GEN 1:1 మొట్ట మొదటి దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు.
GEN 1:2 భూమి మొత్తం శూన్యంగా ఉంది. భూమిమీద ఏమీ లేదు. మహా సముద్రాన్ని చీకటి ఆవరించింది. దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండెను.
GEN 1:3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది.
GEN 1:4 దేవుడు ఆ వెలుగును చూశాడు. ఆయనకు అది చక్కగా కనబడింది. అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటి నుండి వేరు చేసాడు.
GEN 1:5 వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని దేవుడు పేరు పెట్టాడు. అస్తమయము అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మొదటి రోజు.
GEN 1:6 అప్పుడు దేవుడు, “జలములను రెండు భాగములుగా చేయుటకు అంతరిక్షం ఉండును గాక!” అన్నాడు.
GEN 1:7 కనుక దేవుడు అంతరిక్షాన్ని చేసి, నీళ్లను వేరుపర్చాడు. కొంత నీరు గాలికి పైగాను, కొంత నీరు గాలికి కిందను ఉంది.
GEN 1:8 దేవుడు ఆ అంతరిక్షానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది రెండవ రోజు.
GEN 1:9 అప్పుడు దేవుడు, “పొడి నేల కనబడునట్లు, ఆకాశం కింద నీరు ఒక్క చోట చేరునుగాక!” అన్నాడు. అలాగే జరిగింది.
GEN 1:10 ఆ పొడి నేలకు “భూమి” అని దేవుడు పేరు పెట్టాడు. మరియు ఒక్క చోట చేరిన నీటికి “సముద్రాలు” అని దేవుడు పేరు పెట్టాడు. ఆయనకు ఇది చక్కగా ఉన్నట్టు కనబడింది.
GEN 1:11 అప్పుడు దేవుడు, “భూమి గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను, ఫలవృక్షాలను మొలిపించు గాక, ఫలవృక్షాలు విత్తనాలుగల పండ్లను పండిస్తాయి. మరియూ ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాన్ని రూపొందిస్తుంది. ఈ మొక్కలు భూమిమీద పెరుగును గాక” అన్నాడు. అలాగే జరిగింది.
GEN 1:12 గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను భూమి మొలిపించింది. మరియు అది విత్తనాలుగల పండ్ల చెట్లను మొలిపించింది. ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాలను రూపొందించింది. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది.
GEN 1:13 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మూడవ రోజు.
GEN 1:14 అప్పుడు, “ఆకాశంలో జ్యోతులు ఉండును గాక. ఈ జ్యోతులు రాత్రి నుండి పగలును వేరు చేస్తాయి. జ్యోతులు ప్రత్యేక సంకేతాలను, ప్రత్యేక సమావేశాల ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగించబడతాయి. మరియు రోజులను సంవత్సరాలను తెలుపుటకు అవి ఉపయోగించబడతాయి.
GEN 1:15 భూమి మీద వెలుగును ప్రకాశింప చేయుటకు ఈ జ్యోతులు ఆకాశంలో ఉంటాయి” అన్నాడు దేవుడు. అలాగే జరిగింది.
GEN 1:16 కనుక ఆ రెండు పెద్ద జ్యోతులను దేవుడు చేసాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేసాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేసాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేసాడు.
GEN 1:17 భూమి మీద ప్రకాశించుటకు ఈ జ్యోతులను దేవుడు ఆకాశంలో ఉంచాడు.
GEN 1:18 పగటిని, రాత్రిని ఏలుటకు ఈ జ్యోతులను ఆకాశంలో ఉంచాడు. ఈ జ్యోతులు చీకటి నుండి వెలుగును వేరు చేసాయి. దేవునికి ఇది చక్కగా ఉన్నట్టు కనబడింది.
GEN 1:19 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది నాలుగవ రోజు.
GEN 1:20 అప్పుడు, “నీళ్లు అనేక ప్రాణులతో నిండి పోవును గాక. మరియు భూమికి పైగా గాలిలో ఎగురుటకు పక్షులు ఉండును గాక!” అన్నాడు దేవుడు.
GEN 1:21 కనుక దేవుడు సముద్రపు పెద్ద జంతువులను చేసాడు. సముద్రంలో సంచరించే ప్రతి ప్రాణిని దేవుడు చేసాడు. సముద్ర జంతువులు ఎన్నో రకాలు ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు చేసాడు. ఆకాశంలో ఎగిరే ప్రతి రకం పక్షిని కూడ దేవుడు చేసాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్టు దేవునికి కనబడింది.
GEN 1:22 ఈ జంతువులను దేవుడు ఆశీర్వదించాడు. అవి అనేక పిల్లల్ని పెట్టి, సముద్రాలు నిండిపోవాలని దేవుడు వాటితో చెప్పాడు.
GEN 1:23 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఐదవ రోజు.
GEN 1:24 అప్పుడు దేవుడు, “భూమి అనేక ప్రాణులను చేయును గాక. అనేక రకాల జంతువులు ఉండును గాక. పెద్ద జంతువులు, ప్రాకే అన్ని రకాల పురుగులు చిన్న జంతువులు ఉండును గాక! మరియు ఈ జంతువులన్నీ యింకా వాటి రకపు జంతువుల్ని ఎక్కువగా వృద్ధి చేయుగాక” అన్నాడు దేవుడు. ఈ సంగతులు అన్నీ జరిగాయి.
GEN 1:25 కనుక దేవుడు ప్రతి రకపు జంతువును చేసాడు. క్రూర జంతువులను, సాధు జంతువులను, ప్రాకుచుండు చిన్న వాటన్నింటినీ దేవుడు చేశాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్టు దేవునికి కనబడింది.
GEN 1:26 అప్పుడు, “ఇప్పుడు మనం మనిషిని చేద్దాం. మనం మన పోలికతో మనుష్యుల్ని చేద్దాం. మనుష్యులు మనలా ఉంటారు. సముద్రంలోని చేపలన్నింటి మీద, గాలిలో పక్షులన్నిటి మీద వారు ఏలుబడి చేస్తారు. భూమి మీద పెద్ద జంతువులన్నింటి మీదను, ప్రాకు చిన్న వాటన్నింటిమీదను వారు ఏలుబడి చేస్తారు” అని చెప్పాడు.
GEN 1:27 కనుక దేవుడు తన స్వంత రూపంలో మనుష్యుల్ని చేశాడు. తన ప్రతిరూపంలో దేవుడు మనుష్యుల్ని చేశాడు. దేవుడు వారిని మగ, ఆడ వారిగా చేశాడు.
GEN 1:28 దేవుడు, వారిని “ఇంకా అనేక మంది ప్రజలు ఉండునట్లు పిల్లలను కనండి. భూమిమీద నిండిపోయి, దానిని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపల మీద, గాలిలో పక్షుల మీద ఏలుబడి చేయండి. భూమి మీద సంచరించే ప్రతి ప్రాణిమీద ఏలుబడి చేయండి” అని ఆశీర్వదించాడు.
GEN 1:29 “ఆహార ధాన్యపు మొక్కలన్నిటిని, ఫలవృక్షాలు అన్నింటిని నేను మీకు ఇస్తున్నాను. ఆ చెట్లు విత్తనాలు గల పండ్లను పండిస్తాయి. ఈ ఆహార ధాన్యం, పండ్లు మీ ఆహారం అవుతుంది.
GEN 1:30 మరియు పచ్చ మొక్కలు అన్నింటిని జంతువులకు నేను ఇస్తున్నాను. ఆ పచ్చ మొక్కలు వాటికి ఆహారం అవుతాయి. భూమిమీద ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, భూమిమీద ప్రాకుచుండు చిన్న ప్రాణులు అన్నీ ఆ ఆహారాన్ని తింటాయి” అని దేవుడు చెప్పాడు. ఈ సంగతులు అన్నీ జరిగాయి.
GEN 1:31 దేవుడు తాను చేసినది అంతా చూశాడు. అది అంతా చాలా చక్కగా ఉన్నట్టు దేవునికి కనబడింది. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఆరవ రోజు.
GEN 2:1 కనుక భూమి, ఆకాశం, వాటిలోని ప్రతిదీ పూర్తయింది.
GEN 2:2 దేవుడు తాను చేస్తున్న పని ముగించాడు. కనుక ఏడవ రోజున దేవుడు తన పని నుండి విశ్రాంతి తీసుకొన్నాడు.
GEN 2:3 ఏడవ రోజును దేవుడు ఆశీర్వదించి, దానిని పవిత్ర దినంగా చేసాడు. దేవుడు ప్రపంచాన్ని చేసేటప్పుడు జరిగించిన పని అంతటి నుండి ఆ రోజున విశ్రాంతి తీసుకొన్నాడు గనుక, ఆ రోజును ఆయన ప్రత్యేకమైనదిగా చేసాడు.
GEN 2:4 ఇదే భూమి, ఆకాశం చరిత్ర. భూమిని, ఆకాశాన్ని దేవుడు చేసినప్పుడు జరిగిన సంగతుల విషయం ఇది.
GEN 2:5 భూమి మీద మొక్కలు ఏమీ లేవు. పొలాల్లో ఏమీ పెరగటం లేదు. అప్పటికి యింకా ఎక్కడా మొక్కలు మొలవలేదు. అప్పటికి భూమిమీద యింకా వర్షం యెహోవా కురిపించలేదు. మొక్కలను గూర్చి జాగ్రత్త తీసుకొనే ఏ మనిషి అప్పటికి లేడు.
GEN 2:6 భూమి నుండి ఆవిరి ఉబికి నేల అంతటిని తడిపింది.
GEN 2:7 అప్పుడు యెహోవా దేవుడు నేలనుండి మట్టి తీసుకొని మనిషిని చేశాడు. మనిషి నాసికా రంధ్రాలలో జీవ వాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడు అయ్యాడు.
GEN 2:8 అప్పుడు తూర్పున ఏదెను అను చోట ఒక తోటను యెహోవా నాటాడు. యెహోవా దేవుడు తాను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు.
GEN 2:9 అప్పుడు చూచుటకు అందంగా కనబడే చెట్లన్నింటినీ, మరియు ఆహారానికి మంచివైన చెట్లు అన్నింటినీ భూమి పుట్టించునట్లు దేవుడు చేసాడు. జీవ వృక్షమును, మంచి చెడుల తెలివిని ఇచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉన్నాయి.
GEN 2:10 ఏదెను తోటలో నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ తోటకు నీటిని ఇస్తుంది. ఆ నది పాయలై నాలుగు చిన్న నదులయింది.
GEN 2:11 మొదటి నది పేరు పీషోను. ఇది హవీలా దేశం అంతటా ప్రవహించే నది.
GEN 2:12 (ఆ దేశంలో బంగారం ఉంది, ఆ బంగారం చాలా మంచిది. ఆ దేశంలో బోళం, గోమేధికము కూడా ఉన్నాయి).
GEN 2:13 రెండవ నది పేరు గీహోను. ఆ నది కూషు దేశమంతటా ప్రవహిస్తుంది.
GEN 2:14 మూడో నది పేరు హిద్దెకెలు. ఆ నది అష్షూరు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది. నాలుగో నది యూఫ్రటీసు.
GEN 2:15 మనిషిని ఏదేను తోటలో యెహోవా దేవుడు ఉంచాడు. మొక్కలు నాటి తోటనుగూర్చి శ్రద్ధ తీసుకోవడం మనిషి పని.
GEN 2:16 యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ యిచ్చాడు: “ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనా నీవు తినవచ్చు.
GEN 2:17 అయితే మంచి, చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలమును నీవు తినకూడదు. ఆ చెట్టు పండు నీవు తిన్న రోజున తప్పక చస్తావు.”
GEN 2:18 అప్పుడు యెహోవా దేవుడు, “పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి సాటియైన సహకారిణిని నేను చేస్తాను. మరియు ఆ సహకారిణి అతనికి సహాయం చేస్తుంది” అనుకొన్నాడు.
GEN 2:19 పొలాల్లోని ప్రతి జంతువును, గాలిలోని ప్రతి పక్షిని నేలనుండి యెహోవా దేవుడు చేసాడు. ఈ జంతువులన్నింటిని యెహోవా దేవుడు మనిషి దగ్గరకు రప్పించాడు, మనిషి ప్రతిదానికి పేరు పెట్టాడు.
GEN 2:20 సాధు జంతువులన్నింటికీ, ఆకాశ ఫక్షులన్నింటికి, అడవి క్రూర జంతువులన్నింటికి మనిషి పేర్లు పెట్టాడు. ఎన్నెన్నో జంతువుల్ని పక్షుల్ని మనిషి చూశాడు. అయితే తనకు సరిపోయే సహాయంగా ఏదీ అతనికి కనబడలేదు.
GEN 2:21 అందుచేత ఆ పురుషుడు గాఢనిద్ర పోయేటట్టు చేసాడు యెహోవా దేవుడు. అతడు నిద్రపోతూ ఉండగా, అతని శరీరంలోని పక్క ఎముకలలో ఒకదాన్ని తీసాడు. పక్క ఎముకను తీసిన చోటును అతని మాంసముతో యెహోవా దేవుడు పూడ్చి వేసాడు.
GEN 2:22 స్త్రీని చేసేందుకు, అతని ప్రక్క ఎముకను యెహోవా దేవుడు ఉపయోగించాడు. అప్పుడు ఆ స్త్రీని ఆ పురుషుని దగ్గరకు యెహోవా దేవుడు తీసుకొని వచ్చాడు.
GEN 2:23 అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు: “ఇప్పుడు, ఇది నావంటి మనిషే అమె ఎముక నా ఎముకల్లోనుంచి వచ్చింది. ఆమె శరీరం నా శరీరంలోనుంచి వచ్చింది. ఆమె నరుని లోనుండి తీయబడింది గనుక ఆమెను నారి అంటాను.”
GEN 2:24 ఇందువల్ల పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి, తన భార్యను హత్తుకొంటాడు. వాళ్లిద్దరు ఏకమవుతారు.
GEN 2:25 ఆ తోటలో ఆ పురుషుడు, అతని భార్యా నగ్నంగా ఉన్నారు. కాని వారికి సిగ్గు తెలియదు.
GEN 3:1 ఆ సమయంలో ఆ స్త్రీతో సర్పం మాట్లాడింది. యెహోవా దేవుడు సృష్టించిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా తెలివైనది, కపటమైనది. ఆ సర్పం స్త్రీని మోసగించాలనుకొని, “ఏమమ్మా ఈ తోటలోని ఏ చెట్టు ఫలమైనా తినివద్దని దేవుడు నిజంగా నీతో చెప్పాడా?” అంది.
GEN 3:2 సర్పానికి ఆమె ఇలా జవాబిచ్చింది: “లేదు! దేవుడు అలాగు చెప్పలేదు. తోటలోని చెట్ల ఫలాలు మేము తినవచ్చు.
GEN 3:3 అయితే ఒక చెట్టుంది, దాని ఫలము మేము తినకూడదు. ‘తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మీరు తినకూడదు. అసలు ఆ చెట్టును మీరు ముట్టుకోకూడదు. అలాచేస్తే మీరు చస్తారు’ అని దేవుడు మాతో చెప్పాడు.”
GEN 3:4 అయితే సర్పం ఆ స్త్రీతో ఇలా అంది: “మీరు చావరు.
GEN 3:5 ఆ చెట్టు ఫలం మీరు తింటే, మంచి చెడ్డలను గూర్చి మీరు తెలుసుకొంటారని దేవునికి తెలుసు. అప్పుడు మీరు దేవునివలె ఉంటారు!”
GEN 3:6 ఆ చెట్టు చాలా అందంగా ఉన్నట్టు ఆ స్త్రీ చూసింది; ఆ ఫలం తినటానికి మంచిదిగా ఉన్నట్టు, ఆ చెట్టు తెలివినిస్తుందని ఆమె తెలుసుకొంది. కనుక ఆ స్త్రీ ఆ చెట్టు ఫలం తీసుకొని దానిని తిన్నది. ఆ పండులో కొంత ఆమె భర్తకు ఇచ్చింది, అతడు కూడా దాన్ని తిన్నాడు.
GEN 3:7 అప్పుడు ఆ పురుషుడు, స్త్రీ ఇద్దరూ మారిపోయారు. వారి కళ్లు తెరవబడ్డట్టు, వారికి అన్నీ వేరుగా కనబడ్డాయి. వారికి బట్టలు లేనట్లు నగ్నంగా ఉన్నట్లు వాళ్లు చూశారు. కనుక వారు అంజూరపు ఆకులను కుట్టి వాటినే బట్టలుగా ధరించారు.
GEN 3:8 సాయంకాలపు చల్లని వేళలో యెహోవా దేవుడు ఆ తోటలో నడుస్తుండగా ఆ పురుషుడు, స్త్రీ ఆ చప్పుడు విని తోటలోని చెట్లమధ్య దాగుకొన్నారు. యెహోవా దేవుని నుండి దాగుకొనేందుకు వారు ప్రయత్నించారు.
GEN 3:9 అయితే యెహోవా దేవుడు ఆ పురుషుని పిలిచాడు. “నీవు ఎక్కడున్నావు?” అన్నాడు యెహోవా.
GEN 3:10 “నీవు తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను, నాకు భయం వేసింది. నేను నగ్నంగా ఉన్నాను, అందుకే దాగుకొన్నాను” అన్నాడు ఆ పురుషుడు.
GEN 3:11 దేవుడు ఆ పురుషునితో ఇలా అన్నాడు. “నీవు నగ్నంగా ఉన్నావని నీతో ఎవరు చెప్పారు? నిన్ను సిగ్గుపడేటట్లు చేసింది ఏమిటి? నేను తినవద్దని చెప్పిన పండు నీవు తిన్నావా ఏమిటి? ఆ చెట్టు ఫలం తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించానుగదా!”
GEN 3:12 అందుకు ఆ పురుషుడు, “నా కోసం నీవు చేసిన ఈమె ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది, అందుచేత నేను తిన్నాను” అన్నాడు.
GEN 3:13 అప్పుడు యెహోవా దేవుడు, “ఏమిటి నీవు చేసింది?” అన్నాడు ఆ స్త్రీతో. ఆ స్త్రీ, “సర్పం నన్ను మోసం చేసింది. నన్ను వెర్రిదాన్ని చేస్తే ఆ పండు తినేసాను” అని చెప్పింది.
GEN 3:14 అందుచేత యెహోవా దేవుడు సర్పంతో ఇలా అన్నాడు: “ఈ మహా చెడ్డ పని నీవే చేసావు కనుక నీవు శపించబడ్డావు. జంతువులన్నీటి కంటే నీ పరిస్థితి హీనంగా ఉంటుందు. నీవు నీ పొట్టతో పాకడం తప్పనిసరౌవుతుంది. నీవు జీవిత కాలమంతా మట్టి తింటావు.
GEN 3:15 ఈ స్త్రీని, నిన్ను ఒకరికొకర్ని విరోధుల్నిగా నేను చేస్తాను. నీ సంతానము, ఆమె సంతానము ఒకరికొకరు విరోధులవుతారు. నీవు ఆమె శిశువు పాదం మీద కాటేస్తావు ఈ శిశువు నీ తలను చతుక కొడతాడు.”
GEN 3:16 అప్పుడు స్త్రీతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “నీవు గర్భవతిగా ఉన్నప్పుడు నేను నీకు బహు ప్రయాస కలుగజేస్తాను. నీవు పిల్లల్ని కనేటప్పుడు మహా గొప్ప బాధ నీకు కలుగుతుంది. నీవు నీ భర్తను వాంఛిస్తావు కాని అతడే నిన్ను ఏలుతాడు.”
GEN 3:17 అప్పుడు పురుషునితో దేవుడు ఈలాగు అన్నాడు: “ప్రత్యేకమైన చెట్టుఫలాన్ని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించాను. అయితే నీవు నీ భార్య చెప్పిన మాటలు విన్నావు ఆ చెట్టు ఫలాన్ని తిన్నావు కనుక నీ మూలంగా భూమిని నేను శపిస్తాను. భూమి ఇచ్చే ఆహారం కోసం నీవు నీ జీవితాంతం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.
GEN 3:18 పొలంలో పండే మొక్కల్ని నీవు తినాలని అనుకొంటావు కాని ముళ్లను, పొదలను నేల నీకోసం పండిస్తుంది.
GEN 3:19 నీ భోజనం కోసం నీవు చాలా కష్టపడి పని చేస్తావు. నీ ముఖం అంతా చెమటతో నిండి పోయేంతగా నీవు పని చేస్తావు. నీవు చనిపోయే రోజు వరకు కష్టపడి పని చేస్తావు మరణించాక నీవు మరలా మట్టి అయిపోతావు. నేను నిన్ను చేసినప్పుడు మట్టిలో నుంచే నీవు తీయబడ్డావు మళ్లీ నీవు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు.”
GEN 3:20 ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎన్నడైనా సరే బతికిన ప్రతి మనిషికి ఈమె తల్లి కనుక ఆయన ఆమెకు ఆ పేరు పెట్టాడు.
GEN 3:21 యెహోవా దేవుడు జంతు చర్మాలతో ఆ పురుషునికి, అతని భార్యకు చొక్కాలు చేసాడు. ఆ తరువాత ఆ చొక్కాలను వారికి తొడిగించాడు.
GEN 3:22 అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు: “చూడండి, మనిషి మనలా తయారయ్యాడు. మంచి, చెడ్డలు మనిషికి తెలుసు. ఇప్పుడు ఆ మనిషి జీవ వృక్షం నుండి ఫలములు తీసుకొని తింటే అతడు శాశ్వతంగా జీవిస్తాడు.”
GEN 3:23 కనుక ఏదెను తోటనుండి ఆ మనిషిని యెహోవా దేవుడు వెళ్లగొట్టాడు. ఆదాము బలవంతంగా వెళ్లగొట్టబడి ఏ నేల నుండి అతడు తీయబడ్డాడో ఆ నేలను సేద్యం చేయటం మొదలు పెట్టాడు.
GEN 3:24 తరువాత ఆ తోటకు కాపలాగా దాని ద్వారం దగ్గర కెరూబులను దేవుడు ఉంచాడు. ఒక అగ్ని ఖడ్గాన్ని కూడా అక్కడ ఉంచాడు. జీవ వృక్షమునకు పోయే మార్గాన్ని కాపలా కాస్తూ ఆ ఖడ్గం చుట్టూరా తిరుగుతూవుంది.
GEN 4:1 ఆదాముకు అతని భార్య హవ్వకు లైంగిక సంబంధాలు కలిగాయి. హవ్వ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు కయీను అని నామకరణం జరిగింది. హవ్వ “యెహోవా సహాయంతో నేను ఒక మనిషిని పొందాను” అంది.
GEN 4:2 ఆ తర్వాత హవ్వ మరో శిశువుకు జన్మనిచ్చింది. ఈ శిశువు కయీనుకు తమ్ముడు అతనికి హేబెలు అని నామకరణం చేశారు. హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. కయీను వ్యవసాయదారుడయ్యాడు.
GEN 4:3 కోతకాలంలో కయీను యెహోవాకు ఒక అర్పణను తెచ్చాడు. నేలనుండి తాను పండించిన ఆహార పదార్థాన్ని కయీను తెచ్చాడు. హేబెలు తన మందలో నుండి కొన్ని మంచి బలిసిన తొలిచూలు గొర్రెల్ని తెచ్చాడు. హేబెలును, అతని అర్పణను దేవుడు స్వీకరించాడు.
GEN 4:5 అయితే కయీనును, అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందువల్ల కయీను దుఃఖించాడు. అతనికి చాలా కోపం వచ్చేసింది.
GEN 4:6 యెహోవా కయీనును అడిగాడు: “నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖం అలా విచారంగా ఉందేమిటి?
GEN 4:7 నీవు మంచి పనులు చేస్తే నాతో నీవు సరిగ్గా ఉంటావు. అప్పుడు నిన్ను నేను అంగీకరిస్తాను. కాని నీవు చెడ్డ పనులు చేస్తే అప్పుడు నీ జీవితంలో ఆ పాపం ఉంటుంది. నీ పాపం నిన్ను అదుపులో ఉంచుకోవాలనుకొంటుంది. కానీ నీవే ఆ పాపమును అదుపులో పెట్టాలి.”
GEN 4:8 “మనం పొలంలోకి వెళ్దాం రా” అన్నాడు కయీను తన తమ్ముడైన హేబెలుతో. కనుక కయీను, హేబెలు పొలంలోకి వెళ్లారు. అప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపేసాడు.
GEN 4:9 తర్వాత, “నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు?” అంటూ కయీనును యెహోవా అడిగాడు. “నాకు తెలియదు. నా తమ్ముణ్ణి కాపలా కాయడం, వాణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకోవడమేనా నా పని” అని కయీను జవాబిచ్చాడు.
GEN 4:10 అప్పుడు యెహోవా యిలా అన్నాడు, “నీవు చేసింది ఏమిటి? నీవే నీ తమ్ముణ్ణి చంపేసావు. నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొర్ర పెట్టుతూ వుంది.
GEN 4:11 (నీవు నీ తమ్మణ్ణి చంపావు) నీ చేతులనుండి అతని రక్తాన్ని తీసుకోవటానికి భూమి నోరు తెరచుకుంది. భూమిమీద నుండి నీవు శపించబడ్డావు.
GEN 4:12 ఇది వరకు నీవు మొక్కలు నాటుకొన్నావు. అవి చక్కగా పెరిగాయి. కాని ఇప్పుడు నీవు మొక్కలు నాటినా, నీ మొక్కలు ఏపుగా ఎదగటానికి నేల తోడ్పడదు. భూమి మీద నీకు ఇల్లు కూడా ఉండదు. ఒక చోటు నుండి మరొక చోటుకు నీవు తిరుగుతూ ఉంటావు.”
GEN 4:13 అప్పుడు కయీను అన్నాడు: “ఇది నేను భరించలేని శిక్ష!
GEN 4:14 చూడు! నన్ను ఈ భూమిని విడిచిపెట్టేటట్లు నీవు బలవంతం చేశావు. నేను నీనుండి వెళ్లపోయి దాగుకొంటాను. (నీ రక్షణనుండి దూరంగా వెళ్తాను). నేనిక్కడ, అక్కడ తిరుగుతుంటాను. నన్ను ఎవరు చూస్తారో వాళ్లు నన్ను చంపేస్తారు.”
GEN 4:15 అప్పుడు కయీనుతో యెహోవా ఇలా అన్నాడు: “నేను అలా జరుగనివ్వను! కయీనూ, నిన్ను ఎవరైనా చంపితే, నేను వారిని మరింతగా శిక్షిస్తా” తరువాత కయీనుకు యెహోవా ఒక గుర్తు వేసాడు. ఎవ్వరూ అతణ్ణి చంపకూడదు అని ఈ గుర్తు సూచిస్తుంది.
GEN 4:16 అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లపోయాడు. ఏదెనుకు తూర్పునవున్న నోదు దేశములో కయీను నివసించాడు.
GEN 4:17 కయీను తన భార్యతో కలసినప్పుడు, ఆమె గర్భవతియై హనోకు అనే కుమారుని కన్నది. కయీను ఒక పట్టణం కట్టించి తన కుమారుడైన హనోకు పేరు దానికి పెట్టాడు.
GEN 4:18 హనోకుకు ఈరాదు అనే కుమారుడు పుట్టాడు. ఈరాదుకు మహూయాయేలు అనే కుమారుడు పుట్టాడు. మహూయాయేలుకు మతూషాయేలు అనే కుమారుడు పుట్టాడు. మతూషాయేలుకు లెమెకు అనే కుమారుడు పుట్టాడు.
