﻿హగ్గయి ప్రవచనం.
1.
రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరో నెల మొదటి రోజున ప్రవక్తయైన హగ్గయి ద్వారా యూదాదేశపు అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకు, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పింది: 
సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: “యెహోవాకు మందిరాన్ని మరలా కట్టడానికి సమయమింకా రాలేదని ఈ ప్రజలు అంటున్నారు.” 
అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా చెప్పింది ఏంటంటే: 
“ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు చెక్క పలకలతో కప్పిన మీ ఇళ్ళలో నివసించడానికి ఇది సమయమా?” 
కాబట్టి సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: “మీ ప్రవర్తన గురించి బాగా ఆలోచించుకోండి. 
మీరు విస్తారంగా విత్తినా కానీ పండింది కొంచెమే. మీరు భోజనం చేస్తున్నా ఆకలి తీరడం లేదు. మీరు త్రాగుతున్నారు కానీ మత్తు ఎక్కడం లేదు. బట్టలు కప్పుకున్నా వెచ్చగా లేదు. మీరు జీతం సంపాదిస్తున్నా అది చిల్లు సంచిలో వేసినట్లే ఉంటుంది.” 
సైన్యాలకు యెహోవా చెబుతున్న మాట ఇదే: “మీ ప్రవర్తన గురించి బాగా ఆలోచించుకోండి. 
పర్వతాల పైకి వెళ్లి కలపను తీసుకువచ్చి నా మందిరాన్ని కట్టండి, అప్పుడు నేను దానిలో ఆనందించి ఘనత పొందుతానని” యెహోవా తెలియజేస్తున్నారు. 
“మీరు ఎక్కువ ఆశించారు కాని కొంచెమే వచ్చింది. మీరు ఇంటికి తెచ్చిన దానిని నేను చెదరగొట్టాను. ఎందుకు? అని సైన్యాలకు యెహోవా అంటున్నారు. ఎందుకంటే నా మందిరం పాడైపోయి ఉండగా మీరంతా మీ ఇళ్ళు కట్టుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 
కాబట్టి మీ కారణంగా ఆకాశం నుండి మంచు కురవలేదు భూమి పంటలు పండలేదు. 
పొలాలు పర్వతాల విషయంలో ధాన్యం క్రొత్త ద్రాక్షరసం విషయంలో నూనె విషయంలో భూమి పండించే చేసే ప్రతి దాని విషయంలో మనుష్యులు పశువుల విషయంలో చేతి పనులన్నిటి విషయంలో కరువు రప్పించాను.” 
షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునైన యెహోషువ, మిగిలి ఉన్న ప్రజలందరూ తమ దేవుడైన యెహోవా మాట విని, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపి తెలియజేసిన సందేశానికి లోబడి యెహోవా పట్ల భయభక్తులు చూపించారు. 
అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియజేసిన సందేశాన్ని ప్రజలకు ఇలా వినిపించాడు: “నేను మీకు తోడుగా ఉన్నాను” ఇదే యెహోవా వాక్కు. 
యెహోవా యూదాదేశపు అధికారిగా ఉన్న షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలు మనస్సును, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనసును, మిగిలి ఉన్న ప్రజలందరి మనస్సులను ప్రేరేపించగా వారందరూ వచ్చి, వారి దేవుడైన సైన్యాల యెహోవా మందిరపు పనిని, 
ఆరో నెల ఇరవై నాల్గవ రోజున ప్రారంభించారు. రాజైన దర్యావేషు పరిపాలించిన రెండవ సంవత్సరంలో, 
