﻿2 దినవృత్తాంతములు.
10.
రెహబామును రాజుగా చేయడానికి ఇశ్రాయేలు ప్రజలంతా షెకెముకు వెళ్లగా రెహబాము అక్కడికి వెళ్లాడు. 
రాజైన సొలొమోను దగ్గరి నుండి ఈజిప్టుకు పారిపోయి అక్కడే నివాసం చేస్తున్న నెబాతు కుమారుడైన యరొబాము ఇది విని, ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడు. 
కాబట్టి ప్రజలు యరొబామును పిలిపించారు. అతడు, ఇశ్రాయేలీయులు అంతా కలిసి రెహబాము దగ్గరకు వెళ్లి అతనితో ఇలా అన్నారు: 
“మీ తండ్రి మామీద బరువైన కాడిని మోపాడు, అయితే మీ తండ్రి పెట్టిన కఠినమైన దాసత్వాన్ని, మామీద ఉంచిన బరువైన కాడిని తేలిక చేయండి, అప్పుడు మేము మీకు సేవ చేస్తాము.” 
అందుకు రెహబాము జవాబిస్తూ, “మీరు మూడు రోజులయ్యాక మళ్ళీ రండి” అన్నాడు. కాబట్టి ప్రజలు వెళ్లిపోయారు. 
అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతనికి సేవలందించిన పెద్దలను సంప్రదించి, “ఈ ప్రజలకు ఎలా జవాబివ్వాలో చెప్పండి” అని అడిగాడు. 
అందుకు వారు, “ఈ రోజు నీవు ఈ ప్రజల మీద దయచూపి వారిని సంతోషపరచి వారికి అనుకూలంగా జవాబు చెప్తే, వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు” అని చెప్పారు. 
కాని రెహబాము పెద్దలు ఇచ్చిన సలహాను తిరస్కరించి, తనతో పెరిగి పెద్దవారై తనకు సేవలందిస్తున్న యువకులను సంప్రదించాడు. 
అతడు వారిని, “మీ సలహా ఏంటి? ‘మీ తండ్రి పెట్టిన కాడిని తేలిక చేయండి’ అని నాతో అంటున్న ఈ ప్రజలకు నేనేమి జవాబివ్వాలి?” అని అడిగాడు. 
అతనితో పాటు పెరిగి పెద్దవారైన ఆ యువకులు జవాబిస్తూ, “ఈ ప్రజలు నీతో, ‘మీ తండ్రి మామీద బరువైన కాడి ఉంచాడు, కాని మీరు దాన్ని తేలిక చేయండి’ అని అన్నారు. కాని నీవు వారితో, ‘నా తండ్రి నడుముకంటే నా చిటికెన వేలు పెద్దది. 
నా తండ్రి మీమీద బరువైన కాడి ఉంచాడు; నేను దానిని ఇంకా బరువు చేస్తాను. నా తండ్రి కొరడాలతో కొట్టాడు; నేను తేళ్లతో కొడతాను’ అని చెప్పాలి” అన్నారు. 
రాజు, “మూడు రోజుల తర్వాత నా దగ్గరకు రండి” అని చెప్పిన ప్రకారం మూడు రోజుల తర్వాత యరొబాము ప్రజలంతా రెహబాము దగ్గరకు వచ్చారు. 
రెహబాము రాజు పెద్దలు చెప్పిన సలహాను తిరస్కరించి, వారికి కఠినంగా జవాబిచ్చాడు. 
అతడు యువకులు ఇచ్చిన సలహా ప్రకారం, “నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాడు; నేను మరి ఎక్కువ బరువుగా చేస్తాను. నా తండ్రి కొరడాలతో శిక్షించాడు; నేను తేళ్లతో శిక్షిస్తాను” అని అన్నాడు. 
రాజు ప్రజల మాట వినిపించుకోలేదు, ఎందుకంటే యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో చెప్పిన మాట నెరవేర్చడానికి ఈ సంఘటనలు దేవుడు ఇలా జరిగించారు. 
రాజు తమ మాట అంగీకరించలేదని తెలుసుకున్న ఇశ్రాయేలీయులంతా రాజుకు ఇలా జవాబిచ్చారు: “దావీదులో మాకేం భాగం ఉంది, యెష్షయి కుమారునిలో మాకేం స్వాస్థ్యం ఉంది? ఇశ్రాయేలీయులారా, మీ గుడారాలకు వెళ్లిపొండి! దావీదూ, నీ సొంత ఇంటి సంగతి చూసుకో!” కాబట్టి ఇశ్రాయేలీయులంతా గుడారాలకు వెళ్లిపోయారు. 
కాని యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలీయుల మీద మాత్రం రెహబాము పరిపాలన చేశాడు. 
రాజైన రెహబాము వెట్టి పనివారి మీద అధికారిగా ఉన్న అదోనిరామును పంపాడు, కాని ఇశ్రాయేలీయులు అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. అయితే రాజైన రెహబాము తప్పించుకుని తన రథమెక్కి యెరూషలేముకు పారిపోయాడు. 
కాబట్టి నేటికీ ఇశ్రాయేలీయులు దావీదు వంశం మీద తిరుగబడుతూనే ఉన్నారు. 