GEN 4:19 లెమెకు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. ఒక భార్య పేరు ఆదా, మరొక భార్య పేరు సిల్లా.
GEN 4:20 ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. గుడారములలో నివసిస్తూ, పశువులను పెంచుట ద్వారా జీవనోపాధి సంపాదించుకొనే ప్రజలందరికి యాబాలు తండ్రి.
GEN 4:21 ఆదాకు యూబాలు అనే మరో కుమారుడు ఉన్నాడు. (యూబాలు యాబాలు సోదరుడు). సితారాను పిల్లన గ్రోవిని ఊదేవారందరికిని యూబాలు తండ్రి.
GEN 4:22 సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. ఇత్తడి, యినుము పనులు చేసే వాళ్లందరికీ తూబల్కయీను తండ్రి. తూబల్కయీను సోదరికి నయమా అని పేరు పెట్టబడింది.
GEN 4:23 లెమెకు తన భార్యతలో ఇలా అన్నాడు: “ఆదా, సిల్లా, నా మాట వినండి! లెమెకు భార్య లారా నేను చెప్పే సంగతులను వినండి: ఒకడు నన్ను గాయపర్చాడు కనుక వాడ్ని చంపేసాను ఒక పిల్లవాడు నన్ను కొట్టగా నేనతనిని చంపేసాను.
GEN 4:24 కయీనును చంపినందుకు శిక్ష చాలా అధికం! కనుక నన్ను చంపినందుకు శిక్ష మరి ఎంతో అధికంగా ఉంటుందు.”
GEN 4:25 ఆదాము హవ్వతో కలసినప్పుడు హవ్వ మరో కుమారుణ్ణి కన్నది. ఈ కుమారునికి షేతు అని పేరు పెట్టారు. నాకు ఇంకో కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. కయీను హేబెలును చంపాడు, అయితే ఇప్పుడు నాకు షేతు ఉన్నాడు అంది హవ్వ.
GEN 4:26 షేతుకు కూడ ఒక కుమారుడు పుట్టాడు. అతనికి, ఎనోషు అని అతడు పేరుపెట్టాడు. ఆ సమయంలో ప్రజలు యెహోవాను ప్రార్థించటం మొదలుబెట్టారు.
GEN 5:1 ఆదాము వంశాన్ని గూర్చిన గ్రంథం ఇది. దేవుడు తన పోలికలో మనిషిని (ఆదాము) చేసాడు.
GEN 5:2 ఒక పురుషుణ్ణి, మరో స్త్రీని దేవుడు చేసాడు. వాళ్లిద్దర్నీ చేసిన రోజున ఆయన వాళ్లను ఆశీర్వదించి, అప్పుడు వాళ్లకు మనుష్యులు అని పేరు పెట్టాడు.
GEN 5:3 ఆదాముకు 130 సంవత్సరములు వయస్సు వచ్చాక ఇంకో కుమారునికి తండ్రి అయ్యాడు. ఈ కుమారుడు అచ్చం ఆదాములాగే ఉన్నాడు. ఆదాము తన కుమారునికి షేతు అని పేరు పెట్టాడు.
GEN 5:4 షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరములు బతికాడు. ఆ కాలంలో ఆదాముకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 5:5 కనుక ఆదాము మొత్తం 930 సంవత్సరములు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
GEN 5:6 షేతుకు 105 సంవత్సరముల వయస్సులో ఎనోషు అనే ఒక కుమారుడు పుట్టాడు.
GEN 5:7 ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో షేతుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 5:8 కనుక మొత్తం 912 సంవత్సరాలు షేతు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
GEN 5:9 తొంబై సంవత్సరాల వయస్సు దాటిన తరువాత ఎనోషుకు కేయినాను అనే కుమారుడు పుట్టాడు.
GEN 5:10 కేయినాను పుట్టిన తర్వాత, ఎనోషు 815 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి యింకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 5:11 కనుక మొత్తం 905 సంవత్సరాలు ఎనోషు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
GEN 5:12 కేయినాను 70 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత, మహలలేలు అనే కుమారుడు అతినికి పుట్టాడు.
GEN 5:13 మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో కేయినానుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 5:14 కనుక కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
GEN 5:15 మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు యెరెదు అను కుమారుడు అతనికి పుట్టాడు.
GEN 5:16 యెరెదు పుట్టిన తర్వాత, మహలలేలు 830 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 5:17 కనుక మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
GEN 5:18 యెరెదుకు 162 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత హనోకు అనే కుమారుడు పుట్టాడు.
GEN 5:19 హనోకు పుట్టిన తర్వాత, యెరెదు 800 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 5:20 కనుక యెరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
GEN 5:21 హనోకు 65 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత మెతూషెల అనే కుమారుడు అతనికి పుట్టాడు.
GEN 5:22 మెతూషెల పుట్టిన తర్వాత, హనోకు యింకా 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 5:23 కనుక హనోకు మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు.
GEN 5:24 హనోకు దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. ఒకనాడు దేవుడు హనోకును తనతో తీసుకుపోయాడు గనుక అతడు కనబడకుండా పోయాడు.
GEN 5:25 మెతూషెలకు 187 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత లెమెకు అనే కుమారుడు పుట్టాడు.
GEN 5:26 లెమెకు పుట్టిన తర్వాత, మెతూషెల 782 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 5:27 కనుక మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించాడు. అతడు అప్పుడు మరణించాడు.
GEN 5:28 లెమెకు వయస్సు 182 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు.
GEN 5:29 లెమెకు తన కుమారునికి నోవహు అని పేరు పెట్టాడు. “దేవుడు భూమిని శపించాడు గనుక వ్యయసాయ దారులమైన మనం చాసా కష్టపడి పని చేస్తున్నాం. అయితే నోవహు మనకు నెమ్మది కలుగజేస్తాడు” అన్నాడు లెమెకు.
GEN 5:30 నోవహుకు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరములు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 5:31 కనుక లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.
GEN 5:32 నోవహు 500 సంవత్సరములు దాటిన తర్వాత షేము, హాము, యాఫెతు అనే కుమారులు పుట్టారు.
GEN 6:1 భూమిమీద మనుష్యుల సంఖ్య పెరుగుతూ పోయింది. వీరికి ఆడపిల్లలు పుట్టారు.
GEN 6:2 ఈ ఆడపిల్లలు చాలా అందంగా ఉన్నట్టు దేవుని కుమారులు చాశారు. కనుక దేవుని కుమారులు వారికి నచ్చిన ఆడపిల్లల్ని వాళ్లు పెళ్లి చేసుకొన్నారు. ఆ స్త్రీలు పిల్లల్ని కన్నారు, ఆ కాలంలోను, ఆ తర్వాత కాలంలోను నెఫీలులనువారు ఆ దేశంలో నివసించారు. వారు చాలా ప్రఖ్యాతి చెందిన ప్రజలు, ప్రాచీన కాలంనుండి వారు మహా వీరులు. అప్పుడు యెహోవా అన్నాడు, “మనుష్యులు మానవ మాత్రులు, వారి మూలంగా నా ఆత్మను ఎల్లప్పుడు కలవరపడనియ్యను. 120 సంవత్సరాలు వారిని బతకనిస్తాను.”
GEN 6:5 భూమిమీద మనుష్యులు చాలా చెడ్డవాళ్లుగా ఉన్నట్టు యెహోవా చూశాడు. ప్రజలు ఎల్లప్పుడునూ చెడ్డ వాటిని గూర్చి మాత్రమే తలుస్తున్నట్టు యెహోవా చూశాడు.
GEN 6:6 ఈ భూమిమీద మనుష్యులను చేసినందుకు యెహోవా విచార పడ్డాడు. దేవుని హృదయంలో అది ఎంతో దుఃఖం కలిగించింది.
GEN 6:7 కనుక యెహోవా ఇలా అన్నాడు: “భూమిమీద నేను చేసిన మనుష్యులందరినీ నేను నాశనం చేసేస్తాను. ప్రతి మనుష్యుని, ప్రతి జంతువును, భూమిమీద ప్రాకు ప్రతి జీవిని నాశనం చేస్తాను. ఆకాశ పక్షుల్ని కూడా నేను నాశనం చేస్తాను. ఎందుచేతనంటే, వీటన్నింటినీ నేను చేసినందుకు విచారిస్తున్నాను గనుక.”
GEN 6:8 అయితే భూమిమీద యెహోవాను సంతోష పెట్టిన మనిషి ఒక్కడు ఉన్నాడు. అతడు నోవహు.
GEN 6:9 ఇది నోవహు కుటుంబ కథ. నోవహు తన తరం వారిలోనే నీతిమంతుడు. అతడు ఎల్లప్పుడు దేవునిని అనుసరించాడు.
GEN 6:10 నోవహుకు షేము, హాము, యాఫెతు అని ముగ్గురు కుమారులు.
GEN 6:11 దేవుడు భూమిని చూసి, మనుష్యులు దానిని పాడుచేసినట్టు కనుగొన్నాడు. ఎక్కడ చూసినా చెడుతనం ప్రజలు చెడ్డవారై పోయి, క్రూరులై, భూమిమీద వారి జీవితాన్ని నాశనం చేసుకొన్నారు.
GEN 6:13 కనుక నోవహుతో దేవుడు ఇలా చెప్పాడు: “మనుష్యులంతా ఈ భూమిని కోపంతో హింసతో నింపేసారు. కనుక జీవిస్తున్న వాటన్నింటిని నేను నాశనం చేస్తాను. ఈ భూమిమీద నుండి వారిని నేను తీసివేస్తాను.
GEN 6:14 చితిసారకపు చెక్కతో నీ కోసం ఒక ఓడను నిర్మించు, ఓడలో గదులను చేసి ఓడకు తారు పైపూత పూయి.
GEN 6:15 “నీవు చేయాల్సిన ఓడ కొలత ఇలా ఉండాలి. 300 అ. పొడవు, 50 అ. వెడల్పు, 30 అ. ఎత్తు.
GEN 6:16 కప్పుకు సుమారు 18 అంగుళాల క్రింద ఓడకు ఒక కిటికీ చేయి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టు. ఓడలో మూడు అంతస్తులు చేయి. పై అంతస్తు, మధ్య అంతస్తు, క్రింది అంతస్తు.
GEN 6:17 “నేను నీతో చెబుతోంది గ్రహించు. ఈ భూమి మీదకి ఒక మహాగొప్ప జలప్రళయాన్ని నేను తీసుకొస్తున్నాను. ఆకాశం క్రింద జీవిస్తున్న సకల ప్రాణులను నేను నాశనం చేస్తాను. భూమిమీద ఉండే ప్రతీ ప్రాణి చస్తుంది. భూమిమీద ఉన్న అన్నీ చస్తాయి.
GEN 6:18 అయితే నిన్ను నేను రక్షిస్తాను. అప్పుడు నీతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేస్తాను. నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్లు అందరు ఓడలో ఎక్కాలి.
GEN 6:19 భూమిమీద జీవిస్తోన్న ప్రాణులన్నింటిలో రెండేసి చొప్పున నీవు సంపాదించాలి. ఆడ, మగ చొప్పున వాటిని ఓడలోనికి తీసుకొని రావాలి. వాటిని నీతో కూడా సజీవంగా ఉంజనివ్వు.
GEN 6:20 భూమిమీద ఉన్న ప్రతీ జాతి పక్షుల్లోనుంచి రెండేసి తీసుకురా. భూమిమీద ఉన్న అన్ని రకాల జంతువుల్లోనుంచి రెండేసి తీసుకురా. నేలమీద ప్రాకు ప్రతి ప్రాణులలో రెండేసి చొప్పున తీసుకురా, భూమిమీద ఉండే అన్ని రకాల జంతువులు మగది, ఆడది నీతో ఉండాలి. ఓడలో వాటిని సజీవంగా ఉంచు.
GEN 6:21 అలాగే భూమి మీద ఉండే ప్రతి విధమైన ఆహారాన్ని ఓడలోనికి తీసుకొనిరా. అది నీకు, జంతువులకు భోజనం అవుతుంది.”
GEN 6:22 వీటన్నింటినీ నోవహు చేసాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే నోవహు వాటన్నిటినీ చేసాడు.
GEN 7:1 అప్పుడు నోవహుతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ కాలపు దుర్మార్గుల మధ్య నీవు మంచి వాడివిగా నాకు కనబడ్డావు. కనుక నీ కుటుంబం అంతటినీ కలుపుకొని మీరంతా ఓడలోపలికి వెళ్లండి.
GEN 7:2 శుద్ధమయిన జంతువులన్నింటిలో నుండి ఏడేసి జాతులు. (మగవి ఏడు, ఆడవి ఏడు) తీసుకో, భూమి మీద ఉన్న ఇతర జంతువులన్నింటిలోనుండి ఒక్క జత (మగది ఒకటి, ఆడది ఒకటి) తీసుకో. ఈ జంతువులన్నింటిని నీతోబాటు ఓడలోనికి నడిపించు.
GEN 7:3 ఆకాశంలో ఎగిరే పక్షులన్నింటిలో నుండి ఏడేసి జతలు (మగవి ఏడు, ఆడవి ఏడు) తీసుకో. ఇలా చేయటంవల్ల మిగతా జంతువులన్ని నాశనం చేయబడిన తర్వాత కూడా ఈ జంతువులన్ని భూమిమీద జీవించడానికి వీలవుతుందు.
GEN 7:4 ఇంక ఏడు రోజులకు భూమిమీద విస్తారమైన వర్షం కురిపిస్తాను. 40 పగళ్లు, 40 రాత్రులు వర్షం కురుస్తుంది. భూమిమీద జీవించే ప్రతిప్రాణి నాశనం చేయబడుతుంది. నేను చేసినవన్నీ నశించిపోతాయి.”
GEN 7:5 యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నిటి విషయంలో నోవహు విధేయుడయ్యాడు.
GEN 7:6 ఈ జలప్రళయము వచ్చినప్పుడు నోవహు వయస్సు 600 సంవత్సరాలు.
GEN 7:7 వరద నీటినుండి తప్పించుకొనేందుకు నోవహు, అతని కుంటుంబం ఓడలో ప్రవేశించారు. నోవహు భార్య, అతని కుమారులు, వారి భార్యలు అతనితో కూడ ఓడలో ఉన్నారు.
GEN 7:8 పవిత్ర జంతువులన్నీ, భూమిమీది ఇతర జంతువులన్నీ, పక్షులన్నీ, నేలమీద ప్రాకు ప్రాణులన్నీ నోవహుతో పాటు ఓడలోకి వెళ్లాయి. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్లుగా ఆడ, మగ అనే జంటలుగ లోపలికి వెళ్లాయి.
GEN 7:10 ఏడు రోజుల తర్వాత వరద రారంభమయింది. భూమిమీద వర్షం కురవటం మొదలయింది.
GEN 7:11 రెండవ నెల 17వ రోజున భూమి క్రింద ఉన్న జల ఊటలన్నీ బ్రద్దలై, నేలనుండి నీరు ప్రవహించటం మొదలయింది. అదే రోజున భూమిమీద భారీ వర్షాలు కురవటం ప్రారంభం అయింది. ఆకాశానికి కిటికీలు తెర తీసినట్టుగా ఉంది. 40 పగళ్లు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిసింది. సరిగ్గా అదే రోజున నోవహు, అతని భార్య, అతని కుమారులు షేము, హాము, యాఫెతు వారి భార్యలు ఓడ ఎక్కారు. ఈ సమయంలో నోవహు 600 సంవత్సరాల వయస్సువాడు.
GEN 7:14 ఆ మనుష్యులు, భూమిమీదనున్న అన్ని రకాల జంతువులు ఆ ఓడలో ఉన్నారు. అన్ని రకాల పశువులు, నేలమీద ప్రాకు అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు ఆ ఓడలో ఉన్నాయి.
GEN 7:15 ఈ జంతువులన్నీ నోవహుతో కలిసి ఓడలోకి వెళ్లాయి. ప్రాణం ఉన్న ప్రతి రకం జంతువు రెండేసి చొప్పున వచ్చాయి.
GEN 7:16 సరిగ్గా దేవుడు ఆజ్ఞాపించినట్లే ఈ జంతువులన్నీ ఓడలో జతలు జతలుగా ప్రవేశించాయి. తరువాత యెహోవా ఓడ తలుపులు మూసివేసాడు.
GEN 7:17 40 రోజుల పాటు నీళ్లు భూమిమీద వరదలై పారాయి. నీటిమట్టం పెరుగుతూ ఓడను నేలమీదనుండి పైకి లేపడం మొదలయింది.
GEN 7:18 నీటిమట్టం పెరగటం కొనసాగుతునే ఉంది. ఓడ నేలకు చాలా ఎత్తుగా నీటిమీద తేలుతొంది.
GEN 7:19 నీటి మట్టం చాలా పైకి లేచినందువల్ల గొప్ప ఎత్తయిన పర్వతాలు అన్నీ నీళ్లలో మునిగిపోయాయి.
GEN 7:20 పర్వత శిఖరాలకు పైగా నీటిమట్టం లేస్తూనే ఉంది. అన్నింటికంటే ఎత్తయిన పర్వత శిఖరానికి ఇంకా 20 అడుగులు ఎత్తుగానే నీటిమట్టం ఉంది.
GEN 7:21 భూమిమీద బ్రతికి ఉన్న ప్రతి ప్రాణీ చనిపోయింది. ప్రతి పురుషుడు, స్త్రీ మరణించారు. పక్షులు, పశువులు, జంతువులు ఎగిరే ప్రతి ప్రాణి చంపివేయబడ్డాయి. బ్రతికి శ్వాసించే ప్రతి జీవి చనిపోయింది.
GEN 7:23 కనుక భూమిమీద ఉన్న సకల ప్రాణులను, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రాకు ప్రతి ప్రాణి, ప్రతి పక్షి అన్నింటినీ దేవుడు నాశనం చేసాడు. ఇవన్నీ భూమిమీద నుండి నాశనం చేయబడ్డాయి. ఓడలోవున్న నోవహు అతనితో ఉన్న మనుష్యులు, జంతువులు మాత్రమే బ్రతికి ఉన్న ప్రాణులు.
GEN 7:24 150 రోజుల పాటు నీళ్లు భూమిని కప్పేసాయి.
GEN 8:1 అయితే నోవహును దేవుడు మరచిపోలేదు. నోవహును, అతనితో కూడ ఓడలో ఉన్న జంతువులన్నింటిని, పశువులన్నింటిని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు. భూమిమీద గాలి వీచేటట్టు దేవుడు చేసాడు. నీళ్లన్నీ కనపడకుండా పోయాయి.
GEN 8:2 ఆకాశం నుండి వర్షం కురవటం ఆగిపోయింది. భూమి క్రింద నుండి నీళ్లు ఉబుకుట కూడ నిలిచిపోయింది.
GEN 8:3 నేలమీద నిండిన నీళ్లు బాగా ఇంకిపోవడం మొదలయింది. 150 రోజుల తర్వాత నీళ్లు బాగా తగ్గిపోయాయి, గనుక ఓడ మరల నేలమీద నిలిచింది. అరారాతు పర్వతాల్లో ఒకదాని మీద ఓడ నిలిచింది. ఇది ఏడవ నెల పదిహేడవ రోజు.
GEN 8:5 నీళ్లు ఇంకిపోతూనే ఉన్నాయి, పదవ నెల మొదటి రోజుకు కొండ శిఖరాలు నీళ్లకు పైగా కనబడ్డాయి.
GEN 8:6 నలభై రోజుల తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తెరిచాడు.
GEN 8:7 ఒక కాకిని నోవహు బయటకు పంపాడు. నీళ్లన్నీ ఇంకి పోయి, నేల ఆరిపోయేంత వరకు ఒక చోటునుండి మరో చోటుకు ఆ కాకి ఎగురుతూనే ఉంది.
GEN 8:8 ఒక పావురాన్ని కూడా నోవహు పంపించాడు. ఆరిన నేలను పావురం తెల్సుకోవాలను కొన్నాడు నోవహు. అతడు నేల ఇంకా నీళ్లతో నిండి ఉందేమో తెల్సుకోవాలను కొన్నాడు.
GEN 8:9 నేలమీద ఇంకా నీళ్లు నిండి ఉండటం చేత పావురం తిరిగి ఓడలోకి వచ్చేసింది. నోవహు చేయి బయటకు చాచి పావురాన్ని పట్టుకున్నాడు. ఆ పావురాన్ని నోవహు మళ్లీ ఓడలోకి తెచ్చాడు.
GEN 8:10 ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మళ్లీ బయటకి పంపించాడు.
GEN 8:11 ఆ మధ్యాహ్నం ఆ పావురం మళ్లీ నోవహు దగ్గరకు వచ్చేసింది. తాజా ఓలీవ ఆకు ఆ పావురం నోటవుంది. భూమిమీద ఆరిన నేల ఉన్నట్టుగా నోవహుకు అది ఒక గుర్తు.
GEN 8:12 ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మరల బయటకి పంపించాడు. అయితే ఈసారి పావురం మరల ఎన్నడూ తిరిగిరాలేదు.
GEN 8:13 ఆ తర్వాత నోవహు ఓడ తలుపులు తెరిచాడు. నేల ఆరిపోయినట్టుగా నోవహు చూశాడు. అది సంవత్సరములో మొదటి నెల మొదటి రోజు. అప్పుడు నోవహు వయస్సు 601 సంవత్సరాలు.
GEN 8:14 రెండవ నెల 27వ రోజుకు నేల పూర్తిగా ఆరిపోయింది.
GEN 8:15 అప్పుడు యెహోవా నోవహుతో అన్నాడు:
GEN 8:16 “ఓడ నేలకు దిగింది. నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్లు ఇప్పుడు బయటకు వెళ్లాలి.
GEN 8:17 జీవమున్న ప్రతి జంతువును, పక్షులన్నింటిని, భూమిమీద ప్రాకు ప్రాణులన్నిటిని నీతోబాటు బయటకు తీసుకొనిరా. ఆ జంతువులు సంతానాభివృద్ధి చెంది, అవి మరల భూమిని నింపుతాయి.”
GEN 8:18 తన కుమారులు, తన భార్య, తన కోడళ్లతో నోవహు బయటకు వెళ్లాడు.
GEN 8:19 జంతువులన్నీ ప్రాకు ప్రాణులన్నీ, ప్రతి పక్షి ఓడను విడచి వెళ్లాయి. జంతువులన్నీ వాటి జాతి ప్రకారం గుంపులుగా బయటకు వచ్చాయి.
GEN 8:20 అప్పుడు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నోవహు కట్టాడు. పవిత్రమైన పక్షులన్నింటిలో నుండి, పవిత్రమైన జంతువులన్నింటిలో నుండి కొన్నింటిని నోవహు తీసుకొని, దేవునికి కానుకగా బలిపీఠం మీద వాటిని దహించాడు.
GEN 8:21 యెహోవా ఈ బలుల సువాసనను ఆఘ్రాణించి ఆనందించాడు. యెహోవా తనలో తాను అనుకొన్నాడు, “మనుష్యుల్ని శిక్షించేందుకోసం ఒక పద్ధతిగా మరల ఎన్నడు నేను భూమిని శపించను. మనుష్యులు చిన్నప్పటి నుండే దుర్మార్గులు కనుక భూమిమీద జీవిస్తున్న వాటన్నింటిని మరల ఎన్నడును నాశనం చేయను. లేదు మరల నేను ఇలా చేయను.
GEN 8:22 భూమి ఉన్నంత కాలమూ, నాటుటకు, పంట కోయుటకు ఎల్లప్పుడూ ఒక సమయం ఉంటుంది. భూమిమీద ఎప్పటికీ, చల్లదనం, వేడి, వేసివికాలం, చలికాలం, పగలు, రాత్రిళ్లు ఉంటాయి.”
GEN 9:1 నోవహును, అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అతనితో చెప్పాడు: “అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపు.
GEN 9:2 భూమి మీదనున్న ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, నేలమీద ప్రాకు ప్రతి ప్రాణి, సముద్రంలోని ప్రతి చేప నీకు భయపడతాయి. వాటన్నిటిపైన నీవు పాలకునిగా ఉంటావు.”
GEN 9:3 “గతంలో నీవు తినేందుకు పచ్చ మొక్కల్ని ఇచ్చాను. ఇప్పుడు ప్రతి జంతువు నీకు ఆహారం అవుతుంది. భూమిపై నున్న సమస్తాన్ని నీకు ఇస్తున్నాను–అదంతా నీదే.
GEN 9:4 అయితే నీకు నేను ఒక ఆజ్ఞ యిస్తున్నాను. దానిలో ఇంకా ప్రాణము (రక్తం) ఉన్న మాంసాన్ని మీరు తినకూడదు.
GEN 9:5 అనగా ఏ మనిషినైనా ఒక జంతువు చంపితే దాని రక్తాన్ని అడుగుతాను, అలానే ఏ మనిషినైనా మరో మనిషి ప్రాణం తీస్తే, ఆ మనిషి రక్తాన్ని అడుగుతాను.
GEN 9:6 “దేవుడు అచ్చం తనలాగే మనుష్యులను చేసాడు. కనుక యింకొక మనిషిని చంపిన వాడు మరో మనిషి చేత చంపబడాలి.”
GEN 9:7 నోవహూ, “నీవు, నీ కుమారులు అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపుదురు గాక.”
GEN 9:8 తర్వాత నోవహుతో అతని కుమారుతో దేవుడు ఇలా అన్నాడు:
GEN 9:9 “నీతోను నీ తర్వాత నీ ప్రజలతోను ఇప్పుడు నేను నా వాగ్దానం చేస్తున్నాను.
GEN 9:10 నీతోబాటు ఓడలో నుండి బయటకు వచ్చిన పక్షులన్నింటితోను, పశువులన్నింటితోను, జంతువులన్నింటితోను, నేను వాగ్దానం చేస్తున్నాను. భూమి మీదనున్న ప్రతి ప్రాణితో నేను వాగ్దానం చేస్తున్నాను.
GEN 9:11 ఇదే నీకు నా వాగ్దానం. వరద నీటిచేత, భూమిమీద సకల ప్రాణులు నాశనం చేయబడ్డాయి. అయితే ఇక ఎన్నటికీ మరల అలా జరుగదు. భూమిమీద సకల ప్రాణులను ఒక వరద మాత్రం ఇక ఎన్నటికీ తిరిగి నాశనం చేయదు.”
GEN 9:12 తర్వాత నోవహు, అతని కుమారులతో యెహోవా యిలా అన్నాడు: “ఈ వాగ్దానం నేను మీకు యిచ్చినట్టు రుజువుగా నేను మీకు ఒకటి ఇస్తాను. మీతోను, భూమిమీద జీవించే ప్రతి ప్రాణితోను ఈ వాగ్దానం నేను చేసానని చెప్పేందుకు ఇది రుజువు. ఈ వాగ్దానం రాబోయే కాలములన్నిటిలో కొనసాగుతుంది. ఇదే ఆ రుజువు.
GEN 9:13 మేఘాల్లో నా రంగుల ధనస్సునుంచుచున్నాను. నాకు, భూమికి జరిగిన ఒడం బడికకు రుజువు ఆ రంగుల ధనస్సు.
GEN 9:14 భూమికి పైగా మేఘాలను నేను రప్పించినపుడు, మేఘాలలో రంగుల ధనస్సును మీరు చూస్తారు.
GEN 9:15 రంగుల ధనస్సును నేను చూపినప్పుడు నీతోను, భూమిమీదనున్న సకల ప్రాణులతోను జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ భూమిమీద సకల ప్రాణులను ఒక జలప్రళయం మాత్రం ఇంకెన్నడూ నాశనం చేయదు అని ఆ ఒప్పందం చెబుతోంది.
