﻿యెషయా.
66.
యెహోవా చెప్పే మాట ఇదే: “ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం. మీరు నా కోసం కట్టాలనుకున్న ఇల్లు ఎక్కడ? నా విశ్రాంతి స్థలం ఏది? 
వీటన్నిటిని చేసింది నా చేయి కాదా, ఈ విధంగా అవి కలిగాయి కదా?” అని యెహోవా తెలియజేస్తున్నారు. “ఎవరైతే వినయంతో పశ్చాత్తాప హృదయం కలిగి నా మాట విని వణుకుతారో, వారికే నేను దయ చూపిస్తాను. 
అయితే కోడెను బలిచ్చేవారు నరబలి ఇచ్చేవారి వంటివారే, గొర్రెపిల్లను బలిగా అర్పించేవారు, కుక్క మెడను విరిచేవారి వంటివారే; భోజనార్పణ చేసేవారు పందిరక్తం అర్పించేవారి వంటివారే, జ్ఞాపకార్థ ధూపం వేసేవారు విగ్రహాలను పూజించేవారి వంటివారే. వారు తమకిష్టమైన దుష్ట మార్గాలను ఎంచుకున్నారు వారి అసహ్యమైన పనులలో వారు సంతోషిస్తారు; 
కాబట్టి నేను వారి కోసం కఠినమైన శిక్షను ఎంచుకుంటాను వారు భయపడేవాటిని వారి మీదికి రప్పిస్తాను. ఎందుకంటే, నేను పిలిస్తే ఎవరూ జవాబు ఇవ్వలేదు నేను మాట్లాడితే ఎవరూ వినలేదు. నా దృష్టిలో మీరు చెడుగా ప్రవర్తించి నాకు అయిష్టమైన వాటిని ఎంచుకున్నారు.” 
యెహోవా మాటకు భయపడేవారలారా, ఆయన మాట వినండి. “మిమ్మల్ని ద్వేషిస్తూ నా నామాన్ని బట్టి మిమ్మల్ని త్రోసివేసే మీ సొంతవారు, ‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు మహిమ కలుగును గాక!’ అని అన్నారు. అయినా వారు సిగ్గుపరచబడతారు. 
పట్టణం నుండి వచ్చే కోలాహలం వినండి మందిరం నుండి వస్తున్న ఆ శబ్దం వినండి! తన శత్రువులకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తున్న యెహోవా యొక్క శబ్దం అది. 
“ఆమె ప్రసవవేదన పడక ముందే ఆమె బిడ్డకు జన్మనిస్తుంది; ఆమెకు నొప్పులు రాకముందే కుమారున్ని కంటుంది. 
అలాంటి సంగతులు ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? అలాంటి సంగతులు ఎవరైనా ఎప్పుడైనా చూశారా? ఒక్క రోజులో దేశం పుడుతుందా ఒక్క నిమిషంలోనే ఒక జనం జన్మిస్తుందా? అయితే సీయోనుకు ప్రసవవేదన కలగగానే ఆమె తన బిడ్డలకు జన్మనిస్తుంది. 
నేను ప్రసవవేదన కలిగించి జన్మనివ్వకుండా ఉంటానా?” అని యెహోవా అడుగుతున్నారు. “పుట్టుక వరకు తీసుకువచ్చి గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నారు. 
“యెరూషలేమును ప్రేమించే మీరందరూ ఆమెతో సంతోషించి ఆనందించండి. ఆమె గురించి ఏడ్చే మీరందరూ ఆమెతో గొప్పగా సంతోషించండి. 
ఆదరణకరమైన ఆమె రొమ్ము పాలు త్రాగి మీరు తృప్తిపొందుతారు. మీరు తృప్తిగా త్రాగి ఆమె సమృద్ధిని అనుభవిస్తూ ఆనందిస్తారు.” 
