﻿కీర్తనలు.
2.
దేశాలు ఎందుకు కుట్ర చేస్తున్నాయి? ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు? 
యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచి పాలకులందరు ఒకటిగా చేరి, 
“మనం వారి గొలుసులను తెంపుదాం వారి సంకెళ్ళను విసిరి పారేద్దాం” అంటున్నారు. 
ఆకాశంలో ఆసీనులై ఉన్న ప్రభువు నవ్వుతున్నారు; ఆయన వారిని చూసి ఎగతాళి చేస్తున్నారు. 
ఆయన కోపంతో వారిని గద్దించి తన తీవ్రమైన ఉగ్రతతో వారిని భయకంపితులను చేసి ఇలా అన్నారు, 
“నా పవిత్ర పర్వతమైన సీయోనును నా రాజు ఏలుతున్నారు.” 
నేను యెహోవా శాసనాన్ని ప్రకటిస్తాను: ఆయన నాతో ఇలా అన్నారు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను. 
నన్ను అడిగితే, నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా, భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను. 
ఇనుపదండంతో నీవు వారిని నలగ్గొడతావు; పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.” 
కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి. 
యెహోవాను భయంతో సేవించండి వణుకుతూ ఆనందించండి. 
ఆయన కుమారున్ని ముద్దాడండి, లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. 
