిస్తాను, ఈసారి వారికి నా శక్తిని, మహాత్మ్యాన్ని బోధిస్తాను. అప్పుడు వారు నా పేరు యెహోవా అని తెలుసుకుంటారు.
JER 17:1 “యూదా పాపం వారి హృదయ పలకలపై, వారి బలిపీఠాల కొమ్ములపై, ఇనుప పనిముట్టుతో చెక్కబడింది. వజ్రపు మొనతో లిఖించబడింది.
JER 17:2 వారి పిల్లలు కూడా మహా వృక్షాల ప్రక్కన ఎత్తైన కొండలమీద ఉన్న తమ బలిపీఠాలను, అషేరా స్తంభాలను జ్ఞాపకం చేసుకుంటారు.
JER 17:3 నీవు పాపం నీ దేశమంతటా ఉంది కాబట్టి దేశంలోని నా కొండలను, నీ ధనాన్ని, నీ సంపదను, నీ క్షేత్రాలతో పాటు దోపుడు సొమ్ముగా ఇస్తాను.
JER 17:4 నీవు చేసిన తప్పు వల్ల నేను నీకు ఇచ్చిన వారసత్వాన్ని నీవు కోల్పోతావు. నీకు తెలియని దేశంలో నిన్ను నీ శత్రువులకు బానిసగా చేస్తాను, నీవు నా కోపాన్ని రెచ్చగొట్టావు, అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది.”
JER 17:5 యెహోవా ఇలా అంటున్నారు: “మనుష్యుల మీద నమ్మకం పెట్టుకునేవారు, కేవలం శరీర బలం మీద ఆధారపడేవారు, యెహోవా నుండి తమ హృదయాన్ని త్రిప్పివేసుకునేవారు శాపగ్రస్తులు.
JER 17:6 వారు బంజరు భూములలో పొదలా ఉంటారు; వృద్ధి కలిగినప్పుడు వారు దానిని చూడరు. వారు ఎడారిలోని ఎండిన ప్రదేశాల్లో, ఎవరూ నివసించని ఉప్పు భూమిలో నివసిస్తారు.
JER 17:7 “కాని యెహోవా మీద నమ్మకముంచేవారు ధన్యులు, ఆయనయందు నమ్మకం ఉంచేవారు ధన్యులు.
JER 17:8 వారు నీళ్ల ప్రక్కన నాటిన చెట్టులా ఉంటారు వాటి వేర్లు నీటి ప్రక్కన లోతుగా పాదుకుంటాయి. కాబట్టి వేడి తగిలినా అవి భయపడవు; వాటి ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. కరువు వచ్చిన సంవత్సరంలో వాటికి చింత ఉండదు, ఫలాలు ఇచ్చే విషయంలో ఎప్పుడూ విఫలం కావు.”
JER 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది నయం చేయలేని వ్యాధి కలది. దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
JER 17:10 “యెహోవానైన నేను హృదయాన్ని పరిశోధించి మనస్సును పరీక్షించి, ప్రతి వ్యక్తికి వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తాను.”
JER 17:11 అన్యాయంగా ధనాన్ని సంపాదించేవారు పెట్టని గుడ్ల మీద పొదిగిన కౌజుపిట్టలాంటి వారు. వారి జీవితం సగం ముగిసినప్పటికే సంపద వారిని వదిలివేస్తుంది, చివరికి వారు మూర్ఖులు అని నిరూపించబడతారు.
JER 17:12 మన పరిశుద్ధాలయం, ఆది నుండి హెచ్చింపబడిన ఒక మహిమగల సింహాసనము.
JER 17:13 యెహోవా, మీరే ఇశ్రాయేలీయుల నిరీక్షణ; మిమ్మల్ని విడిచిపెట్టేవారందరూ అవమానానికి గురవుతారు. మిమ్మల్ని విడిచిపెట్టినవారి గమ్యం నాశనమే, ఎందుకంటే వారు జీవజలపు ఊటయైన యెహోవాను విడిచిపెట్టారు.
JER 17:14 యెహోవా, నన్ను స్వస్థపరచండి, నేను స్వస్థపడతాను; నన్ను రక్షించండి, నేను రక్షింపబడతాను, నేను స్తుతించేది మిమ్మల్నే.
JER 17:15 వారు నాతో ఇలా అంటారు: “యెహోవా మాట ఏమైంది? అది ఇప్పుడు నెరవేరాలి!”
JER 17:16 నేను మీకు కాపరిగా ఉండకుండ పారిపోలేదు; వారికి నిరాశ దినం రావాలని నేను కోరుకోలేదని మీకు తెలుసు. నా పెదవుల నుండి బయటకు వచ్చే ప్రతీ మాట మీకు తెలుసు.
JER 17:17 నాకు భయాన్ని కలిగించకండి; ఆపద దినాన మీరే నాకు ఆశ్రయము.
JER 17:18 నన్ను హింసించేవారు అవమానించబడాలి, కాని అవమానపాలుకాకుండ నన్ను కాపాడండి. వారికి భయభ్రాంతులు కలగాలి, కాని నాకు భయభ్రాంతులు కలుగకుండా కాపాడండి. వారి మీదికి నాశన దినాన్ని రప్పించండి; రెట్టింపు విధ్వంసంతో వారిని నాశనం చేయండి.
JER 17:19 యెహోవా నాతో ఇలా అన్నారు: “నీవు వెళ్లి యూదా రాజులు వెళ్లే ప్రజల ద్వారం దగ్గర నిలబడు. యెరూషలేము యొక్క అన్ని ఇతర ద్వారాల దగ్గర కూడా నిలబడు.
JER 17:20 నీవు వారితో, ‘ఈ ద్వారాల గుండా వచ్చే యూదా రాజులారా, సర్వ యూదా ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ యెహోవా మాట వినండి.
JER 17:21 యెహోవా ఇలా అంటున్నారు: సబ్బాతు దినాన ఏ బరువులు మోయకుండా, వాటిని యెరూషలేము ద్వారాల గుండా తీసుకురాకుండా జాగ్రత్తపడండి.
JER 17:22 సబ్బాతు దినాన మీ ఇళ్ళ నుండి బరువులు తేకండి, ఏ పని చేయకండి, అయితే నేను మీ పూర్వికులకు ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలి.
JER 17:23 కాని వారు వినలేదు, పట్టించుకోలేదు; వారు మొండి వారై నా మాటలు వినలేదు, క్రమశిక్షణకు ప్రతిస్పందించలేదు.
JER 17:24 అయితే యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, మీరు నా మాటకు విధేయత చూపుతూ, సబ్బాతు దినాన ఈ పట్టణపు ద్వారాల గుండా ఎలాంటి బరువులు తీసుకురాకుండా, ఏ పని చేయకుండా సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే,
JER 17:25 దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులు తమ అధికారులతో కలిసి ఈ నగర ద్వారాల గుండా వస్తారు. వారు, వారి అధికారులు రథాల మీద, గుర్రాల మీద స్వారీ చేస్తూ, యూదా వారితో, యెరూషలేము నివాసులతో కలిసి వస్తారు, ఈ పట్టణం శాశ్వతంగా ఉంటుంది.
JER 17:26 యూదా పట్టణాల నుండి, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల నుండి, బెన్యామీను ప్రాంతం నుండి, పడమటి కొండ దిగువ ప్రదేశాల నుండి, కొండ ప్రదేశాల నుండి, దక్షిణ వైపు నుండి ప్రజలు దహనబలులను, బలులను, భోజనార్పణలను, ధూపద్రవ్యాలను, కృతజ్ఞతార్పణలను యెహోవా ఆలయానికి తీసుకువస్తారు.
JER 17:27 అయితే మీరు సబ్బాతు దినాన యెరూషలేము గుమ్మాల గుండా వస్తున్నప్పుడు ఎలాంటి బరువును మోస్తూ రాకుండ సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించడంలో మీరు నాకు విధేయత చూపితే సరి, లేకపోతే నేను యెరూషలేము గుమ్మాల్లో ఆర్పలేని అగ్నిని రప్పిస్తాను, అది దాని భవనాలను దహించివేస్తుంది.’ ”
JER 18:1 యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు:
JER 18:2 “నీవు లేచి, కుమ్మరి ఇంటికి వెళ్లు, అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని ఆదేశించింది.
JER 18:3 కాబట్టి నేను కుమ్మరి ఇంటికి వెళ్లాను, అక్కడ కుమ్మరి చక్రంపై పని చేయడం చూశాను.
JER 18:4 అయితే బంకమట్టితో చేస్తున్న కుండ అతని చేతిలో విడిపోయింది; అతడు దాన్ని మళ్ళీ ముద్ద చేసి తనకు ఇష్టమైన ఆకారంలో మరో కుండను చేశాడు.
JER 18:5 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది.
JER 18:6 ఆయన, “ఇశ్రాయేలూ, ఈ కుమ్మరి చేసినట్టు నేను నీకు చేయకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “కుమ్మరి చేతిలోని మట్టిలా, ఇశ్రాయేలూ, నీవు నా చేతిలో ఉన్నావు.
JER 18:7 ఏదైనా ఒక దేశాన్ని లేదా రాజ్యాన్ని పెళ్లగిస్తానని, కూల్చివేస్తానని, నాశనం చేస్తానని నేను ఎప్పుడైనా ప్రకటిస్తే,
JER 18:8 దానికి ఆ దేశం దాని చెడు గురించి పశ్చాత్తాపపడితే నేను జాలిపడి, పంపాలనుకున్న విపత్తును పంపకుండ నిలిపివేస్తాను.
JER 18:9 ఏదైనా ఒక దేశాన్ని గాని రాజ్యాన్ని గాని కడతానని, స్థిరపరుస్తానని నేను ప్రకటిస్తే,
JER 18:10 ఒకవేళ అది నా దృష్టిలో చెడు చేసి, నాకు లోబడకపోతే, నేను దానికి చేయాలని ఉద్దేశించిన మంచి చేయకుండా ఆపివేస్తాను.
JER 18:11 “కాబట్టి ఇప్పుడు యూదా ప్రజలతోను, యెరూషలేము నివాసులతోను ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: చూడండి! నేను మీ కోసం ఒక విపత్తును రప్పిస్తున్నాను, మీకు వ్యతిరేకంగా ఒక ఆలోచన చేస్తున్నాను. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తనను సరిచేసుకోండి.’
JER 18:12 అయితే వారంటారు, ‘మీరు చెప్పినా ప్రయోజనం లేదు. మేము మా ఆలోచనల ప్రకారమే నడుచుకుంటాం; మేమందరం మా దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరిస్తాము.’ ”
JER 18:13 కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నారు: “కన్యయైన ఇశ్రాయేలు అత్యంత ఘోరమైన పని చేసింది. ఇలాంటిది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? అన్ని దేశాలను అడిగి తెలుసుకోండి.
JER 18:14 లెబానోను మంచు దాని రాతి బండల నుండి ఎప్పుడైనా మాయమవుతుందా? సుదూర ప్రాంతాల నుండి వచ్చే దాని చల్లని జలాలు ప్రవహించడం ఆగిపోతాయా?
JER 18:15 అయినా నా ప్రజలు నన్ను మరచిపోయారు; పనికిమాలిన విగ్రహాలకు ధూపం వేస్తున్నారు, వాటివలన వారు తమ జీవితాల్లో తడబడ్డారు పురాతనమైన మార్గాలను వదిలిపెట్టి, సరిగా లేని అడ్డదారుల్లో నడవాలి అనుకున్నారు.
JER 18:16 వారి దేశం పాడైపోయి నిత్యం హేళన చేయబడేదిగా ఉంటుంది; దారిన వెళ్లేవారంతా నివ్వెరపోయి వారి తలలాడిస్తారు.
JER 18:17 తూర్పు గాలి చెదరగొట్టినట్లు, నేను వారి శత్రువుల ముందు వారిని చెదరగొడతాను; వారి మీదకు విపత్తు వచ్చిన రోజున నేను వారిపై దయ చూపను.”
JER 18:18 వారు, “రండి, యిర్మీయా మీద కుట్ర చేద్దాం; యాజకుడు ధర్మశాస్త్రాన్ని బోధించక మానడు, జ్ఞానులు సలహాలు ఇవ్వడం మానరు, ప్రవక్తలు వాక్కును ప్రకటింపక మానరు. కాబట్టి రండి, అతడు చెప్పేదేదీ పట్టించుకోకుండా మన మాటలతో అతనిపై దాడి చేద్దాం” అంటారు.
JER 18:19 యెహోవా, నా మాట వినండి; నాపై నేరాలు మోపేవారు చెప్పేది వినండి!
JER 18:20 మేలుకు ప్రతిగా కీడు చేయాలా? అయినా వారు నా కోసం గొయ్యి త్రవ్వారు. నేను నీ ఎదుట నిలబడి వారి మీది నుండి మీ కోపం తొలగించమని వారి పక్షాన నేను మిమ్మల్ని వేడుకున్నానని జ్ఞాపకం తెచ్చుకోండి.
JER 18:21 కాబట్టి వారి పిల్లలను కరువుకు అప్పగించండి; ఖడ్గానికి వారిని అప్పగించండి. వారి భార్యలు సంతానం లేనివారుగా, విధవరాండ్రుగా ఉండాలి; వారి మనుష్యులు చంపబడాలి, వారి యువకులు యుద్ధంలో కత్తివేటుతో చంపబడాలి.
JER 18:22 మీరు అకస్మాత్తుగా వారిపైకి దండెత్తే వారిని రప్పించినప్పుడు, వారి ఇళ్ళలో నుండి కేకలు వినబడాలి, ఎందుకంటే వారు నన్ను పట్టుకోవడానికి గొయ్యి త్రవ్వారు, నా పాదాలకు రహస్య ఉచ్చులు బిగించారు.
JER 18:23 అయితే యెహోవా, నన్ను చంపడానికి వారు పన్నిన కుట్రలన్నీ మీకు తెలుసు. వారి నేరాలను క్షమించకండి మీ దృష్టి నుండి వారి పాపాలను తుడిచివేయకండి. వారిని మీ ఎదుట కూలనివ్వండి; మీరు కోపంలో ఉన్నప్పుడే వారికి తగిన శాస్తి చేయండి.
JER 19:1 యెహోవా ఇలా అంటున్నారు: “వెళ్లి కుమ్మరి దగ్గర ఒక మట్టి పాత్ర కొను. నీతో పాటు ప్రజల పెద్దలను, యాజకులలో కొందరిని తీసుకుని,
JER 19:2 హర్సీతు ద్వారం దగ్గర ఉన్న బెన్ హిన్నోము లోయకు వెళ్లి అక్కడ నేను మీకు చెప్పే మాటలు ప్రకటిస్తూ,
JER 19:3 ఇలా చెప్పు, ‘యూదా రాజులారా, యెరూషలేము ప్రజలారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: వినండి! నేను ఈ స్థలం మీదికి ఒక విపత్తును తెచ్చి, దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేలా చేస్తాను.
JER 19:4 ఎందుకంటే వారు నన్ను విడిచిపెట్టి, ఈ స్థలాన్ని ఇతర దేవతల స్థలంగా చేశారు. వారికి గాని, వారి పూర్వికులకు గాని, యూదా రాజులకు గాని తెలియని దేవతలకు ధూపం వేసి, ఈ స్థలాన్ని నిర్దోషుల రక్తంతో నింపారు.
JER 19:5 వారు తమ పిల్లలను బయలుకు దహనబలులుగా అగ్నిలో కాల్చడానికి బయలుకు క్షేత్రాలను నిర్మించారు. అలా చేయమని నేను వారికి ఆజ్ఞాపించలేదు, కనీసం ప్రస్తావించలేదు, అసలు అది నా మనస్సులోకి కూడా రాలేదు.
JER 19:6 ప్రజలు ఇకపై ఈ ప్రదేశాన్ని తోఫెతు లేదా బెన్ హిన్నోము లోయ అని పిలువకుండా, వధ లోయ అని పిలిచే రోజులు రాబోతున్నాయి, కాబట్టి జాగ్రత్త వహించండి, అని యెహోవా హెచ్చరించారు.
JER 19:7 “ ‘ఈ స్థలంలో నేను యూదా, యెరూషలేము ప్రణాళికలను నాశనం చేస్తాను. వారిని చంపాలనుకునే శత్రువుల చేతిలో వారు కత్తివేటుకు గురయ్యేలా చేస్తాను, వారి శవాలను పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను.
JER 19:8 నేను ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను; దానిని భయానకంగా, ఎగతాళిగా చేస్తాను; దారిన వెళ్లేవారంతా నివ్వెరపోతారు, దాని గాయాలన్నిటిని చూసి అపహాస్యం చేస్తారు.
JER 19:9 వారు తమ కుమారుల, కుమార్తెల మాంసాన్ని తినేలా చేస్తాను, వారు ఒకరి మాంసాన్ని మరొకరు తింటారు, ఎందుకంటే వారి శత్రువులు వారిని నాశనం చేయడానికి వారిని పూర్తిగా ముట్టడిస్తారు.’
JER 19:10 “నీతో పాటు వచ్చినవారు చూస్తుండగానే ఆ కుండను పగలగొట్టి,
JER 19:11 వారితో ఇలా చెప్పు, ‘సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మరలా బాగుచేయడానికి వీలు లేకుండ ఈ కుమ్మరి కుండను పగలగొట్టినట్లు నేను ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని ధ్వంసం చేస్తాను. తోఫెతులో స్థలం లేకపోయేంతగా అక్కడే చనిపోయినవారిని పాతిపెడతారు.
JER 19:12 నేను ఈ ప్రదేశానికి, ఇక్కడ నివసించేవారికి ఇదే చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు. నేను ఈ పట్టణాన్ని తోఫెతులా చేస్తాను.
JER 19:13 యెరూషలేములోని ఇల్లు, యూదా రాజుల భవనాలు ఆ తోఫెతు స్థలంలా అపవిత్రం చేయబడతాయి. అన్ని ఇళ్ల మీద ప్రజలు ఆకాశ సైన్యాలకు ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించారు.’ ”
JER 19:14 ప్రవచించడానికి యెహోవా అతన్ని పంపిన తోఫెతు నుండి యిర్మీయా తిరిగివచ్చి యెహోవా ఆలయ ఆవరణంలో నిలబడ్డాడు.
JER 19:15 “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘వినండి! వారు మెడవంచని వారై నా మాటలు వినలేదు కాబట్టి నేను ఈ పట్టణం మీద దాని చుట్టుప్రక్కల గ్రామాలన్నిటి మీదికి నేను చెప్పిన ప్రతి విపత్తును తీసుకురాబోతున్నాను.’ ”
JER 20:1 యిర్మీయా ఈ విషయాలు ప్రవచించడం ఇమ్మేరు కుమారుడు, యాజకుడు, యెహోవా ఆలయానికి అధికారియైన పషూరు విని,
JER 20:2 అతడు యిర్మీయా ప్రవక్తను కొట్టించి, యెహోవా మందిరం దగ్గర బెన్యామీను ఎగువ ద్వారం దగ్గర ఉన్న కొయ్యకు బంధించాడు.
JER 20:3 మరుసటిరోజు, పషూరు అతన్ని కొయ్య నుండి విడిపించినప్పుడు, యిర్మీయా అతనితో, “నీకు యెహోవా ఇచ్చిన పేరు పషూరు కాదు, నీ పేరు మాగోర్-మిస్సాబీబు.
JER 20:4 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను నిన్ను నీకు, నీ స్నేహితులందరికీ భయంగా చేస్తాను; వారు తమ శత్రువుల ఖడ్గం చేత పడిపోవుట నీ కళ్లతో చూస్తావు. నేను యూదా ప్రజలందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతడు వారిని బబులోనుకు తీసుకెళ్తాడు, ఖడ్గంతో హతమారుస్తాడు.
JER 20:5 నేను ఈ పట్టణంలోని సంపాదనంతటిని అంటే దాని ఉత్పత్తులన్నిటినీ, విలువైన వస్తువులన్నిటినీ, యూదా రాజుల సంపదలన్నిటినీ వాళ్ల శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు దానిని దోచుకుని బబులోనుకు తీసుకెళ్తారు.
JER 20:6 పషూరు, నీవు, నీ ఇంట్లో నివసించే వారందరూ బబులోనుకు బందీలుగా వెళ్తారు. అక్కడ మీరు, మీ అబద్ధాల ప్రవచనాలతో మీరు మోసగించిన మీ స్నేహితులందరూ చనిపోయి పాతిపెట్టబడతారు.’ ”
JER 20:7 యెహోవా! మీరే నన్ను మోసగించావు, నేను లోబడ్డాను, మీరు నాకంటే బలవంతులు, మీరే గెలిచారు, రోజంతా అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు.
JER 20:8 నేను మాట్లాడినప్పుడెల్లా ఒకే ప్రవచనం వస్తుంది, హింస, నాశనం అంటూ ఎలుగెత్తి ప్రకటించవలసి వస్తుంది. యెహోవా మాట పలికినందుకు నాకు అవమానం, అపహాస్యం ఎదురయ్యాయి.
JER 20:9 “దేవుని పేరు నేనెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటించను” అని అనుకుంటే, అప్పుడది నా హృదయంలో అగ్నిలా మండుతుంది. నా ఎముకల్లో మూయబడిన అగ్ని! ఎంత కాలమని ఓర్చుకోను? విసుగొస్తుంది, చెప్పకుండా ఉండలేను.
JER 20:10 చాలామంది గుసగుసలాడడం విన్నాను, “అన్ని వైపుల భయం! అతన్ని ఖండించండి! అతన్ని ఖండిద్దాము.” నా స్నేహితులందరూ నేను జారిపడాలని చూస్తూ ఉన్నారు, “బహుశా అతడు మోసపోవచ్చు; అప్పుడు మనం అతనిపై విజయం సాధించి అతని మీద పగ తీర్చుకుందాము.”
JER 20:11 అయితే పరాక్రమంగల బలాఢ్యుడైన యెహోవా నాకు తోడు; కాబట్టి నన్ను హింసించేవారు నిలువలేక తడబడతారు, వారు అనుకున్నది సాధించే యుక్తి లేక అవమానపాలవుతారు; వారి అవమానం ఎన్నటికీ మరవబడదు.
JER 20:12 సైన్యాల యెహోవా! మీరు నీతిమంతులను పరీక్షిస్తారు, అంతరింద్రియాలను, హృదయాలను పరిశీలిస్తారు. నా వాదన మీకే అప్పగిస్తున్నాను, మీరు వారికి ఎలా ప్రతీకారం చేస్తారో నేను చూస్తాను.
JER 20:13 యెహోవాను కీర్తించండి! యెహోవాను స్తుతించండి! దుష్టుని బారి నుండి దరిద్రుని ప్రాణాన్ని ఆయనే విడిపిస్తారు.
JER 20:14 నేను పుట్టిన దినం శపితమవును గాక, నా తల్లి నన్ను కనిన దినం దీవించబడకపోవును గాక.
JER 20:15 “నీకు ఒక కుమారుడు పుట్టాడు!” అని నా తండ్రికి వార్త తెలియజేసి, అతనికి చాలా సంతోషం కలిగించిన వ్యక్తి శాపగ్రస్తుడగును గాక.
JER 20:16 యెహోవా దయ లేకుండా పడగొట్టిన పట్టణాల్లా ఆ వ్యక్తి ఉండును గాక. అతడు ఉదయాన్నే రోదనను, మధ్యాహ్నం యుద్ధఘోష వినును గాక.
JER 20:17 ఎందుకంటే అతడు నన్ను గర్భంలో చంపి, నా తల్లినే నాకు సమాధిగా ఉండేలా చేయలేదు, ఆమె గర్భం శాశ్వతంగా ఉండిపోయేలా చేయలేదు.
JER 20:18 కష్టాన్ని, దుఃఖాన్ని చూసి సిగ్గుతో నా దినాలు ముగించుకోవాలనా నేను గర్భం నుండి బయటకు వచ్చింది?
JER 21:1 సిద్కియా రాజు మల్కీయా కుమారుడైన పషూరు, మయశేయా కుమారుడు యాజకుడైన జెఫన్యా అనే ఇద్దరిని అతని దగ్గరకు పంపినప్పుడు, యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చింది. వారు వచ్చి, యిర్మీయాతో:
JER 21:2 “బబులోను రాజైన నెబుకద్నెజరు మనమీద దాడి చేస్తున్నాడు. అయితే అతడు మనల్ని విడిచివెళ్లేలా, యెహోవా గతంలో చేసినట్లుగా ఇప్పుడు కూడా ఏమైన అద్భుతాలు చేస్తారేమో, యెహోవా దగ్గర విచారణ చేయి” అని అడిగారు.
JER 21:3 అయితే యిర్మీయా వారితో, “సిద్కియాతో ఇలా చెప్పండి,
JER 21:4 ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు అని చెప్పండి: బబులోను రాజుతో ప్రాకారం బయట ఉన్న బబులోను వారితో పోరాడేందుకు మీరు ఉపయోగించే యుద్ధ ఆయుధాలను నేను మీ మీదికే త్రిప్పబోతున్నాను. నేను వాటిని ఈ పట్టణం లోపల పోగుచేయిస్తాను.
JER 21:5 స్వయంగా నేనే భయంకరమైన కోపంతో, మహా ఉగ్రతతో, నా చాపబడిన చేతితో, బలమైన బాహువుతో నీకు వ్యతిరేకంగా పోరాడతాను.
JER 21:6 ఈ పట్టణంలో నివసించే మనుష్యులను, మృగాలను నేను చంపుతాను. భయంకరమైన తెగులుతో వారు చస్తారు.
JER 21:7 ఆ తర్వాత, ఈ పట్టణంలో తెగులు, ఖడ్గం కరువు నుండి బయటపడిన యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను, ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతులకు, వారిని చంపాలనుకునే శత్రువుల చేతులకు అప్పగిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు. ఆ రాజు వారి మీద దయ, జాలి, కనికరం చూపించకుండ వారిని ఖడ్గంతో చంపుతాడు.’
JER 21:8 “ఇంకా, ప్రజలతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: చూడండి, నేను మీ ముందు జీవమార్గాన్ని, మరణమార్గాన్ని పెడుతున్నాను.
JER 21:9 ఈ పట్టణంలో ఉండబోయే వారు ఖడ్గం వల్ల గాని కరువు వల్ల గాని తెగులు వల్ల గాని చస్తారు. అయితే ఎవరైనా పట్టణం బయటకు వెళ్లి మీమీద దాడి చేస్తున్న బబులోనీయులకు లొంగిపోతే, వారు బ్రతుకుతారు; వారు తమ ప్రాణాలతో తప్పించుకుంటారు.
JER 21:10 నేను ఈ పట్టణానికి మేలు కాదు హాని చేయాలని నిశ్చయించుకున్నాను, కాని మేలు చేయాలని కాదు. ఈ పట్టణం బబులోను రాజు చేతికి అప్పగించబడుతుంది, అతడు దానిని అగ్నితో నాశనం చేస్తాడు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 21:11 “అంతేకాక, యూదా రాజకుటుంబంతో ఇలా చెప్పు, ‘యెహోవా మాట వినండి.
JER 21:12 దావీదు ఇంటివారలారా, యెహోవా మీతో ఇలా చెప్తున్నారు: “ ‘ప్రతి ఉదయం న్యాయం చేయండి; అణచివేసే వారి చేతి నుండి దోచుకోబడిన వానిని విడిపించండి, లేకపోతే మీరు చేసిన దుర్మార్గాన్ని బట్టి నా ఉగ్రత అగ్నిలా మండుతూ ఎవరూ ఆర్పలేనంతగా మిమ్మల్ని కాల్చివేస్తుంది.
JER 21:13 యెరూషలేమా, లోయకు ఎగువన రాతి పీఠభూమి మీద నివసించేదానా, “మా మీదికి ఎవరు రాగలరు? మా నివాసంలోకి ఎవరు ప్రవేశించగలరు?” అని నీవు అనుకుంటున్నావు, అని యెహోవా అంటున్నారు.
JER 21:14 నీ క్రియలకు తగినట్లు నేను నిన్ను శిక్షిస్తాను, నీ అడవుల్లో అగ్ని రాజబెడతాను అది నీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని కాల్చివేస్తుంది, అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
JER 22:1 యెహోవా ఇలా అంటున్నారు: “నీవు యూదారాజు యొక్క రాజభవనానికి వెళ్లి, అక్కడ ఈ సందేశాన్ని ప్రకటించు:
JER 22:2 ‘దావీదు సింహాసనం మీద ఆసీనుడైయున్న యూదా రాజైన మీకు, మీ అధికారులకు, ఈ ద్వారాల గుండా వచ్చే మీ ప్రజలకు, యెహోవా ప్రకటిస్తున్న మాట వినండి.
JER 22:3 యెహోవా ఇలా చెప్తున్నారు: నీతిన్యాయాల ప్రకారం చేయండి. అణచివేసే వారి చేతిలో నుండి దోపిడికి గురైన వారిని విడిపించండి. విదేశీయులకు, తండ్రిలేనివారికి, విధవరాండ్రకు ఎలాంటి అన్యాయం చేయవద్దు, హింసించవద్దు, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించవద్దు.
JER 22:4 ఎందుకంటే ఒకవేళ మీరు ఈ ఆజ్ఞలను పాటించడంలో జాగ్రత్త వహిస్తే, అప్పుడు దావీదు సింహాసనంపై కూర్చున్న రాజులు రథాలు, గుర్రాలపై స్వారీ చేస్తూ, వారి అధికారులు, వారి ప్రజలతో కలిసి ఈ రాజభవనం ద్వారాల గుండా వస్తారు.
JER 22:5 ఒకవేళ మీరు ఈ ఆజ్ఞలను పాటించకపోతే, నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ రాజభవనం శిథిలమవుతుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.”
JER 22:6 ఎందుకంటే యూదా రాజభవనం గురించి యెహోవా ఇలా అంటున్నారు: “నీవు నాకు గిలాదులా ఉన్నా, లెబానోను శిఖరంలా ఉన్నా, నిన్ను బంజరు భూమిలా, నివసించేవారు లేని పట్టణాల్లా చేస్తాను.
JER 22:7 నేను నీ మీదికి నాశనం చేసేవారిని పంపుతాను, వారు తమ ఆయుధాలతో నీ శ్రేష్ఠమైన దేవదారు దూలాలను నరికి వాటిని అగ్నిలో పడవేస్తారు.
JER 22:8 “అనేక దేశాల ప్రజలు ఈ పట్టణం గుండా వెళ్తూ, ‘యెహోవా ఈ గొప్ప పట్టణానికి ఎందుకు ఇలా చేశాడు?’ అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. యెహోవా ఈ గొప్ప పట్టణానికి ఎందుకు ఇలా చేశాడు?
JER 22:9 దానికి జవాబు: ‘ఎందుకంటే వారు తమ దేవుడైన యెహోవా నిబంధనను విడిచిపెట్టి, ఇతర దేవతలను ఆరాధించి సేవించారు.’ ”
JER 22:10 చనిపోయిన రాజు కోసం ఏడవవద్దు అతన్ని కోల్పోయినందుకు దుఃఖించవద్దు; దానికి బదులు, బందీలుగా కొనిపోబడినవారి కోసం తీవ్రంగా ఏడవండి, ఎందుకంటే వారు ఎప్పటికీ తిరిగి రారు, తన స్వదేశాన్ని మళ్ళీ చూడరు.
JER 22:11 తన తండ్రి తర్వాత యూదా రాజుగా ఆసీనుడైన యోషీయా కుమారుడైన షల్లూము గురించి యెహోవా ఇలా అంటున్నారు: “అతడు ఎప్పటికీ తిరిగి రాడు.
JER 22:12 వారు అతన్ని బందీగా తీసుకెళ్లిన చోటే అతడు చనిపోతాడు; అతడు మళ్ళీ ఈ దేశాన్ని చూడడు.”
JER 22:13 “అక్రమంతో తన రాజభవనాన్ని, అన్యాయంతో తన మేడగదులను కట్టించుకునే వారికి శ్రమ, ఏమి చెల్లించకుండ తన సొంత ప్రజలతో పని చేయించుకుని, వారి ప్రయాసానికి తగిన వేతనం ఇవ్వని వారికి శ్రమ.
JER 22:14 ‘నేను విశాలమైన పై గదులున్న గొప్ప రాజభవనాన్ని నిర్మించుకుంటాను’ అని అతడు అనుకుంటాడు. కాబట్టి దానికి పెద్ద కిటికీలు చేయించుకుని, దేవదారుతో పలకలు అతికి వాటికి ఎరుపురంగు పూసి అలంకరిస్తాడు.
JER 22:15 “ఎక్కువగా దేవదారు కలిగి ఉండడం అతడు నీతిని న్యాయాన్ని చేసినప్పుడు, నీ తండ్రికి అన్నపానాలు లేవా? అతడు సరియైనది, న్యాయమైనది చేశాడు, అతనికి అంతా బాగానే జరిగింది కదా.
JER 22:16 అతడు పేదలు, అవసరతలో ఉన్న వారి పక్షంగా వాదించాడు, కాబట్టి అంతా బాగానే జరిగింది. నన్ను తెలుసుకోవడం అంటే అదే కదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 22:17 “అయితే నీ కళ్లు, నీ హృదయం అన్యాయమైన సంపాదనపై, నిర్దోషుల రక్తాన్ని చిందించడంపై, అణచివేయడంపై, దోపిడీపై మాత్రమే దృష్టి పెట్టాయి.”
JER 22:18 కాబట్టి యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము గురించి యెహోవా ఇలా అంటున్నారు: “ ‘అయ్యో, నా సోదరా! అయ్యో, నా సోదరీ!’ అంటూ అతని గురించి వారు దుఃఖించరు, ‘అయ్యో, నా యజమానీ! అయ్యో, అతని వైభవమా!’ అంటూ వారు అతని గురించి దుఃఖించరు.
JER 22:19 అతడు యెరూషలేము గుమ్మాల బయటకు ఈడ్వబడి, అక్కడ విసిరివేయబడి ఒక గాడిదలా పాతిపెట్టబడతాడు.”
JER 22:20 “లెబానోనుకు వెళ్లి కేకవేయి, నీ స్వరం బాషానులో వినబడాలి, అబారీము నుండి కేకవేయి, ఎందుకంటే నీ స్నేహితులంతా నలగ్గొట్టబడ్డారు.
JER 22:21 నీవు క్షేమంగా ఉన్నావని భావించినప్పుడు నేను నిన్ను హెచ్చరించాను, కానీ ‘నేను వినను!’ అని నీవన్నావు, నీ చిన్నప్పటి నుండి ఇదే నీకు అలవాటు; నీవు నా మాటకు లోబడలేదు.
JER 22:22 గాలికి నీ కాపరులందరు కొట్టుకుపోతారు, నీ స్నేహితులను బందీలుగా తీసుకెళ్తారు. అప్పుడు నీ దుష్టత్వమంతటిని బట్టి నీవు సిగ్గుపడి అవమానానికి గురవుతావు.
JER 22:23 ‘లెబానోనులో’ నివసించే నీవు దేవదారు భవనాలలో గూడు కట్టుకుని ఉన్న నీవు, ప్రసవ వేదనలో ఉన్న స్త్రీకి కలిగే నొప్పిలాంటి నొప్పులు నీకు వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తావో!
JER 22:24 “నా జీవం తోడు” అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “యూదా రాజైన యెహోయాకీము కుమారుడవైన యెహోయాకీనూ, నీవు నా కుడిచేతి ముద్ర ఉంగరంగా ఉన్నా, నేను నిన్ను పీకేస్తాను.
JER 22:25 నిన్ను చంపాలనుకునే వారి చేతులకు, నీవు భయపడే బబులోను రాజైన నెబుకద్నెజరుకు, బబులోనీయుల చేతులకు నిన్ను అప్పగిస్తాను.
JER 22:26 నిన్ను, నీ కన్నతల్లినీ మరో దేశంలోకి విసిరివేస్తాను. అది నీ జన్మస్థలం కాదు, అక్కడే మీరు చస్తారు.
JER 22:27 తిరిగి రావాలని మీరెంతో ఆశిస్తారు, కాని ఇక్కడకు మీరు తిరిగి రారు.”
JER 22:28 ఈ యెహోయాకీను హేయమైన పగిలిన కుండ వంటివాడా, ఎవరూ కోరుకోని వస్తువా? అతడు అతని పిల్లలు విసిరివేయబడి, వారికి తెలియని దేశంలోకి త్రోసివేయబడతారు?
JER 22:29 ఓ దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినండి!
JER 22:30 యెహోవా చెప్పేదేమిటంటే, “అతడు సంతానం లేనివాడని, తన జీవితకాలంలో వృద్ధిచెందలేడని అతని గురించి వ్రాయండి, అతని సంతానంలో ఎవరూ వర్ధిల్లరు, దావీదు సింహాసనం మీద ఎవరూ కూర్చోరు, యూదాలో ఇకపై పరిపాలన చేయరు.”
JER 23:1 “నా పచ్చిక బయళ్లలోని గొర్రెలను నాశనం చేసి చెదరగొట్టే కాపరులకు శ్రమ!” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 23:2 కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలను మేపుతున్న గొర్రెల కాపరులతో ఇలా అంటున్నారు: “మీరు నా మందను చెదరగొట్టి వాటిని తరిమివేసి వాటిని పట్టించుకోనందున, మీరు చేసిన దుర్మార్గానికి నేను మీకు శిక్ష విధిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 23:3 “నేను వాటిని తరిమికొట్టిన దేశాలన్నిటిలో నుండి నా మందలో మిగిలిన వాటిని నేనే పోగుచేసి, వాటి పచ్చిక బయళ్లకు తిరిగి వాటిని తీసుకువస్తాను, అక్కడ అవి ఫలించి వృద్ధిచెందుతాయి.
JER 23:4 వాటిని మేపడానికి నేను గొర్రెల కాపరులను నియమిస్తాను, అవి ఇకపై భయపడవు, బెదిరిపోవు, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 23:5 “రాబోయే రోజుల్లో, నేను దావీదుకు నీతి అనే చిగురును పుట్టిస్తాను, జ్ఞానయుక్తంగా పరిపాలించే రాజు, దేశంలో నీతి న్యాయాలు జరిగించేవాన్ని” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 23:6 అతని పరిపాలనలో యూదాకు కాపుదల ఉంటుంది ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తుంది. యెహోవా మన నీతిమంతుడైన రక్షకుడు అని పిలువబడతాడు.
JER 23:7 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో, ఇకపై ప్రజలు, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట అని చెప్పరు’
JER 23:8 అయితే, ‘ఇశ్రాయేలీయుల సంతానాన్ని ఉత్తర దేశంలో నుండి, ఆయన వారిని బహిష్కరించిన అన్ని దేశాల నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట’ అని వారు చెప్తారు. అప్పుడు వారు వారి స్వదేశంలో నివసిస్తారు.”
JER 23:9 ప్రవక్తల గురించి: యెహోవాను బట్టి ఆయన మాట్లాడిన మాటలనుబట్టి నా హృదయం నాలో పగిలిపోయింది; నా ఎముకలన్నీ వణుకుతున్నాయి. త్రాగిన మత్తులో ఉన్నవాడిలా, ద్రాక్షరసానికి లొంగిపోయిన బలవంతునిలా ఉన్నాను,
JER 23:10 దేశమంతా వ్యభిచారులతో నిండిపోయింది; శాపం కారణంగా భూమి ఎండిపోయింది అరణ్యంలో పచ్చికబయళ్లు ఎండిపోయాయి. ప్రవక్తలు చెడు మార్గం అనుసరిస్తారు తమ అధికారాన్ని అన్యాయంగా ఉపయోగిస్తారు.
JER 23:11 “ప్రవక్త యాజకుడు ఇద్దరూ భక్తిహీనులే; నా మందిరంలో కూడా వారి దుర్మార్గాన్ని నేను చూస్తున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 23:12 “కాబట్టి వారి దారి జారే నేలలా అవుతుంది; వారు చీకటిలోకి వెళ్లగొట్టబడతారు అక్కడ వారు పడిపోతారు. వారు శిక్షించబడే సంవత్సరంలో నేను వారి మీదికి విపత్తు రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 23:13 “సమరయ ప్రవక్తల్లో నేను ఇలాంటి అసహ్యకరమైన దాన్ని చూశాను: వారు బయలు పేరిట ప్రవచించి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను తప్పుదారి పట్టించారు.
JER 23:14 యెరూషలేము ప్రవక్తల్లో భయంకరమైనది నేను చూశాను: వారు వ్యభిచారం చేస్తారు, అబద్ధాలతో జీవిస్తారు. వారు దుర్మార్గుల చేతులను బలపరుస్తారు, వారిలో ఒక్కరు కూడా తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టరు. వారందరూ నాకు సొదొమలాంటివారు; యెరూషలేము ప్రజలు గొమొర్రా వంటివారు.”
JER 23:15 కాబట్టి సైన్యాల యెహోవా ప్రవక్తలను గురించి ఇలా అంటున్నారు: “నేను వారిని చేదు ఆహారం తినేలా చేస్తాను, విషపూరితమైన నీళ్లు త్రాగేలా చేస్తాను, ఎందుకంటే యెరూషలేము ప్రవక్తల భక్తిహీనత దేశమంతటా వ్యాపించింది.”
JER 23:16 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ప్రవక్తలు మీకు చెప్పే ప్రవచనాలను వినవద్దు; అవి మిమ్మల్ని భ్రమ పెడతాయి. వారి సొంత మనస్సులోని దర్శనాలు చెప్తారు, కాని యెహోవా నోటి నుండి వచ్చినవి కాదు.
JER 23:17 ‘మీకు సమాధానం కలుగుతుంది యెహోవా చెప్తున్నారు’ అని నన్ను తృణీకరించే వారితో అంటారు. ‘మీకు హాని జరగదు’ అని వారు హృదయ కాఠిన్యం గలవారితో అంటారు.
JER 23:18 అయితే ఆయనను చూడడానికి, ఆయన మాట వినడానికి వారిలో ఎవరు యెహోవా సభలో నిలబడి ఉన్నారు? ఆయన మాటను ఎవరు విన్నారు ఎవరు ఆలకించారు?
JER 23:19 చూడండి, యెహోవా ఉగ్రత తుఫానులా విరుచుకుపడుతుంది, అది సుడిగాలిలా దుష్టుల తలలపైకి దూసుకెళ్తుంది.
JER 23:20 యెహోవా తన హృదయ ఉద్దేశాలను పూర్తిగా నెరవేర్చే వరకు ఆయన కోపం తగ్గదు. ఈ విషయాన్ని రాబోయే రోజుల్లో మీరు స్పష్టంగా గ్రహిస్తారు.
JER 23:21 నేను ఈ ప్రవక్తలను పంపలేదు, అయినాసరే వారు తమ సొంత సందేశంతో పరుగెత్తుకు వచ్చారు; నేను వారితో మాట్లాడలేదు, అయినాసరే వారు ప్రవచించారు.
JER 23:22 కానీ ఒకవేళ వారు నా సభలో నిలబడి ఉంటే, వారు నా ప్రజలకు నా మాటలు ప్రకటించి వారి చెడు మార్గాల నుండి వారి చెడు పనుల నుండి వారిని తప్పించి ఉండేవారు.
JER 23:23 “నేను దగ్గరగా ఉంటేనే దేవుణ్ణా, దూరంగా ఉంటే నేను దేవున్ని కానా? అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 23:24 నాకు కనబడకుండ ఎవరైనా రహస్య ప్రదేశాల్లో దాచుకోగలరా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను ఆకాశంలో భూమి మీద అంతటా లేనా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 23:25 “నా పేరిట అబద్ధాలు చెప్పే ప్రవక్తలు చెప్పేది నేను విన్నాను. వారు, ‘నాకొక కల వచ్చింది! నాకొక కల వచ్చింది!’ అని అంటారు.
JER 23:26 తమ మనస్సులోని భ్రమలను ప్రవచించే ఈ అబద్ధాల ప్రవక్తల హృదయాల్లో ఇలా ఎంతకాలం కొనసాగుతుంది?
JER 23:27 తమ పూర్వికులు బయలును ఆరాధించి నా పేరును మరచిపోయినట్లే, వీరు ఒకరికొకరు చెప్పుకునే కలలు నా ప్రజలు నా పేరును మరచిపోయేలా చేస్తాయని వీరు అనుకుంటున్నారు.
JER 23:28 కలలు కనే ప్రవక్తలు వారి కలలను చెప్పవచ్చు, నా సందేశాన్ని పొందుకున్న వారు ఆ సందేశాన్ని నమ్మకంగా చెప్పవచ్చు. పొట్టుకు ధాన్యంతో ఏమి సంబంధం?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 23:29 “నా మాట అగ్నిలాంటిది కాదా, బండను ముక్కలు చేసే సుత్తిలాంటిది కాదా? అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 23:30 “కాబట్టి,” యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఒకరి నుండి నా మాటలను దొంగిలించే ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.
JER 23:31 అవును” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “తమ నాలుకలతో తమ స్వంత మాటలు మాట్లాడుతూ ‘యెహోవా ప్రకటిస్తున్నారు’ అనే చెప్పే ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.
JER 23:32 నిజానికి, తప్పుడు కలలను ప్రవచించే వారికి నేను వ్యతిరేకిని” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “వారు తమ మోసపూరితమైన అబద్ధాలతో నా ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తారు, నేను వారిని పంపలేదు వారిని నియమించలేదు. వారి వల్ల ఈ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 23:33 “ఈ ప్రజలు గాని ఒక ప్రవక్త గాని యాజకుడు గాని, ‘యెహోవా నుండి ఏం సందేశం వచ్చింది?’ అని నిన్ను అడిగినప్పుడు, ‘ఏ సందేశం? నేను మిమ్మల్ని విడిచిపెడతాను అని యెహోవా చెప్తున్నారు’ అని చెప్పు.
JER 23:34 ఒకవేళ ప్రవక్త గాని యాజకుడు గాని లేదా ఇంకెవరైనా, ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని చెప్పినట్లయితే, నేను వారిని వారి ఇంటివారిని శిక్షిస్తాను.
JER 23:35 మీరు మీ స్నేహితులతో ఇతర ఇశ్రాయేలీయులతో, ‘యెహోవా జవాబేంటి? యెహోవా ఏమి చెప్పారు?’ అని అనాలి.
JER 23:36 కానీ మీరు ‘యెహోవా సందేశం’ అని చెప్పకూడదు, ఎందుకంటే ఎవరి మాట వారికి సందేశం అవుతుంది. మీరు సజీవుడైన దేవుని మాటలను, మన దేవుడైన సైన్యాల యెహోవా మాటలను తారుమారు చేశారు.
JER 23:37 మీరు ప్రవక్తతో ఇలా చెప్పాలి: ‘యెహోవా నీకు ఇచ్చిన జవాబేంటి? యెహోవా ఏమి చెప్పారు?’
JER 23:38 ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని మీరు చెబితే, యెహోవా ఇలా చెప్తున్నారు: ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని మీరు చెప్పకూడదని నేను మీతో చెప్పినా సరే, ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని మీరు చెప్పారు.
JER 23:39 కాబట్టి, నేను మిమ్మల్ని పూర్తిగా మరచిపోతాను, నేను మీకు మీ పూర్వికులకు ఇచ్చిన పట్టణంతో పాటు మిమ్మల్ని నా సన్నిధిలో నుండి వెళ్లగొడతాను.
JER 23:40 నేను నీ మీదికి ఎన్నటికీ మరచిపోలేని శాశ్వతమైన అవమానాన్ని రప్పిస్తాను.”
JER 24:1 యూదారాజు యెహోయాకీము కుమారుడైన యెహోయాకీనును, అధికారులను, నైపుణ్యం కలిగిన పనివారిని, యూదా కళాకారులను బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకెళ్లిన తర్వాత, యెహోవా మందిరం ముందున్న రెండు బుట్టల అంజూర పండ్లు యెహోవా నాకు చూపించారు.
JER 24:2 యెహోవా మందిరం ముందున్న రెండు బుట్టల అంజూర పండ్లు యెహోవా నాకు చూపించారు.
JER 24:3 అప్పుడు యెహోవా నన్ను, “యిర్మీయా, నీకు ఏమి కనిపిస్తుంది?” అని అడిగారు. “అంజూర పండ్లు, వాటిలో మంచివి చాలా బాగున్నాయి, కానీ చెడిపోయిన బాగా కుళ్లిపోయిన వాటిని మాత్రం తినలేము” అని నేను జవాబిచ్చాను.
JER 24:4 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
JER 24:5 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా నుండి దూరంగా బబులోనీయుల దేశానికి బందీలుగా పంపిన వారిని నేను ఈ మంచి అంజూర పండ్లలా భావిస్తున్నాను.
JER 24:6 వారికి మేలు కలిగేలా వారిపై నా దృష్టి పెడతాను. వారిని మళ్ళీ ఈ దేశానికి రప్పిస్తాను. నేను వారిని కడతాను, కూల్చివేయను; నాటుతాను, పెరికివేయను.
JER 24:7 నేనే యెహోవానని నన్ను తెలుసుకునే హృదయాన్ని వారికి ఇస్తాను. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారి దేవుడనై ఉంటాను, ఎందుకంటే వారు తమ పూర్ణహృదయంతో నా దగ్గరకు తిరిగి వస్తారు.
JER 24:8 “ ‘అయితే, నేను యూదా రాజైన సిద్కియాకు, అతని అధికారులకు, యెరూషలేములో మిగిలిన వారికి ఈజిప్టులో నివసిస్తున్న వారికి తినలేనంతగా పాడైన అంజూర పండ్లకు చేసినట్టు చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 24:9 నేను వారిని చెదరగొట్టిన అన్ని భూరాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా, అభ్యంతరకరమైన వారిగా నిందగా, ఒక సామెతగా, ఒక శాపంగా, హేళనకు కారణంగా చేస్తాను.
JER 24:10 నేను వారికి, వారి పూర్వికులకు ఇచ్చిన దేశంలో నుండి వారు పూర్తిగా నాశనమయ్యే వరకు నేను వారి మీదికి ఖడ్గాన్ని కరువును తెగులును పంపుతాను.’ ”
JER 25:1 యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి నాల్గవ సంవత్సరంలో అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి మొదటి సంవత్సరంలో యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది.
JER 25:2 కాబట్టి యిర్మీయా ప్రవక్త యూదా ప్రజలందరితో, యెరూషలేములో నివసిస్తున్న వారందరితో ఇలా అన్నాడు:
JER 25:3 యూదా రాజైన ఆమోను కుమారుడైన యోషీయా పాలనలో పదమూడవ సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఇరవై మూడు సంవత్సరాలు యెహోవా వాక్కు నాకు వస్తూ ఉండింది. నేను మీతో పదే పదే మాట్లాడాను కానీ మీరు వినలేదు.
JER 25:4 యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరినీ మీ దగ్గరకు మళ్ళీ మళ్ళీ పంపినా మీరు వినలేదు లేదా పట్టించుకోలేదు.
JER 25:5 వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరు మీ చెడు మార్గాలను, మీ చెడు ఆచారాలను ఇప్పటికైనా విడిచిపెట్టండి, యెహోవా మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు శాశ్వతంగా ఉండగలరు.
JER 25:6 ఇతర దేవుళ్ళ విగ్రహాలను మీరు సేవించవద్దు, పూజించవద్దు, వాటిని అనుసరించవద్దు; మీ చేతిపనుల వలన మీరు నాకు కోపం రేపవద్దు; అప్పుడు నేను మీకు హాని చేయను” అని చెప్పారు.
JER 25:7 “కాని మీరు నా మాట వినలేదు, మీ చేతులు చేసిన వాటితో మీరు నా కోపాన్ని రేపి, మీకే హాని తెచ్చుకున్నారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 25:8 కాబట్టి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీరు నా మాటలు వినలేదు కాబట్టి,
JER 25:9 నేను ఉత్తరాది జనాంగాలను, నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును పిలిపిస్తాను” అని యెహోవా అంటున్నారు. నేను వారిని ఈ దేశం మీదికి, దాని నివాసుల మీదికి, చుట్టుప్రక్కల ఉన్న అన్ని దేశాల మీదికి తీసుకువస్తాను. నేను ఈ ప్రజలను పూర్తిగా నాశనం చేస్తాను. వారిని భయానకంగా, హేళనగా శాశ్వతమైన నాశనంగా చేస్తాను.
JER 25:10 నేను సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను, తిరుగటిరాళ్ల శబ్దాన్ని దీపపు వెలుగును వారి నుండి దూరం చేస్తాను.
JER 25:11 ఈ దేశమంతా నిర్జనమైన బంజరుగా మారుతుంది, ఈ దేశాలు డెబ్బై సంవత్సరాలు బబులోను రాజుకు సేవ చేస్తాయి.
JER 25:12 “అయితే డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను బబులోను రాజును, అతని ప్రజలను, బబులోనీయుల దేశాన్ని వారి దోషాన్ని బట్టి శిక్షిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “దానిని శాశ్వతంగా నిర్జనం చేస్తాను.
JER 25:13 నేను ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాటన్నిటిని, ఈ పుస్తకంలో వ్రాసి ఉన్నవాటన్నిటిని, యిర్మీయా ప్రవచించిన ప్రకారం ఆ దేశం మీదికి రప్పిస్తాను.
JER 25:14 వారే అనేక దేశాలకు, గొప్ప రాజులకు బానిసలుగా ఉంటారు; వారి క్రియలనుబట్టి వారి చేతి పనులను బట్టి నేను వారికి ప్రతిఫలమిస్తాను.”
JER 25:15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “నా ఉగ్రత అనే ద్రాక్షరసంతో నిండిన ఈ గిన్నెను నా చేతిలో నుండి తీసివేసి, నేను నిన్ను పంపే దేశాలన్నిటిని త్రాగనివ్వు.
JER 25:16 వారు దానిని త్రాగినప్పుడు, నేను వారి మధ్యకు పంపబోయే ఖడ్గాన్ని చూసి వారు తడబడి పిచ్చివారైపోతారు.”
JER 25:17 కాబట్టి నేను యెహోవా చేతిలో నుండి గిన్నె తీసుకుని, ఆయన నన్ను పంపిన దేశాలన్నిటిని త్రాగేలా చేశాను:
JER 25:18 అవి నేడు ఉన్నట్లుగా నాశనం చేయడానికి వాటిని నిర్జనంగా ఎగతాళిగా ఒక శాపంగా మార్చడానికి యెరూషలేముకు, యూదా పట్టణాలకు, దాని రాజులకు అధికారులకు దానిని త్రాగించాను;
JER 25:19 ఈజిప్టు రాజు ఫరో, అతని పరిచారకులు, అధికారులు, అతని ప్రజలందరూ,
JER 25:20 అక్కడున్న విదేశీయులందరు అనగా ఊజు రాజులందరూ; ఫిలిష్తీయ పట్టణాలైన అష్కెలోను, గాజా, ఎక్రోను రాజులందరూ అష్డోదులో మిగిలిన ప్రజలు;
JER 25:21 ఎదోము, మోయాబు, అమ్మోను;
JER 25:22 తూరు సీదోను రాజులందరూ; సముద్ర తీర ప్రాంతాల రాజులు;
JER 25:23 దేదాను, తేమా, బూజీయులు దూర ప్రాంతాల్లో ఉన్నవారందరు;
JER 25:24 అరేబియా రాజులందరూ అరణ్యంలో నివసించే పరదేశి ప్రజల రాజులందరూ;
JER 25:25 జిమ్రీ, ఏలాము, మాదీయుల రాజులందరూ;
JER 25:26 ఉత్తరాన ఉన్న రాజులందరూ, సమీపంలో దూరంగా, ఒకదాని తర్వాత ఒకటి భూమిపై ఉన్న అన్ని రాజ్యాలు త్రాగుతారు. వారందరి తర్వాత షేషకు రాజు కూడా దానిని త్రాగుతాడు.
JER 25:27 “అప్పుడు వారితో, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ మధ్యకు పంపే ఖడ్గాన్ని బట్టి ఇకపై లేవకుండా పడిపోండి, త్రాగండి, త్రాగి వాంతులు చేసుకోండి.’
JER 25:28 అయితే వారు మీ చేతిలో నుండి పాత్ర తీసుకుని త్రాగడానికి నిరాకరిస్తే, నీవు వారితో ఇలా చెప్పు, ‘మీరు దీన్ని త్రాగాలి అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
JER 25:29 ఇదిగో, నా పేరు ఉన్న పట్టణం మీదికి నేను విపత్తు రప్పించబోతున్నాను, మీరు నిజంగా శిక్షించబడరా? మీరు శిక్షించబడకుండా ఉండరు, ఎందుకంటే నేను భూమిపై నివసించే వారందరిపై ఖడ్గాన్ని రప్పిస్తున్నాను, అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.’
JER 25:30 “ఇప్పుడు నీవు వారికి ఈ మాటలన్నీ ప్రవచించి వారితో ఇలా చెప్పు: “ ‘యెహోవా పైనుండి గర్జిస్తారు; ఆయన తన పవిత్ర నివాసం నుండి ఉరుముతారు; ఈ దేశానికి వ్యతిరేకంగా బలంగా గర్జిస్తారు. ద్రాక్షపండ్లను త్రొక్కేవారి మీద ఆయన గట్టిగా అరుస్తారు, భూమిపై నివసించే వారందరికి వ్యతిరేకంగా కేకలు వేస్తారు.
JER 25:31 భూదిగంతముల వరకు ఆ సందడి ప్రతిధ్వనిస్తుంది, ఎందుకంటే యెహోవా దేశాల మీద ఆరోపణలు చేస్తాడు; అతడు సమస్త మానవాళికి తీర్పు తెచ్చి, దుర్మార్గులను ఖడ్గానికి గురి చేస్తాడు’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 25:32 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ఇదిగో! దేశం నుండి దేశానికి విపత్తు విస్తరిస్తుంది; పెను తుఫాను భూమి అంచుల నుండి ఎగసిపడుతుంది.”
JER 25:33 ఆ సమయంలో యెహోవాచేత చంపబడినవారు భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు ప్రతిచోటా ఉంటారు. వారి కోసం ఎవరూ దుఃఖించరు, వారి మృతదేహాలను సేకరించి పాతిపెట్టరు, అవి నేలమీద పెంటలా పడి ఉంటాయి.
JER 25:34 కాపరులారా, ఏడవండి రోదించండి; మంద నాయకులారా, దుమ్ములో దొర్లండి. ఎందుకంటే మీరు వధించబడే సమయం ఆసన్నమైంది; మీరు శ్రేష్ఠమైన పొట్టేళ్లలా పడిపోతారు.
JER 25:35 గొర్రెల కాపరులకు పారిపోవడానికి చోటు ఉండదు, మందలోని నాయకులు తప్పించుకోవడానికి స్థలం ఉండదు.
JER 25:36 గొర్రెల కాపరుల మొర, మంద నాయకుల ఏడ్పులు వినబడుతున్నాయి, యెహోవా వారి పచ్చికను నాశనం చేస్తున్నారు.
JER 25:37 నెమ్మదిగల పచ్చికభూములు యెహోవా కోపాగ్నికి పాడవుతాయి.
JER 25:38 సింహం తన గుహలో నుంచి వచ్చినట్లు ఆయన వస్తారు, అణచివేసే వారి ఖడ్గం కారణంగా యెహోవా తీవ్రమైన కోపం కారణంగా వారి భూమి నిర్జనమైపోతుంది.
JER 26:1 యూదారాజు యోషీయా కుమారుడైన యెహోయాకీము పరిపాలన ప్రారంభంలో, యెహోవా నుండి ఈ మాట వచ్చింది:
JER 26:2 “యెహోవా ఇలా అంటున్నారు: యెహోవా ఆలయ ఆవరణలో నిలబడి, యూదా పట్టణాల నుండి యెహోవా మందిరంలో ఆరాధించడానికి వచ్చే ప్రజలందరితో మాట్లాడు. ఒక్క మాట కూడా వదలకుండ నేను నీకు ఆజ్ఞాపిస్తున్నదంతా వారికి చెప్పు.
JER 26:3 బహుశా వారు విని తమ చెడు మార్గాలను విడిచిపెట్టవచ్చు. అప్పుడు నేను నా మనస్సు మార్చుకుని వారి దుర్మార్గాన్ని బట్టి నేను వారి మీదికి రప్పించాలనుకున్న విపత్తును రప్పించను.
JER 26:4 వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు నా మాట వినకపోయినా, నేను మీ ముందు ఉంచిన నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినా,
JER 26:5 పదే పదే నేను మీ దగ్గరకు పంపిన నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోయినా,
JER 26:6 నేను ఈ మందిరానికి షిలోహుకు చేసినట్లు చేస్తాను, ఈ పట్టణాన్ని భూమ్మీద ఉన్న అన్ని దేశాల్లో ఒక శాపంగా చేస్తాను.’ ”
JER 26:7 యిర్మీయా యెహోవా మందిరంలో ఈ మాటలు మాట్లాడడం యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ విన్నారు.
JER 26:8 అయితే చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించినవన్నీ యిర్మీయా ప్రజలందరికి చెప్పడం ముగించిన వెంటనే యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ అతన్ని పట్టుకుని, “నీవు తప్పక చావాల్సిందే!
JER 26:9 ఈ మందిరం షిలోహులా అవుతుందని, ఈ పట్టణం నిర్జనమై ఎడారిగా అవుతుందని నీవు యెహోవా నామంలో ఎందుకు ప్రవచిస్తున్నావు?” అని అంటూ ప్రజలంతా యిర్మీయా యెహోవా మందిరంలో ఉండగానే అతని చుట్టూ గుమిగూడారు.
JER 26:10 ఈ సంగతుల గురించి యూదా అధికారులు విన్నప్పుడు, వారు రాజభవనం నుండి యెహోవా ఆలయానికి వెళ్లి యెహోవా ఆలయ క్రొత్త గుమ్మం దగ్గర కూర్చున్నారు.
JER 26:11 అప్పుడు యాజకులు, ప్రవక్తలు అధికారులతో, ప్రజలందరితో, “ఈ వ్యక్తి ఈ పట్టణానికి వ్యతిరేకంగా ప్రవచించాడు, అది మీ చెవులతో మీరే విన్నారు. కాబట్టి ఇతనికి మరణశిక్ష విధించాలి” అని అన్నారు.
JER 26:12 అప్పుడు యిర్మీయా అధికారులందరితోను, అలాగే ప్రజలందరితోను ఇలా చెప్పారు: “మీరు విన్నదంతా ఈ ఆలయానికి, ఈ పట్టణానికి వ్యతిరేకంగా ప్రవచించడానికి యెహోవాయే నన్ను పంపించారు.
JER 26:13 మీ మార్గాలను, క్రియలను, సరిచేసికొని, మీ దేవుడైన యెహోవాకు లోబడండి. అప్పుడు యెహోవా తన మనస్సు మార్చుకుని, మీ మీదికి రప్పిస్తానని ఆయన ప్రకటించిన విపత్తును ఆయన రప్పించరు.
JER 26:14 ఇక నా విషయానికొస్తే, నేను మీ చేతుల్లో ఉన్నాను; మీకు ఏది మంచిది, సరియైనది అనిపిస్తే అదే చేయండి.
JER 26:15 కాని ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఒకవేళ మీరు నన్ను చంపితే, నిర్దోషిని చంపిన అపరాధం మీ మీదికి, ఈ పట్టణం మీదికి, అందులో నివసించేవారి మీదికి తెచ్చిన వారవుతారు. ఎందుకంటే ఈ మాటలన్నీ మీకు వినబడేలా చెప్పడానికి నిజంగా యెహోవాయే నన్ను మీ దగ్గరికి పంపారు.”
JER 26:16 అప్పుడు అధికారులు, ప్రజలందరూ యాజకులతో ప్రవక్తలతో ఇలా అన్నారు, “ఇదంతా ఇతడు మన దేవుడైన యెహోవా నామంలో మనతో చెప్పాడు కాబట్టి ఇతనికి మరణశిక్ష విధించకూడదు!” అన్నారు.
JER 26:17 అప్పుడు ఆ దేశంలోని పెద్దలలో కొందరు ముందుకు వచ్చి, ప్రజల సమాజమంతటితో ఇలా అన్నారు,
JER 26:18 “మోరెషెతు వాడైన మీకా ప్రవక్త యూదా రాజైన హిజ్కియా దినాల్లో ప్రవచించాడు. అతడు యూదా ప్రజలందరితో ఇలా చెప్పాడు, ‘సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది, ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో నిండిపోతుంది.’
JER 26:19 “మరి యూదా రాజైన హిజ్కియా గాని, యూదా దేశస్థుడు ఎవడైనా గాని, ఆ ప్రవక్తను చంపారా? ఆ రాజైన హిజ్కియా భయభక్తులతో యెహోవా దయ కోసం ప్రార్ధన చేశాడు గదా! యెహోవా మనస్సు మార్చుకుని, వారి మీదికి రప్పించవలసిన కీడును ఆపివేయలేదా? మనకు మనమే మన మీదికి భయంకరమైన విపత్తు తెచ్చుకోబోతున్నాం!”
JER 26:20 (అదే సమయంలో కిర్యత్-యారీము వాడైన షెమయా కుమారుడైన ఊరియా అనే మరొక వ్యక్తి యెహోవా నామమున ప్రవచించాడు; అతడు కూడా యిర్మీయా ప్రవచించినట్లే ఈ పట్టణానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రవచించాడు.
JER 26:21 రాజైన యెహోయాకీము, అతని అధికారులు, ముఖ్యులందరూ అతని మాటలు విన్నప్పుడు, రాజు అతన్ని చంపాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఊరియా అది విని భయపడి ఈజిప్టుకు పారిపోయాడు.
JER 26:22 అయితే రాజైన యెహోయాకీము, అక్బోరు కుమారుడైన ఎల్నాతానును మరికొందరు వ్యక్తులతో పాటు ఈజిప్టుకు పంపాడు.
JER 26:23 వారు ఊరియాను ఈజిప్టు నుండి రాజైన యెహోయాకీము దగ్గరకు తీసుకురాగా, రాజు అతడిని ఖడ్గంతో చంపి అతని దేహాన్ని సామాన్య ప్రజల సమాధి స్థలంలోకి విసిరివేశాడు.)
JER 26:24 ఇంకా, షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు అండగా నిలబడ్డాడు, కాబట్టి యిర్మీయాను చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.
JER 27:1 యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడిలో, యెహోవా నుండి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది:
JER 27:2 యెహోవా నాతో ఇలా అన్నారు: “సంకెళ్లు ఒక కాడిని తయారుచేసి నీ మెడ మీద పెట్టుకో.
JER 27:3 యూదా రాజైన సిద్కియా దగ్గరకు యెరూషలేముకు వచ్చిన రాయబారులతో ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను రాజులకు కబురు పంపించు.
JER 27:4 తమ యజమానుల తెలియజేయమని వారికి ఈ సందేశం ఇవ్వు, ‘ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీరు మీ యజమానులకు ఇలా చెప్పండి:
JER 27:5 నా గొప్ప శక్తితో చాచిన బాహువుతో నేను భూమిని, దాని ప్రజలను దానిపై ఉన్న జంతువులను సృష్టించాను. నేను ఎవరు సరైన వారనుకుంటే వారికి దానిని ఇస్తాను.
JER 27:6 ఇప్పుడు నేను నీ దేశాలన్నిటిని నా సేవకుడు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాను; అడవి జంతువులను కూడా అతనికి లోబడి చేస్తాను.
JER 27:7 అతని దేశానికి అంతం వచ్చేవరకు అన్ని దేశాలు అతనికి, అతని కుమారునికి, మనుమడికి సేవ చేస్తారు; అప్పుడు అనేక దేశాలు, గొప్ప రాజులు అతన్ని లొంగదీసుకుంటారు.
JER 27:8 “ ‘ “అయితే, ఏదైనా దేశం గాని రాజ్యం గాని బబులోను రాజైన నెబుకద్నెజరుకు సేవ చేయకపోయినా అతని కాడి క్రింద మెడ వంచకపోయినా, నేను ఆ దేశాన్ని కత్తితో, కరువుతో, తెగులుతో శిక్షిస్తాను, అతని చేతితో దానిని పూర్తిగా నాశనం చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 27:9 కాబట్టి, ‘మీరు బబులోను రాజుకు సేవ చేయరు’ అని మీతో చెప్పే మీ ప్రవక్తలు, భవిష్యవాణి చెప్పేవారు, కలల భావం చెప్పేవారు, మృతుల ఆత్మతో మాట్లాడేవారు, మంత్రగాళ్ల మాటలు మీరు వినవద్దు.
JER 27:10 మిమ్మల్ని మీ దేశం నుండి దూరం చేయడానికే వారు మీతో అబద్ధాలు ప్రవచిస్తారు; నేను నిన్ను వెళ్లగొడతాను మీరు నశిస్తారు.
JER 27:11 అయితే ఏ దేశమైనా బబులోను రాజు కాడి క్రింద మెడ వంచి అతనికి సేవ చేస్తే, నేను ఆ దేశాన్ని దాని సొంత దేశంలోనే ఉండి, దానిలో వ్యవసాయం చేయడానికి అక్కడ నివసించడానికి అనుమతిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.” ’ ”
JER 27:12 నేను యూదా రాజైన సిద్కియాకు కూడా అదే సందేశం ఇచ్చాను. నేను, “బబులోను రాజు కాడి క్రింద నీ మెడను వంచు; అతనికి అతని ప్రజలకు సేవ చేయండి, మీరు జీవిస్తారు.
JER 27:13 బబులోను రాజుకు సేవ చేయని ఏ దేశానికైనా యెహోవా హెచ్చరించినట్లు కత్తితో కరువుతో తెగులుతో నీవు, నీ ప్రజలు ఎందుకు చావాలి?
JER 27:14 ప్రవక్తల మాటలను వినవద్దు, వారు మీతో, ‘నీవు బబులోను రాజుకు సేవ చేయవు’ అని అబద్ధాలు ప్రవచిస్తున్నారు.
JER 27:15 యెహోవా ఇలా చెప్తున్నారు, ‘నేను వారిని పంపలేదు, నా పేరుతో వారు అబద్ధాలు ప్రవచిస్తున్నారు. కాబట్టి, నేను నిన్ను వెళ్లగొడతాను, మీరూ మీతో పాటు ప్రవచించే ప్రవక్తలు కూడా నశిస్తారు.’ ”
JER 27:16 అప్పుడు నేను యాజకులతో, ఈ ప్రజలందరితో ఇలా అన్నాను: “యెహోవా ఇలా చెప్తున్నారు: ‘అతిత్వరలో యెహోవా ఆలయ పాత్రలు బబులోను నుండి మళ్ళీ తేబడతాయి’ అని చెప్పే ప్రవక్తల మాటలను మీరు వినవద్దు, వారు మీకు అబద్ధాలు ప్రవచిస్తున్నారు.
JER 27:17 వారి మాట వినవద్దు. బబులోను రాజును సేవించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఈ పట్టణం ఎందుకు నాశనమవ్వాలి?
JER 27:18 ఒకవేళ వారు ప్రవక్తలైతే వారు యెహోవా మాటలు కలిగి ఉన్నట్లయితే, యెహోవా మందిరంలో, యూదారాజు రాజభవనంలో యెరూషలేములో మిగిలి ఉన్న వస్తువులను బబులోనుకు తీసుకెళ్లవద్దని వారు సైన్యాల యెహోవాను వేడుకోవడం మంచిది.
JER 27:19 ఎందుకంటే స్తంభాలు, ఇత్తడి నీళ్ల తొట్టె, కదిలే పీటలు ఈ పట్టణంలో మిగిలి ఉన్న ఇతర వస్తువుల గురించి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు,
JER 27:20 వేటినైతే యూదా రాజైన యెహోయాకీము కుమారుడైన యెహోయాకీనును, యూదా యెరూషలేము పెద్దలందరిని యెరూషలేము నుండి బబులోనుకు బందీగా తీసుకెళ్లినప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు తీసుకెళ్లలేదో,
JER 27:21 యెహోవా మందిరంలో, అలాగే యూదారాజు యొక్క రాజభవనంలో యెరూషలేములోను మిగిలిపోయిన వాటి గురించి ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా చెప్పారు:
JER 27:22 ‘వాటిని బబులోనుకు తీసుకెళ్తారు; నేను వాటిని దర్శించి ఇక్కడికి తీసుకువచ్చి ఈ స్థలంలో పెట్టే వరకు అవి అక్కడే ఉంటాయి’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 28:1 అదే సంవత్సరం అంటే, యూదారాజు సిద్కియా ఏలుబడిలో నాల్గవ సంవత్సరం అయిదవ నెలలో, గిబియోనుకు చెందిన అజ్జూరు కుమారుడైన హనన్యా ప్రవక్త యెహోవా మందిరంలో యాజకులు ప్రజలందరి సమక్షంలో నాతో ఇలా అన్నాడు,
JER 28:2 “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను బబులోను రాజు కాడిని విరగ్గొడతాను.
JER 28:3 బబులోను రాజైన నెబుకద్నెజరు ఇక్కడినుండి బబులోనుకు తీసుకెళ్లిన యెహోవా మందిరంలోని పాత్రలన్నిటిని రెండు సంవత్సరాల లోపు తిరిగి తెప్పిస్తాను.
JER 28:4 నేను బబులోను రాజు కాడిని విరగ్గొట్టి, యూదా రాజును యెహోయాకీము కుమారుడునైన యెహోయాకీనును, బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన యూదావారందరిని తిరిగి ఇక్కడకు రప్పిస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.”
JER 28:5 అప్పుడు యిర్మీయా ప్రవక్త యెహోవా మందిరంలో నిలబడి ఉన్న యాజకుల ముందు, ప్రజలందరి ముందు ప్రవక్తయైన హనన్యాకు జవాబిచ్చాడు.
JER 28:6 యిర్మీయా ఇలా అన్నాడు, “ఆమేన్! యెహోవా అలా చేయును గాక! బబులోను నుండి యెహోవా మందిరానికి సంబంధించిన వస్తువులను బందీలుగా తీసుకెళ్లిన వారందరిని తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి నీవు ప్రవచించిన మాటలను యెహోవా నెరవేరుస్తారు.
JER 28:7 అయితే, నీవు వింటుండగా, ఈ ప్రజలందరు వింటుండగా నేను చెప్పేది విను:
JER 28:8 నీకు నాకు ముందు ఉన్న ప్రవక్తలు చాలా దేశాలకు గొప్ప రాజ్యాలకు వ్యతిరేకంగా యుద్ధాలు, విపత్తు, తెగులు గురించి చాలా కాలం నుండి ప్రవచించారు.
JER 28:9 అయితే క్షేమం కలుగుతుందని ప్రవచించే ప్రవక్త తన అంచనా నిజమైతేనే యెహోవా పంపిన వ్యక్తిగా గుర్తించబడతాడు.”
JER 28:10 అప్పుడు ప్రవక్తయైన హనన్యా యిర్మీయా ప్రవక్త మెడలోని కాడిని తీసి, దాన్ని విరిచి,
JER 28:11 ప్రజలందరి ముందు, “యెహోవా ఇలా అంటున్నారు: ‘రెండు సంవత్సరాల్లో అన్ని దేశాల మెడ మీద నుండి బబులోను రాజై నెబుకద్నెజరు కాడిని నేను అలాగే విరగ్గొడతాను.’ ” అది వినగానే యిర్మీయా ప్రవక్త అక్కడినుండి వెళ్లిపోయాడు.
JER 28:12 ప్రవక్తయైన హనన్యా యిర్మీయా ప్రవక్త మెడలోని కాడిని విరగ్గొట్టిన తర్వాత, యెహోవా వాక్కు యిర్మీయాకు ఇలా వచ్చింది:
JER 28:13 “నీవు, వెళ్లి హనన్యాతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పేదేమిటంటే, నీవు చెక్క కాడి విరగ్గొట్టావు. కానీ దాని స్థానంలో నీవు ఇనుప కాడిని పొందుతావు.
JER 28:14 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: బబులోను రాజైన నెబుకద్నెజరుకు సేవ చేసేలా ఈ దేశాలందరి మెడపై నేను ఇనుప కాడిని ఉంచుతాను. అడవి జంతువులపై కూడా నేను అతనికి అధికారం ఇస్తాను.’ ”
JER 28:15 అప్పుడు యిర్మీయా ప్రవక్త హనన్యా ప్రవక్తతో ఇలా అన్నాడు: “విను హనన్యా! యెహోవా నిన్ను పంపలేదు, అయినప్పటికీ నీ అబద్ధాలను ఈ ప్రజలు నమ్మేలా చేశావు.
JER 28:16 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నిన్ను భూమి మీద నుండి తొలగించబోతున్నాను. మీరు ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు బోధించారు కాబట్టి ఈ సంవత్సరమే మీరు చనిపోతారు.’ ”
JER 28:17 అదే సంవత్సరం ఏడవ నెలలో హనన్యా ప్రవక్త చనిపోయాడు.
JER 29:1 నెబుకద్నెజరు యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారిలో మిగిలి ఉన్న పెద్దలకు, యాజకులకు, ప్రవక్తలకు, ఇతర ప్రజలందరికి యెరూషలేము నుండి యిర్మీయా ప్రవక్త పంపిన ఉత్తరంలోని మాటలు ఇవి.
JER 29:2 (యెహోయాకీను రాజు, రాజమాత, ఆస్థాన అధికారులు, యూదా, యెరూషలేము నాయకులు, నిపుణులైన పనివారు కళాకారులు యెరూషలేము నుండి బందీలుగా తీసుకువెళ్లిన తర్వాత ఈ ఉత్తరం పంపబడినది.)
JER 29:3 యూదా రాజైన సిద్కియా బబులోను రాజు నెబుకద్నెజరు దగ్గరకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశా, హిల్కీయా కుమారుడైన గెమర్యాలతో అతడు ఈ ఉత్తరాన్ని పంపించాడు. అందులో ఇలా ఉంది:
JER 29:4 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా తన ఇష్టప్రకారం యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారందరితో ఇలా అంటున్నారు:
JER 29:5 “ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు నాటి వాటి పండ్లను తినండి.
JER 29:6 పెళ్ళి చేసుకుని కుమారులు, కుమార్తెలను కనండి; మీ కుమారులకు భార్యలను తెచ్చుకోండి, మీ కుమార్తెలకు పెళ్ళి చేయండి, వారు కూడా కుమారులు కుమార్తెలను కంటారు. అప్పుడు మీ సంఖ్య తగ్గకుండ అధికమవుతుంది.
JER 29:7 అలాగే, నేను మిమ్మల్ని బందీలుగా తీసుకువెళ్లిన పట్టణంలో సమాధానం, అభివృద్ధి ఉండాలని కోరుకుని యెహోవాను ప్రార్థించండి, ఎందుకంటే అది అభివృద్ధి చెందితే, మీరు కూడా అభివృద్ధి చెందుతారు.”
JER 29:8 అవును, ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీ మధ్య ఉన్న ప్రవక్తలు భవిష్యవాణి చెప్పేవారు మిమ్మల్ని మోసగించకుండ చూసుకోండి. మీలో కలలు కనేవారి మాటలు మీరు వినకండి.
JER 29:9 వారు నా పేరిట అబద్ధాలు ప్రవచిస్తున్నారు. నేను వారిని పంపలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 29:10 యెహోవా ఇలా అంటున్నారు: “బబులోనుకు డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను మిమ్మల్ని దర్శించి నేను చేసిన మంచి వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను.
JER 29:11 ఎందుకంటే మీ కోసం నేను ఏర్పరచుకున్న ప్రణాళికలు నాకు తెలుసు” అని యెహోవా అంటున్నారు. “అవి మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి, రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలిగించే సమాధానకరమైన ఉద్దేశాలే గాని మీకు హాని కలిగించడానికి కాదు.
JER 29:12 అప్పుడు మీరు నాకు మొరపెట్టి నాకు ప్రార్థిస్తారు, అప్పుడు నేను మీ మాట వింటాను.
JER 29:13 మీరు నన్ను వెదకినప్పుడు, మీ పూర్ణహృదయంతో నన్ను వెదికినప్పుడు నన్ను కనుగొంటారు.
JER 29:14 మీరు నన్ను కనుగొంటారు, మిమ్మల్ని చెర నుండి తిరిగి రప్పిస్తాను. నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన అన్ని దేశాల నుండి అన్ని ప్రాంతాల నుండి మిమ్మల్ని సమకూరుస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన దేశానికి తిరిగి తీసుకువస్తాను.
JER 29:15 “బబులోనులో యెహోవా మన కోసం ప్రవక్తలను లేవనెత్తారు” అని మీరు అనవచ్చు,
JER 29:16 అయితే దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజు గురించి, మీతో పాటు బందీలుగా వెళ్లకుండా ఈ పట్టణంలో మిగిలిన మీ తోటి సోదరులు ప్రజలందరి గురించి యెహోవా ఇలా అంటున్నారు.
JER 29:17 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను ఖడ్గాన్ని, కరువును, తెగులును వారిపైకి పంపుతాను, వారిని తినడానికి పనికిరాని చెడ్డ అంజూర పండ్లలా చేస్తాను.
JER 29:18 నేను వారిని ఖడ్గంతో, కరువుతో, తెగుళ్ళతో వెంటాడి, వారిని ఏ దేశాల్లోకి తరుముతానో ఆ భూరాజ్యాలన్నిటికి వారిని అసహ్యమైన వారిగా, శాపంగా, భయానకంగా, హేళనగా నిందగా చేస్తాను.
JER 29:19 ఎందుకంటే వారు నా మాటలు వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నా సేవకులైన ప్రవక్తల ద్వారా నేను వారికి మళ్ళీ మళ్ళీ పంపిన మాటలు వారు వినలేదు. వారే కాదు బందీలుగా ఉన్న మీరు కూడా వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 29:20 కాబట్టి నేను యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా పంపినవారలారా, యెహోవా మాట వినండి.
JER 29:21 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా, నా పేరిట మీకు అబద్ధాలు ప్రవచిస్తున్న కోలాయా కుమారుడైన అహాబు, మయశేయా కుమారుడైన సిద్కియా గురించి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను వారిని బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాను, అతడు మీ కళ్లముందే వారిని చంపేస్తాడు.
JER 29:22 వారి కారణంగా, బబులోనులో ఉన్న యూదా నుండి బందీలుగా వెళ్లిన వారందరూ, ‘సిద్కియా, అహాబులను బబులోను రాజు అగ్నిలో కాల్చివేసినట్టుగా, యెహోవా మీకు చేయును గాక’ అని శపిస్తారు.
JER 29:23 ఎందుకంటే వారు ఇశ్రాయేలులో అవమానకరమైన పనులు చేశారు; వారు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచారం చేశారు, నేను ప్రకటించని విషయాలలో వారు నా పేరిట అబద్ధాలు చెప్పారు. అది నాకు తెలుసు, నేనే దానికి సాక్షిని” అని యెహోవా తెలియజేస్తున్నారు.
JER 29:24 నెహెలామీయుడైన షెమయాతో ఇలా చెప్పు,
JER 29:25 “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: యెరూషలేములో ఉన్న ప్రజలందరికి, మయశేయా కుమారుడు యాజకుడునైన జెఫన్యాకు, ఇతర యాజకులందరికీ నీ పేరిట ఉత్తరాలు పంపి జెఫన్యాతో ఇలా అన్నావు,
JER 29:26 ‘యెహోవా ఆలయానికి అధిపతిగా ఉండడానికి యెహోయాదా స్థానంలో యెహోవా నిన్ను యాజకునిగా నియమించారు; ప్రవక్తలా ప్రవర్తించే ఉన్మాదిని నీవు ఇనుప సంకెళ్లతో బంధించి కొయ్యకు బిగించాలి.
JER 29:27 కాబట్టి మీలో ప్రవక్తగా నటిస్తున్న అనాతోతీయుడైన యిర్మీయాను నీవెందుకు గద్దించలేదు?
JER 29:28 అతడు బబులోనులో ఉన్న మాకు, మీరు చాలా కాలం పాటు ఉంటారు. కాబట్టి ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు వేసి వాటి పండ్లు తినండని సందేశాన్ని పంపాడు.’ ”
JER 29:29 అయితే యాజకుడైన జెఫన్యా యిర్మీయా ప్రవక్తకు ఆ ఉత్తరాన్ని చదివి వినిపించాడు.
JER 29:30 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చి:
JER 29:31 “బందీలుగా ఉన్నవారందరికి ఈ సందేశం పంపు, ‘నెహెలామీయుడైన షెమయా గురించి యెహోవా ఇలా అంటున్నారు: నేను అతన్ని పంపలేదు, అయినాసరే షెమయా మీకు ప్రవచించి మీరు ఆ అబద్ధాలను నమ్మేలా చేశాడు.
JER 29:32 యెహోవా ఇలా అంటున్నారు: నెహెలామీయుడైన షెమయాను, అతని సంతానాన్ని నేను తప్పకుండా శిక్షిస్తాను. నా ప్రజలకు నేను చేయబోయే మేలు అతని సంతతిలో ఎవరూ చూడరు, ఎందుకంటే అతడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రకటించాడు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.”
JER 30:1 యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది:
JER 30:2 “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు, ‘నేను మాట్లాడిన మాటలన్నీ ఒక గ్రంథంలో వ్రాయి.
JER 30:3 అవి జరుగబోయే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నా ప్రజలైన ఇశ్రాయేలును, యూదాను చెరనుండి విడిపించి, వారి పూర్వికులకు నేనిచ్చిన దేశానికి వారిని రప్పిస్తాను, వారు దాన్ని స్వాధీనం చేసుకునే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా చెప్తున్నారు.”
JER 30:4 ఇశ్రాయేలు, యూదా గురించి యెహోవా చెప్పిన మాటలు:
JER 30:5 “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘భయంతో కూడిన కేకలు వినబడుతున్నాయి, భయమే ఉంది తప్ప, సమాధానం లేదు.
JER 30:6 ఓ విషయం వారిని అడిగి చూడండి: పురుషుడు పిల్లలు కనగలడా? అలాంటప్పుడు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా పురుషులందరు ఎందుకు నడుముపై చేతులు పెట్టుకున్నారు? వారి ముఖాలు ఎందుకు వాడిపోయాయి?
JER 30:7 ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందో! అలాంటిది మరొకటి ఉండదు. అది యాకోబుకు కష్టకాలం, అయితే వారు దాని నుండి రక్షించబడతారు.
JER 30:8 సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ ‘ఆ రోజు, నేను వారి మెడల మీద ఉన్న కాడిని విరగ్గొడతాను వారి బంధకాలను తెంపివేస్తాను; ఇకపై విదేశీయులు వారిని బానిసలుగా చేయరు.
JER 30:9 కాని, వారు తమ దేవుడైన యెహోవాకు సేవ చేస్తారు నేను వారికి రాజుగా నియమించే దావీదు రాజును వారు సేవిస్తారు.
JER 30:10 “ ‘కాబట్టి నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలు, కలవరపడకు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘సుదూర ప్రాంతం నుండి నేను నిన్ను తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతిని వారు బందీలుగా ఉన్న దేశం నుండి తప్పకుండా రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ సమాధానం నెమ్మది కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు.
JER 30:11 నేను నీతో ఉన్నాను, నిన్ను రక్షిస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘నేను నిన్ను చెదరగొట్టిన దేశాలన్నిటిని పూర్తిగా నాశనం చేసినా, నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చేయను. కాని నేను నిన్ను తగినంతగా శిక్షిస్తాను; శిక్షించకుండ మాత్రం నిన్ను వదిలిపెట్టను.’
JER 30:12 “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ గాయం నయం కానిది, నీ గాయం తీవ్రమైనది.
JER 30:13 నీ పక్షంగా వాదించడానికి ఎవరు లేరు, నీ పుండుకు నివారణ లేదు, నీకు స్వస్థత లేదు.
JER 30:14 నీ స్నేహితులందరు నిన్ను మరచిపోయారు; వారు నీ గురించి ఏమీ పట్టించుకోరు. శత్రువు కొట్టినట్లుగా నేను నిన్ను కొట్టి, క్రూరమైనవానిలా నిన్ను శిక్షించాను, ఎందుకంటే నీ అపరాధం చాలా పెద్దది, నీ పాపాలు చాలా ఎక్కువ.
JER 30:15 నీ గాయం గురించి, తీరని నీ బాధ గురించి ఎందుకు ఏడుస్తున్నావు? నీ గొప్ప అపరాధం అనేక పాపాల కారణంగా నేను నీకు ఇవన్నీ చేశాను.
JER 30:16 “ ‘అయితే నిన్ను మ్రింగివేసేవాళ్లంతా మ్రింగివేయబడతారు; నీ శత్రువులందరూ బందీలుగా కొనిపోబడతారు. నిన్ను దోచుకునేవారు దోచుకోబడతారు; నిన్ను పాడుచేసే వారందరిని నేను పాడుచేస్తాను.
JER 30:17 అయితే నేను నీకు స్వస్థత కలుగజేసి నీ గాయాలను బాగుచేస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే ‘నీవు వెలివేయబడినవాడవని, సీయోనును ఎవ్వరూ పట్టించుకోరు’ అని నీ గురించి అన్నారు.
JER 30:18 “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నేను యాకోబు ఇంటివారిని చెర నుండి తిరిగి రప్పించి, అతని నివాసాలపై కనికరం చూపుతాను. పట్టణం దాని శిథిలాల మీద మరలా కట్టబడుతుంది, రాజభవనం దాని స్థలంలోనే ఉంటుంది.
JER 30:19 వాటినుండి కృతజ్ఞతాగీతాలు ఆనంద ధ్వనులు వస్తాయి. నేను వారి సంఖ్యను తగ్గించకుండ, అధికం చేస్తాను; నేను వారికి ఘనతను తెస్తాను, వారు అసహ్యానికి గురికారు.
JER 30:20 వారి పిల్లలు పూర్వకాలంలో ఉన్నట్లే ఉంటారు, వారి సంఘం నా ముందు స్థిరపడుతుంది; వారిని హింసించే వారందరినీ నేను శిక్షిస్తాను.
JER 30:21 వారి నాయకుడు వారిలో ఒకడు; వారి పాలకుడు వారి మధ్య నుండి లేస్తాడు. నేను అతన్ని దగ్గరికి తీసుకువస్తాను, అతడు నా దగ్గరికి వస్తాడు నన్ను సమీపించే సాహసం చేయగల వ్యక్తి ఎవరు?’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 30:22 ‘కాబట్టి మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను.’ ”
JER 30:23 చూడండి, యెహోవా ఉగ్రత తుఫానులా విరుచుకుపడుతుంది, అది సుడిగాలిలా వీస్తూ దుష్టుల తలలపైకి తిరుగుతుంది.
JER 30:24 ఆయన తన హృదయ ఉద్దేశాలను పూర్తిగా నెరవేర్చే వరకు యెహోవా తీవ్రమైన కోపం చల్లారదు. రాబోయే రోజుల్లో మీరు దీన్ని గ్రహిస్తారు.
JER 31:1 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఆ సమయంలో నేను ఇశ్రాయేలు కుటుంబాలన్నిటికీ దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు.”
JER 31:2 యెహోవా చెప్పేదేమిటంటే: “ఖడ్గం నుండి తప్పించుకున్న ప్రజలు అరణ్యంలో దయ పొందుతారు; ఇశ్రాయేలీయులకు విశ్రాంతి ఇవ్వడానికి నేను వస్తాను.”
JER 31:3 గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను; నేను మారని ప్రేమతో నిన్ను నా వైపు ఆకర్షించాను.
JER 31:4 నేను నిన్ను మళ్ళీ నిర్మిస్తాను, ఇశ్రాయేలు కన్యా, నీవు తిరిగి కట్టబడతావు. మళ్ళీ నీవు నీ తంబురలు తీసుకుని ఆనందించే వారితో కలిసి నాట్యం చేస్తావు.
JER 31:5 మళ్ళీ సమరయ కొండలపై నీవు ద్రాక్షతోటలు నాటుతావు. రైతులు వాటిని నాటుతారు నీవు వాటి ఫలాలను తింటూ ఆనందిస్తావు.
JER 31:6 ఎఫ్రాయిం కొండలమీద కావలివారు, ‘రండి, మనం సీయోనుకు, మన దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్దాం’ అని కేకలు వేసే రోజు వస్తుంది.”
JER 31:7 యెహోవా ఇలా అంటున్నారు: “యాకోబు కోసం ఆనందంగా పాడండి; దేశాల్లో గొప్పదాని కోసం కేకవేయండి. స్తుతులు చెల్లిస్తూ, ‘యెహోవా, ఇశ్రాయేలీయులలో మిగిలిన, నీ ప్రజలను రక్షించండి’ అని అనండి.
JER 31:8 చూడు, నేను వారిని ఉత్తర దేశం నుండి రప్పించి, భూమి మూలల నుండి వారిని పోగుచేస్తాను. వారిలో గ్రుడ్డివారు, కుంటివారు, తల్లి కాబోతున్నవారు పురిటినొప్పులు పడుతున్న స్త్రీలు ఉంటారు; గొప్ప గుంపు తరలివస్తుంది.
JER 31:9 వారు ఏడుస్తూ వస్తారు; నేను వారిని వెనుకకు తీసుకువస్తున్నప్పుడు వారు ప్రార్థన చేస్తారు. నేను వారిని నీటి ప్రవాహాల ప్రక్కన వారు తడబడని తిన్నని దారిలో నడిపిస్తాను ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల తండ్రిగా ఉంటాను, ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారునిగా ఉంటాడు.
JER 31:10 “జనులారా, యెహోవా మాట వినండి; సుదూర తీరప్రాంతాలలో ఇలా ప్రకటించండి: ‘ఇశ్రాయేలును చెదరగొట్టినవారే వారిని సమకూర్చి, కాపరిలా తన మందను కాపాడతాడు.’
JER 31:11 ఎందుకంటే యెహోవా యాకోబును, వారికంటే బలవంతుల చేతిలో నుండి వారిని విడిపిస్తారు.
JER 31:12 వారు వచ్చి సీయోను కొండలమీద ఆనందంతో కేకలు వేస్తారు. వారు యెహోవా ఇచ్చిన సమృద్ధిని బట్టి ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం ఒలీవ నూనెలను బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టే పిల్లలను బట్టి సంతోషిస్తారు వారు బాగా నీరు పెట్టిన తోటలా ఉంటారు, వారు ఇకపై విచారించరు.
JER 31:13 అప్పుడు యువతులు యువకులు, వృద్ధులు సంతోషంతో నాట్యం చేస్తారు. నేను వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను; నేను వారికి విచారానికి బదులుగా ఆదరణను, ఆనందాన్ని ఇస్తాను.
JER 31:14 నేను యాజకులను సమృద్ధితో తృప్తిపరుస్తాను, నా ప్రజలు నా సమృద్ధితో నింపబడతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 31:15 యెహోవా చెప్పే మాట ఇదే: “రామాలో రోదన, గొప్ప ఏడ్పు వినబడుతుంది, రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఇక వారు లేరని, ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.”
JER 31:16 యెహోవా ఇలా చెప్తున్నారు: “ఏడవకుండా నీ స్వరాన్ని, కన్నీరు పెట్టుకోకుండా నీ కళ్లను అడ్డుకో, ఎందుకంటే నీ పనికి ప్రతిఫలం లభిస్తుంది, వారు శత్రువుల దేశం నుండి తిరిగి వస్తారు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 31:17 కాబట్టి నీ సంతానానికి నిరీక్షణ ఉంది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “మీ పిల్లలు తమ సొంత దేశానికి తిరిగి వస్తారు.
JER 31:18 “ఎఫ్రాయిం మూలుగులు నేను ఖచ్చితంగా విన్నాను: ‘శిక్షణ పొందని దూడలా ఉన్న నన్ను మీరు క్రమశిక్షణలో పెట్టారు, నేను క్రమశిక్షణ పొందాను. నన్ను బాగుచేయండి, నేను తిరిగి వస్తాను, ఎందుకంటే మీరే నా దేవుడైన యెహోవావు.
JER 31:19 నేను దారితప్పిన తర్వాత, పశ్చాత్తాపపడ్డాను; నేను అర్థం చేసుకున్న తర్వాత, నా రొమ్ము కొట్టుకున్నాను. నా యవ్వనంలో కలిగిన అవమానాన్ని భరిస్తూ, నేను సిగ్గుపడ్డాను అవమానపాలయ్యాను.’
JER 31:20 ఎఫ్రాయిం నా ప్రియ కుమారుడు, నేను ఇష్టపడే బిడ్డ కాదా? నేను తరచుగా అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, నేను ఇప్పటికీ అతన్ని జ్ఞాపకముంచుకుంటాను. కాబట్టి నా హృదయం అతని కోసం ఆశపడుతుంది; అతని మీద నాకు చాలా కనికరం ఉంది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 31:21 “రహదారి గుర్తులను ఏర్పాటు చేయి; దారి చూపే స్తంభాలు పెట్టించు. నీవు వెళ్లే మార్గాన్ని, ఆ రహదారిని గమనించు. ఇశ్రాయేలు కన్యా, నీ పట్టణాలకు తిరిగి రా.
JER 31:22 విశ్వాసఘాతకురాలవైన కుమార్తె, ఇశ్రాయేలూ, నీవు ఎంతకాలం తిరుగుతావు? యెహోవా భూమిపై ఒక క్రొత్తదాన్ని సృష్టిస్తారు, స్త్రీ పురుషుని దగ్గరకు తిరిగి వస్తుంది.”
JER 31:23 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను వారిని చెర నుండి తిరిగి రప్పించినప్పుడు, యూదా దేశంలోనూ దాని పట్టణాల్లోనూ ఉన్న ప్రజలు ఇలా చెప్తారు: ‘నీతి కలిగిన నగరమా, పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక.’
JER 31:24 రైతులు, తమ మందలతో తిరిగే కాపరులతో సహా యూదాలో, దాని పట్టణాలన్నిటిలో ప్రజలందరూ కలిసి జీవిస్తారు.
JER 31:25 అలసినవారికి అలసట తీరుస్తాను, అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాను.”
JER 31:26 అంతలో నాకు మెలకువ వచ్చి చుట్టూ చూశాను. నా నిద్ర నాకు హాయిగా ఉంది.
JER 31:27 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను మనుష్యుల సంతానంతో అలాగే జంతువుల సంతానంతో నాటే రోజులు రాబోతున్నాయి.
JER 31:28 నేను వారిని పెరికివేయడానికి, కూల్చివేయడానికి, పడద్రోయడానికి, నాశనం చేయడానికి, విపత్తును రప్పించడానికి ఎలా ఎదురుచూశానో, అలాగే వారిని కట్టడానికి నాటడానికి నేను ఎదురుచూస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 31:29 “ఆ రోజుల్లో ప్రజలు, “ ‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్షలు తిన్నప్పుడు, పిల్లల పళ్లు పులిసాయి’ అనే సామెత చెప్పరు.
JER 31:30 ఎవరి పాపానికి వారే చస్తారు; ఎవరు పుల్లని ద్రాక్షలు తింటారో వారి పళ్లే పులుస్తాయి.
JER 31:31 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ క్రొత్త నిబంధన చేసే రోజులు వస్తున్నాయి.
JER 31:32 ఆ నిబంధన, ఈజిప్టు నుండి నేను వారి పూర్వికుల చేయి పట్టుకుని బయటకు నడిపించినపుడు నేను వారితో చేసిన నిబంధనలా ఉండదు, ఎందుకంటే నేను వారికి ఒక భర్తగా ఉన్నా, వారితో చేసిన నా నిబంధనను వారు ఉల్లంఘించారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 31:33 “ఆ కాలం తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను చేసే నిబంధన ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను నా ధర్మశాస్త్రాన్ని వారి మనస్సుల్లో ఉంచి, దాన్ని వారి హృదయాల మీద వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు.
JER 31:34 ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు, ‘యెహోవాను తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు, ఎందుకంటే వారిలో, సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఎందుకంటే నేను వారి దుష్టత్వాన్ని క్షమించి వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.”
JER 31:35 యెహోవా ఇలా చెప్తున్నారు, పగలు ప్రకాశించడానికి సూర్యుని నియమించినవాడు, రాత్రి ప్రకాశించడానికి, చంద్రుని, నక్షత్రాలను శాసించేవాడు, కెరటాలు గర్జించేలా, సముద్రాన్ని కదిలించేవాడు ఆయనే, ఆయన పేరు సైన్యాల యెహోవా:
JER 31:36 “ఈ శాసనాలు నా దృష్టి నుండి మాయమైతేనే,” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఇశ్రాయేలు ఇక ఎన్నటికీ నా ఎదుట ఒక జనంగా ఉండదు.”
JER 31:37 యెహోవా ఇలా అంటున్నారు: “పైన ఉన్న ఆకాశాలు కొలవబడగలిగితే, అలాగే క్రింద ఉన్న భూమి పునాదులు పరిశోధించబడగలిగితే తప్ప, వారు చేసినదంతటిని బట్టి నేను ఇశ్రాయేలు సంతతివారందరిని తిరస్కరిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 31:38 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “హనానేలు గోపురం నుండి మూల ద్వారం వరకు ఈ పట్టణం నా కోసం తిరిగి కట్టబడే రోజులు వస్తున్నాయి.
JER 31:39 కొలనూలు అక్కడినుండి నేరుగా గారేబు కొండ వరకు వెళ్లి, ఆపై గోయా వైపు తిరుగుతుంది.
JER 31:40 శవాలను, బూడిదను విసిరే లోయ మొత్తం, తూర్పున కిద్రోను లోయవరకు గుర్రపు ద్వారం మూల వరకు ఉన్న డాబాలన్నీ యెహోవాకు పవిత్రంగా ఉంటాయి. పట్టణం ఇంకెప్పుడు పెరికివేయబడదు, కూల్చివేయబడదు.”
JER 32:1 యూదా రాజైన సిద్కియా ఏలుబడిలో పదవ సంవత్సరంలో అంటే నెబుకద్నెజరు ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరంలో యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన మాట ఇది.
JER 32:2 బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద దాడి చేస్తున్నప్పుడు యిర్మీయా ప్రవక్త యూదా రాజభవనంలోని కావలివారి ప్రాంగణంలో బంధించబడ్డాడు.
JER 32:3 యూదా రాజైన సిద్కియా అతన్ని అక్కడ బంధించి, “నీవు అలా ఎందుకు ప్రవచిస్తున్నావు? పైగా నీవంటున్నావు, ‘యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను, అతడు దానిని స్వాధీనం చేసుకుంటాడు.
JER 32:4 యూదా రాజైన సిద్కియా బబులోనీయుల నుండి తప్పించుకోడు, అతడు బబులోను రాజు చేతికి ఖచ్చితంగా అప్పగించబడతాడు, సిద్కియా అతనితో ముఖాముఖి మాట్లాడతాడు తన కళ్లారా అతన్ని చూస్తాడు.
JER 32:5 అతడు సిద్కియాను బబులోనుకు తీసుకెళ్తాడు, నేను అతని సంగతి చూసే వరకు అతడు అక్కడే ఉంటాడని యెహోవా ప్రకటిస్తున్నారు. ఒకవేళ మీరు బబులోనీయులతో పోరాడితే విజయం సాధించలేరు’ అని చెప్పావు” అన్నాడు.
JER 32:6 యిర్మీయా ఇలా అన్నాడు: “యెహోవా వాక్కు నాకు వచ్చింది:
JER 32:7 నీ మేనమామ షల్లూము కుమారుడైన హనామేలు నీ దగ్గరకు వచ్చి, ‘అనాతోతులో నా పొలాన్ని కొను, ఎందుకంటే ఒక సమీప బంధువుగా దాన్ని కొనడం నీ హక్కు నీ బాధ్యత’ అని చెప్తాడు.
JER 32:8 “అప్పుడు, యెహోవా చెప్పినట్లే, నా బంధువైన హనామేలు కావలివారి ప్రాంగణంలో నా దగ్గరకు వచ్చి, ‘బెన్యామీను ప్రాంతంలోని అనాతోతులో ఉన్న నా పొలాన్ని కొను. దానిని విడిపించి, స్వాధీనపరచుకునే హక్కు నీకుంది కాబట్టి, నీ కోసం దాన్ని కొనుక్కో’ అని అన్నాడు. “ఇది యెహోవా వాక్కు అని నాకు తెలుసు;
JER 32:9 కాబట్టి నేను అనాతోతులో ఉన్న పొలాన్ని నా బంధువైన హనామేలు దగ్గర కొని, అతనికి పదిహేడు షెకెళ్ళ వెండి తూకం వేసి ఇచ్చాను.
JER 32:10 నేను క్రయపత్రం వ్రాసి ముద్రవేసి, సాక్షి సంతకం కూడా చేయించి వెండిని తూకం వేయించి ఇచ్చాను.
JER 32:11 అప్పుడు కొనుగోలు నియమ నిబంధనలు వ్రాసి ముద్ర వేసిన, ముద్ర వేయని పత్రాలను నేను తీసుకున్నాను.
JER 32:12 నేను ఈ పత్రాన్ని నా బంధువు హనామేలు సమక్షంలో, అలాగే పత్రంపై సంతకం చేసిన సాక్షుల సమక్షంలో, కావలివారి ప్రాంగణంలో కూర్చున్న యూదులందరి సమక్షంలో మహశేయా కుమారుడైన నేరియా, అతని కుమారుడైన బారూకుకు ఇచ్చాను.
JER 32:13 “వారి సమక్షంలో నేను బారూకుకు ఈ సూచనలను ఇచ్చాను:
JER 32:14 ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ఈ పత్రాలను, అనగా ముద్ర వేసిన కొనుగోలు పత్రాన్ని, ముద్ర వేయని కొనుగోలు పత్రాన్ని తీసుకుని, అవి చాలా కాలం పాటు ఉండేలా వాటిని మట్టికుండలో దాచిపెట్టు.
JER 32:15 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ఈ దేశంలో మళ్ళీ ఇల్లు, పొలాలు, ద్రాక్షతోటలు కొంటారు.’
JER 32:16 “నేరియా కుమారుడైన బారూకుకు కొనుగోలు పత్రాన్ని ఇచ్చిన తర్వాత, నేను యెహోవాను ఇలా ప్రార్థించాను:
JER 32:17 “అయ్యో, ప్రభువా యెహోవా, మీ గొప్ప శక్తితో, మీ చాచిన బాహువుతో ఆకాశాలను భూమిని సృష్టించారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు.
JER 32:18 మీరు వేలమందిపై ప్రేమ చూపిస్తారు కానీ తల్లిదండ్రుల పాపాల శిక్షను వారి తర్వాత వారి పిల్లల ఒడిలోకి తీసుకువస్తారు. ఆయన గొప్ప బలవంతుడైన దేవుడు, ఆయన పేరు సైన్యాల యెహోవా.
JER 32:19 మీ ఉద్దేశాలు గొప్పవి, మీ క్రియలు బలమైనవి. మీ కనుదృష్టి సర్వ మానవాళిపై ఉన్నది; మీరు ప్రతిఒక్కరికి వారి ప్రవర్తనకు, వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తారు.
JER 32:20 మీరు ఈజిప్టులో సూచకక్రియలు, అద్భుతాలు చేశారు, నేటికీ ఇశ్రాయేలు మధ్య, ఇతర మనుష్యలందరి మధ్య వాటిని కొనసాగిస్తూ మీరు ఇంకా పేరు కీర్తి కలిగించుకుంటున్నారు.
JER 32:21 మీ ప్రజలైన ఇశ్రాయేలీయులను సూచకక్రియలతో, అద్భుతాలతో, బలమైన చేతితో, చాచిన బాహువుతో, గొప్ప భయాన్ని కలిగించి ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చారు.
JER 32:22 మీరు వారి పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన ఈ దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చారు.
JER 32:23 వారు దాని లోపలికి వచ్చి దానిని స్వాధీనం చేసుకున్నారు, కానీ వారు మీకు లోబడలేదు, మీ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు; మీరు వారికి ఆజ్ఞాపించినట్లు వారు చేయలేదు. కాబట్టి మీరు వారిపై ఈ విపత్తు అంతా తెచ్చారు.
JER 32:24 “పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముట్టడి దిబ్బలు ఎలా నిర్మించబడ్డాయో చూడండి. ఖడ్గం, కరువు తెగులు కారణంగా పట్టణం దాని మీద దాడి చేస్తున్న బబులోనీయుల చేతులకు అప్పగించబడుతుంది. నీవు చెప్పింది జరగడం ఇప్పుడు నీవే చూస్తున్నావు.
JER 32:25 పట్టణం బబులోనీయుల చేతికి అప్పగించబడినప్పటికీ, యెహోవా, మీరు నాతో, ‘వెండి ఇచ్చి పొలాన్ని కొని, లావాదేవీకి సాక్షులను ఏర్పాటు చేసుకో’ అని చెప్పారు.”
JER 32:26 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై:
JER 32:27 “నేను యెహోవాను; నేను సర్వ మానవాళికి దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా?
JER 32:28 కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోనీయుల చేతికి, బబులోను రాజు నెబుకద్నెజరుకు అప్పగించబోతున్నాను, అతడు దానిని స్వాధీనం చేసుకుంటాడు.
JER 32:29 ఈ పట్టణంపై దాడి చేస్తున్న బబులోనీయులు లోపలికి వచ్చి దానికి నిప్పు పెడతారు; బయలుకు ఏ ఇంటి పైకప్పుల మీద ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించి ప్రజలు నాకు కోపాన్ని రేపారో ఆ ఇళ్ళతో పాటు వారు దానిని కాల్చివేస్తారు.
JER 32:30 “ఇశ్రాయేలు, యూదా ప్రజలు తమ చిన్ననాటి నుండి నా దృష్టికి చెడు తప్ప మరి ఏమీ చేయలేదు. నిజానికి, ఇశ్రాయేలు ప్రజలు తమ చేతులు చేసిన వాటితో నాకు కోపం తెప్పించడం తప్ప మరేమీ చేయలేదు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 32:31 ఈ పట్టణం కట్టబడిన రోజు నుండి ఇప్పటివరకు నాకు కోపాన్ని, ఉగ్రతను రప్పిస్తూనే ఉన్నది.
JER 32:32 ఇశ్రాయేలు, యూదా ప్రజలు, వారి రాజులు, అధికారులు, వారి యాజకులు, ప్రవక్తలు, యూదా ప్రజలు యెరూషలేములో నివసించేవారు తాము చేసిన వాటన్నిటితో నాకు కోపం రేపారు.
JER 32:33 వారు నావైపు తమ ముఖాలు త్రిప్పక నాకు వెన్ను చూపారు. నేను వారికి పదే పదే బోధించినప్పటికీ, వారు క్రమశిక్షణను అంగీకరించలేదు, స్పందించలేదు.
JER 32:34 నా పేరు కలిగిన మందిరంలో తమ నీచమైన విగ్రహాలను ప్రతిష్ఠించి దానిని అపవిత్రం చేశారు.
JER 32:35 వారు తమ కుమారులను, కుమార్తెలను మోలెకుకు బలి ఇవ్వడానికి బెన్ హిన్నోము లోయలో బయలుకు క్షేత్రాలు కట్టారు. అది నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదా పాపంలో పడి అలాంటి అసహ్యమైనది చేస్తారని కనీసం నా మనస్సులోకి రాలేదు.
JER 32:36 “మీరు ఈ పట్టణం గురించి, ‘ఖడ్గం, కరువు తెగులు కారణంగా అది బబులోను రాజు చేతికి అప్పగించబడుతుంది’ అని అంటున్నారు; అయితే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు:
JER 32:37 నా ఉగ్రతతో, గొప్ప కోపంతో నేను వారిని వెళ్లగొట్టే అన్ని దేశాల నుండి తప్పకుండా వారిని సమకూర్చి తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి క్షేమంగా జీవించేలా చేస్తాను.
JER 32:38 వారు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను.
JER 32:39 నేను వారికి ఏక హృదయాన్ని ఒకే మార్గాన్ని ఇస్తాను, తద్వార వారు ఎల్లప్పుడూ నాకు భయపడతారు, వారికి, వారి తర్వాత వారి పిల్లలకు, వారి పిల్లల పిల్లలకు అంతా మేలు జరుగుతుంది.
JER 32:40 నేను వారితో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను: నేను వారికి మేలు చేయడం ఎప్పటికీ మానను, వారు నా నుండి ఎన్నటికీ దూరంగా ఉండకుండ నా పట్ల వారికి భయభక్తులు కలిగిస్తాను.
JER 32:41 నేను వారికి మేలు చేయడంలో నాకు ఆనందం ఉంది కాబట్టి నిజంగా నా పూర్ణహృదయంతో నా పూర్ణాత్మతో వారిని ఈ దేశంలో నాటుతాను.
JER 32:42 “యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ ప్రజలమీదికి ఇంత గొప్ప విపత్తు తెచ్చినట్లే, నేను వారికి వాగ్దానం చేసిన వృద్ధి అంతటిని వారికి ఇస్తాను.
JER 32:43 ‘ఇది బబులోనీయుల చేతికి అప్పగించబడి మనుష్యులు జంతువులు లేక పాడైపోయిందని’ మీరు చెప్పే ఈ దేశంలో మరలా పొలాలు కొంటారు.
JER 32:44 బెన్యామీను ప్రాంతాల్లోనూ, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ, యూదా పట్టణాల్లోనూ, కొండ సీమల్లోనూ, పడమటి దిగువ కొండ ప్రదేశాల్లోనూ, దక్షిణ ప్రాంతాల్లోనూ పొలాలు వెండి ఇచ్చి కొంటారు, ఒప్పందాలపై సంతకాలు చేస్తారు, కొనుగోలు పత్రాలపై ముద్రలు వేస్తారు, ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.”
JER 33:1 యిర్మీయా ఇంకా కావలివారి ప్రాంగణంలో బంధించబడి ఉండగా, యెహోవా వాక్కు అతనికి రెండవసారి వచ్చింది:
JER 33:2 “యెహోవా ఇలా అంటున్నారు, ఆయన భూమిని సృష్టించారు, యెహోవా దానిని రూపించి, స్థాపించారు; యెహోవా అని పేరు కలిగినవారే ఇలా చెప్తున్నారు,
JER 33:3 ‘నాకు మొరపెట్టు, నేను నీకు జవాబు ఇస్తాను, నీకు తెలియని, నీవు పరిశోధించలేని గొప్ప విషయాలను నీకు చెప్తాను.’
JER 33:4 బబులోనీయులతో జరిగిన యుద్ధంలో ముట్టడి దిబ్బల వల్ల ఖడ్గం వల్ల నాశనమైన ఈ పట్టణంలోని ఇళ్ళ గురించి, యూదా రాజభవనాల గురించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘అవి నా కోపం ఉగ్రత వల్ల నేను చంపిన మనుష్యుల శవాలతో నిండిపోతాయి. ఈ పట్టణపు దుష్టత్వాన్ని బట్టి దానికి నేను నా ముఖాన్ని దాచుకుంటాను.
JER 33:6 “ ‘అయినప్పటికీ, నేను దానికి ఆరోగ్యాన్ని స్వస్థతను తెస్తాను; నేను నా ప్రజలను స్వస్థపరచి వారు సమృద్ధిగా సమాధానాన్ని సత్యాన్ని ఆస్వాదించేలా చేస్తాను.
JER 33:7 నేను యూదాను, ఇశ్రాయేలీయులను చెర నుండి తిరిగి రప్పించి వారు ఎలా పూర్వం ఉన్నారో వారిని తిరిగి అలాగే నిర్మిస్తాను.
JER 33:8 వారు నాకు వ్యతిరేకంగా చేసిన పాపాలన్నిటి నుండి నేను వారిని శుద్ధి చేస్తాను, నాపై తిరుగుబాటు చేసిన వారి పాపాలన్నిటిని క్షమిస్తాను.
JER 33:9 అప్పుడు నేను వారి కోసం చేయబోతున్న మంచి పనులన్నిటి గురించి విన్న భూప్రజలందరి ముందు ఈ పట్టణం నాకు కీర్తిని ఆనందాన్ని గౌరవాన్ని తెస్తుంది. నేను వారికి ఇచ్చే విస్తారమైన వృద్ధిని సమాధానాన్ని చూసి వారు భయంతో వణికిపోతారు.’
JER 33:10 “యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ స్థలం గురించి మీరు ఇలా అంటున్నారు, “ఇది మనుష్యులు జంతువులు లేక పాడైపోయింది” అని మీరు చెప్పే ఈ స్థలంలోనే, మనుష్యులుగానీ, జంతువులుగానీ నివసించకుండా పాడైపోయిన యూదా పట్టణాల్లో యెరూషలేము వీధుల్లో
JER 33:11 సంతోషకరమైన శబ్దాలు, ఆనంద ధ్వనులు, వధూవరుల స్వరాలు మరోసారి వినిపిస్తాయి. వారు యెహోవా ఆలయానికి కృతజ్ఞతార్పణలు తీసుకువస్తూ, “సైన్యాల యెహోవాకు స్తుతులు చెల్లించండి, యెహోవా మంచివాడు; ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది” అంటారు. ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను’ అని యెహోవా అంటున్నారు.
JER 33:12 “సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మనుష్యులు, జంతువులు లేక నిర్జనమైన ఈ స్థలంలో, దాని పట్టణాలన్నింటిలో గొర్రెల కాపరులు తమ మందలకు విశ్రాంతి ఇచ్చేందుకు మళ్ళీ పచ్చికబయళ్లు ఉంటాయి.
JER 33:13 కొండ ప్రాంత పట్టణాల్లో, పడమటి పర్వత ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతంలో, బెన్యామీను ప్రాంతంలో, యెరూషలేము చుట్టూ ఉన్న గ్రామాల్లో, యూదా పట్టణాల్లో మందలు లెక్కించే వారిచేత లెక్కించబడతాయి’ అని యెహోవా చెప్తున్నారు.
JER 33:14 “యెహోవా అంటూ ఇలా ప్రకటిస్తున్నారు, ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలకు నేను చేసిన మంచి వాగ్దానాన్ని నేను నెరవేర్చే రోజులు వస్తున్నాయి.’
JER 33:15 “ ‘ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదు వంశం నుండి నీతి కొమ్మను మొలకెత్తిస్తాను. అతడు దేశంలో నీతి న్యాయాలు జరిగిస్తాడు.
JER 33:16 ఆ రోజుల్లో యూదాకు కాపుదల ఉంటుంది యెరూషలేము క్షేమంగా జీవిస్తుంది. యెహోవాయే మన నీతిమంతుడైన రక్షకుడు అనే పేరుతో యెరూషలేము పిలువబడుతుంది.’
JER 33:17 యెహోవా ఇలా అంటున్నారు: ‘ఇశ్రాయేలు సింహాసనంపై కూర్చోడానికి దావీదుకు ఒకడు లేకుండా ఉండడు.
JER 33:18 నా ఎదుట నిలబడి దహనబలులు అర్పించడానికి, భోజనార్పణలు అర్పించడానికి, బలులు అర్పించడానికి లేవీయులైన యాజకులకు ఒకడు లేకుండా పోడు.’ ”
JER 33:19 యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చి:
JER 33:20 “యెహోవా ఇలా అంటున్నారు: ‘పగలు రాత్రులు వాటి నిర్ణీత సమయంలో రాకుండా నేను పగటికి, రాత్రికి చేసిన నా ఒడంబడికను మీరు భంగం చేస్తే,
JER 33:21 అప్పుడు నా సేవకుడైన దావీదుతో తన సింహాసనంపై రాజ్యం చేయడానికి అతనికి ఒకడు లేకుండా పోడని నేను చేసిన నిబంధన, నా ఎదుట పరిచర్య చేస్తున్న యాజకులుగా ఉన్న లేవీయులతో నేను చేసిన నిబంధన వ్యర్ధం అవుతుంది.
JER 33:22 నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నా ఎదుట పరిచర్య చేసే లేవీయులను ఆకాశంలోని నక్షత్రాలవలె లెక్కపెట్టలేనంతగా, సముద్రతీరంలోని ఇసుకలా కొలువలేనంతగా చేస్తాను.’ ”
JER 33:23 యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చి:
JER 33:24 “ఈ ప్రజలు, ‘యెహోవా తాను ఎంచుకున్న రెండు రాజ్యాలను ఆయన తృణీకరించారు’ అని అనడం నీవు గమనించలేదా? కాబట్టి వారు నా ప్రజలను తృణీకరిస్తారు ఇకపై వారిని ఒక జనంగా పరిగణించరు.
JER 33:25 యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను పగలు రాత్రితో నా ఒడంబడిక చేసి, భూమ్యాకాశాల నియమాలను స్థాపించి ఉండకపోతే,
JER 33:26 అప్పుడు నేను యాకోబు నా సేవకుడైన దావీదుల సంతతిని తిరస్కరించి ఉండేవాన్ని, అబ్రాహాము, ఇస్సాకు యాకోబుల సంతతివారిని పరిపాలించడానికి అతని కుమారులలో ఒక్కరిని కూడా ఎన్నుకోను. ఎందుకంటే నేను చెర నుండి వారిని తిరిగి రప్పించి, వారిపై కనికరం చూపుతాను.’ ”
JER 34:1 బబులోను రాజైన నెబుకద్నెజరు, అతని సైన్యమంతా, అతడు పరిపాలించిన సామ్రాజ్యంలోని అన్ని రాజ్యాలు, జనాంగాలు యెరూషలేముతో పాటు దాని చుట్టుప్రక్కల పట్టణాలన్నిటితో యుద్ధం చేస్తున్నప్పుడు, యెహోవా నుండి యిర్మీయాకు ఈ మాట వచ్చింది:
JER 34:2 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: యూదా రాజైన సిద్కియా దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను, అతడు దానిని కాల్చివేస్తాడు.
JER 34:3 నీవు అతని పట్టు నుండి తప్పించుకోలేవు, ఖచ్చితంగా బంధించబడి అతని చేతులకు అప్పగించబడతావు. నీవు బబులోను రాజును నీ కళ్లతో చూస్తావు, అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. నీవు బబులోనుకు వెళ్లిపోతావు.
JER 34:4 “ ‘అయినప్పటికీ యూదా రాజైన సిద్కియా, యెహోవా నీకు చేసిన వాగ్దానాన్ని విను. నీ గురించి యెహోవా ఇలా అంటున్నారు: నీవు ఖడ్గంతో చంపబడవు;
JER 34:5 నీవు సమాధానంగా చనిపోతావు. నీకు ముందుగా పాలించిన రాజులైన నీ పూర్వికుల గౌరవార్థం ప్రజలు సుగంధ ద్రవ్యాలను దహించినట్లే, వారు నీ కోసం కూడా సుగంధద్రవ్యాలు దహిస్తూ, “అయ్యో, యజమానుడా!” అని విలపిస్తారు. నాకు నేనే ఈ వాగ్దానం చేస్తున్నాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
JER 34:6 అప్పుడు యిర్మీయా ప్రవక్త యెరూషలేములో ఉన్న యూదా రాజైన సిద్కియాకు ఇదంతా చెప్పాడు.
JER 34:7 ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద యూదాలోని ఇతర పట్టణాల మీద, లాకీషు, అజేకా మీదా యుద్ధం చేస్తూ ఉంది. యూదాలో మిగిలి ఉన్న కోట పట్టణాలు ఇవి మాత్రమే.
JER 34:8 సిద్కియా రాజు యెరూషలేములోని ప్రజలందరితో బానిసలకు విడుదల ప్రకటించాలని ఒడంబడిక చేసుకున్న తర్వాత యెహోవా నుండి యిర్మీయాకు ఈ మాట వచ్చింది.
JER 34:9 ప్రతి ఒక్కరూ తమకు బానిసలుగా ఉన్న హెబ్రీయులైన మగవారిని, ఆడవారిని అందరిని విడిపించాలి; తోటి యూదులను ఎవరూ బానిసత్వంలో ఉంచకూడదు.
JER 34:10 కాబట్టి ఈ ఒడంబడిక ప్రకారం వచ్చిన అధికారులందరు, అలాగే ప్రజలందరూ తమ దగ్గర ఉన్న ఆడ, మగ బానిసలను విడుదల చేస్తామని, ఇక ఎప్పటికీ వారిని బానిసలుగా ఉంచమని అంగీకరించి, ఆ ఆజ్ఞకు లోబడి వారిని విడుదల చేశారు.
JER 34:11 అయితే ఆ తర్వాత వారు మనస్సు మార్చుకుని విడిపించిన బానిసలను వెనుకకు తీసుకుని మళ్ళీ బానిసలుగా చేసుకున్నారు.
JER 34:12 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చింది:
JER 34:13 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి, బానిస దేశం నుండి బయటకు రప్పించినప్పుడు వారితో నిబంధన చేసి నేను ఇలా అన్నాను,
JER 34:14 ‘మీకు అమ్మబడిన తోటి హెబ్రీయులను ఏడవ సంవత్సరంలో మీలో ప్రతి ఒక్కరు వారిని విడుదల చేయాలి. వారు ఆరు సంవత్సరాలు మీకు సేవ చేసిన తర్వాత, మీరు వారిని స్వతంత్రులుగా వెళ్లిపోనివ్వాలి.’ అయితే, మీ పూర్వికులు నా మాట వినలేదు, కనీసం నా గురించి పట్టించుకోలేదు.
JER 34:15 ఇటీవలే మీరు పశ్చాత్తాపపడి మీలో ప్రతి ఒక్కరూ మీ సొంత ప్రజలకు విడుదల ప్రకటించి నా దృష్టికి సరియైనది చేశారు. నా పేరు కలిగిన మందిరంలో మీరు నా ముందు ఒక ఒడంబడిక కూడా చేశారు.
JER 34:16 కాని ఇప్పుడు మీరు తిరగబడి నా పేరును అపవిత్రం చేశారు. మీలో ప్రతి ఒక్కరు మీ ఆడ, మగ బానిసలను వారు కోరుకున్న చోటికి వెళ్లగలిగేలా వారిని విడుదల చేశారు. కాని మీరు వారిని మళ్ళీ మీ బానిసలుగా ఉండాలని బలవంతం చేశారు.
JER 34:17 “కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: మీరు నా మాట వినలేదు. మీరు మీ సొంత ప్రజలకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించలేదు. కాబట్టి నేను ఇప్పుడు మీకు ‘స్వాతంత్ర్యాన్ని’ చాటిస్తున్నాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. ఖడ్గం, తెగులు కరువుతో చావడానికే మీకు ‘విడుదల.’ నేను మిమ్మల్ని భూలోక రాజ్యాలన్నిటికీ అసహ్యమైన వారిగా చేస్తాను.
JER 34:18 నా ఒడంబడికను ఉల్లంఘించి, నా ముందే తాము చేసిన ఒడంబడికలోని నిబంధనలను నెరవేర్చని వారిని, దూడను రెండు ముక్కలు చేసి దాని మధ్య నడిచినవారిగా నేను చూస్తాను.
JER 34:19 యూదా, యెరూషలేము నాయకులు, ఆస్థాన అధికారులు, యాజకులు, దేశ ప్రజలందరు దూడ ముక్కల మధ్య నడిచినవారు,
JER 34:20 వారిని చంపాలనుకున్న వారి శత్రువుల చేతికి నేను వారిని అప్పగిస్తాను. వారి మృతదేహాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి.
JER 34:21 “నేను యూదా రాజైన సిద్కియాను, అతని అధికారులను వారిని చంపాలనుకున్న శత్రువుల చేతికి, అంటే నీ దగ్గర నుండి వెనుకకు వెళ్లిపోయిన బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను.
JER 34:22 నేను ఆదేశాన్ని జారీ చేయబోతున్నాను. వారిని ఈ పట్టణానికి తిరిగి తీసుకువస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు. వారు దానికి వ్యతిరేకంగా పోరాడి, దానిని స్వాధీనం చేసుకుని దానిని కాల్చివేస్తారు. నేను యూదా పట్టణాలను ఎవరూ నివసించని విధంగా నాశనం చేస్తాను.”
JER 35:1 యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము పరిపాలనలో యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన మాట ఇది:
JER 35:2 “రేకాబీయుల కుటుంబం దగ్గరకు వెళ్లి, వారిని యెహోవా మందిరంలోని ప్రక్క గదుల్లో ఒక దానిలోకి రమ్మని ఆహ్వానించి, త్రాగడానికి వారికి ద్రాక్షరసం ఇవ్వు.”
JER 35:3 కాబట్టి నేను హబజ్జిన్యా మనుమడును యిర్మీయా కుమారుడునైన యాజన్యాను అతని సోదరులను అతని కుమారులందరిని అంటే రేకాబీయుల కుటుంబమంతటిని తీసుకురావడానికి వెళ్లాను.
JER 35:4 నేను వారిని యెహోవా మందిరంలోకి, అంటే దైవజనుడైన ఇగ్దలియా కుమారుడైన హానాను కుమారుల గదిలోకి తీసుకువచ్చాను. అది అధికారుల గది ప్రక్కనే ఉన్న ద్వారపాలకుడైన షల్లూము కుమారుడైన మయశేయా గదికి పైన ఉంది.
JER 35:5 అప్పుడు నేను ద్రాక్షరసంతో నిండిన పాత్రలను, కొన్ని గిన్నెలను రేకాబీయుల ముందు ఉంచి, “కొంచెం ద్రాక్షరసం త్రాగండి” అని వారితో చెప్పాను.
JER 35:6 అయితే వారు, “మేము ద్రాక్షరసం త్రాగము, ఎందుకంటే మా పూర్వికుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు, ‘మీరు గాని మీ సంతానం గాని ఎప్పుడూ ద్రాక్షరసం త్రాగకూడదు.
JER 35:7 అలాగే మీరు ఎప్పటికీ ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు విత్తవద్దు, ద్రాక్షతోటలు నాటవద్దు; వీటిలో మీకు ఏదీ ఉండకూడదు; ఎల్లప్పుడూ గుడారాల్లో నివసించాలి. అప్పుడు మీరు పరవాసులుగా ఉన్న దేశంలో దీర్ఘకాలం జీవిస్తారు’ అని మాకు ఆజ్ఞాపించాడు.
JER 35:8 మా పూర్వికుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన ప్రతిదానికీ మేము లోబడి ఉన్నాము. మేము గాని మా భార్యలు గాని మా కుమారులు, కుమార్తెలు గాని ఎప్పుడూ ద్రాక్షరసం త్రాగలేదు.
JER 35:9 నివసించడానికి ఇల్లు కట్టుకోలేదు, ద్రాక్షతోటలు గాని, పొలాలు గాని పంటలు గాని మాకు లేవు.
JER 35:10 మేము గుడారాల్లో నివసించాము, మా పూర్వికుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని పూర్తిగా పాటించాము.
JER 35:11 అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశాన్ని ఆక్రమించినప్పుడు, మేము, ‘రండి, మనం బబులోను, సిరియనుల సైన్యాల నుండి తప్పించుకోవడానికి యెరూషలేముకు వెళ్దాం’ అని చెప్పుకున్నాము. కాబట్టి మేము యెరూషలేములో ఉండిపోయాం” అని చెప్పారు.
JER 35:12 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ఇలా ప్రకటించింది:
JER 35:13 “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీరు వెళ్లి యూదా ప్రజలకు, యెరూషలేములో నివసిస్తున్న వారికి ఇలా చెప్పండి, ‘మీరు గుణపాఠం నేర్చుకుని నా మాటలకు లోబడరా?’ అని యెహోవా అడుగుతున్నారు.
JER 35:14 ‘రేకాబు కుమారుడైన యెహోనాదాబు ద్రాక్షరసం త్రాగకూడదని తన వారసులకు ఆదేశించగా అది స్థిరంగా ఉంది. వారు తమ పూర్వికుల ఆజ్ఞను పాటిస్తున్నారు కాబట్టి నేటికీ వారు ద్రాక్షరసం త్రాగరు. అయితే నేను మీతో పదే పదే మాట్లాడుతున్నా, మీరు నా మాట వినట్లేదు.
JER 35:15 నా సేవకులైన ప్రవక్తలందరినీ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి పంపాను. వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరూ మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తన సరిచేసుకోవాలి; ఇతర దేవతలను సేవించవద్దు వాటిని అనుసరించవద్దు. అప్పుడు నేను మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు” అని ప్రకటించారు. కానీ మీరు నా మాట వినలేదు పట్టించుకోలేదు.
JER 35:16 రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతివారు తమ తండ్రి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చారు, కానీ ఈ ప్రజలు నా మాటకు లోబడలేదు.’
JER 35:17 “కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఇలా అంటున్నారు: ‘వినండి! నేను వారితో మాట్లాడాను కాని వారు వినలేదు; నేను వారిని పిలిచాను కాని వారు జవాబివ్వలేదు. కాబట్టి నేను యూదా వారిమీదికి యెరూషలేము నివాసులందరి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడంతా వాళ్ళ మీదకి తీసుకురాబోతున్నాను.’ ”
JER 35:18 అప్పుడు యిర్మీయా రేకాబీయులతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మీరు మీ పూర్వికుడైన యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞకు లోబడ్డారు, అలాగే అతని ఆదేశాలన్నిటిని అనుసరించి అతడు ఆదేశించిన ప్రతిదీ మీరు చేశారు.’
JER 35:19 కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘నన్ను సేవించడానికి రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతానంలో ఒకడు ఎప్పటికీ ఉంటాడు.’ ”
JER 36:1 యూదారాజు యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడిలో నాలుగో సంవత్సరంలో, యిర్మీయాకు యెహోవా నుండి ఈ మాట వచ్చింది:
JER 36:2 “ఒక గ్రంథపుచుట్ట తీసుకుని యూదా, ఇశ్రాయేలు, ఇతర జనాంగాల గురించి యోషీయా పాలనలో నీతో మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు నేను నీతో చెప్పిన మాటలన్నీ దానిలో వ్రాయి.
JER 36:3 బహుశా యూదా ప్రజలు నేను వారికి రప్పించాలని అనుకున్న ప్రతి విపత్తు గురించి విన్నప్పుడు వారు తమ చెడు మార్గాలను విడిచిపెడతారేమో; అప్పుడు నేను వారి దుర్మార్గాన్ని, వారి పాపాన్ని క్షమిస్తాను.”
JER 36:4 కాబట్టి యిర్మీయా నేరియా కుమారుడైన బారూకును పిలిచి, యెహోవా తనతో చెప్పిన మాటలన్నిటిని యిర్మీయా చెప్తుండగా, బారూకు వాటిని గ్రంథపుచుట్ట మీద వ్రాశాడు.
JER 36:5 అప్పుడు యిర్మీయా బారూకుతో, “నేను నిర్బంధించబడ్డాను; కాబట్టి యెహోవా ఆలయానికి వెళ్లడానికి నాకు అనుమతి లేదు.
JER 36:6 కాబట్టి ఉపవాస దినాన నీవు యెహోవా ఆలయానికి వెళ్లి, నేను చెప్పినట్లుగా నీవు గ్రంథపుచుట్టలో వ్రాసిన యెహోవా వాక్కులను ప్రజలకు చదివి వినిపించు. తమ పట్టణాల నుండి వచ్చే యూదా ప్రజలందరికి వాటిని చదివి వినిపించు.
JER 36:7 బహుశా వారి విన్నపం యెహోవా సన్నిధిలో ఆమోదించబడి, వారు తమ చెడు మార్గాలను విడిచిపెడతారేమో, ఎందుకంటే యెహోవా ఈ ప్రజల మీదకు తీవ్రమైన కోపం ఉగ్రత వస్తాయని ప్రకటించారు.”
JER 36:8 నేరియా కుమారుడైన బారూకు యిర్మీయా ప్రవక్త చెప్పినదంతా చేశాడు; యెహోవా మందిరంలో అతడు గ్రంథపుచుట్టలోని యెహోవా మాటలను చదివి వినిపించాడు.
JER 36:9 యూదారాజు యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడిలో అయిదవ సంవత్సరం తొమ్మిదవ నెలలో, యెరూషలేములోని ప్రజలందరికి, యూదా పట్టణాల నుండి వచ్చిన ప్రజలందరికి యెహోవా సన్నిధిలో ఉపవాసం ఉండాలని ప్రకటించబడింది.
JER 36:10 యెహోవా మందిరంలో కార్యదర్శియైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగా ఉన్న ప్రాంగణంలో యెహోవా మందిర క్రొత్త ద్వార ప్రవేశం దగ్గర ప్రజలందరికి వినిపించేలా బారూకు గ్రంథపుచుట్టలో నుండి యిర్మీయా చెప్పిన మాటలను చదివాడు.
JER 36:11 షాఫాను మనుమడును గెమర్యా కుమారుడునైన మీకాయా ఆ గ్రంథపుచుట్టలో నుండి చదవబడిన యెహోవా చెప్పిన మాటలన్నీ విని,
JER 36:12 అతడు రాజభవనంలోని లేఖికుని గదిలోకి వెళ్లాడు, అక్కడ అధికారులందరు అనగా లేఖికుడైన ఎలీషామా, షెమయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా, ఇంకా ఇతర అధికారులందరూ కూర్చుని ఉన్నారు.
JER 36:13 బారూకు ఆ గ్రంథపుచుట్ట నుండి ప్రజలకు చదివి వినిపించిన ప్రతిదీ మీకాయా వారికి చెప్పిన తర్వాత,
JER 36:14 “నీవు ఏ గ్రంథపుచుట్ట నుండి ప్రజలకు చదివి వినిపించావో దాన్ని తీసుకుని రా” అని బారూకుకు చెప్పడానికి అధికారులందరు కలిసి కూషీ కుమారుడైన షెలెమ్యా, అతని కుమారుడైన నెతన్యా, అతని కుమారుడైన యెహూదిని పంపారు. కాబట్టి నేరియా కుమారుడైన బారూకు ఆ గ్రంథపుచుట్టను తీసుకుని వారి దగ్గరకు వెళ్లాడు.
JER 36:15 వారు అతనితో, “దయచేసి కూర్చుని, మాకు దాన్ని చదివి వినిపించండి” అని అడిగారు. కాబట్టి బారూకు దానిని వారికి చదివి వినిపించాడు.
JER 36:16 వారు ఈ మాటలు విని భయంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుని బారూకుతో, “ఈ మాటలన్నీ మనం తప్పక రాజుకు తెలియజేయాలి” అని అన్నారు.
JER 36:17 అప్పుడు వారు బారూకును, “నీవు ఇవన్నీ ఎలా వ్రాశావు? యిర్మీయా చెప్పాడా? మాకు చెప్పు” అని అడిగారు.
JER 36:18 అందుకు బారూకు, “అవును, ఇవన్నీ అతడు చెప్తుండగా, నేను ఈ గ్రంథపుచుట్టలో వ్రాశాను” అని జవాబిచ్చాడు.
JER 36:19 అప్పుడు అధికారులు బారూకుతో, “నీవు, అలాగే యిర్మీయా కూడా వెళ్లి దాక్కోండి. మీరు ఎక్కడున్నారో ఎవరికీ తెలియకూడదు” అని చెప్పారు.
JER 36:20 తర్వాత వారు ఆ గ్రంథపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో పెట్టి, తన భవన ప్రాంగణంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్లి, జరిగినదంతా ఆయనతో చెప్పారు.
JER 36:21 అప్పుడు రాజు ఆ గ్రంథపుచుట్టను తెమ్మని యెహూదిని పంపినప్పుడు, అతడు వెళ్లి లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తెచ్చి రాజుకు, ఆయన ప్రక్కన నిలబడి ఉండిన అధికారులందరికి చదివి వినిపించాడు.
JER 36:22 అది తొమ్మిదవ నెల కాబట్టి రాజు శీతాకాలపు భవనంలో మంటలు మండుతున్న కుంపటి ముందు కూర్చుని ఉన్నాడు.
JER 36:23 యెహూది గ్రంథపుచుట్టలోని మూడు నాలుగు వరుసలను చదివినప్పుడల్లా, రాజు వాటిని లేఖికుని కత్తితో కోసి మండుతున్న కుంపటిలో విసురుతూ ఉన్నాడు, ఆ గ్రంథపుచుట్టను పూర్తిగా కాల్చివేసే వరకు రాజు అలాగే చేశాడు.
JER 36:24 ఈ మాటలన్నీ విన్న రాజు గాని అతని సహాయకులెవ్వరు గాని భయపడలేదు, తమ బట్టలు చింపుకోలేదు.
JER 36:25 ఆ గ్రంథపుచుట్టను కాల్చవద్దు అంటూ ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా రాజును అభ్యర్థించారు, కాని రాజు వారి అభ్యర్థనను వినిపించుకోలేదు.
JER 36:26 పైగా రాజు, లేఖికుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను బంధించమని రాజకుమారుల్లో ఒకడైన యెరహ్మెయేలు, అజ్రీయేలు కుమారుడైన శెరాయా, అబ్దీయేలు కుమారుడైన షెలెమ్యాలను ఆజ్ఞాపించాడు. అయితే యెహోవా వారిని దాచిపెట్టారు.
JER 36:27 యిర్మీయా చెప్తూ ఉండగా బారూకు వ్రాసిన ఆ గ్రంథపుచుట్టను రాజు కాల్చివేసినప్పుడు, యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చింది:
JER 36:28 “మరో గ్రంథపుచుట్టను తీసుకుని యూదా రాజైన యెహోయాకీము కాల్చివేసిన మొదటి గ్రంథపుచుట్టలో ఉండిన మాటలన్నీ దానిపై వ్రాయి.
JER 36:29 అలాగే యూదా రాజైన యెహోయాకీముతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు ఆ గ్రంథపుచుట్టను కాల్చివేసి, “బబులోను రాజు ఖచ్చితంగా వచ్చి ఈ దేశాన్ని నాశనం చేస్తాడని దాని నుండి మనుష్యులను, జంతువులను తుడిచివేస్తాడని నీవు దానిపై ఎందుకు వ్రాశావు?” అని అన్నావు.
JER 36:30 కాబట్టి యూదా రాజైన యెహోయాకీమును గురించిన యెహోవా వాక్కు ఇదే: దావీదు సింహాసనం మీద కూర్చోడానికి నీకు ఎవరూ ఉండరు, అతని శవం పగలు ఎండలో రాత్రి మంచులో పడి ఉంటుంది.
JER 36:31 నేను అతన్ని, అతని పిల్లలను అతని సేవకులను వారి దుర్మార్గాన్ని బట్టి శిక్షిస్తాను; నేను వారి మీదికి, యెరూషలేములో నివసించేవారి మీదికి, యూదా ప్రజలమీదికి నేను వారికి వ్యతిరేకంగా ప్రకటించిన ప్రతీ విపత్తును రప్పిస్తాను, ఎందుకంటే వారు నా మాట వినలేదు.’ ”
JER 36:32 కాబట్టి యిర్మీయా మరో గ్రంథపుచుట్టను తీసుకుని నేరియా కుమారుడైన బారూకు అనే లేఖికునికి ఇచ్చి, యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపుచుట్టలోని మాటలన్నిటిని యిర్మీయా చెప్తూ ఉండగా, బారూకు దానిపై వ్రాశాడు. ఆ మాటలతో పాటు అలాంటి అనేక మాటలను వ్రాశాడు.
JER 37:1 యోషీయా కుమారుడైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాకు రాజుగా నియమించాడు. అతడు యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను స్థానంలో రాజయ్యాడు.
JER 37:2 ప్రవక్తయైన యిర్మీయా ద్వారా యెహోవా చెప్పిన మాటలను అతడు గాని, అతని సేవకులు గాని, దేశ ప్రజలు గాని పట్టించుకోలేదు.
JER 37:3 అయితే రాజైన సిద్కియా, షెలెమ్యా కుమారుడైన యెహుకలును మయశేయా కుమారుడును యాజకుడునైన జెఫన్యాతో పాటు యిర్మీయా ప్రవక్తకు ఈ సందేశాన్ని పంపాడు: “దయచేసి మాకోసం మన దేవుడైన యెహోవాకు ప్రార్థించండి.”
JER 37:4 అప్పటికి యిర్మీయాను ఇంకా జైలులో పెట్టలేదు కాబట్టి ప్రజలమధ్య స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు.
JER 37:5 ఫరో సైన్యం ఈజిప్టు నుండి బయలుదేరగా, యెరూషలేమును ముట్టడించిన బబులోనీయులు ఆ వార్త విని యెరూషలేము నుండి వెనుకకు వెళ్లిపోయారు.
JER 37:6 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయా ప్రవక్తకు వచ్చింది:
JER 37:7 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘ఫరో గురించి నన్ను విచారించడానికి నిన్ను పంపిన యూదా రాజుతో చెప్పు. మీకు మద్ధతు ఇవ్వడానికి బయలుదేరిన సైన్యం తిరిగి తన దేశమైన ఈజిప్టుకు వెళ్తుంది.
JER 37:8 అప్పుడు బబులోనీయులు తిరిగివచ్చి ఈ పట్టణంపై దాడి చేస్తారు; వారు దానిని పట్టుకుని కాల్చివేస్తారు.’
JER 37:9 “యెహోవా ఇలా అంటున్నారు: ‘బబులోనీయులు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోతారు’ అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వారు వెళ్లరు!
JER 37:10 మీపై దాడి చేస్తున్న బబులోనీయుల సైన్యం మొత్తాన్ని మీరు ఓడించినా, గాయపడిన మనుష్యులు మాత్రమే తమ గుడారాల్లో మిగిలిపోయినా, వారే బయటకు వచ్చి ఈ పట్టణాన్ని కాల్చివేస్తారు.”
JER 37:11 ఫరో సైన్యాన్ని బట్టి బబులోనీయుల సైన్యం యెరూషలేము నుండి వెనుకకు వెళ్లిన తర్వాత,
JER 37:12 యిర్మీయా బెన్యామీను ప్రాంతంలో తన ప్రజల ఆస్తిలో తన వాటాను పొందేందుకు యెరూషలేమును విడిచి అక్కడి వెళ్లడానికి బయలుదేరాడు.
JER 37:13 అయితే అతడు బెన్యామీను ద్వారం దగ్గరకు చేరుకున్నప్పుడు, హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు ఇరియా అనే కావలివారి దళాధిపతి ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకుని, “నీవు బబులోనీయులతో చేరిపోవడానికి వెళ్తున్నావు!” అన్నాడు.
JER 37:14 “అది నిజం కాదు! నేను బబులోనీయులలో చేరడానికి వెళ్లడం లేదు” అని యిర్మీయా జవాబిచ్చాడు. కాని ఇరియా అతని మాట వినలేదు; పైగా, అతడు యిర్మీయాను బంధించి అధికారుల దగ్గరకు తీసుకువచ్చాడు.
JER 37:15 వారు యిర్మీయా మీద కోపం తెచ్చుకుని, అతన్ని కొట్టి, కార్యదర్శియైన యోనాతాను ఇంట్లో బంధించి, ఆ ఇంటిని వారు జైలుగా చేశారు.
JER 37:16 యిర్మీయా సొరంగంలో ఉన్న ఒక చెరసాలలో చాలా రోజులు ఉండిపోయాడు.
JER 37:17 అప్పుడు రాజైన సిద్కియా అతన్ని పిలిపించి, రాజభవనానికి తీసుకువచ్చి, “యెహోవా నుండి ఏదైనా వాక్కు వచ్చిందా?” అని అడిగాడు. “అవును, నీవు బబులోను రాజు చేతికి అప్పగించబడతావు” అని యిర్మీయా జవాబిచ్చాడు.
JER 37:18 అప్పుడు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు: “నన్ను జైలులో వేయడానికి నేను నీకు గాని నీ సేవకులకు గాని ఈ ప్రజలకు గాని వ్యతిరేకంగా ఏ నేరం చేశాను?
JER 37:19 ‘బబులోను రాజు మీ మీదా, ఈ దేశం మీదా దాడి చేయడు’ అని మీకు ప్రవచించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు?
JER 37:20 అయితే నా ప్రభువా, రాజా, దయచేసి వినండి. నా విన్నపాన్ని మీ ముందుకు తేనివ్వండి: నన్ను కార్యదర్శియైన యోనాతాను ఇంటికి తిరిగి పంపవద్దు, నేను అక్కడే చనిపోతాను.”
JER 37:21 రాజైన సిద్కియా యిర్మీయాను కావలివారి ప్రాంగణంలో ఉంచి, పట్టణంలోని రొట్టెలన్నీ పూర్తిగా అయిపోయే వరకు ప్రతిరోజు రొట్టెలు చేసేవారి వీధి నుండి ఒక రొట్టె ఇవ్వమని ఆజ్ఞాపించాడు. కాబట్టి యిర్మీయా కావలివారి ప్రాంగణంలో ఉండిపోయాడు.
JER 38:1 మత్తాను కుమారుడైన షెఫట్యా, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకాలు, మల్కీయా కుమారుడైన పషూరు యిర్మీయా ప్రజలందరితో చెప్పేది విని,
JER 38:2 “యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ పట్టణంలో నివసించేవారు ఖడ్గంతో కరువుతో తెగులుతో చనిపోతారు, కానీ బబులోనీయుల దగ్గరకు వెళ్లేవారు బ్రతుకుతారు. వారు తమ ప్రాణాలతో తప్పించుకుని బ్రతుకుతారు; వారు జీవిస్తారు.’
JER 38:3 యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ పట్టణం ఖచ్చితంగా బబులోను రాజు సైన్యానికి అప్పగించబడుతుంది, అతడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు’ ” అని చెప్పడం విన్నారు.
JER 38:4 అప్పుడు ఆ అధికారులు రాజుతో, “ఈ వ్యక్తికి మరణశిక్ష విధించాలి. ఇతడు ఈ పట్టణంలో మిగిలి ఉన్న సైనికులను, అలాగే ప్రజలందరినీ తాను వారితో చెప్పే మాటల ద్వార నిరుత్సాహపరుస్తున్నాడు. ఈ వ్యక్తి ఈ ప్రజల క్షేమం కోరడంలేదు, వారి పతనాన్ని కోరుతున్నాడు.”
JER 38:5 అందుకు రాజైన సిద్కియా, “అతడు మీ ఆధీనంలో ఉన్నాడు, రాజు మీకు వ్యతిరేకంగా ఏమి చేయడు” అన్నాడు.
JER 38:6 కాబట్టి వారు యిర్మీయాను తీసుకెళ్లి, చెరసాల ప్రాంగణంలో ఉన్న రాజు కుమారుడైన మల్కీయా నీటి గోతిలోకి దింపినప్పుడు దాంట్లో వారు యిర్మీయాను త్రాళ్లతో నీటి గోతిలోకి దించారు; దాంట్లో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది, యిర్మీయా ఆ బురదలో మునిగిపోయాడు.
JER 38:7 అయితే రాజభవనంలో అధికారిగా ఉన్న ఎబెద్-మెలెకు అనే ఒక కూషీయుడు యిర్మీయాను నీటి గోతిలో వేశారు అని విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.
JER 38:8 ఎబెద్-మెలెకు రాజభవనంలో నుండి రాజు దగ్గరకు వెళ్లి రాజుతో,
JER 38:9 “రాజా! నా ప్రభువా! ఈ మనుష్యులు యిర్మీయా ప్రవక్త విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. వీరు అతన్ని గోతిలో వేశారు, పట్టణంలో ఇక ఆహారం లేకుండా పోతే అక్కడ అతడు ఆకలితో చనిపోతాడు” అని మనవి చేశాడు.
JER 38:10 అప్పుడు రాజు కూషీయుడైన ఎబెద్-మెలెకుకు, “నీవు ఇక్కడినుండి ముప్పది మందిని తీసుకెళ్లి, యిర్మీయా ప్రవక్తను చావకముందే ఆ గోతిలో నుండి బయటకు తీయించు” అని ఆజ్ఞాపించాడు.
JER 38:11 కాబట్టి ఎబెద్-మెలెకు ఆ మనుష్యులను తనతో పాటు తీసుకుని రాజభవనంలోని ఖజానా క్రింద ఉన్న గదిలోకి వెళ్లాడు. అతడు అక్కడినుండి కొన్ని పాత గుడ్డలు చిరిగిన బట్టలు తీసుకుని, నీటి గోతిలో ఉన్న యిర్మీయాకు వాటిని త్రాళ్లతో దించాడు.
JER 38:12 కూషీయుడైన ఎబెద్-మెలెకు యిర్మీయాతో, “ఈ పాత గుడ్డలు, చిరిగిన బట్టలు త్రాళ్లగా చేయడానికి నీ చేతుల క్రింద పెట్టుకో” అన్నాడు. యిర్మీయా అలాగే చేశాడు,
JER 38:13 వారు అతన్ని త్రాళ్లతో పైకి లాగి బందీకానా నుండి పైకి లేపారు. యిర్మీయా కావలివారి ప్రాంగణంలో ఉండిపోయాడు.
JER 38:14 అప్పుడు రాజైన సిద్కియా యిర్మీయా ప్రవక్తను పిలిపించి, యెహోవా మందిరంలోని మూడవ ద్వారం దగ్గరకు అతన్ని రప్పించాడు. రాజు యిర్మీయాతో, “నేను నిన్ను ఒక విషయం అడుగుతున్నాను; నా దగ్గర ఏమీ దాచకుండ జవాబివ్వాలి” అని అన్నాడు.
JER 38:15 అందుకు యిర్మీయా సిద్కియాతో, “ఒకవేళ నేను మీరు నిజం చెబితే, మీరు నన్ను చంపరా? నేను ఒకవేళ మీకు సలహా ఇచ్చినా మీరు నా మాట వినరు.”
JER 38:16 అయితే సిద్కియా రాజు యిర్మీయాతో రహస్యంగా ఈ ప్రమాణం చేశాడు: “మనకు ఊపిరినిచ్చే, సజీవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్న, నిన్ను నేను చంపను, నిన్ను చంపాలనుకున్న వారికి అప్పగించను.”
JER 38:17 అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: ‘నీవు బబులోను రాజు అధికారులకు లొంగిపోతే, నీ ప్రాణం దక్కుతుంది, ఈ పట్టణం కూడా అగ్నితో కాల్చివేయబడదు; నీవు, నీ కుటుంబం బ్రతుకుతారు.
JER 38:18 అయితే ఒకవేళ నీవు బబులోను రాజు అధికారులకు లొంగిపోకపోతే, ఈ పట్టణం బబులోనీయుల చేతులకు అప్పగించబడుతుంది, వారు దానిని కాల్చివేస్తారు; అప్పుడు కనీసం నీవు కూడా వారి నుండి తప్పించుకోలేవు.’ ”
JER 38:19 సిద్కియా రాజు యిర్మీయాతో, “బబులోనీయుల దగ్గరకు వెళ్లిపోయిన యూదుల గురించి నేను భయపడుతున్నాను, ఎందుకంటే బబులోనీయులు నన్ను వారి చేతికి అప్పగిస్తే, వారు నన్ను ఘోరంగా అవమానిస్తారు” అని అన్నాడు.
JER 38:20 “వారు మిమ్మల్ని అప్పగించరు; నేను చెప్పేది చేస్తూ యెహోవాకు లోబడండి. అప్పుడు అది మీకు అంతా మంచే జరుగుతుంది, మీరు ప్రాణాలతో ఉంటారు” అని యిర్మీయా జవాబిచ్చాడు.
JER 38:21 కానీ మీరు లొంగిపోవడానికి నిరాకరిస్తే, యెహోవా నాకు ఇలా తెలియజేశారు:
JER 38:22 యూదారాజు యొక్క రాజభవనంలో మిగిలి ఉన్న స్త్రీలందరినీ బబులోను రాజు యొక్క అధికారుల దగ్గరికి తీసుకువస్తారు. అప్పుడు ఆ స్త్రీలు నిన్ను చూసి వెటకారంగా ఇలా అంటారు: “ ‘మీ నమ్మకమైన స్నేహితులు మిమ్మల్ని తప్పుదారి పట్టించారు, వారు మిమ్మల్ని అప్పగించారు. మీ పాదాలు బురదలో దిగబడినప్పుడు; మీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారు.’
JER 38:23 “మీ భార్యాపిల్లలందరూ బబులోనీయుల దగ్గరికి రప్పించబడతారు. స్వయంగా మీరే వారి చేతుల నుండి తప్పించుకోలేరు; మీరు బబులోను రాజు చేత బంధించబడతారు; ఈ పట్టణం కాల్చివేయబడుతుంది.”
JER 38:24 అప్పుడు సిద్కియా యిర్మీయాతో, “ఈ సంభాషణ గురించి ఎవరికీ తెలియకూడదు, తెలిస్తే నీవు చస్తావు.
JER 38:25 నేను నీతో మాట్లాడానని అధికారులు విని, నీ దగ్గరికి వచ్చి, ‘మీరు రాజుతో ఏం మాట్లాడారో, రాజు మీతో ఏం మాట్లాడారో మాకు చెప్పండి. మా దగ్గర దాచవద్దు, లేకుంటే మేము మిమ్మల్ని చంపుతాము’
JER 38:26 అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘నన్ను యోనాతాను ఇంటికి తిరిగి పంపించవద్దని రాజు దగ్గర విన్నవించుకున్నాను.’ ”
JER 38:27 అధికారులందరూ యిర్మీయా దగ్గరకు వచ్చి అతన్ని ప్రశ్నించగా, అతడు రాజు వారితో చెప్పమని తనకు ఆదేశించినదంతా చెప్పాడు. కాబట్టి వారు అతనితో ఇంకేమి అనలేదు, ఎందుకంటే రాజుతో అతనికి ఏమి సంభాషణ జరిగిందో ఎవరూ వినలేదు.
JER 38:28 యెరూషలేము స్వాధీనమైపోయిన రోజు వరకు యిర్మీయా, కావలివారి ప్రాంగణంలోనే ఉన్నాడు. యెరూషలేము ఈ విధంగా ఆక్రమించబడింది:
JER 39:1 యూదా రాజైన సిద్కియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం పదవ నెలలో, బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో వచ్చి యెరూషలేమును ముట్టడించాడు.
JER 39:2 సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం నాలుగవ నెల తొమ్మిదవ రోజు పట్టణ ప్రాకారం విరగ్గొట్టబడింది.
JER 39:3 అప్పుడు బబులోను రాజు అధికారులు శమ్గరుకు చెందిన నెర్గల్-షారెజెరు, ముఖ్య అధికారియైన నెబో-శర్సెకీము, వచ్చి మధ్య ద్వారంలో కూర్చున్నారు. నెర్గల్-షారెజెరు ఒక ఉన్నతాధికారి, మిగిలినవారు బబులోను రాజు ఇతర అధికారులు.
JER 39:4 యూదా రాజైన సిద్కియా, అతని సైనికులందరు వారిని చూసి పారిపోయారు; రాత్రివేళ వారు రాజు తోటలోని మార్గం నుండి రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా పట్టణాన్ని విడిచిపెట్టి, అరాబా వైపు బయలుదేరి వెళ్లారు.
JER 39:5 అయితే బబులోను సైన్యం వారిని వెంటాడి యెరికో సమతల మైదానంలో ఉన్న సిద్కియాను పట్టుకుంది. వారు అతన్ని పట్టుకుని హమాతు దేశంలోని రిబ్లాలో ఉన్న బబులోను రాజైన నెబుకద్నెజరు దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు.
JER 39:6 అక్కడ బబులోను రాజు రిబ్లాలో సిద్కియా కుమారులను, అలాగే యూదా పెద్దలందరినీ అతని కళ్లముందే చంపేశాడు.
JER 39:7 అప్పుడు అతడు సిద్కియా కళ్లు ఊడదీసి, అతన్ని ఇత్తడి సంకెళ్ళతో బంధించి బబులోనుకు తీసుకెళ్లాడు.
JER 39:8 బబులోనీయులు రాజభవనాలన్నిటిని ప్రజల ఇళ్ళను తగలబెట్టి యెరూషలేము గోడలను పడగొట్టారు.
JER 39:9 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను పట్టణంలో మిగిలి ఉన్నవారిని, ద్రోహులై తమ రాజును విడిచి అతనితో చేరిన వారిని, మిగిలిన ప్రజలందరినీ బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు.
JER 39:10 అయితే రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను నిరుపేదలను యూదా దేశంలో విడిచిపెట్టి వారికి ద్రాక్షతోటలు పొలాలు ఇచ్చాడు.
JER 39:11 ఇప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు యిర్మీయా గురించి రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదానుకు ఇలా ఆజ్ఞాపించాడు:
JER 39:12 “అతన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోవాలి; అతనికి హాని చేయవద్దు, అతడు ఏమి అడిగినా అతని కోసం చేయాలి.”
JER 39:13 కాబట్టి రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను, ముఖ్య అధికారి నెబూషజ్బాను, ఉన్నతాధికారియైన నెర్గల్-షారెజెరు, బబులోను రాజు ఇతర అధికారులందరూ,
JER 39:14 మనుష్యులను పంపి యిర్మీయాను కావలివారి ప్రాంగణం నుండి బయటకు తీసుకువచ్చారు. అతన్ని తిరిగి తన ఇంటికి తీసుకెళ్లమని షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యాకు అప్పగించారు. కాబట్టి యిర్మీయా తన సొంత ప్రజల మధ్యనే ఉండిపోయాడు.
JER 39:15 యిర్మీయా కావలివారి ప్రాంగణంలో బంధించబడి ఉన్నప్పుడు, అతనికి యెహోవా వాక్కు వచ్చి:
JER 39:16 “వెళ్లి కూషీయుడైన ఎబెద్-మెలెకుతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ పట్టణానికి వ్యతిరేకంగా చెప్పిన నా మాటలను అనగా మేలు గురించి కాదు కాని కీడు గురించి చెప్పిన మాటలను నేను నెరవేర్చబోతున్నాను. ఆ సమయంలో అవి మీ కళ్లముందు నెరవేరుతాయి.
JER 39:17 అయితే ఆ రోజు నేను నిన్ను రక్షిస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు; నీవు భయపడేవారి చేతికి నీవు అప్పగించబడవు.
JER 39:18 నేను నిన్ను రక్షిస్తాను; నీవు నన్ను నమ్మావు కాబట్టి నీవు ఖడ్గానికి బలి కాకుండ, నీవు ప్రాణంతో తప్పించుకుంటావు అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
JER 40:1 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను రామాలో విడిచిపెట్టిన తర్వాత యిర్మీయాకు యెహోవా నుండి వాక్కు వచ్చింది. నెబూజరదాను యెరూషలేము, యూదా నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్తున్న వారిలో గొలుసులతో బంధించబడి ఉన్న యిర్మీయాను చూశాడు.
JER 40:2 రాజ రక్షక దళాధిపతి యిర్మీయాతో, “నీ దేవుడైన యెహోవా ఈ స్థలానికి విపత్తు రప్పిస్తానని ప్రకటించారు కదా.
JER 40:3 ఇప్పుడు యెహోవా దాన్ని రప్పించి తాను చెప్పినట్లే ఆయన చేశారు. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయనకు లోబడలేదు కాబట్టి ఇదంతా జరిగింది.
JER 40:4 అయితే ఈ రోజు నేను నీ మణికట్టుకు ఉన్న సంకెళ్ళ నుండి నిన్ను విడిపిస్తున్నాను. నీకు ఇష్టమైతే నాతో పాటు బబులోనుకు రా, నేను నిన్ను చూసుకుంటాను; ఒకవేళ నాతో రావడం సరియైనది కాదని నీకు అనిపిస్తే రావద్దు. చూడు, దేశం మొత్తం నీ ముందు ఉంది; నీకిష్టమైన చోటికి వెళ్లు” అన్నాడు.
JER 40:5 అయితే, యిర్మీయా బయలుదేరక ముందు, నెబూజరదాను, “బబులోను రాజు యూదా పట్టణాలపై నియమించిన షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరకు తిరిగివెళ్లి, అతనితో పాటు ప్రజలమధ్య నివసించు, లేదా ఎక్కడికి వెళ్లడం సరియైనది అని నీకు అనిపిస్తే అక్కడికి వెళ్లు” అని చెప్పాడు. తర్వాత దళాధిపతి అతనికి ఆహారపదార్థాలు బహుమానం ఇచ్చి అతన్ని పంపించాడు.
JER 40:6 కాబట్టి యిర్మీయా మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి వెళ్లి, దేశంలో మిగిలిపోయిన ప్రజలమధ్య నివసించాడు.
JER 40:7 బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడని, అలాగే బబులోనుకు బందీలుగా వెళ్లకుండా మిగిలిన నిరుపేదలైన పురుషులు, స్త్రీలు, పిల్లల మీద అధికారిగా నియమించాడని చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న సైన్య అధిపతులందరు, వారి మనుష్యులు విన్నప్పుడు,
JER 40:8 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారులైన యోహానాను యోనాతాను, తన్హుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీయుడైన ఏఫా కుమారులు, మయకాతీయుని కుమారుడైన యెజన్యా వారి మనుష్యులు మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు వచ్చారు.
JER 40:9 అప్పుడు షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యా ప్రమాణం చేసి, వారికి వారి భద్రత గురించి నమ్మకం కలిగించడానికి, “బబులోనీయులకు సేవ చేయడానికి మీరు భయపడకండి; దేశంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి, మీకు అంతా మంచే జరుగుతుంది.
JER 40:10 మన దగ్గరకు వచ్చే బబులోనీయుల ముందు మీకు ప్రాతినిధ్యం వహించడానికి స్వయంగా నేనే మిస్పాలో ఉంటాను, అయితే మీరు ద్రాక్షరసాన్ని, వేసవికాలపు పండ్లను, ఒలీవ నూనెను సేకరించి, వాటిని మీ పాత్రల్లో నిల్వజేయండి, మీరు స్వాధీనం చేసుకున్న పట్టణాల్లో నివసించండి” అని అన్నాడు.
JER 40:11 బబులోను రాజు యూదాలో కొందరిని విడిచిపెట్టి షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడునైన గెదల్యాను వారి మీద అధిపతిగా నియమించాడని మోయాబు, అమ్మోను, ఎదోము ఇతర దేశాల్లో ఉన్న యూదులందరు విన్నప్పుడు,
JER 40:12 వారందరూ వారు చెదరగొట్టబడిన అన్ని దేశాల నుండి యూదా దేశానికి, మిస్పాలోని గెదల్యా దగ్గరకు తిరిగి వచ్చారు. వారు సమృద్ధిగా ద్రాక్షరసాన్ని వేసవికాలపు పండ్లను సేకరించారు.
JER 40:13 కారేహ కుమారుడైన యోహానాను, ఇంకా చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్న సైన్య అధికారులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరకు వచ్చి,
JER 40:14 అతనితో, “అమ్మోనీయుల రాజైన బాలిస్ నిన్ను చంపడానికి నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపాడని నీకు తెలియదా?” అని అన్నారు. కాని అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాటలు నమ్మలేదు.
JER 40:15 అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా మాట్లాడుతూ, “నేను వెళ్లి ఎవరికీ తెలియకుండా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును చంపుతాను. అతడు ఎందుకు నీ ప్రాణాన్ని తీయాలి, అలా చేసి, నీ చుట్టూ ఉన్న యూదులందరు చెదిరిపోయేలా, యూదా వారిలో మిగిలినవారు నాశనమయ్యేలా ఎందుకు చేయాలి?”
JER 40:16 అయితే అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడు యోహానానుతో, “అలాంటి పని చేయకు! ఇష్మాయేలు గురించి మీరు చెప్పేది నిజం కాదు” అన్నాడు.
JER 41:1 ఏడవ నెలలో, రాజవంశానికి చెందిన వాడు, రాజు అధికారులలో ఒకడైన ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొని మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరకు వచ్చాడు. అక్కడ వారు కలిసి భోజనం చేస్తుండగా,
JER 41:2 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతనితో ఉన్న పదిమంది మనుష్యులు లేచి, బబులోను రాజు ఆ దేశం మీద అధిపతిగా నియమించిన షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గంతో కొట్టి చంపారు.
JER 41:3 అంతటితో ఆగక, మిస్పాలో గెదల్యా దగ్గర ఉన్న యూదులందరిని, బబులోనీయుల సైనికులను ఇష్మాయేలు చంపివేశాడు.
JER 41:4 గెదల్యా హత్య జరిగిన మరుసటిరోజు, ఆ విషయం ఎవరికీ తెలియకముందే,
JER 41:5 తమ గడ్డాలు గీసుకుని, బట్టలు చింపుకుని, తమను తాము గాయపరచుకున్న ఎనభైమంది షెకెము, షిలోహు, సమరయ నుండి భోజనార్పణలు, ధూపం తీసుకుని యెహోవా ఆలయానికి వచ్చారు.
JER 41:6 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని కలుసుకోడానికి మిస్పా నుండి ఏడుస్తూనే వెళ్లాడు. అతడు వారిని కలుసుకున్నప్పుడు, అతడు వారితో, “అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి రండి” అని అన్నాడు.
JER 41:7 వారు పట్టణంలోకి వెళ్లినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతనితో ఉన్న మనుష్యులు వారిని చంపి గోతిలో పడేశారు.
JER 41:8 అయితే వారిలో పదిమంది ఇష్మాయేలుతో, “మమ్మల్ని చంపకు! మా దగ్గర గోధుమలు, యవలు, ఒలీవనూనె తేనె ఉన్నాయి, వాటిని పొలంలో దాచిపెట్టాము” అని అన్నారు. కాబట్టి అతడు వారిని మిగతా వారితోపాటు చంపలేదు.
JER 41:9 అతడు గెదల్యాతో పాటు చంపిన మనుష్యులందరి మృతదేహాలను పడవేసిన గోతిని గతంలో రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయెషా నుండి కాపాడుకోడానికి త్రవ్వించాడు. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దానిని మృతదేహాలతో నింపాడు.
JER 41:10 ఇష్మాయేలు మిస్పాలో ఉన్న మిగిలిన ప్రజలందరినీ రాజకుమార్తెలతో పాటు అక్కడ మిగిలిపోయిన వారందరినీ బందీలుగా చేశాడు. రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను వారి మీద అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడు. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని బందీలుగా తీసుకుని అమ్మోనీయుల దగ్గరకు బయలుదేరి వెళ్ళాడు.
JER 41:11 కారేహ కుమారుడైన యోహానాను, అతనితో ఉన్న సైన్య అధికారులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన నేరాల గురించి విని,
JER 41:12 తమ సైనికులందరిని తీసుకుని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్లారు. వారు గిబియోనులోని పెద్ద కొలను దగ్గర అతన్ని పట్టుకున్నారు.
JER 41:13 ఇష్మాయేలు అతనితో ఉన్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానాను అతనితో ఉన్న సైన్య అధికారులను చూసినప్పుడు, వారు సంతోషించారు.
JER 41:14 మిస్పాలో ఇష్మాయేలు బందీలుగా పట్టుకున్న ప్రజలంతా తిరిగి కారేహ కుమారుడైన యోహానాను దగ్గరికి వెళ్లారు.
JER 41:15 అయితే నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతని ఎనిమిది మంది మనుష్యులు యోహానాను నుండి తప్పించుకుని అమ్మోనీయుల దగ్గరకు పారిపోయారు.
JER 41:16 అప్పుడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను హత్యచేసిన తర్వాత కారేహ కుమారుడైన యోహానాను అతనితో ఉన్న సైన్య అధికారులందరూ మిస్పాలో ఇష్మాయేలు దగ్గర ప్రాణాలతో మిగిలి ఉన్న ప్రజలందరినీ అనగా గిబియోను నుండి ఇష్మాయేలు తీసుకెళ్లిన సైనికులను, స్త్రీలను, పిల్లలను ఆస్థాన అధికారులను తిరిగి తీసుకువచ్చారు.
JER 41:17 వారు బబులోనీయుల నుండి తప్పించుకోవడానికి వారు ఈజిప్టుకు వెళ్లే మార్గంలో బేత్లెహేము సమీపంలోని గెరూత్-కిమ్హాము దగ్గర ఆగారు.
JER 41:18 వారు బబులోను రాజు దేశానికి అధిపతిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపాడు కాబట్టి వారు బబులోనీయులకు భయపడ్డారు.
JER 42:1 అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను, హోషయా కుమారుడైన యెజన్యాతో సహా సైన్య అధికారులందరూ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరూ,
JER 42:2 యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి, “దయచేసి మా విన్నపం విని, ఈ మిగిలిన వారందరి కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు. ఎందుకంటే నీవిప్పుడు చూస్తున్నట్లుగా, మేము ఒకప్పుడు చాలా మందిమే అయినప్పటికీ, ఇప్పుడు కొద్ది మందిమి మాత్రమే మిగిలి ఉన్నాము.
JER 42:3 మేము ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో మాకు తెలియజేయమని నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు” అని అన్నారు.
JER 42:4 “నేను నీ మాట విన్నాను, మీరు కోరినట్లే నేను మీ దేవుడైన యెహోవాకు తప్పక ప్రార్థిస్తాను; యెహోవా చెప్పినదంతా నేను మీకు చెప్తాను మీ నుండి ఏమీ దాచను” అని యిర్మీయా ప్రవక్త జవాబిచ్చాడు.
JER 42:5 అప్పుడు వారు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీ దేవుడైన యెహోవా నీ ద్వారా మాకు తెలియజేసిన మాటల ప్రకారం మేము చేయకపోతే, యెహోవాయే మాకు వ్యతిరేకంగా నిజమైన, నమ్మకమైన సాక్షిగా ఉండును గాక.
JER 42:6 అది మాకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మేము నిన్ను పంపుతున్న మా దేవుడైన యెహోవాకు లోబడతాము. మా దేవుడైన యెహోవాకు లోబడితే మాకు మంచే జరుగుతుంది.”
JER 42:7 పది రోజుల తర్వాత యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది.
JER 42:8 కాబట్టి అతడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్య అధికారులందరినీ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరినీ పిలిచాడు.
JER 42:9 అతడు వారితో, “మీ విన్నపాన్ని తెలియజేయడానికి మీరు ఎవరి దగ్గరకు నన్ను పంపించారో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు:
JER 42:10 ‘మీరు ఈ దేశంలోనే ఉంటే, నేను మిమ్మల్ని కడతాను, కూల్చివేయను; నేను మిమ్మల్ని నాటుతాను, పెరికివేయను, ఎందుకంటే నేను మీకు కలిగించిన విపత్తు గురించి బాధపడ్డాను.
JER 42:11 ఇప్పుడు మీరు ఎవరికైతే భయపడుతున్నారో ఆ బబులోను రాజుకు మీరు భయపడవద్దు. అతనికి భయపడవద్దు, అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని రక్షిస్తాను అతని చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను.
JER 42:12 నేను మీమీద కనికరం చూపిస్తాను, అప్పుడు అతడు మీమీద కనికరం చూపి, మిమ్మల్ని మీ దేశానికి తిరిగి పంపుతాడు.’
JER 42:13 “అయితే, ‘మేము ఈ దేశంలో ఉండము’ అని చెప్పి, మీ దేవుడైన యెహోవాకు అవిధేయత చూపితే,
JER 42:14 ఒకవేళ మీరు, ‘వద్దు, మేము ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసిస్తాము. మేము యుద్ధం చూడం, బూరధ్వని వినం, రొట్టెల కోసం ఆకలితో ఉండం’ అని అంటే,
JER 42:15 యూదాలో మిగిలి ఉన్నవారలారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఒకవేళ మీరు ఈజిప్టుకు వెళ్లి, అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొని ఉంటే,
JER 42:16 మీరు ఏ ఖడ్గానికి భయపడతారో అది అక్కడ మిమ్మల్ని పట్టుకుంటుంది, మీరు భయపడే కరువు ఈజిప్టులోకి కూడా మిమ్మల్ని వెంటపడుతుంది, అక్కడే మీరు చనిపోతారు.
JER 42:17 నిజానికి, ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొనిన వారందరూ ఖడ్గం, కరువు, తెగులు వల్ల చస్తారు; నేను వారి మీదికి తెచ్చే విపత్తు నుండి వారిలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు, ప్రాణాలతో బయటపడలేరు.’
JER 42:18 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘యెరూషలేములో నివసించేవారి మీద నా కోపం, ఉగ్రత ఎలా కుమ్మరించానో, మీరు ఈజిప్టుకు వెళ్లినప్పుడు కూడా నా కోపం మీమీద అలాగే కుమ్మరిస్తాను. మీరు శాపగ్రస్తులుగా, భయానకంగా, శాపంగా, నిందగా అవుతారు; మీరు ఈ స్థలాన్ని మళ్ళీ చూడలేరు.’
JER 42:19 “యూదాలో మిగిలి ఉన్నవారలారా, ‘ఈజిప్టుకు వెళ్లవద్దు’ అని యెహోవా మీతో చెప్పారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి:
JER 42:20 మీరు నన్ను మీ దేవుడైన యెహావా దగ్గరకు పంపి, ‘మాకోసం మా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి, ఆయన చెప్పే ప్రతిదీ మాతో చెప్పు, మేము అలాగే చేస్తాము’ అని చెప్పి మీరు ఘోరమైన తప్పు చేశారని గుర్తుంచుకోండి.
JER 42:21 ఈ రోజు నేను మీతో చెప్పాను, కానీ మీకు చెప్పమని నన్ను పంపిన వాటన్నిటిలో దేనికి మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు.
JER 42:22 కాబట్టి ఇప్పుడు ఈ విషయం తప్పక గుర్తుంచుకోండి: మీరు ఎక్కడికి వెళ్లి స్థిరపడాలనుకున్నా మీరు ఖడ్గం, కరువు, తెగులు వల్ల చనిపోతారు.”
JER 43:1 వారి దేవుడైన యెహోవా వారికి చెప్పమని తెలియజేసిన వాక్కులన్నిటిని యిర్మీయా ప్రజలకు చెప్పడం ముగించిన తర్వాత ఏ వాక్కులు చెప్పమని యెహోవా అతన్ని వారి దగ్గరకు పంపాడో ఆ వాక్కులన్నిటిని చెప్పిన తర్వాత,
JER 43:2 హోషయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను, ఇంకా గర్విష్ఠులైన కొందరు యిర్మీయాతో, “నీవు అబద్ధం చెప్తున్నావు! ‘మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడకూడదు’ అని చెప్పమని మా దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.
JER 43:3 అయితే నేరియా కుమారుడైన బారూకు మమ్మల్ని బబులోనీయులకు అప్పగించమని నిన్ను మా మీదికి రెచ్చగొడుతున్నాడు, అలా చేస్తే వారు మమ్మల్ని చంపుతారు లేదా బబులోనుకు బందీలుగా తీసుకెళ్తారు” అని అన్నారు.
JER 43:4 కాబట్టి కారేహ కుమారుడైన యోహానాను, సైన్య అధికారులందరూ, ప్రజలందరూ యూదా దేశంలో ఉండాలి అనే యెహోవా ఆజ్ఞను ఉల్లంఘించారు.
JER 43:5 అందుకు బదులుగా, కారేహ కుమారుడైన యోహానాను సైన్య అధికారులందరూ ఆయా దేశాలకు పారిపోయి యూదా దేశానికి తిరిగివచ్చిన మిగిలి ఉన్న యూదా ప్రజలందరిని తీసుకెళ్లారు.
JER 43:6 షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యా దగ్గర రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను విడిచిపెట్టిన వారందరినీ అనగా పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను కూడా వారు తీసుకెళ్లారు. అలాగే వారు ప్రవక్తయైన యిర్మీయాను, నేరియా కుమారుడైన బారూకును తమ వెంట తీసుకెళ్లారు.
JER 43:7 వారు యెహోవాకు లోబడక ఈజిప్టులో ప్రవేశించి, తహ్పన్హేసు వరకు వెళ్లారు.
JER 43:8 తహ్పన్హేసులో యిర్మీయాకు యెహోవా వాక్కు ఇలా వచ్చింది:
JER 43:9 “యూదులు చూస్తుండగానే, నీతో పాటు కొన్ని పెద్ద రాళ్లను తీసుకెళ్లి, తహ్పన్హేసులోని ఫరో రాజభవనం ద్వారం దగ్గర ఉన్న ఇటుక కాలిబాటలో మట్టిలో పాతిపెట్టు.
JER 43:10 అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను నా సేవకుడును బబులోను రాజైన నెబుకద్నెజరును పిలిపించి, నేను ఇక్కడ పాతిపెట్టిన ఈ రాళ్లపై అతని సింహాసనాన్ని ఏర్పాటు చేస్తాను; అతడు వాటి మీద తన రాజ మండపాన్ని వేస్తాడు.
JER 43:11 అతడు వచ్చి ఈజిప్టుపై దాడి చేసి, చావవలసినవారు చనిపోయేలా, బందీలుగా వెళ్లవలసినవారు బందీలుగా వెళ్లేలా, ఖడ్గానికి బలి కావలసినవారిని ఖడ్గం పాలు అయ్యేలా చేస్తాడు.
JER 43:12 అతడు ఈజిప్టు దేవతల ఆలయాలకు నిప్పంటిస్తాడు; అతడు వారి దేవాలయాలను కాల్చివేస్తాడు వారి దేవుళ్ళను బందీగా తీసుకుంటాడు. ఒక గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పేళ్లను దులిపివేసినట్లు అతడు ఈజిప్టును శుభ్రంగా దులిపివేసి అక్కడినుండి సమాధానంగా వెళ్లిపోతాడు.
JER 43:13 అక్కడ ఈజిప్టులోని బేత్-షెమెషులో ఉన్న సూర్య దేవాలయంలో పవిత్ర స్తంభాలను పడగొట్టి, ఈజిప్టు దేవతల ఆలయాలను కాల్చివేస్తాడు.’ ”
JER 44:1 ఈజిప్టులోని మిగ్దోలు, తహ్పన్హేసు, మెంఫిసులో, పత్రూసులో నివసిస్తున్న యూదులందరి గురించి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది:
JER 44:2 “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: యెరూషలేము మీదా యూదా పట్టణాలన్నింటి మీదా నేను తెచ్చిన మహా విపత్తును మీరు చూశారు. వారు చేసిన దుర్మార్గం కారణంగా నేడు అవి నిర్జనమై శిథిలావస్థలో ఉన్నాయి.
JER 44:3 వారికి గాని, మీకు గాని, మీ పూర్వికులకు గాని ఎన్నడూ తెలియని ఇతర దేవతలకు వారు ధూపం వేసి, పూజించి వారు నా కోపాన్ని రెచ్చగొట్టారు.
JER 44:4 ‘నేను అసహ్యించుకునే ఈ అసహ్యకరమైన పనిని చేయవద్దు!’ అని చెప్పమని మళ్ళీ మళ్ళీ నేను నా సేవకులైన ప్రవక్తలను పంపాను, వారు వెళ్లి చెప్పారు.
JER 44:5 కానీ వారు వినలేదు, అసలు పట్టించుకోలేదు. వారు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు, ఇతర దేవతలకు ధూపం వేయడం ఆపలేదు.
JER 44:6 కాబట్టి, నా తీవ్రమైన కోపం యూదా పట్టణాల మీదా, యెరూషలేము వీధుల మీదా కుమ్మరించబడి వాటిని నేటి వరకు పాడైపోయిన శిథిలాలుగా మిగిల్చింది.
JER 44:7 “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: యూదాలో స్త్రీలూ, పురుషులు, పిల్లలు, పసిపిల్లలు ఎవరూ ఉండకుండా నిర్మూలం అయ్యేలా, మీలో ఎవరూ మిగలకుండా మీ మీదికి మీరే విపత్తు ఎందుకు తెచ్చుకుంటున్నారు?
JER 44:8 మీరు నివసించడానికి వచ్చిన ఈజిప్టులో ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ, మీ చేతులు చేసిన వాటితో ఎందుకు నా కోపాన్ని రెచ్చగొడుతున్నారు? మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు, భూమిపై ఉన్న అన్ని దేశాల మధ్య మిమ్మల్ని మీరు ఒక శాపంగా చేసుకుంటారు, అవమానం పాలవుతారు.
JER 44:9 మీ పూర్వికులు, యూదా రాజులు, రాణులు చేసిన దుర్మార్గాన్ని, యూదా దేశంలో, యెరూషలేము వీధుల్లో మీరు, మీ భార్యలు చేసిన దుర్మార్గాన్ని మీరు మరచిపోయారా?
JER 44:10 ఈ రోజు వరకు వారు తమను తాము తగ్గించుకోలేదు, గౌరవం చూపించలేదు, నేను మీ ముందు, మీ పూర్వికుల ముందు ఉంచిన నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను మీరు అనుసరించలేదు.
JER 44:11 “కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ మీదికి విపత్తు తెచ్చి యూదా అంతటిని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాను.
JER 44:12 ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకున్న యూదా వారిలో మిగిలి ఉన్నవారిని నేనే అక్కడికి తీసుకువెళ్తాను. వారంతా ఈజిప్టులో నశిస్తారు; వారు ఖడ్గం వల్ల చనిపోతారు లేదా కరువుతో చనిపోతారు. సామాన్యుల నుండి గొప్పవారి వరకు, వారు ఖడ్గం చేత గాని కరువుచేత గాని చనిపోతారు. వారు శాపంగాను, భయం పుట్టించే వారుగాను; ఒక శాపంగాను నిందకు కారణమైనవారిగాను అవుతారు.
JER 44:13 నేను యెరూషలేమును ఎలా శిక్షించానో ఈజిప్టులో నివసించేవారిని కూడా ఖడ్గంతో, కరువుతో, తెగులుతో అలాగే శిక్షిస్తాను.
JER 44:14 ఈజిప్టులో నివసించడానికి వెళ్లిన యూదా వారిలో మిగిలి ఉన్న వారెవరూ తప్పించుకోలేరు, ఎక్కడికైతే తిరిగివెళ్లి జీవించాలని అనుకుంటున్నారో, ఆ యూదా దేశానికి ప్రాణాలతో తిరిగి వెళ్లరు; పారిపోయిన కొంతమంది తప్ప ఎవరూ తిరిగి వెళ్లరు.”
JER 44:15 అప్పుడు తమ భార్యలు ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తున్నారని తెలిసిన పురుషులు, అక్కడ ఉన్న స్త్రీలందరు పెద్ద సమాజంగా చేరి దిగువ ఎగువ ఈజిప్టులో అనగా పత్రూసులో నివసిస్తున్న ప్రజలందరూ యిర్మీయాతో ఇలా అన్నారు,
JER 44:16 “యెహోవా పేరిట నీవు మాతో చెప్పిన సందేశాన్ని మేము వినము.
JER 44:17 ఖచ్చితంగా మాకు ఇష్టం వచ్చినట్లే మేము చేస్తాము: మేము, మా పూర్వికులు, మా రాజులు మా అధికారులు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో చేసినట్లుగా మేము కూడా ఆకాశ రాణికి ధూపం వేస్తాము ఆమెకు పానార్పణలు అర్పిస్తాము. ఆ సమయంలో మాకు పుష్కలంగా ఆహారం ఉండింది, మేము బాగున్నాం, ఎలాంటి హాని జరగలేదు.
JER 44:18 ఆకాశ రాణికి ధూపం వేయడం ఆమెకు పానార్పణలు అర్పించడం మానివేసినప్పటి నుండి మా దగ్గర ఏమి లేకుండా పోయింది, మేము ఖడ్గం చేత కరువుచేత నాశనమవుతున్నాము.”
JER 44:19 ఆ స్త్రీలు ఇంకా ఇలా అన్నారు: “మేము ఆకాశ రాణికి ధూపం వేసి, ఆమెకు పానార్పణలు అర్పించినప్పుడు, మేము ఆమె ప్రతిమకు నచ్చిన రొట్టెలు చేసి, ఆమెకు పానార్పణలు అర్పిస్తున్నామని మా భర్తలకు తెలియదా?” అని అన్నారు.
JER 44:20 అప్పుడు యిర్మీయా తనకు జవాబిస్తున్న స్త్రీ పురుషులందరితో ఇలా అన్నాడు:
JER 44:21 “మీరు, మీ పూర్వికులు, మీ రాజులు, మీ అధికారులు దేశ ప్రజలు, యూదా పట్టణాల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ ధూపం వేసిన విషయం యెహోవా గుర్తుంచుకుని జ్ఞాపకం తెచ్చుకోలేదా?
JER 44:22 మీ దుష్ట కార్యాలను, మీరు చేసిన అసహ్యకరమైన పనులను యెహోవా ఇక భరించలేనప్పుడు, మీ దేశం నేడు ఉన్నట్లుగా శాపంగా, నివాసులు లేని నిర్జనమైనదిగా మారింది.
JER 44:23 ఎందుకంటే మీరు ధూపం వేసి, యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసి, ఆయనకు విధేయత చూపలేదు, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన శాసనాలను, ఆయన నిబంధనలను అనుసరించలేదు కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఈ విపత్తు మీ మీదికి వచ్చింది.”
JER 44:24 అప్పుడు యిర్మీయా స్త్రీలతో సహా ప్రజలందరితో, “ఈజిప్టులోని యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి.
JER 44:25 ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానార్పణలు అర్పిస్తాం, మేము మ్రొక్కుకున్న మ్రొక్కుబడులను నిశ్చయంగా నెరవేరుస్తాం’ అని మీరు మీ భార్యలు ప్రమాణం చేసినట్టే మీరు చేశారు. “అయితే సరే అలాగే కానివ్వండి, మీరు వాగ్దానం చేసినట్లు చేయండి! మీ మ్రొక్కుబడులను చెల్లించుకోండి!
JER 44:26 అయితే ఈజిప్టులో నివసిస్తున్న యూదులారా, యెహోవా మాట వినండి: ‘నా గొప్ప నామం తోడు’ అంటూ యెహోవా ఇలా చెప్తున్నారు, ‘ఈజిప్టులో నివసించే యూదా వారెవరూ ఇకపై, “ప్రభువైన యెహోవా జీవం తోడు.”
JER 44:27 ఎందుకంటే నేను వారికి మేలు చేయాలని కాదు వారికి కీడు చేయడం కోసమే ఎదురు చూస్తున్నాను. ఈజిప్టులోని యూదులు పూర్తిగా నాశనమయ్యే వరకు ఖడ్గంతోను కరువుతోను చస్తారు.
JER 44:28 ఖడ్గం నుండి తప్పించుకుని ఈజిప్టు నుండి యూదా దేశానికి తిరిగి వచ్చేవారు చాలా తక్కువ. అప్పుడు ఈజిప్టులో నివసించడానికి వచ్చిన యూదా శేషులంతా ఎవరి మాట నెరవేరుతుందో! నాదో వారిదో అనేది తెలుసుకుంటారు.
JER 44:29 “ ‘నేను ఈ స్థలంలో నిన్ను శిక్షిస్తాను అనడానికి ఇది నీకు సూచనగా ఉంటుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘తద్వార నీకు హాని చేస్తాననే నా బెదిరింపులు తప్పక నిజమవుతాయని మీరు తెలుసుకుంటారు.’
JER 44:30 యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను ఎలాగైతే యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించానో, అలాగే ఈజిప్టు రాజైన ఫరో హోఫ్రాను అతన్ని చంపాలనుకుంటున్న అతని శత్రువుల చేతులకు అప్పగించబోతున్నాను.’ ”
JER 45:1 యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలన నాల్గవ సంవత్సరంలో యిర్మీయా ప్రవక్త చెప్పిన మాటలను నేరియా కుమారుడైన బారూకు గ్రంథపుచుట్టలో వ్రాసినప్పుడు, యిర్మీయా బారూకుతో ఇలా అన్నాడు:
JER 45:2 “బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీతో ఇలా అంటున్నారు:
JER 45:3 ‘అయ్యో నాకు శ్రమ! యెహోవా నా బాధకు దుఃఖాన్ని జోడించారు; నేను మూలుగులతో సొమ్మసిల్లిపోయాను, నాకు నెమ్మది లేదు’ అని నీవు అనుకుంటున్నావు.
JER 45:4 అయితే యెహోవా నీతో, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నేను కట్టిన దాన్ని నేనే కూలదోస్తాను, నేను నాటిన వాటిని నేనే పెరికివేస్తాను; ఇది భూమి అంతటా జరుగుతుంది’ అని చెప్పమని నాకు చెప్పారు.
JER 45:5 ‘అలాంటప్పుడు నీకోసం నీవు గొప్ప వాటిని వెదుక్కోవాలా? వాటిని వెదకవద్దు. నేను ప్రజలందరికి విపత్తు తెస్తాను, కానీ నీవు ఎక్కడికి వెళ్లినా నీవు ప్రాణాలతో తప్పించుకునేలా చేస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
JER 46:1 ఇతర దేశాల గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు:
JER 46:2 ఈజిప్టును గురించి: యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు చేతిలో యూఫ్రటీసు నది దగ్గర కర్కెమీషులో ఓడిపోయిన ఈజిప్టు రాజైన ఫరో నెకో సైన్యానికి వ్యతిరేకంగా వచ్చిన సందేశం ఇది:
JER 46:3 “చిన్న, పెద్ద డాళ్లను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరండి.
JER 46:4 గుర్రాలను సిద్ధం చేసుకోండి, గుర్రాలను ఎక్కండి! శిరస్త్రాణం ధరించి బయలుదేరడానికి సిద్ధపడండి! నీ ఈటెలను పదును చేయండి, మీ కవచాన్ని ధరించండి!
JER 46:5 నేను చూస్తున్నదేంటి? వారు భయభ్రాంతులకు గురవుతున్నారు, వారు వెన్ను చూపుతున్నారు, వారి యోధులు ఓడిపోయారు. వారు వెనుకకు చూడకుండ వేగంగా పారిపోతున్నారు, అన్నివైపులా భయమే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 46:6 “వేగంగా పరుగెత్తేవారు పారిపోలేరు, బలాఢ్యులు తప్పించుకోలేరు. ఉత్తరాన యూఫ్రటీసు నదీ తీరాన వారు తడబడి పడిపోతున్నారు.
JER 46:7 “నైలు నది ప్రవాహంలా ప్రవహించే నదుల్లా వస్తున్నదెవరు?
JER 46:8 ఈజిప్టు నైలు నదిలా, ఉప్పెనలా ప్రవహిస్తుంది. ఆమె ఇలా అన్నది, ‘నేను లేచి భూమిని కప్పివేస్తాను, పట్టణాలను వాటిలోని ప్రజలను నాశనం చేస్తాను’ అంటుంది.
JER 46:9 గుర్రాల్లారా ఎగరండి, రథాల్లారా రెచ్చిపోండి! యోధులారా, డాళ్లు మోసే కూషు వారలారా, పూతు వారలారా, బయలుదేరండి, విల్లు విసిరే లిడియా పురుషులారా ముందుకు నడవండి.
JER 46:10 అయితే ఈ దినం సైన్యాల అధిపతియైన యెహోవాది; తన శత్రువుల మీద పగతీర్చుకునే దినం. ఖడ్గం తనకు తృప్తి కలిగే వరకు హతమారుస్తుంది, తన రక్త దాహం తీరే వరకు హతమారుస్తుంది. ఎందుకంటే యూఫ్రటీసు నది ప్రక్కన ఉత్తర దేశంలో సైన్యాల అధిపతియైన యెహోవా బలి అర్పించబోతున్నారు.
JER 46:11 “కన్యయైన ఈజిప్టు కుమారీ, గిలాదుకు వెళ్లి ఔషధతైలం తెచ్చుకో. కానీ నీవు అనేక మందులు వాడడం వ్యర్థమే; నీకు స్వస్థత కలుగదు.
JER 46:12 దేశాలు నీ అవమానం గురించి వింటాయి; నీ కేకలు భూమంతటా వినబడతాయి. యోధులు ఒకరికొకరు తగిలి తడబడి; ఇద్దరూ కలిసి క్రిందకు పడిపోతారు.”
JER 46:13 ఈజిప్టుపై దాడి చేయడానికి బబులోను రాజైన నెబుకద్నెజరు రావడం గురించి యెహోవా యిర్మీయా ప్రవక్తతో చెప్పిన సందేశం ఇది:
JER 46:14 “ఈజిప్టులో ప్రకటన చేయండి, మిగ్దోలులో చాటించండి; మెంఫిసులో, తహ్పన్హేసులో కూడా చాటించండి: ‘ఖడ్గం నీ చుట్టూ ఉన్నవారందరిని హతమారుస్తుంది, కాబట్టి మీరు మీ స్థానాల్లో సిద్ధంగా ఉండండి.’
JER 46:15 నీ బలవంతులు ఎందుకు దిగజారిపోతారు? వారు నిలబడలేరు, ఎందుకంటే యెహోవా వారిని క్రిందికి నెట్టివేస్తారు.
JER 46:16 వారు పదే పదే తడబడతారు; వారు ఒకరి మీద ఒకరు పడతారు. వారు, ‘లేవండి, మనం అణచివేసే వారి ఖడ్గానికి దూరంగా, మన స్వదేశాలకు, మన సొంత ప్రజల దగ్గరికి తిరిగి వెళ్దాం’ అని చెప్తారు.
JER 46:17 అక్కడ వారు, ‘ఈజిప్టు రాజు ఫరో పెద్ద శబ్దం మాత్రమే; అతడు తన అవకాశాన్ని కోల్పోయాడు’ అని గట్టిగా కేకలు వేస్తారు.
JER 46:18 “నా జీవం తోడు” అని రాజు ప్రకటిస్తున్నారు, ఆయన పేరు సైన్యాల యెహోవా, “పర్వతాల మధ్య తాబోరు లాంటివాడు, సముద్రం ఒడ్డున ఉన్న కర్మెలు లాంటివాడు వస్తాడు.
JER 46:19 ఈజిప్టులో నివసించేవారలారా, బందీలుగా వెళ్లడానికి మీ సామాన్లు సర్దుకోండి, ఎందుకంటే మెంఫిసు పాడుచేయబడి, నివాసులు లేక శిథిలమవుతుంది.
JER 46:20 “ఈజిప్టు అందమైన పాడి ఆవు, అయితే దాని మీదికి ఉత్తరం నుండి జోరీగ వస్తున్నది.
JER 46:21 దాని శాలల్లో ఉన్న కిరాయి సైనికులు బలిసిన దూడల వంటివారు. వారు కూడా నిలబడలేక, వెనక్కి పారిపోతారు. విపత్తు రోజు వారి మీదికి రాబోతోంది, అది వారు శిక్షించబడే సమయము.
JER 46:22 శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు పారిపోతున్న సర్పంలా ఈజిప్టు బుసలు కొడుతుంది. చెట్లు నరికేవారు గొడ్డళ్లతో వచ్చినట్లు వారు ఆమె మీదికి వస్తారు.
JER 46:23 ఆమె దట్టమైన అడవులను, వారు నరికివేస్తారు” అని యెహోవా చెప్తున్నారు. “వారి సంఖ్య మిడతల కంటే ఎక్కువ, వారిని లెక్కించలేము.
JER 46:24 ఈజిప్టు కుమార్తె అవమానించబడుతుంది, ఉత్తరాది ప్రజల చేతికి అప్పగించబడుతుంది.”
JER 46:25 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “తేబేసులోని ఆమోను దేవున్ని, ఫరోను, ఈజిప్టును దాని దేవుళ్ళను, రాజులను, ఫరోను నమ్ముకున్న వారిని శిక్షించబోతున్నాను.
JER 46:26 వారిని చంపాలనుకున్న వారి చేతులకు అనగా బబులోను రాజైన నెబుకద్నెజరుకు అతని అధికారులకు నేను వారిని అప్పగిస్తాను. ఆ తర్వాత ఈజిప్టు గతంలో ఉన్నట్లే నివాసయోగ్యంగా ఉంటుంది” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 46:27 “నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలూ, కలవరపడకు. నేను నిన్ను సుదూర ప్రాంతం నుండి తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతివారిని బందీలుగా ఉన్న దేశం నుండి రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ శాంతి భద్రతలు కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు.
JER 46:28 నా సేవకుడైన యాకోబూ, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను” అని యెహోవా చెప్తున్నారు. “నేను నిన్ను చెదరగొట్టే దేశాలన్నిటిని పూర్తిగా నాశనం చేసినా, నిన్ను పూర్తిగా నాశనం చేయను. కాని నేను నిన్ను తగినంతగా శిక్షిస్తాను; శిక్షించకుండ మాత్రం నిన్ను వదిలిపెట్టను.”
JER 47:1 ఫరో ఇంకా గాజా మీద దాడిచేయక ముందు ఫిలిష్తీయుల గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు:
JER 47:2 యెహోవా ఇలా చెప్తున్నారు: “ఉత్తరాన జలప్రవాహాలు ఎలా ఎగసిపడుతున్నాయో చూడండి; అవి వరదలా పొంగి పొర్లిపారుతాయి. అవి దేశం మీద, అందులో ఉన్న వాటన్నిటి మీద, పట్టణాల మీద, వాటిలో నివసించేవారి మీద పొర్లిపారుతాయి. కాబట్టి ప్రజలంతా మొరపెడతారు; దేశంలో నివసించేవారంతా ఏడుస్తారు.
JER 47:3 పరుగెత్తే గుర్రాల డెక్కల శబ్దానికి, శత్రు రథాల శబ్దానికి వాటి చక్రాల శబ్దానికి వారు రోదిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయరు; వారి చేతులు బలహీనంగా ఉంటాయి.
JER 47:4 ఎందుకంటే ఆ రోజు వచ్చింది, ఫిలిష్తీయులందరినీ నాశనం చేసే రోజు తూరు, సీదోనులకు సహాయం చేసేవారందరిని తొలగించే రోజు తప్పకుండా వస్తుంది. యెహోవా ఫిలిష్తీయులను, కఫ్తోరు తీరాల్లో మిగిలి ఉన్నవారిని నాశనం చేయబోతున్నారు.
JER 47:5 గాజా దుఃఖంలో తల క్షౌరం చేసుకుంటుంది; అష్కెలోను నిశ్శబ్దం చేయబడుతుంది. సమతల మైదానంలో మిగిలి ఉన్నవారలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపరచుకుంటారు?
JER 47:6 “ ‘అయ్యో, యెహోవా ఖడ్గమా, నీవు ఎంత కాలానికి విశ్రాంతి తీసుకుంటావు? నీ ఒర లోనికి తిరిగివెళ్లి ప్రశాంతంగా విశ్రమించు.’
JER 47:7 అయితే అష్కెలోను మీదా, సముద్ర తీర ప్రాంతాల మీద దాడి చేయమని, యెహోవా దాన్ని ఆజ్ఞాపించినప్పుడు, అది ఎలా విశ్రమిస్తుంది?”
JER 48:1 మోయాబు గురించి: ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: “నెబోకు శ్రమ, అది శిథిలమైపోతుంది. కిర్యతాయిము ఆక్రమించబడి అవమానించబడుతుంది; దాని కోట పడగొట్టబడి అవమానించబడుతుంది.
JER 48:2 మోయాబును ఇకపై పొగడరు; హెష్బోను ప్రజలు ఆమె పతనానికి కుట్ర చేస్తారు: ‘రండి, ఆ దేశాన్ని అంతం చేద్దాము.’ మద్మేను ప్రజలారా, మీరు కూడా మౌనంగా ఉంటారు; ఖడ్గం నిన్ను వెంటాడుతుంది.
JER 48:3 హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినబడుతున్నాయి, అక్కడ మహా వినాశనం, నాశనం జరుగుతున్నాయి.
JER 48:4 మోయాబు ధ్వంసమవుతుంది; దాని చిన్న బిడ్డలు బిగ్గరగా ఏడుస్తారు.
JER 48:5 వారు కొండపై నుండి లూహీతుకు, ఏడుస్తూ వెళ్తున్నారు; హొరొనయీముకు వెళ్లే దారిలో జరిగిన విధ్వంసం వల్ల ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.
JER 48:6 పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి; ఎడారిలో పొదలా ఉండండి.
JER 48:7 మీరు మీ క్రియలను, ఐశ్వర్యాన్ని నమ్ముతారు కాబట్టి, మీరు కూడా బందీలుగా కొనిపోబడతారు, అలాగే కెమోషు దేవుడు తన యాజకులతో, అధికారులతో పాటు బందీగా వెళ్తాడు.
JER 48:8 యెహోవా చెప్పారు కాబట్టి నాశనం చేసేవాడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు, ఒక్క పట్టణం తప్పించుకోదు. లోయ పాడైపోతుంది, పీఠభూమి నాశనమవుతుంది.
JER 48:9 మోయాబుకు రెక్కలు ఇవ్వబడితే, అది ఎగిరిపోయి, దేశం వ్యర్థంగా పడి ఉండేది; నివసించేవారు లేక, దాని పట్టణాలు నిర్జనమైపోయేవి.
JER 48:10 “యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులు! రక్తం చిందించకుండ తమ ఖడ్గాన్ని ఒరలో పెట్టేవారు శాపగ్రస్తులు!
JER 48:11 “మోయాబు యవ్వన నుండి ప్రశాంతంగా ఉండింది, ఒక బాన నుండి మరొక బానలో పోయబడని, అడుగున మడ్డితో ఉన్న ద్రాక్షరసంలా ఉండింది, అది చెరలోకి వెళ్లలేదు. కాబట్టి దాని రుచి ఎప్పటిలాగే ఉంది, దాని సువాసన మారలేదు.”
JER 48:12 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో నేను, కుండను కుమ్మరించే వారిని పంపినప్పుడు, వారు దాన్ని బయటకు కుమ్మరించి, కుండలను ఖాళీచేసి వాటిని పగలగొడతారు.
JER 48:13 ఇశ్రాయేలీయులు బేతేలును నమ్మినప్పుడు ఎలా సిగ్గుపడ్డారో మోయాబీయులు కెమోషును బట్టి సిగ్గుపడతారు.
JER 48:14 “ ‘మేము యోధులం, యుద్ధంలో పరాక్రమవంతులం’ అని మీరు ఎలా చెప్పగలరు?
JER 48:15 మోయాబు నాశనమై దాని పట్టణాలు ఆక్రమించబడతాయి; దాని శ్రేష్ఠమైన యువకులు వధకు గురవుతారు,” అని రాజు ప్రకటిస్తున్నారు, ఆయన పేరు సైన్యాల యెహోవా.
JER 48:16 “మోయాబు పతనం సమీపించింది; దాని విపత్తు త్వరగా వస్తుంది.
JER 48:17 దాని చుట్టూ నివసించేవారలారా, దాని కీర్తి తెలిసినవారలారా, దాని గురించి దుఃఖించండి; ‘బలమైన రాజదండం ఎలా విరిగిపోయింది, కీర్తి కలిగిన దండం ఎలా విరిగిపోయింది!’ అని అనండి.
JER 48:18 “దీబోను కుమార్తెలారా, మీ కీర్తి నుండి క్రిందికి దిగి, ఎండిపోయిన నేల మీద కూర్చుండి, ఎందుకంటే మోయాబును నాశనం చేసేవాడు మీ మీదికి వస్తాడు మీ కోట పట్టణాలను పతనం చేస్తాడు.
JER 48:19 అరోయేరులో నివసించేవారలారా, రోడ్డు ప్రక్కన నిలబడి చూడండి. పారిపోతున్న పురుషుడిని, తప్పించుకుంటున్న స్త్రీని, ‘ఏమైంది?’ అని అడగండి.
JER 48:20 మోయాబు కుప్పకూలిపోయి, అపకీర్తి పాలయింది. రోదించండి, బిగ్గరగా ఏడవండి! మోయాబు నాశనమైపోయిందని అర్నోనులో ప్రకటించండి.
JER 48:21 పీఠభూమికి తీర్పు తీర్చబడింది హోలోనుకు, యహజుకు, మెఫాతుకు,
JER 48:22 దీబోనుకు, నెబోకు, బేత్-దిబ్లాతయీము,
JER 48:23 కిర్యతాయిముకు, బేత్-గమూలుకు, బేత్-మెయోనుకు,
JER 48:24 కెరీయోతుకు, బొస్రాకు దూరంగా దగ్గరగా ఉన్న మోయాబులోని అన్ని పట్టణాలకు శిక్ష విధించబడుతుంది.
JER 48:25 మోయాబు కొమ్ము నరికివేయబడింది; దాని బాహువు విరిగింది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 48:26 “ఆమెకు మత్తు ఎక్కేలా త్రాగించండి, ఎందుకంటే ఆమె యెహోవాను ధిక్కరించింది. మోయాబు తన వాంతిలో పడిదొర్లుతుంది; ఆమె హేళన చేయబడుతుంది.
JER 48:27 ఇశ్రాయేలును మీరు హేళన చేయలేదా? ఆమె దొంగల మధ్య పట్టుబడిన దానిలా, నీవు ఆమె గురించి ఎప్పుడు మాట్లాడినా ఛీ అన్నట్లుగా తల ఊపుతావు?
JER 48:28 మోయాబులో నివసించేవారలారా, మీ పట్టణాలను విడిచిపెట్టి రాళ్ల మధ్య నివసించండి. గుహ ముఖద్వారం దగ్గర గూడు కట్టుకునే పావురంలా ఉండండి.
JER 48:29 “మోయాబు గర్వం గురించి దానికి అహంకారం గురించి దాని తలపొగరు, దాని గర్వం, దాని దురహంకారం, దాని హృదయ అతిశయం గురించి విన్నాము.
JER 48:30 దాని తలపొగరు నాకు తెలుసు, దానికి ఏ విలువలేదు, దాని ప్రగల్భాలు ఏమీ సాధించవు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 48:31 కాబట్టి నేను మోయాబు గురించి రోదిస్తున్నాను, మోయాబు అంతటి కోసం నేను బిగ్గరగా ఏడుస్తున్నాను, కీర్ హరెశెతు ప్రజల కోసం నేను మూలుగుతున్నాను.
JER 48:32 షిబ్మా ద్రాక్షలారా, యాజెరు ఏడ్చినట్లు, నేను మీ కోసం ఏడుస్తున్నాను. మీ కొమ్మలు సముద్రం వరకు వ్యాపించాయి; అవి యాజెరు వరకు వ్యాపించాయి. నాశనం చేసేవాడు, పండిన మీ పండ్ల మీద, ద్రాక్షపండ్ల మీద పడ్డాడు.
JER 48:33 మోయాబు పండ్ల తోటల్లో నుండి, పొలాల్లో నుండి ఆనందం, సంతోషం పోయాయి. నేను వారి గానుగల నుండి ద్రాక్షరసం రాకుండ చేశాను; ఆనందంతో కేకలువేస్తూ వాటిని ఎవరూ త్రొక్కరు. కేకలు వినిపించినప్పటికీ, అవి ఆనందంతో వేసిన కేకలు కావు.
JER 48:34 “నిమ్రీములోని నీళ్లు కూడా ఎండిపోయాయి కాబట్టి హెష్బోను నుండి ఎల్యాలెహు యాహాజుల వరకు, సోయరు నుండి హొరొనయీము, ఎగ్లత్-షెలీషియాల వరకు, వారి కేకలు వినిపిస్తున్నాయి.
JER 48:35 క్షేత్రాల దగ్గర అర్పణలు అర్పించేవారిని మోయాబులో తమ దేవుళ్ళకు ధూపం వేసేవారిని నేను మోయాబులో లేకుండా చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 48:36 “కాబట్టి నా హృదయం మోయాబు గురించి పిల్లనగ్రోవిలా విలపిస్తుంది; అది కీర్ హరెశెతు ప్రజలకు పిల్లనగ్రోవిలా విలపిస్తుంది. వారు సంపాదించిన సంపద పోయింది.
JER 48:37 ప్రతి తల గుండు చేయబడింది ప్రతి గడ్డం కత్తిరించబడింది; ప్రతి చేయి నరకబడింది ప్రతి నడుము గోనెపట్టతో కప్పబడింది.
JER 48:38 మోయాబులో ఇళ్ల పైకప్పులన్నిటి మీద బహిరంగ కూడళ్లలో దుఃఖం తప్ప మరేమీ లేదు, పనికిరాని కుండను పగలగొట్టినట్లు నేను మోయాబును పగులగొట్టాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 48:39 “అది ఎలా శిథిలమైపోయిందో! వారు ఎలా విలపిస్తున్నారో! మోయాబు సిగ్గుతో ఎలా వెన్నుచూపిస్తుందో! మోయాబు దాని చుట్టూ ఉన్నవారందరికి, హేళనగా భయం పుట్టించేదిగా మారింది.”
JER 48:40 యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి! ఒక గ్రద్ద మోయాబు మీద రెక్కలు విప్పుకుని దూసుకుపోతుంది.
JER 48:41 కెరీయోతు స్వాధీనం చేసుకోబడుతుంది, బలమైన కోటలు వారి స్వాధీనం అవుతాయి. ఆ రోజు మోయాబు యోధుల హృదయాలు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ హృదయంలా ఉంటాయి.
JER 48:42 మోయాబు యెహోవాను ధిక్కరించింది కాబట్టి ఒక జనాంగంగా ఉండకుండ నాశనమవుతుంది.
JER 48:43 మోయాబు ప్రజలారా, భయాందోళనలు, గొయ్యి, ఉచ్చు మీ కోసం ఎదురుచూస్తున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 48:44 “భయాందోళన నుండి పారిపోయేవాడు గొయ్యిలో పడిపోతాడు, గొయ్యిలో నుండి తప్పించుకుని పైకి వచ్చినవాడు ఉచ్చులో చిక్కుకుంటాడు; నేను మోయాబు మీదికి దాన్ని శిక్షించే సంవత్సరాన్ని రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 48:45 “పారిపోయినవారు హెష్బోను నీడలో బలహీనులై నిలబడి ఉన్నారు, హెష్బోను నుండి అగ్ని, సీహోను మధ్య నుండి మంటలు బయలుదేరాయి. అది మోయాబు నొసళ్లను, అహంకారుల పుర్రెలను కాల్చివేస్తుంది.
JER 48:46 మోయాబూ, నీకు శ్రమ! కెమోషు ప్రజలు నాశనమైపోయారు; నీ కుమారులు బందీలుగా వెళ్లారు నీ కుమార్తెలు బందీలుగా కొనిపోబడ్డారు.
JER 48:47 “అయితే నేను రాబోయే రోజుల్లో మోయాబు వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. దీనితో మోయాబుపై తీర్పు ముగిసింది.
JER 49:1 అమ్మోనీయుల గురించి: యెహోవా ఇలా చెప్తున్నారు: “ఇశ్రాయేలుకు కుమారులు లేరా? ఇశ్రాయేలుకు వారసుడు లేడా? మోలెకు గాదును ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు? అతని ప్రజలు దాని పట్టణాల్లో ఎందుకు నివసిస్తున్నారు?
JER 49:2 అయితే ఆ రోజులు రాబోతున్నాయి” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “అమ్మోనీయుల రబ్బాకు వ్యతిరేకంగా నేను యుద్ధధ్వని చేసినప్పుడు; అది శిథిలాల దిబ్బ అవుతుంది, దాని చుట్టుప్రక్కల గ్రామాలు అగ్నికి ఆహుతి అవుతాయి. అప్పుడు ఇశ్రాయేలు దాన్ని వెళ్లగొట్టిన వారిని వెళ్లగొడుతుంది,” అని యెహోవా అంటున్నారు.
JER 49:3 “హెష్బోనూ, ఏడువు. ఎందుకంటే హాయి నాశనం చేయబడింది! రబ్బా నివాసులారా, బిగ్గరగా ఏడవండి! గోనెపట్ట కట్టుకుని దుఃఖించండి; గోడల లోపల ఇటు అటు పరుగెత్తండి, ఎందుకంటే మోలెకు దేవుడు తన యాజకులు, అధికారులతో పాటు బందీగా వెళ్తాడు.
JER 49:4 మీ లోయలు చాలా ఫలవంతమైనవి, అని మీరు మీ లోయల గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటారు? అమ్మోనూ, నమ్మకద్రోహియైన కుమార్తె, నీవు నీ సంపదపై నమ్మకం ఉంచి, ‘నాపై ఎవరు దాడి చేస్తారు?’ అని అంటున్నావు.
JER 49:5 నీ చుట్టూ ఉన్న వారందరి నుండి నీకు భయం పుట్టిస్తాను” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు. “మీలో ప్రతి ఒక్కరు తరిమివేయబడతారు, పారిపోయినవారిని ఎవరూ సమకూర్చరు.
JER 49:6 “అయితే, నేను అమ్మోనీయులను చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 49:7 ఎదోము గురించి: సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “తేమానులో ఇక జ్ఞానం లేదా? వివేకవంతులు సలహా ఇవ్వడం మానివేశారా? వారి జ్ఞానం తగ్గిపోయిందా?
JER 49:8 దేదానులో నివసించేవారలారా, వెనక్కి తిరిగి పారిపోయి లోతైన గుహల్లో దాక్కోండి, నేను ఏశావు మీదికి విపత్తు రప్పించి వారిని శిక్షిస్తాను.
JER 49:9 ద్రాక్షలు పోగుచేసుకునేవారు మీ దగ్గరకు వస్తే, వారు కొన్ని ద్రాక్షలు వదిలేయరా? రాత్రివేళ దొంగలు వస్తే, వారికి కావలసినంత వారు దొంగిలించరా?
JER 49:10 అయితే నేను ఏశావును నగ్నంగా చేస్తాను; అతడు దాక్కునే స్థలాలను బయటపెడతాను, అప్పుడతడు ఎక్కడా దాక్కోలేడు. అతని సాయుధ పురుషులు నాశనానికి గురవుతారు, అతని సోదరులు పొరుగువారు కూడా నాశనమవుతారు. కాబట్టి,
JER 49:11 ‘తండ్రిలేని నీ పిల్లలను వదిలేయండి; నేను వారిని చూసుకుంటాను. నీ విధవరాండ్రు కూడా నన్ను నమ్ముకోవచ్చు’ అని చెప్పడానికి ఎవ్వరూ ఉండరు.”
JER 49:12 యెహోవా ఇలా అంటున్నారు: “పాత్రలోనిది త్రాగడానికి అర్హత లేనివారు కూడా దానిని త్రాగినప్పుడు మీరు శిక్షించబడకుండ ఎందుకు ఉండాలి? మీరు శిక్షించబడేలా దానిని మీరు త్రాగాలి.”
JER 49:13 యెహోవా, “నా జీవం తోడు, బొస్రా నాశనంగా, శాపంగా మారుతుందని, భయానకంగా, నిందలకు గురి అవుతుందని నా మీద నేను ప్రమాణం చేస్తున్నాను. దాని పట్టణాలన్ని శాశ్వతంగా శిథిలావస్థలో ఉంటాయి” అని ప్రకటిస్తున్నారు.
JER 49:14 నేను యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది; “దానిపై దాడి చేయడానికి మీరంతా కలిసి రండి! లెండి! యుద్ధానికి వెళ్దాం” అని చెప్పడానికి, దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.
JER 49:15 “ఇప్పుడు నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా, మనుష్యులు నిన్ను తృణీకరించేలా చేస్తాను.
JER 49:16 నీవు రేపిన భయాందోళనలు, నీ హృదయ గర్వం నిన్ను మోసం చేశాయి, బండ సందుల్లో నివసించేదానా, కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా, నీవు గ్రద్దలా ఎత్తైన చోట నీ గూడు కట్టుకున్నా అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను” అని యెహోవా చెప్తున్నారు.
JER 49:17 “ఎదోము నాశనం అవుతుంది; దారిన వెళ్లేవారంతా నివ్వెరపోతారు, దాని గాయాలన్నిటిని చూసి ఎగతాళి చేస్తారు.
JER 49:18 సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో పాటు పడగొట్టినట్లు వీటిని కూడా పడగొట్టిన తర్వాత అక్కడ ఎవరూ నివసించనట్లే; ఇక్కడ కూడా ప్రజలు నివసించరు” అని యెహోవా అంటున్నారు.
JER 49:19 “యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను ఎదోమును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”
JER 49:20 కాబట్టి ఎదోమును వ్యతిరేకంగా యెహోవా ఏమి ప్రణాళిక వేశారో వినండి, తేమానులో నివసించేవారికి ఆయన ఏమి ఉద్దేశించారో వినండి: మందలోని చిన్న పిల్లలు బయటకు ఈడ్చివేయబడతాయి; వారు చేసిన దానికి వారి పచ్చికబయళ్లు పాడుచేయబడతాయి.
JER 49:21 వారు పతనమైనప్పుడు భూమి కంపిస్తుంది; వారి మొర ఎర్ర సముద్రం వరకు వినిపిస్తుంది.
JER 49:22 చూడండి! శత్రువు తన రెక్కలు బొస్రా మీదుగా విప్పి గ్రద్దలా దూసుకుపోతాడు. ఆ రోజున ఎదోము యోధులు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా వేదనలో ఉంటారు.
JER 49:23 దమస్కు గురించి: “హమాతు, అర్పదు చెడువార్త విని భయంతో క్రుంగిపోయారు. వారు హృదయంలో కలవరపడ్డారు, నెమ్మది లేని సముద్రంలా ఆందోళన పడుతున్నారు.
JER 49:24 దమస్కు బలహీనమైపోయింది, పారిపోవడానికి అది వెనుకకు తిరిగింది, భయం దాన్ని పట్టుకుంది; ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా దానికి వేదన, బాధ కలిగాయి.
JER 49:25 పేరు పొందిన పట్టణం, నేను ఆనందించే పట్టణం ఎందుకు వదల్లేదు?
JER 49:26 నిశ్చయంగా, దాని యువకులు వీధుల్లో కూలిపోతారు; ఆ రోజున దాని సైనికులందరూ మూగబోతారు,” అని సైన్యాల యెహోవా ప్రకటించారు.
JER 49:27 “నేను దమస్కు గోడలకు నిప్పు పెడతాను; అది బెన్-హదదు కోటలను దహించివేస్తుంది.”
JER 49:28 బబులోను రాజైన నెబుకద్నెజరు దాడి చేసిన కేదారు, హాసోరు రాజ్యాల గురించి: యెహోవా ఇలా అంటున్నారు: “లేవండి, లేచి కేదారు మీద దాడి చేసి తూర్పు ప్రజలను నాశనం చేయండి.
JER 49:29 వారి గుడారాలు, వారి మందలు స్వాధీనం చేసుకోబడ్తాయి; వారి ఒంటెలు, వారి మొత్తం సామాగ్రితో పాటు, వారి గుడారాలను తీసుకెళ్తారు. ‘అన్నివైపులా భయమే!’ అని ప్రజలు వారితో అంటారు.
JER 49:30 “త్వరగా పారిపోండి! హాసోరులో నివసించేవారలారా, లోతైన గుహల్లో దాక్కోండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “బబులోను రాజైన నెబుకద్నెజరు నీకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. అతడు నీకు వ్యతిరేకంగా ఒక పథకం వేశాడు.
JER 49:31 “మీరు లేచి, నిర్భయంగా జీవిస్తూ, ద్వారాలు గాని అడ్డు గడియలు గాని లేకుండ ప్రజలు క్షేమంగా ఉంటున్న, దేశం మీద దాడి చేయండి,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 49:32 “వారి ఒంటెలు దోచుకోబడతాయి, వారి విస్తారమైన మందలు యుద్ధంలో కొల్లగొట్టబడతాయి. సుదూర ప్రాంతాలకు నలువైపులా వారిని చెదరగొట్టి వారి మీదికి అన్నివైపులా విపత్తు తెస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 49:33 “హాసోరు నక్కలకు నిలయంగా, ఎప్పటికీ నిర్జన ప్రదేశంగా మారుతుంది. అక్కడ ఎవరూ నివసించరు; దానిలో ఏ ప్రజలు నివసించరు.”
JER 49:34 యూదా రాజైన సిద్కియా పాలనలో ఏలామును గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు ఇది:
JER 49:35 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను ఏలాము బలానికి మూలమైన విల్లును విరగ్గొడతాను.
JER 49:36 నేను ఏలాముకు వ్యతిరేకంగా ఆకాశంలోని నాలుగు దిక్కుల నుండి నాలుగు గాలులను రప్పిస్తాను; నేను వారిని నాలుగు గాలులకు చెదరగొడతాను, చెదిరిపోయిన ఏలాము వారు వెళ్లని దేశమే ఉండదు.
JER 49:37 నేను ఏలామును వారి శత్రువుల ఎదుట, వారిని చంపాలనుకున్న వారి ఎదుట వారిని చెదరగొడతాను. నేను వారి మీదికి విపత్తును, నా కోపాగ్నిని కూడా రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను వారిని అంతం చేసే వరకు ఖడ్గంతో వారిని వెంటాడుతాను.
JER 49:38 ఏలాములో నా సింహాసనాన్ని స్థాపించి, దాని రాజును, అధికారులను నాశనం చేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 49:39 “అయినప్పటికీ నేను రాబోయే రోజుల్లో ఏలాముకు చెందిన వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 50:1 బబులోను గురించి, బబులోనీయుల దేశం గురించి యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన వాక్కు ఇది:
JER 50:2 “దేశాల మధ్య ప్రకటన చేసి, చాటించండి, ఒక జెండాను ఎత్తి దాన్ని చాటించండి; ఏదీ దాచకుండా ఇలా చెప్పండి, ‘బబులోను స్వాధీనం చేసుకోబడుతుంది; బేలు దేవుడు సిగ్గుపరచబడతాడు, మర్దూకు దేవత పడవేయబడుతుంది. బబులోను ప్రతిమలు సిగ్గుపరచబడతాయి, దాని విగ్రహాలు పడద్రోయబడతాయి.’
JER 50:3 ఉత్తర దిక్కునుండి ఒక దేశం దానిపై దాడి చేసి దాని దేశాన్ని పాడుచేస్తుంది. దానిలో ఎవరూ నివసించరు; మనుష్యులు పారిపోతారు జంతువులు పారిపోతాయి.
JER 50:4 “ఆ రోజుల్లో, ఆ సమయంలో, ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కలిసి తమ దేవుడైన యెహోవాను వెదకడానికి కన్నీటితో వెళ్తారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 50:5 వారు సీయోనుకు వెళ్లే దారి ఎటు అని అడిగి ఆ దారిలో ప్రయాణిస్తారు. వారు వచ్చి మరచిపోలేని శాశ్వతమైన ఒడంబడికలో యెహోవాకు కట్టుబడి ఉంటారు.
JER 50:6 “నా ప్రజలు తప్పిపోయిన గొర్రెలు; వారి కాపరులు వారిని తప్పుత్రోవ పట్టించి వారిని పర్వతాలమీద తిరిగేలా చేశారు. వారు పర్వతాలు, కొండలమీద తిరుగుతూ, తమ సొంత విశ్రాంతి స్థలాన్ని మరచిపోయారు.
JER 50:7 వారిని చూసినవారు వారిని మ్రింగివేశారు; వారి శత్రువులు, ‘మేము దోషులం కాదు, ఎందుకంటే వారు తమ నీతి సింహాసనమైన యెహోవాకు, తమ పూర్వికుల నిరీక్షణయైన యెహోవాకు విరోధంగా పాపం చేశారు’ అని అన్నారు.
JER 50:8 “బబులోను నుండి పారిపోండి; బబులోనీయుల దేశాన్ని విడిచిపెట్టండి, మందను నడిపించే మేకపోతుల్లా ప్రజల ముందు నడవండి.
JER 50:9 నేను బబులోనుకు వ్యతిరేకంగా ఉత్తర దేశం నుండి గొప్ప దేశాల కూటమిని రప్పిస్తాను. వారు దానికి వ్యతిరేకంగా యుద్ధపంక్తులు తీర్చుతారు, ఉత్తరం నుండి దాన్ని పట్టుకుంటారు. వారి బాణాలు వట్టి చేతులతో తిరిగి రాని నైపుణ్యం కలిగిన యోధుల వలె ఉంటాయి.
JER 50:10 కాబట్టి బబులోను దోచుకోబడుతుంది; దాన్ని దోచుకునే వారందరూ సంతృప్తి చెందుతారు” అని యెహోవా ప్రకటించాడు.
JER 50:11 “నా స్వాస్థ్యాన్ని దోచుకునేవారలారా, అది మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది ధాన్యం నూర్పిడి చేస్తున్న దూడలా బలమైన గుర్రాల్లా మీరు సకిలిస్తున్నారు.
JER 50:12 నీ తల్లి చాలా సిగ్గుపడుతుంది; నీకు జన్మనిచ్చిన ఆమె పరువు పోతుంది. అది దేశాలన్నిటిలో నీచమైనదిగా అరణ్యంగా, ఎండిన భూమిగా, ఎడారిగా ఉంటుంది.
JER 50:13 యెహోవా కోపం వలన అది నివాసయోగ్యంగా ఉండదు. పూర్తిగా నిర్జనమైపోతుంది. బబులోను దాటి వెళ్లే వారందరూ నివ్వెరపోతారు; దాని గాయాలన్నిటిని బట్టి వారు ఎగతాళి చేస్తారు.
JER 50:14 “బబులోను చుట్టూ యుద్ధపంక్తులు తీరండి, విల్లును వంచగలిగిన ప్రతి ఒక్కరు విల్లు లాగండి. అది యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసింది, దానిపై బాణాలు వేయండి! మీ బాణాలు దాచుకోవద్దు.
JER 50:15 అన్ని వైపుల నుండి దానిమీద కేకలు వేయండి! అది లొంగిపోతుంది, దాని బురుజులు పడిపోయాయి, దాని గోడలు కూలిపోయాయి. ఇది యెహోవా ప్రతీకారం కాబట్టి, దాని మీద ప్రతీకారం తీర్చుకోండి; అది ఇతరులకు చేసినట్లు దానికి చేయండి.
JER 50:16 బబులోను నుండి విత్తేవారిని, కొడవలితో కోత కోసేవారిని నిర్మూలం చేయండి. అణచివేసే వారి ఖడ్గం కారణంగా ప్రతి ఒక్కరూ తమ ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరూ తమ సొంత దేశానికి పారిపోతున్నారు.
JER 50:17 “ఇశ్రాయేలు చెదరిపోయిన గొర్రెలు సింహాలు వాటిని తరిమికొట్టాయి. మొదట అష్షూరు రాజు వాటిని మ్రింగివేశాడు; చివరిగా బబులోను రాజైన నెబుకద్నెజరు వాటి ఎముకలను విరగ్గొట్టాడు.”
JER 50:18 కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను అష్షూరు రాజును శిక్షించినట్లే బబులోను రాజును అతని దేశాన్ని శిక్షిస్తాను.
JER 50:19 అయితే నేను ఇశ్రాయేలీయులను వారి పచ్చిక బయళ్లకు తిరిగి రప్పిస్తాను, వారు కర్మెలు బాషాను మీద మేస్తారు. ఎఫ్రాయిం గిలాదు కొండలమీద వారు తృప్తి చెందుతారు.”
JER 50:20 యెహోవా ప్రకటిస్తున్నదేంటంటే, “ఆ రోజుల్లో, ఆ సమయంలో, ఇశ్రాయేలీయుల అపరాధాల కోసం వెదకుతారు, కానీ అవి కనబడవు, అలాగే యూదా కోసం వెదకుతారు, కానీ అవి దొరకవు, మిగిలి ఉన్నవారిని నేను క్షమిస్తాను.
JER 50:21 “మెరతాయీము మీద దాడి చేయండి. పేకోదులో నివసించేవారి మీద దాడి చేయండి,” వెంటాడి, వారిని చంపి పూర్తిగా నాశనం చేయండి, అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను నీకు ఆజ్ఞాపించినదంతా చేయండి.
JER 50:22 దేశంలో యుద్ధధ్వని, మహా విధ్వంసపు ధ్వని వినబడుతుంది!
JER 50:23 మొత్తం భూమిని కొడుతున్న సుత్తి ఎలా విరిగి పగిలిపోయిందో! దేశాల మధ్య బబులోను ఎలా నిర్జనమైపోయిందో చూడండి!
JER 50:24 బబులోనూ, నీ కోసం ఉచ్చు బిగించాను అది నీకు తెలియకముందే దానిలో చిక్కుకున్నావు. నీవు యెహోవాను వ్యతిరేకించావు కాబట్టి నిన్ను కనుగొని బంధించాను.
JER 50:25 బబులోనీయుల దేశంలో ప్రభువైన సైన్యాల యెహోవా చేయవలసిన పని ఉంది. కాబట్టి యెహోవా తన ఆయుధశాలను తెరిచి తన ఉగ్రతను తీర్చే ఆయుధాలను బయటకు తెచ్చారు.
JER 50:26 దూరం నుండి ఆమెపై దాడి చేయడానికి రండి. ఆమె ధాన్యాగారాలు తెరవండి; ధాన్యం కుప్పలా ఆమెను పోగు చేయండి. దాన్ని పూర్తిగా నాశనం చేయండి ఆమెలో దేన్ని వదలవద్దు.
JER 50:27 దాని కోడెలన్నిటినీ చంపండి; వాటిని వధకు పంపండి! వారికి శ్రమ దినం వచ్చింది, వారు శిక్షించబడే సమయం వచ్చింది.
JER 50:28 బబులోను నుండి తప్పించుకొని పారిపోయినవారి శబ్దం వినిపిస్తుంది మన దేవుడైన యెహోవా తన మందిరం కోసం ఎలా ప్రతీకారం తీర్చుకున్నారో, సీయోనులో ప్రకటించండి.
JER 50:29 “బబులోను మీదికి రమ్మని, విలుకాండ్రను బాణాలు విసిరే వారిని పిలువండి. ఆమె చుట్టూ చేరండి; ఎవరూ తప్పించుకోకూడదు. ఆమె చేసిన వాటికి ప్రతిఫలం ఇవ్వండి; ఆమె చేసినట్లే ఆమెకు చేయండి. ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను ఆమె ధిక్కరించింది.
JER 50:30 కాబట్టి, ఆమె యువకులు వీధుల్లో కూలిపోతారు; ఆ రోజున ఆమె సైనికులందరూ మూగబోతారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 50:31 సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “అహంకారి, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను, నీ శ్రమ దినం వచ్చింది, నీవు శిక్షించబడే సమయం వచ్చింది.
JER 50:32 గర్విష్ఠులు తడబడి పడిపోతారు ఆమెను లేపడానికి ఎవరూ సహాయం చేయరు. నేను ఆమె పట్టణాల్లో అగ్ని రాజేస్తాను అది ఆమె చుట్టూ ఉన్నవారందరిని కాల్చివేస్తుంది.”
JER 50:33 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కూడా అణచివేయబడ్డారు. వారిని బంధించినవారు వారిని పట్టుకొని ఉన్నారు వారిని విడిచిపెట్టడానికి నిరాకరించారు.
JER 50:34 అయినా వారి విమోచకుడు బలవంతుడు; ఆయన పేరు సైన్యాల యెహోవా. ఆయన వారి దేశానికి విశ్రాంతిని తెచ్చేలా వారి పక్షాన వాదిస్తారు, బబులోనులో నివసించేవారికి అశాంతి కలుగుతుంది.”
JER 50:35 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “బబులోనీయుల మీదికి బబులోనులో నివసించేవారి మీదికి దాని అధికారులు జ్ఞానుల మీదికి ఖడ్గం వస్తుంది.
JER 50:36 దాని అబద్ధ ప్రవక్తల మీదికి ఖడ్గం వస్తుంది! వారు మూర్ఖులు అవుతారు. దాని యోధుల మీదికి ఖడ్గం వస్తుంది! వారు భయంతో నిండిపోతారు.
JER 50:37 దాని గుర్రాలు రథాల మీదికి దానిలో ఉన్న విదేశీయులందరి మీదికి ఖడ్గం వస్తుంది! వారు స్త్రీలలా బలహీనులవుతారు. ఆమె సంపద మీదికి ఖడ్గం వస్తుంది! దాన్ని దోచుకుంటారు.
JER 50:38 దానికి నీళ్ల కరువు వస్తుంది! నీళ్లు ఎండిపోతాయి. అది విగ్రహాల దేశం, భయంకరమైన విగ్రహాల వల్ల ప్రజలు పిచ్చివారవుతారు.
JER 50:39 “కాబట్టి ఎడారి జీవులు, హైనాలు అక్కడ నివసిస్తాయి, గుడ్లగూబ అక్కడ నివసిస్తుంది. అది ఇంకెప్పుడు నివాసస్థలంగా ఉండదు తరతరాల వరకు దానిలో ఎవరూ నివసించరు.
JER 50:40 సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో పాటు పడగొట్టినట్లు వీటిని కూడా చేసిన తర్వాత, అక్కడ ఎవరూ నివసించనట్లే, ఇక్కడ కూడా ఎవరూ నివసించరు” అని యెహోవా అంటున్నారు.
JER 50:41 “చూడండి! ఉత్తర దిక్కునుండి ఒక సైన్యం వస్తుంది; ఒక గొప్ప దేశం అనేకమంది రాజులు భూదిగంతాల నుండి పురికొల్పబడతారు.
JER 50:42 వారు విల్లు, ఈటె పట్టుకుని ఉన్నారు; వారు క్రూరులు, కనికరం లేనివారు. వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు వారి స్వరం సముద్ర ఘోషలా ఉంటుంది; బబులోను కుమార్తె, నీ మీద దాడి చేయడానికి వారు యుద్ధ వ్యూహంలోని సైనికుల్లాగా వస్తారు.
JER 50:43 బబులోను రాజు వారి గురించిన వార్తలను విన్నాడు, అతని చేతులు వణికిపోయాయి. స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి వేదన అతన్ని పట్టుకుంది.
JER 50:44 యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను బబులోనును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”
JER 50:45 కాబట్టి, బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా ఏమి ప్రణాళిక వేశారో, బబులోనీయుల దేశానికి వ్యతిరేకంగా ఏమి ఉద్దేశించారో వినండి: మందలోని చిన్న పిల్లలు బయటకు ఈడ్చివేయబడతాయి; వారు చేసిన దానికి వారి పచ్చికబయళ్లు పాడుచేయబడతాయి.
JER 50:46 బబులోను పతనమైనప్పుడు భూమి కంపిస్తుంది; వారి మొర దేశాల్లో ప్రతిధ్వనిస్తుంది.
JER 51:1 యెహోవా ఇలా చెప్తున్నారు: “చూడండి, నేను బబులోనుకు, లేబ్-కమాయి ప్రజలకు వ్యతిరేకంగా నాశనకరమైన ఆత్మను రేపుతాను.
JER 51:2 బబులోనును చెదరగొట్టడానికి దాని దేశాన్ని నాశనం చేయడానికి విదేశీయులను పంపుతాను; దాని విపత్తు దినాన ప్రతి వైపున వారు దానిని వ్యతిరేకిస్తారు.
JER 51:3 విలుకాండ్రు తమ విల్లును తీయకుందురు గాక, తమ కవచాలను ధరించకుందురు గాక. దాని యువకులను విడిచిపెట్టవద్దు; దాని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేయాలి.
JER 51:4 వారు బబులోనులో హతమవుతారు, దాని వీధుల్లో ఘోరంగా గాయపరచబడతారు.
JER 51:5 ఎందుకంటే ఇశ్రాయేలు, యూదా దేశాలు ఇశ్రాయేలు పరిశుద్ధునికి వ్యతిరేకంగా చేసిన దోషాలతో నిండి ఉన్నప్పటికీ వారి దేవుడైన సైన్యాల యెహోవా వారిని విడిచిపెట్టలేదు.
JER 51:6 “బబులోను నుండి పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి! దాని పాపాలను బట్టి నాశనం కాకండి. ఇది యెహోవా ప్రతీకారం తీర్చుకునే సమయం; దానికి తగిన ప్రతిఫలం ఆయన చెల్లిస్తారు.
JER 51:7 బబులోను యెహోవా చేతిలో బంగారు గిన్నె; అది భూమినంతటిని మత్తెక్కించింది. అన్ని దేశాలు దాని ద్రాక్షారసాన్ని త్రాగాయి; కాబట్టి వారు ఇప్పుడు పిచ్చివారైపోయారు.
JER 51:8 బబులోను హఠాత్తుగా పడిపోయి విరిగిపోతుంది. దాని గురించి విలపించండి! దాని నొప్పికి ఔషధతైలం ఇవ్వండి; బహుశా దానికి నయం కావచ్చు.
JER 51:9 “ ‘మనం బబులోనును స్వస్థపరచి ఉండేవారం, కానీ దానికి స్వస్థత కలగదు; మనం దాన్ని విడిచి మన సొంత దేశానికి వెళ్దాం, ఎందుకంటే దాని తీర్పు ఆకాశాన్ని తాకుతుంది, అది మేఘాలంత ఎత్తుగా లేస్తుంది.’
JER 51:10 “ ‘యెహోవా మన నీతిని బయటపెట్టారు; రండి, మన దేవుడైన యెహోవా ఏమి చేశారో సీయోనులో చెప్పుదాము.’
JER 51:11 “బాణాలకు పదును పెట్టండి, కవచాలను తీసుకోండి! యెహోవా మాదీయుల రాజులను రెచ్చగొట్టారు, ఎందుకంటే బబులోనును నాశనం చేయడమే ఆయన ఉద్దేశము. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటారు, తన మందిరం కోసం ప్రతీకారం తీర్చుకుంటారు.
JER 51:12 బబులోను గోడలకు వ్యతిరేకంగా జెండా ఎత్తండి! రక్షకభటులను బలపరచండి, కావలివారిని నిలబెట్టండి, మాటుగాండ్రను సిద్ధం చేయండి! యెహోవా తన ఉద్దేశాన్ని, బబులోను ప్రజలకు వ్యతిరేకంగా తన శాసనాన్ని నెరవేర్చబోతున్నారు.
JER 51:13 అనేక జలాల ప్రక్కన నివసించేదానా, సమృద్ధి సంపదలు కలిగి ఉన్నదానా, నీ అంతం వచ్చింది, నీవు నాశనమయ్యే సమయం వచ్చింది.
JER 51:14 సైన్యాల యెహోవా తన జీవం తోడని ప్రమాణం చేశారు: మిడతల దండులా నేను నిన్ను నిశ్చయంగా మనుష్యులతో నింపుతాను, వారు నీపై విజయ కేకలు వేస్తారు.
JER 51:15 “ఆయన తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.
JER 51:16 ఆయన ఉరిమినప్పుడు, ఆకాశ జలాలు గర్జిస్తాయి; ఆయన భూదిగంతాల నుండి మేఘాలు లేచేలా చేస్తారు. ఆయన వర్షంతో మెరుపులు పంపి తన గిడ్డంగుల నుండి గాలిని రప్పిస్తారు.
JER 51:17 “మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు.
JER 51:18 అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.
JER 51:19 యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు, ఆయన పేరు సైన్యాల యెహోవా.
JER 51:20 “నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు, యుద్ధ ఆయుధంవంటివాడవు నీతో నేను దేశాలను చిన్నాభిన్నం చేస్తాను, నీతో రాజ్యాలను నాశనం చేస్తాను,
JER 51:21 నీతో నేను గుర్రాన్ని రౌతును చిన్నాభిన్నం చేస్తాను, నీతో నేను రథాన్ని సారథిని చిన్నాభిన్నం చేస్తాను,
JER 51:22 నీతో పురుషున్ని స్త్రీని చిన్నాభిన్నం చేస్తాను, నీతో వృద్ధులను చిన్నవారిని చిన్నాభిన్నం చేస్తాను, నీతో యువకులను యువతులను చిన్నాభిన్నం చేస్తాను,
JER 51:23 నీతో గొర్రెల కాపరిని మందను చిన్నాభిన్నం చేస్తాను, నీతో రైతును ఎద్దులను చిన్నాభిన్నం చేస్తాను, నీతో అధిపతులను అధికారులను చిన్నాభిన్నం చేస్తాను.
JER 51:24 “బబులోనుకు, బబులోనులో నివసించే వారందరికి సీయోనులో చేసిన అన్యాయానికి బదులుగా మీ కళ్లముందే నేను ప్రతిఫలం చెల్లిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 51:25 “నాశనం చేసే పర్వతమా, భూమి అంతటిని నాశనం చేసేదానా, నేను నీకు వ్యతిరేకిని,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీకు వ్యతిరేకంగా నా చేయి చాపి, నిన్ను కొండలమీద నుండి దొర్లించి, నిన్ను కాలిపోయిన పర్వతంలా చేస్తాను.
JER 51:26 ప్రజలు నీ నుండి మూలరాయిని గాని, పునాది రాయిని గాని తీసుకోరు, ఎందుకంటే నీవు శాశ్వతంగా నిర్జనమై ఉంటావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 51:27 “దేశంలో ఒక జెండా ఎత్తండి! దేశాల మధ్య బాకా ఊదండి! దానితో యుద్ధానికి జనాలను సిద్ధపరచండి; దాని మీద దాడి చేయడానికి: అరారతు, మిన్ని అష్కెనజు. దానికి వ్యతిరేకంగా సేనాధిపతిని నియమించండి; మిడతల దండులా గుర్రాలను పంపండి.
JER 51:28 మాదీయుల రాజులను, వారి అధిపతులను, వారి అధికారులందరిని, వారు పాలించే అన్ని దేశాలను దాని మీదికి యుద్ధానికి సిద్ధపరచండి.
JER 51:29 భూమి వణుకుతుంది, ప్రసవ వేదన పడుతుంది, బబులోను దేశాన్ని పాడు చేయాలని అక్కడ ఎవరూ నివసించకుండ చేయాలని యెహోవా ఉద్దేశాలలో మార్పు లేదు.
JER 51:30 బబులోను యోధులు యుద్ధం ఆపివేశారు; వారు తమ కోటల్లోనే ఉంటారు. వారి బలం సమసిపోయింది; వారు బలహీనులయ్యారు. దాని నివాసాలకు నిప్పు పెట్టారు; దాని ద్వారబంధాలు విరిగిపోయాయి.
JER 51:31 అతని పట్టణమంతా స్వాధీనం చేసుకోబడిందని బబులోను రాజుకు తెలియజేయడానికి, ఒక వార్తాహరుని వెంట మరో వార్తాహరుడు, ఒక దూత వెంట మరో దూత పరుగు పెడుతున్నారు.
JER 51:32 నదుల రేవులను ఆక్రమించబడ్డాయి. చిత్తడి నేలలకు నిప్పంటించబడింది, సైనికులు భయభ్రాంతులకు గురయ్యారు.”
JER 51:33 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “బబులోను కుమార్తె నూర్పిడి కళ్ళంలా ఉంది దాన్ని నూర్పిడి సమయం ఇదే; త్వరలో దాని కోతకాలం వస్తుంది.”
JER 51:34 “బబులోను రాజైన నెబుకద్నెజరు మనల్ని మ్రింగివేశాడు, మనల్ని గందరగోళంలో పడేశాడు, మనల్ని ఖాళీ కుండలా చేశాడు. ఘటసర్పంలా మనల్ని మ్రింగివేసి మన రుచికరమైన పదార్ధాలతో తన కడుపు నింపుకొని తర్వాత మనల్ని ఉమ్మివేశాడు.
JER 51:35 మన శరీరానికి చేసిన హింస బబులోనుకు జరుగును గాక,” అని సీయోను నివాసులు అంటున్నారు. “మా రక్తదోషం బబులోనులో నివసించేవారి మీద ఉండును గాక,” అని యెరూషలేము అంటుంది.
JER 51:36 కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను మీ పక్షంగా వాదిస్తాను, మీ కోసం ప్రతీకారం తీర్చుకుంటాను. నేను దాని సముద్రం ఆరిపోయేలా చేస్తాను, దాని నీటి ఊటలు ఎండిపోయేలా చేస్తాను.
JER 51:37 బబులోను శిథిలాల కుప్పగా, నక్కల నివాసంగా, భయానకంగా, హేళనగా, ఎవరూ నివసించని స్థలంగా అవుతుంది.
JER 51:38 దాని ప్రజలంతా కొదమ సింహాల్లా గర్జిస్తారు, సింహం పిల్లల్లా కేకలు వేస్తారు.
JER 51:39 అయితే వారు ఉత్సాహంగా ఉన్నప్పుడు, నేను వారికి విందు ఏర్పాటుచేసి, వారు సంతోషించేలా, మద్యంతో వారికి మత్తు ఎక్కేలా చేస్తాను అప్పుడు వారు శాశ్వతంగా నిద్రపోతారు, తిరిగి మేలుకోరు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 51:40 “వధకు గొర్రెపిల్లలను పొట్టేళ్లను, మేకలను తెచ్చినట్టు, నేను వారిని తీసుకువస్తాను.
JER 51:41 “భూమి అంతా మెచ్చుకునే, షేషకు ఎలా పట్టబడింది! దేశాల మధ్యలో బబులోను ఎంత నిర్జనంగా మారిందో!
JER 51:42 సముద్రం బబులోను మీదికి పొంగి వచ్చింది; ఎగసిపడే అలలు దాన్ని కప్పివేస్తాయి.
JER 51:43 దాని పట్టణాలు నిర్జనమై, ఎండిపోయి ఎడారిగా, ఎవరూ నివసించని దేశంగా ఉంది, ఎవరూ ప్రయాణించని దేశంగా ఉంటుంది.
JER 51:44 నేను బబులోనులో బేలును శిక్షిస్తాను అతడు మ్రింగివేసిన దాన్ని బయటకు కక్కేలా చేస్తాను. దేశాలు అతని దగ్గరకు ఇక గుంపులుగా రావు. బబులోను గోడ కూలిపోతుంది.
JER 51:45 “నా ప్రజలారా, దాని నుండి బయటకు రండి! మీ ప్రాణాలు కాపాడుకోండి! యెహోవా కోపాగ్ని నుండి పారిపోండి.
JER 51:46 దేశంలో పుకార్లు వినబడినప్పుడు, ధైర్యం కోల్పోవద్దు, భయపడవద్దు; ప్రతి సంవత్సరం ఒకదాని తర్వాత ఇంకొక పుకారు వస్తూనే ఉంటుంది, దేశంలో హింస జరుగుతుందని, పాలకునికి వ్యతిరేకంగా మరో పాలకుడు ఉన్నాడని పుకార్లు వినబడతాయి.
JER 51:47 ఎందుకంటే నేను బబులోను విగ్రహాలను శిక్షించే సమయం తప్పకుండా వస్తుంది; దాని దేశమంతా అవమానించబడుతుంది చనిపోయిన దాని ప్రజలు దానిలోనే పడిపోయి ఉంటారు.
JER 51:48 అప్పుడు భూమి ఆకాశాలు వాటిలో ఉన్నవన్నీ బబులోను గురించి ఆనందంతో కేకలు వేస్తాయి, ఎందుకంటే ఉత్తర దిక్కునుండి నాశనం చేసేవారు దాని మీద దాడి చేస్తారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 51:49 “బబులోను ఇశ్రాయేలు వారిని చంపినట్లే, బబులోను పతనం కావాలి బబులోనువారు భూమి అంతటా చంపబడతారు.
JER 51:50 ఖడ్గం నుండి తప్పించుకున్న వారలారా, వెళ్లిపొండి, ఆలస్యం చేయకండి! సుదూరదేశంలో ఉన్నాసరే, యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి.”
JER 51:51 “మేము అపకీర్తి పాలయ్యాము, ఎందుకంటే మేము అవమానించబడ్డాము సిగ్గు మా ముఖాలను కప్పివేస్తుంది, ఎందుకంటే యెహోవా మందిరంలోని పవిత్ర స్థలాల్లోకి విదేశీయులు ప్రవేశించారు.”
JER 51:52 యెహోవా ప్రకటిస్తున్నదేంటంటే, “రాబోయే రోజుల్లో, నేను దాని విగ్రహాలను శిక్షిస్తాను, దాని దేశమంతటా గాయపడినవారు మూల్గుతారు.
JER 51:53 బబులోను ఆకాశానికి ఎక్కి తన ఎత్తైన కోటను పటిష్టం చేసుకున్నా, నేను దాని మీదికి నాశనం చేసేవారిని పంపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
JER 51:54 “బబులోను నుండి ఏడ్పు వస్తుంది, బబులోనీయుల దేశం నుండి మహా విధ్వంస శబ్దం వస్తుంది.
JER 51:55 యెహోవా బబులోనును నాశనం చేస్తారు; ఆయన దాని సందడిని అణచివేస్తారు. శత్రువుల కెరటాలు మహా జలాల్లా ఎగసిపడతాయి; వారి స్వరాల గర్జన ప్రతిధ్వనిస్తుంది.
JER 51:56 బబులోను మీదికి నాశనం చేసేవాడు వస్తాడు; దాని యోధులు బందీలవుతారు, ఎందుకంటే వారి విల్లులు విరిగిపోతాయి. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు; ఆయన పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.
JER 51:57 నేను దాని ఉన్నతాధికారులు, జ్ఞానులు, దాని అధిపతులు, అధికారులు, యోధులు కూడా మద్యం త్రాగి మత్తెక్కేలా చేస్తాను. వారు శాశ్వతంగా నిద్రపోతారు ఇక మేలుకోరు,” అని సైన్యాల యెహోవా అనే పేరుగల రాజు ప్రకటిస్తున్నారు.
JER 51:58 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “బబులోను దృఢమైన గోడ నేలమట్టం అవుతుంది, దాని ఎత్తైన ద్వారాలకు నిప్పు పెట్టబడుతుంది. ప్రజలు వృధాగా కష్టపడుతున్నారు, దేశాల శ్రమ అగ్ని పాలవుతుంది.”
JER 51:59 యూదా రాజైన సిద్కియా పాలనలోని నాల్గవ సంవత్సరంలో మహశేయా మనుమడును నేరియా కుమారుడును రాజు వసతిగృహ అధికారియునైన శెరాయా, రాజైన సిద్కియాతో కలిసి బబులోనుకు వెళ్లినప్పుడు, ప్రవక్తయైన యిర్మీయా ఈ సందేశాన్ని అతనికి ఇచ్చాడు.
JER 51:60 యిర్మీయా ఒక గ్రంథపుచుట్టలో బబులోను మీదికి రాబోతున్న విపత్తులన్నిటిని గురించి వ్రాశాడు. బబులోను గురించి వ్రాయబడిన మాటలన్నిటిని దానిలో వ్రాశాడు.
JER 51:61 అప్పుడు యిర్మీయా శెరాయాతో, “మీరు బబులోనుకు చేరుకున్నప్పుడు, ఈ మాటలన్నీ బిగ్గరగా చదివి వినిపించు.
JER 51:62 తర్వాత ఇలా చెప్పండి, ‘యెహోవా, ఈ స్థలంలో మనుష్యులుగానీ, జంతువులుగానీ నివసించకుండ దాన్ని నాశనం చేస్తాను; అది శాశ్వతంగా పాడైపోయి ఉంటుందని యెహోవా చెప్పారు’ అని నీవు చెప్పాలి.
JER 51:63 నీవు ఈ గ్రంథపుచుట్ట చదవడం ముగించాక, దానికి ఒక రాయి కట్టి యూఫ్రటీసు నదిలో పడేయండి.
JER 51:64 తర్వాత, ‘నేను దాని మీదికి తెచ్చే విపత్తు వల్ల బబులోను ఇక లేవకుండ అలాగే మునిగిపోతుంది. దాని ప్రజలు పతనమవుతారు.’ అని నీవు చెప్పాలి.” యిర్మీయా మాటలు ఇంతటితో ముగిశాయి.
JER 52:1 సిద్కియా రాజైనప్పుడు అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు; ఆమె యిర్మీయా కుమార్తె; ఆమె లిబ్నా పట్టణస్థురాలు.
JER 52:2 యెహోయాకీము చేసినట్టే అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
JER 52:3 యెహోవా తీవ్రమైన కోపంతో వారిని తన సన్నిధి నుండి త్రోసివేసేంతగా ఈ చెడుతనం యెరూషలేము, యూదాల్లో జరిగింది. తర్వాత సిద్కియా బబులోను రాజుపై తిరుగుబాటు చేశాడు.
JER 52:4 కాబట్టి సిద్కియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం, పదవనెల పదవ రోజున, బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి బయలుదేరాడు. వారు పట్టణం బయట శిబిరం వేసుకుని దాని చుట్టూ ముట్టడి దిబ్బలు నిర్మించారు.
JER 52:5 సిద్కియా రాజు ఏలుబడిలో పదకొండవ సంవత్సరం వరకు పట్టణం ముట్టడిలో ఉంది.
JER 52:6 నాలుగవ నెల తొమ్మిదవ రోజున కరువు పట్టణంలో మరీ తీవ్రంగా ఉండడంతో ప్రజలకు ఆహారం లేకుండా పోయింది.
JER 52:7 పట్టణ గోడలు పడగొట్టి బబులోనీయులు పట్టణాన్ని చుట్టుముట్టినప్పుడు, సైన్యమంతా రాత్రివేళ రాజు తోట సమీపంలోని రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా వారు పట్టణాన్ని విడిచిపోయారు. వారు అరాబా వైపు పారిపోయారు.
JER 52:8 అయితే బబులోను సైన్యం సిద్కియా రాజును వెంటాడి, యెరికో సమతల మైదానంలో అతన్ని పట్టుకుంది. అతని సైనికులందరూ అతని నుండి చెదిరిపోయారు.
JER 52:9 అతడు పట్టుబడ్డాడు. అతన్ని హమాతు దేశంలోని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు.
JER 52:10 అక్కడ బబులోను రాజు రిబ్లాలో సిద్కియా కుమారులను, అలాగే యూదా పెద్దలందరినీ అతని కళ్లముందే చంపేశాడు.
JER 52:11 అప్పుడు అతడు సిద్కియా రాజు కళ్లు ఊడదీసి, ఇత్తడి సంకెళ్ళతో బంధించి, అతన్ని బబులోనుకు తీసుకెళ్లాడు. అతడు చనిపోయే వరకు అక్కడే చెరసాలలో ఉంచాడు.
JER 52:12 బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలనలోని పందొమ్మిదవ సంవత్సరం, అయిదవ నెల, పదవ రోజున బబులోను రాజు సేవకుడును రాజ రక్షక దళాధిపతియునైన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు.
JER 52:13 అతడు యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని యెరూషలేములోని ఇళ్ళన్నిటిని తగలబెట్టాడు. అతడు ప్రతి ప్రాముఖ్య భవనాన్ని తగలబెట్టాడు.
JER 52:14 రాజ రక్షక దళాధిపతి క్రింద ఉన్న బబులోను సైన్యమంతా యెరూషలేము చుట్టూ ఉన్న గోడలన్నిటిని పడగొట్టారు.
JER 52:15 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను నిరుపేదలైన కొందరిని పట్టణంలో మిగిలినవారిని, బబులోను రాజు పక్షం చేరిన వారిని, మిగిలిన నిపుణులైన చేతిపని వారిని బందీలుగా తీసుకెళ్లాడు.
JER 52:16 అయితే నెబూజరదాను ద్రాక్షతోటల్లో, పొలాల్లో పని చేయడానికి దేశంలోని కొంతమంది నిరుపేద ప్రజలను విడిచిపెట్టాడు.
JER 52:17 బబులోనీయులు యెహోవా మందిరం దగ్గర ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, ఇత్తడి గంగాళాన్ని పగలగొట్టి, ఆ ఇత్తడినంతటిని బబులోనుకు తీసుకెళ్లారు.
JER 52:18 వారు కుండలు, గడ్డపారలు, వత్తులు కత్తిరించే కత్తెరలను, చిలకరించే గిన్నెలు, గిన్నెలు ఆలయ సేవలో ఉపయోగించే అన్ని ఇత్తడి వస్తువులను కూడా తీసుకెళ్లారు.
JER 52:19 రాజ రక్షక దళాధిపతి పళ్లెములు, ధూపార్తులను, చిలకరింపు పాత్రలను, కుండలను, దీపస్తంభాలను, పానీయ అర్పణలకు ఉపయోగించే గిన్నెలను పాత్రలను మేలిమి బంగారంతో వెండితో చేసిన వాటన్నిటిని తీసుకెళ్లాడు.
JER 52:20 యెహోవా మందిరం కోసం సొలొమోను రాజు చేయించిన రెండు స్తంభాలు, గంగాళం, దాని క్రింద ఉన్న పన్నెండు ఇత్తడి ఎద్దులు, పీటలకున్న ఇత్తడిని తూకం వేయలేనంత ఎక్కువ బరువు కలవి.
JER 52:21 ఒక్కో స్తంభం ఎత్తు పద్దెనిమిది మూరలు, చుట్టుకొలత పన్నెండు మూరలు; ఒక్కొక్కటి నాలుగు వ్రేళ్ల మందంతో గుల్లగా ఉన్నాయి.
JER 52:22 ఒక స్తంభం మీద ఉన్న ఇత్తడి పీట ఎత్తు అయిదు మూరలు, దాని చుట్టూ అల్లికపనితో, ఇత్తడితో చేసిన దానిమ్మ పండ్లతో అలంకరించబడింది. ఇంకొక స్తంభం కూడా దానిమ్మ పండ్లతో అలాగే ఉంది.
JER 52:23 ప్రక్కలలో తొంభై ఆరు దానిమ్మపండ్లు ఉన్నాయి; చుట్టూరా అల్లికపని పైన ఉన్న మొత్తం దానిమ్మపండ్ల సంఖ్య వంద.
JER 52:24 రాజ రక్షక దళాధిపతి ముఖ్య యాజకుడైన శెరాయాను, ఆ తర్వాతి స్థానంలో ఉన్న యాజకుడైన జెఫన్యాను, ముగ్గురు ద్వారపాలకులను ఖైదీలుగా తీసుకెళ్లాడు.
JER 52:25 పట్టణంలో ఇంకా ఉన్నవారిలో నుండి అతడు సైనికుల అధికారిని, ఏడుగురు రాజ సలహాదారులను తీసుకెళ్లాడు. అంతేకాక, దేశప్రజలను సైన్యంలో చేర్చే ప్రధాన అధికారిగా ఉన్న కార్యదర్శిని, పట్టణంలో దొరికిన అరవైమంది ప్రముఖులను పట్టుకుని తీసుకెళ్లాడు.
JER 52:26 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను వారందరినీ పట్టుకుని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తీసుకెళ్లాడు.
JER 52:27 హమాతు దేశంలోని రిబ్లాలో బబులోను రాజు వారిని చంపించాడు. కాబట్టి యూదా తన దేశానికి దూరంగా బందీగా వెళ్లిపోయింది.
JER 52:28 నెబుకద్నెజరు బందీలుగా తీసుకెళ్లిన ప్రజల సంఖ్య ఇది: ఏడవ సంవత్సరంలో, 3,023 మంది యూదులు;
JER 52:29 నెబుకద్నెజరు పద్దెనిమిదవ సంవత్సరంలో, యెరూషలేము నుండి 832 మంది;
JER 52:30 నెబుకద్నెజరు తన పరిపాలన ఇరవై మూడవ సంవత్సరంలో, 745 మంది యూదులను రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను బందీలుగా తీసుకెళ్లాడు.
JER 52:31 యూదా రాజైన యెహోయాకీను బందీగా ఉన్న ముప్పై ఏడవ సంవత్సరం, ఆవిల్-మెరోదకు బబులోనుకు రాజైన సంవత్సరంలో, పన్నెండవ నెల ఇరవై అయిదవ రోజున, అతడు యూదా రాజైన యెహోయాకీనును జైలు నుండి విడుదల చేశాడు.
JER 52:32 అతడు యెహోయాకీనుతో దయగా మాట్లాడాడు. బబులోనులో తనతో ఉన్న ఇతర రాజుల స్థాయి కంటే ఉన్నత స్థాయిని అతనికిచ్చాడు.
JER 52:33 కాబట్టి యెహోయాకీను తన జైలు దుస్తులు తీసివేసి, ఇక తన జీవితాంతం రాజు బల్ల దగ్గర భోజనం చేశాడు.
JER 52:34 అతడు బ్రతికి ఉన్నంత కాలం, అతడు చనిపోయే వరకు, బబులోను రాజు ప్రతిరోజు క్రమంగా యెహోయాకీనుకు బత్తెం ఇచ్చాడు.
LAM 1:1 పట్టణం ఎలా నిర్జనమై ఉంది, ఒకప్పుడు జనంతో నిండి ఉండేది! ఆమె ఒక విధవరాలిలా ఎలా ఉంది, ఒకప్పుడు దేశాల మధ్య గొప్పదిగా ఉండేది! ఆమె రాజ్యాల మధ్య రాణిగా ఉండేది, కాని ఇప్పుడు బానిసగా మారింది.
LAM 1:2 రాత్రంతా ఆమె ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది, ఆమె చెంపల మీద కన్నీరు ఉంటుంది. ఆమె ప్రేమికులందరి మధ్య ఉన్నా ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. ఆమె స్నేహితులందరూ ఆమెను అప్పగించారు; వారు ఆమెకు శత్రువులయ్యారు.
LAM 1:3 బాధ, కఠిన శ్రమ తర్వాత, యూదా చెరకు వెళ్లిపోయింది. ఆమె జనాంగాల మధ్య నివసిస్తుంది; ఆమెకు విశ్రాంతి స్థలం దొరకడం లేదు. ఆమెను వెంటాడే వారంతా ఆమె కష్టాల మధ్య ఆమెను దాటి వెళ్లిపోయారు.
LAM 1:4 సీయోనుకు వెళ్లే దారులు దుఃఖిస్తున్నాయి, ఎందుకంటే దాని నియమించబడిన పండుగలకు ఎవరూ రావట్లేదు. దాని ద్వారాలన్నీ నిర్జనమయ్యాయి, ఆమె యాజకులు మూలుగుతున్నారు, ఆమె యువతులు దుఃఖపడుతున్నారు, ఆమె తీవ్ర వేదనలో ఉంది.
LAM 1:5 ఆమె విరోధులు ఆమెకు యజమానులయ్యారు; ఆమె శత్రువులు సుఖంగా జీవిస్తున్నారు; ఆమె యొక్క అనేక పాపాలను బట్టి యెహోవా ఆమెకు దుఃఖం కలిగించారు. ఆమె పిల్లలు చెరకు వెళ్లారు, వారు శత్రువు ముందు బందీలుగా ఉన్నారు.
LAM 1:6 సీయోను కుమారి నుండి వైభవమంతా అంతరించింది. ఆమె అధిపతులు, పచ్చిక దొరకని దుప్పిలా ఉన్నారు; బలహీనులై తమను వెంటాడుతున్న వారి ఎదుటి నుండి పారిపోయారు.
LAM 1:7 తన బాధలో, ఆమె నిరాశ్రయురాలిగా ఉన్న రోజుల్లో, యెరూషలేము పూర్వకాలంలో తనకు చెందిన సంపదలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటుంది. ఆమె ప్రజలు శత్రువు చేతిలో పడినప్పుడు, వారికి సాయం చేయడానికి ఎవరూ లేరు. ఆమె శత్రువులు ఆమె వైపు చూసి ఆమెకు కలిగిన నాశనాన్ని బట్టి నవ్వారు.
LAM 1:8 యెరూషలేము చాలా పాపం చేసింది కాబట్టి అపవిత్రమైనది. ఆమెను గౌరవించిన వారందరూ ఆమెను తృణీకరిస్తారు, అందరు ఆమెను నగ్నంగా చూశారు. ఆమె మూలుగుతూ వెనుదిరిగింది.
LAM 1:9 ఆమె అపవిత్రత ఆమె దుస్తులకు అంటుకుంది; ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఆమె పతనం ఆశ్చర్యకరంగా ఉంది; ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. “యెహోవా, నా బాధను చూడు, ఎందుకంటే శత్రువు నా మీద విజయం సాధించాడు.”
LAM 1:10 ఆమె సంపదలన్నిటినీ ఆమె శత్రువులు చేజిక్కించుకున్నారు; యూదేతరుల దేశాలు ఆమె పరిశుద్ధాలయంలోకి ప్రవేశించడం ఆమె చూసింది, మీరు మీ సమాజంలోకి ప్రవేశించకుండ నిషేధించబడినవారు.
LAM 1:11 ఆమె ప్రజలందరూ ఆహారం కోసం వెదుకుతూ మూల్గుతారు; తాము బ్రతికి ఉండడానికి వారు తమ సంపదలను ఇచ్చి ఆహారం తెచ్చుకుంటున్నారు. “యెహోవా, మమ్మల్ని చూసి, ఏదైనా ఆలోచించు, ఎందుకంటే మేము తృణీకరించబడ్డాము.”
LAM 1:12 “దారిన పోయే మీకందరికి, ఏమీ అనిపించడం లేదా? చుట్టూ తిరిగి చూడండి. యెహోవా నా మీదికి తన కోపాగ్ని దినాన తెచ్చిన బాధలాంటి బాధ ఏదైనా ఉందా?
LAM 1:13 “ఆయన పైనుండి అగ్ని పంపారు, దాన్ని నా ఎముకల్లోకి పంపారు. నా పాదాలకు వలవేసి నన్ను వెనుకకు తిరిగేలా చేశారు. ఆయన నన్ను నిర్జనంగా చేశారు, నేను బాధతో మూర్ఛపోయాను.
LAM 1:14 “నా పాపాలు కాడికి కట్టబడ్డాయి; ఆయన చేతులతో అవి ఒక్కటిగా నేయబడ్డాయి. అవి నా మెడకు వ్రేలాడదీయబడ్డాయి, యెహోవా నా బలాన్ని విఫలం చేశారు. నేను తట్టుకోలేని వారి చేతుల్లోకి ఆయన నన్ను అప్పగించారు.
LAM 1:15 “నా మధ్య ఉన్న బలవంతులందరినీ యెహోవా తిరస్కరించారు; నా యువకులను అణచివేయడానికి ఆయన నా మీదికి సైన్యాన్ని పిలిపించారు. కన్యయైన యూదా కుమారిని ప్రభువు తన ద్రాక్షగానుగలో త్రొక్కారు.
LAM 1:16 “అందుకే నేను ఏడుస్తున్నాను నా కళ్ల నుండి కన్నీరు పొర్లి పారుతున్నాయి. నన్ను ఓదార్చడానికి నాకు దగ్గరగా ఎవరూ లేరు, నా ఆత్మను ఉత్తేజపరచడానికి ఎవరూ లేరు. శత్రువు నన్ను జయించాడు కాబట్టి నా పిల్లలు నిరుపేదలయ్యారు.”
LAM 1:17 సీయోను చేతులు చాచింది, ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. యాకోబుకు తన పొరుగువారే శత్రువులుగా మారాలని యెహోవా శాసించారు; యెరూషలేము వారి మధ్య అపవిత్రం అయ్యింది.
LAM 1:18 “యెహోవా నీతిమంతుడు, అయినా నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను. జనాంగములారా, వినండి; నా శ్రమను చూడండి. నా యువకులు, యువతులు చెరకు వెళ్లారు.
LAM 1:19 “సహాయం కోసం నేను నా స్నేహితులను పిలిచాను కానీ వారు నన్ను మోసం చేశారు. నా యాజకులు, నా పెద్దలు తాము బ్రతికి ఉండాలని ఆహారం కోసం వెదుకుతూ, వారు పట్టణంలో చనిపోయారు.
LAM 1:20 “యెహోవా, చూడండి, నేను ఎంత బాధలో ఉన్నానో! నా లోలోపల చిత్రహింసను అనుభవిస్తున్నాను, నా హృదయంలో నేను కలత చెందాను, ఎందుకంటే నేను ఘోరంగా తిరుగుబాటు చేశాను. బయట, ఖడ్గం హతమారుస్తూ ఉంది; లోపల, కేవలం మరణమే.
LAM 1:21 “ప్రజలు నా మూలుగు విన్నారు, కాని నన్ను ఓదార్చడానికి ఎవరూ లేరు. నా శత్రువులందరూ నా బాధను గురించి విన్నారు; మీరు నాకు చేసిన దానిని బట్టి వారు సంతోషిస్తున్నారు. మీరు ప్రకటించిన రోజును మీరు రప్పించాలి అప్పుడు వారు నాలా అవుతారు.
LAM 1:22 “వారి దుష్టత్వమంతా మీ ముందుకు రావాలి; నా పాపాలన్నిటిని బట్టి మీరు నాతో ఎలా వ్యవహరించారో వారితో కూడా అలాగే వ్యవహరించాలి. నా మూలుగులు అనేకం నా హృదయం సొమ్మసిల్లింది.”
LAM 2:1 ప్రభువు తన కోపంతో సీయోను కుమార్తెను మేఘంతో కప్పివేశారు! ఆయన ఇశ్రాయేలు వైభవాన్ని ఆకాశం నుండి భూమి మీదికి పడగొట్టారు; ఆయన తన కోప్పడిన దినాన తన పాదపీఠాన్ని జ్ఞాపకం చేసుకోలేదు.
LAM 2:2 దయ లేకుండా ప్రభువు యాకోబు నివాసాలన్నింటినీ నాశనం చేశారు. తన కోపంలో ఆయన తన కుమార్తెయైన యూదా కోటలను పడగొట్టారు. ఆయన ఆమె రాజ్యాన్ని, దాని అధిపతులను అగౌరపరచి నేలకూల్చారు.
LAM 2:3 ఆయన తన కోపాగ్నిలో ఇశ్రాయేలీయుల ప్రతి కొమ్మును నరికివేశారు. శత్రువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన కుడిచేతిని వెనుకకు తీసుకున్నారు. ఆయన యాకోబులో మండుతున్న అగ్నిలా, దాని చుట్టూ ఉన్న సమస్తాన్ని దహించే మంటలా ఉన్నారు.
LAM 2:4 ఒక శత్రువులా ఆయన తన విల్లు ఎక్కుపెట్టారు; ఆయన కుడిచేయి సిద్ధంగా ఉంది. ఆయన ఒక శత్రువులా కంటికి నచ్చిన వారందరినీ చంపేశారు; ఆయన తన కోపాన్ని అగ్నిలా సీయోను కుమార్తె గుడారం మీద కుమ్మరించారు.
LAM 2:5 ప్రభువు ఒక శత్రువులా; ఇశ్రాయేలును నాశనం చేశారు. ఆమె రాజభవనాలన్నింటిని ఆయన కూల్చివేశారు, అలాగే ఆమె కోటలను నాశనం చేశారు. ఆయన యూదా కుమార్తె కోసం దుఃఖాన్ని, విలాపాన్ని అధికం చేశారు.
LAM 2:6 ఆయన తన నివాసాన్ని తోటలో ఉండే ఒక పాకలా కూల్చివేశారు; ఆయన తన సమావేశ స్థలాన్ని నాశనం చేశారు. యెహోవా సీయోనును తన నియమించబడిన పండుగలను, సబ్బాతులను మరచిపోయేలా చేశారు; ఆయన తన కోపాగ్నిలో రాజును, యాజకులను తిరస్కరించారు.
LAM 2:7 ప్రభువు తన బలిపీఠాన్ని తిరస్కరించి, తన పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టారు. ఆయన ఆమె రాజభవనాల గోడలను శత్రువుల చేతికి అప్పగించారు; నియామక పండుగ రోజున చేసినట్టుగా వారు యెహోవా నివాసంలో బిగ్గరగా కేకలు వేశారు.
LAM 2:8 సీయోను కుమారి చుట్టూ ఉన్న గోడను పడగొట్టాలని యెహోవా నిశ్చయించుకున్నారు. ఆయన కొలమానాన్ని గీసాడు నాశనం చేయకూడదని తన చేతిని వెనుకకు తీసుకోలేదు. ఆయన రక్షణ వ్యవస్థ అంతటిని, గోడలను విలపించేలా చేశారు; అవి శిథిలావస్థలో ఉండిపోయాయి.
LAM 2:9 ఆమె ద్వారాలు భూమిలోకి కృంగిపోయాయి; ఆయన వాటి బంధాలను పగలగొట్టి నాశనం చేశారు. ఆమె రాజు, ఆమె అధిపతులు దేశాల్లోకి చెరకు కొనిపోబడ్డారు, ఇక ఉపదేశం లేకుండా పోయింది, ఆమె ప్రవక్తలు ఇక యెహోవా నుండి దర్శనాలను పొందుకోలేదు.
LAM 2:10 సీయోను కుమార్తె పెద్దలు మౌనంగా నేలమీద కూర్చున్నారు; తమ తలలపై ధూళి చల్లుకొని గోనెపట్ట కట్టుకున్నారు. యెరూషలేము యువతులు తమ తలలు నేలకు వంచుకున్నారు.
LAM 2:11 ఏడ్వడం వల్ల నా కళ్లు క్షీణిస్తున్నాయి, నా లోపలి భాగాలు వేదనను అనుభవిస్తున్నాను. నా హృదయం నేలమీద కుమ్మరించబడింది, ఎందుకంటే నా ప్రజలు నాశనమయ్యారు, పిల్లలు, పసిపిల్లలు నగర వీధుల్లో మూర్ఛపోయారు.
LAM 2:12 వారు తమ తల్లులతో, “తినడానికి, త్రాగడానికి ఏమి లేవా?” అని అడుగుతున్నారు, వారు గాయపడిన వారిలా నగర వీధుల్లో మూర్ఛపోతున్నారు, వారి తల్లుల చేతుల్లో వారి ప్రాణాలు పోతున్నాయి.
LAM 2:13 యెరూషలేము కుమారీ! నీ గురించి ఏమి చెప్పగలను? నిన్ను దేనితో పోల్చగలను? సీయోను కుమారీ, కన్యకా! నిన్నెలా ఓదార్చడానికి నిన్ను దేనితో పోల్చగలను నీకు కలిగిన గాయం సముద్రమంత లోతుగా ఉంది నిన్నెవరు స్వస్థపరచగలరు?
LAM 2:14 నీ ప్రవక్తల దర్శనాలు అబద్ధం, పనికిరానివి; చెర నుండి నిన్ను తప్పించడానికి వారు నీ పాపాన్ని బయటపెట్టలేదు. వారు నీకు చెప్పిన ప్రవచనాలు అబద్ధం, తప్పుదారి పట్టించేవి.
LAM 2:15 నీ దారిన వెళ్లేవారంతా నిన్ను చూసి, చప్పట్లు కొడతారు; వారు యెరూషలేము దిక్కు చూసి ఎగతాళిగా తలలాడిస్తూ ఇలా అంటారు: “పరిపూర్ణ సౌందర్య పట్టణమని, సమస్త భూనివాసులకు ఆనంద కారణమని ఈ పట్టణాన్ని గురించేనా చెప్పుకున్నారు?”
LAM 2:16 నీ శత్రువులందరూ నీకు వ్యతిరేకంగా నోరు విప్పారు. వారు ఎగతాళి చేసి పళ్లు కొరుకుతూ, “మేము ఆమెను నాశనం చేశాము. ఈ రోజు కోసమే మేము ఎదురు చూసింది; దీన్ని చూడడానికే మేము బ్రతికి ఉండింది” అని అంటారు.
LAM 2:17 యెహోవా తాను సంకల్పించింది చేశారు, చాలా కాలం క్రితం ఆయన శాసించిన, తన మాట ఆయన నెరవేర్చారు. ఆయన దయ లేకుండా నిన్ను పడగొట్టారు, శత్రువు నీ మీద సంతోషించేలా చేశారు, ఆయన నీ శత్రువుల కొమ్మును హెచ్చించారు.
LAM 2:18 ప్రజల హృదయాలు యెహోవాకు మొరపెడుతున్నాయి. సీయోను కుమారి గోడలారా, మీ కన్నీటిని నదిలా పగలు రాత్రి ప్రవహించనివ్వండి; మీకు మీరే ఉపశమనం కలిగించుకోవద్దు, మీ కళ్లకు విశ్రాంతి ఇవ్వవద్దు.
LAM 2:19 లేచి, రాత్రివేళ కేకలు వేయండి, రేయి మొదటి జామున కేకలు వేయండి. నీ హృదయాన్ని నీళ్లలా ప్రభువు సన్నిధిలో కుమ్మరించండి. ప్రతి వీధి చివరిలో ఆకలితో మూర్ఛపోయిన మీ పిల్లల ప్రాణాల కోసం ఆయన వైపు మీ చేతులు ఎత్తండి.
LAM 2:20 “చూడండి, యెహోవా, ఆలోచించండి: మీరు ఇంతకుముందు ఎవరితోనైనా ఇలా వ్యవహరించారా? స్త్రీలు తమ సంతానాన్ని తినాలా, తాము పెంచిన పిల్లలను తినాలా? యాజకుడు, ప్రవక్త ప్రభువు యొక్క పరిశుద్ధాలయంలో చంపబడాలా?
LAM 2:21 “చిన్నవారు, పెద్దవారు కలిసి వీధుల్లోని దుమ్ములో పడుకుంటారు; నా యువకులు, యువతులు ఖడ్గం చేత చంపబడ్డారు. మీరు కోప్పడిన దినాన మీరు వారిని చంపారు; మీరు జాలి లేకుండా వారిని వధించారు.
LAM 2:22 “మీరు ఒక పండుగ దినానికి పిలిచినట్లు, నాకు వ్యతిరేకంగా ప్రతి వైపు నుండి భయాందోళనలు పిలిచారు. యెహోవా ఉగ్రత దినాన ఎవరూ తప్పించుకోలేదు, బ్రతకలేదు; నేను అపురూపంగా పెంచుకొన్న వారిని నా శత్రువు నాశనం చేశాడు.”
LAM 3:1 యెహోవా ఉగ్రత కర్ర చేత నేను బాధను అనుభవించిన వాన్ని.
LAM 3:2 ఆయన నన్ను వెళ్లగొట్టి, వెలుగులో కాకుండా చీకటిలో నడిచేలా చేశారు.
LAM 3:3 నిజానికి, ఆయన రోజంతా మాటిమాటికి నా మీద తన చేయి ఆడిస్తానే ఉన్నారు.
LAM 3:4 ఆయన నా చర్మాన్ని, నా మాంసాన్ని క్షీణించిపోయేలా చేసి నా ఎముకలను విరగ్గొట్టారు.
LAM 3:5 ఆయన నన్ను ముట్టడించి, విషంతో కఠినత్వంతో నన్ను చుట్టుముట్టారు.
LAM 3:6 ఎప్పుడో చనిపోయినవారు పడి ఉన్నట్లుగా ఆయన నన్ను చీకటిలో పడి ఉండేలా చేశారు.
LAM 3:7 నేను తప్పించుకోకుండా ఆయన నా చుట్టూ గోడ కట్టించారు; బరువైన గొలుసులతో ఆయన నన్ను బంధించారు.
LAM 3:8 నేను సహాయం కోసం పిలిచినా, మొరపెట్టినా ఆయన నా ప్రార్థనకు తన చెవులు మూసుకుంటారు.
LAM 3:9 ఆయన రాళ్లను నా దారికి అడ్డుపెట్టారు; ఆయన నా మార్గాలను వంకర చేశారు.
LAM 3:10 పొంచి ఉన్న ఎలుగుబంటిలా, దాక్కున్న సింహంలా,
LAM 3:11 ఆయన నన్ను దారిలో నుండి ఈడ్చుకెళ్లి, నన్ను ముక్కలు చేసి, నిస్సహాయ స్థితిలో వదిలేశారు.
LAM 3:12 ఆయన తన విల్లు తీసి, తన బాణాలకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు.
LAM 3:13 ఆయన తన అంబుల పొదిలోని బాణాలతో, నా గుండెను గుచ్చారు.
LAM 3:14 నేను నా ప్రజలందరికి నవ్వులాటగా మారాను; రోజంతా వారు పాటలో నన్ను హేళన చేస్తున్నారు.
LAM 3:15 ఆయన నాతో చేదు మూలికలు తినిపించారు, త్రాగడానికి చేదు పానీయాన్ని ఇచ్చారు.
LAM 3:16 ఆయన రాళ్లతో నా పళ్లను విరగ్గొట్టారు; నన్ను దుమ్ములో త్రొక్కారు.
LAM 3:17 సమాధానం నాకు దూరమైంది, అభివృద్ధి అంటే ఏంటో మరచిపోయాను.
LAM 3:18 కాబట్టి, “నా వైభవం పోయింది, యెహోవా నుండి నేను ఆశించినవన్నీ పోయాయి” అని నేనన్నాను.
LAM 3:19 నా శ్రమ, నా నిరాశ్రయ స్థితి, నేను త్రాగిన చేదు పానీయం జ్ఞాపకం చేసుకోండి.
LAM 3:20 నేను వాటిని బాగా జ్ఞాపకముంచుకున్నాను, నా ప్రాణం నాలో కృంగి ఉంది.
LAM 3:21 అయినప్పటికీ నేను ఇది జ్ఞాపకం చేసుకుంటాను, కాబట్టి నాకు నిరీక్షణ ఉంది:
LAM 3:22 యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు, ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు.
LAM 3:23 ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి; మీ నమ్మకత్వం గొప్పది.
LAM 3:24 నాలో నేను, “యెహోవా నా స్వాస్థ్యం; కాబట్టి నేను ఆయన కోసం వేచి ఉంటాను” అని అనుకుంటున్నాను.
LAM 3:25 తన మీద నిరీక్షణ కలిగి ఉన్నవారికి, తనను వెదికేవారికి యెహోవా మేలు చేస్తారు;
LAM 3:26 యెహోవా రక్షణ కోసం ఓపికతో వేచి ఉండడం మంచిది.
LAM 3:27 ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు.
LAM 3:28 యెహోవాయే దాన్ని అతని మీద ఉంచారు, కాబట్టి అతడు ఒంటరిగా మౌనంగా కూర్చోవాలి.
LAM 3:29 అతడు తన ముఖం ధూళిలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా నిరీక్షణ ఉండవచ్చు.
LAM 3:30 తనను కొట్టేవానికి తన చెంపను చూపించి, నిండా అవమానం పాలుకానివ్వు.
LAM 3:31 ఎవ్వరూ ప్రభువుచేత శాశ్వతంగా త్రోసివేయబడరు.
LAM 3:32 ఆయన దుఃఖం కలిగించినప్పటికీ, ఆయన కనికరం చూపుతారు, ఆయన మారని ప్రేమ చాలా గొప్పది.
LAM 3:33 ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని దుఃఖం గాని కలుగజేయరు.
LAM 3:34 దేశంలో ఖైదీలందరిని, కాళ్లక్రింద పడేసి త్రొక్కాలని,
LAM 3:35 మహోన్నతుని ఎదుట, ప్రజలు తమ హక్కులను త్రోసిపుచ్చాలని,
LAM 3:36 ఒక వ్యక్తికి న్యాయం జరగకుండా చేయడం, ఇలాంటివి ప్రభువు చూడరా?
LAM 3:37 ప్రభువు శాసించనప్పుడు అది జరిగేలా ఎవరు ఆజ్ఞాపించగలరు?
LAM 3:38 మహోన్నతుని నోటి నుండి వైపరీత్యాలు, అలాగే మంచి విషయాలు రావా?
LAM 3:39 తమ పాపాలను బట్టి శిక్షించబడినప్పుడు సజీవులైన మనుష్యులు ఎందుకు ఫిర్యాదు చేయాలి?
LAM 3:40 మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము.
LAM 3:41 మన హృదయాలను, చేతులను పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి:
LAM 3:42 “మేము పాపం చేశాము, తిరుగుబాటు చేశాము మీరు క్షమించలేదు.
LAM 3:43 “మీరు కోపంతో కప్పుకుని మమ్మల్ని వెంటాడారు; మీరు జాలి లేకుండా చంపారు.
LAM 3:44 ఏ ప్రార్థన ఫలించకుండా, మీరు ఒక మేఘంతో మిమ్మల్ని మీరు కప్పుకున్నారు.
LAM 3:45 దేశాల మధ్య మీరు మమ్మల్ని చెత్తగా చేశారు.
LAM 3:46 “మా శత్రువులందరూ మాకు వ్యతిరేకంగా నోరు తెరిచారు.
LAM 3:47 మేము భయాందోళనలను ఆపదలను ఎదుర్కొన్నాము, పతనము నాశనము.”
LAM 3:48 నా ప్రజలు నాశనమయ్యారు కాబట్టి నా కళ్ళ నుండి కన్నీటి ధారలు ప్రవహిస్తాయి.
LAM 3:49 యెహోవా పరలోకం నుండి క్రిందికి వంగి చూసే వరకు, ఉపశమనం లేకుండా, నా కంటి నుండి నీరు ఎడతెగకుండా ప్రవహిస్తుంది.
LAM 3:51 నా నగర స్త్రీలందరి వల్ల నేను చూసేది నా ప్రాణానికి దుఃఖం కలిగిస్తుంది.
LAM 3:52 కారణం లేకుండా నాకు శత్రువులుగా ఉన్నవారు పక్షిలా నన్ను వేటాడారు.
LAM 3:53 వారు గొయ్యిలో వేసి నా ప్రాణం తీయాలని చూశారు, నాపై రాళ్లు విసిరారు;
LAM 3:54 నీరు నా తలపై మూసుకుపోయాయి, నేను నశిస్తానని అనుకున్నాను.
LAM 3:55 యెహోవా, నీ నామమున మొరపెట్టాను, గొయ్యి లోతుల్లో నుండి నీ నామాన్ని పిలిచాను.
LAM 3:56 “మీరు నా మొరను ఆలకించారు, నీ చెవులు మూసుకోకు” అనే నా విన్నపాన్ని మీరు విన్నారు.
LAM 3:57 నేను నిన్ను పిలిచినప్పుడు మీరు దగ్గరికి వచ్చి “భయపడకు” అన్నారు.
LAM 3:58 ప్రభువా, నీవు నా కేసు తీసుకున్నావు. నీవు నా ప్రాణాన్ని విమోచించావు.
LAM 3:59 యెహోవా చూశావు. నా కారణాన్ని సమర్థించండి!
LAM 3:60 వారి ప్రతీకార తీవ్రతను, నాకు వ్యతిరేకంగా వారు పన్నిన కుట్రలన్నీ మీరు చూశారు.
LAM 3:61 యెహోవా, వారి అవమానాలను, నాకు వ్యతిరేకంగా వారు పన్నిన పన్నాగాలన్నీ మీరు విన్నారు.
LAM 3:62 నా శత్రువులు రోజంతా నాకు వ్యతిరేకంగా గుసగుసలాడే గొణుగుతున్నారు.
LAM 3:63 వాటిని చూడు! కూర్చున్నా, నిలబడినా తమ పాటల్లో నన్ను వెక్కిరిస్తారు.
LAM 3:64 యెహోవా వారి క్రియా కలపలను బట్టి, ప్రతీకారం చేస్తావు.
LAM 3:65 వారికి కాఠిన్యమైన హృదయాలు ఇవ్వండి, మీ శాపం వారి మీదికి వచ్చును గాక.
LAM 3:66 కోపంతో వారిని వెంటాడి, యెహోవా ఆకాశాల క్రిందనుండి వారిని నాశనం చేయండి.
LAM 4:1 బంగారం తన మెరుపును ఎలా కోల్పోయింది, మంచి బంగారం ఎలా మొద్దుబారిపోయింది! ప్రతి వీధి మూలలో ప్రశస్తమైన రాళ్ల వంటి రత్నాలు చెల్లాచెదురుగా ఉన్నాయి.
LAM 4:2 ప్రశస్తమైన సీయోను పిల్లలు ఎలా అయిపోయారు, ఒకప్పుడు వారి విలువ బంగారంతో తూగేది, ఇప్పుడు మట్టి కుండలుగా, కుమ్మరి చేతి పనిగా పరిగణించబడుతున్నారు!
LAM 4:3 నక్కలు కూడా తమ పిల్లలకు పాలివ్వడానికి తమ రొమ్ములిస్తాయి, కానీ నా ప్రజలు ఎడారిలో నిప్పుకోడిలా హృదయం లేనివారయ్యారు.
LAM 4:4 దాహం వల్ల పసివారి నాలుక నోటి అంగిటికి అంటుకుపోతుంది; పిల్లలు ఆహారం కోసం వేడుకుంటారు, కానీ ఎవరూ వారికి ఇవ్వరు.
LAM 4:5 ఒకప్పుడు రుచికరమైన పదార్ధాలు తిన్నవారు వీధుల్లో నిరుపేదలు. రాజ ఊదా రంగులో పెరిగిన ఇప్పుడు బూడిద కుప్పల మీద పడుకున్నారు.
LAM 4:6 సొదొమ శిక్ష కంటే నా ప్రజల శిక్ష గొప్పది, ఆమెకు సహాయం చేయడానికి చేయి లేకుండానే క్షణాల్లో పడగొట్టబడింది.
LAM 4:7 అందలి అధిపతులు మంచుకంటే స్వచ్ఛమైన వారు, పాలకంటే తెల్లని వారు. శరీరాలు పగడాలకంటే ఎర్రగా ఉన్నాయి, వారి దేహకాంతి నీలమణి లాంటిది.
LAM 4:8 అలాంటివారి ఆకారం బొగ్గు కంటే నలుపుగా అయింది, వీధుల్లో వారిని చూసి వారిని గుర్తు పట్టలేదు. వారి చర్మం వారి ఎముకలకు అంటుకుపోయి ఎండిన కర్రలా అయింది.
LAM 4:9 కరువు వారిని దెబ్బతీసింది, పంటలు పండవు. ఈ బాధకు క్షీణించిపోయారు, ఇంతకంటే ఖడ్గం చేత చావడం మహా భాగ్యం అనిపిస్తుంది.
LAM 4:10 కనికరంగల స్త్రీలు తమ సొంత చేతులతో తమ పిల్లలను వండుకున్నారు, నా ప్రజలు నాశనమైనప్పుడు, వారికి ఆహారం అయ్యారు.
LAM 4:11 యెహోవా తన కోపాన్ని పూర్తిగా చల్లార్చారు. ఆయన తన తీవ్రమైన కోపాన్ని కుమ్మరించాడు. ఆయన సీయోనులో అగ్నిని రప్పించారు, అది దాని పునాదులను దహించివేసింది.
LAM 4:12 శత్రువులు, శత్రువులు యెరూషలేము గుమ్మాల్లోకి ప్రవేశించవచ్చని భూరాజులు నమ్మలేదు, ప్రపంచంలోని జనాంగలెవరూ నమ్మలేదు.
LAM 4:13 అయితే అది ఎందువల్ల జరిగిందంటే, నీతిమంతుల రక్తాన్ని చిందించిన దాని ప్రవక్తల పాపాల వల్ల, దాని యాజకుల దోషాల వల్ల జరిగింది.
LAM 4:14 ఇప్పుడు వారు గ్రుడ్డివారిలా వీధుల్లో తడుముతూ తిరుగుతున్నారు. వారు రక్తంతో ఎంతగా అపవిత్రం అయ్యారంటే, వారి వస్త్రాలను తాకడానికి ఎవరూ సాహసించరు.
LAM 4:15 “వెళ్లిపొండి! మీరు అపవిత్రులు!” అని ప్రజలు గట్టిగా వారిమీద అరుస్తారు. “దూరం! దూరం! మమ్మల్ని తాకవద్దు!” అని వారు పారిపోయి, తిరుగులాడుతున్నప్పుడు, దేశాల్లో ఉన్న ప్రజలు, “వారు ఇకపై ఇక్కడ ఉండడానికి వీల్లేదు” అని అంటారు.
LAM 4:16 యెహోవా తానే వారిని చెదరగొట్టారు; ఆయన ఇకపై వారిని పట్టించుకోరు. యాజకుల పట్ల ఇక గౌరవం చూపించరు, పెద్దల పట్ల దయ చూపించరు.
LAM 4:17 పైగా, సహాయం కోసం వ్యర్థంగా, మేము మా గోపురాల నుండి; మమ్మల్ని రక్షించలేని దేశం కోసం ఎదురుచూస్తూ మా కళ్లు క్షీణించిపోయాయి.
LAM 4:18 ప్రజలు అడుగడుగునా మమ్మల్ని పొంచి ఉన్నారు, మేము మా వీధుల్లో నడవలేకపోయాము. మా అంతం దగ్గరపడింది, మా రోజులు లెక్కించబడ్డాయి, మా అంతం వచ్చింది.
LAM 4:19 మమ్మల్ని వెంటాడుతున్నవారు ఆకాశంలో ఎగిరే గ్రద్ద కంటే వేగంగా ఉన్నారు; పర్వతాల మీదుగా మమల్ని వెంబడించి ఎడారిలో మాకోసం వేచి ఉన్నారు.
LAM 4:20 యెహోవా అభిషిక్తుడు, మన ప్రాణానికి ఊపిరి. వారి ఉచ్చులో చిక్కుకున్నాడు. ఆయన నీడలో మనం ప్రజలమధ్య జీవిస్తాం అని అనుకున్నాము.
LAM 4:21 ఎదోము కుమారీ, ఊజు దేశంలో నివసిస్తున్నదానా, ఆనందించి సంతోషించు. అయితే గిన్నె మీకు కూడా పంపబడుతుంది; నీవు త్రాగి మత్తెక్కి వస్త్రాలు ఊడిపోయి నగ్నంగా ఉంటావు.
LAM 4:22 సీయోను కుమారీ, నీ శిక్ష పూర్తి కాబోతుంది; ఆయన మీ చెరను పొడిగించరు. కానీ ఎదోము కుమారీ, ఆయన నీ పాపాన్ని శిక్షిస్తారు, నీ దుర్మార్గాన్ని బట్టబయలు చేస్తారు.
LAM 5:1 యెహోవా, మాకు ఏమి జరిగిందో జ్ఞాపకముంచుకోండి; మా వైపు తిరిగి, మాకు కలిగిన అవమానాన్ని చూడండి.
LAM 5:2 మా వారసత్వం అపరిచితులకు, మా ఇళ్ళను విదేశీయులకు అప్పగించారు.
LAM 5:3 మేము తండ్రిలేని వారమయ్యాము, మా తల్లులు విధవరాండ్రు.
LAM 5:4 మేము త్రాగే నీటిని మేము కొనుక్కోవలసి వస్తుంది; మేము కట్టెలు ఎక్కువ వెలపెట్టి కొనుక్కోవలసి వస్తుంది.
LAM 5:5 మమ్మల్ని వెంటాడేవారు మా వెనుకే ఉన్నారు; మేము అలసిపోయాము, కాని విశ్రాంతి దొరకడం లేదు.
LAM 5:6 తగినంత ఆహారం పొందేందుకు మేము ఈజిప్టు, అష్షూరు వారివైపు మేము మా చేతులు చాపాము.
LAM 5:7 మా పూర్వికులు పాపం చేశారు, వారు చనిపోయారు, వారి శిక్షను మేము భరిస్తున్నాము.
LAM 5:8 బానిసలు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, వారి చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరు.
LAM 5:9 ఎడారిలో ఖడ్గం కారణంగా, ప్రాణాలను పణంగా పెట్టి ఆహారం తెచ్చుకుంటున్నాము.
LAM 5:10 ఆకలికి జ్వరంగా ఉండి, మా చర్మం పొయ్యిలా వేడిగా అయ్యింది.
LAM 5:11 సీయోనులో స్త్రీలు, యూదా పట్టణాల్లో కన్యలు హింసించబడ్డారు.
LAM 5:12 అధిపతుల చేతులు కట్టబడి, వ్రేలాడదీయబడ్డారు; పెద్దలకు గౌరవం లేదు.
LAM 5:13 యువకులు తిరుగటిరాళ్ల దగ్గర కష్టపడుతున్నారు; బాలురు కట్టెల బరువు మోయలేక తూలుతున్నారు.
LAM 5:14 పెద్దలు నగర ద్వారం నుండి వెళ్లిపోయారు, యువకులు తమ సంగీతాన్ని ఆపివేశారు.
LAM 5:15 మా హృదయాల్లో నుండి ఆనందం వెళ్లిపోయింది, మా నాట్యం దుఃఖంగా మారింది.
LAM 5:16 మా తల మీది నుండి కిరీటం పడిపోయింది, పాపం చేశాము, మాకు శ్రమ.
LAM 5:17 మా హృదయాలు ధైర్యం కోల్పోయాయి, వీటిని బట్టి మా కళ్లు క్షీణిస్తున్నాయి
LAM 5:18 సీయోను పర్వతం నిర్జనంగా పడి ఉంది, నక్కలు దాని మీద విహరిస్తున్నాయి.
LAM 5:19 యెహోవా, ఎప్పటికీ పాలించండి; మీ సింహాసనం తరతరాలుగా ఉంటుంది.
LAM 5:20 మీరు మమ్మల్ని ఎందుకు మరచిపోతారు? ఇంతకాలం వరకు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టారు?
LAM 5:21 యెహోవా, మేము తిరిగి వచ్చేలా, మమ్మల్ని మీ దగ్గరకు రప్పించుకోండి; మీరు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించి,
LAM 5:22 మామీద చెప్పలేనంత కోపాన్ని పెంచుకుంటే తప్ప, మా రోజులను పాత రోజుల్లా నూతనపర్చండి.
EZE 1:1 నా ముప్పయవ సంవత్సరం, నాల్గవ నెల, అయిదవ రోజున నేను కెబారు నది దగ్గర బందీల మధ్య ఉన్నప్పుడు ఆకాశం తెరువబడింది, నేను దేవుని దర్శనాలను చూశాను.
EZE 1:2 రాజైన యెహోయాకీను బందీగా ఉన్న అయిదవ సంవత్సరం నాల్గవ నెల అయిదవ రోజున ఇది జరిగింది.
EZE 1:3 బబులోనీయుల దేశంలో కెబారు నది దగ్గర బూజీ కుమారుడు యాజకుడైన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యింది. అక్కడ యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది.
EZE 1:4 నేను చూసినప్పుడు ఉత్తరం నుండి గాలి తుఫాను రావడం కనిపించింది; అది జ్వలించే అగ్నితో ప్రకాశవంతమైన కాంతితో నిండిన గొప్ప మేఘము. ఆ అగ్ని మధ్య భాగం కరిగిన ఇత్తడిలా కనిపించింది.
EZE 1:5 దానిలో కరిగిన ఇత్తడిలా నాలుగు జీవుల్లాంటి ఒక రూపం కనిపించింది. వాటి రూపం మానవరూపంలా ఉంది.
EZE 1:6 కాని ప్రతి జీవికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి.
EZE 1:7 వాటి కాళ్లు తిన్నగా ఉండి అరికాళ్లు దూడ కాళ్లలా ఉన్నాయి. అవి ఇత్తడిలా తళతళ మెరుస్తున్నాయి.
EZE 1:8 వాటి రెక్కల క్రింద నాలుగు వైపులా మనుష్యుల చేతులు ఉన్నాయి. ఆ నాలుగింటికి ముఖాలు, రెక్కలు ఉన్నాయి.
EZE 1:9 ఒకదాని రెక్కలు మరొకదాని రెక్కలకు తాకుతున్నాయి. అవి అటూ ఇటూ తిరగకుండా అన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి.
EZE 1:10 ఆ నాలుగింటికి మానవ ముఖంలాంటి ముఖాలు ఉన్నాయి, కుడి వైపున సింహపు ముఖం, ఎడమవైపున ఎద్దు ముఖం ఉన్నాయి. ప్రతి దానికి గ్రద్ద ముఖం ఉంది.
EZE 1:11 వాటి ముఖాలు అలా ఉన్నాయి. ప్రతి దానికి పైకి చాచి ఉన్న రెండు రెక్కలు వాటి ప్రక్కన ఉన్నవాటి రెక్కలను తాకుతూ ఉన్నాయి. మరో రెండు రెక్కలు వాటి శరీరాలను కప్పాయి.
EZE 1:12 ప్రతిదీ తిన్నగా ముందు వెళ్తూ ఉంది. అవి అటూ ఇటూ తిరగకుండా ఆత్మ ఏ వైపుకు వెళ్తే అవి ఆ వైపుకే వెళ్తున్నాయి.
EZE 1:13 ఆ జీవుల రూపం మండుతున్న నిప్పులా దివిటీలా ఉంది. అగ్ని ఆ జీవుల మధ్య ముందుకి వెనుకకు కదులుతూ ఉంది. ఆ అగ్ని చాలా ప్రకాశవంతంగా ఉండి దానిలో నుండి మెరుపులు వస్తున్నాయి.
EZE 1:14 మెరుపు తీగెల్లా ఆ జీవులు అటూ ఇటూ తిరుగుతున్నాయి.
EZE 1:15 నేను ఆ జీవులను చూసినప్పుడు, ప్రతి జీవి నాలుగు ముఖాల్లో ప్రతీదాని ప్రక్కన నేలమీద ఒక్కొక్క చక్రం కనిపించింది.
EZE 1:16 చక్రాల రూపం, నిర్మాణం ఇలా ఉంది: అవి గోమేధికంలా మెరుస్తూ, నాలుగు ఒకేలా ఉన్నాయి. ప్రతిదీ ఒక చక్రంలో మరో చక్రం ఇమిడి ఉండేలా తయారుచేయబడినట్లు కనిపించింది.
EZE 1:17 అవి కదిలినప్పుడు ఆ జీవుల ముఖాలు ఉన్న నాలుగు దిశలలో కదులుతున్నాయి; ఆ జీవులు వెళ్లినప్పుడు ఆ చక్రాలు దిశను మార్చలేదు.
EZE 1:18 వాటి అంచులు ఎత్తుగా భయంకరంగా ఉన్నాయి. నాలుగు అంచుల చుట్టూ కళ్లతో నిండి ఉన్నాయి.
EZE 1:19 జీవులు కదిలినప్పుడు, వాటి ప్రక్కన ఉన్న చక్రాలు కదిలాయి; జీవులు నేల నుండి లేచినప్పుడు, చక్రాలు కూడా లేచాయి.
EZE 1:20 ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, అక్కడికి అవి వెళ్తున్నాయి, వాటితో పాటు చక్రాలు కూడా లేస్తున్నాయి, ఎందుకంటే జీవుల ఆత్మ చక్రాలలో ఉంది.
EZE 1:21 జీవులు కదిలినప్పుడు, అవి కూడా కదిలాయి; జీవులు నిశ్చలంగా ఉన్నప్పుడు, అవి కూడా నిలిచి ఉన్నాయి; జీవులు నేల నుండి లేచినప్పుడు, చక్రాలు వాటితో పాటు లేచాయి, ఎందుకంటే జీవుల ఆత్మ చక్రాలలో ఉంది.
EZE 1:22 జీవుల తలల పైన విశాలమైనది ఒకటి కనిపించింది. అది స్ఫటికంలా మెరుస్తూ, అద్భుతంగా ఉంది.
EZE 1:23 ఆ విశాలం క్రింద వాటి రెక్కలు ఒకదాని వైపు ఒకటి తిన్నగా చాపి ఉన్నాయి, ప్రతి దాని శరీరాన్ని రెండు రెక్కలు కప్పి ఉంచాయి.
EZE 1:24 ఆ జీవులు కదిలినప్పుడు నేను వాటి రెక్కల శబ్దం విన్నాను. అది జలప్రవాహాల ఘోషలా, సర్వశక్తిమంతుని స్వరంలా, సైన్యం నుండి వచ్చే కోలాహలంలా ఉంది. అవి నిలబడినప్పుడు వాటి రెక్కలు క్రిందికి వాల్చాయి.
EZE 1:25 అవి రెక్కలు వాల్చి నిలబడినప్పుడు వాటి తలపైన ఉన్న విశాలం పైనుండి ఒక స్వరం వచ్చింది.
EZE 1:26 వాటి తలపైన ఉన్న విశాలంపైన నీలమణి వంటి ప్రశస్తమైన రాళ్లతో చేసిన ఒక సింహాసనం వంటిది కనిపించింది. దాని మీద మానవరూపంలో ఉన్న ఒకడు కూర్చున్నాడు.
EZE 1:27 అతని నడుము నుండి పైభాగం చుట్టూరా అగ్నిలో కరుగుతున్న ఇత్తడిలా, క్రింది భాగం అగ్నిలా నాకు కనిపించింది. అతని చుట్టూ ప్రకాశవంతమైన కాంతి ఉంది.
EZE 1:28 వర్షం కురుస్తున్న రోజు మేఘాలలో వానవిల్లు కనిపించినట్లు, అతని చుట్టూ ఉన్న తేజస్సు కూడా అలాగే ఉంది. ఇది యెహోవా మహిమ రూపము. నేను దానిని చూసినప్పుడు, నేను నేల మీద పడిపోయాను, ఒక స్వరం నాకు వినిపించింది.
EZE 2:1 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, లేచి నీ కాళ్లమీద నిలబడు. నీతో నేను మాట్లాడతాను” అన్నారు.
EZE 2:2 ఆయన మాట్లాడుతూ ఉండగా, ఆత్మ నా మీదికి వచ్చి నా పాదాల మీద నన్ను నిలబెట్టినప్పుడు ఆయన నాతో మాట్లాడడం నేను విన్నాను.
EZE 2:3 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నా మీద తిరుగుబాటు చేసిన ప్రజలైన ఇశ్రాయేలీయుల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను; వారు వారి పూర్వికులు ఈ రోజు వరకు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.
EZE 2:4 మొండివారును కఠిన హృదయులునైన ప్రజల దగ్గరకు నేను నిన్ను పంపుతున్నాను. ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదేనని వారితో చెప్పు.’
EZE 2:5 వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకునేలా వారికి చెప్పు.
EZE 2:6 మనుష్యకుమారుడా, వారికి, వారి మాటలకు భయపడకు. నీ చుట్టూ ముండ్లపొదలు ముళ్ళు ఉన్నా, తేళ్ల మధ్య నివసిస్తున్నా నీవు భయపడకు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వారు అన్న వాటికి వారి చూపులకు నీవేమి భయపడకు.
EZE 2:7 వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా నేను చెప్పిన మాట వారికి తెలియజేయి.
EZE 2:8 మనుష్యకుమారుడా, వారు తిరుగుబాటు చేసినట్లే నీవు చేయకు. నా మాట విను. నోరు తెరిచి నేను ఇచ్చేది తిను.”
EZE 2:9 నేను చూస్తుండగా గ్రంథపుచుట్టను పట్టుకుని ఒక చేయి నాకు దగ్గరగా రావడం కనపడింది,
EZE 2:10 ఆయన దానిని నా ముందు తెరిచారు. దానికి రెండు వైపులా విలాపం, దుఃఖం శ్రమ అనే మాటలు వ్రాసి ఉన్నాయి.
EZE 3:1 ఆయన నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, నీకు కనిపించిన దానిని తిని, ఈ గ్రంథపుచుట్టను తిను; తర్వాత ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి వారికి ప్రకటించు.”
EZE 3:2 నేను నోరు తెరవగా ఆయన నాకు ఆ గ్రంథపుచుట్టను తినిపించారు.
EZE 3:3 అప్పుడు ఆయన, “మనుష్యకుమారుడా, నేనిచ్చే ఈ గ్రంథపుచుట్టను తిని నీ కడుపు నింపుకో” అన్నారు. ఆయన చెప్పినట్లే ఆ గ్రంథాన్ని తిన్నాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది.
EZE 3:4 ఆయన ఇంకా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి నా మాటలు వారికి తెలియజేయి.
EZE 3:5 నీవు అర్థం చేసుకోలేని మాటలు మాట్లాడేవారి దగ్గరకు తెలియని భాష మాట్లాడే ప్రజల దగ్గరకు కాదు ఇశ్రాయేలీయుల దగ్గరికే నిన్ను పంపుతున్నాను.
EZE 3:6 నీకు అర్థం చేసుకోలేని మాటలు తెలియని భాష మాట్లాడే ఇతర ప్రజల దగ్గరకు పంపలేదు. వారి మధ్యకు నిన్ను పంపితే నీవు చెప్పేది వారు వింటారు.
EZE 3:7 కాని ఇశ్రాయేలీయులు మొండివారు కఠిన హృదయులు. నా మాటలు వినడానికి ఇష్టపడరు కాబట్టి నీ మాటలు కూడా వినరు.
EZE 3:8 వారి ముఖంలాగానే నీ ముఖం కఠినంగా పోతుంది. వారి నుదురులా నీ నుదిటిని కఠినంగా చేస్తాను.
EZE 3:9 నేను నీ నుదుటిని వజ్రం కంటే గట్టి రాయిలా చేస్తాను. వారు తిరుగుబాటుదారులు అయినప్పటికీ వారికి బెదరకు వారిని చూసి భయపడకు.”
EZE 3:10 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నేను మాట్లాడే మాటలు జాగ్రత్తగా విని మనస్సులో ఉంచుకో.
EZE 3:11 బందీలుగా ఉన్న నీ ప్రజలు దగ్గరకు వెళ్లి వారు విన్నా వినకపోయినా, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే’ అని ప్రకటించు” అన్నారు.
EZE 3:12 ఆత్మ నన్ను పైకెత్తగా నా వెనుక ఆయన ఉన్న స్థలం నుండి యెహోవా మహిమకు స్తోత్రం కలుగుతుంది అనే గొప్ప గర్జన లాంటి శబ్దం వినిపించింది.
EZE 3:13 అది జీవుల రెక్కలు ఒకదానికొకటి తగులుతుంటే వచ్చిన శబ్దము. వాటి ప్రక్కన ఉన్న చక్రాల శబ్దం గొప్ప గర్జన వంటి శబ్దంలా ఉంది.
EZE 3:14 అప్పుడు ఆత్మ నన్ను ఎత్తుకుని తీసుకెళ్లాడు. నేనలాగే కొట్టుకొని పోయాను. నా మనస్సులో పుట్టిన కోపానికి ఎంతో కలత చెందినప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చింది.
EZE 3:15 కెబారు నది దగ్గర ఉన్న తేలాబీబు అనే స్థలంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు వచ్చాను. వారు కూర్చున్న చోటే దిగులుగా ఏడు రోజులు కూర్చుండిపోయాను.
EZE 3:16 ఏడు రోజులు గడిచిన తర్వాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి:
EZE 3:17 “మనుష్యకుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను; కాబట్టి నేను చెప్పే మాట విని నా తరపున వారిని హెచ్చరించు.
EZE 3:18 నేను దుర్మార్గునితో, ‘నీవు తప్పక చస్తావు’ అని చెప్పినప్పుడు, నీవు వాన్ని హెచ్చరించకపోయినా, లేదా వాని ప్రాణం కాపాడబడేలా చెడు మార్గాలను విడిచిపెట్టమని వాన్ని హెచ్చరించకపోయినా, ఆ దుర్మార్గుడు వాని పాపాలను బట్టి చనిపోతే, వాని చావుకు నిన్ను జవాబుదారీని చేస్తాను.
EZE 3:19 అయితే ఒకవేళ నీవు ఆ దుర్మార్గులను హెచ్చరించినా వారు తమ దుర్మార్గాన్ని, దుష్ట మార్గాలను వదలకపోతే, వారు తమ పాపాలను బట్టి చస్తారు; కాని నీవు తప్పించుకుంటావు.
EZE 3:20 “నీతిమంతుడు తన నీతి నుండి తొలగిపోయి చెడు చేస్తే నేను అతని ముందు అభ్యంతరం పెడతాను అప్పుడతడు చస్తాడు. అయితే నీవు అతన్ని హెచ్చరించలేదు కాబట్టి అతడు తన పాపాన్ని బట్టి చస్తాడు. అతడు చేసిన నీతిక్రియలను నేను జ్ఞాపకం చేసుకోను, కాని అతని రక్తానికి నిన్నే జవాబుదారీని చేస్తాను.
EZE 3:21 ఒకవేళ పాపం చేయకూడదని నీవు నీతిమంతుని హెచ్చరించినప్పుడు అతడు పాపం చేయకపోతే అతడు ఖచ్చితంగా బ్రతుకుతాడు, ఎందుకంటే అతడు ఆ హెచ్చిరికకు లోబడ్డాడు. అలాగే నిన్ను నీవు కాపాడుకుంటావు.”
EZE 3:22 అప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చి, ఆయన నాతో, “నీవు లేచి, సమతల మైదాన ప్రాంతానికి వెళ్లు. అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని అన్నారు.
EZE 3:23 కాబట్టి నేను లేచి సమతల మైదానానికి వెళ్లాను. కెబారు నది దగ్గర నేను చూసిన యెహోవా మహిమ అక్కడ నిలబడి ఉంది. నేను ముఖం నేలకు ఆనించి మోకాళ్లమీద ఉన్నాను.
EZE 3:24 అప్పుడు ఆత్మ నా లోనికి వచ్చి నా కాళ్లమీద నన్ను నిలబెట్టాడు. తర్వాత యెహోవా నాతో ఇలా చెప్పారు: “నీ ఇంటి లోపలికి వెళ్లి, తలుపులు మూసివేసుకో.
EZE 3:25 మనుష్యకుమారుడా, వారు నిన్ను త్రాళ్లతో కట్టి బంధించబోతున్నారు కాబట్టి నీవు వారి మధ్యకు వెళ్లవద్దు.
EZE 3:26 వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి నీవు వారిని గద్దించకుండా మౌనంగా ఉండేలా నీ నాలుక నీ అంగిటికి అంటుకుపోయేలా చేస్తాను.
EZE 3:27 కాని నేను నీతో మాట్లాడినప్పుడు నీవు వారితో, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు’ చెప్పడానికి నేను నీ నోరు తెరుస్తాను. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వినేవారు వింటారు విననివారు వినరు.
EZE 4:1 “మనుష్యకుమారుడా, ఒక మట్టి ఇటుకను తీసుకుని, నీ ముందు పెట్టుకుని, దాని మీద యెరూషలేము పట్టణ నమూనాను గీయి.
EZE 4:2 తర్వాత అది ముట్టడి వేయబడినట్లుగా దాని ఎదురుగా ముట్టడి దిబ్బలు, బురుజు కట్టినట్లు, దానికి ఎదురుగా సైనిక శిబిరాలు, గోడలను పడగొట్టే యంత్రాలు ఉన్నట్లు గీయి.
EZE 4:3 తర్వాత ఒక ఇనుప రేకును తీసుకుని, దాన్ని నీకు, పట్టణానికి మధ్య ఇనుప గోడలా ఉంచి, నీ ముఖాన్ని దాని వైపుకు త్రిప్పి నిలబడు. నీవు పట్టణాన్ని ముట్టడి చేస్తున్నట్లుగా ఉంటావు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఒక సూచనగా ఉంటుంది.
EZE 4:4 “అప్పుడు నీవు నీ ఎడమవైపుకు పడుకుని ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని నీ మీద వేసుకో. నీవు నీవైపు పడుకుని ఉన్న అన్ని రోజులు వారి పాపాన్ని నీవు భరించాలి.
EZE 4:5 ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు పాపం చేశారో అన్ని రోజులు నేను నీకు నిర్ణయిస్తాను. దాని ప్రకారం 390 రోజులు నీవు వారి పాపాన్ని భరించాలి.
EZE 4:6 “నీవు ఇది పూర్తి చేసిన తర్వాత, ఈసారి నీ కుడి వైపుకు తిరిగి పడుకుని యూదా ప్రజల పాపాన్ని భరించు. నేను నీకు 40 రోజులు, ప్రతి సంవత్సరానికి ఒక రోజు నియమించాను.
EZE 4:7 ముట్టడిలో ఉన్న యెరూషలేము వైపు నీ ముఖాన్ని త్రిప్పి చొక్కా తీసివేసి చేయి ఎత్తి, దానికి వ్యతిరేకంగా ప్రవచించు.
EZE 4:8 నీ ముట్టడి రోజులు పూర్తయ్యే వరకు నీవు ఒకవైపు నుండి మరోవైపుకు తిరగకుండా నిన్ను త్రాళ్లతో బంధిస్తాను.
EZE 4:9 “గోధుమలు, యవలు, చిక్కుడు కాయలు, అలచందలు, జొన్నలు తీసుకోండి; వాటిని ఒక పాత్రలో నిల్వ ఉంచి వాటితో రొట్టెలు చేసుకుని నీవు ఒకవైపు పడుకున్న 390 రోజులు వాటిని తినాలి.
EZE 4:10 ప్రతిరోజు తినడానికి ఇరవై షెకెళ్ళ ఆహారాన్ని తూకం వేసి, నిర్ణీత సమయాల్లో తినాలి.
EZE 4:11 అలాగే ఒక హిన్ లో ఆరవ వంతు నీరు కొలిచి నిర్ణీత సమయాల్లో త్రాగాలి.
EZE 4:12 యవలతో రొట్టెలు చేసుకుని ప్రజలంతా చూస్తుండగా మానవ మలంతో వాటిని కాల్చుకుని తినాలి.
EZE 4:13 నేను వారిని ఏ జాతుల మధ్యకు వెళ్లగొడతానో వారి మధ్య ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అపవిత్రమైన ఆహారం తింటారు” అని యెహోవా నాకు చెప్పారు.
EZE 4:14 అప్పుడు నేను, “అలా కాదు, ప్రభువా, యెహోవా! నన్ను నేను ఎప్పుడూ అపవిత్రం చేసుకోలేదు. నా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు చనిపోయింది గాని అడవి జంతువులు చంపిన దానిని గాని నేను తినలేదు. ఏ అపవిత్రమైన మాంసం నా నోటిలోకి వెళ్లలేదు” అని అన్నాను.
EZE 4:15 అందుకు ఆయన, “మంచిది, అలా అయితే మానవ మలం బదులు ఆవు పేడ మీద కాల్చడానికి నేను నిన్ను అనుమతిస్తాను” అని అన్నారు.
EZE 4:16 ఇంకా ఆయన నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, నేను యెరూషలేములో ఆహార సరఫరాను నిలిపివేయబోతున్నాను. ప్రజలు ఆందోళనకు గురియై కొలత ప్రకారం ఆహారం తింటారు, అలాగే కొలత ప్రకారం నీరు త్రాగుతారు.
EZE 4:17 ఆహారానికి నీటికి కొరత ఏర్పడుతుంది. వారు ఒకరినొకరు చూసి దిగులుపడతారు, వారి పాపం కారణంగా వారు నశించిపోతారు.
EZE 5:1 “మనుష్యకుమారుడా, పదునైన కత్తిని తీసుకుని దానిని మంగలి కత్తిలా ఉపయోగించి నీ తలను, గడ్డాన్నీ క్షౌరం చేసుకో. ఒక త్రాసు తెచ్చి ఆ వెంట్రుకలను తూచి భాగాలుగా చేయి.
EZE 5:2 నీ ముట్టడి రోజులు పూర్తి కాగానే ఈ వెంట్రుకలలో మూడవ భాగాన్ని పట్టణం లోపల కాల్చివేయాలి. మూడవ భాగాన్ని తీసుకుని ఖడ్గంతో పట్టణం చుట్టూ చెదరగొట్టాలి. మిగిలిన మూడవ భాగాన్ని గాలికి ఎగిరిపోనివ్వాలి. ఎందుకంటే నేను ఖడ్గంతో వారిని వెంటాడతాను.
EZE 5:3 అయితే కొన్ని వెంట్రుకలు తీసుకుని నీ బట్టల అంచుకు కట్టుకో.
EZE 5:4 మరికొన్నిటిని తీసుకుని అగ్నిలో వేసి కాల్చు, అందులో నుండి అగ్ని వచ్చి ఇశ్రాయేలంతా వ్యాపిస్తుంది.
EZE 5:5 “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అనేక జాతుల మధ్య నేను ఉంచిన యెరూషలేము ఇదే! దాని చుట్టూరా దేశాలున్నాయి.
EZE 5:6 అయితే అది దాని చుట్టూ ఉన్న జాతుల కన్నా, రాజ్యాల కన్నా ఎక్కువగా నా ధర్మశాస్త్రాన్ని, శాసనాలను నిర్లక్ష్యం చేసింది. అది నా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించి నా శాసనాలను పాటించలేదు.
EZE 5:7 “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: మీ చుట్టూ ఉన్న జాతుల కంటే మీరే దుష్టులు, నా శాసనాలను అనుసరించలేదు, నా చట్టాలను పాటించలేదు. కనీసం మీ చుట్టూ ఉన్న జాతుల ప్రమాణాలకు కూడా మీరు అనుగుణంగా ఉండరు.
EZE 5:8 “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: యెరూషలేమా, నేనే నీకు వ్యతిరేకంగా ఉన్నాను, జాతులు చూస్తుండగానే నేను నీకు శిక్ష విధిస్తాను.
EZE 5:9 మీ అసహ్యమైన విగ్రహాలన్నిటిని బట్టి నేను ఇంతకు ముందెన్నడూ చేయనిది, ఇకపై ఎన్నడూ చేయనిది మీకు చేస్తాను.
EZE 5:10 కాబట్టి మీ మధ్య తల్లిదండ్రులు తమ పిల్లలను తింటారు, పిల్లలు తమ తల్లిదండ్రులను తింటారు. నేను మీకు శిక్ష విధించి మీలో మిగిలిన వారినందరిని గాలికి చెదరగొడతాను.
EZE 5:11 నా జీవం తోడు, నిశ్చయంగా, నీవు నీ నీచమైన ప్రతిమలతోను అసహ్యమైన ఆచారాలతోను నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరిచావు కాబట్టి, నేనే నీకు క్షౌరం చేస్తాను; నేను నీపై జాలిపడను, నిన్ను కనికరించను” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 5:12 మీ ప్రజల్లో మూడవ భాగం మీలోనే తెగులుతో చస్తారు, కరువుతో నశిస్తారు; మరో మూడవ భాగం మీ గోడల బయట ఖడ్గానికి కూలిపోతారు. మిగిలిన భాగాన్ని నేను గాలికి చెదరగొట్టి ఖడ్గంతో వారిని వెంటాడతాను.
EZE 5:13 “అప్పుడు నా కోపం తీరుతుంది, వారి మీద నా ఉగ్రత తగ్గుతుంది, నా ప్రతీకారం తీరుతుంది. నేను వారి మీద నా ఉగ్రతను పూర్తిగా కుమ్మరించినప్పుడు, యెహోవానైన నేను రోషంతో మాట్లాడానని వారు తెలుసుకుంటారు.
EZE 5:14 “నీ చుట్టూ ఉన్న జాతుల మధ్యలో నిన్ను చూసే వారందరి ఎదుట నిన్ను నిర్జనంగాను నిందగాను చేస్తాను.
EZE 5:15 నేను కోపంలో, ఉగ్రతలో, కఠోరమైన మందలింపుతో నిన్ను శిక్షించినప్పుడు, నీ చుట్టూ ఉన్న జాతులకు నీవు ఒక నిందగా హేళనగా ఒక హెచ్చరికగా ఒక భయానకమైనదానిగా ఉంటావు. యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.
EZE 5:16 నేను నిన్ను నాశనం చేయడానికి ఘోరమైన, నాశనకరమైన కరువు బాణాలను నీ మీదికి విసురుతాను. నేను నీ మీదికి ఇంకా ఇంకా ఎక్కువ కరువు రప్పించి, నీ ఆహార సరఫరాను నిలిపివేస్తాను.
EZE 5:17 నేను నీ మీదికి కరువును, అడవి మృగాలను పంపుతాను, అవి మీకు సంతానం లేకుండా చేస్తాయి. తెగులు, రక్తపాతం నిన్ను తుడిచివేస్తాయి, నేను నీ మీదికి ఖడ్గాన్ని రప్పిస్తానని యెహోవానైన నేనే చెప్పాను.”
EZE 6:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 6:2 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయుల పర్వతాల వైపు తిరిగి, వాటికి వ్యతిరేకంగా ప్రవచిస్తూ,
EZE 6:3 ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, పర్వతాలకు, కొండలకు, కనుమలకు, లోయలకు ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను మీ మీదికి ఖడ్గాన్ని రప్పించి, మీ క్షేత్రాలను నాశనం చేస్తాను.
EZE 6:4 మీ బలిపీఠాలు కూల్చివేయబడతాయి, మీ ధూపవేదికలు పగులగొట్టబడతాయి; మీ విగ్రహాల ముందు నేను నీ ప్రజలను చంపుతాను.
EZE 6:5 ఇశ్రాయేలీయుల శవాలను వారి విగ్రహాల ముందు పడవేస్తాను, మీ బలిపీఠాలు చుట్టూ మీ ఎముకలు వెదజల్లుతాను.
EZE 6:6 మీరు ఎక్కడ నివసించినా, ఆ పట్టణాలు నిర్జనమవుతాయి, క్షేత్రాలు పడగొట్టబడతాయి, తద్వారా మీ బలిపీఠాలు అపవిత్రమవుతాయి, మీ విగ్రహాలు పగిలి శిథిలమవుతాయి, మీ ధూపవేదికలు పగులగొట్టబడతాయి, మీరు తయారుచేసినవి తుడిచివేయబడతాయి.
EZE 6:7 మీ ప్రజలు మీ మధ్య చంపబడతారు, అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
EZE 6:8 “ ‘అయినా నేను కొందరిని విడిచిపెడతాను, ఎందుకంటే మీరు వివిధ దేశాలకు జాతుల మధ్యకు చెదరగొట్టబడినపుడు మీలో కొంతమంది ఖడ్గం నుండి తప్పించుకుంటారు.
EZE 6:9 అప్పుడు తప్పించుకుని ఇతర దేశాల్లో బందీలుగా ఉన్నవారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. నాకు దూరంగా ఉన్న వారి వ్యభిచార హృదయాలను బట్టి నేను ఎలా దుఃఖించానో, వారి విగ్రహాల పట్ల వారి కళ్లల్లో కనిపించిన మోహాన్ని బట్టి నేను ఎలా బాధపడ్డానో జ్ఞాపకం చేసుకుంటారు. వారు చేసిన చెడును బట్టి వారి అసహ్యమైన ఆచారాలన్నిటిని బట్టి తమను తాము అసహ్యించుకుంటారు.
EZE 6:10 అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు; వారిపైకి కీడు రప్పిస్తానని నేను ఊరకనే బెదిరించలేదు.
EZE 6:11 “ ‘ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: మీ చేతులను చరిచి మీ పాదాలతో నేలను తన్ని ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గమైన అసహ్యమైన క్రియలనుబట్టి “అయ్యో!” అని ఏడువు ఎందుకంటే వారు ఖడ్గం కరువు తెగులు ద్వారా చస్తారు.
EZE 6:12 దూరాన ఉన్నవారు తెగులు వచ్చి చస్తారు. దగ్గరగా ఉన్నవారు ఖడ్గంతో చస్తారు, ఎవరైనా మిగిలినా, విడిచిపెట్టబడినా, వారు కరువుతో చస్తారు. నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను.
EZE 6:13 తమ విగ్రహాల మధ్య, తమ బలిపీఠాల చుట్టూరా, ఎత్తైన కొండలన్నిటి మీద, పర్వత శిఖరాలన్నిటి మీద, మహా వృక్షాల క్రింద, ఏపుగా పెరిగిన సింధూర వృక్షాలన్నిటి క్రింద ఎక్కడైతే తమ విగ్రహాలన్నిటికి పరిమళ ధూపం వేశారో అక్కడ వారి ప్రజలందరూ చచ్చి పడి ఉండడం చూసి, నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
EZE 6:14 నేను వారికి వ్యతిరేకంగా నా చేయి చాపి వారెక్కడ నివసించినా ఆ దేశాన్ని ఎడారి నుండి రిబ్లా వరకు నిర్జనమైన వ్యర్థంగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
EZE 7:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 7:2 “మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా ఇశ్రాయేలీయుల దేశానికి చెప్తున్న మాట ఇదే: “ ‘అంతం! అంతం వచ్చేసింది దేశం నలువైపులా వచ్చేసింది!
EZE 7:3 ఇప్పుడు నీ మీద అంతం వచ్చేసింది! నా కోపాన్ని నీపై కుమ్మరిస్తాను. నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి నీ అసహ్యకరమైన ఆచారాలన్నిటిని బట్టి నీకు తిరిగి చెల్లిస్తాను.
EZE 7:4 నీ మీద ఏమాత్రం దయ చూపించను నిన్ను వదిలిపెట్టను. నీ ప్రవర్తనకు నీ మధ్య ఉన్న అసహ్యకరమైన ఆచారాలన్నిటికి నీకు ప్రతిఫలమిస్తాను. “ ‘నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’
EZE 7:5 “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: “ ‘విపత్తు! విపత్తు వెనకే విపత్తు చూడండి, అది వచ్చేస్తుంది!
EZE 7:6 అంతం వచ్చేసింది! అంతం వచ్చేసింది! అది నీ కోసమే చూస్తుంది; ఇదిగో, వచ్చింది.
EZE 7:7 దేశ నివాసులారా! మీ మీదికి వినాశనం వస్తుంది. సమయం దగ్గరకి వచ్చింది! ఆ రోజు సమీపంగా ఉంది! ఆనందం కాదు భయమే పర్వతాలమీద వినపడుతుంది.
EZE 7:8 నా ఉగ్రత మీపై కుమ్మరించబోతున్నాను. నా కోపాన్ని మీమీద చూపిస్తాను. మీ ప్రవర్తనకు మీరు చేసిన అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను.
EZE 7:9 మీమీద ఏమాత్రం దయ చూపించను; మిమ్మల్ని వదిలిపెట్టను. మీ ప్రవర్తనకు, మీ మధ్య ఉన్న అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను. “ ‘అప్పుడు యెహోవానైన నేనే మిమ్మల్ని శిక్షిస్తున్నానని మీరు తెలుసుకుంటారు.’
EZE 7:10 “ ‘ఇదిగో ఆ రోజు! అది వచ్చేస్తుంది! నాశనం బయలుదేరి వచ్చేసింది దండం వికసించింది. గర్వం చిగురించింది.
EZE 7:11 బలాత్కారం మొదలై దుష్టులను శిక్షించే దండం అయింది. ప్రజల్లో గాని వారి గుంపులో గాని, ఆస్తిలో గాని, వారి ప్రఖ్యాతిలో గాని ఏదీ మిగల్లేదు.
EZE 7:12 ఆ సమయం వచ్చింది! ఆ రోజు వచ్చింది! ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది. కాబట్టి కొనేవాడు సంతోష పడనక్కరలేదు అమ్మే వానికి దుఃఖ పడనక్కరలేదు.
EZE 7:13 అమ్మినవాడు కొన్న వాడు జీవించి ఉన్నంత కాలం అమ్మినవాడు తాను అమ్మిన దానిని తిరిగిపొందడు. ఈ దర్శనం ఆ గుంపు అంతటికి సంబంధించినది అది తప్పక నెరవేరుతుంది. వారి పాపాల కారణంగా వారిలో ఎవరూ తమ ప్రాణాలను రక్షించుకోలేడు.
EZE 7:14 “ ‘వారంతా సిద్ధపడి యుద్ధానికి బూరలను ఊదుతారు. ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది కాబట్టి వారిలో ఏ ఒక్కరూ యుద్ధానికి వెళ్లరు.
EZE 7:15 బయట కత్తి ఉంది; లోపల తెగులు కరువు ఉన్నాయి. బయట ఉన్నవారు కత్తి వలన చచ్చారు; పట్టణంలో ఉన్నవారు తెగులు కరువు వలన నాశనమవుతారు.
EZE 7:16 వాటినుండి తప్పించుకున్నవారు పర్వతాల మీదకు పారిపోయి తమ పాపాలను బట్టి వారిలో ప్రతి ఒక్కరు లోయ పావురాల్లా మూల్గుతారు.
EZE 7:17 ప్రతీ చేయి బలహీనం అవుతుంది; ప్రతీ కాలు మూత్రంతో తడిసిపోతుంది.
EZE 7:18 వారు గోనెపట్ట కట్టుకుంటారు భయం వారిని ఆవరిస్తుంది. ప్రతి ఒక్కరు సిగ్గుతో తలవంచుకుంటారు, ప్రతి తల క్షౌరం చేయబడుతుంది.
EZE 7:19 “ ‘వారు తమ వెండిని వీధుల్లో పారేస్తారు, వారి బంగారం అపవిత్రంగా పరిగణించబడుతుంది. యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని రక్షించలేవు. వారు పాపంలో పడడానికి అవి కారణంగా ఉన్నందుకు వాటివలన వారి ఆకలి తీరదు వారి కడుపు నిండదు.
EZE 7:20 అందమైన ఆభరణాల బట్టి గర్వించి హేయమైన విగ్రహాలను తయారుచేయడానికి వాటిని ఉపయోగించారు. వారు దానిని నీచమైన చిత్రాలుగా మార్చారు; కాబట్టి నేను దానిని వారి కోసం ఒక అపవిత్రమైనదానిగా చేస్తాను.
EZE 7:21 నేను వారి సంపదను విదేశీయులకు ఎరగా భూమిమీది దుర్మార్గులకు దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను వారే దానిని అపవిత్రపరుస్తారు.
EZE 7:22 వారిని చూడకుండ నా ముఖాన్ని త్రిప్పుకుంటాను, కాబట్టి దొంగలు నా నిధి ఉన్న స్థలాన్ని అపవిత్రపరుస్తారు. వారు దానిలోనికి వెళ్లి దానిని మలినం చేస్తారు.
EZE 7:23 “ ‘దేశమంతా రక్తంతో పట్టణమంతా హింసతో నిండిపోయింది కాబట్టి సంకెళ్ళు సిద్ధం చేయండి.
EZE 7:24 వారి ఇళ్ళను స్వాధీనం చేసుకోవడానికి ప్రజల్లో అత్యంత దుష్ట జాతులను రప్పిస్తాను. నేను వారి బలవంతుల గర్వాన్ని అణచివేస్తాను వారి పరిశుద్ధాలయాలు అపవిత్రం చేయబడతాయి.
EZE 7:25 భయం కలిగినప్పుడు వారు సమాధానాన్ని వెదుకుతారు కాని అది దొరకదు.
EZE 7:26 నాశనం వెంబడి నాశనం వస్తుంది, పుకార్ల మీద పుకార్లు పుట్టుకొస్తాయి. వారు ప్రవక్త దగ్గరకి దర్శనం కోసం వెళ్తారు ధర్మశాస్త్ర జ్ఞానం యాజకులకు ఉండదు. పెద్దలు ఆలోచన చేయరు.
EZE 7:27 రాజు దుఃఖిస్తారు, యువరాజు నిరాశకు గురవుతాడు, దేశ ప్రజల చేతులు వణకుతాయి. వారి ప్రవర్తనను బట్టి వారికి చేస్తాను, వారి సొంత ప్రమాణాల ప్రకారమే నేను వారికి తీర్పు తీరుస్తాను. “ ‘అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
EZE 8:1 ఆరవ సంవత్సరం ఆరవ నెల అయిదవ రోజున నా ఇంట్లో నేను, యూదా పెద్దలు కూర్చుని ఉన్నప్పుడు, ప్రభువైన యెహోవా చేయి నా మీదికి వచ్చింది.
EZE 8:2 నేను చూస్తుండగా ఒక మానవ ఆకారం కనిపించింది. అతని నడుము నుండి క్రిందికి నిప్పులా ఉన్నాడు, అక్కడినుండి అతని రూపం మెరుస్తున్న లోహంలా ప్రకాశవంతంగా ఉంది.
EZE 8:3 ఆయన చేయిలాంటి దానిని చాపి నా జుట్టు పట్టుకున్నారు. ఆత్మ నన్ను భూమికి ఆకాశానికి మధ్యకు ఎత్తి దేవుని దర్శనాలలో ఆయన నన్ను యెరూషలేముకు లోపలి ఆవరణ ఉత్తర ద్వారం దగ్గర ఉన్న రోషం పుట్టించే విగ్రహం దగ్గరకు తీసుకువచ్చాడు.
EZE 8:4 అప్పుడు సమతల మైదానంలో నేను చూసిన దర్శనంలో కనిపించినట్లే ఇశ్రాయేలీయుల దేవుని మహిమ మళ్ళీ కనిపించింది.
EZE 8:5 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఉత్తరదిక్కు చూడు” అని చెప్పినప్పుడు, నేను ఉత్తరదిక్కు చూడగా అక్కడ బలిపీఠపు ఉత్తర ద్వారం దగ్గర రోషం పుట్టించే విగ్రహం కనిపించింది.
EZE 8:6 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, వారు చేస్తున్నది నీవు చూశావు కదా! నా పరిశుద్ధాలయం నుండి నన్ను దూరం చేసేలా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేస్తున్న చాలా అసహ్యకరమైన పనులు చూశావా? కాని వీటి కంటే మరింత అసహ్యకరమైన వాటిని నీవు చూస్తావు” అన్నారు.
EZE 8:7 అప్పుడు ఆయన నన్ను ఆవరణ ద్వారం దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడ నేను చూడగా, నాకు గోడకు ఒక రంధ్రం కనిపించింది.
EZE 8:8 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఆ గోడ లోపలికి త్రవ్వు” అని చెప్పారు. నేను ఆ గోడ లోపలికి త్రవ్వగా ద్వారం ఒకటి కనిపించింది.
EZE 8:9 ఆయన నాతో, “లోపలికి వెళ్లి వారు ఇక్కడ చేస్తున్న దుర్మార్గమైన అసహ్యకరమైన పనులు చూడు” అని చెప్పారు.
EZE 8:10 నేను లోపలికి వెళ్లి చూస్తే, అన్ని రకాల ప్రాకే జీవులు, అపవిత్రమైన జంతువులు, ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహాలు గోడ మీద అంతటా గీయబడి కనిపించాయి.
EZE 8:11 డెబ్బది మంది ఇశ్రాయేలీయుల పెద్దలు వాటి ముందు నిలబడి ఉన్నారు. వారి మధ్యలో షాఫాను కుమారుడైన యాజన్యా ఉన్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో ధూపార్తి ఉంది. ఆ ధూపం యొక్క సువాసన మేఘంలా పైకి వెళ్తుంది.
EZE 8:12 ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ తమ విగ్రహాల గుడి దగ్గర ప్రతి ఒక్కరూ తమ తమ విగ్రహాల గుడి దగ్గర ఏమి చేస్తున్నారో నీవు చూశావు గదా? యెహోవా మమ్మల్ని చూడడు; యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడని వారు అనుకుంటున్నారు” అన్నారు.
EZE 8:13 ఆయన ఇంకా నాతో, “నీవు ఈ వైపుకు తిరిగి చూస్తున్నావా? వీటికి మించిన అసహ్యమైన పనులు వీరు చేయడం నీవు చూస్తావు” అన్నారు.
EZE 8:14 ఇలా చెప్పి ఆయన నన్ను యెహోవా ఆలయానికి ఉత్తర ద్వారం దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, అక్కడ కొందరు స్త్రీలు కూర్చుని తమ్మూజు దేవతను గురించి ఏడుస్తూ నాకు కనిపించారు.
EZE 8:15 అప్పుడు ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నీవు ఇది చూస్తున్నావా? అని యెహోవా అన్నాడు. వీటికి మించిన అసహ్యమైన పనులు వీరు చేయడం నీవు చూస్తావు” అన్నారు.
EZE 8:16 ఆయన నన్ను యెహోవా ఆలయ లోపలి ఆవరణంలోనికి తీసుకువచ్చినప్పుడు, ఆలయ ప్రవేశం దగ్గర ఉన్న మంటపానికి బలిపీఠానికి మధ్యలో ఇంచుమించు ఇరవై అయిదుగురు మనుష్యులు నాకు కనిపించారు. వారి వీపులు యెహోవా మందిరం వైపు వారి ముఖాలు తూర్పు వైపు తిరిగి ఉన్నాయి. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారం చేస్తున్నారు.
EZE 8:17 అప్పుడు ఆయన నాతో, “మనుష్యకుమారుడా, చూశావా? యూదా ప్రజలు ఇక్కడ చేస్తున్న ఈ అసహ్యమైన పనులు చేయడం చిన్న విషయమా? అంతే కాకుండా వారు దేశాన్ని హింసతో నింపివేస్తూ నా కోపాన్ని అంతకంతకు పెంచుతున్నారు. వారి ముక్కుకు తీగె పెట్టుకుంటున్నారు చూడు!
EZE 8:18 కాబట్టి నేను వారితో కోపంగా వ్యవహరిస్తాను; వారి మీద జాలి చూపించను వారిని వదిలిపెట్టను. వారు నా చెవుల్లో అరిచినా నేను వారి మొర వినను” అన్నారు.
EZE 9:1 ఆయన గట్టిగా ఇలా మాట్లాడడం నేను విన్నాను, “మీలో ప్రతి ఒక్కరు తమ చేతిలో ఆయుధం పట్టుకుని పట్టణం మీద తీర్పును అమలుచేయడానికి నియమించబడిన వారిని దగ్గరకు తీసుకురండి.”
EZE 9:2 ఉత్తరాన ఉన్న పై ద్వారం వైపు నుండి ఆరుగురు వ్యక్తులు తమ చేతుల్లో మారణాయుధాలు పట్టుకుని రావడం నేను చూశాను. వారితో పాటు నారబట్టలు వేసుకుని తన నడుముకు లేఖికుని సిరాబుడ్డి కట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. వారు లోపలికి వచ్చి ఇత్తడి బలిపీఠం ప్రక్కన నిలబడ్డారు.
EZE 9:3 ఇశ్రాయేలీయుల దేవుని మహిమ అది ఉన్న కెరూబు మీది నుండి పైకి వెళ్లి ఆలయ గడప దగ్గరకు వచ్చి నిలిచింది. అప్పుడు యెహోవా నారబట్టలు వేసుకుని తన నడుముకు లేఖికుని సిరాబుడ్డి కట్టుకుని ఉన్న వానిని పిలిచి,
EZE 9:4 యెహోవా అతనితో, “నీవు వెళ్లి యెరూషలేము పట్టణమంతా తిరిగి అక్కడ జరుగుతున్న అసహ్యకరమైన పనులన్నిటిని బట్టి దుఃఖించి విలపించే వారి నుదిటిపై ఒక గుర్తు పెట్టు” అన్నారు.