GEN 9:16 మేఘాల్లో ఆ రంగుల ధనస్సును నేను చూచినప్పుడు శాశ్వతంగా కొనసాగే ఆ ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నాకు, భూమిమీద సకల ప్రాణులకు మధ్య జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను.”
GEN 9:17 కనుక, “భూమిమీద సకల ప్రాణులతోని నేను చేసిన ఒడంబడికకు ఆ మేఘ ధనస్సు రుజువు” అని నోవహుతో యెహోవా చెప్పాడు. కనుక నోవహుతో ప్రభువు, “భూమిమీద సకల ప్రాణులతోను నేను చేసిన ఒడంబడికకు మేఘములోని ధనస్సు రుజువు” అని చెప్పాడు.
GEN 9:18 నోవహుతో కూడ అతని కుమారులు ఓడలో నుండి బయటకు వచ్చారు. వారి పేర్లు షేము, హాము, యాఫెతు. (హాము కనానుకు తండ్రి).
GEN 9:19 ఆ ముగ్గురు మగవాళ్లు నోవహు కుమారులు. మరియు భూమిమీద ప్రజలంతా ఆ ముగ్గురి కుమారుల నుండి వచ్చినవాళ్లే.
GEN 9:20 నోవహు వ్యయసాయదారుడయ్యాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు.
GEN 9:21 నోవహు ద్రాక్షారసం చేసి, దాన్ని తాగాడు. అతడు మత్తెక్కి తన గుడారంలో పండుకొన్నాడు. నోవహు బట్టలు ఏమీ వేసుకొనలేదు.
GEN 9:22 కనాను తండ్రి హాము, దిగంబరంగా ఉన్న తన తండ్రిని చూశాడు. గుడారం వెలుపలున్న తన సోదరులతో హాము ఈ విషయం చెప్పాడు.
GEN 9:23 అప్పుడు షేము, యాఫెతు కలసి ఒక అంగీని తెచ్చారు. వాళ్లు ఆ అంగీని తమ భుజాలమీద మోసి గుడారంలోకి తీసుకువెళ్లారు. వారు వెనక్కి గుడారంలోకి నడిచివెళ్లి బట్టలు లేకుండా ఉన్న తమ తండ్రి ఒంటిమీద బట్ట కప్పారు.
GEN 9:24 ఆ తర్వాత నోవహు మేల్కొన్నాడు. (ద్రాక్షారసంవల్ల అతడు నిద్రపోతూ ఉన్నాడు). అప్పుడు తన చిన్న కుమారుడు హాము తనకు చేసిన దాన్ని అతడు తెలుసుకొన్నాడు.
GEN 9:25 కనుక నోవహు అన్నాడు: “కనాను శపించబడును గాక! కనాను తన సోదరులకు బానిస అగును గాక!”
GEN 9:26 నోవహు ఇంకా ఇలా అన్నాడు: “షేము దేవుడగు యెహోవా స్తుతించబడును గాక! కనాను షేముకు బానిస అవును గాక.
GEN 9:27 యాఫెతుకు దేవుడు ఇంకా ఎక్కువ భూమిని ఇచ్చును గాక! షేము గుడారాలలో దేవుడు నివసించు గాక! కనాను వారికి బానిస అవును గాక!”
GEN 9:28 జలప్రళయం తర్వాత నోవహు 350 సంవత్సరాలు బతికాడు.
GEN 9:29 నోవహు మొత్తం 950 సంవత్సరాలు బతికాడు. తరువాత అతడు మరణించాడు.
GEN 10:1 నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు. ప్రళయం తర్వాత ఈ ముగ్గురు మగవాళ్లు ఇంకా అనేకమంది కుమారులకు తండ్రులయ్యారు. షేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఇది. యాఫెతు వంశస్థులు:
GEN 10:2 యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
GEN 10:3 గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా
GEN 10:4 యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
GEN 10:5 మధ్యధరా సముద్రానికి చుట్టు ప్రక్కల దేశాల్లో నివశించు ప్రజలంతా ఈ యాఫెతు కుమారుల సంతానమే. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత దేశం ఉంది. కుటుంబాలన్ని పెరిగి వేరు వేరు జాతుల వారయ్యారు. ప్రతి జాతివారికి వారి స్వంత భాష ఉంది.
GEN 10:6 హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను.
GEN 10:7 కూషు కుమారులు సెబా, హవీలా, సబ్తా. రాయమా కుమారులు షేబ, దదాను.
GEN 10:8 కూషుకు నిమ్రోదు అనే కుమారుడు కూడా ఉన్నాడు. భూమిమీద నిమ్రోదు చాలా శక్తిమంతుడయ్యాడు.
GEN 10:9 నిమ్రోదు యెహోవా యెదుట గొప్ప వేటగాడు. అందుకే మనుష్యులు కొందరిని నిమ్రోదుతో పోల్చి, “ఆ మనిషి నిమ్రోదు వలె యెహోవా యెదుట గొప్ప వేటగాడు” అంటారు.
GEN 10:10 షీనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదు అనే చోట్ల నిమ్రోదు రాజ్యం ఆరంభం అయింది.
GEN 10:11 నిమ్రోదు అష్షూరు కూడా వెళ్లాడు. అక్కడే నీనెవె రహోబో, తీరు, కాలహు,
GEN 10:12 రెసెను పట్టణాలను అతడు నిర్మించాడు. (నీనెవెకు, కాలహు మహా పట్టణానికి మధ్య రెసెను ఉంది.)
GEN 10:13 లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, సఫ్తుహీయులు.
GEN 10:14 సత్రుసీయులు, కఫ్తోరీయుల జనాంగములకు మిస్రాయము తండ్రి. (ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చిన వారే.)
GEN 10:15 సీదోను తండ్రి కనాను. కనాను జ్యేష్ఠ కుమారుడు సీదోను, హేతుకు కనాను తండ్రి.
GEN 10:16 యెబూసీయులు, అమోరీయులు, గీర్గాషీయులు.
GEN 10:17 హివ్వీయులు, అర్కీయులు, సినీయులు.
GEN 10:18 అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికి కనాను తండ్రి. కనాను వంశాలు ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు వ్యాప్తి చెందాయి.
GEN 10:19 ఉత్తరాన సీదోను నుండి దక్షీణాన గెరారు వరకు, పశ్చిమాన గాజా నుండి తూర్పున సొదొమ, గొమొర్రా, అద్మా. సెబోయిము నుండి లాషా వరకు కనాను ప్రజల భూభాగమే.
GEN 10:20 ఆ ప్రజలంతా హాము సంతానం. ఆ ప్రజలందరికీ వారికి స్వంత భాషలు, స్వంత దేశాలు ఉన్నాయు. వారు వేరు వేరు జాతులయ్యారు.
GEN 10:21 యాఫెతు అన్న షేము. షేము వంశస్థుల్లో ఒకడైన ఏబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి.
GEN 10:22 షేము కుమారులు, ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
GEN 10:23 అరాము కుమారులు ఊజు, హోలు, గెతెరుమాష.
GEN 10:24 అర్పక్షదు షేలహుకు తండ్రి. షేలహు ఏబెరుకు తండ్రి.
GEN 10:25 ఏబెరు ఇద్దరు కుమారులకు తండ్రి, ఒక కుమారునికి పెలెగు అని పేరు పెట్టబడింది. అతని జీవిత కాలములోనే భూమి విభజించబడింది. కనుక అతనికి ఈ పేరు పెట్టబడింది. మరో సోదరుడి పేరు యొక్తాను.
GEN 10:26 యొక్తాను కుమారులు అల్మదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
GEN 10:27 హదోరము, ఊజాలు, దిక్లాను
GEN 10:28 ఓబాలు, అబీమాయెలు, షేబ,
GEN 10:29 ఓఫీరు, హవీలా, యోబాబు. ఈ మనుష్యులంతా యొక్తాను కుమారులు.
GEN 10:30 మేషాకు దేశానికి, తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేషా ఉంది.
GEN 10:31 వాళ్లు షేము వంశంనుండి వచ్చిన ప్రజలు. వంశాలు, భాషలు, దేశాలు, జాతులను బట్టి వారి క్రమం ఏర్పాటు చేయబడింది.
GEN 10:32 నోవహు కుమారుల వంశాల జాబితా అది. అవి వారి జాతుల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్రళయం తర్వాత భూమి అంతటా వ్యాపించిన ప్రజలందరూ ఆ వంశాల నుండి వచ్చిన వారే.
GEN 11:1 జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష మాట్లాడారు. ప్రజలంతా ఒకే పదజాలం ఉపయోగించారు.
GEN 11:2 తూర్పు నుండి ప్రజలు కదిలిపోయారు. షీనారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొన్నారు. బతుకుదెరువు కోసం ప్రజలంతా అక్కడే ఉండిపోయారు.
GEN 11:3 “మనం ఇటుకలు చేసి, అవి గట్టిపడేందుకు వాటిని కాల్చాలి” అనికొన్నారు ప్రజలు. ఇళ్లు కట్టుటకు ప్రజలు రాళ్లు గాక ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసు గాక తారు ఉపయోగించారు.
GEN 11:4 అప్పుడు ప్రజలు ఇలా అన్నారు: “మన కోసం మనం ఒక పట్టణం కట్టుకోవాలి. ఆకాశం అంత ఎత్తుగా మనం ఒక గోపుర శిఖరం కట్టుకోవాలి. ఇలా గనుక చేస్తే మనం ప్రఖ్యాతి చెందుతాం ప్రపంచమంతటా మనం చెల్లా చెదురవకుండా ఒకే చోట మనమంతా కలసి ఉంటాం.”
GEN 11:5 ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యెహోవా చూశాడు.
GEN 11:6 యెహోవా ఇలా అన్నాడు: “ఈ ప్రజలంతా ఒకే భాష మాట్లాడుతున్నారు. వీళ్లంతా కలసి ఉమ్మడిగా ఈ పని చేస్తున్నట్టు నాకు కనబడుతోంది. వారు చేయగలగిన దానికి ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో వాళ్లు యోచించినదేదైనా చేయ గలుగుతారు.
GEN 11:7 అందుచేత మనం కిందికి వెళ్లి వారి భాషను గలిబిలి చేద్దాం. అప్పుడు వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు.”
GEN 11:8 ఆ ప్రజలు భూలోకం అంతటా చెదిరిపోయేటట్టు యెహోవా చేసాడు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం ఆ ప్రజలు ముగించలేకపోయారు.
GEN 11:9 మొత్తం ప్రపంచంలోని భాషను దేవుడు గలిబిలి చేసిన చోటు అదే. కనుక ఆ స్థలం బాబెలు అని పిలువబడింది. కనుక ఆ స్థలం నుండి భూమిమీద ఇతర చోట్లన్నింటికీ ఆ ప్రజలను యెహోవా చెదరగొట్టాడు.
GEN 11:10 షేము కుటుంబ చరిత్ర ఇది. జలప్రళయం తర్వాత రెండు సంవత్సరాలకు, షేము 100 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుమారుడు అర్పక్షదు పుట్టాడు.
GEN 11:11 ఆ తర్వాత షేము 700 సంవత్సరాలు జీవించాడు. అతనికి ఇంకా కుమారులు కమార్తెలు, ఉన్నారు.
GEN 11:12 అర్పక్షదు 35 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుమారుడు షేలహు పుట్టాడు.
GEN 11:13 షేలహు పుట్టిన తర్వాత అర్పక్షదు 403 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు కుమార్తెలు పుట్టారు.
GEN 11:14 షేలహుకు 30 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు ఏబెరు పుట్టాడు.
GEN 11:15 ఏబెరు పుట్టిన తర్వాత షేలహు 403 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు, కుమారలు కుమార్తెలు పుట్టారు.
GEN 11:16 ఏబెరుకు 34 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు పెలెగు పుట్టాడు.
GEN 11:17 పెలెగు పుట్టిన తర్వాత ఏబెరు 430 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు.
GEN 11:18 పెలెగుకు 30 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు రయూ పుట్టాడు.
GEN 11:19 రయూ పుట్టిన తర్వాత, పెలెగు ఇంకా 209 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 11:20 రయూకు 32 సంవత్సరాలు నిండినప్పుడు, అతని కుమారుడు సెరూగు పుట్టాడు.
GEN 11:21 సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బతికాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమార్తెలు, కుమారులు పుట్టారు.
GEN 11:22 సెరూగుకు 30 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు నాహోరు పుట్టాడు.
GEN 11:23 నాహోరు పుట్టిన తర్వాత, సేరూగు 200 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 11:24 నాహోరుకు 29 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు తెరహు పుట్టాడు.
GEN 11:25 తెరహు పుట్టిన తర్వాత నాహోరు 119 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
GEN 11:26 తెరహుకు 70 సంవత్సరాలు నిండినప్పుడు, అతని కుమారులు అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు.
GEN 11:27 తెరహు కుటుంబ చరిత్ర ఇది. అబ్రాము, నాహోరు, హారానులకు తండ్రి తెరహు. లోతుకు హారాను తండ్రి.
GEN 11:28 కల్దీయుల ఊర్ అనే తన స్వగ్రామంలో హారాను మరణించాడు. తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే హారాను చనిపోయాడు.
GEN 11:29 అబ్రాము, నాహోరు పెళ్లి చేసుకొన్నారు. అబ్రాము భార్యకు శారయి అని పేరు పెట్టబడింది. నాహోరు భార్యకు మిల్కా అని పేరు పెట్టబడింది. మిల్కా హారాను కుమార్తె. మిల్కా ఇస్కాలకు హారాను తండ్రి.
GEN 11:30 శారయి పిల్లలను కనే అవకాశం లేనందువల్ల ఆమెకు పిల్లలు లేరు.
GEN 11:31 తెరహు తన కుటుంబముతోబాటు కల్దీయుల ఊర్ అను పట్టణమును విడచిపెట్టేసాడు. కనానుకు ప్రయాణం చేయాలని వారు ఏర్పాటు చేసుకొన్నారు. తన కుమారుడు అబ్రామును, మనమడు లోతును (హారాను కుమారుడు), కోడలు శారయిని తెరహు తన వెంట తీసుకు వెళ్లాడు. వారు హారాను పట్టణం వరకు ప్రయాణం చేసి, అక్కడ ఉండిపోవాలని నిర్ణయించుకొన్నారు.
GEN 11:32 తెరహు 205 సంవత్సరాలు జీవించాడు. తర్వాత అతడు హారానులో మరణించాడు.
GEN 12:1 అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు, “నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు. నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి, నేను నీకు చూపించు దేశానికి వెళ్లు.
GEN 12:2 నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఒక గొప్ప జాతిగా నేను చేస్తాను నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను. ఇతరులను ఆశీర్వదించటానికి ప్రజలు నీ పేరు ఉపయోగిస్తారు.
GEN 12:3 నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను శపించే వాళ్లను నేను శపిస్తాను. భూమి మీదనున్న మనుష్యులందరిని ఆశీర్వదించడానికి నేను నిన్ను ఉపయోగిస్తాను.”
GEN 12:4 కనుక అబ్రాము యెహోవాకు విధేయుడై కనాను వెళ్లాడు. అతడు హారానును విడిచిపెట్టాడు, లోతు అతనితో కూడ వెళ్లాడు. ఈ సమయంలో అబ్రాము వయస్సు 75 సంవత్సరాలు.
GEN 12:5 అబ్రాము హారానును విడిచిపెట్టినప్పుడు అతడు ఒంటరి వాడు కాడు. తన భార్య శారయిని, తమ్ముని కుమారుడు లోతును, హారానులో వారికి కలిగిన సమస్తాన్ని అబ్రాము తనతో తీసుకు వెళ్లాడు. హారానులో అబ్రాము సంపాదించిన బానిసలు అంతా వారితో వెళ్లారు. అబ్రాము అతని వర్గంవారు హారాను విడిచి, కనాను దేశానికి ప్రయాణం చేసారు.
GEN 12:6 అబ్రాము కనాను దేశం గుండా సంచారం చేసాడు. అబ్రాము షెకము పట్టణానికి పయనించి మోరేలో వున్న మహా వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ కాలంలో కనానీ ప్రజలు ఈ దేశంలో నివసించారు.
GEN 12:7 అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యి, “ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను” అన్నాడు. ఆ స్థలంలో అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ స్థలంలో యెహోవాను ఆరాధించటానికి అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు.
GEN 12:8 తర్వాత అబ్రాము ఆ స్థలం విడిచిపెట్టి బేతేలుకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ అబ్రాము తన గుడారం వేసుకొన్నాడు. పడమటకి బేతేలు పట్టణం ఉంది. తూర్పున హాయి పట్టణం ఉంది. ఆ స్థలంలో యెహోవా కోసం మరో బలిపీఠాన్ని అబ్రాము నిర్మించాడు. అక్కడ అబ్రాము యెహోవాను ఆరాధించాడు.
GEN 12:9 ఆ తర్వాత అబ్రాము మరల ప్రయాణం మొదలు పెట్టాడు. నెగెబు దిశగా అతడు ప్రయాణం చేసాడు.
GEN 12:10 ఆ కాలంలో భూమి చాలా ఎండిపోయింది. వర్షం లేదు కనుక ఏ పంటా పెరగటం లేదు. కనుక అబ్రాము నివసించటానికి ఈజిప్టుకు వెళ్లాడు.
GEN 12:11 తన భార్య శారయి చాలా అందంగా ఉండటం అబ్రాము గమనించాడు. కనుక వారు ఈజిప్టు చేరకముందే అబ్రాము శారయితో ఇలా చెప్పాడు: “నీవు చాలా అందమైన స్త్రీవని నాకు తెలుసు.
GEN 12:12 ఈజిప్టీయులు నిన్ను చూస్తారు. ఈ స్త్రీ అతని భార్య అని వాళ్లు అంటారు. తర్వాత వాళ్లు నిన్ను అశించి నన్ను చంపేస్తారు.
GEN 12:13 కనుక నీవు నా సోదరివి అని ప్రజలతో చెప్పు. అప్పుడు వాళ్లు నన్ను చంపరు. నేను నీ సోదరుణ్ణి అని అనుకొంటారు గనుక వాళ్లు నామీద దయ చూపిస్తారు. ఈ విధంగా నీవు నా ప్రాణం కాపాడుతావు.”
GEN 12:14 కనుక అబ్రాము తన భార్యతో ఈజిప్టు దేశంలో ప్రవేశించారు. శారయి చాలా అందగత్తె అని ఈజిప్టు ప్రజలు చూశారు.
GEN 12:15 ఈజిప్టు నాయకులు కూడ కొందరు ఆమెను చూశారు. ఆమె చాలా అందగత్తె అని ఫరోతో వాళ్లు చెప్పారు. ఆ నాయకులు శారయిని ఫరో యింటికి తీసుకెళ్లారు.
GEN 12:16 శారయికి అబ్రాము సోదరుడు అనుకొని ఫరో అబ్రాము మీద దయ చూపించాడు. గొర్రెలు, పశువులు, గాడిదలను ఫరో అబ్రాముకు ఇచ్చాడు. సేవకులు, సేవకురాండ్రు, ఒంటెలను కూడా అబ్రాముకు ఇచ్చాడు.
GEN 12:17 అబ్రాము భార్యను ఫరో తీసుకొన్నాడు. కనుక ఫరోకు అతని ఇంటిలోని మనుష్యులందరికి చాలా తీవ్రమైన రోగాలు వచ్చేటట్టు యెహోవా చేసాడు.
GEN 12:18 అందుచేత ఫరో అబ్రామును పిలిచాడు. ఫరో ఇలా అన్నాడు, “నీవు నాకు చాలా అపకారం చేశావు. శారయి నీ భార్య అని నాతో ఎందుకు నీవు చెప్పలేదు?
GEN 12:19 ఈమె నీ సోదరి అని చెప్పావు. నీవు ఎందుకలా చెప్పావు? అమె నా భార్యగా ఉండాలని అమెను నేను తీసుకొన్నాను. అయితే ఇప్పుడు నీ భార్యను మరల నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఆమెను తీసుకొని వెళ్లిపో!”
GEN 12:20 తర్వాత అబ్రామును ఈజిప్టు నుండి పంపించి వేయుమని ఫరో తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. కనుక అబ్రాము, అతని భార్య ఆ స్థలం విడచి వెళ్లీపోయారు. వాళ్లకు ఉన్న సమస్తాన్ని తీసుకొని వెళ్లిపోయారు.
GEN 13:1 కనుక అబ్రాము ఈజిప్టు విడచిపెట్టాడు. తన భార్యను, స్వంతంగా తనకు ఉన్నదంతా తీసుకొని, నెగెబుగుండా అబ్రాము ప్రయాణం చేసాడు. లోతు కూడా వాళ్లతో ఉన్నాడు.
GEN 13:2 ఈ సమయానికి అబ్రాము చాలా ఐశ్వర్యవంతుడు. అతనికి చాలా విస్తారంగా పశువులు ఉన్నాయి. చాలా వెండి, బంగారం ఉన్నాయి.
GEN 13:3 అబ్రాము చుట్టుప్రక్కల సంచరిస్తూనే ఉన్నాడు. నెగెబు విడచిపెట్టి మళ్లీ బేతేలు వెనుకకు వెళ్లాడు. బేతేలు పట్టణానికి, హాయి పట్టణానికి మధ్యనున్న చోటుకు అతడు వెళ్లాడు. ఇంతకు ముందు అబ్రాము నివసించిన స్థలమే ఇది.
GEN 13:4 అబ్రాము ఒక బలిపీఠాన్ని నిర్మించిన స్థలమిది. కనుక ఈ స్థలంలో అబ్రాము యెహోవాను ఆరాధించాడు.
GEN 13:5 ఈ సమయంలో అబ్రాముతో లోతు గూడా ప్రయాణం చేస్తున్నాడు. లోతుకు గొర్రెలు, పశువులు, గుడారాలు చాలా ఉన్నాయి.
GEN 13:6 అబ్రాముకు, లోతుకు పశువులు విస్తారంగా ఉన్నందువల్ల వాళ్లిద్దరికి ఈ భూమి సరిపోలేదు.
GEN 13:7 అబ్రాము గొర్రెల కాపరులు లోతు గొర్రెల కాపరులు వాదించుకోవడం మొదలు పెట్టారు. అదే సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఈ దేశంలో నివసిస్తున్నారు.
GEN 13:8 కనుక లోతుతో అబ్రాము ఇలా అన్నాడు: “నీకు, నాకు మధ్య వాదం ఏమీ ఉండకూడదు. నీ మనుష్యులు నా మనుష్యులు వాదించుకోగూడదు. మనమంతా సోదరులం.
GEN 13:9 మనం వేరైపోవాలి. నీకు ఇష్టం వచ్చిన స్థలం ఏదైనా నీవు కోరుకో నీవు ఎడమకు వెళ్తే నేను కుడికి వెళ్తాను. నీవు కుడికి వెళ్తే, నేను ఎడమకు వెళ్తాను.”
GEN 13:10 లోతు పరిశీలించి యోర్దాను లోయను చూశాడు. అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నట్టు లోతు చూశాడు. (ఇది సొదొమ గొమొర్రాలను యెహోవా నాశనము చేయకముందు ఆ కాలంలో సోయరు వరకు యోర్దాను లోయ యెహోవా తోటలా ఉంది, ఈజిప్టు భూమిలా ఇది కూడ మంచి భూమి.)
GEN 13:11 అందుచేత యోర్దాను లోయలో జీవించాలని లోతు నిర్ణయించుకొన్నాడు. ఆ ఇద్దరు మనుష్యులు వేరైపోయారు, లోతు తూర్పు దిక్కుగా ప్రయాణం మొదలు పెట్టాడు.
GEN 13:12 అబ్రాము కనాను దేశంలోనే ఉండిపోయాడు, లోతు లోయలోని పట్టణాల్లో నివసించాడు. బాగా దక్షిణాదిన ఉన్న సొదొమకు తరలిపోయి అక్కడ లోతు నివాసం ఏర్పర్చుకొన్నాడు.
GEN 13:13 సొదొమ ప్రజలు చాలా దుర్మార్గులు. వాళ్లు ఎప్పుడూ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.
GEN 13:14 లోతు వెళ్లపోయిన తర్వాత అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు: “నీ చుట్టు చూడు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర చూడు.
GEN 13:15 నీవు చూస్తోన్న ఈ దేశం అంతా నీకు, నీ వారుసులకు నేను ఇస్తాను. ఇది శాశ్వతంగా నీ దేశం అవుతుంది.
GEN 13:16 భూమిమీద ధూళి కణాలు ఎంత విస్తారమో, నీ వారసులను గూడ అంత విస్తరింప జేస్తాను. నేలమీద ధూళి కణాలను ఎవరైనా లెక్కించగలిగితే అది నీ ప్రజల సంఖ్య అవుతుంది.
GEN 13:17 కనుక వెళ్లు నీ దేశంలో సంచరించు. దానిని ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను.”
GEN 13:18 కనుక అబ్రాము తన గుడారాలను తరలించాడు, మమ్రే సమీపంలోని మహా వృక్షాల దగ్గర నివసించాలని అతడు వెళ్లాడు. ఇది హెబ్రోను పట్టణానికి దగ్గరగా ఉంది. యెహోవాను ఆరాధించటానికి ఈ స్థలంలో ఒక బలిపీఠాన్ని అబ్రాము కట్టించాడు.
GEN 14:1 షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాం రాజైన కదొర్లాయోమెరు, మరియు గోయియుల రాజైన తిదాలు.
GEN 14:2 ఈ రాజులంతా కలసి సొదొమ రాజు బెరాతోను, గొమొర్రా రాజు బిర్షా, అద్మా రాజు షినాబు, సెబోయీయుల రాజు షెమేబెరు, బెల రాజు (సోయరు అని కూడ బెల పిలవబడింది) లతో యుద్ధము చేసారు.
GEN 14:3 ఈ రాజులంతా సిద్దీము లోయలో వారి సైన్యాలతో కలుసుకున్నారు. (సిద్దీమ లోయ యిప్పుడు ఉప్పు సముద్రం)
GEN 14:4 ఈ రాజులు పన్నెండు సంవత్సరాల పాటు కదొర్లాయోమెరుకు సేవ చేసారు. అయితే 13వ సంవత్సరంలో వారంతా అతని మీద తిరుగుబాటు చేసారు.
GEN 14:5 కనుక 14వ సంవత్సరంలో కదొర్లాయోమెరు రాజు, అతనితో ఉన్న రాజులు వీరిమీద యుద్ధం చేయటానికి వచ్చారు. కదొర్లొయోమెరు, అతనితో ఉన్న రాజులు అష్తారోతు కర్నాయిములో రఫాయి ప్రజలను ఓడించారు. హాములో జూజీయులను కూడా వారు ఓడించారు. షావే కిర్యతాయిములో ఏమీయులను వారు ఓడించారు.
GEN 14:6 శేయీరు కొండ ప్రదేశం నుండి ఏల్పారాను వరకు హోరీయులను వారు ఓడించారు. (ఏల్పారాను ఎడారి దగ్గరగా ఉంది.)
GEN 14:7 తర్వాత కదొర్లాయోమెరు రాజు ఉత్తర దిశగా తిరిగి ఏన్మిష్పతు (అంటే కాదేషు) వెళ్లి, అమాలేకీ ప్రజలందర్నీ ఓడించాడు. అమోరీ ప్రజలను కూడా అతడు ఓడించాడు. హససోన్ తమారులో ఈ ప్రజలు నివసిస్తారు.
