﻿యెషయా.
15.
మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒక రాత్రిలోనే మోయాబులోని ఆరు పట్టణం పాడై నశిస్తుంది! ఒక రాత్రిలోనే మోయాబులోని కీరు పట్టణం పాడై నశిస్తుంది! 
దీబోను ఏడ్వడానికి గుడికి తన క్షేత్రాలకు వెళ్తుంది; నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది. ప్రతి తల క్షౌరం చేయబడింది ప్రతివాని గడ్డం గొరిగించబడింది. 
వారు తమ సంతవీధులలో గోనెపట్ట కట్టుకుంటారు; తమ మేడల మీద, బహిరంగ స్థలాల్లో వారందరు రోదిస్తారు, ఏడుస్తూ కన్నీరు కారుస్తారు. 
హెష్బోను ఎల్యాలెహు మొరపెడుతున్నారు, యాహాజు వరకు వారి స్వరం వినబడుతుంది. కాబట్టి మోయాబీయుల వీరులు మొరపెడతారు, వారి హృదయాలు క్రుంగిపోతాయి. 
మోయాబు గురించి నా హృదయం మొరపెడుతుంది; వారిలో పారిపోయినవారు సోయరు వరకు, ఎగ్లత్-షెలీషియా వరకు పారిపోతారు. వారు లూహీతు ఎక్కుతున్నప్పుడు ఆ దారిలో ఏడుస్తూ ఎక్కుతారు; హొరొనయీము వెళ్లే దారిలో తమ నాశనం గురించి విలపిస్తారు. 
నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి గడ్డి ఎండిపోయింది; వృక్ష సంపద ఉండదు పచ్చదనం ఎక్కడా మిగల్లేదు. 
కాబట్టి వారు సంపాదించి సమకూర్చుకున్న ఆస్తిని నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని వెళ్తారు. 
వారి ఆర్తనాదాలు మోయాబు సరిహద్దులలో ప్రతిధ్వనిస్తాయి; వారి రోదన ఎగ్లయీము వరకు వారి ఏడ్పు బెయేర్-ఎలీము వరకు వినబడుతుంది. 
దీమోను నీళ్లు రక్తంతో నిండిపోయాయి కాని నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పిస్తాను. మోయాబు నుండి తప్పించుకున్నవారి మీదికి ఆ దేశంలో మిగిలిన వారి మీదికి సింహాన్ని రప్పిస్తాను. 
