﻿2 సమూయేలు.
8.
కాలక్రమేణా దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోబరచుకున్నాడు, వారి ఆధీనంలో ఉన్న మెతెగ్ అమ్మాను స్వాధీనం చేసుకున్నాడు. 
అలాగే దావీదు మోయాబీయులను కూడా ఓడించాడు. అతడు పట్టుకున్న వారిని నేలపై పడుకోబెట్టి త్రాడుతో వారిని కొలిపించాడు. అతడు వారిలో ప్రతి రెండు త్రాళ్ల పొడవున్న వారిని చంపి, మూడవ తాడు కొలతలో ఉన్నవారిని బ్రతకనిచ్చాడు. కాబట్టి మోయాబీయులు దావీదుకు లోబడి అతనికి కప్పం చెల్లించారు. 
రెహోబు కుమారుడు సోబా రాజైన హదదెజెరు యూఫ్రటీసు నది దగ్గర తన స్థూపాన్ని నిలబెట్టడానికి బయలుదేరినప్పుడు దావీదు అతన్ని ఓడించాడు. 
దావీదు అతని దగ్గర నుండి 1,000 రథాలను, 7,000 రథసారధులను, 20,000 మంది సైనికులను పట్టుకున్నాడు. వాటిలో వంద రథాలకు సరిపడా గుర్రాలను ఉంచుకుని మిగతా వాటికి చీలమండల నరాలు తెగగొట్టాడు. 
సోబా రాజైన హదదెజెరుకు సహాయం చేయడానికి దమస్కులో ఉన్న అరామీయులు వచ్చినప్పుడు, దావీదు వారిలో 22,000 మందిని చంపాడు. 
దమస్కులో ఉన్న అరామీయుల దేశంలో అతడు తన సైనిక దళాలను ఉంచగా, అరామీయులు అతనికి దాసులై కప్పం చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయాన్ని ఇచ్చారు. 
దావీదు హదదెజెరు సైన్యాధిపతులకు చెందిన బంగారు డాళ్లను తీసుకుని వాటిని యెరూషలేముకు తెచ్చాడు. 
హదదెజెరుకు చెందిన తెబా బెరోతయి అనే పట్టణాల నుండి రాజైన దావీదు పెద్ద మొత్తంలో ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు. 
హదదెజెరు సైన్యమంతటిని దావీదు ఓడించిన సంగతి హమాతు రాజైన తోయు విన్నప్పుడు, 
అతడు తన కుమారుడైన యోరామును రాజైన దావీదు దగ్గరకు అతని క్షేమం గురించి తెలుసుకుని అతనికి శుభాకాంక్షలు చెప్పడానికి పంపాడు, ఎందుకంటే హదదెజెరుకు తోయుకు మధ్య విరోధం ఉంది. యోరాము బంగారం వెండి ఇత్తడితో చేసిన అన్ని రకాల వస్తువులను తెచ్చాడు. 
రాజైన దావీదు ఈ వస్తువులను తాను జయించిన అన్ని దేశాలు నుండి, అనగా ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు, అమాలేకీయుల దేశాల నుండి స్వాధీనం చేసుకున్న వెండి బంగారాలను ప్రతిష్ఠించిన విధంగానే యెహోవాకు ప్రతిష్ఠించాడు. అంతేకాక, రెహోబు కుమారుడు సోబా రాజైన హదదెజెరు నుండి స్వాధీనం చేసుకున్న వాటిని యెహోవాకు ప్రతిష్ఠించాడు. 
దావీదు ఉప్పు లోయలో 18,000 మంది ఎదోమీయులను చంపి తిరిగివచ్చిన తర్వాత అతడు చాలా పేరు గడించాడు. 
అతడు ఎదోము దేశమంతటా సైనిక దళాలను ఉంచాడు. ఎదోమీయులంతా దావీదుకు లొంగిపోయారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయమిచ్చారు. 
దావీదు ఇశ్రాయేలంతటిని పరిపాలిస్తూ తన ప్రజలందరికి న్యాయాన్ని ధర్మాన్ని జరిగించాడు. 
సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల మీద అధికారి. 
అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులు; శెరాయా కార్యదర్శి. 
యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకు పెలేతీయులకు అధిపతి. దావీదు కుమారులు యాజకులు. 
