﻿లేవీయ.
8.
యెహోవా మోషేతో చెప్పారు, 
“నీవు అహరోనును అతని కుమారులను, వారి వస్త్రాలను, అభిషేక తైలాన్ని, పాపపరిహారబలికి ఒక కోడెను, రెండు పొట్టేళ్లను గంపెడు పులియని రొట్టెలు తీసుకువచ్చి, 
సమాజమంతటిని సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సమకూర్చాలి.” 
యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడు, అలాగే సమాజం సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సమావేశమయ్యింది. 
“యెహోవా ఇలా చేయాలని ఆజ్ఞాపించారు” అని మోషే సమాజానికి చెప్పాడు. 
అప్పుడు మోషే, అహరోనును, అతని కుమారులను ముందుకు తెచ్చి నీటితో వారిని కడిగాడు. 
అతడు అహరోను మీద పైవస్త్రం వేసి, నడికట్టు కట్టి, ఏఫోదు వస్త్రాన్ని, అలాగే ఏఫోదును అతనికి ధరింపజేశాడు. అతడు ఏఫోదును అల్లబడిన నడికట్టుతో అతనికి చుట్టూ కట్టాడు. 
అతడు రొమ్ము పతకాన్ని అతనిపై ఉంచాడు, రొమ్ము పతకం లోపల ఊరీము తుమ్మీములను అమర్చాడు. 
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు అహరోను తలమీద తలపాగాను పెట్టి, దానికి బంగారు పలకను అమర్చి దానికి పవిత్ర చిహ్నాన్ని తగిలించాడు. 
తర్వాత మోషే అభిషేక తైలాన్ని తీసుకుని సమావేశ గుడారాన్ని, దానిలోని ప్రతిదాన్ని అభిషేకించి, వాటిని పవిత్రం చేశాడు. 
అతడు బలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటిని, దాని గంగాళాన్ని దాని పీటను ప్రతిష్ఠించడానికి, బలిపీఠం మీద ఏడుసార్లు కొంచెం నూనె చిలకరించి వాటిని అభిషేకించాడు. 
అహరోనును ప్రతిష్ఠించడానికి అభిషేక తైలంలో కొంచెం అతని తలమీద పోశాడు. 
తర్వాత యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా అతడు అహరోను కుమారులను ముందుకు తీసుకువచ్చి, వారికి చొక్కాలు తొడిగించి నడికట్టు కట్టి, వారి తలల మీద టోపీలను పెట్టాడు. 
తర్వాత అతడు పాపపరిహారబలి కోసం ఎద్దును సమర్పించాడు, దాని తలపై అహరోను అతని కుమారులు తమ చేతులు ఉంచారు. 
మోషే ఎద్దును వధించి, కొంత రక్తాన్ని తీసుకుని, బలిపీఠం శుద్ధి చేయడానికి, తన వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద దానిని పూసాడు. మిగిలిన రక్తాన్ని అతడు బలిపీఠం అడుగున పోశాడు. కాబట్టి మోషే దానికి ప్రాయశ్చిత్తం చేసి దానిని ప్రతిష్ఠించాడు. 
మోషే లోపలి అవయవాల చుట్టూ ఉన్న క్రొవ్వునంతటిని, కాలేయం మీది క్రొవ్వు, రెండు మూత్రపిండాలు వాటి క్రొవ్వును తీసుకుని బలిపీఠం మీద కాల్చాడు. 
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, కోడెను, దాని చర్మాన్ని దాని మాంసాన్ని, దాని పేడను శిబిరం బయట కాల్చివేశాడు. 
తర్వాత అతడు దహనబలికి పొట్టేలును తీసుకువచ్చినప్పుడు, దాని తలపై అహరోను అతని కుమారులు చేతులుంచారు. 
అప్పుడు మోషే పొట్టేలును వధించి దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు. 
అతడు పొట్టేలును ముక్కలు చేసి తలను, ముక్కలను, క్రొవ్వును కాల్చాడు. 