EZE 9:5 నేను వింటుండగా ఆయన మిగిలిన వారితో, “మీరు అతని వెంట పట్టణంలోనికి వెళ్లి దయా కనికరం లేకుండా అందరిని చంపండి.
EZE 9:6 ఎవరినీ విడిచిపెట్టకండి. వృద్ధులను, యువకులను, స్త్రీలను, తల్లులను పిల్లలను అందరిని చంపండి కాని ఆ గుర్తు ఉన్నవారిని మాత్రం ముట్టుకోవద్దు. నా పరిశుద్ధాలయం నుండి మొదలుపెట్టండి” అన్నారు. వెంటనే వారు మందిరం ముందున్న వృద్ధులతో మొదలుపెట్టారు.
EZE 9:7 ఆయన వారితో, “మందిరాన్ని అపవిత్రం చేయండి. ఆవరణాలను శవాలతో నింపండి. మొదలుపెట్టండి” అన్నారు. వారు బయలుదేరి వెళ్లి పట్టణంలో అందరిని చంపడం మొదలుపెట్టారు.
EZE 9:8 వారు చంపుతూ ఉన్నప్పుడు నేను ఒక్కడినే మిగిలి పోయాను, అప్పుడు నేను నేలపై పడి గట్టిగా ఏడుస్తూ, “అయ్యో! ప్రభువైన యెహోవా! యెరూషలేముపై నీ ఉగ్రతను కుమ్మరించి ఇశ్రాయేలీయులలో మిగిలి ఉన్నవారందరిని నాశనం చేస్తావా?” అని మొరపెట్టాను.
EZE 9:9 అందుకు ఆయన నాతో, “ఇశ్రాయేలు ప్రజల పాపాలు, యూదా ప్రజల పాపాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ దేశమంతా రక్తపాతంతో పట్టణమంతా అన్యాయంతో నిండిపోయింది. యెహోవా మమ్మల్ని చూడడు; యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడని వారు అనుకుంటున్నారు.
EZE 9:10 కాబట్టి వారి మీద ఏమాత్రం దయ చూపించను వారిని కనికరించను కాని వారు చేసిన దానికి తగిన ప్రతిఫలాన్ని నేను వారికి ఇస్తాను” అన్నారు.
EZE 9:11 నారబట్టలు వేసుకుని తన నడుముకు వ్రాత సామాన్లు కట్టుకుని ఉన్నవాడు తిరిగివచ్చి, “నీవు ఆజ్ఞాపించినట్లే నేను చేశాను” అని చెప్పాడు.
EZE 10:1 నేను చూడగా, కెరూబుల తలల పైన ఉన్న విశాలంపైన నీలమణి వంటి ప్రశస్తమైన రాళ్లతో చేసిన ఒక సింహాసనం వంటిది కనిపించింది.
EZE 10:2 నారబట్టలు వేసుకున్న వానితో యెహోవా, “కెరూబు క్రింద ఉన్న చక్రాల మధ్యకు వెళ్లు. కెరూబుల మధ్య ఉన్న నిప్పులు నీ చేతి నిండా గుప్పిలిలో తీసుకుని పట్టణమంతా చల్లు” అని చెప్పారు. నేను చూస్తుండగానే ఆయన లోపలికి వెళ్లిపోయారు.
EZE 10:3 ఆయన లోపలికి వెళ్లినప్పుడు కెరూబులు ఆలయానికి దక్షిణం వైపున నిలబడి ఉన్నాయి; ఒక మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మివేసింది.
EZE 10:4 అప్పుడు యెహోవా మహిమ కెరూబు మీద నుండి పైకి వెళ్లి ఆలయ గుమ్మం వరకు వెళ్లింది. మేఘం మందిరాన్ని నింపివేసింది, ఆవరణం యెహోవా మహిమతో నిండిపోయింది.
EZE 10:5 కెరూబుల రెక్కల ధ్వని బయటి ఆవరణం వరకు, సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినిపించే స్వరంలా వినబడింది.
EZE 10:6 నారబట్టలు వేసుకున్న వానితో యెహోవా, “కెరూబుల మధ్య ఉన్న చక్రాల మధ్య నుండి అగ్నిని తీసివేయి” అని ఆజ్ఞాపించినప్పుడు, అతడు లోపలికి వెళ్లి ఒక చక్రం ప్రక్కన నిలబడ్డాడు.
EZE 10:7 అప్పుడు కెరూబులలో ఒకడు తన చేతిని వారి మధ్య ఉన్న అగ్ని వైపుకు చాచి కొన్ని నిప్పులు తీసుకుని నారబట్టలు వేసుకున్న వాని చేతికి ఇవ్వగా అతడు వాటిని తీసుకుని బయటకు వెళ్లాడు.
EZE 10:8 (కెరూబుల రెక్కల క్రింద మానవ చేతుల్లాంటివి కనిపించాయి.)
EZE 10:9 ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రం చొప్పున మొత్తం నాలుగు చక్రాలున్నాయి. అవి పుష్యరాగం వంటి ప్రశస్తమైన రాళ్లతో చేసినట్లుగా ఉన్నాయి.
EZE 10:10 ఆ నాలుగు చక్రాలు ఒకేలా ఉన్నాయి. ఆ చక్రాలు ఒకదానిలో ఒకటి అమర్చినట్లుగా ఉన్నాయి.
EZE 10:11 అవి కదిలినప్పుడు కెరూబులు తిరిగి ఉన్న నాలుగు వైపులకు అవి వెళ్తాయి అయితే కెరూబులు వెళ్తూ ఉన్నప్పుడు అవి వెనుకకు తిరగలేదు. కెరూబులు ఎటూ తిరగకుండా వాటి తలలు తిరగి ఉన్న వైపు వెళ్లాయి.
EZE 10:12 వాటి వీపు, చేతులు రెక్కలతో సహా వాటి శరీరమంతా కళ్లు ఉన్నాయి; వాటికున్న నాలుగు చక్రాలు కూడా పూర్తిగా కళ్లతో నిండి ఉన్నాయి.
EZE 10:13 తిరగండని చక్రాలతో చెప్పడం నేను విన్నాను.
EZE 10:14 ప్రతి కెరూబుకు నాలుగు ముఖాలు ఉన్నాయి: మొదటిది కెరూబు ముఖం, రెండవది మానవ ముఖం, మూడవది సింహ ముఖం, నాల్గవది గ్రద్ద ముఖము.
EZE 10:15 అప్పుడు కెరూబులు పైకి లేచాయి. కెబారు నది దగ్గర నేను చూసిన జీవులు ఇవే.
EZE 10:16 కెరూబులు కదిలినప్పుడు వాటి ప్రక్కనున్న చక్రాలు కూడా కదిలాయి; కెరూబులు నేల నుండి పైకి లేవడానికి రెక్కలు విప్పినప్పుడు కూడా చక్రాలు వాటి దగ్గర నుండి తొలగిపోలేదు.
EZE 10:17 జీవుల ఆత్మ చక్రాలలో ఉంది కాబట్టి కెరూబులు నిలబడినప్పుడు అవి కూడ నిలబడ్డాయి; లేచినప్పుడు అవి కూడా లేచాయి.
EZE 10:18 అప్పుడు యెహోవా మహిమ ఆలయ గుమ్మం మీద నుండి వెళ్లిపోయి కెరూబుల పైన ఆగింది.
EZE 10:19 నేను చూస్తుండగానే కెరూబులు రెక్కలు విప్పి నేల నుండి పైకి లేచాయి, అవి వెళ్తుండగా చక్రాలు వాటితో పాటు వెళ్లాయి. అవి యెహోవా ఆలయ తూర్పు ద్వారం దగ్గరకు వచ్చి ఆగాయి; ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపైన ఉంది.
EZE 10:20 ఇవి కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నేను చూసిన జీవులు ఇవే. అవి కెరూబులను నేను గ్రహించాను.
EZE 10:21 ప్రతి దానికి నాలుగు ముఖాలు నాలుగు రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కల క్రింద మానవ చేతుల్లాంటివి ఉన్నాయి.
EZE 10:22 వాటి ముఖాలు నేను కెబారు నది దగ్గర నేను చూసిన ముఖాల్లాగానే ఉన్నాయి. అవన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి.
EZE 11:1 అప్పుడు ఆత్మ నన్ను పైకి లేపి తూర్పు వైపున ఉన్న యెహోవా మందిరపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చాడు. ద్వారం దగ్గర ఇరవై అయిదుగురు మనుష్యులు ఉన్నారు, వారిలో ప్రజల నాయకులైన అజ్జూరు కుమారుడైన యాజన్యా, బెనాయా కుమారుడైన పెలట్యా నాకు కనిపించారు.
EZE 11:2 యెహోవా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, వీరు చెడు కుట్రలు పన్నుతూ ఈ పట్టణంలో దుష్ట సలహాలు ఇస్తున్నారు.
EZE 11:3 వారు, ‘మన ఇల్లు కట్టుకోవడానికి ఇది సమయం కాదు; ఈ పట్టణం ఒక కుండ అయితే మనం దానిలో మాంసం’ అని అంటున్నారు.
EZE 11:4 కాబట్టి వారికి వ్యతిరేకంగా ప్రవచించు; మనుష్యకుమారుడా, ప్రవచించు.”
EZE 11:5 అప్పుడు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఇలా చెప్పమని నాతో చెప్పారు: “యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలు నాయకులారా, మీరు చెప్పేది అదే కాని మీ మనస్సులో వచ్చే ఆలోచనలు నాకు తెలుసు.
EZE 11:6 మీరు ఈ పట్టణంలో ఎంతోమందిని చంపారు; మీరు చంపిన శవాలతో పట్టణ వీధులు నిండిపోయాయి.
EZE 11:7 “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు చంపి పట్టణంలో పడవేసిన వారి శవాలే మాంసం, ఈ పట్టణం ఒక కుండ అయితే నేను మిమ్మల్ని పట్టణంలో ఉండకుండా వెళ్లగొడతాను.
EZE 11:8 మీరు ఖడ్గానికి భయపడుతున్నారు, కాబట్టి నేనే మీ మీదికి ఖడ్గాన్ని రప్పిస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 11:9 నేను మిమ్మల్ని పట్టణంలో నుండి వెళ్లగొట్టి విదేశీయుల చేతికి మిమ్మల్ని అప్పగించి మీకు శిక్ష విధిస్తాను.
EZE 11:10 ఇశ్రాయేలు సరిహద్దుల లోపలే మీరు ఖడ్గంతో చంపబడేలా నేను మిమ్మల్ని శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
EZE 11:11 ఈ పట్టణం మీకు కుండగా ఉండదు, మీరు దానిలో మాంసం కారు. ఇశ్రాయేలు సరిహద్దులలో నేను మిమ్మల్ని శిక్షిస్తాను.
EZE 11:12 మీ చుట్టూ ఉన్న జాతుల విధులను పాటించడానికి మీరు ఎవరి శాసనాలను అనుసరించకుండా ఎవరి విధులను పాటించలేదో ఆ యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.”
EZE 11:13 నేను ఈ విధంగా ప్రవచిస్తుండగానే బెనాయా కుమారుడైన పెలట్యా చనిపోయాడు. అప్పుడు నేను సాష్టాంగపడి గట్టిగా ఏడుస్తూ, “అయ్యో ప్రభువైన యెహోవా! ఇశ్రాయేలీయులలో మిగిలి ఉన్నవారిని కూడా పూర్తిగా నిర్మూలిస్తావా?” అని మొరపెట్టాను.
EZE 11:14 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 11:15 “మనుష్యకుమారుడా, మీ తోటి బందీల గురించి ఇతర ఇశ్రాయేలీయులందరి గురించి యెరూషలేము ప్రజలు, ‘వారు యెహోవాకు చాలా దూరంగా ఉన్నారు; ఈ దేశం మా స్వాస్థ్యంగా ఇవ్వబడింది’ అని అంటున్నారు.
EZE 11:16 “కాబట్టి వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దూరంగా ఉన్న జాతుల మధ్యకు నేను వారిని పంపినా, దేశాల మధ్య వారిని చెదరగొట్టినా వారు వెళ్లిన దేశాల్లో కొంతకాలం వారికి నేను పరిశుద్ధాలయంగా ఉన్నాను.’
EZE 11:17 “వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ జాతులలో నుండి మిమ్మల్ని సమకూర్చి, మీరు చెదిరిపోయిన దేశాల నుండి మిమ్మల్ని తిరిగి రప్పించి ఇశ్రాయేలు దేశాన్ని మీకు తిరిగి ఇస్తాను.’
EZE 11:18 “వారు అక్కడికి వచ్చి అక్కడ తాము ఉంచిన అసహ్యమైన విగ్రహాలను హేయమైన వాటిని తొలగిస్తారు.
EZE 11:19 నేను వారికి ఏక హృదయం ఇచ్చి వారిలో నూతన ఆత్మను ఉంచుతాను; నేను వారిలో నుండి రాతి హృదయాన్ని తీసివేసి వారికి మాంసపు హృదయాన్ని ఇస్తాను.
EZE 11:20 అప్పుడు వారు నా శాసనాలను అనుసరించి నా కట్టడలను పాటించడంలో జాగ్రత్తగా ఉంటారు. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను.
EZE 11:21 అయితే తమ విగ్రహాలను అనుసరిస్తూ ఎప్పటిలాగే అసహ్యమైన పనులు చేసేవారికి వాటి ప్రతిఫలాన్ని వారి తల మీదికి రప్పిస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
EZE 11:22 అప్పుడు కెరూబులు రెక్కలు విప్పాయి, చక్రాలు వాటి ప్రక్కనే ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ వాటిపై ఉంది.
EZE 11:23 యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకి వెళ్లి తూర్పున ఉన్న కొండ పైన ఆగింది.
EZE 11:24 దేవుని ఆత్మ వలన వచ్చిన దర్శనంలో ఆత్మ నన్ను పైకి ఎత్తి బబులోనీయుల దేశంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు తీసుకువచ్చింది. అంతలో నాకు కనబడిన దర్శనం నన్ను విడిచి వెళ్లిపోయింది.
EZE 11:25 అప్పుడు యెహోవా నాకు చూపించిన వాటన్నిటిని బందీలుగా ఉన్నవారికి చెప్పాను.
EZE 12:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 12:2 “మనుష్యకుమారుడా, నీవు తిరుగుబాటుదారుల మధ్య జీవిస్తున్నావు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి చూసే కళ్లు ఉన్నా చూడరు, వినే చెవులు ఉన్నా వినరు.
EZE 12:3 “కాబట్టి మనుష్యకుమారుడా, దేశాంతరం వెళ్లడానికి నీ వస్తువులను సర్దుకుని, పగటివేళ వారు చూస్తుండగానే బయలుదేరి నీవు ఉన్న చోటు నుండి వేరొక ప్రదేశానికి వెళ్లు. వారు తిరుగుబాటుదారులే అయినా బహుశా వారు అర్థం చేసుకోవచ్చు.
EZE 12:4 పగలు వారు చూస్తుండగా దేశం నుండి వెళ్లిపోడానికి సర్దుకున్న నీ సామాన్లు బయటకు తీసుకురా. సాయంత్రం వారు చూస్తుండగా దేశం విడిచి వెళ్తున్నట్లుగా బయలుదేరి వెళ్లు.
EZE 12:5 వారు చూస్తుండగా, గోడను త్రవ్వి దానిలో నుండి నీ వస్తువులను బయటకు తీయి.
EZE 12:6 వారు చూస్తుండగానే వాటిని నీ భుజంపై వేసుకుని సంధ్యా సమయంలో వాటిని తీసుకుని వెళ్లు. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు సూచనగా చేశాను కాబట్టి నీకు నేల కనిపించకుండా నీ ముఖాన్ని కప్పుకో.”
EZE 12:7 నాకు ఆజ్ఞాపించిన ప్రకారమే నేను చేశాను. దేశం విడిచి వెళ్తున్నట్లుగా పగలు నా సామాన్లు బయటకు తెచ్చాను. సాయంత్రం నా చేతితో గోడను త్రవ్వాను. రాత్రి వారు చూస్తుండగా నా సామాన్లు భుజంపై ఎత్తుకున్నాను.
EZE 12:8 ఉదయాన యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:
EZE 12:9 మనుష్యకుమారుడా, నీవేం చేస్తున్నావని తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలీయులు నిన్ను అడగలేదా?
EZE 12:10 “వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ ప్రవచనం యెరూషలేములోని యువరాజుకు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరికి సంబంధించినది.’
EZE 12:11 వారికి ఈ మాట చెప్పు: ‘నేను మీకు సూచనగా ఉన్నాను.’ “నేను చేసినట్లే వారికి కూడా జరుగుతుంది. వారు బందీలుగా దేశం నుండి కొనిపోబడతారు.
EZE 12:12 “వారిలో యువరాజు రాత్రివేళ తన సామాన్లు భుజంపై వేసుకుని తాను వెళ్లడానికి గోడను త్రవ్వుతాడు. అతడు నేల కనిపించకుండా తన ముఖాన్ని కప్పుకుంటాడు.
EZE 12:13 అతన్ని పట్టుకోడానికి వల వేయగా అతడు దానిలో చిక్కుకుంటాడు. నేను అతన్ని బబులోనీయుల దేశమైన బబులోనుకు తీసుకువస్తాను కానీ అతడు దానిని చూడకుండానే అక్కడే అతడు చనిపోతాడు.
EZE 12:14 అతనితో ఉన్నవారందరిని అనగా అతని సహాయకులను అతని సైన్యాన్ని గాలికి చెదరగొడతాను. కత్తి దూసి వారినందరిని తరుముతాను.
EZE 12:15 “నేను వారిని జాతుల మధ్యకు చెదరగొట్టి వివిధ దేశాలకు వెళ్లగొట్టినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
EZE 12:16 వారు వెళ్లే దేశాల్లోని ప్రజలకు వారు చేసే అసహ్యమైన ఆచారాల గురించి వివరించడానికి వారిలో కొంతమందిని ఖడ్గం నుండి కరువు తెగులు నుండి కాపాడి తప్పిస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు.”
EZE 12:17 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 12:18 “మనుష్యకుమారుడా, వణుకుతూ నీ ఆహారం తిను, భయంతో తడబడుతూ నీ నీళ్లు త్రాగు.
EZE 12:19 దేశంలోని ప్రజలకు ఇలా చెప్పు: ‘యెరూషలేములో ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్నవారి గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అక్కడ నివసించే వారందరు చేసే హింస కారణంగా వారి దేశంలోని ప్రతిదీ తీసివేయబడుతుంది. కాబట్టి వారు ఆందోళనలో తమ ఆహారాన్ని తింటారు నిరాశతో నీరు త్రాగుతారు.
EZE 12:20 నివాసులు ఉండిన పట్టణాలు వ్యర్థమైన శిథిలాలుగా, దేశం నిర్జనంగా మారుతాయి. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
EZE 12:21 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 12:22 “మనుష్యకుమారుడా, ‘రోజులు గడిచిపోతున్నాయి, ప్రతీ దర్శనం విఫలమవుతుంది’ అని ఇశ్రాయేలు దేశంలో చెప్పే సామెతకు అర్థం ఏమిటి?
EZE 12:23 వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఇకపై ఇశ్రాయేలు దేశంలో వినబడకుండ నేను ఆ సామెతకు ముగింపు ఇవ్వబోతున్నాను. ప్రతీ దర్శనం నెరవేరబోయే రోజులు ఎదురుగా ఉన్నాయని వారితో చెప్పు.
EZE 12:24 ఇశ్రాయేలీయుల మధ్య తప్పుడు దర్శనాలు గాని పొగడ్తలతో కూడిన భవిష్యవాణి గాని ఉండవు.
EZE 12:25 అయితే యెహోవానైన నేను, నేను ఏమి చేస్తానో అదే మాట్లాడతాను, అది ఆలస్యం లేకుండా నెరవేరుతుంది. ఎందుకంటే, తిరుగుబాటుదారులారా, మీ రోజుల్లో నేను చెప్పేది నెరవేరుస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
EZE 12:26 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 12:27 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు, ‘అతడు చూసే దర్శనం నెరవేరడానికి చాలా సంవత్సరాల పడుతుంది, అతడు చాలా కాలం తర్వాత భవిష్యత్తులో జరిగే వాటి గురించి ప్రవచిస్తున్నాడు’ అని అంటున్నారు.
EZE 12:28 “కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇకపై నా మాటల్లో ఏదీ ఆలస్యం కాదు; నేను చెప్పిన మాటలన్నీ నెరవేరుతాయి, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
EZE 13:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 13:2 “మనుష్యకుమారుడా, ఇప్పుడు ప్రవచిస్తున్న ఇశ్రాయేలు ప్రవక్తలకు వ్యతిరేకంగా ప్రవచించు. తమ సొంత ఊహ ఆధారంగా ప్రవచించే వారితో ఇలా చెప్పు: ‘యెహోవా మాట వినండి!
EZE 13:3 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: దర్శనమేమి చూడకపోయినా సొంత ఆత్మను అనుసరించే మూర్ఖ ప్రవక్తలకు శ్రమ.
EZE 13:4 ఇశ్రాయేలీయులారా! మీ ప్రవక్తలు శిథిలాల మధ్య తిరిగే నక్కల్లాంటి వారు.
EZE 13:5 ఇశ్రాయేలు ప్రజలు యెహోవా రోజున జరిగే యుద్ధంలో స్థిరంగా నిలబడేలా మీరు గోడ పగుళ్ల దగ్గరకు వెళ్లి వాటిని బాగుచేయలేదు.
EZE 13:6 వారి దర్శనాలు తప్పు, వారి భవిష్యవాణి అబద్ధము. యెహోవా తమను పంపకపోయినా, “ఇదే యెహోవా వాక్కు” అని చెబుతూ తమ మాటలు నెరవేరుతాయని నమ్మిస్తారు.
EZE 13:7 నేను మాట్లాడక పోయినా ఇదే యెహోవా మాట అని మీరు చెప్పినప్పుడు మీ చూసిన దర్శనాలు వట్టి భ్రమలు భవిష్యవాణి అబద్ధమే కదా?
EZE 13:8 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు చెప్పే వట్టిమాటలు అబద్ధపు దర్శనాల కారణంగా నేను మీకు వ్యతిరేకంగా ఉన్నానని ప్రభువైన యెహోవా తెలియజేస్తున్నారు.
EZE 13:9 వ్యర్థమైన దర్శనాలు చూస్తూ అబద్ధపు సోదె చెప్పే ప్రవక్తలకు నా చేయి వ్యతిరేకంగా ఉంటుంది. వారిని నా ప్రజల సభలోనికి రానివ్వను, వారు ఇశ్రాయేలీయుల జాబితాలో నమోదు చేయబడరు, ఇశ్రాయేలీయుల దేశానికి తిరిగి రారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.
EZE 13:10 “ ‘సమాధానం లేనప్పుడు సమాధానం అంటూ నా ప్రజలను మోసగిస్తున్నారు. ఒకరు కట్టిన బలహీనమైన గోడకు వారు సున్నం వేస్తారు.
EZE 13:11 సున్నం వేస్తున్నవారితో అది కూలిపోతుందని చెప్పు. నేను వర్షం, వడగండ్లు కురిపించినప్పుడు బలమైన గాలులు వీచి అది పడిపోతుంది.
EZE 13:12 గోడ కూలిపోవడం చూసిన ప్రజలు, “మీరు వేసిన సున్నం ఏది అని అడగరా?”
EZE 13:13 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను ఉగ్రతతో బలమైన గాలిని, కోపంతో వడగండ్లు కుండపోత వర్షాన్ని పంపి దానిని పడగొడతాను.
EZE 13:14 మీరు సున్నం వేసిన గోడను దాని పునాది కనబడేలా నేలమట్టం చేస్తాను. ఆ గోడ పడినప్పుడు దాని క్రింద మీరంతా నాశనమవుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
EZE 13:15 ఆ గోడ మీద దానికి సున్నం వేసిన వారి మీద నా కోపం కురిపిస్తాను. అప్పుడు నేను మీతో, “గోడ లేదు దానికి సున్నం వేసినవారు కూడా లేరు,
EZE 13:16 యెరూషలేముకు సమాధానం లేకపోయినా సమాధానం కలిగే దర్శనాలు చూసి ప్రవచించే ఇశ్రాయేలు ప్రవక్తలు కూడా ఉండరు అని చెప్తాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.” ’
EZE 13:17 “మనుష్యకుమారుడా, ప్రవచిస్తున్న నీ ప్రజల కుమార్తెలకు విరోధంగా ప్రవచించి,
EZE 13:18 వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ప్రజలను వలలో వేసుకోవడానికి తమ మణికట్టు మీద తాయెత్తులు కట్టుకుని తమ తలలపై వేసుకోడానికి వివిధ రకాల ముసుగులు తయారుచేసే స్త్రీలకు శ్రమ. మీరు నా ప్రజల జీవితాలను ఉచ్చులో ఇరికించి, మీ సొంత ప్రాణాలను కాపాడుకుంటారా?
EZE 13:19 మీరు గుప్పెడు యవల కోసం రొట్టె ముక్కల కోసం నా ప్రజలమధ్య నన్ను అవమానపరిచారు. అబద్ధాలు వినే నా ప్రజలకు అబద్ధాలు చెప్పి, చావకూడని వారిని చంపారు; బ్రతకకూడని వారిని విడిచిపెట్టారు.
EZE 13:20 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు పక్షులకు వల వేసినట్లు ప్రజల ప్రాణాలకు వల వేయడానికి ఉపయోగించే మీ మంత్రాలకు నేను వ్యతిరేకిని. నేను వాటిని మీ చేతుల నుండి తెంపివేస్తాను; పక్షులను పట్టినట్లు వలవేసి మీరు పట్టిన ప్రజలను విడిపిస్తాను.
EZE 13:21 నేను మీ ముసుగులను చింపివేసి, నా ప్రజలను మీ చేతుల నుండి రక్షిస్తాను, వారు ఇకపై మీ శక్తికి బలి అవరు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
EZE 13:22 ఇదంతా ఎందుకంటే, నేను దుఃఖపరచని నీతిమంతుల హృదయాన్ని అబద్ధాలతో మీరు దుఃఖపెట్టారు. దుర్మార్గులు తమ చెడు మార్గాలు వదిలిపెట్టి తమ ప్రాణాలను కాపాడుకోకుండ మీరు వారిని ప్రోత్సహించారు.
EZE 13:23 కాబట్టి ఇకపై మీరు అబద్ధపు దర్శనాలు చూడరు భవిష్యవాణి చెప్పరు. మీ చేతుల్లో నుండి నా ప్రజలను రక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
EZE 14:1 ఇశ్రాయేలు పెద్దలలో కొంతమంది నా దగ్గరకు వచ్చి నాకు ఎదురుగా కూర్చున్నారు.
EZE 14:2 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 14:3 “మనుష్యకుమారుడా, ఈ మనుష్యులు తమ హృదయాల్లో విగ్రహాలను ఉంచుకొని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకున్నారు. నా దగ్గర విచారణ చేయడానికి నేను వారిని అనుమతించాలా?
EZE 14:4 కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ ఇశ్రాయేలు సర్వసమాజం తమ హృదయాల్లో విగ్రహాలను పెట్టుకుని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకుని ప్రవక్త దగ్గరకు వెళ్తే వారు చేసే విగ్రహారాధనను బట్టి వారికి యెహోవానైన నేనే స్వయంగా సమాధానం ఇస్తాను.
EZE 14:5 తమ విగ్రహాలన్నిటి కోసం నన్ను విడిచిపెట్టిన ఇశ్రాయేలీయుల హృదయాలను తిరిగి నా వైపు త్రిప్పుకోడానికి నేను ఇలా చేస్తాను.’
EZE 14:6 “కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీ విగ్రహాలను విడిచిపెట్టి అసహ్యకరమైన ఆచారాలు మానివేసి మనస్సు మార్చుకోండి.
EZE 14:7 “ ‘ఇశ్రాయేలీయులు గాని వారి దేశంలో ఉంటున్న విదేశీయులు గాని నన్ను విడిచిపెట్టి తమ హృదయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించుకుని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకుని నా దగ్గర విచారణచేయమని వారు ప్రవక్త దగ్గరకు వెళ్తే వారికి యెహోవానైన నేనే స్వయంగా సమాధానం ఇస్తాను.
EZE 14:8 వారికి నేను విరోధిగా ఉండి వారిని ఒక సూచనగా సామెతగా చేస్తాను. నేను వారిని నా ప్రజల నుండి తొలగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
EZE 14:9 “ ‘ఎవరైనా ప్రవక్త మోసపోయి ఏదైన ప్రవచనం చెబితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి వ్యతిరేకంగా నా చేయి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలులో నుండి అతన్ని నాశనం చేస్తాను.
EZE 14:10 వారు తమ శిక్షను భరిస్తారు; ప్రవచనం కోసం వచ్చిన వాని దోషమెంతో ప్రవచించిన ప్రవక్త దోషం కూడా అంతే.
EZE 14:11 అప్పుడిక ఇశ్రాయేలు ప్రజలు నన్ను విడిచిపెట్టరు, వారు తమ పాపాలన్నిటితో తమను తాము అపవిత్రం చేసుకోరు. వారు నా ప్రజలై ఉంటారు. నేను వారి దేవుడినై ఉంటానని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
EZE 14:12 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 14:13 “మనుష్యకుమారుడా, ఒక దేశం నమ్మకద్రోహంతో నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే దానికి వ్యతిరేకంగా నా చేతిని చాపి ఆహారం లేకుండా చేసి కరువు పంపించి దాని మనుష్యులను పశువులను చంపుతాను.
EZE 14:14 ఆ దేశంలో నోవహు దానియేలు యోబు ఈ ముగ్గురు ఉన్నప్పటికీ వారు తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 14:15 “ఆ దేశం పిల్లలు లేనిదై నిర్మానుష్యంగా మారేలా దాని మీదికి అడవి మృగాలను పంపుతాను. వాటి కారణంగా దానిగుండా ఎవరూ ప్రయాణించరు.
EZE 14:16 నా జీవం తోడు ఆ ముగ్గురు నీతిమంతులు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. వారు తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు కాని దేశం పాడైపోతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 14:17 “నేను ఆ దేశం మీదికి ఖడ్గాన్ని రప్పించి, ఆ దేశమంతా తిరిగి దానిలోని మనుష్యులను పశువులను చంపమని చెప్పినప్పుడు,
EZE 14:18 నా జీవం తోడు ఆ ముగ్గురు నీతిమంతులు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. వారు తమను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 14:19 “నేను ఆ దేశంలోకి తెగులు పంపి రక్తపాతం జరిగేంతగా నా ఉగ్రత కుమ్మరించి మనుష్యులను పశువులను చంపినప్పుడు,
EZE 14:20 నా జీవం తోడు నోవహు దానియేలు యోబు అక్కడ ఉన్నప్పటికీ వారు తమ కుమారులను కుమార్తెలను రక్షించుకోలేరు. తమ నీతితో తమను మాత్రమే రక్షించుకోగలరని యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 14:21 “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దాని మనుష్యులను వారి జంతువులను చంపడానికి యెరూషలేము మీదికి ఖడ్గం కరువు అడవి మృగాలు తెగులు అనే నాలుగు భయంకరమైన తీర్పులను పంపినప్పుడు అది ఎంతో ఘోరంగా ఉంటుంది!
EZE 14:22 అయినప్పటికీ దానిలో నుండి బయటకు రప్పించబడిన కుమారులు కుమార్తెలలో కొంతమంది ప్రాణాలతో మిగిలి ఉంటారు. వారు మీ దగ్గరకు వస్తారు, మీరు వారి ప్రవర్తనలో పనులలో తేడాను చూసినప్పుడు నేను యెరూషలేము మీదికి రప్పించిన కీడు గురించి నేను దానికి చేసిన వాటన్నిటి గురించి మీరు ఓదార్పు పొందుతారు.
EZE 14:23 వారి ప్రవర్తన వారి పనులు చూసినప్పుడు నేను కారణం లేకుండా ఏదీ చేయలేదని మీరు తెలుసుకుని ఓదార్పు పొందుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”
EZE 15:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 15:2 “మనుష్యకుమారుడా, ద్రాక్షచెట్టు కర్ర అడవిలోని ఇతర చెట్ల కొమ్మల కంటే ఏమైనా గొప్పదా?
EZE 15:3 దాని కర్ర ఏ పనికైనా ఉపయోగపడుతుందా? ఏ పనికైనా దాని కర్రను వాడతారా? దేనినైనా తగిలించడానికి దాని కర్రతో మేకులు తయారుచేస్తారా?
EZE 15:4 లేదు కదా, అది మంటలో వేయడానికే ఉపయోగపడుతుంది. అగ్నిలో రెండు చివరలు మధ్య భాగం కాలిపోయిన తర్వాత అది దేనికైనా ఉపయోగపడుతుందా?
EZE 15:5 అది కాలక ముందే దేనికి ఉపయోగపడనప్పుడు అగ్నిలో పూర్తిగా కాలిన తర్వాత మరి దేనికి ఉపయోగపడుతుంది?
EZE 15:6 “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: అడవి చెట్లలో ద్రాక్షచెట్టు కర్రను నేను ఎలా అగ్నికి అప్పగించానో అలానే యెరూషలేములో నివసించే ప్రజలను అప్పగిస్తాను.
EZE 15:7 నేను వారిపట్ల కఠినంగా ఉంటాను. వారు అగ్ని నుండి తప్పించుకున్నా సరే అగ్ని వారిని కాల్చివేస్తుంది. నేను వారిపట్ల కఠినంగా ఉన్నప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
EZE 15:8 వారు నమ్మకద్రోహులుగా ఉన్నారు కాబట్టి నేను దేశాన్ని పాడుచేస్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”
EZE 16:1 యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చి:
EZE 16:2 “మనుష్యకుమారుడా, యెరూషలేము చేసిన అసహ్యమైన ఆచారాలు దానికి తెలియజేసి,
EZE 16:3 ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఇలా చెప్తున్నారు: మీ మూలలు, మీ పుట్టుక కనానీయుల దేశంలోనే; మీ తండ్రి అమోరీయుడు, మీ తల్లి హిత్తీయురాలు.
EZE 16:4 నీ జన్మ విధానం చూస్తే, నీవు పుట్టిన రోజున నీ నాభి సూత్రం కత్తిరించబడలేదు, నిన్ను నీళ్లతో శుభ్రం చేయలేదు, ఉప్పుతో రుద్దలేదు, గుడ్డలో చుట్టలేదు.
EZE 16:5 నీ మీద ఎవరూ జాలిపడలేదు. ఈ పనులలో ఒక్కటైనా చేయాలని ఎవరూ నీ మీద కనికరం చూపించలేదు. పైగా, పుట్టిననాడే నిన్ను అసహ్యించుకుని, బయట పొలంలో విసిరివేశారు.
EZE 16:6 “ ‘అప్పుడు నేను అటు నుండి వెళ్తూ నీ రక్తంలో కొట్టుకుంటున్న నిన్ను చూసి, నీవు నీ రక్తంలో పడి ఉన్నప్పుడు నేను నీతో, “బ్రతుకు!” అని అన్నాను.
EZE 16:7 నిన్ను పొలం లోని మొక్కలా పెంచాను. నీవు పెరిగి అభివృద్ధిచెంది యుక్తవయస్సులోకి ప్రవేశించావు. నీకు రొమ్ములు ఏర్పడ్డాయి, నీ జుట్టు పెరిగింది, అయినప్పటికీ నీవు పూర్తిగా నగ్నంగా ఉన్నావు.
EZE 16:8 “ ‘తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసి, నీవు ప్రేమకు తగిన వయస్సులో ఉన్నావు కాబట్టి నా వస్త్రాన్ని నీపై వేసి నీ నగ్న శరీరాన్ని కప్పాను. నేను నీతో ప్రమాణం చేసి నిబంధన చేసుకున్నప్పుడు నీవు నా దానివి అయ్యావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 16:9 “ ‘నీకు నీళ్లతో స్నానం చేయించి నీ రక్తాన్ని కడిగి సువాసనగల నూనెతో నిన్ను అభిషేకించాను.
EZE 16:10 నీకు అందమైన కుట్టుపని చేసిన వస్త్రాలు వేసి, మంచి చర్మంతో చేసిన చెప్పులు నీ పాదాలకు తొడిగించాను. నీకు సన్నని అవిసె నారబట్టలు వేసి ఖరీదైన పట్టు వస్త్రంతో నిన్ను కప్పాను.
EZE 16:11 నేను నిన్ను నగలతో అలంకరించాను: నీ చేతులకు కంకణాలు, మెడలో హారం వేసి,
EZE 16:12 ముక్కుకు ముక్కుపుడక, చెవులకు పోగులు తలపై కిరీటం పెట్టాను.
EZE 16:13 ఇలా నిన్ను బంగారం, వెండితో అలంకరించి, సన్నని నార కుట్టుపని ఉన్న ఖరీదైన పట్టు వస్త్రాలు నీకు ధరింపజేశాను. నీకు ఆహారంగా తేనె, ఒలీవనూనె నాణ్యమైన పిండి ఇవ్వగా నీవు చాలా అందంగా తయారయ్యావు, ఒక రాణిగా ఎదిగావు.
EZE 16:14 నీ అందం కారణంగా నీ కీర్తి దేశాల్లో వ్యాపించింది, ఎందుకంటే నేను నీకు ఇచ్చిన వైభవం నీ అందాన్ని పరిపూర్ణం చేసిందని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 16:15 “ ‘అయితే నీ అందాన్ని నమ్ముకుని, నీ కీర్తిని ఉపయోగించుకుని నీవు వేశ్యగా మారావు. దారిన వెళ్లే వారందరితో వ్యభిచరించావు; నీ అందం వారి సొంతం అయింది.
EZE 16:16 నీవు అందమైన క్షేత్రాలను ఏర్పాటు చేయడానికి నీ వస్త్రాల్లో కొన్నిటిని తీసుకున్నావు, అక్కడ నీవు నీ వ్యభిచారం కొనసాగించావు. నీవు అతని దగ్గరకు వెళ్లావు, అతడు నీ అందాన్ని తనది చేసుకున్నాడు.
EZE 16:17 నేను నీకు ఇచ్చిన నాణ్యమైన నగలు, నా బంగారు వెండితో చేసిన నగలు కూడా తీసుకుని, నీకోసం మగ విగ్రహాలను తయారుచేసి, వాటితో వ్యభిచారం చేశావు.
EZE 16:18 నీవు వాటికి నీ కుట్టుపని చేసిన వస్త్రాలు ధరింపజేసి, నీవు వాటికి నా నూనె, ధూపం సమర్పించావు.
EZE 16:19 నేను నీకు ఆహారంగా ఇచ్చిన నాణ్యమైన పిండి, తేనె, నూనెలను తీసుకుని సువాసన వచ్చేలా వాటికి అర్పించావు. జరిగింది ఇదే అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 16:20 “ ‘నీవు నాకు కనిన కుమారులను, కుమార్తెలను ఆ విగ్రహాలకు ఆహారంగా బలి అర్పించావు. నీవు చేసిన వ్యభిచారం సరిపోలేదా?
EZE 16:21 నా పిల్లలను నీవు వధించి ఆ విగ్రహాలకు బలి ఇచ్చావు.
EZE 16:22 నీవు అసహ్యకరమైన ఆచారాలు పాటిస్తూ వ్యభిచారం చేస్తున్నప్పుడు నీ యవ్వనంలో నీవు నగ్నంగా ఒంటి మీద ఏమి లేకుండ, నీ రక్తంలో పడి తన్నుకుంటున్న రోజులను జ్ఞాపకం చేసుకోలేదు.
EZE 16:23 “ ‘నీవు చేసిన చెడుతనాన్ని బట్టి శ్రమ! నీకు శ్రమ అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 16:24 నీవు నీకోసం ఒక మట్టిదిబ్బను నిర్మించుకున్నావు, ప్రతి బహిరంగ కూడలిలో ఒక ఎత్తైన క్షేత్రాన్ని నిర్మించావు.
EZE 16:25 ప్రతి వీధి మూలలో నీవు నీ ఎత్తైన క్షేత్రాలను నిర్మించి, నీ అందాన్ని దిగజార్చుకున్నావు, కామం ఎక్కువై దారిన ఎవరు వెళ్తే వారికి నీ కాళ్లను తెరిచి వ్యభిచరించావు.
EZE 16:26 నీవు కామవాంఛలతో నిండిన నీ పొరుగువారైన ఈజిప్టు వారితో మరి ఎక్కువగా వ్యభిచారం చేసి నాకు కోపాన్ని రేపావు.
EZE 16:27 కాబట్టి నేను నీ మీదికి చేయి చాచి నీ సరిహద్దులను కుదించాను; నీ అశ్లీల ప్రవర్తనకు దిగ్భ్రాంతి చెందిన ఫిలిష్తీయుల కుమార్తెలైన నీ శత్రువుల దురాశకు నిన్ను అప్పగించాను.
EZE 16:28 నీకు తృప్తి కలుగలేదు కాబట్టి నీవు అష్షూరీయులతో కూడా వ్యభిచరించావు; ఆ తర్వాత కూడా నీకు తృప్తి కలుగలేదు.
EZE 16:29 బబులోను వర్తక దేశంతో కూడా వ్యభిచరించావు, అయినా నీకు తృప్తి కలుగలేదు.
EZE 16:30 “ ‘నీవు ఇవన్నీ చేస్తూ సిగ్గులేని వేశ్యలా ప్రవర్తిస్తూ ఉంటే, నాకు నీ మీద కోపం వచ్చింది, అని ప్రభువైన యెహోవా అంటున్నారు.
EZE 16:31 నీవు ప్రతి వీధి మూలలో నీ మట్టిదిబ్బలను నిర్మించినప్పుడు, ప్రతి బహిరంగ కూడలిలో నీ క్షేత్రాలను నిర్మించినప్పుడు నీవు ఒక వేశ్య చేసినట్లు చేయలేదు, ఎందుకంటే నీవు డబ్బును తిరస్కరించావు.
EZE 16:32 “ ‘వ్యభిచారియైన భార్యా! నీవు నీ సొంత భర్త కంటే అపరిచితులే కావాలనుకుంటావు!
EZE 16:33 వేశ్యలందరూ బహుమతులు తీసుకుంటారు, కానీ నీ ప్రేమికులందరికీ నీవు ఎదురు బహుమతులు ఇస్తావు, నీతో వ్యభిచారం చేయడం కోసం ఎక్కడి నుండైనా నీ దగ్గరకు రావాలని వారికి లంచం ఇస్తావు.
EZE 16:34 కాబట్టి నీ వ్యభిచారంలో నీకు ఇతరులకు తేడా ఉంది; నీతో వ్యభిచరించడానికి ఎవరూ నీ వెంట పడరు. నీవు డబ్బులు తీసుకోవు కాని తిరిగి నీవే వారికి ఇస్తావు కాబట్టి నీవు చాలా భిన్నమైనదానివి.
EZE 16:35 “ ‘కాబట్టి, వేశ్యా, నీవు యెహోవా మాట విను!
EZE 16:36 ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: నీవు నీ ప్రేమికులతో నీ వ్యభిచారంలో నీ కామాన్ని కుమ్మరించి, నీ నగ్న శరీరాన్ని చూపించినందుకు, నీ అసహ్యకరమైన విగ్రహాల కారణంగా, నీవు వాటికోసం నీ పిల్లల రక్తాన్ని చిందించినందున,
EZE 16:37 నీకు ఇష్టమైన నీ ప్రేమికులందరిని నీవు ప్రేమించినవారిని అలాగే నీవు ద్వేషించిన వారందరిని పోగుచేస్తాను. నీ చుట్టూ వారిని పోగు చేసి వారు నీ నగ్న శరీరాన్ని చూసేలా వారి ఎదుట నిన్ను వివస్త్రను చేస్తాను.
EZE 16:38 వ్యభిచారులై హత్యలు చేసే స్త్రీలకు విధించే శిక్షను నేను నీకు విధిస్తాను; నా కోపం, రోషంతో కూడిన రక్త ప్రతీకారాన్ని నేను నీ మీదికి తెస్తాను.
EZE 16:39 తర్వాత నేను నిన్ను నీ ప్రేమికుల చేతికి అప్పగిస్తాను, వారు నీ మట్టిదిబ్బలను కూల్చివేసి, నీ ఎత్తైన క్షేత్రాలను నాశనం చేస్తారు. వారు నీ బట్టలు విప్పి, నీ సొగసైన నగలును తీసుకుని నిన్ను నగ్నంగా వదిలివేస్తారు.
EZE 16:40 వారు నీ మీదికి గుంపును రెచ్చగొట్టి పంపుతారు, ఆ గుంపు నిన్ను రాళ్లతో కొట్టి, తమ ఖడ్గాలతో నిన్ను ముక్కలు చేస్తారు.
EZE 16:41 వారు నీ ఇళ్ళను తగలబెట్టి, అనేకమంది స్త్రీల చూస్తుండగా నీకు శిక్ష విధిస్తారు. నేను నీ వ్యభిచారాన్ని మాన్పిస్తాను, నీవు ఇకపై నీ ప్రేమికులకు డబ్బు చెల్లించవు.
EZE 16:42 అప్పుడు నీ మీద నా ఉగ్రత తగ్గిపోతుంది, రోషంతో కూడిన నా కోపం నీ మీద నుండి తొలగిపోతుంది; నేను ప్రశాంతంగా ఉంటాను, ఇకపై కోపంగా ఉండను.
EZE 16:43 “ ‘నీవు నీ యవ్వన దినాలను జ్ఞాపకం చేసుకోక వీటన్నిటితో నాకు కోపం రేపావు కాబట్టి, నీవు చేసిన పనిని నేను నిశ్చయంగా నీ తల మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. మీరు మీ ఇతర అసహ్యకరమైన ఆచారాలకు అసభ్యతను జోడించలేదా?
EZE 16:44 “ ‘సామెతలు చెప్పే ప్రతి ఒక్కరూ నీ గురించి ఈ సామెత చెప్తారు: “తల్లి ఎలాంటిదో కూతురు అలాంటిదే” అని.
EZE 16:45 నీవు భర్తను పిల్లలను విడిచిపెట్టిన నీ తల్లికి తగిన కుమార్తెవు; అలాగే నీవు తన భర్తను పిల్లలను విడిచిపెట్టిన నీ అక్కకు తగ్గ చెల్లెలివి. నీ తల్లి హిత్తీయురాలు నీ తండ్రి అమోరీయుడు.
EZE 16:46 నీ ఎడమ ప్రక్కన తన కుమార్తెలతో నివసించే సమరయ నీకు అక్క, నీ కుడి ప్రక్కన తన కుమార్తెలతో నివసించే సొదొమ నీకు చెల్లెలు.
EZE 16:47 నీవు వారిలా ప్రవర్తించడమే కాకుండా వారి అసహ్యకరమైన ఆచారాలను పాటించావు, ప్రవర్తన అంతటిలో వారికన్నా మరింతగా దిగజారిపోయావు.
EZE 16:48 నీవు, నీ కుమార్తెలు చేసినట్లు నీ సోదరియైన సొదొమ గాని దాని కుమార్తెలు గాని చేయలేదని నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 16:49 “ ‘నీ సోదరి సొదొమ చేసిన పాపమేమిటంటే, తాను, తన కుమార్తెలు అహంకారులు, ఆహార సమృద్ధి కలిగి ఉండి ఇతరులను పట్టించుకోరు; వారు పేదలకు గాని అవసరంలో ఉన్నవారికి గాని సహాయం చేయలేదు.
EZE 16:50 వారంతా గర్వించి నా ఎదుట అసహ్యమైన వాటిని చేశారు కాబట్టి అదంతా చూసి నేను వారిని వెళ్లగొట్టాను.
EZE 16:51 సమరయ సైతం నీవు చేసిన పాపంలో సగమైనా చేయలేదు. నీవు వారికంటే అసహ్యమైన పనులు చేశావు. నీవు చేసిన వాటితో పోల్చితే నీ అక్కచెల్లెళ్లు నీతిమంతులుగా కనబడతారు.
EZE 16:52 నీ అక్కచెల్లెళ్లకు నీవు విధించిన అవమాన శిక్ష నీవే భరించాలి. వారి పాపాల నీ పాపాలు కంటే చాలా నీచంగా ఉన్నాయి కాబట్టి వారు నీ కంటే ఎక్కువ నీతిమంతులుగా కనిపిస్తారు. నీ పనుల వలన నీ అక్కచెల్లెళ్లు నీతిమంతులుగా కనబడుతున్నారు కాబట్టి సిగ్గుపడి అవమానాన్ని భరించు.
EZE 16:53 “ ‘నేను సొదొమకు దాని కుమార్తెలకు, సమరయకు దాని కుమార్తెలకు వారి సంపదతో పాటు మీ సంపదను తిరిగి ఇస్తాను.
EZE 16:54 తద్వార వారి ఆదరణ కోసం నీవు చేసిన దానంతటిని బట్టి నీవు అవమానాన్ని భరించి సిగ్గుపడతావు.
EZE 16:55 నీ సోదరీలైన సొదొమ దాని కుమార్తెలు, సమరయ దాని కుమార్తెలు తమ పూర్వస్థితికి వస్తారు. అలాగే నీవు నీ కుమార్తెలు కూడా మీ పూర్వస్థితికి వస్తారు.
EZE 16:56 నీవు గర్వించే రోజుల్లో, నీ దుర్మార్గం బయటపడక ముందు నీ సోదరి సొదొమ గురించి కూడా ప్రస్తావించవు,
EZE 16:57 అయినప్పటికీ, ఇప్పుడు ఎదోము కుమార్తెలు, ఆమె పొరుగువారైన ఫిలిష్తీయుల కుమార్తెలు, మీ చుట్టూ ఉన్న మిమ్మల్ని తృణీకరించే వారందరూ మిమ్మల్ని దూషిస్తున్నారు.
EZE 16:58 నీ అసభ్య ప్రవర్తనకు నీ అసహ్యమైన ఆచారాల పర్యవసానాన్ని నీవే భరించాలి అని యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 16:59 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు చేసిన నిబంధన ఉల్లంఘించడం ద్వారా నీవు నా ప్రమాణాన్ని తృణీకరించావు కాబట్టి దానికి తగినట్లుగా నీకు చేస్తాను.
EZE 16:60 అయినా నీ యవ్వనంలో నేను నీతో చేసిన ఒడంబడికను జ్ఞాపకం చేసుకుంటాను, నీతో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను.
EZE 16:61 నీవు నీ అక్కచెల్లెళ్లను కలుసుకున్నప్పుడు నీ మార్గాలను జ్ఞాపకం చేసుకుని సిగ్గుపడతావు. నీతో నా ఒడంబడికలో భాగం కాకపోయినా నేను వారిని నీకు కుమార్తెలుగా ఇస్తాను.
EZE 16:62 నేను నీతో నా ఒడంబడికను స్థిరపరుస్తాను, అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.
EZE 16:63 నీవు చేసిన వాటన్నిటికి నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు నీవు వాటిని జ్ఞాపకం చేసుకుని సిగ్గుపడతావు, నీ అవమానాన్ని బట్టి ఇక ఎన్నటికీ నోరు విప్పవు, ఇదే యెహోవా వాక్కు.’ ”
EZE 17:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 17:2 “మనుష్యకుమారుడా, నీవు ఒక పొడుపు కథ వేసి, దానిని ఇశ్రాయేలీయులకు ఒక ఉపమానంలా చెప్పాలి.
EZE 17:3 వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: బలమైన రెక్కలు, పొడవైన ఈకలు కలిగి రకరకాల రంగులతో ఉన్న ఒక పెద్ద గ్రద్ద లెబానోను పర్వతానికి వచ్చి, దేవదారు చెట్టు కొమ్మపై వాలి,
EZE 17:4 దాని అంచున ఉన్న లేత కొమ్మల చిగురు తెంపి వర్తకుల దేశానికి తీసుకెళ్లి వ్యాపారుల పట్టణంలో దానిని నాటింది.
EZE 17:5 “ ‘అది ఆ దేశపు విత్తనాలను తీసుకెళ్లి సారవంతమైన నేలలో నాటింది. విస్తారమైన నీటి ప్రక్కన పెరిగే నిరవంజి చెట్లలా ఆ మొక్కను నాటింది,
EZE 17:6 అది చిగురు వేసి పైకి పెరగకుండ నేలమీద విస్తరించి పెద్ద ద్రాక్షావల్లి అయింది. దాని కొమ్మలు గ్రద్ద వరకు వెళ్లాయి, కాని దాని వేర్లు గ్రద్ద క్రింద ఉన్నాయి. అలా అది ద్రాక్షవల్లిలా మారి అనేక కొమ్మలతో రెమ్మలు వేసింది.
EZE 17:7 “ ‘అయితే బలమైన రెక్కలు దట్టమైన ఈకలతో మరొక పెద్ద గ్రద్ద ఉంది. ఆ ద్రాక్షావల్లి అది నాటబడిన చోటు నుండి ఆ గ్రద్ద వైపు తన వేర్లు విస్తరింపజేసుకుని, దాని కొమ్మలను నీటి కోసం దానివైపు విస్తరింపచేసుకుంది.
EZE 17:8 ఆ ద్రాక్షావల్లికి తీగెలు వచ్చి, పండ్లు ఇచ్చేలా, అద్భుతమైన ద్రాక్షవల్లిలా అయ్యేలా, అది మంచి నేలలో విస్తారమైన నీటి ప్రక్కన నాటబడింది.’
EZE 17:9 “కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అలాంటి ద్రాక్షావల్లి వృద్ధి చెందుతుందా? అది ఎండిపోయేలా ప్రజలు దాని వేరు పెకిలించి, దాని పండ్లు కోయరా? దాని చిగురులన్నీ ఎండిపోతాయి. దానిని వేర్లతో సహా పెకిలించడానికి బలమైన చేయి గాని, చాలామంది వ్యక్తులు గాని అవసరం లేదు.
EZE 17:10 అది ఒకచోట నుండి మరొక చోట నాటబడింది, అది వృద్ధి చెందుతుందా? తూర్పు గాలి దాని మీద వీచినపుడు అది నాటబడిన చోటనే ఎండిపోదా?’ ”
EZE 17:11 మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 17:12 “తిరుగుబాటు చేసే ఈ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఈ మాటల అర్థం మీకు తెలియదా?’ ఇదిగో, ‘బబులోను రాజు యెరూషలేముకు వెళ్లి దాని రాజును, అధిపతులను పట్టుకుని తనతో పాటు బబులోనుకు తీసుకువచ్చాడు.
EZE 17:13 తర్వాత అతడు రాజ కుటుంబీకుల్లో ఒకన్ని ఎంచుకుని, అతనితో ప్రమాణం చేయించి, అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాక ఆ రాజ్యం బలహీనపడి, మరలా అది బలపడకుండా తన ఒప్పందాన్ని పాటించడం ద్వారా మాత్రమే మనుగడ సాగించేలా, దేశంలోని నాయకులను తీసుకెళ్లిపోయాడు.
EZE 17:15 అయితే రాజకుటుంబం నుండి ఎంచుకోబడిన వ్యక్తి, తనకు గుర్రాలను పెద్ద సైన్యాన్ని పంపి సహాయం చేయమని అడగడానికి ఈజిప్టు దేశానికి రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు. అతడు విజయం సాధిస్తాడా? అటువంటి పనులు చేసినవాడు తప్పించుకుంటాడా? అతడు ఒప్పందాన్ని ఉల్లంఘించి తప్పించుకుంటాడా?
EZE 17:16 “ ‘ఏ రాజైతే అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడో, ఎవరి ప్రమాణాన్ని అతడు తృణీకరించాడో, ఎవరి ఒప్పందాన్ని అతడు ఉల్లంఘించాడో ఆ రాజు దేశమైన బబులోనులోనే, నా జీవం తోడు అతడు చనిపోతాడు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 17:17 యుద్ధం జరిగేటప్పుడు అనేకుల జీవితాలను నాశనం చేయాలని బబులోనీయులు ముట్టడి దిబ్బలు వేసి కోటలు కట్టినప్పుడు ఫరో తనకున్న మహా బలమైన గొప్ప సైన్యంతో వచ్చినా ఆ రాజుకు ఏమాత్రం సహాయం చేయలేడు.
EZE 17:18 నిబంధనను భంగం చేసి తన ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేశాడు. ప్రమాణం చేసి కూడా అలాంటి పనులు చేశాడు కాబట్టి అతడు ఏమాత్రం తప్పించుకోలేడు.
EZE 17:19 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: అతడు నేను పెట్టుకున్న ఒట్టును తృణీకరించి నా నిబంధనను భంగం చేసినందుకు నా జీవం తోడు నేను అతనికి ప్రతిఫలమిస్తాను.
EZE 17:20 నేను అతనికి వలవేసి నా ఉచ్చులో బిగించి బబులోనుకు తీసుకెళ్లి అతడు నా పట్ల నమ్మకద్రోహిగా ఉన్నాడు కాబట్టి అక్కడ అతనికి శిక్ష విధిస్తాను.
EZE 17:21 అతని సైన్యంలో ఎంపిక చేయబడిన వారందరు కత్తివేటుకు చనిపోతారు, తప్పించుకున్నవారు గాలికి చెదిరిపోతారు. అప్పుడు యెహోవానైన నేనే ఈ మాట చెప్తున్నానని మీరు తెలుసుకుంటారు.
EZE 17:22 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఎత్తైన దేవదారు చెట్టులో చిటారు కొమ్మ ఒకటి తీసి దానిని నాటుతాను; దాని పైనున్న కొమ్మల్లో ఒక లేత కొమ్మను త్రుంచి అత్యున్నత పర్వతం మీద నాటుతాను.
EZE 17:23 ఇశ్రాయేలు దేశంలో ఎత్తైన పర్వతం మీద నేనే దానిని నాటుతాను. అది కొమ్మలు వేసి ఫలించి ఘనమైన దేవదారు చెట్టు అవుతుంది. అన్ని రకాల పక్షులు దానిపై గూళ్ళు కట్టుకుంటాయి; దాని కొమ్మల నీడలో అవి ఆశ్రయాన్ని పొందుతాయి.
EZE 17:24 యెహోవానైన నేనే పొడవైన చెట్లను చిన్నవిగా, నీచమైన చెట్లను గొప్ప చెట్లుగా మార్చగలనని, పచ్చని చెట్టుని ఎండిపోయేలా, ఎండిన చెట్టుని పచ్చని చెట్టులా చేస్తానని అడవిలో ఉన్న అన్ని చెట్లు తెలుసుకుంటాయి. “ ‘యెహోవానైన నేనే ఈ మాట అంటున్నాను. నేనే దానిని నెరవేరుస్తాను.’ ”
EZE 18:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 18:2 “ఇశ్రాయేలు దేశం గురించి మీరు చెప్పే ఈ సామెతకు అర్థం ఏంటి? “ ‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్షలు తింటే పిల్లల పళ్లు పులిసాయి.’
EZE 18:3 “నా జీవం తోడు, ఇశ్రాయేలీయుల మధ్య ఈ సామెత మళ్ళీ వినపడదు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 18:4 ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా వారే, తండ్రులైనా పిల్లలైనా ఇద్దరూ నా వారే. పాపం చేసేవాడు చనిపోతాడు.
EZE 18:5 “ఒక నీతిమంతుడు ఉంటే అతడు నీతిని న్యాయాన్ని జరిగిస్తాడు.
EZE 18:6 అతడు పర్వత క్షేత్రాల మీద భోజనం చేయడు, ఇశ్రాయేలీయుల విగ్రహాలవైపు చూడడు, తన పొరుగువాని భార్యను అపవిత్రం చేయడు, బహిష్టులో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవడు,
EZE 18:7 ఎవరిని బాధించడు, అప్పుకు తాకట్టుగా పెట్టిన దానిని తిరిగి ఇచ్చేస్తాడు, ఎవరినీ దోచుకోడు కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇచ్చి దిగంబరికి బట్టలు ఇస్తాడు.
EZE 18:8 వడ్డీకి అప్పు ఇవ్వడు వారి నుండి లాభం తీసుకోడు. తప్పు చేయకుండా జాగ్రత్తపడతాడు సత్యంగా న్యాయం తీరుస్తాడు.
EZE 18:9 అతడు నా శాసనాలను అనుసరించి నా ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు. ఇలాంటి వాడే నీతిమంతుడు; అతడు నిజంగా బ్రతుకుతాడు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 18:10 “ఒకవేళ అతనికి ఈ మంచి పనులేవి చేయకుండా రక్తం చిందించే ఒక హింసాత్మకుడైన కుమారుడు ఉంటే,
EZE 18:11 అతడు తన తండ్రి చేయని వీటన్నిటిని చేసేవాడైతే: “అతడు పర్వత క్షేత్రాల దగ్గర తింటాడు. తన పొరుగువాని భార్యను అపవిత్రం చేస్తాడు.
EZE 18:12 పేదవారిని దరిద్రులను అణచివేస్తాడు. దోపిడీలు చేస్తాడు. అప్పుకు తాకట్టుగా తీసుకున్న దానిని తిరిగి ఇవ్వడు. అతడు విగ్రహాలవైపు చూస్తాడు. అసహ్యమైన పనులు చేస్తాడు.
EZE 18:13 అతడు వడ్డీలకు అప్పు ఇచ్చి లాభం తీసుకుంటాడు. అలాంటివాడు బ్రతుకుతాడా? అతడు బ్రతకడు! ఎందుకంటే అతడు ఈ అసహ్యమైన పనులన్నీ చేశాడు కాబట్టి, అతనికి మరణశిక్ష విధించబడుతుంది; తన మరణానికి అతడే బాధ్యుడు.
EZE 18:14 “అయితే అలాంటి వానికి పుట్టిన కుమారుడు తన తండ్రి చేసిన పాపాలన్నిటిని చూసి ఆలోచించి అలాంటి పనులు చేయకపోతే అంటే:
EZE 18:15 “అతడు పర్వత క్షేత్రాల దగ్గర తినడు ఇశ్రాయేలీయుల విగ్రహాలను చూడడు. తన పొరుగువాని భార్యను అపవిత్రం చేయడు.
EZE 18:16 అతడు ఎవరినీ అణచివేయడు, ఎవరి వస్తువులు తాకట్టు ఉంచుకోడు. అతడు ఎవరినీ దోచుకోడు కాని ఆకలితో ఉన్నవారికి తన ఆహారాన్ని ఇస్తాడు, దిగంబరికి బట్టలు ఇస్తాడు.
EZE 18:17 అతడు పేదల పట్ల తప్పుగా ప్రవర్తించడు, వారి నుండి వడ్డీని గాని లాభాన్ని గాని తీసుకోడు. అతడు నా చట్టాలను అనుసరించి నా శాసనాలను పాటిస్తాడు. అతడు తన తండ్రి చేసిన పాపం కారణంగా మరణించడు కాని ఖచ్చితంగా బ్రతుకుతాడు.
EZE 18:18 కాని అతని తండ్రి క్రూరుడై ఇతరులను బాధపెట్టి తన సోదరులను దోచుకుని తన ప్రజలమధ్య చేయకూడని తప్పు చేశాడు కాబట్టి అతడు తన పాపం కారణంగా చనిపోతాడు.
EZE 18:19 “అయితే మీరు, ‘తన తండ్రి దోషశిక్షను కుమారుడు ఎందుకు భరించడు?’ అని అడుగుతున్నారు. కుమారుడు నీతిన్యాయాలను జరిగిస్తూ నా శాసనాలను అనుసరించి నా నిబంధనలను పాటించాడు. కాబట్టి అతడు ఖచ్చితంగా బ్రతుకుతాడు.
EZE 18:20 పాపం చేసేవాడు చనిపోతాడు. తల్లిదండ్రుల పాపాన్ని పిల్లలు భరించరు. పిల్లల పాపాన్ని తల్లిదండ్రులు భరించరు. నీతిమంతుని నీతి వానికే చెందుతుంది. అలాగే దుర్మార్గుని దుర్మార్గం వానికే చెందుతుంది.
EZE 18:21 “అయితే దుర్మార్గులు తాము చేసిన పాపాలను విడిచిపెట్టి నా శాసనాలను అనుసరించి న్యాయమైనవి, సరియైనవి చేస్తే వారు చనిపోరు; ఖచ్చితంగా బ్రతుకుతారు.
EZE 18:22 వారు చేసిన నేరాల్లో ఏది జ్ఞాపకం చేసుకోబడదు. వారి నీతి క్రియలను బట్టే వారు బ్రతుకుతారు.
EZE 18:23 దుర్మార్గులు చనిపోతే నాకు సంతోషం కలుగుతుందా? వారు తమ ప్రవర్తన సరిదిద్దుకొని బ్రతికితేనే నాకు సంతోషము. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 18:24 “అయితే నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి పాపం చేస్తూ దుర్మార్గునిలా అసహ్యమైన పనులు చేస్తే వారు బ్రతుకుతారా? వారు చేసిన ఏ నీతికార్యాలు జ్ఞాపకం చేసుకోబడవు. వారు నమ్మకద్రోహంతో చేసిన దోషాలను బట్టి, వారు చేసిన పాపాలను బట్టి వారు చస్తారు.
EZE 18:25 “అయినా మీరు, ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటారు. ఇశ్రాయేలీయులారా! నా మాట వినండి. నా మార్గం అన్యాయమైనదా? మీ మార్గాలు అన్యాయమైనవి కావా?
EZE 18:26 నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి పాపం చేస్తే వారు దానిని బట్టి చస్తారు. వారు చేసిన పాపాన్ని బట్టి వారు చస్తారు.
EZE 18:27 అయితే దుర్మార్గులు తాము చేసిన దుర్మార్గాన్ని విడిచిపెట్టి న్యాయమైనవి, సరియైనవి చేస్తే, వారు తమ ప్రాణాలను కాపాడుకుంటారు.
EZE 18:28 అతడు తాను చేసిన నేరాలన్నిటిని గమనించుకుని వాటిని చేయడం మానేశాడు కాబట్టి అతడు చనిపోడు కాని ఖచ్చితంగా బ్రతుకుతాడు.
EZE 18:29 అయినా ఇశ్రాయేలీయులు, ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటారు. ఇశ్రాయేలీయులారా! నా మార్గాలు అన్యాయమైనవా? కాని మీ మార్గాలే కదా అన్యాయమైనవి?
EZE 18:30 “ఇశ్రాయేలు ప్రజలారా! ఎవరి ప్రవర్తనను బట్టి వారిని నేను శిక్షిస్తాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. పశ్చాత్తాపపడి మీ అక్రమాల కారణంగా మీరు శిక్షించబడకుండా వాటిని విడిచిపెట్టండి.
EZE 18:31 గతంలో మీరు చేసిన నేరాలన్నిటిని విడిచిపెట్టి నూతన హృదయాన్ని నూతన ఆత్మను పొందండి. ఇశ్రాయేలీయులారా! మీరెందుకు మరణాన్ని పొందాలి?
EZE 18:32 మరణించిన వానిని బట్టి నేను సంతోషించను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. పశ్చాత్తాపపడి జీవించండి!
EZE 19:1 “నీవు ఇశ్రాయేలీయుల అధిపతుల గురించి విలాప గీతం పాడి ఇలా చెప్పు:
EZE 19:2 “ ‘నీ తల్లి ఎలాంటిది అంటే సింహాల మధ్యలో ఆడసింహం లాంటిది. కొదమ సింహాల మధ్య పడుకుని తన పిల్లలను పెంచింది.
EZE 19:3 ఆమె వాటిలో ఒకదాన్ని పెంచినప్పుడు అది బలమైన సింహం అయ్యింది. అది వేటాడడం నేర్చుకొని మనుష్యులను తినే జంతువుగా మారింది.
EZE 19:4 దాని గురించి ఇతర జనాంగాలు విని తమ గోతిలో దానిని పట్టుకున్నారు. దానికి గాలం తగిలించి ఈజిప్టు దేశానికి తీసుకెళ్లారు.
EZE 19:5 “ ‘అది చూసిన దాని తల్లి తన ఆశ నిరాశ అయ్యిందని తన పిల్లల్లో మరో దానిని తీసుకుని బలమైన సింహంగా తయారుచేసింది.
EZE 19:6 ఇది కూడా కొదమ సింహమై, మిగిలిన కొదమ సింహాలతో పాటు తిరుగుతూ వేటాడడం నేర్చుకొని మనుష్యులను తినే జంతువుగా మారింది.
EZE 19:7 అది వారి బలమైన కోటలను పడగొట్టి వారి పట్టణాలను పాడుచేసింది. దాని గర్జన విని దేశంతో పాటు దేశంలో ఉన్నదంతా పాడైపోయింది.
EZE 19:8 నాలుగు వైపుల ఉన్న దేశాల ప్రజలందరూ దానిని పట్టుకోవడానికి వచ్చి దాని కోసం తమ వలలు పన్ని తమ గోతిలో దానిని చిక్కించుకున్నారు.
EZE 19:9 దానికి గాలం తగిలించి బోనులో పెట్టి బబులోను రాజు దగ్గరకు దానిని తీసుకెళ్లారు. ఇశ్రాయేలీయుల పర్వతాలమీద దాని గర్జన ఎన్నటికీ వినబడకుండా వారు దానిని చెరసాలలో ఉంచారు.
EZE 19:10 “ ‘నీ తల్లి నీ ద్రాక్షతోటలో నీటి ప్రక్కన నాటబడిన ద్రాక్షవల్లిలాంటిది; నీరు సమృద్ధిగా ఉన్నందున అది ఫలించి అనేక కొమ్మలతో నిండి ఉంది.
EZE 19:11 పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన బలమైన కొమ్మలు దానికున్నాయి. అది మేఘాలను తాకే అంతగా పైకి పెరిగింది దానికున్న అనేక కొమ్మలతో ఏపుగా పెరిగింది.
EZE 19:12 అయితే మహా కోపంతో అది పెరికి వేయబడి నేల మీద పారవేయబడింది. తూర్పు గాలి వీచగా దాని పండ్లు వాడిపోయాయి; బలమైన దాని కొమ్మలు అగ్నిలో పడి కాలిపోయాయి.
EZE 19:13 ఇప్పుడది అరణ్యంలో పూర్తిగా ఎండిపోయిన నీళ్లు లేని ఎడారిలో నాటబడింది.
EZE 19:14 దాని కొమ్మల్లో నుండి అగ్ని వ్యాపించి దాని పండ్లను కాల్చివేసింది. పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన బలమైన కొమ్మ ఒక్కటి కూడా మిగల్లేదు.’ ఇదే విలాప వాక్యం; దీనినే విలాప గీతంగా పాడతారు.”
EZE 20:1 ఏడవ సంవత్సరం అయిదవ నెల పదవ రోజున ఇశ్రాయేలు పెద్దలలో కొందరు యెహోవాను సంప్రదించడానికి నా దగ్గరకు వచ్చి నా ఎదుట కూర్చున్నారు.
EZE 20:2 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 20:3 “మనుష్యకుమారుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నన్ను సంప్రదించడానికి మీరు వచ్చారా? నా జీవం తోడు, నేను మీకే ఆలోచన చెప్పను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’
EZE 20:4 “వారికి న్యాయం తీరుస్తావా? మనుష్యకుమారుడా, వారికి న్యాయం తీరుస్తావా? వారి పూర్వికులు చేసిన అసహ్యమైన ఆచారాలు వారికి తెలియజేసి,
EZE 20:5 వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను ఇశ్రాయేలును ఏర్పరచుకున్న రోజున, నేను యాకోబు వారసులకు ప్రమాణం చేసిన రోజున ఈజిప్టులో వారికి నన్ను ప్రత్యక్షపరచుకుని ప్రమాణం చేసి, “మీ దేవుడనైన యెహోవాను నేనే” అని వారికి ప్రకటించాను.
EZE 20:6 వారిని ఈజిప్టు దేశంలో నుండి బయటకు తీసుకువచ్చి నేను వారికి ఏర్పాటుచేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి, అన్ని దేశాల్లో సుందరమైన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రమాణం చేశాను.
EZE 20:7 అప్పుడు నేను, “నేనే మీ దేవుడనైన యెహోవాను. మీలో ప్రతివాడు తనకిష్టమైన అసహ్యమైన పనులను విడిచిపెట్టాలి. ఈజిప్టువారి విగ్రహాలను పూజించి అపవిత్రులు కావద్దని వారికి ఆజ్ఞాపించాను.”
EZE 20:8 “ ‘అయితే వారు నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేశారు; తమకిష్టమైన అసహ్యమైన పనులు చేయడం మానలేదు, ఈజిప్టువారి విగ్రహాలను పూజించడం మానలేదు. కాబట్టి వారు ఈజిప్టు దేశంలో ఉండగానే నేను నా ఉగ్రతను వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకున్నాను.
EZE 20:9 అయితే నా నామం కోసం వారిని ఈజిప్టు నుండి బయటకు రప్పించాను. వారు నివసించిన జనాంగాల దృష్టిలో, ఎవరి ఎదుట నన్ను నేను ఇశ్రాయేలీయులకు బయలుపరచుకున్నానో వారి ఎదుట నా పేరు అపవిత్రం కాకూడదని అలా చేశాను.
EZE 20:10 వారిని ఈజిప్టు దేశం నుండి బయటకు రప్పించి అరణ్యంలోకి తీసుకువచ్చి,
EZE 20:11 వారికి నా శాసనాలను ఇచ్చి, నా ధర్మశాస్త్రాన్ని వారికి తెలియజేశాను. వాటిని అనుసరించిన మనుష్యులే బ్రతుకుతారు.
EZE 20:12 యెహోవానైన నేనే వారిని పవిత్రపరచానని వారు తెలుసుకునేలా, నాకు వారికి మధ్య సూచనగా సబ్బాతులను నియమించాను.
EZE 20:13 “ ‘అరణ్యంలో ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి, నా శాసనాలను తృణీకరించి, వాటికి లోబడేవారు బ్రతుకుతారని నేనిచ్చిన నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండా నేను నియమించిన సబ్బాతులను పూర్తిగా అపవిత్రం చేశారు. కాబట్టి వారిపై నా ఉగ్రత కుమ్మరించి వారిని అరణ్యంలో నాశనం చేయాలనుకున్నాను.
EZE 20:14 అయితే కోసం నేను ఎవరి దృష్టిలో వారిని బయటకు తీసుకువచ్చానో ఆ జాతుల దృష్టిలో నా నామం అపవిత్రం కాకుండా ఉండేందుకు నేను అనుకున్న ప్రకారం చేయలేదు.
EZE 20:15 తమకిష్టమైన విగ్రహాలను పూజించాలని నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండ నా శాసనాలను అనుసరించకుండ నా సబ్బాతులను అపవిత్రం చేసినందుకు, నేను వారికి ఇస్తానని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, అన్ని దేశాల్లో అతి సుందరమైన దేశంలోనికి నేను వారిని తీసుకురానని వారు అరణ్యంలో ఉండగానే నా చేయి పైకెత్తి వారితో ప్రమాణం చేశాను.
EZE 20:17 అయినా వారి మీద జాలిపడి వారిని నాశనం చేయలేదు, అరణ్యంలోనే వారిని అంతం చేయలేదు.
EZE 20:18 వారు అరణ్యంలో ఉన్నప్పుడు నేను వారి పిల్లలతో, “మీ తండ్రుల కట్టడలను పాటించవద్దు; వారి పద్ధతులను అనుసరిస్తూ వారి విగ్రహాలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు.
EZE 20:19 మీ దేవుడైన యెహోవాను నేనే; నా శాసనాలను అనుసరిస్తూ నా ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పాటించండి.
EZE 20:20 సబ్బాతును పరిశుద్ధంగా పాటించండి; నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకునేలా అవి మీకూ నాకు మధ్య సూచనగా ఉంటాయి” అని చెప్పాను.
EZE 20:21 “ ‘అయినా వారి పిల్లలు నాపై తిరగబడ్డారు: వారు అనుసరించి బ్రతకాలని చెప్పి నేను ఇచ్చిన నా శాసనాలను వారు పాటించకుండా నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా నా సబ్బాతును అపవిత్రం చేశారు. కాబట్టి వారు అరణ్యంలో ఉండగానే నా ఉగ్రతను వారి మీద కుమ్మరించి కోపాన్ని తీర్చుకోవాలని అనుకున్నాను.
EZE 20:22 అయితే నేను ఏ ఇతర ప్రజలమధ్య ప్రత్యక్షమయ్యానో ఏ ఇతర ప్రజల నుండి వారిని బయటకు రప్పించానో ఆ ప్రజలమధ్య నా నామం అపవిత్రపరచబడకుండా నా చేయి వెనుకకు తీసి నా వాగ్దానం నెరవేర్చాను.
EZE 20:23 వారు నా ధర్మశాస్త్రానికి లోబడకుండా నా శాసనాలను తృణీకరించి నా సబ్బాతును అపవిత్రపరచి తమ తండ్రులు పెట్టిన విగ్రహాలను పూజించారు, కాబట్టి నేను వారిని ఇతర ప్రజలమధ్య చెదరగొట్టి అన్ని దేశాలకు వారిని చెదరగొడతానని అరణ్యంలో వారికి ప్రమాణం చేశాను.
EZE 20:25 కాబట్టి నేనే యెహోవానని వారు తెలుసుకునేలా నేను వారికి మంచివి కాని శాసనాలు, వారు బ్రతకడానికి ఉపయోగపడని విధులు ఇచ్చాను;
EZE 20:26 వారు తమ మొదటి సంతానాన్ని బలి ఇచ్చి తమను తాము అపవిత్రం చేసుకోనిచ్చాను. నేనే యెహోవానని వారు తెలుసుకునేలా వారిని భయాందోళనలకు గురిచేస్తాను.’
EZE 20:27 “కాబట్టి మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ విషయంలో కూడా మీ పూర్వికులు నాకు నమ్మకద్రోహం చేసి నన్ను దూషించారు:
EZE 20:28 నేను వారిని ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలోకి నేను వారిని తీసుకువచ్చిన తర్వాత కూడా ఎత్తైన కొండను గాని గుబురుగా ఉన్న చెట్టును గాని వారు చూడగానే వాటికి బలులు అర్పణలు అర్పిస్తూ, పరిమళ ధూపాలను వేస్తూ పానార్పణలు చేస్తూ నాకు కోపం పుట్టించారు.
EZE 20:29 అప్పుడు నేను వారితో ఇలా అన్నాను: మీరు వెళ్లే ఈ ఉన్నత స్థలం ఏమిటి?’ ” అని అడిగాను. (ఇప్పటికి అది బామా అనే పిలువబడుతుంది.)
EZE 20:30 “కాబట్టి ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీ పూర్వికులు చేసిన విధంగా మీరు కూడా అసహ్యమైన విగ్రహాలతో వ్యభిచారం చేస్తారా?
EZE 20:31 నేటి వరకు మీరు అర్పణలు అర్పించి, మీ పిల్లలను అగ్నిగుండాలు దాటించి మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటిని పూజించి అపవిత్రులవుతున్నారు. ఇశ్రాయేలీయులారా, నన్ను విచారించడానికి నేను మిమ్మల్ని అనుమతించాలా? నా జీవం తోడు నా నుండి మీకు ఏ ఆలోచనా దొరకదు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 20:32 “ ‘ “మేము కట్టెను, రాయిని సేవించే దేశాల్లా, ప్రపంచంలోని జనాంగాల్లా ఉండాలని కోరుకుంటున్నాము” అని మీరంటున్నారు. కాని మీ మనస్సులో ఉన్నట్లు ఎప్పటికీ జరగదు.
EZE 20:33 నా జీవం తోడు, నేను బలిష్టమైన చేతితో, చాచిన బాహువుతో, వెల్లువెత్తుతున్న కోపంతో నిన్ను పరిపాలిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 20:34 నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి రప్పిస్తాను మీరు చెదిరిపోయి ఉన్న దేశాల నుండి బలమైన చేతితో, చాచిన బాహువుతో, వెల్లువెత్తుతున్న ఉగ్రతతో మిమ్మల్ని సమకూరుస్తాను.
EZE 20:35 నేను మిమ్మల్ని జనాలు ఉన్న అరణ్యంలోకి తీసుకువస్తాను, అక్కడ ముఖాముఖిగా నేను మీకు తీర్పు తీరుస్తాను.
EZE 20:36 ఈజిప్టు దేశపు అరణ్యంలో నేను మీ పూర్వికులకు తీర్పు ఇచ్చినట్టే మీకు కూడా తీరుస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 20:37 మీరు నా చేతికర్ర క్రింద దాటి వెళ్తున్నప్పుడు నేను మిమ్మల్ని గమనించి మిమ్మల్ని ఒడంబడిక బంధంలోనికి తీసుకువస్తాను.
EZE 20:38 నా మీద తిరుగుబాటు చేసేవారిని దోషులను మీలో ఉండకుండా చేస్తాను. వారు ఉంటున్న దేశంలో నుండి వారిని బయటకు రప్పిస్తాను కాని వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు. అప్పుడు మీరు నేనే యెహోవానని తెలుసుకుంటారు.
EZE 20:39 “ ‘ఇశ్రాయేలు ఇంటివారలారా! ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు నా మాట వినకపోతే మీరు వెళ్లి మీ విగ్రహాలను పూజించండి. కాని మీ అర్పణల వలన విగ్రహాల వలన నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేయకండి.
EZE 20:40 ఇశ్రాయేలీయులకు ఉన్నత పర్వతమైన నా పరిశుద్ధ పర్వతం మీద దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరు నాకు సేవ చేస్తారు, అక్కడే నేను వారిని అంగీకరిస్తాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అక్కడ మీ పరిశుద్ధ బలులతో పాటు మీ అర్పణలు, మీ ప్రత్యేక కానుకలన్నిటిని నేను అంగీకరిస్తాను.
EZE 20:41 ఇతర ప్రజల నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు మీరు చెదరిపోయిన ఆయా దేశాల్లో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు పరిమళ ధూపంలా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. ఇతర ప్రజల ఎదుట మీ మధ్య నన్ను నేను పరిశుద్ధ పరుచుకుంటాను.
EZE 20:42 మీ పూర్వికులకు ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశమైన ఇశ్రాయేలీయుల దేశానికి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
EZE 20:43 అక్కడ మీరు మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకున్న పనులన్నిటిని జ్ఞాపకం చేసుకుని మీరు చేసిన చెడు అంతటిని బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.
EZE 20:44 ఇశ్రాయేలీయులారా! మీ దుర్మార్గాన్ని బట్టి మీ చెడు పనులను బట్టి కాకుండా నా నామాన్ని బట్టే మీకు ఇలా చేసినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
EZE 20:45 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 20:46 “మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని దక్షిణం వైపు త్రిప్పుకుని దక్షిణ దేశానికి ప్రకటించు; దక్షిణ అరణ్యాన్ని గురించి ప్రవచించు.
EZE 20:47 దక్షిణ అరణ్యంలో ఇలా చెప్పు: ‘యెహోవా మాట విను. ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను నీలో అగ్ని రాజేస్తాను. అది నీలో ఉన్న పచ్చని చెట్లను ఎండిన చెట్లను అన్నిటిని కాల్చివేస్తుంది. ఆ అగ్ని ఆరిపోదు. దక్షిణ దిక్కునుండి ఉత్తరదిక్కు వరకు భూతలమంతా కాలిపోతుంది.
EZE 20:48 ఆ అగ్నిని రగిలించింది యెహోవానైన నేనేనని అందరు తెలుసుకుంటారు; దాన్ని ఎవరూ ఆర్పలేరు.’ ”
EZE 20:49 అప్పుడు నేను ఇలా అన్నాను, “ప్రభువైన యెహోవా, వారు నా గురించి, ‘ఇతడు కేవలం ఉపమానాలు చెప్పేవాడే కదా?’ అని అంటున్నారు.”
EZE 21:1 అప్పుడు యెహోవా వాక్కు నాకు వచ్చి:
EZE 21:2 “మనుష్యకుమారుడా, యెరూషలేము వైపు నీ ముఖం త్రిప్పుకుని పరిశుద్ధాలయం గురించి ఇశ్రాయేలు దేశాన్ని గురించి ప్రవచించి ఇలా చెప్పు:
EZE 21:3 యెహోవా ఇలా చెప్తున్నారు: ‘ఓ ఇశ్రాయేలూ, నేను నీకు విరోధంగా ఉన్నాను. ఒర నుండి నా ఖడ్గాన్ని దూసి నీలో ఉన్న నీతిమంతులను, దుర్మార్గులను హతమారుస్తాను.
EZE 21:4 నీతిమంతులను, దుర్మార్గులను చంపబోతున్నాను కాబట్టి, దక్షిణం నుండి ఉత్తరం వరకు వారందరినీ చంపే వరకు నా ఖడ్గం ఒరలో పెట్టబడదు.
EZE 21:5 అప్పుడు యెహోవానైన నేనే నా ఖడ్గాన్ని మళ్ళీ ఒరలో పెట్టకుండా దూసానని ప్రజలందరూ తెలుసుకుంటారు.’
EZE 21:6 “కాబట్టి మనుష్యకుమారుడా, మూల్గు! నీ విరిగిన మనస్సుతో తీవ్రమైన దుఃఖంతో వారి ముందు మూలుగు.
EZE 21:7 ‘నీవెందుకు మూల్గుతున్నావు?’ అని వారు అడిగినప్పుడు, నీవు వారితో, ‘శ్రమ దినం వస్తుందనే భయంకరమైన వార్త నాకు వినబడింది! ప్రతి హృదయం భయంతో కరిగిపోతుంది, ప్రతి చేయి బలహీనం అవుతుంది. ప్రతి ఆత్మ సొమ్మసిల్లుతుంది, ప్రతీ కాలు మూత్రంతో తడిసిపోతుంది’ అని చెప్తావు. అది వస్తోంది! అది తప్పక జరుగుతుందని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
EZE 21:8 మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 21:9 “మనుష్యకుమారుడా, నీవు ప్రవచించి ఇలా చెప్పు: ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం పదును పెట్టబడి మెరుగు పెట్టబడింది.
EZE 21:10 వధించడానికి పదును పెట్టబడింది, మెరుపులా మెరిసేలా మెరుగు పెట్టబడింది! “ ‘నా కుమారుని రాజదండాన్ని బట్టి మనం సంతోషిద్దామా? అలాంటి ప్రతి దండాన్ని ఆ ఖడ్గం తృణీకరిస్తుంది.
EZE 21:11 “ ‘ఆ ఖడ్గం మెరుగుపరచడానికి, చేతితో పట్టుకోడానికి నియమించబడింది; హతం చేసేవాడు పట్టుకోడానికి, అది పదును పెట్టబడి, మెరుగు పెట్టబడి సిద్ధంగా ఉంది.
EZE 21:12 మనుష్యకుమారుడా, మొరపెట్టు, రోదించు ఆ ఖడ్గం నా ప్రజలమీదికి ఇశ్రాయేలు అధిపతులందరి మీదికి వస్తున్నది. నా ప్రజలతో పాటు వారు కూడా ఖడ్గంతో చంపబడతారు. కాబట్టి నీ రొమ్ము కొట్టుకో.
EZE 21:13 “ ‘పరీక్ష తప్పకుండా వస్తుంది. ఒకవేళ ఖడ్గం తృణీకరించిన రాజదండం కూడా కొనసాగకపోతే ఎలా? అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’
EZE 21:14 “కాబట్టి మనుష్యకుమారుడా, ప్రవచించు, నీ రెండు చేతులతో చప్పట్లు కొట్టు. ఖడ్గం రెండు సార్లు దాడి చేయును గాక మూడుసార్లు అయినా దాడి చేయును గాక. అది వధ కొరకైన ఖడ్గం, మహా వధ కొరకైన ఖడ్గం, అన్ని వైపుల నుండి వారి మీద దాడి చేస్తుంది.
EZE 21:15 తద్వార వారి హృదయాలు భయంతో కరిగిపోవును గాక, చాలామంది హతమవుదురు గాక, వారి గుమ్మాలన్నిటి దగ్గర నేను ఖడ్గాన్ని నిలబెట్టాను. చూడండి! అది తళతళ మెరుస్తూ ఉంది, అది వధ కోసం దూయబడింది.
EZE 21:16 ఖడ్గమా! కుడివైపు వేటు వేయి, తర్వాత ఎడమవైపు వేటు వేయి. ఎటువైపు త్రిప్పబడితే అటు వేటు వేయి.
EZE 21:17 నేను కూడా నా చేతులతో చప్పట్లు కొట్టి, నా ఉగ్రత తీర్చుకుంటాను. యెహోవానైన నేనే ఈ మాట అన్నాను.”
EZE 21:18 యెహోవా వాక్కు నాకు వచ్చి:
EZE 21:19 “మనుష్యకుమారుడా, బబులోను రాజు ఖడ్గం పట్టడానికి రెండు దారులను ఏర్పరచు, రెండూ ఒకే దేశం నుండి మొదలవుతాయి. ఒక సూచికను తయారుచేసి, పట్టణానికి వెళ్లే రహదారి ఆరంభంలో ఉంచు.
EZE 21:20 అమ్మోనీయుల పట్టణమైన రబ్బా మీదికి ఒక మార్గాన్ని, అలాగే యూదా దేశంలో ఉన్న ప్రాకార పట్టణమైన యెరూషలేము మీదికి ఒక ఖడ్గం వచ్చేలా మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలి.
EZE 21:21 దారులు విడిపోయే చోట రెండు మార్గాలు చీలే స్థలంలో శకునం తెలుసుకోవడానికి బబులోను రాజు ఆగుతాడు. అతడు బాణాలను అటూ ఇటూ ఆడిస్తూ విగ్రహాల దగ్గర విచారణ చేస్తాడు. అతడు కాలేయం శకునాన్ని పరీక్షించి చూస్తున్నాడు.
EZE 21:22 యెరూషలేము గురించి తన కుడి వైపున శకునం కనిపించింది ఏర్పాటు చేయమని, చంపమని, యుద్ధధ్వని చేయమని, గుమ్మాలకు ఎదురుగా పడగొట్టే యంత్రాలు ఏర్పాటు చేయమని, ముట్టడి దిబ్బలు వేయమని చెప్పాడు.
EZE 21:23 అతనితో ఒప్పందం చేసుకున్న వారికి ఇది తప్పుడు శకునంగా కనిపిస్తుంది, కాని అతడు వారి అపరాధాన్ని వారికి గుర్తు చేసి వారిని బందీగా తీసుకెళ్తాడు.
EZE 21:24 “కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘మీరు బహిరంగంగా తిరుగుబాటు చేసి మీ అపరాధాన్ని గుర్తుకు తెచ్చారు, మీరు చేసేవాటన్నిటిలో మీ పాపాలను బయట పెట్టుకున్నారు. మీరు ఇలా చేశారు కాబట్టి, మీరు బందీలుగా కొనిపోబడతారు.
EZE 21:25 “ ‘అపవిత్రుడా ఇశ్రాయేలీయుల దుష్ట అధిపతీ, నిన్ను శిక్షించే రోజు సమీపించింది; నీ శిక్షాకాలం ముగింపుకు చేరుకుంది,
EZE 21:26 ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: తలపాగా తీసివేయి, కిరీటాన్ని తీసివేయి. ఇది వరకు ఉన్నట్లుగా ఇక ఉండదు: అల్పులు హెచ్చింపబడతారు, గొప్పవారు తగ్గించబడతారు.
EZE 21:27 శిథిలం! ఒక శిథిలం! నేను దానిని శిథిలం చేస్తాను! కిరీటం న్యాయంగా ఎవరికి చెందినదో ఆయన వచ్చేవరకు అది ఉండదు; దానిని నేను ఆయనకు ఇస్తాను.’
EZE 21:28 “మనుష్యకుమారుడా! నీవు ప్రవచించి ఇలా చెప్పు, ‘అమ్మోనీయుల గురించి వారి అవమానాల గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం, వధ కోసం దూయబడింది, నాశనం చేయడానికి మెరుగు పెట్టబడి, మెరుపులా తళతళలాడుతూ ఉంది!
EZE 21:29 నీ గురించి శకునగాండ్రు తప్పుడు దర్శనాలు చూస్తుండగా, నీ గురించి అబద్ధపు శకునాలు చెప్తున్నప్పుడు, ఎవరి దినమైతే వచ్చేసిందో, ఎవరి శిక్షా సమయం ముగింపుకు చేరుకుందో, ఆ దుర్మార్గుల మెడ మీద ఆ ఖడ్గం పెట్టబడుతుంది. వారి మెడ ప్రక్కనే అది నిన్ను పడవేస్తుంది.
EZE 21:30 “ ‘ఖడ్గాన్ని తిరిగి ఒరలో పెట్టు. నీవు సృజించబడిన స్థలంలోనే, నీ పూర్వికుల దేశంలోనే నేను నీకు తీర్పు తీరుస్తాను.
EZE 21:31 నేను నా ఉగ్రతను నీపై కుమ్మరించి నా కోపాగ్నిని నీ మీదికి ఊదుతాను; నాశనం చేయడంలో నేర్పరులైన క్రూరుల చేతికి నిన్ను అప్పగిస్తాను.
EZE 21:32 నీవు అగ్నికి ఆహుతి అవుతావు, నీ రక్తం నీ దేశంలో చిందించబడుతుంది, నీవు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోబడవు; ఎందుకంటే యెహోవానైన నేనే చెప్పాను.’ ”
EZE 22:1 యెహోవా వాక్కు నాకు వచ్చి:
EZE 22:2 “మనుష్యకుమారుడా, నీవు దానికి తీర్పు తీరుస్తావా? రక్తం చిందించిన ఈ పట్టణానికి నీవు తీర్పు తీరుస్తావా? అలా అయితే నీవు దాని అసహ్యమైన ఆచారాలన్నిటిని బట్టి దానిని నిలదీస్తూ
EZE 22:3 ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తన మధ్య రక్తాన్ని చిందిస్తూ, విగ్రహాలను తయారుచేస్తూ తనను తాను అపవిత్రం చేసుకునే నగరమా,
EZE 22:4 నీవు చిందించిన రక్తాన్ని బట్టి నీవు అపరాధివి అయ్యావు, నీవు తయారుచేసిన విగ్రహాల వలన నీవు అపవిత్రం అయ్యావు. నీవే నీ దినాలు దగ్గర పడేలా చేసుకున్నావు, నీ సంవత్సరాలు ముగింపుకు వచ్చాయి. కాబట్టి నేను నిన్ను ఇతర జనాంగాల మధ్య హాస్యాస్పదంగా చేసి, అన్ని దేశాల ఎదుట నవ్వులపాలు చేస్తాను.
EZE 22:5 అపకీర్తి పొందిన పట్టణమా, కలత చెందినదానా, నీకు దగ్గరగా ఉన్నవారు, దూరంగా ఉన్నవారు నిన్ను ఎగతాళి చేస్తారు.
EZE 22:6 “ ‘చూడండి, నీలో ఉన్న ఇశ్రాయేలు నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి హత్యలు చేయాలని నిర్ణయించుకున్నారు.
EZE 22:7 నీలో వారు తండ్రిని తల్లిని అవమానించారు; నీలో వారు పరదేశులను అణచివేశారు, తండ్రిలేనివారిని, విధవరాండ్రను చులకనగా చూశారు.
EZE 22:8 నీవు నా పరిశుద్ధ వస్తువులను తృణీకరించి నా సబ్బాతులను అపవిత్రం చేశావు.
EZE 22:9 అపవాదులు వేసేవారు, రక్తం చిందించేవారు నీలో ఉన్నారు; పర్వత క్షేత్రాల దగ్గర తిని, అసభ్యకరమైన పనులు చేసేవారు నీలో ఉన్నారు.
EZE 22:10 తమ తండ్రి పడకను అవమానపరిచేవారు నీలో ఉన్నారు; బహిష్టు సమయంలో అపవిత్రంగా ఉన్న స్త్రీలను చెరిపినవారు నీలో ఉన్నారు.
EZE 22:11 నీలో ఒకడు తన పొరుగువాని భార్యతో అసహ్యకరమైన నేరం చేస్తాడు, మరొకడు అవమానకరంగా తన కోడలిని అపవిత్రం చేస్తాడు, మరొకడు తన సోదరిని, తన తండ్రి కుమార్తెను చెరుపుతాడు.
EZE 22:12 నీలో రక్తం చిందించడానికి లంచాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు; నీవు వడ్డీ తీసుకుని పేదల నుండి లాభం పొందుతావు. నీవు నీ పొరుగువారి నుండి అన్యాయమైన లాభం పొందుతావు. నీవు నన్ను మరచిపోయావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 22:13 “ ‘నీవు సంపాదించిన అన్యాయ లాభాన్ని, నీవు చేసిన హత్యలు చూసి నా చేతులు చరుచుకుంటాను.
EZE 22:14 నేను నిన్ను శిక్షించే రోజును తట్టుకునే ధైర్యం నీకు ఉంటుందా? నీ చేతులు బలంగా ఉంటాయా? యెహోవానైన నేను చెప్పాను, దానిని నేను నెరవేరుస్తాను.
EZE 22:15 ఇతర జనాంగాల్లోకి నిన్ను చెదరగొట్టి, ఇతర దేశాలకు నిన్ను వెళ్లగొడతాను; నీ అపవిత్రతకు ముగింపు తెస్తాను.
EZE 22:16 నీవు జనాంగాల దృష్టిలో అపవిత్రం అయినప్పుడు, నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’ ”
EZE 22:17 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 22:18 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి లోహపు మడ్డిలాంటి వారు; వారంతా కొలిమి లోపల మిగిలిపోయిన రాగి, తగరం, ఇనుము, తగరం వంటివారు. వారు వెండి లోహపు మడ్డి వంటివారు.
EZE 22:19 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘మీరంతా లోహపు మడ్డిలా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని యెరూషలేము మధ్యకు పోగుచేస్తాను.
EZE 22:20 వెండి, ఇత్తడి, ఇనుము, తగరాన్ని పోగుచేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది, కరిగించినట్లు నేను నా కోపంతో నా ఉగ్రతతో మిమ్మల్ని పోగుచేసి ఆ పట్టణం లోపల ఉంచి మిమ్మల్ని కరిగిస్తాను.
EZE 22:21 మిమ్మల్ని పోగుచేసి నా కోపాగ్నిని మీమీద ఊదగా మీరు దానిలో కరిగిపోతారు.
EZE 22:22 కొలిమిలో వెండి కరిగినట్లు మీరు దానిలో కరిగిపోతారు. యెహోవానైన నేను నా ఉగ్రతను మీమీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు.’ ”
EZE 22:23 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 22:24 “మనుష్యకుమారుడా, యెరూషలేముతో ఇలా చెప్పు, ‘నీవు శుద్ధి చేయబడని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం కురవదు.’
EZE 22:25 సింహం గర్జిస్తూ వేటను చీల్చేటట్లు దానిలో దాని ప్రవక్తలు కుట్ర చేస్తారు. వారు మనుష్యులను మ్రింగివేస్తారు. ప్రజల సంపదను విలువైన వస్తువులను దోచుకుంటారు. చాలామందిని విధవరాండ్రుగా చేస్తారు.
EZE 22:26 దాని యాజకులు నా ధర్మశాస్త్రాన్ని మీరి నా పరిశుద్ధ వస్తువులను అపవిత్రం చేస్తారు; పరిశుద్ధమైన వాటికి సాధారణమైన వాటికి మధ్య భేదం వారికి తెలియదు. పవిత్రతకు అపవిత్రతకు మధ్య ఉన్న భేదాన్ని ప్రజలకు నేర్పించరు. నా విశ్రాంతి దినాలను నిర్లక్ష్యం చేస్తారు. వారి మధ్య నేను అపవిత్రం అయ్యాను.
EZE 22:27 దానిలో అధికారులు వేటాడినదాన్ని చీల్చే తోడేళ్లలా ఉన్నారు; అక్రమ సంపాదన కోసం వారు రక్తాన్ని చిందించి ప్రజలను చంపుతారు.
EZE 22:28 దాని ప్రవక్తలు తప్పుడు దర్శనాలు అబద్ధపు శకునాలు చూస్తూ యెహోవా ఏమి చెప్పనప్పటికి ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే అని తమ పనులను కప్పిపుచ్చుకుంటారు.
EZE 22:29 దేశ ప్రజలు బలాత్కారాలు చేస్తూ దొంగతనాలు చేస్తారు; పేదవారిని దరిద్రులను హింసిస్తారు, విదేశీయులను అన్యాయంగా బాధిస్తారు.
EZE 22:30 “నేను దేశాన్ని నాశనం చేయకుండా దాని గోడలను బాగుచేయడానికి పగుళ్లలో నా ఎదుట నిలబడడానికి నేను తగిన వాన్ని వెదికాను కాని అలాంటివాడు ఒక్కడు కూడా నాకు కనపడలేదు.
EZE 22:31 కాబట్టి నేను నా ఉగ్రతను వారి మీద క్రుమ్మరించి, నా కోపాగ్నితో వారిని కాల్చివేసి వారు చేసిన వాటన్నిటి ఫలితాన్ని వారి మీదికి రప్పిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
EZE 23:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 23:2 “మనుష్యకుమారుడా, ఒకే తల్లి కుమార్తెలైన ఇద్దరు స్త్రీలు ఉన్నారు.
EZE 23:3 వారు తమ యవ్వనం నుండి వ్యభిచారం చేస్తూ ఈజిప్టులో వేశ్యలుగా మారారు. ఆ దేశంలో వారి రొమ్ములు పిండబడ్డాయి, వారి కన్య చనుమొనలు నలిపివేయబడ్డాయి.
EZE 23:4 వారిలో పెద్దదాని పేరు ఒహోలా, దాని చెల్లి పేరు ఒహోలీబా. నేను వారిని పెళ్ళి చేసుకోగా వారు నాకు కుమారులను, కుమార్తెలను కన్నారు. ఒహోలా అంటే సమరయ, ఒహోలీబా అంటే యెరూషలేము.
EZE 23:5 “ఒహోలా నాదానిగా ఉన్నప్పుడే వ్యభిచారం చేసింది; అది తన ప్రేమికులైన అష్షూరు వారిని మోహించింది.
EZE 23:6 వారు నీలిరంగు వస్త్రాలను ధరించిన యోధులు, అధికారులు సైన్యాధిపతులు, వారందరూ అందమైన యువకులు, గుర్రాలు స్వారీ చేసేవారు.
EZE 23:7 అది ఒక వేశ్యలా అష్షూరీయులలో ముఖ్యులైన వారి ఎదుట తిరుగుతూ వారందరితో వ్యభిచరిస్తూ వారు నిలబెట్టిన విగ్రహాలన్నిటిని పూజించి అపవిత్రురాలైంది.
EZE 23:8 అది ఈజిప్టులో ప్రారంభించిన వ్యభిచారాన్ని ఇంకా వదల్లేదు, దాని యవ్వనంలోనే పురుషులు దానితో పడుకున్నప్పుడు, దాని కన్య చనుమొనలను నలిపి, దానితో తమ కామాన్ని తీర్చుకున్నారు.
EZE 23:9 “కాబట్టి అది మోహించిన దాని ప్రేమికులైన అష్షూరువారి చేతికే దానిని అప్పగించాను.
EZE 23:10 వారు దానిని నగ్నంగా నిలబెట్టారు, దాని కుమారులను కుమార్తెలను బంధించి దాన్ని ఖడ్గంతో చంపారు. స్త్రీలందరిలో అది ఒక సామెతగా అయ్యింది, దానికి శిక్ష విధించబడింది.
EZE 23:11 “దాని చెల్లి ఒహోలీబా ఇదంతా చూసింది, అయినాసరే కామంలో వ్యభిచారంలో దాని అక్కను మించి దిగజారిపోయింది.
EZE 23:12 అది కూడా అష్షూరు వారిలో సైన్యాధిపతులు, అధికారులను, నీలిరంగు వస్త్రాలను ధరించిన యోధులు, గుర్రాలు స్వారీ చేసేవారిని, అందమైన యువకులను మోహించింది.
EZE 23:13 అది కూడా తనను తాను అపవిత్రపరచుకోవడం నేను చూశాను; వారిద్దరు ఒకే దారిలో వెళ్లారు.
EZE 23:14 “అయితే అది వ్యభిచారాన్ని మరింత ఎక్కువగా చేసింది. అది గోడపై ఎరుపు రంగులో చిత్రీకరించబడిన కల్దీయుల పురుషుల చిత్రాలను చూసింది.
EZE 23:15 వారు నడుములకు దట్టీలు, తలలపై తలపాగాలు ధరించిన బబులోను రథ అధికారుల్లా, కల్దీయ సంతానంలా కనిపించారు.
EZE 23:16 అది వారిని చూడగానే వారిని మోహించి, కల్దీయలో ఉన్న వారి దగ్గరకు దూతలను పంపింది.
EZE 23:17 అప్పుడు బబులోనువారు దాని పడక సుఖాన్ని కోరి వచ్చి వ్యభిచరించి దానిని అపవిత్రం చేశారు. అది వారిచే అపవిత్రపరచబడిన తర్వాత, దాని మనస్సుకు వారంటే అసహ్యం వేసింది.
EZE 23:18 అదలా తన వ్యభిచారాన్ని బహిరంగంగా నిర్వహిస్తూ, తన నగ్న శరీరాన్ని బహిర్గతం చేసినప్పుడు, నేను దాని సోదరిని వదిలేసినట్టే, దీని మీద అసహ్యం కలిగి దీన్ని కూడా వదిలేశాను.
EZE 23:19 అయినప్పటికీ అది ఈజిప్టులో వేశ్యగా ఉన్న తన యవ్వన రోజులను గుర్తుచేసుకుని మరింత వ్యభిచారం చేసింది.
EZE 23:20 గాడిదల్లాంటి పురుషాంగం గుర్రాల్లాంటి వీర్య స్ఖలనం ఉన్న తన ప్రేమికులను అది మోహించింది.
EZE 23:21 కాబట్టి ఈజిప్టులో నీ రొమ్ములను చనుమొనలను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని నీ యవ్వనపు అశ్లీల ప్రవర్తన కొనసాగించాలని ఎంతో ఆశించావు.
EZE 23:22 “కాబట్టి ఒహోలీబా, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీ ప్రేమికులనే నీకు వ్యతిరేకంగా రేపుతాను, నీవు అసహ్యం కలిగి వదిలేసిన వారినే అన్ని వైపుల నుండి నీ మీదికి రప్పిస్తాను.
EZE 23:23 బబులోనీయులు, కల్దీయులందరూ, పేకోదు, షోవ, కోవ యొక్క పురుషులు, వారితో ఉన్న అష్షూరీయులందరు, అందమైన యువకులు, అధికారులు, అధిపతులు, రథ అధికారులు ఉన్నత స్థాయి పురుషులు, గుర్రపు స్వారీ చేసే వీరందరిని రప్పిస్తాను.
EZE 23:24 వారు ఆయుధాలతో రథాలతో బండ్లతో జనసమూహంతో నీ మీదికి వస్తారు. పెద్ద డాళ్లు, చిన్న డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి అన్ని వైపుల నుండి నిన్ను చుట్టుముడతారు. శిక్షించడానికి నేను నిన్ను వారికి అప్పగిస్తాను, వారు తమ పద్ధతిలో నిన్ను శిక్షిస్తారు.
EZE 23:25 నేను రోషంతో నా కోపాన్ని చూపించగా కోపాగ్రతతో వారు నిన్ను శిక్షిస్తారు. వారు నీ ముక్కు నీ చెవులు నరికివేస్తారు, నీలో మిగిలి ఉన్నవారు కత్తివేటుకు కూలిపోతారు. నీ కుమారులను కుమార్తెలను వారు తీసుకెళ్తారు, నీలో మిగిలిన వారు అగ్నిచేత కాల్చబడతారు.
EZE 23:26 వారు నీ బట్టలు లాగివేసి నీ విలువైన ఆభరణాలు తీసుకెళ్తారు.
EZE 23:27 కాబట్టి ఈజిప్టులో నీవు మొదలుపెట్టిన అశ్లీల ప్రవర్తన, వ్యభిచారం నీలో ఉండకుండా చేస్తాను. ఇకపై నీవు ఈజిప్టును జ్ఞాపకం చేసుకోవు, నీవు వీటిపై నీ దృష్టిని పెట్టవు.
EZE 23:28 “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు ద్వేషించిన వారికి నీవు అసహ్యించుకునే వారికి నిన్ను అప్పగిస్తున్నాను.
EZE 23:29 వారు ద్వేషంతో నిన్ను బాధిస్తారు. నీవు వేటి కోసం కష్టపడ్డావో వాటన్నిటిని తీసుకుంటారు. వారు నిన్ను నగ్నంగా వదిలివేయగా నీ వేశ్యాత్వం వలన కలిగిన అవమానం బహిర్గతమవుతుంది.
EZE 23:30 నీవు దేశాలను మోహించి, వారి విగ్రహాలతో నిన్ను నీవు అపవిత్రం చేసుకున్నావు, నీ అశ్లీలత, వ్యభిచారం వల్లనే ఇది నీ మీదికి వచ్చింది.
EZE 23:31 నీ సోదరి వెళ్లిన దారిలోనే నీవు వెళ్లావు; కాబట్టి నేను దాని గిన్నెనే నీ చేతిలో పెడతాను.
EZE 23:32 “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “నీ అక్క త్రాగిన గిన్నె లోనిదే నీవు త్రాగుతావు, అది లోతైన పెద్ద గిన్నె; అది అపహాస్యం ఎగతాళిని తెస్తుంది, అందులో త్రాగాల్సింది చాలా ఉంటుంది.
EZE 23:33 నీవు మత్తుతో, విచారంతో నిండిపోతావు, నీ సోదరియైన సమరయ గిన్నె, శిథిలం నిర్మానుష్యంతో నిండిన గిన్నె.
EZE 23:34 అడుగు వరకు దానిలోనిది త్రాగి ఆ పాత్రను ముక్కలు చేసి, వాటితో నీ రొమ్ములు చీల్చుకుంటావు. ఇది నేనే చెప్పాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 23:35 “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు నన్ను మరచిపోయి నాకు వెన్ను చూపావు, నీ అశ్లీల ప్రవర్తనకు వ్యభిచారానికి తగిన శిక్షను నీవు భరించాలి.”
EZE 23:36 యెహోవా నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఒహోలాకు, ఒహోలీబాకు నీవు తీర్పు తీరుస్తావా? వారు చేసిన అసహ్యమైన పనులను వారికి తెలియజేయి.
EZE 23:37 వారు వ్యభిచారులు, వారి చేతికి రక్తం అంటింది. వారు విగ్రహాలతో వ్యభిచరించారు; నాకు కన్న బిడ్డలను వారు విగ్రహాలకు ఆహారంగా అర్పించారు.
EZE 23:38 వారు నాకు కూడా ఇలా చేశారు: అదే సమయంలో వారు నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు; నా సబ్బాతులను కూడా అపవిత్రం చేశారు.
EZE 23:39 వారు తాము పెట్టుకున్న విగ్రహాలకు తమ పిల్లలను అర్పించిన రోజే వారు నా పరిశుద్ధాలయంలో ప్రవేశించి దానిని అపవిత్రం చేశారు. నా నివాసంలో వారు ఈ విధంగానే చేశారు.
EZE 23:40 “వారు దూర ప్రాంతాల నుండి వచ్చిన పురుషుల కోసం దూతలను కూడా పంపారు. వారు వచ్చినప్పుడు వారి కోసం నీవు స్నానం చేసి కళ్లకు కాటుక పెట్టుకుని నగలు ధరించావు.
EZE 23:41 అందమైన మంచం మీద కూర్చుని దాని ఎదురుగా ఉన్న బల్లమీద నా పరిమళద్రవ్యాన్ని ఒలీవల నూనెను పెట్టావు.
EZE 23:42 “అప్పుడే కోలాహలం చేసే గుంపు ఆమె చుట్టూ వినిపించింది; అల్లరిమూకలోని వారితో పాటు ఎడారి మార్గాన త్రాగుబోతులు వచ్చారు. వారు ఈ అక్కచెల్లెళ్ల చేతులకు కడియాలను తొడిగి వారి తలకు అందమైన కిరీటాలు పెట్టారు.
EZE 23:43 వ్యభిచారం చేసి అలసిపోయిన దాని గురించి ఇలా అన్నాను, ‘అది వారితో చేసినట్లే వారు దానితో వ్యభిచారం చేశారు.’
EZE 23:44 వేశ్యతో గడిపినట్లుగా వారు ఆమెతో గడిపారు. అలాగే వేశ్యలైన ఒహోలాతో, ఒహోలీబాతో గడిపారు.
EZE 23:45 వీరిద్దరు వ్యభిచారం చేసి హత్యలు చేశారు కాబట్టి నీతిమంతులైన న్యాయాధిపతులు వీరికి తగిన శిక్ష విధిస్తారు.
EZE 23:46 “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: వారి మీదికి నేను అల్లరిమూకను రప్పిస్తాను. శత్రువులు వారిని భయపెట్టి దోచుకుంటారు.
EZE 23:47 అల్లరిమూక వారిని రాళ్లు రువ్వి చంపుతుంది. ఖడ్గంతో చంపుతారు. వారి కుమారులు కుమార్తెలను చంపి వారి ఇళ్ళను కాల్చివేస్తారు.
EZE 23:48 “కాబట్టి స్త్రీలందరూ మిమ్మల్ని అనుకరించకుండా హెచ్చరికగా ఉండేలా నేను దేశంలోని అసభ్య అంతం చేస్తాను.
EZE 23:49 మీరు మీ అసభ్య ప్రవర్తనకు శిక్ష అనుభవిస్తారు, విగ్రహారాధన పాపానికి పర్యవసానాలను భరిస్తారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.”
EZE 24:1 తొమ్మిదో సంవత్సరం పదవనెల పదవ రోజున యెహోవా వాక్కు నాకు వచ్చి:
EZE 24:2 “మనుష్యకుమారుడా, ఈ తేదీని నమోదు చేయి ఎందుకంటే బబులోను రాజు ఈ రోజే యెరూషలేమును ముట్టడించాడు.
EZE 24:3 తిరుగుబాటు చేసే ఈ ప్రజల గురించి ఉపమానరీతిగా ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక కుండ తెచ్చి దానిలో నీళ్లు పోసి, దానిని పొయ్యిమీద పెట్టు.
EZE 24:4 తొడ ముక్కలు, జబ్బ ముక్కల వంటి మంచి ముక్కలు దానిలో వేసి మంచి ఎముకలతో దానిని నింపు;
EZE 24:5 మందలో శ్రేష్ఠమైన వాటిని తీసుకో! దానిలోని ఎముకలు బాగా ఉడికేలా దాని క్రింద కట్టెలతో మంట ఎక్కువగా పెట్టి వాటిని మరిగించి బాగా ఉడకబెట్టు.
EZE 24:6 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘హంతకులున్న పట్టణానికి శ్రమ, మడ్డి ఉన్న కుండకు శ్రమ, దాని తుప్పు పోదు. ఏ వరుసలో వచ్చినా సరే దానిలో నుండి మాంసాన్ని ముక్క తర్వాత ముక్కగా తీయండి.
EZE 24:7 “ ‘అది చిందించిన రక్తం దాని మధ్యనే ఉంది: మట్టితో కప్పివేయడానికి వీలుగా అది రక్తాన్ని నేలమీద క్రుమ్మరించకుండ, వట్టి బండ మీద క్రుమ్మరించింది;
EZE 24:8 ఉగ్రతను రేపి ప్రతీకారం తీసుకోవడానికి దాని రక్తం కప్పివేయబడకుండ వట్టి బండ మీద క్రుమ్మరించాను.
EZE 24:9 “ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘హంతకులున్న పట్టణానికి శ్రమ! నేను మరి ఎక్కువగా కట్టెలు పేర్చుతాను.
EZE 24:10 కట్టెలు పేర్చి అగ్ని రాజేయండి. మసాలాలు కలిపి మాంసం బాగా ఉడకబెట్టండి; ఎముకలు పూర్తిగా ఉడకనివ్వండి;
EZE 24:11 తర్వాత దానికున్న మలినం కరిగిపోయి, మడ్డి పూర్తిగా పోయేలా ఆ కుండ వేడెక్కి దాని రాగి మెరిసే వరకు దానిని బొగ్గుల మీద ఉంచండి.
EZE 24:12 అలసిపోయేంత వరకు ప్రయత్నించినా అగ్నితో కాల్చినా సరే దాని మడ్డి తొలగిపోలేదు.
EZE 24:13 “ ‘నీ అతి కామాతురతయే నీకున్న అపవిత్రత. నిన్ను పవిత్రపరచడానికి నేను ప్రయత్నించాను కాని నీవు శుద్ధి కాలేదు కాబట్టి నా ఉగ్రత నీమీద తీర్చుకునే వరకు నీవు పవిత్రం కావు.
EZE 24:14 “ ‘యెహోవానైన నేను మాట ఇచ్చాను. అది నెరవేర్చే సమయం వచ్చింది. నేను వెనక్కి తీసుకోను; నేను జాలిపడను పశ్చాత్తాపపడను. నీ ప్రవర్తనను బట్టి, నీ పనులను బట్టి నీకు శిక్ష విధించబడుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
EZE 24:15 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 24:16 “మనుష్యకుమారుడా, ఒక్క దెబ్బతో నీ కళ్లల్లో ఆనందాన్ని నీ నుండి తీసివేయబోతున్నాను. విలపించవద్దు ఏడవవద్దు కన్నీరు కార్చవద్దు.
EZE 24:17 చనిపోయినవారి కోసం దుఃఖించకుండ నిశ్శబ్దంగా నిట్టూర్చు. నీ తలపాగాను కట్టుకుని నీ కాళ్లకు చెప్పులు వేసుకో; నీ మీసం గెడ్డం కప్పుకోవద్దు; సంతాపంగా ఇతరులు తెచ్చిన ఆహారం తినవద్దు.”
EZE 24:18 కాబట్టి నేను ఉదయం ప్రజలతో మాట్లాడాను, సాయంత్రం నా భార్య చనిపోయింది. మరుసటిరోజు ఉదయం నాకు ఆజ్ఞాపించినట్లే నేను చేశాను.
EZE 24:19 అప్పుడు ప్రజలు నన్ను ఇలా అడిగారు, “నీవు చేస్తున్న వాటినుండి మేము తెలుసుకోవలసిన వాటిని మాకు చెప్పవా?”
EZE 24:20 అప్పుడు నేను వారితో ఇలా అన్నాను, “యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:
EZE 24:21 ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీకు గర్వకారణంగా, మీ కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేదిగా, మీరు అభిమానించే నా పరిశుద్ధాలయాన్ని నేను అపవిత్రం చేయబోతున్నాను. మీరు వెనుక విడిచిపెట్టిన మీ కుమారులు, కుమార్తెలు కత్తివేటుకు కూలిపోతారు.
EZE 24:22 అప్పుడు నేను చేసినట్లే మీరు కూడా చేస్తారు. మీ మీసం గడ్డం కప్పుకోరు; సంతాపంగా ఇతరులు తెచ్చిన ఆహారం తినరు.
EZE 24:23 మీ తలపాగాలు మీ తలల మీద నుండి తీయరు మీ చెప్పులు మీ కాళ్లకే ఉంటాయి. మీరు దుఃఖించరు ఏడవరు కానీ మీలో మీరే మూల్గుతూ మీ పాపాల కారణంగా క్రుంగిపోతారు.
EZE 24:24 యెహెజ్కేలు నీకు సూచనగా ఉంటాడు. అతడు చేసిందంతా మీరూ చేస్తారు. ఇది జరిగినప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
EZE 24:25 “మనుష్యకుమారుడా, నేను వారి ఆశ్రయాన్ని, వారి ఆనందాన్ని కీర్తిని, వారి కళ్లకు ఇష్టమైన దానిని, వారి హృదయ ఆశలను అలాగే వారి కుమారులను కుమార్తెలను తీసివేసే రోజు వస్తుంది.
EZE 24:26 ఆ రోజున నీకు వార్త చెప్పడానికి ఒకడు తప్పించుకుని నీ దగ్గరకు వస్తాడు.
EZE 24:27 అప్పుడు నీవు మౌనంగా ఉండకుండా తప్పించుకుని వచ్చిన వానితో నోరు తెరిచి స్పష్టంగా మాట్లాడతావు. నేనే యెహోవానని వారు తెలుసుకోవడానికి ఇలా నీవు వారికి ఒక సూచనగా ఉంటావు.”
EZE 25:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 25:2 “మనుష్యకుమారుడా, అమ్మోనీయుల వైపు నీ ముఖాన్ని త్రిప్పి వారి గురించి ప్రవచించు.
EZE 25:3 వారితో ఇలా చెప్పు, ‘అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా పరిశుద్ధాలయం అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలు దేశం పాడైపోతున్నప్పుడు, యూదా వారు బందీలుగా వెళ్తున్నప్పుడు మీరు “ఆహా!” అన్నారు.
EZE 25:4 కాబట్టి నేను మిమ్మల్ని తూర్పు ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగిస్తాను. వారు గుడారాలు వేసుకుని మీ మధ్య నివసిస్తారు; వారు మీ పండ్లు తిని మీ పాలు త్రాగుతారు.
EZE 25:5 రబ్బా పట్టణాన్ని ఒంటెల శాలగా మారుస్తాను. అమ్మోనీయుల దేశాన్ని గొర్రె దొడ్డిగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
EZE 25:6 ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీరు చప్పట్లు కొట్టి కాళ్లతో నేలను తన్ని ఇశ్రాయేలు దేశానికి జరిగిన దానిని గురించి మీ మనస్సులోని దురుద్దేశంతో సంతోషించారు.
EZE 25:7 అందుకే నేను మీకు విరోధినై మిమ్మల్ని ప్రజలకు దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను. ఇతర ప్రజల్లో ఉండకుండా నేను మిమ్మల్ని తుడిచివేస్తాను, దేశాల నుండి నిర్మూలిస్తాను. నేను మిమ్మల్ని నాశనం చేసినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
EZE 25:8 “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘మోయాబీయులు శేయీరు పట్టణస్థులు, “యూదా వారు కూడా ఇతర జనాల్లాగానే తయారయ్యారు” అన్నారు కాబట్టి,
EZE 25:9 మోయాబుకు ఘనతను తెచ్చే పొలిమేర పట్టణాలైన బేత్-యెషిమోతు బయల్-మెయోను కిర్యతాయిములతో మొదలుపెట్టి సరిహద్దు పట్టణాలన్నిటిని
EZE 25:10 అమ్మోనీయులతో పాటు తూర్పు ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగిస్తాను, అప్పుడు జనాల్లో అమ్మోనీయులు జ్ఞాపకానికి రారు.
EZE 25:11 మోయాబుకు నేను శిక్ష విధిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
EZE 25:12 “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘ఎదోమీయులు యూదా వారి మీద పగతీర్చుకున్నారు. అలా చేసి వారు దోషులయ్యారు,
EZE 25:13 కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఎదోము మీద నా చేయి చాపి మనుష్యులను పశువులను చంపి సమస్తాన్ని నిర్మూలం చేస్తాను. తేమాను పట్టణం నుండి దేదాను వరకు ప్రజలంతా కత్తివేటుకు కూలిపోతారు.
EZE 25:14 నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము మీద నా పగ తీర్చుకుంటాను. నా కోపం నా ఉగ్రతకు అనుగుణంగా వారు ఎదోముకు చేస్తారు. అప్పుడు నా ఉగ్రత ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.’ ”
EZE 25:15 “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘ఫిలిష్తీయులు పగతీర్చుకున్నారు తమ హృదయాల్లో ఉన్న ద్వేషంతో పాత పగలతో యూదాను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
EZE 25:16 కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఫిలిష్తీయుల మీద నేను చేయి చాపి కెరేతీయులను తుడిచివేస్తాను. సముద్రతీరాన నివసించే మిగిలిన వారికి కూడా నాశనం చేస్తాను.
EZE 25:17 నా ఉగ్రతతో వారిని శిక్షించి వారి మీద పూర్తిగా పగ తీర్చుకుంటాను. వారి మీద నేను పగ తీర్చుకున్నప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
EZE 26:1 పదకొండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది:
EZE 26:2 “మనుష్యకుమారుడా, యెరూషలేము గురించి తూరు, ‘ఆహా! జనాంగాలకు గుమ్మం విరిగిపోయింది, దాని తలుపులు నా కోసం తెరచుకొని ఉన్నాయి; ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది కాబట్టి నేను వృద్ధి చెందుతాను’ అని చెప్పింది.
EZE 26:3 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తూరు పట్టణమా, నేను నీకు విరోధిని. సముద్రంలో అలలు పొంగినట్లు అనేక జనాంగాలను నీ మీదికి రప్పిస్తాను.
EZE 26:4 వారు తూరు గోడలు కూల్చివేసి దాని గోపురాలను పడగొడతారు; దాని మీద ఉన్న మట్టిని నేను తుడిచివేసి, వట్టి బండలా మిగిలేలా చేస్తాను.
EZE 26:5 సముద్రం దానిని చుట్టుముట్టినప్పుడు అది చేపల వలలు ఆరబెట్టే స్థలంగా మారుతుంది. నేనే మాట ఇచ్చాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అది జనాంగాలకు దోపుడు సొమ్ముగా మారుతుంది,
EZE 26:6 పొలంలో ఉన్న దాని కుమార్తెలు ఖడ్గం పాలవుతారు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.
EZE 26:7 “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఉత్తరం నుండి నేను రాజుల రాజు, బబులోను రాజైన నెబుకద్నెజరును గుర్రాలు రథాలు, గుర్రపురౌతులు గొప్ప సైన్యంతో తూరు మీదికి రప్పించబోతున్నాను.
EZE 26:8 అతడు ఖడ్గంతో ప్రధాన భూభాగంలో మీ నివాసాలను నాశనం చేస్తాడు; అతడు మీకు వ్యతిరేకంగా ముట్టడి పనులను ఏర్పాటు చేస్తాడు, మీ గోడలకు ముట్టడి దిబ్బలను ఏర్పాటు చేస్తాడు.
EZE 26:9 అతడు మీ గోడల మీదికి తన పడగొట్టే యంత్రాలను పంపుతాడు, తన ఆయుధాలతో మీ గోపురాలను కూల్చివేస్తాడు.
EZE 26:10 అతనికి ఉన్న గుర్రాలు రేపిన దుమ్ము నిన్ను కమ్ముతుంది. ఒకడు పగిలిన గోడలున్న పట్టణంలోకి ప్రవేశించినట్లు అతడు నీ గుమ్మాల్లోకి వచ్చినప్పుడు గుర్రపురౌతుల నుండి రథచక్రాల నుండి వచ్చే శబ్దానికి నీ గోడలు అదురుతాయి.
EZE 26:11 అతడు తన గుర్రాల డెక్కలతో నీ వీధులన్నిటిని అణగద్రొక్కిస్తాడు. కత్తితో నీ ప్రజలను చంపుతాడు. నీ బలమైన స్తంభాలు నేల కూలిపోతాయి.
EZE 26:12 వారు నీ సంపదను దోచుకుంటారు నీ వస్తువులను దొంగిలిస్తారు. వారు నీ గోడలను కూల్చివేసి, నీ విలాసవంతమైన భవనాలను పడగొట్టి, నీ రాళ్లను కలపను సముద్రంలోకి విసిరివేస్తారు.
EZE 26:13 నేను నీ సంగీతాన్ని ఆపివేస్తాను. నీ సితార శబ్దం ఇకపై వినపడదు.
EZE 26:14 నేను నిన్ను వట్టి బండగా చేస్తాను, నీవు చేపల వలలు పరిచే స్థలం అవుతావు. నీవు ఎప్పటికీ కట్టబడవు, ఎందుకంటే యెహోవానైన నేనే చెప్పాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 26:15 “తూరు గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు కూలిపోయినప్పుడు నీలో నుండి వచ్చే గాయపడినవారి కేకలు, నీ మధ్య జరుగుతున్న ఊచకోతను విని తీరప్రాంతాలు వణకవా?
EZE 26:16 తీరప్రాంతపు అధికారులందరూ తమ సింహాసనాల మీది నుండి దిగి, వారి వస్త్రాలను, చేతికుట్టుతో చేసిన వస్త్రాలను తీసివేసి, భయంతో నేలపై కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి ఆందోళన చెందుతారు.
EZE 26:17 నీ గురించి విలాప గీతం ఎత్తి ఇలా పాడతారు: “ ‘సముద్ర ప్రజలతో నిండిన గొప్ప పట్టణమా! నీవెలా నాశనమైపోయావు! నీవు నీ నివాసులు సముద్రాల మీద బలవంతులుగా ఉన్నారు, అక్కడ నివసించిన వారందరిపై నీవు నీ భయాన్ని ఉంచావు.
EZE 26:18 ఇప్పుడు నీవు కూలిపోయిన రోజున తీరప్రాంతాలు కంపిస్తున్నాయి. నీవు పతనాన్ని చూసి సముద్ర ద్వీపాలు భయపడుతున్నాయి.’
EZE 26:19 “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నివాసులు లేని పట్టణాల్లా నిన్ను నేను నిర్మానుష్యంగా మార్చినప్పుడు, నిన్ను మహా సముద్రం ముంచివేసేలా నీ మీదికి అగాధ జలాలను రప్పిస్తాను. నిన్ను మహా సముద్రం నిన్ను ముంచివేస్తున్నప్పుడు,
EZE 26:20 చాలా కాలం క్రితం పాతాళంలోకి దిగి వెళ్లిన వారి దగ్గరకు నేను నిన్ను పడవేస్తాను. నేను నిన్ను భూమి క్రింద ఉన్న స్థలంలో ప్రాచీన శిథిలాల మధ్య పాతాళంలోకి దిగి వెళ్లిన వారితో నివసించేలా చేస్తాను, అప్పుడు నీవు సజీవులు నివసించే చోటికి తిరిగి రావు.
EZE 26:21 నేను నీకు భయంకరమైన ముగింపు ఇస్తాను, నీవు ఇకపై ఉండవు. నీ గురించి ఎంత వెదికినా నీవు ఎప్పటికీ కనిపించవు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
EZE 27:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 27:2 “మనుష్యకుమారుడా, తూరు పట్టణం గురించి విలాప గీతం పాడు:
EZE 27:3 సముద్ర ద్వారం దగ్గర ఉన్న తూరుతో చెప్పు, అనేక తీర ప్రాంతాల ప్రజలకు వ్యాపారిగా ఉన్న తూరుతో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘తూరూ, నీవంటావు, “అందంలో నేను పరిపూర్ణమైన దానిని.”
EZE 27:4 నీ సరిహద్దులు సముద్రం మధ్యలో ఉన్నాయి; నీ భవన నిర్మాణకులు నీ అందానికి పరిపూర్ణత తెచ్చారు.
EZE 27:5 శెనీరు దేశపు సరళ పలకలతో వారు నీ ఓడలు తయారుచేస్తారు; లెబానోను దేవదారు చెక్కతో వారు ఓడ స్తంభాలు తయారుచేస్తారు.
EZE 27:6 బాషాను సింధూర చెక్కతో వారు నీ తెడ్లు తయారుచేస్తారు. కుప్ర తీరం నుండి తెచ్చిన తమాల కలపతో వారు నీకు పీటలు తయారుచేసి ఏనుగు దంతంతో అలంకరించారు.
EZE 27:7 ఈజిప్టు నుండి వచ్చిన కుట్టుపని చేసిన సన్నని నార నీ తెరచాపగా జెండాగా పని చేశాయి; ఎలీషా తీరాల నుండి తెచ్చిన నీలం ఊదా రంగుల బట్ట నీ అంతస్తుల పైకప్పులు.
EZE 27:8 తూరూ, సీదోను వారు అర్వాదు వారు నీ తెడ్లు వేసేవారు; నీ మనుష్యుల్లో నిపుణులైనవారు నీ నావికులు.
EZE 27:9 నీ ఓడను బాగుచేయడానికి గెబాలుకు చెందిన పెద్దలు, అనుభవజ్ఞులైన చేతి పనివారు ఉన్నారు. సముద్రంలో నీ వస్తువులు కొనడానికి, సముద్రపు నావికుల ఓడలన్నీ నీ రేవులో ఉన్నాయి.
EZE 27:10 “ ‘పర్షియా మనుష్యులారా, లిడియా, పూతుకు చెందినవారు నీ సైన్యంలో సైనికులుగా పని చేశారు. వారు తమ డాళ్లు, శిరస్త్రాణాలు నీ గోడలకు వ్రేలాడదీసి, నీకు వైభవాన్ని తెస్తున్నారు.
EZE 27:11 అర్వాదు వారు, హెలెకు వారు అన్నివైపులా నీ గోడలకు కాపలా కాసారు; గమ్మాదీయులు నీ గోపురాలలో ఉన్నారు. వారు తమ డాళ్లు, శిరస్త్రాణాలు నీ గోడలకు వ్రేలాడదీశారు; వారు నీ అందానికి పరిపూర్ణత తెచ్చారు.
EZE 27:12 “ ‘నీ గొప్ప సంపదను బట్టి తర్షీషు వారు నీతో వ్యాపారం చేశారు; వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి మీ సరుకు తీసుకున్నారు.
EZE 27:13 “ ‘గ్రీసు, తుబాలు, మెషెకు వారు నీతో వ్యాపారం చేశారు; మనుష్యులను, ఇత్తడి వస్తువులను ఇచ్చి మీ వస్తువులను కొన్నారు.
EZE 27:14 “ ‘బేత్ తోగర్మా వారు మీ సరుకు కోసం రథ గుర్రాలు, అశ్వికదళ గుర్రాలు కంచరగాడిదలను ఇచ్చారు.
EZE 27:15 “ ‘దేదాను వారు నీతో వ్యాపారం చేశారు, చాలా తీర ప్రాంతాల ప్రజలు నీ సరుకు కొన్నారు; వారు మీకు దంతపు దంతాలు, తునికి కలప ఇచ్చారు.
EZE 27:16 “ ‘నీ దగ్గర ఉన్న అనేక వస్తువుల కారణంగా అరామీయులు నీతో వ్యాపారం చేశారు. వారు పచ్చరాళ్లను, ఊదా రంగు నూలుతో కుట్టుపని చేసిన వస్త్రాలు, సన్నని నారబట్టలు, కెంపులు రత్నాలు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.
EZE 27:17 “ ‘యూదా వారు, ఇశ్రాయేలీయులు నీతో వ్యాపారం చేశారు. వారు మిన్నీతు గోధుమలు, మిఠాయిలు, తేనె, ఒలీవనూనె ఇచ్చి నీ సరుకు కొన్నారు.
EZE 27:18 “ ‘దమస్కు నీ దగ్గర అనేక వస్తువులు విలువైన సరుకు ఉన్న కారణంగా నీతో వ్యాపారం చేసింది. వారు హెల్బోను నుండి ద్రాక్షరసం, జహరు నుండి ఉన్ని,
EZE 27:19 వారు ఇజాలు నుండి ద్రాక్షరసం పీపాలు ఇచ్చి, అచ్చుపోసిన ఇనుము, లవంగపట్ట, వోమ ఇచ్చి మీ సరుకులు కొన్నారు.
EZE 27:20 “ ‘దేదాను వారు నీతో జీను దుప్పట్ల వ్యాపారం చేశారు.
EZE 27:21 “ ‘అరేబియా వారు కేదారు యువరాజులందరూ నీతో వ్యాపారం చేశారు. గొర్రెపిల్లలు పొట్టేళ్లు మేకలు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.
EZE 27:22 “ ‘షేబ రాయమా వర్తకులు నీతో వ్యాపారం చేశారు. అన్ని రకాల సుగంధద్రవ్యాలు విలువైన రాళ్లు బంగారం ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.
EZE 27:23 “ ‘హారాను వారు కన్నెహు వారు ఏదెను వారు షేబ వర్తకులు అష్షూరు కిల్మదు వర్తకులు నీతో వ్యాపారం చేశారు.
EZE 27:24 వారు వ్యాపారం చేసి అందమైన వస్త్రాలు, నీలం బట్టలు, కుట్టుపని చేసిన బట్టలు, తివాచీలు బాగా పేనిన గట్టి త్రాళ్లు ఇచ్చి నీ వస్తువులు కొన్నారు.
EZE 27:25 “ ‘తర్షీషు ఓడలు నీ సరుకులు మోసుకెళ్లేవి. నీవు విస్తారమైన సరుకులతో సముద్రం మీద కూర్చున్నావు.
EZE 27:26 నీ తెడ్లు నడిపేవారు మహా సముద్రంలోకి నిన్ను తీసుకెళ్లారు. కాని తూర్పు గాలి వీచి సముద్రం మధ్యలో నిన్ను నాశనం చేస్తుంది.
EZE 27:27 అప్పుడు నీ సంపద, సరుకులు వస్తువులు, నీ నావికులు, ఓడ నాయకులు నీ ఓడలు బాగుచేసేవారు, నీ వ్యాపారులు నీ సైనికులందరూ, నీతో ఉన్న ప్రతి ఒక్కరూ నీ ఓడ ధ్వంసమైన రోజున సముద్రం మధ్యలో మునిగిపోతారు.
EZE 27:28 నీ నావికులు వేసే కేకలకు తీరప్రాంతాలు కంపిస్తాయి.
EZE 27:29 తెడ్డు నడిపే వారందరూ నావికులు, ఓడ నాయకులు తమ ఓడల మీద నుండి దిగివచ్చి తీరాన నిలబడతారు.
EZE 27:30 వారంతా గొంతెత్తి నీ గురించి ఏడుస్తారు; తమ తలలపై బూడిద చల్లుకుని బూడిదలో దొర్లుతారు.
EZE 27:31 నీ గురించి వారు తమ తలలు గొరిగించుకుని గోనెపట్టలు కట్టుకుని తీవ్రమైన దుఃఖంతో నీ గురించి ఏడుస్తారు;
EZE 27:32 వారు నీ గురించి ఏడుస్తూ విలాప గీతం పాడతారు: “సముద్రం మధ్యలో మునిగిపోయిన తూరు పట్టణమా! నీకు సాటియైన పట్టణమేదీ?”
EZE 27:33 సముద్రం మీద నీ వస్తువులు తీసుకెళ్తూ, అనేకమందిని తృప్తిపరిచావు; నీ విస్తారమైన సంపదతో నీ వ్యాపార వస్తువులతో భూరాజులను ఐశ్వర్యవంతులను చేశావు.
EZE 27:34 ఇప్పుడు లోతైన జలాల్లో మునిగి సముద్రంలో నాశనమయ్యావు; నీ వస్తువులు నీ సహచరులు నీతో పాటే మునిగిపోయారు.
EZE 27:35 తీరప్రాంతాలలో ఉన్నవారంతా నీ గురించి దిగులుపడతారు; వారి రాజులు వణకుతారు. వారి ముఖాలు చిన్నబోయాయి.
EZE 27:36 వివిధ ప్రజల మధ్యలో వర్తకులు నిన్ను ఎగతాళి చేస్తారు. నీవు భయంకరమైన ముగింపుకు వచ్చావు, పూర్తిగా నాశనం అవుతావు.’ ”
EZE 28:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 28:2 “మనుష్యకుమారుడా, తూరు పాలకునితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘గర్వించిన హృదయంతో నీవు, “నేనొక దేవుడిని; సముద్రం మధ్యలో ఒక దేవుని సింహాసనం మీద నేను కూర్చున్నాను” అని అన్నావు. దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు, కాని నీవు కేవలం ఒక మనిషివి మాత్రమే దేవునివి కాదు.
EZE 28:3 నీవు దానియేలు కన్నా జ్ఞానివా? నీకు తెలియని రహస్యం ఏదీ లేదా?
EZE 28:4 నీకున్న జ్ఞానంతో వివేకంతో నీకోసం సంపద సంపాదించుకుని నీ ఖజానాలో వెండి బంగారాలను పోగు చేసుకున్నావు.
EZE 28:5 వ్యాపారంలో నీకున్న గొప్ప నైపుణ్యంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు, నీ సంపదను బట్టి నీవు హృదయంలో గర్వించావు.
EZE 28:6 “ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: “ ‘దేవునిలా నీవు జ్ఞానివి అనుకుంటున్నావు కాబట్టి,
EZE 28:7 నేను నీమీదికి విదేశీయులను, అత్యంత క్రూరులైన జనాంగాలను రప్పించబోతున్నాను; నీ జ్ఞానంతో నీవు సౌందర్యంగా నిర్మించుకున్న వాటి మీద ఖడ్గాన్ని దూసి, నీ వైభవాన్ని ద్వంసం చేస్తారు.
EZE 28:8 వారు నిన్ను పాతాళంలో పడవేస్తారు. సముద్రం మధ్యలో భయంకరంగా చనిపోతావు.
EZE 28:9 నిన్ను చంపేవారి ఎదుట “నేను దేవుడిని” అని చెప్తావా? నిన్ను చంపేవారి చేతుల్లో నీవు మనిషివే కాని దేవుడవు కావు.
EZE 28:10 సున్నతిలేనివారు చనిపోయినట్లు నీవు విదేశీయుల చేతిలో చస్తావు అని చెప్పింది నేనే అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
EZE 28:11 యెహోవా వాక్కు నాకు వచ్చి:
EZE 28:12 “మనుష్యకుమారుడా, తూరు రాజు గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘నీవు పరిపూర్ణతకు ముద్రగా, జ్ఞానంతో నిండి ఎంతో అందంగా ఉండేవాడివి.
EZE 28:13 దేవుని తోటయైన, ఏదెనులో నీవు ఉండేవాడివి; ప్రతి ప్రశస్తమైన రాయితో నీవు అలంకరించబడ్డావు. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని, మరకతం, నీలమణి, పద్మరాగం, అన్ని బంగారంతో నీకోసం తయారుచేయబడ్డాయి; నీవు సృజించబడిన రోజున అవి నీకోసం సిద్ధపరచబడ్డాయి.
EZE 28:14 అభిషేకం పొందిన కావలి కెరూబులా నేను నిన్ను నియమించాను దేవుని పరిశుద్ధ పర్వతం మీద నీవున్నావు. నీవు కాలుతున్న రాళ్ల మధ్య నడిచావు.
EZE 28:15 నీవు సృష్టించబడిన రోజు నుండి నీలో దుష్టత్వం కనిపించిన రోజు వరకు నీ ప్రవర్తన నిందారహితంగా ఉంది.
EZE 28:16 అయితే నీ వ్యాపారం విస్తరించి నీవు హింసతో నిండిపోయి పాపం చేశావు. కాబట్టి నేను నిన్ను అపవిత్రపరచి దేవుని పర్వతం మీద ఉండకుండా వెళ్లగొట్టాను, కావలి కెరూబుల కాలుతున్న రాళ్ల మధ్య నీవిక ఉండకుండా నిన్ను నాశనం చేస్తాను.
EZE 28:17 నీ సౌందర్యం చూసుకుని నీ హృదయం గర్వించింది నీ వైభవం కారణంగా నీ జ్ఞానం కలుషితమయ్యింది, కాబట్టి నేను నిన్ను భూమి మీద పడవేస్తాను. రాజులు నిన్ను చూసేలా నేను నిన్ను వారి ఎదుట ఉంచుతాను.
EZE 28:18 నీ అన్యాయమైన వ్యాపారంతో నీవు చేసిన అనేక పాపాల వలన, నీ పరిశుద్ధాలయాలను అపవిత్రం చేశావు. కాబట్టి నీలో అగ్ని పుట్టిస్తాను. అది నిన్ను కాల్చివేస్తుంది, చూస్తున్న వారందరి ఎదుట నేను నిన్ను నేల మీద బూడిదగా చేస్తాను.
EZE 28:19 నిన్ను ఎరిగిన జనులంతా నిన్ను బట్టి వణికిపోతారు; నీవు భయానక ముగింపుకు వచ్చావు నీవు పూర్తిగా నాశనమైపోతావు.’ ”
EZE 28:20 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 28:21 “మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు త్రిప్పుకుని దాని గురించి ప్రవచించి ఇలా చెప్పు:
EZE 28:22 ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్య నేను ఘనత పొందుతాను. నేను నీకు శిక్ష విధించి నీలో నా పరిశుద్ధతను కనుపరిచినప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.
EZE 28:23 పట్టణం మీదికి తెగులు పంపించి నీ వీధుల్లో రక్తం పారేలా చేస్తాను. అన్ని వైపుల నుండి నీ మీదికి వచ్చే కత్తివేటుకు వారు చనిపోతారు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.
EZE 28:24 “ ‘ఇశ్రాయేలీయుల పొరుగువారు ఇకపై గుచ్చుకుని బాధించే కంపలుగా పదునైన ముళ్ళుగా ఉండరు. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు.
EZE 28:25 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ప్రజల్లో చెదరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చినప్పుడు వారి ద్వారా నేను ఆ ప్రజల ఎదుట పరిశుద్ధుడనని రుజువవుతాను. నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన వారి దేశంలో వారు నివసిస్తారు.
EZE 28:26 అందులో వారు నిశ్చింతగా నివసించి ఇల్లు కట్టుకుని ద్రాక్షతోటలు నాటతారు. వారిని హింసించిన వారి పొరుగువారందరిని నేను శిక్షించిన తర్వాత వారు నిర్భయంగా నివసిస్తారు. అప్పుడు నేనే తమ దేవుడనైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
EZE 29:1 పదవ సంవత్సరం పదవనెల పన్నెండవ రోజు యెహోవా వాక్కు నాకు వచ్చి:
EZE 29:2 “మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని ఈజిప్టు రాజైన ఫరోవైపు త్రిప్పి అతని గురించి ఈజిప్టు దేశమంతటి గురించి ప్రవచించి ఇలా చెప్పు:
EZE 29:3 ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఈజిప్టు రాజైన ఫరో, నైలు నదిలో పడుకుని ఉన్న ఘటసర్పమా, నేను నీకు విరోధిని. “నైలు నది నాదే, నేనే దాన్ని చేశానని నీవు అంటావు.”
EZE 29:4 కాని నేను నీ దవడలకు గాలాలు తగిలించి, నీ నదులలో ఉన్న చేపలు నీ పొలుసులకు అంటుకుపోయేలా చేస్తాను. నీ పొలుసులకు అంటుకున్న చేపలతో పాటు నైలు నదిలో నుండి నిన్ను బయటకు లాగుతాను.
EZE 29:5 నిన్ను నీ నదులలోని చేపలన్నిటిని నేను అరణ్యంలో విడిచిపెడతాను. నీవు నేల మీద పడతావు నిన్ను ఎత్తేవారు గాని, తీసేవారు గాని ఉండరు. అడవి మృగాలకు ఆకాశపక్షులకు నిన్ను ఆహారంగా ఇస్తాను.
EZE 29:6 అప్పుడు నేనే యెహోవానని ఈజిప్టు నివాసులందరూ తెలుసుకుంటారు. “ ‘ఈజిప్టు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లల్లాంటి చేతికర్ర అయ్యింది.
EZE 29:7 వారు నిన్ను చేతితో పట్టుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి భుజాలలో గుచ్చుకున్నావు; వారు నీ మీద ఆనుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవడానికి కారణమయ్యావు.
EZE 29:8 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను నీ మీదికి కత్తిని రప్పిస్తాను. అది మనుష్యులను పశువులను చంపుతుంది.
EZE 29:9 ఈజిప్టు దేశం నిర్మానుష్యమై పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. “ ‘నైలు నది నాది నేనే దానిని చేశానని నీవు అన్నావు కాబట్టి,
EZE 29:10 నేను నీకు నీ నదికి విరోధిని అయ్యాను. ఈజిప్టు దేశాన్ని మిగ్దోలు నుండి సైనే వరకు కూషు సరిహద్దు వరకు పూర్తిగా పాడుచేసి ఎడారిగా చేస్తాను.
EZE 29:11 దానిలో మనుష్యులు నడవరు పశువులు తిరగరు. నలభై సంవత్సరాలు దానిలో ఎవరూ నివసించరు.
EZE 29:12 నిర్మానుష్యమైన దేశాల మధ్య ఈజిప్టు దేశం పాడైపోతుంది. శిథిలమై పోయిన పట్టణాల మధ్య దాని పట్టణాలు నలభై సంవత్సరాలు పాడైపోయి ఉంటాయి. ఈజిప్టువారిని ఇతర ప్రజలమధ్య చెదరగొడతాను. వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను.
EZE 29:13 “ ‘అయినా ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత ఇతర ప్రజలమధ్య చెదరిపోయిన ఈజిప్టువారిని నేను సమకూరుస్తాను.
EZE 29:14 బందీ నుండి వారిని తీసుకువచ్చి దక్షిణ ఈజిప్టులోని పత్రూసు అనేవారి పూర్వికుల దేశానికి వారిని రప్పిస్తాను. అక్కడ వారు ఒక అల్పమైన రాజ్యంగా ఏర్పడతారు.
EZE 29:15 రాజ్యాలన్నిటిలో అది అల్పమైన రాజ్యంగా ఉంటుంది. వారు ఇకపై ఇతర రాజ్యాల మీద ఆధిపత్యం చెలాయించకుండ నేను వారిని అణచివేస్తాను.
EZE 29:16 ఇశ్రాయేలీయులకు ధైర్యం కలిగించేదిగా ఈజిప్టు ఉండదు కాని సహాయం కోసం ఈజిప్టు వైపు తిరిగి తాము చేసిన పాపాన్ని ఇశ్రాయేలీయులు గుర్తుచేసుకుంటారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
EZE 29:17 ఇరవై ఏడవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:
EZE 29:18 “మనుష్యకుమారుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యంతో దండెత్తి చాలా బాధాకరమైన పని చేయించాడు. వారందరి తలలు బోడివయ్యాయి. అందరి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరు పట్టణం మీదికి అతడు తెచ్చిన నష్టాన్ని బట్టి అతనికి అతని సైన్యానికి ప్రతిఫలం కూడా దొరకలేదు.
EZE 29:19 కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఈజిప్టు దేశాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నాను. అతడు దాని ఆస్తిని తీసుకుని దాని సొమ్మును దోచుకొని కొల్లగొడతాడు. అదే అతని సైన్యానికి జీతం అవుతుంది.
EZE 29:20 అతడు అతని సైన్యం నా కోసమే శ్రమించారు కాబట్టి అతడు చేసిన దానికి ప్రతిఫలంగా బహుమానంగా ఈజిప్టు దేశాన్ని అతనికి అప్పగించాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 29:21 “ఆ రోజున నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిర్చేలా చేస్తాను. వారి మధ్య మాట్లాడటానికి నీకు ధైర్యాన్ని ఇస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”
EZE 30:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 30:2 “మనుష్యకుమారుడా, ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘రోదిస్తూ అనండి: “అయ్యో, శ్రమ దినం వచ్చిందే!”
EZE 30:3 ఎందుకంటే ఆ రోజు వచ్చేసింది, యెహోవా దినం సమీపించింది, మబ్బులు కమ్ముకునే రోజు, జనాంగాలు శిక్షించబడే రోజు.
EZE 30:4 ఈజిప్టు దేశం మీదికి ఖడ్గం దూసుకువస్తుంది, కూషు మీదికి వేదన వస్తుంది. ఈజిప్టులో హతులైనవారు పడిపోతుంటే, దాని సంపదను తీసుకెళ్లిపోతారు, దాని పునాదులు కూల్చివేయబడతాయి.
EZE 30:5 కూషు వారు, లిబియా వారు (పూతు వారు), లిడియా వారు, అరేబియా అంతా, కూబు వారు, ఇంకా నిబంధన దేశపు ప్రజలు ఈజిప్టుతో పాటు ఖడ్గానికి కూలిపోతారు.
EZE 30:6 “ ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఈజిప్టు సహాయకులు కూలిపోతారు, దాని బల గర్వం అణిగిపోతుంది. మిగ్దోలు నుండి సైనే వరకు ప్రజలు దాని లోపలే ఉన్న ఖడ్గానికి కూలిపోతారు. అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 30:7 పాడైపోయిన దేశాల మధ్య ఈజిప్టువారు దిక్కులేని వారవుతారు. శిథిలమైన పట్టణాల మధ్య వారి పట్టణాలు పడి ఉంటాయి.
EZE 30:8 ఈజిప్టు దేశంలో అగ్ని రగిలించబడి దాని సహాయకులంతా నలిపివేయబడినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
EZE 30:9 “ ‘ఆ రోజున దూతలు నా దగ్గర నుండి ఓడలలో బయలుదేరి నిర్భయంగా ఉన్న కూషును భయపెడతారు. ఈజిప్టుకు తీర్పు తీర్చబడిన రోజున వారికెంతో భయాందోళనలు కలుగుతాయి. అది తప్పనిసరిగా వస్తుంది.
EZE 30:10 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘బబులోను రాజైన నెబుకద్నెజరుచేత నేను ఈజిప్టువారి అల్లరిమూకలను అంతం చేస్తాను.
EZE 30:11 ప్రజల్లో అతి క్రూరులైన తన సైన్యాన్ని తీసుకుని ఆ దేశాన్ని నాశనం చెయ్యడానికి అతడు వస్తాడు. వారు ఈజిప్టు వారిపై తమ ఖడ్గాలు దూసి దేశమంతా శవాలతో నింపుతారు.
EZE 30:12 నైలు నదిని ఎండిపోయేలా చేసి ఆ దేశాన్ని దుర్మార్గులకు అమ్మేస్తాను. విదేశీయులచేత నేను ఆ దేశాన్ని అందులోని సమస్తాన్ని పాడుచేస్తాను. యెహోవానైన నేనే మాట ఇచ్చాను.
EZE 30:13 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘విగ్రహాలను నాశనం చేసి మెంఫిసులో ఒక్క విగ్రహం కూడా మిగలకుండా చేస్తాను. ఈజిప్టు దేశంలో ఒక్క యువరాజు కూడా ఉండడు, ఆ దేశమంతా భయం పుట్టిస్తాను.
EZE 30:14 పత్రూసు పాడుచేస్తాను, సోయనులో అగ్ని పుట్టిస్తాను తేబేసుకు శిక్ష విధిస్తాను.
EZE 30:15 ఈజిప్టుకు కోటయైన సీను మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. తేబేసు అల్లరిమూకలను నిర్మూలం చేస్తాను.
EZE 30:16 ఈజిప్టు దేశంలో మంట పుట్టిస్తాను. సీను వేదనతో మెలికలు తిరుగుతుంది. తేబేసు తుఫాను తాకిడికి చిన్నాభిన్నం అవుతుంది; మెంఫిసు నిరంతరం బాధలో ఉంటుంది.
EZE 30:17 హెలియోపొలిస్, పీ-బెసెతు యువకులు కత్తివేటుకు కూలిపోతారు, ఆ పట్టణస్థులు బందీలవుతారు.
EZE 30:18 ఈజిప్టు కాడిని నేను విరిచినప్పుడు తహ్పన్హేసులో పగలే చీకటి కమ్ముతుంది; దాని బల గర్వం అణచివేయబడుతుంది. దానిని మబ్బులు క్రమ్ముతాయి దాని కుమార్తెలు బందీగా వెళ్తారు.
EZE 30:19 కాబట్టి నేను ఈజిప్టువారికి శిక్ష విధిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
EZE 30:20 పదకొండవ సంవత్సరం మొదటి నెల ఏడవ రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:
EZE 30:21 “మనుష్యకుమారుడా, నేను ఈజిప్టు రాజైన ఫరో చేతిని విరగ కొట్టాను. అది బాగవ్వడానికి ఎవరూ దానికి కట్టు కట్టరు, అది కత్తి పట్టుకోడానికి కావలసినంత బలంగా మారడానికి బద్దపెట్టి కట్టరు.
EZE 30:22 కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని అయ్యాను. బాగా ఉన్న చేతిని విరిగిపోయిన చేతిని రెండింటిని నేను విరగ్గొట్టి అతని చేతిలో నుండి కత్తి పడిపోయేలా చేస్తాను.
EZE 30:23 ఈజిప్టువారిని ఇతర జనాంగాల్లోకి చెదరగొట్టి వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను.
EZE 30:24 నేను బబులోను రాజు చేతులను బలపరచి నా ఖడ్గాన్ని అతని చేతికి అందిస్తాను. నేను ఫరో చేతులను విరగ్గొట్టినప్పుడు బబులోను రాజు ఎదుట చావు దెబ్బ తిన్నవానిలా అతడు మూల్గుతాడు.
EZE 30:25 నేను బబులోను రాజు చేతులను బలపరుస్తాను, కాని ఫరో చేతులు చచ్చుబడిపోతాయి. ఈజిప్టు దేశం మీద ఆడించడానికి నేను నా ఖడ్గాన్ని బబులోను రాజు చేతికి ఇచ్చినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
EZE 30:26 ఈజిప్టువారిని ఇతర ప్రజల్లో చెదరగొట్టి వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”
EZE 31:1 పదకొండవ సంవత్సరం మూడవ నెల మొదటి తేది యెహోవా వాక్కు నాకు వచ్చి:
EZE 31:2 “మనుష్యకుమారుడా, నీవు ఈజిప్టు రాజైన ఫరోతో అతని పరివారంతో ఇలా చెప్పు: “ ‘ఘనతలో నీకు సాటి ఎవరు?
EZE 31:3 అష్షూరును చూడు, ఒకప్పుడు లెబానోను దేవదారులా, అందమైన కొమ్మలతో అడవిలా ఉండేది; దాని చిటారు కొమ్మ మిగతా చెట్ల కన్నా ఎత్తుగా ఉండేది.
EZE 31:4 సమృద్ధియైన జలాలు దానిని పోషించాయి, లోతైన నీటి ఊటలు దానిని ఎత్తుగా పెరిగేలా చేశాయి; వాటి ప్రవాహాలు దాని మొదలు చుట్టూ ప్రవహించాయి, పొలంలో ఉన్న చెట్లన్నిటికి దాని కాలువలు నీరు అందించాయి.
EZE 31:5 కాబట్టి పొలం లోని చెట్లన్నిటి కన్నా ఆ చెట్టు ఎత్తుగా ఎదిగింది; నీరు సమృద్ధిగా ఉన్నందున, దాని కొమ్మలు విస్తరించి, పెద్ద శాఖలుగా ఎదిగాయి.
EZE 31:6 ఆకాశ పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి, అడవి జంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టాయి; గొప్ప జనాంగాలన్నీ దాని నీడలో నివసించాయి.
EZE 31:7 నీరు సమృద్ధిగా ఉన్న చోటికి దాని వేర్లు వ్యాపించాయి, కాబట్టి అది విస్తరించిన కొమ్మలతో ఎంతో అందంగా ఉంది.
EZE 31:8 దేవుని తోటలో దేవదారు వృక్షాలు కూడా దానితో పోటీపడలేకపోయాయి, సరళ వృక్షాలు దాని కొమ్మలతో సమానం కాలేవు, అక్షోట వృక్షాల కొమ్మలు దాని కొమ్మలతో పోల్చబడలేవు, దానికి ఉన్నంత అందం దేవుని తోటలో ఉన్న ఏ చెట్టుకు లేదు.
EZE 31:9 విస్తారమైన కొమ్మలతో నేను దానిని అందంగా తయారుచేశాను, దేవుని తోటయైన ఏదెను లోని చెట్లన్నీ దానిని చూసి అసూయపడేలా చేశాను.
EZE 31:10 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మహా దేవదారు చెట్టు మిగిలిన చెట్ల కన్నా ఎత్తుగా ఉంది కాబట్టి అది గర్వపడింది.
EZE 31:11 కాబట్టి దాని దుర్మార్గానికి తగినట్టుగా నేను దానిని దేశాల అధినేత చేతులకు అప్పగించాను. నేను దానిని విసిరివేశాను,
EZE 31:12 విదేశీ జాతులలో క్రూరులు దాన్ని నరికి నేల మీద వదిలేశారు. కొండల్లో, లోయల్లో దాని కొమ్మలు పడి ఉన్నాయి; భూమిమీది వాగులన్నిటిలో దాని కొమ్మలు విరిగిపడ్డాయి. భూమి మీద ఉన్న జాతులన్ని దాని నీడ నుండి బయటకు వచ్చి దానిని వదిలేశాయి.
EZE 31:13 కూలిపోయిన చెట్టు మీద ఆకాశ పక్షులన్నీ వాలాయి, కొమ్మల మధ్య అడవి జంతువులన్నీ నివసించాయి.
EZE 31:14 కాబట్టి నీటి ప్రక్కన ఉన్న ఏ చెట్టు వాటి చిటారు కొమ్మలను గుబురుగా పెంచుకుని గర్వించకూడదు. నీరు సమృద్ధిగా ఉన్న ఏ ఇతర చెట్లు అంత ఎత్తుకు ఎప్పటికీ ఎదగకూడదు; వాటన్నిటి గమ్యం మరణమే, భూమి దిగువన పాతాళంలోనికి దిగిపోయే సాధారణ మనుష్యుల్లా అవి చనిపోతాయి.
EZE 31:15 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అది పాతాళానికి రప్పించబడిన రోజున నేను దాని గురించి దుఃఖిస్తూ లోతైన ఊటలతో దానిని కప్పివేసాను; దాని ప్రవాహాలను ఆపి, విస్తారమైన జలాలను అరికట్టాను. దాని కోసం నేను లెబానోను పర్వతాన్ని గాఢాంధకారం కమ్మేలా చేశాను, పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి.
EZE 31:16 పాతాళంలోకి దిగే వారితో ఉండడానికి నేను దానిని పాతాళంలోకి దించినప్పుడు, దాని పతనం వల్ల వచ్చే శబ్దానికి నేను దేశాలు వణికిపోయేలా చేశాను. అప్పుడు ఏదెను చెట్లన్నీ, లెబానోనులో ఉత్తమమైనవి, మంచివి, సమృద్ధిగా నీరున్న చెట్లు, భూమి దిగువన ఓదార్పు పొందాయి.
EZE 31:17 వారు కూడా గొప్ప దేవదారులా, ఖడ్గంతో చంపబడినవారి దగ్గరకు, జాతుల మధ్య దాని నీడలో నివసించిన సాయుధ పురుషులతో పాటు పాతాళానికి దిగారు.
EZE 31:18 “ ‘వైభవంలో ఘనతలో ఏదెను తోటలో ఉన్న ఏ చెట్లు నీతో పోల్చబడగలవు? అయినప్పటికీ, నీవు కూడా ఏదెను చెట్లతో పాటు భూమి దిగువకు రప్పించబడతావు; సున్నతిలేనివారి మధ్య, ఖడ్గం వలన చచ్చినవారితో నీవు కూడ పడి ఉంటావు. “ ‘ఫరోకు, అతని పరివారానికి ఇలా జరుగుతుంది, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
EZE 32:1 పన్నెండవ సంవత్సరం, పన్నెండవ నెల మొదటి రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:
EZE 32:2 “మనుష్యకుమారుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు: “ ‘దేశాల మధ్య సింహంవంటివాడవు; నీవు నీ ప్రవాహంలో కొట్టుకుపోతూ, నీ పాదాలతో నీటిని చిమ్ముతూ, ప్రవాహాలను బురదమయం చేస్తూ, సముద్రాల్లో ఉండే భీకరమైన సముద్ర జీవిలాంటి వాడవు.
EZE 32:3 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘గుంపులు గుంపులుగా ప్రజలు చేరినప్పుడు నేను నీ మీద వల వేస్తాను; నా వలలో చిక్కిన నిన్ను వారంతా నీటిలో నుండి బయటకు లాగుతారు.
EZE 32:4 నేను నిన్ను నేల మీద పడవేసి బయట పొలంలో విసిరివేస్తాను. ఆకాశ పక్షులను నీ మీద వ్రాలనిస్తాను, అడవి జంతువులను వాటి కడుపునిండా నిన్ను తినేలా చేస్తాను.
EZE 32:5 నీ మాంసాన్ని పర్వతాలమీద వెదజల్లుతాను, నీ శవాలతో లోయలన్నిటిని నింపుతాను.
EZE 32:6 నేను నీ రక్తధారలతో భూమిని పర్వతాల వరకు తడుపుతాను, లోయలు నీ మాంసంతో నిండిపోతాయి.
EZE 32:7 నేను నిన్ను ఆర్పివేసి ఆకాశాన్ని మూసివేస్తాను. నక్షత్రాలను చీకటిగా చేస్తాను; సూర్యుని మబ్బుతో కప్పుతాను చంద్రుడు ప్రకాశించడు.
EZE 32:8 నీ వలన ఆకాశంలోని జ్యోతులను చీకటిగా చేస్తాను నీ దేశం మీద గాఢాంధకారం కమ్మేలా చేస్తాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 32:9 నీకు తెలియని దేశాల మధ్య అనేక జనాంగాల మధ్య నేను నీ మీదికి నాశనం తెచ్చినప్పుడు అనేక జనాంగాల హృదయాలకు కలవరం కలిగిస్తాను.
EZE 32:10 నేను వారి ముందు నా ఖడ్గాన్ని ఆడించినప్పుడు, నీ కారణంగా అనేకమందికి కలవరాన్ని కలిగిస్తాను, వారి రాజులు నిన్ను చూసి భయపడతారు. నీవు కూలిపోయిన రోజున వారంతా ప్రాణభయంతో నిత్యం వణికిపోతారు.
EZE 32:11 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘బబులోను రాజు ఖడ్గం నీ మీదికి వస్తుంది.
EZE 32:12 అన్ని జాతులలో అతి క్రూరులైన బల శూరుల ఖడ్గంతో నీ సైన్యం పతనమయ్యేలా చేస్తాను. వారు ఈజిప్టువారి గర్వాన్ని అణచివేస్తారు, దాని అల్లరిమూకలు నాశనమైపోతాయి.
EZE 32:13 సమృద్ధి జలాల ప్రక్కన ఉన్న దాని పశువులన్నిటిని నేను నాశనం చేస్తాను, ఇకపై నరుని పాదాలు వాటిని కదల్చవు, పశువుల కాళ్లు వాటిని బురదమయం చేయవు.
EZE 32:14 అప్పుడు నేను జలాలను నిమ్మళింపజేసి, దాని ప్రవాహాలను నూనెలా ప్రవహించేలా చేస్తాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 32:15 నేను ఈజిప్టును పాడు చేసినప్పుడు, అందులో ఉన్నవాటన్నిటిని నాశనం చేసినప్పుడు, దానిలో నివసించే వారినందరిని నిర్మూలం చేసినప్పుడు, నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’
EZE 32:16 “వారు ఆమె కోసం ఈ విలాప గీతం పాడతారు. ఆయా దేశాల కుమార్తెలు దానిని పాడతారు; ఈజిప్టు కోసం, దాని అల్లరిమూకలన్నిటి కోసం వారు దానిని పాడతారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
EZE 32:17 పన్నెండవ సంవత్సరం మొదటి నెల పదిహేనవ రోజున యెహోవా వాక్కు నాకు వచ్చి:
EZE 32:18 “మనుష్యకుమారుడా! ఈజిప్టు అల్లరిమూకల కోసం విలపించు పాతాళంలోకి దిగివెళ్లే వారితో పాటు ఆమెను, బలమైన దేశాల కుమార్తెలను భూమికి అప్పగించు.
EZE 32:19 వారితో ఇలా చెప్పు, ‘నీవు ఇతరులకంటే ఎక్కువ అందంగా ఉన్నావా? నీవు క్రిందికి దిగివెళ్లి, సున్నతిలేనివారి మధ్య పడుకో.’
EZE 32:20 ఖడ్గం వలన చనిపోయినవారితో వారు కూలుతారు. ఖడ్గం దూయబడింది; ఆమెను తన అల్లరిమూకలన్నిటితో పాటు ఈడ్చుకుపోతారు.
EZE 32:21 పాతాళంలోని బలమైన నాయకులు ఈజిప్టు, దాని మిత్రుల గురించి ఇలా చెప్తారు, ‘వారు దిగి వచ్చారు, వారు సున్నతిలేని వారితో, ఖడ్గంతో చంపబడినవారితో పడుకున్నారు.’
EZE 32:22 “అష్షూరు దాని మొత్తం సైన్యంతో అక్కడే ఉంది; దాని చుట్టూ హతుల సమాధులు, ఖడ్గం వలన చంపబడినవారి సమాధులు ఉన్నాయి.
EZE 32:23 వారి సమాధులు పాతాళ అగాధాల్లో ఉన్నాయి, దాని సమాధుల చుట్టూ దాని సైన్యం పడి ఉంది. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసిన వారంతా ఖడ్గంతో చచ్చి పడి ఉన్నారు.
EZE 32:24 “సమాధి చుట్టూ ఏలాము దాని అల్లరిమూకలు ఉన్నాయి. వారందరూ చంపబడ్డారు, ఖడ్గంతో కూలారు. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసిన వారంతా సున్నతి పొందని వారిగా పాతాళంలోకి దిగివెళ్లే వారితో పాటు తమ అవమానాన్ని భరిస్తున్నారు.
EZE 32:25 చనిపోయినవారి మధ్య, దాని సమాధి చుట్టూ ఉన్న దాని అల్లరిమూకలకు దానికి పడక ఏర్పాటు చేయబడింది. వారందరూ సున్నతి లేకుండా ఖడ్గంతో చచ్చారు. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేశారు కాబట్టి పాతాళానికి దిగివెళ్లే వారితో తమ అవమానాన్ని భరిస్తున్నారు; చనిపోయినవారి మధ్య వారు పడి ఉన్నారు.
EZE 32:26 “మెషెకు, తుబాలు తమ సమాధుల చుట్టూ తమ అల్లరిమూకలతో పాటు అక్కడ ఉన్నారు. వారంతా సున్నతిలేనివారు, ఖడ్గంతో చంపబడ్డారు ఎందుకంటే సజీవుల దేశంలో వారు భయాన్ని వ్యాపింపజేశారు.
EZE 32:27 అయితే వారు సున్నతిలేని వారిలో పతనమైన యోధులతో పడుకోరు, వారు యుద్ధ ఆయుధాలతో పాటు పాతాళానికి దిగివెళ్లి, తమ ఖడ్గాలను వారి తలల క్రింద, వారి డాళ్లు వారి ఎముకల మీద పెట్టుకుని పడుకుంటారు; వీరు సజీవుల దేశంలో భయాన్ని పుట్టించారు కాబట్టి వీరి దోషం వీరి ఎముకలకు తగిలింది.
EZE 32:28 “ఫరో, నీవు కూడా సున్నతిలేనివారి మధ్య కత్తితో చంపబడినవారితో పాటు పడుకుంటావు.
EZE 32:29 “అక్కడ ఎదోము, దాని రాజులు యువరాజులు ఉన్నారు; వారికి శక్తి ఉన్నప్పటికీ, వారు ఖడ్గం చేత చంపబడినవారితో పాటు పడి ఉన్నారు. వారు సున్నతి పొందని వారితో, గొయ్యిలో దిగే వారితో పడుకుంటారు.
EZE 32:30 “ఉత్తర ప్రాంత అధిపతులందరు, అలాగే సీదోనీయులందరు అక్కడ ఉన్నారు; వారు తమ శక్తి వల్ల భీభత్సం సృష్టించినప్పటికీ చంపబడినవారితో దిగివెళ్లి అవమానానికి గురయ్యారు. వారు ఖడ్గం చేత చంపబడినవారితో సున్నతి పొందని వారిగా పడి ఉన్నారు, పాతాళానికి దిగివెళ్లే వారితో తమ అవమానాన్ని భరిస్తున్నారు.
EZE 32:31 “ఖడ్గంతో చంపబడిన ఫరో అతని సైన్యమంతా వారిని చూసి తమ అల్లరిమూకలన్నిటిని బట్టి ఓదార్పు పొందుతారు అని ప్రభువైన యెహోవా ప్రకటించారు.
EZE 32:32 సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసేలా చేశాను కాబట్టి ఫరో అతనితో పాటు అతని సైన్యం సున్నతిలేని వారితోనూ ఖడ్గం చేత హతులైనవారితోనూ పడి ఉంటారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
EZE 33:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 33:2 “మనుష్యకుమారుడా, నీ ప్రజలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘నేను ఒక దేశం మీదికి ఖడ్గాన్ని రప్పించగా ఆ ప్రజలు తమలో ఒకరిని ఎంచుకుని అతన్ని తమ కావలివానిగా పెట్టుకుంటారు.
EZE 33:3 అతడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదుతాడు,
EZE 33:4 అప్పుడు ఒకవేళ ఎవరైనా బూర శబ్దం విని కూడా జాగ్రత్త పడకపోతే ఆ ఖడ్గం వచ్చి వారి ప్రాణాన్ని తీస్తుంది, వారి చావుకు వారే బాధ్యులు.
EZE 33:5 వారు బూర శబ్దం విని కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు, కాబట్టి వారి చావుకు వారే బాధ్యులు. ఒకవేళ వారు ఆ హెచ్చరికకు జాగ్రత్తపడి ఉంటే, వారు తమ ప్రాణాలను కాపాడుకునేవారు.
EZE 33:6 అయితే ఒకవేళ కావలివాడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి కూడా ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదకపోతే, ఖడ్గం వచ్చి ఎవరినైనా చంపితే, చనిపోయినవారు తమ పాపాల కారణంగా చనిపోయినప్పటికి, నేను ఆ కావలివాన్ని బాధ్యున్ని చేస్తాను.’
EZE 33:7 “మనుష్యకుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను; కాబట్టి నేను చెప్పే మాట విని నా తరపున వారిని హెచ్చరించు.
EZE 33:8 నేను దుర్మార్గునితో, ‘దుర్మార్గుడా, నీవు తప్పక చస్తావు’ అని చెప్పినప్పుడు, వారి మార్గాలను విడిచిపెట్టమని నీవు వాన్ని హెచ్చరించకపోతే, ఆ దుర్మార్గుడు వాని పాపాలను బట్టి చనిపోతే వాని చావుకు నిన్ను బాధ్యున్ని చేస్తాను.
EZE 33:9 అయితే ఒకవేళ నీవు ఆ దుర్మార్గులను హెచ్చరించినా ఆ దుర్మార్గులు తమ దుష్టత్వాన్ని వదలకపోతే, వారు తమ పాపాలను బట్టి చస్తారు, అయితే నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.
EZE 33:10 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు, “మా పాపాలు దోషాలు మాకు భారంగా ఉన్నాయి, వాటివలన మేము క్షీణించి పోతున్నాము; మేమెలా బ్రతకాలి?” అని అంటున్నారు.’
EZE 33:11 నీవు వారితో ఇలా చెప్పు, ‘నా జీవం తోడు, దుర్మార్గులు చనిపోతే నాకు సంతోషం ఉండదు గాని వారు తమ చెడు మార్గాలు విడిచి బ్రతికితే నాకు సంతోషము. తిరగండి! మీ చెడు మార్గాల నుండి తిరగండి! ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చస్తారు?’ అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 33:12 “కాబట్టి మనుష్యకుమారుడా, నీ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఒకవేళ నీతిమంతులు పాపం చేస్తే, వారి గతంలోని నీతికి విలువ ఉండదు. అలాగే దుష్టులు పశ్చాత్తాపపడితే, వారి యొక్క గతంలోని దుష్టత్వం శిక్షను తీసుకురాదు. పాపం చేసే నీతిమంతులు గతంలో నీతిమంతులుగా ఉన్నప్పటికీ, వారు జీవించడానికి అనుమతించబడరు.’
EZE 33:13 నీతిమంతులు తప్పక జీవిస్తారని నేను చెప్పినా సరే, వారు తమ నీతిని నమ్ముకొని పాపం చేస్తే, వారు చేసిన ఏ నీతికార్యాలు జ్ఞాపకం చేసుకోబడవు; వారు చేసిన పాపానికి వారు చస్తారు.
EZE 33:14 అలాగే ఒకవేళ నేను దుర్మార్గులతో, ‘మీరు తప్పక చస్తారు’ అని చెప్తే, వారు తమ పాపాన్ని విడిచిపెట్టి, న్యాయమైనవి, సరియైనవి చేస్తూ,
EZE 33:15 వారు అప్పు ఇచ్చినప్పుడు తాకట్టుగా పెట్టుకున్న వాటిని తిరిగి ఇస్తే, వారు దొంగిలించింది తిరిగి ఇస్తే, జీవితాన్ని ఇచ్చే శాసనాలను అనుసరిస్తూ కీడు చేయనట్లైతే; ఆ వారు ఖచ్చితంగా బ్రతుకుతారు; వారు చనిపోరు.
EZE 33:16 వారు చేసిన పాపాల్లో ఏదీ జ్ఞాపకం చేసుకోబడదు. వారు న్యాయమైనవి, సరియైనవి చేశారు; కాబట్టి వారు ఖచ్చితంగా బ్రతుకుతారు.
EZE 33:17 “అయినా నీ ప్రజలు, ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటారు. కాని నిజానికి వారి విధానమే న్యాయమైనది కాదు.
EZE 33:18 నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి చెడు చేస్తే, ఆ పాపాన్ని బట్టి వారు చస్తారు.
EZE 33:19 దుర్మార్గులు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి న్యాయమైనవి, సరియైనవి చేస్తే, వాటిని బట్టి వారు బ్రతుకుతారు.
EZE 33:20 అయితే ఇశ్రాయేలీయులారా, మీరు ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటున్నారు. అయితే నేను మీ ప్రవర్తన బట్టి మీ అందరికి తీర్పు తీరుస్తాను.”
EZE 33:21 మనం బందీలుగా వచ్చిన పన్నెండవ సంవత్సరం పదవనెల అయిదవ రోజున యెరూషలేములో నుండి తప్పించుకున్న ఒక మనుష్యుడు నా దగ్గరికి వచ్చి, “పట్టణం కూలిపోయింది!” అని చెప్పాడు.
EZE 33:22 అతడు ఇక్కడకు రావడానికి ముందు సాయంత్రం యెహోవా హస్తం నా మీద ఉంచి, ఉదయం ఆ వ్యక్తి నా దగ్గరికి రాకముందు ఆయన నా నోరు తెరిచారు. కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, నేను ఇక మౌనంగా ఉండను.
EZE 33:23 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 33:24 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు దేశంలో శిథిలాల మధ్య నివసిస్తున్నవారు, ‘అబ్రాహాము ఒంటరిగానే ఈ దేశమంతటిని స్వాధీనపరచుకున్నాడు. కాని మనమైతే చాలామందిమి; ఖచ్చితంగా ఈ దేశం మనకు మన స్వాస్థ్యంగా ఇవ్వబడింది’ అని అంటున్నారు.
EZE 33:25 కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు మాంసంలో ఇంకా రక్తం ఉండగానే తింటూ, మీ విగ్రహాలవైపు చూస్తూ రక్తాన్ని చిందిస్తున్నారు, అలాంటి మీరు భూమిని స్వాధీనం చేసుకోగలరని అనుకుంటున్నారా?
EZE 33:26 మీరు మీ ఖడ్గం మీద ఆధారపడుతున్నారు, అసహ్యమైన పనులు చేస్తున్నారు, మీలో ప్రతి ఒక్కరూ మీ పొరుగువాని భార్యను అపవిత్రం చేస్తారు; అలాంటి మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోగలరా?’
EZE 33:27 “వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నా జీవం తోడు, శిథిలాల్లో మిగిలి ఉన్నవారు ఖడ్గం చేత కూలిపోతారు, బయట పొలంలో ఉన్నవారు అడవి మృగాలకు ఆహారమవుతారు, కోటలలో గుహల్లో ఉన్నవారు తెగులుతో చస్తారు.
EZE 33:28 నేను ఆ దేశాన్ని నిర్మానుష్యంగా చేస్తాను. దాని బల గర్వం ముగిసిపోతుంది, వాటి గుండా ఎవరూ వెళ్లకుండా ఇశ్రాయేలీయుల పర్వతాలు నిర్జనమవుతాయి.
EZE 33:29 వారు చేసిన అసహ్యమైన పనులను బట్టి నేను వారి దేశాన్ని పాడు చేసినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’
EZE 33:30 “మనుష్యకుమారుడా, నీ ప్రజలు గోడల దగ్గర, ఇళ్ళ గుమ్మాల దగ్గర నిలబడి నీ గురించి మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు, ‘రండి యెహోవా దగ్గర నుండి వచ్చిన సందేశం ఏంటో విందాం’ అని చెప్పుకుంటున్నారు.
EZE 33:31 నా ప్రజలు ఎప్పుడూ వచ్చినట్లే నీ దగ్గరకు వచ్చి మీ మాటలు వినడానికి నీ ఎదుట కూర్చుంటారు, కాని వారు వాటిని పాటించరు. వారి నోళ్ళు ప్రేమ గురించి మాట్లాడతాయి, కాని వారి హృదయాలు అన్యాయపు లాభాన్ని ఆశిస్తాయి.
EZE 33:32 నిజానికి, వారికి నీవు అందమైన స్వరంతో ప్రేమ పాటలు పాడే వాడివి, వాయిద్యాన్ని చక్కగా వాయించే వాడివి తప్ప మరేమీ కాదు, ఎందుకంటే వారు మీ మాటలు వింటారు కానీ వాటిని పాటించరు.
EZE 33:33 “ఇవన్నీ నిజమైతే! ఖచ్చితంగా నిజమవుతాయి. అప్పుడు తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకుంటారు.”
EZE 34:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 34:2 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు కాపరులకు వ్యతిరేకంగా ప్రవచించు; ప్రవచించి వారితో ఇలా చెప్పు: ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మిమ్మల్ని మీరు మాత్రమే చూసుకునే ఇశ్రాయేలు కాపరులారా మీకు శ్రమ! కాపరులు తమ గొర్రెల మందను జాగ్రత్తగా చూసుకోవాలి కదా?
EZE 34:3 మీరు క్రొవ్విన వాటిని తింటారు, ఉన్నితో బట్టలు వేసుకుంటారు, ఎంపిక చేసిన జంతువులను వధిస్తారు, కానీ మందను మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోరు.
EZE 34:4 మీరు బలహీనమైన వాటిని బలపరచలేదు, రోగంతో ఉన్నవాటిని స్వస్థపరచలేదు, గాయపడిన వాటికి కట్టు కట్టలేదు. మీరు దారితప్పిన వాటిని తిరిగి తీసుకురాలేదు, తప్పిపోయిన వాటికోసం వెదకలేదు. మీరు వాటిని కఠినంగా, క్రూరంగా పాలించారు.
EZE 34:5 కాపరి లేనందున అవి చెదిరిపోయాయి, అవి చెదిరిపోయి అడవి జంతువులన్నిటికి ఆహారమయ్యాయి.
EZE 34:6 నా గొర్రెలు పర్వతాలన్నిటి మీదా, ఎత్తైన ప్రతి కొండ మీదా సంచరించాయి. వారు భూమి అంతటా చెల్లాచెదురుగా ఉన్నారు, ఎవరూ వాటిని వెదకలేదు, వాటికోసం చూడలేదు.
EZE 34:7 “ ‘కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి:
EZE 34:8 నా జీవం తోడు కాపరులు లేని నా గొర్రెలు దోచుకోబడ్డాయి, అడవి మృగాలన్నిటికి ఆహారమయ్యాయి, నా కాపరులు నా గొర్రెలను వెదకలేదు, నా గొర్రెలను జాగ్రత్తగా చూసుకోకుండా వారు తమ గురించి మాత్రమే చూసుకున్నారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 34:9 కాబట్టి కాపరులారా, యెహోవా మాట వినండి:
EZE 34:10 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఆ కాపరులకు వ్యతిరేకిని, నా మంద గురించి నేను వారిని లెక్క అడుగుతాను. గొర్రెల కాపరులు ఇకపై మందను మేపకుండ నేను వారిని తొలగిస్తాను, తద్వార వారు తమను తాము పోషించుకోలేరు. వారి నోటి నుండి నేను నా మందను విడిపిస్తాను, ఇకపై అది వారికి ఆహారంగా ఉండదు.
EZE 34:11 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేనే స్వయంగా నా గొర్రెలను వెదికి వాటిని చూసుకుంటాను.
EZE 34:12 గొర్రెల కాపరి చెదిరిపోయిన తన మందను వెదకినట్లు నేను నా గొర్రెలను వెదకుతాను. మేఘాలు కమ్మి చీకటిగా ఉన్న రోజున, అవి ఎక్కడెక్కడ చెదిరిపోయాయో అక్కడ నుండి నేను వాటిని రక్షిస్తాను.
EZE 34:13 నేను వాటిని ఇతర జాతుల నుండి బయటకు రప్పించి, దేశాల నుండి వాటిని సమకూర్చి, నేను వాటిని వారి స్వదేశానికి తీసుకువస్తాను. నేను వాటిని ఇశ్రాయేలు పర్వతాలమీద, కనుమలలో, దేశంలోని అన్ని నివాస స్థలాల్లో మేపుతాను.
EZE 34:14 మంచి పచ్చిక ఉన్నచోట వాటిని మేపుతాను, ఇశ్రాయేలీయుల ఎత్తైన పర్వతాలు వాటికి పచ్చికబయళ్లుగా ఉంటాయి. అందులో అవి హాయిగా పడుకుంటాయి. ఇశ్రాయేలు పర్వతాలమీద శ్రేష్ఠమైన మేత ఉన్న స్థలాల్లో అవి మేస్తాయి.
EZE 34:15 నేనే స్వయంగా నా గొర్రెలను మేపి వాటిని పడుకోబెడతాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 34:16 నేను తప్పిపోయిన వాటిని వెదికి, తోలివేసిన వాటిని తిరిగి తోలుకు వస్తాను. నేను గాయపడిన వాటికి కట్టుకడతాను. బలహీనమైన వాటిని బలపరుస్తాను. క్రొవ్విన వాటిని బలిసిన వాటిని నాశనం చేస్తాను. మందను న్యాయంగా మేపుతాను.
EZE 34:17 “ ‘నా మందా, నీ గురించి ప్రభువైన యెహోవా చెప్తున్నారు: నేను గొర్రెకు మధ్య, పొట్టేళ్లకు మేకపోతులకూ మధ్య తీర్పు తీరుస్తాను.
EZE 34:18 మంచి పచ్చికబయళ్లను తింటే సరిపోదా? మిగిలిన పచ్చికబయళ్లను కాళ్లతో త్రొక్కాలా? మీరూ స్వచ్ఛమైన నీరు త్రాగితే సరిపోదా? మీ పాదాలతో మిగిలిన నీటిని బురదమయం చేయాలా?
EZE 34:19 మీ కాళ్లతో త్రొక్కింది నా మంద మేయాలా? కాళ్లతో బురద చేసిన నీళ్లను నా గొర్రెలు త్రాగాలా?
EZE 34:20 “ ‘ప్రభువైన యెహోవా వారికి చెబుతున్న మాట ఇదే: క్రొవ్విన గొర్రెలకు బక్కచిక్కిన గొర్రెలకు మధ్య నేనే తీర్పు తీరుస్తాను.
EZE 34:21 మీరు కొమ్ములతో పొడుస్తూ, భుజంతో ప్రక్కలతో తోస్తూ బలహీనమైన గొర్రెలన్నిటిని తరిమికొడుతున్నారు కాబట్టి,
EZE 34:22 నేను నా గొర్రెలను కాపాడతాను, ఇకపై అవి దోచుకోబడవు. గొర్రెకు మధ్య నేను తీర్పు తీరుస్తాను.
EZE 34:23 వాటిని మేపడానికి నేను నా సేవకుడైన దావీదును కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని కాస్తాడు; అతడు వాటిని మేపుతాడు, వాటికి కాపరిగా ఉంటాడు.
EZE 34:24 యెహోవానైన నేను వారికి దేవునిగా ఉంటాను, నా సేవకుడైన దావీదు వాటికి అధిపతిగా ఉంటాడు. యెహోవానైన నేను మాట చెప్పాను.
EZE 34:25 “ ‘అవి అరణ్యంలో క్షేమంగా నివసించి అడవుల్లో పడుకునేలా నేను వాటితో సమాధాన ఒడంబడిక చేసుకుంటాను, అలాగే అడవి మృగాలను దేశంలో లేకుండా చేస్తాను.
EZE 34:26 నేను వాటిని నా పర్వతం చుట్టుప్రక్కల ఉన్న స్థలాలను ఆశీర్వాదకరంగా చేస్తాను. రుతువుల ప్రకారం జల్లులు కురిపిస్తాను; ఆశీర్వాదకరమైన జల్లులు కురుస్తాయి.
EZE 34:27 చెట్లు తమ పండ్లను ఇస్తాయి, భూమి తన పంటను ఇస్తుంది; ప్రజలు తమ దేశంలో క్షేమంగా ఉంటారు. నేను వారి కాడిని విరగ్గొట్టి, వారిని బానిసలుగా చేసుకున్న వారి చేతుల్లో నుండి వారిని విడిపించినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
EZE 34:28 వారు ఇకపై దేశాలచేత దోచుకోబడరు, అడవి మృగాలకు వారు ఆహారం కారు. వారు క్షేమంగా జీవిస్తారు, వారిని ఎవరూ భయపెట్టరు.
EZE 34:29 పంటలకు ప్రసిద్ధి చెందిన దేశాన్ని నేను వారికి ఇస్తాను, వారు ఇకపై దేశంలో కరువు బారిన పడరు, ఇతర దేశాల మధ్య అవమానాన్ని భరించే అవసరం ఉండదు.
EZE 34:30 అప్పుడు నేను వారి దేవుడనైన యెహోవాను వారికి తోడుగా ఉన్నానని, ఇశ్రాయేలీయులైన వారు నా ప్రజలని వారు తెలుసుకుంటారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 34:31 మీరు నా గొర్రెలు, నా పచ్చిక బయళ్లలోని గొర్రెలు, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
EZE 35:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 35:2 “మనుష్యకుమారుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖం త్రిప్పి దానికి వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు:
EZE 35:3 ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఓ శేయీరు పర్వతమా, నేను నీకు వ్యతిరేకిని, నేను నీకు వ్యతిరేకంగా నా చేయి చాపి నిన్ను నిర్జనమై వ్యర్థంగా మిగిలిపోయేలా చేస్తాను.
EZE 35:4 నీ పట్టణాలను శిథిలాలుగా మారుస్తాను; నీవు నిర్జనమవుతావు. అప్పుడు నేనే యెహోవానని తెలుసుకుంటావు.
EZE 35:5 “ ‘నీవు ఇశ్రాయేలీయుల పట్ల ఎప్పుడూ పగతో ఉండి, వారి విపత్తు సమయంలో, వారి శిక్ష ముగింపుకు చేరుకున్న సమయంలో నీవు వారిని ఖడ్గానికి అప్పగించావు,
EZE 35:6 కాబట్టి నా జీవం తోడు, నేను నిన్ను రక్తపాతానికి అప్పగిస్తాను, అది నీ వెంటపడుతుంది. నీవు రక్తపాతాన్ని ద్వేషించలేదు కాబట్టి, రక్తపాతం నిన్ను వెంటాడుతుందని యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 35:7 నేను శేయీరు పర్వతాన్ని నిర్జనంగా వ్యర్థంగా చేస్తాను, వస్తూ వెళ్తూ ఉండేవారు అక్కడ లేకుండా చేస్తాను.
EZE 35:8 నీ పర్వతాలను శవాలతో నింపుతాను; ఖడ్గం చేత చచ్చినవారు నీ కొండలమీద, నీ లోయల్లో, నీ వాగుల్లో పడి ఉంటారు.
EZE 35:9 నేను నిన్ను శాశ్వతంగా పాడైపోయేలా చేస్తాను; నీ పట్టణాల్లో ఎవరూ నివసించరు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.
EZE 35:10 “ ‘యెహోవానైన నేను అక్కడ ఉన్నప్పటికీ, “ఈ రెండు జాతులు, దేశాలు మనవే; మనం వాటిని స్వాధీనం చేసుకుందాం” అని మీరు చెప్పారు.
EZE 35:11 కాబట్టి నా జీవం తోడు నీవు వారిమీద ద్వేషంతో నీవు వారికి చూపించిన కోపం అసూయను బట్టి నేను నీ పట్ల తగిన రీతిగా వ్యవహరిస్తాను. నేను నిన్ను శిక్షించినప్పుడు నన్ను నేను వారికి పరిచయం చేసుకుంటాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 35:12 “అవి పాడుచేయబడ్డాయి, మనకు ఆహారంగా ఇవ్వబడ్డాయి” అని నీవు ఇశ్రాయేలు పర్వతాలను దూషించిన మాటలన్నీ యెహోవానైన నేను విన్నానని నీవు తెలుసుకుంటావు.
EZE 35:13 మీరు ప్రగల్భాలు పలుకుతూ, ఏమాత్రం అదుపు లేకుండా నాకు వ్యతిరేకంగా మాట్లాడారు, అదంతా నేను విన్నాను.
EZE 35:14 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఒకవైపు లోకమంతా సంతోషిస్తూ ఉంటే, నేను నిన్ను నాశనం చేస్తాను.
EZE 35:15 ఇశ్రాయేలీయుల వారసత్వం పాడైపోయినప్పుడు నీవు సంతోషించావు, కాబట్టి నేను నీతో అలాగే వ్యవహరిస్తాను. శేయీరు పర్వతమా, నీవూ నీతో పాటు ఎదోము అంతా పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
EZE 36:1 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు పర్వతాల గురించి ప్రవచించి ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా మాట వినండి.
EZE 36:2 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ఆహా! ప్రాచీనమైన ఉన్నత స్థలాలు మా స్వాధీనమయ్యాయి” అని శత్రువులు నీ గురించి అన్నారు.’
EZE 36:3 కాబట్టి ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు మిగిలిన ఇతర దేశాల వారికి స్వాధీనమయ్యేలా, ప్రజల మధ్యలో మీరు ఎగతాళిచేయబడి హేళన చెందేలా, వారు అన్ని వైపుల నుండి మిమ్మల్ని ధ్వంసం చేసి అణచివేశారు.
EZE 36:4 కాబట్టి, ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి: ప్రభువైన యెహోవా పర్వతాలతో, కొండలతో, కనుమలతో, లోయలతో, నిర్జనమైన శిథిలాలతో, మీ చుట్టూ ఉన్న మిగిలిన ఇతర జాతులచేత దోచుకోబడి అపహాస్యం చేయబడిన పాడైన పట్టణాలతో మాట్లాడుతూ,
EZE 36:5 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: చుట్టూ ఉన్న దేశాలు, ఎదోము వారంతా ద్వేషంతో, ఆనందంతో ఉప్పొంగుతూ నా దేశాన్ని దోపుడు సొమ్ముగా తీసుకున్నారు, కాబట్టి నేను తీవ్రమైన రోషంలో నేను వారికి వ్యతిరేకంగా మాట్లాడాను.’
EZE 36:6 కాబట్టి ఇశ్రాయేలు దేశం గురించి ప్రవచించి పర్వతాలతో, కొండలతో, కనుమలతో, లోయలతో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు దేశాల మధ్య అవమానించబడ్డారు, కాబట్టి నేను నా రోషంలో ఉగ్రతలో మాట్లాడుతున్నాను.
EZE 36:7 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీ చుట్టూ ఉన్న దేశాలు కూడా అవమానం పాలవుతాయని నా చేయి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను.
EZE 36:8 “ ‘కాని ఇశ్రాయేలు పర్వతాల్లారా, త్వరలో నా ప్రజలైన ఇశ్రాయేలీయులు తమ ఇంటికి తిరిగి వస్తారు, కాబట్టి మీరు కొమ్మలుగా ఎదిగి వారి కోసం పండ్లు ఇవ్వాలి.
EZE 36:9 నేను మీ పక్షంగా ఉండి మీమీద దయ చూపిస్తాను; మీరు దున్నబడి, విత్తబడతారు.
EZE 36:10 మీమీద మనుష్యజాతిని అంటే ఇశ్రాయేలీయులందరు నివసించేలా చేస్తాను. నా పట్టణాల్లో మళ్ళీ నివాసులు ఉంటారు, శిథిలాలు మళ్ళీ కట్టబడతాయి.
EZE 36:11 మీమీద నివసించే మనుష్యులను పశువులను నేను విస్తరింపజేస్తాను, వారు ఫలించి విస్తరిస్తారు. గతంలో ఉన్నట్లే మీమీద ప్రజలను స్థిరపరచి, అంతకుముందు కన్నా అధికంగా అభివృద్ధి కలిగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
EZE 36:12 నేను మనుష్యజాతిని అనగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను మీమీద నివసించేలా చేస్తాను. వారు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు, మీరు వారికి స్వాస్థ్యంగా ఉంటారు; ఇక ఎప్పటికీ మీరు వారిని పిల్లలు లేనివారిగా చేయరు.
EZE 36:13 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “నీవు మనుష్యులను చంపుతూ, నీ దేశంలో పిల్లలు లేకుండా చేస్తున్నావు” అని కొందరు నీ గురించి చెప్పుకుంటున్నారు.
EZE 36:14 కాబట్టి నీవు ఇకపై మనుష్యులను చంపవు, నీ దేశాన్ని పిల్లలు లేనిదిగా చేయవు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 36:15 ఇకపై మిమ్మల్ని దేశాలు దూషించడం మీరు వినరు, ఇకపై మిమ్మల్ని జనాంగాల అవమానించవు, మీ జాతిని పతనమయ్యేలా చేయరు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
EZE 36:16 మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 36:17 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు తమ స్వదేశంలో నివసిస్తున్నప్పుడు, వారు తమ ప్రవర్తనతో తమ చేష్టలతో దానిని అపవిత్రం చేశారు. నా దృష్టికి వారి ప్రవర్తన నెలసరిలో ఉన్న స్త్రీ అపవిత్రతలా ఉంది.
EZE 36:18 కాబట్టి వారు దేశంలో రక్తం చిందించినందుకు, తమ విగ్రహాలతో దానిని అపవిత్రం చేసినందుకు నేను వారిపై నా ఉగ్రత క్రుమ్మరించాను.
EZE 36:19 నేను వారిని జాతుల మధ్యకు చెదరగొట్టాను, వారు వివిధ దేశాలకు చెదిరిపోయారు; వారి ప్రవర్తన, వారి చేష్టలకు తగినట్టుగా నేను వారికి తీర్పు తీర్చాను.
EZE 36:20 వారు ఏ దేశాల మధ్యకు వెళ్లినా నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేశారు, ఎలా అంటే, ‘వారు యెహోవా ప్రజలే అయినప్పటికీ వారు ఆయన దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది’ అని వారి గురించి చెప్తారు.
EZE 36:21 నా పరిశుద్ధ నామం గురించి నాకు చింత ఉంది, దానిని ఇశ్రాయేలీయులు తాము వెళ్లిన దేశాల్లో అపవిత్రం చేశారు.
EZE 36:22 “కాబట్టి ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలు ప్రజలారా, నేను చేయబోయేది మీ కోసం కాదు, ఇతర ప్రజల్లో మీ వలన అవమానానికి గురియైన నా పరిశుద్ధ నామం కోసమే చేస్తాను.
EZE 36:23 మీ మూలంగా ఇతర ప్రజల్లో అవమానపరచబడుతున్న నా గొప్ప పేరు ఎంత పరిశుద్ధమైనదో మీకు చూపిస్తాను. వారి కళ్ళెదుట మీ ద్వారా నా పరిశుద్ధతను వెల్లడి చేసినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 36:24 “ ‘నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి బయటకు తీసుకువస్తాను; దేశాలన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశానికి తిరిగి తీసుకువస్తాను.
EZE 36:25 నేను మీమీద శుద్ధ జలాన్ని చిలకరిస్తాను, మీరు శుద్ధులవుతారు; మీ విగ్రహాల నుండి, అపవిత్రతలన్నిటి నుండి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను.
EZE 36:26 నేను మీకు నూతన హృదయాన్ని ఇచ్చి, మీలో నూతనమైన ఆత్మను ఉంచుతాను. మీలోని రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతాను.
EZE 36:27 నా ఆత్మను మీలో ఉంచి, నా శాసనాలను అనుసరించి నా ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా మిమ్మల్ని చేస్తాను.
EZE 36:28 అప్పుడు మీ పూర్వికులకు నేనిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను.
EZE 36:29 మీ అపవిత్రతలన్నిటి నుండి మిమ్మల్ని కాపాడతాను. మీ మీదికి కరువు తీసుకురాకుండా మీకు సమృద్ధిగా ధాన్యం పండేలా చేస్తాను.
EZE 36:30 చెట్ల ఫలాలను, పొలాల పంటను వృద్ధి చేస్తాను, అప్పుడు కరువు కారణంగా ఇతర ప్రజల ముందు మీకు అవమానం కలుగదు.
EZE 36:31 అప్పుడు మీరు మీ చెడు ప్రవర్తనను, చేసిన చెడ్డపనులను జ్ఞాపకం చేసుకుని మీరు చేసిన పాపాలు అసహ్యమైన పనులను బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.
EZE 36:32 ఇదంతా నేను మీ కోసం చేయడం లేదని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. ఇశ్రాయేలీయులారా! మీ ప్రవర్తనకు సిగ్గుపడండి, అవమానంగా భావించండి.
EZE 36:33 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను మిమ్మల్ని మీ పాపాలన్నిటి నుండి శుద్ధి చేసే రోజున మీరు తిరిగి మీ పట్టణాల్లో నివసించేలా చేస్తాను; శిథిలమైన పట్టణాలు తిరిగి కట్టబడతాయి.
EZE 36:34 ఆ దారిలో వెళ్లే వారందరి దృష్టికి ఈ పాడుబడి నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఈ భూమి సేద్యం చేయబడుతుంది.
EZE 36:35 వ్యర్థంగా ఉండిన ఈ భూమి ఏదెను తోటలా మారింది; శిథిలమై పాడుబడి నిర్మానుష్యంగా ఉన్న పట్టణాలు ఇప్పుడు కోటలతో జనసంచారంతో సందడిగా ఉన్నాయని వారంటారు.
EZE 36:36 అప్పుడు యెహోవానైన నేను శిథిలమైన వాటిని మళ్ళీ కడతానని, పాడైన స్థలాల్లో చెట్లు నాటుతానని మీ చుట్టూ మిగిలి ఉన్న దేశాలు తెలుసుకుంటాయి. యెహోవానైన నేను చెప్పాను, దానిని నేను చేస్తాను.’
EZE 36:37 “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తమ కోసం ఇలా చేయమని ఇశ్రాయేలు ప్రజలు నన్ను వేడుకునేలా చేస్తాను. గొర్రెలు విస్తరించినట్లు నేను వారు విస్తరించేలా చేస్తాను.
EZE 36:38 నియమించబడిన పండుగల్లో యెరూషలేములో అర్పించబడే గొర్రె మందల్లా వారి సంఖ్యను అభివృద్ధి చేస్తాను. అప్పుడు శిథిలమైన పట్టణాలు మనుష్యుల గుంపులతో నిండిపోతాయి. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”
EZE 37:1 యెహోవా చేయి నా మీదికి వచ్చింది. యెహోవా ఆత్మ నన్ను తీసుకెళ్లి ఎముకలతో నిండిన ఒక లోయలో దించారు.
EZE 37:2 ఆయన వాటి మధ్య నన్ను అటూ ఇటూ నడిపించారు. ఆ లోయలో బాగా ఎండిపోయిన చాలా ఎముకలు నాకు కనబడ్డాయి.
EZE 37:3 “మనుష్యకుమారుడా, ఈ ఎముకలు బ్రతుకుతాయా?” అని ఆయన నన్ను అడిగారు. అందుకు నేను, “ప్రభువైన యెహోవా, అది మీకు మాత్రమే తెలుసు” అని చెప్పాను.
EZE 37:4 ఆయన నాతో ఇలా అన్నారు, “ఈ ఎముకలకు ప్రవచించి వాటితో ఇలా చెప్పు: ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి.
EZE 37:5 ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు బ్రతికేలా మీలోనికి ఊపిరి పంపిస్తాను.
EZE 37:6 మీకు కండరాలను అతికించి మాంసాన్ని పొదిగి మీమీద చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పెడతాను, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
EZE 37:7 కాబట్టి నాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నేను ప్రవచిస్తూ ఉండగా, గలగలమనే శబ్దం వినిపించి చూస్తే, ఆ ఎముకలన్నీ దగ్గరకు వచ్చి ఒక దానికి ఒకటి అంటుకున్నాయి.
EZE 37:8 నేను చూస్తుండగా వాటి మీదికి కండరాలు మాంసం పొదగడం, వాటి మీద చర్మం కప్పుకోవడం కనిపించింది, అయితే వాటిలో ఊపిరి లేదు.
EZE 37:9 అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, ఊపిరి వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఊపిరీ! నీవు నాలుగు వైపుల నుండి వచ్చి, ఈ హతులైన వీరి బ్రతికేలా వీరిలో ఊపిరి నింపు.’ ”
EZE 37:10 కాబట్టి ఆయన ఆజ్ఞాపించిన ప్రకారమే నేను ప్రవచించినప్పుడు ఊపిరి వారిలోనికి ప్రవేశించి వారు సజీవులై లేచి మహా సైన్యంగా నిలబడ్డారు.
EZE 37:11 ఆయన నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు ప్రజలు. వారు, ‘మా ఎముకలు ఎండిపోయాయి, మాకు ఏ ఆశ లేదు మేము నాశనమయ్యాం’ అని అనుకుంటున్నారు.
EZE 37:12 కాబట్టి నీవు ప్రవచించి వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నా ప్రజలారా, నేను మీరున్న సమాధులు తెరచి వాటిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పిస్తాను; ఇశ్రాయేలు దేశంలోకి మిమ్మల్ని తిరిగి తీసుకువస్తాను.
EZE 37:13 నేను మీరున్న సమాధులు తెరచి వాటిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు నా ప్రజలైన మీరు నేనే యెహోవానని తెలుసుకుంటారు.
EZE 37:14 మీరు బ్రతికేలా మీలో నా ఆత్మను ఉంచి మీ స్వదేశంలో మీరు నివసించేలా చేస్తాను. అప్పుడు యెహోవానైన నేను మాట ఇచ్చాను, దానిని నెరవేర్చానని మీరు తెలుసుకుంటారని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
EZE 37:15 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 37:16 “మనుష్యకుమారుడా, ఒక కర్ర తీసుకుని, దానిపై ‘ఇది యూదాకు, అతని సహచరులైన ఇశ్రాయేలీయులకు చెందినది’ అని వ్రాయి, తర్వాత మరొక కర్ర తీసుకుని, దానిపై, ‘యోసేపు (అంటే, ఎఫ్రాయిం) అతని సహచరులైన ఇశ్రాయేలీయులందరికి చెందినది’ అని వ్రాయి.
EZE 37:17 ఆ రెండింటిని నీ చేతిలో ఒకే కర్రలా ఉండేలా జతచేయి.
EZE 37:18 “ ‘దీని భావమేమిటో మాకు చెప్పవా?’ అని నీ ప్రజలు నిన్ను అడిగినప్పుడు,
EZE 37:19 వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఎఫ్రాయిం చేతిలో ఉన్న యోసేపు కర్రను, అతనితో సంబంధం ఉన్న ఇశ్రాయేలీయుల గోత్రాలను తీసుకుని యూదా కర్రకు జతచేయబోతున్నాను. నేను వాటిని ఒకే కర్రలా చేస్తాను, అవి నా చేతిలో ఒకటిగా అవుతాయి.’
EZE 37:20 నీవు ఏ కర్రల మీదైతే వ్రాసావో వాటిని వారి కళ్లముందు పట్టుకుని,
EZE 37:21 వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలీయులు చెదరిపోయిన దేశాల నుండి నేను వారిని బయటకి తీసుకువస్తాను. వారిని చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి సమకూర్చి వారి స్వదేశానికి తిరిగి రప్పిస్తాను.
EZE 37:22 వారు ఇక ఎన్నటికీ రెండు జాతులుగా గాని రెండు రాజ్యాలుగా విడిపోకుండ నేను వారిని ఇశ్రాయేలు పర్వతాలమీద, ఒకే దేశంగా చేస్తాను. వారందరికి ఒకే రాజు ఉంటాడు.
EZE 37:23 వారు ఇకపై తమ విగ్రహాలతో, నీచమైన చిత్రాలతో గాని వారి నేరాలతో గాని తమను తాము అపవిత్రం చేసుకోరు, ఎందుకంటే వారు పాపాలు చేస్తూ నివసించిన ప్రతి స్థలం నుండి నేను వారిని రక్షించి, వారిని శుద్ధి చేస్తాను. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను.
EZE 37:24 “ ‘నా సేవకుడైన దావీదు వారికి రాజు. వారందరికి ఒకే కాపరి ఉంటాడు. వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను పాటించే విషయంలో వారు జాగ్రత్త వహిస్తారు.
EZE 37:25 నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన దేశంలో అనగా మీ పూర్వికులు నివసించిన దేశంలో వారు నివసిస్తారు. వారు వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు అక్కడ నిత్యం నివసిస్తారు. నా సేవకుడైన దావీదు వారికి శాశ్వతమైన అధిపతిగా ఉంటాడు.
EZE 37:26 నేను వారితో సమాధాన ఒప్పందాన్ని చేస్తాను; అది నాకు వారికి మధ్య శాశ్వత నిబంధనగా ఉంటుంది. నేను వారిని స్థిరపరచి వారిని విస్తరింపచేస్తాను, వారి మధ్య నా పరిశుద్ధాలయాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను.
EZE 37:27 నా నివాసస్థలం వారితో ఉంటుంది; నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.
EZE 37:28 వారి మధ్య నా పరిశుద్ధాలయం నిత్యం ఉండడం చూసి ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచే యెహోవాను నేనే అని ఇతర ప్రజలు తెలుసుకుంటారు.’ ”
EZE 38:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
EZE 38:2 “మనుష్యకుమారుడా, మాగోగు దేశానికి చెందిన గోగు వైపు అనగా మెషెకుకు తుబాలుకు రోషుకు అధిపతియైన వానివైపు నీ ముఖాన్ని త్రిప్పి, అతనికి వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పుమని ఆజ్ఞాపించింది:
EZE 38:3 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మెషెకుకు తుబాలుకు ముఖ్య అధిపతియైన గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను.
EZE 38:4 నేను నిన్ను వెనక్కు త్రిప్పి, నీ దవడలకు కొక్కేలు తగిలించి, నిన్ను సైన్యమంతటితో పాటు, నీ గుర్రాలను, సంపూర్ణ సాయుధులైన నీ రౌతులను, పెద్ద చిన్న డాళ్లను ధరించి, వారంతా ఖడ్గాలు ఆడిస్తూ పట్టుకున్న యోధులను బయటకు తీసుకువస్తాను.
EZE 38:5 పర్షియా, కూషు, పూతు వారందరు డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి వారితో పాటు వస్తారు.
EZE 38:6 అలాగే గోమెరు అతని సైన్యం, ఉత్తరాన దూరంగా ఉన్న తోగర్మా అతని సైన్యం, ఇంకా అనేక జాతులవారు నీతో వస్తారు.
EZE 38:7 “ ‘సిద్ధంగా ఉండు; నీవు నీతో పాటు చేరిన సమూహమంతటితో కలిసి సిద్ధంగా ఉండు, నీవే వారికి నాయకునిగా ఉండు.
EZE 38:8 చాలా రోజుల తర్వాత నీవు పిలువబడతావు. రాబోయే సంవత్సరాల్లో మీరు యుద్ధం నుండి కోలుకున్న దేశం మీద, చాలాకాలంగా నిర్జనంగా ఉన్న ఇశ్రాయేలు పర్వతాలమీద నివసించడానికి వివిధ దేశాల నుండి సమకూర్చబడి దాని ప్రజల మీద దాడి చేస్తారు. వారు చెదిరిపోయిన దేశాల నుండి సమకూర్చబడి ఇప్పుడు నిర్భయంగా జీవిస్తున్నారు.
EZE 38:9 అయితే నీవు గాలి తుఫాను వచ్చినట్లుగా వస్తావు; నీవు, నీ సైన్యం, నీ పక్షాన ఉన్న అనేకమంది ప్రజలు కలిసి దేశం మీద మేఘంలా కమ్ముకుంటారు.
EZE 38:10 “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ రోజు నీ మనస్సులో చెడు ఆలోచనలు పుడతాయి. నీవు చెడు పన్నాగం పన్ని,
EZE 38:11 దురాలోచనతో నీవు ఇలా అంటావు, “నేను గోడలులేని గ్రామాలున్న దేశంపై దాడి చేస్తాను; గోడలు ద్వారాలు అడ్డగడియలు లేని దేశంలో ప్రశాంతంగా క్షేమంగా నివసిస్తున్న ప్రజల మీద దాడి చేస్తాను.
EZE 38:12 వారిని దోచుకుని సొమ్ము కొల్లగొట్టడానికి, గతంలో పాడుబడి ఉన్నా మళ్ళీ నివాసం ఉంటున్న స్థలాల మీద దాడి చేయడానికి, ఇతర జనాల్లో నుండి సమకూర్చబడి సమృద్ధిగా పశువులు సరుకులు కలిగి భూమి మధ్యభాగంలో నివసించే ప్రజలమీదికి వెళ్తాను.”
EZE 38:13 షేబ వారు, దేదాను వారు, తర్షీషు వర్తకులు, దాని కొదమ సింహాల్లాంటి వారందరు నిన్ను చూసి, “దోచుకోవడానికి వచ్చావా? వెండి బంగారాలను, పశువులను సరుకులను కొల్లగొట్టుకొని తీసుకెళ్లడానికి, దోచుకోవడానికి నీ సైన్యాన్ని సమకూర్చుకున్నావా?” అని అంటారు.’
EZE 38:14 “మనుష్యకుమారుడా, గోగుకు వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించే రోజున నీవు ఇది గమనించలేదా?
EZE 38:15 ఉత్తరాన దూరంగా ఉన్న నీ స్థలంలో నుండి నీవూ, నీతో పాటు అనేక జనాలు గుర్రాలపై స్వారీ చేస్తూ చాలా గొప్ప సైన్యంగా వస్తారు.
EZE 38:16 దేశాన్ని మేఘం క్రమ్మినట్లు మీరంతా నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీదికి వస్తారు. రాబోయే రోజుల్లో అది జరుగుతుంది; నీ ద్వారా ఇతర ప్రజల ఎదుట నేను పరిశుద్ధుడను అని కనుపరిచినప్పుడు వారు నన్ను తెలుసుకునేలా గోగూ, నేను నిన్ను నా దేశం మీదికి రప్పిస్తాను.
EZE 38:17 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: పూర్వకాలంలో నా సేవకులైన ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా నేను మాట్లాడింది నీ గురించే. నేను నిన్ను వారికి వ్యతిరేకంగా తీసుకువస్తానని అనేక సంవత్సరాలుగా వారు ప్రవచించారు.
EZE 38:18 ఆ రోజున గోగు ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తి వచ్చేటప్పుడు నా కోపం తీవ్రంగా ఉంటుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 38:19 నేను రోషంతో, కోపోద్రేకంతో ఏమని ప్రకటించానంటే, ఆ సమయంలో ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన భూకంపం వస్తుంది.
EZE 38:20 అప్పుడు సముద్రంలోని చేపలు, ఆకాశపక్షులు, భూజంతువులు, భూమి మీద ప్రాకే పురుగులు, భూమి మీద ఉన్న మనుష్యులందరు నా ఎదుట వణుకుతారు. పర్వతాలు కూలిపోతాయి, కొండచరియలు విరిగిపోతాయి, ప్రతి గోడ నేలమట్టం అవుతుంది.
EZE 38:21 నేను నా పర్వతాలన్నిటిపైన గోగుకు వ్యతిరేకంగా ఖడ్గాన్ని రప్పిస్తాను. ప్రతి ఒక్కని ఖడ్గం తన సోదరుని మీద పడుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 38:22 తెగులుతో రక్తపాతంతో అతని మీద తీర్పు తీరుస్తాను; అతనిపై అతని సైన్యం మీద అతనితో పాటు ఉన్న అనేక దేశాలపై నేను కుండపోత వర్షాన్ని, వడగండ్లను అగ్నిగంధకాలను కురిపిస్తాను.
EZE 38:23 నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను చూపించి ఇతర జనుల ఎదుట నన్ను నేను ప్రత్యక్ష్యపరచుకుంటాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’
EZE 39:1 “మనుష్యకుమారుడా, గోగు గురించి ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మెషెకుకు తుబాలుకు అధిపతియైన గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను.
EZE 39:2 నేను నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, దూరంగా ఉన్న ఉత్తర దిక్కునుండి రప్పించి ఇశ్రాయేలు పర్వతాల మీదికి పంపుతాను.
EZE 39:3 అప్పుడు నేను నీ ఎడమచేతి నుండి నీ విల్లు, నీ కుడిచేతి నుండి నీ బాణాలు క్రింద పడేలా చేస్తాను.
EZE 39:4 నీవు నీ సైన్యం నీతో పాటు ఉన్న అనేక జనులు ఇశ్రాయేలు పర్వతాలమీద కూలిపోతారు. వేటాడే రకరకాల క్రూర పక్షులకు, అడవి మృగాలకు నిన్ను ఆహారంగా చేస్తాను.
EZE 39:5 నీవు పొలంలో పడిపోతావు; నేను మాట ఇచ్చాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 39:6 నేను మాగోగు మీదికి, సముద్ర తీర ప్రాంతాల్లో క్షేమంగా నివసించేవారి మీదికి అగ్ని పంపిస్తాను, అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
EZE 39:7 “ ‘నా పరిశుద్ధ నామాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య వెల్లడి చేస్తాను. ఇకపై నా పరిశుద్ధ నామం అవమానానికి గురి కానివ్వను, అప్పుడు నేనే యెహోవానని ఇశ్రాయేలులో పరిశుద్ధుడనని ఇతర దేశాల ప్రజలు తెలుసుకుంటారు.
EZE 39:8 ఆ సమయం వస్తుంది! అది ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 39:9 “ ‘అప్పుడు ఇశ్రాయేలు పట్టణాల్లో నివసించేవారు బయటకు వెళ్లి, ఆ ఆయుధాలను చిన్న పెద్ద డాళ్లు, విల్లులు బాణాలు, యుద్ధ దండాలు ఈటెలను తీసుకుని పొయ్యిలో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఏడేళ్లపాటు వాటిని ఇంధనంగా వినియోగించనున్నారు.
EZE 39:10 వారు పొలంలో కట్టెలు ఏరుకోకుండా అడవిలో చెట్లు నరకకుండా ఆయుధాలను పొయ్యిలో కాలుస్తారు. వారు తమను దోచుకున్న వారిని తిరిగి దోచుకుంటారు. తమను కొల్లగొట్టిన వారిని తిరిగి కొల్లగొడతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 39:11 “ ‘ఆ రోజున నేను సముద్రానికి తూర్పుగా ప్రయాణికులు వెళ్లే లోయలో ఇశ్రాయేలు దేశంలో గోగును, అల్లరిమూకలను పాతిపెట్టడానికి స్థలం ఇస్తాను. అక్కడ గోగును, అతని అల్లరిమూకలన్ని పాతిపెట్టిన తర్వాత ప్రయాణికులు వెళ్లడానికి వీలుపడదు. ఆ లోయకు హమోన్ గోగు అనే పేరు వస్తుంది.
EZE 39:12 “ ‘దేశాన్ని పవిత్రపరచడానికి ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెడతారు.
EZE 39:13 దేశంలోని ప్రజలందరూ వారిని పాతిపెడతారు, నేను ఘనత పొందిన ఆ రోజు వారికి ఘనత కలుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 39:14 దేశాన్ని పవిత్రపరచడానికి కొంతమంది మనుష్యులను నియమిస్తారు. వారు ఇతరులతో కలిసి దేశమంతా తిరుగుతూ నేల మీద పడివున్న శవాలను పాతిపెడతారు. “ ‘ఏడు నెల తర్వాత వారు దేశాన్ని పూర్తిగా తనిఖీ చేస్తారు.
EZE 39:15 దేశమంతా తిరుగుతున్నప్పుడు వారిలో ఎవరికైనా మనిషి ఎముక కనబడితే పాతి పెట్టేవారు దానిని తీసుకెళ్లి హమోన్ గోగు లోయలో పాతిపెట్టే వరకు దాని దగ్గర ఒక గుర్తు ఉంచుతారు.
EZE 39:16 ఆ లోయ దగ్గర హమోనా అనే పేరున్న పట్టణం ఉంది. ఈ విధంగా వారు దేశాన్ని పవిత్ర పరుస్తారు.’
EZE 39:17 “మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు అన్ని రకాల పక్షులకు అడవి మృగాలకు ఇలా చెప్పు: ‘నేను మీ కోసం సిద్ధపరుస్తున్న బలికి అనగా ఇశ్రాయేలు పర్వతాలమీద జరుగబోయే గొప్ప బలి దగ్గరకు నలువైపుల నుండి తరలి రండి, అక్కడ మీరు మాంసాన్ని తిని రక్తాన్ని త్రాగుతారు.
EZE 39:18 కోడెల రక్తం త్రాగుతారు. మీరు అక్కడ బలవంతుల మాంసాన్ని తింటారు; భూ రాజుల రక్తాన్ని బాషానులో బలిసిన పొట్టేళ్ల, గొర్రెపిల్లల, మేకల, కోడెల రక్తంలా త్రాగుతారు. అవన్నీ బాషానుకు చెందిన క్రొవ్విన జంతువులే.
EZE 39:19 నేను మీ కోసం సిద్ధపరుస్తున్న బలి దగ్గర కడుపునిండా ఆ క్రొవ్వును తింటారు. మత్తు ఎక్కేవరకు రక్తం త్రాగుతారు.
EZE 39:20 నేను ఏర్పరచిన బల్ల దగ్గర గుర్రాలను, రౌతులను బలవంతులను, సైనికులందరిని కడుపారా తింటారు.’ ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 39:21 “నా మహిమను ఇతర ప్రజలమధ్య చూపుతాను. ఇతర ప్రజలందరు నేను విధించిన శిక్షను నేను వారిపై ఉంచిన చేతిని చూస్తారు.
EZE 39:22 ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు నేనే వారి దేవుడైన యెహోవానని తెలుసుకుంటారు.
EZE 39:23 ఇశ్రాయేలీయులు పాపం చేసిన కారణంగా బందీలుగా వెళ్లవలసి వచ్చిందని, నా పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు నేను వారికి నా ముఖం దాచి వేసి వారంతా కత్తివేటుకు కూలిపోయేలా వారి శత్రువులకు అప్పగించానని ఇతర ప్రజలు తెలుసుకుంటారు.
EZE 39:24 వారి అపవిత్రత తిరుగుబాటుతనం బట్టి నేను వారికి విరోధినై వారికి తగిన ప్రతీకారం చేశాను.
EZE 39:25 “కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను నా పరిశుద్ధ నామాన్ని బట్టి రోషం కలిగి యాకోబు సంతతిని చెరలో నుండి రప్పిస్తాను. ఇశ్రాయేలు ప్రజలందరినీ కనికరిస్తాను.
EZE 39:26 ఎవరినుండి భయం లేకుండా వారు తమ స్వదేశంలో క్షేమంగా నివసిస్తున్నప్పుడు వారు నాకు చేసిన నమ్మకద్రోహాన్ని, దానివల్ల వారు పొందిన అవమానాన్ని మర్చిపోతారు.
EZE 39:27 నేను వారిని ఇతర జనాల్లో నుండి బయటకు తీసుకువచ్చి శత్రు దేశాల నుండి వారిని సమకూర్చినప్పుడు వారి ద్వారా అనేక జనుల మధ్యలో నన్ను నేను పరిశుద్ధునిగా కనుపరచుకుంటాను.
EZE 39:28 నేను వారిని ఇతర ప్రజల మధ్యలోనికి బందీలుగా పంపి, ఎవరినీ విడిచిపెట్టకుండా వారందరిని వారి స్వదేశానికి సమకూరుస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని వారి దేవుడనని తెలుసుకుంటారు.
EZE 39:29 అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను, కాబట్టి వారికిక నా ముఖాన్ని దాచను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”
EZE 40:1 అప్పటికి మేము బందీలుగా వచ్చిన ఇరవై అయిదవ సంవత్సరంలోని మొదటి నెల పదవ రోజున, అనగా పట్టణం నాశనమైన పద్నాలుగవ సంవత్సరంలో ఆ రోజునే యెహోవా హస్తం నా మీదికి వచ్చి ఆయన నన్ను పట్టణానికి తీసుకెళ్లారు.
EZE 40:2 దేవుని దర్శనంలో ఆయన నన్ను ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్లి చాలా ఎత్తైన పర్వతం మీద నన్ను ఉంచారు. దాని మీద దక్షిణం వైపున ఒక పట్టణం లాంటిది నాకు కనిపించింది.
EZE 40:3 ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్లగా మెరుస్తున్న ఇత్తడిలా ఉన్న ఒక వ్యక్తిని నేను చూశాను. అతడు తన చేతిలో నార దారం, కొలిచే కర్ర పట్టుకుని పట్టణ ద్వారంలో నిలబడి ఉన్నాడు.
EZE 40:4 ఆ వ్యక్తి నాతో ఇలా అన్నాడు, “మనుష్యకుమారుడా, నేను నీకు చూపించబోయే ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని మనస్సులో ఉంచుకో. వాటిని నీకు చూపించడానికే నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. నీవు చూసిన ప్రతిదాన్ని ఇశ్రాయేలీయులకు తెలియజేయి.”
EZE 40:5 ఆలయ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టిన గోడను నేను చూశాను. ఆ వ్యక్తి చేతిలోని ఉన్న కొలిచే కడ్డీ పొడవు ఆరు మూరలు, ఒక్కొక్కటి ఒక మూర ఒక బెత్తెడు వెడల్పు ఉంది. అతడు గోడను కొలిచాడు; అది ఆ కొలిచే కడ్డీ అంత వెడల్పు, ఆ కడ్డీ అంత ఎత్తు ఉంది.
EZE 40:6 అప్పుడతడు తూర్పు వైపున ఉన్న ద్వారం దగ్గరికి వెళ్లి దాని మెట్లెక్కి దాని గుమ్మపు గడపను కొలిచినప్పుడు అది ఒక కొలిచే కర్ర పొడవు ఉంది.
EZE 40:7 కావలివారి గది పొడవు వెడల్పులు కొలిచే కర్రంత ఉన్నాయి. ఆ గదులకు మధ్య ఉన్న గోడలు అయిదు మూరల మందంగా ఉన్నాయి. ద్వారం ప్రక్క నుండి ఆలయానికి ఎదురుగా ఉన్న మంటపానికి ఒక కొలిచే కర్ర లోతు ఉంది.
EZE 40:8 అతడు ద్వారపు మంటపం మధ్య కొలిచాడు;
EZE 40:9 ద్వారం వాకిలి ఎనిమిది మూరలు, దాని ద్వారబంధాలు రెండు మూరలు ఉన్నాయి; ద్వారపు మంటపం మందిరం లోపలి వైపుకు ఉంది.
EZE 40:10 తూర్పు ద్వారం లోపల ప్రతి వైపు మూడు కాపలా గదులు ఉన్నాయి; మూడింటికి ఒకే కొలతలు ఉన్నాయి; వాటి రెండు ప్రక్కల ఉన్న ద్వారబంధాలు కూడా ఒకే కొలతలు ఉన్నాయి.
EZE 40:11 అప్పుడు అతడు ద్వారాల వాకిళ్లను కొలిచినప్పుడు దాని వెడల్పు పది మూరలు, పొడవు పదమూడు మూరలు ఉన్నాయి.
EZE 40:12 ప్రతి కాపలా గదికి ఎదురుగా ఉన్న గోడ ఎత్తు ఒక మూర ఉంది. గదులైతే రెండు ప్రక్కలా ఆరు మూరల ఎత్తు ఉన్నాయి.
EZE 40:13 అప్పుడతడు ఒక గది పైకప్పు నుండి మరో గది పైకప్పు వరకు ద్వారాన్ని కొలిచినప్పుడు ఇరవై అయిదు మూరల దూరం ఉంది, రెండు వాకిళ్ల మధ్య కూడా అదే కొలత ఉంది.
EZE 40:14 అతడు ద్వారం లోపల భాగం చుట్టూ ఉన్న గోడల వెంబడి అరవై మూరలు కొలిచాడు. ఆ కొలత ఆవరణానికి ఎదురుగా ఉన్న ప్రాంగణం వరకు.
EZE 40:15 బయటి గుమ్మం నుండి లోపలి గుమ్మం ద్వారం యొక్క ఆవరణం వరకు యాభై మూరలు.
EZE 40:16 కాపలా గదులకు ద్వారం లోపల చుట్టూ ఉన్న గోడలకు ప్రక్క గదులకు మూసి ఉన్న కిటికీలు ఉన్నాయి. గోడలోని ద్వారబంధాలు కిటికీలు ఉన్నాయి. ప్రతి ద్వారబంధాన్ని ఖర్జూరం చెట్లతో అలంకరించారు.
EZE 40:17 తర్వాత నన్ను బయటి ఆవరణంలోకి తీసుకువచ్చాడు. అక్కడ నేను కొన్ని గదులు, ఆవరణం చుట్టూ నిర్మించబడిన ఒక కాలిబాటను చూశాను; కాలిబాట ప్రక్కగా ముప్పై గదులు ఉన్నాయి.
EZE 40:18 ఈ చప్టా ద్వారం వరకు ఉండి వాటి వెడల్పుకు సమానంగా ఉంది. ఇది క్రింది చప్టా.
EZE 40:19 అప్పుడు అతడు దిగువ ద్వారం లోపలి నుండి లోపలి ఆవరణం బయట వరకు కొలిచినప్పుడు అది తూర్పు వైపుకు వంద మూరలు ఉత్తరం వైపుకు వంద మూరలు ఉంది.
EZE 40:20 అప్పుడతడు బయటి ఆవరణానికి దారితీసే ఉత్తరం గుమ్మం పొడవు వెడల్పులను కొలిచాడు.
EZE 40:21 దానికి రెండు వైపులా ఉన్న మూడేసి కాపలా గదులను వాటి ద్వారబంధాలను వాటి మధ్య గోడలను కొలిచినప్పుడు వాటి కొలత, మొదటి ద్వారం కొలత ఒక్కటే. పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.
EZE 40:22 వాటి కిటికీలు మధ్య గోడలు, ఖర్జూరం చెట్లతో అలంకరించిన ద్వారబంధాల కొలతలన్నీ తూర్పు గుమ్మం కొలతతో సమానంగా ఉన్నాయి. పైకి ఎక్కడానికి ఏడు మెట్లున్నాయి. వాటికి ఎదురుగా దాని మధ్య గోడలు ఉన్నాయి.
EZE 40:23 తూర్పు ద్వారంలా ఉత్తర ద్వారానికి ఎదురుగా లోపలి ఆవరణానికి దారితీసే ఒక గుమ్మం ఉంది. ఈ ద్వారం నుండి ఆ ద్వారం వరకు దూరం కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.
EZE 40:24 అప్పుడతడు నన్ను దక్షిణం వైపుకు తీసుకెళ్లగా అక్కడ దక్షిణ ద్వారం కనిపించింది. దాని ద్వారబంధాలను మధ్య గోడలను కొలిచినప్పుడు దీని కొలత ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.
EZE 40:25 వాటికి ఉన్నట్లుగానే దీనికి కూడా దీని మధ్యగోడలకు చుట్టూ కిటికీలు ఉన్నాయి. ద్వారం పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.
EZE 40:26 పైకి ఎక్కడానికి ఏడు మెట్లున్నాయి. వాటికి ఎదురుగా దాని మధ్య గోడలు ఉన్నాయి. రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించిన ద్వారబంధాలు ఉన్నాయి.
EZE 40:27 అతడు ఈ ద్వారం నుండి దక్షిణం వైపున ఉన్న బయటి ద్వారం వరకు కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.
EZE 40:28 అప్పుడతడు దక్షిణ ద్వారం గుండా లోపలి ఆవరణంలోకి నన్ను తీసుకువచ్చి దక్షిణ ద్వారాన్ని కొలిచాడు; దీని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.
EZE 40:29 దాని కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.
EZE 40:30 లోపలి ఆవరణం చుట్టూ ఉన్న మధ్య గోడల పొడవు ఇరవై అయిదు మూరలు వెడల్పు అయిదు మూరలు.
EZE 40:31 దాని మధ్య గోడలు బయటి ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
EZE 40:32 అప్పుడతడు నన్ను తూర్పు వైపున ఉన్న లోపలి ఆవరణం దగ్గరికి తీసుకువచ్చి దాని ద్వారాన్ని కొలిచాడు; దాని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.
EZE 40:33 దాని కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.
EZE 40:34 దాని ద్వారబంధాలు బయట ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
EZE 40:35 అప్పుడతడు నన్ను ఉత్తర ద్వారం దగ్గరికి తీసుకువచ్చి దానిని కొలిచాడు; దాని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.
EZE 40:36 అలాగే కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.
EZE 40:37 దాని ద్వారబంధాలు బయట ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద రెండు వైపులా ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
EZE 40:38 ప్రతి లోపలి ద్వారంలో మంటపం దగ్గర ద్వారం ఉన్న గది ఉంది, ఇక్కడ దహనబలుల మాంసం కడుగుతారు.
EZE 40:39 ద్వారపు మంటపానికి రెండు వైపులా రెండు బల్లలు ఉన్నాయి; వాటిపై దహనబలులు, పాపపరిహార బలులు, అపరాధబలులను వధిస్తారు.
EZE 40:40 ద్వారం యొక్క బయటి మంటపం దగ్గర ఉత్తర ద్వారం మెట్లు ఎక్కే చోట రెండు బల్లలు, మెట్లకు అవతలి వైపు రెండు బల్లలు ఉన్నాయి.
EZE 40:41 ద్వారానికి ఒక్కో వైపు నాలుగు చొప్పున రెండు వైపులా ఎనిమిది బల్లలు ఉన్నాయి; వాటిపై బలులు వధిస్తారు.
EZE 40:42 అంతే కాకుండా దహనబలుల కోసం చెక్కిన రాతితో చేసిన నాలుగు బల్లలు ఉన్నాయి; వాటి పొడవు మూరన్నర వెడల్పు మూరన్నర ఎత్తు ఒక మూర. దహనబలులు ఇతర బలులు వధించడానికి ఉపయోగించే పాత్రలు వాటిపై ఉంచారు.
EZE 40:43 చుట్టూ ఉన్న గోడకు ఒక బెత్తెడు పొడవు ఉన్న మేకులు తగిలించి ఉన్నాయి. అర్పణల మాంసాన్ని ఆ బల్లల మీద ఉంచుతారు.
EZE 40:44 లోపలి ఆవరణంలో లోపలి ద్వారం బయట రెండు గదులు ఉన్నాయి. ఒకటి ఉత్తర ద్వారం దగ్గర దక్షిణం వైపుగా ఒకటి, తూర్పు ద్వారం దగ్గర ఉత్తరం వైపుగా ఒకటి ఉన్నాయి.
EZE 40:45 అతడు నాతో ఇలా అన్నాడు, “దక్షిణం వైపుగా ఉన్న గది మందిరాన్ని కాపలా కాసే యాజకుల కోసము.
EZE 40:46 ఉత్తరం వైపుగా ఉన్న గది బలిపీఠాన్ని కాపలా కాసే యాజకుల కోసము. లేవీయులలో సాదోకు వారసులైన వీరు యెహోవా సన్నిధిలో సేవ చేయటానికి వస్తారు.”
EZE 40:47 అప్పుడతడు ఆవరణాన్ని కొలిచినప్పుడు అది చతురస్రాకారంలో ఉండి పొడవు వెడల్పులు వంద మూరలు ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా బలిపీఠం ఉంది.
EZE 40:48 అప్పుడతడు ఆలయ మంటపంలోకి నన్ను తీసుకెళ్లి దాని స్తంభాలను కొలిచాడు; రెండు వైపులా వాటి వెడల్పు అయిదు మూరలు. దాని ద్వారం వెడల్పు పద్నాలుగు మూరలు ఉంది, దానికి రెండు వైపులా ఉన్న గోడ మందం మూడు మూరలు.
EZE 40:49 మంటపం పొడవు ఇరవై మూరలు. వెడల్పు పన్నెండు మూరలు. దానిపైకి ఎక్కడానికి మెట్లున్నాయి, దాని ద్వారబంధాలకు రెండు వైపులా స్తంభాలు ఉన్నాయి.
EZE 41:1 అప్పుడతడు నన్ను ప్రధాన ప్రాంగణంలోనికి తీసుకువచ్చి ద్వారబంధాలను కొలిచాడు, వాటి వెడల్పు రెండు వైపులా ఆరు మూరలు ఉంది.
EZE 41:2 వాకిలి వెడల్పు పది మూరలు. దానికి రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు అయిదు మూరలు ఉంది. దానిని కొలిచినప్పుడు పొడవు నలభై మూరలు వెడల్పు ఇరవై మూరలు ఉంది.
EZE 41:3 అప్పుడతడు గర్భాలయం లోపలికి వెళ్లి వాకిలి ద్వారబంధాలను కొలిచినప్పుడు వాటి వెడల్పు రెండు మూరలు, వాకిలి ఆరు మూరలు దానికి రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు ఏడు మూరలు ఉంది.
EZE 41:4 అతడు గర్భాలయాన్ని కొలిచినప్పుడు దాని పొడవు ఇరవై మూరలు, ప్రధాన మందిరానికి దానికి మధ్య ఉన్న వెడల్పు ఇరవై మూరలు ఉంది. “అది అతి పరిశుద్ధ స్థలం” అని అతడు నాతో చెప్పాడు.
EZE 41:5 తర్వాత అతడు ఆలయ గోడలను కొలిచినప్పుడు వాటి మందం ఆరు మూరలు, ఆలయానికి రెండు వైపులా ఉన్న గదుల వెడల్పు నాలుగేసి మూరల ఉంది.
EZE 41:6 ప్రక్కన ఉన్న ఆ గదులకు మూడంతస్థులు ఉన్నాయి. ప్రతి అంతస్తులో ముప్పై గదులున్నాయి. అవి ఆలయ గోడకు ఆనుకుని ఉండకుండా ప్రక్క గదులకు ఆనుకుని ఉండేలా ఆలయ గోడ చుట్టూ వరసగా ఉన్నాయి.
EZE 41:7 మందిరం చుట్టూ ఉన్న ఈ ప్రక్క గదులు పైకి వెళ్లే కొలది వాటి వెడల్పు ఎక్కువవుతుంది. మందిరం చుట్టూ ఉన్న గదులు క్రింది నుండి పైకి వెళ్లే కొలది ఎక్కువ వెడల్పుగా ఉండేలా అవి నిర్మించబడ్డాయి. క్రింది అంతస్తు నుండి మధ్య అంతస్తు ద్వారా పై అంతస్తు వరకు మెట్లు ఉన్నాయి.
EZE 41:8 నేను చూసినప్పుడు మందిరం చుట్టూ మేడ గదులకు ఎత్తుగా ఉన్న పునాది కనిపించింది. దాని పొడవు కొలిచే కర్రంత అనగా ఆరు మూరలు.
EZE 41:9 ఆ ప్రక్క గదుల బయటి గోడల మందం అయిదు మూరలు. ఆలయపు ప్రక్క గదుల మధ్యలో ఖాళీ స్థలం ఉంది.
EZE 41:10 ఆలయానికి అన్ని వైపుల నుండి ఇరవై మూరల దూరంలో యాజకుల గదులు ఉన్నాయి.
EZE 41:11 ఆ ప్రక్క గదుల గుమ్మాలు ఖాళీ స్థలం వైపుకు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరం వైపుకు మరొకటి దక్షిణం వైపుకు ఉంది. ఖాళీ స్థలం అన్ని వైపుల నుండి అయిదు మూరలు ఉంది.
EZE 41:12 పడమటి వైపున ఆలయ ఆవరణానికి ఎదురుగా ఉన్న భవనం డెబ్బై మూరల వెడల్పుతో ఉంది. దాని గోడ మందం అయిదు మూరలు పొడవు తొంభై మూరలు.
EZE 41:13 తర్వాత అతడు మందిరాన్ని కొలిచినప్పుడు అది వంద మూరల పొడవు ఉంది. ఆలయ ఆవరణాన్ని దానికి ఎదురుగా ఉన్న భవనాన్ని దాని గోడలను కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.
EZE 41:14 తూర్పు వైపు ఆలయ ప్రాంగణాన్ని ఆలయ ముందు భాగాన్ని కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది.
EZE 41:15 మందిరం వెనుక భాగంలో ఉన్న ఆవరణానికి ఎదురుగా ఉన్న భవనాన్ని దానికి రెండు వైపులా ఉన్న వసారాలను అతడు కొలిచినప్పుడు వంద మూరలు ఉంది. ప్రధాన ప్రాంగణం, గర్భాలయం, ఆవరణానికి ఎదురుగా ఉన్న మంటపం,
EZE 41:16 గడపలు, కమ్ములు ఉన్న కిటికీలు మూడు అంతస్తుల చుట్టూ ఉన్న వసారాలను చెక్కతో కప్పి ఉన్న గడపలతో సహా ప్రతిదాన్ని అతడు కొలిచాడు. నేల, కిటికీల వరకు ఉన్న గోడ, కిటికీలు చెక్కతో కప్పబడి ఉన్నాయి.
EZE 41:17 వాకిలికి పై భాగంలో గర్భాలయం బయట, లోపల ఉన్న గోడలు, మందిరం చుట్టూ ఉన్న బయటి గోడలు లోపలి గోడలు కొలత ప్రకారం కట్టి ఉన్నాయి.
EZE 41:18 వాటిపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. రెండు కెరూబుల మధ్యలో ఒక ఖర్జూరపు చెట్టు ఉంది. ప్రతి కెరూబుకు రెండు ముఖాలు ఉన్నాయి.
EZE 41:19 ఒక ప్రక్కన ఉన్న ఖర్జూరపు చెట్టు వైపు నరుని ముఖం, రెండవ ప్రక్కన ఉన్న ఖర్జూరపు చెట్టు వైపు సింహ ముఖం ఉన్నాయి. ఆలయమంతా అవి చెక్కి ఉన్నాయి.
EZE 41:20 నేల నుండి వాకిలి పైభాగం వరకు ప్రధాన మందిరపు గోడలపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
EZE 41:21 ప్రధాన మందిరానికి ద్వారబంధం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. అతి పరిశుద్ధ స్థలం ద్వారబంధం కూడా అలాంటిదే.
EZE 41:22 అక్కడ చెక్కతో చేయబడి ఉన్న బలిపీఠం ఎత్తు మూడు మూరలు పొడవు రెండు మూరలు. దాని మూలలు అడుగుభాగం ప్రక్క భాగం కర్రతో చేయబడ్డాయి. “ఇది యెహోవా ఎదుట ఉండే బల్ల” అని అతడు నాతో చెప్పాడు.
EZE 41:23 ప్రధాన మందిరానికి అతి పరిశుద్ధ స్థలానికి రెండు తలుపులు ఉన్నాయి.
EZE 41:24 ప్రతి తలుపుకు మడత బందులు ఉన్న రెండు రెక్కలు ఉన్నాయి.
EZE 41:25 గోడ మీద ఉన్నట్లే ప్రధాన ప్రాంగణం తలుపులపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. బయటి మంటపానికి కర్రతో చేసిన పందిరి ఉంది.
EZE 41:26 ఆవరణ ప్రక్క గోడలలో ఇరుకైన కిటికీలు ఉన్నాయి, ప్రతి వైపున ఖర్జూర చెట్లతో చెక్కబడ్డాయి. ఆలయ ప్రక్క గదులకు కూడా కప్పులు ఉండేవి.
EZE 42:1 అతడు ఉత్తరం వైపుగా బయటి ఆవరణంలోకి నన్ను నడిపించి ఆలయ ప్రాంగణానికి ఉత్తరాన ఉన్న బయటి గోడకు ఎదురుగా ఉన్న గదుల దగ్గరికి తీసుకువచ్చాడు.
EZE 42:2 ఉత్తరం వైపు తలుపు ఉన్న ఆ భవనం పొడవు వంద మూరలు, వెడల్పు యాభై మూరలు.
EZE 42:3 లోపలి ఆవరణం నుండి ఇరవై మూరల భాగంలో బయటి ఆవరణం కాలిబాట ఎదురుగా ఉన్న భాగంలో, వసారా మూడు అంతస్తుల వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.
EZE 42:4 ఆ గదుల ముందు పది మూరల వెడల్పు, వంద మూరల పొడవు ఉన్న లోపలి మార్గం ఉంది. వాటి తలుపులు ఉత్తరం వైపు ఉన్నాయి.
EZE 42:5 ఆ భవనంలోని క్రింది అలాగే మధ్య అంతస్తులలో ఉన్న గదుల కన్నా పై అంతస్తులో వసారాలు ఎక్కువ స్థలం ఆక్రమించడం వలన పై గదులు ఇరుకుగా ఉన్నాయి.
EZE 42:6 పై అంతస్తులో ఉన్న గదులకు ఆవరణంలో ఉన్నట్లుగా స్తంభాలు లేవు; కాబట్టి అవి క్రింది, మధ్య అంతస్తుల కంటే చిన్నవిగా ఉన్నాయి.
EZE 42:7 గదులకు, బయటి ఆవరణానికి సమాంతరంగా బయటి గోడ ఉంది; అది యాభై మూరల వరకు గదుల ముందు విస్తరించి ఉంది.
EZE 42:8 బయటి ఆవరణ ప్రక్కన ఉన్న గదుల వరుస యాభై మూరల పొడవు ఉండగా, గర్భాలయానికి సమీపంలో ఉన్న వరుస వంద మూరల పొడవు ఉంది.
EZE 42:9 బయటి ఆవరణంలో నుండి దిగువ గదుల్లోకి ప్రవేశించేలా దిగువ గదులకు తూర్పు వైపున ద్వారం ఉంది.
EZE 42:10 బయటి ఆవరణ గోడ పొడవున దక్షిణం వైపున, ఆలయ ప్రాంగణానికి ఆనుకుని, బయటి గోడకు ఎదురుగా గదులు ఉన్నాయి,
EZE 42:11 వాటికి ముందు ఒక మార్గం ఉంది. అవి ఉత్తరాన ఉన్న గదుల్లా ఉన్నాయి; అవి ఒకే విధమైన బయటకు వెళ్లే ద్వారాలు, కొలతలతో ఒకే పొడవు, వెడల్పు కలిగి ఉన్నాయి. ఉత్తరాన ఉన్న ద్వారాల మాదిరిగానే,
EZE 42:12 దక్షిణాన ఉన్న గదుల ద్వారాలు ఉన్నాయి. తూర్పు వైపున ఉన్న గోడకు ఎదురుగా ఉన్న ఆవరణంలోకి వెళ్లే దారి మొదట్లో ఆ గదుల్లోకి వెళ్లడానికి ఒక ద్వారం ఉంది.
EZE 42:13 అప్పుడతడు నాతో ఇలా అన్నాడు, “ఆలయ ఆవరణానికి ఎదురుగా ఉత్తర గదులు, దక్షిణ గదులు యాజకులకు చెందినవి; అక్కడ యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధ అర్పణలను తింటారు. అక్కడే వారు అతి పరిశుద్ధ అర్పణలను అనగా భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులను ఉంచుతారు. ఆ స్థలం అతిపరిశుద్ధమైనది.
EZE 42:14 యాజకులు పరిశుద్ధ ఆవరణంలోకి ప్రవేశించిన తర్వాత, వారు పరిచర్య చేసే వస్త్రాలను విప్పివేసే వరకు వారు బయటి ఆవరణంలోనికి వెళ్లకూడదు, ఎందుకంటే ఇవి పరిశుద్ధమైనవి. ప్రజలు ఉండే స్థలానికి వెళ్లేటప్పుడు యాజకులు వేరే బట్టలు ధరించాలి.”
EZE 42:15 అతడు లోపలి మందిరాన్ని కొలవడం పూర్తి చేసిన తర్వాత అతడు నన్ను తూర్పు ద్వారం గుండా తీసుకెళ్లి చుట్టూ ఉన్న స్థలాన్ని కొలిచాడు.
EZE 42:16 తూర్పు వైపున కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది.
EZE 42:17 అలాగే ఉత్తరం వైపు కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది.
EZE 42:18 దక్షిణం వైపు కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది.
EZE 42:19 అతడు పడమటి వైపుకు తిరిగి కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది.
EZE 42:20 అతడు ఆ స్థలాన్ని నాలుగు వైపులా కొలిచాడు. పరిశుద్ధ స్థలాన్ని సాధారణ స్థలాన్ని వేరు చేయడానికి దాని చుట్టూ అయిదువందల మూరల పొడవు అయిదువందల మూరల వెడల్పు గల ఒక గోడ ఉంది.
EZE 43:1 అతడు నన్ను తూర్పు వైపున ఉన్న గుమ్మం దగ్గరకు తీసుకువచ్చాడు.
EZE 43:2 ఇశ్రాయేలు దేవుని మహిమ తూర్పు నుండి రావడం నేను చూశాను. ఆయన స్వరం, ప్రవహించే జలాల గర్జనలా ఉంది, భూమి ఆయన మహిమతో ప్రకాశిస్తూ ఉంది.
EZE 43:3 నేను చూసిన దర్శనం ఆయన పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు కెబారు నది దగ్గర నేను చూసిన దర్శనాల్లా ఉంది, నేను నేలపై సాష్టాంగపడ్డాను.
EZE 43:4 తూర్పు వైపున ఉన్న గుమ్మం గుండా యెహోవా మహిమ మందిరంలోనికి ప్రవేశించింది.
EZE 43:5 అప్పుడు ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణంలోకి తీసుకువచ్చినప్పుడు, ఆలయమంతా యెహోవా మహిమ నిండిపోయి ఉంది.
EZE 43:6 ఆ వ్యక్తి నా ప్రక్కన నిలబడి ఉండగా, మందిరం లోపలి నుండి ఎవరో నాతో మాట్లాడడం విన్నాను.
EZE 43:7 ఆయన ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఇది నా సింహాసనం, నా పాదాలు పెట్టుకునే స్థలము. ఇక్కడే నేను ఇశ్రాయేలీయుల మధ్య శాశ్వతంగా నివసిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు తమ వ్యభిచారం ద్వారా, వారి రాజుల మరణ సమయంలో వారి అంత్యక్రియల అర్పణల ద్వారా నామాన్ని వారు గాని వారి రాజులు గాని అపవిత్రం చేయరు.
EZE 43:8 నాకు వారికి మధ్య గోడ మాత్రమే ఉంచి, వారు నా గుమ్మం ప్రక్కన తమ గుమ్మాలను, నా గడపల ప్రక్కన తమ గడపలను కట్టి, తమ అసహ్యమైన ఆచారాలతో వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేశారు, కాబట్టి నేను కోపంతో వారిని నాశనం చేశాను.
EZE 43:9 ఇప్పటికైనా వారు తమ వ్యభిచారాన్ని తమ రాజుల అంత్యక్రియల అర్పణలను నా దగ్గరి నుండి దూరంగా తీసివేసినప్పుడు, నేను వారి మధ్య శాశ్వతంగా నివసిస్తాను.
EZE 43:10 “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాలకు సిగ్గుపడేలా మందిరాన్ని గురించి వారికి వివరించండి. వారు దాని పరిపూర్ణతను పరిగణలోనికి తీసుకుని,
EZE 43:11 వారు చేసిన పనులన్నిటికి వారు సిగ్గుపడితే, వారికి ఆలయ రూపకల్పనను గురించి అనగా దాని అమర్చిన విధానం, దానిలోనికి వచ్చే బయటకు వెళ్లే ద్వారాల గురించి, దాని మొత్తం రూపకల్పన గురించి, దాని అన్ని నియమాలు, చట్టాలను తెలియజేయాలి. వారు దాని రూపకల్పన పట్ల నమ్మకంగా ఉండగలిగేలా, వారు దాని నియమానలన్నింటినీ అనుసరించేలా చేయడానికి వాటిని వారి ముందు వ్రాసిపెట్టాలి.
EZE 43:12 “ఇది ఆలయ నియమం: పర్వతం పైన ఉన్న పరిసర ప్రాంతాలన్నీ అత్యంత పవిత్రంగా ఉంటాయి. ఆలయ ధర్మం అలాంటిది.
EZE 43:13 “మూరలలో బలిపీఠం కొలతలు: మూరెడు అంటే ఒక మూర ఒక బెత్తెడు; దాని అడుగుభాగం ఎత్తు ఒక మూర, వెడల్పు ఒక మూర. దాని అంచుకు ఒక జానెడు చట్రం ఉంది. ఇది బలిపీఠం యొక్క ఎత్తు:
EZE 43:14 నేల మీద ఉన్న అడుగుభాగం నుండి క్రింది గట్టు వరకు బలిపీఠం ఎత్తు రెండు మూరలు. వెడల్పు ఒక మూర. చిన్న గట్టు నుండి పెద్ద గట్టు వరకు దాని ఎత్తు నాలుగు మూరలు, వెడల్పు ఒక మూర.
EZE 43:15 బలిపీఠం పొయ్యి ఎత్తు నాలుగు మూరలు. ఆ పొయ్యి నుండి పైకి నాలుగు కొమ్మలు ఉన్నాయి.
EZE 43:16 ఆ పొయ్యి చతురస్రంగా ఉండి పొడవు పన్నెండు మూరలు వెడల్పు పన్నెండు మూరలు ఉంది.
EZE 43:17 దాని పైచూరు కూడా చతురస్రంగా ఉండి పొడవు పద్నాలుగు మూరలు వెడల్పు పద్నాలుగు మూరలు ఉంది. దాని చుట్టూ ఉన్న అంచు వెడల్పు ఒక జానెడు దాని అంచుకు అర మూరెడు చట్రం ఉంది. బలిపీఠానికి మెట్లు తూర్పు వైపుగా ఉన్నాయి.”
EZE 43:18 అప్పుడు అతడు నాతో ఇలా అన్నాడు, “మనుష్యకుమారుడా, యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ బలిపీఠం కట్టిన తర్వాత దాని మీద రక్తం చిలకరించి దహనబలులు అర్పించడానికి నియమాలు ఇవి:
EZE 43:19 నా సన్నిధిలో సేవ చేయడానికి వచ్చే సాదోకు కుటుంబీకులు లేవీయులైన యాజకులకు పాపపరిహారబలి అర్పించడానికి కోడెదూడను ఇవ్వాలని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 43:20 వారు దానిని పాపపరిహారబలిగా అర్పించి బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేసి దాన్ని శుద్ధీకరించడానికి ఆ దూడ రక్తంలో కొంత తీసుకుని బలిపీఠపు నాలుగు కొమ్ము మీద, పై గట్టు నాలుగు మూలల మీద, చుట్టూ ఉన్న అంచు మీద ఉంచాలి.
EZE 43:21 మీరు పాపపరిహారబలి కోసం ఎద్దును తీసుకెళ్లి, పరిశుద్ధాలయం బయట ఆలయ ప్రాంతంలోని నిర్ణయించబడిన భాగంలో కాల్చాలి.
EZE 43:22 “రెండవ రోజున పాపపరిహారబలిగా ఏ లోపం లేని మేకపోతును అర్పించాలి. కోడెతో బలిపీఠానికి పాపపరిహారం చేసినట్లే మేకపోతుతో కూడా బలిపీఠానికి పాపపరిహారం చేయాలి.
EZE 43:23 దానిని శుద్ధి చేయడం పూర్తి చేసిన తర్వాత ఏ దోషంలేని కోడెను, పొట్టేలును అర్పించాలి.
EZE 43:24 మీరు వాటిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి అప్పుడు యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పిస్తారు.
EZE 43:25 “రోజుకు ఒకటి చొప్పున వరుసగా ఏడు రోజులు పాపపరిహారబలిగా మేకపోతులను సిద్ధం చేయాలి. అలాగే మందలో నుండి ఏ లోపం లేని కోడెను పొట్టేలును సిద్ధం చేయాలి.
EZE 43:26 ఏడు రోజులు యాజకులు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేస్తూ దాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. అలా వారు దానిని ప్రతిష్ఠించాలి.
EZE 43:27 ఈ రోజులన్నీ ముగిసిన తర్వాత ఎనిమిదో రోజు నుండి యాజకులు బలిపీఠం మీద మీ దహనబలులు మీ సమాధానబలులు అర్పిస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
EZE 44:1 అతడు నన్ను తూర్పు వైపున ఉన్న పరిశుద్ధస్థలం బయటి ద్వారం దగ్గరికి తీసుకువచ్చాడు. అది మూసి ఉంది.
EZE 44:2 యెహోవా నాతో ఇలా అన్నారు, “అది మూసే ఉంటుంది. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ద్వారం గుండా ప్రవేశించారు కాబట్టి అది మూసే ఉంటుంది. ఏ ఒక్కరూ దానిలో ప్రవేశించకుండా ఇక ఎన్నటికీ తెరవకుండా మూసే ఉంటుంది.
EZE 44:3 యువరాజైన ఒక్కడే యెహోవా సన్నిధిలో భోజనం చేయడానికి ద్వారం లోపల కూర్చోవచ్చును. అతడు మంటపం మార్గంలో లోపలికి వెళ్లి అదే దారిలో బయటకు వెళ్లాలి.”
EZE 44:4 అతడు నన్ను ఉత్తర ద్వారం గుండా మందిరం ముందుకు తీసుకువచ్చాడు. అప్పుడు నేను యెహోవా మహిమ ప్రకాశంతో యెహోవా మందిరం నిండిపోవడం చూసి నేను నేలపై పడ్డాను.
EZE 44:5 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, యెహోవా ఆలయానికి సంబంధించిన అన్ని నియమాలు విధుల గురించి నేను నీకు చెప్పే ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని గ్రహించు. మందిరం లోపలికి వచ్చే మార్గాన్ని పరిశుద్ధస్థలం నుండి బయటకు వెళ్లే అన్ని మార్గాలను శ్రద్ధగా గమనించు.
EZE 44:6 తిరుగుబాటు చేసే ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు ప్రజలారా, ఇంతవరకు మీరు చేసిన అసహ్యమైన ఆచారాలు చాలు.
EZE 44:7 మీరు చేసిన అసహ్యమైన ఆచారాలతో పాటు హృదయానికి శరీరానికి సున్నతిలేని విదేశీయులను నా పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువచ్చి మీరు నాకు ఆహారాన్ని క్రొవ్వును రక్తాన్ని అర్పించి నా మందిరాన్ని అపవిత్రపరచి నా నిబంధనను భంగం చేశారు.
EZE 44:8 మీకు అప్పగించిన నా పవిత్ర వస్తువుల బాధ్యతను మీరు నెరవేర్చకుండా నా పరిశుద్ధస్థలం యొక్క బాధ్యతను ఇతరులకు అప్పగించారు.
EZE 44:9 ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: హృదయానికి శరీరానికి సున్నతిలేని విదేశీయులుగా ఇశ్రాయేలీయుల మధ్య నివసించే వారిలో ఎవరూ నా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించకూడదు.
EZE 44:10 “ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టి తమ విగ్రహాలను అనుసరించినప్పుడు వారితో పాటు నాకు దూరమైన లేవీయులు తమ దోషాన్ని భరించాలి.
EZE 44:11 వారు నా పరిశుద్ధ స్థలంలో సేవ చేశారు, ఆలయ ద్వారపాలకులుగా బాధ్యత వహించి సేవ చేశారు; వారు ప్రజల కోసం దహనబలులను బలులను వధించి ప్రజల ముందు నిలబడి వారికి సేవ చేశారు.
EZE 44:12 కానీ వారు తమ విగ్రహాల సమక్షంలో వారికి సేవ చేసి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యారు కాబట్టి వారు తమ పాప దోషాన్ని భరించేలా నేను వారికి వ్యతిరేకంగా నా చేయెత్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 44:13 వారు నాకు యాజకులుగా సేవ చేయడానికి నా సన్నిధికి రాకూడదు, నా పరిశుద్ధ వస్తువుల దగ్గరకు గాని అతి పరిశుద్ధ అర్పణల దగ్గరకు గాని రాకూడదు. వారు చేసిన అసహ్యమైన పనులకు వారు అవమానాన్ని భరించాలి.
EZE 44:14 అయితే మందిరంలో చేయవలసిన పనులన్నిటికి నేను వారిని కాపలాగా నియమిస్తాను.
EZE 44:15 “ఇశ్రాయేలు ప్రజలు నన్ను విడిచిపెట్టినప్పుడు నా పరిశుద్ధ స్థలానికి కాపలాగా ఉన్న సాదోకు వంశస్థులై లేవీయులైన యాజకులు సేవ చేయడానికి నా సన్నిధికి వస్తారు. వారు నా ఎదుట నిలబడి క్రొవ్వును రక్తాన్ని నాకు అర్పిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 44:16 వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు; వారే నా బల్ల దగ్గరికి వచ్చి సేవ చేస్తారు. వారే నేను అప్పగించిన దాన్ని కాపాడతారు.
EZE 44:17 “ ‘వారు లోపలి ఆవరణపు గుమ్మాల్లోకి ప్రవేశించినప్పుడు వారు నారబట్టలు ధరించాలి; లోపలి ఆవరణపు గుమ్మాల్లో గాని మందిరం లోపల గాని సేవ చేసేటప్పుడు వారు ఉన్ని బట్టలు వేసుకోకూడదు.
EZE 44:18 తలకు నార తలపాగా ధరించి నడుముకు నారబట్ట కట్టుకోవాలి. చెమట పుట్టించేదీ ఏదీ వారు ధరించకూడదు.
EZE 44:19 ప్రజలు ఉండే బయటి ఆవరణంలోకి వారు వెళ్లేటప్పుడు వారి వస్త్రాలతో తాకి ప్రజలు ప్రతిష్ఠించకుండా ఉండడానికి తమ సేవ వస్త్రాలను తీసివేసి వాటిని పవిత్రమైన గదుల్లో ఉంచి వేరే బట్టలు వేసుకుని వెళ్లాలి.
EZE 44:20 “ ‘వారు తమ తలలు క్షౌరం చేయించుకోకూడదు, తలవెంట్రుకలు పొడవుగా పెరగకుండ వాటిని కత్తిరించాలి.
EZE 44:21 లోపలి ఆవరణంలో ప్రవేశించేటప్పుడు ఏ యాజకుడు ద్రాక్షరసం త్రాగకూడదు.
EZE 44:22 యాజకులు విధవరాండ్రను గాని, విడాకులు తీసుకున్న స్త్రీని గాని పెళ్ళి చేసుకోకూడదు. వారు కేవలం ఇశ్రాయేలు కన్యలను గాని యాజకులకు భార్యలై విధవరాండ్రుగా ఉన్నవారిని గాని పెళ్ళి చేసుకోవచ్చు.
EZE 44:23 అంతేగాక వారు నా ప్రజలకు పవిత్రమైన వాటికి సాధారణమైన వాటి మధ్య భేదాన్ని బోధిస్తారు; పవిత్రమైన దానికి, అపవిత్రమైన దానికి మధ్య తేడా ఏమిటో వారికి చూపిస్తారు.
EZE 44:24 “ ‘ఏదైనా వివాదం ఉన్నప్పుడు యాజకులు న్యాయమూర్తులుగా వ్యవహరించి నా శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వాలి. నా నియమించబడిన పండుగలన్నిటిలో వారు నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను పాటించాలి, వారు నా విశ్రాంతి దినాలను పవిత్రంగా ఆచరించాలి.
EZE 44:25 “ ‘యాజకుడు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్లి తనను తాను అపవిత్రం చేసుకోకూడదు; చనిపోయిన వ్యక్తి తన తండ్రి తల్లి కుమారుడు కుమార్తె సోదరుడు లేదా పెళ్ళికాని సోదరి అయితే శవాన్ని ముట్టుకొని అతడు అపవిత్రం కావచ్చు.
EZE 44:26 అయితే అతడు శుద్ధి చేయబడిన తర్వాత, అతడు ఏడు రోజులు వేచి ఉండాలి.
EZE 44:27 పరిశుద్ధాలయంలో సేవ చేయడానికి పరిశుద్ధాలయం లోపలి ఆవరణంలోనికి వెళ్లినప్పుడు అతడు పాపపరిహారబలి అర్పించాలి, అని ప్రభువైన యెహోవా ప్రకటించారు.
EZE 44:28 “ ‘యాజకులకు ఉన్న ఏకైన వారసత్వం నేనే. నీవు వారికి ఇశ్రాయేలులో స్వాస్థ్యం ఇవ్వకూడదు; నేనే వారికి స్వాస్థ్యంగా ఉంటాను.
EZE 44:29 వారు భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులు తింటారు. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించినవన్నీ వారివే అవుతాయి.
EZE 44:30 మీ ప్రథమ ఫలాల్లో మీ ప్రత్యేక కానుకలన్నిటిలో శ్రేష్ఠమైనవి యాజకులకు చెందుతాయి. మీ కుటుంబం మీద ఆశీర్వాదం ఉండేలా మీరు మొదట పిసికిన పిండిముద్దను యాజకులకు ఇవ్వాలి.
EZE 44:31 పక్షుల్లో పశువుల్లో సహజంగా చచ్చిన వాటిని గాని మృగాలు చీల్చిన వాటిని గాని యాజకులు తినకూడదు.
EZE 45:1 “ ‘మీరు భూమిని వారసత్వంగా కేటాయిస్తున్నప్పుడు, మీరు భూమి నుండి ఒక భాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠించాలి. ఆ భాగం పొడవు 25,000 మూరలు, వెడల్పు 20,000 మూరలు ఉండాలి; ఆ స్థలమంతా ప్రతిష్ఠితమవుతుంది.
EZE 45:2 దానిలో పరిశుద్ధస్థలం కోసం 500 మూరల చతురస్రాకార స్థలాన్ని కేటాయించాలి దాని చుట్టూ అన్నివైపులా 50 మూరల మైదానం ఉండాలి.
EZE 45:3 ఈ స్థలం నుండి 25,000 మూరల పొడవు 10,000 మూరల వెడల్పు గల భూమి కొలవాలి. దానిలో అతి పరిశుద్ధ స్థలమైన పరిశుద్ధస్థలం ఉంటుంది.
EZE 45:4 యెహోవాకు పరిచర్య చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేసే యాజకులకు కేటాయించిన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలమవుతుంది. అది వారి ఇళ్ళకు స్థలంగా పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలంగా ఉంటుంది.
EZE 45:5 25,000 మూరల పొడవు 10,000 మూర వెడల్పు గల స్థలం మందిరంలో సేవచేసే లేవీయులకు స్వాస్థ్యంగా ఇరవై గదులు ఉన్న వారి నివాస స్థలంగా ఉంటుంది.
EZE 45:6 “ ‘పరిశుద్ధ స్థలానికి ఆనుకుని 5,000 మూరల వెడల్పు 25,000 మూరల పొడవు ఉన్న పవిత్ర భాగాన్ని మీరు పట్టణానికి ఆస్తిగా ఇవ్వాలి; అది ఇశ్రాయేలీయులందరికి చెందుతుంది.
EZE 45:7 “ ‘ప్రతిష్ఠిత భాగానికి పట్టణ భాగానికి ఎదురుగా, వాటికి పడమర వైపుగా తూర్పు వైపుగా, ప్రతిష్ఠిత భాగానికి పట్టణ భాగానికి రెండు వైపులా ఉన్న భూభాగాన్ని యువరాజుకు కేటాయించాలి. పడమర నుండి తూర్పుకు కొలిచినప్పుడు అది ఒక గోత్ర భాగానికి సరిపడిన పొడవు ఉండాలి.
EZE 45:8 ఈ భూమి ఇశ్రాయేలులో అతనికి స్వాస్థ్యంగా ఉంటుంది. నా అధిపతులు ఇకపై నా ప్రజలను హింసించరు కానీ ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల ప్రకారం భూమిని కేటాయించుకోడానికి అనుమతిస్తారు.
EZE 45:9 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు అధిపతులారా! ఇక చాలు. ఇంతవరకు మీరు పెట్టిన హింసను బాధను విడిచిపెట్టి, న్యాయమైనది సరియైనది చేయండి. నా ప్రజలను దోచుకోవడం మానండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 45:10 మీరు సరైన త్రాసు సరైన ఏఫాను సరైన బాతును వాడండి.
EZE 45:11 ఏఫా బాతు ఒకే పరిమాణంలో ఉండాలి; హోమెరులో పదవ వంతు ఏఫా, హోమెరులో పదవ వంతు బాతు; హోమెరు రెండింటికీ ప్రామాణిక కొలతగా ఉండాలి.
EZE 45:12 ఒక షెకెలుకు ఇరవై గెరాలు. ఇరవై షెకెళ్లు, ఇరవై అయిదు షెకెళ్లు, పదిహేను షెకెళ్లు కలిపి ఒక మినాకు సమానము.
EZE 45:13 “ ‘మీరు అర్పించవలసిన ప్రత్యేక కానుక ఏంటంటే ప్రతి హోమెరు గోధుమలలో ఒక ఏఫాలో ఆరవ భాగం ప్రతి హోమెరు యవలలో ఒక ఏఫాలో ఆరవ భాగం అర్పించాలి.
EZE 45:14 సూచించిన భాగం బాతులలో కొలత ప్రకారం మీ నూనెలో ప్రతి కోరుకు బాతులో పదోవంతు అర్పించాలి. ఒక కోరు అనగా పది బాతులు లేదా ఒక హోమెరు; అంటే పది బాతులు ఒక హోమెరుకు సమానము.
EZE 45:15 అలాగే ఇశ్రాయేలులో మంచి నీరున్న పచ్చికబయళ్లలో మేపిన మందలోని ప్రతి రెండు వందలకు ఒక గొర్రెను తీసుకోవాలి. ప్రజలకు ప్రాయశ్చిత్తం చేయడానికి వీటిని భోజనార్పణలు, దహనబలులు, సమాధాన బలులకు ఉపయోగిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
EZE 45:16 దేశంలోని ప్రజలందరూ ఇశ్రాయేలులోని యువరాజుకు ఈ ప్రత్యేక కానుక ఇవ్వాలి.
EZE 45:17 పండుగల్లోను, అమావాస్య దినాల్లోను, సబ్బాతు దినాల్లోను, ఇశ్రాయేలీయులు కూడుకునే నియామక కాలాల్లోను వాడబడే దహనబలులను నైవేద్యాలను పానార్పణలను అందించడం అధిపతి యొక్క బాధ్యత. అతడు ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలులు, భోజనార్పణలు, దహనబలులు, సమాధానబలులను సమకూరుస్తాడు.
EZE 45:18 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మొదటి నెల మొదటి రోజున లోపం లేని కోడెను తీసుకుని పరిశుద్ధాలయాన్ని శుద్ధి చేయాలి.
EZE 45:19 యాజకుడు పాపపరిహారబలి రక్తంలో కొంత తీసి దానిని ఆలయ ద్వారబంధాల పైన, బలిపీఠపు పైగట్టు నాలుగు మూలల మీద, లోపలి ఆవరణ ద్వారబంధాల పైన చల్లాలి.
EZE 45:20 అనుకోకుండ గాని అవివేకంతో గాని ఎవరైనా పాపం చేస్తే, అలాంటి వారికి మీరు నెలలో ఏడవ రోజున అదే విధంగా చేయాలి; ఇలా మీరు ఆలయానికి ప్రాయశ్చిత్తం చేయాలి.
EZE 45:21 “ ‘మొదటి నెల పద్నాలుగవ రోజు పస్కా పండుగ ఆచరించాలి, ఆ పండుగ జరిగే ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి.
EZE 45:22 ఆ రోజు అధిపతి తన కోసం, దేశంలోని ప్రజలందరి కోసం పాపపరిహారబలిగా ఒక ఎద్దును అందించాలి.
EZE 45:23 పండుగ జరిగే ఏడు రోజుల్లో ప్రతిరోజు అతడు యెహోవాకు దహనబలిగా లోపం లేని ఏడు ఎద్దులు ఏడు పొట్టేళ్లను, పాపపరిహారబలిగా ఒక మేకపోతును ఇవ్వాలి.
EZE 45:24 అతడు భోజనార్పణగా ప్రతి కోడెతో పాటు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఒక్క కోడెకు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఒక్క పొట్టేలుకు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఏఫా పిండికి ఒక హిన్ ఒలీవ నూనెను కూడా ఇవ్వాలి.
EZE 45:25 “ ‘ఏడవ నెలలో పదిహేనవ రోజున ప్రారంభమయ్యే పండుగ యొక్క ఏడు రోజుల్లో కూడా అతడు పాపపరిహార బలులు, దహనబలులు, భోజనార్పణలు, నూనెను అదే విధంగా ఏర్పాటు చేయాలి.
EZE 46:1 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఆరు పని దినాల్లో తూర్పు ముఖంగా ఉన్న లోపలి ఆవరణ ద్వారం మూసివేయబడాలి, అయితే సబ్బాతు దినాన అమావాస్య రోజున దానిని తెరవాలి.
EZE 46:2 యువరాజు బయటి మంటప గుమ్మం ద్వారా ప్రవేశించి గుమ్మం ద్వారబంధాల దగ్గర నిలబడాలి. యాజకులు అతని దహనబలిని, సమాధానబలులను అర్పించాలి. అతడు గుమ్మం దగ్గర ఆరాధన చేసి నమస్కరించి బయటకు వెళ్లాలి, కాని సాయంత్రం వరకు ద్వారాన్ని మూసివేయకూడదు.
EZE 46:3 సబ్బాతులలో, అమావాస్యల్లో దేశ ప్రజలు ఆ ద్వారం దగ్గర నిలబడి యెహోవాను ఆరాధించాలి.
EZE 46:4 సబ్బాతు దినాన యువరాజు యెహోవాకు దహనబలిగా లోపం లేని ఆరు మగ గొర్రెపిల్లలను ఒక పొట్టేలును అర్పించాలి.
EZE 46:5 పొట్టేలుతో పాటు ఒక ఏఫా పిండిని, గొర్రెపిల్లలతో పాటు తన శక్తికొలది పిండిని భోజనార్పణగా అర్పించాలి. ప్రతి ఏఫా పిండితో పాటు ఒక హిన్ నూనె అర్పించాలి.
EZE 46:6 అమావాస్య నాడు అతడు ఒక కోడెను, ఆరు గొర్రెపిల్లలను, ఒక పొట్టేలును లోపం లేనివాటిని అర్పించాలి.
EZE 46:7 అతడు భోజనార్పణగా ఎద్దుతో పాటు ఒక ఏఫా పిండిని, పొట్టేలుతో పాటు ఒక ఏఫా పిండిని, గొర్రెపిల్లలతో పాటు తన శక్తికొలది పిండిని అర్పించాలి. ప్రతి ఏఫా పిండితో పాటు ఒక హిన్ నూనె అర్పించాలి.
EZE 46:8 యువరాజు ప్రవేశించినప్పుడు, అతడు మంటప గుమ్మం ద్వారా లోపలికి వెళ్లాలి అదే దారిలో బయటకు రావాలి.
EZE 46:9 “ ‘దేశ ప్రజలు నియమించబడిన పండుగల్లో యెహోవా సన్నిధికి ఆరాధించడానికి వచ్చినప్పుడు, ఉత్తర ద్వారం నుండి వచ్చేవారు దక్షిణ ద్వారం నుండి బయటకు వెళ్లాలి; దక్షిణ ద్వారం నుండి వచ్చేవారు ఉత్తర ద్వారం నుండి బయటకు వెళ్లాలి. ఎవరూ తాము వచ్చిన ద్వారం గుండా తిరిగి వెళ్లకుండా ప్రతిఒక్కరు తిన్నగా బయటకు వెళ్లాలి.
EZE 46:10 యువరాజు వారి మధ్య ఉండి, లోపలికి వెళ్లి వారితో పాటు బయటకు వెళ్లాలి.
EZE 46:11 పండుగల్లో, నియమించబడిన సమయాల్లో, భోజనార్పణగా ఎద్దుతో పాటు ఒక ఏఫా పిండిని, పొట్టేలుతో పాటు ఒక ఏఫా పిండిని, గొర్రెపిల్లలతో పాటు తన శక్తికొలది పిండిని అర్పించాలి. ప్రతి ఏఫా పిండితో పాటు ఒక హిన్ నూనె అర్పించాలి.
EZE 46:12 “ ‘యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలి గాని, సమాధానబలి గాని యువరాజు అర్పించేటప్పుడు అతని కోసం తూర్పు వైపు ద్వారం తలుపులు తెరవాలి. సబ్బాతు దినాన అర్పించునట్లుగానే దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవాలి. అతడు వెళ్లిన తర్వాత ద్వారం తలుపులు మూసివేయాలి.
EZE 46:13 “ ‘ప్రతిరోజు మీరు యెహోవాకు దహనబలిగా ఏ లోపం లేని ఒక సంవత్సరం వయస్సున్న గొర్రెపిల్లను అందించాలి. ప్రతి ఉదయం మీరు దానిని ఏర్పాటు చేయాలి.
EZE 46:14 మీరు దానితో ప్రతి ఉదయం భోజనార్పణను ఏర్పాటు చేయాలి, పిండిని తేమగా ఉంచడానికి ఒక ఏఫాలో ఆరవ వంతు నూనెతో పాటు, ఒక హిన్‌లో మూడింట ఒక వంతు నూనె ఉంటుంది. ఈ భోజనార్పణను యెహోవాకు సమర్పించడమనేది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
EZE 46:15 కాబట్టి ప్రతిరోజు ఉదయం క్రమమైన దహనబలి కోసం గొర్రెపిల్లను, భోజనార్పణను, నూనెను అందించాలి.
EZE 46:16 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అధిపతి వారసత్వంగా పొందిన భూమిలో ఒక భాగం తన కొడుక్కు ఇస్తే అది అతనికే సంక్రమిస్తుంది. ఇది వారసత్వ నియమము.
EZE 46:17 ఒకవేళ సేవకునికి ఇస్తే అది విడుద సంవత్సరం వరకే సేవకుని ఆధీనంలో ఉంటుంది. అప్పుడది తిరిగి అధిపతికే వస్తుంది. అది పతి వారసత్వం భూమి అతని సంతతి వారిదే!
EZE 46:18 ప్రజలను వారి స్వాస్థ్యంలో నుండి బయటకు వెళ్లగొట్టి, వారి వారసత్వంలో నుండి అధిపతి ఏదీ తీసుకోకూడదు. అధిపతి తన భూమిలో నుండి తన కుమారునికి భాగాలివ్వాలి. దేవుని ప్రజల్లో ఎవరూ తమ భూములను విడిచి చెదరిపోకూడదు.’ ”
EZE 46:19 ఉత్తర వైపుగా ఉన్న యాజకుల పవిత్ర గదుల్లోకి ఆయన నన్ను తీసుకెళ్లి అక్కడ వెనక వైపు పశ్చిమదిక్కున ఒక స్థలం నాకు చూపించారు.
EZE 46:20 అతడు నాతో ఇలా అన్నారు: “అపరాధ పరిహారార్థబలి, పాపపరిహారబలి వండి, భోజనార్పణ కాల్చడానికి, బయటి ఆవరణంలోనికి వాటిని తీసుకురాకుండా, ప్రజలను పవిత్రం చేయడానికి యాజకులు ఉండే స్థలం ఇది.”
EZE 46:21 అప్పుడు అతడు నన్ను బయటి ఆవరణానికి తీసుకువచ్చి దాని నాలుగు మూలలకు నన్ను నడిపించాడు, నేను ప్రతి మూలలో మరొక ఆవరణాన్ని చూశాను.
EZE 46:22 బయటి ఆవరణం యొక్క నాలుగు మూలల్లో నలభై మూరల పొడవు, ముప్పై మూరల వెడల్పు ఉన్న ఆవరణాలు ఉన్నాయి; నాలుగు మూలల్లో ఒక్కో ఆవరణం ఒకే పరిమాణంలో ఉంది.
EZE 46:23 నాలుగు ఆవరణాల ప్రతి లోపలి భాగంలో ఒక రాతి గట్టు ఉంది, దాని చుట్టూ గట్టు క్రింద పొయ్యిలున్నాయి.
EZE 46:24 ఆయన నాతో ఇలా అన్నాడు: “దేవాలయంలో పరిచర్య చేసేవారు ప్రజల బలి అర్పణలు వండడానికి ఇవి వంటశాలలు.”
EZE 47:1 ఆ మనుష్యుడు నన్ను ఆలయ ద్వారం దగ్గరకు తిరిగి తీసుకువచ్చాడు, అక్కడ ఆలయ గుమ్మం క్రిందనుండి తూర్పు వైపుకు నీరు రావడం నేను చూశాను (మందిరం తూర్పు ముఖంగా ఉంది). ఆ నీరు ఆలయానికి దక్షిణం వైపున క్రింది నుండి, బలిపీఠానికి దక్షిణం నుండి వస్తుంది.
EZE 47:2 తర్వాత అతడు నన్ను ఉత్తర ద్వారం గుండా బయటకు తీసుకువచ్చి, తూర్పు వైపున ఉన్న బయటి ద్వారం దగ్గరకు నన్ను నడిపించాడు, అక్కడ ఆ నీరు దక్షిణం వైపు నుండి పారుతుంది.
EZE 47:3 ఆ వ్యక్తి తన చేతిలో కొలమానం పట్టుకుని తూర్పు వైపు వెళ్తుండగా, అతడు వెయ్యి మూరలు కొలిచాడు, ఆపై చీలమండల లోతు ఉన్న నీటి గుండా నన్ను నడిపించాడు.
EZE 47:4 అతడు మరో వెయ్యి మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించాడు. నీళ్లు మోకాళ్ల వరకు వచ్చాయి. మరో వెయ్యి మూరలు కొలిచి నీటి గుండా నన్ను నడిపించాడు. అక్కడ నీళ్లు నడుము వరకు వచ్చాయి.
EZE 47:5 అతడు మరో వెయ్యి కొలిచాడు, కానీ ఇప్పుడు అది నేను దాటలేని నదిగా ఉంది, ఎందుకంటే నీళ్లు ఎక్కువై ఈదగలిగినంత లోతుగా ఉంది.
EZE 47:6 “మనుష్యకుమారుడా! ఇది చూస్తున్నావా?” ఆయన నన్ను మరల నది ఒడ్డుకు చేర్చాడు.
EZE 47:7 నేను అక్కడికి చేరుకున్నప్పుడు, నదికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో చెట్లు కనిపించాయి.
EZE 47:8 అతడు నాతో ఇలా అన్నాడు, “ఈ నీరు తూర్పు ప్రాంతం వైపు ప్రవహిస్తూ అరాబా లోకి వెళ్తుంది, అక్కడ అది మృత సముద్రంలోకి ప్రవేశిస్తుంది. అది సముద్రంలోకి వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న ఉప్పునీరు మంచి నీటిగా మారుతుంది.
EZE 47:9 ఈ నది నీరు ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ జీవరాశుల గుంపులు ఉంటాయి. మృత సముద్రంలో చేపలు పుష్కలంగా ఉంటాయి, ఎందుకంటే దాని నీళ్లు మంచి నీటిగా ఉంటాయి. ఈ నీరు ఎక్కడ ప్రవహిస్తే అక్కడ జీవం వర్ధిల్లుతుంది.
EZE 47:10 ఎన్-గేదీ నుండి ఎన్-ఎగ్లయీము వరకు చేపలు పట్టేవారు ఒడ్డున నిలబడి వలలు వేస్తారు. మధ్యధరా సముద్రంలో ఉన్నట్లు అన్ని రకాల చేపలు మృత సముద్రంలో ఉంటాయి.
EZE 47:11 కానీ బురద మడుగులు, చిత్తడి నేలలు శుద్ధి చేయబడవు; అవి ఇంకా ఉప్పుగానే ఉంటాయి.
EZE 47:12 నదికి ఇరువైపులా అన్ని రకాల పండ్లచెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల ఆకులు గోధుమ రంగులోకి మారవు, వాడిపోతాయి వాటి కొమ్మలపై ఎల్లప్పుడూ పండ్లు ఉంటాయి. దేవాలయం నుండి ప్రవహించే నది ద్వారా వాటికి నీరు అందుతుంది కాబట్టి ప్రతి నెల క్రొత్త పంట ఉంటుంది. పండ్లు ఆహారంగా ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి.”
EZE 47:13 ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: “ఇవి ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి స్వాస్థ్యంగా మీరు పంచుకునే దేశ సరిహద్దులు, యోసేపుకు రెండు వంతులు.
EZE 47:14 నీవు దానిని వారి మధ్య సమానంగా పంచాలి. మీ పూర్వికులకు ఇస్తానని చేయెత్తి ప్రమాణం చేశాను కాబట్టి, ఈ భూమి మీకు వారసత్వంగా మారుతుంది.
EZE 47:15 “ఇది దేశానికి సరిహద్దుగా ఉంటుంది: “ఉత్తరం వైపున ఇది మధ్యధరా సముద్రం నుండి హెత్లోను రహదారి ద్వారా లెబో హమాతు దాటి సెదాదు వరకు ఉంటుంది,
EZE 47:16 తర్వాత అది దమస్కు హమాతు మధ్య సరిహద్దులో ఉన్న బెరోతా సిబ్రాయిము వరకు, చివరకు హౌరాను సరిహద్దులో ఉన్న హజెర్-హత్తికోను వరకు వెళ్తుంది.
EZE 47:17 సముద్రం నుండి వచ్చిన ఈ సరిహద్దు దమస్కు సరిహద్దు వున్న హజర్-ఎనానుకు వెళ్తుంది. దానికి ఉత్తరంగా హమాతు సరిహద్దు ఉంటుంది. ఇది ఉత్తర సరిహద్దు.
EZE 47:18 తూర్పు వైపున సరిహద్దు హౌరాను దమస్కు మధ్య, గిలాదు ఇశ్రాయేలు దేశాల మధ్య యొర్దాను వెంట, మృత సముద్రం, తామారు వరకు ఉంటుంది. ఇది తూర్పు సరిహద్దు అవుతుంది.
EZE 47:19 దక్షిణం వైపున అది తామారు నుండి మెరీబా కాదేషు నీళ్ల వరకు, తర్వాత ఈజిప్టు వాగు వెంట మధ్యధరా సముద్రం వరకు వెళుతుంది. ఇది దక్షిణ సరిహద్దు అవుతుంది.
EZE 47:20 పడమటి వైపున, మధ్యధరా సముద్రం లెబో హమాతుకు ఎదురుగా ఉన్న చోటుకు సరిహద్దుగా ఉంటుంది. ఇది పశ్చిమ సరిహద్దు అవుతుంది.
EZE 47:21 “ఇశ్రాయేలు ప్రజ గోత్రాల ప్రకారం దేశాన్ని నీవు పంచాలి.
EZE 47:22 మీరు దానిని మీకు మీ మధ్య నివసిస్తూ పిల్లలను కన్న విదేశీయులకు వారసత్వంగా పంచుకోవాలి. మీరు వారిని స్థానిక ఇశ్రాయేలీయులుగా పరిగణించాలి; మీతో పాటు వారికి ఇశ్రాయేలు గోత్రాల మధ్య వారసత్వం ఇవ్వబడుతుంది.
EZE 47:23 ఏ గోత్రికుల మధ్య పరదేశులు నివసిస్తున్నారో ఆ గోత్రాల భూభాగంలో వారికి వారసత్వం ఇవ్వాలి” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 48:1 “పేర్ల ప్రకారం జాబితా తయారుచేయబడిన గోత్రాలు ఇవే: “ఉత్తర సరిహద్దులో దానుకు ఒక భాగం ఉంటుంది; అది హెత్లోను నుండి లెబో హమాతుకు వెళ్లే రహదారి వెంట ఉంటుంది; హజర్-ఎనాను హమాతుకు ప్రక్కన దమస్కు ఉత్తర సరిహద్దు తూర్పు వైపు నుండి పడమటి వైపు వరకు దాని సరిహద్దులో భాగంగా ఉంటుంది.
EZE 48:2 ఆషేరు వారికి ఒక భాగం; అది తూర్పు నుండి పడమటి వరకు దానుకు సరిహద్దుగా ఉంటుంది.
EZE 48:3 నఫ్తాలికి ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు ఆషేరు భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
EZE 48:4 మనష్షేకు ఒక భాగం ఉంటుంది; అది తూర్పు నుండి పడమర వరకు నఫ్తాలి భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
EZE 48:5 ఎఫ్రాయిముకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు మనష్షే భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
EZE 48:6 రూబేనుకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు ఎఫ్రాయిముకు సరిహద్దుగా ఉంటుంది.
EZE 48:7 యూదాకు ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు రూబేను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
EZE 48:8 “తూర్పు నుండి పడమర వరకు యూదా భూభాగానికి సరిహద్దుగా ఉండే భాగాన్ని మీరు ప్రత్యేక బహుమతిగా సమర్పించాలి. అది 25,000 మూరల వెడల్పు, దాని పొడవు తూర్పు నుండి పడమర వరకు ఉన్న గోత్రాల భాగాలలో ఒక దానితో సమానము.
EZE 48:9 “యెహోవాకు ప్రతిష్ఠించే ప్రత్యేక భాగం పొడవు 25,000 మూరలు. వెడల్పు 10,000 మూరలు ఉంటుంది.
EZE 48:10 ఇది యాజకులకు కేటాయించబడిన పవిత్రమైన భాగము. అది ఉత్తరం వైపు 25,000 మూరల పొడవు, పడమర వైపు 10,000 మూరల వెడల్పు, తూర్పు వైపున 10,000 మూరల వెడల్పు దక్షిణం వైపున 25,000 మూరల పొడవు ఉంటుంది. దాని మధ్యలో యెహోవా మందిరం ఉంటుంది.
EZE 48:11 ఇది ప్రతిష్ఠించబడిన యాజకులైన సాదోకు సంతతివారి కోసము. ఇశ్రాయేలీయులు తప్పుదారి పట్టినప్పుడు లేవీయుల్లా తప్పుదారి పట్టకుండా, వారు నాకు సేవచేయడంలో నమ్మకంగా ఉన్నారు.
EZE 48:12 పవిత్రమైన భూమిలో లేవీయుల భూభాగానికి సరిహద్దుగా ఉన్న ఆ భాగం వారికి ప్రత్యేక బహుమతిగా ఉంటుంది, అది అతిపరిశుద్ధమైన భాగము.
EZE 48:13 “యాజకుల ప్రాంతంతో పాటు, లేవీయులకు 25,000 మూరల పొడవు 10,000 మూరల వెడల్పు ఉంటుంది. దాని మొత్తం పొడవు 25,000 మూరలు వెడల్పు 10,000 మూరలు.
EZE 48:14 వారు దేనినీ అమ్మకూడదు లేదా మార్చుకోకూడదు. ఇది భూమిలో శ్రేష్ఠమైనది ఇతర చేతుల్లోకి వెళ్లకూడదు, ఎందుకంటే ఇది యెహోవాకు పవిత్రమైనది.
EZE 48:15 “మిగిలిన స్థలం, 5,000 మూరల వెడల్పు 25,000 మూరల పొడవున మిగిలిన భూమిని ఉమ్మడి ప్రాంతంగా భావించి పట్టణంలోని ఇళ్ళ కోసం పచ్చిక బయళ్ల కోసం ఉపయోగించాలి. పట్టణం దాని మధ్యలో ఉంటుంది.
EZE 48:16 పట్టణానికి ఈ కొలతలు ఉంటాయి: ఉత్తరం వైపు 4,500 మూరలు, దక్షిణం వైపు 4,500 మూరలు, తూర్పు వైపు 4,500 మూరలు పడమర వైపు 4,500 మూరలు.
EZE 48:17 పట్టణం కోసం పచ్చిక బయలు ఉత్తరాన 250 మూరలు, దక్షిణాన 250 మూరలు, తూర్పున 250 మూరలు పశ్చిమాన 250 మూరలు ఉండాలి.
EZE 48:18 కేటాయించబడిన పవిత్ర స్థలంతో పాటు మిగిలిన భూమి పొడవు తూర్పు వైపున 10,000 మూరలు పడమర వైపు 10,000 మూరలు ఉంటుంది. ఇది పట్టణంలో పనిచేసి బ్రతికేవారికి ఆహారాన్ని అందించే ఆధారంగా ఉంటుంది.
EZE 48:19 ఇశ్రాయేలులోని అన్ని గోత్రాల నుండి పట్టణంలో కష్టపడి పని చేసేవారు దానిని సాగు చేస్తారు.
EZE 48:20 భాగమంతా చతురస్రాకారంలో ఉంటుంది, ప్రతి వైపు 25,000 మూరలు ఉండాలి. ప్రత్యేక బహుమతిగా మీరు పట్టణం యొక్క ఆస్తితో పాటు పవిత్ర భాగాన్ని ప్రక్కన పెడతారు.
EZE 48:21 “పవిత్ర కేటాయింపు, పట్టణం యొక్క ఆస్తికి రెండు వైపులా మిగిలి ఉన్నవి యువరాజుకు చెందుతాయి. ఇది పవిత్ర భాగపు 25,000 మూరల నుండి తూర్పు సరిహద్దు వరకు పశ్చిమాన 25,000 మూరల నుండి పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉంటుంది. గిరిజన ప్రాంతాల పొడవునా ఈ రెండు ప్రాంతాలు యువరాజుకు చెందుతాయి ఆలయ పరిశుద్ధ స్థలంతో కూడిన పవిత్ర భాగం వాటి మధ్యలో ఉంటుంది.
EZE 48:22 కాబట్టి లేవీయుల స్వాస్థ్యం, పట్టణం యొక్క స్వాస్థ్యం యువరాజుకు చెందిన ప్రాంతం మధ్యలో ఉంటుంది. యువరాజుకు చెందిన ప్రాంతం యూదా సరిహద్దుకు బెన్యామీను సరిహద్దుకు మధ్య ఉంటుంది.
EZE 48:23 “తక్కిన గోత్రాల వివరాలు: “బెన్యామీను వారికి ఒక భాగము. అది తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.
EZE 48:24 షిమ్యోను వారికి ఒక భాగము. తూర్పు నుండి పడమటి వరకు అది బెన్యామీను వారి భూమిని ఆనుకుని ఉంటుంది.
EZE 48:25 ఇశ్శాఖారు వారికి ఒక వాటా! అది తూర్పు నుండి పడమర వరకు షిమ్యోను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
EZE 48:26 జెబూలూను తూర్పు నుండి పడమర వరకు ఇశ్శాఖారు భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
EZE 48:27 గాదు వారికి ఒక వాటా. అది తూర్పు నుండి పడమర వరకు జెబూలూను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
EZE 48:28 గాదు దక్షిణ సరిహద్దు తామారు నుండి మెరీబా కాదేషు నీళ్ల వరకు, తర్వాత ఈజిప్టు వాగు వెంట మధ్యధరా సముద్రం వరకు వెళ్తుంది.
EZE 48:29 “ఇశ్రాయేలు గోత్రాలకు వారసత్వంగా కేటాయించవలసిన దేశం ఇదే, ఇవి వారి భాగాలు” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
EZE 48:30 “పట్టణం నుండి బయటకు వెళ్లే గుమ్మాల వివరాలు: “ఉత్తర దిక్కున 4,500 మూరల పొడవుగా ద్వారాలు మూడు ఉంటాయి,
EZE 48:31 పట్టణ ద్వారాలకు ఇశ్రాయేలు గోత్రాల పేర్లు పెట్టాలి. ఉత్తర దిక్కున రూబేను ద్వారం, యూదా ద్వారం, లేవీ ద్వారం ఉండాలి.
EZE 48:32 తూర్పు దిక్కున 4,500 మూరల పొడవుతో మూడు ద్వారాలు: యోసేపు ద్వారం, బెన్యామీను ద్వారం, దాను ద్వారము.
EZE 48:33 దక్షిణ దిక్కున 4,500 మూరల కొలతలతో మూడు ద్వారాలు: షిమ్యోను ద్వారం, ఇశ్శాఖారు ద్వారం, జెబూలూను ద్వారం ఉండాలి.
EZE 48:34 పశ్చిమదిక్కున 4,500 మూరల కొలతలతో మూడు ద్వారాలు: గాదు ద్వారం, ఆషేరు ద్వారం, నఫ్తాలి ద్వారం ఉండాలి.
EZE 48:35 “దాని చుట్టూ విస్తీర్ణం 18,000 మూరలు. “అప్పటినుండి ఆ పట్టణానికి, ‘యెహోవా షమ్మా అని పేరు.’ ”
DAN 1:1 యూదా రాజైన యెహోయాకీము పరిపాలనలోని మూడవ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముకు వచ్చి దానిని ముట్టడించాడు.
DAN 1:2 ప్రభువు నెబుకద్నెజరు చేతికి యూదా రాజైన యెహోయాకీమును, దేవుని ఆలయపు పరికరాలతో పాటు అప్పగించారు. బబులోను రాజు వాటిని తన బబులోనియా దేవుని గుడికి తీసుకెళ్లి వాటిని తన దేవుని ధనాగారంలో ఉంచాడు.
DAN 1:3 రాజు, రాజ్య పరిచర్య చేయడానికి ఇశ్రాయేలీయులలో రాజకుటుంబానికి, రాజవంశాలకు చెందిన కొంతమందిని తీసుకురమ్మని తన ముఖ్య అధికారియైన అష్పెనజును ఆదేశించాడు.
DAN 1:4 ఆ యువకులు ఏ శారీరక లోపం లేనివారై, అందంగా ఉండి, విద్యా ప్రావీణ్యత కలిగి తెలివి కలవారై, త్వరగా గ్రహించే వారై రాజభవనంలో సేవ చేయటానికి సామర్థ్యం కలిగి ఉండాలి. వారికి బబులోనీయుల భాష చదవడం వ్రాయడం నేర్పాలి.
DAN 1:5 రాజు తన బల్ల నుండి వారి కోసం ఆహారం, ద్రాక్షరసం కొంత భాగాన్ని ప్రతిరోజు వారికి కేటాయించాడు. వారు మూడు సంవత్సరాలు శిక్షణ పొంది ఆ తర్వాత వారు రాజుకు సేవ చేయాలి.
DAN 1:6 యూదా నుండి ఎంపిక చేసిన వారిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా ఉన్నారు.
DAN 1:7 ప్రధాన అధికారి దానియేలుకు బెల్తెషాజరు అని, హనన్యాకు షద్రకు అని మిషాయేలుకు మేషాకు అని అజర్యాకు అబేద్నెగో అని క్రొత్త పేర్లు పెట్టాడు.
DAN 1:8 అయితే దానియేలు, రాజు ఇచ్చే ఆహారం, ద్రాక్షరసం పుచ్చుకుని తనను తాను అపవిత్రపరచుకోవద్దని నిర్ణయించుకొని, తాను అపవిత్రం కాకుండా ఉండేందుకు వాటిని తినకుండా ఉండడానికి ప్రధాన అధికారి అనుమతి కోరాడు.
DAN 1:9 ఆ అధిపతి దానియేలు పట్ల దయ కరుణ చూపించేలా దేవుడు చేశారు.
DAN 1:10 కాబట్టి ఆ అధికారి దానియేలుతో, “మీకు ఆహారం పానీయం కేటాయించిన నా ప్రభువైన నా రాజుకు నేను భయపడుతున్నాను. మీ వయస్సు యువకుల కంటే మీరు అతనికి ఎందుకు పీక్కుపోయినట్టుగా కనిపించాలి? అప్పుడు రాజు మిమ్మల్ని బట్టి నా తల నరికేస్తాడు” అన్నాడు.
DAN 1:11 అప్పుడు దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా మీద ప్రధాన అధికారి నియమించిన నాయకునితో దానియేలు,
DAN 1:12 “దయచేసి పది రోజులపాటు మీ దాసులను పరీక్షించి చూడండి: మాకు కూరగాయలు, త్రాగడానికి నీళ్లు తప్ప ఏమి ఇవ్వకండి.
DAN 1:13 ఆ తర్వాత రాజాహారం తిన్న యువకులతో మా ముఖాలను పోల్చి చూసిన తర్వాత మీకు నచ్చినట్లు మాకు చేయండి” అని అన్నాడు.
DAN 1:14 అందుకతడు ఒప్పుకుని పది రోజులు వారిని పరీక్షించాడు.
DAN 1:15 పది రోజుల తర్వాత చూస్తే రాజు ఆహారం తిన్న యువకులందరికంటే వీరు ఆరోగ్యంగా, పుష్టిగా కనిపించారు.
DAN 1:16 కాబట్టి ఆ నాయకుడు రాజు ఆహారాన్ని, వారు త్రాగవలసిన ద్రాక్షరసాన్ని తీసివేసి వారికి కూరగాయలు పెట్టాడు.
DAN 1:17 ఈ నలుగురు యువకులకు దేవుడు అన్ని రకాల సాహిత్యంలో, విద్యలో, తెలివిని, వివేకాన్ని ఇచ్చారు. అంతేకాక, దానియేలు దర్శనాలు, రకరకాల కలల భావాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు.
DAN 1:18 వారిని రాజు సేవకై తీసుకువచ్చే సమయం సమీపించినప్పుడు, ప్రముఖ అధికారి వారిని నెబుకద్నెజరు సమక్షంలో నిలబెట్టాడు.
DAN 1:19 రాజు వారితో మాట్లాడారు, వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలకు సమానం ఎవరూ లేరని కనుగొన్నాడు; కాబట్టి వారిని రాజు సేవకు నియమించాడు.
DAN 1:20 రాజు వారిని ప్రశ్నించినప్పుడు జ్ఞానం, వివేకం విషయంలో తన రాజ్యమంతటిలో ఉన్న మాంత్రికులు, శకునగాళ్లు, అందరికంటే పది రెట్లు గొప్పగా వారునట్లు అతడు కనుగొన్నాడు.
DAN 1:21 దానియేలు రాజ్య సేవలో రాజైన కోరెషు పరిపాలనలోని మొదటి సంవత్సరం వరకు ఉన్నాడు.
DAN 2:1 నెబుకద్నెజరు పరిపాలన యొక్క రెండవ సంవత్సరంలో అతడు కలలు కన్నాడు; వాటివలన అతని మనస్సు కలతచెందింది, అతడు పడుకోలేకపోయాడు.
DAN 2:2 కాబట్టి అతడు తనకు వచ్చిన కలను చెప్పడానికి మాంత్రికులను, శకునగాళ్లను, గారడీవారిని, జ్యోతిష్యులను పిలిపించాడు. వారు వచ్చి రాజు సమక్షంలో నిలబడ్డారు.
DAN 2:3 రాజు వారితో, “నాకు కల వచ్చింది, అది నన్ను కలవరపెడుతుంది, దాని భావం ఏంటో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను” అని అన్నాడు.
DAN 2:4 అప్పుడు జ్యోతిష్యులు రాజుకు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక! మీ దాసులకు కల ఏంటో చెప్పండి, మేము దాని భావం చెప్తాం” అన్నారు.
DAN 2:5 రాజు కల్దీయ జ్యోతిష్యులతో, “నేను ఆ కలను మరచిపోయాను. మీరు నాకు వచ్చిన కలను, దాని భావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని ముక్కలుగా చేసి, మీ ఇళ్ళను కూల్చివేస్తాను.
DAN 2:6 కాని ఒకవేళ మీరు నా కలను, దాని భావాన్ని చెప్తే మీకు కానుకలు, బహుమానాలు, గొప్ప ఘనతను ఇస్తాను. కాబట్టి నాకు వచ్చిన కలను చెప్పి, దాని భావాన్ని వివరించండి” అన్నాడు.
DAN 2:7 అందుకు వారు, “రాజు తన దాసులకు కలను చెబితే మేము దాని భావం వివరిస్తాం” అన్నారు.
DAN 2:8 అప్పుడు రాజు వారితో ఇలా అన్నాడు, “నాకు వచ్చిన కలను నేను మరచిపోయాను కాబట్టి మీరు కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు ఖచ్చితంగా తెలుసు.
DAN 2:9 నాకు వచ్చిన కలను మీరు చెప్పకపోతే, మీరు ఖచ్చితంగా శిక్షించబడతారు. పరిస్థితి మారాలని నన్ను తప్పుదారి పట్టించే మోసపు మాటలు చెప్పాలని అనుకుంటున్నారు. కాబట్టి నాకు కలను చెప్పండి, అప్పుడు మీరు కల భావం చెప్పగలరని నేను తెలుసుకుంటాను.”
DAN 2:10 కల్దీయ జ్యోతిష్యులు రాజుకు జవాబిస్తూ ఇలా అన్నారు, “రాజు అడిగింది చెప్పేవారు భూమిపై ఎవరూ లేరు! ఏ రాజు ఏ అధిపతి ఏ అధికారి ఇలాంటి విషయాన్ని ఏ శకునగాడిని గాని మాంత్రికున్ని గాని జ్యోతిష్యున్ని గాని ఇప్పటివరకు అడగలేదు.
DAN 2:11 రాజు అడిగేది కష్టతరమైనది. దేవుళ్ళు తప్ప ఎవరూ దానిని రాజుకు తెలియజేయలేరు, అయితే వారేమో మానవుల మధ్య నివసించరు.”
DAN 2:12 ఇది రాజుకు తీవ్రమైన కోపాన్ని పుట్టించగా అతడు బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపమని ఆదేశించాడు.
DAN 2:13 జ్ఞానులను చంపమని శాసనం జారీ అయ్యింది, కాబట్టి దానియేలును అతని స్నేహితులను చంపాలని మనుష్యులు వారిని వెదకడానికి వెళ్లారు.
DAN 2:14 రాజుకు ప్రధాన రక్షక భటుడైన అర్యోకు బబులోనులోని జ్ఞానులను చంపడానికి వెళ్లినప్పుడు, దానియేలు జ్ఞానంతో, యుక్తితో అతనితో మాట్లాడాడు.
DAN 2:15 “రాజు దగ్గర నుండి ఇలాంటి కఠినమైన ఆజ్ఞ ఇంత త్వరగా రావడమేంటి?” అని రాజాధికారిని అతడు అడిగాడు. అప్పుడు అర్యోకు దానియేలుకు విషయాన్ని వివరించాడు.
DAN 2:16 వెంటనే దానియేలు రాజు దగ్గరకు వెళ్లి, ఆ కల భావాన్ని వివరించడానికి కొంత సమయం ఇవ్వమని కోరాడు.
DAN 2:17 తర్వాత దానియేలు ఇంటికి వెళ్లి తన స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు ఆ సంగతి వివరించాడు.
DAN 2:18 దానియేలు, అతని స్నేహితులు, బబులోనులో ఉన్న ఇతర జ్ఞానులతో పాటు చంపబడకుండునట్లు, పరలోక దేవుడు ఆ మర్మాన్ని తెలియజేసేలా ఆయన కరుణ కోసం ప్రాధేయపడమని వారిని బలవంతం చేశాడు.
DAN 2:19 ఆ రాత్రివేళ దానియేలుకు దర్శనం ద్వారా ఆ మర్మం తెలియజేయబడింది. అప్పుడు దానియేలు పరలోక దేవున్ని స్తుతిస్తూ,
DAN 2:20 ఇలా అన్నాడు: “దేవుని నామానికి ఎల్లప్పుడు స్తుతి కలుగును గాక; జ్ఞానం, శక్తి ఆయనకే చెందుతాయి.
DAN 2:21 ఆయన కాలాలను, రుతువులను మారుస్తారు; ఆయన రాజులను కూలగొట్టి ఇతరులను నియమిస్తారు. ఆయన జ్ఞానులకు జ్ఞానాన్ని, వివేకులకు వివేకాన్ని ఇస్తారు.
DAN 2:22 ఆయన లోతైన విషయాలను, రహస్యాలను బయలుపరుస్తారు; చీకటిలో ఉన్నది ఆయనకు తెలుసు, వెలుగు ఆయనతో నివసిస్తుంది.
DAN 2:23 నా పూర్వికుల దేవా, నేను మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను: మీరు నాకు జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చారు, మేము మిమ్మల్ని అడిగింది మీరు నాకు తెలియజేశారు, రాజు కలను మీరు మాకు తెలియజేశారు.”
DAN 2:24 అప్పుడు దానియేలు బబులోను జ్ఞానులను చంపమని రాజు నియమించిన అర్యోకు దగ్గరకు వెళ్లి అతనితో, “బబులోను జ్ఞానులను చంపకండి. నన్ను రాజు దగ్గరకు తీసుకెళ్లండి, నేను అతని కల భావం అతనికి తెలియజేస్తాను” అన్నాడు.
DAN 2:25 వెంటనే అర్యోకు దానియేలును రాజు దగ్గరకు తీసుకెళ్లి, “యూదా నుండి బందీలుగా వచ్చిన వారిలో రాజు కల భావం చెప్పగలవాడు నాకు దొరికాడు” అని చెప్పాడు.
DAN 2:26 రాజు దానియేలును (మరో పేరు బెల్తెషాజరు), “నేను కలలో ఏమి చూశానో, దాని భావం ఏంటో చెప్పగలవా?” అని అడిగాడు.
DAN 2:27 దానియేలు జవాబిస్తూ ఇలా అన్నాడు, “రాజు అడిగిన మర్మం ఏ జ్ఞాని గాని, శకునాలు చెప్పేవాడు గాని, మాంత్రికుడు గాని, జ్యోతిష్యుడు గాని చెప్పలేడు.
DAN 2:28 అయితే మర్మాలు బయలుపరిచే ఒక దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనే నెబుకద్నెజరు రాజుకు రాబోయే రోజుల్లో జరిగేది తెలియజేశారు. మీ మంచం మీద మీరు పడుకున్నప్పుడు మీ మనస్సులోనికి వచ్చిన మీ కల, మీ దర్శనాలు ఇవి:
DAN 2:29 “రాజా! మీరు పడుకున్నప్పుడు, రాబోయే సంగతుల గురించి మీరు ఆలోచిస్తుండగా, మర్మాలను తెలిపేవాడు జరగబోయే దానిని చూపించారు.
DAN 2:30 నా మట్టుకైతే, ఈ మర్మం నాకు బయలుపరచబడింది, నేను ఇతరులకంటే గొప్ప జ్ఞానం కలిగినవాడినని కాదు గాని, రాజుకు భావం తెలియజేయడానికి, మీ మనస్సులోని ఆలోచనలు మీరు గ్రహించాలని అది బయలుపరచబడింది.
DAN 2:31 “రాజా! మీరు మీ కలలో చూసినప్పుడు మీ ఎదుట ఒక బ్రహ్మాండమైన విగ్రహం ఉంది. అది గొప్పది, ప్రకాశమానమైన, భయంకరమైన ప్రతిమ.
DAN 2:32 ఆ ప్రతిమ తల మేలిమి బంగారంతో, దాని రొమ్ము, చేతులు వెండితో, దాని కడుపు, తొడలు ఇత్తడితో,
DAN 2:33 దాని కాళ్లు ఇనుముతో, దాని పాదాలు కొంత ఇనుము కొంత బంకమట్టితో చేయబడింది.
DAN 2:34 మీరు చూస్తుండగా, మనిషి చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఇనుము బంకమట్టితో ఉన్న ఆ విగ్రహం పాదాల మీద పడి వాటిని విరగ్గొట్టింది.
DAN 2:35 అప్పుడు ఇనుము, బంకమట్టి, ఇత్తడి, వెండి, బంగారం ముక్కలుగా విరిగిపోయి, వేసవికాలంలో నూర్పిడి కళ్ళం మీద పడే పొట్టులా అయ్యింది. జాడ తెలియలేనంతగా గాలి వాటిని ఈడ్చుకెళ్తుంది. అయితే ఆ విగ్రహాన్ని కొట్టిన ఆ రాయి మహా పర్వతంగా మారి భూమంతా నిండింది.
DAN 2:36 “ఇదే కల, ఇప్పుడు దాని భావం రాజుకు మేము వివరిస్తాము.
DAN 2:37 రాజా! మీరు రాజులకు రాజు. పరలోక దేవుడు మీకు అధికారాన్ని, శక్తిని, బలాన్ని, వైభవాన్ని అనుగ్రహించారు;
DAN 2:38 ఆయన మానవులందరిని, భూజంతువులను, ఆకాశ పక్షులను మీ చేతుల్లో ఉంచారు. వారున్న ప్రతిచోట ఆయన మిమ్మల్ని పాలకునిగా చేశారు. ఆ విగ్రహానికి ఉన్న బంగారు తల మీరు.
DAN 2:39 “మీ తర్వాత, మీకంటే తక్కువగా ఉన్న మరో సామ్రాజ్యం లేస్తుంది. దాని తర్వాత ఇత్తడి సూచనగా ఉన్న మూడవ సామ్రాజ్యం, లోకమంతటిని పరిపాలిస్తుంది.
DAN 2:40 చివరికి, ఇనుము వంటి బలమైన నాలుగవ సామ్రాజ్యం వస్తుంది. ఇనుము అన్నిటిని విరగ్గొట్టి ముక్కలుగా చేసినట్లు, ఆ రాజ్యం ఇతరులందరిని చితుకగొట్టి, విరగ్గొడుతుంది.
DAN 2:41 ఆ విగ్రహ పాదాలు, కాళ్ల వేర్లు కొంత ఇనుము, కొంత బంకమట్టితో ఉన్నట్టు మీరు చూసిన విధంగా అది విభజించబడిన రాజ్యంగా ఉంటుంది; అయినా ఇనుము బంకమట్టితో కలిసి ఉన్నట్లు, దానిలో కొంత ఇనుములా బలంగా ఉంటుంది.
DAN 2:42 కాళ్ల వ్రేళ్లు కొంత ఇనుము, కొంత బంకమట్టితో ఉన్నట్లు, ఆ రాజ్యం కొంత బలంగా, కొంత బలహీనంగా ఉంటుంది.
DAN 2:43 ఇనుము, బంకమట్టితో కలిసినట్లు మీరు చూసినట్లే, ఆ రాజ్య ప్రజలు మిశ్రితమై ఉంటారు. అయినా ఇనుము బంకమట్టితో కలవనట్లు, వారు కూడా ఐక్యంగా ఉండలేరు.
DAN 2:44 “ఆ రాజుల కాలంలో పరలోక దేవుడు ఒక రాజ్యం నెలకొల్పుతారు, అది ఎన్నటికి నశించదు, అది ఇతర ప్రజల చేతిలో పడదు. అది ఆ రాజ్యాలన్నిటినీ చితగ్గొట్టి, వాటిని తుదముట్టిస్తుంది, కాని అది మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది.
DAN 2:45 మనుష్యుల చేతితో ముట్టని రాయి, పర్వతం నుండి చీలిపోయి ఇనుమును, ఇత్తడిని, వెండిని, బంగారాన్ని ముక్కలు చేసినట్లు వచ్చిన ఆ దర్శనానికి అర్థం ఇది. “గొప్ప దేవుడు భవిష్యత్తులో జరిగేది రాజుకు వెల్లడి చేశారు. ఈ కల నిజం, దాని వివరణ నమ్మదగినది.”
DAN 2:46 అప్పుడు నెబుకద్నెజరు రాజు దానియేలు ఎదుట సాష్టాంగపడి, అతన్ని పూజించి, అతనికి నైవేద్యం ధూపం అర్పించమని ఆదేశించాడు.
DAN 2:47 రాజు దానియేలుతో, “నిజంగా నీ దేవుడే దేవుళ్ళకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మాలను బయలుపరిచేవాడు, ఎందుకంటే ఈ మర్మాన్ని నీవు బయలుపరిచావు” అన్నాడు.
DAN 2:48 అప్పుడు రాజు దానియేలుకు ఉన్నత పదవిని ఇచ్చి, ఎన్నో గొప్ప బహుమానాలు ఇచ్చాడు. అతన్ని బబులోను సామ్రాజ్యమంతటి మీద అధికారిగా చేశాడు, ఆ దేశ జ్ఞానులందరి మీద ప్రధానిగా నియమించాడు.
DAN 2:49 అంతేకాక, రాజు దానియేలు చేసిన మనవి ప్రకారం షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను సామ్రాజ్యంలో నిర్వాహకులుగా నియమించాడు, అయితే దానియేలు రాజభవనంలోనే ఉండిపోయాడు.
DAN 3:1 నెబుకద్నెజరు రాజు ఒక బంగారు విగ్రహం చేయించి, దానిని బబులోను దేశంలో దూరా అనే మైదానంలో నిలబెట్టాడు. దాని ఎత్తు అరవై మూరలు, వెడల్పు ఆరు మూరలు.
DAN 3:2 తర్వాత రాజైన నెబుకద్నెజరు ఆ విగ్రహ ప్రతిష్ఠ కోసం పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, సలహాదారులు, కోశాధికారులు, న్యాయవాదులు, ప్రముఖ న్యాయాధిపతులు, ఇతర సామంతులందరూ రావాలని ప్రకటించాడు.
DAN 3:3 కాబట్టి నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన విగ్రహ ప్రతిష్ఠ కోసం పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, సలహాదారులు, కోశాధికారులు, న్యాయవాదులు, ప్రముఖ న్యాయాధిపతులు, ఇతర సామంతులందరూ వచ్చి దాని ఎదుట నిలబడ్డారు.
DAN 3:4 అప్పుడు దూత బిగ్గరగా ఇలా ప్రకటించాడు, “దేశాల్లారా, వివిధ భాషల ప్రజలారా, మీకు ఇవ్వబడిన ఆజ్ఞ ఇదే:
DAN 3:5 బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు మీరు విన్నప్పుడు, మీరు సాగిలపడి నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన బంగారు విగ్రహాన్ని పూజించాలి.
DAN 3:6 దానికి సాగిలపడి పూజించని వారు వెంటనే మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు.”
DAN 3:7 కాబట్టి వారు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు విన్న వెంటనే సమస్త దేశాలవారు, వివిధ భాషల ప్రజలు నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన బంగారు విగ్రహం ఎదుట సాగిలపడి దానిని పూజించారు.
DAN 3:8 ఆ సమయంలో కొందరు కల్దీయ జ్యోతిష్యులు ముందుకు వచ్చి యూదుల మీద అభియోగం మోపారు.
DAN 3:9 వారు నెబుకద్నెజరు రాజు దగ్గరకు వచ్చి అన్నారు, “రాజు చిరకాలం జీవించు గాక!
DAN 3:10 రాజా! మీరు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు వినబడిన వెంటనే ప్రజలందరు సాగిలపడి బంగారు విగ్రహాన్ని పూజించాలని,
DAN 3:11 ఎవరైతే సాగిలపడి పూజించరో, వారిని మండుతున్న అగ్నిగుండంలో పడవేస్తారని శాసనం జారీ చేశారు.
DAN 3:12 అయితే రాజా, మీరు బబులోను సామ్రాజ్య అధికారులుగా నియమించిన షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే యూదులు మిమ్మల్ని లెక్క చేయట్లేదు. వారు మీ దేవుళ్ళకు సేవ చేయడం లేదు, పూజించడం లేదు.”
DAN 3:13 నెబుకద్నెజరు అతి కోపంతో మండిపోయి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. కాబట్టి వారిని రాజు సముఖానికి తీసుకువచ్చారు.
DAN 3:14 అప్పుడు నెబుకద్నెజరు వారితో, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవుళ్ళకు సేవ చేయలేదని, నేను నిలిపిన బంగారు విగ్రహాన్ని పూజించట్లేదనేది నిజమా?
DAN 3:15 ఇప్పటికైనా మీరు బాకా, పిల్లనగ్రోవి, తీగ వాయిద్యం, సితారా, వీణ, తంతి వాద్యాలు, వివిధ రకాల సంగీత ధ్వనులు విన్నప్పుడు నేను నిలబెట్టిన విగ్రహం ఎదుట సాగిలపడి పూజిస్తే మంచిది. ఒకవేళ మీరు దానిని పూజించకపోతే, మీరు మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. అప్పుడు ఏ దేవుడు మిమ్మల్ని నా చేతి నుండి రక్షిస్తాడు?” అన్నాడు.
DAN 3:16 షద్రకు, మేషాకు, అబేద్నెగో అతనికి జవాబిస్తూ, “నెబుకద్నెజరు రాజు, ఈ విషయంలో మేము మీ ఎదుట వివరం ఇవ్వాల్సిన అవసరం లేదు.
DAN 3:17 ఒకవేళ మమ్మల్ని మండుతున్న అగ్నిగుండంలో పడవేసినా మేము సేవించే దేవుడు దాని నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు. రాజా, మీ చేతిలో నుండి ఆయన మమ్మల్ని రక్షిస్తారు.
DAN 3:18 రాజా, ఆయన రక్షించకపోయినా సరే మీ దేవుళ్ళకు మేము సేవ చేయం, మీరు నిలబెట్టిన బంగారు విగ్రహాన్ని పూజించమని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాము” అన్నారు.
DAN 3:19 అప్పుడు నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోల మీద కోపంతో మండిపడి వారి పట్ల తన వైఖరిని మార్చుకున్నాడు. ఆ అగ్నిగుండంలో వేడి ఏడంతలు ఎక్కువ చేయమని ఆదేశించి,
DAN 3:20 తన సైన్యంలో బలిష్ఠులైన సైనికులను కొందరిని పిలిచి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి మండుతున్న అగ్నిగుండంలో పడవేయమని ఆజ్ఞాపించాడు.
DAN 3:21 కాబట్టి వారు వేసుకున్న అంగీలు, ప్యాంట్లు, తలపాగాలు, ఇతర బట్టలు ఏమి తీయకుండానే వారిని మండుతున్న అగ్నిగుండం మధ్యలో పడేలా విసిరివేశారు.
DAN 3:22 రాజాజ్ఞ తీవ్రంగా ఉంది కాబట్టి అగ్నిగుండం చాలా వేడిగా ఉండింది కాబట్టి, షద్రకు, మేషాకు, అబేద్నెగోలను తీసుకెళ్లిన సైనికులు ఆ అగ్ని మంటల్లో కాలిపోయి చనిపోయారు.
DAN 3:23 షద్రకు, మేషాకు, అబేద్నెగోలను ఆ ముగ్గురిని గట్టిగా బంధించి అగ్నిగుండంలో పడవేశారు.
DAN 3:24 అప్పుడు నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యంతో ఒక్కసారి లేచి నిలబడి అతని సలహాదారులను, “మనం బంధించి అగ్నిలో వేసింది ముగ్గురిని కాదా?” అని అడిగాడు. “అవును రాజా!” అని వారు జవాబిచ్చారు.
DAN 3:25 అతడు, “చూడండి! అగ్నిలో అటూ ఇటూ తిరుగుతూ నలుగురు కనబడుతున్నారు, వారు బంధించబడినట్లుగాని, ఏ హాని కలిగినట్లు గాని లేరు, ఆ నాలుగవ వ్యక్తి దేవుళ్ళ కుమారునిగా కనిపిస్తున్నాడు” అన్నాడు.
DAN 3:26 అప్పుడు నెబుకద్నెజరు మండుతున్న అగ్నిగుండం యొక్క ద్వారం దగ్గరకు వెళ్లి, “షద్రకు, మేషాకు, అబేద్నెగో, సర్వోన్నతుడైన దేవుని సేవకులారా! బయటకు రండి! ఇక్కడకు రండి!” అని అంటూ బిగ్గరగా పిలిచారు. కాబట్టి మంటల్లో నుండి షద్రకు, మేషాకు, అబేద్నెగోలు బయటకు వచ్చారు.
DAN 3:27 పాలకులు, ప్రముఖులు, రాష్ట్ర అధిపతులు, రాజ సలహాదారులు వారి చుట్టూ గుమికూడారు. వారి శరీరాలను అగ్ని హాని చేయలేదని, వారి తలవెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదు, వారి దగ్గర కాలిన వాసన కూడా లేదని వారు గమనించారు.
DAN 3:28 అప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు, “షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి స్తుతి! ఆయన తన దేవదూతను పంపి తన సేవకులను రక్షించారు! వారాయనను నమ్ముకొని రాజాజ్ఞను ధిక్కరించారు, తమ దేవున్ని తప్ప మరే దేవున్ని సేవించి పూజించమని, తమ జీవితాలను పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు.
DAN 3:29 కాబట్టి ఏ దేశ ప్రజలైనా గాని, ఏ భాష ప్రజలైనా గాని, షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుని దూషిస్తే వారు ముక్కలు చేయబడతారని, వారి ఇల్లు కూల్చివేయబడుతుందని ఆదేశిస్తున్నాను, ఎందుకంటే ఈ విధంగా మరి ఏ దేవుడు రక్షించలేడు.”
DAN 3:30 అప్పుడు రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను సామ్రాజ్యంలో ఉన్నత స్థానాల్లో నియమించాడు.
DAN 4:1 రాజైన నెబుకద్నెజరు, లోకంలో జీవించే వివిధ భాషలు గల దేశాలకు, ప్రజలకు ఇలా తెలియజేస్తున్నాడు: మీకు గొప్పగా అభివృద్ధి కలుగును గాక!
DAN 4:2 సర్వోన్నతుడైన దేవుడు నా పట్ల చేసిన అద్భుతమైన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు మీకు చెప్పడం నాకు ఎంతో ఆనందము.
DAN 4:3 ఆయన సూచకక్రియలు ఎంతో గొప్పవి,
DAN 4:4 నెబుకద్నెజరు అనే నేను, నా రాజభవనంలో హాయిగా, క్షేమంగా ఉన్నాను.
DAN 4:5 నాకు ఒక కల వచ్చింది, అది నన్ను భయపెట్టింది. నేను మంచం మీద పడుకుని ఉన్నప్పుడు, నా మనస్సులోనికి వచ్చిన దృశ్యాలు, దర్శనాలు నన్ను భయపెట్టాయి.
DAN 4:6 కాబట్టి ఆ కల భావం చెప్పడానికి బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ నా ఎదుటకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాను.
DAN 4:7 మాంత్రికులు, శకునగాళ్లు, కల్దీయ జ్యోతిష్యులు, సోదె చెప్పేవారు వచ్చినప్పుడు నా కల వారికి చెప్పాను. కాని వారు దాని భావం చెప్పలేకపోయారు.
DAN 4:8 చివరికి, దానియేలు నా దగ్గరకు వచ్చాడు (నా దేవుని పేరైన బెల్తెషాజరు అని అతనికి పేరు పెట్టాను, ఎందుకంటే అతనిలో పవిత్ర దేవుళ్ళ ఆత్మ ఉంది) అతనికి నా కల చెప్పాను.
DAN 4:9 నేను అతనితో, “శకునగాండ్రకు అధిపతివైన బెల్తెషాజరూ, పవిత్ర దేవుళ్ళ ఆత్మ నీలో ఉందని, మర్మం ఏదైనా నీకు కష్టం కాదని నాకు తెలుసు. ఇదిగో నా కల; దాని భావం నాకు చెప్పు.
DAN 4:10 నా పడకలో నేను పడుకుని ఉన్నప్పుడు నేను చూసిన దర్శనాలు ఇవి: నేను చూడగా, భూమి మధ్యలో ఒక చెట్టు కనిపించింది, దాని ఎత్తు చాలా ఎక్కువ.
DAN 4:11 ఆ చెట్టు ఎత్తుగా, బలంగా పెరిగింది. దాని కొమ్మ ఆకాశాన్ని అంటుకుంది; భూమి అంచుల వరకు అది కనిపించింది.
DAN 4:12 దానికి అందమైన ఆకులు సమృద్ధిగా ఫలాలు ఉన్నాయి. అందరికి సరిపడా ఆహారం దాని మీద ఉంది. అడవి జంతువులు దాని నీడలో ఉన్నాయి, పక్షులు దాని కొమ్మల్లో నివసించాయి; ప్రతి జీవి దాని నుండి పోషించబడింది.
DAN 4:13 “నేను మంచం మీద పడుకుని ఉన్నప్పుడు నా దర్శనాలలో పరలోకం నుండి ఒక పరిశుద్ధుడు, ఒక దూత రావడం చూశాను.
DAN 4:14 అతడు ఇలా బిగ్గరగా అన్నాడు: ‘ఈ చెట్టును నరికివేయండి, కొమ్మలను కత్తిరించండి; దాని ఆకులను తీసివేసి దాని పండ్లను చెదరగొట్టండి. దాని క్రిందనుండి జంతువులు, దాని కొమ్మల నుండి పక్షులు పారిపోవాలి.
DAN 4:15 అయితే దాని మొద్దును దాని వేర్లను ఇనుముతో ఇత్తడితో కట్టి పొలంలోని గడ్డిలో నేలపై విడిచిపెట్టండి. “ ‘అతడు ఆకాశ మంచులో తడిసిపోవాలి, అతడు జంతువులతో, భూమిమీది మొక్కలతో నివసించాలి.
DAN 4:16 అతనికి ఏడు కాలాలు గడిచేవరకు, అతనికి మానవ మనస్సుకు బదులు జంతువు మనస్సు ఉండాలి.
DAN 4:17 “ ‘ఈ నిర్ణయం దేవదూతలు ప్రకటించారు, పరిశుద్ధులు ఈ తీర్పును ప్రకటించారు, తద్వారా సర్వోన్నతుడు, సమస్త మానవ రాజ్యాల మీద ప్రభువని, ఆయన కోరుకున్న వారెవరికైన ఇస్తారని, ఆయన మనుష్యుల్లో అల్పులైనవారికి వాటి మీద అధికారమిస్తారని మనుషులంతా తెలుసుకుంటారు.’
DAN 4:18 “బెల్తెషాజరూ, నెబుకద్నెజరు రాజునైన నాకు వచ్చిన కల ఇది. బెల్తెషాజరూ, దాని అర్థమేంటో నాకు చెప్పు, నా రాజ్యంలో ఏ జ్ఞాని దీని భావం చెప్పలేదు. అయితే పవిత్ర దేవుళ్ళ ఆత్మ నీలో ఉంది కాబట్టి నీవు చెప్పగలవు” అని అన్నాడు.
DAN 4:19 అప్పుడు దానియేలు (బెల్తెషాజరు అని కూడా పిలువబడ్డాడు) కొంత సమయం కలవరపడ్డాడు, అతని తలంపులు అతనికి భయం కలిగించాయి. అప్పుడు రాజు అన్నాడు, “బెల్తెషాజరూ, ఈ కలకు గాని దాని భావానికి కలవరపడవద్దు.” బెల్తెషాజరు జవాబిస్తూ అన్నాడు, “నా ప్రభువా, ఆ కల మీ శత్రువులకు, దాని అర్థం మీ విరోధులకు చెందితే ఎంత బాగుండేది!
DAN 4:20 మీరు చూసిన చెట్టు పెద్దగా, బలంగా పెరుగుతూ, ఆకాశాన్ని తాకుతూ, లోకమంతట కనిపిస్తుంది,
DAN 4:21 దాని ఆకులు అందంగా, ఫలాలు సమృద్ధిగా ఉంటూ, అందరికి ఆహారాన్ని ఇస్తూ, అడవి జంతువులకు ఆశ్రయాన్ని ఇస్తూ, పక్షులు గూళ్ళు కట్టుకునే స్థలం కలిగి ఉంది
DAN 4:22 రాజా! ఆ చెట్టు మీరే! మీరు గొప్పగా, బలవంతునిగా అయ్యారు; మీ గొప్పతనం ఆకాశాన్ని తాకే అంతగా, మీ అధికారం భూదిగంతాల వరకు విస్తరించింది.
DAN 4:23 “రాజా! పరలోకం నుండి పరిశుద్ధుడు, ఒక దేవదూత వచ్చి, ‘చెట్టును నరికి దానిని నాశనం చేయాలి, కాని మొద్దును ఇనుముతో, ఇత్తడితో కట్టి పొలం గడ్డి మధ్యలో విడిచిపెట్టాలి, దాని వేర్లు భూమిలో ఉండాలి. అతడు ఆకాశ మంచులో తడిసిపోవాలి; అతడు ఏడు కాలాలు దాటే వరకు అడవి జంతువుల మధ్యలో నివసించాలి’ అని ప్రకటించడం మీరు చూశారు.
DAN 4:24 “రాజా! ఆ కల భావం ఇదే, సర్వోన్నతుడైన దేవుడు నా ప్రభువైన రాజుకు జారీ చేసిన ఆదేశం ఇది:
DAN 4:25 మీరు ప్రజల నుండి తరిమివేయబడి, అడవి జంతువుల మధ్య నివసిస్తారు; ఎద్దులా గడ్డి మేస్తూ ఆకాశపు మంచుకు తడిసిపోతారు. సర్వోన్నతుడు భూమిపై ఉన్న రాజ్యాలకు ప్రభువని, ఆయన వాటిని ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తారని మీరు గుర్తించేవరకు మీకు ఏడు కాలాల వరకు ఇలా జరుగుతుంది.
DAN 4:26 చెట్టు మొద్దు, వేర్లు అలానే విడిచిపెట్టమని ఇచ్చిన ఆజ్ఞకు అర్థం ఏంటంటే, మీరు పరలోకం పరిపాలిస్తుందని గ్రహించినప్పుడు, మీ రాజ్యం తిరిగి మీకు ఇవ్వబడుతుంది.
DAN 4:27 కాబట్టి రాజా! నా సలహాను ఇష్టంతో అంగీకరించండి: సరియైనది చేస్తూ మీ పాపాలను విడిచిపెట్టండి, బాధల్లో ఉన్నవారికి దయ చూపిస్తూ మీ చెడుతనాన్ని మానేయండి. అప్పుడు మీ అభివృద్ధి కొనసాగుతుంది.”
DAN 4:28 ఇదంతా నెబుకద్నెజరుకు రాజుకు జరిగింది.
DAN 4:29 పన్నెండు నెలల తర్వాత, రాజు బబులోను రాజభవనం పైకప్పు మీద నడుస్తూ,
DAN 4:30 “నా రాజ నివాసంగా నేను కట్టుకున్న ఈ మహా బబులోను పట్టణం నా బలప్రభావంతో నా వైభవాన్ని కనుపరచడానికి కట్టుకుంది కాదా?” అని తనలో తాను అనుకున్నాడు.
DAN 4:31 ఆ మాటలు తన పెదవుల మీద ఉండగానే, ఆకాశం నుండి ఓ స్వరం వినిపించింది, “రాజైన నెబుకద్నెజరూ, నీకోసం ఇలా ప్రకటించబడింది: నీ రాజ్యాధికారం నీ నుండి తీసివేయబడింది.
DAN 4:32 నీవు ప్రజల నుండి తొలగించబడతావు, నీవు ప్రజల్లో నుండి తరమబడి అడవి జంతువులతో నివసిస్తావు; ఎద్దులా నీవు గడ్డి మేస్తావు. సర్వోన్నతుడు భూరాజ్యాల మీద అధికారి అని, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి వాటిని ఇస్తారని నీవు గ్రహించే వరకు నీవు ఏడు కాలాలు గడుపుతావు.”
DAN 4:33 వెంటనే నెబుకద్నెజరు గురించి చెప్పబడింది నెరవేరింది. అతడు ప్రజల నుండి తరమబడి, ఎద్దులా గడ్డి మేశాడు. అతని తలవెంట్రుకలు గ్రద్ద ఈకల్లా, అతని గోళ్ళు పక్షి గోళ్ళలా పెరిగే వరకు, అతని శరీరం ఆకాశం నుండి పడే మంచుకు తడిసిపోయింది.
DAN 4:34 ఆ కాలం గడిచిన తర్వాత నెబుకద్నెజరు అనే నేను ఆకాశం వైపు నా తలెత్తి చూశాను, అప్పుడు నా మానవ బుద్ధి తిరిగి వచ్చింది. అప్పుడు నేను సర్వోన్నతున్ని స్తుతించాను; నిత్యం జీవించే ఆయనను ఘనపరిచాను, మహిమపరిచాను.
DAN 4:35 ఆయన దృష్టిలో భూప్రజలు శూన్యులు.
DAN 4:36 నా మానవ బుద్ధి తిరిగి ఇవ్వబడిన ఆ సమయంలోనే, నా రాజ్య మహిమ కోసం నా ఘనత, నా వైభవం నాకు తిరిగి ఇవ్వబడ్డాయి. నా సలహాదారులు, నా ఘనులు నా దగ్గరకు వచ్చారు, నేను నా సింహాసనం మీద మరలా కూర్చున్నాను, మునుపటి కంటే ఇంకా గొప్పవాడిగా అయ్యాను.
DAN 4:37 ఇప్పుడు నెబుకద్నెజరు అనే నేను పరలోక రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతున్నాను, ఎందుకంటే ఆయన చేసే ప్రతిదీ సత్యమైనది, ఆయన విధానాలన్నీ న్యాయమైనవి. గర్వంతో జీవించేవారిని ఆయన అణచివేయగలడు.
DAN 5:1 బెల్షస్సరు రాజు తన వేయిమంది ప్రముఖులకు గొప్ప విందు ఏర్పాటు చేసి వారితో కలిసి ద్రాక్షరసం త్రాగాడు.
DAN 5:2 బెల్షస్సరు ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు, తన తండ్రియైన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజు, తన ప్రముఖులు, తన భార్యలు, తన ఉంపుడుగత్తెలు వాటిలో ద్రాక్షరసం త్రాగాలని అనుకున్నాడు.
DAN 5:3 కాబట్టి వారు యెరూషలేములోని దేవుని మందిరంలో నుండి తెచ్చిన బంగారు గిన్నెలు తీసుకురాగా రాజు, అతని ప్రముఖులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు వాటిలో త్రాగారు.
DAN 5:4 వారు ద్రాక్షరసం త్రాగుతూ, తమ బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అనే వాటితో చేసిన దేవుళ్ళను స్తుతించారు.
DAN 5:5 అకస్మాత్తుగా మనిషి చేతివ్రేళ్లు కనిపించాయి, అవి దీపస్తంభానికి ఎదురుగా రాజభవనం గోడ మీద ఆ చేయి వ్రాస్తుండగా రాజు చూశాడు.
DAN 5:6 అప్పుడు రాజు ముఖం తెల్లబోయింది, భయంతో అతని మోకాళ్లు వణుకుతూ కొట్టుకున్నాయి.
DAN 5:7 రాజు శకునగాళ్లను, కల్దీయ జ్యోతిష్యులను, సోదె చెప్పేవారిని పిలిపించగా వచ్చిన బబులోను జ్ఞానులతో అతడు ఇలా అన్నాడు, “ఎవరైనా ఈ గోడ మీద రాత చదివి, దాని భావం నాకు చెప్తే, అతనికి ఊదా రంగు వస్త్రాలు తొడిగించి, తన మెడలో బంగారు గొలుసు వేసి, రాజ్యంలో మూడవ అధికారిగా చేస్తాము.”
DAN 5:8 అప్పుడు రాజు యొక్క జ్ఞానులందరు వచ్చారు, కాని గోడ మీద ఆ రాతను చదవలేకపోయారు, దాని అర్థం చెప్పలేకపోయారు.
DAN 5:9 కాబట్టి బెల్షస్సరు రాజు ఇంకా భయపడ్డాడు, అతని ముఖం ఇంకా పాలిపోయింది. అతని అధికారులు కలవరపడ్డారు.
DAN 5:10 రాజు, అతని అధికారుల స్వరాలు విని, రాణి విందుశాలకు వచ్చింది, “రాజు చిరకాలం జీవించు గాక! కలవరపడకండి! నిబ్బరంగా ఉండండి! అని ఆమె అన్నది.
DAN 5:11 మీ రాజ్యంలో పవిత్ర దేవుళ్ళ ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. మీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం, వివేకం, తెలివితేటలు కలిగినవానిగా గుర్తించబడ్డాడు. మీ తండ్రియైన నెబుకద్నెజరు రాజు అతన్ని మాంత్రికులు, శకునగాళ్లు, కల్దీయ జ్యోతిష్యులు, సోదె చెప్పేవారి మీద అధిపతిగా నియమించాడు.
DAN 5:12 ఎందుకంటే బెల్తెషాజరు అని రాజుచేత పిలువబడే దానియేలుకు చురుకైన మనస్సు, వివేకం, జ్ఞానం కలిగి, కలల భావాలు చెప్పడానికి, మర్మాలు వివరించడానికి, కఠినమైన ప్రశ్నలను పరిష్కరించడానికి సామర్థ్యం గలవాడు. ఆ దానియేలును పిలిపించండి, అతడు ఈ వ్రాతకు అర్థం మీకు చెప్తాడు.”
DAN 5:13 కాబట్టి దానియేలును రాజు సముఖానికి తీసుకువచ్చారు. రాజు దానియేలుతో ఇలా అన్నాడు, “నా తండ్రి యూదా నుండి తెచ్చిన బందీలలో ఒకడివైన దానియేలు నీవేనా?
DAN 5:14 నీలో దేవుళ్ళ ఆత్మ ఉందని, దైవ జ్ఞానం, వివేకం, విశేష జ్ఞానం ఉన్నాయని నేను విన్నాను.
DAN 5:15 గోడ మీద ఈ వ్రాత చదివి, దాని అర్థం నాకు చెప్పడానికి జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాను, కాని వారెవరు అర్థం చెప్పలేకపోయారు.
DAN 5:16 ఇప్పుడు నీవు భావాలు చెప్పగలవని, కఠిన ప్రశ్నలను పరిష్కరించగలవని నేను విన్నాను. ఈ వ్రాత చదివి దాని అర్థం నాకు చెప్తే, నీకు ఊదా రంగు వస్ర్తం తొడిగించి, నీ మెడకు బంగారు గొలుసు వేసి, నిన్ను రాజ్యంలో మూడవ అధికారిగా చేస్తాను.”
DAN 5:17 అప్పుడు దానియేలు రాజుకు జవాబిస్తూ, “మీ కానుకలు మీరే ఉంచుకోండి, మీ బహుమానాలు ఎవరికైనా ఇవ్వండి. అయితే రాజు కోసం నేను ఈ రాత చదివి, దాని భావం ఏంటో చెప్తాను” అన్నాడు.
DAN 5:18 “రాజా! సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరుకు ఆధిపత్యం, మహాత్యం, ఘనత, వైభవం ప్రసాదించారు.
DAN 5:19 అతనికి ఇచ్చిన ఉన్నత స్థానాన్ని బట్టి అన్ని దేశాలు, వివిధ భాషల ప్రజలందరు అతనికి వణుకుతూ, భయపడేవారు. రాజు చంపాలనుకున్న వారిని చంపేవాడు; వదిలేయాలనుకున్నవారిని వదిలేశాడు; ఉన్నత పదవి ఇవ్వాలనుకున్నవారికి ఉన్నత పదవి ఇచ్చాడు; అవమానించాలని అనుకున్నవారిని అవమానించాడు.
DAN 5:20 అయితే, అతని హృదయం అహంకారంతో నిండింది, గర్వంతో బండబారి పోయింది, అప్పుడు అతడు తన సింహాసనం నుండి త్రోసివేయబడి, తన మహిమను కోల్పోయాడు.
DAN 5:21 అతడు ప్రజల్లో నుండి తరమబడి అతనికి జంతువుల మనస్సు ఇవ్వబడింది; అతడు అడవి గాడిదలతో నివసిస్తూ, ఎద్దులా గడ్డి మేశాడు; సర్వోన్నతుడు భూరాజ్యాల మీద అధికారి అని, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి వాటిని ఇస్తారని అతడు గుర్తించేవరకు అతని శరీరం ఆకాశం నుండి కురిసే మంచుకు తడిసింది.
DAN 5:22 “అయితే అతని కుమారుడవైన బెల్షస్సరు, ఇదంతా తెలిసినా కూడా నిన్ను నీవు తగ్గించుకోలేదు.
DAN 5:23 పరలోక ప్రభువుకు వ్యతిరేకంగా నిన్ను నీవు గొప్ప చేసుకున్నావు. దేవాలయ పాత్రలను తెప్పించి వాటిలో ద్రాక్షరసం పోసుకొని నీవు, నీ అధికారులు, నీ భార్యలు, నీ ఉంపుడుగత్తెలు త్రాగారు. చూడలేని, వినలేని, గ్రహించలేని వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, కర్ర, రాతి దేవుళ్ళను నీవు స్తుతించావు. కాని నీ జీవితాన్ని, నీ మార్గాలన్నిటిని తన చేతిలో పట్టుకున్న దేవున్ని నీవు గౌరవించలేదు.
DAN 5:24 కాబట్టి ఆయన వ్రాత వ్రాయడానికి ఆ చేతిని పంపారు.
DAN 5:25 “వ్రాయబడిన రాత ఇది: మెనే, మెనే, టెకేల్, ఉఫార్సీన్.
DAN 5:26 “ఈ పదాల అర్థం ఇది: “మెనే: దేవుడు నీ పరిపాలన రోజులను లెక్కించి, నీ పాలనను ముగింపుకు తీసుకువచ్చారు.
DAN 5:27 “టెకేల్: నీవు త్రాసులో తూచబడ్డావు, తక్కువగా ఉన్నట్లు తేలింది.
DAN 5:28 “ఫెరేస్: నీ రాజ్యం విభజింపబడి మాదీయులకు పర్షియా వారికి ఇవ్వబడుతుంది.”