GEN 14:8 ఆ సమయంలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బెల రాజు (బెల అంటె సోయరు) కలసి వారి శత్రువుల మీద సిద్దీము లోయలో యుద్ధం చేయటానికి వెళ్లారు.
GEN 14:9 ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు మీద వారు యుద్ధము చేసారు. అందుచేత ఈ నలుగురు రాజులు ఆ అయిదుగురితో యుద్ధం చేసారు.
GEN 14:10 సిద్దీం లోయలో తారుతో నింపబడ్డ గుంటలు చాలా ఉన్నాయి. సొదొమ, గొమొర్రాల రాజులు వారి సైన్యాలు పారిపోయారు. చాలా మంది సైనికులు ఆ గుంటల్లో పడిపోయారు. అయితే మిగిలివాళ్లు కొండల్లోకి పారిపోయారు.
GEN 14:11 కనుక సొదొమ, గొమొర్రా ప్రజల ఆస్తినంతా వారి శత్రువులు తీసుకుపోయారు. వారి బట్టలు, భోజనం అంతా తీసుకొని వారు వెళ్లిపోయారు.
GEN 14:12 అబ్రాము సోదరుని కుమారుడు లోతు సొదొమలో నివసిస్తుండగా శత్రువు అతణ్ణి బంధించాడు. అతని ఆస్తి మొత్తం తీసుకొని శత్రువు వెళ్లిపోయాడు.
GEN 14:13 పట్టుబడని లోతుయొక్క మనుష్యులలో ఒకడు అబ్రాము దగ్గరకు వెళ్లి జరిగినదాన్ని చెప్పాడు. అమ్మోరీవాడగు మమ్రే చెట్లదగ్గర అబ్రాము నివాసం చేస్తున్నాడు. మమ్రే, ఎష్కోలు, అనేరు ఒకరికి ఒకరు సహాయ ఒడం బడిక చేసుకొన్నారు. అబ్రాహాముకు సహాయం చేసేందుకు గూడ వారు ఒక ఒడంబడిక చేసుకొన్నారు.
GEN 14:14 లోతు బంధించబడ్డాడని అబ్రాముకు తెలిసింది. కనుక అబ్రాము తన కుటుంబం అతంటిని సమావేశ పర్చాడు. వారిలో 318 మంది శిక్షణ పొందిన సైనికులు ఉన్నారు. అబ్రాము తన మనుష్యులకు నాయకత్వం వహించి, దాను పట్టణం వరకు శత్రువును పూర్తిగా తరిమివేసాడు.
GEN 14:15 ఆ రాత్రి అతడు, అతని మనుష్యులు శత్రువు మీద అకస్మాత్తుగా దాడి జరిపారు. వారు శత్రువును ఓడించి దమస్కుకు ఉత్తరాన హూబ వరకు వారిని తరిమివేసారు.
GEN 14:16 అప్పుడు అబ్రాము శత్రువు దొంగిలించిన వస్తువులన్నింటిని మరల వెనుకకు తీసుకొని వచ్చాడు. స్త్రీలను, సేవకులను, లోతును, అతని ఆస్తి అంతటిని అబ్రాము వెనుకకు తీసుకొని వచ్చాడు.
GEN 14:17 కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించిన తర్వాత అబ్రాము తన యింటికి తిరిగి వెళ్లాడు. అతడు యింటికి వచ్చుచున్నప్పుడు షావే లోయలో అతణ్ణి కలుసుకొనేందుకు సొదొమ రాజు వెళ్లాడు. (ఇప్పుడు దీనిని రాజు లోయ అంటారు.)
GEN 14:18 షాలెము రాజు మెల్కీసెదెకు కూడా అబ్రామును కలుసుకొనేందుకు వెళ్లాడు. సర్వోన్నతుడైన దేవునికి మెల్కీసెదెకు యాజకుడు. రొట్టెను ద్రాక్షారసాన్ని మెల్కీసెదెకు తెచ్చాడు.
GEN 14:19 మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించి ఇలా అన్నాడు: “అబ్రామా, మహోన్నతుడైన దేవుడు నీకు దీవెనలు ప్రసాదించుగాక, దేవుడు భూమ్యాకాశాలను చేసినవాడు.
GEN 14:20 సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం నీ శత్రవుల్ని ఓడించటానికి ఆయనే నీకు సహాయం చేసాడు.” యుద్ధ సమయంలో అబ్రాము తెచ్చుకొన్న దానంతటిలో నుండి పదోవంతు మెల్కీసెదెకునకు అతడు ఇచ్చాడు.
GEN 14:21 అప్పుడు సొదొమ రాజు, “వీటన్నింటిని నీ కోసమే ఉంచుకో. శత్రువుచేత బాధించబడి తీసుకొనిపోబడ్డ నా మనుష్యులను మాత్రం నాకు ఇచ్చేయి” అని అబ్రాముతో చెప్పాడు.
GEN 14:22 అయితే సొదొమ రాజుతో అబ్రాము ఇలా చెప్పాడు: “భూమిని ఆకాశాన్ని చేసిన మహోన్నతుడైన యెహోవా దేవుని పేర నేను వాగ్దానం చేస్తున్నాను.
GEN 14:23 నీకు చెందినది ఏదీ నేను ఉంచుకోను. ఒక నూలుపోగైనా లేక జోళ్ల దారాలయినా, ఏదీ ఉంచుకోనని నేను వాగ్దానం చేస్తున్నాను. ‘అబ్రామును నేనే ధనికునిగా చేసానని నీవు చెప్పడం నాకిష్టం లేదు.’
GEN 14:24 నా యువకులు భుజించిన ఆహారం ఒక్కటి మాత్రము నేను స్వీకరిస్తాను. అయితే మిగిలిన వారికి వారి వంతు నీవు ఇవ్వాలి. యుద్ధములో మేము గెలుచుకొన్న వాటిని తీసుకొని, ఆనేరు, ఎష్కోలు, మమ్రేలకు రావలసిన భాగాలు వారికి ఇవ్వు. వీళ్లు నాకు యుద్ధంలో సహాయపడ్డారు.”
GEN 15:1 ఈ సంగతులన్నీ జరిగాక, ఒక దర్శనంలో అబ్రాముకు యెహోవా వాక్కు వచ్చి “అబ్రామూ భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. నేను నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాను” అన్నాడు దేవుడు.
GEN 15:2 అయితే అబ్రాము అన్నాడు; “యెహోవో దేవా, నన్ను సంతోష పెట్టగలిగేందుకు నీవు ఇవ్వగలిగింది ఏదీ లేదు. ఎందుచేతనంటే నాకు కుమారుడు లేడు. కనుక నేను చనిపోయిన తర్వాత, నా సేవకుడును దమస్కువాడైన ఎలీయెజెరు నా ఆస్తి అంతటికి కర్త అవుతాడు.”
GEN 15:3 అబ్రాము: “చూడు దేవా, నాకు నీవు కుమారుణ్ణి ఇవ్వలేదు. కనుక నా ఇంటిలో పుట్టిన సేవకుడు నాకు గల ఆస్తి అంతా దక్కించుకొంటాడు,”
GEN 15:4 అప్పుడు అబ్రాముతో యెహోవా మాట్లాడాడు: “నీకు ఉన్నవాటన్నింటిని పొందేవాడు నీ సేవకుడు కాదు. నీకు ఒక కుమారుడు కలుగుతాడు. నీకుగల వాటన్నింటిని నీ కుమారుడు పొందుతాడు.”
GEN 15:5 అంతట దేవుడు అబ్రామును గుడారము బయటకు తీసుకొని వెళ్లి, ఇలా చెప్పాడు: “ఆకాశం చూడు, అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడు. అవి చాలా ఉన్నాయి. నీవు లెక్కపెట్టలేవు. భవిష్యత్తులో నీ కుటుంబం అలాగే ఉంటుంది.”
GEN 15:6 అబ్రాము దేవుణ్ణి నమ్మాడు, అబ్రాముయొక్క విశ్వాసాన్ని దేవుడు నీతిగా అంగీకరించాడు
GEN 15:7 అబ్రాముతో దేవుడు ఇలా అన్నాడు, “కల్దీయుల ఊరు అను పట్టణము నుండి నిన్ను బయటకు నడిపించిన యెహోవాను నేనే. ఈ దేశాన్ని నీకు ఇచ్చేందుకు నేను అలా చేసాను. ఈ దేశం నీ స్వంతం అవుతుంది.”
GEN 15:8 అయితే అబ్రాము, “యెహోవా, నా ప్రభువా ఈ దేశం నాదే అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు.
GEN 15:9 అబ్రాముతో దేవుడు అన్నాడు: “మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. మూడు సంవత్సరాల ఆవు ఒకటి, మూడు సంవత్సరాల మేక ఒకటి, మూడు సంవత్సరాల పొట్టేలు ఒకటి తీసుకురా. ఇంకా నా కోసం ఒక పావురాన్ని, ఒక చిన్న పావురాన్ని తీసుకురా.”
GEN 15:10 దేవుని కోసం వీటన్నిటిని అబ్రాము తెచ్చాడు. ఆ జంతువులన్నింటిని చంపి ఒక్కోదాన్ని రెండేసి ముక్కలు చేసాడు, తర్వాత అబ్రాము ఈ భాగాలను ఒకదానికొకటి ఎదురెదురుగా వేసాడు. పక్షులను రెండు భాగాలుగా అబ్రాము ఖండించలేదు.
GEN 15:11 తర్వాత ఈ జంతువులను తినటానికి పెద్ద పక్షులు వచ్చి వాలాయి. కాని అబ్రాము వాటిని వెళ్లగొట్టేసాడు.
GEN 15:12 తర్వాత ఆ రోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అబ్రాముకు బాగా నిద్ర వచ్చి నిద్రపోయాడు. అతడు నిద్రపోతూ ఉండగా భయంకర గాఢ చీకటి కమ్మింది.
GEN 15:13 అప్పుడు అబ్రాముతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ సంగతులు నీవు తెలుసుకోవాలి, నీ సంతానము విదేశీయులై వారి స్వంతం కాని దేశంలో అపరిచితులుగా ఉంటారు. వారు అక్కడ బానిసలుగా ఉంటారు. ఇంకా, 400 సంవత్సరాలు కఠినంగా వాళ్లు శ్రమ పెట్టబడతారు.
GEN 15:14 అయితే వాళ్లకు యజమానిగా ఉన్న దేశాన్ని, 400 సంవత్సారాల తరువాత నేను శిక్షిస్తాను. మరి నీ ప్రజలేమో ఆ దేశాన్ని విడిచి పెట్టేస్తారు. నీ ప్రజలు వెళ్లిపోయేటప్పుడు విస్తారమైన ఆస్తులను వారితో తీసుకొనిపోతారు.
GEN 15:15 “నీ మట్టుకు నీవు చాలా వృద్ధాప్యం వరకు జీవిస్తావు, మనశ్శాంతితో నీవు మరణిస్తావు. నీ వంశం వారితో నీవు పాతి పెట్టబడతావు.
GEN 15:16 నాలుగు తరాల తర్వాత నీ ప్రజలు మరల ఈ దేశం వస్తారు. ఆ సమయంలో అమోరీ ప్రజలను నీ ప్రజలు ఓడిస్తారు. అక్కడ నివసిస్తోన్న అమోరీ ప్రజలను శిక్షించుటానికి నీ ప్రజలను నేను వాడుకొంటాను. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. ఎందుచేతనంటే, శిక్షకు తగినంత చెడుతనం ఇప్పుడు అమోరీ ప్రజల్లో లేదు.”
GEN 15:17 సూర్యుడు అస్తమించాక, చాలా చీకటి పడింది, చచ్చిన జంతువులు రెండేసి ముక్కలుగా ఖండించబడి ఇంకా అక్కడే నేలమీద పడి ఉన్నాయి. ఆ సమయంలో పొగమంటల వరుస చచ్చిన జంతువుల రెండేసి ముక్కల మధ్యగా సాగిపోయింది. దేవుడు అబ్రాముతో చేసుకొన్న ఒప్పందానికి ఇది ఒక “ముద్ర” లేక “సంతకం.” ఆ రోజుల్లో, కోయబడ్డ జంతువుల ముక్కల మధ్య నడవడం అనే ఒడంబడిక ఆ మనిషి యొక్క నిజాయితీని తెలుపుతుంది. “నేను ఈ ఒడంబడికను అనుసరించకపోతే ఇదే నాకు జరుగనీ” అన్నది దీని అర్థం.
GEN 15:18 కనుక ఆనాడు, ఒక వాగ్దానాన్ని, ఒక ఒడంబడికను అబ్రాముతో యెహోవా చేసాడు. యెహోవా అన్నాడు: “ఈ దేశాన్ని నీ సంతానమునకు నేను ఇస్తాను. ఈజిప్టు నదికి, యూఫ్రటీసు నదికి మధ్య ఉన్న దేశాన్ని నేను వారికి ఇస్తాను.
GEN 15:19 కెనీయులు, కెనిజ్జీయులు, కద్మానీయులు,
GEN 15:20 హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీమీయులు,
GEN 15:21 అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యోబూషీయుల దేశమిది.”
GEN 16:1 అబ్రాము భార్య శారయి. ఆమెకు, అబ్రాముకు పిల్లలు లేరు. శారయికి ఈజిప్టుకు చెందిన పని పిల్ల ఉంది. ఆమె పేరు హాగరు.
GEN 16:2 శారయి అబ్రాముతో యిలా చెప్పింది: “చూడండి నాకు పిల్లలు పుట్టకుండా చేసాడు యెహోవా. కనుక మీరు నా పని మనిషితో పొండి. ఆమె ద్వారా పుట్టే శిశువును నా స్వంత శిశువుగా నేను స్వీకరిస్తాను.” తన భార్య శారయి మాట అబ్రాము విన్నాడు.
GEN 16:3 కనాను దేశంలో అబ్రాము పది సంవత్సరాలు జీవించిన తర్వాత ఇది జరిగింది. హాగరును తన భర్త అబ్రాముకు శారయి యిచ్చింది. (హాగరు ఈజిప్టు నుండి వచ్చిన దాసి)
GEN 16:4 అబ్రాము వల్ల హాగరు గర్భవతి అయింది. హాగరు ఇది గమనించినప్పుడు. ఆమె చాలా గర్వపడి, తన యజమానురాలైన శారయికంటే తాను గొప్పదాన్ని అని తలంచడం మొదలు పెట్టింది.
GEN 16:5 అయితే శారయి అబ్రాముతో, “నా పనిమనిషి ఇప్పుడు నన్నే అసహ్యించుకొంటుంది. దీనికి నేను నిన్నే నిందిస్తాను. ఆమెను నేను నీకు ఇచ్చాను. ఆమె గర్భవతి అయింది. అయితే ఆమె నాకంటే గొప్పదని భావిస్తుంది. మనలో ఎవరు సరియైనవాళ్లో యెహోవాయే నిర్ణయించాలని నేను కోరుతున్నాను” అని అనింది.
GEN 16:6 కాని అబ్రాము, “హాగరుకు నీవు యజమానురాలివి, నీ యిష్టం వచ్చినట్టు నీవు ఆమెకు చేయవచ్చు” అన్నాడు శారయితో. అందుచేత శారయి తన పనిమనిషిని చాలా చులకనగా చూసింది. ఆ పనిమనిషి పారిపోయింది.
GEN 16:7 ఎడారిలో నీటి ఊట దగ్గర యెహోవా దూతకు ఆ పనిమనిషికి కనబడింది. షూరు మార్గంలో ఆ ఊట ఉంది.
GEN 16:8 “హాగరూ, నీవు శారయి పని మనిషివి గదూ! ఇక్కడెందుకు ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆ దూత అడుగగా, “నా యజమానురాలు శారయి నుండి పారిపోతున్నాను” అని చెప్పింది హాగరు.
GEN 16:9 “నీ యజమానురాలి దగ్గరకు నీవు తిరిగి వెళ్లు, ఆమెకు లోబడి నడుచుకో” అని యెహోవా దూత ఆమెతో చెప్పడం జరిగింది.
GEN 16:10 “నీలో నుండి అనేక జనములు వస్తారు. వారు చాలామంది ఉంటారు గనుక వాళ్లను లెక్కపెట్టడం కూడ కుదరదు” అని కూడ యెహోవా దూత చెప్పడం జరిగింది.
GEN 16:11 ఇంకా యెహోవా దూత, “ఇప్పుడు నీవు గర్భవతివి, మరి నీకు ఒక కుమారుడు పుడ్తాడు. అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఎందుచేతనంటే నీ కష్టాల్ని గూర్చి యెహోవా విన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు.
GEN 16:12 ఇష్మాయేలు అడవి గాడిదలా అదుపులేక, స్వేచ్ఛగా ఉంటాడు అతడు అందరికి వ్యతిరేకమే ప్రతి ఒక్కరూ అతనికి వ్యతిరేకమే తన సోదరులకు దగ్గరగా అతడు నివసిస్తాడు కాని అతడు వారికి వ్యతిరేకంగా ఉంటాడు.” అని చెప్పాడు.
GEN 16:13 ఆ పనిమనిషితో యెహోవా మాట్లాడాడు. దేవునికి ఆమె ఒక కొత్త పేరు ప్రయోగించింది. “నన్ను చూసే దేవుడవు నీవు” అని ఆయనతో చెప్పింది. “ఈ స్థలంలో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, రక్షిస్తున్నాడు” అని అనుకొన్నందువల్ల ఆమె ఇలా చెప్పింది.
GEN 16:14 కనుక ఆ బావి బెయేర్ లహాయిరోయి అని పిలువబడింది. కాదేషుకు బెరెదుకు మధ్య ఉంది ఆ బావి.
GEN 16:15 హాగరు ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారునికి ఇష్మాయేలు అని అబ్రాము పేరు పెట్టాడు.
GEN 16:16 హాగరుకు ఇష్మాయలు పుట్టినప్పుడు అబ్రాము వయస్సు 86 సంవత్సరాలు.
GEN 17:1 అబ్రాముకు 99 సంవత్సారల వయస్సు ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడి యిలా చెప్పాడు: “నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని నా కోసం ఈ పనులు చేయి. నాకు విధేయుడవై, సరైన జీవితం జీవించు.
GEN 17:2 ఇలా గనుక నీవు చేస్తే మన ఇద్దరి మధ్య ఒక ఒడంబడికను నేను తయారు చేస్తాను. నిన్ను బాగా అభివృద్ధి చేస్తాను.”
GEN 17:3 అప్పుడు దేవునియెదుట అబ్రాము సాష్టాంగ పడ్డాడు. అతనితో దేవుడు అన్నాడు.
GEN 17:4 “మన ఒడంబడికలో నా భాగం ఇది. అనేక జనములకు నిన్ను తండ్రిగా నేను చేస్తాను.
GEN 17:5 నీ పేరు నేను మార్చేస్తాను. నీ పేరు అబ్రాము కాదు—నీ పేరు అబ్రాహాము. అనేక జనాంగములకు నీవు తండ్రివి అవుతావు గనుక, నీకు నేను ఈ పేరు పెడుతున్నాను.
GEN 17:6 నీకు నేను పెద్ద సంతానాన్ని ఇస్తాను. నీనుండి కొత్త జనాంగాలు ఉద్భవిస్తాయి. నీనుండి కొత్త రాజులు వస్తారు.
GEN 17:7 నీకు నాకు మధ్య ఒక ఒడంబడికను నేను ఏర్పాటు చేస్తాను. నీ సంతానానికి ఈ ఒడంబడిక వర్తిస్తుంది. నేను నీకు దేవునిగా ఉంటాను. నీ సంతానానికి దేవునిగా ఉంటాను.
GEN 17:8 నీవు పరాయివాడిగా నివసిస్తున్న ఈ దేశాన్ని అంటే కనాను దేశాన్ని నీకును, నీ సంతానపు వారందిరికిని శాశ్వతపు హక్కుగా ఇస్తాను. నేను మీకు దేవునిగా ఉంటాను.”
GEN 17:9 అబ్రాహాముతో దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “ఇక, ఒడంబడికలో నీ భాగం యిది. ఒడంబడికను నీవు నిలబెట్టాలి నీవూ, నీ సంతానమంతా నా ఒడంబడికకు విధేయులు కావాలి.
GEN 17:10 మీరు విధేయులు కావాల్సిన ఒడంబడిక ఇదే. ఇది మీకు, నాకు మధ్య ఒడంబడిక. ఇది నీ సంతానము వారి కోసమూను; పుట్టిన ప్రతి పిల్లవాడికి తప్పక సున్నతి చెయ్యాలి.
GEN 17:11 నీకు నాకు మధ్యగల ఒడంబడికను నీవు అనుసరిస్తావని తెలియ చేసేందుకు నీవు నీ మర్మాంగపు ముందు చర్మాన్ని కోయాలి.
GEN 17:12 నీ జనములో పుట్టిన ప్రతి బాలుడు, నీ జనమునుండి కాక, ఇతర జనములనుండి డబ్బుతో బానిసగా కొనబడిన వారిలో ప్రతి పురుషుడు సున్నతి చేయించుకొనవలెను.
GEN 17:13 కనుక నీ జాతి అంతటిలో ప్రతి పిల్లవానికి సున్నతి జరుగుతున్నది. నీ వంశంలో పుట్టిన ప్రతి పిల్లవాడికి, లేక బానిసగా కొనబడిన పిల్లవాడికి సున్నతి జరుగుతుంది.
GEN 17:14 ఇది నా చట్టం, నీకు నాకు మధ్యనున్న ఒడంబడిక. సున్నతి చేయని ఏ మగవాడైనా సరే తన ప్రజల్లో నుండి తొలగించివేయ బడతాడు. ఎందుచేతనంటే, ఆ వ్యక్తి నా ఒడంబడికను ఉల్లంఘించాడు కనుక.”
GEN 17:15 అబ్రాహాముతో దేవుడు అన్నాడు: “నీ భార్య శారయికి నేను ఒక కొత్త పేరు పెడ్తాను. ఆమె కొత్త పేరు శారా.
GEN 17:16 ఆమెను నేను ఆశీర్వదిస్తాను. ఆమెకు ఒక కుమారుణ్ణి నేను ఇస్తాను, మరి నీవు తండ్రివి అవుతావు. అనేక కొత్త జనాంగములకు ఆమె తల్లి అవుతుంది. జనముల రాజులు ఆమెలోనుండి వస్తారు.”
GEN 17:17 దేవుణ్ణి గౌరవించుటకు అబ్రాహాము ముఖం క్రిందికి దించుకొన్నాడు. అయితే అతడు నవ్వి తనలో తాను అనుకొన్నాడు: “నా వయస్సు 100 సంవత్సరాలు. నాకు కొడుకు పుట్టజాలడు. మరి శారా వయస్సు 90 సంవత్సరాలు. ఆమెకు శిశువు జన్మించడం అసాధ్యం.”
GEN 17:18 అప్పుడు అబ్రాహాము దేవునితో ఇలా అన్నాడు: “నా కుమారుడు ఇష్మాయేలు జీవించి నిన్ను సేవిస్తాడని అశిస్తున్నాను.”
GEN 17:19 దేవుడు చెప్పాడు: “లేదు! నీ భార్య శారాకు కుమారుడు పుడతాడని నేను చెప్పాను. అతనికి ఇస్సాకు అని నీవు పేరు పెడ్తావు. అతనితో నేను నా ఒడంబడిక చేసుకొంటాను. ఆ ఒడంబడిక అతని సంతానాలన్నిటితోను శాశ్వతంగా కొనసాగే ఒడంబడికగా ఉంటుంది.
GEN 17:20 “ఇష్మాయేలును గూర్చి నీవు నన్ను అడిగావు, నేను విన్నాను. అతణ్ణి నేను ఆశీర్వదిస్తాను. అతనికి చాలా మంది పిల్లలు ఉంటారు. పన్నెండు మంది మహా నాయకులకు అతడు తండ్రి అవుతాడు. అతని కుటుంబం ఒక గొప్ప జాతి అవుతుంది.
GEN 17:21 అయితే ఇస్సాకుతో నేను నా ఒడంబడిక చేస్తాను. శారాకు పుట్టబోయే కుమారుడు ఇస్సాకు. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే కాలంలో నీకు కుమారుడు పుడతాడు.”
GEN 17:22 అబ్రాహాముతో దేవుడు మాట్లాడటం ముగించిన తర్వాత అబ్రాహాము ఒంటరిగా ఉన్నాడు. దేవుడు లేచి అబ్రాహామును విడచి వెళ్లపోయాడు.
GEN 17:23 తన కుటుంబంలోని మగవాళ్లకు, బాలురకు సున్నతి చేయమని అబ్రాహాముతో దేవుడు చెప్పాడు. కనుక ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన సేవకులందరిని అబ్రాహాము సమావేశపర్చాడు. డబ్బుతో కొనబడిన సేవకులను గూడ అబ్రాహాము సమావేశపర్చాడు. అబ్రాహాము ఇంటిలోని ప్రతి పురుషుడు, బాలుడు ఒక చోట సమావేశ పర్చబడ్డారు. వారందరికి సున్నతి చేయబడింది. అబ్రాహాము దేవుడు చెప్పినట్లు వారందరికి సున్నతి చేశాడు.
GEN 17:24 అబ్రాహాము సున్నతి జరిగినప్పుడు అతని వయస్సు 99 సంవత్సరాలు.
GEN 17:25 అతని కుమారుడు ఇష్మాయేలుకి సున్నతి జరిగినప్పుడు అతడు 13 ఏండ్లవాడు.
GEN 17:26 అబ్రాహాము, అతని కుమారుడు ఇద్దరు ఒకే రోజున సున్నతి చేయబడ్డారు.
GEN 17:27 ఆ రోజునే అబ్రాహాము ఇంటిలోని మగవాళ్లందరికి గూడ సున్నతి జరిగింది. అతని ఇంట పుట్టిన సేవకులందరికి, అతడు కొన్న సేవకులందరికి సున్నతి జరిగింది.
GEN 18:1 తర్వాత మళ్లీ అబ్రాహామునకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. మమ్రేలోని సింధూర వనమునకు దగ్గర్లో అబ్రాహాము నివసిస్తున్నాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం అబ్రాహాము తన గుడార ద్వారం దగ్గర కూర్చున్నాడు.
GEN 18:2 అబ్రాహాము తలెత్తి చూడగా, తన ముందర నిలచిన ముగ్గురు మనుష్యులు కనబడ్డారు. అబ్రాహాము వాళ్లను చూడగానే అతడు వారి దగ్గరకు వెళ్లి: వారి ముందు వంగి,
GEN 18:3 ఇలా అన్నాడు, “అయ్యలారా, మీ దాసుడనైన నా దగ్గర దయచేసి కొంత కాలం ఉండండి.
GEN 18:4 మీ కాళ్లు కడుక్కొనేందుకు నేను నీళ్లు తెస్తాను. చెట్ల కింద మీరు విశ్రాంతి తీసుకోవచ్చు.
GEN 18:5 మీ కోసం నేను భోజనం తెస్తాను, కడుపు నిండా భోంచేయండి. తర్వాత మీ దారిన మీరు వెళ్లొచ్చు.” “చాలా బాగుంది, అలాగే కానీయి” అన్నారు ఆ ముగ్గురు మనుష్యులు.
GEN 18:6 అబ్రాహాము తన గుడారము దగ్గరకు త్వరత్వరగా వెళ్లాడు. “మూడు రొట్టెలకు సరిపడె గోధుమలు త్వరగా తయారు చేయి” అన్నాడు శారాతో అబ్రాహాము.
