﻿2 దినవృత్తాంతములు.
13.
యరొబాము పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో అబీయా యూదా దేశానికి రాజయ్యాడు. 
అతడు యెరూషలేములో మూడేళ్ళు పరిపాలించాడు. అతని తల్లి పేరు మయకా; ఈమె గిబియా పట్టణం వాడైన ఊరియేలు కుమార్తె. అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. 
అబీయా నాలుగు లక్షలమంది సమర్థులైన సైనికులతో యుద్ధానికి వెళ్తే, యరొబాము ఎనిమిది లక్షలమంది సమర్థులైన సైనికులతో అతనికి వ్యతిరేకంగా యుద్ధ వ్యూహం రచించాడు. 
అబీయా ఎఫ్రాయిం కొండ సీమలో ఉన్న సెమరాయిము కొండమీద నిలబడి ఇలా అన్నాడు, “యరొబామా, సర్వ ఇశ్రాయేలు ప్రజలారా, నేను చెప్పేది వినండి! 
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉప్పు ఒడంబడిక చేసి, ఇశ్రాయేలు రాజ్యపరిపాలనను శాశ్వతంగా దావీదు వారసులకు ఇచ్చాడు. ఈ సంగతి మీకు తెలియదా? 
అయినాసరే దావీదు కుమారుడైన సొలొమోను సేవకుడును నెబాతు కుమారుడునైన యరొబాము తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు. 
సొలొమోను కుమారుడైన రెహబాము యువకుడై నిర్ణయాలు తీసుకోలేనివాడై, వారిని ఎదిరించే శక్తి లేనివానిగా ఉన్నప్పుడు, కొందరు పనికిమాలిన పోకిరీలు అతని చుట్టూ చేరి, అతని మీదికి యుద్ధానికి వెళ్లారు. 
“ఇక ఇప్పుడేమో దావీదు వారసుల చేతుల్లో ఉన్న యెహోవా రాజ్యాన్ని ఎదిరించాలని మీరు ఆలోచిస్తున్నారు. నిజానికి మీరు మహా సైన్యంగా ఉన్నారు. మీతో యరొబాము మీకు దేవుళ్ళుగా చేయించిన బంగారు దూడలు ఉన్నాయి. 
అయితే మీరు అహరోను కుమారులైన యెహోవా యాజకులను, లేవీయులను వెళ్లగొట్టి, ఇతర దేశాల ప్రజల్లా మీ సొంత యాజకులను నియమించుకోలేదా? ఒక కోడెతో ఏడు పొట్టేళ్లతో తనను తాను పవిత్రం చేసుకోవడానికి వచ్చిన ప్రతివాడు దేవుళ్ళు కాని వాటికి యాజకులవుతున్నారు. 
“మా విషయానికొస్తే యెహోవాయే మా దేవుడు, మేము ఆయనను విడిచిపెట్టలేదు. యెహోవాకు సేవచేసే యాజకులు అహరోను కుమారులు; లేవీయులు వారికి సహాయం చేస్తారు. 
ప్రతి ఉదయం సాయంత్రం వారు యెహోవాకు దహనబలులు అర్పిస్తారు, పరిమళ ధూపం వేస్తారు. వారు ఆచారం ప్రకారం వారు పవిత్రమైన బల్లపై రొట్టెలు పెట్టి, ప్రతి సాయంత్రం బంగారు దీపస్తంభంపై దీపాలను వెలిగిస్తారు. మేము మా దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటిస్తున్నాము. కాని మీరు ఆయనను విడిచిపెట్టారు. 
దేవుడు మాతో ఉన్నారు; ఆయన మా నాయకుడు. ఆయన యాజకులు తమ బూరలతో మీమీద యుద్ధనాదం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వికుల దేవుడైన యెహోవాతో పోరాడకండి, ఎందుకంటే మీరు గెలువలేరు.” 
కాని యరొబాము కొంత సైన్యాన్ని వెనుకకు పంపాడు. అతడు యూదా వారికి ముందు ఉన్నప్పుడు మాటుగాండ్రు వారి వెనుక ఉండేలా చేశాడు. 
యూదా వారు, తాము ముందు వెనుక ముట్టడి చేయబడ్డామని తెలుసుకుని యెహోవాకు మొరపెట్టారు. యాజకులు తమ బూరలు ఊదగా, 
యూదా వారు యుద్ధనాదం చేశారు. వారు చేసిన యుద్ధనాదం వినబడడంతోనే దేవుడు అబీయా ఎదుట యూదా వారి ఎదుట యరొబామును ఇశ్రాయేలు సైన్యమంతటిని తరిమివేశారు. 
ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయారు. దేవుడు ఇశ్రాయేలు వారిని యూదా వారి చేతులకు అప్పగించారు. 
అబీయా అతని సేనలు వారికి భారీ ప్రాణనష్టం కలిగించగా ఇశ్రాయేలీయుల సమర్థులలో అయిదు లక్షలమంది సైనికులు మరణించారు. 
ఈ విధంగా ఇశ్రాయేలీయులు అణచివేయబడ్డారు. యూదా ప్రజలు తమ పూర్వికుల దేవుడైన యెహోవాపై ఆధారపడ్డారు కాబట్టి వారు విజయం సాధించారు. 
అబీయా యరొబామును వెంటాడి, అతని వశంలో నుండి బేతేలును దాని పట్టణాలను, యెషానాను ఎఫ్రోనునూ వాటి చుట్టూ ఉన్న గ్రామాలను స్వాధీనపరచుకున్నాడు. 
అబీయా రోజుల్లో యరొబాము మళ్ళీ బలపడలేదు. యెహోవా అతన్ని మొత్తాడు కాబట్టి అతడు చనిపోయాడు. 
కానీ అబీయా బలాభివృద్ధి చెందాడు. అతడు పద్నాలుగు మంది స్త్రీలను పెళ్ళి చేసుకున్నాడు; అతనికి ఇరవై రెండు మంది కుమారులు, పదహారు మంది కుమార్తెలు. 
అబీయా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు ఏమి చేశాడో ఏమి చెప్పాడో, అవన్నీ ప్రవక్తయైన ఇద్దో రచించిన వ్యాఖ్యాన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. 