DAN 5:29 అప్పుడు బెల్షస్సరు ఆజ్ఞమేరకు, దానియేలుకు ఊదా రంగు వస్ర్తం తొడిగించారు, అతని మెడలో బంగారు గొలుసు వేశారు, అతన్ని రాజ్యంలో మూడవ అధికారిగా ప్రకటించారు.
DAN 5:30 అదే రాత్రి కల్దీయుల రాజైన బెల్షస్సరు చంపబడ్డాడు,
DAN 5:31 మాదీయుడైన దర్యావేషు అరవై రెండేళ్ళ వయస్సులో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
DAN 6:1 దర్యావేషు తన రాజ్యమంతటిని పాలించడానికి 120 మంది అధిపతులను నియమించాడు.
DAN 6:2 వీరి మీద ముగ్గురు నిర్హాహకులను నియమించాడు, ఆ ముగ్గురిలో దానియేలు ఒకడు. రాజుకు నష్టం వాటిల్లకుండ ఆ అధిపతులు ఈ ముగ్గురికి లెక్క అప్పచెప్పాలి.
DAN 6:3 అయితే దానియేలు తనకున్న గొప్ప లక్షణాలను బట్టి అధిపతులకంటే, నిర్వాహకులకంటే ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి రాజు తన రాజ్యమంతటి మీద అతన్ని నియమించాలని అనుకున్నాడు.
DAN 6:4 అందువల్ల నిర్వాహకులు, అధిపతులు దానియేలు మీద నేరం మోపడానికి అతని ప్రభుత్వ నిర్వహణలో లోట్ల కోసం వెదికారు కాని, అతడు నమ్మకస్థుడు, నేరం లేనివాడు. వారు అతనిలో ఎలాంటి నేరం కనుగొనలేకపోయారు.
DAN 6:5 చివరికి ఈ మనుష్యులు, “ఈ దానియేలు మీద నేరం మోపడానికి ఎలాంటి కారణం ఎన్నడు మనకు దొరకదు, దొరికితే తన దేవుని ధర్మశాస్త్రం విషయంలో దొరకవచ్చు” అని అనుకున్నారు.
DAN 6:6 కాబట్టి ఈ నిర్వాహకులు, అధిపతులు గుంపుగా రాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు, “రాజైన దర్యావేషు చిరకాలం జీవించు గాక!
DAN 6:7 రానున్న ముప్పై రోజుల్లో ఎవరైనా మీకు తప్ప ఏ దేవునికైనా, మనిషికైనా ప్రార్థిస్తే వారు సింహాల గుహలో పడవేయబడాలని రాజు ఒక ఆదేశం జారీ చేసి, దానిని అమల్లోకి తీసుకురావాలని రాజ్య నిర్వాహకులు, ప్రముఖులు, అధిపతులు, సలహాదారులు, రాష్ట్ర అధికారులు అందరం ఏకీభవించి కోరుతున్నాము.
DAN 6:8 రాజా! ఈ శాసనాన్ని ఇచ్చి, అది మాదీయుల పర్షియా చట్టం ప్రకారం అది రద్దు కాకుండా, మార్చబడకుండా ఉండేందుకు దానిని వ్రాతపూర్వకంగా ఇవ్వండి.”
DAN 6:9 కాబట్టి రాజైన దర్యావేషు శాసనాన్ని రాయించి, సంతకం చేశాడు.
DAN 6:10 అయితే ఈ శాసనం ఇవ్వబడిందని దానియేలు తెలిసినప్పటికీ అతడు ఇంటికి వెళ్లి యెరూషలేము వైపు తెరచిన కిటికీలు ఉన్న తన పైగదికి వెళ్లాడు. అతడు గతంలో చేసినట్టు, రోజుకు మూడుసార్లు మోకరించి ప్రార్థన చేస్తూ, తన దేవునికి స్తుతులు చెల్లించాడు.
DAN 6:11 అప్పుడు ఈ మనుష్యులు గుంపుగా వెళ్లి, దానియేలు ప్రార్థన చేస్తూ, దేవుని సహాయం కోసం వేడుకోవడం చూశారు.
DAN 6:12 కాబట్టి వారు రాజు దగ్గరకు వెళ్లి, తన రాజ శాసనం గురించి చెప్తూ, “రాజా! వచ్చే ముప్పై రోజుల వరకు మీకు తప్పా ఏ దేవునికి గాని మనిషికి గాని ప్రార్థన గాని చేయకూడదని, అలా చేస్తే వారు సింహాల గుహలో పడవేయబడాలని శాసనం ఇచ్చారు కదా?” అన్నారు. రాజు జవాబిస్తూ, “ఆ శాసనం అమలు చేయబడుతుంది. మాదీయుల పర్షియా వారి చట్టం ప్రకారం అది రద్దు చేయబడదు” అన్నాడు.
DAN 6:13 అప్పుడు వారు రాజుతో అన్నారు, “రాజా! యూదా నుండి వచ్చిన బందీలలో ఒకడైన దానియేలు మిమ్మల్ని కాని మీరు సంతకం చేసిన శాసనాన్ని గాని లెక్క చేయట్లేదు. అతడు ఇంకా మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాడు.”
DAN 6:14 ఇది విని రాజు చాల బాధపడ్డాడు; ఎలాగైనా దానియేలును కాపాడాలని, సూర్యాస్తమయం వరకు అతన్ని విడిపించాలని ఎంతో ప్రయత్నించాడు.
DAN 6:15 అప్పుడు ఆ మనుష్యులు రాజైన దర్యావేషు దగ్గరకు గుంపుగా వెళ్లి, “రాజా! మాదీయ పర్షియా వారి చట్టం ప్రకారం రాజు చేసిన శాసనాన్ని గాని తీర్మానాన్ని గాని ఎవరు మార్చకూడదనే విషయాన్ని మీరు గుర్తుచేసుకోవాలి” అన్నారు.
DAN 6:16 అప్పుడు రాజు ఆదేశం ఇవ్వగా, వారు దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో పడవేశారు. రాజు దానియేలుతో, “నీవు నిత్యం సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని అన్నాడు.
DAN 6:17 ఒక రాయి తీసుకువచ్చి దానితో గుహ ద్వారాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో నిర్ణయాన్ని మార్చుకోకుండ రాజు తన రాజ ముద్రను, ప్రముఖుల ముద్రలను రాతి మీద వేశాడు.
DAN 6:18 తర్వాత రాజు భవనానికి వెళ్లి రాత్రంతా ఉపవాసం ఉండి వినోదాలను జరగనియ్యలేదు. అతనికి నిద్రపట్టలేదు.
DAN 6:19 తెల్లవారే సమయంలో రాజు లేచి, సింహాల గుహ దగ్గరకు త్వరగా వెళ్లాడు.
DAN 6:20 రాజు సింహాల గుహ దగ్గరకు చేరుకుని దుఃఖ స్వరంతో, “దానియేలూ! సజీవ దేవుని సేవకుడా! నిత్యం నీవు సేవించే నీ దేవుడు సింహాల బారి నుండి నిన్ను రక్షించగలిగారా?” అని అన్నాడు.
DAN 6:21 దానియేలు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక!
DAN 6:22 నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్ళు మూయించారు. అవి నాకు హాని చేయలేదు, ఎందుకంటే ఆయన దృష్టిలో నేను నిర్దోషిని. రాజా! మీ ఎదుట కూడా నేను ఏ తప్పు చేయలేదు” అన్నాడు.
DAN 6:23 రాజు ఎంతో సంతోషించి దానియేలును గుహలో నుండి బయటకు తీసుకురమ్మని ఆదేశించాడు. దానియేలు తన దేవున్ని నమ్మాడు కాబట్టి అతడు బయటకు వచ్చినప్పుడు, అతని మీద ఏ గాయం లేదు.
DAN 6:24 రాజు ఆజ్ఞమేరకు, దానియేలు మీద తప్పుడు నేరం మోపిన వ్యక్తులను వారి భార్య పిల్లలతో పాటు సింహాల గుహలో పడవేశారు. వారు ఇంకా గుహ నేలను తాకకముందే సింహాలు వారిని చీల్చి, వారి ఎముకలన్నిటిని నలుగగొట్టాయి.
DAN 6:25 అప్పుడు రాజైన దర్యావేషు భూమిపై ఉన్న దేశాలన్నిటికి, వివిధ భాషల ప్రజలందరికి: “మీరు గొప్పగా వృద్ధి పొందుదురు గాక!
DAN 6:26 “నా రాజ్యంలో ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలంతా దానియేలు దేవునికి భయపడాలి ఆయనను గౌరవించాలని నేను ఆదేశిస్తున్నాను.
DAN 6:27 ఆయన రక్షిస్తారు, కాపాడతారు;
DAN 6:28 కాబట్టి దానియేలు దర్యావేషు రాజు పరిపాలనలోను పర్షియా వాడైన కోరెషు రాజు పరిపాలనలోను వృద్ధి చెందాడు.
DAN 7:1 బబులోను రాజైన బెల్షస్సరు పరిపాలనలోని మొదటి సంవత్సరంలో, దానియేలు తన పడక మీద పడుకుని ఉన్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది, దర్శనాలు తన మనస్సులో కలిగాయి. అతడు తన కలను ఇలా సంక్షిప్తంగా వ్రాశాడు.
DAN 7:2 దానియేలు, “రాత్రివేళ నా దర్శనంలో నేను తేరిచూడగా నా ఎదుట ఆకాశం నాలుగు వైపుల నుండి గాలులు వీచి మహా సముద్రాన్ని కదిలించాయి.
DAN 7:3 అప్పుడు సముద్రంలో నుండి నాలుగు గొప్ప మృగాలు పైకి లేచాయి, ఇవి ఒక దానికి ఒకటి భిన్నంగా ఉన్నాయి.
DAN 7:4 “మొదటి మృగం సింహంలా ఉంది, దానికి గ్రద్ద రెక్కలవంటి రెక్కలున్నాయి. దాని రెక్కలు తీసివేయగా అది మనిషిలా రెండు కాళ్లమీద నిలబడడం చూశాను, దానికి మనిషి మనస్సు ఇవ్వబడింది.
DAN 7:5 “తర్వాత నా ఎదుట రెండవ మృగం ఎలుగుబంటిలా ఉంది. అది ఒకవైపు ఎత్తుగా ఉండి దాని నోటి పళ్ల మధ్యలో మూడు ప్రక్కటెముకలు ఉన్నాయి. ‘లేచి నీవు తినగలిగినంత మాంసం తిను!’ అని దానికి చెప్పబడింది.
DAN 7:6 “ఆ తర్వాత నాకు చిరుతపులిలా ఉన్న ఇంకొక మృగం కనిపించింది. దాని వీపుకు పక్షి రెక్కలవంటి నాలుగు రెక్కలున్నాయి. ఈ మృగానికి నాలుగు తలలు ఉన్నాయి, పరిపాలించడానికి దీనికి అధికారం ఇవ్వబడింది.
DAN 7:7 “దాని తర్వాత రాత్రివేళ నా దర్శనంలో నేను చూస్తుండగా నాలుగవ మృగం కనిపించింది. అది భయానకంగా, భయం కలిగించేదిగా, మహా శక్తి కలిగి ఉంది. దానికి పెద్ద ఇనుప పళ్లున్నాయి; అది దాని బాధితులను నలిపి మ్రింగివేసి, మిగిలిన దానిని కాళ్లక్రింద త్రొక్కేసింది. అంతకుముందు కనిపించిన మృగాల కంటే అది భిన్నమైనది, దానికి పది కొమ్ములున్నాయి.
DAN 7:8 “నేను కొమ్ముల గురించి ఆలోచిస్తుండగా వాటి మధ్య నుండి మరొక చిన్న కొమ్ము పైకి వచ్చింది. మొదటి మూడు కొమ్ములు దాని ఎదుట నుండి పెరికివేయబడ్డాయి. ఈ కొమ్ముకు మనిషిలాంటి కళ్లు, గర్వంగా మాట్లాడే నోరు ఉన్నాయి.
DAN 7:9 “నేను చూస్తుండగా, “సింహాసనాలు వాటి స్థానాల్లో వేయబడ్డాయి, వాటిపై మహా వృద్ధుడు కూర్చున్నారు. ఆయన వస్త్రం మంచులా తెల్లగా, ఆయన తలవెంట్రుకలు శుద్ధమైన తెల్లని గొర్రె ఉన్నిలా ఉన్నాయి. ఆయన సింహాసనం అగ్నిలా మండుతూ ఉంది, దాని చక్రాలు మండుతూ ఉన్నాయి.
DAN 7:10 ఆయన ఎదుట నుండి అగ్ని నది ప్రవహిస్తూ వస్తుంది, వేవేలకొలది ఆయనకు సేవ చేస్తున్నారు; పదివేలకొలది ఆయన ఎదుట నిలబడ్డారు, న్యాయసభ మొదలైంది, గ్రంధాలు విప్పారు.
DAN 7:11 “అప్పుడు నేను చూస్తుండగా ఆ చిన్న కొమ్ము గర్వంగా మాట్లాడినందుకు ఆ జంతువు చంపబడింది. దాని శవం నాశనం చేయబడి మండుతున్న అగ్నిలో పడవేయబడింది.
DAN 7:12 (ఇతర మృగాల తమ అధికారం కోల్పోయాయి, కాని కొంతకాలం వరకు బ్రతకడానికి అనుమతించబడ్డాయి.)
DAN 7:13 “రాత్రి దర్శనంలో నేను చూస్తుండగా మనుష్యకుమారునిలా ఉన్న ఒక వ్యక్తి మేఘాల మీద నా ముందుకు వచ్చాడు. అతడు మహా వృద్ధుని సముఖంలోకి వచ్చాడు.
DAN 7:14 ఆయనకు అధికారం, మహిమ, సర్వ శక్తి ఇవ్వబడ్డాయి; సర్వ దేశాలు, వివిధ భాషల ప్రజలు ఆయనను ఆరాధించారు. ఆయన అధికారం శాశ్వతమైనది అది ఎన్నడు గతించిపోదు. ఆయన రాజ్యం ఎన్నటికి నాశనం కాదు.
DAN 7:15 “దానియేలు అనే నేను ఆత్మలో ఆందోళన చెందాను, నాకు వచ్చిన దర్శనాల నన్ను కలవరపరిచాయి.
DAN 7:16 అక్కడ నిలబడివున్న వారిలో ఒకని దగ్గరకు వెళ్లి, దీనంతటి అర్థం చెప్పమని అడిగాను. “కాబట్టి అతడు నాతో మాట్లాడి ఈ సంగతుల భావం ఇలా తెలియజేశాడు:
DAN 7:17 ‘ఆ నాలుగు మహా మృగాలు భూలోకాన్ని పాలించే నలుగురు రాజులు.
DAN 7:18 కాని, సర్వోన్నతుని పరిశుద్ధులే రాజ్యాన్ని పొందుకుంటారు, వారి రాజ్యమే యుగయుగాలకు శాశ్వతంగా నిలిచి ఉంటుంది.’
DAN 7:19 “అప్పుడు నేను ఆ నాలుగవ మృగం గురించిన భావం తెలుసుకోవాలని కోరాను. అది మిగతా మృగాలన్నిటికంటే భిన్నంగా, అతి భయంకరంగా ఉంది, దాని పళ్లు ఇనుపవి, దాని పంజా ఇత్తడిది. ఆ మృగం దాని బాధితులను నలిపి మ్రింగివేసి, మిగిలిన దానిని కాళ్లక్రింద త్రొక్కేసింది.
DAN 7:20 దాని తలమీద ఉన్న పది కొమ్ముల గురించి, వాటి మధ్య నుండి లేచిన మొదట ఉన్న మూడు కొమ్ములను పడగొట్టిన చిన్న కొమ్ము గురించి కూడా తెలుసుకోవాలనుకున్నాను. అది ఇతర కొమ్ముల కంటే గంభీరంగా కనిపిస్తూ, కళ్లు, గర్వంగా మాట్లాడు నోరు గలది.
DAN 7:21 నేను చూస్తుండగా, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ వారిని ఓడిస్తూ ఉంది,
DAN 7:22 మహా వృద్ధుడు వచ్చి సర్వోన్నతుని పరిశుద్ధుల పక్షంగా తీర్పు చెప్పే వరకు అది అలా చేసింది. కాని సమయం వచ్చినప్పుడు వారు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు.
DAN 7:23 “అతడు ఇలా వివరించాడు: ‘నాలుగవ మృగం భూలోకంలోని నాలుగవ రాజ్యము. అది ఇతర రాజ్యాలకు భిన్నంగా ఉంటూ, సర్వ లోకాన్ని త్రొక్కుతూ, నాశనం చేస్తూ మ్రింగివేస్తుంది.
DAN 7:24 పది కొమ్ములు ఈ రాజ్యంలో నుండి వచ్చే పదిమంది రాజులు. వారి తర్వాత మరో రాజు వస్తాడు, అతడు ముందున్న వారికంటే భిన్నమైనవాడు; అతడు ముగ్గురు రాజులను లోబరచుకుంటాడు.
DAN 7:25 అతడు సర్వోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆయన పరిశుద్ధులను హింసిస్తూ, పండుగ కాలాలను, శాసనాలను మార్చే ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధులు ఒక కాలం, కాలాలు, సగం కాలం అతని చేతికి అప్పగించబడతారు.
DAN 7:26 “ ‘అయితే తీర్పు తీర్చబడి అతని అధికారం తీసివేయబడుతుంది, ఎప్పటికీ పూర్తిగా నిర్మూలం చేయబడుతుంది.
DAN 7:27 అప్పుడు ఆకాశం క్రిందున్న అన్ని రాజ్యాల అధికారం, శక్తి, మహాత్యం, సర్వోన్నతుని పరిశుద్ధులకు ఇవ్వబడుతుంది. ఆయన రాజ్యం శాశ్వతం రాజ్యం, అధికారులందరు ఆయనను ఆరాధిస్తూ, ఆయనకు లోబడతారు.’
DAN 7:28 “ఇది ఆ విషయానికి ముగింపు. దానియేలు అనే నేను నా తలంపులలో ఆందోళన చెందాను, నా ముఖం పాలిపోయింది, కాని నేను ఈ విషయాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను.”
DAN 8:1 రాజైన బెల్షస్సరు పరిపాలనలోని మూడవ సంవత్సరంలో, దానియేలు అనే నాకు ముందు వచ్చిన దర్శనం కాకుండా మరో దర్శనం వచ్చింది.
DAN 8:2 నేను దర్శనం చూస్తూ ఉన్నప్పుడు ఏలాము సామ్రాజ్యంలోని షూషను కోటలో ఉన్న నేను, దర్శనంలో ఊలయి కాలువ దగ్గర ఉన్నట్లు చూశాను.
DAN 8:3 నేను కళ్ళెత్తి చూడగా ఆ కాలువ ప్రక్కన రెండు కొమ్ములున్న ఒక పొట్టేలు ఉంది, ఆ కొమ్ములు పొడువుగా ఉన్నాయి. ఆ కొమ్ములలో ఒకటి రెండవ దానికంటే పొడువుగా ఉంది కాని అది తర్వాత మొలిచింది.
DAN 8:4 నేను చూస్తుండగా ఆ పొట్టేలు పడమర, ఉత్తర, దక్షిణాల వైపు కొమ్ములతో పొడుస్తూ ఉంది. దాని ఎదుట ఏ జంతువు నిలబడలేక పోయింది, దాని శక్తి నుండి ఏది తప్పించుకోలేదు. అది తన ఇష్టానుసారంగా చేస్తూ గొప్పగా అయ్యింది.
DAN 8:5 నేను దాని గురించి ఆలోచిస్తుండగా, అకస్మాత్తుగా పడమటి నుండి కళ్ల మధ్యలో పెద్ద కొమ్ము ఉన్న ఒక మేకపోతు వచ్చి, కాళ్లు నేలను తాకించకుండా భూమంతా పరుగు పెట్టింది.
DAN 8:6 ఆ మేకపోతు కాలువ ఒడ్డున నేను చూసిన రెండు కొమ్ముల పొట్టేలు వైపు వచ్చి తీవ్రమైన కోపంతో బలంగా దానివైపు పరుగెత్తింది.
DAN 8:7 అది పొట్టేలుపై ఆవేశంగా దాడి చేసి, దాని రెండు కొమ్ములను విరగ్గొట్టింది. దాని ఎదుట పొట్టేలు నిలువలేకపోయింది; మేకపోతు దాన్ని క్రింద పడేసి త్రొక్కేసింది, దాని శక్తి నుండి పొట్టేలును ఎవరూ రక్షించలేకపోయారు.
DAN 8:8 మేకపోతు ఎంతో గొప్పగా అయ్యింది, కాని దాని అధికారం ఉన్నత స్థితిలో ఉండగా, దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది, దాని స్థానంలో నాలుగు పెద్ద కొమ్ములు పైకి వచ్చి ఆకాశం నాలుగు వైపులకు పెరిగాయి.
DAN 8:9 వాటిలో ఒకదాని నుండి మరో కొమ్ము వచ్చింది, అది చిన్నగా ప్రారంభమై దక్షిణం, తూర్పుకు, సుందరమైన దేశం వైపు బలంతో వ్యాపించింది.
DAN 8:10 అది ఆకాశ సమూహాన్ని చేరేవరకు పెరిగి కొన్ని నక్షత్ర సమూహాలను భూమిపై పడేసి, వాటిని త్రొక్కింది.
DAN 8:11 యెహోవా సైన్యం యొక్క అధిపతికి సమానంగా తనను తాను హెచ్చించుకుంది; యెహోవా నుండి అనుదిన అర్పణలను నిలిపివేసింది, ఆయన పరిశుద్ధాలయాన్ని పడద్రోసింది.
DAN 8:12 దాని తిరుగుబాటును బట్టి, యెహోవా ప్రజలు, అనుదిన అర్పణలు దానికి ఇవ్వబడ్డాయి. అది సత్యాన్ని నేలపాలు చేసి ఇష్టం వచ్చినట్లు చేస్తూ వర్థిల్లింది.
DAN 8:13 అప్పుడు ఒక పరిశుద్ధుడు మాట్లాడడం నేను చూశాను, మరో పరిశుద్ధుడు అతనితో, “అనుదిన అర్పణలు, నాశనానికి కారణమైన తిరుగుబాటు, పరిశుద్ధాలయాన్ని లోబరచుకోవడం, యెహోవా ప్రజలు పాదాల క్రింద త్రొక్కబడుతున్న ఈ దర్శనం నెరవేరడానికి ఎంతకాలం పడుతుంది?” అన్నాడు.
DAN 8:14 అతడు నాతో, “దానికి 2,300 ఉదయ సాయంత్రాలు పడుతుంది; తర్వాత పరిశుద్ధాలయం తిరిగి పవిత్రపరచబడుతుంది.”
DAN 8:15 దానియేలు అనే నేను ఆ దర్శనం చూసి దానిని గ్రహించుకునే ప్రయత్నం చేస్తుండగా, నా ఎదుట మనిషిలా ఉన్న ఒకడు నిలబడ్డాడు.
DAN 8:16 అప్పుడు ఊలయి కాలువ నుండి, “గబ్రియేలూ, ఆ దర్శనాన్ని గ్రహించేలా ఈ మనుష్యునికి చెప్పు” అని అంటూ ఒక స్వరం అనడం విన్నాను.
DAN 8:17 అతడు నేను నిలుచున్న చోటికి రాగానే, నేను భయపడి సాగిలపడ్డాను. “మనుష్యకుమారుడా, అంత్యకాలం గురించిన దర్శనాన్ని గ్రహించు” అని అతడు నాతో అన్నాడు.
DAN 8:18 అతడు నాతో మాట్లాడుతున్నప్పుడు, నేను గాఢనిద్రలో నేల మీద సాష్టాంగపడ్డాను. అప్పుడు అతడు నన్ను ముట్టి నన్ను నిలబెట్టాడు.
DAN 8:19 అతడు అన్నాడు: “ఉగ్రత కాలంలో ఏం జరగబోతుందో నీకు చెప్పబోతున్నాను, ఎందుకంటే, దర్శనం నిర్ణీతమైన అంత్య కాలానికి సంబంధించింది.
DAN 8:20 నీవు చూసిన రెండు కొమ్ముల పొట్టేలు మెదీయ, పర్షియా రాజులను సూచిస్తుంది.
DAN 8:21 బొచ్చుగల మేకపోతు గ్రీసు దేశపు రాజును, దాని కళ్ల మధ్య ఉన్న పెద్ద కొమ్ము దాని మొదటి రాజును సూచిస్తుంది.
DAN 8:22 ఆ కొమ్ము స్థానంలో వచ్చిన నాలుగు కొమ్ములు అతని దేశం నుండి లేచే నాలుగు రాజ్యాలను సూచిస్తుంది, కాని వాటికి మొదటి రాజుకు ఉన్నంత బలం ఉండదు.
DAN 8:23 “వారి పరిపాలనలోని చివరి భాగంలో, తిరుగుబాటుదారులు పూర్తిగా దుష్టులైనప్పుడు, భయంకరంగా కనిపించే రాజు, కుట్రలో ఆరితేరినవాడు లేస్తాడు.
DAN 8:24 అతడు ఎంతో బలవంతుడవుతాడు, కాని తన సొంత శక్తి ద్వారా కాదు. అతడు స్తంభింపజేసే విధ్వంసాలు చేస్తాడు, అతడు చేసే ప్రతీ దాంట్లో జయం పొందుతాడు.అతడు బలాఢ్యులను, పరిశుద్ధులను నాశనం చేస్తాడు.
DAN 8:25 అతడు యుక్తి గలవాడై మోసం చేసి తనకు లాభం కలిగేలా చూసుకుంటాడు. క్షేమంగా ఉన్నామని వారు అనుకున్నప్పుడు, అతడు ఎంతోమందిని నాశనం చేస్తాడు, రాజాధిరాజుతో యుద్ధం చేస్తాడు. కాని చివరకు అతడు నాశనమవుతాడు, అయితే మానవ శక్తి ద్వారా కాదు.
DAN 8:26 “ఉదయ సాయంత్రాల గురించి నీకు ఇవ్వబడిన దర్శనం నిజమైనది, కాని దానిని రహస్యంగా ఉంచాలి, ఎందుకంటే అది చాలా కాలం తర్వాత జరిగేది.”
DAN 8:27 దానియేలు అనే నేను నీరసించిపోయాను, కొన్ని రోజులు అనారోగ్యంతో ఉన్నాను. తర్వాత నేను లేచి రాజు పనులలో ఉన్నాను. దర్శనాన్ని బట్టి నేను ఆందోళన చెందాను; అది గ్రహింపుకు మించింది.
DAN 9:1 మాదీయుడును అహష్వేరోషు కుమారుడునైన దర్యావేషు బబులోను రాజ్యం మీద రాజుగా నియమించబడిన మొదటి సంవత్సరంలో
DAN 9:2 అతని పరిపాలన మొదటి సంవత్సరంలో, దానియేలు అనే నేను పవిత్ర గ్రంథంలోని లేఖనాల ద్వారా గ్రహించింది, యిర్మీయా ప్రవక్తకు యెహోవా పంపిన వాక్కు ప్రకారం, యెరూషలేము యొక్క నిర్జన స్థితి డెబ్బై సంవత్సరాల వరకు కొనసాగుతుంది.
DAN 9:3 కాబట్టి నేను ప్రభువైన దేవుని వైపు తిరిగి ప్రార్థన, విన్నపం ద్వారా ఆయనను ప్రాధేయపడ్డాను, ఉపవాసముండి, గోనెపట్ట చుట్టుకొని, బూడిద మీద పోసుకున్నాను.
DAN 9:4 నా దేవుడైన యెహోవాకు ఇలా ప్రార్థన చేస్తూ ఒప్పుకున్నాను: “ప్రభువా! మిమ్మల్ని ప్రేమించి, మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల ప్రేమ నిబంధనను నిలిపే మహా భీకరుడవైన దేవా,
DAN 9:5 మేము పాపం చేశాము, తప్పు చేశాము. మేము దుష్టులమై తిరుగుబాటు చేశాం; మీ ఆజ్ఞలు, న్యాయవిధుల నుండి తప్పిపోయాము.
DAN 9:6 మీ నామంలో, మా రాజులతో, అధిపతులతో, పూర్వికులతో, దేశ ప్రజలందరితో మాట్లాడిన మీ దాసులైన ప్రవక్తల మాటలు మేము వినలేదు.
DAN 9:7 “ప్రభువా! మీరు నీతిమంతులు, కాని ఈ రోజు మేమైతే అనగా మీ పట్ల మేము చూపిన నమ్మకద్రోహాన్ని బట్టి ఆయా దేశాలకు చెదరగొట్టబడిన యూదా ప్రజలం, యెరూషలేము నివాసులం, ఇశ్రాయేలీయులం, దగ్గరగా దూరంగా ఉన్నవారమందరం అవమానంతో నిండిపోయాము.
DAN 9:8 యెహోవా, మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాం కాబట్టి మేము, మా రాజులు, అధిపతులు, పూర్వికులు అవమానంతో కప్పబడ్డాము.
DAN 9:9 మా ప్రభువైన దేవుడు, మేము తిరుగుబాటు చేసిన కూడా, కరుణ, క్షమాపణ గలవారు;
DAN 9:10 దేవుడైన యెహోవాకు మేము లోబడలేదు, ఆయన తన దాసులైన ప్రవక్తల ద్వారా మాకిచ్చిన న్యాయవిధులను మేము పాటించలేదు.
DAN 9:11 ఇశ్రాయేలంతా మీకు విధేయత చూపడం విడిచిపెట్టి, మీ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, వదిలేశారు. “కాబట్టి దేవుని దాసుడైన మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న శాపాలు, ప్రమాణం చేయబడిన తీర్పులు మామీద కుమ్మరించబడ్డాయి, ఎందుకంటే మీకు విరోధంగా మేము పాపం చేశాము.
DAN 9:12 మమ్మల్ని ఉద్దేశించి చెప్పిన మాటలు, మా మీదికి, మా పాలకుల మీదికి గొప్ప విపత్తు తీసుకురావడం ద్వారా మీరు నెరవేర్చారు. యెరూషలేముకు జరిగినట్లు ఆకాశమంతటి క్రింద మరే స్థలంలో ఎప్పుడూ జరగలేదు.
DAN 9:13 మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినట్లే, ఈ విపత్తు అంతా మా మీదికి వచ్చింది, అయినా మేము పాపాలను వదిలి, మీ సత్యం వైపు దృష్టి పెట్టక, మా దేవుడైన యెహోవా చూపించు దయను కోరలేదు.
DAN 9:14 మా దేవుడైన యెహోవా తాను క్రియలన్నిటిలో న్యాయవంతులు కాబట్టి యెహోవా ఈ విపత్తు మా మీదికి రప్పించడానికి మొహమాట పడలేదు; అయినా మేము ఆయనకు లోబడలేదు.
DAN 9:15 “ప్రభువైన మా దేవా, బలమైన హస్తం ద్వారా మీ ప్రజలను ఈజిప్టు నుండి బయటకు రప్పించి నీ నామానికి ఘనత తెచ్చుకున్నావు. మేము పాపం చేశాం, దుర్మార్గంగా ప్రవర్తించాము.
DAN 9:16 ప్రభువా, మీ నీతిక్రియల ప్రకారం మీ పట్టణం, మీ పరిశుద్ధ కొండయైన యెరూషలేము పట్ల మీ కోపాన్ని వదిలేయండి. మా పాపాలు, మా పూర్వికుల అతిక్రమాలు, మా చుట్టూ ఉన్న ప్రజలకు, యెరూషలేమును, మీ ప్రజలను హేళన చేసే విషయంగా మార్చాయి.
DAN 9:17 “ఇప్పుడు, మా దేవా, మీ దాసుని ప్రార్థనలు, విన్నపాలు ఆలకించండి. ప్రభువా, మీ కోసం, పాడైపోయిన మీ పరిశుద్ధాలయం మీద దయతో చూడండి.
DAN 9:18 మా దేవా, చెవియొగ్గి ఆలకించండి; మీ కళ్లు తెరిచి, మీ పేరుపెట్టబడిన పట్టణం యొక్క శిథిలావస్తను చూడండి. మేము నీతిమంతులమని కాదు కాని, మీ గొప్ప కరుణను బట్టి మేము మీకు మా విన్నపాలు చేస్తున్నాము.
DAN 9:19 ప్రభువా ఆలకించండి! ప్రభువా క్షమించండి! నా దేవా మీ కోసం, ఆలస్యం చేయకండి, ఎందుకంటే మీ పట్టణం మీ ప్రజలు మీ పేరు కలిగి ఉన్నారు.”
DAN 9:20 నేను మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ, నా పాపాలు, నా ప్రజలైన ఇశ్రాయేలు పాపాలు ఒప్పుకుంటూ, నా దేవుడైన యెహోవాకు ఆయన పరిశుద్ధ కొండ గురించి వేడుకుంటూ ప్రార్థించాను.
DAN 9:21 నేను ఇంకా ప్రార్థనలో ఉన్నప్పుడు, ముందు చూసిన దర్శనంలో కనిపించిన వ్యక్తియైన గబ్రియేలు సాయంకాల నైవేద్య సమయంలో వేగంగా ఎగురుకుంటూ నా దగ్గరకు వచ్చాడు.
DAN 9:22 అతడు నాకు ఉపదేశిస్తూ నాతో అన్నాడు, “దానియేలూ, నేను నీకు వివేకమును, గ్రహింపును ఇవ్వడానికి వచ్చాను.
DAN 9:23 నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన వెంటనే, ఒక మాట బయటకు వెళ్లింది, అది నేను నీతో చెప్పాలని వచ్చాను, ఎందుకంటే నీవు ఎంతో విలువగలవాడివి. కాబట్టి, వాక్కును పరిగణించి, దర్శనాన్ని గ్రహించు:
DAN 9:24 “దోషం ముగించడానికి, పాపం తుదముట్టించడానికి, దుష్టత్వానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, శాశ్వత నీతిని చేకూర్చడానికి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి, నీ ప్రజలకు, నీ పరిశుద్ధ పట్టణానికి డెబ్బై ‘ఏడులు’ నిర్ణయించబడ్డాయి.
DAN 9:25 “దీనిని తెలుసుకొని, గ్రహించు: యెరూషలేము పునరుద్ధరణ, పునర్నిర్మాణం కోసం ఆజ్ఞ ఇయ్యబడింది మొదలుకొని, అభిషిక్తుడైన అధిపతి వచ్చేవరకు ఏడు ‘వారాలు,’ అరవై రెండు ‘వారాలు’ పడుతుంది. అయితే కష్టకాలంలో యెరూషలేము నడి వీధులతో, కాలువతో పునర్నిర్మించబడుతుంది.
DAN 9:26 అరవై రెండు ‘సంవత్సరాల’ తర్వాత అభిషిక్తుడు హతం చేయబడతాడు, ఆయన స్వాధీనంలో ఏమీ ఉండదు. ఆ తర్వాత వచ్చే పరిపాలకుని ప్రజలు పట్టణాన్ని, పరిశుద్ధాలయాన్ని నాశనం చేస్తారు. అంతం వరదలా వస్తుంది: యుద్ధం అంతం వరకు కొనసాగుతుంది, వినాశనం జరగాలని నిర్ణయంచబడింది.
DAN 9:27 ఆ పరిపాలకుడు ఒక ‘ఏడు’ కోసం చాలా మందితో నిబంధన నెలకొల్పుతాడు. అయితే ఆ ‘ఏడు’ సగం గడిచాక, బలిని, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అతని మీద శాసించబడిన అంతం కుమ్మరించబడేవరకు, మందిరం దగ్గర వినాశనం కలిగించే హేయమైన దానిని నిలుపుతాడు.”
DAN 10:1 పర్షియా రాజైన కోరెషు పరిపాలన యొక్క మూడవ సంవత్సరంలో, దానియేలుకు (బెల్తెషాజరు అని పిలువబడేవాడు) ఒక ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆ ప్రత్యక్షత యొక్క సందేశం నిజం, అది మహా యుద్ధం గురించిన విషయము. అతనికి ఆ వార్త యొక్క గ్రహింపు దర్శనంలో వచ్చింది.
DAN 10:2 ఆ సమయంలో దానియేలు అనే నేను మూడు వారాలు విలపిస్తూ ఉన్నాను.
DAN 10:3 నేను శ్రేష్ఠమైన ఆహారం తినలేదు; మాంసం కాని, ద్రాక్షరసం కాని నా పెదవులను తాకలేదు; మూడు వారాలు గడిచేవరకు సువాసనగల నూనె రాసుకోలేదు.
DAN 10:4 మొదటి నెల ఇరవై నాలుగవ రోజున నేను మహా నది టైగ్రీసు ఒడ్డున నిలబడి ఉన్నాను,
DAN 10:5 నేను తేరిచూడగా, నా ఎదుట సన్నని నారబట్టలు ధరించి నడుముకు ఊఫజు నుండి తెప్పించబడిన మేలిమి బంగారు నడికట్టు నడుముకు కట్టుకున్న మనిషి కనిపించాడు.
DAN 10:6 అతని శరీరం గోమేధికంలా, అతని ముఖం మెరుపులా, అతని కళ్లు మండే దివిటీలలా, అతని కాళ్లు చేతులు మెరుగుపెట్టిన ఇత్తడిలా తళతళలాడుతూ ఉన్నాయి. అతని కంఠస్వరం గుంపు చేసే ధ్వనిలా ఉంది.
DAN 10:7 దానియేలు అనే మాత్రమే ఆ దర్శనాన్ని చూసింది; నాతో ఉన్నవారు దానిని చూడలేదు, కాని వారు ఎంతో భయాబ్రాంతులై పారిపోయి దాక్కున్నారు.
DAN 10:8 కాబట్టి నేనొక్కడినే ఈ గొప్ప దర్శనాన్ని చూస్తూ ఉండిపోయాను, ఈ గొప్ప దర్శనం చూశాను; నాలో బలం ఏమి లేదు, నా ముఖం ఎంతో పాలిపోయింది, నేను పూర్తిగా నీరసించిపోయాను.
DAN 10:9 అప్పుడు అతడు మాట్లాడడం నేను విన్నాను, నేను వింటూ ఉండగా, సాష్టాంగపడి గాఢ నిద్రలోకి వెళ్లాను.
DAN 10:10 ఒక చేయి నన్ను తాకి వణుకుతున్న నా మోకాళ్లు, అరచేతుల మీద నిలబెట్టింది.
DAN 10:11 అతడు, “దానియేలూ! నీవు ఎంతో విలువైనవాడవు, నేను నీతో మాట్లాడే మాటలు శ్రద్ధగా ఆలోచించి, లేచి నిలబడు, ఎందుకంటే నేను నీ దగ్గరకు పంపబడ్డాను” అన్నాడు. అతడు ఇది చెప్పిన తర్వాత, నేను వణకుతూ లేచి నిలబడ్డాను.
DAN 10:12 అప్పుడతడు అన్నాడు, “దానియేలూ, భయపడకు. నీవు గ్రహింపు కోసం నీ మనస్సును సిద్ధపరచుకుని, నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకున్న మొదటి రోజు నుండే నీ ప్రార్థనలు ఆలకించబడ్డాయి, వాటికి జవాబుగా నేను వచ్చాను.
DAN 10:13 అయితే, పర్షియా రాజ్యాధిపతి ఇరవై ఒక రోజులు నన్ను ఎదిరించాడు. నేను పర్షియా రాజు ఎదుట ఉండిపోవలసి వచ్చింది కాబట్టి ప్రముఖ దేవదూతల్లో ఒకడైన మిఖాయేలు నాకు సహాయం చేయడానికి వచ్చాడు.
DAN 10:14 ఇప్పుడు నీ ప్రజలకు భవిష్యత్తులో జరుగబోయే వాటిని నీకు వివరించడానికి వచ్చాను, ఎందుకంటే దర్శనం రాబోయే కాలం గురించి వచ్చింది.”
DAN 10:15 అతడు ఇది నాకు చెప్తుండగా, నేను నా ముఖాన్ని నేల వైపుకు వంచుకొని ఏమి మాట్లాడలేకపోయాను.
DAN 10:16 అప్పుడు మనిషిని పోలిన ఒక వ్యక్తి నా పెదవులు ముట్టాడు, నేను నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాను. నా ఎదుట నిలుచున్న వ్యక్తితో అన్నాను, “నా ప్రభువా! ఈ దర్శనాన్ని బట్టి నేను వేదన చెందాను, నేను ఎంతో బలహీనంగా అయ్యాను.
DAN 10:17 నా ప్రభువా, మీ దాసుడనైన నేను మీతో ఎలా మాట్లాడగలను? నా బలం పోయింది, కష్టంగా ఊపిరి తీసుకుంటున్నాను.”
DAN 10:18 మనిషిని పోలిన ఆ వ్యక్తి మరలా నన్ను తాకి, నన్ను బలపరిచాడు.
DAN 10:19 “నీవు ఎంతో విలువైనవాడవు, భయపడకు, సమాధానం! ఇప్పుడు ధైర్యం తెచ్చుకో! ధైర్యం తెచ్చుకో!” అని అతడు అన్నాడు. అతడు నాతో మాట్లాడినప్పుడు నేను బలపరచబడ్డాను, “నా ప్రభువా, మీరు నాకు బలం కలిగించారు, కాబట్టి మాట్లాడండి” అని అన్నాను.
DAN 10:20 కాబట్టి అతడు అన్నాడు, “నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? త్వరలో నేను పర్షియా రాజ్యాధిపతితో పోరాడడానికి తిరిగి వస్తాను, నేను వెళ్లిన తర్వాత, గ్రీసు అధిపతి వస్తాడు;
DAN 10:21 అయితే ముందు సత్య గ్రంథంలో వ్రాయబడింది ఏంటో నీకు చెప్తాను. (వాళ్ళను ఎదిరించడానికి మీ అధిపతియైన మిఖాయేలు తప్ప ఎవరూ నా పక్షంగా నిలువరు.
DAN 11:1 మాదీయుడైన దర్యావేషు పరిపాలన యొక్క మొదటి సంవత్సరం, నేను అతనికి సహాయం చేయడానికి, బలపరచడానికి నిలబడ్డాను.)
DAN 11:2 “కాబట్టి ఇప్పుడు, నేను నీకు సత్యం చెప్తాను: ఇంకా ముగ్గురు పర్షియా రాజులు వస్తారు, తర్వాత నాలుగవ రాజు వస్తాడు, అతడు ఇతరులందరికంటే ఎంతో ధనవంతుడు. తన ధనం వల్ల బలం పొందుకున్న తర్వాత, అతడు గ్రీసు రాజ్యనికి వ్యతిరేకంగా అందరిని పురికొల్పుతాడు.
DAN 11:3 తర్వాత బలమైన రాజు లేచి, గొప్ప శక్తితో పాలిస్తూ, తన ఇష్టానుసారంగా చేస్తాడు.
DAN 11:4 అతడు పైకి వచ్చిన తర్వాత, అతని సామ్రాజ్యం చీల్చబడి ఆకాశ నలుదిక్కులకు పంచి పెట్టబడుతుంది. అది అతని వారసులకు సంక్రమించదు, లేదా అతడు ఉపయోగించిన అధికారం దానికి ఉండదు ఎందుకంటే, అతని సామ్రాజ్యం పెరికి వేయబడి ఇతరులకు ఇవ్వబడుతుంది.
DAN 11:5 “తర్వాత దక్షిణాది రాజు బలవంతుడవుతాడు, అయితే అతనికంటే అతని అధిపతులలో ఒకడు ఇంకా ఎక్కువ బలం కలిగి, అతని సొంత రాజ్యంలో గొప్ప అధికారంతో ఏలుతాడు.
DAN 11:6 కొన్ని సంవత్సరాలకు వారిద్దరు మిత్రులవుతారు. అంతేగాక దక్షిణ రాజు కుమార్తె ఉత్తర రాజుతో సంబంధాలు సరిచేయడానికి అతని దగ్గరకు వెళ్తుంది, కాని ఆమె అతని మీద తన ప్రభావాన్ని నిలుపుకోదు, అతడు, అతని అధికారం నిలువదు. ఆ రోజుల్లో ఆమె, ఆమె రాజ అంగరక్షకులు, ఆమె తండ్రి, ఆమెకు సహాయపడినవాడు తృణీకరించబడతారు.
DAN 11:7 “ఆమె కుటుంబ వంశం నుండి ఆమెకు బదులు ఒకడు లేస్తాడు. అతడు ఉత్తరాది రాజు యొక్క బలగాలపై దాడి చేసి అతని కోటలో చొరబడతాడు; అతడు వారి మీద యుద్ధం చేసి గెలుస్తాడు.
DAN 11:8 అతడు వారి దేవుళ్ళను, వారి పోతవిగ్రహాలను, వారి విలువైన వెండి బంగారు వస్తువులను పట్టుకుని ఈజిప్టుకు తీసుకెళ్తాడు. కొన్ని సంవత్సరాలు అతడు ఉత్తరాది రాజును ఒంటరిగా వదిలేస్తాడు.
DAN 11:9 తర్వాత ఉత్తరాది రాజు దక్షిణాది రాజు దేశంలోకి దండెత్తి వస్తాడు కాని, తిరిగి స్వదేశానికి వెళ్లిపోతాడు.
DAN 11:10 అతని కుమారులు యుద్ధానికి సిద్ధపడి, గొప్ప సైన్యాన్ని సమకూరుస్తారు, అది ఆగలేని వరదలా ముందుకు వస్తూ, అతని కోట వరకు యుద్ధాన్ని తీసుకెళ్తుంది.
DAN 11:11 “అప్పుడు దక్షిణాది రాజు కోపంతో గొప్ప సైన్యాన్ని పురికొల్పిన ఉత్తరాది రాజు మీదికి దండెత్తి వస్తాడు, వారిని ఓడిస్తాడు.
DAN 11:12 ఆ సైన్యాన్ని పట్టుకెళ్లిన తర్వాత, దక్షిణాది రాజు గర్వంతో నిండి, వేలమందిని చంపేస్తాడు, అయినా అతని విజయం నిలువదు.
DAN 11:13 ఎందుకంటే ఉత్తరాది రాజు మరో సైన్యాన్ని సిద్ధం చేస్తాడు, అది ముందున్న దానికంటే గొప్పది; కొన్ని సంవత్సరాల తర్వాత, పూర్తిగా సిద్ధం చేయబడిన మహా సైన్యంతో అతడు తిరిగి వస్తాడు.
DAN 11:14 “ఆ రోజుల్లో చాలామంది దక్షిణాది రాజు మీదికి లేస్తారు. నీ సొంత ప్రజల్లో హింసాత్మకమైన వారు దర్శనం నెరవేర్పులో భాగంగా తిరగబడతారు, కాని విఫలమవుతారు.
DAN 11:15 తర్వాత ఉత్తరాది రాజు వచ్చి ముట్టడి దిబ్బలను వేసి, కోటగల పట్టణాన్ని చెరగా పట్టుకుంటాడు. దక్షిణాది బలగాలకు ఎదుర్కొనే శక్తి ఉండదు; వారి యొక్క బలమైన సైన్యానికి కూడా ఎదుర్కొనే బలం ఉండదు.
DAN 11:16 ఉత్తరాది రాజు తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు; అతన్ని ఎదిరించే సామర్థ్యం ఎవరికీ లేదు. అతడు సుందరమైన దేశంలో తనను తాను స్థిరపరచుకుంటాడు, దానిని నాశనం చేసే శక్తి అతనికి ఉంది.
DAN 11:17 అతడు తన రాజ్యమంతటి బలంతో వచ్చి దక్షిణాది రాజుతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతని రాజ్యాన్ని పడగొట్టడానికి ఒక కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేస్తాడు, కాని అతని ప్రణాళికలు విజయవంతం కావు, అవేవి అతనికి సహాయపడవు.
DAN 11:18 తర్వాత అతడు తన దృష్టి సముద్ర తీరాల మీద పెట్టి చాలా పట్టణాలను జయిస్తాడు, కాని అతడు కలిగించిన అవమానాన్ని ఒక సైన్యాధిపతి తుదముట్టించి ఆ అవమానం అతనికే కలిగిస్తాడు.
DAN 11:19 దీని తర్వాత, అతడు తన దేశ కోటల వైపు తిరుగుతాడు, కాని మరెన్నడు కనిపించకుండా, తడబడి పడిపోతాడు.
DAN 11:20 “అతని వారసుడు రాజ వైభవాన్ని నిర్వహించడానికి పన్ను వసూలు చేసేవాన్ని పంపిస్తాడు, అయితే అతడు నాశనమవుతాడు, అయినా ఎవరి కోపం వల్ల లేదా యుద్ధం వల్ల కాదు.
DAN 11:21 “అతని తర్వాత రాజ్య గౌరవం దక్కని నీచమైన వ్యక్తి అధికారంలోకి వస్తాడు. ప్రజలు సురక్షితంగా ఉన్నామని అనుకున్నప్పుడు, అతడు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు, కాని కుట్రతో ఆక్రమించుకుంటాడు.
DAN 11:22 అప్పుడు అతని ఎదుట ఉప్పొంగే సైన్యం కొట్టుకుపోతుంది; అది, దాని నిబంధన అధికారి నాశనమవుతారు.
DAN 11:23 అతనితో సంధి చేసుకున్న తర్వాత అతడు కపటంగా వ్యవహరిస్తాడు, తనతో ఉన్న కొంతమంది ప్రజలతో మాత్రమే అధికారంలోకి వస్తాడు.
DAN 11:24 ధనికమైన ప్రాంతాలు సురక్షితంగా ఉన్నామని భావించినప్పుడు, అతడు వాటిని ఆక్రమించి, తన పితరులు, తన పూర్వికులు సంపాదించలేనిది సంపాదిస్తాడు. అతడు దోపుడుసొమ్మును, కొల్లగొట్టిన సొమ్మును, ధనాన్ని తన అనుచరులకు పంచిపెడతాడు. కోటలు పడగొట్టడానికి కుట్ర చేస్తాడు, కాని కొంతకాలం మట్టుకే.
DAN 11:25 “గొప్ప సైన్యంతో అతడు దక్షిణాది రాజు మీద తన బలాన్ని, ధైర్యాన్ని సమకూరుస్తాడు. దక్షిణాది రాజు చాల శక్తివంతమైన పెద్ద సైన్యం సమకూర్చుకొని యుద్ధం చేస్తాడు, కాని అతనికి విరుద్ధంగా వేసిన కుట్రలను బట్టి అతడు నిలువలేకపోతాడు.
DAN 11:26 రాజు భోజనం తినేవారు, అతన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు; అతని సైన్యం తుడిచివేయబడుతుంది, ఎంతోమంది యుద్ధంలో కూలిపోతారు.
DAN 11:27 ఆ ఇద్దరు రాజులు కీడును ఉద్దేశిస్తూ, ఒకే బల్ల దగ్గర కూర్చుని ఒకనితో ఒకడు అబద్ధాలు చెప్పుకుంటారు, కాని అది నిష్ప్రయోజనం, ఎందుకంటే అంతం దాని నిర్ణీత కాలంలో వస్తుంది.
DAN 11:28 ఉత్తరాది రాజు గొప్ప ఐశ్వర్యంతో తన స్వదేశానికి తిరిగి వస్తాడు, అయితే అతని హృదయం పరిశుద్ధ నిబంధనకు విరుద్ధంగా ఉంటుంది. దానికి విరుద్ధంగా కార్యం చేసి, తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోతాడు.
DAN 11:29 “నిర్ణీత కాలంలో అతడు దక్షిణాది ప్రాంతం మీద మళ్ళీ దాడి చేస్తాడు, అయితే ఈసారి మునుపటి ఫలితానికి భిన్నంగా ఉంటుంది.
DAN 11:30 కిత్తీము అనగా పశ్చిమ తీర ప్రాంతాల ఓడలు అతన్ని వ్యతిరేకిస్తాయి, అతడు ధైర్యం కోల్పోతాడు. అప్పుడు అతడు తన దేశానికి తిరిగివెళ్లి, పరిశుద్ధ నిబంధనకు వ్యతిరేకంగా తన కోపాన్ని చూపిస్తాడు. అతడు తిరిగివెళ్లి పరిశుద్ధ నిబంధనను విడిచిపెట్టినవారి పట్ల దయ చూపిస్తాడు.
DAN 11:31 “అతని సాయుధ దళాలు దేవాలయ కోటను అపవిత్రపరచి అనుదిన బలిని నిలిపివేయడానికి లేచి నాశనానికి కారణమైన హేయమైన దానిని నిలబెడతారు.
DAN 11:32 అతడు దుర్మార్గమైన పనులు చేస్తూ పొగడ్తలతో నిబంధనను అతిక్రమించేవారిని తన వశం చేసుకుంటాడు, అయితే తమ దేవున్ని తెలుసుకున్నవారు కదలక అతన్ని ఎదిరిస్తారు.
DAN 11:33 “ప్రజల్లో జ్ఞానులు చాలామందికి ఉపదేశిస్తారు, కాని వారు ఖడ్గం చేత గాని దహించబడడం వల్ల గాని చెరపట్టబడడం వల్ల గాని దోపిడికి గురికావడం వల్ల గాని హతమవుతారు.
DAN 11:34 వారు పడిపోయినప్పుడు, వారు కొద్ది సహాయం పొందుకుంటారు, అయితే చాలామంది నిజాయితీ లేనివారు వారితో చేరుతారు.
DAN 11:35 అంత్యకాలం కోసం శుద్ధి చేయబడి, పవిత్రపరచబడి, మచ్చలేని వారిగా చేయబడడానికి జ్ఞానులలో కొంతమంది పడిపోతారు, ఎందుకంటే, నిర్ణీత సమయంలో అంతం వస్తుంది.
DAN 11:36 “రాజు తన ఇష్టానుసారంగా చేస్తాడు. తనను తాను ప్రతి దేవునిపైన హెచ్చించుకొని, ఘనపరచుకొని, దేవాది దేవునికి వ్యతిరేకంగా ఎన్నడు వినని విషయాలు మాట్లాడతాడు. ఉగ్రత కాలం పూర్తయ్యే వరకు అతడు వర్ధిల్లుతూ ఉంటాడు, ఎందుకంటే నిర్ణయించబడింది జరగాలి.
DAN 11:37 అతడు తన పూర్వికుల దేవుళ్ళను గాని, స్త్రీలు కోరే దేవున్ని కాని, ఏ ఇతర దేవతను గాని ఆలోచింపక, వారందరి మీద తనను తాను హెచ్చించుకుంటాడు.
DAN 11:38 వారికి బదులు, కోటల దేవున్ని ఘనపరుస్తాడు; తన పూర్వికులకు తెలియని దేవున్ని వెండి, బంగారం, ప్రశస్తమైన రాళ్లు, ఖరీదైన బహుమానాలు ఇచ్చి ఘనపరుస్తాడు.
DAN 11:39 అతడు పరదేశి దేవుని సహాయంతో బలమైన కోటల మీద దాడి చేసి, తనను గుర్తించిన వారిని గొప్పగా ఘనపరుస్తాడు. వారిని అనేకుల మీద పాలకులుగా నియమిస్తాడు, వెలకు దేశాన్ని పంచిపెడతాడు.
DAN 11:40 “అంత్యకాలంలో దక్షిణాది రాజు యుద్ధంలో పాల్గొంటాడు, ఉత్తరాది రాజు రథాలు, గుర్రాల దళం, ఎన్నో యుద్ధ నౌకలతో అతని మీద దాడి చేస్తాడు. అతడు ఎన్నో దేశాలను ఆక్రమించి వరదలా వాటిని లాగేస్తాడు.
DAN 11:41 అతడు సుందరమైన దేశాన్ని కూడ ఆక్రమిస్తాడు, ఎన్నో దేశాలు పడిపోతాయి, కాని ఎదోము, మోయాబు, అమ్మోను నాయకులు అతని చేతి నుండి విడిపించబడతారు.
DAN 11:42 అతడు ఎన్నో దేశాల మీద తన అధికారం కలిగి ఉంటాడు; ఈజిప్టు తప్పించుకోలేదు.
DAN 11:43 ఈజిప్టులో కూడబెట్టిన వెండి, బంగారు నిధులు, విలువైన వస్తువులన్నీ అతని ఆధీనంలోనికి తీసుకుంటాడు. లిబియానీయులు, కూషీయులు అతనికి లొంగిపోతారు.
DAN 11:44 అయితే తూర్పు, ఉత్తరం నుండి వచ్చే సమాచారాలు అతన్ని కలవరపరుస్తాయి. అప్పుడతడు అనేకులను నాశనం చేయడానికి నిర్మూలించడానికి మహా కోపోద్రేకంతో బయలుదేరుతాడు.
DAN 11:45 అతడు తన రాజ గుడారాలను సముద్రాల మధ్య సుందరమైన పవిత్ర పర్వతం దగ్గర వేసుకుంటాడు. అయినా అతడు అంతరించిపోతాడు, ఎవరూ అతనికి సహాయం చేయరు.
DAN 12:1 “ఆ సమయంలో నీ ప్రజలను కాపాడే గొప్ప అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు దేశాల పుట్టుక నుండి ఎప్పుడు సంభవించని ఆపద కాలం వస్తుంది. అయితే ఆ సమయంలో, నీ ప్రజల్లో ఎవరి పేర్లు గ్రంథంలో వ్రాయబడి ఉంటాయో వారు రక్షింపబడతారు.
DAN 12:2 భూలోక మట్టికి చేరి నిద్రించిన వారిలో చాలామంది లేస్తారు: కొందరు నిత్యజీవం, మరికొందరు అవమానం, శాశ్వత నిందను అనుభవించడానికి.
DAN 12:3 జ్ఞానులైనవారు ఆకాశ ప్రకాశంతో ప్రకాశిస్తారు, అనేకులను నీతిమార్గం లోనికి నడిపించేవారు నక్షత్రాల్లా నిత్యం ప్రకాశిస్తారు.
DAN 12:4 అయితే దానియేలూ, నీవు ఈ గ్రంథం యొక్క మాటలను అంత్యకాలం వరకు భద్రపరచి ముద్రించు. చాలామంది జ్ఞానం అధికం చేసుకోవడానికి అటూ ఇటూ వెళ్తూ ఉంటారు.”
DAN 12:5 అప్పుడు దానియేలు అనే నేను చూస్తుండగా, నా ఎదుట ఇద్దరు వ్యక్తులు, ఒకడు నది అవతలి ఒడ్డున మరొకడు ఇవతలి ఒడ్డున నిలబడి ఉన్నారు.
DAN 12:6 వారిలో ఒకడు, నారబట్టలు వేసుకుని నది జలాల మీద ఉన్న వ్యక్తిని, “ఈ భయానకమైన సంఘటనలు జరగడానికి ఎంతకాలం పడుతుంది?” అని అడిగాడు.
DAN 12:7 నారబట్టలు వేసుకుని నది జలాల మీద ఉన్న వ్యక్తి, తన కుడిచేతిని, తన ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి, నిత్యం జీవించే ఆయన మీద ప్రమాణం చేస్తూ, “అది ఒక కాలం, కాలాలు, సగం కాలం వరకు జరుగుతుంది. చివరికి పరిశుద్ధుల అధికారం విరగ్గొట్టబడిన తర్వాత, ఇవన్నీ సమాప్తమైతాయి” అని అనడం నేను విన్నాను.
DAN 12:8 నేను విన్నాను కాని గ్రహించలేదు. కాబట్టి నేను, “నా ప్రభువా! వీటికి పర్యవసానమేంటి?” అని అడిగాను.
DAN 12:9 అతడు జవాబిస్తూ అన్నాడు, “దానియేలూ, నీ మార్గాన్న నీవు వెళ్లు, ఎందుకంటే ఈ సంగతులు అంత్యకాలం వరకు భద్రంగా ముద్రించబడ్డాయి.
DAN 12:10 చాలామంది శుద్ధి చేయబడి, మచ్చలేనివారుగా, పవిత్రులుగా అవుతారు, అయితే దుష్టులు దుష్టులుగానే ఉంటారు. దుష్టులెవరు వీటిని గ్రహించరు కానీ జ్ఞానులు గ్రహిస్తారు.
DAN 12:11 “అనుదిన నైవేద్యం నిలిపివేయడం, వినాశనం కలిగించే హేయమైనది స్థిరపరచబడడం జరిగే కాలం నుండి 1,290 రోజులు గడచిపోతాయి.
DAN 12:12 ఎదురుచూస్తూ 1,335 రోజుల ముగింపు వరకు వేచి ఉండే మనిషి ధన్యుడు.
DAN 12:13 “నీవైతే, నీ మార్గాన్న అంతం వరకు వెళ్లు. నీవు విశ్రమిస్తావు, కాలాంతంలో నీవు లేచి నీకు కేటాయించబడిన స్వాస్థ్యాన్ని పొందుకుంటావు.”
HOS 1:1 ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల పాలన కాలంలో, యెహోయాషు కుమారుడైన యరొబాము అనే ఇశ్రాయేలు రాజు కాలంలో, బెయేరి కుమారుడైన హోషేయకు యెహోవా వాక్కు వచ్చింది:
HOS 1:2 యెహోవా హోషేయ ద్వారా మాట్లాడడం ఆరంభించినప్పుడు, యెహోవా ఇలా అన్నారు, “వెళ్లు, ఒక వ్యభిచారిణిని పెళ్ళి చేసుకో, ఆమెతో పిల్లలు కను, ఎందుకంటే ఈ దేశం కూడా ఒక వ్యభిచారిణిలా యెహోవాకు నమ్మకద్రోహం చేస్తూ ఉంది.”
HOS 1:3 కాబట్టి అతడు దిబ్లయీము కుమార్తెయైన గోమెరును పెళ్ళి చేసుకున్నాడు, ఆమె గర్భవతియై అతనికి కుమారున్ని కన్నది.
HOS 1:4 అప్పుడు యెహోవా హోషేయతో అన్నారు, “అతనికి యెజ్రెయేలు అనే పేరు పెట్టు, ఎందుకంటే యెజ్రెయేలులో జరిగిన రక్తపాతాన్ని బట్టి త్వరలో నేను యెహు వంశాన్ని శిక్షిస్తాను, ఇశ్రాయేలు రాజ్యాన్ని తుదముట్టిస్తాను.
HOS 1:5 ఆ రోజు యెజ్రెయేలు లోయలో నేను ఇశ్రాయేలు విల్లు విరగ్గొడతాను.”
HOS 1:6 గోమెరు మళ్ళీ గర్భవతియై ఆడపిల్లను కన్నది. అప్పుడు యెహోవా హోషేయతో ఇలా అన్నారు, “ఆమెకు లో-రుహామా అని పేరు పెట్టు, ఎందుకంటే నేను ఇక ఇశ్రాయేలును ప్రేమించను వారిని ఏమాత్రం క్షమించను.
HOS 1:7 అయితే యూదా వారికి నా ప్రేమను చూపించి వారిని రక్షిస్తాను; విల్లు, ఖడ్గం, యుద్ధం, గుర్రాలు, రౌతుల వల్ల కాదు, కాని వారి దేవుడనైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను.”
HOS 1:8 ఆమె లో-రుహామాను పాలు మాన్పించిన తర్వాత, గోమెరుకు మరో కుమారుడు పుట్టాడు.
HOS 1:9 అప్పుడు యెహోవా ఇలా అన్నారు, “అతనికి లో-అమ్మీ అని పేరు పెట్టు, ఎందుకంటే మీరు నా జనం కాదు, నేను మీ దేవుడను కాదు.
HOS 1:10 “అయినా ఇశ్రాయేలీయులు సముద్రతీరాన ఉన్న ఇసుకంత విస్తారంగా కొలువలేనంతగా లెక్కపెట్టలేనంతగా ఉంటారు. ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అక్కడే వారు ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు.
HOS 1:11 యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏకమవుతారు; వారు ఒక నాయకున్ని నియమించుకుంటారు, వారు ఈ దేశంలో ఎదుగుతారు, ఎందుకంటే యెజ్రెయేలు దినం గొప్పగా ఉండబోతుంది.
HOS 2:1 “మీరు మీ సోదరులతో, ‘మీరు నా ప్రజలు’ అని, మీ సహోదరీలతో, ‘నా ప్రియమైన వారలారా’ అని అనండి.
HOS 2:2 “మీ తల్లిని గద్దించండి, గద్దించండి, ఆమె నా భార్య కాదు, నేను ఆమె భర్తను కాను. ఆమె తన వ్యభిచార చూపును మానుకోవాలి, తన రొమ్ముల మధ్య నుండి పరపురుషులను తొలగించాలి.
HOS 2:3 లేకపోతే ఆమెను దిగంబరిని చేస్తాను, ఆమె బట్టలు తీసివేసి ఆమె పుట్టిన రోజున ఉన్నట్లు ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమెను ఎడారిలా చేస్తాను, ఎండిపోయిన భూమిలా చేస్తాను దప్పికతో ఆమె చచ్చునట్లు చేస్తాను.
HOS 2:4 ఆమె పిల్లల మీద నా ప్రేమను చూపించను, ఎందుకంటే, వారు వ్యభిచారం వలన పుట్టిన పిల్లలు.
HOS 2:5 వారి తల్లి వ్యభిచారం చేసింది, అవమానంలో వారిని కన్నది. ఆమె, ‘నేను నా ప్రేమికుల వెంట వెళ్తాను, వారు నాకు నా ఆహారం, నీళ్లు, ఉన్ని, జనపనార, ఒలీవనూనె, పానీయం ఇస్తారు’ అన్నది.
HOS 2:6 కాబట్టి ముళ్ళపొదలను ఆమె దారిని అడ్డుగా వేస్తాను; ఆమె తన దారి కనబడకుండ నేను గోడ కడతాను.
HOS 2:7 ఆమె తన ప్రేమికుల వెంటపడుతుంది కాని వారిని కలుసుకోలేదు; ఆమె వారిని వెదుకుతుంది కాని వారు కనబడరు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ‘నేను నా మొదటి భర్త దగ్గరకు తిరిగి వెళ్తాను, ఇప్పటి కంటే అప్పుడే నా స్థితి బాగుండేది.’
HOS 2:8 ఆమెకు ధాన్యం, నూతన ద్రాక్షరసం, నూనె, విస్తారమైన వెండి, బంగారాలు, ఇచ్చింది నేనే అని ఆమె గుర్తించలేదు, వాటిని బయలు కోసం వాడింది.
HOS 2:9 “కాబట్టి కోతకాలంలో నా ధాన్యం నేను తీసివేస్తాను, ద్రాక్షరసం సిద్ధంగా ఉన్నప్పుడు దానిని తీసివేస్తాను. ఆమె దిగంబరత్వాన్ని కప్పుకోడానికి నేను ఇచ్చిన నా ఉన్నిని, నా జనపనారను తిరిగి తీసుకుంటాను.
HOS 2:10 కాబట్టి ఇప్పుడు ఆమె ప్రేమికుల కళ్లెదుట, ఆమె కామాతురతను బయటపెడతాను, ఆమెను నా చేతిలో నుండి ఎవ్వరూ విడిపించలేరు.
HOS 2:11 ఆమె ఉత్సవ వేడుకలన్నిటిని: ఆమె వార్షిక పండుగలు, అమావాస్యలు, ఆమె సబ్బాతు దినాలు అన్ని ఆగిపోయేలా చేస్తాను.
HOS 2:12 తన ప్రేమికులు తనకు ఇచ్చిన జీతం అని ఆమె చెప్పుకునే, ఆమె ద్రాక్షలను అంజూర చెట్లను నేను పాడుచేస్తాను; వాటిని దట్టమైన అడవిగా మారుస్తాను, అడవి జంతువులు వాటిని తినివేస్తాయి.
HOS 2:13 ఆమె బయలులకు ధూపం వేసిన రోజుల గురించి, నేను ఆమెను శిక్షిస్తాను; ఆమె నగలు ఆభరణాలతో అలంకరించుకుని, తన ప్రేమికుల వెంట వెళ్లిపోయింది, కాని నన్ను మరచిపోయింది” అని యెహోవా చెప్తున్నారు.
HOS 2:14 కాబట్టి ఆమెను ఆకర్షించబోతున్నాను; నేను ఆమెను అరణ్యంలోకి నడిపించి, ఆమెతో మృదువుగా మాట్లాడతాను.
HOS 2:15 అక్కడ ఆమె ద్రాక్షతోటలను ఆమెకు తిరిగి ఇస్తాను, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అక్కడ ఆమె తన యవ్వన రోజుల్లో ఉన్నట్లు, ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రోజున ఉన్నట్లు స్పందిస్తుంది.
HOS 2:16 యెహోవా ఇలా అంటున్నారు, “ఆ రోజున నీవు నన్ను, ‘నా భర్తవు’ అని అంటావు; నీవు నన్ను ఇక ఎన్నడు ‘నా బయలు’ అని పిలువవు.
HOS 2:17 నేను ఆమె పెదవుల నుండి బయలుల పేర్లు తీసివేస్తాను; ఇక ఎన్నడు వారి పేర్లు ప్రస్తావించబడవు.
HOS 2:18 ఆ రోజున నా ప్రజల కోసం అడవి జంతువులతో, ఆకాశ పక్షులతో, నేలను ప్రాకే జంతువులతో నిబంధన చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధం దేశంలో లేకుండా చేస్తాను, అప్పుడు వారు క్షేమంగా పడుకుంటారు.
HOS 2:19 నీవు శాశ్వతంగా నాతో ఉండేలా, నేను నిన్ను నీతి, న్యాయంతో, మారని ప్రేమతో, దయతో ప్రధానం చేసుకుంటాను.
HOS 2:20 నీవు యెహోవాను తెలుసుకునేలా, నేను నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రధానం చేసుకుంటాను.
HOS 2:21 “ఆ రోజున నేను జవాబిస్తాను,” అని యెహోవా అంటున్నారు. “నేను ఆకాశాలకు జవాబిస్తాను, అవి భూమికి జవాబిస్తాయి;
HOS 2:22 భూమి ధాన్యంతో, నూతన ద్రాక్షరసంతో, ఒలీవనూనెతో మాట్లాడుతుంది. అవి యెజ్రెయేలుతో మాట్లాడతాయి.
HOS 2:23 నేను ఆమెను నా కోసం దేశంలో నాటుతాను; ‘నా ప్రియురాలు కాదు,’ అని ఎవరి గురించి అన్నానో ఆ వ్యక్తికే నా ప్రేమను చూపిస్తాను. ‘నా ప్రజలు కారు,’ అని ఎవరి గురించి అన్నానో వారితో, ‘మీరు నా ప్రజలు’ అని చెప్తాను; అప్పుడు వారు, ‘మీరే మా దేవుడు’ అంటారు.”
HOS 3:1 యెహోవా నాతో, “వెళ్లు, నీ భార్యను వేరే వ్యక్తి ప్రేమించినా, వ్యభిచారిగా ఉన్నా ఆమెకు నీ ప్రేమను చూపించు. ఇశ్రాయేలీయులు ఇతర దేవుళ్ళను పూజించి పవిత్ర ద్రాక్షపండ్ల ముద్దలను ఆశించనప్పటికి, యెహోవా వారిని ప్రేమించినట్లు ఆమెను ప్రేమించు” అని చెప్పారు.
HOS 3:2 కాబట్టి నేను పదిహేను వెండి నాణేలు, ఒక హోమెరు, ఒక లెతెకు యవలు ఇచ్చి ఆమెను కొనుక్కున్నాను.
HOS 3:3 అప్పుడు ఆమెతో, “నీవు నాతో చాలా కాలం జీవించాలి; నీవు వేశ్యగా ఉండకూడదు, వేరే ఏ పురుషునితో సన్నిహితంగా ఉండకూడదు, అలాగే నేను నీ పట్ల నమ్మకంగా ఉంటాను” అన్నాను.
HOS 3:4 ఎందుకంటే ఇశ్రాయేలీయులు చాలా కాలం రాజు గాని పాలకుడు గాని లేకుండా, బలులు గాని పవిత్ర రాళ్లు గాని లేకుండా, ఏఫోదు గాని గృహ దేవుళ్ళు గాని లేకుండా ఉంటారు.
HOS 3:5 తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగివచ్చి, తమ దేవుడైన యెహోవాను, తమ రాజైన దావీదును వెదుకుతారు. చివరి రోజుల్లో యెహోవా దగ్గరకు, ఆయన దీవెనలు దగ్గరకు వారు వణకుతూ వస్తారు.
HOS 4:1 ఇశ్రాయేలీయులారా, యెహోవా వాక్కు వినండి, యెహోవా ఈ దేశ వాసులైన మీమీద నేరం మోపుతున్నారు: “ఈ దేశంలో నమ్మకత్వం, ప్రేమ దేవుని గురించిన జ్ఞానం అనేవి లేవు.
HOS 4:2 శపించడం, అబద్ధాలు చెప్పడం, హత్య చేయడం, దొంగిలించడం, వ్యభిచారం చేయడం మాత్రమే ఉన్నాయి; వారు దౌర్జన్యాలు మానలేదు, నిత్యం రక్తపాతం జరుగుతూ ఉంది.
HOS 4:3 ఈ కారణంచేత దేశం ఎండిపోతుంది, అందులో నివసించేవారు నీరసించి పోతున్నారు; అడవి జంతువులు, ఆకాశపక్షులు, సముద్రపు చేపలు నశించిపోతున్నాయి.
HOS 4:4 “అయితే ఏ ఒకరిపై నేరం మోపకండి, ఏ ఒక్కరు ఇంకొకరిని నిందించకండి, ఎందుకంటే మీ ప్రజలు యాజకుని మీద నేరం మోపుతారు.
HOS 4:5 మీరు పగలు రాత్రులు తడబడతారు, ప్రవక్తలు మీతో కలిసి తడబడతారు, కాబట్టి నేను నీ తల్లిని నాశనం చేస్తాను.
HOS 4:6 జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు. “మీరు జ్ఞానాన్ని త్రోసివేశారు కాబట్టి, నేను కూడా మిమ్మల్ని నా యాజకులుగా ఉండకుండా త్రోసివేస్తున్నాను; మీరు మీ దేవుని ఉపదేశాన్ని పట్టించుకోలేదు కాబట్టి, నేను కూడా మీ పిల్లలను పట్టించుకోను.
HOS 4:7 యాజకుల సంఖ్య పెరిగిన కొద్దీ, వారు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు; వారి ఘనతను అవమానంగా మారుస్తాను.
HOS 4:8 నా ప్రజల పాపాన్ని ఆహారంగా చేసుకుంటారు వారి దుష్టత్వం ఎక్కువ కావాలని కోరుకుంటారు.
HOS 4:9 కాబట్టి ప్రజలు జరిగినట్లే యాజకులకు జరుగుతుంది. వారి విధానాలను బట్టి వారిద్దరిని నేను శిక్షిస్తాను వారి క్రియలకు తగిన ప్రతిఫలం వారికిస్తాను.
HOS 4:10 “వారు తింటారు, కాని తృప్తి పొందరు; వారు వ్యభిచారం చేస్తారు, కాని అభివృద్ధి చెందరు, ఎందుకంటే వారు యెహోవాను వదిలేశారు, తమను తాము
HOS 4:11 వ్యభిచారానికి అప్పగించుకున్నారు; పాత ద్రాక్షరసం, క్రొత్త ద్రాక్షరసం వారి మతిని పోగొట్టాయి.
HOS 4:12 నా ప్రజలు చెక్క విగ్రహాన్ని సంప్రదిస్తారు, సోదె చెప్పే వాని కర్ర వారితో మాట్లాడుతుంది. వ్యభిచార ఆత్మ వారిని చెదరగొడుతుంది; వారు తమ దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు.
HOS 4:13 వారు పర్వత శిఖరాల మీద బలులు అర్పిస్తారు కొండలమీద ధూపం వేస్తారు, సింధూర, చినారు, మస్తకి వృక్షాల క్రింద నీడ మంచిగా ఉన్నచోట బలులు అర్పిస్తారు. కాబట్టి మీ కుమార్తెలు వేశ్యలయ్యారు మీ కోడళ్ళు వ్యభిచారిణులయ్యారు.
HOS 4:14 “మీ కుమార్తెలు వేశ్యలు అయినందుకు, నేను వారిని శిక్షించను, మీ కోడళ్ళు వ్యభిచారం చేసినందుకు, నేను వారిని శిక్షించను ఎందుకంటే, మనుష్యులు వ్యభిచారిణులుతో పోతారు, క్షేత్ర వ్యభిచారులతో పాటు బలులు అర్పిస్తారు, గ్రహింపు లేని ప్రజలు నాశనమవుతారు.
HOS 4:15 “ఇశ్రాయేలూ, నీవు వ్యభిచారం చేసినా సరే, యూదా అపరాధం చేయకూడదు. “గిల్గాలుకు వెళ్లవద్దు; బేత్-ఆవెనుకు వెళ్లవద్దు. ‘యెహోవా జీవం తోడు’ అని ఒట్టు పెట్టుకోవద్దు.
HOS 4:16 పొగరుబోతు పెయ్యలా ఇశ్రాయేలీయులు మొండిగా ఉన్నారు. అలాగైతే యెహోవా వారిని విశాల మైదానంలో గొర్రెపిల్లలను మేపినట్టు ఎలా పోషిస్తారు?
HOS 4:17 ఎఫ్రాయిం విగ్రహాలతో కలుసుకున్నాడు; అతన్ని అలాగే వదిలేయండి!
HOS 4:18 వారి పానీయాలు అయిపోయినా, వారి వ్యభిచారం కొనసాగిస్తున్నారు; వారి పాలకులు సిగ్గుమాలిన విధానాలను ఎంతో ఇష్టపడతారు.
HOS 4:19 సుడిగాలి వారిని చెదరగొడుతుంది, వారి బలుల వలన వారికి అవమానం కలుగుతుంది.
HOS 5:1 “యాజకులారా! ఇది వినండి, ఇశ్రాయేలీయులారా! శ్రద్ధగా వినండి, రాజ వంశస్థులారా! వినండి, ఈ తీర్పు మీ కొరకే ఇవ్వబడింది: మీరు మిస్పాలో ఉరిగా, తాబోరు మీద వలలా ఉన్నారు.
HOS 5:2 తిరుగుబాటుదారులు ఘోరమైన హత్యలు చేశారు. వారందరిని నేను శిక్షిస్తాను.
HOS 5:3 ఎఫ్రాయిం గురించి నాకు అంతా తెలుసు; ఇశ్రాయేలు నా నుండి దాచబడలేదు. ఎఫ్రాయిమూ! ఇప్పుడు నీవు వ్యభిచారం వైపు తిరిగావు; ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది.
HOS 5:4 “వారి పనుల వలన వారు తమ దేవుని దగ్గరకు తిరిగి రారు. వారి హృదయాల్లో వ్యభిచార ఆత్మ ఉంది; వారు యెహోవాను గుర్తించరు.
HOS 5:5 ఇశ్రాయేలీయుల అహంకారం వారికి విరోధంగా సాక్ష్యమిస్తుంది; ఇశ్రాయేలీయులు, ఎఫ్రాయిమువారు కూడా తమ పాపంలో తడబడతారు; యూదా కూడా వారితో తడబడుతుంది.
HOS 5:6 వారు యెహోవాను వెదకడానికి తమ గొర్రెలను, పశువులను వెంటబెట్టుకొని వెళ్లినప్పుడు, ఆయనను కనుగొనరు; ఎందుకంటే ఆయన వారికి దూరంగా ఉన్నారు.
HOS 5:7 వారు యెహోవా పట్ల అపనమ్మకంగా ఉన్నారు; వారు అక్రమ సంతానాన్ని కన్నారు. వారు అమావాస్య ఉత్సవాలు జరుపుకున్నప్పుడు, ఆయన వారి భూములను నాశనం చేస్తారు.
HOS 5:8 “గిబియాలో బాకానాదం చేయండి, రామాలో బూర ఊదండి. బెన్యామీనూ, నీ వెనుకే వస్తున్నాము; బేత్-ఆవెనులో యుద్ధ నినాదాలు చేయండి.
HOS 5:9 దండన రోజున ఎఫ్రాయిం పాడైపోతుంది. తప్పనిసరిగా జరగబోయే దానిని నేను ఇశ్రాయేలు గోత్రాలకు ప్రకటిస్తున్నాను.
HOS 5:10 యూదా నాయకులు సరిహద్దు రాళ్లను జరిపే వారిలా ఉన్నారు. వారి మీద నా కోపాన్ని నీటి ప్రవాహంలా కుమ్మరిస్తాను.
HOS 5:11 ఎఫ్రాయిమీయులు విగ్రహాల వెంట వెళ్తున్నారు కాబట్టి వారు హింసించబడతారు, తీర్పులో త్రొక్కబడతారు.
HOS 5:12 నేను ఎఫ్రాయిం వారికి చిమ్మెట పురుగులా ఉన్నాను, యూదా ప్రజలకు కుళ్లు పట్టించే తెగులుగా ఉంటాను.
HOS 5:13 “ఎఫ్రాయిం తన రోగాన్ని, యూదా తన పుండ్లను చూసుకున్నప్పుడు, ఎఫ్రాయిం అష్షూరు వైపు తిరిగి గొప్ప రాజును సహాయం కోరాడు. అయితే అతడు నిన్ను బాగుచేయలేదు, నీ పుండ్లను స్వస్థపరచలేదు.
HOS 5:14 ఎందుకంటే నేను ఎఫ్రాయిముకు సింహంలా యూదాకు కొదమసింహంలా ఉంటాను. నేను వారిని ముక్కలుగా చీల్చి వెళ్లిపోతాను; వారిని మోసుకెళ్తాను, వారిని కాపాడేవారెవరూ ఉండరు.
HOS 5:15 వారు తమ అపరాధం ఒప్పుకుని నన్ను వెదికే వరకు నేను నా స్థలానికి తిరిగి వెళ్తాను, వారు తమ దురవస్థలో నన్ను తీవ్రంగా వెదకుతారు.”
HOS 6:1 “రండి, మనం యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. ఆయన మనల్ని ముక్కలుగా చీల్చారు కాని ఆయనే మనల్ని బాగుచేస్తారు; ఆయన మనల్ని గాయపరచారు కాని ఆయన మన గాయాలను కడతారు.
HOS 6:2 రెండు రోజుల తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తారు, ఆయన సన్నిధిలో మనం బ్రతికేటట్టు, మూడవ రోజున ఆయన మనల్ని పునరుద్ధరిస్తారు.
HOS 6:3 మనం యెహోవా గురించి తెలుసుకుందాం; ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సూర్యోదయం ఎంత నిశ్చయమో, ఆయన ప్రత్యక్షమవ్వడం అంతే నిశ్చయం; ఆయన శీతాకాలం వర్షాల్లా, భూమిని తడిపే తొలకరి వానలా దగ్గరకు వస్తారు.”
HOS 6:4 “ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి? యూదా, నిన్ను నేనేం చేయాలి? మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా, ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది.
HOS 6:5 కాబట్టి నా ప్రవక్తల ద్వారా మిమ్మల్ని ముక్కలు చేశాను, నా నోటిమాటల ద్వారా మిమ్మల్ని చంపాను, అప్పుడు నా తీర్పులు మెరుపులా ప్రకాశిస్తాయి.
HOS 6:6 ఎందుకంటే నేను దయను కోరుతున్నాను బలిని కాదు, దహనబలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టము.
HOS 6:7 ఆదాములా వారు నా నిబంధనను మీరారు; వారు నాకు నమ్మకద్రోహం చేశారు.
HOS 6:8 గిలాదు దుర్మార్గుల పట్టణం, దానిలో రక్తపు అడుగుజాడలు ఉన్నాయి.
HOS 6:9 బందిపోటు దొంగల్లా మాటున పొంచి ఉన్నట్లు, యాజకుల గుంపు పొంచి ఉంది; షెకెము మార్గంలో వారు హత్య చేస్తారు, దుర్మార్గపు కుట్రలు చేస్తూ ఉంటారు.
HOS 6:10 నేను ఇశ్రాయేలులో ఘోరమైన విషయాన్ని చూశాను: అక్కడ ఎఫ్రాయిం వ్యభిచారానికి అప్పగించుకుంది, ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది.
HOS 6:11 “నేను నా ప్రజలను మునుపటి స్థితికి తీసుకువచ్చినప్పుడు, “యూదా వారలారా, మీ కోసం కూడా కోత సిద్ధంగా ఉంది.
HOS 7:1 నేను ఇశ్రాయేలును స్వస్థపరిచేటప్పుడు, ఎఫ్రాయిం పాపాలు బహిర్గతం అవుతున్నాయి, సమరయ నేరాలు బయటపడుతున్నాయి. వారు మోసం చేస్తూనే ఉంటారు, దొంగలు ఇళ్ళలో చొరబడతారు, బందిపోటు దొంగలు వీధుల్లో దోచుకుంటారు;
HOS 7:2 అయితే వారి చెడు పనులన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటానని వారు గ్రహించరు. వారి పాపాలు వారిని చుట్టుముట్టాయి; అవి ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి.
HOS 7:3 “వారు తమ దుష్టత్వంతో రాజును, వారి అబద్ధాలతో అధిపతులను సంతోషపరుస్తారు.
HOS 7:4 వారంతా వ్యభిచారులు, పొయ్యిలా మండుతూ ఉంటారు, వంటమనిషి ముద్ద పిసికిన తర్వాత అది పొంగే వరకు వేడి చేసిన పొయ్యివంటి వారు.
HOS 7:5 మన రాజు పండుగ దినాన, అధిపతులు ద్రాక్ష మద్యం మత్తులో ఉంటారు. అతడు అపహాసకులతో చేతులు కలుపుతాడు.
HOS 7:6 వారి హృదయాలు పొయ్యివంటివి; కుట్రతో వారు అతన్ని సమీపిస్తారు. రాత్రంతా వారి కోపాగ్ని రగులుతూ ఉంటుంది; ఉదయాన అది మండే అగ్నిలా ప్రజ్వలిస్తుంది.
HOS 7:7 వారంతా పొయ్యిలా వేడిగా ఉన్నారు; వారు తమ పాలకులను మ్రింగివేస్తారు వారి రాజులందరూ కూలిపోతారు, వారిలో ఏ ఒక్కడు నన్ను ప్రార్థించడు.
HOS 7:8 “ఎఫ్రాయిం దేశాలతో కలిసిపోతుంది; ఎఫ్రాయిం తిరిగేయని అప్పం లాంటిది.
HOS 7:9 విదేశీయులు అతని బలాన్ని లాగేస్తారు, కాని అతడు గ్రహించడు. అతని తలమీద నెరసిన వెంట్రుకలు ఉంటాయి, కాని అతడు గమనించడు.
HOS 7:10 ఇశ్రాయేలు అహంకారం అతనికి విరుద్ధంగా సాక్ష్యం ఇస్తుంది, కాని ఇదంతా జరిగినా కూడా అతడు తన దేవుడైన యెహోవా వైపు తిరగడం లేదు, ఆయనను వెదకడం లేదు.
HOS 7:11 “ఎఫ్రాయిం గువ్వ లాంటిది, బుద్ధిలేక సులభంగా మోసపోతుంది, అది ఈజిప్టును పిలుస్తుంది, అది అష్షూరు వైపు తిరుగుతుంది.
HOS 7:12 వారు వెళ్లేటప్పుడు, నేను వారి మీద నా వల వేస్తాను; నేను వారిని ఆకాశంలో పక్షుల్లా క్రిందికి లాగుతాను. వారు సమాజంగా కూడుకుంటున్నారని నేను విన్నప్పుడు, నేను వారిని శిక్షిస్తాను.
HOS 7:13 వారికి శ్రమ కలుగుతుంది, ఎందుకంటే నా మీద తిరుగుబాటు చేశారు! వారికి నాశనం కలుగుతుంది, ఎందుకంటే నాకు విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. నేను వారిని విమోచించాలని ఆశిస్తాను, కాని వారు నా గురించి అబద్ధాలు చెప్పారు.
HOS 7:14 వారు తమ హృదయపూర్వకంగా నాకు మొరపెట్టరు, కాని తమ పడకల మీద విలపిస్తారు. ధాన్యం కోసం, నూతన ద్రాక్షరసం కోసం, వారు తమ దేవుళ్ళను వేడుకుంటూ తమను తాము కొట్టుకుంటారు కాని వారు నా నుండి తొలగిపోయారు.
HOS 7:15 నేను వారికి శిక్షణ ఇచ్చి బలపరిచాను, కాని నాకు విరుద్ధంగా దురాలోచన చేస్తున్నారు.
HOS 7:16 వారు సర్వోన్నతుని వైపు తిరుగరు, వారు పనికిరాని విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ గర్వపు మాటల వలన కత్తివేటుకు పడిపోతారు. ఇందుచేత ఈజిప్టు దేశంలో వారు ఎగతాళి చేయబడతారు.
HOS 8:1 “బూర నీ పెదవులపై పెట్టుకో! ఒక గ్రద్ద యెహోవా ఇంటి మీద వ్రాలింది. ఎందుకంటే ప్రజలు నా నిబంధనను మీరి, నా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు.
HOS 8:2 ఇశ్రాయేలు, ‘మా దేవా! మిమ్మల్ని మేము తెలుసుకున్నాం’ అని మొరపెడుతుంది.
HOS 8:3 కాని ఇశ్రాయేలు మంచి దానిని విసర్జించారు; కాబట్టి శత్రువులు వారిని తరుముతారు.
HOS 8:4 వారు నా సమ్మతి లేకుండా రాజులను నియమించుకున్నారు, వారు నా ఆమోదం లేకుండా అధిపతులను ఎన్నుకున్నారు. వారి వెండి బంగారాలతో తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు. అవి వారి సొంత నాశనానికే.
HOS 8:5 సమరయా, నీ దూడ విగ్రహాన్ని తీసివేయి! నా కోపం వాటి మీద రగులుకుంది ఎంతకాలం మీరు అపవిత్రులుగా ఉంటారు?
HOS 8:6 ఆ విగ్రహాలు ఇశ్రాయేలువి! ఈ దూడను కంసాలి తయారుచేశాడు. అది దేవుడు కాదు, ఆ సమరయ దూడ ముక్కలుగా విరగ్గొట్టబడుతుంది.
HOS 8:7 “వారు గాలిని విత్తుతారు, సుడిగాలిని కోస్తారు. పైరుకు కంకులు లేవు, దాని నుండి పిండి రాదు. అది ఒకవేళ పంటకు వస్తే, విదేశీయులు దాన్ని మ్రింగివేస్తారు.
HOS 8:8 ఇశ్రాయేలు మ్రింగివేయబడింది; ఇప్పుడు అది ఎవరికీ ఇష్టం లేనిదానిగా, ఇతర దేశాల మధ్య ఉంది.
HOS 8:9 వారు ఒంటరిగా తిరిగే అడవి గాడిదలా, అష్షూరుకు వెళ్లారు, ఎఫ్రాయిం తనను తాను విటులకు అమ్ముకుంది.
HOS 8:10 వారు తమను ఇతర దేశాల్లో అమ్ముకున్నప్పటికీ, నేను వారిని ఇప్పుడు సమకూరుస్తాను. బలవంతుడైన రాజు పెట్టే భారం క్రింద, వారు నీరసించిపోతారు.
HOS 8:11 “పాపపరిహార బలులు అర్పించడానికి ఎఫ్రాయిం అనేక బలిపీఠాలు నిర్మించింది, కాని అవే పాపం చేయడానికి కారణమయ్యాయి.
HOS 8:12 నేను వారి కోసం నా ధర్మశాస్త్ర విషయాలు ఎన్నో వ్రాశాను, కాని అవి తమకు సంబంధించినవి కావన్నట్లు పరిగణించారు.
HOS 8:13 వారు తమ బలులు నాకు బహుమానంగా ఇచ్చినా, వాటి మాంసం తిన్నా సరే, యెహోవా వారిని బట్టి సంతోషించడం లేదు. ఇప్పుడు ఆయన వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని, వారి పాపాలను శిక్షిస్తారు: వారు ఈజిప్టుకు తిరిగి వెళ్తారు.
HOS 8:14 ఇశ్రాయేలు తమ సృష్టికర్తను మరచిపోయి రాజభవనాలను కట్టుకున్నారు; యూదావారు చాలా పట్టణాలకు కోటలు కట్టుకున్నారు. అయితే నేను వారి పట్టణాల మీద అగ్ని కురిపిస్తాను, అది వాటి కోటలను దహించి వేస్తుంది.”
HOS 9:1 ఇశ్రాయేలూ, ఆనందించకు; ఇతర దేశాల్లా ఉత్సాహపడకు. నీవు నీ దేవుని పట్ల నమ్మకంగా లేవు; ధాన్యం దుల్లగొట్టే నీ నూర్పిడి కళ్ళాలన్నిటిలో నీవు వేశ్యల జీతాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డావు.
HOS 9:2 నూర్పిడి కళ్ళాలు, ద్రాక్ష గానుక తొట్లు ప్రజలను పోషించవు, క్రొత్త ద్రాక్షరసం వారికి మిగలదు.
HOS 9:3 వారు యెహోవా దేశంలో నిలిచి ఉండరు, ఎఫ్రాయిం ఈజిప్టుకు తిరిగి వెళ్తుంది, అష్షూరులో అపవిత్ర ఆహారాన్ని తింటుంది.
HOS 9:4 వారు యెహోవాకు ద్రాక్షరస పానార్పణలు అర్పించరు, వారి బలులు ఆయనను సంతోషపరచవు. అట్టి బలులు ఏడ్చేవారి రొట్టెలా ఉంటాయి. వాటిని తినేవారందరు అపవిత్రులవుతారు. ఈ ఆహారం వారికే సరిపడుతుంది; అది యెహోవా మందిరంలోకి రాదు.
HOS 9:5 మీ నియమించబడిన పండుగల దినాన, యెహోవా విందు దినాల్లో మీరేం చేస్తారు?
HOS 9:6 వారు నాశనాన్ని తప్పించుకున్నా సరే, ఈజిప్టువారిని సమకూరుస్తుంది, మెంఫిసు వారిని పాతిపెడుతుంది. వారికి ప్రియమైన వెండి వస్తువులను దురదగొండ్లు ఆక్రమిస్తాయి, వారి గుడారాలు ముళ్ళతో నిండుతాయి.
HOS 9:7 శిక్షా దినాలు వస్తున్నాయి, వెల చెల్లించే దినాలు సమీపంగా ఉన్నాయి. ఇశ్రాయేలు దీనిని తెలుసుకోవాలి. ఎందుకంటే మీ అపరాధాలు అనేకం, మీరు చూపిన శత్రుత్వం తీవ్రమైంది కాబట్టి ప్రవక్త మూర్ఖునిగా, ప్రభావం గల వ్యక్తి పిచ్చివానిగా పరిగణించబడుతున్నారు.
HOS 9:8 నా దేవునితో పాటు ఉండే ప్రవక్త ఎఫ్రాయిం ప్రజలకు కావలివాడు, అయినప్పటికీ అతని త్రోవలన్నిట్లో ఉచ్చులు పొంచి ఉన్నాయి. తన దేవుని ఆలయంలో కూడా శత్రువులు ఉన్నారు.
HOS 9:9 గిబియా రోజుల్లో ఉన్నట్లు, వారు అవినీతిలో లోతుగా మునిగిపోయారు. దేవుడు వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని, వారి పాపాల కోసం వారిని శిక్షిస్తారు.
HOS 9:10 “నాకు ఇశ్రాయేలు దొరికినప్పుడు, ఎడారిలో ద్రాక్షపండ్లు చూసినట్లు అనిపించింది; నేను మీ పూర్వికులను చూసినప్పుడు, అంజూర చెట్టు మీద తొలి పండ్లను చూసినట్లు అనిపించింది. అయితే వారు బయల్-పెయోరు వచ్చినప్పుడు, వారు ఆ సిగ్గుమాలిన విగ్రహానికి తమను తాము ప్రతిష్ఠించుకొన్నారు, తాము ఇష్టపడింది ఎంత నీచమో, వారు అంత నీచులయ్యారు.
HOS 9:11 ఎఫ్రాయిం యొక్క ఘనత పక్షిలా ఎగిరిపోతుంది, పుట్టుక, గర్భధారణ, పిల్లలను కనడం వారిలో ఉండవు.
HOS 9:12 వారు పిల్లలను పెంచినా సరే, నేను వారికి మనుష్యులందరిని దూరం చేస్తాను. నేను వారిని విడిచిపెట్టినప్పుడు, వారికి శ్రమ!
HOS 9:13 నేను ఎఫ్రాయిమును, అందమైన స్థలంలో నాటబడిన తూరులా చూశాను. కాని ఎఫ్రాయిం తన పిల్లలను, వధించే వాని దగ్గరకు తెస్తుంది.”
HOS 9:14 యెహోవా, వారికి ఇవ్వండి, వారికి మీరేమి ఇస్తారు, జన్మనివ్వలేని గర్భాలను, ఎండిపోయిన రొమ్ములను వారికి ఇవ్వండి.
HOS 9:15 “గిల్గాలులో వారి చెడుతనం అంతటిని బట్టి, అక్కడ వారిని ద్వేషిస్తున్నాను. వారు పాప క్రియలనుబట్టి, నేను వారిని నా మందిరంలో నుండి వెళ్లగొడతాను. నేను ఇక ఎన్నడూ వారిని ప్రేమించను; వారి నాయకులంతా తిరుగుబాటుదారులు.
HOS 9:16 ఎఫ్రాయిమువారు మొత్తబడ్డారు, వారి వేరు ఎండిపోయింది, వారు ఇక ఫలించరు. ఒకవేళ వారు పిల్లలు కన్నా, వారి ప్రియమైన సంతతిని నేను నాశనం చేస్తాను.”
HOS 9:17 వారు నా దేవునికి లోబడలేదు కాబట్టి, ఆయన వారిని తిరస్కరించారు; వారు ఇతర దేశాల్లో తిరుగుతూ ఉంటారు.
HOS 10:1 ఇశ్రాయేలు విస్తరించిన ద్రాక్షచెట్టు; అతడు బాగా ఫలించాడు. అతడు ఫలించినకొద్దీ, అతడు ఎక్కువ బలిపీఠాలను కట్టాడు. అతని భూమి సారవంతమైన కొద్ది, అతడు తన పవిత్ర రాళ్లను అలంకరించాడు.
HOS 10:2 వారి హృదయం కపటమైనది, ఇప్పుడు వారు తమ అపరాధానికి శిక్షను భరించాలి. యెహోవా వారి బలిపీఠాలను పడగొట్టి, వారి పవిత్ర రాళ్లను నాశనం చేస్తారు.
HOS 10:3 అప్పుడు వారు, “మనకు రాజు లేడు ఎందుకంటే మనం యెహోవాకు భయపడలేదు. ఒకవేళ మనకు రాజు ఉన్నా కూడా, అతడు మనకు ఏమి చేయగలడు?” అంటారు.
HOS 10:4 వారు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, అబద్ధ ప్రమాణాలు చేస్తారు ఒప్పందాలు చేసుకుంటారు; కాబట్టి వాదనలు దున్నబడిన పొలంలో విషపు మొక్కల్లా మొలుస్తాయి.
HOS 10:5 సమరయలో నివసించే ప్రజలు, బేత్-ఆవెనులో ఉన్న దూడ విగ్రహం గురించి భయపడతారు. దాని ఘనత పోయిందని దాని ప్రజలు దుఃఖపడతారు, దాని వైభవం గురించి ఆనందించిన దాని యాజకులు ఏడుస్తారు.
HOS 10:6 అది అష్షూరుకు కొనిపోబడి, మహారాజుకు కానుకగా ఇవ్వబడుతుంది. ఎఫ్రాయిం అవమానించబడుతుంది; ఇశ్రాయేలు తాను చేసిన తప్పుడు ఆలోచనలను బట్టి సిగ్గుపడుతుంది.
HOS 10:7 సమరయ రాజు నాశనమవుతాడు, అతడు నీటిలో విరిగిపోయిన రెమ్మలా కొట్టుకు పోతాడు.
HOS 10:8 ఇశ్రాయేలు పాపానికి ప్రతిరూపాలైన దుష్టత్వం కలిగిన క్షేత్రాలు నాశనం చేయబడతాయి. ముండ్ల చెట్లు, గచ్చపొదలు పెరిగి వారి బలిపీఠాలను కప్పుతాయి. అప్పుడు వారు పర్వతాలతో, “మమ్మల్ని కప్పండి!” అని కొండలతో, “మామీద పడండి!” అని అంటారు.
HOS 10:9 “ఇశ్రాయేలూ, గిబియా కాలం నుండి నీవు పాపం చేస్తూ ఉన్నావు. నీవు అదే స్థితిలో ఉండిపోయావు. గిబియాలోని దుర్మార్గుల మీదికి మరలా యుద్ధం రాలేదా?
HOS 10:10 నాకు ఇష్టమైనప్పుడు, నేను వారిని శిక్షిస్తాను; వారి రెండంతల పాపం కోసం వారిని బంధకాలలో పెట్టడానికి దేశాలు వారికి విరుద్ధంగా కూడుకుంటాయి.
HOS 10:11 ఎఫ్రాయిం శిక్షణ పొందిన పెయ్యలా ఉంది, నూర్పిడి అంటే దానికి ఇష్టం; కాబట్టి దాని నున్నటి మెడ మీద నేను కాడి పెడతాను, నేను ఎఫ్రాయిం మీద స్వారీ చేస్తాను, యూదా భూమిని దున్నాలి, యాకోబు భూమిని చదును చేయాలి.
HOS 10:12 మీ కోసం నీతిని విత్తండి, మారని ప్రేమ అనే పంట కోయండి. దున్నబడని భూమిని చదును చేయండి; ఎందుకంటే, యెహోవా మీ దగ్గరకు వచ్చి, నీతి వర్షం మీపై కురిపించే వరకు, యెహోవాను వెదికే సమయం ఇదే.
HOS 10:13 కాని మీరు దున్ని దుష్టత్వాన్ని నాటారు, మీరు చెడును కోశారు, మీరు వంచన ఫలాలు తిన్నారు. మీరు మీ సొంత బలాన్ని, మీకున్న అనేకమంది యోధులను నమ్ముకున్నారు.
HOS 10:14 కాబట్టి మీ ప్రజల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది, షల్మాను యుద్ధంలో బేత్-అర్బేలును పాడుచేసినట్లు, మీ కోటలన్నీ నాశనమవుతాయి, ఆ రోజు తల్లులు తమ పిల్లలతో పాటు నేలకు కొట్టబడతారు.
HOS 10:15 బేతేలు, నీకు ఇలా జరుగుతుంది, ఎందుకంటే, నీ దుష్టత్వం ఘోరంగా ఉంది. ఆ రోజు ఉదయించినప్పుడు, ఇశ్రాయేలు రాజు సంపూర్ణంగా నాశనమవుతాడు.
HOS 11:1 “ఇశ్రాయేలు శిశువుగా ఉన్నప్పుడు నేను అతన్ని ప్రేమించాను, ఈజిప్టులో నుండి నేను నా కుమారుని పిలిచాను.
HOS 11:2 అయితే ఎంత ఎక్కువగా వారిని పిలిస్తే, అంతగా వారు నా నుండి దూరమయ్యారు. వారు బయలుకు బలులు అర్పించారు, విగ్రహాలకు ధూపం వేశారు.
HOS 11:3 ఎఫ్రాయిం ప్రజలను చేయి పట్టుకుని, నడవడం నేర్పింది నేనే; అయితే వారిని స్వస్థపరచింది నేనని వారు గ్రహించలేదు.
HOS 11:4 నేను మనుష్యుల మంచితనం అనే త్రాళ్లతో, ప్రేమ బంధాలతో వారిని నడిపించాను. ఒకడు చిన్నబిడ్డను ముఖం దగ్గరకు ఎలా తీసుకుంటారో, అలా నేను వారికి ఉంటూ వారి మీద నుండి కాడిని తీసివేశాను, నేను క్రిందికి వంగి వారిని పోషించాను.
HOS 11:5 “వారు ఈజిప్టుకు తిరిగి వెళ్లరా? అష్షూరు రాజు వారిమీద అధికారం చేయడా? ఎందుకంటే వారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు.
HOS 11:6 వారి పట్టణాల్లో ఖడ్గం తళుక్కుమంటుంది; అది వారి అబద్ధ ప్రవక్తలను మ్రింగివేస్తుంది, వారి ఉపాయాలను తుదముట్టిస్తుంది.
HOS 11:7 నా ప్రజలు నా నుండి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నారు. వారు మహోన్నత దేవుడనైన నాకు మొరపెట్టినా, నేను ఏ విధంగాను వారిని హెచ్చించను.
HOS 11:8 “ఎఫ్రాయిమూ, నిన్ను ఎలా వదిలేయగలను? ఇశ్రాయేలూ, నిన్ను ఎలా అప్పగించగలను? నిన్ను ఎలా అద్మాలా పరిగణించగలను? సెబోయిములా నిన్ను ఎలా చేయగలను? నా హృదయం నాలో మారింది; నా జాలి అంతా ఉప్పొంగుతుంది.
HOS 11:9 నేను నా కోపాగ్నిని చూపించను, ఎఫ్రాయిమును మరలా నాశనం చేయను. నేను దేవుడను, మనిషిని కాను, మీ మధ్య ఉన్న పరిశుద్ధ దేవుడను. నేను వారి పట్టణాలకు విరుద్ధంగా రాను.
HOS 11:10 వారు యెహోవాను అనుసరిస్తారు; ఆయన సింహంలా గర్జిస్తారు, ఆయన గర్జించినప్పుడు, ఆయన పిల్లలు పడమటి నుండి వణకుతూ వస్తారు.
HOS 11:11 వారు వణకుతూ ఈజిప్టు నుండి పక్షుల్లా ఎగిరి వస్తారు, అష్షూరు నుండి గువ్వల్లా అల్లాడుతూ వస్తారు. వారిని తమ ఇళ్ళలో నివసించేలా చేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
HOS 11:12 ఎఫ్రాయిం అబద్ధాలతో నన్ను చుట్టుముట్టింది, ఇశ్రాయేలు మోసంతో నన్ను ఆవరించింది. యూదా దేవునికి విరుద్ధంగా ఉంది, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు.
HOS 12:1 ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు; అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు. అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడు ఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు.
HOS 12:2 యెహోవా యూదా మీద నేరారోపణ చేస్తున్నారు; ఆయన యాకోబును తన మార్గాలను బట్టి శిక్షిస్తారు ఆయన అతని క్రియలనుబట్టి అతనికి ప్రతిఫలం ఇస్తారు.
HOS 12:3 తల్లి గర్భంలో అతడు తన సోదరుని కాలి మడమను పట్టుకున్నాడు; అతడు పెద్దవాడయ్యాక దేవునితో పోరాడాడు.
HOS 12:4 అతడు దేవదూతతో పోరాడి గెలిచాడు; అతడు ఏడ్చి, దయచూపమని వేడుకున్నాడు. బేతేలులో అతడు దేవున్ని కనుగొన్నాడు అక్కడ అతడు ఆయనతో మాట్లాడాడు.
HOS 12:5 ఆయన సైన్యాల అధిపతియైన యెహోవా, ఆయన పేరు యెహోవా!
HOS 12:6 అయితే నీవు నీ దేవుని దగ్గరకు తిరిగి రావాలి; ప్రేమ, న్యాయం కలిగి ఉండాలి, నీ దేవుని కోసం ఎల్లప్పుడు వేచి ఉండాలి.
HOS 12:7 వ్యాపారి తప్పుడు తూకం వాడుతూ మోసం చేయడానికి ఇష్టపడతాడు.
HOS 12:8 “నేను చాలా ధనవంతుడను; నాకున్న ధనాన్ని బట్టి వారు నాలో ఏ తప్పును కాని పాపాన్ని కాని చూపించలేరు” అని ఎఫ్రాయిం అతిశయిస్తున్నాడు.
HOS 12:9 “మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను; మీ నియమించబడిన పండుగ రోజుల్లో ఉన్నట్లు నేను మిమ్మల్ని మరలా గుడారాల్లో నివసింపజేస్తాను.
HOS 12:10 నేను ప్రవక్తలతో మాట్లాడాను. వారికి అనేక దర్శనాలను ఇచ్చి ఉపమానరీతిగా వారికి చెప్పాను.”
HOS 12:11 గిలాదు చెడ్డదా? దాని ప్రజలు వ్యర్థమైన వారు! వారు గిల్గాలులో కోడెలను బలి అర్పిస్తున్నారా? వారి బలిపీఠాలు దున్నబడిన పొలంలోని రాళ్ల కుప్పల్లా ఉన్నాయి.
HOS 12:12 యాకోబు అరాము దేశానికి పారిపోయాడు; ఇశ్రాయేలు భార్యను పొందడానికి సేవ చేశాడు, భార్యను సంపాదించడానికి గొర్రెలు కాచాడు.
HOS 12:13 యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తీసుకురావడానికి ఒక ప్రవక్తను వాడుకున్నారు, ప్రవక్త ద్వారా ఆయన వారిని సంరక్షించారు.
HOS 12:14 కాని ఎఫ్రాయిం ఆయన మహా కోపాన్ని రేపాడు అతడు చేసిన రక్తపాతం బట్టి దేవుడు అతని మీద నేరం మోపుతారు అతని ధిక్కారం బట్టి ఆయన అతనికి ప్రతీకారం చేస్తారు.
HOS 13:1 ఎఫ్రాయిం మాట్లాడినప్పుడు ప్రజలు వణికారు; అతడు ఇశ్రాయేలులో ఘనపరచబడ్డాడు. కాని అతడు బయలును పూజించి అపరాధిగా చనిపోయాడు.
HOS 13:2 ఇప్పుడు వారు మరి ఎక్కువ పాపం చేస్తున్నారు; వారు వెండితో తమ కోసం విగ్రహాలను చేసుకుంటున్నారు, అవి నైపుణ్యంతో చేయబడిన ప్రతిమలు, అవన్నీ కళాకారుని చేతిపనులు. ఈ ప్రజల గురించి ఇలా చెప్తారు, “వారు నరబలులు అర్పిస్తారు! దూడ విగ్రహాలను ముద్దు పెట్టుకుంటారు!”
HOS 13:3 కాబట్టి వారు ఉదయకాలపు పొగలా ఉంటారు, ఉదయకాలపు మంచులా అదృశ్యం అవుతారు, నూర్పిడి కళ్ళంలో నుండి గాలికి ఎగిరే పొట్టులా ఉంటారు, కిటికీలో గుండా పోయే పొగలా అయిపోతారు.
HOS 13:4 “మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను; మీరు నన్ను తప్ప మరే దేవున్ని అంగీకరించకూడదు, నేను తప్ప రక్షకుడు ఎవరూ లేరు.
HOS 13:5 మీరు తీవ్రమైన వేడిగల అరణ్యంలో ఉన్నప్పుడు, నేను మిమ్మల్ని సంరక్షించాను.
HOS 13:6 నేను వారిని పోషించగా వారు తృప్తి చెందారు. వారు తృప్తి చెందిన తర్వాత గర్వించి; నన్ను మరచిపోయారు.
HOS 13:7 కాబట్టి నేను వారికి సింహంలా ఉంటాను, చిరుతపులిలా దారిలో పొంచి ఉంటాను.
HOS 13:8 పిల్లలు పోయిన ఎలుగుబంటిలా, నేను వారిపై పడి వారిని చీల్చివేస్తాను; సింహంలా వారిని మ్రింగివేస్తాను, అడవి మృగంలా వారిని చీల్చివేస్తాను.
HOS 13:9 “ఇశ్రాయేలూ! నీవు నాశనమవుతావు ఎందుకంటే నీవు నీ సహాయకుడనైన నాకు విరుద్ధంగా ఉన్నావు.
HOS 13:10 నిన్ను కాపాడగలిగే నీ రాజు ఎక్కడా? మీ పట్టణాలన్నిటిలో ఉండే మీ అధిపతులు ఎక్కడా? వారి గురించి నీవు, ‘నాకు రాజును అధిపతులను ఇవ్వండి’ అని నీవు అడిగావు కదా?
HOS 13:11 కాబట్టి నేను కోపంలో నీకు రాజును ఇచ్చాను. నా ఆగ్రహంతో అతన్ని తొలగించాను.
HOS 13:12 ఎఫ్రాయిం అపరాధం పోగుచేయబడింది, అతని పాపాలు వ్రాయబడ్డాయి.
HOS 13:13 ప్రసవ వేదనలాంటి శ్రమ అతనికి కలుగుతుంది, కాన్పు సమయం వచ్చినప్పుడు కాని అతడు జ్ఞానంలేని శిశువుగా ఉన్నాడు; గర్భం నుండి బయటకు రాని శిశువులా అతడు జ్ఞానంలేనివానిగా ఉన్నాడు.
HOS 13:14 “నేను ఈ ప్రజలను పాతాళం శక్తి నుండి విడిపిస్తాను; మరణం నుండి వారిని విమోచిస్తాను. ఓ మరణమా, నీవు కలిగించే తెగుళ్ళు ఎక్కడ? ఓ పాతాళమా, నీవు కలిగించే నాశనం ఎక్కడ? “అతడు తన సోదరుల మధ్య ఎదుగుతున్నా సరే,
HOS 13:15 నేను ఎఫ్రాయిం పట్ల దయ చూపించను. యెహోవా నుండి తూర్పు గాలి వస్తుంది, ఎడారి నుండి అది వీస్తుంది. అతని నీటిబుగ్గ ఎండిపోతుంది అతని బావి ఇంకిపోతుంది. అతని ధననిధులు, ప్రియమైన వస్తువులు దోచుకోబడతాయి.
HOS 13:16 సమరయ ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి, ఎందుకంటే వారు తమ దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారు ఖడ్గానికి కూలుతారు; వారి చంటి పిల్లలు నేలకు కొట్టబడతారు, వారి గర్భిణీల కడుపులు చీల్చబడతాయి.”
HOS 14:1 ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవా దగ్గరకు మరలా రా! నీ పాపాలను బట్టి నీవు పడిపోయావు!
HOS 14:2 మాటలు సిద్ధపరచుకొని యెహోవా దగ్గరకు రా. ఆయనతో ఇలా చెప్పు: “మా పాపాలన్నీ క్షమించండి మమ్మల్ని దయతో స్వీకరించండి, కోడెలకు బదులుగా మేము మా పెదవులను అర్పిస్తాము.
HOS 14:3 అష్షూరు మమ్మల్ని రక్షించలేదు; మేము యుద్ధ గుర్రాలను ఎక్కము. మా చేతులు చేసిన వాటితో మేము, ‘మా దేవుళ్ళు’ అని ఇక ఎన్నడు చెప్పము, ఎందుకంటే మీరు తండ్రిలేనివారికి దయ చూపుతారు.”
HOS 14:4 “నేను వారి నమ్మకద్రోహాన్ని సరిచేస్తాను, మనస్పూర్తిగా వారిని ప్రేమిస్తాను, ఎందుకంటే వారి మీదున్న నా కోపం చల్లారింది.
HOS 14:5 నేను ఇశ్రాయేలుకు మంచులా ఉంటాను; అతడు తామరలా వికసిస్తాడు. లెబానోను దేవదారు చెట్టులా అతని వేర్లు భూమి లోతుకు వెళ్తాయి;
HOS 14:6 అతని చిగురు పెరుగుతుంది. అతని వైభవం ఒలీవ చెట్టులా, అతని సువాసన లెబానోను దేవదారులా ఉంటుంది.
HOS 14:7 అతని నీడలో ప్రజలు నివసిస్తారు; వారు ధాన్యంలా అభివృద్ధి చెందుతారు, వారు ద్రాక్షలా వికసిస్తారు, ఇశ్రాయేలు కీర్తి లెబానోను ద్రాక్షరసంలా ఉంటుంది.
HOS 14:8 ఎఫ్రాయిమూ, ఇకనుండి విగ్రహాలతో నాకేం పని? నేనే అతనికి జవాబిస్తాను, అతన్ని సంరక్షిస్తాను. నేను పచ్చని సరళ వృక్షం వంటి వాన్ని; నా వలనే నీకు ఫలం కలుగుతుంది.”
HOS 14:9 జ్ఞానులెవరు? వారు ఈ విషయాలు గ్రహించాలి. వివేచన గలవారెవరు? వారు కూడ గ్రహించాలి. యెహోవా మార్గాలు సరియైనవి; నీతిమంతులు వాటిలో నడుస్తారు, కాని తిరుగుబాటుదారులు వాటిలో తొట్రిల్లుతారు.
JOE 1:1 ఇది పెతూయేలు కుమారుడైన యోవేలుకు వచ్చిన యెహోవా వాక్కు.
JOE 1:2 పెద్దలారా, దీనిని వినండి; దేశ నివాసులారా, మీరంతా ఆలకించండి. ఇప్పుడు జరుగుతున్నది, మీ కాలంలో గాని, మీ పూర్వికుల కాలంలో గాని ఎప్పుడైనా జరిగిందా?
JOE 1:3 ఈ సంగతి మీ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలు తమ పిల్లలకు చెప్పాలి, వారి పిల్లలు రాబోయే తరం వారికి చెప్పాలి.
JOE 1:4 మిడతల గుంపు విడిచిపెట్టిన దానిని పెద్ద మిడతలు తినేశాయి; పెద్ద మిడతలు విడిచిపెట్టిన దానిని చిన్న మిడతలు తినేశాయి; చిన్న మిడతలు విడిచిపెట్టిన దానిని ఇతర మిడతలు తినేశాయి.
JOE 1:5 త్రాగుబోతులారా, మేల్కొని ఏడవండి! ద్రాక్షరసం త్రాగే మీరందరు విలపించండి; క్రొత్త ద్రాక్షరసం కోసం విలపించండి, ఎందుకంటే అది మీ నోటి పెదవుల దగ్గర నుండి తీసివేయబడింది.
JOE 1:6 లెక్కలేనంత గొప్ప సైన్యం ఉన్న ఒక దేశం, నా దేశాన్ని ఆక్రమించింది; దానికి సింహం పళ్లు ఉన్నాయి ఆడసింహం కోరలు ఉన్నాయి.
JOE 1:7 అది నా ద్రాక్ష చెట్లను పాడుచేసింది నా అంజూర చెట్లను నాశనం చేసింది. అది వాటి బెరడు ఒలిచి పడవేసినందుకు, చెట్ల కొమ్మలు తెల్లగా కనిపించాయి.
JOE 1:8 తన యవ్వన భర్తను కోల్పోయి గోనెపట్ట కట్టుకుని, దుఃఖించే కన్యలా దుఃఖించండి.
JOE 1:9 భోజనార్పణలు పానార్పణలు యెహోవా మందిరంలోకి రాకుండ నిలిచిపోయాయి. యెహోవ ఎదుట సేవచేసే యాజకులు శోకంలో ఉన్నారు.
JOE 1:10 పొలాలు పాడయ్యాయి, నేల ఎండిపోయింది; ధాన్యం నాశనమైంది, క్రొత్త ద్రాక్షరసం ఎండిపోయింది, ఒలీవనూనె అయిపోయింది.
JOE 1:11 రైతులారా, నిరాశ చెందండి, ద్రాక్షలను పెంచే వారలారా, విలపించండి, గోధుమ, యవల కోసం దుఃఖించండి, ఎందుకంటే పొలం పంట పాడైపోయింది.
JOE 1:12 ద్రాక్ష ఎండిపోయింది అంజూర చెట్టు వాడిపోయింది; దానిమ్మ, తాటి చెట్టు, ఆపిల్ పండు చెట్లు, పొలం లోని చెట్లన్నీ ఎండిపోయాయి. ఖచ్చితంగా మనుష్యులకు ఆనందం లేకుండా పోయింది.
JOE 1:13 యాజకులారా, మీరు గోనెపట్ట కట్టుకుని ఏడవండి; బలిపీఠం దగ్గర సేవ చేసేవారలారా, మీరు రోదించండి. నా దేవుని ఎదుట సేవ చేసేవారలారా, రండి, రాత్రంత గోనెపట్ట కట్టుకుని గడపండి; ఎందుకంటే దేవుని మందిరంలోకి భోజనార్పణలు పానార్పణలు రాకుండ నిలిచిపోయాయి.
JOE 1:14 పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి; పరిశుద్ధ సభను నిర్వహించండి. మీ దేవుడైన యెహోవా మందిరానికి వచ్చి, యెహోవాకు మొరపెట్టడానికి పెద్దలను పిలిపించండి, దేశవాసులందరిని పిలిపించండి.
JOE 1:15 యెహోవా దినం దగ్గరపడింది; అయ్యో! ఆ దినం నాశనంలా సర్వశక్తుని నుండి వస్తుంది.
JOE 1:16 మన కళ్లెదుటే దేవుని మందిరంలో ఆహారం నిలిపివేయబడలేదా సంతోషం ఆనందం నిలిచిపోలేదా?
JOE 1:17 విత్తనాలు మట్టిగడ్డల క్రింద కుళ్లిపోతున్నాయి. ధాన్యం ఎండిపోవడంతో, గిడ్డంగులు పాడైపోయాయి ధాన్యాగారాలు పడగొట్టబడ్డాయి.
JOE 1:18 తినడానికి మేత లేక పశువులు ఎంతగానో మూలుగుతున్నాయి! మందలు అటూ ఇటూ తిరుగుతున్నాయి; గొర్రెల మందలు కూడా శిక్షను అనుభవిస్తున్నాయి.
JOE 1:19 యెహోవా మీకు నేను మొరపెడుతున్నాను, ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లను అగ్ని కాల్చివేసింది పొలం లోని చెట్లన్నిటిని మంటలు కాల్చివేశాయి.
JOE 1:20 కాలువలు ఎండిపోయాయి; అరణ్యంలో అగ్ని పచ్చికబయళ్లను కాల్చివేసింది మీ కోసం అడవి జంతువులు కూడా దాహంతో ఉన్నాయి.
JOE 2:1 సీయోనులో బూర ఊదండి; నా పరిశుద్ధ పర్వతం మీద నినాదాలు చేయండి. యెహోవా దినం రాబోతుంది కాబట్టి, దేశ నివాసులంతా వణకాలి, ఆ దినం సమీపంగా ఉంది.
JOE 2:2 అది దట్టమైన చీకటి ఉండే దినం, అది కారు మబ్బులు గాఢాంధకారం ఉండే దినం, పర్వతాలమీద ఉదయకాంతి ప్రసరించినట్టు, బలమైన మహా గొప్ప సైన్యం వస్తుంది, అలాంటివి పూర్వకాలంలో ఎన్నడూ లేవు, ఇకమీదట రాబోయే తరాలకు ఉండవు.
JOE 2:3 వాటి ముందు అగ్ని మండుతూ ఉంది, వాటి వెనుక మంటలు మండుతూ ఉన్నాయి. అవి రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది, అవి వచ్చిన తర్వాత ఎండిన ఎడారిలా మారింది ఏదీ వాటినుండి తప్పించుకోలేదు.
JOE 2:4 అవి గుర్రాల్లా కనిపిస్తున్నాయి; సైనికుల గుర్రాల్లా అవి పరుగెడుతున్నాయి.
JOE 2:5 రథాలు కదిలే ధ్వనిలా, అగ్నిజ్వాలలు కాల్చుతున్న శబ్దంలా, యుద్ధానికి సిద్ధమైన మహా సైన్యంలా, అవి పర్వత శిఖరాల మీద దూకుతున్నాయి,
JOE 2:6 వాటిని చూసి ప్రజలు వేదన చెందుతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి.
JOE 2:7 అవి వీరుల్లా ముందుకు వస్తున్నాయి, సైనికుల్లా అవి గోడలెక్కి వస్తున్నాయి. అవి అటూ ఇటూ తిరుగకుండా, తిన్నగా నడుస్తున్నాయి.
JOE 2:8 ఒక దానినొకటి త్రోసుకోకుండా, అన్నీ నేరుగా ముందుకు వస్తున్నాయి. వాటికి ఆయుధాలు ఎదురుపడినా, అవి వరుస మాత్రం తప్పవు.
JOE 2:9 అవి పట్టణం మీదికి దూసుకు వస్తాయి. గోడ మీద పరుగెత్తుతూ వస్తాయి. దొంగలు కిటికీల నుండి చొరబడినట్లు, అవి ఇళ్ళలోనికి దూరుతున్నాయి.
JOE 2:10 వాటికి ముందు భూమి కంపిస్తుంది, ఆకాశాలు వణకుతాయి, సూర్యచంద్రులకు చీకటి కమ్ముతుంది. నక్షత్రాలు ఇక ప్రకాశించవు.
JOE 2:11 యెహోవా తన సైన్యాన్ని నడిపిస్తూ ఉరుములా గర్జిస్తారు; ఆయన బలగాలు లెక్కకు మించినవి, ఆయన ఆజ్ఞకు లోబడే సైన్యం గొప్పది, యెహోవా దినం గొప్పది; అది భయంకరమైనది, దాన్ని ఎవరు తట్టుకోగలరు?
JOE 2:12 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఇప్పుడైనా ఉపవాసముండి ఏడుస్తూ దుఃఖిస్తూ మీ హృదయమంతటితో నా దగ్గరకు రండి.”
JOE 2:13 మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను చీల్చుకుని, మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి, ఆయన కృపా కనికరం గలవాడు, త్వరగా కోప్పడడు, మారని ప్రేమగలవాడు ఆయన జాలిపడుతూ విపత్తును పంపించకుండా ఉంటారు.
JOE 2:14 ఆయన మీ వైపు తిరిగి మనస్సు మార్చుకుంటారేమో, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు, మళ్ళీ మీరు మీ దేవుడైన యెహోవాకు భోజనార్పణలు, పానార్పణలు తెస్తారేమో, ఎవరికి తెలుసు?
JOE 2:15 సీయోనులో బూర ఊదండి, పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి, పరిశుద్ధ సభకు ప్రజలను పిలువండి.
JOE 2:16 ప్రజలను సమకూర్చండి, సమావేశాన్ని ప్రతిష్ఠించండి; పెద్దలను రప్పించండి, పిల్లలను సమకూర్చండి, చంటి పిల్లలను కూడా తీసుకురండి. పెళ్ళికుమారుడు తన గదిని పెళ్ళికుమార్తె తన పెద్ద గదిని విడిచి రావాలి.
JOE 2:17 యెహోవా ఎదుట సేవచేసే యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి. వారు, “యెహోవా! మీ ప్రజలను కనికరించండి. మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు. ‘వీరి దేవుడు ఎక్కడ?’ అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?”
JOE 2:18 అప్పుడు యెహోవా తన దేశంపట్ల ఆసక్తి చూపి, ప్రజలను కనికరించారు.
JOE 2:19 యెహోవా వారికి ఇలా జవాబిచ్చారు: “నేను మిమ్మల్ని పూర్తిగా తృప్తిపరచడానికి, ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె పంపుతున్నాను; ఇక ఎన్నడూ మిమ్మల్ని దేశాల్లో అవమానానికి గురిచేయను.
JOE 2:20 “నేను ఉత్తర దిక్కునుండి వచ్చే సైన్యాన్ని మీకు దూరంగా తరిమివేస్తాను. ఎండిపోయిన, నిస్సారమైన ప్రాంతానికి దానిని పంపివేస్తాను; తూర్పు వైపున్న దాని సైన్యం మృత సముద్రంలో మునిగిపోతుంది, పశ్చిమ వైపున్న దాని సైన్యం మధ్యధరా సముద్రంలో మునిగిపోతుంది. అది కంపు కొడుతుంది, దాని దుర్వాసన లేస్తుంది.” నిజంగా ఆయన గొప్పకార్యాలు చేశారు!
JOE 2:21 యూదా దేశమా, భయపడకు; సంతోషించు, ఆనందించు. నిజంగా యెహోవా గొప్పకార్యాలు చేశారు!
JOE 2:22 అడవి జంతువులారా, భయపడకండి, ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లు పచ్చగా మారుతున్నాయి. చెట్లు తమ ఫలాలు ఇస్తాయి. అంజూర చెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి.
JOE 2:23 సీయోను ప్రజలారా, సంతోషించండి, మీ దేవుడైన యెహోవాను బట్టి ఆనందించండి, ఆయన నమ్మదగినవారు కాబట్టి, ఆయన మీకు తొలకరి వర్షం ఇచ్చారు. ఆయన సమృద్ధి వర్షాలు పంపిస్తారు, ఆయన ముందు పంపినట్లు తొలకరి వర్షం, కడవరి వర్షం పంపిస్తారు.
JOE 2:24 నూర్పిడి కళ్ళాలు ధాన్యంతో నిండి ఉంటాయి, క్రొత్త ద్రాక్షరసం, నూనెతో గానుగ తొట్లు పొర్లిపారుతాయి.
JOE 2:25 “నేను మీ మధ్యకు పంపిన నా గొప్ప సైన్యం పెద్ద మిడతలు, చిన్న మిడతలు, ఇతర మిడతలు, మిడతల గుంపులు తినేసిన సంవత్సరాల పంటను నేను తిరిగి మీకు ఇస్తాను.
JOE 2:26 మీరు కడుపునిండా తిని తృప్తి పొందేవరకు మీకు సమృద్ధి ఉంటుంది, మీ కోసం అద్భుతాలు చేసిన మీ దేవుడైన యెహోవా నామాన్ని మీరు స్తుతిస్తారు; ఇక మరెన్నడు నా ప్రజలు సిగ్గుపడరు.
JOE 2:27 అప్పుడు నేను ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నానని, నేను మీ దేవుడైన యెహోవానని, వేరే దేవుడు ఎవరూ లేరని మీరు తెలుసుకుంటారు; ఇక మరెన్నడు నా ప్రజలు సిగ్గుపడరు.
JOE 2:28 “ఆ తర్వాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ యువకులు దర్శనాలు చూస్తారు.
JOE 2:29 ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను.
JOE 2:30 నేను ఆకాశంలో అద్భుతాలను, భూమి మీద రక్తం, అగ్ని, గొప్ప పొగను చూపిస్తాను.
JOE 2:31 యెహోవా భయంకరమైన మహాదినం రాకముందు, సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారుతాడు.
JOE 2:32 యెహోవా పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు; యెహోవా చెప్పినట్టే, సీయోను పర్వతం మీద, యెరూషలేములో విడుదల ఉంటుంది, ఎవరినైతే యెహోవా పిలుచుకుంటారో, వారు రక్షింపబడతారు.
JOE 3:1 “ఆ దినాల్లో ఆ కాలంలో, నేను యూదా, యెరూషలేము వారిని తిరిగి రప్పించినప్పుడు,
JOE 3:2 నేను దేశాలన్నిటిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోకి నడిపిస్తాను. నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులకు వారు చేసిన దానిని బట్టి, అక్కడ వారికి న్యాయ విచారణ జరిగిస్తాను, ఎందుకంటే వారు నా ప్రజలను దేశాల్లో చెదరగొట్టారు నా దేశాన్ని విభజించారు.
JOE 3:3 వారు నా ప్రజల కోసం చీట్లు వేసి అబ్బాయిలను ఇచ్చి వేశ్యలను తీసుకున్నారు. అమ్మాయిలను అమ్మి ద్రాక్షరసం కొన్నారు.
JOE 3:4 “తూరూ, సీదోనూ, ఫిలిష్తియా ప్రాంతాలందరూ, నా మీద మీకున్న వ్యతిరేకత ఏంటి? నేను చేసిన దానికి నాకు ప్రతీకారం చేస్తున్నారా? ఒకవేళ మీరు నాకు ప్రతీకారం చేస్తే, మీరు చేసిన దాన్ని త్వరలోనే, చాలా వేగంగా మీ తల మీదికి రప్పిస్తాను.
JOE 3:5 ఎందుకంటే మీరు నా వెండి బంగారాలను తీసుకెళ్లారు, నా శ్రేష్ఠమైన వస్తువులను మీ గుళ్ళకు తీసుకెళ్లారు.
JOE 3:6 యూదా, యెరూషలేము ప్రజలు తమ ప్రాంతానికి దూరం ఉండాలని వారిని గ్రీకులకు అమ్మివేశారు.
JOE 3:7 “చూడండి, మీరు వారిని అమ్మి వేసిన స్థలాల నుండి వారిని రప్పిస్తాను. మీరు చేసిన దాన్ని మీ తల మీదికే రప్పిస్తాను.
JOE 3:8 నేను మీ కుమారులను, కుమార్తెలను యూదా ప్రజలకు అమ్ముతాను, వారు దూర దేశస్థులైన షెబాయీయులకు వారిని అమ్మివేస్తారు.” యెహోవా చెప్పింది ఇదే.
JOE 3:9 దేశాల మధ్య ఈ విషయం చాటించండి, యుద్ధానికి సిద్ధపడండి! వీరులను పురికొల్పండి, పోరాడేవారందరు సమకూడి వచ్చి దాడి చేయాలి.
JOE 3:10 మీ నాగటి నక్కులను సాగగొట్టి ఖడ్గాలు చేయండి, మడ్డికత్తులను సాగగొట్టి ఈటెలుగా చేయండి. “నేను బలవంతున్ని!” అని బలహీనులు అనుకోవాలి.
JOE 3:11 ప్రతి వైపు ఉన్న అన్ని దేశాల్లారా, త్వరగా రండి, అక్కడ సమకూడండి. యెహోవా, మీ వీరులను తీసుకురండి!
JOE 3:12 “దేశాలు లేవాలి; అవి యెహోషాపాతు లోయ వైపు వెళ్లాలి నలుదిశల ఉన్న అన్ని దేశాలకు తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.
JOE 3:13 పంట పండింది కాబట్టి, కొడవలి తిప్పండి, ద్రాక్షగానుగ నిండింది తొట్లు పొర్లి పారుతున్నాయి కాబట్టి రండి, ద్రాక్షలను త్రొక్కండి, వారి దుష్టత్వం అధికంగా ఉంది!”
JOE 3:14 తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు, ఎందుకంటే తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం ఆసన్నమైంది.
JOE 3:15 సూర్యచంద్రులు చీకటిగా మారుతాయి, నక్షత్రాలు ఇక ప్రకాశించవు.
JOE 3:16 యెహోవా సీయోను నుండి గర్జిస్తారు, యెరూషలేములో నుండి ఉరుముతారు; భూమ్యాకాశాలు వణకుతాయి, అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయంగా ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలకు దుర్గంగా ఉంటారు.
JOE 3:17 “అప్పుడు మీ దేవుడైన యెహోవానైన నేను నా పవిత్ర కొండయైన సీయోను మీద నివసిస్తానని మీరు తెలుసుకుంటారు. యెరూషలేము పరిశుద్ధంగా ఉంటుంది; ఇక ఎన్నడు ఇతర దేశాల సైన్యాలు దానిని ఆక్రమించరు.
JOE 3:18 “ఆ రోజు పర్వతాల నుండి క్రొత్త ద్రాక్షరసం ప్రవహిస్తుంది, కొండల నుండి పాలు ప్రవహిస్తాయి; యూదాలోని వాగులన్నిటిలో నీళ్లు పారతాయి. యెహోవా మందిరంలో నుండి ఒక ఊట ప్రవహిస్తూ, షిత్తీము లోయను తడుపుతుంది.
JOE 3:19 అయితే ఈజిప్టు పాడైపోతుంది, ఎదోము పాడైపోయిన ఎడారిగా అవుతుంది. ఎందుకంటే ఈ దేశాలు యూదా ప్రజలపై దౌర్జన్యం చేశాయి, వారి దేశంలో నిర్దోషుల రక్తం చిందించారు.
JOE 3:20 యూదాలో ప్రజలు నిత్యం నివసిస్తారు, యెరూషలేము తరతరాలకు నివాస స్థలంగా ఉంటుంది.
JOE 3:21 వారు చిందించిన నిర్దోషుల రక్తాన్ని బట్టి ప్రతీకారం తీసుకోకుండా వారిని వదిలేయాలా? నేను ప్రతీకారం చేస్తాను.”
AMO 1:1 యూదాకు రాజుగా ఉజ్జియా, ఇశ్రాయేలు రాజుగా యెహోయాషు కుమారుడైన యరొబాము ఉన్న సమయంలో, భూకంపం రావడానికి రెండు సంవత్సరాలు ముందే ఇశ్రాయేలు ప్రజలను గురించి తెకోవలోని గొర్రెల కాపరులలో ఒకడైన ఆమోసు చూసిన దర్శనము.
AMO 1:2 ఆమోసు ఇలా చెప్పాడు: “యెహోవా సీయోను నుండి గర్జిస్తున్నారు యెరూషలేము నుండి ఉరుముతున్నారు; కాపరుల పచ్చికబయళ్లు ఎండిపోతున్నాయి, కర్మెలు పర్వత శిఖరం వాడిపోతుంది.”
AMO 1:3 యెహోవా ఇలా చెప్తున్నారు: “దమస్కు చేసిన మూడు పాపాల గురించి, దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అది గిలాదును ఇనుప పనిముట్లతో నూర్చింది.
AMO 1:4 నేను హజాయేలు ఇంటి మీదికి అగ్నిని పంపుతాను, అది బెన్-హదదు కోటలను దగ్ధం చేస్తుంది.
AMO 1:5 దమస్కు ద్వారాన్ని విరగ్గొడతాను; ఆవెను లోయలో ఉన్న రాజును నాశనం చేస్తాను అతడు బేత్-ఏదెనులో రాజదండం పట్టుకున్నవాడు. అరాము ప్రజలు కీరుకు బందీలుగా వెళ్తారు” అని యెహోవా చెప్తున్నారు.
AMO 1:6 యెహోవా ఇలా చెప్తున్నారు: “గాజా చేసిన మూడు పాపాల గురించి, నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అది సమాజమంతటిని బందీలుగా తీసుకెళ్లి ఎదోముకు అమ్మివేసింది.
AMO 1:7 నేను గాజా ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను, అది దాని కోటలను దగ్ధం చేస్తుంది.
AMO 1:8 నేను అష్డోదు రాజును నాశనం చేస్తాను, అతడు అష్కెలోనులో రాజదండం పట్టుకున్నవాడు. నేను ఫిలిష్తీయులలో చివరి వారు మరణించే వరకు, నేను ఎక్రోనుకు విరుద్ధంగా నా చేతిని ఉంచుతాను” అని ప్రభువైన యెహోవా చెప్తున్నారు.
AMO 1:9 యెహోవా ఇలా చెప్తున్నారు: “తూరు చేసిన మూడు పాపాల గురించి, దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే సహోదర ఒప్పందాన్ని పరిగణించకుండా, అది సమాజమంతటిని బందీలుగా ఎదోముకు అమ్మివేసింది.
AMO 1:10 నేను తూరు ప్రాకారాల మీదికి అగ్నిని పంపుతాను, అది దాని కోటలను దగ్ధం చేస్తుంది.”
AMO 1:11 యెహోవా చెప్పే మాట ఇదే: “ఎదోము చేసిన మూడు పాపాల గురించి, అతని నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అతడు తన సోదరున్ని ఖడ్గంతో వెంటాడాడు, ఆ దేశ స్త్రీలను చంపేశాడు, అతని కోపం అధికమవుతూ ఉంది, ఎప్పుడూ రగులుతూ ఉంది.
AMO 1:12 నేను తేమాను మీదికి అగ్నిని పంపుతాను, అది బొస్రాలోని కోటలను దగ్ధం చేస్తుంది.”
AMO 1:13 యెహోవా ఇలా చెప్తున్నారు: “అమ్మోను చేసిన మూడు పాపాల గురించి, అతని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అతడు తన సరిహద్దులను విశాల పరచడానికి, గిలాదులో ఉన్న గర్భిణి స్త్రీల కడుపులను చీల్చాడు.
AMO 1:14 నేను రబ్బా ప్రాకారాలను తగలబెడతాను, యుద్ధం రోజున యుద్ధ నినాదాల మధ్యలో, తుఫాను రోజున పెనుగాలి వీస్తూ ఉన్నప్పుడు, అగ్ని దాని కోటలను దగ్ధం చేస్తుంది.
AMO 1:15 దాని రాజు, తన రాజ పరివారంతో పాటు బందీగా వెళ్తాడు” అని యెహోవా చెప్తున్నారు.
AMO 2:1 యెహోవా చెప్పే మాట ఇదే: “మోయాబు చేసిన మూడు పాపాల గురించి, అతని నాలుగు పాపాల గురించి నేను అతన్ని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అతడు ఎదోము రాజు ఎముకలను కాల్చి బూడిద చేశాడు.
AMO 2:2 నేను మోయాబు మీదికి అగ్నిని పంపుతాను, అది కెరీయోతు కోటలను దగ్ధం చేస్తుంది. యుద్ధ నినాదాల మధ్యలో, బూర శబ్దం వినబడినప్పుడు, మోయాబు గొప్ప కలవరంతో అంతరిస్తుంది.
AMO 2:3 నేను దాని పరిపాలకున్ని నిర్మూలిస్తాను, అతనితో పాటు దాని అధిపతులందరినీ హతం చేస్తాను,” అని యెహోవా చెప్తున్నారు.
AMO 2:4 యెహోవా చెప్పే మాట ఇదే: “యూదా వారు చేసిన మూడు పాపాల గురించి, వారి నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను, ఎందుకంటే వారు యెహోవా ఉపదేశాలను విసర్జించారు, ఆయన శాసనాలను పాటించలేదు, వారి పూర్వికులు అనుసరించిన అబద్ధ దేవుళ్ళను నమ్ముకొని, వారి వల్ల దారి తప్పారు.
AMO 2:5 నేను యూదా మీదికి అగ్నిని పంపుతాను, అది యెరూషలేము కోటలను దగ్ధం చేస్తుంది.”
AMO 2:6 యెహోవా చెప్పే మాట ఇదే: “ఇశ్రాయేలు చేసిన మూడు పాపాల గురించి, వారి నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను, వారు నిర్దోషులను వెండి కోసం అమ్మారు, బీదలను చెప్పుల కోసం అమ్మారు.
AMO 2:7 వారు నేల మట్టిని త్రొక్కినట్టు బీదల తలలను త్రొక్కుతున్నారు హింసించబడే వారికి న్యాయం జరగనివ్వలేదు. తండ్రీ, కుమారులు ఒకే స్త్రీ దగ్గరకు వెళ్లారు అలా నా పరిశుద్ధ నామాన్ని అవమానపరిచారు.
AMO 2:8 తాకట్టు పెట్టిన బట్టలు అప్పగించకుండా, ప్రతి బలిపీఠం దగ్గర వాటిని పరుచుకొని పడుకుంటారు. వారు జరిమానాలతో కొనుక్కున్న ద్రాక్షరసాన్ని, తమ దేవుని మందిరంలోనే త్రాగుతారు.
AMO 2:9 “దేవదారు వృక్షమంత ఎత్తుగా, అయినా నేను వారి సింధూర వృక్షమంత బలంగా ఉన్న, అమోరీయులను వారి ఎదుట ఉండకుండా నేను నాశనం చేశాను. నేను పైనున్న వారి ఫలాన్ని, క్రిందున్న వారి వేరును నాశనం చేశాను.
AMO 2:10 అమోరీయుల దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలని, నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి, నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించాను.
AMO 2:11 “అంతేకాక నేను మీ సంతానం నుండి ప్రవక్తలను, మీ యవకులలో నుండి నాజీరులను లేవనెత్తాను. ఇశ్రాయేలీయులారా! ఇది నిజం కాదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
AMO 2:12 “అయితే మీరు నాజీరులతో ద్రాక్షరసం త్రాగించారు, ప్రవచించ వద్దని ప్రవక్తలను ఆదేశించారు.
AMO 2:13 “కాబట్టి ధాన్యపు మోపులతో నిండిన బండి నేలను అణగద్రొక్కినట్టు, ఇప్పుడు నేను మిమ్మల్ని అణగద్రొక్కుతాను.
AMO 2:14 వేగంగా పరుగెత్తేవారు తప్పించుకోలేరు, బలాఢ్యులు ధైర్యం తెచ్చుకోలేరు, వీరుడు తన ప్రాణాన్ని రక్షించుకోలేడు.
AMO 2:15 విలుకాడు నిలబడలేడు, బాగా పరుగెత్తగల సైనికుడు తప్పించుకోలేడు, గుర్రపురౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు.
AMO 2:16 ఆ రోజున ధైర్యవంతులైన వీరులు కూడా దిగంబరులై పారిపోతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
AMO 3:1 ఇశ్రాయేలీయులారా! యెహోవా ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన కుటుంబమంతటి గురించి నేను పలికిన ఈ మాట వినండి:
AMO 3:2 “భూలోకంలోని కుటుంబాలన్నిటి నుండి మిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాను. కాబట్టి మీరు చేసిన పాపాలన్నిటిని బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”
AMO 3:3 పరస్పర సమ్మతి లేకుండా ఇద్దరూ కలిసి నడుస్తారా?
AMO 3:4 ఆహారం దొరకక పోతే, సింహం అడవిలో గర్జిస్తుందా? దేనినీ పట్టుకోకుండానే అది దాని గుహలో గుర్రుమంటుందా?
AMO 3:5 నేల మీద ఎరపెట్టనిదే, పక్షి ఉరిలో చిక్కుకుంటుందా? ఉరిలో ఏదీ చిక్కకపోతే, ఆ ఉరి నేల నుండి పైకి లేస్తుందా?
AMO 3:6 పట్టణంలో బూరధ్వని వినబడితే, ప్రజలు వణకరా? పట్టణంలో విపత్తు వచ్చినప్పుడు అది యెహోవా పంపింది కాదా?
AMO 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తన ప్రణాళికను తెలియజేయకుండా ప్రభువైన యెహోవా ఏదీ చేయరు.
AMO 3:8 సింహం గర్జించింది, భయపడని వారెవరు? ప్రభువైన యెహోవా చెప్పారు దానిని ప్రవచించకుండ ఉన్నవారెవరు?
AMO 3:9 అష్డోదు కోటలకు ఇలా చాటించండి, ఈజిప్టు కోటలకు ఇలా చాటించండి: “సమరయ పర్వతాలమీద కూడుకోండి; దానిలో జరుగుతున్న గొప్ప అల్లరిని, దాని ప్రజలమధ్య ఉన్న దౌర్జన్యాన్ని చూడండి.”
AMO 3:10 “సరియైనది ఎలా చేయాలో వారికి తెలియదు,” అని యెహోవా చెప్తున్నారు, “వారు తమ కోటలలో తాము కొల్లగొట్టిన దోపుడుసొమ్మును దాచుకుంటారు.”
AMO 3:11 కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “శత్రువు నీ ప్రాంతంలో చొరబడతాడు, మీ దుర్గాలను పడగొడతాడు, మీ కోటలను దోచుకుంటాడు.”
AMO 3:12 యెహోవా చెప్పే మాట ఇదే: “గొర్రెల కాపరి సింహం నోటి నుండి విడిపించేటప్పుడు, దాని రెండు కాళ్లను గాని లేదా చెవి ముక్కను గాని విడిపించినట్లుగా, సమరయలో మంచాల మీద పట్టు దిండ్లమీద కూర్చుని ఉన్న, ఇశ్రాయేలీయులు రక్షించబడతారు.”
AMO 3:13 “దీనిని విని, యాకోబు వారసులకు వ్యతిరేకంగా తెలియజేయండి” అని ప్రభువు, సైన్యాల యెహోవా దేవుడు చెప్తున్నారు.
AMO 3:14 “ఇశ్రాయేలు పాపాలను శిక్షించే రోజున బేతేలులోని బలిపీఠాలను నేను నాశనం చేస్తాను; ఆ బలిపీఠపు కొమ్మలు విరగ్గొట్టబడి నేలరాలుతాయి.
AMO 3:15 చలికాలపు విడిది భవనాన్ని, ఎండకాలపు విడిది భవనాన్ని పడగొడతాను; ఏనుగు దంతంతో అలంకరించబడ్డ భవనాలు నాశనమవుతాయి గొప్ప భవనాలు నిర్మూలించబడతాయి,” అని యెహోవా చెప్తున్నారు.
AMO 4:1 సమరయ పర్వతం మీద తిరిగే బాషాను ఆవులారా! దిక్కులేని వారిని బాధిస్తూ, బీదలను అణగద్రొక్కుతూ “మాకు కొంచెం మద్యం తీసుకురండి!” అని భర్తలకు చెప్పే స్త్రీలారా, ఈ మాట వినండి.
AMO 4:2 ప్రభువైన యెహోవా తన పవిత్రత తోడని ప్రమాణం చేశారు: “మిమ్మల్ని కొంకులతో పట్టుకుని, మీలో మిగిలిన వారిని గాలంతో పట్టుకుని తీసుకెళ్లే కాలం ఖచ్చితంగా రాబోతుంది.
AMO 4:3 మీరంతా ప్రాకారాలలో పగుళ్ళ గుండా తిన్నగా పోతారు. మీరు హర్మోను వైపుకు పారవేయబడతారు,” అని యెహోవా చెప్తున్నారు.
AMO 4:4 “బేతేలుకు వెళ్లి పాపం చేయండి; గిల్గాలుకు వెళ్లి ఇంకా ఎక్కువ పాపం చేయండి. ప్రతి ఉదయం మీ బలులు తీసుకరండి, మూడు సంవత్సరాలకు ఒకసారి మీ దశమ భాగాల్ని తీసుకురండి.
AMO 4:5 పులిసిన రొట్టెను కృతజ్ఞతార్పణగా కాల్చండి మీ స్వేచ్ఛార్పణల గురించి ప్రకటించండి. ఇశ్రాయేలీయులారా, వాటి గురించి ప్రకటన చేయండి, ఇలా చేయడం మీకు చాలా ఇష్టం కదా” అని ప్రభువైన యెహోవా అంటున్నారు.
AMO 4:6 “మీ ప్రతి పట్టణానికి తినడానికి ఏమీ దొరక్కుండా చేశాను, ప్రతి పట్టణంలో ఆహారం లేకుండ చేశాను, అయినా మీరు నా వైపు తిరగలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
AMO 4:7 “కోతకాలానికి మూడు నెలలు ముందు వర్షం కురవకుండా చేశాను, నేను ఒక పట్టణం మీద వర్షం కురిపించి, మరో పట్టణం మీద కురిపించలేదు. ఒక పొలం మీద వర్షం కురిసింది; వర్షం లేనిచోటు ఎండిపోయింది.
AMO 4:8 ప్రజలు నీళ్ల కోసం పట్టణం నుండి పట్టణానికి తడబడుతూ వెళ్లారు కాని వారికి త్రాగడానికి సరిపడా నీళ్లు దొరకలేదు. అయినా మీరు నా వైపు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు.
AMO 4:9 “ఎన్నోసార్లు నేను మీ తోటలను, ద్రాక్షతోటలను వడగాలి వల్ల కాటుక తెగుళ్ళ వల్ల పాడు చేశాను. మిడతలు మీ అంజూర చెట్లను ఒలీవ చెట్లను మ్రింగివేశాయి. అయినా మీరు నా వైపు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు.
AMO 4:10 “నేను ఈజిప్టు మీదికి రప్పించినట్లు మీ మీదికి తెగుళ్ళు రప్పించాను. మీరు కొల్లగొట్టిన గుర్రాలతో పాటు మీ యువకులను కత్తితో చంపాను. మీ శిబిరాల పుట్టిన దుర్వాసన మీ ముక్కు పుటలను చేరింది. అయినా మీరు నా వైపుకు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు.
AMO 4:11 “నేను సొదొమ గొమొర్రా పట్టణాలను పడగొట్టినట్టు మీలో కొంతమందిని పడగొట్టాను. మీరు మంటలో నుండి లాగివేసిన కట్టెలా ఉన్నారు, అయినా మీరు నా వైపుకు తిరగలేదు, అని యెహోవా అంటున్నారు.
AMO 4:12 “కాబట్టి ఇశ్రాయేలూ, నేను నీకు చేసేది ఇదే, ఇశ్రాయేలూ, నేను ఇలా చేస్తాను కాబట్టి నీ దేవుని కలుసుకోడానికి సిద్ధపడు.”
AMO 4:13 పర్వతాలను ఏర్పరచింది గాలిని సృష్టించింది ఆయనే, తన ఆలోచనలను మనుష్యులకు వెల్లడి చేసేది, ఉదయాన్ని చీకటిగా మార్చేది ఆయనే, భూమి ఎత్తైన స్థలాల్లో ఆయన నడుస్తారు ఆయన పేరు దేవుడైన సైన్యాల యెహోవా.
AMO 5:1 ఇశ్రాయేలూ! ఈ మాట విను, ఇది మిమ్మల్ని గురించి విలాప వాక్కు:
AMO 5:2 “ఇశ్రాయేలు కన్య పడిపోయింది, ఆమె మరి ఎన్నడు లేవదు, ఆమెను లేపడానికి ఎవరూ లేక తన సొంత నేలపై పడి ఉంది.”
AMO 5:3 ప్రభువైన యెహోవా ఇశ్రాయేలుతో చెప్పే మాట ఇదే: “నీ పట్టణం నుండి వేయిమంది బలమైన వారు బయలుదేరితే, వందమంది మాత్రమే మిగులుతారు. నీ పట్టణం నుండి వందమంది బలమైన వారు బయలుదేరితే పదిమంది మాత్రమే మిగులుతారు.”
AMO 5:4 యెహోవా ఇశ్రాయేలుతో చెప్పే మాట ఇదే: “నన్ను వెదికితే బ్రతుకుతారు.
AMO 5:5 బేతేలును ఆశ్రయించకండి; గిల్గాలు క్షేత్రాలకు వెళ్లకండి, బెయేర్షేబకు ప్రయాణించకండి. గిల్గాలు ప్రజలు ఖచ్చితంగా బందీలుగా వెళ్తారు, విపత్తులతో బేతేలు శూన్యంగా మారుతుంది.”
AMO 5:6 యెహోవాను వెదకండి మీరు బ్రతుకుతారు, లేదంటే యోసేపు గోత్రాల మీద ఆయన అగ్నిలా పడతారు; అది వారిని కాల్చివేస్తుంది బేతేలులో దాన్ని ఆర్పివేయగల వారెవరూ ఉండరు.
AMO 5:7 వారు న్యాయాన్ని చేదుగా మార్చి నీతిని నేల మీద పడవేస్తారు.
AMO 5:8 ఆయన సప్తర్షి నక్షత్రాలను మృగశీర్ష నక్షత్రాలను సృష్టించారు, ఆయన మధ్యరాత్రిని ఉదయంగా మారుస్తారు, పగటిని చీకటి చేస్తారు. ఆయన సముద్రంలోని నీటిని రప్పించి. భూమి మీద కుమ్మరిస్తారు ఆయన పేరు యెహోవా.
AMO 5:9 ఆయన మెరుపు వేగంతో దుర్గాన్ని నాశనం చేస్తారు, వారి కోటగల పట్టణాన్ని నాశనం చేస్తారు.
AMO 5:10 న్యాయస్థానంలో న్యాయం కోసం నిలబడే వారిని యథార్థంగా మాట్లాడేవారిని ద్వేషించేవారు మీలో ఉన్నారు.
AMO 5:11 మీరు బీదలను అణగద్రొక్కుతూ, వారి ధాన్యం మీద పన్ను వేస్తారు. కాబట్టి మీరు రాళ్లతో భవనాలను కట్టుకున్నా, వాటిలో కాపురముండరు; అందమైన ద్రాక్షతోటలు నాటినా మీరు ఆ పండ్ల రసం త్రాగరు.
AMO 5:12 ఎందుకంటే మీ అపరాధాలు ఎన్ని ఉన్నాయో మీ పాపాలు ఎంత ఘోరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని అమాయకులను బాధిస్తారు, న్యాయస్థానంలో వచ్చే బీదలకు న్యాయం జరగనివ్వరు.
AMO 5:13 ఇది చెడుకాలం కాబట్టి, అలాంటి సమయాల్లో వివేకవంతులు మౌనంగా ఉంటారు.
AMO 5:14 చెడును విడిచిపెట్టి మంచిని వెదకండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అప్పుడు ఆయన గురించి మీరనుకున్న విధంగా సైన్యాల యెహోవా దేవుడు మీతో ఉంటారు.
AMO 5:15 చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి; న్యాయస్థానాల్లో న్యాయం జరిగించండి. బహుశ సైన్యాల యెహోవా దేవుడు, యోసేపు వంశంలో మిగిలి ఉన్నవారిపై దయ చూపిస్తారేమో.
AMO 5:16 కాబట్టి ప్రభువు, సైన్యాల యెహోవా దేవుడు చెప్పే మాట ఇదే: “వీధులన్నిటిలో విలాపం ఉండబోతుంది ప్రతి రాజ మార్గంలో వేదనతో కూడిన ఏడ్పులు. ఏడ్వడానికి రైతులను దుఃఖపడడానికి విలపించేవారిని పిలుస్తారు.
AMO 5:17 ద్రాక్షతోటలన్నిటిలో శోకం ఉంటుంది, ఎందుకంటే నేను మీ మధ్యలో సంచరిస్తాను,” అని యెహోవా అంటున్నారు.
AMO 5:18 యెహోవా దినం రావాలని ఆశించే మీకు శ్రమ! యెహోవా దినం కోసం ఎందుకు మీరు ఆశిస్తున్నారు? ఆ దినం వెలుగుగా కాదు, చీకటిగా ఉంటుంది.
AMO 5:19 అది ఒక మనిషి సింహం నుండి తప్పించుకుని ఎలుగుబంటి ఎదురు పడినట్లు, అతడు ఇంట్లోకి ప్రవేశించి గోడ మీద చేయి పెడితే పాము కరిచినట్టుగా ఉంటుంది.
AMO 5:20 యెహోవా దినం వెలుగుగా కాకుండా అంధకారంగా ఉంటుంది కదా, ఒక్క కాంతి కిరణం కూడా లేకుండ కారుచీకటిగా ఉంటుంది కదా?
AMO 5:21 “మీ పండుగలంటే నాకు అసహ్యం, వాటిని నేను ద్వేషిస్తాను; మీ సమావేశాల్లో నేను సంతోషించను.
AMO 5:22 మీరు నాకు దహనబలులు, భోజనార్పణలు సమర్పించినా, నేను వాటిని స్వీకరించను. మీరు క్రొవ్విన జంతువులను సమాధానబలులుగా సమర్పించినా, నేను వాటిని లెక్కచేయను.
AMO 5:23 మీ పాటల ధ్వని నా నుండి తీసివేయండి! మీ సితారాల సంగీతం నేను వినను.
AMO 5:24 అయితే న్యాయం నదీ ప్రవాహంలా, నీతి ఎన్నడూ ఎండిపోని కాలువలా ప్రవహించాలి.
AMO 5:25 “ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు, మీరు నాకు బలులు, అర్పణలు తెచ్చారా?
AMO 5:26 మీరు మీ సక్కూతు రాజ దేవుని క్షేత్రాన్ని, మీ కైవాన్ విగ్రహాలను, మీ కోసం మోసుకొచ్చారు. అది మీరు మీ కోసం చేసుకుంది.
AMO 5:27 కాబట్టి నేను మిమ్మల్ని దమస్కు అవతలికి బందీలుగా పంపిస్తాను,” అని సైన్యాల దేవుడు అని పేరు కలిగిన యెహోవా అంటున్నారు.
AMO 6:1 సీయోనులో సంతృప్తిగా ఉన్నవారికి శ్రమ, సమరయ పర్వతం మీద ఆధారపడి ఉన్న మీకు శ్రమ, ఇశ్రాయేలు ప్రజలకు సలహాదారులుగా ఉన్న, గొప్ప దేశాల్లో ప్రముఖులైన మీకు శ్రమ!
AMO 6:2 మీరు కల్నేకు వెళ్లి చూడండి; అక్కడినుండి హమాతుకు వెళ్లండి, తర్వాత ఫిలిష్తీయలోని గాతుకు వెళ్లండి. మీ రెండు రాజ్యాల కంటే అవి గొప్పవా? వాటి నేల మీకంటే పెద్దది కాదా?
AMO 6:3 ఆపద్దినం దూరంగా ఉందనుకుని, దౌర్జన్య పరిపాలనను త్వరగా రప్పిస్తున్నారు.
AMO 6:4 మీరు దంతపు మంచాల మీద పడుకుంటారు, పరుపులపై ఆనుకుంటారు. శ్రేష్ఠమైన గొర్రెపిల్లలను, శాలలోని క్రొవ్విన దూడలను మీరు తింటారు.
AMO 6:5 మీరు దావీదులా సితారా వాయిస్తూ వాయిద్యాలు మెరుగుపరుస్తారు.
AMO 6:6 మీరు ద్రాక్షరసం పాత్ర నిండా నింపుకొని త్రాగుతారు, పరిమళ తైలాలు పూసుకుంటారు, కాని మీరు యోసేపు నాశనం గురించి విచారపడరు.
AMO 6:7 కాబట్టి బందీలుగా మొదట దేశాంతరం పోయే వారిలో మీరు ఉంటారు; మీ ఉత్సవాలు, మీ విలాసాలు గతించిపోతాయి.
AMO 6:8 ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసి, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “నేను యాకోబు గర్వాన్ని అసహ్యించుకుంటున్నాను అతని కోటలను ద్వేషిస్తున్నాను; నేను పట్టణాన్ని దానిలో ఉన్న అంతటితో శత్రువు వశం చేస్తాను.”
AMO 6:9 ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా,
AMO 6:10 ఆ శవాలను ఇంట్లోనుండి తీసుకుపోయి వాటిని దహనం చేయడానికి వచ్చిన బంధువు ఇంట్లో దాక్కొని ఉన్నవానితో, “నీతో ఇంకెవరైన ఉన్నారా?” అని అడిగితే, “లేదు” అని అతడు చెప్తే, “మాట్లాడకు, మనం యెహోవా పేరును ప్రస్తావించకూడదు” అని అంటాడు.
AMO 6:11 ఎందుకంటే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, పెద్ద కుటుంబాలు ముక్కలుగా విడిపోతాయి చిన్నా కుటుంబాలు చీలిపోతాయి.
AMO 6:12 గుర్రాలు బండ మీద పరుగెత్తుతాయా? బండ మీద ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? కాని న్యాయాన్ని విషంగా మార్చారు, నీతి ఫలాన్ని చేదుగా మార్చారు.
AMO 6:13 లో దెబారును జయించి ఆనందిస్తున్న మీరు, “మా సొంత బలంతోనే కర్నాయీమును పట్టుకోలేదా?” అంటారు.
AMO 6:14 అయితే సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు, “ఇశ్రాయేలూ, నేను నీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను, అది నిన్ను హమాతు మొదలుకొని అరాబా లోయవరకు ఆ అరణ్య మార్గమంతా నిన్ను హింసిస్తుంది.”
AMO 7:1 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇది: రాజుకు రావలసిన పంట వచ్చిన తర్వాత గడ్డి మళ్ళీ మొలిచినప్పుడు, యెహోవా మిడత గుంపులను సిద్ధపరిచారు.
AMO 7:2 అవి మొత్తం పంటను తినివేసినప్పుడు, “ప్రభువైన యెహోవా, క్షమించండి! యాకోబు వంశం చిన్నది అది ఎలా మనుగడ సాగించగలదు?” అని నేను మొరపెట్టాను.
AMO 7:3 కాబట్టి యెహోవా జాలిపడ్డారు. “ఇది జరగదు” అని యెహోవా అన్నారు.
AMO 7:4 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇది: ప్రభువైన యెహోవా అగ్ని ద్వారా తీర్పును ప్రకటిస్తున్నారు; అది మహా అగాధాన్ని ఎండగొట్టి, నేలను మ్రింగివేసింది.
AMO 7:5 అప్పుడు నేను, “ప్రభువైన యెహోవా, దయచేసి ఆపండి! యాకోబు వంశం చిన్నది అది ఎలా మనుగడ సాగించగలదు?” అని మొరపెట్టాను.
AMO 7:6 కాబట్టి యెహోవా జాలిపడ్డారు. “ఇది కూడా జరగదు” అని ప్రభువైన యెహోవా అన్నారు.
AMO 7:7 ఆయన నాకు చూపించింది ఇదే: ప్రభువు తన చేతిలో కొలనూలు పట్టుకుని, మట్టపు గుండు ప్రకారం కట్టబడిన గోడ దగ్గర నిలబడి ఉన్నారు.
AMO 7:8 యెహోవా నన్ను, “ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని అడిగారు. “కొలనూలు” అని నేను జవాబిచ్చాను. అప్పుడు ప్రభువు అన్నారు, “చూడు, నా ఇశ్రాయేలు ప్రజలమధ్య కొలనూలు వేయబోతున్నాను, ఇకమీదట వారిని శిక్షించకుండ వదలను.
AMO 7:9 “ఇస్సాకు క్షేత్రాలు నాశనమవుతాయి ఇశ్రాయేలు పరిశుద్ధ స్థలాలు పాడైపోతాయి; యరొబాము ఇంటి మీదికి నా కత్తి ఎత్తుతాను.”
AMO 7:10 తర్వాత బేతేలు యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఇలా వర్తమానం పంపాడు: “ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే ఆమోసు నీ మీద కుట్ర పన్నుతున్నాడు. దేశం అతని మాటలన్నిటిని భరించలేకపోతుంది.
AMO 7:11 ఎందుకంటే ఆమోసు చెప్పేది ఇదే: “ ‘యరొబాము ఖడ్గం చేత చస్తాడు, ఇశ్రాయేలు ప్రజలు తమ సొంత దేశం నుండి బందీలుగా దేశాంతరం పోతారు.’ ”
AMO 7:12 అప్పుడు అమజ్యా ఆమోసుతో, “దీర్ఘదర్శీ నీవు వెళ్లిపో! యూదా దేశానికి తిరిగి వెళ్లు! అక్కడ నీకు ఆహారం సంపాదించుకో, అక్కడే నీవు ప్రవచించుకో.
AMO 7:13 బేతేలులో ప్రవచించడం ఆపు, ఎందుకంటే రాజు గుడి, రాజభవనం ఇక్కడే ఉన్నాయి” అని చెప్పాడు.
AMO 7:14 ఆమోసు అమజ్యాకు జవాబిస్తూ ఇలా అన్నాడు, “నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కుమారున్ని కాదు. నేను గొర్రెల కాపరిగా ఉంటూ మేడిచెట్లను చూసుకునే వాన్ని.
AMO 7:15 అయితే యెహోవా, మందను కాసుకుంటున్న నన్ను పిలిచి, ‘వెళ్లు, నా ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచించు’ అన్నారు.
AMO 7:16 కాబట్టి ఇప్పుడు యెహోవా చెప్పేది వినండి. నీవు ఇలా అంటున్నావు, “ ‘ఇశ్రాయేలుకు విరుద్ధంగా ప్రవచించకు, ఇస్సాకు సంతానానికి విరుద్ధంగా ప్రసంగించడం ఆపు.’
AMO 7:17 “కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: “ ‘నీ భార్య పట్టణంలో వేశ్యగా మారుతుంది, నీ కుమారులు, కుమార్తెలు ఖడ్గానికి కూలుతారు. నీ భూమి కొలవబడి విభజించబడుతుంది, నీవు యూదేతర దేశంలో చస్తావు. ఇశ్రాయేలు ప్రజలు తమ సొంత దేశానికి దూరంగా, బందీలుగా వెళ్తారు.’ ”
AMO 8:1 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇదే: పండిన పండ్ల గంప.
AMO 8:2 “ఆమోసూ! నీవేం చూస్తున్నావు?” అని ఆయన అడిగారు. “పండిన పండ్ల గంప” అని నేను జవాబిచ్చాను. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “నా ప్రజలైన ఇశ్రాయేలుకు సమయం దగ్గరపడింది; ఇక నేను వారిని శిక్షించకుండా ఉండను.
AMO 8:3 “ఆ రోజు గుడిలో వారు పాడే పాటలు విలాపంగా మారుతాయి. ఎన్నో శవాలు ఉంటాయి; ఎక్కడ చూసినా అవే! ఊరుకోండి!” అని ప్రభువైన యెహోవా చెప్తున్నారు.
AMO 8:4 అవసరతలో ఉన్నవారిని అణగద్రొక్కే వారలారా, దేశంలో ఉన్న పేదలను అంతం చేసేవారలారా,
AMO 8:5 అలా చేస్తూ, “మనం ధాన్యం అమ్ముకోడానికి, అమావాస్య ఎప్పుడు దాటి పోతుందో, గోధుమ వ్యాపారం సాగటానికి విశ్రాంతి దినం ఎప్పుడు గతించి పోతుందో?” అనుకునేవారలారా వినండి. మీరు కొల గంపలు చిన్నగా చేస్తూ, ధర ఎక్కువ చేస్తూ, దొంగ త్రాసుతో మోసగిస్తారు,
AMO 8:6 బీదలను వెండికి కొంటారు, చెప్పులిచ్చి అవసరతలో ఉన్నవారిని కొంటారు, పాడైపోయి గింజలు కూడా అమ్మివేస్తారు.
AMO 8:7 యాకోబు ఆత్మగౌరవమైన తన నామం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశారు: “నేను వారు చేసిన వాటిలో ఒక్కటి కూడా ఎన్నటికీ మరువను.
AMO 8:8 “ఈ కారణంచేత భూమి కంపించదా? దేశవాసులందరూ దుఃఖపడరా? నైలు నది పొంగినట్లు దేశమంతా పొంగుతుంది, అది పైకి లేచి తర్వాత ఈజిప్టు నదిలా అణగిపోతుంది.
AMO 8:9 “ఆ రోజున,” అంటూ ప్రభువైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, మధ్యాహ్నమే సూర్యుడు అస్తమించేలా, పట్ట పగటివేళ భూమికి చీకటి కమ్మేలా చేస్తాను.
AMO 8:10 నేను మీరు ఆచరించే పండుగలను విలాపంగా, మీ పాటలన్నీ విషాద గీతాలుగా మారుస్తాను. నేను మీరంతా గోనెపట్ట కట్టుకునేలా, తల గొరిగించుకునేలా చేస్తాను. ఏకైక కుమారుని కోసం ఏడ్చినట్లుగా ఆ సమయాన్ని చేస్తాను, దాని అంతం ఘోరమైన రోజుగా ఉంటుంది.
AMO 8:11 ప్రభువైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో నేను ఈ దేశంలో కరువు పుట్టిస్తాను, ఆహారం నీళ్లు లేకపోవడం వల్ల కలిగే కరువు కాదు, యెహోవా వాక్కుల కరువు పుట్టిస్తాను.
AMO 8:12 ప్రజలు యెహోవా వాక్కు కోసం వెతుకుతూ, ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు, ఉత్తర దిక్కునుండి తూర్పుదిక్కు వరకు తిరుగుతారు కాని అది వారికి దొరకదు.
AMO 8:13 “ఆ రోజున “అందమైన కన్యలు బలమైన యువకులు దప్పికతో మూర్ఛపోతారు.
AMO 8:14 సమరయ దోషానికి కారణమైనదాని తోడని, ‘దాను దేవుని తోడు’ అని, ‘బెయేర్షేబ దేవుని తోడు’ అని ప్రమాణం చేసేవారు మళ్ళీ లేవకుండా కూలిపోతారు.”
AMO 9:1 బలిపీఠం దగ్గర ప్రభువు నిలబడి ఉండడం నేను చూశాను, ఆయన ఇలా అన్నారు: “గడపలు కదిలి పోయేలా, స్తంభాల పైభాగాలను కొట్టు. వాటిని ప్రజలందరి తలల మీద పడవేయు; మిగిలిన వారిని నేను ఖడ్గంతో హతం చేస్తాను. ఒక్కడు కూడా పారిపోలేడు, ఎవ్వడూ తప్పించుకోలేడు.
AMO 9:2 వారు పాతాళం లోతుల్లోనికి త్రవ్వుకొని వెళ్లినా, అక్కడినుండి నా చేయి వారిని తీసుకుంటుంది. వారు పైనున్న ఆకాశాల పైకి ఎక్కినా, అక్కడినుండి వారిని క్రిందికి తీసుకువస్తాను.
AMO 9:3 వారు కర్మెలు పర్వత శిఖరాన దాక్కున్నా, అక్కడ నేను వారిని వెంటబడి పట్టుకుంటాను. నా కళ్లకు కనిపించకుండా వారు సముద్రపు అడుగుభాగంలో దాక్కున్నా, అక్కడ వారిని కరవమని సర్పానికి ఆజ్ఞ ఇస్తాను.
AMO 9:4 శత్రువులు వారిని బందీలుగా దేశాంతరం తీసుకెళ్లినా, అక్కడ వారిని చంపమని ఖడ్గానికి ఆజ్ఞ ఇస్తాను. “నా చూపు వారి మీద నిలుపుతాను, అది కీడుకోసమే కాని మేలుకోసం కాదు.”
AMO 9:5 సైన్యాల అధిపతియైన యెహోవా ఆయన భూమిని ముట్టగా అది కరిగిపోతుంది, భూనివాసులు అందరు విలపిస్తారు; దేశమంతా నైలు నదిలా పొంగుతుంది, ఈజిప్టు నదిలా అణగిపోతుంది.
AMO 9:6 ఆయన ఆకాశాల్లో తన ఉన్నత రాజభవనాన్ని కట్టుకుంటారు, దాని పునాదిని భూమి మీద నిర్మిస్తారు. ఆయన సముద్రం నీటిని పిలిపించి భూమి మీద కుమ్మరిస్తారు, ఆయన పేరు యెహోవా.
AMO 9:7 “ఇశ్రాయేలీయులైన మీరు నా దృష్టికి కూషు దేశస్థులతో సమానం కారా?” అని యెహోవా అంటున్నారు. “నేను ఇశ్రాయేలును ఈజిప్టు నుండి, ఫిలిష్తీయులను కఫ్తోరు నుండి, అరామీయులను కీరు నుండి తీసుకురాలేదా?
AMO 9:8 “నిజంగా ప్రభువైన యెహోవా కళ్లు పాపిష్ఠి రాజ్యం మీద ఉన్నాయి. నేను దాన్ని భూమి మీద ఉండకుండ నాశనం చేస్తాను. అయినా యాకోబు సంతానాన్ని సంపూర్ణంగా నాశనం చేయను,” అని యెహోవా అంటున్నారు.
AMO 9:9 “నేను ఆజ్ఞ ఇస్తాను, మనిషి ధాన్యం జల్లెడలో వేసి, ఒక్క గింజ కూడా నేల పడకుండా జల్లించే విధంగా, ఇశ్రాయేలు ప్రజలను అన్ని దేశాల వారి మధ్య జల్లిస్తాను.
AMO 9:10 నా ప్రజల్లోని పాపులందరు ‘విపత్తు మనల్ని తరమదు, మన మీదికి రాదు’ అని అనుకునే వారందరు, ఖడ్గానికి గురై చస్తారు.
AMO 9:11 “ఆ రోజున, “పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను, నేను దాని విరిగిన గోడలను మరమ్మత్తు చేసి, దాని శిథిలాలను తిరిగి నిర్మిస్తాను, మునుపు ఉండినట్లుగా దాన్ని తిరిగి కడతాను.
AMO 9:12 అలా వారు ఎదోము జనంలో మిగిలిన వారిని, నా నామం కలిగిన యూదేతరులనందరినీ స్వాధీనం చేసుకుంటారు,” అని ఈ కార్యాలన్ని చేసే యెహోవా అంటున్నారు.
AMO 9:13 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో పంట కోసేవారిని దున్నేవాడు దాటిపోతాడు, నాటే వారిని ద్రాక్ష పండ్లు త్రొక్కేవాడు దాటిపోతాడు, నూతన ద్రాక్షరసం పర్వతాలమీద నుండి, అన్ని కొండల నుండి ప్రవహిస్తుంది.
AMO 9:14 నేను నా ఇశ్రాయేలు ప్రజలను బందీల నుండి తిరిగి తీసుకువస్తాను. “వారు శిథిలమైన పట్టణాలను పునర్నిర్మించుకుని వాటిలో నివసిస్తారు. వారు ద్రాక్షతోటలు వేసి వాటి ద్రాక్షరసం త్రాగుతారు; వారు వనాలు నాటి వాటి పండ్లు తింటారు.
AMO 9:15 నేను ఇశ్రాయేలును తమ స్వదేశంలో నాటుతాను, నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక ఎన్నడు పెళ్లగించబడరు,” అని మీ దేవుడైన యెహోవా చెప్తున్నారు.
OBA 1:1 ఓబద్యాకు వచ్చిన దర్శనం. ప్రభువైన యెహోవా ఎదోము గురించి ఇలా చెప్తున్నారు: మేము యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది, “లెండి! ఎదోము మీద యుద్ధానికి వెళ్దాం” అని చెప్పడానికి దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.
OBA 1:2 “చూడు, నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా చేస్తాను; నీవు పూర్తిగా తృణీకరించబడతావు.
OBA 1:3 నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది, బండ సందుల్లో నివసించేదానా, కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా, ‘నన్ను ఎవరు క్రిందకు పడవేయగలరు?’ అని నీలో నీవనుకుంటావు.
OBA 1:4 నీవు గ్రద్దలా పైకి ఎగిరి, నక్షత్రాలలో నీ గూడు కట్టుకున్నా, అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను” అని యెహోవా చెప్తున్నారు.
OBA 1:5 “ఒకవేళ నీ మీదికి దొంగలు వస్తే, రాత్రివేళ దొంగలు వస్తే ఎంతగా నాశనం చేస్తారో కదా! వారికి కావలసినంత వారు దోచుకుంటారు కదా? ద్రాక్షలు పోగుచేసుకునేవారు నీ దగ్గరకు వస్తే, వారు కొన్ని ద్రాక్షలు వదిలిపెడతారు కదా?
OBA 1:6 ఏశావు సంతతివారిని పూర్తిగా దోచుకుంటారు, వారు దాచిన నిధులన్నిటిని దోచుకుంటారు!
OBA 1:7 నీతో సంధి చేసుకున్న వారు నిన్ను తమ సరిహద్దు వరకు తరిమివేస్తారు; నీ స్నేహితులు నిన్ను మోసం చేసి నీ మీద గెలుస్తారు; నీ ఆహారం తిన్నవారు నీకోసం ఉచ్చు పెడతారు, నీవు దానిని తెలుసుకోలేవు.
OBA 1:8 “ఆ రోజున, యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, నేను ఎదోము జ్ఞానులను, ఏశావు పర్వతాల్లో వివేకులను నాశనం చేయనా?
OBA 1:9 తేమానూ! నీ వీరులు భయపడతారు, ఏశావు పర్వతాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు, సంహరించబడి కూలిపోతారు.
OBA 1:10 నీ సోదరుడైన యాకోబు మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి, నీకు అవమానం కలుగుతుంది; నీవు ఎప్పటికీ లేకుండా నాశనమవుతావు.
OBA 1:11 అపరిచితులు అతని ఆస్తులను తీసుకెళ్లినప్పుడు, విదేశీయులు అతని గుమ్మాల్లోకి వచ్చి, యెరూషలేము మీద చీట్లు వేసేిన రోజున, నీవు దూరంగా నిలబడ్డావు, నీవు వారిలో ఒకనిగా ఉన్నావు.
OBA 1:12 నీ సోదరునికి దురవస్థ కలిగిన రోజు, నీవు సంతోషించకూడదు, యూదా ప్రజల నాశన దినాన వారిని చూసి ఆనందించకూడదు, వారి శ్రమ దినాన, నీవు గొప్పలు చెప్పుకోవద్దు.
OBA 1:13 నా ప్రజలకు ఆపద సంభవించిన రోజున వారి గుమ్మాల్లో చొరబడకూడదు, వారికి ఆపద కలిగిన రోజున, వారికి వచ్చిన విపత్తును బట్టి సంతోషించకూడదు, వారికి ఆపద వచ్చిన రోజున వారి ఆస్తులను దోచుకోకూడదు.
OBA 1:14 వారిలో తప్పించుక పోయేవారిని చంపడానికి నీవు కూడలిలో ఎదురుచూస్తూ నిలబడకూడదు, వారి శ్రమ దినాన వారిలో మిగిలే వారిని శత్రువులకు అప్పగించకూడదు.
OBA 1:15 “యెహోవా దినం ఆసన్నమైంది, అది అన్ని దేశాల మీదికి వస్తుంది. నీవు చేసినట్టే, నీకు చేయబడుతుంది, నీ క్రియలు నీ తల మీదికి వస్తాయి;
OBA 1:16 మీరు నా పవిత్ర కొండమీద త్రాగినట్టే, ఇతర ప్రజలందరు నిత్యం త్రాగుతారు; వారు ముందెన్నడూ త్రాగలేదన్నట్లు త్రాగుతూనే ఉంటారు.
OBA 1:17 అయితే సీయోను పర్వతం మీద విడుదల ఉంటుంది; అది పవిత్రంగా ఉంటుంది, యాకోబు వారు తన వారసత్వాన్ని స్వాధీనపరచుకుంటారు.
OBA 1:18 యాకోబు అగ్నిలా, యోసేపు మంటలా ఉంటారు; ఏశావు కొయ్యకాలులా ఉంటాడు, వారు అతనికి నిప్పంటించి నాశనం చేస్తారు. ఏశావు వారిలో నుండి ఎవరూ తప్పించుకోలేరు” అని యెహోవా చెప్పారు.
OBA 1:19 దక్షిణ ప్రాంత ప్రజలు ఏశావు పర్వతాలను స్వాధీనం చేసుకుంటారు, దిగువ కొండ ప్రాంత ప్రజలు, ఫిలిష్తీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. వారు ఎఫ్రాయిం, సమరయ భూములను స్వాధీనం చేసుకుంటారు, బెన్యామీను వారు గిలాదును స్వాధీనం చేసుకుంటారు.
OBA 1:20 కనానులో బందీలుగా ఉన్న ఇశ్రాయేలీయులు సారెపతు వరకు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు; సెఫారాదులో ఉన్న యెరూషలేము ప్రవాసులు దక్షిణ ప్రాంత పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు.
OBA 1:21 ఏశావు పర్వతాలను పరిపాలించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు, రాజ్యం యెహోవాది అవుతుంది.
JON 1:1 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు వచ్చింది:
JON 1:2 “నీవు లేచి నీనెవె మహా పట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటించు, ఎందుకంటే దాని చెడుతనం నా దృష్టిలో ఘోరంగా ఉంది.”
JON 1:3 అయితే యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోదామని తర్షీషు వైపు వెళ్లాడు. అతడు యొప్పేకు వెళ్లి అక్కడ తర్షీషుకు వెళ్లే ఓడను చూశాడు. అతడు డబ్బు చెల్లించి, యెహోవా నుండి పారిపోవడానికి ఓడ ఎక్కి తర్షీషుకు ప్రయాణమయ్యాడు.
JON 1:4 అప్పుడు యెహోవా సముద్రం మీద పెనుగాలిని పంపగా బలమైన తుఫాను లేచింది, అది ఓడను బద్దలు చేసేంత భయంకరంగా ఉంది.
JON 1:5 ఆ నావికులందరు భయపడ్డారు, ప్రతివాడు తన దేవునికి మొరపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి దానిలో ఉన్న సరుకులు సముద్రంలో పారవేశారు. అయితే యోనా ఓడ దిగువ భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రలోకి వెళ్లాడు.
JON 1:6 ఓడ నాయకుడు అతని దగ్గరకు వెళ్లి, “నీవు ఎలా పడుకోగలుగుతున్నావు? లేచి నీ దేవునికి మొరపెట్టు! ఒకవేళ ఆయన మనల్ని గమనించి మనం నశించకుండా చేస్తారేమో” అని అన్నాడు.
JON 1:7 అప్పుడు నావికులు, “రండి, ఎవరి మూలంగా ఈ ఆపద రాడానికి ఎవరు బాధ్యులో చీట్లు వేసి తెలుసుకుందాం” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. వారు చీట్లు వేసినప్పుడు చీటి యోనా పేరిట వచ్చింది.
JON 1:8 కాబట్టి వారు అతన్ని, “చెప్పు, ఈ కష్టం మన మీదికి రావడానికి ఎవరు బాధ్యులు? నీవు ఏ పని చేస్తావు? నీవు ఎక్కడ నుండి వచ్చావు? నీ దేశం ఏది? నీ జనమేది?” అని అడిగారు.
JON 1:9 అందుకతడు, “నేను హెబ్రీయున్ని; సముద్రాన్ని ఎండిన నేలను సృజించిన పరలోక దేవుడైన యెహోవాను ఆరాధిస్తాను” అన్నాడు.
JON 1:10 దానికి వారు భయపడి అతనితో, “నీవు చేసింది ఏంటి?” అన్నారు. (అతడు యెహోవా నుండి పారిపోతున్నాడని వారికి తెలుసు, ఎందుకంటే అతడు అప్పటికే వారికి చెప్పాడు.)
JON 1:11 సముద్రంలో తుఫాను మరీ తీవ్రంగా మారుతుంది. కాబట్టి వారు అతన్ని, “సముద్రం మాకోసం నిమ్మళించాలంటే మేము నీకేం చేయాలి?” అని అడిగారు.
JON 1:12 అందుకు అతడు, “నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రం నిమ్మళిస్తుంది. ఈ గొప్ప తుఫాను నా కారణంగానే మీ మీదికి వచ్చిందని నాకు తెలుసు” అన్నాడు.
JON 1:13 అయితే వారు ఓడను సముద్రతీరానికి చేర్చడానికి శాయశక్తులా ప్రయత్నించారు. కాని తుఫాను ఇంకా తీవ్రంగా విజృంభిస్తుంది కాబట్టి వారు ఏమి చేయలేకపోయారు.
JON 1:14 అప్పుడు వారు యెహోవాకు మొరపెట్టి, “యెహోవా, ఈ మనిషి ప్రాణం కోసం దయచేసి మమ్మల్ని చావనివ్వకండి. నిర్దోషిని చంపుతున్నామని మామీద నేరం మోపకండి, ఎందుకంటే యెహోవా, మీ ఇష్ట ప్రకారం ఇలా జరిగిస్తున్నారు” అని చెప్పి,
JON 1:15 వారు యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు, వెంటనే పొంగుతూ ఉన్న సముద్రం నిమ్మళించింది.
JON 1:16 అది చూసి వారంతా యెహోవాకు ఎంతో భయపడి, యెహోవాకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేశారు.
JON 1:17 యెహోవా యోనాను మ్రింగడానికి పెద్ద చేపను యెహోవా నియమించారు, యోనా మూడు పగళ్ళు మూడు రాత్రులు ఆ చేప కడుపులో ఉన్నాడు.
JON 2:1 చేప కడుపులో నుండి యోనా తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు.
JON 2:2 అతడు ఇలా ప్రార్థించాడు: “నా ఆపదలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు జవాబిచ్చారు. మృత్యులోకంలో ఉండి సహాయం కోసం అడిగాను, మీరు నా మొర విన్నారు.
JON 2:3 మీరు నన్ను అగాధంలో సముద్ర గర్భంలో పడవేశారు. ప్రవాహాలు నన్ను ఆవరించాయి, మీ అలలు, తరంగాలు నన్ను ముంచి వేశాయి.
JON 2:4 ‘నేను మీ సన్నిధి నుండి నన్ను తరిమివేసినా మరలా నేను పరిశుద్ధ ఆలయం వైపు తిరిగి చూస్తాను’ అనుకున్నాను.
JON 2:5 ముంచివేసే నీళ్లు నన్ను భయపెట్టాయి, అగాధం నన్ను ఆవరించింది; సముద్రంలో ఉన్న నాచు నా తలకు చుట్టుకుంది.
JON 2:6 పర్వతాల పునాదుల వరకు నేను మునిగాను, క్రిందున్న భూమి గడియలు నన్ను శాశ్వతంగా బంధించాయి. అయితే నా దేవా! యెహోవా, మీరు నా ప్రాణాన్ని గోతిలో నుండి పైకి తీసుకువచ్చారు.
JON 2:7 “నా ప్రాణం క్షీణిస్తూ ఉంటే, యెహోవా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. నా ప్రార్థన మీ దగ్గరకు వచ్చింది, మీ పరిశుద్ధ ఆలయానికి చేరింది.
JON 2:8 “విలువలేని విగ్రహాలను పూజించేవారు, తమ పట్ల దేవునికున్న ప్రేమకు దూరమవుతారు.
JON 2:9 నేనైతే కృతజ్ఞత స్తుతులు చేస్తూ మీకు బలి అర్పిస్తాను. నేను చేసిన మ్రొక్కుబడి చెల్లిస్తాను, ‘రక్షణ యెహోవా నుండి వస్తుంది’ అని అంటాను.”
JON 2:10 యెహోవా ఆ చేపకు ఆజ్ఞాపించగా అది యోనాను పొడినేల మీద కక్కివేసింది.
JON 3:1 తర్వాత యెహోవా వాక్కు రెండవసారి యోనాకు వచ్చింది:
JON 3:2 “నీవు మహా పట్టణమైన నీనెవెకు వెళ్లి నేను నీకు ఇచ్చే సందేశాన్ని ప్రకటించు.”
JON 3:3 యోనా యెహోవా మాటకు లోబడి నీనెవెకు వెళ్లాడు; నీనెవె చాలా పెద్ద పట్టణం కాబట్టి దానిగుండా వెళ్లడానికి మూడు రోజుల పట్టింది.
JON 3:4 యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, “ఇంకా నలభై రోజులకు నీనెవె నాశనమవుతుంది” అని అంటూ ప్రకటించాడు.
JON 3:5 నీనెవె ప్రజలు దేవున్ని నమ్మి ఉపవాసం ప్రకటించారు. గొప్పవారి నుండి సామాన్యుల వరకు అందరు గోనెపట్ట కట్టుకున్నారు.
JON 3:6 యోనా హెచ్చరిక నీనెవె రాజుకు చేరినప్పుడు, అతడు తన సింహాసనం దిగి, తన రాజ వస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు.
JON 3:7 అతడు నీనెవెలో ఈ ప్రకటన చేశాడు: “రాజు, అతని ఘనుల శాసనం ప్రకారం: “మనుష్యులు గాని జంతువులు పశువులు గొర్రెల మందలు గాని దేన్ని రుచి చూడకూడదు తినకూడదు త్రాగకూడదు.
JON 3:8 మనుష్యులు పశువులు గోనెపట్ట కప్పుకోవాలి. అందరు తక్షణమే దేవున్ని వేడుకోవాలి. తమ చెడు మార్గాలను, దౌర్జన్యాన్ని మానివేయాలి.
JON 3:9 దేవుని మనస్సు మార్చుకుని కనికరంతో తన తీవ్రమైన కోపాన్ని విడిచిపెట్టి మనం నశించకుండా చేస్తారేమో ఎవరికి తెలుసు?”
JON 3:10 వారు చేసింది, వారు ఎలా తమ చెడుతనాన్ని విడిచిపెట్టారో దేవుడు చూసి తన మనస్సు మార్చుకొని, ఆయన వారికి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడును రానివ్వలేదు.
JON 4:1 అయితే యోనాకు ఇది చాల తప్పు అనిపించింది, అతనికి కోపం వచ్చింది.
JON 4:2 అతడు యెహోవాకు ప్రార్థన చేస్తూ అన్నాడు, “యెహోవా, ఇలా జరుగుతుందని నేను నా దేశంలో ఉన్నప్పుడే చెప్పలేదా? అందుకే నేను తర్షీషుకు పారిపోవడానికి ప్రయత్నించాను. మీరు కృపాకనికరంగల దేవుడని, త్వరగా కోప్పడరని, మారని ప్రేమ గలవారని, కీడు కలిగించకుండా మానివేస్తారని నాకు తెలుసు.
JON 4:3 యెహోవా, బ్రతకడం కంటే నాకు చావడం మేలు, కాబట్టి నా ప్రాణాన్ని తీసివేయండి.”
JON 4:4 అయితే యెహోవా జవాబిస్తూ, “నీవలా కోప్పడడం న్యాయమేనా?” అని అన్నారు.
JON 4:5 తర్వాత యోనా బయటకు వెళ్లి పట్టణానికి తూర్పుగా ఒకచోట కూర్చున్నాడు. అక్కడ తన కోసం తాను ఒక పందిరి వేసుకొని, పట్టణానికి ఏం జరుగుతుందో చూద్దామని దాని నీడలో కూర్చుని ఉన్నాడు.
JON 4:6 అప్పుడు యెహోవా, యోనా తలకు నీడనివ్వాలని, అతనికి కలిగిన బాధ తగ్గించాలని ఆకులుగల ఒక చెట్టును మొలిపించారు, యోనా ఆ చెట్టును బట్టి ఎంతో సంతోషించాడు.
JON 4:7 అయితే మరుసటిరోజు ఉదయం దేవుడు ఒక పురుగును పంపగా అది చెట్టును తినివేయడంతో ఆ చెట్టు వాడిపోయింది.
JON 4:8 సూర్యుడు ఉదయించినప్పుడు, దేవుడు తూర్పు నుండి వడగాలిని పంపించారు, యోనా తలకు ఎండదెబ్బ తగిలి అతడు నీరసించిపోయాడు. “నేను బ్రతికి ఉండడం కంటే చావడం మేలు” అని తనలో తాను అనుకున్నాడు.
JON 4:9 అయితే దేవుడు యోనాతో, “ఆ చెట్టు గురించి నీవలా కోప్పడడం సరైనదా?” అన్నారు. అతడు, “అవును, సరైనదే, నాకు చావాలన్నంత కోపం వస్తుంది” అన్నాడు.
JON 4:10 అయితే యెహోవా, “నీవు ఈ చెట్టును పోషించలేదు, పెంచలేదు. అది రాత్రికి రాత్రి మొలిచింది, రాత్రికి రాత్రి చచ్చింది. అయినా నీవు ఈ చెట్టు విషయంలో బాధపడుతున్నావు.
JON 4:11 అలాంటప్పుడు కుడి ఎడమలు తెలియని లక్ష ఇరవై వేలమంది మనుష్యులు ఎన్నో జంతువులు ఉన్న గొప్ప పట్టణమైన నీనెవె గురించి నేను చింతించకూడదా?” అన్నారు.
MIC 1:1 యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల పరిపాలన కాలాల్లో మోరెషెతు వాడైన మీకా దగ్గరకు వచ్చిన యెహోవా వాక్కు. సమరయ, యెరూషలేముల గురించి అతడు చూసిన దర్శనం.
MIC 1:2 ప్రజలారా, మీరంతా వినండి, భూమీ, నీవు నీలోని నివాసులందరూ ఆలకించండి, ప్రభువైన యెహోవా మీమీద నేరారోపణ చేయబోతున్నారు, ప్రభువు తన పరిశుద్ధ ఆలయం నుండి మాట్లాడుతున్నారు.
MIC 1:3 చూడండి! యెహోవా తన నివాసస్థలం నుండి వస్తున్నారు; ఆయన దిగి భూమిమీది ఉన్నతస్థలాల మీద నడవబోతున్నారు.
MIC 1:4 అగ్నికి మైనం కరిగినట్లు, వాలు మీద నీరు ప్రవహించినట్లు, ఆయన పాదాల క్రింద పర్వతాలు కరుగుతాయి, లోయలు చీలిపోతాయి.
MIC 1:5 దీనంతటికీ యాకోబు అతిక్రమం, ఇశ్రాయేలు ప్రజల పాపాలే కారణం. యాకోబు అతిక్రమం ఏంటి? అది సమరయ కాదా? యూదా యొక్క క్షేత్రం ఏంటి? అది యెరూషలేము కాదా?
MIC 1:6 “కాబట్టి నేను సమరయను రాళ్ల కుప్పగా చేస్తాను, అది ద్రాక్షతోటలు నాటే స్థలం అవుతుంది. దాని రాళ్లను లోయలో పారవేస్తాను, దాని పునాదులు బయట పడతాయి.
MIC 1:7 దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరగ్గొట్టబడతాయి; దాని గుడి కానుకలన్ని అగ్నితో కాల్చబడతాయి; నేను దాని ప్రతిమలన్నిటినీ నాశనం చేస్తాను. అది వేశ్య సంపాదనతో తన బహుమానాలను పోగుచేసింది కాబట్టి అవి మళ్ళీ వేశ్య జీతంగా ఇవ్వబడతాయి.”
MIC 1:8 దీనిని బట్టి నేను ఏడుస్తూ విలపిస్తాను; నేను చెప్పులు లేకుండా, దిగంబరిగా బయట తిరుగుతాను. నేను నక్కలా అరుస్తాను, గుడ్లగూబలాగా మూలుగుతాను.
MIC 1:9 ఎందుకంటే సమరయ తెగులు బాగు చేయలేనిది; అది యూదాకు వ్యాపించింది. అది నా ప్రజల ద్వారాల వరకు, యెరూషలేము వరకు కూడా వ్యాపించింది.
MIC 1:10 ఈ సంగతి గాతు పట్టణంలో చెప్పకండి; ఏమాత్రం ఏడవకండి. బేత్-లీఫ్రాలో నేను ధూళిలో పొర్లాడాను.
MIC 1:11 షాఫీరు వాసులారా, దిగంబరులై సిగ్గు పడుతూ దాటి వెళ్లండి. జయనాను నివాసులు బయటకు రారు. బేత్-ఏజెల్ శోకంలో ఉంది; అది ఇక ఎన్నడు మిమ్మల్ని కాపాడదు.
MIC 1:12 మారోతు వాసులు బాధలో ఉన్నారు, ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే, ఎందుకంటే, యెహోవా దగ్గర నుండి కీడు వచ్చింది, అది యెరూషలేము ద్వారం వరకు వచ్చింది.
MIC 1:13 లాకీషులో నివాసులారా, రథాలకు గుర్రాలను కట్టండి. ఇశ్రాయేలు అతిక్రమాలు మీలో కనిపించాయి, సీయోను కుమార్తె పాపానికి ప్రారంభం మీరు.
MIC 1:14 కాబట్టి మీరు మోరెషెత్-గాతుకు వీడుకోలు కానుకలిస్తారు. అక్సీబు పట్టణం ఇశ్రాయేలు రాజులను మోసగిస్తుందని రుజువు అవుతుంది.
MIC 1:15 మరేషా వాసులారా! మీ పట్టణాన్ని స్వాధీనపరచుకునేవారిని పంపుతాను. ఇశ్రాయేలు ఘనులు అదుల్లాముకు పారిపోతారు.
MIC 1:16 మీకు ఇష్టమైన పిల్లల కోసం శోకంలో మీ తలలు గొరిగించుకోండి; రాబందులా బోడితల చేసుకోండి ఎందుకంటే మీ పిల్లలు మీ నుండి బందీలుగా వెళ్తారు.
MIC 2:1 తమ పడకల మీద పాపపు ఆలోచనలు చేసేవారికి, కీడును తలంచే వారికి శ్రమ! వారికి అధికారం ఉంది కాబట్టి, ఉదయకాల వెలుగులో వారు చెడు చేస్తారు.
MIC 2:2 వారు భూములను ఆశించి ఆక్రమించుకుంటారు, ఇళ్ళను ఆశించి తీసుకుంటారు. వారు ప్రజలను మోసం చేసి వారి ఇళ్ళను లాక్కుంటారు, ప్రజల నుండి వారి స్వాస్థ్యాన్ని దోచుకుంటారు.
MIC 2:3 కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: “నేను ఈ వంశం మీదికి విపత్తు రప్పించబోతున్నాను, దాని నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. అది విపత్తు కాలం కాబట్టి మీరు ఇక ఎన్నడు గర్వంగా నడవలేరు.
MIC 2:4 ఆ రోజు ప్రజలు మీ గురించి ఒక సామెత చెప్తారు; మీ గురించి ఈ విషాద గీతం పాడుతూ ఎగతాళి చేస్తారు: ‘మేము పూర్తిగా పాడైపోయాం; నా ప్రజల ఆస్తి విభజింపబడింది ఆయన దాన్ని నా నుండి తీసుకుంటారు! ఆయన మా భూములను దేశద్రోహులకు అప్పగించారు.’ ”
MIC 2:5 అందువల్ల చీట్లువేసి భూమిని కొలమానం ప్రకారం పంచడానికి యెహోవా సమాజంలో ఎవరూ ఉండరు.
MIC 2:6 “ప్రవచించకండి” అని వారి ప్రవక్తలు అంటారు, “వీటి గురించి ప్రవచించకండి; మనకు అవమానం కలుగకూడదు.”
MIC 2:7 యాకోబు వారసులారా, “యెహోవా సహనం కోల్పోయారా? ఆయన ఇలాంటి పనులు చేస్తారా?” అని అనవచ్చా? “యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమం కలిగించవా?
MIC 2:8 ఇటీవల నా ప్రజలే శత్రువుగా లేచారు. యుద్ధం నుండి తిరిగి వచ్చే మనుష్యుల్లా, నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి నుండి సంపన్న వస్త్రాన్ని మీరు లాగివేస్తారు.
MIC 2:9 నా ప్రజల స్త్రీలను వారికిష్టమైన గృహాలలో నుండి వెళ్లగొడతారు. వారి పిల్లల మీద ఎప్పటికీ నా ఆశీర్వాదం ఉండకుండా చేస్తున్నారు.
MIC 2:10 మీరు లేచి వెళ్లిపోండి! ఇది మీ విశ్రాంతి స్థలం కాదు, ఎందుకంటే అది అపవిత్రమైంది, అది పూర్తిగా నిర్మూలమైంది.
MIC 2:11 ఒకవేళ అబద్ధికుడు మోసగాడు వచ్చి, ‘ద్రాక్షరసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచిస్తాను’ అంటే, వాడే ఈ ప్రజలకు తగిన ప్రవక్త!
MIC 2:12 “యాకోబూ, నేను ఖచ్చితంగా మీ అందరిని సమకూరుస్తాను; నేను ఖచ్చితంగా మిగిలిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాను. నేను వారిని గొర్రెల దొడ్డిలోని గొర్రెల్లా, పచ్చిక బయళ్లలోని మందలా సమకూరుస్తాను, ఈ స్థలం మనుష్యులతో కిటకిటలాడుతుంది.
MIC 2:13 అడ్డును పడగొట్టేవాడు వారికి ముందుగా వెళ్తాడు; వారు గుమ్మాన్ని పడగొట్టి, దానిగుండా బయటకు వెళ్తారు. వారి రాజు వారికి ముందుగా వెళ్తాడు, యెహోవా వారికి నాయకునిగా ఉంటారు.”
MIC 3:1 అప్పుడు నేను ఇలా అన్నాను, “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, వినండి. న్యాయాన్ని మీరు తెలుసుకోవద్దా?
MIC 3:2 మీరు మంచిని అసహ్యించుకుని చెడును ప్రేమిస్తారు; నా ప్రజల చర్మం ఒలిచి, వారి ఎముకల మీద మాంసాన్ని చీలుస్తారు;
MIC 3:3 నా ప్రజల మాంసాన్ని తింటారు, వారి చర్మం ఒలిచి, వారి ఎముకలను ముక్కలుగా విరగ్గొడతారు; పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు, కుండలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్లు చేస్తారు.”
MIC 3:4 తర్వాత వారు యెహోవాకు మొరపెడతారు, కాని ఆయన వారికి జవాబివ్వరు. వారు చేసిన చెడు కారణంగా ఆయన ఆ కాలంలో తన ముఖం దాచుకుంటారు.
MIC 3:5 యెహోవా చెప్పే మాట ఇదే: “నా ప్రజలను తప్పుదారి పట్టించిన ప్రవక్తల విషయానికి వస్తే, వారికి తినడానికి ఏదైన ఉంటే, వారు ‘సమాధానం’ ప్రకటిస్తారు, కాని ఎవరైనా వారికి భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధానికి సిద్ధపడతారు.
MIC 3:6 కాబట్టి మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముతుంది, సోదె చెప్పకుండా మిమ్మల్ని చీకటి ఆవరిస్తుంది. ప్రవక్తలకు సూర్యాస్తమయం అవుతుంది, పగలు వారికి చీకటిగా మారుతుంది.
MIC 3:7 అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గుపడతారు సోదె చెప్పేవారు అవమానపడతారు. దేవుని దగ్గర నుండి జవాబేమీ రాక వారంతా తమ ముఖాలను కప్పుకుంటారు.”
MIC 3:8 నేనైతే, యాకోబుకు అతని అతిక్రమాన్ని ఇశ్రాయేలుకు అతని పాపాన్ని తెలియజేయడానికి, యెహోవా ఆత్మను పొంది శక్తితో నింపబడి ఉన్నాను, న్యాయబుద్ధితో, బలంతో ఉన్నాను.
MIC 3:9 యాకోబు నాయకులారా, ఇశ్రాయేలు పాలకులారా, మీరు ఇది వినండి. మీరు న్యాయాన్ని తృణీకరించి, సరియైన దానినంతటిని వంకర చేస్తారు;
MIC 3:10 మీరు రక్తపాతంతో సీయోనును కడతారు, దుష్టత్వంతో యెరూషలేమును నిర్మిస్తారు.
MIC 3:11 దాని నాయకులు లంచం తీసుకుని తీర్పు చెప్తారు, దాని యాజకులు జీతానికి ఉపదేశిస్తారు. దాని ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెప్తారు. అయినా వారు యెహోవా సహాయం కోసం చూస్తూ, “యెహోవా మన మధ్య ఉన్నారు గదా! ఏ కీడు మన మీదికి రాదు” అంటారు.
MIC 3:12 కాబట్టి మీ కారణంగా, సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో మట్టి దిబ్బగా మారుతుంది.
MIC 4:1 చివరి రోజుల్లో యెహోవా ఆలయ పర్వతం పర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది; అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది, ప్రజలు ప్రవాహంలా దాని దగ్గరకు వెళ్తారు.
MIC 4:2 అన్య దేశాల వారనేకులు వచ్చి ఇలా అంటారు, “రండి, మనం యెహోవా పర్వతం మీదికి, యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము. మనం ఆయన మార్గంలో నడిచేలా, ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.” సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి.
MIC 4:3 ఆయన అనేక ప్రజలకు తీర్పు తీరుస్తారు, దూరంగా ఉన్న బలమైన దేశాల వివాదాలను పరిష్కరిస్తారు. వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా, తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు. దేశం మరొక దేశం మీది ఖడ్గం తీయదు, వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు.
MIC 4:4 ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్షచెట్టు క్రింద, తమ అంజూర చెట్టు క్రింద కూర్చుంటారు, ఎవరూ వారిని భయపెట్టరు, ఎందుకంటే సైన్యాల యెహోవా మాట ఇచ్చారు.
MIC 4:5 అన్ని దేశాల ప్రజలు తమ దేవుళ్ళ పేరిట నడుచుకుంటారు, అయితే మేము మా దేవుడైన యెహోవా పేరును బట్టి ఎల్లకాలం నడుచుకుంటాము.
MIC 4:6 యెహోవా ఇలా అంటున్నారు, “ఆ రోజు, నేను కుంటివారిని పోగుచేస్తాను; బందీలుగా వెళ్లిన వారిని, నేను బాధకు గురిచేసిన వారిని సమకూరుస్తాను.
MIC 4:7 కుంటివారిని నా శేషంగా, వెళ్లగొట్టబడిన వారిని బలమైన దేశంగా చేస్తాను. యెహోవా సీయోను కొండమీద ఆ రోజు నుండి ఎల్లప్పుడూ వారిని పరిపాలిస్తారు.
MIC 4:8 మందకు కావలికోటగా, సీయోను కుమార్తె దుర్గంగా ఉన్న నీకైతే, మునుపటి అధికారం తిరిగి ఇవ్వబడుతుంది; యెరూషలేము కుమార్తెకు రాజ్యాధికారం వస్తుంది.”
MIC 4:9 ఇప్పుడు మీరెందుకు కేకలు వేస్తున్నారు? మీకు రాజు లేడా? మీ పరిపాలకుడు నాశనమయ్యాడా? స్త్రీ ప్రసవవేదన పడినట్లు మీరెందుకు వేదన చెందుతున్నారు?
MIC 4:10 సీయోను కుమార్తె, నీవు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా వేదనతో మెలికలు తిరుగు, ఎందుకంటే ఇప్పుడు నీవు పట్టణం వదిలిపెట్టి, బయట నివసించాలి. మీరు బబులోనుకు వెళ్తారు, అక్కడే మీరు విడిపించబడతారు. అక్కడే యెహోవా మీ శత్రువు చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తారు.
MIC 4:11 ఇప్పుడు అనేక దేశాలు మీకు విరుద్ధంగా కూడుకుని, “సీయోను అపవిత్రం కావాలి, దాని నాశనం మేము కళ్లారా చూడాలి!” అంటున్నారు.
MIC 4:12 కాని వారికి యెహోవా తలంపులు తెలియవు; ఆయన ప్రణాళిక వారు గ్రహించరు. నూర్పిడి కళ్ళంలో పనలు సమకూర్చినట్లు ఆయన వారిని సమకూరుస్తారు.
MIC 4:13 “సీయోను కుమార్తె, లేచి, కళ్ళం త్రొక్కు, నేను నీకు ఇనుప కొమ్ములు ఇస్తాను; ఇత్తడి డెక్కలు ఇస్తాను. నీవు అనేక దేశాలను ముక్కలుగా విరగ్గొడతావు.” నీవు వారి అన్యాయపు సంపదను యెహోవాకు సమర్పిస్తావు. వారి ఆస్తులను సర్వలోక ప్రభువుకు సమర్పిస్తావు.
MIC 5:1 సైన్య సమూహాలు గల నగరమా, సమూహాలను సమకూర్చు, శత్రువులు మనల్ని ముట్టడించారు. వారు ఇశ్రాయేలు ప్రజల పాలకున్ని బెత్తంతో చెంపమీద కొడతారు.
MIC 5:2 “అయితే బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాల మధ్య నీవు చిన్నదానివైనప్పటికి, నా కోసం ఇశ్రాయేలు మీద పరిపాలన చేసే అధిపతి నీలో నుండి వస్తాడు, ఆయన పూర్వకాలం నుండి శాశ్వతకాలం ఉన్నవాడు.”
MIC 5:3 కాబట్టి ప్రసవ వేదన పడే స్త్రీ బిడ్డను కనేవరకు ఇశ్రాయేలు విడిచిపెట్టబడుతుంది. అతని సోదరులలో మిగిలిన వారు, ఇశ్రాయేలీయులతో చేరడానికి తిరిగి వస్తారు.
MIC 5:4 ఆయన యెహోవా బలం పొంది తన దేవుడైన యెహోవా నామ మహిమతో లేచి తన మందను మేపుతాడు. ఆయన మహాత్యం భూదిగంతాల వరకు వ్యాపిస్తుంది, కాబట్టి వారు సురక్షితంగా నివసిస్తారు.
MIC 5:5 అష్షూరు వారు దండెత్తి మన దేశంలోకి వచ్చి మన కోటలలో ప్రవేశించేటప్పుడు, ఆయన మన సమాధానం అవుతారు మనం వారికి విరుద్ధంగా ఏడుగురు కాపరులను, ఎనిమిది మంది నాయకులుగా నియమిస్తాము.
MIC 5:6 వీరు ఖడ్గంతో అష్షూరు దేశాన్ని, దూసిన ఖడ్గంతో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. అష్షూరు వారు దండెత్తి మన సరిహద్దులను దాటి, మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తారు.
MIC 5:7 యాకోబు సంతానంలో మిగిలినవారు, అనేక జనాల మధ్యలో, యెహోవా కురిపించే మంచులా, ఎవరి కోసం ఎదురుచూడకుండ ఏ మనిషి మీద ఆధారపడకుండా గడ్డి మీద కురిసే వానజల్లులా ఉంటారు.
MIC 5:8 యాకోబు సంతానంలో మిగిలినవారు దేశాల మధ్య, అనేక జనాల మధ్య, అడవి మృగాలలో సింహంలా, గొర్రెల మందలలో దూరి, ఎవ్వరూ విడిపించలేనంతగా వాటిని త్రొక్కి చీల్చే కొదమసింహంలా ఉంటారు.
MIC 5:9 మీ హస్తం మీ విరోధుల మీద విజయం సాధిస్తుంది, మీ శత్రువులందరూ నాశనమవుతారు.
MIC 5:10 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఆ దినాన” “నేను మీ మధ్య నుండి మీ గుర్రాలను నాశనం చేస్తాను, మీ రథాలను ధ్వంసం చేస్తాను.
MIC 5:11 మీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను మీ కోటలను పడగొడతాను,
MIC 5:12 మీ మధ్య మంత్రవిద్య లేకుండా నాశనం చేస్తాను ఇక ఎన్నడూ మీరు సోదె చెప్పరు.
MIC 5:13 నేను మీ విగ్రహాలను, మీ పవిత్ర రాళ్లను మీ మధ్య నుండి నిర్మూలిస్తాను; ఇకపై మీరు ఎన్నడు మీ చేతి పనులకు మ్రొక్కరు.
MIC 5:14 నేను మీ పట్టణాలను పడగొట్టినప్పుడు, మీ మధ్య నుండి అషేరా స్తంభాలను పెళ్లగిస్తాను.
MIC 5:15 నా మాట వినని దేశాల మీద కోపంతో, క్రోధంతో ప్రతీకారం తీసుకుంటాను.”
MIC 6:1 యెహోవా చెప్పేది వినండి: “మీరు నిలబడి, పర్వతాల ఎదుట నా వాదన వినిపించండి; కొండలు మీరు చెప్పేది వినాలి.
MIC 6:2 “పర్వతాల్లారా, యెహోవా చేసిన నేరారోపణ వినండి; భూమికి నిత్యమైన పునాదుల్లారా, ఆలకించండి. యెహోవా తన ప్రజలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నారు; ఆయన ఇశ్రాయేలుపై అభియోగం మోపుతున్నారు.
MIC 6:3 “నా ప్రజలారా! నేను మీకేం చేశాను? నేను మిమ్మల్ని ఎలా కష్టపెట్టాను? నాకు జవాబివ్వండి.
MIC 6:4 నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి తీసుకువచ్చాను మిమ్మల్ని దాస్యంలో ఉంచిన ఆ దేశం నుండి విడిపించాను. మీకు దారి చూపడానికి మోషే అహరోను మిర్యాములను పంపించాను.
MIC 6:5 నా ప్రజలారా! మోయాబు రాజైన బాలాకు ఎలా కుట్ర చేశాడో, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ఎలా జవాబిచ్చాడో జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నీతి క్రియలు మీరు గ్రహించేలా షిత్తీము నుండి గిల్గాలు వరకు జరిగిన మీ ప్రయాణం జ్ఞాపకం చేసుకోండి.”
MIC 6:6 ఏమి తీసుకుని నేను యెహోవా సన్నిధిలోకి రావాలి, మహోన్నతుడైన దేవుని ఎదుట నమస్కరించాలి? నేను దహనబలులను, ఏడాది దూడలను ఆయన సన్నిధికి తీసుకురావాలా?
MIC 6:7 వేల కొలది పొట్టేళ్ళూ, పదివేల నదులంత నూనెను అర్పిస్తే యెహోవా సంతోషిస్తారా? నా అతిక్రమం కోసం నా జ్యేష్ఠ కుమారున్ని, నా పాపం కోసం నా గర్భఫలాన్ని అర్పించాలా?
MIC 6:8 ఓ మనుష్యుడా, ఏది మంచిదో ఆయన నీకు చూపించారు. యెహోవా నీ నుండి కోరేదేంటి? న్యాయంగా ప్రవర్తించడం, కరుణను ప్రేమించడం, వినయం కలిగి నీ దేవునితో కలిసి నడవడమే కదా.
MIC 6:9 వినండి! యెహోవా పట్టణానికి ఇలా ప్రకటన చేస్తున్నారు: మీ నామానికి భయపడడమే జ్ఞానం, “శిక్షను, దానిని విధించేవాని మాటలు వినండి.
MIC 6:10 దుర్మార్గపు ఇల్లా, మీ అక్రమ సంపాదనలు, అసహ్యకరమైన మీ తప్పుడు కొలతలు ఇంకా ఉన్నాయి కదా?
MIC 6:11 తప్పుడు త్రాసు, మోసపు తూనిక రాళ్లున్న సంచి కలిగిన వారిని నిర్దోషి అని నేను తీర్పు ఇవ్వాలా?
MIC 6:12 మీ ధనవంతులు దౌర్జన్యం చేస్తున్నారు; మీ నివాసులు అబద్ధికులు వారి నాలుకలు కపటంగా మాట్లాడతాయి.
MIC 6:13 కాబట్టి మీ పాపాల కారణంగా నేను మిమ్మల్ని నాశనం చేసి నిర్మూలిస్తాను.
MIC 6:14 మీరు తింటారు కాని తృప్తి చెందరు; మీ కడుపులు ఇంకా ఖాళీగా ఉంటాయి. మీరు కూడబెట్టుకుంటారు కాని ఏమి కాపాడుకోలేరు, ఎందుకంటే మీరు భద్రపరచుకుంది నేను ఖడ్గానికి అప్పగిస్తాను.
MIC 6:15 మీరు నాటుతారు కాని పంట కోయరు; మీరు ఒలీవపండ్లను త్రొక్కుతారు కాని ఆ నూనెను వాడరు; ద్రాక్షలను త్రొక్కుతారు కాని ద్రాక్షరసం త్రాగరు.
MIC 6:16 మీరు ఒమ్రీ కట్టడాలను పాటించారు అహాబు ఇంటివారి విధానాలన్నీ పాటించారు; వారి సంప్రదాయాలను అనుసరించారు; కాబట్టి నేను మిమ్మల్ని నాశనం చేస్తాను ప్రజలు మిమ్మల్ని అపహాస్యం చేస్తారు; మీరు నా ప్రజల నిందను భరిస్తారు.”
MIC 7:1 ఏంటి నా దుస్థితి! నా పరిస్థితి వేసవికాలపు పండ్లు ఏరుకునే వానిలా ద్రాక్షతోట పరిగె సేకరించేవానిలా ఉంది; తినడానికి ద్రాక్షపండ్ల గెల లేదు, నేను ఆశించే క్రొత్త అంజూరపు పండ్లు లేవు.
MIC 7:2 నమ్మకమైనవారు దేశంలో లేకుండా పోయారు; యథార్థవంతుడు ఒక్కడూ లేడు. అందరు రక్తం చిందించడానికి పొంచి ఉన్నారు; వారు ఒకరిని ఒకరు వలలతో వేటాడతారు.
MIC 7:3 వారి రెండు చేతులు కీడు చేస్తాయి; పాలకులు బహుమతులు కోరతారు, న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటారు, గొప్పవారు తమ కోరికను తెలియజేస్తారు. వారంతా కలిసి కుట్ర చేస్తారు.
MIC 7:4 వారిలో మంచి వారు ముళ్ళపొద వంటివారు, వారిలో అత్యంత యథార్థవంతులు ముండ్లకంచె కంటే ఘోరము. దేవుడు మిమ్మల్ని దర్శించే రోజు, మీ కాపరులు హెచ్చరించే రోజు వచ్చింది. ఇప్పుడే మీరు కలవరపడే సమయము.
MIC 7:5 పొరుగువారిని నమ్మకండి; స్నేహితుని మీద నమ్మకం పెట్టుకోకండి. మీ కౌగిటిలో ఉండే స్త్రీ దగ్గర కూడా మీ పెదవుల నుండి వచ్చే మాటలను కాచుకోండి.
MIC 7:6 కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం చేస్తాడు, తల్లి మీదికి కుమార్తె, అత్త మీదికి తన కోడలు తిరగబడతారు, సొంత ఇంటివారే వారికి శత్రువులవుతారు.
MIC 7:7 నేనైతే యెహోవా వైపు నిరీక్షణతో చూస్తాను, నా రక్షకుడైన దేవుని కోసం వేచి ఉంటాను; నా దేవుడు నా ప్రార్ధన వింటారు.
MIC 7:8 నా విరోధీ, నా మీద అతిశయించకు, నేను పడిపోయినా తిరిగి లేస్తాను. నేను చీకటిలో కూర్చున్నా, యెహోవా నాకు వెలుగై ఉంటారు.
MIC 7:9 నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను కాబట్టి, ఆయన నాకు న్యాయం తీర్చేవరకు ఆయన నా పక్షాన ఉండే వరకు నేను ఆయన కోపాగ్నిని భరిస్తాను. ఆయన నన్ను వెలుగులోకి తీసుకువస్తారు, నేను ఆయన నీతిని చూస్తాను.
MIC 7:10 అప్పుడు నా శత్రువు దాన్ని చూసి, ఇలా జరగడం చూసి సిగ్గుపడుతుంది. “నీ దేవుడైన యెహోవా ఎక్కడ?” అని నాతో అన్న ఆమె నా కళ్లు ఆమె పతనం చూస్తాయి; ఇప్పుడు కూడా ఆమె వీధిలోని బురదలా కాళ్లక్రింద త్రొక్కబడుతుంది.
MIC 7:11 మీ గోడలు కట్టే రోజు వస్తుంది మీ సరిహద్దులు విశాలపరిచే రోజు వస్తుంది.
MIC 7:12 ఆ రోజు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు పట్టణాల నుండి మీ దగ్గరకు వస్తారు, ఈజిప్టు మొదలుకొని యూఫ్రటీసు వరకు, సముద్రం నుండి సముద్రం వరకు పర్వతం నుండి పర్వతం వరకు ఉన్న ప్రజలు వస్తారు.
MIC 7:13 భూనివాసులు చేసిన క్రియలకు ఫలితంగా దేశం పాడవుతుంది.
MIC 7:14 మీ చేతికర్రతో మీ ప్రజలను కాయండి, వారు మీ వారసత్వపు మంద, వారు అడవిలో ఒంటరిగా, సారవంతమైన పచ్చికబయళ్లలో నివసిస్తున్నారు. పూర్వకాలంలో మేసినట్లు వారిని బాషాను, గిలాదులో మేస్తారు.
MIC 7:15 “మీరు ఈజిప్టు నుండి వచ్చిన రోజుల్లో చేసినట్లు, నేను నా అద్భుతాలు వారికి చూపిస్తాను.”
MIC 7:16 దేశాల ప్రజలు అది చూసి తమ శక్తి కోల్పోయి సిగ్గుపడతారు. వారు తమ చేతులతో నోరు మూసుకుంటారు, వారి చెవులకు చెవుడు వస్తుంది.
MIC 7:17 పాములా, నేల మీద ప్రాకే పురుగులా, వారు ధూళిని నాకుతారు. వారు తమ గుహల్లో నుండి వణకుతూ బయటకు వస్తారు; వారు భయంతో మన దేవుడైన యెహోవా వైపు తిరుగుతారు, నిన్ను బట్టి భయపడతారు.
MIC 7:18 మీలాంటి దేవుడెవరు? మీరు మీ వారసత్వమైన వారిలో మిగిలిన వారి పాపాలను మన్నించి, అతిక్రమాలను క్షమిస్తారు, మీరు నిత్యం కోపంతో ఉండరు కాని దయ చూపడంలో ఆనందిస్తారు.
MIC 7:19 మీరు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తారు; మీరు మా పాపాలను అణగద్రొక్కుతారు, మా అతిక్రమాలన్నిటిని సముద్రంలో లోతుల్లో పడవేస్తారు.
MIC 7:20 మీరు పూర్వకాలంలో మా పూర్వికులకు ప్రమాణం చేసిన విధంగా యాకోబు పట్ల నమ్మకత్వాన్ని, అబ్రాహాము పట్ల మారని ప్రేమ చూపుతారు.
NAH 1:1 నీనెవెను గురించిన ప్రవచనం; ఎల్కోషీయుడైన నహూముకు ఇవ్వబడిన దర్శనాన్ని వివరించే గ్రంథమిది.
NAH 1:2 యెహోవా రోషం గలవారు ప్రతీకారం తీర్చుకునే దేవుడు; యెహోవా పగ తీర్చుకునేవారు ఉగ్రత గలవారు. యెహోవా తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటారు, తన శత్రువులపై తన ఉగ్రతను వెళ్లగ్రక్కుతారు.
NAH 1:3 యెహోవా త్వరగా కోప్పడరు, ఆయన గొప్ప శక్తిగలవారు; యెహోవా దోషులను శిక్షించకుండ విడిచిపెట్టరు. ఆయన మార్గం సుడిగాలిలోనూ తుఫానులోనూ ఉంది, మేఘాలు ఆయన పాద ధూళి.
NAH 1:4 ఆయన సముద్రాన్ని గద్దించి దానిని ఆరిపోయేలా చేస్తారు; నదులన్నిటినీ ఆయన ఎండిపోయేలా చేస్తారు. బాషాను కర్మెలు ఎండిపోతాయి, లెబానోను పువ్వులు వాడిపోతాయి.
NAH 1:5 ఆయన ముందు పర్వతాలు కంపిస్తాయి, కొండలు కరిగిపోతాయి. ఆయన సన్నిధిలో భూమి వణుకుతుంది, లోకం, దానిలో నివసించే వారందరూ వణుకుతారు.
NAH 1:6 ఆయన ఆగ్రహాన్ని ఎవరు తట్టుకోగలరు? ఆయన కోపాగ్నిని ఎవరు సహించగలరు? ఆయన ఉగ్రత అగ్నిలా బయటకు కుమ్మరించబడింది; ఆయన ముందు బండలు బద్దలయ్యాయి.
NAH 1:7 యెహోవా మంచివారు, ఆపద సమయాల్లో ఆశ్రయం ఇస్తారు. ఆయన మీద నమ్మకముంచే వారిపట్ల ఆయన శ్రద్ధ చూపుతారు.
NAH 1:8 అయితే పొంగిపొరలే వరదతో నీనెవెను అంతం చేస్తారు; ఆయన తన శత్రువులను చీకటిలోకి తరుముతారు.
NAH 1:9 వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పన్నాగం పన్నినా, ఆపద రెండవసారి రాకుండ, ఆయన దానిని అంతం చేస్తారు.
NAH 1:10 వారు ముళ్ళపొదల్లో చిక్కుకొని తమ ద్రాక్షరసంతో మత్తులై ఎండిన చెత్తలా కాలిపోతారు.
NAH 1:11 నీనెవే, నీ నుండి యెహోవాకు వ్యతిరేకంగా చెడు పన్నాగాలు పన్నేవాడు, దుష్ట ప్రణాళికలు వేసే ఒకడు వచ్చాడు.
NAH 1:12 యెహోవా ఇలా చెప్తున్నారు: “వారికి ఎంతోమంది మిత్రులు ఉన్నప్పటికీ, వారు నాశనమై గతించిపోతారు. యూదా, నేను నిన్ను బాధించాను, ఇక నేను నిన్ను బాధించను.
NAH 1:13 నీ మెడ మీద ఉన్న వారి కాడిని నేను విరగ్గొట్టి, నీ సంకెళ్ళను తెంపివేస్తాను.”
NAH 1:14 నీనెవే, నీ గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించారు: “నీ పేరు పెట్టుకునే సంతతివారు ఎవరూ ఉండరు. నీ దేవతల గుడిలో ఉన్న ప్రతిమలను, విగ్రహాలను నాశనం చేస్తాను. నీవు నీచుడవు, కాబట్టి, నీ సమాధిని సిద్ధం చేస్తాను.”
NAH 1:15 చూడు, అక్కడ పర్వతాలమీద, సువార్తను ప్రకటించేవారి పాదాలు, వారు సమాధానాన్ని ప్రకటించేవారు! యూదా, నీ పండుగలు జరుపుకో, నీ మ్రొక్కుబడులను నెరవేర్చుకో. ఇకపై దుష్టులు నీపై దండెత్తరు; వారు పూర్తిగా నాశనం చేయబడతారు.
NAH 2:1 నీనెవే! దాడి చేసేవాడు నీ మీదికి వస్తున్నాడు. కోటకు కాపలా ఉండు, రహదారి మీద నిఘా వేయి, నడుము బిగించుకో, నీ బలమంతటిని కూడగట్టుకో!
NAH 2:2 దోపిడిదారులు యాకోబును దోచుకున్నప్పటికీ, వారి ద్రాక్షతీగెలను నాశనం చేసినప్పటికీ, యెహోవా ఇశ్రాయేలు వైభవంలా, యాకోబు వైభవాన్ని తిరిగి ఇస్తారు.
NAH 2:3 సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి; యోధులు ఎరుపు దుస్తులు ధరించారు. వారు సిద్ధపడిన రోజున రథాలపై ఉన్న లోహం మెరుస్తుంది; సరళవృక్షంతో చేసిన ఈటెలు ఆడుతున్నాయి.
NAH 2:4 రథాలు వీధుల్లో దూసుకెళ్తాయి, రాజమార్గాల గుండా ఒకదాని వెనుక ఒకటి పరుగెడుతున్నాయి. అవి మండుతున్న జ్యోతుల్లా కనిపిస్తున్నాయి; అవి మెరుపులా వేగంగా వెళ్తున్నాయి.
NAH 2:5 నీనెవె తన అధికారులను పిలుస్తుంది, అయినా వారు తమ దారిలో తడబడతారు. వారు నగర గోడకు గుద్దుకుంటారు; రక్షణ కవచం సిద్ధం చేస్తారు.
NAH 2:6 నది ద్వారాలు తెరుస్తారు, రాజభవనాలు కూలిపోతాయి.
NAH 2:7 నీనెవెను బందీగా, తీసుకుపోవాలని శాసించబడింది. ఆమె దాసీలు పావురాల్లా మూలుగుతూ, తమ రొమ్ముల మీద కొట్టుకుంటారు.
NAH 2:8 నీనెవె నీరు పారుతున్న నీరు కొలనులా ఉంది. “ఆగు! ఆగు!” అని వారు ఏడుస్తారు, కానీ ఎవరూ వెనుకకు తిరుగరు.
NAH 2:9 వెండిని దోచుకో! బంగారాన్ని దోచుకో! ఆమె ఖజానాల్లో అంతులేని సంపదలు ఉన్నాయి!
NAH 2:10 ఆమె కొల్లగొట్టబడి దోచుకోబడి పాడుచేయబడుతుంది! హృదయాలు కరిగిపోతున్నాయి, మోకాళ్లు వణుకుతున్నాయి, శరీరాలు వణుకుతున్నాయి, ప్రతీ ముఖం పాలిపోతుంది.
NAH 2:11 సింహాల గుహ ఇప్పుడు ఎక్కడ? వాటి పిల్లల మేత స్థలం ఎక్కడ? సింహం, ఆడసింహం, సింహం కూనలు ఏ భయం లేకుండా తిరిగే చోటు ఏది?
NAH 2:12 సింహం తన కూనల కోసం కావలసినంత వేటాడుతూ, ఆడ సింహానికి ఆహారంగా జంతువుల మెడ కొరికి చంపుతూ, చంపిన వాటితో తన నివాస స్థలాలను, వేట మాంసంతో తన గుహలను నింపింది.
NAH 2:13 సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు “నేను నీకు వ్యతిరేకిని, నీ రథాల నుండి పొగ వచ్చేలా కాల్చివేస్తాను, ఖడ్గం నీ కొదమ సింహాలను చంపివేస్తుంది. నేను భూమ్మీద నీకు ఏ ఎర దొరక్కుండా చేస్తాను. నీ దూతల స్వరాలు ఇక వినబడవు.”
NAH 3:1 అబద్ధాలతో దోపిడీతో నిండి ఉన్న, హంతకుల పట్టణానికి శ్రమ! నిత్యం బాధితులు ఉండే, రక్తపు పట్టణానికి శ్రమ!
NAH 3:2 కొరడాల ధ్వని, చక్రాల మోత, పరుగెడుతున్న గుర్రపు డెక్కల శబ్దం వేగంగా పరుగెడుతున్న రథాల ధ్వని వినబడుతుంది!
NAH 3:3 రౌతులు ముందుకు దూసుకువెళ్తుండగా, వారి ఖడ్గాలు మెరుస్తున్నాయి, వారి ఈటెలు తళతళ మెరుస్తున్నాయి! ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది, మృతులు కుప్పలుగా పడి ఉన్నారు, మృతదేహాలకు లెక్క లేదు, మృతదేహాలు తగిలి ప్రజలు తడబడుతున్నారు.
NAH 3:4 తన మంత్రవిద్య ద్వారా ప్రజలను, తన వ్యభిచారం ద్వారా దేశాలను బానిసలుగా మార్చిన వేశ్య; మంత్రగత్తెల యజమానురాలు ఇదంతా చేసింది.
NAH 3:5 సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను నీకు వ్యతిరేకిని, నేను నీ వస్త్రాలను నీ ముఖం మీదుగా ఎత్తి, దేశాలకు నీ నగ్నత్వాన్ని రాజ్యాలకు నీ అవమానాన్ని చూపిస్తాను.
NAH 3:6 నీ మీదికి హేయమైనది విసిరి, అందరి ముందు, నిన్ను అవమానిస్తాను.
NAH 3:7 నిన్ను చూసేవారందరూ నీ నుండి పారిపోయి, ‘నీనెవె శిథిలావస్థలో ఉంది, ఆమె కోసం ఎవరు దుఃఖిస్తారు?’ నిన్ను ఓదార్చేవారిని నేను ఎక్కడి నుండి తీసుకురాగలం?” అని అంటారు.
NAH 3:8 నైలు నది దగ్గర ఉండి, చుట్టూ నీళ్లు ఉన్న, తేబేసు కంటే మేలైనదానివా? ఆ నది ఆమెకు రక్షణ, ఆ నీళ్లు ఆమెకు గోడ.
NAH 3:9 కూషు, ఈజిప్టు ఆమెకు అపరిమితమైన బలం; పూతు, లిబియా ఆమెకు మిత్రరాజ్యాలు.
NAH 3:10 అయినప్పటికీ ఆమెను బందీగా తీసుకెళ్లారు. ప్రతి వీధి మూలలో దాని పసిపిల్లల్ని ముక్కలు చేశారు. దాని అధిపతుల కోసం చీట్లు వేశారు, దాని ఘనులందరిని సంకెళ్ళతో బంధించారు.
NAH 3:11 నీకు కూడా మత్తు ఎక్కుతుంది; నీవు వెళ్లి దాక్కుని శత్రువు నుండి కాపాడుకోడానికి ఆశ్రయాన్ని వెదకుతావు.
NAH 3:12 నీ కోటలన్నీ మొదట పండిన పండ్లతో ఉన్న అంజూరపు చెట్లలా ఉన్నాయి; అవి కదిలించబడినప్పుడు, తినే వారి నోటిలో అంజూరపు పండ్లు పడతాయి.
NAH 3:13 నీ సైన్యాన్ని చూడు, వారంతా బలహీనులు. నీ దేశపు ద్వారాలు నీ శత్రువులకు విశాలంగా తెరిచి ఉన్నాయి; అగ్ని నీ ద్వారబంధాలను కాల్చివేసింది.
NAH 3:14 ముట్టడివేసే సమయానికి నీళ్లు తోడుకో, నీ కోటలను బలపరచుకో! బురదలోకి దిగు, ఇటుకలు తయారుచేయడానికి బురదను త్రొక్కు, ఇటుక బట్టీలను సిద్ధపరచు.
NAH 3:15 అక్కడ అగ్ని నిన్ను కాల్చివేస్తుంది; ఖడ్గం నిన్ను నరికివేస్తుంది, మిడతల గుంపులా అవి నిన్ను మ్రింగివేస్తాయి. గొంగళిపురుగుల్లా విస్తరించు, మిడతలంత విస్తారంగా నీ సంఖ్యను పెంచుకో!
NAH 3:16 ఆకాశంలోని నక్షత్రాల కంటే మీ వ్యాపారుల సంఖ్యను ఎక్కువగా ఉన్నప్పటికీ, మిడతల్లా వారు దేశాన్ని దోచుకుని ఎగిరిపోతారు.
NAH 3:17 మీ కావలివారు మిడతల్లా ఉన్నారు, మీ అధికారులు మిడతల గుంపులా ఉన్నారు. అవి చలికాలంలో గోడల మీద ఉండి ఎండ రాగానే ఎగిరిపోతాయి. అవి ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు.
NAH 3:18 అష్షూరు రాజా, మీ కాపరులు నిద్రపోతున్నారు; మీ అధిపతులు విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నారు. మీ ప్రజలు పర్వతాలమీద చెదరిపోయారు.
NAH 3:19 ఏదీ నిన్ను స్వస్థపరచలేదు; మీ గాయం ప్రాణాంతకమైనది. మీ గురించిన వార్త విన్నవారందరు మీ పతనాన్ని చూసి చప్పట్లు కొడతారు, ఎందుకంటే ప్రజలందరూ మీ అంతులేని క్రూరత్వాన్ని నీ క్రూరమైన హింసను అనుభవించిన వారే.
HAB 1:1 ఇది ప్రవక్తయైన హబక్కూకు ఒక దర్శనంలో పొందుకున్న ప్రవచనము.
HAB 1:2 యెహోవా, సహాయం కోసం నేను మొరపెట్టినా, ఎంతకాలం వినకుండా ఉంటావు? “హింస!” జరుగుతుందని నీకు మొరపెట్టినా ఎంతకాలం రక్షించకుండ ఉంటావు?
HAB 1:3 నన్నెందుకు దుష్టత్వాన్ని చూసేలా చేస్తున్నావు? తప్పు చేయడాన్ని నీవెందుకు సహిస్తున్నావు? నాశనం హింస నా ముందే ఉన్నాయి; కలహాలు ఘర్షణలు చెలరేగుతున్నాయి.
HAB 1:4 అందుకే ధర్మశాస్త్రం కుంటుపడింది, ఎప్పుడూ న్యాయం జరగడం లేదు. దుర్మార్గులు నీతిమంతులను చుట్టుముడుతున్నారు, న్యాయం చెడిపోతుంది.
HAB 1:5 “దేశాల వైపు గమనించి చూసి, నిర్ఘాంతపోయి ఆశ్చర్యపడండి: ఎందుకంటే మీ కాలంలో నేనొక కార్యాన్ని చేయబోతున్నాను, దాని గురించి ఎవరైనా మీకు చెప్పినా మీరు దాన్ని నమ్మరు.
HAB 1:6 తమవి కాని నివాస స్థలాలను ఆక్రమించుకోడానికి, భూమి అంచుల వరకు తిరిగే క్రూరులును, ఆవేశపరులునైన బబులోను ప్రజలను నేను రేపుతున్నాను.
HAB 1:7 వారు అత్యంత భయంకరమైన ప్రజలు; వారు తమకు ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేసుకుని అధికారం చెలాయిస్తారు.
HAB 1:8 వారి గుర్రాలు చిరుతపులి కంటే వేగవంతమైనవి, చీకట్లలో తిరిగే తోడేళ్ళ కంటే భయంకరమైనవి. వారి గుర్రాల దండు దూకుడుగా చొరబడతాయి; వారి రౌతులు దూరం నుండి వస్తారు. ఎరను పట్టుకోవడానికి గ్రద్ద వచ్చినట్లుగా వారు వేగంగా వస్తారు;
HAB 1:9 వారంతా దౌర్జన్యం చేయడానికి వస్తారు. ఎడారి గాలిలా వారి ముఖాలను పైకెత్తి ఇసుకరేణువులంత విస్తారంగా ప్రజలను బందీలుగా పట్టుకుంటారు.
HAB 1:10 వారు రాజులను వెక్కిరిస్తారు పాలకులను ఎగతాళి చేస్తారు. కోటలున్న పట్టణాలను చూసి నవ్వుతారు; మట్టి దిబ్బలు వేసి వాటిని స్వాధీనపరచుకుంటారు.
HAB 1:11 గాలికి కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతూ అపరాధులవుతారు, తమ బలాన్నే తమ దేవునిగా భావిస్తారు.”
HAB 1:12 యెహోవా, నీవు ఆరంభం నుండి ఉన్నవాడవు కావా? నా దేవా, నా పరిశుద్ధుడా, నీవు ఎన్నడు చనిపోవు. యెహోవా, నీవు వారిని తీర్పు తీర్చడానికి నియమించావు; నా రక్షకా, మమ్మల్ని దండించడానికి నీవు వారిని నియమించావు.
HAB 1:13 నీ కళ్లు చెడును చూడలేనంత స్వచ్ఛమైనవి; నీవు తప్పును సహించలేవు. మరి ద్రోహులను ఎందుకు సహిస్తున్నావు? దుర్మార్గులు తమకంటే నీతిమంతులైన వారిని నాశనం చేస్తుంటే నీవెందుకు మౌనంగా ఉన్నావు?
HAB 1:14 పాలకుడు లేని సముద్ర జీవులతో, సముద్ర చేపలతో నీవు నరులను సమానులుగా చేశావు.
HAB 1:15 చెడ్డ శత్రువు వారందరిని గాలంతో పైకి లాగి, తన వలలో వారిని పట్టుకుంటాడు, తన ఉచ్చులో వారిని పోగుచేసుకుని సంతోషంతో గంతులు వేస్తాడు.
HAB 1:16 తన వల వలన విలాసవంతమైన జీవితం మంచి ఆహారం దొరుకుతుందని తన వలకు బలులు అర్పించి తన ఉచ్చుకు ధూపం వేస్తాడు.
HAB 1:17 అతడు కనికరం లేకుండా దేశాలను నాశనం చేస్తూ, నిత్యం తన వలను ఖాళీ చేస్తూనే ఉంటాడా?
HAB 2:1 నేను నా కావలి స్థలం దగ్గర కనిపెట్టుకుని నగర గోడపై నిలబడి ఉంటాను; ఆయన నాతో ఏమి చెప్తాడో, ఈ ఫిర్యాదుకు నేను ఏమి జవాబు చెప్పాలో చూస్తాను.
HAB 2:2 యెహోవా నాకిలా జవాబిచ్చారు: “ప్రకటించేవాడు పరుగెడుతూ సులభంగా చదవడానికి వీలుగా దర్శన సందేశాన్ని పలక మీద స్పష్టంగా వ్రాయి.
HAB 2:3 దర్శన సందేశం ఒక నియమిత సమయంలో జరుగుతుంది; అది అంతం గురించి మాట్లాడుతుంది అది తప్పక నెరవేరుతుంది. అది ఆలస్యమైనా, దాని కోసం వేచి ఉండండి; ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఆలస్యం కాదు.
HAB 2:4 “చూడండి, శత్రువు కోరికలు న్యాయమైనవి కాకపోయినా అతడు అతిశయపడుతున్నాడు; కాని నీతిమంతుడు తన నమ్మకత్వాన్ని బట్టి జీవిస్తాడు.
HAB 2:5 ద్రాక్షరసం అతన్ని మోసం చేస్తుంది; గర్విష్ఠియైన అతడు ఎప్పుడూ విశ్రమించడు. అతనికి పాతాళమంత దురాశ ఉన్నందున మరణంలా అది ఎన్నడూ తృప్తిపడదు, అతడు సమస్త జనాలను వశపరచుకుంటాడు ప్రజలందరిని బందీలుగా తీసుకెళ్తాడు.
HAB 2:6 “అయితే వారందరూ అతన్ని ఎగతాళి చేస్తూ ఈ సామెత చెబుతారు, “ ‘దొంగిలించిన వస్తువులను పోగుచేసి బలత్కారంతో ధనవంతునిగా మారిన వారికి శ్రమ! ఇలా ఎంతకాలం కొనసాగుతుంది?’
HAB 2:7 అప్పు ఇచ్చినవారు నీ మీద అకస్మాత్తుగా పడరా? వారు లేచి నీకు వణుకు పుట్టించరా? అప్పుడు వారు నిన్ను దోచుకుంటారు.
HAB 2:8 నీవు అనేక దేశాలను దోచుకున్నావు కాబట్టి, మిగిలి ఉన్న ప్రజలంతా నిన్ను దోచుకుంటారు. నీవు నరహత్యలు చేసినందుకు, భూములను పట్టణాలను వాటిలోని వారందరినీ నాశనం చేసినందుకు ప్రజలు నిన్ను దోచుకుంటారు.
HAB 2:9 “తనకు నాశనం కలుగకుండా తన నివాసాన్ని ఎత్తు చేసుకుని అన్యాయమైన సంపాదనతో తన ఇంటిని నిర్మించుకునే వారికి శ్రమ!
HAB 2:10 అనేక ప్రజలను నాశనం చేయడానికి కుట్రచేసి నీ ఇంటివారి మీదికి అవమానం తెచ్చుకుని నీ ప్రాణాన్ని కోల్పోతున్నావు.
HAB 2:11 గోడ రాళ్లు మొరపెడతాయి, చెక్క దూలాలు వాటిని ప్రతిధ్వనింపచేస్తాయి.
HAB 2:12 “రక్తం చిందించి పట్టణాన్ని నిర్మించేవారికి అన్యాయంతో ఊరిని స్థాపించేవారికి శ్రమ!
HAB 2:13 ప్రజలు కష్టపడతారు కాని అగ్ని పాలవుతారని, వ్యర్థమైన దాని కోసం కష్టపడి జనులు అలసిపోతారని సైన్యాల యెహోవా నిర్ణయించలేదా?
HAB 2:14 నీళ్లు సముద్రాన్ని కప్పినట్లు యెహోవా మహిమాన్విత జ్ఞానంతో భూమి నిండి ఉంటుంది.
HAB 2:15 “తన పొరుగువారి నగ్న శరీరాలను చూడాలని, వారు మత్తులో మునిగిపోయేలా కోపంతో వారికి ద్రాక్షరసం పోసేవారికి శ్రమ!
HAB 2:16 కీర్తికి బదులుగా నీకు అవమానం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు నీ వంతు! నీవు కూడా త్రాగి నీ నగ్నత్వాన్ని చూపించుకుంటావు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీ దగ్గరకు వస్తోంది, అవమానం నీ కీర్తిని కప్పివేస్తుంది.
HAB 2:17 లెబానోనుపై నీవు చేసిన హింస నీ మీదికే వస్తుంది, పశువులను నాశనం చేసినందుకు నీ మీదికి భయంకరమైన తీర్పు వస్తుంది. నీవు మనుష్యులను హత్య చేసినందుకు, దేశాలను పట్టణాలను వాటి నివాసులను నాశనం చేసినందుకు ఇలా జరుగుతుంది.
HAB 2:18 “శిల్పి చెక్కిన ఒక విగ్రహం వలన ప్రయోజనమేంటి? అబద్ధాలు బోధించే ప్రతిమ వలన ప్రయోజనమేంటి? ఒకడు మాట్లాడలేని విగ్రహాలను చేసిన తాను రూపం ఇచ్చిన వాటిపైనే నమ్మకం ఉంచడం వలన ప్రయోజనమేంటి?
HAB 2:19 చెక్కను చూసి, ‘ప్రాణం తెచ్చుకో’ అని నిర్జీవమైన రాయితో, ‘మేలుకో’ అని చెప్పేవానికి శ్రమ! అది దారి చూపించగలదా? అది బంగారం వెండితో పూత వేయబడింది; దానిలో శ్వాస లేదు.”
HAB 2:20 కాని, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు; ఆయన ఎదుట లోకమంతా మౌనం వహించాలి.
HAB 3:1 ప్రవక్తయైన హబక్కూకు చేసిన ప్రార్థన. షిగియోనోతు.
HAB 3:2 యెహోవా, నీ కీర్తి గురించి విన్నాను; యెహోవా, నీ క్రియలకు నేను భయపడుతున్నాను. మా దినాల్లో వాటిని మళ్ళీ చేయండి, మా కాలంలో వాటిని తెలియజేయండి; ఉగ్రతలో కరుణించడం జ్ఞాపకముంచుకోండి.
HAB 3:3 దేవుడు తేమాను నుండి వచ్చాడు, పరిశుద్ధుడు పారాను పర్వతం నుండి వచ్చాడు. సెలా ఆయన మహా వైభవం ఆకాశాలను కప్పివేసింది భూమి ఆయన స్తుతితో నిండింది.
HAB 3:4 ఆయన తేజస్సు సూర్యకాంతిలా ఉంది; ఆయన చేతిలో నుండి కిరణాలు బయలువెళ్తున్నాయి, అక్కడ ఆయన శక్తి దాగి ఉంది.
HAB 3:5 ఆయనకు ముందుగా తెగులు వెళ్లింది; అంటువ్యాధి ఆయన పాదాలను అనుసరించింది.
HAB 3:6 ఆయన నిలబడగా భూమి కంపించింది; ఆయన చూడగా దేశాలు వణికాయి. పురాతన పర్వతాలు కూలిపోయాయి పురాతన కొండలు అణగిపోయాయి కానీ ఆయన మార్గాలు శాశ్వతమైనవి.
HAB 3:7 భయంలో ఉన్న కూషీయుల గుడారాలను, వేదనలో ఉన్న మిద్యానువాసుల నివాసాలను నేను చూశాను.
HAB 3:8 యెహోవా, నీవు నదులపై కోపంగా ఉన్నావా? ప్రవాహాల మీద నీ ఉగ్రత ఉందా? సముద్రంపై కోపం వచ్చిందా? అందుకే నీవు నీ గుర్రాల మీద స్వారీ చేస్తూ నీ విజయ రథాలను ఎక్కి వస్తున్నావా?
HAB 3:9 వరలో నుండి నీ విల్లు తీసావు, నీ వాక్కుతోడని ప్రమాణం చేసి నీ బాణాలను సిద్ధం చేశావు. సెలా నీవు భూమిని చీల్చి నదులను ప్రవహింపజేశావు;
HAB 3:10 పర్వతాలు నిన్ను చూసి వణికాయి. నీళ్లు ప్రవాహాలుగా ప్రవహిస్తాయి; అగాధం ఘోషిస్తూ తన అలలను పైకి లేపుతుంది.
HAB 3:11 ఎగిరే నీ బాణాల కాంతికి నీ ఈటె తళతళ మెరుపుకు సూర్యచంద్రులు తమ ఆకాశంలో స్థానాల్లో నిలిచిపోతాయి.
HAB 3:12 ఉగ్రతతో నీవు భూమిమీద తిరుగుతున్నావు ఆగ్రహంతో దేశాలను అణగద్రొక్కుతున్నావు.
HAB 3:13 నీ ప్రజలను విడిపించడానికి, నీ అభిషిక్తుని రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు. దుర్మార్గపు దేశపు నాయకుడిని నీవు కూలద్రోసి, తల నుండి పాదం ఖండించి నిర్మూలం చేస్తున్నావు. సెలా
HAB 3:14 దాక్కున్న దౌర్భాగ్యులను మ్రింగివేసేందుకు ఉవ్విళ్లూరుతూ, మనల్ని చెదరగొట్టడానికి అతని యోధులు దూసుకుని వచ్చినప్పుడు, అతని తలలో మీరు అతని ఈటెనే గుచ్చారు.
HAB 3:15 నీవు నీ గుర్రాలతో సముద్రాన్ని త్రొక్కించావు, గొప్ప జలాలను చిలుకుతున్నావు.
HAB 3:16 నేను వినగా నా గుండె కొట్టుకుంది, ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి; నా ఎముకలు కుళ్లిపోతున్నాయి, నా కాళ్లు వణికాయి. అయినా మనపై దాడి చేస్తున్న దేశం మీదికి విపత్తు సంభవించే దినం వచ్చేవరకు నేను ఎదురుచూస్తూ ఉంటాను.
HAB 3:17 అంజూరపు చెట్టు పూత పూయకపోయినా ద్రాక్షచెట్టుకు పండ్లు లేకపోయినా, ఒలీవచెట్లు కాపు కాయకపోయినా పొలాలు పంట ఇవ్వకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా,
HAB 3:18 నేను యెహోవాయందు ఆనందిస్తాను, నా రక్షకుడైన దేవునియందు నేను సంతోషిస్తాను.
HAB 3:19 ప్రభువైన యెహోవాయే నా బలం; ఆయన నా కాళ్లను లేడికాళ్లలా చేస్తాడు, ఎత్తైన స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తారు. సంగీత దర్శకుని కోసము. తంతి వాయిద్యాలపై పాడదగినది.
ZEP 1:1 ఇది యూదా రాజైన ఆమోను కుమారుడు యోషీయా పాలనలో జెఫన్యాకు యెహోవా నుండి వచ్చిన వాక్కు. జెఫన్యా కూషీ కుమారుడు, కూషీ గెదల్యా కుమారుడు, గెదల్యా అమర్యా కుమారుడు, అమర్యా హిజ్కియాకు కుమారుడు.
ZEP 1:2 “భూమి మీద ఏమీ మిగలకుండా నేను సమస్తాన్ని తుడిచివేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ZEP 1:3 “మనుష్యులను మృగాలను తుడిచివేస్తాను; ఆకాశంలో ఎగిరే పక్షులను, సముద్రంలోని చేపలను తుడిచివేస్తాను, దుర్మార్గులను పడిపోయేలా చేసే విగ్రహాలను తుడిచివేస్తాను.” “నేను మానవజాతి అంతటిని భూమి మీద ఉండకుండా చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ZEP 1:4 “యూదా వారి మీద, యెరూషలేములో నివసిస్తున్న వారందరి మీద నా చేయి చాపుతాను. ఈ స్థలంలో మిగిలి ఉన్న బయలు దేవత ఆరాధికులను ఆ విగ్రహాన్ని పూజించేవారి పూజారుల పేర్లతో సహా నిర్మూలిస్తాను.
ZEP 1:5 మిద్దెమీద ఎక్కి ఆకాశ నక్షత్ర సమూహాన్ని పూజించేవారిని, యెహోవా పేర మోలెకు దేవత పేర మొక్కి ఒట్టు వేసుకునేవారిని నేను నాశనం చేస్తాను.
ZEP 1:6 యెహోవాను అనుసరించకుండా ప్రక్కకు తిరిగినవారిని ఆయనను వెదకకుండ, ఆయన దగ్గర విచారణ చేయనివారిని నాశనం చేస్తాను.”
ZEP 1:7 ప్రభువైన యెహోవా దినం సమీపించింది, కాబట్టి ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి. యెహోవా బలి సిద్ధం చేశారు; తాను ఆహ్వానించిన వారిని ఆయన పవిత్రపరిచారు.
ZEP 1:8 “యెహోవా ఏర్పరచిన బలి దినాన నేను అధికారులను, రాజకుమారులను, విదేశీయుల్లా దుస్తులు వేసుకున్నవారందరిని శిక్షిస్తాను.
ZEP 1:9 ఆ రోజున, ఇంటి గుమ్మం దాటివచ్చి, తమ దేవతల మందిరాన్ని హింసతో మోసంతో నింపేవారందరినీ నేను శిక్షిస్తాను.
ZEP 1:10 “ఆ దినాన యెరూషలేములో ఉన్న చేప ద్వారం నుండి ఏడుపు, పట్టణ దిగువ భాగం నుండి రోదన, కొండల దిక్కునుండి గొప్ప నాశనం వస్తుంది, అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ZEP 1:11 వర్తక ప్రాంతంలో నివసించేవారలారా! రోదించండి; నీ వర్తకులంతా తుడిచివేయబడతారు, వెండితో వ్యాపారం చేసేవారంతా నాశనం చేయబడతారు.
ZEP 1:12 ఆ కాలంలో నేను దీపాలు పట్టుకుని యెరూషలేమును సోదా చేస్తాను, మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసం లాంటివారై ‘యెహోవా మేలు గాని కీడు గాని ఏదీ చేయడు’ అనుకుంటూ, ఆత్మసంతృప్తితో ఉన్నవారిని నేను శిక్షిస్తాను.
ZEP 1:13 వారి ధనం దోపిడి అవుతుంది, వారి ఇల్లు పాడవుతాయి. వారు ఇళ్ళు కట్టుకున్నా వాటిలో నివసించలేరు; వారు ద్రాక్షతోటలు నాటినా వాటి ద్రాక్షరసం త్రాగలేరు.”
ZEP 1:14 యెహోవా మహాదినం సమీపంగా ఉంది, అది ఆసన్నమై త్వరగా రాబోతుంది. యెహోవా దినాన ఏడ్పు భయంకరంగా ఉంటుంది; ఆ దినాన బలాఢ్యులు ఘోరంగా ఏడుస్తారు.
ZEP 1:15 ఆ దినం ఉగ్రత దినం; బాధ, వేదన కలుగుతుంది. అది నాశనం, ధ్వంసం, చీకటి అంధకారం కమ్మే దినం, మబ్బులు, గాఢాంధకారం కమ్మే రోజు.
ZEP 1:16 ప్రాకార పట్టణాల దగ్గర ఎత్తైన గోపురాల దగ్గర యుద్ధఘోష, బాకానాదం వినబడే రోజు.
ZEP 1:17 “ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేశారు, కాబట్టి మనుష్యులందరి మీదికి నేను బాధను రప్పించగా వారు గ్రుడ్డివారిలా తడుముకుంటారు. వారి రక్తం దుమ్ములా, వారి మాంసం పెంటలా పారవేయబడుతుంది.
ZEP 1:18 యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేవు.” ఆయన రోషాగ్ని చేత లోకమంతా దగ్దమవుతుంది, ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నారు.
ZEP 2:1 సిగ్గుమాలిన దేశమా, సమకూడండి, మిమ్మల్ని మీరు సమకూర్చుకొండి
ZEP 2:2 శాసనం అమలులోకి రాకముందే ఆ దినం గాలికి కొట్టుకుపోయే పొట్టులా కనుమరుగు కాక ముందే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకముందే, యెహోవా ఉగ్రత దినం మీ మీదికి రాకముందే సమకూడండి.
ZEP 2:3 దేశంలోని సమస్త దీనులారా, ఆయన ఆజ్ఞను పాటించేవారలారా, యెహోవాను వెదకండి. నీతిని వెదకండి, దీనత్వాన్ని వెదకండి; యెహోవా కోప్పడే దినాన బహుశ మీకు ఆశ్రయం దొరకవచ్చు.
ZEP 2:4 గాజా విడిచిపెట్టబడుతుంది, అష్కెలోను పాడైపోతుంది. మధ్యాహ్న సమయంలో అష్డోదు ఖాళీ చేయబడుతుంది, ఎక్రోను పట్టణం పెళ్ళగించబడుతుంది.
ZEP 2:5 సముద్రతీరాన కాపురమున్న కెరేతీయులారా! మీకు శ్రమ. ఫిలిష్తీయ ప్రజలు కాపురమున్న కనాను దేశమా! యెహోవా వాక్కు నీకు వ్యతిరేకంగా ఉంది, “నీలో ఎవరూ మిగలకుండా నేను నిన్ను నాశనం చేస్తాను” అని ఆయన అంటున్నారు.
ZEP 2:6 సముద్రతీరాన ఉన్న దేశం, గొర్రెల కాపరులకు పచ్చికబయళ్లుగా అవుతుంది; బావులు, మందల కోసం దొడ్లు ఉంటాయి.
ZEP 2:7 ఆ ప్రాంతం యూదా వంశంలో మిగిలిన వారికి స్వాధీనం అవుతుంది. వారి దేవుడు యెహోవా వారి పట్ల శ్రద్ధ చూపిస్తారు, వారు బందీలుగా వెళ్లిన స్థలాల నుండి ఆయన వారిని రప్పిస్తారు. వారు ఆ ప్రాంతంలో తమ మందలు మేపుతారు. సాయంకాల సమయంలో అష్కెలోను ఇళ్ళలో పడుకుంటారు.
ZEP 2:8 “నా ప్రజల ప్రాంతంలోకి ప్రవేశించి వారిని దూషించిన, మోయాబు వారు చేసిన అవమానాల గురించి, అమ్మోనీయుల దూషణల గురించి నేను విన్నాను.
ZEP 2:9 కాబట్టి, నా జీవం తోడు, మోయాబు సొదొమలా, అమ్మోను గొమొర్రాలా అవుతుంది. కలుపు మొక్కలు ఉప్పు గుంటలతో, అవి ఎప్పటికీ బంజరు భూమిగానే ఉంటాయి. నా ప్రజల్లో శేషించినవారు వారిని దోచుకుంటారు; నా దేశంలో బ్రతికినవారు తమ దేశాన్ని స్వతంత్రించుకుంటారు” అని ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
ZEP 2:10 ఈ విధంగా వారు గర్వంతో, సైన్యాల యెహోవా ప్రజలను అవమానించినందుకు, ఎగతాళి చేసినందుకు ప్రతిఫలం పొందుతారు.
ZEP 2:11 ఆయన భూమ్మీద ఉన్న దేవతలందరినీ నాశనం చేసినప్పుడు యెహోవా వారికి భయంకరంగా ఉంటాడు. ద్వీపాల్లో నివసించే జనులంతా తమ స్థలాల నుండి, ఆయనకు నమస్కారం చేస్తారు.
ZEP 2:12 “కూషీయులారా, మీరు కూడా నా ఖడ్గం చేత చంపబడతారు.”
ZEP 2:13 ఆయన తన చేయి ఉత్తరం వైపు చాచి అష్షూరును నాశనం చేస్తారు. నీనెవెను పూర్తిగా నిర్జనమై ఎడారిలా ఎండిపోయేలా చేస్తారు.
ZEP 2:14 గొర్రెల మందలు, పశువుల మందలు, దేశంలోని అన్ని రకాల జీవులు అక్కడ పడుకుంటాయి. ఎడారి గుడ్లగూబ, పెద్ద గుడ్లగూబ దాని స్తంభాలపై కూర్చుంటాయి. వారి కూత కిటికీల గుండా ప్రతిధ్వనిస్తుంది, రాళ్లతో తలుపులు నిండిపోతాయి, దేవదారు దూలాలు నాశనమవుతాయి.
ZEP 2:15 ఇది క్షేమకరమైన ఆనందకరమైన పట్టణము. ఆమె తనలో తాను, “నా వంటి పట్టణం మరొకటి లేదని అనుకున్నది. ఆమె ఎంతగా పాడైపోయింది,” క్రూరమృగాలకు గుహలా మారింది! ఆ దారి గుండా వెళ్లే వారందరూ ఎగతాళి చేస్తూ చేతులు ఆడిస్తున్నారు.
ZEP 3:1 అణచివేత, తిరుగుబాటుతనం, అపవిత్రత నిండిన పట్టణానికి శ్రమ!
ZEP 3:2 ఆమె ఎవరికీ లోబడదు, ఆమె దిద్దుబాటును అంగీకరించదు. ఆమె యెహోవా మీద నమ్మకముంచదు, ఆమె తన దేవున్ని సమీపించదు.
ZEP 3:3 దానిలో ఉన్న అధికారులు గర్జించే సింహాలు; దాని పాలకులు రాత్రివేళ తిరుగుతూ, ఉదయానికి ఏమీ మిగల్చకుండా తినే తోడేళ్లు.
ZEP 3:4 దాని ప్రవక్తలు నీతిలేనివారు; వారు నమ్మకద్రోహులు. దాని యాజకులు పరిశుద్ధస్థలాన్ని అపవిత్రం చేస్తారు ధర్మశాస్త్రాన్ని హింసిస్తారు.
ZEP 3:5 అయితే యెహోవా నీతిమంతుడు; ఆయన తప్పు చేయరు. అనుదినం ఆయన మానకుండా, ఉదయాన్నే తన న్యాయాన్ని అమలుచేస్తారు, అయినప్పటికీ నీతిలేని వానికి సిగ్గు తెలియదు.
ZEP 3:6 “నేను దేశాలను నాశనం చేశాను; వాటి కోటలు పడగొట్టబడ్డాయి. నేను వాటి వీధులను ఎడారిగా వదిలేశాను, ఎవరూ వాటి గుండా వెళ్లరు. వాటిలో ఎవరూ నివసించకుండా వారి పట్టణాలను నిర్జనంగా చేశాను.
ZEP 3:7 నేను యెరూషలేము గురించి, ‘ఖచ్చితంగా నీవు నాకు భయపడి దిద్దుబాటును అంగీకరిస్తావు! అప్పుడు దాని ఆశ్రయ స్థలం నాశనం చేయబడదు, నా శిక్షలేవీ దాని మీదికి రావు’ అని అనుకున్నాను. కాని వారు అన్ని రకాల చెడుపనులు చేయాలని ఆతృతగా ఉన్నారు.
ZEP 3:8 కాబట్టి నా కోసం వేచి ఉండండి,” అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు. “నేను సాక్ష్యం చెప్పడానికి నిలబడే రోజు కోసం వేచి ఉండండి. నేను దేశాలను పోగుచేయాలని, రాజ్యాలను సమకూర్చాలని వాటి మీద నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని కుమ్మరించాలని నిర్ణయించుకున్నాను. రోషంతో కూడిన నా కోపానికి లోకమంతా దహించబడుతుంది.
ZEP 3:9 “నేను ప్రజల పెదవులను శుద్ధి చేస్తాను, అప్పుడు వారంతా యెహోవా నామానికి మొరపెట్టి ఏక మనసుతో ఆయనను సేవిస్తారు.
ZEP 3:10 చెదిరిపోయిన నన్ను ఆరాధించే నా ప్రజలు కూషు నదుల అవతల నుండి నాకు అర్పణలు తెస్తారు.
ZEP 3:11 ఆ దినాన యెరూషలేమా, నీవు నా మీద తిరుగబడి చేసిన పనుల గురించి నీవు సిగ్గుపడవు, ఎందుకంటే నీ గర్వాన్ని బట్టి సంతోషించేవారిని నేను నీలో నుండి తొలగిస్తాను. నా పరిశుద్ధ కొండపై ఇంకెప్పుడు నీవు గర్వపడవు.
ZEP 3:12 అయితే నేను మీలో సాత్వికులను, దీనులను వదిలివేస్తాను. ఇశ్రాయేలులో మిగిలినవారు యెహోవా నామాన్ని నమ్ముతారు.
ZEP 3:13 ఇశ్రాయేలులో మిగిలినవారు ఏ తప్పు చేయరు; వారు అబద్ధాలు చెప్పరు. మోసపూరిత నాలుక వారి నోళ్లలో ఉండదు. వారు తిని పడుకుంటారు వారికి ఎవరి భయం ఉండదు.”
ZEP 3:14 సీయోను కుమారీ, పాట పాడు; ఇశ్రాయేలూ, బిగ్గరగా కేకవేయి! యెరూషలేము కుమారీ, నీ పూర్ణహృదయంతో సంతోషించి ఆనందించు!
ZEP 3:15 యెహోవా నీ శిక్షను తొలగించారు, నీ శత్రువును తిప్పికొట్టారు. ఇశ్రాయేలు రాజైన యెహోవా నీకు తోడుగా ఉన్నారు; ఇంకెప్పుడు ఏ హానికి నీవు భయపడవు.
ZEP 3:16 ఆ రోజున వారు యెరూషలేముతో, “సీయోనూ, భయపడకు; నీ చేతులను బలహీన పడనివ్వవద్దు.
ZEP 3:17 నీ దేవుడైన యెహోవా, రక్షించే పరాక్రమశాలి నీకు తోడుగా ఉన్నారు. ఆయన నిన్ను చూసి చాలా సంతోషిస్తారు; ఆయన తన ప్రేమను బట్టి ఆయన ఇకపై నిన్ను గద్దించరు, పాడుతూ నిన్ను చూసి సంతోషిస్తారు.”
ZEP 3:18 “నీ నియమించబడిన పండుగలకు రాలేక దుఃఖించే వారందరినీ నేను మీ మధ్య నుండి తొలగిస్తాను. వారు మీకు భారంగా నిందగా ఉన్నారు.
ZEP 3:19 ఆ సమయంలో నిన్ను హింసించిన వారందరిని నేను శిక్షిస్తాను. కుంటివారిని నేను రక్షిస్తాను; చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. వారు అవమానానికి గురైన ప్రతి దేశంలో నేను వారికి కీర్తిని, ఘనతను ఇస్తాను.
ZEP 3:20 ఆ సమయంలో నేను మిమ్మల్ని సమకూర్చుతాను; ఆ సమయంలో నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువస్తాను. నేను మిమ్మల్ని చెరలో నుండి తిరిగి తీసుకువచ్చినప్పుడు భూమ్మీద ఉన్న ప్రజలందరిలో నేను మీకు కీర్తిని, ఘనతను ఇస్తాను” అని యెహోవా అంటున్నారు.
HAG 1:1 రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరో నెల మొదటి రోజున ప్రవక్తయైన హగ్గయి ద్వారా యూదాదేశపు అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకు, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పింది:
HAG 1:2 సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: “యెహోవాకు మందిరాన్ని మరలా కట్టడానికి సమయమింకా రాలేదని ఈ ప్రజలు అంటున్నారు.”
HAG 1:3 అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా చెప్పింది ఏంటంటే:
HAG 1:4 “ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు చెక్క పలకలతో కప్పిన మీ ఇళ్ళలో నివసించడానికి ఇది సమయమా?”
HAG 1:5 కాబట్టి సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: “మీ ప్రవర్తన గురించి బాగా ఆలోచించుకోండి.
HAG 1:6 మీరు విస్తారంగా విత్తినా కానీ పండింది కొంచెమే. మీరు భోజనం చేస్తున్నా ఆకలి తీరడం లేదు. మీరు త్రాగుతున్నారు కానీ మత్తు ఎక్కడం లేదు. బట్టలు కప్పుకున్నా వెచ్చగా లేదు. మీరు జీతం సంపాదిస్తున్నా అది చిల్లు సంచిలో వేసినట్లే ఉంటుంది.”
HAG 1:7 సైన్యాలకు యెహోవా చెబుతున్న మాట ఇదే: “మీ ప్రవర్తన గురించి బాగా ఆలోచించుకోండి.
HAG 1:8 పర్వతాల పైకి వెళ్లి కలపను తీసుకువచ్చి నా మందిరాన్ని కట్టండి, అప్పుడు నేను దానిలో ఆనందించి ఘనత పొందుతానని” యెహోవా తెలియజేస్తున్నారు.
HAG 1:9 “మీరు ఎక్కువ ఆశించారు కాని కొంచెమే వచ్చింది. మీరు ఇంటికి తెచ్చిన దానిని నేను చెదరగొట్టాను. ఎందుకు? అని సైన్యాలకు యెహోవా అంటున్నారు. ఎందుకంటే నా మందిరం పాడైపోయి ఉండగా మీరంతా మీ ఇళ్ళు కట్టుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
HAG 1:10 కాబట్టి మీ కారణంగా ఆకాశం నుండి మంచు కురవలేదు భూమి పంటలు పండలేదు.
HAG 1:11 పొలాలు పర్వతాల విషయంలో ధాన్యం క్రొత్త ద్రాక్షరసం విషయంలో నూనె విషయంలో భూమి పండించే చేసే ప్రతి దాని విషయంలో మనుష్యులు పశువుల విషయంలో చేతి పనులన్నిటి విషయంలో కరువు రప్పించాను.”
HAG 1:12 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునైన యెహోషువ, మిగిలి ఉన్న ప్రజలందరూ తమ దేవుడైన యెహోవా మాట విని, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపి తెలియజేసిన సందేశానికి లోబడి యెహోవా పట్ల భయభక్తులు చూపించారు.
HAG 1:13 అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియజేసిన సందేశాన్ని ప్రజలకు ఇలా వినిపించాడు: “నేను మీకు తోడుగా ఉన్నాను” ఇదే యెహోవా వాక్కు.
HAG 1:14 యెహోవా యూదాదేశపు అధికారిగా ఉన్న షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలు మనస్సును, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనసును, మిగిలి ఉన్న ప్రజలందరి మనస్సులను ప్రేరేపించగా వారందరూ వచ్చి, వారి దేవుడైన సైన్యాల యెహోవా మందిరపు పనిని,
HAG 1:15 ఆరో నెల ఇరవై నాల్గవ రోజున ప్రారంభించారు. రాజైన దర్యావేషు పరిపాలించిన రెండవ సంవత్సరంలో,
HAG 2:1 ఏడవ నెల ఇరవై ఒకటవ రోజున ప్రవక్తయైన హగ్గయి ద్వార వచ్చిన యెహోవా వాక్కు:
HAG 2:2 “నీవు యూదాదేశపు అధికారిగా ఉన్న షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువతో, మిగిలి ఉన్న ప్రజలందరితో మాట్లాడి ఇలా అడుగు,
HAG 2:3 పూర్వం ఈ మందిర వైభవాన్ని చూసినవారు మీలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడది మీకు ఎలా కనబడుతోంది? దానితో పోల్చడానికి ఎందుకూ సరిపోదు కదా?
HAG 2:4 అయితే యెహోవా చెప్పేదేమంటే, ‘జెరుబ్బాబెలూ, ధైర్యం తెచ్చుకో! ప్రధాన యాజకుడవును యెహోజాదాకు కుమారుడవునైన యెహోషువా, ధైర్యం తెచ్చుకో! దేశ ప్రజలారా, మీరందరూ ధైర్యం తెచ్చుకోండి! నేను మీకు తోడుగా ఉన్నాను’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
HAG 2:5 ‘మీరు ఈజిప్టు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన ఇదే. నా ఆత్మ మీ మధ్య ఉంటుంది కాబట్టి భయపడకండి.’
HAG 2:6 “సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘మరికొంత సమయంలో మరోసారి నేను ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని ఎండిన భూమిని కంపింపజేస్తాను.
HAG 2:7 నేను ఇతర జనాలను కదిలించగా వారు తమకిష్టమైన వాటిని తీసుకువస్తారు; నేను ఈ మందిరాన్ని నా మహిమతో నింపుతాను’ ఇదే సైన్యాల యెహోవా మాట.
HAG 2:8 వెండి నాది, బంగారం నాది; ఇదే సైన్యాల యెహోవా మాట.
HAG 2:9 ‘ఇప్పుడున్న మందిర వైభవం గత మందిర వైభవం కన్నా అధికంగా ఉంటుంది’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. అంతేకాదు ఆయన ఇంకా మాట్లాడుతూ, ‘ఈ స్థలంలో నేను సమాధానాన్ని అనుగ్రహిస్తాను’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.”
HAG 2:10 రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం తొమ్మిదో నెల ఇరవై నాల్గవ రోజున యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి దగ్గరకు వచ్చి తెలియజేసింది ఏంటంటే:
HAG 2:11 “సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: ధర్మశాస్త్రం గురించి యాజకులను అడుగు:
HAG 2:12 ఎవరైనా తమ వస్త్రపు చెంగులో ప్రతిష్ఠితమైన మాంసాన్ని తీసుకెళ్లి, ఆ చెంగుతో రొట్టెను గాని వంటకాన్ని గాని, ద్రాక్షరసాన్ని గాని, నూనెను గాని ఇతర ఏ ఆహారాన్ని గాని తాకితే అది పవిత్రం అవుతుందా?” అని అడిగితే, యాజకులు, “కాదు” అన్నారు.
HAG 2:13 అప్పుడు హగ్గయి, “ఎవరైనా శవాన్ని తాకి అపవిత్రుడై ఆ వస్తువులలో ఒకదాన్ని తాకితే అతడు తాకింది అపవిత్రం అవుతుందా?” అని అడిగితే, యాజకులు, “అవును, అది అపవిత్రం అవుతుంది” అని జవాబిచ్చారు.
HAG 2:14 అందుకు హగ్గయి వారితో ఇలా అన్నాడు, “ఈ ప్రజలు, ఈ జనాలు నా దృష్టికి అలాగే ఉన్నారు. వారు చేసే క్రియలన్నీ అక్కడ వారు అర్పించేదంతా నా దృష్టికి అపవిత్రమే! ఇదే యెహోవా వాక్కు.
HAG 2:15 “ ‘ఆ రోజు నుండి మీరు దీని గురించి బాగా ఆలోచించండి. యెహోవా మందిరంలో రాయి మీద రాయి ఉంచే ముందు మీ పరిస్థితులను గురించి ఆలోచించండి.
HAG 2:16 ఒకడు ఇరవై కుప్పల ధాన్యం నాటగా పది కుప్పల ధాన్యమే వస్తుంది. ద్రాక్షగానుగ తొట్టిలో నుండి యాభై కొలతల ద్రాక్షరసం తీయడానికి వెళ్తే ఇరవై కొలతలు మాత్రమే ఉంటుంది.
HAG 2:17 నేను నీ చేతి పనంతటిని తెగులుతో బూజుతో వడగండ్లతో నాశనం చేశాను. అయినా మీరు నా వైపు తిరుగలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.
HAG 2:18 ‘మీరు బాగా ఆలోచించండి. ఈ రోజు నుండి, తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ రోజు నుండి, అంటే యెహోవా ఆలయ పునాది వేయబడిన రోజు నుండి జరిగిన వాటిని గురించి జాగ్రత్తగా ఆలోచించండి:
HAG 2:19 గిడ్డంగిలో ధాన్యమేమైనా మిగిలి ఉందా? ఇప్పటివరకు ద్రాక్షతీగె గాని అంజూరపు చెట్టు గాని దానిమ్మ చెట్టు గాని ఒలీవచెట్టు గాని ఫలించలేదు గదా! “ ‘అయితే ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.’ ”
HAG 2:20 అదే నెల ఇరవై నాల్గవ రోజున యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి దగ్గరకు రెండవసారి వచ్చి తెలియజేసింది ఏంటంటే:
HAG 2:21 యూదాదేశపు అధికారియైన జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు, నేను ఆకాశాన్ని భూమిని కదిలించబోతున్నాను.
HAG 2:22 నేను రాజ సింహాసనాలను కూలదోసి ఇతర రాజ్యాల అధికారాన్ని నాశనం చేస్తాను. నేను రథాలను రథసారథులను కూలదోస్తాను; గుర్రాలు గుర్రపురౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలిపోతారు.
HAG 2:23 “ ‘అయితే షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలూ, నీవు నా సేవకుడవు. నేను నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి ఆ రోజున నేను నిన్ను తీసుకుని నా ముద్ర ఉంగరంలా చేస్తాను, ఎందుకంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను’ ఇదే సైన్యాల యెహోవా వాక్కు.”
ZEC 1:1 దర్యావేషు పరిపాలన రెండవ సంవత్సరం ఎనిమిదో నెలలో, ఇద్దో కుమారుడు బెరక్యా, బెరక్యా కుమారుడైన జెకర్యా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు:
ZEC 1:2 “యెహోవా మీ పూర్వికుల మీద చాలా కోపంగా ఉన్నారు.
ZEC 1:3 కాబట్టి నీవు ఈ ప్రజలతో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను’ అని సైన్యాల యెహోవా అంటున్నారు.
ZEC 1:4 ప్రవక్తలు మీ పూర్వికులతో, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ చెడు అలవాట్లన్నింటినీ మానుకోండి’ అని చెప్పినప్పుడు వినని, పట్టించుకోని మీ పూర్వికుల్లా మీరు ఉండకండి, అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ZEC 1:5 ఇప్పుడు మీ పూర్వికులు ఏమయ్యారు? ఆ ప్రవక్తలు ఏమయ్యారు, వారు ఎల్లకాలం బ్రతికి ఉంటారా?
ZEC 1:6 అయితే నా సేవకులైన ప్రవక్తలకు నేను ఆదేశించిన మాటలు శాసనాలు మీ పూర్వికుల విషయంలో నెరవేరలేదా? “అవి నెరవేరినప్పుడు వారు పశ్చాత్తాపపడి, ‘మన ప్రవర్తనకు మన పనులకు తగినట్లుగా సైన్యాల యెహోవా తాను చేయాలనుకున్న ప్రకారం మనకు చేశారు’ అని చెప్పుకున్నారు.”
ZEC 1:7 దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం శెబాతు అనే పదకొండవ నెల ఇరవై నాల్గవ రోజున ఇద్దో కుమారుడైన బెరక్యా, బెరక్యా కుమారుడైన జెకర్యా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు.
ZEC 1:8 రాత్రి సమయంలో నాకు దర్శనం వచ్చింది, అక్కడ నా ఎదుట ఎర్రని గుర్రంపై ఎక్కిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక లోయలోని గొంజిచెట్ల మధ్య నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుర్రాలు, గోధుమరంగు గుర్రాలు, తెలుపు గుర్రాలు ఉన్నాయి.
ZEC 1:9 అప్పుడు నేను, “నా ప్రభువా, ఇవి ఏంటి?” అని అడిగాను. నాతో మాట్లాడుతున్న ఆ దూత, “అవేంటో నీకు చూపిస్తాను” అని చెప్పాడు.
ZEC 1:10 అప్పుడు గొంజిచెట్ల మధ్యలో నిలబడిన వ్యక్తి, “ఇవి భూమి అంతా తిరగడానికి యెహోవా పంపించిన గుర్రాలు” అని చెప్పాడు.
ZEC 1:11 వారు గొంజిచెట్ల మధ్యలో నిలబడిన యెహోవా దూతతో, “మేము లోకమంతటా తిరిగి వచ్చాము. లోకమంతా ప్రశాంతంగా సమాధానంగా ఉండడం చూశాం” అన్నారు.
ZEC 1:12 అప్పుడు యెహోవా దూత, “సైన్యాల యెహోవా, డెబ్బై సంవత్సరాలుగా మీరు యెరూషలేము మీద, యూదా పట్టణాల మీద కోపంతో ఉన్నారు, ఇంకెన్నాళ్లు వరకు కనికరించకుండా ఉంటారు?” అని మనవి చేశాడు.
ZEC 1:13 కాబట్టి నాతో మాట్లాడుతున్న ఆ దూతకు యెహోవా దయగల ఆదరణ కలిగించే మాటలు చెప్పారు.
ZEC 1:14 ఆ తర్వాత నాతో మాట్లాడుతున్న దూత ఇలా అన్నాడు, “నీవు ఈ మాటను ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెరూషలేము, సీయోను గురించి నేనెంతో ఆసక్తి కలిగి ఉన్నాను.
ZEC 1:15 నిశ్చింతగా బ్రతుకుతున్న ఇతర జాతులపై నేను చాలా కోపంగా ఉన్నాను. గతంలో నేను కొంచెమే కోప్పడ్డాను, కానీ వారు ఆ శిక్షను చాలా తీవ్రం చేసుకున్నారు.’
ZEC 1:16 “కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: ‘నేను కనికరంతో యెరూషలేము వైపు తిరుగుతాను, అక్కడ నా మందిరం తిరిగి కట్టబడుతుంది. యెరూషలేము మీద నిర్మాణకులు కొలతలు వేస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
ZEC 1:17 “ఇది కూడా నీవు ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నా పట్టణాలు మళ్ళీ అభివృద్ధితో నిండుతాయి, యెహోవా మళ్ళీ సీయోనును ఆదరిస్తారు, యెరూషలేమును ఎన్నుకుంటారు.’ ”
ZEC 1:18 తర్వాత నేను పైకి చూసినప్పుడు అక్కడ నాలుగు కొమ్ములు కనిపించాయి.
ZEC 1:19 నాతో మాట్లాడుతున్న దూతను, “ఇవి ఏంటి?” అని అడిగాను. అందుకతడు, “ఇవి యూదా, ఇశ్రాయేలు, యెరూషలేములను చెదరగొట్టిన కొమ్ములు” అని చెప్పాడు.
ZEC 1:20 అప్పుడు యెహోవా నాకు నలుగురు కంసాలులను చూపించారు.
ZEC 1:21 “వీరు ఏమి చేయడానికి వస్తున్నారు?” అని నేను అడిగాను. అందుకాయన, “ఎవ్వరూ తమ తల ఎత్తకుండ యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే కంసాలులు వారిని భయభ్రాంతులకు గురిచేసి, యూదా దేశంలోని ప్రజలను చెదరగొట్టడానికి తమ కొమ్ములను ఎత్తిన దేశాల కొమ్ములను పడగొట్టడానికి వచ్చారు” అని అన్నారు.
ZEC 2:1 ఆ తర్వాత నేను పైకి చూసినప్పుడు నా ఎదుట కొలమానం పట్టుకున్న వ్యక్తి కనబడ్డాడు.
ZEC 2:2 “నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని నేను అడిగాను. అందుకతడు, “యెరూషలేము పొడవు, వెడల్పు ఎంత ఉందో కొలిచి తెలుసుకోవడానికి వెళ్తున్నాను” అన్నాడు.
ZEC 2:3 అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత వెళ్లిపోతుండగా, మరొక దూత అతన్ని కలుసుకోడానికి వచ్చి,
ZEC 2:4 అతనితో ఇలా అన్నాడు: “నీవు ఆ యువకుని దగ్గరికి పరుగెత్తుకొని వెళ్లి ఇలా చెప్పు, ‘యెరూషలేములో మనుష్యులు పశువులు విస్తారంగా ఉన్నందుకు, అది గోడలులేని పట్టణంలా ఉంటుంది.
ZEC 2:5 నేనే దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, దాని మధ్యలో నివసించి దానికి ఘనతగా ఉంటాను’ అని యెహోవా చెప్తున్నారు.
ZEC 2:6 “రండి! ఉత్తర దేశం నుండి తప్పించుకుని రండి, ఆకాశం నాలుగు దిక్కులకు వీచే గాలిలా నేను మిమ్మల్ని చెదరగొట్టాను” అని యెహోవా చెప్తున్నారు.
ZEC 2:7 “సీయోను ప్రజలారా, రండి! బబులోను దేశంలో నివసిస్తున్న మీరు తప్పించుకుని రండి!”
ZEC 2:8 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మిమ్మల్ని ముట్టుకున్న వారు యెహోవా కనుగుడ్డును ముట్టినట్లే అని తలంచి తనకు ఘనత కలిగేలా మహిమాన్వితుడు మిమ్మల్ని దోచుకున్న దేశాల మీదికి నన్ను పంపించారు.
ZEC 2:9 నేను వారి మీద నా చేయి ఎత్తుతాను అప్పుడు వారి బానిసలు వారిని దోచుకుంటారు. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను పంపారని మీరు తెలుసుకుంటారు.
ZEC 2:10 “సీయోను కుమార్తె, కేకవేయి, సంతోషించు. నేను వస్తున్నాను, మీ మధ్య నివసిస్తాను” అని యెహోవా చెప్తున్నారు.
ZEC 2:11 “ఆ రోజున అనేక దేశాలు యెహోవా దగ్గరకు చేరి నా ప్రజలవుతారు. నేను మీ మధ్య నివసిస్తాను, అప్పుడు సైన్యాల యెహోవా నన్ను పంపారని మీరు తెలుసుకుంటారు.
ZEC 2:12 పరిశుద్ధ దేశంలో యెహోవా యూదాను తన స్వాస్థ్యంగా సొంతం చేసుకుంటారు, యెరూషలేమును మళ్ళీ ఎన్నుకుంటారు.
ZEC 2:13 సర్వజనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి వస్తున్నారు కాబట్టి ఆయన ఎదుట మౌనంగా ఉండండి.”
ZEC 3:1 అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం, అతన్ని నిందించడానికి సాతాను అతని కుడి ప్రక్కన నిలబడి ఉండడం అతడు నాకు చూపించాడు.
ZEC 3:2 అప్పుడు యెహోవా సాతానుతో, “సాతానా, యెహోవా నిన్ను గద్దిస్తారు! యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తారు! ఈ మనిషి మంటలో నుండి తీసిన మండుతున్న కర్రలాంటి వాడు కాదా?” అని అన్నారు.
ZEC 3:3 అయితే యెహోషువ మురికిబట్టలు వేసుకుని దేవదూత ముందు నిలబడి ఉన్నాడు.
ZEC 3:4 దూత తన ముందు నిలబడి ఉన్నవారితో, “అతని మురికిబట్టలు తీసివేయండి” అని చెప్పాడు. అప్పుడు అతడు యెహోషువతో, “చూడు, నేను నీ పాపాన్ని తీసివేశాను, నీకు మంచి వస్త్రాలు వేస్తాను” అన్నాడు.
ZEC 3:5 అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా పెట్టండి” అని చెప్పగా, యెహోవా దూత ప్రక్కన నిలబడి ఉండగా వారు అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచి, అతనికి బట్టలు తొడిగించారు.
ZEC 3:6 తర్వాత యెహోవా దూత యెహోషువకు ఈ ఆదేశం ఇచ్చాడు:
ZEC 3:7 “సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీవు నాకు లోబడి జీవిస్తూ, నా మార్గాలను పాటిస్తే, నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణాల మీద అధికారం కలిగి ఉంటావు. ఇక్కడ నిలబడి ఉన్న వారి మధ్యలో నేను నీకు స్థానం ఇస్తాను.
ZEC 3:8 “ ‘ప్రధాన యాజకుడవైన యెహోషువా! విను; నీవూ, నీ ఎదుట కూర్చుని ఉన్న నీ సహచరులు జరగబోయే వాటికి సూచనలుగా ఉన్నారు: చిగురు అనే నా సేవకుడిని నేను తీసుకురాబోతున్నాను.
ZEC 3:9 నేను యెహోషువ ఎదుట ఉంచిన రాతిని చూడండి. ఆ రాయికి ఏడు కళ్లు ఉన్నాయి, నేను దాని మీద ఒక శాసనం చెక్కుతాను, ఒకే రోజులోనే నేను ఈ దేశపు పాపాన్ని తొలగిస్తాను’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
ZEC 3:10 “ ‘ఆ రోజున మీ ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద కూర్చోడానికి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారిని పిలుస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.”
ZEC 4:1 అప్పుడు నాతో మాట్లాడిన దూత తిరిగివచ్చి నిద్రపోతున్న వాన్ని లేపినట్లు నన్ను లేపాడు.
ZEC 4:2 “నీకు ఏం కనబడుతుంది?” అని నన్ను అడిగాడు. అందుకు నేను, “బంగారు దీపస్తంభం, దాని మీద ఉన్న గిన్నె, ఏడు దీపాలు, దీపాలకున్న ఏడు గొట్టాలు నాకు కనిపిస్తున్నాయి.
ZEC 4:3 అంతే కాకుండా ఆ దీపస్తంభానికి కుడి వైపున ఒకటి ఎడమవైపున ఒకటి ఉన్న రెండు ఒలీవచెట్లు అక్కడ కనిపిస్తున్నాయి” అన్నాను.
ZEC 4:4 నాతో మాట్లాడిన దూతను, “నా ప్రభువా, ఇవి ఏంటి?” అని అడిగాను.
ZEC 4:5 అందుకా దూత, “ఇవి ఏంటో నీకు తెలియదా?” అని అడిగాడు. అందుకు నేను, “నా ప్రభువా, నాకు తెలియదు” అని చెప్పాను.
ZEC 4:6 అప్పుడతడు నాతో ఇలా చెప్పాడు, “జెరుబ్బాబెలు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: ‘శక్తి వలన గాని బలం వలన గాని ఇది జరుగదు కాని నా ఆత్మ వలననే ఇది జరుగుతుంది’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
ZEC 4:7 “మహా పర్వతమా! నీవు ఎంతటి దానివి? జెరుబ్బాబెలు ఎదుట నీవు నేలమట్టం అవుతావు. అప్పుడు ‘దేవుడు దీవిస్తారు గాక! దేవుడు దీవిస్తారు గాక!’ అని కేకలు వేస్తుండగా అతడు పైరాయిని తీసుకువస్తాడు.”
ZEC 4:8 తర్వాత యెహోవా వాక్కు నా దగ్గరకు ఇలా వచ్చింది:
ZEC 4:9 “జెరుబ్బాబెలు చేతులు ఈ ఆలయపు పునాదిని వేశాయి; అంతే కాకుండా అతని చేతులే దానిని ముగిస్తాయి. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను మీ దగ్గరకు పంపారని మీరు తెలుసుకుంటారు.
ZEC 4:10 “చిన్న విషయాలు జరిగే రోజును తృణకీరించే ధైర్యం ఎవరికైనా ఉందా? భూమి అంతా సంచరించే యెహోవా యొక్క ఏడు కళ్లు జెరుబ్బాబెలు చేతిలోని మట్టపు గుండును చూసి సంతోషిస్తాయి.”
ZEC 4:11 అప్పుడు నేను ఆ దూతను, “దీపస్తంభానికి కుడి ఎడమలకు ఉన్న ఈ రెండు ఒలీవచెట్లు ఏంటి?” అని అడిగాను.
ZEC 4:12 నేను మరలా, “ఆ రెండు బంగారు గొట్టాలలో నుండి బంగారు నూనె కుమ్మరించే ఆ రెండు ఒలీవ చెట్ల కొమ్మలు ఏంటి?” అని అతన్ని అడిగాను.
ZEC 4:13 అందుకతడు, “ఇవి ఏంటో నీకు తెలియదా?” అని అడిగాడు. “నా ప్రభువా, నాకు తెలియదు” అన్నాను.
ZEC 4:14 అందుకతడు, “ఈ ఇద్దరూ సర్వలోక ప్రభువు దగ్గర నిలబడి సేవ చేయడానికి అభిషేకించబడ్డవారు” అని చెప్పాడు.
ZEC 5:1 నేను మళ్ళీ చూసినప్పుడు ఎగురుతున్న గ్రంథపుచుట్ట ఒకటి కనిపించింది.
ZEC 5:2 అతడు నన్ను, “నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు. నేను, “ఇరవై మూరల పొడవు, పది మూరల వెడల్పు కలిగి ఎగురుతున్న గ్రంథపుచుట్టను చూస్తున్నాను” అని జవాబిచ్చాను.
ZEC 5:3 అందుకతడు నాతో ఇలా అన్నాడు, “ఇది భూమి అంతటి మీదికీ బయలుదేరి వెళ్తున్న శాపం; దానికి ఒకవైపు వ్రాసి ఉన్న ప్రకారం దొంగలు నాశనమవుతారు, రెండవ వైపు వ్రాసి ఉన్న ప్రకారం అబద్ధ ప్రమాణం చేసేవారంతా దేశ బహిష్కరణ శిక్ష పొందుతారు.
ZEC 5:4 సైన్యాల యెహోవా చెప్తున్న మాట ఇదే, ‘నేను దానిని బయటకు పంపుతాను, అది దొంగల ఇంట్లోకి, నా పేరిట అబద్ధ ప్రమాణం చెప్పే అందరి ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉంటూ దాని దూలాలు, రాళ్లతో సహా సమస్తాన్ని నాశనం చేస్తుంది.’ ”
ZEC 5:5 అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత ముందుకు వచ్చి, “నీ కళ్లు పైకెత్తి ఏమి కనిపిస్తుందో చూడు” అన్నాడు.
ZEC 5:6 “అది ఏమిటి?” అని నేను అడిగాను. అందుకతడు, “అది ఓ బుట్ట, అది దేశమంతటిలో ఉన్న ప్రజల దోషం” అని చెప్పాడు.
ZEC 5:7 తర్వాత సీసంతో చేసిన మూత తీసినప్పుడు ఆ బుట్టలో ఒక స్త్రీ కూర్చుని కనబడింది.
ZEC 5:8 అతడు, “ఇది దుర్మార్గం” అని చెప్పి బుట్టలోనికి దానిని నెట్టి సీసం మూత మూసి వేశాడు.
ZEC 5:9 నేను మరలా పైకి చూడగా నా ఎదుట ఇద్దరు స్త్రీలు కనిపించారు, వారికున్న రెక్కలు గాలికి కదులుతున్నాయి. కొంగ రెక్కలవంటి రెక్కలు వారికున్నాయి, అవి ఆకాశానికి భూమికి మధ్యలో ఆ బుట్టను ఎత్తాయి.
ZEC 5:10 నాతో మాట్లాడుతున్న దూతను, “బుట్టను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అని అడిగాను.
ZEC 5:11 అతడు జవాబిస్తూ, “దానికి ఇల్లు కట్టడానికి బబులోను దేశానికి తీసుకెళ్తున్నారు. ఇల్లు సిద్ధమైనప్పుడు ఆ బుట్ట అక్కడ దాని స్థానంలో ఉంచుతారు” అన్నాడు.
ZEC 6:1 నేను మళ్ళీ పైకి చూస్తే, నా ఎదుట రెండు పర్వతాల మధ్య నుండి నాలుగు రథాలు బయలుదేరుతూ కనిపించాయి. అవి ఇత్తడి పర్వతాలు.
ZEC 6:2 మొదటి రథానికి ఎర్రటి గుర్రాలు, రెండవ రథానికి నల్లని గుర్రాలు,
ZEC 6:3 మూడవ రథానికి తెల్లని గుర్రాలు, నాలుగవ రథానికి చుక్కలు ఉన్న గుర్రాలు ఉన్నాయి. అవన్నీ బలమైనవి.
ZEC 6:4 నాతో మాట్లాడుతున్న దూతను, “నా ప్రభువా, ఇవి ఏమిటి?” అని అడిగాను.
ZEC 6:5 దూత నాకు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఇవి సర్వలోక ప్రభువు సన్నిధి నుండి బయలుదేరిన నాలుగు పరలోకపు ఆత్మలు.
ZEC 6:6 నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశం వైపు, తెల్లని గుర్రాలున్న రథం పడమర వైపు, చుక్కలున్న గుర్రాలున్న రథం దక్షిణం వైపు వెళ్తాయి.”
ZEC 6:7 ఆ బలమైన గుర్రాలు బయలుదేరి భూమి అంతా తిరగడానికి సిద్ధంగా ఉండగా అతడు, “వెళ్లి భూమి అంతా తిరగండి!” అని అన్నాడు. కాబట్టి అవి భూమి అంతటా వెళ్లాయి.
ZEC 6:8 అప్పుడు అతడు నన్ను పిలిచి, “ఉత్తర దేశం వైపు వెళ్లేవాటిని చూడు, అవి ఉత్తర దేశంలో నా ఆత్మకు నెమ్మది కలిగిస్తాయి” అన్నాడు.
ZEC 6:9 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
ZEC 6:10 “బందీలుగా వెళ్లిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబీయా, యెదాయాల నుండి వెండి బంగారాలు తీసుకో. ఆ రోజే జెఫన్యా కుమారుడైన యోషీయా ఇంటికి వెళ్లు.
ZEC 6:11 వారి నుండి వెండి బంగారాలు తీసుకుని కిరీటం చేసి దానిని ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తలమీద పెట్టి,
ZEC 6:12 అతనితో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘చిగురు అనే పేరుగల వ్యక్తి ఉన్నాడు. అతడు తన స్థలంలో నుండి చిగురిస్తూ, యెహోవా మందిరం కడతాడు.
ZEC 6:13 యెహోవా మందిరాన్ని కట్టేవాడు అతడే; అతడు వైభవాన్ని కలిగి సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తాడు. అతడు తన సింహాసనం మీద యాజకునిగా ఉంటాడు. ఆ ఇద్దరి మధ్య సమాధానకరమైన ఆలోచన ఉంటుంది.’
ZEC 6:14 ఆ కిరీటం యెహోవా మందిరంలో జ్ఞాపకార్థంగా హేలెము, టోబీయా, యెదాయాలకు, జెఫన్యా కుమారుడైన హేనుకు ఇవ్వబడుతుంది.
ZEC 6:15 దూరంగా ఉన్నవారు వచ్చి యెహోవా మందిరాన్ని కట్టడానికి సహాయం చేస్తారు. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను మీ దగ్గరకు పంపారని మీరు తెలుసుకుంటారు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జ్రాగత్తగా వింటే ఇలా జరుగుతుంది.”
ZEC 7:1 రాజైన దర్యావేషు పరిపాలన నాలుగవ సంవత్సరం కిస్లేవు అనే తొమ్మిదవ నెల నాలుగో రోజున యెహోవా వాక్కు జెకర్యా దగ్గరకు వచ్చింది.
ZEC 7:2 బేతేలు ప్రజలు యెహోవాను వేడుకోడానికి షెరెజెరును రెగెమ్మెలెకును తమ మనుష్యులతో పాటు పంపి,
ZEC 7:3 “అనేక సంవత్సరాలుగా మేము చేస్తున్నట్లుగా అయిదవ నెలలో దుఃఖిస్తూ ఉపవాసం ఉండాలా?” అని సైన్యాల యెహోవా మందిరంలోని యాజకులను, ప్రవక్తలను అడిగారు.
ZEC 7:4 అప్పుడు సైన్యాల యెహోవా వాక్కు నాకు వచ్చి:
ZEC 7:5 “దేశ ప్రజలందరినీ, యాజకులను ఇలా అడుగు, ‘మీరు గత డెబ్బై సంవత్సరాలుగా అయిదవ నెలలో, ఏడవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించినప్పుడు, మీరు నిజంగా నా కోసం ఉపవాసం ఉన్నారా?
ZEC 7:6 మీరు తినేటప్పుడు త్రాగేటప్పుడు కేవలం మీ కోసం మాత్రమే విందు చేసుకోలేదా?
ZEC 7:7 యెరూషలేము, దాని ప్రక్కన ఉన్న పట్టణాలన్ని విశ్రాంతిగా క్షేమంగా ఉన్నప్పుడు, దక్షిణ ప్రదేశం, పడమటి మైదానాల్లో ప్రజలు విస్తరించి ఉన్నప్పుడు పూర్వకాలపు ప్రవక్తల ద్వారా యెహోవా ఈ మాటలను ప్రకటించలేదా?’ ”
ZEC 7:8 మరోసారి యెహోవా వాక్కు జెకర్యాకు వచ్చి:
ZEC 7:9 “సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘సత్యంతో న్యాయం తీర్చండి; ఒకరిపట్ల ఒకరు కనికరం, దయ కలిగి ఉండండి.
ZEC 7:10 విధవరాండ్రను తండ్రిలేనివారిని విదేశీయులను బీదలను హింసించకండి. ఒకరి మీద ఒకరు కుట్ర చేయకండి’ అని చెప్పింది.
ZEC 7:11 “కానీ వారు నిర్లక్ష్యం చేసి మొండిగా వెనుదిరిగి తమ చెవులను మూసుకున్నారు.
ZEC 7:12 తమ హృదయాలను చెకుముకి రాయిలా గట్టిగా చేసుకున్నారు, సైన్యాల యెహోవా తన ఆత్మ ద్వారా పూర్వ ప్రవక్తలకు ఇచ్చిన ఉపదేశాన్ని, మాటలను వినలేదు. కాబట్టి సైన్యాల యెహోవా చాలా కోప్పడ్డారు.
ZEC 7:13 “ ‘నేను పిలిచినప్పుడు, వారు వినలేదు; కాబట్టి వారు పిలిచినప్పుడు నేను వినను’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
ZEC 7:14 ‘వారికి తెలియని ఇతర దేశ ప్రజల మధ్యలోని నేను వారిని సుడిగాలిలా చెదరగొట్టాను. వారు వదిలి వెళ్లిన దేశం గుండా ఎవరూ ప్రయాణించలేనంతగా అది పాడైపోయింది. ఇలా మనోహరమైన తమ దేశాన్ని వారు పాడుచేశారు.’ ”
ZEC 8:1 సైన్యాల యెహోవా వాక్కు నాకు వచ్చింది.
ZEC 8:2 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నేను సీయోను గురించి చాలా ఆసక్తి కలిగి ఉన్నాను; ఆమె పట్ల ఉన్న ఆసక్తి నన్ను దహించివేస్తుంది.”
ZEC 8:3 యెహోవా చెప్పే మాట ఇదే: “నేను సీయోనుకు తిరిగివచ్చి యెరూషలేములో నివసిస్తాను. అప్పుడు యెరూషలేము నమ్మకమైన పట్టణమని, సైన్యాల యెహోవా పర్వతమని, పవిత్ర పర్వతమని పిలువబడుతుంది.”
ZEC 8:4 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మరోసారి వృద్ధులైన స్త్రీ పురుషులు తమ చేతికర్ర పట్టుకొని ఇంకా యెరూషలేము వీధుల్లో కూర్చుంటారు.
ZEC 8:5 పట్టణ వీధులు ఆటలాడే అబ్బాయిలతో అమ్మాయిలతో నిండిపోతాయి.”
ZEC 8:6 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ సమయంలో ఈ ప్రజల్లో మిగిలిన ఉన్నవారికి ఇది ఆశ్చర్యకరంగా ఉండవచ్చు కాని నాకు ఆశ్చర్యంగా ఉంటుందా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
ZEC 8:7 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నేను తూర్పు, పడమర దేశాల నుండి నా ప్రజలను రక్షిస్తాను.
ZEC 8:8 యెరూషలేములో నివసించేందుకు వారిని తిరిగి తీసుకువస్తాను; వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవునిగా నమ్మకంగా నీతితో ఉంటాను.”
ZEC 8:9 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఇప్పుడు ఈ మాటలు వినండి, ‘మందిరాన్ని కట్టడానికి మీ చేతులను బలపరచుకోండి.’ సైన్యాల యెహోవా మందిర పునాది వేసినప్పుడు ఉన్న ప్రవక్తలు చెప్పింది ఇదే.
ZEC 8:10 అంతకుముందు మనుష్యులకు జీతం గాని, పశువులకు బాడిగ గాని దొరకలేదు. నేను ఒకరిపై ఒకరికి వ్యతిరేకత కలిగించాను కాబట్టి ఎవరూ క్షేమంగా తమ పనిని చేయలేకపోయారు.
ZEC 8:11 అయితే పూర్వకాలంలో నేను చేసినట్లుగా ఇప్పుడు మిగిలి ఉన్నవారిపట్ల చేయను” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
ZEC 8:12 “సమాధానమనే విత్తనం చక్కగా మొలకెత్తుతుంది, ద్రాక్షచెట్టు తన ఫలాన్ని ఇస్తుంది, భూమి తన పంటను ఇస్తుంది, ఆకాశం మంచు కురిపిస్తుంది. ఈ ప్రజల్లో మిగిలి ఉన్నవారికి వీటన్నిటిని వారసత్వంగా ఇస్తాను.
ZEC 8:13 యూదా, ఇశ్రాయేలూ, మీరు ఇతర ప్రజల్లో ఎలా శాపానికి గురై ఉన్నారో అలాగే మీరు దీవెనకరంగా ఉండేలా నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు దీవెనకరంగా ఉంటారు. భయపడకండి, మీ చేతులు బలం కలిగి ఉండనివ్వండి.”
ZEC 8:14 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మీ పూర్వికులు నాకు కోపం పుట్టించినప్పుడు దయ చూపించకుండ నేను మీకు కీడు చేయాలని అనుకున్నట్టే” అని సైన్యాల యెహోవా అంటున్నారు,
ZEC 8:15 “ఇప్పుడు నేను యెరూషలేము యూదాలకు మేలు చేయాలని నిశ్చయించుకున్నాను. భయపడకండి.
ZEC 8:16 మీరు చేయవలసిన పనులేవంటే: ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి, మీ న్యాయస్థానాల్లో సమాధానకరమైన తీర్పు ఇవ్వాలి;
ZEC 8:17 ఒకరిపై ఒకరు కుట్ర చేయకూడదు, అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడవద్దు. ఇవన్నీ నేను ద్వేషిస్తాను” అని యెహోవా చెప్తున్నారు.
ZEC 8:18 సైన్యాల యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది.
ZEC 8:19 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నాలుగు, అయిదు, ఏడు పదవ నెలల్లో మీరు చేసే ఉపవాసాలు యూదా వారికి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించే సంతోషకరమైన పండుగలుగా మారుతాయి. కాబట్టి సత్యాన్ని సమాధానాన్ని ప్రేమించండి.”
ZEC 8:20 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “అనేకమంది ప్రజలు ఎన్నో పట్టణాల నివాసులు ఇంకా వస్తారు,
ZEC 8:21 ఒక పట్టణం వారు మరో పట్టణం వారి దగ్గరకు వెళ్లి, ‘సైన్యాల యెహోవాను వెదకి, యెహోవాను వేడుకోడానికి వెంటనే వెళ్దాం రండి’ అని చెప్పగా వారు, ‘మేము కూడా వస్తాం’ అని అంటారు.
ZEC 8:22 అన్నిటిని పరిపాలించే సైన్యాల యెహోవాను వెదకడానికి, ఆయన దయను కోరడానికి అనేకమంది ప్రజలు, శక్తివంతమైన దేశాలు యెరూషలేముకు వస్తారు.”
ZEC 8:23 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ రోజుల్లో, ఇతర ప్రజల్లో ఆయా భాషల్లో మాట్లాడే పదిమంది ఒక యూదుని చెంగు పట్టుకుని, ‘దేవుడు మీకు తోడుగా ఉన్నారని మేము విన్నాము. మేము కూడా మీతో వస్తాం’ అంటారు.”
ZEC 9:1 ప్రవచనం: హద్రాకు దేశం గురించి దమస్కు పట్టణం గురించి వచ్చిన యెహోవా వాక్కు: మనుష్యులందరి కళ్లు, ఇశ్రాయేలు గోత్రాలన్నిటి కళ్లు యెహోవా మీద ఉన్నాయి.
ZEC 9:2 అంతేకాక, దాని సరిహద్దును ఆనుకుని ఉన్న హమాతు గురించి, చాలా నిపుణులైన తూరు సీదోను ప్రజల గురించి వచ్చిన యెహోవా వాక్కు.
ZEC 9:3 తూరు తన కోసం బలమైన దుర్గం కట్టుకుంది; ధూళి అంత విస్తారంగా వెండిని, వీధుల్లోని మట్టి అంత విస్తారంగా బంగారాన్ని పోగుచేసింది.
ZEC 9:4 అయితే యెహోవా దాని సంపదలు తీసివేసి, సముద్రంలో ఉన్న దాని శక్తిని నాశనం చేస్తారు. అది అగ్నితో కాల్చబడుతుంది.
ZEC 9:5 అష్కెలోను దానిని చూసి భయపడుతుంది; గాజా వేదనతో విలపిస్తుంది ఎక్రోను కూడా తన నిరీక్షణ కోల్పోతుంది. గాజా తన రాజును కోల్పోతుంది అష్కెలోను ఎడారిగా మారుతుంది.
ZEC 9:6 సంకరజాతి ప్రజలు అష్డోదును ఆక్రమిస్తారు, ఫిలిష్తీయుల గర్వాన్ని నేను అంతం చేస్తాను.
ZEC 9:7 వారి నోటిలో నుండి రక్తాన్ని, వారి పళ్ల మధ్య నుండి తినకూడని ఆహారాన్ని నేను తీసివేస్తాను. వారిలో మిగిలి ఉన్నవారు మన దేవుని వారై యూదాలో ఒక వంశంగా ఉంటారు. ఎక్రోను వారు యెబూసీయుల్లా ఉంటారు.
ZEC 9:8 నేను కళ్లారా చూస్తున్నాను కాబట్టి బాధించేవారు నా ప్రజలపై మరలా ఎన్నడూ దాడి చేయకుండా దోపిడి మూకలు నా మందిరం మీదికి రాకుండా కాపాడడానికి నేను దాని దగ్గర శిబిరం ఏర్పాటు చేస్తాను.
ZEC 9:9 సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు! యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి! ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు దీనుడిగా గాడిద మీద, గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ మీ దగ్గరకు వస్తున్నాడు.
ZEC 9:10 నేను ఎఫ్రాయింలో రథాలు లేకుండా చేస్తాను యెరూషలేములో యుద్ధ గుర్రాలు లేకుండా చేస్తాను యుద్ధపు విల్లు విరిగిపోతుంది. ఆయన దేశాలకు సమాధానాన్ని ప్రకటిస్తారు. ఆయన రాజ్యం సముద్రం నుండి సముద్రం వరకు నది నుండి భూమి అంచుల వరకు ఉంటుంది.
ZEC 9:11 నేను మీతో చేసిన నిబంధన రక్తాన్ని బట్టి బందీలుగా ఉన్న మీ వారిని నీరులేని గోతిలో నుండి విడిపిస్తాను.
ZEC 9:12 నిరీక్షణగల బందీల్లారా, మీ కోటకు తిరిగి రండి. నేను మీకు రెండింతలు మేలు చేస్తానని ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను.
ZEC 9:13 నా విల్లును వంచినట్లు నేను యూదాను వంచుతాను ఎఫ్రాయిము అనే నా బాణంతో దానిని నింపుతాను. సీయోనూ, నీ కుమారులను పురికొల్పి నిన్ను యోధుని కత్తిలా మార్చుతాను; గ్రీసు దేశస్థులారా! సీయోను కుమారులను మీ మీదికి పురికొల్పుతాను.
ZEC 9:14 అప్పుడు యెహోవా వారికి పైగా ప్రత్యక్షమవుతారు; ఆయన బాణాలు మెరుపులా వస్తాయి. ప్రభువైన యెహోవా బాకా మోగిస్తూ దక్షిణపు తుఫాను గాలులతో ముందుకు సాగుతారు,
ZEC 9:15 సైన్యాల యెహోవా వారిని కాపాడతారు. వారు నాశనం చేస్తూ వడిసెల రాళ్లతో గెలుస్తారు. వారు త్రాగి, ద్రాక్షారసాన్ని త్రాగినట్లుగా వారు గర్జిస్తారు; బలిపీఠం మూలల్లో చిలకరించడానికి ఉపయోగించే గిన్నెలా వారు నిండుగా ఉంటారు.
ZEC 9:16 కాపరి తన గొర్రెల మందను కాపాడినట్లు ఆ రోజున వారి దేవుడైన యెహోవా వారిని కాపాడతారు. వారు కిరీటంలోని ప్రశస్తమైన రాళ్లలా ఆయన దేశంలో ఉంటారు.
ZEC 9:17 ధాన్యంతో యువకులు క్రొత్త ద్రాక్షరసంతో యువతులు వర్ధిల్లుతారు. వారు ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటారు!
ZEC 10:1 వసంతకాలంలో వర్షం కోసం యెహోవాను అడగండి; ఉరుములతో ఉన్న తుఫానును పంపేది యెహోవాయే. అందరి పొలానికి మొక్కలు పెరిగేలా, ఆయన ప్రజలందరికి వర్షాన్ని కురిపిస్తారు.
ZEC 10:2 గృహదేవతలు మోసపు మాటలు మాట్లాడతాయి, సోదె చెప్పేవారు అబద్ధపు దర్శనాలు చూస్తారు; వారు మోసంతో కలల భావాలు చెప్తారు, వ్యర్థమైన ఓదార్పు ఇస్తారు. కాబట్టి కాపరి లేకపోవడం వలన బాధించబడిన గొర్రెలు తిరిగినట్లు ప్రజలు తిరుగుతారు.
ZEC 10:3 “కాపరుల మీద నా కోపం రగులుకుంది, నేను నాయకులను శిక్షిస్తాను; సైన్యాల యెహోవా తన మందయైన యూదా ప్రజల మీద శ్రద్ధ చూపుతారు ఆయన వారిని గర్వించే యుద్ధ గుర్రాల్లా చేస్తారు.
ZEC 10:4 యూదా నుండి మూలరాయి వస్తుంది, అతని నుండి డేరా మేకు, అతని నుండి యుద్ధ విల్లు వస్తాయి, అతని నుండి ప్రతి పాలకుడు వస్తాడు.
ZEC 10:5 వారందరు కలిసి యుద్ధంలోని వీరుల్లా వీధుల బురదలో తమ శత్రువులను త్రొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారు పోరాడతారు, శత్రువుల గుర్రపురౌతులను సిగ్గుపడేలా చేస్తారు.
ZEC 10:6 “నేను యూదాను బలపరుస్తాను యోసేపు గోత్రాలను రక్షిస్తాను. వారి పట్ల నాకు దయ ఉంది కాబట్టి, నేను వారిని తిరిగి రప్పిస్తాను. నేను వారిని విడిచిపెట్టిన సంగతిని వారు మరిచిపోతారు, ఎందుకంటే నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారికి జవాబిస్తాను.
ZEC 10:7 ఎఫ్రాయిమువారు వీరుల్లా అవుతారు, ద్రాక్షరసం త్రాగినట్లుగా వారి హృదయాలు సంతోషిస్తాయి. వారి పిల్లలు అది చూసి సంతోషిస్తారు; యెహోవాను బట్టి వారి హృదయాలు ఆనందిస్తాయి.
ZEC 10:8 నేను వారికి ఈలవేసి పిలిచి వారిని సమకూరుస్తాను. ఖచ్చితంగా నేను వారిని విమోచిస్తాను; వారు మునుపటిలా అనేకులుగా ఉంటారు.
ZEC 10:9 నేను వారిని ఇతర ప్రజల మధ్యలోనికి చెదరగొట్టినా దూరదేశాలలో వారు నన్ను జ్ఞాపకం చేసుకొంటారు. వారు వారి సంతానం సజీవులుగా తిరిగి వస్తారు.
ZEC 10:10 నేను వారిని ఈజిప్టు నుండి తిరిగి తీసుకువస్తాను అష్షూరు దేశం నుండి సమకూరుస్తాను. నేను వారిని గిలాదు, లెబానోను దేశాలకు తీసుకువస్తాను అక్కడ ఉన్న స్థలం వారికి సరిపోదు.
ZEC 10:11 వారు దుఃఖ సముద్రాన్ని దాటుతారు; సముద్రపు అలలు అణచివేయబడతాయి నైలు నదిలోని లోతైన స్థలాలన్నీ ఎండిపోతాయి. అష్షూరు యొక్క గర్వం అణచివేయబడుతుంది, ఈజిప్టు రాజదండం తీసివేయబడుతుంది.
ZEC 10:12 నేను వారిని యెహోవాలో బలపరుస్తాను. ఆయన నామం బట్టి వారు క్షేమంగా జీవిస్తారు,” అని యెహోవా చెప్తున్నారు.
ZEC 11:1 లెబానోనూ! అగ్ని వచ్చి నీ దేవదారు చెట్లను కాల్చివేయునట్లు, నీ తలుపులు తీయి.
ZEC 11:2 సరళ వృక్షాల్లారా, రోదించండి! దేవదారు చెట్లు కూలిపోయాయి; మహా వృక్షాలు నాశనమైపోయాయి! బాషాను యొక్క సింధూర వృక్షాల్లారా, రోదించండి: దట్టమైన అడవి నరకబడింది.
ZEC 11:3 గొర్రెల కాపరుల ఏడ్పు వినండి; వారి శ్రేష్ఠమైన పచ్చికబయళ్లు నాశనమైపోయాయి! సింహాల గర్జన వినండి; యొర్దాను లోయలోని దట్టమైన అడవులు పాడైపోయాయి!
ZEC 11:4 నా దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందకు కాపరిగా ఉండు.
ZEC 11:5 వాటిని కొనేవారు వాటిని వధించి శిక్ష పొందకుండా ఉన్నారు. వాటిని అమ్మేవారు, ‘యెహోవాకు స్తోత్రం, మాకు డబ్బు వచ్చింది!’ అని అంటారు. వాటి సొంత కాపరులే వాటి మీద జాలిపడరు.
ZEC 11:6 ఇకనుండి నేను ఈ దేశ ప్రజలపై కనికరం చూపించను. వారందరిని వారి పొరుగువారి చేతికి, వారి రాజు చేతికి నేను అప్పగిస్తాను. వారు దేశాన్ని పాడుచేస్తారు, నేను వారి చేతుల్లో నుండి ఎవరినీ విడిపించను” అని యెహోవా అంటున్నారు.
ZEC 11:7 కాబట్టి వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందకు, ముఖ్యంగా మందలో బాధించబడిన వాటికి నేను కాపరిగా ఉన్నాను. రెండు కర్రలు పట్టుకుని కాపరిగా కాచాను. ఒక కర్రకు దయ అని, రెండవ కర్రకు బంధం అని పేరు పెట్టాను.
ZEC 11:8 ఒకే నెలలో నేను ముగ్గురు కాపరులను తీసివేశాను. మంద నన్ను అసహ్యించుకుంది; నేను వారిని చూసి విసిగిపోయి,
ZEC 11:9 “నేను మీ కాపరిగా ఉండను. చచ్చేవారు చావవచ్చు, నశించేవారు నశించవచ్చు. మిగిలి ఉన్నవారు ఒకరి మాంసాన్ని ఒకరు తింటే తినవచ్చు” అన్నాను.
ZEC 11:10 తర్వాత నేను దేశాలన్నిటినితో చేసిన నిబంధనను రద్దు చేయడానికి దయ అనే కర్రను తీసుకుని దానిని విరిచాను.
ZEC 11:11 ఆ రోజు ఆ నిబంధన రద్దయింది కాబట్టి నేను చెప్పింది యెహోవా వాక్కు అని మందలోని అణచివేతకు గురై నా వైపు చూస్తున్నవారు తెలుసుకున్నారు.
ZEC 11:12 నేను వారితో, “మీకు మంచిదనిపిస్తే నా జీతం ఇవ్వండి; లేదంటే మానేయండి” అన్నాను. కాబట్టి వారు నాకు ముప్పై వెండి నాణేలు చెల్లించారు.
ZEC 11:13 అప్పుడు వారు నాకు చెల్లించిన దానిని కుమ్మరి దగ్గర పారవేయమని యెహోవా నాకు ఆజ్ఞాపించారు కాబట్టి నేను ఆ ముప్పై వెండి నాణేలు తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను.
ZEC 11:14 తర్వాత యూదా వారికి, ఇశ్రాయేలు వారికి మధ్య ఉన్న సహోదర బంధాన్ని తెంచడానికి బంధమనే నా రెండవ కర్రను విరిచాను.
ZEC 11:15 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “బుద్ధిలేని గొర్రెల కాపరి సామాగ్రిని మరల తీసుకో.
ZEC 11:16 ఎందుకంటే ఈ దేశంలో నేను నియమించబోయే కాపరి తప్పిపోయిన వాటిని పట్టించుకోడు, పిల్లలను వెదకడు, గాయపడ్డ వాటిని బాగు చేయడు, ఆరోగ్యకరమైన వాటిని పోషించడు, కాని క్రొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసాన్ని తింటాడు.
ZEC 11:17 “మందను విడిచిపెట్టిన పనికిమాలిన కాపరికి శ్రమ! ఖడ్గం అతని చేయి, కుడికన్నును నరుకుతుంది గాక! అతని చేయి పూర్తిగా ఎండిపోవాలి, అతని కుడికన్ను పూర్తిగా గ్రుడ్డిదవ్వాలి.”
ZEC 12:1 ఇది ప్రవచనం: ఇశ్రాయేలు ప్రజల గురించి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశాలను విశాలపరచి, భూమికి పునాది వేసి, ఒక వ్యక్తిలో మానవ ఆత్మను సృష్టించిన యెహోవా చెప్తున్న మాట:
ZEC 12:2 “నేను యెరూషలేమును చుట్టూ ఉన్న ప్రజలందరికి మత్తెక్కించే పాత్రగా చేయబోతున్నాను. యూదా యెరూషలేము ముట్టడి చేయబడతాయి.
ZEC 12:3 భూమిపై ఉన్న దేశాలన్నీ దానికి వ్యతిరేకంగా సమకూడినప్పుడు, ఆ రోజున నేను యెరూషలేమును అన్ని దేశాలకు బరువైన బండగా చేస్తాను. దాన్ని తొలగించడానికి ప్రయత్నించే వారందరూ తమను తాము గాయపరచుకుంటారు.
ZEC 12:4 ఆ రోజున నేను ప్రతి గుర్రానికి భయాన్ని, దాని రౌతుకు వెర్రిని పుట్టిస్తాను” అని యెహోవా చెప్తున్నారు. “నేను యూదాపై నా దృష్టి ఉంచి ఇతర ప్రజల గుర్రాలన్నిటికి గుడ్డితనం కలిగిస్తాను.
ZEC 12:5 అప్పుడు యూదా నాయకులు తమ హృదయాల్లో, ‘యెరూషలేము ప్రజలకు వారి దేవుడైన సైన్యాల యెహోవా తోడుగా ఉన్నందుకు వారు బలంగా ఉన్నారు’ అనుకుంటారు.
ZEC 12:6 “ఆ రోజున నేను యూదా నాయకులను కట్టెల క్రింద నిప్పులా పనల క్రింద దివిటీలా చేస్తాను. వారు నాలుగు వైపుల ఉన్న ప్రజలందరినీ కాల్చివేస్తారు, కాని యెరూషలేము దాని స్థానంలో చెక్కుచెదరకుండా ఉంటుంది.
ZEC 12:7 “దావీదు వంశీయులకు యెరూషలేము నివాసులకు ఉన్న ఘనత యూదా వారికంటే గొప్పది కాకుండా యెహోవా మొట్టమొదట యూదా వారి నివాస స్థలాలను రక్షిస్తారు.
ZEC 12:8 ఆ రోజున, యెహోవా యెరూషలేములో నివసించేవారిని కాపాడతారు, అప్పుడు వారిలో బలహీనులు దావీదులా, దావీదు వంశీయులు దేవుని వంటివారిగా, వారి ముందు నడిచే యెహోవా దూతలా ఉంటారు.
ZEC 12:9 ఆ రోజున యెరూషలేముపై దాడి చేసే దేశాలన్నిటిని నాశనం చేయడానికి నేను బయలుదేరుతాను.
ZEC 12:10 “అప్పుడు దావీదు వంశీయుల మీద యెరూషలేము నివాసుల మీద కనికరంగల ఆత్మను విన్నపం చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు తాము పొడిచిన నన్ను చూసి, ఒకరు తన ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపించినట్లు, తన మొదటి కుమారుని కోసం దుఃఖపడునట్లు, ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారు.
ZEC 12:11 ఆ రోజు, మెగిద్దో మైదానంలో హదద్-రిమ్మోనులో జరిగిన రోదన కంటే యెరూషలేములోని రోదన అధికంగా ఉంటుంది.
ZEC 12:12 దేశ ప్రజలంతా ఏ వంశానికి ఆ వంశంగా తమ భార్యలతో పాటు రోదిస్తాయి: దావీదు రాజవంశీయులు వారి భార్యలు, నాతాను వంశీయులు వారి భార్యలు,
ZEC 12:13 లేవీ వంశీయులు వారి భార్యలు, షిమీ వంశీయులు వారి భార్యలు,
ZEC 12:14 మిగిలిన వంశీయులు వారి భార్యలు అందరు ఎవరికి వారు రోదిస్తారు.
ZEC 13:1 “ఆ రోజున పాపాన్ని అపవిత్రతను శుభ్రం చేసుకోవడానికి దావీదు వంశీయులకు, యెరూషలేము నివాసులకు ఒక నీటి ఊట తెరవబడుతుంది.
ZEC 13:2 “ఆ రోజున విగ్రహాల పేర్లు ఎప్పటికీ జ్ఞాపకం రాకుండా దేశంలోని నుండి నేను వాటిని నిర్మూలిస్తాను. ప్రవక్తలను అపవిత్ర ఆత్మను దేశంలో లేకుండా చేస్తాను” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
ZEC 13:3 “ఇంకా ఎవరైనా ప్రవచనాలు చెప్తూ ఉంటే, ఆ వ్యక్తిని కన్న తల్లిదండ్రులు వారితో, ‘నీవు యెహోవా పేరట అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి నీవు చావాలి’ అని అంటారు. వారు ప్రవచనం చెప్తే, వారి కన్న తల్లిదండ్రులే వారిని పొడుస్తారు.
ZEC 13:4 “ఆ రోజున ప్రతి ప్రవక్త తాము చెప్పిన ప్రవచనం బట్టి దర్శనం బట్టి సిగ్గుపడి ఇకపై ప్రజలను మోసగించడానికి ప్రవక్త గొంగళి ధరించడం మానేస్తారు.
ZEC 13:5 ప్రతి ఒక్కరు, ‘నేను ప్రవక్తను కాను. నేను ఒక రైతును; నా చిన్నప్పటి నుండి నన్ను కొన్న వాని దగ్గర పొలంలో పని చేస్తున్నాను’ అంటారు.
ZEC 13:6 ‘నీ చేతులకు గాయాలేంటి?’ అని ఎవరైనా వారిని అడిగితే, ‘ఇవి నేను నా స్నేహితుల ఇంట్లో ఉన్నప్పుడు తగిలిన గాయాలు’ అంటారు.
ZEC 13:7 “ఖడ్గమా, మేలుకో, నా గొర్రెల కాపరి మీద నా సన్నిహితుడి మీద పడు!” అని సైన్యాల యెహోవా అంటున్నారు. “కాపరిని కొడతాను, గొర్రెలు చెదిరిపోతాయి, చిన్నవారి మీద నేను నా చేతిని ఉంచుతాను.”
ZEC 13:8 యెహోవా అంటున్నారు, “దేశమంతటిలో మూడింట రెండు వంతుల ప్రజలు హతమై నశిస్తారు; అయినా దేశంలో మూడవ వంతు ప్రజలు మిగిలి ఉంటారు.
ZEC 13:9 ఈ మూడవ వంతు ప్రజలను నేను అగ్నిలో నుండి వెండిని శుద్ధి చేసినట్లు వారిని శుద్ధి చేస్తాను బంగారాన్ని పరీక్షించినట్లు వారిని పరీక్షిస్తాను. వారు నా పేరట మొరపెడతారు, నేను వారికి జవాబిస్తాను. ‘వారు నా ప్రజలు’ అని నేనంటాను, ‘యెహోవా మా దేవుడు’ అని వారంటారు.”
ZEC 14:1 యెరూషలేమా, యెహోవా దినం రాబోతుంది, అప్పుడు మీ దగ్గర కొల్లగొట్టబడిన ఆస్తులు మీ మధ్యనే పంచుతారు.
ZEC 14:2 యెరూషలేము మీద యుద్ధం చేయడానికి అన్ని దేశాలను నేను సమకూరుస్తాను; వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఇల్లు దోచుకుంటారు, స్త్రీలను అత్యాచారం చేస్తారు. పట్టణ ప్రజల్లో సగం మంది బందీలుగా వెళ్తారు. అయితే మిగిలి ఉన్న ప్రజలు నాశనం కాకుండా పట్టణంలోనే ఉండిపోతారు.
ZEC 14:3 అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలంలో పోరాడే విధంగా ఆ దేశాలతో యుద్ధం చేస్తారు.
ZEC 14:4 ఆ రోజున ఆయన యెరూషలేముకు తూర్పుగా ఉన్న ఒలీవకొండ మీద తన పాదాలు ఉంచగా ఒలీవకొండ తూర్పు నుండి పడమరకు రెండుగా చీలిపోయి, సగం కొండ ఉత్తరదిక్కుకు, మరో సగం కొండ దక్షిణ దిక్కుకు జరిగి మధ్యలో విశాలమైన లోయ ఏర్పడుతుంది.
ZEC 14:5 కొండల మధ్య నేను ఏర్పరచిన ఆ లోయ ఆజేలు వరకు ఉంటుంది కాబట్టి మీరు ఆ కొండలోయ గుండా పారిపోతారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయినట్లు మీరు పారిపోతారు. అప్పుడు నా దేవుడైన యెహోవా తన పరిశుద్ధులందరితో కలిసి వస్తారు.
ZEC 14:6 ఆ రోజున సూర్యకాంతి ఉండదు, చలి ఉండదు, చీకటి ఉండదు.
ZEC 14:7 అది యెహోవాకు మాత్రమే తెలిసిన ప్రత్యేకమైన రోజు. అది పగలు కాదు, రాత్రి కాదు. సాయంకాలమైనా వెలుగు ఉంటుంది.
ZEC 14:8 ఆ రోజున యెరూషలేములో నుండి జీవజలాలు బయలుదేరి వాటిలో సగం మృత సముద్రానికి తూర్పుగా మరో సగం మధ్యధరా సముద్రానికి పడమరగా ప్రవహిస్తాయి. వేసవికాలంలో చలికాలంలో కూడా ఇలాగే ప్రవహిస్తాయి.
ZEC 14:9 యెహోవా సర్వభూమికి రాజుగా ఉంటారు. ఆ రోజున యెహోవా ఒక్కరే ఉంటారు, ఆయన పేరు ఒక్కటే నిలిచి ఉంటుంది.
ZEC 14:10 యెరూషలేముకు దక్షిణాన ఉన్న గెబా నుండి రిమ్మోను వరకు ఉన్న దేశమంతా అరాబాలా మైదానంలా అవుతుంది. అయితే యెరూషలేము బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు అనగా మొదటి ద్వారం ఉన్న స్థలం వరకు, హనానేలు గోపురం నుండి రాజ ద్రాక్షగానుగల వరకు వ్యాపించి ఉంటుంది.
ZEC 14:11 మనుష్యులు దానిలో నివసిస్తారు; ఇక ఎన్నడు అది నాశనం కాదు. యెరూషలేము క్షేమంగా ఉంటుంది.
ZEC 14:12 యెరూషలేము మీద యుద్ధం చేసిన దేశాలన్నిటి మీదికి యెహోవా రప్పించే తెగులు ఇలా ఉంటుంది: వారు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్ళిపోతాయి, వారి కళ్లు కంటి కుహరాల్లో ఉండి కూడా కుళ్ళిపోతాయి, వారి నాలుకలు వారి నోటిలోనే కుళ్ళిపోతాయి.
ZEC 14:13 ఆ రోజున యెహోవా ప్రజల్లో గొప్ప భయాన్ని పుట్టిస్తారు. వారంతా శత్రువులుగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు.
ZEC 14:14 యూదా వారు కూడా యెరూషలేము దగ్గర యుద్ధం చేస్తారు. చుట్టూ ఉన్న దేశాల నుండి విస్తారమైన బంగారం, వెండి, వస్త్రాలు, సంపదలు పోగు చేయబడతాయి.
ZEC 14:15 అలాగే వారి గుర్రాలకు, కంచరగాడిదలకు, ఒంటెలకు, గాడిదలకు శిబిరాలలో ఉన్న పశువులన్నిటికి తెగులు సోకుతుంది.
ZEC 14:16 అప్పుడు యెరూషలేముపై దాడి చేసిన దేశాలన్నిటిలో మిగిలి ఉన్నవారంతా రాజైన సైన్యాల యెహోవాను ఆరాధించడానికి గుడారాల పండుగ ఆచరించడానికి ఏటేటా యెరూషలేముకు వస్తారు.
ZEC 14:17 ఒకవేళ భూప్రజల కుటుంబాలలో ఎవరైనా రాజైన సైన్యాల యెహోవాను ఆరాధించడానికి యెరూషలేముకు రాకపోతే, వారికి వాన కురవదు.
ZEC 14:18 ఒకవేళ ఈజిప్టు కుటుంబాలు బయలుదేరి వెళ్లి పాల్గొనకపోతే వారికి వర్షం ఉండదు. గుడారాల పండుగ ఆచరించడానికి రాని దేశాలకు యెహోవా నియమించిన తెగులును ఆయన వారికి సోకేలా చేస్తారు.
ZEC 14:19 ఈజిప్టుకు, గుడారాల పండుగ ఆచరించడానికి వెళ్లని దేశాలకు విధించే శిక్ష ఇదే!
ZEC 14:20 ఆ రోజున గుర్రాలకు కట్టిన గంటల మీద, “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాయబడి ఉంటుంది. యెహోవా మందిరంలో ఉన్న వంట పాత్రలు బలిపీఠం ఎదుట ఉన్న పవిత్ర పాత్రల వలె ఉంటాయి.
ZEC 14:21 యెరూషలేములో, యూదాలో ఉన్న ప్రతి పాత్ర సైన్యాల యెహోవాకు ప్రతిష్ఠించబడతాయి, బలి అర్పించడానికి వచ్చే వారంతా ఆ పాత్రల్లో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వంట చేసుకుంటారు. ఆ రోజు ఏ కనానీయుడు సైన్యాల యెహోవా మందిరంలో ఉండడు.
MAL 1:1 ఇది ఇశ్రాయేలు ప్రజలకు మలాకీ ద్వారా ఇవ్వబడిన యెహోవా ప్రవచన వాక్కు.
MAL 1:2 యెహోవా ఇలా అంటున్నారు, “నేను మిమ్మల్ని ప్రేమించాను.” “కాని మీరు, ‘నీవెలా మమ్మల్ని ప్రేమించావు?’ అని అడుగుతున్నారు. “ఏశావు యాకోబుకు అన్న కాడా? అయినా నేను యాకోబును ప్రేమించాను.
MAL 1:3 ఏశావును ద్వేషించాను; నేను అతని కొండలను పాడు చేశాను. అతడు వారసత్వంగా పొందిన ప్రదేశాన్ని అడవి నక్కల పాలు చేశాను” అని యెహోవా అంటున్నారు.
MAL 1:4 ఎదోము వారు, “మేము నలుగగొట్టబడ్డాము, అయినాసరే మేము ఆ శిథిలాలనే తిరిగి కట్టుకుంటాము” అని అంటారేమో! కాని సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: “వారు మళ్ళీ కట్టుకున్నా, నేను కూల్చివేస్తాను. వారిది దుర్మార్గుల దేశమని, ఎప్పటికీ యెహోవా ఉగ్రతకు గురయ్యే ప్రజలని పిలువబడతారు.
MAL 1:5 మీరు అది కళ్లారా చూసి, ‘ఇశ్రాయేలు సరిహద్దు అవతల కూడా యెహోవా గొప్పవాడు!’ అని అంటారు.
MAL 1:6 “కుమారుడు తన తండ్రిని గౌరవిస్తాడు, దాసుడు తన యజమానిని గౌరవిస్తాడు, కానీ ఒకవేళ నేను మీ తండ్రినైతే, మరి నా గౌరవం ఏది? నేను యజమానినైతే, నాకెందుకు భయపడరు?” అని సైన్యాల యెహోవా అంటున్నారు. “యాజకులైన మీరు నా నామాన్ని అవమానిస్తున్నారు. “అయినా మీరు, ‘మేము మీ నామాన్ని ఎలా అవమానిస్తున్నాము?’ అని అంటారు.
MAL 1:7 “మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన ఆహారం అర్పిస్తూ, “అయినా మీరు, ‘మేము మిమ్మల్ని ఎలా అపవిత్రపరచాము?’ అని అడుగుతారు. “యెహోవా బల్లను ప్రాముఖ్యత లేనిదిగా చూడడం వల్లనే.
MAL 1:8 మీరు గ్రుడ్డి జంతువులను తెచ్చి బలి అర్పిస్తే తప్పు కాదా? కుంటి దానిని, జబ్బుతో ఉన్న జంతువులను తెచ్చి బలి అర్పిస్తే తప్పు కాదా? అలాంటి వాటిని మీ అధికారికి ఇచ్చి చూడండి! అలాంటివి ఇస్తే స్వీకరిస్తాడా? అతడు నిన్ను అంగీకరిస్తాడా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
MAL 1:9 “కానీ ఇప్పుడేమో మాపై దయచూపమని దేవుని వేడుకొంటున్నారు. మీ చేతులతో అలాంటి అర్పణలను ఇస్తే ఆయన స్వీకరిస్తాడా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
MAL 1:10 “మీరు నా బలిపీఠం మీద వృధాగా మంటలు వేయకుండా మీలో ఎవరైనా గుడి తలుపులు మూసివేస్తే ఎంత బాగుంటుంది! నేను మీ పట్ల సంతోషంగా లేను. నేను మీ చేతుల నుండి ఏ అర్పణను స్వీకరించను అని సైన్యాల యెహోవా అంటున్నారు.
MAL 1:11 తూర్పుదిక్కు నుండి పడమటిదిక్కు వరకు ఇతర దేశాల మధ్య నా నామం ఘనపరచబడుతుంది. ప్రతిచోటా ధూపద్రవ్యాలు, పవిత్రమైన అర్పణలు వారు నాకు తెస్తారు. నా పేరు ఇతర దేశాల్లో గొప్పగా ఉంటుంది” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
MAL 1:12 “కానీ మీరు, ‘యెహోవా బల్ల అపవిత్రం అయింది, దాని ఆహారం నీచమైనది’ అంటూ నా నామాన్ని అవమానపరుస్తున్నారు.
MAL 1:13 పైగా, ‘ఎంత భారంగా ఉంది!’ అంటూ ఆ బల్లను తిరస్కరిస్తున్నారు” అని సైన్యాల యెహోవా అంటున్నారు. “మీరు గాయపడిన దాన్ని కుంటి దాన్ని, జబ్బుపడిన జంతువులను తీసుకువచ్చి బలి అర్పించినప్పుడు నేను మీ చేతుల నుండి వాటిని స్వీకరించాలా?” అని యెహోవా అంటున్నారు.
MAL 1:14 “తన మందలో అంగీకారయోగ్యమైన మగ జంతువు ఉండి, దానిని బలి ఇస్తానని మ్రొక్కుబడి చేసి దోషం ఉన్న జంతువును బలి అర్పించే మోసగాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే నేను గొప్ప రాజును, దేశాలకు నేనంటే భయం” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
MAL 2:1 “యాజకులారా, ఈ ఆజ్ఞ మీ కోసమే!
MAL 2:2 మీరు నా మాట వినకుండా నా పేరును మనసారా గౌరవించడానికి నిశ్చయించుకోకపోతే, నేను మీ మీదికి శాపం రప్పిస్తాను. మీరు పొందుకున్న దీవెనలను కూడా నేను శాపాలుగా మారుస్తాను. నిజానికి, మీరు నా హెచ్చరికను గుర్తు ఉంచుకోలేదు కాబట్టి నేను ఇప్పటికే వాటిని శాపాలుగా మార్చాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
MAL 2:3 “నేను మీ కారణంగా మీ సంతానాన్ని గద్దిస్తాను; మీ పండుగల్లో మీరు అర్పించే పశువుల పేడ మీ ముఖాల మీద వేస్తాను. దానితో పాటు మీరు కూడా ఊడ్చివేయబడతారు.
MAL 2:4 నేను లేవీయులకు చేసిన ఒడంబడిక ఉండిపోయేలా నేనే మీకు ఈ ఆజ్ఞ ఇచ్చానని మీరు తెలుసుకుంటారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
MAL 2:5 నేను లేవీయులతో చేసిన నిబంధన జీవానికి సమాధానానికి సంబంధించింది. వారు నా పట్ల భయభక్తులు చూపాలని అవి వారికి ఇచ్చాను. అప్పుడు వారు నన్ను గౌరవించి నా పేరు పట్ల భయభక్తులు కలిగివుంటారు.
MAL 2:6 సత్యమైన ఉపదేశం వారి నోటి నుండి వెలువడిందే తప్ప దుర్బోధ ఏమాత్రం కాదు. వారు సమాధానంతో నిజాయితీ కలిగి నా సహవాసంలో నడిచారు. వారు అనేకులను పాపం విడిచిపెట్టేలా చేశారు.
MAL 2:7 “యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా దూతలు. ఎందుకంటే మనుష్యులు వారి నోట ధర్మశాస్త్రం విని నేర్చుకుంటారు. కాబట్టి వారు జ్ఞానాన్ని కలిగి బోధించాలి.
MAL 2:8 మీరైతే దారి తప్పారు, మీ ఉపదేశం వల్ల అనేకులు తడబడ్డారు, నేను లేవీయులతో చేసిన ఒడంబడికను వమ్ము చేశారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
MAL 2:9 “నా మార్గాలను అనుసరించక, ధర్మశాస్త్ర విషయాల్లో పక్షపాతం చూపుతూ వచ్చారు, కాబట్టి ప్రజలందరి కళ్లెదుటే మిమ్మల్ని అణచివేసి తృణీకారానికి గురిచేస్తాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
MAL 2:10 మనకందరికి తండ్రి ఒక్కడు కాదా? ఒక్క దేవుడే మనల్ని సృజించలేదా? అలాంటప్పుడు ఒకరిపట్ల ఒకరం నమ్మకద్రోహం చేస్తూ దేవుడు మన పూర్వికులతో చేసిన నిబంధనను ఎందుకు అపవిత్రం చేస్తున్నాము?
MAL 2:11 యూదా వారు నమ్మకద్రోహులయ్యారు, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములో అసహ్యమైన పనులు జరుగుతున్నాయి. యూదా వారు యెహోవా ప్రేమించే పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరచి ఇతర దేవతలను పూజించేవారి స్త్రీలను పెండ్లి చేసుకున్నారు.
MAL 2:12 ఇలా చేసినవారు ఎవరైనా సరే యాకోబు వంశీయుల డేరాలలో లేకుండా సైన్యాలకు అధిపతియైన యెహోవాకు నైవేద్యాలు అర్పించేవారి సహవాసంలో లేకుండా యెహోవా నిర్మూలించు గాక!
MAL 2:13 మీరు మరొకసారి అలాగే చేస్తున్నారు: మీ కన్నీళ్లతో యెహోవా బలిపీఠాన్ని తడుపుతున్నారు. ఆయన మీ నైవేద్యాలను ఇష్టపడరు వాటిని మీ నుండి సంతోషంతో స్వీకరించరు కాబట్టి మీరు ఏడుస్తూ రోదిస్తారు.
MAL 2:14 “ఎందుకు?” అని మీరడుగుతారు. ఎందుకంటే నీకు నీ యవ్వనకాలంలో నీవు పెండ్లాడిన భార్యకు మధ్య యెహోవా సాక్షిగా ఉన్నారు. ఆమె నీ భాగస్వామి, నీ చేసిన వివాహ నిబంధన వలన నీ భార్య అయినప్పటికీ నీవు ఆమెకు ద్రోహం చేశావు.
MAL 2:15 ఆయన మీ ఇద్దరిని ఒకటి చేయలేదా? శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా! అలా ఒకటిగా చేయడం ఎందుకు? దేవుని మూలంగా వారికి సంతానం కలగాలని కదా! అందుచేత మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి, యవ్వనంలో పెండ్లాడిన మీ భార్యకు ద్రోహం చేయకండి.
MAL 2:16 “పెళ్ళి బంధాన్ని తెంచడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అంటున్నారు. మనిషి వస్త్రంలా దౌర్జన్యాన్ని కప్పుకోవడం కూడా నాకు అసహ్యం” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నారు. కాబట్టి మీ హృదయాలను కాపాడుకోండి, ద్రోహం తలపెట్టకండి.