GEN 18:7 తర్వాత అబ్రాహాము తన పశువుల దగ్గరకు పరుగెత్తాడు. అబ్రాహాము చాలా మంచి యవ్వనంలో ఉన్న దూడను తీసుకొని తన సేవకునికి ఇచ్చాడు. త్వరగా ఆ దూడను వధించి, దానితో భోజనం సిద్ధం చేయుమని అబ్రాహాము చెప్పాడు.
GEN 18:8 ఆ మాంసాన్ని ఆ ముగ్గురు మనుష్యులు భోంచేసేందుకు అబ్రాహాము ఇచ్చాడు. అతడు పాలు, వెన్న కూడ వాళ్లకు ఇచ్చాడు. ఆ ముగ్గురు చెట్టు కింద భోజనం చేస్తూ ఉండగా అబ్రాహాము వారి దగ్గర నిలబడ్డాడు.
GEN 18:9 “నీ భార్య శారా ఎక్కడ?” అంటూ ఆ ముగ్గురు అబ్రాహామును అడిగారు. “అమె అక్కడ గుడారంలో ఉంది” అన్నాడు అబ్రాహాము.
GEN 18:10 అప్పుడు యెహోవా, “మళ్లీ వసంతకాలంలో నేను వస్తాను. అప్పటికి నీ భార్య శారాకు ఒక కుమారుడు కలిగి ఉంటాడు” అన్నాడు. గుడారం లోపల శారా ఈ విషయాలు విన్నది.
GEN 18:11 అబ్రాహాము శారాలు చాలా ముసలివాళ్లు. స్త్రీలు పిల్లలను కనగల వయస్సు శారాకు దాటిపోయింది.
GEN 18:12 అందుచేత తాను విన్న మాటలను శారా నమ్మలేదు. “ఇప్పుడు నేను ముసలిదాన్ని, నా భర్త ముసలివాడు. నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా” అనుకొంది తనలో తాను.
GEN 18:13 అప్పుడు అబ్రాహాముతో యెహోవా ఇలా అన్నాడు: “నేను చెప్పింది శారా నమ్మటం లేదు. ఆమె నవ్వింది. నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా!” అంది.
GEN 18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను వస్తానని చెప్పిన వసంతకాలంలో మళ్లీ వస్తాను, అప్పుడు నీ భార్య శారాకు కుమారుడు ఉంటాడు.
GEN 18:15 అయితే శారా, “నేను నవ్వలేదు” అంది. (భయపడి అమె అలా అంది.) కాని యెహోవా, “కాదు, నీవు చెప్పేది నిజం కాదని నాకు తెలుసు. నీవు నవ్వావు” అన్నాడు.
GEN 18:16 అప్పుడు ఆ మనుష్యులు వెళ్లటానికి లేచారు. వారు సొదొమ వైపు చూసి, ఆ దిశగా నడక ప్రారంభించారు. వారికి వీడ్కోలు చెప్పటానికి అబ్రాహాము వాళ్లతో కొంత దూరం నడిచాడు.
GEN 18:17 యెహోవా తనలో తాను ఇలా అనుకొన్నాడు: “ఇప్పుడు నేను చేయబోతున్నది అబ్రాహాముకు నేను చెప్పాలా?
GEN 18:18 అబ్రాహాము గొప్ప శక్తిగల జనానికి మూల పురుషుడు అవుతాడు. అతని మూలంగా భూమి మీది ప్రజలంతా ఆశీర్వదించబడుతారు.
GEN 18:19 అబ్రాహాముతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేసుకున్నాను. అతని పిల్లలు, సంతానము యెహోవా ఇష్ట ప్రకారం జీవించేటట్టు అబ్రాహాము వారికి ఆజ్ఞాపించాలని చెప్పి, నేను ఇలా చేసాను. సక్రమంగా న్యాయంగా వాళ్లు జీవించాలని చెప్పి నేను ఇలా చేసాను. అప్పుడు, యెహోవానైన నేను వాగ్దానం చేసిన వాటిని అతనికి ఇవ్వగలను.”
GEN 18:20 మరల యెహోవా ఇలా అన్నాడు: “సొదొమ గొమొర్రాల అరుపులు చాలా పెద్దవి. వారి పాపం చాలా భయంకరమైనది. అని నేను విన్నాను.
GEN 18:21 కనుక నేను వెళ్లి, అక్కడి విషయాలు నేను విన్నంత చెడ్డగా ఉన్నాయేమో చుస్తాను. అప్పుడు నాకు నిశ్చయంగా తెలుస్తుంది.”
GEN 18:22 అంచేత ఆ మనుష్యులు మళ్లీ, సొదొమవైపు నడక ప్రారంభించారు. అయితే అబ్రాహాము యెహోవాతో అక్కడ ఉండిపోయాడు.
GEN 18:23 అప్పుడు అబ్రాహాము యెహోవాను సమీపించి ఇలా అడిగాడు. “యెహోవా, నీవు దుష్టులను నాశనం చేసేటప్పుడు మంచి వారిని కూడా నాశనం చేస్తావా?
GEN 18:24 ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది మంచి వాళ్లు ఉంటే ఎలా? ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా? అక్కడ నివసిస్తున్న 50 మంది మంచివాళ్ల కోసం తప్పక నీవు ఆ పట్టణాన్ని కాపాడు.
GEN 18:25 ఆ పట్టణాన్ని నీవు అసలు నాశనం చేయనే చేయవు. చెడ్డవాళ్లను చంపడంకోసం 50 మంది మంచి వాళ్లను నీవు నాశనం చేయవు. అలా గనుక జరిగితే మంచివాళ్లు చెడ్డవాళ్లు సమానమై, ఇద్దరూ శిక్షించబడుతారు. భూలోకమంతటికి నీవు న్యాయమూర్తివి. నిజంగా నీవు సరైనదే చేస్తావని నాకు తెలుసు.”
GEN 18:26 అప్పుడు, “సొదొమ పట్టణంలో 50 మంది మంచి వాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణం అంతటిని కాపాడుతాను” అన్నాడు యెహోవా.
GEN 18:27 దానికి అబ్రాహాము ఇలా అన్నాడు: “ప్రభూ, నీతో పోల్చుకొంటే, నేను ధూళిని, బూడిదను మాత్రమే. అయినా నేను మరోసారి తెగించి ఈ ప్రశ్న అడుగుతున్నాను.
GEN 18:28 ఒకవేళ అయిదుగురు మంచివాళ్లు తప్పిపోయి, 45 మంది మాత్రమే మంచివాళ్లు ఆ పట్టణంలో ఉంటే ఎలా? కేవలం అయిదుగురు తక్కువ అయినందువల్ల మొత్తం పట్టణమంతటిని నాశనం చేస్తావా?” “అక్కడ 45 మంది మంచివాళ్లు గనుక నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను వదిలివేస్తాను” అన్నాడు యెహోవా.
GEN 18:29 మరల అబ్రాహాము, “అక్కడు 40 మంది మాత్రమే మంచివాళ్లు నీకు కనబడినా, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని యెహోవాను అడిగాడు. “40 మంది మంచి వాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు యెహోవా.
GEN 18:30 అందుకు అబ్రాహాము, “ప్రభూ, నా మీద కోపగించకు. మరొక్క మాట అడుగుతాను. ఆ పట్టణంలో 30 మంది మాత్రమే మంచివాళ్లు కనబడితే, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “అక్కడ 30 మంది మంచి వాళ్లు నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని చెప్పాడు.
GEN 18:31 అప్పుడు అబ్రాహాము, “నా ప్రభువుతో మరోసారి మాటలాడ తెగించితిని ఒకవేళ అక్కడ 20 మంది మంచివాళ్లే ఉంటే” అన్నాడు. “20 మంది మంచివాళ్లు నాకు కనబడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని జవాబిచ్చాడు యెహోవా.
GEN 18:32 అప్పుడు అబ్రాహాము ఇలా అన్నాడు, “ప్రభూ నాపై కోపగించకు, ఈ ఒక్కసారే చివరిగా నీతో మాటలాడ తెగిస్తున్నాను. పదిమంది మంచివాళ్లే గనుక అక్కడ నీకు కనబడితే, నీవేం చేస్తావు?” “పదిమంది మంచివాళ్లు గనుక అక్కడ నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అన్నాడు” యెహోవా.
GEN 18:33 యెహోవా అబ్రాహాముతో మాట్లాడటం అయిపోయింది, గనుక యెహోవా వెళ్లిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి వెళ్లిపోయాడు.
GEN 19:1 ఆ సాయంకాలం, ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ పట్టణం వచ్చారు. పట్టణ ద్వారం దగ్గర కూర్చొని ఉన్న లోతు ఆ దేవదూతల్ని చూశాడు. లోతు లేచి, దేవదూతల దగ్గరకు వెళ్లి, సాష్టాంగ పడ్డాడు.
GEN 19:2 లోతు ఇలా అన్నాడు: “అయ్యలారా, దయతో నా ఇంటికి రండి, నేను మీకు సేవ చేస్తాను. అక్కడ మీరు మీ కాళ్లు కడుక్కొని, రాత్రి బస చేయవచ్చును. ఆ తరువాత మీరు మీ ప్రయాణం కొనసాగించవచ్చు.” “లేదు. ఈ రాత్రికి మేము ఈ ఖాళీ స్థలంలో బస చేస్తాం” అన్నారు దేవదూతలు.
GEN 19:3 కాని, వారిని తన ఇంటికి రమ్మని లోతు బలవంతము చేసెను. అంచేత లోతు ఇంటికి వెళ్లడానికి దేవదూతలు ఒప్పుకొన్నారు. వారు ఇంటికి వెళ్లగానే, వారు తినేందుకు లోతు భోజనం తయారు చేసాడు, వాళ్ల కోసం రొట్టెలు చేసాడు. లోతు వండిన భోజనం దేవదూతలు తిన్నారు.
GEN 19:4 ఆ రాత్రి పండుకొనక ముందు, పట్టణం నలుమూలల నుండి పురుషులు చిన్నలూ, పెద్దలూ లోతు ఇంటికి వచ్చారు. సొదొమ ప్రజలు లోతు ఇంటిని చుట్టుముట్టి, లోతును పిల్చారు.
GEN 19:5 “ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు మనుష్యులు (దేవదూతలు) ఎక్కడ? వాళ్లను బయటకు మా దగ్గరకు తీసుకురా. మేము వాళ్లను సంభోగించాలి” అన్నారు.
GEN 19:6 లోతు బయటకు వెళ్లి, తన వెనుకగా తలుపు మూసాడు.
GEN 19:7 “వద్దు, నా సోదరులారా, దయచేసి ఈ చెడ్డపని మీరు చేయవద్దని బతిమాలాడుతున్నాను” అని ఆ మనుష్యులతో చెప్పాడు.
GEN 19:8 “చూడండి, నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ఇదివరకు ఎన్నడూ ఏ పురుషునివద్ద పడుకోలేదు. నా కూతుళ్లను మీకు ఇస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు వాళ్లను చేసుకోండి. కాని దయచేసి ఈ మనుష్యులను మాత్రం ఏమీ చేయకండి. వీళ్లు నా ఇంటికి వచ్చారు, నేను వాళ్లను కాపాడాలి” లోతు ఆ మనుష్యులతో అన్నాడు.
GEN 19:9 “దారిలోనుంచి తప్పుకో” అంటూ ఇంటి చుట్టూ ఉన్నవాళ్లంతా అరిచారు. “ఈ లోతు ఒక యాత్రికుడుగా మన పట్టణం వచ్చాడు. ఇప్పుడు మనకే నీతులు చెబుతున్నాడు” అని వాళ్లలో వాళ్లు చెప్పుకొన్నారు. అప్పుడు వాళ్లు లోతుతో, “వాళ్లకు చేసే వాటికంటే ఎక్కువ కీడు నీకు చేస్తాం” అని చెప్పారు కనుక ఆ మనుష్యులు లోతు దగ్గరకు మరింత సమీపంగా వెళ్లి, తలుపు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు.
GEN 19:10 అయితే లోతు ఇంటిలో వున్న ఆ యిద్దరు మనుష్యులు తలుపు తెరచి లోతును లోపలికి లాగేసారు. తర్వాత వాళ్లు తలుపు మూసేసారు.
GEN 19:11 ద్వారమునకు వెలుపల ఉన్న మనుష్యులు గ్రుడ్డివాళ్లు అయ్యేటట్టు ఆ దేవదూతలు చేసారు. కనుక ఇంటిలోనికి ప్రవేశించాలని ప్రయత్నించిన ఆ మనుష్యులు, పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అందరు గుడ్డివాళ్లయిపోయి ద్వారం ఎక్కడుందో కనుక్కోలేక పోయారు.
GEN 19:12 “మీ కుటుంబాలకు చెందిన వాళ్లు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉన్నారా? అల్లుళ్లు, కుమారులు, కుమార్తెలు, లేక ఇంకెవరైనా మీ కుటుంబంలో ఉన్నారా? మీ కుటుంబానికి చెందిన వాళ్లు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉంటే, వాళ్లను ఇప్పుడే ఈ చోటు విడిచిపెట్టమని చెప్పాలి.
GEN 19:13 మేము ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాం. ఈ పట్టణంలో ఉన్న దుష్టత్వాన్ని గూర్చి యెహోవా అంతా చూశాడు. కనుక ఈ పట్టణాన్ని నాశనం చేయటానికి యెహోవా మమ్ముల్ని పంపించాడు” అని ఆ ఇద్దరు మనుష్యులు లోతుకు చెప్పారు.
GEN 19:14 కనుక లోతు బయటకు వెళ్లి, తన కుమార్తెలను పెళ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాట్లాడాడు. “త్వరగా ఈ పట్టణం వదిలిపెట్టిండి. యెహోవా దీన్ని త్వరగా నాశనం చేస్తాడు” అన్నాడు లోతు. అయితే లోతు పరిహాసం చేస్తున్నాడనుకొన్నారు వాళ్లు.
GEN 19:15 మర్నాడు సూర్యోదయాన దేవదూతలు లోతును తొందరపెట్టి ఈలాగన్నారు. “చూడు, ఈ పట్టణం శిక్షించబడుతుంది. కనుక ఇంక నీతో ఉన్న నీ భార్యను, నీ యిద్దరు కుమార్తెలను తోడుకొని ఈ స్థలం విడిచిపెట్టు. అప్పుడు ఈ పట్టణంతోబాటు నీవు నాశనంగాకుండా ఉంటావు.”
GEN 19:16 కాని, లోతు కలవరపడి, వెళ్లిపోయేందుకు త్వరపడలేదు. కనుక ఆ ఇద్దరు మనుష్యులు, (దేవదూతలు) లోతు, అతని భార్య, అతని యిద్దరు కుమార్తెల చేతులు పట్టుకొన్నారు. లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుంచి క్షేమంగా బయటకు నడిపించారు. లోతు, అతని కుటుంబం యెడల యెహోవా దయ చూపెట్టాడు.
GEN 19:17 అందుచేత లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. వారు బయటకు వచ్చాక, ఆ మనుష్యులలో ఒకరు ఇలా అన్నారు: “ఇప్పుడు మీ ప్రాణం కాపాడుకోవటానికి పారిపొండి. మళ్లీ వెనక్కు తిరిగి పట్టణం వైపు చూడకండి. లోయలో ఎక్కడా ఆగకండి. పర్వతాలు చేరేంత వరకు పరుగెత్తండి. అలా చేయకపోతే, పట్టణంతో పాటు మీరూ నాశనం అయిపోతారు.”
GEN 19:18 అయితే ఆ ఇద్దరు మనుష్యులతో లోతు ఇలా చెప్పాడు: “అయ్యలారా, అంత దూరం పరుగెత్తమని నన్ను బలవంతం చేయవద్దు.
GEN 19:19 మీ సేవకుడైన నా మీద మీరు చాలా దయ చూపించారు. నన్ను రక్షించటం మీరు చూపించిన మహా గొప్ప దయ. కానీ, నేను పర్వతాల వరకు పరుగెత్తలేను. నేను మరీ నిదానమైతే, ఆ నగరానికి సంభవించవలసిన శిక్ష నాకు తగిలి నేను మరణిస్తాను.
GEN 19:20 అయితే చూడండి, ఇక్కడికి సమీపంలో ఒక చిన్న ఊరుంది. నన్ను ఆ ఊరికి పారిపోనివ్వండి, అక్కడ నా ప్రాణం రక్షించబడుతుంది.”
GEN 19:21 దేవదూత లోతుతో, “సరే మంచిది, అలాగే కానివ్వు. నీవు వెళ్తున్న ఆ ఊరిని నేను నాశనం చేయను.
GEN 19:22 అయితే అక్కడికి వేగంగా పరుగెత్తు. నీవు క్షేమంగా ఆ ఊరు చేరేంతవరకు, సొదొమను నేను నాశనం చేయను” అనెను. (ఆ ఊరు చిన్నది గనుక అది సోయరు అని పిలువబడింది.)
GEN 19:23 సూర్యోదయం అయ్యేటప్పటికి లోతు సోయరులో ప్రవేశిస్తున్నాడు.
GEN 19:24 సొదొమ గొమొర్రాలను యెహోవా నాశనం చేయటం మొదలు బెట్టాడు. ఆకాశం నుండి అగ్ని గంధక వర్షాన్ని యెహోవా పంపించాడు.
GEN 19:25 కనుక ఆ పట్టణాలను యెహోవా నాశనం చేసాడు, మరియు ఆ లోయను, ఆ నగరాల్లో నివసిస్తోన్న ప్రజలందరిని, చెట్లన్నింటిని ఆయన నాశనం చేశాడు.
GEN 19:26 వారు పారిపోతూ ఉండగా లోతు భార్య వెనుకకు తిరిగి పట్టణం వైపు చూసింది. ఆమె వెనుకకు తిరిగిచూడగానే ఉప్పుస్తంభం అయిపోయింది.
GEN 19:27 ఆ ఉదయమే పెందలకడ అబ్రాహాము లేచి నిన్న యెహోవా ఎదుట నిలిచిన స్థలానికి వెళ్లాడు.
GEN 19:28 అబ్రాహాము సొదొమ గొమొర్రాలవైపు కిందుగా చూశాడు. ఆ లోయ ప్రదేశమంతా అబ్రాహాము చూశాడు. ఆ చోటనుండి విస్తారమైన పొగలు రావటం చూశాడు. అది ఒక మహాగొప్ప మంటనుండి లేచిన పొగలా కనబడింది.
GEN 19:29 ఆ లోయలోని పట్టణాలను దేవుడు నాశనం చేసాడు. అయితే దేవుడు ఇది చేసినప్పుడు, అబ్రాహాము అడిగిన దానిని ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. లోతు ప్రాణాన్ని దేవుడు రక్షించాడు, కాని లోతు నివసించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేసాడు.
GEN 19:30 సోయరులో జీవితం గడిపేందుకు లోతు భయపడ్డాడు. కనుక అతడు, అతని ఇద్దరు కుమార్తెలు వెళ్లి పర్వతాల్లో నివాసం చేశారు. అక్కడ ఒక గుహలో వారు నివసించారు.
GEN 19:31 ఒక రోజున పెద్ద కుమార్తె చిన్న కుమార్తెతో ఇలా చెప్పింది: “భూమిమీద అంతటా స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకొని కుటుంబం కలిగి ఉంటారు. కానీ మనం పెళ్లి చేసుకొని పిల్లలు కలిగేందుకు ఇక్కడ ఎవ్వరూ మగవాళ్లు లేరు. మన తండ్రి ముసలివాడు.
GEN 19:32 కానీ మన కుటుంబం సాగాలి గనుక మనకు పిల్లలు పుట్టడం కోసం మనం మన తండ్రిని ఉపయోగించుకోవాలి. మనం మన తండ్రి దగ్గరకు వెళ్లి, ఆయనతో పాటు మధుపానం చేసి, ఆయనకు మత్తు కలిగిద్దాం. అప్పుడు మనం ఆయనతో పండుకోవచ్చు.”
GEN 19:33 ఆ రాత్రి ఇద్దరు అమ్మాయిలో తమ తండ్రి దగ్గరకు వెళ్లి, అతనికి ద్రాక్షారసాన్ని తాగించి మత్తుగా చేశారు. అప్పుడు పెద్దమ్మాయు తన తండ్రి పడక మీదకు వెళ్లి, అతనితో లైంగికంగా కలసికొన్నది. లోతు తాగిన మత్తులో ఉన్నాడు గనుక, ఆమె ఎప్పుడు తనతో పండుకొన్నది, లేచి వెళ్లినది, అతనికి తెలియలేదు.
GEN 19:34 మర్నాడు పెద్దమ్మాయి చిన్నమ్మాయితో చెప్పింది: “గత రాత్రి నా తండ్రితో నేను పండుకొన్నాను. ఈ రాత్రి మళ్లీ మనం ఆయనకు ద్రాక్షారసముతో మత్తు కలిగిద్దాం. అప్పుడు నీవు ఆయన పడక మీదకి వెళ్లి ఆయనతో లైంగికంగా కలసికొనవచ్చు. ఈ విధంగా మన కుటుంబం అంతం కాకుండా పిల్లలు పుట్టేందుకు మనం మన తండ్రిని ఉపయోగించుకోవచ్చు.”
GEN 19:35 కనుక ఆ రాత్రి తమ తండ్రికి మత్తు ఎక్కేంతవరకు ఆ ఇద్దరు అమ్మాయిలూ తమ తండ్రికి ద్రాక్షారసాన్ని తాగించారు. అప్పుడు చిన్నమ్మాయి అతని పడక మీదకి వెళ్లి అతనితో పడుకొంది. అతని కుమార్తె అతనితో పండుకొన్నట్టు లోతుకు మరల తెలియలేదు.
GEN 19:36 అందుచేత లోతు కుమార్తెలు ఇద్దరూ గర్భవతులయ్యారు. వారి తండ్రి వారి శిశువులకు తండ్రి.
GEN 19:37 పెద్ద కుమార్తెకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె ఆ కుమారునికు మోయాబు అని పేరు పెట్టింది. నేటికి జీవిస్తోన్న మోయాబు ప్రజలందరికి అతడు తండ్రి.
GEN 19:38 చిన్న కుమార్తెకు కూడ ఒక కొడుకు పుట్టాడు. ఆమె తన కుమారునికి బెన్నమ్మి అని పేరు పెట్టింది. నేటికి జీవిస్తోన్న అమ్మనీ ప్రజలందిరికి బెన్నమ్మి తండ్రి.
GEN 20:1 అబ్రాహాము ఆ చోటు విడిచి నెగెబుకు ప్రయాణం కట్టాడు. కాదేషుకు, షూరుకు మధ్యనున్న గెరారుకు అబ్రాహాము వెళ్లాడు. గెరారులో ఉన్నప్పుడు
GEN 20:2 శారా తన సోదరి అని అబ్రాహాము ప్రజలతో చెప్పాడు. గెరారు రాజు అబీమెలెకు ఇది విన్నాడు. అబీమెలెకు శారాను ఇష్టపడి, ఆమెను తీసుకుని వచ్చేందుకు కొందరు సేవకుల్ని పంపించాడు.
GEN 20:3 అయితే ఆ రాత్రి దర్శనంలో అబీమెలెకుతో దేవుడు మాట్లాడి, “చూడు, నీవు చస్తావు. నీవు తెచ్చుకొన్న ఆ స్త్రీ వివాహితురాలు” అని చెప్పాడు.
GEN 20:4 కానీ అప్పటికి అబీమెలెకు శారాతో శయనించ లేదు. కనుక అబీమెలెకు, “ప్రభూ, నేను దోషిని కాను. నిర్దోషిని నీవు చంపుతావా?
GEN 20:5 ‘ఈ స్త్రీ నా సోదరి’ అని అబ్రాహాము స్వయంగా నాతో చెప్పాడు. ఆ స్త్రీ కూడా ‘ఈ పురుషుడు నా సోదరుడు’ అని చెప్పింది. నేను నిర్దోషిని. నేను చేస్తున్నది ఏమిటో నాకు తెలియలేదు” అన్నాడు.
GEN 20:6 ఆ దర్శనంలో అబీమెలెకుతో దేవుడు ఇలా చెప్పాడు: “అవును, నాకు తెలుసు, నీవు నిర్దోషివి. నీవు చేస్తున్నది ఏమిటో నీకు తెలియదు అని నాకు తెలుసు. నేను నిన్ను కాపాడాను. నాకు వ్యతిరేకంగా నిన్ను నేను పాపం చేయనీయలేదు. నీవు ఆమెతో శయనించకుండా చేసింది నేనే.
GEN 20:7 కనుక అబ్రాహాము భార్యను తిరిగి అతనికి అప్పగించు. అబ్రాహాము ఒక ప్రవక్త. అతడు నీ కోసం ప్రార్థిస్తాడు, అప్పుడు నీవు బతుకుతావు. కానీ శారాను నీవు తిరిగి అబ్రాహాముకు ఇవ్వకపోతే, నీవు మరణించడం తప్పదు. నీతోబాటు నీ కుటుంబం అంతా మరణిస్తుంది.”
GEN 20:8 కనుక మర్నాడు వేకువనే, అబీమెలెకు తన సేవకులందరినీ పిల్చాడు. దర్శనంలో సంభవించిన సంగతులన్నీ అబీమెలెకు వారితో చెప్పాడు. సేవకులు చాలా భయపడ్డారు.
GEN 20:9 అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిచి, అతనితో అన్నాడు: “నీవు మాకు ఎందుకు ఇలా చేసావు? నీకు నేను ఏమి అపకారం చేసాను? ఎందుకలా అబద్ధం చెప్పి, ఆమె నీ సోదరి అన్నావు? నా రాజ్యానికి నీవు చాలా చిక్కు తెచ్చిపెట్టావు. నాకు నీవు ఇలా చేయకుండా ఉండాల్సింది.
GEN 20:10 నీవు దేనికి ఇలా చేసావు?”
GEN 20:11 అందుకు అబ్రాహాము చెప్పాడు: “నేను భయపడ్డాను. దేవుడంటే ఇక్కడ ఎవరికీ భయము లేదని అనుకొన్నాను. శారాను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపేస్తారు అనుకొన్నాను.
GEN 20:12 ఆమె నా భార్య, అయితే నా సోదరి కూడాను. ఆమె నా తండ్రి కుమార్తె గాని, నా తల్లి కుమార్తె కాదు.
GEN 20:13 నా తండ్రి ఇంటినుండి దేవుడు నన్ను బయటకు నడిపించాడు. అనేక చోట్ల సంచారం చేసేటట్టు దేవుడు నన్ను నడిపించాడు. అలా జరిగినప్పుడు, ‘నీవు నా సోదరివని ప్రజలతో మనం వెళ్లిన చోటల్లా చెప్పు, నాకు ఈ మేలు చేయి’ అని నేను శారాతో చెప్పాను.”
GEN 20:14 అప్పుడు జరిగిందేమిటో అబీమెలెకు అర్థం చేసుకొన్నాడు. కనుక శారాను అబీమెలెకు తిరిగి అబ్రాహాముకు అప్పగించేసాడు. కొన్ని గొర్రెలు, పశువులు, కొందరు ఆడ, మగ బానిసలను కూడ అబీమెలెకు అబ్రాహాముకు ఇచ్చాడు.
GEN 20:15 మరియు “నీ చుట్టూ చూడు. ఇది నా దేశం. నీకు ఇష్టం వచ్చిన చోట నీవు ఉండవచ్చు” అన్నాడు అబీమెలెకు.
