﻿ఆది.
25.
అబ్రాహాము కెతూరా అనే మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు, 
ఆమె అతనికి కన్న కుమారులు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. 
యొక్షాను కుమారులు షేబ, దేదాను; అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు దేదాను వారసులు. 
ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా సంతానము. 
అబ్రాహాము తనకున్నదంతా ఇస్సాకుకు ఇచ్చాడు. 
అయితే అబ్రాహాము ఇంకా బ్రతికి ఉండగానే తన ఉపపత్నులకు పుట్టిన కుమారులకు బహుమానాలిచ్చి, వారినందరిని తన కుమారుడైన ఇస్సాకు దగ్గర నుండి తూర్పు ప్రాంతాలకు పంపివేశాడు. 
అబ్రాహాము నూట డెబ్బై సంవత్సరాలు జీవించాడు. 
అబ్రాహాము తన వృద్ధాప్యంలో, సంవత్సరాలు నిండిన వృద్ధునిగా తుది శ్వాస విడిచి చనిపోయాడు; తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు. 
అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలులు కలిసి తమ తండ్రిని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా గుహలో సమాధి చేశారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడైన ఎఫ్రోను పొలము. 
అబ్రాహాము ఆ పొలాన్ని హిత్తీయుల దగ్గర కొన్నాడు. అందులో అబ్రాహాము తన భార్యయైన శారాతో పాటు పాతిపెట్టబడ్డాడు. 
అబ్రాహాము మృతి చెందిన తర్వాత, దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించారు, అప్పుడు అతడు బెయేర్-లహాయి-రోయి దగ్గర నివసించాడు. 
శారా దాసి, ఈజిప్టుకు చెందిన హాగరు, అబ్రాహాముకు కన్న ఇష్మాయేలు కుటుంబ వంశావళి: 
ఇష్మాయేలు కుమారులు, వారు పుట్టిన క్రమం ప్రకారం వారి పేర్లు: ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, కేదారు, అద్బీయేలు, మిబ్శాము, 
మిష్మా, దూమా, మశ్శా, 
హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా. 
వీరు ఇష్మాయేలు కుమారులు, వారి వారి స్థావరాలలో, శిబిరాలలో, తమ తమ జనాంగాలకు పన్నెండుగురు గోత్ర పాలకుల పేర్లు. 
ఇష్మాయేలు నూట ముప్పై ఏడు సంవత్సరాలు జీవించాడు. తన తుది శ్వాస విడిచి చనిపోయాడు, తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు. 
అతని వారసులు అష్షూరు వైపు వెళ్లే మార్గంలో హవీలా నుండి ఈజిప్టు సరిహద్దు దగ్గర ఉన్న షూరు వరకు ఉన్న ప్రాంతంలో స్థిరపడ్డారు. వారు తమ సోదరులందరికి విరోధంగా నివసించారు. 
అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు వంశావళి. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, 
ఇస్సాకు పద్దనరాములోని సిరియావాడైన బెతూయేలు కుమార్తె, లాబాను సోదరియైన రిబ్కాను పెళ్ళి చేసుకున్నప్పుడు అతని వయస్సు నలభై సంవత్సరాలు. 
రిబ్కాకు సంతానం కలుగలేదు కాబట్టి ఇస్సాకు ఆమె గురించి యెహోవాకు ప్రార్థన చేశాడు, యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చారు, అతని భార్య రిబ్కా గర్భవతి అయ్యింది. 
ఆమె గర్భంలో పిల్లలు ఒకరితో ఒకరు పెనుగులాడారు, అందుకు ఆమె, “నాకెందుకు ఇలా జరుగుతుంది?” అని అంటూ యెహోవాను అడగడానికి వెళ్లింది. 
యెహోవా ఆమెతో ఇలా చెప్పారు, “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి, ఈ రెండు జనాంగాలు నీ గర్భం నుండే వేరుగా ఉంటాయి; ఒక జనం మరొక జనం కంటే బలంగా ఉంటారు. పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు.” 
ఆమె ప్రసవ కాలం సమీపించినప్పుడు, ఆమె గర్భంలో కవలపిల్లలు ఉన్నారు. 
మొదట పుట్టినవాడు ఎర్రగా ఉన్నాడు, అతని శరీరమంతా రోమాల వస్త్రంలా ఉంది; కాబట్టి అతనికి ఏశావు అని పేరు పెట్టారు. 
తర్వాత అతని సోదరుడు, అతని మడిమెను పట్టుకుని బయటకు వచ్చాడు, అతనికి యాకోబు అని పేరు పెట్టారు. రిబ్కా వారికి జన్మనిచ్చినప్పుడు ఇస్సాకు వయస్సు అరవై సంవత్సరాలు. 
అబ్బాయిలు పెరిగారు, ఏశావు అరణ్యంలో తిరుగుతూ నేర్పుగల వేటగాడయ్యాడు. యాకోబు నెమ్మదస్థుడై గుడారాల్లో నివసించేవాడు. 
ఇస్సాకు వేటాడిన మాంసం కోరుకునేవాడు, అతడు ఏశావును ప్రేమించేవాడు, కానీ రిబ్కా యాకోబును ప్రేమించేది. 
ఒక రోజు యాకోబు వంటకం చేస్తున్నపుడు, ఏశావు పొలం నుండి బాగా ఆకలితో వచ్చి, 
“నేను చాలా ఆకలితో ఉన్నాను, నీవు వండుచున్న ఆ ఎర్రని కూర కొంచెం నాకు పెట్టు!” అని అడిగాడు, (అందుకే అతనికి ఎదోము అని పేరు వచ్చింది.) 
యాకోబు, “అలా అయితే మొదట నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు అమ్ము” అని అన్నాడు. 
అప్పుడు ఏశావు, “నేను ఆకలితో చస్తూ ఉంటే నాకు జ్యేష్ఠత్వం దేనికి ఉపయోగం?” అని అన్నాడు. 
అయితే యాకోబు, “ముందు నాకు ప్రమాణం చేయి” అన్నాడు. కాబట్టి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మివేస్తున్నట్టుగా ప్రమాణం చేశాడు. 
అప్పుడు యాకోబు కొంత రొట్టె, కొంత కాయధాన్యం వంటకం ఏశావుకు ఇచ్చాడు. అతడు తిని త్రాగి లేచి వెళ్లిపోయాడు. ఈ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. 