MAL 2:17 మీరు మీ మాటచేత యెహోవాకు విసుగు పుట్టిస్తున్నారు. “ఆయనకు విసుగు ఎలా కలిగించాం?” అని మీరు అడుగుతున్నారు. “చెడు చేసేవారంతా యెహోవా దృష్టికి మంచి వారు, అలాంటి వారంటే ఆయనకు ఇష్టమే, లేకపోతే న్యాయం జరిగించే దేవుడు ఏమయ్యాడు?” అని అడుగుతూ ఆయనకు విసుగు పుట్టిస్తున్నారు.
MAL 3:1 సైన్యాలకు యెహోవా చెప్పేదేమంటే, “నేను నా దూతను పంపుతాను, అతడు నా ముందర మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆ తర్వాత మీరు వెదుకుతున్న ప్రభువు అంటే మీరు కోరే నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు.”
MAL 3:2 అయితే ఆయన రాకడ దినం ఎవరు తట్టుకోగలరు? ఆయన కనబడేటప్పుడు ఎవరు నిలబడి ఉండగలరు? ఆయన కంసాలి నిప్పులాంటి వాడు, బట్టలను శుద్ధి చేసే చాకలివాని సబ్బు లాంటివాడు.
MAL 3:3 ఆయన వెండిని పరీక్షించి, పుటం పెట్టి శుద్ధి చేసే కంసాలిలా కూర్చుంటారు, వెండి బంగారాలను పుటం పెట్టే విధంగా ఆయన లేవీ వారిని శుద్ధి చేస్తారు. అప్పుడు వారు నీతి నిజాయితీ అనుసరించి యెహోవాకు నైవేద్యాలు అర్పిస్తారు.
MAL 3:4 గతించిన రోజుల్లో, పూర్వకాలంలో ఉన్నట్లు యూదా వారు యెరూషలేము నివాసులు చేసే అర్పణలు యెహోవాకు అంగీకారమవుతాయి.
MAL 3:5 “తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వస్తాను, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నాకు భయపడక జీతాల విషయంలో కూలివారిని మోసం ఉద్యోగులను మోసం చేసేవారికి, విధవరాండ్రను అనాధలను అణచివేసే వారికి, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు న్యాయం జరుగకుండ చేసేవారికి వ్యతిరేకంగా నేను మాట్లాడతాను” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
MAL 3:6 “నేను యెహోవాను, నేను మార్పు చెందను. కాబట్టే యాకోబు సంతతివారలారా, మీరు నాశనం కాలేదు.
MAL 3:7 మీ పూర్వికుల కాలం నుండి మీరు నా శాసనాల విషయంలో త్రోవ తప్పి వాటిని పాటించలేదు. నా వైపుకు తిరగండి, అప్పుడు నేను మీవైపుకు తిరుగుతాను” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. “కాని మీరు, ‘మేము ఏ విషయంలో తిరగాలి?’ అని అడుగుతారు.
MAL 3:8 “మానవులు దేవున్ని దోచుకుంటారా? కాని మీరు నన్ను దోచుకుంటున్నారు. “అయినా మీరు, ‘మేము మిమ్మల్ని ఎలా దోచుకుంటున్నాము?’ అని అడుగుతారు. “పదవ భాగాన్ని కానుకలను ఇవ్వక దోచుకుంటున్నారు.
MAL 3:9 ఈ ప్రజలంతా నా దగ్గర దొంగతనం చేస్తున్నారు కాబట్టి శాపగ్రస్థులయ్యారు.
MAL 3:10 నా మందిరంలో ఆహారం ఉండేలా పదవ భాగాన్నంతా నా ఆలయానికి తీసుకురండి. ఇలా చేసి నన్ను పరీక్షించండి, నేను పరలోక ద్వారాలను తెరచి పట్టలేనంతగా దీవెనలు కుమ్మరిస్తానో లేదో చూడండి అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
MAL 3:11 మీ పైరును పురుగులు తినివేయకుండా చేస్తాను, అవి మీ పొలం పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్ల పండ్లు అకాలంలో రాలవు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
MAL 3:12 “అప్పుడు మీ దేశం ఆనందంగా ఉంటుంది కాబట్టి అన్ని దేశాల ప్రజలు మిమ్మల్ని ధన్యులంటారు” అని సైన్యాలకు యెహోవా ప్రకటిస్తున్నాడు.
MAL 3:13 యెహోవా చెప్పేదేమంటే, “నాకు వ్యతిరేకంగా మీరు చాలా గర్వించి మాట్లాడారు.” “అయినా మేము నీకు వ్యతిరేకంగా ఏం మాట్లాడాము?” అని మీరు అడుగుతున్నారు.
MAL 3:14 “మీరు ఇలా అంటారు, ‘దేవునికి సేవ చేయడం వ్యర్థం, ఆయన ఆజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తూ సైన్యాలకు అధిపతియైన యెహోవా ఎదుట దుఃఖా క్రాంతులై తిరుగుతూ ఉండి ప్రయోజనం ఏంటి?
MAL 3:15 ఇప్పుడు గర్విష్ఠులనే ధన్యులని పిలుస్తున్నాము. చెడు చేసేవారు వర్ధిల్లుతూ ఉన్నారు, వారు దేవున్ని పరీక్షించినప్పుడు కూడా వారికి ఏ హాని కలగడం లేదు.’ ”
MAL 3:16 అప్పుడు, యెహోవా పట్ల భయభక్తులు కలిగినవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా విన్నారు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయన పేరును గౌరవించే వారి విషయం ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థమైన గ్రంథంలో వ్రాయబడింది.
MAL 3:17 “నేను నియమించిన ఆ రోజున వారు నాకు విలువైన స్వాస్థ్యంగా ఉంటారు. తండ్రి తనను సేవించే తన కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరిస్తాను” అని అంటూ సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు.
MAL 3:18 అప్పుడు నీతిమంతులకు, దుర్మార్గులకు, దేవున్ని సేవించేవారికి, సేవించని వారికి మధ్య వ్యత్యాసాన్ని మీరు మళ్ళీ చూస్తారు.
MAL 4:1 “తీర్పు దినం ఖచ్చితంగా వస్తుంది; అది మండుతున్న కొలిమిలా ఉంటుంది. గర్విష్ఠులందరూ, కీడుచేసే ప్రతివాడు ఎండుగడ్డిలా ఉంటారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. “రాబోయే ఆ రోజున వారు కాలిపోతారు, వారికి వేరు గాని, కొమ్మ గాని మిగలదు.
MAL 4:2 అయితే నా పేరుకు భయపడే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని కిరణాలతో స్వస్థత కలుగుతుంది. మీరు శాలలోనుండి బయటకు వెళ్లిన క్రొవ్వినదూడల్లా ఉల్లాసంగా గంతులు వేస్తారు.
MAL 4:3 నేను నియమించే ఆ రోజున దుర్మార్గులు మీ కాళ్లక్రింద ధూళిలా ఉంటారు, మీరు వారిని త్రొక్కివేస్తారు” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
MAL 4:4 “నా సేవకుడైన మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలందరి కోసం ఉద్దేశించింది, హోరేబు పర్వతం మీద నేను అతనికి ఇచ్చిన ఆజ్ఞలు, చట్టాలు జ్ఞాపకముంచుకోండి.
MAL 4:5 “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకముందు నేను ఏలీయా ప్రవక్తను మీ దగ్గరికి పంపిస్తాను.
MAL 4:6 నేను వచ్చి దేశాన్ని శపించకుండ ఉండేలా అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపు, పిల్లల హృదయాలను తండ్రుల వైపు త్రిప్పుతాడు.”
MAT 1:1 ఇది అబ్రాహాము సంతానమైన దావీదు సంతానం నుండి వచ్చిన క్రీస్తు యేసు వంశావళి:
MAT 1:2 అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు యూదా అతని సహోదరులు.
MAT 1:3 యూదా కుమారులైన పెరెసు, జెరహు; వీరి తల్లి తామారు. పెరెసు కుమారుడు హెస్రోను, హెస్రోను కుమారుడు అరాము.
MAT 1:4 అరాము కుమారుడు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను, నయస్సోను కుమారుడు శల్మాను.
MAT 1:5 శల్మాను కుమారుడు బోయజు; అతని తల్లి రాహాబు, బోయజు కుమారుడు ఓబేదు; అతని తల్లి రూతు, ఓబేదు కుమారుడు యెష్షయి.
MAT 1:6 రాజైన దావీదు యెష్షయి కుమారుడు. దావీదు కుమారుడు సొలొమోను; అతని తల్లి అంతకుముందు ఊరియాకు భార్య.
MAT 1:7 సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు అబీయా, అబీయా కుమారుడు ఆసా.
MAT 1:8 ఆసా కుమారుడు యెహోషాపాతు, యెహోషాపాతు కుమారుడు యెహోరాము, యెహోరాము కుమారుడు ఉజ్జియా.
MAT 1:9 ఉజ్జియా కుమారుడు యోతాము, యోతాము కుమారుడు ఆహాజు, ఆహాజు కుమారుడు హిజ్కియా.
MAT 1:10 హిజ్కియా కుమారుడు మనష్షే, మనష్షే కుమారుడు ఆమోను, ఆమోను కుమారుడు యోషీయా.
MAT 1:11 యోషీయా కుమారులెవరనగా యెకొన్యా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు.
MAT 1:12 బబులోనుకు కొనిపోబడిన తర్వాత పుట్టినవారు వీరే: యెకొన్యా కుమారుడు షయల్తీయేలు, షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.
MAT 1:13 జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు, అబీహూదు కుమారుడు ఎల్యాకీము, ఎల్యాకీము కుమారుడు అజోరు.
MAT 1:14 అజోరు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు ఆకీము, ఆకీము కుమారుడు ఎలీహూదు.
MAT 1:15 ఎలీహూదు కుమారుడు ఎలియాజరు, ఎలియాజరు కుమారుడు మత్తాను, మత్తాను కుమారుడు యాకోబు.
MAT 1:16 యాకోబు కుమారుడైన యోసేపు మరియకు భర్త. ఆమె యేసు అని పిలువబడిన క్రీస్తుకు తల్లి.
MAT 1:17 ఈ విధంగా అబ్రాహాము నుండి దావీదు వరకు పద్నాలుగు తరాలు, దావీదు నుండి బబులోను చెరకు కొనిపోబడిన కాలం వరకు పద్నాలుగు తరాలు, చెరకు కొనిపోబడినప్పటి నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు.
MAT 1:18 యేసు క్రీస్తు పుట్టుక ఇలా జరిగింది: ఆయన తల్లియైన మరియ యోసేపుకు ప్రధానం చేయబడింది. కానీ వారిద్దరు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది.
MAT 1:19 అయితే ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
MAT 1:20 అతడు ఇలా ఆలోచిస్తూ ఉండగా, కలలో ప్రభువు దూత అతనికి కనపడి, “దావీదు కుమారుడవైన యోసేపూ, మరియను నీ భార్యగా ఇంటికి తీసుకెళ్లడానికి భయపడకు. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ మూలంగా గర్భం ధరించింది.
MAT 1:21 ఆమె ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తారు. కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టాలి” అని చెప్పాడు.
MAT 1:22 ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాటలు నెరవేరేలా ఇదంతా జరిగింది.
MAT 1:23 “ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు” (అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం).
MAT 1:24 యోసేపు నిద్రలేచి ప్రభువు దూత తనకు ఆదేశించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంట్లో చేర్చుకున్నాడు.
MAT 1:25 అయితే ఆమె కుమారునికి జన్మనిచ్చే వరకు, యోసేపు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు.
MAT 2:1 హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేములో యేసు జన్మించినప్పుడు తూర్పుదిక్కు నుండి జ్ఞానులు యెరూషలేము పట్టణానికి వచ్చారు.
MAT 2:2 వారు, “యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చాం” అని చెప్పారు.
MAT 2:3 హేరోదు రాజు ఈ సంగతిని విని, అతడును అతనితో పాటు యెరూషలేము వారంతా కలవరపడ్డారు.
MAT 2:4 హేరోదు రాజు ప్రజల ముఖ్య యాజకులను, ధర్మశాస్త్ర ఉపదేశకులనందరిని పిలిపించి, క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది అని వారిని అడిగాడు.
MAT 2:5 అందుకు వారు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని చెప్పారు, “ఎందుకంటే ప్రవక్త ద్వారా ఈ విధంగా వ్రాయబడి ఉంది:
MAT 2:6 “ ‘యూదయ దేశంలోని బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం తక్కువదానివి కావు; ఎందుకంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడే అధిపతి నీలో నుండి వస్తాడు.’”
MAT 2:7 అప్పుడు హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన ఖచ్చితమైన సమయమేదో వారిని అడిగి తెలుసుకున్నాడు.
MAT 2:8 తర్వాత ఆయన వారితో, “మీరు వెళ్లి ఆ శిశువు కోసం జాగ్రత్తగా వెదకి మీరు అతన్ని కనుగొనగానే నాకు చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పి బేత్లెహేముకు పంపించాడు.
MAT 2:9 వారు రాజు మాటలు విని బయలుదేరి వెళ్తున్నప్పుడు, తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం వారి ముందు వెళ్తూ ఆ శిశువు ఉన్న స్థలం మీదికి వచ్చి ఆగింది.
MAT 2:10 వారు ఆ నక్షత్రాన్ని చూసి చాలా ఆనందించారు.
MAT 2:11 వారు ఆ ఇంట్లోకి వెళ్లి ఆ శిశువును తల్లియైన మరియను చూసి, వంగి నమస్కరించి ఆయనను ఆరాధించారు. తర్వాత వారు తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించారు.
MAT 2:12 హేరోదు రాజు దగ్గరకు తిరిగి వెళ్లకూడదని కలలో వారు హెచ్చరించబడి వేరే దారిలో తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు.
MAT 2:13 వారు వెళ్లిన తర్వాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “ఈ శిశువును చంపాలని హేరోదు రాజు వెదుకుతున్నాడు కాబట్టి నీవు శిశువును తల్లిని తీసుకుని ఈజిప్టుకు పారిపోయి నేను నీతో చెప్పే వరకు అక్కడే ఉండు” అని చెప్పాడు.
MAT 2:14 కాబట్టి యోసేపు లేచి ఆ రాత్రి సమయంలోనే శిశువును తల్లియైన మరియను తీసుకుని ఈజిప్టుకు బయలుదేరి వెళ్లి,
MAT 2:15 హేరోదు మరణించే వరకు అక్కడే ఉన్నాడు. “ఈజిప్టులో నుండి నేను నా కుమారుని పిలిచాను” అని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటలు ఇలా నెరవేరాయి.
MAT 2:16 ఆ జ్ఞానులు తనను మోసగించారని గ్రహించిన హేరోదు చాలా కోపంతో జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములోను దాని పరిసర ప్రాంతాల్లోను రెండు సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయస్సుగల మగ పిల్లలందరిని చంపుమని ఆదేశించాడు.
MAT 2:17 యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన ఈ మాటలు నెరవేరాయి:
MAT 2:18 “రామాలో ఏడ్పు గొప్ప రోదన వినబడుతుంది, రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఇక వారు లేరని, ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.”
MAT 2:19 హేరోదు చనిపోయిన తర్వాత, ఈజిప్టులో ఉన్న యోసేపుకు ప్రభువు దూత కలలో కనపడి
MAT 2:20 అతనితో, “బాలుని ప్రాణం తీయాలని చూసినవారు చనిపోయారు. కాబట్టి నీవు లేచి బాలున్ని అతని తల్లిని తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్లు” అని చెప్పాడు.
MAT 2:21 కాబట్టి యోసేపు లేచి బాలున్ని అతని తల్లిని తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్లాడు.
MAT 2:22 అయితే అర్కెలా తన తండ్రియైన హేరోదు స్థానంలో యూదయ దేశాన్ని పరిపాలిస్తున్నాడని అతడు విని అక్కడికి వెళ్లడానికి భయపడ్డాడు. కలలో దేవుని హెచ్చరిక పొంది గలిలయ ప్రాంతానికి వెళ్లి,
MAT 2:23 నజరేతు అనే ఊరిలో నివసించాడు. ఆయన నజరేయుడు అని పిలువబడతాడని ప్రవక్తల ద్వారా చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది.
MAT 3:1 ఆ రోజుల్లో బాప్తిస్మమిచ్చే యోహాను వచ్చి యూదయలోని అరణ్యంలో,
MAT 3:2 “పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని ప్రకటిస్తున్నాడు.
MAT 3:3 దేవుడు యెషయా ప్రవక్త ద్వారా: “ ‘ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన కోసం త్రోవలను సరాళం చేయండి’ అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం” అని ఇతని గురించే చెప్పింది.
MAT 3:4 యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాలను, నడుముకు తోలుదట్టీ ధరించేవాడు. అతడు మిడతలు, అడవి తేనె తినేవాడు.
MAT 3:5 యెరూషలేము, యూదయ ఇంకా యొర్దాను నది ప్రాంతమంతటి నుండి ప్రజలందరూ అతని దగ్గరకు వచ్చి,
MAT 3:6 తమ పాపాలను ఒప్పుకుని యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందారు.
MAT 3:7 అయితే తాను బాప్తిస్మం ఇస్తున్న ప్రాంతానికి పరిసయ్యులు సద్దూకయ్యులలో చాలామంది రావడం చూసి అతడు వారితో, “సర్పసంతానమా! రానున్న ఉగ్రత నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
MAT 3:8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి.
MAT 3:9 ‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి కూడా అబ్రాహాముకు సంతానం కలుగజేయగలడని మీతో చెప్తున్నాను.
MAT 3:10 ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర పెట్టబడింది. మంచి పండ్లు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది.
MAT 3:11 “పశ్చాత్తాపం కోసం నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తారు.
MAT 3:12 గోధుమల నుండి పొట్టును వేరు చేయడానికి తన చేతిలో చేటతో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గోధుమలను తన ధాన్యపు కొట్టులో పోసి, తన నూర్చెడి కళ్లాన్ని శుభ్రం చేసి, పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తారు” అని అన్నాడు.
MAT 3:13 అప్పుడు యేసు యోహాను చేత బాప్తిస్మం పొందడానికి గలిలయ నుండి యొర్దానుకు వచ్చారు.
MAT 3:14 కాని యోహాను ఆయనతో, “నేనే నీ ద్వారా బాప్తిస్మం పొందాలి, అలాంటిది నీవు నా దగ్గరకు వస్తున్నావా?” అని అంటూ యేసును ఆపడానికి ప్రయత్నించాడు.
MAT 3:15 అందుకు యేసు, “ఇప్పటికి ఇలా కానివ్వు. నీతి అంతటిని నెరవేర్చడానికి ఇలా చేయడం మనకు సరియైనది” అని చెప్పారు. కాబట్టి యోహాను ఒప్పుకున్నాడు.
MAT 3:16 యేసు బాప్తిస్మం పొంది నీళ్లలో నుండి బయటకు వచ్చారు. ఆ క్షణంలో ఆకాశం తెరువబడి, దేవుని ఆత్మ పావురంలా దిగి వచ్చి ఆయన మీద వాలడం అతడు చూశాడు.
MAT 3:17 పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం వినపడింది: “ఈయన నా ప్రియ కుమారుడు; ఈయనయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను.”
MAT 4:1 అప్పుడు యేసు అపవాది చేత శోధించబడడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకెళ్లాడు.
MAT 4:2 నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు ఆకలివేసింది.
MAT 4:3 శోధకుడు యేసు దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మారమని చెప్పు” అని అన్నాడు.
MAT 4:4 అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
MAT 4:5 అప్పుడు అపవాది ఆయనను పవిత్ర పట్టణానికి తీసుకుని వెళ్లి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి,
MAT 4:6 “నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు. ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, నీ పాదాలకు ఒక్క రాయి తగలకుండ, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు’” అని అన్నాడు.
MAT 4:7 అందుకు యేసు అతనితో, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని కూడా వ్రాయబడి ఉంది” అని అన్నారు.
MAT 4:8 మరల అపవాది ఆయనను ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్లి ప్రపంచంలోని రాజ్యాలన్నిటినీ వాటి వైభవాన్ని ఆయనకు చూపించాడు.
MAT 4:9 వాడు యేసుతో, “నీవు నా ముందు తలవంచి నన్ను ఆరాధిస్తే వీటన్నిటిని నీకు ఇస్తాను” అన్నాడు.
MAT 4:10 అందుకు యేసు, “సాతానా! నా దగ్గర నుండి వెళ్లిపో! నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉంది” అని చెప్పారు.
MAT 4:11 అపవాది ఆయనను విడిచి వెళ్లిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు.
MAT 4:12 యోహాను చెరసాలలో వేయబడ్డాడని విన్న తర్వాత యేసు గలిలయకు వెళ్లారు.
MAT 4:13 ఆయన నజరేతును వదిలి జెబూలూను, నఫ్తాలి ప్రాంతపు సముద్రతీరాన ఉన్న కపెర్నహూముకు వెళ్లారు. వారు అక్కడ కొన్ని రోజులు నివసించారు.
MAT 4:14 ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన:
MAT 4:15 “జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో, యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో, యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతంలో,
MAT 4:16 చీకటిలో నివసిస్తున్న ప్రజలు, గొప్ప వెలుగును చూశారు; మరణచ్ఛాయలో నివసించేవారి మీద ఒక వెలుగు ప్రకాశించింది” అనే మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది.
MAT 4:17 అప్పటినుండి యేసు, “పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని ప్రకటించడం మొదలుపెట్టారు.
MAT 4:18 యేసు గలిలయ సముద్రతీరాన నడుస్తున్నప్పుడు పేతురు అని పిలువబడే సీమోను, అతని సోదరుడు అంద్రెయ అనే ఇద్దరు సోదరులు సముద్రంలో వలలు వేయడం ఆయన చూశారు. వారు జాలరులు.
MAT 4:19 యేసు వారితో, “నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నారు.
MAT 4:20 వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు.
MAT 4:21 ఆయన అక్కడినుండి వెళ్తూ జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అనే మరో ఇద్దరు సోదరులను చూశారు. వారు తమ తండ్రి జెబెదయితో కలసి పడవలో ఉండి తమ వలలను సిద్ధం చేసుకుంటున్నారు. యేసు వారిని పిలిచారు.
MAT 4:22 వెంటనే వారు పడవను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.
MAT 4:23 యేసు గలిలయ ప్రాంతమంతా తిరుగుతూ, వారి సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ప్రజల మధ్యలో ప్రతి వ్యాధిని రోగాన్ని బాగుచేస్తూ ఉన్నారు.
MAT 4:24 ఆయన గురించి సిరియా దేశమంతటా తెలిసి ప్రజలు రకరకాల వ్యాధులతో, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నవారిని, దయ్యాలు పట్టినవారిని, మూర్ఛ రోగం గలవారిని పక్షవాత రోగులను యేసు దగ్గరకు తీసుకుని రాగా ఆయన వారిని బాగుచేశారు.
MAT 4:25 గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ, యొర్దాను అవతలి వైపు ఉన్న ప్రాంతాల నుండి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించారు.
MAT 5:1 యేసు ఆ జనసమూహాన్ని చూసి కొండ మీదికి వెళ్లి కూర్చుని ఉండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు.
MAT 5:2 అప్పుడు ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు. ఆయన ఇలా బోధించారు:
MAT 5:3 “ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే.
MAT 5:4 దుఃఖించే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు.
MAT 5:5 సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు.
MAT 5:6 నీతి కోసం ఆకలిదప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపొందుతారు.
MAT 5:7 కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.
MAT 5:8 హృదయశుధ్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు.
MAT 5:9 సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు.
MAT 5:10 నీతి కోసం హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే.
MAT 5:11 “నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని అవమానించి, హింసించి మీరు చెడ్డవారని మీమీద అపనిందలు వేసినప్పుడు మీరు ధన్యులు.
MAT 5:12 సంతోషించి ఆనందించండి. ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది, మీకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు.
MAT 5:13 “మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కాని ఉప్పు తన సారం కోల్పోతే అది తిరిగి సారవంతం కాగలదా? ఇక అది దేనికి పనికిరాదు, బయట పారవేయబడి త్రొక్కబడడానికే తప్ప మరి దేనికి పనికిరాదు.
MAT 5:14 “మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండమీద కట్టబడిన పట్టణం కనపడకుండా ఉండలేదు.
MAT 5:15 అలాగే ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని పాత్ర క్రింద పెట్టరు, కాని దానిని దీపస్తంభం మీద పెడతారు. అప్పుడే ఇంట్లో ఉన్నవారందరికి వెలుగు ఇస్తుంది.
MAT 5:16 అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి.
MAT 5:17 “నేను ధర్మశాస్త్రాన్ని లేదా ప్రవక్తల మాటలను రద్దు చేయడానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని నెరవేర్చడానికే కాని రద్దు చేయడానికి రాలేదు.
MAT 5:18 ఆకాశం భూమి గతించిపోకముందు, ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అందులో నుండి ఒక పొల్లు కానీ, ఒక సున్నా కానీ తప్పిపోదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 5:19 కాబట్టి ఈ ఆజ్ఞలలో అతి చిన్నదైన ఒకదాన్ని చేయకుండ ఇతరులకు వాటిని బోధించేవారు పరలోకరాజ్యంలో చాలా తక్కువగా ఎంచబడతారు, అయితే ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ బోధించేవారు పరలోకరాజ్యంలో గొప్పవారిగా గుర్తించబడతారు.
MAT 5:20 ధర్మశాస్త్ర ఉపదేశకుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, మీ నీతి అధికంగా లేకపోతే మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 5:21 “ ‘మీరు హత్య చేయకూడదు. ఎవరైనా హత్య చేస్తే, వారు శిక్షకు గురవుతారు’ అని మీ పూర్వికులకు చెప్పిన మాట మీరు విన్నారు కదా.
MAT 5:22 కాని నేను చెప్పేదేంటంటే, తన సహోదరుని మీద కాని సహోదరి మీద కాని కోప్పడేవారు తీర్పుకు గురవుతారు. అంతేకాక తన సహోదరుని కాని సహోదరిని కాని చూసి ద్రోహి అని పలికేవారు న్యాయస్థానం ఎదుట నిలబడాలి. ‘వెర్రివాడ లేదా వెర్రిదాన!’ అనే వారికి నరకాగ్నికి తప్పదు.
MAT 5:23 “కాబట్టి మీరు బలిపీఠం దగ్గర కానుకను అర్పిస్తూ ఉండగా మీ సహోదరునికైనా సహోదరికైనా మీమీద ఏదైన విరోధం ఉందని జ్ఞాపకం వస్తే,
MAT 5:24 మీ కానుకను అక్కడ బలిపీఠం ముందే పెట్టి, మొదట వెళ్లి మీ సహోదరునితో లేక సహోదరితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించాలి.
MAT 5:25 “మీలో ఎవరైనా మీ విరోధితో నీకున్న వివాదం విషయంలో మీరిద్దరు న్యాయస్థానానికి వెళ్తున్నట్లయితే ఇంకా దారిలో ఉండగానే సమాధానపడడం మంచిది. లేకపోతే మీ విరోధి మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు, ఆ న్యాయాధిపతి మిమ్మల్ని అధికారికి అప్పగించి చెరసాలలో వేయించవచ్చు.
MAT 5:26 అప్పుడు జరిగేదేంటంటే చివరి పైసా చెల్లించే వరకు మీరు బయట పడలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 5:27 “ ‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పిన మాట మీరు విన్నారు కదా.
MAT 5:28 అయితే నేను మీతో చెప్పేదేంటంటే, ఒక వ్యక్తి స్త్రీని కామంతో చూస్తేనే అతడు తన మనస్సులో ఆమెతో వ్యభిచారం చేసినట్టు.
MAT 5:29 మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడికన్ను కారణమైతే, దాన్ని పెరికి పారవేయడం మేలు. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే, మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా.
MAT 5:30 మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడి చేయి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా.
MAT 5:31 “ ‘తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెకు ధృవీకరణ పత్రం వ్రాసివ్వాలి’ అని చెప్పబడింది.
MAT 5:32 కానీ నేను మీతో చెప్పేదేంటంటే, ఒక్క వ్యభిచార విషయంలో తప్ప తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నట్టే. విడిచిపెట్టబడిన స్త్రీని పెళ్ళి చేసుకునేవాడు ఆమెతో వ్యభిచారం చేస్తున్నట్టే.
MAT 5:33 “అంతేగాక, ‘మీరు మాట ఇస్తే తప్పకూడదు. చేసిన ప్రమాణాలను ప్రభువును బట్టి నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులతో చెప్పిన మాట మీరు విన్నారు.
MAT 5:34 అయితే నేను మీతో చెప్పేదేంటంటే, అసలు మీరు ఒట్టు పెట్టుకోవద్దు: ఆకాశంతోడని అనవద్దు, ఎందుకంటే ఆకాశం దేవుని సింహాసనం;
MAT 5:35 భూమి తోడని అనవద్దు, ఎందుకంటే భూమి ఆయన పాదపీఠం; యెరూషలేము తోడని అనవద్దు, ఎందుకంటే యెరూషలేము మహారాజు పట్టణం.
MAT 5:36 మీ తలమీద ప్రమాణం చేయవద్దు, ఎందుకంటే మీరు కనీసం ఒక్క వెంట్రుకనైనా తెల్లగా కాని నల్లగా కాని చేయలేరు కదా.
MAT 5:37 మీరు కేవలం ‘అవునంటే అవును కాదంటే కాదు’ అని చెప్పాలి; దీనికి మించి ఏమి చెప్పినా అది దుష్టుని నుండి వచ్చినట్టే.
MAT 5:38 “ ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని చెప్పిన మాట మీరు విన్నారు కదా.
MAT 5:39 అయితే నేను మీతో చెప్పేదేంటంటే, దుష్టుని ఎదిరించకూడదు, ఎవరైనా మిమ్మల్ని కుడిచెంప మీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి.
MAT 5:40 ఎవరైనా మీతో వివాదం పెట్టుకోవాలని మీ అంగీ తీసుకుంటే, వారికి మీ పైవస్త్రాన్ని కూడా ఇవ్వండి.
MAT 5:41 ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని మిమ్మల్ని బలవంతం చేస్తే వారితో మీరు రెండు మైళ్ళు వెళ్లండి.
MAT 5:42 ఎవరైనా మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. మిమ్మల్ని అప్పు అడగాలనుకున్న వారి నుండి మీరు తప్పించుకోవద్దు.
MAT 5:43 “ ‘మీ పొరుగువారిని ప్రేమించాలి, మీ శత్రువును ద్వేషించాలి’ అని చెప్పిన మాటలను మీరు విన్నారు కదా.
MAT 5:44 అయితే నేను మీతో చెప్పేదేంటంటే, మీరు పరలోకంలోని మీ తండ్రికి పిల్లలవాలంటే మీరు మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించాలి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తున్నారు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నారు.
MAT 5:46 ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు ఏం లాభం? పన్ను వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు కదా!
MAT 5:47 ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే ఇతరులకు మీకు తేడా ఏంటి? దేవుని ఎరుగనివారు కూడా అలాగే చేస్తారు కదా!
MAT 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు, మీరు కూడ పరిపూర్ణులై ఉండండి.
MAT 6:1 “మీరు ఇతరులకు కనబడాలని వారి ముందు మీ నీతి క్రియలను చేయకుండ జాగ్రత్తపడండి. ఎందుకంటే మీరు అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి దగ్గర ఫలం పొందరు.
MAT 6:2 “కాబట్టి మీరు ఎవరికైనా దానం చేస్తే ఇతరుల నుండి ఘనత పొందాలని సమాజమందిరాల్లోను వీధుల్లోను ప్రకటించుకునే వేషధారుల్లా బూరలు ఊదించుకోకండి. అలాంటివారు తమ పూర్తి ప్రతిఫలం పొందుకున్నారని మీతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 6:3 అయితే మీరు అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే, మీ కుడి చేయి చేసేది మీ ఎడమ చేతికి తెలియనివ్వకండి.
MAT 6:4 మీరు చేసే సహాయం రహస్యంగా ఉండాలి. ఎందుకంటే రహస్యంగా చేసింది కూడా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.
MAT 6:5 “మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల్లా ఉండకండి. ఎందుకంటే వారు సమాజమందిరాల్లోను వీధుల మూలల్లోను నిలబడి అందరికి కనబడేలా ప్రార్థించడం వారికి ఇష్టం. వారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 6:6 అయితే మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని, కనిపించని మీ తండ్రికి ప్రార్థన చేయండి. మీరు రహస్యంగా చేసేది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.
MAT 6:7 మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ మాటలు మాట్లాడితే తమ ప్రార్థన ఆలకించబడుతుందని భావించే యూదేతరుల్లా అనవసరమైన మాటలు పలుకుతూ ప్రార్థించకండి.
MAT 6:8 మీ తండ్రిని మీరు అడగడానికి ముందే మీకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మీరు వారిలా ఉండకండి.
MAT 6:9 “మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి: “ ‘పరలోకమందున్న మా తండ్రీ, మీ నామం పరిశుద్ధపరచబడును గాక,
MAT 6:10 మీ రాజ్యం వచ్చును గాక; పరలోకంలో జరుగునట్లు భూమి మీద, మీ చిత్తం జరుగును గాక.
MAT 6:11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి.
MAT 6:12 మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణాలను క్షమించండి.
MAT 6:13 మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’
MAT 6:14 మీరు ఇతరుల పాపాలను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు.
MAT 6:15 ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు.
MAT 6:16 “మీరు ఉపవాసం ఉన్నప్పుడు, తాము ఉపవాసం ఉంటున్నామని ఇతరులకు తెలియాలని తమ ముఖాలను నీరసంగా పెట్టుకొనే వేషధారుల్లా నీరసంగా ఉండవద్దు. అలా చేసినవారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 6:17 అయితే మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ తలకు నూనె రాసుకొని ముఖం కడుక్కోండి.
MAT 6:18 అప్పుడు మీరు ఉపవాసం ఉన్నారని కనిపించని మీ తండ్రికి తప్ప ఇతరులకు తెలియదు; రహస్యంగా చేసింది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.
MAT 6:19 “భూమి మీద మీ కోసం ధనం కూడపెట్టుకోకండి. ఇక్కడ చెదలు తుప్పు తినివేస్తాయి, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు.
MAT 6:20 అయితే మీ కోసం పరలోకంలో ధనం కూడపెట్టుకోండి. అక్కడ చెదలు తుప్పు తినివేయవు, దొంగలు కన్నం వేసి దొంగిలించలేరు.
MAT 6:21 ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది.
MAT 6:22 “కన్ను దేహానికి దీపం. మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటే మీ దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది.
MAT 6:23 మీ కళ్లు పాడైతే మీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది. మీలో ఉన్న వెలుగు చీకటైతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో!
MAT 6:24 “ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేదా ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవున్ని ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు.
MAT 6:25 “కాబట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి? అని మీ ప్రాణం గురించి గాని లేదా ఏమి ధరించాలి అని మీ దేహం గురించి గాని చింతించకండి. ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి.
MAT 6:26 గాలిలో ఎగిరే పక్షులను చూడండి; అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. మీరు వాటికన్నా ఇంకా ఎంతో విలువైన వారు కారా?
MAT 6:27 మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా?
MAT 6:28 “మీరు బట్టల గురించి ఎందుకు చింతిస్తున్నారు? పొలంలో పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు బట్టలు నేయవు.
MAT 6:29 అయినా గొప్ప వైభవం కలిగి ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను.
MAT 6:30 అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి రేపు అగ్నిలో పడవేయబడే పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా అలంకరిస్తారు!
MAT 6:31 కాబట్టి ‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏమి ధరించుకోవాలి?’ అంటూ చింతించకండి.
MAT 6:32 దేవుని ఎరుగని ప్రజలు అలాంటి వాటి వెంటపడతారు, కాని అవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు.
MAT 6:33 కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి.
MAT 6:34 రేపటి గురించి చింతించకండి; ఎందుకంటే రేపటి సంగతి గురించి రేపు చింతింస్తుంది; ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.
MAT 7:1 “తీర్పు తీర్చకండి. అప్పుడు మీకు కూడ తీర్పు తీర్చబడదు.
MAT 7:2 మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు తీర్చబడుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకు అదే కొలత కొలవబడుతుంది.
MAT 7:3 “నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు?
MAT 7:4 ఎప్పుడూ నీ కంటిలో దూలాన్ని ఉంచుకుని నీ సహోదరునితో, ‘నీ కంటిలో ఉన్న నలుసును తీయనివ్వు?’ అని నీవెలా అనగలవు?
MAT 7:5 ఓ వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయు, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది.
MAT 7:6 “పవిత్రమైన వాటిని కుక్కలకు పెట్టకండి. మీ ముత్యాలను పందుల ముందు వేయకండి. మీరు అలా చేస్తే ఆ పందులు తమ కాళ్లతో వాటిని త్రొక్కివేసి, మీమీద పడి మిమ్మల్ని ముక్కలుగా చీల్చివేస్తాయి.
MAT 7:7 “అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది.
MAT 7:8 అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి తలుపు తీయబడుతుంది.
MAT 7:9 “మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టె అడిగితే రాయి ఇస్తారా?
MAT 7:10 చేప అడిగితే పాము ఇస్తారా?
MAT 7:11 మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా మంచి బహుమానాలు ఇస్తారో కదా!
MAT 7:12 కాబట్టి ఏ విషయంలోనైనా ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి. ఎందుకంటే ధర్మశాస్త్రం, ప్రవక్తలు చెప్పిన సారాంశం ఇదే.
MAT 7:13 “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి వెళ్లే ద్వారం వెడల్పుగా, దారి విశాలంగా ఉంటుంది. అనేకమంది దానిలోనికి ప్రవేశిస్తారు.
MAT 7:14 జీవానికి వెళ్లడానికి ప్రవేశించే ద్వారం ఇరుకుగా దారి ఇరుకుగా ఉంటుంది. కొంతమందే దాన్ని కనుగొంటారు.
MAT 7:15 “అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెతోలు కప్పుకుని మీ దగ్గరకు వస్తారు; లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.
MAT 7:16 వారి ఫలంతో మీరు వారిని గుర్తించగలరు. ముళ్ళపొదల్లో ద్రాక్షపండ్లను, పల్లేరులాంటి ముళ్ళ మొక్కల్లో అంజూర పండ్లను ప్రజలు కోస్తారా?
MAT 7:17 ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. చెడ్డ చెట్టు చెడ్డపండ్లు కాస్తుంది.
MAT 7:18 మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు.
MAT 7:19 మంచి పండ్లు కాయని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది.
MAT 7:20 అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు.
MAT 7:21 “ ‘ప్రభువా, ప్రభువా’ అని పిలిచే ప్రతి ఒక్కరు పరలోకరాజ్యంలో ప్రవేశించరు. కాని పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు.
MAT 7:22 ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభువా, ప్రభువా, మేము నీ పేరట ప్రవచించలేదా? నీ పేరట దయ్యాలను వెళ్లగొట్టలేదా? నీ పేరట అనేక అద్భుతాలను చేయలేదా?’ అని అంటారు.
MAT 7:23 అప్పుడు నేను వారితో, ‘మీరెవరో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అని చెప్తాను.
MAT 7:24 “కాబట్టి నేను చెప్పిన ఈ మాటలు విని, వాటి ప్రకారం చేసేవారు బండ మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగలవారిని పోలినవారు.
MAT 7:25 వాన కురిసి వరదలు వచ్చి గాలులు వీచి ఆ ఇంటిని తాకినా ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద వేయబడింది.
MAT 7:26 అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న తెలివిలేనివారిని పోలినవారు.
MAT 7:27 వాన కురిసి వరదలు వచ్చి గాలులు వీచి ఆ ఇంటిని తాకాయి. అప్పుడు పెద్ద శబ్దంతో అది కూలిపోయింది.”
MAT 7:28 యేసు ఈ మాటలు చెప్పి ముగించిన తర్వాత ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు.
MAT 7:29 ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల్లా కాక ఒక అధికారం కలవానిగా బోధించారు.
MAT 8:1 యేసు కొండమీద నుండి దిగి వచ్చినప్పుడు గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి.
MAT 8:2 కుష్ఠురోగి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి ఆయనతో, “ప్రభువా, నీకిష్టమైతే, నన్ను బాగు చేయి” అన్నాడు.
MAT 8:3 యేసు చేయి చాపి వాన్ని ముట్టి వానితో, “నాకు ఇష్టమే, నీవు బాగవు” అన్నారు. వెంటనే వాని కుష్ఠురోగం వాన్ని విడిచి వాడు బాగయ్యాడు.
MAT 8:4 అప్పుడు యేసు వానితో, “నీవు ఈ విషయం ఎవరికి చెప్పకు. నీవు వెళ్లి యాజకునికి చూపించుకుని వారికి సాక్ష్యంగా ఉండేలా మోషే నియమించిన కానుకను అర్పించు” అని చెప్పారు.
MAT 8:5 యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి,
MAT 8:6 “ప్రభువా, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో చాలా బాధపడుతున్నాడు” అని చెప్పాడు.
MAT 8:7 అప్పుడు యేసు అతనితో, “నేను వచ్చి అతన్ని బాగుచేయనా?” అని అన్నారు.
MAT 8:8 అందుకు శతాధిపతి, “ప్రభువా, నిన్ను నా ఇంటికి రప్పించుకునేంత యోగ్యత నాకు లేదు. కానీ నీవు ఒక మాట చెప్తే చాలు నా పనివాడు బాగవుతాడు.
MAT 8:9 ఎందుకంటే, నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడినే. నా మాటకు ఉండే అధికారం నాకు తెలుసు. నా అధికారం క్రింద సైనికులున్నారు. నేను ‘వెళ్లండి’ అంటే వెళ్తారు, ‘రండి’ అంటే వస్తారు. నా పనివాన్ని ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు.
MAT 8:10 యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి తన వెంట వస్తున్నవారితో, “ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎవ్వరిలో చూడలేదని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 8:11 అనేకులు తూర్పు పడమర నుండి వచ్చి పరలోకరాజ్యంలో జరిగే విందులో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు తమ తమ స్థానాల్లో కూర్చుంటారు.
MAT 8:12 కానీ రాజ్యసంబంధులు బయట చీకటిలోకి త్రోసివేయబడతారు. అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.”
MAT 8:13 అప్పుడు యేసు శతాధిపతితో, “వెళ్లు. నీవు నమ్మినట్లే నీకు జరుగును గాక” అని చెప్పారు. ఆ క్షణమే అతని పనివాడు బాగయ్యాడు.
MAT 8:14 తర్వాత యేసు పేతురు ఇంటికి వచ్చినప్పుడు జ్వరంతో పడుకుని ఉన్న పేతురు అత్తను చూసి,
MAT 8:15 ఆయన ఆమె చేయిని ముట్టగానే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె లేచి ఆయనకు సేవలు చేయడం మొదలుపెట్టింది.
MAT 8:16 సాయంకాలమైనప్పుడు, దయ్యాలు పట్టిన చాలామందిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. ఆయన ఒక్కమాటతో ఆ దయ్యాలను వెళ్లగొట్టి, రోగులందరిని బాగుచేశారు.
MAT 8:17 యెషయా ప్రవక్త ద్వారా పలికిన: “ఆయన మన బలహీనతలను తన మీద వేసుకుని, మన రోగాలను భరించారు” అనే మాటలు నెరవేరేలా ఇలా జరిగింది.
MAT 8:18 యేసు తన చుట్టూ ఉన్న జనసమూహాన్ని చూసి గలిలయ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించారు.
MAT 8:19 అప్పుడు ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో, “బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్లినా నేను నిన్ను వెంబడిస్తాను” అన్నాడు.
MAT 8:20 అందుకు యేసు, “నక్కలకు గుంటలు, ఆకాశపక్షులకు గూళ్లు ఉన్నాయి గాని మనుష్యకుమారునికి కనీసం తలవాల్చుకోడానికి స్ధలం లేదు” అని అతనికి జవాబిచ్చారు.
MAT 8:21 ఆయన శిష్యులలో ఒకడు, “ప్రభువా, మొదట నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టడానికి నన్ను వెళ్లనివ్వు” అని అన్నాడు.
MAT 8:22 అందుకు యేసు అతనితో, “చనిపోయినవారు తమ చనిపోయినవారిని పాతిపెట్టుకుంటారు; నీవైతే నన్ను వెంబడించు” అన్నారు.
MAT 8:23 ఆ తర్వాత యేసు పడవ ఎక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు.
MAT 8:24 అప్పుడు అకస్మాత్తుగా సముద్రం మీద తీవ్రంగా తుఫాను రేగి సరస్సు మీదికి వచ్చి అలలు ఆ పడవను తాకాయి. అయితే యేసు నిద్రపోతున్నారు.
MAT 8:25 శిష్యులు ఆయన దగ్గరకు వెళ్లి, “ప్రభువా, మేము మునిగిపోతున్నాం మమ్మల్ని కాపాడు” అంటూ ఆయనను లేపారు.
MAT 8:26 అందుకు ఆయన, “అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకంతగా భయపడుతున్నారు?” అని కోప్పడి లేచి గాలులను అలలను గద్దించారు. అప్పుడు అంతా ప్రశాంతంగా మారిపోయింది.
MAT 8:27 వారందరు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటి వాడు! గాలి అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి” అని చెప్పుకున్నారు.
MAT 8:28 ఆయన గలిలయ అవతలి ఒడ్డున ఉన్న గదరేనీ ప్రాంతం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడ్డారు. వారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడంతో ఎవరూ ఆ దారిన వెళ్లలేకపోయారు.
MAT 8:29 అవి ఆయనను చూసిన వెంటనే, “దేవుని కుమారుడా! మాతో నీకేమి? కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని కేకలు వేశాయి.
MAT 8:30 వారికి కొంత దూరంలో ఒక పెద్ద పందుల మంద మేస్తూ ఉంది.
MAT 8:31 ఆ దయ్యాలు యేసును, “నీవు మమ్మల్ని బయటకు వెళ్లగొట్టాలనుకుంటే ఆ పందుల మందలోకి మమ్మల్ని పంపు” అని బ్రతిమాలాయి.
MAT 8:32 ఆయన ఆ దయ్యాలతో, “వెళ్లండి!” అన్నారు. కాబట్టి అవి బయటకు వచ్చి ఆ పందులలోనికి చొరబడగా ఆ పందుల మంద మొత్తం ఎత్తైన ప్రదేశం నుండి వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకుని వెళ్లి ఆ నీటిలో పడి చచ్చాయి.
MAT 8:33 ఆ పందులను కాస్తున్నవారు పట్టణంలోకి పరుగెత్తుకుని వెళ్లి జరిగిందంతా అంటే దయ్యాలు పట్టిన వారికి జరిగిన దానితో సహా అన్ని విషయాలు చెప్పారు.
MAT 8:34 అప్పుడు ఆ పట్టణమంతా యేసును చూడడానికి వెళ్లారు. వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాలారు.
MAT 9:1 యేసు పడవ ఎక్కి సరస్సు దాటి తన సొంత పట్టణం చేరుకున్నారు.
MAT 9:2 కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని చాపమీద ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, అతనితో, “కుమారుడా, ధైర్యం తెచ్చుకో, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు.
MAT 9:3 అప్పుడు కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని చెప్పుకొన్నారు.
MAT 9:4 యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో, “మీ హృదయాల్లో ఈ దురాలోచనలు ఎందుకు రానిస్తున్నారు?
MAT 9:5 వీటిలో ఏది చెప్పడం సులభం: ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడమా లేదా ‘లేచి నడువు’ అని చెప్పడమా?
MAT 9:6 అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు,
MAT 9:7 అతడు లేచి ఇంటికి వెళ్లాడు.
MAT 9:8 జనసమూహం అది చూసి, వారు భయంతో నిండుకొని, మానవునికి ఇలాంటి అధికారాన్ని ఇచ్చిన దేవుని స్తుతించారు.
MAT 9:9 యేసు అక్కడినుండి వెళ్తూ, పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒక వ్యక్తిని చూసి, “నన్ను వెంబడించు” అని అతనితో అన్నారు. మత్తయి లేచి ఆయనను వెంబడించాడు.
MAT 9:10 యేసు మత్తయి ఇంట్లో భోజనం చేస్తుండగా, అనేకమంది పన్ను వసూలు చేసేవారు, పాపులు వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో పాటు కలిసి భోజనం చేశారు.
MAT 9:11 ఇది చూసిన పరిసయ్యులు, “మీ బోధకుడు పన్ను వసూలు చేసేవారితో, పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు?” అని ఆయన శిష్యులను అడిగారు.
MAT 9:12 అది విని యేసు, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు.
MAT 9:13 అందుకే మీరు వెళ్లి, ‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’ అంటే అర్థం ఏంటో తెలుసుకోండి: ఎందుకంటే నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను” అన్నారు.
MAT 9:14 అప్పుడు యోహాను శిష్యులు వచ్చి, “మేము, పరిసయ్యులు తరచుగా ఉపవాసం ఉంటున్నాం, కాని నీ శిష్యులు ఉపవాసం ఉండడం లేదు ఎందుకు?” అని ఆయనను అడిగారు.
MAT 9:15 అందుకు యేసు, “పెండ్లికుమారుడు తమతో ఉన్నప్పుడు అతని అతిథులు ఎందుకు దుఃఖిస్తారు? పెండ్లికుమారుడు వారి దగ్గర నుండి తీసుకొనిపోబడే సమయం వస్తుంది, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు” అని జవాబిచ్చారు.
MAT 9:16 “ఎవ్వరూ పాత బట్టకు క్రొత్త బట్ట అతుకువేసి కుట్టరు, ఎందుకంటే ఆ బట్ట, పాత బట్ట నుండి విడిపోయి చినుగును మరి ఎక్కువ చేస్తుంది.
MAT 9:17 అలాగే ఎవ్వరూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు; అలా చేస్తే క్రొత్త ద్రాక్షరసం వలన ఆ తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోతుంది, తిత్తులు పాడైపోతాయి. కాబట్టి క్రొత్త ద్రాక్షరసాన్ని క్రొత్త తిత్తులలోనే పోయాలి అప్పుడు ఆ రెండు భద్రంగా ఉంటాయి” అని చెప్పారు.
MAT 9:18 ఆయన ఈ సంగతులు వారితో చెప్తున్నప్పుడు, సమాజమందిరపు అధికారి ఒకరు వచ్చి ఆయన ముందు మోకరించి, “నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. కానీ నీవు వచ్చి ఆమె మీద చేయి పెడితే, ఆమె బ్రతుకుతుంది” అన్నాడు.
MAT 9:19 యేసు లేచి అతనితో వెళ్లారు, ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్లారు.
MAT 9:20 అప్పుడే, పన్నెండేళ్ళ నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆయన వెనుక నుండి వచ్చి, ఆయన వస్త్రపు అంచును తాకింది.
MAT 9:21 ఆమె తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నేను పూర్తిగా స్వస్థపడతాను” అనుకుంది.
MAT 9:22 యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, “కుమారీ, ధైర్యం తెచ్చుకో! నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది” అన్నారు. ఆ సమయంలోనే ఆ స్త్రీ స్వస్థత పొందుకుంది.
MAT 9:23 యేసు ఆ సమాజమందిరపు అధికారి ఇంట్లోకి వెళ్లినప్పుడు, అక్కడ పిల్లన గ్రోవులు వాయిస్తూ గోల చేస్తున్న గుంపును చూసి,
MAT 9:24 ఆయన వారితో, “బయటకు వెళ్లండి! అమ్మాయి చనిపోలేదు కానీ నిద్రపోతుంది” అన్నారు. అందుకు వారు ఆయనను చూసి హేళనగా నవ్వారు.
MAT 9:25 ఆ గుంపును బయటకు పంపివేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్లి ఆ అమ్మాయి చేతిని పట్టుకోగానే ఆ అమ్మాయి లేచి నిలబడింది.
MAT 9:26 ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకిపోయింది.
MAT 9:27 అక్కడినుండి యేసు వెళ్తున్నప్పుడు ఇద్దరు గ్రుడ్డివారు, “దావీదు కుమారుడా! మమ్మల్ని కరుణించు” అని కేకలువేస్తూ ఆయనను వెంబడించారు.
MAT 9:28 ఆయన ఇంట్లోకి వెళ్లినప్పుడు, ఆ గ్రుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చారు. యేసు వారితో, “నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా?” అని అన్నారు. వారు, “అవును, ప్రభువా!” అన్నారు.
MAT 9:29 అప్పుడు ఆయన వారి కళ్లను ముట్టి, “మీ విశ్వాసం చొప్పున మీకు జరుగును గాక” అన్నారు.
MAT 9:30 వారికి తిరిగి చూపు వచ్చేసింది. యేసు వారితో, “ఈ సంగతి ఎవ్వరికి తెలియనివ్వకండి” అని తీవ్రంగా హెచ్చరించారు.
MAT 9:31 కానీ వారు బయటకు వెళ్లి, ఆయన గురించి ఆ ప్రాంతం అంతా చాటించారు.
MAT 9:32 వారు బయటకు వెళ్లేటప్పుడు, దయ్యం పట్టి మూగవానిగా ఉన్న ఒకనిని కొందరు ఆయన దగ్గరకు తీసుకువచ్చారు.
MAT 9:33 ఆ దయ్యం వెళ్లగొట్టబడిన తర్వాత ఆ మూగవానిగా ఉండినవాడు మాట్లాడాడు, దానికి జనసమూహం ఆశ్చర్యపడి, “ఇలాంటిది ఇశ్రాయేలు దేశంలో ఎప్పుడు చూడలేదు” అని చెప్పుకొన్నారు.
MAT 9:34 కాని పరిసయ్యులు, “దయ్యాల అధిపతి సహాయంతో ఇతడు దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు.
MAT 9:35 యేసు అన్ని పట్టణాలు, గ్రామాల గుండా వెళ్తూ వారి సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ప్రతి వ్యాధిని, రోగాన్ని బాగుచేస్తూ ఉన్నారు.
MAT 9:36 ఆయన జనసమూహాలను చూసినప్పుడు వారు కాపరి లేని గొర్రెలవలె పీడించబడి నిస్సహాయులుగా ఉన్నారని వారి మీద కనికరపడ్డారు.
MAT 9:37 అప్పుడు ఆయన తన శిష్యులతో, “కోత సమృద్ధిగా ఉంది కాని పనివారు కొద్దిమందే ఉన్నారు.
MAT 9:38 పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు.
MAT 10:1 యేసు పన్నెండుమంది శిష్యులను దగ్గరకు పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి, అన్ని రకాల రోగాలను వ్యాధులను బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చారు.
MAT 10:2 ఆ పన్నెండుమంది అపొస్తలుల పేర్లు: మొదట పేతురు అని పిలువబడే సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను,
MAT 10:3 ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, పన్ను వసూలు చేసే మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, తద్దయి;
MAT 10:4 జెలోతే అని పిలువబడిన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
MAT 10:5 యేసు ఆ పన్నెండు మందికి ఈ సూచనలు ఇచ్చి పంపారు: “యూదేతరుల ప్రాంతాల్లోనికి గాని సమరయ పట్టణాలకు గాని వెళ్లకండి.
MAT 10:6 ఇశ్రాయేలీయులలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకు వెళ్లండి.
MAT 10:7 మీరు వెళ్తూ, ‘పరలోక రాజ్యం సమీపించింది’ అనే సందేశాన్ని ప్రకటించండి.
MAT 10:8 రోగులను స్వస్థపరచండి, చనిపోయినవారిని లేపండి, కుష్ఠురోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెళ్లగొట్టండి. మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి.
MAT 10:9 “మీ నడికట్టులో బంగారం గాని వెండి గాని రాగి గాని పెట్టుకోకండి.
MAT 10:10 ప్రయాణం కోసం సంచి గాని రెండవ చొక్కా గాని చెప్పులు గాని చేతికర్ర గాని తీసుకెళ్లకండి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు.
MAT 10:11 మీరు ఏ పట్టణంలో గాని గ్రామంలో గాని ప్రవేశించినప్పుడు అక్కడ యోగ్యులెవరో అడిగి తెలుసుకొని అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి.
MAT 10:12 ఒక గృహంలో ప్రవేశించినప్పుడు ఆ ఇంటివారికి శుభమని చెప్పండి.
MAT 10:13 ఆ ఇంటికి ఆ యోగ్యత ఉంటే మీ శాంతి ఆ ఇంటి మీద నిలుస్తుంది. ఆ యోగ్యత ఆ ఇంటికి లేకపోతే మీ శాంతి మీకే తిరిగి వస్తుంది.
MAT 10:14 ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీ మాటలు వినకపోతే, ఆ ఇంటిని లేదా ఆ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు మీ పాదాల దుమ్మును దులిపి వెళ్లండి.
MAT 10:15 తీర్పు దినాన ఆ గ్రామానికి పట్టిన గతికంటే సొదొమ, గొమొర్రాల గతి భరించ గలదిగా ఉంటుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 10:16 “చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కాబట్టి మీరు పాముల్లా వివేకంగాను పావురాల్లా కపటం లేనివారిగాను ఉండండి.
MAT 10:17 మనుష్యుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు.
MAT 10:18 అయితే వారికి, అలాగే యూదేతరులకు మీరు సాక్షులుగా ఉండడానికి నన్ను బట్టి మీరు అధికారుల ఎదుటకు రాజుల ఎదుటకు కొనిపోబడతారు.
MAT 10:19 అయితే వారు మిమ్మల్ని బంధించినప్పుడు, మీరు ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో అని చింతించకండి. మీరు ఏమి చెప్పాలనేది ఆ సమయంలోనే మీకు ఇవ్వబడుతుంది;
MAT 10:20 ఎందుకంటే, ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు; మీ తండ్రి ఆత్మయే మీ ద్వారా మాట్లాడతారు.
MAT 10:21 “సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు; పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు.
MAT 10:22 నన్ను బట్టి మీరు వారందరిచేత ద్వేషించబడతారు, అయితే అంతం వరకు స్థిరంగా నిలిచి ఉండేవారే రక్షించబడతారు.
MAT 10:23 మిమ్మల్ని ఒక గ్రామంలో హింసిస్తే మరో గ్రామానికి పారిపోండి. మనుష్యకుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు గ్రామాలన్నింటికి వెళ్లడం పూర్తి చేయలేరు” అని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 10:24 ఒక శిష్యుడు బోధకుని కంటే లేదా సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు.
MAT 10:25 శిష్యుడు తన బోధకునిలా, సేవకుడు తన యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు అని పిలిస్తే అతని ఇంటివారిని ఇంకా ఎలా పిలుస్తారో గదా!
MAT 10:26 “కాబట్టి వారికి భయపడకండి, ఎందుకంటే దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు.
MAT 10:27 నేను మీతో చీకట్లో చెప్పేదానిని మీరు పగటి వెలుగులో చెప్పండి; మీ చెవిలో చెప్పబడినదానిని పైకప్పుల నుండి ప్రకటించండి.
MAT 10:28 శరీరాన్ని చంపి ఆత్మను చంపలేనివారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి.
MAT 10:29 రెండు పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడడం లేదా! అయినా వాటిలో ఒకటి కూడా మీ పరమతండ్రి అనుమతి లేకుండా నేల కూలదు.
MAT 10:30 అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి.
MAT 10:31 కాబట్టి భయపడకండి; మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు.
MAT 10:32 “ఎవరు ఇతరుల ముందు బహిరంగంగా నన్ను ఒప్పుకుంటారో, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటాను.
MAT 10:33 ఎవరు ఇతరుల ముందు నన్ను నిరాకరిస్తారో, పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేను వారిని నిరాకరిస్తాను.
MAT 10:34 “భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని అనుకోకండి. నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చానే గాని సమాధానం తేవడానికి కాదు.
MAT 10:35 ఎలాగంటే, “ ‘తన తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు తన తల్లికి వ్యతిరేకంగా కుమార్తె, తన అత్తకు వ్యతిరేకంగా కోడలు తిరగబడతారు.
MAT 10:36 ఒక మనుష్యుని శత్రువులు తన సొంత ఇంటివారే.’
MAT 10:37 “తన తండ్రిని గాని తల్లిని గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తన కుమారుని గాని కుమార్తెను గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు.
MAT 10:38 తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు యోగ్యులు కారు.
MAT 10:39 తన ప్రాణాన్ని దక్కించుకొనే వారు దానిని పోగొట్టుకుంటారు. నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని దక్కించుకుంటారు.
MAT 10:40 “మిమ్మల్ని చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు. నన్ను చేర్చుకొనేవారు నన్ను పంపినవానిని చేర్చుకొంటారు.
MAT 10:41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనేవారు ప్రవక్త ఫలం పొందుతారు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనేవారు నీతిమంతుని ఫలం పొందుతారు.
MAT 10:42 నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకరికి ఒక గిన్నెడు చల్లని నీళ్లను ఇస్తే వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.”
MAT 11:1 యేసు తన పన్నెండుమంది శిష్యులకు ఆదేశాలు ఇవ్వడం ముగించిన తర్వాత, ఆయన అక్కడినుండి గలిలయలోని పట్టణాల్లో ఉపదేశించడానికి, సువార్తను ప్రకటించడానికి వెళ్లారు.
MAT 11:2 క్రీస్తు చేస్తున్న క్రియలను గురించి చెరసాలలో ఉన్న యోహాను విని, ఆయన దగ్గరకు తన శిష్యులను పంపించి,
MAT 11:3 “రావలసిన వాడవు నీవేనా, లేదా మేము వేరొకరి కోసం ఎదురుచూడాలా?” అని ఆయనను అడగమన్నాడు.
MAT 11:4 యేసు వారికి ఇలా జవాబిచ్చారు, “మీరు వెళ్లి చూసినవాటిని, విన్నవాటిని యోహానుకు చెప్పండి.
MAT 11:5 గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయినవారు తిరిగి బ్రతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటించబడుతుంది.
MAT 11:6 నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు.”
MAT 11:7 యోహాను శిష్యులు వెళ్లిపోతుండగా, యేసు జనంతో యోహాను గురించి మాట్లాడటం ప్రారంభించాడు, “ఏమి చూడడానికి మీరు అరణ్యంలోనికి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా?
MAT 11:8 అది కాకపోతే, మరి ఏమి చూడడానికి వెళ్లారు? విలువైన వస్త్రాలను ధరించిన ఒక వ్యక్తినా? కాదు, విలువైన వస్త్రాలను ధరించిన వ్యక్తులు రాజభవనాల్లో ఉంటారు.
MAT 11:9 మరి ఏమి చూడడానికి మీరు వెళ్లారు? ఒక ప్రవక్తనా? అవును, ప్రవక్తకంటే కూడా గొప్పవాడు అని మీతో చెప్తున్నాను.
MAT 11:10 అతని గురించి ఇలా వ్రాయబడింది: “ ‘ఇదిగో, నీకు ముందుగా దూతను పంపుతాను, అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.’
MAT 11:11 స్త్రీలకు పుట్టిన వారిలో బాప్తిస్మమిచ్చే యోహాను కంటే గొప్పవానిగా ఎదిగినవారు ఒక్కరు లేరు; అయినప్పటికీ, పరలోకరాజ్యంలో అందరికంటే అల్పమైనవాడు అతనికంటే గొప్పవాడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 11:12 బాప్తిస్మమిచ్చే యోహాను రోజులనుండి ఇప్పటివరకు పరలోక రాజ్యం హింసకు గురవుతూనే ఉంది, హింసించేవారు దానిపై దాడులు చేస్తూనే ఉన్నారు.
MAT 11:13 యోహాను వచ్చేవరకు ధర్మశాస్త్రం, అలాగే ప్రవక్తలందరు ప్రవచించారు.
MAT 11:14 మీరు అంగీకరించడానికి ఇష్టపడితే, ఇతడే ఆ రావలసిన ఏలీయా.
MAT 11:15 వినడానికి చెవులుగలవారు విందురు గాక.
MAT 11:16 “ఈ తరం వారిని నేను దేనితో పోల్చాలి? వారు సంత వీధుల్లో కూర్చుని ఇతరులను పిలుస్తూ అని చెప్పుకునే చిన్న పిల్లల్లా ఉంటారు:
MAT 11:17 “ ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి వాయించాం, మీరు నాట్యం చేయలేదు; మేము విషాద గీతం పాడాం, మీరు దుఃఖపడలేదు’
MAT 11:18 యోహాను తినలేదు త్రాగలేదు అయినా వారు, ‘వీడు దయ్యం పట్టినవాడు’ అంటున్నారు.
MAT 11:19 మనుష్యకుమారుడు తింటున్నారు త్రాగుతున్నారు కాబట్టి వారు, ‘ఇదిగో, తిండిబోతు, త్రాగుబోతు, పన్ను వసూలు చేసేవారికి, పాపులకు స్నేహితుడు’ అంటున్నారు. కాని జ్ఞానం సరియైనదని దాని పనులను బట్టే నిరూపించబడుతుంది.”
MAT 11:20 యేసు ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలను చేశాడో ఆ పట్టణాలు పశ్చాత్తాపపడలేదని వాటిని నిందించడం మొదలుపెట్టారు.
MAT 11:21 “కొరజీనూ నీకు శ్రమ! బేత్సయిదా నీకు శ్రమ! ఎందుకంటే మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో జరిగి ఉంటే, ఆ ప్రజలు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని పశ్చాత్తాపపడి ఉండేవారు.
MAT 11:22 అయితే తీర్పు దినాన మీ మీదికి వచ్చే గతికంటే తూరు సీదోను పట్టణాల గతి భరించ గలదిగా ఉంటుంది.
MAT 11:23 ఓ కపెర్నహూమా, నీవు ఆకాశానికి ఎత్తబడతావా? లేదు, నీవు పాతాళంలోనికి దిగిపోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో జరిగి ఉంటే అది ఈనాటి వరకు నిలిచి ఉండేది.
MAT 11:24 అయితే తీర్పు దినాన మీ మీదికి వచ్చే గతికంటే సొదొమ దేశపు గతి భరించ గలదిగా ఉంటుందని నేను మీతో చెప్తున్నాను.”
MAT 11:25 ఆ సమయంలో యేసు ఇలా అన్నారు, “తండ్రీ, భూమి ఆకాశాలకు ప్రభువా, నీవు ఈ సంగతులను జ్ఞానులకు, తెలివైనవారికి మరుగుచేసి, చిన్న పిల్లలకు బయలుపరిచావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను.
MAT 11:26 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకు సంతోషము.
MAT 11:27 “నా తండ్రి నాకు సమస్తం అప్పగించారు. కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు; అలాగే తండ్రి ఎవరో కుమారునికి, కుమారుడు ఎవరికి తెలియచేయాలని అనుకున్నారో వారికి తప్ప మరి ఎవరికి తెలియదు.
MAT 11:28 “భారం మోస్తూ అలసిపోయిన వారలారా! మీరందరు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను.
MAT 11:29 నేను సౌమ్యుడను, వినయ హృదయం గలవాడను కాబట్టి నా కాడి మీమీద ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది.
MAT 11:30 ఎందుకంటే, నా కాడి సుళువుగా మోయదగినది, నేను ఇచ్చే నా భారం తేలికైనది.”
MAT 12:1 ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులకు ఆకలివేసి కొన్ని కంకులు తెంపుకొని తినడం మొదలుపెట్టారు.
MAT 12:2 అది చూసిన పరిసయ్యులు, “చూడు, నీ శిష్యులు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు” అని ఆయనతో అన్నారు.
MAT 12:3 అందుకు ఆయన వారితో, “దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా?
MAT 12:4 అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకుని తాను తనతో ఉన్నవారు తిన్నారు కదా!
MAT 12:5 యాజకులు సబ్బాతు దినాన దేవాలయం విధులను నిర్వహించడం కూడా సబ్బాతు దినాన్ని అపవిత్ర పరచినట్లే అయినాసరే వారు నిర్దోషులని ధర్మశాస్త్రంలో చదవలేదా?
MAT 12:6 దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో నేను చెప్తున్నాను.
MAT 12:7 ‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’ అనే మాటల అర్థం ఒకవేళ మీకు తెలిసి ఉంటే, మీరు నిర్దోషులకు తీర్పు తీర్చేవారు కారు.
MAT 12:8 ఎందుకంటే మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి ప్రభువు” అని చెప్పారు.
MAT 12:9 ఆయన అక్కడినుండి వెళ్తూ, వారి సమాజమందిరంలో వెళ్లారు.
MAT 12:10 అక్కడ చేతికి పక్షవాతం కలవాడు ఒకడున్నాడు. యేసు మీద నేరం మోపడానికి కారణం వెదుకుతున్న కొందరు, “సబ్బాతు దినాన బాగుచేయడం ధర్మశాస్త్రానుసారమా?” అని అడిగారు.
MAT 12:11 అందుకు యేసు వారితో, “మీలో ఎవనికైనా ఒక గొర్రె ఉండి అది సబ్బాతు దినాన గుంటలో పడితే దానిని పట్టుకుని బయటకు తీయకుండా ఉంటారా?
MAT 12:12 గొర్రె కంటే మనిషి విలువ ఎంతో ఎక్కువ కదా! కాబట్టి సబ్బాతు దినాన మంచి చేయడం ధర్మశాస్త్ర ప్రకారం న్యాయమే” అన్నారు.
MAT 12:13 ఆయన ఆ వ్యక్తితో, “నీ చేయి చాపు” అన్నారు. వాడు దాన్ని చాపగానే అది రెండవ చేయిలా పూర్తిగా బాగయింది.
MAT 12:14 కానీ పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును ఎలా చంపుదామా అని ఆయన మీద పన్నాగం పన్నారు.
MAT 12:15 యేసు ఆ సంగతిని తెలుసుకొని అక్కడినుండి వెళ్లిపోయారు. చాలా గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. ఆయన రోగులందరిని బాగుచేశారు.
MAT 12:16 ఆయన తన గురించి ఇతరులకు చెప్పవద్దని వారిని హెచ్చరించారు.
MAT 12:17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా అది అలా జరిగింది. అదేమిటంటే:
MAT 12:18 “ఇదిగో, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నేను ప్రేమించేవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.
MAT 12:19 ఆయన జగడమాడడు, అరవడు కేకలు వేయడు; వీధుల్లో ఆయన స్వరం ఎవరికీ వినిపించదు.
MAT 12:20 న్యాయాన్ని వ్యాపింపచేసే వరకు ఆయన నలిగిన రెల్లును విరువడు, మంటలేకుండా కాలి పొగవస్తున్న వత్తిని ఆర్పడు.
MAT 12:21 దేశాలు ఈయన నామంలో నిరీక్షణ కలిగి ఉంటాయి.”
MAT 12:22 అప్పుడు దయ్యం పట్టిన గ్రుడ్డి మూగవానిగా ఉండిన ఒకనిని కొందరు యేసు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు, వాడు చూడగలుగునట్లు మాట్లాడగలుగునట్లు యేసు వానిని బాగుచేశారు.
MAT 12:23 కాబట్టి ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఈయనే దావీదు కుమారుడా?” అని చెప్పుకొన్నారు.
MAT 12:24 కాని పరిసయ్యులు ఆ మాటలు విన్నప్పుడు, వారు, “ఇతడు బయెల్జెబూలు అనే దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు.
MAT 12:25 యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఈ విధంగా అన్నారు, “ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నాశనం అవుతుంది. అలాగే ఏ పట్టణమైనా లేదా కుటుంబమైన తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నిలబడదు.
MAT 12:26 ఒకవేళ సాతాను సాతానును వెళ్లగొడితే వాడు తనను తాను వ్యతిరేకించుకొని చీలిపోతాడు. అలాంటప్పుడు వాని రాజ్యం ఎలా నిలుస్తుంది?
MAT 12:27 ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ ప్రజలు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు వారే మీకు తీర్పుతీర్చుతారు.
MAT 12:28 కానీ ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్లగొడుతున్నట్లయితే, అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని అర్థము.
MAT 12:29 “ఎవడైనా బలవంతుడైనవాని ఇంట్లోకి వెళ్లి మొదట ఆ బలవంతుని బంధించకుండా అతని ఆస్తిని దోచుకోగలడా? అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు.
MAT 12:30 “నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు.
MAT 12:31 అందుకే ప్రతి పాపానికి, దూషణకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే మాటకు క్షమాపణ లేదని నేను మీతో చెప్తున్నాను.
MAT 12:32 మనుష్యకుమారునికి విరోధంగా మాట్లాడే వారికైనా క్షమాపణ ఉంది కానీ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కానీ ఉండదు.
MAT 12:33 “చెట్టు మంచిదైతే దాని ఫలం మంచిదవుతుంది, చెట్టు చెడ్డదైతే దాని ఫలం చెడ్డదవుతుంది, ఎందుకంటే చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది.
MAT 12:34 సర్పసంతానమా! మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలను ఎలా పలకగలరు? హృదయం దేనితో నిండి ఉందో దానినే నోరు మాట్లాడుతుంది.
MAT 12:35 మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు.
MAT 12:36 కాని నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి తాను అజాగ్రత్తతో పలికిన ప్రతి మాట కోసం తీర్పు రోజున లెక్క అప్పగించాల్సిందే.
MAT 12:37 ఎందుకంటే నీ మాటలను బట్టే నీవు నిర్దోషిగా, నీ మాటలను బట్టే నీవు శిక్షకు పాత్రునిగా తీర్పును పొందుకొంటావు.”
MAT 12:38 అప్పుడు, కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు దగ్గరకు వచ్చి, “ఉపదేశకుడా, నీ నుండి ఒక సూచన చూడాలని ఉంది” అన్నారు.
MAT 12:39 అందుకు యేసు వారితో, “దుష్టులు, వ్యభిచారులైన ఈ తరం వారు సూచనను అడుగుతున్నారు! కానీ యోనా ప్రవక్త సూచన తప్ప మరి ఏ సూచన ఈ తరం వారికి ఇవ్వబడదు.
MAT 12:40 ఎలాగైతే యోనా మూడు పగళ్ళు మూడు రాత్రులు ఆ పెద్ద చేప కడుపులో ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు కూడా మూడు రాత్రులు పగళ్ళు భూగర్భంలో ఉంటాడు.
MAT 12:41 నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు.”
MAT 12:42 దక్షిణదేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంచుల నుండి వచ్చింది, అయితే సొలొమోను కన్నా గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి తీర్పు దినాన ఆమె ఈ తరం వారితో పాటు లేచి వారిని ఖండిస్తుంది.
MAT 12:43 “అపవిత్రాత్మ ఒక వ్యక్తి నుండి బయటకు రాగానే, విశ్రాంతి కోసం అది నీరు లేని స్థలాలను వెదకుతూ వెళ్తుంది కాని అలాంటి స్థలం దొరకదు.
MAT 12:44 అప్పుడది, ‘నేను వదిలిన ఇంటికే తిరిగి వెళ్తాను’ అని అనుకుంటుంది. అది తిరిగి వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరు లేకపోవడం, పైగా శుభ్రంగా ఊడ్చి, చక్కగా అమర్చి ఉండడం చూస్తుంది.
MAT 12:45 అప్పుడు అది వెళ్లి దానికంటే మరి చెడ్డవైన ఏడు ఇతర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చి అక్కడే నివసిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి మొదటి స్థితి కంటే చివరి స్ధితి దారుణంగా ఉంటుంది. ఈ దుష్టతరం కూడా అలాగే ఉంటుంది” అని చెప్పారు.
MAT 12:46 యేసు ఆ జనసమూహాలతో ఇంకా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన తల్లి తమ్ముళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు.
MAT 12:47 అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడాలని బయట వేచి ఉన్నారు” అని చెప్పాడు.
MAT 12:48 అందుకు యేసు అతనికి, “నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు?” అని చెప్పి
MAT 12:49 తన శిష్యులను చూపిస్తూ, “వీరే నా తల్లి, నా సహోదరులు.
MAT 12:50 ఎందుకంటే నా పరలోకపు తండ్రి ఇష్టాన్ని చేసేవారే నా సహోదరుడు, సహోదరి తల్లి” అని జవాబిచ్చారు.
MAT 13:1 అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్లి సముద్రం ఒడ్డున కూర్చున్నారు.
MAT 13:2 గొప్ప జనసమూహాలు తన చుట్టూ గుమిగూడుతున్నారని యేసు ఒక పడవను ఎక్కి కూర్చున్నారు, ప్రజలంతా ఒడ్డున నిలబడి ఉన్నారు.
MAT 13:3 అప్పుడు ఆయన ఉపమానాలతో వారికి చాలా సంగతులను ఈ విధంగా చెప్పారు: “ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు.
MAT 13:4 విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి.
MAT 13:5 మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి. మట్టి లోతు లేకపోయినా అవి త్వరగానే మొలకెత్తాయి.
MAT 13:6 కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి వాటికి వేరు లేదా అవి ఎండిపోయాయి.
MAT 13:7 మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి.
MAT 13:8 మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి, అక్కడ అవి విత్తబడినవాటి కన్న వందరెట్లు, అరవైరెట్లు, ముప్పైరెట్లు అధికంగా పంటనిచ్చాయి.
MAT 13:9 వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు.
MAT 13:10 ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “నీవు ప్రజలతో ఉపమానరీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అని అడిగారు.
MAT 13:11 అందుకు యేసు వారితో, “ఎందుకంటే పరలోక రాజ్యం గురించిన రహస్యాలకు సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది గాని వారికి ఇవ్వబడలేదు.
MAT 13:12 కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, అతడు సమృద్ధిగా కలిగి ఉంటాడు. లేనివాని నుండి, వానికి కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది.
MAT 13:13 దీనిని బట్టి నేను వారితో ఉపమానరీతిలోనే చెప్పాను: “వారు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు, ఎప్పుడూ వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు.
MAT 13:14 యెషయా పలికిన ప్రవచనం వారి విషయంలో ఇలా నెరవేరింది: “ ‘మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు. మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు.
MAT 13:15 ఎందుకంటే ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి; వారు చెవులతో వినరు, వారు కళ్లు మూసుకున్నారు. లేకపోతే వారు తమ కళ్లతో చూసి, చెవులతో విని, తమ హృదయాలతో గ్రహించి, నా తట్టు తిరిగి ఉండేవారు అప్పుడు నేను వారిని స్వస్థపరచియుండేవాన్ని.’
MAT 13:16 అయితే మీ కళ్లు చూస్తున్నాయి అలాగే మీ చెవులు వింటున్నాయి కాబట్టి అవి ధన్యమైనవి.
MAT 13:17 అనేకమంది ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూస్తున్నవాటిని చూడాలనుకున్నారు కాని వారు చూడలేదు, మీరు వినేవాటిని వినాలని అనుకున్నారు కాని వినలేదు అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 13:18 “విత్తనాలు చల్లినవాని ఉపమాన భావం వినండి:
MAT 13:19 పరలోక రాజ్యాన్ని గురించి వాక్యాన్ని విని దానిని గ్రహించలేకపోతే, దుర్మార్గుడు వచ్చి వారి హృదయాల్లో విత్తబడిన దానిని ఎత్తుకుపోతాడు. వారు దారి ప్రక్కన పడిన విత్తనాలు.
MAT 13:20 రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరించేవారు.
MAT 13:21 అయితే వారిలో వేరు లేకపోవడంతో కొంతకాలమే నిలబడతారు. వారికి వాక్యాన్ని బట్టి కష్టాలు హింసలు ఎదురైనప్పుడు వారు త్వరగా పడిపోతారు.
MAT 13:22 ముళ్ళపొదల్లో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని వింటారు కాని జీవితాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ధనవ్యామోహం ఆ వాక్యాన్ని అణచివేసి ఫలించకుండా చేస్తాయి.
MAT 13:23 అయితే మంచి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని గ్రహించినవారు, వారిలో కొందరు వందరెట్లు, కొందరు అరవైరెట్లు, మరికొందరు ముప్పైరెట్లు ఫలిస్తారు” అని చెప్పారు.
MAT 13:24 “ఆయన వారికి మరొక ఉపమానం చెప్పారు, పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలను విత్తిన రైతును పోలి ఉంది.
MAT 13:25 కాని అందరు నిద్రపోతున్నప్పుడు, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లాడు.
MAT 13:26 గోధుమ విత్తనం పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి.
MAT 13:27 “ఆ పొలంలో పని చేసే దాసులు వచ్చి యజమానిని, ‘అయ్యా, నీ పొలంలో మంచి విత్తనాలను చల్లావు కదా! ఈ కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?’ అని అడిగారు.
MAT 13:28 “ఆయన వారితో, ‘ఇది శత్రువు చేసిన పని’ అన్నాడు. “అందుకు ఆ దాసులు, ‘అయితే మమ్మల్ని వెళ్లి ఆ కలుపు మొక్కలను పీకెయ్యమంటారా?’ అని అడిగారు.
MAT 13:29 “అందుకతడు ‘వద్దు, ఎందుకంటే కలుపు మొక్కలను పీకివేసేటప్పుడు వాటితో గోధుమ మొక్కలను కూడా పీకేస్తారేమో.
MAT 13:30 కోతకాలం వరకు రెండింటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలం వచ్చినప్పుడు ముందుగా కలుపు మొక్కలను పోగు చేసి వాటిని కాల్చివేయడానికి కట్టలుగా కట్టి ఆ తర్వాత గోధుమలను నా ధాన్యపు కొట్టులోనికి చేర్చండి అని కోత కోసే వారితో చెప్తాను అన్నాడు.’ ”
MAT 13:31 ఆయన వారికి మరో ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం, ఒకడు తన పొలంలో నాటిన ఆవగింజ లాంటిది.
MAT 13:32 అది విత్తనాలన్నింటిలో చిన్నదైనప్పటికి అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటి కంటే పెద్దగా పెరిగి, పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకునే ఒక చెట్టుగా ఎదుగుతుంది.”
MAT 13:33 యేసు వారికి మరో ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం ఒక స్త్రీ ఇరవై ఏడు కిలోల పిండిని కలిపి ఆ పిండంతా పొంగడానికి దానిలో కలిపిన కొంచెం పులిసిన పిండి లాంటిది.”
MAT 13:34 యేసు ఈ సంగతులను ఉపమానాలుగా జనసమూహానికి చెప్పారు. ఆయన ఉపమానం లేకుండా వారికేమి చెప్పలేదు.
MAT 13:35 ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరాయి: “నేను ఉపమానాలతో నా నోరు తెరుస్తాను. సృష్టికి పునాది వేయబడక ముందే రహస్యంగా ఉంచిన విషయాలు నేను మాట్లాడతాను.”
MAT 13:36 అప్పుడు యేసు జనసమూహాన్ని పంపివేసి ఇంట్లోకి వెళ్లారు. యేసు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “పొలం లోని కలుపు మొక్కల ఉపమానాన్ని మాకు వివరించండి” అని అడిగారు.
MAT 13:37 అందుకు యేసు వారితో, “మంచి విత్తనాలను చల్లేది మనుష్యకుమారుడు.
MAT 13:38 పొలం అనేది ఈ లోకము. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించినవారు. కలుపు మొక్కలు దుష్టునికి సంబంధించినవారు.
MAT 13:39 ఆ కలుపులను విత్తిన శత్రువు అపవాది. కోతకాలం ఈ యుగసమాప్తి సమయం ఆ కోత కోసేవారు దేవదూతలు.
MAT 13:40 “కలుపు మొక్కలను పెరికి, పోగు చేసి అగ్నిలో కాల్చినట్టే ఈ యుగసమాప్తిలో జరుగుతుంది.
MAT 13:41 మనుష్యకుమారుడు తన దేవదూతలను పంపుతాడు, వారు ఆయన రాజ్యంలో పాపానికి కారణమైన ప్రతిదీ దుష్ట కార్యాలను చేసే వారినందరిని బయటకు తొలగిస్తారు.
MAT 13:42 వారు వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.
MAT 13:43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు.
MAT 13:44 పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనం వంటిది. ఒకడు దానిని కనుగొనగానే దానిని మరల దాచిపెట్టి, సంతోషంతో వెళ్లి తనకు ఉన్నదంతా అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు.
MAT 13:45 ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కోసం వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది.
MAT 13:46 వానికి చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే అతడు వెళ్లి తన దగ్గర ఉన్నదంతా అమ్మివేసి ఆ ముత్యాన్ని కొంటాడు.
MAT 13:47 ఇంకా, పరలోక రాజ్యం సముద్రంలోకి వల విసిరి అన్ని రకాల చేపలు పట్టే ఆ వలను పోలి ఉంది.
MAT 13:48 ఆ వల నిండిన తర్వాత జాలరులు దానిని ఒడ్డుకు లాగి వాటిలోని మంచి చేపలను బుట్టల్లో వేసుకుని పనికిమాలిన వాటిని అవతల పారవేస్తారు.
MAT 13:49 ఈ యుగ సమాప్తంలో అలాగే ఉంటుంది. దేవదూతలు వచ్చి, నీతిమంతుల మధ్య నుండి చెడ్డవారిని వేరు చేస్తారు.
MAT 13:50 ఆ తర్వాత వారిని అగ్నిగుండంలో పారవేస్తారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.
MAT 13:51 యేసు వారిని, “మీరు వీటన్నిటిని గ్రహిస్తున్నారా?” అని అడిగినప్పుడు. వారు, “అవును, ప్రభువా” అన్నారు.
MAT 13:52 యేసు వారితో, “పరలోక రాజ్యాన్ని గురించి ఉపదేశం పొంది దానిని పాటించే ప్రతి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, తన ధననిధి నుండి పాత వాటిని క్రొత్త వాటిని బయటకు తెచ్చే ఒక ఇంటి యజమాని వంటివాడు” అని చెప్పారు.
MAT 13:53 యేసు ఈ ఉపమానాలను చెప్పడం ముగించిన తర్వాత అక్కడినుండి వెళ్లి,
MAT 13:54 తన స్వగ్రామానికి చేరి, సమాజమందిరంలోని వారికి బోధించడం మొదలుపెట్టారు. వారు చాలా ఆశ్చర్యపడి, “ఈ అద్భుతాలు చేసే సామర్థ్యం, ఈ జ్ఞానం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది?
MAT 13:55 ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా ఇతని సహోదరులు కారా?
MAT 13:56 ఇతని సహోదరీలు అందరు మనతో లేరా? ఇతనికి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి?” అని చెప్పుకొని అభ్యంతరపడ్డారు.
MAT 13:57 అయితే యేసు వారితో, “ప్రవక్త తన స్వగ్రామంలో, సొంత ఇంట్లో తప్ప అంతటా గౌరవం పొందుతాడు” అని అన్నారు.
MAT 13:58 వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎక్కువ అద్భుతాలు అక్కడ చేయలేదు.
MAT 14:1 ఆ సమయంలో చతుర్థాధిపతియైన హేరోదు యేసును గురించి విని,
MAT 14:2 తన సేవకులతో, “ఇతడు బాప్తిస్మమిచ్చే యోహాను; చనిపోయి మళ్ళీ బ్రతికాడు. అందుకే ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని అన్నాడు.
MAT 14:3 హేరోదు రాజు తన సొంత సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియ కోసం యోహానును బంధించి చెరసాలలో వేయించాడు.
MAT 14:4 ఎందుకంటే అంతకుముందు యోహాను హేరోదుతో: “నీవు ఆమెను ఉంచుకోవడం న్యాయం కాదు” అని చెప్పాడు.
MAT 14:5 కాబట్టి హేరోదు యోహానును చంపాలని చూశాడు కాని, ప్రజలు అతన్ని ప్రవక్తగా భావిస్తున్నారని ప్రజలకు భయపడి చంపలేకపోయాడు.
MAT 14:6 అయితే హేరోదు పుట్టిన రోజున, హేరోదియ కుమార్తె అతిథుల మధ్య నాట్యంచేసి హేరోదును సంతోషపరిచింది.
MAT 14:7 కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తాను అని అతడు ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు.
MAT 14:8 ఆమె తన తల్లి ప్రేరేపణతో, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది.
MAT 14:9 రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులను బట్టి తాను చేసిన ప్రమాణం కోసం ఆమె కోరినట్లు చేయమని ఆదేశించాడు.
MAT 14:10 అలా తన రక్షకభటులను పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు.
MAT 14:11 వారు బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చినప్పుడు ఆమె తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చింది.
MAT 14:12 యోహాను శిష్యులు వచ్చి అతని శవాన్ని తీసుకెళ్లి సమాధి చేసి, యేసు దగ్గరకు వచ్చి ఈ సంగతిని తెలియజేశారు.
MAT 14:13 యేసు జరిగిన సంగతిని విని పడవ ఎక్కి, అక్కడినుండి ఏకాంత స్థలానికి వెళ్లారు. ఆ సంగతి విని పట్టణాల నుండి కాలినడకన జనసమూహాలు ఆయనను వెంబడించారు.
MAT 14:14 యేసు పడవ దిగి గొప్ప జనసమూహం రావడం చూసి వారి మీద కనికరపడి వారిలో రోగాలతో ఉన్నవారిని స్వస్థపరిచారు.
MAT 14:15 సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా ఆలస్యం కూడా అవుతుంది. కాబట్టి జనసమూహాలను పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు” అన్నారు.
MAT 14:16 యేసు వారితో, “వారు ఎక్కడికి వెళ్లే అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అని అన్నారు.
MAT 14:17 వారు యేసుతో, “ఇక్కడ మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు తప్ప ఇంకేమి లేవు” అని జవాబిచ్చారు.
MAT 14:18 ఆయన, “వాటిని నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పారు.
MAT 14:19 వారిని పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని చెప్పి ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టెలను విరిచి తన శిష్యులకు ఇచ్చారు, శిష్యులు వాటిని ప్రజలకు పంచిపెట్టారు.
MAT 14:20 వారందరు తృప్తిగా తిన్నారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.
MAT 14:21 తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.
MAT 14:22 వెంటనే యేసు జనసమూహాన్ని పంపివేస్తూ శిష్యులు తనకంటే ముందుగా అవతలి తీరానికి వెళ్లేలా వారిని పడవ ఎక్కించారు.
MAT 14:23 ఆయన వారిని పంపివేసిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు. ఆ రాత్రి సమయంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు.
MAT 14:24 అప్పటికే ఆ పడవ ఒడ్డుకు దూరంగా ఉంది, ఎదురుగాలి వీస్తూ అలలు వచ్చి ఆ పడవను కొడుతున్నాయి.
MAT 14:25 రాత్రి నాల్గవ జామున యేసు సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరకు వెళ్లారు.
MAT 14:26 ఆయన నీళ్ల మీద నడవటం చూసిన శిష్యులు భయపడి, “భూతం” అని చెప్పుకుంటూ భయంతో కేకలు వేశారు.
MAT 14:27 వెంటనే యేసు వారిని చూసి, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి” అని తన శిష్యులతో చెప్పారు.
MAT 14:28 పేతురు అది చూసి, “ప్రభువా, నీవే అయితే నేను నీళ్ల మీద నడిచి నీ దగ్గరకు రావడానికి నన్ను పిలువు” అని ఆయనతో అన్నాడు.
MAT 14:29 అందుకు యేసు, “రా!” అన్నారు. పేతురు పడవ దిగి నీళ్ల మీద యేసువైపు నడిచాడు.
MAT 14:30 కాని అతడు గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించి, “ప్రభువా, నన్ను కాపాడు!” అని కేకలు వేశాడు.
MAT 14:31 వెంటనే యేసు తన చేయి చాపి పేతురును పట్టుకుని, “అల్ప విశ్వాసీ, నీవెందుకు అనుమానించావు?” అన్నారు.
MAT 14:32 వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణగిపోయింది.
MAT 14:33 అప్పుడు పడవలో ఉన్నవారు వచ్చి, “నీవు నిజంగా దేవుని కుమారుడవు” అని చెప్పి ఆయనను ఆరాధించారు.
MAT 14:34 వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు అనే ప్రాంతంలో దిగారు.
MAT 14:35 అక్కడి ప్రజలందరు యేసును గుర్తుపట్టి, చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతమంతా సమాచారం పంపించారు, కాబట్టి ప్రజలు రోగులను ఆయన దగ్గరకు తీసుకువచ్చారు.
MAT 14:36 నీ వస్త్రపు అంచునైనా వారిని ముట్టనివ్వండని వారు ఆయనను బ్రతిమాలారు. ముట్టిన వారందరు స్వస్థత పొందారు.
MAT 15:1 అప్పుడు కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేము పట్టణం నుండి యేసు దగ్గరకు వచ్చి,
MAT 15:2 “నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. వారు పెద్దల సాంప్రదాయాన్ని ఎందుకు పాటించరు?” అని అడిగారు.
MAT 15:3 అప్పుడు యేసు వారితో ఈ విధంగా చెప్పారు, “మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను ఎందుకు మీరుతున్నారు?
MAT 15:4 ‘మీ తండ్రిని తల్లిని గౌరవించాలి. ఎవరైనా తల్లిని గాని తండ్రిని గాని శపిస్తే వారికి మరణశిక్ష విధించాలి’ అని దేవుడు చెప్పారు.
MAT 15:5 కానీ మీరు, ఎవరైనా తమ తండ్రితో గాని తల్లితో గాని సహాయపడడానికి ఉపయోగించినది ‘దేవునికి అంకితం’ అని ప్రకటిస్తే,
MAT 15:6 వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు. ఈ విధంగా మీ సంప్రదాయం కోసం దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు.
MAT 15:7 వేషధారులారా! మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే:
MAT 15:8 “ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి;
MAT 15:9 వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’ ”
MAT 15:10 యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “మీరు విని తెలుసుకోండి.
MAT 15:11 నోటిలోకి వెళ్లేవీ ఒకరిని అపవిత్రపరచవు, కాని నోటి నుండి బయటకు వచ్చేవి మాత్రమే వారిని అపవిత్రపరుస్తాయి” అని వారితో చెప్పారు.
MAT 15:12 ఆ తర్వాత యేసు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “పరిసయ్యులు ఆ మాటలను విని అభ్యంతరపడ్డారు అని నీకు తెలుసా!” అని అడిగారు.
MAT 15:13 అందుకు యేసు, “పరలోకపు నా తండ్రి నాటని ప్రతి మొక్క వేర్లతో సహా పీకివేయబడుతుంది.
MAT 15:14 వారిని వదిలిపెట్టండి; వారు గ్రుడ్డి మార్గదర్శకులు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపిస్తే, వారిద్దరు గుంటలో పడతారు” అన్నారు.
MAT 15:15 అందుకు పేతురు, “మాకు ఈ ఉపమానం అర్థమయ్యేలా చెప్పమని” అడిగాడు.
MAT 15:16 యేసు, “మీరు ఇంకా అవివేకంగానే ఉన్నారా?
MAT 15:17 నోటిలోకి పోయేవన్ని కడుపులోనికి వెళ్లి, తర్వాత శరీరం నుండి బయటకు విసర్జింపబడతాయని మీరు చూడలేదా? అని వారిని అడిగారు.
MAT 15:18 కానీ వ్యక్తి నోటి నుండి వచ్చేవన్ని హృదయంలోనుండి వస్తాయి. ఇవే వారిని అపవిత్రపరుస్తాయి.
MAT 15:19 ఎందుకంటే, హృదయంలో నుండే నరహత్య, వ్యభిచారం, లైంగిక అనైతికత, దొంగతనం, అబద్ధసాక్ష్యం దూషణ అనే చెడ్డ ఆలోచనలు వస్తాయి.
MAT 15:20 ఇవే వ్యక్తిని అపవిత్రపరుస్తాయి; అంతేకాని చేతులు కడక్కుండా భోజనం చేస్తే అది వారిని అపవిత్రపరచదు” అని చెప్పారు.
MAT 15:21 యేసు అక్కడినుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతానికి వెళ్లారు.
MAT 15:22 అక్కడ నివసించే ఒక కనాను స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు! నా కుమార్తెకు దయ్యం పట్టి చాలా బాధపడుతోంది” అని కేకలు వేసింది.
MAT 15:23 కాని యేసు ఆమె మాటలకు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఈమె కేకలువేస్తూ మన వెనుకే వస్తుంది కాబట్టి ఈమెను పంపివేయమని” ఆయనను వేడుకొన్నారు.
MAT 15:24 అందుకు యేసు, “నేను ఇశ్రాయేలులో తప్పిపోయిన గొర్రెల దగ్గరికే పంపబడ్డాను” అని చెప్పారు.
MAT 15:25 ఆ స్త్రీ వచ్చి ఆయన ముందు మోకరించి, “ప్రభువా, నాకు సహాయం చేయమని” అడిగింది.
MAT 15:26 అందుకు యేసు, “పిల్లల రొట్టెలను తీసుకుని, కుక్కలకు వేయడం సరికాదు” అన్నారు.
MAT 15:27 అప్పుడు ఆమె, “నిజమే ప్రభువా, కానీ కుక్కలు కూడ తమ యజమానుల బల్ల మీద నుండి పడే ముక్కలను తింటాయి కదా!” అని చెప్పింది.
MAT 15:28 అందుకు యేసు, “అమ్మా, నీకు ఉన్న నమ్మకం చాలా గొప్పది! నీవు కోరినట్టే నీకు జరుగును గాక!” అని ఆమెతో చెప్పారు. ఆ క్షణంలోనే ఆమె కూతురు స్వస్థత పొందింది.
MAT 15:29 యేసు అక్కడినుండి వెళ్లి, గలిలయ సముద్రతీరాన వెళ్తూ ఒక కొండ ఎక్కి అక్కడ కూర్చున్నారు.
MAT 15:30 చాలామంది ప్రజలు గుంపులుగా కుంటివారిని, గ్రుడ్డివారిని, వికలాంగులను, మూగవారిని ఇంకా అనేకమందిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు. యేసు వారిని స్వస్థపరిచారు.
MAT 15:31 మూగవారు మాట్లాడడం, వికలాంగులు బాగుపడడం, కుంటివారు నడవడం, గ్రుడ్డివారు చూడడం వంటివి చూసి ప్రజలు ఎంతో ఆశ్చర్యపడి, ఇశ్రాయేలు దేవుని ఘనపరిచారు.
MAT 15:32 అప్పుడు యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “ఈ ప్రజలు మూడు రోజులుగా ఏమి తినకుండా నా దగ్గరే ఉండిపోయారు, వారి మీద నాకు జాలి కలుగుతుంది. వీరిని ఆకలితో పంపడం నాకు ఇష్టం లేదు, లేదా వారు దారిలో సొమ్మసిల్లిపోతారు” అని చెప్పారు.
MAT 15:33 అందుకు ఆయన శిష్యులు, “ఇంత మంది ప్రజలకు భోజనం పెట్టి తృప్తిపరచడానికి కావలసినంత ఆహారం ఈ మారుమూల ప్రాంతంలో మనకు ఎక్కడ నుండి దొరుకుతుంది?” అన్నారు.
MAT 15:34 అందుకు యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగారు. వారు, “ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి” అని జవాబిచ్చారు.
MAT 15:35 అప్పుడు యేసు జనసమూహాన్ని నేల మీద కూర్చోమని ఆదేశించి,
MAT 15:36 ఆ ఏడు రొట్టెలను చేపలను పట్టుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చారు, వారు ప్రజలందరికి పంచిపెట్టారు.
MAT 15:37 వారందరు తిని తృప్తి పొందారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండా నింపారు.
MAT 15:38 స్త్రీలు పిల్లలు కాకుండా నాలుగు వేలమంది పురుషులు తిన్నారు.
MAT 15:39 తర్వాత ఆయన ప్రజలందరినీ పంపివేసి, పడవ ఎక్కి మగదాను ప్రాంతానికి వెళ్లారు.
MAT 16:1 అప్పుడు కొందరు పరిసయ్యులు సద్దూకయ్యులు యేసును పరీక్షించడానికి వచ్చి, ఆకాశం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు.
MAT 16:2 అందుకు ఆయన, “సాయంకాలమైనప్పుడు, ఆకాశం ఎరుపుగా ఉంటే వాతావరణము మామూలుగానే ఉందని,
MAT 16:3 అలాగే ఉదయాన ఆకాశం ఎరుపుగా, మబ్బుగా ఉంది కాబట్టి ఈ రోజు గాలి వాన వస్తుందని మీరు చెప్తారు. ఆకాశం యొక్క వాతావరణ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలుసు, కాని కాలాలను అర్థం చేసుకోలేరు.
MAT 16:4 అయితే దుష్టులు, వ్యభిచారులైన తరం వారు సూచనను అడుగుతున్నారు, కానీ యోనా సూచన తప్ప వేరే ఏది వారికి ఇవ్వబడదు” అని చెప్పి యేసు వారిని విడిచి వెళ్లిపోయారు.
MAT 16:5 యేసు శిష్యులు అవతలి ఒడ్డుకు వెళ్లినప్పుడు వారు రొట్టెలు తీసుకెళ్లడం మరచిపోయారు.
MAT 16:6 యేసు వారితో, “పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి” అని వారితో చెప్పారు.
MAT 16:7 కాబట్టి వారు, “మనం రొట్టెలు తీసుకురాలేదు కాబట్టి ఇలా అన్నారు” అని తమలో తాము చర్చించుకున్నారు.
MAT 16:8 వారు ఏమి చర్చించుకుంటున్నారో తెలిసినవాడై యేసు, “అల్పవిశ్వాసులారా, రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు?
MAT 16:9 మీరు ఇంకా గ్రహించలేదా పోతున్నారా? అయిదు రొట్టెలు అయిదు వేలమందికి పంచినప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తారు?
MAT 16:10 లేదా ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచినప్పుడు, ఎన్ని గంపలు ఎత్తారు?
MAT 16:11 నేను మీతో మాట్లాడుతుంది రొట్టెల గురించి కాదని మీకెందుకు అర్థం కాలేదు? మీరు పరిసయ్యులు, సద్దూకయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి” అని వారితో చెప్పారు.
MAT 16:12 అప్పుడు పులిసిన రొట్టెల పిండిని గురించి కాదు గాని పరిసయ్యులు, సద్దూకయ్యులు చేస్తున్న బోధ గురించి జాగ్రత్త అని యేసు తమతో చెప్పాడని వారు గ్రహించారు.
MAT 16:13 యేసు కైసరయ ఫిలిప్పు ప్రాంతానికి వచ్చినప్పుడు, “మనుష్యకుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని తన శిష్యులను అడిగారు.
MAT 16:14 వారు ఆయనతో, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అని, కొందరు ఏలీయా అని, మరికొందరు యిర్మీయా లేదా ప్రవక్తల్లో ఒకడు అని చెప్పుకుంటున్నారని” జవాబిచ్చారు.
MAT 16:15 అయితే ఆయన వారిని, “మరి మీరు ఏమనుకుంటున్నారు?” అని అడిగారు.
MAT 16:16 అందుకు సీమోను పేతురు, “నీవు క్రీస్తువు, సజీవుడైనా దేవుని కుమారుడవు” అని చెప్పాడు.
MAT 16:17 అందుకు యేసు, “యోనా కుమారుడా సీమోను, నీవు ధన్యుడవు, రక్తమాంసములున్న వారి ద్వారా నీకు తెలియపరచబడలేదు, కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ సంగతిని నీకు తెలియజేశారు.
MAT 16:18 నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలువలేవని నేను నీతో చెప్తున్నాను.
MAT 16:19 పరలోక రాజ్యపు తాళపుచెవి నీకు ఇస్తున్నాను, నీవు భూమి మీద వేటిని బంధిస్తావో అవి పరలోకంలో బంధింపబడతాయి, అలాగే భూమి మీద వేటిని విప్పుతావో అవి పరలోకంలో విప్పబడతాయి” అని పేతురుతో చెప్పారు.
MAT 16:20 ఆ తర్వాత యేసు, తానే క్రీస్తు అని ఎవరితో చెప్పకూడదని ఆయన తన శిష్యులకు ఆదేశించారు.
MAT 16:21 అప్పటినుండి యేసు తాను యెరూషలేము పట్టణానికి వెళ్లి యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే, ధర్మశాస్త్ర ఉపదేశకులచే అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ రోజున తిరిగి లేస్తానని తన శిష్యులకు వివరించడం మొదలుపెట్టారు.
MAT 16:22 అప్పుడు పేతురు, “ప్రభువా, అది నీ నుండి దూరమగు గాక, అలా నీకు ఎన్నడు జరుగకూడదు!” అని ఆయనను ప్రక్కకు తీసుకెళ్లి గద్దింపసాగాడు.
MAT 16:23 అప్పుడు యేసు పేతురు వైపు తిరిగి, “సాతానా, నా వెనుకకు పో! నీవు నాకు ఆటంకంగా ఉన్నావు; నీ మనస్సులో దేవుని విషయాలు లేవు, కేవలం మనుష్యుల విషయాలు ఉన్నాయి” అన్నారు.
MAT 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూసి, “ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి.
MAT 16:25 తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం తన ప్రాణానికి తెగించేవారు దాన్ని దక్కించుకొంటారు.
MAT 16:26 ఎవరైనా లోకమంతా సంపాదించుకుని తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు?
MAT 16:27 ఎందుకంటే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడ రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రతివానికి వాని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.
MAT 16:28 “ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యంతో రావడం చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
MAT 17:1 ఆరు రోజుల తర్వాత యేసు పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహానును తన వెంట తీసుకుని ఒంటరిగా ఒక ఎత్తైన కొండ మీదికి వెళ్లారు.
MAT 17:2 అక్కడ ఆయన వారి ముందు రూపాంతరం పొందారు. అప్పుడు ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగువలె తెల్లగా మారాయి.
MAT 17:3 అప్పుడు మోషే, ఏలీయా యేసుతో మాట్లాడుతూ, వారికి కనబడ్డారు.
MAT 17:4 అప్పుడు పేతురు యేసుతో, “ప్రభువా, మనం ఇక్కడే ఉండడం మంచిది. నీకు ఇష్టమైతే, మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని చెప్పాడు.
MAT 17:5 అతడు ఇంకా మాట్లాడుతున్నప్పుడు, కాంతివంతమైన ఒక మేఘం వారిని కమ్ముకుని ఆ మేఘంలో నుండి ఒక స్వరం వారితో, “ఇదిగో ఈయన నేను ప్రేమించే నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను, కాబట్టి ఈయన మాటలను వినండి!” అని చెప్పడం వినిపించింది.
MAT 17:6 శిష్యులు ఆ మాటలు విని, భయంతో నేల మీద బోర్లపడిపోయారు.
MAT 17:7 కానీ యేసు వారి దగ్గరకు వచ్చి వారిని ముట్టి, “లేవండి, భయపడకండి” అని చెప్పారు.
MAT 17:8 వారు లేచి చూసినప్పుడు, అక్కడ వారికి యేసు తప్ప ఇంకెవరు కనబడలేదు.
MAT 17:9 వారు కొండ దిగి వస్తున్నప్పుడు, “మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచేవరకు మీరు చూసినవాటిని ఎవరితో చెప్పవద్దు” అని యేసు శిష్యులను ఖచ్చితంగా ఆదేశించారు.
MAT 17:10 అప్పుడు శిష్యులు, “ఏలీయా ముందుగా రావాలని ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందుకు చెప్తున్నారు?” అని ఆయనను అడిగారు.
MAT 17:11 అందుకు యేసు, “ఏలీయా వచ్చి అన్నిటిని చక్కపెడతాడన్న మాట నిజమే.
MAT 17:12 ఏలీయా ముందే వచ్చాడు కాని ఎవరు అతన్ని గుర్తించలేదు, వారు తమకు ఇష్టం వచ్చినట్టుగా అతనికి చేశారు. మనుష్యకుమారుడు కూడ అలాగే వారి చేత హింసను పొందబోతున్నాడని మీతో చెప్తున్నాను” అన్నారు.
MAT 17:13 యేసు తమతో చెప్తున్నది బాప్తిస్మమిచ్చే యోహానును గురించి అని శిష్యులు అర్థం చేసుకున్నారు.
MAT 17:14 వారు జనసమూహాన్ని సమీపించినప్పుడు ఒకడు యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరించి,
MAT 17:15 “ప్రభువా, నా కుమారుని కరుణించు. వాడు మూర్ఛ రోగంతో చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పులో, నీళ్లలో పడిపోతున్నాడు.
MAT 17:16 నేను వీన్ని మీ శిష్యుల దగ్గరకు తీసుకువచ్చాను కానీ వారు బాగు చేయలేకపోయారు” అని చెప్పాడు.
MAT 17:17 అందుకు యేసు, “విశ్వాసంలేని మూర్ఖతరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహించగలను? ఆ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకురండి” అన్నారు.
MAT 17:18 అప్పుడు యేసు ఆ దయ్యాన్ని గద్దించారు, అది వానిని వదిలిపోయింది. ఆ సమయం నుండి వాడు బాగైపోయాడు.
MAT 17:19 ఆ తర్వాత శిష్యులు యేసు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి, “మేము ఎందుకు దానిని వెళ్లగొట్టలేకపోయాం” అని అడిగారు.
MAT 17:20 అందుకు యేసు, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణము. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఈ కొండతో, ‘ఇక్కడినుండి అక్కడికి వెళ్లు’ అంటే అది పోతుంది. ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 17:21 ఇలాంటివి కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే బయటకు వెళ్లిపోతాయి” అని వారికి చెప్పారు.
MAT 17:22 వారు గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు తన శిష్యులతో, “మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడతాడు.
MAT 17:23 అప్పుడు వారు ఆయనను చంపుతారు కానీ ఆయన మూడవ రోజున సజీవంగా తిరిగి లేచును” అని శిష్యులతో చెప్పినప్పుడు వారు ఎంతో దుఃఖించారు.
MAT 17:24 తర్వాత యేసు తన శిష్యులతో కపెర్నహూము పట్టణానికి చేరినప్పుడు, అర షెకెలు ఆలయ పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరకు వచ్చి, “మీ బోధకుడు ఆలయ పన్ను చెల్లించడా?” అని అడిగారు.
MAT 17:25 అందుకు పేతురు, “చెల్లిస్తాడు” అని జవాబిచ్చాడు. పేతురు ఇంట్లోకి వచ్చినప్పుడు యేసు ముందుగా మాట్లాడుతూ, అతన్ని, “సీమోనూ, నీవేమి అనుకుంటున్నావు? ఈ భూ రాజులు మందిర పన్ను ఎవరి దగ్గర వసూలు చేయాలి? సొంత కుమారుల దగ్గరా లేదా బయటి వారి దగ్గరా?” అని అడిగారు.
MAT 17:26 అందుకు పేతురు, “బయటి వారి దగ్గరే” అని చెప్పాడు. అందుకు యేసు, “అలాగైతే కుమారులు పన్నుకట్టే అవసరం లేదు.
MAT 17:27 కాని మనం వారికి అభ్యంతరకరంగా ఉండకూడదు, కాబట్టి నీవు సముద్రానికి వెళ్లి నీ గాలం వేయి. నీవు పట్టిన మొదటి చేపను తీసుకో, దాని నోటిని తెరిస్తే దానిలో నీకు ఒక షెకెలు నాణెము దొరుకుతుంది. అది తీసుకుని నా కోసం నీకోసం పన్ను చెల్లించు” అని చెప్పారు.
MAT 18:1 ఆ సమయంలోనే శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “పరలోకరాజ్యంలో అందరికంటే గొప్పవాడెవరు?” అని అడిగారు.
MAT 18:2 అప్పుడు యేసు ఒక చిన్నబిడ్డను తన దగ్గరకు పిలుచుకొని వారి మధ్యలో నిలబెట్టి ఈ విధంగా చెప్పారు,
MAT 18:3 “మీరు ఈ చిన్నపిల్లలవలె మారితేనే కాని పరలోకరాజ్యంలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 18:4 కాబట్టి ఈ చిన్నపిల్లల్లా తమను తాము తగ్గించుకునేవారు పరలోకరాజ్యంలో గొప్పవారు.
MAT 18:5 ఇలాంటి ఒక చిన్నబిడ్డను నా పేరట చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు.
MAT 18:6 “ఎవరైనా నన్ను నమ్మిన ఈ చిన్నపిల్లల్లో ఒకరికి ఆటంకం కలిగిస్తే వారి మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వారికి మేలు.
MAT 18:7 నా విషయంలో ప్రజలను ఆటంకపరిచే వాటిని బట్టి లోకానికి శ్రమ. అయితే అలాంటి శోధనలు తప్పవు కాని అవి ఎవరి వలన వస్తున్నాయో, వానికి శ్రమ.
MAT 18:8 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ చేయి లేదా నీ కాలు కారణమైతే వాటిని నరికి నీ దగ్గర నుండి పారవేయ్యి. రెండు చేతులు, రెండు కాళ్లు కలిగి నిత్యం మండుతున్న అగ్నిలో పడవేయబడే కంటే, కుంటివానిగా లేదా అవయవాలు లేనివానిగా జీవంలో ప్రవేశించడం నీకు మేలు.
MAT 18:9 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కన్ను కారణమైతే, దానిని పెరికి పారవేయి. నీవు రెండు కళ్లు కలిగి నరకంలో పడవేయబడటం కంటే, ఒక కన్నుతో జీవంలోనికి ప్రవేశించడం నీకు మేలు.
MAT 18:10 “ఈ చిన్నపిల్లల్లో ఒకరిని కూడా తక్కువగా చూడకండి, ఎందుకంటే పరలోకంలో ఉన్న వీరి దూతలు ఎల్లప్పుడు పరలోకంలోని నా తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటారని మీతో చెప్తున్నాను.
MAT 18:11 ఎట్లనగా, ‘తప్పిపోయిన దానిని వెదకి రక్షించడానికే మనుష్యకుమారుడు వచ్చాడు.’
MAT 18:12 “ఒక వ్యక్తికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు ఏమి చేస్తాడని మీకు అనిపిస్తుంది? తొంభై తొమ్మిది గొర్రెలను కొండలమీద వదిలిపెట్టి, తప్పిపోయిన ఆ ఒక గొర్రెను వెదకడానికి వెళ్లడా?
MAT 18:13 ఒకవేళ అతనికి అది దొరికితే, తొంభై తొమ్మిది గొర్రెల కంటే తప్పిపోయి దొరికిన ఆ గొర్రె గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 18:14 అలాగే ఈ చిన్నవారిలో ఒకరైనా నశించడం పరలోకంలో ఉన్న మీ తండ్రికి ఇష్టం లేదు.
MAT 18:15 “ఒకవేళ నీ సహోదరుడు లేదా సహోదరి పాపం చేస్తే నీవు వెళ్లి వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పు గురించి వారిని గద్దించు. ఒకవేళ వారు నీ మాట వింటే నీవు వారిని సంపాదించుకున్నట్లే.
MAT 18:16 వారు వినకపోతే, ‘ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యాల మీద ప్రతి విషయం స్థిరపరచబడునట్లు’ నీతో పాటు ఒకరిని లేదా ఇద్దరిని వెంటబెట్టుకొని వెళ్లు.
MAT 18:17 వారు ఇంకా మాట వినకపోతే, ఆ సంగతిని సంఘానికి తెలియజేయండి. వారు సంఘం మాట కూడా వినకపోతే వారిని ప్రక్కన పెట్టి ఒక దేవుని ఎరుగనివారిగా లేదా పన్ను వసూలుచేసేవారిగా పరిగణించండి.
MAT 18:18 “మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధింపబడతాయి, అలాగే భూమి మీద వేటిని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడతాయని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 18:19 “ఇంకొక విషయం, ఒకవేళ మీలో ఇద్దరు దేన్ని గురించియైన భూమి మీద ఏకీభవించి అడిగితే అది పరలోకంలో నా తండ్రి వారి పట్ల దానిని జరిగిస్తాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 18:20 ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడుకుని ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను” అని చెప్పారు.
MAT 18:21 అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి, “ప్రభువా, నా సహోదరుడు నాకు విరోధంగా తప్పు చేస్తే నేను ఎన్ని సార్లు అతన్ని క్షమించాలి, ఏడుసార్లు క్షమించాలా?” అని అడిగాడు.
MAT 18:22 అందుకు యేసు అతనితో, “ఏడు సార్లే కాదు కాని డెబ్బై ఏడుసార్లు వరకు క్షమించాలి అని నీతో చెప్తున్నాను.
MAT 18:23 “పరలోక రాజ్యం తన దాసుల లెక్కలను సరిచూడ కోరిన ఒక రాజును పోలి ఉంది.
MAT 18:24 లెక్కలను సరిచూడ మొదలుపెట్టినప్పుడు, పదివేల తలాంతుల బంగారం అప్పు ఉన్నవాడు తీసుకురాబడ్డాడు.
MAT 18:25 వాడు అప్పు తీర్చలేక పోయినందుకు ఆ రాజు వాని దగ్గర ఏమిలేదని, వాని భార్యను, వాని పిల్లలను వానికి కలిగినవన్ని అమ్మి తన బాకీని తీర్చాలని ఆదేశించాడు.
MAT 18:26 “అందుకు ఆ పనివాడు ఆ రాజు పాదాల ముందు సాగిలపడి, ‘నా విషయంలో కొంచెం ఓపిక పట్టండి, నేను బాకీ అంతా తీర్చేస్తాను’ అని బ్రతిమాలాడు.
MAT 18:27 కాబట్టి రాజు వాని మీద జాలిపడి, వాని బాకీ అంతా క్షమించి, వానిని విడిచిపెట్టాడు.
MAT 18:28 “కానీ వాడు బయటకు వెళ్లి తనకు వంద వెండి దేనారాలు బాకీ ఉన్న తన తోటి పనివానిలో ఒకనిని చూసి, ‘నీవు తీసుకున్న బాకీ తిరిగి చెల్లించు!’ అని వాని గొంతు పట్టుకున్నాడు.
MAT 18:29 “అందుకు ఆ తోటి పనివాడు అతని పాదాల మీద పడి ‘నా విషయం కొంచం ఓపిక పట్టు, నేను బాకీ అంతా తీర్చేస్తాను’ అని బ్రతిమాలాడు.
MAT 18:30 “అయితే అతడు దానికి ఒప్పుకోలేదు. బదులుగా, వాడు బాకీ తీర్చేవరకు వానిని జైలులో వేయించాడు.
MAT 18:31 అదంతా చూసిన తోటి పనివారు చాలా దుఃఖపడి, వెళ్లి జరిగిన సంగతిని రాజుకు వివరించారు.
MAT 18:32 “అప్పుడు రాజు వానిని పిలిపించి, ‘చెడ్డ దాసుడా, నీవు నన్ను బ్రతిమాలి అడిగావని నేను నీ బాకీ అంతా క్షమించాను’ కదా!
MAT 18:33 నేను నీ పట్ల చూపిన దయను, నీవు నీ తోటి పనివాని పట్ల చూపించాలి కదా! అని వానితో అన్నాడు.
MAT 18:34 అప్పుడు రాజు కోపంతో వాడు తన దగ్గర చేసిన బాకీ అంతా తీర్చేవరకు, చిత్రహింసలు అనుభవించడానికి జైలు అధికారికి వానిని అప్పగించాడు.
MAT 18:35 “మీలో ప్రతి ఒకడు తన తోటి విశ్వాసిని హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోక తండ్రి కూడా మీతో అలాగే వ్యవహరిస్తాడు” అని వారితో చెప్పారు.
MAT 19:1 యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్లారు.
MAT 19:2 గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది, యేసు వారి రోగాలను బాగుచేశారు.
MAT 19:3 కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించడానికి ఆయన దగ్గరకు వచ్చి, “ఏ కారణంగానైనా ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్టప్రకారం న్యాయమేనా?” అని అడిగారు.
MAT 19:4 అందుకు యేసు, “ఆదిలో సృష్టికర్త వారిని ‘పురుషునిగాను స్త్రీగాను సృజించారు’ అని మీరు చదువలేదా?
MAT 19:5 ‘ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. అలా వారిద్దరు ఏకశరీరం అవుతారు.’
MAT 19:6 కాబట్టి వారు ఇక ఇద్దరు కారు, కాని ఒక శరీరమే అవుతారు. కాబట్టి దేవుడు జతపరచినవారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు” అని చెప్పారు.
MAT 19:7 అయితే వారు, “అలాంటప్పుడు, ఒక వ్యక్తి తన భార్యకు విడాకుల ధృవీకరణ పత్రం ఇచ్చి ఆమెను పంపించవచ్చని మోషే ఆజ్ఞాపించాడా?” అని ఆయనను అడిగారు.
MAT 19:8 అందుకు యేసు ఇలా సమాధానం ఇచ్చారు, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, మీ భార్యను విడిచిపెట్ట వచ్చునని మోషే అనుమతించాడు గాని ఆది నుండి అలా జరగలేదు.
MAT 19:9 అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, లైంగిక అనైతికత కారణంతో కాకుండా, తన భార్యను విడిచి మరొక స్త్రీని పెళ్ళి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.”
MAT 19:10 ఆయన శిష్యులు ఆయనతో, “భార్యా భర్తల మధ్య పరిస్థితి ఇలా ఉంటే అసలు పెళ్ళి చేసుకోకుండా ఉండడమే మంచిది” అని అన్నారు.
MAT 19:11 అందుకు యేసు, “ఈ మాటను అందరు అంగీకరించలేకపోవచ్చు కానీ ఈ మాటలు ఎవరి కోసం చెప్పబడ్డాయో వారికి మాత్రమే.
MAT 19:12 ఎందుకంటే తల్లి గర్భం నుండే నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు, నపుంసకులుగా చేయబడినవారు ఉన్నారు, పరలోక రాజ్యం కోసం నపుంసకులగా జీవిస్తున్నవారు ఉన్నారు. కాబట్టి దీనిని అంగీకరించగలవాడు అంగీకరించును గాక!” అని వారితో చెప్పారు.
MAT 19:13 అప్పుడు ప్రజలు తమ చిన్నపిల్లలపై యేసు తన చేతులుంచి ప్రార్థించాలని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. కాని శిష్యులు వారిని గద్దించారు.
MAT 19:14 అప్పుడు యేసు, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే పరలోక రాజ్యం ఇలాంటి వారిదే” అని చెప్పి,
MAT 19:15 ఆ చిన్నపిల్లల మీద తన చేతులుంచిన తర్వాత ఆయన అక్కడినుండి వెళ్లిపోయారు.
MAT 19:16 అంతలో ఒకడు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేను ఏ మంచిని చేయాలి?” అని అడిగాడు.
MAT 19:17 అందుకు యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే ఉన్నాడు. నీవు జీవంలోనికి ప్రవేశించాలి అంటే ఆజ్ఞలను పాటించు” అని చెప్పారు.
MAT 19:18 అతడు, “ఏ ఆజ్ఞలు?” అని అడిగాడు. అందుకు యేసు, ఈ విధంగా చెప్పారు, “ ‘మీరు హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు,
MAT 19:19 మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’ అనే ఆజ్ఞలు.”
MAT 19:20 అందుకు ఆ యవ్వనస్థుడు, “నేను వీటన్నిటిని పాటిస్తూనే ఉన్నాను. ఇంకా నాలో ఏ కొరత ఉంది?” అని ఆయనను అడిగాడు.
MAT 19:21 అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి అంటే వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి నన్ను వెంబడించు” అని చెప్పారు.
MAT 19:22 అయితే ఆ యవ్వనస్థుడు ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే గొప్ప ఆస్తి కలవాడు.
MAT 19:23 అప్పుడు యేసు తన శిష్యులతో, “ఒక ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం అని, నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 19:24 ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు.
MAT 19:25 శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యంతో, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు.
MAT 19:26 యేసు వారివైపు చూసి, “ఇది మనుష్యులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తం సాధ్యమే” అని చెప్పారు.
MAT 19:27 అప్పుడు పేతురు, “ఇదిగో, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేమి దొరకుతుంది” అని ఆయనను అడిగాడు.
MAT 19:28 అందుకు యేసు వారితో, “అన్ని నూతన పరచబడిన తర్వాత మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారిని తీర్పుతీర్చుతారు.
MAT 19:29 నా నామాన్ని కలిగి ఉన్నందుకు తన కుటుంబాన్ని, అనగా సహోదరులను, సహోదరీలను, తల్లిని, తండ్రిని, పిల్లలను లేదా పొలాలను గృహాలను నా కోసం విడిచిపెట్టిన ప్రతివాడు నూరురెట్లు పొందుకొని, నిత్యజీవానికి వారసుడు అవుతాడు.
MAT 19:30 అయితే చాలామంది మొదటివారు చివరివారవుతారు, చివరి వారు మొదటివారవుతారు” అని చెప్పారు.
MAT 20:1 యేసు పరలోక రాజ్యం గురించి వివరిస్తూ, “పరలోక రాజ్యం, తన ద్రాక్షతోటలో కూలికి పని చేసేవారిని తీసుకురావాలని వేకువనే బయలుదేరిన ఒక యజమానిని పోలి ఉంది.
MAT 20:2 అతడు రోజుకు ఒక దేనారం కూలి ఇస్తానని ఒప్పుకుని తన ద్రాక్షతోటలోనికి పనికి వారిని పంపించాడు.
MAT 20:3 “ఉదయకాలం దాదాపు తొమ్మిది గంటలకు ఏ పనిలేక ఖాళీగా సంతవీధిలో నిలబడి ఉన్న మరి కొంతమందిని అతడు చూశాడు.
MAT 20:4 వారితో, ‘మీరు కూడా వెళ్లి ద్రాక్షతోటలో పని చేయండి, మీకు ఏది న్యాయమో అది మీకు చెల్లిస్తాను’ అని వారితో చెప్పాడు.
MAT 20:5 కాబట్టి వారు కూడా వెళ్లారు. “మళ్ళీ దాదాపు పన్నెండు గంటలకు, తిరిగి మూడు గంటలకు అతడు వెళ్లి అలాగే చేశాడు.
MAT 20:6 దాదాపు అయిదు గంటలకు కూడా మరికొందరు ఏ పనిలేక ఖాళీగా సంతవీధిలో నిలబడి ఉన్నారని చూసి, ‘రోజంతా ఇక్కడ మీరు ఏ పనిలేక ఖాళీగా ఎందుకు నిలబడి ఉన్నారు?’ అని వారిని అడిగాడు.
MAT 20:7 “అందుకు వారు, ‘ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు’ అని చెప్పారు. “కాబట్టి అతడు వారితో, ‘మీరు కూడా వెళ్లి, నా ద్రాక్షతోటలో పని చేయండి’ అని చెప్పాడు.
MAT 20:8 “సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని తన గృహనిర్వాహకునితో, ‘పనివారిని పిలిచి వారికి చివరి నుండి మొదట వచ్చిన వారివరకు కూలి ఇవ్వమని’ చెప్పాడు.
MAT 20:9 “దాదాపు అయిదు గంటలకు కూలికి వచ్చినవారు వచ్చి ఒక్కొక్కరు ఒక దేనారం కూలి తీసుకున్నారు.
MAT 20:10 అది చూసి, మొదట కూలి పనికి వచ్చినవారు, మిగతా వారికంటే తమకు ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశించారు. కాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు.
MAT 20:11 వారు కూలి తీసుకుని, ‘మేము ఉదయం నుండి ఎండలో కష్టపడి పని చేశాము అయినా చివరిలో వచ్చి ఒక్క గంట మాత్రమే పని చేసిన వారితో సమానంగా కూలి ఇచ్చారు’ అని యజమానుని మీద సణుగుకొన్నారు.
MAT 20:13 “అందుకు ఆ యజమాని వారిలో ఒకనితో, ‘స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదు. నీవు నా దగ్గర ఒక దేనారం కొరకే పని చేస్తానని ఒప్పుకున్నావు కదా?
MAT 20:14 నీవు నీ కూలిని తీసుకుని వెళ్లు. నేను నీకు ఇచ్చినట్టే చివర వచ్చిన వానికి ఇవ్వడం నా ఇష్టము.
MAT 20:15 నా సొంత డబ్బును నా ఇష్ట ప్రకారం ఖర్చు చేసుకోవడానికి నాకు అనుమతి లేదా? లేదా నేను ధారాళంగా ఇస్తున్నానని నీవు అసూయపడుతున్నావా?’ అని అడిగాడు.
MAT 20:16 “కాబట్టి చివరి వారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు” అని చెప్పారు.
MAT 20:17 యేసు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు తన పన్నెండుమంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్లి దారిలో వారితో,
MAT 20:18 “మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్యకుమారుడు ముఖ్య యాజకులకు ధర్మశాస్త్ర ఉపదేశకులకు అప్పగించబడతాడు. వారు ఆయనకు మరణశిక్ష విధించి,
MAT 20:19 యూదేతరుల చేత అపహసించబడి, కొరడాలతో కొట్టబడి, సిలువ వేయబడడానికి అప్పగిస్తారు. అయితే ఆయన మూడవ రోజున సజీవంగా మరల తిరిగి లేస్తాడు!” అని చెప్పారు.
MAT 20:20 అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చి, ఆయన పాదాల ముందు మోకరించి ఒక మనవి చేసింది.
MAT 20:21 యేసు ఆమెను, “నీకేమి కావాలి?” అని అడిగారు. అందుకు ఆమె, “నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఇంకొకడు నీ ఎడమవైపున కూర్చోడానికి అనుమతి ఇవ్వండి” అని ఆయనతో అన్నది.
MAT 20:22 యేసు వారితో, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా?” అని అడిగారు. వారు, “మేము త్రాగగలం” అని జవాబిచ్చారు.
MAT 20:23 అప్పుడు యేసు వారితో, “వాస్తవానికి నా గిన్నెలోనిది మీరు త్రాగుతారు, కాని నా కుడి లేదా ఎడమవైపున కూర్చోడానికి అనుమతి ఇవ్వాల్సింది నేను కాదు. ఈ స్థానాలు నా తండ్రి ద్వారా ఎవరి కోసం సిద్ధపరచబడి ఉన్నాయో వారికే చెందుతాయి” అని వారితో అన్నారు.
MAT 20:24 ఇది విన్న తక్కిన పదిమంది శిష్యులు, ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద కోప్పడ్డారు.
MAT 20:25 యేసు వారిని తన దగ్గరకు పిలుచుకొని, “యూదేతరుల అధికారులు వారి మీద ప్రభుత్వం చేస్తారు, వారి మీద ప్రభుత్వం చేస్తారని, వారి పై అధికారులు కూడా వారి మీద అధికారం చెలాయిస్తారని మీకు తెలుసు.
MAT 20:26 కాని మీరలా ఉండకూడదు. మీలో గొప్పవాడు కావాలని కోరేవాడు మీకు దాసునిగా ఉండాలి,
MAT 20:27 మీలో మొదటివానిగా ఉండాలని కోరుకునేవాడు మీకు దాసునిలా ఉండాలి.
MAT 20:28 ఎందుకంటే మనుష్యకుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు కాని సేవ చేయడానికి, తన ప్రాణాన్ని అనేకులకు విమోచన క్రయధనంగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నారు.
MAT 20:29 యేసు అతని శిష్యులతో యెరికో పట్టణం దాటి వెళ్తున్నప్పుడు ఒక గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది.
MAT 20:30 దారి ప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు!” అని బిగ్గరగా కేకలు వేశారు.
MAT 20:31 ఆ జనసమూహం వారిని గద్దించారు, నిశ్శబ్దంగా ఉండమని వారికి చెప్పారు, కాని వారు, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు!” అని ఇంకా గట్టిగా కేకలు వేశారు.
MAT 20:32 యేసు ఆగి వారిని పిలిపించి, “నేను మీకు ఏమి చేయాలని కోరుతున్నారు?” అని వారిని అడిగారు.
MAT 20:33 వారు, “ప్రభువా, మాకు చూపు కావాలి!” అని అన్నారు.
MAT 20:34 యేసు వారి మీద కనికరపడి వారి కళ్లను ముట్టాడు, వెంటనే వారు చూపు పొందుకొని ఆయనను వెంబడించారు.
MAT 21:1 వారు యెరూషలేముకు సమీపిస్తూ, ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే గ్రామానికి వచ్చాక, యేసు తన ఇద్దరు శిష్యులను పంపుతూ,
MAT 21:2 “మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి. అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద, గాడిదపిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి.
MAT 21:3 ఎవరైనా మిమ్మల్ని ఏమైన అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అతడు వెంటనే వాటిని పంపుతారు” అని చెప్పి వారిని పంపారు.
MAT 21:4 ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది:
MAT 21:5 “ ‘ఇదిగో, గాడిద మీద, గాడిదపిల్ల మీద, సాత్వికునిగా స్వారీ చేస్తూ, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు’ అని సీయోను కుమారితో చెప్పండి.”
MAT 21:6 శిష్యులు వెళ్లి, యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేశారు.
MAT 21:7 వారు ఆ గాడిదను, దాని పిల్లను తీసుకువచ్చి వాటి మీద తమ వస్త్రాలను వేశారు, ఆయన వాటి మీద కూర్చున్నారు.
MAT 21:8 ఒక గొప్ప జనసమూహం తమ వస్త్రాలను దారి అంతటా పరచారు, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి అంతటా పరచారు.
MAT 21:9 ఆయన ముందు వెళ్లే జనసమూహం ఆయనను వెంబడించేవారు బిగ్గరగా, “దావీదు కుమారునికి హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!” “సర్వోన్నతమైన స్థలాల్లో హోసన్నా!” అని కేకలు వేశారు.
MAT 21:10 యేసు యెరూషలేములో ప్రవేశించినప్పుడు, పట్టణమంతా కలవరపడి, “ఈయన ఎవరు?” అని అడిగారు.
MAT 21:11 అందుకు ఆ జనసమూహం, “ఈయన యేసు, గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామం నుండి వచ్చిన ప్రవక్త” అని జవాబిచ్చారు.
MAT 21:12 యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి అక్కడ అమ్ముతూ, కొంటూ ఉన్నవారినందరిని తరిమివేశారు. డబ్బు మార్చే వారి బల్లలను, గువ్వలను, అమ్మేవారి పీటలను ఆయన పడవేశారు.
MAT 21:13 ఆయన వారితో, “ ‘నా మందిరం ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడి ఉంది కానీ మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ” అన్నారు.
MAT 21:14 గ్రుడ్డివారు, కుంటివారు, దేవాలయంలో ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన వారందరిని స్వస్థపరిచారు.
MAT 21:15 అయితే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన చేసిన అద్భుతాలను, “దావీదు కుమారునికి, హోసన్నా” అని దేవాలయ ఆవరణంలో కేకలు వేస్తున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు.
MAT 21:16 వారు ఆయనను, “వీరు చెప్తున్నది వింటున్నావా?” అని అడిగారు. “అవును,” యేసు ఈ విధంగా జవాబిచ్చారు, “ ‘ప్రభువా, చిన్నపిల్లల చంటిబిడ్డల పెదవుల నుండి మీ స్తుతులను పలికింపచేశారు’ అనే ఈ మాటను మీరు ఎన్నడు చదువలేదా?”
MAT 21:17 యేసు వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియ గ్రామానికి వెళ్లి, ఆ రాత్రి ఆయన అక్కడ బస చేశారు.
MAT 21:18 తెల్లవారిన తర్వాత యేసు యెరూషలేము పట్టణానికి తిరిగి వెళ్తున్నప్పుడు ఆయనకు ఆకలివేసింది.
MAT 21:19 అప్పుడు ఆ దారి ప్రక్కన ఉన్న ఒక అంజూర చెట్టును చూసి, దాని దగ్గరకు వెళ్లారు కాని దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు, కాబట్టి, “ఇకమీదట ఎన్నడు నీకు కాయలు కాయవు” అని దానితో చెప్పగా వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది.
MAT 21:20 శిష్యులు అది చూసి, ఆశ్చర్యపడ్డారు. “ఆ అంజూర చెట్టు అంత త్వరగా ఎలా ఎండిపోయింది?” అని అడిగారు.
MAT 21:21 అందుకు యేసు, “మీరు విశ్వాసం కలిగి అనుమానించకపోతే, ఈ అంజూర చెట్టుకు జరిగిందే కాదు, ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పితే, అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 21:22 మీరు నమ్మితే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా దానిని పొందుకొంటారు” అని వారితో చెప్పారు.
MAT 21:23 యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి, ఆయన బోధిస్తున్నప్పుడు, ముఖ్య యాజకులు, ప్రజానాయకులు ఆయన దగ్గరకు వచ్చారు. వారు, “నీవు ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నావు? నీకు ఈ అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.
MAT 21:24 అందుకు యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పండి, అప్పుడు ఏ అధికారంతో నేను వీటిని చేస్తున్నానో మీకు చెప్తాను.
MAT 21:25 యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడ నుండి కలిగింది, పరలోకం నుండి కలిగిందా? లేదా మానవుల నుండి కలిగిందా?” అని వారిని అడిగారు. వారు తమలో తాము చర్చించుకొంటూ అనుకున్నారు, “ఒకవేళ మనం ‘పరలోకం నుండి కలిగింది’ అని చెప్పితే ‘మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు’ అని అడుగుతాడు.
MAT 21:26 ఒకవేళ మనం, ‘మనుష్యుల వలన’ అని చెప్తే, ప్రజలందరు యోహానును ప్రవక్త అని నమ్ముతున్నారు, కాబట్టి మనం వారికి భయపడుతున్నాం” అని తమలో తాము చర్చించుకొన్నారు.
MAT 21:27 అందుకు వారు, “మాకు తెలియదు” అని యేసుకు జవాబిచ్చారు. అందుకు యేసు, “నేను కూడా ఏ అధికారంతో ఈ పనులను చేస్తున్నానో మీతో చెప్పను” అన్నారు.
MAT 21:28 యేసు వారితో ఇంకా మాట్లాడుతూ, “మీకు ఏమి అనిపిస్తుంది? ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మొదటి వాని దగ్గరకు వెళ్లి, ‘కుమారుడా, వెళ్లి ఈ రోజు ద్రాక్షతోటలో పని చేయి’ అని చెప్పాడు.
MAT 21:29 “అతడు, ‘నేను వెళ్లను’ అని జవాబు ఇచ్చాడు కాని తర్వాత మనస్సు మార్చుకొని వెళ్లాడు.
MAT 21:30 “అప్పుడు ఆ తండ్రి రెండవ కుమారుని దగ్గరకు వెళ్లి, అదే విధంగా చెప్పాడు. అప్పుడు వాడు, ‘వెళ్తాను’ అని తండ్రితో చెప్పాడు కాని వెళ్లలేదు.
MAT 21:31 “అయితే, ఈ ఇద్దరు కుమారులలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసినవాడు?” అని యేసు వారిని అడిగారు. అందుకు వారు, “మొదటి వాడే” అన్నారు. అప్పుడు యేసు వారితో, “పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటే ముందు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 21:32 ఎలాగంటే, యోహాను నీతి మార్గాన్ని చూపించడానికి మీ దగ్గరకు వచ్చాడు, కాని మీరు అతన్ని నమ్మలేదు, కాని పన్ను వసూలు చేసేవారు వేశ్యలు అతన్ని నమ్మారు. అది చూసిన తర్వాత కూడా, మీరు పశ్చాత్తాపపడి ఆయనను నమ్మలేదు” అని చెప్పారు.
MAT 21:33 “మరొక ఉపమానం వినండి: ఒక యజమాని తన పొలంలో ద్రాక్షతోటను నాటాడు. అతడు దాని చుట్టూ కంచె వేయించి, అందులో ద్రాక్ష గానుగ తొట్టి తొలిపించి, కాపలా కాయడానికి ఎత్తైన గోపురం కట్టించాడు. తర్వాత ఆ ద్రాక్షతోటను కొందరు కౌలురైతులకు అద్దెకు ఇచ్చి దూర దేశానికి వెళ్లిపోయాడు.
MAT 21:34 కోతకాలం సమీపించినప్పుడు పంటలో తన వంతును తీసుకుని రమ్మని ఆ రైతుల దగ్గరకు తన దాసులను పంపాడు.
MAT 21:35 “ఆ రైతులు అతని దాసులను పట్టుకున్నారు; వారు ఒకని కొట్టారు, ఒకని చంపారు, మరొకని మీద రాళ్లు విసిరారు.
MAT 21:36 ఆ యజమాని ఇతర దాసులను, మొదటిసారి కంటే ఎక్కువ మంది పంపాడు, ఆ కౌలు రైతులు వీరిని కూడా ముందు చేసినట్టే చేశారు.
MAT 21:37 చివరికి ఆ యజమాని, ‘వారు నా కుమారున్ని గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుని వారి దగ్గరకు పంపాడు.
MAT 21:38 “కాని ఆ కౌలు రైతులు కుమారుని చూసి ‘ఇతడే వారసుడు, రండి ఇతన్ని చంపి ఇతని వారసత్వాన్ని తీసుకుందాం’ అని తమలో తాము చెప్పుకొన్నారు.
MAT 21:39 కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు.
MAT 21:40 “అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చినప్పుడు ఆ కౌలురైతులను ఏమి చేస్తాడు?”
MAT 21:41 అందుకు, “ఆ దుష్టులను కఠినంగా నిర్మూలం చేస్తాడు, కోతకాలంలో తనకు రావలసిన పంటను సక్రమంగా చెల్లించే వేరే కౌలురైతులకు ఆ ద్రాక్షతోటను అద్దెకు ఇస్తాడు” అని వారు జవాబిచ్చారు.
MAT 21:42 అయితే యేసు వారితో, “లేఖనాల్లో ఈ వాక్యం మీరు ఎప్పుడు చదువలేదా: “ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది. ఇది ప్రభువే చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.’
MAT 21:43 “కాబట్టి దేవుని రాజ్యం మీ నుండి తీసివేసి, ఆయన దానిని ఫలింపచేసే ప్రజలకు ఇస్తాడు అని మీతో చెప్తున్నాను.
MAT 21:44 ఈ రాయి మీద పడినవారు ముక్కలైపోతారు గాని ఎవరి మీద ఈ రాయి పడుతుందో వారు దాని క్రింద నలిగిపోతారు” అని చెప్పారు.
MAT 21:45 ముఖ్య యాజకులు, పరిసయ్యులు యేసు చెప్పిన ఉపమానాలను విని, ఆయన తమ గురించే చెప్పారని గ్రహించారు.
MAT 21:46 కాబట్టి వారు ఆయనను బంధించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు, కాని ప్రజలు ఆయనను ప్రవక్త అని భావించడంతో వారికి భయపడ్డారు.
MAT 22:1 యేసు మరలా ఉపమానరీతిలో వారితో మాట్లాడుతూ,
MAT 22:2 “పరలోక రాజ్యం ఒక రాజు తన కుమారుని కోసం ఏర్పాటుచేసిన గొప్ప పెండ్లి విందును పోలి ఉంది.
MAT 22:3 ఆ పెండ్లివిందుకు పిలువబడినవారిని రమ్మని పిలువడానికి అతడు తన పనివారిని పంపించాడు, కాని వారు రావడానికి తిరస్కరించారు.
MAT 22:4 “కాబట్టి ఆయన ఆహ్వానించిన వారి దగ్గరకు మరికొందరు పనివారిని పంపించి, ‘ఇదిగో, నేను విందు సిద్ధపరిచాను: నా ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడ్డాయి, అంతా సిద్ధంగా ఉంది. పెండ్లివిందుకు రండి’ అని చెప్పమన్నాడు.
MAT 22:5 “కానీ వారు అతని మాటలు లెక్కచేయకుండా ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్లిపోయారు.
MAT 22:6 మిగిలిన వారు ఆ పిలుపును తెచ్చిన పనివారిని పట్టుకుని, అవమానించి వారిని చంపారు.
MAT 22:7 కాబట్టి రాజు కోప్పడి తన సైన్యాన్ని పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.
MAT 22:8 “అప్పుడు అతడు తన పనివారితో, ‘పెండ్లి విందు సిద్ధంగా ఉంది, గాని నేను పిలిచిన వారు యోగ్యులు కారు.
MAT 22:9 కాబట్టి మీరు వీధి మూలలకు పోయి మీకు కనబడిన వారినందరిని పెండ్లివిందుకు ఆహ్వానించండి’ అని తన పనివారితో చెప్పాడు.
MAT 22:10 ఆ పనివారు వీధులలోనికి పోయి తమకు కనబడిన చెడ్డవారిని, మంచివారిని అందరిని పోగుచేశారు, కాబట్టి ఆ పెండ్లి వేదిక అంతా విందుకు వచ్చిన అతిథులతో నిండిపోయింది.
MAT 22:11 “కాని ఆ రాజు అతిథులను చూడడానికి లోపలికి వచ్చినప్పుడు, అక్కడ పెండ్లి వస్త్రాలను వేసుకోకుండా కూర్చున్న ఒకడు అతనికి కనిపించాడు.
MAT 22:12 రాజు వానితో, ‘స్నేహితుడా, పెండ్లి వస్త్రాలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. వాడు మౌనంగా ఉండిపోయాడు.
MAT 22:13 “అప్పుడు ఆ రాజు తన పనివారితో, ‘వీని చేతులు కాళ్లు కట్టి, బయట చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి’ అని చెప్పారు.
MAT 22:14 “అనేకులు పిలువబడ్డారు, కానీ కొందరే ఏర్పరచబడ్డారు.”
MAT 22:15 అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును తన మాటల్లోనే ఎలా చిక్కించాలని ఆలోచించారు.
MAT 22:16 హేరోదీయులతో పాటు తమ అనుచరులను ఆయన దగ్గరకు పంపించారు. వారు ఆయనతో, “బోధకుడా, నీవు యథార్థవంతుడవని, సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కాబట్టి ఇతరులచే నీవు ప్రభావితం కావు.
MAT 22:17 అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పు” అని అడిగారు.
MAT 22:18 అయితే యేసు, వారి చెడు ఉద్దేశాన్ని గ్రహించి, వారితో, “వేషధారులారా, మీరు ఎందుకు నన్ను చిక్కున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు?
MAT 22:19 పన్నుకట్టే ఒక నాణెము నాకు చూపించండి” అన్నారు. అందుకు వారు ఒక దేనారం తెచ్చారు.
MAT 22:20 ఆయన వారిని, “దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు.
MAT 22:21 వారు, “కైసరువి” అన్నారు. అప్పుడు ఆయన, “అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు.
MAT 22:22 వారు ఈ మాటలు విని, ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ఆయనను విడిచి వెళ్లిపోయారు.
MAT 22:23 పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు అదే రోజు ఆయన దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు.
MAT 22:24 “బోధకుడా, ఒకడు సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే చెప్పాడు.
MAT 22:25 అలా మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. కాబట్టి అతని తమ్ముడు అతని విధవను చేసుకున్నాడు.
MAT 22:26 అలాగే రెండవవాడు, మూడవవాడు, ఏడవ వాని వరకు అలాగే జరిగింది.
MAT 22:27 చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది.
MAT 22:28 ఆమెను వారందరు పెళ్ళి చేసుకున్నారు కాబట్టి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” అని ఆయనను అడిగారు.
MAT 22:29 అందుకు యేసు, “మీకు వాక్యం కాని దేవుని శక్తిని కాని తెలియదు కాబట్టి మీరు పొరపాటు పడుతున్నారు.
MAT 22:30 పునరుత్థానంలో ప్రజలు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు. వారు పరలోకంలో దూతల్లా ఉంటారు.
MAT 22:31 మృతుల పునరుత్థానం గురించి, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు మీతో చెప్పిన మాటను మీరు చదువలేదా? ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు” అని చెప్పారు.
MAT 22:33 జనులు ఈ మాటను విన్నప్పుడు, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు.
MAT 22:34 యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని, పరిసయ్యులు అక్కడికి చేరుకున్నారు.
MAT 22:35 వారిలో ఒక ధర్మశాస్త్ర నిపుణుడు, యేసును పరీక్షిస్తూ,
MAT 22:36 “బోధకుడా, ధర్మశాస్త్రంలో అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.
MAT 22:37 అందుకు యేసు, “ ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి.’
MAT 22:38 ఇది అతి ముఖ్యమైన మొదటి ఆజ్ఞ.
MAT 22:39 రెండవ ఆజ్ఞ దాని వంటిదే: ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి.’
MAT 22:40 ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తల మాటలకు ఆధారంగా ఉన్నాయి” అని అతనితో చెప్పారు.
MAT 22:41 పరిసయ్యులు ఒకచోట కూడి ఉన్నప్పుడు యేసు వారిని ఈ విధంగా అడిగారు,
MAT 22:42 “క్రీస్తును గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఎవరి కుమారుడు?” అందుకు వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు.
MAT 22:43 అందుకాయన, “అలాగైతే దావీదు, ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనను ‘ప్రభువు’ అని ఎందుకు పిలుస్తున్నాడు? దావీదు ఇలా అన్నాడు,
MAT 22:44 “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి ప్రక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో అన్నారు.” ’
MAT 22:45 దావీదే ఆయనను ‘ప్రభువు’ అని పిలిస్తే, ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?” అని అడిగారు.
MAT 22:46 ఆ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పలేకపోయారు, ఆ రోజు నుండి ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు.
MAT 23:1 అప్పుడు యేసు జనసమూహాలతో తన శిష్యులతో,
MAT 23:2 “ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు మోషే అధికార పీఠం మీద కూర్చున్నారు.
MAT 23:3 కాబట్టి వారు మీతో చెప్పేవాటన్నిటిని జాగ్రత్తగా అనుసరించండి. కాని వారు చేసే క్రియలను చేయకండి, ఎందుకంటే వారు బోధించే వాటిని పాటించరు.
MAT 23:4 వారు మోయలేనంత బరువులను కట్టి, మనుష్యుల భుజాల మీద పెడతారు, కాని తమ ఒక చేతి వ్రేలితో కూడా వాటిని కదిలించడానికి ఇష్టపడరు.
MAT 23:5 “వారు చేసే ప్రతిదీ మనుష్యులకు చూపించడానికే చేస్తారు: అనగా వారు తమ నొసటి మీద కట్టుకునే దేవుని వాక్యం కలిగిన రక్షకరేకులను వెడల్పుగాను వస్త్రాలకుండే కుచ్చులు పొడవుగాను చేసుకుంటారు.
MAT 23:6 వారు విందుల్లో గౌరవప్రదమైన స్థలాన్ని, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను,
MAT 23:7 సంత వీధుల్లో గౌరవ వందనం పొందాలని ‘రబ్బీ’ అని పిలువబడానికి ఇష్టపడతారు.
MAT 23:8 “కానీ మీరు ‘రబ్బీ’ అని పిలిపించుకోవద్దు, ఎందుకంటే మీరందరు అన్నదమ్ములు, మీకు ఒక్కడే బోధకుడున్నాడు.
MAT 23:9 మీరు భూమి మీద ఎవరిని ‘తండ్రి’ అని పిలువద్దు ఎందుకంటే మీకు ఒక్కరే తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు.
MAT 23:10 మీరు ‘గురువులు’ అని పిలువబడవద్దు, మీకు ఒక్కడే గురువు, ఆయన క్రీస్తు.
MAT 23:11 మీలో గొప్పవాడు మీకు దాసునిగా ఉండాలి.
MAT 23:12 ఎందుకంటే తనను తాను హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు, తనను తాను తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు.
MAT 23:13 “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! కాబట్టి మీకు మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించే మనుష్యులను ప్రవేశించకుండా వారి ముఖం మీదనే తలుపు వేసేస్తున్నారు. మీరు దానిలో ప్రవేశించడంలేదు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వడంలేదు.
MAT 23:14 “వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు.
MAT 23:15 “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! ఒక్కడిని మీ మతంలో కలుపుకోడానికి, మీరు సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు, వాడు మీ మతంలో కలిసిన తర్వాత, వానిని మీకంటే రెండంతలు ఎక్కువ నరకానికి పాత్రునిగా చేస్తారు.
MAT 23:16 “వివేచనలేని గ్రుడ్డి మార్గదర్శకులారా మీకు శ్రమ! మీరంటున్నారు, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకొంటే, అందులో ఏమి లేదు; కాని దేవాలయ బంగారం తోడు అని ఒట్టు పెట్టుకొంటే వాడు దానికి కట్టుబడి ఉండాలి’ అని.
MAT 23:17 గ్రుడ్డి మూర్ఖులారా! ఏది గొప్పది? బంగారమా, లేదా బంగారాన్ని పరిశుద్ధపరచే దేవాలయమా?
MAT 23:18 అలాగే, ‘ఒకడు బలిపీఠం తోడు అని ఒట్టు పెట్టుకొంటే, అందులో ఏమి లేదు, కాని బలిపీఠం మీది అర్పణ తోడని ఒట్టు పెట్టుకొంటే దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెప్తారు.
MAT 23:19 గ్రుడ్డివారా! ఏది గొప్పది? అర్పణా లేదా అర్పణను పవిత్రపరిచే బలిపీఠమా?
MAT 23:20 కాబట్టి, ఎవడైనను బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొంటే దాని మీద ఉన్న వాటన్నిటి తోడు అని ఒట్టు పెట్టుకొంటున్నాడు.
MAT 23:21 ఎవడైన దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొంటే అందులో నివసించే వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకొంటున్నాడు.
MAT 23:22 అలాగే పరలోకం తోడని ఒట్టు పెట్టుకొనే వాడు దేవుని సింహాసనం తోడని దాని మీద కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకొంటున్నాడు.
MAT 23:23 “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను పదవ భాగం ఇస్తున్నారు. కాని ధర్మశాస్త్రంలోని చాలా ముఖ్యమైన విషయాలు అనగా న్యాయం, కనికరం, విశ్వాసం వంటి వాటిని నిర్లక్ష్యం చేశారు. మీరు మొదటివాటిని నిర్లక్ష్యం చేయకుండ, వెనుకటివాటిని పాటించాల్సింది.
MAT 23:24 గ్రుడ్డి మార్గదర్శకులారా! మీరు చిన్న దోమను వడగడతారు కాని ఒంటెను మ్రింగుతారు.
MAT 23:25 “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు గిన్నెను, పాత్రను బయట శుభ్రం చేస్తారు, కాని లోపల అత్యాశతో, స్వీయ సంతృప్తితో నిండి ఉన్నారు.
MAT 23:26 గ్రుడ్డి పరిసయ్యుడా! మొదట గిన్నె, పాత్ర లోపల శుద్ధిచేయాలి అప్పుడు బయట కూడా శుద్ధిగా ఉంటుంది.
MAT 23:27 “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు. అవి బయటకు అందంగా కనిపించినా లోపల మృతుల ఎముకలతోను అపవిత్రమైన దానితో నిండి ఉన్నాయి.
MAT 23:28 అలాగే మీరు బయట మనుష్యులకు నీతిమంతులుగా కనబడతారు కాని, లోపల వేషధారణ దుష్టత్వంతో నిండి ఉన్నారు.
MAT 23:29 “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు ప్రవక్తలకు సమాధులు కట్టిస్తున్నారు, నీతిమంతుల సమాధులను అలంకరిస్తున్నారు.
MAT 23:30 ఇంకా మీరు, ‘మేము మా పితరుల దినాల్లో ఉండి ఉంటే, ప్రవక్తల రక్తాన్ని చిందించడంలో వారితో పాలివారం కాదని’ చెప్పుకుంటారు.
MAT 23:31 ఈ విధంగా మీరు ప్రవక్తలను చంపిన మీరూ వారి సంతానమే అని మీకు మీరే సాక్ష్యం ఇస్తున్నారు.
MAT 23:32 కాబట్టి, ఇక మీ పితరులు ఆరంభించిన పనిని పూర్తి చేయండి.
MAT 23:33 “సర్పాల్లారా! సర్పసంతానమా! మీరు నరకానికి పోయే శిక్షను ఎలా తప్పించుకుంటారు?
MAT 23:34 అందుకే నేను మీ దగ్గరకు ప్రవక్తలను, జ్ఞానులను, బోధకులను పంపిస్తున్నాను. వారిలో కొందరిని మీరు చంపి సిలువ వేస్తారు; ఇంకొందరిని ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి తరిమి మీ సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టిస్తారు.
MAT 23:35 నీతిమంతుడు హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం దేవాలయానికి మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జెకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల నిరపరాధ రక్తదోషం అంతా మీ మీదికి వస్తుంది.
MAT 23:36 ఇవన్నీ ఈ తరం వారి మీదికే వస్తాయి అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAT 23:37 “యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపావు నీ దగ్గరకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టినదానా, ఒక కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను ఎలా చేర్చుకొంటుందో అలాగే నేను నీ పిల్లలను ఎన్నోసార్లు చేర్చుకోవాలని అనుకున్నాను కాని నీవు అంగీకరించలేదు.
MAT 23:38 చూడు, నీ ఇల్లు నిర్జనమైనదిగా నీకే విడిచిపెట్టబడుతుంది.
MAT 23:39 ‘ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!’ అని మీరు చెప్పే వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను” అన్నారు.
MAT 24:1 యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడాలను ఆయనకు చూపించారు.
MAT 24:2 అందుకు యేసు, “మీరు ఇవన్నీ చూస్తున్నారా? ఒక రాయి మీద ఇంకొక రాయి ఉండదు; ప్రతి ఒకటి పడవేయబడుతుంది అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు.
MAT 24:3 యేసు ఒలీవల కొండమీద కూర్చుని ఉన్నప్పుడు, తన శిష్యులు ఆయన దగ్గరకు ఒంటరిగా వచ్చారు. వారు, “ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడకు యుగాంతం కావడానికి సూచనలు ఏమైనా కనబడతాయా?” మాకు చెప్పుమని అడిగారు.
MAT 24:4 యేసు వారితో, “ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా ఉండండి.
MAT 24:5 ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే క్రీస్తును’ అని చెప్పి చాలామందిని మోసం చేస్తారు.
MAT 24:6 మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి వింటారు. కాని మీరు కలవరపడకుండ జాగ్రత్తగా ఉండండి. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం వెంటనే రాదు.
MAT 24:7 జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి.
MAT 24:8 ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే.
MAT 24:9 “అప్పుడు హింసించబడడానికి మరణానికి మీరు అప్పగించబడతారు, నన్ను బట్టి మీరు అన్ని రాజ్యాలచేత ద్వేషించబడతారు.
MAT 24:10 ఆ సమయంలో అనేకులు తమ నమ్మకాన్ని వదులుకొని ఒకరినొకరు ద్వేషించుకొని మోసగించుకుంటారు.
MAT 24:11 అప్పుడు అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎంతోమందిని మోసపరుస్తారు.
MAT 24:12 దుష్టత్వం ఎక్కువవుతూ ఉంటే అనేకుల ప్రేమ చల్లారుతుంది.
MAT 24:13 కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు.
MAT 24:14 ఈ రాజ్యసువార్త సమస్త దేశ ప్రజలకు సాక్ష్యంగా లోకమంతట ప్రకటింపబడిన తర్వాత, అంతం వస్తుంది.
MAT 24:15 “కాబట్టి ‘నిర్జనంగా మారడానికి కారణమైన హేయమైనది’ పరిశుద్ధ స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు, దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, చదివేవాడు అర్థం చేసుకొనును గాక.
MAT 24:16 అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి.
MAT 24:17 ఇంటిపైన ఉన్నవారెవరు క్రిందికి దిగకూడదు ఇంట్లోకి వెళ్లి దేన్ని బయటకు తీసుకురాకూడదు.
MAT 24:18 పొలంలో ఉన్నవారు తమ పైవస్త్రాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లకూడదు.
MAT 24:19 ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ!
MAT 24:20 అందుకే చలికాలంలో కాని సబ్బాతు దినాన కాని పారిపోయే పరిస్థితి రాకుండా ప్రార్థించండి.
MAT 24:21 ఎందుకంటే లోకం సృష్టించినప్పటి నుండి నేటి వరకు అలాంటి శ్రమ రాలేదు. మరి ఎప్పటికీ రాదు.
MAT 24:22 “ఒకవేళ ఆ దినాలను తగ్గించకపోతే ఎవ్వరూ తప్పించుకోలేరు, అయితే ఎన్నుకోబడినవారి కోసం ఆ రోజులు తగ్గించబడతాయి.
MAT 24:23 ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు!’ లేదా, ‘ఆయన అక్కడ ఉన్నాడు!’ అని చెప్పితే, నమ్మకండి.
MAT 24:24 ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయడానికి గొప్ప సూచకక్రియలను, అద్భుతాలను చేస్తారు.
MAT 24:25 చూడండి, ఈ విషయాలను నేను మీకు ముందుగానే చెప్పాను.
MAT 24:26 “కాబట్టి ఎవరైనా, ‘ఇదిగో, ఆయన అరణ్యంలో ఉన్నాడు’ అని మీతో చెబితే, వెళ్లకండి; లేదా ‘ఇదిగో ఆయన ఇక్కడ, లోపలి గదిలో ఉన్నాడు’ అని చెప్పితే నమ్మకండి.
MAT 24:27 మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడుతుందో, అలాగే మనుష్యకుమారుని రాకడ ఉంటుంది.
MAT 24:28 ఎక్కడ పీనుగు ఉంటే అక్కడ గద్దలు పోగవుతాయి.
MAT 24:29 “ఆ శ్రమకాలం ముగిసిన వెంటనే, “ ‘సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి.’
MAT 24:30 “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూప్రజలందరు మనుష్యకుమారుడు తన ప్రభావంతో, గొప్ప మహిమతో ఆకాశ మేఘాల మీద రావడం చూసి ప్రజలు రొమ్ము కొట్టుకొంటూ రోదిస్తారు.
MAT 24:31 గొప్ప బూర శబ్దంతో పిలుపుతో ఆయన తన దూతలను పంపుతారు, వారు నలుదిక్కుల నుండి, ఆకాశాల ఒక చివర నుండి మరొక చివర వరకు ఆయనచేత ఎన్నుకోబడిన వారిని పోగుచేస్తారు.
MAT 24:32 “అంజూర చెట్టును చూసి ఒక పాఠం నేర్చుకోండి: అంజూర కొమ్మలు లేతవై చిగురిస్తున్నప్పుడు వేసవికాలం సమీపంగా ఉందని మీకు తెలుస్తుంది.
MAT 24:33 ఆ ప్రకారంగానే, ఈ సంగతులన్ని జరుగుతున్నాయని మీరు చూసినప్పుడు, ఆయన రాకడ దగ్గరలో, ద్వారం దగ్గరే ఉందని మీరు తెలుసుకోండి.
MAT 24:34 ఇవన్నీ జరిగే వరకు, ఈ తరం గతించదని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను.
MAT 24:35 ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు.
MAT 24:36 “అయితే ఆ దినం గురించి ఆ సమయం గురించి ఎవరికి తెలియదు, కనీసం పరలోకంలోని దూతలకు గాని, తన కుమారునికి గాని తెలియదు. కేవలం తండ్రికి మాత్రమే తెలుసు,
MAT 24:37 నోవహు దినాల్లో ఎలా ఉన్నదో, మనుష్యకుమారుని రాకడలో కూడా అలాగే ఉంటుంది.
MAT 24:38 జలప్రళయానికి ముందు దినాల్లో, నోవహు ఓడలోనికి వెళ్లిన రోజు వరకు, ప్రజలు తింటూ, త్రాగుతూ, పెండ్లి చేసుకొంటూ, పెండ్లికిస్తూ ఉన్నారు.
MAT 24:39 ఆ జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోయే వరకు వారికి తెలియలేదు. మనుష్యకుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది.
MAT 24:40 ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు కొనిపోబడతారు ఇంకొకరు విడవబడతారు.
MAT 24:41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతుంటారు, ఒక స్త్రీ కొనిపోబడుతుంది ఇంకొక స్త్రీ విడవబడుతుంది.
MAT 24:42 “కాబట్టి ఏ దినం మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు, కాబట్టి మెలకువగా ఉండండి.
MAT 24:43 ఈ విషయం అర్థం చేసుకోండి: దొంగ రాత్రి ఏ జామున వస్తాడో ఒకవేళ ఇంటి యజమానికి తెలిస్తే, అతడు తన ఇంటికి కన్నం వేయకుండా మెలకువగా ఉంటాడు.
MAT 24:44 కాబట్టి మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు, కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి.
MAT 24:45 “యజమాని తన ఇంట్లోని పనివారికి తగిన సమయాల్లో భోజనం పెట్టి, వారిని పర్యవేక్షించడానికి వారిపై పర్యవేక్షకునిగా నియమించడానికి, నమ్మకమైన, జ్ఞానం కలిగిన సేవకుడు ఎవడు?
MAT 24:46 యజమాని తిరిగి వచ్చినప్పుడు ఆ సేవకుడు అలా చేస్తూ కనిపించడం మంచిది.
MAT 24:47 ఆ యజమాని తన యావదాస్తి మీద అతన్ని అధికారిగా ఉంచుతాడని, నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను.
MAT 24:48 కాని ఒకవేళ ఆ సేవకుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడు’ అని తన మనస్సులో అనుకుని,
MAT 24:49 తన తోటి సేవకులను కొట్టడం మొదలుపెట్టి త్రాగుబోతులతో కలిసి తిని త్రాగుతూ ఉంటాడు.
MAT 24:50 అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు.
MAT 24:51 అతడు వాన్ని ముక్కలుగా నరికి వేషధారులతో అతనికి చోటు ఇస్తాడు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.
MAT 25:1 “పరలోక రాజ్యం తమ దీపాలను పట్టుకుని పెండ్లికుమారుని ఎదుర్కోడానికి బయలుదేరిన పదిమంది కన్యలను పోలి ఉంది.
MAT 25:2 వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు.
MAT 25:3 బుద్ధిలేని వారు తమ దీపాలను పట్టుకున్నారు కాని తమతో నూనెను తీసుకుపోలేదు.
MAT 25:4 బుద్ధిగలవారు, తమ దీపాలతో పాటు సీసాల్లో నూనె తీసుకెళ్లారు.
MAT 25:5 పెండ్లికుమారుడు రావడానికి ఆలస్యం అయ్యింది, అంతలో వారందరు కునికి నిద్రపోయారు.
MAT 25:6 “అర్థరాత్రి సమయంలో ‘ఇదిగో, పెండ్లికుమారుడు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కోడానికి రండి!’ అనే కేక వినపడింది.
MAT 25:7 “అప్పుడు ఆ కన్యలందరు లేచి తమ దీపాలను సరిచేసికొని వెలిగించుకున్నారు.
MAT 25:8 గాని బుద్ధిలేని కన్యలు బుద్ధిగల కన్యలతో, ‘మా దీపాలు ఆరిపోతున్నాయి; మాకు కొంచెం నూనెను ఇవ్వండి’ అని అడిగారు.
MAT 25:9 “అందుకు బుద్ధిగల కన్యలు, ‘లేదు, మాకు మీకు అది సరిపోదు, మీరు అమ్మేవారి దగ్గరకు పోయి కొనుక్కోండి’ అని చెప్పారు.
MAT 25:10 “వారు కొనడానికి వెళ్తున్నప్పుడే, పెండ్లికుమారుడు వచ్చాడు. సిద్ధపడి ఉన్న కన్యలు ఆయనతో కూడ పెండ్లివిందుకు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత తలుపు మూయబడింది.
MAT 25:11 “ఆ తర్వాత మిగతావారు వచ్చి, ‘ప్రభువా, ప్రభువా, మాకోసం తలుపు తెరవండి!’ అన్నారు.
MAT 25:12 “కాని అతడు, ‘నేను మీతో నిజం చెప్తున్న, మీరు ఎవరో నాకు తెలియదు’ అని జవాబిచ్చాడు.
MAT 25:13 “కాబట్టి మెలకువగా ఉండండి, ఎందుకంటే ఆ దినం కాని ఆ గంట కాని మీకు తెలియదు” అని చెప్పారు.
MAT 25:14 యేసు మరొక ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం, దూర దేశానికి ప్రయాణమై, తన ఇంట్లో పని చేసి సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించిన ఒక మనుష్యుని పోలి ఉంది.
MAT 25:15 ఆయన వారిలో ఒకనికి అయిదు తలాంతుల బంగారం, ఇంకొకనికి రెండు తలాంతుల బంగారం, మరొకనికి ఒక తలాంతు బంగారం, ఎవని సామర్థ్యాన్ని బట్టి వానికి ఇచ్చాడు. తర్వాత అతడు ప్రయాణమై వెళ్లాడు.
MAT 25:16 అయిదు తలాంతుల బంగారం తీసుకున్నవాడు వెంటనే వెళ్లి వెంటనే ఆ డబ్బుతో వ్యాపారం చేసి ఇంకా అయిదు తలాంతులను సంపాదించాడు.
MAT 25:17 అలాగే, రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు మరి రెండు సంపాదించాడు.
MAT 25:18 అయితే ఒక తలాంతు బంగారం తీసికొన్నవాడు మాత్రం వెళ్లి, భూమిలో ఒక గుంట త్రవ్వి దానిలో తన యజమానుని ఇచ్చిన ఒక్క తలాంతును దాచిపెట్టాడు.
MAT 25:19 “చాలా కాలం తర్వాత ఆ యజమానుడు తిరిగివచ్చి వారి దగ్గర లెక్క చూసుకొన్నాడు.
MAT 25:20 అయిదు తలాంతుల బంగారం తీసికొన్నవాడు ఇంకా అయిదు తలాంతులు తెచ్చి, ‘యజమానుడా, నీవు నాకు అయిదు తలాంతుల బంగారం అప్పగించావు. చూడు, నేను ఇంకా అయిదు తలాంతులను సంపాదించాను’ అని చెప్పాడు.
MAT 25:21 “అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు.
MAT 25:22 “అలాగే రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు కూడా వచ్చాడు. అతడు ‘యజమానుడా, నీవు నాకు రెండు తలాంతుల బంగారం అప్పగించావు; చూడు, నేను ఇంకా రెండు తలాంతులను సంపాదించాను’ అని చెప్పాడు.
MAT 25:23 “అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు.
MAT 25:24 “ఆ తర్వాత ఒక తలాంతు బంగారం తీసికొన్నవాడు వచ్చి, ‘యజమానుడా, నీవు కఠినుడవని, విత్తనాలు విత్తని చోట పంట కోసేవాడవు, వెదజల్లని చోట పంట కూర్చుకునే వాడవని నాకు తెలుసు.
MAT 25:25 కాబట్టి నేను భయపడి వెళ్లి, నీ తలాంతు బంగారాన్ని భూమిలో దాచి పెట్టాను’ అని చెప్పాడు.
MAT 25:26 “అందుకు అతని యజమానుడు వానితో, ‘సోమరియైన చెడ్డ దాసుడా! నేను విత్తనాలు విత్తని చోట కోసే వాడను అని, వెదజల్లని చోట పంట కూర్చుకునే వాడనని నీకు తెలుసు కదా?
MAT 25:27 అలాగైతే, నీవు నా సొమ్మును వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టాల్సింది, అప్పుడు నేను వచ్చి దానిని వడ్డీతో కలిపి తీసుకునేవాన్ని’ అన్నాడు.
MAT 25:28 “ఆ తలాంతును వాని దగ్గరి నుండి తీసుకుని, పది తలాంతుల గలవానికి ఇవ్వండి.
MAT 25:29 ఎందుకంటే కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, అతడు సమృద్ధిగా కలిగి ఉంటాడు. లేనివారి నుండి, వారు కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది.
MAT 25:30 అయితే పనికిమాలిన ఈ దాసుని బయటకు చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.”
MAT 25:31 మనుష్యకుమారుడు తన మహిమలో, దేవదూతలందరితో వచ్చేటప్పుడు, ఆయన తన మహిమగల సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.
MAT 25:32 భూప్రజలందరు ఆయన ముందు పోగు చేయబడి ఉంటారు, ఒక గొర్రెల కాపరి మేకల నుండి గొర్రెలను వేరు చేసినట్లు ఆయన వారిని వేరు చేస్తాడు.
MAT 25:33 ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను వేరుగా నిలబెడతాడు.
MAT 25:34 అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారితో, “నా తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా; రండి! లోకం సృజింపబడినప్పటి నుండి మీ కోసం సిద్ధపరచి ఉంచిన మీ వారసత్వ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి.
MAT 25:35 ఎందుకంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు త్రాగడానికి ఇచ్చారు. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకొన్నారు.
MAT 25:36 నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకున్నారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించారు” అని చెప్తాడు.
MAT 25:37 “అప్పుడు ఆ నీతిమంతులు, ‘ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలితో ఉన్నావని చూసి ఆహారం పెట్టాం? ఎప్పుడు దప్పికతో ఉన్నావని చూసి నీ దాహం తీర్చాము?
MAT 25:38 ఎప్పుడు నీవు పరదేశివని చూసి నిన్ను మా ఇంట్లోకి చేర్చుకున్నాము? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూసి బట్టలు ఇచ్చాము?
MAT 25:39 ఎప్పుడు నిన్ను రోగిగా చూసి లేదా చెరసాలలో చూసి పరామర్శించాము?’ అని ఆయనను అడుగుతారు.
MAT 25:40 “అందుకు ఆ రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేశారు కాబట్టి, నాకు చేసినట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.
MAT 25:41 “అప్పుడు ఆయన తన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి, అపవాది వాని దూతల కోసం సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్లిపొండి.
MAT 25:42 ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు, దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు దాహం తీర్చలేదు,
MAT 25:43 నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకోలేదు, నాకు బట్టలు లేనప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగిగా చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించలేదు’ అని చెప్తాడు.
MAT 25:44 “అందుకు వారు, ‘ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలితో ఉండడం లేదా దాహంతో ఉండడం లేదా పరదేశిగా ఉండడం లేదా బట్టలు లేనివానిగా ఉండడం లేదా రోగిగా లేదా చెరసాలలో ఉండడం చూసి సహాయం చేయలేదు?’ అడుగుతారు.
MAT 25:45 “అందుకు రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేయలేదు కాబట్టి నాకు చేయనట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.
MAT 25:46 “అప్పుడు వారు నిత్య శిక్షలోనికి ప్రవేశిస్తారు, కాని నీతిమంతులు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు.”
MAT 26:1 యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత, ఆయన తన శిష్యులతో,
MAT 26:2 “మీకు తెలిసినట్లు, పస్కాకు ఇంకా రెండు రోజులున్నాయి, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడడానికి అప్పగించబడతాడు” అని చెప్పారు.
MAT 26:3 అప్పుడు ముఖ్య యాజకులు, ప్రజానాయకులు కలిసి కయప అనబడే ప్రధాన యాజకుని నివాసంలో సమావేశమయ్యారు.
MAT 26:4 వారు యేసును రహస్యంగా పట్టుకుని, చంపాలి అని కుట్రపన్నారు.
MAT 26:5 కాని పండుగ సమయంలో వద్దు, “జనాల మధ్య అల్లరి కలుగుతుందేమో” అని చెప్పుకున్నారు.
MAT 26:6 యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు,
MAT 26:7 ఒక స్త్రీ చాలా ఖరీదైన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, ఆయన భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన తలమీద ఆ పరిమళద్రవ్యంను పోసింది.
MAT 26:8 శిష్యులు అది చూసి కోప్పడి, “ఇలా ఎందుకు వృధా చేయడం?” అని అడిగారు.
MAT 26:9 వారు, “ఈ పరిమళద్రవ్యాన్ని ఎక్కువ వెలకు అమ్మి ఆ డబ్బు పేదవారికి ఇచ్చి ఉండాల్సింది” అన్నారు.
MAT 26:10 యేసు ఆ సంగతి గ్రహించి వారితో, “ఈ స్త్రీని ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా కోసం ఒక మంచి కార్యం చేసింది.
MAT 26:11 పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, కాని నేను మీతో ఉండను.
MAT 26:12 ఈమె ఈ పరిమళద్రవ్యంను నా శరీరం మీద పోసి, నా భూస్థాపన కోసం నన్ను సిద్ధం చేసింది.
MAT 26:13 సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడినా, అక్కడ ఈమె చేసింది జ్ఞాపకం చేసుకుని, ఈమె చేసిన దాని గురించి కూడా చెప్పుకుంటారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు.
MAT 26:14 అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్య యాజకుల దగ్గరకు వెళ్లి,
MAT 26:15 “నేను యేసును మీకు పట్టించడానికి నాకు ఏమి ఇస్తారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు ముప్పై వెండి నాణాలు లెక్కపెట్టి వానికి ఇచ్చారు.
MAT 26:16 వాడు అప్పటినుండి ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు.
MAT 26:17 పులియని రొట్టెల పండుగ మొదటి రోజున, శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “నీకోసం పస్కా భోజనం సిద్ధం చేయడానికి మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటావు?” అని అడిగారు.
MAT 26:18 అందుకు యేసు, “మీరు పట్టణంలో ఫలాన వ్యక్తి దగ్గరకు వెళ్లి, అతనితో, బోధకుడు ఇలా అన్నాడు: నా సమయం దగ్గరకు వచ్చింది. నేను నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కాను ఆచరిస్తాను అని చెప్పమన్నాడు అని చెప్పండి” అన్నారు.
MAT 26:19 శిష్యులు వెళ్లి యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేసి పస్కాను సిద్ధం చేశారు.
MAT 26:20 సాయంకాలమైనప్పుడు, ఆయన పన్నెండుమంది శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు.
MAT 26:21 వారు భోజనం చేస్తూ ఉండగా, ఆయన వారితో, “మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అని అన్నారు.
MAT 26:22 అందుకు వారు చాలా దుఃఖపడి, “ప్రభువా, నేనైతే కాదు కదా?” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనను అడగడం మొదలుపెట్టారు.
MAT 26:23 అందుకు యేసు, “నాతో పాటు గిన్నెలో చేయి ముంచిన వాడే నన్ను అప్పగిస్తాడు.
MAT 26:24 మనుష్యకుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన వెళ్లిపోతారు. కాని మనుష్యకుమారుని పట్టించే వానికి శ్రమ! ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మేలు” అని అన్నారు.
MAT 26:25 అప్పుడు ఆయనను అప్పగించబోయే యూదా, “బోధకుడా, నేనైతే కాదు కదా?” అని అడిగాడు. అందుకు యేసు, “అలా నీవే చెప్పావు” అని జవాబిచ్చారు.
MAT 26:26 వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకుని, దాని కోసం కృతజ్ఞతలు చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకుని తినండి; ఇది నా శరీరం” అని చెప్పారు.
MAT 26:27 తర్వాత ఆయన పాత్రను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి, “దీనిలోనిది మీరందరు త్రాగండి.
MAT 26:28 ఇది అనేకుల పాపక్షమాపణ కోసం నేను చిందించనున్న నా నిబంధన రక్తము.
MAT 26:29 నేను మీతో చెప్పేదేమనగా, నా తండ్రి రాజ్యంలో మీతో కూడ నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగను.”
MAT 26:30 వారు ఒక కీర్తన పాడిన తర్వాత, ఒలీవల కొండకు వెళ్లారు.
MAT 26:31 అప్పుడు యేసు వారితో, “నన్ను బట్టి ఈ రాత్రి మీరందరు చెదరిపోతారు ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నేను గొర్రెల కాపరిని కొడతాను, అప్పుడు మందలోని గొర్రెలు చెదిరిపోతాయి.’
MAT 26:32 కాని నేను తిరిగి లేచిన తర్వాత, మీకంటే ముందు గలిలయకు వెళ్తాను” అన్నారు.
MAT 26:33 అందుకు పేతురు, “అందరు నిన్ను విడిచి వెళ్లిపోయినా, నేను నిన్ను విడువను” అన్నాడు.
MAT 26:34 అందుకు యేసు అతనితో, “ఈ రాత్రి కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
MAT 26:35 కాని పేతురు యేసుతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా, నీవెవరో నాకు తెలియదని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరు కూడా అలాగే అన్నారు.
MAT 26:36 ఆ తర్వాత యేసు తన శిష్యులతో కూడ గెత్సేమనే అనే చోటికి వెళ్లారు, ఆయన వారితో, “నేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చేవరకు మీరు ఇక్కడే కూర్చోండి” అని అన్నారు.
MAT 26:37 ఆయన పేతురును, జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుతూ బాధపడసాగారు.
MAT 26:38 ఆయన వారితో, “నేను చనిపోయే అంతగా నా ఆత్మ దుఃఖంతో నిండి ఉంది, కాబట్టి మీరు ఇక్కడే ఉండి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పారు.
MAT 26:39 కొంత దూరం వెళ్లి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి తొలగిపోనివ్వు. అయినా నా చిత్తప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించు” అని ప్రార్థించారు.
MAT 26:40 యేసు తిరిగి తన శిష్యుల దగ్గరకు వచ్చి, వారు నిద్రిస్తున్నారని చూసి పేతురుతో, “ఒక గంటయైనా నాతో మెలకువగా ఉండలేరా?” అని అడిగి,
MAT 26:41 “మీరు శోధనలో పడకుండ ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం” అని చెప్పారు.
MAT 26:42 ఆయన రెండవసారి వెళ్లి ప్రార్థించారు, “నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే తప్ప ఇది నా దగ్గరి నుండి తొలగిపోవడం సాధ్యం కానట్లైతే, నీ చిత్తమే నెరవేర్చు.”
MAT 26:43 ఆయన తిరిగి వచ్చినప్పుడు, వారి కళ్లు బరువుగా ఉన్నాయి, కాబట్టి వారు మళ్ళీ నిద్రపోతున్నారని గమనించారు.
MAT 26:44 కాబట్టి ఆయన మరొకసారి వారిని విడిచివెళ్లి, ఆ మాటలనే పలుకుతూ మూడవసారి ప్రార్థించారు.
MAT 26:45 అప్పుడు ఆయన తన శిష్యుల దగ్గరకు తిరిగివచ్చి, “మీరు ఇంకా నిద్రిస్తు విశ్రాంతి తీసుకొంటున్నారా? చూడండి, మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది.
MAT 26:46 వెళ్దాం రండి. నన్ను పట్టించేవాడు వస్తున్నాడు” అని చెప్పారు.
MAT 26:47 ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు ప్రజానాయకులు పంపిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకుని వచ్చింది.
MAT 26:48 ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు, “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించాలి”
MAT 26:49 యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా, నీకు శుభం” అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు.
MAT 26:50 అందుకు యేసు, “స్నేహితుడా, ఏమి చేయడానికి వచ్చావో అది చేయి” అన్నారు. అప్పుడు వారు ముందుకు వచ్చి, యేసును పట్టుకొని, ఆయనను బంధించారు.
MAT 26:51 అంతలో, యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, వాని చెవిని నరికివేశాడు.
MAT 26:52 యేసు వానితో, “నీ కత్తిని దాని ఒరలో తిరిగిపెట్టు, ఎందుకంటే కత్తి ఉపయోగించేవాడు కత్తితోనే చస్తాడు.
MAT 26:53 ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే, ఆయన పన్నెండు దళాల సైన్యం కంటే ఎక్కువ మంది దూతలను వెంటనే నాకు పంపడని అనుకున్నావా?
MAT 26:54 కాని, ఈ విధంగా జరగాలని లేఖనాల్లో చెప్పబడినవి ఎలా నెరవేరుతాయి?” అని అన్నారు.
MAT 26:55 ఆ సమయంలోనే యేసు ఆ గుంపుతో, “నన్ను పట్టుకోడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా? నేను ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో కూర్చుని బోధించేటప్పుడు, మీరు నన్ను బంధించలేదు.
MAT 26:56 అయితే ప్రవక్తలు వ్రాసిన లేఖనాలు నెరవేరడానికే ఈ విధంగా జరిగింది” అని చెప్పారు. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయారు.
MAT 26:57 యేసును బంధించినవారు ఆయనను ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు యూదా నాయకులు సమావేశమై ఉన్నారు.
MAT 26:58 అయితే పేతురు ప్రధాన యాజకుని ఇంటి ప్రాంగణం వరకు, ఆయనను దూరం నుండి వెంబడిస్తూ వచ్చాడు. లోపల ఏమి జరుగుతుందో చూడాలని అక్కడే సైనికులతో కూర్చున్నాడు.
MAT 26:59 ముఖ్య యాజకులు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలను వెదకుతున్నారు.
MAT 26:60 చాలామంది అబద్ధ సాక్షులు ముందుకు వచ్చారు, కానీ వారికి ఏమి దొరకలేదు. చివరికి ఇద్దరు సాక్షులు ముందుకొచ్చారు.
MAT 26:61 వారిచ్చిన సాక్ష్యం ఏంటంటే, “ఈయన దేవాలయాన్ని పడగొట్టి, మూడు దినాల్లో దానిని లేపుతాను అని చెప్పాడు.”
MAT 26:62 అప్పుడు ప్రధాన యాజకుడు లేచి యేసుతో, “నీవు జవాబు చెప్పవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న ఈ సాక్ష్యం ఏమిటి?” అని అడిగాడు.
MAT 26:63 అయితే యేసు మౌనంగా ఉన్నారు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “జీవంగల దేవుని తోడని నిజం చెప్పు: ఒకవేళ నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే మాతో చెప్పు” అన్నాడు.
MAT 26:64 అందుకు యేసు, “నీవు చెప్పినట్లే. అయితే ఇప్పటినుండి మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారని మీ అందరికి చెప్తున్నాను.”
MAT 26:65 అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రాలను చింపుకొని, “వీడు దైవదూషణ చేశాడు! ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? చూడండి, ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు.
MAT 26:66 మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు. వారు, “ఇతనికి మరణశిక్ష విధించాలి” అని సమాధానం ఇచ్చారు.
MAT 26:67 అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఆయనను వారి పిడికిళ్ళతో గుద్దారు, మరికొందరు ఆయనను తమ అరచేతులతో కొట్టి,
MAT 26:68 “క్రీస్తు, నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు” అన్నారు.
MAT 26:69 పేతురు బయట ప్రాంగణంలో కూర్చుని ఉన్నప్పుడు, అక్కడ ఒక దాసియైన అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది. “నీవు కూడా గలిలయవాడైన యేసుతో ఉన్నవాడివే” అన్నది.
MAT 26:70 అయితే పేతురు అందరి ముందు తిరస్కరించి, “నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అన్నాడు.
MAT 26:71 తర్వాత అతడు ద్వారం వైపు వెళ్లాడు, అక్కడ మరొక దాసియైన అమ్మాయి అతన్ని చూసి అక్కడ ఉండిన ప్రజలతో, “ఇతడు నజరేయుడైన యేసుతో ఉన్నవాడే” అని చెప్పింది.
MAT 26:72 పేతురు ఈసారి ఒట్టు పెట్టుకొంటూ, “అతడు నాకు తెలియదు” అని మళ్ళీ తిరస్కరించాడు.
MAT 26:73 కొంతసేపటి తర్వాత, అక్కడ నిలబడినవారు పేతురు దగ్గరకు వెళ్లి, “ఖచ్చితంగా నీవు కూడ వారిలో ఒకడివి; నీ మాట తీరే చెప్తుంది” అన్నారు.
MAT 26:74 అప్పుడు పేతురు శపించడం మొదలుపెట్టి, “అతని గురించి నాకు తెలియదు!” అని వారితో ప్రమాణం చేశాడు. వెంటనే కోడి కూసింది.
MAT 26:75 “కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు” అని యేసు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకుని బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.
MAT 27:1 తెల్లవారుజామున ముఖ్య యాజకులు, ప్రజానాయకులు కలిసి యేసును ఎలా చంపాలి అని ఆలోచన చేశారు.
MAT 27:2 కాబట్టి వారు ఆయనను బంధించి, తీసుకెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు.
MAT 27:3 అప్పుడు యేసును అప్పగించిన యూదా, యేసుకు శిక్ష వేయడం చూసి, తాను చేసిన దోషాన్ని బట్టి పశ్చాత్తాపపడి, ఆ ముప్పై వెండి నాణాలను ముఖ్య యాజకులు యూదా నాయకులకు తిరిగి ఇవ్వడానికి వెళ్లాడు.
MAT 27:4 అతడు వారితో, “నేను ఒక నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి, పాపం చేశాను” అని అన్నాడు. అందుకు వారు, “దానితో మాకేంటి? అది నీ సమస్య” అని జవాబిచ్చారు.
MAT 27:5 అప్పుడు యూదా ఆ వెండి నాణాలను దేవాలయంలో విసిరి వేసి అక్కడినుండి వెళ్లి, ఉరి వేసుకున్నాడు.
MAT 27:6 ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలను తీసుకుని, “ఇవి రక్తపు వెల కాబట్టి వీటిని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పి,
MAT 27:7 వారు ఆలోచించి ఆ డబ్బుతో విదేశీయులను సమాధి చేయడానికి ఒక కుమ్మరి వాని పొలం కొన్నారు.
MAT 27:8 అందుకే నేటి వరకు ఆ పొలం రక్తపొలం అని పిలువబడుతూ ఉంది.
MAT 27:9 ఈ విధంగా యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పబడిన: “వారు ముప్పై వెండి నాణేలు తీసుకున్నారు, అవి ఇశ్రాయేలీయులు ఆయనకు కట్టిన విలువ, ప్రభువు నన్ను ఆదేశించిన ప్రకారం, వారు ఆ డబ్బుతో కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు,” అనే ప్రవచనం నెరవేరింది.
MAT 27:11 తర్వాత యేసు పిలాతు అధిపతి ఎదుట నిలబడ్డాడు. అప్పుడు అధిపతి, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, “అని నీవే అన్నావు కదా” అని జవాబిచ్చారు.
MAT 27:12 ముఖ్య యాజకులు యూదానాయకులును యేసు మీద నిందలు మోపినప్పుడు, ఆయన వాటికి జవాబివ్వలేదు.
MAT 27:13 అందుకు పిలాతు, “వారు నీకు వ్యతిరేకంగా తెస్తున్న సాక్ష్యాన్ని నీవు వినడం లేదా?” అని అడిగాడు.
MAT 27:14 కాని కనీసం ఒకదానికైనా యేసు జవాబివ్వలేదు, అధిపతికి చాలా ఆశ్చర్యం కలిగింది.
MAT 27:15 పండుగ రోజు ప్రజల ఎన్నుకున్న ఒక నేరస్థుని విడుదల చేయడం అధిపతికి ఆనవాయితి.
MAT 27:16 ఆ సమయంలో బందిపోటు దొంగగా పేరుమోసిన బరబ్బ అనే ఖైదీ ఉన్నాడు.
MAT 27:17 కాబట్టి జనసమూహం సమకూడినప్పుడు, పిలాతు, “నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు? యేసు అనబడిన బరబ్బనా లేదా క్రీస్తు అనబడిన యేసునా?” అని వారిని అడిగాడు.
MAT 27:18 ఎందుకంటే వారు కేవలం అసూయతోనే యేసును అప్పగించారని అతడు గ్రహించాడు.
MAT 27:19 పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, అతని భార్య అతనికి: “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు, రాత్రి కలలో ఆయన గురించి నేను చాలా కష్టపడ్డాను” అని వర్తమానం పంపింది.
MAT 27:20 కాని ముఖ్య యాజకులు నాయకులు బరబ్బాను విడుదల చేసి యేసును చంపమని అడిగేలా ప్రజలను రెచ్చగొట్టారు.
MAT 27:21 అధిపతి, “ఈ ఇద్దరిలో నేను ఎవనిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని వారిని అడిగాడు. వారు, “బరబ్బనే” అని కేకలు వేశారు.
MAT 27:22 అందుకు పిలాతు, “అలాగైతే క్రీస్తు అనబడిన యేసును, ఏమి చేయాలి?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
MAT 27:23 “ఎందుకు? ఇతడు చేసిన నేరమేంటి?” అని పిలాతు అడిగాడు. అయితే వారు ఇంకా గట్టిగా, “అతన్ని సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
MAT 27:24 పిలాతు అల్లరి ఎక్కువ అవుతుంది తప్ప తాను ఏమి చేయలేకపోతున్నానని గ్రహించి, నీళ్లు తీసుకుని ప్రజలందరి ముందు తన చేతులను కడుక్కుని, “ఈయన రక్తం విషయంలో నేను నిర్దోషిని, ఇక మీదే బాధ్యత!” అని చెప్పాడు.
MAT 27:25 అప్పుడు ప్రజలందరు, “ఇతని రక్తం మామీద మా పిల్లల మీద ఉండును గాక!” అని కేకలు వేశారు.
MAT 27:26 అప్పుడు పిలాతు బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయడానికి అప్పగించాడు.
MAT 27:27 అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి, సైనికులందరిని యేసు చుట్టూ సమకూర్చారు.
MAT 27:28 వారు ఆయన బట్టలను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించారు.
MAT 27:29 ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఒక కర్ర తన కుడిచేతిలో ఉంచారు. అప్పుడు ఆయన ఎదుట మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అని అంటూ ఆయనను ఎగతాళి చేశారు.
MAT 27:30 వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసుకుని దానితో ఆయనను తలమీద పదే పదే కొట్టారు.
MAT 27:31 వారు ఆయనను ఎగతాళి చేసిన తర్వాత, ఆయన మీదున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రాలను ఆయనకే తొడిగించారు. ఆ తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్లారు.
MAT 27:32 వారు వెళ్తుండగా, కురేనీయ పట్టణానికి చెందిన, సీమోను అనే ఒకడు కనిపించగానే, వారు అతన్ని సిలువ మోయడానికి బలవంతం చేశారు.
MAT 27:33 వారు గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము.
MAT 27:34 అక్కడ వారు చేదు కలిపిన, ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు; గాని ఆయన దాని రుచి చూసి, త్రాగడానికి ఒప్పుకోలేదు.
MAT 27:35 వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు.
MAT 27:36 వారు అక్కడే కూర్చుని, ఆయనకు కాపలాగా ఉన్నారు.
MAT 27:37 ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలపైన బిగించారు: ఇతడు యేసు, యూదుల రాజు.
MAT 27:38 ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను, కుడి వైపున ఒకడిని, ఎడమవైపున ఒకడిని సిలువ వేశారు.
MAT 27:39 ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ,
MAT 27:40 “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు, నిన్ను నీవే రక్షించుకో! నీవు దేవుని కుమారుడవైతే, సిలువ మీద నుండి దిగిరా” అని అంటూ దూషించారు.
MAT 27:41 అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు కూడా ఆయనను ఎగతాళి చేశారు,
MAT 27:42 “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు! ఇశ్రాయేలీయుల రాజు కదా! ఇప్పుడు సిలువ మీది నుండి దిగివస్తే, మేము ఇతన్ని నమ్ముతాము.
MAT 27:43 వీడు దేవుని నమ్మాడు. ‘నేను దేవుని కుమారుడనని’ చెప్పుకొన్నాడు కదా, దేవునికి ఇష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అన్నారు.
MAT 27:44 ఆయనతో కూడా సిలువవేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు.
MAT 27:45 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది.
MAT 27:46 ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, “నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు?” అని అర్థము.
MAT 27:47 అక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు ఆ మాట విని, “ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.
MAT 27:48 వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని వెళ్లి ఒక స్పంజీని తెచ్చాడు. దాన్ని ఆ చేదు చిరకలో ముంచి, కర్రకు తగిలించి, యేసుకు త్రాగడానికి అందించాడు.
MAT 27:49 మిగిలిన వారు, “ఇప్పుడు వీన్ని ఒంటరిగా వదిలి వేద్దాము. ఏలీయా వచ్చి వీన్ని రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు.
MAT 27:50 యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు.
MAT 27:51 ఆ క్షణంలో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి.
MAT 27:52 సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన చాలామంది పరిశుద్ధుల శరీరాలు జీవంతో లేచాయి.
MAT 27:53 యేసు లేచిన తర్వాత వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి, పరిశుద్ధ పట్టణంలో చాలామందికి కనిపించారు.
MAT 27:54 శతాధిపతి అతనితో కూడ యేసుకు కాపలా కాస్తున్నవారు వచ్చిన భూకంపాన్ని జరిగిన కార్యాలన్నిటిని చూసి, వారు భయపడి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అని చెప్పుకొన్నారు.
MAT 27:55 అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, వారు దూరంగా నిలబడి చూస్తున్నారు. వారు యేసుకు సపర్యలు చేస్తూ గలిలయ నుండి ఆయనను వెంబడించారు.
MAT 27:56 వారిలో మగ్దలేనే మరియ, యాకోబు యోసేపుల తల్లియైన మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.
MAT 27:57 సాయంకాలం అవుతున్నప్పుడు, తనకు తానే యేసు శిష్యునిగా మారిన, అరిమతయికు చెందిన యోసేపు అనే ధనవంతుడు వచ్చాడు.
MAT 27:58 అతడు పిలాతు దగ్గరకు వెళ్లి, యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు, అందుకు పిలాతు దానిని అతనికి అప్పగించమని ఆదేశించాడు.
MAT 27:59 యోసేపు ఆ దేహాన్ని తీసుకుని, శుభ్రమైన నారబట్టతో చుట్టి,
MAT 27:60 తన కోసం రాతిలో తొలిపించుకొన్న క్రొత్త సమాధిలో దానిని పెట్టాడు. ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి దొర్లించి వెళ్లిపోయాడు.
MAT 27:61 మగ్దలేనే మరియ, వేరొక మరియ అక్కడే ఆ సమాధి ఎదుట కూర్చుని ఉన్నారు.
MAT 27:62 మరుసటిరోజు, అనగా సిద్ధపరచే దినానికి తర్వాత రోజు, ముఖ్య యాజకులు పరిసయ్యులు పిలాతు దగ్గరకు వెళ్లారు.
MAT 27:63 వారు, “అయ్యా, ఆ మోసగాడు జీవిస్తున్నప్పుడే, ‘మూడు దినాల తర్వాత నేను లేస్తాను’ అని పలికిన మాట మాకు జ్ఞాపకం ఉంది.
MAT 27:64 కాబట్టి మూడవ దినం వరకు సమాధిని భద్రం చేయడానికి ఆదేశించండి. లేకపోతే, అతని శిష్యులు వచ్చి వాని శరీరాన్ని ఎత్తుకుపోయి, అతడు మృతులలో నుండి లేచాడని ప్రజలతో చెప్పవచ్చు. అప్పుడు మొదటి మోసం కంటే కడపటి మోసం మరి విపరీతంగా ఉంటుంది” అని చెప్పారు.
MAT 27:65 అందుకు పిలాతు, “కావలివారిని తీసుకోండి, మీరు వెళ్లి, మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి” అని వారితో చెప్పాడు.
MAT 27:66 కాబట్టి వారు వెళ్లి కావలివారిని ఏర్పాటు చేసి రాతికి ముద్రవేసి సమాధిని భద్రం చేశారు.
MAT 28:1 సబ్బాతు దినం తర్వాత, వారం మొదటి రోజున, తెల్లవారేటప్పుడు మగ్దలేనే మరియ, వేరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు.
MAT 28:2 అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చింది, ఎందుకంటే పరలోకం నుండి ప్రభువు దూత దిగి వచ్చి, సమాధి దగ్గరకు వెళ్లి, ఆ రాయిని వెనుకకు దొర్లించి దాని మీద కూర్చున్నాడు.
MAT 28:3 ఆ దూత రూపం మెరుపులా, అతని బట్టలు మంచులా తెల్లగా ఉన్నాయి.
MAT 28:4 ఆ కావలివారు దూతను చూసి భయంతో వణికి చచ్చిన వారిలా పడిపోయారు.
MAT 28:5 దూత ఆ స్త్రీలతో, “భయపడకండి, మీరు సిలువవేయబడిన, యేసును వెదకుతున్నారు అని నాకు తెలుసు.
MAT 28:6 ఆయన ఇక్కడ లేరు; తాను చెప్పినట్లే, ఆయన లేచారు. రండి ఆయనను పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి.
MAT 28:7 త్వరగా వెళ్లి ఆయన శిష్యులతో, ‘యేసు మృతులలో నుండి లేచారు, ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నారు. అక్కడ మీరు ఆయనను చూస్తారు’ అని చెప్పండి. నేను మీతో చెప్పింది జ్ఞాపకముంచుకోండి” అన్నాడు.
MAT 28:8 ఆ స్త్రీలు భయపడినప్పటికీ గొప్ప ఆనందంతో, యేసు శిష్యులకు ఆ సమాచారం చెప్పడానికి సమాధి నుండి త్వరగా పరుగెత్తి వెళ్లారు.
MAT 28:9 అకస్మాత్తుగా యేసు వారిని కలిశారు. ఆయన వారికి “శుభములు” అని చెప్పారు. వారు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన పాదాలను పట్టుకుని ఆయనను ఆరాధించారు.
MAT 28:10 యేసు వారితో, “భయపడకండి, మీరు వెళ్లి నా సహోదరులను గలిలయకు వెళ్లుమని చెప్పండి; అక్కడ వారు నన్ను చూస్తారు” అని వారికి చెప్పారు.
MAT 28:11 ఆ స్త్రీలు మార్గంలో ఉండగానే, సమాధి దగ్గర ఉన్న కావలివారిలో కొంతమంది పట్టణంలోనికి వెళ్లి, జరిగిన విషయాలన్నిటిని ముఖ్య యాజకులతో చెప్పారు.
MAT 28:12 ముఖ్య యాజకులు యూదా పెద్దలతో కలసి ఆలోచించి, ఆ సైనికులకు చాలా డబ్బు లంచంగా ఇచ్చి,
MAT 28:13 “మేము నిద్రపోతున్నప్పుడు, ‘రాత్రి సమయంలో యేసు శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకుపోయారు’ అని చెప్పండి.
MAT 28:14 ఒకవేళ ఇది అధిపతికి తెలిసినా, మేము అతనికి చెప్పి మీకు ఏ ప్రమాదం కలుగకుండా చూస్తాము” అని వారికి మాట ఇచ్చారు.
MAT 28:15 కాబట్టి సైనికులు ఆ డబ్బు తీసుకుని వారితో చెప్పిన ప్రకారం చేశారు. ఈ కథ ఇప్పటికీ యూదులలో చాలా వ్యాపించి ఉంది.
MAT 28:16 ఆ పదకొండు మంది శిష్యులు యేసు తమకు చెప్పినట్లే, గలిలయలోని కొండకు వెళ్లారు.
MAT 28:17 వారు ఆయనను చూసినప్పుడు, ఆయనను ఆరాధించారు గాని కొందరు సందేహించారు.
MAT 28:18 యేసు వారి దగ్గరకు వచ్చి, “పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది.
MAT 28:19 కాబట్టి మీరు వెళ్లి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరున బాప్తిస్మమిస్తూ, అన్ని దేశాలను శిష్యులుగా చేసి,
MAT 28:20 నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని, వారు పాటించాలని మీరు వారికి బోధించండి. గుర్తుంచుకోండి, నేను యుగాంతం వరకు, ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను” అని వారితో చెప్పారు.
MAR 1:1 దేవుని కుమారుడైన క్రీస్తు యేసును గురించిన సువార్త ప్రారంభం.
MAR 1:2 యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడినట్లుగా: “ఇదిగో, నీకు ముందుగా నా దూతను పంపుతాను, అతడు నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.”
MAR 1:3 “అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం, ‘ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన కోసం త్రోవలను సరాళం చేయండి’ ” అని చెప్తుంది.
MAR 1:4 అలాగే బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యంలో ప్రత్యక్షమై, పాపక్షమాపణ కొరకై పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందుకోండని ప్రకటిస్తున్నాడు.
MAR 1:5 యూదయ గ్రామీణ ప్రాంతమంతా, యెరూషలేము ప్రజలందరూ అతని దగ్గరకు వచ్చి తమ పాపాలను ఒప్పుకుని యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందారు.
MAR 1:6 యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాలను ధరించి, నడుముకు తోలుదట్టీ కట్టుకునేవాడు. అతడు మిడతలు అడవి తేనె తినేవాడు.
MAR 1:7 ఆయన ఇచ్చిన సందేశమిది: “నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు.
MAR 1:8 నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను, కాని ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తారు.”
MAR 1:9 ఆ సమయంలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందారు.
MAR 1:10 యేసు నీటిలో నుండి బయటకు వస్తుండగా, ఆకాశం చీలి దేవుని ఆత్మ పావురంలాగ ఆయన మీదికి దిగి రావడం అతడు చూశాడు.
MAR 1:11 అంతేకాక పరలోకం నుండి ఒక స్వరం: “నీవు నా కుమారుడవు, నేను ప్రేమించేవాడవు; నీయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను” అని చెప్పడం వినబడింది.
MAR 1:12 వెంటనే ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకెళ్లాడు,
MAR 1:13 ఆయన సాతానుచేత శోధించబడుతూ, నలభై రోజులు అరణ్యంలో ఉన్నారు. అడవి మృగాల మధ్య ఆయన ఉన్నాడు, దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు.
MAR 1:14 యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత, యేసు దేవుని సువార్తను ప్రకటిస్తూ, గలిలయకు వెళ్లారు.
MAR 1:15 ఆయన, “కాలము పూర్తయింది. దేవుని రాజ్యం సమీపించింది. పశ్చాత్తాపపడండి, సువార్తను నమ్మండి!” అని చెప్పారు.
MAR 1:16 యేసు గలిలయ సముద్రతీరాన నడుస్తున్నప్పుడు, సీమోను అతని సోదరుడు అంద్రెయ సముద్రంలో వల వేయడం ఆయన చూశారు, వారు జాలరులు.
MAR 1:17 యేసు వారితో, “నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నారు.
MAR 1:18 వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు.
MAR 1:19 ఆయన ఇంకా కొంత దూరం వెళ్లినప్పుడు, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను పడవలో ఉండి, తమ వలలను సిద్ధం చేసుకోవడం ఆయన చూశారు
MAR 1:20 వెంటనే ఆయన వారిని పిలిచారు, వారు ఆలస్యం చేయకుండ తమ తండ్రియైన జెబెదయిని పనివారితో పాటు పడవలో విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.
MAR 1:21 వారు కపెర్నహూముకు వెళ్లారు, సబ్బాతు దినం వచ్చినప్పుడు, యేసు సమాజమందిరంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు.
MAR 1:22 ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల్లా కాక, ఒక అధికారం కలవానిగా వారికి బోధించారు.
MAR 1:23 అంతలో వారి సమాజమందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒకడు,
MAR 1:24 “నజరేతువాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవు ఎవరో నాకు తెలుసు, దేవుని పరిశుద్ధుడవు!” అని బిగ్గరగా కేకలు వేశాడు.
MAR 1:25 అందుకు యేసు, “మాట్లాడకు!” అని అంటూ, “వానిలో నుండి బయటకు రా!” అని గద్దించారు.
MAR 1:26 అప్పుడు ఆ అపవిత్రాత్మ వానిని బలంగా కుదిపి పెద్ద కేకలు వేసి వానిలో నుండి బయటకు వచ్చేసింది.
MAR 1:27 ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఇదేంటి? అధికారంతో కూడిన ఒక క్రొత్త బోధ! ఆయన అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అవి ఆయనకు లోబడుతున్నాయి” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
MAR 1:28 ఇలా ఆయనను గురించిన వార్త గలిలయ ప్రాంతమంతా వేగంగా వ్యాపించింది.
MAR 1:29 వారు సమాజమందిరం నుండి బయటకు రాగానే, వారు యాకోబు యోహానుతో కలిసి అంద్రెయ, సీమోనుల ఇంటికి వెళ్లారు.
MAR 1:30 సీమోను అత్త జ్వరంతో పడుకుని ఉంది, వెంటనే వారు యేసుకు ఆమె గురించి చెప్పారు.
MAR 1:31 కాబట్టి ఆయన ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె చేయి పట్టుకుని లేవనెత్తారు. జ్వరం ఆమెను వదిలిపోయింది అప్పుడు ఆమె వారికి పరిచారం చేయడం మొదలుపెట్టింది.
MAR 1:32 సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రజలు రోగాలు గలవారినందరిని దయ్యాలు పట్టినవారిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు.
MAR 1:33 పట్టణస్థులందరు ఆ ఇంటి ద్వారం దగ్గర కూడుకున్నారు,
MAR 1:34 వివిధ రోగాలు గల అనేకులను యేసు స్వస్థపరిచారు. ఆయన అనేక దయ్యాలను వెళ్లగొట్టారు, అయితే ఆ దయ్యాలకు తాను ఎవరో తెలుసు, కాబట్టి ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
MAR 1:35 చాలా ప్రొద్దున, ఇంకా చీకటిగా ఉండగానే యేసు నిద్రలేచి, ఇంటి నుండి బయలుదేరి తాను ప్రార్థించే ఏకాంత స్థలానికి వెళ్లారు.
MAR 1:36 సీమోను, అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెదకుతూ వెళ్లి,
MAR 1:37 ఆయనను కనుగొని, “అందరు నీకోసం వెదకుతున్నారు!” అని చెప్పారు.
MAR 1:38 అందుకు యేసు, “మనం దగ్గరలో ఉన్న గ్రామాలకు వెళ్దాం రండి, అప్పుడు నేను అక్కడ కూడా ప్రకటించగలను, నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అని వారితో చెప్పారు.
MAR 1:39 కాబట్టి ఆయన గలిలయ ప్రాంతమంతా తిరుగుతూ, వారి సమాజమందిరాల్లో ప్రకటిస్తూ దయ్యాలను వెళ్లగొడుతూ ఉన్నారు.
MAR 1:40 కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్లమీద ఉండి, “నీకిష్టమైతే, నన్ను బాగు చేయి” అని ఆయనను బ్రతిమాలాడు.
MAR 1:41 యేసు వాని మీద కనికరపడ్డారు. ఆయన తన చేయి చాపి వాన్ని ముట్టి వానితో, “నాకు ఇష్టమే, బాగవు” అన్నారు.
MAR 1:42 వెంటనే కుష్ఠురోగం వాన్ని విడిచి వెళ్లింది, వాడు బాగయ్యాడు.
MAR 1:43 వెంటనే యేసు: “నీవు ఈ విషయం ఎవరికి చెప్పకు. కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకుని వారికి సాక్ష్యంగా ఉండేలా నీ శుద్ధీకరణ కోసం మోషే నియమించిన అర్పణలను అర్పించు” అని హెచ్చరించి వాన్ని పంపివేశారు.
MAR 1:45 కాని వాడు వెళ్లి ఈ విషయాన్ని అందరితో చెప్తూ, ఆ వార్తను ప్రచురం చేశాడు. దాని ఫలితంగా యేసు ఆ పట్టణంలో బహిరంగంగా ప్రవేశించలేక ఎవరు నివసించని బయట ప్రదేశాల్లో ఉన్నారు. అయినాసరే వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఆయన దగ్గరకు వస్తూనే ఉన్నారు.
MAR 2:1 కొన్ని రోజుల తర్వాత, యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఆయన ఇంటికి వచ్చారని ప్రజలకు తెలిసింది.
MAR 2:2 వారు పెద్ద సంఖ్యలో కూడి వచ్చారు కాబట్టి తలుపు బయట నిలబడడానికి కూడ స్థలం లేదు, అయినా ఆయన వారికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు.
MAR 2:3 అప్పుడు కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు, నలుగురు అతన్ని మోసుకొచ్చారు.
MAR 2:4 కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వాన్ని యేసు దగ్గరకు తీసుకుని వెళ్లలేదా, సరిగ్గా యేసు ఉన్నచోట ఇంటి పైకప్పును విప్పి పక్షవాతంగల వాన్ని చాపపై పడుకోబెట్టి క్రిందికి దింపారు.
MAR 2:5 యేసు వారి విశ్వాసం చూసి, పక్షవాతం గలవానితో, “కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నారు.
MAR 2:6 కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడ కూర్చుని ఉన్నారు, వారు తమలో తాము, “ఈ వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇతడు దైవదూషణ చేస్తున్నాడు! దేవుడు తప్ప పాపాలను క్షమించగలవారెవరు?” అని ఆలోచిస్తున్నారు.
MAR 2:8 వారు తమ హృదయాల్లో ఆలోచిస్తున్నది ఇదే అని వెంటనే యేసు తన ఆత్మలో గ్రహించి వారితో, “మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు?
MAR 2:9 ఏది సులభం: ఈ పక్షవాతం గలవానితో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడమా లేదా, ‘నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువు’ అని చెప్పడమా?
MAR 2:10 అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో,
MAR 2:11 “నేను చెప్తున్న. నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు.
MAR 2:12 అతడు లేచి, తన పరుపెత్తుకొని అందరు చూస్తుండగానే నడిచి వెళ్లాడు. అది చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడి, “ఇలాంటివి ఇంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు!” అని చెప్తూ దేవుని స్తుతించారు.
MAR 2:13 యేసు మరొకసారి సరస్సు తీరానికి వెళ్లారు. అక్కడ ఒక గొప్ప జనసమూహం యేసు దగ్గరకు వచ్చింది, ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు.
MAR 2:14 ఆయన మార్గంలో నడుస్తుండగా, పన్ను వసూలు చేసే స్థానంలో కూర్చుని ఉన్న అల్ఫయి కుమారుడగు లేవీని చూసి, “నన్ను వెంబడించు” అని యేసు అతనితో అన్నారు, లేవీ లేచి ఆయనను వెంబడించాడు.
MAR 2:15 లేవీ ఇంట్లో యేసు భోజనం చేస్తుండగా, అనేకమంది పన్ను వసూలు చేసేవారు, పాపులు ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు, ఆయనను వెంబడించేవారు చాలామంది అక్కడ ఉన్నారు.
MAR 2:16 పరిసయ్యులైన ధర్మశాస్త్ర ఉపదేశకులు అతన్ని పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి తినడం చూసి, “ఆయన పన్ను వసూలు చేసేవారితో పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నాడు?” అని ఆయన శిష్యులను అడిగారు.
MAR 2:17 అది విని, యేసు వారితో, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను పిలువడానికి వచ్చాను” అన్నారు.
MAR 2:18 యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం ఉన్నారు. కొందరు వచ్చి, “యోహాను శిష్యులు పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు కాని, నీ శిష్యులు ఉండడం లేదు ఎందుకు?” అని యేసును అడిగారు.
MAR 2:19 అందుకు యేసు, “పెండ్లికుమారుడు తమతో ఉన్నప్పుడు అతని అతిథులు ఎందుకు ఉపవాసం ఉంటారు? అతడు తమతో కూడ ఉన్నంత వరకు, వారు ఉపవాసం ఉండరు.
MAR 2:20 అయితే పెండ్లికుమారుడు వారి దగ్గర నుండి తీసుకొనిపోబడే సమయం వస్తుంది, ఆ రోజున వారు ఉపవాసం ఉంటారు.
MAR 2:21 “ఎవ్వరూ పాత బట్టకు క్రొత్త బట్ట అతుకువేసి కుట్టరు, అలా చేస్తే, క్రొత్త బట్టముక్క పాత బట్ట నుండి పిగిలిపోతూ చినుగును మరి ఎక్కువ చేస్తుంది.
MAR 2:22 ఎవ్వరూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు. అలా చేస్తే, ద్రాక్షరసం వలన ఆ తిత్తులు పిగిలిపోతాయి, ద్రాక్షరసం, తిత్తులు రెండూ పాడైపోతాయి. అందుకే, వారు క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలోనే పోస్తారు” అని చెప్పారు.
MAR 2:23 ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు, ఆయనతో పాటు నడుస్తున్న శిష్యులు, కొన్ని కంకులు తెంపుకొని తినడం మొదలుపెట్టారు.
MAR 2:24 అది చూసిన పరిసయ్యులు, “చూడు, ఎందుకు వారు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు?” అని ఆయనతో అన్నారు.
MAR 2:25 అందుకు ఆయన, “దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా?
MAR 2:26 ప్రధాన యాజకుడైన అబ్యాతారు దినాల్లో, అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకుని తాను తిని, తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు” అని జవాబిచ్చారు.
MAR 2:27 ఆయన వారితో, “మనుష్యుల కోసం సబ్బాతు దినం కాని, సబ్బాతు దినం కోసం మనుష్యులు నియమించబడలేదు.
MAR 2:28 కాబట్టి మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి కూడ ప్రభువు” అని చెప్పారు.
MAR 3:1 మరొకసారి యేసు సమాజ మందిరంలోకి వెళ్లినప్పుడు, అక్కడ చేతికి పక్షవాతం కలవాడు ఒకడున్నాడు.
MAR 3:2 వారిలో కొందరు యేసు మీద నేరం మోపడానికి కారణం కోసం వెదుకుతున్నారు, కాబట్టి వారు సబ్బాతు దినాన ఆయన స్వస్థపరుస్తారేమో అని దగ్గర నుండి ఆయనను గమనిస్తున్నారు.
MAR 3:3 చేతికి పక్షవాతం గలవానితో యేసు, “అందరి ముందు నిలబడు” అన్నారు.
MAR 3:4 అప్పుడు ఆయన, “సబ్బాతు దినాన ఏది న్యాయం: మంచి చేయడమా లేదా చెడు చేయడమా, ప్రాణం రక్షించడమా లేదా ప్రాణం తీయడమా?” అని వారిని అడిగారు కాని వారు మౌనంగా ఉన్నారు.
MAR 3:5 ఆయన కోపంతో చుట్టూ ఉన్నవారిని చూసి, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి బాధతో నొచ్చుకుని, చేతికి పక్షవాతం గలవానితో, “నీ చేయి చాపు” అన్నారు. వాడు దాన్ని చాపగానే, వాని చేయి పూర్తిగా బాగయింది.
MAR 3:6 అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్లి హేరోదు వర్గానికి చెందిన వారితో కలిసి యేసును ఎలా చంపుదామా అని కుట్రపన్నడం మొదలుపెట్టారు.
MAR 3:7 యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్లారు, అలాగే గలిలయ నుండి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది.
MAR 3:8 ఆయన చేస్తున్న గొప్ప కార్యాల గురించి ప్రజలు విని, చాలామంది యూదయ, యెరూషలేము, ఇదూమయ, యొర్దాను అంతటా తూరు, సీదోను చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వచ్చారు.
MAR 3:9 జనసమూహం కారణంగా ఆయన తన శిష్యులతో, తన కోసం ఒక చిన్న పడవను సిద్ధం చేయమని చెప్పారు.
MAR 3:10 ఆయన చాలామందిని స్వస్థపరిచారు, కాబట్టి వ్యాధులు ఉన్నవారు ఆయనను ముట్టుకోవాలని ముందుకు వస్తున్నారు.
MAR 3:11 అపవిత్రాత్మలు ఆయనను చూడగానే, ఆయన ముందు సాగిలపడి, “నీవు దేవుని కుమారుడవు” అని కేకలు వేశాయి.
MAR 3:12 అయితే ఆయన తన గురించి ఇతరులకు చెప్పవద్దని వారికి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు.
MAR 3:13 ఆ తర్వాత యేసు కొండెక్కి తనకు ఇష్టమైన వారిని పిలిచారు, వారు ఆయన దగ్గరకు వచ్చారు.
MAR 3:14 తనతో ఉండడానికి, ప్రకటించడానికి తాను బయటకు పంపడానికి ఆయన పన్నెండుమందిని నియమించుకొని
MAR 3:15 దయ్యాలను వెళ్లగొట్టే అధికారాన్ని వారికిచ్చారు.
MAR 3:16 ఆ పన్నెండుమంది ఎవరనగా: ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను,
MAR 3:17 జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను; (వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అనే పేరు పెట్టారు; దాని అర్థం “ఉరుము కుమారులు”),
MAR 3:18 అంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, అత్యాసక్తి కలవాడైన సీమోను,
MAR 3:19 ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
MAR 3:20 తర్వాత యేసు ఒక ఇంట్లోకి వెళ్లినప్పుడు, ప్రజలు మరల గుంపుగా కూడి వచ్చారు, కాబట్టి ఆయన శిష్యులు భోజనం కూడా చేయలేకపోయారు.
MAR 3:21 అది విని ఆయన కుటుంబీకులు, “ఆయనకు మతిపోయింది” అని చెప్పి ఆయనను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
MAR 3:22 యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర ఉపదేశకులు, “ఇతడు బయెల్జెబూలు చేత పట్టబడినవాడు! దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అని అన్నారు.
MAR 3:23 కాబట్టి యేసు వారిని తన దగ్గరకు పిలుచుకొని వారితో ఉపమానరీతిగా మాట్లాడారు: “సాతాను సాతానును ఎలా వెళ్లగొట్టగలడు?
MAR 3:24 ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే, ఆ రాజ్యం నిలువలేదు.
MAR 3:25 ఒక కుటుంబం తనకు తానే వ్యతిరేకంగా చీలిపోతే అది నిలబడదు.
MAR 3:26 అలాగే ఒకవేళ సాతాను తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాడు నిలువలేడు; వాని అంతం వచ్చినట్లే.
MAR 3:27 నిజానికి, బలవంతుడైనవాని మొదట కట్టివేయకుండ అతని ఇంట్లోకి ఎవరు ప్రవేశించలేరు. అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు.
MAR 3:28 ప్రతి పాపానికి, దూషణకు మనుష్యులకు క్షమాపణ ఉంది.
MAR 3:29 కాని, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఉండదు; వారు నిత్య పాపం చేసిన అపరాధులుగా ఉంటారని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
MAR 3:30 “ఆయన అపవిత్రాత్మ పట్టినవాడు” అని వారు అంటున్నారు కాబట్టి యేసు ఈ విధంగా చెప్పారు.
MAR 3:31 ఆ తర్వాత యేసు తల్లి సహోదరులు వచ్చారు. వారు బయట నిలబడి, ఆయనను పిలువడానికి ఒకరిని లోపలికి పంపారు.
MAR 3:32 జనసమూహం ఆయన చుట్టూ కూర్చుని ఉండగా, వారు ఆయనతో, “నీ తల్లి నీ సహోదరులు నిన్ను కలువడానికి వచ్చి బయట వేచి ఉన్నారు” అని చెప్పారు.
MAR 3:33 అందుకు ఆయన, “నా తల్లి నా సహోదరులు ఎవరు?” అని అడిగారు.
MAR 3:34 ఆయన తన చుట్టూ కూర్చున్న వారిని చూసి, “వీరే నా తల్లి, నా సహోదరులు!
MAR 3:35 దేవుని చిత్తప్రకారం చేసేవారే నా సహోదరుడు, సహోదరి తల్లి” అని చెప్పారు.
MAR 4:1 యేసు మరల సరస్సు ఒడ్డులో బోధించడం మొదలుపెట్టారు. ఆయన చుట్టూ ఉన్న గుంపు పెద్దగా ఉండడం వల్ల ఆయన సరస్సులో ఒక పడవను ఎక్కి కూర్చున్నారు, ప్రజలంతా ఒడ్డున నిలబడి ఉన్నారు.
MAR 4:2 ఆయన ఉపమానాలతో అనేక విషయాలను వారికి బోధిస్తూ ఈ విధంగా చెప్పారు:
MAR 4:3 “ఇటు వినండి! ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు.
MAR 4:4 అతడు విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినివేశాయి.
MAR 4:5 మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి, మట్టి లోతు లేకపోయినా అవి త్వరగానే మొలకెత్తాయి.
MAR 4:6 కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి, వాటికి వేరు లేదా అవి ఎండిపోయాయి.
MAR 4:7 మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి, ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి, కాబట్టి అవి పంటను ఇవ్వలేదా పోయాయి.
MAR 4:8 మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, ఎదిగి, కొన్ని ముప్పైరెట్లు, కొన్ని అరవైరెట్లు, కొన్ని వందరెట్లు అధికంగా పంటనిచ్చాయి.”
MAR 4:9 అప్పుడు యేసు, “వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు.
MAR 4:10 ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ పన్నెండు మందితో పాటు ఆయన చుట్టూ ఉన్న కొందరు ఉపమానాల గురించి ఆయనను అడిగారు.
MAR 4:11 అందుకు ఆయన ఈ విధంగా చెప్పారు, “దేవుని రాజ్యం గురించిన మర్మానికి సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది. కాని బయటివారికి ప్రతి విషయం ఉపమాన రీతిగానే చెప్పబడింది.
MAR 4:12 తద్వారా, “ ‘వారు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు, ఎప్పుడూ వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు; లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొంది ఉండేవారు!’”
MAR 4:13 తర్వాత యేసు వారితో, “మీరు ఈ ఉపమానం అర్థం చేసుకోలేదా? అలాగైతే ఇతర ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు?
MAR 4:14 రైతు వాక్యం విత్తుతున్నాడు.
MAR 4:15 కొందరు దారి ప్రక్కన పడిన విత్తనంలాంటి వారు, అక్కడ వాక్యం విత్తబడింది. వారు వినిన వెంటనే, సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడు.
MAR 4:16 మరికొందరు, రాతి నేలలో పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరిస్తారు.
MAR 4:17 అయితే వారిలో వేరు లేకపోవడంతో, వారు కొంతకాలమే నిలబడతారు. వారికి వాక్యాన్ని బట్టి కష్టాలు హింసలు ఎదురైనప్పుడు, వారు త్వరగా పడిపోతారు.
MAR 4:18 ఇంకా ఇతరులు ముళ్ళపొదల్లో పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని వింటారు.
MAR 4:19 కాని జీవితాల్లో ఎదురయ్యే తొందరలు, ధనమోసం ఇతర కోరికలు ఆ వాక్యాన్ని అణచివేసి, ఫలించకుండా చేస్తాయి.
MAR 4:20 ఇక మిగిలిన వారు, సారవంతమైన నేల మీద పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని వింటారు, దానిని అంగీకరిస్తారు, వారిలో కొందరు విత్తబడిన దానికి ముప్పైరెట్లు, కొందరు అరవైరెట్లు, మరికొందరు వందరెట్లు ఫలిస్తారు” అని చెప్పారు.
MAR 4:21 ఆయన వారితో, “మీరు దీపాన్ని తెచ్చి పాత్ర క్రింద లేదా మంచం క్రింద పెడతారా? దాన్ని దీపస్తంభం మీద పెట్టరా?
MAR 4:22 ఎందుకంటే రహస్యంగా ఉంచబడింది బయటకు తేబడాలి, దాచిపెట్టబడింది బహిర్గతం కావాలి.
MAR 4:23 వినడానికి చెవులు కలవారు విందురు గాక!” అన్నారు.
MAR 4:24 ఆయన ఇంకా మాట్లాడుతూ, “మీరు వింటున్న దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత లేదా అంతకన్నా ఎక్కువ కొలవబడుతుంది.
MAR 4:25 కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది; లేనివారి నుండి, వారు కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది” అని చెప్పారు.
MAR 4:26 ఆయన ఇంకా వారితో, “దేవుని రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ఒక మనుష్యుడు నేల మీద విత్తనం చల్లుతాడు.
MAR 4:27 పగలు రాత్రి, అతడు నిద్రపోతున్నా మేల్కొని ఉన్నా, అతనికి తెలియకుండానే, ఆ విత్తనం మొలిచి పెరుగుతుంది.
MAR 4:28 భూమి దానంతట అదే మొదట మొలకను, తర్వాత కంకిని, అటు తర్వాత కంకి నిండా గింజలను పుట్టిస్తుంది.
MAR 4:29 పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని అతడు కొడవలితో కోస్తాడు” అని చెప్పారు.
MAR 4:30 ఆయన మళ్ళీ, “దేవుని రాజ్యం దేనిలా ఉంటుందని చెప్పగలం, దాన్ని వివరించడానికి ఏ ఉపమానాన్ని ఉపయోగించగలం?
MAR 4:31 అది భూమిలోని విత్తనాలన్నింటిలో చిన్నదైన ఆవగింజ లాంటిది.
MAR 4:32 అయినాసరే అది విత్తబడినప్పుడు, అది పెరిగి, పక్షులు గూళ్ళను కట్టుకోగలిగినంత పెద్ద కొమ్మలతో తోటలోని మొక్కలన్నిటి కంటే పెద్దదిగా ఎదుగుతుంది” అన్నారు.
MAR 4:33 వారు అర్థం చేసుకోగలిగినంతవరకు, ఇలాంటి అనేక ఉపమానాలతో యేసు వారితో మాట్లాడారు.
MAR 4:34 ఆయన ఉపమానం లేకుండా వారికేమి చెప్పలేదు. తాను తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన వారికి అన్నిటిని వివరించేవారు.
MAR 4:35 ఆ రోజు సాయంకాలమైనప్పుడు, ఆయన తన శిష్యులతో, “మనం సరస్సు దాటి అవతలి ఒడ్డుకు వెళ్దాం” అన్నారు.
MAR 4:36 జనసమూహాన్ని విడిచిపెట్టి, ఉన్నపాటుననే, ఆయన పడవ ఎక్కగా వారు ఆయనను తీసుకెళ్లారు. మరికొన్ని పడవలు కూడా వారి వెంట వెళ్లాయి.
MAR 4:37 అప్పుడు భయంకరమైన తుఫాను రేగి, అలలు పడవ మీద ఎగసిపడ్డాయి, పడవ నీటితో నిండిపోసాగింది.
MAR 4:38 యేసు ఆ పడవ వెనుక భాగంలో, దిండు వేసుకుని నిద్రపోతున్నారు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకుడా, మేము మునిగిపోతున్నా నీకు చింత లేదా?” అని అన్నారు.
MAR 4:39 ఆయన లేచి గాలిని గద్దించి, అలలతో, “నిశ్శబ్దం! కదలకుండా ఉండు!” అని చెప్పారు. అప్పుడు గాలి ఆగిపోయి అక్కడ అంతా నిశ్శబ్దమయింది.
MAR 4:40 ఆయన తన శిష్యులతో, “మీరు ఎందుకంతగా భయపడుతున్నారు? ఇప్పటికీ మీకు విశ్వాసం లేదా?” అన్నారు.
MAR 4:41 వారు చాలా భయపడి, ఒకరితో ఒకరు, “ఈయన ఎవరు? గాలి, అలలు కూడా ఈయనకు లోబడుతున్నాయి!” అని చెప్పుకొన్నారు.
MAR 5:1 వారు సరస్సు దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్లారు.
MAR 5:2 యేసు పడవ దిగిన వెంటనే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయనను కలుసుకున్నాడు.
MAR 5:3 వాడు సమాధుల్లో నివసించేవాడు, గొలుసులతో కూడా ఎవరు వాన్ని బంధించలేకపోయారు.
MAR 5:4 ఎందుకంటే తరచుగా వాని కాళ్లుచేతులను గొలుసులతో బంధించేవారు కానీ, వాడు ఆ గొలుసులను తెంపి వాటిని ముక్కలు చేసేవాడు. వాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు.
MAR 5:5 వాడు పగలు రాత్రులు సమాధుల మధ్య, కొండల్లో కేకలువేస్తూ తనను తాను రాళ్లతో గాయపరచుకొనే వాడు.
MAR 5:6 వాడు యేసును దూరం నుండి చూసి, పరుగెత్తుకొని వెళ్లి ఆయన ముందు మోకరించాడు.
MAR 5:7 వాడు బిగ్గరగా కేకలువేస్తూ, “సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసూ, నాతో నీకేమి? దేవుని పేరట నన్ను వేధించవద్దు నిన్ను వేడుకొంటున్నాను!” అని అన్నాడు.
MAR 5:8 ఎందుకంటే యేసు, “అపవిత్రాత్మా, వీన్ని విడిచిపో!” అని వానితో అన్నారు.
MAR 5:9 అప్పుడు యేసు, “నీ పేరేమిటి?” అని వాన్ని అడిగారు. అందుకు వాడు, “నా పేరు సేన, ఎందుకంటే మేము అనేకులం” అని జవాబిచ్చాడు.
MAR 5:10 “వాటిని ఆ ప్రాంతం నుండి బయటకు పంపివేయవద్దని” వాడు యేసును పదే పదే వేడుకున్నాడు.
MAR 5:11 అక్కడ దగ్గరలో పెద్ద పందుల మంద కొండమీద మేస్తూ ఉంది.
MAR 5:12 ఆ దయ్యాలు, “ఆ పందులలోనికి చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని యేసును బ్రతిమాలాయి.
MAR 5:13 ఆయన వాటికి అనుమతి ఇచ్చారు, ఆ అపవిత్రాత్మలు బయటకు వచ్చి పందులలోనికి చొరబడ్డాయి. ఇంచుమించు రెండువేల పందులు గల ఆ మంద, వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకొని వెళ్లి మునిగిపోయింది.
MAR 5:14 ఆ పందులను కాస్తున్నవారు పరుగెత్తుకొని వెళ్లి పట్టణంలోను, గ్రామీణ ప్రాంతాల్లోనూ జరిగినదంతా తెలియజేశారు, అప్పుడు ఏమి జరిగిందో చూడడానికి ప్రజలు వెళ్లారు.
MAR 5:15 వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, సేన దయ్యం పట్టినవాడు, బట్టలు వేసుకుని సరియైన మానసిక స్థితిలో, అక్కడ కూర్చుని ఉండడం చూశారు; వారు భయపడ్డారు.
MAR 5:16 జరిగింది చూసినవారు దయ్యాలు పట్టినవాని గురించి పందుల గురించి ఊరి వారికి తెలియజేశారు.
MAR 5:17 అప్పుడు ప్రజలు తమ ప్రాంతాన్ని విడిచిపొమ్మని యేసును బ్రతిమాలారు.
MAR 5:18 యేసు పడవ ఎక్కుతున్నప్పుడు, దయ్యాలు పట్టినవాడు ఆయనతో పాటు వస్తానని బ్రతిమాలాడు.
MAR 5:19 యేసు వాన్ని అనుమతించలేదు, కాని వానితో, “నీవు నీ ఇంటికి నీ సొంతవారి దగ్గరకు వెళ్లు, ప్రభువు నీ పట్ల చేసిన మేలును, నీ పట్ల చూపిన కనికరం గురించి వారికి చెప్పు” అన్నారు.
MAR 5:20 కాబట్టి వాడు వెళ్లిపోయి దెకపొలిలోని పది పట్టణాల్లో యేసు తనకు చేసిన దానిని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. అది విన్నవారందరు ఆశ్చర్యపడ్డారు.
MAR 5:21 యేసు మరల పడవ ఎక్కి సరస్సు అవతలి ఒడ్డుకు చేరినప్పుడు, ఆ సరస్సు ఒడ్డున గొప్ప జనసమూహం ఆయన చుట్టూ చేరింది.
MAR 5:22 అప్పుడు సమాజమందిరపు నాయకుల్లో ఒకడైన యాయీరు అనే పేరుగలవాడు వచ్చి, యేసును చూడగానే, ఆయన పాదాల మీద పడ్డాడు.
MAR 5:23 “నా చిన్న కుమార్తె చనిపోయేలా ఉంది, నీవు వచ్చి ఆమె మీద నీ చేతులుంచితే ఆమె బాగై బ్రతుకుతుంది” అని ఆయనను వేడుకున్నాడు.
MAR 5:24 కాబట్టి యేసు అతనితో వెళ్లారు. పెద్ద జనసమూహం ఆయనను వెంబడిస్తూ ఆయన చుట్టూ మూగారు.
MAR 5:25 పన్నెండేళ్ళ నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది.
MAR 5:26 ఆమె ఎందరో వైద్యుల దగ్గరకు తిప్పలుపడి వెళ్లి తనకు ఉన్నదంతా ఖర్చుపెట్టినా, జబ్బు బాగవ్వడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించిపోయింది.
MAR 5:27 ఆమె యేసు గురించి విన్నప్పుడు, తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని మాత్రం తాకితే చాలు స్వస్థపడతాను” అనుకుని, జనసమూహంలో ఆయన వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రాన్ని తాకింది.
MAR 5:29 వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది, తన శరీరంలో ఉన్న బాధ నుండి తాను విడుదల పొందినట్లు ఆమె గ్రహించింది.
MAR 5:30 వెంటనే యేసు తనలో నుండి శక్తి బయటకు వెళ్లిందని గ్రహించారు. ఆయన జనసమూహంలో చుట్టూ తిరిగి, “నా వస్త్రాలను ఎవరు తాకారు?” అని అడిగారు.
MAR 5:31 అందుకు ఆయన శిష్యులు, “ఈ జనసమూహం అంతా నీ మీద పడుతూ ఉండడం నీవు చూస్తూనే ఉన్నావు అయినా, ‘నన్ను ముట్టింది ఎవరు’ అని అడుగుతున్నావు” అని అన్నారు.
MAR 5:32 అయినా యేసు తనను తాకింది ఎవరు అని చుట్టూ తిరిగి చూస్తూనే ఉన్నారు.
MAR 5:33 అప్పుడు ఆ స్త్రీ, తనకు జరిగింది తెలుసుకొని, వచ్చి ఆయన కాళ్లమీద పడి, భయంతో వణుకుతూ తనకు జరిగిన నిజాన్ని ఆయనకు చెప్పింది.
MAR 5:34 అందుకు ఆయన ఆమెతో, “కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. సమాధానంతో వెళ్లు నీ బాధ నుండి విడుదల పొందుకో” అని చెప్పారు.
MAR 5:35 యేసు ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిరపు నాయకుడైన యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చారు. వారు యాయీరుతో, “నీ కుమార్తె చనిపోయింది. ఇంకా బోధకునికి శ్రమ కలిగించడం ఎందుకు?” అన్నారు.
MAR 5:36 యేసు వారు చెప్పిన మాటలను పట్టించుకోకుండా, సమాజమందిరపు అధికారితో, “భయపడకు; నమ్మకం మాత్రం ఉంచు” అని చెప్పారు.
MAR 5:37 ఆయన పేతురు యాకోబు సహోదరుడైన యోహాను అనే వారిని తప్ప మరి ఎవరిని తన వెంట తీసుకెళ్లలేదు.
MAR 5:38 వారు సమాజమందిరపు నాయకుని ఇంటికి వచ్చినప్పుడు, ఇంటివారు గట్టిగా ఏడుస్తూ, ప్రలాపిస్తూ, గందరగోళంగా ఉండడం యేసు చూశారు.
MAR 5:39 ఆయన ఇంట్లోకి వెళ్లి వారితో, “మీరెందుకు ప్రలాపించి ఏడుస్తున్నారు? అమ్మాయి చనిపోలేదు కానీ నిద్రపోతుంది” అన్నారు.
MAR 5:40 అందుకు వారు ఆయనను హేళన చేశారు. అయితే ఆయన వారందరిని బయటకు పంపిన తర్వాత, ఆ అమ్మాయి తల్లిదండ్రులను తనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకొని, ఆ అమ్మాయి ఉన్న గదిలోకి వెళ్లారు.
MAR 5:41 ఆయన ఆ అమ్మాయి చేయి పట్టుకుని, “తలితాకుమి!” అన్నారు. ఆ మాటకు, “చిన్నదానా, లే!” అని అర్థము.
MAR 5:42 వెంటనే ఆ అమ్మాయి లేచి నడవ మొదలుపెట్టింది. ఆ అమ్మాయి వయస్సు పన్నెండు సంవత్సరాలు. ఇది చూసిన వారికి చాలా ఆశ్చర్యం కలిగింది.
MAR 5:43 జరిగిన ఈ సంగతి ఎవనికి తెలియకూడదని ఆయన వారికి ఖచ్చితంగా ఆదేశించి, ఆమెకు ఆహారం పెట్టమని చెప్పారు.
MAR 6:1 యేసు తన శిష్యులతో కలిసి, అక్కడినుండి తన స్వగ్రామానికి వెళ్లారు.
MAR 6:2 సబ్బాతు దినాన, సమాజమందిరంలో ఆయన బోధించడం మొదలుపెట్టారు. ఆయన బోధ విని అనేకమంది ఆశ్చర్యపడ్డారు. “ఎక్కడ నుండి ఇతనికి ఇవి వచ్చాయి? ఈయనకు ఇవ్వబడిన ఈ జ్ఞానం ఏంటి? ఈయన చేస్తున్న ఈ అద్భుతాలు ఏంటి?
MAR 6:3 ఇతడు ఒక వడ్రంగివాడు కాడా? ఇతడు మరియ కుమారుడు కాడా? యాకోబు, యోసే, యూదా, సీమోను ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరీలు ఇక్కడ మనతో లేరా?” అని చెప్పుకుంటూ ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు.
MAR 6:4 అందుకు యేసు వారితో, “ఒక ప్రవక్త తన స్వగ్రామంలో, తన సొంత బంధువుల మధ్యలో తన సొంత ఇంట్లో తప్ప అంతటా గౌరవం పొందుతాడు” అని అన్నారు.
MAR 6:5 కొద్దిమంది రోగుల మీద మాత్రమే యేసు చేతులుంచి వారిని బాగుచేశారు తప్ప మరి ఏ అద్భుతాలు అక్కడ చేయలేదు.
MAR 6:6 ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. తర్వాత యేసు బోధిస్తూ చుట్టూ ఉన్న గ్రామ గ్రామానికి వెళ్లారు.
MAR 6:7 ఆయన పన్నెండుమందిని దగ్గరకు పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి వారికి అధికారం ఇచ్చి, వారిని ఇద్దరిద్దరిగా పంపించడం మొదలుపెట్టారు.
MAR 6:8 ఆయన వారికిచ్చిన సూచనలు ఇవే: “ప్రయాణానికి చేతికర్ర తప్ప వేరే ఏది తీసుకెళ్లకూడదు. ఆహారం కాని, చేతిలో సంచి కానీ, నడికట్టులో డబ్బు కాని తీసుకుని వెళ్లకూడదు. చెప్పులు వేసుకోండి కాని ఒక అంగీ ఎక్కువ తీసుకెళ్లకూడదు.
MAR 6:10 మీరు ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు, అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి.
MAR 6:11 ఏ స్థలంలోనైనా ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీ మాటలు వినకపోతే, మీరు అక్కడినుండి బయలుదేరే ముందు వారికి సాక్ష్యంగా ఉండడానికి మీ పాదాల దుమ్మును అక్కడ దులిపి వెళ్లండి.”
MAR 6:12 శిష్యులు వెళ్లి, ప్రజలు పశ్చాత్తాపపడాలని ప్రకటించారు.
MAR 6:13 వారు అనేక దయ్యాలను వెళ్లగొట్టారు అనేక రోగులను నూనెతో ముట్టి వారిని బాగుచేశారు.
MAR 6:14 యేసు పేరు ప్రసిద్ధిచెందడం గురించి రాజైన హేరోదుకు తెలిసింది. కొందరు, “బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయి మళ్ళీ బ్రతికాడు, అందుకే ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని చెప్తున్నారు.
MAR 6:15 మరికొందరు, “ఈయన ఏలీయా” అన్నారు. ఇంకొందరు, “ఈయన పూర్వకాల ప్రవక్తల్లో ఒక ప్రవక్తలాంటివాడు” అని చెప్పుకొన్నారు.
MAR 6:16 అయితే హేరోదు ఇదంతా విని, “నేను తల నరికించిన యోహాను ఇతడేనా, ఇతడు చావు నుండి లేచాడా!” అనుకున్నాడు.
MAR 6:17 ఎందుకంటే, హేరోదు తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను పెళ్ళి చేసుకున్నప్పుడు, “నీ సహోదరుని భార్యను నీవు ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను హేరోదుతో అంటూ ఉండేవాడు.
MAR 6:18 హేరోదు ఆమె కోసం యోహానును బంధించి చెరసాలలో వేయమని ఆదేశాన్ని జారీ చేశాడు.
MAR 6:19 హేరోదియ యోహానును చంపాలని చూసింది. కాని అలా చెయ్యలేకపోయింది.
MAR 6:20 ఎందుకనగా యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హేరోదు తెలుసుకొని అతనికి భయపడి అతని కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలను విన్నప్పుడు ఎంతో కలవరపడే వాడు; అయినా అతని మాటలను వినడానికి ఇష్టపడేవాడు.
MAR 6:21 చివరికి సరియైన సమయం రానే వచ్చింది. హేరోదు తన జన్మదినం సందర్భంగా తన ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ ప్రాంత ప్రముఖులకు విందు ఇచ్చాడు.
MAR 6:22 అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యంచేసి హేరోదును అతని అతిథులను సంతోషపరిచింది. అందుకు రాజు ఆమెతో, “నీకు ఏమి కావాలో అడుగు, నేను ఇస్తాను” అని అన్నాడు.
MAR 6:23 అతడు, “నీవు ఏది అడిగినా నేను ఇస్తాను, నా రాజ్యంలో సగం అడిగినా ఇచ్చేస్తాను!” అని ఆమెతో ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు.
MAR 6:24 కాబట్టి ఆమె బయటకు వెళ్లి తన తల్లిని, “నేనేమి అడగాలి?” అని అడిగింది. అందుకు ఆమె తల్లి, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను అడుగు” అని చెప్పింది.
MAR 6:25 వెంటనే ఆమె రాజు దగ్గరకు త్వరగా వెళ్లి, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించాలని కోరుకొంటున్నాను” అని చెప్పింది.
MAR 6:26 రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులు తాను చేసిన ప్రమాణం కోసం ఆమె అడిగిన దానిని కాదనలేకపోయాడు.
MAR 6:27 అందువల్ల రాజు వెంటనే ఒక సైనికున్ని పిలిచి, యోహాను తలను తెమ్మని ఆదేశించి పంపించాడు. వాడు వెళ్లి, చెరసాలలో యోహాను తలను నరికి,
MAR 6:28 ఆ తలను పళ్లెంలో పెట్టి తీసుకువచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాడు, ఆమె దానిని తన తల్లికి ఇచ్చింది.
MAR 6:29 ఈ సంగతి విన్న యోహాను శిష్యులు వచ్చి, అతని శవాన్ని తీసుకెళ్లి సమాధి చేశారు.
MAR 6:30 అపొస్తలులు యేసు చుట్టూ గుమికూడి తాము బోధించినవి, తాము చేసినవి ఆయనకు తెలియజేశారు.
MAR 6:31 అనేకమంది వస్తూ పోతూ ఉండడంతో వారికి భోజనం చేయడానికి కూడా అవకాశం దొరకలేదు. కాబట్టి ఆయన, “మీరు నాతో కూడా ఏకాంత స్థలానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి” అని చెప్పారు.
MAR 6:32 కాబట్టి వారు పడవ ఎక్కి ఏకాంత స్థలానికి వెళ్లారు.
MAR 6:33 అయితే వారు వెళ్తున్నారని చూసిన అనేకమంది వారిని గుర్తుపట్టి, అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి వారికంటే ముందే ఆ స్థలానికి చేరుకొన్నారు.
MAR 6:34 యేసు పడవ దిగి, గొప్ప జనసమూహం రావడం చూసినప్పుడు, వారు కాపరి లేని గొర్రెలవలె ఉన్నారని వారి మీద కనికరపడ్డారు. వారికి అనేక సంగతులను బోధించడం మొదలుపెట్టారు.
MAR 6:35 అప్పటికి ప్రొద్దుపోయే సమయం అయ్యింది, కాబట్టి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా ఆలస్యం కూడా అవుతుంది.
MAR 6:36 కాబట్టి జనాన్ని పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు” అన్నారు.
MAR 6:37 అందుకు యేసు, “మీరే వారికి భోజనం పెట్టండి” అన్నారు. అందుకు వారు, “రెండువందల దేనారాల కంటే ఎక్కువవుతుంది. మేము వెళ్లి, అంత డబ్బు ఖర్చుపెట్టి రొట్టెలను కొని, వారికి పెట్టాలా?” అని ఆయనను అడిగారు.
MAR 6:38 అందుకు ఆయన, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్లి చూడండి” అని అడిగారు. వారు వెళ్లి చూసి, “అయిదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అన్నారు.
MAR 6:39 అప్పుడు ఆయన వారందరిని గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని శిష్యులతో చెప్పారు.
MAR 6:40 వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు.
MAR 6:41 అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి ఆ రొట్టెలను విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. ఆయన ఆ రెండు చేపలను కూడా వారందరికి విభజించారు.
MAR 6:42 వారందరు తిని తృప్తి పొందారు.
MAR 6:43 తర్వాత శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.
MAR 6:44 తిన్న వారి సంఖ్య అయిదు వేలమంది పురుషులు.
MAR 6:45 వెంటనే యేసు జనసమూహాన్ని పంపివేస్తూ తన శిష్యులు తనకన్న ముందుగా బేత్సయిదా గ్రామానికి వెళ్లేలా వారిని పడవ ఎక్కించారు.
MAR 6:46 వారిని పంపివేసిన తర్వాత, ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు.
MAR 6:47 ఆ రాత్రి సమయాన, ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది, ఆయన ఒంటరిగా నేలపైన ఉన్నారు.
MAR 6:48 ఎదురుగాలి వీస్తుండడంతో, శిష్యులు పడవను చాలా కష్టపడుతూ నడపడం యేసు చూశారు. రాత్రి నాల్గవ జామున ఆయన సరస్సు మీద నడుస్తూ, వారి దగ్గరకు వెళ్లారు.
MAR 6:49 కాని ఆయన నీళ్ల మీద నడవటం వారు చూసినప్పుడు, భూతం అనుకుని వారు కేకలు వేశారు,
MAR 6:50 ఎందుకంటే వారందరు ఆయనను చూసి భయపడ్డారు. వెంటనే ఆయన వారితో, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి!” అన్నారు.
MAR 6:51 అప్పుడు ఆయన వారితో పడవలోనికి ఎక్కారు, అప్పుడు గాలి అణగిపోయింది. వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు.
MAR 6:52 రొట్టెల అద్భుతం యొక్క ప్రాముఖ్యతను వారు ఇంకా అర్థం చేసుకోలేదు; వారి హృదయాలు కఠినమయ్యాయి.
MAR 6:53 వారు అవతలకు వెళ్లి, గెన్నేసరెతు అనే ప్రాంతంలో దిగారు, అక్కడ లంగరు వేశారు.
MAR 6:54 వారు పడవ దిగగానే, ప్రజలు యేసును గుర్తుపట్టారు.
MAR 6:55 వారు ఆ ప్రాంతమంతా పరుగెత్తుకొనిపోయి, ఆయన ఎక్కడ ఉన్నాడని విన్నారో అక్కడికి రోగులను పరుపుల మీద మోసుకొచ్చారు.
MAR 6:56 యేసు గ్రామాలకు, పట్టణాలకు, పల్లెటూళ్ళకు, ఎక్కడికి వెళ్లినా వారు రోగులను తెచ్చి సంత వీధుల్లో ఉంచారు. ఆయన వస్త్రపు అంచునైనా ముట్టనివ్వండని వారు ఆయనను బ్రతిమాలారు. ఆయనను ముట్టిన వారందరు స్వస్థత పొందారు.
MAR 7:1 యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు చుట్టూ చేరారు.
MAR 7:2 ఆయన శిష్యులలో కొందరు మురికి చేతులతో, అనగా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుండడం చూశారు.
MAR 7:3 పెద్దల సాంప్రదాయం ప్రకారం, పరిసయ్యులు యూదులందరు తమ చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు.
MAR 7:4 వారు సంతవీధులలో నుండి వచ్చిన తర్వాత స్నానం చేయకుండా భోజనం చేయరు. ఇంకా గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను, భోజనబల్లను నీళ్లతో కడగటం లాంటి అనేక ఆచారాలను వారు పాటిస్తారు.
MAR 7:5 అందుకు పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, “నీ శిష్యులు ఎందుకు పెద్దల సాంప్రదాయాన్ని పాటించకుండా అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు?” అని యేసును అడిగారు.
MAR 7:6 అందుకు ఆయన వారితో, “వేషధారులారా, మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే; అక్కడ వ్రాయబడి ఉన్నట్లు: “ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి.
MAR 7:7 వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’
MAR 7:8 మీరు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం విడిచిపెట్టి మానవ ఆచారాలకు కట్టుబడి ఉన్నారు” అన్నారు.
MAR 7:9 ఆయన ఇంకా మాట్లాడుతూ, “మీరు మీ సొంత సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను పూర్తిగా ప్రక్కకు పెట్టేస్తున్నారు!
MAR 7:10 మోషే, ‘మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ‘ఎవరైనా తల్లిని గాని తండ్రిని గాని శపిస్తే, వారికి మరణశిక్ష విధించాలి’ అని ఆజ్ఞాపించాడు.
MAR 7:11 కానీ మీరు, ఒక వ్యక్తి తన తల్లితో గాని తండ్రితో గాని నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా కొర్బాన్ (అంటే దేవునికి అంకితం) అని ప్రకటిస్తే,
MAR 7:12 వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు.
MAR 7:13 ఈ విధంగా మీరు నియమించుకొన్న మీ సాంప్రదాయం వలన దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో మీరు చేస్తున్నారు” అని చెప్పారు.
MAR 7:14 యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కరు, నా మాట విని, గ్రహించండి.
MAR 7:15 బయట నుండి లోపలికి వెళ్లేవీ ఒకరిని అపవిత్రపరచవు. కాని లోపలి నుండి బయటకు వచ్చేవి మాత్రమే వారిని అపవిత్రులుగా చేస్తాయి.
MAR 7:16 వినడానికి చెవులు కలవారు విందురు గాక!” అని అన్నారు.
MAR 7:17 ఆయన ఆ జనసమూహాన్ని విడిచి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు.
MAR 7:18 ఆయన, “మీరు ఇంత బుద్ధిహీనులా? బయట నుండి లోపలికి వెళ్లేది ఏది ఒకరిని అపవిత్రపరచదని మీరు చూడలేదా? అని అడిగారు.
MAR 7:19 ఎందుకంటే అది వాని హృదయంలోకి వెళ్లదు, కాని కడుపులోనికి వెళ్లి, తర్వాత శరీరం నుండి బయటకు విసర్జింపబడుతుంది.” (ఈ విషయాన్ని చెప్తూ, భోజనపదార్ధాలన్ని పవిత్రమైనవే అని యేసు ప్రకటించారు.)
MAR 7:20 ఆయన ఇంకా మాట్లాడుతూ, “ఓ వ్యక్తి లోపలినుండి ఏవైతే బయటకు వస్తాయో అవే వారిని అపవిత్రపరుస్తాయి.
MAR 7:21 ఎందుకంటే, అంతరంగంలో నుండి లైంగిక అనైతికత, దొంగతనం, నరహత్య,
MAR 7:22 వ్యభిచారం, దురాశ, పగ, మోసం, అశ్లీలత, అసూయ, దూషణ, అహంకారం, అవివేకం లాంటి దుష్ట ఆలోచనలు వస్తాయి.
MAR 7:23 ఈ దుష్టమైనవన్ని లోపలినుండే బయటకు వచ్చి వ్యక్తిని అపవిత్రపరుస్తాయి” అన్నారు.
MAR 7:24 యేసు అక్కడినుండి లేచి తూరు ప్రాంతానికి వెళ్లారు. ఆయన ఒక ఇంట్లో ప్రవేశించి తాను అక్కడ ఉన్నట్లు ఎవరికి తెలియకూడదని కోరుకున్నారు; కాని, తాను అక్కడ ఉన్నాననే సంగతిని ఆయన రహస్యంగా ఉంచలేకపోయారు.
MAR 7:25 ఒక స్త్రీ ఆయన గురించి విన్న వెంటనే, వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఆమె చిన్నకుమార్తెకు అపవిత్రాత్మ పట్టింది.
MAR 7:26 ఆ స్త్రీ, సిరియా ఫెనికయాలో పుట్టిన గ్రీసుదేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యాన్ని వెళ్లగొట్టమని యేసును వేడుకొంది.
MAR 7:27 ఆయన ఆమెతో, “మొదట పిల్లలను వారు కోరుకున్నంతా తిననివ్వాలి, ఎందుకంటే పిల్లల రొట్టెలను తీసుకుని కుక్కలకు వేయడం సరికాదు” అన్నారు.
MAR 7:28 అందుకు ఆమె, “ప్రభువా, బల్లక్రింద ఉండే కుక్కలు కూడా పిల్లలు పడవేసే రొట్టె ముక్కలను తింటాయి” అని జవాబిచ్చింది.
MAR 7:29 అందుకు ఆయన, “జవాబు బాగుంది! నీవు వెళ్లు; నీ కుమార్తెను దయ్యం వదిలిపోయింది” అని చెప్పారు.
MAR 7:30 ఆమె ఇంటికి వెళ్లి, తన కుమార్తె మంచం మీద పడుకుని ఉండడం, దయ్యం ఆమెను వదిలిపోయింది.
MAR 7:31 యేసు తూరు పట్టణ ప్రాంతాన్ని విడిచి సీదోను ద్వారా, గలిలయ సముద్రం దెకపొలి ప్రాంతాలకు వెళ్లారు.
MAR 7:32 అక్కడ కొందరు చెవుడు, నత్తి ఉన్న ఒకన్ని ఆయన దగ్గరకు తీసుకువచ్చి, వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకున్నారు.
MAR 7:33 యేసు జనసమూహంలో నుండి వానిని ప్రక్కకు తీసుకెళ్లి, వాని చెవుల్లో తన వ్రేళ్ళను ఉంచారు. తర్వాత ఆయన ఉమ్మివేసి, వాని నాలుకను ముట్టారు.
MAR 7:34 ఆయన ఆకాశం వైపు చూసి నిట్టూర్పు విడిచి వానితో, “ఎప్ఫతా!” అన్నారు. (ఆ మాటకు “తెరుచుకో!” అని అర్థం.)
MAR 7:35 వెంటనే వాని చెవులు తెరువబడ్డాయి, అలాగే వాని నాలుక సడలి వాడు తేటగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
MAR 7:36 ఆ సంగతి ఎవ్వరితో చెప్పవద్దని యేసు గుంపును ఆదేశించారు. కాని ఆయన ఎంత ఖచ్చితంగా చెప్పారో, వారు అంత ఎక్కువగా దానిని ప్రకటించారు.
MAR 7:37 “ఆయన చెవిటివారిని వినగలిగేలా, మూగవారిని మాట్లాడేలా చేస్తూ, అన్నిటిని బాగు చేస్తున్నారు” అని చెప్పుకుంటూ ప్రజలు ఆశ్చర్యంతో నిండిపోయారు.
MAR 8:1 ఆ రోజుల్లో మరొక పెద్ద గుంపు గుమికూడింది. అయితే వారు ఏమి తినలేదు, కాబట్టి యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి,
MAR 8:2 “ఈ ప్రజలు మూడు రోజులుగా ఏమి తినకుండా నా దగ్గరే ఉండిపోయారు; వారి మీద నాకు జాలి కలుగుతుంది.
MAR 8:3 నేను వీరిని ఆకలితో ఇళ్ళకు పంపితే, వారు దారిలో సొమ్మసిల్లిపోతారు ఎందుకంటే కొందరు దూరం నుండి వచ్చారు” అని చెప్పారు.
MAR 8:4 అందుకు ఆయన శిష్యులు, “కాని ఇంత మందికి భోజనం పెట్టి తృప్తిపరచడానికి కావలసినంత ఆహారం ఈ మారుమూల ప్రాంతంలో మనకు ఎక్కడ దొరుకుతుంది?” అన్నారు.
MAR 8:5 యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగారు. వారు, “ఏడు” అని జవాబిచ్చారు.
MAR 8:6 యేసు ఆ జనసమూహాన్ని నేల మీద కూర్చోమని ఆదేశించారు. ఆ ఏడు రొట్టెలను పట్టుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వాటిని విరిచి జనసమూహానికి పంచిపెట్టుమని తన శిష్యులకు ఇచ్చారు, వారు పంచిపెట్టారు.
MAR 8:7 వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడ ఉన్నాయి; ఆయన వాటిని కూడ ఆశీర్వదించి, పంచిపెట్టుమని తన శిష్యులకు చెప్పారు.
MAR 8:8 ప్రజలు తిని తృప్తి పొందారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండా నింపారు.
MAR 8:9 తిన్న వారందరు ఇంచుమించు నాలుగు వేలమంది. యేసు వారిని పంపించిన వెంటనే,
MAR 8:10 ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి దల్మనూతా అనే ప్రాంతానికి వెళ్లారు.
MAR 8:11 పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడానికి, ఆకాశం నుండి ఒక సూచన చూపించుమని వారు ఆయనను అడిగారు.
MAR 8:12 అందుకు ఆయన ఆత్మలో దీర్ఘ నిట్టూర్పు విడిచి, “ఈ తరం వారు నన్ను ఎందుకు సూచన అడుగుతున్నారు? వారికి ఏ సూచన ఇవ్వబడదని నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను” అని వారితో అన్నారు.
MAR 8:13 తర్వాత ఆయన వారిని విడిచిపెట్టి మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డున చేరుకొన్నారు.
MAR 8:14 శిష్యులు తమతో రొట్టెలను తెచ్చుకోవడం మరచిపోయారు, పడవలో వారి దగ్గర ఒక్క రొట్టె తప్ప ఏమి లేదు.
MAR 8:15 యేసు వారితో, “పరిసయ్యుల హేరోదు వెంబడించేవారి పులిసిన పిండి మీలో ఉండకుండా చూసుకోండి” అని వారిని హెచ్చరించారు.
MAR 8:16 వారు, “మన దగ్గర రొట్టెలు లేవని ఇలా అన్నారు” అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.
MAR 8:17 వారు ఏమి చర్చించుకుంటున్నారో తెలిసినవాడై యేసు, “రొట్టెలు లేవని మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇప్పటికీ మీరు చూడలేకపోతున్నారా లేదా గ్రహించలేదా పోతున్నారా? మీ హృదయాలు కఠినమైపోయాయా?
MAR 8:18 మీరు కళ్లు ఉండి చూడలేకపోతున్నారా? చెవులు ఉండి వినలేకపోతున్నారా? మీకు జ్ఞాపకం లేదా?
MAR 8:19 నేను అయిదు రొట్టెలను విరిచి అయిదు వేలమందికి పంచినప్పుడు, మీరు ఎన్ని గంపలు ఎత్తారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “పన్నెండు” అని చెప్పారు.
MAR 8:20 “నేను ఏడు రొట్టెలను విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు, ఎన్ని గంపల నిండా ముక్కలను ఎత్తారు?” అని ఆయన వారిని అడిగారు. అందుకు వారు, “ఏడు” అని జవాబిచ్చారు.
MAR 8:21 అప్పుడు ఆయన వారితో, “మీకు ఇంకా అర్థం కాలేదా?” అన్నారు.
MAR 8:22 వారు బేత్సయిదాకు వచ్చినప్పుడు, కొందరు ఒక గ్రుడ్డివానిని తీసుకువచ్చి వానిని ముట్టుమని ఆయనను బ్రతిమాలారు.
MAR 8:23 ఆయన ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకుని ఊరి బయటకు తీసుకెళ్లి, వాని కళ్ల మీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి, “నీకు ఏమైనా కనబడుతుందా?” అని అడిగారు.
MAR 8:24 అందుకు వాడు తల పైకెత్తి చూస్తూ, “మనుష్యులు కనపడుతున్నారు, వారు చెట్లలా నడుస్తున్నారు” అని చెప్పాడు.
MAR 8:25 యేసు మళ్ళీ తన చేతులు వాని కళ్ల మీద ఉంచారు. అప్పుడు వాని కళ్లు తెరువబడ్డాయి, వాడు చూపు పొందుకొని, అన్నిటిని స్పష్టంగా చూడగలిగాడు.
MAR 8:26 యేసు వానితో, “నీవు ఊరిలోనికి వెళ్లకుండా ఇంటికి వెళ్లు” అని చెప్పి వానిని పంపివేశారు.
MAR 8:27 యేసు, ఆయన శిష్యులు కైసరయ ఫిలిప్పు చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లారు. మార్గం మధ్యలో ఆయన వారిని, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని అడిగారు.
MAR 8:28 అందుకు వారు, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అంటున్నారు; ఇతరులు ఏలీయా అంటున్నారు; మరికొందరు ప్రవక్తల్లో ఒకడు అని చెప్పుకుంటున్నారు” అన్నారు.
MAR 8:29 ఆయన వారిని, “అయితే నేనెవరినని మీరనుకొంటున్నారు?” అని అడిగారు. పేతురు, “నీవు క్రీస్తువు” అని చెప్పాడు.
MAR 8:30 అప్పుడు యేసు తన గురించి ఎవరితో చెప్పకూడదని వారిని హెచ్చరించారు.
MAR 8:31 ఆ తర్వాత యేసు, మనుష్యకుమారుడు యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే, ధర్మశాస్త్ర ఉపదేశకులచే తిరస్కరించబడి, అనేక హింసలు పొంది, చంపబడి, మూడు రోజుల తర్వాత తిరిగి లేస్తాడు అని తన శిష్యులకు బోధించడం మొదలుపెట్టారు.
MAR 8:32 ఆయన ఈ మాటను స్పష్టంగా చెప్పారు, కాబట్టి పేతురు ఆయనను ప్రక్కకు తీసుకెళ్లి గద్దింపసాగాడు.
MAR 8:33 కాని యేసు తన శిష్యులవైపు తిరిగి వారిని చూసి, పేతురును, “సాతానా, నా వెనుకకు పో! నీ మనస్సులో దేవుని విషయాలు లేవు, కేవలం మనుష్యుల విషయాలు ఉన్నాయి” అని గద్దించారు.
MAR 8:34 ఆ తర్వాత యేసు జనసమూహంతో పాటు తన శిష్యులను తన దగ్గరకు పిలిచి వారితో ఈ విధంగా చెప్పారు: “ఎవరైనా నా శిష్యునిగా ఉండాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి.
MAR 8:35 ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా తెగించేవారు దానిని దక్కించుకుంటారు.
MAR 8:36 ఎవరైనా లోకమంతా సంపాదించుకుని, తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం?
MAR 8:37 ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు?
MAR 8:38 ఈ వ్యభిచార, పాపిష్ఠి తరం మధ్యలో నా గురించి గాని, నా మాటల గురించి గాని ఎవరైనా సిగ్గుపడితే, మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో పరిశుద్ధ దూతలతో పాటు వచ్చినప్పుడు ఆయన వారి గురించి సిగ్గుపడతాడు.”
MAR 9:1 యేసు ఇంకా మాట్లాడుతూ, “ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యం శక్తితో రావడం చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
MAR 9:2 ఆరు రోజుల తర్వాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకుని ఒంటరిగా ఎత్తైన కొండ మీదికి వెళ్లారు, అక్కడ వారి ముందు ఆయన రూపాంతరం చెందారు.
MAR 9:3 ఆయన వస్త్రాలు మిరుమిట్లుగొలిపేంత తెల్లగా మారాయి, లోకంలో ఎవ్వరూ ఉతకలేనంత తెల్లగా.
MAR 9:4 అప్పుడు మోషే, ఏలీయా ప్రత్యక్షమై యేసుతో మాట్లాడుతూ వారికి కనబడ్డారు.
MAR 9:5 పేతురు యేసుతో, “బోధకుడా, మనం ఇక్కడే ఉండడం మంచిది, మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని చెప్పాడు.
MAR 9:6 అతనికి ఏమి చెప్పాలో తెలియలేదు, వారు చాలా భయపడ్డారు.
MAR 9:7 అప్పుడు మేఘం వారిని కమ్ముకుంది, ఆ మేఘంలో నుండి ఒక స్వరం ఇలా చెప్పింది: “ఇదిగో ఈయన నేను ప్రేమించే నా ప్రియ కుమారుడు. ఈయన మాటలను వినండి!”
MAR 9:8 అకస్మాత్తుగా, వారు చుట్టూ చూసినప్పుడు, తమతో యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు.
MAR 9:9 వారు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు, మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచేవరకు మీరు చూసినవాటిని ఎవరితో చెప్పవద్దు అని యేసు శిష్యులను ఖచ్చితంగా ఆదేశించారు.
MAR 9:10 “చనిపోయి తిరిగి బ్రతకడం” అనే మాట మీద వారు ఒకరితో ఒకరు చర్చించుకొంటూ, ఆ విషయాన్ని తమ మధ్యలోనే ఉంచుకున్నారు.
MAR 9:11 వారు, “ఏలీయా ముందుగా రావాలని ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందుకు చెప్తున్నారు?” అని ఆయనను అడిగారు.
MAR 9:12 అందుకు యేసు, “ఏలీయా ముందుగా వచ్చి అన్నిటిని చక్కపెడతాడన్న మాట నిజమే. అలాంటప్పుడు మనుష్యకుమారుడు అధికంగా హింసను అనుభవించి తృణీకరించబడతాడని ఎందుకు వ్రాయబడింది?
MAR 9:13 అయితే నేను మీతో చెప్తున్న, ఏలీయా ముందే వచ్చాడు, అతని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం, ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టుగా అతనికి చేశారు” అని అన్నారు.
MAR 9:14 వారు ఇతర శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు, వారి చుట్టూ గొప్ప జనసమూహం ఉండడం ధర్మశాస్త్ర ఉపదేశకులు వారితో వాదిస్తుండడం చూశారు
MAR 9:15 ప్రజలందరు యేసును చూసిన వెంటనే, వారు ఆశ్చర్యంతో మునిగిపోయి ఆయనను పలకరించడానికి పరుగెత్తారు.
MAR 9:16 యేసు, “మీరు దేని గురించి వారితో వాదిస్తున్నారు?” అని వారిని అడిగారు.
MAR 9:17 ఆ జనసమూహంలో నుండి ఒకడు, “బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని తీసుకువచ్చాను.
MAR 9:18 అది వాన్ని పట్టినప్పుడెల్లా, వాన్ని నేల మీద పడవేస్తుంది. అప్పుడు వాడు నోటి నుండి నురుగు కారుస్తాడు, పండ్లు కొరుకుతూ, బిగుసుకుపోతాడు. ఈ దయ్యాన్ని వెళ్లగొట్టమని మీ శిష్యులను అడిగాను కాని వారిచేత కాలేదు” అన్నాడు.
MAR 9:19 అందుకు యేసు, “విశ్వాసంలేని తరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహించగలను? ఆ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకురండి” అన్నారు.
MAR 9:20 కాబట్టి వారు వాన్ని తీసుకువచ్చారు. ఆ దయ్యం యేసుని చూసిన వెంటనే ఆ పిల్లవాన్ని విలవిలలాడించింది. వాడు నేల మీద పడి నురుగు కార్చుకొంటు పొర్లాడుతున్నాడు.
MAR 9:21 యేసు ఆ పిల్లవాని తండ్రితో, “వీడు ఎంతకాలం నుండి ఇలా ఉన్నాడు?” అని అడిగారు. అతడు, “వాని చిన్నతనం నుండే.
MAR 9:22 అది వాన్ని చంపాలని చాలాసార్లు నిప్పుల్లో, నీళ్లలో పడవేసింది. ఒకవేళ నీ వలనైతే, మమ్మల్ని కనికరించి మాకు సహాయం చేయి” అన్నాడు.
MAR 9:23 అందుకు యేసు, “ ‘నీ వలనైతే?’ అని అడిగి, ఒక వ్యక్తి నమ్మితే సమస్తం సాధ్యమే” అని అతనితో చెప్పారు.
MAR 9:24 వెంటనే ఆ చిన్నవాని తండ్రి, “నేను నమ్ముతున్నాను; నా అపనమ్మకాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి!” అని అరిచాడు.
MAR 9:25 ప్రజలు గుంపుగా తన దగ్గరకు పరుగెత్తికొని వస్తున్నారని యేసు చూసి, “మూగ, చెవిటి దయ్యమా, ఇతనిలో నుండి బయటకు రా, ఇంకెప్పుడు వానిలో ప్రవేశింపకూడదని నీకు ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ అపవిత్రాత్మను గద్దించారు.
MAR 9:26 అప్పుడు ఆ అపవిత్రాత్మ పెద్ద కేక వేసి, వాన్ని విలవిలలాడించి వదిలిపోయింది. ఆ పిల్లవాడు చచ్చిన వానిలా పడి ఉండడం చూసి చాలామంది, “వాడు చనిపోయాడు” అనుకున్నారు.
MAR 9:27 కానీ యేసు వాని చేయి పట్టుకుని లేవనెత్తారు, అప్పుడు వాడు లేచి నిలబడ్డాడు.
MAR 9:28 యేసు ఇంట్లోకి వెళ్లిన తర్వాత, శిష్యులు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, “మేము ఎందుకు దానిని వెళ్లగొట్టలేకపోయాం” అని అడిగారు.
MAR 9:29 అందుకు ఆయన, “ఇలాంటివి ప్రార్థన ద్వారా మాత్రమే బయటకు వస్తాయి” అని చెప్పారు.
MAR 9:30 వారు ఆ స్థలాన్ని వదిలి గలిలయ ప్రాంతం గుండా వెళ్లారు. యేసు తన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు కాబట్టి,
MAR 9:31 తాము ఎక్కడ ఉన్నామో ఎవనికి తెలియకూడదని అనుకున్నారు. ఆయన వారితో, “మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయనను చంపుతారు, మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పారు.
MAR 9:32 అయితే వారు ఆయన మాటల అర్థాన్ని గ్రహించలేదు పైగా దాని గురించి ఆయనను అడగడానికి కూడా భయపడ్డారు.
MAR 9:33 వారు కపెర్నహూముకు వచ్చారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, ఆయన వారిని, “మీరు త్రోవలో దేని గురించి వాదించుకుంటున్నారు?” అని అడిగారు.
MAR 9:34 కాని వారు మౌనంగా ఉండిపోయారు ఎందుకంటే దారిలో వారు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు.
MAR 9:35 యేసు కూర్చుని, పన్నెండుమందిని తన దగ్గరకు పిలుచుకొని, “ఎవడైనా మొదటివానిగా ఉండాలని అనుకుంటే వాడు అందరిలో చివరివాడై, అందరికి దాసునిగా ఉండాలి” అని వారితో అన్నారు.
MAR 9:36 ఆయన ఒక చిన్నబిడ్డను తీసుకుని వారి మధ్యలో నిలబెట్టి, ఆ చిన్నబిడ్డను తన కౌగిటిలో ఎత్తుకుని, వారితో ఈ విధంగా చెప్పారు,
MAR 9:37 ఎవరైనా ఈ చిన్నబిడ్డల్లో ఒకనిని నా పేరట చేర్చుకుంటారో, వారు నన్ను చేర్చుకున్నట్టే; అలాగే నన్ను చేర్చుకొన్న వారు నన్నే కాదు నన్ను పంపినవానిని చేర్చుకున్నట్టే.
MAR 9:38 యోహాను యేసుతో, “బోధకుడా, నీ పేరట ఒకడు దయ్యాలను వెళ్లగొట్టడం మేము చూసి, వాన్ని ఆపివేయమని చెప్పాము, ఎందుకంటే వాడు మనవాడు కాడు” అని చెప్పాడు.
MAR 9:39 అందుకు యేసు, “వాన్ని ఆపకండి, ఎందుకంటే నా పేరున అద్భుతాలు చేసేవాడు నా గురించి చెడ్డగా మాట్లాడలేడు.
MAR 9:40 మనకు విరోధి కాని వాడు మన పక్షంగా ఉన్నవాడు.
MAR 9:41 మీరు క్రీస్తుకు చెందినవారని ఎవరైనా నా పేరట ఒక గిన్నెడు నీళ్లను మీకు ఇచ్చినా వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAR 9:42 “ఎవరైనా నన్ను నమ్మిన ఈ చిన్నపిల్లల్లో ఒకరికి ఆటంకం కలిగిస్తే, వారి మెడకు తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వారికి మేలు.
MAR 9:43 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ చేయి కారణమైతే, దానిని నరికి పారవేయి. ఎందుకంటే నీవు రెండు చేతులు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడటం కంటే, ఒక చేతితో నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు.
MAR 9:44 ఆ నరకంలో, “ ‘వారిని తినే పురుగులు చావవు అగ్ని ఆరదు.’
MAR 9:45 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కాలు కారణమైతే దానిని నరికి పారవేయి. నీవు రెండు కాళ్లు కలిగి ఆరని అగ్ని ఉండే నరకంలో పడవేయబడటం కంటే, కుంటివానిగా నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు.
MAR 9:46 ఆ నరకంలో, “ ‘వారిని తినే పురుగులు చావవు అగ్ని ఆరదు.’
MAR 9:47 నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కన్ను కారణమైతే, దానిని పెరికి పారవేయి. నీవు రెండు కళ్లు కలిగి నరకంలో పడవేయబడటం కంటే, ఒక కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం నీకు మేలు.
MAR 9:48 ఆ నరకంలో, “ ‘వారిని తినే పురుగులు చావవు, అగ్ని ఆరదు.’
MAR 9:49 ప్రతి ఒక్కరు అగ్నితో ఉప్పు సారం పొందుకొంటారు.
MAR 9:50 “ఉప్పు మంచిదే, కాని ఒకవేళ అది తన సారం కోల్పోతే, నీవు దానిని తిరిగి ఎలా సారవంతం చేయగలవు? మీలో మీరు ఉప్పును కలిగి ఉండండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి.”
MAR 10:1 యేసు కపెర్నహూము నుండి యూదయ ప్రాంతానికి యొర్దాను నది అవతల ఉన్న ప్రాంతానికి వెళ్లారు. మళ్ళీ ప్రజల గుంపు ఆయన దగ్గరకు వచ్చింది కాబట్టి ఆయన ఎప్పటిలాగే వారికి బోధించారు.
MAR 10:2 కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించడానికి ఆయన దగ్గరకు వచ్చి, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్టప్రకారం న్యాయమేనా?” అని అడిగారు.
MAR 10:3 అందుకు యేసు, “మోషే మీకు ఏమి ఆజ్ఞాపించాడు?” అని అడిగారు.
MAR 10:4 వారు, “విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెను పంపించడానికి మోషే పురుషునికి అనుమతించాడు” అన్నారు.
MAR 10:5 అందుకు యేసు, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మోషే ఈ ఆజ్ఞను మీ కోసం వ్రాశాడు.
MAR 10:6 సృష్టి ఆరంభం నుండే దేవుడు వారిని ‘పురుషునిగాను స్త్రీగాను’ సృజించారు.
MAR 10:7 ‘ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు,
MAR 10:8 అలా వారిద్దరు ఏకశరీరం అవుతారు.’ కాబట్టి వారు ఇక ఇద్దరు కారు, కాని ఒక శరీరమే అవుతారు.
MAR 10:9 కాబట్టి దేవుడు జతపరచినవారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు” అని చెప్పారు.
MAR 10:10 వారందరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, శిష్యులు వీటి గురించి యేసుని వివరంగా చెప్పమని అడిగారు.
MAR 10:11 ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, “తన భార్యను విడిచి మరొక స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు ఆమెకు విరుద్ధంగా వ్యభిచారం చేస్తున్నాడు.
MAR 10:12 అలాగే ఒకవేళ ఆమె తన భర్తను విడిచి వేరే పురుషుని పెళ్ళి చేసుకుంటే, ఆమె వ్యభిచారం చేస్తుంది.”
MAR 10:13 ప్రజలు తమ చిన్నపిల్లలపై యేసు తన చేతులుంచి వారిని ఆశీర్వదించాలని ఆయన దగ్గరకు తీసుకుని వస్తున్నారు, కాని శిష్యులు వారిని గద్దించారు.
MAR 10:14 యేసు అది చూసి, శిష్యుల మీద కోప్పడ్డారు. ఆయన వారితో, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే ఇలాంటి వారిదే దేవుని రాజ్యము.
MAR 10:15 ఎవరైనా చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే ఎన్నటికి దానిలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు.
MAR 10:16 అప్పుడు ఆయన ఆ పిల్లలను తన కౌగిటిలో ఎత్తుకుని, వారి మీద తన చేతులుంచి వారిని దీవించారు.
MAR 10:17 యేసు బయలుదేరి వెళ్తునప్పుడు, ఒక మనిషి ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి ఆయన ముందు మోకాళ్లూని, “మంచి బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.
MAR 10:18 అందుకు యేసు, “నీవు నన్ను ఎందుకు మంచివాడనని పిలుస్తున్నావు? దేవుడు తప్ప మంచివారు ఎవ్వరూ లేరు.
MAR 10:19 మీకు ఆజ్ఞలు తెలుసు: ‘హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ” అని అన్నారు.
MAR 10:20 అందుకు అతడు, “బోధకుడా, నేను నా బాల్యం నుండే వీటన్నిటిని ఆచరిస్తున్నాను” అన్నాడు.
MAR 10:21 యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, “నీలో ఒక కొరత ఉంది. నీవు వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు, అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి, నన్ను వెంబడించు” అని చెప్పారు.
MAR 10:22 ఆ మాటతో అతడు ముఖం చిన్నబుచ్చుకుని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే అతడు గొప్ప ఆస్తి కలవాడు.
MAR 10:23 యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టమో!” అన్నారు.
MAR 10:24 ఆయన మాటలకు శిష్యులు ఆశ్చర్యపడ్డారు కాని యేసు మళ్ళీ, “పిల్లలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టమో!
MAR 10:25 ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు.
MAR 10:26 ఇది విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, ఒకరితో ఒకరు, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అనుకున్నారు.
MAR 10:27 యేసు వారివైపు చూసి, “ఇది మనుష్యులకు అసాధ్యమే, కాని దేవునికి కాదు; దేవునికి సమస్తం సాధ్యమే!” అన్నారు.
MAR 10:28 అప్పుడు పేతురు, “మేము అన్నిటిని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము!” అన్నాడు.
MAR 10:29 అందుకు యేసు, “నేను మీతో నిజంగా చెప్తున్నాను, నా కోసం సువార్త కోసం ఎవరైతే తమ ఇంటిని, సహోదరులను, సహోదరీలను, తల్లిని, తండ్రిని, పిల్లలను, పొలాలను విడిచిపెడతారో,
MAR 10:30 వారు హింసతో పాటు ఇండ్లను, సహోదరులను, సహోదరీలను, తల్లులను, పిల్లలను, పొలాలను ఈ ప్రస్తుత యుగంలో రానున్న యుగంలో నిత్యజీవాన్ని వందరెట్లు పొందుకొంటారు.
MAR 10:31 అయితే చాలామంది మొదటివారు చివరివారవుతారు, చివరి వారు మొదటివారవుతారు” అని చెప్పారు.
MAR 10:32 వారు యెరూషలేముకు వెళ్తున్నారు, యేసు వారికి ముందు నడుస్తున్నారు, ఆయనను వెంబడించినవారు భయపడుతూ ఉంటే, శిష్యులు విస్మయమొందారు. యేసు మళ్ళీ తన పన్నెండుమంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్లి తనకు జరగబోయే సంగతులను వారికి చెప్పారు.
MAR 10:33 “మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్యకుమారుడు ముఖ్య యాజకులకు ధర్మశాస్త్ర ఉపదేశకులకు అప్పగించబడతాడు. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను యూదేతరుల చేతికి అప్పగిస్తారు.
MAR 10:34 వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి, కొరడాలతో కొట్టి చంపేస్తారు. మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పారు.
MAR 10:35 జెబెదయి కుమారులైన యాకోబు యోహానులు ఆయన దగ్గరకు వచ్చి, “బోధకుడా, మేమేది అడిగినా నీవు మాకోసం అది చేయాలని మేము కోరుతున్నాం” అని అన్నారు.
MAR 10:36 ఆయన వారిని, “నేను మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడిగారు.
MAR 10:37 వారు ఆయనతో, “నీ మహిమలో మా ఇద్దరిలో ఒకడు నీ కుడి వైపున ఇంకొకడు నీ ఎడమవైపున కూర్చోపెట్టుకో” అన్నారు.
MAR 10:38 యేసు వారితో, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా లేదా నేను పొందిన బాప్తిస్మం మీరు పొందగలరా?” అని అడిగారు.
MAR 10:39 వారు, “మేము చేయగలం” అని జవాబిచ్చారు. అప్పుడు యేసు వారితో, “నేను త్రాగే గిన్నెలోనిది మీరు తప్పక త్రాగుతారు నేను పొందిన బాప్తిస్మం మీరు పొందుతారు,
MAR 10:40 కాని నా కుడి వైపున లేదా ఎడమవైపున కూర్చోడానికి అనుమతి ఇవ్వాల్సింది నేను కాదు. ఈ స్థానాలు ఎవరి కోసం సిద్ధపరచబడి ఉన్నాయో వారికే చెందుతాయి” అని వారితో అన్నారు.
MAR 10:41 ఇది విన్న తక్కిన పదిమంది శిష్యులు, యాకోబు యోహానుల మీద కోప్పడ్డారు.
MAR 10:42 యేసు వారిని తన దగ్గరకు పిలుచుకొని వారితో, “యూదేతరుల అధికారులు వారి మీద ప్రభుత్వం చేస్తారని వారి ఉన్నతాధికారులు వారి మీద అధికారం చెలాయిస్తారని మీకు తెలుసు.
MAR 10:43 కాని మీరలా ఉండకూడదు. మీలో గొప్పవాడు కావాలని కోరేవాడు మీకు దాసునిగా ఉండాలి,
MAR 10:44 అలాగే మీలో మొదటివానిగా ఉండాలని కోరుకునేవాడు అందరికి దాసునిగా ఉండాలి.
MAR 10:45 ఎందుకంటే మనుష్యకుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు కాని సేవ చేయడానికి, తన ప్రాణాన్ని అనేకులకు విమోచన క్రయధనంగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నారు.
MAR 10:46 ఆ తర్వాత వారు యెరికో పట్టణం చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, గొప్ప జనసమూహంతో కలిసి, పట్టణం విడిచి వెళ్తుండగా, తిమయి కుమారుడైన బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు.
MAR 10:47 వాడు నజరేయుడైన యేసు అక్కడ ఉన్నాడని విని, “దావీదు కుమారుడా యేసూ, నా మీద దయ చూపించు!” అని కేకలు వేయడం మొదలుపెట్టాడు.
MAR 10:48 అనేకులు వాన్ని గద్దించారు, నిశ్శబ్దంగా ఉండమని వానికి చెప్పారు. కాని వాడు, “దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు.
MAR 10:49 అప్పుడు యేసు ఆగి, “వాన్ని పిలువండి” అన్నారు. వారు ఆ గ్రుడ్డివానితో, “సంతోషించు! లేచి రా! ఆయన నిన్ను పిలుస్తున్నారు” అన్నారు.
MAR 10:50 అప్పుడు వాడు తన పైవస్త్రాన్ని పారవేసి దిగ్గున లేచి యేసు దగ్గరకు వచ్చాడు.
MAR 10:51 యేసు వాన్ని, “నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు?” అని అడిగారు. అప్పుడు ఆ గ్రుడ్డివాడు, “బోధకుడా, నాకు చూపు కావాలి” అని అన్నాడు.
MAR 10:52 అందుకు యేసు, “వెళ్లు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది” అని చెప్పారు. వెంటనే వాడు చూపు పొందుకొని ఆ దారిన యేసును వెంబడించాడు.
MAR 11:1 వారు యెరూషలేముకు సమీపిస్తూ, ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియ, బేత్పగే గ్రామాలకు వచ్చాక, యేసు తన ఇద్దరు శిష్యులను పంపుతూ,
MAR 11:2 “మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి, దానిలో ప్రవేశించగానే, ఇంతవరకు ఎవ్వరూ ఎక్కని ఒక గాడిదపిల్ల కట్టబడి మీకు కనబడుతుంది. దానిని విప్పి ఇక్కడకు తీసుకురండి.
MAR 11:3 ‘మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ‘ఇది ప్రభువుకు కావాలి, త్వరలో తిరిగి పంపిస్తారు’ అని చెప్పండి” అన్నారు.
MAR 11:4 వారు వెళ్లి ఒక వీధిలో ఒక ఇంటి తలుపు బయట ఒక గాడిదపిల్ల కట్టబడి ఉండడం చూశారు వారు దాన్ని విప్పుతున్నప్పుడు,
MAR 11:5 అక్కడ నిలబడ్డ కొందరు, “మీరు ఆ గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని వారిని అడిగారు.
MAR 11:6 యేసు చెప్పినట్లే వారు ఆ మనుష్యులకు చెప్పినప్పుడు, ఆ మనుష్యులు దాన్ని తీసుకెళ్లనిచ్చారు.
MAR 11:7 వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరకు తీసుకువచ్చి దానిపై తమ వస్త్రాలను వేశారు, ఆయన దానిపై కూర్చున్నారు.
MAR 11:8 చాలామంది ప్రజలు తమ వస్త్రాలను త్రోవలో పరిచారు, మరికొందరు పొలాల్లో నుండి కొమ్మలు నరికితెచ్చి పరిచారు.
MAR 11:9 ఆయన ముందు వెళ్లేవారు, ఆయనను వెంబడిస్తున్న వారు బిగ్గరగా, “హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!”
MAR 11:10 “రానైయున్న మన పితరుడైన దావీదు రాజ్యం ధన్యమవును గాక!” “సర్వోన్నతమైన స్థలాల్లో హోసన్నా!” అని కేకలు వేశారు.
MAR 11:11 యేసు యెరూషలేములో ప్రవేశించి, దేవాలయ ఆవరణంలోనికి వెళ్లారు. అక్కడ ఉన్నవాటన్నిటిని చూశారు కాని అప్పటికే ఆలస్యం అయినందుకు ఆయన పన్నెండు మందితో కలిసి బేతనియ గ్రామానికి వెళ్లిపోయారు.
MAR 11:12 మరుసటిరోజు వారు బేతనియ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు, యేసుకు ఆకలివేసింది.
MAR 11:13 దూరం నుండి ఒక అంజూర చెట్టును చూసి, దానిలో ఏమైనా పండ్లు ఉన్నాయా అని దగ్గరకు వెళ్లారు. కాని అది అంజూర పండ్లు కాసే కాలం కాదు కాబట్టి ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు.
MAR 11:14 అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఇకపై ఎవ్వరూ ఎన్నడు నీ పండ్లను తినకపోవుదురు గాక” అన్నారు. ఆయన అలా అనడం శిష్యులు విన్నారు.
MAR 11:15 వారు యెరూషలేము చేరిన తర్వాత, యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి అక్కడ అమ్ముతూ, కొంటూ ఉన్నవారినందరిని తరమడం ప్రారంభించారు. డబ్బు మార్చే వారి బల్లలను, గువ్వలను, అమ్మేవారి పీటలను ఆయన పడవేశారు.
MAR 11:16 దేవాలయ ఆవరణంలో ఎవరినీ వ్యాపారం చేయనివ్వలేదు.
MAR 11:17 ఆయన వారికి బోధిస్తూ, “ ‘నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడలేదా? కాని మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ” అన్నారు.
MAR 11:18 ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ మాటలు విని, ఆయనను చంపడానికి ఒక మార్గాన్ని వెదకడం ప్రారంభించారు, కాని ప్రజలందరు ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడడం చూసి, ఆయనకు భయపడ్డారు.
MAR 11:19 సాయంత్రం అయినప్పుడు, యేసు తన శిష్యులతో కలిసి పట్టణం విడిచి వెళ్లారు.
MAR 11:20 మరుసటి ఉదయం, వారు వెళ్తున్నప్పుడు, ఆ అంజూర చెట్టు వేర్లతో సహా ఎండిపోయిందని వారు గమనించారు.
MAR 11:21 అందుకు పేతురు దానిని జ్ఞాపకం చేసుకుని యేసుతో, “బోధకుడా చూడు! నీవు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది” అన్నాడు.
MAR 11:22 అందుకు యేసు, “దేవునిలో విశ్వాసముంచండి” అని చెప్పారు.
MAR 11:23 “ఎవరైనా ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పి, తమ మనస్సులో సందేహించక తాము చెప్పింది తప్పక జరుగుతుందని నమ్మితే, వారికి అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
MAR 11:24 కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా, దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు దానిని మీరు పొందుకుంటారు.
MAR 11:25 మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఎవరిపట్లనైనా ఏదైనా వ్యతిరేకత కలిగి ఉంటే, వారిని క్షమించండి, దాన్ని బట్టి మీ పరలోకపు తండ్రి మీ పాపాలను క్షమిస్తారు.
MAR 11:26 ఒకవేళ మీరు ఇతరుల అపరాధాలను క్షమించకపోతే, మీ పరలోకపు తండ్రి కూడ మీ అపరాధాలను క్షమించరు.”
MAR 11:27 వారు తిరిగి యెరూషలేముకు చేరుకొన్నారు, యేసు దేవాలయ ఆవరణంలో నడుస్తున్నప్పుడు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, నాయకులు ఆయన దగ్గరకు వచ్చారు.
MAR 11:28 వారు, “నీవు ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నావు? ఇవి చేయడానికి నీకు అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.
MAR 11:29 అందుకు యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పండి, అప్పుడు ఏ అధికారంతో నేను వీటిని చేస్తున్నానో మీకు చెప్తాను.
MAR 11:30 యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండా? లేదా మానవుల నుండా?” అని వారిని అడిగారు.
MAR 11:31 వారు తమలో తాము చర్చించుకొంటూ అనుకున్నారు, “ఒకవేళ మనం ‘పరలోకం నుండి కలిగింది’ అని చెప్పితే ‘మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు’ అని అడుగుతాడు.
MAR 11:32 ఒకవేళ మనం, ‘మనుష్యుల వలన’ ” అని చెప్తే, (వారు ప్రజలకు భయపడ్డారు. దానికి కారణం ప్రతి ఒక్కరు యోహాను నిజంగా ఒక ప్రవక్తని నమ్ముతున్నారు.)
MAR 11:33 అందుకు వారు, “మాకు తెలియదు” అని యేసుకు జవాబిచ్చారు. అందుకు యేసు, “నేను ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నానో నేను కూడా మీతో చెప్పను” అన్నారు.
MAR 12:1 యేసు వారితో ఉపమానరీతిలో మాట్లాడడం ప్రారంభించారు: “ఒక వ్యక్తి తన పొలంలో ద్రాక్షతోటను నాటాడు. అతడు దాని చుట్టూ కంచె వేయించి, అందులో ద్రాక్ష గానుగ తొట్టి తొలిపించి, కాపలా కాయడానికి ఎత్తైన గోపురం కట్టించాడు. తర్వాత ఆ ద్రాక్షతోటను కొందరు కౌలురైతులకు అద్దెకు ఇచ్చి దూర దేశానికి వెళ్లిపోయాడు.
MAR 12:2 కోతకాలం వచ్చినప్పుడు అతడు ఆ ద్రాక్షతోటకు వెళ్లి దానిలోని తన భాగం తెమ్మని ఒక పనివానిని ఆ రైతుల దగ్గరకు పంపాడు,
MAR 12:3 కాని ఆ రైతులు వానిని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు.
MAR 12:4 అప్పుడు అతడు మరొక పనివానిని వారి దగ్గరకు పంపాడు కాని, వారు వాన్ని తలమీద కొట్టి అవమానించి పంపేశారు.
MAR 12:5 అప్పుడు అతడు మరొక పనివానిని పంపాడు, వారు అతన్ని కూడ చంపేశారు. అలా అతడు చాలామంది పనివారిని పంపాడు, వారు కొంతమందిని కొట్టారు, మరికొందరిని చంపారు.
MAR 12:6 “పంపడానికి అతని దగ్గర ఒకడే మిగిలాడు, తాను ఎంతో ప్రేమించే, తన కుమారుడు. ‘వారు నా కుమారున్ని గౌరవిస్తారు’ అనుకుని, చివరిగా అతన్ని పంపాడు.
MAR 12:7 “కాని వారు ఒకరితో ఒకరు, ‘ఇతడే వారసుడు, రండి, ఇతన్ని చంపుదాం, అప్పుడు ఈ వారసత్వం మనదైపోతుంది’ అని అనుకున్నారు.
MAR 12:8 కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు.
MAR 12:9 “అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు? అతడు వచ్చి ఆ కౌలురైతులను చంపి తన ద్రాక్షతోటను ఇతరులకు అప్పగిస్తాడు.
MAR 12:10 మీరు ఈ లేఖనం చదువలేదా: “ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది;
MAR 12:11 ఇది ప్రభువే చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.’”
MAR 12:12 ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, నాయకులు తమ గురించే ఆయన ఈ ఉపమానం చెప్పారని గ్రహించి ఎలాగైనా ఆయనను బంధించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. కాని వారు ప్రజలకు భయపడి ఆయనను వదిలి వెళ్లిపోయారు.
MAR 12:13 తర్వాత వారు యేసును ఆయన మాటల్లోనే పట్టించాలని కొంతమంది పరిసయ్యులను హేరోదీయులను ఆయన దగ్గరకు పంపారు.
MAR 12:14 వారు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, నీవు యథార్థవంతుడవని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కాబట్టి ఇతరులచే నీవు ప్రభావితం కావు; కాని సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా?”
MAR 12:15 మేము పన్ను కట్టాలా దగ్గరా? అని అడిగారు. అయితే యేసు వారి వేషధారణ తెలిసినవాడై, “మీరు ఎందుకు నన్ను చిక్కున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు? నా దగ్గరకు ఒక దేనారం తీసుకురండి, నేను దాన్ని చూస్తాను” అన్నారు.
MAR 12:16 వారు ఒక నాణెం తెచ్చారు, ఆయన వారిని, “దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు. వారు, “కైసరువి” అన్నారు.
MAR 12:17 అప్పుడు యేసు, “కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు. ఆయన జవాబుకు వారు చాలా ఆశ్చర్యపడ్డారు.
MAR 12:18 అప్పుడు పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు.
MAR 12:19 “బోధకుడా, పెళ్ళి చేసుకున్న ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని చనిపోయిన తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే మాకోసం వ్రాశాడు.
MAR 12:20 అయితే ఒక కుటుంబంలో ఏడుగురు సోదరులు ఉన్నారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు.
MAR 12:21 కాబట్టి రెండవవాడు ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, కాని వాడు కూడా సంతానం లేకుండానే చనిపోయాడు. అలాగే మూడవ వానికి కూడా జరిగింది.
MAR 12:22 వాస్తవానికి, ఆ ఏడుగురు కూడా సంతానం లేకుండానే చనిపోయారు. చివరికి, ఆ స్త్రీ కూడా చనిపోయింది.
MAR 12:23 ఆమెను ఏడుగురు పెళ్ళి చేసుకున్నారు కాబట్టి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” అని అడిగారు.
MAR 12:24 అందుకు యేసు, “మీకు వాక్యం కాని దేవుని శక్తిని కాని తెలియదు కాబట్టి మీరు పొరపాటు చేయట్లేదా?
MAR 12:25 చనిపోయినవారు తిరిగి బ్రతికిన తర్వాత వారు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు; వారు పరలోకంలో దూతల్లా ఉంటారు.
MAR 12:26 మృతులు తిరిగి లేచే విషయం మోషే వ్రాసిన గ్రంథంలో, మండుతున్న పొద సంఘటనలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, ‘నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను’ అని చెప్పడం మీరు చదువలేదా?
MAR 12:27 ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు. మీరు ఘోరంగా పొరబడుతున్నారు” అన్నారు.
MAR 12:28 ధర్మశాస్త్ర ఉపదేశకులలో ఒకడు వచ్చి వారు తర్కించుకోవడం విన్నాడు. యేసు వారికి మంచి జవాబు ఇవ్వడం గమనించి, “ఆజ్ఞలన్నిటిలో అతి ముఖ్యమైనదేది?” అని ఆయనను అడిగాడు.
MAR 12:29 అందుకు యేసు, “అన్నిటిలో అతి ముఖ్యమైనది: ‘ఓ ఇశ్రాయేలీయులారా, వినండి: మన ప్రభువైన దేవుడు, ప్రభువు ఒక్కరే.
MAR 12:30 మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణమనస్సుతో, మీ పూర్ణబలంతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి.’
MAR 12:31 రెండవ ఆజ్ఞ: ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’ వీటిని మించిన గొప్ప ఆజ్ఞ లేదు” అని అతనితో చెప్పారు.
MAR 12:32 అతడు, “బోధకుడా, బాగా చెప్పావు. దేవుడు ఒక్కరే, ఆయన తప్ప వేరొకరు లేరని నీవు చెప్పింది నిజమే.
MAR 12:33 మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణవివేకంతో, మీ పూర్ణబలంతో ఆయనను ప్రేమించాలి, మీకులా మీ పొరుగువారిని ప్రేమించడం దహనబలులు అర్పణల కంటే ముఖ్యం” అని జవాబిచ్చాడు.
MAR 12:34 అతడు తెలివిగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అని అతనితో చెప్పారు. ఆ తర్వాత ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు.
MAR 12:35 యేసు దేవాలయ ఆవరణంలో బోధిస్తూ, “క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎందుకు చెప్తున్నారు?
MAR 12:36 దావీదు తానే, పరిశుద్ధాత్మతో నింపబడి ఈ విధంగా మాట్లాడాడు: “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’
MAR 12:37 దావీదే ఆయనను ‘ప్రభువు’ అని పిలిచినప్పుడు ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?” అని అడిగారు. ఆ పెద్ద జనసమూహం అంతా సంతోషంగా ఆయన మాటలను విన్నారు.
MAR 12:38 యేసు బోధిస్తూ, “ధర్మశాస్త్ర ఉపదేశకులను గురించి జాగ్రత్తపడండి. వారు పొడుగు అంగీలు వేసుకుని సంత వీధుల్లో తిరుగుతూ ప్రజల నుండి గౌరవం అందుకోవడానికి ఇష్టపడతారు.
MAR 12:39 వారు సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను విందుల్లో గౌరవ స్థలాలను పొందాలని కోరుకుంటారు.
MAR 12:40 వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు” అని చెప్పారు.
MAR 12:41 యేసు దేవాలయంలో కానుకలపెట్టె ముందు కూర్చుని జనసమూహం ఆ కానుక పెట్టెలో వారి డబ్బులు వేయడం గమనిస్తున్నారు. చాలామంది ధనవంతులు డబ్బు మూటలను అందులో వేస్తున్నారు.
MAR 12:42 కాని ఒక బీద విధవరాలు వచ్చి రెండు చిన్న కాసులను ఆ పెట్టెలో వేసింది.
MAR 12:43 యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “నేను మీతో నిజంగా చెప్తున్న, కానుక పెట్టెలో అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది.
MAR 12:44 వారందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కొంత వేశారు, కాని ఈమె తన పేదరికం నుండి తన జీవనాధారమంతా వేసింది” అని అన్నారు.
MAR 13:1 యేసు దేవాలయం నుండి వెళ్తుండగా, ఆయన శిష్యులలో ఒకడు, “బోధకుడా, చూడండి! ఈ రాళ్లు ఎంత పెద్దగా ఉన్నాయో! ఈ కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో!” అని ఆయనతో అన్నాడు.
MAR 13:2 అందుకు యేసు, “నీవు ఈ గొప్ప కట్టడలన్నిటిని చూస్తున్నావా? ఇందులో ఒక రాయి మీద ఇంకొక రాయి ఉండదు; ప్రతి ఒకటి పడవేయబడుతుంది” అని చెప్పారు.
MAR 13:3 యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండమీద కూర్చుని ఉన్నప్పుడు, పేతురు, యాకోబు, యోహాను అంద్రెయలు ఏకాంతంగా ఉన్నప్పుడు, “ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ నెరవేరబడబోతున్నాయి అనడానికి సూచన ఏంటి? మాకు చెప్పండి” అని ఆయనను అడిగారు.
MAR 13:5 అందుకు యేసు వారితో, “ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా చూసుకోండి.
MAR 13:6 ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే ఆయనను’ అని చెప్పి చాలామందిని మోసం చేస్తారు.
MAR 13:7 మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి విన్నప్పుడు, ఆందోళన చెందకండి. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం రావలసి ఉంది.
MAR 13:8 జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. ఇవి ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే.
MAR 13:9 “మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు న్యాయసభలకు అప్పగించబడతారు, సమాజమందిరాల్లో కొరడాలతో కొట్టబడతారు. నన్ను బట్టి మీరు అధికారుల ఎదుట రాజుల ఎదుట వారికి సాక్షులుగా నిలబడతారు.
MAR 13:10 ఈ సువార్త మొదట అన్ని దేశాల ప్రజలకు ప్రకటించబడాలి.
MAR 13:11 మీరు బంధించబడి తీర్పుకు అప్పగించబడినప్పుడు ఏమి చెప్పాలో అని మీరు ముందుగానే చింతించవద్దు. ఆ సమయంలో మీకు ఇవ్వబడిన మాటలనే చెప్పండి, ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ మీ ద్వారా మాట్లాడతాడు.
MAR 13:12 “సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు.
MAR 13:13 నన్ను బట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ద్వేషిస్తారు, కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు.
MAR 13:14 “ ‘నిర్జనంగా మారడానికి కారణమైన హేయమైనది’ నిలబడకూడని స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు, చదివేవాడు అర్థం చేసుకొనును గాక, అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి.
MAR 13:15 ఇంటిపైన ఉన్నవారెవరు క్రిందికి దిగకూడదు ఇంట్లోకి వెళ్లి లేదా ప్రవేశించి దేన్ని బయటకు తీసుకురాకూడదు.
MAR 13:16 పొలంలో ఉన్నవారు తమ పైవస్త్రాన్ని తెచ్చుకోడానికి వెనుకకు వెళ్లకూడదు.
MAR 13:17 ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ!
MAR 13:18 ఇది చలికాలంలో రాకుండా ప్రార్థించండి.
MAR 13:19 ఎందుకంటే దేవుడు లోకాన్ని సృష్టించినప్పటి నుండి నేటి వరకు అలాంటి శ్రమ రాలేదు, మరి ఎప్పటికీ రాదు.
MAR 13:20 “ప్రభువు ఆ దినాలను తగ్గించకపోతే ఎవ్వరూ తప్పించుకోలేరు. అయితే ఎన్నుకోబడినవారి కోసం, అనగా ఆయన ఏర్పరచుకున్న వారి కోసం ఆ రోజులు తగ్గించబడతాయి.
MAR 13:21 ఆ రోజుల్లో మీతో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు!’ లేదా, ‘ఇదిగో, ఆయన అక్కడ ఉన్నాడు!’ అని చెప్పితే నమ్మకండి.
MAR 13:22 ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు ఏర్పరచుకున్న వారిని కూడా మోసం చేయడానికి సూచకక్రియలను, అద్భుతాలను చేస్తారు.
MAR 13:23 కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి; అందుకే ఈ విషయాలను నేను మీకు ముందుగానే చెప్పాను.
MAR 13:24 “కాని ఆ దినాల్లో, ఆ శ్రమకాలం తర్వాత, “ ‘సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు.
MAR 13:25 ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి.’
MAR 13:26 “అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో మహిమతో మేఘాల మీద రావడం ప్రజలు చూస్తారు.
MAR 13:27 ఆయన తన దూతలను పంపి, నలుదిక్కుల నుండి, భూమి అంతం నుండి ఆకాశ అంతం వరకు తాను ఏర్పరచుకున్న వారిని పోగుచేస్తారు.
MAR 13:28 “అంజూర చెట్టును చూసి ఒక పాఠం నేర్చుకోండి: అంజూర కొమ్మలు లేతవై చిగురిస్తున్నప్పుడు, వేసవికాలం సమీపంగా ఉందని మీకు తెలుస్తుంది.
MAR 13:29 అలాగే, ఈ సంగతులన్ని జరుగుతున్నాయని మీరు చూసినప్పుడు, ఆయన రాకడ చాలా దగ్గరలో ఉందని, తలుపు దగ్గరే ఉందని మీరు తెలుసుకోండి.
MAR 13:30 ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను.
MAR 13:31 ఆకాశం భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏమాత్రం గతించవు.
MAR 13:32 “అయితే ఆ దినం గురించి, ఆ సమయం గురించి ఎవరికి తెలియదు, కనీసం పరలోకంలోని దూతలకు గాని, తన కుమారునికి గాని తెలియదు. కేవలం తండ్రికి మాత్రమే తెలుసు.
MAR 13:33 జాగ్రత్తగా ఉండండి! మెలకువగా ఉండండి! ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు.
MAR 13:34 అది తన ఇల్లు విడిచి దూరదేశం వెళ్తున్న ఒక మనిషిని పోలి ఉంది: అతడు సేవకులకు అధికారం ఇచ్చి, ప్రతీ సేవకునికి వారి వారి పనులను అప్పగించి, ద్వారం దగ్గర ఉన్నవానికి కాపలా కాయమని చెప్తాడు.
MAR 13:35 “ఇంటి యజమాని సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడి కూసే వేళకు వస్తాడో, లేదా సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి.
MAR 13:36 అతడు ఒకవేళ అకస్మాత్తుగా వస్తే, మీరు నిద్రపోవడం చూస్తాడేమో అని జాగ్రత్తగా ఉండండి!
MAR 13:37 నేను మీతో చెప్తుందే అందరితో చెప్తున్న: ‘మెలకువగా ఉండండి!’ ”
MAR 14:1 పస్కా పండుగ పులియని రొట్టెల పండుగకు ఇంకా రెండు రోజులు ఉందనగా, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసును రహస్యంగా పట్టుకుని చంపడానికి కుట్ర పన్నుతున్నారు.
MAR 14:2 “కాని పండుగ సమయంలో వద్దు, ఎందుకంటే ప్రజలు అల్లరి చేయవచ్చు” అని చెప్పుకున్నారు.
MAR 14:3 యేసు బేతనియలో, కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు, ఒక స్త్రీ చాలా విలువైన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, ఆ సీసాను పగులగొట్టి ఆ పరిమళద్రవ్యాన్ని యేసు తలమీద పోసింది.
MAR 14:4 అక్కడ ఉన్న కొందరు కోప్పడి, “పరిమళద్రవ్యాన్ని ఇలా ఎందుకు వృధా చేయడం? అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
MAR 14:5 ఈ పరిమళద్రవ్యాన్ని మూడువందల దేనారాలకు అమ్మి ఆ డబ్బును పేదవారికి ఇచ్చి ఉండాల్సింది” అని ఆ స్త్రీని కోపంగా గద్దించారు.
MAR 14:6 అందుకు యేసు, “ఆమెను ఒంటరిగా వదిలేయండి, ఆమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఆమె నా కోసం ఒక కార్యం చేసింది.
MAR 14:7 పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, మీకు ఇష్టం వచ్చిన సమయంలో మీరు వారికి సహాయం చేయవచ్చు. కాని నేను మీతో ఉండను.
MAR 14:8 ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నా భూస్థాపన కోసం నన్ను సిద్ధం చేయడానికి ఆమె ముందుగానే పరిమళద్రవ్యాన్ని నా శరీరం మీద పోసింది.
MAR 14:9 సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడినా, అక్కడ ఈమె చేసింది జ్ఞాపకం చేసుకుని, ఈమె చేసిన దాని గురించి కూడా చెప్పుకుంటారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు.
MAR 14:10 పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్య యాజకుల చేతికి యేసును అప్పగించడానికి వారి దగ్గరకు వెళ్లాడు.
MAR 14:11 ఇది విని వారు సంతోషించి వానికి డబ్బులు ఇస్తామని వాగ్దానం చేశారు. కాబట్టి వాడు యేసును అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు.
MAR 14:12 పులియని రొట్టెల పండుగ మొదటి రోజున, అది ఆచార ప్రకారం పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం, యేసు శిష్యులు ఆయనతో, “నీకోసం పస్కా భోజనం సిద్ధం చేయడానికి మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటావు?” అని అడిగారు.
MAR 14:13 యేసు తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ, వారితో ఈ విధంగా అన్నారు, “మీరు పట్టణంలోనికి వెళ్లినప్పుడు, నీళ్లకుండ ఎత్తుకుని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు కలుస్తాడు, మీరు అతన్ని వెంబడించండి.
MAR 14:14 అతడు ప్రవేశించే ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి, నా అతిథుల గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడగమన్నాడు’ అని చెప్పండి.
MAR 14:15 అతడు అన్ని సదుపాయాలతో, సిద్ధంగా ఉన్న ఒక పెద్ద మేడగదిని మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ సిద్ధం చేయండి” అని చెప్పారు.
MAR 14:16 శిష్యులు పట్టణంలోనికి వెళ్లి యేసు చెప్పినట్లుగా వాటిని కనుగొన్నారు. కాబట్టి అక్కడ వారు పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు.
MAR 14:17 సాయంకాలమైనప్పుడు, యేసు పన్నెండుమంది శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు.
MAR 14:18 వారంతా బల్ల దగ్గర కూర్చుని తింటున్నప్పుడు, ఆయన వారితో, “మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడు నాతో పాటు భోజనం చేస్తున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అన్నారు.
MAR 14:19 వారికి దుఃఖం కలిగింది, ఒకరి తర్వాత ఒకరు ఆయనతో, “ఖచ్చితంగా నేనైతే కాదు కదా?” అన్నారు.
MAR 14:20 అందుకు యేసు, “ఈ పన్నెండుమందిలో ఒకడు, అతడు నాతో పాటు రొట్టెను గిన్నెలో ముంచేవాడు.
MAR 14:21 మనుష్యకుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన వెళ్లిపోతారు. కాని మనుష్యకుమారుని పట్టించే వానికి శ్రమ! ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మేలు” అని అన్నారు.
MAR 14:22 వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకుని, దాని కోసం కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకోండి, ఇది నా శరీరం” అని చెప్పారు.
MAR 14:23 ఆ తర్వాత ఆయన పాత్రను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి, దానిని వారికి ఇచ్చారు, అప్పుడు వారందరు దానిలోనిది త్రాగారు.
MAR 14:24 యేసు వారితో, “ఇది అనేకుల కోసం చిందించనున్న నా నిబంధన రక్తము.
MAR 14:25 దేవుని రాజ్యంలో నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగనని మీతో చెప్తున్నాను” అన్నారు.
MAR 14:26 వారు ఒక కీర్తన పాడిన తర్వాత, ఒలీవల కొండకు వెళ్లారు.
MAR 14:27 యేసు వారితో, “మీరందరు చెదరిపోతారు, ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నేను గొర్రెల కాపరిని కొడతాను, అప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి.’
MAR 14:28 కాని నేను తిరిగి లేచిన తర్వాత మీకంటే ముందు గలిలయ ప్రాంతానికి వెళ్తాను” అని చెప్పారు.
MAR 14:29 అప్పుడు పేతురు ఆయనతో, “అందరు నిన్ను విడిచినా, నేను విడువను” అన్నాడు.
MAR 14:30 అందుకు యేసు, “ఈ రాత్రే కోడి రెండు సార్లు కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
MAR 14:31 కాని పేతురు నొక్కి చెప్తూ, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా, నీవెవరో తెలియదని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులు కూడా అలాగే అన్నారు.
MAR 14:32 తర్వాత వారు గెత్సేమనే అనే చోటికి వెళ్లారు, అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థనచేసి వచ్చేవరకు మీరు ఇక్కడే కూర్చోండి” అని అన్నారు.
MAR 14:33 ఆయన పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని పోయి, తీవ్ర వేదనతో బాధపడసాగారు.
MAR 14:34 ఆయన వారితో, “నేను చనిపోయే అంతగా నా ఆత్మ దుఃఖంతో నిండి ఉంది, కాబట్టి మీరు ఇక్కడే ఉండి మెలకువగా ఉండండి” అని చెప్పారు.
MAR 14:35 ఆయన కొంత దూరం వెళ్లి, నేల మీద పడి సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటి పోవాలని ప్రార్థించారు.
MAR 14:36 ఆయన, “అబ్బా, తండ్రీ, నీకు సమస్తం సాధ్యమే. ఈ గిన్నెను నా దగ్గర నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు, మీ చిత్తమే జరగాలి” అన్నారు.
MAR 14:37 ఆయన తిరిగి తన శిష్యుల దగ్గరకు వచ్చి, వారు నిద్రిస్తున్నారని చూసి పేతురుతో, “సీమోనూ, నిద్రిస్తున్నావా? ఒక గంటయైనా మెలకువగా ఉండలేవా?
MAR 14:38 మీరు శోధనలో పడకుండ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం” అని చెప్పారు.
MAR 14:39 ఆయన మళ్ళీ వెళ్లి అదే విధంగా ప్రార్థించారు.
MAR 14:40 ఆయన తిరిగి వచ్చినప్పుడు, వారి కళ్లు బరువుగా ఉన్నాయి, కాబట్టి వారు మళ్ళీ నిద్రపోతున్నారని తెలుసుకున్నారు. ఆయనకు ఏమి చెప్పాలో వారికి తెలియలేదు.
MAR 14:41 యేసు మూడవసారి తిరిగివచ్చి, “మీరు ఇంకా నిద్రిస్తు విశ్రాంతి తీసుకొంటున్నారా? ఇక చాలు! చూడండి, మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది.
MAR 14:42 వెళ్దాం రండి. నన్ను పట్టించేవాడు వస్తున్నాడు” అని చెప్పారు.
MAR 14:43 ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు పంపిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకుని వచ్చింది.
MAR 14:44 ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు: “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించి బందోబస్తుతో తీసుకెళ్లండి.”
MAR 14:45 యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా” అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు.
MAR 14:46 వారు వచ్చి యేసును పట్టుకొని, ఆయనను బంధించారు.
MAR 14:47 యేసు ప్రక్కన నిలుచున్న వారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి చెవిని నరికివేశాడు.
MAR 14:48 యేసు, “నన్ను పట్టుకోడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా?
MAR 14:49 నేను ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో బోధిస్తూ, మీతోనే ఉన్నాను, మీరు నన్ను బంధించలేదు. ఎందుకంటే లేఖనాలు నెరవేరాలని ఇలా జరిగింది” అని చెప్పారు.
MAR 14:50 అప్పుడు అందరు ఆయనను ఒంటరిగా విడిచి పారిపోయారు.
MAR 14:51 సన్నని నార వస్త్రం మాత్రమే ధరించిన ఒక యువకుడు, యేసును వెంబడిస్తున్నాడు. వారు అతన్ని పట్టుకున్నప్పుడు,
MAR 14:52 అతడు ఆ వస్త్రాన్ని వదిలి దిగంబరిగా పారిపోయాడు.
MAR 14:53 వారు యేసును ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకెళ్లారు, ముఖ్య యాజకులు, నాయకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరు అక్కడ సమావేశం అయ్యారు.
MAR 14:54 పేతురు ప్రధాన యాజకుని ఇంటి ప్రాంగణం వరకు, ఆయనను దూరం నుండి వెంబడిస్తూ వచ్చాడు. అక్కడ కాపలా కాస్తున్న వారితో చలిమంట దగ్గర కూర్చుని, చలి కాచుకుంటున్నాడు.
MAR 14:55 ముఖ్య యాజకులు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలను వెదకుతున్నారు. కానీ వారికి ఏమి దొరకలేదు.
MAR 14:56 ఆయనకు వ్యతిరేకంగా అనేకులు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు, కాని వాటిలో ఒకదానికొకటి సరిపోలేదు.
MAR 14:57 అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా ఈ అబద్ధసాక్ష్యం చెప్పారు: “ ‘ఇతడు మనుష్యుల చేతులతో కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో మనుష్యుల చేతులతో కట్టని మరొక దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు.
MAR 14:59 అయినా వారి సాక్ష్యం కూడా సరిపోలేదు.
MAR 14:60 అప్పుడు ప్రధాన యాజకుడు వారి ముందు నిలబడి యేసును, “నీవు వారికి సమాధానం ఇవ్వవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న సాక్ష్యాల గురించి నీవు ఏమంటావు?” అని అడిగాడు.
MAR 14:61 కాని యేసు మౌనంగా ఉండి వారికి ఏ జవాబు ఇవ్వలేదు. ప్రధాన యాజకుడు మళ్ళీ యేసును, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా?” అని అడిగాడు.
MAR 14:62 అందుకు యేసు, “అవును” అంతేకాదు, “మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారు” అని చెప్పారు.
MAR 14:63 అప్పుడు ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొని, “ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు. మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు. అందుకు వారందరు మరణశిక్ష విధించాలి అన్నారు.
MAR 14:65 ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయడం మొదలుపెట్టారు; వారు ఆయన కళ్లు మూసి, ఆయనను తమ పిడికిళ్ళతో గుద్ది, “నిన్ను ఎవరు కొట్టారో, చెప్పు!” అన్నారు. కావలివారు కూడా ఆయనను పట్టుకుని కొట్టారు.
MAR 14:66 పేతురు ఇంటి ప్రాంగణంలో క్రింది భాగంలో ఉన్నప్పుడు, ప్రధాన యాజకుని దగ్గర పని చేసే అమ్మాయి అక్కడికి వచ్చింది.
MAR 14:67 పేతురు చలి కాచుకుంటూ ఉండగా ఆమె, అతన్ని దగ్గర నుండి చూసింది. ఆ అమ్మాయి పేతురుతో, “నీవు కూడా నజరేతువాడైన, యేసుతో ఉన్నావు” అన్నది.
MAR 14:68 కాని దానికతడు ఒప్పుకోలేదు. “నీవు ఏమి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అని చెప్పి, అతడు ద్వారం వైపుకు వెళ్లాడు. వెంటనే కోడి కూసింది.
MAR 14:69 ఆ దాసియైన అమ్మాయి అతన్ని అక్కడ చూసినప్పుడు, చుట్టూ నిలబడి ఉన్నవారితో, “ఇతడు కూడా వారిలో ఒకడే” అన్నది.
MAR 14:70 అతడు మళ్ళీ తిరస్కరించాడు. కొంతసేపటి తర్వాత, పేతురుకు దగ్గరలో నిలబడినవారు పేతురుతో, “ఖచ్చితంగా నీవు కూడ వారిలో ఒకడివి, ఎందుకంటే నీవు గలిలయ వాడవు” అన్నారు.
MAR 14:71 అందుకతడు శపించడం మొదలుపెట్టి, “మీరు ఎవరి గురించైతే మాట్లాడుతున్నారో ఆయన నాకు తెలియదు!” అని వారితో ప్రమాణం చేశాడు.
MAR 14:72 వెంటనే రెండవసారి కోడి కూసింది. అప్పుడు పేతురు, “కోడి రెండు సార్లు కూయక ముందే నేనెవరో నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు” అని యేసు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకుని, వెక్కివెక్కి ఏడ్చాడు.
MAR 15:1 తెల్లవారుజామున ముఖ్య యాజకులు, నాయకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు న్యాయసభ సభ్యులు అందరు కలిసి ఆలోచన చేశారు. కాబట్టి వారు యేసును బంధించి, తీసుకెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు.
MAR 15:2 పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు. అందుకు యేసు, “అని నీవే అన్నావు” అని జవాబిచ్చారు.
MAR 15:3 ముఖ్య యాజకులు యేసు మీద అనేక నేరాలు మోపారు.
MAR 15:4 అందుకు పిలాతు మళ్ళీ యేసుతో, “నీవు వారికి జవాబు చెప్పవా? వారు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు!” అన్నాడు.
MAR 15:5 కాని యేసు జవాబివ్వలేదు, కాబట్టి పిలాతు ఆశ్చర్యపోయాడు.
MAR 15:6 పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి.
MAR 15:7 తిరుగుబాటు చేసి, మనుష్యులను చంపినందుకు బంధింపబడిన వారిలో బరబ్బా అనేవాడు ఉన్నాడు.
MAR 15:8 ప్రజలు గుంపుగా వచ్చి, అతడు ఎప్పుడూ చేసినట్లే చేయమని పిలాతును కోరారు.
MAR 15:9 ముఖ్య యాజకులు కేవలం అసూయతోనే యేసును అప్పగించారని పిలాతుకు తెలుసు, కాబట్టి, “యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని అడిగాడు.
MAR 15:11 కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బాను విడుదల చేసేలా పిలాతును కోరమని గుంపును రెచ్చగొట్టారు.
MAR 15:12 అందుకు పిలాతు, “మరి, మీరు యూదుల రాజు అని పిలిచే ఇతన్ని ఏమి చేయమంటారు?” అని వారిని అడిగాడు.
MAR 15:13 అందుకు వారు, “సిలువ వేయండి!” అని అరిచారు.
MAR 15:14 “ఎందుకు? ఇతడు చేసిన నేరమేంటి?” అని పిలాతు అడిగాడు. అయితే వారు ఇంకా గట్టిగా, “అతన్ని సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
MAR 15:15 పిలాతు ఆ ప్రజలను సంతోషపెట్టడానికి, బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయడానికి అప్పగించాడు.
MAR 15:16 సైనికులు యేసును ప్రేతోర్యము అని పిలువబడే అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి అక్కడ మిగిలిన సైనికులందరిని సమకూర్చారు.
MAR 15:17 వారు ఆయనకు ఊదా రంగు అంగీని వేసి, ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు.
MAR 15:18 ఆ తర్వాత, “జయం, యూదుల రాజా!” అని ఆయనను పిలవడం మొదలుపెట్టారు.
MAR 15:19 ఆయన తలపై కొమ్మతో పదే పదే కొడుతూ, ఆయన మీద ఉమ్మి వేశారు. వారు ఆయన ముందు మోకరించి, ఆయనను అవమానిస్తూ నమస్కరించారు.
MAR 15:20 ఈ విధంగా ఆయనను ఎగతాళి చేసిన తర్వాత, ఆయన మీదనున్న ఊదా రంగు వస్త్రాన్ని తీసివేసి, ఆయన వస్త్రాలను ఆయనకే తొడిగించారు. తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్లారు.
MAR 15:21 కురేనీ ప్రాంతానికి చెందిన, అలెగ్జాండరు రూఫసు అనేవారి తండ్రియైన సీమోను ఆ మార్గాన వెళ్తున్నాడు. సైనికులు అతన్ని పట్టుకుని సిలువ మోయమని బలవంతం చేశారు.
MAR 15:22 వారు యేసును గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము.
MAR 15:23 అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు.
MAR 15:24 ఆ తర్వాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన వస్త్రాలను పంచుకోడానికి, వారు చీట్లు వేసి ఎవరికి వచ్చింది వారు తీసుకున్నారు.
MAR 15:25 ఆయనను సిలువ వేసినప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది.
MAR 15:26 ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది: యూదుల రాజు.
MAR 15:27 తిరుగుబాటు చేసిన ఇద్దరు బందిపోటు దొంగలను, ఆయనకు కుడి వైపున ఒకడిని, ఎడమవైపున మరొకడిని సిలువ వేశారు.
MAR 15:28 ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు అని వ్రాయబడినది.
MAR 15:29 ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు నీవే కదా!
MAR 15:30 సిలువ మీద నుండి దిగిరా, నిన్ను నీవే రక్షించుకో!” అని అంటూ దూషించారు.
MAR 15:31 అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను ఎగతాళి చేశారు, “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు.
MAR 15:32 ఈ క్రీస్తు, ఇశ్రాయేలీయుల రాజు, మేము చూసి నమ్మేలా ఇప్పుడు సిలువ నుండి దిగిరా” అని ఆయనను హేళన చేశారు. ఆయనతో కూడా సిలువవేయబడిన వారు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు.
MAR 15:33 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది.
MAR 15:34 మూడు గంటలకు యేసు, “ఎలోయి, ఎలోయి, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటలకు, “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థము.
MAR 15:35 దగ్గర నిలబడిన వారిలో కొందరు ఆ మాటలను విని, “వినండి, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.
MAR 15:36 ఒకడు పరుగెత్తుకొని వెళ్లి, ఒక స్పంజీని పుల్లని ద్రాక్షరసంలో ముంచి ఒక కర్రకు తగిలించి, యేసుకు త్రాగడానికి అందించాడు. “ఇప్పుడు వీన్ని ఒంటరిగా వదిలి వేద్దాము. ఏలీయా వచ్చి వీన్ని క్రిందికి దించుతాడేమో చూద్దాం” అన్నాడు.
MAR 15:37 గొప్ప కేక వేసి, యేసు ప్రాణం విడిచారు.
MAR 15:38 అప్పుడు దేవాలయంలో తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది.
MAR 15:39 యేసుకు ఎదురుగా నిలబడి ఉన్న శతాధిపతి, ఆయన ప్రాణం విడవడం చూసి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అన్నాడు.
MAR 15:40 కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్నవాడైన యాకోబు యోసేపుల తల్లియైన మరియ ఇంకా సలోమి ఉన్నారు.
MAR 15:41 ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి, ఆయనకు సేవ చేశారు, వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన అనేకమంది స్త్రీలు కూడ అక్కడ ఉన్నారు.
MAR 15:42 అది సిద్ధపాటు రోజు అనగా సబ్బాతు దినానికి ముందు రోజు. కాబట్టి సాయంకాలమైనప్పుడు,
MAR 15:43 అరిమతయికు చెందిన యోసేపు న్యాయసభలో ప్రాముఖ్యమైన సభ్యుడు, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నవాడు, అతడు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.
MAR 15:44 ఆయన అప్పటికే చనిపోయాడని విన్న పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని తన దగ్గరకు పిలిచి, యేసు అప్పుడే చనిపోయాడా అని అడిగాడు.
MAR 15:45 శతాధిపతి నుండి ఆ సంగతిని తెలుసుకున్నాక, యోసేపుకు యేసు శరీరాన్ని అప్పగించాడు.
MAR 15:46 కాబట్టి యోసేపు సన్నని నారబట్ట కొని తెచ్చి, యేసు దేహాన్ని క్రిందికి దింపి, నారబట్టతో చుట్టి, రాతితో చెక్కబడిన సమాధిలో పెట్టాడు. తర్వాత ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి దొర్లించి దానిని మూసి వేశాడు.
MAR 15:47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లియైన మరియ ఆయనను పెట్టిన చోటును చూశారు.
MAR 16:1 సబ్బాతు దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి యేసు శరీరానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలను కొన్నారు.
MAR 16:2 వారం మొదటి రోజున తెల్లవారేటప్పుడు, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారు సమాధి దగ్గరకు వెళ్తూ
MAR 16:3 “సమాధి ద్వారాన్ని మూసిన రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు.
MAR 16:4 కాని వారు అక్కడ చేరుకుని, ఆ పెద్ద రాయి ప్రక్కకు తొలగిపోయి ఉండడం చూశారు
MAR 16:5 వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, తెల్లని అంగీ వేసుకుని ఉన్న ఒక యవ్వనస్థుడు కుడి ప్రక్కన కూర్చుని ఉండడం చూసి, చాలా భయపడ్డారు.
MAR 16:6 అప్పుడు ఆ దూత, “భయపడవద్దు, మీరు సిలువవేయబడిన, నజరేయుడైన యేసును వెదుకుతున్నారు. ఆయన లేచారు! ఆయన ఇక్కడ లేరు. వారు ఆయనను పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి.
MAR 16:7 అయితే వెళ్లి, ఆయన శిష్యులతో, పేతురుతో, ‘ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నారు. ఆయన మీతో చెప్పినట్లే, అక్కడ మీరు ఆయనను చూస్తారు’ ” అని చెప్పండని ఆ స్త్రీలతో చెప్పాడు.
MAR 16:8 ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ సమాధి నుండి పరుగెత్తి వెళ్లిపోయారు. వారు చాలా భయపడ్డారు, కాబట్టి వారు ఎవరితో ఏమి చెప్పలేదు.
MAR 16:9 వారంలో మొదటి రోజైన ఆదివారం తెల్లవారుతుండగా, యేసు ఎవరిలో నుండి ఏడు దయ్యాలను వెళ్లగొట్టారో ఆ మగ్దలేనే మరియకు మొదట కనిపించారు.
MAR 16:10 ఆమె వెళ్లి, ఆయనతో పాటు ఉండినవారై ఆయన కోసం దుఃఖిస్తూ, ఏడుస్తున్నవారికి చెప్పింది.
MAR 16:11 యేసు బ్రతికి ఉన్నాడని, ఆమె ఆయనను చూసిందని వారు విన్నప్పుడు, వారు నమ్మలేదు.
MAR 16:12 ఆ తర్వాత వారిలో ఇద్దరు నడుస్తూ వెళ్తుండగా యేసు వారికి వేరే రూపంలో కనిపించారు.
MAR 16:13 వారు తిరిగివెళ్లి జరిగిన విషయాన్ని మిగిలిన శిష్యులకు చెప్పారు; కాని వీరి మాటలను కూడా వారు నమ్మలేదు.
MAR 16:14 తర్వాత పదకొండు మంది శిష్యులు భోజనం చేస్తున్నప్పుడు యేసు వారికి కనిపించారు. యేసు తిరిగి లేచిన తర్వాత ఆయనను చూసినవారు వారికి చెప్పినా వారు నమ్మలేదని, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన వారిని గద్దించారు.
MAR 16:15 యేసు వారితో, “మీరు సర్వలోకానికి వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి.
MAR 16:16 నమ్మి, బాప్తిస్మం పొందేవారు రక్షణ పొందుతారు, నమ్మనివారు శిక్షను అనుభవిస్తారు.
MAR 16:17 నన్ను నమ్మిన వారందరి ద్వారా ఈ సూచకక్రియలు జరుగుతాయి: నా నామంలో దయ్యాలను వెళ్లగొడతారు; క్రొత్త భాషలు మాట్లాడుతారు;
MAR 16:18 తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు; విషం త్రాగినా వారికి ఏ హాని కలుగదు; వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, రోగులు స్వస్థత పొందుతారు” అన్నారు.
MAR 16:19 ప్రభువైన యేసు శిష్యులతో మాట్లాడిన తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు, దేవుని కుడిచేతి వైపున కూర్చున్నారు.
MAR 16:20 ఆ తర్వాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రకటించారు, ప్రభువు వారితో కూడా ఉండి, అద్భుతాలు సూచనలతో తన మాటలు నిజమని నిరూపించారు.
LUK 1:1 ఘనత వహించిన థెయోఫిలా, జరిగిన సంఘటనలను కళ్లారా చూసినవారు, వాక్య ఉపదేశకులు మనకు చెప్తూ అందించిన వివరాలను అనేకులు వ్రాయడం మొదలుపెట్టారు. కాబట్టి నీకు బోధించబడిన సంగతులు ఖచ్చితంగా జరిగాయని నీవు తెలుసుకోవడానికి, దీన్ని దృష్టిలో ఉంచుకుని, నేనే ఆరంభం నుండి ప్రతిదీ జాగ్రత్తగా పరిశోధించాను కాబట్టి నేను కూడా మీ కోసం అన్నిటిని ఒక క్రమంలో వ్రాయాలని నిర్ణయించుకున్నాను, నెరవేర్చబడిన సంఘటనలన్నిటిని గురించి నేనే జాగ్రత్తగా పరిశోధించి, తద్వారా మీకు బోధించబడిన విషయాలు ఎంత ఖచ్చితమైనవో మీకు తెలుస్తుంది.
LUK 1:5 యూదయదేశపు రాజైన హేరోదు రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన ఒక యాజకుడు ఉన్నాడు, అతని పేరు జెకర్యా; అతని భార్య అహరోను యాజక వంశీయురాలు, ఆమె పేరు ఎలీసబెతు.
LUK 1:6 వారిద్దరు ప్రభువు ఆజ్ఞలను, శాసనాలను నిందారహితంగా అనుసరిస్తూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు.
LUK 1:7 అయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరు చాలా వృద్ధులు.
LUK 1:8 ఒకసారి జెకర్యా వారి శాఖ విధుల్లో ఉన్నప్పుడు అతడు దేవుని ఎదుట యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు,
LUK 1:9 యాజకులు వారి సాంప్రదాయం ప్రకారం చీట్లు వేసినప్పుడు, అతనికి ప్రభువు మందిరంలోనికి వెళ్లి ధూపం వేసే వంతు వచ్చింది.
LUK 1:10 ధూపం వేసే సమయం వచ్చినప్పుడు, సమాజ ప్రజలందరు బయట ప్రార్థిస్తున్నారు.
LUK 1:11 ప్రభువు దూత ధూపవేదికకు కుడి వైపున నిలబడి, అతనికి ప్రత్యక్షమయ్యాడు.
LUK 1:12 జెకర్యా అతన్ని చూసి, ఉలిక్కిపడి, భయంతో బిగుసుకుపోయాడు.
LUK 1:13 ఆ దూత అతనితో, “జెకర్యా భయపడకు; నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కుమారుని కంటుంది, నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి.
LUK 1:14 అతడు నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగ చేస్తాడు, అలాగే అనేకులు అతని పుట్టుకను బట్టి సంతోషిస్తారు.
LUK 1:15 ఎందుకంటే ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడవుతాడు. అతడు ద్రాక్షరసం కానీ మద్యం కానీ త్రాగకూడదు, అతడు పుట్టక ముందే పరిశుద్ధాత్మచేత నింపబడతాడు.
LUK 1:16 ఇశ్రాయేలీయుల్లోని చాలామందిని అతడు వారి ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పుతాడు.
LUK 1:17 అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానం వైపుకు త్రిప్పి, ప్రజలను ప్రభువు కోసం సిద్ధపరచడానికి ఏలీయా యొక్క ఆత్మతో శక్తితో ప్రభువుకు ముందుగా వెళ్తాడు” అన్నాడు.
LUK 1:18 అందుకు జెకర్యా ఆ దూతతో, “ఇది జరుగుతుందని నేను ఎలా నమ్మాలి? నేను ముసలివాన్ని, నా భార్య వయస్సు కూడా మీరిపోయింది” అన్నాడు.
LUK 1:19 అందుకు ఆ దూత అతనితో, “నేను గబ్రియేలును. నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాను, నీతో మాట్లాడి నీకు ఈ శుభవార్త చెప్పడానికి నేను నీ దగ్గరకు పంపబడ్డాను.
LUK 1:20 నేనిప్పుడు నీతో చెప్పిన మాటలను నీవు నమ్మలేదు, కాబట్టి నిర్ణీత సమయంలో ఇది జరిగే వరకు, నీవు మూగవానిగా మౌనంగా ఉంటావు” అన్నాడు.
LUK 1:21 అంతలో, ప్రజలు జెకర్యా కోసం ఎదురుచూస్తూ దేవాలయంలో అతడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు.
LUK 1:22 అతడు బయటకు వచ్చాక, అతడు వారితో మాట్లాడలేకపోయాడు. అతడు తమతో మాట్లాడటానికి బదులు సైగలు చేస్తూ ఉండడంతో, అతడు దేవాలయంలో దర్శనం చూశాడని వారు గ్రహించారు.
LUK 1:23 అతని సేవ కాలం పూర్తయినప్పుడు, అతడు ఇంటికి వెళ్లిపోయాడు.
LUK 1:24 ఆ తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భం ధరించి అయిదు నెలల వరకు ఇతరులకు కనబడకుండా ఉండింది.
LUK 1:25 ఆమె, “ప్రభువే నా కోసం ఈ కార్యం చేశారు, ఈ దినాల్లో ఆయన నన్ను కరుణించి, నా ప్రజలమధ్య నాకున్న అవమానం తొలగించారు” అని అన్నది.
LUK 1:26 ఎలీసబెతు గర్భవతియైన ఆరో నెలలో, దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామానికి,
LUK 1:27 దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే కన్య దగ్గరకు పంపారు.
LUK 1:28 ఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, “బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు” అని చెప్పాడు.
LUK 1:29 అతని మాటలకు మరియ చాలా కలవరపడి, ఇది ఎటువంటి శుభవచనమో అని ఆశ్చర్యపడింది.
LUK 1:30 అయితే ఆ దూత ఆమెతో, “మరియా, భయపడకు; నీవు దేవుని దయను పొందుకొన్నావు.
LUK 1:31 నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి.
LUK 1:32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు.
LUK 1:33 ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు.
LUK 1:34 మరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది.
LUK 1:35 అందుకు ఆ దూత, “పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.
LUK 1:36 నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన ముసలితనంలో గర్భం ధరించింది, పిల్లలు పుట్టరు అని ఎవరి గురించైతే అనుకున్నారో, ఆమెకు ఇప్పుడు ఆరో నెల నిండింది.
LUK 1:37 ఎందుకంటే దేవుని నుండి వచ్చే ఏ మాట నెరవేరక మానదు” అన్నాడు.
LUK 1:38 అందుకు మరియ, “నేను ప్రభువు దాసురాలను, నీవు చెప్పిన ప్రకారం నాకు జరుగును గాక” అని అన్నది. తర్వాత దూత వెళ్లిపోయాడు.
LUK 1:39 కొన్ని రోజుల తర్వాత మరియ సిద్ధపడి యూదయ కొండ ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్లింది,
LUK 1:40 అక్కడ ఆమె జెకర్యా ఇంటికి వెళ్లి ఎలీసబెతుకు వందనాలు చెప్పింది.
LUK 1:41 ఎలీసబెతు మరియ చెప్పిన వందనాలను వింటున్నప్పుడు, ఆమె గర్భంలోని శిశువు గంతులేసాడు, ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నింపబడింది.
LUK 1:42 ఆమె పెద్ద స్వరంతో: “స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీవు గర్భంలో మోస్తున్న శిశువు ధన్యుడు!
LUK 1:43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను?
LUK 1:44 నీవు చెప్పిన వందనం నా చెవిని చేరగానే, నా గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేశాడు.
LUK 1:45 ప్రభువు తనకు చేసిన వాగ్దానం తప్పక నెరవేరుతుందని నమ్మిన స్త్రీ ధన్యురాలు!” అని చెప్పింది.
LUK 1:46 అందుకు మరియ: “నా ఆత్మ ప్రభువును మహిమపరుస్తుంది.
LUK 1:47 నా రక్షకుడైన దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.
LUK 1:48 తన సేవకురాలి దీనస్థితిని ఆయన గమనించారు. ఇది మొదలుకొని తరతరాల వారు నన్ను ధన్యురాలు అంటారు,
LUK 1:49 ఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు.
LUK 1:50 తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది.
LUK 1:51 ఆయన తన బాహువుతో గొప్ప కార్యాలను చేస్తారు; తమ అంతరంగాల్లో గర్వించు వారిని ఆయన చెదరగొట్టారు.
LUK 1:52 సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు, కాని, దీనులను పైకి లేవనెత్తారు.
LUK 1:53 ఆకలిగొనిన వారిని మంచి పదార్ధాలతో తృప్తిపరిచారు, కాని, ధనవంతులను వట్టి చేతులతో పంపారు.
LUK 1:54 ఆయన అబ్రాహాముకు అతని సంతతివారికి నిత్యం దయ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకొంటూ, మన పితరులకు వాగ్దానం చేసినట్లు, తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు.”
LUK 1:56 మరియ దాదాపు మూడు నెలలు ఎలీసబెతుతో ఉండి తన ఇంటికి తిరిగి వెళ్లింది.
LUK 1:57 ఎలీసబెతుకు నెలలు నిండినప్పుడు, ఆమె ఒక కుమారుని కన్నది.
LUK 1:58 ప్రభువు ఆమెపై ఈ గొప్ప కరుణను చూపించాడన్న సంగతిని విన్న ఇరుగుపొరుగువారు బంధువులు, ఆమెతో కలిసి సంతోషించారు.
LUK 1:59 ఎనిమిదవ రోజున శిశువుకు సున్నతిచేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా,
LUK 1:60 తల్లి, “వద్దు! బాబును యోహాను అని పిలువాలి” అని చెప్పింది.
LUK 1:61 అందుకు వారు ఆమెతో, “మీ బంధువుల్లో ఎవ్వరికి ఆ పేరు లేదు కదా” అన్నారు.
LUK 1:62 వారు ఈ బాబుకు ఏ పేరు పెట్టాలని తండ్రికి సైగ చేసి అడిగారు.
LUK 1:63 అందుకతడు ఒక పలకను అడిగి, “బాబు పేరు యోహాను” అని దానిపై వ్రాసినప్పడు వారందరు ఆశ్చర్యపడ్డారు.
LUK 1:64 వెంటనే అతని నోరు తెరుచుకుంది అతని నాలుక సడలింది, అతడు మాట్లాడుతూ దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు.
LUK 1:65 ఇరుగుపొరుగు వారందరు భయంతో నిండిపోయారు, యూదయ కొండ ప్రాంత ప్రజలందరు ఈ సంగతుల గురించి చెప్పుకొన్నారు.
LUK 1:66 ఇది విన్న ప్రతి ఒక్కరు దాని గురించి ఆశ్చర్యపడి, “ఈ బిడ్డ ఏమవుతాడో?” అనుకున్నారు. ఎందుకంటే ప్రభువు హస్తం బిడ్డకు తోడుగా ఉన్నది.
LUK 1:67 తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ విధంగా ప్రవచించాడు:
LUK 1:68 “ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు స్తుతింపబడును గాక, ఎందుకంటే ఆయన తన ప్రజలను దర్శించి వారిని విమోచించారు.