GEN 20:16 “చూడు, నీ సోదరుడైన అబ్రాహాముకు 1,000 వెండి నాణెములు ఇచ్చాను. జరిగిన వాటి విషయమై నా పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి యిది చేసాను. నేను సక్రమంగా జరిగించినట్టు అందరూ చూడాలని నేను కోరుతున్నాను” అని అబీమెలెకు శారాతో చెప్పాడు.
GEN 20:17 అబీమెలెకు కుటుంబంలోని స్త్రీలను గొడ్రాళ్లుగా చేసాడు యెహోవా. అబ్రాహాము భార్య శారాను అబీమెలెకు తీసుకొన్నందుచేత దేవుడు ఇలా చేసాడు. అయితే అబ్రాహాము ప్రార్థించగా అబీమెలెకును, అతని భార్యను మరియు అతని దాసీలను దేవుడు స్వస్థపరచాడు.
GEN 21:1 యెహోవా శారాకు అనుగ్రహిస్తానని ఆమెకు వాగ్దానం చేసాడు. ఆయన వాగ్దానం చేసినట్టే ఆమెపై అనుగ్రహాన్ని చూపాడు.
GEN 21:2 అబ్రాహాము వృద్దాప్యంలో శారా గర్భవతి అయ్యింది, అతనికి ఒక కుమారుని కన్నది. ఈ సంగతులన్నీ సరిగ్గా దేవుడు వాగ్దానం చేసినట్టే జరిగాయి.
GEN 21:3 శారా కుమారుని కన్నది, అబ్రాహాము వానికి ఇస్సాకు అని పేరు పెట్టాడు.
GEN 21:4 దేవుడు ఆజ్ఞాపించినట్టు, ఇస్సాకుకు ఎనిమిది రోజులు నిండగానే అబ్రాహాము అతనికి సున్నతి చేశాడు.
GEN 21:5 తన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము నయస్సు 100 సంవత్సరాలు.
GEN 21:6 “దేవుడు నన్ను సంతోషపెట్టాడు. ఇది విన్న ప్రతి ఒక్కరూ నాతో సంతోషిస్తారు.
GEN 21:7 నేను శారాను, అబ్రాహాము కుమారుణ్ణి పొందుతాడని ఏ ఒక్కరూ తలంచలేదు. కానీ ఆయన వృద్ధుడుగా ఉన్నప్పుడు అబ్రాహాముకు నేను ఒక కుమారుని కన్నాను” అంది శారా.
GEN 21:8 ఇస్సాకు ఎదుగుతున్నాడు. త్వరలోనే గట్టి పదార్థాలు భోజనం చేసేటంతటి పెద్దవాడయ్యాడు. అప్పట్లో అబ్రాహాము ఒక మహా గొప్ప విందు చేసాడు.
GEN 21:9 గతంలో ఈజిప్టు బానిసైన స్త్రీ హాగరు ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి కూడా తండ్రి అబ్రాహామే. అయితే ఆ కుమారుడు ఇప్పుడు ఇస్సాకును వేధించడం శారా చూసింది.
GEN 21:10 “కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బలవంతంగా వెళ్లగొట్టు. మన మరణం తరువాత మన కుమారుడు ఇస్సాకు మన ఆస్తి అంతటికి వారసుడవుతాడు. దానిలో దాసీ కుమారుడు ఇస్సాకుతో భాగం పంచుకోవటం నాకు ఇష్టం లేదు అంటూ” శారా అబ్రాహాముతో చెప్పింది.
GEN 21:11 ఇదంతా అబ్రాహాముకు బాధ కలిగించింది. తన కుమారుడైన ఇష్మాయేలును గూర్చి అతడు చింతించాడు.
GEN 21:12 కానీ అబ్రాహాముతో దేవుడన్నాడు: “ఆ పిల్లవాణ్ణి గూర్చి నీవు చింతించకు. ఆ బానిస స్త్రీని గూర్చి నీవు చింతపడకు. శారా కోరినట్టే చేయి. ఇస్సాకు మాత్రమే నీకు వారసుడయిన కుమారుడు.
GEN 21:13 అయితే నీ బానిస స్త్రీ కుమారుణ్ణి కూడా నేను ఆశీర్వదిస్తాను. అతడు నీ కుమారుడే, కనుక అతని వంశం నుండి గూడ నేను ఒక గొప్ప జనాన్ని చేస్తాను.”
GEN 21:14 మర్నాడు వేకువనే అబ్రాహాము కొంత భోజనాన్ని, తిత్తిలో నీళ్లు తెచ్చాడు. అబ్రాహాము వీటిని హాగరుకు ఇచ్చాడు. హాగరు వీటిని తీసుకొని, తన కుమారునితో కలసి వెళ్లిపోయింది. హాగరు ఆ చోటు విడిచి బెయేర్షెబా అరణ్యంలో సంచరించింది.
GEN 21:15 కొన్నాళ్లకు తిత్తిలోని నీళ్లన్నీ అయిపోయాయి. తాగటానికి ఏమీ మిగలలేదు. కనుక హాగరు తన కుమారుణ్ణి ఒక పొద పక్కన పెట్టింది.
GEN 21:16 హాగరు కొంచె దూరం నడచి వెళ్లింది. అక్కడ ఆగిపోయి కూర్చుంది. నీళ్లు లేవు గనుక తన కుమారుడు చనిపోతాడనుకొంది హాగరు. వాడు చస్తోంటే చూడటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె అక్కడ కూర్చొని ఏడ్వటం మొదలు పెట్టింది.
GEN 21:17 ఆ పిల్లవాడు ఏడ్వడం దేవుడు విన్నాడు. పరలోకంనుండి దేవుని దూత హాగరును పిలిచాడు. అతడన్నాడు, “హాగరూ, ఏం జరిగింది? భయపడకు. అక్కడ పిల్లవాడు ఏడ్వడం యెహోవా విన్నాడు.
GEN 21:18 వెళ్లి పిల్లవాడికి సహాయం చేయి. వాడి చేయి పట్టి నడిపించు. ఒక గొప్ప జనాంగానికి అతణ్ణి తండ్రిగా నేను చేస్తాను”
GEN 21:19 అంతలో హాగరుకు ఒక బావి కనబడేటట్టు చేసాడు దేవుడు. కనుక హాగరు ఆ బావి దగ్గరకు వెళ్లి తన తిత్తిని నీళ్లతో నింపుకొన్నది. తర్వాత పిల్లవాడు తాగటానికి ఆమె నీళ్లు ఇచ్చింది.
GEN 21:20 ఆ పిల్లవాడు ఎదుగుతూ ఉండగా దేవుడు వానికి తోడుగానే ఉన్నాడు. ఇష్మాయేలు అరణ్యంలో జీవిస్తూ, వేయగాడయ్యాడు. బాణం కొట్టడంలో నిపుణత నేర్చుకొన్నాడు.
GEN 21:21 అతని తల్లి అతని కోసం ఈజిప్టులో భార్యను కనుగొన్నది. వారు పారాను అరణ్యంలోనే జీవిస్తూ ఉన్నారు.
GEN 21:22 అంతట ఆబీమెలెకు, ఫీకోలు అబ్రాహాముతో మాట్లాడారు. అబీమెలెకు, అతని సైన్యాధిపతి ఫికోలు అబ్రాహాముతో ఇలా చెప్పారు: “నీవు చేసే ప్రతి దానిలోను దేవుడు నీతో ఉన్నాడు.
GEN 21:23 కనుక ఇక్కడ దేవుని యెదుట నాకు ఒక వాగ్దానం చేయాలి. నాతో, నా పిల్లలతో నీవు న్యాయంగా వ్యవహరిస్తావని వాగ్దానం చేయాలి. నీవు నివసించిన ఈ దేశం మీద, నా మీద నీవు దయగలిగి ఉంటానని వాగ్దానం చేయాలి. నీపైన నేను ఎంత దయ చూపెట్టానో, నాపైన నీవు కూడా అంత దయ చూపెడ్తానని వాగ్దానం చేయాలి.”
GEN 21:24 “నన్ను నీవు ఎలా పరామర్శించావో నేను కాడు నిన్ను అలాగే పరామర్శిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు అబ్రాహాము.
GEN 21:25 అప్పుడు అబ్రాహాము అబీమెలెకుతో ఒక ఫిర్యాదు చేసాడు. అబీమెలెకు సేవకులు ఒక మంచి నీటి బావిని స్వాధీనం చేసుకొన్నందుచేత అబ్రాహాము అబీమెలెకుతో ఫిర్యాదు చేసాడు.
GEN 21:26 కానీ అబీమెలెకు, “ఇది ఎవరు చేసారో నాకు తెలియదు. ఇంతకు ముందు ఈ విషయం నీవు నాతో చెప్పలేదు” అన్నాడు.
GEN 21:27 కనుక అబ్రాహాము, అబీమెలెకు ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆ ఒడంబడిక సూచనగా కొన్ని గొర్రెలను, పశువులను అబీమెలెకుకు అబ్రాహాము ఇచ్చాడు.
GEN 21:28 ఏడు ఆడ గొర్రె పిల్లల్ని కూడా అబీమెలెకు ఎదుట ఉంచాడు అబ్రాహాము.
GEN 21:29 “ఈ ఏడు ఆడ గొర్రెపిల్లల్ని ఇలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు?” అని అబీమెలెకు అబ్రాహామును అడిగాడు.
GEN 21:30 “ఈ గొర్రెపిల్లల్ని నా దగ్గర నుండి నీవు స్వీకరించినప్పుడు, ఈ బావిని నేను తవ్వించినట్టు రుజువు అవుతుంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు.
GEN 21:31 కనుక ఆ తర్వాత ఆ బావి బెయేర్షెబా అని పిలువబడింది. వారిద్దరు ఒకరికి ఒకరు ఆ స్థలంలో వాగ్దానం చేసుకొన్న చోటు గనుక దానికి వారు ఆ పేరు పెట్టారు.
GEN 21:32 కనుక అబ్రాహాము, అబీమెలెకు బెయేర్షెబా దగ్గర ఒక ఒడంబడిక చేసుకొన్నారు. అప్పుడు అబెమెలెకు, అతని సైన్యాధిపతి తిరిగి ఫిలిష్తీ ప్రజల దేశం వెళ్లిపోయారు.
GEN 21:33 బెయేర్షెబాలో అబ్రాహాము ఒక అలంకారపు చెట్టు నాటాడు. అప్పుడు అబ్రాహాము ప్రభువు, ఎల్లప్పుడు జీవిస్తున్న దేవుడైన యెహోవాకు అతడు అక్కడ ప్రార్థన చేశాడు.
GEN 21:34 ఫిలిష్తీయుల దేశంలో అబ్రాహాము చాలాకాలం నివసించాడు.
GEN 22:1 ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని దేవుడు అనుకొన్నాడు. “అబ్రాహామూ” అని దేవుడు అతణ్ణి పిలిచాడు. దానికి అబ్రాహాము “చిత్తం” అన్నాడు.
GEN 22:2 అప్పుడు దేవుడు చెప్పాడు, “నీ కుమారుని మోరీయా దేశం తీసుకొని వెళ్లు. మోరీయాలో నీ కుమారుణ్ణి నాకు బలిగా చంపు. నీ ఒకే కుమారుడు, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడైన ఇస్సాకును ఇలా చేయాలి. అక్కడ కొండల్లో ఒక దానిమీద అతణ్ణి దహనబలిగా ఉపయోగించు. ఏ కొండ అనేదీ నేను నీతో చెబుతాను.”
GEN 22:3 ఉదయాన అబ్రాహాము లేచి తన గాడిదను సిద్ధం చేసాడు. ఇస్సాకును తన ఇద్దరు సేవకులను అబ్రాహాము తన వెంట తీసుకు వెళ్లాడు. బలి అర్పణ కోసం కట్టెలను అబ్రాహాము నరికాడు. తర్వాత వారు వెళ్లాలని దేవుడు అతనితో చెప్పిన చోటుకి వారు వెళ్లారు.
GEN 22:4 వారు మూడు రోజులు ప్రయాణం చేసిన తర్వాత, అబ్రాహాము కనులెత్తి దూరంలో వారు వెళ్లవలసిన చోటును చూశాడు.
GEN 22:5 అప్పుడు అబ్రాహాము, “మీరు ఈ గాడిదతో ఇక్కడ ఉండండి. నేను నా కుమారుణ్ణి తీసుకొని, అక్కడికి వెళ్లి ఆరాధన చేస్తాం. ఆ తర్వాత మేము మీ దగ్గరకు తిరిగి వస్తాం” అని తన సేవకులతో చెప్పాడు.
GEN 22:6 అబ్రాహాము బలికోసం కట్టెలు తీసుకొని తన కుమారుని భుజంమీద పెట్టాడు. ఒక ప్రత్యేక ఖడ్గం, నిప్పు అబ్రాహాము పట్టుకొన్నాడు. అప్పుడు అబ్రాహాము, అతని కుమారుడు యిద్దరు కలిసి ఆరాధనా స్థలానికి వెళ్లారు.
GEN 22:7 ఇస్సాకు “తండ్రీ!” అని తన తండ్రి అబ్రాహామును పిలిచాడు. “ఏమిటి కొడుకా?” అని అడిగాడు అబ్రాహాము. “కట్టెలు, నిప్పు నాకు కనబడుతున్నాయి. కాని మనం బలిగా దహించే గొర్రెపిల్ల ఏది?” అని ఇస్సాకు అడిగాడు.
GEN 22:8 “నా కుమారుడా, బలికోసం గొర్రెపిల్లను సరైన సమయంలో దేవుడు మనకు ఇస్తాడు” అని అబ్రాహాము జవాబిచ్చాడు. కనుక అబ్రాహాము, అతని కుమారుడు ఇద్దరూ కలిసి ఆ చోటుకి వెళ్లారు.
GEN 22:9 దేవుడు వారికి వెళ్లమని చెప్పిన చోటుకి వారు వెళ్లారు. అక్కడ అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. కట్టెలను ఆ బలిపీఠం మీద పెట్టాడు. తర్వాత తన కుమారుడు ఇస్సాకును అబ్రాహాము కట్టివేసాడు. బలిపీఠం మీద కట్టెలపై ఇస్సాకును పరుండబెట్టాడు.
GEN 22:10 అప్పుడు అబ్రాహాము తన ఖడ్గం తీసుకొని తన కుమారుని చంపడానికి సిద్ధమయ్యాడు.
GEN 22:11 కాని అప్పుడు యెహోవా దూత అబ్రాహామును ఆపు చేసాడు. దేవుదూత ఆకాశం నుండి “అబ్రాహామా, అబ్రాహామా” అని పిలిచాడు. “చిత్తం” అని అబ్రాహాము జవాబిచ్చాడు.
GEN 22:12 “నీ కుమారుని చంపవద్దు, అతనికి ఏ హానీ చేయవద్దు. నీకు దేవుని పట్ల భయం, ఆరాధనా భావం ఉన్నాయని నాకిప్పుడు తెలుసు. నా కోసం, నీ కుమారుణ్ణి అదీ నీ ఒకే ఒక్క కుమారుణ్ణి చంపడానికి గూడా నీవు సిద్ధమేనని నేను చూశాను” అన్నాడు దేవదూత.
GEN 22:13 అబ్రాహాము అటు ప్రక్క చూడగా ఒక పొట్టేలు కనబడింది. ఆ పొట్టేలు కొమ్ములు ఒక పొదలో చిక్కుకొన్నాయు. కనుక అబ్రాహాము వెళ్లి, పొట్టేలును పట్టుకొని దానిని చంపాడు. ఆ పొట్టేలును దేవునికి బలిగా అబ్రాహాము ఉపయోగించాడు. అబ్రాహాము కుమారుడు రక్షించబడ్డాడు.
GEN 22:14 అందుచేత ఆ స్థలానికి “యెహోవా ఈరె” అని అబ్రాహాము పేరు పెట్టాడు. “ఈ పర్వతం మీద యెహోవా చూసుకుంటాడు” అని ఇప్పటికి ప్రజలు చెబుతారు.
GEN 22:15 ఆకాశంనుండి యెహోవా దూత అబ్రాహామును రెండవసారి పిల్చాడు.
GEN 22:16 యెహోవా దూత చెప్పాడు: “నా కోసం నీ కుమారుణ్ణి చంపడానికి నీవు సిద్ధపడ్డావు. అతడు నీకు ఒక్కడే కుమారుడు. నా కోసం నీవు ఇలా చేశావు గనుక నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను. యెహోవానైన నేను వాగ్దానం చేసేది ఏమిటంటే
GEN 22:17 నిజంగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఆకాశంలో అసంఖ్యాక నక్షత్రాలులాగా సముద్ర తీరంలో ఇసుకలాగా నీ సంతానమును చేస్తాను. నీ ప్రజలు వారి శత్రువులనందరినీ ఓడిస్తారు.
GEN 22:18 నీ సంతానం ద్వారా భూమిమీద ప్రతిజనం ఆశీర్వదించబడతారు. నీవు నాకు విధేయుడవయ్యావు కనుక నేను దీన్ని చేస్తాను.”
GEN 22:19 అప్పుడు అబ్రాహాము మళ్లీ తన సేవకుల దగ్గరకు వెళ్లిపోయాడు. వాళ్లంతా బెయేర్షెబాకు ప్రయాణమై వెళ్లిపోయారు, అబ్రాహాము అక్కడ నివసించాడు.
GEN 22:20 ఈ సంగతులన్నీ జరిగాక, అబ్రాహాముకు ఒక సందేశం పంపబడింది. ఆ సందేశం ఇది, “నీ సోదరుడు నాహోరు, అతని భార్య మిల్కాకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు.
GEN 22:21 మొదటి కుమారుడు ఊజు. రెండవ కుమారుడు బూజు, మూడవ కుమారుడు కెమూయేలు, అతడు అరాము తండ్రి.
GEN 22:22 ఆ తర్వాత కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయోలు అనువారు ఉన్నారు.”
GEN 22:23 బెతూయేలు రిబ్కాయొక్క తండ్రి. ఈ ఎనిమిది మంది కుమారులకు తల్లి మిల్కా, తండ్రి నాహోరు. నాహోరు అబ్రాహాము సోదరుడు.
GEN 22:24 మరియు నాహోరు దాసియైన రయూమా ద్వారా అతనికి ఇంకా నలుగురు కుమారులు తెబహు, గహము, తహషు, మయకా కలిగారు.
GEN 23:1 శారా 127 సంవత్సరాలు జీవించింది.
GEN 23:2 కనాను దేశంలోని కిర్యతర్బా పట్టణంలో (అనగా హెబ్రోను) అమె మరణించింది. అబ్రాహాము చాలా దుఃఖించి, ఆమె కోసం అక్కడ ఏడ్చాడు.
GEN 23:3 అప్పుడు మరణించిన తన భార్యను విడచిపెట్టి, హిత్తీ ప్రజలతో మాట్లాడేందుకు అబ్రాహాము వెళ్లాడు.
GEN 23:4 “నేను ఈ దేశవాసిని కాను. ఇక్కడ నేను యాత్రికుడను మాత్రమే. అందుచేత నా భార్యను పాతిపెట్టుటకు నాకు స్థలము లేదు. నేను నా భార్యను పాతిపెట్టడానికి దయచేసి నాకు కొంత స్థలం ఇవ్వండి” అన్నాడు.
GEN 23:5 హిత్తీ ప్రజలు అబ్రాహాముకు ఇలా జవాబు చెప్పారు.
GEN 23:6 “అయ్యా, మా మధ్య మీరు దేవుని మహా నాయకులలో ఒకరు. చనిపోయిన మీ వాళ్లను పాతిపెట్టేందుకు మా శ్రేష్ఠమైన స్థలాన్ని మీరు తీసుకోవచ్చు. చనిపోయిన వాళ్లను పాతిపెట్టే మా స్థలాల్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అక్కడ మీ భార్యను పాతిపెట్టడానికి మేము ఎవ్వరం అడ్డు చెప్పం.”
GEN 23:7 అబ్రాహాము లేచి ప్రజలకు నమస్కరించాడు.
GEN 23:8 అబ్రాహాము వాళ్లతో చెప్పాడు: “నేను నా భార్యను పాతిపెట్టడానికి మీరు నిజంగా నాకు సహాయం చేయగోరితే, సోహరు కుమారుడు ఎఫ్రోనుతో నా పక్షంగా మీరు మాట్లాడండి.
GEN 23:9 మక్పేలా గుహను నేను కొనాలని కోరుతున్నాను. ఇది ఎఫ్రోను స్వంతం. అది అతని పొలం చివరిలో ఉంది. దాని విలువ ఎంతో అంత మొత్తం నేను చెల్లిస్తాను. పాతిపెట్టే స్థలంగా దీనిని నేను కొంటున్నట్టు మీరంతా సాక్షులుగా ఉండాలని నేను కోరుతున్నాను.”
GEN 23:10 ఎఫ్రోను ఆ జనం మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఎఫ్రోను అబ్రాహాముకు ఇలా జవాబిచ్చాడు:
GEN 23:11 “లేదయ్యా, నేను ఆ స్థలం ఇక్కడ మా అందరి ప్రజల సమక్షంలో నీకిచ్చేస్తాను. ఆ గుహను నేను నీకిస్తాను. నీవు నీ భార్యను పాతిపెట్టుకొనేందుకు ఆ స్థలం నేను నీకు ఇచ్చివేస్తాను.”
GEN 23:12 అప్పుడు అబ్రాహాము హిత్తీయుల ముందు వంగి నమస్కారం చేసాడు.
GEN 23:13 అబ్రాహాము, “ఆ పొలానికి పూర్తి ధర నేను చెల్లిస్తాను. నా డబ్బు స్వీకరించి, నా మృతులను నేను పాతిపెట్టుకొంటాను” అని ప్రజలందరి ముందు ఎఫ్రోనుతో చెప్పాడు.
GEN 23:14 అబ్రాహాముకు ఎఫ్రోను జవాబు చెప్పాడు:
GEN 23:15 “అయ్యా నా మాట వినండి. 400 తులాల వెండి మీకు గాని నాకు గాని ఏపాటి? భూమిని తీసుకొని, చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో.”
GEN 23:16 తనతో ఆ పొలం వెల ఎఫ్రోను చెబుతున్నాడని గ్రహించి ఆ వెల 400 తులాల వెండి తూచి అబ్రాహాము అతనికి ఇచ్చాడు.
GEN 23:17 కనుక ఎఫ్రోను పొలానికి స్వంతదారులు మారిపోయారు. ఈ పొలం మమ్రేకు తూర్పున మక్పేలాలో ఉంది. ఆ పొలానికి, పొలంలో ఉన్న గుహకు, అందులోని చెట్లన్నిటికీ, అబ్రాహాము స్వంతదారుడయ్యాడు. ఎఫ్రోను అబ్రాహాముల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆ పట్టణ ప్రజలంతా చూశారు.
GEN 23:19 ఇది జరిగిన తర్వాత మమ్రే దగ్గర ఉన్న మక్పేలా గుహలో అబ్రాహాము తన భార్యను పాతి పెట్టాడు (అది కనానులోని హెబ్రోను)
GEN 23:20 ఆ పొలాన్ని, దానిలోని గుహను హిత్తీ ప్రజల దగ్గర అబ్రాహాము కొన్నాడు. ఇది అతని ఆస్తి అయ్యింది, దాన్ని అతడు పాతిపెట్టే స్థలంగా ఉపయోగించాడు.
GEN 24:1 అబ్రాహాము కురువృద్ధుడయ్యేంత వరకు జీవించాడు. అబ్రాహామును, అతడు చేసిన దాన్నంతటిని దేవుడు ఆశీర్వదించాడు.
GEN 24:2 అబ్రాహాము యొక్క పాత సేవకుడు ఆస్తి వ్యవహారాలన్నింటి మీద నిర్వాహకునిగా ఉన్నాడు. ఆ సేవకుణ్ణి అబ్రాహాము తన దగ్గరకు పిలిచి ఇలా చెప్పాడు: “నీ చేయి నా తొడకింద పెట్టు.
GEN 24:3 ఇప్పుడు నీవు నాకు ఒక వాగ్దానం చేయాలి. కనాను స్త్రీలలో ఎవరినీ నా కుమారుని పెళ్లి చేసుకోనివ్వవని భూమ్యాకాశాలకు దేవుడుగు యెహోవా ఎదుట నాకు వాగ్దానం చేయి. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం గాని అతణ్ణి మాత్రం కనాను స్త్రీని వివాహం చేసుకోనివ్వవద్దు.
GEN 24:4 నా దేశంలోని నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లు. అక్కడ నా కుమారుని కోసం భార్యను చూడు. అప్పుడు ఆమెను ఇక్కడికి (అతని దగ్గరకు) తీసుకురా.”
GEN 24:5 ఆ సేవకుడు, “ఒకవేళ ఆ స్త్రీ నాతో కలిసి ఈ దేశం రావడానికి ఇష్టపడకపోతే, నీ కుమారుడ్ని నేను నీ స్వంత దేశానికి తీసుకొని వెళ్లవచ్చునా?” అని అడిగాడు.
GEN 24:6 అబ్రాహాము అతనితో చెప్పాడు: “వద్దు, నా కుమారుని ఆ దేశం తీసుకు వెళ్లొద్దు.
GEN 24:7 పరలోక దేవుడైన యెహోవా నా స్వదేశము నుండి ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చాడు. ఆ దేశం నా తండ్రికి, నా కుటుంబానికి మాతృదేశం కాని ఈ నూతన దేశం నీ కుటుంబానికి చెందుతుందని యెహోవా వాగ్దానం చేసాడు. ప్రభువు నీకంటే ముందర తన దేవదూతను పంపిస్తాడు. మరి నీవు నా కుమారునికి వధువును అక్కడనుంచి తెస్తావు.
GEN 24:8 అయితే అమ్మాయి నీతో రావటానికి నిరాకరిస్తే, ఈ వాగ్దాన విషయంలో నీ బాధ్యత తీరుపోతుంది. అంతేగాని నా కుమారుని మాత్రం నీవు ఆ దేశానికి తిరిగి తీసుకువెళ్లొద్దు.”
GEN 24:9 కనుక ఆ సేవకుడు తన యజమాని తొడకింద తన చేయి పెట్టి వాగ్దానం చేసాడు.
GEN 24:10 అబ్రాహాము ఒంటెలలో పదింటిని తీసుకొని ఆ సేవకుడు ఆ చోటు విడిచి వెళ్లాడు. రకరకాల అందాల కానుకలు ఎన్నో తనతో కూడ ఆ సేవకుడు తీసుకెళ్లాడు. మెసపొతేమియాలోని నాహోరు పట్టణం వెళ్లాడు ఆ సేవకుడు.
GEN 24:11 పట్టణం వెలుపల ఉన్న మంచి నీళ్ల బావి దగ్గరకు ఆ సేవకుడు సాయంకాలం వెళ్లాడు. నీళ్లు తీసుకొని పోయేందుకు స్త్రీలు సాయంకాలం వస్తారు. ఆ సేవకుడు తన ఒంటెలను అక్కడ మోకరింపజేసాడు.
GEN 24:12 ఆ సేవకుడు చెప్పాడు: “ప్రభూ, నీవు నా యజమాని అబ్రాహాము దేవుడవు. ఈ వేళ నన్ను అతని కుమారుని కోసం భార్యను కనుగొనునట్లు చేయుము. నా యజమాని అబ్రాహాముకు దయచేసి ఈ మేలు అనుగ్రహించు.
GEN 24:13 ఇదిగో, మంచి నీళ్లు బావి దగ్గర నేను ఉన్నాను, పట్టణం నుండి అమ్మాయిలు నీళ్లు తోడటానికి ఇక్కడికి వస్తున్నారు.