యెహోవా చెప్పే మాట ఇదే: “వినండి. ఆమె దగ్గరకు సమాధానం నదిలా ప్రవహించేలా చేస్తాను, దేశాల సంపదలు పొంగిపొర్లే ప్రవాహంలా వస్తాయి; మీరు పోషించబడి ఆమె చంకనెక్కుతారు ఆమె మోకాళ్లమీద ఆడుకుంటారు. 
తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు.” 
మీరు ఇది చూసినప్పుడు మీ హృదయం సంతోషిస్తుంది మీరు గడ్డిలా వర్ధిల్లుతారు; యెహోవా యొక్క చేతి బలం తన సేవకులకు తెలియజేయబడుతుంది, కాని ఆయన కోపం తన శత్రువులకు చూపించబడుతుంది. 
చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నారు, ఆయన రథాలు సుడిగాలిలా వస్తున్నాయి. ఆయన తన కోపాన్ని తీవ్రతతో క్రిందికి తెస్తున్నారు, ఆయన గద్దింపు అగ్ని మంటలతో వస్తుంది. 
అగ్నితో తన ఖడ్గంతో యెహోవా ప్రజలందరికి తీర్పు అమలుచేస్తారు, యెహోవా ద్వారా అనేకమంది చంపబడతారు. 
“ఎవరైతే పందిమాంసం, ఎలుకలు, ఇతర అపవిత్రమైన వాటిని తినేవాన్ని అనుసరిస్తూ, పవిత్ర తోటలోకి వెళ్లి పూజించడానికి తమను తాము ప్రతిష్ఠించుకుని శుద్ధి చేసుకుంటారో, వారు తాము అనుసరించే వానితో పాటు నశిస్తారు” అని యెహోవా తెలియజేస్తున్నారు. 
“వారి యొక్క పనులు వారి ఆలోచనలను బట్టి నేను అన్ని దేశాల ప్రజలను, రకరకాల భాషలు మాట్లాడేవారిని ఒక్కచోట చేర్చడానికి వస్తున్నాను. వారు వచ్చి నా మహిమను చూస్తారు. 
“నేను వారి ఎదుట ఒక సూచనను పెడతాను. వారిలో తప్పించుకున్న వారిని వేరే దేశాలకు అనగా, తర్షీషు, పూలు, లూదు (ప్రసిద్ధ విల్లుకాండ్రు) అనే దేశాల దగ్గరకు, తుబాలు గ్రీసులకు, నా గురించి నా మహిమ గురించి వినని దూరంగా ఉన్న ద్వీపవాసుల దగ్గరకు పంపిస్తాను. వారు దేశాల మధ్య నా మహిమ గురించి ప్రకటిస్తారు. 
ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రల్లో భోజనార్పణల్ని యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లు, గుర్రాల మీద, రథాల మీద, బండ్ల మీద, కంచరగాడిదల మీద, ఒంటెల మీద ఎక్కించి అన్ని దేశాల నుండి నా పరిశుద్ధ పర్వతమైన యెరూషలేముకు మీ ప్రజలందరినీ యెహోవాకు అర్పణగా వారు తీసుకువస్తారు” అని యెహోవా చెప్తున్నారు. 
“యాజకులుగా లేవీయులుగా ఉండడానికి నేను వారిలో కొందరిని ఏర్పరచుకుంటాను” అని యెహోవా చెప్తున్నారు. 
“నేను చేయబోయే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నా ఎదుట నిత్యం నిలిచి ఉన్నట్లు, నీ పేరు నీ సంతానం నిలిచి ఉంటుంది” అని యెహోవా తెలియజేస్తున్నారు. 
“ప్రతి అమావాస్య రోజున, ప్రతి సబ్బాతు దినాన నా ఎదుట ఆరాధించడానికి ప్రజలందరూ వస్తారు” అని యెహోవా చెప్తున్నారు. 
“వారు వెళ్లి నా మీద తిరుగుబాటు చేసిన వారి శవాలను చూస్తారు; వాటిని తినే పురుగులు చావవు, వాటిని కాల్చే అగ్ని ఆరిపోదు, మనుష్యులందరికి అది అసహ్యంగా ఉంటుంది.”
