﻿ద్వితీయో.
34.
తర్వాత మోషే మోయాబు సమతల మైదానాల నుండి వెళ్లి యెరికో ఎదురుగా ఉన్న పిస్గా పర్వత శిఖరం వరకు వెళ్లి నెబో పర్వతమెక్కాడు. అక్కడ యెహోవా అతనికి గిలాదు నుండి దాను వరకు ఉన్న దేశాన్నంతా చూపించారు, 
నఫ్తాలి ప్రాంతమంతటిని, ఎఫ్రాయిం మనష్షేల ప్రాంతాలను, పశ్చిమదిక్కున ఉన్న మధ్యధరా సముద్రం వరకు ఉన్న యూదా ప్రాంతాన్ని, 
దక్షిణ ప్రాంతాన్ని, ఖర్జూర చెట్ల పట్టణమైన యెరికో లోయ నుండి సోయరు వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని అతనికి చూపించారు. 
అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నారు, “నేను మీ సంతానానికి ఇస్తానని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన దేశం ఇదే. కళ్ళారా నిన్ను దాన్ని చూడనిస్తున్నాను కాని, నది దాటి నీవు అక్కడికి వెళ్లవు.” 
యెహోవా చెప్పిన ప్రకారంగా యెహోవా సేవకుడైన మోషే మోయాబు దేశంలోనే చనిపోయాడు. 
బేత్-పెయోరు ఎదుట మోయాబులో ఉన్న ఒక లోయలో ఆయన అతన్ని పాతిపెట్టారు. అతని సమాధి ఎక్కడ ఉందో నేటివరకు ఎవరికీ తెలియదు. 
మోషే చనిపోయినప్పుడు అతని వయస్సు నూట ఇరవై సంవత్సరాలు, అతని కళ్లు మసక బారలేదు అతని బలం తగ్గలేదు. 
సంతాప దినాల సమయం పూర్తి అయ్యేవరకు ఇశ్రాయేలీయులు మోయాబు సమతల మైదానాల్లో మోషే కోసం ముప్పై రోజులు దుఃఖించారు. 
అంతకుముందే మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచాడు కాబట్టి అతడు జ్ఞానాత్మతో నింపబడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. 
అప్పటినుండి ఇశ్రాయేలులో యెహోవా ముఖాముఖిగా మాట్లాడిన మోషే వంటి ప్రవక్త, 
ఈజిప్టులో ఫరోకు, అతని అధికారులందరికి, అతని దేశమంతటికి సూచనలను, అద్భుతాలను చేయడానికి యెహోవా పంపిన అలాంటి ప్రవక్త ఇశ్రాయేలులో లేడు. 
ఎందుకంటే ఇశ్రాయేలీయులందరి దృష్టిలో మోషే చేసిన భయం పుట్టించే శక్తివంతమైన కార్యాలు ఎవ్వరూ చేయలేదు.