GEN 24:14 ఇస్సాకు కోసం ఏ అమ్మాయి సరైనదో తెలుసుకొనేందుకు ఒక ప్రత్యేక సూచన కోసం నేను కనిపెడుతున్నాను. ఆ ప్రత్యేక సూచన ఏమిటంటే: ‘నేను నీళ్లు తాగాలి, నీ కడవ కింద పెట్టు’ అని అమ్మాయితో నేను అంటాను. ‘తాగు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను’ అని అమ్మాయి గనుక చెబితే, అప్పుడు ఆమె సరైన అమ్మాయి అని నేను తెలుసుకొంటాను. అలా జరిగితే ఆమె ఇస్సాకుకు సరైన జోడు అని నీవు రుజువు చేసినట్టే. నా యజమానికి నీవు కరుణ చూపించావని నాకు తెలుస్తుంది.”
GEN 24:15 అంతలో, ఆ సేవకుడు ప్రార్థన ముగించక ముందే రిబ్కా అనే ఒక అమ్మాయి తన గ్రామం నుండి బావి దగ్గరకు వచ్చింది. రిబ్కా బెతూయేలు కుమార్తె. బెతూయేలు అబ్రాహాము సోదరుడు నాహోరు, మిల్కాల కుమారుడు. రిబ్కా తన నీళ్ల కడవ తన భుజంమీద పెట్టుకొని బావి దగ్గరకు వచ్చింది.
GEN 24:16 ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఆమె కన్య. ఆమె ఎన్నడూ పురుషునితో శయనించలేదు. ఆమె తన కడవ నింపుకోటానికి బావిలోనికి దిగింది.
GEN 24:17 అప్పుడు ఆ సేవకుడు ఆమె దగ్గరకు పరుగెత్తి వెళ్లి, “నాకు తాగటానికి దయచేసి నీ కడవలో కొన్ని నీళ్లు ఇస్తావా” అన్నాడు.
GEN 24:18 రిబ్కా త్వరగా తన భుజంమీద నుండి కడవ దించి, అతనికి నీళ్లు ఇచ్చింది. “అయ్యా, ఇదిగో తాగండి” అంది రిబ్కా.
GEN 24:19 అతను తాగటానికి పోయడం అయిన వెంటనే, “నీ ఒంటెలకు గూడా నేను నీళ్లు పోస్తాను” అంది రిబ్కా.
GEN 24:20 రిబ్కా వెంటనే తన కడవలోని నీళ్లన్నీ ఒంటెల కోసం అని చెప్పి నీళ్ల తొట్టిలో పోసింది. తర్వాత ఇంకా నీళ్లు తెచ్చేందుకు ఆమె బావి దగ్గరకు పరుగెత్తింది. ఆ ఒంటెలన్నింటికి ఆమె నీళ్లు పెట్టింది.
GEN 24:21 ఆ సేవకుడు మౌనంగా ఆమెను గమనించాడు. యెహోవా తనకు జవాబిచ్చాడని, తన ప్రయాణాన్ని విజయవంతం చేశాడని అతను రూఢిగా తెలుసుకోవాలనుకొన్నాడు.
GEN 24:22 ఒంటెలు నీళ్లు తాగడం అయిపోగానే, అతడు అరతులం బంగారపు ఉంగరం రిబ్కాకు ఇచ్చాడు. 5 తులాల ఎత్తుగల బంగారపు గాజులు రెండు అతడు ఆమెకు ఇచ్చాడు.
GEN 24:23 “నీ తండ్రి ఎవరు? మా గుంపు పండుకొనేందుకు నీ తండ్రి ఇంటిలో చోటు ఉందా?” అని ఆ సేవకుడు ఆమెను అడిగాడు.
GEN 24:24 “నా తండ్రి బెతూయేలు, నాహోరు మిల్కాయొక్క కుమారుడు” అని రిబ్కా జవాబిచ్చింది.
GEN 24:25 తర్వాత, “అవునండి, మీ ఒంటెలకు గడ్డి, మీరు పండుకొనేందుకు స్థలం మా దగ్గర ఉంది” అని ఆమె చెప్పింది.
GEN 24:26 ఆ సేవకుడు వంగి యెహోవాను ఆరాధించి,
GEN 24:27 “నా యజమాని అబ్రాహాము దేవుడైన యెహోవా స్తుతించబడు గాక. యెహోవా నా యజమానుని పట్ల దయ చూపాడు. నా యజమాని బంధువు యింటికి యెహోవా నన్ను నడిపించాడు” అని చెప్పాడు.
GEN 24:28 అప్పుడు రిబ్కా పరుగెత్తి వెళ్లి తన ఇంటివారికి ఈ సంగతులన్నీ చెప్పింది.
GEN 24:29 రిబ్కాకు ఒక సోదరుడు ఉన్నాడు. అతని పేరు లాబాను. ఆ మనిషి తనతో చెప్పిన విషయాలు రిబ్కా చెప్పింది. లాబాను ఆమె మాటలు వింటున్నాడు. ఎప్పుడైతే తన సోదరి చేతులకు ఉంగరం, గాజులు లాబాను చూశాడో, అప్పుడు బావి దగ్గరకు అతడు పరుగెత్తాడు. అక్కడ ఆ మనిషి బావి దగ్గర ఒంటెల పక్కగా నిలబడి ఉన్నాడు.
GEN 24:31 “అయ్యా, తమరికి లోనికి సుస్వాగతం. మీరలా ఇక్కడే బయట నిలబడి ఉండనక్కర్లేదు. మీ ఒంటెలకు స్థలం, మీరు పండుకొనేందుకు గది నేను సిద్ధం చేసాను” అని లాబాను చెప్పాడు.
GEN 24:32 కనుక అబ్రాహాము సేవకుడు ఆ ఇంటిలో ప్రవేశించాడు. ఒంటెల పనిలో అతనికి లాబాను సహాయం చేసి, అతని ఒంటెలకు గడ్డి వేసాడు. అతను, అతనితో ఉన్న మనుష్యులకు కాళ్లు కడుక్కొనేందుకు నీళ్లు ఇచ్చాడు.
GEN 24:33 తర్వాత లాబాను అతనికి భోజనం పెట్టాడు. అయితే ఆ సేవకుడు తినకుండా నిరాకరించాడు. “నేను ఎందుకు వచ్చానో మీతో చేప్పకుండా నేను భోజనం చేయను” అన్నాడు అతను. కనుక లాబాను, “అలాగైతే మాతో చెప్పు మరి” అన్నాడు.
GEN 24:34 ఆ సేవకుడు చెప్పింది ఇది: “నేను అబ్రాహాము సేవకుడను.
GEN 24:35 అన్ని విషయాల్లోను యెహోవా నా యజమానిని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. నా యజమాని మహా ఘనుడయ్యాడు. గొర్రెల మందలు, పశువుల మందలు విస్తారంగా యెహోవా అబ్రాహాముకు ఇచ్చాడు. అబ్రాహాముకు వెండి బంగారాలు విస్తారంగా ఉన్నాయి. చాలా మంది ఆడ మగ సేవకులు ఉన్నారు. ఒంటెలు, గాడిదలు చాలా ఉన్నాయి.
GEN 24:36 నా యజమాని భార్య శారా. ఆమె చాలా వృద్ధాప్యంలో ఒక కుమారుని కన్నది. నా యజమాని తన ఆస్తి సర్వం ఆ కుమారునికి ఇచ్చాడు.
GEN 24:37 నేను ఒక వాగ్దానం చేయాలని నా యజమాని నన్ను బలవంతం చేసాడు. నా యజమాని ‘నా కుమారుణ్ణి కనాను అమ్మాయిల్లో ఎవర్నీ చేసుకోనివ్వగూడదు. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం కాని కనాను అమ్మాయిల్నెవరినీ అతడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు.
GEN 24:38 కనుక నీవు నా తండ్రి దేశానికి వెళ్తావని వాగ్దానం చేయాలి. నా వంశం వారి దగ్గరకు వెళ్లి, నా కుమారుని కోసం భార్యను కుదుర్చి’ అని నాతో చెప్పాడు.
GEN 24:39 ‘ఒక వేళ ఆ స్త్రీ నాతో కలిసి ఈ దేశానికి రాదేమో’ అని నేను నా యజమానితో అన్నాను.
GEN 24:40 అయితే నా యజమాని నాతో ఇలా చెప్పాడు, ‘నేను యెహోవాను సేవిస్తాను, యెహోవా తన దూతను నీతో కూడ పంపి నీకు సహాయం చేస్తాడు. అక్కడి ప్రజలలో నా కుమారుని కోసం భార్యను నీవు కనుక్కొంటావు.
GEN 24:41 కాని నీవు నా తండ్రి దేశం వెళ్లాక, నా కుమారుని కోసం భార్యను ఇచ్చేందుకు వారు నిరాకరిస్తే, అప్పుడు ఈ ప్రమాణ బాధ్యత నీకు ఉండదు.’
GEN 24:42 “ఈ వేళ నేను ఈ బావి దగ్గరకు వచ్చి అన్నాను: ‘నా యజమాని అబ్రాహాము దేవుడైన యెహోవా, దయతో నా ప్రయాణం విజయవంతం చేయి.
GEN 24:43 నేను ఈ బావి దగ్గర నిలబడి, నీళ్లకోసం ఒక అమ్మాయి ఇక్కడికి రావాలని నిరీక్షిస్తాను. అప్పుడు నేను, దయచేసి తాగటానికి నీ కడవలోనుంచి నీళ్లు ఇమ్మని అడుగుతాను.
GEN 24:44 సరైన అమ్మాయి అయితే ఒక ప్రత్యేక విధానంలో జవాబిస్తుంది. ఈ నీళ్లు తాగు, నీ ఒంటెలకు గూడ నేను నీళ్లు తెస్తాను అని ఆమె అంటుంది. ఆ విధంగా, నా యజమాని కుమారుని కోసం యెహోవా ఏర్పరచిన స్త్రీ ఆమె అని నేను తెలుసుకొంటాను.’
GEN 24:45 “నేను ప్రార్థించటం ముగించక ముందే, నీళ్ల కోసం రిబ్కా బావి దగ్గరకు వచ్చింది. ఆమె తన నీళ్ల కడవ తన భుజం మీద పెట్టుకొంది. ఆమె వెళ్లి బావినుండి నీళ్లు తోడింది. ‘దయచేసి కొంచెం నీళ్లు ఇమ్మని’ నేను ఆమెతో అన్నాను.
GEN 24:46 వెంటనే ఆమె తన భుజం మీదనుండి కడవదించి, నాకు నీళ్లు పోసి, ‘ఇవి త్రాగు, నీ ఒంటెలకు గూడ నేను నీళ్లు తెస్తాను’ అంది. అందుచేత నేను నీళ్లు తాగాను, నా ఒంటెలకు కూడా ఆమె నీళ్లు పెట్టింది.
GEN 24:47 అప్పుడు ‘నీ తండ్రి ఎవరు?’ అని నేను ఆమెను అడిగాను. ‘మిల్కా నాహోరుల కుమారడైన బెతూయేలు నా తండ్రి’ అని ఆమె జవాబిచ్చింది. అప్పుడు ఆమె చేతికి ఉంగరం, గాజులు నేను ఇచ్చాను.
GEN 24:48 ఆ సమయంలో నేను నా తలవంచి యెహోవాకు వందనాలు చేశాను. నా యజమాని దేవుడైన యెహోవాను నేను స్తుతించాను. నా యజమాని సోదరుని మనుమరాలి దగ్గరకే నన్ను ఆయన తిన్నగా నడిపించినందుకు ఆయనకు వందనాలు చెప్పాను.
GEN 24:49 ఇప్పుడు మీరేం చేస్తారో నాకు చెప్పండి. నా యజమాని యెడల మీరు దయ, నమ్మకత్వం చూపి, మీ కుమార్తెను ఆయనకు ఇస్తారా? లేక మీ కుమార్తెను ఇవ్వటానికి నిరాకరిస్తారా? నేను ఏమి చెయ్యాలో నాకు తెలిసేటట్టు, మీరు చెప్పండి.”
GEN 24:50 అప్పుడు లాబాను, బెతూయేలు జవాబిచ్చారు. “ఇది యెహోవా నుండి వచ్చినట్లు మేము చూస్తున్నాము. కాబట్టి దీన్ని మార్చమని మేము చెప్పుటకు ఏమీలేదు.
GEN 24:51 రిబ్కా నీ ముందే వున్నది. ఆమెను తీసుకొని వెళ్లు. నీ యజమాని కుమారుణ్ణి ఆమె పెళ్లి చేసుకొంటుంది. ఇదే యెహోవా కోరేది.”
GEN 24:52 అబ్రాహాము సేవకుడు ఈ మాటలు విని, యెహోవా యెదుట నేలపై సాగిలపడ్డాడు.
GEN 24:53 అప్పుడు ఆ సేవకుడు తాను తెచ్చిన కానుకలను రిబ్కాకు ఇచ్చాడు బంగారు వెండి నగలు, ఎన్నో అందమైన బట్టలు అతడు రిబ్కాకు యిచ్చాడు. ఆమె సోదరునికి, తల్లికి గూడ చాలా ఖరీదైన కానుకలు అతడు ఇచ్చాడు.
GEN 24:54 ఆ సేవకుడు, అతనితోనున్న సేవకులు తిని, తాగి అక్కడే ఉన్నారు. ఆ రాత్రి వారు అక్కడే ఉన్నారు. మర్నాడు ఉదయం వారు లేచి, “ఇప్పుడు మేం తిరిగి మా యజమాని దగ్గరకు వెళ్తాం” అన్నారు.
GEN 24:55 అప్పుడు రిబ్కా తల్లి, సహోదరుడు ఈ విధంగా చెప్పారు, “రిబ్కాను కొన్నాళ్లు మా దగ్గర ఉండనివ్వు. పది రోజులు ఉండనివ్వు. ఆ తర్వాత ఆమె వెళ్లవచ్చు.”
GEN 24:56 కానీ ఆ సేవకుడు, “నన్ను ఇంక ఆపవద్దు. నా ప్రయాణాన్ని యెహోవా విజయవంతం చేసాడు. కనుక ఇప్పుడు నా యజమాని దగ్గరకు నన్ను వెళ్లనివ్వండి” అని వారితో చెప్పాడు.
GEN 24:57 “రిబ్కాను పిలిచి, ఆమె ఇష్టం ఏమీటో మేము అడుగుతాం” అన్నారు రిబ్కా అన్న, తల్లి.
GEN 24:58 వారు రిబ్కాను పిలిచి, “నీవు ఈ మనుష్యునితో కలిసి ఇప్పుడే వెళ్తావా?” అని అడిగారు. “అవును, నేను వెళ్తాను అంది రిబ్కా.”
GEN 24:59 కనుక అబ్రాహాము సేవకునితో, అతని మనుష్యులతో కలిసి రిబ్కా వెళ్లటానికి వారు అనుమతించారు. రిబ్కా దాది కూడ వారితో వెళ్లింది.
GEN 24:60 వారు వెళ్తున్నప్పుడు రిబ్కాతో వారు ఇలా చెప్పారు: “మా సోదరి, వేలమందికి, పది వేలమందికి నీవు తల్లిని అవుదువు గాక. నీ సంతానము వారి శత్రువులను ఓడించి వారి పట్టణాలను స్వాధీనం చేసుకొందురు గాక!”
GEN 24:61 అప్పుడు రిబ్కా, ఆమె దాది ఒంటెలను ఎక్కి ఆ సేవకుని, అతని మనుష్యులను వెంబడించారు. ఆ విధంగా ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని తిరుగు ప్రయాణమయ్యాడు.
GEN 24:62 అప్పటికి ఇస్సాకు బెయేర్ లహాయిరోయి విడిచి, నెగెవులో నివసిస్తున్నాడు.
GEN 24:63 ఒక సాయంకాలం ఇస్సాకు ధ్యానించుట కోసం అలా బయటకు పోలాల్లోకి వెళ్లాడు. ఇస్సాకు తలెత్తి చూచేటప్పటికి అంత దూరంలో వస్తున్న ఒంటెలు కనిపించాయి.
GEN 24:64 రిబ్కా తలెత్తి ఇస్సాకును చూసింది. అప్పుడామె ఒంటె మీద నుండి క్రిందికి దిగెను.
GEN 24:65 “మనలను కలుసుకొనేందుకు ఆ పొలాల్లో నడిచి వస్తున్న యువకుడు ఎవరు?” అంటు ఆమె సేవకుని అడిగింది. “ఆయనే నా యజమాని కుమారుడు” అని చెప్పాడు ఆ సేవకుడు. కనుక రిబ్కా తన ముఖం మీద ముసుగు కప్పుకొంది.
GEN 24:66 జరిగిన సంగతులన్నీ ఇస్సాకుతో ఆ సేవకుడు చెప్పాడు.
GEN 24:67 అప్పుడు ఇస్సాకు ఆ అమ్మాయిని తన తల్లి గుడారంలోకి తీసుకు వచ్చాడు. ఆ రోజు రిబ్కా ఇస్సాకు భార్య అయ్యింది. ఇస్సాకు ఆమెను చాలా ప్రేమించాడు. తన తల్లి మరణించిన తర్వాత ఇస్సాకు దుఃఖనివారణ పొందాడు.
GEN 25:1 అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకొన్నాడు. ఆయన కొత్త భార్య పేరు కెతూరా.
GEN 25:2 కెతూరాకు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు పుట్టారు.
GEN 25:3 యొక్షాను, షేబ, దెదానులకు తండ్రి. అష్షూరు, లెయుమీ మరియు లెతూషీ ప్రజలు దెదాను సంతానము.
GEN 25:4 మిద్యాను కుమారులు ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. అబ్రాహాము కెతూరా, వివాహం మూలంగా ఈ కుమారులంతా పుట్టారు.
GEN 25:5 అబ్రాహాము చనిపోక ముందు తన దాసీల కుమారులందరికి అతడు కొన్ని కానుకలు ఇచ్చాడు. ఆ కుమారులను అబ్రాహాము తూర్పునకు పంపాడు. అతడు వారిని ఇస్సాకుకు దూరంగా పంపించి వేసాడు. అప్పుడు అబ్రాహాము తన ఆస్తి సర్వస్వం ఇస్సాకుకు ఇచ్చాడు.
GEN 25:7 అబ్రాహాము 175 సంవత్సరాలు వయస్సు వరకు జీవించాడు.
GEN 25:8 అప్పుడు అబ్రాహాము బలము తగ్గిపోయి చనిపోయాడు. సుదీర్ఘ సంతృప్తికర జీవతం అతడు జీవించాడు. అతడు మరణించి తనవారి దగ్గరకు చేర్చబడ్డాడు.
GEN 25:9 అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు కలసి మక్పేలా గుహలో అతణ్ణి పాతిపెట్టారు. సోహరు కుమారుడు ఎఫ్రోను పొలంలో ఈ గుహ ఉంది. అది మమ్రేకు తూర్పున ఉంది.
GEN 25:10 హిత్తీ ప్రజల దగ్గర్నుండి అబ్రాహాము కొన్న గుహ ఇదే. అబ్రాహాము తన భార్య శారాతో అక్కడ పాతిపెట్టబడ్డాడు.
GEN 25:11 అబ్రాహాము చనిపోయిన తరువాత, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. మరియు ఇస్సాకు బేయేర్ లహాయిలోనే నివాసం కొనసాగించాడు.
GEN 25:12 ఇష్మాయేలు వంశంవారి జాబితా ఇది. అబ్రాహాము హాగరుల కుమారుడు ఇష్మాయేలు. (శారాకు ఈజిప్టు దాసి హాగరు.)
GEN 25:13 ఇష్మాయేలు కుమారుల పేర్లు ఇవి: మొదటి కుమారుని పేరు సేబాయోతు, తర్వాత కేదారు పుట్టాడు, తర్వాత అద్బయేలు, మిబాశిము,
GEN 25:14 మిష్మా, దమారమశ్శా,
GEN 25:15 హదరు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా పుట్టారు.
GEN 25:16 అవి ఇష్మాయేలు కుమారుల పేర్లు. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత శిబిరం ఉండేది, అదే ఒక చిన్న పట్టణం అయింది. పన్నెండు మంది కుమారులు, వారి స్వంత ప్రజలతో, పన్నెండు మంది యువరాజుల్లా ఉన్నారు.
GEN 25:17 ఇష్మాయేలు 137 సంవత్సరాలు బతికాడు. తరువాత అతను చనిపోయి, అతని పూర్వీకులతో చేర్చబడ్డాడు.
GEN 25:18 ఇష్మాయేలు సంతానం వారు ఎడారి ప్రాంతమంతా బసచేసారు. ఈ ప్రాంతం ఈజిప్టు దగ్గర హవీలా, షూరు నుండి ఉత్తరపు చివరన అష్షూరు వరకు విస్తరించి ఉంది. ఇష్మాయేలు సంతానము తరచూ అతని సోదరుని ప్రజలను ఎదుర్కొన్నారు.
GEN 25:19 ఇస్సాకు కుటుంబం చరిత్ర ఇది. అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడు ఉన్నాడు.
GEN 25:20 ఇస్సాకు వయస్సు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రిబ్కాను అతడు వివాహం చేసుకొన్నాడు. రిబ్కా పద్దనరాముకు చెందినది. ఆమె బెతూయేలు కుమార్తె, అరామీయుడగు లాబానుకు సోదరి.
GEN 25:21 ఇస్సాకు భార్యకు పిల్లలు పుట్టలేదు. కనుక ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థించాడు. ఇస్సాకు ప్రార్థన యెహోవా విన్నాడు. రిబ్కాను గర్భవతి కానిచ్చాడు.
GEN 25:22 రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె గర్భంలో కవల పిల్లలు పెనుగులాడారు. రిబ్కా యెహోవాను ప్రార్థించి, “ఎందుకు నాకు ఇలా జరిగింది?” అని అడిగింది.
GEN 25:23 ఆమెతో యెహోవా చెప్పాడు: “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి. రెండు వంశాల పాలకులు నీలోనుండి పుడతారు. కాని వారు విభజించబడతారు. ఒక కుమారుడు మరో కుమారుని కంటే బలవంతుడుగా ఉంటాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుని సేవిస్తాడు.”
GEN 25:24 తగిన సమయం రాగానే రిబ్కా కవల పిల్లల్ని కన్నది.
GEN 25:25 మొదట శిశువు ఎరుపు. వాని చర్మం బొచ్చు అంగీలా ఉంది. కనుక వానికి ఏశావు అని పేరు పెట్టబడింది.
GEN 25:26 రెండవ శిశువు పుట్టినప్పుడు వాడు ఏశావు మడిమను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కనుక ఆ శిశువుకు యాకోబు అని పేరు పెట్టబడింది. యాకోబు, ఏశావు పుట్టినప్పుడు ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు.
GEN 25:27 అబ్బాయిలు పెద్దవాళ్లయ్యారు. ఏశావు నిపుణతగల వేటగాడయ్యాడు. బయట పొలాల్లో ఉండటం అంటే అతనికి చాలా ఇష్టం. అయితే యాకోబు నెమ్మదిపరుడు. అతను తన గుడారంలోనే ఉన్నాడు.
GEN 25:28 ఇస్సాకు ఏశావును చాలా ప్రేమించాడు. ఏశావు వేటాడిన జంతువులను తినటం అతనికి ఇష్టం. కాని రిబ్కాకు యాకోబు మీద ప్రేమ.
GEN 25:29 ఒకసారి ఏశావు వేటనుండి తిరిగి వచ్చాడు. అతను అలసిపోయి, ఆకలితో బలహీనంగా ఉన్నాడు. యాకోబు వంట పాత్రలో చిక్కుడుకాయలు వండుతున్నాడు.
GEN 25:30 కనుక ఏశావు, “నేను ఆకలితో నీరసం అయిపోయాను ఆ ఎర్రటి చిక్కుడు కాయలు నాకు కొంచెం పెట్టు” అని యాకోబును అడిగాడు. (అందుకే ప్రజలు అతణ్ణి ఏదోం అని పిలిచేవాళ్లు.)
GEN 25:31 అయితే యాకోబు, “నీ జ్యేష్ఠత్వపు జన్మ హక్కుల్ని ఈ వేళ నాకు అమ్మివేయాలి” అన్నాడు.
GEN 25:32 ఏశావు “నేను ఆకలితో దాదాపు చచ్చాను. నేను చనిపోతే, నా తండ్రి ఐశ్వర్యారన్నీ నాకు సహాయపడవు. కనుక నా వాటా నీకు ఇచ్చేస్తాను” అన్నాడు.
GEN 25:33 కానీ యాకోబు దాన్ని, “నాకు ఇస్తావని ముందు ప్రమాణం చేయాలి” అన్నాడు. కనుక ఏశావు యాకోబుకు ప్రమాణం చేసాడు. తన తండ్రి ఐశ్వర్యంలో తన వాటాను ఏశావు యాకోబుకు అమ్మివేసాడు.
GEN 25:34 అప్పుడు యాకోబు రొట్టె, భోజనం ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తిని, తాగి వెళ్లిపోయాడు. కనుక ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కులను లక్ష్యపెట్ట లేదని వ్యక్తం చేసాడు.
GEN 26:1 ఒకసారి కరువుకాలం వచ్చింది. అబ్రాహాము జీవిత కాలంలో వచ్చిన కరువులాంటిదే ఇది. కనుక గెరారు పట్టణంలో ఉన్న ఫిలిష్తీ ప్రజల రాజు అబీమెలెకు దగ్గరకు ఇస్సాకు వెళ్లాడు.
GEN 26:2 ఇస్సాకుతో యెహోవా మాట్లాడాడు. యెహోవా చెప్పాడు: “ఈజిప్టు వెళ్లవద్దు. నీవు ఉండాలని నేను నీకు ఆజ్ఞాపించిన దేశంలోనే నీవు నివసించాలి.
GEN 26:3 ఆ దేశంలోనే నీవు నివాసం ఉండు, నేను నీతో ఉంటాను. నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నీకు నీ వంశానికి ఈ భూభాగాలన్నీ ఇస్తాను. నీ తండ్రి అబ్రాహాముకు నేను వాగ్దానం చేసినదంతా నీకు నేను ఇస్తాను.
GEN 26:4 ఆకాశ నక్షత్రాలు ఎన్నో, నీ సంతానం అంతటిదిగా నేను చేస్తాను. ఈ దేశాలన్నీ నీ కుటుంబానికి నేను ఇస్తాను. నీ సంతానం మూలంగా భూమిమీద జనాంగాలన్నీ ఆశీర్వదించబడతాయి.
GEN 26:5 నీ తండ్రియైన అబ్రాహాము నా మాటలకు లోబడి, నేను చెప్పిన వాటిని చేసాడు గనుక నేను ఇది చేస్తాను. అబ్రాహాము నా ఆజ్ఞలకు చట్టాలకు, నియమాలకు విధేయుడయ్యాడు.”
GEN 26:6 కనుక ఇస్సాకు గెరారులో ఉండిపోయి అక్కడ నివసించాడు.
GEN 26:7 ఇస్సాకు భార్య రిబ్కా చాలా అందగత్తె. రిబ్కాను గూర్చి అక్కడి మనుష్యులు ఇస్సాకును అడిగారు. “ఆమె నా సోదరి” అని చెప్పాడు ఇస్సాకు. రిబ్కా తన భార్య అని వారితో చెప్పడానికి ఇస్సాకు భయపడ్డాడు. ఆమెను పొందటం కోసం ఆ మనుష్యులు తనను చంపివేస్తారని ఇస్సాకు భయపడ్డాడు.
