﻿2 దినవృత్తాంతములు.
3.
ఆ తర్వాత సొలొమోను యెరూషలేములో ఉన్న మోరీయా కొండమీద యెహోవా మందిరాన్ని కట్టడం ఆరంభించాడు. అక్కడే యెహోవా సొలొమోను తండ్రియైన దావీదుకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను మందిరం కట్టించిన స్థలం అంతకుముందు యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళం ఉంది. దావీదు దానిని సిద్ధం చేశాడు. 
అతడు తన పాలనలోని నాలుగవ సంవత్సరం రెండవ నెల రెండవ రోజున కట్టడం ప్రారంభించాడు. 
సొలొమోను దేవుని ఆలయానికి పునాది వేయించాడు. పూర్వంలో ఉపయోగించిన మూర కొలత ప్రకారం, దాని పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు. 
మందిరం విశాల గదికి ముందు మంటపం ఉంది. దాని పొడవు ఇరవై మూరలు, ఎత్తు నూట ఇరవై మూరలు. లోపలిభాగాన్ని అతడు మేలిమి బంగారంతో పొదిగించాడు. 
అతడు ప్రధాన గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారం పొదిగించి, పైభాగాన ఖర్జూరపు చెట్లు, గొలుసుల్లాంటివి చెక్కించాడు. 
మందిరాన్ని ప్రశస్తమైన రాళ్లతో అలంకరించాడు. అతడు ఉపయోగించిన బంగారం పర్వయీము నుండి తెచ్చింది. 
మందిర దూలాలను, స్తంభాలను, గోడలను, తలుపులను బంగారంతో పొదిగించాడు. గోడ మీద కెరూబు చెక్కించాడు. 
అతడు మందిరంలో అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. మందిరం వెడల్పు బట్టి దాని పొడవు ఇరవై మూరలు. వెడల్పు కూడా ఇరవై మూరలు. దాన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. అందుకు సుమారు 20,000 కిలోగ్రాముల బంగారం పట్టింది. 
బంగారు మేకు బరువు యాభై షెకెళ్ళు, మందిర పైభాగాలను కూడా బంగారంతో పొదిగించాడు. 
అతి పరిశుద్ధ స్థలంలో రెండు కెరూబులను చెక్కించాడు. వాటిని బంగారంతో పొదిగించాడు. 
ఆ కెరూబులకు రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కల పొడవు మొత్తం ఇరవై మూరలు. ఒక్కొక్క రెక్క అయిదు మూరల పొడవు మొదటి రెక్క గోడకు తాకుతూ ఉంది. రెండవ రెక్క దానికి జతగా ఉన్న కెరూబు తాకుతూ ఉంది. 
అదే విధంగా రెండవ కెరూబు ఒక రెక్క అయిదు మూరల పొడవు. అది ఆలయ గోడకు తాకుతూ ఉంది. దాని మరొక రెక్క అయిదు మూరల పొడవు, మొదటి కెరూబు రెక్కను తాకుతూ ఉంది. 
ఆ విధంగా ఆ కెరూబుల రెక్కలు ఇరవై మూరలు వ్యాపించాయి. కెరూబుల ముఖాలు ప్రధాన మందిరం వైపుకు తిరిగి ఉన్నాయి. కెరూబులు కాళ్లమీద నిలబడి ఉన్నాయి. 
సొలొమోను నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో సన్నని నారతో ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను అల్లించాడు. 
మందిరం ముందు స్థలానికి రెండు స్తంభాలు చేయించాడు. వాటి ఎత్తు ముప్పై అయిదు మూరలు. వాటి మీద అయిదు మూరల ఎత్తుగల పీటలు కూడా చేయించాడు. 
అతడు అల్లిన గొలుసులు చేయించి స్తంభాల పైభాగంలో పెట్టాడు. వంద దానిమ్మపండ్లు కూడా చేసి గొలుసులకు తగిలించాడు. 
మందిరం ముందు భాగంలో స్తంభాలను ఒకటి దక్షిణం వైపు ఒకటి ఉత్తరం వైపు నిలబెట్టాడు. దక్షిణాన ఉన్న దానికి యాకీను అని, ఉత్తరాన ఉన్న దానికి బోయజు అని పేరు పెట్టాడు. 