LUK 1:69 దేవుడు ముందుగానే తన పవిత్ర ప్రవక్తల ద్వారా పలికించినట్లు, తన సేవకుడైన దావీదు వంశంలో మన కోసం రక్షణ కొమ్మును మొలిపించారు.
LUK 1:71 మన శత్రువుల చేతి నుండి మనల్ని ద్వేషించు వారి నుండి రక్షణ కలిగించారు,
LUK 1:72 మన పితరులకు దయ చూపడానికి తన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి:
LUK 1:73 మన తండ్రియైన అబ్రాహాముకు ప్రమాణం చేసినట్లుగా,
LUK 1:74 మన శత్రువుల చేతి నుండి మనల్ని తప్పించి, మనం భయపడకుండా ఆయనను సేవించాలని,
LUK 1:75 బ్రతికిన కాలమంతా మనం ఆయన ఎదుట పరిశుద్ధత నీతి కలిగి జీవించాలని విమోచించారు.
LUK 1:76 “నా బిడ్డా, నీవు, మహోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు; ప్రభువుకు ముందుగా నీవు ఆయన కోసం మార్గం సిద్ధం చేస్తావు.
LUK 1:77 ఆయన ప్రజలకు వారి పాపక్షమాపణ ద్వారానే, రక్షణ కలుగుతుందని వారికి తెలియ చేస్తావు,
LUK 1:78 ఎందుకంటే మన పాదాలను సమాధాన మార్గంలో నడిపించడానికి, చీకటిలో జీవిస్తున్నవారిపై మరణచ్ఛాయలో ఉన్నవారిపై ప్రకాశించడానికి పరలోకం నుండి ఉదయించే సూర్యునిలా మన దేవుని దయా కనికరం మన కోసం అనుగ్రహించబడింది.”
LUK 1:80 ఆ బాలుడు ఎదిగి ఆత్మలో బలపడ్డాడు; ఇశ్రాయేలీయులకు బహిరంగంగా కనబడే వరకు అరణ్యంలో నివసించాడు.
LUK 2:1 ఆ దినాల్లో రోమా రాజ్యమంతటా ప్రజా సంఖ్యను నిర్వహించాలని కైసరు ఆగస్టస్ ఆజ్ఞాపించాడు.
LUK 2:2 (ఇది కురేనియు సిరియా దేశాధిపతిగా ఉన్నప్పుడు తీసిన మొదటి ప్రజాసంఖ్య.)
LUK 2:3 ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేయించుకోడానికి తమ స్వగ్రామాలకు వెళ్లారు.
LUK 2:4 కాబట్టి యోసేపు కూడా దావీదు వంశస్థుడు కాబట్టి, అతడు గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామం నుండి, యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే దావీదు పట్టణానికి వెళ్లాడు, ఎందుకంటే అతడు దావీదు వంశస్థుడు.
LUK 2:5 తనతో పెండ్లికి ప్రధానం చేయబడి, గర్భవతిగా ఉన్న మరియతో పాటు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి వెళ్లాడు.
LUK 2:6 వారు అక్కడ ఉన్నపుడు, ఆమె నెలలు నిండి, తన మొదటి కుమారుని కన్నది.
LUK 2:7 సత్రంలో వారికి స్థలం దొరకలేదు, కాబట్టి ఆమె ఆ శిశువును మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది.
LUK 2:8 ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులు కొందరు దగ్గరలో ఉన్న పొలాల్లో ఉండి, రాత్రి జామున తమ మందను కాచుకుంటూ ఉన్నారు.
LUK 2:9 ప్రభువు దూత వారికి కనబడినప్పుడు, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించడంవల్ల, వారు భయంతో వణికిపోయారు.
LUK 2:10 అయితే ఆ దూత వారితో, “భయపడకండి, ప్రజలందరికి గొప్ప సంతోషాన్ని కలిగించే శుభవార్తను నేను మీకు తెచ్చాను.
LUK 2:11 దావీదు పట్టణంలో ఈ రోజే రక్షకుడు మీ కోసం పుట్టాడు; ఆయన ప్రభువైన క్రీస్తు.
LUK 2:12 మీరు గుర్తు పట్టడానికి మీకు గుర్తు ఇదే: ఒక శిశువు మెత్తని గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉండడం మీరు చూస్తారు” అని చెప్పాడు.
LUK 2:13 అప్పుడు అకస్మాత్తుగా ఆ దూతతో పాటు ఆకాశంలో దూతల గొప్ప సమూహం కనబడి, ఈ విధంగా దేవుని స్తుతించారు,
LUK 2:14 “అత్యున్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైనవారికి భూమి మీద సమాధానం కలుగును గాక.”
LUK 2:15 ఆ దూతలు వారి దగ్గర నుండి పరలోకానికి వెళ్లిన తర్వాత, ఆ గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు, “రండి మనం బేత్లెహేము పట్టణానికి వెళ్లి, దేని గురించైతే ప్రభువు మనకు చెప్పారో, ఆ జరిగిన దానిని చూద్దాం” అని చెప్పుకొన్నారు.
LUK 2:16 కాబట్టి వారు త్వరపడి వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు
LUK 2:17 వారు ఆ శిశువును చూసి, ఆ శిశువు గురించి తమతో చెప్పబడిన సంగతులను వారు ఇతరులకు చెప్పారు.
LUK 2:18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన మాటలను విన్నవారందరు ఎంతో ఆశ్చర్యపడ్డారు.
LUK 2:19 అయితే మరియ ఆ మాటలన్నింటిని తన హృదయంలో భద్రం చేసుకుని వాటి గురించి ఆలోచిస్తూ ఉండింది.
LUK 2:20 ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా, తాము విని చూసిన వాటన్నిటిని గురించి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్లారు.
LUK 2:21 ఆ శిశువుకు సున్నతి చేయాల్సిన ఎనిమిదవ రోజున, ఆయనను గర్భం దాల్చక ముందు దేవదూత చెప్పినట్లు, ఆయనకు యేసు అని పేరు పెట్టారు.
LUK 2:22 మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ రోజులు పూర్తియైన తర్వాత, యోసేపు మరియలు ఆ శిశువును ప్రభువునకు ప్రతిష్ఠించడానికి యెరూషలేముకు తీసుకెళ్లారు.
LUK 2:23 (ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లుగా, “ప్రతి తొలి మగబిడ్డ ప్రభువునకు ప్రతిష్ఠించబడాలి”),
LUK 2:24 ప్రభువు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా: “గువ్వల జతను, లేదా రెండు చిన్న పావురాలను” బలిగా అర్పించడానికి తీసుకెళ్లారు.
LUK 2:25 ఆ సమయంలో యెరూషలేములో నీతిమంతుడు భక్తిపరుడైన, సుమెయోను అని పిలువబడే ఒక వృద్ధుడున్నాడు. అతడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం ఎదురు చూస్తున్నవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు.
LUK 2:26 అతడు ప్రభువుని అభిషిక్తుని అనగా క్రీస్తును చూడకుండ చనిపోడని పరిశుద్ధాత్మ ద్వార బయలుపరచబడింది.
LUK 2:27 అతడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు. ధర్మశాస్త్ర ఆచార ప్రకారం శిశువైన యేసుకు జరిగించడానికి ఆయన తల్లిదండ్రులు ఆయనను లోపలికి తీసుకువచ్చినప్పుడు,
LUK 2:28 సుమెయోను ఆ శిశువుని తన చేతుల్లోకి తీసుకుని దేవుని స్తుతిస్తూ, ఇలా అన్నాడు:
LUK 2:29 “సర్వశక్తిగల ప్రభువా, నీ మాట ప్రకారం, ఇప్పుడు సమాధానంతో నీ దాసుని వెళ్లనివ్వు.
LUK 2:30 సర్వలోక ప్రజల కోసం నీవు సిద్ధపరచిన, నీ రక్షణను నా కళ్లారా చూశాను, అది యూదేతరులందరికి నిన్ను ప్రత్యక్షపరచే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మహిమగా ఉన్నది.”
LUK 2:33 ఆయన గురించి చెప్పిన మాటలను విన్న ఆయన తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు.
LUK 2:34 సుమెయోను వారిని దీవించి ఆయన తల్లియైన మరియతో: “ఇశ్రాయేలీయులలో అనేకమంది పడిపోవడానికి లేవడానికి కారణంగాను, వ్యతిరేకంగా చెప్పుకోడానికి గుర్తుగాను ఉండడానికి ఈ శిశువు నియమించబడ్డాడు,
LUK 2:35 తద్వారా అనేకమంది హృదయాలోచనలు బయలుపరచబడతాయి, నీ హృదయంలోకి కూడా ఒక ఖడ్గం దూసికొనిపోతుంది.”
LUK 2:36 అలాగే ఆషేరు గోత్రానికి చెందిన, పనూయేలు కుమార్తెయైన, అన్న, అనే ఒక ప్రవక్తి కూడా అక్కడ ఉండింది. ఆమె చాలా వృద్ధురాలు; ఆమె పెళ్ళి చేసుకుని ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి,
LUK 2:37 తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు నిండేవరకు విధవరాలుగా ఉండింది. ఆమె ఎప్పుడు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా, రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో ఆరాధిస్తున్నది.
LUK 2:38 ఆమె కూడ ఆ సమయంలోనే దేవాలయ ఆవరణంలో వారి దగ్గరకు వచ్చి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, యెరూషలేము విమోచన కోసం ఎదురు చూస్తున్న వారందరితో శిశువు గురించి చెప్పింది.
LUK 2:39 యోసేపు మరియలు ప్రభువు ధర్మశాస్త్రం ప్రకారం అన్ని జరిగించిన తర్వాత, గలిలయలోని నజరేతు అనే తమ పట్టణానికి వెళ్లారు.
LUK 2:40 బాలుడు ఎదిగి బలం పొందుకొన్నాడు; ఆయన జ్ఞానంతో నింపబడ్డాడు, దేవుని దయ ఆయన మీద ఉండింది.
LUK 2:41 ప్రతి సంవత్సరం పస్కా పండుగకు యేసు తల్లిదండ్రులు యెరూషలేముకు వెళ్లేవారు.
LUK 2:42 ఆయన పన్నెండేళ్ళ వాడై ఉన్నప్పుడు, ఆచారం ప్రకారం వారు పండుగకు వెళ్లారు.
LUK 2:43 ఆ పండుగ ముగిసిన తర్వాత, వారు తిరిగి ఇంటికి వెళ్తుండగా, బాలుడైన యేసు యెరూషలేములోనే ఉండిపోయారు కాని ఆయన తల్లిదండ్రులకు ఆ సంగతి తెలియలేదు.
LUK 2:44 ఆయన తమ గుంపు వారితోనే ఉన్నాడని అనుకుని, వారు ఒక రోజు ప్రయాణం చేశారు. తర్వాత తమ బంధువులలోను పరిచితులలోను ఆయన కోసం వెదకడం మొదలుపెట్టారు.
LUK 2:45 వారికి ఆయన కనబడకపోయేసరికి, వారు ఆయనను వెదకడానికి తిరిగి యెరూషలేముకు వెళ్లారు.
LUK 2:46 మూడు దినాలైన తర్వాత దేవాలయ ఆవరణంలో, బోధకుల మధ్య ఆయన కూర్చుని, వారి మాటలను వింటూ వారిని ప్రశ్నలు అడగడం వారు చూశారు
LUK 2:47 ఆయన మాటలను విన్న ప్రతి ఒక్కరు ఆయనకున్న గ్రహింపుకు, ఆయన ఇచ్చే జవాబులకు ఆశ్చర్యపడ్డారు.
LUK 2:48 ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి, విస్తుపోయారు. ఆయన తల్లి ఆయనతో, “కుమారుడా, ఎందుకు ఇలా చేశావు? నేను మీ తండ్రి ఆందోళన చెంది నీకోసం వెదకుతున్నాము” అన్నది.
LUK 2:49 అందుకు ఆయన, “మీరెందుకు నా కోసం వెదుకుతున్నారు? నేను నా తండ్రి ఇంట్లో ఉండాలని మీకు తెలియదా?” అని వారితో అన్నారు.
LUK 2:50 అయితే ఆయన వారితో చెప్తున్న దానిని వారు గ్రహించలేకపోయారు.
LUK 2:51 ఆ తర్వాత యేసు వారితో కలిసి నజరేతుకు వెళ్లి వారికి లోబడి ఉన్నారు. అయితే ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రం చేసుకున్నది.
LUK 2:52 యేసు జ్ఞానంలోను వయస్సులోను దేవుని దయలోను మనుష్యుల దయలోను వర్ధిల్లారు.
LUK 3:1 తిబెరి కైసరు ఏలుచున్న పదిహేనవ సంవత్సరంలో, యూదయ ప్రాంతానికి అధిపతిగా పొంతి పిలాతు, గలిలయ ప్రాంతానికి చతుర్థాధిపతిగా హేరోదు, ఇతూరియా త్రకోనీతి అనే ప్రాంతాలకు చతుర్థాధిపతిగా అతని తమ్ముడైన ఫిలిప్పు అబిలేనె ప్రాంతానికి చతుర్థాధిపతిగా లుసానీయ ఉన్నారు.
LUK 3:2 అన్నా కయపాల ప్రధాన యాజకత్వం కొనసాగుతున్న సమయంలో, అరణ్యంలో నివసిస్తున్న జెకర్యా కుమారుడైన యోహాను దగ్గరకు దేవుని వాక్కు వచ్చింది.
LUK 3:3 అతడు యూదయలోని యొర్దాను నదీ తీరప్రాంతమంతా వెళ్తూ పాపక్షమాపణ కొరకై పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందుకోండని ప్రకటిస్తున్నాడు.
LUK 3:4 ప్రవక్తయైన యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లు: “అరణ్యంలో ఒక స్వరం ఎలుగెత్తి ఇలా చెప్తుంది, ‘ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన కోసం త్రోవలను సరాళం చేయండి.
LUK 3:5 ప్రతి లోయ పూడ్చబడుతుంది, ప్రతి పర్వతం, కొండ సమం చేయబడుతుంది. వంకర త్రోవలు తిన్నగా, గరుకు మార్గాలు నున్నగా చేయబడతాయి.
LUK 3:6 దేవుని రక్షణను ప్రజలందరు చూస్తారు.’ ”
LUK 3:7 తనచే బాప్తిస్మం పొందడానికి వస్తున్న జనసమూహంతో యోహాను, “సర్పసంతానమా! రానున్న ఉగ్రత నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
LUK 3:8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. ‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని మీలో మీరు అనుకోవడం మొదలుపెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి కూడా అబ్రాహాముకు సంతానం కలుగజేయగలడు అని మీతో చెప్తున్నాను.
LUK 3:9 ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర పెట్టబడింది, మంచి పండ్లు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది.”
LUK 3:10 అందుకు జనసమూహం, “అయితే మేము ఏమి చేయాలి?” అని అడిగారు.
LUK 3:11 అందుకు యోహాను, “రెండు చొక్కాలు ఉన్నవాడు ఏమిలేని వానికి ఇవ్వాలి, ఆహారం కలవాడు కూడా అలాగే చేయాలి” అన్నాడు.
LUK 3:12 పన్ను వసూలు చేసేవారు కూడ బాప్తిస్మం పొందడానికి వచ్చారు. వారు, “బోధకుడా, మేము ఏమి చేయాలి?” అని అడిగారు.
LUK 3:13 అందుకు అతడు వారితో, “మీకు నిర్ణయించబడిన పన్ను కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని చెప్పాడు.
LUK 3:14 తర్వాత కొందరు సైనికులు వచ్చి, “మేము ఏమి చేయాలి?” అని అడిగారు. అందుకతడు, “ఎవరి దగ్గరి నుండి అక్రమంగా డబ్బు తీసుకోవద్దు అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు, మీ జీతంతో తృప్తిగా ఉండండి” అని వారితో చెప్పాడు.
LUK 3:15 ప్రజలు క్రీస్తు వస్తాడని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి యోహానే క్రీస్తు అయి ఉంటాడా అని వారందరు తమ హృదయాల్లో అనుకుంటూ ఉన్నారు.
LUK 3:16 అప్పుడు యోహాను వారందరితో అన్నాడు, “నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను. కాని నాకన్నా శక్తిమంతుడు ఒకడు వస్తాడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తారు.
LUK 3:17 గోధుమల నుండి పొట్టును వేరు చేయడానికి తన చేతిలో చేటతో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గోధుమలను తన ధాన్యపు కొట్టులో పోసి, తన నూర్చెడి కల్లమును శుభ్రం చేసి, పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తారు.”
LUK 3:18 అతడు ఇంకా అనేకమైన ఇతర మాటలతో వారిని హెచ్చరిస్తూ వారికి సువార్త ప్రకటించాడు.
LUK 3:19 అయితే చతుర్థాధిపతియైన హేరోదు, తన సోదరుని భార్యయైన హేరోదియను పెళ్ళి చేసుకున్నందుకు, అతడు చేసిన ఇతర దుష్ట క్రియలను గురించి యోహాను అతన్ని గద్దించాడు కాబట్టి,
LUK 3:20 హేరోదు తాను చేసిన తప్పులు చాలవన్నట్టు యోహానును చెరసాలలో వేయించాడు.
LUK 3:21 ప్రజలందరు బాప్తిస్మం పొందుతున్నప్పుడు, యేసు కూడా బాప్తిస్మం పొందుకున్నారు. ఆయన ప్రార్థిస్తుండగా, ఆకాశం తెరువబడింది,
LUK 3:22 పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదకు దిగివచ్చాడు. పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం వినబడింది: “నీవు నా కుమారుడవు, నేను ప్రేమించేవాడవు; నీయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను.”
LUK 3:23 ఆ తర్వాత యేసు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఇంచుమించు ముప్పై యేండ్ల వయస్సు కలవాడు. ఆయన యోసేపు కుమారుడని అనుకున్నారు, యోసేపు హేలీ కుమారుడు,
LUK 3:24 హేలీ మత్తతు కుమారుడు, మత్తతు లేవీ కుమారుడు, లేవీ మెల్కి కుమారుడు, మెల్కి యన్న కుమారుడు, యన్న యోసేపు కుమారుడు,
LUK 3:25 యోసేపు మత్తతీయ కుమారుడు, మత్తతీయ ఆమోసు కుమారుడు, ఆమోసు నహూము కుమారుడు, నహూము ఎస్లి కుమారుడు, ఎస్లి నగ్గయి కుమారుడు,
LUK 3:26 నగ్గయి మయతు కుమారుడు, మయతు మత్తతీయ కుమారుడు, మత్తతీయ సిమియ కుమారుడు, సిమియ యోశేఖు కుమారుడు, యోశేఖు యోదా కుమారుడు,
LUK 3:27 యోదా యోహన్న కుమారుడు, యోహన్న రేసా కుమారుడు, రేసా జెరుబ్బాబెలు కుమారుడు, జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు, షయల్తీయేలు నేరి కుమారుడు,
LUK 3:28 నేరి మెల్కీ కుమారుడు, మెల్కి అద్ది కుమారుడు, అద్ది కోసాం కుమారుడు, కోసాము ఎల్మాదాం కుమారుడు, ఎల్మాదాం ఏరు కుమారుడు,
LUK 3:29 ఏరు యెహోషువ కుమారుడు, యెహోషువ ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు యోరీము కుమారుడు, యోరీము మత్తతు కుమారుడు, మత్తతు లేవీ కుమారుడు,
LUK 3:30 లేవీ షిమ్యోను కుమారుడు, షిమ్యోను యూదా కుమారుడు, యూదా యోసేపు కుమారుడు. యోసేపు యోనాము కుమారుడు, యోనాము ఎల్యాకీము కుమారుడు,
LUK 3:31 ఎల్యాకీము మెలెయ కుమారుడు, మెలెయ మెన్నా కుమారుడు, మెన్నా మత్తతా కుమారుడు, మత్తతా నాతాను కుమారుడు, నాతాను దావీదు కుమారుడు,
LUK 3:32 దావీదు యెష్షయి కుమారుడు, యెష్షయి ఓబేదు కుమారుడు, ఓబేదు బోయజు కుమారుడు, బోయజు శల్మాను కుమారుడు, శల్మాను నయస్సోను కుమారుడు,
LUK 3:33 నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు, అమ్మీనాదాబు అరాము కుమారుడు, అరాము హెస్రోను కుమారుడు, హెస్రోను పెరెసు కుమారుడు, పెరెసు యూదా కుమారుడు,
LUK 3:34 యూదా యాకోబు కుమారుడు, యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రాహాము కుమారుడు, అబ్రాహాము తెరహు కుమారుడు, తెరహు నాహోరు కుమారుడు,
LUK 3:35 నాహోరు సెరూగు కుమారుడు, సెరూగు రయూ కుమారుడు, రయూ పెలెగు కుమారుడు, పెలెగు హెబెరు కుమారుడు, హెబెరు షేలహు కుమారుడు,
LUK 3:36 షేలహు కేయినాను కుమారుడు, కేయినాను అర్పక్షదు కుమారుడు, అర్పక్షదు షేము కుమారుడు, షేము నోవహు కుమారుడు, నోవహు లెమెకు కుమారుడు,
LUK 3:37 లెమెకు మెతూషెల కుమారుడు, మెతూషెల హనోకు కుమారుడు, హనోకు యెరెదు కుమారుడు, యెరెదు మహలలేలు కుమారుడు, మహలలేలు కేయినాను కుమారుడు,
LUK 3:38 కేయినాను ఎనోషు కుమారుడు, ఎనోషు షేతు, షేతు ఆదాము కుమారుడు, ఆదాము దేవుని కుమారుడు.
LUK 4:1 యేసు, పరిశుద్ధాత్మపూర్ణుడై, యొర్దానును విడిచి వెళ్లారు. ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకెళ్లాడు.
LUK 4:2 అక్కడ నలభై రోజులు ఆయన అపవాది చేత శోధించబడ్డారు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు, ఆ రోజులు పూర్తి అవుతుండగా ఆయనకు ఆకలివేసింది.
LUK 4:3 అపవాది ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాయిని రొట్టెగా మారమని చెప్పు” అని అన్నాడు.
LUK 4:4 అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
LUK 4:5 తర్వాత అపవాది ఆయనను ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్లి ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్నిటినీ ఆయనకు చూపించాడు.
LUK 4:6 అపవాది ఆయనతో, “వీటన్నిటి రాజ్యాధికారం, వాటి వైభవం నీకు ఇస్తాను; అవి నాకు ఇవ్వబడ్డాయి, నాకిష్టమైన వారికెవరికైనా నేను వాటిని ఇవ్వగలను.
LUK 4:7 నీవు నన్ను ఆరాధిస్తే, వీటన్నిటిని నీకు ఇస్తాను” అన్నాడు.
LUK 4:8 అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
LUK 4:9 అపవాది ఆయనను యెరూషలేముకు తీసుకెళ్లి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, “నీవు దేవుని కుమారుడవైతే, ఇక్కడినుండి క్రిందికి దూకు.
LUK 4:10 ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నిన్ను జాగ్రత్తగా కాపాడడానికి నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు;
LUK 4:11 నీ పాదాలకు ఒక రాయి తగలకుండ, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు’ ” అని అన్నాడు.
LUK 4:12 అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని వ్రాయబడి ఉంది” అని అన్నారు.
LUK 4:13 అపవాది శోధించడం అంతా ముగించిన తర్వాత, తగిన సమయం వచ్చేవరకు ఆయనను విడిచి వెళ్లిపోయాడు.
LUK 4:14 యేసు పరిశుద్ధాత్మ శక్తితో తిరిగి గలిలయకు వెళ్లారు, అప్పుడు ఆయన గురించిన వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
LUK 4:15 ఆయన వారి సమాజమందిరాల్లో బోధిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆయనను కొనియాడారు.
LUK 4:16 యేసు తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్లినప్పుడు, అలవాటు ప్రకారం సబ్బాతు దినాన ఆయన సమాజమందిరానికి వెళ్లి, వాక్యాన్ని చదవడానికి నిలబడ్డారు.
LUK 4:17 ఆయన చేతికి ప్రవక్తయైన యెషయా వ్రాసిన గ్రంథాన్ని వారు అందించారు. ఆయన ఆ గ్రంథపుచుట్టను విప్పుతుండగా ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉండడం కనిపించింది:
LUK 4:18 “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి, ఆయన నన్ను అభిషేకించారు; చెరలో ఉన్నవారికి విడుదలను ప్రకటించడానికి, గ్రుడ్డివారికి చూపును ఇవ్వడానికి, బాధింపబడిన వారికి విడుదలను కలుగచేయడానికి,
LUK 4:19 ప్రభువు హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారు.”
LUK 4:20 ఆ తర్వాత ఆ గ్రంథపుచుట్టను చుట్టి, అక్కడ ఉన్న పరిచారకునికి ఇచ్చి కూర్చున్నారు. సమాజమందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన మీద దృష్టి సారించారు.
LUK 4:21 అప్పుడు ఆయన వారితో, “ఈ రోజు మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అన్నారు.
LUK 4:22 అందరు ఆయనను మెచ్చుకొంటూ ఆయన నోటి నుండి వచ్చే దయ గల మాటలకు ఆశ్చర్యపడి, “ఈయన యోసేపు కుమారుడు కాడా?” అని వారు అడిగారు.
LUK 4:23 యేసు వారితో మాట్లాడుతూ, “ ‘ఓ వైద్యుడా, నిన్ను నీవు స్వస్థపరుచుకో!’ అనే సామెతను తప్పకుండా నాకు చెప్తారు, ఇంకా నాతో, ‘నీవు కపెర్నహూములో కార్యాలను చేశావని మేము విన్నట్లుగా, నీ సొంత గ్రామమైన ఇక్కడ కూడా చేయి’ అని మీరు అంటారు” అని అన్నారు.
LUK 4:24 ఆయన వారితో ఇంకా మాట్లాడుతూ, “ఏ ప్రవక్త తన స్వగ్రామంలో అంగీకరించబడరని నేను మీతో నిజంగా చెప్తున్నాను.
LUK 4:25 ఏలీయా ప్రవక్త రోజుల్లో మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూయబడి, దేశమంతట తీవ్రమైన కరువు వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులలో అనేకమంది విధవరాండ్రు ఉన్నారని నేను మీకు సత్యమే చెప్తున్నాను.
LUK 4:26 అయితే వారెవరి దగ్గరకు ఏలీయా పంపబడలేదు, సీదోను ప్రాంతంలోని సారెపతు గ్రామంలోని ఒక విధవరాలి దగ్గరికే పంపబడ్డాడు.
LUK 4:27 ఎలీషా అనే ఇంకొక ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీయులలో అనేక కుష్ఠురోగులు ఉన్నా, సిరియా దేశపు నయమాను తప్ప మరి ఎవరు శుద్ధి పొందలేదు” అని చెప్పారు.
LUK 4:28 ఈ మాటలు విన్న సమాజమందిరంలో ఉన్న ప్రజలందరూ కోప్పడ్డారు.
LUK 4:29 వారు లేచి, ఆయనను పట్టణం నుండి బయటకు తరుముతూ, ఆ పట్టణం కట్టబడి ఉన్న కొండ అంచు మీదకు తీసుకెళ్లి అక్కడినుండి క్రిందికి పడద్రోయాలనుకొన్నారు.
LUK 4:30 కానీ ఆయన జనసమూహం మధ్య నుండి నడుచుకుంటూ తన దారిన వెళ్లిపోయారు.
LUK 4:31 ఆ తర్వాత ఆయన గలిలయలోని కపెర్నహూముకు వెళ్లారు, సబ్బాతు దినాన ప్రజలకు బోధించారు.
LUK 4:32 ఆయన బోధకు వారు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే ఆయన మాటల్లో అధికారం ఉండింది.
LUK 4:33 ఆ సమాజమందిరంలో అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు ఉన్నాడు. వాడు స్వరమెత్తి బిగ్గరగా,
LUK 4:34 “నజరేతువాడా, యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవు దేవుని పరిశుద్ధుడవు అని నాకు తెలుసు!” అని వాడు బిగ్గరగా కేకలు వేశాడు.
LUK 4:35 అందుకు యేసు, “మాట్లాడకు!” అని అంటూ, “వానిలో నుండి బయటకు రా!” అని గద్దించారు. అప్పుడు ఆ దయ్యం వానికి ఏ గాయం చేయకుండ వారందరి ముందు వానిని పడవేసి బయటకు వచ్చేసింది.
LUK 4:36 ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఏంటి ఆ మాటలు! అధికారంతో శక్తితో ఈయన అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే, అవి బయటకు వచ్చేస్తున్నాయి!” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
LUK 4:37 ఇలా ఆయనను గురించిన వార్త చుట్టుప్రక్కల ప్రాంతమంతా వ్యాపించింది.
LUK 4:38 యేసు సమాజమందిరం నుండి బయటకు వచ్చి సీమోను ఇంటికి వెళ్లారు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది, కాబట్టి వారు ఆమెకు సహాయం చేయమని యేసును అడిగారు.
LUK 4:39 కాబట్టి ఆయన ఆమె వైపుకు వంగి జ్వరాన్ని గద్దించారు, జ్వరం ఆమెను వదిలిపోయింది. వెంటనే ఆమె లేచి వారికి పరిచారం చేయడం మొదలుపెట్టింది.
LUK 4:40 సూర్యుడు అస్తమించినప్పుడు, ప్రజలు వివిధ రోగాలు గలవారినందరిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు, ఆయన వారందరి మీద తన చేతులుంచి, వారిని స్వస్థపరిచారు.
LUK 4:41 అంతేకాక, చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడవు” అని కేకలువేస్తూ బయటకు వచ్చాయి! కాని తాను క్రీస్తు అని వాటికి తెలుసు, కాబట్టి ఆయన వాటిని గద్దించి మాట్లాడనివ్వలేదు.
LUK 4:42 మరుసటిరోజు తెల్లవారగానే, యేసు ఏకాంత స్థలానికి వెళ్లారు. ప్రజలు ఆయనను వెదకుతూ ఆయన ఉన్న చోటుకు వచ్చి, ఆయనను వెళ్లిపోకుండా ఆపే ప్రయత్నం చేశారు.
LUK 4:43 కానీ ఆయన వారితో, “నేను ఇతర గ్రామాల్లో కూడా దేవుని రాజ్యసువార్తను ప్రకటించాలి, అందుకొరకే నేను పంపబడ్డాను” అని వారితో చెప్పారు.
LUK 4:44 ఆయన యూదయలో ఉన్న సమాజమందిరాల్లో ప్రకటిస్తూ ఉన్నారు.
LUK 5:1 ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నారు, ప్రజలు ఆయన చుట్టూ చేరి దేవుని వాక్యాన్ని వింటున్నారు.
LUK 5:2 సరస్సు తీరాన ఆయన రెండు పడవలను చూశారు, జాలరులు వాటిని అక్కడ విడిచిపెట్టి, తమ వలలను కడుక్కుంటున్నారు.
LUK 5:3 ఆయన ఆ పడవలలో ఒక దానిలోకి ఎక్కారు, ఆ పడవ సీమోనుది, కాబట్టి ఆయన తీరం నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగారు. ఆయన పడవలో కూర్చుని, అక్కడినుండి ప్రజలకు బోధించారు.
LUK 5:4 ఆయన మాట్లాడడం ముగించాక, ఆయన సీమోనుతో, “పడవను నీటి లోతుకు నడిపించి, చేపలు పట్టడానికి వలలు వేయి” అన్నారు.
LUK 5:5 అందుకు సీమోను, “బోధకుడా, రాత్రంతా కష్టపడినా మేము ఏమి దొరకలేదు. అయినా నీవు చెప్పావు కాబట్టి నేను వలలను వేస్తాను” అని ఆయనతో అన్నాడు.
LUK 5:6 వారు అలా చేసినప్పుడు, విస్తారమైన చేపలు వలల్లో పడి ఆ వలలు పిగిలిపోసాగాయి.
LUK 5:7 అందుకు వారు వేరే పడవల్లోని తమ జతపనివారిని పిలిచి వచ్చి సహాయం చేయమని సైగలు చేశారు, కాబట్టి వారు వచ్చి ఆ రెండు పడవలను నింపగా ఆ బరువుకు ఆ పడవలు మునిగిపోసాగాయి.
LUK 5:8 సీమోను పేతురు జరిగింది చూసి, యేసు మోకాళ్లమీద పడి, “ప్రభువా, నా దగ్గర నుండి వెళ్లిపో; నేను పాపిష్ఠి వాడను!” అన్నాడు.
LUK 5:9 అతడు అతనితో ఉన్నవారందరు విస్తారంగా పట్టిన చేపలను చూసి ఆశ్చర్యపడ్డారు.
LUK 5:10 సీమోను జతపనివారైన జెబెదయి కుమారులైన, యాకోబు యోహానులు కూడా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు యేసు సీమోనుతో, “భయపడకు; ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టే జాలరివి” అన్నారు.
LUK 5:11 వారు తమ పడవలను ఒడ్డుకు చేర్చి, అన్నిటిని విడిచి ఆయనను వెంబడించారు.
LUK 5:12 యేసు ఒక పట్టణంలో ఉన్నప్పుడు, కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చాడు. వాడు యేసును చూసి, నేల మీద సాగిలపడి, “ప్రభువా, నీకిష్టమైతే, నన్ను బాగు చేయి” అని ఆయనను బ్రతిమాలాడు.
LUK 5:13 యేసు చేయి చాపి వాన్ని ముట్టారు. ఆయన వానితో, “నాకు ఇష్టమే, బాగవు” అన్నారు. వెంటనే కుష్ఠురోగం వాన్ని విడిచి వెళ్లింది.
LUK 5:14 అప్పుడు యేసు, “నీవు ఎవరికి చెప్పకు, కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకొని వారికి సాక్ష్యంగా ఉండేలా, నీ శుద్ధీకరణ కోసం మోషే నియమించిన అర్పణలను అర్పించు” అని వానిని ఆదేశించారు.
LUK 5:15 అయినాసరే ఆయనను గురించిన వార్త మరి ఎక్కువగా వ్యాపించి, ఆయన చెప్పే మాటలను వినడానికి వారి వ్యాధుల నుండి స్వస్థపడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు.
LUK 5:16 అయితే యేసు తరచుగా ఏకాంత ప్రాంతాలకు వెళ్లి ప్రార్థించారు.
LUK 5:17 ఒక రోజు యేసు బోధిస్తూ ఉండగా, పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడ కూర్చుని ఉన్నారు. వారు గలిలయ, యూదయ, యెరూషలేము ప్రాంతాలలోని ప్రతి గ్రామం నుండి వచ్చారు. ఆ సమయంలో రోగులను బాగుచేసే ప్రభువు శక్తి యేసులో ఉంది.
LUK 5:18 కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని చాపమీద మోసుకొని తెచ్చి, యేసు ముందు ఉంచాలని ఇంట్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు.
LUK 5:19 కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వానిని లోపలికి తేవడానికి వీలుకాలేదు, కాబట్టి వారు ఆ ఇంటి కప్పుమీదికి ఎక్కి పెంకులు తీసి ప్రజలమధ్య, ఆ చాపతోనే వానిని యేసు ముందు దింపారు.
LUK 5:20 యేసు వారి విశ్వాసం చూసి, అతనితో, “స్నేహితుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు.
LUK 5:21 పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు, తమలో తాము, “దైవదూషణ చేస్తున్న వీడు ఎవడు? దేవుడు తప్ప పాపాలను క్షమించగలవారెవరు?” అని ఆలోచించడం మొదలుపెట్టారు.
LUK 5:22 యేసు వారి ఆలోచనలను గ్రహించి, “మీ హృదయాల్లో మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు?
LUK 5:23 వీటిలో ఏది చెప్పడం సులభం: ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడమా లేదా ‘లేచి నడువు’ అని చెప్పడమా?”
LUK 5:24 అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని, “నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “నేను చెప్తున్న, నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు.
LUK 5:25 వెంటనే వాడు వారి ముందే లేచి, తాను పడుకుని ఉన్న పరుపెత్తుకొని దేవుని స్తుతిస్తూ తన ఇంటికి వెళ్లాడు.
LUK 5:26 అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో దేవుని స్తుతించారు. వారు భయంతో నిండుకొని, “ఈ రోజు మేము అద్భుతాలను చూశాం” అని చెప్పుకొన్నారు.
LUK 5:27 దీని తర్వాత, యేసు బయటకు వెళ్తూ లేవీ అనే పేరుగల పన్ను వసూలు చేసేవాడు పన్ను వసూలు చేసే స్థానంలో కూర్చుని ఉండడం చూసి, “నన్ను వెంబడించు” అని యేసు అతనితో అన్నారు.
LUK 5:28 వెంటనే లేవీ లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు.
LUK 5:29 తర్వాత, లేవీ యేసు కోసం తన ఇంట్లో ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు, పెద్ద సంఖ్యలో పన్ను వసూలు చేసేవారు ఇతరులు వారితో పాటు తింటున్నారు.
LUK 5:30 అయితే వారి తెగకు చెందిన పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు, “ఎందుకు మీరు పన్నులు వసూలు చేసేవారితో పాపులతో కలిసి తిని త్రాగుతారు?” అని ఆయన శిష్యులతో అన్నారు.
LUK 5:31 అందుకు యేసు వారితో, “రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు.
LUK 5:32 నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, పాపులు పశ్చాత్తాపపడాలని వారిని పిలువడానికి వచ్చాను” అన్నారు.
LUK 5:33 వారు ఆయనతో, “యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారు, అలాగే పరిసయ్యుల శిష్యులు కూడా చేస్తారు, కాని నీ శిష్యులు తింటూ త్రాగుతూ ఉంటారు” అన్నారు.
LUK 5:34 అందుకు యేసు, “పెండ్లికుమారుడు తన స్నేహితులతో ఉన్నప్పుడు వారిని ఉపవాసం ఉండేలా మీరు చేయగలరా?
LUK 5:35 పెండ్లికుమారుడు వారి దగ్గర నుండి తీసుకొనిపోబడే సమయం వస్తుంది; ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు” అని జవాబిచ్చారు.
LUK 5:36 ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఎవ్వరూ క్రొత్త బట్ట నుండి ముక్క చింపి పాత దానికి అతుకువేయరు. అలా చేస్తే, వారికి చినిగిపోయిన క్రొత్త బట్ట మిగులుతుంది, క్రొత్త బట్ట అతుకు పాత దానితో కలవదు.
LUK 5:37 ఎవ్వరూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు. అలా చేస్తే, క్రొత్త ద్రాక్షరసం వలన ఆ తిత్తులు పిగిలిపోతాయి; ద్రాక్షరసం కారిపోతుంది, తిత్తులు పాడైపోతాయి.
LUK 5:38 అలా వద్దు, క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలోనే పోయబడాలి.
LUK 5:39 పాత ద్రాక్షరసం త్రాగినవారు ఎవ్వరూ క్రొత్త దానిని కోరరు, ‘పాతదే బాగుంది’ అని అంటారు” అని అన్నారు.
LUK 6:1 ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు, ఆయన శిష్యులు కొన్ని కంకులు తెంపుకొని, తమ చేతుల్లో వాటిని నలిపి తినడం మొదలుపెట్టారు.
LUK 6:2 అది చూసిన పరిసయ్యులు కొందరు, “మీరెందుకు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు?” అని వారిని అడిగారు.
LUK 6:3 యేసు వారితో, “దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా?
LUK 6:4 అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకుని, తాను తిని తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు” అని జవాబిచ్చారు.
LUK 6:5 ఆ తర్వాత యేసు వారితో, “మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి ప్రభువు” అని చెప్పారు.
LUK 6:6 మరొక సబ్బాతు దినాన ఆయన సమాజమందిరానికి వెళ్లి బోధిస్తుండగా, అక్కడ కుడి చేతికి పక్షవాతం కలవాడు ఒకడున్నాడు.
LUK 6:7 యేసు మీద నేరం మోపడానికి కారణం వెదుకుతున్న పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన సబ్బాతు దినాన వానిని స్వస్థపరుస్తారేమో అని కనిపెట్టుకొని ఉన్నారు.
LUK 6:8 అయితే యేసు వారి ఆలోచనలను తెలిసినవాడై చేతికి పక్షవాతం గలవానితో, “లేచి అందరి ముందు నిలబడు” అన్నారు. అందుకతడు లేచి నిలబడ్డాడు.
LUK 6:9 అప్పుడు యేసు, “నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, సబ్బాతు దినాన ఏది న్యాయం: మంచి చేయడమా లేదా చెడు చేయడమా, ప్రాణం రక్షించడమా లేదా ప్రాణం తీయడమా?” అని వారిని అడిగారు.
LUK 6:10 ఆయన చుట్టూ ఉన్నవారిని చూసి, చేతికి పక్షవాతం గలవానితో, “నీ చేయి చాపు” అన్నారు. వాడు అలాగే చేశాడు, వాని చేయి పూర్తిగా బాగయింది.
LUK 6:11 అయితే పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మండిపడి యేసును ఏమి చేయాలా అని ఒకరితో ఒకరు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
LUK 6:12 ఆ రోజుల్లో ఒక రోజు ప్రార్థించడానికి యేసు కొండెక్కి రాత్రంతా దేవుని ప్రార్థిస్తూ గడిపారు.
LUK 6:13 ఉదయమైనప్పుడు, ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండుమందిని ఎన్నుకుని, వారిని అపొస్తలులుగా నియమించారు. అపొస్తలులు అనగా “పిలువబడిన వారు” అని అర్థము:
LUK 6:14 వారు ఎవరనగా, ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి,
LUK 6:15 మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అని పిలువబడే సీమోను,
LUK 6:16 యాకోబు కుమారుడైన యూదా, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
LUK 6:17 ఆయన కొండ దిగి వారితో పాటు మైదానంలో నిలబడ్డారు. అక్కడ ఆయన శిష్యుల యొక్క గొప్ప జనసమూహం ఉంది, యూదయ అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను చుట్టూ ఉన్న తీరప్రాంతం నుండి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
LUK 6:18 వారు ఆయన చెప్పే బోధను వినడానికి తమ వ్యాధుల నుండి స్వస్థత పొందడానికి వచ్చారు. అపవిత్రాత్మలు పీడిస్తున్న వారు కూడా బాగుపడ్డారు,
LUK 6:19 ప్రజలందరూ ఆయనను ముట్టుకోవాలని ప్రయత్నించారు ఎందుకంటే, ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి వారందరిని స్వస్థపరుస్తున్నది.
LUK 6:20 తన శిష్యులవైపు చూస్తూ, ఆయన ఇలా బోధించారు: “దీనులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీదే.
LUK 6:21 ఇప్పుడు ఆకలిగొనిన మీరు ధన్యులు, మీరు తృప్తిపొందుతారు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు.
LUK 6:22 మనుష్యకుమారుని నిమిత్తం ప్రజలు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, మిమ్మల్ని అవమానించి, మీరు చెడ్డవారని మీ పేరును తృణీకరించినప్పుడు మీరు ధన్యులు.
LUK 6:23 “ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది. ఎందుకంటే వారి పితరులు కూడా ప్రవక్తలను ఇలాగే హింసించారు.
LUK 6:24 “కాని ధనవంతులారా మీకు శ్రమ, మీ ఆదరణను మీరు ఇప్పటికే పొందుకున్నారు.
LUK 6:25 ఇప్పుడు కడుపు నింపుకొన్న వారలారా మీకు శ్రమ, మీరు ఆకలిగొంటారు. ఇప్పుడు నవ్వుతున్న వారలారా మీకు శ్రమ, మీరు దుఃఖించి రోదిస్తారు.
LUK 6:26 మనుష్యులందరు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ, వారి పూర్వికులు అబద్ధ ప్రవక్తలకు అలాగే చేశారు.
LUK 6:27 “అయితే వింటున్న మీతో నేను చెప్పేది ఏంటంటే: మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి,
LUK 6:28 మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించండి.
LUK 6:29 ఎవరైనా మిమ్మల్ని చెంపమీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి. ఎవరైనా మీ పైవస్త్రాన్ని తీసుకుంటే, వారికి మీ అంగీని కూడా ఇవ్వండి.
LUK 6:30 మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా నీకు చెందిన దానిని తీసుకుంటే, దాన్ని మళ్ళీ అడగవద్దు.
LUK 6:31 ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి.
LUK 6:32 “ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు ఏం లాభం? పాపులు కూడా తమను ప్రేమించేవారినే ప్రేమిస్తారు.
LUK 6:33 ఒకవేళ మీరు మీకు మేలు చేసే వారికే మేలు చేస్తే, మీకేమి లాభం? పాపులు కూడ అలాగే చేస్తారు కదా!
LUK 6:34 మీకు తిరిగి ఇవ్వగలిగిన వారికే మీరు ఇస్తే మీకేమి లాభం? మీరు కూడా తాము ఇచ్చింది తమకు పూర్తిగా తిరిగి వస్తుందని పాపులకే ఇస్తారు.
LUK 6:35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, తిరిగి ఏమి ఆశించకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ ప్రతిఫలం గొప్పగా ఉంటుంది, మీరు సర్వోన్నతుని పిల్లలుగా ఉంటారు, ఎందుకంటే ఆయన కృతజ్ఞతలేనివారికి, దుష్టులకు కూడా దయ చూపించేవాడు.
LUK 6:36 మీ తండ్రి కనికరం కలవాడై ఉన్నట్లు, మీరు కూడ కనికరం కలవారై ఉండండి.
LUK 6:37 “తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు. ఖండించకండి, మీరు ఖండించబడరు. క్షమించండి, మీరు క్షమించబడతారు.
LUK 6:38 ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. అణచి, కుదిపి, పొర్లిపారునట్లు నిండు కొలత మీ ఒడిలో పోయబడుతుంది. ఎందుకంటే, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత కొలవబడుతుంది.”
LUK 6:39 యేసు వారికి ఈ ఉపమానాన్ని కూడా చెప్పారు, “గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపించగలడా? వారిద్దరు గుంటలో పడరా?
LUK 6:40 ఒక శిష్యుడు బోధకుని కంటే ఉన్నతుడు కాడు, అయితే పూర్తిగా శిక్షణ పొందుకొన్నవాడు తన బోధకునిలా అవుతాడు.
LUK 6:41 “నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు?
LUK 6:42 నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోవడం విఫలమైన నీవు నీ సహోదరునితో, ‘సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీయనివ్వు’ అని నీవెలా అనగలవు? ఓ వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయు, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది.
LUK 6:43 “ఏ మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, ఏ చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు.
LUK 6:44 ప్రతి చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది. ప్రజలు ముళ్ళపొదల్లో అంజూర పండ్లను, లేదా గచ్చ పొదల్లో ద్రాక్షపండ్లను కోయరు.
LUK 6:45 మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు. ఎందుకంటే, హృదయం దేనితో నిండి ఉందో దానినే నోరు మాట్లాడుతుంది.
LUK 6:46 “నేను చెప్పే మాట ప్రకారం చేయకుండా ఎందుకు నన్ను ‘ప్రభువా, ప్రభువా’ అని పిలుస్తున్నారు?
LUK 6:47 నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేసేవారు ఎలాంటివారో నేను మీకు చెప్తాను.
LUK 6:48 లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి, ఇల్లు కట్టిన వ్యక్తిలా ఉంటారు. వరదలు వచ్చి ప్రవాహాలు వేగంగా ఆ ఇంటిని తాకాయి కాని ఆ ఇంటిని ఏమి చేయలేకపోయాయి, ఎందుకంటే ఆ వ్యక్తి ఆ ఇంటిని బలమైన పునాది మీద కట్టుకున్నాడు.
LUK 6:49 అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాని లాంటివారు. వరద ప్రవాహం వేగంగా ఆ ఇంటిని తాకగానే, అది కూలి పూర్తిగా ధ్వంసం అయ్యింది.”
LUK 7:1 తన మాటలు వింటున్న ప్రజలకు యేసు ఇదంతా చెప్పడం ముగించిన తర్వాత, ఆయన కపెర్నహూములో ప్రవేశించారు.
LUK 7:2 అక్కడ శతాధిపతికి ఎంతో ఇష్టమైన పనివాడు అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్నాడు.
LUK 7:3 ఆ శతాధిపతి యేసు గురించి విని, యేసును వచ్చి తన దాసుని స్వస్థపరచుమని బ్రతిమాలడానికి యూదా నాయకుల్లో కొందరిని ఆయన దగ్గరకు పంపించాడు.
LUK 7:4 వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, వారు ఆయనను బ్రతిమాలుతూ, “నీ నుండి మేలు పొందడానికి అతడు యోగ్యుడు,
LUK 7:5 ఎందుకంటే అతనికి మన ప్రజలంటే ప్రేమ మన సమాజమందిరాన్ని కట్టించాడు” అని చెప్పారు.
LUK 7:6 కాబట్టి యేసు వారితో కూడ వెళ్లారు. ఆయన ఆ ఇంటికి దగ్గరగా ఉండగానే, శతాధిపతి తన స్నేహితులను పంపించి, “ప్రభువా, అంత శ్రమ తీసుకోవద్దు, నీవు నా ఇంటికప్పు క్రిందికి రావడానికి కూడా నాకు యోగ్యత లేదు.
LUK 7:7 అందుకే, నేను నీ దగ్గరకు రావడానికి కూడా నాకు యోగ్యత లేదని నేను అనుకుంటున్నాను. కానీ నీవు ఒక మాట చెప్తే చాలు, నా పనివాడు స్వస్థపడతాడు.
LUK 7:8 ఎందుకంటే, నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడినే. మాటకు ఉండే అధికారం నాకు తెలుసు. నా అధికారం క్రింద సైనికులున్నారు. నేను ‘వెళ్లండి’ అంటే వెళ్తారు, ‘రండి’ అంటే వస్తారు. నా పనివాన్ని ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు.
LUK 7:9 యేసు ఈ మాటలను విని, ఆశ్చర్యపడి, తనను వెంబడిస్తున్న జనసమూహం వైపు తిరిగి, ఆయన ఇలా అన్నారు, “ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఇశ్రాయేలులో కూడా కనుగొనలేదని మీతో చెప్తున్నాను.”
LUK 7:10 అప్పుడు శతాధిపతిచే పంపబడినవారు ఇంటికి చేరి ఆ సేవకుడు ఆరోగ్యంగా ఉన్నాడని గుర్తించారు.
LUK 7:11 అది యైన వెంటనే, యేసు నాయీను అనే ఒక గ్రామానికి వెళ్లారు, ఆయన శిష్యులు పెద్ద జనసమూహం ఆయన వెంట వెళ్లారు.
LUK 7:12 ఆయన ఆ గ్రామ ద్వారాన్ని చేరినప్పుడు, చనిపోయిన వానిని బయటకు మోసుకొనిపోతున్నారు. వాని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు ఆమె ఒక విధవరాలు; ఆ గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద గుంపు ఆమెతో పాటు ఉంది.
LUK 7:13 ప్రభువు ఆమెను చూసి, ఆమె మీద కనికరపడి, “ఏడవవద్దు” అని ఆమెతో అన్నారు. దానిని మోసేవారు ఆగిపోయి నిలబడ్డారు.
LUK 7:14 అప్పుడు ఆయన వారు మోసుకెళ్తున్న పాడెను ముట్టారు, దానిని మోస్తున్నవారు ఆగిపోయారు. అప్పుడు ఆయన, “నేను నీతో చెప్తున్నాను, చిన్నవాడా, లే!” అన్నారు.
LUK 7:15 ఆ చనిపోయినవాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు, యేసు వానిని అతని తల్లికి అప్పగించారు.
LUK 7:16 వారందరు దేవుని భయంతో నిండి, “మన మధ్య ఒక గొప్ప ప్రవక్త బయలుదేరాడు, దేవుడే తన ప్రజలను దర్శించాడు” అని అంటూ దేవుని స్తుతించారు.
LUK 7:17 ఆయన గురించి ఈ సమాచారం యూదయ చుట్టుప్రక్కల ప్రాంతమంతా వ్యాపించింది.
LUK 7:18 యోహాను శిష్యులు ఈ సంగతులన్నిటిని యోహానుకు తెలియజేశారు.
LUK 7:19 అయితే యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, వారిని ప్రభువు దగ్గరకు పంపించి, “రావలసిన వాడవు నీవేనా లేదా మేము వేరొకరి కోసం చూడాలా?” అని అడగమన్నాడు.
LUK 7:20 ఆ మనుష్యులు యేసు దగ్గరకు వచ్చి, “బాప్తిస్మమిచ్చే యోహాను మమ్మల్ని నీ దగ్గరకు పంపి, ‘రావలసిన వాడవు నీవేనా? లేదా మేము మరొకరి కోసం ఎదురుచూడాలా?’ అని అడగమన్నాడు” అని చెప్పారు.
LUK 7:21 ఆ సమయంలోనే యేసు అనేకమంది రోగులను, అనారోగ్యం గలవారిని, దయ్యాలు పట్టినవారిని స్వస్థపరచి, అనేకమంది గ్రుడ్డివారికి చూపునిచ్చారు.
LUK 7:22 కాబట్టి యేసు వారితో, “మీరు వెళ్లి చూసినవాటిని, విన్నవాటిని యోహానుకు చెప్పండి; గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయినవారు తిరిగి బ్రతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటించబడుతుంది.
LUK 7:23 నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు” అని జవాబిచ్చారు.
LUK 7:24 యోహాను శిష్యులు వెళ్లిపోయిన తర్వాత, యేసు యోహానును గురించి జనసమూహంతో ఈ విధంగా చెప్పారు: “ఏమి చూడడానికి మీరు అరణ్యంలోనికి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా?
LUK 7:25 అది కాకపోతే, మరి ఏమి చూడడానికి వెళ్లారు? విలువైన వస్త్రాలను ధరించిన ఒక వ్యక్తినా? కాదు, విలువైన వస్త్రాలను ధరించి విలాసవంతంగా జీవించేవారు రాజభవనాల్లో ఉంటారు.
LUK 7:26 అయితే ఏమి చూడడానికి మీరు వెళ్లారు? ఒక ప్రవక్తనా? అవును, ప్రవక్తకంటే కూడా గొప్పవాడు అని మీతో చెప్తున్నాను.
LUK 7:27 వాక్యంలో ఇతని గురించే ఈ విధంగా వ్రాయబడింది: “ ‘ఇదిగో, నీకు ముందుగా నా దూతను పంపుతాను, అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.’
LUK 7:28 స్త్రీలకు పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు; అయినప్పటికీ, దేవుని రాజ్యంలో అందరికంటే అల్పమైనవాడు అతనికంటే గొప్పవాడని, నేను చెప్తున్నాను” అన్నారు.
LUK 7:29 ప్రజలందరు, పన్ను వసూలు చేసేవారితో సహా అంతా యేసు మాటలు విని, దేవుని మార్గం సరియైనది అని ఒప్పుకున్నారు. ఎందుకంటే వారు యోహాను చేత బాప్తిస్మం పొందుకున్నారు.
LUK 7:30 పరిసయ్యులు ధర్మశాస్త్ర ప్రావీణ్యులు యోహాను చేత బాప్తిస్మం పొందక, తమ పట్ల దేవుని ఉద్దేశాన్ని నిరాకరించారు.
LUK 7:31 యేసు ఇంకా మాట్లాడుతూ, “మరి, ఈ తరం వారిని నేను దేనితో పోల్చాలి? వారు ఎలాంటివారు?
LUK 7:32 వారు వీధిలో ఆడుకుంటూ చాడీలు చెప్పుకునే చిన్న పిల్లల్లాంటివారు: “ ‘మేము మీ కోసం పిల్లనగ్రోవి వాయించాం, కాని మీరు నాట్యం చేయలేదు; మేము విషాద గీతం పాడాం, కాని మీరు ఏడవలేదు.’
LUK 7:33 ఎందుకంటే బాప్తిస్మమిచ్చే యోహాను రొట్టెలు తినలేదు ద్రాక్షరసం త్రాగలేదు అయినా మీరు, ‘వీడు దయ్యం పట్టినవాడు’ అంటున్నారు.
LUK 7:34 మరోవైపు మనుష్యకుమారుడు తింటున్నాడు త్రాగుతున్నాడు కాబట్టి మీరు, ‘ఇదిగో తిండిబోతు, త్రాగుబోతు, పన్ను వసూలు చేసేవారికి, పాపులకు స్నేహితుడు’ అంటున్నారు.
LUK 7:35 కాని జ్ఞానం సరియైనదని దాని పిల్లలందరిని బట్టే నిరూపించబడుతుంది.”
LUK 7:36 పరిసయ్యులలో ఒకడు యేసును తనతో కలిసి భోజనం చేయడానికి ఆహ్వానించాడు, ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజనబల్ల దగ్గర కూర్చున్నారు.
LUK 7:37 ఆ గ్రామంలోని పాపిష్ఠిదైన ఒక స్త్రీ పరిసయ్యుని ఇంట్లో యేసు భోజనం చేస్తున్నాడని తెలుసుకొని, పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తీసుకుని వచ్చింది.
LUK 7:38 ఆమె ఆయన వెనుక పాదాల దగ్గర నిలబడి ఏడుస్తూ, ఆమె తన కన్నీటితో ఆయన పాదాలు తడపడం మొదలుపెట్టింది. తర్వాత తన తలవెంట్రుకలతో వాటిని తుడిచి, గౌరవంతో ఆయన పాదాలకు ముద్దు పెడుతూ పరిమళద్రవ్యాన్ని పూసింది.
LUK 7:39 ఆయనను ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూసి, తనలో తాను, “ఈయన ఒక ప్రవక్త అయితే తనను ముట్టినది ఒక పాపాత్మురాలని గ్రహించేవాడు” అనుకున్నాడు.
LUK 7:40 యేసు దాని గురించి, “సీమోను, నీతో ఒక మాట చెప్పాలి” అన్నారు. అతడు, “చెప్పండి బోధకుడా” అన్నాడు.
LUK 7:41 అప్పుడు యేసు, “అప్పు ఇచ్చే వాని దగ్గర ఇద్దరు అప్పు చేశారు. వారిలో ఒకడు అయిదువందల దేనారాలు, మరొకడు యాభై దేనారాలు అప్పు తీసుకున్నారు.
LUK 7:42 ఆ అప్పు తీర్చడానికి వారిద్దరి దగ్గర ఏమీ లేదని అతడు వారిద్దరి అప్పును క్షమించాడు. కాబట్టి వారిద్దరిలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, చెప్పు?” అని అడిగారు.
LUK 7:43 అందుకు సీమోను, “అతడు, ఎవని అప్పును ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు అనిపిస్తుంది” అని చెప్పాడు. యేసు, “నీవు సరిగా అంచనా వేశావు” అని అతనితో చెప్పారు.
LUK 7:44 తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నా పాదాలు కడుక్కోడానికి నీవు నాకు నీళ్లు ఇవ్వలేదు గాని, ఈమె తన కన్నీటితో నా పాదాలను తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచింది.
LUK 7:45 నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి, ఈమె నా పాదాలకు ముద్దు పెట్టడం మానలేదు.
LUK 7:46 నీవు నా తలకు నూనె పూయలేదు గాని, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది.
LUK 7:47 కాబట్టి నేను నీతో చెప్పేది ఏమనగా, ఆమె విస్తారంగా ప్రేమ చూపినందుకు ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. కాని ఎవరి పాపాలు కొంచెమే క్షమించబడ్డాయో వాడు కొంచెమే ప్రేమిస్తాడు” అని చెప్పారు.
LUK 7:48 అప్పుడు యేసు ఆమెతో, “నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నారు.
LUK 7:49 అందుకు అక్కడ ఆయనతో భోజన పంక్తిలో కూర్చుండిన వారు తమలో తాము, “పాపాలు కూడా క్షమిస్తున్నాడు ఈయన ఎవరు?” అని అనుకోవడం మొదలుపెట్టారు.
LUK 7:50 అప్పుడు యేసు ఆ స్త్రీతో, “నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానంతో వెళ్లు” అని చెప్పారు.
LUK 8:1 ఆ తర్వాత, యేసు దేవుని రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి, ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణం చేశారు. ఆయనతో పాటు పన్నెండుమంది శిష్యులు ఉన్నారు,
LUK 8:2 అపవిత్రాత్మల నుండి వ్యాధుల నుండి బాగుపడిన కొందరు స్త్రీలు, అనగా, ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ;
LUK 8:3 హేరోదు గృహనిర్వాహకుడైన కూజా భార్య యోహన్న; సూసన్న ఇంకా అనేకమంది ఉన్నారు. ఈ స్త్రీలు తమకు కలిగిన వాటితో వారికి సహాయం చేసేవారు.
LUK 8:4 ఒక రోజు ప్రతి పట్టణం నుండి గొప్ప జనసమూహం యేసు దగ్గరకు వస్తుండగా, ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు:
LUK 8:5 “ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు. అతడు విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి; అవి కాళ్లతో త్రొక్కబడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినివేశాయి.
LUK 8:6 మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, అవి మొలిచినప్పుడు, వాటికి తడి లేదు కాబట్టి మొక్కలు ఎండిపోయాయి.
LUK 8:7 మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి, వాటితో ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి.
LUK 8:8 మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, విత్తబడినవాటి కన్న వందరెట్లు అధికంగా పంటనిచ్చాయి.” ఆయన ఇది చెప్పిన తర్వాత, “వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని బిగ్గరగా అన్నారు.
LUK 8:9 శిష్యులు, ఈ ఉపమాన భావం ఏమిటి? అని ఆయనను అడిగారు.
LUK 8:10 ఆయన, “దేవుని రాజ్యం గురించిన రహస్యాలకు సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది, కాని ఇతరులతో ఉపమానరీతిలోనే మాట్లాడతాను, ఎందుకంటే, “ ‘చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు, వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు.’
LUK 8:11 “ఇది ఈ ఉపమాన భావం: విత్తనం దేవుని వాక్యము.
LUK 8:12 దారి ప్రక్కన పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని వింటారు, కానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు.
LUK 8:13 రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వారు వాక్యాన్ని విన్నప్పుడు దానిని సంతోషంతో అంగీకరిస్తారు, కానీ వారిలో వేరు ఉండదు. వారు కొంతకాలమే నమ్ముతారు, శోధన సమయంలో త్వరగా పడిపోతారు.
LUK 8:14 ముళ్ళపొదల్లో పడిన విత్తనాలు అంటే, వారు వాక్యాన్ని వింటారు, కాని కాలం గడిచేకొలది తమ జీవితాల్లో ఎదురయ్యే తొందరలు, ఐశ్వర్యాలు ఆనందాలతో అణచివేయబడడంవల్ల, వాక్యంలో ఎదగరు.
LUK 8:15 అయితే మంచి నేలలో పడిన విత్తనాలు యోగ్యులై మంచి హృదయం కలిగినవారు, వారు వాక్యాన్ని వింటారు, దానిని పాటిస్తారు, పట్టుదలతో ఫలిస్తారు.
LUK 8:16 “ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని మట్టి పాత్ర క్రింద లేదా మంచం క్రింద పెట్టరు. దానికి బదులు, లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు.
LUK 8:17 ఎందుకంటే మరుగున ఉంచినదేది బయటపడక ఉండదు, దాచిపెట్టబడినదేది తెలియకుండా లేదా బహిర్గతం కాకుండ ఉండదు.
LUK 8:18 కాబట్టి మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది; లేనివారి నుండి, తమకు ఉన్నదని అనుకునేది కూడా తీసివేయబడుతుంది” అని చెప్పారు.
LUK 8:19 యేసు తల్లి సహోదరులు ఆయనను కలవడానికి వచ్చారు, కానీ ప్రజలు గుంపుగా ఉండడంతో ఆయన దగ్గరకు రాలేకపోయారు.
LUK 8:20 అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి నీ సహోదరులు నిన్ను కలవడానికి వచ్చి, బయట వేచి ఉన్నారు” అని చెప్పాడు.
LUK 8:21 అందుకు ఆయన, “దేవుని వాక్యాన్ని విని, దాని ప్రకారం జీవించేవారే నా తల్లి, నా సహోదరులు” అని జవాబిచ్చారు.
LUK 8:22 ఒక రోజు యేసు తన శిష్యులతో, “మనం సరస్సు అవతలి వైపుకి వెళ్దాం పదండి” అన్నారు, వారు పడవ ఎక్కి బయలుదేరారు.
LUK 8:23 వారు ప్రయాణం చేస్తూ ఉండగా, యేసు నిద్రపోయారు. అంతలో భయంకరమైన తుఫాను సరస్సు మీదికి వచ్చి, పడవంతా నీళ్లతో నిండిపోవడం మొదలుపెట్టింది, వారు ఎంతో ప్రమాదంలో ఉన్నారు.
LUK 8:24 కాబట్టి శిష్యులు ఆయన దగ్గరకు వెళ్లి, “బోధకుడా, బోధకుడా, మేము మునిగిపోతున్నాం” అని అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలిని ఉప్పొంగుతున్న నీటిని గద్దించగానే, తుఫాను ఆగింది, అంతా ప్రశాంతంగా మారింది.
LUK 8:25 అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అని తన శిష్యులను అడిగారు. అయితే వారు విస్మయంతో భయపడుతూ ఒకనితో ఒకడు, “ఈయన ఎవరు? గాలిని నీళ్లను ఈయన ఆజ్ఞాపించగానే, అవి లోబడుతున్నాయి” అని చెప్పుకొన్నారు.
LUK 8:26 వారు గలిలయ సరస్సును దాటి, గెరాసేనీయులు నివసించు ప్రాంతాన్ని చేరుకొన్నారు.
LUK 8:27 యేసు ఒడ్డున అడుగు పెట్టగానే, దయ్యాలు పట్టిన గ్రామస్తుడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు చాలా కాలం నుండి బట్టలు వేసుకోలేదు ఇంట్లో కాకుండా, సమాధుల్లో నివసించేవాడు.
LUK 8:28 వాడు యేసును చూడగానే, వాడు కేక వేస్తూ ఆయన పాదాల దగ్గర పడి, “సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసూ, నాతో నీకేమి? నన్ను వేధించవద్దని నిన్ను వేడుకొంటున్నాను!” అని బిగ్గరగా అరిచాడు.
LUK 8:29 ఎందుకంటే యేసు ఆ అపవిత్రాత్మను వాని నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించారు. అది చాలాసార్లు వానిని పట్టి పీడించింది, వాని కాళ్లకు చేతులకు గొలుసులను వేసి బంధించి కాపలా ఉన్నా, వాడు ఆ గొలుసులను తెంపివేసేవాడు, ఆ దయ్యాలు వాన్ని అరణ్యంలోనికి తీసుకెళ్ళేవి.
LUK 8:30 అప్పుడు యేసు, “నీ పేరేమిటి?” అని వాన్ని అడిగారు. అందుకు వాడు, “సేన” అని జవాబిచ్చాడు, ఎందుకంటే అనేక దయ్యాలు వానిలో చొరబడి ఉన్నాయి.
LUK 8:31 పాతాళానికి వెళ్లమని తమను ఆజ్ఞాపించవద్దని అవి యేసును పదే పదే బ్రతిమాలాయి.
LUK 8:32 అక్కడ ఒక పెద్ద పందుల మంద కొండమీద మేస్తూ ఉంది. ఆ దయ్యాలు ఆ పందులలోనికి చొరబడడానికి అనుమతి ఇవ్వమని యేసును బ్రతిమాలాయి, ఆయన వాటికి అనుమతి ఇచ్చారు.
LUK 8:33 ఆ దయ్యాలు వానిలో నుండి బయటకు వచ్చి, ఆ పందులలోనికి చొరబడ్డాయి, వెంటనే ఆ మంద కొండ మీది నుండి వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకొని వెళ్లి మునిగిపోయింది.
LUK 8:34 ఎప్పుడైతే పందులను కాస్తున్నవారు జరిగిన దానిని చూశారో, వారు పరుగెత్తుకొని వెళ్లి పట్టణంలోను గ్రామీణ ప్రాంతాల్లోనూ తెలియజేశారు.
LUK 8:35 ప్రజలు ఏమి జరిగిందో చూడడానికి వెళ్లారు. వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, దయ్యాలు వదిలిన మనుష్యుడు, బట్టలు వేసుకుని సరియైన మానసిక స్థితిలో, యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూశారు; వారు భయపడ్డారు.
LUK 8:36 జరిగింది చూసినవారు ఆ దయ్యాలు పట్టినవాడు ఎలా బాగయ్యాడో ఆ ఊరి వారికి తెలియజేశారు.
LUK 8:37 అప్పుడు గెరాసేన ప్రాంతపు ప్రజలందరు ఎంతో భయపడి, తమను విడిచిపొమ్మని యేసును బ్రతిమాలారు. కాబట్టి ఆయన పడవ ఎక్కి అక్కడినుండి వెళ్లిపోయారు.
LUK 8:38 అప్పుడు ఆ దయ్యాల నుండి విడుదల పొందినవాడు, తాను ఆయనతో పాటు వస్తానని బ్రతిమలాడాడు.
LUK 8:39 కాని యేసు అతనితో, “నీ ఇంటికి వెళ్లి దేవుడు నీకు ఎంతగా మేలు చేశాడో చెప్పు” అని చెప్పి పంపివేశారు. కాబట్టి వాడు వెళ్లిపోయి యేసు తనకు చేసిన దానిని గురించి ఆ పట్టణమంతటికి చెప్పాడు.
LUK 8:40 యేసు తిరిగి రాగానే, ఆయన కోసం ఎదురు చూస్తున్న ప్రజలు సంతోషంగా ఆయనను ఆహ్వానించారు.
LUK 8:41 అప్పుడు యాయీరు అనే పేరుగల సమాజమందిరపు అధికారి వచ్చి, యేసు పాదాలపై పడి, తన ఇంటికి రమ్మని బ్రతిమాలాడు.
LUK 8:42 ఎందుకంటే సుమారు పన్నెండేళ్ళ వయస్సుగల అతని ఏకైక కుమార్తె జబ్బుతో చనిపోయేలా ఉంది. యేసు అతనితో వెళ్తూ ఉండగా, ప్రజలు గుంపుగా ఆయనపై పడుతున్నారు.
LUK 8:43 పన్నెండేళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసినా గాని, ఎవరు ఆమెను బాగు చేయలేకపోయారు.
LUK 8:44 ఆమె ఆయన వెనుక నుండి వచ్చి, ఆయన వస్త్రపు అంచును ముట్టింది, వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
LUK 8:45 “నన్ను ముట్టింది ఎవరు?” అని యేసు అడిగారు. మేము కాదని అందరు అంటూ ఉంటే, పేతురు, “బోధకుడా, ప్రజలు గుంపుగా నీపై పడుతున్నారు కదా” అన్నాడు.
LUK 8:46 అయినా యేసు, “ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి శక్తి బయటకు వెళ్లినట్లు నాకు తెలిసింది” అని అన్నారు.
LUK 8:47 అప్పుడు ఆ స్త్రీ, ఇక దాగి ఉండలేనని తెలిసి, వణుకుతూ వచ్చి ఆయన కాళ్లమీద పడింది. ఆమె ఎందుకు ఆయనను ముట్టుకుందో వెంటనే ఎలా స్వస్థత పొందిందో ప్రజలందరి ముందు చెప్పింది.
LUK 8:48 అప్పుడు ఆయన ఆమెతో, “కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. సమాధానంతో వెళ్లు” అని చెప్పారు.
LUK 8:49 యేసు ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిరపు నాయకుడైన యాయీరు ఇంటి నుండి ఒకడు వచ్చాడు, యాయీరుతో, “నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకునికి శ్రమ కలిగించవద్దు” అని చెప్పాడు.
LUK 8:50 వారి మాటలను విని, యేసు యాయీరుతో, “భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు, నీ కుమార్తె స్వస్థపడుతుంది” అని చెప్పారు.
LUK 8:51 ఆయన యాయీరు ఇల్లు చేరిన తర్వాత, పేతురు, యోహాను, యాకోబు ఆ బాలిక తల్లిదండ్రులును తప్ప మరి ఎవరిని లోనికి రానివ్వలేదు.
LUK 8:52 ఆ సమయంలో, ప్రజలందరు ఆమె కోసం ఏడుస్తూ రోదిస్తున్నారు. అప్పుడు యేసు, “ఏడ్పు ఆపండి! ఈమె చనిపోలేదు కానీ నిద్రపోతుంది” అన్నారు.
LUK 8:53 ఆమె చనిపోయిందని తెలిసి, వారు ఆయనను ఎగతాళి చేశారు.
LUK 8:54 అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని ఆమెతో, “చిన్నదానా, లే!” అన్నారు.
LUK 8:55 అప్పుడు ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది, ఆమె వెంటనే లేచి నిలబడింది. అప్పుడు ఆయన, “ఆమెకు తినడానికి ఏమైన ఇవ్వండి” అని వారితో చెప్పారు.
LUK 8:56 ఆమె తల్లిదండ్రులు అది చూసి ఆశ్చర్యపడ్డారు, అయితే ఆయన జరిగింది ఎవరికీ చెప్పకూడదు అని వారిని ఆదేశించారు.
LUK 9:1 యేసు పన్నెండుమందిని దగ్గరకు పిలిచి దయ్యాలను వెళ్లగొట్టడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి వారికి శక్తి, అధికారం ఇచ్చి,
LUK 9:2 దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి వారిని పంపారు.
LUK 9:3 ఆయన వారికి, “ప్రయాణం కోసం చేతికర్ర గాని, సంచి గాని, రొట్టె గాని, డబ్బు గాని, రెండవ చొక్కా గాని ఏమి తీసుకుని వెళ్లకూడదు.
LUK 9:4 మీరు ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ పట్టణం వదిలే వరకు ఆ ఇంట్లోనే బసచేయండి.
LUK 9:5 ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే, వారికి వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉండడానికి మీ పాదాల దుమ్మును దులిపి వారి గ్రామం విడిచి వెళ్లిపొండి” అని చెప్పారు.
LUK 9:6 కాబట్టి వారు సువార్తను ప్రకటిస్తూ ప్రతిచోట రోగులను స్వస్థపరుస్తూ గ్రామ గ్రామానికి వెళ్లారు.
LUK 9:7 జరుగుతున్న సంగతులన్నిటి గురించి చతుర్థాధిపతియైన హేరోదు విని కలవరపడ్డాడు. ఎందుకంటే కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయి మళ్ళీ బ్రతికాడు, అని చెప్పుకుంటున్నారు,
LUK 9:8 మరికొందరు ఏలీయా కనబడ్డాడని, ఇంకొందరు పూర్వకాల ప్రవక్తల్లో ఒకడు తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు.
LUK 9:9 అయితే హేరోదు, “నేను యోహాను తలను తీయించాను కదా, మరి నేను వింటున్నది, ఎవరి గురించి?” అని అనుకున్నాడు. అతడు ఆయనను చూడాలని ప్రయత్నించాడు.
LUK 9:10 అపొస్తలులు తిరిగివచ్చి, తాము చేసినవి యేసుకు తెలియజేశారు. అప్పుడు యేసు వారిని వెంటబెట్టుకుని బేత్సయిదా అనే గ్రామానికి ఏకాంతంగా వెళ్లారు,
LUK 9:11 అయితే అది తెలుసుకొని జనసమూహాలు ఆయనను వెంబడించారు. ఆయన వారిని చేర్చుకొని వారికి దేవుని రాజ్యం గురించి బోధిస్తూ, అవసరం ఉన్నవారిని స్వస్థపరిచారు.
LUK 9:12 ప్రొద్దుగూకే సమయంలో ఆ పన్నెండుమంది ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం కాబట్టి జనసమూహాన్ని పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు బస చేస్తారు” అన్నారు.
LUK 9:13 అందుకు ఆయన, “మీరే వారికి ఏదైనా తినడానికి ఇవ్వండి!” అని జవాబిచ్చారు. అందుకు వారు, “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీరికందరికి పెట్టాలంటే మనం వెళ్లి భోజనం కొని తీసుకురావాలి” అన్నారు.
LUK 9:14 ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు అక్కడ ఉన్నారు. అయినా ఆయన తన శిష్యులతో, “వారందరిని యాభైమంది చొప్పున గుంపులుగా కూర్చోబెట్టండి” అని చెప్పారు.
LUK 9:15 వారు అలానే చేసి, వారందరిని కూర్చోబెట్టారు.
LUK 9:16 అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి వాటిని విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు.
LUK 9:17 వారందరు తిని తృప్తి పొందారు, తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.
LUK 9:18 ఒక రోజు యేసు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు, అప్పుడు ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని వారిని అడిగారు.
LUK 9:19 అందుకు వారు, “కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను అని; కొందరు ఏలీయా అని, ఇంకొందరు పూర్వకాల ప్రవక్తల్లో ఒకడు తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు” అని జవాబిచ్చారు.
LUK 9:20 అయితే ఆయన, “నేనెవరినని మీరనుకొంటున్నారు?” అని అడిగారు. అందుకు పేతురు, “దేవుని అభిషిక్తుడు అనగా క్రీస్తు” అని చెప్పాడు.
LUK 9:21 ఈ విషయం ఎవరితో చెప్పకూడదని వారిని ఖచ్చితంగా హెచ్చరించారు.
LUK 9:22 ఆయన వారితో, “మనుష్యకుమారుడు అనేక శ్రమలు పొందాలి యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే ధర్మశాస్త్ర ఉపదేశకులచే తిరస్కరించబడాలి, ఆయన చంపబడి మూడవ రోజున తిరిగి లేస్తాడు” అని చెప్పారు.
LUK 9:23 ఆ తర్వాత ఆయన వారందరితో, “ఎవరైనా నా శిష్యునిగా ఉండాలనుకుంటే తనను తాను తిరస్కరించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి.
LUK 9:24 తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా తెగించేవారు దానిని దక్కించుకుంటారు.
LUK 9:25 ఎవరైనా లోకమంతా సంపాదించుకుని, తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం?
LUK 9:26 ఎవరైనా నా గురించి గాని నా మాటల గురించి గాని సిగ్గుపడితే, మనుష్యకుమారుడు తన తేజస్సుతో తన తండ్రి తేజస్సుతో పరిశుద్ధ దూతల తేజస్సుతో వచ్చినప్పుడు ఆయన వారి గురించి సిగ్గుపడతాడు.
LUK 9:27 “ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.
LUK 9:28 యేసు ఈ సంగతి చెప్పిన ఎనిమిది రోజుల తర్వాత, ఆయన పేతురు, యోహాను, యాకోబులను తన వెంట తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ మీదికి వెళ్లారు.
LUK 9:29 ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన ముఖరూపం మారింది, ఆయన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరుస్తున్నాయి.
LUK 9:30 అప్పుడు మోషే, ఏలీయా అనే ఇద్దరు వ్యక్తులు యేసుతో మాట్లడుతూ అద్భుతమైన ప్రకాశంతో కనబడ్డారు.
LUK 9:31 యెరూషలేములో ఆయన నెరవేర్చబోతున్న, ఆయన నిష్క్రమణ గురించి వారు మాట్లాడారు.
LUK 9:32 పేతురు అతనితో ఉన్నవారు నిద్రమత్తులో ఉన్నారు, కానీ వారు పూర్తిగా మేల్కొనినప్పుడు, ఆయన మహిమను ఇద్దరు వ్యక్తులు ఆయనతో నిలబడి ఉండడం చూశారు
LUK 9:33 ఆ ఇద్దరు వ్యక్తులు యేసును విడిచి వెళ్తుండగా, పేతురు ఆయనతో, “బోధకుడా, మనం ఇక్కడే ఉండడం మంచిది. మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని అన్నాడు. తాను ఏమి చెప్తున్నాడో తనకే తెలియదు.
LUK 9:34 అతడు మాట్లాడుతున్నప్పుడు, కాంతివంతమైన ఒక మేఘం ప్రత్యక్షమై వారిని కమ్ముకుంది, వారు దానిలోనికి వెళ్లినప్పుడు వారు భయపడ్డారు.
LUK 9:35 ఆ మేఘంలో నుండి ఒక స్వరం, “ఈయన, నేను ఏర్పరచుకొన్న నా కుమారుడు, ఈయన చెప్పేది వినండి” అని చెప్పడం వినబడింది.
LUK 9:36 ఆ స్వరం మాట్లాడినప్పుడు, వారు యేసు ఒంటరిగా ఉండడం చూశారు శిష్యులు తాము చూసినవాటిని గురించి ఎవరికి చెప్పకుండా తమ మనస్సులోనే ఉంచుకున్నారు.
LUK 9:37 మరుసటిరోజు, వారు కొండ దిగి వచ్చినప్పుడు, గొప్ప జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది.
LUK 9:38 ఆ జనసమూహంలోని ఒకడు బిగ్గరగా పిలిచి, “బోధకుడా, దయచేసి నా కుమారుని వైపు చూడు, నాకు వీడు ఒక్కడే కుమారుడు.
LUK 9:39 అపవిత్రాత్మ వీనిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేస్తాడు; అది వాన్ని మూర్ఛపోయేలా చేస్తుంది అప్పుడు వాడు నోటి నుండి నురుగు కారుస్తాడు. వానిని విలవిలలాడించి వేధించి వదలుతుంది.
LUK 9:40 దానిని వెళ్లగొట్టమని మీ శిష్యులను బ్రతిమాలాను, కానీ వారి వల్ల కాలేదు” అని చెప్పాడు.
LUK 9:41 యేసు, “విశ్వాసంలేని మూర్ఖతరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహిస్తాను? నీ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకురా” అన్నారు.
LUK 9:42 వాడు వస్తుండగానే, ఆ దయ్యం వానిని క్రింద పడద్రోసి మూర్ఛపోయేలా చేసింది. కాని యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి, ఆ బాలుని స్వస్థపరచి అతని తండ్రికి అప్పగించారు.
LUK 9:43 దేవుని గొప్పతనాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపడ్డారు. యేసు చేసినదంతటిని చూసి ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉంటే, ఆయన తన శిష్యులతో,
LUK 9:44 “నేను చెప్పబోయే మాటలను జాగ్రత్తగా వినండి: మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడబోతున్నాడు” అని చెప్పారు.
LUK 9:45 అయితే వారు ఆ మాటల అర్థాన్ని గ్రహించలేదు. అది వారికి మరుగు చేయబడింది కాబట్టి వారు దానిని తెలుసుకోలేకపోయారు. అంతేకాదు వారు దాని గురించి అడగడానికి కూడా భయపడ్డారు.
LUK 9:46 అప్పుడే వారిలో ఎవరు గొప్ప అని శిష్యుల మధ్య వాదం పుట్టింది.
LUK 9:47 యేసు, వారి ఆలోచనలను తెలుసుకొని, ఒక చిన్నబిడ్డను తన ప్రక్కన నిలబెట్టుకున్నారు.
LUK 9:48 తర్వాత ఆయన వారితో, “ఎవరు ఈ చిన్నబిడ్డను నా పేరట చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్టే; నన్ను చేర్చుకొనేవారు నన్ను పంపినవానిని చేర్చుకున్నట్టే. ఎందుకంటే మీ అందరిలో చివరివానిగా ఉండేవారే గొప్పవారు” అని చెప్పారు.
LUK 9:49 యోహాను యేసుతో, “బోధకుడా, నీ పేరట ఒకడు దయ్యాలను వెళ్లగొట్టడం మేము చూసి, వాన్ని ఆపే ప్రయత్నం చేశాం, ఎందుకంటే వాడు మనవాడు కాడు” అని చెప్పాడు.
LUK 9:50 అందుకు యేసు, “అలా ఆపవద్దు, ఎందుకంటే, మీకు విరోధి కాని వాడు మీ పక్షంగా ఉన్నవాడు” అని చెప్పారు.
LUK 9:51 తాను పరలోకానికి ఎత్తబడే సమయం ఆసన్నమైనదని గ్రహించి, యేసు యెరూషలేముకు వెళ్లాలని మనస్సును స్థిరపరచుకున్నారు.
LUK 9:52 తన కోసం బస సిద్ధం చేయడానికి తనకంటే ముందుగా, కొందరిని సమరయుల గ్రామానికి పంపారు.
LUK 9:53 కాని అక్కడి ప్రజలు ఆయన యెరూషలేముకు వెళ్తున్నారని తెలిసి, ఆయనను చేర్చుకోలేదు.
LUK 9:54 ఆయన శిష్యులైన యాకోబు యోహాను అది చూసి, ఆయనతో, “ప్రభువా, ఆకాశం నుండి అగ్నిని కురిపించి వీరిని నాశనం చేయమంటావా?” అని అడిగారు.
LUK 9:55 అయితే యేసు వారివైపు తిరిగి వారిని గద్దించారు.
LUK 9:56 ఆ తర్వాత ఆయన తన శిష్యులతో మరొక గ్రామానికి వెళ్లారు.
LUK 9:57 వారు దారిన వెళ్తున్నప్పుడు, ఒకడు ఆయనతో, “నీవు ఎక్కడికి వెళ్లినా నేను నిన్ను వెంబడిస్తాను” అని అన్నాడు.
LUK 9:58 అందుకు యేసు, “నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గూళ్ళు ఉన్నాయి, కాని మనుష్యకుమారునికి తలవాల్చుకోడానికి కూడా స్ధలం లేదు” అని అతనితో చెప్పారు.
LUK 9:59 ఆయన ఇంకొకనితో, “నన్ను వెంబడించు” అన్నారు. అందుకు అతడు, “ప్రభువా, మొదట నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టడానికి నన్ను వెళ్లనివ్వు!” అని అన్నాడు.
LUK 9:60 యేసు అతనితో, “చనిపోయినవారు తమ చనిపోయినవారిని పాతిపెట్టుకుంటారు, నీవైతే వెళ్లి దేవుని రాజ్యం గురించి ప్రకటించు” అని చెప్పారు.
LUK 9:61 ఇంకొకడు ఆయనతో, “ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను; కానీ మొదట నేను వెళ్లి నా కుటుంబీకులకు వెళ్తున్నానని చెప్పి వస్తా” అన్నాడు.
LUK 9:62 అందుకు యేసు వానితో, “నాగలిపై చేయి వేసాక వెనుకకు తిరిగి చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు” అని అన్నారు.
LUK 10:1 ఆ తర్వాత ప్రభువు ఇంకా డెబ్బైరెండు మంది శిష్యులను ఏర్పరచుకొని వారిని ఇద్దరిద్దరిగా తాను వెళ్లబోయే ప్రతి పట్టణానికి స్థలానికి తనకు ముందుగా వారిని పంపారు.
LUK 10:2 ఆయన వారితో, “కోత సమృద్ధిగా ఉంది, కాని పనివారు కొద్దిమందే ఉన్నారు. పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు.
LUK 10:3 వెళ్లండి! నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లల్లా పంపుతున్నాను.
LUK 10:4 మీ చేతుల్లో డబ్బు సంచి గాని సంచి గాని చెప్పులు గాని తీసుకోవద్దు; దారిలో ఎవరిని పలకరించకూడదు.
LUK 10:5 “మీరు ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు, మొదట, ‘ఈ ఇంటికి సమాధానం కలుగును గాక’ అని చెప్పండి.
LUK 10:6 ఒకవేళ అక్కడ సమాధానం కోరేవారుంటే, మీ సమాధానం వారి మీద నిలుస్తుంది; ఒకవేళ లేకపోతే, అది మీకే తిరిగి వస్తుంది.
LUK 10:7 వారు ఏది ఇచ్చినా తింటూ త్రాగుతూ, అక్కడే ఉండండి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు.
LUK 10:8 “మీరు ఒక గ్రామంలోనికి ప్రవేశించినప్పుడు, వారు మిమ్మల్ని చేర్చుకొంటే, వారు మీకు ఇచ్చే వాటిని తినండి.
LUK 10:9 అక్కడ ఉన్న రోగులను స్వస్థపరచండి, ‘దేవుని రాజ్యం సమీపించింది’ అని వారితో చెప్పండి.
LUK 10:10 అయితే మీరు ఒక గ్రామంలోనికి ప్రవేశించినప్పుడు, అక్కడి వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే, మీరు ఆ గ్రామ వీధులలోనికి వెళ్లి,
LUK 10:11 ‘మీకు హెచ్చరికగా మా పాదాల దుమ్మును కూడా దులిపి వేస్తున్నాము. అయినా దేవుని రాజ్యం సమీపించింది’ అని తెలుసుకోండి.
LUK 10:12 నేను చెప్పేదేంటంటే, తీర్పు దినాన ఆ గ్రామానికి పట్టిన గతికంటే సొదొమ గతి భరించ గలదిగా ఉంటుంది.
LUK 10:13 “కొరజీనూ, నీకు శ్రమ! బేత్సయిదా నీకు శ్రమ! ఎందుకంటే మీలో జరిగిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో జరిగి ఉంటే, ఆ ప్రజలు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని, పశ్చాత్తాపపడి ఉండేవారు.
LUK 10:14 అయితే తీర్పు దినాన మీ గతికంటే తూరు సీదోను పట్టణాల గతి భరించ గలదిగా ఉంటుంది.
LUK 10:15 ఓ కపెర్నహూమా, నీవు ఆకాశానికి ఎత్తబడతావా? లేదు, నీవు పాతాళంలోనికి దిగిపోతావు.
LUK 10:16 “మీ మాటలను వినేవారు నా మాటలను వింటారు; మిమ్మల్ని నిరాకరించే వారు నన్ను నిరాకరిస్తారు; అయితే నన్ను నిరాకరించే వారు నన్ను పంపినవానిని నిరాకరిస్తారు” అన్నారు.
LUK 10:17 ఆ డెబ్బైరెండు మంది సంతోషంగా తిరిగివచ్చి ఆయనతో, “ప్రభువా, దయ్యాలు కూడ నీ పేరిట మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు.
LUK 10:18 దానికి ఆయన, “సాతాను ఆకాశం నుండి మెరుపులా పడడం చూశాను.
LUK 10:19 ఇదిగో, పాములను, తేళ్ళను త్రొక్కడానికి, శత్రు బలమంతటిని జయించడానికి నేను మీకు అధికారం ఇచ్చాను; ఏవి మీకు ఏమాత్రం హాని చేయవు.
LUK 10:20 అయినా కానీ, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించకండి, కాని మీ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పారు.
LUK 10:21 ఆ సమయంలో, యేసు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందిస్తూ, ఇలా అన్నారు: “తండ్రీ! భూమి ఆకాశాలకు ప్రభువా, నీవు ఈ సంగతులను జ్ఞానులకు తెలివైనవారికి మరుగుచేసి, చిన్న పిల్లలకు బయలుపరిచావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. అవును, తండ్రీ, ఈ విధంగా చేయడం నీకు సంతోషము.
LUK 10:22 “నా తండ్రి నాకు సమస్తం అప్పగించారు. కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు, అలాగే తండ్రి ఎవరో కుమారునికి, కుమారుడు ఎవరికి తెలియచేయాలని అనుకున్నారో వారికి తప్ప మరి ఎవరికి తెలియదు.”
LUK 10:23 అప్పుడు ఆయన తన శిష్యులవైపు తిరిగి వారితో ఏకాంతంగా, “మీరు చూస్తున్నవాటిని చూసే కళ్లు ధన్యమైనవి.
LUK 10:24 ఎందుకంటే అనేకమంది ప్రవక్తలు, రాజులు మీరు చూస్తున్నవాటిని చూడాలనుకున్నారు కాని వారు చూడలేదు, మీరు వినేవాటిని వినాలని అనుకున్నారు కాని వినలేదు అని మీతో చెప్తున్నాను” అని అన్నాడు.
LUK 10:25 ఒక రోజు ఒక ధర్మశాస్త్ర నిపుణుడు లేచి యేసును పరీక్షిస్తూ, “బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.
LUK 10:26 అందుకు యేసు, “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసి ఉంది? దాన్ని నీవు ఎలా చదువుతావు?” అని అడిగారు.
LUK 10:27 అందుకు అతడు, “ ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో, మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి’ ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’ ” అని చెప్పాడు.
LUK 10:28 దానికి యేసు, “నీవు సరిగ్గా చెప్పావు, ఇది చేస్తే నీవు జీవిస్తావు” అని జవాబిచ్చారు.
LUK 10:29 అయితే అతడు తనను తాను నీతిమంతునిగా చూపించుకోడానికి, “నా పొరుగువాడు ఎవడు?” అని యేసుని అడిగాడు.
LUK 10:30 అందుకు యేసు, “ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తూ ఉండగా, బందిపోట్లు అతని మీద దాడి చేశారు. వారు అతని బట్టలు దోచుకొని, అతన్ని కొట్టి, సగం చచ్చినవానిగా అతన్ని విడిచి, వెళ్లిపోయారు.
LUK 10:31 అప్పుడే ఒక యాజకుడు ఆ దారిన వెళ్తూ, వానిని చూసి, వేరే ప్రక్క నుండి వెళ్లిపోయాడు.
LUK 10:32 అలాగే ఒక లేవీయుడు ఆ స్థలానికి వచ్చినప్పుడు వానిని చూసి, వేరే ప్రక్క నుండి వెళ్లిపోయాడు.
LUK 10:33 అయితే ఒక సమరయుడు, ప్రయాణం చేస్తూ, వాడు పడి ఉన్న చోటికి వచ్చాడు; అతడు వానిని చూసినప్పుడు, వాని మీద జాలిపడ్డాడు.
LUK 10:34 అతనికి దగ్గరకు వెళ్లి వానికి నూనె ద్రాక్షరసం పోసి, గాయాలు కట్టాడు. తర్వాత అతడు వానిని తన గాడిద మీద ఎక్కించుకొని, ఒక సత్రానికి తీసుకెళ్లి వాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు.
LUK 10:35 మరునాడు అతడు రెండు దేనారాలు తీసి ఆ సత్రపు యజమానికి ఇచ్చాడు. ‘ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, నీవు అధనంగా ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే, నేను మళ్ళీ వచ్చినప్పుడు దానిని తిరిగి చెల్లిస్తాను’ అని అతనితో చెప్పి వెళ్లాడు.
LUK 10:36 “దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు?” అని అతన్ని అడిగారు.
LUK 10:37 అందుకు ధర్మశాస్త్ర నిపుణుడు, “వాని పట్ల కనికరం చూపినవాడే” అని చెప్పాడు. యేసు అతనితో, “నీవు వెళ్లి అలాగే చేయి” అన్నారు.
LUK 10:38 యేసు ఆయన శిష్యులు దారిన వెళ్తూ, ఒక గ్రామానికి వచ్చారు. అక్కడ మార్త అనే పేరుగల స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది.
LUK 10:39 ఆమె సహోదరి పేరు మరియ, ఆమె ప్రభువు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధను వింటూ ఉంది.
LUK 10:40 అయితే మార్త తాను చేయాల్సిన ఏర్పాట్లపైనే దృష్టి పెట్టింది. ఆమె ఆయన దగ్గరకు వచ్చి, “ప్రభువా, నా సహోదరి పనులన్నీ నాకే వదిలేసి ఇక్కడ కూర్చుంది అయినా నీవు పట్టించుకోవా? నాకు సహాయం చేయమని చెప్పండి!” అని అన్నది.
LUK 10:41 ప్రభువు ఆమెతో, “మార్తా, మార్తా, నీవు అనేక విషయాల గురించి చింతిస్తున్నావు,
LUK 10:42 కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది, అది ఆమె నుండి తీసివేయబడదు” అన్నారు.
LUK 11:1 ఒక రోజు యేసు ఒక స్థలంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన ముగించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, “ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించినట్లు మాకు నేర్పించు” అని ఆయనను అడిగాడు.
LUK 11:2 ఆయన వారితో, “మీరు ప్రార్థన చేసేప్పుడు: “ ‘తండ్రీ, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక.
LUK 11:3 మా అనుదిన ఆహారం ప్రతిరోజు మాకు ఇవ్వండి.
LUK 11:4 మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లు, మా పాపాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి.’”
LUK 11:5 ఆ తర్వాత యేసు వారితో, “మీలో ఒకరికి ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి, నీవు అర్థరాత్రి సమయంలో అతని దగ్గరకు వెళ్లి, ‘స్నేహితుడా, నా స్నేహితుడొకడు ప్రయాణం చేస్తూ, నా దగ్గరకు వచ్చాడు, వానికి పెట్టడానికి నా దగ్గర ఆహారమేమి లేదు కాబట్టి నాకు మూడు రొట్టెలిస్తావా?’ అని అడిగితే;
LUK 11:7 లోపల ఉన్నవాడు, ‘నన్ను ఇబ్బంది పెట్టకు, తలుపుకు తాళం వేసి ఉంది. నేను నా పిల్లలు పడుకున్నాము. నేను లేచి నీకు ఏమీ ఇవ్వలేను?’ అని అన్నాడనుకోండి.
LUK 11:8 నేను చెప్తున్న, మీకున్న స్నేహాన్ని బట్టి అతడు లేచి నీకు రొట్టె ఇవ్వకపోయినా, నీవు అంతగా సిగ్గువిడిచి అడిగావు కాబట్టి అతడు తప్పక లేచి, నీకు అవసరమైనంత ఇస్తాడు.
LUK 11:9 “అందుకే నేను మీకు చెప్తున్న: అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది.
LUK 11:10 అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి, తలుపు తీయబడుతుంది.
LUK 11:11 “మీ తండ్రులలో ఎవరైనా, తన కుమారుడు, చేప అడిగితే పాము ఇస్తారా?
LUK 11:12 వాడు గ్రుడ్డు అడిగితే తేలు ఇస్తాడా?
LUK 11:13 మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా పరిశుద్ధాత్మను ఇస్తారు!”
LUK 11:14 ఒక రోజు యేసు మూగ దయ్యాన్ని వెళ్లగొడుతున్నారు. దయ్యం వెళ్లిపోగానే, ఆ మూగవానిగా ఉండినవాడు మాట్లాడాడు, దానికి జనసమూహం ఆశ్చర్యపడ్డారు.
LUK 11:15 అయితే వారిలో కొందరు, “ఇతడు బయెల్జెబూలు, అనే దయ్యాల అధిపతి ద్వారా దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు.
LUK 11:16 మరికొందరు పరలోకం నుండి ఒక సూచన కావాలని అడుగుతూ ఆయనను పరీక్షించారు.
LUK 11:17 యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఈ విధంగా అన్నారు: “ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నాశనం అవుతుంది, ఒక కుటుంబం దానికదే వ్యతిరేకించి చీలిపోతే అది కూలిపోతుంది.
LUK 11:18 ఒకవేళ సాతాను కూడా తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? నేనిలా చెప్తున్న ఎందుకంటే నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నానని మీరు అంటున్నారు కాబట్టి.
LUK 11:19 ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ అనుచరులు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు, వారే మీకు తీర్పుతీర్చుతారు.
LUK 11:20 కానీ ఒకవేళ నేను దేవుని అధికారంతో దయ్యాలను వెళ్లగొడుతున్నట్లయితే, అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని అర్థము.
LUK 11:21 “బలవంతుడైనవాడు ఆయుధాలను ధరించుకొని, తన ఇంటిని కాపల కాస్తున్నప్పుడు, అతని ఆస్తి భద్రంగా ఉంటుంది.
LUK 11:22 అయితే అతనికంటే బలవంతుడు వానిని ఓడించినప్పుడు, వాడు నమ్మకముంచిన ఆ ఆయుధాలను తీసుకున్న తర్వాతే అతని ఆస్తినంతటిని దోచుకొంటాడు.
LUK 11:23 “నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు.
LUK 11:24 “అపవిత్రాత్మ ఒక వ్యక్తి నుండి బయటకు రాగానే, విశ్రాంతి కోసం అది నీరు లేని స్థలాలను వెదకుతూ వెళ్తుంది కాని అలాంటి స్థలం దొరకదు. అప్పుడది, ‘నేను వదిలిన ఇంటికే తిరిగి వెళ్తాను’ అని అనుకుంటుంది.
LUK 11:25 అది తిరిగి వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి, చక్కగా అమర్చి ఉండడం చూస్తుంది.
LUK 11:26 అప్పుడు అది వెళ్లి దానికంటే మరి చెడ్డవైన ఏడు ఇతర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చి అక్కడే నివసిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి మొదటి స్థితి కంటే చివరి స్ధితి దారుణంగా ఉంటుంది.”
LUK 11:27 యేసు ఈ మాటలను చెప్తుండగా, ఆ జనసమూహంలోని ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నీకు పాలిచ్చిన స్తనాలు ధన్యమైనవి” అని కేకలు వేసి చెప్పింది.
LUK 11:28 అందుకు యేసు, “అది నిజమే, కానీ దానికంటే దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపేవారు ఇంకా ధన్యులు” అని చెప్పారు.
LUK 11:29 జనుల గుంపులు పెరుగుతూ ఉండగా యేసు, “ఇది దుష్టతరము. వీరు సూచనను అడుగుతున్నారు కానీ వీరికి యోనా సూచన తప్ప మరి ఏ సూచన ఇవ్వబడదు.
LUK 11:30 నీనెవె పట్టణస్థులకు యోనా ఒక సూచనగా ఉండునట్లు, మనుష్యకుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు.
LUK 11:31 దక్షిణదేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంచుల నుండి వచ్చింది, అయితే సొలొమోను కన్నా గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, కాబట్టి తీర్పు దినాన ఆమె ఈ తరం వారితో పాటు లేచి వారిని ఖండిస్తుంది.
LUK 11:32 నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా, ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె ప్రజలు న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు” అని చెప్పారు.
LUK 11:33 “ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని చాటుగా ఉండే చోటులో లేదా పాత్ర క్రింద పెట్టరు. దానికి బదులు లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు.
LUK 11:34 నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కళ్లు ఆరోగ్యంగా ఉంటే, దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది. కాని అవి అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది.
LUK 11:35 నీలో ఉన్న దేన్ని నీవు వెలుగు అనుకుంటున్నావో అది నిజానికి చీకటి కాకుండా చూసుకో.
LUK 11:36 కాబట్టి, నీ దేహంలో ఏ భాగం చీకటి కాకుండా నీ దేహమంతా వెలుగు మయమైతే, నీ మీద దీపం వెలుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది” అని చెప్పారు.
LUK 11:37 యేసు మాట్లాడడం చాలించిన తర్వాత, ఒక పరిసయ్యుడు తనతో కలిసి భోజనం చేయమని యేసును ఆహ్వానించాడు; కాబట్టి ఆయన వెళ్లి భోజనపు బల్ల దగ్గర కూర్చున్నారు.
LUK 11:38 అయితే యేసు యూదుల ఆచార ప్రకారం భోజనానికి ముందు చేతులు కడుక్కోకుండా కూర్చోవడం చూసి ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపడ్డాడు.
LUK 11:39 అందుకు ప్రభువు అతనితో, “పరిసయ్యులైన మీరు పాత్రను, గిన్నెను బయట శుభ్రం చేస్తారు, కాని లోపల అత్యాశతో, దుష్టత్వంతో నిండి ఉన్నారు.
LUK 11:40 అవివేకులైన ప్రజలారా! బయటి దాన్ని చేసినవాడే లోపలి దాన్ని కూడా చేయలేదా?
LUK 11:41 కాబట్టి పేదలకు బహుమతులు ఇవ్వండి అప్పుడు మీకు అంతా శుద్ధిగానే ఉంటుంది.
LUK 11:42 “పరిసయ్యులారా, మీకు శ్రమ. ఎందుకంటే, మీరు పుదీనా, మెంతులు ఇంకా అన్ని రకాల ఆకుకూరల్లో దేవునికి పదవ భాగం ఇస్తున్నారు, కాని న్యాయాన్ని, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు మొదటివాటిని విడిచిపెట్టకుండా వెనుకటివాటిని పాటించాల్సింది.
LUK 11:43 “పరిసయ్యులారా మీకు శ్రమ, ఎందుకంటే సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్లో ఉండడానికి, సంత వీధుల్లో గౌరవం అందుకోవడానికి ఇష్టపడుతున్నారు.
LUK 11:44 “మీకు శ్రమ! మీరు సరిగా గుర్తుపట్టలేని సమాధుల్లా ఉన్నారు, తెలియక ప్రజలు వాటి మీద నడుస్తారు.”
LUK 11:45 ధర్మశాస్త్ర నిపుణులలో ఒకడు, “బోధకుడా, నీవిలా చెప్పి, మమ్మల్ని అవమానపరుస్తున్నావు” అని ఆయనతో అన్నాడు.
LUK 11:46 అందుకు యేసు, “ధర్మశాస్త్ర నిపుణులారా మీకు శ్రమ, మీరు మోయలేని బరువులను ప్రజలతో మోయిస్తూ, కనీసం ఒక వ్రేలి మోతనైనా మోసి వారికి సహాయపడరు.
LUK 11:47 “మీకు శ్రమ, ఎందుకంటే మీరు ప్రవక్తలకు సమాధులు కట్టిస్తున్నారు, కాని వారిని చంపింది మీ పితరులే.
LUK 11:48 దీనిని బట్టి మీ పితరులు చేసిన వాటిని మీరు సమ్మతిస్తున్నట్లు సాక్ష్యమిస్తున్నారు; వారు ప్రవక్తలను చంపారు, మీరు వారికి సమాధులను కడుతున్నారు.
LUK 11:49 ఇందుకే, దేవుడు మీ గురించి తన జ్ఞానంలో, ‘నేను వారికి ప్రవక్తలను, అపొస్తలులను పంపుతాను, వారిలో కొందరిని వారు చంపుతారు, మరికొందరిని హింసిస్తారు.’
LUK 11:50 కాబట్టి లోక ఆరంభం నుండి చిందించబడిన ప్రవక్తలందరి రక్తానికి ఈ తరం బాధ్యత వహిస్తుంది,
LUK 11:51 అనగా, హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం దేవాలయానికి మధ్య చంపబడిన జెకర్యా రక్తం వరకు. అవును, నేను చెప్పేది నిజం, ఈ తరం వారే దానంతటికి బాధ్యులుగా ఎంచబడతారు.
LUK 11:52 “ధర్మశాస్త్ర నిపుణులారా మీకు శ్రమ, ఎందుకంటే మీరు జ్ఞానానికి చెందిన తాళపు చెవిని తీసివేసుకున్నారు. మీరే దానిలో ప్రవేశించలేదు, పైగా ప్రవేశిస్తున్న వారిని ఆటంకపరిచారు.”
LUK 11:53 అక్కడినుండి యేసు బయటకు వెళ్లినప్పుడు, పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించి తమ ప్రశ్నలతో ఆయనను చిక్కులు పెట్టాలని,
LUK 11:54 ఆయన చెప్పే మాటల్లో తప్పు పట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు.
LUK 12:1 అంతలో, వేలాదిమంది ప్రజలు ఒకరినొకరు త్రొక్కిసలాడుకొనేంతగా గుమికూడారు. అప్పుడు యేసు మొదట తన శిష్యులతో మాట్లాడడం ప్రారంభించారు: “వేషధారణ అనే పరిసయ్యుల పులిసిన పిండి మీలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి.
LUK 12:2 దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు.
LUK 12:3 మీరు చీకట్లో మాట్లాడినవి పగటి వెలుగులో వినబడతాయి. మీరు లోపలి గదుల్లో చెవిలో చెప్పిన మాటలు పైకప్పుల నుండి ప్రకటించబడతాయి.
LUK 12:4 “నా స్నేహితులారా, నేను మీతో చెప్పేదేమంటే, మీ శరీరాన్ని చంపి, ఆ తర్వాత ఏమి చేయలేనివారికి భయపడకండి.
LUK 12:5 మీరు ఎవరికి భయపడాలో నేను చెప్తాను: మీ దేహం చంపబడిన తర్వాత, మిమ్మల్ని నరకంలో పడద్రోసే శక్తిగల వానికి భయపడండి. అవును, ఆయనకే భయపడండి.
LUK 12:6 అయిదు పిచ్చుకలు రెండు కాసులకే అమ్మబడడం లేదా? అయినా వాటిలో ఒకదాన్ని కూడా దేవుడు మరచిపోరు.
LUK 12:7 నిజానికి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. భయపడకండి; మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు.
LUK 12:8 “ఎవరు ఇతరుల ముందు బహిరంగంగా నన్ను ఒప్పుకుంటారో, మనుష్యకుమారుడు కూడా దేవదూతల ముందు వారిని ఒప్పుకుంటారు.
LUK 12:9 కాని ఇతరుల ముందు ఎవరు నన్ను నిరాకరిస్తారో దేవదూతల ముందు వారు నిరాకరించబడతారు.
LUK 12:10 మనుష్యకుమారునికి విరోధంగా మాట్లాడే వారికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవారెవ్వరు క్షమించబడరు.
LUK 12:11 “మిమ్మల్ని సమాజమందిరాలు, పరిపాలకులు అధికారుల ముందుకు ఈడ్చుకొని వెళ్లినప్పుడు, మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో అని ఏమి చెప్పాలో అని మీరు చింతపడవద్దు.
LUK 12:12 ఎందుకంటే మీరు ఏమి చెప్పాలో ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు.”
LUK 12:13 ఆ జనసమూహంలో నుండి ఒకడు ఆయనతో, “బోధకుడా, వారసునిగా నేను పొందాల్సిన ఆస్తి భాగాన్ని పంచమని నా సహోదరునితో చెప్పండి” అన్నాడు.
LUK 12:14 అందుకు యేసు, “అయ్యా, నన్ను మీకు న్యాయాధిపతిగా గాని మధ్యవర్తిగా గాని నన్నెవరు నియమించారు?” అని జవాబిచ్చారు.
LUK 12:15 ఆ తర్వాత ఆయన వారితో, “మెలకువగా ఉండండి! మీరు అన్ని రకాల అత్యాశలకు విరుద్ధంగా ఉండేలా జాగ్రత్తపడండి; జీవితం అంటే సమృద్ధిగా ఆస్తులు కలిగి ఉండడం కాదు” అని చెప్పారు.
LUK 12:16 ఇంకా ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఒక ధనవంతుని పొలం సమృద్ధిగా పంట పండింది.
LUK 12:17 అప్పుడు అతడు తనలో తాను అనుకున్నాడు, ‘నేను ఏమి చేయాలి? ఈ పంటంతటిని నిల్వ చేసుకోవడానికి నాకు స్ధలం చాలదు.’
LUK 12:18 “అప్పుడతడు, ‘నేను ఇలా చేస్తాను. ఇప్పుడున్న కొట్లను పడగొట్టి, పెద్ద కొట్లను కట్టించి వాటిలో నా ధాన్యాన్ని సమకూర్చుకుంటాను.
LUK 12:19 నా ఆత్మతో నేను ఇలా అనుకుంటాను, “అనేక సంవత్సరాలకు సరిపడినంత విస్తారమైన ధాన్యం నీకోసం సమకూర్చి ఉంచాను. జీవితాన్ని తేలికగా తీసుకో; తిను, త్రాగు, సంతోషంగా ఉండు” ’ అని అనుకున్నాడు.
LUK 12:20 “కాని దేవుడు అతనితో, ‘ఓయీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతే, నీకోసం నీవు సిద్ధపరచుకొన్నది ఎవరిదవుతుంది?’
LUK 12:21 “దేవునిలో ధనవంతుడు కాకుండా తమ కోసం సమకూర్చుకొనేవారి స్థితి ఇలా ఉంటుంది” అని చెప్పారు.
LUK 12:22 తర్వాత యేసు తన శిష్యులతో, “కాబట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి అని, మీ ప్రాణం గురించి గాని, లేదా ఏమి ధరించాలి అని మీ దేహం గురించి గాని చింతించకండి.
LUK 12:23 ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి.
LUK 12:24 కాకులను చూడండి: అవి విత్తవు కోయవు, వాటికి నిల్వ చేసుకోడానికి గది కాని కొట్లు కాని లేవు; అయినా దేవుడు వాటిని పోషిస్తున్నారు. పక్షుల కన్నా మీరు ఇంకా ఎంతో విలువైన వారు.
LUK 12:25 మీలో ఎవరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా?
LUK 12:26 మీరు ఇంత చిన్నదాన్ని చేయలేనప్పుడు, మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తారు?
LUK 12:27 “అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు నేయవు. అయినా గొప్ప వైభవం కలిగి ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను.
LUK 12:28 అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో పడవేయబడే, పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా అలంకరిస్తారు!
LUK 12:29 ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ హృదయంలో కలవరపడకండి; దాని గురించి చింతించకండి.
LUK 12:30 దేవుని ఎరుగనివారు అలాంటి వాటి వెంటపడతారు కాని, అవన్నీ మీకు అవసరమని మీ తండ్రికి తెలుసు.
LUK 12:31 కాబట్టి ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి.
LUK 12:32 “చిన్న మందా, భయపడవద్దు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రి తన రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు.
LUK 12:33 మీ ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వండి. మీ కోసం పాతగిల్లని డబ్బు సంచులను ఏర్పరచుకోండి, పరలోకంలో ధనం ఎప్పటికీ తరిగిపోదు, అక్కడ ఏ దొంగ సమీపించలేడు, ఏ చిమ్మెట కొట్టివేయలేదు.
LUK 12:34 ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో, అక్కడే మీ హృదయం ఉంటుంది.
LUK 12:35 “సేవ కోసం మీ నడుము కట్టుకోండి, మీ దీపాలను వెలుగుతూ ఉండనివ్వండి,
LUK 12:36 తమ యజమాని పెండ్లి విందునుండి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురుచూస్తూ, అతడు వచ్చి తలుపు తట్టినప్పుడు వెంటనే తలుపు తీయడానికి మెలకువతో సిద్ధంగా ఉన్న సేవకుల్లా ఉండండి.
LUK 12:37 యజమాని వచ్చినప్పుడు ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ సేవకులకు మేలు. నేను చెప్పేది నిజం, సేవ చేయడానికి అతడు తన నడుము కట్టుకుని, ఆ సేవకులను భోజనానికి కూర్చోబెట్టి, అతడు అక్కడే వేచి ఉంటాడు.
LUK 12:38 తమ యజమాని మధ్యరాత్రి వచ్చినా లేదా తెల్లవారుజామున వచ్చినా, సిద్ధపడి కనిపించడం ఆ సేవకులకు మేలు.
LUK 12:39 అయితే ఈ విషయం అర్థం చేసుకోండి: దొంగ ఏ సమయంలో వస్తాడో ఒకవేళ ఇంటి యజమానికి తెలిస్తే, అతడు తన ఇంటికి కన్నం వేయకుండా జాగ్రత్తపడతాడు.
LUK 12:40 అలాగే మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి” అని చెప్పారు.
LUK 12:41 అప్పుడు పేతురు, “ప్రభువా, ఈ ఉపమానం మాకేనా లేదా అందరికి చెప్తున్నావా?” అని అడిగాడు.
LUK 12:42 అందుకు ప్రభువు, “యజమాని తన ఇంటి సేవకులకు సమయానికి వారి భోజన వేతనం ఇచ్చే బాధ్యతను అప్పగించడానికి, నమ్మకమైన, జ్ఞానం కలిగిన నిర్వాహకుడు ఎవడు?
LUK 12:43 యజమాని తిరిగి వచ్చినప్పుడు అలా చేస్తూ కనిపించడం ఆ సేవకునికి మేలు.
LUK 12:44 ఆ యజమాని తన యావదాస్తి మీద అతన్ని అధికారిగా ఉంచుతాడని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను.
LUK 12:45 కాని ఒకవేళ ఆ సేవకుడు, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడని’ తన మనస్సులో అనుకుని, తన తోటి సేవకులను, పురుషులు స్త్రీలను కూడా కొట్టడం మొదలుపెట్టి, తింటూ త్రాగుతూ మత్తులో ఉండి!
LUK 12:46 అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో యజమాని వస్తాడు, అతడు వాన్ని ముక్కలుగా నరికి అవిశ్వాసులతో అతనికి చోటు ఇస్తాడు.
LUK 12:47 “ఏ సేవకుడైతే తన యజమానుని చిత్తాన్ని ఎరిగి కూడా దాని ప్రకారం సిద్ధపడి తన యజమాని కోరుకున్నట్లుగా చేయడో వాడు అనేక దెబ్బలు తింటాడు.
LUK 12:48 అయితే తెలియక శిక్షకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే పడతాయి. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడిందో వాని నుండి ఎక్కువ తీసుకుంటారు; ఎవనికి ఎక్కువ అప్పగించబడిందో, వాని నుండి ఎక్కువ అడుగుతారు.”
LUK 12:49 నేను భూమి మీద అగ్ని వేయడానికే వచ్చాను, ఇప్పటికే అది రగులుకొని మండుతూ ఉండాలని ఎంతో కోరుతున్నాను.
LUK 12:50 అయితే నేను ఒక బాప్తిస్మం పొందాల్సి ఉంది, అది నెరవేరే వరకు ఎంత నిర్బంధంలో ఉన్నానో!
LUK 12:51 నేను భూమి మీదికి సమాధానం తేవడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? కాదు, కాని విడగొట్టడానికి తేవడానికి.
LUK 12:52 ఇప్పటినుండి అయిదుగురు ఉన్న ఒక కుటుంబంలో ఒకరికి ఒకరు వ్యతిరేకంగా విభజింపబడతారు, ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు, ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరు.
LUK 12:53 ఎలాగంటే, కుమారుని మీదికి తండ్రి, తండ్రి మీదికి కుమారుడు, కుమార్తెకు మీదికి తల్లి, తల్లి మీదికి కుమార్తె, కోడలు మీదికి అత్త, అత్త మీదికి కోడలు, ఇలా వారు విడిపోతారు.
LUK 12:54 ఆయన జనసమూహంతో ఇలా అన్నారు: “పడమర వైపు నుండి మబ్బులు రావడం చూసినప్పుడు మీరు వెంటనే, ‘వాన కురవబోతుంది’ అని అంటారు, అలాగే వాన కురుస్తుంది.
LUK 12:55 అలాగే దక్షిణపు గాలి వీచినప్పుడు, ‘వేడిగా ఉండబోతుంది’ అని అంటారు, అది అలాగే ఉంటుంది.
LUK 12:56 వేషధారులారా! భూమి, ఆకాశం యొక్క వాతావరణ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలుసు. అలాంటప్పుడు ప్రస్తుత కాలాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలియకపోవడమేంటి?
LUK 12:57 “ఏది సరియైనదో మీ అంతట మీరే ఎందుకు విమర్శించుకోలేరు?
LUK 12:58 నీవు నీ విరోధితో న్యాయాధిపతి దగ్గరకు వెళ్తున్నప్పుడు, దారిలో ఉన్నప్పుడే వానితో సమాధానపడే ప్రయత్నం చేయి, లేకపోతే నీ విరోధి నిన్ను న్యాయాధిపతి దగ్గరకు ఈడ్చుకెళ్లవచ్చు, న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాలలో వేయించవచ్చు.
LUK 12:59 చివరి పైసా చెల్లించే వరకు నీవు బయట పడలేవు” అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
LUK 13:1 అక్కడ ఉండిన ప్రజల్లో కొందరు యేసుతో, పిలాతు గలిలయుల రక్తాన్ని బలులతో కలిపిన సంగతిని చెప్పారు.
LUK 13:2 అందుకు యేసు, “ఈ గలిలయులు అలా శ్రమను అనుభవించారు కాబట్టి మిగిలిన గలిలయుల కంటే వీరు ఘోర పాపులని మీరు అనుకుంటున్నారా?
LUK 13:3 నేను మీతో చెప్తున్న, కాదు అని! మీరు పశ్చాత్తాపపడితేనే తప్ప, లేకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు.
LUK 13:4 సిలోయము గోపురం కూలి దాని క్రిందపడి పద్దెనిమిది మంది చనిపోయారు, వారు యెరూషలేములో జీవిస్తున్న వారందరికంటే ఎక్కువ పాపం చేశారని అనుకుంటున్నారా?
LUK 13:5 కాదని నేను మీతో చెప్తున్నాను! మీరు పశ్చాత్తాపపడాలి, లేకపోతే మీరందరు కూడా అలాగే నశిస్తారు.”
LUK 13:6 తర్వాత ఆయన ఈ ఉపమానం చెప్పారు: “ఒక మనుష్యుడు తన ద్రాక్షతోటలో ఒక అంజూర చెట్టును పెంచుతున్నాడు, అతడు వెళ్లి పండ్ల కోసం ఆ చెట్టును చూశాడు కాని ఏమి దొరకలేదు.
LUK 13:7 కాబట్టి అతడు తోటమాలితో, ‘ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంజూర చెట్టు పండ్ల కోసం వచ్చి చూస్తున్నాను గాని ఇంతవరకు ఏమి దొరకలేదు. దీనిని నరికివేయి! దీని వల్ల భూసారం ఎందుకు వృధా అవ్వాలి?’ అని అన్నాడు.
LUK 13:8 “అయితే ఆ తోటమాలి, ‘అయ్యా, ఇంకొక సంవత్సరం దానిని ఉండనివ్వండి, నేను దాని చుట్టూ త్రవ్వి, ఎరువు వేసి చూస్తాను.
LUK 13:9 ఒకవేళ అది పండ్లు ఇస్తే సరి, లేకపోతే నరికించండి’ అన్నాడు.”
LUK 13:10 ఒక సబ్బాతు దినాన యేసు సమాజమందిరంలో బోధిస్తున్నారు,
LUK 13:11 అక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుండి అపవిత్రాత్మ చేత పట్టబడి నడుము వంగిపోయి నిటారుగా నిలబడలేకపోతున్న ఒక స్త్రీ ఉండింది.
LUK 13:12 యేసు ఆమెను చూసి, ముందుకు రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావు” అని చెప్పారు.
LUK 13:13 తర్వాత ఆయన ఆమె మీద చేతులుంచారు, వెంటనే ఆమె నిటారుగా నిలబడి దేవుని స్తుతించింది.
LUK 13:14 సబ్బాతు దినాన యేసు స్వస్థపరిచారని, ఆ సమాజమందిరపు అధికారి మండిపడి ప్రజలతో, “పని చేసుకోవడానికి ఆరు దినాలు ఉన్నాయి. కాబట్టి ఆ దినాల్లో వచ్చి స్వస్థత పొందండి, అంతేకాని సబ్బాతు దినాన కాదు” అని చెప్పాడు.
LUK 13:15 అందుకు ప్రభువు అతనితో, “వేషధారులారా! మీలో ప్రతివాడు సబ్బాతు దినాన తన ఎద్దును గాని గాడిదను గాని పశువులశాల దగ్గరి నుండి వాటిని విప్పి తోలుకొనిపోయి వాటికి నీళ్లు పెట్టరా?
LUK 13:16 అలాంటప్పుడు అబ్రాహాము కుమార్తెయై ఉండి, పద్దెనిమిది సంవత్సరాలు సాతానుచేత బంధించబడి ఉన్న ఈ స్త్రీని సబ్బాతు దినాన ఎందుకు విడిపించకూడదు?” అని ప్రశ్నించారు.
LUK 13:17 ఆయన ఈ విధంగా చెప్పినప్పుడు, ఆయనను వ్యతిరేకించిన వారందరు సిగ్గుపడ్డారు, కానీ ప్రజలందరు ఆయన చేస్తున్న మహత్కార్యాలను చూసి సంతోషించారు.
LUK 13:18 అప్పుడు యేసు వారిని, “దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చాలి? అని అడిగి,
LUK 13:19 అది ఒక ఆవగింజ లాంటిది, ఒకడు దాన్ని తీసుకెళ్లి తన పొలంలో నాటాడు. అది పెరిగి వృక్షమయ్యింది, ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్నాయి.”
LUK 13:20 మరల ఆయన, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? అని అడిగి,
LUK 13:21 అది ఒక స్త్రీ ఇరవై ఏడు కిలోల పిండిని కలిపి ఆ పిండంతా పొంగడానికి దానిలో కలిపిన కొంచెం పులిసిన పిండి లాంటిది” అని చెప్పారు.
LUK 13:22 ఆ తర్వాత యేసు పట్టణాలు, గ్రామాల గుండా బోధిస్తూ, యెరూషలేముకు వెళ్లారు.
LUK 13:23 అప్పుడు ఒకడు ఆయనను, “ప్రభువా, కొందరు మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు. ఆయన వారితో,
LUK 13:24 “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రతీ ప్రయత్నం చేయండి, ఎందుకంటే, చాలామంది ప్రవేశించే ప్రయత్నం చేస్తారు, కాని ప్రవేశించలేరు అని మీకు చెప్తున్నాను.
LUK 13:25 ఒక్కసారి ఇంటి యజమాని లేచి తలుపును మూసివేస్తే, మీరు తలుపు బయట నిలబడి తలుపు తడుతూ, ‘అయ్యా, మాకోసం తలుపు తెరవండి’ అని వేడుకొంటారు. “కాని అతడు మీతో, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు’ అని జవాబిస్తాడు.
LUK 13:26 “అప్పుడు మీరు, ‘మేము నీతో కలిసి తిన్నాము త్రాగాము, నీవు మా వీధుల్లో బోధించావు’ అని అంటారు.
LUK 13:27 “కాని అతడు, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అంటాడు.
LUK 13:28 “మీరు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ప్రవక్తలందరినీ దేవుని రాజ్యంలో చూస్తారు, కానీ మీరు మాత్రం వెలుపటికి త్రోసివేయబడతారు, అక్కడ ఏడ్వడం, పండ్లు కొరకడం ఉంటాయి.
LUK 13:29 ప్రజలు తూర్పు, పడమర ఉత్తరం, దక్షిణం నుండి వచ్చి, దేవుని రాజ్యంలో జరిగే విందులో తమ తమ స్థానాల్లో కూర్చుంటారు.
LUK 13:30 వాస్తవానికి చివరి వారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు.”
LUK 13:31 ఆ సమయంలో కొందరు పరిసయ్యులు యేసు దగ్గరకు వచ్చి, “నీవు ఈ స్థలాన్ని విడచి ఎక్కడికైన వెళ్లిపోవడం మంచిది. హేరోదు రాజు నిన్ను చంపాలనుకుంటున్నాడు” అని ఆయనతో చెప్పారు.
LUK 13:32 అందుకు ఆయన, “వెళ్లి ఆ నక్కతో చెప్పండి, ‘ఇవ్వాళ రేపు నేను దయ్యాలను వెళ్లగొడుతూ ప్రజలను స్వస్థపరుస్తూ ఇక్కడే ఉంటాను, మూడవ రోజున నా గమ్యాన్ని చేరుకుంటాను.’
LUK 13:33 ఏ పరిస్థితిలోనైనా, నేను ఇవ్వాళ రేపు ఎల్లుండి వరకు వీటిని చేస్తూ ఉండాల్సిందే, ఎందుకంటే ఏ ప్రవక్త కూడా యెరూషలేము బయట చావలేడు! అని బదులిచ్చారు.
LUK 13:34 “యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపావు నీ దగ్గరకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టినదానా, ఒక కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను ఎలా చేర్చుకొంటుందో అలాగే నేను నీ పిల్లలను ఎన్నోసార్లు చేర్చుకోవాలని అనుకున్నాను కాని నీవు అంగీకరించలేదు.
LUK 13:35 చూడు, నీ ఇల్లు నిర్జనమైనదిగా నీకే విడిచిపెట్టబడుతుంది. ‘ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!’ అని మీరు చెప్పే వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను” అన్నారు.
LUK 14:1 ఒక సబ్బాతు దినాన, అధికారిగా ఉండిన ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి యేసు వెళ్లినప్పుడు, కొందరు ఆయన ఏమి చేస్తాడా అని ఆయనను గమనిస్తున్నారు.
LUK 14:2 అక్కడ ఆయన ముందు విపరీతమైన వాపుతో బాధపడుతున్న ఒక రోగి ఉన్నాడు.
LUK 14:3 అప్పుడు యేసు, “సబ్బాతు దినాన స్వస్థపరచడం ధర్మశాస్త్రానుసారమా కాదా?” అని పరిసయ్యులను ధర్మశాస్త్ర నిపుణులను అడిగారు.
LUK 14:4 కానీ వారు ఏ జవాబు ఇవ్వలేదు, అప్పుడు యేసు ఆ రోగి చేయి పట్టుకుని వానిని బాగుచేసి పంపించారు.
LUK 14:5 అప్పుడు ఆయన వారితో, “మీలో ఎవరి కుమారుడు గాని లేదా ఎద్దు గాని సబ్బాతు దినాన గుంటలో పడితే వెంటనే దానిని బయటకు తీయకుండా ఉంటారా?” అని అడిగారు.
LUK 14:6 కాని వారు ఆయనకు జవాబు ఇవ్వలేకపోయారు.
LUK 14:7 ఆహ్వానించబడిన వారు భోజనబల్ల దగ్గర గౌరవ స్థానాలను ఎంచుకోవడం గమనించి, ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు:
LUK 14:8 “ఎవరైనా మిమ్మల్ని పెళ్ళి విందుకు ఆహ్వానిస్తే గౌరవ స్థానంలో కూర్చోకండి, ఎందుకంటే ఒకవేళ మీకంటే గొప్ప వ్యక్తిని ఆహ్వానించి ఉండవచ్చు.
LUK 14:9 ఆ అతిథి వచ్చినప్పుడు నిన్ను ఆహ్వానించినవారు నీ దగ్గరకు వచ్చి, ‘మీరు లేచి వీరిని కూర్చోనివ్వండి’ అని అంటే మీరు అవమానంతో ఎక్కడో చివరికి వెళ్లి కూర్చోవలసి వస్తుంది.
LUK 14:10 అలా కాకుండ, మీరు ఆహ్వానించబడినప్పుడు వెళ్లి చివరి స్థానంలో కూర్చోండి అప్పుడు మిమ్మల్ని ఆహ్వానించినవారు వచ్చి మీతో, ‘స్నేహితుడా, నీవు లేచి ముందున్న గౌరవ స్థానంలో కూర్చో’ అని అంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఇతర అతిథులందరి ముందు నీవు గౌరవించబడతావు.
LUK 14:11 తమను తాము హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు, తమను తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు” అన్నారు.
LUK 14:12 తర్వాత యేసు తనను ఆహ్వానించిన వానితో, “నీవు మధ్యాహ్న భోజనం గాని రాత్రి భోజనం గాని పెట్టినప్పుడు, నీ స్నేహితులనే గాని, సహోదరులు లేదా సహోదరీలనే గాని, బంధువులనే గాని, ధనికులైన పొరుగువారినే గాని ఆహ్వానించవద్దు; ఒకవేళ నీవు అలా చేస్తే, వారు కూడా తమ విందులకు నిన్ను ఆహ్వానించి నీ రుణాన్ని తీర్చేసుకుంటారు.
LUK 14:13 అయితే నీవు విందును ఏర్పాటు చేసినప్పుడు పేదలను, కుంటివారిని, గ్రుడ్డివారిని, వికలాంగులను ఆహ్వానించు,
LUK 14:14 అప్పుడు నీవు దీవించబడతావు. పిలువబడిన వారు నీకు తిరిగి ఏమి ఇవ్వలేకపోయినా, నీతిమంతుల పునరుత్థానంలో నీకు తిరిగి ఇవ్వబడుతుంది” అన్నారు.
LUK 14:15 అది విని వారితో భోజనానికి కూర్చున్నవారిలో ఒకడు విని, యేసుతో, “దేవుని రాజ్య విందులో తినేవాడు ధన్యుడు” అని అన్నాడు.
LUK 14:16 అందుకు యేసు, “ఒకడు గొప్ప విందు సిద్ధపరుస్తూ చాలామంది అతిథులను ఆహ్వానించాడు.
LUK 14:17 విందు సమయంలో విందుకు పిలువబడినవారిని, ‘రండి, విందు సిద్ధంగా ఉంది’ అని చెప్పడానికి అతడు తన సేవకులను పంపించాడు.
LUK 14:18 “కానీ వారందరు ఒకేలా సాకులు చెప్పడం మొదలుపెట్టారు. మొదటివాడు, ‘నేను ఇప్పుడే ఒక పొలం కొన్నాను కాబట్టి దానిని చూడడానికి తప్పక వెళ్లాలి, దయచేసి నన్ను క్షమించండి’ అన్నాడు.
LUK 14:19 “మరొకడు, ‘నేనిప్పుడే అయిదు జతల ఎడ్లను కొన్నాను, ఇప్పుడు వాటిని చూడడానికి వెళ్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి’ అన్నాడు.
LUK 14:20 “మరొకడు, ‘నేను ఇప్పుడే పెళ్ళి చేసుకున్నాను, కాబట్టి నేను రాలేనని’ చెప్పి పంపాడు.
LUK 14:21 “ఆ సేవకుడు తిరిగివచ్చి, తన యజమానికి వారి మాటలను తెలియజేశాడు. ఆ యజమాని ఆ మాటలను విని కోప్పడి ఆ సేవకునితో, ‘నీవు వెంటనే వెళ్లి పట్టణ వీధుల్లో, సందుల్లో ఉన్న బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని తీసుకురా’ అని ఆదేశించాడు.
LUK 14:22 “ఆ సేవకుడు తన యజమానితో, ‘అయ్యా, నీవు చెప్పినట్లే చేశాను, అయినా ఇంకా చాలా ఖాళీ స్థలం ఉంది’ అన్నాడు.
LUK 14:23 “అందుకు ఆ యజమాని తన సేవకునితో, ‘నా ఇంటిని నింపడానికి వీధుల్లో సందులలోన కనిపించిన వారందరిని లోపలికి రమ్మని బలవంతం చేయి.
LUK 14:24 ఆహ్వానించబడిన వారిలో ఒక్కడు కూడ నేను ఏర్పచిన విందును రుచి చూడడని మీతో చెప్తున్నాను’ అని అన్నారు.”
LUK 14:25 పెద్ద జనసమూహాలు యేసుతో కూడా వెళ్తుండగా, ఆయన వారివైపు తిరిగి అన్నారు:
LUK 14:26 “ఎవరైనా, నా శిష్యునిగా ఉండాలనుకుంటే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, సహోదర సహోదరీలను, చివరికి తన ప్రాణాన్ని సైతం, వదులుకోడానికి సిద్ధంగా లేకపోతే, నా శిష్యులు కాలేరు.
LUK 14:27 తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు శిష్యులు కాలేరు.
LUK 14:28 “ఉదాహరణకు మీలో ఎవరైనా ఒక గోపురం కట్టించాలని అనుకుంటే దాన్ని పూర్తి చేయడానికి సరిపడే డబ్బు మీ దగ్గర ఉందా లేదా అని ముందుగా చూసుకోరా?
LUK 14:29 ఎందుకంటే ఒకవేళ మీరు పునాది వేసి, దాన్ని పూర్తి చేయలేకపోతే, చూసే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని,
LUK 14:30 ‘వీడు కట్టడం మొదలుపెట్టాడు కాని ముగించలేకపోయాడు’ అంటూ ఎగతాళి చేస్తారు.
LUK 14:31 “ఒక రాజు మరొక రాజుపై యుద్ధం చేయబోయేటప్పుడు, ఇరవై వేలమంది సైన్యంతో తన మీదికి వస్తున్న వాన్ని పదివేలమంది సైన్యంతో ఎదిరించగలనా అని అతడు ముందుగానే కూర్చుని ఆలోచించడా?
LUK 14:32 ఒకవేళ అతనికి అది అసాధ్యం అనిపిస్తే, శత్రువు ఇంకా దూరంలో ఉండగానే శాంతి నిబంధనలను చర్చించడానికి అతడు ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతాడు.
LUK 14:33 అదే విధంగా, మీరు కూడా మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు.
LUK 14:34 “ఉప్పు మంచిదే, కాని ఒకవేళ అది తన సారం కోల్పోతే, అది తిరిగి సారవంతం ఎలా చేయబడుతుంది?
LUK 14:35 అది నేలకు గాని ఎరువు కుప్పకు గాని పనికిరాదు; అది బయట పారవేయబడుతుంది. “వినడానికి చెవులుగలవారు విందురు గాక!”
LUK 15:1 ఒక రోజు పన్ను వసూలు చేసేవారు పాపులు యేసు మాటలను వినాలని ఆయన చుట్టూ గుమికూడారు.
LUK 15:2 అయితే పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అది చూసి, “ఇతడు పాపులతో కూర్చుని వారితో కలిసి తింటున్నాడు” అని సణుగుకొన్నారు.
LUK 15:3 అప్పుడు యేసు వారితో ఈ ఉపమానం చెప్పారు:
LUK 15:4 “మీలో ఎవనికైనా వంద గొర్రెలు ఉండి, వాటిలో ఒకటి తప్పిపోతే అతడు తొంభై తొమ్మిది గొర్రెలను అరణ్యంలో వదిలేసి, తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె దొరికే వరకు వెదకడా?
LUK 15:5 అది దొరికినప్పుడు అతడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకుని,
LUK 15:6 ఇంటికి వెళ్లి, తన స్నేహితులను తన పొరుగువారిని పిలిచి, ‘నేను పోగొట్టుకున్న నా గొర్రె దొరికింది, రండి నాతో కలిసి సంతోషించండి’ అని అంటాడు.
LUK 15:7 అదే విధంగా, పశ్చాత్తాపం అవసరంలేని తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే, పశ్చాత్తాపపడిన ఒక పాపిని బట్టి పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది అని నేను మీతో చెప్తున్నాను” అన్నారు.
LUK 15:8 “లేదా ఉదాహరణకు ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణాలు ఉండి, వాటిలో ఒకటి పోగొట్టుకుంది. అప్పుడు ఆమె దాని కోసం ఒక దీపం వెలిగించి తన ఇల్లును ఊడ్చి, అది దొరికే వరకు జాగ్రత్తగా వెదకదా?
LUK 15:9 అది దొరకగానే, ఆమె తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, వారితో, ‘పోయిన నా నాణెము దొరికింది, రండి నాతో కూడా సంతోషించండి’ అని చెప్తుంది కదా!
LUK 15:10 అలాగే పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగిన ఒక పాపిని గురించి దేవుని దూతల మధ్య సంతోషం కలుగుతుంది అని మీతో చెప్తున్నాను” అన్నారు.
LUK 15:11 యేసు ఇంకా మాట్లాడుతూ: “ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులున్నారు.
LUK 15:12 వారిలో చిన్నవాడు తన తండ్రితో, ‘నాన్నా, ఆస్తిలో నాకు రావలసిన భాగం నాకు ఇవ్వు’ అని అడిగాడు. కాబట్టి తండ్రి తన ఆస్తిని వారిద్దరికి పంచి ఇచ్చాడు.
LUK 15:13 “కొన్ని రోజుల్లోనే, ఆ చిన్నకుమారుడు తన దగ్గర ఉన్నదంతా పోగుచేసుకుని, సుదూర దేశానికి బయలుదేరాడు అక్కడ తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ తన సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేశాడు.
LUK 15:14 అతడు అంతా ఖర్చు చేసిన సమయంలోనే, ఆ దేశంలో తీవ్రమైన కరువు రావడం వలన అతనికి ఇబ్బందులు మొదలయ్యాయి.
LUK 15:15 కాబట్టి అతడు ఆ దేశస్థులలో ఒకని పొలంలో పందులను మేపే పనిలో చేరాడు.
LUK 15:16 అతనికి బాగా ఆకలివేస్తూ ఉండింది, కాని తినడానికి ఎవరూ ఏమి ఇవ్వలేదు కాబట్టి అతడు పందులు మేస్తున్న పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూశాడు.
LUK 15:17 “అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు, ‘నా తండ్రి దగ్గర పని చేసే చాలామంది కూలివారికి కూడా సమృద్ధిగా ఆహారం ఉంది, కానీ నేను ఇక్కడ ఆకలితో చస్తున్నాను.
LUK 15:18 నేను నా తండ్రి దగ్గరకు వెళ్లి అతనితో, నాన్నా, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను.
LUK 15:19 నీ కుమారుడనని అనిపించుకునే అర్హత కూడా నాకు లేదు, నన్ను నీ పనివారిలో ఒకనిగా పెట్టుకో అని చెప్తాను’ అనే ఆలోచనతో లేచి,
LUK 15:20 అతని తండ్రి దగ్గరకు వెళ్లాడు. “వాడు ఇంకా దూరంగా ఉండగానే, వాని తండ్రి వాన్ని చూసి, వానిపై జాలిపడి, పరుగెత్తుకొని వచ్చి వాని కౌగిలించుకుని వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు.
LUK 15:21 “అప్పుడు వాడు తన తండ్రితో, ‘నాన్నా, నీకు పరలోకానికిని విరోధంగా నేను పాపం చేశాను. ఇప్పటినుండి నేను నీ కుమారుడను అని అనిపించుకోడానికి కూడా అర్హున్ని కాను’ అని అన్నాడు.
LUK 15:22 “కాని వాని తండ్రి తన పనివారితో, ‘త్వరగా! విలువైన వస్త్రాలను తెచ్చి ఇతనికి ధరింపచేయండి, వీని చేతికి ఉంగరం పెట్టి, కాళ్లకు చెప్పులను తొడిగించండి.
LUK 15:23 ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుని ఆనందిద్దాము.
LUK 15:24 ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, వీడు తప్పిపోయి దొరికాడు’ అని అన్నాడు. అలా వారందరు అతనితో ఆనందించడం మొదలుపెట్టారు.
LUK 15:25 “ఆ సమయంలో, పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వస్తున్నాడు. అతడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, సంగీత నాట్యాల ధ్వని వినిపించింది.
LUK 15:26 అప్పుడు అతడు తన పనివారిలో ఒకన్ని పిలిచి, ‘ఇంట్లో ఏం జరుగుతోంది?’ అని అడిగాడు.
LUK 15:27 అందుకు ఆ పనివాడు, ‘నీ తమ్ముడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడని నీ తండ్రి సంతోషంతో విందు చేయడానికి క్రొవ్విన దూడను వధించాడు’ అని చెప్పాడు.
LUK 15:28 “దానితో పెద్ద కుమారుడు కోప్పడి ఇంట్లోకి వెళ్లడానికి ఇష్టపడలేదు. కాబట్టి అతని తండ్రి బయటకు వచ్చి అతన్ని ఇంట్లోకి రమ్మని బ్రతిమాలాడు.
LUK 15:29 కాని అతడు తన తండ్రితో, ‘చూడు, ఇన్ని సంవత్సరాల నుండి నీకు దాస్యం చేస్తూ వచ్చాను, నీ మాటను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అయినా నా స్నేహితులతో కలిసి సంతోషించడానికి ఒక చిన్న మేకపిల్లను కూడా నీవు ఎప్పుడు నాకు ఇవ్వలేదు.
LUK 15:30 కానీ నీ చిన్నకుమారుడు నీ ఆస్తినంతా వేశ్యలతో తిరిగి పాడుచేసి, ఇంటికి తిరిగి వస్తే వీని కోసం క్రొవ్విన దూడను వధించి విందు చేస్తున్నావా?’ అని అన్నాడు.
LUK 15:31 “అందుకు అతని తండ్రి, ‘నా కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నాకున్నదంతా నీదే.
LUK 15:32 కాని ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, అతడు తప్పిపోయి దొరికాడు కాబట్టి మనం సంతోషించి ఆనందించాలి’ అని చెప్పాడు.”
LUK 16:1 యేసు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు: “ఒక ధనవంతుని దగ్గర ఒక గృహనిర్వాహకుడు ఉన్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేస్తున్నాడని వాని మీద నేరారోపణ ఉంది.
LUK 16:2 కాబట్టి ఆ ధనవంతుడు వానిని లోపలికి పిలిపించి వానితో, ‘నీ గురించి నేను వింటుంది ఏమి? నిన్ను గృహనిర్వాహక పని నుండి తొలగిస్తున్నాను కాబట్టి నీవు లెక్కలన్నీ అప్పగించాలి’ అన్నాడు.
LUK 16:3 “ఆ గృహనిర్వాహకుడు తనలో తాను, ‘ఇప్పుడు నేను ఏమి చేయాలి? నా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేస్తాడు, నేను త్రవ్వే పని చేయలేను, భిక్షమెత్తాలంటే నాకు సిగ్గు.
LUK 16:4 కాబట్టి ఇక్కడ నా ఉద్యోగం పోయినా ప్రజలు నన్ను తమ ఇళ్ళకు ఆహ్వానించేలా ఏం చేయాలో నాకు తెలుసు!’ అని అనుకున్నాడు.
LUK 16:5 “కాబట్టి అతడు, తన యజమానికి బాకీ ఉన్న ప్రతివారిని పిలిపించాడు. మొదటి వానిని, ‘నా యజమానికి నీవెంత బాకీ ఉన్నావు?’ అని అడిగాడు.
LUK 16:6 “అందుకు వాడు, ‘మూడు వేల లీటర్ల నూనె’ అని జవాబిచ్చాడు. “వెంటనే ఆ గృహనిర్వాహకుడు వానితో, ‘నీ చీటి తీసుకుని, పదిహేను వందల లీటర్లు అని వ్రాసుకో’ అన్నాడు.
LUK 16:7 “ఆ తర్వాత రెండవ వానిని, ‘నీవెంత బాకీ ఉన్నావు?’ అని అడిగాడు. “అందుకు వాడు, ‘వంద టన్నుల గోధుమలు’ అని చెప్పాడు. “కాబట్టి అతడు వానితో, ‘నీవు నీ చీటిలో ఎనభై టన్నులని వ్రాసుకో’ అన్నాడు.
LUK 16:8 “ఈ విషయాన్ని విన్న ధనవంతుడు ఆ యజమాని మోసగాడైనా కానీ యుక్తిగా నడుచుకొన్నాడని వానిని మెచ్చుకొన్నాడు. ఈ లోకసంబంధులు తమ తరాన్ని బట్టి చూస్తే వెలుగు సంబంధుల కంటే యుక్తిగా వ్యవహరిస్తున్నారు.
LUK 16:9 కాబట్టి నేను మీతో చెప్పేదేమంటే, మీకున్న లోక ధనసంపదతో మీరు స్నేహితులను సంపాదించుకోండి, అది పోయినప్పుడు, నిత్యమైన నివాసాల్లో మీకు ఆహ్వానం దొరుకుతుంది.
LUK 16:10 “చాలా కొంచెంలో నమ్మకంగా ఉండేవారు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు; చిన్న వాటిలో అన్యాయంగా ఉండేవారు పెద్ద వాటిలో కూడా అన్యాయంగానే ఉంటారు.
LUK 16:11 అనగా, ఈ లోక సంపద విషయాల్లో మీరు నమ్మకంగా లేనప్పుడు, నిజమైన ధనం విషయంలో మిమ్మల్ని ఎవరు నమ్ముతారు?
LUK 16:12 మీరు ఇతరుల ఆస్తి విషయంలో నమ్మకంగా లేనప్పుడు, మీకు సొంత ఆస్తిని ఎవరు ఇస్తారు?
LUK 16:13 “ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేదా ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవున్ని, ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు.”
LUK 16:14 డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలను విని యేసును ఎగతాళి చేశారు.
LUK 16:15 ఆయన వారితో, “మీరు మనుష్యుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకుంటారు గాని దేవుడు మీ హృదయాలను ఎరిగి ఉన్నాడు. మనుష్యులు అధిక విలువ ఇచ్చేవి దేవుని దృష్టికి అసహ్యము.
LUK 16:16 “యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ప్రవక్తలు ఉన్నారు. అప్పటినుండి దేవుని రాజ్యసువార్త ప్రకటింపబడుతూ ఉంది, ప్రతి ఒక్కరు ఆ రాజ్యంలో చొరబడుతూనే ఉన్నారు.
LUK 16:17 ధర్మశాస్త్రం నుండి ఒక పొల్లు తప్పిపోవడం కన్న ఆకాశం భూమి గతించిపోవడం సులభం.
LUK 16:18 “ఎవడైనా తన భార్యను విడిచి మరొక స్త్రీని పెళ్ళి చేసుకుంటే వాడు వ్యభిచారం చేస్తున్నాడు, అలాగే విడిచిపెట్టబడిన స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
LUK 16:19 “ఊదా రంగు సన్నని నారబట్టలను ధరించుకొని, ప్రతిరోజు విలాసంగా జీవించే ఒక ధనవంతుడు ఉండేవాడు.
LUK 16:20 వాని ఇంటి వాకిటనే శరీరమంతా కురుపులు ఉన్న లాజరు అనే పేరుగల ఒక పేదవాడు ఉండేవాడు.
LUK 16:21 వాడు ఆ ధనవంతుని బల్ల నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలని చూసేవాడు. కుక్కలు వచ్చి వాని కురుపులను నాకేవి.
LUK 16:22 “ఆ పేదవాడు చనిపోయినప్పుడు దేవదూతలు వానిని అబ్రాహాము రొమ్మున ఆనుకోడానికి తీసుకెళ్లారు. అలాగే ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడ్డాడు.
LUK 16:23 ధనవంతుడు నరకంలో యాతనపడుతు, దూరం నుండి అబ్రాహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూశాడు.
LUK 16:24 వెంటనే అతడు, ‘తండ్రీ అబ్రాహామూ, నేను అగ్నిలో అల్లాడి పోతున్నాను. నా మీద కనికరం చూపించి, తన చేతివ్రేలికొన నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపించవా’ అని కేక వేశాడు.
LUK 16:25 “అందుకు అబ్రాహాము, ‘కుమారుడా, జ్ఞాపకం చేసుకో, లాజరు కష్టాలను అనుభవిస్తున్నప్పుడు నీ జీవితంలో నీవు మేళ్ళను అనుభవించావు, కానీ ఇప్పుడు ఇక్కడ అతడు ఆదరణ పొందుతున్నాడు, కానీ నీవు యాతనపడుతున్నావు.
LUK 16:26 వీటన్నిటితో పాటు, నీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది కాబట్టి ఇక్కడి వారు అక్కడికి గాని అక్కడి వారు ఇక్కడకు గాని రాలేరు’ అన్నాడు.
LUK 16:27 “అందుకు అతడు, ‘అయితే తండ్రీ, నా కుటుంబంలో నాకు అయిదుగురు సహోదరులు ఉన్నారు. వారు కూడ ఇక్కడకు వచ్చి వేదన పడకుండా వారిని హెచ్చరించడానికి లాజరును పంపించమని నిన్ను వేడుకొంటున్నాను’ అన్నాడు.
LUK 16:29 “అందుకు అబ్రాహాము, ‘వారికి మోషే ప్రవక్తలు ఉన్నారు, వారు వీరి మాటలను విననివ్వు’ అన్నాడు.
LUK 16:30 “అందుకు అతడు, ‘కాదు, తండ్రీ అబ్రాహామూ, చనిపోయినవారిలో నుండి ఎవరైనా వెళ్తే, వారు పశ్చాత్తాపపడతారు’ అన్నాడు.
LUK 16:31 “అందుకు అబ్రాహాము అతనితో, ‘వారు మోషే మాటలు గాని ప్రవక్తల మాటలు గాని వినకపోతే చనిపోయినవారిలో నుండి ఒకడు లేచి వెళ్లినా నమ్మరు’ అన్నాడు.”
LUK 17:1 యేసు తన శిష్యులతో, “ప్రజలను ఆటంకపరిచే శోధనలు తప్పకుండా వస్తాయి, కాని అవి ఎవరి వలన వస్తాయో, వానికి శ్రమ.
LUK 17:2 ఎవడైనా ఈ చిన్నపిల్లల్లో ఒకరికి ఆటంకంగా ఉండడం కన్నా, వాని మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వానికి మేలు.
LUK 17:3 కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. “ఒకవేళ నీ సహోదరుడు గాని సహోదరి గాని నీ ఎడల పాపం చేస్తే, వారిని గద్దించండి; వారు పశ్చాత్తాపపడితే, వారిని క్షమించండి.
LUK 17:4 వారు ఒకే రోజు నీకు వ్యతిరేకంగా ఏడుసార్లు తప్పు చేసి తాము చేసిన తప్పును బట్టి ‘నేను పశ్చాత్తాపపడుతున్నాను’ అంటూ నీ దగ్గరకు వస్తే, నీవు వారిని తప్పక క్షమించాలి.”
LUK 17:5 అప్పుడు అపొస్తలులు, “ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచండి!” అని అడిగారు.
LUK 17:6 అందుకు ఆయన, “మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఈ మారేడు చెట్టును చూసి, ‘నీవు వేళ్లతో సహా పెకిలించబడి సముద్రంలో నాటబడు’ అని చెప్తే అది మీకు లోబడుతుంది.
LUK 17:7 “మీలో ఎవనికైనా దున్నడానికి లేదా మేపడానికి సేవకుడు ఉన్నాడనుకోండి. వాడు పొలంలో పని చేసి ఇంటికి రాగానే, అతని యజమాని, ఆ సేవకునితో, ‘భోజనం చేద్దాం రా అని వానిని పిలుస్తాడా?’
LUK 17:8 దాని బదులు, ‘ముందుగా నాకు భోజనం సిద్ధం చేసి, నీవు సిద్ధపడి నేను తిని త్రాగే వరకు నా సేవ చేయి, ఆ తర్వాత నీవు తిని త్రాగవచ్చు’ అని చెప్పుతాడు కదా!
LUK 17:9 తాను చెప్పినట్లే సేవకుడు చేశాడని యజమాని వానికి వందనాలు చెప్తాడా?
LUK 17:10 అలాగే మీరు కూడా, మీకు అప్పగించబడిన పనులన్నీ చేసిన తర్వాత, ‘మేము యోగ్యత లేని సేవకులం; మా పని మాత్రమే మేము చేశాం’ అని చెప్పాలి” అని అన్నారు.
LUK 17:11 యేసు సమరయ గలిలయ ప్రాంతాల సరిహద్దుల గుండా యెరూషలేముకు వెళ్లారు.
LUK 17:12 ఆయన ఒక గ్రామంలోనికి ప్రవేశించేటప్పుడు పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యారు. వారు దూరంగా నిలబడి,
LUK 17:13 “యేసూ, బోధకుడా, మమ్మల్ని కనికరించండి!” అని అంటూ బిగ్గరగా కేక వేశారు.
LUK 17:14 ఆయన వారిని చూసి, వారితో, “మీరు వెళ్లి, మిమ్మల్ని మీరు యాజకులకు కనుపరచుకోండి” అన్నారు. వారు వెళ్తుండగానే వారు శుద్ధులయ్యారు.
LUK 17:15 అందులో ఒకడు, తనకు స్వస్థత కలిగిందని చూసుకొని, బిగ్గరగా దేవుని స్తుతిస్తూ తిరిగి వచ్చాడు.
LUK 17:16 అతడు యేసు పాదాల ముందు సాగిలపడి ఆయనకు కృతజ్ఞత చెప్పాడు. అతడు సమరయుడు.
LUK 17:17 యేసు, “పదిమంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ?
LUK 17:18 ఈ సమరయుడు తప్ప దేవుని స్తుతించడానికి ఇంకెవరు తిరిగి రాలేదా?” అని అడిగారు.
LUK 17:19 ఆ తర్వాత వానితో, “నీవు లేచి వెళ్లు; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది” అన్నారు.
LUK 17:20 ఒకసారి పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని యేసును అడిగినప్పుడు ఆయన, “దేవుని రాజ్యం పైకి కనిపించేదిగా రాదు,
LUK 17:21 దేవుని రాజ్యం మీలోనే ఉంది కాబట్టి ‘ఇదిగో ఇక్కడ ఉంది’ లేదా ‘అదిగో అక్కడ ఉంది’ అని ఎవరు చెప్పలేరు” అని జవాబిచ్చారు.
LUK 17:22 ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “మనుష్యకుమారుని దినాల్లోని ఒక రోజునైనా చూడాలని మీరు ఆశించే సమయం వస్తుంది, కాని మీరు ఆ రోజును చూడరు.
LUK 17:23 ప్రజలు మీతో ‘అదిగో ఆయన అక్కడ ఉన్నాడు!’ లేదా ‘ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు!’ అని అంటారు. మీరు వారి వెనుక పరుగెత్తకండి.
LUK 17:24 ఎందుకంటే మనుష్యకుమారుని రాకడ దినం ఆకాశంలో ఒక దిక్కునుండి మరో దిక్కువరకు మెరిసే మెరుపువలె ఉంటుంది.
LUK 17:25 కానీ దానికి ముందు, ఆయన అనేక హింసలు పొందాలి ఈ తరం వారి చేత తిరస్కరించబడాలి.
LUK 17:26 “నోవహు దినాల్లో జరిగినట్టు, మనుష్యకుమారుని దినాల్లో కూడా జరుగుతుంది.
LUK 17:27 నోవహు ఓడలోనికి ప్రవేశించిన రోజు వరకు ప్రజలందరూ తింటూ, త్రాగుతూ, పెండ్లి చేసుకొంటూ, పెండ్లికిస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి వారందరిని నాశనం చేసింది.
LUK 17:28 “లోతు దినాల్లో జరిగినట్టే జరుగుతుంది. ప్రజలు తింటూ త్రాగుతూ కొంటూ అమ్ముతూ మొక్కలు నాటుతూ, ఇళ్ళు కడుతున్నారు.
LUK 17:29 కానీ లోతు సొదొమ గ్రామం విడిచి వెళ్లిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి వారందరు నాశనం అయ్యారు.
LUK 17:30 “మనుష్యకుమారుడు ప్రత్యక్షమయ్యే రోజు కూడా అలాగే ఉంటుంది.
LUK 17:31 ఆ రోజు ఇంటిపైన ఉన్నవారెవరు ఇంట్లోనుండి తమ వస్తువులను తెచ్చుకోవడానికి క్రిందికి దిగి వెళ్లకూడదు. అలాగే పొలంలో ఉన్నవారు ఏమైనా తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లకూడదు.
LUK 17:32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి.
LUK 17:33 తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దాన్ని పోగొట్టుకుంటారు, తన ప్రాణాన్ని పోగొట్టుకునేవారు దాన్ని కాపాడుకుంటారు.
LUK 17:34 ఆ రాత్రి ఒకే పరుపు మీద ఉన్న ఇద్దరిలో, ఒకరు కొనిపోబడతారు ఇంకొకరు విడవబడతారు.
LUK 17:35 ఇద్దరు స్త్రీలు కలిసి తిరుగలి విసురుతుంటారు; ఒక స్త్రీ కొనిపోబడుతుంది, ఇంకొక స్త్రీ విడవబడుతుంది.
LUK 17:36 ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు; ఒకడు కొనిపోబడతాడు మరొకడు విడవబడుతాడు” అని చెప్పారు.
LUK 17:37 అందుకు శిష్యులు, “ప్రభువా, ఇది ఎక్కడ జరుగుతుంది?” అని యేసును అడిగారు. అందుకు యేసు, “పీనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు పోగవుతాయి” అని వారికి జవాబిచ్చారు.
LUK 18:1 ఒక రోజు యేసు విసుగక ప్రార్థన చేస్తూ ఉండాలి అనే విషయాన్ని ఉపమానరీతిగా చెప్పారు:
LUK 18:2 “ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుని భయం లేదు, మనుష్యులను లెక్క చేసేవాడు కాడు.
LUK 18:3 ఆ పట్టణంలో ఒక విధవరాలు అతని దగ్గరకు తరచుగా వస్తూ, ‘నా విరోధి విషయంలో నాకు న్యాయం తీర్చండి’ అని అడుగుతూ ఉండేది.
LUK 18:4 “అతడు కొంతకాలం వరకు ఆమె మాటలను తిరస్కరించాడు కానీ, అతడు తనలో తాను, ‘నేను దేవునికి భయపడకపోయినా లేదా మనుష్యులను లక్ష్యపెట్టక పోయినా,
LUK 18:5 ఈ విధవరాలు, “నాకు న్యాయం చేయండి” అని నన్ను తరచుగా తొందర పెడుతుంది, కాబట్టి ఆమె మాటిమాటికి వచ్చి నన్ను విసిగించకుండా, నేను ఆమెకు న్యాయం చేస్తాను’ అని అనుకున్నాడు.”
LUK 18:6 కాబట్టి ప్రభువు దాని గురించి, “అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఏమన్నాడో వినండి.
LUK 18:7 దేవుడు తాను ఏర్పరచుకున్నవారు, దివారాత్రులు తనకు మొరపెడుతున్న వారికి న్యాయం చేయరా? వారికి న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తారా?
LUK 18:8 నేను చెప్పేది ఏంటంటే, ఆయన వారికి న్యాయం జరిగేలా చేస్తారు, అది కూడా అతిత్వరలో చేస్తారు. అయినా మనుష్యకుమారుడు వచ్చినప్పుడు, ఆయనకు భూమి మీద వారిలో విశ్వాసం కనిపిస్తుందా?” అని అడిగారు.
LUK 18:9 తమ స్వనీతిని ఆధారం చేసుకుని ఇతరులను చిన్న చూపు చూసేవారితో యేసు ఈ ఉపమానం చెప్పారు:
LUK 18:10 “ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్లారు. వారిలో ఒకడు పరిసయ్యుడు మరొకడు పన్నులు వసూలు చేసేవాడు.
LUK 18:11 పరిసయ్యుడు నిలబడి తన గురించి ఇలా ప్రార్థించాడు: ‘దేవా, నేను దొంగలు, అన్యాయస్థులు వ్యభిచారుల వంటి ఇతరుల్లా కాని, ఈ పన్నులు వసూలు చేసేవాని వలె కాని లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
LUK 18:12 నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదనలో పదవ భాగం ఇస్తాను.’
LUK 18:13 “అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడి, తలను పైకెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక, రొమ్ము కొట్టుకొంటూ, ‘దేవా, నేను పాపిని, నన్ను కరుణించు’ అని వేడుకొన్నాడు.
LUK 18:14 “నేను మీతో చెప్పేది ఏంటంటే, పరిసయ్యుని కంటే పన్నులు వసూలు చేసేవాడే దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్లాడు. ఎందుకంటే తమను తాము హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు. తమను తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు.”
LUK 18:15 కొందరు తల్లితండ్రులు తమ పసిపిల్లలపై యేసు తన చేతులుంచి వారిని ఆశీర్వదించాలని ఆయన దగ్గరకు తీసుకుని వస్తున్నారు. అయితే ఆయన శిష్యులు అది చూసి వారిని గద్దించారు.
LUK 18:16 కానీ యేసు పిల్లలను తన దగ్గరకు పిలిచి తన శిష్యులతో, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటి వారిదే” అని చెప్పారు.
LUK 18:17 “ఎవరైనా చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే, ఎన్నటికి దానిలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు.
LUK 18:18 ఒక అధికారి యేసుతో, “మంచి బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.
LUK 18:19 అందుకు యేసు, “నీవు నన్ను ఎందుకు మంచివాడనని పిలుస్తున్నావు? దేవుడు తప్ప మంచివారు ఎవ్వరూ లేరు.
LUK 18:20 మీకు ఆజ్ఞలు తెలుసు: ‘వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ” అని అన్నారు.
LUK 18:21 అందుకు ఆ అధికారి, “చిన్నప్పటి నుండి నేను వీటిని పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు.
LUK 18:22 యేసు అతడు చెప్పింది విని వానితో, “అయినా నీలో ఒక కొరత ఉంది. నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు, అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి, నన్ను వెంబడించు” అని చెప్పారు.
LUK 18:23 అయితే ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే అతడు గొప్ప ఆస్తిగలవాడు.
LUK 18:24 యేసు అతన్ని చూసి అతనితో, “ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు.
LUK 18:26 ఇది విన్న వారు, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు.
LUK 18:27 అందుకు యేసు, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం” అని జవాబిచ్చాడు.
LUK 18:28 పేతురు ఆయనతో, “మేము మాకు కలిగిన వాటన్నిటిని విడిచి నిన్ను వెంబడించాము” అన్నాడు.
LUK 18:29 అందుకు యేసు వారితో, “నేను మీతో నిజంగా చెప్తున్నాను, దేవుని రాజ్యం కోసం తన ఇంటిని, భార్యను, సహోదరులను, సహోదరీలను, తల్లిదండ్రులను, పిల్లలను విడిచిపెట్టిన వారు ఈ యుగంలో చాలారెట్లు పొందుకోవడమే కాక, రానున్న యుగంలో నిత్యజీవాన్ని కూడా తప్పక పొందుకొంటాడు” అని వారితో అన్నారు.
LUK 18:31 యేసు తన పన్నెండుమంది శిష్యులను ప్రక్కకు తీసుకెళ్లి, “రండి, మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్యకుమారుని గురించి ప్రవక్తలు వ్రాసిన మాటలన్నీ నెరవేరుతాయి.
LUK 18:32 వారు ఆయనను యూదేతరుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మివేసి ఆయనను అవమానపరుస్తారు.
LUK 18:33 వారు ఆయనను కొరడాలతో కొట్టి చంపేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పారు.
LUK 18:34 ఆయన చెప్పిన ఈ మాటల్లో శిష్యులు ఏది గ్రహించలేదు. దాని అర్థం వారికి మరుగు చేయబడింది కాబట్టి ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో వారికి తెలియలేదు.
LUK 18:35 యేసు యెరికో పట్టణ సమీపంలో ఉన్నపుడు, ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు.
LUK 18:36 జనసమూహం వెళ్తుందని వాడు విని, “ఆ సందడేంటి?” అని అడిగాడు.
LUK 18:37 “నజరేతువాడైన యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని వారు జవాబిచ్చారు.
LUK 18:38 అందుకతడు బిగ్గరగా, “యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని కేకలు వేశాడు.
LUK 18:39 ఆ దారిలో వెళ్లేవారు వాన్ని గద్దించారు, నిశ్శబ్దంగా ఉండమని వానికి చెప్పారు. కాని వాడు, “దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు.
LUK 18:40 తర్వాత యేసు నిలబడి, వానిని తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు వానితో,
LUK 18:41 “నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు?” అని అడిగారు. “ప్రభువా, నాకు చూపు కావాలి!” అని వాడు అన్నాడు.
LUK 18:42 యేసు వానితో, “నీవు చూపును పొందుకో; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది!” అన్నారు.
LUK 18:43 వెంటనే వాడు చూపు పొందుకొని, దేవుని స్తుతిస్తూ యేసును వెంబడించాడు. ప్రజలందరు ఇది చూసి, వారు కూడా దేవునిని స్తుతించారు.
LUK 19:1 యేసు యెరికో పట్టణంలోనికి ప్రవేశించి దానిగుండా వెళ్తున్నారు.
LUK 19:2 అక్కడ జక్కయ్య అనే పేరు కలవాడు ఉన్నాడు, అతడు ప్రధాన పన్ను వసూలుదారుడు ధనవంతుడు.
LUK 19:3 అతడు యేసు ఎవరో చూడాలని ఆశించాడు, కాని అతడు పొట్టివాడు కాబట్టి జనసమూహం మధ్యలో ఉన్న యేసును చూడలేకపోయాడు.
LUK 19:4 కాబట్టి యేసు ఆ దారిలోనే వస్తున్నాడు, కాబట్టి అతడు పరుగెత్తి యేసును చూడాలని మేడి చెట్టు ఎక్కాడు.
LUK 19:5 యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ఆయన పైకి చూసి అతనితో, “జక్కయ్యా, వెంటనే క్రిందికి దిగు. నేను ఈ రోజు నీ ఇంట్లో ఉండాలి” అన్నారు.
LUK 19:6 అతడు వెంటనే క్రిందకు దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు.
LUK 19:7 ప్రజలందరు అది చూసి, “ఈయన ఒక పాపాత్ముని ఇంటికి అతిథిగా వెళ్లాడు” అని సణగడం మొదలుపెట్టారు.
LUK 19:8 కానీ జక్కయ్య నిలబడి ప్రభువుతో, “చూడు, ప్రభువా! నా ఆస్తిలో సగం బీదలకిస్తున్నాను, నేనెవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుని ఉంటే, వారికి నాలుగంతలు నేను చెల్లిస్తాను” అని చెప్పాడు.
LUK 19:9 అందుకు యేసు అతనితో, “ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే, కాబట్టి నేడు రక్షణ ఈ ఇంటికి వచ్చింది.
LUK 19:10 ఎందుకంటే మనుష్యకుమారుడు వచ్చిందే తప్పిపోయిన వాటిని వెదకి రక్షించడానికి.”
LUK 19:11 వారు ఈ మాటలు వింటూ ఉండగా, యేసు తాను యెరూషలేముకు దగ్గరగా ఉన్నందుకు, ప్రజలు దేవుని రాజ్యం అకస్మాత్తుగా వచ్చేస్తుందని భావిస్తున్నందుకు, ఆయన వారికి ఒక ఉపమానం చెప్పారు
LUK 19:12 “గొప్ప జన్మించిన వ్యక్తి సుదూర దేశానికి వెళ్లి తనను తాను రాజుగా నియమించుకొని తిరిగి వచ్చేయాలి.
LUK 19:13 అందుకతడు తన పదిమంది సేవకులను పిలిచి వారికి పది మినాలను ఇచ్చి, ‘నేను తిరిగి వచ్చేవరకు, వీటితో వ్యాపారం చేయండి’ అని వారితో చెప్పాడు.
LUK 19:14 “కాని ఆ పట్టణస్థులు అతన్ని ద్వేషించారు కాబట్టి, ‘ఇతడు మాకు రాజుగా వద్దు’ అనే సందేశాన్ని అతనికి పంపించారు.
LUK 19:15 “ఎలాగైతేనేం, అతడు రాజ్యాన్ని స్వాధీనపరచుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. తర్వాత అతడు తాను డబ్బు ఇచ్చిన సేవకులు దానితో ఏమి లాభం పొందారో తెలుసుకోవడానికి వారిని పిలిపించాడు.
LUK 19:16 “మొదటివాడు వచ్చి, ‘అయ్యా, నీవు ఇచ్చిన ఒక్క మినా పది మినాలను సంపాదించింది’ అని చెప్పాడు.
LUK 19:17 “ఆ యజమాని, ‘భళా, మంచి దాసుడా! నీవు, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, కాబట్టి పది పట్టణాల మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను’ అని వానితో చెప్పాడు.
LUK 19:18 “తర్వాత రెండవవాడు వచ్చి, ‘అయ్యా, నీవు ఇచ్చిన ఒక్క మినా అయిదు మినాలు సంపాదించింది’ అని చెప్పాడు.
LUK 19:19 “అతని యజమాని అతనితో, ‘నిన్ను అయిదు పట్టణాల మీద అధికారిగా నియమిస్తున్నాను’ అన్నాడు.
LUK 19:20 “అప్పుడు మరొకడు వచ్చి, ‘అయ్యా, నీవు పెట్టని చోట తీసుకునే, విత్తని చోట పంటను కోసే కఠినుడవని భయపడి, ఇదిగో నీవు ఇచ్చిన ఈ మినాను రుమాలులో దాచి పెట్టాను’ అన్నాడు.
LUK 19:22 “అందుకు ఆ యజమాని, ‘చెడ్డ దాసుడా, నీ నోటి మాటతోనే నీకు తీర్పు తీరుస్తాను! నేను పెట్టని చోట తీసుకొనేవాడినని, విత్తని చోట పంటను కోసేవాడినని, కఠినుడనని నీకు తెలుసు, అవునా?
LUK 19:23 అలాంటప్పుడు నీవు నా సొమ్మును, నేను తిరిగివచ్చిన తర్వాత, వడ్డీతో సహా తీసుకునేలా, వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు?’ అన్నాడు.
LUK 19:24 “ఆ తర్వాత ఆ యజమాని తన దగ్గర నిలిచిన వారితో, ‘వీని నుండి ఆ మినా తీసుకుని ఇప్పటికే పది మినాలు గలవానికి ఇవ్వండి’ అని చెప్పాడు.
LUK 19:25 “వారు, ‘అయ్యా, అతని దగ్గర ఇప్పటికే పది మినాలు ఉన్నాయి!’ అన్నారు.
LUK 19:26 “అందుకు ఆ యజమాని, ‘కలిగిన ప్రతివానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, లేనివాని నుండి, వానికి కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని మీతో చెప్తున్నాను’ అన్నాడు.
LUK 19:27 అతడు ఇంకా ఏమి చెప్పాడంటే, ‘అయితే నేను పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడకు తెచ్చి నా ముందు వారిని సంహరించండి’ అన్నాడు.”
LUK 19:28 యేసు ఈ మాటలను చెప్పి యెరూషలేముకు ప్రయాణమై వెళ్లారు.
LUK 19:29 ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే, బేతనియ గ్రామాల సమీపంలో ఉన్నప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ,
LUK 19:30 “మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి, దానిలో మీరు ప్రవేశించగానే, ఇంతవరకు ఎవ్వరూ ఎక్కని ఒక గాడిదపిల్ల కట్టబడి మీకు కనబడుతుంది. దానిని విప్పి ఇక్కడకు తీసుకురండి.
LUK 19:31 ‘మీరు ఎందుకు దాన్ని విప్పుతున్నారు?’ అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి.”
LUK 19:32 ఆయన పంపినవారు వెళ్లి, వారితో చెప్పినట్లే దానిని చూశారు
LUK 19:33 వారు ఆ గాడిద పిల్లను విప్పుతుంటే, దాని యజమానులు, “మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు.
LUK 19:34 అందుకు వారు, “ఇది ప్రభువుకు కావాలి” అని చెప్పారు.
LUK 19:35 వారు దానిని యేసు దగ్గరకు తీసుకువచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ వస్త్రాలను వేశారు, యేసు దానిపై కూర్చున్నారు.
LUK 19:36 ఆయన వెళ్తుంటే, ప్రజలు దారి పొడుగున తమ వస్త్రాలను పరిచారు.
LUK 19:37 ఒలీవల కొండ నుండి దిగే చోటికి ఆయన సమీపించినప్పుడు, శిష్యుల సమూహమంతా వారు చూసిన అద్భుతాలన్నిటిని బట్టి తమ స్వరాలతో బిగ్గరగా సంతోషంతో:
LUK 19:38 “ప్రభువు పేరట వచ్చే రాజు స్తుతింపబడును గాక!” “ఉన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ పరలోకంలో సమాధానం కలుగును గాక!” అని దేవుని స్తుతించారు.
LUK 19:39 ఆ జనసమూహంలో ఉన్న పరిసయ్యులు కొందరు యేసుతో, “బోధకుడా, నీ శిష్యులను గద్దించు!” అన్నారు.
LUK 19:40 ఆయన వారితో, “నేను చెప్తున్నాను, వీరు ఊరుకుంటే ఈ రాళ్లు కేకలు వేస్తాయి” అన్నాడు.
LUK 19:41 ఆయన యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు దానిని చూసి దాని గురించి ఏడుస్తూ,
LUK 19:42 “నీకు దేని ద్వార సమాధానం కలుగుతుందో నీవు తెలుసుకొని ఉంటే బాగుండేది, కాని ఇప్పుడది నీ కళ్ల నుండి దాచబడి ఉంది.
LUK 19:43 ప్రభువు నిన్ను దర్శించినప్పుడు నీవు గ్రహించుకోలేదు కాబట్టి నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా ఒక గట్టు కట్టి అన్ని వైపుల నిన్ను ముట్టడి వేసి అన్ని వైపుల నుండి నిన్ను అరికట్టి, నీ గోడల లోపల ఉన్న నీ పిల్లలతో పాటు నిన్ను భూమిలోకి నలిపి నీలో ఒక రాయి మీద ఇంకొక రాయి నిలబడకుండ చేసే దినాలు వస్తాయి” అని చెప్పారు.
LUK 19:45 యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి, అక్కడ అమ్ముకునే వారిని తరమడం ప్రారంభించారు.
LUK 19:46 “ ‘నా మందిరం ప్రార్థన మందిరం’ అని వ్రాయబడి ఉంది, కానీ మీరు దానిని ‘దొంగల గుహగా’ చేశారు” అని అన్నారు.
LUK 19:47 ఆయన ప్రతిరోజు దేవాలయంలో బోధిస్తూ ఉండేవారు. అయితే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రజానాయకులు ఆయనను చంపాలని ప్రయత్నించారు.
LUK 19:48 అయినా ప్రజలందరు ఆయన చెప్పే మాటలను వినాలని ఆయననే హత్తుకుని ఉన్నారు, కాబట్టి వారేమి చేయలేకపోయారు.
LUK 20:1 ఒకనాడు యేసు దేవాలయ ఆవరణంలో ప్రజలకు బోధిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉండగా, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, నాయకులతో కలసి ఆయన దగ్గరకు వచ్చారు.
LUK 20:2 వారు, “నీవు ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నావో మాకు చెప్పు, నీకు ఈ అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.
LUK 20:3 అందుకు యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను:
LUK 20:4 యోహానుకు ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా? లేదా మానవుల నుండి కలిగిందా?”
LUK 20:5 వారు తమలో తాము చర్చించుకొంటూ, “ఒకవేళ మనం ‘పరలోకం నుండి కలిగింది’ అని చెప్పితే ‘మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు?’
LUK 20:6 ఒకవేళ మనం, ‘మనుష్యుల వలన’ అని చెప్తే ప్రజలు రాళ్లతో కొడతారు, ఎందుకంటే వారికి యోహాను ఒక ప్రవక్త అని గట్టి నమ్మకం” అని అనుకున్నారు.
LUK 20:7 అందుకు వారు, “అది ఎక్కడ నుండి వచ్చిందో మాకు తెలియదు” అని జవాబిచ్చారు.
LUK 20:8 అందుకు యేసు, “నేను కూడా ఏ అధికారంతో వీటిని చేస్తున్నానో చెప్పను” అన్నారు.
LUK 20:9 ఆయన ప్రజల వైపు తిరిగి ఈ ఉపమానం చెప్పడం మొదలుపెట్టారు: “ఒక మనుష్యుడు ద్రాక్షతోటను నాటించి, దానిని కొందరు కౌలురైతులకు అద్దెకు ఇచ్చి, దూర దేశానికి వెళ్లి చాలా కాలం అక్కడే ఉన్నాడు.
LUK 20:10 కోతకాలం వచ్చినప్పుడు అతడు ఒక పనివానిని ఆ ద్రాక్షతోటకు వెళ్లి దానిలోని తన భాగం తెమ్మని ఆ రైతుల దగ్గరకు పంపాడు, కాని ఆ రైతులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు.
LUK 20:11 మళ్ళీ అతడు మరొక పనివానిని పంపించాడు. వారు వానిని కూడా కొట్టి అవమానపరచి, వట్టి చేతులతో పంపారు.
LUK 20:12 మళ్ళీ అతడు మూడవ వానిని పంపించాడు. వారు వానిని గాయపరచి బయటకు తోసివేసారు.
LUK 20:13 “అప్పుడా ద్రాక్షతోట యజమాని ‘నేనేమి చేయాలి? నేను ప్రేమించే నా కుమారున్ని పంపిస్తాను, వారు ఒకవేళ అతన్ని గౌరవిస్తారేమో’ అని అనుకున్నాడు.
LUK 20:14 “కాని ఆ కౌలు రైతులు అతన్ని చూసి, ‘ఇతడే వారసుడు, ఇతన్ని చంపుదాం, అప్పుడు ఈ వారసత్వం మనదైపోతుంది’ అని ఒకనితో ఒకరు చెప్పుకొని,
LUK 20:15 కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు. “అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు?
LUK 20:16 అతడు వచ్చి ఆ కౌలురైతులను చంపి తన ద్రాక్షతోటను ఇతరులకు అప్పగిస్తాడు” అని చెప్పారు. అది విన్న వారు, “అలా ఎన్నటికి కాకూడదు” అన్నారు.
LUK 20:17 యేసు సూటిగా వారిని చూసి, “అలాగైతే లేఖనాల్లో, “ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది’ అని వ్రాయబడిన మాటకు అర్థం ఏమిటి?
LUK 20:18 ఈ రాయి మీద పడిన ప్రతివారు ముక్కలైపోతారు, కాని ఎవరి మీద రాయి పడుతుందో వారు దాని క్రింద నలిగిపోతారు” అని చెప్పారు.
LUK 20:19 ఇది విన్న ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన తమ గురించే ఆయన ఈ ఉపమానం చెప్పారని గ్రహించి, ఎలాగైనా ఆయనను త్వరగా బంధించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. కాని ప్రజలకు భయపడ్డారు.
LUK 20:20 ఆయనపై నిఘా వేసి ఉంచడానికి, వారు యథార్థంగా ఉన్నట్లు నటించగల వేగులవారిని పంపారు. యేసు మాట్లాడే దాంట్లో ఏదో తప్పు పట్టి ఆయనను పట్టుకుని, ఆయనను అధిపతి యొక్క అధికారానికి, ప్రభావానికి అప్పగించవచ్చని వారు ఆశించారు.
LUK 20:21 అయితే ఆ వేగులవారు వచ్చి, “బోధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుతూ బోధిస్తావని మాకు తెలుసు. నీవు ఏ పక్షపాతం చూపకుండ, దేవుని మార్గాన్ని సత్యం ఆధారంగా బోధిస్తావు.
LUK 20:22 అయితే మనం కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా?” అని యేసును అడిగారు.
LUK 20:23 ఆయన వారి కుయుక్తిని ఎరిగి, వారితో,
LUK 20:24 “నాకు ఒక దేనారాన్ని చూపించండి, దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు. అందుకు వారు, “కైసరువి” అన్నారు.
LUK 20:25 అప్పుడు ఆయన, “అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు.
LUK 20:26 మాటల్లో చిక్కులు పెట్టాలని చూసినవారు ప్రజల ముందు ఆయన మాటలను తప్పు పట్టలేక ఆయన జవాబుకు ఆశ్చర్యపడి నిశ్శబ్దమై పోయారు.
LUK 20:27 పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు, యేసు దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు,
LUK 20:28 “బోధకుడా, పెళ్ళి చేసుకున్న ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని చనిపోయిన తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే మాకోసం వ్రాశాడు.
LUK 20:29 అయితే ఒక కుటుంబంలో ఏడుగురు సహోదరులు ఉన్నారు. మొదటివాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు.
LUK 20:30 రెండవవాడు,
LUK 20:31 అదే విధంగా మూడవవాడు కూడా ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, ఆ విధంగా ఏడుగురు సంతానం లేకుండానే చనిపోయారు.
LUK 20:32 చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది.
LUK 20:33 ఆమెను ఏడుగురు పెళ్ళి చేసుకున్నారు కాబట్టి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” అని అడిగారు.
LUK 20:34 అందుకు యేసు, “ఈ యుగానికి చెందినవారు పెళ్ళి చేసుకొంటారు, పెళ్ళికి ఇవ్వబడతారు గాని
LUK 20:35 మృతుల పునరుత్థానం పొంది రానున్న యుగానికి యోగ్యులుగా ఎంచబడేవారు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు.
LUK 20:36 వారు ఎన్నడు చావనే చావరు. దూతల్లా ఉంటారు. వారు పునరుత్థాన సంతానంగా దేవుని పిల్లలు అవుతారు.
LUK 20:37 అయితే మృతులు తిరిగి లేచే విషయం చెప్తూ ఇలా అన్నారు: మండుతున్న పొద సంఘటనలో మోషే, ‘అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు’ అని చెప్తూ మృతులు లేస్తారని సూచించాడు.
LUK 20:38 ఆయన దృష్టిలో అందరు జీవించే ఉన్నారు కాబట్టి ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు” అని వారికి జవాబిచ్చారు.
LUK 20:39 ధర్మశాస్త్ర ఉపదేశకులలో కొందరు, “బోధకుడా, నీవు చాలా బాగా చెప్పావు” అని అన్నారు.
LUK 20:40 ఆ తర్వాత ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు.
LUK 20:41 యేసు వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని ఎందుకు చెప్పబడింది?
LUK 20:42 దావీదే స్వయంగా కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాశాడు: “ ‘నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు
LUK 20:43 “నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’
LUK 20:44 దావీదే ఆయనను, ‘ప్రభువు’ అని పిలిచినప్పుడు ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?”
LUK 20:45 ప్రజలందరు వింటూ ఉండగా, యేసు తన శిష్యులతో,
LUK 20:46 “ధర్మశాస్త్ర ఉపదేశకులను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు పొడుగు అంగీలు వేసుకుని సంత వీధుల్లో తిరుగుతూ ప్రజల నుండి గౌరవం అందుకోవడానికి ఇష్టపడతారు. వారు సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను విందుల్లో గౌరవ స్థలాలను పొందాలని కోరుకుంటారు.
LUK 20:47 వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు” అని చెప్పారు.
LUK 21:1 దేవాలయ కానుక పెట్టెలో కానుకలను వేస్తున్న ధనవంతులను యేసు గమనించి చూస్తున్నారు.
LUK 21:2 అప్పుడు ఒక బీద విధవరాలు రెండు చిన్న కాసులు అందులో వేయడం చూసి యేసు, “నేను మీతో నిజంగా చెప్తున్న, అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది.
LUK 21:4 వీరందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కొంత వేశారు. కాని ఈమె తన పేదరికం నుండి తన జీవనాధారమంతా వేసింది” అని అన్నారు.
LUK 21:5 ఆయన శిష్యులలో కొందరు దేవాలయం అందమైన రాళ్లతో దేవునికి ఇచ్చిన అర్పణలతో అలంకరించబడి ఉందని మాట్లాడుకుంటున్నారు. కాని యేసు వారితో,
LUK 21:6 “ఇక్కడ మీరు వీటిని చూస్తున్నారు కదా, వీటిలో ఒక రాయి మీద ఇంకొక రాయి నిలబడకుండ పడవేయబడే రోజులు వస్తున్నాయి” అని చెప్పారు.
LUK 21:7 అందుకు వారు, “బోధకుడా, ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ నెరవేరడానికి ముందు సూచనలు ఏమైనా కనబడతాయా? మాకు చెప్పండి” అని ఆయనను అడిగారు.
LUK 21:8 అందుకు ఆయన, “మీరు మోసగించబడకుండ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే ఆయనను’ ‘సమయం సమీపించింది’ అని చెప్తారు. వారిని అనుసరించవద్దు.
LUK 21:9 మీరు యుద్ధాల గురించి, విప్లవాలను గురించి విన్నప్పుడు భయపడవద్దు. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం అప్పుడే రాదు.”
LUK 21:10 తర్వాత ఆయన వారితో: “జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి.
LUK 21:11 అక్కడక్కడ గొప్ప భూకంపాలు, కరువులు, తెగుళ్ళు వస్తాయి. ఆకాశంలో కూడ భయంకరమైన సంఘటనలు, గొప్ప సూచనలు కనిపిస్తాయి.
LUK 21:12 “ఇవన్నీ జరుగక ముందు, వారు మిమ్మల్ని బలవంతంగా పట్టుకుని హింసిస్తారు. వారు మిమ్మల్ని సమాజమందిరాలకు అప్పగిస్తారు మిమ్మల్ని చెరసాలలో వేస్తారు, నా నామాన్ని బట్టి మీరు రాజుల ఎదుటకు అధికారుల ఎదుటకు కొనిపోబడతారు.
LUK 21:13 మీరు నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు.
LUK 21:14 అయితే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో అని ముందుగానే చింతించకుండ ఉండేలా మీ మనస్సును సిద్ధపరచుకోండి.
LUK 21:15 ఎందుకంటే మీ విరోధులు ఎదిరించడానికి గాని, నిరాకరించడానికి గాని వీలుకాని మాటలను జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను.
LUK 21:16 మీ తల్లిదండ్రులు, సహోదరులు, సహోదరీలు, బంధువులు, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు, వారు మీలో కొందరిని చంపుతారు.
LUK 21:17 నన్ను బట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ద్వేషిస్తారు.
LUK 21:18 కాని మీ తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదు.
LUK 21:19 స్థిరంగా ఉండండి, అప్పుడు మీరు ప్రాణాలు కాపాడుకుంటారు.
LUK 21:20 “యెరూషలేము పట్టణాన్ని సైన్యాలు చుట్టుముట్టాయని మీరు చూసినప్పుడు దాని నాశనం సమీపించిందని మీరు తెలుసుకోండి.
LUK 21:21 అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు వెళ్లిపోవాలి, బయట పొలాల్లో ఉన్నవారు పట్టణంలోనికి వెళ్లకూడదు.
LUK 21:22 ఎందుకంటే లేఖనాల్లో వ్రాయబడి ఉన్న ప్రకారం దండన నెరవేరే సమయం ఇదే!
LUK 21:23 ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు పాలిచ్చే తల్లులకు శ్రమ! ఈ ప్రజల మీద దేవుని కోపం దిగి భూమి మీద బహు భయంకరమైన దురవస్థ కలుగుతుంది.
LUK 21:24 ఆ సమయంలో వారు ఖడ్గంచే హతం అవుతారు ఖైదీలుగా అన్ని రాజ్యాలకు అప్పగించబడతారు. యూదేతరుల పరిపాలన కాలం అంతా పూర్తయ్యే వరకు యూదేతరులు యెరూషలేము పట్టణాన్ని అణగద్రొక్కుతారు.
LUK 21:25 “ఇంకా సూర్య, చంద్ర, నక్షత్రాలలో సూచనలు, సముద్ర తరంగాల గర్జనలతో భూమి మీద ఉన్న దేశాలు వేదనతో కలవరంతో సతమతం అవుతాయి.
LUK 21:26 ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి కాబట్టి భూమిపైకి ఏమి రాబోతుందో అని ప్రజలు భయంతో దిగులుతో వణికిపోతారు.
LUK 21:27 అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావంతో గొప్ప మహిమతో మేఘాల మీద రావడం చూస్తారు.
LUK 21:28 ఇలా జరగటం మొదలైనప్పుడు మీకు విడుదల అతి సమీపంగా ఉందని గ్రహించి, ధైర్యంతో మీ తలలను పైకి లేవనెత్తండి” అని చెప్పారు.
LUK 21:29 ఆయన వారికి ఉపమానం చెప్పారు: “అంజూర చెట్టును ఇతర చెట్లను చూడండి.
LUK 21:30 అవి చిగిరిస్తున్నాయి అని చూసి, వేసవికాలం సమీపంగా ఉందని మీరు తెలుసుకుంటారు గదా!
LUK 21:31 అలాగే, ఇవన్నీ జరుగుతున్నాయని మీరు చూసినప్పుడు, దేవుని రాజ్యం చాలా దగ్గరలో ఉందని మీరు తెలుసుకోండి.
LUK 21:32 “ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను.
LUK 21:33 ఆకాశం భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏమాత్రం గతించవు.
LUK 21:34 “అకస్మాత్తుగా వలలో చిక్కినట్లు ఆ దినం మీ మీదికి వస్తుంది, అలా రాకుండా, తిని త్రాగి మత్తెక్కడం వలన జీవితంలోని ఆందోళనల వలన మీ హృదయాలు బరువెక్కకుండ జాగ్రత్తగా చూసుకోండి.
LUK 21:35 ఆ దినం భూమి మీద ఉన్న వారందరి మీదకు అకస్మాత్తుగా వస్తుంది.
LUK 21:36 కాబట్టి జరగబోయే వాటన్నిటి నుండి తప్పించుకుని, మనుష్యకుమారుని ముందు నిర్దోషిగా నిలబడగలిగేలా అన్ని సమయాల్లో మెలకువగా ఉండి ప్రార్థించండి” అని చెప్పారు.
LUK 21:37 ఆయన ప్రతిరోజు పగలు దేవాలయంలో బోధిస్తూ, రాత్రులు ఒలీవ కొండపై గడిపేవారు.
LUK 21:38 ప్రజలందరు ఆయన మాటలను వినడానికి వేకువనే దేవాలయానికి వచ్చేవారు.
LUK 22:1 పస్కా అనే పులియని రొట్టెల పండుగ సమీపించినప్పుడు,
LUK 22:2 ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసును ఎలా చంపించాలా అని అవకాశం కోసం చూస్తున్నారు, ఎందుకంటే వారు ప్రజలకు భయపడ్డారు.
LUK 22:3 అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు.
LUK 22:4 కాబట్టి వాడు ముఖ్య యాజకులతో దేవాలయ కావలివారి అధికారులతో కలిసి యేసును వారికి ఎలా అప్పగించబోతున్నాడో వారితో చర్చించుకున్నాడు.
LUK 22:5 వారు వాని మాటలకు సంతోషించి వానికి డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
LUK 22:6 వాడు దానికి అంగీకరించి, ప్రజల గుంపు ఆయనతో లేనప్పుడు యేసును వారికి అప్పగించడానికి అవకాశం కోసం ఎదురుచూశాడు.
LUK 22:7 పులియని రొట్టెల పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం వచ్చినప్పుడు,
LUK 22:8 యేసు పేతురు యోహానును పిలిచి, “మీరు వెళ్లి మనం పస్కాను భుజించడానికి సిద్ధం చేయండి” అని పంపారు.
LUK 22:9 కాబట్టి వారు, “మేము ఎక్కడ ఏర్పాటు చేయాలి?” అని అడిగారు.
LUK 22:10 అందుకు ఆయన, “మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు, నీళ్లకుండ ఎత్తుకుని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు కలుస్తాడు, అతడు ప్రవేశించే ఇంటి వరకు అతన్ని వెంబడించి,
LUK 22:11 ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి, అతిథుల గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడగమన్నాడు’ అని చెప్పండి.
LUK 22:12 అతడు అన్ని సదుపాయాలతో ఉన్న ఒక పెద్ద మేడగదిని మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని చెప్పారు.
LUK 22:13 వారు అక్కడికి వెళ్లి యేసు చెప్పినట్లుగా వాటిని కనుగొని పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు.
LUK 22:14 వారు పస్కా భుజించే సమయం వచ్చినపుడు, ఆయన తన అపొస్తలులతో భోజనబల్ల దగ్గర కూర్చున్నారు.
LUK 22:15 ఆయన వారితో, “నేను శ్రమను అనుభవించక ముందు ఈరీతిగా మీ అందరితో కలిసి ఈ పస్కా విందును భుజించాలని ఎంతో ఆశించాను.
LUK 22:16 ఎందుకంటే, ఇది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు, మరలా దీనిని నేను భుజించను అని మీకు చెప్తున్నాను” అన్నారు.
LUK 22:17 ఆయన గిన్నెను తీసుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, “ఇది తీసుకుని మీరందరు పంచుకోండి.
LUK 22:18 దేవుని రాజ్యం వచ్చేవరకు మళ్ళీ ఈ ద్రాక్షరసం త్రాగనని మీతో చెప్పుతున్నాను” అన్నారు.
LUK 22:19 ఆ తర్వాత ఆయన ఒక రొట్టెను పట్టుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, వారికిచ్చి, “ఇది మీ కోసం ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి” అని చెప్పారు.
LUK 22:20 అలాగే, భోజనమైన తర్వాత, ఆయన పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందించనున్న నా రక్తంలో క్రొత్త నిబంధన.
LUK 22:21 కాని నన్ను అప్పగించబోయే వాని చేయి నాతోకూడ ఈ బల్ల మీద ఉంది.
LUK 22:22 నిర్ణయం ప్రకారం మనుష్యకుమారుడు వెళ్లిపోతారు, కాని ఆయనను అప్పగించే వానికి శ్రమ!” అని అన్నారు.
LUK 22:23 అలా చేయబోయేది ఎవరు అని వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు.
LUK 22:24 అంతలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో పుట్టింది.
LUK 22:25 యేసు వారితో, “యూదేతరుల రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు; వారి మీద అధికారం చేసేవారు తమను తాము ఉపకారులుగా పిలుచుకుంటారు.
LUK 22:26 కానీ మీరు వారిలా ఉండవద్దు. దాని బదులు, మీలో గొప్పవాడు అందరిలో చిన్నవానిగా ఉండాలి, అధికారి దాసునిగా ఉండాలి.
LUK 22:27 అసలు గొప్పవాడు ఎవరు, భోజనబల్ల దగ్గర ఉన్నవాడా, లేదా సేవ చేసేవాడా? భోజనబల్ల దగ్గర ఉన్నవాడు కాదా? కానీ నేనైతే మీ మధ్య సేవ చేసేవానిలా ఉన్నాను.
LUK 22:28 మీరైతే నా శోధన సమయంలో నాతో నిలిచి ఉన్నవారు.
LUK 22:29 కాబట్టి నా తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించినట్టుగా, నా రాజ్యంలో మీరు నా భోజనబల్ల దగ్గర కూర్చుని అన్నపానాలను పుచ్చుకొంటూ, సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీర్చుటకు నేను మీకు నా రాజ్యాన్ని అనుగ్రహించాను.
LUK 22:31 “సీమోనూ, సీమోనూ, సాతాను గోధుమలను జల్లించినట్లు నిన్ను జల్లించాలని అడిగాడు.
LUK 22:32 కానీ నీ విశ్వాసం తప్పిపోకుండా ఉండాలని నేను నీకోసం ప్రార్థించాను. అయితే నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు” అని చెప్పారు.
LUK 22:33 కానీ పేతురు, “ప్రభువా, నీతో కూడ చెరలోనికే కాదు చావటానికైనా నేను సిద్ధమే” అన్నాడు.
LUK 22:34 అందుకు యేసు, “పేతురూ, ఈ రోజే కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో చెప్తున్నాను” అన్నారు.
LUK 22:35 ఇంకా ఆయన, “మీకు డబ్బు సంచి, సంచి, చెప్పులు లేకుండ నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైనదా?” అని వారిని అడిగారు. దానికి వారు, “ఏమి తక్కువ కాలేదు” అన్నారు.
LUK 22:36 అందుకు ఆయన వారితో, “అయితే ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర డబ్బు సంచి ఉంటే, దాన్ని తీసుకెళ్లాలి. ఒకవేళ మీ దగ్గర ఖడ్గం లేకపోతే, మీ పైవస్త్రాన్ని అమ్మి ఖడ్గాన్ని కొనుక్కోవాలి.
LUK 22:37 ‘ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు’ అని వ్రాయబడి ఉంది; నా విషయంలో ఇది నెరవేర్చబడాలి. అవును, నా గురించి వ్రాయబడినవి నెరవేరబోతున్నాయి” అని అన్నారు.
LUK 22:38 శిష్యులు, “ఇదిగో ప్రభువా, ఇక్కడ రెండు ఖడ్గాలు ఉన్నాయి” అన్నారు. ఆయన వారితో, “అవి చాలు!” అని జవాబిచ్చారు.
LUK 22:39 భోజనమైన తర్వాత ఆయన బయలుదేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్లారు, ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. వారు అక్కడ చేరిన తర్వాత, ఆయన వారితో, “మీరు శోధనలో పడిపోకుండా ఉండడానికి ప్రార్థన చేయండి” అని చెప్పారు.
LUK 22:41 అలా చెప్పి వారి నుండి ఒక రాయి విసిరేంత దూరం వెళ్లి, మోకరించి ఇలా ప్రార్థించారు:
LUK 22:42 “తండ్రీ, నీ చిత్తమైతే, ఈ గిన్నెను నా నుండి తీసివేయి, అయినా నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారమే చేయి.”
LUK 22:43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు.
LUK 22:44 ఆయన బహు వేదనతో, మరింత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేల మీద పడుతూ ఉంది.
LUK 22:45 ఆయన ప్రార్థనలో నుండి లేచి శిష్యుల దగ్గరకు తిరిగివచ్చి, వారు దుఃఖంతో అలసి, నిద్రిస్తున్నారని చూశారు
LUK 22:46 ఆయన వారితో, “మీరెందుకు నిద్రపోతున్నారు? శోధనలో పడిపోకుండా లేచి ప్రార్థన చేయండి” అని చెప్పారు.
LUK 22:47 ఆయన ఇంకా మాట్లాడుతుండగా, ప్రజలు గుంపుగా వచ్చారు, పన్నెండుగురిలో ఒకడైన యూదా అని పిలువబడే వాడు ముందుండి వారిని నడిపించాడు. వాడు యేసుని ముద్దు పెట్టుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చాడు.
LUK 22:48 అయితే యేసు వానితో, “యూదా, నీవు ముద్దుతో మనుష్యకుమారుని అప్పగిస్తున్నావా?” అని చెప్పారు.
LUK 22:49 యేసుతో ఉన్నవారు జరుగబోయేది గ్రహించి, “ప్రభువా, వారిని ఖడ్గంతో నరకమంటావా?” అని ఆయనను అడిగారు.
LUK 22:50 అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, వాని కుడి చెవిని నరికాడు.
LUK 22:51 అయితే యేసు, “అంతటితో ఆపండి!” అని చెప్పి, వాని చెవిని ముట్టి స్వస్థపరిచారు.
LUK 22:52 యేసు తనను పట్టుకోవడానికి వచ్చిన ముఖ్య యాజకులతో, దేవాలయ కావలివారి అధికారులతో యూదా నాయకులతో, “నన్ను పట్టుకోవడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా?
LUK 22:53 నేను ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో కూర్చుని బోధించేటప్పుడు నాపై ఒక చేయి కూడ వేయలేదు. అయినా ఇప్పుడు ఇది మీ సమయం, చీకటి పరిపాలిస్తున్న సమయం” అన్నారు.
LUK 22:54 వారు యేసును బంధించి, ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు పేతురు దూరం నుండి వారిని వెంబడించాడు.
LUK 22:55 అక్కడ కొందరు ప్రాంగణం మధ్యలో మంటలు వేసి, కలిసి కూర్చున్నప్పుడు, పేతురు వారితో కూర్చున్నాడు.
LUK 22:56 అప్పుడు ఆ మంట వెలుతురులో ఒక దాసియైన అమ్మాయి అతన్ని తేరి చూసి, “ఇతడు కూడా అతనితో ఉన్నవాడే” అన్నది.
LUK 22:57 పేతురు దానిని నిరాకరించి, “అమ్మాయి, అతడు ఎవరో నాకు తెలియదు” అన్నాడు.
LUK 22:58 కొంతసేపు తర్వాత ఇంకొకడు అతన్ని చూసి, “నీవు కూడా వారిలో ఒకడివి” అన్నాడు. పేతురు, “నేను కాదు!” అన్నాడు.
LUK 22:59 ఇంచుమించు ఒక గంట సమయం తర్వాత మరొకడు, “వీడు గలిలయుడే, నిజంగానే వీడు కూడా అతనితో ఉన్నవాడే” అన్నాడు.
LUK 22:60 అందుకు పేతురు, “నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అని చెప్తుండగానే కోడి కూసింది.
LUK 22:61 అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశారు అప్పుడు పేతురు, “కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు” అని ప్రభువు తనతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని,
LUK 22:62 బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.
LUK 22:63 యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు.
LUK 22:64 వారు ఆయన ముఖాన్ని కప్పి, “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు!” అన్నారు.
LUK 22:65 ఆయనను దూషిస్తూ అనేక మాటలు అన్నారు.
LUK 22:66 ఉదయం కాగానే ప్రజానాయకుల సభ, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు సమావేశమయ్యారు, యేసు వారి ముందు నడిపించబడ్డారు.
LUK 22:67 “నీవు క్రీస్తువైతే, మాతో చెప్పు” అన్నారు. అందుకు యేసు, “నేను మీతో చెప్పినా, మీరు నమ్మరు.
LUK 22:68 ఒకవేళ నేను మిమ్మల్ని అడిగినా, మీరు నాకు జవాబు చెప్పరు.
LUK 22:69 కానీ ఇప్పటినుండి మనుష్యకుమారుడు శక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుంటాడు” అని వారితో చెప్పారు.
LUK 22:70 అందుకు వారందరు, “నీవు దేవుని కుమారుడవా?” అని అడిగారు. అందుకు ఆయన, “అని మీరే అంటున్నారు” అని వారితో చెప్పారు.
LUK 22:71 అందుకు వారు, “మనకు ఇంకా సాక్ష్యం ఏం అవసరం? స్వయంగా ఇతడే తన నోటితో పలకడం విన్నాం” అన్నారు.
LUK 23:1 ఆ సభ వారందరు లేచి యేసును పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు.
LUK 23:2 వారు ఆయన మీద, “ఇతడు మన దేశాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాడని మేము తెలుసుకున్నాము. ఇతడు కైసరుకు పన్ను కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాడు నేనే రాజైన క్రీస్తును అని చెప్పుకుంటున్నాడు” అని నేరారోపణ చేయడం మొదలుపెట్టారు.
LUK 23:3 అందుకు పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. దానికి యేసు, “అని నీవే అన్నావు” అని జవాబిచ్చారు.
LUK 23:4 అందుకు అధిపతి పిలాతు, ముఖ్య యాజకులతో జనసమూహంతో, “ఇతనిలో నాకే దోషం కనిపించలేదు” అన్నాడు.
LUK 23:5 అయినా వారు పట్టుబట్టి, “ఇతడు తన బోధలతో గలిలయ నుండి యూదయ ప్రాంతమంతట ప్రజలను రెచ్చగొడుతూ, ఇక్కడి వరకు వచ్చాడు” అన్నారు.
LUK 23:6 ఇది విన్న పిలాతు, “ఈయన గలిలయుడా?” అని అడిగాడు.
LUK 23:7 యేసు హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రాంతానికి చెందినవాడని పిలాతుకు తెలిసినప్పుడు, ఆ రోజు యెరూషలేములోనే ఉన్న హేరోదు దగ్గరకు ఆయనను పంపించాడు.
LUK 23:8 హేరోదు చాలా కాలం నుండి యేసును చూడాలని ఆశపడ్డాడు, కాబట్టి ఆయనను చూడగానే అతడు చాలా సంతోషించాడు. యేసు గురించి తాను అనేక సంగతులను విన్నాడు కాబట్టి ఆయన ఏదైనా సూచకక్రియ చేస్తే చూడాలని ఆశించాడు.
LUK 23:9 హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కాని యేసు వాటికి జవాబివ్వలేదు.
LUK 23:10 ముఖ్య యాజకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు నిలబడి, ఆయన మీద తీవ్ర నేరారోపణ చేశారు.
LUK 23:11 హేరోదు అతని సైనికులు ఆయనను ఎగతాళి చేస్తూ అవమానపరిచారు, ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి, వారు ఆయనను మరల పిలాతు దగ్గరకు పంపించారు.
LUK 23:12 అంతకుముందు శత్రువులుగా ఉండిన హేరోదు పిలాతు ఆ రోజున స్నేహితులు అయ్యారు.
LUK 23:13 తర్వాత పిలాతు ముఖ్య యాజకులను, అధికారులను ప్రజలను పిలిపించి,
LUK 23:14 “ప్రజలను తిరుగుబాటు చేయిస్తున్నాడు అని మీరు ఈ మనుష్యుని నా దగ్గరకు తీసుకువచ్చారు. నేను మీ ముందే ఇతన్ని విచారించాను కానీ మీరు అతని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా ఇతనిలో నాకు కనబడలేదు.
LUK 23:15 హేరోదుకు కూడా అతనిలో ఏ నేరం కనబడలేదని మరలా నా దగ్గరకు పంపించాడు; ఇదిగో, ఈయన మరణానికి తగిన నేరమేమి చేయలేదు.
LUK 23:16 కాబట్టి నేను ఇతనికి శిక్షించి విడుదల చేస్తాను” అని వారితో చెప్పాడు.
LUK 23:17 పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి.
LUK 23:18 అయితే వారందరు, “ఇతన్ని చంపి! మాకు బరబ్బాను విడుదల చెయ్యండి!” అని కలిసికట్టుగా కేకలు వేశారు.
LUK 23:19 ఈ బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు చేసినందుకు హత్య చేసినందుకు చెరసాలలో పెట్టబడ్డాడు.
LUK 23:20 పిలాతు యేసును విడుదల చేయాలని, వారికి తిరిగి విజ్ఞప్తి చేశాడు.
LUK 23:21 కానీ వారు, “వీనిని సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
LUK 23:22 మూడవసారి అతడు వారితో, “ఎందుకు? ఈ మనిషి చేసిన నేరమేంటి? ఇతనికి మరణశిక్షను విధించదగిన నేరమేమి నాకు కనబడలేదు. కాబట్టి ఇతన్ని శిక్షించి వదిలేస్తాను” అని వారితో చెప్పాడు.
LUK 23:23 కాని వారు ఇంకా గట్టిగా కేకలువేస్తూ ఆయన సిలువవేయబడాలని పట్టుబట్టారు, చివరికి వారి కేకలే గెలిచాయి.
LUK 23:24 కాబట్టి పిలాతు వారు కోరినట్లే చేయడానికి నిర్ణయించాడు
LUK 23:25 వారు కోరుకున్న విధంగా తిరుగుబాటు హత్యానేరాలతో చెరసాలలో ఉన్న బరబ్బాను వారికి విడుదల చేసి, యేసును వారి ఇష్టానికి అప్పగించాడు.
LUK 23:26 వారు ఆయనను సిలువ వేయడానికి తీసుకుని వెళ్తుండగా, ప్రక్క గ్రామం నుండి వస్తున్న కురేనీయుడైన సీమోను అనే ఒకన్ని పట్టుకుని, యేసు వెనుక సిలువను మోయడానికి ఆ సిలువను అతని మీద పెట్టారు.
LUK 23:27 దుఃఖిస్తూ విలపిస్తున్న స్త్రీలతో పాటు పెద్ద జనసమూహం ఆయనను వెంబడించారు.
LUK 23:28 యేసు వారివైపు తిరిగి వారితో, “యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి; మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి.
LUK 23:29 ఎందుకంటే ఒక సమయం రాబోతుంది అప్పుడు మీరు, ‘గొడ్రాళ్లు, కనని గర్భాలు, పాలియ్యని స్తనాలు ధన్యం అని అంటారు.’
LUK 23:30 అప్పుడు వారు, “పర్వతాలతో ‘మామీద పడండి!’ అని కొండలతో, ‘మమ్మల్ని కప్పండి!’ అని అంటారు.
LUK 23:31 పచ్చగా ఉన్న చెట్టుకే వారు ఇలా చేస్తే, ఎండిన దానికి ఇంకా ఏమి చేస్తారు?” అని చెప్పారు.
LUK 23:32 ఆయనతో పాటు మరి ఇద్దరు నేరస్థులను కూడ చంపడానికి తీసుకువచ్చారు.
LUK 23:33 కపాలం అనే స్థలానికి వారు వచ్చినప్పుడు, ఆయనను నేరస్థులతో పాటు కుడి వైపున ఒకడు, ఎడమవైపున ఒకన్ని పెట్టి సిలువ వేశారు.
LUK 23:34 యేసు, “తండ్రీ, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి” అని చెప్పారు. వారు చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు.
LUK 23:35 ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు, అధికారులు కూడ, “వీడు ఇతరులను రక్షించాడు; వీడు నిజంగా దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అని అంటూ ఎగతాళి చేశారు.
LUK 23:36 అప్పుడు సైనికులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు చిరకాను పులిసిన ద్రాక్షరసం అందించి,
LUK 23:37 “నీవు యూదుల రాజువైతే, నిన్ను నీవే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు.
LUK 23:38 ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది: ఇతడు యూదుల రాజు.
LUK 23:39 వ్రేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయనను అవమానిస్తూ, “నీవు క్రీస్తువు కాదా? నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడ రక్షించు!” అని హేళన చేశాడు.
LUK 23:40 కానీ మరొక నేరస్థుడు వానిని గద్దించి, “నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు, నీవు దేవునికి భయపడవా?” అన్నాడు.
LUK 23:41 “మనం చేసిన తప్పులకు న్యాయంగానే శిక్షను అనుభవిస్తున్నాం కాని ఈయన ఏ తప్పు చేయలేదు” అన్నాడు.
LUK 23:42 ఆ తర్వాత ఆ నేరస్థుడు యేసును చూసి, “నీవు నీ రాజ్యంలోనికి వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు.
LUK 23:43 యేసు వానితో, “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉంటావని, నీతో నిశ్చయంగా చెప్తున్నాను” అన్నారు.
LUK 23:44 అప్పుడు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది.
LUK 23:45 సూర్యుడు కాంతినివ్వలేదు. దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది.
LUK 23:46 అప్పుడు యేసు, “తండ్రీ, మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను” అని గొప్ప శబ్దంతో కేక వేశారు. ఆయన ఈ మాట చెప్పి, తన ప్రాణం విడిచారు.
LUK 23:47 శతాధిపతి, జరిగింది చూసి, “నిజంగా ఈయన నీతిమంతుడు” అని చెప్పి దేవుని స్తుతించాడు.
LUK 23:48 ఈ దృశ్యాన్ని చూస్తూ అక్కడ ఉన్న ప్రజలందరు జరిగిందంతా చూసి, రొమ్ము కొట్టుకొంటూ తిరిగి వెళ్లిపోయారు.
LUK 23:49 ఆయనతో పరిచయం ఉన్నవారందరు, గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలతో సహా అందరు దూరంగా నిలబడి చూస్తున్నారు.
LUK 23:50 అరిమతయికు చెందిన యోసేపు యూదుల న్యాయసభలో సభ్యుడు, మంచివాడు నీతిపరుడు.
LUK 23:51 అతడు ఇతర న్యాయసభ సభ్యుల తీర్మానానికి గాని వారి చర్యకు గాని అంగీకరించకుండా దేవుని రాజ్యం కోసం కనిపెడుతూ ఉండినవాడు.
LUK 23:52 అతడు పిలాతు దగ్గరకు వెళ్లి, యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.
LUK 23:53 తర్వాత అతడు దాన్ని క్రిందకు దింపి, దానిని సన్నపు నారబట్టతో చుట్టి, అంతకుముందు ఎవరి శరీరాన్ని ఎప్పుడూ పెట్టని రాతితో చెక్కబడిన సమాధిలో పెట్టాడు.
LUK 23:54 అది సిద్ధపాటు దినం సబ్బాతు దినం మొదలుకాబోతుంది.
LUK 23:55 అప్పుడు గలిలయ నుండి యేసును వెంబడిస్తూ వచ్చిన స్త్రీలు అతని వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహాన్ని ఎలా పెట్టారో చూశారు.
LUK 23:56 తర్వాత వారు ఇంటికి వెళ్లి, సుగంధ ద్రవ్యాలను, పరిమళ తైలాలను సిద్ధం చేసుకున్నారు. కాని వారు ఆజ్ఞకు లోబడుతూ సబ్బాతు దినాన విశ్రాంతి తీసుకున్నారు.
LUK 24:1 వారం మొదటి రోజున తెల్లవారేటప్పుడు స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరకు వచ్చారు.
LUK 24:2 వారు సమాధి రాయి దొర్లించబడి ఉండడం చూశారు,
LUK 24:3 కాని వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, అక్కడ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు.
LUK 24:4 వారు ఈ విషయాన్ని గురించి కలవరపడుతూ ఉండగా, మిలమిల మెరుస్తున్న వస్త్రాలను ధరించిన ఇద్దరు మనుష్యులు వారి ప్రక్కన నిలబడి ఉండడం చూశారు
LUK 24:5 స్త్రీలు భయంతో తమ ముఖాలను నేలకు వంచుకొన్నారు కానీ ఆ పురుషులు వారితో, “మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెదకుతున్నారు?
LUK 24:6 ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచారు! ఆయన మీతో గలిలయలో ఉన్నప్పుడు మీతో ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి,
LUK 24:7 ‘మనుష్యకుమారుడిని పాపుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను సిలువ వేసి చంపుతారు, ఆయన మూడవ రోజున సజీవంగా లేస్తాడని’ చెప్పాడు కదా!” అని అన్నారు.
LUK 24:8 అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకం చేసుకున్నారు.
LUK 24:9 వారు సమాధి నుండి తిరిగివెళ్లి, ఈ సంగతులను పదకొండు మంది శిష్యులకు మిగిలిన వారందరికి చెప్పారు.
LUK 24:10 శిష్యులకు అపొస్తలులకు ఈ విషయాన్ని చెప్పింది వీరే: మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లియైన మరియ ఇంకా వారితో ఉన్న ఇతర స్త్రీలు.
LUK 24:11 ఈ స్త్రీలు చెప్పిన మాటలు వారికి వెర్రి మాటలుగా అనిపించాయి, కాబట్టి వారు నమ్మలేదు.
LUK 24:12 అయితే పేతురు లేచి, సమాధి దగ్గరకు పరుగెత్తికొని పోయి, వంగి, నారబట్టలు మాత్రమే పడి ఉండడం చూసి, సమాధిలో ఏమి జరిగిందో అని ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్లిపోయాడు.
LUK 24:13 అదే రోజున ఇద్దరు శిష్యులు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు.
LUK 24:14 వారు జరిగిన ఈ విషయాలన్నిటిని గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.
LUK 24:15 వారు అలా మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉన్నప్పుడు, యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడ నడిచారు;
LUK 24:16 కానీ వారు ఆయనను గుర్తించకుండా వారి కళ్లు మూయబడ్డాయి.
LUK 24:17 ఆయన వారిని, “మీరు నడుస్తూ మాట్లాడుకుంటున్న మాటలు ఏమిటి?” అని అడిగారు. అందుకు వారు దిగులు ముఖాలతో నిలబడిపోయారు.
LUK 24:18 వారిలో క్లెయొపా అనేవాడు, “గత కొద్ది దినాల్లో యెరూషలేములో జరిగిన సంగతుల గురించి తెలియని వ్యక్తివి నీ ఒక్కడివేనా?” అని అడిగాడు.
LUK 24:19 “ఏ విషయాలు?” అని ఆయన అడిగారు. అందుకు వారు, “నజరేయుడైన యేసును గురించి, ఆయన దేవుని ముందు ప్రజలందరి ముందు, మాటలోను కార్యాలలోను శక్తిగల ప్రవక్త.
LUK 24:20 మన ముఖ్య యాజకులు అధికారులు ఆయనను మరణశిక్షకు అప్పగించి, సిలువ వేయించారు;
LUK 24:21 కాని ఇశ్రాయేలు ప్రజలను విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షణ కలిగి ఉన్నాము. ఇంతకన్నా ఏముంది, ఇదంతా జరిగి నేటికీ మూడవ రోజు అవుతుంది.
LUK 24:22 దానికి తోడు, మాలో కొందరు స్త్రీలు మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. ఈ రోజు తెల్లవారగానే వారు సమాధి దగ్గరకు వెళ్లారు,
LUK 24:23 ఆయన దేహం అక్కడ కనబడలేదు. వారు తిరిగివచ్చి, దేవదూతలు తమకు కనబడి ‘ఆయన బ్రతికే ఉన్నాడు’ అని చెప్పినట్లు మాకు చెప్పారు.
LUK 24:24 మాతో కూడ ఉన్నవారిలో కొందరు సమాధి దగ్గరకు వెళ్లి, ఆ స్త్రీలు చెప్పినట్లే చూశారు, కానీ వారు యేసును చూడలేదు” అని ఆయనకు చెప్పారు.
LUK 24:25 అందుకాయన, “మీరు ఎంత అవివేకులు, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మలేని మందమతులుగా ఉన్నారు. క్రీస్తు ఈ శ్రమలు అనుభవించి తన మహిమలో ప్రవేశించకూడదా?” అని వారితో అన్నారు.
LUK 24:27 ఆయన మోషే మొదలుకొని ప్రవక్తలందరు లేఖనాల్లో తనను గురించి వ్రాసిన విషయాలను వారికి వివరించారు.
LUK 24:28 ఇంతలో వారు వెళ్లవలసిన గ్రామం సమీపించారు, అయితే యేసు ఇంకా ముందుకు వెళ్తున్నట్లు వారికి అనిపించింది.
LUK 24:29 అందుకని వారు, “ప్రొద్దు గ్రుంకి, సాయంకాలం కావచ్చింది, కాబట్టి మాతో కూడ ఉండండి” అని చెప్పి ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడ ఇంట్లోకి వెళ్లారు.
LUK 24:30 యేసు వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఆయన ఒక రొట్టెను తీసుకుని, కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి వారికి ఇవ్వడం మొదలుపెట్టారు.
LUK 24:31 అప్పుడు వారి కళ్లు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు, అయితే ఆయన వారికి కనబడకుండా పోయారు.
LUK 24:32 అప్పుడు వారు ఒకనితో ఒకడు, “ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనాలు వివరిస్తూ ఉంటే మన అంతరంగంలో మన హృదయాలు మండుతున్నట్లు అనిపించలేదా?” అని చెప్పుకొన్నారు.
LUK 24:33 వారు వెంటనే లేచి యెరూషలేముకు తిరిగి వెళ్లారు. అక్కడ పదకొండు మంది శిష్యులు వారితో ఉన్నవారందరు సమకూడి,
LUK 24:34 వారు, “అది నిజమే! ప్రభువు నిజంగానే లేచి సీమోనుకు కనిపించారు” అని మాట్లాడుకుంటున్నారు.
LUK 24:35 అప్పుడు ఆ ఇద్దరు దారిలో జరిగిన సంగతులను, యేసు రొట్టె విరిచేటప్పుడు ఆయనను ఎలా గుర్తించారో అని వారికి చెప్పారు.
LUK 24:36 వారు దాని గురించి ఇంకా మాట్లాడుకుంటుండగా, యేసు తానే వారి మధ్య నిలబడి, “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో అన్నారు.
LUK 24:37 తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు.
LUK 24:38 ఆయన వారితో, “మీరెందుకు కలవరపడుతున్నారు, మీ మనస్సుల్లో ఎందుకు సందేహాలు కలుగుతున్నాయి?
LUK 24:39 నా చేతులను నా పాదాలను చూడండి, ‘ఇది నేనే!’ నన్ను ముట్టుకొని చూడండి; నాకు ఉన్నట్లు, ఒక భూతానికి ఎముకలు మాంసం ఉండవు” అని చెప్పారు.
LUK 24:40 ఆయన ఇలా చెప్పి, తన చేతులను, తన పాదాలను వారికి చూపించారు.
LUK 24:41 అయితే వారు సంతోషాన్ని బట్టి ఆశ్చర్యాన్ని బట్టి ఇంకా నమ్మలేకుండా ఉన్నప్పుడు, ఆయన వారిని, “ఇక్కడ మీ దగ్గర ఏమైన తినడానికి ఉందా?” అని అడిగారు.
LUK 24:42 వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు.
LUK 24:43 ఆయన దానిని తీసుకుని వారి ముందే తిన్నారు.
LUK 24:44 తర్వాత ఆయన వారితో, “మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనల పుస్తకంలోను నన్ను గురించి వ్రాయబడినవి అన్ని నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను కదా!” అని అన్నారు.
LUK 24:45 అప్పుడు వారు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచారు.
LUK 24:46 ఆయన వారితో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు హింసించబడి మూడవ రోజున మరణం నుండి లేస్తారని,
LUK 24:47 యెరూషలేము మొదలుకొని అన్ని దేశాలకు యేసు పేరట పశ్చాత్తాపం పాపక్షమాపణ ప్రకటించబడుతుంది.
LUK 24:48 ఈ సంగతులన్నిటికి మీరే సాక్షులు.
LUK 24:49 నా తండ్రి వాగ్దానం చేసిన దానిని మీ దగ్గరకు పంపిస్తున్నాను కాబట్టి పైనుండి శక్తి మిమ్మల్ని కమ్ముకునే వరకు మీరు పట్టణంలోనే ఉండండి” అని వారితో చెప్పారు.
LUK 24:50 ఆయన బేతనియా ప్రాంతం వరకు వారిని తీసుకుని వెళ్లి, చేతులెత్తి వారిని ఆశీర్వదించారు.
LUK 24:51 వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు, ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణమయ్యారు.
LUK 24:52 వారు ఆయనను ఆరాధించి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
LUK 24:53 వారు దేవుని స్తుతిస్తూ, దేవాలయంలోనే మానక ఉన్నారు.
JOH 1:1 ఆదిలో వాక్యం ఉన్నది. ఆ వాక్యం దేవునితో ఉన్నది, ఆ వాక్యమే దేవుడు.
JOH 1:2 ఆయన ఆదిలో దేవునితో ఉన్నారు.
JOH 1:3 సృష్టిలో ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగాయి, కలిగింది ఏదీ ఆయన లేకుండా కలుగలేదు.
JOH 1:4 ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం మానవులందరికి వెలుగుగా ఉన్నది.
JOH 1:5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కాని, చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతుంది.
JOH 1:6 యోహాను అనే పేరుగల ఒక వ్యక్తి దేవుని దగ్గర నుండి పంపబడ్డాడు.
JOH 1:7 ప్రజలందరు తన ద్వారా ఆ వెలుగును నమ్మాలని ఆ వెలుగుకు సాక్షిగా అతడు వచ్చాడు.
JOH 1:8 అయితే అతడు ఆ వెలుగు కాదు కాని, ఆ వెలుగు గురించి సాక్ష్యం చెప్పడానికి మాత్రమే వచ్చాడు.
JOH 1:9 ప్రతి వ్యక్తికి వెలుగునిచ్చే నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వస్తూ ఉండేది.
JOH 1:10 ఆయన వలననే లోకం కలిగింది కాని, ఆయన లోకంలో ఉన్నపుడు లోకం ఆయనను గుర్తించలేదు.
JOH 1:11 ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చారు, కాని వారు ఆయనను అంగీకరించలేదు.
JOH 1:12 అయినా ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికి, అనగా తన పేరును నమ్మిన వారికందరికి దేవుని పిల్లలుగా అయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చారు.
JOH 1:13 ఈ పిల్లలు శరీర కోరికల వలన, మానవుల నిర్ణయాల వలన, భర్త కోరిక వలన పుట్టలేదు కాని దేవుని మూలంగా పుట్టారు.
JOH 1:14 ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాం, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.
JOH 1:15 యోహాను ఆయన గురించి సాక్ష్యం చెప్తూ, “నేను చెప్పిన వాడు ఈయనే, ‘నా తర్వాత వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు ఎందుకంటే ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు’ ” అని బిగ్గరగా కేక వేసి చెప్పాడు.
JOH 1:16 ఆయన సంపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి కృపను పొందాము.
JOH 1:17 ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది కాని కృప, సత్యం యేసు క్రీస్తు ద్వారా వచ్చాయి.
JOH 1:18 ఎవ్వరూ ఎన్నడును దేవుని చూడలేదు, కానీ తానే దేవుడై ఉండి, తండ్రితో అత్యంత సమీప సంబంధం కలిగి ఉన్న ఏకైక కుమారుడే ఆయనను మనకు తెలియపరిచారు.
JOH 1:19 యెరూషలేములోని యూదా అధికారులు అతడు ఎవరో తెలుసుకోవడానికి యాజకులను, లేవీయులను యోహాను దగ్గరకు పంపినప్పుడు అతడు వారికి ఇచ్చిన సాక్ష్యం ఇదే.
JOH 1:20 అతడు నాకు తెలియదు అని చెప్పకుండా “నేను క్రీస్తును కాను” అని ధైర్యంగా ఒప్పుకున్నాడు.
JOH 1:21 అప్పుడు వారు, “అయితే నీవెవరవు? నీవు ఏలీయావా?” అని అడిగారు. అతడు, “కాదు” అని చెప్పాడు. అయితే, “నీవు ప్రవక్తవా?” అని అడిగారు. అతడు, “కాదు” అని జవాబిచ్చాడు.
JOH 1:22 చివరికి వారు, “నీవెవరవు? మమ్మల్ని పంపినవారికి మేము సమాధానం చెప్పడానికి నీ గురించి నీవు ఏమి చెప్తావు?” అని అడిగారు.
JOH 1:23 అందుకు యోహాను, యెషయా ప్రవక్త చెప్పిన మాటలతో జవాబిచ్చాడు, “ ‘ప్రభువు కోసం మార్గాన్ని సరాళం చేయండి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న స్వరం నేనే’ ” అన్నాడు.
JOH 1:24 అప్పుడు పంపబడిన పరిసయ్యులు,
JOH 1:25 “నీవు క్రీస్తువు కాదు, ఏలీయావు కాదు, ప్రవక్తవు కాదు, అలాంటప్పుడు ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు?” అని అతన్ని ప్రశ్నించారు.
JOH 1:26 అందుకు యోహాను, “నేను నీటితో బాప్తిస్మమిస్తున్నాను, కాని మీ మధ్య నిలబడి ఉన్న వ్యక్తిని మీరు ఎరుగరు.
JOH 1:27 నా తర్వాత రానున్నవాడు ఆయనే. ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడ నేను యోగ్యున్ని కాదు” అని సమాధానం చెప్పాడు.
JOH 1:28 ఇదంతా యొర్దాను నదికి అవతల ఉన్న బేతనియ అనే ఊరిలో యోహాను బాప్తిస్మం ఇస్తున్న చోట జరిగింది.
JOH 1:29 మరుసటిరోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూసి, “చూడండి, లోక పాపాన్ని మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల!
JOH 1:30 ‘నా తర్వాత వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు ఎందుకంటే ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు’ అని నేను చెప్పింది ఈయన గురించే.
JOH 1:31 ఆయన ఎవరో నాకే తెలియదు, కాని ఆయనను ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయడానికి నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను” అన్నాడు.
JOH 1:32 అప్పుడు యోహాను ఇలా సాక్ష్యం ఇచ్చాడు: “పరలోకం నుండి ఆత్మ పావురంలా దిగి వచ్చి ఆయనపై నిలిచి ఉండడం నేను చూశాను.
JOH 1:33 అయితే నాకే ఆయన తెలియలేదు కానీ, ‘నీవు ఎవరి మీదకి ఆత్మ దిగి వచ్చి ఆయనపై నిలిచి ఉండడం చూస్తావో, ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడు’ అని నీళ్లతో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాతో చెప్పారు.
JOH 1:34 నేను చూశాను కాబట్టి ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నాను.”
JOH 1:35 మరుసటిరోజు యోహాను తన ఇద్దరి శిష్యులతో ఉన్నాడు.
JOH 1:36 అతడు నడచి వెళ్తున్న యేసు చూసి, “చూడండి, దేవుని గొర్రెపిల్ల!” అని చెప్పాడు.
JOH 1:37 అతడు చెప్పిన మాటలు విన్న ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించారు.
JOH 1:38 యేసు వెనుకకు తిరిగి, తనను వెంబడిస్తున్న వారిని చూసి, “మీకు ఏమి కావాలి?” అని అడిగారు. అందుకు వారు, “రబ్బీ, నీవు ఎక్కడ నివసిస్తున్నావు?” అని అడిగారు. రబ్బీ అనగా బోధకుడు అని అర్థము.
JOH 1:39 ఆయన, “వచ్చి చూడండి” అని చెప్పారు. కాబట్టి వారు వెళ్లి ఆయన ఉన్నచోటును చూసి, ఆ రోజంతా ఆయనతో గడిపారు. అప్పటికి సాయంకాలం సుమారు నాలుగు గంటలైంది.
JOH 1:40 యోహాను మాటలు విని యేసును వెంబడించిన ఇద్దరిలో ఒకడు అంద్రెయ అతడు సీమోను పేతురుకు సోదరుడు.
JOH 1:41 అంద్రెయ మొదట తన సహోదరుడైన సీమోనును కలిసి, “మేము క్రీస్తును కనుగొన్నాం” అని చెప్పి,
JOH 1:42 అతన్ని యేసు దగ్గరకు తీసుకువచ్చాడు. యేసు అతన్ని చూసి, “నీవు యోహాను కుమారుడవైన సీమోనువు. నీవు కేఫా అని పిలువబడతావు” అని చెప్పారు.
JOH 1:43 మరుసటిరోజు యేసు గలిలయకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఫిలిప్పును చూసి, “నన్ను వెంబడించు” అని చెప్పారు.
JOH 1:44 ఫిలిప్పు కూడా పేతురు, అంద్రెయల పట్టణమైన బేత్సయిదాకు చెందిన వాడు.
JOH 1:45 ఫిలిప్పు నతనయేలును చూసి అతనితో, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసారో ఆయనను మేము కనుగొన్నాము. ఆయనే యోసేపు కుమారుడైన, నజరేయుడైన యేసు” అని చెప్పాడు.
JOH 1:46 “నజరేతా! ఆ ఊరి నుండి మంచిది ఏదైనా రాగలదా?” అని నతనయేలు అడిగాడు. అందుకు ఫిలిప్పు, “వచ్చి చూడు” అన్నాడు.
JOH 1:47 నతనయేలు తన దగ్గరకు రావడం చూసిన యేసు, “ఇతడు ఏ కపటం లేని నిజమైన ఇశ్రాయేలీయుడు” అన్నారు.
JOH 1:48 అందుకు నతనయేలు, “నేను నీకెలా తెలుసు?” అని అడిగాడు. అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువకముందే నీవు ఆ అంజూర చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అని చెప్పారు.
JOH 1:49 అప్పుడు నతనయేలు, “రబ్బీ, నీవు దేవుని కుమారుడవు; నీవు ఇశ్రాయేలుకు రాజువు” అని సమాధానం ఇచ్చాడు.
JOH 1:50 అందుకు యేసు, “నీవు ఆ అంజూర చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూసానని చెప్పినందుకు నీవు నమ్మావు. దీని కంటే గొప్ప కార్యాలను నీవు చూస్తావు” అని అతనితో చెప్పారు.
JOH 1:51 తర్వాత యేసు, “ఆకాశం తెరువబడి, దేవదూతలు మనుష్యకుమారుని పైగా ఎక్కడం, దిగడం మీరు చూస్తారని నేను మీతో చెప్పేది నిజం” అన్నారు.
JOH 2:1 మూడవ రోజున గలిలయ ప్రాంతంలోని కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది.
JOH 2:2 యేసు, ఆయన శిష్యులు ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు.
JOH 2:3 అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు, యేసు తల్లి ఆయనతో, “ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది.
JOH 2:4 అందుకు యేసు, “అమ్మా, దాంతో మనకేంటి? నా సమయం ఇంకా రాలేదు” అన్నారు.
JOH 2:5 ఆయన తల్లి పరిచారకులతో, “ఆయన మీతో చెప్పేది చేయండి” అని చెప్పింది.
JOH 2:6 అక్కడ ఆరు రాతి నీటి బానలు ఉన్నాయి, యూదులు శుద్ధీకరణ ఆచారం కోసం వాటిని వాడుతారు. ఒక్కొక్క దానిలో వంద లీటర్ల నీళ్లు పడతాయి.
JOH 2:7 యేసు, “ఆ బానలను నీటితో నింపండి” అని చెప్పారు; కాబట్టి ఆ పనివారు వాటిని అంచుల వరకు నింపారు.
JOH 2:8 ఆయన వారితో, “ఇప్పుడు అందులో నుండి ముంచి తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి” అని చెప్పారు. వారు ఆ విధంగా చేసినప్పుడు,
JOH 2:9 ఆ విందు ప్రధాని ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని రుచి చూశాడు. ఆ నీటిని తెచ్చిన పనివారికి తప్ప అది ఎక్కడ నుండి వచ్చిందో అతనికి తెలియలేదు. కాబట్టి అతడు పెండ్లికుమారుని ప్రక్కకు పిలిచి,
JOH 2:10 “అందరు మొదట మంచి ద్రాక్షరసాన్ని పోసి, అతిథులు త్రాగలేని స్థితిలో ఉన్నప్పుడు చౌక ద్రాక్షరసాన్ని పోస్తారు, కాని నీవైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసాన్నే ఉంచావు” అన్నాడు.
JOH 2:11 గలిలయ ప్రాంతపు కానాలో యేసు ఈ మొదటి అద్భుతం చేసి తన మహిమను తెలియజేశారు. దీని వలన ఆయన శిష్యులు ఆయనను నమ్మారు.
JOH 2:12 దీని తర్వాత యేసు తన తల్లి, తన సహోదరులు, తన శిష్యులతో కలిసి కపెర్నహూముకు వెళ్లారు. వారు కొన్ని రోజులు అక్కడ ఉన్నారు.
JOH 2:13 యూదుల పస్కా పండుగ దగ్గర పడినప్పుడు యేసు యెరూషలేముకు వెళ్లారు.
JOH 2:14 దేవాలయ ఆవరణంలో కొందరు ఎడ్లను, గొర్రెలను, పావురాలను అమ్మడం, మరికొందరు పరదేశి డబ్బులు మార్చే బల్లల దగ్గర కూర్చుని ఉండడం ఆయన చూశారు.
JOH 2:15 ఆయన త్రాళ్లతో ఒక కొరడాను చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటిని దేవాలయ ఆవరణంలో నుండి బయటకు తోలివేసి, డబ్బు మార్చే వారి నాణాలను చెల్లాచెదురు చేసి వారి బల్లలను పడవేశారు.
JOH 2:16 పావురాలను అమ్మేవారితో, “వీటిని ఇక్కడినుండి తీసివేయండి! నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చడం మానేయండి!” అన్నారు.
JOH 2:17 “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినేస్తుంది” అని వ్రాయబడి ఉన్నదని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు.
JOH 2:18 అప్పుడు యూదులు, “ఇదంతా చేయడానికి నీకు అధికారం ఉన్నదని నిరూపించడానికి మాకు ఏ సూచనను చూపిస్తావు?” అని ఆయనను అడిగారు.
JOH 2:19 యేసు, “ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను మూడు రోజుల్లో దానిని తిరిగి లేపుతాను” అని వారికి జవాబిచ్చారు.
JOH 2:20 దానికి వారు, “ఈ దేవాలయాన్ని కట్టడానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు మూడు దినాల్లో దానిని తిరిగి లేపుతావా?” అని అడిగారు.
JOH 2:21 అయితే ఆయన తన శరీరమనే దేవాలయం గురించి చెప్పారు.
JOH 2:22 ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత, ఆయన శిష్యులు ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. వారు లేఖనాలను, యేసు చెప్పిన మాటలను నమ్మారు.
JOH 2:23 పస్కా పండుగ సమయంలో ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను చూసిన చాలామంది ఆయన పేరును నమ్మారు.
JOH 2:24 అయితే యేసుకు ప్రజలందరి గురించి తెలుసు కాబట్టి, ఆయన తనను తాను వారికి అప్పగించుకోలేదు.
JOH 2:25 ప్రతి ఒక్కరి అంతరంగం ఏమిటో ఆయనకు తెలుసు, కాబట్టి మానవుల గురించి ఎవరూ ఆయనకు సాక్ష్యమిచ్చే అవసరం లేదు.
JOH 3:1 యూదుల న్యాయసభ సభ్యుడైన నీకొదేము అనేవాడు పరిసయ్యులలో ఉన్నాడు.
JOH 3:2 అతడు రాత్రివేళ యేసు దగ్గరకు వచ్చి, “రబ్బీ, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని మాకు తెలుసు. ఎందుకంటే దేవుడు తోడు లేకపోతే నీవు చేసే అద్భుత కార్యాలను ఎవరు చేయలేరు” అన్నాడు.
JOH 3:3 అందుకు యేసు, “ఒకరు తిరిగి జన్మించాలి లేకపోతే వారు దేవుని రాజ్యాన్ని చూడలేరని నేను మీతో చెప్పేది నిజమే” అని అన్నారు.
JOH 3:4 అప్పుడు నీకొదేము, “ఒకడు పెరిగి పెద్దవాడైన తర్వాత తిరిగి ఎలా జన్మించగలడు? అతడు రెండవసారి తన తల్లి గర్భంలోనికి ప్రవేశించి జన్మించలేడు కదా!” అన్నాడు.
JOH 3:5 అందుకు యేసు, “ఒకరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరని నేను మీతో చెప్పేది నిజమే.
JOH 3:6 శరీరం నుండి జన్మించేది శరీరం, ఆత్మ నుండి జన్మించేది ఆత్మ.
JOH 3:7 ‘నీవు తిరిగి జన్మించాలి’ అని నేను చెప్పినందుకు నీవు ఆశ్చర్యపడవద్దు.
JOH 3:8 గాలి తనకు ఇష్టమైన చోట వీస్తుంది, దాని శబ్దం వినగలవు కానీ అది ఎక్కడ నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో చెప్పలేవు. అలాగే ఆత్మ మూలంగా జన్మించినవారు కూడా అంతే” అన్నారు.
JOH 3:9 దానికి నీకొదేము, “అది ఎలా సాధ్యం?” అని అడిగాడు.
JOH 3:10 అందుకు యేసు, “నీవు ఇశ్రాయేలీయుల బోధకుడివి, అయినా ఈ విషయాలను నీవు గ్రహించలేదా?”
JOH 3:11 మాకు తెలిసిన వాటిని గురించి మేము మాట్లాడుతున్నాం, మేము చూసినవాటిని గురించి సాక్ష్యం ఇస్తున్నాము. అయినా మీరు మా సాక్ష్యాన్ని అంగీకరించడం లేదని నేను మీతో చెప్పేది నిజమే.
JOH 3:12 నేను భూలోక విషయాలను చెప్పినప్పుడే మీరు నమ్మడం లేదు మరి పరలోక విషయాలను చెప్పితే ఎలా నమ్ముతారు?
JOH 3:13 పరలోకం నుండి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప మరి ఎవరూ పరలోకానికి వెళ్లలేదు.
JOH 3:14 ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందేలా, అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తిన విధంగా మనుష్యకుమారుడు ఎత్తబడాలి.
JOH 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయనలో విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుని అనుగ్రహించారు.
JOH 3:17 దేవుడు తన కుమారుని ఈ లోకానికి తీర్పు తీర్చుటకు పంపలేదు కానీ, ఆయన ద్వారా లోకాన్ని రక్షించడానికే పంపారు.
JOH 3:18 ఆయనలో నమ్మిక ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు, కాని నమ్మనివారు దేవుని ఏకైక కుమారుని పేరులో నమ్మకముంచలేదు కాబట్టి వారికి ఇంతకుముందే శిక్ష విధించబడింది.
JOH 3:19 ఆ తీర్పు ఏమిటంటే: లోకంలోనికి వెలుగు వచ్చింది, కానీ ప్రజలు తమ దుష్ట కార్యాలను బట్టి వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమించారు.
JOH 3:20 చెడ్డపనులు చేసే ప్రతి ఒక్కరు వెలుగును ద్వేషిస్తారు. వారు తమ చెడుపనులు బయటపడతాయనే భయంతో వెలుగులోనికి రారు.
JOH 3:21 “అయితే సత్యాన్ని అనుసరించి జీవించేవారు తాము చేసినవి దేవుని దృష్టి ఎదుట చేసినవి కాబట్టి అవి స్పష్టంగా కనబడేలా వెలుగులోనికి వస్తారు” అని చెప్పారు.
JOH 3:22 దాని తర్వాత, యేసు తన శిష్యులతో కలిసి యూదయ ప్రాంతానికి వెళ్లి అక్కడ వారితో కొంతకాలం గడిపి బాప్తిస్మమిస్తూ ఉన్నారు.
JOH 3:23 సలీము దగ్గర ఉన్న ఐనోను అనే స్థలంలో నీరు సమృద్ధిగా ఉండేది కాబట్టి యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చేవాడు. ప్రజలు వచ్చి బాప్తిస్మాన్ని పొందేవారు.
JOH 3:24 ఇదంతా యోహాను చెరసాలలో వేయబడక ముందు.
JOH 3:25 ఒక రోజు శుద్ధీకరణ ఆచారం గురించి యోహాను శిష్యులలో కొందరికి ఒక యూదునితో వివాదం ఏర్పడింది.
JOH 3:26 వారు యోహాను దగ్గరకు వచ్చి అతనితో, “రబ్బీ, యొర్దాను నదికి అవతల నీతో పాటు ఉన్నవాడు, నీవు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చావో, అతడు కూడా బాప్తిస్మమిస్తున్నాడు. అందరు అతని దగ్గరకు వెళ్తున్నారు” అని చెప్పారు.
JOH 3:27 అందుకు యోహాను ఇలా అన్నాడు, “పరలోకం నుండి వారికి ఇవ్వబడితేనే గాని ఎవరు దేనిని పొందలేరు.
JOH 3:28 ‘నేను క్రీస్తును కాను, నేను ఆయన కంటే ముందుగా పంపబడిన వాడను’ అని నేను చెప్పిన మాటలకు మీరే సాక్షులు.
JOH 3:29 పెండ్లికుమార్తె పెండ్లికుమారునికే చెందుతుంది. పెండ్లికుమారుని దగ్గర ఉండి చూసుకునే స్నేహితుడు అతడు ఏమైనా చెబితే వినాలని ఎదురుచూస్తాడు. పెండ్లికుమారుని స్వరాన్ని విన్నప్పుడు అతడు ఎంతో సంతోషిస్తాడు. నా సంతోషం కూడా అలాంటిదే, ఇప్పుడు అది సంపూర్ణమయ్యింది.
JOH 3:30 ఆయన హెచ్చింపబడాలి; నేను తగ్గించబడాలి.”
JOH 3:31 పైనుండి వచ్చినవాడు అందరికంటే పైనున్నవాడు, భూమి నుండి వచ్చినవాడు భూలోకానికి చెందిన వాడు, భూలోక సంబంధిగానే మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికంటే పైనున్నవాడు.
JOH 3:32 ఆయన తాను చూసినవాటిని, వినిన వాటిని గురించి సాక్ష్యం ఇస్తారు, కానీ ఎవరు ఆయన సాక్ష్యాన్ని అంగీకరించరు.
JOH 3:33 ఆయన సాక్ష్యాన్ని అంగీకరించేవారు దేవుడు సత్యవంతుడని ధ్రువీకరిస్తారు.
JOH 3:34 ఎందుకంటే దేవుడు పరిమితి లేకుండా ఆత్మను అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుడు పంపినవాడు దేవుని మాటలనే మాట్లాడతాడు.
JOH 3:35 తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి సమస్తం ఆయన చేతులకు అప్పగించారు.
JOH 3:36 కుమారునిలో నమ్మకం ఉంచే వారికి నిత్యజీవం కలుగుతుంది, అయితే కుమారుని తృణీకరించినవాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది కాబట్టి వాడు జీవాన్ని చూడడు.
JOH 4:1 యోహాను కంటే యేసు ఎక్కువమందిని శిష్యులుగా చేసుకుని బాప్తిస్మం ఇస్తున్నట్లు పరిసయ్యులు విన్నారని యేసుకు తెలిసింది.
JOH 4:2 నిజానికి బాప్తిస్మం ఇచ్చింది యేసు కాదు ఆయన శిష్యులు ఇస్తున్నారు.
JOH 4:3 కాబట్టి ఆయన యూదయ ప్రాంతాన్ని విడిచి మరొకసారి గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్లారు.
JOH 4:4 ఆయన సమరయ ప్రాంతం గుండా వెళ్లవలసివచ్చింది.
JOH 4:5 కాబట్టి యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరగా ఉన్న సమరయలోని సుఖారనే ఊరికి ఆయన వచ్చారు.
JOH 4:6 అక్కడ యాకోబు బావి ఉంది. యేసు ప్రయాణం చేసి అలసిపోయి ఆ బావి ప్రక్క కూర్చున్నారు. అది మిట్టమధ్యాహ్న సమయము.
JOH 4:7 ఒక సమరయ స్త్రీ నీరు తోడుకోడానికి అక్కడికి వచ్చినప్పుడు యేసు ఆమెతో, “నాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వగలవా?” అని అడిగారు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్లారు.
JOH 4:9 ఆ సమరయ స్త్రీ ఆయనతో, “నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. నీవు నన్ను త్రాగడానికి ఇవ్వమని ఎలా అడుగుతావు?” అన్నది. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసం చేయరు.
JOH 4:10 యేసు, “నీవు దేవుని బహుమానం గురించి, నిన్ను నీళ్లు అడుగుతున్న వ్యక్తి గురించి తెలుసుకుంటే నీవే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడు” అని ఆమెకు జవాబిచ్చారు.
JOH 4:11 అందుకు ఆమె, “అయ్యా, ఈ బావి చాలా లోతైనది. పైగా నీళ్లు తోడుకోడానికి నీ దగ్గర ఏమి లేదు. మరి ఆ జీవజలం నీకు ఎక్కడ దొరుకుతుంది?
JOH 4:12 మా పితరుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు. ఈ బావి నీళ్లను అతడు, అతని కుమారులు త్రాగారు; అతని పశువులు కూడా త్రాగాయి. నీవు అతనికంటే గొప్పవాడివా?” అని అడిగింది.
JOH 4:13 అందుకు యేసు, “ఈ నీళ్లు త్రాగిన వారందరికి మళ్ళీ దాహం వేస్తుంది.
JOH 4:14 కానీ నేనిచ్చే నీళ్లు త్రాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నిజానికి, నేనిచ్చే నీళ్లు వారిలో నిత్యజీవానికి నీటి ఊటగా ఉంటుంది” అన్నారు.
JOH 4:15 ఆ స్త్రీ ఆయనతో, “అయ్యా, నాకు దాహం వేయకుండా, నీళ్లు చేదుకోడానికి ఇంత దూరం రానవసరం లేకుండ ఆ నీటిని నాకు ఇవ్వండి” అన్నది.
JOH 4:16 ఆయన ఆమెతో, “వెళ్లి, నీ భర్తను పిలుచుకొనిరా” అని చెప్పారు.
JOH 4:17 అందుకు ఆమె, “నాకు భర్త లేడు” అన్నది. యేసు ఆమెతో, “నీకు భర్త లేడని నీవు చెప్పింది వాస్తవమే.
JOH 4:18 నిజానికి, నీకు అయిదుగురు భర్తలు ఉండేవారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. నీవు సత్యమే చెప్పావు” అన్నారు.
JOH 4:19 అప్పుడు ఆ స్త్రీ, “అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను.
JOH 4:20 మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ యూదులైన మీరు ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని అంటారు” అన్నది.
JOH 4:21 అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా, నన్ను నమ్ము. ఒక సమయం వస్తుంది అప్పుడు మీరు తండ్రిని ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని ఆరాధించరు.
JOH 4:22 సమరయులైన మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు; మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం, ఎందుకంటే రక్షణ యూదులలో నుండే వస్తుంది.
JOH 4:23 అయినా నిజమైన ఆరాధికులు పరలోక తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఒక సమయం వస్తుంది. అది ఇప్పటికే వచ్చేసింది. ఎందుకంటే అలాంటి ఆరాధికుల కోసమే తండ్రి చూస్తున్నారు.
JOH 4:24 దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి” అని చెప్పారు.
JOH 4:25 అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు వస్తాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలను మాకు వివరిస్తాడు” అని అన్నది.
JOH 4:26 అప్పుడు యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అని చెప్పారు.
JOH 4:27 ఇంతలో ఆయన శిష్యులు అక్కడికి వచ్చి యేసు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ, “నీకు ఏమి కావాలి? అని గాని, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?” అని గాని ఎవరు అడగలేదు.
JOH 4:28 అప్పుడు ఆ స్త్రీ తన నీటి కుండను అక్కడే వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్లి ప్రజలతో,
JOH 4:29 “రండి, నేను చేసిందంతా నాతో చెప్పిన ఆయనను చూడండి, ఈయనే క్రీస్తు కాడా?” అని చెప్పింది.
JOH 4:30 వారు ఊరి నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.
JOH 4:31 ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ, కొంచెం తినండి” అని ఆయనను వేడుకున్నారు.
JOH 4:32 అయితే ఆయన, “తినడానికి మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది” అని వారితో చెప్పారు.
JOH 4:33 అందుకు శిష్యులు ఒకరితో ఒకరు, “ఎవరైనా ఈయనకు ఆహారం తెచ్చారేమో?” అని చెప్పుకున్నారు.
JOH 4:34 యేసు వారితో, “నన్ను పంపినవాని చిత్తప్రకారం చేసి ఆయన పనిని ముగించడమే నా ఆహారము.
JOH 4:35 ‘కోతకు రావడానికి ఇంకా నాలుగు నెలలు ఉంది’ అని మీరు చెప్పుతారు కదా! నేను మీతో చెప్పేది ఏంటంటే, కళ్లు తెరిచి పొలాలను చూడండి! పంట పండి కోతకు సిద్ధంగా ఉంది.
JOH 4:36 విత్తినవాడు కోసేవాడు ఇద్దరూ సంతోషించేలా, పంటను కోసేవాడు తన జీతం తీసుకుని పంట అంతా కోసి నిత్యజీవం కోసం కూర్చుకుంటాడు.
JOH 4:37 ఈ విషయంలో ‘విత్తువాడు ఒకడు, కోసేవాడు మరొకడు’ అనే సామెత నిజమే.
JOH 4:38 మీరు పని చేయని పొలంలో పంటను కోయడానికి నేను మిమ్మల్ని పంపించాను. అక్కడ ఇతరులు కష్టపడి పని చేశారు. వారి కష్ట ఫలాన్ని మీరు కోసుకొని అనుభవిస్తున్నారు” అన్నారు.
JOH 4:39 ఆ ఊరిలోని సమరయులలో అనేకమంది, “నేను చేసిందంతా నాతో చెప్పారు” అని ఆ స్త్రీ ఆయనను గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయనను నమ్మారు.
JOH 4:40 ఆ సమరయులు ఆయన దగ్గరకు వచ్చి తమతో ఉండమని వేడుకున్నప్పుడు ఆయన అక్కడ రెండు రోజులు ఉన్నారు.
JOH 4:41 ఆయన మాటలు విని ఇంకా చాలామంది విశ్వాసులయ్యారు.
JOH 4:42 వారు ఆ స్త్రీతో, “నీవు చెప్పిన దానిని బట్టి కాదు; కాని మాకు మేమే విని నిజంగా ఈయన లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నాం” అన్నారు.
JOH 4:43 రెండు రోజుల తర్వాత ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్లారు.
JOH 4:44 ఒక ప్రవక్త తన స్వదేశంలో గౌరవం పొందడని యేసే స్వయంగా సాక్ష్యమిచ్చారు.
JOH 4:45 ఆయన గలిలయకు చేరగానే గలిలయులు ఆయనను ఆహ్వానించారు. పస్కా పండుగ సమయంలో వారందరు అక్కడే ఉన్నారు కాబట్టి యెరూషలేములో ఆయన చేసిన కార్యాలన్నిటిని వారు చూశారు.
JOH 4:46 ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన గలిలయలోని కానాకు మరలా వచ్చారు. కపెర్నహూములో ఒక రాజ్యాధికారి కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు.
JOH 4:47 యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చాడని ఆ రాజ్యాధికారి విని ఆయన దగ్గరకు వెళ్లి, చనిపోతున్న తన కుమారుని స్వస్థపరచుమని బ్రతిమాలుకున్నాడు.
JOH 4:48 యేసు అతనితో, “మీరు అద్భుతకార్యాలు, మహత్కార్యాలను చూస్తేనే తప్ప నమ్మరు” అన్నారు.
JOH 4:49 ఆ రాజ్యాధికారి, “అయ్యా, నా బిడ్డ చనిపోకముందే దయచేసి రండి” అని వేడుకున్నాడు.
JOH 4:50 యేసు, “వెళ్లు, నీ కుమారుడు బ్రతుకుతాడు” అని చెప్పారు. యేసు మాటను నమ్మి అతడు వెళ్లిపోయాడు.
JOH 4:51 అతడు ఇంకా దారిలో ఉండగానే, అతని పనివారు అతన్ని కలిసి అతని కుమారుడు బాగయ్యాడని చెప్పారు.
JOH 4:52 అతడు తన కుమారుడు ఏ సమయంలో బాగుపడ్డాడని వారిని అడిగినప్పుడు, “నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు అతని జ్వరం తగ్గిపోయింది” అని వారు చెప్పారు.
JOH 4:53 అప్పుడు ఆ తండ్రి యేసు తనతో, “నీ కుమారుడు బ్రతుకుతాడు” అని సరిగ్గా అదే సమయంలో చెప్పారని గ్రహించి అతడు, అతని ఇంటివారందరు నమ్మారు.
JOH 4:54 యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చిన తర్వాత ఆయన చేసిన రెండవ సూచకక్రియ ఇది.
JOH 5:1 కొంతకాలం తర్వాత యూదుల పండుగకు యేసు యెరూషలేముకు వెళ్లారు.
JOH 5:2 యెరూషలేములోని గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్ద అనబడే ఒక కోనేరు ఉంది. దాని చుట్టూ అయిదు మండపాలు ఉన్నాయి.
JOH 5:3 ఇక్కడ గ్రుడ్డివారు, కుంటివారు, పక్షవాతం కలవారు, అనేక రకాల రోగాలు కలిగినవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు.
JOH 5:4 ఎప్పటికప్పుడు ఒక దేవదూత వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించేవాడు. నీరు కదిలిన ప్రతిసారి ఆ కోనేటిలోనికి ఎవరు మొదట దిగితే వారికి ఏ రోగం ఉన్నా దాని నుండి బాగుపడేవారు. కాబట్టి అక్కడున్నవారు ఆ నీరు ఎప్పుడు కదులుతుందా అని ఎదురు చూసేవారు.
JOH 5:5 ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కదల్లేని స్థితిలో ఉన్న ఒక రోగి అక్కడ ఉన్నాడు.
JOH 5:6 చాలాకాలంగా అతడు అదే స్థితిలో అక్కడ పడి ఉన్నాడని తెలుసుకున్న యేసు, అతన్ని చూసి, “నీవు బాగవ్వాలని కోరుతున్నావా?” అని అడిగారు.
JOH 5:7 ఆ కదల్లేనివాడు, “అయ్యా, నీరు కదిలినప్పుడు కోనేటిలోనికి దిగడానికి నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. నేను దానిలోనికి దిగడానికి ప్రయత్నించేలోపు నాకన్నా ముందు మరొకరు దిగిపోతున్నారు” అని సమాధానం చెప్పాడు.
JOH 5:8 అప్పుడు యేసు వానితో, “లేచి, నీ పరుపెత్తుకొని నడువు” అన్నారు.
JOH 5:9 వెంటనే అతడు స్వస్థత పొంది, తన పరుపెత్తుకొని నడిచాడు. ఇది సబ్బాతు దినాన జరిగింది.
JOH 5:10 అందుకని యూదా నాయకులు స్వస్థత పొందినవానితో, “ఇది సబ్బాతు దినం కాబట్టి నీవు పరుపును మోయడానికి ధర్మశాస్త్రం అనుమతించదు” అన్నారు.
JOH 5:11 అయితే అతడు, “నన్ను స్వస్థపరచినవాడు ‘నీ పరుపెత్తుకొని నడువు’ అని నాతో చెప్పాడని” అన్నాడు.
JOH 5:12 కాబట్టి వారు అతన్ని, “నీకు పరుపెత్తుకొని నడవమని చెప్పింది ఎవరు?” అని అడిగారు.
JOH 5:13 అయితే స్వస్థపడినవానికి ఆయన ఎవరో తెలియలేదు. ఎందుకంటే యేసు అక్కడ ఉన్న గుంపులోనికి వెళ్లిపోయారు.
JOH 5:14 తర్వాత యేసు వానిని దేవాలయంలో చూసి అతనితో, “చూడు, నీవు స్వస్థపడ్డావు. పాపం చేయకు లేదంటే నీకు మరింత కీడు జరుగవచ్చు” అని చెప్పారు.
JOH 5:15 అతడు వెళ్లి యూదా నాయకులతో తనను బాగుచేసింది యేసు అని చెప్పాడు.
JOH 5:16 యేసు ఈ కార్యాలను సబ్బాతు దినాన చేశాడని యూదా నాయకులు ఆయనను హింసించారు.
JOH 5:17 యేసు వారికి సమాధానం ఇస్తూ, “నా తండ్రి నేటి వరకు కూడా తన పని చేస్తూనే ఉన్నారు. నేను కూడా చేస్తున్నాను” అని చెప్పారు.
JOH 5:18 యేసు సబ్బాతు దినాన్ని పాటించకపోవడమే కాక దేవున్ని తన సొంత తండ్రి అని పిలుస్తూ, తనను తాను దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడని ఆయనను చంపడానికి వారు మరింత గట్టిగా ప్రయత్నించారు.
JOH 5:19 కాబట్టి యేసు వారితో మాట్లాడుతూ, “నేను మీతో చెప్పేది నిజం, కుమారుడు తనకు తానుగా ఏమి చేయడు; తండ్రి చేస్తున్న దానిని చూసి కుమారుడు చేస్తాడు, ఎందుకంటే తండ్రి ఏం చేస్తే కుమారుడు అదే చేస్తాడు.
JOH 5:20 తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి తాను చేసే వాటన్నిటిని కుమారునికి చూపిస్తారు. అవును, మీరు ఆశ్చర్యపడేంతగా, వీటికన్నా గొప్ప కార్యాలను తండ్రి కుమారునికి చూపిస్తారు.
JOH 5:21 తండ్రి ఎలాగైతే చనిపోయినవారిని లేపి జీవమిస్తారో, కుమారుడు కూడా తనకు ఇష్టమైనవారికి జీవాన్ని ఇస్తారు.
JOH 5:22 అంతేకాక, తండ్రి ఎవరికి తీర్పు తీర్చరు కానీ, తండ్రిని ఘనపరచినట్లే అందరు కుమారున్ని కూడా ఘనపరచాలని,
JOH 5:23 ఆయన అందరికి తీర్పు తీర్చే అధికారాన్ని కుమారునికే ఇచ్చారు. కుమారుని ఘనపరచని వారు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచరు.
JOH 5:24 “నా మాటలను విని నన్ను పంపినవానిని నమ్మేవారు నిత్యజీవం కలవారు. వారు మరణం నుండి జీవంలోనికి దాటుతారు కాబట్టి వారికి తీర్పు ఉండదని నేను మీతో చెప్పేది నిజము.
JOH 5:25 మరణించినవారు దేవుని కుమారుని స్వరం వినే సమయం వస్తుంది, అది ఇప్పుడు వచ్చే ఉంది. ఆయన స్వరాన్ని విన్న వారు తిరిగి జీవిస్తారని నేను మీతో చెప్పేది నిజము.
JOH 5:26 తండ్రి తనలో జీవం కలిగి ఉన్న ప్రకారమే కుమారునిలో కూడా జీవం కలిగి ఉండేలా ఆయనకు అధికారం ఇచ్చారు.
JOH 5:27 ఆయన మనుష్యకుమారుడు కాబట్టి తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఇచ్చారు.
JOH 5:28 “దీని గురించి ఆశ్చర్యపడకండి, ఎందుకనగా ఒక సమయం వస్తుంది, అప్పుడు సమాధుల్లో ఉన్నవారందరు ఆయన స్వరాన్ని విని,
JOH 5:29 బయటకు వస్తారు. మంచి కార్యాలను చేసినవారు పునరుత్థాన జీవంలోనికి లేస్తారు. చెడు కార్యాలను చేసినవారు పునరుత్థాన శిక్ష పొందడానికి లేస్తారు.
JOH 5:30 నా అంతట నేనే ఏమి చేయలేను. నేను విన్నదానిని బట్టి తీర్పు తీరుస్తాను, నా తీర్పు న్యాయమైనది. ఎందుకంటే నన్ను పంపినవాని ఇష్టాన్నే నేను చేస్తాను తప్ప నా ఇష్టాన్ని కాదు.
JOH 5:31 “నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం సత్యం కాదు.
JOH 5:32 నా పక్షాన సాక్ష్యం ఇవ్వడానికి ఇంకొకరు ఉన్నారు. ఆయన నా గురించి ఇచ్చే సాక్ష్యం సత్యమని నాకు తెలుసు.
JOH 5:33 “మీరు యోహాను దగ్గరకు కొందరిని పంపినప్పుడు, అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు.
JOH 5:34 నేను మనుష్యుల సాక్ష్యాన్ని కోరను కానీ, మీరు రక్షింపబడాలని దీనిని చెప్తున్నాను.
JOH 5:35 యోహాను మండుచూ వెలుగిచ్చే దీపం వంటివాడు. మీరు అతని వెలుగులో కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడ్డారు.
JOH 5:36 “అయితే యోహాను చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. అదేమిటంటే పూర్తి చేయమని తండ్రి నాకిచ్చిన పనులు అనగా నేను చేస్తున్న పనులే తండ్రి నన్ను పంపాడని సాక్ష్యంగా ఉన్నాయి.
JOH 5:37 నన్ను పంపిన తండ్రి తానే నా గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మీరు ఆయన స్వరాన్ని ఎప్పుడు వినలేదు, ఆయన రూపాన్ని ఎప్పుడు చూడలేదు.
JOH 5:38 ఆయన పంపినవానిని మీరు నమ్మలేదు కాబట్టి ఆయన వాక్యం మీలో నివసించదు.
JOH 5:39 మీరు వాటిని జాగ్రత్తగా పఠిస్తున్నారు ఎందుకంటే మీరు లేఖనాల్లో మీకు నిత్యజీవం ఉందని మీరనుకుంటున్నారు. ఈ లేఖనాలే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
JOH 5:40 కాని జీవం పొందడానికి నా దగ్గరకు రావడానికి మీరు నిరాకరిస్తున్నారు.
JOH 5:41 “నేను మనుష్యుల మెప్పును అంగీకరించను.
JOH 5:42 అయితే నాకు మీ గురించి తెలుసు. మీ హృదయాల్లో దేవుని ప్రేమ లేదని నాకు తెలుసు.
JOH 5:43 నేను నా తండ్రి పేరట వచ్చాను కాని, మీరు నన్ను అంగీకరించలేదు; అయితే మరొకడు తన సొంత పేరులో వస్తే మీరు అతన్ని అంగీకరిస్తారు.
JOH 5:44 ఏకైక దేవుని నుండి వచ్చే కీర్తిని వెదకకుండా ఒకరి నుండి ఒకరికి వచ్చే కీర్తిని అంగీకరించే మీరు నన్ను ఎలా నమ్ముతారు?
JOH 5:45 “నేను తండ్రి ముందు మీమీద నేరం మోపుతానని అనుకోవద్దు. మీరు నిరీక్షణ ఉంచిన మోషేనే మీమీద నేరం మోపుతాడు.
JOH 5:46 మీరు మోషేను నమ్మితే నన్ను కూడా నమ్ముతారు, ఎందుకంటే అతడు వ్రాసింది నా గురించే.
JOH 5:47 కానీ అతడు వ్రాసిన దానినే మీరు నమ్మకపోతే నేను చెప్పేది ఎలా నమ్ముతారు?”
JOH 6:1 ఈ సంగతులు జరిగిన కొంతకాలానికి, యేసు గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తిబెరియ సముద్రతీరానికి వెళ్లారు.
JOH 6:2 అక్కడ ఆయన రోగులను స్వస్థపరచడం ద్వారా ఆయన చేసిన అసాధారణ సూచకక్రియలను చూసిన గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది.
JOH 6:3 అప్పుడు యేసు కొండ ఎక్కి తన శిష్యులతో పాటు అక్కడ కూర్చుని ఉన్నారు.
JOH 6:4 యూదుల పస్కా పండుగ సమీపించింది.
JOH 6:5 యేసు గొప్ప జనసమూహం తన దగ్గరకు రావడం చూసి ఫిలిప్పుతో, “ఈ ప్రజలు తినడానికి రొట్టెలను ఎక్కడ కొందాం?” అన్నారు.
JOH 6:6 తాను చేయబోయేది ఆయనకు ముందుగానే తెలుసు, కేవలం అతన్ని పరీక్షించడానికి మాత్రమే ఆయన అడిగారు.
JOH 6:7 ఫిలిప్పు ఆయనతో, “ఒక్కొక్కరికి ఒక్కో చిన్నముక్క ఇవ్వడానికి సరిపడే రొట్టెలను కొనాలంటే రెండువందల దేనారాల కంటే ఎక్కువవుతుంది” అని చెప్పాడు.
JOH 6:8 ఆయన శిష్యులలో మరొకడు, సీమోను పేతురు సోదరుడైన అంద్రెయ మాట్లాడుతూ,
JOH 6:9 “ఇక్కడ ఒక బాలుని దగ్గర అయిదు యవల రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఇంత మందికి అవి ఎలా సరిపోతాయి?” అన్నాడు.
JOH 6:10 అప్పుడు యేసు, “ప్రజలను కూర్చోబెట్టండి” అని చెప్పారు. అక్కడ చాలా పచ్చిక ఉంది కాబట్టి, ప్రజలు కూర్చున్నారు. అక్కడ సుమారు అయిదు వేలమంది పురుషులు ఉన్నారు.
JOH 6:11 యేసు ఆ రొట్టెలను తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి అక్కడ కూర్చున్న వారికి కావలసినంత పంచిపెట్టారు. చేపలు కూడా అలాగే పంచిపెట్టారు.
JOH 6:12 వారందరూ సరిపడినంత తిన్న తర్వాత ఆయన తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా మిగిలిన ముక్కలను పోగు చేయండి” అని చెప్పారు.
JOH 6:13 అందరు తిన్న తర్వాత మిగిలిన అయిదు యవల రొట్టె ముక్కలను పన్నెండు గంపలలో నింపారు.
JOH 6:14 యేసు చేసిన అద్భుత కార్యాన్ని చూసిన ప్రజలు, “నిజంగా ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే” అని చెప్పుకోవడం మొదలుపెట్టారు.
JOH 6:15 వారు తనను బలవంతంగా రాజును చేయాలని చూస్తున్నారని యేసు గ్రహించి తప్పించుకుని ఒంటరిగా కొండపైకి వెళ్లారు.
JOH 6:16 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రతీరానికి వెళ్లి,
JOH 6:17 ఒక పడవ ఎక్కి ఆ సరస్సును దాటుతూ కపెర్నహూముకు వెళ్తున్నారు. అప్పటికే చీకటి పడింది కానీ యేసు వారిని ఇంకా చేరుకోలేదు.
JOH 6:18 బలమైన గాలి వీస్తూ అలల ఉధృతి పెరిగింది.
JOH 6:19 వారు సుమారు మూడు, నాలుగు మైళ్ళ దూరం ప్రయాణం చేసిన తర్వాత, యేసు నీటి మీద నడస్తూ పడవ దగ్గరకు రావడం చూసి వారు భయపడ్డారు.
JOH 6:20 అయితే ఆయన వారితో, “నేనే, భయపడకండి” అన్నారు.
JOH 6:21 అప్పుడు వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకోడానికి ఒప్పుకున్న వెంటనే ఆ పడవ వారు వెళ్లవలసిన తీరాన్ని చేరింది.
JOH 6:22 తర్వాత రోజు సరస్సు అవతలి వైపు ఉన్న జనసమూహం అక్కడ ఒకే ఒక పడవ ఉండడం చూసి యేసు తన శిష్యులతో కలిసి పడవలో ఎక్కి వెళ్లలేదని కేవలం శిష్యులు మాత్రమే వెళ్లారని గ్రహించారు.
JOH 6:23 ప్రభువు కృతఙ్ఞతలు చెల్లించిన తర్వాత వారు రొట్టెలు తిన్న ప్రాంతానికి కొన్ని చిన్న పడవలు తిబెరియ నుండి వచ్చాయి.
JOH 6:24 ఆ పడవలలో వచ్చిన ఆ జనసమూహం యేసు ఆయన శిష్యులు అక్కడ లేరని గ్రహించి మళ్ళీ పడవలు ఎక్కి యేసును వెదుకుతూ కపెర్నహూముకు వెళ్లారు.
JOH 6:25 వారు ఆయనను సరస్సు అవతలి ఒడ్డున చూసినప్పుడు, “రబ్బీ, నీవు ఇక్కడకు ఎప్పుడు వచ్చావు?” అని వారు ఆయనను అడిగారు.
JOH 6:26 అందుకు యేసు వారితో, “మీరు రొట్టెలు తిని తృప్తి పొందారు కాబట్టి నన్ను వెదుకుతున్నారు తప్ప నేను చేసిన అద్భుత కార్యాలను చూసినందుకు కాదని నేను మీతో చెప్పేది నిజము.
JOH 6:27 మీరు పాడైపోయే ఆహారం కోసం కష్టపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచి ఉండే ఆహారం కోసం కష్టపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేశారు” అని చెప్పారు.
JOH 6:28 అప్పుడు వారు ఆయనను, “దేవుని పనులను చేయడానికి మేమేమి చేయాలి?” అని అడిగారు.
JOH 6:29 అందుకు యేసు, “ఆయన పంపినవానిని నమ్మడమే దేవుని పని” అని చెప్పారు.
JOH 6:30 కాబట్టి వారు, “మేము చూసి నిన్ను నమ్మడానికి నీవు ఏ అద్భుత కార్యాన్ని చేస్తున్నావు? ఏమి చేస్తావు?
JOH 6:31 మన పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారని, ‘తినడానికి వారికి పరలోకం నుండి ఆహారం ఇచ్చారు’ అని వ్రాయబడి ఉంది కదా!” అని ఆయనను అడిగారు.
JOH 6:32 యేసు వారితో, “నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను, మీకు పరలోకం నుండి ఆహారం ఇచ్చింది మోషే కాదు, పరలోకం నుండి నా తండ్రే నిజమైన ఆహారం మీకిస్తారు.
JOH 6:33 ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇచ్చేది దేవుడు ఇచ్చే ఆహారమని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు.
JOH 6:34 అందుకు వారు, “అయ్యా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడు ఇవ్వు” అన్నారు.
JOH 6:35 అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు.
JOH 6:36 అయితే నేను మీకు చెప్పిన రీతిగానే మీరు నన్ను చూసి కూడా నమ్మలేదు.
JOH 6:37 తండ్రి నాకు ఇచ్చే వారందరు నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎప్పుడు త్రోసివేయను.
JOH 6:38 ఎందుకంటే నేను నాకిష్టమైనది చేయడానికి పరలోకం నుండి దిగిరాలేదు కానీ నన్ను పంపినవానికి ఇష్టమైనది చేయడానికే వచ్చాను.
JOH 6:39 ఆయన నాకిచ్చిన వారిలో ఎవరినీ పోగొట్టుకోకుండా, చివరి రోజున వారిని జీవంతో లేపడం నన్ను పంపినవాని చిత్తమై ఉంది.
JOH 6:40 కుమారుని చూసి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందాలనేది నా తండ్రి చిత్తమై ఉంది. వారిని చివరి రోజున జీవంతో నేను లేపుతాను.”
JOH 6:41 “పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే” అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనపై సణుగుకోవడం మొదలుపెట్టారు.
JOH 6:42 వారు, “ఈ యేసు యోసేపు కుమారుడు కాడా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలియదా? ‘నేను పరలోకం నుండి దిగి వచ్చాను’ అని ఎలా చెప్తున్నాడు?” అని చెప్పుకున్నారు.
JOH 6:43 యేసు, “మీలో మీరు సణుగుకోవడం ఆపండి” అన్నారు.
JOH 6:44 ఇంకా మాట్లాడుతూ, “నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరు, చివరి రోజున నేను వారిని జీవంతో లేపుతాను.
JOH 6:45 ‘దేవుడు వారందరికి బోధిస్తారు’ అని ప్రవక్తలచే వ్రాయబడిన విధంగా, తండ్రి మాటలను విని ఆయన నుండి నేర్చుకున్న ప్రతిఒక్కరు నా దగ్గరకు వస్తారు.
JOH 6:46 దేవుని నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవరు తండ్రిని చూడలేదు; ఆయన మాత్రమే తండ్రిని చూశారు
JOH 6:47 నమ్మినవారే నిత్యజీవాన్ని కలిగి ఉంటాడని నేను మీతో చెప్పేది నిజము.
JOH 6:48 జీవాహారం నేనే.
JOH 6:49 మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయారు.
JOH 6:50 అయితే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇక్కడ ఉంది. దీన్ని తినే వారెవరు చనిపోరు.
JOH 6:51 పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే” అని చెప్పారు.
JOH 6:52 అందుకని యూదులు తమలో తాము, “ఈయన తన శరీరాన్ని మనం తినడానికి ఎలా ఇవ్వగలడు?” అని తీవ్రంగా వాదించుకోవడం మొదలుపెట్టారు.
JOH 6:53 అందుకు యేసు వారితో, “నేను మీతో చెప్పేది నిజం, మీరు మనుష్యకుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగితేనే తప్ప మీలో జీవం ఉండదు.
JOH 6:54 నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగినవారు నిత్యజీవం కలిగి ఉంటారు. చివరి రోజున నేను వానిని జీవంతో లేపుతాను.
JOH 6:55 నా శరీరం నిజమైన ఆహారం నా రక్తం నిజమైన పానీయము.
JOH 6:56 నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని త్రాగినవారు నాలో నిలిచి ఉంటారు, అలాగే నేను వారిలో నిలిచి ఉంటాను.
JOH 6:57 సజీవుడైన తండ్రి నన్ను పంపినందుకు నేను తండ్రి వలననే జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవారు నా వలన జీవిస్తారు.
JOH 6:58 పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదే. మీ పితరులు మన్నాను తిని చనిపోయారు కాని ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు” అని చెప్పారు.
JOH 6:59 కపెర్నహూములోని సమాజమందిరంలో బోధిస్తూ యేసు ఈ మాటలను చెప్పారు.
JOH 6:60 అది విన్న ఆయన శిష్యులలో అనేకమంది, “ఇది కష్టమైన బోధ, ఎవరు దీనిని అంగీకరిస్తారు?” అన్నారు.
JOH 6:61 యేసు తన శిష్యులు దీని గురించి సణుగుకుంటున్నారని గ్రహించి వారితో, “ఈ మాటలు మీకు అభ్యంతరకరంగా ఉన్నాయా?
JOH 6:62 అయితే మనుష్యకుమారుడు తాను ఇంతకుముందు ఉన్న చోటికే ఎక్కిపోవడం చూస్తే ఏమంటారు?
JOH 6:63 ఆత్మ జీవాన్ని ఇస్తుంది; శరీరం వలన ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మతో జీవంతో నిండి ఉన్నాయి.
JOH 6:64 అయినా మీలో కొందరు నమ్మడం లేదు” అన్నారు. ఎందుకంటే వారిలో ఎవరు మొదటి నుండి నమ్మడం లేదో, ఎవరు తనను అప్పగిస్తారో యేసుకు తెలుసు.
JOH 6:65 ఆయన వారితో, “ఈ కారణంగానే తండ్రి రానిస్తేనే తప్ప మరి ఎవరు నా దగ్గరకు రాలేరని నేను మీతో చెప్తున్నాను” అన్నారు.
JOH 6:66 అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకమంది వెనక్కి వెళ్లిపోయి మరి ఎన్నడు ఆయనను వెంబడించలేదు.
JOH 6:67 యేసు పన్నెండుమందిని, “మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా?” అని అడిగారు.
JOH 6:68 అందుకు సీమోను పేతురు ఆయనతో, “ప్రభువా, మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? నిత్యజీవపు మాటలను నీ దగ్గరే ఉన్నాయి.
JOH 6:69 నీవే దేవుని పరిశుద్ధుడవని మేము నమ్మి తెలుసుకున్నాము” అని చెప్పాడు.
JOH 6:70 అప్పుడు యేసు, “మీ పన్నెండుమందిని నేను ఎన్నుకోలేదా? అయినా మీలో ఒకడు దుష్టుడు” అని వారితో చెప్పారు.
JOH 6:71 పన్నెండుమందిలో ఒకనిగా ఉన్నా తర్వాత ఆయనను అప్పగించబోయే సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా గురించి ఆయన చెప్పారు.
JOH 7:1 ఆ తర్వాత, యేసు గలిలయల ప్రాంతంలోనే తిరుగుతున్నారు. యూదా నాయకులు ఆయనను చంపాలని ఎదురు చూస్తున్నారని యేసు యూదయ ప్రాంతాలకు వెళ్లకూడదనుకున్నారు.
JOH 7:2 కానీ యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడినప్పుడు,
JOH 7:3 యేసుని సహోదరులు ఆయనతో, “గలిలయల వదిలి యూదయకు వెళ్లు. అప్పుడు అక్కడ ఉన్న నీ శిష్యులు నీవు చేసిన కార్యాలు చూస్తారు.
JOH 7:4 అందరిలో ప్రసిద్ధి పొందాలని కోరుకునే వారెవరు రహస్యంగా కార్యాలను చేయరు. నీవు ఈ కార్యాలను చేస్తున్నావు, లోకానికి నీ గురించి తెలిసేలా చేయి” అన్నారు.
JOH 7:5 ఎందుకంటే ఆయన సహోదరులు కూడా ఆయనను నమ్మలేదు.
JOH 7:6 అందుకు యేసు వారితో, “నా సమయం ఇంకా రాలేదు; కానీ మీ సమయం ఎప్పుడైనా ఉంటుంది.
JOH 7:7 ఈ లోకం మిమ్మల్ని ద్వేషించదు, కానీ నేను దాని పనులు చెడ్డవని సాక్ష్యమిస్తున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తుంది.
JOH 7:8 మీరు పండుగకు వెళ్లండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి నేను ఈ పండుగకు ఇప్పుడే రాను” అని చెప్పారు.
JOH 7:9 ఇది చెప్పిన తర్వాత ఆయన గలిలయలో ఉన్నారు.
JOH 7:10 అయితే తన సహోదరులు పండుగకు వెళ్లిన తర్వాత, బహిరంగంగా కాకుండా రహస్యంగా ఆయన కూడా వెళ్లారు.
JOH 7:11 పండుగలో యూదా నాయకులు యేసుని వెదకుతూ, “ఆయన ఎక్కడ?” అని అడుగుతున్నారు.
JOH 7:12 ఆ జనసమూహంలో ఆయన గురించి గుసగుసలు మొదలయ్యాయి. వారిలో కొందరు, “అతడు మంచివాడు” అన్నారు. మరికొందరు, “కాదు, అతడు ప్రజలను మోసం చేస్తున్నాడు” అన్నారు.
JOH 7:13 అయితే యూదా నాయకులకు భయపడి ఎవరు ఆయన గురించి బహిరంగంగా ఏమి మాట్లాడలేదు.
JOH 7:14 పండుగ ఉత్సవాలు సగం రోజులు పూర్తియైన తర్వాత యేసు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు.
JOH 7:15 అక్కడ ఉన్న యూదులు ఆశ్చర్యపడి, “చదువుకోని వానికి ఇంతటి పాండిత్యం ఎలా వచ్చింది?” అని అడిగారు.
JOH 7:16 అందుకు యేసు, “నా బోధ నా సొంతం కాదు. నన్ను పంపినవాని నుండి అది వచ్చింది.
JOH 7:17 దేవుని చిత్తాన్ని చేయాలని నిశ్చయించుకున్నవారు నా బోధలు దేవుని నుండి వచ్చాయా లేదా నా సొంతంగా మాట్లాడుతున్నానా అనేది గ్రహిస్తారు.
JOH 7:18 సొంతగా మాట్లాడేవారు తన ఘనత కొరకే అలా చేస్తారు, కాని తనను పంపినవాని ఘనత కోసం చేసేవాడు సత్యవంతుడు; ఏ అబద్ధానికి ఆయనలో చోటు ఉండదు.
JOH 7:19 మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? అయితే మీలో ఎవ్వరూ ధర్మశాస్త్రాన్ని పాటించడంలేదు. మీరు ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు?” అన్నారు.
JOH 7:20 అందుకు జనసమూహం, “నీకు దయ్యం పట్టింది, నిన్ను ఎవరు చంపాలని ప్రయత్నిస్తున్నారు?” అన్నారు.
JOH 7:21 యేసు వారితో, “నేను ఒక అద్భుతాన్ని చేశాను. అందుకు మీరు ఆశ్చర్యపోయారు.
JOH 7:22 అయితే మోషే మీకు సున్నతి ఆచారాన్ని ఇచ్చాడు. వాస్తవానికి అది మోషే నుండి రాలేదు, కాని మీ పితరుల నుండి వచ్చింది. అయినా సబ్బాతు దినాన మీరు ఒక మగ శిశువుకు సున్నతి చేస్తున్నారు.
JOH 7:23 మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి మీరు సబ్బాతు దినాన ఒక మగ శిశువుకు సున్నతి చేస్తే, నేను సబ్బాతు దినాన ఒక వ్యక్తి దేహాన్నంతటిని బాగుచేసినందుకు నాపై ఎందుకు కోప్పడుతున్నారు?
JOH 7:24 కేవలం పైరూపాన్ని చూసి విమర్శించడం మాని న్యాయంగా తీర్పు తీర్చండి” అని అన్నారు.
JOH 7:25 ఆ సమయంలో యెరూషలేము ప్రజల్లో కొందరు, “యూదులు చంపాలని చూస్తుంది ఇతన్ని కాదా?
JOH 7:26 ఇక్కడ ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నాడు, అయినా ఆయనను ఎవరు ఏమి అనరు. ఈయన నిజంగా క్రీస్తు అని అధికారులు తెలుసుకున్నారా?
JOH 7:27 అయితే ఈయన ఎక్కడివాడో మనకు తెలుసు; కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వస్తాడో ఎవరికీ తెలియదు” అని అనుకున్నారు.
JOH 7:28 అప్పుడు యేసు ఇంకా దేవాలయ ఆవరణంలో బోధిస్తూ గొంతెత్తి ఇలా చెప్పారు, “అవును, నేను మీకు తెలుసు. నేను ఎక్కడివాడనో తెలుసు. అయినా నా అంతట నేను నా సొంత అధికారంతో ఇక్కడకు రాలేదు. అయితే నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన మీకు తెలియదు.
JOH 7:29 నాకు ఆయన తెలుసు; ఎందుకంటే నేను ఆయన దగ్గరి నుండి వచ్చాను ఆయనే నన్ను పంపారు.”
JOH 7:30 ఈ మాటలకు వారు ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ, ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఎవ్వరూ ఆయన మీద చేయి వేయలేకపోయారు.
JOH 7:31 అయినా, సమూహంలోని అనేకమంది ఆయనను నమ్మారు. వారు, “క్రీస్తు వచ్చినప్పుడు ఈయన కన్నా ఎక్కువ అద్భుతాలను చేస్తాడా?” అని అడిగారు.
JOH 7:32 ఆయన గురించి ఈ విషయాలను ఆ జనసమూహంలో గుసగుసలాడడం పరిసయ్యులు విన్నారు. అప్పుడు ముఖ్య యాజకులు పరిసయ్యులు ఆయనను బంధించడానికి దేవాలయ సంరక్షకులను పంపించారు.
JOH 7:33 యేసు, “నేను మీతో కేవలం కొంతకాలమే ఉంటాను. తర్వాత నన్ను పంపినవాని దగ్గరకు నేను వెళ్తాను.
JOH 7:34 మీరు నా కోసం వెదకుతారు కాని, కనుగొనలేరు; నేను ఉన్న చోటికి మీరు రాలేరు” అని చెప్పారు.
JOH 7:35 అప్పుడు యూదుల నాయకులు ఒకరితో ఒకరు, “మనం కనుగొనలేని ఏ స్థలానికి ఇతడు వెళ్లబోతున్నాడు? గ్రీసు దేశస్థుల మధ్య చెదరిపోయి జీవిస్తున్న మన ప్రజల దగ్గరకు ఆయన వెళ్లి, గ్రీసు దేశస్థులకు బోధిస్తాడా?
JOH 7:36 ‘మీరు నన్ను వెదకుతారు కాని కనుగొనలేరు; నేను ఉన్న చోటికి మీరు రాలేరు’ అని ఈయన చెప్పిన దానికి అర్థం ఏమిటి?” అని చెప్పుకున్నారు.
JOH 7:37 పండుగలోని గొప్ప రోజైన చివరి రోజున యేసు నిలబడి, “ఎవరైనా దప్పిగొంటే నా దగ్గరకు వచ్చి దాహం తీర్చుకోండి.
JOH 7:38 లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రకారం, నన్ను నమ్మేవారి అంతరంగంలో నుండి జీవజలధారలు ప్రవహిస్తాయి” అని బిగ్గరగా చెప్పారు.
JOH 7:39 ఆయనను నమ్మినవారు తర్వాత పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాటలను చెప్పారు. యేసు ఇంకా మహిమ పరచబడలేదు కాబట్టి ఆత్మ అప్పటికి ఇంకా ఇవ్వబడలేదు.
JOH 7:40 ఆయన మాటలను విన్న తర్వాత ప్రజల్లో కొందరు, “ఈయన నిజంగానే ప్రవక్త” అని చెప్పుకున్నారు.
JOH 7:41 మరికొందరు, “ఈయనే క్రీస్తు” అన్నారు. అయినప్పటికీ ఇంకా కొందరు, “క్రీస్తు గలిలయ నుండి ఎలా వస్తాడు?
JOH 7:42 క్రీస్తు దావీదు కుటుంబంలో నుండి దావీదు నివసించిన బేత్లెహేమనే ఊరి నుండి వస్తాడని లేఖనాల్లో వ్రాయబడలేదా?” అని చెప్పుకుంటున్నారు.
JOH 7:43 ఈ విధంగా క్రీస్తును గురించి ప్రజల్లో విభేదాలు ఏర్పడ్డాయి.
JOH 7:44 కొందరు ఆయనను పట్టుకోవాలని అనుకున్నారు, కాని ఎవ్వరూ ఆయన మీద చేయి వేయలేకపోయారు.
JOH 7:45 చివరికి దేవాలయ సంరక్షకులు తిరిగి ముఖ్య యాజకులు పరిసయ్యుల దగ్గరకు వెళ్లినప్పుడు వారు, “అతన్ని మీరెందుకు తీసుకురాలేదు?” అని వారిని అడిగారు.
JOH 7:46 ఆ సంరక్షకులు, “ఆయన మాట్లాడే విధంగా ఇంతకుముందు ఎవ్వరూ మాట్లాడలేదు” అని చెప్పారు.
JOH 7:47 పరిసయ్యులు, “అంటే మిమ్మల్ని కూడా అతడు మోసగించాడా? అని అన్నారు.
JOH 7:48 అధికారులలో లేదా పరిసయ్యులలో ఎవరైనా ఆయనను నమ్మారా?
JOH 7:49 లేదు! ధర్మశాస్త్రం గురించి ఏమి తెలియని ఈ గుంపు నమ్ముతున్నారు, వారి మీద శాపం ఉంది” అన్నారు.
JOH 7:50 అంతకుముందు యేసు దగ్గరకు వెళ్లిన వాడును స్వయంగా వారిలో ఒక సభ్యుడునైన నీకొదేము,
JOH 7:51 “ఒకరు చెప్పేది వినకుండా, వారు ఏమి చేస్తూ ఉన్నాడో కనుక్కోకుండా మన ధర్మశాస్త్రం తీర్పు తీర్చుతుందా?” అని అడిగాడు.
JOH 7:52 అందుకు వారు, “నీవు కూడ గలిలయకు చెందినవాడివా? ఇదిగో, గలిలయ నుండి ఏ ప్రవక్త రాడు కదా!” అన్నారు.
JOH 7:53 తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.
JOH 8:1 అయితే యేసు ఒలీవల కొండకు వెళ్లారు.
JOH 8:2 ఉదయం పెందలకడనే యేసు మళ్ళీ దేవాలయ ఆవరణంలో కనబడినప్పుడు ప్రజలందరు ఆయన చుట్టూ చేరారు. ఆయన వారికి బోధించడానికి కూర్చున్నారు.
JOH 8:3 అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిసయ్యులు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వారు ఆమెను గుంపు ముందు నిలబెట్టి,
JOH 8:4 వారు యేసుతో, “బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.
JOH 8:5 అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మనకు ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు. ఇప్పుడు నీవేమంటావు?” అని అడిగారు.
JOH 8:6 యేసు మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ అలా అడిగారు. కానీ యేసు క్రిందికి వంగి తన వ్రేలితో నేలపై వ్రాస్తూ ఉన్నారు.
JOH 8:7 వారు ఆపకుండా ఆయనను ప్రశ్నిస్తూనే ఉన్నందుకు, ఆయన తన తల పైకెత్తి చూసి వారితో, “మీలో పాపం లేనివాడు ఆమెపై మొదటి రాయి వేయండి” అని చెప్పి,
JOH 8:8 మళ్ళీ క్రిందకు వంగి నేలపై వ్రాస్తూ ఉన్నారు.
JOH 8:9 వారు ఆ మాట విని పెద్దవారి నుండి చిన్నవారి వరకు ఒకరి తర్వాత ఒకరిగా వెళ్లిపోయారు. యేసు ఒక్కరే మిగిలారు; ఆ స్త్రీ అక్కడే నిలబడి ఉంది.
JOH 8:10 యేసు తన తలయెత్తి, “అమ్మా, వారెక్కడ? ఎవరు నిన్ను శిక్షించలేదా?” అని అడిగారు.
JOH 8:11 ఆమె, “అయ్యా ఎవరూ లేరు” అన్నది. అందుకు యేసు, “నేను కూడ నిన్ను శిక్షించను. నీవు వెళ్లి, ఇప్పటినుండి పాపం చేయకుండ బ్రతుకు” అన్నారు.
JOH 8:12 యేసు ప్రజలతో మాట్లాడుతూ, “నేనే లోకానికి వెలుగు. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, కాని వారిలో జీవం కలిగించే వెలుగును కలిగి ఉంటారు” అని చెప్పారు.
JOH 8:13 అందుకు పరిసయ్యులు, “నీ గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు; కాబట్టి నీ సాక్ష్యానికి విలువలేదు” అన్నారు.
JOH 8:14 యేసు జవాబిస్తూ, “నా గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నా నా సాక్ష్యం విలువైనదే, ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కానీ నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు.
JOH 8:15 మీరు మానవ ప్రమాణాలను బట్టి తీర్పు తీరుస్తారు; కాని నేను ఎవరికి తీర్పు తీర్చను.
JOH 8:16 నేను ఒంటరిగా లేను, నేను నన్ను పంపిన తండ్రితో ఉన్నాను కాబట్టి నేను తీర్పు తీర్చినా నా నిర్ణయాలు న్యాయమైనవే.
JOH 8:17 ఇద్దరు మనుష్యుల సాక్ష్యం విలువైనదని మీ ధర్మశాస్త్రంలోనే వ్రాయబడి ఉంది.
JOH 8:18 నేను నా గురించి సాక్ష్యమిస్తున్నాను; నా మరొక సాక్షి నన్ను పంపిన తండ్రి” అన్నారు.
JOH 8:19 వారు ఆయనను, “నీ తండ్రి ఎక్కడ?” అని అడిగారు. అప్పుడు యేసు, “మీకు నా గురించి కాని నా తండ్రిని గురించి కాని తెలియదు. మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని తెలుసుకుని ఉండేవారు” అని చెప్పారు.
JOH 8:20 దేవాలయ ఆవరణంలో కానుకలపెట్టె ఉండే స్థలం దగ్గరగా బోధిస్తూ ఈ మాటలను చెప్పారు. అయినా వారెవరు ఆయనను పట్టుకోలేదు, ఎందుకంటే ఆయన గడియ ఇంకా రాలేదు.
JOH 8:21 యేసు మరొకసారి వారితో, “నేను వెళ్లిపోతున్నాను, మీరు నా కోసం వెదకుతారు, మీరు మీ పాపంలోనే చస్తారు. నేను వెళ్లే చోటికి మీరు రాలేరు” అన్నారు.
JOH 8:22 అందుకు యూదులు, “తనను తానే చంపుకుంటాడా? అందుకేనా ‘నేను వెళ్లే చోటికి మీరు రాలేరు’ అని చెప్తున్నాడు” అని అనుకున్నారు.
JOH 8:23 అప్పుడు ఆయన, “మీరు క్రిందుండే వారు; నేను పైనుండి వచ్చాను. మీరు ఈ లోకానికి చెందినవారు; నేను ఈ లోకానికి చెందిన వాడను కాను.
JOH 8:24 మీరు మీ పాపంలోనే చస్తారు అని నేను చెప్పాను; నేనే ఆయనను అని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే చస్తారు” అని వారితో చెప్పారు.
JOH 8:25 వారు, “నీవు ఎవరవు?” అని అడిగారు. అందుకు యేసు, “మొదటి నుండి నేను మీతో ఎవరినని చెప్పుతూ వచ్చానో ఆయననే.
JOH 8:26 మిమ్మల్ని గురించి తీర్పు చెప్పడానికి నాకు చాలా సంగతులు ఉన్నాయి, కానీ నన్ను పంపినవాడు నమ్మదగినవాడు. ఆయన దగ్గర నుండి నేను విన్నవాటినే ఈ లోకానికి చెప్తున్నాను” అన్నారు.
JOH 8:27 ఆయన తన తండ్రి గురించి చెప్తున్నారని వారు గ్రహించలేకపోయారు.
JOH 8:28 కాబట్టి యేసు, “మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనను, నా అంతట నేనేమి చేయను కాని తండ్రి నాకు బోధించిన వాటినే నేను చెప్తున్నానని మీరు తెలుసుకుంటారు.
JOH 8:29 నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు; నేనెల్లప్పుడు ఆయనను సంతోషపరచే వాటినే చేస్తున్నాను, కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు” అని చెప్పారు.
JOH 8:30 ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగా చాలామంది ఆయనను నమ్మారు.
JOH 8:31 తనను నమ్మిన యూదులతో యేసు, “ఒకవేళ మీరు నా బోధలో స్థిరంగా ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు అవుతారు.
JOH 8:32 అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అని చెప్పారు.
JOH 8:33 వారు ఆయనతో, “మేము అబ్రాహాము సంతతివారం, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు. అలాంటప్పుడు మీరు విడుదల పొందుతారని ఎలా చెప్తారు?” అన్నారు.
JOH 8:34 యేసు వారితో, “పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడే అని నేను మీతో చెప్పేది నిజము.
JOH 8:35 కుటుంబంలో దాసునికి స్థిరమైన స్థానం ఉండదు. కానీ కుమారుడు ఎల్లప్పుడు కుటుంబ సభ్యునిగానే ఉంటాడు.
JOH 8:36 అందుకే కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా విడుదల పొందినవారిగా ఉంటారు.
JOH 8:37 మీరు అబ్రాహాము సంతతివారని నాకు తెలుసు. అయినా మీలో నా మాటకు చోటు లేదు, కాబట్టి మీరు నన్ను చంపడానికి చూస్తున్నారు.
JOH 8:38 నేను నా తండ్రి సన్నిధిలో చూసినవాటిని మీకు చెప్తున్నాను. మీరు మీ తండ్రి దగ్గరి విన్నవాటిని చేస్తున్నారు” అన్నారు.
JOH 8:39 దానికి వారు, “అబ్రాహాము మా తండ్రి” అని జవాబిచ్చారు. అందుకు యేసు, “మీరు అబ్రాహాము పిల్లలైతే మీరు అబ్రాహాము చేసిన వాటిని చేస్తారు.
JOH 8:40 కాని నేను దేవుని నుండి విన్న సత్యాన్ని మీకు చెప్పినందుకు మీరు నన్ను చంపడానికి చూస్తున్నారు. అబ్రాహాము అలాంటివి చేయలేదు.
JOH 8:41 మీ సొంత తండ్రి చేసిన పనులనే మీరు చేస్తున్నారు” అని వారితో అన్నారు. అందుకు వారు, “మేము వ్యభిచారం వల్ల పుట్టినవారం కాదు. మాకు ఉన్న ఏకైక తండ్రి దేవుడే” అని ఎదురు చెప్పారు.
JOH 8:42 యేసు వారితో, “దేవుడు మీ తండ్రియైతే మీరు నన్ను ప్రేమించేవారు. ఎందుకంటే నేను దేవుని యొద్ద నుండే ఇక్కడకు వచ్చాను. నా అంతట నేను రాలేదు; దేవుడే నన్ను పంపించారు.
JOH 8:43 నా మాటలు మీకెందుకు అర్థం కావడం లేదు? ఎందుకంటే నేను చెప్తుంది మీరు వినలేకపోతున్నారు.
JOH 8:44 మీరు మీ తండ్రియైన అపవాదికి చెందినవారు, కాబట్టి మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చాలని కోరుతున్నారు. మొదటి నుండి వాడు హంతకుడే, వానిలో సత్యం లేదు, కాబట్టి వాడు సత్యాన్ని పట్టుకుని ఉండడు. వాడు అబద్ధం చెప్పినప్పుడు వాడు తన స్వభావాన్ని బట్టి మాట్లాడతాడు. ఎందుకంటే వాడు అబద్ధికుడు అబద్ధాలకు తండ్రి.
JOH 8:45 అయినాసరే నేను మీకు నిజం చెప్తున్నా మీరు నన్ను నమ్మరు!
JOH 8:46 నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను సత్యాన్ని చెప్తున్నప్పుడు మీరెందుకు నన్ను నమ్మరు?
JOH 8:47 దేవునికి చెందినవారు దేవుడు చెప్పే మాటలు వింటారు. మీరు దేవునికి చెందినవారు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు” అని అన్నారు.
JOH 8:48 అందుకు యూదులు ఆయనతో, “నీవు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవని మేము చెప్పింది నిజం కాదా?” అన్నారు.
JOH 8:49 యేసు, “నేను దయ్యం పట్టినవాడను కాను. నేను నా తండ్రిని ఘనపరుస్తున్నాను. మీరు నన్ను అవమానపరుస్తున్నారు.
JOH 8:50 నేను నా ఘనత కోసం వెదకడం లేదు; కానీ ఘనత కోసం వెదికేవాడు ఉన్నాడు, ఆయనే న్యాయమూర్తి.
JOH 8:51 నా మాటలకు లోబడేవారు ఎన్నడు చావరని నేను మీతో చెప్పేది నిజం” అని వారికి చెప్పారు.
JOH 8:52 ఈ విధంగా చెప్పగానే యూదులు, “నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు మాకు తెలిసింది! అబ్రాహాము, అలాగే ప్రవక్తలు కూడ చనిపోయారు, అయినా ‘నా మాటలకు లోబడేవారు ఎన్నడు చావరు’ అని నీవంటున్నావు.
JOH 8:53 మా తండ్రియైన అబ్రాహాము కన్నా నీవు గొప్పవాడవా? అతడు చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. నిన్ను నీవు ఎవరని అనుకుంటున్నావు?” అని అడిగారు.
JOH 8:54 అందుకు యేసు, “నన్ను నేను ఘనపరచుకుంటే ఆ ఘనత వట్టిదే. మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్తున్నారో ఆ నా తండ్రియే నన్ను ఘనపరుస్తున్నారు.
JOH 8:55 మీకు ఆయన ఎవరో తెలియదు, కాని ఆయన నాకు తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియదని నేను చెప్తే నేను కూడా మీలాగే అబద్ధికుని అవుతాను. కానీ ఆయన నాకు తెలుసు నేను ఆయన మాటకు లోబడతాను.
JOH 8:56 మీ తండ్రియైన అబ్రాహాము నేనున్న రోజును చూడాలన్న ఆలోచనకే ఆనందించాడు; అతడు దాన్ని చూసి సంతోషించాడు” అని చెప్పారు.
JOH 8:57 అందుకు యూదులు, “నీకు యాభై సంవత్సరాలు కూడ లేవు, నీవు అబ్రాహామును చూశావా!” అని ఆయనను అడిగారు.
JOH 8:58 అందుకు యేసు, “అబ్రాహాము పుట్టక ముందే నేనున్నాను! అని నేను మీతో చెప్పేది నిజం” అన్నారు.
JOH 8:59 అప్పుడు వారు ఆయన మీద విసరడానికి రాళ్లు తీశారు. కానీ యేసు వారికి కనబడకుండ దేవాలయం నుండి బయటకు వెళ్లిపోయారు.
JOH 9:1 యేసు దారిలో వెళ్తూ పుట్టుకతో గ్రుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తిని చూశారు.
JOH 9:2 ఆయన శిష్యులు ఆయనను, “రబ్బీ, అతడు గ్రుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? అతడా లేదా అతని తల్లిదండ్రులా?” అని అడిగారు.
JOH 9:3 యేసు, “అతడు కానీ అతని తల్లిదండ్రులు కాని పాపం చేయలేదు. దేవుని కార్యాలు అతనిలో వెల్లడి కావడానికి ఇలా జరిగింది.
JOH 9:4 పగలున్నంత వరకు నన్ను పంపినవాని పనులను మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది అప్పుడు ఎవరూ పని చేయలేరు.
JOH 9:5 ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఈ లోకానికి వెలుగు” అని చెప్పారు.
JOH 9:6 ఆయన ఇది చెప్పి నేల మీద ఉమ్మివేసి, ఆ ఉమ్మితో కొంత బురద చేసి, అతని కళ్ల మీద దానిని పూసారు.
JOH 9:7 ఆయన అతనితో, “వెళ్లు, సిలోయము అనే కోనేటిలో కడుక్కో” అని చెప్పారు. సిలోయము అనగా, “పంపబడిన” అని అర్థము. అతడు వెళ్లి కడుక్కుని చూపుతో ఇంటికి వచ్చాడు.
JOH 9:8 అతని పొరుగువారు, అంతకుముందు గ్రుడ్డిభిక్షవానిగా అతన్ని చూసినవారు, “వీడు ఇక్కడ కూర్చుని భిక్షం అడుక్కున్నవాడు కాడా?” అని చెప్పుకొన్నారు.
JOH 9:9 వారిలో కొందరు వాడే అన్నారు. మరికొందరు, “కాదు, వాడిలా ఉన్నాడు” అన్నారు. అయితే వాడు, “ఆ వానిని నేనే” అని ఒప్పుకున్నాడు.
JOH 9:10 వారు అతన్ని, “అయితే నీ కళ్లు ఎలా తెరుచుకున్నాయి?” అని అడిగారు.
JOH 9:11 అతడు వారితో, “యేసు అనే ఆయన కొంత బురద చేసి దాన్ని నా కళ్ల మీద పూసారు. తర్వాత సిలోయము కోనేటికి వెళ్లి కడుక్కో అని చెప్పాడు. కాబట్టి నేను వెళ్లి కడుక్కున్న తర్వాత చూడగలుగుతున్నాను” అని చెప్పాడు.
JOH 9:12 వారు, “ఆయన ఎక్కడ?” అని అతన్ని అడిగారు. వాడు, “నాకు తెలియదు” అని చెప్పాడు.
JOH 9:13 అంతకుముందు గ్రుడ్డివానిగా ఉండిన వానిని వారు పరిసయ్యుల దగ్గరకు తీసుకెళ్లారు.
JOH 9:14 అయితే యేసు బురద చేసి అతని కళ్లను తెరిచిన రోజు సబ్బాతు దినము.
JOH 9:15 అందుకు పరిసయ్యులు ఎలా చూపు పొందావని వానిని అడిగారు. అందుకు అతడు, “ఆయన నా కళ్ల మీద బురద పూసాడు. నేను దానిని కడుక్కున్న తర్వాత చూడగలుగుతున్నాను” అని చెప్పాడు.
JOH 9:16 పరిసయ్యులలో కొందరు, “ఇతడు సబ్బాతు దినాన్ని పాటించడంలేదు. కాబట్టి ఇతడు దేవుని నుండి రాలేదు” అన్నారు. కానీ మరికొందరు ఒక పాపి ఇలాంటి అద్భుత కార్యాలను ఎలా చేయగలుగుతాడు? అన్నారు. కాబట్టి వారిలో భేదాలు ఏర్పడ్డాయి.
JOH 9:17 చివరికి వారు గ్రుడ్డివానితో, “నీ కళ్లను తెరిచిన ఈ వ్యక్తి గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగారు. వాడు, “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు.
JOH 9:18 అయినా వారు ఆ గ్రుడ్డివాడు చూపు పొందాడని నమ్మలేదు కాబట్టి వాని తల్లిదండ్రులను పిలిపించారు.
JOH 9:19 వారు తల్లిదండ్రులతో, “ఇతడు మీ కుమారుడేనా? పుట్టు గ్రుడ్డివాడని మీరు చెప్పే కుమారుడు వీడేనా? అయితే వీడు ఇప్పుడెలా చూడగలుగుతున్నాడు?” అని అడిగారు.
JOH 9:20 అందుకు వాని తల్లిదండ్రులు, “వీడు మా కొడుకే, వీడు గ్రుడ్డివానిగానే పుట్టాడని మాకు తెలుసు.
JOH 9:21 అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో, వీని కళ్లను ఎవరు తెరిచారో మాకు తెలియదు. వీడు పెద్దవాడే కాబట్టి వీనినే అడగండి. తన సంగతి తానే చెప్పుకోగలడు” అన్నారు.
JOH 9:22 యేసును క్రీస్తు అని అంగీకరించిన వారిని సమాజమందిరం నుండి బయటకు వెలివేయాలని యూదా అధికారులు ముందుగానే నిర్ణయించారు కాబట్టి అతని తల్లిదండ్రులు వారికి భయపడి అలా చెప్పారు.
JOH 9:23 అందుకే అతని తల్లిదండ్రులు, “అతడు పెద్దవాడు అతన్నే అడగండి” అన్నారు.
JOH 9:24 గ్రుడ్డివానిగా ఉండిన వానిని యూదా అధికారులు మరలా రెండవసారి పిలిపించారు. “నీవు సత్యం చెప్పి దేవుని మహిమపరచు. మాకైతే ఆ వ్యక్తి పాపి అని తెలుసు” అన్నారు.
JOH 9:25 అందుకు అతడు, “ఆయన పాపియో కాడో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఒక్కటే. గ్రుడ్డివాడిగా ఉన్న నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను” అని చెప్పాడు.
JOH 9:26 అప్పుడు వారు వానిని, “ఆయన నీకేమి చేశాడు? నీ కళ్లను అతడు ఎలా తెరిచాడు?” అని అడిగారు.
JOH 9:27 వాడు వారితో, “నేను మీకు ముందే చెప్పాను కానీ మీరు వినలేదు. మీరు మరలా ఎందుకు వినాలని అనుకుంటున్నారా? మీరు కూడ ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా?” అని అడిగాడు.
JOH 9:28 అప్పుడు వారు అతన్ని దూషించి, “నీవే వాని శిష్యుడవు. మేము మోషే శిష్యులం!
JOH 9:29 దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు, కానీ వీడు ఎక్కడి నుండి వచ్చాడో కూడ మాకు తెలియదు” అన్నారు.
JOH 9:30 అందుకు అతడు, “ఆయన ఎక్కడి నుండి వచ్చారో మీకు తెలియక పోవడం ఆశ్చర్యమే! అయినా ఆయన నా కళ్లను తెరిచారు.
JOH 9:31 దేవుడు పాపుల మనవి వినరని మనకు తెలుసు. తన చిత్తాన్ని చేసే భక్తుల మనవి ఆయన వింటారు.
JOH 9:32 భూమి మొదలైనప్పటి నుండి ఏ పుట్టు గ్రుడ్డివాని కళ్లు తెరవబడ్డాయని ఎవరు వినలేదు.
JOH 9:33 ఒకవేళ ఇతడు దేవుని నుండి కానట్లైతే, ఏమి చేయగలిగేవాడు కాదు” అని చెప్పాడు.
JOH 9:34 దానికి వారు, “పుట్టుకతోనే పాపిగా ఉన్న నీవు మాకు బోధిస్తున్నావా?” అని వానిని సమాజమందిరం నుండి బయటకు వెలివేశారు.
JOH 9:35 అతన్ని సమాజమందిరం నుండి బయటకు వెలివేశారని యేసు విని, అతన్ని కనుగొని, “నీవు మనుష్యకుమారుని నమ్ముతున్నావా?” అని అడిగారు.
JOH 9:36 అప్పుడు అతడు, “అయ్యా, ఆయన ఎవరు? నాతో చెబితే నేను ఆయనను నమ్ముతానేమో” అన్నాడు.
JOH 9:37 యేసు, “నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అన్నారు.
JOH 9:38 అప్పుడు అతడు, “ప్రభువా, నేను నమ్ముతున్నాను” అని చెప్పి ఆయనను ఆరాధించాడు.
JOH 9:39 అప్పుడు యేసు, “నేను గ్రుడ్డివారు చూసేలా, చూసేవారు గ్రుడ్డివారయ్యేలా తీర్పు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను” అన్నారు.
JOH 9:40 అక్కడ ఉన్న కొందరు పరిసయ్యులు ఆయన చెప్పిన ఈ మాటలు విని, “అయితే మేము కూడ గ్రుడ్డివారమేనా?” అని అడిగారు.
JOH 9:41 అందుకు యేసు, “మీరు గ్రుడ్డివారైతే మీమీద ఈ పాపం ఉండేది కాదు; కాని చూడగలమని మీరు చెప్పుకుంటున్నారు. కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది” అని చెప్పారు.
JOH 10:1 “గొర్రెల దొడ్డిలోనికి వెళ్లే ద్వారం నుండి కాక వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగ దోచుకునేవాడని నేను మీతో చెప్పేది నిజము.
JOH 10:2 గొర్రెల దొడ్డిలోనికి ద్వారం గుండా వచ్చేవాడు గొర్రెల కాపరి.
JOH 10:3 కావలివాడు కాపరికి తలుపు తీస్తాడు. ఆ గొర్రెలు తమ కాపరి స్వరాన్ని వింటాయి. ఆ కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలిచి, వాటిని బయటకు నడిపిస్తాడు.
JOH 10:4 అతడు తన సొంత గొర్రెలను బయటకు తీసుకువచ్చినప్పుడు వాటికి ముందుగా నడుస్తాడు, ఆ గొర్రెలకు అతని స్వరం తెలుసు కాబట్టి అవి అతన్ని వెంబడిస్తాయి.
JOH 10:5 అయితే క్రొత్తవారి స్వరాన్ని అవి గుర్తించవు కాబట్టి వారిని వెంబడించవు; నిజానికి, అవి వారి నుండి పారిపోతాయి” అని చెప్పారు.
JOH 10:6 ఈ సాదృశ్యం ద్వారా యేసు చెప్పిన విషయాన్ని పరిసయ్యులు గ్రహించలేకపోయారు.
JOH 10:7 కాబట్టి యేసు మళ్ళీ వారితో, “నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను, గొర్రెలకు ద్వారం నేనే అని మీతో చెప్పేది నిజం.
JOH 10:8 నాకన్నా ముందు వచ్చిన వారందరు దొంగలు దోచుకునేవారే. కాబట్టి గొర్రెలు వారి మాటలు వినలేదు.
JOH 10:9 నేనే ద్వారాన్ని; నా ద్వారా లోపలికి ప్రవేశించేవారు రక్షింపబడతారు. వారు లోపలికి వస్తూ బయటకు వెళ్తూ పచ్చికను కనుగొంటారు.
JOH 10:10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి వస్తాడు. అయితే నేను గొర్రెలకు జీవం కలిగించాలని, అది సమృద్ధిగా కలిగించాలని వచ్చాను.
JOH 10:11 “నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెలను కాపాడడానికి తన ప్రాణానికి తెగిస్తాడు.
JOH 10:12 జీతగాడు గొర్రెల కాపరి కాదు. ఆ గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి వాడు గొర్రెలను విడిచి పారిపోతాడు. తోడేలు ఆ మంద మీద దాడి చేసి వాటిని చెదరగొడుతుంది.
JOH 10:13 జీతగాడు జీతం కొరకే పని చేస్తాడు కాబట్టి గొర్రెల గురించి పట్టించుకోకుండా పారిపోతాడు.
JOH 10:14 “నేను మంచి కాపరిని; నా తండ్రికి నేను తెలుసు నాకు నా తండ్రి తెలుసు; అలాగే నాకు నా గొర్రెలు తెలుసు నా గొర్రెలకు నేను తెలుసు. నా గొర్రెల కోసం నేను నా ప్రాణం పెడతాను.
JOH 10:16 ఈ దొడ్డివికాని వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి. వాటిని కూడ నేను తోడుకొని రావాలి. అవి కూడా నా స్వరం వింటాయి, అప్పుడు ఒక్క మంద ఒక్క కాపరి ఉంటాడు.
JOH 10:17 నేను నా ప్రాణాన్ని మళ్ళీ పొందడానికే దాన్ని పెడుతున్నాను, కాబట్టి నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నారు.
JOH 10:18 నా దగ్గర నుండి ఎవరు దానిని తీసుకోలేరు. నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. ప్రాణం పెట్టడానికి దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞను నేను నా తండ్రి నుండి పొందాను” అని చెప్పారు.
JOH 10:19 ఈ మాటల వలన యూదులలో మరల భేదాలు ఏర్పడ్డాయి.
JOH 10:20 వారిలో అనేకమంది, “ఇతడు పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఇతనికి దయ్యం పట్టింది. ఇతని మాటలను ఎందుకు వింటున్నారు?” అన్నారు.
JOH 10:21 కానీ మరికొందరు, “ఇవి దయ్యం పట్టినవాని మాటలు కాదు, ఒక దయ్యం గ్రుడ్డివాడికి చూపు ఇవ్వగలదా?” అని అడిగారు.
JOH 10:22 ఆ తర్వాత యెరూషలేములో ప్రతిష్ఠిత పండుగ సమీపించింది. అది శీతాకాలము.
JOH 10:23 యేసు దేవాలయ ఆవరణంలో సొలొమోను మండపంలో నడుస్తున్నారు.
JOH 10:24 అప్పుడు యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో, “ఇంకా ఎంతకాలం నీవు మమ్మల్ని సందేహంలో ఉంచుతావు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు” అన్నారు.
JOH 10:25 అందుకు యేసు వారితో, “నేను మీకు చెప్పాను కాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేసిన అద్భుతకార్యాలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
JOH 10:26 కాని మీరు నా గొర్రెలు కారు కాబట్టి మీరు నమ్మరు.
JOH 10:27 నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి; అవి నాకు తెలుసు అవి నన్ను వెంబడిస్తాయి.
JOH 10:28 నేను వాటికి నిత్యజీవాన్ని ఇస్తాను, కాబట్టి అవి ఎన్నడు నశించవు; వాటిని నా చేతిలో నుండి ఎవరు దొంగిలించలేరు.
JOH 10:29 వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు; నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవరు దొంగిలించలేరు.
JOH 10:30 నేను నా తండ్రి ఏకమై ఉన్నాం” అన్నారు.
JOH 10:31 ఆయనకు విరోధంగా ఉన్న యూదులు మళ్ళీ ఆయనను కొట్టాలని రాళ్లను పట్టుకున్నారు.
JOH 10:32 అయితే యేసు వారితో, “నా తండ్రి నుండి మీకు అనేక మంచి కార్యాలను చూపించాను. వాటిలో దేన్ని బట్టి నన్ను రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నారా?” అని అడిగారు.
JOH 10:33 “అందుకు యూదులు, నీవు చేసిన మంచిపనుల బట్టి కాదు. నీవు మానవుడవై ఉండి దేవుడనని చెప్పుకుంటూ దైవదూషణ చేస్తున్నందుకు” అని అన్నారు.
JOH 10:34 యేసు వారితో, “ ‘మీరు “దేవుళ్ళు” అని నేను అన్నాను’ అని మీ లేఖనాల్లో వ్రాసిలేదా?
JOH 10:35 దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టివేయడానికి లేదు; దేవుని వాక్యాన్ని పొందుకొనిన వారినే ఆయన ‘దేవుళ్ళు’ అని పిలిచినప్పుడు,
JOH 10:36 తండ్రి తన సొంతవానిగా ప్రత్యేకపరచుకుని లోకానికి పంపినవాని సంగతేమిటి? ‘నేను దేవుని కుమారుడను’ అని చెప్పినందుకు దైవదూషణ అని నాపైన నేరం ఎందుకు మోపుతున్నారు?
JOH 10:37 నేను నా తండ్రి పనులను చేయకపోతే నన్ను నమ్మకండి.
JOH 10:38 అయితే నేను వాటిని చేస్తే మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలో ఉన్నాడని నేను తండ్రిలో ఉన్నానని మీరు తెలుసుకుని గ్రహించేలా, నేను చేసే క్రియలను నమ్మండి” అని చెప్పారు.
JOH 10:39 వారు ఆయనను పట్టుకోవాలని మరల ప్రయత్నించారు, కానీ ఆయన వారి నుండి తప్పించుకున్నారు.
JOH 10:40 తర్వాత యేసు యొర్దాను నదిని దాటి, యోహాను మొదట బాప్తిస్మమిస్తూ ఉండిన ప్రాంతానికి తిరిగివచ్చి అక్కడ ఉన్నారు.
JOH 10:41 చాలామంది ఆయన దగ్గరకు వచ్చి, “యోహాను ఏ అద్భుత కార్యాన్ని చేయలేదు కాని ఈయన గురించి యోహాను చెప్పినవి అన్ని సత్యమే” అన్నారు.
JOH 10:42 ఆ స్థలంలో చాలామంది యేసును నమ్మారు.
JOH 11:1 బేతనియ గ్రామానికి చెందిన మరియ, మార్తల సహోదరుడైన లాజరు అనారోగ్యంతో ఉన్నాడు.
JOH 11:2 అనారోగ్యంతో ఉన్న లాజరు సహోదరియైన మరియ ఈమెనే ప్రభువు పాదాల మీద పరిమళద్రవ్యాన్ని పోసి తన తలవెంట్రుకలతో తుడిచింది.
JOH 11:3 కాబట్టి అతని సహోదరీలు, “ప్రభువా, నీవు ప్రేమించినవాడు అనారోగ్యంగా ఉన్నాడు” అని కబురు పంపించారు.
JOH 11:4 యేసు అది విని, “ఈ అనారోగ్యం చావు కోసం వచ్చింది కాదు. దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ పరచడానికే వచ్చింది” అని అన్నారు.
JOH 11:5 యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించారు.
JOH 11:6 లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసు విని కూడా తాను ఉన్న చోటే మరో రెండు రోజులు ఉన్నారు.
JOH 11:7 ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “యూదయ ప్రాంతానికి వెళ్దాం రండి” అని అన్నారు.
JOH 11:8 అందుకు శిష్యులు, “రబ్బీ, ఇంతకుముందే యూదులు నిన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు కదా, అయినా నీవు అక్కడికి మళ్ళీ వెళ్తావా?” అని అడిగారు.
JOH 11:9 అందుకు యేసు, “పగలుకు పన్నెండు గంటలు ఉన్నాయి కదా? పగలు నడిచేవాడు తడబడకుండా నడుస్తాడు ఎందుకంటే అతడు లోకపు వెలుగులో చూడగలడు.
JOH 11:10 అతడు రాత్రివేళ నడిస్తే వెలుగు ఉండదు కాబట్టి అతడు తడబడతాడు” అని చెప్పారు.
JOH 11:11 యేసు ఈ సంగతులు వారితో చెప్పిన తర్వాత ఆయన ఇంకా వారితో, “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు. కాబట్టి నేను అతన్ని లేపడానికి వెళ్తున్నాను” అని అన్నారు.
JOH 11:12 అందుకు ఆయన శిష్యులు ఆయనతో, “ప్రభువా, అతడు నిద్రపోతే బాగవుతాడు” అన్నారు.
JOH 11:13 యేసు అతని చావు గురించి మాట్లాడారు. కాని వారు సాధారణమైన నిద్ర గురించి అనుకున్నారు.
JOH 11:14 కాబట్టి యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.
JOH 11:15 అప్పుడు నేను అక్కడ లేనందుకు మీ గురించి సంతోషిస్తున్నాను. దీన్ని బట్టి మీరు నమ్ముతారు. పదండి అతని దగ్గరకు వెళ్దాం” అన్నారు.
JOH 11:16 అప్పుడు దిదుమ అని పిలువబడే తోమా, “ఆయనతో పాటు చనిపోవడానికి ‘మనం కూడ వెళ్దాం రండి’ ” అని తోటి శిష్యులతో అన్నాడు.
JOH 11:17 యేసు అక్కడికి చేరుకుని, లాజరు శవాన్ని సమాధిలో ఉంచి అప్పటికే నాలుగు రోజులు గడిచాయని తెలుసుకున్నారు.
JOH 11:18 యెరూషలేము నుండి బేతనియకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది.
JOH 11:19 చాలామంది యూదులు మార్తను మరియను వారి సహోదరుని గురించి ఓదార్చడానికి వచ్చారు.
JOH 11:20 మార్త యేసు వస్తున్నారని విని ఆమె ఆయనను ఎదుర్కోడానికి బయటకు వెళ్లింది కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.
JOH 11:21 మార్త యేసుతో, “ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు.
JOH 11:22 ఇప్పుడైనా నీవు దేవుని ఏమి అడిగినా అది నీకు ఇస్తాడని నాకు తెలుసు” అన్నది.
JOH 11:23 యేసు ఆమెతో, “నీ సహోదరుడు మరల లేస్తాడు” అని చెప్పారు.
JOH 11:24 అందుకు మార్త, “చివరి రోజున పునరుత్ధానంలో అతడు తిరిగి లేస్తాడని నాకు తెలుసు” అన్నది.
JOH 11:25 యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు.
JOH 11:26 బ్రతికి ఉండి నన్ను నమ్మినవారు ఎప్పుడూ చనిపోరు. నీవు ఇది నమ్ముతున్నావా?” అని ఆమెను అడిగారు.
JOH 11:27 ఆమె, “అవును ప్రభువా, నీవు ఈ లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముతున్నాను” అని ఆయనతో చెప్పింది.
JOH 11:28 ఆమె ఈ మాట చెప్పిన తర్వాత, ఆమె వెనుకకు తిరిగివెళ్లి ఎవరికి తెలియకుండా తన సహోదరియైన మరియను ప్రక్కకు పిలిచి, “బోధకుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని చెప్పింది.
JOH 11:29 మరియ అది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్లింది.
JOH 11:30 అప్పటికి ఇంకా యేసు గ్రామం లోపలికి ప్రవేశించలేదు, మార్త తనను కలుసుకొన్న చోటే ఉన్నారు.
JOH 11:31 మరియను ఓదారుస్తూ ఇంట్లో ఉన్న యూదులు ఆమె త్వరగా లేచి బయటకు వెళ్లడం చూసి ఆమె ఏడ్వడానికి సమాధి దగ్గరకు వెళ్తుందని భావించి ఆమె వెంట వెళ్లారు.
JOH 11:32 మరియ యేసు ఉన్న చోటికి వెళ్లి యేసును చూసి ఆయన పాదాల మీద పడి, “ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు” అన్నది.
JOH 11:33 ఆమె ఏడ్వడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడుస్తూ ఉండడం యేసు చూసి, తన ఆత్మలో ఎంతో బాధతో మూలుగుతూ,
JOH 11:34 “మీరు అతన్ని ఎక్కడ పెట్టారు?” అని వారిని అడిగారు. అప్పుడు వారు, “ప్రభువా, వచ్చి చూడండి” అని అన్నారు.
JOH 11:35 యేసు ఏడ్చారు.
JOH 11:36 అప్పుడు యూదులు, “చూడండి ఆయన అతన్ని ఎంత ప్రేమించాడో!” అని అన్నారు.
JOH 11:37 అయితే వారిలో కొందరు, “గ్రుడ్డివాడి కళ్లను తెరిచిన ఈయన, ఇతనికి చావు రాకుండా చేయలేదా పోయాడా?” అన్నారు.
JOH 11:38 యేసు తనలో తాను మరొకసారి మూలుగుతూ సమాధి దగ్గరకు వచ్చారు. ఆ సమాధి ముందు ఒక రాయి అడ్డుగా పెట్టబడి ఉంది.
JOH 11:39 యేసు, “ఈ రాయిని తీసి వేయండి” అన్నారు. చనిపోయిన లాజరు సహోదరియైన మార్త, “ప్రభువా, అతన్ని అందులో పెట్టి నాలుగు రోజులైంది, ఈపాటికి దుర్వాసన వస్తూ ఉంటుంది” అన్నది.
JOH 11:40 అప్పుడు యేసు, “నీవు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నారు.
JOH 11:41 కాబట్టి వారు రాయిని ప్రక్కకు తొలగించారు. అప్పుడు యేసు తల పైకెత్తి చూస్తూ, “తండ్రీ, నీవు నా విన్నపాలను విన్నందుకు నీకు కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాను.
JOH 11:42 నీవు ఎల్లప్పుడు నా విన్నపాలను వింటావని నాకు తెలుసు. అయితే ఇక్కడ నిలబడిన ప్రజలు నీవు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాటను పలికాను” అన్నారు.
JOH 11:43 యేసు ఈ మాట చెప్పిన తర్వాత బిగ్గరగా, “లాజరూ, బయటకు రా!” అని పిలిచారు.
JOH 11:44 చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు, అతని కాళ్లు చేతులు నారవస్త్రంతో కట్టి ఉన్నాయి, అతని ముఖం ఒక గుడ్డతో చుట్టబడి ఉంది. అప్పుడు యేసు వారితో, “సమాధి బట్టలను తీసివేసి అతన్ని వెళ్లనివ్వండి” అన్నారు.
JOH 11:45 మరియను చూడటానికి వచ్చిన యూదులలో చాలామంది యేసు చేసిన కార్యాలను చూసి ఆయనను నమ్మారు.
JOH 11:46 అయితే వారిలో కొందరు పరిసయ్యుల దగ్గరకు వెళ్లి వారికి యేసు చేసిన కార్యాలను చెప్పారు.
JOH 11:47 అప్పుడు ముఖ్య యాజకులు పరిసయ్యులు న్యాయసభను ఏర్పాటు చేశారు. “మనం ఏమి చేద్దాం? ఈయన అనేక అద్భుత కార్యాలను చేస్తున్నాడు.
JOH 11:48 మనం ఆయనను ఇలాగే వదిలేస్తే, ప్రతి ఒక్కరు ఆయనను నమ్ముతారు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలాన్ని, మన దేశ ప్రజలను తీసుకుపోతారు” అన్నారు.
JOH 11:49 అప్పుడు వారిలో ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడైన కయప మాట్లాడుతూ, “మీకు ఏమి తెలియదు!
JOH 11:50 ప్రజలందరు నశించిపోకుండా వారి కోసం ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని మీరు గ్రహించడంలేదు” అన్నాడు.
JOH 11:51 అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు కాని, ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా అతడు యేసు యూదా దేశమంతటి కోసం చనిపోతాడని,
JOH 11:52 ఆ దేశం కోసం మాత్రమే కాకుండా చెదిరిపోయిన దేవుని పిల్లలందరిని ఒక్క చోటికి చేర్చి వారందరిని ఒకటిగా సమకూర్చుతాడని ప్రవచించాడు.
JOH 11:53 కాబట్టి ఆ రోజు నుండి వారు యేసును చంపడానికి ఆలోచన చేస్తున్నారు.
JOH 11:54 కాబట్టి యేసు అప్పటినుండి యూదుల మధ్య బహిరంగంగా తిరగలేదు. కానీ అక్కడి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిం అనే గ్రామంలో తన శిష్యులతో ఉన్నారు.
JOH 11:55 యూదుల పస్కా పండుగ దగ్గర పడుతుందని, చాలామంది తమ శుద్ధీకరణ ఆచార ప్రకారం పస్కాకు ముందుగానే గ్రామాల నుండి బయలుదేరి యెరూషలేముకు వెళ్లారు.
JOH 11:56 వారు యేసు కోసం వెదకుతూ దేవాలయ ఆవరణంలో నిలబడి ఒకరితో ఒకరు, “మీరేమంటారు? ఆయన పండుగకు రావట్లేదేమో!” అని చెప్పుకుంటున్నారు.
JOH 11:57 యేసు ఎక్కడ ఉన్నాడనే సంగతి ఎవరికైనా తెలిస్తే, వారు ఆయనను పట్టుకోవడానికి తమకు తెలియచేయాలని ముఖ్య యాజకులు పరిసయ్యులు ప్రజలకు ఆదేశించారు.
JOH 12:1 ఏ లాజరు చనిపోతే యేసు మళ్ళీ బ్రతికించారో ఆ లాజరు ఉండే బేతనియ అనే ఊరికి పస్కా పండుగకు ఆరు రోజుల ముందు యేసు వచ్చారు.
JOH 12:2 ఇక్కడ యేసు కోసం విందు సిద్ధం చేయబడింది. ఆ భోజనపు బల్ల దగ్గర ఆయనతో పాటు కూర్చున్నవారిలో లాజరు కూడా ఉన్నాడు. మార్త వారికి వడ్డిస్తూ ఉంది.
JOH 12:3 మరియ సుమారు అయిదువందల గ్రాముల, అత్యంత విలువైన జటామాంసి చెట్ల నుండి తీసిన అత్తరు తెచ్చి యేసు పాదాల మీద పోసి తన తలవెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. అప్పుడు ఆ ఇల్లంతా పరిమళద్రవ్యపు వాసనతో నిండిపోయింది.
JOH 12:4 అయితే ఆయనను అప్పగించబోతున్న ఆయన శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా ఆమె చేసిన దానికి అభ్యంతరం చెప్తూ,
JOH 12:5 “ఈ అత్తరును అమ్మి ఆ డబ్బును పేదవారికి ఇవ్వాల్సింది కదా! దాని ఖరీదు ఒక సంవత్సర జీతానికి సరిపడుతుంది.”
JOH 12:6 అతడు ఈ మాటలు మాట్లాడింది బీదల మీద ఉన్న శ్రద్ధతో కాదు; అతడు ఒక దొంగ; డబ్బు సంచి తన దగ్గరే ఉండేది కాబట్టి అందులో ఉన్న డబ్బు వాడుకునేవాడు.
JOH 12:7 అందుకు యేసు, “ఆమె చేస్తుంది చేయనివ్వండి, ఎందుకంటే నా భూస్థాపన రోజు వరకు ఆమె ఈ అత్తరును ఉంచుకోవాలి.
JOH 12:8 బీదలు మీ మధ్య ఎప్పుడూ ఉంటారు కాని నేను మీతో ఉండను” అన్నారు.
JOH 12:9 అంతలో యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకున్న యూదులు గుంపుగా ఆయన కోసం మాత్రమే కాక చనిపోయి తిరిగి లేపబడిన లాజరును కూడా చూడాలని వచ్చారు.
JOH 12:10 ముఖ్య యాజకులు లాజరును కూడా చంపాలని ఆలోచన చేశారు.
JOH 12:11 ఎందుకంటే చనిపోయిన లాజరును యేసు బ్రతికించారని విన్న యూదులలో చాలామంది తమ వారిని విడిచిపెట్టి యేసును నమ్మారు.
JOH 12:12 మరునాడు పండుగకు వచ్చిన గొప్ప జనసమూహం యేసు యెరూషలేముకు వస్తున్నారని విని,
JOH 12:13 ఖర్జూరపు మట్టలు తీసుకుని, “హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!” “ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక!” అని కేకలువేస్తూ ఆయనను కలుసుకోడానికి వెళ్లారు.
JOH 12:14 యేసు ఒక గాడిద పిల్లను చూసి దానిపై కూర్చున్నారు. ఎందుకంటే లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
JOH 12:15 “సీయోను కుమారీ, భయపడకు! ఇదిగో, గాడిదపిల్ల మీద కూర్చుని నీ రాజు వస్తున్నాడు.”
JOH 12:16 మొదట ఆయన శిష్యులు ఈ సంగతులను గ్రహించలేదు. కాని యేసు మహిమ పరచబడిన తర్వాత మాత్రమే ఈ సంగతులన్ని ఆయన గురించే వ్రాయబడ్డాయని, అందుకే అవన్నీ ఆయనకు జరిగాయని జ్ఞాపకం చేసుకున్నారు.
JOH 12:17 యేసు సమాధిలో నుండి పిలిచి లాజరును మళ్ళీ బ్రతికించిన యేసుతో పాటు ఉన్న ప్రజలందరు ఆ విషయాన్ని ఇతరులకు చెప్తూనే ఉన్నారు.
JOH 12:18 ఆయన ఈ అద్భుత కార్యాన్ని చేశారని విన్న జనసమూహం ఆయనను కలుసుకోడానికి వస్తూనే ఉన్నారు.
JOH 12:19 దీని గురించి పరిసయ్యులు, “చూడండి, లోకమంతా ఆయన వెనుక ఎలా వెళ్తుందో! అయినా మనమేమి చేయలేకపోతున్నాం!” అని ఒకరితో ఒకరు అనుకున్నారు.
JOH 12:20 ఆ పండుగలో ఆరాధించడానికి వచ్చిన వారిలో కొందరు గ్రీసుదేశస్థులున్నారు.
JOH 12:21 వారు గలిలయలోని బేత్సయిదా గ్రామానికి చెందిన ఫిలిప్పు దగ్గరకు వచ్చి, “అయ్యా, మాకు యేసును చూడాలని ఉంది” అని అన్నారు.
JOH 12:22 ఫిలిప్పు వెళ్లి ఆ విషయం అంద్రెయతో చెప్పాడు. ఫిలిప్పు అంద్రెయ కలిసి వెళ్లి యేసుతో చెప్పారు.
JOH 12:23 అందుకు యేసు వారితో, “మనుష్యకుమారుడు మహిమ పొందే సమయం వచ్చింది.
JOH 12:24 నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది గింజగానే ఉండిపోతుంది. అది చస్తేనే విస్తారంగా ఫలిస్తుంది.
JOH 12:25 తన ప్రాణాన్ని ప్రేమించేవారు దానిని పోగొట్టుకుంటారు, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవారు దాన్ని నిత్యజీవం కోసం కాపాడుకుంటారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
JOH 12:26 నన్ను సేవించేవారు నన్ను వెంబడించాలి; అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నా సేవకులు అక్కడ ఉంటారు. ఇలా నన్ను సేవించే వానిని నా తండ్రి ఘనపరుస్తాడు.
JOH 12:27 “ఇప్పుడు నా ప్రాణం ఆందోళన చెందుతూ ఉంది, నేనేం చెప్పాలి? ‘తండ్రీ, ఈ గడియ నుండి నన్ను తప్పించవా?’ కానీ దీని కోసమే కదా నేను ఈ గడియకు చేరుకున్నాను.
JOH 12:28 తండ్రీ, నీ పేరుకు మహిమ కలిగించుకో!” అన్నారు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను దాన్ని మహిమపరిచాను, మళ్ళీ నేను మహిమపరుస్తాను” అని వినిపించింది.
JOH 12:29 అప్పుడు అక్కడ నిలబడి ఉన్న జనసమూహం అది విని, ఇప్పుడు ఉరిమింది కదా అన్నారు. మిగిలిన వారు, “ఒక దేవదూత అతనితో మాట్లాడాడు” అని అన్నారు.
JOH 12:30 అప్పుడు యేసు, “ఆ స్వరం నా కోసం రాలేదు అది మీ కోసమే వచ్చింది.
JOH 12:31 ఇప్పుడు లోకానికి తీర్పు తీర్చే సమయం. ఇది ఈ లోకాధికారిని తరిమి వేసే సమయం.
JOH 12:32 నేను భూమిమీది నుండి మీదికి ఎత్తబడినప్పుడు, మానవులందరిని నా దగ్గరకు ఆకర్షించుకుంటాను” అని అన్నారు.
JOH 12:33 ఆయన తాను పొందబోయే మరణాన్ని సూచిస్తూ ఈ మాటను చెప్పారు.
JOH 12:34 ఆ జనసమూహం, “క్రీస్తు ఎల్లప్పుడు ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని మేము విన్నాం, మరి మనుష్యకుమారుడు మీదికి ఎత్తబడాలని నీవెలా చెప్తావు? ఈ మనుష్యకుమారుడు ఎవరు?” అని అడిగారు.
JOH 12:35 అందుకు యేసు వారితో, “ఇంకా కొంతకాలం మాత్రమే మీ మధ్య వెలుగు ఉంటుంది. చీకటిలో నడిచేవానికి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కాబట్టి మిమ్మల్ని చీకటి కమ్ముకోక ముందే వెలుగు ఉన్నప్పుడే నడవండి.
JOH 12:36 మీరు వెలుగు కుమారులుగా మారడానికి మీకు వెలుగు ఉన్నప్పుడే వెలుగును నమ్మండి” అని అన్నారు. యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత, అక్కడినుండి వెళ్లి వారికి కనబడకుండా రహస్యంగా ఉన్నారు.
JOH 12:37 యేసు వారి ఎదుట అనేక అద్భుత కార్యాలను చేసిన తర్వాత కూడ వారు ఆయనను నమ్మలేదు.
JOH 12:38 దానికి కారణం, “ప్రభువా, మా సందేశాన్ని ఎవరు నమ్మారు, ప్రభువు హస్తం ఎవరికి వెల్లడయింది?” అని యెషయా ప్రవక్త చెప్పిన మాటలు నెరవేరాలి.
JOH 12:39 అందుకే వారు నమ్మలేకపోయారు, ఎందుకంటే మరొక చోట యెషయా ఇలా అన్నాడు:
JOH 12:40 “ఆయన వారి కళ్ళకు గ్రుడ్డితనాన్ని, వారి హృదయాలకు కాఠిన్యాన్ని కలుగజేశారు. అలా చేసి ఉండకపోతే వారు తమ కళ్లతో చూసి హృదయాలతో గ్రహించి, వారు నా తట్టు తిరిగి ఉండేవారు అప్పుడు నేను వారిని స్వస్థపరచే వానిని.”
JOH 12:41 యెషయా యేసు మహిమను చూశాడు కాబట్టి ఆయనను గురించి ఈ మాట చెప్పాడు.
JOH 12:42 అధికారులలో కూడ చాలామంది ఆయనను నమ్మారు. కాని వారు తమ విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకుంటే పరిసయ్యులు తమను సమాజమందిరం నుండి వెలివేస్తారని భయపడ్డారు.
JOH 12:43 ఎందుకంటే వారు దేవుని మెప్పు కన్నా, ప్రజల మెప్పునే ఎక్కువగా ఇష్టపడ్డారు.
JOH 12:44 అప్పుడు యేసు బిగ్గరగా, “ఎవరైతే నన్ను నమ్ముతారో, వారు నన్ను మాత్రమే కాదు, నన్ను పంపినవానిని కూడ నమ్ముతారు.
JOH 12:45 నన్ను చూసేవాడు నన్ను పంపినవానిని చూస్తున్నాడు.
JOH 12:46 నన్ను నమ్మిన ఏ ఒక్కరు చీకటిలో ఉండకూడదని, నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను.
JOH 12:47 “ఎవరైనా నా మాటలు విని వాటిని పాటించకపోతే నేను వానికి తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికే వచ్చాను తప్ప తీర్పు తీర్చడానికి రాలేదు.
JOH 12:48 నన్ను తిరస్కరించి నా మాటలు స్వీకరించని వాని కోసం ఒక న్యాయాధిపతి ఉన్నాడు; నేను పలికిన ఈ మాటలే చివరి రోజున వాన్ని తీర్పు తీరుస్తాయి.
JOH 12:49 నా అంతట నేను మాట్లాడడం లేదు; నేను ఏమి మాట్లాడాలని నన్ను పంపిన తండ్రి నన్ను ఆజ్ఞాపించాడో దాన్నే నేను మాట్లాడాను.
JOH 12:50 తండ్రి ఆజ్ఞ నిత్యజీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుకే తండ్రి చెప్పమని నాకు చెప్పిన మాటలనే నేను చెప్తున్నాను” అని చెప్పారు.
JOH 13:1 పస్కా పండుగకు ముందే యేసు తాను ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు వెళ్లవలసిన సమయం వచ్చిందని గ్రహించారు. ఈ లోకంలో ఉన్న తన సొంత వారిని ఆయన అంతం వరకు ప్రేమించారు.
JOH 13:2 వారు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు, అప్పటికే యేసును అప్పగించాలని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాను అపవాది ప్రేరేపించాడు.
JOH 13:3 తండ్రి అన్నిటిని తనకు అప్పగించాడని, తాను దేవుని దగ్గర నుండి వచ్చాడని, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తాడని యేసుకు తెలుసు.
JOH 13:4 కాబట్టి ఆయన భోజనం దగ్గర నుండి లేచి తన పైవస్త్రాన్ని తీసి, ఒక తువాలును నడుముకు కట్టుకున్నారు.
JOH 13:5 ఆ తర్వాత ఒక పళ్లెంలో నీళ్లు పోసి, తన శిష్యుల పాదాలు కడిగి తాను కట్టుకుని ఉన్న తువాలు తీసి దానితో పాదాలు తుడవడం మొదలుపెట్టారు.
JOH 13:6 ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చినప్పుడు, అతడు, “ప్రభువా, నీవు నా పాదాలు కడుగుతావా?” అని అన్నాడు.
JOH 13:7 అందుకు యేసు, “నేను చేస్తుంది ఇప్పుడు నీకు అర్థం కాదు కాని తర్వాత నీవు అర్థం చేసుకుంటావు” అన్నారు.
JOH 13:8 పేతురు, “వద్దు ప్రభువా, నీవు ఎప్పుడు నా పాదాలు కడుగకూడదు” అన్నాడు. అందుకు యేసు జవాబిస్తూ, “నేను నిన్ను కడక్కపోతే, నాతో నీకు పాలు ఉండదు” అన్నారు.
JOH 13:9 అప్పుడు సీమోను పేతురు, “అయితే ప్రభువా, నా పాదాలే కాదు నా చేతులు తల కూడా కడుగు!” అన్నాడు.
JOH 13:10 అందుకు యేసు, “స్నానం చేసిన వారి శరీరం మొత్తం శుభ్రంగానే ఉంటుంది, కాబట్టి వారు పాదాలను మాత్రం కడుక్కుంటే చాలు; మీరు శుద్ధులే, కాని అందరు కాదు” అని అన్నారు.
