﻿యోబు.
8.
అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా అన్నాడు: 
“ఎంతకాలం నీవు ఇలాంటి మాటలు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలా ఉన్నాయి. 
దేవుడు న్యాయాన్ని తలక్రిందులు చేస్తారా? సర్వశక్తిమంతుడు ధర్మాన్ని వక్రీకరిస్తారా? 
నీ పిల్లలు ఆయనకు విరోధంగా పాపం చేసి ఉండవచ్చు, అందుకే ఆయన వారి పాపానికి తగ్గ శిక్షకు వారిని అప్పగించారు. 
కాని నీవు జాగ్రత్తగా దేవుని వెదికితే, సర్వశక్తిమంతుడైన దేవుని వేడుకుంటే, 
నీవు పవిత్రంగా యథార్థంగా ఉంటే, ఇప్పుడే ఆయన నీ పక్షాన లేస్తారు, నీ సంపన్న స్థితిని తిరిగి ఇస్తారు. 
నీ స్థితి మొదట మామూలుగా ఉన్నా, చివరకు అది ఎంతో అభివృద్ధి చెందుతుంది. 
“గత తరం వారిని అడుగు, వారి పూర్వికులు చేసిన శోధనను గమనించు, 
ఎందుకంటే మనం నిన్న పుట్టినవారం, మనకు ఏమి తెలియదు, భూమిపై మన రోజులు నీడ వంటివి. 
వారు నీకు బోధించి చెప్పరా? వారు తమ అనుభవంతో మాట్లాడరా? 
బురద లేకుండ జమ్ము పెరుగుతుందా? నీళ్లు లేకుండ రెల్లు ఎదుగుతుందా? 
అవి కోయకముందు పచ్చగా ఉంటాయి గడ్డి కంటే త్వరగా వాడిపోతాయి. 
దేవుడిని మరచిపోయే వారందరి గతి ఇలాగే ఉంటుంది; భక్తిహీనుల ఆశ అడుగంటిపోతుంది. 
వారు నమ్మేది పెళుసుగా ఉంటుంది. వారి ఆశ్రయం సాలెగూడు వంటిది. 
వారు సాలెగూడును ఆశ్రయిస్తారు కాని అది నిలబడదు, వారు దానిని అంటిపెట్టుకుంటారు కాని అది విడిపోతుంది. 
వారు సూర్యరశ్మిలో సమృద్ధి నీరు కలిగిన వాటిలా పచ్చగా ఉంటూ, వాటి తీగలు వారి తోటమీద అల్లుకుంటూ విస్తరిస్తారు. 
దాని వేర్లు రాళ్ల చుట్టూ చుట్టుకొని, రాళ్ల మధ్యకు చొచ్చుకుపోవాలని చూస్తుంది. 
ఆ చోటు నుండి అది తెంచివేయబడినప్పుడు, ఆ చోటు ‘నేను నిన్నెప్పుడు చూడలేదు’ అంటూ దానిని నిరాకరిస్తుంది. 
ఖచ్చితంగా అది వాడిపోతుంది, భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి. 
“దేవుడు నిర్దోషిని త్రోసివేయరు దుర్మార్గుల చేతులను బలపరచరు. 
ఆయన నీ నోటిని నవ్వుతో, నీ పెదవులను ఆనంద ధ్వనులతో నింపుతారు. 
నీ శత్రువులు అవమానాన్ని ధరిస్తారు, దుర్మార్గుల గుడారాలు ఇక ఉండవు.” 
