﻿న్యాయాధిపతులు.
17.
ఎఫ్రాయిం కొండ సీమలో మీకా అనే ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. 
అతడు తన తల్లితో, “నీ దగ్గర నుండి తీసుకున్న పదకొండు వందల షెకెళ్ళ వెండి గురించి నీవు పెట్టిన శాపనార్థాలను నేను విన్నాను. ఆ వెండి నా దగ్గరే ఉంది, నేనే దానిని తీసుకున్నాను” అని అన్నాడు. అందుకు అతని తల్లి, “నా కుమారుడా! యెహోవా నిన్ను దీవించును గాక” అని అన్నది. 
అతడు ఆ పదకొండు వందల షెకెళ్ళ వెండిని తన తల్లికి తిరిగి ఇచ్చేసినప్పుడు ఆమె, “నేను నా వెండిని యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, నా కుమారుడు వెండితో పొదిగించిన ఒక విగ్రహం తయారుచేసిన తర్వాత అది తిరిగి నీకు ఇచ్చేస్తాను” అని అన్నది. 
కాబట్టి అతడు తన తల్లికి ఆ వెండి తిరిగి ఇచ్చేసిన తర్వాత ఆమె దానిలో రెండువందల షెకెళ్ళ వెండి తీసి, కంసాలికి ఇచ్చింది. అతడు దానితో ఒక విగ్రహం చెక్కి పూత విగ్రహం తయారుచేశాడు. వాటిని మీకా ఇంట్లో పెట్టారు. 
మీకా అనే ఈ వ్యక్తికి క్షేత్రం ఒకటి ఉన్నది, అతడు ఒక ఏఫోదును, మరికొన్ని గృహ దేవుళ్ళ విగ్రహాలను చేయించి, తన కుమారులలో ఒకనిని తన యాజకునిగా నియమించాడు. 
ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు; ప్రతి ఒక్కరూ తమకు సరియైనదని అనిపించింది చేసేవారు. 
యూదా ప్రాంతంలోని బేత్లెహేములో యూదా కుటుంబీకులతో నివసిస్తున్న ఒక లేవీ యువకుడు, 
యూదాలోని బేత్లెహేము పట్టణాన్ని విడిచి, తాను నివసించడానికి స్థలం వెదకడానికి వెళ్లాడు. ఆ పనిమీద వెళ్తూ అతడు ఎఫ్రాయిం కొండ సీమలోని మీకా ఇంటికి వచ్చాడు. 
మీకా అతన్ని, “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు. అతడు, “నేను యూదాలోని బేత్లెహేములో ఉంటున్న లేవీయుడను. నివసించడానికి స్థలం వెదకుతున్నాను” అన్నాడు. 
అప్పుడు మీకా ఆ లేవీయునితో, “నీవు నాతో నివసిస్తూ, నా తండ్రిగా, యాజకునిగా ఉండిపో. నేను సంవత్సరానికి పది షెకెళ్ళ వెండి, బట్టలు, భోజనం ఇస్తాను” అన్నాడు. 
కాబట్టి ఆ లేవీయుడు అతనితో ఉండడానికి ఒప్పుకున్నాడు, ఆ యువకుడు తన కుమారులలో ఒకనిగా అయ్యాడు. 
మీకా ఆ లేవీయున్ని నియమించగా ఆ యువకుడు యాజకునిగా ఉంటూ ఆ ఇంట్లో నివసించాడు. 
మీకా, “ఈ లేవీయుడు నా యాజకుడయ్యాడు, కాబట్టి ఇప్పుడు యెహోవా నాకు మేలు చేస్తారని నాకు తెలుసు” అన్నాడు. 