JOH 13:11 ఆయనను ఎవరు అప్పగించబోతున్నారో ఆయనకు ముందే తెలుసు, అందుకే ఆయన, “మీలో అందరు శుద్ధులు కారు” అన్నారు.
JOH 13:12 ఆయన వారి పాదాలు కడిగి, తన పైవస్త్రాన్ని వేసుకుని తన కూర్చున్న చోటికి తిరిగివెళ్లి, “నేను చేసింది మీకు అర్థమైందా?” అని ఆయన వారిని అడిగి ఇలా చెప్పడం మొదలుపెట్టారు:
JOH 13:13 “అవును, మీరు నన్ను ‘బోధకుడని, ప్రభువని’ పిలుస్తున్నారు. అది నిజమే కాబట్టి మీరలా పిలువడం న్యాయమే.
JOH 13:14 నేను మీకు ప్రభువుగా బోధకునిగా ఉండి, మీ పాదాలు కడిగాను, కాబట్టి మీరు కూడ ఒకరి పాదాలు ఒకరు కడగాలి.
JOH 13:15 నేను మీ కోసం చేసినట్లే మీరు కూడ చేయాలని నేను మీకు మాదిరిని చూపించాను.
JOH 13:16 ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాలేడు, అలాగే ఒక సందేశాన్ని తీసుకెళ్లేవాడు సందేశాన్ని పంపినవాని కన్నా గొప్పవాడు కాలేడని నేను మీతో చెప్పేది నిజం.
JOH 13:17 ఇప్పుడు మీకు ఈ సంగతులు తెలుసు కాబట్టి వాటిని పాటిస్తే మీరు ధన్యులు.
JOH 13:18 “నేను మీ అందరి గురించి చెప్పడం లేదు; మీలో నేను ఎంపిక చేసుకున్నవారెవరో నాకు తెలుసు. అయితే ‘నా ఆహారం తిన్నవాడే నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తుతాడు’ అనే లేఖనం నెరవేరడానికి అలా జరగాలి.
JOH 13:19 “అయితే అది జరగకముందే నేను మీతో చెప్తున్నాను ఎందుకంటే అది జరిగినప్పుడు, ‘నేనే ఎల్లకాలం ఉన్నవాడను’ అని మీరు నమ్మాలని చెప్తున్నాను.
JOH 13:20 నేను పంపేవాన్ని స్వీకరించేవారు నన్ను స్వీకరిస్తారు; నన్ను స్వీకరించిన వారు నన్ను పంపినవాన్ని స్వీకరిస్తారు అని నేను మీతో చెప్పేది నిజం” అని చెప్పారు.
JOH 13:21 యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత, తన ఆత్మలో కలవరపడి ఆయన వారితో, “మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు.
JOH 13:22 ఆయన తమలో ఎవరిని గురించి చెప్తున్నాడోనని శిష్యులు ఒకరిని ఒకరు అనుమానంతో చూడసాగారు.
JOH 13:23 ఆయన శిష్యులలో ఒకడు అనగా యేసు రొమ్మును ఆనుకుని ఉన్న యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రక్కన కూర్చుని ఉన్నాడు.
JOH 13:24 సీమోను పేతురు ఆ శిష్యునికి సైగ చేసి, “ఆయన చెప్పేది ఎవరి గురించి అని ఆయనను అడుగు” అన్నాడు.
JOH 13:25 అతడు యేసు రొమ్ముకు ఇంకా దగ్గరగా ఆనుకుని, “ప్రభువా, అతడు ఎవరు?” అని ఆయనను అడిగాడు.
JOH 13:26 యేసు, “ఈ గిన్నెలో రొట్టె ముక్కను ముంచి నేను ఎవరికి ఇస్తానో అతడే” అని ఆయన ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు ఇచ్చారు.
JOH 13:27 యూదా ఆ రొట్టెను తీసుకున్న వెంటనే సాతాను అతనిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో, “నీవు చేయబోయేది త్వరగా చేయు” అన్నారు.
JOH 13:28 కాని యేసు అతనితో అలా ఎందుకు అన్నారో ఆ భోజనబల్ల దగ్గర ఉన్న ఎవరికీ అర్థం కాలేదు.
JOH 13:29 యూదాకు డబ్బు బాధ్యత ఇవ్వబడి ఉండింది కాబట్టి పండుగ కోసం అవసరమైన వాటిని కొనడానికో, పేదవారికి ఏమైనా ఇవ్వమని యేసు అతనితో చెప్తున్నాడని కొందరు అనుకున్నారు.
JOH 13:30 యూదా రొట్టెను తీసుకున్న వెంటనే వెళ్లిపోయాడు. అది రాత్రి సమయం.
JOH 13:31 అతడు వెళ్లిపోయిన తర్వాత యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమ పొందాడు, అలాగే దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు.
JOH 13:32 దేవుడు కుమారునిలో మహిమపరచబడినట్లైతే దేవుడు తనలో ఆయనను మహిమపరుస్తారు. వెంటనే కుమారుని మహిమపరుస్తారు.
JOH 13:33 “నా పిల్లలారా, నేను మీతో ఇంకా కొంత సమయమే ఉంటాను. నేను యూదులకు చెప్పినట్లే ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను: మీరు నన్ను వెదకుతారు, కాని నేను వెళ్లే చోటికి మీరు రాలేరు.
JOH 13:34 “ఒక క్రొత్త ఆజ్ఞను మీకిస్తున్నాను: మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి; నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి.
JOH 13:35 మీరు ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉంటే, జనులందరు మీరు నా శిష్యులని తెలుసుకుంటారు” అన్నారు.
JOH 13:36 సీమోను పేతురు ఆయనతో, “ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, “నేను వెళ్లే చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, నీవు తర్వాత వస్తావు” అని అతనితో అన్నారు.
JOH 13:37 అయితే పేతురు, “ప్రభువా, నేను ఇప్పుడెందుకు రాలేను? నీకోసం నేను నా ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తాను” అన్నాడు.
JOH 13:38 అప్పుడు యేసు, “నీవు నిజంగా నా కోసం నీ ప్రాణం త్యాగం చేస్తావా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీవు కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదని మూడుసార్లు అబద్దమాడుతావు.
JOH 14:1 “మీ హృదయాలను కలవరపడనీయకండి. దేవుని నమ్మండి; నన్ను కూడా నమ్మండి.
JOH 14:2 నా తండ్రి ఇంట్లో చాలా నివాసస్థలాలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే, మీ కోసం స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నానని నేను మీతో చెప్పి ఉండేవాడినా?
JOH 14:3 నేను వెళ్లి మీ కోసం నివాస స్థలాన్ని సిద్ధపరచి, మళ్ళీ వచ్చి నాతో పాటు ఉండడానికి నేను ఉండే స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తాను.
JOH 14:4 నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ స్థలానికి మార్గం మీకు తెలుసు” అన్నారు.
JOH 14:5 తోమా ఆయనతో, “ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకు ఆ మార్గం ఎలా తెలుస్తుంది?” అన్నాడు.
JOH 14:6 అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, “నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు.
JOH 14:7 మీరు నన్ను నిజంగా తెలుసుకుని ఉంటే, మీకు నా తండ్రి కూడా తెలిసి ఉండేవాడు. ఇప్పటినుండి ఆయన మీకు తెలుసు, మీరు ఆయనను చూశారు” అన్నారు.
JOH 14:8 అందుకు ఫిలిప్పు, “ప్రభువా, మాకు తండ్రిని చూపించు, మాకది చాలు” అన్నాడు.
JOH 14:9 యేసు అతనితో, “ఫిలిప్పూ, నేను ఇంతకాలం మీతో ఉన్నా నేను నీకు తెలియదా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే. అలాంటప్పుడు ‘తండ్రిని చూపించు’ అని ఎలా అడుగుతున్నావు?
JOH 14:10 నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నీవు నమ్మడం లేదా? నేను మీతో మాట్లాడే మాటలు నా స్వంత మాటలు కావు, నాలో జీవిస్తూ, తన కార్యాలను చేస్తున్న తండ్రియే మాట్లాడుతున్నాడు.
JOH 14:11 నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నామని నేను చెప్పితే నన్ను నమ్మండి; లేదా కనీసం దానికి రుజువుగా ఉన్న అద్భుత కార్యాలను చూసి నమ్మండి.
JOH 14:12 నన్ను నమ్మేవారు నేను చేస్తున్న క్రియలు చేయడమే కాదు, వీటికన్నా గొప్ప వాటిని చేస్తారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను.
JOH 14:13 మీరు నా పేరిట ఏది అడుగుతారో, తండ్రి కుమారునిలో మహిమ పొందునట్లు నేను దాన్ని చేస్తాను.
JOH 14:14 మీరు నా పేరిట ఏమి అడిగినా నేను చేస్తాను.
JOH 14:15 “మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు.
JOH 14:16 మీతో ఎల్లప్పుడు ఉండేలా మరొక ఆదరణకర్తను మీకు ఇవ్వమని, నేను తండ్రిని అడుగుతాను.
JOH 14:17 ఆయన సత్యమైన ఆత్మ. ఈ లోకం ఆయనను చూడలేదు తెలుసుకోలేదు, కాబట్టి ఆయనను అంగీకరించదు. కానీ మీకు ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన మీలో జీవిస్తున్నాడు మీలో ఉంటాడు.
JOH 14:18 నేను మీ దగ్గరకు వస్తాను, మిమ్మల్ని అనాధలుగా విడిచిపెట్టను.
JOH 14:19 కొంత కాలమైన తర్వాత ఈ లోకం ఇక నన్ను చూడదు, కాని మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తారు.
JOH 14:20 నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామని మీరు ఆ రోజు గుర్తిస్తారు.
JOH 14:21 నా ఆజ్ఞలను పాటించేవారు నన్ను ప్రేమించేవారు. నన్ను ప్రేమించేవారిని నా తండ్రి ప్రేమిస్తాడు, నేను కూడ వారిని ప్రేమించి నన్ను నేను వారికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నారు.
JOH 14:22 యూదా ఇస్కరియోతు కాదు, మరొక యూదా యేసుతో, “కానీ ప్రభువా, నీవు ఈ లోకానికి కాకుండా మాకే ఎందుకు కనుపరచుకోవాలని అనుకుంటున్నావు?” అని అడిగాడు.
JOH 14:23 అందుకు యేసు, “ఎవరైనా నన్ను ప్రేమిస్తే వారు నా బోధను పాటిస్తారు. కాబట్టి నా తండ్రి వానిని ప్రేమిస్తాడు మేము వారి దగ్గరకు వచ్చి వారితో నివాసం చేస్తాము.
JOH 14:24 నన్ను ప్రేమించనివారు నా బోధలను పాటించరు. మీరు వింటున్న ఈ మాటలు నా సొంతం కాదు; అవి నన్ను పంపిన తండ్రి మాటలు.
JOH 14:25 “నేను మీ మధ్య ఉన్నప్పుడే ఈ సంగతులను మీతో చెప్పాను.
JOH 14:26 కానీ నా పేరిట తండ్రి పంపించు ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ, మీకు అన్ని విషయాలను బోధిస్తూ నేను మీకు చెప్పిన వాటినన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాడు.
JOH 14:27 నా సమాధానాన్ని మీతో వదిలి వెళ్తున్నాను; నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. నేను ఈ లోకం ఇచ్చినట్టుగా ఇవ్వడం లేదు మీ హృదయాలను కలవరపడనీయకండి, భయపడకండి.
JOH 14:28 “ ‘నేను వెళ్లి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను’ అని నేను చెప్పిన మాటను మీరు విని ఉన్నారు. అయితే మీరు నన్ను ప్రేమిస్తే, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నానని సంతోషించేవారు, ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు.
JOH 14:29 అది జరిగినప్పుడు మీరు నమ్మాలని, అది జరుగక ముందే ఇప్పుడే మీకు చెప్పాను.
JOH 14:30 నేను మీతో ఇంతకంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఈ లోకాధికారి వస్తున్నాడు. కానీ అతనికి నా మీద అధికారం లేదు.
JOH 14:31 అయితే నేను తండ్రిని ప్రేమిస్తున్నానని, తండ్రి నాకు ఆజ్ఞాపించిన వాటిని మాత్రమే నేను చేస్తున్నానని ఈ లోకం తెలుసుకోవాలనే అతడు వస్తాడు. “లేవండి, ఇక్కడినుండి వెళ్దాము.
JOH 15:1 “నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.
JOH 15:2 నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన కత్తిరించి పారవేస్తారు. ఫలించే ప్రతితీగె అధికంగా ఫలించడానికి ఆయన దానిని కత్తిరించి సరిచేస్తారు.
JOH 15:3 నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పటికే శుద్ధులు.
JOH 15:4 నేను మీలో నిలిచేలా మీరు నాలో నిలిచి ఉండండి. ఒక ద్రాక్ష తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే తప్ప తనంతట తాను ఫలించలేదు; అలాగే మీరు కూడా నాలో నిలిచి ఉంటేనే తప్ప ఫలించలేరు.
JOH 15:5 “నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలు. మీరు నాలో ఉండి, నేను మీలో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఫలిస్తారు. నా నుండి మీరు వేరుగా ఉండి ఏమి చేయలేరు.
JOH 15:6 మీరు నాలో ఉండకపోతే, బయట పారవేయబడిన కొమ్మలా ఎండిపోతారు; అలాంటి కొమ్మలను పోగు చేసి అగ్నిలో వేసి కాల్చివేస్తారు.
JOH 15:7 మీరు నాలో నిలిచి నా మాటలు మీలో నిలిచి ఉంటే, మీకు ఇష్టమైన దానిని అడగండి, అది మీకు జరుతుంది.
JOH 15:8 మీరు నా శిష్యులుగా ఉండి ఎక్కువగా ఫలిస్తే నా తండ్రికి మహిమ కలుగుతుంది.
JOH 15:9 “తండ్రి నన్ను ప్రేమించినట్లే, నేను మిమ్మల్ని ప్రేమించాను. కాబట్టి మీరు నా ప్రేమలో నిలిచి ఉండండి.
JOH 15:10 నేను నా తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లే, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే, నా ప్రేమలో నిలిచి ఉంటారు.
JOH 15:11 అప్పుడు నా సంతోషం మీలో ఉండి, మీ సంతోషం పరిపూర్ణం కావాలని, నేను ఈ సంగతులను మీతో చెప్పాను.
JOH 15:12 నేను ఇచ్చే ఆజ్ఞ ఇదే: నేను మిమ్మల్ని ప్రేమించినట్లే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి.
JOH 15:13 ఒకడు తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టే ప్రేమకంటే గొప్ప ప్రేమ లేదు.
JOH 15:14 నా ఆజ్ఞల ప్రకారం మీరు చేస్తే మీరు నా స్నేహితులు అవుతారు.
JOH 15:15 నేను మిమ్మల్ని సేవకులని ఇక పిలువను. ఎందుకంటే ఏ సేవకునికైనా తన యజమానుడు చేసే పనులు తెలియవు. నేనైతే మిమ్మల్ని స్నేహితులనే పిలుస్తున్నాను. ఎందుకంటే నేను నా తండ్రి నుండి విన్న విషయాలన్నిటిని మీకు తెలియజేశాను.
JOH 15:16 మీరు నన్ను ఎంచుకోలేదు, కాని నేనే మిమ్మల్ని ఎంచుకుని మీరు వెళ్లి ఫలించాలని మీ ఫలం నిలిచి ఉండాలని మిమ్మల్ని నియమించాను. కాబట్టి మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇవ్వాలని ఇలా చేశాను.
JOH 15:17 నా ఆజ్ఞ ఇదే: ఒకరిని ఒకరు ప్రేమించండి.
JOH 15:18 “ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే అది మీకంటె ముందుగా నన్ను ద్వేషించిందని మీరు గ్రహించాలి.
JOH 15:19 మీరు ఈ లోకానికి చెందినవారైతే అది మిమ్మల్ని సొంత వారిలా ప్రేమించేది. కానీ మీరు ఈ లోకానికి చెందినవారు కారు, నేను మిమ్మల్ని ఈ లోకం నుండి ప్రత్యేకించాను; అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.
JOH 15:20 నేను మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి: ‘ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాడు.’ వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా బోధకు లోబడి ఉంటే, వారు మీ బోధకు కూడా లోబడుతారు.
JOH 15:21 నా నామాన్ని బట్టి వారు మీ పట్ల ఇలా ప్రవర్తిస్తారు, ఎందుకంటే వారికి నన్ను పంపినవారెవరో తెలియదు అందుకే ఇలా చేస్తారు.
JOH 15:22 నేను వచ్చి వారితో ఈ విషయాలను మాట్లాడి ఉండకపోతే, వారికి పాపం ఉండేది కాదు; కాని ఇప్పుడు వారు పాపం చేయలేదని తప్పించుకునే అవకాశం లేదు.
JOH 15:23 నన్ను ద్వేషించేవారు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నారు.
JOH 15:24 ఎవరూ చేయని ఈ అద్భుత కార్యాలను నేను వారి మధ్యలో చేసి ఉండకపోతే వారికి పాపం ఉండేది కాదు. అయితే ఇప్పుడు వారు వాటిని చూసి కూడా నన్ను, నా తండ్రిని ద్వేషిస్తున్నారు.
JOH 15:25 ‘కారణం లేకుండా వారు నన్ను ద్వేషించారు’ అని ధర్మశాస్త్రంలో వ్రాయబడినది నెరవేరడానికి ఇది జరిగింది.
JOH 15:26 “తండ్రి నుండి నేను పంపబోయే ఆదరణకర్త అనగా సత్యమైన ఆత్మ తండ్రి దగ్గరి నుండి వచ్చినప్పుడు నా గురించి ఆయన సాక్ష్యం ఇస్తారు.
JOH 15:27 మీరు మొదటి నుండి నాతో ఉన్నవారే, కాబట్టి మీరు కూడ తప్పక నా గురించి సాక్ష్యం ఇవ్వాలి.
JOH 16:1 “మీరు విశ్వాసం నుండి తొలగిపోకూడదని నేను మీకు ఈ సంగతులను చెప్పాను.
JOH 16:2 వారు మిమ్మల్ని సమాజమందిరంలో నుండి వెలివేస్తారు; నిజానికి, మిమ్మల్ని చంపినవారు దేవుని కోసం మంచి పని చేస్తున్నామని భావించే ఒక సమయం వస్తుంది.
JOH 16:3 వారు నన్ను గాని, తండ్రిని గాని తెలుసుకోలేదు కాబట్టి వారు ఇలాంటి పనులను చేస్తారు.
JOH 16:4 అవి జరిగేటప్పుడు ఇలా జరుగుతుందని నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరించానని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు చెప్పాను. మొదట్లో ఈ సంగతులను మీతో చెప్పలేదు ఎందుకంటే అప్పుడు నేను మీతోనే ఉన్నాను.
JOH 16:5 ఇప్పుడు నేను నన్ను పంపినవాని దగ్గరకు వెళ్తున్నాను. అయినా, ‘నీవు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు.
JOH 16:6 కానీ నేను చెప్పిన ఈ సంగతులను గురించి మీ హృదయాలు దుఖంతో నిండి ఉన్నాయి.
JOH 16:7 అయితే నేను మీతో చెప్పేది నిజం, నేను వెళ్లిపోవడం మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్లకుండా ఆదరణకర్త మీ దగ్గరికి రారు. నేను వెళ్తే ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను.
JOH 16:8 ఆయన వచ్చినప్పుడు, పాపం గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకస్తులను తప్పు ఒప్పుకునేలా చేస్తాడు.
JOH 16:9 ప్రజలు నన్ను నమ్మలేదు కాబట్టి వారి పాపం గురించి, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి ఇక మీరు నన్ను చూడరు కాబట్టి వారి నీతిని గురించి,
JOH 16:11 ఈ లోకాధికారి ఇప్పుడు తీర్పుపొందినవానిగా ఉన్నాడు కాబట్టి తీర్పు గురించి ఒప్పింపజేస్తాడు.
JOH 16:12 “మీతో ఇంకా చాలా చెప్పాల్సి ఉంది, కాని మీరు ఇప్పుడు వాటిని భరించలేరు.
JOH 16:13 అయితే సత్యమైన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను మాట్లాడడు; తాను విన్నవాటినే ఆయన చెప్తాడు, జరుగబోయే వాటిని మీకు చెప్తాడు.
JOH 16:14 ఆయన నా నుండి వినే వాటినే మీకు తెలియచేస్తూ నన్ను మహిమపరుస్తాడు.
JOH 16:15 నా తండ్రికి ఉన్నవన్నీ నావే. అందుకే ఆత్మ నా నుండి వినే వాటినే మీకు తెలియజేస్తాడని నేను చెప్పాను.”
JOH 16:16 యేసు ఇంకా చెప్తూ, “ఇంకా కొద్ది సమయం తర్వాత మీరు నన్ను చూడరు, ఆ తర్వాత మరికొద్ది సమయానికి మీరు నన్ను చూస్తారు.”
JOH 16:17 అప్పుడు ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, “ఆయన చెప్తున్న, ‘నేను నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ కాబట్టి ‘కొద్ది కాలం మీరు నన్ను చూడరు. ఆ తర్వాత కొంతకాలానికి మీరు నన్ను చూస్తారు’ అనే మాటలకు అర్థం ఏమైయుంటుంది?” అని చెప్పుకొన్నారు.
JOH 16:18 వారు, “ ‘ఇంకా కొద్ది సమయం’ అంటే ఆయన అర్థమేంటి? ఆయన ఏమి చెప్తున్నారో మనకు అర్థం కావడం లేదు” అని అనుకున్నారు.
JOH 16:19 యేసు తన శిష్యులు ఆ విషయం గురించి తనను అడగాలని అనుకుంటున్నారని గ్రహించి వారితో, “ఇంకా కొద్ది సమయం తర్వాత మీరు నన్ను చూడరు, దాని తర్వాత ఇంకొద్ది సమయానికి మీరు నన్ను చూస్తారు” అని నేను చెప్పినదాని గురించి మీరు ఒకరిని ఒకరు అడుగుతున్నారా?
JOH 16:20 నేను మీతో చెప్పేది నిజం, మీరు ఏడుస్తూ దుఃఖిస్తున్న సమయంలో ఈ లోక ప్రజలు సంతోషిస్తారు. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం సంతోషంగా మారుతుంది.
JOH 16:21 ఒక స్త్రీ ప్రసవించు సమయం వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడుతుంది; కానీ శిశువు పుట్టగానే తన ద్వారా ఈ లోకానికి ఒక బిడ్డ పుట్టాడనే ఆనందంలో తాను పడిన వేదనంతా ఆమె మరచిపోతుంది.
JOH 16:22 మీ విషయంలో కూడా అంతే; మీకు ఇది దుఃఖ సమయం, కాని నేను తిరిగి మిమ్మల్ని చూసినప్పుడు మీ హృదయాంతరంగంలో నుండి ఆనందిస్తారు. ఆ ఆనందాన్ని మీ దగ్గర నుండి ఎవ్వరూ తీసివేయలేరు.
JOH 16:23 ఆ రోజు మీరు ఇక నన్ను దేని గురించి అడగరు. మీరు నా పేరట నా తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇస్తారని నేను మీతో చెప్పేది నిజం.
JOH 16:24 ఇప్పటివరకు మీరు నా పేరట ఏమి అడగలేదు. అడగండి మీరు పొందుకొంటారు, మీ ఆనందం పరిపూర్ణమవుతుంది.
JOH 16:25 “ఇంతవరకు నేను మీతో ఉపమానాలతో చెప్పాను. కానీ ఒక సమయం వస్తుంది అప్పుడు నా తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజేస్తాను.
JOH 16:26 ఆ రోజు మీరు నా పేరిట అడుగుతారు. అయితే మీ కోసం నేను తండ్రిని అడుగుతానని చెప్పడం లేదు.
JOH 16:27 ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని దగ్గరి నుండి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
JOH 16:28 నేను తండ్రి దగ్గరి నుండి బయలుదేరి ఈ లోకానికి వచ్చాను; ఇప్పుడు నేను లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తున్నాను” అన్నారు.
JOH 16:29 అప్పుడు యేసు శిష్యులు, “ఇప్పుడు నీవు ఉపమానాలతో కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నావు.
JOH 16:30 నీకు అన్ని సంగతులు తెలుసని, ఎవరు నిన్ను ప్రశ్నించే అవసరం లేదని మేము గ్రహిస్తున్నాము. దీనిని బట్టి నీవు దేవుని నుండి వచ్చావని మేము నమ్ముతున్నాం” అన్నారు.
JOH 16:31 యేసు వారితో, “ఇప్పుడు మీరు నమ్ముతున్నారా?” అన్నారు.
JOH 16:32 “ఒక సమయం రాబోతుంది, అది ఇప్పటికే వచ్చేసింది అప్పుడు మీలో ప్రతి ఒక్కరు నన్ను ఒంటరిగా విడిచి, ఎవరి ఇంటికి వారు చెదరిపోతారు. అయినాసరే నేను ఒంటరి వానిని కాను, ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు.
JOH 16:33 “ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. అయినా ధైర్యం తెచ్చుకోండి! ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. నాలో మీకు సమాధానం ఉండాలని ఈ సంగతులను మీకు చెప్పాను” అన్నారు.
JOH 17:1 యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత ఆకాశం వైపు చూస్తూ ఇలా ప్రార్థించారు: “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచేలా నీ కుమారుని మహిమపరచు.
JOH 17:2 నీవు నీ కుమారునికి అప్పగించిన వారందరికి నిత్యజీవం అనుగ్రహించడానికి ప్రజలందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు.
JOH 17:3 నీవు మాత్రమే నిజ దేవుడవని, యేసు క్రీస్తు నీవు పంపినవాడని వారు తెలుసుకోవడమే నిత్యజీవం.
JOH 17:4 నీవు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరిచాను.
JOH 17:5 తండ్రీ, ఈ లోక ఆరంభానికి ముందు నీతో నాకు ఉండిన మహిమతో ఇప్పుడు నన్ను నీ సన్నిధిలో మహిమపరచు.
JOH 17:6 “ఈ లోకంలో నుండి నీవు నాకు ఇచ్చిన వారికి నేను నిన్ను తెలియపరిచాను. వారు నీవారు; నీవు వారిని నాకు ఇచ్చావు వారు నీ వాక్యాన్ని పాటించారు.
JOH 17:7 ఇప్పుడు వారు నీవు నాకు ఇచ్చినవన్ని నీ దగ్గర నుండే వచ్చాయని తెలుసుకున్నారు.
JOH 17:8 ఎందుకంటే నీవు నాకు ఇచ్చిన మాటలను నేను వారికి ఇచ్చాను. వారు వాటిని అంగీకరించి నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చానని వారు తెలుసుకుని నీవు నన్ను పంపావని నమ్మారు.
JOH 17:9 నేను వారి కోసం ప్రార్థిస్తున్నాను. నేను లోకం కోసం ప్రార్థన చేయడం లేదు, కాని నీవు నాకు ఇచ్చినవారు నీవారు కాబట్టి వారి కోసం ప్రార్థిస్తున్నాను.
JOH 17:10 నాకు ఉన్నవన్నీ నీవి, నీకు ఉన్నవన్నీ నావి. వారి ద్వారా నాకు మహిమ కలిగింది.
JOH 17:11 నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, కాబట్టి లోకంలో ఇక ఉండను. కాని వారైతే ఇంకా లోకంలోనే ఉన్నారు. పరిశుద్ధ తండ్రీ, నీ పేరిట అనగా నీవు నాకిచ్చిన పేరిట వారిని కాపాడు. అప్పుడు మనం ఏకమై ఉన్నట్లు వారు ఏకమై ఉంటారు.
JOH 17:12 నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఇచ్చిన పేరిట వారిని రక్షించి భద్రంగా ఉంచాను. లేఖనాలు నెరవేరేలా నాశనానికి దిగజారిన ఒక్కడు తప్ప మరి ఎవరు తప్పిపోలేదు.
JOH 17:13 “ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను. అయినా నా ఆనందం వారిలో పరిపూర్ణం కావాలని నేను ఇంకా ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ విషయాలను చెప్తున్నాను.
JOH 17:14 నేను నీ వాక్యాన్ని వారికి ఇచ్చాను. వారు కూడా నాలాగే ఈ లోకానికి చెందినవారు కారు కాబట్టి లోకం వారిని ద్వేషించింది.
JOH 17:15 ఈ లోకం నుండి నీవు వారిని తీసుకో అని నేను ప్రార్థన చేయడం లేదు కాని, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను.
JOH 17:16 నేను ఈ లోకానికి చెందనట్లే, వారు కూడ ఈ లోకానికి చెందినవారు కారు.
JOH 17:17 సత్యంతో వారిని పవిత్రపరచు; నీ వాక్యమే సత్యము.
JOH 17:18 నీవు నన్ను ఈ లోకానికి పంపించినట్లే, నేను వారిని ఈ లోకానికి పంపించాను.
JOH 17:19 వారు కూడా సత్యంలో ప్రతిష్ఠ చేయబడాలని, వారి కోసం నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను.
JOH 17:20 “నేను వారి కోసం మాత్రమే కాదు కాని, వారి మాటల ద్వారా నిన్ను నమ్మబోయే వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను.
JOH 17:21 నీవు నన్ను పంపించావని లోకం నమ్మేలా తండ్రీ, నీవు నాలో, నేను నీలో ఏకమై ఉన్నట్లు వారు కూడా ఒకటిగా ఉండాలి. నీవు నన్ను పంపించావని లోకం నమ్మేలా వారు మనలో కూడా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
JOH 17:22 మనం ఏకంగా ఉన్నట్లు వారు కూడ ఏకంగా ఉండాలని నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను.
JOH 17:23 అప్పుడు నీవే నన్ను పంపావని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావని లోకం తెలుసుకుంటుంది.
JOH 17:24 “తండ్రీ, నీవు నన్ను సృష్టికి పునాది వేయబడక ముందే ప్రేమించి నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడడానికి నేను ఎక్కడ ఉంటానో అక్కడ, నీవు నాకు ఇచ్చిన వారందరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
JOH 17:25 “నీతిగల తండ్రీ, ఈ లోకానికి నీవు తెలియకపోయినా, నాకు నీవు తెలుసు. నీవే నన్ను పంపావని వీరికి తెలుసు.
JOH 17:26 నా పట్ల నీకున్న ప్రేమ వీరిలో ఉండాలని, నేను వారిలో ఉండాలని నేను నీ నామాన్ని వీరికి తెలియజేశాను. ఇంకా తెలియజేస్తూనే ఉంటాను.”
JOH 18:1 యేసు ప్రార్థించిన తర్వాత తన శిష్యులతో కలిసి కెద్రోను వాగు దాటి, దానికి మరొకవైపున ఉన్న ఒలీవల తోటలోకి వెళ్లారు.
JOH 18:2 యేసు తన శిష్యులతో తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవారు, కాబట్టి ఆయనను అప్పగించబోయే యూదాకు ఆ చోటు తెలుసు.
JOH 18:3 కాబట్టి యూదా తనతో సైనికుల గుంపును ముఖ్య యాజకులు పరిసయ్యులు పంపిన అధికారులను వెంటబెట్టుకొని, దివిటీలతో, దీపాలతో ఆయుధాలతో తోటకు వచ్చాడు.
JOH 18:4 యేసు తనకు ఏమి జరుగబోతుందో తెలిసి కూడా బయటకు వెళ్లి వారితో, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు.
JOH 18:5 “నజరేయుడైన యేసు” అని వారు జవాబిచ్చారు. “ఆయనను నేనే” అని యేసు వారితో చెప్పారు. యేసును అప్పగించిన యూదా కూడా వారితో నిలబడి ఉన్నాడు.
JOH 18:6 యేసు వారితో, “ఆయనను నేనే” అని చెప్పినప్పుడు వారు వెనుకకు తూలి నేలపై పడిపోయారు.
JOH 18:7 ఆయన మళ్ళీ, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు. అందుకు, “నజరేయుడైన యేసు” అని వారు అన్నారు.
JOH 18:8 అందుకు యేసు, “నేనే ఆయనను. ఒకవేళ మీరు నా కోసం వెదకుతున్నట్లయితే వారిని వెళ్లిపోనివ్వండి” అన్నారు.
JOH 18:9 “నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు” అని యేసు ముందుగా చెప్పిన మాటలు నెరవేరడానికి ఈ విధంగా జరిగింది.
JOH 18:10 అప్పుడు సీమోను పేతురు తన దగ్గర ఉన్న కత్తిని దూసి, మల్కు అని పేరుగల ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, అతని కుడి చెవిని నరికాడు.
JOH 18:11 అప్పుడు యేసు పేతురుతో, “కత్తిని దాని ఒరలో పెట్టు!” అని చెప్పి, “నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉంటానా?” అన్నారు.
JOH 18:12 అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతి, యూదా నాయకులు యేసును బంధించారు.
JOH 18:13 వారు మొదట ఆయనను ఆ సంవత్సర ప్రధాన యాజకుడైన కయపకు మామయైన అన్నా దగ్గరకు తీసుకెళ్లారు.
JOH 18:14 ప్రజల కోసం ఒక మనుష్యుడు చనిపోవడం మంచిదని యూదా నాయకులతో ఆలోచన చెప్పిన కయప ఇతడే.
JOH 18:15 సీమోను పేతురు, మరొక శిష్యుడు యేసును వెంబడిస్తూ వెళ్లారు. ఎందుకంటే ఆ శిష్యుడు ప్రధాన యాజకుని పరిచితుడు కాబట్టి, అతడు యేసుతో కూడా ప్రధాన యాజకుని ఇంటి వాకిటికి వెళ్లాడు.
JOH 18:16 కాని పేతురు ద్వారం బయటనే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకునితో పరిచయం ఉన్న ఆ మరొక శిష్యుడు బయటకు వెళ్లి అక్కడ పని చేసే ద్వారపాలికురాలితో మాట్లాడి పేతురును లోపలికి తీసుకువచ్చాడు.
JOH 18:17 ఆమె, “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి కదా?” అని పేతురును అడిగింది. అందుకు అతడు, “కాదు” అన్నాడు.
JOH 18:18 అప్పుడు చలిగా ఉండడంతో సేవకులు అధికారులు ఆ చలిమంట చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నారు. పేతురు కూడా వారితో నిలబడి చలి కాచుకుంటున్నాడు.
JOH 18:19 ఇంతలో ప్రధాన యాజకుడు యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన చేసిన బోధల గురించి ప్రశ్నించాడు.
JOH 18:20 అందుకు యేసు, “నేను ప్రజలందరితో బహిరంగంగానే మాట్లాడాను. ఎప్పుడు యూదులందరు కూడుకొనే సమాజమందిరాల్లో దేవాలయాల్లోనే నేను బోధించాను. నేను రహస్యంగా ఏమి మాట్లాడలేదు.
JOH 18:21 నన్నెందుకు ప్రశ్నించడం? నా మాటలు విన్నవారిని అడగండి. నేనేం చెప్పానో వారికి తెలుసు” అని అతనితో అన్నారు.
JOH 18:22 యేసు ఇలా చెప్పినప్పుడు, అక్కడ నిలబడి ఉన్న అధికారులలో ఒకడు తన అరచేతితో యేసు చెంపమీద కొట్టి, “ఇదేనా ప్రధాన యాజకునికి సమాధానం చెప్పే పద్ధతి?” అని అడిగాడు.
JOH 18:23 అందుకు యేసు, “నేను తప్పు మాట్లాడితే ఆ తప్పు ఏమిటో రుజువుచేయి. కాని నేను సత్యమే మాట్లాడాను, నీవు నన్ను ఎందుకు కొట్టావు?” అన్నారు.
JOH 18:24 అప్పుడు అన్నా యేసును కట్లతో బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు పంపించాడు.
JOH 18:25 సీమోను పేతురు చలి కాచుకుంటూ అక్కడే నిలబడి ఉన్నప్పుడు వారు, “నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివి, అవునా కాదా?” అని అడిగారు. అందుకు అతడు, “నేను కాదు” అని చెప్తూ తిరస్కరించాడు.
JOH 18:26 ప్రధాన యాజకుని సేవకులలో ఒకడు, పేతురు చెవి నరికినవాడి బంధువైన ఒకడు, “నేను నిన్ను ఒలీవల తోటలో అతనితో చూడలేదా?” అని అడిగాడు.
JOH 18:27 పేతురు మరోసారి తిరస్కరించాడు, ఆ సమయంలోనే కోడి కూసింది.
JOH 18:28 అప్పుడు యూదా నాయకులు యేసును ప్రధాన యాజకుడైన కయప దగ్గర నుండి రోమా అధిపతి భవనానికి తీసుకెళ్లారు. అప్పటికి తెల్లవారింది కాబట్టి అపవిత్రపడకుండ పస్కాను తినాలని వారు భవనం లోనికి వెళ్లలేదు.
JOH 18:29 కాబట్టి పిలాతు బయట ఉన్న వారి దగ్గరకు వచ్చి, “మీరు ఇతని మీద ఏ నేరాన్ని మోపుతున్నారు?” అని వారిని అడిగాడు.
JOH 18:30 వారు, “ఇతడు నేరస్థుడు కాకపోతే మేము నీకు అప్పగించి ఉండేవారం కాదు!” అన్నారు.
JOH 18:31 పిలాతు, “అతన్ని మీరే తీసుకెళ్లి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చండి” అన్నాడు. అందుకు యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అని అడ్డు చెప్పారు.
JOH 18:32 యేసు తాను ఎలాంటి మరణం పొందుతానని ముందుగా చెప్పాడో ఆ మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది.
JOH 18:33 తర్వాత పిలాతు భవనం లోనికి వెళ్లి, యేసును పిలిపించి ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
JOH 18:34 యేసు, “అది నీ సొంత ఆలోచనా లేదా ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నారు.
JOH 18:35 పిలాతు, “నేనేమైనా యూదుడనా? నీ సొంత ప్రజలు ముఖ్య యాజకులే నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏమి చేశావు?” అని అడిగాడు.
JOH 18:36 యేసు, “నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అలా ఉండి ఉంటే, యూదా నాయకులు నన్ను బంధించకుండా నా సేవకులు వారితో పోరాడి ఉండేవారు. కాని నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చారు.
JOH 18:37 అప్పుడు పిలాతు, “అయితే నీవు రాజువా?” అని అడిగాడు. అందుకు యేసు, “నేను రాజునని నీవే చెప్తున్నావు. నిజానికి, నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకంలో జన్మించాను. సత్యం వైపు ఉన్నవారందరు నా మాటలను వింటారు” అని జవాబిచ్చారు.
JOH 18:38 పిలాతు, “సత్యం అంటే ఏమిటి?” అని అడిగాడు. మళ్ళీ బయటకు వెళ్లి యూదులతో, “ఇతన్ని నిందించడానికి తగిన నేరం ఏదీ నాకు కనిపించలేదు.
JOH 18:39 కాని పస్కా పండుగ సమయంలో నేరస్థులలో ఒకరిని నేను మీ కోసం విడుదల చేసే ఆచారం ఉంది కాబట్టి, యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని వారిని అడిగాడు.
JOH 18:40 అందుకు వారు, “వద్దు, ఆయన వద్దు! మాకు బరబ్బాను విడుదల చెయ్యండి!” అని గట్టిగా కేకలు వేశారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.
JOH 19:1 ఆ తర్వాత పిలాతు యేసుని కొరడాలతో కొట్టించాడు.
JOH 19:2 సైనికులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయనకు ఊదా రంగు వస్త్రాన్ని తొడిగించి,
JOH 19:3 ఆయన దగ్గరకు మాటిమాటికి వెళ్లి ఆయనతో, “యూదుల రాజా నీకు శుభం!” అని ఎగతాళి చేస్తూ, ఆయన ముఖం మీద అరచేతులతో కొట్టారు.
JOH 19:4 పిలాతు మరొకసారి బయటకు వచ్చి యూదులతో, “చూడండి, ఇతనిలో నాకు ఏ నేరం కనిపించలేదని చెప్పడానికి ఈయనను బయటకు మీ దగ్గరకు తీసుకుని వస్తున్నాను” అని చెప్పాడు.
JOH 19:5 యేసు బయటకు వచ్చినప్పుడు ఆ ముళ్ళ కిరీటాన్ని ఊదా రంగు వస్త్రాన్ని ధరించుకొని ఉన్నారు. పిలాతు వారితో, “ఇదిగో, ఈ మనుష్యుడు!” అని చెప్పాడు.
JOH 19:6 ముఖ్య యాజకులు వారి అధికారులు ఆయనను చూడగానే, “సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు. అయితే పిలాతు, “మీరే ఆయనను తీసుకెళ్లి సిలువ వేయండి. నాకైతే ఆయనలో ఏ నేరం కనిపించలేదు” అన్నాడు.
JOH 19:7 అందుకు యూదా నాయకులు, “మా ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా తాను దేవుని కుమారుడనని చెప్పుకుంటే చట్టాన్ని బట్టి అతడు చావవలసిందే” అన్నారు.
JOH 19:8 పిలాతు ఆ మాట విని మరింత భయపడి,
JOH 19:9 తిరిగి తన భవనం లోనికి వెళ్లి, “నీవు ఎక్కడి నుండి వచ్చావు?” అని యేసును అడిగాడు. కాని యేసు అతనికి ఏ జవాబివ్వలేదు.
JOH 19:10 అప్పుడు పిలాతు, “నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికైనా, సిలువ వేయడానికైన నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అన్నాడు.
JOH 19:11 అందుకు యేసు, “నీకు ఆ అధికారం పైనుండి ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు అధికారం లేదు. కాబట్టి నన్ను నీకు అప్పగించినవాడు నీ కంటే మరి ఎక్కువ పాపం చేశాడు” అన్నారు.
JOH 19:12 అప్పటినుండి పిలాతు యేసును విడుదల చేయడానికి ప్రయత్నించాడు కాని యూదా నాయకులు, “నీవు ఇతన్ని విడుదల చేస్తే నీవు కైసరుకు స్నేహితుడవు కావు. నేను రాజును అని చెప్పుకునే ప్రతివాడు కైసరుకు విరోధి” అని కేకలు వేశారు.
JOH 19:13 పిలాతు ఈ మాటలను విని, యేసును బయటకు తీసుకువచ్చి, రాతి బాటగా ప్రసిద్ధి చెందిన స్థలంలో అతడు న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి గబ్బతా అని పేరు.
JOH 19:14 అది పస్కాను సిద్ధపరచే రోజు, అప్పుడు ఇంచుమించు ఉదయం ఆరు గంటల సమయం అవుతుంది. పిలాతు, “ఇదిగో మీ రాజు” అని యూదులతో చెప్పాడు.
JOH 19:15 కాని వారు, “అతన్ని తీసుకెళ్లండి! అతన్ని తీసుకెళ్లండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు. “మీ రాజును నేను సిలువ వేయనా?” అని పిలాతు అడిగాడు. అప్పుడు ముఖ్య యాజకులు, “మాకు కైసరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు.
JOH 19:16 చివరికి పిలాతు సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. కాబట్టి సైనికులు యేసును తీసుకెళ్లారు.
JOH 19:17 యేసు తన సిలువను తానే మోసుకొని కపాల స్థలం అనే చోటికి తీసుకెళ్లారు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి “గొల్గొతా” అని పేరు.
JOH 19:18 అక్కడ ఆయనతో పాటు మరో ఇద్దరిని, ఆయనకు ఇరువైపుల ఉంచి వారి మధ్యలో యేసును సిలువ వేశారు.
JOH 19:19 పిలాతు సిలువకు వ్రాతపూర్వక ఉత్తర్వును తగిలించాడు. అది ఇలా ఉంది: నజరేతువాడైన యేసు, యూదుల రాజు.
JOH 19:20 యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటనను హెబ్రీ, లాటిను గ్రీకు భాషల్లో వ్రాయించారు కాబట్టి యూదుల్లో చాలామంది దానిని చదివారు.
JOH 19:21 ముఖ్య యాజకులైన యూదులు దానిని వ్యతిరేకించి పిలాతును, “యూదుల రాజు అని వ్రాయవద్దు కాని యూదులకు రాజునని చెప్పుకునేవాడు” అని వ్రాయమని అడిగారు.
JOH 19:22 అందుకు పిలాతు, “నేను వ్రాసిందేదో వ్రాసేసాను” అని జవాబిచ్చాడు.
JOH 19:23 సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత, వారు ఆయన వస్త్రాలను తీసుకుని, ఒక్కొక్కరికి ఒక భాగం వచ్చేలా నాలుగు భాగాలుగా చేశారు కాని ఆయనపై అంగీ ఏ కుట్టు లేకుండా పైనుండి క్రింది వరకు ఒకే వస్త్రంగా నేయబడింది.
JOH 19:24 కాబట్టి వారు, “దీనిని చింపవద్దు, చీట్లు వేసి ఎవరి పేరట చీటి వస్తుందో వారు తీసుకుందాం” అని చెప్పుకొన్నారు. లేఖనంలో వ్రాయబడినట్లు, “వారు నా వస్త్రాలు పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేస్తారు” అనేది నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు.
JOH 19:25 యేసు తల్లి, ఆయన తల్లి సహోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ సిలువ దగ్గర నిలబడి ఉన్నారు.
JOH 19:26 యేసు అతని తల్లి తాను ప్రేమించిన శిష్యుడు అక్కడ నిలబడి ఉండడం చూసి, ఆయన తన తల్లితో, “అమ్మా, ఇదిగో నీ కుమారుడు” అని,
JOH 19:27 తర్వాత తన ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అని చెప్పారు. అప్పటినుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.
JOH 19:28 ఆ తర్వాత, యేసు అంతా ముగిసినదని గ్రహించి లేఖనాలు నెరవేరేలా, “దాహంగా ఉంది” అన్నారు.
JOH 19:29 అక్కడే ఉన్న ఒక పులిసిన ద్రాక్షరసం పాత్రలో వారు ఒక స్పంజీని చిరకలో ముంచి, హిస్సోపు చెట్టు కొమ్మకు చుట్టి, యేసు పెదవులకు దానిని అందించారు.
JOH 19:30 ఆయన పులిసిన ద్రాక్షరసం పుచ్చుకుని, “సమాప్తమైనది” అని చెప్పి యేసు తన తలను వంచి తన ప్రాణం విడిచారు.
JOH 19:31 అది సిద్ధపాటు రోజు, మరుసటి దినం ప్రత్యేకమైన సబ్బాతు దినము. సబ్బాతు దినాన సిలువపై వారి దేహాలు ఉండకూడదని యూదా నాయకులు భావించి సిలువవేయబడిన వారి కాళ్లను విరగ్గొట్టి, వారి దేహాలను క్రిందికి దింపివేయాలని వారు పిలాతును అడిగారు.
JOH 19:32 కాబట్టి సైనికులు వచ్చి యేసుతో పాటు సిలువ వేసిన మొదటివాడి కాళ్లను తర్వాత రెండవవాడి కాళ్లను విరుగగొట్టారు.
JOH 19:33 కాని వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే చనిపోయారని గ్రహించి ఆయన కాళ్లను విరుగగొట్టలేదు.
JOH 19:34 కాని సైనికుల్లో ఒకడు బల్లెంతో యేసుని ప్రక్కలో పొడిచాడు. వెంటనే రక్తం నీరు కారాయి.
JOH 19:35 అది చూసినవాడు సాక్ష్యం ఇచ్చాడు, అతని సాక్ష్యం నిజము. అతడు నిజం చెప్తున్నాడని అతనికి తెలుసు. మీరు కూడా నమ్మడానికి అతడు సాక్ష్యమిస్తున్నాడు.
JOH 19:36 లేఖనాల్లో వ్రాయబడినట్లు, “ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరువబడలేదు” అని నెరవేరేలా ఇది జరిగింది.
JOH 19:37 ఇతర లేఖనాల్లో, “వారు తాము పొడిచిన వానివైపు చూస్తారు” అని వ్రాయబడి ఉంది.
JOH 19:38 ఆ తర్వాత యూదా నాయకులు భయపడి రహస్యంగా యేసుకు శిష్యుడిగా ఉన్న అరిమతయికు చెందిన యోసేపు యేసు దేహాన్ని తాను తీసుకెళ్తానని పిలాతును వేడుకున్నాడు. పిలాతు అనుమతితో అతడు వచ్చి యేసు దేహాన్ని తీసుకెళ్లాడు.
JOH 19:39 అతనితో పాటు, గతంలో ఒక రాత్రివేళ యేసుతో మాట్లాడిన నీకొదేము కూడా ఉన్నాడు. నీకొదేము ఇంచుమించు ముప్పైనాలుగు కిలోగ్రాముల బోళం అగరుల మిశ్రమాన్ని, శవం కుళ్ళిపోకుండా ఉంచే సుగంధ ద్రవ్యాలను తనతో తీసుకువచ్చాడు.
JOH 19:40 వారిద్దరు యేసు దేహాన్ని తీసుకెళ్లి, యూదుల ఆచారం ప్రకారం దానికి సుగంధ ద్రవ్యాలను పూసి, నారబట్టతో చుట్టారు.
JOH 19:41 యేసును సిలువ వేసినచోట ఒక తోట ఉన్నది. ఆ తోటలో ఎవరిని పెట్టని ఒక క్రొత్త సమాధి ఉంది.
JOH 19:42 యూదుల ఆచారం ప్రకారం సిద్ధపాటు దినం మొదలుకాక ముందే సమాధి చేయాలని, దగ్గరలో ఉన్న ఆ క్రొత్త సమాధిలో యేసు దేహాన్ని పెట్టారు.
JOH 20:1 వారం మొదటి రోజున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వెళ్లి సమాధి ద్వారాన్ని మూసిన రాయి తొలగిపోయి ఉండడం చూసింది.
JOH 20:2 కాబట్టి ఆమె సీమోను పేతురు యేసు ప్రేమించిన శిష్యుని దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, “వారు ప్రభువును సమాధిలో నుండి తీసుకుని వెళ్లిపోయారు. ఆయనను ఎక్కడ పెట్టారో తెలియడం లేదు” అని చెప్పింది.
JOH 20:3 కాబట్టి పేతురు, మరొక శిష్యుడు వెంటనే సమాధి దగ్గరకు బయలుదేరారు.
JOH 20:4 వారిద్దరు పరుగెడుతూ ఉండగా ఆ శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదట సమాధి దగ్గరకు చేరుకున్నాడు.
JOH 20:5 అతడు సమాధిలోనికి వంగి నారబట్టలు పడి ఉన్నాయని చూశాడు కాని దాని లోపలికి వెళ్లలేదు.
JOH 20:6 ఆ తర్వాత అతని వెనకాలే వచ్చిన సీమోను పేతురు నేరుగా సమాధిలోనికి వెళ్లి, అక్కడ నారబట్టలు పడి ఉన్నాయని,
JOH 20:7 యేసు తలకు చుట్టిన రుమాలు, ఆ నారబట్టలతో కాకుండా వేరే చోట మడతపెట్టి ఉందని చూశాడు.
JOH 20:8 సమాధి దగ్గరకు మొదట చేరుకున్న శిష్యుడు కూడ లోపలికి వెళ్లి చూసి నమ్మాడు.
JOH 20:9 యేసు చనిపోయి తిరిగి జీవంతో లేస్తాడని చెప్పే లేఖనాలను వారు ఇంకా గ్రహించలేదు.
JOH 20:10 తర్వాత ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్లిపోయారు.
JOH 20:11 కాని మరియ, సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ సమాధిలోనికి తొంగి చూసినప్పుడు,
JOH 20:12 తెల్లని బట్టలను ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహాన్ని ఉంచిన చోట తల వైపున ఒకరు కాళ్ల వైపున మరొకరు కూర్చుని ఉండడం చూసింది.
JOH 20:13 వారు ఆమెను, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు. అందుకు ఆమె, “వారు నా ప్రభువును సమాధిలో నుండి తీసుకుని వెళ్లిపోయారు. వారు ఆయనను ఎక్కడ పెట్టారో తెలియడం లేదు” అన్నది.
JOH 20:14 అప్పుడు ఆమె వెనుకకు తిరిగి అక్కడ యేసు నిలబడి ఉన్నాడని చూసింది, కానీ ఆయనే యేసు అని ఆమె గుర్తు పట్టలేదు.
JOH 20:15 ఆయన, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ఎవరిని వెదకుతున్నావు?” అని అడిగారు. ఆమె ఆయనను తోటమాలి అనుకుని, “అయ్యా, నీవు ఆయనను తీసుకెళ్తే, ఆయనను ఎక్కడ ఉంచావో నాకు చెప్పు. నేను ఆయనను తీసుకెళ్తాను” అన్నది.
JOH 20:16 యేసు ఆమెను, “మరియ” అని పిలిచారు. ఆమె ఆయన వైపుకు తిరిగి “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనగా హెబ్రీ భాషలో “బోధకుడు” అని అర్థము.
JOH 20:17 యేసు, “నేను తండ్రి దగ్గరకు ఇంకా ఆరోహణమవ్వలేదు, కాబట్టి నన్ను ముట్టుకోవద్దు. నీవు నా సహోదరుల దగ్గరకు వెళ్లి వారితో, ‘నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడును నీ దేవుడునైన వాని దగ్గరకు ఎక్కి వెళ్తున్నాను’ అని వారితో చెప్పు” అన్నారు.
JOH 20:18 మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్లి, “నేను ప్రభువును చూశాను! ఆయన నాతో ఈ సంగతులు చెప్పారు” అని వారికి చెప్పింది.
JOH 20:19 ఆదివారం సాయంకాలాన యూదా నాయకులకు భయపడి తలుపులను మూసుకుని శిష్యులందరు ఒక్కచోట ఉన్నప్పుడు, యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి వారితో, “మీకు సమాధానం కలుగును గాక!” అని చెప్పారు.
JOH 20:20 ఆయన ఆ విధంగా చెప్పి వారికి తన చేతులను, తన ప్రక్కను చూపించగా శిష్యులు ప్రభువును చూసి చాలా సంతోషించారు.
JOH 20:21 యేసు మళ్ళీ వారితో, “మీకు సమాధానం కలుగును గాక! నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని చెప్పారు.
JOH 20:22 ఈ మాట చెప్పిన తర్వాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి.
JOH 20:23 మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి; మీరు ఎవరిని క్షమించరో వారు క్షమించబడరు” అన్నారు.
JOH 20:24 పన్నెండుమంది శిష్యులలో దిదుమా అని పిలువబడే తోమా, యేసు వచ్చినప్పుడు అక్కడ వారితో లేడు.
JOH 20:25 కాబట్టి మిగతా శిష్యులు అతనితో, “మేము ప్రభువును చూశాం” అని చెప్పారు. అప్పుడు అతడు వారితో, “నేను ఆయన చేతిలో మేకులు కొట్టిన గాయాలలో నా వ్రేలును ఆయనను పొడిచిన ప్రక్కలో నాచేయి పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను” అన్నాడు.
JOH 20:26 ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు మరల ఇంట్లో ఉన్నప్పుడు తోమా వారితో పాటు ఉన్నాడు. వారి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి, అయినా యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో చెప్పారు.
JOH 20:27 తర్వాత ఆయన తోమాతో, “నా చేతులను చూడు; నీ వ్రేలితో ఆ గాయాలను ముట్టి చూడు. నీ చేయి చాపి నా ప్రక్క గాయాన్ని ముట్టి చూడు. అనుమానించడం మాని నమ్ము” అన్నారు.
JOH 20:28 తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు.
JOH 20:29 అప్పుడు యేసు అతనితో, “నీవు నన్ను చూసి నమ్మినావు; చూడకుండానే నమ్మినవారు ధన్యులు” అన్నారు.
JOH 20:30 యేసు తన శిష్యుల ముందు అనేక ఇతర అద్భుత కార్యాలను చేశారు. వాటన్నిటిని ఈ పుస్తకంలో వ్రాయలేదు.
JOH 20:31 అయితే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మడానికి, ఆయన నామాన్ని నమ్మడం ద్వారా మీరు జీవాన్ని పొందుకోవాలని ఈ సంగతులను వ్రాశాను.
JOH 21:1 ఆ తర్వాత యేసు మరల తన శిష్యులకు తిబెరియ సముద్రం తీరంలో కనిపించారు.
JOH 21:2 సీమోను పేతురు, దిదుమా అని పిలువబడే తోమా, గలిలయలోని కానాకు చెందిన నతనయేలు, జెబెదయి కుమారులు, మరో ఇద్దరు శిష్యులు కలిసి ఉన్నప్పుడు,
JOH 21:3 సీమోను పేతురు వారందరితో, “నేను చేపలను పట్టడానికి వెళ్తున్నాను” అని చెప్పగా వారు, “మేము కూడ నీతో వస్తాము” అన్నారు. కాబట్టి వారు పడవలో ఎక్కి వెళ్లి, రాత్రంతా కష్టపడినా కానీ వారు ఏమీ పట్టుకోలేదు.
JOH 21:4 తెల్లవారుజామున, యేసు సరస్సు ఒడ్డున నిలబడి ఉన్నారు, కానీ శిష్యులు ఆయనను యేసు అని గుర్తించలేదు.
JOH 21:5 ఆయన వారిని పిలిచి, “పిల్లలారా, మీ దగ్గర చేపలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగారు. అందుకు వారు, “లేవు” అని జవాబిచ్చారు.
JOH 21:6 ఆయన, “పడవకు కుడి వైపున మీ వలలు వేయండి, మీకు దొరుకుతాయి” అని చెప్పగా వారు అలాగే చేశారు. అప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి కాబట్టి వారు ఆ వలలను లాగలేకపోయారు.
JOH 21:7 యేసు ప్రేమించిన శిష్యుడు సీమోను పేతురుతో, “ఆయన ప్రభువు!” అన్నాడు. “ఆయన ప్రభువు” అని పేతురు విన్న వెంటనే ఇంతకుముందు తీసి వేసిన పైబట్టను తన చుట్టూ వేసుకుని నీటిలోనికి దూకాడు.
JOH 21:8 పడవలో ఉన్న మిగతా శిష్యులు చేపలున్న వలను లాగుతూ ఉన్నారు. అప్పుడు వారు ఒడ్డుకు సుమారు వంద గజాల దూరంలో మాత్రమే ఉన్నారు.
JOH 21:9 వారు ఒడ్డుకు రాగానే, అక్కడ నిప్పులో కాలుతుండిన చేపలను కొన్ని రొట్టెలను చూశారు.
JOH 21:10 యేసు వారితో, “మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్నిటిని తీసుకురండి” అని చెప్పారు.
JOH 21:11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలలో 153 పెద్ద చేపలున్నాయి. అన్ని చేపలు ఉన్నా ఆ వలలు చిరిగిపోలేదు.
JOH 21:12 యేసు వారితో, “రండి, భోజనం చేయండి” అని పిలిచారు. ఆయనే ప్రభువని వారికి తెలిసింది కాబట్టి ఆ శిష్యులలో ఎవరు ఆయనను, “నీవు ఎవరు?” అని అడగడానికి ధైర్యం చేయలేదు.
JOH 21:13 యేసు వచ్చి రొట్టెను తీసుకుని వారికి పంచారు. అదే విధంగా చేపలను కూడ పంచారు.
JOH 21:14 యేసు తాను చనిపోయి సజీవునిగా లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు కనబడడం ఇది మూడవసారి.
JOH 21:15 వారు తిని ముగించిన తర్వాత యేసు సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగారు. అతడు, “అవును, ప్రభువా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అన్నాడు. అయితే, “నా గొర్రెపిల్లలను మేపుము” అని యేసు చెప్పారు.
JOH 21:16 మరల యేసు, “యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?” అని రెండవసారి అడిగారు. అతడు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అని చెప్పాడు. అందుకు యేసు, “నా గొర్రెలను కాయుము” అన్నారు.
JOH 21:17 యేసు మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగారు. యేసు తనను మూడవసారి, “నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగినందుకు బాధపడిన పేతురు, “ప్రభువా, నీవు అన్ని తెలిసినవాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అని చెప్పాడు. అందుకు యేసు, “నా గొర్రెలను మేపుము”
JOH 21:18 నేను మీతో చెప్పేది నిజం, “నీవు యవ్వనస్థునిగా ఉన్నప్పుడు, నీకు నీవే నీ నడుము కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు వెళ్లేవాడివి. కాని నీవు ముసలి వాడవైనప్పుడు నీవు నీ చేతులను చాపుతావు, అప్పుడు మరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టం లేని చోటికి నిన్ను మోసుకువెళ్తాడు” అని చెప్పారు.
JOH 21:19 పేతురు ఎలాంటి మరణం పొంది దేవుని మహిమపరుస్తాడో సూచిస్తూ యేసు ఈ విషయాలను చెప్పారు. ఇలా చెప్పి ఆయన అతనితో, “నన్ను వెంబడించు” అని చెప్పారు.
JOH 21:20 పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన శిష్యుడు తమను వెంబడిస్తున్నాడని చూశాడు. భోజనం చేసేప్పుడు యేసు దగ్గరగా ఆనుకుని కూర్చుని, “ప్రభువా, నిన్ను అప్పగించేది ఎవరు?” అని అడిగినవాడు ఇతడే.
JOH 21:21 పేతురు అతన్ని చూసి, “ప్రభువా, అతని సంగతి ఏమిటి?” అని అడిగాడు.
JOH 21:22 అందుకు యేసు, “నేను తిరిగి వచ్చేవరకు అతడు జీవించి ఉండడం నాకు ఇష్టమైతే నీకు ఏమి? నీవు నన్ను వెంబడించాలి” అని జవాబిచ్చారు.
JOH 21:23 అందుకని ఆ శిష్యుడు చనిపోడు అనే మాట విశ్వాసుల మధ్య పాకిపోయింది. అయితే యేసు అతడు చావడు అని చెప్పలేదు కానీ, ఆయన, “నేను తిరిగి వచ్చేవరకు అతడు జీవించి ఉండడం నాకు ఇష్టమైతే నీకు ఏమి?” అని మాత్రమే అన్నారు.
JOH 21:24 ఈ విషయాల గురించి సాక్ష్యమిస్తూ వీటిని వ్రాసిన శిష్యుడు ఇతడే. అతని సాక్ష్యం నిజం అని మనకు తెలుసు.
JOH 21:25 యేసు చేసిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాస్తే, వ్రాసిన గ్రంథాలను ఉంచడానికి ఈ ప్రపంచమంతా కూడా సరిపోదు అని నేను భావిస్తున్నాను.
ACT 1:1 ఓ థెయోఫిలా, యేసు ఆరంభం నుండి ఆయన ఏర్పరచుకొన్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వార సూచనలు ఇచ్చిన తర్వాత, పరలోకానికి ఆయన కొనిపోబడిన సమయం వరకు ఆయన ఏమేమి చేశారో ఏ విషయాలను బోధించారో వాటన్నిటిని గురించి నా మొదటి పుస్తకంలో నేను వ్రాశాను.
ACT 1:3 అనగా, ఆయన హింసను పొందిన తర్వాత, తాను సజీవునిగా ఉన్నారని అనేక రుజువులతో తనను తాను వారికి నలభై రోజులు కనుపరచుకుంటూ దేవుని రాజ్యాన్ని గురించి బోధించారు.
ACT 1:4 ఒక రోజు యేసు వారితో కలసి భోజనం చేస్తున్నప్పుడు ఆయన వారికి ఈ ఆజ్ఞ ఇచ్చారు: “మీరు యెరూషలేమును వదిలి వెళ్లకండి, నేను మీతో ముందే చెప్పినట్లు, నా తండ్రి వాగ్దానం చేసిన ఆ బహుమానాన్ని పొందుకొనే వరకు కనిపెడుతూ ఉండండి.
ACT 1:5 ఎందుకంటే, యోహాను నీటితో బాప్తిస్మమిచ్చాడు, కాని కొన్ని రోజుల్లో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకొంటారు.”
ACT 1:6 అప్పుడు ఆ అపొస్తలులు ఆయన చుట్టుచేరి, “ప్రభువా, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని తిరిగి నిర్మిస్తావా?” అని అడిగారు.
ACT 1:7 అందుకు ఆయన వారితో, “తండ్రి తన అధికారంతో నిర్ణయించిన సమయాలను, కాలాలను తెలుసుకోవడం మీ పని కాదు.
ACT 1:8 అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకొంటారు. అప్పుడు మీరు యెరూషలేములో, సమస్త యూదయ, సమరయ ప్రాంతాల్లో, భూమి అంచుల వరకు నాకు సాక్షులుగా ఉంటారు” అన్నారు.
ACT 1:9 ఈ మాటలను చెప్పిన తర్వాత, వారి కళ్ళ ముందే, ఆయన ఆరోహణమయ్యారు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను కమ్ముకున్నది.
ACT 1:10 ఆయన వెళ్తునప్పుడు వారు ఆకాశంవైపే తేరి చూస్తూ నిలబడ్డారు, అప్పుడు తెల్లని వస్త్రాలను ధరించుకొన్న ఇద్దరు వ్యక్తులు వారి దగ్గరకు వచ్చి,
ACT 1:11 “గలిలయ వాసులారా, మీరు ఇక్కడ నిలబడి ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నారు? మీ ముందు ఆరోహణమైన ఈ యేసే, ఏ విధంగా పరలోకానికి వెళ్లడం చూశారు, అదే విధంగా ఆయన తిరిగి వస్తారు” అని వారితో చెప్పారు.
ACT 1:12 తర్వాత అపొస్తలులు ఒలీవల కొండ నుండి బయలుదేరి యెరూషలేముకు తిరిగి వెళ్లారు, అది ఒక సబ్బాతు దిన ప్రయాణం అనగా దాదాపు ఒక కిలోమీటరు దూరం ఉంటుంది.
ACT 1:13 వారు పట్టణం చేరి, తాము ఉంటున్న మేడ గదికి ఎక్కి వెళ్లారు. అక్కడ ఎవరు ఉన్నారంటే: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా; బర్తలోమయి, మత్తయి; అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే సీమోను, యాకోబు కుమారుడైన యూదా.
ACT 1:14 వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియైన మరియ, ఆయన తమ్ముళ్ళు కలిసి, ఏకమనస్సుతో విడువక ప్రార్థిస్తున్నారు.
ACT 1:15 ఇంచుమించు నూట ఇరవైమంది విశ్వాసులు ఒక్కచోట చేరినప్పుడు పేతురు వారి మధ్యలో నిలబడి,
ACT 1:16 “సహోదరీ సహోదరులారా, యేసును బంధించడానికి వారికి దారి చూపించిన యూదా గురించి, చాలా కాలం క్రిందట దావీదు ద్వారా పరిశుద్ధాత్మ చెప్పిన లేఖనాలు నెరవేరవలసి ఉంది.
ACT 1:17 ‘అతడు మనలో ఒకనిగా ఉండి మన పరిచర్యలో భాగం పంచుకొన్నాడు.’ ”
ACT 1:18 ద్రోహం చేసి సంపాదించిన డబ్బుతో యూదా ఒక పొలాన్ని కొన్నాడు; అక్కడే అతడు తలక్రిందులుగా పడి, శరీరం చీలి అతని ప్రేగులన్ని బయట చెదరిపడ్డాయి.
ACT 1:19 ఈ సంగతిని గురించి యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరు విన్నారు, కాబట్టి ఆ పొలాన్ని వారి భాషలో అకెల్దమా అని పిలుస్తున్నారు, అకెల్దమా అనగా రక్త భూమి అని అర్థం.
ACT 1:20 పేతురు ఇలా అన్నాడు, “ఎందుకంటే, కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది: “ ‘అతని స్థలం పాడైపోవును గాక; దానిలో ఎవరు నివసించకుందురు గాక’ ‘అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక.’
ACT 1:21 కాబట్టి యోహాను ద్వార బాప్తిస్మం పొందుకున్నది మొదలుకొని ప్రభువైన యేసు మన దగ్గర నుండి పరలోకానికి వెళ్లిన సమయం వరకు,
ACT 1:22 ఆయన మన మధ్య ఉన్న కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి.”
ACT 1:23 కాబట్టి వారు యూస్తు, బర్సబ్బా అని పిలువబడే యోసేపు మత్తీయా అనే ఇద్దరి పేర్లు సూచించారు.
ACT 1:24 తర్వాత వారు, “ప్రభువా, నీకు అందరి హృదయాలు తెలుసు. ఈ ఇద్దరిలో ఎవరు
ACT 1:25 యూదా విడిచి వెళ్లిన ఈ అపొస్తలిక పరిచర్యను కొనసాగించడానికి మీరు ఎవరిని ఎన్నుకున్నారో మాకు చూపించండి” అని ప్రార్థించారు.
ACT 1:26 తర్వాత వారు చీట్లు వేసినప్పుడు, మత్తీయా పేరున చీటి వచ్చింది, కాబట్టి పదకొండు మంది అపొస్తలులతో అతన్ని చేర్చారు.
ACT 2:1 పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు, వారందరు ఒక్కచోట చేరుకొన్నారు.
ACT 2:2 అప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి వేగంగా వీస్తున్న గాలి లాంటి ధ్వని వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నింపింది.
ACT 2:3 అగ్ని జ్వాలల్లాంటి నాలుకలు విభజింపబడి వారిలో అందరిపై నిలిచినట్లు వారు చూశారు
ACT 2:4 వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ వారికి ఇచ్చిన సామర్థ్యంతో ఇతర భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు.
ACT 2:5 ఆ రోజుల్లో ఆకాశం క్రింద ఉన్న దేశాలన్నింటి నుండి వచ్చిన దైవభక్తి కలిగిన యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు.
ACT 2:6 వారు ఈ శబ్దం విన్నప్పుడు, ప్రజలు కలవరంతో ఒక్క చోటికి గుంపుగా వచ్చారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ సొంత భాష మాట్లాడడం విన్నారు.
ACT 2:7 వారు ఎంతగానో ఆశ్చర్యపడి, “మాట్లాడుతున్న వీరందరు గలిలయులు కారా?
ACT 2:8 అయితే మనలో ప్రతి ఒక్కరూ మన మాతృభాషలో వారు మాట్లాడటాన్ని ఎలా వింటున్నాం? అని చెప్పుకొన్నారు.
ACT 2:9 పార్తీయులు, మెదీయ వారు, ఎలామీయులు, మెసొపొటేమియా నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా,
ACT 2:10 ఫ్రుగియ, పంఫులియా, ఈజిప్టు, కురేనే దగ్గరి లిబియా ప్రాంతాలకు చెందినవారు, రోమా నుండి వచ్చిన కొంతమంది సందర్శకులు
ACT 2:11 అనగా యూదులు, యూదా మతంలోనికి మారిన వారు; క్రేతీయులు, అరబీయులు మొదలైన వారందరు విస్మయపడి ఆశ్చర్యంతో, వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యాలను ప్రకటించడాన్ని మనం వింటున్నాము.”
ACT 2:12 దీని భావం ఏంటి? అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
ACT 2:13 అయితే కొందరు, “వీరు క్రొత్త మద్యాన్ని చాలా ఎక్కువగా త్రాగారు” అని అంటూ వారిని హేళన చేశారు.
ACT 2:14 అప్పుడు పేతురు ఆ పదకొండు మందితో పాటు నిలబడి, బిగ్గరగా ఆ జనసమూహంతో ఇలా అన్నాడు: “తోటి యూదులారా యెరూషలేములో ఉంటున్నవారలారా, నేను మీకు దీని గురించి వివరిస్తాను; నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.
ACT 2:15 మీరందరు అనుకుంటున్నట్లు, వీరు మద్యం త్రాగిన మత్తులో లేరు. ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటలు అవుతుంది!
ACT 2:16 యోవేలు ప్రవక్త ఇలా చెప్పాడు:
ACT 2:17 “ ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజుల్లో, నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యువకులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు.
ACT 2:18 ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచిస్తారు,
ACT 2:19 నేను పైన ఆకాశంలో అద్భుతాలను క్రింద భూమి మీద నా సూచకక్రియలను, రక్తం అగ్ని గొప్ప పొగను చూపిస్తాను.
ACT 2:20 మహా మహిమగల ప్రభువు దినం రాకముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారుతాడు.
ACT 2:21 అయితే ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.’
ACT 2:22 “తోటి ఇశ్రాయేలీయులారా, ఇది వినండి: మీ కోసం దేవుని నుండి అధికారం పొందిన నజరేయుడైన యేసు ద్వారా అద్భుతాలను, మహత్కార్యాలను, సూచకక్రియలను దేవుడే మీ మధ్యలో చేయించారని మీకు కూడ తెలుసు.
ACT 2:23 దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్నిబట్టి నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం యేసు క్రీస్తును మీకు అప్పగించారు; అయితే మీరు, దుష్టుల సహాయంతో, ఆయనను సిలువకు మేకులు కొట్టి చంపారు.
ACT 2:24 కానీ మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం, కాబట్టి దేవుడు ఆయనను మరణ వేదన నుండి విడిపించి, మృతులలో నుండి లేపారు.
ACT 2:25 దావీదు ఆయన గురించి ఇలా అన్నారు: “ ‘ఎల్లప్పుడు నేను నా ఎదుట నా ప్రభువును చూస్తున్నాను. నా ప్రభువు, నా కుడి ప్రక్కనే ఉన్నారు, కాబట్టి నేను కదల్చబడను.
ACT 2:26 కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది; నా శరీరం కూడా నిరీక్షణలో విశ్రమిస్తుంది,
ACT 2:27 ఎందుకంటే నీవు నా ఆత్మను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు, మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.
ACT 2:28 మీరు నాకు జీవమార్గాలను తెలిపారు; మీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతారు.’
ACT 2:29 “తోటి ఇశ్రాయేలీయులారా, నేను మీతో నిస్సందేహంగా చెప్పగలను, మీ పితరుడైన దావీదు చనిపోయి పాతిపెట్టబడ్డాడు, అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది.
ACT 2:30 అతడు ఒక ప్రవక్త దేవుడు అతని సంతానంలో ఒకనిని అతని సింహాసనం మీద కూర్చోబెడతానని ఒట్టు పెట్టుకుని తనకు ప్రమాణం చేశాడని దావీదుకు తెలుసు.
ACT 2:31 రాబోయేదాన్ని చూసిన ఆయన క్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడుతూ, ఆయన మృతుల రాజ్యంలో విడిచిపెట్టబడలేదని, ఆయన శరీరం కుళ్ళి పోవడం చూడలేదని చెప్పారు.
ACT 2:32 దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులము.
ACT 2:33 దేవుని కుడిచేతి వైపుకు ఎత్తబడి, తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకొని ఇప్పుడు మీరు చూస్తూ వింటున్న దానిని మీమీద కుమ్మరించారు.
ACT 2:34 దావీదు పరలోకానికి ఎక్కి పోలేదు అయినా ఇలా చెప్పాడు, “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు
ACT 2:35 “నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’
ACT 2:36 “కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరు ఖచ్చితంగా తెలుసుకోవలసింది ఏంటంటే: మీరు సిలువ వేసిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగా క్రీస్తుగా చేశారు.”
ACT 2:37 ప్రజలు ఈ మాటలు విని, మనస్సులో బాధపడి పేతురు, ఇతర అపొస్తలులతో, “సహోదరులారా, మేము ఏమి చేయాలి?” అని అన్నారు.
ACT 2:38 అందుకు పేతురు, “మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కోసం పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు.
ACT 2:39 ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరంగా ఉన్నవారందరికి అనగా, మన ప్రభువైన దేవుడు పిలిచే వారందరికి చెందుతుంది” అని వారితో చెప్పాడు.
ACT 2:40 ఇంకా అనేక రకాల మాటలతో పేతురు వారిని హెచ్చరించి, “ఈ వక్ర తరం నుండి మీరు రక్షణ పొందండి” అని వారికి విజ్ఞప్తి చేశాడు.
ACT 2:41 అతని సందేశాన్ని అంగీకరించినవారు బాప్తిస్మం పొందుకున్నారు, ఆ రోజు సుమారుగా మూడువేలమంది వ్యక్తులు సంఘానికి చేర్చబడ్డారు.
ACT 2:42 వారు అపొస్తలులు చెప్పే బోధలకు లోబడి, వారి సహవాసంలో ఉండి, రొట్టె విరుచుటలో ప్రార్థనలో ఆసక్తితో కొనసాగుతున్నారు.
ACT 2:43 అపొస్తలుల ద్వార జరిగిన అనేక అద్భుతాలు సూచకక్రియలను బట్టి ప్రతీ వ్యక్తికి భయం కలిగింది.
ACT 2:44 విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు.
ACT 2:45 వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలో ఉన్నవారికి ఇచ్చారు.
ACT 2:46 వారందరు ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో క్రమంగా కలుసుకొనేవారు. తమ ఇళ్ళలో అందరు కలిసి ఆనందంగా యథార్థ హృదయంతో రొట్టెను విరిచి తినేవారు.
ACT 2:47 వారు దేవుని స్తుతిస్తూ, ప్రజలందరి అభిమానం పొందుకున్నారు. ప్రభువు ప్రతిదినం రక్షించబడుచున్న వారిని వారి సంఖ్యకు చేర్చారు.
ACT 3:1 ఒక రోజు పేతురు యోహానులు మధ్యాహ్నం మూడు గంటల వేళలో ప్రార్థన సమయానికి దేవాలయానికి వెళ్తున్నారు.
ACT 3:2 సుందరమని పిలువబడే ఆ దేవాలయ గుమ్మం దగ్గర కూర్చుని, ఆవరణంలోనికి వచ్చేవారి దగ్గర భిక్షం అడుక్కోడానికి పుట్టుకతోనే కుంటివాడైన ఒకనిని ప్రతిరోజు కొంతమంది మోసుకొచ్చేవారు.
ACT 3:3 పేతురు యోహానులు ఆ దేవాలయ ఆవరణంలోనికి ప్రవేశిస్తుండగా వాడు చూసి భిక్షమడిగాడు.
ACT 3:4 యోహాను చేసినట్టుగానే, పేతురు వానివైపు సూటిగా చూసి, వానితో, “మా వైపు చూడు!” అన్నాడు.
ACT 3:5 వాడు వారి దగ్గర ఏమైన దొరుకుతుందేమోనని ఆశిస్తూ, వారివైపు దీక్షగా చూశాడు.
ACT 3:6 అప్పుడు పేతురు వానితో, “వెండి బంగారాలు నా దగ్గర లేవు గాని, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు పేరట లేచి నడువు” అని చెప్పి,
ACT 3:7 వాని కుడిచేయి పట్టుకుని లేపాడు. వెంటనే వాని పాదాలు, చీలమండలాలు బలం పొందుకున్నాయి.
ACT 3:8 వాడు లేచి ఎగిరి తన కాళ్లపై నిలబడి నడవడం మొదలుపెట్టాడు. తర్వాత వాడు నడుస్తూ, గంతులు వేస్తూ, దేవుని స్తుతిస్తూ వారితో పాటు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు.
ACT 3:9 ప్రజలందరు అతడు నడుస్తూ దేవుని స్తుతిస్తున్నాడని చూసి,
ACT 3:10 సుందరమని పిలువబడే ఆ దేవాలయ గుమ్మం దగ్గర కూర్చుని భిక్షమడిగేవాడు వీడే అని గుర్తించి, వానికి జరిగిన దానిని బట్టి విస్మయం చెంది ఆశ్చర్యపడ్డారు.
ACT 3:11 స్వస్థత పొందినవాడు పేతురు యోహానులతో ఉండగా, ప్రజలందరు ఆశ్చర్యపడి, సొలొమోను మండపం అని పిలువబడే చోటికి గుంపులుగా పరుగెత్తుకొని వచ్చారు.
ACT 3:12 అది చూసిన పేతురు వారితో ఈ విధంగా చెప్పాడు: “తోటి ఇశ్రాయేలీయులారా, జరిగింది చూసి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మేమేదో మా స్వశక్తితోనో లేదా మా భక్తితోనో వీడిని నడిచేలా చేసినట్లు మీరు మా వైపే తదేకంగా చూస్తున్నారేమిటి?
ACT 3:13 మన పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచారు. మీరు ఆయనను చంపబడటానికి అప్పగించారు, పిలాతు ఆయనను విడుదల చేయాలని నిర్ణయించుకున్నా, మీరు అతని ముందు క్రీస్తును తిరస్కరించారు.
ACT 3:14 మీరు పరిశుద్ధుడు, నీతిమంతుడైన వానిని తిరస్కరించి నరహంతుకుడిని మీ కోసం విడుదల చేయమని అడిగారు.
ACT 3:15 మీరు జీవాధిపతిని చంపారు, కాని దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు. దానికి మేమే సాక్షులము.
ACT 3:16 యేసు నామంలోని విశ్వాసం చేత, మీరు చూసిన మీకు తెలిసిన ఇతడు బలపరచబడ్డాడు. మీరందరు చూస్తునట్లే ఇది యేసు పేరట ఆయన ద్వార కలిగే విశ్వాసమే, ఇతన్ని పూర్తిగా స్వస్థపరచింది.
ACT 3:17 “అయితే, నా తోటి సహోదరులారా, మీ నాయకుల వలె మీరు కూడా అజ్ఞానంతో చేశారని నాకు తెలుసు.
ACT 3:18 అయితే దేవుడు తన క్రీస్తు తప్పక హింసించబడతాడని ప్రవక్తలందరి ద్వారా ముందుగానే తెలియపరచిన దానిని దేవుడు ఈ విధంగా నెరవేర్చారు.
ACT 3:19 పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరగండి, అప్పుడు మీ పాపాలు తుడిచివేయబడి, ప్రభువు దగ్గర నుండి విశ్రాంతి కాలాలు రావచ్చు.
ACT 3:20 మీ కోసం నియమించిన క్రీస్తును అనగా యేసును ఆయన పంపవచ్చు.
ACT 3:21 దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ముందే వాగ్దానం చేసినట్లుగా, దేవుడు సమస్తాన్ని పునరుద్ధరించడానికి సమయం వచ్చేవరకు, పరలోకం ఆయనను చేర్చుకోవల్సిందే.
ACT 3:22 అందుకే మోషే, ‘మీ దేవుడైన ప్రభువు నా లాంటి ప్రవక్తను మీలో నుండి మీ కోసం లేవనెత్తుతాడు, ఆయన మీతో చెప్పేవాటన్నిటిని మీరు ఖచ్చితంగా వినాలి.
ACT 3:23 ఎవరైనా ప్రవక్త చెప్పే మాటలకు స్పందించకపోతే వారు తమ ప్రజల నుండి పూర్తిగా తొలగించబడాలి’ అని చెప్పాడు.
ACT 3:24 “నిజానికి సమూయేలు మొదలుకొని ప్రవక్తలందరు ఈ రోజుల గురించి ముందే ప్రవచించారు.
ACT 3:25 మీరు ప్రవక్తలకు మీ పితరులతో దేవుడు చేసిన నిబంధనకు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ సంతానం ద్వారా భూమిపై ఉన్న ప్రజలందరు ఆశీర్వదించబడతారు’ అని వాగ్దానం చేశారు.
ACT 3:26 దేవుడు తన సేవకుని లేపినప్పుడు, మీలో అందరిని దుష్ట మార్గాల నుండి తప్పించి మిమ్మల్ని దీవించడానికి ఆయనను మొదట మీ దగ్గరకు పంపించారు.”
ACT 4:1 పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతున్నపుడు యాజకులు దేవాలయ కావలివారి అధిపతి సద్దూకయ్యులు వారి దగ్గరకు వచ్చారు.
ACT 4:2 అపొస్తలులు ప్రజలకు యేసును గురించి బోధిస్తూ, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని ప్రకటించడం విని వారు చాలా కలవరపడ్డారు.
ACT 4:3 వారు పేతురు యోహానులను పట్టుకుని, సాయంకాలం కావడంతో, మరుసటిరోజు వరకు వారిని చెరసాలలో బంధించారు.
ACT 4:4 కానీ సువార్తను విన్న అనేకమంది నమ్మారు; ఆ విధంగా నమ్మినవారిలో పురుషుల సంఖ్య సుమారు అయిదువేల వరకు పెరిగింది.
ACT 4:5 మరుసటిరోజు అధికారులు, యూదా నాయకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేములో కలుసుకొన్నారు.
ACT 4:6 ముఖ్య యాజకుడు అన్నా, అతని అల్లుడు కయప, యోహాను, అలెగ్జాండరు ప్రధాన యాజకుని ఇతర కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు.
ACT 4:7 వారు పేతురు యోహానులను తీసుకువచ్చి వారి ముందు నిలబెట్టి, “మీరు ఈ పనిని ఏ అధికారంతో ఏ పేరిట చేశారు?” అని ప్రశ్నించడం మొదలుపెట్టారు.
ACT 4:8 అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని, వారితో, “అధికారులారా, ప్రజా నాయకులారా!
ACT 4:9 మేము కుంటివానిపట్ల చూపించిన దయను బట్టి వాడు ఎలా స్వస్థత పొందాడో ప్రశ్నించడానికి నేడు మేము పిలువబడినట్లైతే,
ACT 4:10 మీరు ఇశ్రాయేలు ప్రజలందరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు ఎవరిని సిలువ వేశారో, దేవుడు మరణం నుండి ఎవరిని తిరిగిలేపారో, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామాన్ని బట్టే, ఇతడు స్వస్థపడి మీ ముందు నిలబడ్డాడు.
ACT 4:11 యేసు గురించి, “ ‘ఇల్లు కట్టే మీరు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది’ అని వ్రాయబడింది.
ACT 4:12 కాబట్టి మరి ఎవరి వలన రక్షణ పొందలేము, ఎందుకంటే ఆకాశం క్రింద మనుష్యులకు రక్షణ పొందడానికి మరి ఏ ఇతర పేరులేదు” అన్నాడు.
ACT 4:13 వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వీరు విద్యలేని సామాన్య మనుష్యులని తెలుసుకొని ఆశ్చర్యపడి, వీరు యేసుతో పాటు ఉన్నవారని గుర్తించారు.
ACT 4:14 కానీ ఆ స్వస్థపడినవాడు వీరితో కూడా నిలబడి ఉండడం చూసి మరి ఏమి చెప్పలేకపోయారు.
ACT 4:15 కాబట్టి వారు వీరిని న్యాయసభ నుండి బయటకు వెళ్లమని ఆదేశించి, తమలో తాము చర్చించుకొంటూ,
ACT 4:16 “ఈ మనుష్యులను మనం ఏమి చేద్దాం? యెరూషలేములో నివసించే వారందరికి వీరు ఈ గొప్ప సూచకక్రియను చేశారని తెలుసు, కాబట్టి అది జరగలేదని చెప్పలేము.
ACT 4:17 అయినా ఈ సంగతిని ప్రజల్లో మరింతగా వ్యాపించకుండా ఆపడానికి, ఈ పేరట మరి ఎవరితో మాట్లాడకుండా వారిని మనం బెదిరిద్దాం” అని అనుకున్నారు.
ACT 4:18 మరల ఆ అపొస్తలులను లోపలికి పిలిచి యేసు పేరట ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధించకూడదు అని ఆదేశించారు.
ACT 4:19 అందుకు పేతురు యోహానులు, “దేవుని దృష్టిలో మీ మాట వినడం న్యాయమా లేదా దేవుని మాట వినడం న్యాయమా? మీరే న్యాయం చెప్పండి.
ACT 4:20 మా మట్టుకైతే, మేము చూసినవాటిని విన్నవాటిని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము” అని బదులిచ్చారు.
ACT 4:21 ప్రజలందరు జరిగినదాని గురించి దేవుని స్తుతిస్తున్నారు, అందుకని వీరిని ఎలా శిక్షించాలో నిర్ణయించలేకపోయారు. కాబట్టి వారిని మరింత బెదిరించి విడిచిపెట్టారు.
ACT 4:22 అద్భుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు.
ACT 4:23 పేతురు యోహానులు విడుదల పొందిన తర్వాత, వారి సహవిశ్వాసుల దగ్గరకు వెళ్లి ముఖ్య యాజకులు యూదా పెద్దలు తమతో చెప్పిన వాటన్నింటి గురించి వారికి చెప్పారు.
ACT 4:24 అది విన్న వెంటనే, వారందరు ఏకమనస్సుతో బిగ్గరగా దేవునికి ఈ విధంగా ప్రార్థించారు, “సర్వాధికారియైన ప్రభువా, మీరు ఆకాశాలను, భూమిని సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించారు.
ACT 4:25 చాలా కాలం ముందే మీ సేవకుడు, మా పితరుడైన దావీదు ద్వారా పరిశుద్ధాత్మ పలికించిన మాటలు: “ ‘దేశాలు ఎందుకు కోపంతో ఉన్నాయి ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు?
ACT 4:26 ప్రభువుకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచారు అధికారులు ఏకమయ్యారు.’
ACT 4:27 నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా, యూదేతరులతో ఇశ్రాయేలు ప్రజలతో కలిసి హేరోదు పొంతి పిలాతు ఈ పట్టణంలో కుట్ర చేశారు.
ACT 4:28 ఏమి జరగాలని నీ శక్తి నీ చిత్తం ముందుగానే నిర్ణయించిందో అలాగే వారు చేశారు.
ACT 4:29 ప్రభువా, ఇప్పుడు, వీరి బెదిరింపుల మధ్య మీ సేవకులకు మీ మాటలను చెప్పడానికి గొప్ప ధైర్యం ఇవ్వండి.
ACT 4:30 మీ పరిశుద్ధ సేవకుడైన యేసు పేరట స్వస్థపరచడానికి, సూచకక్రియలు, అద్భుతాలు చేయడానికి మీ హస్తాన్ని చాపండి.”
ACT 4:31 వారు ప్రార్థించిన తర్వాత, వారు ఉన్న స్ధలం కంపించింది. వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
ACT 4:32 నమ్మినవారందరు ఏక హృదయం, ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఎవ్వరూ తమకు కలిగిన ఆస్తిపాస్తులు తమకే సొంతం అనుకోలేదు, తమ దగ్గర ఉన్నవాటన్నిటిని అందరు సమానంగా పంచుకున్నారు.
ACT 4:33 అపొస్తలులు గొప్ప శక్తితో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్ష్యమివ్వడం కొనసాగించారు. వారందరిలో దేవుని కృప ఎంతో శక్తివంతంగా పని చేస్తూ ఉన్నది.
ACT 4:34 అవసరాన్ని బట్టి సమయానికి పొలాలు, ఇల్లు ఉన్నవారు వాటిని అమ్మి ఆ డబ్బును తెచ్చి, అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు.
ACT 4:35 అది అవసరంలో ఉన్నవారికి పంచిపెట్టబడింది. కాబట్టి వారి మధ్య అవసరంలో ఉన్నవారెవరు లేరు.
ACT 4:36 కుప్రకు చెందిన యోసేపు అనే ఒక లేవీయుడు ఉన్నాడు. అపొస్తలులు అతన్ని బర్నబా అని పిలిచేవారు. ఆ పేరుకు “ఆదరణ పుత్రుడు” అని అర్థము.
ACT 4:37 అతడు తన పొలాలను అమ్మివేసి ఆ డబ్బును తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
ACT 5:1 అననీయ అనేవాడు తన భార్యయైన సప్పీరాతో కలిసి తన పొలాన్ని అమ్మాడు.
ACT 5:2 అతడు తన భార్యకు తెలిసే ఆ అమ్మిన డబ్బు నుండి కొంత దాచుకొని, మిగిలిన దానిని తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
ACT 5:3 అప్పుడు పేతురు, “అననీయా, పొలాన్ని అమ్మిన డబ్బులో కొంత నీవు దాచుకొని పరిశుద్ధాత్మతో అబద్ధమాడడానికి ఎలా సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు?
ACT 5:4 అమ్మక ముందు అది నీదే కాదా? దానిని అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! అలాంటప్పుడు ఇలాంటి పని చేయాలని నీవు ఎలా ఆలోచించావు? నీవు మనుష్యులతో కాదు కాని దేవునితోనే అబద్ధమాడావు” అన్నాడు.
ACT 5:5 అననీయ ఆ మాటలు విని, వెంటనే క్రిందపడి చనిపోయాడు. జరిగిన విషయాన్ని విన్నవారందరిలో గొప్ప భయం పుట్టింది.
ACT 5:6 అప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అతని శరీరాన్ని బట్టలతో చుట్టి, మోసుకువెళ్లి పాతిపెట్టారు.
ACT 5:7 మూడు గంటల తర్వాత, జరిగిన సంగతి తెలియని అతని భార్య లోపలికి వచ్చింది.
ACT 5:8 పేతురు ఆమెను, “నీవు అననీయ కలిసి ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాకు చెప్పు” అని అడిగాడు. అందుకు ఆమె, “అవును, ఇంతకే అమ్మాము” అని జవాబిచ్చింది.
ACT 5:9 అందుకు పేతురు ఆమెతో, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరు ఎందుకు ఒక్కటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారి పాదాలు గుమ్మం దగ్గరే ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసుకుపోతారు” అన్నాడు.
ACT 5:10 ఆ క్షణమే ఆమె అతని పాదాల దగ్గర పడి చనిపోయింది. అప్పుడు ఆ యువకులు లోపలికి వచ్చి, ఆమె చనిపోయిందని చూసి, ఆమె శరీరాన్ని మోసుకుపోయి తన భర్త ప్రక్కనే ఆమెను పాతిపెట్టారు.
ACT 5:11 సంఘంలో ఈ సంగతులను విన్నవారందరిలో గొప్ప భయం పుట్టింది.
ACT 5:12 అపొస్తలులు ప్రజల మధ్యలో అనేక సూచకక్రియలను, అద్భుతాలను చేశారు. విశ్వసించిన వారందరు సొలొమోను మండపంలో కలుసుకొనేవారు.
ACT 5:13 ప్రజలు వారిని చాలా గౌరవించినప్పటికి, ఎవరు వారితో కలిసే ధైర్యం చేయలేకపోయారు.
ACT 5:14 అయినా, మరి ఎక్కువ సంఖ్యలలో స్త్రీలు పురుషులు ప్రభువును నమ్ముకొని విశ్వాసుల గుంపులో చేరారు.
ACT 5:15 అపొస్తలుల కార్యాలను బట్టి అనేకమంది రోగులను మంచాల మీద తీసుకువచ్చి, పేతురు వెళ్లేటప్పుడు అతని నీడ పడినా చాలని భావించి వీధుల్లో పరుపు మీద పడుకోబెట్టారు.
ACT 5:16 యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్న పట్టణపు ప్రజలు తీసుకుని వచ్చిన రోగులు అపవిత్రాత్మలతో పీడింపడే వారందరు కూడా స్వస్థపడ్డారు.
ACT 5:17 ప్రధాన యాజకుడు అతనితో ఉన్నవారంతా, అనగా సద్దూకయ్యుల తెగవారు అసూయతో నిండుకొన్నారు.
ACT 5:18 కాబట్టి వారు అపొస్తలులను పట్టుకుని పట్టణపు చెరసాలలో వేయించారు.
ACT 5:19 కానీ ప్రభువు దూత ఆ రాత్రివేళ చెరసాల తలుపులు తెరచి, వారిని బయటకు తీసుకువచ్చి,
ACT 5:20 “వెళ్లి, దేవాలయ ఆవరణంలో నిలబడి ఈ జీవం గురించి ప్రజలందరికి బోధించండి” అని వారితో చెప్పాడు.
ACT 5:21 తమకు చెప్పిన ప్రకారం తెల్లవారగానే వారు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు. ప్రధాన యాజకుడు అతని సహచరులు రాగానే, యూదా న్యాయసభ వారిని పిలిపించి, అపొస్తలులను చెరసాల నుండి తీసుకురమ్మని అధికారులను పంపించారు.
ACT 5:22 వారు చెరసాలకు వచ్చి చూసినపుడు వారక్కడ కనబడలేదు. ఆ అధికారులు తిరిగివెళ్లి న్యాయసభ వారికి,
ACT 5:23 “మేము వెళ్లినప్పుడు చెరసాల జాగ్రత్తగానే తాళం వేయబడి కావలివారు తలుపుల దగ్గర నిలబడే ఉన్నారు; కానీ మేము తలుపులు తెరిచినప్పుడు, లోపల మాకు ఎవరు కనబడలేదు” అని చెప్పారు.
ACT 5:24 ఆ మాటలు విని, దేవాలయ కాపలా అధికారి ముఖ్య యాజకులు కలవరంతో, ఇది దేనికి దారితీస్తుందో అని ఆందోళన చెందారు.
ACT 5:25 అప్పుడు ఒకడు వచ్చి, “చూడండి, మీరు చెరసాలలో పెట్టినవారు దేవాలయ ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు.
ACT 5:26 వెంటనే కాపలా అధికారి తన సేవకులతో వెళ్లి, అపొస్తలులను తీసుకువచ్చారు. ప్రజలు తమను రాళ్లతో కొడతారేమో అని భయపడి, వారు బలప్రయోగం చేయలేదు.
ACT 5:27 ప్రధాన యాజకుడు ప్రశ్నించాలని అపొస్తలులను న్యాయసభ ముందు నిలబెట్టారు.
ACT 5:28 అప్పుడు ప్రధాన యాజకుడు, “ఈ పేరట బోధించకూడదు అని మీకు మేము ఖచ్చితంగా ఆదేశించాము, అయినాసరే మీ బోధలతో యెరూషలేమును నింపి ఈ మనుష్యుని హత్యచేసిన నేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని అన్నాడు.
ACT 5:29 అందుకు పేతురు ఇతర అపొస్తలులు, “మేము మనుష్యుల కన్నా దేవునికే లోబడాలి కదా!
ACT 5:30 మీరు సిలువ మీద వ్రేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు సజీవంగా లేపారు.
ACT 5:31 ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలకు పశ్చాత్తాపాన్ని, పాపక్షమాపణను దయచేయడానికి, దేవుడు ఆయనను అధిపతిగా రక్షకునిగా తన కుడిచేతి వైపుకు హెచ్చించారు.
ACT 5:32 మేము, అలాగే దేవునికి లోబడిన వారికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులము.”
ACT 5:33 న్యాయసభ వారు ఈ మాటలను విని మరింత కోపం తెచ్చుకుని వారిని చంపాలని అనుకున్నారు.
ACT 5:34 అయితే న్యాయసభలోని ఒకడు, ప్రజలందరి చేత గౌరవించబడే పరిసయ్యుడైన గమలీయేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, వారిని కొంతసేపు బయట ఉంచమని ఆదేశించాడు.
ACT 5:35 తర్వాత న్యాయసభతో, “ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యులకు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దాని గురించి జాగ్రత్తగా ఉండండి.
ACT 5:36 ఎందుకంటే కొంతకాలం క్రిందట థూదా అనే ఒకడు, తాను గొప్పవానినని చెప్పుకొన్నాడు, ఇంచుమించు నాలుగువందలమంది అతన్ని అనుసరించారు. అతడు చంపబడిన తర్వాత, అతని అనుచరులు చెదరిపోయారు, ఏమి మిగలకుండా పోయింది.
ACT 5:37 అతని తర్వాత, జనాభా లెక్కలను వ్రాసే రోజుల్లో గలిలయుడైన యూదా అనేవాడు లేచి ప్రజలను తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. అతడు కూడా చంపబడ్డాడు, అతని అనుచరులు కూడా చెదరిపోయారు.
ACT 5:38 కాబట్టి ప్రస్తుత ఈ పరిస్థితిలో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే: వారిని వదిలేయండి! వారిని వెళ్లనివ్వండి. వారి ఉద్దేశాలు లేదా క్రియలు మనుష్యుల వలన వచ్చినవైతే అవే ఆగిపోతాయి.
ACT 5:39 కాని అది దేవుని నుండి అయితే, వారిని మీరు ఆపలేరు; మీరు దేవునితో పోరాడుతున్నట్లే అని మీరు తెలుసుకుంటారు” అన్నాడు.
ACT 5:40 అతని మాటలను వారు అంగీకరించారు, కాబట్టి అపొస్తలులను లోపలికి పిలిచి వారిని కొట్టించారు. తర్వాత యేసు పేరట మాట్లాడకూడదని వారిని ఆదేశించి పంపించారు.
ACT 5:41 ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి తగినవారిగా ఎంచడంతో సంతోషిస్తూ అపొస్తలులు న్యాయసభ నుండి బయటకు వెళ్లిపోయారు.
ACT 5:42 వారు ప్రతీ రోజు మానక దేవాలయ ఆవరణాల్లో ఇంటింట సువార్తను బోధిస్తూ “యేసే క్రీస్తు” అని ప్రకటించుచున్నారు.
ACT 6:1 ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నపుడు, ప్రతీ రోజు ఆహారం పంచిపెట్టే విషయంలో, గ్రీకు విధవరాండ్రను పట్టించుకోవడం లేదని గ్రీకుభాష మాట్లాడే యూదులు హెబ్రీభాష మాట్లాడే యూదుల మీద సణుగుకొన్నారు.
ACT 6:2 కాబట్టి పన్నెండుమంది అపొస్తలులు మిగిలిన విశ్వాసులందరిని ఒకచోటకు పిలిపించి వారితో, “మేము దేవుని వాక్య పరిచర్యను నిర్లక్ష్యం చేసి భోజన బల్లల గురించి కనిపెట్టుకొని ఉండడం సరికాదు.
ACT 6:3 కాబట్టి సహోదరి సహోదరులారా, ఆత్మతో, జ్ఞానంతో నింపబడిన ఏడుగురిని మీలో నుండి ఏర్పరచుకోండి. మేము ఈ బాధ్యతను వారికి అప్పగిస్తాము.
ACT 6:4 అప్పుడు మేము ప్రార్థనపై, వాక్య పరిచర్యపై శ్రద్ధ వహించగలం” అని చెప్పారు.
ACT 6:5 ఈ ఆలోచన అందరికి నచ్చింది. కాబట్టి వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండిన స్తెఫెను, ఫిలిప్పు, ప్రోకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదా మతంలోనికి మారిన అంతియొకయ నివాసియైన నికోలాసు అనే వారిని ఏర్పరచుకున్నారు.
ACT 6:6 వారిని అపొస్తలుల ముందు నిలబెట్టినప్పుడు, వారు వీరిపై చేతులుంచి ప్రార్థన చేశారు.
ACT 6:7 కాబట్టి దేవుని వాక్యం వ్యాపించింది. యెరూషలేములో శిష్యుల సంఖ్య అతివేగంగా పెరిగింది, యాజకులలో కూడా చాలామంది విశ్వాసానికి లోబడ్డారు.
ACT 6:8 స్తెఫెను, దేవుని కృపతో శక్తితో నిండి ప్రజలమధ్య గొప్ప అద్భుతాలు సూచకక్రియలు చేశాడు.
ACT 6:9 అయితే స్వతంత్రుల సమాజమందిరానికి (అలా పిలువబడేది) చెందిన కురేనీయులు అలెక్సంద్రియ, అలాగే కిలికియా ఆసియా ప్రాంతాల నుండి వచ్చిన యూదులు స్తెఫెనుతో వాదించడం మొదలుపెట్టారు.
ACT 6:10 కాని ఆత్మ అనుగ్రహించిన జ్ఞానంతో మాట్లాడుతున్న స్తెఫెనుకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేకపోయారు.
ACT 6:11 కాబట్టి వారు రహస్యంగా కొందరిని ప్రేరేపించి, “మోషే మీద దేవుని మీద స్తెఫెను దైవదూషణ చేయడం మేము విన్నాం” అని చెప్పించారు.
ACT 6:12 ప్రజలను, యూదా నాయకులను ధర్మశాస్త్ర ఉపదేశకులను వారు రెచ్చగొట్టారు. వారు స్తెఫెనును పట్టుకుని న్యాయసభ ముందు నిలబెట్టారు.
ACT 6:13 వారు అబద్ధ సాక్షులను తీసుకువచ్చి, “ఇతడు ఈ పరిశుద్ధ స్థలానికి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఆపలేదు.
ACT 6:14 నజరేయుడైన యేసు ఈ స్థలాన్ని పడగొట్టి, మోషే మనకు ఇచ్చిన ఆచారాలను మార్చేస్తాడని ఇతడు చెప్పడం మేము విన్నాం” అని చెప్పించారు.
ACT 6:15 న్యాయసభలో కూర్చున్న వారంతా స్తెఫెను వైపు సూటిగా చూసినప్పుడు, అతని ముఖం ఒక దేవదూత ముఖంలా వారికి కనబడింది.
ACT 7:1 అప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫెనును, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు.
ACT 7:2 అందుకు అతడు, “సహోదరులారా తండ్రులారా, నా మాటను వినండి! మన పితరుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై,
ACT 7:3 ‘నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు’ అని చెప్పారు.
ACT 7:4 “కాబట్టి అతడు కల్దీయుల దేశాన్ని విడిచివెళ్లి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత, నేడు మనం నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడు అతన్ని పంపారు.
ACT 7:5 ఇక్కడ అతనికి ఒక పాదం పట్టే అంత స్థలం కూడా దేవుడు వారసత్వంగా ఇవ్వలేదు. కాని దేవుడు అబ్రాహాముకు ఒక్క సంతానం కూడా లేని సమయంలో అతని తర్వాత రాబోయే అతని సంతానం ఆ దేశాన్ని స్వాధీన పరచుకొంటారని అతనితో వాగ్దానం చేశారు.
ACT 7:6 దేవుడు అతనితో ఇలా మాట్లాడారు: ‘నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు.
ACT 7:7 కాని వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత ఆ దేశం నుండి వారు బయటకు వచ్చి ఈ స్థలంలో నన్ను ఆరాధిస్తారు’ అని దేవుడు చెప్పారు.
ACT 7:8 అప్పుడు దేవుడు అబ్రాహాముకు సున్నతితో ఒక నిబంధనను ఇచ్చారు. కాబట్టి అతడు ఇస్సాకుకు తండ్రియైనప్పుడు నిబంధన ప్రకారం అతడు పుట్టిన ఎనిమిదవ రోజున అతనికి సున్నతి చేశాడు. ఇలా ఇస్సాకు యాకోబుకు తండ్రిగా యాకోబు పన్నెండు గోత్రాల పితరులను కన్న తండ్రిగా సున్నతి నిబంధనను పాటించారు.
ACT 7:9 “మన పితరులు తమ సహోదరుడైన యోసేపును అసూయతో ఈజిప్టుకు బానిసగా అమ్మివేశారు.
ACT 7:10 కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి, అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించారు. ఆయన యోసేపుకు జ్ఞానం ఇచ్చి ఈజిప్టు రాజైన ఫరో దయ పొందుకొనేలా చేశారు. కాబట్టి ఫరో ఈజిప్టు దేశమంతటిమీద అలాగే అతని రాజభవనం మీద కూడా అతన్ని అధికారిగా నియమించాడు.
ACT 7:11 “ఆ తర్వాత ఈజిప్టు కనాను దేశాల్లో తీవ్రమైన కరువు వచ్చి, ప్రజలందరికి చాలా కష్టాలు కలిగాయి, అప్పుడు మన పితరులకు కరువు వల్ల ఆహారం దొరకలేదు.
ACT 7:12 యాకోబు ఈజిప్టులో ధాన్యం ఉందని విని, మన పితరులను మొదటిసారి ఈజిప్టు దేశానికి పంపించాడు.
ACT 7:13 వారు రెండవసారి వెళ్లినప్పుడు, యోసేపు తాను ఎవరో తన సహోదరులకు తెలియజేశాడు. అలాగే ఫరో యోసేపు కుటుంబం గురించి తెలుసుకున్నాడు.
ACT 7:14 ఆ తర్వాత యోసేపు తన తండ్రియైన యాకోబును, తన కుటుంబమంతటిని పిలిపించాడు, వారు మొత్తం డెబ్బై అయిదు మంది వ్యక్తులు.
ACT 7:15 అప్పుడు యాకోబు ఈజిప్టుకు వెళ్లాడు, అక్కడే అతడు మన పితరులు చనిపోయారు.
ACT 7:16 వారి మృతదేహాలను షెకెము అనే ఊరికి తెచ్చి అబ్రాహాము షెకెములోని హామోరు కుమారుల దగ్గర వెల ఇచ్చి కొన్న అదే స్థలంలోని సమాధిలో ఉంచారు.
ACT 7:17 “దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చే సమయం దగ్గరకు వచ్చినప్పుడు, ఈజిప్టులో ఉన్న మన ప్రజల సంఖ్య అతి విస్తారంగా పెరిగింది.
ACT 7:18 కొంతకాలం తర్వాత యోసేపు గురించి తెలియని ఒక క్రొత్త రాజు, ఈజిప్టులో అధికారంలోకి వచ్చాడు.
ACT 7:19 అతడు మన జాతి ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించి పుట్టిన తమ చంటి పిల్లలను చనిపోవడానికి పారవేయాలని మన పితరులను బలవంతం చేసి హింసించాడు.
ACT 7:20 “ఇలాంటి రోజుల్లో మోషే పుట్టాడు, అతడు సామాన్యమైన బిడ్డ కాదు. మూడు నెలల వరకు అతని కుటుంబం అతన్ని కాపాడింది.
ACT 7:21 అతన్ని బయట వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని, అతన్ని తన సొంత కుమారునిగా పెంచుకొంది.
ACT 7:22 మోషే ఈజిప్టువారి విద్యలన్నింటిని నేర్చుకొని, మాటలోను, క్రియలలోను ప్రావీణ్యత సంపాదించుకున్నాడు.
ACT 7:23 “మోషేకు నలభై సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులైన తన సొంత ప్రజలను చూడాలని నిర్ణయించుకొన్నాడు.
ACT 7:24 అతడు తన జాతివారిలోని ఒకడిని ఒక ఐగుప్తీయుడు దౌర్జన్యంగా కొట్టడం చూసి, వానిని కాపాడి ఆ ఈజిప్టువాన్ని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు.
ACT 7:25 తన ద్వారా తన సొంత జాతి ప్రజలను దేవుడు విడుదల చేస్తున్నాడనే సంగతిని తన ప్రజలు తెలుసుకుంటారని మోషే అనుకున్నాడు కాని వారు గ్రహించలేదు.
ACT 7:26 మరుసటిరోజు, పోట్లాడుకుంటున్న ఇద్దరు ఇశ్రాయేలీయుల దగ్గరకు మోషే వచ్చి వారిని సమాధానపరచాలని ప్రయత్నిస్తూ ‘అయ్యా, మీరిద్దరు సహోదరులు కదా, మీరెందుకు ఒకరిని ఒకరు గాయపరచుకొంటున్నారు?’ అని అడిగాడు.
ACT 7:27 “అయితే గాయపరుస్తున్న వాడు మోషేను ప్రక్కకు త్రోసి, ‘మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు?
ACT 7:28 ఆ ఈజిప్టువాన్ని చంపినట్లు నన్ను కూడా చంపాలని అనుకుంటున్నావా?’ అన్నాడు.
ACT 7:29 మోషే ఆ మాట విని మిద్యాను దేశానికి పారిపోయి, అక్కడ ఒక పరదేశిగా జీవించి ఇద్దరు కుమారులను కన్నాడు.
ACT 7:30 “నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత, ఒక రోజు సీనాయి పర్వతం దగ్గర అరణ్యంలో ఒక మండుతున్న పొదలో నుండి వస్తున్న అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత మోషేకు ప్రత్యక్షమయ్యాడు.
ACT 7:31 అతడు అది చూసి, ఆ దర్శనానికి ఆశ్చర్యపడి స్పష్టంగా చూడడానికి దాని దగ్గరకు వెళ్తుండగా,
ACT 7:32 ‘నేను మీ పితరుల దేవుడను అనగా నేనే అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడను’ అని ప్రభువు చెప్పడం అతడు విన్నాడు. కాబట్టి మోషే భయంతో వణుకుతూ దానిని చూడడానికి సాహసించలేకపోయాడు.
ACT 7:33 “అప్పుడు ప్రభువు అతనితో, ‘నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు.
ACT 7:34 ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను నేను చూశాను. నేను వారి మూలుగులను విని వారిని విడిపించడానికి దిగి వచ్చాను. కాబట్టి రా! నేను నిన్ను తిరిగి ఈజిప్టు దేశానికి పంపుతాను’ అన్నారు.
ACT 7:35 “ ‘మామీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు?’ అని తిరస్కరించిన ఈ మోషేనే దేవుడు వారికి అధికారిగా విమోచకునిగా ఉండాలని మండుతున్న పొదలో ప్రత్యక్షమైన దేవదూత ద్వార పంపించారు.
ACT 7:36 అతడు ఈజిప్టులో, ఎర్ర సముద్రం దగ్గర నలభై సంవత్సరాలు అరణ్యంలో అద్భుతాలను సూచకక్రియలను చేసి వారిని ఈజిప్టు నుండి బయటకు నడిపించాడు.
ACT 7:37 “ఈ మోషేనే ఇశ్రాయేలీయులతో, ‘దేవుడు నా లాంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కోసం లేవనెత్తుతాడు’ అని చెప్పాడు.
ACT 7:38 అతడు అరణ్యంలో ఉన్నప్పుడు సీనాయి కొండమీద తనతో మాట్లాడిన దూతతో మన పితరులతో సమావేశం అయ్యాడు; మనకు అందించడానికి జీవ వాక్కులు పొందుకున్నాడు.
ACT 7:39 “కానీ మన పితరులు అతనికి లోబడలేదు. పైగా అతన్ని తిరస్కరించి తమ హృదయాల్లో ఈజిప్టు వైపుకు తిరిగారు.
ACT 7:40 వారు అహరోనుతో, ‘ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి’ అని అన్నారు.
ACT 7:41 అప్పుడు వారు ఒక దూడ రూపంలో ఒక విగ్రహాన్ని చేసుకున్నారు. దానికి బలులను అర్పించి తమ స్వహస్తాలతో చేసిన దాని ముందు ఆనందించారు.
ACT 7:42 అందుకు దేవుడు వారి నుండి దూరమై సూర్య, చంద్ర నక్షత్రాలను పూజించడానికి వారిని విడిచిపెట్టాడు. దీనిని గురించి ప్రవక్తల గ్రంథాల్లో: “ ‘ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు మీరు నాకు బలులు అర్పణలు తెచ్చారా?
ACT 7:43 మీరు తయారుచేసుకున్న విగ్రహాలను పూజించారు మొలొకును దైవమని దాని గుడారాన్ని ఊరేగించారు, రెఫాను అనే మీ దేవుని నక్షత్రాన్ని పూజించారు. అందుకే నేను మిమ్మల్ని బబులోను అవతలికి బందీలుగా పంపిస్తాను’ అని వ్రాయబడి ఉంది.
ACT 7:44 “దేవుడు మోషేకు చూపించిన నమూనా ప్రకారం, దేవుని సన్నిధి కలిగిన సాక్షి గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉన్నది.
ACT 7:45 ఆ గుడారాన్ని పొందుకొన్న తర్వాత, మన పితరులు యెహోషువ నాయకత్వంతో దేవుడు తమ ముందు నుండి వెళ్లగొట్టిన జనాలను నుండి స్వాధీనపరచుకున్న దేశంలోనికి తమతో పాటు దానిని తెచ్చారు. ఆ గుడారం దావీదు కాలం వరకు ఆ దేశంలోనే ఉన్నది.
ACT 7:46 దావీదు దేవుని దయను అనుభవించినవాడై, యాకోబు దేవుని కోసం నివాస స్థలాన్ని ఏర్పాటుచేస్తానని దేవున్ని అడిగాడు.
ACT 7:47 కానీ ఆయన కోసం నివాస స్థలాన్ని సొలొమోను కట్టించాడు.
ACT 7:48 “అయినా, మానవుల చేతులతో నిర్మించే ఆలయాలలో సర్వోన్నతుడు నివసించడు. దాని గురించి ప్రవక్తలు ఈ విధంగా చెప్పారు:
ACT 7:49 “ ‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కోసం ఎలాంటి నివాస స్థలాన్ని కడతారు? అని దేవుడు అంటున్నారు నా విశ్రాంతి స్థలం ఏది?
ACT 7:50 వీటన్నిటిని చేసింది నా చేయి కాదా?’
ACT 7:51 “మెడవంచని ప్రజలారా! మీ హృదయాలు మీ చెవులు ఇంకా సున్నతి పొందనివిగా ఉన్నాయి. మీరు మీ పితరుల వలె ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు.
ACT 7:52 మీ పితరులు హింసించని ప్రవక్త ఒకడైనా ఉన్నాడా? ఆ నీతిమంతుని రాకను ముందుగానే ప్రవచించిన వారందరిని చంపేశారు. ఇప్పుడు మీరు అతన్ని అప్పగించి హత్య చేశారు.
ACT 7:53 దేవదూతల ద్వారా చేయించిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందుకున్నారు కాని దానికి లోబడలేదు” అన్నాడు.
ACT 7:54 న్యాయసభ సభ్యులు ఈ మాటలు విన్నప్పుడు, చాలా కోపంతో స్తెఫెనును చూసి పండ్లు కొరికారు.
ACT 7:55 కానీ స్తెఫెను పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశం వైపు తన తలనెత్తి దేవుని మహిమను, దేవుని కుడిచేతి వైపున యేసు నిలబడి ఉండడం చూశాడు.
ACT 7:56 అతడు వారితో, “చూడండి! నేను పరలోకం తెరవబడి ఉండడం, మనుష్యకుమారుడు దేవుని కుడిచేతి వైపున నిలబడి ఉండడం నేను చూస్తున్నాను” అని చెప్పాడు.
ACT 7:57 అందుకు వారందరు తమ చెవులను మూసుకొని పెద్దగా కేకలువేస్తూ, అతని మీద పడి,
ACT 7:58 పట్టణం బయటకు అతన్ని ఈడ్చుకొని వెళ్లి, రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. చూసే సాక్షులందరు తమ వస్త్రాలను సౌలు అనే యువకుని పాదాల దగ్గర పెట్టారు.
ACT 7:59 వారు స్తెఫెనును రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో” అని ప్రార్థించాడు.
ACT 7:60 తర్వాత అతడు మోకరించి, “ప్రభువా, ఈ పాపాన్ని వీరి మీద మోపకు” అని మొరపెట్టాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత, అతడు నిద్రించాడు.
ACT 8:1 సౌలు స్తెఫెను చావును సమ్మతించాడు. ఆ రోజు నుండి యెరూషలేములోని సంఘానికి విరోధంగా తీవ్రమైన హింస చెలరేగింది, కాబట్టి అపొస్తలులు తప్ప మిగిలిన సంఘమంతా యూదయ, సమరయ ప్రాంతాలకు చెదరిపోయింది.
ACT 8:2 దైవభయం గల విశ్వాసులు స్తెఫెనును సమాధి చేసి అతని కోసం ఎంతో రోదించారు.
ACT 8:3 అయితే సౌలు ఇంటింటికి వెళ్లి, పురుషులను స్త్రీలను బయటకు ఈడ్చుకెళ్లి వారిని చెరసాలలో వేయిస్తూ, సంఘాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు.
ACT 8:4 చెదరిపోయినవారు తాము వెళ్లిన ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని బోధించారు.
ACT 8:5 ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్లి అక్కడ క్రీస్తు గురించి ప్రకటించాడు.
ACT 8:6 జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచకక్రియలను చూసి, అతడు చెప్పిన మాటల మీద శ్రద్ధ పెట్టసాగారు.
ACT 8:7 చాలామందిలో నుండి దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి, చాలామంది పక్షవాతం కలవారు, కుంటివారు స్వస్థత పొందుకున్నారు.
ACT 8:8 కాబట్టి ఆ పట్టణంలో గొప్ప ఆనందం కలిగింది.
ACT 8:9 కొంతకాలం నుండి ఆ పట్టణంలో మంత్రవిద్యను ప్రదర్శిస్తూ తానొక గొప్పవాడినని చెప్పుకుంటూ సమరయ ప్రజలందరినీ ఆశ్చర్యపరచే, సీమోను అనే పేరు కలవాడు ఉన్నాడు.
ACT 8:10 అల్పులు మొదలుకొని గొప్పవారి వరకు ప్రజలందరు, “దేవుని శక్తి అంటే ఇతడే” అని చెప్తూ అతని మాటలపై శ్రద్ధచూపారు.
ACT 8:11 అతడు తన మంత్రవిద్యతో వారిని చాలా కాలం నుండి ఆశ్చర్యపరుస్తున్నాడు కాబట్టి వారు అతన్ని వెంబడించేవారు.
ACT 8:12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యసువార్తను, యేసు క్రీస్తు నామాన్ని ప్రకటించినప్పుడు వారు నమ్మారు, అలా నమ్మిన స్త్రీలు పురుషులు బాప్తిస్మం పొందుకున్నారు.
ACT 8:13 సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందుకొన్నాడు. అతడు ఫిలిప్పు వెళ్లిన ప్రతి చోటికి వెంబడిస్తూ, తాను చూసిన గొప్ప సూచకక్రియలు అద్భుతాలను బట్టి ఆశ్చర్యపడ్డాడు.
ACT 8:14 సమరయ ప్రజలు దేవుని వాక్యాన్ని స్వీకరించారని విన్న యెరూషలేములోని అపొస్తలులు, పేతురు యోహానులను సమరయ ప్రాంతానికి పంపించారు.
ACT 8:15 వారు అక్కడికి చేరుకొని, నూతన విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థించారు,
ACT 8:16 ఎందుకంటే వారిలో ఎవ్వరూ పరిశుద్ధాత్మను ఇంకా పొందుకోలేదు; వారు కేవలం ప్రభువైన యేసు పేరట బాప్తిస్మం మాత్రమే పొందుకున్నారు.
ACT 8:17 పేతురు యోహానులు తమ చేతులను వారి మీద ఉంచగానే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు.
ACT 8:18 అపొస్తలులు చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మను పొందుకోవడం చూసిన సీమోను, వారికి డబ్బు ఇస్తూ,
ACT 8:19 “నేను చేతులుంచిన ప్రతివారు పరిశుద్ధాత్మను పొందుకొనేలా ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి” అని అడిగాడు.
ACT 8:20 అందుకు పేతురు, “నీవు దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకున్నావు కాబట్టి నీ డబ్బు నీతో నశించును గాక!
ACT 8:21 నీ హృదయం దేవుని ఎదుట సరియైనదిగా లేదు, కాబట్టి ఈ పరిచర్యలో నీకు భాగం లేదు.
ACT 8:22 నీ హృదయంలో అలాంటి ఆలోచన కలిగినందుకు క్షమిస్తాడనే నిరీక్షణతో నీ దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకో.
ACT 8:23 ఎందుకంటే నీవు ఘోర దుష్టత్వంతో నిండి పాపంలో బంధించబడి ఉన్నావని నాకు కనిపిస్తోంది” అన్నాడు.
ACT 8:24 అందుకు సీమోను, “మీరు నాతో చెప్పినవి ఏవి నాకు జరుగకుండా నా కోసం మీరే ప్రభువుకు ప్రార్థన చేయండి” అని వేడుకున్నాడు.
ACT 8:25 వారు దేవుని వాక్యాన్ని ప్రకటించి యేసు గురించి సాక్ష్యం ఇచ్చిన తర్వాత, పేతురు యోహానులు సమరయలోని అనేక గ్రామాల్లో సువార్తను ప్రకటిస్తూ యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
ACT 8:26 ఒక దేవదూత ఫిలిప్పుతో, “నీవు దక్షిణ దిశలో యెరూషలేము పట్టణం నుండి గాజాకు వెళ్లే ఎడారి మార్గంలో వెళ్లు” అని చెప్పాడు.
ACT 8:27 అతడు బయలుదేరి వెళ్తునప్పుడు, ఆ మార్గంలో ఇతియొపీయుల రాణియైన కందాకే యొక్క ధనాగారం అంతటికి ముఖ్య అధికారిగా ఉన్న ఇతియొపీయుడైన నపుంసకుని కలుసుకున్నాడు. ఇతడు ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లాడు,
ACT 8:28 అతడు తన ఇంటికి తిరిగి వెళ్తూ తన రథంలో కూర్చుని యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతున్నాడు.
ACT 8:29 అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథానికి దగ్గరగా వెళ్లు” అని చెప్పాడు.
ACT 8:30 అప్పుడు ఫిలిప్పు పరుగెత్తి రథం దగ్గరకు వెళ్లినప్పుడు అతడు యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని చదువుతుంటే విని, “నీవు చదివేది నీకు అర్థమవుతుందా?” అని ఫిలిప్పు అడిగాడు.
ACT 8:31 అతడు, “ఎవరు వివరించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది?” అని చెప్పి, ఫిలిప్పును తన రథమెక్కి తనతో కూర్చోమని వేడుకున్నాడు.
ACT 8:32 ఆ నపుంసకుడు చదువుతున్న లేఖనభాగం ఇది: “ఆయన వధించబడడానికి తేబడిన గొర్రెవలె బొచ్చు కత్తిరించే వాని దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన తన నోరు తెరవలేదు.
ACT 8:33 తన దీనత్వాన్ని బట్టి ఆయన న్యాయాన్ని కోల్పోయాడు. ఆయన సంతానం గురించి మాట్లాడేవారు ఎవరు? ఎందుకంటే భూమి మీద నుండి ఆయన ప్రాణం తీసివేయబడింది.”
ACT 8:34 ఆ నపుంసకుడు ఫిలిప్పును, “ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు, తన గురించా లేదా ఇంకొకరి గురించా? దయచేసి, నాకు చెప్పండి” అని అడిగాడు.
ACT 8:35 అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనంతో ప్రారంభించి, యేసును గురించిన సువార్తను అతనికి చెప్పాడు.
ACT 8:36 వారు దారిలో వెళ్తునప్పుడు, నీళ్లు ఉన్న చోటికి వారు వచ్చారు, అప్పుడు ఆ నపుంసకుడు, “చూడండి, ఇక్కడ నీళ్లున్నాయి కదా, నేను బాప్తిస్మం పొందడానికి ఏమైన ఆటంకం ఉందా?” అని అడిగాడు.
ACT 8:37 అందుకు ఫిలిప్పు, “నీ పూర్ణహృదయంతో నమ్మితే, పొందుకోవచ్చు” అని చెప్పాడు. అప్పుడు ఆ నపుంసకుడు, “యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను” అన్నాడు.
ACT 8:38 అతడు రథాన్ని ఆపమని ఆదేశించాడు. వారు ఇద్దరు నీళ్లలోనికి దిగిన తర్వాత ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు.
ACT 8:39 వారు నీళ్లలో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును తీసుకెళ్లాడు. తర్వాత ఆ నపుంసకుడు అతన్ని ఇంకా ఎప్పుడు చూడలేదు, కాని అతడు సంతోషంగా తన దారిన వెళ్లిపోయాడు.
ACT 8:40 అయితే, ఫిలిప్పు ఆజోతు పట్టణంలో కనబడిన తర్వాత, అక్కడినుండి కైసరయ పట్టణానికి వెళ్లేవరకు అతడు అన్ని పట్టణాల్లో సువార్త ప్రకటిస్తూ వెళ్లాడు.
ACT 9:1 మరోవైపు, సౌలు, ప్రభువు శిష్యులను చంపుతానని బెదిరిస్తూనే ఉన్నాడు. అతడు ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్లి,
ACT 9:2 ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఎవరైనా తనకు కనబడితే, పురుషులనైనా స్త్రీలనైనా బందీలుగా యెరూషలేముకు తీసుకురావడానికి, దమస్కులోని సమాజమందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇవ్వమని అడిగాడు.
ACT 9:3 వాటిని తీసుకుని అతడు ప్రయాణిస్తూ, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.
ACT 9:4 అతడు నేల మీద పడిపోయి, ఒక స్వరం, “సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు?” అని అనడం విన్నాడు.
ACT 9:5 అందుకు సౌలు, “ప్రభువా, నీవెవరు?” అని అడిగాడు. అప్పుడు ఆ స్వరం అతనితో, “నేను నీవు హింసిస్తున్న యేసును
ACT 9:6 నీవు లేచి పట్టణంలోనికి వెళ్లు, నీవు అక్కడ ఏం చేయాలో నీకు తెలుస్తుంది” అన్నది.
ACT 9:7 సౌలుతో పాటు ప్రయాణం చేస్తున్నవారు ఆ శబ్దాన్ని విన్నారు కాని మౌనంగా నిలబడిపోయారు, వారికి స్వరం వినబడింది కాని ఎవ్వరూ కనబడలేదు.
ACT 9:8 సౌలు నేల నుండి లేచి, కళ్లు తెరిచినప్పుడు ఏమి చూడలేకపోయాడు. కాబట్టి వారు అతని చేయి పట్టుకుని దమస్కు పట్టణంలోనికి నడిపించారు.
ACT 9:9 మూడు రోజులు చూపులేకుండా ఉన్నాడు, ఏమి తినలేదు త్రాగలేదు.
ACT 9:10 దమస్కు పట్టణంలో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. దర్శనంలో ప్రభువు అతన్ని, “అననీయా!” అని పిలిచారు. అప్పుడు అతడు, “ప్రభువా” నేనే అని సమాధానం చెప్పాడు.
ACT 9:11 ప్రభువు అతనితో, “తిన్నని వీధిలో యూదా అనే వాని ఇంటికి వెళ్లి తార్సు నుండి వచ్చిన సౌలును గురించి అడుగు, ఎందుకంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు.
ACT 9:12 అననీయ అనే వ్యక్తి వచ్చి, తాను చూపు పొందుకోవడానికి తనపై చేతులు ఉంచుతాడని ఒక దర్శనంలో అతడు చూశాడు” అన్నారు.
ACT 9:13 అందుకు అననీయ, “ప్రభువా, అతని గురించి, అతడు యెరూషలేములో నిన్ను విశ్వసించిన వారికి చేసిన హానిని గురించి అనేక విషయాలను నేను విన్నాను.
ACT 9:14 ఇంకా ఇక్కడ కూడా నీ పేరట ప్రార్థించే వారందరిని బంధించడానికి ముఖ్య యాజకుల నుండి అధికారాన్ని పొందుకొని ఇక్కడకు వచ్చాడు” అని జవాబిచ్చాడు.
ACT 9:15 అయితే ప్రభువు అననీయతో, “వెళ్లు! ఇతడు ఇశ్రాయేలీయులకు యూదేతరులకు వారి రాజులకు నా నామాన్ని ప్రకటించడానికి నేను ఏర్పరచుకున్న నా సాధనము.
ACT 9:16 నా పేరు కోసం ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను” అని చెప్పారు.
ACT 9:17 అప్పుడు అననీయ ఆ ఇంటికి వెళ్లి సౌలు మీద తన చేతులుంచి అతనితో, “సహోదరుడా సౌలు, నీవు ఇక్కడ వస్తున్నప్పుడు మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు మరలా చూపు పొందాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని నన్ను నీ దగ్గరకు పంపించారు” అని చెప్పాడు.
ACT 9:18 వెంటనే, సౌలు కళ్ల నుండి పొరల వంటివి రాలిపడి, అతడు మరలా చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మం పొందుకొన్నాడు.
ACT 9:19 అతడు కొంత ఆహారం తీసుకున్న తర్వాత శక్తి పొందుకొన్నాడు. సౌలు కొన్ని రోజులు దమస్కులోని శిష్యులతో గడిపాడు.
ACT 9:20 యేసే దేవుని కుమారుడని సమాజమందిరాల్లో ప్రకటించడం మొదలుపెట్టాడు.
ACT 9:21 అతని మాటలు విన్నవారందరు ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసు పేరట ప్రార్థించిన వారిని నాశనం చేసినవాడు ఇతడే కదా? ముఖ్య యాజకుల దగ్గరకి వారిని బందీలుగా పట్టుకుని వెళ్లడానికే ఇక్కడి వచ్చాడు కదా?” అని చెప్పుకొన్నారు.
ACT 9:22 అయినా సౌలు మరింత ఎక్కువ బలపడి యేసే క్రీస్తు అని రుజువుచేస్తూ దమస్కులో జీవిస్తున్న యూదులను ఆశ్చర్యపరిచాడు.
ACT 9:23 చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు.
ACT 9:24 కాని వారి కుట్ర గురించి సౌలు తెలుసుకున్నాడు. అతన్ని చంపడానికి వారు రాత్రింబగళ్ళు పట్టణపు ద్వారాల దగ్గర చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు.
ACT 9:25 అయితే అతని అనుచరులు రాత్రివేళలో అతన్ని తీసుకెళ్లి గంపలో కూర్చోబెట్టి గోడలోని సందు గుండా క్రిందకు దించారు.
ACT 9:26 అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు, శిష్యులతో చేరడానికి ప్రయత్నించాడు, కాని అతడు నిజమైన శిష్యుడని నమ్మలేక వారు అతనికి భయపడ్డారు.
ACT 9:27 కానీ బర్నబా అతన్ని దగ్గరకు చేరదీసి అపొస్తలుల దగ్గరకు అతన్ని తీసుకువచ్చాడు. సౌలు తన ప్రయాణంలో ప్రభువును ఎలా చూశాడు, ప్రభువు అతనితో మాట్లాడిన విషయం, అతడు దమస్కులో యేసు పేరట ధైర్యంగా ఎలా బోధించాడు అనే విషయాలను వారికి చెప్పాడు.
ACT 9:28 కాబట్టి సౌలు వారితో కలిసి ఉంటూ యెరూషలేములో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరట ధైర్యంగా బోధించసాగాడు.
ACT 9:29 అతడు గ్రీకుభాష మాట్లాడే యూదులతో మాట్లాడుతూ వాదించాడు, అయితే వారు అతన్ని చంపాలని ప్రయత్నించారు.
ACT 9:30 దీనిని గురించి తెలుసుకొన్న విశ్వాసులు, అతన్ని కైసరయకు తీసుకువచ్చి తార్సుకు పంపించారు.
ACT 9:31 ఆ తర్వాత యూదయ, గలిలయ సమరయ ప్రాంతాల్లో ఉన్న సంఘం కొంత సమయం ప్రశాంతాన్ని ఆనందిస్తూ బలపడింది. దేవుని భయాన్ని కలిగి జీవిస్తూ పరిశుద్ధాత్మచేత ప్రోత్సాహింపబడి, సంఘం సంఖ్య మరింత పెరిగింది.
ACT 9:32 పేతురు దేశమంతా ప్రయాణిస్తూ, లుద్ద అనే ఊరిలో నివసిస్తున్న పరిశుద్ధులను కలవడానికి వచ్చాడు.
ACT 9:33 అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాలుగా మంచం మీద ఉన్న ఐనెయ అనే వ్యక్తిని కలిశాడు.
ACT 9:34 పేతురు అతనితో, “ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరస్తున్నారు. నీవు లేచి నీ పడకను సర్దుకో” అని చెప్పిన వెంటనే ఐనెయ లేచి నిలబడ్డాడు.
ACT 9:35 లుద్ద షారోనులో నివసించే వారందరు అతన్ని చూసి ప్రభువు వైపుకు తిరిగారు.
ACT 9:36 యొప్పే పట్టణంలో తబితా అనే ఒక శిష్యురాలు ఉంది, గ్రీకు భాషలో ఆమెకు దొర్కా అని పేరు దానికి లేడి అని అర్థము. ఆమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ పేదలకు సహాయం చేసేది.
ACT 9:37 ఆ సమయంలో ఆమె అనారోగ్యంతో చనిపోయింది, కాబట్టి ఆమె శరీరాన్ని కడిగి మేడ గదిలో ఉంచారు.
ACT 9:38 లుద్ద యొప్పేకు దగ్గరగా ఉంటుంది. పేతురు లుద్దలో ఉన్నాడని శిష్యులు విని, “వెంటనే రమ్మని బ్రతిమాలడానికి” ఇద్దరిని అతని దగ్గరకు పంపించారు.
ACT 9:39 కాబట్టి పేతురు వారితో వెళ్లాడు, అతడు అక్కడ చేరుకొన్న తర్వాత అతన్ని మేడ గదికి తీసుకెళ్లారు. విధవరాండ్రందరు అతని చుట్టూ నిలబడి, ఏడుస్తూ దొర్కా తమతో ఉన్నప్పుడు ఆమె తయారుచేసిన అంగీలను ఇతర వస్త్రాలను అతనికి చూపించారు.
ACT 9:40 పేతురు వారందరిని గది నుండి బయటకు పంపించి, మోకరించి ప్రార్థించాడు. చనిపోయిన ఆ స్త్రీ శవం వైపు తిరిగి, “తబితా లే!” అని చెప్పాడు. ఆమె తన కళ్లను తెరిచి పేతురును చూసి లేచి కూర్చుంది.
ACT 9:41 అతడు ఆమె చేయి పట్టుకుని పైకి లేపి నిలబెట్టాడు. అప్పుడు అతడు విశ్వాసులను, ముఖ్యంగా విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు.
ACT 9:42 ఈ సంగతి యొప్పే పట్టణమంతా తెలిసి, చాలామంది ప్రజలు ప్రభువును నమ్ముకున్నారు.
ACT 9:43 పేతురు సీమోను అనే చర్మకారునితో కలిసి కొంతకాలం యొప్పే పట్టణంలో ఉన్నాడు.
ACT 10:1 ఇటలీ దేశ సైనిక దళానికి శతాధిపతి యైన కొర్నేలీ అనే వ్యక్తి కైసరయ పట్టణంలో ఉన్నాడు.
ACT 10:2 అతడు అతని కుటుంబమంతా దేవుని యందు భయభక్తులు కలిగినవారు; అవసరంలో ఉన్న ప్రజలకు ధారాళంగా దానధర్మాలు చేస్తూ క్రమంగా దేవునికి ప్రార్థన చేసేవాడు.
ACT 10:3 ఒక రోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది. ఒక దేవదూత ప్రత్యక్షమై, “కొర్నేలీ!” అని పిలువడం ఆ దర్శనంలో స్పష్టంగా కనబడింది.
ACT 10:4 కొర్నేలీ భయంతో అతన్ని తేరి చూస్తూ, “ఏమిటి, ప్రభువా?” అని అడిగాడు. అప్పుడు ఆ దూత, “నీ ప్రార్థనలు పేదవారికి నీవు చేసిన దానధర్మాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థ అర్పణగా చేరాయి.
ACT 10:5 నీవు మనుష్యులను యొప్పే పట్టణానికి పంపి పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు.
ACT 10:6 అతడు సముద్రపు ఒడ్డున ఉన్న సీమోను అనే చర్మకారుని ఇంట్లో ఉన్నాడు” అని చెప్పాడు.
ACT 10:7 అతనితో మాట్లాడిన ఆ దేవదూత వెళ్లిపోయిన తర్వాత కొర్నేలీ తన సేవకులలో ఇద్దరిని, తన వ్యక్తిగత సేవలు చేసే దైవభక్తి గల ఒక సైనికుని పిలిచాడు.
ACT 10:8 వారికి జరిగినదంతా చెప్పి యొప్పేకు పంపించాడు.
ACT 10:9 వారు బయలుదేరి ప్రయాణమై పట్టణాన్ని చేరుకోబోతున్నప్పటికి మరుసటిరోజు సుమారు మధ్యాహ్న సమయంలో, పేతురు ప్రార్థన చేసుకోవడానికి ఇంటి పైకప్పుకు వెళ్లాడు.
ACT 10:10 అతనికి చాలా ఆకలివేసి ఏమైనా తినాలని అనిపించింది, భోజనం సిద్ధం చేస్తుండగా అతడు స్వాప్నిక స్థితిలోనికి వెళ్లాడు.
ACT 10:11 అప్పుడతడు పరలోకం తెరువబడి నాలుగు మూలలు పట్టుకోబడి భూమి మీదకు దింపబడుతున్న ఒక పెద్ద దుప్పటి వంటి దాన్ని చూశాడు.
ACT 10:12 దానిలో నాలుగు కాళ్లున్న అన్ని రకాల జంతువులు, ప్రాకే ప్రాణులు పక్షులు ఉన్నాయి.
ACT 10:13 అప్పుడు ఒక స్వరం అతనితో ఇలా అన్నది: “పేతురు, లేచి వాటిని చంపుకొని తిను.”
ACT 10:14 అందుకు పేతురు, “లేదు, ప్రభువా! నేను అపరిశుభ్రమైనది అపవిత్రమైనది ఎప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు.
ACT 10:15 రెండవసారి ఆ స్వరం అతనితో, “దేవుడు పవిత్రపరచిన వాటిని నీవు అపవిత్రమని పిలువద్దు” అన్నది.
ACT 10:16 ఈ విధంగా మూడుసార్లు జరిగింది, వెంటనే ఆ దుప్పటి తిరిగి ఆకాశానికి కొనిపోబడింది.
ACT 10:17 పేతురు ఆ దర్శనానికి భావం ఏమిటని ఆశ్చర్యపడుతున్నప్పుడు, కొర్నేలీ పంపినవారు, సీమోను ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకొని దాని ద్వారం ముందు నిలబడ్డారు.
ACT 10:18 ఇంటివారిని పిలిచి, పేతురు అనబడే సీమోను ఉండేది ఇక్కడేనా? అని అడిగారు.
ACT 10:19 పేతురు ఇంకా ఆ దర్శనం గురించి ఆలోచిస్తుండగా, ఆత్మ అతనితో, “సీమోను నీకోసం ముగ్గురు వ్యక్తులు చూస్తున్నారు.
ACT 10:20 నీవు లేచి క్రిందికి వెళ్లు. నేనే వారిని పంపించాను, కాబట్టి నీవు వారితో వెళ్లడానికి సందేహించకు” అని చెప్పారు.
ACT 10:21 పేతురు క్రిందికి వెళ్లి వారితో, “మీరు వెదికేది నా కోసమే, మీరు ఎందుకు వచ్చారు?” అని అడిగాడు.
ACT 10:22 అందుకు వారు, “కొర్నేలీ అనే శతాధిపతి దగ్గర నుండి మేము వచ్చాము. అతడు నీతిమంతుడు దేవుని భయం కలవాడు, యూదులందరిచే గౌరవించబడుతున్నవాడు. నీవు చెప్పేది వినడానికి నిన్ను ఇంటికి పిలుచుకొని రమ్మని ఒక పరిశుద్ధ దేవదూత అతనితో చెప్పాడు” అన్నారు.
ACT 10:23 అప్పుడు పేతురు వారిని తన అతిథులుగా ఇంట్లోకి ఆహ్వానించాడు. మరుసటిరోజు పేతురు వారితో కలిసి బయలుదేరాడు, వారితో పాటు యొప్పేలో ఉన్న కొందరు విశ్వాసులు కూడా వెళ్లారు.
ACT 10:24 ఆ మరుసటిరోజు అతడు కైసరయ పట్టణం చేరాడు. కొర్నేలీ తన బంధువులను సన్నిహిత స్నేహితులను పిలిచి వీరి కోసం ఎదురు చూస్తున్నాడు.
ACT 10:25 పేతురు ఆ ఇంట్లో ప్రవేశించగానే, కొర్నేలీ అతన్ని కలుసుకొని భక్తితో అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు.
ACT 10:26 అయితే పేతురు, “లేచి నిలబడు, నేను కూడా మనిషినే” అని చెప్పి అతన్ని పైకి లేపాడు.
ACT 10:27 పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చినప్పుడు, అక్కడ చాలామంది వచ్చి ఉండడం చూశాడు.
ACT 10:28 అతడు వారితో, “మీ అందరికి తెలిసినట్లే ఒక యూదుడు, యూదుడుకాని వ్యక్తితో సాంగత్యం చేయడం, వారిని కలవడం, యూదా నియమానికి విరుద్ధము. అయితే ఎవరినీ నేను అపవిత్రులని గాని నిషేధించబడిన వారని గాని పిలువకూడదని దేవుడు నాకు చూపించాడు.
ACT 10:29 కాబట్టి నీవు నన్ను పిలిచినప్పుడు ఏ అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారో నాకు చెప్పండి?” అని అడిగాడు.
ACT 10:30 అందుకు కొర్నేలీ, “మూడు రోజుల క్రితం ఇదే సమయంలో అనగా మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు నేను నా ఇంట్లో ప్రార్థన చేస్తునప్పుడు అకస్మాత్తుగా మెరుస్తున్న వస్త్రాల్లో ఉన్న ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి,
ACT 10:31 నాతో, ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థనలను ఆలకించాడు నీవు పేదవారికి చేసిన దానధర్మాలను జ్ఞాపకం చేసుకున్నాడు.
ACT 10:32 నీవు యొప్పే పట్టణంలో ఉన్న పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. అతడు సముద్రపు ఒడ్డున ఉన్న సీమోను అనే చర్మకారుని ఇంట్లో అతిథిగా ఉన్నాడు’ అని నాతో చెప్పాడు.
ACT 10:33 కాబట్టి నేను వెంటనే నిన్ను పిలిపించాను, నీవు మా మధ్యకు రావడం చాలా సంతోషము. ఇప్పుడు మేమందరం దేవుని సన్నిధిలో ఉండి దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి చేరుకొన్నాం” అని చెప్పాడు.
ACT 10:34 అప్పుడు పేతురు మాట్లాడడం మొదలుపెట్టాడు, “దేవుడు పక్షపాతం చూపించడు,
ACT 10:35 కానీ ప్రతీ జనాల్లో ఆయనకు భయపడుతూ సరియైనది చేసేవారిని ఆయన స్వీకరిస్తారని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను.
ACT 10:36 అందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సమాధాన సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీకు తెలుసు.
ACT 10:37 యోహాను ప్రకటించిన బాప్తిస్మం తర్వాత గలిలయ ప్రాంతం మొదలుకొని యూదయ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటిలో జరిగిన సంగతులు మీకు తెలుసు.
ACT 10:38 దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో ఎలా అభిషేకించారో, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందుకు ఎలా ఆయన మేలులను చేస్తూ అపవాది శక్తుల క్రింద ఉన్నవారందరిని బాగుచేస్తూ తిరిగాడో మీకు తెలుసు.
ACT 10:39 “యూదయా ప్రాంతంలో యెరూషలేము పట్టణంలో యేసు చేసిన కార్యాలన్నింటికి మేము సాక్షులము. వారు ఆయనను సిలువ మీద వ్రేలాడదీసి చంపారు.
ACT 10:40 కానీ దేవుడు ఆయనను మూడవ రోజున మరణం నుండి సజీవునిగా లేపి మేము ఆయనను చూసేలా మాకు కనుపరిచారు.
ACT 10:41 ఆయన ప్రజలందరికి కనబడలేదు; కానీ దేవుడు ముందుగానే తన సాక్షులుగా ఏర్పరచుకున్నవారికి అనగా ఆయన మరణం నుండి తిరిగి జీవంతో లేచిన తర్వాత ఆయనతో పాటు తిని త్రాగిన మాకు కనబడ్డారు.
ACT 10:42 దేవుడు ఆయననే సజీవులకు, మృతులకు తీర్పు తీర్చేవానిగా నియమించారని ప్రజలకు ప్రకటించి, సాక్ష్యం ఇవ్వమని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించారు.
ACT 10:43 ఆయనను నమ్మిన ప్రతివారు ఆయన పేరట పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.”
ACT 10:44 పేతురు ఇంకా ఈ మాటలను మాట్లాడుతుండగా, ఈ సందేశాన్ని విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చారు.
ACT 10:45 యూదేతరుల మీద కూడా పరిశుద్ధాత్మ వరం కుమ్మరించబడడం చూసి పేతురుతో వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు ఆశ్చర్యపోయారు.
ACT 10:46 దానికి కారణం వారందరు ఇతర భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతించడం విన్నారు. అప్పుడు పేతురు,
ACT 10:47 “మనం పొందుకొన్న విధంగానే వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి వీరిని నీటి బాప్తిస్మం పొందడానికి ఇక ఆటంకపరచగలమా? ఆటంకపరచలేము కదా” అని అన్నాడు.
ACT 10:48 కాబట్టి వారు యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందాలని పేతురు ఆదేశించాడు. ఆ తర్వాత వారు పేతురును తమతో మరికొన్ని రోజులు ఉండమని బ్రతిమాలుకొన్నారు.
ACT 11:1 యూదేతరులు కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించారని యూదయ ప్రాంతమంతటిలో ఉన్న అపొస్తలులు విశ్వాసులు విన్నారు.
ACT 11:2 కాబట్టి పేతురు యెరూషలేముకు తిరిగి వెళ్లినప్పుడు, సున్నతి పొందిన విశ్వాసులు అతన్ని విమర్శించి,
ACT 11:3 “నీవు సున్నతి పొందని వారి ఇంటికి వెళ్లి వారితో భోజనం చేశావు” అన్నారు.
ACT 11:4 అప్పుడు పేతురు మొదటి నుండి జరిగినదంతా వారితో చెప్పాడు,
ACT 11:5 “నేను యొప్పే పట్టణంలో ప్రార్థిస్తున్నప్పుడు, నేను స్వాప్నిక స్థితిలో ఒక దర్శనం చూశాను. అందులో పరలోకం నుండి నాలుగు మూలలు పట్టుకోబడి భూమి మీదకు దింపబడుతున్న ఒక పెద్ద దుప్పటి నేనున్న చోటికి దిగి రావడం చూశాను.
ACT 11:6 భూమిపై ఉండే నాలుగు కాళ్ల జంతువుల, అడవి మృగాలు, ప్రాకే ప్రాణులు పక్షులు దానిలో ఉండడం నేను చూశాను.
ACT 11:7 అప్పుడు ఒక స్వరం నాతో, ‘పేతురు లేచి, వాటిని చంపుకొని తిను’ అని చెప్పడం విన్నాను.
ACT 11:8 “అందుకు నేను ‘లేదు, ప్రభువా! అపరిశుభ్రమైనది అపవిత్రమైనది ఎప్పుడూ నా నోటిలోనికి రాలేదు’ అన్నాను.
ACT 11:9 “రెండవసారి పరలోకం నుండి ఆ స్వరం నాతో, ‘దేవుడు పవిత్రపరచిన వాటిని నీవు అపవిత్రమని పిలువద్దు’ అని చెప్పడం వినబడింది.
ACT 11:10 ఈ విధంగా మూడుసార్లు జరిగింది, ఆ తర్వాత అదంతా తిరిగి ఆకాశానికి కొనిపోబడింది.
ACT 11:11 “అలా జరిగిన వెంటనే నా కోసం కైసరయ పట్టణం నుండి పంపబడిన ముగ్గురు వ్యక్తులు నేను ఉన్న ఇంటి ముందు నిలబడ్డారు.
ACT 11:12 అప్పుడు ఆత్మ నాతో, వారితో వెళ్లడానికి సందేహించవద్దు అని ఆదేశించాడు. ఈ ఆరుగురు సహోదరులు కూడా నాతో వచ్చారు, మేము ఆ వ్యక్తి ఇంటికి వెళ్లాము.
ACT 11:13 అతడు తన ఇంట్లో ఉన్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై, ‘యొప్పేకు మనుష్యులను పంపించి పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు.
ACT 11:14 అతడు తెచ్చే సందేశం ద్వారా నీవు నీ ఇంటివారందరు రక్షించబడతారని’ చెప్పాడని మాతో చెప్పాడు.
ACT 11:15 “నేను బోధించడం మొదలుపెట్టగానే ప్రారంభంలో మన మీదకు పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగానే వారి మీదకు కూడా దిగివచ్చాడు.
ACT 11:16 అప్పుడు: ‘యోహాను నీటితో బాప్తిస్మమిచ్చాడు, కాని మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకొంటారు’ అని ప్రభువు చెప్పినది నేను జ్ఞాపకం చేసుకున్నాను.
ACT 11:17 ప్రభువైన యేసు క్రీస్తును నమ్మిన మనకు ఇవ్వబడిన వరాన్నే దేవుడు వారికి కూడా ఇస్తే, దేవుని అడ్డగించి నిలబడడానికి నేను ఎవరిని?” అని వారితో అన్నాడు.
ACT 11:18 వారు ఈ మాటలను విన్నప్పుడు, వారు ఏ అభ్యంతరం చెప్పకుండా, “అయితే దేవుడు యూదేతరులకు కూడా జీవంలోనికి నడిపించే పశ్చాత్తాపాన్ని అనుగ్రహించాడని” చెప్పుకుంటూ దేవుని స్తుతించారు.
ACT 11:19 స్తెఫెను చంపబడినప్పుడు హింస కారణంగా చెదిరిపోయిన విశ్వాసులు ఫేనీకే, కుప్ర అంతియొకయ పట్టణ ప్రాంతాల వరకు వెళ్లి కేవలం యూదుల మధ్యనే సువార్త ప్రకటించారు.
ACT 11:20 వారిలో కుప్ర కురేనీకు చెందిన కొందరు అంతియొకయ పట్టణానికి వెళ్లి గ్రీకు దేశస్థులతో కూడా ప్రభువైన యేసు సువార్తను చెప్పడం మొదలుపెట్టారు.
ACT 11:21 ప్రభువు హస్తం వారికి తోడుగా ఉన్నందున, పెద్ద సంఖ్యలలో ప్రజలు నమ్మి, ప్రభువు వైపు తిరిగారు.
ACT 11:22 ఈ సమాచారం యెరూషలేములో ఉన్న సంఘానికి చేరినప్పుడు వారు బర్నబాను అంతియొకయ ప్రాంతానికి పంపించారు.
ACT 11:23 అతడు అక్కడ చేరాక దేవుని కృప చేసిన కార్యాలను చూసి అతడు సంతోషించి, తమ పూర్ణహృదయంతో ప్రభువుకు నమ్మకంగా ఉండాలని వారందరిని ప్రోత్సాహించాడు.
ACT 11:24 బర్నబా మంచివాడు, పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండినవాడు, అతని ద్వార పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభువులోనికి చేర్చబడ్డారు.
ACT 11:25 ఆ తర్వాత బర్నబా సౌలును వెదకడానికి తార్సు పట్టణానికి వెళ్లి,
ACT 11:26 అతన్ని కలుసుకొని అంతియొకయ ప్రాంతానికి తీసుకువచ్చాడు. ఒక సంవత్సరం అంతా బర్నబా సౌలు ఆ సంఘంతో కలిసి ఉంటూ అనేకమందికి బోధించారు. అంతియొకయలో శిష్యులు మొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు.
ACT 11:27 ఆ రోజుల్లో యెరూషలేము నుండి అంతియొకయకు కొందరు ప్రవక్తలు వచ్చారు.
ACT 11:28 వారిలో అగబు అనే పేరు కలవాడు నిలబడి, రోమా సామ్రాజ్యం అంతటా గొప్ప కరువు వస్తుందని ఆత్మ ద్వారా ప్రవచించాడు. అతడు చెప్పింది క్లౌదియ చక్రవర్తి కాలంలో జరిగింది.
ACT 11:29 అప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి తమ శక్తికొలది యూదయలో నివసిస్తున్న విశ్వాసులకు సహాయం అందించడానికి నిశ్చయించుకున్నారు.
ACT 11:30 కాబట్టి వారు బర్నబా సౌలుల ద్వారా ఆ సహాయాన్ని అక్కడి సంఘ పెద్దలకు పంపించారు.
ACT 12:1 ఆ దినాల్లో రాజైన హేరోదు సంఘానికి చెందిన కొందరిని హింసించాలని ఉద్దేశించి వారిని బంధించాడు.
ACT 12:2 అలా రాజు, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు.
ACT 12:3 ఈ విషయాన్ని యూదులు అంగీకరించడం చూసిన హేరోదు పేతురును కూడా బంధించాడు. అది పులియని రొట్టెల పండుగ సమయంలో జరిగింది.
ACT 12:4 హేరోదు పేతురును పట్టుకుని చెరసాలలో వేయించి, నలుగురేసి సైనికులుండే నాలుగు సైనిక దళాలను అతనికి కాపలాగా నియమించాడు. పస్కా పండుగ తర్వాత ప్రజల ముందు అతన్ని విచారణకు తీసుకురావాలని హేరోదు భావించాడు.
ACT 12:5 కాబట్టి పేతురును చెరసాలలో పెట్టారు. కానీ సంఘం అతని కోసం దేవునికి ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు.
ACT 12:6 హేరోదు అతన్ని విచారణకు తీసుకురావడానికి ముందు రాత్రి, పేతురు రెండు గొలుసులతో బంధించబడి, ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. అలాగే కావలివారు చెరసాల తలుపు ముందు కాపలా కాస్తున్నారు.
ACT 12:7 అప్పుడు, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు, కాబట్టి ఆ గదిలో వెలుగు ప్రకాశించింది. అప్పుడా దూత పేతురు ప్రక్కన తట్టి, “త్వరగా లే” అని చెప్పాడు. అప్పుడు పేతురు చేతులకున్న ఆ గొలుసులు తెగిపడ్డాయి.
ACT 12:8 అప్పుడు ఆ దూత అతనితో, “నీ బట్టలు చెప్పులు వేసుకో” అని చెప్పాడు. పేతురు అలాగే చేశాడు. దూత అతనితో, “నీ చుట్టూ వస్త్రాన్ని చుట్టుకొని నన్ను వెంబడించు” అని చెప్పాడు.
ACT 12:9 పేతురు ఆ దూతను వెంబడిస్తూ చెరసాల బయటకు వచ్చాడు, దూత చేసేదంతా నిజంగా జరుగుతుంది అన్న ఆలోచనే అతనికి లేదు; తాను ఒక దర్శనం చూస్తున్నానని భావించాడు.
ACT 12:10 వారు మొదటి, రెండవ కావలివారిని దాటి పట్టణంలోనికి దారితీసే ఇనుప ద్వారం దగ్గరకు వచ్చారు. ఆ ద్వారం దానంతట అదే తెరచుకుంది, కాబట్టి వారు దానిగుండా వెళ్లారు. వారు ఒక వీధిని దాటిన తర్వాత, అకస్మాత్తుగా ఆ దూత అతన్ని విడిచిపోయాడు.
ACT 12:11 అప్పుడు పేతురు జరిగిందంతా నిజం అని తెలుసుకొని, “ప్రభువు తన దూతను పంపించి హేరోదు చేతి నుండి యూదులు తనకు చేయాలనుకున్నవేవి జరుగకుండా తప్పించాడని, ఏ సందేహం లేకుండా ఇప్పుడు నాకు తెలిసిందని” తనలో తాను అనుకున్నాడు.
ACT 12:12 దీనిని గ్రహించిన తర్వాత, అతడు మార్కు అనబడే యోహాను తల్లియైన మరియ ఇంటికి వెళ్లాడు, అక్కడ చాలామంది విశ్వాసులు చేరి ప్రార్థన చేస్తున్నారు.
ACT 12:13 పేతురు బయటి గుమ్మం దగ్గర నిలబడి తలుపు తట్టాడు, అప్పుడు రోదె అనే పేరుగల ఒక సేవకురాలు తలుపు తీయడానికి వచ్చింది.
ACT 12:14 ఆమె పేతురు స్వరాన్ని గుర్తుపట్టి, అత్యంత సంతోషంతో తలుపు తీయకుండానే వెనుకకు పరుగెత్తుకొని వెళ్లి, “పేతురు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు!” అని కేక వేసి చెప్పింది.
ACT 12:15 వారు ఆమెతో, “నీకు పిచ్చి పట్టింది” అన్నారు. ఆమె అది నిజమని పట్టుబడుతూవుంటే వారు, “అది అతని దూతయై ఉండవచ్చు” అన్నారు.
ACT 12:16 కానీ పేతురు తలుపు తట్టుతూనే ఉన్నాడు, వారు తలుపు తీసినప్పుడు అక్కడ పేతురును చూసి ఆశ్చర్యపడ్డారు.
ACT 12:17 పేతురు, నెమ్మదిగా ఉండండని చేతితో సైగ చేసి ప్రభువు అతన్ని చెరసాలలో నుండి ఎలా బయటకు తీసుకుని వచ్చాడో వారికి వివరించాడు. “యాకోబుకు, ఇతర సహోదరి సహోదరులందరికి కూడా ఈ సంగతిని తెలియజేయండి” అని చెప్పి, అక్కడినుండి మరొక చోటికి వెళ్లాడు.
ACT 12:18 తెల్లవారగానే పేతురుకు ఏమైనదని సైనికుల్లో చాలా గందరగోళం కలిగింది.
ACT 12:19 హేరోదు పేతురు కోసం ఎంత వెదకినా కనబడలేదు, కాబట్టి అతడు కావలివారిని విచారించి, వారిని చంపమని ఆదేశించాడు. ఆ తర్వాత హేరోదు యూదయ ప్రాంతం నుండి కైసరయ పట్టణానికి వెళ్లి అక్కడ నివసించాడు.
ACT 12:20 హేరోదు తూరు సీదోను పట్టణస్థులతో జగడమాడుతూ ఉండేవాడు; ఇప్పుడు వారంతా కలిసి రాజుతో మాట్లాడాలని భావించారు. వారు ఆహార సరఫరా కోసం హేరోదు రాజ్యం మీద ఆధారపడ్డారు, కాబట్టి రాజు యొక్క నమ్మకమైన వ్యక్తిగత సేవకుడైన బ్లాస్తు అనే వాని మద్ధతు పొందిన తర్వాత, పరిస్థితిని సమాధానపరచమని అడిగారు.
ACT 12:21 నిర్ణయించబడిన రోజున హేరోదు, రాజ వస్త్రాలను ధరించుకొని, తన సింహాసనం మీద కూర్చుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు.
ACT 12:22 అప్పుడు ప్రజలు, “ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే!” అని కేకలు వేశారు.
ACT 12:23 వెంటనే, హేరోదు దేవునికి ఘనత ఇవ్వని కారణంగా, ప్రభువు దూత అతన్ని కొట్టగా, అతడు పురుగులుపడి చనిపోయాడు.
ACT 12:24 కానీ దేవుని వాక్యం అంతకంతకు వ్యాపిస్తూ ఉండింది.
ACT 12:25 బర్నబా సౌలులు తమ పని ముగించిన తర్వాత, మార్కు అనబడే యోహానును వెంటబెట్టుకొని, యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
ACT 13:1 అంతియొకయ సంఘంలో ప్రవక్తలు బోధకులు ఉన్నారు. వారిలో కొందరు: బర్నబా, నీగెర అనబడే సుమెయోను, కురేనీకి చెందిన లూకియ, చతుర్థాధిపతి హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు.
ACT 13:2 ఒక రోజు వారు ఉపవాసం ఉండి ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబా సౌలును పిలిచిన పని కోసం వారిని నా కోసం ప్రత్యేకపరచండి” అని చెప్పాడు.
ACT 13:3 కాబట్టి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత వారి మీద చేతులుంచి వారిని సేవకు పంపించారు.
ACT 13:4 వారిద్దరు పరిశుద్ధాత్మచే పంపబడిన తర్వాత, సెలూకయ పట్టణాన్ని దాటి ఓడలో కుప్ర ద్వీపానికి వెళ్లారు.
ACT 13:5 వారు సలమీ పట్టణానికి చేరాక, దేవుని వాక్యాన్ని యూదుల సమాజమందిరాల్లో ప్రకటించారు. అప్పుడు మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు.
ACT 13:6 వారు పాఫు అనే ఊరు వచ్చేవరకు ఆ ద్వీపమంతా తిరిగారు. అక్కడ వారు బర్ యేసు అనే పేరుగల యూదా మంత్రగాడైన ఒక అబద్ధ ప్రవక్తను కలుసుకొన్నారు.
ACT 13:7 అతడు సెర్గియ పౌలు అనే రోమా అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి తెలివిగలవాడు, అతడు దేవుని వాక్యాన్ని వినాలని బర్నబాను సౌలును పిలిపించుకున్నాడు.
ACT 13:8 అయితే ఎలుమ అనే మంత్రగాడు ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు.
ACT 13:9 అప్పుడు పౌలు అనబడే సౌలు పరిశుద్ధాత్మతో నింపబడి, ఎలుమ వైపు నేరుగా చూస్తూ,
ACT 13:10 “నీవు సాతాను బిడ్డవు నీతికార్యాలన్నింటికి విరోధివి! నీవు అన్ని రకాల కపటంతో మోసంతో నిండి ఉన్నావు. ప్రభువు యొక్క సరియైన మార్గాలను చెడగొట్టడం మానవా?
ACT 13:11 ఇదిగో, దేవుని హస్తం నీకు వ్యతిరేకంగా ఉంది. నీవు సూర్యుని కాంతిని కూడా చూడలేదా కొంతకాలం గ్రుడ్డివాడివి అవుతావు” అన్నాడు. వెంటనే అతని మీదికి మబ్బు వంటి చీకటి కమ్మింది, కాబట్టి అతడు తడుముకుంటూ తనను ఎవరైనా చేయి పట్టుకుని నడిపిస్తారని వెదకసాగాడు.
ACT 13:12 జరిగింది అంతా ఆ అధిపతి చూసి, ప్రభువు గురించిన బోధకు ఆశ్చర్యపడి నమ్మాడు.
ACT 13:13 తర్వాత పౌలు, అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి పంఫులియా లోని పెర్గే పట్టణానికి వచ్చారు, యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయాడు.
ACT 13:14 అప్పుడు వారు పెర్గే పట్టణం నుండి బయలుదేరి పిసిదియ ప్రాంతంలోని అంతియొకయ పట్టణానికి వచ్చారు. సబ్బాతు దినాన వారు సమాజమందిరానికి వెళ్లి కూర్చున్నారు.
ACT 13:15 ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల లేఖనాలను చదివిన తర్వాత సమాజమందిరపు అధికారులు, “సహోదరులారా, ప్రజలను ప్రోత్సహించే వాక్యం చెప్పాలని ఉంటే చెప్పండి” అని వారికి వర్తమానం పంపారు.
ACT 13:16 పౌలు లేచి నిలబడి తన చేతితో సైగ చేస్తూ, “తోటి ఇశ్రాయేలీయులారా, దేవుని ఆరాధించే యూదేతరులారా, నా మాటలను వినండి!
ACT 13:17 ఇశ్రాయేలు దేశ ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకుని, వారిని ఈజిప్టులో అభివృద్ధిపరచి, వారిని తన గొప్ప శక్తితో ఆ దేశం నుండి బయటకు రప్పించారు.
ACT 13:18 రప్పించిన తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలో వారి ప్రవర్తనను సహించారు,
ACT 13:19 కనాను దేశంలోని ఏడు జాతుల వారిని తరిమివేసి, వారి దేశాన్ని తన ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చారు.
ACT 13:20 సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు ఈ సంఘటనలన్ని జరిగాయి. “ఆ తర్వాత, సమూయేలు ప్రవక్త కాలం వరకు దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చారు.
ACT 13:21 తర్వాత ప్రజలు తమకు రాజు కావాలని అడిగినప్పుడు, దేవుడు బెన్యామీను గోత్రానికి చెందిన కీషు కుమారుడైన సౌలును వారికి రాజుగా ఇచ్చారు, అతడు వారిని నలభై సంవత్సరాలు పరిపాలించాడు.
ACT 13:22 సౌలును తొలగించిన తర్వాత, దావీదును వారికి రాజుగా చేశాడు. దేవుడు అతని గురించి, ‘యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. నేను చేయాలని ఉద్దేశాలన్నిటిని అతడు నెరవేరుస్తాడు’ అని సాక్ష్యమిచ్చారు.
ACT 13:23 “దేవుడు తాను చేసిన వాగ్దానం ప్రకారం, దావీదు సంతానం నుండి ఇశ్రాయేలు ప్రజల కోసం యేసు రక్షకుని పుట్టించారు.
ACT 13:24 యేసు రాకముందు, పశ్చాత్తాపం బాప్తిస్మం గురించి యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికి బోధించాడు.
ACT 13:25 యోహాను తాను వచ్చిన పనిని ముగిస్తూ, ‘నేను ఎవరని మీరు అనుకుంటున్నారా? మీరు ఎదురు చూస్తున్న వానిని నేను కాదు. కాని నా తర్వాత వస్తున్న వాని చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు’ అన్నాడు.
ACT 13:26 “తోటి అబ్రాహాము సంతానమా దేవుని భయభక్తులు గల ఇతర జాతుల వారలారా, ఈ రక్షణ సందేశం మన కొరకే పంపబడినది.
ACT 13:27 యెరూషలేము ప్రజలు వారి పరిపాలకులు యేసును గుర్తు పట్టలేదు, కాని వారు యేసుకు మరణశిక్షను విధించుట ద్వార ప్రతి సబ్బాతు దినాన చదవబడే ప్రవక్తల మాటలను నెరవేర్చారు.
ACT 13:28 ఆయనలో మరణశిక్షకు తగిన ఏ ఆధారం కనబడకపోయినా, ఆయనను చంపాలని వారు పిలాతును వేడుకొన్నారు.
ACT 13:29 ఆయన గురించి వ్రాయబడిన వాటన్నిటిని వారు నెరవేర్చిన తర్వాత, ఆయనను సిలువ మీది నుండి దించి సమాధిలో పెట్టారు.
ACT 13:30 కానీ దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు.
ACT 13:31 ఇంకా ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో ప్రయాణం చేసినవారికి చాలా రోజులు కనిపించారు. వారే ఇప్పుడు మన ప్రజలకు సాక్షులుగా ఉన్నారు.
ACT 13:32 “మేము మీకు చెప్పే సువార్త ఏంటంటే: దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం,
ACT 13:33 యేసును మరణం నుండి లేపడం ద్వారా ఆయన పిల్లలంగా ఉన్న మన కోసం నెరవేర్చారు. రెండవ కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ ‘నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.’
ACT 13:34 ఆయన ఎప్పటికీ కుళ్ళిపోకూడదని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపారు. దేవుడు చెప్పినట్లే, “ ‘నేను దావీదుకు వాగ్దానం చేసిన పవిత్రమైన, నమ్మదగిన దీవెనలను మీకు అనుగ్రహిస్తాను.’
ACT 13:35 మరి ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ ‘మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.’
ACT 13:36 “దావీదు తన తరంలో దేవుని చిత్తాన్ని జరిగించిన తర్వాత, చనిపోయాడు; అతడు అతని పితరుల వలె పాతిపెట్టబడగా అతని శరీరం కుళ్ళిపోయింది.
ACT 13:37 కానీ దేవుడు మరణం నుండి లేపినవాని శరీరం కుళ్ళు పట్టలేదు.
ACT 13:38 “కాబట్టి, నా స్నేహితులారా, యేసు ద్వారానే పాపక్షమాపణ కలుగునని ప్రకటించబడింది అని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.
ACT 13:39 ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రం ద్వారా మిమ్మల్ని నిర్దోషులుగా తీర్చడం సాధ్యం కాలేదు, కాని క్రీస్తు యేసును నమ్మిన ప్రతి ఒక్కరు ఆయన ద్వారా ప్రతి పాపం నుండి విడుదల పొంది నిర్దోషిగా తీర్చబడుతున్నారు.
ACT 13:40 కానీ ప్రవక్తలు ముందుగానే చెప్పినది మీమీద రాకుండా ఉండాలని జాగ్రత్తగా చూసుకోండి అవేమంటే:
ACT 13:41 “ ‘చూడండి, ఎగతాళి చేసేవారలారా, ఆశ్చర్యపడి నశించిపోయేవారలారా వినండి, నేను మీ రోజుల్లో ఒక కార్యాన్ని చేయబోతున్నాను, దాని గురించి మీకు ఎవరు వివరించినా దానిని మీరు నమ్మలేరు.’”
ACT 13:42 పౌలు బర్నబా సమాజమందిరంలో నుండి వెళ్తున్నప్పుడు, మరో సబ్బాతు దినాన కూడా ఈ సంగతుల గురించి మళ్ళీ చెప్పాలని ప్రజలు వారిని బ్రతిమలాడారు.
ACT 13:43 వచ్చినవారు వెళ్లిపోయిన తర్వాత, చాలామంది యూదులు, యూదా మతంలోనికి మారిన వారు, దేవుని కృపలో కొనసాగాలని తమతో మాట్లాడి, తమను బ్రతిమాలిన పౌలును బర్నబాను వెంబడించారు.
ACT 13:44 మరుసటి సబ్బాతు దినాన ఇంచుమించు ఆ పట్టణమంతా ప్రభువు వాక్కును వినడానికి చేరుకొన్నారు.
ACT 13:45 యూదులు ఆ జనసమూహాన్ని చూసి అసూయపడ్డారు. పౌలు చెప్పిన మాటలకు వ్యతిరేకించడం మొదలుపెట్టి అతని మీద నిందలను మోపసాగారు.
ACT 13:46 అయితే పౌలు బర్నబాలు ధైర్యంగా వారికి సమాధానం ఇచ్చారు: “మేము దేవుని వాక్యాన్ని మీకు మొదట బోధించాలి. కానీ మీరు దానిని తిరస్కరించి నిత్యజీవానికి అర్హులుగా ఎంచుకోలేదు, కాబట్టి మేము యూదేతరుల దగ్గరకు వెళ్తున్నాము.
ACT 13:47 ప్రభువు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఇదే: “మీరు భూమి అంచుల వరకు రక్షణను తెచ్చేవారిలా, నేను మిమ్మల్ని యూదేతరులకు వెలుగుగా నియమించాను.”
ACT 13:48 అప్పుడు యూదేతరులు ఈ మాటలు విని సంతోషించి ప్రభువు వాక్యాన్ని గౌరవించారు. నిత్యజీవం కోసం నియమించబడిన వారందరు నమ్మారు.
ACT 13:49 ఆ ప్రదేశమంతటా ప్రభువు వాక్యం వ్యాపించింది.
ACT 13:50 కానీ యూదా నాయకులు దైవభయం కలిగిన స్త్రీలను ఆ పట్టణ ప్రముఖులను ప్రేరేపించి, పౌలు బర్నబాలకు వ్యతిరేకంగా హింస కలుగచేసి వారిని తమ ప్రాంతం నుండి తరిమివేశారు.
ACT 13:51 కాబట్టి వారు హెచ్చరికగా తమ పాదాల దుమ్మును దులిపివేసి అక్కడినుండి ఈకొనియ పట్టణానికి వెళ్లిపోయారు.
ACT 13:52 ఆ ప్రాంతపు శిష్యులు పరిశుద్ధాత్మతో ఆనందంతో నింపబడ్డారు.
ACT 14:1 ఈకొనియ పట్టణంలో పౌలు బర్నబాలు ఎప్పటిలాగే యూదుల సమాజమందిరంలో ప్రవేశించి వాక్యాన్ని చాలా ప్రభావవంతంగా మాట్లాడినప్పుడు చాలామంది యూదులు గ్రీసు దేశస్థులు నమ్మారు.
ACT 14:2 కాని నమ్మని యూదులు, యూదేతరులను రేపి, సహోదరులకు విరోధంగా వారి మనస్సుల్లో ద్వేషాన్ని పుట్టించారు.
ACT 14:3 అయినా పౌలు బర్నబాలు ప్రభువు కోసం ధైర్యంగా మాట్లాడుతూ చాలా కాలం అక్కడే ఉండి, ప్రభువు గురించి బోధిస్తూ ఉండగా, ప్రభువు వారి ద్వారా సూచకక్రియలను అద్భుతాలను చేయించి తన కృపా సందేశాన్ని రుజువుపరిచారు.
ACT 14:4 ఆ పట్టణ ప్రజల్లో కొందరు యూదుల పక్షంగా మరికొందరు అపొస్తలుల పక్షంగా విడిపోయారు.
ACT 14:5 యూదులు యూదేతరులు తమ నాయకులతో కలిసి, వారిని రాళ్లతో కొట్టి చంపాలని తలంచారు.
ACT 14:6 కానీ వారు ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడినుండి లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర దెర్బే పట్టణాలకు వాటి చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్లి,
ACT 14:7 అక్కడ సువార్త బోధించుటను కొనసాగించారు.
ACT 14:8 లుస్త్రలో కుంటివాడొకడు అక్కడ కూర్చుని ఉన్నాడు. వాడు పుట్టుకతోనే అలా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు నడవలేదు.
ACT 14:9 అతడు పౌలు చేసే బోధను వినేటప్పుడు, పౌలు సూటిగా అతనివైపు చూసి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉందని గ్రహించి,
ACT 14:10 అతనితో, “లేచి నీ కాళ్లమీద నిలబడు!” అని బిగ్గరగా అనగానే అతడు గంతులువేసి నడవసాగాడు.
ACT 14:11 పౌలు చేసిన కార్యాన్ని జనసమూహం చూసి, వారు లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవరూపంలో మన కోసం దిగి వచ్చారు” అని కేకలు వేశారు.
ACT 14:12 బర్నబాకు జ్యూస్ అని, పౌలుకు ముఖ్య ప్రసంగీకుడుగా హెర్మెసు అని పేర్లు పెట్టారు.
ACT 14:13 ఆ పట్టణం బయట ఉన్న జ్యూస్ గుడి పూజారి ప్రజలతో కలిసి ఎద్దులను, పూలదండలను పట్టణ ద్వారం దగ్గరకు తీసుకువచ్చి వారికి బలి అర్పించాలని అనుకున్నారు.
ACT 14:14 అయితే అపొస్తలులైన బర్నబా పౌలు ఈ సంగతి విని, తమ వస్త్రాలను చింపుకొని ఆ జనసమూహంలోనికి చొరబడి, బిగ్గరగా ఇలా అన్నారు:
ACT 14:15 “స్నేహితులారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుష్యులమే. మీరు ఇలాంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించిన సజీవుడైన దేవుని వైపు తిరగండని మేము మీకు సువార్తను ప్రకటిస్తున్నాము.
ACT 14:16 గతంలో, ఆయన అన్ని దేశాల ప్రజలను తమ సొంత మార్గాల్లో వెళ్లనిచ్చాడు.
ACT 14:17 అయినా కానీ ఆయన గురించి సాక్ష్యం లేకుండా ఉంచలేదు ఎలాగంటే: ఆయన మీకు ఆకాశం నుండి వర్షాన్ని వాటి రుతువుల్లో పంటలు పండింపచేసి తన దయను చూపించారు; సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహిస్తూ మీ హృదయాలను ఆనందంతో నింపుతున్నారు.”
ACT 14:18 వారు ఈ మాటలు చెప్పినా కానీ తమకు బలి అర్పించాలనుకున్న సమూహాన్ని ఆపడం కష్టమైపోయింది.
ACT 14:19 అంతియొకయ ఈకొనియ ప్రాంతాల నుండి వచ్చిన కొందరు యూదులు జనసమూహాన్ని తమ పక్షం చేసికొని, పౌలును రాళ్లతో కొట్టించి, అతడు చనిపోయాడనుకొని పట్టణం బయటకు ఈడ్చుకొని పోయారు.
ACT 14:20 కానీ విశ్వాసులు అతని చుట్టూ చేరిన వెంటనే, అతడు లేచి పట్టణంలోనికి తిరిగి వెళ్లాడు. మరుసటిరోజు అతడు బర్నబాతో కలిసి దెర్బేకు వెళ్లాడు.
ACT 14:21 వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేశారు. తర్వాత లుస్త్ర, ఈకొనియ అంతియొకయ పట్టణాలకు తిరిగి వచ్చారు.
ACT 14:22 శిష్యుల ఆత్మలను బలపరచి విశ్వాసంలో స్థిరంగా ఉండాలని వారిని ప్రోత్సాహించారు. “మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అనేక హింసలు పొందాల్సి ఉంది” అని వారు చెప్పారు.
ACT 14:23 పౌలు బర్నబాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రతి సంఘంలో సంఘ పెద్దలను నియమించి, వారు నమ్మిక ఉంచిన ప్రభువుకు వారిని అప్పగించారు.
ACT 14:24 వారు పిసిదియ ప్రాంతం ద్వారా పంఫులియా ప్రాంతానికి వచ్చి,
ACT 14:25 అక్కడ పెర్గే పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత అత్తాలియ సముద్రతీరాన ఉన్న పట్టణానికి వెళ్లారు.
ACT 14:26 అత్తాలియ పట్టణం నుండి బయలుదేరి ఓడ ఎక్కి తాము ఇంతవరకు పూర్తి చేసిన పనిని దేవుని కృపకు అప్పగించి అంతియొకయ పట్టణానికి తిరిగి వచ్చారు.
ACT 14:27 అక్కడ చేరిన వెంటనే, సంఘమంతటిని సమకూర్చి దేవుడు తమ ద్వారా జరిగించిన కార్యాలను, యూదేతరుల కోసం ఆయన ఏ విధంగా విశ్వాసపు ద్వారాన్ని తెరిచాడో వారికి వివరంగా తెలియజేశారు.
ACT 14:28 ఆ తర్వాత వారు శిష్యులతో కలిసి అక్కడే చాలా కాలం ఉన్నారు.
ACT 15:1 కొందరు యూదయ ప్రాంతం నుండి అంతియొకయ ప్రాంతానికి వచ్చి విశ్వాసులతో: “మోషే నియమించిన ఆచార ప్రకారం సున్నతి పొందితేనే తప్ప రక్షణ లేదు” అని బోధించారు.
ACT 15:2 ఇది పౌలు బర్నబాల మధ్య తీవ్రమైన తర్కానికి దారి తీసింది. కాబట్టి వారు, మరికొందరు విశ్వాసులతో కలిసి ఈ ప్రశ్న విషయమై యెరూషలేములోని అపొస్తలులను, సంఘ పెద్దలను కలుసుకోడానికి వెళ్లాలని నిర్ణయించారు.
ACT 15:3 కాబట్టి సంఘస్థులు వారిని పంపినప్పుడు, వారు ఫేనీకే సమరయ ప్రాంతాల ద్వారా వెళ్తూ, యూదేతరులు ఎలా దేవుని వైపు తిరిగారో చెప్పినప్పుడు విశ్వాసులందరు చాలా ఆనందించారు.
ACT 15:4 వారు యెరూషలేము చేరుకొన్నప్పుడు, సంఘస్థులు అపొస్తలులు సంఘపెద్దలు వారిని చేర్చుకున్నారు. అక్కడ ఉన్నవారందరికి దేవుడు తమ ద్వారా జరిగించిన వాటన్నిటిని వివరించారు.
ACT 15:5 అప్పుడు కొందరు పరిసయ్యుల తెగలోని విశ్వాసులు లేచి, “యూదేతరులు తప్పనిసరిగా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, సున్నతి చేయించుకోవాలి” అని వారికి చెప్పారు.
ACT 15:6 కాబట్టి ఈ ప్రశ్నను గురించి చర్చించడానికి అపొస్తలులు సంఘపెద్దలు సమావేశమయ్యారు.
ACT 15:7 చాలా చర్చలు జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లన్నాడు: “సహోదరులారా, కొంతకాలం క్రిందట యూదేతరులు నా నోట సువార్త సందేశం విని విశ్వసించాలని మీలో నుండి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని మీకు తెలుసు కదా!
ACT 15:8 హృదయాలను ఎరిగిన దేవుడు, ఆయన మన పట్ల చేసినట్టుగానే, వారికి కూడా పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా ఆయన వారిని స్వీకరించాడని నిరూపించారు.
ACT 15:9 దేవుడు మనకు వారికి మధ్య ఏ భేదం చూపించకుండ వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచారు.
ACT 15:10 కాబట్టి ఇప్పుడు, మన పితరులు కానీ మనం కానీ మోయలేని కాడిని యూదేతరులలో నుండి వచ్చిన విశ్వాసుల మెడ మీద పెట్టి దేవుని శోధించవచ్చా? అలా చేయకూడదు!
ACT 15:11 వారు రక్షణ పొందినట్లే, ప్రభువైన యేసు కృప చేతనే మనం కూడా రక్షణ పొందుకుంటున్నామని నమ్ముతున్నాం కదా.”
ACT 15:12 బర్నబా పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరుల మధ్యలో చేసిన అద్భుతాలను సూచకక్రియలను ఆ సభలో వివరిస్తున్నప్పుడు అక్కడ చేరిన వారందరు శ్రద్ధతో నిశ్శబ్దంగా విన్నారు.
ACT 15:13 వారు చెప్పడం ముగించిన తర్వాత, యాకోబు లేచి ఈ విధంగా చెప్పాడు: “సహోదరులారా, నా మాట వినండి.
ACT 15:14 యూదేతరులలో నుండి దేవుడు తన నామము కోసం ప్రజలను ఏర్పరచుకోడానికి తానే మొదట ఎలా జోక్యం చేసుకున్నాడో సీమోను వివరించాడు.
ACT 15:15 దీనిని గురించి ప్రవక్తల మాటలు కూడా ఏకీభవిస్తున్నాయి, ఎలాగంటే:
ACT 15:16 “ ‘ఆ తర్వాత నేను తిరిగివచ్చి, పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతాను. దాని శిథిలాలను తిరిగి నిర్మిస్తాను, దానిని పునరుద్ధరిస్తాను,
ACT 15:17 అప్పుడు మిగిలిన వారందరు, నా నామం ధరించిన యూదేతరులు కూడ దేవుని వెదకేలా చేస్తాను, అని పూర్వం నుండి తెలియచేయబడిన ఈ కార్యములను,
ACT 15:18 చేస్తున్న ప్రభువు చెప్తున్నాడు.’
ACT 15:19 “కాబట్టి, దేవుని వైపు తిరుగుతున్న యూదేతరులకు మనం కష్టంగా ఉండేలా చేయకూడదనేది నా తీర్పు.
ACT 15:20 దానికి బదులుగా, విగ్రహాలకు అర్పించి అపవిత్రపరచిన ఆహారాన్ని తినడం, లైంగిక అనైతికత సంబంధాలను, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, రక్తాన్ని తినడం మానుకోవాలని మనం వారికి ఉత్తరం వ్రాసి తెలియచేయాలి.
ACT 15:21 ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రాన్ని అనేక తరాల నుండే ప్రతి పట్టణంలోని సమాజమందిరాల్లో ప్రతి సబ్బాతు దినాన చదువుతూ బోధిస్తున్నారు” అని చెప్పాడు.
ACT 15:22 ఆ తర్వాత అపొస్తలులు సంఘపెద్దలు సంఘమంతటితో కలిసి, పౌలు బర్నబాలతో పాటు ఇంకొందరు విశ్వాసులను అంతియొకయ ప్రాంతానికి పంపాలని నిర్ణయించి విశ్వాసుల మధ్యలో నాయకులుగా ఉన్న బర్సబ్బా అని పిలువబడే యూదా సీలను ఏర్పరచుకున్నారు.
ACT 15:23 వారితో ఈ ఉత్తరాన్ని పంపించారు: అపొస్తలులు, మీ సహోదరులైన సంఘపెద్దలు, అంతియొకయలోను, సిరియాలోను, కిలికియ ప్రాంతాల్లో నివసించే యూదేతరులలోని విశ్వాసులకు, శుభములు.
ACT 15:24 మా నుండి అనుమతి పొందకుండానే మాలో నుండి కొందరు మీ దగ్గరకు వచ్చి వారు మీతో చెప్పే బోధలతో మిమ్మల్ని కలవరపరుస్తూ, మీ మనస్సులను ఇబ్బంది పెడుతున్నారని మేము విన్నాము.
ACT 15:25 కాబట్టి మా నుండి కొంతమందిని ఏర్పరచుకొని మా ప్రియ స్నేహితులైన బర్నబా పౌలుతో వారిని పంపడానికి మేము అందరం అంగీకరించాము.
ACT 15:26 మేము పంపించే ఈ ప్రియ స్నేహితులు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట తమ ప్రాణాలను కూడా లెక్కచేయని వారు.
ACT 15:27 మేము వ్రాసిన దానిని నోటి మాటలతో దృఢపరచడానికి యూదాను సీలను పంపిస్తున్నాము.
ACT 15:28 వీటి కంటే మీమీద ఎక్కువ భారం మోపకూడదని పరిశుద్ధాత్మకు, మాకు అనిపించిన విషయాలు ఏమనగా:
ACT 15:29 విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే మీకు మేలు కలుగుతుంది. మీకు క్షేమం కలుగును గాక.
ACT 15:30 వారు పంపబడిన తర్వాత వారు అక్కడినుండి బయలుదేరి అంతియొకయ పట్టణానికి వచ్చి, అక్కడ సంఘమంతటిని ఒక్క చోటికి చేర్చి ఈ ఉత్తరాన్ని వారికి అందించారు.
ACT 15:31 వారు ఆ ఉత్తరాన్ని చదివి, దానిలోని ప్రోత్సాహపరిచే సందేశాన్ని బట్టి ఎంతో సంతోషించారు.
ACT 15:32 యూదా, సీలలు కూడా ప్రవక్తలు కాబట్టి వారు కూడా విశ్వాసులను ప్రోత్సహించి వారిని విశ్వాసంలో బలపరిచారు.
ACT 15:33 అక్కడ వారు కొంతకాలం గడిపిన తర్వాత తమను పంపిన వారి దగ్గరకు తిరిగి వెళ్లడానికి విశ్వాసులచే సమాధానంతో పంపబడ్డారు.
ACT 15:34 అయితే సీల అక్కడే ఉండాలని నిర్ణయించుకొన్నాడు.
ACT 15:35 కానీ పౌలు బర్నబాలు అంతియొకయలోనే ఉండి, ఇంకా అనేకులతో కలిసి ప్రభువు సందేశాన్ని బోధిస్తూ ప్రకటించారు.
ACT 15:36 కొంతకాలం తర్వాత పౌలు, “మనం ప్రభువు వాక్యాన్ని ప్రకటించిన అన్ని పట్టణాలకు తిరిగివెళ్లి, అక్కడి విశ్వాసులను కలుసుకొని వారి క్షేమ సమాచారాలను తెలుసుకుందాం” అని బర్నబాతో అన్నాడు.
ACT 15:37 బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకెళ్లాలని భావించాడు.
ACT 15:38 కాని పౌలు, పంఫులియాలో అతడు పరిచర్యకు రాకుండా తమను విడిచిపెట్టి వెళ్లిపోయాడు కాబట్టి అతన్ని తీసుకుని వెళ్లడం మంచిది కాదని తలంచాడు.
ACT 15:39 ఆ విషయాన్ని బట్టి వారిద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారిద్దరు వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్ర ద్వీపానికి వెళ్లాడు.
ACT 15:40 విశ్వాసులు పౌలును ప్రభువు కృపకు అప్పగించినప్పుడు అతడు సీలను ఎంచుకుని అక్కడినుండి బయలుదేరాడు.
ACT 15:41 వారు సంఘాలను విశ్వాసంలో బలపరస్తు సిరియా కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశారు.
ACT 16:1 పౌలు దెర్బేకు వచ్చి అక్కడినుండి లుస్త్రకు వచ్చాడు, అక్కడ తిమోతి అనే పేరుగల విశ్వాసిని కలుసుకున్నాడు. అతని తల్లి క్రీస్తును విశ్వాసించిన యూదురాలు తండ్రి గ్రీసు దేశస్థుడు.
ACT 16:2 లుస్త్ర ఈకొనియ విశ్వాసులు అతని గురించి మంచి చెప్పారు.
ACT 16:3 పౌలు తన ప్రయాణంలో అతన్ని వెంట తీసుకుని వెళ్లాలని భావించి, ఆ ప్రాంతంలోని యూదులందరికి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని తెలుసు కాబట్టి వారిని బట్టి అతనికి సున్నతి చేయించాడు.
ACT 16:4 వారు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తూ, యెరూషలేములోని అపొస్తలుల సంఘపెద్దల నిర్ణయాలను ప్రజలు పాటించడం కోసం అప్పగించారు.
ACT 16:5 కాబట్టి సంఘాలన్ని విశ్వాసంలో బలపడుతూ, ప్రతిరోజు విశ్వాసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ACT 16:6 పౌలు అతనితో ఉన్నవారు ఫ్రుగియ, గలతీయ ప్రాంతాల గుండా ప్రయాణం చేసి ఆసియా ప్రాంతంలో వాక్యం బోధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ వారిని బోధించనియ్యలేదు.
ACT 16:7 ఆ తర్వాత వారు ముసియ ప్రాంత సరిహద్దు దగ్గరకు వచ్చి, బితూనియ ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు కానీ యేసు ఆత్మ వారిని వెళ్లనివ్వలేదు.
ACT 16:8 కాబట్టి వారు ముసియ ప్రాంతాన్ని దాటి త్రోయ పట్టణానికి వెళ్లారు.
ACT 16:9 రాత్రివేళలో కలిగిన దర్శనంలో మాసిదోనియకు చెందిన ఒక వ్యక్తి నిలబడి, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయండి” అని తనను బ్రతిమాలుతున్నట్లు పౌలు చూశాడు.
ACT 16:10 పౌలు ఆ దర్శనాని చూసిన తర్వాత, వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని నిర్ణయించుకొని, వెంటనే మాసిదోనియ ప్రాంతానికి వెళ్లడానికి మేము సిద్ధపడ్డాము.
ACT 16:11 మేము త్రోయ ప్రాంతాన్ని వదిలి ఓడ ఎక్కి నేరుగా సమొత్రాకే ద్వీపానికి వచ్చి, మరుసటిరోజు నెయపొలి ప్రాంతానికి వెళ్లాము.
ACT 16:12 అక్కడినుండి మేము ప్రయాణం చేసి, రోమీయులున్న మాసిదోనియ ప్రాంతంలోని ముఖ్య పట్టణమైన ఫిలిప్పీకు వెళ్లాము. మేము అక్కడ చాలా రోజులు ఉన్నాము.
ACT 16:13 ఒక సబ్బాతు దినాన ప్రార్థన స్థలమేదైనా ఉంటుందేమో చూద్దామని, పట్టణ ద్వారాన్ని దాటి నదీ తీరానికి వెళ్లాము, మేము ఒక చోటున కూర్చుని అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడడం ప్రారంభించాము.
ACT 16:14 అక్కడ వింటున్న వారిలో తుయతైర పట్టణానికి చెందిన, ఊదా రంగు బట్టలను అమ్మే లూదియ అనే స్త్రీ ఉంది. ఆమె దేవుని ఆరాధించేది. పౌలు చెప్పిన మాటలకు స్పందించేలా ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచారు.
ACT 16:15 కాబట్టి ఆమె ఇంటివారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆమె మాతో, “నేను ప్రభువు విశ్వాసినని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండవలసిందే” అని తన ఇంటికి రమ్మని బ్రతిమాలి మమ్మల్ని ఆహ్వానించింది.
ACT 16:16 మరొక రోజు మేము ప్రార్థన స్థలానికి వెళ్తుండగా, దయ్యం పట్టి సోదె చెప్పే ఒక బానిస స్త్రీ మాకు ఎదురయింది. ఆమె సోదె చెప్తూ తన యజమానికి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించేది.
ACT 16:17 ఆమె పౌలును మమ్మల్ని వెంబడిస్తూ, “ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని తెలియజేస్తున్నారు” అని బిగ్గరగా అరిచి చెప్పింది.
ACT 16:18 ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ ఉంది. చివరికి ఒక రోజు పౌలు చాలా చికాకుపడి ఆమె వైపు తిరిగి దయ్యంతో, “నీవు ఈమె నుండి బయటకు వెళ్లిపో అని యేసు క్రీస్తు పేరట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను!” అని గద్దించాడు. వెంటనే ఆ దయ్యం ఆమెను వదిలిపోయింది.
ACT 16:19 ఆమె యజమానులు ఇక వారికి ఆదాయం వచ్చే మార్గమే లేకుండా పోయిందని గుర్తించి, వారు పౌలు సీలలను పట్టుకుని ఆ పట్టణ సంతవీధులలో ఉండే అధికారుల దగ్గరకు వారిని ఈడ్చుకొని పోయారు.
ACT 16:20 వారు వారిని న్యాయాధికారుల దగ్గరకు తెచ్చి, “ఈ మనుష్యులు యూదులు, రోమీయులమైన మనం అంగీకరించని ఆచారాలను ప్రకటిస్తూ,
ACT 16:21 మన పట్టణంలో కలహాలను రేపుతున్నారు” అని చెప్పారు.
ACT 16:22 జనసమూహం కూడా వారి మీద దాడి చేశారు, కాబట్టి న్యాయాధికారులు వారి వస్త్రాలను లాగివేసి వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు.
ACT 16:23 వారిని తీవ్రంగా దెబ్బలు కొట్టి, చెరసాలలో పడవేసి, భద్రంగా కాపలా కాయమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు.
ACT 16:24 అతడు ఈ ఆదేశాలను పొందుకొని, వారిని చెరసాలలోని లోపలి గదిలో కాళ్లను చెక్క మొద్దులలో ఇరికించి బంధించాడు.
ACT 16:25 సుమారు అర్థరాత్రి సమయంలో పౌలు సీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలను పాడుతున్నప్పుడు, ఇతర ఖైదీలు వింటూ ఉన్నారు.
ACT 16:26 అప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చి ఆ చెరసాల పునాదులను కదిలించింది. ఒక్కసారిగా చెరసాల గదుల తలుపులన్ని తెరవబడి, వారందరి సంకెళ్ళు ఊడిపోయాయి.
ACT 16:27 ఆ చెరసాల అధికారి నిద్రలేచి, చెరసాల గదుల తలుపులన్ని తెరిచి ఉండడం చూసి, ఖైదీలందరు పారిపోయారని భావించి తన ఖడ్గాన్ని బయటకు దూసి తనను తాను చంపుకోబోయాడు.
ACT 16:28 వెంటనే పౌలు, “నీకు నీవు హాని చేసుకోవద్దు! మేమందరం ఇక్కడే ఉన్నాం!” అని అరిచాడు.
ACT 16:29 చెరసాల అధికారి దీపాలను తెమ్మని చెప్పి, వేగంగా లోనికి వచ్చి, వణుకుతూ పౌలు సీలల ముందు సాగిలపడ్డాడు.
ACT 16:30 ఆ తర్వాత అతడు వారిని బయటకు తెచ్చి, “అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు.
ACT 16:31 అందుకు వారు, “ప్రభువైన యేసును నమ్ము అప్పుడు నీవు నీ ఇంటివారందరు రక్షింపబడతారు” అని చెప్పారు.
ACT 16:32 అప్పుడు వారు అతనికి అతని ఇంటి వారందరికి ప్రభువు వాక్యాన్ని బోధించారు.
ACT 16:33 ఆ రాత్రి సమయంలోనే అతడు వారిని తీసుకువచ్చి, వారి గాయాలను కడిగాడు. వెంటనే అతడు అతని ఇంటివారందరు బాప్తిస్మం పొందుకున్నారు.
ACT 16:34 ఆ చెరసాల అధికారి వారిని తన ఇంటికి తెచ్చి వారికి భోజనం వడ్డించాడు. తాను తన ఇంటివారందరు దేవుని నమ్ముకున్నందుకు అతడు ఆనందించాడు.
ACT 16:35 మరుసటిరోజు తెల్లవారగానే న్యాయాధికారులు చెరసాల అధికారి దగ్గరకు భటులను పంపి, “ఆ మనుష్యులను విడచిపెట్టండి” అనే ఆదేశాన్ని ఇచ్చి పంపించారు.
ACT 16:36 ఆ చెరసాల అధికారి పౌలుతో, “న్యాయాధికారులు మిమ్మల్ని విడిచిపెట్టమని ఆదేశించారు కాబట్టి మీరు సమాధానంగా బయలుదేరండి” అని చెప్పాడు.
ACT 16:37 అయితే పౌలు ఆ భటులతో, “రోమీయులమైన మమ్మల్ని వారు న్యాయ విచారణ చేయకుండానే బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా పంపించాలని అనుకుంటున్నారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని బయటకు తీసుకెళ్లాలి” అని చెప్పాడు.
ACT 16:38 ఆ అధికారులు ఈ సంగతిని న్యాయాధికారులకు తెలియజేశారు. వారు పౌలు సీలలు రోమీయులని విని భయపడ్డారు.
ACT 16:39 కాబట్టి వారు వీరిని శాంతింప చేయడానికి వచ్చి, చెరసాల నుండి వారిని బయటకు తీసుకువచ్చి, పట్టణం విడిచిపొమ్మని బ్రతిమాలారు.
ACT 16:40 పౌలు సీలలు చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత, వారు లూదియ ఇంటికి వెళ్లారు, అక్కడ సహోదర సహోదరీలను కలిసి వారిని ప్రోత్సహించిన తర్వాత, వారు అక్కడినుండి బయలుదేరి వెళ్లిపోయారు.
ACT 17:1 పౌలు అతనితో ఉన్నవారు అంఫిపొలి అపొల్లోనియ అనే పట్టణాల గుండా థెస్సలొనీక పట్టణానికి చేరుకొన్నారు, అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది.
ACT 17:2 పౌలు తన అలవాటు ప్రకారం, మూడు సబ్బాతు దినాలు సమాజమందిరంలోనికి వెళ్లి లేఖనాల్లో నుండి వారితో చర్చిస్తూ,
ACT 17:3 క్రీస్తు ఏ విధంగా శ్రమలను అనుభవించి, చావు నుండి తిరిగి లేచాడో వారికి నిరూపిస్తూ, “మేము ప్రకటిస్తున్న ఈ యేసే క్రీస్తు అని” వివరించాడు.
ACT 17:4 కొంతమంది యూదులు ఒప్పింపబడి పౌలు సీలలతో చేరారు, అదే విధంగా పెద్ద సంఖ్యలో దేవునికి భయపడే గ్రీసు దేశస్థులు, కొద్దిమంది ప్రముఖ స్త్రీలు కూడా చేరారు.
ACT 17:5 కానీ ఆ బోధను నమ్మని ఇతర యూదులు అసూయపడ్డారు; వారు సంతవీధులలోని పోకిరివారిని తమ వెంటపెట్టుకుని గుంపుగా చేరి పట్టణంలో అల్లరిని సృష్టించారు. వారు పౌలు సీలలను ప్రజల మధ్యకు తీసుకురావాలని వారిని వెదకడానికి యాసోను ఇంటి మీద దాడి చేశారు.
ACT 17:6 కానీ వారు అక్కడ కనబడలేదు కాబట్టి వారు యాసోనును మరికొందరు విశ్వాసులను పట్టణపు అధికారుల దగ్గరకు ఈడ్చుకొని వచ్చి, “భూలోకాన్ని తలక్రిందులు చేసినవారు ఇక్కడకు కూడా వచ్చారు.
ACT 17:7 యాసోను వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. వీరందరు యేసు అనే మరొక రాజు ఉన్నాడని చెప్పి, కైసరు చట్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు” అని కేకలు వేశారు.
ACT 17:8 ఆ మాటలను విన్న జనసమూహం, పట్టణ అధికారులు కలవరపడ్డారు.
ACT 17:9 వారు యాసోను మిగిలిన వారి దగ్గర నుండి జామీను తీసుకుని విడిచిపెట్టారు.
ACT 17:10 రాత్రియైన వెంటనే విశ్వాసులు పౌలును సీలలను అక్కడినుండి బెరయాకు పంపివేశారు. వారు అక్కడ చేరుకొని యూదుల సమాజమందిరానికి వెళ్లారు.
ACT 17:11 బెరయాలోని యూదులు థెస్సలొనీకలో ఉండే వారికంటే వాక్యాన్ని శ్రద్ధతో స్వీకరించి పౌలు చెప్పిన సంగతులను సత్యమేనా అని తెలుసుకోవడానికి ప్రతిరోజు లేఖనాలను పరిశీలిస్తూ వచ్చారు.
ACT 17:12 దాని ఫలితంగా, వారిలో చాలామంది యూదులు, అలాగే గ్రీసు దేశపు ప్రముఖులైన స్త్రీలు పురుషులు నమ్మారు.
ACT 17:13 కానీ థెస్సలొనీకలోని యూదులు పౌలు దేవుని వాక్యాన్ని బెరయాలో ప్రకటిస్తున్నాడని విన్నప్పుడు, వారిలో కొందరు అక్కడికి కూడా వెళ్లి, ప్రజలను రెచ్చగొట్టి అల్లరి రేపారు.
ACT 17:14 కాబట్టి విశ్వాసులు వెంటనే పౌలును అక్కడినుండి సముద్రతీరానికి పంపించారు, కానీ సీల తిమోతిలు బెరయాలోనే ఉండిపోయారు.
ACT 17:15 పౌలు వెంట వచ్చినవారు ఏథెన్సు పట్టణం వరకు అతన్ని చేర్చి, సీల తిమోతిలు వీలైనంత తొందరగా తన దగ్గరకు తిరిగి చేరాలి అనే ఆజ్ఞపొంది వెళ్లారు.
ACT 17:16 పౌలు ఏథెన్సు పట్టణంలో వారి కోసం ఎదురుచూస్తూ, ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉందని చూసి ఎంతో దుఃఖించాడు.
ACT 17:17 కాబట్టి సమాజమందిరాల్లో యూదులతో దేవుని భయం కలిగిన గ్రీసు దేశస్థులతో, అదే విధంగా ప్రతిరోజు సంత వీధుల్లో కనిపించే వారందరితో చర్చిస్తూ ఉండేవాడు.
ACT 17:18 ఎపికూరీయ అనే గుంపువారు స్తోయికులలో కొందరు జ్ఞానులు పౌలుతో వాదించసాగారు. వారిలో కొందరు, “ఈ వదరుబోతు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు?” అన్నారు. మరికొందరు, “ఇతడు మనకు తెలియని దేవతలను గురించి బోధిస్తున్నాడు” అన్నారు. పౌలు యేసును గురించి పునరుత్థానం గురించి సువార్త ప్రకటించడం వలన వారు అలా అన్నారు.
ACT 17:19 వారు అతన్ని వెంటబెట్టుకొని అరేయొపగు అనే సభకు తీసుకెళ్లి, “నీవు బోధిస్తున్న ఈ క్రొత్త బోధ ఏమిటో మేము తెలుసుకుంటాం మాకు చెప్పు!” అని అడిగారు.
ACT 17:20 వారు అతనితో, “నీవు కొన్ని వింతైన ఆలోచనలను మాకు వినిపిస్తున్నావు, మాకు వాటి అర్థం తెలుసుకోవాలని ఉంది” అన్నారు.
ACT 17:21 ఏథెన్సు పట్టణానికి చెందినవారు, అక్కడ నివసించే విదేశీయులు అందరు ఏదైనా ఒక క్రొత్త ఆలోచనల గురించి మాట్లాడుతూ వింటూ తమ కాలాన్ని గడిపేవారు.
ACT 17:22 అప్పుడు పౌలు అరేయొపగు సభలో లేచి నిలబడి, ఈ విధంగా చెప్పాడు, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లోను చాలా భక్తిపరులుగా ఉన్నారని నేను గమనించాను.
ACT 17:23 నేను చుట్టూ తిరుగుతూ మీరు పూజించే వాటిని జాగ్రత్తగా చూసినప్పుడు నాకు కనబడిన ఒక బలిపీఠం మీద, తెలియని దేవునికి, అని వ్రాయబడింది. కాబట్టి మీరు తెలియక ఆరాధిస్తున్న దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను.
ACT 17:24 “ఈ లోకాన్ని, దానిలోని సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆకాశానికి భూమికి ప్రభువు, ఆయన మానవుల చేతులతో నిర్మించే ఆలయాలలో నివసించడు.
ACT 17:25 ఆయనే వారందరికి జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని అనుగ్రహించేవాడు కాబట్టి ఏదో అవసరం ఉన్నట్లు మానవుల చేతులతో చేసే సేవలు ఆయనకు అవసరం లేదు.
ACT 17:26 ఆయన ఒక మనుష్యుని నుండి భూజనులందరిని సృష్టించారు, వారు భూమినంతటిని నింపుతారు. ఆయన వారికి చరిత్రలో సమయాలను, వారి సరిహద్దులను నిర్ణయించారు.
ACT 17:27 దేవుడు మనలో ఎవరినుండి దూరంగా ఉండరు కాని, ప్రజలు ఆయనను వెదకి కనుగొని ఆయన దగ్గరకు చేరాలని ఆయన ఈ విధంగా చేశారు.
ACT 17:28 ‘ఆయనలో మనం బ్రతుకుతున్నాం, కదులుతున్నాం మన ఉనికిని కలిగి ఉన్నాము.’ మీ సొంత కవులు కొందరు, ‘మనం ఆయన సంతానం’ అని అన్నారు.
ACT 17:29 “మనం దేవుని సంతానం కాబట్టి, మానవుడు తన నేర్పరితనంతో తయారుచేసి రూపమిచ్చిన బంగారు, వెండి లేదా రాయి బొమ్మలా దైవం ఉంటాడని మనం అనుకోవద్దు.
ACT 17:30 గతంలో మానవుని అజ్ఞానాన్ని దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడు, కాని ఇప్పుడు ప్రజలందరు ప్రతిచోట పశ్చాత్తాపం పొందాలని ఆయన ఆజ్ఞాపించారు.
ACT 17:31 ఎందుకనగా, లోకమంతటికి ఆయన నియమించిన వ్యక్తి ద్వారా నీతితో తీర్పు తీర్చడానికి ఆయన ఒక రోజును నిర్ణయించాడు. దేవుడు ఆయనను మరణం నుండి సజీవంగా లేపి వారందరికి దీనిని రుజువుపరిచాడు.”
ACT 17:32 వారు మరణం నుండి తిరిగి లేవడం గురించి విన్నప్పుడు, కొందరు హేళన చేయసాగారు కాని మరికొందరు, “ఈ సంగతిని గురించి మేము మరలా వినాలని అనుకుంటున్నాం” అన్నారు.
ACT 17:33 ఆ తర్వాత పౌలు ఆ న్యాయసభ నుండి వెళ్లిపోయాడు.
ACT 17:34 అయితే వారిలో కొందరు పౌలు చెప్పిన మాటలను నమ్మి అతని అనుచరులయ్యారు. వారిలో అరేయొపగు సభ సభ్యుడైన దియొనూసియు, దమరి అనే పేరుగల ఒక స్త్రీ, వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు.
ACT 18:1 ఆ తర్వాత, పౌలు ఏథెన్సు పట్టణం నుండి కొరింథీ పట్టణానికి వెళ్లాడు.
ACT 18:2 అక్కడ పొంతు అనే ప్రాంతానికి చెందిన అకుల అనే ఒక యూదుడు తన భార్య ప్రిస్కిల్లతో కలిసి, యూదులందరు రోమా ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలనే క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞమేరకు ఇటలీ దేశం నుండి కొరింథీ పట్టణానికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్లాడు.
ACT 18:3 పౌలు కూడా వారిలా డేరాలను తయారుచేసేవాడు, కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు.
ACT 18:4 అతడు యూదులను గ్రీసుదేశస్థులను ఒప్పించే ప్రయత్నం చేస్తూ, ప్రతి సబ్బాతు దినాన సమాజమందిరంలో తర్కించేవాడు.
ACT 18:5 సీల తిమోతిలు మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చినప్పుడు, పౌలు యేసే క్రీస్తు అని యూదులకు ప్రకటించడానికి, సాక్ష్యమివ్వడానికి తనను తాను ప్రత్యేకంగా అంకితం చేసుకున్నాడు.
ACT 18:6 అయితే వారు పౌలును దూషిస్తూ ఎదురు తిరిగినప్పుడు, అతడు తన వస్త్రాలను దులుపుకొని, “ ‘మీ రక్తం మీ తలల మీదికే వచ్చు గాక!’ నేనైతే ఈ విషయంలో నిర్దోషిని. ఇక ఇప్పటినుండి నేను యూదేతరుల దగ్గరకు వెళ్తున్నాను” అని వారితో చెప్పాడు.
ACT 18:7 పౌలు సమాజమందిరం నుండి బయటకు వెళ్లి దాని ప్రక్కనే ఆనుకుని ఉన్న దేవుని ఆరాధించే తీతియు యూస్తు అనే వాని ఇంటికి వచ్చాడు.
ACT 18:8 ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు అతని కుటుంబమంతా ప్రభువును నమ్ముకున్నారు; అలాగే పౌలు మాటలు విన్న చాలామంది కొరింథీయులు నమ్మి బాప్తిస్మం పొందుకున్నారు.
ACT 18:9 ఒక రాత్రి దర్శనంలో ప్రభువు పౌలుతో, “భయపడకు; మాట్లాడుతూనే ఉండు, మౌనంగా ఉండకు.
ACT 18:10 ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, ఎవరు నీ మీద దాడి చేసి నీకు హాని చేయరు, ఈ పట్టణంలో నాకు చెందిన ప్రజలు చాలామంది ఉన్నారు” అని చెప్పారు.
ACT 18:11 కాబట్టి ఒకటిన్నర సంవత్సరం పాటు పౌలు అక్కడే ఉండి దేవుని వాక్యాన్ని వారికి బోధించాడు.
ACT 18:12 అకాయ ప్రాంతానికి గల్లియో అధిపతిగా ఉన్నపుడు, కొరింథీలోని యూదులందరు కలిసి పౌలు మీద దాడి చేసి, అతన్ని న్యాయస్థానానికి తీసుకుని వచ్చారు.
ACT 18:13 వారు అతని మీద, “ఇతడు ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పద్ధతులతో దేవుని ఆరాధించండని ప్రజలను ఒప్పిస్తున్నాడు” అని ఫిర్యాదు చేశారు.
ACT 18:14 పౌలు మాట్లాడడం ఆరంభిస్తుండగా, గల్లియో వారితో, “యూదులారా, మీరు ఒక అన్యాయం లేదా నేరానికి సంబంధించి ఫిర్యాదు చేస్తే, నేను మీ మాటలు వినడం న్యాయంగా ఉంటుంది.
ACT 18:15 కాని ఇది మీ ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు, మాటలు, పేర్ల గురించే కాబట్టి మీరే పరిష్కరించుకోండి. అలాంటి విషయాలకు నేను న్యాయాధికారిని కాను” అని వారితో చెప్పి,
ACT 18:16 వారందరిని అక్కడినుండి పంపేశాడు.
ACT 18:17 అప్పుడు ఆ ప్రజలందరు సమాజమందిరపు అధికారి సోస్తెనేసును పట్టుకుని న్యాయస్థానం ముందు కొట్టారు, అయినా కానీ గల్లియో దాని గురించి ఏమి పట్టించుకోలేదు.
ACT 18:18 పౌలు మరికొన్ని రోజులు కొరింథీలోనే గడిపాడు. తర్వాత అక్కడి సహోదర సహోదరీల దగ్గర సెలవు తీసుకుని, అకుల ప్రిస్కిల్లతో కలిసి ఓడలో సిరియా దేశానికి వెళ్లాడు. అతడు ప్రయాణానికి ముందు తాను చేసుకొన్న మ్రొక్కుబడి ప్రకారం తన తల వెంట్రుకలను కెంక్రేయలో కత్తిరించుకున్నాడు.
ACT 18:19 వారు ఎఫెసుకు చేరుకున్నాక, పౌలు అకుల ప్రిస్కిల్లను అక్కడ విడిచిపెట్టాడు. తాను ఒక్కడే సమాజమందిరంలోనికి వెళ్లి యూదులతో తర్కించేవాడు.
ACT 18:20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు.
ACT 18:21 కానీ వెళ్లేముందు వారితో, “దేవుని చిత్తమైతే నేను తిరిగి వస్తాను” అని వాగ్దానం చేసి, ఎఫెసులో ఓడ ఎక్కి బయలుదేరాడు.
ACT 18:22 అతడు కైసరయ తీరాన దిగి, యెరూషలేముకు వెళ్లి సంఘాన్ని పలకరించాడు మళ్ళీ అక్కడినుండి అంతియొకయ పట్టణానికి తిరిగి వచ్చాడు.
ACT 18:23 అంతియొకయలో కొంతకాలం గడిపిన తర్వాత, పౌలు అక్కడినుండి బయలుదేరి గలతీయ ఫ్రుగియ పరిసర ప్రాంతాలంతట, ఒక స్థలం నుండి మరొక స్థలానికి తిరుగుతూ శిష్యులందరిని బలపరిచాడు.
ACT 18:24 ఆ సమయంలో అలెక్సంద్రియ పట్టణానికి చెందిన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్యావంతుడు, లేఖనాల్లో పూర్తి ప్రవీణ్యత కలిగినవాడు.
ACT 18:25 అతడు ప్రభువు మార్గం గురించి ఉపదేశాన్ని పొంది, తనకి యోహాను బాప్తిస్మం గురించి మాత్రమే తెలిసినప్పటికీ చాలా ఆసక్తితో యేసు గురించి స్పష్టంగా బోధిస్తున్నాడు.
ACT 18:26 అతడు సమాజమందిరంలో ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అకుల ప్రిస్కిల్లలు అతని మాటలను విని, అతన్ని తమ ఇంటికి ఆహ్వానించి దేవుని మార్గం గురించి మరింత పూర్తిగా అతనికి వివరించారు.
ACT 18:27 అపొల్లో అకాయ ప్రాంతానికి వెళ్లాలని తలంచినప్పుడు అక్కడి సహోదరి సహోదరులు అతన్ని ప్రోత్సహించి, అతన్ని చేర్చుకోవాలని అకాయలోని శిష్యులకు ఉత్తరాన్ని వ్రాసి పంపారు. అతడు అక్కడికి చేరినప్పుడు కృప చేత నమ్మిన వారికి అతడు గొప్ప సహాయంగా నిలిచాడు.
ACT 18:28 ఎందుకంటే, అతడు లేఖనాల ఆధారంతో యేసే క్రీస్తు అని నిరూపిస్తూ తనకు వ్యతిరేకంగా ఉన్న యూదుల వాదనలను బహిరంగంగా గట్టిగా ఖండించాడు.
ACT 19:1 అపొల్లో కొరింథీలో ఉన్నప్పుడు, పౌలు పల్లె ప్రాంతాలు సంచరిస్తూ ఎఫెసుకు చేరాడు.
ACT 19:2 అక్కడ అతడు కొందరు శిష్యులను కలిసి వారిని, “మీరు క్రీస్తును నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నారా?” అని అడిగాడు. అప్పుడు వారు, “లేదు, అసలు పరిశుద్ధాత్మ ఉన్నదని కూడా మేము ఎప్పుడు వినలేదు” అన్నారు.
ACT 19:3 అప్పుడు పౌలు, “అలాగైతే మీరు ఏ బాప్తిస్మాన్ని పొందుకున్నారు?” అని అడిగాడు. అప్పుడు వారు, “యోహాను బాప్తిస్మం” అని చెప్పారు.
ACT 19:4 అందుకు పౌలు వారితో, “యోహాను పశ్చాత్తాప బాప్తిస్మాన్ని ఇచ్చాడు. తన వెనుక రాబోతున్న యేసును నమ్మండని ప్రజలకు చెప్పాడు” అన్నాడు.
ACT 19:5 అది విని, వారు ప్రభువైన యేసు పేరట బాప్తిస్మం పొందుకున్నారు.
ACT 19:6 పౌలు తన చేతులను వారి మీద ఉంచినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషల్లో మాట్లాడుతూ ప్రవచించారు.
ACT 19:7 వారందరు కలిసి ఇంచుమించు పన్నెండుమంది ఉన్నారు.
ACT 19:8 పౌలు సమాజమందిరంలో, దేవుని రాజ్యం గురించి ధైర్యంగా మాట్లాడుతూ వారితో తర్కించి ఒప్పిస్తూ మూడు నెలలు గడిపాడు.
ACT 19:9 అయితే వారిలో కొందరు హృదయాలను కఠినం చేసుకుని అతని మాటలను తిరస్కరిస్తూ, బహిరంగంగా ప్రభువు మార్గాన్ని దూషించారు, కాబట్టి పౌలు వారిని వదిలి వెళ్లాడు. ప్రతిరోజు శిష్యులను తీసుకుని తురన్ను అనే ఉపన్యాస గదిలో చర్చిస్తూ ఉండేవాడు.
ACT 19:10 అలాగే రెండు సంవత్సరాలు కొనసాగేటప్పటికి, ఆసియా ప్రాంతంలో నివసిస్తున్న యూదులు గ్రీసు దేశస్థులు అందరు ప్రభువు వాక్యాన్ని విన్నారు.
ACT 19:11 దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతాలను చేశాడు.
ACT 19:12 అనగా, అతన్ని తాకిన చేతి రుమాలు కాని వస్త్రాలను కాని రోగులు తాకగానే వారికున్న అనారోగ్యం నుండి స్వస్థత పొందుకున్నారు, దురాత్మలు వారిని వదిలిపోయాయి.
ACT 19:13 కొందరు యూదులు యేసు ప్రభువు నామాన్ని ఉపయోగిస్తూ, దయ్యం పట్టిన వారిలోని దురాత్మలను వెళ్లగొట్టడానికి బయలుదేరారు. వారు, “పౌలు ప్రకటిస్తున్న యేసు నామమున బయటకు రమ్మని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నారు.
ACT 19:14 యూదుల ముఖ్య యాజకుడు స్కెవ ఏడుగురు కుమారులు ఈ విధంగా చేస్తూ వచ్చారు.
ACT 19:15 ఒక రోజు దురాత్మ వారిని, “యేసు నాకు తెలుసు, పౌలు నాకు తెలుసు, కాని మీరెవరు?” అని అడిగింది.
ACT 19:16 ఆ దురాత్మ పట్టినవాడు వారి మీద పడి వారిని లోబరచుకుని దాడి చేయగా వారు రక్తం కారుతున్న గాయాలతో దిగంబరులుగా ఆ ఇంటి నుండి పారిపోయారు.
ACT 19:17 ఈ విషయం ఎఫెసులో ఉన్న యూదులకు గ్రీసు ప్రజలకు తెలిసినప్పుడు, వారందరు భయపడిపోయారు, కాబట్టి ప్రభు యేసు పేరు ఘనపరచబడింది.
ACT 19:18 అప్పుడు నమ్మినవారిలో చాలామంది వచ్చి తాము చేసిన దుష్ట కార్యాలను అందరి ముందు ఒప్పుకున్నారు.
ACT 19:19 మంత్రవిద్యను అభ్యసించే వారిలో చాలామంది వాటికి సంబంధించిన పుస్తకాలను తెచ్చి అందరి ముందు వాటిని కాల్చివేశారు. కాల్చిన ఆ పుస్తకాల ఖరీదును లెక్కిస్తే వాటి ఖరీదు యాభైవేల వెండి నాణాలు అయింది.
ACT 19:20 ఈ విధంగా ప్రభువు వాక్యం శక్తితో వ్యాప్తిస్తూ చాలా ప్రాంతాలకు విస్తరించింది.
ACT 19:21 ఇదంతా జరిగిన తర్వాత పౌలు మాసిదోనియ అకాయ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ యెరూషలేముకు వెళ్లాలి అని నిర్ణయించుకొన్నాడు. “నేను అక్కడికి వెళ్లిన తర్వాత రోమా పట్టణాన్ని కూడా దర్శించాలి” అనుకున్నాడు.
ACT 19:22 అతడు తిమోతి ఎరస్తు అనే ఇద్దరు తన తోటి పరిచారకులను మాసిదోనియాకు పంపి, అతడు ఆసియా ప్రాంతంలో కొంతకాలం ఉండిపోయాడు.
ACT 19:23 ఆ సమయంలో ప్రభువు మార్గం గురించి అక్కడ చాలా అల్లరి చెలరేగింది.
ACT 19:24 అది ఎలాగంటే, దేమేత్రి అనే ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేస్తూ, అక్కడి పనివారికి వ్యాపారంలో మంచి ఆదాయం కల్పించేవాడు.
ACT 19:25 అతడు ఆ వ్యాపార సంబంధమైన పని వారందరిని పిలిపించి, ఈ విధంగా చెప్పాడు, “నా స్నేహితులారా, ఈ వ్యాపారం ద్వారా మనకు మంచి ఆదాయం వస్తుందని మీకు అందరికి తెలుసు.
ACT 19:26 అయితే పౌలు అనే ఇతడు ఎఫెసు ఆసియా ప్రాంతాలన్నింటిలో చాలామంది ప్రజలను ఎలా ఒప్పించి దారి తప్పిస్తున్నాడో మీరు చూస్తున్నారు వింటున్నారు. మానవుల చేతులతో తయారుచేసిన దైవాలు అసలు దైవాలే కావు అని ఇతడు అంటున్నాడు.
ACT 19:27 దీని వలన మన వ్యాపారానికి ఉన్న మంచి పేరు పోవడమే కాకుండా గొప్ప అర్తెమి దేవి గుడికి ఉన్న ఘనత కూడా పోతుంది; ఆసియా ప్రాంతాల్లోనూ లోకమంతటను ఆమెకు ఉన్న దివ్యఘనత తగ్గిపోతుంది.”
ACT 19:28 అది విన్న వారు కోపంతో, “ఎఫెసీయుల అర్తెమి దేవి గొప్పది!” అని బిగ్గరగా కేకలు వేశారు.
ACT 19:29 దానితో పట్టణంలో అల్లరి చెలరేగింది. పౌలుతో మాసిదోనియ నుండి ప్రయాణం చేసి వచ్చిన గాయి అనే అరిస్తర్కును పట్టుకుని, వారందరు ఒకేసారి నాటకశాలలోనికి ఈడ్చుకు వెళ్లారు.
ACT 19:30 పౌలు ఆ జనసమూహానికి కనిపించాలి అనుకున్నాడు, కాని శిష్యులు అతన్ని వెళ్లనివ్వలేదు.
ACT 19:31 అంతేకాక కొందరు ఆసియా దేశ అధికారులు, పౌలు మిత్రులు, అతన్ని నాటకశాలలోనికి వెళ్లవద్దని బ్రతిమాలుతూ వర్తమానం పంపించారు.
ACT 19:32 సభ అంతా గందరగోళంగా మారింది: కొందరు ఒకదాని గురించి కేకలు వేస్తుంటే, మరికొందరు మరొకదాని గురించి. అక్కడ ఉన్నవారిలో చాలామందికి తాము అక్కడ ఎందుకు ఉన్నారో కూడా తెలియలేదు.
ACT 19:33 ఆ జనసమూహంలోని యూదులు అలెగ్జాండరును ముందుకు త్రోసి, అతన్ని జనుల ముందు నిలబెట్టి వారు కేకలు వేశారు. కాబట్టి అతడు ప్రజల ముందు సమాధానం చెప్పడానికి నిలబడి నిశ్శబ్దంగా ఉండండి అని సైగ చేశాడు.
ACT 19:34 కానీ అతడు యూదుడు అని తెలుసుకొని వారు సుమారు రెండు గంటల సేపు ఏకకంఠంతో, “ఎఫెసీయుల అర్తెమి దేవి గొప్పది!” అని బిగ్గరగా కేకలు వేశారు.
ACT 19:35 ఆ నగర గుమస్తా ఆ ప్రజలను శాంతపరస్తూ వారితో ఇలా అన్నాడు: “తోటి ఎఫెసీయులారా, అర్తెమి దేవి గుడికి, ఆకాశం నుండి పడిన ఆమె ప్రతిమకు ఎఫెసు పట్టణం సంరక్షణ అని లోకమంతటికి తెలియదా?
ACT 19:36 ఈ సంగతులు త్రోసిపుచ్చలేని నిజాలు కాబట్టి, మీరు శాంతించాలి, తొందరపడి ఏమి చేయకూడదు.
ACT 19:37 అయితే మీరు తీసుకుని వచ్చిన వీరు మన గుడిని దోచుకోలేదు, మన దేవతను దూషించలేదు.
ACT 19:38 నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేమేత్రికి అతని తోటి పనివారికి ఎవరి మీద ఆరోపణలు ఉన్నా, వారి కోసం న్యాయస్థానాలు తెరిచి ఉన్నాయి, అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి వారు అక్కడికి వెళ్లి వీరి మీద ఫిర్యాదు చేసుకోవాలి.
ACT 19:39 మీకు ఏ విషయమైనా తెలియచేయాలని అనుకుంటే వాటిని క్రమపద్ధతిలో న్యాయసభలో సరిచేసుకోవాలి.
ACT 19:40 అయితే ఈ రోజు జరిగిన అల్లరి గురించి అధికారులు మనపై విచారణ చేసే ప్రమాదం ఉంది. ఏ కారణం లేకుండా కలిగిన ఈ అల్లరికి మనం ఏ కారణం ఇవ్వగలమని” వారితో అన్నాడు.
ACT 19:41 అతడు ఈ మాటలను చెప్పి ప్రజలను పంపేశాడు.
ACT 20:1 ఆ అల్లరంతా తగ్గిన తర్వాత, పౌలు శిష్యులను తన దగ్గరకు పిలుచుకొని, వారిని ధైర్యపరచి వారి దగ్గర సెలవు తీసుకుని మాసిదోనియకు బయలుదేరాడు.
ACT 20:2 అతడు ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ప్రజలను ధైర్యపరచే మాటలను చెప్పుతూ, చివరికి గ్రీసు దేశం చేరాడు.
ACT 20:3 అతడు అక్కడ మూడు నెలలు గడిపిన తర్వాత, ఓడ ఎక్కి సిరియా దేశానికి బయదేరుతున్నప్పుడు, కొందరు యూదులు అతని మీద కుట్ర పన్నుతున్నారని తెలుసుకొని మాసిదోనియా గుండా తిరిగి వెళ్లడానికి నిర్ణయించుకొన్నాడు.
ACT 20:4 అతనితో బెరయా పట్టణస్థుడు పుర్రు కుమారుడైన సోపత్రు, థెస్సలొనీక పట్టణస్థుడైన అరిస్తర్కు సెకుందు, దెర్బే పట్టణస్థుడైన గాయి, తిమోతి, తుకికు ఆసియా ప్రాంతం నుండి త్రోఫిము అనేవారు ఉన్నారు.
ACT 20:5 వీరందరు మాకంటే ముందుగా త్రోయ పట్టణం చేరుకొని మాకోసం ఎదురు చూస్తున్నారు.
ACT 20:6 కానీ మేము పులియని రొట్టెల పండుగ తర్వాత మాసిదోనియలోని ఫిలిప్పీ పట్టణం నుండి ఓడ ఎక్కి బయలుదేరి, అయిదు రోజుల తర్వాత మిగిలిన వారిని త్రోయ పట్టణంలో కలుసుకొని వారి దగ్గర ఏడు రోజులు గడిపాము.
ACT 20:7 వారం మొదటి రోజున రొట్టె విరవడం కోసం మేము ఒక్కచోట చేరినప్పుడు, పౌలు మరుసటిరోజు వెళ్లిపోవాలి, కాబట్టి వారితో అర్థరాత్రి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు.
ACT 20:8 మేము సమావేశమైన మేడ గదిలో చాలా దీపాలు ఉన్నాయి.
ACT 20:9 ఆ గది కిటికీ మీద ఐతుకు అనే పేరుగల ఒక యవ్వనస్థుడు కూర్చుని ఉన్నాడు, పౌలు ఇంకా మాట్లాడుతుండగా వాడు మత్తు నిద్రలోకి వెళ్లిపోయాడు. వాడు బాగా నిద్రలోకి వెళ్లినప్పుడు, వాడు మూడవ అంతస్తు నుండి క్రింద నేలపై పడి చనిపోయాడు.
ACT 20:10 అప్పుడు పౌలు క్రిందికి వెళ్లి, ఆ యువకుని మీద పడి, తన చేతులతో కౌగిలించుకుని, “మీరు కంగారుపడకండి, ఇతడు ప్రాణంతో ఉన్నాడు” అని వారితో చెప్పాడు.
ACT 20:11 అతడు మళ్ళీ మేడ గదికి వెళ్లి వారందరితో కలిసి రొట్టెను విరిచి తిన్నాడు. అతడు తెల్లవారే వరకు వారితో మాట్లాడి బయలుదేరి వెళ్లాడు.
ACT 20:12 ఆ యువకుని సజీవంగా ఇంటికి తీసుకుని వెళ్లిన ప్రజలందరు గొప్ప ఆదరణ పొందారు.
ACT 20:13 పౌలును ఎక్కించుకోవాలని, మేము ఓడలో ముందుగా బయలుదేరి అస్సోసు చేరిపోయాము. పౌలు అక్కడికి కాలినడకన రావాలని ఈ ఏర్పాటును చేశాడు.
ACT 20:14 అనుకున్న విధంగానే అతడు మమ్మల్ని అస్సోసులో కలుసుకున్నాడు, మేము అతన్ని మితులేనేకు తీసుకుని వెళ్లాము.
ACT 20:15 మరుసటిరోజు మేము అక్కడినుండి ఓడలో బయలుదేరి కీయోసు చేరి, మరుసటిరోజు సమొసును దాటి, ఆ తర్వాత రోజు మిలేతు చేరుకొన్నాము.
ACT 20:16 పెంతెకొస్తు పండుగ రోజు యెరూషలేములో ఉండాలని పౌలు ఆతురతలో ఉన్నాడు కాబట్టి, అతడు ఆసియా ప్రాంతంలో సమయం వ్యర్థం చేయకూడదని ఎఫెసు పట్టణం దాటి పోవడానికి నిర్ణయించుకొన్నాడు.
ACT 20:17 పౌలు మిలేతు నుండి ఎఫెసు సంఘ పెద్దలకు వర్తమానం పంపి వారిని పిలిపించాడు.
ACT 20:18 వారు వచ్చినపుడు, వారితో ఈ విధంగా చెప్పాడు: “నేను ఆసియా ప్రాంతానికి వచ్చిన మొదటి రోజు నుండి మీతో గడిపిన సమయమంతటిలో నేను ఎలా జీవించానో మీకు తెలుసు.
ACT 20:19 నాకు విరోధంగా యూదులు చేసిన కుట్రల వలన నేను ఎదుర్కొన్న శ్రమల మధ్యలో కూడా నేను కన్నీరు విడుస్తు, మిక్కిలి వినయంగా ప్రభువును సేవించాను.
ACT 20:20 మీకు ఉపయోగకరమైన దానిని సంకోచించకుండా బహిరంగంగా ఇంటింటికి తిరిగి బోధించానని మీకు తెలుసు.
ACT 20:21 పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి ప్రభువైన యేసును నమ్మమని యూదులకు గ్రీసు దేశస్థులకు నేను ప్రకటించాను.
ACT 20:22 “ఇప్పుడు, నేను ఆత్మ చేత బలవంతం చేయబడి, నేను యెరూషలేముకు వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమి జరుగబోతుందో తెలియదు.
ACT 20:23 ప్రతి పట్టణంలో నా కోసం సంకెళ్ళు హింసలు వేచి ఉన్నాయని, పరిశుద్ధాత్మ నన్ను హెచ్చరిస్తున్నాడని మాత్రం నాకు తెలుసు.
ACT 20:24 అయినా కాని, నా జీవితం నాకు విలువైనది కాదని నేను భావిస్తున్నాను; ప్రభువైన యేసు నా ముందు ఉంచిన పరుగు పందెమును పూర్తి చేసి, దేవుని కృపను గురించిన సువార్తను ప్రకటించాలని ఆయన నాకు ఇచ్చిన పనిని పూర్తి చేయడమే నా ఏకైక లక్ష్యంగా ఉంది.
ACT 20:25 “నేను మీ మధ్య తిరుగుతూ దేవుని రాజ్యం గురించి ప్రకటించాను కానీ మీలో ఎవరూ మళ్ళీ నన్ను చూడరని నాకు తెలుసు.
ACT 20:26 మీ రక్తం విషయంలో నేను నిర్దోషిని అని నేడు మీ ముందు ప్రకటిస్తున్నాను.
ACT 20:27 ఎందుకంటే, దేవుని ఉద్దేశమంతటిని మీకు ప్రకటించడానికి నేను సంకోచించలేదు.
ACT 20:28 అయితే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాచుకుంటూ పరిశుద్ధాత్మ మీకు అప్పగించిన మందను సంఘపెద్దలుగా కాయండి. దేవుడు తన స్వరక్తాన్ని క్రయధనంగా చెల్లించి కొన్న ఆయన సంఘానికి కాపరులుగా ఉండండి.
ACT 20:29 నేను వెళ్లిన తర్వాత, భయంకరమైన తోడేళ్ళు మీ మధ్యకు చొరబడతాయి, అవి మందను విడిచిపెట్టవని నాకు అర్థమవుతుంది.
ACT 20:30 శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవడానికి సత్యాన్ని మళ్ళించే వారు మీ సొంతవారిలో నుండే బయలుదేరుతారు.
ACT 20:31 కాబట్టి మీరు మెలకువగా ఉండండి! నేను మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఎలా కన్నీరు కార్చుతూ మీలో అందరిని మానకుండా హెచ్చరించానో జ్ఞాపకం చేసుకోండి.
ACT 20:32 “ఇప్పుడు నేను మిమ్మల్ని దేవునికి, మిమ్మల్ని అభివృద్ధిపరచి పరిశుద్ధులందరితో పాటు మీకు స్వాస్థ్యాన్ని ఇవ్వగల ఆయన కృపా వాక్యానికి అప్పగిస్తున్నాను.
ACT 20:33 నేను ఎవరి వెండిని కాని బంగారం కాని వస్త్రాలను కాని ఆశించలేదు.
ACT 20:34 నా సొంత చేతులతో నా అవసరాలను, నాతో ఉన్న వారి అవసరాలను తీర్చానని మీకే తెలుసు.
ACT 20:35 నేను చేసే ప్రతి పనిలో మీకు మాదిరిని చూపిస్తూ, ‘తీసుకోవడంకంటే ఇవ్వడం ఎంతో దీవెనకరం’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలని, నేను కష్టపడి బలహీనులకు సహాయం చేసి మీకు మాదిరిని చూపించాను” అని చెప్పాడు.
ACT 20:36 పౌలు మాట్లాడటం ముగించిన తర్వాత, అతడు వారందరితో కలిసి మోకరించి ప్రార్థించాడు.
ACT 20:37 వారందరు పౌలును కౌగిలించుకుని ముద్దు పెడుతూ ఏడ్చారు.
ACT 20:38 మీరు మరలా ఎన్నడు నా ముఖం చూడరు అని అతడు చెప్పిన మాట వారికి చాలా దుఃఖం కలిగించింది. ఆ తర్వాత వారు అతన్ని ఓడ వరకు సాగనంపారు.
ACT 21:1 మేము ఎఫెసు సంఘ పెద్దలను విడిచిపెట్టిన తర్వాత ఓడను ఎక్కి నేరుగా కోసు వెళ్లి, మరుసటిరోజు రొదు పట్టణానికి, ఆ తర్వాత అక్కడినుండి పతర చేరుకొన్నాము.
ACT 21:2 అక్కడ ఫేనీకేకు వెళ్లే ఒక ఓడను చూసి దానిలో ఎక్కి బయలుదేరాము.
ACT 21:3 కుప్ర కనపడగా దాని దక్షిణ వైపు నుండి సిరియాకు వెళ్లాము. తూరు పట్టణ తీరాన మేమున్న ఓడలోని సరుకులను దించవలసి వచ్చింది.
ACT 21:4 కాబట్టి మేము అక్కడి శిష్యులను కలిసి వారితో ఏడు రోజులు ఉన్నాము. నీవు యెరూషలేముకు వెళ్లవద్దని ఆత్మ ద్వారా వారు పౌలును బ్రతిమలాడారు.
ACT 21:5 మేము బయలుదేరే సమయం వచ్చినప్పుడు, మేము మా ప్రయాణాన్ని కొనసాగించాము. అప్పుడు వారందరు తమ భార్యా పిల్లలతో కలిసి పట్టణం బయటి వరకు మాతో కూడా వచ్చారు, మేము అందరం సముద్రపు తీరాన మోకరించి ప్రార్థించాము.
ACT 21:6 మేము ఒకరికి ఒకరం వీడ్కోలు చెప్పిన తర్వాత ఓడను ఎక్కాము, వారు తమ ఇళ్ళకు తిరిగి వెళ్లారు.
ACT 21:7 మేము తూరు పట్టణం నుండి మా ప్రయాణం కొనసాగించి తొలెమాయి పట్టణంలో దిగి అక్కడ ఉన్న సహోదర సహోదరీలను పలకరించి వారితో ఒక రోజు గడిపాము.
ACT 21:8 మరుసటిరోజు బయలుదేరి కైసరయ ప్రాంతానికి చేరి, మొదట్లో ఎన్నుకున్న ఏడుగురిలో ఒకడైన ఫిలిప్పు అనే సువార్తికుని ఇంట్లో ఉన్నాము.
ACT 21:9 అతనికి ప్రవచన వరం కలిగిన పెళ్ళికాని నలుగురు కుమార్తెలున్నారు.
ACT 21:10 మేము అక్కడ చాలా రోజులు ఉన్నప్పుడు, యూదయ ప్రాంతం నుండి అగబు అనే ప్రవక్త వచ్చాడు.
ACT 21:11 అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు నడికట్టును తీసుకుని దానితో తన చేతులను, కాళ్లను కట్టుకుని, “ ‘యెరూషలేములోని యూదా నాయకులు ఈ నడికట్టు కల వానిని ఈ విధంగా బంధించి యూదేతరుల చేతికి అప్పగిస్తారు’ అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు” అని అన్నాడు.
ACT 21:12 ఈ మాట విన్న తర్వాత మేము, అక్కడ కూడిన ప్రజలు పౌలును యెరూషలేముకు వెళ్లవద్దని బ్రతిమాలాము.
ACT 21:13 అప్పుడు పౌలు, “ఎందుకు మీరు ఏడుస్తూ నా గుండెను బద్దలు చేస్తున్నారు? ప్రభువైన యేసు పేరు కోసం నేను బందీని అవ్వడమే కాదు యెరూషలేములో చనిపోడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని చెప్పాడు.
ACT 21:14 అతడు ఎంత చెప్పినా ఒప్పుకోలేదు కాబట్టి, “దేవుని చిత్తం జరుగును గాక” అని మౌనంగా ఉండిపోయాము.
ACT 21:15 ఆ తర్వాత, మేము యెరూషలేముకు బయలుదేరాము.
ACT 21:16 కైసరయ ప్రాంతం నుండి మాతో కొందరు శిష్యులు వెంట వచ్చి, మొదటి శిష్యులలో ఒకడైన కుప్రకు చెందిన మ్నాసోను ఇంటికి తీసుకెళ్లి, అక్కడ మేము ఉండడానికి ఏర్పాట్లు చేశారు.
ACT 21:17 మేము యెరూషలేముకు చేరిన తర్వాత, సహోదరి సహోదరులు మమ్మల్ని సంతోషంగా చేర్చుకున్నారు.
ACT 21:18 మరుసటిరోజు పౌలు మేము కలిసి యాకోబును చూడటానికి వెళ్లాము, అక్కడ సంఘ పెద్దలందరు ఉన్నారు.
ACT 21:19 పౌలు వారిని పలకరించి, యూదేతరుల మధ్యలో తన పరిచర్య ద్వారా దేవుడు చేసిన కార్యాలన్నింటిని వివరంగా తెలియజేశాడు.
ACT 21:20 వారు వాటిని విని దేవుని స్తుతించారు. ఆ తర్వాత వారు పౌలుతో, “సహోదరుడా, చూడు, యూదులలో ఎన్ని వేలమంది విశ్వసించారో, వారందరు ధర్మశాస్త్రం కోసం ఆసక్తి కలిగి ఉన్నారు.
ACT 21:21 యూదేతరుల మధ్యలో నివసిస్తున్న యూదులకు వారి పిల్లలకు సున్నతి చేయించవద్దని, మన ఆచారాల ప్రకారం జీవించవద్దని, మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నావని వారు తెలియజేశారు.
ACT 21:22 నీవు ఇక్కడ వచ్చావన్న సంగతి వారు ఖచ్చితంగా వింటారు.
ACT 21:23 కాబట్టి మేము చెప్పినట్లు నీవు చేయాలి. అది ఏంటంటే, మాతో నలుగురు మ్రొక్కుబడి చేసుకొన్నవారు ఉన్నారు.
ACT 21:24 వారిని తీసుకెళ్లి, వారి శుద్ధీకరణ సంస్కారంలో పాల్గొని, వారు తమ తల వెంట్రుకలను తీయించుకోవడానికి అయ్యే ఖర్చులను భరించు. అప్పుడు నీ గురించి తెలిసినదానిలో సత్యం లేదని, నీవు కూడా ధర్మశాస్త్రానికి లోబడే జీవిస్తున్నావని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు.
ACT 21:25 అయితే యూదేతరుల విశ్వాసులు, ‘విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి’ అనే మా నిర్ణయాన్ని వారికి వ్రాసి తెలిపాం” అన్నారు.
ACT 21:26 మరుసటిరోజు పౌలు ఆ మనుష్యులను తీసుకెళ్లి వారితో తాను కూడా శుద్ధి చేసుకున్నాడు. శుద్ధీకరణ రోజులు పూర్తియైన తర్వాత అందరి కోసం కానుకలను చెల్లిస్తానని చెప్పడానికి అతడు దేవాలయంలోనికి వెళ్లాడు.
ACT 21:27 ఏడు రోజులు పూర్తి కావచ్చినప్పుడు, ఆసియా ప్రాంతం నుండి వచ్చిన కొందరు యూదులు దేవాలయంలో పౌలును చూసి, జనసమూహాన్ని రెచ్చగొట్టి అతన్ని పట్టుకున్నారు.
ACT 21:28 వారు బిగ్గరగా, “తోటి ఇశ్రాయేలీయులారా, మాకు సహాయం చేయండి! ఈ వ్యక్తి మన ప్రజలకు మన ధర్మశాస్త్రానికి ఈ స్థలానికి వ్యతిరేకంగా ప్రతిచోట అందరికి బోధిస్తున్నాడు. అంతేకాక గ్రీసుదేశస్థులను ఈ దేవాలయంలోనికి తీసుకువచ్చి, ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేశాడు” అని కేకలు వేశారు.
ACT 21:29 వారు అంతకుముందు ఎఫెసీయుడైన త్రోఫిముతో పౌలును పట్టణంలో చూశారు, కాబట్టి పౌలు అతన్ని దేవాలయంలోనికి తెచ్చాడని భావించారు.
ACT 21:30 పట్టణం అంతా ఆందోళన రేగింది, అన్ని వైపుల నుండి ప్రజలు పరుగెత్తికొని వచ్చారు. వారు పౌలును పట్టుకుని, అతన్ని దేవాలయం నుండి బయటకు లాగి, వెంటనే దేవాలయ తలుపులు మూసేసారు.
ACT 21:31 వారు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, యెరూషలేము పట్టణమంతా ఆందోళనగా మారిందనే వార్త రోమా ప్రధాన సైన్యాధికారికి చేరింది.
ACT 21:32 అతడు వెంటనే కొందరు అధికారులను, సైనికులను వెంటపెట్టుకుని ఆ గుంపు దగ్గరకు పరుగెత్తుకొని వచ్చాడు. ఆ ఆందోళనకారులు అధిపతిని అతని సైనికులను చూసి, పౌలును కొట్టడం ఆపివేశారు.
ACT 21:33 అధిపతి వచ్చి అతన్ని పట్టుకుని, రెండు గొలుసులతో బంధించమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత, “అతడు ఎవరు? ఏమి చేశాడు?” అని అడిగాడు.
ACT 21:34 ఆ గుంపులో కొందరు ఒకదాని గురించి కేకలు వేస్తుంటే, మరికొందరు మరొకదాని గురించి కేకలు వేశారు, ఆ గందరగోళం వలన ఆ అధిపతికి నిజం ఏమిటని స్పష్టం కాలేదు, కాబట్టి పౌలును సైనిక కోటలోనికి తీసుకుని వెళ్లమని ఆజ్ఞాపించాడు.
ACT 21:35 పౌలు మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు, అతనిపై ప్రజలు చాలా ఎక్కువగా దాడి చేస్తుండడంతో సైనికులు అతన్ని మోసుకొనివెళ్లారు.
ACT 21:36 అక్కడ ఉన్న గుంపు, “అతన్ని చంపివేయండి!” అని మరి ఎక్కువగా కేకలువేస్తూ వారి వెంటబడ్డారు.
ACT 21:37 సైనికులు పౌలును సైనిక కోటలోనికి తీసుకెళ్తున్నప్పుడు, పౌలు ఆ అధిపతిని, “నేను మీతో ఒక విషయం చెప్పడానికి అనుమతి ఉందా?” అని అడిగాడు. అందుకు ఆ అధికారి, “నీకు గ్రీకుభాష తెలుసా?” అన్నాడు.
ACT 21:38 “ఇంతకుముందు తిరుగుబాటును ఆరంభించి నాలుగు వేలమంది విప్లవకారులను అరణ్యంలోనికి నడిపించిన ఈజిప్టు వాడవు నీవేనా?” అని అడిగాడు.
ACT 21:39 అందుకు పౌలు, “నేను కిలికియ ప్రాంతంలోని తార్సు పట్టణానికి చెందిన యూదుడను, ఆ గొప్ప పట్టణ పౌరుడిని. అయితే దయచేసి ప్రజలతో నన్ను మాట్లాడ నివ్వండి!” అన్నాడు.
ACT 21:40 అధిపతి అనుమతితో, పౌలు మెట్ల మీద నిలబడి ప్రజలకు సైగ చేశాడు. వారందరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, హెబ్రీ భాషలో వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు.
ACT 22:1 “సహోదరులారా, తండ్రులారా, ఇప్పుడు వాదన వినండి” అన్నాడు.
ACT 22:2 అతడు హెబ్రీ భాషలో మాట్లాడడం విని, వారందరు మరింత నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు పౌలు వారితో ఈ విధంగా చెప్పాడు,
ACT 22:3 “నేను కిలికియ ప్రాంతపు తార్సు పట్టణంలో పుట్టిన యూదుడను, కాని ఈ పట్టణంలోనే పెరిగి పెద్దవాడినయ్యాను, గమలీయేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుని దగ్గర మన పితరుల ధర్మశాస్త్ర విద్యను పూర్తిగా అభ్యసించాను. మీరందరిలా నేను కూడా దేవుని కోసం ఆసక్తి కలవాన్ని.
ACT 22:4 క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో పడవేసి, వారిలో అనేకమందిని చచ్చే వరకు హింసించాను.
ACT 22:5 ఈ విషయాల గురించి ప్రధాన యాజకుడు న్యాయసభ సభ్యులందరు సాక్ష్యం ఇవ్వగలరు. దమస్కులోని వారి సహచరులకు ఇవ్వవలసిన ఉత్తరాలు కూడా నేను వారి దగ్గరి నుండి తీసుకుని, శిక్షించబడడానికి వీరిని బందీలుగా యెరూషలేముకు తీసుకురావడానికి వెళ్లాను.
ACT 22:6 “నేను దమస్కు పట్టణానికి సమీపించినప్పుడు, మధ్యాహ్న సమయంలో, అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక వెలుగు నా చుట్టూ ప్రకాశించింది.
ACT 22:7 నేను నేల మీద పడి ఒక స్వరం నాతో, ‘సౌలా, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు?’ అనడం విన్నాను.
ACT 22:8 “అందుకు నేను, ‘ప్రభువా, నీవెవరవు?’ అని అడిగాను. “అప్పుడు ఆ స్వరం నాతో, ‘నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును’ అని జవాబిచ్చాడు.
ACT 22:9 నాతో ఉన్నవారు వెలుగును చూశారు, కాని నాతో మాట్లాడిన స్వరాన్ని గ్రహించలేకపోయారు.
ACT 22:10 “ ‘ప్రభువా, నేను ఏమి చేయాలి?’ అని అడిగాను. “అప్పుడు ‘నీవు లేచి, దమస్కు పట్టణంలోనికి వెళ్లు, అక్కడ నీవు ఏమి చేయాలని నేను నిర్ణయించానో నీకు తెలియజేస్తాను’ అని చెప్పాడు.
ACT 22:11 ప్రకాశమానమైన ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చేసినందుకు, నాతో ఉన్నవారు నా చేతిని పట్టుకుని దమస్కు పట్టణంలోనికి నడిపించారు.
ACT 22:12 “అక్కడ అననీయ అనే ఒక వ్యక్తి నన్ను చూడడానికి వచ్చాడు. అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ యూదులందరి చేత మంచి పేరు పొందిన భక్తిపరుడు.
ACT 22:13 అతడు నా ప్రక్కన నిలబడి, ‘సహోదరుడా సౌలు చూపుపొందుకో!’ అన్నాడు. వెంటనే నేను అతన్ని చూడగలిగాను.
ACT 22:14 “అప్పుడు అతడు, ‘మన పితరుల దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి, నీతిమంతుని చూడడానికి ఆయన నోటి మాటలను వినడానికి నిన్ను ఎన్నుకున్నాడు.
ACT 22:15 నీవు చూసి వినిన దాని గురించి ప్రజలందరికి చెప్పే సాక్షిగా ఉంటావు.
ACT 22:16 నీవు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? లేచి, ప్రభువు పేరున ప్రార్థనచేసి, బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగివేసుకో అని చెప్పాడు.’
ACT 22:17 “నేను యెరూషలేముకు తిరిగివచ్చి, దేవాలయంలో ప్రార్థిస్తున్నప్పుడు, నేను స్వాప్నిక స్థితిలోనికి వెళ్లి,
ACT 22:18 ప్రభువు నాతో మాట్లాడడం చూశాను. ఆయన, ‘త్వరగా! నీవు వెంటనే యెరూషలేమును విడిచి వెళ్లు, ఎందుకంటే, నా గురించి నీవు ఇచ్చే సాక్ష్యం ఇక్కడి ప్రజలు అంగీకరించరు’ అని చెప్పారు.
ACT 22:19 “అందుకు నేను, ‘ప్రభువా, నేను ఒక సమాజమందిరం నుండి మరొక సమాజమందిరానికి వెళ్తూ, నిన్ను నమ్మినవారిని చెరసాలలో వేయించి హింసించానని నీకు తెలుసు.
ACT 22:20 నీకోసం హతసాక్షిగా చనిపోయిన స్తెఫెను రక్తం చిందినప్పుడు నేను అక్కడే నిలబడి దానికి సమ్మతించి, అతన్ని చంపిన వారి వస్త్రాలకు కాపలాగా ఉన్నానని తెలుసు కదా’ అన్నాను.
ACT 22:21 “అప్పుడు ప్రభువు నాతో, ‘నీవు వెళ్లు, నేను నిన్ను వీరినుండి దూరంగా యూదేతరుల దగ్గరకు పంపిస్తాను’ అని చెప్పారు.”
ACT 22:22 పౌలు చెప్పిందంతా ఆ ప్రజలు విని, “వీనిని భూమి మీద ఉండకుండ చేయండి! ఇలాంటివాడు బ్రతుక కూడదు!” అని బిగ్గరగా కేకలు వేశారు.
ACT 22:23 ఇతడు దైవదూషణ చేస్తున్నాడని కేకలువేస్తూ తమ వస్త్రాలను విసిరివేస్తూ, దుమ్మెత్తి ఆకాశంలోనికి పోస్తున్నప్పుడు,
ACT 22:24 సైన్యాధిపతి పౌలును సైనిక కోటలోకి తీసుకెళ్లి, ప్రజలు అతని గురించి ఎందుకు అలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవడానికి అతన్ని కొరడాలతో కొట్టించి, విచారించమని ఆదేశించాడు.
ACT 22:25 వారు అతన్ని కొరడాలతో కొట్టడానికి ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు, అక్కడ నిలబడి ఉన్న శతాధిపతితో పౌలు, “ఏ నేరం నిరూపించకుండానే ఒక రోమీయుని కొరడాలతో కొట్టించడం మీకు న్యాయమేనా?” అన్నాడు.
ACT 22:26 అది విన్న ఆ శతాధిపతి, తన అధిపతి దగ్గరకు వెళ్లి అతనితో, “మీరేమి చేస్తున్నారు? ఈ వ్యక్తి రోమీయుడు” అని చెప్పాడు.
ACT 22:27 ఆ అధిపతి పౌలు దగ్గరకు వెళ్లి, “నీవు రోమీయుడవా?” అని అడిగాడు. “అవును, నేను రోమీయుడనే” అని సమాధానం ఇచ్చాడు.
ACT 22:28 అప్పుడు ఆ అధిపతి, “నేను నా రోమా పౌరసత్వాన్ని పొందడానికి ఎంతో వెల చెల్లించాను” అన్నాడు. దానికి పౌలు, “నేను పుట్టుకతోనే రోమీయుడను” అని సమాధానం చెప్పాడు.
ACT 22:29 అతన్ని విచారణ చేయబోయేవారు వెంటనే అతన్ని విడిచిపెట్టారు. గొలుసులతో బంధించిన పౌలు రోమీయుడని తెలుసుకొన్న తర్వాత అధిపతి కూడా భయపడ్డాడు.
ACT 22:30 ఆ అధిపతి పౌలు ఎందుకు యూదులచేత నిందింపబడుతున్నాడో సరిగా తెలుసుకోవాలనుకున్నాడు. మరుసటిరోజు అతన్ని విడిచిపెట్టి, ముఖ్య యాజకులను యూదుల న్యాయసభ సభ్యులందరిని సమావేశమవ్వమని ఆదేశించి పౌలును వారి ముందు నిలబెట్టాడు.
ACT 23:1 పౌలు న్వాయసభ వారిని సూటిగా చూసి, “నా సహోదరులారా, ఈ రోజు వరకు నేను నా మంచి మనస్సాక్షితో దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేశాను” అని చెప్పాడు.
ACT 23:2 అందుకు ప్రధాన యాజకుడైన అననీయ, పౌలుకు దగ్గరగా నిలబడి ఉన్నవానితో, అతని నోటి మీద కొట్టమని ఆదేశించాడు.
ACT 23:3 అప్పుడు పౌలు అతనితో, “ఓ సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు! ధర్మశాస్త్రం ప్రకారం నాకు తీర్పు తీర్చడానికి అక్కడ కూర్చుని, నన్ను కొట్టమని ఆదేశించి నీవు ధర్మశాస్త్ర ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు!” అన్నాడు.
ACT 23:4 పౌలుకు దగ్గరగా నిలబడినవారు, “దేవుని ప్రధాన యాజకుని విమర్శించడానికి నీకెంత ధైర్యం!” అన్నారు.
ACT 23:5 అందుకు పౌలు, “సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు; అయితే ‘మీ ప్రజల అధికారులను నిందించవద్దు అని’ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది” అన్నాడు.
ACT 23:6 అక్కడ ఉన్నవారిలో కొందరు సద్దూకయ్యులు మరికొందరు పరిసయ్యులు ఉన్నారని పౌలు గ్రహించి, ఆ న్యాయసభలోని వారితో, “నా సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతానంగా పుట్టాను. నేను మృతులకు పునరుత్థానం ఉందనే నిరీక్షణను బట్టి ఈ విచారణ పాలయ్యాను” అని బిగ్గరగా చెప్పాడు.
ACT 23:7 అతడు ఆ విధంగా చెప్పిన వెంటనే, అక్కడ ఉన్న పరిసయ్యులు సద్దూకయ్యుల మధ్య విభేదం పుట్టి, ఆ సభ రెండుగా చీలిపోయింది.
ACT 23:8 ఎందుకంటే, సద్దూకయ్యులు పునరుత్థానం లేదని, దేవదూతలు లేరని, ఆత్మలు లేవని అంటారు. కానీ పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయని నమ్ముతారు.
ACT 23:9 అప్పుడు పరిసయ్యులలోని ధర్మశాస్త్ర ఉపదేశకులు కొందరు లేచి, “ఈ వ్యక్తిలో మాకు ఏ తప్పు కనిపించడం లేదు, అతనితో ఆత్మ కాని దేవదూత కాని మాట్లాడి ఉంటే తప్పు ఏంటి?” అని అడుగుతూ గట్టిగా వాదించారు, కాబట్టి గొప్ప అల్లరి చెలరేగింది.
ACT 23:10 ఈ విభేదం మరింత హింసాత్మకంగా మారినందుకు పౌలును ముక్కలుగా చీల్చివేస్తారేమో అని ఆ అధిపతి భయపడ్డాడు. అతడు సైనికులను వెళ్లి వారి మధ్యలో నుండి పౌలును బలవంతంగా పట్టుకుని, సైనికుల కోటలోకి తీసుకుని రమ్మని ఆదేశించాడు.
ACT 23:11 ఆ రాత్రి ప్రభువు పౌలు దగ్గర నిలబడి, “ధైర్యం తెచ్చుకో! యెరూషలేములో నా గురించి నీవు సాక్ష్యమిచ్చినట్టే రోమాలో కూడా నీవు సాక్ష్యమివ్వాలి” అని చెప్పారు.
ACT 23:12 మరుసటిరోజు ఉదయం కొందరు యూదులు ఒక కుట్రపన్ని, తాము పౌలును చంపే అంతవరకు ఏమి తినకూడదు త్రాగకూడదని ఒట్టు పెట్టుకొన్నారు.
ACT 23:13 ఇలా కలిసి ఒట్టుపెట్టుకున్న వారు సుమారు నలభై కంటే ఎక్కువ మంది ఉన్నారు.
ACT 23:14 వారు ముఖ్య యాజకులు యూదా పెద్దల దగ్గరకు వెళ్లి, “మేము పౌలును చంపే వరకు ఏమి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాము.
ACT 23:15 కాబట్టి మీరు న్యాయసభతో కలిసి, పౌలును మరింత వివరంగా విచారణ చేయాలని అతన్ని మీ దగ్గరకు తీసుకురమ్మని అధిపతితో మనవి చేయండి. అతడు ఇక్కడకు రావడానికి ముందే అతన్ని చంపడానికి మేము సిద్ధంగా ఉంటాం” అని చెప్పుకొన్నారు.
ACT 23:16 అయితే పౌలు అక్క కుమారుడు ఈ కుట్ర గురించి విన్నప్పుడు, సైనిక కోటలోనికి పోయి ఆ విషయం పౌలుతో చెప్పాడు.
ACT 23:17 అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, “ఈ యువకుడిని అధిపతి దగ్గరకు తీసుకెళ్లండి; ఇతడు అధిపతికి ఒక మాట చెప్పాలి” అని చెప్పాడు.
ACT 23:18 కాబట్టి అతడు ఆ యువకుని అధిపతి దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అప్పుడు శతాధిపతి, “ఈ యువకుడు నీకు ఒక మాట చెప్పాలి కాబట్టి ఇతన్ని మీ దగ్గరకు తీసుకెళ్లమని ఖైదీగా ఉన్న పౌలు నన్ను విన్నవించుకున్నాడు” అని అధిపతితో చెప్పాడు.
ACT 23:19 అప్పుడు ఆ అధిపతి అతని చేతిని పట్టుకుని ప్రక్కకు తీసుకెళ్లి, “నీవు నాకు ఏమి చెప్పాలని అనుకున్నావు?” అని అడిగాడు.
ACT 23:20 అందుకు అతడు, “కొందరు యూదులు పౌలును మరింత వివరంగా విచారణ చేయాలనే వంకతో రేపు న్యాయసభకు అతన్ని పంపించమని మిమ్మల్ని విన్నవించుకొంటారు.
ACT 23:21 అయితే మీరు వారికి అనుమతి ఇవ్వకండి, ఎందుకంటే సుమారు నలభై కన్నా ఎక్కువ మంది అతని కోసం పొంచి ఉన్నారు. పౌలును చంపే వరకు ఏమి తినకూడదని వారు ఒట్టు పెట్టుకొన్నారు. ఇప్పుడు వారు మీ దగ్గర అనుమతి కోసం ఎదురుచూస్తూ, సిద్ధంగా ఉన్నారు” అని చెప్పాడు.
ACT 23:22 ఆ అధిపతి, “ఈ సంగతిని నాకు చెప్పావని ఎవరికి చెప్పవద్దు” అని హెచ్చరించి ఆ యువకుడిని పంపించాడు.
ACT 23:23 తర్వాత ఆ అధిపతి తన శతాధిపతులలో ఇద్దరిని పిలిచి, “రెండువందలమంది సైనికులు, డెబ్బైమంది గుర్రపురౌతులను రెండువందలమంది ఈటెల సైన్య పటాలంతో ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరయకు వెళ్లడానికి సిద్ధపడండని ఆదేశించాడు.
ACT 23:24 అలాగే అధిపతియైన ఫెలిక్స్ దగ్గరకు పౌలును క్షేమంగా తీసుకెళ్లడానికి అతనికి గుర్రాన్ని ఇవ్వండి” అని ఆదేశించాడు.
ACT 23:25 అతడు ఈ విధంగా ఒక ఉత్తరం వ్రాశాడు:
ACT 23:26 క్లౌదియ లూసియ, మహా గౌరవనీయులైన ఫెలిక్స్ అధిపతికి, నా వందనాలు.
ACT 23:27 ఈ వ్యక్తిని యూదులు పట్టుకుని చంపబోతుంటే, ఇతడు రోమీయుడని తెలుసుకొని నేను సైనికులతో వెళ్లి రక్షించాను.
ACT 23:28 వారు అతన్ని ఎందుకు నిందిస్తున్నారో తెలుసుకోవడానికి, వారి న్యాయసభ ముందు అతన్ని నిలబెట్టాను.
ACT 23:29 వారు అతనిపై వారి ధర్మశాస్త్రానికి సంబంధించిన నిందలను మోపారు కాని, మరణశిక్ష వేయడానికి లేదా చెరసాలలో ఖైదీగా బంధించడానికి తగిన నేరమేదీ అతనిలో లేదు.
ACT 23:30 అతన్ని చంపాలని కుట్ర పన్నుతున్నారని నాకు తెలియగానే, ఇతన్ని మీ దగ్గరకు పంపాను అతని మీద నిందమోపే వారిని వారి ఫిర్యాదులను మీ ముందు చెప్పుకోవాలి అని ఆదేశించాను.
ACT 23:31 కాబట్టి సైనికులు, తమకు ఇచ్చిన ఆ దేశం ప్రకారం, రాత్రివేళ బయలుదేరి తమతో పౌలును యెరూషలేము నుండి అంతిపత్రి ప్రాంతానికి తీసుకెళ్లారు.
ACT 23:32 మరుసటిరోజు గుర్రాల దండును పౌలుతో పాటు పంపి, వారు సైనికుల కోటకు తిరిగి వచ్చారు.
ACT 23:33 ఆ గుర్రాల దండు కైసరయకు చేరిన తర్వాత, వారు ఆ ఉత్తరంతో పాటు పౌలును అధిపతికి అప్పగించారు.
ACT 23:34 ఆ అధిపతి ఆ ఉత్తరం చదివి, అతడు ఏ ప్రాంతానికి చెందిన వాడు అని అడిగాడు. అతడు కిలికియకు చెందినవాడని తెలుసుకొని,
ACT 23:35 “నీ మీద నేరం మోపిన వారు కూడా ఇక్కడకు వచ్చినప్పుడు నీ విషయాన్ని నేను విచారిస్తాను” అని చెప్పి, అతన్ని హేరోదు రాజగృహంలో కాపలా మధ్యలో ఉంచాలని ఆదేశించాడు.
ACT 24:1 అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయా కొందరు యూదా నాయకులు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాదితో కలిసి కైసరయ పట్టణానికి వచ్చి పౌలుకు వ్యతిరేకంగా తమ ఫిర్యాదులను అధిపతికి తెలియజేశారు.
ACT 24:2 పౌలును ఫెలిక్స్ ముందు నిలబెట్టిన తర్వాత, తెర్తుల్లు తన ఫిర్యాదులను అధిపతికి ఇలా తెలియజేశాడు: “ఘనత వహించిన ఫెలిక్స్ అధిపతి, మీ పాలనలో మీరు ముందు చూపుతో ఎన్నో సంస్కరణలు ఈ దేశానికి తెచ్చినందుకు మేము చాలా కాలం నుండి శాంతి కలిగి సంతోషంగా ఉన్నాము.
ACT 24:3 ఈ విషయాన్ని ప్రతిచోట అన్ని విధాలుగా పూర్ణ కృతజ్ఞతతో మేము అంగీకరిస్తున్నాము.
ACT 24:4 మిమ్మల్ని మరింత ఇబ్బందికి గురిచేయకుండా, మేము క్లుప్తంగా చెప్పేదానిని దయచేసి వినండని ప్రాధేయపడుతున్నాను.
ACT 24:5 “ఇతడు లోకమంతట యూదులలో కలహాలను రేపుతూ ఇబ్బంది కలిగిస్తున్నాడు. నజరేయులు అనే మతశాఖకు ఇతడు నాయకుడు.
ACT 24:6 ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయాలని చూశాడు, కాబట్టి మేము ఇతన్ని పట్టుకున్నాము.
ACT 24:7 మేము ఇతన్ని మా ధర్మశాస్త్రం ప్రకారం విచారణ చేస్తున్నాము. అయితే అధిపతి లూసియ వచ్చి ఇతన్ని మా దగ్గర నుండి బలవంతంగా తీసుకెళ్లి, ఇతనిపై ఫిర్యాదు చేసినవారు మీ ముందుకు రావాలి అని ఆదేశించాడు.
ACT 24:8 మీరు ఇతన్ని విచారణ చేస్తే మేము ఇతనిపై చేసిన ఫిర్యాదులు సత్యమని మీరే తెలుసుకుంటారు” అని చెప్పాడు.
ACT 24:9 అప్పుడు మిగిలిన యూదులు అతనితో ఏకీభవించి, ఆ ఫిర్యాదులు సత్యమే అని చెప్పారు.
ACT 24:10 అధిపతి పౌలును మాట్లాడమని సైగ చేసినప్పుడు, అతడు ఈ విధంగా సమాధాన ఇచ్చాడు: “మీరు అనేక సంవత్సరాలుగా ఈ దేశానికి న్యాయాధికారిగా ఉన్నారని నాకు తెలుసు కాబట్టి నేను సంతోషంగా నా సమాధానాన్ని తెలియజేయగలను.
ACT 24:11 నేను ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లి ఈ రోజుతో పన్నెండు రోజులే అవుతున్నాయని మీరు సులభంగా విచారించి తెలుసుకోగలరు.
ACT 24:12 దేవాలయంలో కాని సమాజమందిరంలో కాని పట్టణంలో కాని మరెక్కడైనా నేను ఎవరితోనైనా వాదించడం లేదా ప్రజలమధ్య అల్లరి రేపడం కాని నా మీద ఫిర్యాదు చేసినవారు కనుగొనలేదు.
ACT 24:13 వారు నాపై చేసిన ఫిర్యాదు నిజమని వారే నిరూపించలేరు.
ACT 24:14 ఏది ఏమైనా, మతశాఖకు చెందినదని పిలువబడుతున్న ఈ మార్గాన్ని వెంబడించేవానిగా, నేను మన పూర్వికుల దేవునినే ఆరాధిస్తున్నానని ఒప్పుకుంటాను. నేను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాల్లో వ్రాసిన ప్రకారం అన్నిటిని నమ్ముతున్నాను.
ACT 24:15 అలాగే నీతిమంతులకు దుర్మార్గులకు పునరుత్థానం ఉందని వీరికున్న నిరీక్షణనే నేను కూడా కలిగి ఉన్నాను.
ACT 24:16 కాబట్టి నా మనస్సాక్షిని దేవుడు మనిషి ముందు స్పష్టంగా ఉంచడానికి నేనెల్లప్పుడు ప్రయాసపడుతున్నాను.
ACT 24:17 “నేను అనేక సంవత్సరాల తర్వాత, నా ప్రజల్లోని పేదవారికి దానధర్మం చేసి దేవునికి అర్పణలను అర్పించడానికి యెరూషలేము పట్టణానికి వచ్చాను.
ACT 24:18 నేను దేవాలయ ఆవరణంలో శుద్ధీకరణ సంస్కారాన్ని ముగిస్తున్నప్పుడు నా మీద నిందమోపుతున్న వారు నన్ను చూశారు అక్కడ నాతో ఏ గుంపు లేదు, నా వలన ఏ అల్లరి కూడా జరుగలేదు.
ACT 24:19 అయితే ఆసియా ప్రాంతపు యూదులు కొందరు ఉన్నారు, వారికి నాపై ఏమైనా వ్యతిరేకత ఉంటే మీ దగ్గరకు వచ్చి నా మీద నేరం మోపి ఉండ వచ్చునేమో.
ACT 24:20 లేదా ఇక్కడ ఉన్నవారు నేను న్యాయసభ ముందు నిలబడినప్పుడు నాలో ఏ నేరాన్ని కనుగొన్నారో వారే చెప్పాలి.
ACT 24:21 అయితే ఆసియా ప్రాంతపు యూదుల మధ్యలో నేను ఉన్నప్పుడు, ‘నేడు మృతుల పునరుత్థానం గురించి మీ ముందు విమర్శకు గురవుతున్నాను’ అని బిగ్గరగా చెప్పినదాని బట్టి తప్ప మరి ఏ నేరమున్నదో వారే తెలియచేయాలి” అన్నాడు.
ACT 24:22 అప్పుడు, ఫెలిక్స్ ఈ మార్గం గురించి బాగా తెలిసినవాడు కాబట్టి, “లూసియ అధిపతి వచ్చినప్పుడు నేను నీ సంగతిని విచారణ చేస్తాను” అని చెప్పి విచారణ వాయిదా వేశాడు.
ACT 24:23 అతడు పౌలును కాపలాలో ఉంచి, అతని అవసరాలను తీర్చడానికి అతని స్నేహితుల్లో ఎవరిని ఆటంకపరచవద్దు అని శతాధిపతిని ఆదేశించాడు.
ACT 24:24 కొన్ని రోజుల తర్వాత ఫెలిక్స్ యూదురాలైన తన భార్య ద్రుసిల్లతో కలసి వచ్చాడు. అతడు పౌలును పిలిపించి యేసు క్రీస్తులోని విశ్వాసాన్ని గురించి అతడు బోధించిన మాటలను విన్నాడు.
ACT 24:25 పౌలు నీతి గురించి, మనస్సును అదుపులో ఉంచుకోవడం గురించి, రాబోయే తీర్పుల గురించి బోధించిన మాటలు విని ఫెలిక్స్ ఎంతో భయపడి, “ఇప్పటికి ఇది చాలు! నీవు వెళ్లు, మళ్ళీ నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నిన్ను పిలిపిస్తాను” అని చెప్పాడు.
ACT 24:26 పౌలు తనకు లంచం ఇస్తాడేమోనని ఆశించి, తరచుగా అతన్ని పిలిపిస్తూ అతనితో మాట్లాడేవాడు.
ACT 24:27 రెండు సంవత్సరాల తర్వాత, ఫెలిక్స్ స్థానంలో పోర్కియస్ ఫేస్తు అధిపతిగా నియమించబడ్డాడు. అయితే ఫెలిక్స్ యూదులకు ఉపకారం చేయాలని పౌలును చెరసాలలోనే ఉంచాడు.
ACT 25:1 ఫేస్తు వచ్చిన మూడు రోజుల తర్వాత తన పదవి బాధ్యతలను స్వీకరించడానికి కైసరయ పట్టణం నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు.
ACT 25:2 అక్కడ ముఖ్య యాజకులు యూదా నాయకులు అతన్ని కలిసి పౌలుకు వ్యతిరేకంగా తాము చేసిన ఫిర్యాదును తెలియజేశారు.
ACT 25:3 వెళ్తున్నప్పుడే మధ్యలో పౌలును చంపాలని కుట్రను పన్ని, పౌలును యెరూషలేముకు పంపించమని ఫేస్తును వేడుకొన్నారు.
ACT 25:4 అందుకు ఫేస్తు, “పౌలు కైసరయలో ఉన్నాడు, నేను త్వరలో అక్కడికి వెళ్తున్నాను.
ACT 25:5 కాబట్టి మీలో కొందరు నాయకులు నాతో రండి. అతడు ఏమైన తప్పు చేస్తే అది అతనిపై మోపవచ్చు” అని చెప్పాడు.
ACT 25:6 వారితో ఎనిమిది, పది రోజులు గడిపిన తర్వాత ఫేస్తు అధిపతి కైసరయకు వెళ్లాడు. మరుసటిరోజు అతడు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు తీసుకుని రమ్మని ఆదేశించాడు.
ACT 25:7 పౌలు లోపలికి వచ్చినప్పుడు, యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలబడ్డారు. అతని మీద అనేక తీవ్ర ఆరోపణలు చేశారు, కాని వాటిని రుజువు చేయలేకపోయారు.
ACT 25:8 అప్పుడు పౌలు సమాధానం చెప్పుతూ, “నేను యూదుల ధర్మశాస్త్రానికి గాని దేవాలయానికి గాని లేదా కైసరుకు గాని వ్యతిరేకంగా ఏ తప్పు చేయలేదు” అని చెప్పాడు.
ACT 25:9 ఫేస్తు యూదులకు అనుకూలంగా ఉండాలని భావిస్తూ పౌలుతో, “నీవు యెరూషలేముకు వచ్చి అక్కడ నా ముందు వీరు చేసిన ఫిర్యాదుల గురించిన విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నావా?” అని అడిగాడు.
ACT 25:10 అందుకు పౌలు, “నేను ఇప్పుడు కైసరు న్యాయసభలో నిలబడి ఉన్నాను, నన్ను విచారణ చేయవలసిన స్థలం ఇదే. నేను యూదుల పట్ల ఏ తప్పు చేయలేదని మీకు బాగా తెలుసు.
ACT 25:11 ఒకవేళ, నేను మరణశిక్షకు తగిన తప్పును చేస్తే, నేను మరణశిక్షను నిరాకరించను. కానీ ఈ యూదులు నాకు వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదులలో సత్యం లేనప్పుడు, నన్ను వారికి అప్పగించే అధికారం ఎవరికి లేదు. నేను కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను!” అని చెప్పాడు.
ACT 25:12 ఫేస్తు తన న్యాయసభతో కలిసి చర్చించిన అతడు, “నీవు కైసరు దగ్గర విజ్ఞప్తి చేసుకుంటానని చెప్పావు కాబట్టి నీవు కైసరు దగ్గరకే వెళ్తావు!” అని ప్రకటించాడు.
ACT 25:13 కొన్ని రోజుల తర్వాత రాజైన అగ్రిప్ప అతని భార్య బెర్నీకేతో ఫేస్తును దర్శించడానికి కైసరయకు వచ్చారు.
ACT 25:14 వారు అనేక రోజులు అక్కడ ఉన్నారు కాబట్టి ఫేస్తు పౌలు విషయాన్ని రాజుతో చర్చిస్తూ, “ఫెలిక్స్ విడిచిపెట్టిన ఒక ఖైదీ నా దగ్గర ఉన్నాడు.
ACT 25:15 నేను యెరూషలేము పట్టణానికి వెళ్లినప్పుడు, ముఖ్య యాజకులు యూదా నాయకులు అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసి అతన్ని శిక్షించమని కోరారు.
ACT 25:16 “అందుకు నేను ‘ఎవరినైనా సరే నేరం మోపిన వారిని కలుసుకొని, తమ వాదన వినిపించుకొనే అవకాశం ఇవ్వకుండా అప్పగించడం అనేది రోమీయుల ఆచారం కాదు’ అని వారితో చెప్పాను.
ACT 25:17 వారు నాతో ఇక్కడకు వచ్చినప్పుడు, నేను ఈ విషయంలో ఆలస్యం చేయకుండా, న్యాయసభను సమావేశపరిచి మరునాడే ఆ వ్యక్తిని తీసుకుని రమ్మని ఆదేశించాను.
ACT 25:18 అతని మీద ఫిర్యాదు చేసినవారు నేను ఊహించిన ఏ నేరాన్ని మోపలేదు.
ACT 25:19 దానికి బదులు అతనితో వారికున్న మతసంబంధమైన, యేసు అనే ఒక వ్యక్తి చనిపోయినా ఇంకా బ్రతికే ఉన్నాడని పౌలు చెప్తున్నాడనే కొన్ని వివాదాలను తెలియజేశారు.
ACT 25:20 ఇలాంటి విషయాలను ఏ విధంగా విచారణ చేయాలో నాకు అర్థం కాలేదు; కాబట్టి యెరూషలేము వెళ్లి అక్కడ వారి ఫిర్యాదుకు విచారణ ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నావా అని అతన్ని అడిగాను.
ACT 25:21 కానీ పౌలు తాను చక్రవర్తికి విజ్ఞప్తి చేసుకుంటానని మనవి చేసినప్పుడు, నేను అతన్ని కైసరు దగ్గరకు పంపించే వరకు అతన్ని అక్కడే ఉంచమని ఆదేశించాను” అని చెప్పాడు.
ACT 25:22 అప్పుడు అగ్రిప్ప రాజు ఫేస్తుతో, “నాకు ఆ వ్యక్తి మాటలను స్వయంగా వినాలని ఉంది” అన్నాడు. అందుకు అతడు, “రేపు మీరు వినవచ్చు” అని చెప్పాడు.
ACT 25:23 మరుసటిరోజు అగ్రిప్ప రాజు అతని భార్య బెర్నీకే గొప్ప ఆడంబరంగా, ఉన్నత సైనికాధికారులతో పట్టణ ప్రముఖులతో కలిసి ప్రేక్షకుల గది లోనికి ప్రవేశించారు. ఫేస్తు ఆజ్ఞతో పౌలును లోపలికి తీసుకుని వచ్చారు.
ACT 25:24 అప్పుడు ఫేస్తు, “అగ్రిప్ప రాజా, ఇక్కడున్న ప్రజలారా! ఈ వ్యక్తిని చూడండి, యూదా సమాజమంత ఇతనికి వ్యతిరేకంగా యెరూషలేములోను ఇక్కడ కైసరయలోను ఫిర్యాదు చేసి, ఇతడు బ్రతకడానికి అర్హుడుకాడు అని కేకలు వేస్తున్నారు.
ACT 25:25 ఇతడు మరణశిక్ష పొందేంత నేరమేమి చేయలేదని నేను గ్రహించాను, కానీ ఇతడు చక్రవర్తికి విజ్ఞప్తి చేసుకుంటాను అన్నాడు కాబట్టి ఇతన్ని రోమా దేశానికి పంపించాలని నిర్ణయించాను.
ACT 25:26 అయితే ఇతని గురించి చక్రవర్తికి వ్రాయడానికి ఖచ్చితమైన కారణాలు ఏమి కనబడలేదు. కాబట్టి ఈ విచారణ తర్వాత నేను వ్రాయడానికి నాకు కారణం లభిస్తుందని అతన్ని మీ అందరి ముందుకు, ముఖ్యంగా రాజైన అగ్రిప్ప ముందుకు తీసుకువచ్చాను.
ACT 25:27 ఒక ఖైదీ మీద మోపిన నేరాల గురించి సరియైన వివరణ లేకుండా అతన్ని రోమాకు పంపించడం సరికాదని నేను భావిస్తున్నాను” అని వారితో చెప్పాడు.
ACT 26:1 అప్పుడు అగ్రిప్ప రాజు పౌలుతో, “నీ సమాధానం చెప్పుకోడానికి నిన్ను అనుమతిస్తున్నాను” అన్నాడు. కాబట్టి పౌలు తన చేయి చాపి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు:
ACT 26:2 అగ్రిప్ప రాజా, యూదులు నా మీద వేసిన ఫిర్యాదులన్నిటికి నా సమాధానం తెలియజేయడానికి,
ACT 26:3 ఈ రోజు మీ ముందు నిలబడి ఉండడం నా భాగ్యం అని భావిస్తున్నాను, ఎందుకంటే మీరు యూదుల ఆచారాలు వివాదాల గురించి బాగా తెలిసిన వారు. కాబట్టి నా సమాధానం ఓపికతో వినాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ACT 26:4 నా సొంత ప్రాంతంలో, యెరూషలేములో నేను నా బాల్యం నుండి జీవించిన విధానం గురించి యూదులందరికి తెలుసు.
ACT 26:5 వారికి నేను చాలా కాలం నుండి పరిచయస్తుడినే కాబట్టి వారికి ఇష్టమైతే, నేను పరిసయ్యునిగా జీవిస్తూ మా మతాచారాలను ఖచ్చితంగా పాటించే వాడినని వారే సాక్ష్యం ఇవ్వగలరు.
ACT 26:6 దేవుడు మన పితరులకు ఇచ్చిన వాగ్దానం గురించి నాకున్న నిరీక్షణ బట్టి ఈ రోజు నన్ను ఈ విచారణకు నిలబెట్టారు.
ACT 26:7 మన పన్నెండు గోత్రాల ఇశ్రాయేలీయులు పగలు రాత్రి దేవుని సేవించడం ద్వారా ఆ వాగ్దాన నెరవేర్పును చూస్తామనే నిరీక్షణ కలిగి ఉన్నారు. అయితే అగ్రిప్ప రాజా, ఈ నిరీక్షణ గురించే యూదులు నన్ను నిందిస్తున్నారు.
ACT 26:8 దేవుడు చనిపోయిన వానిని సజీవంగా లేపడం నమ్మశక్యంగా లేదని మీరు ఎందుకు భావిస్తున్నారు?
ACT 26:9 “నజరేయుడైన యేసు నామాన్ని వ్యతిరేకించడానికి సాధ్యమైనవన్నీ చేయాలని నేను కూడా అనుకున్నాను.
ACT 26:10 యెరూషలేములో అలాగే చేశాను. ముఖ్య యాజకుని దగ్గర నుండి అధికారం పొందుకొని పరిశుద్ధులలో అనేకమందిని చెరసాలలో వేయించి, వారిని చంపినప్పుడు దానికి అంగీకారం తెలిపాను.
ACT 26:11 అనేకసార్లు వారిని శిక్షించడానికి ఒక సమాజమందిరం నుండి మరొక సమాజమందిరానికి వెళ్తూ, వారిని శిక్షిస్తూ దైవదూషణ చేసేలా వారిని బలవంతం చేశాను. వారిని ఇంకా హింసించాలని తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాల్లో కూడా వారిని వెంటాడాను.
ACT 26:12 “అలా చేస్తూ ఒక రోజు నేను ముఖ్య యాజకుల నుండి అధికార పత్రం తీసుకుని దమస్కు పట్టణానికి బయలుదేరాను.
ACT 26:13 అగ్రిప్ప రాజా, ఇంచుమించు మధ్యాహ్న సమయంలో, నేను దారిలో ఉన్నప్పుడు, సూర్యుని కన్న ప్రకాశమైన వెలుగు పరలోకం నుండి వచ్చి నా చుట్టూ నాతో ఉన్న వారి చుట్టూ ప్రకాశించడం నేను చూశాను.
ACT 26:14 అప్పుడు మేమందరం నేల మీద పడిపోయాం, అప్పుడు హెబ్రీ భాషలో నాతో, ‘సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? మునికోలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని ఒక స్వరం చెప్పడం విన్నాను.
ACT 26:15 “అప్పుడు ‘ప్రభువా, నీవు ఎవరు?’ అని అడిగాను. “ ‘నేను నీవు హింసిస్తున్న యేసును,
ACT 26:16 నీవు లేచి నిలబడు, ఇకమీదట నీవు నా గురించి చూసినవాటికి చూడబోయే వాటికి సాక్షిగా సేవకునిగా నిన్ను నియమించడానికే నేను నీకు ప్రత్యక్షమయ్యాను.
ACT 26:17 నేను నిన్ను నీ ప్రజల నుండి యూదేతరుల నుండి తప్పిస్తాను.
ACT 26:18 వారు చీకటి నుండి వారిని వెలుగులోనికి, సాతాను శక్తి నుండి దేవుని వైపుకు తిరిగి, పాపక్షమాపణ పొందుకొని, నా మీద ఉన్న నమ్మకంతో పరిశుద్ధపరచబడి పరిశుద్ధుల మధ్యలో వారికి ఉన్న వారసత్వాన్ని పొందుకునేలా వారి కళ్ళను తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరకు పంపిస్తున్నాను’ అని చెప్పాడు.
ACT 26:19 “కాబట్టి, అగ్రిప్ప రాజా, పరలోకం నుండి వచ్చిన దర్శనానికి నేను అవిధేయత చూపలేను.
ACT 26:20 మొదట దమస్కులో ఉన్నవారికి, తర్వాత యెరూషలేములో ఉన్నవారికి యూదయ ప్రాంతమంతటిలో ఉన్నవారందరికి, ఆ తర్వాత యూదేతరులకు పశ్చాత్తాపపడి దేవుని వైపునకు తిరగమని మారుమనస్సు పొందిన కార్యాలను చేయాలని నేను ప్రకటించాను.
ACT 26:21 అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నించారు.
ACT 26:22 అయితే ఈ రోజు వరకు దేవుడు నాకు సహాయం చేశాడు; కాబట్టి క్రీస్తు శ్రమపడి, చనిపోయినవారిలో నుండి మొదటివానిగా లేస్తాడనేది, తన సొంత ప్రజలకు, యూదేతరులకు వెలుగును ప్రచురిస్తుందని మోషే ప్రవక్తలు చెప్పినవి మించి ఏమి చెప్పకుండా ఇక్కడ నిలబడి గొప్పవారికి అల్పులకు ఒకేలా సాక్ష్యం చెప్తున్నాను” అని చెప్పాడు.
ACT 26:24 అంతలో ఫేస్తు అతని మాటలను మధ్యలో ఆపుతూ, “పౌలు! నీకు మతిభ్రమించింది. నీ గొప్ప విద్యలు నిన్ను పిచ్చి పట్టించాయి” అని గట్టిగా అరిచాడు.
ACT 26:25 అందుకు పౌలు, “ఘనత వహించిన ఫేస్తు అధిపతి, నాకు పిచ్చి పట్టలేదు. నేను చెప్పేది సత్యం సమంజసము.
ACT 26:26 ఈ సంగతులు రాజుకు తెలిసినవే కాబట్టి నేను ఆయనతో ధైర్యంగా చెప్పుకోగలను. అయినా ఈ సంగతులు ఒక మూలలో జరిగినవి కావు, కాబట్టి వీటిలో ఏది ఆయన దృష్టిలో నుండి తప్పిపోదని నేను నమ్ముతున్నాను.
ACT 26:27 అగ్రిప్ప రాజా, నీవు ప్రవక్తలను నమ్ముతున్నావా? అవునని నాకు తెలుసు” అని అన్నాడు.
ACT 26:28 అప్పుడు అగ్రిప్ప పౌలుతో, “ఇంత తక్కువ సమయంలోనే నన్ను క్రైస్తవునిగా మార్చగలనని నీవు అనుకుంటున్నావా?” అన్నాడు.
ACT 26:29 అందుకు పౌలు, “తక్కువ సమయమైనా ఎక్కువ సమయమైనా, నీవే కాదు ఈ రోజు ఈ సంకెళ్ళు తప్ప నా మాటలు వింటున్న వారందరు నాలా మారాలని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను” అని చెప్పాడు.
ACT 26:30 అగ్రిప్ప రాజు లేచాడు, అతనితో పాటు ఫేస్తు, బెర్నీకే వారితో కూర్చున్న వారందరు లేచారు.
ACT 26:31 వారు ఆ గదిని విడిచి వెళ్లిన తర్వాత వారు ఒకరితో ఒకరు, “ఇతడు మరణశిక్ష పొందడానికి గాని చెరసాలలో బంధించడానికి గాని తగిన తప్పు ఏది చేయలేదు” అని చెప్పుకొన్నారు.
ACT 26:32 అప్పుడు అగ్రిప్ప రాజు ఫేస్తు అధిపతితో, “ఇతడు కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటాను అనకపోతే విడుదల చేయబడి ఉండేవాడు” అని చెప్పాడు.
ACT 27:1 మేము ఓడ ఎక్కి ఇటలీ దేశానికి వెళ్లాలని నిర్ణయించినప్పుడు, పౌలు మరికొందరు ఖైదీలను చక్రవర్తి ఔగుస్తు సైనిక దళానికి చెందిన యూలి అనే శతాధిపతికి అప్పగించారు.
ACT 27:2 మేము అద్రముత్తియ పట్టణం నుండి ఆసియా తీరప్రాంత పట్టణాల గుండా ప్రయాణించే ఓడ ఎక్కి, ప్రయాణించేటప్పుడు మాసిదోనియలోని థెస్సలొనీక పట్టణానికి చెందిన అరిస్తర్కు అనేవాడు మాతో ఉన్నాడు.
ACT 27:3 మరుసటిరోజు మేము సీదోను పట్టణ ప్రాంతంలో దిగాం; యూలి శతాధిపతి పౌలు పట్ల దయ చూపించి, అతడు తన స్నేహితుల దగ్గరకు వెళ్లి తనకు అవసరమైన వాటిని సమకూర్చుకోవడానికి అతన్ని అనుమతించాడు.
ACT 27:4 అక్కడినుండి మేము మళ్ళీ బయలుదేరి ప్రయాణిస్తున్నప్పుడు, గాలి మాకు వ్యతిరేక దిశలో వీస్తున్నందుకు కుప్ర దీవి చాటుగా ఓడను నడిపించాము.
ACT 27:5 మేము కిలికియ పంఫులియా సముద్రతీరాలను దాటి, లుకియాలోని మూర అనే పట్టణానికి చేరుకొన్నాము.
ACT 27:6 అక్కడ ఆ శతాధిపతి ఇటలీ దేశానికి వెళ్తున్న అలెక్సంద్రియ పట్టణానికి చెందిన ఓడను చూసి దానిలోనికి మమ్మల్ని ఎక్కించాడు.
ACT 27:7 చాలా రోజులు మెల్లగా ప్రయాణించిన తర్వాత ఎంతో కష్టపడి క్నీదు పట్టణం చేరుకున్నాము. గాలి బలంగా వీస్తూ మమ్మల్ని ముందుకు పోనివ్వక పోవడంతో, సల్మోనేకు ఎదురుగా ఉన్న క్రేతు ద్వీపం చాటున మేము ప్రయాణించాము.
ACT 27:8 మేము తీరం వెంబడి చాలా కష్టపడి ప్రయాణం చేసి, లసైయ పట్టణానికి ప్రక్కనే ఉన్న, మంచి ఓడల రేవు అని పిలువబడే స్థలానికి వచ్చాము.
ACT 27:9 చాలా కాలం గడిచిపోయింది, ప్రయాణం చేయడం ఇప్పటికే ప్రమాదకరంగా మారింది, అప్పటికి ప్రాయశ్చిత్త దినం కూడా గతించింది. కాబట్టి పౌలు వారిని,
ACT 27:10 “సహోదరులారా, మన ప్రయాణం ప్రమాదకరంగా ఉండబోతుంది ఓడకు దానిలోని సరుకులకును గొప్ప నష్టంరాబోతుంది మన ప్రాణాలకు కూడా ఆపద కలుగుతుందని నాకు అనిపిస్తుంది” అని హెచ్చరించాడు.
ACT 27:11 కానీ శతాధిపతి, పౌలు చెప్పిన మాటలను వినకుండా, ఆ ఓడ యజమాని, ఓడ నడిపే వారి సలహాలను పాటించాడు.
ACT 27:12 శీతాకాలంలో ఆ ఓడరేవు అనుకూలమైనది కాదు, మనం ఫీనిక్సు ఓడరేవును చేరుకొని అక్కడ శీతాకాలం గడపవచ్చు కాబట్టి మనం ముందుకే వెళ్దాం అని ఎక్కువ మంది నిర్ణయించారు. అది క్రేతులోని నైరుతి వాయువ్య దిశలకు ఎదురుగా ఉన్న ఓడల రేవు.
ACT 27:13 దక్షిణపు గాలి మెల్లగా వీయడం మొదలు పెట్టేటప్పటికి, వారికి అవకాశం ఉన్నట్లు అనిపించింది; కాబట్టి లంగరు పైకెత్తి క్రేతు తీరం వైపు ఓడను నడిపించారు.
ACT 27:14 ఎక్కువసేపు అవ్వక ముందే, ఈశాన్యగాలి అని పిలువబడే, పెనుగాలి బలంగా వీయడంతో, ద్వీపం నుండి దూరంగా కొట్టుకొని పోయాము.
ACT 27:15 ఓడ తుఫానులో చిక్కుకొని గాలికి ఎదురు నడిపించలేక మేము గాలికి కొట్టుకుపోయాము.
ACT 27:16 కౌద అనే చిన్న ద్వీపం వైపు మేము వెళ్లినప్పుడు, చాలా కష్టంగా ఓడకు కట్టిన రక్షక పడవను కాపాడగలిగాము.
ACT 27:17 వాటిని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళను ఓడ అడుగు నుండి తీసి, రెండింటిని కలిపి గట్టిగా బిగించారు. తాము సూర్తి అనే ఇసుకదిబ్బలను గుద్దుకొంటామేమో అని భయపడి, ఓడ లంగరును క్రిందికి దించి, గాలితో ఓడ కొట్టుకొని పోయేలా చేశారు.
ACT 27:18 తుఫాను గాలి భయంకరంగా కొడుతుంది కాబట్టి మరుసటిరోజు ఓడలోని సరుకులను సముద్రంలో పడవేయడం మొదలుపెట్టారు.
ACT 27:19 మూడవ రోజు, వారు తమ చేతులతో ఓడను నడిపే సామాగ్రిని కూడా పడవేశారు.
ACT 27:20 అనేక రోజులగా సూర్యుడు కాని నక్షత్రాలు కాని కనిపించలేదు. తుఫాను మరింత తీవ్రంగా మారింది. చివరికి మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా పోయింది.
ACT 27:21 వారు ఆ విధంగా ఆహారం లేకుండా చాలా రోజులు గడిపిన తర్వాత, పౌలు వారి ముందు నిలబడి వారితో, “సహోదరులారా, నేను ఇచ్చిన సలహాను మీరు విని క్రేతు నుండి బయలుదేరకుండా ఉండవలసింది; అప్పుడు మీకు ఈ ప్రమాదం గాని నష్టం కాని జరుగకపోయేది.
ACT 27:22 ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీలో ఎవరికి ప్రాణహాని కలుగదు; కేవలం ఓడ మాత్రమే పాడైపోతుంది.
ACT 27:23 నేను ఎవరికి చెందిన వాడినో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి,
ACT 27:24 ‘పౌలు భయపడకు. నీవు కైసరు ముందు విచారణకు నిలబడవలసి ఉంది. నీతో కూడ ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరి జీవితాలను దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు.
ACT 27:25 అతడు నాకు చెప్పినట్లే జరుగుతుందని నాకు దేవునిలో విశ్వాసం ఉంది, కాబట్టి సహోదరులారా, మీరు ధైర్యం తెచ్చుకోండి.
ACT 27:26 అయినప్పటికీ, మన ఓడ ఏదైనా ఒక ద్వీపం తగులుకోవాలి” అని చెప్పాడు.
ACT 27:27 పద్నాలుగవ రోజు రాత్రి మేము ఇంకా అద్రియా సముద్రంలో కొట్టుకొనిపోతుండగా, ఇంచుమించు అర్థరాత్రి సమయంలో ఓడను నడిపేవారు ఒడ్డును సమీపిస్తున్నాం అని గ్రహించారు.
ACT 27:28 వారు ఇనుప గుండు కట్టిన తాడు సముద్రంలో వేసి చూసి దానితో అక్కడ సుమారు నూట ఇరవై అడుగుల లోతుందని తెలుసుకున్నారు. మరికొద్ది సేపటికి సముద్రపు లోతును కనుగొనే దానిని మరలా వేసి తొంభై అడుగుల లోతుందని తెలుసుకొన్నారు.
ACT 27:29 మేము రాతి దిబ్బలకు గుద్దుకొంటామేమో అనే భయంతో వారు నాలుగు లంగరులను ఓడ మూలలో నుండి క్రిందకు వేసి, పగటి వెలుగు కోసం ప్రార్థించాము.
ACT 27:30 ఓడ నడిపేవారు ఓడలో నుండి పారిపోవాలని, తాము ఓడ ముందు భాగం నుండి కొన్ని లంగరులను పడవేయడానికి వెళ్తున్నట్లు నటిస్తూ రక్షక పడవను సముద్రంలోకి దింపారు.
ACT 27:31 అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ మనుష్యులు ఓడలో ఉంటేనే తప్ప తమ ప్రాణాలను రక్షించుకోలేరు” అని చెప్పాడు.
ACT 27:32 వెంటనే సైనికులు రక్షకపడవ దూరంగా కొట్టుకొని పోవడానికి దాని త్రాళ్లను కోసివేశారు.
ACT 27:33 తెల్లవారుతునప్పుడు పౌలు వారందరిని ఆహారం తినమని వేడుకున్నాడు. “గత పద్నాలుగు రోజులనుండి ఏమి జరుగుతుందో అని మీరు ఏమి తినలేదు.
ACT 27:34 మీరు బలహీనం కాకుండా దయచేసి భోజనం చేయండి, మీలో ఎవరి తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు” అని వారిని బ్రతిమాలాడు.
ACT 27:35 అతడు ఈ మాటలను చెప్పిన తర్వాత, రొట్టెను తీసుకుని వారందరి ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి తినడం ప్రారంభించాడు.
ACT 27:36 అప్పుడు వారందరు ధైర్యం తెచ్చుకుని కొంత ఆహారం తిన్నారు.
ACT 27:37 ఓడలో మొత్తం 276 మంది వ్యక్తులం ఉన్నాము.
ACT 27:38 వారు తమకు కావలసినంత ఆహారం తిన్న తర్వాత, ఓడను తేలిక చేయడానికి ధాన్యాన్ని సముద్రంలో పడవేశారు.
ACT 27:39 పగటి వెలుగు వచ్చినప్పుడు, వారు ఆ ప్రాంతాన్ని గుర్తించలేదు, కాని ఇసుకతీరం ఉన్న సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే దానిలోనికి ఓడను నడిపించాలి అనుకున్నారు.
ACT 27:40 త్రాళ్లను కోసి లంగరులను సముద్రంలో విడిచిపెట్టారు అదే సమయంలో చుక్కానులకు కట్టిన త్రాళ్లను విప్పేసారు. తర్వాత తెరచాపలను గాలికి ఎత్తి తీరం వైపునకు నడిపించారు.
ACT 27:41 కాని రెండు ప్రవాహాలు కలిసిన చోట ఇసుకలో ఓడ ముందు భాగం కూరుకొనిపోయి కదల్లేదు. అలల తాకిడికి ఓడ వెనుక భాగం ముక్కలుగా విరిగి పోసాగింది.
ACT 27:42 ఖైదీలు ఈదుకుని పారిపోకుండా వారిని చంపేయాలని సైనికులు అనుకున్నారు.
ACT 27:43 కానీ శతాధిపతి పౌలు ప్రాణాన్ని కాపాడాలనుకొని సైనికులను తాము అనుకున్న దానిని చేయకుండా ఆపివేసి, ఈత వచ్చినవారు మొదట సముద్రంలోకి దూకి ఒడ్డుకు చేరుకోవాలని,
ACT 27:44 మిగిలిన వారు చెక్కపలకల మీద లేదా ఓడ చెక్కల మీద ఒడ్డుకు చేరుకోవాలని ఆదేశించాడు. ఆ విధంగా వారందరు క్షేమంగా ఒడ్డుకు చేరుకొన్నారు.
ACT 28:1 మేము క్షేమంగా ఒడ్డు చేరుకొన్న తర్వాత, ఆ ద్వీపం పేరు మాల్తే అని తెలుసుకున్నాము.
ACT 28:2 ఆ ద్వీపవాసులు మా పట్ల ఎంతో దయ చూపించారు. అప్పుడు వర్షం పడుతూ చలిగా ఉండడంతో వారు మంట వెలిగించి మా అందరిని చేర్చుకున్నారు.
ACT 28:3 పౌలు కొన్ని కట్టెలు ఏరి మంటలో పెడుతున్నప్పుడు, ఆ మంట వేడికి ఒక పాము బయటకు వచ్చి, అతని చేతిని పట్టుకుంది.
ACT 28:4 పాము అతని చేతికి వేలాడడం చూసిన ఆ ద్వీపవాసులు తమలో తాము, “ఈ వ్యక్తి ఖచ్చితంగా హంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నా, న్యాయదేవత ఇతన్ని బ్రతకనివ్వడం లేదు” అని చెప్పుకొన్నారు.
ACT 28:5 అయితే పౌలు తన చేతిని విదిలించి ఆ పామును మంటలో వేశాడు దానివల్ల అతనికి ఎలాంటి హాని కలుగలేదు.
ACT 28:6 ప్రజలు అతని శరీరం వాపు వస్తుందని లేదా అకస్మాత్తుగా మరణిస్తాడని అనుకున్నారు; కానీ చాలాసేపు చూసిన తర్వాత కూడా అతనికి ఏ ప్రమాదం జరుగకపోవడం చూసి, తమ మనస్సులను మార్చుకొని, ఇతడు ఒక దేవున్ని చెప్పసాగారు.
ACT 28:7 పొప్లి అనేవాడు ఆ ద్వీపానికి ముఖ్యుడు, ఆ ప్రాంతంలో అతనికి భూములు ఉన్నాయి. అతడు మమ్మల్ని తన ఇంటికి ఆహ్వానించి మూడు రోజులు మంచి ఆతిథ్యం ఇచ్చాడు.
ACT 28:8 ఆ సమయంలో పొప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాలతో బాధపడుతూ అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నాడు. పౌలు అతన్ని చూడడానికి వెళ్లి, ప్రార్థన చేసిన తర్వాత తన చేతులను అతని మీద ఉంచి స్వస్థపరిచాడు.
ACT 28:9 ఇది జరిగినప్పుడు, ఆ ద్వీపంలోని మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందుకున్నారు.
ACT 28:10 వారు అనేక సత్కారాలతో మాకు మర్యాద చేశారు; మేము ఓడలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మాకు కావలసిన వస్తువులన్నిటిని తెచ్చి ఓడలో ఉంచారు.
ACT 28:11 మేము మూడు నెలలు ద్వీపంలో శీతాకాలం గడిపిన తర్వాత కాస్టర్, పోలుక్స్ అనే కవల దేవతల చిహ్నం కలిగిన అలెక్సంద్రియ పట్టణానికి వెళ్లే ఓడ ఎక్కి బయలుదేరాము.
ACT 28:12 మేము సురకూసై పట్టణానికి వచ్చి అక్కడ మూడు రోజులు ఉన్నాము.
ACT 28:13 అక్కడినుండి ఓడలో బయలుదేరి రేగియు అనే పట్టణానికి వచ్చాము, మరుసటిరోజు దక్షిణపు గాలి విసరడంతో పొతియొలీ పట్టణానికి చేరుకొన్నాము.
ACT 28:14 అక్కడ కలిసిన కొందరు సహోదర సహోదరీలు తమతో ఒక వారం రోజులు ఉండమని మమ్మల్ని వేడుకున్నారు. ఆ విధంగా మేము రోమా పట్టణానికి చేరుకున్నాము.
ACT 28:15 మేము వస్తున్నామని విన్న సహోదర సహోదరీలు అప్పియా సంతపేట మూడు సత్రాలపేట వరకు మమ్మల్ని కలుసుకోడానికి బయలుదేరి వచ్చారు. పౌలు వారందరిని చూసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు.
ACT 28:16 మేము రోమా పట్టణానికి వచ్చినప్పుడు, పౌలు తనకు కాపలాగా ఉన్న ఒక సైనికునితో పాటు తనంతట తాను జీవించడానికి అనుమతి పొందాడు.
ACT 28:17 మూడు రోజుల తర్వాత పౌలు అక్కడి యూదా నాయకులను పిలిచి, వారు ఒక్కచోట చేరినప్పుడు వారితో, “నా సహోదరులారా, నేను మన ప్రజలకు, మన పూర్వికుల ఆచారాలకు వ్యతిరేకంగా ఏమి చేయకపోయినా, నన్ను యెరూషలేములో బంధించి రోమీయులకు అప్పగించారు.
ACT 28:18 వారు నన్ను విచారణ చేసి మరణశిక్ష విధించవలసినంత తప్పు నేను చేయలేదని నన్ను విడిచిపెట్టాలని అనుకున్నారు.
ACT 28:19 కానీ యూదులు అడ్డుచెప్పడంతో నేను కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటానని మనవి చేశాను. నా సొంత ప్రజలకు వ్యతిరేకంగా నేను ఏ ఫిర్యాదు చేయదలచుకోలేదు.
ACT 28:20 ఈ కారణంగానే నేను మిమ్మల్ని చూసి మీతో మాట్లాడాలని మిమ్మల్ని పిలిపించాను. ఇశ్రాయేలీయుల యొక్క నిరీక్షణను బట్టి నేను ఈ గొలుసుతో బంధించబడి ఉన్నాను” అని వారితో చెప్పాడు.
ACT 28:21 అందుకు వారు, “నీ గురించి యూదయ నుండి ఎటువంటి ఉత్తరాలు మాకు రాలేదు. అక్కడినుండి వచ్చిన మన ప్రజల్లో ఎవరు నీ గురించి చెడుగా మాతో చెప్పలేదు.
ACT 28:22 కానీ ప్రతిచోట ప్రజలు ఈ మతమార్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు, కాబట్టి దీని గురించి నీ అభిప్రాయం మేము వినాలనుకొంటున్నాం” అన్నారు.
ACT 28:23 ఒక రోజును ఏర్పాటు చేసుకుని, పౌలు ఉన్న చోటికి చాలామంది వచ్చారు. అతడు ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని రాజ్యం గురించి వివరిస్తూ సాక్ష్యమిచ్చి, మోషే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తలు వ్రాసిన పుస్తకాల నుండి యేసు గురించి బోధిస్తూ వారిని ఒప్పించడానికి ప్రయత్నించాడు.
ACT 28:24 అతడు చెప్పిన సంగతులను కొందరు నమ్మారు, మరికొందరు నమ్మలేదు.
ACT 28:25 పౌలు వారితో చివరిగా చెప్పిన మాటలు ఇవి: “యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో పరిశుద్ధాత్మ మాట్లాడినది నిజమే:
ACT 28:26 “ ‘ఈ ప్రజల దగ్గరకు వెళ్లి చెప్పు, “మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని అర్థం చేసుకోరు; ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు.”
ACT 28:27 ఎందుకంటే ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి; వారు చెవులతో వినరు, వారు కళ్లు మూసుకున్నారు. లేకపోతే వారు తమ కళ్లతో చూసి, చెవులతో విని, తమ హృదయాలతో గ్రహించి, నా వైపుకు తిరుగుతారు, అప్పుడు నేను వారిని స్వస్థపరుస్తాను.’
ACT 28:28 “అందుకే దేవుని రక్షణ యూదేతరుల దగ్గరకు పంపబడినది, వారు దాన్ని వింటారని మీరు తెలుసుకోవాలి.”
ACT 28:29 పౌలు ఈ మాటలను చెప్పిన తర్వాత యూదులు తమలో తాము తీవ్రంగా వాదించుకుంటూ అక్కడినుండి వెళ్లిపోయారు.
ACT 28:30 పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో ఉంటూ తనను చూడాలని వచ్చిన వారందరిని స్వాగతించాడు.
ACT 28:31 అతడు పూర్ణధైర్యంతో ఏ ఆటంకం లేకుండా దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తు గురించి బోధించాడు.
ROM 1:1 అపొస్తలునిగా ఉండడానికి పిలువబడి దేవుని సువార్త కోసం ప్రత్యేకపరచబడిన పౌలు అనే నేను క్రీస్తు యేసు దాసుడను.
ROM 1:2 ఈ సువార్త ఏమంటే దేవుడు తన కుమారుని గురించి పరిశుద్ధ లేఖనాల్లో ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశారు.
ROM 1:3 ఆయన కుమారుని విషయానికి వస్తే, శరీరానుసారంగా ఆయన దావీదు సంతానానికి చెందినవారు.
ROM 1:4 ఆయన పునరుత్థానం ద్వారా పరిశుద్ధమైన ఆత్మను బట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారునిగా అధికారంతో నిరూపించబడ్డారు.
ROM 1:5 సమస్త ప్రజలందరిని ఆయన నామం కోసం విశ్వాసం నుండి వచ్చే విధేయతలోకి పిలువడానికి ఆయన ద్వారా మేము కృపను అపొస్తలత్వాన్ని పొందాము.
ROM 1:6 యేసు క్రీస్తుకు చెందినవారిగా ఉండడానికి పిలువబడిన ఆ ప్రజలతో పాటు మీరు కూడా ఉన్నారు.
ROM 1:7 రోమాలో ఉన్న దేవునిచే ప్రేమించబడుతున్న వారికి ఆయన పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి పిలువబడిన వారందరికి పౌలు వ్రాయునది:
ROM 1:8 మీ విశ్వాసం గురించి లోకమంతా చాటించబడుతూ ఉంది అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
ROM 1:9 నేను నిరంతరం నా ప్రార్థనలలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను అనడానికి, తన కుమారుని గురించిన సువార్తను ప్రకటిస్తూ నా ఆత్మలో నేను సేవిస్తున్న ఆ దేవుడే సాక్షి.
ROM 1:10 దేవుని చిత్తమైతే నేను మీ దగ్గరకు రావడానికి కనీసం ఇప్పటికైనా నాకు అవకాశం రావాలని ప్రార్థిస్తున్నాను.
ROM 1:11 మిమ్మల్ని బలపరచడానికి, ఆధ్యాత్మిక వరం ఏదైనా మీకు అందించడానికి మిమ్మల్ని చూడాలని నేను ఆరాటపడుతున్నాను.
ROM 1:12 తద్వారా, మీరు నేను పరస్పరం ఒకరి విశ్వాసం ద్వారా ఒకరం ప్రోత్సాహించబడతాము.
ROM 1:13 సహోదరీ సహోదరులారా, యూదేతరుల మధ్యలో నేను ఫలం పొందినట్లు మీ మధ్యలో కూడా ఫలం పొందాలని మీ దగ్గరకు రావడానికి చాలాసార్లు ప్రయత్నించాను గాని ఇప్పటివరకు నాకు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఇది మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు.
ROM 1:14 గ్రీసు దేశస్థులు, గ్రీసు దేశస్థులు కాని వారు, జ్ఞానులు అజ్ఞానుల పట్ల నేను బాధ్యత కలిగి ఉన్నాను.
ROM 1:15 అందువల్ల, రోమాలో ఉన్న మీకు కూడా సువార్తను ప్రకటించాలని నేను చాలా ఆసక్తితో ఉన్నాను.
ROM 1:16 సువార్త గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే నమ్మిన ప్రతివారికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు రక్షణ కలుగజేయడానికి సువార్త దేవుని శక్తి.
ROM 1:17 “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు” అని వ్రాయబడి ఉన్న ప్రకారం, విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా సువార్తలో దేవుని నీతి వెల్లడి చేయబడింది.
ROM 1:18 ప్రజలు తమ దుష్టత్వం చేత సత్యాన్ని అణచివేస్తున్నారు, కాబట్టి వారిలో ఉన్న భక్తిహీనత, దుష్టత్వమంతటి మీదకు దేవుని ఉగ్రత పరలోకం నుండి వెల్లడి చేయబడుతుంది.
ROM 1:19 దేవుడే వారికి తెలియజేశారు కాబట్టి దేవుని గురించి తెలుసుకోవలసిన సంగతులు వారికి స్పష్టంగా ఉన్నాయి.
ROM 1:20 లోకం సృష్టింపబడినప్పటి నుండి, చేయబడిన ప్రతీదాని ద్వారా దేవుని అదృశ్యలక్షణాలైన శాశ్వతమైన శక్తి దైవిక స్వభావం స్పష్టంగా కనిపించాయి. కాబట్టి దేవున్ని తెలుసుకోలేకపోడానికి ప్రజలకు ఏ సాకు లేదు.
ROM 1:21 వారు దేవున్ని ఎరిగినప్పటికీ, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదు, కాని వారి ఆలోచనలు వ్యర్థమయ్యాయి వారి మూర్ఖపు హృదయాలు చీకటిమయం అయ్యాయి.
ROM 1:22 వారు జ్ఞానులమని చెప్పుకున్నప్పటికీ మూర్ఖులుగా మారారు.
ROM 1:23 వారు నిత్యుడైన దేవుని మహిమను నాశనమయ్యే మనుష్యులు, పక్షులు, జంతువులు, ప్రాకే ప్రాణుల రూపాలలో తయారుచేసిన విగ్రహాలకు ఆపాదించారు.
ROM 1:24 కాబట్టి వారి హృదయాల్లో ఉన్న పాపపు కోరికలను బట్టి వారు ఒకరితో ఒకరు తమ శరీరాలను అవమానపరచుకోడానికి దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించారు.
ROM 1:25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చి, సృష్టికర్తకు బదులుగా ఆయన సృష్టించిన వాటిని పూజించి సేవించారు. అయితే ఆయన ఎల్లప్పుడు స్తోత్రార్హుడు. ఆమేన్.
ROM 1:26 అందువల్ల, దేవుడు వారిని అవమానకరమైన వ్యామోహాలకు అప్పగించారు. వారి స్త్రీలు కూడా సహజమైన లైంగిక సంబంధాలకు బదులు అసహజమైన లైంగిక సంబంధాలను ఏర్పరచుకున్నారు.
ROM 1:27 అలాగే పురుషులు కూడా స్త్రీతో ఉండాల్సిన సహజ సంబంధాన్ని వదిలేసి, కామాగ్నితో రగిలిపోతూ పురుషులతో పురుషులు సంబంధాలు పెట్టుకున్నారు. పురుషులు పురుషులతో కలిసి అవమానకరమైన పనులు చేసే తమ తప్పులకు తగిన శిక్షను పొందారు.
ROM 1:28 అంతేగాక, వారు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండడం విలువైనదిగా భావించలేదు, కాబట్టి వారు చేయరాని పనులు చేసేటట్లు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించారు.
ROM 1:29 వారు ప్రతి విధమైన దుర్మార్గంతో, చెడుతనంతో, దురాశలతో, దుర్నీతితో నిండి ఉన్నారు. వారు అసూయ కలిగినవారిగా హత్యలు చేసేవారిగా, కొట్లాటలను మోసాన్ని ఓర్వలేనితనాన్ని కలిగి ఉన్నారు. వారు వదరుబోతులు,
ROM 1:30 నిందలు వేసేవారు, దైవ ద్వేషులు, గర్విష్ఠులు, దురహంకారులు, గొప్పలు చెప్పుకునేవారు; వారు చెడు చేయడానికి మార్గాలను కనిపెడతారు; వారు తమ తల్లిదండ్రులకు అవిధేయులు;
ROM 1:31 వారికి ఏ తెలివిలేదు, నమ్మకత్వం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు.
ROM 1:32 ఇలాంటి పనులు చేసినవారు మరణానికి పాత్రులవుతారు అనే దేవుని నీతిశాసనం గురించి తెలిసి కూడా వారు అవే పనులు చేయడమే కాక వాటిని చేస్తున్నవారిని కూడా అంగీకరించారు.
ROM 2:1 ఇతరులకు తీర్పు తీర్చే వారెవరైనా సరే తప్పించుకునే అవకాశం లేదు. మీరు ఏ విషయంలో ఇతరులకు తీర్పు తీరుస్తున్నారో ఆ విషయంలో మీకు మీరే తీర్పు తీర్చుకుంటున్నారు, ఎందుకంటే తీర్పు తీరుస్తున్న మీరు కూడా అవే పనులు చేస్తున్నారు.
ROM 2:2 అలాంటి కార్యాలు చేసేవారి పట్ల సత్యాన్ని అనుసరించి దేవుని తీర్పు ఉంటుందని మనకు తెలుసు.
ROM 2:3 కాబట్టి అలాంటివి చేసేవారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తూ ఉన్న సాధారణ మనుష్యులైన మీరు దేవుని తీర్పును తప్పించుకోగలరని అనుకుంటున్నారా?
ROM 2:4 దేవుని దయ మిమ్మల్ని పశ్చాత్తాపం వైపు నడిపిస్తుందని తెలియక ఆయన దయ, సహనం, ఓర్పు అనే ఐశ్వర్యాన్ని త్రోసివేస్తారా?
ROM 2:5 అయితే మీ మొండితనం, పశ్చాత్తాపంలేని హృదయాన్నిబట్టి దేవుని న్యాయమైన తీర్పు తీర్చబడే దేవుని ఉగ్రత దినాన దేవుని ఉగ్రతను మీకు మీరే పోగు చేసుకుంటున్నారు.
ROM 2:6 దేవుడు “వారందరికి వారు చేసిన కార్యాలను బట్టి ప్రతిఫలమిస్తారు.”
ROM 2:7 పట్టువదలకుండా మంచిని చేస్తూ మహిమ, ఘనత, నిత్యత్వాన్ని వెదికేవారికి ఆయన నిత్యజీవాన్ని ఇస్తారు.
ROM 2:8 కానీ స్వలాభాన్ని చూసుకుంటూ సత్యాన్ని తిరస్కరించి చెడ్డపనులను చేసేవారి మీదికి దేవుని కోపం, ఉగ్రత వస్తుంది.
ROM 2:9 చెడు చేసే ప్రతీ వ్యక్తికి అనగా మొదట యూదులకు, తర్వాత యూదేతరులకు ఇబ్బంది, బాధ ఉంటుంది;
ROM 2:10 అయితే మంచి పనులు చేసే వారందరికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు మహిమ, ఘనత, సమాధానాలు కలుగుతాయి.
ROM 2:11 ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపించరు.
ROM 2:12 ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారందరు ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తారు. ధర్మశాస్త్రం క్రింద ఉండి పాపం చేసేవారు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పుపొందుతారు.
ROM 2:13 ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని వినేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు కాని దానికి లోబడేవారే నీతిమంతులుగా ప్రకటించబడతారు.
ROM 2:14 ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వతహాగా ధర్మశాస్త్రానికి సంబంధించిన పనులు చేస్తే, వారు ధర్మశాస్త్రం లేనివారైనప్పటికీ, తమకు తామే ధర్మశాస్త్రంగా ఉన్నారు.
ROM 2:15 ధర్మశాస్త్ర సారం తమ హృదయాల మీద రాసి ఉన్నట్లుగా వారు చూపిస్తారు. అలాంటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తుంది. వారి ఆలోచనలు కొన్ని సమయాల్లో వారిని నిందిస్తాయి మరికొన్ని సమయాల్లో వారిని కాపాడతాయి.
ROM 2:16 నా సువార్తలో చెప్పిన ప్రకారం, దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను తీర్పు తీర్చే దినాన ఇలా జరుగుతుంది.
ROM 2:17 ఒకవేళ మిమ్మల్ని మీరు యూదులుగా పిలుచుకుంటూ, మీరు ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవునిలో అతిశయిస్తున్నట్లయితే;
ROM 2:18 మీరు ఆయన చిత్తాన్ని తెలుసుకొని, ఉన్నతమైనదాన్ని ఆమోదిస్తే, మీరు ధర్మశాస్త్రం యొక్క ఉపదేశం వల్లనే.
ROM 2:19 మీరు గ్రుడ్డివారికి మార్గదర్శి అని, చీకటిలో ఉన్నవారికి వెలుగు అని మీకు నమ్మకం ఉంటే,
ROM 2:20 చీకటిలో ఉన్నవారికి వెలుగు అని, మూర్ఖులకు బోధకులు అని, చిన్న పిల్లలకు గురువులు అని మీకు మీరు అనుకుంటే, ఎందుకంటే ధర్మశాస్త్రంలో జ్ఞానం సత్యం మిళితమై ఉన్నాయి
ROM 2:21 అలాంటప్పుడు ఇతరులకు బోధించే మీరు, మీకు మీరు బోధించుకోరా? దొంగతనం చేయవద్దని ప్రకటిస్తున్న మీరే దొంగతనం చేస్తారా?
ROM 2:22 వ్యభిచరించవద్దు అని ప్రజలకు చెప్పే మీరే వ్యభిచరిస్తారా? విగ్రహాలను అసహ్యించుకునే మీరే గుళ్లను దోచుకుంటారా?
ROM 2:23 ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించే మీరే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ దేవున్ని అవమానిస్తారా?
ROM 2:24 “నిన్ను బట్టే దేవుని నామం యూదేతరుల మధ్య దూషించబడుతుంది” అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది.
ROM 2:25 మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే సున్నతికి విలువ ఉంటుంది గాని మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, మీరు సున్నతి చేయబడని వారుగా అయ్యారు.
ROM 2:26 అలా అని సున్నతి పొందనివారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే, వారు సున్నతి చేయబడినవారిగా ఎంచబడరా?
ROM 2:27 శారీరకంగా సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నవారు, ధర్మశాస్త్రాన్ని సున్నతిని కలిగి ఉన్నప్పటికీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవిస్తున్న మీకు తీర్పు తీరుస్తారు.
ROM 2:28 పైకి మాత్రమే యూదులైనవారు నిజంగా యూదులు కారు; శరీరంలో బాహ్యంగా పొందిన సున్నతి నిజంగా సున్నతి కాదు.
ROM 2:29 అయితే అంతరంగంలో కూడా యూదులుగా ఉన్నవారే యూదులు. ఆత్మ వలన హృదయం పొందే సున్నతియే సున్నతి అవుతుంది కాని వ్రాయబడిన నియమాల ప్రకారం పొందింది కాదు. అలాంటి వారికి ఘనత మనుష్యుల నుండి కాదు గాని దేవుని నుండే కలుగుతుంది.
ROM 3:1 అయితే యూదునిగా ఉండడం వల్ల ప్రయోజనమేమిటి? సున్నతిలో ఉన్న విలువేమిటి?
ROM 3:2 ప్రతీ విషయంలోను ఎక్కువే! మొదటిగా, దేవుని మాటలు యూదులకు అప్పగించబడ్డాయి.
ROM 3:3 వారిలో కొందరు అవిశ్వాసంగా ఉన్నంత మాత్రాన వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా?
ROM 3:4 ఎన్నటికి కాదు; ప్రతి ఒక్క మనిషి అబద్ధికుడు కావచ్చు కాని దేవుడు సత్యవంతుడు. దేవుని గురించి లేఖనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, “మాట్లాడినప్పుడు నీవు నీతిమంతుడవని నిరూపించబడతావు తీర్పు తీర్చునప్పుడు నీవు జయిస్తావు.”
ROM 3:5 అయితే మన దుర్మార్గాన్ని బట్టి దేవుడు నీతిమంతుడని మరింత స్పష్టమవుతుంటే, మనమేమి చెప్పగలం? దేవుడు తన ఉగ్రతను మనమీద చూపితే ఆయన అన్యాయస్థులు అవుతారా? నేను మానవరీతిగా మాట్లాడుతున్నాను.
ROM 3:6 ఖచ్చితంగా కాదు! ఒకవేళ అలా అయితే, దేవుడు లోకానికి ఎలా తీర్పు తీర్చగలరు?
ROM 3:7 అయితే కొందరు, “ఒకవేళ నా అబద్ధం వలన దేవుని సత్యం వ్యాపించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపిగా ఎందుకు తీర్పు తీర్చబడాలి?” అని వాదిస్తారు.
ROM 3:8 “మంచి జరగడానికి చెడు చేద్దాం” అని మేము చెప్తున్నామని కొందరు దూషిస్తున్నట్లుగా మేమెందుకు చెప్పకూడదు? అలాంటి వారికి వచ్చే శిక్ష న్యాయమైనదే!
ROM 3:9 అప్పుడు మనం ఏమని నిర్ధారించాలి? మనకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత మాత్రం లేదు! యూదులు, యూదేతరులు ఒకేలా పాప బంధకాలలో ఉన్నారని మేము ముందుగానే చెప్పాము.
ROM 3:10 దీని గురించి లేఖనాల్లో ఈ విధంగా, “నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరు కూడా లేరు;
ROM 3:11 గ్రహించగలినవారు ఒక్కరు కూడా లేరు; దేవుని వెదకేవారు ఒక్కరు కూడా లేరు.
ROM 3:12 అందరు దారి తప్పి చెడిపోయారు, వారందరు కలిసి అప్రయోజకులయ్యారు; మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు, ఒక్కరు కూడా లేరు.”
ROM 3:13 “వారి గొంతుకలు తెరచిన సమాధుల్లా ఉన్నాయి; వారు నాలుకలతో మోసం చేస్తారు.” “వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది.”
ROM 3:14 “వారి నోటి నిండా శాపాలు, పగ ఉన్నాయి.”
ROM 3:15 “వారి పాదాలు రక్తాన్ని చిందించడానికి త్వరపడుతున్నాయి;
ROM 3:16 వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి,
ROM 3:17 సమాధాన మార్గం వారికి తెలియదు.”
ROM 3:18 “వారి కళ్లలో దేవుని భయం లేదు.”
ROM 3:19 ప్రతి నోరు మౌనంగా ఉండేలా, లోకమంతా దేవునికి లెక్క అప్పగించేలా ధర్మశాస్త్రం చెప్పేవన్నీ ధర్మశాస్త్రానికి లోబడేవారికి చెప్తుందని మనం తెలుసు.
ROM 3:20 కాబట్టి ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవరూ దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్పు తీర్చబడరు, కాని ధర్మశాస్త్రం ద్వారా మన పాపాల గురించి మనం తెలుసుకుంటాము.
ROM 3:21 అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం లేకుండానే దేవుని నీతి తెలియజేయబడుతుంది. దానిని గురించి ధర్మశాస్త్రం, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు.
ROM 3:22 యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారా నమ్మిన వారందరికి ఈ నీతి ఇవ్వబడుతుంది. యూదులకు యూదేతరులకు మధ్య ఏ భేదం లేదు.
ROM 3:23 అందరు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు.
ROM 3:24 కాబట్టి విశ్వసించిన వారందరు ఆయన కృప చేత యేసు క్రీస్తు నుండి వచ్చిన విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు.
ROM 3:25 క్రీస్తు రక్తాన్ని చిందించడం ద్వారా దేవుడు ఆయనను ప్రాయశ్చిత్త బలిగా సమర్పించారు; విశ్వాసం ద్వారా దానిని పొందుకోవాలి. ఆయన తన నీతిని చూపించడానికి ఇలా చేశారు, ఎందుకంటే ఆయన సహనంతో పూర్వం చేసిన పాపాలను శిక్ష విధించకుండా వదిలేశారు.
ROM 3:26 ఆయన ఈ ప్రస్తుత కాలంలో తన నీతిని కనుపరచడానికి, ఆయన నీతిమంతుడై ఉండి యేసులో విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చేవానిగా ఉండడానికి ఇలా చేశారు.
ROM 3:27 అయితే అతిశయించడానికి కారణం ఎక్కడ? అది రద్దు చేయబడింది. ఏ నియమాన్ని బట్టి? క్రియల నియమాన్ని బట్టియా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టియే.
ROM 3:28 కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాకుండా విశ్వాసం ద్వారానే ఒకరు నీతిమంతునిగా తీర్చబడతారని మనం నిశ్చయించుకున్నాము.
ROM 3:29 దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడా? యూదేతరులకు ఆయన దేవుడు కాడా? అవును, ఆయన యూదేతరులకు కూడా దేవుడే.
ROM 3:30 దేవుడు ఒక్కడే కాబట్టి సున్నతి పొందినవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేనివారిని కూడా అదే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చుతారు.
ROM 3:31 అయితే ఈ విశ్వాసం బట్టి మనం ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నామా? ఎన్నటికి కాదు! మనం ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.
ROM 4:1 అయితే శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాము ఈ విషయంలో ఏమి తెలుసుకున్నాడని మనం అనవచ్చు?
ROM 4:2 ఒకవేళ, నిజంగానే, అబ్రాహాము క్రియలమూలంగా నీతిమంతునిగా ఎంచబడి ఉంటే అతడు అతిశయించడానికి కారణం ఉండేది కాని దేవుని ఎదుట కాదు.
ROM 4:3 లేఖనాలు ఏమి చెప్తున్నాయి? “అబ్రాహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది” అనే కదా!
ROM 4:4 పని చేసేవారికి ఇచ్చే జీతం ఒక బాధ్యతే కాని ఉచితంగా ఇచ్చే బహుమానం కాదు.
ROM 4:5 అయితే, ఒకరు పని చేయకుండా, భక్తిహీనున్ని కూడా నీతిమంతునిగా తీర్చగల దేవునిపై నమ్మకముంచితే వారి విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది.
ROM 4:6 క్రియలు లేకుండానే ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతారో వారు దీవించబడినవారని దావీదు కూడా చెప్తున్నాడు.
ROM 4:7 “తమ అతిక్రమాలు క్షమించబడినవారు, తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.
ROM 4:8 ప్రభువుచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు ధన్యులు.”
ROM 4:9 ఈ ఆశీర్వాదం కేవలం సున్నతి పొందినవారికి మాత్రమేనా లేదా సున్నతి పొందని వారికి కూడా వర్తిస్తుందా? అబ్రాహాము విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడిందని మనం చెప్తున్నాం కదా.
ROM 4:10 ఏ పరిస్థితుల్లో అది అతనికి నీతిగా యెంచబడింది? అతడు సున్నతి పొందిన తర్వాత లేదా సున్నతి పొందక ముందా? సున్నతి పొందక ముందే కదా!
ROM 4:11 అతడు ఇంకా సున్నతి పొందక ముందే, తనకు ఉన్న విశ్వాసం ద్వారా నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. కాబట్టి సున్నతి పొందకపోయిన విశ్వసించిన వారందరికి అది నీతిగా ఎంచబడేలా అబ్రాహాము వారందరికి తండ్రి అయ్యాడు.
ROM 4:12 అంతేకాక సున్నతి పొందినవారిలో ఎవరైతే మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందక ముందు నడిచిన విశ్వాసపు అడుగుజాడలను అనుసరించి జీవిస్తున్నారో వారికి కూడా అబ్రాహాము తండ్రి అయ్యాడు.
ROM 4:13 అతడు ఈ లోకానికి వారసుడు అవుతాడనే వాగ్దానాన్ని అబ్రాహాము అతని సంతానం ధర్మశాస్త్రం మూలంగా పొందలేదు కాని, విశ్వాసమూలంగా వచ్చిన నీతి ద్వారా మాత్రమే పొందుకున్నారు.
ROM 4:14 ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారసులైతే, విశ్వాసానికి అర్థం ఉండదు, వాగ్దానానికి ఎటువంటి విలువ ఉండదు.
ROM 4:15 ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను తెస్తుంది. ఎక్కడైతే ధర్మశాస్త్రం లేనిచోట దానిని అతిక్రమించడం కూడా ఉండదు.
ROM 4:16 కాబట్టి, వాగ్దానం విశ్వాసమూలంగానే వస్తుంది. ఆ వాగ్దానం అబ్రాహాము సంతానమంతటికి అనగా, కేవలం ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవారికి మాత్రమే కాకుండా అబ్రాహాము ఏ విశ్వాసాన్నైతే కలిగి ఉన్నాడో అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నవారందరికి కృప ద్వారా వర్తిస్తుంది. అతడు మనందరికి తండ్రి.
ROM 4:17 “నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను” అని వ్రాయబడి ఉన్నది. అబ్రాహాము విశ్వాసముంచిన దేవుడు చనిపోయినవారికి జీవమిచ్చేవారు, లేనివాటిని ఉన్నవాటిగా పిలిచేవారు. అలాంటి దేవుని దృష్టిలో అతడు మనకు తండ్రి.
ROM 4:18 “నీ సంతానం అలా ఉంటుంది” అని అతనితో చెప్పినప్పుడు అబ్రాహాము నిరీక్షణలేని సమయంలో కూడా నిరీక్షణ కలిగి నమ్మాడు, అందుకే అతడు అనేక జనాలకు తండ్రి అయ్యాడు.
ROM 4:19 తనకు వంద సంవత్సరాల వయస్సు కాబట్టి తన శరీరం మృతతుల్యంగా ఉందని శారా గర్భం కూడా మృతతుల్యంగా ఉందనే వాస్తవం తెలిసినప్పటికీ అతడు తన విశ్వాసంలో బలహీనపడనే లేదు.
ROM 4:20 అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు కాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమ చెల్లించాడు.
ROM 4:21 దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగల శక్తిగలవాడని అతడు గట్టిగా నమ్మాడు.
ROM 4:22 అందుకే “అది అతనికి నీతిగా ఎంచబడింది.”
ROM 4:23 “అది అతనికి నీతిగా ఎంచబడింది” అని వ్రాయబడిన మాటలు కేవలం అతని ఒక్కడి కోసం మాత్రమే కాదు,
ROM 4:24 మరణం నుండి సజీవంగా తిరిగి లేచిన మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచి దేవునిచే నీతిమంతులుగా తీర్చబడిన మన కోసం కూడా ఆ వాక్యం వ్రాయబడింది.
ROM 4:25 యేసు క్రీస్తు మన పాపాల కోసం మరణానికి అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి మరణం నుండి సజీవంగా తిరిగి లేచారు.
ROM 5:1 మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం సమాధానాన్ని కలిగి ఉన్నాము.
ROM 5:2 ఆయన ద్వారానే విశ్వాసం చేత ఇప్పుడు మనం నిలిచి ఉన్న కృపలోనికి రాగలిగాము. దేవుని మహిమను గురించిన నిరీక్షణలో మనం అతిశయిద్దాం.
ROM 5:3 అంతేకాక, శ్రమలు ఓర్పును పుట్టిస్తాయని మనకు తెలుసు; కాబట్టి శ్రమలలో కూడా మనం ఆనందించగలము.
ROM 5:4 ఓర్పు వలన గుణము, గుణము వలన నిరీక్షణ కలుగుతుంది.
ROM 5:5 మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రుమ్మరింపబడుతుంది, కాబట్టి నిరీక్షణ వలన మనకు ఎన్నడూ నిరాశ కలుగదు.
ROM 5:6 మనం ఇంకను బలహీనులమై ఉన్నప్పుడే, సరియైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం మరణించారు.
ROM 5:7 ఒక మంచివాని కోసం ఎవరో ఒకరు చనిపోవడానికి సాహసం చేయవచ్చు, కాని ఒక నీతిమంతుని కోసం ఎవరైనా చనిపోవడం చాలా అరుదు.
ROM 5:8 కాని మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం మరణించుట ద్వారా దేవునికి మన పట్ల ఉన్న తన ప్రేమను చూపించారు.
ROM 5:9 ఇప్పుడైతే ఆయన రక్తం చేత నీతిమంతులంగా తీర్చబడిన మనం మరింత ఖచ్చితంగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షించబడతాం!
ROM 5:10 ఎందుకంటే, మనం దేవునికి శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఆయనతో తిరిగి సమాధానపరచబడితే ఆయన జీవం ద్వారా మరి అధికంగా రక్షించబడతాము.
ROM 5:11 అంతే కాకుండా మనల్ని సమాధానపరచిన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు మనం దేవునిలో అతిశయిస్తున్నాము.
ROM 5:12 ఒక్క మనుష్యుని ద్వారా ఈ లోకంలోనికి పాపం, పాపం ద్వారా మరణం ఎలా ప్రవేశించాయో, అలాగే అందరు పాపం చేశారు కాబట్టి మరణం ప్రజలందరికి వచ్చింది.
ROM 5:13 ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందే ఈ లోకంలో పాపం ఉంది కాని, ధర్మశాస్త్రం లేని సమయంలో ఎవరి మీద పాపం మోపబడలేదు.
ROM 5:14 అయితే, ఆదాములా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయకపోయినప్పటికి, ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు మరణం పరిపాలించింది. ఆదాము రాబోవుతున్న వానికి మాదిరిగా ఉన్నాడు.
ROM 5:15 అయితే కృపావరమనేది అతిక్రమం వంటిది కాదు. ఒకవేళ ఒకని అతిక్రమాన్ని బట్టి అనేకమంది మరణిస్తే దేవుని కృప, యేసు క్రీస్తు అనే ఒక్క మనుష్యుని కృప చేత వచ్చిన కృపావరం అనేకమందికి విస్తరిస్తుంది కదా!
ROM 5:16 దేవుని వరం ఒక మనుష్యుని పాపం యొక్క ఫలితంతో పోల్చబడలేదు: ఒక పాపం వలన తీర్పు వచ్చి శిక్షను తీసుకువచ్చింది, కాని అనేక అతిక్రమాల తర్వాత వచ్చిన వరం నీతిమంతులుగా చేసింది.
ROM 5:17 ఒకవేళ ఒక్క మనుష్యుని అతిక్రమం వల్ల ఆ ఒక్క మనుష్యుని ద్వారా మరణం రాజ్యమేలితే, దేవుని కృపాసమృద్ధిని, నీతి అనే వరాన్ని పొందినవారు యేసు క్రీస్తు అనే ఒక్క మనుష్యుని ద్వారా ఇంకెంత ఎక్కువగా జీవంలో రాజ్యమేలుతారు!
ROM 5:18 అదేరీతిగా ఒక్కని అతిక్రమం ఫలితంగా ప్రజలందరికి శిక్ష విధించబడినట్లే ఒక్కని నీతిక్రియ ఫలితంగా ప్రజలందరికి జీవప్రదమైన నీతి అనుగ్రహించబడింది.
ROM 5:19 ఒక్క మనుష్యుని అవిధేయత వల్ల అనేకమంది పాపులుగా చేయబడ్డారు, అలాగే ఒక్క మానవుని విధేయత వల్లనే అనేకమంది నీతిమంతులుగా చేయబడ్డారు.
ROM 5:20 అతిక్రమం ఎక్కువ కావడానికి ధర్మశాస్త్రం తీసుకు వచ్చినట్టైంది. అయితే పాపం ఎక్కువైనా కొద్ది, దేవుని కృప మరింత విస్తరించింది.
ROM 5:21 కాబట్టి, పాపం మరణంలో రాజ్యం చేసినట్లుగానే, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిత్యజీవాన్ని తేవడానికి నీతి ద్వారా కృప రాజ్యం చేస్తుంది.
ROM 6:1 అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా?
ROM 6:2 ఎన్నడు అలా చెప్పకూడదు. పాపాన్ని బట్టి మరణించిన మనం దానిలో ఎలా జీవించి ఉండగలం?
ROM 6:3 క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందిన మనం ఆయన మరణంలో కూడా బాప్తిస్మం పొందామని మీకు తెలియదా?
ROM 6:4 తండ్రియైన దేవుని మహిమ ద్వారా మరణం నుండి తిరిగి సజీవంగా లేచిన క్రీస్తువలె మనం కూడా నూతన జీవాన్ని జీవించడానికి ఆయన మరణంలో బాప్తిస్మం పొందిన మనం ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాము.
ROM 6:5 మనం కూడా ఆయన మరణం విషయంలో ఆయనతో ఐక్యమైతే, ఖచ్చితంగా మనం కూడా ఆయన పునరుత్థానం విషయంలో ఆయనతో ఐక్యమవుతాము.
ROM 6:6 మనమింక పాపానికి బానిసలుగా ఉండకుండా పాపం చేత పాలించబడిన శరీరం నశించేలా, మన పాత స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు.
ROM 6:7 ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు.
ROM 6:8 కాబట్టి మనం క్రీస్తుతో పాటు మరణిస్తే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తామని నమ్ముతున్నాము.
ROM 6:9 క్రీస్తు మరణం నుండి తిరిగి సజీవంగా లేచారు, ఆయన మరి ఎన్నడూ మరణించరు; ఇకపై మరణానికి ఆయన మీద అధికారం లేదు.
ROM 6:10 ఆయన మనందరి పాపాల కోసం మరణించారు గాని ఆయన జీవించిన జీవితం దేవుని కొరకే జీవించారు.
ROM 6:11 అలాగే పాప విషయంలో చనిపోయాం కాని యేసు క్రీస్తులో దేవుని కోసం సజీవంగానే ఉన్నామని మిమ్మల్ని మీరు ఎంచుకోండి.
ROM 6:12 కాబట్టి మీ శరీర దురాశలకు మీరు లోబడకుండా ఉండడానికి మరణించే మీ శరీరాన్ని పాపాలచే యేలనివ్వకండి.
ROM 6:13 దుష్టత్వానికి పనిముట్లుగా మీ శరీరంలోని ఏ భాగాన్ని పాపానికి అప్పగించవద్దు. అయితే మరణం నుండి జీవంలోనికి తీసుకురాబడిన వారిలా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. నీతిని జరిగించే పనిముట్లుగా మీ శరీరంలోని ప్రతిభాగాన్ని ఆయనకు అర్పించాలి.
ROM 6:14 మీరు ఉన్నది ధర్మశాస్త్రం క్రింద కాదు కాని, కృప కలిగి ఉన్నారు కాబట్టి ఇకమీదట పాపం మీమీద అధికారాన్ని కలిగి ఉండదు.
ROM 6:15 అయితే మనం ధర్మశాస్త్రం క్రింద కాదు గాని కృప కలిగి ఉన్నాం కాబట్టి మనం పాపం చేయవచ్చా? చేయనే కూడదు!
ROM 6:16 మిమ్మల్ని మీరు ఎవరికైనా విధేయుడైన దాసునిగా అప్పగించుకుంటే మీరు వారికి లోబడి ఉండాల్సిన దాసులు అవుతారని మీకు తెలియదా? అయితే మీరు మరణానికి నడిపించే పాపానికి దాసులుగా ఉంటారా లేదా నీతివైపు నడిపించే విధేయతకు దాసులుగా ఉంటారా?
ROM 6:17 ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పటికీ, ఏ ఉపదేశానికైతే మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి మీరు హృదయమంతటితో లోబడ్డారు. కాబట్టి దేవునికి వందనాలు.
ROM 6:18 మీరు పాపం నుండి విడిపించబడి నీతికి దాసులుగా అయ్యారు.