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దాని లోపలి అవయవాలను కాళ్లను నీళ్లతో కడిగి పొట్టేలంతటిని బలిపీఠం మీద కాల్చాడు. అది దహనబలి, యెహోవాకు సమర్పించబడిన ఇష్టమైన సువాసనగల హోమబలి. 
తర్వాత మోషే మరొక పొట్టేలును అనగా యాజకుని నియామకం కోసం కావలసిన పొట్టేలును తీసుకువచ్చినప్పుడు, అహరోను అతని కుమారులు దాని తలమీద వారి చేతులుంచారు. 
మోషే పొట్టేలును వధించి, దాని రక్తం కొంత తీసుకుని అహరోను కుడిచెవి అంచుకు, కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలి బొటన వ్రేలి మీద పూసాడు. 
మోషే అహరోను కుమారులను కూడా ముందుకు పిలిచి వారి కుడిచెవి అంచుకు, కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలు బొటన వ్రేలి మీద పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు. 
తర్వాత దాని క్రొవ్వును, తోకకు ఉన్న క్రొవ్వును, లోపలి అవయవాలపై ఉన్న క్రొవ్వునంతటిని, కాలేయం మీది క్రొవ్వును, రెండు మూత్రపిండాలను వాటి క్రొవ్వును, వాటి కుడి తొడను తీసుకున్నాడు. 
యెహోవా ఎదుట ఉన్న పులియని రొట్టెల గంపలో నుండి ఒక మందమైన రొట్టెను, ఒలీవనూనె కలిపి చేసిన ఒక మందమైన రొట్టెను, ఒక పల్చని రొట్టెను తీసుకుని, ఆ క్రొవ్వు మీద, కుడి తొడ మీద ఉంచాడు. 
అవన్నీ అహరోను, అతని కుమారుల చేతుల్లో పెట్టగా, వారు యెహోవా ఎదుట వాటిని పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించారు. 
తర్వాత మోషే వారి చేతుల్లో నుండి వాటిని తీసుకుని బలిపీఠం మీద ఉన్న దహనబలి మీదుగా ప్రతిష్ఠార్పణగా వాటిని కాల్చి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా అర్పించాడు. 
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ప్రతిష్ఠార్పణకు చెందిన పొట్టేలులో మోషే వాటాయైన రొమ్ము భాగాన్ని కూడా తీసి పైకెత్తి దానిని యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాడు. 
అప్పుడు మోషే కొంత అభిషేక తైలాన్ని, బలిపీఠం మీద నుండి కొంచెం రక్తాన్ని తీసుకుని అహరోను మీద అతని వస్త్రాల మీద, అతని కుమారుల మీద వారి వస్త్రాల మీద చిలకరించాడు. ఇలా అతడు అహరోనును అతని వస్త్రాలను, అతని కుమారులను వారి వస్త్రాలను ప్రతిష్ఠించాడు. 
అప్పుడు మోషే అహరోనుతో, అతని కుమారులతో, “సమావేశ గుడారపు ద్వారం దగ్గర మాంసాన్ని వండి ప్రతిష్ఠార్పణల గంపలోని రొట్టెలతో తినాలి, నాకు ఆజ్ఞాపించబడిన ప్రకారం, ‘అహరోను అతని కుమారులు దానిని తినాలి.’ 
తర్వాత మిగిలిన మాంసాన్ని, రొట్టెను కాల్చాలి. 
మీ నియామక రోజులు పూర్తయ్యే వరకు ఏడు రోజులు సమావేశ గుడారపు ద్వారాన్ని విడిచివెళ్లవద్దు, ఎందుకంటే మీ నియామకం ఏడు రోజులు ఉంటుంది. 
ఈ రోజు జరిగింది యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి జరిగింది. 
మీరు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర ఏడు రోజులు రాత్రింబగళ్ళు ఉండి యెహోవా ఏం చేయమంటారో అది చేయాలి, అప్పుడు మీరు చావరు; ఎందుకంటే నాకివ్వబడిన ఆజ్ఞ ఇదే” అని చెప్పాడు. 
కాబట్టి అహరోను అతని కుమారులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతిదీ చేశారు. 