ROM 6:19 మీ శరీర బలహీనతలను బట్టి అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఒకప్పుడు మరింత దుష్టత్వంలోనికి నడిపించే అపవిత్రతకు, దుష్టత్వానికి మిమ్మల్ని మీరు ఎలా దాసులుగా అప్పగించుకున్నారో అలాగే ఇప్పుడు పరిశుద్ధత వైపుకు నడిపించే నీతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి.
ROM 6:20 మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో ఈ ఆటంకం లేనివారిగా ఉన్నారు.
ROM 6:21 గతకాలంలో మీరు చేసిన పనుల వల్ల కలిగిన ప్రయోజనమేమిటి? వాటివలన మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా! ఆ పనుల ఫలం మరణమే!
ROM 6:22 అయితే ఇప్పుడు మీరు పాపం నుండి విడుదల పొంది దేవునికి దాసులయ్యారు. దాని వలన మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధతలోనికి నడిపించబడతారు. దానికి ఫలంగా నిత్యజీవాన్ని పొందుతారు.
ROM 6:23 పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం వలన మన ప్రభువైన యేసు క్రీస్తులో నిత్యజీవం లభిస్తుంది.
ROM 7:1 సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవారితో నేను మాట్లాతున్నాను. ఒక మనిషి జీవించి ఉన్నంత వరకు మాత్రమే ధర్మశాస్త్రానికి అతనిపై అధికారం ఉంటుందని మీకు తెలుసా?
ROM 7:2 ఉదాహరణకు, ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకున్న స్త్రీ ఆ వ్యక్తి బ్రతికి ఉన్నంత వరకు అతనితో బంధం కలిగి ఉంటుంది గాని భర్త చనిపోతే అతనితో ఆమెకు బంధాన్ని ఏర్పరచిన ధర్మం నుండి ఆమె విడుదల పొందుతుంది.
ROM 7:3 అయితే ఆమె తన భర్త బ్రతికి ఉండగానే మరొక వ్యక్తితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటే ఆమె వ్యభిచారిణి అవుతుంది. ఒకవేళ ఆమె భర్త చనిపోతే ఆ ధర్మం నుండి ఆమె విడుదల పొందుకున్నది కాబట్టి ఆమె మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే ఆమె వ్యభిచారిణి కాదు.
ROM 7:4 కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని కోసం ఫలించేలా, మరణించి సజీవంగా తిరిగి లేచిన క్రీస్తును చేరుకునేలా మీరు కూడా క్రీస్తు శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మరణించారు.
ROM 7:5 మనం శరీర సంబంధులుగా మనం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం వలన కలిగే పాప ఆలోచనలు మనలో పని చేస్తున్నాయి కాబట్టి మనం మరణాన్ని ఫలంగా పొందుకుంటున్నాము.
ROM 7:6 కాని ఇప్పుడు, మనల్ని బంధించి ఉంచిన దాని విషయమై చనిపోయి, ధర్మశాస్త్రం నుండి విడుదలను పొందాము కాబట్టి, వ్రాయబడి ఉన్న నియమం ప్రకారం కాకుండా ఆత్మానుసారమైన నూతన మార్గంలో మనం సేవిస్తాము.
ROM 7:7 అయితే మనం ఏమనాలి? ధర్మశాస్త్రాన్ని పాపమనా? కానే కాదు! ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు. “మీరు ఆశించకూడదు” అని ధర్మశాస్త్రం చెప్పకపోతే ఆశించడం అంటే ఏమిటో నిజంగా నాకు తెలిసేది కాదు.
ROM 7:8 అయితే పాపం ఆజ్ఞను ఆధారం చేసుకుని నాలో అన్ని రకాల దురాశలను పుట్టించింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం మరణిస్తుంది.
ROM 7:9 ఒకప్పుడు ధర్మశాస్త్రం లేకపోయిన నేను సజీవంగానే ఉన్నాను, అయితే ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు పాపం జీవంలోనికి వచ్చింది, నేను మరణించాను.
ROM 7:10 జీవాన్ని ఇవ్వడానికి ఉద్దేశించబడిన ఆ ఆజ్ఞలే మరణాన్ని తీసుకువచ్చాయని నేను తెలుసుకున్నాను.
ROM 7:11 అయితే పాపం ఆజ్ఞను ఆధారం చేసుకుని నన్ను మోసగించి ఆ ఆజ్ఞల ద్వారానే నన్ను మరణానికి గురిచేసింది.
ROM 7:12 కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, నీతి కలిగినవి, మంచివి.
ROM 7:13 అయితే మంచిది నాకు మరణాన్ని తీసుకువచ్చిందా? ఎన్నడు కాదు! అయితే, పాపం మంచిని ఉపయోగించి నాకు మరణాన్ని తెచ్చింది. పాపాన్ని పాపంగా చూపించే క్రమంలో ఆజ్ఞల ద్వారా పాపం మరింత పాపపూరితమైనది.
ROM 7:14 ధర్మశాస్త్రం ఆత్మకు సంబంధించిందని మనకు తెలుసు, కాని నేను ఆత్మహీనుడను కాబట్టి పాపానికి దాసునిగా అమ్ముడుపోయాను.
ROM 7:15 నేను చేసిన దానిని నేను గ్రహించలేదు. నేను చేయాలనుకున్న దానిని చేయలేదు కాని దేనిని ద్వేషిస్తానో దానినే చేశాను.
ROM 7:16 చేయకూడదని అనుకున్నా దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను.
ROM 7:17 ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే.
ROM 7:18 నాకున్న పాప స్వభావాన్ని బట్టి మంచిది ఏదీ నాలో నివసించదని నాకు తెలుసు కాబట్టి, మంచి చేయాలనే కోరిక నాకు ఉన్నప్పటికీ దానిని నేను చేయలేకపోతున్నాను.
ROM 7:19 నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, చేయకూడదని అనుకుంటున్న చెడునే నేను చేస్తున్నాను.
ROM 7:20 అయితే ఇప్పుడు నేను చేయకూడదని అనుకుంటున్న దానిని నేను చేస్తే, అలా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే.
ROM 7:21 కాబట్టి నేను మంచి చేయాలని అనుకుంటున్నప్పటికి నాలో చెడు ఉందనే నియమాన్ని నేను గమనించాను.
ROM 7:22 నా అంతరంగాన్ని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను.
ROM 7:23 కాని మరొక నియమం నాలో ఉన్నట్లు నాకు కనబడుతుంది. అది నా మనస్సులోని నియమంతో పోరాడుతూ నాలో పని చేస్తున్న పాపనియమానికి నన్ను బందీగా చేస్తుంది.
ROM 7:24 నేను ఎంత దౌర్భాగ్యుడిని! మరణానికి బందీగా ఉన్న నా శరీరం నుండి నన్ను ఎవరు రక్షించగలరు?
ROM 7:25 మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నాకు విడుదలను ఇచ్చే దేవునికి వందనాలు! అయితే నా మనస్సులో నేను దేవుని ధర్మశాస్త్రానికి దాసుడను, కాని నాకున్న పాప స్వభావంలో నేను పాపనియమానికి దాసుడను.
ROM 8:1 కాబట్టి, ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నారో వారికి శిక్షావిధి లేదు.
ROM 8:2 ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని ఇచ్చే ఆత్మ నియమం మిమ్మల్ని పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది.
ROM 8:3 శరీరాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమై దేన్ని చేయలేకపోయిందో దాన్ని చేయడానికి దేవుడు పాపపూరితమైన శరీర రూపంలో పాపపరిహారబలిగా తన సొంత కుమారున్ని పంపించారు. అప్పుడు ఆయన శరీరంలో ఉన్న పాపానికి శిక్ష విధించారు.
ROM 8:4 శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించే మనలో ధర్మశాస్త్రం యొక్క నీతి నియమాలను నెరవేర్చడానికి ఇలా జరిగింది.
ROM 8:5 శరీరానుసారంగా జీవించేవారి మనస్సు శారీరక ఆశలపైనే ఉంటుంది. కాని ఆత్మానుసారంగా జీవించేవారి మనస్సు ఆత్మ సంబంధమైన ఆశలపైన ఉంటుంది.
ROM 8:6 శరీరానుసారమైన మనస్సు మరణము; కాని ఆత్మానుసారమైన మనస్సు జీవం సమాధానమై ఉన్నది.
ROM 8:7 శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమైనది; అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండదు, దాని ప్రకారం నడుచుకోదు.
ROM 8:8 శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు.
ROM 8:9 అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ ఆధీనంలో ఉంటారు, కాబట్టి శరీర స్వభావం కలిగి ఉండరు. క్రీస్తు ఆత్మ లేనివారు క్రీస్తుకు చెందినవారు కారు.
ROM 8:10 క్రీస్తు మీలో ఉన్నట్లయితే పాపాన్ని బట్టి మీ శరీరం మరణించినా, నీతిని బట్టి ఆత్మ జీవిస్తుంది.
ROM 8:11 యేసును మరణం నుండి సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, క్రీస్తును మరణం నుండి సజీవంగా లేపిన ఆయన నాశనమయ్యే మీ శరీరాలకు కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవాన్ని ఇవ్వగలరు.
ROM 8:12 కాబట్టి సహోదరి సహోదరులారా, శరీరానుసారంగా జీవించడానికి మనం శరీరానికి రుణస్థులము కాము.
ROM 8:13 మీరు శరీరానుసారంగా జీవిస్తే మీరు మరణిస్తారు. కాని ఒకవేళ ఆత్మ ద్వారా శరీర సంబంధమైన చెడ్డక్రియలను చంపివేస్తే మీరు బ్రతుకుతారు.
ROM 8:14 ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు.
ROM 8:15 మీరు మరలా భయంలో జీవించడానికి, మీరు పొందిన ఆత్మ మిమ్మల్ని బానిసలుగా చేయదు కాని మీరు పొందిన ఆత్మ ద్వారా దత్తపుత్రులుగా చేయబడతారు. అప్పుడు ఆ ఆత్మ ద్వారా మనం, “అబ్బా, తండ్రీ” అని మొరపెడుతున్నాము.
ROM 8:16 మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు.
ROM 8:17 మనం పిల్లలమైతే వారసులం, అంటే దేవుని వారసులం; క్రీస్తు మహిమను మనం కూడా పొందడానికి ఆయనతో శ్రమపడితే క్రీస్తు సహ వారసులమవుతాం.
ROM 8:18 మనలో ప్రత్యక్షం కాబోయే మహిమతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎంత మాత్రం పోల్చదగినవి కావని నేను భావిస్తాను.
ROM 8:19 దేవుని బిడ్డలు ప్రత్యక్షపరచబడాలని సృష్టి అంతా ఆతురతతో ఎదురుచూస్తూ ఉంది.
ROM 8:20 తన ఇష్ట ప్రకారం కాక దానిని అప్పగించినవాని చిత్తప్రకారం నిరాశకు గురైన సృష్టి నిరీక్షణ కలిగి ఉంది.
ROM 8:21 సృష్టి, నశించిపోవడమనే దాస్యం నుండి విడిపించబడి, దేవుని బిడ్డల మహిమలోనికి స్వాతంత్ర్యంలోనికి తీసుకురాబడుతుందనే ఆ నిరీక్షణ.
ROM 8:22 నేటి వరకు సృష్టి అంతా ప్రసవ వేదన పడుతున్నట్లుగా మూల్గుతున్నదని మనకు తెలుసు.
ROM 8:23 అది మాత్రమే కాదు, ఆత్మలో ప్రథమ ఫలం పొందిన మనం కూడా దత్తపుత్రులంగా అవ్వడానికి మన శరీరాల విమోచన కోసం ఆతురతగా ఎదురుచూస్తూ మన లోలోపల మూలుగుతున్నాము.
ROM 8:24 ఈ నిరీక్షణలోనే మనం రక్షించబడ్డాము. అయితే కనబడే నిరీక్షణ ఎంత మాత్రం నిరీక్షణ కాదు. తాము చూస్తున్న వాటికోసం ఎవరు నిరీక్షిస్తారు?
ROM 8:25 అయితే మన దగ్గర లేని దాని కోసం మనం నిరీక్షిస్తే ఓపికగా ఎదురుచూడగలము.
ROM 8:26 అదే విధంగా మన బలహీనతల్లో ఆత్మ మనకు సహాయం చేస్తాడు. దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియదు కాని, మన కోసం ఆత్మ తానే మాటల్లేని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు.
ROM 8:27 మన హృదయాలను పరిశోధించే ఆయనకు ఆత్మ యొక్క మనస్సు తెలుసు, ఎందుకనగా దేవుని ప్రజల కోసం దేవుని చిత్తప్రకారం ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు.
ROM 8:28 దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి జరిగేలా అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు.
ROM 8:29 అనేకులైన సహోదరి సహోదరుల మధ్యలో ఆయన ప్రథమ సంతానంగా ఉండాలని దేవుడు తాను ముందుగానే ఎరిగినవారిని తన కుమారుని స్వరూపానికి అనుగుణంగా ఉండేలా వారిని ముందుగానే నిర్ణయించారు.
ROM 8:30 ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని ఆయన పిలిచారు; ఆయన ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చారు; ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరిచారు.
ROM 8:31 అయితే ఈ విషయాల గురించి మనమేమి చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపు ఉండగా, మనకు విరోధి ఎవడు?
ROM 8:32 దేవుడు తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీయక మనందరి కోసం ఆయనను అప్పగించినప్పుడు తన కుమారునితో పాటు మనందరికి అన్ని సమృద్ధిగా ఇవ్వకుండా ఎలా ఉండగలరు?
ROM 8:33 దేవుడు ఏర్పరచుకున్నవారికి వ్యతిరేకంగా ఆరోపణ చేసేవారు ఎవరు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే కదా!
ROM 8:34 అయితే శిక్షను విధించేవారు ఎవరు? సజీవంగా తిరిగి లేచి, దేవుని కుడి వైపున కూర్చుండి మన కోసం దేవుని వేడుకొనే యేసు క్రీస్తే తప్ప మరి ఎవరూ కాదు.
ROM 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవారు ఎవరు? ఇబ్బందులు గాని, కష్టాలు గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఆపద గాని, ఖడ్గం గాని మనల్ని వేరు చేయగలదా?
ROM 8:36 లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది: “రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.”
ROM 8:37 అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము.
ROM 8:38 మరణమైనా జీవమైనా, దేవదూతలైనా దయ్యాలైనా, నేడైనా రేపైనా, ఎటువంటి శక్తులైనా,
ROM 8:39 ఎత్తైనా లోతైనా, సృష్టిలో ఉన్న ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవని నేను ఒప్పుకుంటున్నాను.
ROM 9:1 నేను క్రీస్తులో సత్యమే చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నా మనస్సాక్షి దానిని నిర్ధారిస్తుంది.
ROM 9:2 నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి.
ROM 9:3 నా సొంత జాతి వారైన ఇశ్రాయేలీయుల కోసం క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను.
ROM 9:4 వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు దత్తపుత్రులుగా చేయబడినవారు; దైవికమైన మహిమ, నిబంధనలు, పొందిన ధర్మశాస్త్రం, దేవాలయంలో ఆరాధన, వాగ్దానాలు వారివే.
ROM 9:5 పితరులు వారి వారే, అందరికి దేవుడైన క్రీస్తు మానవునిగా వారిలోనే పుట్టారు. ఆయన నిత్యం స్తోత్రార్హుడు! ఆమేన్.
ROM 9:6 దేవుని మాట విఫలమైనదని కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన వారందరు ఇశ్రాయేలీయులు కారు.
ROM 9:7 అబ్రాహాము సంతతి అయినంత మాత్రాన వారు అబ్రాహాముకు పిల్లలు అవ్వరు. అయితే, “ఎందుకంటే ఇస్సాకు మూలంగా కలిగిన వారిగానే నీ సంతానం లెక్కించబడుతుంది.”
ROM 9:8 మరో మాటలో చెప్పాలంటే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని బిడ్డలు కారు, కాని వాగ్దాన సంబంధమైన పిల్లలే అబ్రాహాము సంతానంగా పరిగణించబడతారు.
ROM 9:9 అందువల్లనే, “నియమించబడిన సమయానికి నేను తిరిగి వస్తాను, అప్పటికి శారాకు ఒక కుమారుడు పుడతాడు” అని వాగ్దానం ఇవ్వబడింది.
ROM 9:10 అది మాత్రమే కాకుండా, మన తండ్రియైన ఇస్సాకు వలన రిబ్కా గర్భవతియైన సమయంలో,
ROM 9:11 కవలలు ఇంకా పుట్టి మంచి చెడు ఏదీ చేయక ముందే, ఏర్పాటు చేయబడిన ప్రకారం, దేవుని ఉద్దేశం, క్రియలమూలంగా కాకుండా,
ROM 9:12 పిలుచువాని మూలంగా స్థిరంగా నిలబడడానికి, “పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు” అని ఆమెతో చెప్పబడింది.
ROM 9:13 “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని వ్రాయబడి ఉన్నది.
ROM 9:14 అయితే మనం ఏమనాలి? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు!
ROM 9:15 ఎందుకంటే ఆయన మోషేతో, “నాకు ఎవరి మీద కనికరం కలుగుతుందో వారిని కనికరిస్తాను, నాకు ఎవరి మీద దయ కలుగుతుందో వారికి నేను దయ చూపిస్తాను” అని చెప్పారు.
ROM 9:16 కాబట్టి ఇది ఒకరి కోరిక మీద గాని ప్రయాస మీద గాని ఆధారపడి ఉండదు కాని, దేవుని కనికరం వలనే అవుతుంది.
ROM 9:17 అయితే లేఖనం ఫరోతో ఇలా చెప్తుంది: “నేను నా బలాన్ని నీలో చూపించాలని, భూలోకమంతా నా నామం ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను నియమించాను.”
ROM 9:18 కాబట్టి దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటే వారిని కనికరిస్తారు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నారో వారి పట్ల కఠినంగా ఉంటారు.
ROM 9:19 మీరు నాతో, “అలాగైతే ఇంకా ఎందుకు దేవుడు మనల్ని నిందిస్తాడు? ఆయన చిత్తాన్ని ఎవరు అడ్డుకోగలరు?” అనవచ్చు,
ROM 9:20 కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేశావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?”
ROM 9:21 ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి అధికారం లేదా?
ROM 9:22 దేవుడు తన ఉగ్రతను చూపించడానికి, తమ శక్తిని తెలియజేయడానికి కోరుకున్నప్పటికి, నాశనం కోసం సిద్ధపరచబడిన ఆయన ఉగ్రతకు పాత్రలైన వారిని ఆయన గొప్ప సహనంతో భరిస్తే ఏంటి?
ROM 9:23 మహిమ కోసం ముందుగానే ఆయనచే సిద్ధపరచబడి ఆయన కృపకు పాత్రులైన వారికి,
ROM 9:24 అనగా యూదులలో నుండి మాత్రమే కాక యూదేతరులలో నుండి ఆయన పిలిచిన మన కోసం తన మహిమైశ్వర్యాలను తెలియపరిస్తే ఏంటి?
ROM 9:25 హోషేయ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రకారం, “నా ప్రజలు కాని వారిని ‘నా ప్రజలు’ అని పిలుస్తాను; నాకు ప్రియురాలు కాని దానిని ‘నా ప్రియురాలు’ అని పిలుస్తాను,”
ROM 9:26 ఇంకా, “ ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో, అదే స్థలంలో వారు ‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు.”
ROM 9:27 ఇశ్రాయేలీయుల గురించి యెషయా ఇలా మొరపెట్టాడు: “ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా, వారిలో మిగిలి ఉన్నవారే రక్షించబడతారు.
ROM 9:28 ప్రభువు తాను చెప్పిన మాటను భూమిపై త్వరగా తప్పక నెరవేరుస్తారు.”
ROM 9:29 యెషయా గతంలో చెప్పినట్లుగా, “సైన్యాల ప్రభువు మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే మనం సొదొమలా మారేవారం, గొమొర్రాను పోలి ఉండేవారము.”
ROM 9:30 అయితే దీనిని బట్టి మనం ఏమి చెప్పగలం? నీతిని అనుసరించని యూదేతరులు విశ్వాసాన్నిబట్టి నీతిని పొందుకున్నారు.
ROM 9:31 కాని నీతి మార్గంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ఇశ్రాయేలు ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు.
ROM 9:32 వారెందుకు చేరుకోలేకపోయారు? వారు నీతిని విశ్వాసంతో కాకుండా క్రియలతో అనుసరించారు. ఆటంకంగా అడ్డురాయి ఎదురైనప్పుడు వారు తడబడ్డారు.
ROM 9:33 దీని కోసం ఇలా వ్రాయబడి ఉంది: “ఇదిగో, నేను సీయోనులో ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయిని, వారు పడిపోయేలా చేసే అడ్డుబండను వేశాను, ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు.”
ROM 10:1 సహోదరీ సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలనేది నా హృదయవాంఛ, దాని గురించి నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను.
ROM 10:2 అప్పుడు వారు దేవుని పట్ల అత్యాసక్తి కలిగి ఉన్నారని అయితే వారి అత్యాసక్తి జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదని నేను సాక్ష్యమివ్వగలను.
ROM 10:3 దేవుని నీతి వారికి తెలియకపోయినా తమ స్వనీతిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వారు దేవుని నీతికి లోబడలేదు.
ROM 10:4 విశ్వసించే వారందరికి నీతిగా ఉండడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపుగా ఉన్నారు.
ROM 10:5 ధర్మశాస్త్రం వలన నీతిని జరిగించే వారి గురించి మోషే, “వీటిని చేసేవారు వాటి వల్లనే జీవిస్తారు” అని వ్రాశాడు.
ROM 10:6 అయితే విశ్వాసం ద్వారా వచ్చే నీతి ఇలా చెప్తుంది: “క్రీస్తును క్రిందకు తేవడానికే ‘పరలోకంలోకి ఎవరు ఎక్కి వెళ్తారు?’ అని మీ హృదయంలో అనుకోవద్దు.”
ROM 10:7 “లేదా ‘క్రీస్తును మృతులలో నుండి పైకి తేవడానికే అగాధం లోనికి ఎవరు దిగి వెళ్తారు?’ ” అని మీ హృదయాల్లో అనుకోవద్దు.
ROM 10:8 అయితే ఇది ఏమి చెప్తుంది? “వాక్యం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.” అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే.
ROM 10:9 మీరు మీ నోటితో “యేసు ప్రభువు” అని ఒప్పుకుని, మీ హృదయాల్లో “దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు” అని నమ్మితే మీరు రక్షించబడతారు.
ROM 10:10 అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు రక్షించబడతారు.
ROM 10:11 “ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు” అని లేఖనం చెప్తుంది.
ROM 10:12 యూదులకు, యూదేతరులకు భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఆయనకు మొరపెట్టిన వారందరిని ఆయన సమృద్ధిగా దీవిస్తాడు.
ROM 10:13 ఎందుకంటే, “ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.”
ROM 10:14 అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిని ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు?
ROM 10:15 ప్రకటించేవారిని పంపకపోతే ఎలా ప్రకటించగలరు? దీని గురించి, “సువార్తను తెచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి!” అని వ్రాయబడి ఉంది.
ROM 10:16 అయితే, “ప్రభువా, మా సందేశాన్ని ఎవరు నమ్ముతారు?” అని యెషయా చెప్పిన ప్రకారం, సువార్తను ఇశ్రాయేలు ప్రజలందరూ అంగీకరించలేదు.
ROM 10:17 కాబట్టి, సువార్తను వినడం వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును గురించిన వాక్యం ద్వారా సువార్తను వినగలరు.
ROM 10:18 కాని నేనడిగేదేంటంటే: వారు సువార్తను వినలేదా? వారు ఖచ్చితంగా విన్నారు: “వారి స్వరం భూలోకమంతా వినబడింది, వారి మాటలు భూదిగంతాల వరకు వ్యాపించాయి.”
ROM 10:19 నేను మళ్ళీ అడుగుతున్నా: ఇశ్రాయేలు ప్రజలు దానిని గ్రహించలేదా? మొదట మోషే ఇలా అన్నాడు, “జనులు కాని వారిచేత నేను మిమ్మల్ని అసూయపడేలా చేస్తాను, అవగాహన లేని జనుల వలన మీకు కోపం వచ్చేలా చేస్తాను.”
ROM 10:20 యెషయా ఇలా ధైర్యంగా చెప్పాడు, “నన్ను వెదకనివారికి నేను దొరికాను, నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకున్నాను.”
ROM 10:21 అయితే ఇశ్రాయేలు ప్రజల గురించి అతడు ఇలా చెప్పాడు, “అవిధేయులు మూర్ఖులైన ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాపాను.”
ROM 11:1 అందుకు నా ప్రశ్న ఏంటంటే: దేవుడు తన ప్రజలను తిరస్కరిస్తారా? ఎన్నటికీ కాదు! నేను కూడా ఇశ్రాయేలుకు చెందినవాన్నే, అబ్రాహాము సంతానాన్నే, బెన్యామీను గోత్రానికి చెందినవాన్నే.
ROM 11:2 తన ప్రజలను అనగా తాను ముందుగానే ఎరిగి ఉన్నవారిని దేవుడు తిరస్కరించరు. ఏలీయా గురించిన భాగంలో లేఖనం ఏమి చెప్తుందో మీకు తెలియదా? ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా అతడు దేవునికి ప్రార్థన చేస్తూ,
ROM 11:3 “ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను కూల్చివేశారు, నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను, వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు” అని ఎంతగానో మొరపెట్టుకున్నాడు.
ROM 11:4 అయితే దేవుడు అతనికిచ్చిన సమాధానం ఏంటి? “బయలుకు మోకరించని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకించుకున్నాను” అని.
ROM 11:5 అదే విధంగా ప్రస్తుత సమయంలో కూడా కృప ద్వారా ఏర్పాటు చేయబడినవారు మిగిలే ఉన్నారు.
ROM 11:6 అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు. ఒకవేళ అలా కాకపోతే కృప ఇక కృప కాదు.
ROM 11:7 అప్పుడు ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఆసక్తితో దేనిని వెదికారో అది వారికి దొరకలేదు. వారిలో ఏర్పరచబడినవారికే అది దొరికింది. కాని మిగిలిన వారు కఠినంగా అయ్యారు.
ROM 11:8 దాని గురించి ఇలా వ్రాయబడింది: “నేటి వరకు దేవుడు వారికి మైకంగల ఆత్మను, చూడలేని కళ్లను వినలేని చెవులను ఇచ్చారు.”
ROM 11:9 దావీదు, “వారి భోజనబల్ల వారికి ఉచ్చుగా బోనుగా మారి వారికి అడ్డుబండగా తగిన శాస్తిగా ఉండును గాక.
ROM 11:10 వారు చూడకుండ వారి కళ్లకు చీకటి కమ్మును గాక, వారి నడుములు శాశ్వతంగా వంగిపోవును గాక” అని చెప్తున్నాడు.
ROM 11:11 మరలా నేను: వారు తిరిగి తేరుకోలేనంతగా తొట్రిల్లి పడిపోతారా? అని అడుగుతున్నా, అలా ఎన్నటికి కాదు, వారు చేసిన ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు అసూయపడేలా చేయడానికి యూదేతరులకు రక్షణ లభించింది.
ROM 11:12 అయితే వారి ఆజ్ఞాతిక్రమం లోకానికి ఐశ్వర్యంగా, వారి నష్టం యూదేతరులకు ఐశ్వర్యంగా ఉంటే వారి పరిపూర్ణత మరి ఎంత ఎక్కువ ఐశ్వర్యాన్ని తెస్తుందో కదా!
ROM 11:13 యూదేతరులైన మీతో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే యూదేతరులకు అపొస్తలునిగా నేను ఉన్నాను కాబట్టి నా పరచర్యలో నేను గర్వపడుతూ,
ROM 11:14 ఏదో ఒక విధంగా నా సొంత ప్రజలకు అసూయను కలిగించి వారిలో కొందరినైనా రక్షించాలనేది నా కోరిక.
ROM 11:15 తిరస్కారం లోకానికి సమాధానం తెస్తే, వారి అంగీకారం వల్ల ఏం జరుగుతుంది. మరణం నుండి జీవం వస్తుందా?
ROM 11:16 ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ఆ ముద్ద అంతా పరిశుద్ధమే; అలాగే చెట్టు వేరు పరిశుద్ధమైతే ఆ చెట్టు కొమ్మలు కూడా పరిశుద్ధమే.
ROM 11:17 అయితే ఒలీవచెట్టు కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవచెట్టు కొమ్మలాంటి నీవు మిగిలిన కొమ్మల మధ్యలో అంటుకట్టబడి, ఆ ఒలీవచెట్టు వేరు నుండి వచ్చే సారంలో పాలుపొందినప్పుడు,
ROM 11:18 మిగిలిన కొమ్మల కన్నా నీవు గొప్పవానిగా భావించవద్దు. నీవు అలా భావిస్తే, నీవు వేరుకు ఆధారం కాదు గాని వేరే నీకు ఆధారంగా ఉందని తెలుసుకో.
ROM 11:19 “నేను అంటుకట్టబడాలని ఆ కొమ్మలు విరిచివేయబడ్డాయి” అని నీవు చెప్పవచ్చు.
ROM 11:20 నిజమే. వారు అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడ్డారు, విశ్వాసం వల్ల నీవు నిలిచి ఉన్నావు. కాబట్టి అహంకారంగా ఉండక భయంతో ఉండు.
ROM 11:21 దేవుడు సహజమైన కొమ్మలనే విడిచిపెట్టనప్పుడు ఆయన నిన్ను కూడా విడిచిపెట్టరు కదా.
ROM 11:22 దేవుడు చూపించే దయను, కఠినత్వాన్ని తెలుసుకోండి: పడిపోయిన వారి పట్ల ఆయన కఠినంగా ఉన్నారు కాని, నీ పట్ల దయ చూపించి నీవు ఆయన దయలో కొనసాగేలా చేశారు. లేకపోతే నీవు కూడా నరికివేయబడతావు.
ROM 11:23 వారు అవిశ్వాసంలో కొనసాగకపోతే దేవుడు వారిని తిరిగి అంటుకట్టగల సమర్ధుడు కాబట్టి వారు మరలా అంటుకట్టబడతారు.
ROM 11:24 సహజంగా అడవి ఒలీవచెట్టు నుండి కోయబడిన కొమ్మవైన నీవే స్వభావానికి విరుద్ధంగా మంచి ఒలీవచెట్టుకు అంటుకట్టబడితే, సహజమైన కొమ్మలు మరింత సులభంగా వాటి సొంత ఒలీవచెట్టుకు అంటుకట్టబడతాయి గదా!
ROM 11:25 సహోదరీ సహోదరులారా, మీరు అహంకారులుగా ఉండకూడదని మీకు ఈ మర్మం తెలియాలని నేను కోరుకుంటున్నాను. అది ఏంటంటే యూదేతరులంతా లోపలికి ప్రవేశించే వరకు ఇశ్రాయేలు ప్రజలు కొంతవరకు కఠినం చేయబడ్డారు.
ROM 11:26 అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలందరు రక్షించబడతారు. దీనిని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, “సీయోనులో నుండి విమోచకుడు వస్తాడు, యాకోబులో నుండి భక్తిహీనతను అతడు తీసివేస్తాడు.
ROM 11:27 నేను వారి పాపాలను వారి నుండి తీసివేసినప్పుడు నేను వారితో చేసే నా నిబంధన ఇదే.”
ROM 11:28 సువార్తకు సంబంధించినంత వరకు మిమ్మల్ని బట్టి వారు శత్రువులుగా ఉన్నారు, కాని ఎన్నికకు సంబంధించినంత వరకు వారు పితరులను బట్టి ప్రేమించబడినవారు.
ROM 11:29 అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి.
ROM 11:30 గతంలో దేవునికి అవిధేయులుగా ఉండి, ఇప్పుడు వారి అవిధేయత ఫలితంగా దేవుని కృపను పొందారు.
ROM 11:31 అదే విధంగా మీకు చూపిన దేవుని కృపను బట్టి వారు కృపను పొందుకొనే క్రమంలో వారు నేడు అవిధేయులుగా ఉన్నారు.
ROM 11:32 దేవుడు వారందరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించారు.
ROM 11:33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానాల సమృద్ధి ఎంతో లోతైనది! ఆయన తీర్పులు ఎంతో నిగూఢమైనవి, ఆయన మార్గాలు మన ఊహకు అందనివి!
ROM 11:34 “ప్రభువు మనస్సును తెలుసుకున్న వారెవరు? ఆయనకు ఆలోచన చెప్పగలవారెవరు?”
ROM 11:35 “ముందుగానే దేవునికి ఇచ్చి ఆయన నుండి తిరిగి పొందగలవారు ఎవరు?”
ROM 11:36 ఆయన నుండి ఆయన ద్వారా ఆయన కోసమే సమస్తం ఉన్నాయి కాబట్టి ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.
ROM 12:1 కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన.
ROM 12:2 ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు.
ROM 12:3 నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో అందరికి నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో అందరికి పంచి ఇచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి.
ROM 12:4 ఎలాగైతే మనకు ఉన్న ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నా అవన్నీ ఒకే పని ఎలా చేయవో,
ROM 12:5 అలాగే మనం అనేకులమైనప్పటికీ క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నాము, ప్రతి ఒక్కరు మిగిలిన వారందరికి సంబంధించినవారే.
ROM 12:6 మనలో అందరికి అనుగ్రహించబడిన కృపను బట్టి మనం వేరు వేరు కృపావరాలు కలిగి ఉన్నాము. నీ కృపావరం ప్రవచనా వరమైతే నీ విశ్వాసానికి అనుగుణంగా ప్రవచించు.
ROM 12:7 ఆ కృపావరం సేవచేయడమైతే సేవ చేయి. ఆ కృపావరం బోధించడమైతే బోధించు;
ROM 12:8 ఒకవేళ అది ప్రోత్సహించడమైతే ప్రోత్సహించు; ఒకవేళ అది దానం చేయడమైతే ధారళంగా దానం చేయి; ఒకవేళ ఇతరులను నడిపించడమైతే శ్రద్ధగా నడిపించు, ఒకవేళ అది కనికరం చూపించడమైతే, సంతోషంగా చూపించండి.
ROM 12:9 ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. చెడ్డదాన్ని ద్వేషించి మంచిని పట్టుకోవాలి.
ROM 12:10 ప్రేమలో ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండండి. మీకన్న ఎక్కువగా ఒకరిని ఒకరు గౌరవించండి.
ROM 12:11 అత్యాసక్తి చూపడంలో ఎన్నడూ వెనుకబడవద్దు కాని మీరు ఆత్మీయ ఉత్సాహం కలిగి దేవుని సేవించండి.
ROM 12:12 నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి.
ROM 12:13 అవసరంలో ఉన్న పరిశుద్ధులతో పంచుకోండి. ఆతిథ్యం ఇవ్వండి.
ROM 12:14 మిమ్మల్ని హింసించినవారిని దీవించండి; వారిని దీవించండి కాని శపించవద్దు.
ROM 12:15 ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి.
ROM 12:16 ఒకరితో ఒకరు ఐక్యమత్యం కలిగి జీవించండి. గర్వం ఉండవద్దు కాని మీకన్న తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలతో కూడా సహవాసం చేయండి. అహంకారం ఉండవద్దు.
ROM 12:17 చెడుకు ప్రతిగా ఎవరికి చెడు చేయకండి. అందరి దృష్టికి సరియైనవిగా ఉన్నవాటిని చేసేలా జాగ్రత్తపడండి.
ROM 12:18 మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి.
ROM 12:19 నా ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోకండి కాని, “పగ తీర్చుకోవడం నా పని, వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తానని ప్రభువు చెప్పారు” అని వ్రాయబడిన ప్రకారం దేవుని ఉగ్రతకు విడిచిపెట్టండి.
ROM 12:20 అయితే, “మీ శత్రువు ఆకలితో ఉంటే వానికి ఆహారం పెట్టండి; అతడు దాహంతో ఉంటే వానికి త్రాగడానికి ఇవ్వండి. మీరు ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తారు.”
ROM 12:21 చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి.
ROM 13:1 దేవుడు ఇచ్చిన అధికారం తప్ప మరి ఏ అధికారం లేదు కాబట్టి ప్రతీ వ్యక్తి తన పైఅధికారులకు లోబడి ఉండాలి. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే.
ROM 13:2 కాబట్టి ఎవరైతే అధికారాన్ని ఎదిరిస్తున్నారో వారు దేవుడు నియమించిన దాన్ని ఎదిరిస్తున్నారు. అలా చేసేవారు తమ మీదకు తామే తీర్పు తెచ్చుకుంటారు.
ROM 13:3 మంచి పనులు చేసేవారిని పరిపాలకులు భయపెట్టరు; అయితే తప్పు చేసే వారికే వారంటే భయం. అధికారంలో ఉన్నవారికి భయపడకుండా ఉండాలంటే మీరు మంచి పనులు చేయాలి.
ROM 13:4 మీ మంచి కోసం అధికారంలో ఉన్నవారు దేవుని సేవకులు. మీరు తప్పు చేస్తే భయపడండి, ఎందుకంటే పరిపాలకులు కారణం లేకుండా ఖడ్గాన్ని పట్టుకోరు. వారు తప్పు చేసేవారిపై కోపాన్ని చూపించి శిక్ష విధించే దేవుని సేవకులు.
ROM 13:5 కాబట్టి, శిక్ష విధించబడుతుందని కాక మనస్సాక్షిని బట్టి మనం అధికారులకు లోబడి ఉండాలి.
ROM 13:6 అధికారులు దేవుని సేవకులు, వారు తమ సమయమంతా పాలనకే ఇస్తారు, అందుకే మనం వారికి పన్నులు చెల్లిస్తున్నాము.
ROM 13:7 మీరు ఎవరికి ఏమి రుణపడి ఉంటే వారికి అది చెల్లించండి: మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటే పన్నులు చెల్లించండి; ఆదాయపన్నైతే ఆదాయపన్ను చెల్లించండి; మర్యాదైతే మర్యాద; గౌరవమైతే గౌరవం ఇవ్వండి.
ROM 13:8 ఇతరులను ప్రేమించేవారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో తప్ప మరి దేనిలో ఎవరికి రుణపడి ఉండవద్దు.
ROM 13:9 “మీరు వ్యభిచారం చేయకూడదు, మీరు హత్య చేయకూడదు, మీరు దొంగతనం చేయకూడదు, ఇతరులదేదీ మీరు ఆశించకూడదు” అనే ఆజ్ఞలు ఇతర ఆజ్ఞలు ఉన్నప్పటికీ అవన్నీ, “మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి” అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి.
ROM 13:10 ప్రేమ పొరుగువారికి హాని కలిగించదు. కాబట్టి ప్రేమ చూపించడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే.
ROM 13:11 ప్రస్తుత సమయాన్ని తెలుసుకుని మీరు నిద్రమత్తు నుండి మేల్కోవలసిన సమయం వచ్చిందని గ్రహించండి. ఎందుకంటే మనం మొదట్లో నమ్మినప్పటి కంటే ఇప్పుడు రక్షణ మరింత సమీపంగా ఉంది.
ROM 13:12 రాత్రి చాలా వరకు గడిచిపోయింది; పగలు దాదాపు వచ్చేసింది. కాబట్టి మనం చీకటి క్రియలు విడిచిపెడదాం, వెలుగు కవచాన్ని ధరించుకుందాము.
ROM 13:13 అతి త్రాగి మత్తులు కావడం, హద్దు అదుపు లేని లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, వ్యభిచారం చేయడం, గొడవపడడం, అసూయపడడం మొదలైన వాటిని విడిచి, పగటివేళ నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాం.
ROM 13:14 మీరు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకోండి, శరీరవాంఛలను ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించకండి.
ROM 14:1 వివాదాస్పదమైన అంశాలపై వాదన పెట్టుకోక విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారిని చేర్చుకోండి.
ROM 14:2 ఒకరేమో తన విశ్వాసాన్నిబట్టి అన్నీ తినవచ్చు అని నమ్ముతున్నారు, మరొకరు తన బలహీనమైన విశ్వాసాన్నిబట్టి కేవలం కూరగాయలే తింటున్నారు.
ROM 14:3 అన్నిటిని తినేవారు అలా తినని వారిని చులకనగా చూడకూడదు, అలాగే అన్నిటిని తిననివారు తినేవారి మీద నింద వేయకూడదు. ఎందుకంటే దేవుడు వారిని అంగీకరించారు.
ROM 14:4 వేరేవాళ్ళ సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవరవు? అతడు నిలబడినా పడిపోయినా అది అతని యజమాని చూసుకుంటాడు. ప్రభువు వారిని నిలబెట్టడానికి శక్తిగలవాడు కాబట్టి వారు నిలబడతారు.
ROM 14:5 ఒకరు ఒక రోజును మరొక రోజు కన్నా మంచిదని భావిస్తారు. మరొకరు అన్ని రోజులు ఒకేలాంటివని భావిస్తారు. వారిరువురు తమ మనస్సుల్లో దానిని పూర్తిగా నమ్ముతారు.
ROM 14:6 ఒక రోజును మంచి రోజుగా భావించేవారు ప్రభువు కొరకే భావిస్తున్నారు. మాంసాన్ని తినేవారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కాబట్టి వారు ప్రభువు కొరకే తింటున్నారు. తిననివారు కూడా ప్రభువు కొరకే తినడం మాని, దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తున్నారు.
ROM 14:7 మనలో ఎవరు కేవలం తన కోసం మాత్రమే జీవించరు, తన కోసం మాత్రమే చావరు.
ROM 14:8 మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే, కాబట్టి మనం జీవించినా మరణించినా ప్రభువుకు చెందినవారమే.
ROM 14:9 ఈ కారణంగానే, చనిపోయినవారికి జీవించి ఉన్నవారికి ప్రభువుగా ఉండడానికి క్రీస్తు మరణించి తిరిగి సజీవంగా లేచారు.
ROM 14:10 అయితే మనమందరం దేవుని న్యాయసింహాసనం ఎదుట నిలబడవలసి ఉండగా మీరు మీ సహోదరీ సహోదరులకు ఎందుకు తీర్పు తీర్చుతున్నారు? మీరు వారిని ఎందుకు తిరస్కరిస్తున్నారు?
ROM 14:11 దీని కోసం లేఖనంలో, “ప్రభువు ఇలా చెప్తున్నారు, ‘నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది’” అని వ్రాయబడి ఉంది.
ROM 14:12 కాబట్టి, మనలో ప్రతి ఒక్కరు మన గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి.
ROM 14:13 కాబట్టి ఒకరిపై ఒకరు తీర్పు తీర్చడం మాని సహోదరి లేదా సహోదరుని మార్గానికి ఆటంకం కలిగించము అని తీర్మానం చేసుకుందాం.
ROM 14:14 సహజంగా ఏదీ అపవిత్రమైనది కాదని యేసు ప్రభువులో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే ఎవరైనా ఒకదాన్ని అపవిత్రమైనదని భావిస్తే వానికి అది అపవిత్రమైనదే.
ROM 14:15 మీరు తినే దాన్ని బట్టి మీ సహోదరి గాని సహోదరుడు గాని బాధపడితే, మీలో ప్రేమ లేదన్నట్టే. ఎవరి కోసమైతే క్రీస్తు చనిపోయాడో వారిని మీరు తినే దాన్ని బట్టి పాడు చేయకు.
ROM 14:16 కాబట్టి మీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు.
ROM 14:17 దేవుని రాజ్యం తినడం త్రాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం.
ROM 14:18 ఎందుకంటే క్రీస్తుకు సేవ చేసేవారు దేవునికి ఇష్టులును మానవుల దృష్టికి యోగ్యులుగా ఉన్నారు.
ROM 14:19 కాబట్టి మనకు సమాధానాన్ని, పరస్పర వృద్ధిని కలిగించే దానినే మనం చేద్దాం.
ROM 14:20 ఆహారం గురించి దేవుని పనిని నాశనం చేయవద్దు. ఆహారమంతా శుభ్రమైనదే, కాని ఒకరు తినేది మరొకరికి ఆటంకాన్ని కలిగిస్తే అది తప్పవుతుంది.
ROM 14:21 మాంసం తినడం గాని మద్యం త్రాగడం గాని లేదా మరేదైనా మీ సహోదరులకు సహోదరీలకు ఆటంకంగా ఉంటే అది చేయకపోవడమే మంచిది.
ROM 14:22 వీటి గురించి మీకున్న నమ్మకాన్ని మీకు దేవునికి మధ్యనే ఉండనివ్వండి. తాను అంగీకరించిన వాటిని బట్టి తనకు తాను తీర్పు తీర్చుకొననివారు దీవించబడినవారు.
ROM 14:23 అయితే సందేహంతో తినేవారు విశ్వాసం లేకుండా తింటారు కాబట్టి శిక్ష పొందుతారు. విశ్వాసం లేకుండా చేసే ప్రతిదీ పాపమే అవుతుంది.
ROM 15:1 బలవంతులమైన మనం, మనల్ని మనం సంతోషపరచుకోవడం కాక బలహీనులైన వారి దోషాలను భరించవలసినవారిగా ఉన్నాము.
ROM 15:2 మనలో ప్రతి ఒక్కరూ తన పొరుగువారు వృద్ధిచెందేలా, వారి మంచి కోసం వారిని సంతోషపెట్టాలి.
ROM 15:3 క్రీస్తు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కాని, “నిన్ను అవమానపరిచేవారి అవమానాలు నాపై పడ్డాయి” అని లేఖననాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన వాటిని అనుభవించారు.
ROM 15:4 గతంలో వ్రాయబడిన సంగతులన్ని, లేఖనాల్లో బోధించబడిన ఓర్పు ద్వారా అవి ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండడం కోసం మనకు బోధించడానికి వ్రాయబడ్డాయి.
ROM 15:5 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవున్ని మీరు ఒకే మనస్సుతో ఒకే స్వరంతో మహిమపరిచేలా,
ROM 15:6 మనకు ఓర్పును ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుడు క్రీస్తు యేసు కలిగి ఉన్న వైఖరి మనం ఒకరిపట్ల ఒకరం కలిగి ఉండేలా మనకు అనుగ్రహించును గాక.
ROM 15:7 క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్టుగా దేవునికి మహిమ కలిగేలా మీరు కూడా ఒకరిని ఒకరు అంగీకరించండి.
ROM 15:8 పితరులకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి ఆయనను మహిమపరచడానికి, క్రీస్తు యూదుల సేవకుడిగా మారారని నేను మీకు చెప్తున్నాను. దీని విషయమై లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: “కాబట్టి నేను నిన్ను యూదేతరుల మధ్యలో ఘనపరుస్తాను. నీ నామాన్ని గురించి స్తుతులు పాడతాను.”
ROM 15:10 అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.”
ROM 15:11 మరియొక చోట, “యూదేతరులారా, ప్రభువును స్తుతించండి; సర్వ జనులు ఆయనను కీర్తించుదురు గాక.”
ROM 15:12 మరోచోట యెషయా ఇలా చెప్పాడు, “యెష్షయి వేరు నుండి చిగురు వస్తుంది అంటే జనాల మీద రాజ్యం చేసేవాడు వస్తాడు, యూదేతరులంతా ఆయనలో నిరీక్షణ కలిగి ఉంటారు.”
ROM 15:13 పరిశుద్ధాత్మ శక్తిచేత మీరు అత్యధికమైన నిరీక్షణను కలిగి ఉండేలా నిరీక్షణకర్తయైన దేవుడు, మీరు ఆయనలో నమ్మకముంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపును గాక.
ROM 15:14 నా సహోదరీ సహోదరులారా, మీరందరు మంచితనంతో నిండినవారై, జ్ఞానం కలిగి ఒకరికి ఒకరు బోధించుకోడానికి సమర్ధులని నేను నమ్ముతున్నాను.
ROM 15:15 అయినా నేను కొన్ని విషయాలు మళ్ళీ గుర్తుచేయాలని చాలా ధైర్యంగా మీకు వ్రాస్తున్నాను, ఎందుకంటే నాకు ఇవ్వబడిన దేవుని కృపను బట్టి నేను యూదేతరులకు యేసు క్రీస్తు పరిచారకునిగా ఉన్నాను. పరిశుద్ధాత్మచేత పరిశుద్ధపరచబడి దేవునికి అంగీకారయోగ్యమైన అర్పణగా యూదేతరులు మారేలా దేవుని సువార్తను ప్రకటించడమనే యాజక ధర్మాన్ని ఆయన నాకు ఇచ్చారు.
ROM 15:17 అందువల్ల నేను దేవునికి చేస్తున్న సేవను బట్టి క్రీస్తు యేసులో అతిశయపడుతున్నాను.
ROM 15:18 పరిశుద్ధాత్మ శక్తిచేత నేను చెప్పిన మాటలు, చేసిన క్రియలు, అద్భుతాలు, సూచక క్రియల ద్వారా యూదేతరులను దేవునికి విధేయత చూపించేలా నడిపించడంలో క్రీస్తు నా ద్వారా నెరవేర్చిన దానిని గురించి తప్ప నేను దేని గురించి మాట్లాడడానికి సాహసించను.
ROM 15:19 కాబట్టి యెరూషలేము నుండి ఇల్లూరికు వరకు ఉన్న అన్ని ప్రదేశాల్లో క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించాను.
ROM 15:20 మరొకరు వేసిన పునాది మీద నేను కట్టకూడదని క్రీస్తు గురించి తెలియని చోట్ల సువార్త ప్రకటించాలనేది ఎల్లప్పుడు నా ఆశగా ఉండింది.
ROM 15:21 ఎందుకంటే, ఇలా వ్రాయబడి ఉంది: “ఆయన గురించి ఎవరికి చెప్పబడలేదో వారు చూస్తారు, ఆయన గురించి ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు.”
ROM 15:22 దీనిబట్టే నేను మీ దగ్గరకు రాకుండా చాలాసార్లు నాకు ఆటంకాలు ఎదురయ్యాయి.
ROM 15:23 అయితే ఇప్పుడు ఈ ప్రాంతాల్లో నేను పని చేయడానికి నాకిక స్థలమేమి లేదు. మిమ్మల్ని దర్శించాలని ఎన్నో సంవత్సరాలుగా నేను ఆశపడుతున్నాను.
ROM 15:24 కాబట్టి నేను స్పెయినుకు వెళ్లేటప్పుడు అక్కడికి రావాలని ఆలోచిస్తున్నాను. నేను ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మిమ్మల్ని చూడాలని కొంతకాలం మీ సహవాసంలో ఆనందించిన తర్వాత అక్కడినుండి మీరు నన్ను సాగనంపాలని ఆశిస్తున్నాను.
ROM 15:25 అయితే ఇప్పుడు, నేను యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు సేవ చేయడానికి అక్కడికి వెళ్తున్నాను.
ROM 15:26 యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల మధ్యలో ఉన్న పేదవారికి సహాయం చేయడానికి మాసిదోనియా అకాయ వారు కొంత విరాళాన్ని ఇవ్వడానికి సంతోషించారు.
ROM 15:27 వారు దాన్ని సంతోషంతో చేశారు. నిజానికి వారు వీరికి రుణపడి ఉన్నారు. ఎలాగంటే యూదేతరులు యూదుల ఆత్మ సంబంధమైన దీవెనలను పంచుకున్నారు కాబట్టి తమ భౌతిక సంబంధమైన దీవెనలను యూదులతో పంచుకుని వారు రుణపడి ఉన్నారు.
ROM 15:28 నేను ఈ పనిని ముగించాక ఖచ్చితంగా విరాళం వారికందించి, తర్వాత అక్కడినుండి స్పెయినుకు బయలుదేరి మార్గంలో మిమ్మల్ని కలుస్తాను.
ROM 15:29 నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు క్రీస్తు పరిపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.
ROM 15:30 సహోదరీ సహోదరులారా, నా కోసం దేవునికి ప్రార్థించడం ద్వారా మీరు కూడా నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టి ఆత్మలోని ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను.
ROM 15:31 యూదయలో ఉన్న అవిశ్వాసుల నుండి నేను తప్పించుకునేలా, యెరూషలేముకు నేను తీసుకెళ్తున్న విరాళాన్ని అక్కడ ఉన్న పరిశుద్ధులు సంతోషంగా స్వీకరించేలా ప్రార్థించండి.
ROM 15:32 అప్పుడు నేను దేవుని చిత్తమైతే సంతోషంగా మీ దగ్గరకు వచ్చి మీ సహవాసంలో విశ్రాంతి తీసుకుంటాను.
ROM 15:33 సమాధానకర్తయైన దేవుడు మీ అందరితో ఉండును గాక. ఆమేన్.
ROM 16:1 కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలైన మన సహోదరి ఫీబే గురించి మీకు ఆజ్ఞ ఇస్తున్నాను.
ROM 16:2 నేను మిమ్మల్ని కోరేదేంటంటే ఆమెను ఆయన ప్రజలకు తగినట్లు ప్రభువులో చేర్చుకొని, ఆమెకు ఏమైనా సహాయం అవసరమైతే చేయండి. ఎందుకంటే ఆమె నాతో పాటు అనేకమందికి ప్రయోజనకరంగా ఉంది.
ROM 16:3 యేసు క్రీస్తులో నా తోటిపనివారైన అకుల ప్రిస్కిల్లకు వందనాలు తెలియజేయండి.
ROM 16:4 వారు నా కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు. నేనే కాదు యూదేతరుల సంఘాల వారందరు వారికి కృతజ్ఞులై ఉన్నారు.
ROM 16:5 అలాగే వారి ఇంట్లో కూడుకునే సంఘానికి కూడా వందనాలు తెలియజేయండి. ఆసియా ప్రాంతంలో మొదటిగా క్రీస్తును అంగీకరించిన నా స్నేహితుడైన ఎపైనెటుకు వందనాలు తెలియజేయండి.
ROM 16:6 మీ కోసం ఎంతో కష్టపడిన మరియకు వందనాలు తెలియజేయండి.
ROM 16:7 నా తోటి ఖైదీలు అంద్రొనీకు, యూనీయలకు శుభాలు చెప్పండి. వీరు అపొస్తలుల్లో పేరు పొందినవారు, నాకంటే ముందు క్రీస్తులో ఉన్నవారు.
ROM 16:8 ప్రభువులో నాకు ప్రియ స్నేహితుడైన అంప్లీయతుకు వందనాలు తెలియజేయండి.
ROM 16:9 క్రీస్తులో మన తోటిపనివాడైన ఊర్బాను నా ప్రియ స్నేహితుడైన స్టాకులకు వందనాలు తెలియజేయండి.
ROM 16:10 క్రీస్తులోని విశ్వాసానికి పరీక్షను ఎదుర్కొని నిలబడిన అపెల్లెకు వందనాలు తెలియజేయండి. అరిస్టొబూలు కుటుంబానికి చెందిన వారికి వందనాలు తెలియజేయండి.
ROM 16:11 నా తోటి యూదుడైన హెరోదియోనుకు వందనాలు తెలియజేయండి. నార్కిస్సు కుటుంబంలో ప్రభువులో ఉన్నవారందరికి వందనాలు తెలియజేయండి.
ROM 16:12 ప్రభువులో ప్రయాసపడిన స్త్రీలు త్రుపైనాకు త్రుఫోసాలకు వందనాలు తెలియజేయండి. ప్రభువులో ఎంతో కష్టపడిన నా స్నేహితురాలైన పెర్సిసుకు వందనాలు తెలియజేయండి.
ROM 16:13 ప్రభువులో ఏర్పరచబడిన రూఫసుకు అతని తల్లికి వందనాలు తెలియజేయండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిదే.
ROM 16:14 అసుంక్రితు, ప్లెగోను, హెర్మెసు, పత్రొబ, హెర్మా, వారితో పాటు ఉంటున్న సహోదరీ సహోదరులకు వందనాలు తెలియజేయండి.
ROM 16:15 పిలొలొగు, జూలియా, నేరియ, అతని సహోదరి ఒలింపాకు, వారితో పాటు ఉన్న పరిశుద్ధులందరికి వందనాలు తెలియజేయండి.
ROM 16:16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనాలు తెలియజేసుకోండి. క్రీస్తు సంఘాలన్ని మీకు వందనాలు తెలియజేస్తున్నాయి.
ROM 16:17 సహోదరీ సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధలకు వ్యతిరేకంగా మీ మార్గాల్లో ఆటంకాలు కలిగిస్తూ భేదాలు పుట్టించేవారిని జాగ్రత్తగా గమనించమని వేడుకుంటున్నాను. వారికి దూరంగా ఉండండి.
ROM 16:18 ఎందుకంటే అలాంటివారు మన ప్రభువైన క్రీస్తును సేవించరు కాని తమ ఆకలినే తీర్చుకుంటారు. వారు మృదువైన మాటలతో పొగడ్తలతో అమాయకులైనవారి మనస్సులను మోసం చేస్తారు.
ROM 16:19 మీ విధేయత గురించి ప్రతి ఒక్కరు విన్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అయితే మీరు మంచి విషయంలో జ్ఞానులుగా, చెడు విషయంలో నిర్దోషులుగా ఉండాలని నేను కోరుతున్నాను.
ROM 16:20 సమాధానకర్తయైన దేవుడు త్వరలో తన పాదాల క్రింద సాతానును నలిపివేస్తారు. మన ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక.
ROM 16:21 నా సహపనివాడైన తిమోతి అలాగే నా తోటి యూదులైన లూకియా, యూసోను, సోసిపత్రు అనేవారు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు.
ROM 16:22 ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు వందనాలు తెలియజేస్తున్నాను.
ROM 16:23 నేను అలాగే సంఘమంతా ఆనందించేలా ఆతిథ్యమిచ్చే గాయి మీకు వందనాలు తెలియజేస్తున్నాడు. ఈ పట్టణ ప్రభుత్వ కార్యకలాపాలకు అధికారిగా ఉన్న ఎరస్తు, మన సహోదరుడైన క్వర్తు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు.
ROM 16:24 మన ప్రభువైన యేసు కృప మీ అందరితో ఉండును గాక ఆమేన్.
ROM 16:25 యూదేతరులంతా విశ్వాసానికి విధేయులు కావాలని, అనాది కాలం నుండి రహస్యంగా దాచబడి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం వ్రాయబడిన ప్రవచనాత్మక లేఖనాల ద్వారా ఇప్పుడు వారికి తెలియపరచబడింది. ఆ మర్మానికి అనుగుణంగా నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకారం మిమ్మల్ని స్థిరపరచగల సమర్థుడును ఏకైక జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా శాశ్వత మహిమ కలుగును గాక! ఆమేన్.
1CO 1:1 దేవుని చిత్తం ద్వారా క్రీస్తు యేసుని అపొస్తలునిగా ఉండడానికి పిలువబడిన పౌలు, మన సహోదరుడైన సొస్తెనేసు,
1CO 1:2 క్రీస్తు యేసులో పవిత్రపరచబడి పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి పిలువబడిన వారితో పాటు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట ప్రతిచోట ప్రార్థించే కొరింథీలోని దేవుని సంఘస్థులందరికీ శుభమని చెప్పి వ్రాయునది:
1CO 1:3 మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక.
1CO 1:4 క్రీస్తు యేసులో దేవుని కృప మీకు ఇవ్వబడింది కాబట్టి మీ కోసం నా దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
1CO 1:5 దేవుడు క్రీస్తు గురించి మా సాక్ష్యాన్ని మీ మధ్య స్థిరపరస్తున్నారు కాబట్టి,
1CO 1:6 మీరు ఆయనలో సమస్త జ్ఞానంలోను సమస్త ఉపదేశంలోను ఐశ్వర్యవంతులు అయ్యారు.
1CO 1:7 కాబట్టి మీరు ఏ కృపావరంలో లోటు లేకుండా మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
1CO 1:8 ఆ దేవుడే మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడే రోజున, మీరు నిరపరాధులుగా ఉండాలని అంతం వరకు మిమ్మల్ని స్థిరపరుస్తారు.
1CO 1:9 తన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.
1CO 1:10 సహోదరీ సహోదరులారా, మీ మధ్య భేదాలు లేకుండ మీ మనస్సులోను ఆలోచనలోను పరిపూర్ణ ఏకత్వంతో ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.
1CO 1:11 నా సహోదరీ సహోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారిలో కొందరు నాకు తెలియజేశారు.
1CO 1:12 నేను చెప్పేది ఏంటంటే: మీలో “నేను పౌలును అనుసరిస్తున్నానని” ఒకరు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” వేరొకరు, “నేను కేఫాను అనుసరిస్తున్నానని” మరొకరు, “నేను క్రీస్తును అనుసరిస్తున్నానని” మరి ఇంకొకరు చెప్పుకుంటున్నారని విన్నాను.
1CO 1:13 క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కోసం సిలువ వేయబడ్డాడా? మీరు పౌలు పేరట బాప్తిస్మం పొందారా?
1CO 1:14 నా పేరట బాప్తిస్మం పొందామని మీరు ఎవరూ చెప్పుకోకూడదని క్రిస్పుకు గాయికు తప్ప మరి ఎవరికీ నేను బాప్తిస్మం ఇవ్వనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
1CO 1:16 అవును! స్తెఫెను ఇంటివారికి బాప్తిస్మం ఇచ్చాను, దానికి మించి ఎవరికి కూడా బాప్తిస్మం ఇచ్చినట్టు నాకు గుర్తులేదు.
1CO 1:17 ఎందుకంటే, క్రీస్తు నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి పంపలేదు కానీ, క్రీస్తు సిలువ తన శక్తి కోల్పోకుండా ఉండాలని, జ్ఞానంతో వాక్చాతుర్యంతో కాకుండ సువార్తను ప్రకటించడానికే ఆయన నన్ను పంపించారు.
1CO 1:18 ఎందుకంటే సిలువను గురించిన సువార్త నశించేవారికి పిచ్చితనంగా ఉంది, కానీ రక్షించబడే మనకు అది దేవుని శక్తి.
1CO 1:19 దీని గురించి వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, “జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను; వివేకవంతుల తెలివిని వ్యర్థం చేస్తాను.”
1CO 1:20 జ్ఞాని ఎక్కడ? ధర్మశాస్త్ర బోధకుడు ఎక్కడ? ఈ కాలపు పండితుడు ఎక్కడ? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు కదా?
1CO 1:21 దేవుని జ్ఞానం ప్రకారం, లోకం తన జ్ఞానంతో దేవునిని తెలుసుకోలేదు. సువార్తను ప్రకటించే వెర్రితనం ద్వారా నమ్మినవారిని రక్షించడం దేవునికి ఇష్టమైనది.
1CO 1:22 యూదులు సూచనలు అడుగుతారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం కోసం వెదుకుతారు.
1CO 1:23 అయితే మేము సిలువవేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం: ఆయన యూదులకు ఆటంకంగా యూదేతరులకు వెర్రితనంగా ఉన్నారు.
1CO 1:24 అయితే యూదులలో గ్రీసు దేశస్థులలో దేవునిచే పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిగా, దేవుని జ్ఞానంగా ఉన్నారు.
1CO 1:25 ఎందుకంటే, దేవుని వెర్రితనం మనుష్యుల జ్ఞానం కంటే జ్ఞానవంతమైనది, దేవుని బలహీనత మనుష్యుల బలం కంటే బలమైనది.
1CO 1:26 సహోదరీ సహోదరులారా, మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. లోకపు దృష్టిలో మీలో చాలామంది జ్ఞానులు కారు, ఘనులు కారు, గొప్ప వంశంలో పుట్టిన వారు కారు.
1CO 1:27 అయితే, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలోని బుద్ధిహీనులను దేవుడు ఎన్నుకున్నారు; బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలోని బలహీనులను దేవుడు ఎన్నుకున్నారు.
1CO 1:28 ఎవరూ దేవుని ముందు తనను తాను హెచ్చించుకోకుండా ఉండడానికి, ఎన్నికచేయబడిన వారిని వ్యర్థం చేయడానికి ఈ లోకంలో నీచమైన వారిని, నిర్లక్ష్యం చేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు.
1CO 1:30 దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు.
1CO 1:31 కాబట్టి, “గర్వించేవారు ప్రభువులోనే గర్వించాలి” అని వ్రాయబడి ఉంది.
1CO 2:1 సహోదరీ సహోదరులారా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని మానవ తెలివితేటలతో గాని దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు.
1CO 2:2 నేను మీతో ఉన్నప్పుడు సిలువవేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేని గురించి తెలియజేయకూడదని నిర్ణయించుకున్నాను.
1CO 2:3 నేనైతే బలహీనతలో, అధిక భయంతో వణుకుతో మీ దగ్గరకు వచ్చాను.
1CO 2:4 మీ విశ్వాసం మనుష్యల జ్ఞానం మీద కాకుండా దేవుని శక్తి మీదే ఆధారపడాలని, నా మాటలు నా బోధలు జ్ఞానంతో వాక్చాతుర్యంతో కాకుండా పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉన్నాయి.
1CO 2:6 అయితే పరిపూర్ణులైనవారి మధ్యలో మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాము. అది ఈ యుగసంబంధమైన జ్ఞానం కాదు, వ్యర్థమైపోయే ఈ లోక అధికారుల జ్ఞానం కాదు.
1CO 2:7 అయితే, మేము దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాము. అది ఈ లోకం ఉనికిలోనికి రాకముందే, దేవుడు రహస్యంగా మన ఘనత కోసం దాచియుంచిన మర్మం.
1CO 2:8 దీని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారులలో ఎవరికి తెలియలేదు. అది వారికి తెలిసి ఉంటే వారు మహిమా స్వరూపియైన ప్రభువును సిలువ వేసి ఉండేవారు కారు.
1CO 2:9 అయితే దీని గురించి: “ఎవరూ చూడని ఎవరూ వినని ఏ మనుష్యుని మనస్సు ఊహించనివాటిని దేవుడు తనను ప్రేమించేవారి కోసం సిద్ధపరచారు” అని వ్రాయబడి ఉంది.
1CO 2:10 ఈ విషయాలను దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేశారు. ఆత్మ అన్నిటిని, దేవుని లోతైన సంగతులను కూడ పరిశోధిస్తుంది.
1CO 2:11 ఎందుకంటే ఒకరి మనస్సులోని ఆలోచనలు వారికి తప్ప మరి ఎవరికి తెలుస్తాయి? అలాగే దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు.
1CO 2:12 దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని తెలుసుకోవడానికి, మనం ఈ లోక ఆత్మను కాకుండా దేవుని నుండి వచ్చిన ఆత్మనే పొందుకున్నాము.
1CO 2:13 మానవ జ్ఞానం మాకు నేర్పే మాటలతో కాకుండా, ఆత్మ నేర్పించిన మాటలతోనే మేము మాట్లాడుతున్నాం, ఆ మాటలతోనే ఆత్మీయ సత్యాలను వివరిస్తున్నాము.
1CO 2:14 అయితే ప్రకృతి సంబంధులైన వారు దేవుని ఆత్మ నుండి వచ్చిన వాటిని అంగీకరించలేరు, వాటిని కేవలం ఆత్మ ద్వారానే గ్రహించగలం కాబట్టి, అవి వారికి వెర్రితనంగా అనిపిస్తాయి; వారు వాటిని గ్రహించలేరు.
1CO 2:15 ఆత్మను అనుసరించి నడుచుకొనేవారు అన్నిటి గురించి వివేచిస్తారు కాని వారు ఎవరిచేత వివేచించబడరు.
1CO 2:16 ఎందుకంటే, “ప్రభువు మనస్సును తెలుసుకున్న వారెవరు? ఆయనకు బోధింప గలవారెవరు?” మనమైతే క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము.
1CO 3:1 సహోదరీ సహోదరులారా, ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్లు మీతో నేను మాట్లాడలేకపోయాను. ఎందుకంటే మీరు ఇంకా ఈ లోక సంబంధులుగానే జీవిస్తూ క్రీస్తులో పసిబిడ్డలుగానే ఉన్నారు.
1CO 3:2 మీరు బలమైన ఆహారాన్ని తినడానికి సిద్ధంగా లేరు కాబట్టి నేను మీకు పాలు ఇచ్చాను. ఇప్పుడు కూడా మీరు దానికి సిద్ధంగా లేరు.
1CO 3:3 మీరు ఇంకా లోకస్థులుగానే ఉన్నారు. మీలో అసూయ, కొట్లాటలు ఉన్నాయి. కాబట్టి మీరు శరీర స్వభావంతో సాధారణ మానవుల్లా జీవించడం లేదా?
1CO 3:4 మీలో, “నేను పౌలును అనుసరిస్తున్నాను” అని ఒకరు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నాను” అని ఇంకొకరు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మీరు సాధారణ మానవుల్లా లేరా?
1CO 3:5 అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? కేవలం సేవకులే కదా! ఒక్కొక్కరికి ప్రభువు నియమించిన దాని ప్రకారం, వారి ద్వారా మీరు విశ్వాసంలోనికి వచ్చారు.
1CO 3:6 నేను విత్తనం నాటాను, అపొల్లో దానికి నీళ్లు పోశాడు, అయితే వృద్ధి కలుగచేసింది దేవుడే.
1CO 3:7 కాబట్టి నాటేవారిలో కానీ, నీళ్లు పోసేవారిలో కానీ గొప్పతనం ఏమి లేదు, కానీ దేవుడే దానిని వృద్ధి చేయగలరు.
1CO 3:8 నాటేవారు, నీళ్లు పోసేవారు ఒకే ఉద్దేశం కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరు తాను చేసిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.
1CO 3:9 కాబట్టి మేము దేవుని సేవలో జతపనివారము: మీరు దేవుని పొలంగా దేవుని కట్టడంలా ఉన్నారు.
1CO 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను తెలివైన నిర్మాణకునిగా పునాది వేశాను. అలాగే మరొకరు దాని మీద కడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కట్టాలి.
1CO 3:11 ఎందుకంటే అప్పటికే వేయబడిన పునాది తప్ప మరొకటి ఎవరూ వేయలేరు, ఆ పునాది యేసు క్రీస్తే.
1CO 3:12 ఎవరైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్లు, చెక్క, ఎండుగడ్డి లేదా గడ్డి లాంటి వస్తువులతో కడితే,
1CO 3:13 ఆ న్యాయ దినాన వారు చేసిన పని వెలుగులో స్పష్టంగా కనబడుతుంది. అది అగ్నిచేత నిరూపించబడుతుంది, అందరి పనిలోని నాణ్యత అగ్నిచేత పరీక్షించబడుతుంది.
1CO 3:14 పునాది మీద కట్టిన పని ఎవరిది నిలుస్తుందో, వారు జీతాన్ని పొందుతారు.
1CO 3:15 అది కాల్చి వేయబడితే దానిని కట్టిన వారికి నష్టం కలుగుతుంది కానీ వారు తప్పించుకుంటారు. అయితే అది కేవలం మంటల్లో నుండి తప్పించుకున్నట్లుగా ఉంటారు.
1CO 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా?
1CO 3:17 ఎవరైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే, దేవుడు వారిని పాడుచేస్తారు. ఎందుకంటే దేవుని మందిరం పరిశుద్ధమైనది. మీరందరు కలిసి ఆ ఆలయమై ఉన్నారు.
1CO 3:18 మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఈ లోకరీతిగా, మీలో ఎవరైనా నేను జ్ఞానినని అనుకుంటే, వారు జ్ఞాని అవ్వడానికి “బుద్ధిలేనివారిగా” కావాలి.
1CO 3:19 ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనము. లేఖనాల్లో: “జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు” అని వ్రాయబడి ఉంది.
1CO 3:20 లేఖనాల్లో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవి అని దేవునికి తెలుసు” అని వ్రాయబడి ఉంది.
1CO 3:21 కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే.
1CO 3:22 పౌలు అయినా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడు ఉన్న వాటిలోనైనా, రాబోయే వాటిలోనైనా అన్ని మీకు చెందినవే.
1CO 3:23 మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవారు.
1CO 4:1 అందుచేత, క్రీస్తు సేవకులుగా దేవుని మర్మాలను తెలియజేసే బాధ్యత పొందినవారిగా మమ్మల్ని మీరు భావించాలి.
1CO 4:2 ఆ బాధ్యతను పొందినవారు నమ్మకమైనవారిగా రుజువుపరచుకోవటం చాలా అవసరము.
1CO 4:3 మీ చేత గాని ఇతరులచేత గాని నేను తీర్పు తీర్చబడటం నాకు చాలా చిన్న విషయము. నిజానికి, నన్ను నేనే విమర్శించుకోను.
1CO 4:4 నా మనస్సాక్షి నిర్దోషమైనది, అయినా నేను నిర్దోషి అని కాదు నన్ను తీర్పు తీర్చేది ప్రభువే.
1CO 4:5 అందుకే నిర్ణీత సమయం రాకముందే తీర్పు తీర్చవద్దు, ప్రభువు వచ్చేవరకు ఆగాలి. చీకటిలో దాచబడిన రహస్యాలను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఉద్దేశాలను ఆయనే బయటపెడతారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు దేవుని నుండి తమ ఘనతను పొందుకొంటారు.
1CO 4:6 సహోదరీ సహోదరులారా, “వ్రాయబడిన వాటిని మించి వెళ్లవద్దు” అని చెప్పబడిన మాట భావాన్ని మా నుండి మీరు నేర్చుకోగలిగేలా, మీకు మేలు కలుగడానికి ఈ విషయాలను నా గురించి అపొల్లో గురించి ఉదాహరణగా చెప్పాను. అప్పుడు మమ్మల్ని అనుసరించే వారిగా మీరు ఒకరిపై ఒకరు అతిశయపడకుండా ఉంటారు.
1CO 4:7 ఇతరులకంటే నిన్ను ప్రత్యేకంగా చేసేది ఎవరు? ఇతరుల నుండి నీవు పొందనిది నీ దగ్గర ఏమి ఉంది? నీవు ఇతరుల నుండి పొంది కూడా పొందని వానిలా గొప్పలు చెప్పుకోవడం ఎందుకు?
1CO 4:8 ఇప్పటికే మీకు కావలసినవన్ని మీరు కలిగి ఉన్నారు! మీరు ధనవంతులైయ్యారు! మేము లేకుండానే మీరు పరిపాలించడం ప్రారంభించారు! మేము కూడా మీతో కలిసి పరిపాలించేలా మీరు నిజంగా పరిపాలించడం నాకు సంతోషమే!
1CO 4:9 దేవుడు అపొస్తలులమైన మమ్మల్ని మరణశిక్ష విధించబడినవారి వరుసలో అందరికంటే చివరిగా ఉంచాడని నాకు అనిపిస్తుంది. మేము లోకమంతటికి, దేవదూతలకు అదే విధంగా మనుష్యులకు ఒక వింతగా ఉన్నాము.
1CO 4:10 మేము క్రీస్తు కోసం బుద్ధిహీనులం, కాని మీరు క్రీస్తులో తెలివైనవారు! మేము బలహీనులం, కాని మీరు బలవంతులు! మీరు గౌరవం పొందారు, మేము అవమానం పొందాం!
1CO 4:11 ఈ సమయం వరకు ఆకలిదప్పులతో అలమటించాము, చింపిరి గుడ్డలతో ఉన్నాము, క్రూరంగా కొట్టబడ్డాము, నిరాశ్రయులుగా ఉన్నాము.
1CO 4:12 మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాము. మమ్మల్ని శపించినవారిని మేము దీవిస్తున్నాము; మమ్మల్ని హింసించినప్పుడు ఓర్చుకుంటున్నాము,
1CO 4:13 మమ్మల్ని దూషించినప్పుడు, దయతో సమాధానం చెప్తున్నాము. ఇప్పటివరకు మేము భూమి మీద నీచులుగా, లోకంలో పెంటకుప్పగా ఉన్నాము.
1CO 4:14 మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ, నా ప్రియమైన పిల్లలుగా మిమ్మల్ని హెచ్చరించాలని ఈ మాటలు వ్రాస్తున్నాను.
1CO 4:15 క్రీస్తులో మీకు పదివేలమంది ఉపదేశకులు ఉన్నా, తండ్రులు అనేకులు లేరు. కాబట్టి క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మీకు తండ్రినయ్యాను.
1CO 4:16 కాబట్టి, నన్ను అనుకరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
1CO 4:17 ఈ కారణంగా, ప్రభువులో నమ్మకమైనవాడు నేను ప్రేమించే నా కుమారుడైన తిమోతిని మీ దగ్గరకు పంపాను. ప్రతి సంఘంలో ప్రతిచోట నేను బోధించిన దానితో ఏకీభవించే యేసు క్రీస్తులో నా జీవన విధానాన్ని అతడు మీకు జ్ఞాపకం చేస్తాడు.
1CO 4:18 నేను మీ దగ్గరకు రాననుకొని మీలో కొందరు గర్విస్తున్నారు.
1CO 4:19 అయితే, ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ దగ్గరకు వస్తాను. ఆ గర్విష్ఠులు మాట్లాడే మాటలనే కాకుండా వారికి ఏ శక్తి ఉందో తెలుసుకుంటాను.
1CO 4:20 దేవుని రాజ్యం అంటే వట్టిమాటలు కాదు అది శక్తితో కూడింది.
1CO 4:21 మీరేది కోరుతున్నారు? నేను మీ దగ్గరకు క్రమశిక్షణ అనే బెత్తంతో రావాలా? లేదా నేను ప్రేమతో సౌమ్యమైన మనస్సుతో రావాలా?
1CO 5:1 మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాము. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట కదా! ఇలాంటి వ్యభిచారం దేవుని ఎరుగనివారు కూడా సహించరు.
1CO 5:2 ఇలా ఉండి కూడా మీరు గర్విస్తున్నారా! నిజానికి ఈ విషయం గురించి మీరు దుఃఖించి ఈ పని చేసిన వానిని మీ సహవాసం నుండి వెలివేయాలి కదా!
1CO 5:3 నా మట్టుకైతే, నేను శారీరకంగా మీతో అక్కడ లేకపోయినా నా ఆత్మలో నేను మీతోనే ఉన్నాను. కాబట్టి మీతో ఉన్న వానిగానే మన ప్రభువైన యేసు నామంలో ఈ పని చేసిన వాని మీద తీర్పు ఇదివరకే తెలియజేశాను.
1CO 5:4 ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమకూడినప్పుడు ప్రభువైన యేసు శక్తి ద్వారా నేను ఆత్మలో మీతో ఉన్నాను.
1CO 5:5 కాబట్టి ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడేలా వాని శరీరం నశించడానికి వానిని సాతానుకు అప్పగించాలి.
1CO 5:6 మీరు ఆ విషయంలో గర్వించడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమే అయినా మొత్తం పిండిని పులియజేస్తుందని మీకు తెలుసు కదా!
1CO 5:7 క్రీస్తు అనే మన పస్కా గొర్రెపిల్ల మీ కోసం వధించబడి ప్రాయశ్చిత్తం చేశారు కాబట్టి మీరు పులియని క్రొత్త పిండి ముద్దగా ఉండడానికి పులిసిన పాత పిండిని పారవేయండి.
1CO 5:8 కాబట్టి అసూయ, దుర్మార్గం అనే పులిసిన పాత పిండితో కాకుండా నిజాయితీ సత్యమనే పులియని రొట్టెతో పస్కా పండుగ ఆచరిద్దాము.
1CO 5:9 లైంగిక దుర్నీతి కలిగినవారితో సహవాసం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాశాను.
1CO 5:10 అయితే నేను, ఈ లోకపు వ్యభిచారులతో గాని, అత్యాశపరులతో గాని, మోసం చేసేవారితో గాని, విగ్రహారాధికులతో గాని ఏమాత్రం కలిసి ఉండవద్దని చెప్పడం లేదు, అలాగైతే మీరు లోకాన్నే విడిచి వెళ్లవలసి ఉంటుంది కదా!
1CO 5:11 ఇప్పుడైతే, సహోదరి అని సహోదరుడని పిలువబడే సంఘసభ్యుల గురించి వ్రాస్తున్నాను. ఎవరైనా వ్యభిచారిగా, అత్యాశపరునిగా, విగ్రహారాధికునిగా లేదా నిందలువేసే వారిగా, త్రాగుబోతుగా లేదా మోసగానిగా ఉంటే అలాంటి వారితో కలిసి ఉండవద్దు. అలాంటి వారితో భోజనం కూడా చేయవద్దని మీకు వ్రాస్తున్నాను.
1CO 5:12 సంఘానికి బయట ఉన్నవారిని విమర్శించడం నాకెందుకు? మీకు సంఘసభ్యులను తీర్చు తీర్చే బాధ్యత లేదా?
1CO 5:13 సంఘం బయటివారికి దేవుడే తీర్పు తీరుస్తారు. కాబట్టి వాక్యంలో ఉన్నట్లు, “ఆ దుష్టున్ని మీ మధ్య నుండి వెలివేయండి.”
1CO 6:1 మీలో ఒకరితో ఒకరికి తగాదాలు ఉన్నప్పుడు దానిని పరిశుద్ధుల ముందుకు వెళ్లడానికి బదులు భక్తిహీనులైనవారి ముందుకు న్యాయం కోసం దాన్ని తీసుకెళ్తారా?
1CO 6:2 పరిశుద్ధులే ఈ లోకానికి న్యాయం తీర్చుతారని మీకు తెలియదా? మీరు లోకానికి తీర్పు తీర్చేవారైతే చిన్న చిన్న తగాదాలను మీరు పరిష్కరించుకోలేరా?
1CO 6:3 మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ లోకసంబంధమైన విషయాలను గురించి మరి బాగా తీర్పు తీర్చవచ్చు కదా!
1CO 6:4 కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి విషయాల్లో తగాదాలు ఉంటే, వాటిని పరిష్కరించమని సంఘంలో తిరస్కరించబడిన వారిని అడుగుతారా?
1CO 6:5 మీరు సిగ్గుపడాలని ఇలా చెప్తున్నాను. విశ్వాసుల మధ్య గల తగాదాలు తీర్చగల జ్ఞానవంతులు మీలో ఎవరు లేరా?
1CO 6:6 అలా కాకుండా, ఒక సోదరుడు మరొక సోదరున్ని న్యాయస్థానానికి తీసుకెళ్తున్నాడు, అది కూడా అవిశ్వాసుల ముందు!
1CO 6:7 నిజానికి, మీ మధ్యలో తగాదాలు ఉన్నాయంటే మీరు ముందే పూర్తిగా ఓడిపోయారని అర్థం కాబట్టి మీరు దోషులుగా లేదా మోసపోయిన వారిగానే ఉండవచ్చు కాదా?
1CO 6:8 అయితే మీరే మోసం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, మీ సహోదర సహోదరీలకు కూడా అలాగే చేస్తున్నారు.
1CO 6:9 తప్పు చేసినవారు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? మోసపోకండి: లైంగిక దుర్నీతైనా, విగ్రహారాధికులైనా, వ్యభిచారులైనా, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులైనా,
1CO 6:10 దొంగలైనా, అత్యాశపరులైనా, త్రాగుబోతులైనా, దూషకులైనా, మోసగించేవారైనా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
1CO 6:11 మీరు విమోచింపబడక ముందు మీలో కొందరు అలాంటి వారిగా ఉన్నారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మలో మీరు కడుగబడి పవిత్రపరచబడి, నీతిమంతులుగా తీర్చబడ్డారు.
1CO 6:12 “ఏది చేయడానికైనా నాకు స్వాతంత్ర్యం ఉందని” మీరు అనుకోవచ్చు కాని, అన్ని చేయదగినవి కావు. “ఏది చేయడానికైనా నాకు అనుమతి ఉంది అనుకోవచ్చు” కాని, నేను దేనికి లొంగిపోను.
1CO 6:13 “ఆహారం కడుపు కోసం, కడుపు ఆహారం కోసం నియమించబడ్డాయని మీరు చెప్తారు, కానీ దేవుడు రెండింటిని నాశనం చేస్తారు.” మీ శరీరాన్ని లైంగిక దుర్నీతి కోసం కాదు గాని ప్రభువు కొరకే, ప్రభువు శరీరం కొరకే.
1CO 6:14 దేవుడు తన శక్తి వలన ప్రభువును మరణం నుండి సజీవంగా లేపారు. కాబట్టి ఆయన మనల్ని కూడ అలాగే సజీవంగా లేపుతారు.
1CO 6:15 మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? అయితే నేను క్రీస్తు అవయవాలను తీసుకుని వేశ్య అవయవాలుగా చేస్తానా? అలా ఎన్నడు జరుగకూడదు.
1CO 6:16 వేశ్యతో కలిసేవాడు ఆమెతో ఏక శరీరమై ఉన్నాడని మీకు తెలియదా? వాక్యంలో, “వారిద్దరు ఏకశరీరం అవుతారు” అని వ్రాయబడి ఉంది కదా!
1CO 6:17 అయితే ప్రభువుతో ఏకమైనవారు ఆత్మలో ఆయనతో ఒక్కటై ఉంటారు.
1CO 6:18 లైంగిక దుర్నీతికి దూరంగా పారిపోండి. మానవుడు చేసే ఇతర పాపాలన్నీ శరీరానికి బయట చేసేవే, కానీ లైంగిక పాపం చేసేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.
1CO 6:19 మీ శరీరాన్ని దేవుడే ఇచ్చారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు శరీరం ఆలయమై ఉందని మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు.
1CO 6:20 మీరు వెలపెట్టి కొనబడ్డారు. కాబట్టి మీ శరీరాలతో దేవుని మహిమపరచండి.
1CO 7:1 మీరు వ్రాసిన విషయాల గురించి: “స్త్రీతో లైంగిక సంబంధం లేకపోవడం పురుషునికి మంచిది.”
1CO 7:2 అయితే లైంగిక దుర్నీతి జరుగుతుంది కాబట్టి ప్రతి పురుషుడు తన సొంత భార్యతోనే, ప్రతి స్త్రీ తన సొంత భర్తతోనే లైంగిక సంబంధం కలిగి ఉండాలి.
1CO 7:3 భర్త తన భార్య పట్ల వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి, అదే విధంగా భార్య తన భర్తకు వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి.
1CO 7:4 భార్య శరీరం మీద ఆమె భర్తకే గాని ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద భార్యకే గాని అతనికి అధికారం లేదు.
1CO 7:5 మీరు ఇద్దరు వ్యక్తిగతంగా కొంత సమయం ప్రార్థనలో గడపడానికి పరస్పర అంగీకారంతోనే తప్ప ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండకండి. మీ మనస్సును మీరు అదుపు చేసుకోలేనప్పుడు సాతాను మిమ్మల్ని శోధించకుండ మీరు తిరిగి కలుసుకోండి.
1CO 7:6 ఇది ఒక సలహా మాత్రమే ఆజ్ఞ కాదు.
1CO 7:7 మీరందరు నాలా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ, మీలో ప్రతి ఒక్కరికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చారు; ఒకరికి ఒక వరం, ఇంకొకరికి ఇంకొక వరాన్ని ఇచ్చారు.
1CO 7:8 ఇప్పుడు నేను పెళ్ళికానివారితో, విధవరాండ్రతో చెప్పేది ఏంటంటే: నాలా వారు కూడ పెళ్ళి చేసుకోకుండా ఉండడం మంచిది.
1CO 7:9 అయితే వారు తమను తాము అదుపు చేసుకోలేకపోతే పెళ్ళి చేసుకోవాలి. కామంతో రగిలిపోవడం కంటే పెళ్ళి చేసుకోవడం మేలు.
1CO 7:10 పెళ్ళి అయినవారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించేది ఏంటంటే: భార్య భర్తనుండి వేరుగా ఉండకూడదు.
1CO 7:11 అయితే ఆమె అలా వేరైతే, ఆమె పెళ్ళి చేసుకోకుండా ఉండిపోవాలి లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు.
1CO 7:12 మిగిలిన వారితో ప్రభువు కాదు నేను చెప్పేది ఏంటంటే: ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి, ఆమె అతనితో కలిసి కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు.
1CO 7:13 ఏ స్త్రీకైనా అవిశ్వాసియైన భర్త ఉండి ఆమెతో కాపురం చేయడానికి అతడు ఇష్టపడితే, ఆమె అతన్ని విడిచిపెట్టకూడదు.
1CO 7:14 అవిశ్వాసియైన భర్త, భార్య ద్వారా పరిశుద్ధపరచబడతాడు. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్త ద్వారా పవిత్రపరచబడుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు, ఇప్పుడైతే వాళ్ళు పవిత్రులు.
1CO 7:15 అయితే అవిశ్వాసి విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు. అలాంటి సందర్భాలలో ఉన్న విశ్వాసులైన సహోదరుడు లేదా సహోదరి వివాహానికి కట్టుబడి ఉండనవసరం లేదు; సమాధానం కలిగి జీవించడానికి దేవుడు మనల్ని పిలిచారు.
1CO 7:16 ఓ భార్యా, నీ భర్తను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు? ఓ భర్తా, నీ భార్యను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు?
1CO 7:17 ప్రభువు ప్రతిఒక్కరికి ఏ స్థితి నియమించారో, దేవుడు అందరిని ఏ స్థితిలో పిలిచారో ఆ స్థితిలోనే విశ్వాసిగా జీవించాలి. ఇదే నియమాన్ని అన్ని సంఘాలకు నియమిస్తున్నాను.
1CO 7:18 అప్పటికే సున్నతి పొందినవాడు పిలువబడ్డాడా? అతడు సున్నతి పోగొట్టుకోకూడదు. సున్నతి పొందనివాడు పిలువబడ్డాడా? అతడు సున్నతి పొందకూడదు.
1CO 7:19 సున్నతి పొందడంలో గాని పొందకపోవడంలో ఏమి లేదు. దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం.
1CO 7:20 ప్రతి ఒక్కరూ దేవుడు ఏ స్థితిలో తమను పిలిచారో ఆ స్థితిలోనే ఉండాలి.
1CO 7:21 పిలిచినప్పుడు నీవు దాసునిగా ఉన్నావా? దాని గురించి బాధపడవద్దు; నీవు స్వాతంత్ర్యం పొందుకోగలిగితే స్వాతంత్ర్యం పొందుకో.
1CO 7:22 ప్రభువులో విశ్వాసం ఉంచడానికి పిలువబడిన దాసులు, ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవారు; అదే విధంగా, స్వతంత్రునిగా ఉండి పిలువబడిన వారు క్రీస్తుకు దాసులు.
1CO 7:23 మీరు వెలపెట్టి కొనబడ్డారు కాబట్టి మనుష్యులకు దాసులుగా ఉండకండి.
1CO 7:24 సహోదరీ సహోదరులారా, ప్రతి ఒక్కరిని దేవుడు ఏ స్థితిలో ఉండగా పిలిచారో ఆ స్థితిలోనే వారు దేవునితో నిలిచి ఉండాలి.
1CO 7:25 కన్యల గురించి ప్రభువు నుండి నాకు ఆజ్ఞ లేదు గాని, ప్రభువు కృప చేత నమ్మకమైన వానిగా నేను ఒక ఆలోచన చెప్తున్నాను.
1CO 7:26 ఇప్పటి క్లిష్ట పరిస్థితిని బట్టి పురుషుడు తానున్న స్ధితిలోనే ఉండడం మంచిదని నేను భావిస్తున్నాను.
1CO 7:27 మీరు ఒక స్త్రీకి ప్రమాణం చేశారా? దాని నుండి విడుదల కోరవద్దు. మీరు అలాంటి ప్రమాణం నుండి విడుదల పొందారా? భార్య కోసం వెదకవద్దు.
1CO 7:28 అయితే, మీరు పెళ్ళి చేసుకుంటే అది పాపం కాదు; కన్య పెళ్ళి చేసుకుంటే అది పాపం కాదు. అయితే పెళ్ళి చేసుకున్న వారికి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, అవి మీకు కలుగకూడదని నేను కోరుతున్నాను.
1CO 7:29 సహోదరీ సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, సమయం తక్కువగా ఉన్నది. కాబట్టి ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్లు జీవించండి.
1CO 7:30 దుఃఖించే వారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడనట్టు, ఏదైనా కొన్నవారు అది తమది కాదన్నట్టు ఉండాలి.
1CO 7:31 ఈ లోక విషయాలతో వ్యవహరించేవారు వాటితో సంబంధం లేనివారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం ఉన్న ప్రస్తుత రూపం గతించిపోతుంది.
1CO 7:32 మీరు చింతలేనివారై ఉండాలని నేను కోరుకొంటున్నాను. పెళ్ళికానివారు ప్రభువును ఎలా సంతోషపెట్టగలమా అని ప్రభువు విషయాల గురించి చింతిస్తారు.
1CO 7:33 అయితే పెండ్లియైన వారు భార్యను ఎలా సంతోషపెట్టగలనా అని ఈ లోక విషయాల గురించి చింతిస్తున్నారు.
1CO 7:34 పెళ్ళైన వారికి పెళ్ళికాని వారికి మధ్య భేదం ఉంది; పెళ్ళికాని స్త్రీ లేదా కన్య తాను శరీరంలో, ఆత్మలో పవిత్రంగా ఉండాలని ప్రభువు కార్యాలను గురించి ఆలోచిస్తుంది. కాని పెళ్ళైన స్త్రీ తన భర్తను ఎలా సంతోషపెట్టగలనా అనే ఈ లోక విషయాల గురించి ఆలోచిస్తుంది.
1CO 7:35 ఇది మీ మంచి కోసమే తప్ప మిమ్మల్ని ఆటంకపరచాలని కాదు. అయితే మీరు ఇతర విషయాల మీద ధ్యాస పెట్టకుండా ప్రభువు పైనే దృష్టి నిలిపి సరియైన మార్గంలో జీవించమని చెప్తున్నాను.
1CO 7:36 ఎవరైనా తనకు నిశ్చయమైన కన్య పట్ల గౌరవంగా నడుచుకోవడం లేదని బాధపడితే, ఒకవేళ ఆమె వయస్సు పెరిగిపోవడం వలన పెళ్ళి చేయాలని భావిస్తే, అతడు తాను కోరుకున్నట్లే చేయాలి. అతడు పాపం చేయడం లేదు. వారు పెళ్ళి చేసుకోవాలి.
1CO 7:37 అయితే ఎవడైనా కన్యను పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకొని, దానికి తగిన మనోబలం కలిగి ఉండి తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడైతే అతడు చేసేది కూడా మంచిదే.
1CO 7:38 కాబట్టి ఒకడు కన్యను పెళ్ళి చేసుకున్నా మంచిదే, చేసుకోకపోతే ఇంకా మంచిది.
1CO 7:39 భార్య తన భర్త బ్రతికి ఉన్నంత వరకు అతనికి కట్టుబడి ఉండాలి. భర్త చనిపోతే ఆమె తనకిష్టమైన వాన్ని పెళ్ళి చేసుకోవడానికి స్వతంత్రురాలే కాని, అతడు దేవునికి చెందినవాడై ఉండాలి.
1CO 7:40 అయితే, ఆమె ఉన్న రీతిగానే ఉంటే, అది ఆమెకు సంతోషంగా ఉంటుందని నా అభిప్రాయం. నేనయితే దేవుని ఆత్మను కలిగి ఉన్నాను.
1CO 8:1 విగ్రహాలకు అర్పించబడిన ఆహారాన్ని గురించి: “మనమందరం జ్ఞానం కలిగి ఉన్నాం” అని మనకు తెలుసు. అయితే జ్ఞానం అతిశయపడేలా చేస్తుంది కాని, ప్రేమ అభివృద్ధి కలిగిస్తుంది.
1CO 8:2 ఒకరు తమకు ఏమైనా తెలుసు అనుకుంటే, వారు తెలుసుకోవలసినంతగా తెలుసుకోలేదని అర్థం.
1CO 8:3 అయితే దేవుని ప్రేమించేవారిని దేవుడు గుర్తిస్తారు.
1CO 8:4 అందుకే, విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయంలో: “లోకంలో విగ్రహానికి విలువలేదు, ఒకే ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు” అని మనకు తెలుసు.
1CO 8:5 ఒకవేళ ఆకాశంలో కాని భూమి మీద కాని దేవుళ్ళు అని పిలువబడే వారు ఉన్నా (నిజానికి చాలామంది “దేవుళ్ళు” చాలామంది “ప్రభువులు” ఉన్నారు),
1CO 8:6 కానీ మనకైతే ఒక్కడే తండ్రియైన దేవుడు ఉన్నాడు. ఆయన ద్వారానే అన్ని కలిగాయి. ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాం; అలాగే మనకు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే, ఆయన ద్వారానే అన్ని కలిగాయి, ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాము.
1CO 8:7 అయితే ఈ జ్ఞానం అందరికి లేదు. కొందరు ఇప్పటికీ విగ్రహాలను ఆరాధించేవారు తాము తినే పదార్థాలు విగ్రహాలకు బలి అర్పించినవి అని భావిస్తారు. కాబట్టి వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతుంది.
1CO 8:8 అయితే ఆహారం మనల్ని దేవునికి దగ్గరగా తీసుకురాదు; తినకపోతే మనకు నష్టంలేదు, తినడం వల్ల మనకు లాభం లేదు.
1CO 8:9 అయితే మీకున్న అధికారాన్ని బలహీనులకు అభ్యంతరం కలిగించకుండ చూసుకోండి.
1CO 8:10 ఎందుకంటే మీకున్న జ్ఞానంతో విగ్రహాలు ఉన్న మందిరంలో నీవు తినడం బలహీనమైన మనస్సాక్షి కలవారు చూస్తే, వారు విగ్రహాలను అర్పించిన వాటిని తినడానికి ధైర్యం తెచ్చుకుంటారు కదా?
1CO 8:11 అందువల్ల ఎవరి కోసం క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనులైన ఆ సహోదరీ సహోదరులు నీ జ్ఞానాన్నిబట్టి నశిస్తారు.
1CO 8:12 ఇలా వారికి విరోధంగా పాపం చేసి వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించినందుకు మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.
1CO 8:13 కాబట్టి నేను తిన్నదే నా సహోదరీ సహోదరులు పాపంలో పడడానికి ఒకవేళ కారణమైతే, వారు పాపంలో పడడానికి నేను కారణం కాకూడదని నేను మళ్ళీ ఎప్పుడు అలాంటి ఆహారాన్ని తినను.
1CO 9:1 నేను స్వతంత్రున్ని కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువులో నేను చేసిన పనికి ఫలితం మీరు కారా?
1CO 9:2 ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినా, మీకు మాత్రం తప్పక నేను అపొస్తలుడనే! కాబట్టి ప్రభువులో నా అపొస్తలత్వానికి మీరు ముద్రగా ఉన్నారు.
1CO 9:3 నాపై నిందారోపణ చేసేవారికి నేను చెప్పే సమాధానమిదే.
1CO 9:4 తినడానికి త్రాగడానికి మాకు హక్కు లేదా?
1CO 9:5 మిగతా అపొస్తలుల్లా, ప్రభువు యొక్క సహోదరుల్లా, కేఫాలా విశ్వాసురాలైన భార్యను మాతో పాటు తీసుకెళ్లడానికి మాకు హక్కు లేదా?
1CO 9:6 జీవనోపాధి కోసం పని చేయకుండ ఉండడానికి నాకు బర్నబా మాత్రమే హక్కు లేదా?
1CO 9:7 ఎవరైనా తన సొంత ఖర్చులు పెట్టుకొని సైన్యంలో సేవ చేస్తారా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తిననివారు ఎవరు? మందను పోషిస్తూ వాటి పాలు త్రాగనివారు ఎవరు?
1CO 9:8 ఈ మాటలు కేవలం మానవ అధికారంతో చెప్తున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇదే చెప్తున్నది కదా!
1CO 9:9 మోషే ధర్మశాస్త్రంలో, “ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు” అని వ్రాయబడి ఉంది. దేవుడు ఎద్దులను గురించి చెప్తున్నారా?
1CO 9:10 ఖచ్చితంగా ఆయన మన కొరకే ఈ మాట చెప్పలేదా? అవును, ఇది ఖచ్చితంగా మన కొరకే వ్రాయబడింది, ఎందుకంటే పొలాన్ని దున్నేవారు, త్రొక్కేవారు పంటలో భాగం పొందాలనే ఆశతో పని చేయాలి.
1CO 9:11 మీ మధ్యలో ఆత్మ సంబంధమైన విత్తనాన్ని మేము నాటితే, మీ నుండి ఈ లోకసంబంధమైన పంటను మేము కోస్తే అది గొప్ప విషయమా?
1CO 9:12 మీ నుండి సహాయం పొందడానికి ఇతరులకు హక్కు ఉంటే, మాకు మరి ఎక్కువ హక్కు ఉండదా? అయితే, ఈ హక్కును మేము ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఆటంకంగా ఉండకూడదని అన్ని ఇబ్బందులను మేము సహిస్తున్నాము.
1CO 9:13 దేవాలయంలో పని చేసేవారు దేవాలయం నుండే తమ ఆహారాన్ని పొందుతారని, బలిపీఠం దగ్గర సేవ చేసేవారు బలిపీఠం మీద అర్పించిన వాటిలో పాలిభాగస్థులని మీకు తెలియదా?
1CO 9:14 అలాగే, సువార్తను ప్రకటించేవారు సువార్త వల్లనే తమ జీవనోపాధి పొందుకోవాలని ప్రభువు ఆజ్ఞాపించారు.
1CO 9:15 కాని, నేనైతే వీటిలో దేన్ని ఉపయోగించుకోలేదు. నా పట్ల మీరు ఇలా చేయాలని ఈ సంగతులు వ్రాయడం లేదు. ఈ నా అతిశయాన్ని ఎవరైనా వట్టిదిగా చేస్తే దానికన్నా నాకు మరణమే మేలు.
1CO 9:16 సువార్త ప్రకటించడం నాకు తప్పనిసరి బాధ్యత కాబట్టి నేను సువార్త ప్రకటిస్తున్నానని గొప్ప చెప్పుకోలేను. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ!
1CO 9:17 నేను ఇష్టపూర్వకంగా ప్రకటిస్తే నాకు బహుమానం దొరుకుతుంది. నాకు నేనుగా కాకపోయినా నామీద నమ్మకంతో నాకు అప్పగించబడిన పనిని మాత్రమే నేను చేస్తున్నాను.
1CO 9:18 అప్పుడు నా బహుమానం ఏంటి? సువార్తను ప్రకటించేవానిగా నాకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానము.
1CO 9:19 నేను స్వతంత్రునిగా ఎవరికీ చెందినవాడిగా ఉన్నప్పటికీ, సాధ్యమైనంత వరకు ఎక్కువమందిని దేవుని కోసం సంపాదించడానికి నన్ను నేను అందరికి దాసునిగా చేసుకున్నాను.
1CO 9:20 యూదులను సంపాదించడానికి యూదునిలా ధర్మశాస్త్రానికి లోబడిన వారిని సంపాదించడానికి నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాన్ని కాకపోయినా ధర్మశాస్త్రానికి లోబడిన వానిలా అయ్యాను.
1CO 9:21 ధర్మశాస్త్రం లేనివారిని సంపాదించడానికి నేను ధర్మశాస్త్రం లేనివారిలో ఒక్కడిని అయ్యాను. దేవుని ధర్మశాస్త్రం నుండి విడుదల పొందకపోయినా నేను క్రీస్తు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాను.
1CO 9:22 బలహీనులను సంపాదించడానికి బలహీనులకు బలహీనుడనయ్యాను. అన్ని విధాలుగా కొందరినైనా రక్షించాలని అందరికి అన్ని విధాలుగా ఉన్నాను.
1CO 9:23 సువార్త వల్ల కలిగే ఆశీర్వాదాలలో నేను భాగస్థునిగా ఉండాలని నేను సువార్త కోసమే వీటన్నిటిని చేశాను.
1CO 9:24 పరుగు పందెంలో పాల్గొనే వారందరు పరుగెడతారు కాని, ఒక్కరే బహుమానం పొందుకుంటారని మీకు తెలియదా? అలాగే మీరు బహుమానాన్ని పొందాలని పరుగెత్తండి.
1CO 9:25 ఆటలలో పాల్గొనే ప్రతివారు కఠినమైన శిక్షణ తీసుకుంటారు. వారు నిత్యం ఉండని కిరీటాన్ని పొందడానికి అంత కష్టపడతారు, కానీ మనమైతే నిత్యం నిలిచే కిరీటం పొందడం కోసం కష్టపడతాం.
1CO 9:26 కాబట్టి, గమ్యంలేని వానిలా నేను పరుగెత్తడం లేదు; గాలిని కొట్టువానిలా నేను పోరాడడంలేదు.
1CO 9:27 అయితే, ఇతరులకు సువార్త ప్రకటించిన తర్వాత బహుమానం పొందే అర్హత నేను కోల్పోకుండా ఉండడానికి నా శరీరాన్ని నలగ్గొట్టి, దాన్ని లోబరచుకొంటున్నాను.
1CO 10:1 సహోదరీ సహోదరులారా, మీరు సత్యం తెలియనివారిగా ఉండాలని నేను కోరడంలేదు. మన పూర్వికులందరూ మేఘం క్రింద ఉన్నారు. సముద్రం గుండా ప్రయాణించారు.
1CO 10:2 వారందరు మేఘంలో సముద్రంలో మోషే బట్టి బాప్తిస్మం పొందారు.
1CO 10:3 వారందరు ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు.
1CO 10:4 అందరు ఒకే ఆత్మీయ నీటిని త్రాగారు. ఎందుకంటే తమతో కూడా ఉన్న ఆత్మీయ బండ నుండి వారు త్రాగారు, ఆ బండ క్రీస్తు.
1CO 10:5 అయినాసరే, వారిలో అనేకమంది దేవున్ని సంతోషపరచలేదు; కాబట్టి వారి శవాలు అరణ్యంలో చెల్లాచెదురుగా పడ్డాయి.
1CO 10:6 వారిలా మన హృదయాలను చెడ్డ విషయాలపై నిలుపకుండా ఈ సంగతులు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి.
1CO 10:7 వారిలో కొందరిలా మీరు విగ్రహారాధికులుగా ఉండకండి: “ప్రజలు తినడానికి త్రాగడానికి కూర్చుని ఆడడానికి లేచారు,” అని వారి గురించి వ్రాయబడింది.
1CO 10:8 వారిలా మనం లైంగిక దుర్నీతికి పాల్పడకూడదు. వారిలో కొందరు అలా చేయడం వలన ఒక్క రోజులోనే ఇరవై మూడువేలమంది చనిపోయారు.
1CO 10:9 వారిలో కొందరు శోధించినట్లుగా మనం క్రీస్తును శోధించకూడదు, అలా శోధించినవారు సర్పాల వల్ల చనిపోయారు.
1CO 10:10 వారిలా మనం సణుగకూడదు, వారిలో కొందరు సణిగి నాశనం చేసే దూత వలన చనిపోయారు.
1CO 10:11 మనకు ఉదాహరణలుగా ఉండడానికి ఈ సంగతులు వారికి సంభవించి, రాబోయే యుగాంతంలో మనకు హెచ్చరికగా ఉండడానికి వ్రాయబడ్డాయి.
1CO 10:12 కాబట్టి, తాము దృఢంగా నిలిచి ఉన్నామని భావించేవారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.
1CO 10:13 సాధారణంగా మనష్యులకు కలిగే శోధనలు తప్ప మరి ఏ ఇతర శోధనలు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించబడనివ్వడు. కాని మీరు శోధించబడినప్పుడు దానిని సహించడానికి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే అందిస్తాడు.
1CO 10:14 కాబట్టి నా ప్రియ స్నేహితులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి.
1CO 10:15 నేను తెలివిగల వారితో మాట్లాడుతున్నాను; నేను చెప్పిన దాన్ని మిమ్మల్ని మీరే ఆలోచించండి.
1CO 10:16 మనం కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగడం క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకోవడమే కదా? మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో పాలుపంచుకోవడమే కదా?
1CO 10:17 మనమందరం ఆ ఒకే రొట్టెను పంచుకుంటున్నాం, రొట్టె ఒక్కటే కాబట్టి అనేకులమైన మనం ఒకే శరీరంగా ఉన్నాము.
1CO 10:18 ఇశ్రాయేలు ప్రజలారా చూడండి: బలి అర్పించిన వాటిని తిన్నవారు బలిపీఠంలో భాగస్థులు కారా?
1CO 10:19 ఇక నేను చెప్పేది ఏంటంటే, విగ్రహాలకు అర్పించిన ఆహారంలో ఏమైన ప్రత్యేకత ఉందా? విగ్రహం ఏమైన ప్రత్యేకమైనదా?
1CO 10:20 కాదు, అయితే దేవుని ఎరుగనివారు అర్పించే బలులు దేవునికి కాదు దయ్యాలకే అర్పిస్తున్నారు. కాని దేవునికి అర్పించినవి కావు, మీరు దయ్యాలతో భాగస్వాములుగా ఉండకూడదని నా కోరిక.
1CO 10:21 మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యపు పాత్రలోనిది ఒకేసారి త్రాగలేరు. ప్రభువు బల్లలో దయ్యపు బల్లలో ఒకేసారి పాల్గొనలేరు.
1CO 10:22 ప్రభువు రోషాన్ని పుట్టించడానికి మనం ప్రయత్నిస్తున్నామా? ఆయన కంటే మనం బలవంతులమా?
1CO 10:23 “ఏది చేయడానికైనా నాకు అనుమతి ఉంది” అని మీరు అనుకోవచ్చు, కాని అన్ని ప్రయోజనకరమైనవి కావు. “ఏది చేయడానికైనా నాకు హక్కు ఉంది” కాని అన్నీ అభివృద్ధిని కలిగించవు.
1CO 10:24 ఎవరైనా సరే తమ మంచినే చూసుకోకూడదు ఇతరుల మంచిని కూడా చూడాలి.
1CO 10:25 మనస్సాక్షిని బట్టి ఏ ప్రశ్నలు వేయకుండా మాంసం దుకాణంలో అమ్మే దేనినైనా తినవచ్చును.
1CO 10:26 ఎందుకంటే, “భూమి, దానిలో ఉండే సమస్తం ప్రభువుకు చెందినవే.”
1CO 10:27 ఒక అవిశ్వాసి మిమ్మల్ని భోజనానికి పిలిచినపుడు మీరు వెళ్లాలనుకుంటే, మనస్సాక్షిని బట్టి ఏ ప్రశ్నలు వేయకుండా మీ ముందు ఉంచిన వాటిని తినండి.
1CO 10:28 కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు అర్పించిన ఆహారం” అని చెబితే దాన్ని తినవద్దు. మీకు చెప్పినవాని కోసం, మనస్సాక్షి కోసం దాన్ని తినవద్దు.
1CO 10:29 మీ మనస్సాక్షి గురించి కాదు గాని ఇతరుల మనస్సాక్షి గురించి నేను ఇలా చెప్తున్నాను, ఎందుకంటే వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్యం ఎందుకు విమర్శించబడాలి?
1CO 10:30 నేను కృతజ్ఞతతో పాలు పంచుకుంటే నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన దాని కోసం నేనెందుకు నిందించబడాలి?
1CO 10:31 నీవు ఏమి తిన్నా, ఏమి త్రాగినా ఏమి చేసినా వాటన్నిటిని దేవుని మహిమ కొరకే చేయాలి.
1CO 10:32 యూదులకైనా, గ్రీసు దేశస్థులకైనా, దేవుని సంఘానికైనా మరి ఎవరికైనా సరే అభ్యంతరంగా ఉండకండి.
1CO 10:33 అలాగే నేను కూడా అందరిని అన్ని విధాలుగా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నా స్వలాభాన్ని ఆశించకుండా, అనేకమంది రక్షింపబడాలని వారి మంచి కోరుతున్నాను.
1CO 11:1 నేను క్రీస్తు మాదిరిని అనుసరించినట్లే మీరు నా మాదిరిని అనుసరించండి.
1CO 11:2 మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, మీకు నేను మీకు అప్పగించిన సంప్రదాయాలను అలాగే కొనసాగిస్తున్నందుకు నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను.
1CO 11:3 అయితే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తుకు శిరస్సు దేవుడని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను.
1CO 11:4 కాబట్టి ఏ పురుషుడైనా తన తలమీద ముసుగు వేసుకుని ప్రార్థించినా లేదా ప్రవచించినా అతడు తన తలను అవమానిస్తున్నాడు.
1CO 11:5 అయితే ఏ స్త్రీయైనా తలమీద ముసుగు వేసుకోకుండా ప్రార్థించినా లేదా ప్రవచించినా ఆ స్త్రీ తన తలను అవమానపరుస్తున్నట్టే. అలా చేస్తే ఆమె తలను క్షౌరం చేసుకున్నట్టే.
1CO 11:6 స్త్రీ తన తలపై ముసుగు వేసుకోకపోతే, తన వెంట్రుకలను కత్తిరించుకోవాలి. అయితే వెంట్రుకలు కత్తిరించుకోవడం గాని లేదా తల క్షౌరం చేయించుకోవడం స్త్రీకి అవమానంగా అనిపిస్తే ఆమె తలపై ముసుగు వేసుకోవాలి.
1CO 11:7 పురుషుడు దేవుని పోలికగా మహిమగా ఉన్నాడు కాబట్టి అతడు తన తలపై ముసుగు వేసుకోకూడదు; కాని స్త్రీ పురుషునికి మహిమగా ఉంది.
1CO 11:8 ఎందుకంటే, పురుషుడు స్త్రీ నుండి రాలేదు గాని, స్త్రీ పురుషుని నుండి వచ్చింది.
1CO 11:9 పురుషుడు స్త్రీ కోసం సృష్టించబడలేదు గాని, పురుషుని కోసం స్త్రీ సృష్టించబడింది.
1CO 11:10 ఈ కారణంగా, దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలపై ఉండాలి.
1CO 11:11 అయితే, ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ ఉండరు.
1CO 11:12 పురుషుని నుండి స్త్రీ ఎలా కలిగిందో, అలాగే పురుషుడు స్త్రీ నుండి జన్మిస్తున్నాడు. అయితే సమస్తం దేవుని నుండి వచ్చాయి.
1CO 11:13 మీకు మీరే ఆలోచించుకోండి; స్త్రీ తలపై ముసుగు వేసుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం సరియైనదేనా?
1CO 11:14 పురుషునికి పొడవైన వెంట్రుకలు ఉండడం అతనికి అవమానమని సహజంగా మీకు అనిపిస్తుంది కదా?
1CO 11:15 అయితే స్త్రీకి పొడవైన జుట్టు ఆమె తలను కప్పుకోడానికి పైటచెంగుగా ఇవ్వబడింది కాబట్టి పొడవైన జుట్టు కలిగి ఉండడం ఆమెకు గౌరవం కాదా?
1CO 11:16 కాని, ఎవరైనా దీని గురించి వాదించాలనుకుంటే, మనలో గాని దేవుని సంఘంలో గాని మరి ఏ ఇతర ఆచారం లేదని గ్రహించాలి.
1CO 11:17 ఈ ఆజ్ఞలు ఇస్తూ నేను మిమ్మల్ని మెచ్చుకోను, ఎందుకంటే మీ సమావేశాలు మంచి కంటే చెడునే ఎక్కువగా చేస్తున్నాయి.
1CO 11:18 మొదటి విషయం, మీరు దేవుని సంఘంగా ఒకచోట చేరినప్పుడు మీలో విభేదాలు ఉన్నాయని నేను విన్నాను. ఇది కొంతవరకు నిజమని నేను నమ్ముతున్నాను.
1CO 11:19 మీలో ఎవరు దేవుని ఆమోదం పొందారో తెలియడానికి మీ మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండవలసిందే.
1CO 11:20 అయితే మీరు సమావేశమైనప్పుడు మీరు తినేది ప్రభువు రాత్రి భోజనం కాదు.
1CO 11:21 ఎందుకంటే, మీరు తింటున్నప్పుడు, మీలో కొందరు తమ భోజనాన్ని ముందుగానే చేసేస్తున్నారు. దాని ఫలితంగా ఒకరు ఆకలితో ఉండగా మరొకరు మత్తులై పోతున్నారు.
1CO 11:22 తినడానికి, త్రాగడానికి మీకు ఇల్లు లేవా? లేదా ఏమి లేనివారిని అవమానించడం ద్వారా మీరు దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? నేను మీకు ఏమి చెప్పాలి? మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోలేను.
1CO 11:23 ఎందుకంటే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు నుండి పొందాను. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెను తీసుకుని,
1CO 11:24 కృతజ్ఞతలు చెల్లించి, దాన్ని విరిచి ఇలా అన్నారు, “ఇది మీ కోసం ఇవ్వబడిన నా శరీరం; నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి.”
1CO 11:25 అలాగే భోజనమైన తర్వాత ఆయన పాత్రను తీసుకుని, “ఈ పాత్ర నా రక్తంతో కూడిన క్రొత్త నిబంధన, దీన్ని మీరు త్రాగిన ప్రతిసారి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి” అని చెప్పారు.
1CO 11:26 కాబట్టి మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోనిది త్రాగిన ప్రతిసారి ప్రభువు వచ్చేవరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తారు.
1CO 11:27 కాబట్టి, ఎవరైతే అయోగ్యంగా ప్రభువు రొట్టెను తిని, ఆయన పాత్రలోనిది త్రాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం గురించి అపరాధులవుతారు.
1CO 11:28 కాబట్టి, ప్రతి ఒక్కరు ఆ రొట్టెను తినడానికి ఆ పాత్రలోనిది త్రాగడానికి ముందు తనను తాను పరీక్షించుకోవాలి.
1CO 11:29 ఎందుకంటే, ఎవరైనా ప్రభువు శరీరమని వివేచించకుండా ఆ రొట్టెను తిని, పాత్రలోనిది త్రాగితే వారు తమపైకి తామే తీర్పు తెచ్చుకోవడానికే తిని త్రాగుతున్నారు.
1CO 11:30 ఈ కారణంగానే, మీలో చాలామంది వ్యాధిగ్రస్తులుగా, బలహీనులుగా ఉన్నారు, చాలామంది మరణిస్తున్నారు.
1CO 11:31 కాబట్టి మనల్ని మనమే విమర్శించుకుంటే మన మీదికి తీర్పు రాదు.
1CO 11:32 ప్రభువు ద్వారా మనం తీర్పు పొందినప్పుడు, అంతంలో ఈ లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ఉండడానికి మనం క్రమపరచబడుతున్నాము.
1CO 11:33 కాబట్టి, సహోదరీ సహోదరులారా! మీరు భోజనం చేయడానికి చేరినప్పుడు మీరందరు కలిసి భోజనం చేయండి.
1CO 11:34 ఒకవేళ, మీరు ఒకచోట సమావేశమైనప్పుడు మీరు దేవుని తీర్పుకు గురి కాకుండా ఎవరికైనా ఆకలిగా ఉంటే వారు ఇంటి దగ్గరే ఏదైనా తినాలి. నేను అక్కడికి వచ్చినపుడు మరిన్ని సూచనలు ఇస్తాను.
1CO 12:1 సహోదరీ సహోదరులారా! ఆత్మ సంబంధమైన వరాల గురించి మీరు తెలియనివారిగా ఉండడం నాకు ఇష్టం లేదు.
1CO 12:2 మీరు దేవుని ఎరుగనివారిగా ఉన్నప్పుడు, ఏదో ఒకలా ప్రభావితం చెంది మూగ విగ్రహాల దగ్గరకు తప్పుగా నడిపించబడ్డారని మీకు తెలుసు.
1CO 12:3 అందువల్ల దేవుని ఆత్మచేత మాట్లాడేవారెవరూ “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు. పరిశుద్ధాత్మచే తప్ప మరియెవరూ “యేసే ప్రభువు” అని అంగీకరించలేరని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.
1CO 12:4 అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే.
1CO 12:5 అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి గాని, ప్రభువు ఒక్కడే.
1CO 12:6 అనేక రకాలైన కార్యాలు ఉన్నాయి గాని, అందరిలోను అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే.
1CO 12:7 అందరి మంచి కోసం అందరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది.
1CO 12:8 ఒకే ఆత్మ ఒకరికి బుద్ధి సందేశాన్ని, మరొకరికి జ్ఞాన సందేశాన్ని,
1CO 12:9 ఆ ఆత్మయే ఒకరికి విశ్వాసాన్ని, మరొకరికి స్వస్థత వరాన్ని ఇస్తున్నాడు.
1CO 12:10 ఆత్మ ఒకరికి అద్భుతాలు చేసే శక్తిని, మరొకరికి ప్రవచన శక్తిని, వేరొకరికి ఆత్మల వివేచన శక్తిని, మరొకరికి వివిధ భాషల్లో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థాన్ని వివరించగల శక్తిని ఇస్తున్నాడు.
1CO 12:11 ఇవన్నీ ఒకే ఒక ఆత్మ చేస్తున్న పనులు, ఆత్మ తాను నిర్ణయించుకున్న ప్రకారం అందరికి వాటిని పంచి ఇస్తున్నాడు.
1CO 12:12 ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లు, అనేక అవయవాలు కలిసి ఒక శరీరంలో ఉన్నట్లుగా క్రీస్తు కూడా ఉన్నారు.
1CO 12:13 అలాగే, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, యూదేతరులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, మనమందరం ఒకే శరీరంగా ఉండడానికి ఒకే ఆత్మలో బాప్తిస్మం పొందాం, మనందరికి త్రాగడానికి ఒకే ఆత్మ ఇవ్వబడ్డాడు.
1CO 12:14 శరీరం ఒకే అవయవంతో కాక అనేక అవయవాలుగా రూపొందించబడింది.
1CO 12:15 “నేను చేయి కాదు కాబట్టి, నేను శరీరానికి చెందను” అని పాదం చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండాపోదు.
1CO 12:16 “నేను కన్ను కాదు కాబట్టి, నేను శరీరానికి చెందను” అని చెవి చెప్పినంత మాత్రాన అది శరీరంలో భాగం కాకుండాపోదు.
1CO 12:17 శరీరమంతా ఒక్క కన్నే అయితే అది ఎలా వినగలదు? శరీరమంతా ఒక్క చెవే అయితే అది ఎలా వాసన తెలుసుకోగలదు?
1CO 12:18 అయితే నిజానికి, దేవుడు శరీర అవయవాలలో ప్రతిదాన్ని తన ఇష్ట ప్రకారం శరీరంలో ఉంచారు.
1CO 12:19 అవన్నీ ఒకే అవయవమైతే ఇక శరీరం ఎక్కడ?
1CO 12:20 కాబట్టి అనేక అవయవాలు ఉన్నాయి కాని, శరీరం ఒక్కటే.
1CO 12:21 కాబట్టి, “నీతో నాకు అవసరం లేదు!” అని కన్ను చేతితో చెప్పకూడదు. “మీతో నాకు పనిలేదు!” అని శిరస్సు పాదాలతో చెప్పకూడదు.
1CO 12:22 అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి,
1CO 12:23 ఏ భాగాలు ఘనతలేనివని మనం భావిస్తామో వాటికి మనం అధిక ఘనతను ఇస్తాము. అందంగా లేని శరీరభాగాలు ప్రత్యేకమైన శ్రద్ధను పొందగా,
1CO 12:24 అందంగా ఉన్న శరీర అవయవాలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం లేకపోవచ్చును. గౌరవం లేని అవయవాలకు అధిక గౌరవం కలుగడానికి దేవుడే మన శరీరాన్ని ఒక్కటిగా చేశారు.
1CO 12:25 అందువల్ల శరీరంలో విభేదాలు లేవు. అయితే దానిలోని అవయవాలన్ని పరస్పరం ఒకదానిపై ఒకటి సమానమైన శ్రద్ధను కలిగి ఉండడానికి ఆయన అలా చేశారు.
1CO 12:26 ఒక్క అవయవం బాధపడితే దాంతో పాటు అన్ని అవయవాలు బాధపడతాయి. ఒక అవయవం గౌరవం పొందితే, దాంతో పాటు మిగిలిన అవయవాలన్ని ఆనందిస్తాయి.
1CO 12:27 కాబట్టి మీరందరు క్రీస్తు శరీరము. మీలో ప్రతి ఒక్కరు దానిలో భాగాలే.
1CO 12:28 దేవుడు తన సంఘంలో మొదటిగా అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో బోధకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరాన్ని కలిగినవారిని, సహాయం చేసేవారిని, మార్గదర్శకం చేసేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించారు.
1CO 12:29 అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతాలు చేయగలరా?
1CO 12:30 అందరికి స్వస్థత వరం కలదా? అందరు వివిధ భాషల్లో మాట్లాడతారా? అందరు వాని అర్థాన్ని చెప్పగలరా?
1CO 12:31 కాబట్టి శ్రేష్ఠమైన కృపావరాలను ఆసక్తితో కోరుకోండి. ఇదే కాకుండా, అన్నిటికంటే శ్రేష్ఠమైన మార్గాన్ని నేను మీకు చూపిస్తాను.
1CO 13:1 మానవుల లేదా దేవదూతల భాషలు నేను మాట్లాడ కలిగినా, నాకు ప్రేమ లేకపోతే కేవలం మ్రోగే గంటలా గణగణ మ్రోగించే తాళంలా ఉంటాను.
1CO 13:2 నేను ప్రవచన వరాన్ని కలిగినా, అన్ని రహస్యాలను అర్థం చేసికోగలిగినా, సమస్త జ్ఞానం కలిగి ఉన్నా, పర్వతాలను కూడా కదిలించగల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థమే.
1CO 13:3 నాకున్న సంపాదనంతా పేదలకు ఇచ్చివేసి, మెప్పు కోసం నా శరీరాన్ని కష్టానికి అప్పగించినా నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమి లేదు.
1CO 13:4 ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది.
1CO 13:5 అది ఇతరులను అగౌరపరచదు, స్వార్థం లేనిది, త్వరగా కోప్పడదు, తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు.
1CO 13:6 ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో ఆనందిస్తుంది.
1CO 13:7 అది అన్నిటిని కాపాడుతుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని సహిస్తుంది.
1CO 13:8 ప్రేమ ఎప్పుడు విఫలం కాదు. అయితే ప్రవచనాలు ఆగిపోతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానం గతించిపోతుంది.
1CO 13:9 ఎందుకంటే మనకు తెలిసింది కొంచెమే, మనం ప్రవచించేది కొంతవరకే.
1CO 13:10 కాని సంపూర్ణమయింది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవి గతించిపోతాయి.
1CO 13:11 నేను చిన్నబిడ్డగా ఉన్నపుడు చిన్నబిడ్డగా మాట్లాడాను, చిన్నబిడ్డగా తలంచాను, చిన్నబిడ్డగా ఆలోచించాను, కాని నేను పెద్దవాన్ని అయినప్పుడు బాల్యపు పద్ధతులు వదిలేశాను.
1CO 13:12 ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం అద్దంలో కనబడే ప్రతిబింబమే; కాని తర్వాత ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు నాకు తెలిసింది కొంతమాత్రమే, తర్వాత నేను పూర్తిగా తెలుసుకోబడిన ప్రకారం నేను పూర్తిగా తెలుసుకుంటాను.
1CO 13:13 విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే ఈ మూడు నిలిచి ఉంటాయి. వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమే.
1CO 14:1 ప్రేమ చూపడానికి ప్రయాసపడండి, ఆత్మ వరాలను ఆసక్తితో కోరుకోండి. మరి ముఖ్యంగా ప్రవచన వరాన్ని ఆశించండి.
1CO 14:2 భాషల్లో మాట్లాడేవారు మానవులతో కాదు కాని దేవునితో మాట్లాడతారు. ఎవరూ వాటిని అర్థం చేసుకోలేరు; ఆత్మ ద్వారా వారు రహస్యాలను పలుకుతున్నారు.
1CO 14:3 అయితే ప్రవచించేవారు మానవులను బలపరచడానికి, ప్రోత్సాహం, ఆదరణ కలిగించడానికి వారితో మాట్లాడుతున్నారు.
1CO 14:4 భాషల్లో మాట్లాడేవారు తనకు తానే జ్ఞానాభివృద్ధి చేసుకుంటారు, కాని ప్రవచించేవారు సంఘానికి అభివృద్ధి కలుగజేస్తారు.
1CO 14:5 మీరందరు భాషల్లో మాట్లాడాలని నా కోరిక కాని, మీరు ప్రవచించాలని మరి ఎక్కువగా కోరుతున్నాను. భాషల్లో మాట్లాడేవారు తెలిపిన దానికి సంఘం అభివృద్ధి చెందేలా మరొకరు అర్థం చెప్తేనే తప్ప, భాషల్లో మాట్లాడేవారి కంటే ప్రవచించేవారే గొప్పవారు.
1CO 14:6 కాబట్టి సహోదరీ సహోదరులారా, నేను మీ దగ్గరకు వచ్చి సత్యాన్ని తెలియజేయడం గాని జ్ఞానం గాని ప్రవచనం గాని వాక్య బోధ గాని మీకు చెప్పకపోతే నేను వచ్చి భాషల్లో మాట్లాడడం వల్ల నా నుండి మీకు ఏ మంచి జరుగుతుంది?
1CO 14:7 వేణువు, వీణ వంటి జీవంలేని వాయిద్యాలను వాయించినప్పుడు వాటి స్వరాల్లో భేదం లేకపోతే ఏది ఏ వాయిద్యమో ఎలా తెలుసుకోగలరు?
1CO 14:8 అంతేకాక, బూర ఊదేవారు స్పష్టమైన ధ్వని చేయకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు?
1CO 14:9 అలాగే మీరు నాలుకతో స్పష్టమైన మాటలు మాట్లాడకపోతే మీరు ఏమి మాట్లాడుతున్నారో ఎవరైనా ఎలా తెలుసుకోగలరు? అప్పుడు మీరు కేవలం గాలిలో మాట్లాడినట్లు ఉంటుంది.
1CO 14:10 లోకంలో చాలా భాషలు ఉన్నాయి, అవన్నీ అర్థాన్ని కలిగి ఉన్నాయని అనడంలో సందేహం లేదు.
1CO 14:11 ఎవరైనా మాట్లాడినప్పుడు దాని అర్థాన్ని నేను గ్రహించలేకపోతే మాట్లాడేవారికి నేను, నాకు మాట్లాడేవారు పరాయివానిగా ఉంటాను.
1CO 14:12 ఆత్మ సంబంధమైన వరాలు పొందాలన్న ఆసక్తి మీలో ఉంది కాబట్టి సంఘాన్ని బలపరచడానికి వాటిని సమృద్ధిగా పొందే ప్రయత్నం చేయండి.
1CO 14:13 భాషలో మాట్లాడేవారు తాము మాట్లాడిన దానికి అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థించాలి.
1CO 14:14 ఎందుకంటే, నేను భాషలో ప్రార్థిస్తే, నా ఆత్మ కూడా ప్రార్థిస్తుంది కాని నా మనస్సు ఫలవంతంగా ఉండదు.
1CO 14:15 కాబట్టి నేను ఏమి చేయాలి? నా ఆత్మతో ప్రార్థిస్తాను, అయితే నా జ్ఞానంతో కూడ ప్రార్థిస్తాను. నా ఆత్మతో పాడతాను, నా మనసుతో కూడా పాడతాను.
1CO 14:16 లేకపోతే మీరు ఆత్మలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే, మీరు చెప్పిన దాన్ని గ్రహించలేనివారు అక్కడ ఉంటే, మీరు ఏం చెప్పారో వారికి తెలియదు కాబట్టి మీ కృతజ్ఞతా స్తుతికి వారు “ఆమేన్” అని ఎలా చెప్తారు?
1CO 14:17 నీవు చక్కగానే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు కాని దానివల్ల ఎవరికి జ్ఞానవృద్ధి కలుగదు.
1CO 14:18 మీ అందరికంటే నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
1CO 14:19 కాని, సంఘంలో అర్థం చేసుకోలేని భాషలో పదివేల మాటలు మాట్లాడడం కంటే, ఇతరులకు బోధించడానికి అర్థమైన అయిదు మాటలు నేను మాట్లాడితే మంచిది.
1CO 14:20 సహోదరీ సహోదరులారా, పసిబిడ్డల్లా ఆలోచించడం ఆపండి. చెడు విషయంలో పసివారిలా ఉండండి కాని ఆలోచించడంలో పెద్దవారిలా ఉండండి.
1CO 14:21 ధర్మశాస్త్రంలో ఇలా వ్రాయబడి ఉంది: “ఇతర భాషలతో పరదేశీయుల పెదాలతో నేను ఈ ప్రజలతో మాట్లాడతాను, కాని వారు నా మాట వినరు, అని ప్రభువు పలుకుతున్నాడు.”
1CO 14:22 కాబట్టి భాషలతో మాట్లాడడం అనేది విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన. అయితే ప్రవచించడం అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచన.
1CO 14:23 ఒకవేళ సంఘమంతా ఒకచోట చేరి అందరు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు గ్రహించలేనివారు గాని అవిశ్వాసులు గాని లోపలికి వస్తే, మీరందరు పిచ్చివారిలా మాట్లాడుతున్నారని అనుకుంటారు కదా?
1CO 14:24 కాని, అందరు ప్రవచిస్తే అవిశ్వాసి కాని, తెలియనివారు కాని లోపలికి వస్తే తాము విన్నదానిని బట్టి వారు తాము పాపులమని గ్రహించి అందరిని బట్టి వారు తీర్పుపొందుతారు.
1CO 14:25 వారి హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి. వారు సాగిలపడి దేవున్ని ఆరాధిస్తూ, “దేవుడు నిజంగా మీ మధ్యలో ఉన్నాడు!” అని అంగీకరిస్తారు.
1CO 14:26 సహోదరీ సహోదరులారా, మేము ఇక ఏమి చెప్పాలి? మీరు సమావేశమైనప్పుడు, మీలో ఒకరు కీర్తన పాడాలని, ఒకరు బోధించాలని, ఒకరు దేవుడు బయలుపరచిన దాన్ని ప్రకటించాలని, ఒకరు భాషలతో మాట్లాడాలని, ఒకడు దానికి అర్థం చెప్పాలని తలస్తున్నారు. కాని ఇవన్నీ సంఘాన్ని బలపరచడానికి చేయండి.
1CO 14:27 భాషల్లో మాట్లాడాలనుకున్నవారు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. మరొకరు దాని అర్థాన్ని వివరించాలి.
1CO 14:28 అయితే అర్థాన్ని వివరించగలవారు ఎవరూ లేకపోతే, భాషలు మాట్లాడేవారు సంఘంలో మౌనంగా ఉండి, తనలో తాను దేవునితోను మాత్రమే మాట్లాడుకోవాలి.
1CO 14:29 ప్రవక్తల్లో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే మాట్లాడాలి. ఇతరులు వారు చెప్పిన దానిని జాగ్రత్తగా వివేచించాలి.
1CO 14:30 సమావేశంలో కూర్చున్నవారిలో ఎవరైనా దేవుని నుండి ప్రత్యక్షతను పొందితే, మాట్లాడుతున్నవారు తన మాటలు ఆపివేయాలి.
1CO 14:31 ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ప్రోత్సహించబడేలా మీరందరు ఒకరి తర్వాత ఒకరు ప్రవచించాలి.
1CO 14:32 ప్రవక్తల ఆత్మ ప్రవక్తలకు లోబడి ఉండాలి.
1CO 14:33 అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానాన్ని కలిగిస్తారే తప్ప అల్లరిని కాదు.
1CO 14:34 స్త్రీలు సంఘాల్లో మౌనంగా ఉండాలి. వారు మాట్లాడడానికి అనుమతి లేదు కాని ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా వారు వినయం కలిగి ఉండాలి.
1CO 14:35 వారు ఏదైనా తెలుసుకోవాలంటే ఇంటి దగ్గర తమ భర్తలను అడగాలి; సంఘంలో మాట్లాడడం స్త్రీకి అవమానకరం.
1CO 14:36 దేవుని వర్తమానం మీ నుండే మొదలైనదా? లేదా అది మీ దగ్గరకు మాత్రమే వచ్చిందా?
1CO 14:37 ఎవరైనా తాము దేవుని ప్రవక్తలమని లేదా ఆత్మ వరాలు గల వారమని తలిస్తే, నేను మీకు వ్రాసేది ప్రభువు ఆజ్ఞ అని వారు గ్రహించాలి.
1CO 14:38 కాని, ఎవరైనా దీన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు నిర్లక్ష్యం చేయబడినవారిగానే ఉంటారు.
1CO 14:39 కాబట్టి నా సహోదరీ సహోదరులారా, ప్రవచించడాన్ని ఆసక్తితో కోరుకోండి, భాషలతో మాట్లాడడాన్ని ఆటంకపరచకండి.
1CO 14:40 అయితే సమస్తం మర్యాదగా క్రమంగా జరుగనివ్వండి.
1CO 15:1 సహోదరీ సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీరు అంగీకరించి దానిలో నిలిచి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
1CO 15:2 నేను మీకు బోధించిన విధంగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకుని ఉంటే ఈ సువార్తను బట్టి మీరు రక్షించబడతారు. లేకపోతే మీరు నమ్మడం వ్యర్థమే.
1CO 15:3 నేను పొందిన దానిని మొదట మీకు ప్రకటించాను: అది ఏంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం మరణించారు.
1CO 15:4 లేఖనాల ప్రకారం ఆయన సమాధి చేయబడి, మూడవ దినాన సజీవునిగా లేచారు.
1CO 15:5 ఆయన కేఫాకు, తర్వాత పన్నెండు మందికి కనబడ్డారు.
1CO 15:6 దాని తర్వాత ఆయన ఒకేసారి అయిదువందల మందికి పైగా సహోదర సహోదరీలకు కనబడ్డారు. వారిలో కొందరు మరణించినా చాలామంది ఇంకా జీవించే ఉన్నారు.
1CO 15:7 ఆ తర్వాత యాకోబుకు, మిగిలిన అపొస్తలులందరికి ఆయన కనబడ్డారు.
1CO 15:8 అందరికంటే చివరిగా అకాలంలో పుట్టిన నాకు కూడా ఆయన కనబడ్డారు.
1CO 15:9 అపొస్తలులందరిలో నేను అల్పమైనవాన్ని. నేను దేవుని సంఘాన్ని హింసించిన కారణంగా అపొస్తలుడని పిలువబడడానికి యోగ్యున్ని కాను.
1CO 15:10 అయితే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే, ఆయన కృప నాలో వ్యర్థం కాలేదు. పైగా ఇతర అపొస్తలుల కంటే నేను ఎంతో ఎక్కువగా శ్రమపడ్డాను కాని అది నిజంగా నా ప్రయాస కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే.
1CO 15:11 కాబట్టి నేనైనా వారైనా దానినే ప్రకటిస్తున్నాం, దానినే మీరు నమ్మారు.
1CO 15:12 మృతులలో నుండి క్రీస్తు సజీవంగా లేపబడ్డారని మేము ప్రకటిస్తుండగా, మృతుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎలా చెప్తారు?
1CO 15:13 మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడనట్టే కదా.
1CO 15:14 అంతేకాదు క్రీస్తు లేపబడకపోతే, మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే.
1CO 15:15 అంతేకాక, దేవుడు క్రీస్తును మరణం నుండి లేపారని దేవుని గురించి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము అబద్ధ సాక్షులంగా కనబడుతున్నాము. అయితే దేవుడు ఆయనను లేపకపోతే మరణించినవారు లేపబడరు అనేది నిజం కదా.
1CO 15:16 మృతులు లేపబడకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు.
1CO 15:17 క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే; మీరు ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు.
1CO 15:18 అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే.
1CO 15:19 కేవలం ఈ జీవితకాలం వరకే క్రీస్తులో మన నిరీక్షణ ఉంచితే, అందరికంటే మనం అత్యంత దయనీయంగా ఉంటాము.
1CO 15:20 ఇప్పుడైతే మరణించినవారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మరణం నుండి లేపబడ్డారు.
1CO 15:21 ఒక్క మనుష్యుని ద్వారా మరణం వచ్చింది కాబట్టి మృతుల పునరుత్థానం కూడ ఒక్క మనుష్యుని ద్వారానే వస్తుంది.
1CO 15:22 ఆదాములో అందరు ఎలా మరణించారో అలాగే క్రీస్తులో అందరు బ్రతికించబడతారు.
1CO 15:23 అయితే ప్రతి ఒక్కరు తమ క్రమాన్ని బట్టి బ్రతికించబడతారు. క్రీస్తు ప్రథమ ఫలము. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయనకు చెందినవారు బ్రతుకుతారు.
1CO 15:24 క్రీస్తు సమస్త ఆధిపత్యాన్ని అధికారాన్ని బలాన్ని నాశనం చేసి తండ్రియైన దేవునికి రాజ్యానికి అప్పగిస్తారు. అప్పుడు అంతం వస్తుంది.
1CO 15:25 ఎందుకంటే ఆయన తన శత్రువులందరిని తన పాదాల క్రింద ఉంచేవరకు ఆయన పరిపాలిస్తారు.
1CO 15:26 చివరిగా నశించే శత్రువు మరణం.
1CO 15:27 “దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచారు” అని చెప్పినప్పుడు ఆయన క్రింద సమస్తాన్ని ఇచ్చిన దేవుడు మినహా మిగిలిన వాటన్నిటిని ఆయన క్రింద ఉంచారని అర్థం.
1CO 15:28 ఆయన ఇది చేసినప్పుడు, దేవుడే అన్నిటిలో సర్వమై ఉండేలా, కుమారుడు తనకు సమస్తాన్ని లోబరచిన దేవునికి తానే లోబడతారు.
1CO 15:29 ఇప్పుడు పునరుత్థానం లేకపోతే, మరి మృతుల కోసం బాప్తిస్మం పొందినవారు ఏం చేస్తారు? మరణించినవారు ఎన్నటికి లేపబడకపోతే, ప్రజలు వారి కోసం ఎందుకు బాప్తిస్మం పొందుతున్నారు?
1CO 15:30 మరి అనుక్షణం మేము ఎందుకు ప్రాణభయంతో ఉండాలి?
1CO 15:31 సహోదరీ సహోదరులైన మీ గురించి మన ప్రభువైన యేసు క్రీస్తులో నాకు అతిశయం కలుగుతున్నట్టుగానే నేను ప్రతి రోజూ చస్తూనే ఉన్నాను.
1CO 15:32 కాని, కేవలం మానవరీతిగా ఎఫెసులోని మృగాలతో నేను పోరాడితే నాకు లాభమేంటి? ఒకవేళ మరణించినవారు లేపబడకపోతే, “రేపు చనిపోతాం కాబట్టి, మనం తిని త్రాగుదాం.”
1CO 15:33 మోసపోకండి: “దుష్టులతో సహవాసం మంచి ప్రవర్తనను పాడుచేస్తుంది.”
1CO 15:34 మీరు నీతిప్రవర్తన కలిగి పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గురించి తెలియదు కాబట్టి, మీరు సిగ్గుపడాలని ఇలా చెప్తున్నాను.
1CO 15:35 “చనిపోయినవారు ఎలా లేపబడతారు? వారికి ఎలాంటి శరీరం ఉంటుంది?” అని ఎవరైనా ప్రశ్నించవచ్చు.
1CO 15:36 మూర్ఖుడా! నీవు ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది చనిపోతేనే తప్ప మొలకెత్తదు.
1CO 15:37 గోధుమ గింజనైన, మరొక దానినైన నీవు భూమిలో నాటినప్పుడు విత్తనం మాత్రమే నాటావు గాని పెరిగిన మొక్క కాదు.
1CO 15:38 అయితే దేవుడు తాను నిర్ణయించిన శరీరాన్ని దానికి ఇస్తారు. ఆయన ప్రతి ఒక్క గింజకు దాని సొంత శరీరాన్ని ఇస్తారు.
1CO 15:39 శరీరాలన్ని ఒకేలా ఉండవు. మానవుల మాంసం వేరు, జంతువుల మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, చేపల మాంసం వేరు.
1CO 15:40 అలాగే ఆకాశ శరీరాలు ఉన్నాయి, భూలోక శరీరాలు ఉన్నాయి; ఆకాశ శరీరాల మహిమ వేరు, భూశరీరాల మహిమ వేరు.
1CO 15:41 సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి మహిమలో భేదం ఉంటుంది.
1CO 15:42 మృతుల పునరుత్థానం కూడా ఇలాగే ఉంటుంది. నశించిపోయే శరీరం నాటబడి నాశనంలేనిదిగా లేపబడుతుంది.
1CO 15:43 ఘనహీనంగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుంది; అది బలహీనమైనదిగా విత్తబడి శక్తిగలదానిగా లేపబడుతుంది.
1CO 15:44 ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మీయ శరీరంగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నట్లే ఆత్మీయ శరీరం కూడ ఉంది.
1CO 15:45 కాబట్టి “మొదటి మనిషియైన ఆదాము జీవి అయ్యాడు” అని వ్రాయబడింది; చివరి ఆదాము జీవాన్నిచ్చే ఆత్మ అయ్యాడు.
1CO 15:46 ఆత్మ సంబంధమైనది మొదట రాలేదు, కాని ప్రకృతి సంబంధమైనది మొదట వచ్చింది, ఆ తర్వాతే ఆత్మ సంబంధమైనది వచ్చింది.
1CO 15:47 మొదటి మానవుడు భూమిలోని మట్టితో చేయబడ్డాడు, రెండవ మానవుడు పరలోకానికి చెందిన వాడు.
1CO 15:48 భూమికి చెందిన మానవునిలా భూలోక సంబంధులు ఉంటారు. పరలోకానికి చెందిన వానిలా పరలోక సంబంధులు ఉంటారు.
1CO 15:49 మనం భూసంబంధియైన మనుష్యుని రూపాన్ని ధరించినట్లే పరలోకసంబంధమైన వాని రూపాన్ని ధరించుకుంటాము.
1CO 15:50 సహోదరీ సహోదరులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, రక్తమాంసాలు దేవుని రాజ్య వారసత్వాన్ని పొందలేవు. నశించిపోయేది శాశ్వతమైన దానిని స్వతంత్రించుకోలేదు.
1CO 15:51 నేను మీకు ఒక రహస్యాన్ని చెప్తాను వినండి: మనమందరం నిద్రించం గాని, మనమందరం మార్పు చెందుతాము.
1CO 15:52 ఒక క్షణంలోనే, రెప్పపాటులో, చివరి బూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుతాము. బూర మ్రోగుతుంది, అప్పుడు మృతులు శాశ్వతమైనవారిగా లేపబడతారు, మనమందరం మార్పు చెందుతాము.
1CO 15:53 ఎందుకంటే, నశించిపోయేది శాశ్వతమైన దాన్ని ధరించుకోవాలి, మరణించేది మరణంలేని దాన్ని ధరించుకోవాలి.
1CO 15:54 నశించిపోయేది శాశ్వతమైన దాన్ని, మరణించేది మరణంలేని దాన్ని ధరించినపుడు, “విజయం మరణాన్ని మ్రింగివేసింది” అని వ్రాయబడిన వాక్యం నిజమవుతుంది.
1CO 15:55 “ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ?”
1CO 15:56 మరణపు ముల్లు పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రమే.
1CO 15:57 అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు.
1CO 15:58 కాబట్టి నా ప్రియ సహోదరీ సహోదరులారా, స్థిరంగా నిలబడండి. ఏది మిమ్మల్ని కదపలేదు. ప్రభువులో మీ శ్రమ వ్యర్థం కాదని మీకు తెలుసు కాబట్టి ఎల్లప్పుడు ప్రభువు కార్యాల్లో పూర్తి శ్రద్ధ చూపండి.
1CO 16:1 ప్రభువు ప్రజల కోసం కానుక పోగుచేయడం గురించి గలతీయలోని సంఘాలకు నేను ఏమి చేయమని చెప్పానో మీరు కూడా అది చేయాలి.
1CO 16:2 ప్రతి వారంలో మొదటి రోజున మీలో ప్రతి ఒక్కరు మీ సంపాదన బట్టి కొంత ధనాన్ని ప్రక్కన పెట్టి దాచి ఉంచండి. దానివల్ల నేను వచ్చినపుడు కానుకలు సేకరించాల్సిన అవసరం ఉండదు.
1CO 16:3 నేను వచ్చిన తర్వాత, మీరు ఆమోదించిన వారికి నేను పరిచయ పత్రికలను ఇచ్చి, మీ కానుకలతో వారిని యెరూషలేముకు పంపుతాను.
1CO 16:4 నేను కూడా వెళ్లడం అవసరం అయితే, వారు నా వెంట వస్తారు.
1CO 16:5 నేను మాసిదోనియాకు వెళ్లాలని అనుకుంటున్నాను కాబట్టి మాసిదోనియాకు వెళ్లినప్పుడు మీ దగ్గరకు వస్తాను.
1CO 16:6 బహుశ మీతో కొంతకాలం గడుపుతాను లేదా చలికాలమంతా ఉంటాను. అప్పుడు నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి నా ప్రయాణంలో మీరు నాకు సహాయం చేయగలరు.
1CO 16:7 మార్గమధ్యలో మిమ్మల్ని చూసి వెంటనే వెళ్లిపోవాలని నేను అనుకోవడం లేదు. ప్రభువు అనుమతిస్తే మీతో కొంతకాలం గడపాలని అనుకుంటున్నాను.
1CO 16:8 అయితే పెంతెకొస్తు దినం వరకు ఎఫెసులోనే ఉంటాను.
1CO 16:9 ఎందుకంటే చాలామంది నన్ను వ్యతిరేకించినా, ఫలవంతమైన పని చేయడానికి ఒక గొప్ప ద్వారం నాకు తెరవబడింది.
1CO 16:10 తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిర్భయంగా ఉండేలా చూడండి. నాలాగే అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.
1CO 16:11 కాబట్టి ఎవరూ అతని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దు. అతడు నా దగ్గరకు తిరిగి వచ్చేలా అతన్ని సమాధానంతో పంపించండి. అతడు సహోదరులతో పాటు వస్తాడని నేను ఎదురు చూస్తున్నాను.
1CO 16:12 మన సహోదరుడైన అపొల్లో విషయం ఏంటంటే, సహోదరులతో పాటు మీ దగ్గరకు వెళ్లమని అతన్ని నేను చాలా బ్రతిమాలాను. కాని ఇప్పుడే బయలుదేరడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే సరియైన అవకాశం లభించినపుడు అతడు వస్తాడు.
1CO 16:13 మెలకువగా ఉండండి; విశ్వాసంలో నిలకడగా ఉండండి; ధైర్యం కలిగి బలవంతులై ఉండండి.
1CO 16:14 ప్రేమ పూర్వకంగా అన్ని పనులు చేయండి.
1CO 16:15 స్తెఫెను అతని ఇంటివారు అకాయలో మొదటిగా క్రీస్తును స్వీకరించారని మీకు తెలుసు. వారు పరిశుద్ధుల సేవకు తమను తాము అర్పించుకున్నారు. సహోదరీ సహోదరులారా, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను,
1CO 16:16 అలాంటి వారికి, వారితో పాటు పని చేసి సేవ చేసేవారికి మీరు లోబడి ఉండండి.
1CO 16:17 స్తెఫెను, ఫొర్మూనాతు అకాయికు అనేవారు రావడం నాకు సంతోషం ఎందుకంటే మీరు లేని కొరత వారు నాకు తీర్చారు.
1CO 16:18 నా ఆత్మకు, మీ ఆత్మకు కూడా వారు నూతన ఉత్తేజం కలిగించారు. అలాంటివారు గౌరవించదగినవారు.
1CO 16:19 ఆసియా ప్రాంతంలోని సంఘాలు మీకు తమ అభినందనలు పంపుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనేవారు, వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘం మీకు ప్రభువులో హృదయపూర్వక అభినందనలు పంపుతున్నారు.
1CO 16:20 ఇక్కడి సహోదరీ సహోదరులందరు మీకు అభినందనలు పంపుతున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరిని ఒకరు అభినందనలు తెలుపుకోండి.
1CO 16:21 పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను.
1CO 16:22 ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రండి!
1CO 16:23 ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక.
1CO 16:24 క్రీస్తు యేసులో మీ అందరికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఆమేన్.
2CO 1:1 దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, మన సోదరుడు తిమోతి,
2CO 1:2 మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక.
2CO 1:3 మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లింద్దాము. మన తండ్రి కనికరం గలవాడు. సమస్త అన్ని విధాలా ఆదరణనిచ్చే దేవుడు.
2CO 1:4 దేవుడు మనల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నారో, అదే ఆదరణతో అలాంటి కష్టాల్లో ఉన్నవారిని ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నారు.
2CO 1:5 క్రీస్తు శ్రమలలో మనం ఎంత ఎక్కువ భాగం పంచుకున్నామో క్రీస్తు ఆదరణ కూడా అంతే ఎక్కువగా మనకు కలుగుతుంది.
2CO 1:6 మేము శ్రమపడడం మీకు ఆదరణ కోసం రక్షణ కోసమే. ఆదరణ లభిస్తే అది మీ కొరకే కాబట్టి మేము పడిన కష్టాలను మీరు కూడా ఓపికతో భరించడానికి శక్తి లభిస్తుంది.
2CO 1:7 మీరు మా కష్టాల్లో పాలివారైనట్లే ఆదరణలో కూడా పాలుపంచుకుంటారని మాకు తెలుసు. కాబట్టి మీలో మా నిరీక్షణ స్థిరంగా ఉంది.
2CO 1:8 సహోదరి సహోదరులారా, ఆసియా ప్రాంతంలో మాకు ఎదురైన కష్టాల గురించి మీకు చెప్పకుండా ఉండాలని అనుకోవడం లేదు. మేము మా శక్తికి మించిన కష్టాలను అనుభవించాము. కాబట్టి మేము జీవితంపై ఆశ వదులుకున్నాము.
2CO 1:9 మాకు మరణశిక్ష విధించబడినట్లుగా భావించించాము. మేము మాపై ఆధారపడక, మృతులను కూడ పునరుత్ధానులుగా చేసిన దేవునిపై ఆధారపడడానికే అలా జరిగింది.
2CO 1:10 మరణకరమైన భయంకర ప్రమాదాల నుండి ఆయన మమ్మల్ని కాపాడారు. ఇకముందు కూడా కాపాడతారు. ఇకముందు కూడ కాపాడతాడు. ఆయన తిరిగి మమ్మల్ని కాపాడతారని ఆయనలో నిరీక్షణ కలిగి ఉన్నాము.
2CO 1:11 మీ ప్రార్థనల ద్వారా మాకు సహాయం చేస్తున్నారు, కాబట్టి వాటిలో అనేక ప్రార్థనలకు జవాబుగా దేవుడు మామీద దయ చూపినందుకు మా పక్షంగా అనేకులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు.
2CO 1:12 ఇప్పుడు ఇది మాకు గర్వకారణం: ముఖ్యంగా మీతో మాకు గల సంబంధం విషయంలో నిజాయితితో, దేవుడు ఇచ్చే పవిత్రతతో మేము నడచుకున్నాము. లోకజ్ఞానంపై ఆధారపడక దేవుని కృపపై ఆధారపడి నడుచుకున్నామని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది.
2CO 1:13 ఎందుకంటే, మీరు చదివి, అర్థం చేసుకోగలిగిన సంగతులను మాత్రమే మీకు వ్రాస్తున్నానని నేను అనుకుంటున్నాను.
2CO 1:14 ఇప్పుడు మీరు కొంతవరకు మాత్రమే అర్థం చేసుకోగల విషయాన్ని, రాబోవు కాలంలో సంపూర్ణంగా గ్రహిస్తారని నేను నిరీక్షిస్తున్నాను. అప్పుడు యేసు ప్రభువు దినాన మమ్మల్ని చూసి మీరు ఎంతగా గర్విస్తారో, మిమ్మల్ని చూసి మేము కూడా అలాగే గర్విస్తాము.
2CO 1:15 దీన్ని గురించి నాకు చాలా నమ్మకం ఉన్నందువల్ల, మీకు రెట్టింపు ఆనందం కలిగేలా నేను మొదట మిమ్మల్ని చూడడానికి రావాలని అనుకున్నాను.
2CO 1:16 నేను మాసిదోనియాకు వెళ్లేటప్పుడు, అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు మీ దగ్గరకు రావాలని, మీరు నన్ను యూదయకు పంపాలని అనుకున్నాను.
2CO 1:17 నేను ఇలా ఆలోచించి అస్థిరంగా నడుచుకున్నానా? నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా? ఔను ఔనని చెప్తూ కాదు కాదని చెప్తున్నానా?
2CO 1:18 అయితే దేవుడు నమ్మదగినవాడు కాబట్టి, మా వర్తమానం “అవునని” చెప్పి “కాదు” అనేలా ఉండదు.
2CO 1:19 ఎందుకంటే సీల ద్వారా, తిమోతి ద్వారా, నా ద్వారా మీకు బోధించబడిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అవునని చెప్పి, కాదనేవాడు కాడు.
2CO 1:20 ఎందుకంటే, దేవుని వాగ్దానాలన్ని క్రీస్తులో “అవును” అన్నట్లుగా ఉన్నాయి. అందుకే, దేవునికి మహిమ కలుగడానికి యేసు క్రీస్తు ద్వారా మనం “ఆమేన్” అని అంటున్నాము.
2CO 1:21 మీతో కూడా క్రీస్తులో నిలిచి ఉండేలా, మమ్మల్ని స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే.
2CO 1:22 ఆయనే తన ముద్రను మనపై వేసి మనల్ని తన వారిగా ప్రకటించారు. ఆయన మనకిచ్చిన వాటిని ధృవపరచడానికి మన హృదయాల్లో పవిత్రాత్మను అనుగ్రహించారు.
2CO 1:23 నా ప్రాణం తోడు దేవుడే దీనికి సాక్షిగా పెట్టుకున్నాను; మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేనందువల్ల నేను తిరిగి కొరింథీకి రాలేదు.
2CO 1:24 అందుకే మీరు విశ్వాసం వల్ల దృఢంగా నిలిచి ఉన్నారు. కాబట్టి మీ విశ్వాస విషయమై మేము ఆజ్ఞాపించడంలేదు. పైగా మేము మీ సంతోషం కోసం మీ తోటిపనివారిగా పనిచేస్తున్నాము.
2CO 2:1 కాబట్టి నేను దుఃఖం కలిగించేలా మీ దగ్గరకు తిరిగి రాకూడదని నేను నిర్ణయించుకున్నాను.
2CO 2:2 ఎందుకంటే, నేను మీకు దుఃఖం కలిగిస్తే, నేను దుఃఖంలో విడిచిపెట్టిన వారు తప్ప మరి ఎవరు నన్ను సంతోషపెట్టగలరు?
2CO 2:3 కాబట్టి, నేను అక్కడికి వచ్చినపుడు నన్ను సంతోషపెట్టాల్సిన వ్యక్తులే నన్ను దుఃఖపెట్టకూడదని నేను మీకు వ్రాశాను. నా ఆనందమే మీ అందరి ఆనందమని నాకు గట్టి నమ్మకము.
2CO 2:4 ఎంతో దుఃఖ హృదయంతో, కన్నీటితో మీకు వ్రాశాను. నేను వ్రాసింది మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు కాని, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో, మీరు గుర్తించడానికి మాత్రమే.
2CO 2:5 ఎవరైనా దుఃఖం కలిగిస్తే, నాకు మాత్రమే గాక మీకందరికిని దుఃఖం కలిగించినట్లే. ఇంతకంటే కఠినంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు.
2CO 2:6 అలాంటి వానికి మీలో ఎక్కువ మంది ద్వారా విధించబడిన శిక్షే చాలు.
2CO 2:7 కాబట్టి మీరిక అతన్ని శిక్షించకుండా క్షమించి, ఓదార్చడం మంచిది, లేకపోతే అతడు అధిక దుఃఖంలో మునిగిపోతాడేమో.
2CO 2:8 అందుకే, మీరు అతని పట్ల మీ ప్రేమను మళ్ళీ రూఢిపరచుమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
2CO 2:9 మిమ్మల్ని పరీక్షించి, అన్ని విషయాల్లో మీరు విధేయత చూపుతారో లేదో తెలుసుకోవడానికి నేను అలా వ్రాశాను.
2CO 2:10 మీరు క్షమించేవారిని నేను క్షమిస్తాను. నేను ఏ దోషమైన క్షమిస్తే, మీ కోసమే క్రీస్తును బట్టి క్షమిస్తాను.
2CO 2:11 సాతాను మనపై ఆధిక్యాన్ని పొందకుండా అలా చేశాను, సాతాను తంత్రాలు మనకు తెలియనివి కావు.
2CO 2:12 క్రీస్తు సువార్తను బోధించడానికి నేను త్రోయకు చేరినప్పుడు ప్రభువు నా పని కోసం అప్పటికే అక్కడ మార్గం సిద్ధపరచి ఉంచారని తెలుసుకున్నాను.
2CO 2:13 కాని నా సోదరుడు తీతును అక్కడ నాకు కనిపించకపోవడంతో నా మనస్సుకు నెమ్మది లేదు. కాబట్టి అక్కడి ప్రజలకు వీడ్కోలు చెప్పి మాసిదోనియా ప్రాంతానికి వెళ్లాను.
2CO 2:14 కాబట్టి ఆయన మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసన వ్యాపింపచేస్తూ, ఆయనలో మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు.
2CO 2:15 ఎందుకంటే, రక్షించబడుతున్నవారి మధ్య, నశించేవారి మధ్య మేము దేవునికి ఇష్టమైన క్రీస్తు పరిమళంగా ఉన్నాము.
2CO 2:16 ఒకరికి మరణం తెచ్చే వాసనగా, మరొకరికి జీవం తెచ్చే వాసనగా ఉన్నాము. కాబట్టి, అలాంటి కార్యానికి యోగ్యులు ఎవరు?
2CO 2:17 మేము దేవుని వాక్యాన్ని స్వలాభం కోసం అమ్మేవారం కాదు, మేము దేవుని వాక్యాన్ని నిజాయితీగా క్రీస్తు అధికారంతో ఆయన ఎదుట బోధిస్తున్నాము. దేవుడు మమ్మల్ని చూస్తున్నారని మాకు తెలుసు.
2CO 3:1 మమ్మల్ని మేమే మరల మెచ్చుకోవడం ప్రారంభించామా? లేదా ఇతరుల్లా మీకు గాని మీ దగ్గరి నుండి గాని మాకు సిఫారసు పత్రికలు అవసరమా?
2CO 3:2 మా హృదయాల మీద వ్రాయబడి, మనుష్యులందరు తెలుసుకుని చదవాల్సిన మా పత్రిక మీరే.
2CO 3:3 రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయక మానవ హృదయాలు అనే పలకల మీద జీవంగల దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరేనని, మా పరిచర్య ఫలితం మీరేనని మీరు తెలియపరుస్తున్నారు.
2CO 3:4 ఇలాంటి నమ్మకం క్రీస్తు ద్వారా దేవునిపై మాకుంది.
2CO 3:5 మేము ఈ పనిని సాధించగలమని చెప్పుకోడానికి మేము సమర్థులమని కాదు, మాలో ఉన్న సామర్థ్యం దేవుని నుండి వచ్చింది.
2CO 3:6 వ్రాతపూర్వకమైన నియమాలను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవించగల సామర్ధ్యాన్ని ఆయనే మాకు ఇచ్చారు. అక్షరం చంపుతుంది కాని ఆత్మ జీవం ఇస్తాడు.
2CO 3:7 మరణాన్ని తెచ్చే పరిచర్య రాళ్లమీద అక్షరాలలో చెక్కబడినా, అది మహిమతో వచ్చింది. మోషే ముఖంపై ప్రకాశించిన మహిమ శాశ్వతమైనది కాకపోయినా ఇశ్రాయేలీయులు దాన్ని నేరుగా చూడలేకపోయారు.
2CO 3:8 అయితే ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎంత మహిమకరంగా ఉంటుంది?
2CO 3:9 శిక్షను తెచ్చే పరిచర్య మహిమ కలిగి ఉంటే, నీతిమంతులుగా చేసే పరిచర్య ఇంకా ఎంత అధిక మహిమ కలిగి ఉంటుందో!
2CO 3:10 అందుకే, ఇప్పటి అత్యున్నతమైన మహిమతో పోల్చినప్పుడు ఇప్పటివరకు మహిమకరంగా ఉన్నవేవి మహిమగా ఉండవు.
2CO 3:11 ఎందుకంటే, గతించిపోయే దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచి ఉండే దానిలో ఇంకెంత మహిమ ఉంటుందో కదా!
2CO 3:12 కాబట్టి, మాకు ఇలాంటి నిరీక్షణ ఉంది, అందుకే మేము ఇంత ధైర్యంతో ఉన్నాము.
2CO 3:13 మేము మోషేలాంటి వారం కాదు, తరిగిపోతున్న దాని అంతాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడకుండ మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు.
2CO 3:14 నిజానికి వారి మనస్సులు మొద్దుబారాయి, పాత నిబంధన చదువుతున్నపుడు ఈనాటికీ వారి మనస్సులకు ఆ ముసుగు అలాగే ఉంది. అది తీసివేయబడలేదు ఎందుకంటే కేవలం క్రీస్తులో మాత్రమే అది తీసివేయబడుతుంది.
2CO 3:15 నేటికీ వారు మోషే ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు, వారి హృదయాల మీద ముసుగు ఉంది.
2CO 3:16 కాని ఎవరైనా ప్రభువు వైపుకు తిరిగితే ఆ ముసుగు తీసివేయబడుతుంది.
2CO 3:17 ఇప్పుడు ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది.
2CO 3:18 కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మయైన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.
2CO 4:1 దేవుని కనికరాన్ని బట్టి ఈ పరిచర్యను మేము కలిగి ఉన్నాము, కాబట్టి మేము ధైర్యాన్ని కోల్పోము.
2CO 4:2 అయితే సిగ్గుపడాల్సిన రహస్యమైన పనులను విడిచిపెట్టాం; మోసాన్ని చేయడం లేదు, దేవుని వాక్యాన్ని వంకరగా బోధించకుండా సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము.
2CO 4:3 ఒకవేళ మేము బోధించే సువార్త ఎవరికైనా మురుగు చేయబడి ఉంటే అది నశించేవారికి మాత్రమే.
2CO 4:4 దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను తెలియజేసే సువార్త వెలుగును వారు చూడకుండ ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనస్సుకు గ్రుడ్డితనం కలుగజేసింది.
2CO 4:5 ఎందుకంటే మా గురించి మేము ప్రకటించడం లేదు కాని యేసు క్రీస్తు ప్రభువని, యేసు కోసం మేము మీ సేవకులమని ప్రకటిస్తున్నాము.
2CO 4:6 “చీకటి నుండి వెలుగు ప్రకాశించును గాక” అని పలికిన ఆ దేవుడే క్రీస్తు ముఖంపై ప్రకాశించే దైవ మహిమను, జ్ఞానమనే వెలుగును మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో తన వెలుగును ప్రకాశింపజేశారు.
2CO 4:7 అయితే ఈ అత్యధిక శక్తి అంతా దేవునిదే గాని మాది కాదు అని చూపించడానికి, మేము మట్టి పాత్రల్లో ఈ సంపదను కలిగి ఉన్నాము.
2CO 4:8 మేము అన్ని వైపుల నుండి తీవ్రమైన శ్రమలకు గురయ్యాం కాని నలిగిపోలేదు; ఆందోళన కలిగినా నిరాశ చెందలేదు;
2CO 4:9 హింసించబడినా విడిచిపెట్టబడలేదు; పడత్రోయబడినా నాశనమవ్వలేదు.
2CO 4:10 మా శరీరంలో యేసు జీవం ప్రత్యక్షపరచబడాలని ఆయన మరణాన్ని మా శరీరంలో ఎప్పుడు మోస్తునే ఉన్నాము.
2CO 4:11 మా క్షయమైన శరీరంలో యేసు జీవం ప్రత్యక్షపరచబడాలని సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు కొరకై మరణానికి అప్పగించబడుతున్నాము.
2CO 4:12 కాబట్టి మాలో మరణం పని చేస్తుంది, కాని మీలో జీవం పని చేస్తుంది.
2CO 4:13 “నేను విశ్వసించాను కాబట్టి మాట్లాడాను” అని వ్రాయబడి ఉంది. అదే విశ్వాసపు ఆత్మ మాలో కూడా ఉంది, కాబట్టి మేము కూడా విశ్వసిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాము.
2CO 4:14 ఎందుకంటే, ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన దేవుడు, యేసుతో పాటు మమ్మల్ని కూడా లేవనెత్తి మీతో పాటు తన ఎదుట నిలబెడతారని మాకు తెలుసు.
2CO 4:15 ఇదంతా మీ మేలు కోసమే, అప్పుడు దేవుని కృప అధికంగా వ్యాపించి ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు విస్తారంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు.
2CO 4:16 కాబట్టి మేము ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోము. మేము బాహ్యంగా క్షీణిస్తున్నా, అంతరంగంలో దినదినం నూతనపరచబడుతున్నాము.
2CO 4:17 మేము అనుభవిస్తున్న ఈ క్షణికమైన తేలికైన కష్టాలు వాటికన్నా ఎంతో అధికమైన నిత్య మహిమను సంపాదిస్తున్నాయి.
2CO 4:18 కాబట్టి కనిపించే వాటిపై కాక కనిపించని వాటిపై మా దృష్టిని నిలిపాము. ఎందుకంటే కనిపించేవి తాత్కాలికమైనవి, కనిపించనివి శాశ్వతమైనవి.
2CO 5:1 మనం నివసిస్తున్న భూసంబంధమైన గుడారం నాశనమైనా, మానవ నిర్మితం కాని దేవుడు కట్టిన ఒక శాశ్వతమైన గృహం పరలోకంలో ఉందని మనకు తెలుసు.
2CO 5:2 ఈలోగా పరలోకం నుండి వచ్చే మన నివాసాన్ని ధరించుకోవాలని ఆశపడుతూ మనం మూలుగుతున్నాము.
2CO 5:3 ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడము.
2CO 5:4 ఈ గుడారంలో ఉన్నంతసేపు మనం భారం మోస్తూ మూల్గుతూ ఉన్నాం, ఎందుకంటే, మనం దిగంబరులుగా ఉండాలని కోరుకోం కాని చనిపోయేది జీవం చేత మ్రింగివేయబడేలా, మన పరలోక నివాసాన్ని ధరించుకోవాలని కోరుతున్నాము.
2CO 5:5 దీని కోసం మనల్ని సిద్ధపరచింది దేవుడే; ఆయనే రాబోయే దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చారు.
2CO 5:6 కాబట్టి మనం ఎల్లప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, ఈ దేహంలో నివసించేంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు.
2CO 5:7 మనం కంటికి కనిపించే దాన్ని కాక, విశ్వాసం వల్ల జీవిస్తున్నాము.
2CO 5:8 కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం సంపూర్ణ నమ్మకం కలిగి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గర నివసించాలని ఎంతగానో ఇష్టపడుతున్నాము.
2CO 5:9 కాబట్టి మనం ఈ శరీరంలో ఉన్నా లేదా దానికి దూరంగా ఉన్నా ఆయనను సంతోషపెట్టడమే లక్ష్యంగా ఉందాము.
2CO 5:10 ఎందుకంటే, మనలో ప్రతి ఒక్కరు తాము శరీరంలో ఉండగా చేసిన వాటికి, అవి మంచివైనా చెడ్డవైనా, తగిన ప్రతిఫలాన్ని పొందడానికి మనమందరం క్రీస్తు న్యాయసింహాసనం ఎదుట ఖచ్చితంగా కనబడాలి.
2CO 5:11 అయితే, ప్రభువుకు భయపడడం అంటే ఏమిటో మాకు తెలుసు కాబట్టి ఇతరులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. మేమేంటో దేవునికి స్పష్టంగా తెలుసు, మీ మనస్సాక్షికి కూడ స్పష్టంగా తెలుసని నేను నమ్ముతున్నాను.
2CO 5:12 మరల మీ ముందు మమ్మల్ని మేము పొగడుకోవాలని ప్రయత్నించడం లేదు కాని, హృదయంలో ఉన్నదానిని బట్టి కాక, కనిపించే దానిని బట్టి గర్వించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా మమ్మల్ని బట్టి మీరు గర్వించడానికి ఒక కారణాన్ని ఇస్తున్నాము.
2CO 5:13 కొందరు చెప్పినట్లు, మేము పిచ్చివారమైతే అది దేవుని కోసం మాత్రమే; మేము వివేకవంతులమైనా అది మీ కోసమే.
2CO 5:14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది, ఎందుకంటే అందరి కోసం ఒక్కడే మరణించాడు కాబట్టి అందరు మరణించినట్టే అని మనం ఒప్పించబడ్డాము.
2CO 5:15 ఆయన అందరి కోసం చనిపోయారు, కాబట్టి జీవిస్తున్నవారు ఇకపై తమ కోసం కాక, వారి కోసం మరణించి తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి.
2CO 5:16 అందువల్ల, మేము ఇప్పటినుండి లోక దృష్టితో ఎవరిని లక్ష్యపెట్టము. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే లక్ష్యపెట్టినా, ఇక మేము అలా చేయము.
2CO 5:17 కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే, వారు నూతన సృష్టి; పాతవి గతించాయి, క్రొత్తవి మొదలయ్యాయి!
2CO 5:18 ఇదంతా దేవుని వల్లనే జరిగింది, ఆయన క్రీస్తు ద్వారా మనల్ని తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరిచే పరిచర్యను మాకు అప్పగించారు.
2CO 5:19 ఆ పరిచర్య ఏంటంటే: దేవుడు ప్రజల పాపాలను వారి మీద మోపకుండా క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరచుకున్నారు. ఆ సమాధాన సందేశాన్ని బోధించే పని మాకు అప్పగించారు.
2CO 5:20 అందువల్ల మేము దేవుడు మా ద్వారా వేడుకోడానికి ఏర్పరచబడిన క్రీస్తు రాయబారులము. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాము.
2CO 5:21 మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారు.
2CO 6:1 దేవుని తోటిపనివారిగా మేము, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాము.
2CO 6:2 అయితే, “నా అనుకూల సమయంలో నీ మొర ఆలకించాను, రక్షణ దినాన నేను నీకు సహాయం చేశాను” అని ఆయన చెప్తున్నారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని మీకు నేను చెప్తున్నాను.
2CO 6:3 మా పరిచర్యకు ఎలాంటి నింద రాకూడదని మేము ఎవరి మార్గానికి ఆటంకాన్ని కలిగించడం లేదు.
2CO 6:4 కాని, మేము దేవుని సేవకులంగా మాకు మేమే అన్ని విధాలుగా మెప్పించుకుంటున్నాము: సహనంలో సమస్యల్లో కష్టాల్లో దుఃఖాల్లో;
2CO 6:5 దెబ్బల్లో చెరసాలల్లో అల్లర్లలో కష్టమైన పనిలో నిద్రలేని రాత్రుల్లో ఆకలిలో;
2CO 6:6 పవిత్రతలో జ్ఞానంలో ఓర్పులో దయలో; పరిశుద్ధాత్మలో నిజమైన ప్రేమలో;
2CO 6:7 సత్యంగా మాట్లాడంలో దేవుని శక్తిలో; కుడిచేతిలో ఎడమ చేతిలో నీతి అనే ఆయుధాలను కలిగి;
2CO 6:8 ఘనతలో అవమానంలో నిందల్లో మెప్పుల్లో; యథార్థవంతులం అయినప్పటికి మోసం చేసేవారమనే నింద మామీద వేయబడింది;
2CO 6:9 తెలిసినవారమైనా తెలియనివారిగా ఎంచబడ్డాము; మరణిస్తున్నా జీవిస్తూనే ఉన్నాం; కొట్టబడ్డాం కాని చంపబడలేదు;
2CO 6:10 దుఃఖపడినా ఎల్లప్పుడు సంతోషిస్తూనే ఉన్నాం; మేము పేదలం కాని అనేకమందిని ధనవంతులుగా చేస్తున్నాము; ఏమి లేదు కాని సమస్తాన్ని కలిగి ఉన్నాము.
2CO 6:11 కొరింథీయులారా, మేము మీతో స్వేచ్ఛగా మాట్లాడాము, మా హృదయాలను మీ ఎదుట విశాలంగా తెరిచాం.
2CO 6:12 మా అభిమానాన్ని మీ నుండి మేము తగ్గించడం లేదు, కానీ మా నుండి మిమ్మల్ని మీరే దూరం ఉంచుతున్నారు.
2CO 6:13 నా బిడ్డలుగా భావించి నేను మీతో మాట్లాడుతున్నాను, మాలా మీరు కూడా మీ హృదయాలను విశాలంగా తెరవండి.
2CO 6:14 అవిశ్వాసులతో సహవాసం చేయకండి. ఎందుకంటే నీతి అవినీతి ఎలా కలిసి ఉంటాయి? చీకటి వెలుతురు ఎలా కలిసి ఉంటాయి?
2CO 6:15 క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఏమిటి?
2CO 6:16 దేవాలయాలకు విగ్రహాలకు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి? మనం జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి దేవుడు ఇలా చెప్పారు: “నేను వారితో నివసిస్తాను వారి మధ్య నడుస్తాను, నేను వారి దేవునిగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”
2CO 6:17 కాబట్టి, “వారి మధ్య నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండండి, అని ప్రభువు చెప్తున్నాడు. అపవిత్రమైన దానిని తాకకండి, అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను.
2CO 6:18 ఇంకా, “నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు, అని సర్వశక్తిగల ప్రభువు చెప్తున్నాడు.”
2CO 7:1 ప్రియ మిత్రులారా, మనం ఈ వాగ్దానాలను కలిగి ఉన్నాం కాబట్టి, దేవుని భయంతో పవిత్రతను సంపూర్ణం చేసుకొంటూ, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాము.
2CO 7:2 మీ హృదయంలో మాకు చోటియ్యండి. మేము ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరిని పాడుచేయలేదు, ఎవరినీ మోసగించలేదు
2CO 7:3 మిమ్మల్ని గద్దించాలనే ఉద్దేశంతో నేను ఇలా చెప్పడం లేదు; ఎందుకంటే, జీవించినా మరణించినా మేము మీతో ఉండేలా మా హృదయాల్లో మీకు ప్రత్యేక స్థానం ఉందని నేను ముందే చెప్పాను.
2CO 7:4 ఎంతో నిష్కపటంగా నేను మీకు చెప్పాను; మీ గురించి నేను చాలా గర్వపడతాను. ఎంతో ధైర్యపరచబడతాను; మా శ్రమలన్నింటిలో నా ఆనందానికి హద్దులు లేవు.
2CO 7:5 మాసిదోనియాకు చేరిన తర్వాత కూడా మాకు విశ్రాంతి లేదు, అయితే ఎక్కడకు వెళ్లినా తీవ్రమైన ఆందోళనలు, బయట కలహాలు లోపల భయాలు.
2CO 7:6 కానీ, బలహీన హృదయులను ధైర్యపరచే దేవుడే తీతు రాక ద్వారా మమ్మల్ని ఓదార్చాడు.
2CO 7:7 అతని రాక వల్లనే కాదు కాని, మీరు అతనికిచ్చిన ఆదరణ వల్ల కూడా. నన్ను చూడాలనే మీ కోరిక గురించి, మీ లోతైన దుఃఖం గురించి, నా పట్ల మీకున్న అభిమానం గురించి అతడు మాకు చెప్పాడు. అందుకు నేను ఎంతో ఎక్కువగా ఆనందించాను.
2CO 7:8 నేను వ్రాసిన పత్రిక మీకు బాధ కలిగించినా, దానికి నేను బాధపడను. ఆ పత్రిక మీకు బాధ కలిగించిందని తెలిసి నేను చింతించినా, అది కొంతకాలం వరకే.
2CO 7:9 మీకు దుఃఖం కలిగించినందుకు కాదు, మీ విచారం మీ పశ్చాత్తాపానికి దారితీసినందుకు ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే, మా వలన మీరు ఏ విధంగా కూడా నష్టపోకూడదని ఉండడానికి దేవుని చిత్తప్రకారం మీరు విచారించారు.
2CO 7:10 దైవికమైన విచారం, రక్షణ కలిగించే పశ్చాత్తాపానికి దారి తీస్తుంది ఏ చింత ఉండదు, కాని లోకసంబంధమైన విచారం మరణాన్ని తెస్తుంది.
2CO 7:11 దైవికమైన విచారం మీలో మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలనే ఎలాంటి ఆతురతను, ఆసక్తిని, ఆగ్రహాన్ని, భయాన్ని, అభిలాషను, శ్రద్ధను, న్యాయం జరిగించడానికి ఎలాంటి సంసిద్ధతను పుట్టిస్తుందో చూడండి. ప్రతిసారి ఈ విషయంలో మీరు నిర్దోషులని మీకు మీరే నిరూపించుకున్నారు.
2CO 7:12 కాబట్టి నేను మీకు పత్రిక వ్రాసినప్పటికి, తప్పు చేసిన వారి గురించి గాని బాధించబడినవారి గురించి గాని వ్రాయలేదు. అయితే మీరు మా పట్ల ఎలా శ్రద్ధ చూపించారో దాన్ని దేవుని ముందు మీరు చూడాలని వ్రాశాను.
2CO 7:13 వీటన్నిటిని బట్టి మేము ధైర్యపరచబడ్డాము. మాకు ఈ ఆదరణ కలిగినపుడు, తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన నెమ్మది పొందినందుకు అతడు ఎంత సంతోషంగా ఉన్నాడో చూసి మరి ఎక్కువగా సంతోషించాము.
2CO 7:14 మిమ్మల్ని అతని ముందు చాలా పొగిడాను, మీరు నన్ను సిగ్గుపరచలేదు, మీకు ఎప్పుడు నిజమే చెప్పాము. అలాగే తీతు ముందు మేము చేసిన పొగడ్తలు వాస్తవమైనవే అని నిరూపించబడ్డాయి.
2CO 7:15 కాబట్టి మీరందరు విధేయత చూపించి, భయంతో వణుకుతో అతన్ని మీరు ఎలా చేర్చుకున్నారో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీమీద అతనికున్న అభిమానం అధికమవుతుంది.
2CO 7:16 ప్రతి విషయంలో మీలో నాకు పూర్తి నమ్మకం ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను.
2CO 8:1 సహోదరీ సహోదరులారా, మాసిదోనియా ప్రాంతంలోని సంఘాలకు అనుగ్రహించబడిన దేవుని కృప గురించి మీరు తెలుసుకోవాలని మేము కోరుతున్నాము.
2CO 8:2 చాలా తీవ్రమైన పరీక్షల మధ్యలో కూడా అత్యధికమైన ఆనందాన్ని వారు పొందారు, వారు నిరుపేదలైనా విస్తారమైన దాతృత్వాన్ని కలిగి ఉన్నారు.
2CO 8:3 ఎందుకంటే, తాము ఇవ్వగలిగిన దానికన్నా, తమ సామర్థ్యాన్ని మించి వారు ఇచ్చారని నేను సాక్ష్యమిస్తాను.
2CO 8:4 ప్రభువు ప్రజలకు పరిచర్య చేయడంలో పాలుపంచుకునే ఆధిక్యత అత్యవసరమని వారు మమ్మల్ని బ్రతిమాలారు.
2CO 8:5 వారు మా అంచనాలను అధిగమించారు: మొదటిగా తమను తాము ప్రభువుకు అర్పించుకున్నారు, ఆ తర్వాత దేవుని చిత్తాన్ని బట్టి మాకు కూడ తమను అర్పించుకున్నారు.
2CO 8:6 కాబట్టి తీతు ఈ దాతృత్వ పనిని గతంలో ప్రారంభించినట్లే మీ వైపు నుండి కూడా దానిని పూర్తి చేయమని అతన్ని వేడుకున్నాము.
2CO 8:7 అయితే మీరు విశ్వాసంలో, వాక్యంలో, జ్ఞానంలో, ఆసక్తిలో, మాపై మీకు గల ప్రేమలో శ్రద్ధలో ఎలా వృద్ధి చెందుతున్నారో అలాగే మీరు ధారాళంగా ఇవ్వడంలో కూడా వృద్ధిచెందేలా చూసుకోండి.
2CO 8:8 ఆజ్ఞాపించి మీకు చెప్పడం లేదు, కాని సహాయం చేయడంలో ఇతరుల ఆసక్తితో పోల్చి మీ ప్రేమ ఎంత నిజమైనదో పరీక్షించాలనుకుంటున్నాను.
2CO 8:9 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కోసం ఆయన పేదవానిగా అయ్యారు.
2CO 8:10 ఈ విషయంలో మీకు ఏది మంచిదో నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. గత ఏడాది మీరు ఇవ్వడంలోనే కాదు అలా చేయాలనే ఆసక్తిలో కూడా మొదటివారిగా ఉన్నారు.
2CO 8:11 కాబట్టి ఆ పనిని ముగించండి, అప్పుడు చేయాలనే మీ ఆసక్తిని, మీ సామర్థ్యాన్ని బట్టి దాన్ని పూర్తి చేయడం ద్వారా సరిపోల్చవచ్చు.
2CO 8:12 ఎందుకంటే, ఇవ్వాలనే ఆసక్తి మీకు ఉంటే, మీ సామర్థ్యాన్ని మించి కాకుండా మీకు ఉన్నదానిలో ఇచ్చే మీ కానుక అంగీకరించదగింది.
2CO 8:13 మీ పైనే భారాన్ని ఉంచి ఇతరులను వదిలేయాలని మేము కోరడంలేదు కాని సమానత్వం ఉండాలని మా కోరిక.
2CO 8:14 ప్రస్తుత సమయంలో మీ సమృద్ధి వారికవసరమైనది సరఫరా చేస్తుంది, అలాగే మీరు అవసరంలో ఉన్నప్పుడు వారి సమృద్ధి మీకు అవసరమైనది సరఫరా చేస్తుంది. సమానత్వమే లక్ష్యం,
2CO 8:15 ఎందుకంటే, “ఎక్కువ పోగుచేసుకున్న వారికి ఎక్కువ మిగల్లేదు, తక్కువ పోగుచేసుకున్న వారికి తక్కువ కాలేదు” అని వ్రాయబడి ఉంది.
2CO 8:16 మీ పట్ల నాకున్న శ్రద్ధనే తీతు హృదయంలో కూడా కలిగించిన దేవునికి కృతజ్ఞతలు.
2CO 8:17 తీతు మా మనవిని అంగీకరించడమే కాకుండా, అతడు ఎంతో ఉత్సాహంతో తన ఇష్టంతో మీ దగ్గరకు వస్తున్నాడు.
2CO 8:18 సువార్త పరిచర్య చేయడంలో సంఘాలన్నింటిలో ప్రసిద్ధి చెందిన సోదరుని కూడా అతనితో పంపుతున్నాను.
2CO 8:19 అంతేకాక, కేవలం ప్రభువును మహిమపరచడానికి, సహాయం చేయడంలో మాకున్న ఆసక్తిని చూపించడానికి మేము చేస్తున్న దానిలో భాగంగా కానుకలను తీసుకెళ్తున్నప్పుడు మాతో పాటు ఉండడానికి సంఘాలు అతన్ని ఏర్పరచుకున్నారు.
2CO 8:20 దాతృత్వంతో ఇచ్చిన కానుకలను మేము ఉపయోగించే విధానం గురించి ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడుతున్నాము.
2CO 8:21 కేవలం ప్రభువు దృష్టిలో మాత్రమే గాక, మనుష్యుల దృష్టికి కూడా మంచిది అనిపించిందే చేయాలని మేము బాధలు అనుభవిస్తున్నాము.
2CO 8:22 అంతేకాక, మా సహోదరున్ని వారితో కూడా పంపుతున్నాము. అతడు ఆసక్తి కలిగినవాడని మాకు అనేకసార్లు రుజువుచేసి చూపించాడు. మీపై అతనికున్న నమ్మకాన్ని బట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆసక్తిగా ఉన్నాడు.
2CO 8:23 ఇక తీతు అయితే నా జతపనివాడు మీ మధ్యలో తోటి పనివాడు; మా సహోదరులైతే సంఘాలకు ప్రతినిధులు క్రీస్తుకు ఘనత తెచ్చేవారు.
2CO 8:24 అందువల్ల వారికి మీ ప్రేమను చూపించండి, మీ గురించి మేము ఎందుకు గర్విస్తున్నామో చూపించండి. అప్పుడు సంఘాలు కూడా తెలుసుకోగలవు.
2CO 9:1 పరిశుద్ధులకు చేస్తున్న పరిచర్య గురించి నేను మీకు వ్రాయాల్సిన అవసరం లేదు.
2CO 9:2 సహాయం చేయడానికి మీరు ఆసక్తి గలవారని నాకు తెలుసు, అందుకే మాసిదోనియాలోని ప్రజలకు మీ గురించి గొప్పగా చెప్పి, అకాయలో ఉన్న మీరు గత ఏడాది నుండి సహాయం చేయడానికి సిద్ధపడ్డారని వారికి చెప్పాను; మీ ఆసక్తి వారిలో అనేకమందిని ప్రేరేపించింది.
2CO 9:3 అయితే ఈ విషయంలో మీ గురించి మేము చెప్పిన గొప్పలు వట్టివి కాకుండా నేను చెప్పినట్లుగా మీరు సిద్ధంగా ఉండాలని సహోదరులను నేను పంపుతున్నాను.
2CO 9:4 ఒకవేళ మాసిదోనియా వారెవరైనా నాతో వచ్చినపుడు మీరు సిద్ధంగా లేరని చూస్తే, మీరే కాదు మీమీద ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్నందుకు మేము కూడా సిగ్గుపడాల్సి ఉంటుంది.
2CO 9:5 అందుకే, మీరు వాగ్దానం చేసిన కానుకలు అయిష్టంగా కాకుండా దాతృత్వంతో ఇచ్చేలా సిద్ధపడి ఉండడానికి ప్రోత్సహించేలా మీ దగ్గరకు ముందుగానే సహోదరులను పంపడం అవసరమని నేను అనుకున్నాను.
2CO 9:6 ఇది జ్ఞాపకం ఉంచుకోండి: కొంచెం విత్తినవానికి కొంచెం పంటే పండుతుంది. విస్తారంగా విత్తినవానికి విస్తారమైన పంట పండుతుంది.
2CO 9:7 సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తారు కాబట్టి అయిష్టంగా బలవంతంగా కాకుండా మీలో ప్రతి ఒక్కరు మీ హృదయాల్లో నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వండి.
2CO 9:8 అన్ని విషయాల్లో, అన్నివేళల్లో మీకు కావలసినవన్ని కలిగి ఉండి, ప్రతి మంచి కార్యంలో సమృద్ధిగా ఉండేలా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించగలరు.
2CO 9:9 దీని గురించి ఇలా వ్రాయబడి ఉంది: “వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు. వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది.”
2CO 9:10 విత్తువానికి విత్తనాలు, తినడానికి రొట్టె సమకూర్చే దేవుడు మీకు విత్తనం ఇచ్చి ఫలింపజేస్తారు, మీ నీతి పంటను విస్తరింపజేస్తారు.
2CO 9:11 మీరు ప్రతి సమయంలో ధారాళంగా ఇవ్వడానికి మీరు అన్ని రకాలుగా సంపన్నులు అవుతారు. మీ దాతృత్వం బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడతాయి.
2CO 9:12 మీరు చేసే ఈ పరిచర్య కేవలం పరిశుద్ధుల అవసరాలు తీర్చడమే కాదు, దేవునికి అనేక విధాలుగా కృతజ్ఞతలు చెల్లించినట్టవుతుంది.
2CO 9:13 ఈ పరిచర్య వలన మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను మీరు అంగీకరించడాన్ని బట్టి కలిగిన విధేయత కోసం, వారితో అందరితో పాలుపంచుకొనే మీ దాతృత్వం బట్టి ఇతరులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు.
2CO 9:14 దేవుడు మీకిచ్చిన అత్యధిక కృపను బట్టి వారు మీ కోసం ప్రార్థిస్తూ, మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు.
2CO 9:15 చెప్పశక్యం కాని ఆయన వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు.
2CO 10:1 క్రీస్తు యొక్క వినయం సౌమ్యతను బట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలు అనే నేను మీతో ముఖాముఖిగా ఉన్నపుడు “పిరికివాన్ని” కాని మీకు దూరంగా ఉన్నపుడు “ధైర్యశాలిని.”
2CO 10:2 ఈ లోక పద్ధతులతో మేము జీవిస్తున్నామని భావించే కొందరితో ధైర్యంగా వ్యవహరించాలని అనుకుంటున్నాను, కాని నేను అక్కడికి వచ్చినప్పుడు అలా జరగకుండా ఆపాలని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను.
2CO 10:3 మేము ఈ లోకంలో జీవించినా ఈ లోకంలా మేము పోరాటం చేయము.
2CO 10:4 మా పోరాటంలో మేము ఉపయోగించే ఆయుధాలు ఈ లోకసంబంధమైన ఆయుధాలు కావు. కోటలను కూడ ధ్వంసం చేయగల దైవశక్తిగల ఆయుధాలు.
2CO 10:5 వితండ వాదాలను, దేవుని జ్ఞానానికి అడ్డునిలిచే ప్రతి ఆటంకాన్ని మేము ధ్వంసం చేస్తాము. ప్రతి ఆలోచనను వశపరచుకొని క్రీస్తుకు లోబడేలా చేస్తాము.
2CO 10:6 మీ విధేయత సంపూర్ణమైన తర్వాత అవిధేయతనంతటిని శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
2CO 10:7 పైకి కనబడే వాటిని బట్టి చూస్తున్నారు. ఎవరైనా తాము క్రీస్తుకు చెందిన వారమని నమ్మితే, వారిలా మేము కూడా క్రీస్తుకు చెందినవారమే అని మరల వారు ఎంచాలి.
2CO 10:8 పడగొట్టడానికి కాక మిమ్మల్ని కట్టడానికే ప్రభువు మాకు ఇచ్చిన అధికారాన్ని గురించి ఒకవేళ నేను గొప్పలు చెప్పుకొన్నా దాని కోసం నేను సిగ్గుపడను.
2CO 10:9 నేను నా పత్రికలతో మిమ్మల్ని భయపెట్టాలని అనుకోవడం లేదు.
2CO 10:10 “ఇతని పత్రికలు గొప్పగా శక్తివంతంగా ఉంటాయి కాని వ్యక్తిగా అతడు బలహీనుడు అతని మాటలు విలువలేనివి” అని కొందరు అన్నారు.
2CO 10:11 మేము లేనప్పుడు పత్రికల్లో ఏమి వ్రాసామో మేము అక్కడ ఉన్నప్పుడు మేము అదే చేస్తామని అలాంటివారు గ్రహించాలి.
2CO 10:12 తమను తామే పొగడుకునే వారితో జత చేరడానికి గాని పోల్చుకోడానికి గాని మాకు ధైర్యం లేదు. ఎప్పుడైతే వారు తమను తామే బేరీజు వేసుకుంటూ తమలో తామే పోల్చుకుంటారో వారు తెలివిలేనివారని అర్థము.
2CO 10:13 మేమైతే పరిమితికి మించి పొగడుకోం, అయినా, దేవుడు మాకు కొలిచి ఇచ్చిన హద్దుల్లోనే ఉన్నాము, ఆ హద్దులో మీరు కూడా ఉన్నారు.
2CO 10:14 క్రీస్తు సువార్తతో మేము మీ దగ్గరకు వచ్చాం కాబట్టి మీ దగ్గరకు మేము రానట్లుగానే మేము పొగడుకోవడంలో మా హద్దులు మీరడం లేదు.
2CO 10:15 ఇతరులు చేసిన పనుల గురించి మా హద్దులు దాటి మేము గొప్పలు చెప్పము. మీ విశ్వాసం అభివృద్ధి చెందుతూ, మీ మధ్యలో మేము పని చేయాల్సిన ప్రాంతం విస్తరించాలని మా నిరీక్షణ.
2CO 10:16 అప్పుడు మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా మేము ఈ సువార్తను బోధించగలము. కాబట్టి వేరొకరి ప్రాంతంలో ఇంతకుముందే జరిగిన పని గురించి మేము పొగడుకోవాలని కోరడంలేదు.
2CO 10:17 అయితే, “గర్వించేవారు ప్రభువులోనే గర్వించాలి.”
2CO 10:18 తనను తానే మెచ్చుకొనేవారు యోగ్యులు కారు గాని, ప్రభువు మెచ్చుకొనేవారే యోగ్యులు.
2CO 11:1 నేను కొంత అవివేకంగా మాట్లాడినా మీరు సహించాలని ఆశిస్తున్నాను. అవును, దయచేసి నన్ను సహించండి!
2CO 11:2 దైవికమైన ఆసక్తిని మీ పట్ల నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే, మిమ్మల్ని నేను క్రీస్తు అనే ఏకైక భర్తకు ప్రధానం చేశాను, కాబట్టి పవిత్రమైన కన్యగా మిమ్మల్ని ఆయనకు అప్పగించాలి.
2CO 11:3 అయితే, సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్లు క్రీస్తులో మీకున్న నిజాయితీ, పవిత్రత నుండి ఏదో ఒక విధంగా మీ మనస్సులు తొలగిపోతాయేమోనని నేను భయపడుతున్నాను.
2CO 11:4 ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము ప్రకటించిన యేసును గాక వేరొక యేసును ప్రకటించినా, లేదా మీరు పొందిన ఆత్మకు విరుద్ధమైన వేరొక ఆత్మను మీరు పొందినా, లేదా మీరు అంగీకరించింది కాకుండా వేరొక సువార్తను అంగీకరించినా మీరు సుళువుగానే సహిస్తున్నారు.
2CO 11:5 “ఈ గొప్ప అపొస్తలుల” కంటే నేను ఏమాత్రం తక్కువ కాదని నేను అనుకుంటున్నాను.
2CO 11:6 మాట్లాడడంలో నాకు నేర్పు లేకపోవచ్చు కాని జ్ఞానంలో కాదు. అన్ని విధాలుగా మేము దీన్ని మీకు పూర్తిగా స్పష్టం చేశాము.
2CO 11:7 దేవుని సువార్తను మీకు ఉచితంగా బోధించి, మిమ్మల్ని గొప్పవారిని చేయడానికి నన్ను నేను తగ్గించుకొని పాపం చేశానా?
2CO 11:8 మీకు నేను సేవ చేయడానికి ఇతర సంఘాల నుండి సహాయం పొంది వారిని దోచుకున్నాను.
2CO 11:9 అంతేకాక నేను మీతో ఉన్నప్పుడు నాకు సహాయం అవసరమైతే నేను ఎవరికి భారంగా లేను, ఎందుకంటే, మాసిదోనియా నుండి వచ్చిన సహోదరులే నాకు అవసరమైనవన్నీ అందించారు. నేను మీకు భారం కాకుండా ఎలా ఉన్నానో ఇకముందు కూడా అలాగే ఉంటాను.
2CO 11:10 నాలో క్రీస్తు సత్యం ఉన్నందుకు, అకాయ ప్రాంతాల్లో నేనిలా గర్వపడకుండ ఎవరు ఆపలేరు.
2CO 11:11 ఎందుకు? మీపై నాకు ప్రేమ లేదా? ఉందని దేవునికి తెలుసు!
2CO 11:12 గర్వించడానికి కారణం వెదికేవారు తాము గర్వించే వాటిలో మాతో సమానంగా ఉన్నామని వారు ఎంచుకోవడానికి అవకాశం లేకుండా చేయడానికి ఇప్పుడు నేను ఏమి చేస్తున్నానో అదే చేయడం కొనసాగిస్తాను.
2CO 11:13 అలాంటివారు అబద్ధ అపొస్తలులు, మోసపూరితమైన పనివారు, క్రీస్తు అపొస్తలుల్లా వేషం వేసుకున్నవారు.
2CO 11:14 ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు, సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకున్నాడు.
2CO 11:15 కాబట్టి వాని సేవకులు కూడా నీతి సేవకుల్లా మారువేషం వేసుకోవడంలో వింత లేదు. వారి క్రియలకు తగిన అంతం వారికి ఉంటుంది.
2CO 11:16 నేను అవివేకినని ఎవరు అనుకోవద్దని మరల చెప్తున్నాను; ఒకవేళ మీరు అలా భావిస్తే అవివేకంగానైనా మీరు నన్ను చేర్చుకోండి అప్పుడు నేను కొంచెం గొప్ప చెప్పుకుంటాను.
2CO 11:17 ఆత్మవిశ్వాసం బట్టి గొప్ప చెప్పడంలో నేను ప్రభువులా మాట్లాడడం లేదు కాని అవివేకిగానే మాట్లాడుతున్నాను.
2CO 11:18 ఈ లోకరీతిగా అనేకమంది గొప్ప చెప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా గొప్ప చెప్పుకుంటాను.
2CO 11:19 మీరు ఎంతో వివేకవంతులు కాబట్టి అవివేకులను కూడ సంతోషంగా సహిస్తారు.
2CO 11:20 నిజానికి, మిమ్మల్ని ఎవరైనా బానిసలుగా చేసినా, మోసం చేసినా, లేదా మిమ్మల్ని చిక్కుల్లో ఇరికించినా, మిమ్మల్ని ముఖంపై కొట్టినా మీరు సహిస్తారు.
2CO 11:21 ఆ విషయంలో మేమెంతో బలహీనులమని నేను సిగ్గుతో ఒప్పుకుంటున్నాను. అయితే ఎవరైనా దేని గురించైనా గొప్పలు చెప్పుకోడానికి ధైర్యం చేస్తే దాని గురించి నేను కూడా గొప్పలు చెప్పుకోడానికి ధైర్యం చేస్తాను, నేను అవివేకిగా మాట్లాడుతున్నాను.
2CO 11:22 వారు హెబ్రీయులా? నేను కూడా. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా. వారు అబ్రాహాము సంతతి వారా? నేను కూడా.
2CO 11:23 వారు క్రీస్తు సేవకులా? నేను మతిలేనివానిలా మాట్లాడుతున్నాను, నేను వారికంటే ఎక్కువ. నేను ఎంతో కష్టపడి పని చేశాను. ఎక్కువసార్లు నేను చెరసాలలో ఉన్నాను, చాలా తీవ్రంగా కొరడా దెబ్బలు తిన్నాను, అనేకసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను.
2CO 11:24 యూదులచేత అయిదు సార్లు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నాను.
2CO 11:25 మూడుసార్లు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, మూడుసార్లు ఓడ పగిలి శ్రమపడ్డాను. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాను.
2CO 11:26 తరచుగా ప్రయాణాలు చేస్తున్నాను. నదుల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, తోటి యూదుల వల్ల ఆపదలు, యూదేతరుల వల్ల ఆపదలు, పట్టణాల్లో, అడవుల్లో, సముద్రాల మీద ఆపదల్లో పడ్డాను; ఇంకా కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉన్నాను.
2CO 11:27 నేను ప్రయాసపడ్డాను కష్టపడ్డాను, తరచూ నిద్ర లేకుండా ఉండేవాన్ని; ఆకలి దాహం నాకు తెలుసు, అనేకసార్లు ఆహారం లేకుండా ఉన్నాను; చలితో, వస్త్రాలు లేకుండా ఉన్నాను.
2CO 11:28 అన్నిటికంటే మించి సంఘాలన్నిటి గురించిన చింత అనుదినం నాకు కలుగుతుంది.
2CO 11:29 ఎవరైనా బలహీనంగా ఉంటే, నేను బలహీనంగా ఉండనా? ఎవరైనా పాపంలో నడిస్తే, నా హృదయం మండదా?
2CO 11:30 ఒకవేళ నేను గర్వించాలంటే, నా బలహీనతలను చూపించే వాటిలోనే గర్విస్తాను.
2CO 11:31 ఎల్లప్పుడు స్తుతించబడే యేసు ప్రభువుకు తండ్రియైన దేవునికి నేను అబద్ధమాడనని తెలుసు.
2CO 11:32 దమస్కులో అరెత అనే రాజు క్రింది అధిపతి నన్ను బంధించడానికి పట్టణం చుట్టూ కాపలా ఉంచాడు.
2CO 11:33 కాని నేను కిటికీ గుండా గోడ పైనుండి ఒక గంపలో క్రిందకు దించబడి, వాని చేతుల్లో నుండి తప్పించుకున్నాను.
2CO 12:1 నేను గర్వపడవచ్చు కాని, దాని వలన నాకు ప్రయోజనం లేదు. ప్రభువు దర్శనాల గురించి, ప్రత్యక్షతల గురించి చెప్తాను.
2CO 12:2 క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు, అతడు పద్నాలుగు సంవత్సరాల క్రితం మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరంతో కొనిపోబడ్డాడా లేక శరీరం లేకుండా కొనిపోబడ్డాడా అనేది నాకు తెలియదు; అది దేవునికే తెలుసు.
2CO 12:3 అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు అది శరీరంతోనా లేదా శరీరం లేకుండా కొనిపోబడ్డాడో నాకు తెలియదు. అది దేవునికే తెలుసు.
2CO 12:4 అతడు పరదైసుకు కొనిపోబడ్డాడు, ఎవరూ చెప్పలేని మాటలు విన్నాడు, ఆ మాటలు పలకడానికి ఎవ్వరికి అనుమతి లేదు.
2CO 12:5 కాబట్టి అలాంటి వాని గురించి గర్విస్తాను, కాని నా గురించి అయితే నా బలహీనత గురించి తప్ప వేరు విధంగా గర్వించను.
2CO 12:6 ఒకవేళ నేను గర్వించాలనుకున్నా సత్యమే చెప్తాను కాబట్టి అవివేకిని కాను. కాని నేను చేసిన దానికి లేదా చెప్పిన దానికి మించి ఎవరూ నా గురించి ఎక్కువగా ఆలోచించకుండా నేను వాటికి దూరంగా ఉన్నాను.
2CO 12:7 నాకు కలిగిన విశేషమైన గొప్ప ప్రత్యక్షతలు వల్ల గర్వంతో ఉబ్బిపోకుండ నా శరీరంలో ఒక ముల్లు పెట్టబడింది. అది సాతాను దూతగా పని చేసి నన్ను నలుగగొట్టి గర్వించకుండా చేస్తుంది.
2CO 12:8 దీన్ని నా నుండి తీసివేయమని నేను మూడుసార్లు ప్రభువుకు మనవి చేశాను.
2CO 12:9 అందుకు, “నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది” అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండేలా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను.
2CO 12:10 అందుకే క్రీస్తు కోసం నాకు కలిగిన బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు నాకు ఆనందాన్నే కలిగిస్తాయి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.
2CO 12:11 నన్ను నేనే బుద్ధిహీనునిగా చేసుకున్నాను, కాని మీరే నన్ను బలవంతం చేశారు. నిజానికి మీరు నన్ను మెచ్చుకోవల్సింది, ఎందుకంటే, నేను వ్యర్థుడనే అయినా మీ “శ్రేష్ఠమైన అపొస్తలుల” కంటే ఏ విషయంలో తక్కువ వాడను కాను.
2CO 12:12 అపొస్తలుల సూచకక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు పూర్తి సహనంతో నా వల్ల మీ మధ్య జరిగాయి.
2CO 12:13 నేనెప్పుడు మీకు భారంగా లేను అనేది తప్ప ఇతర సంఘాల కంటే మీరు ఎలా తక్కువ అవుతారు? ఈ తప్పును బట్టి నన్ను క్షమించండి!
2CO 12:14 నేను మూడవసారి మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, ఎందుకంటే నాకు కావల్సింది మీరే తప్ప మీ ధనం కాదు. పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు తల్లిదండ్రులే పిల్లల కోసం పొదుపు చేసి ఉంచాలి.
2CO 12:15 కాబట్టి నాకు కలిగినదంత మీ ఆత్మల కోసం చాలా సంతోషంగా ఖర్చుచేస్తాను, అంతేకాదు నన్ను నేను కూడా మీ కోసం ఖర్చు చేసుకుంటాను; నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు మీరు నన్ను తక్కువగా ప్రేమిస్తారా?
2CO 12:16 అదలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా ఉండలేదు గాని యుక్తిగా మాయ చేసి మిమ్మల్ని పట్టుకున్నాను అని అంటారేమో!
2CO 12:17 నేను మీ దగ్గరకు పంపినవారి ద్వారా మిమ్మల్ని మోసం చేసి ఏమైనా సంపాదించుకున్నానా?
2CO 12:18 తీతును మీ దగ్గరకు వెళ్లమని వేడుకున్నాను. అతనితో పాటు మా సహోదరున్ని కూడ పంపాను. తీతు మిమ్మల్ని దోచుకోలేదు కదా? మేము ఒకే ఆత్మను కలిగి ఒకే అడుగుజాడల్లో నడువలేదా?
2CO 12:19 ఇంతవరకు మేము మీతో మా పక్షంగా వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టికి క్రీస్తులో ఉన్న వారిలా మేము మాట్లాడుతున్నాము; మిత్రులారా! మేము చేసే ప్రతిదీ మిమ్మల్ని బలపరచడానికే.
2CO 12:20 ఎందుకంటే నేను వచ్చినపుడు నేను కోరుకున్నట్లుగా మీరు ఉండకపోవచ్చు, అలాగే మీరు కోరుకున్నట్లుగా నేను ఉండకపోవచ్చు. అక్కడ కలహాలు, అసూయలు, క్రోధాలు, కక్షలు, వదంతులు, గుసగుసలు, గర్వం, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాను.
2CO 12:21 మరల నేను వచ్చినప్పుడు దేవుడు మీ ముందు నన్ను చిన్నబుచ్చుకునేలా చేస్తాడేమోనని భయపడుతున్నాను, అంతేగాక గతంలో పాపం చేసి జరిగించిన అపవిత్రత, లైంగిక పాపం, పోకిరి చేష్టల గురించి పశ్చాత్తాపం చెందని వారి గురించి కూడ నేను దుఃఖపడాల్సి వస్తుందేమో అని భయపడుతున్నాను.
2CO 13:1 నేను మీ దగ్గరకు రావడం ఇది మూడవసారి. “ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యాల మీద ప్రతి విషయం నిర్ధారించబడాలి.”
2CO 13:2 నేను రెండవసారి మీ దగ్గర ఉన్నపుడే మిమ్మల్ని హెచ్చరించాను, ఇప్పుడు మీ దగ్గర లేకపోయినా మళ్ళీ చెప్పేదేమంటే నేను మళ్ళీ వచ్చినపుడు గతంలో పాపం చేసిన వారిని ఇతరులను ఎవరిని విడిచిపెట్టను.
2CO 13:3 క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నారని మీరు రుజువులు అడిగారు. ఆయన మీ వ్యవహారంలో బలహీనుడు కాడు, మీలో ఆయన బలవంతుడు.
2CO 13:4 బలం లేనివానిగా ఆయన సిలువ వేయబడ్డారు కాని, దేవుని శక్తినిబట్టి ఆయన జీవిస్తున్నారు. అలాగే మేము ఆయనలో బలహీనులం, అయినా మేము మీతో వ్యవహరించే విషయంలో దేవుని శక్తినిబట్టి ఆయనతో కూడ జీవిస్తున్నాము.
2CO 13:5 మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి; మీరు పరీక్షలో ఓడిపోకపోతే తప్ప యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మీకు తెలియదా?
2CO 13:6 కాని మేము పరీక్షలో ఓడిపోలేదని మీరు తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను.
2CO 13:7 మీరు ఏ తప్పులు చేయకూడదని, మేము పరీక్షలో నిలబడినట్లు ప్రజలు చూడాలని కాదు గాని, మేము ఓడిపోయినట్లుగా కనిపించినా మీరు మాత్రం సరియైన దానినే చేయాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాము.
2CO 13:8 కాబట్టి మేము సత్యానికి విరోధంగా ఏమి చేయలేము, సత్యం కోసం మాత్రమే చేస్తాము.
2CO 13:9 మేము బలహీనంగా ఉన్నా మీరు బలంగా ఉంటేనే మాకు సంతోషం. మీరు సంపూర్ణులు కావాలని మేము ప్రార్థిస్తున్నాము.
2CO 13:10 కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ పట్ల నేను కఠినంగా ఉండాల్సిన అవసరం లేకుండ ఇప్పుడే ఇవన్నీ మీకు వ్రాస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని పడద్రోయడానికి కాక మిమ్మల్ని కట్టడానికే ప్రభువు నాకు అధికారాన్ని ఇచ్చారు.
2CO 13:11 చివరిగా సహోదరీ సహోదరులారా, సంతోషించండి! సంపూర్ణంగా పునరుద్ధరించబడడానికి పోరాడండి. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి, ఏక మనస్సు కలిగి ఉండండి. సమాధానం కలిగి జీవించండి. ప్రేమ సమాధానాలకు కర్తయైన దేవుడు మీకు తోడుగా ఉండును గాక.
2CO 13:12 ఒకరిని ఒకరు పవిత్రమైన ముద్దుతో శుభాలు చెప్పుకోండి.
2CO 13:13 ఇక్కడ ఉన్న దేవుని ప్రజలందరు మీకు శుభాలు పంపుతున్నారు.
2CO 13:14 ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికి తోడై యుండును గాక.
GAL 1:1 పౌలు అనే నేను మనుష్యుల ద్వారా గాని ఒక వ్యక్తి వలన గాని పంపబడలేదు, కాని యేసు క్రీస్తు, ఆయనను మరణం నుండి తిరిగి లేపిన తండ్రియైన దేవుని వలన అపొస్తలునిగా పంపబడ్డాను.
GAL 1:2 నేనూ, నాతో ఉన్న సహోదరీ సహోదరులందరం కలిసి,
GAL 1:3 మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక.
GAL 1:4 క్రీస్తు మన తండ్రియైన దేవుని చిత్తానికి లోబడి, దుష్టత్వం ఏలుబడి చేసే ప్రస్తుత యుగం నుండి మనల్ని విడిపించడానికి మన పాపాల కోసం ప్రాయశ్చిత్తంగా తనను తాను అర్పించుకున్నారు.
GAL 1:5 ఆయనకే నిరంతరం మహిమ కలుగును గాక ఆమేన్.
GAL 1:6 మీ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను ఎందుకంటే, క్రీస్తు కృపలో బ్రతకడానికి మిమ్మల్ని పిలిచిన వానిని మీరు ఇంత త్వరగా వదిలేసి, వేరొక సువార్త వైపుకు తిరుగుతున్నారు.
GAL 1:7 నిజానికి అది సువార్త కానే కాదు. అయితే కొందరు సువార్తను తారుమారు చేయాలని ప్రయత్నిస్తూ మిమ్మల్ని గందరగోళంలోనికి నెడుతున్నారు.
GAL 1:8 అయితే మేమే గాని పరలోకం నుండి వచ్చిన దేవదూతే గాని, మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ప్రకటిస్తే, వారి మీదికి దేవుని శాపం వచ్చును గాక!
GAL 1:9 మేము ఇప్పటికే చెప్పినట్లుగా, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను: మీరు అంగీకరించిన సువార్త కాక ఎవరైనా వేరే సువార్త ప్రకటిస్తే వారి మీదికి దేవుని శాపం వచ్చును గాక!
GAL 1:10 నేను ఇప్పుడు మనుష్యుల ఆమోదం పొందటానికి ప్రయత్నిస్తున్నానా, లేక దేవుని ఆమోదమా? నేను ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నానా? ఒకవేళ నేను ప్రజలను సంతోషపెట్టేవాడనైతే నేను క్రీస్తుకు సేవకునిగా ఉండలేను.
GAL 1:11 సహోదరీ సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మానవుని నుండి వచ్చింది కాదని మీరు తెలుసుకోవాలి.
GAL 1:12 నేను ఏ మానవుని నుండి దాన్ని పొందలేదు, నాకెవరూ బోధించలేదు; యేసు క్రీస్తు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారానే నేను పొందాను.
GAL 1:13 నేను యూదా మతంలో జీవించిన నా గత జీవిత విధానాన్ని గురించి, అలాగే దేవుని సంఘాన్ని నాశనం చేయడానికి దాన్ని ఎంత క్రూరంగా నేను హింసించానో మీరు విన్నారు.
GAL 1:14 నా స్వజనులలో నా వయస్సుగల అనేకుల కంటే యూదా మతవిషయంలో నేను ఎంతో ముందున్నాను, నా పూర్వికుల ఆచారాలను పాటించడంలో నాకు అత్యాసక్తి ఉండేది.
GAL 1:15 కాని తన కృప ద్వారా నన్ను నా తల్లి గర్భం నుండే ప్రత్యేకపరచుకొని నన్ను పిలిచిన దేవుడు,
GAL 1:16 తన కుమారుని గురించి యూదేతరుల మధ్య నేను సువార్తను ప్రకటించేలా ఆయన తన కుమారున్ని నాలో బయలుపరచడానికి ఇష్టపడ్డారు. దానికి నేను వెంటనే మనుష్యులను సంప్రదించలేదు.
GAL 1:17 అలాగే నా కంటే ముందు నుండి అపొస్తలులుగా ఉన్నవారిని సంప్రదించడానికి నేను యెరూషలేము వెళ్లలేదు, కాని నేను అరేబియాకు వెళ్లాను. తర్వాత దమస్కుకు తిరిగి వచ్చాను.
GAL 1:18 మూడు సంవత్సరాల తర్వాత, కేఫాను పరిచయం చేసుకోవడానికి యెరూషలేముకు వెళ్లి అక్కడ పదిహేను రోజులు అతనితో ఉన్నాను.
GAL 1:19 ప్రభువు సోదరుడైన యాకోబును తప్ప ఇతర అపొస్తలుల్లో ఎవరిని నేను చూడలేదు.
GAL 1:20 నేను మీకు వ్రాసేది అబద్ధం కాదని దేవుని ముందు రూఢిగా చెప్తున్నాను.
GAL 1:21 ఆ తర్వాత నేను సిరియాకు, కిలికియకు వెళ్లాను.
GAL 1:22 యూదయలోని క్రీస్తులో ఉన్న సంఘాలకు వ్యక్తిగతంగా నేను తెలియదు.
GAL 1:23 వారు, “ఇంతకుముందు మనల్ని హింసించినవాడు, ఏ విశ్వాసాన్నైతే నాశనం చేయాలని ప్రయత్నించాడో దానినే ఇప్పుడు ప్రకటిస్తున్నాడు” అని మాత్రమే విన్నారు.
GAL 1:24 కాబట్టి వారు నన్ను బట్టి దేవుని స్తుతించారు.
GAL 2:1 పద్నాలుగు సంవత్సరాల తర్వాత తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కలిసి మళ్ళీ యెరూషలేముకు వెళ్లాను.
GAL 2:2 దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను అక్కడ నాయకులుగా పేరొందిన వారితో ఏకాంతంగా సమావేశమై, నేను యూదేతరుల మధ్య ప్రకటిస్తున్న సువార్త గురించి వారికి తెలియజేశాను. నా పందెంలో నేను వ్యర్థంగా పరుగెత్తలేదని పరుగెత్తకూడదని ఖచ్చితంగా కోరుతున్నాను.
GAL 2:3 నాతో యెరూషలేముకు వచ్చిన తీతు గ్రీసు దేశస్థుడైనప్పటికి సున్నతి పొందాలని అతన్ని బలవంత పెట్టలేదు.
GAL 2:4 క్రీస్తు యేసులో మనకున్న స్వేచ్ఛపై నిఘా పెట్టడానికి మమ్మల్ని బానిసలుగా చేయడానికి మన మధ్యలోనికి చొరబడిన కొంతమంది అబద్ధపు విశ్వాసుల వలన ఈ విషయం తలెత్తింది.
GAL 2:5 అయితే ఈ సువార్త సత్యం మీలో నిలిచి ఉండేలా ఒక్క క్షణం కూడా మేము వారితో ఏకీభవించలేదు.
GAL 2:6 కొంతమంది గొప్ప పేరుగాంచిన వారు ఉన్నప్పటికీ, వారెవరైనా సరే నేను లెక్కచేయను, ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపేవాడు కాదు, అయినా వారు నా సందేశానికి ఏమి చేర్చలేదు.
GAL 2:7 సున్నతి పొందిన వారి కోసం పేతురు నియమింపబడినట్లే, సున్నతి లేనివారికి సువార్త ప్రకటించే బాధ్యత నాకు అప్పగించబడిందని వారు గుర్తించారు.
GAL 2:8 ఎందుకంటే, సున్నతి పొందే యూదుల కోసం అపొస్తలునిగా ఉండడానికి పేతురుకు సామర్థ్యం ఇచ్చిన దేవుడే సున్నతిలేని యూదేతరుల కోసం అపొస్తలునిగా ఉండడానికి నాకు కూడా సామర్థ్యం ఇచ్చారు.
GAL 2:9 సంఘానికి మూలస్తంభాలుగా పేరు పొందిన యాకోబు, కేఫా, యోహాను అనేవారు దేవుడు నాకిచ్చిన కృపను గుర్తించినపుడు మమ్మల్ని స్వీకరించి మాతో సహవాస సూచనగా నాకు బర్నబాకు తమ కుడిచేతిని అందించారు. మేము యూదేతరుల దగ్గరకు, వారు యూదుల దగ్గరకు వెళ్లాలని అంగీకరించారు.
GAL 2:10 అయితే వారు అడిగింది ఏంటంటే, మేము పేదవారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని వారు కోరారు; ఎప్పుడు నేను చేయాలని కోరుకునేది కూడా అదే.
GAL 2:11 కేఫా అనే పేతురు అంతియొకయకు వచ్చినపుడు, అతడు తప్పు చేశాడు కాబట్టి నేను అతన్ని ముఖాముఖిగా నిలదీశాను.
GAL 2:12 ఎందుకంటే, యాకోబు దగ్గరి నుండి కొందరు మనుష్యులు రాకముందు అతడు యూదేతరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. కాని వారు వచ్చినప్పుడు, అతడు సున్నతి చేయబడిన వారికి భయపడి వెనుకకు తగ్గి యూదేతరుల నుండి ప్రక్కకు వెళ్ళిపోయాడు.
GAL 2:13 ఇతర యూదులు కూడా అతని వేషధారణలో జత కలిశారు, దాని ఫలితంగా బర్నబా కూడా వారి వేషధారణను బట్టి దారితప్పాడు.
GAL 2:14 వారు సువార్త సత్యం ప్రకారం ప్రవర్తించడం లేదని నేను చూసినప్పుడు, వారందరి ముందు కేఫా అనే పేతురుతో, “నీవు యూదుడవు, అయినా నీవు యూదుల్లా కాక యూదేతరుల్లా జీవిస్తున్నావు. అలాంటప్పుడు యూదుల ఆచారాలను అనుసరించమని యూదేతరులను ఎందుకు బలవంతం చేస్తున్నావు?
GAL 2:15 “మనం పుట్టుకతోనే యూదులం, యూదేతరుల్లా పాపులం కాము.
GAL 2:16 ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వల్ల నీతిమంతునిగా తీర్చబడడు, కాని యేసు క్రీస్తులో విశ్వాసముంచడం వల్లనే అని మనకు తెలుసు. అందుకే, మేము కూడా ధర్మశాస్త్ర క్రియలనుబట్టి కాక, క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం, ఎందుకంటే ధర్మశాస్త్ర క్రియలనుబట్టి ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడలేరు.
GAL 2:17 “కాని ఒకవేళ, క్రీస్తులో నీతిమంతులు కావాలని కోరుకుంటూ, యూదులమైన మనం కూడా పాపులమని తీర్చబడితే, క్రీస్తు పాపాన్ని ప్రోత్సహిస్తున్నారని అర్థం కాదా? కానే కాదు!
GAL 2:18 ఒకవేళ నేను కూల్చివేసిన దానిని మరల కడితే, అప్పుడు నేను నిజంగానే అపరాధిని అవుతాను.
GAL 2:19 “నేను దేవుని కోసం జీవించటానికి ధర్మశాస్త్ర విషయంలో ధర్మశాస్త్రం ద్వారా చనిపోయాను.
GAL 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అర్పించుకొన్న దేవుని కుమారునియందు విశ్వాసముంచడం వల్ల జీవిస్తున్నాను.
GAL 2:21 దేవుని కృపను నేను తిరస్కరించను, ఒకవేళ, ధర్మశాస్త్రం ద్వారా నీతి పొందుకోగలిగితే, క్రీస్తు కారణం లేకుండా చనిపోయినట్లే!”
GAL 3:1 అవివేకులైన గలతీయులారా! మిమ్మల్ని ఎవరు భ్రమపెట్టారు? యేసు క్రీస్తు మీ కళ్లముందే సిలువ వేయబడినంత స్పష్టంగా వివరించాము.
GAL 3:2 ఒక్క విషయాన్ని నేను మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను: మీరు ధర్మశాస్త్ర క్రియల వల్ల ఆత్మను పొందారా, లేక మీరు విన్న దాన్ని విశ్వసించడం వల్లనా?
GAL 3:3 మీరు ఇంత అవివేకులా? ఆత్మతో ప్రారంభించి, ఇప్పుడు శరీరంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారా?
GAL 3:4 మీరు పొందిన శ్రమ వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమేనా?
GAL 3:5 నేను మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు మీకు తన ఆత్మను ఇచ్చి, మీ మధ్య అద్భుతాలు జరిగిస్తూ ఉన్నది ధర్మశాస్త్ర క్రియల వల్లనా, లేక మీరు విన్న దాన్ని విశ్వసించడం వల్లనా?
GAL 3:6 అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము కూడా, “దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది.”
GAL 3:7 కాబట్టి మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే విశ్వాసం కలిగినవారే అబ్రాహాముకు పిల్లలవుతారు.
GAL 3:8 దేవుడు యూదేతరులను వారి విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీరుస్తారని లేఖనంలో ముందుగానే చెప్పబడింది. “నిన్ను బట్టి సర్వ జనులు దీవించబడతారు” అని చెప్పడం ద్వారా అబ్రాహాముకు ముందుగానే సువార్త ప్రకటించబడింది.
GAL 3:9 అందువల్ల విశ్వాసంపై ఆధారపడే ప్రతి ఒక్కరూ విశ్వాస పురుషుడైన అబ్రాహాముతో పాటు ధన్యులవుతారు.
GAL 3:10 ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడే వారందరూ శాపగ్రస్తులు, ఎలాగంటే లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం: “ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాటన్నిటిని పాటించనివారు శాపగ్రస్తులు.”
GAL 3:11 ధర్మశాస్త్రం మీద ఆధారపడే ఏ ఒక్కడూ దేవుని ముందు నీతిమంతునిగా తీర్చబడడు, ఎందుకంటే “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు.”
GAL 3:12 ధర్మశాస్త్రం విశ్వాసానికి సంబంధించింది కాదు పైగా “వీటిని చేసేవారు వాటి వల్లనే జీవిస్తారు” అని అది చెప్తుంది.
GAL 3:13 ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపం నుండి మనల్ని విమోచించడానికి క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడయ్యారు. ఎలాగంటే, లేఖనాల్లో, “మ్రానుపై వ్రేలాడదీయబడిన ప్రతి ఒక్కరూ శాపగ్రస్తులే” అని వ్రాయబడిన దాని ప్రకారం.
GAL 3:14 విశ్వాసం ద్వారా దేవుని ఆత్మను గురించిన వాగ్దానాన్ని మనం పొందుకునేలా అబ్రాహాముకు ఇవ్వబడిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కూడా వర్తించాలని ఆయన మనల్ని విమోచించారు.
GAL 3:15 సహోదరీ సహోదరులారా, అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మనుష్యులు చేసిన ఒడంబడికే అయినా దాన్ని స్థిరపరచిన తర్వాత దాన్ని ఎవరూ కొట్టివేయలేరు దానికి ఏమి కలపలేరు. ఇది కూడా అంతే.
GAL 3:16 అబ్రాహాముకు అతని సంతానానికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. లేఖనంలో అనేకులను ఉద్దేశించి “సంతానాలకు” అని చెప్పడం లేదు, గాని ఒక్క వ్యక్తిని ఉద్దేశించి, “నీ సంతానానికి” అని చెప్పారు, ఆ సంతానం క్రీస్తు.
GAL 3:17 నేను చెప్పేదేంటంటే, 430 సంవత్సరాల తర్వాత ఇవ్వబడిన ధర్మశాస్త్రం దేవునిచే ముందుగానే స్థిరపరచబడిన ఒడంబడికను ప్రక్కన పెట్టదు అలాగే దేవుని వాగ్దానాన్ని నిరర్ధకం చేయదు.
GAL 3:18 ఎందుకంటే ఒకవేళ ఆ వారసత్వం ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంటే, ఇక వాగ్దానం మీద ఆధారపడదు, అయితే దేవుడు అబ్రాహాముకు ఆ వారసత్వాన్ని తన కృపలో వాగ్దానం ద్వారా ఇచ్చారు.
GAL 3:19 అలాంటప్పుడు, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? వాగ్దానం ఎవరికి వర్తిస్తుందో ఆ సంతానం వచ్చేవరకు అతిక్రమాలను చూపడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం దూతల ద్వారా ఇవ్వబడి మధ్యవర్తికి అప్పగించబడింది.
GAL 3:20 అయినప్పటికీ మధ్యవర్తి ఒక్కరికే కాదు, కానీ దేవుడు ఒక్కడే.
GAL 3:21 అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? ఎన్నటికి కాదు! ఇవ్వబడిన ధర్మశాస్త్రం మనకు జీవాన్ని ఇచ్చి ఉంటే, తప్పకుండా ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది.
GAL 3:22 అయితే యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా కలిగిన వాగ్దానం ఆయనను నమ్మేవారికి ఇవ్వబడాలని, లేఖనం సమస్తాన్ని అందరిని పాపంలో బంధించింది.
GAL 3:23 ఈ విశ్వాసం గురించి తెలియక ముందు, విశ్వాసం బయలుపరచబడే వరకు మనం బంధింపబడి ధర్మశాస్త్రం అదుపులో ఉంచబడ్డాము.
GAL 3:24 అందువల్ల మనం విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడేలా క్రీస్తు వచ్చేవరకు ధర్మశాస్త్రం మనకు ఒక సంరక్షకునిగా ఉండింది.
GAL 3:25 అయితే ఇప్పుడు ఈ విశ్వాసం మనకు బయలుపరచబడింది కాబట్టి మనం సంరక్షకుని ఆధీనంలో ఉండే అవసరం లేదు.
GAL 3:26 కాబట్టి మీరందరు యేసు క్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు.
GAL 3:27 క్రీస్తులో బాప్తిస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు.
GAL 3:28 ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని, దాసులని స్వతంత్రులని, పురుషుడని స్త్రీ అని ఏ భేదం లేదు, క్రీస్తు యేసులో అందరు ఒక్కటే.
GAL 3:29 మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానంగా ఉండి వాగ్దాన ప్రకారం వారసులు.
GAL 4:1 అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వారసుడు బాలునిగా ఉన్నంత వరకు అతడు ఆస్తి అంతటికి యజమాని అయినప్పటికీ అతడు దాసుని కన్నా గొప్పవాడు కాడు.
GAL 4:2 తన తండ్రి నిర్ణయించిన సమయం వచ్చేవరకు వారసుడు సంరక్షకులు నిర్వాహకుల ఆధీనంలో ఉంటాడు.
GAL 4:3 అలాగే మనం తగిన వయస్సు వచ్చేవరకు ఈ లోకానికి సంబంధించిన మూల నియమాల క్రింద బానిసలుగా ఉన్నాము.
GAL 4:4 అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారున్ని పంపారు; ఆయన ఒక స్త్రీకి జన్మించి, మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్ర ఆధీనంలో ఉన్నవారిని విడిపించాలని ఆయన ధర్మశాస్త్రానికి లోబడినవాడయ్యారు.
GAL 4:6 మీరు ఆయన కుమారులు కాబట్టి, “అబ్బా, తండ్రీ” అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపారు.
GAL 4:7 కాబట్టి ఇకపై మీరు దాసులు కారు, కానీ దేవుని పిల్లలు; మీరు ఆయన పిల్లలు కాబట్టి దేవుడు మిమ్మల్ని వారసులుగా చేశారు.
GAL 4:8 గతంలో, మీరు దేవుని ఎరుగక ముందు, మీరు స్వాభావికంగా దేవుళ్ళు కాని వారికి బానిసలై ఉన్నారు.
GAL 4:9 కాని ఇప్పుడు మీరు దేవున్ని తెలుసుకున్నారు, దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నారు. అలాంటప్పుడు మీరు మళ్ళీ వెనుకకు ఆ బలహీనమైన దిక్కుమాలిన సిద్ధాంతాల వైపు ఎందుకు తిరుగుతున్నారు? మీరు మళ్ళీ వాటికి బానిసలవ్వాలని కోరుకుంటున్నారా?
GAL 4:10 మీరు ప్రత్యేకమైన రోజులను, నెలలను, పండుగలను, సంవత్సరాలను ఆచరిస్తున్నారు గదా!
GAL 4:11 నేను మీ కోసం పడిన కష్టమంతా వృధా అవుతుందేమో అని భయపడుతున్నాను.
GAL 4:12 సహోదరీ సహోదరులారా, నేను మీలా మారినట్లే మీరూ నాలా మారాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను. మీరు నా పట్ల ఏ తప్పు చేయలేదు.
GAL 4:13 నాకు అనారోగ్యంగా ఉన్నా నేను మొదటిగా మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు.
GAL 4:14 నా అనారోగ్యం మీకు ఇబ్బందిని కలిగించినప్పటికీ, మీరు నన్ను తిరస్కరించలేదు అలక్ష్యం చేయలేదు. నిజానికి, మీరు నన్ను దేవుని దూతలా, నేనే యేసు క్రీస్తును అయినట్టు చేర్చుకున్నారు.
GAL 4:15 అయితే నా వలన మీరు పొందిన దీవెన ఇప్పుడేమైపోయింది? మీరు మీ కళ్లను కూడా పెరికివేసి నాకు ఇచ్చేవారని, నేను మీ గురించి సాక్ష్యమివ్వగలను.
GAL 4:16 అయితే ఇప్పుడు మీకు సత్యాన్ని చెప్పి నేను మీకు శత్రువునయ్యానా?
GAL 4:17 ఆ ప్రజలు మిమ్మల్ని గెలవాలని ఆసక్తి కలిగి ఉన్నారు, కాని అది మీ మేలుకోసం కాదు. మీరు వారి పట్ల ఆసక్తిని చూపించాలని, వారు మా నుండి మిమ్మల్ని వేరు చేయాలనుకుంటున్నారు.
GAL 4:18 నేను మీతో ఉన్నప్పుడే కాకుండా ఎప్పుడూ మంచి ఉద్దేశాలలో ఆసక్తి కలిగి ఉండడం మంచిదే.
GAL 4:19 నా ప్రియ పిల్లలారా, మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను.
GAL 4:20 నేను మీ గురించి కలవరపడుతున్నాను. ఇప్పుడు నేను మీతో ఉండి మరో విధంగా మాట్లాడగలిగితే ఎంత బాగుండేది!
GAL 4:21 ఒక్క మాట చెప్పండి, ధర్మశాస్త్రానికే లోబడి ఉండాలనుకునే మీకు ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో తెలియదా?
GAL 4:22 వ్రాయబడి ఉన్న ప్రకారం, అబ్రాహాముకు ఇద్దరు కుమారులు, ఒకడు దాసియైన స్త్రీ వలన, మరొకడు స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టారు.
GAL 4:23 దాసియైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు శరీరానుసారంగా పుట్టాడు, స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు దైవిక వాగ్దాన ఫలితంగా పుట్టాడు.
GAL 4:24 ఈ విషయాలను ఉపమానరీతిగా చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలను సూచిస్తున్నారు. ఒక నిబంధన సీనాయి పర్వతం దగ్గరిది, ఇది హాగరు: బానిసలుగా ఉండడానికి పిల్లలను కంటుంది.
GAL 4:25 హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న యెరూషలేము పట్టణంలా ఆమె తన పిల్లలతో సహా బానిసత్వంలో ఉంది.
GAL 4:26 కాని పైనుండి వచ్చే యెరూషలేము స్వతంత్రమైనది, ఆమె మనకు తల్లి.
GAL 4:27 అయితే వ్రాయబడిన ప్రకారం, “గొడ్రాలా, పిల్లలు కననిదానా, ఆనందించు; ప్రసవవేదన పడనిదానా, ఆనందంతో కేకలు వేయి; ఎందుకంటే, భర్త ఉన్నదాని పిల్లలకంటే విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువమంది ఉన్నారు.”
GAL 4:28 అయితే సహోదరీ సహోదరులారా, మీరు ఇస్సాకులా వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలు.
GAL 4:29 ఆ సమయంలో శరీరానుసారమైన కుమారుడు ఆత్మానుసారమైన కుమారుని ఎలా హింసించాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది.
GAL 4:30 అయితే లేఖనం ఏమి చెప్తుంది? “దాసిని ఆమె కుమారున్ని పంపివేయి, దాసి కుమారుడు ఎప్పటికీ స్వతంత్రురాలైన స్త్రీ కుమారునితో వారసత్వం పంచుకోలేడు” అని చెప్తుంది.
GAL 4:31 కాబట్టి సహోదరీ సహోదరులారా, మనం దాసురాలైన స్త్రీ పిల్లలం కాదు, గాని స్వతంత్రురాలైన స్త్రీ పిల్లలము.
GAL 5:1 క్రీస్తు మనకు విడుదల ఇచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశారు. కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి; బానిసత్వపు కాడి ద్వారా మీరు మళ్ళీ మీమీద భారాన్ని మోపుకోకండి.
GAL 5:2 నా మాటలను గుర్తు పెట్టుకోండి! పౌలు అనే నేను చెప్పేది ఏంటంటే, మీరు సున్నతి పొందినవారైతే, క్రీస్తు ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
GAL 5:3 సున్నతి పొందినవారు ధర్మశాస్త్రమంతటికి లోబడి ఉండాలని అందరితో మళ్ళీ నేను చెప్తున్నాను.
GAL 5:4 ధర్మశాస్త్రం చేత నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయత్నిస్తున్న మీరు క్రీస్తు నుండి దూరం చేయబడ్డారు. మీరు కృపకు దూరమయ్యారు.
GAL 5:5 నీతిమంతులుగా తీర్చబడాలనే మన నిరీక్షణ నెరవేరాలని మనం విశ్వాసం కలిగి ఆత్మ ద్వారా ఆసక్తితో ఎదురుచూస్తున్నాము.
GAL 5:6 యేసు క్రీస్తులో ఉన్నవారు సున్నతి పొందినా పొందకపోయినా దానివల్ల ప్రయోజనమేమి ఉండదు. కేవలం ప్రేమ ద్వారా వ్యక్తపరచబడే విశ్వాసం మాత్రమే ప్రయోజనకరం అవుతుంది.
GAL 5:7 మీరు బాగా పరుగెడుతున్నారు. మీరు సత్యానికి లోబడకుండా మిమ్మల్ని ఆపిన వారెవరు?
GAL 5:8 అలాంటి బోధ మిమ్మల్ని పిలిచే వాని నుండి రాలేదు.
GAL 5:9 “పులిసిన పిండి కొంచెమైనా మొత్తం పిండిని పులియజేస్తుంది.”
GAL 5:10 మీరు మరోలా ఆలోచించరని ప్రభువులో నేను నమ్మకం కలిగి ఉన్నాను. మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు ఎవరైనా సరే వారు తగిన శిక్షను భరించాలి.
GAL 5:11 సహోదరీ సహోదరులారా, ఒకవేళ నేను ఇంకా సున్నతి గురించి ప్రకటిస్తూ ఉన్నట్లయితే, మరి నేనెందుకు ఇంకా హింసించబడుతున్నాను? అలా అయితే సిలువను గురించిన నేరం రద్దు చేయబడింది కదా.
GAL 5:12 మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు తమను తాము నరికివేసుకోవడం మంచిది!
GAL 5:13 నా సహోదరీ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే మీ స్వాతంత్ర్యాన్ని శరీరాశలను నెరవేర్చడానికి ఉపయోగించకుండా, ప్రేమ కలిగి వినయంతో ఒకరికొకరు సేవ చేసుకోండి.
GAL 5:14 “మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి” అనే ఒక్క ఆజ్ఞను పాటించడం వలన ధర్మశాస్త్రమంతా నెరవేరుతుంది.
GAL 5:15 ఒకవేళ మీరు ఒకరినొకరు కరచుకుని మ్రింగివేస్తున్నట్లయితే, జాగ్రత్తపడండి లేదా ఒకరి వలన ఒకరు నాశనం అవుతారు జాగ్రత్తపడండి.
GAL 5:16 కాబట్టి, నేను చెప్పేదేంటంటే, ఆత్మను అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీరు శరీరవాంఛలను తృప్తి పరచరు.
GAL 5:17 శరీరవాంఛలు ఆత్మకు విరుద్ధమైనవి, ఆత్మ సంబంధమైనవి శరీరానికి విరుద్ధమైనవి. అవి ఒక దానికి ఒకటి వ్యతిరేకం కాబట్టి మీరు చేయాలనుకున్నవాటిని మీరు చేయరు.
GAL 5:18 మీరు ఆత్మ చేత నడిపించబడుతున్నవారైతే, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కారు.
GAL 5:19 శరీర సంబంధమైన క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేమంటే: లైంగిక దుర్నీతి, అపవిత్రత, వేశ్యాలోలత్వము;
GAL 5:20 విగ్రహారాధన, క్షుద్రవిద్య; ద్వేషం, విరోధం, అసూయ, అధికమైన ఆగ్రహం స్వార్థపూరిత ఆశలు, భేదాభిప్రాయాలు, విభేదాలు,
GAL 5:21 ఓర్వలేనితనం, మద్యం మత్తు, పోకిరి ఆటలు మొదలైనవి. నేను గతంలో మిమ్మల్ని హెచ్చరించినట్లుగా ఇలాంటి జీవితాన్ని జీవించేవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మళ్ళీ హెచ్చరిస్తున్నాను.
GAL 5:22 అయితే ఆత్మ వలన కలిగే ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం,
GAL 5:23 మృదుత్వం, మనస్సును అదుపు చేసుకోవడం. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ నియమం లేదు.
GAL 5:24 యేసు క్రీస్తుకు సంబంధించినవారు శరీరాన్ని దాని వాంఛలతో దురాశలతో సిలువ వేశారు.
GAL 5:25 మనం ఆత్మ వలన జీవిస్తున్నాం కాబట్టి మనం ఆత్మతో పాటు నడుద్దాము.
GAL 5:26 ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ, ఒకరిపై ఒకరు అసూయపడుతూ, మనం అహంకారులుగా ఉండవద్దు.
GAL 6:1 సహోదరీ సహోదరులారా, ఎవరైనా పాపంలో చిక్కుకొని ఉంటే, ఆత్మ వల్ల జీవిస్తున్న మీరు వారిని మృదువుగా సరియైన మార్గంలోనికి మరలా తీసుకురండి. అంతేకాక మీరు కూడా శోధనలో పడిపోవచ్చు కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.
GAL 6:2 ఒకరి భారాలను ఒకరు మోయండి, ఈ విధంగా మీరు క్రీస్తు ధర్మాన్ని నెరవేరుస్తారు.
GAL 6:3 ఎవరైనా తమలో ఏ గొప్పతనం లేకపోయినా తాము గొప్పవారమని భావిస్తే వారు తమను తామే మోసపరచుకుంటారు.
GAL 6:4 ప్రతి ఒక్కరూ తమ తమ పనులను పరీక్షించుకోవాలి. అప్పుడు ఇతరులతో తమను పోల్చుకోకుండా కేవలం తమను బట్టి తామే గర్వపడగలరు.
GAL 6:5 ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరి భారాలను వారే మోయాలి.
GAL 6:6 వాక్యోపదేశం పొందినవారు తమకు ఉపదేశించినవానితో మంచి వాటన్నిటిని పంచుకోవాలి.
GAL 6:7 మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడరు. ఒకరు దేన్ని విత్తుతారో దాని పంటనే కోస్తారు.
GAL 6:8 తమ శరీరాలను సంతోషపరచడానికి విత్తేవారు తమ శరీరం నుండి నాశనమనే పంట కోస్తారు. తమ ఆత్మను సంతోషపరచడానికి విత్తేవారు తమ ఆత్మ నుండి నిత్యజీవమనే పంటను కోస్తారు.
GAL 6:9 మంచి చేయడంలో మనం అలసి పోవద్దు ఎందుకంటే మానక చేస్తే తగిన కాలంలో మనం పంటను కోస్తాము.
GAL 6:10 కాబట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి ప్రజలందరికి మరి ముఖ్యంగా విశ్వాసుల కుటుంబానికి చెందిన వారికి మంచి చేద్దాము.
GAL 6:11 నా స్వహస్తాలతో పెద్ద అక్షరాలను ఉపయోగించి మీకు వ్రాస్తున్నాను!
GAL 6:12 శరీర సంబంధమైన వాటితో ప్రజలను ఆకట్టుకోవాలని అనుకునేవారు సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. క్రీస్తు సిలువ కోసం హింసించబడకుండ ఉండడానికే వారు ఇలా చేస్తారు.
GAL 6:13 సున్నతి పొందినవారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం లేదు కాని శరీరానుసారమైన మీ సున్నతిని గురించి వారు గొప్పలు చెప్పుకోడానికి మీరు సున్నతి పొందాలని వారు కోరుచున్నారు.
GAL 6:14 మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో తప్ప మరి దేనిలో నేను అతిశయపడను. ఆ సిలువ ద్వారానే నాకు లోకం, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాము.
GAL 6:15 సున్నతి పొందినా పొందకపోయినా అది లెక్కకు రాదు. నూతన సృష్టి మాత్రమే లెక్కించబడుతుంది.
GAL 6:16 ఈ నియమాన్ని అనుసరించే వారందరికి అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానం కనికరం కలుగుతాయి.
GAL 6:17 నేను నా శరీరంపై యేసు గుర్తులను కలిగి ఉన్నాను, కాబట్టి ఇకపై ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు.
GAL 6:18 సహోదరీ సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక ఆమేన్.
EPH 1:1 దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు,
EPH 1:2 మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.
EPH 1:3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక. పరలోక మండలాల్లో, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో క్రీస్తులో ఆయన మనల్ని దీవించారు.
EPH 1:4 మనం ఆయన దృష్టిలో పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలని లోకం సృష్టించబడక ముందే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు.
EPH 1:5 తన ప్రేమతో ముందుగానే, యేసు క్రీస్తు ద్వారా మనల్ని తన సొంత కుమారులుగా స్వీకరించాలని ఆయన నిర్ణయించుకోవడం ఆయనకు ఎంతో ఇష్టాన్ని ఆనందాన్ని కలిగించింది.
EPH 1:6 తాను ప్రేమించిన వానిలో, ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించిన తన మహాకృపకు ఘనత కలుగునట్లు దేవుడు ఈ విధంగా చేశారు.
EPH 1:7 దేవుని కృపా ఐశ్వర్యానికి అనుగుణంగా ఆయనలో మనం ఆయన రక్తం ద్వారా విడుదల, పాపక్షమాపణ కలిగి ఉన్నాము.
EPH 1:8 ఆ కృపను ఎంత ధారాళంగా కుమ్మరించారంటే, దానితో మనకు సంపూర్ణమైన జ్ఞానం, వివేచనను ఇచ్చి,
EPH 1:9 క్రీస్తులో ఆయన ఉద్దేశించిన తన చిత్తాన్ని గురించిన మర్మాన్ని తన దయాసంకల్పానికి అనుగుణంగా మనకు తెలియజేశారు.
EPH 1:10 కాలం సంపూర్ణమైనప్పుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి, అనగా పరలోకంలో ఉన్న వాటినే గాని భూమి మీద ఉన్న వాటినే గాని సమస్తాన్ని క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని నిర్ణయించుకొన్నారు.
EPH 1:11 దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పాన్ని బట్టి, క్రీస్తులో ముందుగా నిరీక్షించిన మనం, తన మహిమకు కీర్తి తీసుకురావాలని నిర్ణయించి, ఆయన మనల్ని తన వారసులుగా ఏర్పరచుకున్నారు.
EPH 1:12 ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయాన్ని బట్టి, సమస్త కార్యాలను జరిగిస్తున్నారు.
EPH 1:13 మీరు కూడా సత్య వాక్యాన్ని అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మచేత ముద్రించబడి ఉన్నారు.
EPH 1:14 దేవుని మహిమను స్తుతించడానికి ఆయన స్వాస్థ్యమైన వారికి విడుదల కలిగే వరకు ఈ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.
EPH 1:15 ఈ కారణాన్ని బట్టి, ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించి, దేవుని ప్రజలందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి,
EPH 1:16 మీ గురించి మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కోసం ప్రార్థిస్తున్నాను.
EPH 1:17 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియైన తండ్రిని మీరు తెలుసుకోవడానికి జ్ఞానం ప్రత్యక్షతగల ఆత్మను మీకు ఇవ్వాలని నా ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.
EPH 1:18 మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణలో, ఆయన పరిశుద్ధ ప్రజల్లో ఆయన వారసత్వం యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిదో, మనం నమ్మిన ఆయన శక్తి యొక్క అపరిమితమైన ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవడానికి మీ మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థిస్తున్నాను.
EPH 1:20 ఆయన ప్రభావవంతమైన శక్తితోనే క్రీస్తును మృతులలో నుండి లేపి, సమస్త ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగంలోను రాబోవు యుగాల్లోను పేరుగాంచిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకంలో తన కుడి వైపున ఆయనను కూర్చోబెట్టుకున్నారు.
EPH 1:22 దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచి, సమస్తానికి పైన సంఘానికి ఆయనను శిరస్సుగా నియమించారు.
EPH 1:23 సంఘం అనగా ఆయన శరీరం; సమస్తాన్ని పూర్తిగా నింపుతున్న ఆయన యొక్క పరిపూర్ణత.
EPH 2:1 మీరైతే, మీ అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండి,
EPH 2:2 మీరు వీటిలో జీవిస్తున్నప్పుడు ఈ లోక మార్గాలను, అవిధేయులైన వారిలో ఇప్పుడు పని చేస్తున్న ఆత్మయైన వాయుమండల అధిపతిని అనుసరించేవారు.
EPH 2:3 మనమందరం కూడా ఒకప్పుడు లోకస్థులతో కలిసి జీవిస్తూ శరీరేచ్ఛలను మనస్సులోని కోరికలను నెరవేర్చుకొంటూ, ఇతరుల్లా మన శరీరాశలను అనుసరించి ప్రవర్తిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులంగా ఉండేవారము.
EPH 2:4 అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి
EPH 2:5 మనం మన అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు.
EPH 2:6 దేవుడు క్రీస్తుతో పాటు మనల్ని కూడా లేపి, పరలోకం మండలాల్లో క్రీస్తు యేసుతో పాటు కూర్చోబెట్టారు.
EPH 2:7 రాబోయే యుగాలలో ఆయన తన కృప యొక్క సాటిలేని ఐశ్వర్యాన్ని చూపించటానికి, క్రీస్తు యేసునందు మన పట్ల ఆయన దయలో వ్యక్తపరిచారు.
EPH 2:8 మీరు మీ విశ్వాసం ద్వారా కృపను చేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ నుండి వచ్చింది కాదు, గాని ఇది దేవుడు మీకిచ్చిన బహుమానము.
EPH 2:9 అది క్రియల వలన కాదు, కాబట్టి ఎవరు గొప్పలు చెప్పుకోలేరు.
EPH 2:10 ఎందుకంటే దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై ఉన్నాము.
EPH 2:11 కాబట్టి, పుట్టుకతోనే యూదేతరులైన మీరు, తమను తాము “సున్నతి” అంటే మానవ హస్తాలతో శరీరంలో చేయబడేది అని పిలుచుకునే వారి చేత “సున్నతి చేయబడనివారు” అని గతంలో ఎలా పిలువబడ్డారో జ్ఞాపకం చేసుకోండి.
EPH 2:12 ఆ సమయంలో మీరు క్రీస్తు నుండి వేరుగా ఉన్నారు, ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారిగా, వాగ్దాన నిబంధనలకు విదేశీయులుగా, నిరీక్షణ లేనివారిగా, లోకంలో దేవుడు లేనివారిగా ఉండేవారు.
EPH 2:13 ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తాన్ని బట్టి దేవునికి దగ్గరయ్యారు.
EPH 2:14 రెండు సమూహాలను ఒకటిగా చేసి, శత్రుత్వం యొక్క అడ్డు గోడను నాశనం చేసిన ఆయనే మన సమాధానం.
EPH 2:15 అంటే, యేసు క్రీస్తు తన శరీరంలో మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను నియమాలను కొట్టివేసారు. ఈ ఇద్దరిని కలిపి తనలో ఒక నూతన మానవున్ని సృజించి ఆ విధంగా సమాధానపరచడం ఆయన ఉద్దేశము.
EPH 2:16 ఈ ఇరువురిని తన సిలువ ద్వారా ఏక శరీరులుగా దేవునితో సమాధానపరచి, వారి మధ్య ఉన్న శత్రుత్వాన్ని చంపేశారు.
EPH 2:17 ఆయన వచ్చి, దూరంగా ఉన్న మీకు, దగ్గరగా ఉన్నవారికి సమాధాన సువార్తను ప్రకటించారు.
EPH 2:18 ఆయన ద్వారానే మనం ఇద్దరం ఒక్క ఆత్మలో తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము.
EPH 2:19 దీన్ని బట్టి మీరు ఇకమీదట పరాయి వారు లేదా విదేశీయులు కారు, దేవుని ప్రజలతో తోటి పౌరులుగా ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నారు.
EPH 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు.
EPH 2:21 ఆ కట్టడమంతా ఆయనలో ఒకటిగా అమర్చబడి ప్రభువులో పరిశుద్ధాలయంగా వృద్ధిపొందుతూ ఉంది.
EPH 2:22 ఈ విధంగా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలంగా కట్టబడుతున్నారు.
EPH 3:1 ఈ కారణంచేత, యూదేతరులైన మీరు రక్షింపబడాలని, పౌలు అనే నేను క్రీస్తు యేసు సువార్త విషయంలో ఖైదీనై ఉన్నాను.
EPH 3:2 మీ కోసం నాకు అనుగ్రహించబడిన దేవుని కృపా ఏర్పాటును గురించి మీరు నిశ్చయంగా విన్నారు.
EPH 3:3 అదేమిటంటే, ఇంతకుముందే మీకు క్లుప్తంగా వ్రాసినట్లు, క్రీస్తు గురించిన మర్మం నాకు ప్రత్యక్షపరచబడింది.
EPH 3:4 మీరు దానిని చదివినట్లైతే ఆ క్రీస్తు మర్మాన్ని గురించి నాకున్న పరిజ్ఞానాన్ని మీరు తెలుసుకోగలరు.
EPH 3:5 ఈ మర్మం, ఆత్మ వలన ఇప్పుడు దేవుని పరిశుద్ధ అపొస్తలులకు ప్రవక్తలకు తెలియపరచబడినట్లుగా ఇతర తరాలలోని వారికి తెలియపరచబడలేదు.
EPH 3:6 ఈ రహస్యం ఏంటంటే, సువార్త ద్వారా యూదేతరులు ఇశ్రాయేలుతో కలిసి వారసులు, ఒకే శరీరంలోని సభ్యులు, క్రీస్తు యేసులోని వాగ్దానంలో భాగస్వాములు.
EPH 3:7 దేవుడు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను.
EPH 3:8 పరిశుద్ధులలో నేను అత్యంత అల్పున్ని కానీ లెక్కించలేని ఆశీర్వాదాలు క్రీస్తు యేసులో ఉన్నాయని యూదేతరులకు ప్రకటించడానికి దేవుడు తన దయతో నన్ను ఏర్పరచుకున్నారు.
EPH 3:9 సమస్తాన్ని సృజించిన దేవుడు అనాది నుండి దాచబడి ఉన్న ఆ మర్మాన్ని, ప్రజలందరికి తెలియజేయడానికి ఆ కృపను నాకు అనుగ్రహించారు.
EPH 3:10 దేవుని ఉద్దేశమేమిటంటే, సంఘం ద్వారా, దేవుని నానా విధాలైన జ్ఞానము వాయుమండలంలోని ప్రధానులకు అధికారులకు తెలియజేయబడాలి.
EPH 3:11 అందుకని దేవుడు తన నిత్య సంకల్పాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నెరవేర్చారు.
EPH 3:12 ఈ విధంగా ఇప్పుడు ఆయనలో ఉంచిన విశ్వాసం ద్వారా స్వేచ్ఛగా ధైర్యంగా దేవుని సమీపించగలము.
EPH 3:13 కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ గురించి నేను పడిన శ్రమలను బట్టి మీరు నిరుత్సాహపడవద్దు, అవి మీకు కీర్తి.
EPH 3:14 ఈ కారణాన్ని బట్టి, తండ్రి ఎదుట నేను మోకరిస్తున్నాను,
EPH 3:15 పరలోకంలోను భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఆయనను బట్టే కుటుంబమని పిలువబడుతుంది.
EPH 3:16 తన మహిమ సమృద్ధి నుండి ఆయన మిమ్మల్ని మీ అంతరంగంలో తన ఆత్మ ద్వారా శక్తితో బలపరచాలని,
EPH 3:17 అప్పుడు విశ్వాసం ద్వారా మీ హృదయాల్లో క్రీస్తు నివసించాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమలో వేరుపారి స్థిరపడాలని,
EPH 3:18 మీరు ప్రభువు యొక్క పరిశుద్ధ ప్రజలందరితో కలిసి శక్తిని పొంది, క్రీస్తు ప్రేమ ఎంత వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఉన్నదో గ్రహిస్తూ,
EPH 3:19 సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ దేవుని పరిపూర్ణతతో మీరు పూర్తిగా నింపబడాలని నేను ప్రార్థిస్తున్నాను.
EPH 3:20 మనలో పని చేసి తన శక్తినిబట్టి మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే కొలవలేనంత అత్యధికంగా చేయడానికి శక్తిగల దేవునికి,
EPH 3:21 సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరములు మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.
EPH 4:1 మీరు పిలువబడిన పిలుపుకు యోగ్యులుగా నడుచుకోవాలని ప్రభువు యొక్క ఖైదీనైన నేను మిమ్మల్ని కోరుతున్నాను.
EPH 4:2 ప్రేమలో ఒకరిని ఒకరు సహించుకుంటూ పూర్ణ వినయంతో సాత్వికంతో, దీర్ఝశాంతంతో ఉండండి.
EPH 4:3 మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోడానికి ప్రయాసపడండి.
EPH 4:4 శరీరం ఒక్కటే; ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీరు పిలువబడినప్పుడు ఒకే నిరీక్షణ కోసం పిలువబడ్డారు;
EPH 4:5 ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే;
EPH 4:6 అందరికి తండ్రియైన దేవుడు ఒక్కరే, ఆయనే అందరికి పైగా ఉన్నవారు, అందరి ద్వారా వ్యాపించి అందరిలో ఉన్నారు.
EPH 4:7 అయితే అందరికి క్రీస్తు నిర్ణయించిన పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది.
EPH 4:8 అందుకే, ఈ విధంగా చెప్పబడింది: “ఆయన ఆరోహణమైనప్పుడు, ఆయన అనేకమందిని చెరపట్టి తీసుకెళ్లి, తన ప్రజలకు బహుమానాలను అనుగ్రహించారు.”
EPH 4:9 ఆయన ఆరోహణం అయ్యారంటే ఆయన క్రిందకు, భూమి మీదకు దిగివచ్చారని దాని అర్థం కాదా?
EPH 4:10 క్రిందకు దిగివచ్చినవాడే, సమస్త ప్రపంచాన్ని నింపడానికి ఆకాశ మండలాలన్నింటి కంటే పైగా ఆరోహణమయ్యారు.
EPH 4:11 మనం విశ్వాసంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఐక్యతను పొందేవరకు, క్రీస్తు యొక్క పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గల వారం అయ్యేవరకు క్రీస్తు శరీరమైన సంఘం కట్టబడేలా తన ప్రజలను పరిచర్య కోసం సిద్ధపరచడానికి, క్రీస్తే అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, బోధకులను అనుగ్రహించారు.
EPH 4:14 మనం ఇంకా పసిపిల్లలం కాదు కాబట్టి, మనుష్యులు మోసపూరిత యోచనలతో వంచనలతో కుయుక్తితో చేసే బోధలు అనే ప్రతీ గాలికి ఇటు అటు ఎగిరిపోతూ, అలలచే ముందుకు వెనుకకు కొట్టుకొనిపోయేవారంగా ఉండకూడదు.
EPH 4:15 ప్రేమ కలిగి సత్యం మాట్లాడుతూ క్రీస్తును శిరస్సుగా కలిగిన పరిపూర్ణ శరీరంలా ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము.
EPH 4:16 ఆయన సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతీ అవయవం దాని పనిని చేస్తుండగా, ప్రతి కీలు సహాయంతో ఒకటిగా అతుకబడి ప్రేమలో తనకు అభివృద్ధి కలుగునట్లు శరీరాన్ని వృద్ధి చేసుకుంటుంది.
EPH 4:17 కాబట్టి మీరు, ఇకమీదట దేవుని భయంలేని యూదేతరులు నడుచుకొనునట్లు వ్యర్థమైన ఆలోచనలతో నడుచుకొనకూడదని ప్రభువు ఇచ్చిన అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
EPH 4:18 వారు తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి తమలో ఉన్న అజ్ఞానం కారణంగా దేవుని నుండి వచ్చే జీవం నుండి వేరుపరచబడి గ్రహించుటలో గ్రుడ్డివారిగా ఉన్నారు.
EPH 4:19 వారు సిగ్గును వదిలి అత్యాశతో నానా విధాలైన అపవిత్ర కార్యాలను జరిగిస్తూ, తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు.
EPH 4:20 అయితే మీరు క్రీస్తు గురించి విన్నప్పుడు యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆయనలో బోధించబడినప్పుడు మీరు నేర్చుకున్న జీవన విధానం ఇది కాదు.
EPH 4:22 మీ పాత స్వభావాన్ని, మీకు బోధించబడిన ప్రకారం, మీ ఆలోచనా వైఖరి నూతనపరచబడటానికి,
EPH 4:23 మీ మోసపూరిత కోరికలతో చెడిపోతున్న, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి;
EPH 4:24 నిజమైన నీతి, పరిశుద్ధత గల దేవుని పోలికగా ఉండడానికి సృజించబడిన క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి.
EPH 4:25 కాబట్టి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడడం మాని సత్యమే మాట్లాడాలి. ఎందుకంటే, మనమందరం ఒకే శరీరంలోని అవయవాలమై ఉన్నాము.
EPH 4:26 “మీ కోపంలో పాపం చేయకండి”: సూర్యుడు అస్తమించే వరకు మీరు ఇంకా కోపంతో ఉండకండి.
EPH 4:27 అలాగే అపవాదికి అడుగుపెట్టే అవకాశం ఇవ్వకండి.
EPH 4:28 దొంగతనం చేసేవారు ఇకమీదట దొంగతనం చేయకూడదు, కానీ తమ చేతులతో అవసరమైన మంచి పనులను చేస్తూ, కష్టపడుతూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి.
EPH 4:29 మీ నోటి నుండి ఏ చెడు మాటలు రానివ్వకండి, వినేవారికి మేలు కలిగేలా అవసరాన్ని బట్టి, ముందు వారు బలపడడానికి సహాయపడే మంచి మాటలే మాట్లాడండి.
EPH 4:30 విమోచన దినం కోసం మీరు ఎవరితో ముద్రించబడ్డారో ఆ దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి.
EPH 4:31 అదే విధంగా, ద్వేషమంతటిని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దూషణను, ప్రతి విధమైన దుష్టత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టండి.
EPH 4:32 క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమిస్తూ, ఒకరిపట్ల ఒకరు దయా, కనికరం కలిగి ఉండండి.
EPH 5:1 కాబట్టి మీరు దేవుని ప్రియ పిల్లల్లా ఆయనను పోలి నడుచుకోండి.
EPH 5:2 క్రీస్తు మనల్ని ప్రేమించి, పరిమళ సువాసనగా మన కోసం తనను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొన్నట్లే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి.
EPH 5:3 లైంగిక అపవిత్రత గాని లేదా ఇతర అపవిత్రత గాని అత్యాశ గాని మీ మధ్యలో ఎంత మాత్రం ఉండకూడదు, ఎందుకంటే ఇవి దేవుని పరిశుద్ధ ప్రజలకు తగినవి కావు.
EPH 5:4 దేవుని పట్ల కృతజ్ఞతగల మాటలనే మాట్లాడండి, మీలో బూతు మాటలకు, మూర్ఖపు లేదా పోకిరి మాటలకు చోటు ఉండకూడదు.
EPH 5:5 వ్యభిచారులు, అపవిత్రులు, అత్యాశపడేవారు అందరు విగ్రహారాధికులే; దేవునికి క్రీస్తుకు చెందిన రాజ్యంలో వారికి వారసత్వం లేదని మీకు ఖచ్చితంగా తెలుసు.
EPH 5:6 వ్యర్థమైన మాటలతో ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, ఎందుకంటే వీటిని బట్టి అవిధేయులైనవారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది.
EPH 5:7 కాబట్టి అలాంటి వారితో మీరు భాగస్వాములుగా ఉండకండి.
EPH 5:8 ఒకప్పుడు మీరు చీకటియై ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు బిడ్డలుగా జీవించండి,
EPH 5:9 ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగి ఉంటుంది.
EPH 5:10 కాబట్టి ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి.
EPH 5:11 నిష్ఫలమైన చీకటి క్రియలలో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి.
EPH 5:12 అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే.
EPH 5:13 కాని వెలుగుచేత చూపించబడే ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది, ప్రకాశించే ప్రతిదీ వెలుగు అవుతుంది.
EPH 5:14 అందుకే వాక్యంలో, “నిద్రిస్తున్నవాడా, మేల్కో, మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తారు” అని వ్రాయబడింది.
EPH 5:15 చాలా జాగ్రత్తగా ఉండండి, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల్లా జీవించండి.
EPH 5:16 దినాలు చెడ్డవి కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
EPH 5:17 కాబట్టి మీరు అవివేకులుగా ఉండకండి, అయితే ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి.
EPH 5:18 మద్యంతో మత్తులు కాకండి, అది మిమ్మల్ని దుష్టత్వంలోనికి నడిపిస్తుంది. అయితే ఆత్మ పూర్ణులై ఉండండి,
EPH 5:19 సంగీతములతో, కీర్తనలతో ఆత్మ సంబంధమైన పాటలతో, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. మీ హృదయాలతో పాటలు పాడుతూ సంగీతంతో ప్రభువును గురించి కీర్తిస్తూ,
EPH 5:20 ఎల్లప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మన తండ్రియైన దేవునికి అన్నిటి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.
EPH 5:21 క్రీస్తుపట్ల గల భయభక్తులతో ఒకరికి ఒకరు లోబడి ఉండండి.
EPH 5:22 భార్యలారా, ప్రభువుకు లోబడి ఉన్నట్లే మీ సొంత భర్తలకు లోబడి ఉండండి.
EPH 5:23 క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నట్లుగా భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సుగా తన శరీరానికి రక్షకుడై ఉన్నారు.
EPH 5:24 సంఘం క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.
EPH 5:25 క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను తాను అప్పగించుకున్నట్లుగా, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి.
EPH 5:26 క్రీస్తు ప్రేమ తన సంఘాన్ని వాక్యమనే నీళ్ల స్నానంతో శుద్ధి చేసి, పవిత్రపరచడానికి,
EPH 5:27 దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాంటిది మరేది లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా మహిమ కలదిగా తన ముందు నిలబెట్టుకోవాలని, దాని కోసం తనను తాను సమర్పించుకున్నారు.
EPH 5:28 అదే విధంగా భర్తలు తమ సొంత శరీరాన్ని ప్రేమించినట్లే తమ భార్యలను ప్రేమించాలి. తన భార్యను ప్రేమించేవాడు తనను తాను ప్రేమించుకుంటున్నాడు.
EPH 5:29 ఎవరూ కూడా తన సొంత శరీరాన్ని ద్వేషించరు, ప్రతివారు దానిని పోషించి, కాపాడుకుంటారు, అదే విధంగా క్రీస్తు సంఘాన్ని పోషించి కాపాడుతున్నారు.
EPH 5:30 ఎందుకంటే మనం ఆయన శరీరం యొక్క అవయవాలమై ఉన్నాము.
EPH 5:31 “ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరు ఏకశరీరం అవుతారు.”
EPH 5:32 ఇది లోతైన మర్మం; అయితే నేను క్రీస్తు సంఘం గురించి చెప్తున్నాను.
EPH 5:33 చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీలో ప్రతీ పురుషుడు తనను తాను ప్రేమించుకొన్నట్లు తన భార్యను ప్రేమించాలి, అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.
EPH 6:1 పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, అది సరియైనది.
EPH 6:2 “మీ తండ్రిని తల్లిని గౌరవించాలి, ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ.
EPH 6:3 దాని వలన మీకు మేలు కలుగుతుంది, మీరు సంతోషంగా భూమి మీద దీర్ఘాయువు కలిగి జీవిస్తారు.”
EPH 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభువు బోధలో క్రమశిక్షణలో వారిని పెంచండి.
EPH 6:5 దాసులారా, మీరు క్రీస్తుకు లోబడినట్టు ఈ లోకసంబంధమైన మీ యజమానులకు గౌరవంతో, యథార్థ హృదయం కలవారై భయంతో లోబడి ఉండండి.
EPH 6:6 వారి కనుదృష్టి మీమీద ఉన్నప్పుడు వారి దయను పొందాలని కాకుండా, క్రీస్తు దాసులుగా, దేవుని చిత్తాన్ని హృదయపూర్వకంగా చేస్తూ వారికి లోబడండి.
EPH 6:7 మనష్యులకు చేసినట్లు కాక, ప్రభువును సేవించినట్లే హృదయపూర్వకంగా సేవ చేయండి.
EPH 6:8 ఎందుకంటే, దాసులైనా, స్వతంత్రులైనా మీలో ప్రతివారు ఏ మంచి కార్యాన్ని చేస్తారో దాని ఫలాన్ని ప్రభువు నుండి పొందుతారని మీకు తెలుసు.
EPH 6:9 అయితే యజమానులారా, మీరు కూడా మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. ఎందుకంటే మీ ఇద్దరి యజమాని పరలోకంలో ఉన్నారు, ఆయన పక్షపాతం చూపడని మీకు తెలుసు కాబట్టి వారిని బెదిరించకండి.
EPH 6:10 చివరిగా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.
EPH 6:11 మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులు కావడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
EPH 6:12 ఎందుకంటే, మనం పోరాడేది శరీరులతో కాదు, కాని పాలకులతో, అధికారులతో, ఈ చీకటి లోకపు శక్తులతో ఆకాశమండలంలో ఉన్న దురాత్మల బలగాలతో వ్యతిరేకంగా పోరాడుతున్నాము.
EPH 6:13 అందుకే ఆపద రోజున మీరు వారిని ఎదిరించడానికి, శక్తిమంతులుగా నిలబడడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
EPH 6:14 స్థిరంగా నిలబడి, మీ నడుములకు సత్యమనే నడికట్టు కట్టుకుని, నీతి అనే కవచాన్ని ధరించుకొని,
EPH 6:15 పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే చెప్పులు వేసుకుని నిలబడండి.
EPH 6:16 వీటితో పాటు, విశ్వాసమనే డాలు పట్టుకోండి. దీనితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నిటిని ఆర్పడానికి శక్తిమంతులు అవుతారు.
EPH 6:17 రక్షణ అనే శిరస్త్రాణాన్ని, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి.
EPH 6:18 ఆత్మలో అన్ని సందర్భాలలో అన్ని రకాల ప్రార్థనలతో విన్నపాలతో ప్రార్థించండి. దీన్ని మనస్సులో ఉంచుకొని, మెలకువగా ఉండి పరిశుద్ధులందరి కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉండండి.
EPH 6:19 సువార్త మర్మాన్ని నేను భయం లేకుండా తెలియజేయడానికి నేను ఎప్పుడు మాట్లాడినా, నాకు మాటలు అనుగ్రహించబడేలా నా కోసం కూడా ప్రార్థన చేయండి.
EPH 6:20 దాని కొరకే నేను రాయబారినై సంకెళ్ళలో ఉన్నాను, నేను దాన్ని ఎలా ప్రకటించాలో అలా దానిని ధైర్యంగా ప్రకటించేలా ప్రార్థించండి.
EPH 6:21 ప్రియ సహోదరుడు, ప్రభువులో నమ్మకమైన సేవకుడు, తుకికు, నేను ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో మీరు కూడా తెలుసుకోవడానికి అన్ని విషయాలను మీకు చెప్తాడు.
EPH 6:22 మేము ఎలా ఉన్నామో మీరు తెలుసుకోవాలని అతడు మిమ్మల్ని ప్రోత్సాహపరచాలనే ఉద్దేశంతో అతన్ని మీ దగ్గరకు పంపుతున్నాను.
EPH 6:23 సహోదరీ సహోదరులందరికి మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి సమాధానం, విశ్వాసంతో కూడిన ప్రేమ కలుగును గాక.
EPH 6:24 మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికందరికి కృప కలుగును గాక.
PHI 1:1 క్రీస్తు యేసు సేవకులైన పౌలు తిమోతి,
PHI 1:2 మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.
PHI 1:3 మీరు గుర్తుకొచ్చినప్పుడెల్లా నేను దేవునికి వందనాలు చెప్తున్నాను.
PHI 1:4 మీ అందరి నిమిత్తం చేసే నా ప్రతి ప్రార్థనలో నేను ఎప్పుడు సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాను.
PHI 1:5 మొదటి నుండి ఇప్పటివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారిగా ఉండడం చూసి,
PHI 1:6 మీలో ఈ మంచి కార్యాన్ని ఆరంభించినవాడు క్రీస్తు యేసు దినం వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను.
PHI 1:7 నేను సంకెళ్ళలో ఉన్నా లేదా సువార్త గురించి వాదించడంలో దానిని స్ధిరపరచడంలో మీరందరు నాతో కూడా ఈ కృపలో భాగస్థులుగా ఉన్నారు, కాబట్టి మీరు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల మీ అందరి గురించి ఇలా భావించడం నాకు న్యాయమే.
PHI 1:8 యేసు క్రీస్తు దయను బట్టి మీ అందరి గురించి నేనెంత ఆశ కలిగి ఉన్నానో దేవుడే సాక్ష్యం ఇస్తారు.
PHI 1:9 దేవునికి మహిమ స్తోత్రం కలుగుటకు, మీరు ఏది ఉత్తమమైనదో గ్రహించ కలిగి క్రీస్తు దినాన మీరు స్వచ్ఛముగా, నిర్దోషులుగా ఉండేలా, మీ ప్రేమ, జ్ఞానంలో, లోతైన పరిజ్ఞానాన్ని కలిగి అంతకంతకు వృద్ధిచెందాలని, క్రీస్తు యేసు నుండి వచ్చే నీతిఫలంతో మీరు నింపబడాలని మీ కోసం ప్రార్థిస్తున్నాను.
PHI 1:12 సహోదరీ సహోదరులారా, నాకు కలిగిన శ్రమల కారణంగా సువార్త మరి ఎక్కువగా విస్తరించిందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.
PHI 1:13 దాని ఫలితంగా, క్రీస్తు కోసం నేను సంకెళ్ళలో ఉన్నానని, రాజమందిరాన్ని కాపలా కాసేవారందరికి, అందరికి స్పష్టంగా తెలిసింది.
PHI 1:14 నా సంకెళ్ళ మూలంగా సహోదరీ సహోదరులలో చాలామంది ప్రభువులో స్ధిరమైన విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి మరి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు.
PHI 1:15 కొందరు అసూయతో, విరోధంతో క్రీస్తును ప్రకటిస్తున్నారనేది నిజమే, కాని ఇతరులు మంచి ఉద్దేశంతోనే ప్రకటిస్తున్నారు.
PHI 1:16 నేను సువార్త గురించి వాదించడానికి ఇక్కడ నియమించబడ్డానని తెలుసుకున్న తర్వాత, వారు ప్రేమతో ప్రకటిస్తున్నారు.
PHI 1:17 గతంలో నేను సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు మరింత ఇబ్బంది కలిగించాలనే తలంపుతో, వారు మంచి ఉద్దేశంతో కాకుండా స్వార్థపూరిత ఉద్దేశంతో, క్రీస్తును గురించి ప్రకటించారు.
PHI 1:18 అయితే ఏంటి? మంచి ఉద్దేశమైన లేదా చెడ్డ ఉద్దేశమైన ప్రతీ మార్గంలోనూ క్రీస్తు గురించి ప్రకటించబడుతుంది అనేదే ముఖ్యము. దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇకముందు కూడా నేను సంతోషిస్తాను.
PHI 1:19 ఎందుకంటే, మీ ప్రార్థన వలన, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా అనుగ్రహించబడుట వలన, నాకు ఏమి జరిగినా అది నాకు రక్షణగానే మారుతుందని నాకు తెలుసు.
PHI 1:20 నేను ఏ విషయంలోను సిగ్గుపడకుండా ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా పూర్ణధైర్యంతో బోధించడం వలన నేను జీవించినా లేదా మరణించినా సరే, నా శరీరంలో ఎప్పుడూ క్రీస్తు ఘనపరచబడాలని నేను ఆసక్తితో ఆశించి నిరీక్షిస్తున్నాను.
PHI 1:21 నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము.
PHI 1:22 ఒకవేళ నేను శరీరంలోనే జీవించాల్సి ఉంటే, ఇది నాకు ఫలభరితమైన ప్రయాసం అవుతుంది. అయినా నేను ఏమి కోరుకోవాలి? నాకు తెలియదు!
PHI 1:23 ఈ రెండింటికీ మధ్య నేను నలిగిపోతున్నాను. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో కూడా ఉండాలని నా ఆశ, అది నాకు చాలా మంచిది.
PHI 1:24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము.
PHI 1:25 మీరు విశ్వాసంలో వృద్ధి చెంది ఆనందించడానికి, నేను జీవిస్తూ, మీ అందరితో కలసి ఉంటానని నాకు తెలుసు.
PHI 1:26 ఇలాంటి నమ్మకం కలిగి, నేను మరల మీతో కలిసి ఉండడం వల్ల నన్ను బట్టి క్రీస్తు యేసులో మీకున్న ఆనందం అధికమవుతుంది.
PHI 1:27 ఏమి జరిగినా, క్రీస్తు సువార్తకు తగినట్లు మీరు ప్రవర్తించండి. నేను వచ్చి మిమ్మల్ని చూసినా లేదా నేను లేనప్పుడు మీ గురించి వినినా, మిమ్మల్ని వ్యతిరేకించేవారికి మీరు ఏ విధంగాను భయపడక, మీరు ఒకే ఆత్మలో దృఢంగా నిలిచి, సువార్త విశ్వాసం కోసం మీరు ఒకటిగా పోరాడుతున్నారని నేను తెలుసుకుంటాను. వారు నాశనం అవుతారు కాని మీరు రక్షించబడతారు, అది వారికి దేవుడు ఇచ్చే ఒక సూచన.
PHI 1:29 మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన కోసం శ్రమలు కూడా అనుభవించాలని ఆయన తరపున ఇది మీకు ఇవ్వబడింది,
PHI 1:30 నేను ఏ శ్రమలు అనుభవించడం మీరు చూశారో ఇప్పుడు మీరు ఆ శ్రమల గుండానే వెళ్తున్నారు, అయితే నేను కూడా ఇంకా శ్రమలగుండా వెళ్లాల్సి ఉంది.
PHI 2:1 అయితే మీకు క్రీస్తులో ప్రోత్సాహం గాని, ఆయన ప్రేమ వలన ఆదరణ గాని, ఆత్మలో ఏ సహవాసం గాని, దయ, కనికరం గాని కలిగినచో,
PHI 2:2 మీరు ఏక మనస్సు, ఒకే ప్రేమ కలిగి, ఆత్మలో ఒక్కటిగా ఉంటూ ఒకే భావం కలవారిగా ఉండి, నా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి.
PHI 2:3 స్వార్థపూరిత ఆశలతో లేదా వ్యర్థమైన గర్వంతో ఏమి చేయకండి. దానికి బదులు, వినయంతో ఇతరులకు మీకంటే ఎక్కువ విలువను ఇస్తూ,
PHI 2:4 మీ సొంత పనులపై మాత్రమే ఆసక్తి చూపక, మీలో ప్రతి ఒక్కరు ఇతరుల పనులపై కూడా ఆసక్తి చూపించాలి.
PHI 2:5 మీలో ఒకరితో ఒకరికి గల మీ సంబంధాల్లో క్రీస్తు యేసు కలిగి ఉన్న స్వభావాన్నే మీరు కూడా కలిగి ఉండండి:
PHI 2:6 ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై ఉండి, దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;
PHI 2:7 కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని మనుష్యుని పోలికగా పుట్టారు.
PHI 2:8 మనుష్యునిగా కనబడి మరణానికి విధేయత చూపించడం ద్వారా అనగా సిలువ మరణం పొందేంతగా తనను తాను తగ్గించుకున్నారు!
PHI 2:9 అందువల్ల దేవుడు ఆయనను ఉన్నత స్థానానికి హెచ్చించి అన్ని నామముల కంటే పై నామాన్ని ఆయనకిచ్చారు,
PHI 2:10 యేసు నామమున ప్రతివారి మోకాలు వంగునట్లు, పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను,
PHI 2:11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది, తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.
PHI 2:12 కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీరు ఎప్పుడు లోబడి ఉన్నట్లుగానే నేను ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, నేను మీతో లేనప్పుడు మరి ఎక్కువ లోబడి భయంతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి.
PHI 2:13 ఎందుకంటే దేవుని మంచి ఉద్దేశాలను నెరవేర్చడానికి మీరు ఇష్టపడడానికి, వాటిని చేయడానికి, మీలో కార్యాన్ని జరిగించేది దేవుడే.
PHI 2:14 సణుగుకోకుండా లేదా వాదించకుండా ప్రతిదాన్ని చేయండి.
PHI 2:15 తద్వారా మీరు నిందలేనివారిగా, శుద్ధులుగా, “చెడిపోయిన వక్రమైన ఈ తరం మధ్యలో, మీరు దోషంలేని దేవుని బిడ్డలు” అవుతారు. మీరు జీవవాక్యాన్ని స్థిరంగా పట్టుకుని ఉన్నప్పుడు, మీరు ఆకాశంలోని నక్షత్రాల్లా వారి మధ్యలో ప్రకాశిస్తారు. అప్పుడు నేను వృధాగా పరుగు పెట్టలేదు లేదా శ్రమపడలేదని క్రీస్తు దినాన నేను అతిశయించగలను.
PHI 2:17 మీ విశ్వాస యాగంలో దానికి సంబంధించిన సేవలో నేను పానార్పణంగా పోయబడినప్పటికి, మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాను.
PHI 2:18 కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి.
PHI 2:19 మీరు ఎలా ఉన్నారో నేను కూడా తెలుసుకుని సంతోషించాలని, ప్రభువైన యేసులో తిమోతిని త్వరలో మీ దగ్గరకు పంపాలని నేను అనుకుంటున్నాను.
PHI 2:20 అతనిలా మీ క్షేమం గురించి నిజమైన ఆసక్తి కలిగినవారు నా దగ్గర ఎవరు లేరు.
PHI 2:21 ప్రతి ఒక్కరు తమ సొంత పనులపైనే ఆసక్తి చూపిస్తున్నారు, కాని యేసు క్రీస్తు పనులపై కాదు.
PHI 2:22 తిమోతి యోగ్యుడని మీకు తెలుసు, ఎందుకంటే ఒక కుమారుడు తన తండ్రికి సేవ చేసినట్లుగా సువార్త పనిలో అతడు నాతో కలిసి సేవ చేశాడు.
PHI 2:23 కాబట్టి నాకు ఏమి జరుగబోతుందో నేను చూసిన వెంటనే, అతన్ని పంపాలని అనుకుంటున్నాను.
PHI 2:24 నేనూ త్వరలోనే వస్తానని ప్రభువులో నాకు నమ్మకం ఉంది.
PHI 2:25 నా సహోదరుడు, జతపనివాడు, నా తోటి యోధుడు, నా అవసరాలను చూసుకోవడాని మీరు పంపిన మీ దూతయైన ఎపఫ్రొదితును తిరిగి మీ దగ్గరకు పంపవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.
PHI 2:26 అతడు అనారోగ్యంగా ఉన్నాడని మీరు విన్నారు, కాబట్టి మీ అందరిని చూడాలని ఆశపడుతూ దుఃఖపడుతున్నాడు.
PHI 2:27 అతడు అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్నాడు కాని దేవుడు అతన్ని కనికరించారు. అతన్నే కాదు నాకు దుఃఖం మీద దుఃఖం కలుగకుండా నన్ను కూడా కనికరించారు.
PHI 2:28 మీరు అతన్ని మరలా చూసినప్పుడు మీరు సంతోషిస్తారు, అలాగే నా వేదన కొంత తగ్గుతుంది, కాబట్టి అతన్ని పంపాలని అందరికంటే నేనే ఎక్కువ ఆశపడుతున్నాను.
PHI 2:29 గొప్ప సంతోషంతో ప్రభువులో అతన్ని ఆదరించండి, అతనిలాంటి వారిని గౌరవించండి.
PHI 2:30 ఎందుకంటే క్రీస్తు పని కోసం అతడు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. మీరు నాకు చేయలేని సహాయాన్ని చేయడానికి అతడు తన ప్రాణాన్ని సైతం లెక్కచేయలేదు.
PHI 3:1 చివరిగా, నా సహోదరీ సహోదరులారా, ప్రభువులో ఆనందించండి! మరల అవే సంగతులను మీకు వ్రాయడం నాకు కష్టం కలిగించదు, అది మీకు రక్షణ కవచము.
PHI 3:2 ఆ కుక్కల గురించి, ఆ కీడుచేసేవారు, శరీరాన్ని ముక్కలు చేసేవారి గురించి జాగ్రత్త.
PHI 3:3 ఎందుకంటే, మనం సున్నతి పొందినవారం, దేవుని ఆత్మ చేత ఆయనను ఆరాధిస్తాం, క్రీస్తు యేసులో అతిశయపడతాం, శరీరంపై నమ్మకం ఉంచండి.
PHI 3:4 కావాలంటే నేను శరీరంపై అలాంటి నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు. ఎవరైనా శరీరంపై నమ్మకం ఉంచడానికి తమ దగ్గర కారణాలు ఉన్నాయని అనుకుంటే, వారికంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి.
PHI 3:5 నేను ఎనిమిదవ రోజున సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశానికి చెందినవాన్ని, బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను; ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడను.
PHI 3:6 అత్యాసక్తితో సంఘాన్ని హింసించాను; ధర్మశాస్త్రం ఆధారం చేసుకుని నీతి విషయంలో నిరపరాధిని.
PHI 3:7 అయితే, ఏవైతే నాకు లాభదాయకంగా ఉన్నాయో, నేను ఇప్పుడు వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా భావించాను.
PHI 3:8 నిశ్చయంగా నా ప్రభువైన క్రీస్తు యేసును తెలుసుకోవడం విలువైనది కాబట్టి నేను ప్రతిదీ నష్టంగా భావిస్తున్నాను. నేను క్రీస్తును సంపాదించుకోడానికి సమస్తాన్ని వ్యర్థంగా భావిస్తున్నాను.
PHI 3:9 క్రీస్తును సంపాదించుకుని, ధర్మశాస్త్రం వలన కలిగే నా నీతిని కాకుండా, క్రీస్తులోని విశ్వాసాన్నిబట్టి దేవుడు దయ చేసిన నీతిని కలిగి ఆయనలో కనబడాలని,
PHI 3:10 నేను క్రీస్తును తెలుసుకోవాలని కోరుతున్నాను, అవును, ఆయన పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలని, ఆయన శ్రమలలో పాలుపంచుకోవడం, ఆయన మరణంలో ఆయనలా కావడం,
PHI 3:11 అలా, ఏదో ఒక విధంగా, మృతులలో నుండి పునరుత్థానం పొందడము.
PHI 3:12 నేను ఇప్పటికే ఇవన్నీ పొందానని గాని, నా లక్ష్యాన్ని చేరుకున్నానని గాని నేను భావించడంలేదు, కాని దేనికోసం క్రీస్తు యేసు నన్ను పట్టుకున్నారో దానిని పట్టుకోవాలని పరుగెడుతున్నాను.
PHI 3:13 సహోదరీ సహోదరులారా, నేను ఇంతకుముందే దానిని పట్టుకున్నానని భావించను, అయితే నేను చేస్తున్నది ఒకటే, వెనుక ఉన్నవాటిని మరచిపోయి ముందున్న వాటికోసం ప్రయాసపడుతున్నాను,
PHI 3:14 క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు వలన కలిగే బహుమానాన్ని గెలవడానికి, లక్ష్యం వైపే పరుగెడుతున్నాను.
PHI 3:15 కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరం ఇదే భావాన్ని కలిగి ఉందాము. అప్పుడు దేని గురించైనా మీరు వేరుగా ఆలోచిస్తే, దాన్ని కూడా దేవుడు మీకు స్పష్టం చేస్తారు.
PHI 3:16 అయినా ఇప్పటివరకు మనం పొందుకున్న దానిని బట్టే క్రమంగా జీవిద్దాము.
PHI 3:17 సహోదరీ సహోదరులారా, మీరు నా మాదిరిని అనుసరించండి. మేము మీకు మాదిరిగా ఉన్నట్లే, ఎవరైతే మాలా జీవిస్తారో వారిపై మీ దృష్టిని ఉంచండి.
PHI 3:18 అనేకమంది క్రీస్తు సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు, గతంలో వీరిని గురించి మీతో అనేకసార్లు చెప్పినా, మరల ఇప్పుడు కన్నీటితో చెప్తున్నాను.
PHI 3:19 వారి గమ్యం నాశనం, వారి కడుపే వారికి దేవుడు, తాము సిగ్గుపడవలసిన వాటిలో వారు గర్వపడుతున్నారు. భూసంబంధమైన వాటిపైనే తమ మనస్సు ఉంచుతున్నారు.
PHI 3:20 అయితే మన పౌరసత్వం పరలోకంలో ఉంది, కాబట్టి అక్కడినుండి వచ్చే మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.
PHI 3:21 సమస్తాన్ని తన ఆధీనంలోనికి తీసుకురాగల తన శక్తినిబట్టి, ఆయన మన నీచమైన శరీరాలను తన మహిమగల శరీరాన్ని పోలి ఉండేలా మార్చగలరు.
PHI 4:1 కాబట్టి, నా సహోదరీ సహోదరులారా, నా ఆనందం నా కిరీటమైన నా ప్రియ స్నేహితులారా, నేను మిమ్మల్ని ప్రేమించి, ఈ విధంగా మీరు ప్రభువులో స్థిరంగా నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను.
PHI 4:2 ప్రభువులో ఏక మనస్సు కలిగి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను.
PHI 4:3 అవును, నా నిజమైన సహకారీ, జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన ఈ స్త్రీలు క్లెమెంతుతో మిగతా నా సహపనివారితో కలిసి సువార్త పనిలో నాతోకూడ ప్రయాసపడ్డారు. కాబట్టి వారికి సహాయం చేయమని నిన్ను అడుగుతున్నా.
PHI 4:4 ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించండి, మరల చెప్తున్నాను ఆనందించండి.
PHI 4:5 మీ శాంత స్వభావాన్ని అందరికి స్పష్టంగా తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నారు.
PHI 4:6 దేన్ని గురించి వేదన పడకండి, కాని ప్రతి విషయంలో ప్రార్థనావిజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి.
PHI 4:7 అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయాలను మీ తలంపులను కాపాడుతుంది.
PHI 4:8 చివరిగా, సహోదరీ సహోదరులారా, ఏదైనా యోగ్యమైనదిగా లేదా మంచిగా ఉంటే, సత్యమైన వాటి మీద, గొప్పవాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, సుందరమైన వాటి మీద, ఘనమైన వాటి మీద మీ మనస్సులను పెట్టండి.
PHI 4:9 మీరు నా నుండి ఏవి నేర్చుకున్నారో, పొందారో లేదా విన్నారో లేదా నాలో ఏమి చూశారు వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు సమాధానకర్తయైన దేవుడు మీతో ఉంటారు.
PHI 4:10 నా గురించి మీరు తిరిగి మరల ఆలోచిస్తున్నారని ప్రభువులో ఎంతో సంతోషించాను. మీరు నా గురించి ఆలోచిస్తున్నారు, గాని దానిని చూపించడానికి తగిన అవకాశం మీకు దొరకలేదు.
PHI 4:11 నేను అవసరంలో ఉన్నానని ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను.
PHI 4:12 దీనస్థితిలో ఉండడం అంటే నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. ఏ స్థితిలోనైనా అన్ని పరిస్థితుల్లో అనగా, కడుపునిండా తిన్నా లేదా ఆకలితో ఉన్నా, సమృద్ధిగా ఉన్నా లేదా అవసరంలో ఉన్నా తృప్తి కలిగి ఉండడానికి రహస్యాన్ని నేను నేర్చుకున్నాను.
PHI 4:13 నన్ను బలపరిచే ఆయనలోనే నేను ఇవన్నీ చేయగలను.
PHI 4:14 అయినప్పటికీ మీరు నా శ్రమలలో భాగం పంచుకోవడం మంచి పని.
PHI 4:15 అంతేకాక, ఫిలిప్పీయులారా, మీరు సువార్తను తెలుసుకున్న తొలి రోజుల్లో, నేను మాసిదోనియలో నుండి పంపబడినప్పుడు, ఇవ్వడంలో తీసుకోవడంలో కేవలం మీరు తప్ప మరి ఏ సంఘం నాతో పాలివారు కాలేదని మీకు తెలుసు.
PHI 4:16 నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా, నేను అవసరంలో ఉన్నప్పుడు అనేకసార్లు మీరు సహాయాన్ని పంపించారు.
PHI 4:17 నేను మీ కానుకలను కోరుకోవడంలేదు; మీరు ఇంకా అధికంగా పొందుకోవాలని కోరుకుంటున్నాను.
PHI 4:18 నేను సమృద్ధిగా పూర్తిగా పొందాను. మీరు పంపిన కానుకలు ఎపఫ్రొదితు నుండి అందుకున్నాను. అవి దేవునికి ఇష్టమైన పరిమళ అర్పణ, అంగీకారమైన త్యాగము.
PHI 4:19 నా దేవుడు తన మహిమైశ్వర్యం ఆధారంగా క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు.
PHI 4:20 మన తండ్రియైన దేవునికి మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.
PHI 4:21 క్రీస్తు యేసులో దేవుని ప్రజలందరికి వందనాలు చెప్పండి. నాతోకూడ ఉన్న సహోదరీ సహోదరులందరు మీకు వందనాలు చెప్తున్నారు.
PHI 4:22 ఇక్కడ ఉన్న దేవుని ప్రజలందరు ముఖ్యంగా కైసరు కుటుంబానికి చెందినవారు మీకు వందనాలు చెప్తున్నారు.
PHI 4:23 ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక ఆమేన్.
COL 1:1 దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, మన సహోదరుడైన తిమోతి శుభమని చెప్పి వ్రాయునది:
COL 1:2 కొలొస్సయిలో ఉన్న దేవుని పరిశుద్ధ ప్రజలకు, క్రీస్తులో విశ్వాసులైన సహోదరీ సహోదరులకు,
COL 1:3 క్రీస్తు యేసులో మీరు కలిగి ఉన్న విశ్వాసం గురించి, దేవుని ప్రజలందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి మేము విన్నాము, కాబట్టి మేము మీ కోసం ప్రార్థన చేసినప్పుడెల్లా, మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.
COL 1:5 మీ దగ్గరకు వచ్చిన సువార్త అనే సత్య బోధలో మీరు విన్న, పరలోకంలో మీ కోసం దాచి ఉంచిన నిరీక్షణ నుండి విశ్వాసం ప్రేమ కలిగాయి.
COL 1:6 అదే విధంగా, మీరు సువార్తను విని, దేవుని కృప గురించి నిజంగా గ్రహించిన రోజు నుండి అది మీ మధ్యలో ఫలించి వృద్ధి చెందుతున్న ప్రకారమే, ఈ సువార్త లోకమంతా ఫలిస్తూ వృద్ధిచెందుతుంది.
COL 1:7 మా ప్రియ తోటి సేవకుడైన ఎపఫ్రా నుండి వీటిని మీరు నేర్చుకున్నారు, అతడు మా విషయంలో క్రీస్తు యొక్క నమ్మకమైన పరిచారకుడు.
COL 1:8 ఆత్మలో మీకున్న ప్రేమను కూడా అతడు మాకు తెలియజేశాడు.
COL 1:9 ఈ కారణంగా, మీ గురించి విన్న రోజు నుండి, మేము మీ కోసం మానక ప్రార్థిస్తున్నాము. మీరు ఆత్మ ఇచ్చే సంపూర్ణ జ్ఞానం, వివేకం ద్వారా ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించినవారై,
COL 1:10 ప్రతి మంచి పనిలో సఫలమవుతూ, దేవుని జ్ఞానంలో ఎదుగుతూ అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా జీవించాలని,
COL 1:11 మీరు ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును, సహనాన్ని కలిగి ఉండేలా, ఆయన మహిమ ప్రభావాలను బట్టి సంపూర్ణ శక్తితో మీరు బలపరచబడాలని దేవున్ని నిరంతరం వేడుకుంటున్నాము.
COL 1:12 వెలుగు రాజ్యంలో పరిశుద్ధ ప్రజల స్వాస్థ్యంలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని ఎన్నికచేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము.
COL 1:13 ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలోనికి మనల్ని తీసుకువచ్చారు.
COL 1:14 ఆ కుమారుని ద్వారా మనకు విడుదల, పాపక్షమాపణ కలుగుతుంది.
COL 1:15 కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు.
COL 1:16 ఎందుకనగా, ఆయనలోనే సమస్తం సృష్టించబడ్డాయి, అనగా: ఆకాశంలో ఉన్నవి, భూమిపై ఉన్నవి, కంటికి కనబడేవి కనబడనివి, సింహాసనాలైనా లేదా ప్రభుత్వాలైనా లేదా పాలకులైనా లేదా అధికారులైనా, సమస్తం ఆయన ద్వారానే ఆయన కొరకే సృష్టించబడ్డాయి.
COL 1:17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆయనే ఆధారము.
COL 1:18 సంఘమనే శరీరానికి ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో సర్వాధికారం కలిగి ఉండడానికి ఆయనే ఆరంభం, మృతులలో నుండి లేచుటలో ప్రథముడయ్యారు.
COL 1:19 ఆయనలో దేవుని సంపూర్ణత నివసించాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం.
COL 1:20 ఆయన ద్వారా సమస్తాన్ని అనగా, భూమిపై ఉన్న లేదా పరలోకంలో ఉన్న, అన్నిటిని, క్రీస్తు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీపరచి, క్రీస్తు ద్వారా తనలో సమాధానపరచుకోవడం తండ్రికి ఇష్టమైనది.
COL 1:21 ఒకప్పుడు మీరు దేవుని నుండి దూరం అయ్యారు, మీ దుష్ట ప్రవర్తన వలన మీ మనస్సులో విరోధులయ్యారు.
COL 1:22 అయితే, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా తన సన్నిధిలో నిలబెట్టడానికి యేసు యొక్క భౌతికమైన శరీరం మరణించుట ద్వారా ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచారు.
COL 1:23 అందువల్ల మీరు విశ్వాసంలో కొనసాగుతూ స్థిరంగా నిలబడి, సువార్తలో చెప్పబడిన నిరీక్షణలో నుండి తొలగిపోకుండా ఉండండి. మీరు విన్న ఈ సువార్త, ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడుతుంది, పౌలు అనే నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను.
COL 1:24 మీ కోసం నేను అనుభవిస్తున్న శ్రమలలో ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను, సంఘమనే ఆయన శరీరం కోసం క్రీస్తు పడిన బాధల్లో మిగిలి ఉన్న వాటిలో నా వంతును, నా శరీరంలో పూర్తి చేస్తున్నాను.
COL 1:25 మీకు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తెలియజేయడానికి, దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను బట్టి సంఘానికి సేవకుడినయ్యాను.
COL 1:26 దేవుని వాక్యం అనగా గత అనేక యుగాలుగా తరాలుగా మరుగుచేయబడిన మర్మం, కాని ఇది ఇప్పుడు పరిశుద్ధులకు తెలియజేయబడింది.
COL 1:27 యూదేతరుల మధ్యలో నుండి దేవుడు ఎన్నికచేసిన వారికి ఈ మర్మం యొక్క సంపూర్ణ మహిమైశ్వర్యం ఎలాంటిదో, అనగా మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై ఉన్నారనే విషయం తెలియజేయబడింది.
COL 1:28 మేము అందరిని సంపూర్ణులుగా క్రీస్తులో నిలబెట్టడానికి సమస్త జ్ఞానంతో అందరికి ఆయన గురించే ప్రకటిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము, బోధిస్తున్నాము.
COL 1:29 నాలో బలంగా పని చేస్తున్న క్రీస్తు శక్తి అంతటిని బట్టి, ఇప్పటివరకు నేను ప్రయాసపడి పని చేస్తున్నాను.
COL 2:1 మీ కోసం లవొదికయలో ఉన్న వారి కోసం, వ్యక్తిగతంగా నన్ను కలుసుకొనని వారందరి కోసం నేను ఎంతగా కష్టపడుతున్నానో మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.
COL 2:2 వారు క్రీస్తు అనే దేవుని మర్మాన్ని స్పష్టంగా తెలుసుకొని, సంపూర్ణ గ్రహింపు అనే గొప్ప సంపదను కలిగి ఉండి, హృదయాల్లో ధైర్యపరచబడి ప్రేమలో ఐక్యత కలిగి ఉండాలనేదే నా లక్ష్యము.
COL 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడి ఉన్నాయి.
COL 2:4 ఇంపైన మాటలతో ఎవరూ మిమ్మల్ని మోసపరచకూడదని దీనిని మీకు చెప్తున్నాను.
COL 2:5 నేను శరీర విషయంలో మీకు దూరంగా ఉన్నా కాని, ఆత్మలో మీతో కూడా ఉండి, మీరు ఎంత క్రమశిక్షణగా ఉన్నారో క్రీస్తులో మీ విశ్వాసం ఎంత స్థిరంగా ఉందో చూసి ఆనందిస్తున్నాను.
COL 2:6 కాబట్టి, మీరు క్రీస్తు యేసును ప్రభువుగా అంగీకరించినట్టుగా, ఆయనలో వేరుపారి బలపడుతూ,
COL 2:7 మీకు బోధించబడిన ప్రకారం విశ్వాసంలో స్థిరపడుతూ, మరి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ, ఆయనలో మీరు జీవించడం కొనసాగించండి.
COL 2:8 క్రీస్తుపై కాకుండా, మానవ ఆచార సాంప్రదాయాలు ఈ లోకసంబంధమైన మూల నియమాలపై ఆధారపడిన మోసకరమైన వ్యర్థ తత్వజ్ఞానంతో ఎవరూ మిమ్మల్ని బంధించకుండా జాగ్రత్తపడండి.
COL 2:9 ఎందుకంటే, పరిపూర్ణ దైవత్వం శరీర రూపంలో క్రీస్తులో జీవిస్తుంది.
COL 2:10 మీరు క్రీస్తులో పరిపూర్ణతలోనికి తీసుకురాబడ్డారు. సమస్త బలానికి అధికారానికి ఆయనే శిరస్సు.
COL 2:11 మానవ చేతులతో చేయబడని సున్నతిని క్రీస్తులో మీరు పొందారు. క్రీస్తు చేత మీరు సున్నతి చేయబడినప్పుడు, మిమ్మల్ని పరిపాలిస్తున్న మీ శరీర పాప స్వభావం కొట్టివేయబడింది.
COL 2:12 ఏ విధంగా అంటే, బాప్తిస్మంలో మీరు ఆయనతో పాటు పాతిపెట్టబడి, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని క్రియలను మీరు విశ్వసించుట ద్వారా ఆయనతో పాటు మీరు కూడా మృతులలో నుండి లేచారు.
COL 2:13 మీ పాపాలను బట్టి మీ శరీరం సున్నతి పొందని కారణంగా మీరు చచ్చినవారిగా ఉండగా దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో పాటు బ్రతికించారు. ఆయన మన పాపాలన్నిటిని క్షమించారు,
COL 2:14 మనకు వ్యతిరేకంగా ఉండి, మనల్ని శిక్షకు గురి చేసే రుణపత్రాన్ని రద్దుచేశారు; ఆయన దానిని తీసివేసి, దానిని సిలువకు మేకులతో కొట్టారు.
COL 2:15 ఆయన సిలువ ద్వారా ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, వారు బహిరంగంగా సిగ్గుపడునట్లు చేసి, సిలువ చేత వారిపై విజయాన్ని ప్రకటించారు.
COL 2:16 కాబట్టి, మీరు తిని త్రాగే వాటి గురించి గాని, మతపరమైన పండుగల గురించి అనగా అమావాస్య, సబ్బాతు దిన ఆచారాల గురించి గాని మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చనివ్వకండి.
COL 2:17 ఇవి రాబోవు వాటి ఛాయారూపమే, కానీ నిజమైన స్వరూపం క్రీస్తులోనే ఉన్నది.
COL 2:18 ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనుపరుస్తూ మిమ్మల్ని అనర్హులుగా చేయకుండా చూసుకోండి. అలాంటివారు తాము చూసినవాటిని గురించి గొప్పగా వివరిస్తూ ఉంటారు; తమ బుద్ధిహీనమైన మనస్సు వలన వ్యర్థమైన ఆలోచనలతో అతిశయపడతారు.
COL 2:19 వారు శిరస్సు నుండి సంబంధాన్ని పోగొట్టుకుంటారు; అయితే ఆ శిరస్సు వలన మొత్తం శరీరం కీళ్ళతో నరములతో ఒకటిగా అతుకబడి, దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతుంది.
COL 2:20 మీరు క్రీస్తుతో పాటు లోకం యొక్క మూల నియమాల విషయమై చనిపోయినవారైతే, లోకానికి చెందినవారిగా, “చేతితో పట్టుకోవద్దు! రుచి చూడవద్దు! ముట్టుకోవద్దు!”
COL 2:21 అనే వాటికి మీరు ఎందుకు లోబడుతున్నారు?
COL 2:22 ఉపయోగించి నశించడానికి నియమించబడిన ఈ నియమాలు కేవలం మానవ ఆజ్ఞలు, బోధలపై ఆధారపడినవి.
COL 2:23 అలాంటి నియమాలు, వారి స్వయంకృత ఆరాధన విషయంలో, అతి వినయం విషయంలో, శరీరాన్ని హింసించుకోవడం జ్ఞానంగా అనిపించవచ్చు, కాని శారీరక ఆశలను చంపుకోవడంలో అలాంటి నియమాలకు ఎలాంటి విలువలేదు.
COL 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కాబట్టి, పైనున్న వాటిపై మీ హృదయాలను ఉంచండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి వైపున కూర్చుని ఉన్నారు.
COL 3:2 భూసంబంధమైన వాటి మీద కాకుండా, పైనున్న వాటి మీదనే మీ మనస్సులను ఉంచండి.
COL 3:3 ఎందుకంటే, మీరు చనిపోయారు, కాబట్టి మీ జీవం క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉంది.
COL 3:4 మీ జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మీరు కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షమవుతారు.
COL 3:5 కాబట్టి మీ భూసంబంధమైన స్వభావానికి సంబంధించిన వాటిని అనగా: లైంగిక దుర్నీతిని, అపవిత్రతను, కామవాంఛలను, దుష్ట కోరికలను, విగ్రహారాధనయైన దురాశలను చంపివేయండి.
COL 3:6 వీటి కారణంగానే దేవుని ఉగ్రత వస్తుంది.
COL 3:7 ఒకప్పుడు మీరు వీటి ప్రకారం నడుచుకొని జీవించారు.
COL 3:8 కానీ ఇప్పుడైతే, మీరు కోపం, ఆగ్రహం, అసూయ, దూషణ, మీ నోటితో బూతులు మాట్లాడడం వంటి వాటిని కూడా విడిచిపెట్టండి.
COL 3:9 మీరు మీ పాత స్వభావాన్ని దాని అలవాట్లతో సహా విడిచిపెట్టారు, కాబట్టి ఒకనితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు,
COL 3:10 సృష్టికర్త స్వారూప్యంలోని జ్ఞానంలో నూతనపరచబడుతున్న క్రొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు.
COL 3:11 ఇక్కడ యూదులు అని యూదేతరులు అని, సున్నతి పొందిన వారని సున్నతి పొందని వారని, అనాగరికులని నాగరికులని, బానిసలని స్వతంత్రులని భేదం లేదు, క్రీస్తే సర్వం, అందరిలో ఆయనే ఉన్నాడు.
COL 3:12 కాబట్టి, పరిశుద్ధులును ప్రియమైన వారునైన దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల్లా మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి.
COL 3:13 ఎవరికైనా ఎవరిపట్లనైనా బాధ ఉంటే, ఒకరిని ఒకరు సహించుకుంటూ ఒకరిని ఒకరు క్షమించుకోండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా క్షమించండి.
COL 3:14 వీటన్నిటికి పైగా, పరిపూర్ణ ఐక్యతలో బంధించే ప్రేమను ధరించుకోండి.
COL 3:15 ఒకే శరీరంలోని అవయవాల వలె, సమాధానం కోసం మీరు పిలువబడ్డారు, కాబట్టి క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలను పరిపాలించనివ్వండి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండండి.
COL 3:16 సంగీతంతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో సమస్త జ్ఞానంతో ఒకరికి ఒకరు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో కృతజ్ఞతతో దేవుని గురించి పాటలు పాడుతూ, క్రీస్తు సువార్తను మీ మధ్యలో సమృద్ధిగా నివసింపనివ్వండి.
COL 3:17 మీరు మాటల్లో కాని పనులలో కాని, ఏమి చేసినా ప్రభువైన యేసు నామంలో చేయండి, తండ్రియైన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.
COL 3:18 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, అది ప్రభువులో తగినది.
COL 3:19 భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి వారితో కఠినంగా ప్రవర్తించకండి.
COL 3:20 పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ప్రభువుకు ఇష్టము.
COL 3:21 తండ్రులారా, మీ పిల్లల మనస్సు నిరుత్సాహపడేటట్లు వారికి కోపం రేపకండి.
COL 3:22 బానిసలారా, మీ భూసంబంధ యజమానులకు లోబడి ఉండండి; వారి కనుదృష్టి మీమీద ఉన్నప్పుడు వారి దయను పొందాలని కాకుండా చిత్తశుద్ధి గల హృదయంతో, ప్రభువుకు భయపడుతూ అన్ని విషయాల్లో వారికి లోబడి ఉండండి.
COL 3:23 మీరు ఏమి చేసినా, అది మనుష్యుల మెప్పు కోసం కాకుండా ప్రభువు కోసం చేస్తున్నామని హృదయపూర్వకంగా చేయండి.
COL 3:24 మీరు ప్రభువు నుండి స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుకుంటారని మీకు తెలుసు కాబట్టి మీరు ప్రభువైన క్రీస్తునే సేవిస్తున్నారు.
COL 3:25 తప్పు చేసినవారికి, వారి తప్పులను బట్టి తగిన శిక్ష ఇవ్వబడుతుంది, ఇందులో ఎటువంటి పక్షపాతం ఉండదు.
COL 4:1 యజమానులారా, పరలోకంలో మీకు కూడా యజమాని ఉన్నాడని మీకు తెలుసు కాబట్టి, మీ దాసులకు సరియైనది న్యాయమైనది ఇవ్వండి.
COL 4:2 కృతజ్ఞత కలిగి మెలకువగా ఉండి, నిరంతరం ప్రార్థన చేయండి.
COL 4:3 నేను సంకెళ్ళతో ఉండడానికి కారణమైన క్రీస్తు మర్మాన్ని మేము ప్రకటించడానికి, మా సువార్త పరిచర్యకు దేవుడు ద్వారాలను తెరవాలని మాకోసం కూడా ప్రార్థన చేయండి.
COL 4:4 నేను ప్రకటించవలసినంత స్పష్టంగా ప్రకటించడానికి నా కోసం ప్రార్థన చేయండి.
COL 4:5 ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సంఘానికి బయటివారితో జ్ఞానంతో ప్రవర్తించండి.
COL 4:6 మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగా కృపతో నిండిన మాటలతో, అందరికి ఎలా జవాబు చెప్పాలో తెలిసిన వారిగా ఉండాలి.
COL 4:7 తుకికు నా సమాచారాన్ని మీకు తెలియజేస్తాడు. అతడు ప్రియ సహోదరుడు, ప్రభువులో నమ్మకమైన పరిచారకుడు నా తోటి సేవకుడు.
COL 4:8 మీరు మా స్ధితి తెలుసుకోవాలని, అతడు మీ హృదయాలను ప్రోత్సాహపరచాలనే ఉద్దేశంతో అతన్ని మీ దగ్గరకు పంపుతున్నాను.
COL 4:9 అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము వస్తున్నాడు, అతడు మీలో ఒకడు. ఇక్కడి సంగతులన్ని వారు మీకు తెలియజేస్తారు.
COL 4:10 నా తోటి ఖైదీలైన అరిస్తర్కుకు బర్నబాకు దగ్గరి బంధువైన మార్కు మీకు వందనాలు చెప్తున్నారు. మార్కును గురించి మీరు ఇంతకుముందే సూచనలు అందుకున్నారు, కాబట్టి అతడు మీ దగ్గరకు వస్తే, అతన్ని చేర్చుకోండి.
COL 4:11 యూస్తు అనబడే యేసు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. దేవుని రాజ్యం కోసం నాతో ఉన్న జతపనివారి మధ్యలో, యూదులు వీరు మాత్రమే ఉన్నారు. వీరు నాకు ఆదరణ కలిగిస్తున్నారు.
COL 4:12 క్రీస్తు యేసు సేవకుడును మీలో ఒకడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు పరిపూర్ణులుగా ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి పూర్తి నిశ్చయతగలవారై స్థిరంగా ఉండాలని, ఇతడు ఎప్పుడు మీ కోసం తన ప్రార్థనలో పోరాడుతూ ఉంటాడు.
COL 4:13 ఇతడు మీ కోసం, లవొదికయలో హియెరాపొలిలో ఉన్న వారి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడని ఇతన్ని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను.
COL 4:14 మన ప్రియ స్నేహితుడు వైద్యుడైన లూకా, సహోదరుడైన దేమా మీకు వందనాలు చెప్తున్నారు.
COL 4:15 లవొదికయలో ఉన్న సహోదరి సహోదరులకు, నుంఫాకు ఆమె గృహంలోని సంఘానికి నా వందనాలు తెలియజేయండి.
COL 4:16 ఈ ఉత్తరాన్ని మీరు చదివిన తర్వాత, లవొదికయలోని సంఘంలో కూడా చదివి వినిపించండి. అలాగే లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరు కూడా చదివించండి.
COL 4:17 అర్ఖిప్పుకు చెప్పండి: “ప్రభువు నుండి మీరు పొందిన పరిచర్యను మీరు పూర్తి చేసేటట్లు చూడండి.”
COL 4:18 పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను. నా సంకెళ్ళను జ్ఞాపకముంచుకోండి. కృప మీతో ఉండును గాక.
1TH 1:1 తండ్రియైన దేవునికి ప్రభువైన యేసు క్రీస్తుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి,
1TH 1:2 మేము ప్రార్థించిన ప్రతిసారి మీ అందరి గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.
1TH 1:3 దేవునిపై మీకున్న విశ్వాసంతో చేసిన కార్యాలు, ప్రేమ చేత ప్రేరేపించబడిన మీ ప్రయాసం, మన ప్రభువైన యేసు క్రీస్తులో మీకున్న నిరీక్షణ వలన మీరు చూపుతున్న ఓర్పును మేము మన తండ్రియైన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము.
1TH 1:4 దేవుని ప్రేమను పొందిన సహోదరీ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఎన్నుకున్నాడనే సంగతి మాకు తెలుసు.
1TH 1:5 ఎందుకంటే, మేము మీకు సువార్తను కేవలం సాధారణ మాటలతో కాక పరిశుద్ధాత్మ శక్తితో బలమైన విశ్వాసంతో ప్రకటించాము. మీ గురించి మేము మీ మధ్యలో ఎలా జీవించామో మీకు తెలుసు.
1TH 1:6 మీరు తీవ్రమైన శ్రమల మధ్యలో పరిశుద్ధాత్మలోని సంతోషంతో వాక్యాన్ని స్వీకరించి, మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకుంటున్నారు.
1TH 1:7 కాబట్టి మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులందరికి మీరు మాదిరిగా ఉన్నారు.
1TH 1:8 అందుకని మీ వలన ప్రభువును గురించిన వాక్యం కేవలం మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో మారుమ్రోగడమే కాకుండా మీలో దేవునిపై ఉన్న విశ్వాసాన్ని గురించి ప్రతిచోట తెలిసింది. కాబట్టి దాని గురించి మేము చెప్పవలసిన అవసరం లేదు,
1TH 1:9 ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎలాంటిదో వారే సాక్ష్యమిస్తున్నారు. సజీవుడైన నిజమైన దేవున్ని సేవించడానికి మీరు విగ్రహాలను విడిచిపెట్టి ఎలా దేవుని వైపుకు తిరిగారో,
1TH 1:10 మరణం నుండి ఆయన లేపిన, రాబోయే ఉగ్రత నుండి మనల్ని కాపాడబోవుచున్న, పరలోకం నుండి రాబోతున్న ఆయన కుమారుడైన యేసు కోసం మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో వారే చెప్తున్నారు.
1TH 2:1 సహోదరీ సహోదరులారా! మేము మీ దగ్గరకు రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు.
1TH 2:2 మీకు తెలిసినట్టే, మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి దౌర్జన్యాన్ని అనుభవించాం కాని మన దేవుని సహాయంతో తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నా ధైర్యంగా ఆయన సువార్తను మీకు ప్రకటించాము.
1TH 2:3 సువార్త విషయమై మిమ్మల్ని ప్రాధేయపడడంలో మాకేమి తప్పుడు ఉద్దేశాలు లేవు, మేము మిమ్మల్ని మోసం చేయడం లేదు.
1TH 2:4 దానికి బదులు, దేవుడు మాకు ఈ సువార్తను అప్పగించడానికి ఆయనచే యోగ్యులుగా ఎంచబడిన వారిలా మేము బోధిస్తున్నాము. కాబట్టి మేము మనుష్యులను మెప్పించడానికి కాకుండా మన హృదయాలను పరిశీలించే దేవుని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాము.
1TH 2:5 మేము ఎన్నడు ముఖస్తుతి చేయలేదు, మేము అత్యాశను దాచిపెట్టే ముసుగును వేసుకోలేదని మీకు తెలుసు; దాని గురించి దేవుడే మాకు సాక్షి.
1TH 2:6 మేము క్రీస్తు అపొస్తలులుగా మా అధికారాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్నా ప్రజల నుండి గాని మీ నుండి గాని ఇతరుల నుండి గాని వచ్చే ఘనతను మేము ఆశించలేదు.
1TH 2:7 కాని, మీ మధ్యలో చిన్నబిడ్డల్లా మృదువుగా ఉన్నాము. పాలిచ్చు తల్లి తన పిల్లలను ఎలా చూసుకుంటుందో,
1TH 2:8 మేము మిమ్మల్ని శ్రద్ధగా చూసుకున్నాము. ఎందుకంటే మేము మిమ్మల్ని ప్రేమించాం, కాబట్టి మేము మీతో దేవుని సువార్తను పంచుకోవడమే కాక మీ కోసం మా ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాము.
1TH 2:9 సహోదరీ సహోదరులారా! మేము పడ్డ మా ప్రయాసాన్ని మా కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మేము ఎవరికి భారంగా ఉండకూడదని దేవుని సువార్తను మీ మధ్య ప్రకటించినప్పుడు, మేము రాత్రింబవళ్ళు పని చేసి మమ్మల్ని మేము పోషించుకున్నాము.
1TH 2:10 విశ్వాసులైన మీ మధ్య మేము ఎంత భక్తిగా, నీతిగా ఎలాంటి నిందలేనివారిగా ఉన్నామో దానికి మీరే సాక్షులు, అలాగే దేవుడు సాక్షి.
1TH 2:11 తండ్రి తన సొంత పిల్లల పట్ల ఉన్నట్లు మేము మీ పట్ల నడుచుకొన్నామని,
1TH 2:12 మిమ్మల్ని తన రాజ్యంలోనికి, మహిమలోనికి పిలిచే దేవునికి తగినట్లుగా మీరు జీవించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ వేడుకొంటున్నాను.
1TH 2:13 అంతేకాక, మేము ప్రకటించిన దేవుని వాక్యాన్ని మీరు గ్రహించినందుకు, మీరు వాటిని మనుష్యుల మాటలుగా కాకుండా అవి నిజంగా దేవుని మాటలు అని, విశ్వసించినవారిలో అవి కార్యరూపం దాల్చుతాయని మీరు అంగీకరించినందుకు మేము దేవునికి మానక కృతఙ్ఞతలు తెలుపుచున్నాము.
1TH 2:14 సహోదరీ సహోదరులారా, మీరు క్రీస్తు యేసులో ఉన్న యూదయలోని దేవుని సంఘాల్లా నడుచుకోవడం మొదలుపెట్టారు: యూదుల వలన ఆ సంఘాలు శ్రమపడిన విధంగానే మీరు కూడా మీ సొంత ప్రజల నుండి శ్రమపడ్డారు.
1TH 2:15 వారే ప్రభువైన యేసు క్రీస్తును, ప్రవక్తలను చంపారు మనల్ని బయటకు తరిమేశారు. వారు దేవునికి కోపం కలిగిస్తారు, అందరితో విరోధంగా ఉంటారు.
1TH 2:16 యూదేతరులకు రక్షణ కలిగించే బోధను మేము అందించకుండా వారు మమ్మల్ని అడ్డగించాలనే ప్రయత్నాలతో వారు తమ పాపాలను అంతులేకుండా పెంచుకుంటున్నారు. కాని దేవుని ఉగ్రత వారి మీదకు రానే వచ్చింది.
1TH 2:17 సహోదరీ సహోదరులారా, మీ నుండి కొంతకాలం శరీరరీత్య దూరంగా ఉన్నా, ఆలోచనలో మీకు ఎప్పుడు దగ్గరగానే ఉన్న మాకు గల గొప్ప ఆశను బట్టి మిమ్మల్ని చూడాలని ప్రతి ప్రయత్నం చేశాము.
1TH 2:18 మేము మీ దగ్గరకు రావాలనుకున్నాము, నిజంగా పౌలును నేను అనేకసార్లు రావాలని ప్రయత్నించాను, కానీ సాతాను మమ్మల్ని ఆటంకపరిచాడు.
1TH 2:19 మన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుట మా నిరీక్షణ, ఆనందం, మా గౌరవ కిరీటం ఎవరు? అది మీరు కాదా?
1TH 2:20 నిజానికి, మీరే మా గౌరవ కిరీటం, ఆనందమై ఉన్నారు.
1TH 3:1 కాబట్టి మేము ఇంకా వేచి ఉండలేదా మేము ఏథెన్సులోనే ఉండడం మంచిదని తలంచాము.
1TH 3:2 మా సహోదరుడు దేవుని పరిచర్యయైన యేసు క్రీస్తు సువార్తను ప్రకటించడంలో మా తోటిపనివాడైన తిమోతిని, మీ విశ్వాసంలో మిమ్మల్ని ప్రోత్సహించి బలపరచడానికి పంపించాము,
1TH 3:3 ఎందుకంటే, అప్పుడు మీలో ఎవరు ఏ శ్రమల వలన కలవరం చెందకుండా ఉండాలని. అయినా మనం శ్రమలను ఎదుర్కోవలసి ఉందని మీకు బాగా తెలుసు.
1TH 3:4 నిజానికి, మనకు శ్రమలు వస్తాయని, మేము మీతో ఉన్నపుడు మీతో చెప్తూనే ఉన్నాము. అలాగే జరిగిందని మీకు తెలుసు.
1TH 3:5 ఏదో ఒక రీతిగా శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడని, అప్పుడు మేము చేసిన పని అంతా వ్యర్థమై పోతుందని నేను భయపడ్డాను, కాబట్టి ఇక నేను వేచి ఉండలేక మీ విశ్వాసం గురించి తెలుసుకోవాలని తిమోతిని పంపించాను.
1TH 3:6 అయితే ఇప్పుడే తిమోతి మీ నుండి మా దగ్గరకు వచ్చి, మీ విశ్వాసం గురించి, మీరు చూపిన ప్రేమ గురించి మంచి వార్తను మాకు అందించాడు. మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ మాకు సంబంధించిన మంచి జ్ఞాపకాలతో జ్ఞాపకం చేసుకుంటూ, మేము మిమ్మల్ని చూడాలని ఎలా ఆరాటపడుతున్నామో అలాగే మీరు కూడా మమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నారని అతడు మాతో చెప్పాడు.
1TH 3:7 కాబట్టి సహోదరీ సహోదరులారా, మేము హింసించబడినప్పుడు బాధను కష్టాలను అనుభవిస్తున్న సమయంలో మీ విశ్వాసాన్ని గురించి విన్నప్పుడు మేము ఆదరణ పొందుకున్నాము.
1TH 3:8 ఎందుకంటే, మీరు దేవునిలో స్థిరంగా నిలబడి ఉండడం మాకు ప్రాణం వచ్చినట్లే.
1TH 3:9 మీ వలన దేవుని సన్నిధిలో మేము పొందిన సంతోషమంతటిని బట్టి దేవునికి మీ కోసం కృతజ్ఞతాస్తుతులు ఎంతని చెల్లించాలి?
1TH 3:10 మిమ్మల్ని మరలా చూడాలని మీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని సరిచేయాలని రాత్రింబగళ్ళు మీ కోసం ఎంతో పట్టుదలతో ప్రార్థిస్తున్నాము.
1TH 3:11 మన తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు మేము త్వరగా మీ దగ్గరకు రావడానికి మార్గం సరాళం చేయును గాక!
1TH 3:12 మేము మీ పట్ల ప్రేమ చూపినట్లే, విశ్వాసులైన మీరు ఒకరిపట్ల ఒకరు మీ ప్రేమను వృద్ధిపొందించుకొంటూ ఇతరులందరికి ఆ ప్రేమను అందించేలా ప్రభువు చేయును గాక.
1TH 3:13 మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసివచ్చినపుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు నిందారహితులుగా పవిత్రులుగా ఉండడానికి ఆయన మీ హృదయాలను బలపరచును గాక.
1TH 4:1 సహోదరీ సహోదరులారా, చివరిగా, దేవునికి ఇష్టులుగా ఎలా జీవించాలో మేము మీకు బోధించిన ప్రకారం మీరు కూడా అలాగే జీవిస్తున్నారు. మీరు ఇలాగే ఇకముందు కూడా జీవించాలని ప్రభువైన యేసులో మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము.
1TH 4:2 ప్రభువైన యేసులో గల అధికారంతో మేము మీకు ఏమి బోధించామో మీకు తెలుసు.
1TH 4:3 మీరు లైంగిక దుర్నీతికి దూరంగా ఉంటూ పరిశుద్ధులుగా ఉండడమే దేవునికి ఇష్టం;
1TH 4:4 మీలో ప్రతివారు మీ సొంత శరీరమనే పాత్రను పరిశుద్ధంగా, ఘనత కలిగినదిగా ఉండేలా దానిపై నియంత్రణ కలిగి జీవించాలి.
1TH 4:5 దేవుని ఎరుగనివారి కామోద్రేకాన్ని కలిగి ఉండవద్దు.
1TH 4:6 ఈ విషయంలో తన సహోదర సహోదరీలను అలుసుగా తీసుకుని మోసం చేయకూడదు. ఎందుకంటే, మేము ముందుగానే మీకు చెప్పి హెచ్చరించిన ప్రకారం అలాంటి పాపాలను చేసిన వారందరిని ఈ క్రియల విషయాల్లో ప్రభువు శిక్షిస్తారు.
1TH 4:7 పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు.
1TH 4:8 కాబట్టి ఈ నియమాన్ని నిర్లక్ష్యం చేసినవారు మనుష్యులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, మీకు తన పరిశుద్ధాత్మను ఇచ్చిన దేవున్నే నిర్లక్ష్యం చేస్తున్నారు.
1TH 4:9 ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మీరు దేవుని నుండి నేర్చుకున్నారు కాబట్టి మీలో ఒకరిపట్ల ఒకరికి గల ప్రేమ గురించి మీకు వ్రాయాల్సిన అవసరం లేదు.
1TH 4:10 నిజానికి, మాసిదోనియ అంతటా ఉన్న దేవుని కుటుంబమంతటికి ప్రేమ చూపిస్తున్నారు. అయినా సహోదరీ సహోదరులారా, మీరు ఇంకా అధికంగా ప్రేమించాలని చెప్తున్నాము.
1TH 4:11 ఆ ప్రేమ ద్వారా సమాధానకరమైన జీవితాన్ని గడపడమే మీ ధ్యేయంగా పెట్టుకొని, మేము మీకు చెప్పిన విధంగా ఇతరుల జోలికి పోకుండా మీ సొంత విషయాలనే చూసుకుంటూ మీ చేతులతో కష్టపడి పని చేయండని మిమ్మల్ని వేడుకొంటున్నాము.
1TH 4:12 అప్పుడు మీ అనుదిన జీవితం బయటి వారి గౌరవాన్ని గెలుచుకుంటుంది, మీరు ఎవరిపైనా ఆధారపడేవారిగా ఉండరు.
1TH 4:13 సహోదరీ సహోదరులారా, చనిపోయినవారి గురించి మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మీరు నిరీక్షణలేని ఇతరుల్లా దుఃఖించకండి.
1TH 4:14 యేసు చనిపోయి తిరిగి లేచారని మనం నమ్ముతున్నాం కాబట్టి, ఆయనలో నిద్రించినవారిని దేవుడు యేసుతో పాటు తీసుకువస్తారని నమ్ముతున్నాము.
1TH 4:15 ప్రభువు చెప్పిన మాటను బట్టి మేము మీతో చెప్పేది ఏంటంటే, ప్రభువు తిరిగి వచ్చేవరకు బ్రతికి ఉండే మనం చనిపోయినవారికంటె ముందుగా ఆయన సన్నిధికి చేరము.
1TH 4:16 ప్రభువే స్వయంగా పరలోకం నుండి గొప్ప అధికార శబ్దంతో మాట్లాడడాన్ని వింటారు, అలాగే ప్రధానదూత మాట్లాడే శబ్దాన్ని వింటారు, బూర ధ్వనితో ఆయన దిగి వస్తారు, అప్పుడు క్రీస్తులో చనిపోయినవారు మొదట లేస్తారు.
1TH 4:17 ఆ తర్వాత మిగతా బ్రతికి ఉన్న మనం వారితో పాటు కలసి, ప్రభువును కలుసుకోడానికి ఆకాశమండలానికి మేఘాల మీద కొనిపోబడతాము. అప్పుడు మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాము.
1TH 4:18 ఆ కారణాన్ని బట్టి, మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోండి.
1TH 5:1 సహోదరీ సహోదరులారా, యేసు క్రీస్తు రాకడ ఎప్పుడు సంభవిస్తుందో ఆ కాలాలు, సమయాల గురించి మేము మీకు వ్రాయాల్సిన అవసరం లేదు,
1TH 5:2 ప్రభువు దినం రాత్రి దొంగలా వస్తుందని మీకు బాగా తెలుసు.
1TH 5:3 ప్రజలు, మేము, “నెమ్మది కలిగి సురక్షితంగా ఉన్నాం” అని అనుకుంటున్నప్పుడు, ఒక గర్భిణి స్త్రీకి పురుటినొప్పులు వచ్చునట్లు వారి పైకి నాశనం అకస్మాత్తుగా వస్తుంది, కాబట్టి వారు దాని నుండి తప్పించుకోలేరు.
1TH 5:4 అయితే సహోదరీ సహోదరులారా, ఆ దినం దొంగలా మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి మీరు చీకటిలో లేరు.
1TH 5:5 మీరంతా వెలుగు సంతానం పగటి సంతానము. మనం చీకటికి లేదా రాత్రికి చెందినవారం కాదు.
1TH 5:6 కాబట్టి మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాము.
1TH 5:7 నిద్రపోయేవారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తులుగా ఉండేవారా రాత్రివేళ మత్తులై ఉంటారు.
1TH 5:8 అయితే మనం పగటికి చెందినవారం కాబట్టి తెలివి కలిగి, విశ్వాసం ప్రేమ అనే కవచాన్ని, రక్షణ పొందాలనే ఆ ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకొంటాము.
1TH 5:9 ఎందుకంటే దేవుడు మనల్ని ఉగ్రతను అనుభవించడానికి నియమించలేదు కాని, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే నియమించారు.
1TH 5:10 ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం లోకంలో జీవించి ఉన్నా లేదా మరణించినా ఆయనతో పాటు మనం జీవించాలని క్రీస్తు మన కోసం చనిపోయారు.
1TH 5:11 కాబట్టి మీరిప్పుడు చేస్తున్నట్లుగానే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొంటూ ఒకరిని ఒకరు బలపరచుకోండి.
1TH 5:12 సహోదరీ సహోదరులారా, మీ మధ్యలో ప్రయాసపడుతున్నవారిని, ప్రభువులో మీ కోసం శ్రద్ధ చూపించేవారిని, మిమ్మల్ని హెచ్చరించేవారిని గౌరవించాలని మేము మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము.
1TH 5:13 వారి పనిని బట్టి వారిని ప్రేమతో అధికంగా గౌరవించండి. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి.
1TH 5:14 సహోదరీ సహోదరులారా, సోమరులను హెచ్చరించమని, క్రుంగిపోయినవారిని ప్రోత్సహించమని, బలహీనులకు సహాయం చేయమని, అందరితో సహనం కలిగి ఉండమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము.
1TH 5:15 మీలో ఎవరూ కీడుకు ప్రతిగా కీడు చేయకుండ చూసుకోండి, అలాగే అందరికి మంచి చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించండి.
1TH 5:16 ఎల్లప్పుడు ఆనందించండి;
1TH 5:17 విడువక ప్రార్థించండి,
1TH 5:18 మీరు ప్రతి విషయం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశము.
1TH 5:19 ఆత్మ ప్రేరణను ఆర్పకండి.
1TH 5:20 ప్రవచనాలను తిరస్కరించకండి.
1TH 5:21 అన్నిటిని పరీక్షిస్తూ మంచి వాటిని గట్టిగా పట్టుకోండి,
1TH 5:22 ప్రతీ కీడును తిరస్కరించండి.
1TH 5:23 సమాధానకర్తయైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక.
1TH 5:24 మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు, కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారు.
1TH 5:25 సహోదరీ సహోదరులారా, మాకోసం ప్రార్థించండి.
1TH 5:26 దేవుని ప్రజలందరికి పవిత్ర ముద్దుతో వందనాలు.
1TH 5:27 సహోదరీ సహోదరులందరికి ఈ పత్రికను చదివి వినిపించాలని ప్రభువు పేరట మిమ్మల్ని ఆదేశిస్తున్నాను.
1TH 5:28 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీతో ఉండును గాక.
2TH 1:1 తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయ సంఘానికి,
2TH 1:2 తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.
2TH 1:3 సహోదరీ సహోదరులారా, మేము మీ గురించి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ వలసిందే ఎందుకంటే, మీ విశ్వాసం అంతకంతకు పెరుగుతుంది, మీ అందరికి ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ మరింత అధికమవుతూ ఉంది.
2TH 1:4 కాబట్టి మీరు పొందుతున్న హింసలలో శ్రమలలో మీరు చూపుతున్న ఓర్పు విశ్వాసం గురించి దేవుని సంఘాల్లో మేము గొప్పగా చెప్తున్నాము.
2TH 1:5 దీన్ని బట్టి దేవుడు ఇచ్చిన తీర్పు న్యాయమైనదని తెలియజేయడానికి రుజువుగా, మీరు అనుభవించిన శ్రమల వలన మీరు దేవుని రాజ్యానికి అర్హులు అవుతారు.
2TH 1:6 దేవుడు న్యాయవంతుడు కాబట్టి మిమ్మల్ని హింసించినవారిని తగిన విధంగా శిక్షిస్తారు,
2TH 1:7 పరలోకం నుండి ప్రభువైన యేసు తన శక్తివంతమైన దూతలతో కలిసి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు శ్రమలను అనుభవిస్తున్న మీకు అదే విధంగా మాకు విశ్రాంతిని ఇస్తారు.
2TH 1:8 దేవుని ఎరుగని వారిని, మన ప్రభువైన యేసు యొక్క సువార్తకు లోబడని వారిని ఆయన శిక్షిస్తారు.
2TH 1:9 వారు అనుభవించే శిక్ష నిత్య నాశనంగా ఉంటుంది, అలాంటివారు ప్రభువు సన్నిధి నుండి ఆయన మహాప్రభావం నుండి వెళ్లగొట్టబడతారు,
2TH 1:10 ఆయన వచ్చే దినాన తన పరిశుద్ధ ప్రజలమధ్య మహిమను కనుపరచుకున్నప్పుడు ఆయనను నమ్మినవారందరు ఆశ్చర్యంగా ఆయనను చూస్తారు. మేము మీకు చెప్పిన సాక్ష్యాన్ని మీరు విశ్వసించారు కాబట్టి మీరు కూడా వారిలో ఉంటారు.
2TH 1:11 దీన్ని హృదయంలో ఉంచుకుని, మన దేవుడు మీకిచ్చిన పిలుపుకు మిమ్మల్ని ఆయన యోగ్యులుగా చేయాలని, ఆయన తన శక్తిచేత మీ ప్రతి ఉత్తమమైన కోరికను ఫలింపచేయాలని, మీ ప్రతి పని విశ్వాసం వలన జరగాలని మేము మీ కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము.
2TH 1:12 తద్వారా మన దేవుని యొక్క ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపను బట్టి మన ప్రభువైన యేసు నామం మీలో, మీరు ఆయనలో మహిమపరచబడాలని మేము ప్రార్థిస్తున్నాము.
2TH 2:1 సహోదరీ సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ గురించి మనం ఆయనను కలుసుకొనుట గురించి మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే,
2TH 2:2 ప్రభువు రాబోయే దినం వచ్చేసిందని ప్రకటించే ప్రవచనాల ద్వారా గాని నోటిమాటల ద్వారా లేదా ఏదైన ఉత్తరం ద్వారా గాని మీకు తెలిస్తే తొందరపడి కలవరంతో భయపడకండి.
2TH 2:3 మిమ్మల్ని ఎవరైనా ఏ రీతిగానైనా మోసపరచనివ్వకండి. ఎందుకంటే తిరుగుబాటు వచ్చేవరకు, నాశనానికి కర్తయైన దుర్మార్గుడు బయటపడే వరకు ఆ దినం రాదు.
2TH 2:4 వాడు దేవునిగా పిలువబడే ప్రతిదాన్ని, పూజించబడే వాటన్నిటిని వ్యతిరేకించి, తనను తాను వాటన్నిటికంటే పైగా హెచ్చించుకొంటూ, తనంతట తానే దేవాలయంలో కూర్చుని, తానే దేవుడనని ప్రకటించుకుంటాడు.
2TH 2:5 నేను మీతో ఉన్నప్పుడు మీకు తెలియజేసిన ఈ సంగతులు మీకు జ్ఞాపకం లేవా?
2TH 2:6 అయితే అతడు సరియైన సమయంలో బయలుపరచబడడానికి ఏది అతన్ని అడ్డగిస్తూ ఉందో ఇప్పుడు మీకు తెలుసు.
2TH 2:7 ఆ దుర్మార్గుని యొక్క రహస్యశక్తి ఇప్పటికే పని చేస్తూ ఉంది; అయితే దానిని అడ్డగిస్తున్నవాడు మార్గంలో నుండి వాన్ని తీసివేసే వరకు వాడు అడ్డగిస్తూ ఉంటాడు.
2TH 2:8 ఆ దుర్మార్గుడు బయలుపరచబడినప్పుడు, ప్రభువైన యేసు తన నోటి ఊపిరితో అతన్ని పడగొట్టి, తన రాకడ ప్రకాశంతో అతన్ని నాశనం చేస్తారు.
2TH 2:9 సాతాను చేసే పనులకు అనుకూలంగా దుర్మార్గుని రాకడ ఉంటుంది. అతడు తన అబద్ధాన్ని నిరూపించుకోవడానికి, తన శక్తిని చూపించుకోడానికి సూచకక్రియలు, అద్భుతాలు, మహాత్కార్యాలను చేస్తాడు,
2TH 2:10 అతడు నశించువారిని అన్ని విధాలుగా దుష్టత్వంతో మోసగిస్తాడు, వారు రక్షణ పొందడానికి గాని సత్యాన్ని ప్రేమించడానికి నిరాకరించారు కాబట్టి వారు నశిస్తారు.
2TH 2:11 ఈ కారణంగా, వారు అబద్ధాన్ని నమ్మేలా దేవుడు వారి మీదకు బలమైన భ్రమను పంపాడు.
2TH 2:12 అప్పుడు సత్యాన్ని నమ్మకుండా దుర్మార్గంలో ఆనందించేవారు శిక్షకు పాత్రులుగా ఎంచబడతారు.
2TH 2:13 ప్రభువు ప్రేమించిన సహోదరీ సహోదరులారా, మేము మీ కోసం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ వలసిందే ఎందుకంటే, మీరు రక్షణ పొందడానికి సత్యాన్ని నమ్మడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మ చేత పరిశుద్ధపరచడానికి ప్రారంభం నుండి ఏర్పరచుకున్నారు.
2TH 2:14 మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమలో పాలుపొందేలా మా సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
2TH 2:15 కాబట్టి సహోదరీ సహోదరులారా, మీరు మా నోటి మాటలతో లేదా ఉత్తరాల ద్వారా మేము మీకు చేయించిన బోధను గట్టిగా పట్టుకుని దానిలో స్థిరంగా ఉండండి.
2TH 2:16 మన ప్రభువైన యేసు క్రీస్తును మన తండ్రియైన దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చేత మనకు నిత్య ప్రోత్సాహాన్ని స్థిరమైన నిరీక్షణను ఇచ్చి,
2TH 2:17 మన హృదయాలను ధైర్యపరచి, ప్రతి మంచి పనిలో మంచి మాటల్లో మిమ్మల్ని బలపరచును గాక.
2TH 3:1 సహోదరీ సహోదరులారా, మిగిలిన విషయాలు ఏంటంటే, ప్రభువు వాక్యం మీలో వ్యాపించిన ప్రకారమే మరింతగా వేగంగా వ్యాపించి ఘనత పొందేలా మాకోసం ప్రార్థించండి.
2TH 3:2 విశ్వాసం అందరికి లేదు కాబట్టి మూర్ఖులైన దుష్టప్రజల నుండి మేము విడిపించబడునట్లు మీరు ప్రార్థించండి.
2TH 3:3 అయితే ప్రభువు నమ్మదగినవాడు కాబట్టి ఆయన మిమ్మల్ని బలపరచి దుష్టుని నుండి కాపాడును.
2TH 3:4 మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తున్నారని, వాటిని చేయడం కొనసాగిస్తారని ప్రభువులో మేము నమ్ముతున్నాము.
2TH 3:5 ప్రభువు మీ హృదయాలను దేవుడు మీ పట్ల చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన సహనం వైపు నడిపించును గాక.
2TH 3:6 సహోదరీ సహోదరులారా, మీరు మా నుండి పొందిన బోధల ప్రకారం జీవించక, తమ పనులను చూసుకోక సోమరులుగా బ్రతుకుతున్న ప్రతి విశ్వాసికి మీరు దూరంగా ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాము.
2TH 3:7 మా మాదిరిని మీరు ఎలా అనుసరించాలో అది మీకు తెలుసు. అంటే మేము మీ మధ్యన ఉన్నప్పుడు వట్టి చేతులతో సోమరులుగా కూర్చోలేదు,
2TH 3:8 మేము ఎవరి దగ్గర ఉచితంగా ఆహారాన్ని తినలేదు. దానికి బదులు, మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి పని చేశాము.
2TH 3:9 అలాంటి సహాయాన్ని పొందే హక్కు లేదని అలా చేయలేదు కాని, మీరు మాలా ప్రవర్తించేలా మీకు ఒక ఆదర్శంగా ఉండాలని మేము అలా చేశాము.
2TH 3:10 మేము మీతో ఉన్నప్పుడు, “పని చేయనివాడు ఆహారం తినడానికి పాత్రుడు కాడు” అనే నియమాన్ని కూడా మీకు ఇచ్చాము.
2TH 3:11 మీలో కొందరు సోమరులుగా ఏ పని చేసుకోకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నారని మేము విన్నాము.
2TH 3:12 అలాంటివారు స్థిరపడి, వారు తినే ఆహారాన్ని వారే సంపాదించుకోవాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము వారిని హెచ్చరిస్తున్నాము, వేడుకుంటున్నాము.
2TH 3:13 సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు.
2TH 3:14 ఈ ఉత్తరంలో మేము వ్రాసిన సూచనలను పాటించని వారిని గమనించి వారు సిగ్గుపడేలా మీరు వారితో కలవకండి.
2TH 3:15 అయితే వారిని శత్రువులుగా చూడవద్దు కాని, మీ తోటి విశ్వాసులుగా వారిని హెచ్చరించండి.
2TH 3:16 సమాధానానికి కర్తయైన దేవుడు అన్ని సమయాల్లో అన్ని విధాలుగా మీకు సమాధానం కలుగజేయును. ప్రభువు మీ అందరికి తోడై ఉండును గాక!
2TH 3:17 పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను, నేను వ్రాసిన ఉత్తరాలన్నింటిలో నేను వ్రాశాను అనడానికి ప్రత్యేకమైన గుర్తు ఇదే.
2TH 3:18 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ అందరితో ఉండును గాక.
1TI 1:1 మన రక్షకుడైన దేవుని, మన నిరీక్షణయైన క్రీస్తు యేసు ఆజ్ఞ వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు,
1TI 1:2 విశ్వాసంలో నాకు నిజ కుమారుడైన తిమోతికి వ్రాయునది:
1TI 1:3 నేను మాసిదోనియా ప్రాంతానికి వెళ్తూ, నేను నిన్ను కోరిన విధంగా, నీవు ఎఫెసు పట్టణంలోనే ఉండి, అక్కడ సత్యానికి విరుద్ధమైన బోధలు చేస్తున్నవారిని అలా బోధించవద్దని,
1TI 1:4 కట్టుకథలపై అంతులేని వంశచరిత్రలపై శ్రద్ధ చూపవద్దని ఆజ్ఞాపించు. వీటన్నిటి వలన విశ్వాసంతో జరిగే దేవుని పని ముందుకు కొనసాగే బదులు వాగ్వివాదాలకు దారి తీస్తాయి.
1TI 1:5 ఈ ఆజ్ఞ యొక్క లక్ష్యం ప్రేమ; అది స్వచ్ఛమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, యథార్థమైన విశ్వాసం నుండి కలుగుతుంది.
1TI 1:6 కొందరు వీటిని విడిచిపెట్టి, అర్థంలేని మాటల్లో పడ్డారు.
1TI 1:7 వారు దేవుని ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలని అనుకుంటారు, కాని తాము మాట్లాడే వాటి గురించి లేదా తాము ఎంతో నమ్మకంగా నొక్కి చెప్పే వాటి గురించి వారికే తెలియదు.
1TI 1:8 ధర్మశాస్త్రాన్ని సరియైన రీతిలో ఉపయోగిస్తే అది మంచిదే అని మనందరికి తెలుసు.
1TI 1:9 అంతేకాక ధర్మశాస్త్రం నీతిమంతుల కోసం కాదు గాని, చట్టానికి విరుద్ధంగా ఉన్నవారికి, తిరుగుబాటు చేసేవారికి, భక్తిహీనులకు, పాపులకు, అపవిత్రులకు, నాస్తికులకు, తమ తల్లిదండ్రులను చంపేవారి కోసం, హంతకుల కోసం
1TI 1:10 లైంగిక అనైతికత కలిగినవారి కోసం, స్వలింగసంపర్కులకు, బానిస వ్యాపారం చేసేవారికి, అబద్ధాలు చెప్పేవారికి, దొంగ సాక్ష్యం చెప్పేవారికి, స్వచ్ఛమైన బోధకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసం నియమించబడిందని మనకు తెలుసు.
1TI 1:11 దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమను గురించిన సువార్తకు అనుగుణమైనదే, ఈ స్వచ్ఛమైన బోధ.
1TI 1:12 నన్ను నమ్మకమైన వానిగా తలంచి బలపరచి తన సేవ కోసం నన్ను నియమించిన, మన ప్రభువైన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
1TI 1:13 ఒకప్పుడు నేను క్రీస్తును తెలుసుకోక ముందు విశ్వాసంలో దృఢపడక ముందు దైవదూషణ చేసేవానిగా, హింసించేవానిగా దుర్మార్గునిగా ఉన్నాను అయినప్పటికీ దేవుడు నన్ను కనికరించాడు.
1TI 1:14 మన ప్రభువు యొక్క కృప, యేసు క్రీస్తులోని ప్రేమ, విశ్వాసం నాపై విస్తారంగా క్రుమ్మరించబడింది.
1TI 1:15 క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారనే మాట నమ్మదగింది పూర్తిగా అంగీకరించదగింది. అలాంటి పాపులలో నేను అతి దుష్టుడను.
1TI 1:16 అయితే ఆ కారణంగానే, నిత్యజీవాన్ని పొందడానికి ఆయనలో నమ్మకముంచబోయే వారికి మాదిరిగా ఉండడానికి, అతి దుష్టుడనైన నాలో క్రీస్తు యేసు తన యొక్క అపరిమితమైన దీర్ఘశాంతాన్ని చూపించారు.
1TI 1:17 కాబట్టి నిత్య రాజుగా ఉన్న, అమరుడగు అదృశ్యుడైన ఒకే దేవునికి ఘనత మహిమలు నిరంతరం కలుగును గాక ఆమేన్.
1TI 1:18 తిమోతీ, నా కుమారుడా! నీ గురించి ఇదివరకే చెప్పబడిన ప్రవచనాలు నెరవేరడానికి నేను ఈ ఆజ్ఞ నీకు ఇస్తున్నాను. నీవు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మంచి పోరాటాన్ని పోరాడు.
1TI 1:19 మనం మంచి మనస్సాక్షిని విశ్వాసాన్ని కలిగి ఉంటేనే పోరాడగలం, అయితే కొందరు విశ్వాసాన్ని వదిలిపెట్టి తమ జీవితనావను నాశనం చేసుకున్నారు.
1TI 1:20 అలాంటివారిలో హుమెనేయు, అలెగ్జాండరు అనేవారు ఉన్నారు. వారిని నేను సాతానుకు వదిలేశాను, అప్పుడు వారు దేవుని దూషించకుండ ఉండడం నేర్చుకుంటారు.
1TI 2:1 అన్నిటికంటే ప్రాముఖ్యంగా, నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, అందరి పక్షంగా అనగా రాజుల కోసం అధికారంలో ఉన్న వారందరి కోసం దేవునికి విన్నపాలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు చేసి కృతజ్ఞతలు చెల్లిస్తే, మనం పూర్ణ భక్తి, పరిశుద్ధత కలిగి శాంతి సమాధానాలతో ప్రశాంతంగా జీవించగలము.
1TI 2:3 ఇలాంటివి మంచివి; మన రక్షకుడైన దేవునికి ప్రీతికరమైనవి.
1TI 2:4 ప్రజలందరు సత్యాన్ని తెలుసుకొని రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.
1TI 2:5 ఎందుకంటే, దేవుడు ఒక్కడే; క్రీస్తు యేసు ఒక్కడే మానవునిగా ఉండి, దేవునికి మానవులకు మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉన్నారు.
1TI 2:6 ఆయనే ప్రజలందరి రక్షణ కోసం విమోచన క్రయధనంగా తనను తాను అర్పించుకున్నారు. దీని గురించి సరియైన సమయంలో సాక్ష్యం ఇవ్వబడుతుంది.
1TI 2:7 దీని కోసమే నేను ప్రకటించేవానిగా, అపొస్తలునిగా యూదేతరులకు నమ్మకమైన బోధకునిగా ఉండడానికి నియమించబడ్డాను, నేను చెప్పేది నిజం నేను అబద్ధం చెప్పడం లేదు.
1TI 2:8 కాబట్టి ప్రతిచోట పురుషులు పవిత్రమైన చేతులను పైకెత్తి, కోపం లేదా కలహభావం లేకుండా ప్రార్థించాలని నేను కోరుతున్నాను.
1TI 2:9 అలాగే స్త్రీలు నిరాడంబరమైన, క్రమమైన వస్త్రధారణ చేసుకోవాలి, విస్తృతమైన కేశాలంకరణ లేదా బంగారం లేదా ముత్యాలు లేదా ఖరీదైన దుస్తులతో కాకుండ,
1TI 2:10 దేవుని పట్ల భక్తి ఉందని అని చెప్పుకునే దానికి తగినట్లుగా మంచి పనులతో అలంకరించుకోవాలని కోరుతున్నాను.
1TI 2:11 ఒక స్త్రీ పూర్ణ వినయంతో శాంత స్వభావంతో నేర్చుకోవాలి.
1TI 2:12 స్త్రీ బోధ చేయడానికి గాని, పురుషునిపై అధికారం చెలాయించడానికి గాని నేను అనుమతించను; ఆమె మౌనంగా ఉండాలి.
1TI 2:13 ఎందుకంటే ఆదాము మొదట సృష్టించబడ్డాడు, ఆ తర్వాత హవ్వ.
1TI 2:14 అంతేకాక, మోసపోయింది ఆదాము కాదు; స్త్రీయే మోసపోయింది పాపిగా అయ్యింది.
1TI 2:15 అయితే స్త్రీలు వివేకం కలిగి విశ్వాసంలో, ప్రేమ, పరిశుద్ధతలో కొనసాగుతూ జీవిస్తే, పిల్లలను కనుట ద్వారా వారు రక్షించబడతారు.
1TI 3:1 ఈ మాట నమ్మతగింది: ఎవరైనా ఒక సంఘపెద్దగా ఉండాలని ఆశిస్తే అది మంచి పనిని కోరడమే.
1TI 3:2 సంఘపెద్ద నిందలేనివానిగా, ఒకే భార్యకు నమ్మకమైన భర్తగా, కోరికలను అదుపులో ఉంచుకునేవానిగా, స్వీయ నియంత్రణ గలవానిగా, మర్యాదస్థునిగా, ఆతిథ్య ప్రియునిగా, సత్యాన్ని బోధించగల సామర్థ్యం గలవానిగా ఉండాలి.
1TI 3:3 అతడు త్రాగుబోతై ఉండకూడదు, చేయి చేసుకునేవాడు కాక, మృదు స్వభావం గలవానిగా ఉండాలి, కొట్లాడేవానిగా, డబ్బును ప్రేమించేవానిగా ఉండకూడదు.
1TI 3:4 అతడు పూర్తిగా గౌరవించదగిన రీతిలో తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకొంటూ తన పిల్లలు తనకు లోబడి ఉండేలా చూసుకోవాలి.
1TI 3:5 ఒకడు తన సొంత కుటుంబాన్నే సరిదిద్దుకోలేనప్పుడు, అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు?
1TI 3:6 అతడు నూతన విశ్వాసిగా ఉండకూడదు, ఎందుకంటే అతడు తన స్థానాన్ని బట్టి గర్వంతో ఉబ్బిపోతాడేమో, సాతాను పొందిన శిక్షకే అతడు కూడా గురి అవుతాడు.
1TI 3:7 అతడు సంఘస్థులు కాని వారి దగ్గర కూడా మంచి సాక్ష్యం కలవాడై ఉండాలి, అప్పుడు అతడు నిందల పాలు కాడు, సాతాను వలలో చిక్కులో పడడు.
1TI 3:8 అదే విధంగా, సంఘ పరిచారకులు కూడా గౌరవించదగినవారిగా, నిష్కపటంగా ఉండాలి, మద్యానికి బానిసగా ఉండకూడదు, అక్రమ సంపాదన ఆశించకూడదు.
1TI 3:9 వారు స్వచ్ఛమైన మనస్సాక్షితో విశ్వాసపు మర్మాలను గట్టిగా పట్టుకోవాలి.
1TI 3:10 వారు ఖచ్చితంగా మొదట పరీక్షించబడాలి; ఏ దోషం లేనివారిగా నిరూపించబడితేనే వారు సంఘపరిచారకులుగా సేవ చేయవచ్చు.
1TI 3:11 అదే విధంగా, సంఘపరిచారకుల భార్యలు కూడా గౌరవించదగినవారిగా ఉండాలి, ద్వేషంతో మాట్లాడేవారిగా కాకుండా కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా ప్రతి విషయంలో నమ్మకమైనవారిగా ఉండాలి.
1TI 3:12 సంఘ పరిచారకుడు తన భార్యకు నమ్మకంగా ఉంటూ, తన పిల్లలను, కుటుంబాన్ని సరిగా నడిపించేవాడై ఉండాలి.
1TI 3:13 తమ పనులను సక్రమంగా నెరవేర్చే పరిచారకులు ప్రజలమధ్య ఉత్తమ స్థాయిని పొందుకొని, క్రీస్తు యేసులో వారికున్న విశ్వాసంలో బహు ధైర్యంగా ఉంటారు.
1TI 3:14 త్వరలో నేను మీ దగ్గరకు రావాలనే నిరీక్షణతో ఈ విషయాలను వ్రాస్తున్నాను.
1TI 3:15 త్వరలో నీ దగ్గరకు రావాలని ఆశిస్తున్నాను, ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా కాని సత్యానికి పునాదిగా స్తంభంగా ఉన్న జీవంగల దేవుని సంఘమైన దేవుని గృహంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియజేయాలనే నేను ఈ సూచనలు వ్రాస్తున్నాను.
1TI 3:16 నిస్సందేహంగా నిజమైన దైవభక్తిని గురించిన మర్మం గొప్పది, అది ఏంటంటే: ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యారు, పవిత్రాత్మ ఆయనను నీతిమంతుడని నిరూపించాడు, దేవదూతలు ఆయనను చూశారు, ఆయన గురించి భూరాజ్యాలన్నిటిలో ప్రజలు ప్రకటించారు, ఆయన గురించి లోకమంతా నమ్మింది, ఆయనను దేవుడు మహిమలోనికి తీసుకెళ్లారు.
1TI 4:1 చివరి దినాల్లో కొందరు విశ్వాసాన్ని విడిచిపెట్టి మోసపరచే ఆత్మలను, దయ్యాలచే బోధించబడే వాటిని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా తెలియజేస్తున్నాడు.
1TI 4:2 కాలుతున్న ఇనుము చేత కాల్చబడిన మనస్సాక్షి కలిగిన వంచకులైన అబద్ధికుల నుండి అలాంటి బోధలు వస్తాయి.
1TI 4:3 వారు ప్రజలను పెళ్ళి చేసుకోవద్దని నిషేధిస్తారు, సత్యాన్ని తెలుసుకున్నవారు, నమ్మినవారు కృతజ్ఞతా పూర్వకంగా తినడానికి దేవుడు సృజించిన ఆహారపదార్థాలలో కొన్నిటిని తినకూడదని వారు ఆజ్ఞాపిస్తారు.
1TI 4:4 కాని, దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే, కాబట్టి మీరు కృతజ్ఞతలు చెల్లించి తీసుకుంటే దేన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు.
1TI 4:5 ఎందుకంటే దేవుని వాక్యం వలన కృతజ్ఞతా ప్రార్థనల వలన అది పవిత్రపరచబడింది.
1TI 4:6 ఈ విషయాలను సహోదరి సహోదరులకు తెలియజేసినట్లైతే, నీవు అనుసరించిన విశ్వాస సంబంధమైన సత్యాలు మంచి బోధలలో పోషించబడి క్రీస్తు యేసుకు మంచి సేవకునిగా ఉంటావు.
1TI 4:7 నిరాధారమైన కల్పితకథలకు, ముసలమ్మల ముచ్చట్లకు దూరంగా ఉండి, దైవభక్తిలో నీకు నీవే శిక్షణ ఇచ్చుకో.
1TI 4:8 శారీరక వ్యాయామం వలన కొంతవరకు లాభం కలుగుతుంది, అయితే ప్రస్తుత జీవితానికి రాబోవు జీవితానికి సంబంధించిన వాగ్దానంతో కూడిన దైవభక్తి అన్ని విషయాల్లో విలువైనది.
1TI 4:9 ఈ మాట నమ్మదగింది పూర్తిగా అంగీకరించదగింది.
1TI 4:10 అందుకే మనుష్యులందరికి, మరి ముఖ్యంగా విశ్వసించిన వారందరికి రక్షకుడైన సజీవ దేవునిలో మా నిరీక్షణ ఉంచి, మేము ప్రయాసపడుతూ గట్టిగా కృషి చేస్తున్నాము.
1TI 4:11 ఈ విషయాలను ఆజ్ఞాపించి బోధించు.
1TI 4:12 నీవు యవ్వనస్థుడవని ఎవరు నిన్ను చులకన చేయకుండా ఉండడానికి నీ మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా నడుచుకో.
1TI 4:13 నేను అక్కడికి వచ్చేవరకు నీవు సంఘంలో పరిశుద్ధ వాక్యాన్ని బిగ్గరగా చదువుతూ, హెచ్చరిస్తూ, బోధించడం మానకుండ జాగ్రత్తగా చూసుకో.
1TI 4:14 సంఘపెద్దలు తమ చేతులను నీపై ఉంచినప్పుడు ప్రవచనం ద్వారా నీకు అనుగ్రహించబడిన వరాన్ని నిర్లక్ష్యం చేయకు.
1TI 4:15 ఈ విషయాల్లో నీవు జాగ్రత్తగా ఉండు; నీ అభివృద్ధి అందరికి స్పష్టంగా కనబడేలా నీవు వాటిని పూర్తిగా ఆచరించు.
1TI 4:16 నీ జీవితాన్ని ఉపదేశాన్ని జాగ్రత్తగా చూసుకో. ఈ విధంగా చేస్తే, నిన్ను నీ బోధలు వినేవారిని కూడా నీవు రక్షించుకుంటావు.
1TI 5:1 వృద్ధుని కఠినంగా గద్దించకుండా, అతన్ని నీ తండ్రిగా భావించి ప్రోత్సహించు. నీ కన్నా చిన్నవారిని నీ సోదరులుగా,
1TI 5:2 సంపూర్ణమైన పవిత్రతతో నీ కన్నా పెద్దవారైన స్త్రీలను తల్లులుగా, నీ కన్నా చిన్నవారైన స్త్రీలను చెల్లెళ్ళుగా చూడు.
1TI 5:3 నిజంగా అవసరంలో ఉన్న విధవరాండ్రకు సరియైన గుర్తింపు ఇవ్వు.
1TI 5:4 కాని ఏ విధవరాలికైన పిల్లలు గాని మనుమలు గాని ఉంటే, ఆ పిల్లలు ముందుగా తమ కుటుంబంపట్ల శ్రద్ధ వహించడం, తమ తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా తాము పాటించే ధర్మాన్ని ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి, ఇది దేవుని సంతోషపరుస్తుంది.
1TI 5:5 నిజంగా ఒంటరియైన, అవసరంలో ఉన్న విధవరాలు దేవునిపై ఆధారపడి రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ సహాయం కోసం దేవున్ని అడుగుతూ ఉంటుంది.
1TI 5:6 తన సొంతసుఖాల కోసం జీవించే విధవరాలు జీవించి ఉన్నా మరణించినట్లే.
1TI 5:7 ఎవరు కూడా నిందించబడకుండా ఉండడానికి ప్రజలకు ఈ సూచనలన్నింటిని చెప్పు.
1TI 5:8 ఎవరైనా తమ బంధువులకు, మరి ముఖ్యంగా తన సొంత కుటుంబీకుల అవసరాలను తీర్చలేకపోతే అలాంటివారు విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లే, వారు అవిశ్వాసుల కంటే చెడ్డవారు.
1TI 5:9 ఏ విధవరాలినైనా విధవరాండ్రల జాబితాలో చేర్చాలంటే, ఆమె అరవై సంవత్సరాలుకు పైబడి, తన భర్తకు నమ్మకంగా ఉండి,
1TI 5:10 తన మంచిపనుల బట్టి సంఘంలో గుర్తింపు కలిగి ఉండాలి, అనగా పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పరిశుద్ధుల పాదాలు కడగడం, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం అన్ని రకాల మంచి పనులు చేయడంలో ముందు ఉండాలి.
1TI 5:11 అయితే యవ్వన విధవరాండ్రను ఆ జాబితాలో చేర్చకూడదు. ఎందుకంటే, వారు మేము క్రీస్తు కొరకే జీవిస్తామని నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత, తమ శారీరక వాంఛలకు లొంగిపోయి పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.
1TI 5:12 ఈ విధంగా వారు దేవునితో చేసుకున్న తమ మొదటి ఒప్పందాన్ని నిలుపుకోలేక తమపైకి తామే తీర్పును తెచ్చుకుంటారు.
1TI 5:13 అంతేకాక వారు సోమరులుగా ఇంటింటికి తిరుగుతూ అనవసరమైన ముచ్చట్లతో, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, ఇతరుల పనులలో జోక్యం చేసుకోవడం అలవాటు చేసుకుంటారు.
1TI 5:14 కాబట్టి యవ్వన విధవరాండ్రకు నేను చెప్పేది ఏంటంటే, వారు పెళ్ళి చేసుకుని పిల్లలను కని, తమ గృహాలను శ్రద్ధగా చూసుకొంటూ, తమను నిందించడానికి విరోధికి అవకాశమివ్వకుండా చూసుకోవాలి.
1TI 5:15 అయితే ఇప్పటికే కొందరు దారితప్పి సాతానును అనుసరిస్తున్నారు.
1TI 5:16 విశ్వాసురాలైన ఏ స్త్రీయైనా తన కుటుంబంలో ఉన్న విధవరాలి భారాన్ని సంఘంపై పెట్టకుండా, తానే అలాంటి వారికి సహాయపడుతూ ఉండాలి. అప్పుడు నిజంగా అవసరంలో ఉన్న విధవరాండ్రకు సంఘం సహాయం చేయ కలుగుతుంది.
1TI 5:17 సంఘాన్ని నడిపించే సంఘపెద్దలు, మరి ముఖ్యంగా వాక్యాన్ని ప్రకటించేవారు వాక్యాన్ని బోధించేవారు రెండింతల గౌరవానికి పాత్రులు.
1TI 5:18 దీని గురించి లేఖనాల్లో, “ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు, పనివాడు జీతానికి పాత్రుడు” అని వ్రాయబడి ఉన్నది.
1TI 5:19 సంఘపెద్దపై వచ్చిన నిందను ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు లేకుండా అంగీకరించకూడదు.
1TI 5:20 అయితే సంఘపెద్దలు ఎవరైనా పాపం చేస్తే, ఇతరులకు హెచ్చరికగా ఉండడానికి వారిని అందరి ముందు గద్దించు.
1TI 5:21 ఎటువంటి పక్షపాతాన్ని చూపించకుండ, ఎవరి పట్ల భేదం చూపకుండ నీవు ఈ సూచనలు పాటించాలని, దేవుని ఎదుట క్రీస్తు యేసు సన్నిధిలో ఎన్నుకోబడిన దేవదూతల ఎదుట నేను నిన్ను హెచ్చరిస్తున్నాను.
1TI 5:22 ఎవరిపైనా చేతులను ఉంచడానికి తొందరపడకు, ఇతరుల పాపంలో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రంగా ఉంచుకో.
1TI 5:23 నీకున్న కడుపునొప్పి, నీకు తరచుగా వచ్చే బలహీనతల కారణంగా కేవలం నీటిని మాత్రమే త్రాగకుండా కొంచెం ద్రాక్షారసాన్ని కూడా త్రాగు.
1TI 5:24 కొందరి పాపాలు ప్రజల ఎదుట స్పష్టంగా కనబడి, తీర్పు తీర్చబడే చోటికి వారి కన్నా ముందుగా చేరుకుంటున్నాయి; మరి కొందరి పాపాలు వారి వెనుక అనుసరిస్తున్నాయి.
1TI 5:25 అదే విధంగా, ఇప్పుడు కొందరు చేసిన మంచి పనులు స్పష్టంగా కనబడుతున్నాయి, అయితే ఇంకొందరు చేసిన మంచి పనులు ఇప్పుడు కనబడకపోయినా, అవి చాలా కాలం దాచబడి ఉండవు.
1TI 6:1 దేవుని నామాన్ని మేము చేసిన బోధలను ప్రజలు దూషించకుండ ఉండడానికి, దాసులుగా బానిసత్వపు కాడి క్రింద ఉన్న విశ్వాసులైన వారందరు తమ యజమానులను గౌరవించదగినవారిగా భావించాలి.
1TI 6:2 విశ్వాసులైన యజమానులను కలిగినవారు వారు తమ తోటి విశ్వాసులే కదా అని అగౌరవంగా ప్రవర్తించకూడదు. పైగా తోటి విశ్వాసులైన తమ యజమానులు తమకెంతో ప్రియమైనవారని, వారు తమ దాసుల క్షేమం కోసం నియమించబడినవారని, వారికి మరింత బాగా సేవలు చేయాలి. నీవు ఈ సంగతులు బోధించి విశ్వాసులను ప్రోత్సాహించాలి.
1TI 6:3 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మంచి ఉపదేశాలకు మన దైవభక్తిని పెంచే బోధకు వ్యతిరేకమైన బోధను ఎవరైనా బోధిస్తే,
1TI 6:4 అలాంటివారు వివేకం లేనివారు అహంకారులు. అలాంటివారు, మాటల వలన కలిగే వివాదాలలో గొడవలలో అనవసరమైన ఆసక్తి కలిగి ఉంటారు. దాని ఫలితంగా అసూయలు, కలహాలు, ద్వేషపూరితమైన మాటలు, దుష్ట సందేహాలు కలుగుతాయి,
1TI 6:5 దుష్ట ఆలోచనలు కలిగిన ప్రజల మధ్యలో తరచూ ఘర్షణలు జరుగుతాయి, అలాంటివారు సత్యం నుండి తొలగిపోయి, దైవభక్తి అనేది ఆదాయం తెచ్చే ఒక మార్గమని భావిస్తారు.
1TI 6:6 అయితే సంతృప్తితో దైవభక్తి కలిగి ఉండడమే గొప్ప లాభదాయకము.
1TI 6:7 మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, లోకం నుండి ఏమి తీసుకెళ్లలేము.
1TI 6:8 కాబట్టి మనం ఆహారాన్ని వస్త్రాలను కలిగి ఉంటే, వాటితో తృప్తిచెందాలి.
1TI 6:9 అయితే ధనవంతులుగా అవ్వాలని కోరుకునేవారు శోధనలో పడి, మానవులను పాడుచేసి నాశనం చేసే మూర్ఖమైన ప్రమాదకరమైన కోరికల వలలో చిక్కుకుంటారు.
1TI 6:10 డబ్బుపై ఉండే ప్రేమ ప్రతి దుష్టత్వానికి వేరు. కొందరు డబ్బును ఎక్కువగా ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, తమను తామే అనేక దుఃఖాలకు గురిచేసుకున్నారు.
1TI 6:11 అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు.
1TI 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. అనేకమంది సాక్షిసమూహం ఎదుట నీవు చేసిన మంచి ఒప్పుకోలును బట్టి నీవు పిలువబడిన నిత్యజీవాన్ని చేపట్టు.
1TI 6:13 అన్నిటికి జీవాన్ని ఇచ్చే దేవుని ఎదుట, పొంతి పిలాతు ఎదుట మంచి సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ముందు నేను నీకు నిర్ధేశించాను.
1TI 6:14 నీవు మన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి ప్రత్యక్షమయ్యే వరకు నిందగాని డాగుగాని లేకుండా ఈ ఆజ్ఞలకు లోబడు.
1TI 6:15 రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఏకైక అధిపతిగా ఉన్న భాగ్యవంతుడైన దేవున్ని తగిన సమయంలో దేవుడు ప్రత్యక్షపరుస్తారు.
1TI 6:16 ఆయన ఒక్కడే మరణం లేనివాడు, ఆయన సమీపించలేనంత వెలుగులో నివసిస్తాడు, ఆయనను ఎవరూ ఎన్నడు చూడలేదు, ఎన్నడు చూడలేరు. అలాంటి దేవునికే ఘనత ప్రభావాలు నిరంతరం కలుగును గాక ఆమేన్.
1TI 6:17 ఈ లోకంలో ధనవంతులైన వారిని గర్వంతో ఉండవద్దని, స్థిరంగా ఉండని సంపదలపై తమ నమ్మకాన్ని ఉంచక, వారి సంతోషం కోసం కావలసిన వాటన్నిటిని సమృద్ధిగా ఇచ్చే దేవునిలోనే నిరీక్షణ ఉంచమని ఆజ్ఞాపించు.
1TI 6:18 వారు మంచిని చేస్తూ, మంచి పనులు చేయడంలో ధనవంతులుగా ఇతరులకు ఇవ్వడంలో ధారాళంగా ఉండమని ఆజ్ఞాపించు.
1TI 6:19 ఈ విధంగా రాబోవు కాలానికి దృఢమైన పునాది కాగల ధనాన్ని వారు తమ కోసం కూర్చుకుంటారు, అప్పుడు వారు నిజమైన జీవాన్ని సంపాదించుకోగలరు.
1TI 6:20 తిమోతీ, నీకు అప్పగించబడిన బోధను జాగ్రత్తగా పాటించు. దుష్టమైన వట్టి మాటలకు, జ్ఞానమని తప్పుగా పిలువబడే విరుద్ధమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి.
1TI 6:21 కొందరు అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ విశ్వాసం నుండి తొలగిపోయారు. కృప నీకు తోడై ఉండును గాక!
2TI 1:1 క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానాన్ని అనుసరించి దేవుని చిత్తప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు,
2TI 1:2 నా ప్రియ కుమారుడైన తిమోతికి వ్రాయునది:
2TI 1:3 నా పితరులు సేవించినట్లే, స్వచ్ఛమైన మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, రాత్రింబవళ్ళు మానక నిన్ను నా ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుంటున్నాను.
2TI 1:4 నీ కన్నీరు జ్ఞాపకం చేసుకుని, నేను ఆనందంతో నింపబడేలా నిన్ను చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాను.
2TI 1:5 నీలో ఉన్న యథార్థమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను, అది మొదట నీ అమ్మమ్మ లోయిలోను తర్వాత నీ తల్లియైన యునీకేలో ఉండింది. ఆ విశ్వాసమే ఇప్పుడు నీలో కూడా ఉందని నేను నమ్ముతున్నాను.
2TI 1:6 ఈ కారణంగానే, నేను నీపై చేతులు ఉంచడం వలన నీవు పొందిన దేవుని కృపా వరాన్ని మరింత రగిలించి వృద్ధి చేయమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను.
2TI 1:7 దేవుడు మనకు పిరికితనాన్ని కలిగించే ఆత్మను ఇవ్వలేదు కాని శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించారు.
2TI 1:8 కాబట్టి నీవు మన ప్రభువు కోసం సాక్ష్యమివ్వడానికి గాని ఆయన కోసం బందీనై ఉన్న నా గురించి కాని సిగ్గుపడకు. దానికి బదులు దేవుని శక్తినిబట్టి సువార్త కోసం నాతో పాటు కలిసి శ్రమలను అనుభవించడానికి సిద్ధపడు.
2TI 1:9 దేవుడు మనల్ని రక్షించి, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి పిలిచిన పిలుపు, మనం చేసిన మంచి పనులను బట్టి కాదు గాని, ఆయన ప్రణాళిక కృపను బట్టియే. ఆ కృప సృష్టి ఆరంభానికి ముందే క్రీస్తు యేసు మూలంగా మనకు ఇవ్వబడింది,
2TI 1:10 అయితే మరణాన్ని నాశనం చేసి, జీవాన్ని, నిత్యత్వాన్ని సువార్త ద్వారా వెలుగులోనికి తీసుకువచ్చిన మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రత్యక్షత వలన అది నేడు మనకు వెల్లడి చేయబడింది.
2TI 1:11 ఈ సువార్తను ప్రకటించడానికి, బోధించడానికి అపొస్తలునిగా నేను నియమించబడ్డాను.
2TI 1:12 ఈ సువార్త వల్లనే, నేను ఈ విధంగా కష్టాలను అనుభవిస్తున్నాను, అయినా దానిని గురించి సిగ్గుపడను, ఎందుకంటే నేను నమ్మినవాని గురించి నాకు తెలుసు; నాకు అప్పగించిన దానిని చివరి రోజు వరకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముతున్నాను.
2TI 1:13 క్రీస్తు యేసులో ప్రేమ, విశ్వాసం కలిగి, నీవు నా నుండి విన్న మంచిబోధను ఆదర్శంగా పాటించు.
2TI 1:14 నీకు అప్పగించబడిన ఈ మంచి విషయాలను మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయంతో కాపాడు.
2TI 1:15 ఆసియా ప్రాంతంలోని విశ్వాసులందరు నన్ను విడిచి వెళ్లిపోయారని నీకు తెలుసు, వారిలో ఫుగెల్లు, హెర్మొగెనే అనేవారు కూడా ఉన్నారు.
2TI 1:16 ప్రభువు కోసం నాకు పడ్డ సంకెళ్ళను గురించి సిగ్గుపడకుండా, అనేకసార్లు నన్ను ఆదరించిన ఒనేసిఫోరు ఇంటివారిపై ప్రభువు కనికరం చూపించును గాక.
2TI 1:17 అతడు రోమాకు వచ్చినప్పుడు నేను కనబడే వరకు నా కోసం వెదికాడు.
2TI 1:18 అతడు ఎఫెసులో నాకు ఎన్ని విధాలుగా సహాయపడ్డాడో నీకు చాలా బాగా తెలుసు. ప్రభువు దినమందు దేవుని దృష్టిలో అతడు కనికరం పొందునట్లు ప్రభువు అతనికి అనుగ్రహించును గాక!
2TI 2:1 నా కుమారుడా, క్రీస్తు యేసులోని కృప చేత బలపడుతూ ఉండు.
2TI 2:2 అనేకమంది సాక్షుల సమక్షంలో నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగల నమ్మకమైన వారికి అప్పగించు.
2TI 2:3 యేసు క్రీస్తు కోసం ఒక మంచి సైనికుని వలె నాతో పాటు కష్టాలను భరించు.
2TI 2:4 యుద్ధానికి వెళ్లే ఏ సైనికుడైన తన సాధారణ జీవన వ్యాపార విషయాల్లో ఇరుక్కుపోడు కాని, తనపై అధికారిని సంతోషపరచడానికి ప్రయత్నిస్తాడు.
2TI 2:5 అదే విధంగా ఒక క్రీడాకారుడు క్రీడానియమాల ప్రకారం పందెంలో పాల్గొంటేనే తప్ప విజయ కిరీటాన్ని పొందుకోలేడు.
2TI 2:6 అలాగే పంటలోని భాగం మొదటిగా పొందాల్సింది కష్టపడి పని చేసే రైతే.
2TI 2:7 నేను చెప్పిన విషయాల గురించి ఆలోచించు, మన ప్రభువు నీకు అన్ని విషయాలను తెలుసుకోగల పరిజ్ఞానాన్ని దయచేస్తారు.
2TI 2:8 మహారాజైన దావీదు సంతానంగా పుట్టిన యేసు క్రీస్తు మృతులలో నుండి సజీవంగా లేచారని గుర్తుంచుకో. ఇదే నేను ప్రకటించిన సువార్త.
2TI 2:9 దీనిని బట్టే నేను నేరస్థునిలా బంధించబడ్డాను. కాని దేవుని వాక్యం బంధించబడలేదు.
2TI 2:10 కాబట్టి, దేవునిచే ఎన్నుకోబడినవారు కూడా నిత్యమహిమతో యేసు క్రీస్తులో ఉన్న రక్షణను పొందాలని నేను ఈ శ్రమలన్నింటిని సహిస్తున్నాను.
2TI 2:11 ఈ మాట నమ్మదగింది: మనం ఆయనతో పాటు చనిపోతే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తాము;
2TI 2:12 మనం భరిస్తే, ఆయనతో పాటు మనం కూడా ఏలుతాము. మనం ఆయనను తిరస్కరిస్తే, ఆయన కూడా మనల్ని తిరస్కరిస్తారు;
2TI 2:13 మనం నమ్మకంగా లేకపోయినా, ఆయన నమ్మకంగానే ఉంటారు, ఎందుకంటే ఆయన తనను తాను తిరస్కరించుకోలేరు.
2TI 2:14 దేవుని ప్రజలకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉండు. వినేవారిని నాశనం చేయడమే తప్ప ఏ విలువ లేని మాటల గురించి వాదించవద్దని దేవుని ఎదుట వారిని హెచ్చరించు.
2TI 2:15 ఆమోదించబడినవానిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్య వాక్యాన్ని సరిగా బోధించేవానిగా నిన్ను నీవు దేవునికి నిరూపించుకోవడానికి ప్రయాసపడు.
2TI 2:16 దుష్టమైన కబుర్లకు దూరంగా ఉండు, ఎందుకంటే వాటిలో మునిగిపోయేవారు మరింత భక్తిహీనంగా మారతారు.
2TI 2:17 వారి బోధలు కుళ్ళింపచేసే వ్యాధిలాంటివి. అలాంటివారిలో హుమెనేయు, ఫిలేతు అనేవారు ఉన్నారు.
2TI 2:18 వారు సత్యానికి దూరమయ్యారు. పునరుత్థానం ముందే జరిగిపోయిందని చెప్తూ, కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు.
2TI 2:19 అయితే దేవుని యొక్క పునాది స్థిరంగా నిలిచి ఉండి, దానిపై ఈ విధంగా ముద్ర వేయబడి ఉంది: “తన వారు ఎవరో ప్రభువుకు తెలుసు, ప్రభువు నామాన్ని ఒప్పుకునే ప్రతివారు దుష్టత్వం నుండి తొలగిపోవాలి.”
2TI 2:20 ఒక పెద్ద ఇంట్లో బంగారు, వెండి పాత్రలే కాకుండా కర్రవి మట్టివి కూడా ఉంటాయి; వాటిలో కొన్ని ప్రత్యేకమైన వాటికి ఉపయోగపడితే, మరికొన్ని సాధారణమైన పనులకు వాడబడతాయి.
2TI 2:21 అదే విధంగా, తమను తాము శుద్ధి చేసుకునేవారు ప్రత్యేకమైన పాత్రలుగా పరిశుద్ధపరచబడి, యజమానికి ఉపయోగకరంగా ఉండి, మంచి పని కోసం సిద్ధపరచబడిన పాత్రలుగా వాడబడతారు.
2TI 2:22 యవ్వనకాల ఆశల నుండి పారిపో, కపటం లేని హృదయంతో ప్రభువును వేడుకొనువారితో పాటు నీతి, విశ్వాసం, ప్రేమ, శాంతిని అనుసరించు.
2TI 2:23 మూర్ఖపు అవివేకమైన వాదనలను విసర్జించు, ఎందుకంటే అవి గొడవలను పుట్టిస్తాయని నీకు తెలుసు.
2TI 2:24 ప్రభువు సేవకుడు కొట్లాడేవానిగా ఉండకుండా అందరితో దయగలవానిగా ఉండాలి, బోధించగల సామర్థ్యం కలిగి ఉండాలి, కోపిష్ఠిగా ఉండకూడదు.
2TI 2:25 దేవుడిచ్చిన తరుణంలో మారుమనస్సును పొంది సత్యాన్ని గ్రహిస్తారనే ఆశ కలిగి, తనను ఎదిరించేవారిని దీనత్వంతో సరిదిద్దాలి.
2TI 2:26 అప్పుడు వారు తమ తప్పును తెలుసుకుని, తన ఇష్టాన్ని చేయడానికి వారిని చెరలోనికి తీసుకెళ్లిన సాతాను ఉచ్చులో నుండి తప్పించుకోగలరు.
2TI 3:1 అంత్యదినాలలో భయంకరమైన కాలాలు వస్తాయని నీవు తెలుసుకో.
2TI 3:2 ఎందుకంటే, ప్రజలు స్వార్థపరులుగా, ధనాన్ని ప్రేమించేవారిగా, గొప్పలు చెప్పుకునేవారిగా, అహంకారులుగా, దూషించేవారిగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, కృతజ్ఞతలేనివారిగా, అపవిత్రులుగా,
2TI 3:3 ప్రేమలేనివారిగా, క్షమించలేనివారిగా, అపనిందలు వేసేవారిగా, స్వీయ నియంత్రణ లేనివారిగా, క్రూరులుగా, మంచితనాన్ని ప్రేమించలేనివారిగా,
2TI 3:4 ద్రోహులుగా, మొండివారిగా, అహంకారులుగా, దేవునికి బదులు సుఖానుభవాన్ని ప్రేమించేవారిగా,
2TI 3:5 దైవభక్తి కలిగి ఉన్నా దాని శక్తిని నమ్మనివారిగా ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండు.
2TI 3:6 అలాంటివారు, పాపంతో నిండిన అన్ని రకాల దురాశలకు బానిసలైన మోసపూరిత స్త్రీల ఇళ్ళలో చొరబడి వారిని లోబరుచుకుంటారు.
2TI 3:7 ఈ స్త్రీలు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు కాని సత్యాన్ని ఎన్నడు గ్రహించలేరు.
2TI 3:8 యన్నే, యంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్లే ఈ బోధకులు కూడా సత్యాన్ని ఎదిరిస్తున్నారు. వారికున్న దుష్టహృదయాన్ని బట్టి విశ్వాస విషయంలో తృణీకరించబడ్డారు.
2TI 3:9 అయినా వారు ముందుకు సాగలేరు ఎందుకంటే, ఆ ఇద్దరికి జరిగినట్లే, వీరి మూర్ఖత్వం అందరికి స్పష్టమవుతుంది.
2TI 3:10 అయితే, నా బోధల గురించి, నా జీవిత విధానం, నా ఉద్దేశాలు, విశ్వాసం, ఓర్పు, ప్రేమ, దీర్ఘశాంతం,
2TI 3:11 హింసలు, శ్రమలు అంటే, అంతియొకయలో, ఈకొనియలో, లుస్త్ర ప్రాంతాల్లో నాకు కలిగిన హింసను నేను ఎలా సహించానో అన్ని నీకు తెలుసు. అయితే ప్రభువు వాటన్నిటి నుండి నన్ను తప్పించారు.
2TI 3:12 నిజానికి, క్రీస్తు యేసులో భక్తిగల జీవితాన్ని జీవించాలనుకొనే వారందరు హింసకు గురి అవుతారు.
2TI 3:13 అయితే దుష్టులు, వంచకులు ఇతరులను మోసం చేస్తూ తామే మోసపోతూ మరింతగా చెడిపోతారు.
2TI 3:14 కాని నీవైతే, నీవు నేర్చుకున్న వాటిని, నీవు నమ్మి విశ్వసించిన వాటిలో స్థిరంగా కొనసాగు ఎందుకంటే, నీవు ఎవరినుండి వాటిని నేర్చుకున్నావో నీకు తెలుసు.
2TI 3:15 క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా కలుగు రక్షణ గురించిన జ్ఞానాన్ని నీకు కలుగజేయడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండే నీకు తెలుసు.
2TI 3:16 ప్రతి లేఖనం దేవుని ప్రేరణ చేతనే కలిగింది, అది బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, నీతిలో నడిపించడానికి ఉపయోగపడుతుంది.
2TI 3:17 ఈ లేఖనాలను బట్టి, దేవుని సేవకుడు ప్రతి సత్కార్యం చేయడానికి పూర్తిగా సిద్ధపడి ఉండాలి.
2TI 4:1 నేను దేవుని ఎదుట, తాను వచ్చినప్పుడు తన రాజ్యంలో సజీవులకు మృతులకు తీర్పు తీర్చబోయే యేసు క్రీస్తు ఎదుట నీకు ఈ బాధ్యతను ఇస్తున్నాను:
2TI 4:2 ఆతురత కలిగి అనుకూల సమయంలోను అనుకూలంగా లేని సమయంలోను సిద్ధంగా ఉండాలి; ఎంతో సహనంతో, సరియైన సూచనలతో ప్రజలను సరిదిద్దుతూ, గద్దిస్తూ, ప్రోత్సహిస్తూ వాక్యాన్ని ప్రకటించు.
2TI 4:3 ఎందుకంటే, ప్రజలు మంచిబోధను అంగీకరించని ఒక సమయం వస్తుంది. అప్పుడు వారు తమ సొంత ఆశలకు అనుగుణంగా తమ దురద చెవులు వినడానికి ఇష్టపడే వాటినే బోధించే అనేకమంది బోధకులను తమ చుట్టూ చేర్చుకుంటారు.
2TI 4:4 వారు సత్యం నుండి తొలగిపోయి కట్టుకథలు వినడానికి తమ చెవులను అప్పగిస్తారు.
2TI 4:5 కాని నీవైతే అన్ని పరిస్థితుల్లో నిబ్బరం కలిగి కష్టాలను సహిస్తూ సువార్తికుని పని చేస్తూ, నీ పరిచర్య పనులను పూర్తిగా నెరవేర్చు.
2TI 4:6 ఇప్పటికే నేను దేవుని ఎదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్లవలసిన సమయం దగ్గరలోనే ఉంది.
2TI 4:7 నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పందాన్ని ముగించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.
2TI 4:8 కాబట్టి నీతిమంతుడు న్యాయాధిపతియైన ప్రభువు ఆ రోజున నాకు బహుమతిగా ఇవ్వబోయే నీతి కిరీటం నా కోసం దాచబడి ఉంది. ఈ బహుమానం నాకు మాత్రమే కాదు ఆయన ప్రత్యక్షత కోసం ప్రేమతో ఎదురు చూస్తున్న వారందరికి అనుగ్రహిస్తారు.
2TI 4:9 త్వరగా నా దగ్గరకు రావడానికి ప్రయత్నించు.
2TI 4:10 దేమా ఈ లోకాన్ని ప్రేమించి, నన్ను వదిలి థెస్సలొనీక వెళ్లాడు. క్రేస్కే గలతీయకు, తీతు దల్మతీయకు వెళ్లారు.
2TI 4:11 లూకా మాత్రమే నాతో ఉన్నాడు. నా పరిచర్యలో మార్కు నాకు సహాయంగా ఉంటాడు, కాబట్టి అతన్ని నీతో పాటు తీసుకురా.
2TI 4:12 నేను తుకికును ఎఫెసు పట్టణానికి పంపించాను.
2TI 4:13 నీవు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు దగ్గర ఉంచిన నా అంగీని, నా పుస్తకాలను మరి ముఖ్యంగా చర్మపు ప్రతులను వెంట తీసుకురా.
2TI 4:14 కంసాలి పని చేసే అలెగ్జాండరు నాకు ఎంతో హాని చేశాడు. అతడు చేసిన పనులకు ప్రభువు వానికి తగిన ప్రతిఫలమిస్తారు.
2TI 4:15 అతడు మన బోధను ఎంతగానో వ్యతిరేకించాడు కాబట్టి నీవు కూడా అతని విషయంలో జాగ్రత్తగా ఉండు.
2TI 4:16 నేను మొదటిసారి న్యాయసభలో నాపై వేయబడిన ఆరోపణలకు జవాబు ఇస్తున్నప్పుడు ఎవరూ నా పక్షాన నిలబడలేదు, అందరు నన్ను వదిలి వెళ్లిపోయారు. అది వారికి వ్యతిరేకంగా ఉండకూడదు
2TI 4:17 కాని నా ప్రభువు నాకు తోడుగా నిలిచి నన్ను బలపరిచారు ఎందుకంటే, నా ద్వారా సువార్త పూర్తిగా ప్రకటించబడి యూదేతరులంతా దానిని వినడానికి దేవుడు నన్ను సింహం నోటి నుండి విడిపించారు.
2TI 4:18 నాకు కలిగే ప్రతి కీడు నుండి ప్రభువు నన్ను కాపాడి తన పరలోక రాజ్యంలోనికి క్షేమంగా చేర్చుకుంటారు. ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.
2TI 4:19 అకుల ప్రిస్కిల్లకు, ఒనేసిఫోరు ఇంటి వారందరికి నా వందనాలు.
2TI 4:20 ఎరస్తు కొరింథులోనే ఉండిపోయాడు, త్రోఫిముకు అనారోగ్యంగా ఉన్నందుకు నేను అతన్ని మిలేతులో వదిలి వచ్చాను.
2TI 4:21 శీతాకాలం రాకముందే నీవు ఇక్కడకు రావడానికి ప్రయత్నించు. యుబూలు నీకు వందనాలు తెలియజేయమన్నాడు, అలాగే పూదే, లీను, క్లౌదియ, ఇక్కడి విశ్వాసులైన సహోదరి సహోదరులందరు తమ వందనాలు నీకు తెలియజేస్తున్నారు.
2TI 4:22 ప్రభువు నీ ఆత్మతో ఉండును గాక. దేవుని కృప నీకు తోడై ఉండును గాక ఆమేన్.
TIT 1:1 దేవుని దాసుడును యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడనైన పౌలు అనే నేను దేవుడు ఏర్పరచుకున్నవారికి విశ్వాసాన్ని ప్రకటించడానికి, దైవిక జీవితాలను ఎలా జీవించాలో వారికి చూపించే సత్యాన్ని తెలుసుకోవడం నేర్పడానికి,
TIT 1:2 ఈ సత్యం వారికి అబద్ధమాడని దేవుడు యుగయుగాలకు ముందే వాగ్దానం చేసిన నిత్యజీవాన్ని గురించిన నిరీక్షణతో,
TIT 1:3 ఆ నిత్యజీవం గురించి అబద్ధమాడని దేవుడు సృష్టి ఆరంభానికి ముందే వాగ్దానం చేశాడు.
TIT 1:4 విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు, తీతుకు:
TIT 1:5 నేను నిన్ను క్రేతులో విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఇంకా పూర్తి చేయవలసిన వాటిని క్రమపరచి, ప్రతి పట్టణంలో సంఘ పెద్దలను నియమించు.
TIT 1:6 ఒక సంఘపెద్ద నిందారహితునిగా, తన భార్యకు నమ్మకమైనవానిగా ఉండాలి, అతని పిల్లలు విశ్వాసం కలవారిగా ఉండి, దుష్టమైన పనులు చేశారని అవిధేయులు అనే నిందలేనివారిగా ఉండాలి.
TIT 1:7 సంఘపెద్ద దేవుని కుటుంబాన్ని నడిపిస్తాడు కాబట్టి, అతడు నిందారహితునిగా ఉండాలి, అయితే అహంకారిగా, త్వరగా కోప్పడేవానిగా, త్రాగుబోతుగా, దౌర్జన్యం చేసేవానిగా, అక్రమ సంపాదన ఆశించేవానిగా ఉండకూడదు.
TIT 1:8 దానికి బదులు, అతడు ఆతిథ్యాన్ని ఇచ్చేవానిగా, మంచిని ప్రేమించేవానిగా, స్వీయ నియంత్రణ కలవానిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, క్రమశిక్షణ కలవాడై ఉండాలి.
TIT 1:9 బోధించబడిన రీతిలో ఈ నమ్మకమైన వాక్యాన్ని అతడు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు అతడు తాను నేర్చుకున్న సత్య బోధతో ఇతరులను ప్రోత్సాహించి దానిని వ్యతిరేకించే వారిని ఖండించగలడు.
TIT 1:10 ఎందుకంటే మీలో అనేకమంది, ముఖ్యంగా సున్నతి పొందినవారిలో కొందరు, తిరుగుబాటు స్వభావం కలిగి, అర్థంలేని మాటలు మాట్లాడేవారిగా, మోసగించేవారిగా ఉన్నారు.
TIT 1:11 వారి నోళ్ళు ఖచ్చితంగా మూయించాలి, ఎందుకంటే వారు తమ అవినీతి సంపాదన కోసం బోధించకూడని తప్పుడు బోధలు చేస్తూ, కుటుంబాలన్నిటిని చెడగొడుతున్నారు.
TIT 1:12 క్రేతు ప్రవక్తల్లో ఒకడు తన సొంత ప్రజల గురించి చెప్తూ, “క్రేతు దేశస్థులు ఎప్పుడు అబద్ధికులుగా, క్రూరులుగా, సోమరులుగా, తిండిబోతులుగా ఉన్నారు” అన్నాడు.
TIT 1:13 వారి గురించి అతడు చెప్పింది సత్యమే. కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండేలా,
TIT 1:14 యూదుల కట్టుకథలను లేదా సత్యాన్ని తిరస్కరించిన మనుష్యుల ఆజ్ఞలను లక్ష్యపెట్టకుండా నీవు వారిని తీవ్రంగా గద్దించు.
TIT 1:15 ఎందుకంటే, పవిత్రులకు అన్ని పవిత్రంగానే ఉంటాయి కాని, నమ్మనివారికి, చెడిపోయినవారికి ఏది పవిత్రంగా ఉండదు. నిజానికి అలాంటివారి మనస్సులు, మనస్సాక్షి కూడా చెడిపోయాయి.
TIT 1:16 వారు దేవుని నమ్ముతున్నామని చెప్తున్నప్పటికి, తమ పనుల ద్వారా ఆయనను తిరస్కరిస్తారు. వారు హేయమైనవారు, అవిధేయులు, ఏ మంచిని చేయడానికైనా అనర్హులు.
TIT 2:1 నీవైతే స్వచ్ఛమైన బోధను అనుసరించి బోధించాలి.
TIT 2:2 వృద్ధులైన పురుషులకు, వారు తమ కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా, గౌరవించదగినవారిగా, స్వీయ నియంత్రణ కలిగినవారిగా విశ్వాసంలో, ప్రేమలో, ఓర్పులో స్థిరంగా ఉండమని బోధించు.
TIT 2:3 అదే విధంగా, వృద్ధ స్త్రీలకు, భక్తి జీవితాన్ని కలిగి ఉండి, అపవాదులు వేసేవారిగా లేదా మద్యానికి బానిసలుగా ఉండకుండా, ఏది మంచిదో దానిని బోధించేవారిగా ఉండమని బోధించు.
TIT 2:4 అప్పుడు వారు యవ్వన స్త్రీలకు తమ భర్తలను బిడ్డలను ప్రేమించుమని,
TIT 2:5 స్వీయ నియంత్రణ కలిగి పవిత్రులుగా ఉండమని, తమ గృహాలలో పనులను చేసుకుంటూ దయ కలిగి ఉండమని, తన భర్తలకు విధేయత కలిగి ఉండమని బోధించగలరు, అప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరూ దూషించలేరు.
TIT 2:6 అదే విధంగా, స్వీయ నియంత్రణ కలిగి ఉండమని యవ్వన పురుషులను ప్రోత్సహించు.
TIT 2:7 నీవు ప్రతి విషయంలో వారికి మాదిరిగా జీవిస్తూ, ఏది మంచిదో అదే చేస్తూ, నీ బోధలలో నిజాయితీని, గంభీరతను చూపిస్తూ,
TIT 2:8 మంచి మాటలనే ఉపయోగించు, అప్పుడు నిన్ను వ్యతిరేకించేవారికి నీ గురించి చెడుగా చెప్పడానికి ఏమి ఉండదు, కాబట్టి వారు సిగ్గుపడతారు.
TIT 2:9 దాసులుగా ఉన్నవారు తమ యజమానులకు ప్రతి విషయంలో లోబడి ఉండాలని, అన్ని విధాలుగా వారిని సంతోషపరచడానికి ప్రయత్నించాలని, వారికి ఎదురు చెప్పకూడదని,
TIT 2:10 యజమానుల నుండి ఏదీ దొంగతనం చేయకుండా, తాము నమ్మదగిన వారని నిరూపించుకోవాలని దాసులకు బోధించు, అప్పుడు వారు ప్రతి విషయంలో మన రక్షకుడైన దేవుని బోధను ఆకర్షణీయంగా చేస్తారు.
TIT 2:11 మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది.
TIT 2:12 మనం భక్తిహీనతను ఈ లోక కోరికలను తృణీకరించి, దివ్య నిరీక్షణ కోసం అనగా, మన గొప్ప దేవుడును రక్షకుడైన యేసు క్రీస్తు తన మహిమతో కనబడతాడనే ఆ దివ్య నిరీక్షణ కలిగి ఎదురుచూస్తూ, స్వీయ నియంత్రణ కలిగి, ఈ ప్రస్తుత యుగంలో న్యాయంగా భక్తి కలిగి జీవించమని ఆ కృపయే మనకు బోధిస్తుంది.
TIT 2:14 యేసు క్రీస్తు మన అతిక్రమాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి మంచి చేయడానికి ఆసక్తి కలిగిన తన ప్రజలుగా మనల్ని పవిత్రపరచాలని తనను తాను అర్పించుకున్నారు.
TIT 2:15 కాబట్టి ఈ విషయాలను నీవు వారికి బోధించాలి, నీకు ఇవ్వబడిన పూర్తి అధికారంతో వారిని హెచ్చరించి గద్దించు. నిన్ను ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా చూసుకో.
TIT 3:1 పరిపాలకులకు అధికారులకు లోబడుతూ విధేయత కలిగి మంచి పనులను చేయడానికి సిద్ధంగా ఉండాలని,
TIT 3:2 ఎవరినీ నిందించకూడదని, శాంతియుతంగా వివేకం కలిగి ఉండాలని, అందరి పట్ల ఎల్లప్పుడూ సౌమ్యంగా మెలగాలని ప్రజలకు జ్ఞాపకం చేయి.
TIT 3:3 ఒకప్పుడు మనం కూడా అవివేకులుగా, అవిధేయులుగా, మోసపోయిన వారిగా అన్ని రకాల వ్యామోహాలకు సుఖాలకు బానిసలుగా ఉన్నాము. మనం ఓర్వలేనితనంతో, అసూయతో, ద్వేషింపబడుతూ ఒకరిని ఒకరం ద్వేషిస్తూ జీవించాము.
TIT 3:4 మన రక్షకుడైన దేవుడు తన దయ ప్రేమను వెల్లడి చేసినప్పుడు,
TIT 3:5 ఆయన మనల్ని రక్షించారు, మనం చేసిన నీతిపనులను బట్టి కాదు కాని, తన కనికరం చేతనే మనం రక్షించబడ్డాము. ఆయన మన పాపాలను కడిగి, పరిశుద్ధాత్మ ద్వారా మనకు క్రొత్త జన్మనిచ్చి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు.
TIT 3:6 ఆయన మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనపై ధారాళంగా ఆత్మను కుమ్మరించాడు.
TIT 3:7 ఆయన కృప వల్ల మనల్ని నీతిమంతులుగా ప్రకటించి, మనం నిత్యజీవాన్ని పొందుతామని నమ్మకాన్ని ఇచ్చాడు.
TIT 3:8 ఇది నమ్మదగిన మాట. కాబట్టి దేవుని నమ్మినవారు మంచి పనులను చేయడానికి శ్రద్ధతో పూనుకొనేలా నీవు ఈ విషయాలను మరింత గట్టిగా బోధించాలని చెప్తున్నాను. ఇవి ఉత్తమమైనవి, అందరికి ప్రయోజనకరమైనవి.
TIT 3:9 అయితే మూర్ఖమైన వివాదాలకు, వంశావళులకు, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాదాలకు కలహాలకు దూరంగా ఉండు, ఎందుకంటే అవి నిష్ఫలమైనవి వ్యర్థమైనవి.
TIT 3:10 విభజనలు కలిగించేవారిని మొదటిసారి గద్దించు, రెండవసారి హెచ్చరించు. ఆ తర్వాత వారిని వదిలేయి.
TIT 3:11 అలాంటివారు చెడిపోయినవారు, పాపాత్ములు; వారు తమను తామే నిందించుకుంటారని నీకు ఖచ్చితంగా తెలుసు.
TIT 3:12 నేను నికొపోలిలో శీతాకాలం గడపాలని అనుకుంటున్నాను, కాబట్టి నేను ఆర్తెమాను లేదా తుకికును నీ దగ్గరకు పంపిన వెంటనే నీవు బయలుదేరి నికొపోలిలో నా దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉండు.
TIT 3:13 న్యాయవాది జేనాసు అపొల్లోను జాగ్రత్తగా పంపించు, వారి ప్రయాణానికి కావలసినవన్ని సమకూర్చి తగిన సహాయం చేయి.
TIT 3:14 మన ప్రజలు నిష్ఫలమైన జీవితాలను జీవించకుండా అవసరాలకు తగినట్లు మంచి పనులు చేయడంలో శ్రద్ధ వహించడం నేర్చుకోవాలి.
TIT 3:15 నాతో ఉన్నవారందరు నీకు శుభాలు తెలియజేస్తున్నారు. విశ్వాసాన్నిబట్టి మమ్మల్ని ప్రేమించేవారందరికి మా వందనాలు తెలియజేయి. దేవుని కృప మీ అందరితో ఉండును గాక.
PHM 1:1 క్రీస్తు యేసును బట్టి ఖైదీనైన, పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి కలిసి,
PHM 1:2 మన సహోదరి అప్ఫియకు, తోటి సైనికుడైన అర్ఖిప్పుకు, మీ ఇంట్లో కూడుకొనే సంఘానికి వ్రాయునది:
PHM 1:3 మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక.
PHM 1:4 ప్రభువైన యేసులో నీకున్న విశ్వాసం, దేవుని ప్రజల పట్ల నీవు చూపే ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి నా ప్రార్థనలలో నిన్ను జ్ఞాపకం చేసికొని, నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
PHM 1:6 క్రీస్తు కోసం మనం పంచుకున్న ప్రతి మంచి విషయం పట్ల నీ విశ్వాసం మరింత జ్ఞానంలో వృద్ధిపొంది ఉపయోగకరంగా, మాతో పాలివానిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
PHM 1:7 సహోదరుడా, నీవు పరిశుద్ధుల హృదయాలను సేదదీర్చినందుకు, నీ ప్రేమ నాకెంతో సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది.
PHM 1:8 అందువల్ల, నీవేమి చేయాలనే దాని గురించి, క్రీస్తులో నేను ధైర్యంగా నిన్ను ఆజ్ఞాపించగలిగినా,
PHM 1:9 ముసలివాన్ని ఇప్పుడు యేసు క్రీస్తు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను నిన్ను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను.
PHM 1:10 నేను సంకెళ్ళతో బంధించబడి ఉన్నప్పుడు నాకు కుమారునిగా మారిన ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను.
PHM 1:11 గతంలో అతడు నీకు నిష్ప్రయోజకుడే కావచ్చు, కాని ఇప్పుడు అతడు నీకు నాకు, ఇద్దరికి ఉపయోగపడే వానిగా అయ్యాడు.
PHM 1:12 నా ప్రాణంతో సమానమైన ఇతన్ని, తిరిగి నీ దగ్గరకు పంపిస్తున్నాను.
PHM 1:13 నేను సువార్త కోసం సంకెళ్ళతో బంధింపబడి ఉన్న సమయంలో నాకు సహాయం చేయడానికి నీ బదులుగా అతన్ని నాతో పాటు ఉంచుకుని ఉండేవాన్ని.
PHM 1:14 కానీ, నీకు తెలియజేయకుండా నేను ఏమి చేయాలనుకోలేదు, ఎందుకంటే నీవు చేసే ఏ సహాయమైనా నీ ఇష్టపూర్వకంగానే చేయాలి కాని, బలవంతంగా కాదని నా అభిప్రాయం.
PHM 1:15 ఇతడు కొంతకాలం నీ నుండి వేరుకావడానికి కారణం, అతడు ఒక బానిసగా కాకుండా, బానిస కంటే ప్రియమైన సహోదరునిగా ఎల్లప్పుడు నీతో పాటు ఉండడానికే కావచ్చును.
PHM 1:16 ఇతడు నాకు చాలా ప్రియమైన వాడు, కాని, సాటి మనిషిగా ప్రభువులో ఒక సహోదరునిగా నీకు కూడా మరింత ప్రియమైన వాడుగా ఉన్నాడు.
PHM 1:17 కాబట్టి నీవు నన్ను ఒక జతపనివానిగా భావిస్తే, నన్ను ఆహ్వానించినట్లే అతన్ని కూడా ఆహ్వానించు.
PHM 1:18 ఒకవేళ అతడు ఏదైనా తప్పు చేసినా లేదా నీకు ఏదైనా బాకీ ఉన్నా, వాటిని నా లెక్కలో వేయి.
PHM 1:19 పౌలు అనే నేను, నా స్వహస్తంతో దీనిని వ్రాస్తున్నాను. నేను ఆ లెక్క చెల్లిస్తాను. నిజానికి, స్వయాన నీవే నాకు బాకీగా ఉన్నావని చెప్పనవసరం లేదు.
PHM 1:20 అవును సహోదరుడా, ప్రభువులో నీ నుండి నేను కొంత లాభం పొందాలని ఆశిస్తున్నాను; క్రీస్తులో నా హృదయాన్ని ఉత్తేజపరచు.
PHM 1:21 నేను అడిగిన దానికంటే ఎక్కువగా నీవు చేస్తావని తెలిసే, నీ విధేయత మీద నమ్మకంతో నేను నీకు వ్రాస్తున్నాను.
PHM 1:22 మరొక విషయం: మీ ప్రార్థనలను బట్టి మీ దగ్గరకు తిరిగి రావాలని నేను నిరీక్షిస్తున్నాను, కాబట్టి నా కోసం ఒక వసతిగదిని ఏర్పాటు చేయండి.
PHM 1:23 యేసు క్రీస్తు నిమిత్తం నాతో పాటు ఖైదీగా ఉన్న, ఎపఫ్రా మీకు వందనాలు తెలియజేస్తున్నాడు.
PHM 1:24 అదే విధంగా మార్కు, అరిస్తర్కు, దేమా, లూకా అనే నా జతపనివారు కూడా వందనాలు తెలియజేస్తున్నారు.
PHM 1:25 ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక.
HEB 1:1 గతంలో దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మాట్లాడారు.
HEB 1:2 కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు.
HEB 1:3 ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తర్వాత, ఆయన పరలోకంలో మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు.
HEB 1:4 కాబట్టి ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన నామాన్ని వారసత్వంగా పొందినట్లే ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందారు.
HEB 1:5 దేవదూతల్లో ఎవరితోనైనా ఎన్నడైన దేవుడు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను” అని గాని, “నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు,” అని గాని అన్నారా?
HEB 1:6 దేవుడు తన మొదటి సంతానాన్ని భూలోకానికి తెచ్చినప్పుడు, ఆయన, “దేవదూతలందరు ఆయనను ఆరాధించాలి,” అని చెప్పారు.
HEB 1:7 దేవదూతల గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు, “ఆయన తన దూతలను ఆత్మలుగా, తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేస్తారు,” అని అన్నారు.
HEB 1:8 కాని తన కుమారుని గురించి ఆయన, “ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; మీ న్యాయ దండం మీ రాజ్య రాజదండం.
HEB 1:9 మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషించారు; కాబట్టి దేవుడు, మీ దేవుడు, ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి, మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు,” అని అన్నారు.
HEB 1:10 ఇంకా ఆయన, “ప్రభువా, ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు, ఆకాశాలు మీ చేతి పని.
HEB 1:11 అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు; ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి.
HEB 1:12 వాటిని మీరు అంగీలా చుట్టి పెడతారు; వస్త్రంలా అవన్నీ మార్చబడతాయి. కానీ మీరు అలాగే ఉంటారు, మీ సంవత్సరాలకు అంతం ఉండదు,” అని అన్నారు.
HEB 1:13 దేవుడు దేవదూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా, “నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు నా కుడి వైపున కూర్చో అని చెప్పారా”?
HEB 1:14 దేవదూతలందరు రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి పరిచర్య చేయడానికి పంపబడిన ఆత్మలు కారా?
HEB 2:1 కాబట్టి మనం ప్రక్కకు మళ్ళించబడకుండా ఉండడానికి, మనం విన్న వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి.
HEB 2:2 ఎందుకంటే దేవదూతల ద్వారా చెప్పబడిన వర్తమానం స్థిరపరచబడింది కాబట్టి, ప్రతి అతిక్రమం అవిధేయత న్యాయమైన శిక్షను పొందగా,
HEB 2:3 మనం గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, మనం ఎలా తప్పించుకోగలం? ఈ రక్షణను ప్రభువే మొదట ప్రకటించారు. ఆయన మాటలు విన్నవారి ద్వారా అది మనకు నిరూపించబడింది.
HEB 2:4 సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు, వివిధ రకాల అద్భుతాలు, తన చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ వరాలను పంచిపెట్టడం ద్వారా దేవుడు కూడా వాటి గురించి సాక్ష్యమిచ్చారు.
HEB 2:5 మనం దేని గురించి మాట్లాడుతున్నామో, ఆ రాబోవు లోకాన్ని ఆయన దేవదూతల చేతి క్రింద ఉంచలేదు.
HEB 2:6 అయితే ఒకచోట ఒకరు ఇలా సాక్ష్యమిచ్చారు: “మీరు మానవాళిని లక్ష్యపెట్టడానికి వారు ఏపాటివారు? మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు?
HEB 2:7 మీరు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశారు; మీరు మహిమ ఘనతను వారికి కిరీటంగా పెట్టారు.
HEB 2:8 సమస్తాన్ని వారి పాదాల క్రింద ఉంచారు,” సమస్తాన్ని వారి క్రింద ఉంచుతూ, వారికి లోబరచకుండా దేవుడు దేన్ని విడిచిపెట్టలేదు. అయినాసరే వారికి ప్రతిదీ లోబడడం ప్రస్తుతానికి మనమింకా చూడలేదు.
HEB 2:9 కాని, యేసు కొంతకాలం వరకు దేవదూతల కంటే తక్కువ చేయబడి, దేవుని కృప వల్ల అందరి కోసం మరణాన్ని రుచిచూశారు కాబట్టి ఇప్పుడు మహిమ ప్రభావాలతో కిరీటం ధరించుకొని ఉన్నట్లు మనం ఆయనను చూస్తున్నాము.
HEB 2:10 ఎవరి కోసం, ఎవరి ద్వారా సమస్తం కలిగిందో ఆ దేవునికి, అనేకమంది కుమారులను కుమార్తెలను మహిమలో తీసుకురావడంలో, వారి రక్షణకు మార్గదర్శి యైన వానిని శ్రమల ద్వారా పరిపూర్ణునిగా చేయడం తగినదిగా ఉండింది.
HEB 2:11 ప్రజలను పరిశుద్ధపరచే వానిది పరిశుద్ధపరచబడిన వారిది ఒక్కటే కుటుంబము. కాబట్టి వారిని సహోదరీ సహోదరులు అని పిలువడానికి యేసు సిగ్గుపడలేదు.
HEB 2:12 ఆయన ఇలా అన్నారు, “నేను మీ నామాన్ని నా సహోదరీ సహోదరులకు ప్రకటిస్తాను; సమాజంలో మీ కీర్తిని నేను గానం చేస్తాను.”
HEB 2:13 అంతేకాక, “నేను ఆయనలో నా నమ్మకాన్ని ఉంచుతాను.” అంతేకాక, “ఇదిగో నేను, దేవుడు నాకిచ్చిన పిల్లలు,” అని ఆయన చెప్తున్నారు.
HEB 2:14 ఈ పిల్లలు రక్తమాంసాలు కలిగి ఉన్నవారు కాబట్టి, తన మరణం ద్వారా మరణంపై అధికారం కలవాడైన అపవాది అధికారాన్ని విరుగగొట్టడానికి,
HEB 2:15 మరణ భయంతో దాస్యంలో ఉంచబడినవారిని విడిపించడానికి, ఆయన కూడా మానవరూపంలో పాలుపంచుకున్నాడు.
HEB 2:16 ఇది ఖచ్చితంగా అబ్రాహాము సంతానానికే గాని దేవదూతలకు సహాయం చేయడానికి కాదు.
HEB 2:17 దేవుని సేవచేయడంలో కనికరం కలిగిన నమ్మకమైన ప్రధాన యాజకునిగా ఉండడానికి, ప్రజల పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి, ఆయన అన్ని విధాలుగా వారిలా సంపూర్ణ మానవునిగా చేయబడ్డారు.
HEB 2:18 ఆయన మానవునిగా శోధించబడినప్పుడు బాధను అనుభవించారు కాబట్టి శోధించబడుతున్న వారికి ఆయన సహాయం చేయగలరు.
HEB 3:1 కాబట్టి, పరలోక పిలుపులో భాగస్థులైన పరిశుద్ధ సహోదరీ సహోదరులారా, మన అపొస్తలునిగా ప్రధాన యాజకునిగా మనం అంగీకరించిన యేసు మీద మీ ఆలోచనలను ఉంచండి.
HEB 3:2 దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లు ఈయన తనను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు.
HEB 3:3 ఇల్లు కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు, మోషే కంటే యేసు అధికమైన మహిమకు అర్హుడుగా కనబడ్డాడు.
HEB 3:4 ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టబడింది, అయితే దేవుడు సమస్తానికి నిర్మాణకుడు.
HEB 3:5 “మోషే దేవుని సేవకునిగా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వానిగా ఉన్నాడు” దేవుడు భవిష్యత్తులో చెప్పబోయేవాటికి సాక్షిగా ఉన్నాడు.
HEB 3:6 అయితే క్రీస్తు, కుమారుడిగా దేవుని ఇంటిపైన నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ మన ధైర్యాన్ని, మనం కీర్తించే నిరీక్షణను గట్టిగా పట్టుకుంటే, మనమే ఆయన గృహము.
HEB 3:7 కాబట్టి, పరిశుద్ధాత్మ చెప్పినట్లు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,
HEB 3:8 అరణ్యంలో శోధన సమయంలో, మీరు తిరుగుబాటు చేసిన విధంగా, మీ హృదయాలను కఠినం చేసుకోకండి;
HEB 3:9 అక్కడ నలభై సంవత్సరాలు నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా, మీ పూర్వికులు నన్ను పరీక్షించారు.
HEB 3:10 అందుకే నేను ఆ తరం వారిపై కోప్పడి ఇలా అన్నాను; ‘వారి హృదయాలు ఎల్లప్పుడు దారి తప్పిపోతున్నాయి, వారు నా మార్గాలను తెలుసుకోలేదు’
HEB 3:11 కాబట్టి, ‘వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’ అని నేను కోపంలో ప్రమాణం చేశాను.”
HEB 3:12 కాబట్టి సహోదరీ సహోదరులారా, జీవంగల దేవుని నుండి దూరంచేసే పాప స్వభావం, అవిశ్వాసపు హృదయం మీలో ఎవరికి ఉండకుండ జాగ్రత్తగా చూసుకోండి.
HEB 3:13 పాపం యొక్క మోసంచేత మీలో ఎవరూ కఠినపరచబడకుండ ఉండడానికి, నేడు అని పిలువబడుతున్న దినం ఉండగానే మీరు ప్రతిదినం ఒకరినొకరు ధైర్యపరచుకొంటూ ఉండండి.
HEB 3:14 ఒకవేళ మనకున్న మొదటి నిశ్చయతను అంతం వరకు గట్టిగా పట్టుకుని ఉంటే, మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము.
HEB 3:15 ఇప్పుడే చెప్పబడినట్లుగా, “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే, మీరు తిరుగుబాటులో చేసినట్టుగా మీ హృదయాలను కఠినం చేసుకోకండి.”
HEB 3:16 దేవుని స్వరాన్ని విని ఆయన మాటను వ్యతిరేకించి తిరుగుబాటు చేసింది ఎవరు? వారందరు ఈజిప్టు నుండి మోషే చేత బయటకు నడిపించబడినవారు కారా?
HEB 3:17 ఆయన ఎవరితో నలభై సంవత్సరాలు కోపంగా ఉన్నాడు? పాపం చేయడం వల్ల ఎవరి శరీరాలు అరణ్యంలో నశించాయో, వారితో కాదా?
HEB 3:18 తన విశ్రాంతిలో ఎన్నడూ ప్రవేశించరని దేవుడు అవిధేయులతో కాక, మరెవరికి ప్రమాణం చేశాడు?
HEB 3:19 కాబట్టి వారి అవిశ్వాసం వల్లనే వారు ప్రవేశించలేక పోయారని మనం గ్రహిస్తున్నాము.
HEB 4:1 అందువల్ల, ఆయన విశ్రాంతిలోకి ప్రవేశిస్తామన్న వాగ్దానం ఇప్పటికీ ఉంది కాబట్టి, మీలో ఎవరూ దాన్ని పొందలేని పరిస్థితిలో లేకుండా జాగ్రత్తపడదాము.
HEB 4:2 ఎందుకంటే సువార్త వారికి ప్రకటించబడిన విధంగానే మనకు ప్రకటించబడింది; అయితే సువార్తకు విధేయత చూపించినవారితో వారు విశ్వాసంతో కలిసి ఉండలేదు కాబట్టి విన్న సువార్త వారికి ప్రయోజనంగా లేదు.
HEB 4:3 అయితే విశ్వసించిన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాము. అయితే దేవుడు ఇలా అన్నారు, “ ‘కాబట్టి వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’ అని నేను కోపంలో ప్రమాణం చేశాను.” ఆయన తన కార్యాలన్ని లోకాన్ని సృష్టించినప్పుడే పూర్తి చేశారు.
HEB 4:4 దేవుడు ఏడవ దినాన్ని గురించి ఇంకొక చోట ఇలా అన్నారు: “దేవుడు ఏడవ రోజున తన పనులన్నిటిని నుండి విశ్రాంతి తీసుకున్నారు.”
HEB 4:5 పై వచనంలో ఆయన, “వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అని అన్నారు.
HEB 4:6 అయితే కొందరు ఆ విశ్రాంతిని గురించిన సువార్తను విన్నా కూడ తాము విన్నవాటిని వారు నమ్మలేదు కాబట్టి ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు.
HEB 4:7 మరల దేవుడు ఒక దినాన్ని సిద్ధపరచి దాన్ని “నేడు” అని పిలిచారు. వాక్యంలో వ్రాయబడిన ప్రకారం చాలా కాలం తర్వాత ఆయన దావీదు ద్వారా కూడా ఇదే మాటను మాట్లాడారు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే, మీ హృదయాలను కఠినం చేసుకోకండి.”
HEB 4:8 ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇచ్చి ఉంటే, దేవుడు మరొక దినాన్ని గురించి మాట్లాడి ఉండేవాడు కాడు.
HEB 4:9 కాబట్టి దేవుని ప్రజలకు ఏడవ రోజు సబ్బాతు దినం;
HEB 4:10 ఎవరైనా దేవుని విశ్రాంతిలోకి ప్రవేశిస్తే, దేవుడు తన పనుల నుండి విశ్రాంతి పొందినట్లే, వారు కూడా తమ పనుల నుండి విశ్రాంతి పొందుతారు.
HEB 4:11 కాబట్టి, వారి అవిధేయత మాదిరిని అనుసరించి ఎవరూ నశించిపోకుండా ప్రతి ప్రయత్నాన్ని చేసి దేవుని విశ్రాంతిలో ప్రవేశిద్దాము.
HEB 4:12 దేవుని వాక్యం సజీవమైనది చురుకైనది. అది రెండంచులు కలిగిన ఏ ఖడ్గం కన్నా పదును కలిగి, ప్రాణాన్ని, ఆత్మను, కీళ్ళను, మూలుగను వేరు చేస్తూ లోనికి చొచ్చుకొని పోతూ, హృదయం యొక్క ఆలోచనలను, వైఖరిని పరీక్షిస్తుంది.
HEB 4:13 సృష్టి అంతటిలో దేవుని దృష్టి నుండి దాచబడింది ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించాల్సి ఉందో ఆయన కళ్లెదుట ప్రతిదీ తెరవబడి స్పష్టంగా ఉంది.
HEB 4:14 కాబట్టి, పరలోకానికి ఎక్కివెళ్లిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం అంగీకరించిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాము.
HEB 4:15 అయితే మన ప్రధాన యాజకుడు మనలానే అన్ని విధాలుగా శోధించబడినప్పటికి ఆయన పాపం చేయలేదు కాబట్టి మన బలహీనతల గురించి సానుభూతి చూపించేవాడు.
HEB 4:16 కాబట్టి మన అవసర సమయంలో సహాయపడేలా కనికరం కృప పొందడానికి మనం ధైర్యంగా దేవుని కృపా సింహాసనాన్ని సమీపిద్దాము.
HEB 5:1 ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఏర్పరచబడి, దేవునికి సంబంధించిన విషయాల్లో ప్రజల ప్రతినిధిగా పాపపరిహార బలులను కానుకలను అర్పించడానికి నియమించబడ్డాడు.
HEB 5:2 తాను కూడా బలహీనతలకు గురైనవానిగా ఉన్నా, అవివేకులైన వారిని దారి తప్పిపోతున్న వారిని దయతో నడిపించగల సమర్ధుడు.
HEB 5:3 ఈ కారణంగా, అతడు తన పాపాల కోసం అలాగే ప్రజల పాపాల కోసం బలి అర్పించాల్సి ఉంది.
HEB 5:4 ఈ గౌరవాన్ని ఎవరు తమంతట తాము పొందలేరు, కాని అహరోను ఎలా పిలువబడ్డాడో అలాగే దేవుని చేత పిలువబడినప్పుడు వారు దానిని పొందుకుంటారు.
HEB 5:5 అదేరీతిగా, క్రీస్తు కూడా ప్రధాన యాజకునిగా అవ్వడానికి తనంతట తానే మహిమను తీసుకోలేదు. అయితే దేవుడే ఆయనతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.”
HEB 5:6 మరొక చోట ఆయన ఇలా అన్నారు, “మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు.”
HEB 5:7 యేసు భూమి మీద జీవించిన రోజుల్లో, మరణం నుండి తనను రక్షించడానికి శక్తి కలిగిన దేవునికి తీవ్రమైన రోదనతో, కన్నీటితో ప్రార్థనలు విన్నపాలు అర్పించారు, ఆయనకున్న భక్తి విధేయతల కారణంగా దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించారు.
HEB 5:8 ఆయన కుమారుడై ఉండి కూడా, తాను అనుభవించిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నారు,
HEB 5:9 ఆయన పరిపూర్ణుడవ్వగానే తనకు లోబడే వారందరికి శాశ్వతమైన రక్షణకు మూలాధారం అయ్యారు.
HEB 5:10 మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకునిగా దేవుని చేత నియమింపబడ్డారు.
HEB 5:11 దీనిని గురించి మేము చెప్పాల్సింది చాలా ఉంది కాని, గ్రహించడానికి మీరు ఏమాత్రం ప్రయత్నించడం లేదు కాబట్టి మీకు వివరించడం కష్టము.
HEB 5:12 నిజానికి, ఈ సమయానికి మీరు బోధకులై ఉండాల్సింది, కాని ఇప్పటికి మీకు మరొకరు దేవుని వాక్యంలోని ప్రాథమిక సత్యాలను బోధించాల్సిన అవసరం ఉంది. బలమైన ఆహారం కాదు, మీకు పాలు అవసరము.
HEB 5:13 పాలు త్రాగుతూ జీవించేవారు ఇంకా శిశువుగానే ఉన్నారు, కాబట్టి నీతిని గురించిన బోధతో పరిచయం లేదు.
HEB 5:14 అయితే బలమైన ఆహారం పరిణతి చెందిన వారికి, అంటే ఎవరైతే నిరంతరం ఉపయోగించడం ద్వారా తమకు తాముగా మంచి చెడులను వేరు చేసే శిక్షణ పొందుకున్నవారికి.
HEB 6:1 అందువల్ల మనం క్రీస్తు గురించిన ప్రాధమిక బోధన అంటే, మరణానికి దారితీసే చర్యల నుండి పశ్చాత్తాపం, దేవుని యందు విశ్వాసముంచడం వంటి వాటితో మళ్ళీ పునాదిని మళ్ళీ వేయక, దానికి మించి, పరిపక్వతకు వైపుకు వెళ్దాం,
HEB 6:2 శుద్ధీకరణ ఆచారాలు, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానం, నిత్య తీర్పు గురించిన మళ్ళీ ఉపదేశం అవసరం లేదు.
HEB 6:3 దేవుడు అనుమతిస్తే, మనం అలా చేద్దాము.
HEB 6:4 ఒకసారి వెలిగించబడి, పరలోకసంబంధమైన వరాలను అనుభవించినవారు తెలుసుకొని, పరిశుద్ధాత్మలో పాలిభాగస్థులై,
HEB 6:5 దేవుని వాక్యం యొక్క అనుగ్రహాన్ని, భవిష్యత్కాలాల శక్తుల ప్రభావాలను రుచి చూసినప్పటికి,
HEB 6:6 తప్పిపోయినవారిని తిరిగి పశ్చాత్తాపం వైపుకు నడిపించడం అసాధ్యము. అలాంటివారు తమ నాశనానికే దేవుని కుమారుని మళ్ళీ సిలువవేస్తూ, ఆయనను బహిరంగంగా అవమానానికి గురిచేస్తున్నారు.
HEB 6:7 భూమి తనపై తరచుగా కురిసే వర్షపు నీటిని త్రాగి, దానిపై వ్యవసాయం చేసేవారికి ప్రయోజనకరమైన పంటను ఇస్తుండగా పండించినవారు దాన్ని దేవుని దీవెనగా పొందుతున్నారు.
HEB 6:8 అయితే ముళ్ళపొదలను కలుపు మొక్కలను పండించే భూమి విలువలేనిదై శాపానికి గురి అవుతుంది ఆ తర్వాత చివరిలో అది కాల్చివేయబడుతుంది.
HEB 6:9 అయితే ప్రియమైన వారలారా, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికి, మీ రక్షణ గురించి మంచి సంగతులు ఉన్నాయని మేము నిశ్చయంగా ఉన్నాము.
HEB 6:10 దేవుడు అన్యాయస్థుడు కాడు; ఆయనపై మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయన ప్రజలకు మీరు చేసిన చేస్తున్న సహాయాన్ని మరచిపోయేవాడు కాడు.
HEB 6:11 మీలో ప్రతి ఒక్కరు, మీరు కలిగి ఉన్న నిరీక్షణ సంపూర్ణంగా నెరవేరేలా ఇదే ఆసక్తిని చివరి వరకు చూపించాలని మేము కోరుతున్నాము.
HEB 6:12 అంతేగాక, మీరు సోమరులుగా ఉండక, విశ్వాసం, ఓర్పు ద్వారా వాగ్దానం చేయబడినదానికి వారసులైన వారిని మీరు అనుకరించాలని మేము కోరుతున్నాము.
HEB 6:13 దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినపుడు, ఆయన కంటే గొప్పవాడు మరియొకడు లేడు కాబట్టి ఆయన తన మీదనే ప్రమాణం చేసి,
HEB 6:14 “నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను” అని చెప్పారు.
HEB 6:15 ఓర్పుతో వేచి ఉన్న తర్వాత, చేయబడిన వాగ్దానఫలాన్ని అబ్రాహాము పొందుకొన్నాడు.
HEB 6:16 ప్రజలు ప్రమాణం చేసినప్పుడు తమకంటే గొప్పవారి తోడని ప్రమాణం చేస్తారు, దాంతో వారి అన్ని వివాదాలు పరిష్కారమవుతాయి.
HEB 6:17 తన వాగ్దానానికి వారసులైన వారికి తన మార్పులేని స్వభావంలోని ఉద్దేశాన్ని స్పష్టం చేయడానికి దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని ప్రమాణంతో దృఢపరిచారు.
HEB 6:18 దేవుడు అబద్ధమాడడం అసాధ్యమైన రెండు మార్పులేని విషయాల ద్వారా, మన ముందు ఉంచిన నిరీక్షణను పట్టుకోవడానికి పరుగెత్తిన మనల్ని ఎంతో ప్రోత్సహించగలిగేలా, దేవుడు ఇలా చేశారు.
HEB 6:19 మనకు ఉన్న ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరులా స్థిరపరచి భద్రపరుస్తుంది. ఇది తెర వెనుక ఉన్న గర్భాలయంలోకి ప్రవేశింప చేస్తుంది.
HEB 6:20 అక్కడే యేసు మనకంటే ముందుగా మెల్కీసెదెకు క్రమంలో నిరంతరం ప్రధాన యాజకునిగా మన పక్షాన దానిలోనికి ప్రవేశించారు.
HEB 7:1 ఈ మెల్కీసెదెకు షాలేముకు రాజు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము నలుగురు రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు షాలేము రాజైన మెల్కీసెదెకు అబ్రాహామును కలిసి అతన్ని ఆశీర్వదించాడు.
HEB 7:2 అబ్రాహాము అన్నిటిలో పదవ భాగాన్ని అతనికి ఇచ్చాడు. మెల్కీసెదెకు అనగా మొదట, “నీతికి రాజు అని అర్థం” అటు తర్వాత “షాలేము రాజు” అనగా, “శాంతికి రాజు” అని అర్థం
HEB 7:3 తల్లి తండ్రి లేకపోయినా, వంశావళి లేకపోయినా, జీవిత ఆరంభం అంతం లేకపోయినా అతడు దేవుని కుమారునికి సాదృశ్యంగా, నిరంతరం యాజకునిగా ఉన్నాడు.
HEB 7:4 ఇతడెంత గొప్పవాడో ఆలోచించండి: మన పితరుడైన అబ్రాహాము కొల్లగొట్టిన దానిలో నుండి పదో భాగాన్ని ఇచ్చాడు!
HEB 7:5 లేవీ సంతతిలో నుండి యాజకులైనవారు ప్రజల నుండి అంటే, అబ్రాహాము నుండి వచ్చిన తోటివారైనా ఇశ్రాయేలీయుల నుండి పదవ వంతు వసూలు చేయాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది.
HEB 7:6 ఈ మనుష్యుడు లేవీ సంతతివాడు కానప్పటికి, అబ్రాహాము నుండి పదో భాగాన్ని తీసుకుని, దేవుని వాగ్దానాలను పొందిన అతన్ని దీవించాడు.
HEB 7:7 తక్కువవాడు గొప్పవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు.
HEB 7:8 ఒక సందర్భంలో, దశమభాగం చనిపోయేవారి చేత వసూలు చేయబడింది; మరో సందర్భంలో, బ్రతికి ఉన్నాడని ప్రకటించబడిన వారి ద్వారా వసూలు చేయబడింది.
HEB 7:9 దశమభాగం పుచ్చుకొనే లేవీయులు అబ్రాహాము ద్వారా పదో భాగాన్ని చెల్లించారు అని చెప్పవచ్చు,
HEB 7:10 ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నపుడు, లేవీ ఇంకా తన పితరుని శరీరంలోనే ఉన్నాడు.
HEB 7:11 ప్రజలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం స్థాపించిన లేవీయుల యాజకత్వం ద్వారా పరిపూర్ణతను సాధించగలిగివుంటే మరొక యాజకుడు అహరోను క్రమంలో కాక, మెల్కీసెదెకు క్రమంలో రావలసిన అవసరం ఏంటి?
HEB 7:12 యాజకత్వం మార్చబడినపుడు, ధర్మశాస్త్రం కూడా మార్చబడాలి.
HEB 7:13 ఈ సంగతులు ఎవరి గురించి చెప్పబడ్డాయో అతడు వేరొక వంశానికి చెందిన వాడు, ఆ వంశం నుండి ఎవరు, ఎన్నడు బలిపీఠం దగ్గర పరిచర్య చేయలేదు.
HEB 7:14 మన ప్రభువు యూదా సంతానం నుండి వచ్చాడనేది స్పష్టం కాని ఆ గోత్రానికి సంబంధించి యాజకులను గురించి మోషే ఏమి చెప్పలేదు.
HEB 7:15 మెల్కీసెదెకు వంటి వేరొక యాజకుడు వస్తే మేము చెప్పింది మరింత స్పష్టంగా అర్థమవుతుంది,
HEB 7:16 యాజకుడైనవాడు వంశపారంపర్య నియమం ప్రకారం యాజకుడు కాలేదు, కాని నాశనములేని జీవానికున్న శక్తినిబట్టి యాజకుడయ్యాడు.
HEB 7:17 అందుకే ఇలా ప్రకటించబడింది: “మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉంటావు.”
HEB 7:18 పాత నియమం బలహీనం, నిరుపయోగం కాబట్టి ప్రక్కకు పెట్టబడింది.
HEB 7:19 ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం దేన్ని పరిపూర్ణం చేయలేదు, కాబట్టి మనల్ని దేవునికి దగ్గర చేసే, మెరుగైన నిరీక్షణ పరిచయం చేయబడింది.
HEB 7:20 అది ప్రమాణం లేకుండా కాదు! ఇతరులు ఏ ప్రమాణం చేయకుండానే యాజకులయ్యారు,
HEB 7:21 అయితే ఆయన ప్రమాణంతో యాజకుడు అయ్యేటప్పుడు దేవుడు ఆయనతో ఇలా అన్నారు: “ప్రభువు ప్రమాణం చేశారు ఆయన తన మనస్సు మార్చుకోరు: ‘నీవు నిరంతరం యాజకునిగా ఉంటావు.’ ”
HEB 7:22 ఈ ప్రమాణం వలన, యేసు మరింత మేలైన నిబంధనకు హామీదారు అయ్యాడు.
HEB 7:23 మరణం వారిని ఆ పదవిలో కొనసాగనివ్వలేదు కాబట్టి యాజకులైనవారు అనేకమంది ఉన్నారు.
HEB 7:24 అయితే యేసు నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి ఆయన శాశ్వత యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు.
HEB 7:25 తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారి కోసం ఎల్లప్పుడు విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి వారిని ఆయన సంపూర్ణంగా రక్షించగలడు.
HEB 7:26 పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు, పాపుల నుండి ప్రత్యేకించబడినవాడు, ఆకాశాల కంటే పైగా హెచ్చింపబడినవాడు, మన అవసరాలను తీర్చగల ప్రధాన యాజకుడు.
HEB 7:27 ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటివాడు కాదు, ప్రతిదినం, మొదట తన పాపాల కోసం, తర్వాత ప్రజల పాపాల కోసం బలులు అర్పించాల్సిన అవసరం ఆయనకు లేదు. తనను తాను అర్పించుకున్నప్పుడే వారందరి పాపాల కోసం ఒకేసారి అర్పించాడు.
HEB 7:28 ధర్మశాస్త్రం బలహీనతతో ఉన్న మనుష్యులను ప్రధాన యాజకులుగా నియమిస్తుంది; కాని ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన దేవుని ప్రమాణం నిత్యం పరిపూర్ణునిగా చేయబడిన దేవుని కుమారున్ని ప్రధాన యాజకునిగా నియమించింది.
HEB 8:1 మనం చెప్తున్న దానిలోని ముఖ్య సారాంశమిది: పరలోకంలో సర్వోన్నతుని సింహాసనం యొక్క కుడి వైపున కూర్చుని ఉన్న వానిని మనం ప్రధాన యాజకునిగా కలిగి ఉన్నాం,
HEB 8:2 ఆయన మానవుని చేత కాక దేవుని చేత తయారుచేయబడిన నిజమైన ప్రత్యక్షగుడారంలో అతిపరిశుద్ధమైన స్థలంలో ప్రధాన యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు.
HEB 8:3 ప్రతి ప్రధాన యాజకుడు దేవునికి కానుకలను బలులను అర్పించడానికి నియమించబడి ఉన్నాడు కాబట్టి ఈయన కూడ దేవునికి ఏదైనా సమర్పించాల్సిన అవసరం ఉండింది.
HEB 8:4 ఆయన భూమి మీద ఉండి ఉంటే, ఒక యాజకుడై ఉండేవాడు కాడు, ధర్మశాస్త్రంలో వ్రాసి ఉన్న ప్రకారం అర్పణలు అర్పించే యాజకులు ఇప్పటికే ఉన్నారు.
HEB 8:5 పరలోకంలో ఉన్న దానికి కేవలం ఒక నమూనాగా ఛాయాచిత్రంగా ఉన్న పరిశుద్ధ స్థలంలో యాజకులుగా వారు సేవ చేస్తారు. ఇందుకే మోషే గుడారాన్ని నిర్మిస్తున్నప్పుడు దాన్ని గురించి ఇలా హెచ్చరిక పొందాడు: “పర్వతం మీద నేను నీకు చూపించిన నమూనా ప్రకారమే ప్రతిదీ చేసేలా చూడాలి.”
HEB 8:6 అయితే నిజానికి నూతన నిబంధన మరింత గొప్ప వాగ్దానాలపై స్థాపించబడింది కాబట్టి, యేసు మధ్యవర్తిగా ఉన్న ఈ నిబంధన గత నిబంధన కన్న శ్రేష్ఠమైనదైనట్లే ఆయనకు అప్పగించబడిన పరిచర్య కూడా శ్రేష్ఠమైనదే.
HEB 8:7 అయితే మొదటి నిబంధన లోపం లేనిదైతే, రెండవ దాని కోసం వెదకాల్సిన అవసరమే లేదు.
HEB 8:8 అయితే దేవుడు ప్రజల్లో దోషాన్ని కనుగొని ఇలా చెప్పారు: “ప్రభువు ఇలా ప్రకటిస్తున్నారు, ఆ రోజులు వస్తున్నాయి, అప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ క్రొత్త నిబంధన చేస్తాను.
HEB 8:9 ఆ నిబంధన, ఈజిప్టు దేశం నుండి నేను వారి పూర్వికుల చేయి పట్టుకొని బయటకు నడిపించినపుడు నేను వారితో చేసిన నిబంధనలా ఉండదు, ఎందుకంటే వారు నా నిబంధనకు నమ్మకంగా నిలబడలేదు, అందుకే నేను వారి నుండి దూరమయ్యాను, అని ప్రభువు చెప్తున్నారు.
HEB 8:10 ఆ కాలం తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను స్థాపించే నిబంధన ఇదే అని ప్రభువు ప్రకటిస్తున్నారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు.
HEB 8:11 ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు, ‘ప్రభువును తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు, ఎందుకంటే వారిలో సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు.
HEB 8:12 ఎందుకంటే నేను దయతో వారి దుష్టత్వాన్ని క్షమించి వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.”
HEB 8:13 ఆయన ఈ నిబంధనను, “క్రొత్త” అని పిలువడం చేత మొదటి దాన్ని వాడుకలో లేకుండ చేశారు; వాడుకలో లేనివి పాతవి త్వరలో అదృశ్యమవుతాయి.
HEB 9:1 మొదటి నిబంధనలో దేవుని ఆరాధించడానికి కొన్ని నియమాలు, భూసంబంధమైన ప్రత్యక్ష గుడారం ఉన్నాయి.
HEB 9:2 ఆ గుడారం ఇలా ఏర్పరచబడింది. దానిలోని మొదటి గదిలో ఒక దీప దీపస్తంభం, ఒక బల్ల దానిపై అర్పించబడిన రొట్టెలు ఉన్నాయి, ఆ గదికి పరిశుద్ధ స్థలమని పేరు.
HEB 9:3 రెండవ తెర వెనుక అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడే గది ఉంది,
HEB 9:4 దానిలో ధూపం వేయడానికి బంగారు బలిపీఠం, బంగారంతో కప్పబడిన నిబంధన పెట్టె ఉన్నాయి. ఆ పెట్టెలో మన్నా ఉంచబడిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, వ్రాయబడిన నిబంధన రాతిపలకలు ఉన్నాయి.
HEB 9:5 ఈ పెట్టె పైన మహిమగల కెరూబులు తమ రెక్కలతో ప్రాయశ్చిత్త పీఠంను కాపాడుతూ ఉన్నాయి. అయితే ఈ సంగతుల గురించి వివరంగా ఇప్పుడు మనం చర్చించలేము.
HEB 9:6 ఇలా అన్ని ఏర్పాటు చేయబడిన తర్వాత, ప్రతిరోజు యాజకులు తమ పరిచర్యను చేయడానికి మొదటి గదిలోకి వెళ్తారు.
HEB 9:7 అయితే కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే లోపలి గదిలోకి ప్రవేశించాడు, అది కూడా సంవత్సరానికి ఒక్కసారే. తెలియక చేసిన పాపాల కోసం తన కోసం, ప్రజల కోసం అతడు అర్పించి ఆ రక్తాన్ని తీసుకెళ్లాలి, రక్తం లేకుండా వెళ్లడానికి లేదు.
HEB 9:8 అంటే మొదటి గుడారం నిలిచి ఉన్నంత కాలం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లే మార్గం ఇంకా తెరవబడలేదని పరిశుద్ధాత్మ దీని ద్వారా చూపిస్తున్నాడు.
HEB 9:9 ఇది ప్రస్తుత కాలాన్ని సూచించే ఒక ఉపమానం, దేవునికి అర్పించబడే కానుకలు, బలులు ఆరాధించేవారి మనస్సాక్షిని శుధ్ధిచేయలేవని తెలియజేస్తుంది.
HEB 9:10 అవి కేవలం తినడం త్రాగడం, వివిధ శుద్ధీకరణ ఆచారాలకు సంబంధించిన బాహ్య నియమాలు క్రొత్త క్రమం వచ్చేవరకు వర్తిస్తాయి.
HEB 9:11 అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మంచి విషయాల యొక్క ప్రధాన యాజకునిగా క్రీస్తు వచ్చినప్పుడు, మానవుల చేతితో చేయబడని గొప్పదైన పరిపూర్ణమైన గుడారం గుండా ఆయన వెళ్లాడు, అంటే అది ఈ సృష్టిలో ఒక భాగం కాదు.
HEB 9:12 ఆయన మేకల దూడల రక్తాన్ని తీసుకుని ప్రవేశించలేదు; కాని శాశ్వత విమోచన సంపాదించడానికి స్వరక్తంతో అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ఒక్కసారే ప్రవేశించాడు.
HEB 9:13 ఆచారపరంగా అపవిత్రులైనవారు బాహ్యంగా పవిత్రులయ్యేలా మేకల ఎడ్ల రక్తంను దహించబడిన దూడ బూడిదను వారిపై చల్లి వారిని పవిత్రులుగా చేస్తాడు.
HEB 9:14 నిత్యమైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొన్న క్రీస్తు రక్తం, మనం జీవంగల దేవుని సేవించేలా, మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి మన మనస్సాక్షిని ఇంకెంత ఎక్కువగా పవిత్రపరుస్తుంది!
HEB 9:15 ఈ కారణంవల్లనే, పిలువబడిన వారు వాగ్దానం చేయబడిన శాశ్వత వారసత్వాన్ని పొందడానికి క్రొత్త నిబంధనకు క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన ప్రకారం చేసిన పాపాల నుండి వారిని విడిపించడానికి ఆయన మరణించి క్రయధనం చెల్లించాడు.
HEB 9:16 వీలునామా విషయంలో, దాన్ని తయారుచేసిన వాడు చనిపోయాడని నిరూపించడం అవసరం,
HEB 9:17 ఎందుకంటే, వీలునామా వ్రాసినవారు బ్రతికి ఉన్నంత వరకు ఆ వీలునామా చెల్లదు; వారు మరణించిన తర్వాత మాత్రమే అది అమల్లోకి వస్తుంది.
HEB 9:18 అందుకే, మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా అమలు పరచబడలేదు.
HEB 9:19 ధర్మశాస్త్రంలోని ప్రతి ఆజ్ఞను మోషే ప్రజలందరికి వినిపించాక, అతడు నీరు, ఎర్రని ఉన్ని, హిస్సోపు కొమ్మలతో దూడల మేకల రక్తాన్ని తీసుకుని, గ్రంథంపైన ప్రజలందరిపైన చల్లాడు.
HEB 9:20 అతడు, “పాటించుమని మీకు దేవుడు ఆజ్ఞాపించిన, నిబంధన రక్తం ఇదే” అన్నాడు.
HEB 9:21 అదే విధంగా, అతడు గుడారంపై దాని ఆచారాల్లో ఉపయోగించే అన్ని వస్తువుల పైన రక్తాన్ని చల్లాడు.
HEB 9:22 నిజానికి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాదాపు అన్ని వస్తువులను రక్తంతో శుద్ధి చేయాలి, రక్తం చిందించకుండ పాపక్షమాపణ కలుగదు.
HEB 9:23 కాబట్టి, ఈ బలులతో పరలోకపు వాటిని పోలి ఉన్న ఈ వస్తువులు శుద్ధి చేయబడటం అవసరం, కానీ పరలోకానికి సంబంధించినవి వీటికన్నా మెరుగైన బలులతో చేయబడాలి.
HEB 9:24 ఎందుకంటే నిజమైన దాని పోలికలో మానవ హస్తాలతో చేయబడిన పరిశుద్ధ స్థలంలోకి క్రీస్తు ప్రవేశించలేదు; కాని ఇప్పుడు మన కోసం దేవుని సన్నిధిలో కనబడటానికి ఆయన పరలోకంలోనికే ప్రవేశించాడు.
HEB 9:25 యూదుల ప్రధాన యాజకుడు, ప్రతి సంవత్సరం అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినట్టుగా క్రీస్తు పదే పదే తనది కాని రక్తాన్ని అర్పించడానికి పరలోకంలోకి ప్రవేశించలేదు.
HEB 9:26 లేకపోతే ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండి అనేకసార్లు క్రీస్తు శ్రమపడాల్సి ఉండేది. అయితే తనను తాను బలిగా అర్పించుకోవడం ద్వారా ప్రజల అపరాధాలను పూర్తిగా కొట్టివేయాలని అన్ని యుగాల కోసం ఒక్కసారే ఆయన ప్రత్యక్షమయ్యాడు.
HEB 9:27 మనుష్యులు ఒక్కసారే చనిపోవాలని, ఆ తర్వాత తీర్పును పొందాలని నియమించబడిన ప్రకారం,
HEB 9:28 అనేకుల పాపాలను తొలగించడానికి క్రీస్తు కూడా ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు; పాపాన్ని భరించడానికి కాకుండా, తన కొరకై వేచి ఉన్నవారిని రక్షించడానికి ఆయన రెండవసారి వస్తారు.
HEB 10:1 ధర్మశాస్త్రం రాబోయే మంచి విషయాల నీడ మాత్రమే కాని నిజ స్వరూపం కాదు. ప్రతి సంవత్సరం అర్పించే అవే బలుల ద్వార అది, ఆరాధించడానికి వచ్చేవారిని పరిపూర్ణులను చేయలేదు.
HEB 10:2 లేకపోతే, వారు బలులు అర్పించడం మానేసేవారు కాదా? ఎందుకంటే ఆరాధించేవారు ఒక్కసారే శుద్ధి చేయబడ్డారు, ఇక అప్పటినుండి వారికి పాపాల గురించి ఇకపై అపరాధ మనస్సాక్షి లేదు.
HEB 10:3 అయితే ఆ బలులు ప్రతి సంవత్సరం పాపాల గురించి వారికి గుర్తు చేసేవిగా ఉండేవి.
HEB 10:4 ఎడ్ల మేకల రక్తానికి పాపాలను తొలగించడం అసాధ్యము.
HEB 10:5 అందుకని, క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు ఇలా అన్నారు: “బలిని అర్పణను మీరు కోరలేదు, కాని మీరు నాకొక శరీరాన్ని సిద్ధపరచారు;
HEB 10:6 దహనబలులతో పాపపరిహార బలులతో మీరు సంతోషించలేదు.
HEB 10:7 అప్పుడు నేను ఇలా అన్నాను, ‘ఇదిగో నేను ఉన్నాను; గ్రంథపుచుట్టలో నా గురించి వ్రాయబడినట్లు నా దేవా, మీ చిత్తం చేయడానికి నేను వచ్చాను.’ ”
HEB 10:8 ఆయన మొదట ఇలా అన్నారు, “బలులు, అర్పణలు, దహనబలులు, పాపపరిహార బలులను కోరలేదు, అవి ధర్మశాస్త్ర ప్రకారమే అర్పించబడినప్పటికి వాటిని బట్టి మీరు సంతోషించలేదు.”
HEB 10:9 తర్వాత ఆయన, “నేను ఇక్కడే ఉన్నాను, మీ చిత్తం చేయడానికి నేను వచ్చాను” అని చెప్పాడు. ఆయన రెండవదానిని స్థాపించడానికి మొదటి దానిని ప్రక్కన పెడతాడు.
HEB 10:10 ఆ చిత్తాన్ని బట్టి, యేసు క్రీస్తు శరీరాన్ని అందరి కోసం ఒక్కసారే అర్పించుట ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడ్డాము.
HEB 10:11 ప్రతిదినం ప్రతి యాజకుడు నిలబడి మతపరమైన విధులు నిర్వర్తిస్తాడు; పాపాలను ఎన్నటికిని తీసివేయలేని అదే బలులను పదే పదే అర్పిస్తాడు.
HEB 10:12 అయితే ఈ యాజకుడు పాపాల కోసం అన్ని కాలాలకు ఒకే ఒక బలిని అర్పించి, దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు,
HEB 10:13 ఆ సమయం నుండి తన శత్రువులు తన పాదపీఠంగా చేయబడేవరకు ఆయన అక్కడ వేచి ఉంటాడు.
HEB 10:14 పరిశుద్ధులుగా చేయబడిన వారిని, ఒకే ఒక బలి ద్వారా ఆయన శాశ్వతంగా పరిపూర్ణులను చేశాడు.
HEB 10:15 పరిశుద్ధాత్మ కూడా దీనిని గురించి మనకు సాక్ష్యమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు:
HEB 10:16 “ఆ కాలం తర్వాత నేను వారితో చేసే నిబంధన ఇదే అని ప్రభువు చెప్పారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను.”
HEB 10:17 ఆయన ఇంకా ఇలా అన్నారు: “వారి పాపాలను, అధర్మ క్రియలను నేను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.”
HEB 10:18 ఇవి క్షమింపబడినప్పడు, పాప పరిహారానికి ఇక బలి అవసరం ఉండదు.
HEB 10:19 కాబట్టి, సహోదరీ సహోదరులారా, యేసు తన శరీరమనే తెర ద్వారా మన కోసం తెరవబడిన సజీవమైన ఒక క్రొత్త మార్గం ద్వారా,
HEB 10:20 యేసు రక్తాన్ని బట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తామనే నమ్మకాన్ని మనం కలిగి ఉన్నాము.
HEB 10:21 దేవుని గృహంపైన ఒక గొప్ప యాజకుని మనం కలిగి ఉన్నాము.
HEB 10:22 విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగిన యథార్థ హృదయంతో, అపరాధ మనస్సాక్షి నుండి శుద్ధి చేయబడిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుని సమీపిద్దాము.
HEB 10:23 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకుందాము.
HEB 10:24 ప్రేమ మంచిపనుల పట్ల మనం ఒకరినొకరం ఎలా ప్రేరేపించవచ్చో ఆలోచిద్దాం,
HEB 10:25 కొందరు అలవాటుగా మానివేసినట్లుగా, మనం కలవడం మానివేయకుండా, ఆ దినం సమీపించడం మీరు చూసినప్పుడు ఇంకా ఎక్కువగా కలుసుకొంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాము.
HEB 10:26 సత్యం మనకు తెలియజేయబడిన తర్వాత కూడా ఒకవేళ మనం పాపాలు చేస్తూనే ఉంటే, ఆ పాపాలను తొలగించగల బలి ఏది లేదు,
HEB 10:27 అయితే తీర్పు కోసం, దేవుని శత్రువులను దహించబోయే ప్రచండమైన అగ్ని కోసం మాత్రమే భయంతో ఎదురుచూడడం మిగిలి ఉంటుంది.
HEB 10:28 మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినవారు ఎవరైనా సరే ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల సాక్ష్యాన్ని బట్టి దయ లేకుండా చంపివేయబడ్డారు.
HEB 10:29 అలాంటప్పుడు దేవుని కుమారుని తమ పాదాల క్రింద త్రొక్కినవారు, తమను పరిశుద్ధపరచే నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదానిగా భావించినవారు, కృప గల ఆత్మను అవమానించినవారు ఎంత గొప్ప తీవ్రమైన శిక్షను పొందుతారో మీరు ఊహించగలరా?
HEB 10:30 “పగ తీర్చుకోవడం నా పని, నేను ప్రతిఫలాన్ని ఇస్తాను” అని, మరలా, “ప్రభువు, తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అని చెప్పిన వాడు మనకు తెలుసు.
HEB 10:31 సజీవుడైన దేవుని చేతుల్లో పడడం మహా భయంకరమైన విషయము.
HEB 10:32 మీరు వెలుగును పొందిన తర్వాత, అనేక శ్రమలతో నిండిన గొప్ప పోరాటాన్ని మీరు ఓర్చుకున్న ప్రారంభపు రోజులను జ్ఞాపకం చేసుకోండి.
HEB 10:33 కొన్నిసార్లు మీరు బహిరంగంగా అవమానపరచబడ్డారు, హింసించబడ్డారు; మరికొన్నిసార్లు మీరు అలాంటివి అనుభవించిన వారితో పాలివారయ్యారు.
HEB 10:34 చెరసాలలో వేయబడిన వారితో పాటు మీరు శ్రమ అనుభవించారు, మీ ఆస్తులను దోచుకున్నా సంతోషంగా స్వీకరించారు, వాటికంటే శాశ్వతంగా నిలిచే మరింత మేలైన ఆస్తులను కలిగి ఉన్నారని మీకు తెలుసు కాబట్టి మీరు వాటిని భరించారు.
HEB 10:35 కాబట్టి మీ ధైర్యాన్ని కోల్పోవద్దు; దానికి మీరు గొప్ప ఫలాన్ని పొందుతారు.
HEB 10:36 దేవుని చిత్తాన్ని చేసేప్పుడు మీరు పట్టుదలగా ఉండడం అవసరం, ఆయన వాగ్దానం చేసిన దాన్ని మీరు పొందుకుంటారు.
HEB 10:37 “ఎందుకంటే ఇంకాసేపట్లో, రాబోయేవాడు వస్తాడు ఆలస్యం చేయడు.”
HEB 10:38 ఇంకా, “నా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. అయితే వెనుతిరిగే వానిని బట్టి నా హృదయం ఏమాత్రం ఆనందించదు.”
HEB 10:39 అయితే మనం వెనుతిరిగి నశించేవారితో లేము, కానీ విశ్వాసం కలిగి, తమ ఆత్మలను కాపాడుకునేవారితో ఉన్నాము.
HEB 11:1 విశ్వాసమనేది మనం ఎదురు చూసే వాటిని గురించిన నమ్మకం, మన కళ్లముందు లేనివాటిని గురించిన నిశ్చయత.
HEB 11:2 దీనిని బట్టి పూర్వికులు మెప్పుపొందారు.
HEB 11:3 దేవుని ఆజ్ఞ చేత సృష్టి రూపించబడింది, కాబట్టి కనిపించే వాటినుండి కనిపిస్తున్నవి చేయబడలేదని విశ్వాసం ద్వారా మనం గ్రహిస్తున్నాము.
HEB 11:4 విశ్వాసం ద్వారానే హేబెలు కయీను కంటే ఉత్తమమైన అర్పణను దేవునికి తెచ్చాడు. విశ్వాసం ద్వారానే అతడు నీతిమంతునిగా ప్రశంసించబడ్డాడు. దేవుడు అతని అర్పణను మెచ్చుకొన్నాడు. చనిపోయినప్పటికి విశ్వాసం ద్వారానే హేబెలు ఇంకా మాట్లాడుతున్నాడు.
HEB 11:5 విశ్వాసం ద్వారానే హనోకు ఈ జీవితంలో మరణాన్ని పొందకుండానే కొనిపోబడ్డాడు; “దేవుడు అతన్ని తీసుకెళ్లారు కాబట్టి అతడు కనబడలేదు.” అతడు కొనిపోబడక ముందు అతడు దేవుని సంతోషపెట్టినవానిగా ప్రశంసించబడ్డాడు.
HEB 11:6 విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం ఎందుకంటే, దేవుని దగ్గరకు వచ్చే ప్రతివాడు దేవుడు ఉన్నాడని, తన కోసం ఆసక్తితో వెదకేవారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి.
HEB 11:7 విశ్వాసం ద్వారానే నోవహు అప్పటివరకు చూడనివాటి గురించి హెచ్చరించబడి పవిత్ర భయం కలిగినవాడై తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను నిర్మించాడు. తన విశ్వాసం వల్లనే అతడు లోకాన్ని ఖండిస్తూ విశ్వాసంతో కొనసాగుతూ నీతికి వారసుడయ్యాడు.
HEB 11:8 విశ్వాసం ద్వారానే అబ్రాహాము, తాను స్వాస్థ్యంగా పొందబోతున్న ప్రదేశానికి వెళ్లమని పిలువబడినపుడు ఆ పిలుపుకు లోబడి తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియకపోయినా అతడు బయలుదేరి వెళ్లాడు.
HEB 11:9 విశ్వాసం ద్వారానే దేవుడు తనకు వాగ్దానం చేసిన దేశంలో పరదేశిలా గుడారంలో నివసించాడు, అతనితో పాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు యాకోబులు కూడా అలాగే చేశారు.
HEB 11:10 ఎందుకంటే అతడు ఎదురుచూస్తున్నది పునాదులుగల పట్టణం కోసం, దానికి దేవుడే శిల్పి నిర్మాణకుడు.
HEB 11:11 వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని శారా నమ్మింది కాబట్టి శారాకు పిల్లలను కనే వయస్సు దాటిపోయినా, విశ్వాసం ద్వారానే ఆమె బిడ్డను కనగలిగింది.
HEB 11:12 చనిపోయినవానితో సమానమైన ఈ ఒక్క మనుష్యుని నుండే ఆకాశంలోని నక్షత్రాల సంఖ్యలా, సముద్రతీరంలోని ఇసుక రేణువుల్లా లెక్కకు మించిన సంతానం కలిగింది.
HEB 11:13 వీరందరు చనిపోయినా, విశ్వాసం ద్వారానే ఇంకా జీవిస్తున్నారు. వాగ్దానం చేసిన వాటిని వారు పొందలేదు; వారు కేవలం దూరం నుండి చూసి వాటిని ఆహ్వానించి, ఈ భూమిపై తాము విదేశీయులమని అపరిచితులమని ఒప్పుకున్నారు.
HEB 11:14 అలాంటి విషయాలు చెప్పే ప్రజలు తమ స్వదేశం కోసం చూస్తున్నారని స్పష్టం చేస్తారు.
HEB 11:15 వారు తాము వదిలి వచ్చిన దేశం గురించి ఆలోచిస్తూ ఉంటే, వారు తిరిగి వెళ్లడానికి అవకాశం కలిగి ఉండేవారు.
HEB 11:16 అయితే, వారు అంతకంటే ఉత్తమమైన దేశాన్ని అంటే పరలోకసంబంధమైన దేశం కోసం ఆరాటపడ్డారు. కాబట్టి వారి దేవున్ని వారి చేత పిలిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. ఎందుకంటే ఆయన వారికి ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు.
HEB 11:17 దేవుడు అబ్రాహామును పరీక్షించినపుడు, విశ్వాసం ద్వారానే అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడు. “ఇస్సాకు మూలంగానే నీ సంతానం లెక్కించబడుతుంది” అని దేవుడు అతనితో చెప్పినప్పటికి, వాగ్దానాలను పొందిన అబ్రాహాము తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. చనిపోయినవారిని సహితం లేపడానికి దేవుడు శక్తిమంతుడని అబ్రాహాము భావించాడు, దానిని ఉపమానరీతిలో చెప్పాలంటే అతడు తన కుమారుడైన ఇస్సాకును మరణం నుండి తిరిగి పొందుకున్నాడు.
HEB 11:20 విశ్వాసం ద్వారానే ఇస్సాకు తన సంతానమైన యాకోబు ఏశావులను వారి భవిష్యత్తు గురించి ఆశీర్వదించాడు.
HEB 11:21 విశ్వాసం ద్వారానే యాకోబు తాను చనిపోయే సమయంలో యోసేపు కుమారులలో అందరిని ఆశీర్వదించి, తన చేతికర్ర మీద ఆనుకుని ఆరాధించాడు.
HEB 11:22 విశ్వాసం ద్వారానే యోసేపు తాను చనిపోయే సమయంలో ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయుల ప్రయాణం గురించి చెప్పి, తన ఎముకలను సమాధి చేయమని ఆదేశాలిచ్చాడు.
HEB 11:23 విశ్వాసం ద్వారానే మోషే తల్లిదండ్రులు అతడు పుట్టిన తర్వాత మూడు నెలల వరకు దాచి ఉంచారు, ఎందుకంటే అతడు సాధారణమైన బాలుడు కాడని వారు గ్రహించారు, రాజాజ్ఞకు వారు భయపడలేదు.
HEB 11:24 విశ్వాసం ద్వారానే మోషే, పెరిగి పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోడానికి నిరాకరించాడు.
HEB 11:25 అతడు అశాశ్వతమైన పాపభోగాలను అనుభవించేకంటే దేవుని ప్రజలతో పాటు శ్రమ పొందడాన్ని ఎంచుకున్నాడు.
HEB 11:26 క్రీస్తు కొరకైన అవమానాన్ని ఈజిప్టు ధనం కన్నా గొప్ప విలువైనదిగా భావించాడు, ఎందుకంటే అతడు తన బహుమానం కోసం ఎదురు చూస్తున్నాడు.
HEB 11:27 విశ్వాసం ద్వారానే మోషే, రాజు కోపాన్ని లెక్కచేయక, ఈజిప్టును విడిచి వెళ్లాడు; అతడు కనిపించని దేవుని చూస్తూ పట్టువదలక సాగిపోయాడు.
HEB 11:28 అతడు విశ్వాసం ద్వారానే, పస్కాను ఆచరించి ఆ పస్కా బలి పశువు రక్తాన్ని పూయడం వలన జ్యేష్ఠ సంతానాన్ని సంహరించే మరణ దూత, ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ సంతానాన్ని ముట్టకుండా చేశాడు.
HEB 11:29 విశ్వాసం ద్వారానే ప్రజలు ఎర్ర సముద్రంలో ఆరిన నేలపై నడిచివెళ్లారు; అయితే ఈజిప్టువారు అలాగే నడిచి వారి వెనుక వెళ్లడానికి ప్రయత్నించి, మునిగిపోయారు.
HEB 11:30 విశ్వాసం ద్వారానే ఇశ్రాయేలు సైన్యం యెరికో గోడల చుట్టూ ఏడు రోజులు తిరుగగా, యెరికో గోడలు కూలిపోయాయి.
HEB 11:31 విశ్వాసం ద్వారానే వేశ్యయైన రాహాబు, గూఢచారులను అతిథులుగా స్వీకరించింది కాబట్టి అవిధేయులతో పాటు చంపబడకుండా రక్షించబడింది.
HEB 11:32 ఇంకా నేనేం చెప్పాలి? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనేవారి గురించి, ప్రవక్తల గురించి వివరించడానికి నాకు సమయం లేదు.
HEB 11:33 వారు విశ్వాసం ద్వారానే రాజ్యాలను జయించారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానఫలాన్ని పొందారు, సింహాల నోళ్లను మూయించారు,
HEB 11:34 తీవ్రమైన అగ్ని జ్వాలలను చల్లార్చారు, ఖడ్గపు అంచు నుండి తప్పించుకున్నారు; వారికి వారి బలహీనతే బలంగా మార్చబడింది; వారు యుద్ధాలలో మహాశక్తివంతులై శత్రు సైన్యాలను ఓడించారు.
HEB 11:35 కొందరు స్త్రీలు చనిపోయిన తమ వారిని తిరిగి సజీవులుగా పొందారు. హింసించబడినవారు ఇంకా కొందరు దేవునితో శ్రేష్ఠమైన పునరుత్థానాన్ని పొందడానికి ఆ హింసను తప్పించుకోలేదు.
HEB 11:36 కొందరు ఎగతాళిచేయబడి కొరడా దెబ్బలు తిన్నారు, సంకెళ్ళతో బంధించబడ్డారు.
HEB 11:37 వారు చంపబడటానికి రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలచేత భాగాలుగా కోయబడ్డారు, కత్తితో చంపబడ్డారు. గొర్రెల మేకల చర్మాలను కప్పుకుని, శ్రమలు హింసలు పొందుతూ దరిద్రుల్లా బాధలు అనుభవించారు.
HEB 11:38 ఈ లోకం వారికి యోగ్యమైనది కాదు. వారు ఎడారుల్లో, పర్వతాల్లో, గుహల్లో, సొరంగాల్లో తిరుగుతూ జీవించారు.
HEB 11:39 వీరందరు వారి విశ్వాసం ద్వారానే ఎంతో మెప్పుపొందినా కాని దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు పొందలేదు,
HEB 11:40 ఎందుకంటే, కేవలం మనతో మాత్రమే కలిపి వారిని పరిపూర్ణులుగా చేయడానికి దేవుడు మన కోసం మరింత ఉన్నతమైన ప్రణాళిక నిర్ణయించారు.
HEB 12:1 కాబట్టి, ఇంత గొప్ప సాక్షిసమూహం మన చుట్టూ ఆవరించి ఉంది కాబట్టి, మనకు ఆటంకం కలిగించే సమస్తాన్ని, సుళువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెడదాము. విశ్వాసానికి కర్తయైన దాన్ని పరిపూర్ణం చేసేవాడైన యేసువైపు చూస్తూ,
HEB 12:2 మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం సిలువను భరించి దానివల్ల కలిగే అవమానాలను లక్ష్యపెట్టక, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చుని ఉన్నారు.
HEB 12:3 పాపుల నుండి అలాంటి వ్యతిరేకతను భరించిన వ్యక్తిని గురించి ఆలోచించండి, తద్వారా మీరు అలసట చెందరు, మీ హృదయాలు క్రుంగిపోవు.
HEB 12:4 మీరు పాపంతో పోరాడటంలో మీ రక్తం చిందేంతగా ప్రతిఘటించలేదు.
HEB 12:5 తండ్రి తన కుమారునితో మాట్లాడినట్లుగా ఆయన మీతో ప్రోత్సాహకరంగా మాట్లాడిన మాటలను పూర్తిగా మరచిపోయారా? అవి ఇలా చెప్తున్నాయి, “నా కుమారుడా, ప్రభువు క్రమశిక్షణను చులకనగా చూడకు, ఆయన నిన్ను గద్దించినపుడు నీవు నిరాశ చెందకు,
HEB 12:6 ఎందుకంటే, ప్రభువు తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు, తన కుమారునిగా అంగీకరించిన ప్రతివారికి ఆయన శిక్షణనిస్తారు.”
HEB 12:7 మీరు పొందే బాధలన్నిటిని క్రమశిక్షణగా సహించండి; ఎందుకంటే దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా భావిస్తున్నాడు. తమ తండ్రిచేత క్రమశిక్షణ పొందని కుమారుడెవడు?
HEB 12:8 అందరు క్రమశిక్షణ పొందినట్లు మీరు క్రమశిక్షణ పొందకపోతే చట్టబద్ధమైన సంతానం అవ్వరు మీరు నిజమైన కుమారులు కుమార్తెలు కారు.
HEB 12:9 మనల్ని క్రమశిక్షణలో పెంచిన మానవ తండ్రులను మనమందరం కలిగి ఉన్నాం, ఈ విషయంలో వారిని గౌరవిస్తాము. అలాగే ఆత్మలకు తండ్రియైన దేవునికి మనం ఇంకా ఎంత అధికంగా లోబడి జీవించాలి!
HEB 12:10 తాము మంచిదని తలంచిన విధంగా మన తండ్రులు కొంతకాలం మనల్ని క్రమశిక్షణలో పెంచారు కాని దేవుడు తన పరిశుద్ధతలో మనం పాలుపంచుకోవడానికి మన మేలు కొరకే ఆ క్రమశిక్షణలో ఉంచాడు.
HEB 12:11 ఆ సమయంలో ఏ క్రమశిక్షణా ఆనందంగా అనిపించదు కాని బాధగా అనిపిస్తుంది. కాని దాని ద్వారా శిక్షణ పొందినవారు నీతి సమాధానం అనే పంట కోస్తారు.
HEB 12:12 కాబట్టి, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి.
HEB 12:13 కుంటివారు పడిపోకుండా వారు స్వస్థత పొందేలా, “మీ పాదాల కోసం సమమైన మార్గాలను తయారుచేయండి.”
HEB 12:14 అందరితో సమాధానం కలిగి జీవించడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేయండి; పరిశుద్ధత లేకుండ ఎవరు ప్రభువును చూడలేరు.
HEB 12:15 దేవుని కృపను పొందడంలో ఎవరు తప్పిపోకుండా, చేదైన వేరు మొలిచి మిమ్మల్ని కలవరపరచి అనేకమందిని అపవిత్రులుగా చేయకుండా జాగ్రత్తపడండి.
HEB 12:16 లైంగిక అనైతికతను సాగించేవారు గాని ఒక్కపూట తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావులాంటి దైవభక్తిలేని వారు గాని మీలో లేకుండ జాగ్రత్తపడండి.
HEB 12:17 ఆ తర్వాత ఏశావు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని అనుకున్నప్పుడు అతడు పొందలేక పోయాడని మీకు తెలుసు. ఎందుకంటే అతడు పశ్చాత్తాపపడేప్పటికి చాలా ఆలస్యమైంది. అతడు కన్నీటితో వెదకినా, తాను చేసిన దాన్ని మార్చలేకపోయాడు.
HEB 12:18 తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు అది అగ్నితో మండుతుంది; చీకటి, కారు మబ్బు, తుఫాను;
HEB 12:19 ఒక బూర శబ్దం లేదా అలాంటి గంభీరస్వరంతో మాట్లాడే చోటుకు మీరు రాలేదు. ఆ స్వరం యొక్క మాటలు విన్న వారు తమతో ఇంకొక్క మాట మాట్లాడకూడదని బ్రతిమాలుకొన్నారు,
HEB 12:20 “ఒకవేళ ఒక జంతువైనా ఆ పర్వతాన్ని తాకితే, రాళ్లతో కొట్టబడి చంపబడాలి” అని ఇవ్వబడిన ఆజ్ఞను వారు భరించలేకపోయారు.
HEB 12:21 ఆ దృశ్యం చాలా భయానకం కాబట్టి మోషే, “నేను భయంతో వణుకుతున్నాను” అన్నాడు.
HEB 12:22 అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు.
HEB 12:23 పరలోకంలో పేర్లు వ్రాయబడి ఉన్న దేవుని జ్యేష్ఠ సంతానమనే సంఘానికి మీరు వచ్చారు. మనుష్యులందరికి న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు, నిర్దోషులుగా తీర్చబడిన నీతిమంతుల్లా పరిపూర్ణత పొందిన ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు.
HEB 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు దగ్గరకు, హేబెలు రక్తంకంటే ఉత్తమంగా మాట్లాడే చిందించబడిన రక్తం దగ్గరకు మీరు వచ్చారు.
HEB 12:25 మాట్లాడుతున్నవానిని మీరు తిరస్కరించకుండా చూసుకోండి. భూమి మీద హెచ్చరించిన వానిని తిరస్కరించినవారు తప్పించుకోలేకపోతే, ఇక పరలోకం నుండి మనల్ని హెచ్చరించే వానిని మనం తిరస్కరిస్తే, మనమెలా తప్పించుకోగలం?
HEB 12:26 ఆ సమయంలో ఆయన స్వరానికి భూమి కంపించింది, కాని ఆయన ఇప్పుడు, “మరోసారి నేను భూమిని మాత్రమే కాక పరలోకాన్ని కూడ కంపింపజేస్తాను” అని వాగ్దానం చేశాడు.
HEB 12:27 “ఇంకొకసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండేలా కదిలింపబడేవి అంటే సృష్టింపబడినవి తీసివేయబడతాయి అని అర్థాన్నిస్తుంది.
HEB 12:28 మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకొంటున్నాం కాబట్టి, కృతజ్ఞతగలవారమై, భయభక్తులతో ఆమోదయోగ్యమైన రీతిలో దేవుని ఆరాధిద్దాం,
HEB 12:29 ఎందుకంటే మన “దేవుడు దహించు అగ్ని.”
HEB 13:1 సహోదరీ సహోదరులుగా, ఒకరిని ఒకరు ఎల్లప్పుడు ప్రేమిస్తూ ఉండండి.
HEB 13:2 క్రొత్తవారికి ఆతిథ్యం ఇవ్వడం మరువవద్దు, ఎందుకంటే క్రొత్తవారికి ఆతిథ్యం ఇస్తుండడం వలన కొందరు తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చారు.
HEB 13:3 చెరసాలలో ఉన్నవారిని మీరు కూడా వారితో పాటు చెరసాలలో ఉన్నట్లుగా, బాధలుపడుతున్న వారితో మీరు కూడా ఆ బాధల్లో వారితో ఉన్నట్లుగా వారిని జ్ఞాపకం చేసుకోండి.
HEB 13:4 పెళ్ళి అందరిచేత గౌరవించబడాలి, పెళ్ళి పాన్పు శుద్ధమైనదిగా ఉండాలి, ఎందుకంటే దేవుడు వ్యభిచారులను లైంగిక అనైతికత గల వారందరిని తీర్పు తీరుస్తాడు.
HEB 13:5 మీ జీవితాలను ధన వ్యామోహానికి దూరంగా ఉంచండి, మీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందండి, ఎందుకంటే దేవుడు ఇలా అన్నాడు, “నేను నిన్ను ఎన్నడు విడిచిపెట్టను; నిన్ను ఎన్నడు త్రోసివేయను.”
HEB 13:6 కాబట్టి మనం ధైర్యంతో ఇలా చెబుదాం, “ప్రభువే నాకు సహాయకుడు; నేను భయపడను. నరమాత్రులు నన్నేమి చేయగలరు?”
HEB 13:7 దేవుని వాక్యాన్ని మీకు బోధించిన మీ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవిత విధానం వలన కలిగిన ఫలితాన్ని తెలుసుకోండి, వారి విశ్వాసాన్ని అనుకరించండి.
HEB 13:8 యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకే విధంగా ఉన్నాడు.
HEB 13:9 అన్ని రకాల వింత బోధలచేత దూరంగా వెళ్లిపోకండి. ఆచార సంబంధమైన ఆహారం తినడం వల్ల కాదు, కాని కృప చేత మన హృదయాలు బలపరచబడటం మంచిది; ఆచారాలను పాటించే వారికి ఏ ప్రయోజనం కలుగదు.
HEB 13:10 మనకు ఒక బలిపీఠం ఉంది, అయితే ప్రత్యక్షగుడారంలో పరిచర్య చేసేవారికి దాని నుండి తీసుకుని తినే అధికారం లేదు.
HEB 13:11 ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని పాపపరిహారబలిగా అతి పరిశుద్ధ స్థలం లోపలికి తీసుకెళ్తాడు, కాని వాటి శరీరాలు శిబిరం బయటే దహించబడతాయి.
HEB 13:12 కాబట్టి, యేసు కూడా తన రక్తం చేత ప్రజలను పాపాల నుండి శుద్ధి చేయడానికి పట్టణ ద్వారానికి బయటే బాధపడ్డాడు.
HEB 13:13 కాబట్టి మనం కూడా శిబిరం బయట ఉన్న ఆయన దగ్గరకు వెళ్లి ఆయన భరించిన అవమానాన్ని మనం కూడా భరిద్దాము.
HEB 13:14 ఎందుకంటే మనకు ఇక్కడ శాశ్వతమైన పట్టణం లేదు, అయితే రాబోతున్న పట్టణం కోసం మనం ఎదురుచూస్తున్నాము.
HEB 13:15 కాబట్టి, యేసు ద్వారా, ఆయన పేరును బహిరంగంగా ఒప్పుకునే పెదవుల ఫలంతో మనం నిరంతరం దేవునికి స్తుతి బలిని అర్పిద్దాము.
HEB 13:16 ఉపకారం చేయడం, ఇతరులతో పంచుకోవడం అనే యాగాలను చేయడం మరువకండి, ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైనవి.
HEB 13:17 మీ నాయకులపై నమ్మకం ఉంచండి, వారి అధికారానికి లోబడి ఉండండి, ఎందుకంటే వారు మీ ఆత్మలను గురించి లెక్క అప్పగించాల్సిన వారుగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వారు తమ పనిని భారంగా భావించి చేస్తే, మీకు ఏ ప్రయోజనం ఉండదు, కాబట్టి వారు చేయవలసిన పనిని భారంగా కాకుండా ఆనందంగా చేసేలా చూడండి.
HEB 13:18 మాకోసం ప్రార్థించండి. మేము అన్ని విధాలుగా గౌరవప్రదంగా జీవించాలనే ఆశ కలిగి స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముతున్నాము.
HEB 13:19 త్వరలో నేను మిమ్మల్ని కలుసుకొనేలా నా కోసం ప్రార్థించమని మిమ్మల్ని ప్రత్యేకంగా బ్రతిమాలుతున్నాను.
HEB 13:20 నిత్య నిబంధన యొక్క రక్తం ద్వారా గొర్రెల గొప్ప కాపరియైన, ప్రభువైన యేసును మృతులలో నుండి తిరిగి వెనుకకు తెచ్చిన సమాధానకర్తయైన దేవుడు,
HEB 13:21 తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి మంచిదానితో మిమ్మల్ని సిద్ధపరచును గాక, ఆయనకు ఇష్టమైనదాన్ని యేసు క్రీస్తు ద్వారా ఆయన మనలో జరిగించుగాక, ఆయనకే నిరంతరం మహిమ కలుగును గాక ఆమేన్.
HEB 13:22 సహోదరీ సహోదరులారా! నా హెచ్చరిక మాటను భరించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను, వాస్తవానికి నేను మీకు చాలా క్లుప్తంగా వ్రాశాను.
HEB 13:23 మన సహోదరుడైన తిమోతి చెరసాల నుండి విడుదల అయ్యాడని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అతడు త్వరగా వస్తే, నేను మిమ్మల్ని చూడడానికి అతనితో కలిసి వస్తాను.
HEB 13:24 మీ నాయకులందరికి, పరిశుద్ధులందరికి వందనాలు తెలియజేయండి. ఇటలీ దేశపు సహోదరులు మీకు వందనాలు తెలియజేస్తున్నారు.
HEB 13:25 కృప మీ అందరితో ఉండును గాక.
JAM 1:1 దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు సేవకుడనైన యాకోబు,
JAM 1:2 నా సహోదరీ సహోదరులారా, మీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలవల్ల ఓర్పు వస్తుందని మీకు తెలుసు కాబట్టి,
JAM 1:3 మీకు ఎప్పుడైనా ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని బట్టి సంతోషించండి.
JAM 1:4 మీరు పరిణతి చెంది సంపూర్ణులై ఏ విషయంలో కొదువలేనివారై ఉండేలా పట్టుదల తన పనిని చేయనివ్వండి.
JAM 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవున్ని అడగాలి, ఆయన తప్పులను ఎంచకుండా అందరికి ధారాళంగా ఇస్తారు.
JAM 1:6 మీరు అడిగినప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగండి ఎందుకంటే, సందేహించేవారు గాలికి రేగి ఎగసిపడే సముద్రపు అలల్లాంటివారు;
JAM 1:7 కాబట్టి వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు.
JAM 1:8 అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగి ఉంటారు, తాము చేసేవాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు.
JAM 1:9 దీనస్థితిలో ఉన్న విశ్వాసులు తమకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి అతిశయించాలి.
JAM 1:10 అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే వారు గడ్డి పువ్వులా కనుమరుగవుతారు.
JAM 1:11 కాల్చివేసే వేడిమితో సూర్యుడు ఉదయించినప్పుడు గడ్డి వాడిపోతుంది; దాని పువ్వు రాలిపోతుంది, దాని అందం నశించిపోతుంది; ధనవంతుల పట్ల కూడా అలాగే జరుగుతుంది; తమ తీరికలేని జీవితం మధ్యలో వారు వాడిపోతారు.
JAM 1:12 శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు.
JAM 1:13 దేవుడు కీడు చేత శోధించబడడు; ఆయన ఎవరిని శోధించడు కాబట్టి ఎవరికైనా శోధన ఎదురైతే, “నేను దేవుని చేత శోధించబడుతున్నాను” అని అనకూడదు.
JAM 1:14 ఒకరు తమ సొంత కోరికతోనే ఆకర్షించబడి వాటి ద్వారా ప్రలోభాలకు గురై శోధించబడతారు.
JAM 1:15 చెడు కోరిక గర్భాన్ని ధరించి పాపానికి జన్మనిస్తుంది, ఆ పాపం పండి మరణానికి జన్మనిస్తుంది.
JAM 1:16 నా ప్రియ సహోదరీ సహోదరులారా, మోసపోకండి.
JAM 1:17 పైనుండి వచ్చే ప్రతీ శ్రేష్ఠమైన సంపూర్ణమైన బహుమానం వెలుగును కలిగించిన తండ్రి దగ్గర నుండి క్రిందకు వస్తున్నాయి, ఆయన ఒకచోట నిలబడని నీడల్లా ఎన్నడు మారరు.
JAM 1:18 ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు.
JAM 1:19 నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు దీనిని గ్రహించాలి: ప్రతి ఒక్కరు వినడానికి తొందరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, అలాగే తొందరపడి కోపపడవద్దు;
JAM 1:20 ఎందుకంటే మీ కోపం దేవుని నీతిని జరిగించదు.
JAM 1:21 కాబట్టి మీ జీవితాల్లోని సమస్త మలినాన్ని చెడును వదిలిపెట్టి, దేవుడు మీ హృదయాల్లో నాటిన వాక్యాన్ని వినయంతో అంగీకరించండి, ఎందుకంటే మీ ఆత్మలను రక్షించే శక్తి దానికే ఉంది.
JAM 1:22 మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాక్యం చెప్పేది చేయండి.
JAM 1:23 ఎవరైతే వాక్యాన్ని విని అది చెప్పిన ప్రకారం చేయరో, వారు తమ ముఖాన్ని అద్దంలో చూసుకునే వారిలా ఉంటారు;
JAM 1:24 వారు తమను చూసుకొని ప్రక్కకు వెళ్లిన వెంటనే తాము ఎలా ఉన్నారో మరచిపోతారు.
JAM 1:25 అయితే స్వాతంత్ర్యాన్ని ఇచ్చే సంపూర్ణమైన ధర్మశాస్త్రంలోనికి పరిశీలనగా చూసి దానిలో కొనసాగేవారు, విని మరచేవారిగా ఉండకుండా అది చెప్పిన ప్రకారం చేస్తారు; వారు తాము చేసిన దానిలో దీవించబడతారు.
JAM 1:26 తాము భక్తిపరులమని భావిస్తూ తమ నాలుకను అదుపులో పెట్టుకోనివారు తమ హృదయాలను తామే మోసం చేసుకుంటారు. అలాంటివారి భక్తి విలువలేనిది.
JAM 1:27 తండ్రియైన దేవుని దృష్టిలో పవిత్రమైన నిష్కళంకమైన ధర్మం ఏంటంటే: అనాధలను, ఇబ్బందుల్లో ఉన్న విధవరాండ్రను సంరక్షించడం, లోక మాలిన్యం అంటకుండా తమను కాపాడుకోవడము.
JAM 2:1 నా సహోదరీ సహోదరులారా, మహిమగల మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసం గలవారిగా పక్షపాతం చూపకండి.
JAM 2:2 బంగారు ఉంగరాలు, విలువైన బట్టలు వేసుకున్న ధనవంతుడు, అలాగే మురికిబట్టలు వేసుకున్న పేదవాడు మీ సంఘానికి వచ్చినప్పుడు,
JAM 2:3 విలువైన బట్టలు వేసుకున్న ధనవంతుడిని ప్రత్యేకంగా గమనించి, “దయచేసి ఇక్కడ కూర్చోండి” అని చెప్పి, పేదవానితో “అక్కడ నిలబడు” అని “నా కాళ్ల దగ్గర కూర్చో” అని చెబితే,
JAM 2:4 మీరు వ్యత్యాసాలు చూపిస్తూ దుర్మార్గపు ఆలోచనలతో విమర్శించినవారు అవుతారు కదా?
JAM 2:5 నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. దేవుడు తనను ప్రేమించినవారికి వాగ్దానం చేసిన ప్రకారం విశ్వాసంలో ధనవంతులుగా ఉండడానికి, తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఈ లోకంలో పేదవారిని దేవుడు ఎంచుకోలేదా?
JAM 2:6 అయితే మీరు పేదవారిని అవమానించారు. మీకు అన్యాయం చేసింది ధనవంతులు కాదా? మిమ్మల్ని న్యాయస్థానానికి లాగింది వారు కాదా?
JAM 2:7 మిమ్మల్ని పిలిచిన దేవుని ఘనమైన నామాన్ని దూషించింది వాళ్ళు కాదా?
JAM 2:8 “మీలా మీ పొరుగువారిని ప్రేమించాలి” అని లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీ ప్రవర్తన సరిగా ఉన్నట్లే.
JAM 2:9 అయితే మీరు పక్షపాతం చూపిస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు అపరాధులుగా నిర్ధారించబడి పాపం చేసినవారవుతారు.
JAM 2:10 ఎవరైనా ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలను పాటించి ఒకే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినప్పటికి వారు అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధులు అవుతారు.
JAM 2:11 “వ్యభిచారం చేయకూడదు,” అని చెప్పిన దేవుడు, “మీరు హత్య చేయకూడదు” అని కూడా చెప్పారు. నీవు వ్యభిచారం చేయకపోయినా నరహత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే.
JAM 2:12 కాబట్టి మీరు స్వాతంత్ర్యాన్ని ఇచ్చే ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు పొందబోయే వానిలా మాట్లాడాలి, అలాగే ప్రవర్తించాలి.
JAM 2:13 ఎందుకంటే దయచూపించనివారి మీద దయ చూపక తీర్పు తీర్చబడుతుంది; దయ తీర్పుపై జయం పొందుతుంది.
JAM 2:14 నా సహోదరీ సహోదరులారా, క్రియలు లేకుండా ఎవరైనా మాకు విశ్వాసం ఉందని చెప్తే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుందా?
JAM 2:15 ఒక సహోదరునికి గాని సహోదరికి గాని వేసుకోవడానికి బట్టలు తినడానికి తిండి లేనప్పుడు మీరు వారి శరీరాలకు అవసరమైనవి ఇవ్వకుండ వారితో, “సమాధానంతో వెళ్లి చలి కాచుకుని, తృప్తిగా తిను” అని చెప్తే ఏం ప్రయోజనం?
JAM 2:17 అలాగే క్రియలు లేకపోతే ఆ విశ్వాసం దానికదే మరణిస్తుంది.
JAM 2:18 అయితే ఎవరైనా, “నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి.” క్రియలు లేకుండా మీ విశ్వాసాన్ని నాకు చూపించు, నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని నీకు చూపిస్తానని చెప్పవచ్చు.
JAM 2:19 దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు అది మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుతాయి.
JAM 2:20 వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని నీకు రుజువులు కావాలా?
JAM 2:21 మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై అర్పించినప్పుడు తాను చేసిన దాన్ని బట్టి నీతిమంతుడని చెప్పబడలేదా?
JAM 2:22 అతని క్రియలు అతని విశ్వాసం కలిసి పని చేశాయి. అతడు చేసిన దాన్ని బట్టి అతని విశ్వాసం సంపూర్ణం అయ్యింది.
JAM 2:23 నెరవేరబడిన లేఖనాలు ఏమి చెప్తున్నాయంటే, “అబ్రాహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది” అనే లేఖనం నెరవేరింది. అలాగే అబ్రాహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు.
JAM 2:24 ఒక వ్యక్తి కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా అతని క్రియలనుబట్టి నీతిమంతునిగా పరిగణించడం మీరు చూశారు.
JAM 2:25 అలాగే వేశ్యయైన రాహాబు దూతలను ఆదరించి, వేరొక మార్గం గుండా వారిని పంపివేసినప్పుడు తాను చేసిన క్రియలనుబట్టి ఆమె నీతిమంతురాలిగా చెప్పబడలేదా?
JAM 2:26 ప్రాణం లేని శరీరం మరణించినట్లే క్రియలు లేని విశ్వాసం కూడా మరణిస్తుంది.
JAM 3:1 నా సహోదరీ సహోదరులారా, బోధకులమైన మనం అత్యంత కఠినంగా తీర్పు తీర్చబడతామని మీకు తెలుసు కాబట్టి మీలో అనేకమంది బోధకులుగా మారకండి.
JAM 3:2 మనమందరం అనేక విషయాల్లో తడబడతాము. మాట్లాడంలో తప్పులు చేయనివారు పరిపూర్ణులై శరీరమంతటిని ఒక కళ్లెంతో అదుపులో ఉంచుకోగల శక్తిని కలిగి ఉంటారు.
JAM 3:3 మనం గుర్రాలను లోబరచుకోవడానికి వాటి నోటికి కళ్లెం వేసి దాని ఆధారంగా వాటి శరీరమంతటిని త్రిప్పుతాము.
JAM 3:4 ఓడలను చూడండి; చాలా పెద్దగా ఉంటాయి, అవి బలమైన గాలికి కొట్టుకొనిపోతున్నా దానిని నడిపేవాని ఇష్ట ప్రకారం చాలా చిన్నగా ఉండే చుక్కాని సహాయంతో త్రిప్పబడుతుంది.
JAM 3:5 అలాగే నాలుక చిన్న అవయవమే కానీ అది అధికంగా ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పురవ్వ వల్ల ఎంతో పెద్ద అడవి కాల్చివేయబడుతుంది.
JAM 3:6 కాబట్టి నాలుక అగ్నిలాంటిది. నాలుక ఒక పాపాల పుట్టగా మన అవయవాల మధ్య ఉంచబడింది; అది శరీరమంతటిని పాడుచేస్తుంది, ప్రకృతి చక్రంలో చిచ్చు పెడుతుంది; నరకాగ్ని చేత దానికదే కాలిపోతుంది.
JAM 3:7 మృగాలను, పక్షులను, ప్రాకే ప్రాణులను, సముద్రపు జీవులను మానవజాతి అదుపుచేస్తుంది, అదుపుచేసింది.
JAM 3:8 కాని నిరంతరం చెడుచేస్తూ, మరణకరమైన విషంతో నిండిన నాలుకను ఎవరూ అదుపుచేయలేరు.
JAM 3:9 ఆ నాలుకతోనే తండ్రియైన దేవుని స్తుతిస్తాం, ఆ నాలుకతోనే దేవుని పోలికతో చేయబడిన వారిని శపిస్తాము.
JAM 3:10 ఒకే నోటి నుండి స్తుతి శాపాలు వస్తున్నాయి. నా సహోదరీ సహోదరులారా, మనం అలా ఉండకూడదు.
JAM 3:11 ఒక నీటి ఊటలో ఒకే చోట నుండి మంచినీరు ఉప్పునీరు వస్తాయా?
JAM 3:12 నా సహోదరీ సహోదరులారా, అంజూర చెట్టుకు ఒలీవల పండ్లు, ద్రాక్షతీగెలకు అంజూర పండ్లు కాస్తాయా? అదే విధంగా ఉప్పునీటి ఊట నుండి మంచినీరు రావు.
JAM 3:13 మీలో జ్ఞానం, గ్రహింపు కలవారు ఎవరు? జ్ఞానం వలన వచ్చిన సహనంతో మీ క్రియలను మీ మంచి ప్రవర్తన ద్వారా చూపించాలి.
JAM 3:14 అయితే మీ హృదయాల్లో తీవ్రమైన అసూయ, స్వార్థపూరితమైన దురాశలు ఉన్నప్పుడు గొప్పలు చెప్పుకోవద్దు, సత్యాన్ని తృణీకరించవద్దు.
JAM 3:15 అలాంటి జ్ఞానం పరలోక నుండి దిగివచ్చింది కాదు ఈ లోక సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది కాదు దయ్యాలకు సంబంధించిన జ్ఞానము.
JAM 3:16 ఎక్కడైతే అసూయ స్వార్థపూరితమైన దురాశలు ఉంటాయో అక్కడ ప్రతి విధమైన అక్రమాలు దుర్మార్గాలు ఉంటాయి.
JAM 3:17 పైనుండి వచ్చిన జ్ఞానం మొదట స్వచ్ఛంగా ఉంటుంది, తర్వాత శాంతికరంగా, సహనంతో, లోబడేదానిగా, దయతో నిండుకొని మంచి ఫలాలను కలిగి, పక్షపాతం కాని మోసం కాని లేనిదై ఉంటుంది.
JAM 3:18 శాంతిలో విత్తిన శాంతిని కలుగజేసినవారు నీతి అనే పంట కోస్తారు.
JAM 4:1 మీ మధ్యలో ఉన్న తగాదాలు, గొడవలు ఎక్కడ నుండి వచ్చాయి? మీలో పోరాడుతున్న దురాశల నుండి వచ్చినవే కదా?
JAM 4:2 మీరు కోరుకున్నదానిని పొందలేదు కాబట్టి మీరు హత్య చేస్తారు. మీరు ఆశపడిన దానిని సంపాదించుకోలేదు కాబట్టి మీరు పోరాటాలు, గొడవలు చేస్తారు. మీరు దేవుని అడగలేదు కాబట్టి మీరు పొందలేదు.
JAM 4:3 మీరు అడిగినప్పుడు మీ సంతోషాల కోసం ఉపయోగించుకోవాలనే దురుద్ధేశ్యంతో అడుగుతారు కాబట్టి మీకు ఏమి దొరకదు.
JAM 4:4 వ్యభిచారులారా! ఈ లోకంతో స్నేహం చేయడమంటే దేవునితో విరోధం పెట్టుకోవడమేనని మీకు తెలియదా? కాబట్టి ఈ లోకంతో స్నేహం చేసిన ప్రతివారు దేవునికి విరోధులుగా మారతారు.
JAM 4:5 లేదా, “దేవుడు మనలో నివసింపచేసిన ఆత్మ కోసం ఆయన ఆరాటపడుతున్నారని” లేఖనం చెప్పడం అనవసరం అని అనుకుంటున్నారా?
JAM 4:6 అయితే ఆయన అందరికి ఎక్కువ కృపను ఇస్తారు కాబట్టి, “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని, దీనులకు దయ చూపిస్తారు” అని లేఖనం చెప్తుంది.
JAM 4:7 కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు.
JAM 4:8 దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.
JAM 4:9 విచారపడుతూ దుఃఖిస్తూ కన్నీరు కార్చండి. మీ నవ్వును దుఃఖంగా, మీ సంతోషాన్ని విచారంగా మార్చుకోండి.
JAM 4:10 ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు.
JAM 4:11 నా సహోదరీ సహోదరులారా, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు లేదా ఇతరులకు తీర్పు తీర్చేవారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తారు. మీరు ధర్మశాస్త్రానికి తీర్పుతీర్చితే అప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా కాకుండా న్యాయాధికారిగా ఉన్నారని అర్థము.
JAM 4:12 ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవారు న్యాయాధికారి ఒక్కరే, ఆయన రక్షించగలరు నాశనం చేయగలరు. కాబట్టి మీ పొరుగువారికి తీర్పు తీర్చడానికి మీరు ఎవరు?
JAM 4:13 “ఈ రోజైనా లేక రేపైనా ఏదో ఒక పట్టణానికి వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అని చెప్పేవారలారా రండి.
JAM 4:14 రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవితం ఏపాటిది? కొంతసేపు కనిపించి అంతలోనే మాయమైపోయే ఆవిరివంటిది.
JAM 4:15 కాబట్టి, “ప్రభువు చిత్తమైతే మనం జీవించి ఇది చేద్దాం అది చేద్దాం” అని మీరు చెప్పాలి.
JAM 4:16 కాని మీరు అహంకారంతో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా గొప్పలు చెప్పుకోవడం చాలా చెడ్డది.
JAM 4:17 కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి దాన్ని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు.
JAM 5:1 ధనవంతులారా రండి, మీపైకి రాబోతున్న దురవస్థలను బట్టి దుఃఖించి ఏడవండి.
JAM 5:2 మీ ధనం పాడైపోతుంది, మీ వస్త్రాలను చిమ్మటలు తినివేస్తాయి.
JAM 5:3 మీ బంగారము వెండి తుప్పుపడతాయి; వాటి తుప్పు మీకు వ్యతిరేక సాక్ష్యంగా ఉండి అగ్నిలా మీ శరీరాన్ని తింటుంది. మీరు చివరిరోజుల కోసం ధనాన్ని కూడబెట్టారు.
JAM 5:4 చూడండి మీ పొలాలను కోసిన పనివారికి ఇవ్వకుండా మోసంతో మీరు దాచిపెట్టిన వారి జీతాలు మొరపెట్టాయి. కోతపనివారి మొరలు సర్వశక్తిమంతుడైన ప్రభుని చెవులకు చేరాయి.
JAM 5:5 మీరు భూమిపై విలాసవంతంగా సుఖంగా జీవించారు; సంహార దినాన మీ హృదయాలను మిమ్మల్ని మీరు పోషించుకున్నారు.
JAM 5:6 మిమ్మల్ని ఎదిరించలేని నీతిమంతులను మీరు శిక్షించి వారిని హత్య చేశారు.
JAM 5:7 కాబట్టి సహోదరీ సహోదరులారా, ప్రభువు వచ్చేవరకు ఓపికతో ఉండండి. రైతు భూమి నుండి విలువైన పంటను పొందడానికి తొలకరి వాన చివరి వానలు పడేవరకు ఓపికతో ఎదురుచూస్తాడు.
JAM 5:8 మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. ప్రభువు రాకడ దగ్గరలో ఉన్నది కాబట్టి మీ హృదయాలను బలపరచుకోండి.
JAM 5:9 సహోదరీ సహోదరులారా, మీరు తీర్పు తీర్చబడకుండా ఉండడానికి ఒకరిపై ఒకరు సణుగుకోవద్దు. చూడండి, న్యాయాధిపతి తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు!
JAM 5:10 సహోదరీ సహోదరులారా, మన ప్రభువు నామంలో మాట్లాడిన ప్రవక్తలను శ్రమలకు ఓపికకు మాదిరిగా తీసుకోండి.
JAM 5:11 సహనాన్ని చూపినవారిని ధన్యులు అని పిలుస్తాము. యోబుకు గల సహనం గురించి మీకు తెలుసు. చివరకు ప్రభువు అతనికి చేసిన దాన్ని చూసి ప్రభువు ఎంతో జాలి దయ గలవారని మీరు తెలుసుకున్నారు.
JAM 5:12 అన్నిటికి మించి, నా సహోదరీ సహోదరులారా, ఆకాశంతోడని గాని భూమితోడని గాని లేదా ఇంకా దేనిపైనైనా గాని ప్రమాణం చేయవద్దు. మీరు, అవునంటే “అవును” కాదంటే “కాదు” అని లేకపోతే మీరు శిక్షించబడతారు.
JAM 5:13 మీలో ఎవరైనా శ్రమలు అనుభవిస్తున్నారా? అయితే వారు ప్రార్థించాలి. ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అయితే వారు స్తుతి గీతాలను పాడాలి.
JAM 5:14 మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? అయితే వారు సంఘ పెద్దలను పిలిపించాలి. ఆ పెద్దలు ప్రభువు పేరిట వారికి నూనె రాసి వారి కోసం ప్రార్థన చేయాలి.
JAM 5:15 విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగులను బాగుచేస్తుంది. ప్రభువు వారిని లేపుతారు; ఎవరైనా పాపం చేస్తే వారి పాపాలు క్షమించబడతాయి.
JAM 5:16 కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకుని మీరు స్వస్థత పొందేలా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది, ఫలవంతమైనది.
JAM 5:17 ఏలీయా మనవంటి మనుష్యుడే; కాని అతడు వర్షం పడకూడదని మనఃపూర్వకంగా ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు భూమిపై వర్షం పడలేదు.
JAM 5:18 అతడు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి వర్షం కురిసింది, భూమి తన పంటను ఇచ్చింది.
JAM 5:19 నా సహోదరీ సహోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి తొలగిపోతే ఎవరో ఒకరు వారిని తిరిగి వెనుకకు తీసుకువస్తే,
JAM 5:20 తప్పిపోయిన ఆ ఒక్క పాపిని తిరిగి వెనుకకు తీసుకువచ్చినవారు ఆ పాపి ఆత్మను మరణం నుండి రక్షించారని, అనేక పాపాలు కప్పివేయబడ్డాయని మీరు తెలుసుకోండి.
1PE 1:1 యేసు క్రీస్తు అపొస్తలుడైన పేతురు,
1PE 1:2 తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానాన్నిబట్టి, మీరు యేసు క్రీస్తుకు విధేయులు కావడానికి ఆయన రక్తం ప్రోక్షణకు ఆయన మిమ్మల్ని ఎన్నుకుని తన ఆత్మ చేత పవిత్రులు చేశారు:
1PE 1:3 మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక! మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగేలా, ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరల జన్మింపజేసారు.
1PE 1:4 ఎన్నడు నశించనిది, కొల్లగొట్టలేనిది, వాడిపోనిదైన వారసత్వాన్ని పరలోకంలో మన కోసం భద్రపరిచారు.
1PE 1:5 చివరి రోజుల్లో ప్రకటించబడే రక్షణ మీకు కలిగేలా విశ్వాసం ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుతున్నారు, ఆ వారసత్వం పరలోకంలో మీ కోసం భద్రపరచబడి ఉంది.
1PE 1:6 మీరు ఎదుర్కోవలసిన అనేక విధాలైన పరీక్షలవల్ల ఇప్పుడు తాత్కాలికంగా మీకు బాధ కలిగినప్పటికి వీటన్నిటిలో మీరు అధికంగా సంతోషించండి.
1PE 1:7 అవి మీ విశ్వాసం యథార్థమైనదని నిరూపిస్తాయి. నాశనమయ్యే బంగారం అగ్నిచేత పరీక్షించబడుతుంది; అలాగే బంగారం కంటే ఎంతో విలువైన మీ విశ్వాసం కూడ పరీక్షింపబడాలి. అప్పుడే అది చెడిపోకుండా నిలిచి ఉంటుంది. దానివల్ల యేసు క్రీస్తు ప్రత్యక్షమైన రోజున కీర్తి, మహిమ, ఘనతలు కలుగుతాయి.
1PE 1:8 మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకపోయినా నమ్ముతున్నారు. వివరించలేని తేజోమయమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు.
1PE 1:9 ఎలాగంటే, మీ విశ్వాసానికి ఫలితంగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుతున్నారు.
1PE 1:10 మీకు కలుగబోయే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి తీవ్రంగా చాలా జాగ్రత్తగా విచారించి పరిశోధించారు.
1PE 1:11 క్రీస్తు అనుభవించాల్సిన కష్టాలను, దాని వలన వచ్చే మహిమ గురించి వారు ప్రవచించినప్పుడు వారిలో ఉన్న క్రీస్తు ఆత్మ ఏ పరిస్థితులను ఏ సమయాన్ని సూచించాడో వారు తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
1PE 1:12 పరలోకం నుండి పంపబడి పరిశుద్ధాత్మచే ప్రభావితులై మీకు సువార్తను ప్రకటించినవారి ద్వారా మీకు ఇప్పుడు చెప్పబడిన సంగతులను వారు చెప్పినప్పుడు, తమ కోసం కాదు కాని మీ కొరకే తాము పరిచర్య చేశారనే సంగతి వారికి వెల్లడి చేయబడింది. వీటిని దేవదూతలు సహితం చూడాలని ఆశించారు.
1PE 1:13 కాబట్టి, మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధిగల మనస్సులతో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి.
1PE 1:14 మీరు విధేయత కలిగిన బిడ్డలు కాబట్టి, అజ్ఞానంలో ఉన్నప్పుడు మీకు గల చెడ్డకోరికలకు అనుగుణంగా ప్రవర్తించకండి.
1PE 1:15 మిమ్మల్ని పిలచిన దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి మీ ప్రవర్తనలో మీరు కూడా పరిశుద్ధులై ఉండండి.
1PE 1:16 ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను, కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి” అని వ్రాయబడి ఉంది.
1PE 1:17 పక్షపాతం లేకుండా ప్రతివారికి వారి వారి పనిని బట్టి తీర్పు తీర్చే దేవున్ని మీరు తండ్రీ అని పిలుస్తున్నారు కాబట్టి ఈ లోకంలో విదేశీయులుగా మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి.
1PE 1:18 ఎలాగంటే, మీ పితరుల నుండి మీకు లభించిన వ్యర్థమైన జీవన విధానం నుండి మీకు విముక్తి ఇవ్వడానికి ఏమి అర్పించబడిందో మీకు తెలుసు. అది నశించిపోయే వెండి బంగారాల వంటిది కాదు.
1PE 1:19 అయితే నిష్కళంకమైన లోపం లేని గొర్రెపిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తం చేత మీరు విమోచించబడ్డారు.
1PE 1:20 లోకం సృజింపబడక ముందే ఆయన దేవునిచే ఎన్నుకోబడ్డారు కాని మీ కోసం ఈ చివరి కాలాల్లో బయలుపరచబడ్డారు.
1PE 1:21 మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవున్ని విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి.
1PE 1:22 ఇప్పుడు సత్యానికి విధేయులై మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుంటున్నారు. తద్వారా తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమ కలిగి ఉండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా అధికంగా ప్రేమించుకోండి.
1PE 1:23 ఎలాగంటే సజీవమైన, శాశ్వతమైన దేవుని వాక్యం ద్వారా మీరు క్షయబీజం నుండి కాక అక్షయబీజం నుండి తిరిగి జన్మించారు.
1PE 1:24 ఎందుకనగా, “ప్రజలందరు గడ్డి వంటివారు, వారి వైభవం అంతా పొలంలోని పువ్వు వంటిది; గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి,
1PE 1:25 కాని దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉంటుంది.” ఈ వాక్యమే మీకు ప్రకటించబడింది.
1PE 2:1 కాబట్టి, ప్రతి విధమైన దుష్టత్వానికి, కపటానికి, అసూయకు దూరంగా ఉండండి. ప్రతి విధమైన దూషణ మానేయండి.
1PE 2:2 నూతనంగా జన్మించిన శిశువుల్లా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక పాలను ఆశించండి. దాన్ని త్రాగడం వలన మీరు పెరిగి పెద్దవారై రక్షించబడతారు.
1PE 2:3 ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి తెలుసుకోండి.
1PE 2:4 ఉపయోగం లేనిదిగా మనుష్యులచే తిరస్కరించబడిన, అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకోబడిన సజీవ రాయియైన ప్రభువును సమీపించండి.
1PE 2:5 మీరు సజీవమైన రాళ్లవలె ఆత్మీయ మందిరంగా నిర్మించబడుతున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ప్రీతికరమైన ఆత్మీయ బలులను అర్పించడానికి మీరు పవిత్రమైన యాజకులుగా చేయబడ్డారు.
1PE 2:6 ఎందుకంటే లేఖనాల్లో, “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని వేశాను అది ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాయి; ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు” అని వ్రాయబడి ఉంది.
1PE 2:7 ఇప్పుడు విశ్వసించేవారికి ఈ రాయి అమూల్యమైనది. కాని విశ్వసించని వారికి, “ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది.”
1PE 2:8 అంతేకాదు, “అది ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయి, వారిని పడిపోయేలా చేసే అడ్డుబండ అయ్యింది.” వారిని పడద్రోసేది ఈ రాయే, వారు ఆ వాక్యానికి అవిధేయులు అయినందుకు వారు పతనమయ్యారు. వారిని గురించిన దేవుని సంకల్పం అలాంటిది.
1PE 2:9 కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు.
1PE 2:10 ఒకప్పుడు మీరు ప్రజలు కారు కాని ఇప్పుడు మీరు దేవుని ప్రజలు; ఒకప్పుడు మీరు దేవుని కృపను ఎరుగరు కాని ఇప్పుడు మీరు ఆ కృపకు పాత్రులు.
1PE 2:11 ప్రియ మిత్రులారా, ఈ లోకంలో విదేశీయులుగా, ప్రవాసులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకుంటున్నాను. శారీరక కోరికలు ఎప్పుడు ఆత్మతో పోరాడుతుంటాయి. కాబట్టి వాటికి విడిచిపెట్టండి.
1PE 2:12 దేవుని ఎరుగనివారు మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. మీ సత్కార్యాలను వారు గుర్తించి, దేవుడు మనల్ని దర్శించే రోజున వారు దేవుని మహిమపరచగలరు.
1PE 2:13 ప్రభువు కోసం మానవ అధికారులందరికి లోబడి ఉండండి: సార్వభౌమాధికారంలో ఉన్న చక్రవర్తులకు లోబడి ఉండండి.
1PE 2:14 దుష్టులను శిక్షించడానికి, మంచివారిని మెచ్చుకోవడానికి పంపబడిన పాలకులకు విధేయులై ఉండండి.
1PE 2:15 మీరు మీ సత్కార్యాల వలన మూర్ఖులైన జ్ఞానంలేని ప్రజల నోరు మూయించాలి, ఇది దేవుని చిత్తం.
1PE 2:16 స్వతంత్రులై బ్రతకండి, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మీ స్వాతంత్ర్యాన్ని వినియోగించకండి; దేవునికి దాసులుగా జీవించండి.
1PE 2:17 అందరిని గౌరవించండి, తోటి విశ్వాసులను ప్రేమించండి, దేవునిలో భయభక్తులు కలిగి ఉండండి, రాజులను గౌరవించండి.
1PE 2:18 దాసులారా, మీ యజమానులకు మీరు విధేయులై ఉండి వారి పట్ల మర్యాదగా ప్రవర్తించండి. దయగల, సౌమ్యులైన యజమానులకే గాక కఠినులైన వారికి కూడా లోబడి ఉండండి.
1PE 2:19 ఎవరైనా అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని పట్ల నిష్కపటమైన మనస్సాక్షి కలిగి దాన్ని ఓర్పుతో సహిస్తే దేవుని అంగీకారం పొందుతారు.
1PE 2:20 పాపం చేసినందుకు ప్రతిఫలంగా వచ్చే శిక్షను ఓర్పుతో భరిస్తే దానిలో గొప్పతనమేంటి? అయితే మంచి చేసి బాధపడాల్సి వచ్చినపుడే మీరు ఓర్పుతో భరిస్తే అది దేవుని మెచ్చుకోదగిన విషయం.
1PE 2:21 దీని కోసమే మీరు పిలువబడ్డారు. ఎందుకంటే క్రీస్తు కూడా మీ కోసం బాధపడి మీరు ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఒక ఉదాహరణను ఉంచారు.
1PE 2:22 “ఆయన ఎలాంటి పాపం చేయలేదు, ఆయన నోటిలో ఏ మోసం లేదు.”
1PE 2:23 తాను దూషించబడినా తిరిగి దూషించలేదు. తాను హింసించబడుతున్నా ఎవరిని బెదిరించలేదు. కాని న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నారు.
1PE 2:24 మనం పాపాల విషయంలో మరణించి నీతి కోసం జీవించేలా ఆయన, “మన పాపాలను తనపై ఉంచుకుని సిలువను మోసారు. ఆయన పొందిన గాయాల వల్ల మీరు స్వస్థత పొందారు.
1PE 2:25 మీరు త్రోవ తప్పిన గొర్రెల్లా ఉన్నారు” కాని ఇప్పుడు మీ ఆత్మల సంరక్షకుడు కాపరియైన వాని దగ్గరకు మీరు తిరిగి వచ్చారు.
1PE 3:1 అలాగే భార్యలారా, మీరు మీ భర్తలకు లోబడి ఉండండి. ఒకవేళ వారిలో ఎవరైనా దేవుని వాక్యాన్ని అంగీకరించనివారు ఉంటే, మీరు ఒక్క మాట కూడా పలకాల్సిన అవసరం లేకుండానే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు.
1PE 3:2 ఎందుకంటే భయభక్తులతో, పరిశుద్ధతతో కూడిన మీ ప్రవర్తనను వారు గమనిస్తారు.
1PE 3:3 తల వెంట్రుకలను అలంకరించుకోవడం, బంగారు ఆభరణాలను ధరించడం, విలువైన వస్త్రాలు వేసుకోవడం అనే బాహ్య సౌందర్యం వద్దు.
1PE 3:4 మృదువైన, సాధు స్వభావమనే అక్షయమైన అలంకారం గల హృదయపు సౌందర్యాన్ని కలిగి ఉండాలి. అదే దేవుని దృష్టిలో అమూల్యమైనది.
1PE 3:5 ఎలాగంటే, పూర్వకాలంలో పరిశుద్ధులైన స్త్రీలు దేవునిలో నిరీక్షణ ఉంచి ఇలా తమ సౌందర్యాన్ని పోషించుకుంటూ, తమ భర్తలకు లోబడి ఉన్నారు.
1PE 3:6 అదే విధంగా శారా అబ్రాహాముకు లోబడి అతడిని యజమాని అని పిలిచింది. మీరు మంచి పనులు చేస్తూ దేనికి బెదరని వారైతే ఆమెకు పిల్లలవుతారు.
1PE 3:7 అలాగే భర్తలారా మీరు, మీ భార్యలు జీవమనే కృపావరంలో మీతో జతపనివారై ఉన్నారని ఎరిగి బలహీనులైన మీ భార్యలను గౌరవిస్తూ వారితో కాపురం చేయండి. అప్పుడు మీ ప్రార్థనలకు ఆటంకం ఉండదు.
1PE 3:8 చివరిగా మీరందరు ఏక మనసు కలిగి సానుభూతి కలవారై పరస్పరం ప్రేమ కలిగి కరుణ, వినయంతో ఉండండి.
1PE 3:9 కీడుకు ప్రతిగా కీడును, దూషణకు ప్రతిగా దూషణ చేయకండి. దానికి బదులుగా ఆశీర్వదించండి. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు.
1PE 3:10 ఎందుకంటే, “ఎవరైనా జీవితాన్ని ప్రేమించి మంచి దినాలను చూడాలనుకుంటారో వారు చెడు మాట్లాడకుండ నాలుకను మోసపు మాటలు చెప్పకుండ తమ పెదవులను కాచుకోవాలి.
1PE 3:11 వారు కీడు చేయడం మాని మేలు చేయాలి; వారు సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.
1PE 3:12 ప్రభువు కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి ప్రార్థనలను వింటున్నాయి, అయితే ప్రభువు ముఖం కీడు చేసేవారికి విరోధంగా ఉన్నది.”
1PE 3:13 మంచి చేయాలని మీకు ఆసక్తి ఉంటే, మీకు హాని చేసేది ఎవరు?
1PE 3:14 మీరొకవేళ, నీతి కోసం శ్రమపడినా మీరు ధన్యులు. “వారి బెదిరింపుకు భయపడకండి, కలవరపడకండి.”
1PE 3:15 మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీలో ఉన్న నమ్మకాన్ని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, మంచితనంతో గౌరవంతో సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండండి.
1PE 3:16 మంచి మనస్సాక్షిని కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో ఉన్న మీ మంచి ప్రవర్తన గురించి చెడుగా మాట్లాడేవారు తమ మాటలకు తామే సిగ్గుపడతారు.
1PE 3:17 అదే దేవుని చిత్తమైతే, కీడు చేసిన బాధపడడం కంటే, మేలు చేసి బాధపడడమే మంచిది.
1PE 3:18 ఎందుకంటే, దేవుని దగ్గరకు తీసుకురావడానికి, అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపాల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డారు.
1PE 3:19 ఆయన సజీవుడైన తర్వాత, అనగా చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించారు;
1PE 3:20 నోవహు ఓడను నిర్మిస్తున్న రోజుల్లో, దేవునికి అవిధేయంగా ఉన్న వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కోసం సహనంతో వేచి ఉన్నారు. ఓడలోని కొద్దిమంది, అనగా ఎనిమిది మంది మాత్రమే నీటి నుండి రక్షించబడ్డారు.
1PE 3:21 ఈ నీరే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు గాని, యేసు క్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని ముందు నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహిస్తుంది.
1PE 3:22 ఆయన పరలోకానికి వెళ్లి దూతలమీద, అధికారుల మీద, శక్తులమీద అధికారం పొందినవాడై, దేవుని కుడి వైపున ఉన్నారు.
1PE 4:1 క్రీస్తు తన శరీరంలో శ్రమపడ్డారు, కాబట్టి మీరు అలాంటి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఎందుకంటే శరీరంలో శ్రమపడే వారు పాప జీవితాన్ని విడిచిపెడతారు.
1PE 4:2 కాబట్టి ఇప్పటినుండి మీరు ఈ లోకంలో మిగిలిన జీవితకాలాన్ని మానవ ఆశలను అనుసరించడానికి కాకుండా దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండేలా కొనసాగించండి.
1PE 4:3 ఎందుకంటే, మీరు గతకాలంలో దేవుని ఎరుగనివారిగా జీవించారు, సిగ్గుమాలిన వారై, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా, అల్లరితో కూడిన ఆటపాటలు, అసహ్యకరమైన విగ్రహారాధనలు చేస్తూ జీవించారు.
1PE 4:4 మీరు ఆ యూదేతరులతో కలిసి విచ్చలవిడిగా నిర్లక్ష్యంగా జీవించకపోవడం చూసి వారు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు.
1PE 4:5 కాని వారు దేవుని ఎదుట సమాధానం చెప్పాల్సి ఉంది. ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు.
1PE 4:6 అందుకే చనిపోయినవారు శరీర విషయంలో మానవ ప్రమాణాల ప్రకారం తీర్పు పొందేలా, ఆత్మీయ జీవితంలో దేవుని బట్టి జీవించేలా వారికి కూడా సువార్త ప్రకటించబడింది.
1PE 4:7 అన్నిటికి అంతం సమీపించింది, కాబట్టి మీరు స్వస్థబుద్ధి కలిగి, మెలకువతో ప్రార్థించండి.
1PE 4:8 అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిపట్ల ఒకరు ఎక్కువ ప్రేమగలవారై ఉండండి. ఎందుకంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది.
1PE 4:9 సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి.
1PE 4:10 అనేక రకాలైన దేవుని వరాలకు మంచి నిర్వాహకుల్లా ప్రతి ఒక్కరు దేవుని నుండి తాము పొందిన విశేష కృపావరాలను ఇతరుల మేలుకోసం ఉపయోగించాలి.
1PE 4:11 ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి. అప్పుడు అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.
1PE 4:12 ప్రియ మిత్రులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చిన అగ్నివంటి పరీక్షను చూసి మీకేదో వింత జరుగుతున్నట్లుగా ఆశ్చర్యపడకండి.
1PE 4:13 క్రీస్తు మహిమ వెల్లడి అయినప్పుడు మీరు మహానందాన్ని అనుభవించేలా ఆయన బాధల్లో పాలుపొందామని ఆనందించండి.
1PE 4:14 క్రీస్తు నామం కోసం మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమగల దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని దాని భావము.
1PE 4:15 ఒకవేళ మీరు శ్రమపడినా, హంతకునిగా దొంగగా దోషిగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకొన్న వారిగా ఆ శ్రమ ఉండకూడదు.
1PE 4:16 అయినా, మీరు క్రైస్తవునిగా శ్రమపడితే సిగ్గుపడకండి, కాని మీరు ఆ నామాన్ని మోస్తున్నవారిగా దేవున్ని స్తుతించండి.
1PE 4:17 తీర్పు మొదలయ్యే సమయం ఆసన్నమైంది; దేవుని ఇంటివారే ముందుగా తీర్పు తీర్చబడతారు. అది మనతోనే మొదలైతే దేవుని సువార్తను నమ్మనివారి గతి ఏంటి?
1PE 4:18 అలాగే, “నీతిమంతుడే రక్షించబడడం కష్టమైతే, భక్తిహీనులు, పాపాత్ముల గతి ఏంటి?”
1PE 4:19 కాబట్టి, దేవుని చిత్తప్రకారం బాధలు అనుభవించేవారు మంచి కార్యాలను కొనసాగిస్తూ, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.
1PE 5:1 తోటి సంఘపెద్దగా, క్రీస్తు పడిన శ్రమలకు సాక్షినై ఉండి, ప్రత్యక్షం కాబోతున్న మహిమలో భాగం పంచుకోబోతున్న నేను మీ సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే:
1PE 5:2 మీ స్వాధీనంలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండండి. అయిష్టంతో కాక దేవుని చిత్తం అనుకుని ఇష్టపూర్వకంగా దాన్ని కాపాడండి. లాభం మీద దురాశతో కాక మనస్సు పూర్వకంగా దాన్ని కాయండి;
1PE 5:3 మీకు అప్పగించబడిన మందపై అధికారం చెలాయించక, మీరు మందకు మాదిరిగా ఉండండి.
1PE 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీరు ఎప్పటికీ తరిగిపోని మహిమ కిరీటం పొందుతారు.
1PE 5:5 అలానే, యవ్వనస్థులారా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. మీరందరు వినయం అనే వస్త్రాన్ని ధరించాలి. ఎందుకనగా, “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని దీనులకు దయ చూపిస్తారు.”
1PE 5:6 దేవుని బలమైన చేతి క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు.
1PE 5:7 ఆయన మీ గురించి చింతిస్తున్నారు కాబట్టి మీ చింతలన్ని ఆయనపై మోపండి.
1PE 5:8 మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు.
1PE 5:9 దృఢ విశ్వాసులై వానిని ఎదిరించండి. ప్రపంచమంతా ఉన్న విశ్వాసుల కుటుంబం ఇలాంటి బాధలనే అనుభవిస్తుందని మీకు తెలుసు.
1PE 5:10 తన శాశ్వత మహిమలోనికి క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియైన దేవుడు, మీరు కొంతకాలం బాధలు పొందిన తర్వాత ఆయనే స్వయంగా మీకు స్థిరత్వాన్ని, బలాన్ని అనుగ్రహిస్తారు.
1PE 5:11 ఆయనకే నిరంతరం ప్రభావం కలుగును గాక ఆమేన్.
1PE 5:12 నేను నమ్మకమైన సహోదరునిగా భావించే సీల సహాయంతో ఈ కొద్ది మాటలు వ్రాస్తున్నాను, మిమ్మల్ని ప్రోత్సహించాలని, ఇది దేవుని నిజమైన కృప మాత్రమే అని సాక్ష్యమిస్తున్నాను. మీరు దీనిలో నిలిచి ఉండండి.
1PE 5:13 బబులోనులో మీలా ఏర్పరచబడిన మీ సహోదర సంఘం, నా కుమారుడైన మార్కు కూడ మీకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.
1PE 5:14 ప్రేమపూర్వకమైన ముద్దుతో ఒకరికొకరు శుభాలు చెప్పుకోండి. క్రీస్తులో ఉన్న మీకందరికి శాంతి కలుగును గాక.
2PE 1:1 యేసు క్రీస్తు సేవకుడు అపొస్తలుడైన సీమోను పేతురు,
2PE 1:2 మన ప్రభువైన యేసు యొక్క, దేవుని యొక్క జ్ఞానం ద్వారా మీకు కృపా సమాధానాలు సమృద్ధిగా కలుగును గాక.
2PE 1:3 తన సొంత మహిమ వలన మంచితనం వలన మనల్ని పిలిచినవాని గురించి మనకున్న జ్ఞానం ద్వారా ఆయన దైవశక్తి, మనం దైవిక జీవితాన్ని జీవించడానికి కావలసిన ప్రతిదీ మనకు ఇస్తుంది.
2PE 1:4 వీటి ద్వారా ఆయన మనకు మహత్తరమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చారు. అప్పుడు మీరు వాటి ద్వారా చెడు కోరికల వల్ల ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుండి తప్పించుకుని దైవిక స్వభావంలో పాలుపొందవచ్చు.
2PE 1:5 ఈ కారణంగా మీ విశ్వాసానికి మంచితనాన్ని, మంచితనానికి వివేకాన్ని;
2PE 1:6 వివేకానికి స్వీయ నియంత్రణను, స్వీయ నియంత్రణకు సహనాన్ని, సహనానికి దైవ భక్తిని;
2PE 1:7 దైవ భక్తికి సోదర భావాన్ని, సోదర భావానికి ప్రేమను చేర్చడానికి కృషి చేయండి.
2PE 1:8 ఈ గుణాలు మీలో వృద్ధి చెందినప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్న జ్ఞానం మిమ్మల్ని పనిలేనివారిగా, ఫలించనివారిగా ఉండకుండా చేస్తుంది.
2PE 1:9 అయితే ఇవి లేనివారు తన గత పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివారిగా దూరదృష్టిలేనివారిగా అవుతారు.
2PE 1:10 కాబట్టి, సహోదరీ సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి కృషి చేయండి. ఒకవేళ మీరు వీటిని చేస్తే ఎప్పుడూ తడబడరు.
2PE 1:11 అప్పుడు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శాశ్వత రాజ్యంలోనికి ఘనమైన స్వాగతం మీకు లభిస్తుంది.
2PE 1:12 కాబట్టి, మీకు తెలిసినవే అయినప్పటికీ, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నప్పటికీ నేను ఈ విషయాలను గురించి మీకు ఎల్లప్పుడు జ్ఞాపకం చేస్తాను.
2PE 1:13 నేను ఈ శరీరమనే గుడారంలో జీవించినంతకాలం, ఈ సంగతులను గురించి మీకు జ్ఞాపకం చేయడం మంచిదని భావిస్తాను.
2PE 1:14 ఎందుకంటే, నేను ఈ శరీరమనే గుడారాన్ని త్వరలో విడచిపెట్టబోతున్నాను, ఈ సంగతి మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు స్పష్టంగా చెప్పారు.
2PE 1:15 కాబట్టి, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా శ్రద్ధ వహిస్తాను.
2PE 1:16 మన ప్రభువైన యేసు క్రీస్తు శక్తి గురించి ఆయన రాకడ గురించి మేము మీకు కట్టుకథలు కల్పించి చెప్పలేదు కాని మా కళ్లారా ఆయన మహా ప్రభావాన్ని చూసి చెప్తున్నాము.
2PE 1:17 ఆయన తండ్రియైన దేవుని నుండి ఘనత మహిమను పొందినపుడు, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను” అని మహత్తరమైన మహిమగల ఒక శబ్దం పలికింది.
2PE 1:18 మేము ఆయనతో కూడా పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు పరలోకం నుండి వచ్చిన ఆ శబ్దాన్ని మేము విన్నాము.
2PE 1:19 మరింత నమ్మకమైన ప్రవచనాత్మక సందేశం మనకు ఉంది. ఉదయకాలపు వేకువచుక్క మీ హృదయాలను వెలుగుతో నింపే వరకు చీకటిలో వెలుగుతున్న దీపంలా ఉన్న ఆ సందేశాన్ని శ్రద్ధతో ఆలకించడం మీకు మంచిది.
2PE 1:20 అన్నిటికంటే ముఖ్యంగా ప్రవక్తల సొంత ఊహల్లో నుండి లేఖనంలోని ప్రవచనాలు పుట్టలేదని మీరు తప్పక గుర్తుంచుకోవాలి.
2PE 1:21 ఎందుకంటే, మానవుని ఇష్టాన్ని బట్టి ప్రవచనం పుట్టదు, కాని ప్రవక్తలు పరిశుద్ధాత్మచేత ప్రభావితులై దేవుని నుండి వచ్చిన సందేశాన్నే పలికారు.
2PE 2:1 అయితే మీలో అబద్ధ బోధకులు ఉన్నట్లుగానే, గతంలో కూడా ప్రజల మధ్యలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు రహస్యంగా నాశనకరమైన నియమాలను ప్రవేశపెడుతూ, తమను కొన్న సర్వాధికారియైన ప్రభువును కూడా తిరస్కరిస్తూ తమ మీదికి తామే వేగంగా నాశనాన్ని తెచ్చుకుంటారు.
2PE 2:2 చాలామంది వారి పోకిరి చేష్టలను అనుసరిస్తారు, వీరిని బట్టి సత్యమార్గంలో ఉన్నవారిని దూషిస్తారు.
2PE 2:3 ఈ బోధకులు దురాశతో కట్టుకథలు చెప్పి మిమ్మల్ని దోచుకుంటారు. వారికి పూర్వకాలమే ఇవ్వబడిన తీర్పు వారి మీదికే వస్తుంది, వారి నాశనం ఆలస్యం కాదు.
2PE 2:4 ఎందుకంటే, దేవదూతలు పాపం చేసినపుడు దేవుడు వారిని విడిచిపెట్టక, వారిని సంకెళ్లతో బంధించి, చీకటి గల పాతాళానికి పంపి తీర్పు దినం వరకు వారిని కాపలాలో ఉంచారు.
2PE 2:5 ఆయన పూర్వకాలపు లోకాన్ని విడిచిపెట్టక అప్పటి భక్తిహీనులైన ప్రజలమీదికి జలప్రళయాన్ని రప్పించారు కాని, నీతిని బోధించిన నోవహును మరి ఏడుగురిని రక్షించారు.
2PE 2:6 దేవుడు సొదొమ, గొమొర్రాలకు తీర్పు తీర్చి వాటిని కాల్చి బూడిద చేసి భక్తిహీనులకు ఏమి జరుగుతుందో తెలియజేయడానికి వాటిని ఒక మాదిరిగా ఉంచారు.
2PE 2:7 దుష్టుల కామ వికార ప్రవర్తన వలన బాధపడిన నీతిమంతుడైన లోతును ఆయన రక్షించారు.
2PE 2:8 ఎందుకంటే, ఈ నీతిమంతుడు దినదినం వారి మధ్య జీవిస్తూ వారి చెడు కార్యాలను చూసి, వారి మాటలు విని తన నీతిగల మనస్సులో వేదన చెందాడు.
2PE 2:9 అదే విధంగా భక్తులను శ్రమలలో నుండి ఎలా విడిపించాలో ప్రభువుకు తెలుసు. అలాగే తీర్పు దినాన దుష్టులను ఎలా శిక్షించాలో కూడా ఆయనకు తెలుసు.
2PE 2:10 మరి ముఖ్యంగా శరీరాశలను అనుసరించి చెడిపోయిన వారిని, ఆయన అధికారాన్ని తృణీకరించిన వారిని శిక్షించడం ఆయనకు తెలుసు. వీరు ధైర్యంగా దురహంకారంతో పరలోక సంబంధులను దూషించడానికి భయపడరు.
2PE 2:11 బలవంతులు శక్తిమంతులైన దేవదూతలు సహితం ప్రభువు తీర్పు తెచ్చినప్పుడు వారిని అలా దూషించరు.
2PE 2:12 కాని ఈ ప్రజలు తాము గ్రహించలేని విషయాలను దూషిస్తారు. వారు స్వాభావికంగా పట్టబడడానికి, నశించడానికి పుట్టిన వివేకంలేని జంతువుల వంటివారు, ఆ జంతువుల్లా వీరు కూడా నశించిపోతారు.
2PE 2:13 వారు ఇతరులకు చేసిన హానికి ప్రతిఫలంగా వారికి హాని కలుగుతుంది. వారు పట్ట పగలే త్రాగుతూ ఆనందించాలని భావిస్తారు. వారు కళంకులు నిందలుగలవారై విందుల్లో మీతో పాల్గొని తిని త్రాగి ఆనందిస్తారు.
2PE 2:14 వ్యభిచారం నిండిన కళ్లతో, పాపం చేయడం వారెప్పటికి మానరు; వారు అస్థిరమైన వ్యక్తులను ప్రలోభపెడతారు; వారు దురాశ కోసం వారి హృదయాలకు శిక్షణనిచ్చారు; వీరు శాపగ్రస్తులైన పిల్లలు!
2PE 2:15 వారు సరియైన మార్గాన్ని విడిచిపెట్టి, దుష్టత్వానికి వచ్చే జీతాన్ని ప్రేమించిన బెయోరు కుమారుడైన బిలాము మార్గాన్ని అనుసరించడానికి వెళ్లారు.
2PE 2:16 అయితే అతడు తన చెడు కార్యాన్ని బట్టి ఒక గాడిద చేత గద్దింపబడ్డాడు, ఒక మాట్లాడలేని జంతువు మానవ స్వరంతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డుకున్నది.
2PE 2:17 వీరు నీళ్లు లేని ఊటల వంటివారు. తుఫాను తీవ్రతకు కొట్టుకొని పోవు మేఘాల వంటివారు. కటిక చీకటి వారి కోసం సిద్ధపరచబడింది.
2PE 2:18 ఎందుకంటే, వారి మాటలు వట్టివి డాంబికమైనవి, వారు శరీర సంబంధమైన దురాశలు కలవారై, చెడు మార్గంలో జీవిస్తూ అప్పుడే తప్పించుకున్నవారికి పోకిరి చేష్టలను ఎరగా చూపించి ప్రలోభపెడతారు.
2PE 2:19 తామే దుర్నీతికి బానిసలై ఉండి, అలాంటి వారికి స్వాతంత్ర్యం ఇస్తామని చెప్తారు. ఎందుకంటే “ఒకరు దేని చేతిలో ఓడిపోతారో దానికే దాసులవుతారు.”
2PE 2:20 మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తును తెలుసుకోవడం వల్ల లోకంలోని పాపం నుండి తప్పించుకుని, మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడితే, వారి చివరి స్థితి మొదటి స్ధితి కన్నా దారుణంగా ఉంటుంది.
2PE 2:21 వారు నీతి మార్గాన్ని తెలుసుకొని వారికి ఇవ్వబడిన పరిశుద్ధ ఆజ్ఞల నుండి వెనుకకు తిరిగితే, ఆ మార్గం వారికి తెలియక పోవడమే మంచిది.
2PE 2:22 “కుక్క తను కక్కిన దానికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలో దొర్లడానికి మళ్లినట్లు” అనే సామెతలు వీరి విషయంలో నిజం.
2PE 3:1 ప్రియ స్నేహితుల్లారా, ఇది మీకు వ్రాస్తున్న నా రెండవ పత్రిక. మీలో పరిపూర్ణమైన ఆలోచనను ప్రేరేపించడానికి జ్ఞాపకం చేయాలని ఈ రెండు పత్రికలను మీకు వ్రాశాను.
2PE 3:2 పూర్వకాలంలో పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలుకబడిన వాక్యాలను, మన ప్రభువైన రక్షకుని వలన అపొస్తలుల ద్వారా మీకు ఇవ్వబడిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను.
2PE 3:3 అన్నిటికి మించి, అంత్యదినాలలో తమ చెడు కోరికలనే అనుసరించే అపహాసకులు వస్తారని మీరు గ్రహించాలి.
2PE 3:4 “ ‘వస్తాను’ అని ఆయన చేసిన వాగ్దానం ఎక్కడ ఉంది? మన పితరులు ఎప్పుడో చనిపోయారు, సృష్టి ఆరంభం నుండి ఎలా ఉందో, మార్పు లేకుండా అంతా అలాగే జరుగుతుంది” అని వారు చెప్తారు.
2PE 3:5 అయితే, పూర్వకాలంలో దేవుని వాక్యం వలన ఆకాశాలు సృజింపబడ్డాయని, నీళ్ల నుండి నీళ్ల ద్వారా భూమి ఏర్పడిందని వారు ఉద్దేశపూర్వకంగా మరచిపోతారు.
2PE 3:6 ఈ నీళ్ల వల్లనే, అప్పటి లోకం ముంచివేయబడి నాశనం చేయబడింది.
2PE 3:7 అదే వాక్యం వల్ల ఇప్పుడున్న భూమి, ఆకాశాలు దహించబడడానికి ఉంచబడ్డాయి, భక్తిహీనులు నాశనం కొరకై తీర్పు దినం వరకు భద్రపరచబడి ఉంటారు.
2PE 3:8 కాని ప్రియ స్నేహితుల్లారా, ఈ ఒక్క విషయాన్ని మరువకండి: దేవుని దృష్టిలో ఒక రోజు వెయ్యి సంవత్సరాల్లా, వెయ్యి సంవత్సరాలు ఒక రోజులా ఉన్నాయి.
2PE 3:9 కొందరు అనుకుంటున్నట్లు ప్రభువు తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆలస్యం చేసేవాడు కాడు. ఎవరు నశించకూడదని, అందరు మారుమనస్సు పొందాలని మీ కోసం ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు.
2PE 3:10 కాని ప్రభువు దినం దొంగలా వస్తుంది. ఆకాశాలు మహాశబ్దంతో గతించిపోతాయి; మూలకాలు అగ్నిచేత నశించిపోతాయి, భూమి దానిలో చేయబడి ఉన్న సమస్తం లయమైపోతాయి.
2PE 3:11 ఇలా అన్ని నశించిపోతూ ఉంటే, మీరు ఎలాంటి వారై ఉండాలి? మీరు పరిశుద్ధమైన భక్తిగల జీవితాన్ని కలిగి ఉండాలి.
2PE 3:12 దేవుని రాకడ దినం కోసం అపేక్షతో కనిపెట్టండి. ఆ దినాన ఆకాశాలు అగ్నిచేత నశించిపోతాయి, మూలకాలు వేడికి కరిగిపోతాయి.
2PE 3:13 కాని మనం ఆయన చేసిన వాగ్దానంలో నిలిచి ఉండి, నీతి నివసించే ఒక క్రొత్త ఆకాశం కోసం ఒక క్రొత్త భూమి కోసం మనం ఎదురుచూస్తున్నాము.
2PE 3:14 కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు దీని కోసం ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి కళంకం లేనివారిగా నిందలేనివారిగా ఆయనలో శాంతం కలవారిగా ఉండడానికి ప్రయత్నించండి.
2PE 3:15 మన ప్రభువు యొక్క సహనానికి అర్థం రక్షణ అని మీ మనస్సుల్లో తలంచుకోండి, అలాగే మన ప్రియ సోదరుడు పౌలు కూడా దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున మీకు వ్రాశాడు.
2PE 3:16 అంతేగాక, వీటన్నిటిని గురించి అన్ని పత్రికల్లో చెప్పాడు, ఇతని పత్రికల్లో కొన్ని విషయాలు అర్థంచేసుకోడానికి కష్టతరంగా ఉంటాయి. వీటిని గ్రహించలేని జ్ఞానహీనులు, అస్థిరులు మిగతా లేఖనాలను అపార్ధం చేసుకొన్నట్లే, తమ స్వనాశనానికి వేరొక రీతిగా అపార్ధం చేసుకుంటారు.
2PE 3:17 కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు ముందుగా హెచ్చరించబడిన ప్రకారం మీ సుస్థిర స్థానం నుండి భ్రష్టులు కాకుండా, అన్యాయస్థుల తప్పిదాల వల్ల పెడత్రోవ పట్టి దుర్మార్గులు కాకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి.
2PE 3:18 అయితే, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపలో జ్ఞానంలో వర్ధిల్లండి. ఆయనకు ఇప్పుడు ఎల్లప్పుడు మహిమ కలుగును గాక! ఆమేన్.
1JO 1:1 ఆది నుండి ఉన్న జీవవాక్యం గురించి మేము విన్నది, మా కళ్ళతో చూసింది, మా చేతులతో తాకింది మేము ప్రకటిస్తున్నాము.
1JO 1:2 ఆ జీవం ప్రత్యక్షమైంది; తండ్రి దగ్గర ఉండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్యజీవాన్ని మేము చూసి, ఆ జీవాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ దాన్ని మీకు తెలియజేస్తున్నాము.
1JO 1:3 తండ్రితో కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు గల సహవాసంలో మీరు కూడా మాతో చేరేలా మేము చూసినవాటిని విన్నవాటిని మీకు ప్రకటిస్తున్నాము.
1JO 1:4 మన ఆనందం సంపూర్ణమవ్వాలని మేము దీనిని వ్రాస్తున్నాము.
1JO 1:5 మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడే వెలుగు; ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు.
1JO 1:6 ఒకవేళ మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్తూ ఇంకా చీకటిలోనే నడిస్తే మనం అబద్ధం చెప్పినట్లే, సత్యంలో జీవించడం లేదు.
1JO 1:7 అయితే, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులోనే నడుస్తున్నట్లయితే, మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాము. ఆయన కుమారుడైన, యేసు రక్తం పాపాలన్నిటి నుండి మనల్ని శుద్ధి చేస్తుంది.
1JO 1:8 ఒకవేళ మనలో ఏ పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనలో సత్యం లేదు.
1JO 1:9 ఒకవేళ మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమిస్తారు, అన్యాయమంతటి నుండి మనల్ని శుద్ధి చేస్తారు.
1JO 1:10 మనం పాపం చేయలేదని చెప్పుకుంటే, మనం ఆయనను అబద్ధికుని చేస్తాము; మనలో ఆయన వాక్యం లేదు.
1JO 2:1 నా ప్రియ పిల్లలారా, మీరు పాపం చేయకూడదని మీకు ఇలా వ్రాస్తున్నాను. కాని ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర న్యాయవాదిగా నీతిమంతుడైన యేసు క్రీస్తు మనకు ఉన్నారు.
1JO 2:2 ఆయనే మన పాపాలకు కూడా ఆయనే ప్రాయశ్చిత్త బలి. మన కోసం మాత్రమే కాదు కాని లోకమంతటి పాపాల కోసం కూడా.
1JO 2:3 మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం ఆయనను తెలుసుకున్నామని మనకు తెలుస్తుంది.
1JO 2:4 కాని ఎవరైనా, “నేను ఆయనను తెలుసుకున్నాను” అని చెప్తూ, ఆయన ఆజ్ఞాపించింది చేయనివారు అబద్ధికులు, వారిలో సత్యం ఉండదు.
1JO 2:5 అయితే ఎవరు ఆయన వాక్యానికి లోబడతారో వారిలో దేవుని పట్ల ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. మనం ఆయనలో ఉన్నామని దీనిని బట్టి తెలుసుకుంటాము.
1JO 2:6 ఆయనలో జీవిస్తున్నామని చెప్పేవారు యేసు క్రీస్తులా జీవించాలి.
1JO 2:7 ప్రియ స్నేహితులారా, నేను మీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయడం లేదు కాని ప్రారంభం నుండి మీరు కలిగి ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. ఈ పాత ఆజ్ఞ మీరు విన్న సందేశమే.
1JO 2:8 అయినా నేను ఒక క్రొత్త ఆజ్ఞ వ్రాస్తున్నాను; చీకటి గతించిపోతుంది, ఇప్పటికే నిజమైన వెలుగు ప్రకాశిస్తున్నది కాబట్టి దాని సత్యం ఆయనలో మీలో కనిపిస్తూ ఉంది.
1JO 2:9 తాను వెలుగులో ఉన్నానని చెప్తూ తన సహోదరున్ని సహోదరిని ద్వేషించేవారు ఇంకా చీకటిలోనే ఉన్నారు.
1JO 2:10 తన సహోదరిని సహోదరులను ప్రేమించేవారు వెలుగులో జీవిస్తారు; వారిలో అభ్యంతరం కలిగించేది ఏది ఉండదు.
1JO 2:11 అయితే తన సహోదరిని, సహోదరున్ని ద్వేషించేవారు చీకటిలో ఉండి, చీకటిలోనే తిరుగుతారు. ఆ చీకటి వారిని గ్రుడ్డివారిగా చేస్తుంది, కాబట్టి తాము ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు.
1JO 2:12 ప్రియ పిల్లలారా, ఆయన నామంలో మీ పాపాలు క్షమించబడ్డాయి, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.
1JO 2:13 తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. యవ్వనస్థులారా, మీరు దుష్టుని జయించారు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.
1JO 2:14 ప్రియ బిడ్డలారా, మీకు తండ్రి తెలుసు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. యవ్వనస్థులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నివసిస్తున్నది; మీరు దుష్టుని జయించారు; కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.
1JO 2:15 ఈ లోకాన్ని లోకంలో ఉన్న దేన్ని ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి పట్ల ప్రేమ వారిలో ఉండదు.
1JO 2:16 ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు గర్వం. ఇవి తండ్రి నుండి రాలేదు, ఇవన్నీ లోకం నుండే వచ్చాయి.
1JO 2:17 ఈ లోకం దాని ఆశలు గతించిపోతాయి కాని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు శాశ్వతంగా జీవిస్తారు.
1JO 2:18 ప్రియ పిల్లలారా, ఇది చివరి గడియ; క్రీస్తు విరోధి వస్తున్నాడని మీరు విన్నట్లుగానే, ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు వచ్చారు. దీనిని బట్టి ఇదే చివరి గడియ అని మనకు తెలుస్తుంది.
1JO 2:19 వారు మనలో నుండి బయలుదేరారు, కాని నిజానికి వారు మనకు సంబంధించినవారు కారు. ఎందుకంటే వారు మనకు సంబంధించినవారైతే మనతోనే నిలిచి ఉంటారు; అయితే వారు అలా వెళ్లిపోవడం వల్ల వారిలో ఒక్కరు కూడా మనకు సంబంధించినవారు కారని తెలుస్తుంది.
1JO 2:20 అయితే, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందారు, మీ అందరికి సత్యం తెలుసు.
1JO 2:21 మీకు సత్యం తెలియదని నేను మీకు వ్రాయడం లేదు కాని సత్యం మీకు తెలుసు, సత్యం నుండి అబద్ధం పుట్టదని మీకు తెలుసు కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.
1JO 2:22 అయితే అబద్ధికులు ఎవరు? ఎవరైతే యేసును క్రీస్తు కాదంటారో వారే. తండ్రిని కుమారుని తిరస్కరించేవాడే క్రీస్తు విరోధి.
1JO 2:23 ఎందుకంటే, కుమారుని తిరస్కరించిన వారికి తండ్రి లేడు; కుమారుని అంగీకరించినవారికి తండ్రి ఉన్నాడు.
1JO 2:24 మీరైతే, మొదటి నుండి మీరు దేన్ని విన్నారో అది మీలో నిలిచి ఉండేలా చూసుకోండి. అది మీలో నిలిచివుంటే, మీరు కూడా కుమారునిలో తండ్రిలో నిలిచివుంటారు.
1JO 2:25 ఇదే క్రీస్తు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవము.
1JO 2:26 మిమ్మల్ని తప్పుత్రోవ పట్టించడానికి ప్రయత్నించే వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాస్తున్నాను.
1JO 2:27 మీరైతే, ఆయన నుండి మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉంటుంది, కాబట్టి ఎవరు మీకు బోధించవలసిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కాని అబద్ధం కాదు; అదే అన్ని విషయాల గురించి మీకు బోధిస్తుంది. అది మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలిచి ఉండండి.
1JO 2:28 కాబట్టి, ప్రియ పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో ఆయన ముందు మనం సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఉండేలా మీరు ఆయనలో కొనసాగండి.
1JO 2:29 ఆయన నీతిమంతుడని మీకు తెలిస్తే, నీతిని జరిగించే ప్రతి ఒక్కరు ఆయన మూలంగా పుట్టారని మీరు తెలుసుకుంటారు.
1JO 3:1 మనం దేవుని పిల్లలమని పిలువబడునట్లు, తండ్రి ఎంత గొప్ప ప్రేమను మనపై కురిపించాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఈ కారణంగానే లోకానికి మనం తెలియదు. ఎందుకంటే దానికి ఆయన తెలియదు.
1JO 3:2 ప్రియ మిత్రులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమే కాని, ఇక ఏమి కానున్నామో ఇంకా స్పష్టం కాలేదు. క్రీస్తు ప్రత్యక్షమైనపుడు, ఆయన యథార్థ రూపాన్ని మనం చూస్తాము కాబట్టి, ఆయన వలె ఉంటామని తెలుసుకుంటాము.
1JO 3:3 ఆయనలో నిరీక్షణ ఉంచు ప్రతివారు, ఆయన పవిత్రుడై ఉన్నట్లే తనను పవిత్రునిగా చేసుకుంటారు.
1JO 3:4 పాపం చేసే ప్రతివారు ఆజ్ఞను అతిక్రమిస్తారు; ఆజ్ఞను అతిక్రమించడమే పాపము.
1JO 3:5 పాపాలను తొలగించడానికే క్రీస్తు ప్రత్యక్షమయ్యారని మీకు తెలుసు. ఆయనలో ఎలాంటి పాపం లేదు.
1JO 3:6 ఆయనలో జీవించేవారు ఎవరూ పాపంలో కొనసాగరు. పాపంలో కొనసాగేవారు ఆయనను ఎన్నడూ చూడలేదు తెలుసుకోలేదు.
1JO 3:7 ప్రియ పిల్లలారా, మీరు ఎవరిచేత మోసపోకండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు, నీతిని జరిగించే ప్రతివారు నీతిమంతులే.
1JO 3:8 సాతాను మొదటి నుండి పాపం చేస్తున్నాడు, కాబట్టి పాపం చేసేవారు సాతాను సంబంధులు, సాతాను కార్యాలను నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు.
1JO 3:9 దేవుని వలన పుట్టిన ప్రతివారిలో ఆయన బీజం నిలిచి ఉంటుంది; కాబట్టి వారు పాపంలో కొనసాగరు. వారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి పాపం చేయలేరు.
1JO 3:10 దీనిని బట్టి దేవుని పిల్లలెవరో సాతాను పిల్లలెవరో మనకు తెలుస్తుంది; నీతిని జరిగించని వారు, తన సహోదరుని, సహోదరిని ప్రేమించనివారు దేవుని పిల్లలు కారు.
1JO 3:11 మనం మొదటి నుండి వింటున్న సందేశం: మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి
1JO 3:12 కయీను వలె ఉండవద్దు, అతడు దుష్టునికి చెందినవాడై తన సహోదరుని చంపాడు. అతడు తన సహోదరుని ఎందుకు చంపాడు? ఎందుకంటే అతడు చేసిన పనులు చెడ్డవి, అతని సహోదరుని పనులు నీతి గలవి.
1JO 3:13 నా సహోదరి సహోదరులారా, ఒకవేళ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆశ్చర్యపడకండి.
1JO 3:14 మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తున్నాము, కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమ లేనివారు మరణంలో నిలిచివుంటారు.
1JO 3:15 తన సహోదరిని, సహోదరుని ద్వేషించేవారు నరహంతకులు, ఏ నరహంతకునిలో నిత్యజీవం ఉండదని మీకు తెలుసు.
1JO 3:16 ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టారు, కాబట్టి దీని వలన ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకుంటున్నాము. మనం కూడా మన సహోదరి సహోదరుల కోసం మన ప్రాణాలను పెట్టాలి.
1JO 3:17 ఈ లోకపు ఆస్తులు కలిగినవారు అవసరంలో ఉన్న తన సహోదరుని సహోదరిని చూసి కూడా వారిపై కనికరం చూపించకపోతే, వారిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది?
1JO 3:18 ప్రియ పిల్లలారా, మనం కేవలం మాటలతో సంభాషణలతో కాకుండా, చేతలతో సత్యంలో ప్రేమిద్దాము.
1JO 3:19 దీనిని బట్టి, మనం సత్యానికి సంబంధించినవారమని మనకు తెలుస్తుంది, మన హృదయాలు ఆయన సన్నిధిలో విశ్రాంతిగా ఉంటాయి;
1JO 3:20 మన హృదయం మనపై దోషారోపణ చేస్తే, మన హృదయం కంటే దేవుడు గొప్పవాడని ఆయన సమస్తాన్ని ఎరిగినవాడని మనం తెలుసుకుంటాము.
1JO 3:21 ప్రియ స్నేహితులారా, మన హృదయం మనపై దోషారోపణ చేయకపోతే, దేవుని ముందు ధైర్యంగా ఉంటాము.
1JO 3:22 ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయనకు సంతోషం కలిగించే పనులు చేస్తే, మనం అడిగిన ప్రతిదాన్ని ఆయన నుండి పొందుకుంటాము.
1JO 3:23 ఆయన ఆజ్ఞ ఇదే: ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి, ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.
1JO 3:24 దేవుని ఆజ్ఞలను పాటించేవారు వారు ఆయనలో ఉంటారు, వారిలో ఆయన ఉంటారు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో ఉన్నారని మనకు తెలుస్తుంది.
1JO 4:1 ప్రియ మిత్రులారా, అబద్ధ ప్రవక్తలు చాలామంది లోకంలో బయలుదేరారు, కాబట్టి ప్రతి ఆత్మను నమ్మకుండా, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి.
1JO 4:2 దేవుని ఆత్మను మనం ఈ విధంగా గుర్తించవచ్చు: యేసు క్రీస్తు మానవ శరీరాన్ని ధరించి వచ్చారని ఒప్పుకునే ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చిందే.
1JO 4:3 అయితే యేసు దేవుని నుండి వచ్చారని ఒప్పుకొనని ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధి ఆత్మ. అది వస్తున్నదని మీరు విన్నారు కాని ఇప్పటికే అది లోకంలోనికి వచ్చి ఉన్నది.
1JO 4:4 ప్రియ బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారు; మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించారు.
1JO 4:5 వారు లోకానికి చెందినవారు కాబట్టి లోకరీతిగా మాట్లాడతారు, లోకం వారి మాటలు వింటుంది.
1JO 4:6 కాని మనం దేవునికి చెందినవారం, దేవుని ఎరిగిన ప్రతి ఒకరు మన మాటలు వింటారు. దేవునికి చెందనివారు మన మాటలు వినరు. కాబట్టి సత్యమైన ఆత్మను అబద్ధపు ఆత్మను దీనిని బట్టి మనకు తెలుస్తుంది.
1JO 4:7 ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి వస్తుంది కాబట్టి మనం ఒకరిని ఒకరం ప్రేమించాలి. ప్రేమించేవారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి వారు దేవున్ని ఎరిగినవారు.
1JO 4:8 దేవుడే ప్రేమ, కాబట్టి ప్రేమించనివారు దేవుని తెలుసుకోలేరు.
1JO 4:9 ఆయన ద్వారా మనం జీవించగలిగేలా, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. ఈ విధంగా దేవుడు మన మధ్య తన ప్రేమను చూపించారు.
1JO 4:10 మనం దేవుడిని ప్రేమించామని కాదు కాని ఆయనే మనల్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపారు. ఇదే ప్రేమంటే.
1JO 4:11 ప్రియ మిత్రులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించారు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరం ప్రేమించుకోవాలి.
1JO 4:12 దేవుడిని ఎవరూ ఎన్నడూ చూడలేదు; కాని మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తే, దేవుడు మనలో జీవిస్తారు; ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది.
1JO 4:13 మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని దీనిని బట్టి మనకు తెలుస్తుంది: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు.
1JO 4:14 లోక రక్షకునిగా దేవుడు తన కుమారుని పంపడం మనం మేము చూశాం సాక్ష్యమిచ్చాము.
1JO 4:15 యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో, వారిలో దేవుడు, వారు దేవునిలో జీవిస్తారు.
1JO 4:16 దేవునికి మనపై ఉన్న ప్రేమను తెలుసుకొని మనం దానిపైన ఆధారపడుతున్నాము. దేవుడే ప్రేమ. ఎవరు ప్రేమ కలిగి జీవిస్తారో, వారు దేవునిలో, దేవుడు వారిలో జీవిస్తారు.
1JO 4:17 తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా దేవుని ప్రేమ మనలో ఈ విధంగా పరిపూర్ణం చేయబడింది: ఈ లోకంలో మనం యేసు వలె ఉన్నాము.
1JO 4:18 ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తరిమివేస్తుంది, ఎందుకంటే భయం అనేది శిక్షకు సంబంధించింది. కాబట్టి భయపడేవారు ప్రేమలో పరిపూర్ణం కాలేరు.
1JO 4:19 ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాము.
1JO 4:20 అయితే ఎవరైనా తాను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ తన సహోదరుని సహోదరిని ద్వేషించేవారు అబద్ధికులు. తాము చూస్తున్న తన సహోదరుని లేదా సహోదరిని ప్రేమించలేనివారు తాము చూడని దేవుని కూడా ప్రేమించలేరు.
1JO 4:21 కాబట్టి దేవుని ప్రేమించే ప్రతివారు తమ సహోదరుని సహోదరిని కూడ ప్రేమించాలి అనేదే క్రీస్తు మనకు ఇచ్చిన ఆజ్ఞ.
1JO 5:1 యేసే క్రీస్తు అని విశ్వసించే ప్రతి ఒక్కరు దేవుని మూలంగా పుట్టినవారే. తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరు ఆయన కుమారుని కూడా ప్రేమిస్తారు.
1JO 5:2 దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుట ద్వారా మనం దేవుని బిడ్డలను ప్రేమిస్తున్నామని మనకు తెలుస్తుంది.
1JO 5:3 నిజానికి, దేవుని ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే. ఆయన ఆజ్ఞలు కష్టతరమైనవి కావు.
1JO 5:4 దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే.
1JO 5:5 లోకాన్ని ఎవరు జయించగలరు? యేసు దేవుని కుమారుడని నమ్మినవారు మాత్రమే కదా.
1JO 5:6 నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు యేసు క్రీస్తే. ఆయన కేవలం నీటి ద్వారా మాత్రమే రాలేదు, కాని నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చారు. ఆత్మ సాక్ష్యమిస్తున్నాడు ఎందుకంటే ఆత్మ సత్యము.
1JO 5:7 దానికై ముగ్గురు సాక్ష్యమిస్తున్నారు:
1JO 5:8 ఆత్మ, నీరు, రక్తం; ఈ ముగ్గురు ఏకీభవిస్తున్నారు.
1JO 5:9 మనం మానవులిచ్చే సాక్ష్యాన్ని అంగీకరిస్తాం, కాని దేవుడిచ్చే సాక్ష్యం గొప్పది, ఎందుకంటే అది ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము.
1JO 5:10 కాబట్టి దేవుని కుమారుని విశ్వసించే ప్రతివారు ఈ సాక్ష్యాన్ని అంగీకరిస్తారు. దేవుని విశ్వసించనివారు తన కుమారుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని నమ్మలేదు, కాబట్టి దేవున్ని అబద్ధికునిగా చేస్తున్నారు.
1JO 5:11 ఆ సాక్ష్యం ఇదే: దేవుడు మనకు నిత్యజీవాన్ని ఇచ్చారు, ఈ జీవం ఆయన కుమారునిలో ఉంది.
1JO 5:12 కుమారుని కలిగిన ప్రతివారిలో ఈ జీవం ఉన్నది; దేవుని కుమారుని పొందని వారిలో జీవం లేదు.
1JO 5:13 దేవుని కుమారుని నామాన్ని విశ్వసించే మీరు నిత్యజీవం గలవారని తెలుసుకుంటారని వీటిని మీకు వ్రాస్తున్నాను.
1JO 5:14 మనం దేవున్ని సమీపిస్తున్నప్పుడు మనకు ఉండే నమ్మకం ఇదే: ఆయన చిత్తప్రకారం మనమేది అడిగినా, మనం అడిగేది ఆయన వింటారు.
1JO 5:15 మనమేది అడిగినా, మనం అడిగేది ఆయన వింటారని మనకు తెలిస్తే, మనం ఆయనను ఏది అడిగామో అది కలిగి ఉన్నామని మనకు తెలుసు.
1JO 5:16 తన సహోదరుడు గాని సహోదరి గాని మరణానికి గురి చేయని పాపం చేయడం మీరు చూస్తే, మీరు తప్పక ప్రార్థించాలి. అప్పుడు దేవుడు వారికి జీవం ఇస్తారు. మరణానికి నడిపించే పాపం ఉంది. మీరు దాని గురించి ప్రార్థించాలని నేను చెప్పడం లేదు.
1JO 5:17 తప్పులన్నీ పాపమే, మరణానికి నడిపించని పాపం ఉంది.
1JO 5:18 దేవుని మూలంగా పుట్టిన వారెవరు పాపం కొనసాగించలేరని మనకు తెలుసు; దేవుని మూలంగా పుట్టిన వారు తమను తాము భద్రం చేసుకుంటారు, కాబట్టి దుష్టుడు వారిని ముట్టలేడు.
1JO 5:19 మనం దేవుని పిల్లలమని, లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉన్నదని మనకు తెలుసు.
1JO 5:20 మనం సత్యవంతుడైన వానిని తెలుసుకునేలా చేయడానికి, దేవుని కుమారుడు వచ్చాడని, మనకు తెలివిని ఇచ్చారని మనకు తెలుసు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో ఉండడం ద్వారా సత్యవంతునిలో మనం ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్యజీవము.
1JO 5:21 చిన్న పిల్లలారా, విగ్రహాలకు దూరంగా ఉండండి.
2JO 1:1 పెద్దనైన నేను,
2JO 1:2 మనలో నివసిస్తున్న, నిత్యం మనతోనే ఉండే సత్యాన్ని బట్టి వారు ప్రేమిస్తున్నారు.
2JO 1:3 సత్యంలోను ప్రేమలోను తండ్రియైన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి మనకు కృపా కనికరం సమాధానాలు మనతో ఉంటాయి.
2JO 1:4 తండ్రి మనకు ఆజ్ఞాపించిన విధంగా నీ బిడ్డలలో కొందరు సత్యంలో జీవించడం చూసి ఎంతో సంతోషించాను.
2JO 1:5 అమ్మా, నేను నీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయడం లేదు కాని ఇది మొదటి నుండి మనకు ఉన్న ఆజ్ఞను బట్టి మనం ఒకరినొకరం ప్రేమించాలని అడుగుతున్నాను.
2JO 1:6 ప్రేమ అంటే మనం దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే. మొదటి నుండి మీరు వింటున్నట్లుగా మీరందరు ప్రేమలో జీవించాలి అనేదే ఆయన ఇచ్చిన ఆజ్ఞ.
2JO 1:7 ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు మనుష్యునిగా వచ్చారని ఒప్పుకొనని మోసగాళ్లు చాలామంది లోకంలో బయలుదేరారు. వారు క్రీస్తు విరోధులు.
2JO 1:8 మనం ఇంతవరకు దేనికోసం పని చేశామో దానిని కోల్పోకుండా మీ బహుమానాన్ని సంపూర్ణంగా పొందుకునేలా జాగ్రత్త వహించండి.
2JO 1:9 క్రీస్తు బోధలో కొనసాగకుండా దానిని విడిచి ముందుకు వెళ్లే వారికి దేవుడు లేడు; కాని బోధలో కొనసాగేవారు తండ్రిని, కుమారుని ఇరువురిని కలిగి ఉంటారు.
2JO 1:10 ఎవరైనా ఈ బోధను తీసుకురాకుండా మీ దగ్గరకు వస్తే, వారిని మీ ఇంట్లోకి తీసుకెళ్లవద్దు రమ్మనవద్దు.
2JO 1:11 వారిని రమ్మని ఆహ్వానించేవారు వారి చెడుపనులలో భాగం పంచుకొంటారు.
2JO 1:12 మీకు చాలా సంగతులు వ్రాయవలసి ఉంది, కాని సిరాతో కాగితంతో వ్రాయడం ఇష్టం లేదు. మన సంతోషం సంపూర్ణం కావడానికి, నేను మీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను.
2JO 1:13 దేవుని చేత ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనాలు చెప్తున్నారు.
3JO 1:1 పెద్దనైన నేను,
3JO 1:2 ప్రియ మిత్రుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నట్లు, మంచి ఆరోగ్యాన్ని కలిగి అన్నిటిలో నీవు వర్ధల్లాలని నేను ప్రార్థిస్తున్నాను.
3JO 1:3 కొందరు విశ్వాసులు వచ్చి నీవు సత్యంలో ఎలా జీవిస్తున్నావో చెప్తూ, మీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యమిచ్చినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది.
3JO 1:4 నా పిల్లలు సత్యంలో జీవిస్తున్నారని వినడంకంటే నాకు సంతోషకరమైన విషయం వేరొకటి లేదు.
3JO 1:5 ప్రియ మిత్రుడా, నీకు పరిచయం లేని సహోదరి సహోదరుల కోసం నీవు చేస్తున్నదాంట్లో నమ్మకంగా ఉన్నావు.
3JO 1:6 నీ ప్రేమ గురించి వారు సంఘానికి చెప్పారు. దయచేసి దేవుని ఘనపరచే విధంగా వారిని వారి మార్గంలో పంపు.
3JO 1:7 దేవుని ఎరుగనివారి నుండి ఏమి తీసుకోకుండా ఆయన నామం నిమిత్తం వారు బయలుదేరారు.
3JO 1:8 మనం సత్యం కోసం కలిసి పని చేసేలా అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి.
3JO 1:9 నేను సంఘానికి వ్రాశాను, కాని మొదటి స్థానాన్ని ఆశించే దియొత్రెఫే మమ్మల్ని చేర్చుకోవడంలేదు.
3JO 1:10 కాబట్టి నేను వచ్చినపుడు అతడు చేస్తున్న వాటిని వివరిస్తాను. అతడు మా గురించి అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాడు. దానితో తృప్తి చెందకుండా, ఇతర విశ్వాసులను చేర్చుకోవడానికి కూడా అంగీకరించడం లేదు. చేర్చుకోవాలనుకునే వారిని కూడ అతడు ఆపివేసి, వారిని సంఘం నుండి వెళ్లగొడుతున్నాడు.
3JO 1:11 ప్రియ మిత్రుడా, చెడును కాక మంచిని మాత్రమే అనుసరించు. మంచి చేసేవారు దేవునికి చెందినవారు. చెడు చేసేవారు దేవుని చూడలేరు.
3JO 1:12 దేమేత్రిని గురించి అందరు మంచిగా చెప్తున్నారు. సత్యం విషయంలో కూడ మంచి సాక్ష్యం ఉంది. మా సాక్ష్యం సత్యమని నీకు తెలుసు.
3JO 1:13 నేను నీకు వ్రాయవలసినది ఎంతో ఉంది. కాని కలంతో సిరాతో వ్రాయాలని నాకు లేదు.
3JO 1:14 త్వరలో నేను నీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా నీతో మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను.
3JO 1:15 నీకు సమాధానం కలుగును గాక. ఇక్కడ ఉన్న స్నేహితులు వారి శుభాలను పంపుతున్నారు. అక్కడ ఉన్న స్నేహితులందరికి పేరుపేరున శుభాలు తెలియజేయి.
JUD 1:1 యేసు క్రీస్తు సేవకుడు యాకోబు సహోదరుడైన యూదా,
JUD 1:2 కరుణ, శాంతి, ప్రేమ మీలో సమృద్ధిగా కలుగును గాక.
JUD 1:3 ప్రియ మిత్రులారా, మనందరం పాలుపంచుకొనే రక్షణ గురించి మీకు వ్రాయాలని చాలా ఆశించాను, కాని దేవుని పరిశుద్ధ ప్రజలకు ఒక్కసారే ఇవ్వబడిన విశ్వాసం కోసం మీరు పోరాడుతూనే ఉండాలని, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, వేడుకోడానికి నేను వ్రాస్తున్నాను.
JUD 1:4 ఎవరి గురించి తీర్పు చాలా కాలం క్రితమే వ్రాయబడిందో వారు రహస్యంగా మీ మధ్యలో చొరబడ్డారు. వారు వ్యభిచారంలో జీవించడానికి మన దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ, మన ఏకైక సర్వాధికారియైన ప్రభువగు యేసు క్రీస్తును తిరస్కరించిన భక్తిహీనులు.
JUD 1:5 మీకు ఇవన్నీ తెలిసినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు ఒక్కసారే ఈజిప్టు దేశం నుండి విడిపించారు, కాని తర్వాత విశ్వసించని వారిని ఆయన నాశనం చేశారనే విషయం నీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను.
JUD 1:6 తమకు అప్పగించిన అధికారాన్ని నిలుపుకోలేక, తమ నివాసాలను విడిచిన దేవదూతలను గుర్తుచేసుకోండి. వారిని ఆయన మహాదినాన తీర్పు తీర్చడానికి కటిక చీకటిలో, శాశ్వతమైన గొలుసులతో బంధించి ఉంచారు.
JUD 1:7 అదే విధంగా, సొదొమ, గొమొర్రాలు ఆ చుట్టుప్రక్కల పట్టణ ప్రజలు లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు, ప్రకృతి విరుద్ధమైన వ్యామోహానికి లోనయ్యారు. ఆ ప్రజలు నిత్యాగ్ని శిక్షను అనుభవించబోయే వారికి ఒక ఉదాహరణగా ఉన్నారు.
JUD 1:8 అదే విధంగా, ఈ భక్తిహీనులు తమ కలల ప్రభావం వలన తమ శరీరాలను మలినం చేసుకుంటారు, అధికారులను తృణీకరిస్తారు, పరలోక సంబంధులను దూషిస్తారు.
JUD 1:9 మోషే శరీరం గురించి సాతానుతో తనకు వచ్చిన తగాదాలో, దేవదూతల్లో ప్రధానుడైన మిఖాయేలు కూడ సాతానును అవమానకరమైన మాటలతో నిందించలేదు కాని కేవలం, “ప్రభువు నిన్ను గద్దించును గాక!” అని మాత్రమే అన్నాడు.
JUD 1:10 అయినా ఈ ప్రజలు తాము గ్రహించలేని వాటిని దూషిస్తారు, అంతేకాక తెలివిలేని జంతువులు చేసినట్లు, వారు వేటిని సహజసిద్ధంగా గ్రహిస్తారో, అవే వారిని నాశనం చేస్తాయి.
JUD 1:11 వారికి శ్రమ! వారు కయీను త్రోవను అనుసరించారు; లాభం పొందాలని బిలాములా తప్పు మార్గాల్లో పరుగెత్తారు; కోరహులా తిరుగుబాటు చేయడం వలన నాశనం చేయబడ్డారు.
JUD 1:12 వీరు మీ ప్రేమ విందుల్లో, వినోదాలలో సిగ్గువిడిచి తింటూ, త్రాగుతూ మాయని మచ్చలుగా ఉన్నారు, వారు కేవలం తమను తాము పోషించుకునే కాపరుల్లా ఉన్నారు. వారు గాలికి కొట్టుకుపోయే, వాన కురవని మబ్బుల వంటివారు. ఆకురాలు కాలంలో, ఫలాలులేకుండా పెల్లగింపబడి రెండు సార్లు చనిపోయిన చెట్లవంటివారు.
JUD 1:13 వారు తమ సిగ్గును నురుగులా కనబడేలా చేసే సముద్రపు భయంకరమైన అలల వంటివారు. వారు నిలకడలేని నక్షత్రాల వంటివారు. వారి కోసం కటిక చీకటి నిరంతరం భద్రం చేయబడి ఉంది.
JUD 1:14 ఆదాము నుండి ఏడవ తరం వాడైన హనోకు వారి గురించి ఇలా ప్రవచించాడు: “చూడండి, వేవేలకొలది తన పరిశుద్ధ జనంతో ప్రభువు వస్తారు.
JUD 1:15 అందరికి తీర్పు తీర్చడానికి, వారి భక్తిహీనతలో వారు చేసిన దుష్ట కార్యాలను, భక్తిహీనులైన పాపులు ఆయనకు వ్యతిరేకంగా పలికిన ధిక్కారపు మాటలను వారందరిచేత ఒప్పింపజేస్తారు.”
JUD 1:16 వారు ఎల్లప్పుడు సణుగుతూ ఇతరులలో తప్పులు వెదుకుతారు; వారు తమ చెడు కోరికలనే అనుసరిస్తారు; వారు తమ గురించి తామే పొగడుకొంటారు, స్వలాభం కోసం ఇతరులను పొగడ్తలతో ముంచెత్తుతారు.
JUD 1:17 కాని, ప్రియ మిత్రులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు మీకు ముందుగానే ఏమి చెప్పారో జ్ఞాపకం చేసుకోండి.
JUD 1:18 “అంత్యదినాలలో తమ చెడు కోరికలనే అనుసరించే అపహాసకులు ఉంటారు” అని వారు మీకు చెప్పారు.
JUD 1:19 అలాంటివారు సహజ సంబంధులు, వీరు ఆత్మలేనివారిగా ఉండి, మీలో విభేదాలు పుట్టిస్తారు.
JUD 1:20 కాని, ప్రియ మిత్రులారా, అతిపరిశుద్ధమైన మీ విశ్వాసంలో మిమ్మల్ని మీరు బలపరచుకొంటూ, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ,
JUD 1:21 మీకు నిత్యజీవాన్ని దయచేసే మన ప్రభువైన యేసు క్రీస్తు కనికరం కోసం మీరు ఎదురుచూస్తూ ఉంటూ మీరు దేవుని ప్రేమలో నిలిచి ఉండండి.
JUD 1:22 సందేహించే వారిపై దయ చూపండి;
JUD 1:23 అగ్నిగుండం నుండి బయటకు లాగినట్లు ఇతరులను రక్షించండి. మరికొందరిపై భయంతో కూడిన కనికరం చూపండి. అయితే శరీర అపవిత్రతతో మరకపడిన వారి దుస్తులను కూడా ద్వేషించండి.
JUD 1:24 మీరు తొట్రిల్లకుండ కాపాడడానికి, తన మహిమ ముందు ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి, శక్తి కలిగిన, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,
JUD 1:25 మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, యుగయుగములకు పూర్వం, ఇప్పుడు, ఎల్లప్పుడు మహిమ ఘనత ఆధిపత్యం అధికారం కలుగును గాక! ఆమేన్.
REV 1:1 త్వరలో సంభవించబోయే వాటి గురించి దేవుడు తన సేవకులకు చూపించడానికి యేసు క్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దూతను తన సేవకుడైన యోహాను దగ్గరకు పంపి ఈ సంగతులను తెలియజేశారు.
REV 1:2 అతడు దేవుని వాక్యం గురించి, యేసు క్రీస్తు సాక్ష్యం గురించి తాను చూసిన వాటన్నిటిని గురించి సాక్ష్యమిస్తున్నాడు.
REV 1:3 సమయం సమీపంగా ఉంది కాబట్టి ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవారు ధన్యులు, దానిలో వ్రాయబడిన వాటిని విని వాటి ప్రకారం నడుచుకొనేవారు ధన్యులు.
REV 1:4 యోహాను,
REV 1:5 నమ్మకమైన సాక్షిగా మృతులలో నుండి అందరికంటే మొదటిగా జీవంతో తిరిగి లేచి భూరాజులందరిని పరిపాలిస్తున్న యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక. మనల్ని ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మన పాపాల నుండి మనల్ని విడిపించి,
REV 1:6 తన తండ్రియైన దేవునికి పరిచర్య చేసే యాజకుల రాజ్యంగా మనల్ని చేసిన ఆయనకే మహిమా ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.
REV 1:7 “ఇదిగో! ఆయన మేఘాలలో వస్తున్నారు. ప్రతి కన్ను ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచిన వారు కూడ ఆయనను చూస్తారు”; భూమి మీద ఉన్న జనులందరు, “ఆయనను చూసి దుఃఖిస్తూ విలపిస్తారు.”
REV 1:8 “అల్ఫా ఒమేగాను నేనే, గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడను రానున్నవాడను నేనే” అని సర్వశక్తిగల ప్రభువైన దేవుడు చెప్తున్నారు.
REV 1:9 యోహాను అనే నేను మీ సహోదరున్ని, యేసులో మనకు కలిగే శ్రమ, రాజ్యం, దీర్ఘ సహనంలో మీతో పాలిభాగస్థుడనైన నేను దేవుని వాక్యం కోసం, యేసు సాక్ష్యం కోసం పత్మాసు ద్వీపంలో బందీగా ఉన్నాను.
REV 1:10 ప్రభువు దినాన నేను ఆత్మవశుడనై ఉన్నప్పుడు నా వెనుక నుండి బూరధ్వని వంటి ఒక పెద్ద స్వరం వినబడింది.
REV 1:11 ఆ స్వరం, “నీవు చూసినవాటిని ఒక గ్రంథపుచుట్టలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు” అని చెప్పడం విన్నాను.
REV 1:12 నేను నాతో మాట్లాడిన స్వరం ఎవరా అని చూడడానికి వెనుకకు తిరిగాను. నేను అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను.
REV 1:13 ఆ దీపస్తంభాల మధ్య, కాళ్ల అంచుల వరకు పొడవైన వస్త్రాలను ధరించుకొని, తన రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకుని మనుష్యకుమారునిలా ఉన్న ఒకరిని చూశాను.
REV 1:14 ఆయన తలవెంట్రుకలు తెల్లని ఉన్నిలా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్లు మండుతున్న అగ్నిజ్వాలల్లా ఉన్నాయి.
REV 1:15 ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ ధగధగ మెరుస్తున్న ఇత్తడిలా ఉన్నాయి; ఆయన కంఠస్వరం అనేక జలప్రవాహాల ధ్వనిలా వినిపించింది.
REV 1:16 ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకున్నాడు; ఆయన నోటి నుండి పదును గల రెండు అంచుల ఖడ్గం బయటకు వస్తుంది; ఆయన ముఖం పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.
REV 1:17 నేను ఆయనను చూడగానే చనిపోయిన వానిలా ఆయన పాదాల దగ్గర పడిపోయాను. అప్పుడు ఆయన తన కుడిచేతిని నా మీద పెట్టి నాతో, “భయపడకు, నేను మొదటివాడను చివరివాడను.
REV 1:18 జీవించేవాడను నేనే. ఇదిగో, నేను చనిపోయాను కాని ఇప్పుడూ ఎల్లకాలం నేను జీవిస్తున్నాను! మరణం, పాతాళ లోకపు తాళపుచెవులు నా ఆధీనంలోనే ఉన్నాయి.
REV 1:19 “కాబట్టి నీవు చూసినవాటిని, ఇప్పుడు ఉన్నవాటిని, వాటి తర్వాత జరుగబోయే వాటిని వ్రాసి పెట్టు.
REV 1:20 నా కుడిచేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రాల గురించి, ఏడు దీపస్తంభాల గురించి మర్మం ఇదే: ఏడు నక్షత్రాలు అంటే ఏడు సంఘాల ఏడు దూతలు, ఏడు దీపస్తంభాలు అంటే ఏడు సంఘాలు.
REV 2:1 “ఎఫెసులో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: ఏడు నక్షత్రాలు తన కుడిచేతిలో పట్టుకుని ఏడు దీపస్తంభాల మధ్య నడిచేవాడు ఈ మాటలు చెప్తున్నాడు.
REV 2:2 నీ క్రియలు నీ కష్టం నీ పట్టుదల నాకు తెలుసు. నీవు దుష్టులను సహించలేవని నాకు తెలుసు. అపొస్తలులు కాకపోయినా మేము అపొస్తలులం అని చెప్పుకొనే వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు తెలుసుకున్నావు.
REV 2:3 నా పేరు కోసం నీవు ఓర్పుతో అలసిపోకుండా కష్టాలను సహించావని నాకు తెలుసు.
REV 2:4 అయినాసరే నేను నీ మీద తప్పు మోపవలసి ఉంది: నీకు ఉండిన మొదట్లో నీకున్న ప్రేమను నీవు వదిలేశావు.
REV 2:5 నీవు ఎంతగా పడిపోయావో గుర్తించు! నీవు పశ్చాత్తాపపడి మొదట చేసిన పనులు చేయి. నీవు పశ్చాత్తాపపడకపోతే నేను నీ దగ్గరకు వచ్చి, నీ దీపస్తంభాన్ని దాని స్థానంలో నుండి తీసివేస్తాను.
REV 2:6 అయితే నేను నీకొలాయితు పద్ధతులను ద్వేషించినట్లు నీవు కూడా ద్వేషిస్తున్నావు కాబట్టి అది నీకు అనుకూలంగా ఉన్న మంచి విషయము.
REV 2:7 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! వీటిని జయించినవారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలను తినడానికి అనుమతిస్తాను.
REV 2:8 “స్ముర్నలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: మొదటి వాడును చివరి వాడునై మరణించి తిరిగి లేచినవాడు ఈ మాటలు చెప్తున్నాడు.
REV 2:9 నీ శ్రమలు, నీ పేదరికం నాకు తెలుసు అయినా నీవు ధనవంతుడవే! యూదులు కాకుండానే తాము యూదులమని చెప్పుకొనే సాతాను సమాజమందిరానికి చెందినవారు నీపై చేసే దూషణ నాకు తెలుసు.
REV 2:10 నీకు కలుగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. నిన్ను శోధించడానికి అపవాది మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు, కాబట్టి పది రోజులు హింస పొందుతారు అని తెలియజేస్తున్నాను. అయినా మరణం వరకు నమ్మకంగా ఉండండి. అప్పుడు నేను మీకు జీవాన్ని మీ విజయ కిరీటంగా బహూకరిస్తాను.
REV 2:11 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! జయించినవారికి రెండవ మరణం హాని చేయదు.
REV 2:12 “పెర్గములో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: పదునైన రెండు అంచులు గల ఖడ్గం కలవాడు ఈ మాటలు చెప్తున్నాడు.
REV 2:13 సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నా నామానికి నిజంగా కట్టుబడి ఉన్నావు. సాతాను నివసించే నీ పట్టణంలో నాకు నమ్మకమైన సాక్షిగా ఉన్న అంతిప అనేవాడు హతసాక్షిగా చంపబడిన దినాల్లో కూడ నాలో నీ విశ్వాసాన్ని వదలకుండా ఉన్నావు.
REV 2:14 అయినా, నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉంది: అవేమనగా విగ్రహాలకు అర్పించిన ఆహారం తినేలా, లైంగిక దుర్నీతి జరిగించేలా ఇశ్రాయేలీయులను వేధించమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు.
REV 2:15 అలాగే నీకొలాయితు చేసే బోధలను అనుసరించేవారు కూడా నీలో ఉన్నారు.
REV 2:16 కాబట్టి పశ్చాత్తాపపడు! లేకపోతే నేను త్వరలో నీ దగ్గరకు వచ్చినా నోటినుండి వచ్చే ఖడ్గంతో వారితో యుద్ధం చేస్తాను.
REV 2:17 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! వీటిని జయించినవారికి నేను దాచి ఉంచిన మన్నాను ఇస్తాను. నేను వారికి తెల్లని రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును ఇస్తాను. దాన్ని పొందినవారికి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది.
REV 2:18 “తుయతైరలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: అగ్ని జ్వాలల్లాంటి కళ్లు, తళతళ మెరుస్తున్న కంచును పోలిన పాదాలు గల దేవుని కుమారుడు ఈ మాటలు చెప్తున్నాడు:
REV 2:19 నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ సేవ, నీ పట్టుదల, నాకు తెలుసు. నీవు ఇప్పుడు చేసే క్రియలు ముందు చేసిన క్రియల కంటే గొప్పవని నాకు తెలుసు.
REV 2:20 అయినా నేను నీ మీద తప్పు మోపవలసివున్నది: తాను ప్రవక్తిని అని చెప్పుకొనే యెజెబెలును మీరు సహిస్తున్నారు. లైంగిక దుర్నీతి, విగ్రహాలకు అర్పించిన ఆహారం తినాలని నా సేవకులకు బోధిస్తూ ఆమె వారిని మోసం చేస్తుంది.
REV 2:21 ఆమె లైంగిక దుర్నీతి గురించి పశ్చాత్తాపపడడానికి నేను సమయం ఇచ్చాను కాని ఆమె దానికి ఇష్టపడలేదు.
REV 2:22 కాబట్టి నేను ఆమెను శ్రమల పడకపై పడవేస్తాను. అలాగే ఆమెతో వ్యభిచరించిన వారు పశ్చాత్తాపపడకపోతే వారిని కూడా తీవ్రమైన బాధలకు గురిచేస్తాను.
REV 2:23 ఆమె పిల్లలను నేను మరణానికి అప్పగిస్తాను. అప్పుడు సంఘాలన్ని నేను అంతరంగాలను, హృదయాలను పరిశోధిస్తానని, మీలో అందరికి మీ క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తానని తెలుసుకుంటాయి.
REV 2:24 అయితే తుయతైరలో యెజెబెలు బోధను అంగీకరించకుండా, సాతాను లోతైన మర్మాలను నేర్చుకోకుండా ఉన్న తక్కిన వారందరికి, ‘నేను ఇక ఏ భారం నీమీద మోపనని చెప్తున్నాను.
REV 2:25 కాని నేను వచ్చేవరకు నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో.’
REV 2:26 అంతం వరకు నా చిత్తాన్ని నెరవేరుస్తూ జయించినవారికి నా తండ్రి నుండి నేను అధికారం పొందినట్లే రాజ్యాల మీద వారికి అధికారం ఇస్తాను.
REV 2:27 ‘వారు ఇనుపదండంతో రాజ్యాలను పరిపాలిస్తారు, వారిని మట్టి కుండలను పగలగొట్టినట్లు పగలగొడతారు.’
REV 2:28 నేను వారికి వేకువ చుక్కను కూడా ఇస్తాను.
REV 2:29 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి.
REV 3:1 “సార్దీసులో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: దేవుని ఏడు ఆత్మలు, ఏడు నక్షత్రాలు కలవాడు ఈ మాటలు చెప్తున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు; నీవు బ్రతికున్నావని పేరు ఉంది కాని నీవు చచ్చిన దానివే.
REV 3:2 మేల్కో! నా దేవుని దృష్టిలో నీ క్రియలు సంపూర్తి అయినట్లు నాకు కనిపించలేదు కాబట్టి చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపరచు.
REV 3:3 కాబట్టి నీవు పొందిన వాటిని విన్నవాటిని జ్ఞాపకం చేసుకుని, వాటిని పాటిస్తూ గట్టిగా పట్టుకుని పశ్చాత్తాపపడు. కాని నీవు మేలుకోక పోతే నేను దొంగలా వస్తాను, నేను ఏ సమయంలో నీ దగ్గరకు వస్తానో నీకు తెలియదు.
REV 3:4 అయినా సార్దీసులో నీ దగ్గర ఉన్న కొందరు తమ వస్త్రాలను మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు కాబట్టి వారు తెల్లని వస్త్రాలను ధరించుకొని నాతో పాటు నడుస్తారు.
REV 3:5 జయించేవారు వారిలా తెల్లని వస్త్రాలు ధరించుకొంటారు. వాని పేరును నేను జీవగ్రంథంలో నుండి ఎన్నడు తుడిచివేయను. నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు వాని పేరును ఒప్పుకుంటాను.
REV 3:6 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి.
REV 3:7 “ఫిలదెల్ఫియలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: దావీదు తాళపు చెవిని కలిగి ఉన్న సత్యవంతుడైన పరిశుద్ధుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన తెరచిన దాన్ని ఎవరూ మూయలేరు, ఆయన మూసిన దాన్ని ఎవరూ తెరవలేరు.
REV 3:8 నీ క్రియలు నాకు తెలుసు. ఎవరు మూయలేని ద్వారం నేను నీ ముందు తెరచి ఉంచాను. నీకు కొద్ది బలమే ఉన్నా నీవు నా వాక్యాన్ని పాటించి జీవిస్తూ నా పేరును తిరస్కరించలేదని నాకు తెలుసు.
REV 3:9 యూదులు కాకుండానే తాము యూదులమని అబద్ధాలు చెప్పుకొనే సాతాను సమాజమందిరానికి చెందిన వారందరిని నీ దగ్గరకు రప్పించి నీ పాదాల ముందు సాగిలపడి నేను నిన్ను ప్రేమిస్తున్నానని వారు ఒప్పుకునేలా చేస్తాను.
REV 3:10 నేను నీకు ఆజ్ఞాపించినట్లే నీవు సహనంతో సహించావు కాబట్టి భూనివాసులు అందరిని పరీక్షించడానికి లోకం మీద రానున్న శోధన సమయంలో నేను నిన్ను కాపాడతాను.
REV 3:11 నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి ఎవరు నీ కిరీటాన్ని తీసుకోకుండా నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో.
REV 3:12 జయించినవారిని నా దేవాలయంలో ఒక స్తంభంగా నిలబెడతాను. అప్పుడు వారు దానిలో నుండి ఎన్నడూ బయటకు వెళ్లరు. వారి మీద నేను నా దేవుని పేరును పరలోకంలో ఉన్న నా దేవుని నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేము అనే నా దేవుని పట్టణం పేరును, నా క్రొత్త పేరును కూడా వ్రాస్తాను.
REV 3:13 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి.
REV 3:14 “లవొదికయలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: ఆమేన్ అనేవాడు, నమ్మకమైనవాడు, సత్య సాక్షి, దేవుని సృష్టిని పరిపాలించేవాడు ఈ మాటలు చెప్తున్నాడు.
REV 3:15 నీ క్రియలు నాకు తెలుసు, నీవు చల్లగా కాని వెచ్చగా కాని లేవు. నీవు చల్లగా కాని వెచ్చగా కాని ఉంటే మంచిది.
REV 3:16 నీవు చల్లగా కాని వెచ్చగా కాని లేకుండా నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోటిలో నుండి నిన్ను ఉమ్మి వేస్తాను.
REV 3:17 నీవు, ‘నేను ధనవంతున్ని నేను చాలా ఆస్తులను సమకూర్చుకొన్నాను కాబట్టి నాకు ఏ లోటులేదని’ అంటున్నావు కాని నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, బీదవాడవు, గ్రుడ్డివాడివి, దిగంబరివని నీకు తెలియదు.
REV 3:18 నీవు ధనవంతునివి అయ్యేలా అగ్నిలో పుటం వేసిన బంగారాన్ని, అవమానకరమైన నీ దిగంబరత్వం కనబడకుండా ధరించుకోవడానికి తెల్లని వస్త్రాన్ని, నీవు చూడగలిగేలా నీ కళ్లకు మందు నా దగ్గర కొనుక్కో అని నేను నీకు సలహా ఇస్తున్నాను.
REV 3:19 నేను ప్రేమించేవారిని గద్దించి శిక్షిస్తాను కాబట్టి నీవు ఆసక్తి కలిగి పశ్చాత్తాపపడు.
REV 3:20 ఇదిగో! నేను తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి వారితో నేను, నాతో వారు భోజనం చేస్తాము.
REV 3:21 నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లే జయించినవారిని నా సింహాసనం మీద నాతో పాటు కూర్చోనిస్తాను.
REV 3:22 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి.”
REV 4:1 ఆ తర్వాత, నేను చూస్తూ ఉండగా పరలోకంలో ఒక తలుపు తెరవబడి కనిపించింది. నేను మొదట విన్న బూరధ్వని వంటి స్వరం నాతో, “ఇక్కడకు ఎక్కి రా, తర్వాత జరగాల్సిన దాన్ని నేను నీకు చూపిస్తాను” అని చెప్పింది.
REV 4:2 వెంటనే నేను ఆత్మవశుడనై ఉండగా నా ముందు పరలోకంలో ఒక సింహాసనం, ఆ సింహాసనం మీద ఒకరు కూర్చుని ఉండడం చూశాను.
REV 4:3 అక్కడ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి చూడడానికి సూర్యకాంత మణిలా కెంపులా మెరుస్తూ కనబడ్డాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తున్న వానవిల్లు ఆవరించి ఉండింది.
REV 4:4 ఆ సింహాసనం చుట్టూ మరో ఇరవైనాలుగు సింహాసనాలు, వాటి మీద ఇరవైనలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని తలల మీద బంగారు కిరీటాలు కలిగి ఉన్నారు.
REV 4:5 ఆ సింహాసనం నుండి మెరుపులు, ఉరుముల గొప్ప శబ్దాలు వచ్చాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.
REV 4:6 ఆ సింహాసనం ముందు స్ఫటికం లాంటి ఒక గాజు సముద్రం ఉంది. మధ్యభాగంలో, ఆ సింహాసనం చుట్టూ నాలుగు ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులకు ముందు వెనుక కళ్లు ఉన్నాయి.
REV 4:7 మొదటి ప్రాణి సింహంలా, రెండవ ప్రాణి దూడలా, మూడవ ప్రాణి ముఖం మనిషిలా, నాలుగవ ప్రాణి ఎగురుతున్న పక్షిరాజులా ఉన్నాయి.
REV 4:8 ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ ఆ రెక్కల క్రింద కళ్లతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు ఆపకుండా నిరంతరం ఇలా అంటున్నాయి:
REV 4:9 ఆ ప్రాణులు సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్న దేవాది దేవునికి మహిమ, ఘనత కృతజ్ఞతలు అర్పిస్తుండగా,
REV 4:10 ఇరవైనలుగురు పెద్దలు లేచి సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్నవాని ముందు సాగిలపడి ఆరాధిస్తూ, గౌరవంతో తమ కిరీటాలు తీసి ఆ సింహాసనం ముందు వేసి ఇలా చెప్పారు:
REV 4:11 “ఓ ప్రభువా, మా దేవా! నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్త ప్రకారమే అవి సృష్టించబడ్డాయి, కాబట్టి మహిమ, ఘనత, ప్రభావాలు పొందడానికి నీవే యోగ్యుడవు.”
REV 5:1 అప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నవాని కుడిచేతిలో ఇరువైపుల వ్రాయబడి ఏడు ముద్రలతో ముద్రించబడి ఉన్న ఒక గ్రంథపుచుట్టను నేను చూశాను.
REV 5:2 అప్పుడు శక్తిగల ఒక దేవదూత బిగ్గరగా, “చుట్టబడి ఉన్న ఈ ముద్రలను విప్పి గ్రంథపుచుట్టను తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” అని ప్రకటన చేస్తుంటే నేను చూశాను.
REV 5:3 అయితే పరలోకంలో కాని, భూమి మీద కాని, భూమి క్రింద కాని ఉన్నవారిలో కాని ఎవరూ ఆ గ్రంథపుచుట్టను విప్పలేకపోయారు, కనీసం దానిలోనికి చూడలేకపోయారు.
REV 5:4 ఆ గ్రంథపుచుట్టను తెరవడానికి కాని దాని లోపలకి చూడడానికి కాని సామర్థ్యం కలవారు ఎవరూ లేరని నేను చాలా ఏడుస్తూ ఉన్నప్పుడు,
REV 5:5 పెద్దలలో ఒకరు నాతో, “ఏడవకు, ఇదిగో, దావీదు వేరు నుండి వచ్చిన యూదా గోత్రపు సింహం జయాన్ని పొందాడు. ఆయనే ఆ ఏడు ముద్రలను విప్పి ఆ గ్రంథపుచుట్టను తెరవగలరు” అన్నాడు.
REV 5:6 అప్పుడు సింహాసనం మధ్య, ఆ నాలుగు ప్రాణులు, పెద్దల మధ్య వధించబడినట్లు ఉన్న ఒక గొర్రెపిల్లను చూశాను. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ల ఉన్నాయి, అవి దేవుడు భూలోకమంతటి మీదికి పంపిన దేవుని ఏడు ఆత్మలు.
REV 5:7 ఆ గొర్రెపిల్ల, సింహాసనం మీద కూర్చుని ఉన్నవాని దగ్గరకు వెళ్లి ఆయన కుడిచేతిలో ఉన్న ఆ గ్రంథపుచుట్టను తీసుకున్నాడు.
REV 5:8 ఆయన ఆ గ్రంథపుచుట్టను తీసుకోగానే ఆ నాలుగు ప్రాణులు, ఆ ఇరవైనలుగురు పెద్దలు వధించబడిన ఆ గొర్రెపిల్ల ముందు సాగిలపడ్డారు. వారిలో ప్రతి ఒక్కరు తంతి వీణను పరిశుద్ధుల ప్రార్థనలనే ధూపంతో నిండిన బంగారు గిన్నెలను పట్టుకున్నారు.
REV 5:9 వారు ఒక క్రొత్త పాటను పాడారు, “చుట్టబడి ఉన్న ఆ గ్రంథపుచుట్టను తీసుకుని, దాని ముద్రలను తెరవడానికి నీవే యోగ్యుడవు! ఎందుకంటే ప్రతి గోత్రం నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి దేశంలోని ప్రజలను, దేవుని కోసం విడిపించడానికి నీవు వధించబడి నీ రక్తంతో కొన్నావు.
REV 5:10 నీవు వారిని దేవుని సేవించే రాజ్యంగా యాజకులుగా చేశావు, భూమిని పరిపాలించడానికి వారిని నియమించావు.”
REV 5:11 అప్పుడు నేను చూస్తూ ఉండగా, సింహాసనం చుట్టూ ఉన్న నాలుగు ప్రాణుల పెద్దల చుట్టూ ఉన్న వేలాదివేల కోటానుకోట్ల దేవదూతల స్వరం నాకు వినబడింది.
REV 5:12 వారు పెద్ద స్వరంతో ఇలా అంటున్నారు: “శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, గౌరవం, మహిమ, స్తుతులను పొందడానికి యోగ్యుడు వధించబడిన గొర్రెపిల్లయే!”
REV 5:13 అప్పుడు పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో ఉన్న సృష్టించబడిన ప్రతి ప్రాణి, అనగా వాటిలో ఉన్న సమస్తం ఇలా చెప్తుండగా నేను విన్నాను: “సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవానికి, వధించబడిన గొర్రెపిల్లకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం,
REV 5:14 ఆ నాలుగు ప్రాణులు, “ఆమేన్” అని చెప్పాయి, అప్పుడు ఆ పెద్దలందరు సాగిలపడి ఆరాధించారు.
REV 6:1 వధించబడిన గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పుతున్నప్పుడు నేను చూశాను. ఆ నాలుగు ప్రాణుల్లో ఒక ప్రాణి ఉరుముతున్న స్వరంతో, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను.
REV 6:2 నేను చూస్తుండగా ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద స్వారీ చేసేవాని చేతిలో ఒక విల్లు ఉంది, అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది, అతడు జయించేవానిగా జయించడానికి బయలుదేరి వెళ్లాడు.
REV 6:3 ఆ వధించబడిన గొర్రెపిల్ల రెండవ ముద్రను విప్పినప్పుడు, రెండవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను.
REV 6:4 అప్పుడు మండుతున్న ఎర్రని మరొక గుర్రం బయలుదేరింది; దాని మీద స్వారీ చేసేవానికి భూమి మీద నుండి సమాధానం తీసివేయడానికి, ప్రజలు ఒకరిని ఒకరు చంపుకొనేలా చేయటానికి అధికారం ఇవ్వబడింది. అతనికి పెద్ద ఖడ్గం ఇవ్వబడింది.
REV 6:5 ఆ వధించబడిన గొర్రెపిల్ల మూడవ ముద్రను విప్పినప్పుడు, మూడవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. అప్పుడు నాకు ఒక నల్లని గుర్రం కనబడింది. దాని మీద స్వారీ చేసేవాడు చేతిలో ఒక త్రాసు పట్టుకుని ఉన్నాడు.
REV 6:6 ఆ నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, “ఒక రోజు జీతానికి ఒక కిలో గోధుమలు, ఒక రోజు జీతానికి మూడు కిలోల యవల గింజలు. అయితే ఒలీవల నూనెను ద్రాక్షారసాన్ని పాడుచేయవద్దు!” అని చెప్పడం విన్నాను.
REV 6:7 ఆ వధించబడిన గొర్రెపిల్ల నాలుగవ ముద్రను విప్పినప్పుడు, నాలుగవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను.
REV 6:8 అప్పుడు నాకు బూడిద రంగు గుర్రం కనబడింది. దాని మీద సవారిచేసేవాని పేరు మృత్యువు, పాతాళం అతన్ని అతి సమీపంగా వెంబడిస్తుంది. ఖడ్గంతో, కరువుతో, తెగుళ్ళతో ఇంకా భూమి మీద ఉండే క్రూర మృగాలతో ప్రజలను చంపడానికి భూమి నాలుగవ భాగంపై అతనికి అధికారం ఇవ్వబడింది.
REV 6:9 ఆ వధించబడిన గొర్రెపిల్ల అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వధించబడిన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద చూశాను.
REV 6:10 వారు పెద్ద స్వరంతో, “ఓ సర్వశక్తిగల ప్రభువా! పరిశుద్ధుడా, సత్యవంతుడా, మా రక్తానికి ప్రతిగా భూనివాసులను తీర్పు తీర్చడానికి ఇంకా ఎంతకాలం?” అని కేకలు వేశారు.
REV 6:11 అప్పుడు వారిలో అందరికి తెల్లని వస్త్రాలను ఇచ్చి, “మీలాగే ఇంకా హతులైన మీ తోటి సేవకుల, సహోదరీ సహోదరుల సంఖ్య పూర్తయ్యే వరకు ఇంకా కొంతకాలం వేచి ఉండాలి” అని వారికి చెప్పబడింది.
REV 6:12 ఆ వధించబడిన గొర్రెపిల్ల ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది. అప్పుడు సూర్యుడు మేక బొచ్చుతో చేసిన గోనెపట్టలా నల్లగా మారాడు, చంద్రుడు రక్తంలా ఎర్రగా మారాడు.
REV 6:13 బలమైన గాలికి అంజూర చెట్టు నుండి రాలిపడిన కాయల్లా ఆకాశం నుండి నక్షత్రాలు భూమి మీద రాలాయి.
REV 6:14 ఆకాశం ఒక గ్రంథపుచుట్టలా చుట్టుకుపోయింది, ప్రతి పర్వతం ప్రతి ద్వీపం వాటి వాటి స్థలాల నుండి తొలగిపోయాయి.
REV 6:15 భూ రాజులు, రాకుమారులు, ప్రధానులు, ధనవంతులు, బలవంతులు, దాసులు, స్వతంత్రులు ప్రతి ఒక్కరు గుహల్లో, కొండల రాళ్ల సందుల్లో దాక్కున్నారు.
REV 6:16 వారు కొండలతో, బండలతో, “మీరు మామీద వచ్చి పడండి! సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాని ముఖం నుండి వధించబడిన గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని దాచి పెట్టండి!
REV 6:17 ఎందుకంటే వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది, దాన్ని ఎవరు తట్టుకోగలరు?” అని వేడుకొంటున్నారు.
REV 7:1 ఈ సంగతుల తర్వాత నలుగురు దూతలు భూమి నాలుగు మూలల్లో నిలబడి భూమిమీద గాని సముద్రం మీద గాని ఏ చెట్టు మీద గాని గాలి వీచకుండా నలుదిక్కుల నుండి గాలులను అడ్డగిస్తున్నారు.
REV 7:2 అప్పుడు నేను మరొక దేవదూత జీవంగల దేవుని ముద్రను కలిగి తూర్పుదిక్కు నుండి పైకి రావడం చూశాను. ఆ దేవదూత భూమికి సముద్రానికి హాని కలిగించడానికి అనుమతిని పొందిన ఆ నలుగురు దూతలతో బిగ్గరగా,
REV 7:3 “మేము మన దేవుని సేవకుల నుదుటి మీద దేవుని ముద్రను వేసే వరకు భూమికి కాని, సముద్రానికి కాని చెట్లకు కాని హాని చేయవద్దు” అని చెప్పడం నేను విన్నాను.
REV 7:4 ఆ తర్వాత నేను వారి సంఖ్య చెప్తుంటే విన్నాను. ఇశ్రాయేలు ప్రజల గోత్రాలు అన్నిటిలో ముద్రింపబడినవారు 1,44,000:
REV 7:5 యూదా గోత్రంలో 12,000; రూబేను గోత్రంలో 12,000; గాదు గోత్రంలో 12,000;
REV 7:6 ఆషేరు గోత్రంలో 12,000; నఫ్తాలి గోత్రంలో 12,000; మనష్షే గోత్రంలో 12,000;
REV 7:7 షిమ్యోను గోత్రంలో 12,000; లేవీ గోత్రంలో 12,000; ఇశ్శాఖారు గోత్రంలో 12,000;
REV 7:8 జెబూలూను గోత్రంలో 12,000; యోసేపు గోత్రంలో 12,000; బెన్యామీను గోత్రంలో 12,000 ముద్రించబడ్డారు.
REV 7:9 ఈ సంగతుల తర్వాత ఒక గొప్ప జనసమూహం లెక్కపెట్టడానికి అసాధ్యమైనంత మంది ప్రజలు ప్రతి దేశం నుండి, ప్రతి గోత్రం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి వచ్చారు. వారు తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూర మట్టలు చేతపట్టుకుని సింహాసనం ముందు వధించబడిన గొర్రెపిల్ల ముందు నిలబడి ఉండడం నేను చూశాను.
REV 7:10 వారు తమ స్వరాలను ఎత్తి బిగ్గరగా ఇలా అన్నారు: “సింహాసనం మీద ఆసీనుడైన మా దేవునికి, వధించబడిన గొర్రెపిల్లకే, రక్షణ చెందుతుంది.”
REV 7:11 అప్పుడు దేవదూతలు అందరు సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడ్డారు; వారు సింహాసనం ముందు తమ ముఖాలను నేలకు ఆనిస్తూ సాగిలపడి దేవుని ఆరాధిస్తూ,
REV 7:12 ఇలా అన్నారు: “ఆమేన్! మా దేవునికి స్తుతి, మహిమ, జ్ఞానం, కృతజ్ఞతాస్తుతులు, ఘనత, శక్తి, ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.”
REV 7:13 అప్పుడు పెద్దలలో ఒకడు, “తెల్లని వస్త్రాలను ధరించుకొన్న వీరు ఎవరు? వీరు ఎక్కడ నుండి వచ్చారు?” అని నన్ను అడిగాడు.
REV 7:14 అప్పుడు నేను, “అయ్యా, అది మీకే తెలుసు కదా” అని చెప్పాను. అతడు నాతో ఇలా అన్నాడు, “వీరు మహా హింసలలో నుండి వచ్చినవారు. వీరు వధించబడిన గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కుని తెల్లగా చేసుకున్నారు.
REV 7:15 అందుకే, “వీరు దేవుని సింహాసనం ముందు ఉండి, ఆయన మందిరంలో రాత్రింబగళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు, కాబట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు.
REV 7:16 ‘మరి ఎన్నడు వారికి ఆకలి ఉండదు దాహం ఉండదు; సూర్యుని తీవ్రమైన వేడి కూడా వారికి తగలదు’ ఏ వేడి వారిని కాల్చదు.
REV 7:17 ఎందుకంటే, సింహాసనం మధ్యలో ఉన్న వధించబడిన గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉండి ‘జీవజలాల ఊటల దగ్గరకు వారిని నడిపిస్తాడు.’ ‘దేవుడు వారి కళ్లలో నుండి కారే ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తారు.’”
REV 8:1 ఆ వధించబడిన గొర్రెపిల్ల ఏడవ ముద్రను విప్పినప్పుడు అక్కడ పరలోకంలో సుమారు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది.
REV 8:2 అప్పుడు నేను దేవుని ముందు నిలబడిన ఏడుగురు దేవదూతలను చూశాను, వారికి ఏడు బూరలు ఇవ్వబడ్డాయి.
REV 8:3 ధూపం వేసే బంగారు పాత్రను పట్టుకున్న మరొక దేవదూత వచ్చి బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. సింహాసనం ముందు ఉన్న బంగారు బలిపీఠం మీద దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిపి అర్పించడానికి చాలా ధూపద్రవ్యాలు అతనికి ఇవ్వబడ్డాయి.
REV 8:4 అప్పుడు దూత చేతి నుండి ఆ ధూపద్రవ్యాల పొగ దేవుని ప్రజలందరి ప్రార్థనలతో కలిసి పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది.
REV 8:5 ఆ దూత బలిపీఠం నుండి తీసిన అగ్నితో ధూపం వేసే పాత్రను నింపి దాన్ని భూమి మీదికి విసిరివేశాడు. అప్పుడు గర్జన లాంటి శబ్దాలు, ఉరుములు, మెరుపుల ధ్వనులు, భూకంపం వచ్చాయి.
REV 8:6 అప్పుడు ఏడు బూరలను పట్టుకుని ఉన్న ఆ ఏడు దూతలు వాటిని ఊదడానికి సిద్ధపడ్డారు.
REV 8:7 మొదటి దూత తన బూరను ఊదినప్పుడు రక్తంతో కలిసి ఉన్న అగ్ని వడగండ్లు భూమి మీదికి కురిసాయి. అప్పుడు భూమి మూడవ భాగం, చెట్లలో మూడవ భాగం కాలిపోయింది, పచ్చని గడ్డంతా కాలిపోయింది.
REV 8:8 రెండవ దూత తన బూరను ఊదినప్పుడు అగ్నితో మండుతున్న పర్వతం లాంటిది సముద్రంలో పడింది. అప్పుడు సముద్రంలోని మూడవ భాగం రక్తంగా మారింది.
REV 8:9 దానితో సముద్రంలోని ప్రాణుల్లో మూడవ భాగం చనిపోయాయి. ఇంకా ఓడలలో మూడవ భాగం నాశనమయ్యాయి.
REV 8:10 మూడవ దూత తన బూరను ఊదినప్పుడు దివిటీలా ప్రకాశిస్తున్న ఒక గొప్ప నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీద, నీటి ఊటలలో పడింది.
REV 8:11 ఆ నక్షత్రం పేరు “చేదు” అది పడినప్పుడు నీటిలో మూడవ భాగం చేదుగా మారింది. ఆ చేదు నీటి వల్ల చాలామంది చనిపోయారు.
REV 8:12 నాలుగవ దూత తన బూరను ఊదినప్పుడు సూర్యుని మూడవ భాగం, చంద్రుని మూడవ భాగం, నక్షత్రాల మూడవ భాగం దెబ్బతిన్నాయి. కాబట్టి అవన్నీ మూడవ భాగం వెలుగును కోల్పోయాయి. పగటి వెలుగులో మూడవ భాగం ప్రకాశం ఇవ్వలేదు అలాగే రాత్రి మూడవ భాగం వెలుగు లేకుండా పోయింది.
REV 8:13 నేను చూస్తూ ఉండగా ఒక పక్షిరాజు మధ్య ఆకాశంలో ఎగురుతూ పెద్ద స్వరంతో, “అయ్యో, శ్రమ! శ్రమ! మిగతా ముగ్గురు దేవదూతలు బూరల ధ్వని చేయబోతున్నారు కాబట్టి భూనివాసులకు శ్రమ” అని అరుస్తుంటే నేను విన్నాను.
REV 9:1 అయిదవ దూత తన బూరను ఊదినప్పుడు ఆకాశం నుండి రాలి భూమి మీద పడిన ఒక నక్షత్రాన్ని నేను చూశాను. అగాధానికి వెళ్లే గొయ్యి తాళపుచెవులు ఆ నక్షత్రానికి ఇవ్వబడ్డాయి.
REV 9:2 అతడు ఆ అగాధాన్ని తెరిచినప్పుడు, చాలా పెద్ద కొలిమిలో నుండి పొగ వచ్చినట్లు ఆ అగాధం నుండి దట్టమైన పొగ పైకి లేచింది. అగాధం నుండి వచ్చిన ఆ పొగకు సూర్యునికి ఆకాశంలో చీకటి కమ్మింది.
REV 9:3 ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చాయి. వాటికి భూమిపై ఉండే తేళ్ళకు ఉన్న శక్తి ఇవ్వబడింది.
REV 9:4 భూమి మీద మొలిచే గడ్డికి కాని, పచ్చని మొక్కలకు కాని, చెట్లకు కాని హాని చేయకూడదు కాని ఏ మనిషి నుదుటి మీద దేవుని ముద్ర లేదో వానికే హాని చేయాలని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది.
REV 9:5 ఆ మిడతలకు అయిదు నెలలపాటు మనుష్యులను వేధించడానికి అధికారం ఇవ్వబడింది కాని వారిని చంపడానికి అనుమతి ఇవ్వబడలేదు. అవి కుట్టినప్పుడు వారికి తేలు కుట్టినంతగా బాధ ఉంటుంది.
REV 9:6 ఆ రోజుల్లో మనుష్యులు మరణాన్ని వెదకుతారు కాని అది వారికి దొరకదు; వారు చావాలని కోరుకుంటారు కాని మరణం వారి నుండి పారిపోతుంది.
REV 9:7 ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్న గుర్రాల్లా ఉన్నాయి. వాటి తలల మీద బంగారు కిరీటాల వంటివి ఉన్నాయి; వాటి ముఖాలు మనుష్యుల ముఖాల్లా ఉన్నాయి.
REV 9:8 వాటి తలవెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్ళు సింహపు కోరల్లా ఉన్నాయి.
REV 9:9 వాటి ఛాతీ ఇనుప కవచంలా ఉంది. వాటి రెక్కల ధ్వని యుద్ధానికి పరుగెత్తే అనేక గుర్రాల రథాల ధ్వనిలా ఉంది.
REV 9:10 వాటికి తేళ్ళ తోకల వంటి తోకలు ఉన్నాయి. అవి అయిదు నెలల వరకు తమ తోకలతో మనుష్యులకు హాని చేసే అధికారాన్ని కలిగి ఉన్నాయి.
REV 9:11 అగాధాన్ని పాలించే దూత వాటికి రాజుగా ఉన్నాడు. వాడి పేరు హెబ్రీ భాషలో అబద్దోను. గ్రీకు భాషలో అపొల్యోను అనగా నాశనం చేసేవాడు అని అర్థము.
REV 9:12 మొదటి శ్రమ గతించిపోయింది. ఇదిగో, ఇంకా రెండు శ్రమలు రానున్నాయి.
REV 9:13 ఆరో దూత బూర ఊదినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్న బంగారు బలిపీఠపు నాలుగు కొమ్ముల నుండి ఒక స్వరం నాకు వినిపించింది.
REV 9:14 ఆ స్వరం బూర ఊదిన ఆరో దేవదూతతో, “యూఫ్రటీసు అనే మహా నది దగ్గర బంధించబడి ఉన్న నలుగురు దూతలను విడిపించు” అని చెప్పడం విన్నాను.
REV 9:15 అయితే ఆ సంవత్సరం, ఆ నెల, ఆ రోజు, ఆ గంట కోసం సిద్ధం చేయబడిన ఆ నలుగురు దూతలు మనుష్యుల్లో మూడవ భాగాన్ని చంపడానికి విడుదల చేయబడ్డారు.
REV 9:16 స్వారీ చేసేవారి సైన్యం లెక్క ఇరవై కోట్లు. వారి సంఖ్య ఇంత అని నేను విన్నాను.
REV 9:17 నా దర్శనంలో ఆ గుర్రాలు, వాటిపై స్వారీ చేసేవారు ఇలా ఉన్నారు; నిప్పులాంటి ఎరుపురంగు, ముదురు నీలం రంగు, గంధకం లాంటి పసుపురంగు కవచాలను వారు తమ ఛాతీ మీద ధరించి ఉండడం నేను చూశాను. ఆ గుర్రాల తలలు సింహపు తలల్లా కనిపించాయి. వాటి నోటి నుండి అగ్ని, పొగ, గంధకం బయలుదేరాయి.
REV 9:18 వాటి నోళ్ల నుండి వచ్చిన అగ్ని, పొగ, గంధకాల వలన మూడు తెగుళ్ళు మనుష్యుల్లో మూడవ భాగం చంపేశాయి.
REV 9:19 ఆ గుర్రాల శక్తి వాటి నోటిలో వాటి తోకలలో ఉంది. వాటి తోకలు పాముల్లా తలలు కలిగి మనుష్యులను గాయపర్చేవిగా ఉన్నాయి.
REV 9:20 ఈ తెగుళ్ళ చేత బాధించబడి చావకుండ మిగిలిన ప్రజలు బంగారు, వెండి, ఇత్తడి, రాయి, కొయ్యలతో తయారుచేసుకొన్న విగ్రహాలను, దయ్యాలను పూజచేయడం మానలేదు. ఆ విగ్రహాలు చూడలేవు, వినలేవు, నడవలేవు. అయినా అవి కేవలం తమ చేతి పని అని వారు గ్రహించలేదు. వాటిని దేవునిగా పూజించడం తప్పు అని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగలేదు.
REV 9:21 వారు చేసే హత్యలు, మంత్రపు ప్రయోగాలు, లైంగిక దుర్నీతి, దొంగతనం అనేవి తప్పు అని గ్రహించి పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగలేదు.
REV 10:1 బలమైన మరొక దేవదూత మేఘాన్ని ధరించుకొని, తన తలమీద వానవిల్లు కలిగి పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. ఆ దేవదూత ముఖం సూర్యునిలా, కాళ్లు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.
REV 10:2 అతడు తెరిచి ఉన్న ఒక చిన్న గ్రంథపుచుట్టను తన చేతిలో పట్టుకుని తన కుడికాలు సముద్రం మీద, ఎడమకాలు భూమి మీద పెట్టి,
REV 10:3 సింహగర్జన వంటి పెద్ద కేక వేశాడు. అతడు కేక వేసినప్పుడు ఏడు ఉరుములు తిరిగి గర్జించాయి.
REV 10:4 ఆ ఏడు ఉరుముల గర్జనలను విన్న నేను వాటి గురించి వ్రాయబోయాను; కానీ పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఈ గర్జనలను గురించి వ్రాయకు, ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేసి వాటిని రహస్యంగా ఉంచాలి” అని చెప్పడం విన్నాను.
REV 10:5 అప్పుడు సముద్రం మీద, భూమి మీద నిలబడి ఉన్నట్లు నేను చూసిన ఆ దేవదూత తన కుడిచేతిని ఆకాశం వైపు ఎత్తాడు.
REV 10:6 ఆ తర్వాత అతడు ఎల్లకాలం జీవిస్తూ పరలోకాన్ని దానిలో ఉన్నవాటన్నిటిని, భూమిని దానిలో ఉన్నవాటన్నిటిని, సముద్రాన్ని దానిలో ఉన్నవాటన్నిటిని సృజించినవాని తోడు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, “ఇక ఏ ఆలస్యం ఉండదు!
REV 10:7 కాని ఏడవ దూత తన బూరను ఊదబోయే సమయంలో, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ముందే తెలిపిన విధంగా దేవుని మర్మం నెరవేరుతుంది” అని చెప్పాడు.
REV 10:8 అప్పుడు పరలోకం నుండి నాతో మాట్లాడిన స్వరం మళ్ళీ నాతో, “వెళ్లు, సముద్రం మీద భూమి మీద నిలబడి ఉన్న దేవదూత చేతిలో తెరిచి ఉన్న ఆ చిన్న గ్రంథపుచుట్టను తీసుకో” అని చెప్పడం విన్నాను.
REV 10:9 కాబట్టి నేను ఆ దేవదూత దగ్గరకు వెళ్లి ఆ చిన్న గ్రంథపుచుట్టను నాకు ఇవ్వమని అడిగాను. అప్పుడు అతడు నాతో, “దీనిని తీసుకుని తిను, ఇది నీ కడుపుకు చేదుగా ఉంటుంది కాని నీ నోటికి తేనెలా తియ్యగా ఉంటుంది” అని చెప్పాడు.
REV 10:10 అప్పుడు నేను ఆ చిన్న గ్రంథపుచుట్టను ఆ దేవదూత చేతిలో నుండి తీసుకుని తినగా అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కాని నేను దాన్ని తిన్న తర్వాత నా కడుపులో చేదుగా మారింది.
REV 10:11 అప్పుడు ఆయన నాతో, “నీవు అనేక ప్రజలు, దేశాలు, రాజులు, వివిధ భాషలు మాట్లాడేవారి గురించి మళ్ళీ ప్రవచించాలి” అని చెప్పాడు.
REV 11:1 అప్పుడు ఒక దేవదూత నా చేతికి కొలిచే కర్రను ఇచ్చి నాతో, “లేచి, దేవుని మందిరాన్ని, బలిపీఠాన్ని కొలిచి ఆరాధిస్తున్నవారి సంఖ్యను లెక్కించు.
REV 11:2 అయితే ఆలయం బయటి ఆవరణాన్ని కొలత తీసుకోకుండా విడిచిపెట్టాలి, ఎందుకంటే అది యూదేతరులకు ఇవ్వబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని అణగద్రొక్కుతారు.
REV 11:3 1,260 రోజులు గోనెపట్ట కట్టుకొని ప్రవచించడానికి నా ఇద్దరు సాక్షులను నేను నియమిస్తున్నాను” అని చెప్పాడు.
REV 11:4 వారు “రెండు ఒలీవచెట్లు” రెండు దీపస్తంభాలుగా ఉన్నారు; “వారు భూలోకానికి ప్రభువైనవాని ఎదుట నిలబడి ఉన్నారు.”
REV 11:5 ఎవరైనా వారికి హాని చేయాలని ప్రయత్నిస్తే, వారి నోటి నుండి అగ్ని వచ్చి వారి శత్రువులను దహించి వేస్తుంది. కాబట్టి వీరికి హాని చేయాలనుకునేవారు ఇలా చావాల్సిందే.
REV 11:6 వారు ప్రవచించే రోజుల్లో భూమి మీద వాన కురవకుండా ఆకాశాన్ని మూయగలిగే అధికారం వారికి ఉంది. అలాగే వారికి కావలసినప్పుడెల్లా నీటిని రక్తంగా మార్చి, అన్ని రకాల వ్యాధులతో భూమిని బాధించడానికి అధికారం వారికి ఉంది.
REV 11:7 ఆ ఇద్దరు సాక్షులు సాక్ష్యం ఇవ్వడం పూర్తి చేసిన తర్వాత, అగాధం నుండి ఒక మృగం వారి మీద యుద్ధం చేసి వారిని ఓడించి చంపుతుంది.
REV 11:8 వారి మృతదేహాలు ఆ గొప్ప పట్టణపు వీధిలో పడి ఉంటాయి. ఆ పట్టణం ఉపమానరీతిలో సొదొమ అని, ఈజిప్టు అని పిలువబడుతుంది. వారి ప్రభువు కూడా సిలువ వేయబడింది అక్కడే.
REV 11:9 మూడున్నర రోజుల వరకు ప్రజల్లో అన్ని గోత్రాల వారు, అన్ని భాషల వారు, అన్ని జాతులవారు వీరి శవాలను చూస్తారు, వాటిని సమాధి చేయనివ్వరు.
REV 11:10 ఆ ఇద్దరు ప్రవక్తలు భూమి మీద జీవించేవారిని వేధించారు కాబట్టి భూనివాసులందరు వారి చావును బట్టి సంతోష సంబరాలు జరుపుకొంటూ ఒకరికొకరు బహుమానాలు ఇచ్చిపుచ్చుకొంటారు.
REV 11:11 కానీ మూడున్నర రోజుల తర్వాత దేవుని నుండి జీవవాయువు వారిలోనికి ప్రవేశించి వారు తమ కాళ్లమీద లేచి నిలబడినప్పుడు వారిని చూసిన వారందరికి విపరీతమైన భయం కలిగింది.
REV 11:12 అప్పుడు పరలోకం నుండి ఒక గొప్ప స్వరం వారితో, “ఇక్కడకు ఎక్కి రండి!” అని చెప్పడం ఆ సాక్షులు విన్నారు. అప్పుడు వారి శత్రువులు వారిని చూస్తూ ఉండగానే వారు ఒక మేఘం మీద పరలోకానికి ఎక్కి వెళ్లిపోయారు.
REV 11:13 సరిగ్గా అదే గంటలో ఒక పెద్ద భూకంపం వచ్చి ఆ పట్టణంలో పదవ భాగం కూలిపోయింది. ఏడు వేలమంది ప్రజలు చనిపోయారు, అయితే మిగిలిన వారికి భయం కలిగి పరలోకం నుండి పరిపాలిస్తున్న దేవుని మహిమపరిచారు.
REV 11:14 రెండవ శ్రమ ముగిసింది. మూడవ శ్రమ అతిత్వరలో రానుంది.
REV 11:15 ఏడవ దేవదూత తన బూరను ఊదినప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు, ఇలా చెప్పడం వినిపించింది, “భూలోక రాజ్యం ప్రభు రాజ్యంగా ఆయన క్రీస్తు రాజ్యంగా మారాయి కాబట్టి ఆయన ఎల్లకాలం పరిపాలిస్తారు.”
REV 11:16 అప్పుడు, దేవుని సన్నిధిలో తమ సింహాసనాల మీద కూర్చుని ఉన్న ఆ ఇరవైనలుగురు పెద్దలు సాగిలపడి ఇలా దేవుని ఆరాధించారు,
REV 11:17 “గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడవైన సర్వశక్తిగల ప్రభువైన దేవా, నీ మహాశక్తిని బట్టి నీవు పరిపాలిస్తున్నావు, కాబట్టి మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము.
REV 11:18 దేశాలు కోప్పడినందుకు నీ ఉగ్రత వచ్చింది. ఇక చచ్చినవారికి తీర్పు తీర్చడానికి, సేవకులైన ప్రవక్తలకు, నీ పేరుకు భయపడే నీ ప్రజలకు సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి, భూమిని నాశనం చేసేవారిని నాశనం చేయడానికి సమయం వచ్చింది.”
REV 11:19 అప్పుడు పరలోకంలోని దేవాలయం తెరచుకొంది, దేవుని నిబంధన మందసం ఆయన దేవాలయంలో కనిపించింది. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపం, తీవ్రమైన వడగండ్ల వాన వచ్చాయి.
REV 12:1 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్లక్రింద చంద్రుని, తన తలమీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది.
REV 12:2 ఆమె గర్భవతిగా ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తుంది.
REV 12:3 అంతలో పరలోకంలో మరొక సూచన కనిపించింది: ఒక ఎర్రని మహా ఘటసర్పానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. దాని ఏడు తలల మీద ఏడు కిరీటాలు ఉన్నాయి.
REV 12:4 దాని తోక ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో మూడవ భాగాన్ని ఈడ్చి భూమి మీదికి విసిరివేసింది. బిడ్డకు జన్మ ఇవ్వబోతున్న స్త్రీ బిడ్డకు జన్మ ఇవ్వగానే ఆ బిడ్డను మ్రింగివేయాలని ఆ ఘటసర్పం ఆ స్త్రీ ముందు నిలబడింది.
REV 12:5 ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు “ఇనుప దండాన్ని పట్టుకుని అన్ని దేశాలను పరిపాలిస్తాడు.” ఆ శిశువు దేవుని దగ్గరకు ఆయన సింహాసనం దగ్గరకు తీసుకుపోబడ్డాడు.
REV 12:6 ఆ స్త్రీ 1,260 రోజుల వరకు సంరక్షింపబడేలా దేవుడు ఆమె కోసం అరణ్యంలో సిద్ధం చేసిన స్థలానికి ఆమె పారిపోయింది.
REV 12:7 అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఆ మహాఘటసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా ఘటసర్పం దాని సైన్యం కూడా యుద్ధంలో పోరాడాయి.
REV 12:8 కాని వానికి తగినంత బలం లేకపోవడంతో గెలువలేక పరలోకంలో తమ స్థానాన్ని పోగొట్టుకొన్నారు.
REV 12:9 ఆ తర్వాత లోకమంతటిని మోసం చేసే ఆ మహా ఘటసర్పం, అనగా సాతాను లేదా అపవాది అని పిలువబడే ఆదిసర్పాన్ని వానిని అనుసరించే దూతలందరు వానితో పాటు భూమి మీదకు పడత్రోయబడ్డారు.
REV 12:10 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప స్వరం, “ఇదిగో, రక్షణ, అధికారం, రాజ్యం మన దేవునివి అయ్యాయి. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. ఎలాగంటే మన సహోదరీ సహోదరుల మీద రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్న అపవాది క్రిందికి పడద్రోయబడ్డాడు.
REV 12:11 వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తాము ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి అపవాది మీద విజయం పొందారు; వారు చావడానికి వెనుకంజ వేయలేదు తమ ప్రాణాలను ప్రేమించలేదు.
REV 12:12 కాబట్టి ఆకాశాల్లారా, వాటిలో నివసించేవారలారా ఆనందించండి! అయితే భూమికి సముద్రానికి శ్రమ! ఎందుకంటే, అపవాది మీ దగ్గరకు దిగివచ్చాడు! తనకు కొద్ది కాలమే మిగిలి ఉందని అతనికి తెలుసు కాబట్టి అతడు తీవ్రమైన కోపంతో ఉన్నాడు” అని ప్రకటించడం నేను విన్నాను.
REV 12:13 తాను భూమి మీద పడద్రోయబడడాన్ని ఘటసర్పం చూసినప్పుడు, అతడు మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ స్త్రీని వెంటాడు.
REV 12:14 ఒక కాలం కాలాలు సగకాలం వరకు సర్పానికి అందకుండ తన ఆకలిదప్పులు తీర్చుకొనేలా అరణ్యంలో ఆమె కోసం సిద్ధపరచిన స్థలానికి ఎగిరి వెళ్లడానికి ఆమెకు గొప్ప పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి.
REV 12:15 అప్పుడు, ఆ స్త్రీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదిలా కుమ్మరించింది.
REV 12:16 కాని ఆ స్త్రీకి సహాయం చేయడానికి భూమి తన నోరు తెరిచి ఆ ఘటసర్పం నోటి నుండి వచ్చిన నదిని మ్రింగివేసింది.
REV 12:17 అందుకు ఆ ఘటసర్పం ఆ స్త్రీపై కోపంతో మండిపడి ఆమె మిగిలిన సంతానంతో అనగా నమ్మకంగా దేవుని ఆజ్ఞలకు లోబడుతూ యేసు క్రీస్తు కోసం సాక్షులుగా జీవిస్తున్న వారితో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్లింది.
REV 13:1 ఆ ఘటసర్పం సముద్రపు ఒడ్డున నిలబడింది. ఇంతలో సముద్రంలో నుండి ఒక మృగం బయటకు రావడం నేను చూశాను. దానికి ఏడు తలలు పది కొమ్ములు, దాని కొమ్ములకు పది కిరీటాలు, దాని ప్రతి తలమీద దైవదూషణ చేసే పేరు ఉంది.
REV 13:2 నేను చూసిన ఆ మృగం చిరుతపులిని పోలి ఉంది, కాని దాని కాళ్లు ఎలుగుబంటి కాళ్లలా, దాని నోరు సింహం నోరులా ఉన్నాయి. ఆ ఘటసర్పం తన శక్తిని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఆ మృగానికి ఇచ్చింది.
REV 13:3 ఆ మృగం తలల్లో ఒకదానికి చనిపోయేంతగా గాయం తగిలినట్లు ఉన్నది కానీ ఆ గాయం పూర్తిగా మానిపోయింది. అందుకు భూలోక ప్రజలంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని వెంబడించారు.
REV 13:4 ఘటసర్పం ఆ మృగానికి అధికారం ఇచ్చింది కాబట్టి ప్రజలు దాన్ని పూజించారు. వారు మృగాన్ని కూడా పూజిస్తూ, “ఈ మృగం వంటివారు ఎవరు? ఈ మృగంతో యుద్ధం చేసి గెలవగలవారు ఎవరు?” అని చెప్పుకున్నారు.
REV 13:5 ఆ మృగానికి దేవునికి విరుద్ధంగా తన గొప్పలు చెప్తూ దైవదూషణ చేసే నోరు ఉంది. నలభై రెండు నెలల వరకు అధికారం చెలాయించడానికి అనుమతి ఇవ్వబడింది.
REV 13:6 ఆ మృగం దేవుని దూషించడానికి, దేవుని నామాన్ని, ఆయన నివాస స్థలాన్ని, దేవునితో జీవించే పరలోక నివాసులను దూషించడానికి నోరు తెరిచింది.
REV 13:7 దేవుని ప్రజల మీద యుద్ధం చేసి వారిని జయించడానికి ఆ మృగానికి అనుమతి ఇవ్వబడింది. ప్రతి గోత్రాన్ని, ప్రజలను, ప్రతి భాష మాట్లాడేవారిని, ప్రతి దేశాన్ని ఏలడానికి దానికి అధికారం ఇవ్వబడింది.
REV 13:8 లోకం సృష్టించబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని భూనివాసులందరు ఆ మృగాన్ని పూజిస్తారు.
REV 13:9 చెవులుగలవారు విందురు గాక!
REV 13:10 “చెరలోనికి వెళ్లవలసినవారు చెరలోనికి వెళ్తారు. ఖడ్గంతో హతం కావలసిన వారు ఖడ్గంతో హతం అవుతారు.” ఇది దేవుని ప్రజలు తమ విశ్వాసానికి నమ్మకంగా ఉండి సహనాన్ని చూపించాల్సిన సమయం.
REV 13:11 దాని తర్వాత రెండవ మృగం భూమిలో నుండి రావడం నేను చూశాను. దానికి గొర్రెపిల్లను పోలిన రెండు కొమ్ములు ఉన్నాయి, కాని అది ఘటసర్పంలా మాట్లాడింది.
REV 13:12 ఆ రెండవ మృగం మొదటి మృగానికి ఉన్న అధికారమంతటిని చెలాయిస్తూ, చనిపోయేంత గాయం నుండి స్వస్థపడిన ఆ మొదటి మృగాన్ని భూమి దాని నివాసులు ఆరాధించేలా చేసింది.
REV 13:13 అది గొప్ప సూచనలు చేస్తూ, మనుష్యులు చూస్తున్నప్పుడే ఆకాశం నుండి భూమి మీద అగ్నిని కురిసేలా చేస్తుంది.
REV 13:14 రెండవ మృగం మొదటి మృగం పక్షంగా దాని కోసం అద్భుతాలను చేస్తూ భూనివాసులందరినీ మోసగిస్తుంది. ఆ రెండవ మృగం ఖడ్గంతో గాయపడి బ్రతికిన ఆ మొదటి మృగం కోసం విగ్రహం చేయమని వారిని ఆదేశించింది.
REV 13:15 అంతేకాక మొదటి మృగం యొక్క విగ్రహానికి ఊపిరి పోసి అది మాట్లాడేలా చేయడానికి, తద్వారా ఆ విగ్రహాన్ని పూజించని వారందరిని చంపించడానికి దానికి అధికారం ఇవ్వబడింది.
REV 13:16 ఇంకా ఆ రెండవ మృగం ఘనులైనా అల్పులైనా, ధనవంతులైనా పేదవారైనా, స్వతంత్రులైనా దాసులైనా సరే అందరు తమ కుడిచేతి మీద గాని నుదుటి మీద గాని ముద్ర వేసుకోవాలని వారిని బలవంతం చేస్తుంది.
REV 13:17 ఎందుకంటే ఈ ముద్రను వేసుకునేవారు తప్ప మరి ఎవరూ అమ్ముకోలేరు కొనుక్కోలేరు. ఈ ముద్ర మృగం పేరుకు ఆ మృగం పేరుకు గల సంఖ్యకు నిదర్శనంగా ఉంది.
REV 13:18 దానిలో జ్ఞానం ఉంది. పరిజ్ఞానం కలవాడు ఆ మృగపు సంఖ్యను లెక్కించి తెలుసుకొనును గాక! అది ఒక మానవుని సంఖ్య. ఆ సంఖ్య 666.
REV 14:1 ఆ తర్వాత నా ఎదుట సీయోను పర్వతం మీద వధించబడిన గొర్రెపిల్ల, ఆయనతో 1,44,000 మంది తమ నుదుటి మీద ఆయన పేరును ఆయన తండ్రి పేరును వ్రాయబడినవారు నిలబడి ఉండడం చూశాను.
REV 14:2 అప్పుడు నేను పరలోకం నుండి ప్రవాహ జలాల ధ్వనిలా, గొప్ప ఉరుములా ఒక శబ్దాన్ని విన్నాను. అది నాకు వీణ వాయిద్యకారులు తమ వాయిద్యాలను వాయిస్తున్న ధ్వనిలా వినిపించింది.
REV 14:3 వారు సింహాసనం ముందు, నాలుగు ప్రాణుల ముందు, పెద్దల ముందు ఒక క్రొత్త పాట పాడారు. భూలోకం నుండి విమోచన పొందిన ఈ 1,44,000 మంది తప్ప ఆ పాటను ఎవరు నేర్చుకోలేరు.
REV 14:4 వీరు ఏ స్త్రీతో తమను అపవిత్రం చేసుకోకుండా పవిత్రంగా జీవించారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు దాన్ని అనుసరించారు. వారు మానవుల నుండి దేవునికి, గొర్రెపిల్లకు తొలిఫలంగా అర్పించడానికి కొనబడ్డవారు.
REV 14:5 వారి నోటి మాటల్లో ఏ అబద్ధం కనిపించదు; వీరు నిందలేనివారు.
REV 14:6 ఆ తర్వాత నేను ఇంకొక దేవదూత ఆకాశం మధ్య ఎగిరివెళ్తూ భూమి మీద జీవిస్తున్న ప్రతి దేశానికి, ప్రతి జాతి వారికి, ప్రతి భాష మాట్లాడేవారికి, ప్రతి జనులకు శాశ్వతమైన సువార్తను ప్రకటించడాన్ని చూశాను.
REV 14:7 అతడు పెద్ద స్వరంతో, “దేవునికి భయపడి ఆయనకు మహిమ చెల్లించండి! ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చింది! ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని నీటి ఊటలను సృష్టించిన దేవుని ఆరాధించండి!” అని చెప్పాడు.
REV 14:8 రెండవ దేవదూత అతని వెంబడించి, “ ‘కూలిపోయింది! బబులోను మహా పట్టణం కూలిపోయింది!’ అది తన వ్యభిచార మద్యాన్ని అన్ని దేశాలకు త్రాగించింది” అని చెప్పాడు.
REV 14:9 మూడవ దేవదూత వారిని వెంబడించి పెద్ద స్వరంతో, “మృగాన్ని దాని విగ్రహాన్ని పూజించి, తమ నుదుటి మీద లేదా చేతి మీద దాని ముద్ర వేయించుకొంటే,
REV 14:10 వారు ఏమి కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమనే మద్యాన్ని త్రాగుతారు. పవిత్ర దేవదూతల ఎదుట వధించబడిన గొర్రెపిల్ల సన్నిధిలో అగ్ని గంధకంతో బాధించబడతారు.
REV 14:11 ఆ మృగాన్ని దాని విగ్రహాన్ని పూజించిన లేదా దాని పేరు ముద్రను వేయించుకొన్నవారు విశ్రాంతి లేకుండా రాత్రింబగళ్ళు వేదన పొందుతారు. ఆ వేదన పొగ ఎల్లప్పుడు లేస్తూనే ఉంటుంది” అని బిగ్గరగా చెప్పాడు.
REV 14:12 ఇది యేసు క్రీస్తుకు నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్న దేవుని ప్రజలు సహనాన్ని చూపించాల్సిన సమయం.
REV 14:13 అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “ఇప్పటినుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు ధన్యులు! అని వ్రాసి పెట్టు” అని చెప్పింది. దేవుని ఆత్మ, “అవును నిజమే, తమ ప్రయాస నుండి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారి క్రియల ఫలాన్ని వారు పొందుతారు” అని పలకడం వినిపించింది.
REV 14:14 నేను చూస్తుండగా ఒక తెల్లని మేఘం మీద మనుష్యకుమారునిలా ఉన్న ఒకడు కూర్చుని ఉన్నాడు. అతడు తన తలమీద బంగారు కిరీటాన్ని ధరించి చేతిలో పదునైన కొడవలిని పట్టుకుని ఉన్నాడు.
REV 14:15 అప్పుడు మరొక దేవదూత దేవాలయంలో నుండి బయటకు వచ్చి మేఘం మీద కూర్చున్న వానితో, “భూమి మీద పంట పూర్తిగా పండి పోయింది కాబట్టి నీ కొడవలి తీసుకుని పండిన పంటను కోయాలి” అని బిగ్గరగా చెప్పాడు.
REV 14:16 కాబట్టి మేఘం మీద కూర్చున్న వాడు తన కొడవలిని భూమి మీద తిప్పగానే భూమి పంటంతా కోయబడింది.
REV 14:17 మరొక దేవదూత పరలోక దేవాలయంలో నుండి బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా పదునైన కొడవలి ఉంది.
REV 14:18 మరో దేవదూత బలిపీఠం నుండి వచ్చాడు. అతనికి బలిపీఠం మీద ఉన్న అగ్నిపై అధికారం ఉంది. అతడు పదునైన కొడవలి గలవానితో బిగ్గరగా, “భూమి మీద ఉన్న ద్రాక్షపండ్లు పండిపోయాయి కాబట్టి నీ పదునైన కొడవలితో ద్రాక్షపండ్ల గుత్తులను కోయాలి” అని చెప్పాడు.
REV 14:19 అప్పుడు ఆ దేవదూత తన కొడవలిని భూమి మీద త్రిప్పి ద్రాక్షపండ్లను కోసి దేవుని తీవ్రమైన ఉగ్రత అనే ద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు.
REV 14:20 ఆ ద్రాక్ష గానుగ పట్టణానికి బయట ఉంది. అక్కడ ద్రాక్షపండ్లను త్రొక్కడంతో ఆ ద్రాక్ష గానుగ నుండి 1,600 స్టాడియా దూరం వరకు గుర్రాల కళ్లెమంత ఎత్తులో ఆ రక్తం నదిలా ప్రవహించింది.
REV 15:1 నేను పరలోకంలో మరొక గొప్ప అద్భుతమైన సూచన చూశాను: ఏడుగురు దేవదూతలు చివరి ఏడు తెగుళ్ళను పట్టుకుని వస్తున్నారు. అవి చివరివి ఎందుకంటే ఈ తెగుళ్ళతో దేవుని కోపం తీరిపోతుంది.
REV 15:2 నేను అగ్నితో కలిసి ఉన్న గాజు సముద్రంలాంటి దాన్ని చూశాను. ఆ గాజు సముద్రపు ఒడ్డున ఆ మృగాన్ని, దాని విగ్రహాన్ని, ఆ మృగం పేరుగల సంఖ్యను జయించినవారు నిలబడి ఉన్నారు. వారు తమకు దేవుడు ఇచ్చిన తంతి వాయిద్యాలను పట్టుకుని ఉన్నారు.
REV 15:3 వారు దేవుని సేవకుడైన మోషే పాట, వధించబడిన గొర్రెపిల్ల పాడిన పాట పాడుతూ, “మా ప్రభువైన సర్వశక్తిగల దేవా! నీవు చేసిన క్రియలు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి! సకల రాజ్యాలకు రాజా! నీ మార్గాలు యథార్థంగా న్యాయంగా ఉన్నాయి!
REV 15:4 ఓ ప్రభువా! నీవు ఒక్కడివే పరిశుద్ధుడవు, కాబట్టి నీకు భయపడని వారు ఎవరు? నీ పేరును ఘనపరచకుండా ఎవరు ఉండగలరు? నీ నీతి క్రియలు తెలియజేయబడ్డాయి, కాబట్టి భూజనులందరు నీ ఎదుటకు వచ్చి ఆరాధిస్తారు,” అని దేవుని స్తుతించారు.
REV 15:5 దీని తర్వాత నేను చూస్తూ ఉండగా, పరలోక దేవాలయం అనగా సాక్షి గుడారం తెరవబడింది.
REV 15:6 ఆ పరలోక దేవాలయం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళు తీసుకువచ్చారు. వారు ప్రకాశిస్తున్న తెల్లని వస్త్రాలను ధరించి తమ రొమ్ముకు బంగారు దట్టీని కట్టుకుని ఉన్నారు.
REV 15:7 అప్పుడు నాలుగు ప్రాణులలోని ఒక ప్రాణి నిరంతరం జీవించే దేవుని ఉగ్రతతో నింపబడిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దేవదూతలకు ఇచ్చాడు.
REV 15:8 అప్పుడు దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చే పొగతో ఆ దేవాలయమంతా నిండిపోయి ఆ ఏడుగురు దేవదూతలు ఆ ఏడు తెగుళ్ళను కుమ్మరించే వరకు ఆ దేవాలయంలోనికి ఎవరు ప్రవేశించలేకపోయారు.
REV 16:1 అప్పుడు దేవాలయంలో నుండి ఒక పెద్ద స్వరం ఏడుగురు దేవదూతలతో, “మీరు వెళ్లి దేవుని ఉగ్రత గల ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించండి” అని బిగ్గరగా చెప్పడం విన్నాను.
REV 16:2 మొదటి దేవదూత వెళ్లి భూమి మీద తన పాత్రను కుమ్మరించాడు. అప్పుడు ఆ మృగం యొక్క ముద్రగలవారికి, దాని విగ్రహాన్ని పూజించేవారికి భయంకరమైన నొప్పి కలిగించే అసహ్యమైన కురుపులు పుట్టాయి.
REV 16:3 రెండవ దేవదూత సముద్రం మీద తన పాత్రను కుమ్మరించిన వెంటనే సముద్రపు నీరు చనిపోయినవారి రక్తంలా మారింది; దానిలోని ప్రతి ప్రాణి చనిపోయింది.
REV 16:4 మూడవ దేవదూత తన పాత్రను నదులు, నీటి ఊటల మీద కుమ్మరించినప్పుడు అవి రక్తంగా మారాయి.
REV 16:5 అప్పుడు జలాల మీద అధికారం కలిగిన దేవదూత ఇలా చెప్పడం విన్నాను, “ఓ పరిశుద్ధుడా! నీవు ఉన్నవాడవు, ఉండిన వాడవు, ఈ తీర్పు తీర్చడానికి నీవు న్యాయవంతుడవు.
REV 16:6 వారు నీ పరిశుద్ధ ప్రజల రక్తాన్ని నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు కాబట్టి, వారికి తగినట్లే వారికి రక్తాన్ని త్రాగించావు.”
REV 16:7 అప్పుడు బలిపీఠం ఈ విధంగా బదులిచ్చింది: “అవును, ఓ సర్వశక్తిమంతుడా ప్రభువైన దేవా, నీ తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి.”
REV 16:8 నాలుగవ దేవదూత సూర్యుని మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు అగ్నితో ప్రజలను కాల్చడానికి సూర్యునికి అనుమతి ఇవ్వబడింది.
REV 16:9 ప్రజలు ఆ భయంకరమైన వేడికి కాలిపోయి ఈ తెగుళ్ళపై అధికారం కలిగిన దేవుని నామాన్ని దూషించారే తప్ప పశ్చాత్తాపపడి ఆయనను మహిమపరచలేదు.
REV 16:10 అయిదవ దేవదూత తన పాత్రను ఆ మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించినప్పుడు దాని రాజ్యమంతా చీకటి కమ్మింది. ప్రజలు ఆ వేదనను తట్టుకోలేక తమ నాలుకలను కొరుక్కున్నారు.
REV 16:11 వారికి కలిగిన వేదనకు, కురుపులకు వారు పరలోక దేవుని దూషించారు కానీ తాము చేసిన వాటి గురించి పశ్చాత్తాపపడలేదు.
REV 16:12 ఆరో దేవదూత యూఫ్రటీసు అనే మహా నది మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు, తూర్పు నుండి రాజులు వచ్చేలా మార్గం సిద్ధపరచడానికి ఆ నది పూర్తిగా ఎండిపోయింది.
REV 16:13 తర్వాత కప్పలను పోలిన మూడు అపవిత్రాత్మలు నాకు కనబడ్డాయి; అవి ఘటసర్పం నోటి నుండి, మృగం నోటి నుండి అబద్ధ ప్రవక్త నోటి నుండి బయటకు వచ్చాయి.
REV 16:14 అవి సూచకక్రియలను చేసే దయ్యపు ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన యుద్ధం చేయడానికి భూలోకమంతటిలో ఉన్న రాజులను పోగుచేయడానికి అవి వారి దగ్గరకు వెళ్లాయి.
REV 16:15 “ఇదిగో! నేను దొంగలా వస్తాను! దిగంబరులుగా ఉండి సిగ్గుపడేవారిగా ఉండకుండా, మెలకువగా ఉండి వస్త్రం ధరించుకొని సిద్ధపడి ఉన్నవారు ధన్యులు!”
REV 16:16 ఆ అపవిత్రాత్మలు రాజులనందరిని హెబ్రీ భాషలో “హర్మగిద్దోను” అని పిలువబడే స్థలంలో పోగుచేశాయి.
REV 16:17 ఏడవ దేవదూత గాలిలో తన పాత్రను కుమ్మరించినప్పుడు, దేవాలయంలోని సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక సమాప్తం అయింది!” అని చెప్పింది.
REV 16:18 అప్పుడు మెరుపుల వెలుగులు, ధ్వనులు, ఉరుములు, భయంకరమైన భూకంపం వచ్చాయి. మానవులు భూమి మీద జీవిస్తున్నప్పటి నుండి ఇలాంటి భూకంపం కలుగలేదు. అది చాలా భయంకరమైన భూకంపము.
REV 16:19 ప్రసిద్ధిగాంచిన ఆ గొప్ప పట్టణం మూడు భాగాలుగా చీలిపోయింది, దేశాల పట్టణాలు కుప్పకూలాయి. దేవుడు బబులోను మహాపట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని తన ఉగ్రత అనే మద్యంతో నిండిన పాత్రను ఆమెకు ఇచ్చారు.
REV 16:20 అప్పుడు ప్రతి ద్వీపం పారిపోయింది, పర్వతాలు కనబడలేదు.
REV 16:21 ఆకాశం నుండి మనుష్యుల మీద భారీ వడగండ్లు పడ్డాయి. ఆ వడగండ్లు ఒక్కొక్కటి సుమారు నలభై అయిదు కిలోల బరువు ఉన్నాయి. ఆ వడగండ్ల తెగులు చాలా భయంకరంగా ఉండడంతో ఆ దెబ్బలకు తట్టుకోలేక ప్రజలు దేవుని దూషించారు.
REV 17:1 ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒక దేవదూత వచ్చి నాతో, “ఇక్కడకు రా, అనేక జలాల మీద కూర్చుని ఉన్న మహావేశ్యకు విధించబడిన శిక్షను నీకు చూపిస్తాను.
REV 17:2 భూ రాజులు ఆ వేశ్యతో వ్యభిచరించారు, ఆమె వ్యభిచారమనే మద్యంతో భూనివాసులందరు మత్తులయ్యారు” అని చెప్పాడు.
REV 17:3 అప్పుడు ఆ దేవదూత నన్ను ఆత్మలో ఎడారిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు రంగులో ఉన్న మృగం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. ఆ మృగం నిండా దైవదూషణ పేర్లు ఉన్నాయి; దానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి.
REV 17:4 ఆ స్త్రీ ఊదా, ఎరుపురంగు వస్త్రాలను ధరించి, మెరిసే బంగారం, విలువైన రాళ్లు, ముత్యాలతో అలంకరించబడి ఉంది. ఆమె తన చేతితో ఒక బంగారు పాత్ర పట్టుకుని ఉంది. ఆ పాత్ర ఆమె చేసిన అసహ్యమైన పనులు, వ్యభిచారమనే మురికితో నిండి ఉంది.
REV 17:5 ఆమె నుదిటి మీద వ్రాసి ఉన్న పేరులో ఒక రహస్యం ఉంది: “మహా బబులోను పట్టణం, వేశ్యలకు తల్లి భూమి మీద జరిగే ప్రతి అసహ్యమైన కార్యానికి తల్లి.”
REV 17:6 ఈ స్త్రీ దేవుని పరిశుద్ధ ప్రజల రక్తాన్ని అనగా యేసు హతసాక్షుల రక్తాన్ని త్రాగి మత్తులో ఉండడం నేను చూశాను. నేను ఆమెను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాను.
REV 17:7 అప్పుడు ఆ దేవదూత నాతో, “నీవెందుకు ఆశ్చర్యపడుతున్నావు? హతసాక్షుల స్వారీ చేసిన ఏడు తలలు పది కొమ్ములు కలిగిన మృగానికి సంబంధించిన రహస్యాన్ని నేను నీకు తెలియజేస్తాను” అని చెప్పాడు.
REV 17:8 నీవు చూసిన ఆ మృగం ఒకప్పుడు ఉండేది కాని ఇప్పుడు లేదు. అది అగాధం నుండి పైకి వచ్చి నాశనమై పోవడానికి సిద్ధంగా ఉన్నది. ఆ మృగం ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. అది మళ్ళీ వస్తుంది కాబట్టి సృష్టికి పునాది వేయబడక ముందు నుండి జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని భూనివాసులందరు ఆ మృగాన్ని చూసి ఆశ్చర్యపడతారు.
REV 17:9 ఈ విషయాన్ని గుర్తించడానికి జ్ఞానంగల మనస్సు అవసరం. ఆ స్త్రీ కూర్చుని ఉన్న ఏడు తలలు ఏడు కొండలు.
REV 17:10 ఆ ఏడు తలలు ఏడుగురు రాజులను సూచిస్తున్నాయి. వారిలో అయిదుగురు పడిపోయారు, ఒక రాజు యేలుతున్నాడు, మరొక రాజు ఇంకా రాలేదు. కాని అతడు వచ్చినప్పుడు అతడు కేవలం కొంతకాలమే యేలుతాడు.
REV 17:11 ఇంతకుముందు ఉండి ఇప్పుడు లేని ఆ మృగమే ఎనిమిదవ రాజు. ఆ మృగమే ఏడుగురిలో ఒకడు, అతడు తన నాశనం కోసమే రాబోతున్నాడు.
REV 17:12 నీవు చూసిన పది కొమ్ములు పదిమంది రాజులు. వారు ఇంకా రాజ్యాన్ని పొందలేదు, కాని మృగంతో పాటు కలిసి ఒక గంట సమయం రాజుల్లా యేలడానికి వారికి అధికారం ఇవ్వబడుతుంది.
REV 17:13 వీరు ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. వీరు తమ శక్తిని, అధికారాన్ని మృగానికి ఇస్తారు.
REV 17:14 ఈ రాజులందరూ మృగంతో పాటు కలిసి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు కాబట్టి ఆయన వారందరి మీద విజయం పొందుతాడు. ఆయనతో పాటు ఆయనచే పిలువబడిన వారు, ఏర్పరచబడినవారు ఆయనను నమ్మకంగా వెంబడించినవారు ఉంటారు.
REV 17:15 అప్పుడు ఆ దేవదూత నాతో, “ఆ వేశ్య కూర్చుని ఉన్న ఆ జలాలే ప్రజలు, జనసమూహాలు, దేశాలు, వివిధ భాషలు మాట్లాడేవారు.
REV 17:16 నీవు చూసిన ఆ మృగం ఆ పది కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమెను దిక్కులేని దానిగా, దిగంబరిగా చేయడానికి ఆమెను తీసుకొస్తాయి. అవి ఆమె మాంసాన్ని తిని, ఆమె శరీరాన్ని అగ్నితో కాల్చివేస్తాయి.
REV 17:17 ఎందుకంటే దేవుడు ముందుగానే పలికిన మాటలు నెరవేరే వరకు వారు తమ రాజ్యాధికారాన్ని ఆ మృగానికి అప్పగించడానికి అంగీకరించడం ద్వారా ఆయన ఉద్దేశాలు పూర్తయ్యే వరకు దేవుడు దీన్ని వారి హృదయాల్లో ఉంచారు.
REV 17:18 నీవు చూసిన ఆ స్త్రీ భూరాజులను యేలుతున్న ఆ మహా పట్టణం” అని చెప్పాడు.
REV 18:1 తర్వాత మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను; అతనికి గొప్ప అధికారం ఉంది, అతని వెలుగుతో భూమి ప్రకాశించింది.
REV 18:2 అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు, “బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది! అది దయ్యాలు సంచరించే స్థలంగా, ప్రతి దుష్ట ఆత్మలు సంచరించే స్థలంగా, ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా, ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలు సంచరించే స్థలంగా మారింది.
REV 18:3 ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి దేశాలన్నీ మత్తులయ్యాయి. భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు. భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.”
REV 18:4 అప్పుడు పరలోకంలో నుండి మరొక స్వరం వినిపించింది: “ ‘నా ప్రజలారా! మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా’ ఆమెకు సంభవించే ఏ కీడు మీ మీదికి రాకుండా, ఆమెలో నుండి బయటకు రండి;
REV 18:5 ఆమె చేసిన పాపాలు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి కాబట్టి, దేవుడు ఆమె అతిక్రమాలను జ్ఞాపకం చేసుకున్నారు.
REV 18:6 ఆమె ఎలా ఇచ్చిందో ఆమెకు అలాగే ఇవ్వండి; ఆమె చేసిన దానికి రెండింతలు ఆమెకు తిరిగి చెల్లించండి. ఆమె పాత్ర నుండే ఆమెకు రెండింతలు పోసి ఇవ్వండి!
REV 18:7 ఆమె తనను తాను హెచ్చించుకొంటూ ఎన్ని సుఖభోగాలు అనుభవించిందో, అంత వేదన దుఃఖాన్ని ఆమెకు కలుగజేయండి. ఎందుకంటే, ఆమె తన హృదయంలో, ‘నేను రాణిగా నా సింహాసనం మీద కూర్చున్నాను. నేను విధవరాలిని కాను, ఇక ఎన్నడు సంతాపం అనుభవించను’ అని అనుకుంది.
REV 18:8 కాబట్టి ఒక్క రోజులోనే ఆమె తెగుళ్ళన్ని ఆమెను పట్టుకుంటాయి, ఆమె మీదికి మరణం, దుఃఖం, కరువు వస్తాయి. ఆమెకు తీర్పు తీర్చే ప్రభువైన దేవుడు శక్తిగలవాడు, కాబట్టి ఆమె అగ్నితో కాల్చివేయబడుతుంది.”
REV 18:9 ఆమెతో వ్యభిచరించి ఆమె సుఖభోగాలను అనుభవించిన భూ రాజులు ఆమె కాలుతున్నప్పుడు వచ్చే పొగను చూసి ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు.
REV 18:10 ఆమె పడే వేదన చూసి భయపడి, వారు దూరంగా నిలబడి ఇలా రోదిస్తారు: “మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ! బబులోను మహా పట్టణమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చింది.”
REV 18:11 భూలోక వ్యాపారులు ఇకపై తమ సరుకులు కొనేవారెవరు లేరని ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు.
REV 18:12 వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, విలువైన రాళ్లు, ముత్యాలు; సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు; సువాసన ఇచ్చే అన్ని రకాల చెక్కలు, దంతాలతో చాలా విలువైన చెక్కతో ఇత్తడి ఇనుము నునుపురాళ్లతో తయారుచేసిన అన్ని రకాల వస్తువులు;
REV 18:13 దాల్చిన చెక్క, సుగంధద్రవ్యాలు, ధూపద్రవ్యాలు, బోళం సాంబ్రాణి, ద్రాక్షరసం ఒలీవనూనె, శ్రేష్ఠమైన పిండి గోధుమలు; పశువులు గొర్రెలు, గుర్రాలు రథాలు; మానవులు కేవలం భౌతిక శరీరాలు మాత్రమే కాదు, మనుష్యుల ప్రాణాలు, బానిసలు.
REV 18:14 అప్పుడు వర్తకులు ఆ పట్టణంతో, “నీ ప్రాణం కోరుకున్న ఫలం నిన్ను విడిచిపోయింది, నీకున్న సుఖవిలాసం, వైభవాలు ఇంకెన్నడు నీకు కనిపించకుండా మాయమైపోయాయి” అని అన్నారు.
REV 18:15 ఈ సరుకులను అమ్ముతూ ఆమె వలన ధనవంతులైన వ్యాపారులు ఆమె అనుభవించే వేదన చూసి భయంతో దూరంగా నిలబడ్డారు. వారు ఏడుస్తూ రోదిస్తూ,
REV 18:16 బిగ్గరగా ఇలా రోదించారు, “ ‘మహా పట్టణమా! నీకు శ్రమ! శ్రమ! సన్నని నారబట్టలు, ఊదా రంగు బట్టలు, ఎరుపురంగు బట్టలు ధరించుకొని, బంగారంతో, విలువైన రాళ్లతో, ముత్యాలతో అలంకరించుకుని మెరుస్తున్నదానా,
REV 18:17 ఒక్క గంటలోనే ఈ నీ గొప్ప ధనసంపద అంతా వ్యర్థమైపోయిందా?’ “ప్రతి ఓడ అధిపతి, ఓడ ప్రయాణికులందరు, నావికులు, సముద్ర వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు దూరంగా నిలబడ్డారు.
REV 18:18 కాలిపోతున్న ఆమె నుండి వస్తున్న పొగను చూసి, ‘ఈ మహా పట్టణం వంటి గొప్ప పట్టణం ఎప్పుడైనా ఉన్నదా?’ అని బిగ్గరగా కేకలు వేస్తారు.
REV 18:19 వారు తమ తలలపై దుమ్మును పోసుకుంటూ కన్నీరు కార్చుతూ దుఃఖిస్తూ బిగ్గరగా రోదిస్తూ, “ ‘మహా పట్టణమా, నీకు శ్రమ! శ్రమ! సముద్రంలో ఓడలున్న వారందరు ఆమె ధన సమృద్ధితో ధనికులయ్యారు. గాని ఒక్క గంటలోనే ఆమె నశించిపోయిందే అని చెప్పుకుంటారు.’
REV 18:20 “పరలోకమా ఆమెను బట్టి ఆనందించండి. దేవుని ప్రజలారా, ఆనందించండి. అపొస్తలులారా, ప్రవక్తలారా ఆనందించండి. ఎందుకంటే, ఆమె మీకు విధించిన తీర్పును బట్టి దేవుడు ఆమెకు తీర్పు తీర్చారు.”
REV 18:21 ఆ తర్వాత ఒక బలమైన దేవదూత ఒక పెద్ద తిరుగలి రాయంత బండరాయిని తీసుకుని సముద్రంలో పడవేసి, “ఇలాంటి హింసలతో బబులోను మహా పట్టణం క్రిందికి త్రోయబడుతుంది మరి ఎన్నడు అది కనబడదు.
REV 18:22 వీణ వాయించేవారి, పిల్లన గ్రోవులు బూరలు ఊదేవారి సంగీతం మరి ఎన్నడు నీలో వినబడదు. వ్యాపారం చేసే ఏ పనివాడైనా నీలో ఎన్నడు కనిపించడు. తిరుగలి రాయి తిప్పే శబ్దం మరెన్నడు నీలో వినబడదు.
REV 18:23 ఇక ఒక దీపపు వెలుగైనా నీలో ఎన్నడూ ప్రకాశించదు. ఇక వధువు స్వరం వరుని స్వరం నీలో ఎన్నడూ వినిపించదు. నీ వర్తకులు ప్రపంచంలో ప్రఖ్యాతి పొందినవారిగా ఉన్నారు. నీ మాయ మంత్రాలతో దేశాలన్నీ మోసపోయాయి.
REV 18:24 ప్రవక్తల రక్తం దేవుని పరిశుద్ధ ప్రజల రక్తం, భూమి మీద వధించబడిన వారందరి రక్తం ఆమెలో కనిపిస్తుంది.”
REV 19:1 ఈ సంగతుల తర్వాత పరలోకంలో ఒక గొప్ప జనసమూహం అరుస్తున్న శబ్దం వంటి శబ్దాన్ని నేను విన్నాను: “హల్లెలూయా! రక్షణ, మహిమ, బలం మన దేవునివే!
REV 19:2 ఎందుకంటే ఆయన తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి. భూమిని తన వ్యభిచారంతో చెడగొట్టిన, ఆ మహావేశ్యకు ఆయన శిక్ష విధించారు. తన సేవకుల రక్తాన్ని కార్చిన ఆమెపై ఆయన పగతీర్చుకున్నారు.”
REV 19:3 మరొకసారి వారు ఇలా బిగ్గరగా కేకలు వేశారు: “హల్లెలూయా! ఆమె నుండి వస్తున్న పొగ ఎల్లకాలం పైకి లేస్తూనే ఉంటుంది!”
REV 19:4 అప్పుడు ఆ ఇరవైనలుగురు పెద్దలు ఆ నాలుగు ప్రాణులు సింహాసనంపై కూర్చున్న దేవుని ముందు సాగిలపడి బిగ్గరగా ఇలా అన్నారు: “ఆమేన్! హల్లెలూయా!” అంటూ ఆరాధించారు.
REV 19:5 అప్పుడు సింహాసనం నుండి వచ్చిన ఒక స్వరం, “దేవునికి భయపడేవారలారా, ఓ దేవుని సేవకులారా! చిన్నవారైన పెద్దవారైన అందరు మన దేవుని స్తుతించండి” అని పలికింది.
REV 19:6 అప్పుడు మహా గొప్ప జనసమూహం వంటి శబ్దాన్ని, పారే జలాల గర్జనను ఉరుముల ధ్వనిని పోలిన స్వరం ఇలా అన్నది, “హల్లెలూయా! సర్వశక్తిగల మన ప్రభువైన దేవుడు పరిపాలిస్తున్నారు.
REV 19:7 కాబట్టి మనం ఆనందించి ఉత్సాహ ధ్వనులతో ఆయనను కీర్తించుదాం! ఎందుకంటే ఇదిగో గొర్రెపిల్ల పెళ్ళి రోజు వచ్చేసింది ఆయన వధువు తనను తాను సిద్ధపరచుకుంది.
REV 19:8 ఆమె ధరించడానికి ప్రకాశమైన శుద్ధమైన, సున్నితమైన నార వస్త్రాలు ఆమెకు ఇవ్వబడ్డాయి.” సన్నని నారబట్టలు అనగా దేవుని పరిశుద్ధ ప్రజలు చేసిన నీతి క్రియలు అని అర్థము.
REV 19:9 ఆ తర్వాత దేవదూత నాతో, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం పొందినవారు ధన్యులు! ఇది వ్రాయి. ఇవి దేవుని సత్య వాక్కులు” అని చెప్పాడు.
REV 19:10 అప్పుడు అతన్ని ఆరాధించడానికి నేను ఆ దేవదూత పాదాల ముందు సాగిలపడ్డాను. కాని అతడు నాతో, “వద్దు! ఇలా చేయకు! నేను ఇతర విశ్వాసుల వలె యేసు కోసం సాక్ష్యమిచ్చే నీలాంటి సేవకుడనే. దేవునినే పూజించు! ఎందుకంటే యేసును గురించిన సాక్ష్యం కలిగి ఉండడమే ప్రవచించే ఆత్మ” అని నాతో చెప్పాడు.
REV 19:11 అప్పుడు పరలోకం తెరవబడి నా ముందు ఒక తెల్లని గుర్రం కనిపించింది. దాని మీద స్వారీ చేసే వ్యక్తి నమ్మకమైన సత్యవంతుడు అని పిలువబడతాడు. ఆయన న్యాయమైన తీర్పును ఇస్తూ యుద్ధం చేస్తాడు.
REV 19:12 ఆయన కళ్లు అగ్నిజ్వాలల్లా ఉంటాయి. ఆయన తలమీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు వ్రాయబడి ఉంది, అది ఆయనకు తప్ప మరి ఎవరికి తెలియదు.
REV 19:13 రక్తంలో ముంచబడిన వస్త్రాలను ఆయన ధరించి ఉన్నాడు. ఆయనకు దేవుని వాక్యమని పేరు.
REV 19:14 తెల్లని, పవిత్రమైన సన్నని నారబట్టలను ధరించి తెల్లని గుర్రాల మీద స్వారీ చేస్తున్న పరలోక సైన్యాలు ఆయనను వెంబడిస్తున్నాయి.
REV 19:15 దేశాలను నరకడానికి ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయటకు వస్తుంది. “ఆయన ఒక ఇనుపదండంతో వారిని పరిపాలిస్తారు.” ఆయన సర్వశక్తిగల దేవుని తీవ్రమైన ఉగ్రత అనే ద్రాక్ష గానుగ తొట్టిని త్రొక్కుతారు.
REV 19:16 ఆయన ధరించిన వస్త్రాల మీద ఆయన తొడ మీద ఈ పేరు వ్రాసి ఉంది: రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు.
REV 19:17 అప్పుడు సూర్యుని మీద నిలబడిన ఒక దూతను నేను చూశాను, అతడు బిగ్గరగా మధ్య ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటినీ పిలుస్తూ వాటితో, “రండి! దేవుని గొప్ప విందుకు కలిసి రండి!
REV 19:18 గుర్రాలు, రాజుల మాంసాన్ని, సైన్యాధికారుల మాంసాన్ని, బలవంతుల మాంసాన్ని, గుర్రాల, వాటి మీద స్వారీ చేసేవారి మాంసాన్ని, స్వతంత్రులు బానిసలు సామాన్యులు గొప్పవారితో సహా ప్రజలందరి మాంసాన్ని తినడానికి రండి!” అని బిగ్గరగా అరిచి చెప్పాడు.
REV 19:19 అప్పుడు నేను ఆ గుర్రం మీద స్వారీ చేసేవానితో ఆయన సైన్యంతో యుద్ధం చేయడానికి ఆ మృగం భూ రాజులు, వారి సైన్యాలతో కలిసి రావడం నేను చూశాను.
REV 19:20 అయితే ఆ మృగం పట్టుబడింది, దాంతో పాటు దాని పక్షాన సూచకక్రియలు చేసిన అబద్ధ ప్రవక్త కూడా పట్టుబడ్డాడు. అతడు ఈ సూచకక్రియలతో మృగం యొక్క ముద్ర వేయబడి దాని విగ్రహాన్ని పూజించిన వారిని మోసగించాడు. వీరిద్దరు ప్రాణాలతో మండుతున్న అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడ్డారు.
REV 19:21 మిగిలిన వారు ఆ గుర్రం మీద కూర్చుని స్వారీ చేస్తూ వస్తున్న వాని నోటి నుండి బయటకు వస్తున్న ఖడ్గంతో చంపబడ్డారు. అప్పుడు పక్షులన్నీ వారి మాంసాన్ని కడుపారా తిన్నాయి.
REV 20:1 ఆ తర్వాత ఒక దేవదూత తన చేతిలో అగాధపు తాళపు చెవిని ఒక పెద్ద గొలుసును పట్టుకుని పరలోకం నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను.
REV 20:2 ఆ దేవదూత ఆదిసర్పం అనే ఘటసర్పాన్ని అనగా అపవాది అనే సాతానుని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకు బంధించాడు.
REV 20:3 ఆ దూత అతన్ని పాతాళంలో పడవేసి, అతడు వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యే వరకు దేశాలను ఎంత మాత్రం మోసం చేయకుండా ఉండడానికి దానికి తాళం వేసి ముద్ర వేశాడు. ఆ తర్వాత అతడు కొంతకాలం వరకు వదిలిపెట్టబడతాడు.
REV 20:4 అప్పుడు తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడినవారు కూర్చుని ఉన్న సింహాసనాలను నేను చూశాను. యేసును గురించి సాక్ష్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి తలలు నరికివేయబడి హతులైనవారి ఆత్మలను నేను చూశాను. వారు ఆ మృగాన్ని గాని వాని విగ్రహాన్ని గాని పూజించలేదు, వారు దాని ముద్రను తమ నుదుటి మీద గాని చేతి మీద గాని వేయించుకోలేదు. వారు బ్రతికివచ్చి క్రీస్తుతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలించారు.
REV 20:5 చనిపోయినవారిలో మిగిలినవారు ఈ వెయ్యి సంవత్సరాలు గడిచేవరకు మళ్ళీ బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుత్థానము.
REV 20:6 మొదటి పునరుత్థానంలో పాలుపొందినవారు ధన్యులు పరిశుద్ధులు. రెండవ మరణానికి వారి మీద అధికారం లేదు. అయితే వారు దేవునికి క్రీస్తుకు యాజకులుగా ఉంటూ ఆయనతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు.
REV 20:7 వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను చెరలో నుండి విడుదల చేయబడతాడు.
REV 20:8 ఆ సాతాను భూమి నలుదిక్కుల ఉన్న దేశాలను గోగు మాగోగు అనే వారిని మోసపుచ్చి యుద్ధానికి సమకూర్చడానికి బయలుదేరి వెళ్తాడు. వారి సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల్లా లెక్కకు మించి ఉంది.
REV 20:9 వారు భూమి అంతటా ప్రయాణించి దేవుని ప్రజలు ఉన్నచోటును, ఆయన ప్రేమించిన పట్టణాన్ని ముట్టడిస్తారు. కానీ పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.
REV 20:10 అప్పుడు వారిని మోసగించిన సాతాను అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడతాడు. అక్కడే ఆ మృగం, అబద్ధ ప్రవక్త పడవేయబడ్డారు. అక్కడ వారు నిరంతరం రాత్రింబగళ్ళు వేధించబడతారు.
REV 20:11 అప్పుడు నేను ఒక తెల్లని సింహాసనాన్ని దాని మీద కూర్చున్న ఒకరిని చూశాను. భూమి ఆకాశాలు ఆయన సన్నిధి నుండి పారిపోయాయి వాటికి ఎక్కడ స్థలం లేదు.
REV 20:12 ఆ తర్వాత దేవుని సింహాసనం ముందు సామాన్యులు గొప్పవారితో సహా చనిపోయిన వారందరూ నిలబడి ఉండడం నేను చూశాను. గ్రంథాలు తెరవబడ్డాయి. వాటిలో జీవగ్రంథం అనబడే మరొక గ్రంథం తెరవబడింది. జీవగ్రంథంలో వ్రాయబడిన ప్రకారం చనిపోయినవారు తాము చేసిన పనులను బట్టి తీర్పు తీర్చబడ్డారు.
REV 20:13 సముద్రం దానిలో చనిపోయినవారిని అప్పగించింది. అలాగే మరణం పాతాళం తమలో ఉన్న చనిపోయినవారిని అప్పగించాయి. అప్పుడు ప్రతి ఒక్కరు తాము చేసిన పనుల ప్రకారం తీర్పు తీర్చబడ్డారు.
REV 20:14 అప్పుడు మరణం పాతాళం అగ్నిగుండంలో పడవేయబడ్డాయి. ఈ అగ్నిగుండమే రెండవ మరణము.
REV 20:15 జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడనివారిని ఈ అగ్నిసరస్సులో పడవేశారు.
REV 21:1 అప్పుడు నేను “క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని” చూశాను. మొదట ఉన్న ఆకాశం, భూమి గతించిపోయాయి. సముద్రం ఇక లేకపోయింది.
REV 21:2 అప్పుడు తన భర్త కోసం అలంకరించుకొని సిద్ధపడిన ఒక వధువులా నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలో దేవుని దగ్గర నుండి క్రిందికి దిగి రావడం నేను చూశాను.
REV 21:3 అప్పుడు దేవుని సింహాసనం నుండి ఒక గొప్ప స్వరం, “ఇదిగో, దేవుని నివాసం ఇప్పుడు మనుష్యుల మధ్యలో ఉంది, ఆయన వారితో నివసిస్తారు. అప్పుడు వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారికి దేవుడై ఉంటారు.
REV 21:4 ‘ఆయన వారి ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తారు. మొదటి సంగతులు గతించి పోయాయి కాబట్టి అక్కడ చావు ఉండదు, దుఃఖం గాని ఏడ్పు గాని బాధ గాని ఎన్నడూ ఉండదు’ ” అని చెప్తుంటే నేను విన్నాను.
REV 21:5 అప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్న దేవుడు, “ఇదిగో, సమస్తాన్ని నూతనపరుస్తున్నాను” అని చెప్పి, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి కాబట్టి వీటిని వ్రాసి పెట్టు” అన్నారు.
REV 21:6 ఆయన నాతో, “సమాప్తమైనది. అల్ఫా ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.
REV 21:7 జయించేవారు వీటన్నింటికి వారుసులవుతారు; నేను వారికి దేవుడనై ఉంటాను వారు నా బిడ్డలవుతారు.
REV 21:8 అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పారు.
REV 21:9 చివరి ఏడు తెగుళ్ళు నిండి ఉన్న ఏడు పాత్రలను పట్టుకున్న ఏడు దేవదూతలలోని ఒక దేవదూత నా దగ్గరకు వచ్చి నాతో, “ఇటురా! నేను పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్లకు కాబోయే భార్యను నీకు చూపిస్తాను” అని చెప్పాడు.
REV 21:10 అప్పుడు ఆ దేవదూత ఆత్మలో నన్ను ఒక ఎత్తైన గొప్ప పర్వతం మీదికి తీసుకెళ్లి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము పరలోకంలోని దేవుని దగ్గర నుండి క్రిందకు దిగి రావడం చూపించాడు.
REV 21:11 అది దేవుని మహిమతో సూర్యకాంతం అనే బహు అమూల్యమైన రత్నపు తేజస్సు కలిగి స్ఫటికంలా మెరుస్తుంది.
REV 21:12 ఆ పట్టణానికి గొప్ప ఎత్తైన గోడ ఉన్నది, దానికి పన్నెండు ద్వారాలు, ఆ ద్వారాల దగ్గర పన్నెండుమంది దేవదూతలు ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాసి ఉన్నాయి.
REV 21:13 మూడు ద్వారాలు తూర్పున, మూడు ద్వారాలు ఉత్తరాన, మూడు ద్వారాలు దక్షిణాన, మూడు ద్వారాలు పశ్చిమాన ఉన్నాయి.
REV 21:14 పట్టణపు గోడకు పన్నెండు పునాదులు ఉన్నాయి, వాటి మీద గొర్రెపిల్ల యొక్క పన్నెండుమంది అపొస్తలుల పేర్లు ఉన్నాయి.
REV 21:15 నాతో మాట్లాడిన ఆ దేవదూత చేతిలో ఆ పట్టణాన్ని, దాని ద్వారాలను దాని గోడలను కొలవడానికి ఒక బంగారు కొలిచే కర్ర ఉంది.
REV 21:16 ఆ పట్టణం చదరపు ఆకారంలో ఉంది, దాని పొడవు, వెడల్పు కొలతలు సమానంగా ఉన్నాయి. ఆ కొలిచే కర్రతో పట్టణం కొలిచినప్పుడు అది 12,000 స్టాడియాల పొడవు ఉంది; దాని వెడల్పు, ఎత్తు సమానంగా ఉన్నాయి.
REV 21:17 అతడు దాని గోడలను కొలిచినప్పుడు మనుష్యుల కొలత ప్రకారం అది 144 మూరల మందం ఉంది.
REV 21:18 ఆ గోడ సూర్యకాంత మణులతో కట్టబడింది. ఆ పట్టణం స్వచ్ఛమైన బంగారంతో చేయబడి గాజులా స్వచ్ఛంగా ఉంది.
REV 21:19 ఆ పట్టణపు గోడ పునాదులు అమూల్యమైన వివిధ రత్నాలతో అలంకరించబడ్డాయి. మొదటి పునాది సూర్యకాంతం, రెండవది నీలం, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ,
REV 21:20 అయిదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేధికం, తొమ్మిదవది పుష్యరాగం, పదవది సువర్ణల శునీయం, పదకొండవది పద్మరాగం, పన్నెండవది కురువింద మణి.
REV 21:21 పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలు, ప్రతి ద్వారం ఒక ముత్యంతో చేయబడింది. ఆ పట్టణపు ప్రధాన వీధి బంగారంతో చేయబడి, గాజులా స్వచ్ఛంగా ఉంది.
REV 21:22 ఆ పట్టణంలో ఏ దేవాలయం నాకు కనిపించలేదు ఎందుకంటే సర్వశక్తిగల ప్రభువైన దేవుడును గొర్రెపిల్ల ఆ పట్టణానికి దేవాలయంగా ఉన్నారు.
REV 21:23 ఆ పట్టణంపై సూర్యుడు గాని చంద్రుడు గాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపము.
REV 21:24 ప్రజలు దాని వెలుగులో నడుస్తారు, ఇంకా భూ రాజులు తమ వైభవాన్ని దానిలోనికి తెస్తారు.
REV 21:25 ఏ రోజు దాని ద్వారాలు మూయబడవు ఎందుకంటే అక్కడ రాత్రి ఉండదు.
REV 21:26 దేశాలు తమ మహిమ వైభవాన్ని దానిలోనికి తెస్తాయి.
REV 21:27 గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడినవారు మాత్రమే ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తారు. అపవిత్రమైనవి అసహ్యకరమైనవి మోసకరమైనవి చేసేవారెవరు దానిలోనికి ఎన్నడూ ప్రవేశించరు.
REV 22:1 అప్పుడు ఆ దేవదూత గొర్రెపిల్ల దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తున్న స్వచ్ఛమైన స్ఫటికం లాంటి జీవజలనది నాకు చూపించాడు.
REV 22:2 ఆ నది ఆ పట్టణపు ప్రధాన వీధి మధ్యన ప్రవహిస్తుంది. ఆ నదికి ఇరువైపుల జీవవృక్షం ఉంది. అది ప్రతి నెల ఫలాన్ని ఇస్తూ పన్నెండు పంటలను ఇస్తుంది. ఇంకా ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉన్నాయి.
REV 22:3 అక్కడ ఏ శాపం ఉండదు. దేవుని గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఆ పట్టణంలో ఉంటాయి. ఆయన సేవకులు ఆయనను సేవిస్తుంటారు.
REV 22:4 వారు ఆయన ముఖాన్ని చూస్తారు, వారి నుదుటి మీద ఆయన పేరు ఉంటుంది.
REV 22:5 అక్కడ రాత్రి ఉండదు. ప్రభువైన దేవుడే వారికి కాంతిని ఇస్తారు కాబట్టి వారికి దీపకాంతి గాని సూర్యకాంతి గాని అవసరం లేదు. వారు ఎల్లకాలం పరిపాలిస్తూ ఉంటారు.
REV 22:6 అప్పుడు ఆ దేవదూత నాతో, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలను ప్రేరేపించే ప్రభువైన దేవుడు తన సేవకులకు త్వరలో జరుగబోయే సంగతులను చూపించడానికి తన దూతను పంపారు” అని చెప్పాడు.
REV 22:7 “ఇదిగో, నేను త్వరగా వస్తున్నాను! ఈ గ్రంథపుచుట్టలో ప్రవచించిన మాటలను పాటించేవారు ధన్యులు!”
REV 22:8 యోహాను అనే నేను ఈ సంగతులను విని చూశాను. నేను వాటిని విని చూసినప్పుడు, నాకు వాటిని చూపిస్తున్న దేవదూతను ఆరాధించడానికి అతని పాదాల ముందు సాష్టాంగపడ్డాను.
REV 22:9 కాని అతడు నాతో, “నీవు అలా చేయవద్దు! ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన మాటలను పాటించేవారిలా, నీ తోటి ప్రవక్తల్లా నేను కూడా నీ తోటి సేవకుడనే. కాబట్టి దేవున్నే ఆరాధించు!” అని చెప్పాడు.
REV 22:10 తర్వాత అతడు నాతో, “ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన ప్రవచనాలను ముద్ర వేయకు ఎందుకంటే సమయం సమీపంగా ఉంది.
REV 22:11 అన్యాయం చేసేవారిని అన్యాయం చేయనివ్వు, దుష్టుడిని దుష్టునిలా కొనసాగనివ్వు, నీతి క్రియలు చేసేవారిని నీతి క్రియలను చేస్తూ ఉండనివ్వు, పరిశుద్ధులను పరిశుద్ధులుగా కొనసాగనివ్వు” అని చెప్పాడు.
REV 22:12 “ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను! ప్రతివారికి వారు చేసిన పనుల చొప్పున వారికి ఇవ్వడానికి నా ప్రతిఫలం నా దగ్గర ఉంది.
REV 22:13 అల్ఫా ఒమేగాను నేనే, మొదటివాడను చివరివాడను నేనే, ఆది అంతం నేనే!
REV 22:14 “జీవ వృక్షానికి హక్కు పొంది, ద్వారాల గుండా పట్టణంలోనికి ప్రవేశించేలా తమ వస్త్రాలను ఉతుక్కున్నవారు ధన్యులు.
REV 22:15 అయితే మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు.
REV 22:16 “యేసు అనే నేను సంఘాల కోసమైన ఈ సాక్ష్యం మీకు ఇవ్వమని నా దూతను పంపాను. నేను దావీదు వేరును సంతానాన్ని, ప్రకాశవంతమైన వేకువ చుక్కను.”
REV 22:17 “రండి!” అని ఆత్మ, పెండ్లికుమార్తె అంటున్నారు. ఈ మాటలు వింటున్నవారు, “రండి!” అని చెప్పాలి. దప్పికగల వారందరు రండి; ఆశపడినవారు జీవజలాన్ని ఉచితంగా పొందుకోండి.
REV 22:18 ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన ప్రవచనాలను వినే ప్రతిఒక్కరికి నేను ఖచ్చితంగా హెచ్చరించేది ఏమంటే: ఎవరైనా ఈ ప్రవచనాలకు దేనినైనా కలిపితే ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన తెగుళ్ళను దేవుడు వానిపైకి రప్పిస్తారు.
REV 22:19 అలాగే ఈ గ్రంథపుచుట్టలో ప్రవచనం నుండి ఏ మాటలనైనా తీసివేస్తే దేవుడు వానికి ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన పరిశుద్ధ పట్టణంలోని జీవవృక్ష ఫలంలో ఏ భాగం లేకుండా చేస్తారు.
REV 22:20 ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, “నిజమే, నేను త్వరగా వస్తున్నాను!” అంటున్నాడు. ఆమేన్! రండి, ప్రభువైన యేసు!
REV 22:21 ప్రభువైన యేసు కృప దేవుని ప్రజలతో ఉండును గాక ఆమేన్.