GEN 26:8 ఇస్సాకు అక్కడు చాలా కాలం ఉన్న తర్వాత, ఇస్సాకు అతని భార్యతో సరసాలు ఆడుకోవటం అబీమెలెకు తన కిటికీ గుండా చూశాడు.
GEN 26:9 అబీమెలెకు ఇస్సాకును పిలిచి “ఈ స్త్రీ నీ భార్య. ఈమె నీ సోదరి అని మాతో ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. “నీవు ఈమెను పొందటం కోసం నన్ను చంపేస్తావని నేను భయపడ్డాను” అని ఇస్సాకు అతనితో చెప్పాడు.
GEN 26:10 “నీవు మాకు కీడు చేసావు. మా మనుష్యుల్లో ఎవడైనా ఒకడు నీ భార్యతో శయనించి ఉండేవాడు. అప్పుడు అతడు మహా పాపము చేసిన నేరస్థుడయ్యైవాడు” అన్నాడు అబీమెలెకు.
GEN 26:11 అందుచేత అబీమెలెకు ప్రజలందరికి హెచ్చరిక ఇచ్చాడు. “ఈ పురుషునిగాని, ఇతని భార్యనుగాని ఎవరూ బాధించగూడదు. వారిని బాధించినవాడు ఎవరైనా సరే చంపివేయబడతాడు” అని అతడు చెప్పాడు.
GEN 26:12 ఆ దేశంలో ఇస్సాకు పొలాల్లో విత్తనాలు విత్తాడు. ఆ సంవత్సరం అతడు విస్తారంగా పంట కూర్చుకున్నాడు. యెహోవా అతన్ని ఎంతో అశీర్వదించాడు.
GEN 26:13 ఇస్సాకు ధనికుడయ్యాడు. అతడు మహా ఐశ్వర్యవంతుడు అయ్యేవరకు మరింత విస్తారంగా ఐశ్వర్యం కూర్చుకొన్నాడు.
GEN 26:14 గొర్రెల మందలు, పశువుల మందలు అతనికి విస్తారంగా ఉన్నాయి. అతనికి చాలా మంది బానిసలు కూడా ఉన్నారు. ఫిలిష్తీ ప్రజలంతా అతని మీద అసూయ పడ్డారు.
GEN 26:15 కనుక ఇస్సాకు తండ్రియైన అబ్రాహాము, అతని సేవకులు తవ్విన చాలా బావుల్ని ఫిలిష్తీ ప్రజలు పాడుచేశారు. ఆ బావుల్ని ఫిలిష్తీ ప్రజలు మట్టితో నింపారు.
GEN 26:16 అబీమెలెకు ఇస్సాకుతో, “మా దేశం వదలి పెట్టు. నీవు మాకంటే చాలా అత్యధికంగా శక్తిమంతుడవయ్యావు” అన్నాడు.
GEN 26:17 కనుక ఇస్సాకు ఆ స్థలం విడిచిపెట్టి, గెరారు చిన్న నదికి సమీపంలో నివాసం చేసాడు. ఇస్సాకు అక్కడ ఉండి జీవించాడు.
GEN 26:18 దీనికి ఎంతో ముందు అబ్రాహాము చాలా బావులు తవ్వాడు. అబ్రాహాము చనిపోయిన తర్వాత ఫిలిష్తీ ప్రజలు ఆ బావులను చెత్తతో నింపేసారు. కనుక ఇస్సాకు తిరిగి వెళ్లి ఆ బావులను మళ్లీ తవ్వాడు. వాటికి తన తండ్రి పెట్టిన పేర్లే ఇస్సాకు పెట్టాడు.
GEN 26:19 చిన్న నది దగ్గర ఇస్సాకు సేవకులు ఒక బావి తవ్వారు. ఆ బావిలో నీటి ఊట ఒకటి ఉబికింది.
GEN 26:20 అయితే గెరారు లోయలో గొర్రెల మందలను కాసేవాళ్లు ఇస్సాకు పనివాళ్లతో జగడమాడారు. “ఈ నీళ్లు మావి అన్నారు వాళ్లు.” కనుక ఆ బావికి “ఏశెకు” అని ఇస్సాకు పేరు పెట్టాడు. అక్కడ ఆ మనుష్యులు అతనితో జగడమాడారు గనుక దానికి ఆ పేరు పెట్టాడు.
GEN 26:21 అప్పుడు ఇస్సాకు సేవకులు మరో బావి తవ్వారు. ఆ బావి మూలంగా అక్కడి ప్రజలు కూడా జగడమాడారు. కనుక ఆ బావికి “శిత్నా” అని ఇస్సాకు పేరు పెట్టాడు.
GEN 26:22 ఇస్సాకు అక్కడనుండి వెళ్లపోయి మరో బావి తవ్వాడు. ఆ బావి విషయం వాదించటానికి ఎవరూ రాలేదు. కనుక ఆ బావికి “రహెబోతు” అని ఇస్సాకు పేరు పెట్టాడు. “ఇప్పుడు మనకోసం యెహోవా ఒక స్థలం ఇచ్చాడు. ఈ దేశంలో మనం అభివృద్ధిపొంది సఫలము కావాలి.” అన్నాడు ఇస్సాకు.
GEN 26:23 ఆ చోటు నుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్లాడు.
GEN 26:24 ఆ రాత్రి ఇస్సాకుతో యెహోవా మాట్లాడాడు. “నీ తండ్రి అబ్రాహాము దేవుణ్ణి నేను. భయపడకు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వంశస్తులను అభివృద్ధి చేస్తాను. నా సేవకుడు అబ్రాహాము కారణంగా నేను ఇది చేస్తాను” అని చెప్పాడు యెహోవా.
GEN 26:25 కనుక ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధించేందుకు ఒక బలిపీఠాన్ని ఇస్సాకు కట్టించాడు. ఇస్సాకు అక్కడ నివాసం చేయగా, అతని సేవకులు ఒక బావి తవ్వారు.
GEN 26:26 ఇస్సాకును చూసేందుకు గెరారు నుండి అబీమెలెకు వచ్చాడు. సలహాదారుడు అహుజతును సైన్యాధిపతయైన ఫీకోలును వెంటబెట్టుకొని అబీమెలెకు వచ్చాడు.
GEN 26:27 ఇస్సాకు వారితో, “ఇంతకుముందు నీవు నాతో స్నేహంగా లేవు గదా. నీ దేశం వదిలిపెట్టేట్టు నీవు నన్ను బలవంతం గూడా చేసావు గదా. ఇప్పుడు నన్ను చూడటానికి ఎందుకు వచ్చావు?” అన్నాడు.
GEN 26:28 వారు జవాబు చెప్పారు: “యెహోవా నీకు తోడుగా ఉన్నాడని ఇప్పుడు మాకు తెలిసింది. మనం ఒక ఒడంబడిక చేసుకోవాలని మా అభిప్రాయం. మాకు నీవు ఒక ప్రమాణం చేయాలి.
GEN 26:29 మేము నిన్ను బాధించలేదు. ఇప్పుడు నీవు కూడా మమ్మల్ని బాధించనని ప్రమాణం చేయాలి. నిన్ను మేము పంపించివేసినా, సమాధానంగా పంపించాం. యెహోవా నిన్ను ఆశీర్వదించాడని యిప్పుడు తేటగా తెలుస్తుంది.”
GEN 26:30 ఇస్సాకు వారికి విందు చేసాడు. వారు తిని తాగారు.
GEN 26:31 మర్నాడు ఉదయం ఒక్కొక్కరు ఒక్కో ప్రమాణం చేసారు. తర్వాత ఆ మనుష్యులు సమాధానంగా వెళ్లిపోయారు.
GEN 26:32 ఆ రోజున ఇస్సాకు సేవకులు వచ్చి, వారు తవ్విన బావిని గూర్చి చెప్పారు. “ఆ బావిలో నీళ్లు చూశాం” అని చెప్పారు సేవకులు.
GEN 26:33 కనుక ఆ బావికి “షేబ” అని పేరు పెట్టాడు ఇస్సాకు. ఆ పట్టణం ఇప్పటికీ బెయేర్షెబా అని పిలువబడుతుంది.
GEN 26:34 ఏశావు 40 సంవత్సరాల వయస్సులో హిత్తీ స్త్రీలను ఇద్దరిని వివాహం చేసుకొన్నాడు. ఒక స్త్రీ బేయేరి కుమార్తె యహూదీతు. ఇంకొక ఆమె ఏలోను కుమార్తె బాశెమతు.
GEN 26:35 ఈ వివాహాలు ఇస్సాకు రిబ్కాలను చాలా బాధపెట్టాయి.
GEN 27:1 ఇస్సాకు ముసలివాడైనప్పుడు అతని చూపు సన్నగిల్లింది. ఇస్సాకు తేటగా చూడలేకపోయాడు. ఒకనాడు తన పెద్ద కుమారుని అతడు తన దగ్గరకు పిల్చాడు, “కుమారుడా” అన్నాడు. “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని జవాబిచ్చాడు ఏశావు.
GEN 27:2 ఇస్సాకు చెప్పాడు: “చూడు, నేను ముసలివాడనయ్యాను. ఒకవేళ త్వరలో నేను చనిపోతానేమో!
GEN 27:3 కనుక నీ విల్లు, అంబులు తీసుకొని వేటకు వెళ్లు. నేను తినటానికి ఒక జంతువును చంపు.
GEN 27:4 నాకు ఇష్టమైన భోజనం తయారు చేయి. అది నా దగ్గరకు తీసుకురా, నేను తింటాను. అప్పుడు నేను మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాను.”
GEN 27:5 కనుక ఏశావు వేటకు వెళ్లాడు. ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో ఆ సంగతులు చెబతున్నప్పుడు రిబ్కా విన్నది.
GEN 27:6 తన కుమారుడైన యాకోబుతో రిబ్కా చెప్పింది: “విను, నీ సోదరుడు ఏశావుతో నీ తండ్రి మాట్లాడటం నేను విన్నాను.
GEN 27:7 ‘నేను తినటానికి ఒక జంతువును చంపి నా కోసం భోజనం సిద్ధం చేయి, నేను భోంచేస్తాను. అప్పుడు నేను మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాను’ అని నీ తండ్రి చెప్పాడు.
GEN 27:8 కనుక, కుమారుడా నేను చెప్పేది విని అలా చేయి.
GEN 27:9 మన మేకల మందలోనికి వెళ్లి, రెండు మేక పిల్లల్ని నా దగ్గరకు తీసుకురా. నీ తండ్రికి ఇష్టమైన పద్ధతిలో నేను వాటిని సిద్ధం చేస్తాను.
GEN 27:10 అప్పుడు ఆ భోజనాన్ని నీవే నీ తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్లు. ఆయన మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాడు.”
GEN 27:11 అయితే యాకోబు తన తల్లి రిబ్కాతో ఇలా చెప్పాడు: “అయితే నా సోదరుడి శరీరమంతా వెంట్రుకలు ఉంటాయి, అతనిలా నాకు వెంట్రుకలు ఉండవు.
GEN 27:12 నా తండ్రి నన్ను తాకితే నేను ఏశావును కానని ఆయన తెలుసుకొంటాడు. అప్పుడు ఆయన నన్ను ఆశీర్వదించడు. నేను ఆయన్ను మోసం చేయటానికి ప్రయత్నించినందువల్ల ఆయన నన్ను శపిస్తాడు.”
GEN 27:13 కనుక రిబ్కా, “ఏదైనా కష్టం వస్తే ఆ నింద నేను భరిస్తాను. నేను చెప్పినది చేయి. వెళ్లి మేకల్ని తెచ్చి నాకు ఇవ్వు” అని అతనితో చెప్పింది.
GEN 27:14 కనుక యాకోబు వెళ్లి రెండు మేకల్ని తీసుకొని, తెచ్చి వాటిని తల్లికి ఇచ్చాడు. ఇస్సాకుకు ఇష్టమైన ఒక ప్రత్యేక విధానంలో అతని తల్లి ఆ మేకలతో వంట చేసింది.
GEN 27:15 తర్వాత ఆమె, తన కుమారుడు ఏశావు ఎక్కువగా ఇష్టపడి ధరించే బట్టలు తెచ్చింది. ఆ బట్టలను చిన్న కుమారుడు యాకోబుకు ధరింపజేసింది.
GEN 27:16 ఆ మేకల చర్మాలను రిబ్కా తీసుకొని, వాటిని యాకోబు చేతుల మీద వేసింది.
GEN 27:17 తర్వాత రిబ్కా తాను వండిన భోజనం తెచ్చి, దానిని యాకోబుకు యిచ్చింది.
GEN 27:18 యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, “తండ్రీ” అని పిల్చాడు. “ఏమీ కుమారుడా, ఎవరు నీవు” అన్నాడు తండ్రి.
GEN 27:19 “నేను ఏశావును, నీ పెద్ద కుమారుడను. నీవు నాకు చెప్పిన పనులు చేసాను. నీ కోసం నేను వేటాడి తెచ్చిన జంతువులను సమకూర్చి వాటిచే నీకొరకైన భోజనమును సిద్ధపరచితిని. దానిని తిని, తృప్తిపొంది నన్ను ఆశీర్వదించవచ్చు” అని యాకోబు తన తండ్రితో చెప్పాడు.
GEN 27:20 అయితే ఇస్సాకు, “నీవు ఇంత త్వరగా ఎలా వేటాడి జంతువుల్ని చంపగలిగావు?” అని తన కుమారుణ్ణి అడిగాడు. “త్వరగా నేను జంతువుల్ని సంపాదించటానికి నీ దేవుడైన యెహోవా నాకు సహాయంచేసాడు గనుక” అని యాకోబు జవాబిచ్చాడు.
GEN 27:21 అప్పుడు ఇస్సాకు, “నా కుమారుడా నేను నిన్ను తడిమి చూడాలి. కనుక నీవిలా నా దగ్గరగా రా. నిన్ను నేను తడిమి చూస్తే, నిజంగా నీవు నా కుమారుడు ఏశావువో కాదో తెలుస్తుంది” అన్నాడు యాకోబతో.
GEN 27:22 కనుక తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. ఇస్సాకు అతణ్ణి తడిమి చూసి, “నీ స్వరం యాకోబు స్వరంలా ఉంది. కానీ, నీ చేతులు మాత్రం ఏశావు చేతుల్లా వెంట్రుకలతో ఉన్నాయి” అన్నాడు.
GEN 27:23 యాకోబు చేతులు ఏశావు చేతులవలె వెంట్రుకలతో ఉన్నందువల్ల అతడు యాకోబు అని ఇస్సాకుకు తెలియలేదు. కనుక ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు.
GEN 27:24 “నిజంగా నీవు నా కుమారుడు ఏశావువేనా?” అన్నాడు ఇస్సాకు. “అవును, నేనే”అని యాకోబు జవాబిచ్చాడు.
GEN 27:25 అప్పుడు ఇస్సాకు, “ఆ భోజనం నా దగ్గరకు తీసుకురా. నేను అది భోంచేసి, నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. కనుక యాకోబు అతనికి భోజనం ఇచ్చాడు, అతడు భోంచేసాడు. యాకోబు అతనికి ద్రాక్షారసం ఇచ్చాడు, అతడు త్రాగాడు.
GEN 27:26 అప్పుడు ఇస్సాకు, “కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో” అని అతనితో చెప్పాడు.
GEN 27:27 కనుక యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. అతని వస్త్రాలను ఇస్సాకు వాసన చూచి, అతణ్ణి ఆశీర్వదించాడు. ఇస్సాకు ఇలా అన్నాడు: “నా కుమారుని వాసన యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనా ఉంది.
GEN 27:28 విస్తారమైన పంటలు, ద్రాక్షారసం నీకు ఉండేటట్టు వర్షాలు యెహోవా నీకు సమృద్ధిగా ఇచ్చుగాక.
GEN 27:29 మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక, జనములు నీకు సాగిలపడుదురు గాక, నీ సోదరుల మీద నీవు పరిపాలన చేస్తావు నీ తల్లియొక్క కుమారులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు, “నిన్ను శపించే ప్రతీ వ్యక్తి శపించబడుతాడు, నిన్ను ఆశీర్వదించే ప్రతి వ్యక్తీ ఆశీర్వదించబడుతాడు.”
GEN 27:30 యాకోబును ఆశీర్వదించటం ముగించాడు ఇస్సాకు. అప్పుడు, తన తండ్రి ఇస్సాకును విడిచి యాకోబు వెళ్తుండగా, వేటనుండి ఏశావు తిరిగి వచ్చాడు.
GEN 27:31 తన తండ్రికి ఇష్టమైన ప్రత్యేక విధానంలో భోజనం తయారు చేసాడు ఏశావు. దానిని ఏశావు తన తండ్రి దగ్గరకు తెచ్చాడు. అతడు తన తండ్రితో, “నాయనా, లేచి నీ కుమారుడు నీ కోసం వేటాడి తెచ్చి వండిన మాంసాన్ని తిను, అప్పుడు నీవు నన్ను దీవించగలవు”.
GEN 27:32 అయితే ఇస్సాకు, “ఎవరు నీవు?” అన్నాడు అతనితో. “నేను నీ మొదటి కుమారుణ్ణి ఏశావును” అన్నాడతను.
GEN 27:33 అప్పుడు ఇస్సాకు చాలా బాధపడి, “అలాగైతే నీవు రాకముందు భోజనం వండి నా దగ్గరకు తీసుకు వచ్చినదెవరు? నేను అదంతా శుభ్రంగా భోంచేసి, అతణ్ణి నేను ఆశీర్వదించానుగదా. ఇప్పుడు మళ్లీ నా ఆశీర్వాదాన్ని నేను వెనుకకు తీసుకోవటానికి సమయం మించిపోయిందే” అన్నాడు.
GEN 27:34 ఏశావు తన తండ్రి మాటలు విన్నాడు. అతనిలో కోపం, కక్ష రెచ్చిపోయాయి. అతను గట్టిగా ఏడ్చేసి “అలాగైతే నన్ను కూడా ఆశీర్వదించు నాయనా” అని తన తండ్రితో చెప్పాడు.
GEN 27:35 “నీ సోదరుడు నన్ను మోసం చేసాడు. అతను వచ్చి, నీ ఆశీర్వాదాలు తీసుకొన్నాడు” అన్నాడు ఇస్సాకు.
GEN 27:36 “అతని పేరే యాకోబు (మోసగాడు). అది అతనికి సరైన పేరు. రెండుసార్లు అతడు నన్ను మోసం చేసాడు. జ్యేష్ఠత్వపు హక్కు తీసువేసుకొన్నాడు, ఇప్పుడు నా ఆశీర్వాదాలు తీసువేసుకొన్నాడు.” అని చెప్పి ఏశావు, “మరి నా కోసం ఆశీర్వాదాలు ఏమైనా మిగిల్చావా?” అని ప్రశ్నించాడు.
GEN 27:37 “లేదు, ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. నీ మీద పరిపాలన చేసే అధికారం యాకోబుకు నేనిచ్చాను. అతని సోదరులంతా అతని సేవకులవుతారని కూడా నేను చెప్పాను. ధాన్యం, ద్రాక్షారసం, సమృద్ధిగా కలిగే అశీర్వాదం కూడా నేను అతనికి యిచ్చాను. నీకు ఇచ్చేందుకు యింకేమీ మిగల్లేదు కుమారుడా” అని జవాబిచ్చాడు ఇస్సాకు.
GEN 27:38 తన తండ్రిని బ్రతిమలాడుతూనే ఉన్నాడు. “నాయనా, నీ దగ్గర ఒక్క ఆశీర్వదమే ఉందా? నన్ను కూడా ఆశీర్వదించు నాయనా” అంటూ ఏశావు ఏడ్వటం మొదలుబెట్టాడు.
GEN 27:39 అప్పుడు అతనితో ఇస్సాకు ఇలా చెప్పాడు: “నీవు సారం లేని దేశంలో నివసిస్తావు నీకు వర్షపాతం ఎక్కువగా ఉండదు.
GEN 27:40 నీ మనుగడ కోసం నీవు పోరాడాలి, నీవు నీ సోదరునికి బానిసవు అవుతావు అయితే స్వతంత్రం కోసం నీవు పోరాడతావు అతని స్వాధీనం నుండి నీవు విడిపోతావు.”
GEN 27:41 ఆ తరువాత తన తండ్రి అతణ్ణి ఆశీర్వదించడంవల్ల యాకోబును ఏశావు అసహ్యించుకొన్నాడు. ఏశావు “త్వరలోనే నా తండ్రి చనిపోతాడు, నేను అతని కోసం దుఃఖిస్తాను. కాని ఆ తర్వాత యాకోబును నేను చంపేస్తాను” అని తనలో తాను అనుకొన్నాడు.
GEN 27:42 ఏశావు యాకోబును చంపాలని చేస్తున్న ఆలోచనను గూర్చి రిబ్కా విన్నది. యాకోబును పిలిపించి, అతనితో ఆమె ఇలా చెప్పింది. “ఇది విను, నీ అన్న ఏశావు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు.
GEN 27:43 అందుచేత, కుమారుడా, నేను చెప్పినట్టు చేయి. హారానులో నా సోదరుడు లాబాను ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్లి దాగుకో.
GEN 27:44 కొన్నాళ్లపాటు అతని దగ్గరే ఉండు. నీ అన్న కోపం చల్లారే వరకు అతని దగ్గరే ఉండు.
GEN 27:45 కొన్ని రోజులు కాగానే నీవు నీ అన్నకు చేసినది అతడు మరచిపోతాడు. అప్పుడు నిన్ను వెనుకకు తీసుకొని రావటానికి నేను ఒక సేవకుని పంపిస్తాను. నా ఇద్దరు కుమారులను ఒకేనాడు పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు.”
GEN 27:46 అప్పుడు రిబ్కా ఇస్సాకుతో, “నీ కుమారుడైన ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. వాళ్లు మన ప్రజలు కారు గనుక వారితో నేను చాలా విసిగిపోయాను. యాకోబు కూడా వాళ్లలో ఒక స్త్రీని పెళ్లి చేసుకొంటే, నేను చావటం మంచిది” అని చెప్పింది.
GEN 28:1 ఇస్సాకు యాకోబును పిలిచి ఆశీర్వదించాడు. తర్వాత ఇస్సాకు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇస్సాకు ఇలా చెప్పాడు: “కనాను స్త్రీని మాత్రం నీవు వివాహం చేసుకోగూడదు.
GEN 28:2 కనుక ఈ చోటు విడిచి, పద్దనరాము వెళ్లు. నీ తల్లి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లు. నీ తల్లి సోదరుడు లాబాను అక్కడే నివసిస్తున్నాడు. అతని కుమార్తెల్లో ఒకదాన్ని పెళ్లాడు.
GEN 28:3 సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించి, అధిక సంతానాన్ని నీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఒక గొప్ప జనాంగానికి నీవు పితరుడవు కావాలని నా ప్రార్థన.
GEN 28:4 దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినట్టే నిన్ను, నీ పిల్లలను ఆశీర్వదించాలని నా ప్రార్థన. నీవు నివసించే దేశం నీ స్వంతం కావాలని నా ప్రార్థన. ఇది దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశం.”
GEN 28:5 ఇస్సాకు యాకోబును పద్దనరాముకు పంపించాడు. రిబ్కా సోదరుడైన లాబాను దగ్గరకు యాకోబు వెళ్లాడు. లాబాను రిబ్కానకు తండ్రి బెతూయేలు. యాకోబు, ఏశావులకు తల్లి రిబ్కా.
GEN 28:6 తన తండ్రియైన ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడని ఏశావుకు తెలిసింది. యాకోబు భార్యను సంపాదించు కొనేందుకు ఇస్సాకు అతణ్ణి పద్దనరాముకు పంపినట్టు ఏశావుకు తెలిసింది. యాకోబు కనాను స్త్రీని వివాహము చేసుకోగూడదని ఇస్సాకు ఆజ్ఞాపించినట్టు ఏశావుకు తెలిసింది.
GEN 28:7 యాకోబు తన తల్లిదండ్రుల మాటకు విధేయుడై పద్దనరాము వెళ్లినట్టు ఏశావుకు తెలిసింది.
GEN 28:8 తన కుమారులు కనానీ స్త్రీలను వివాహం చేసుకోవటం తండ్రికి ఇష్టం లేదని దీనిద్వారా ఏశావుకు తెలిసింది.
GEN 28:9 అప్పటికే ఏశావుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే అతడు ఇష్మాయేలు దగ్గరకు వెళ్లి, మరో స్త్రీని పెళ్లి చేసికొన్నాడు. ఇష్మాయేలు కుమార్తె మాహలతును అతను పెళ్లి చేసుకొన్నాడు. ఇష్మాయేలు అబ్రాహాము కుమారుడు. మాహలతు నెబాయోతు సోదరి.
GEN 28:10 యాకోబు బెయేర్షెబా విడిచి హారాను వెళ్లాడు.
GEN 28:11 యాకోబు ప్రయాణం చేస్తూ ఉండగా సూర్యాస్తమయం అయింది. అందుచేత ఆ రాత్రి ఉండేందుకు యాకోబు ఒక చోటుకి వెళ్లాడు. అక్కడ ఒక బండ కనబడింది. నిద్రపోయేందుకు యాకోబు దానిమీద తలపెట్టి పండుకొన్నాడు.
GEN 28:12 యాకోబుకు ఒక కల వచ్చింది. నేలమీద ఒక నిచ్చెన ఉండి, అది ఆకాశాన్ని అంటుకొన్నట్టు అతనికి కల వచ్చింది. దేవుని దూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుచు, దిగుచు ఉన్నట్టు యాకోబు చూశాడు.
GEN 28:13 అప్పుడు ఆ నిచ్చెన దగ్గర యెహోవా నిలిచినట్టు యాకోబు చూశాడు. యెహోవా చెప్పాడు: “నీ తాత అబ్రాహాము దేవుణ్ణి, యెహోవాను నేను. నేను ఇస్సాకు దేవుణ్ణి ఇప్పుడు నీవు నిద్రపోతున్న ఈ దేశాన్ని నీకు నేనిస్తాను. నీకు, నీ పిల్లలకు ఈ స్థలం నేనిస్తాను.
GEN 28:14 నేలమీద ధూళి కణముల్లాగ నీకు గూడా ఎంతోమంది వారసులు ఉంటారు. తూర్పు పడమరలకు, ఉత్తర దక్షిణాలకు వారు విస్తరిస్తారు. నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూమిమీదనున్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి.
GEN 28:15 “నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్లే ప్రతి చోట నేను నిన్ను కాపాడుతాను. మళ్లీ నిన్ను ఈ దేశానికి నేను తీసుకొని వస్తాను. నేను వాగ్ధానం చేసినది నెరవేర్చేవరకు నిన్ను నేను విడువను.”
GEN 28:16 అప్పుడు యాకోబు నిద్రనుండి మేల్కొని “యెహోవా ఈ స్థలములో ఉన్నాడని నాకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ ఉన్నట్టు, నేను నిద్రపోయేంత వరకు నాకు తెలియదు” అన్నాడు.
GEN 28:17 యాకోబు భయపడ్డాడు. “ఇది మహా గొప్ప స్థానం. ఇది దేవుని మందిరం. ఇది పరలోక ద్వారం” అన్నాడు అతను.
GEN 28:18 ఉదయం పెందలాడే లేచాడు యాకోబు. అతడు పండుకొన్న రాయి తీసుకొని, దానిని అంచుమీద నిలబెట్టాడు యాకోబు. తర్వాత ఆ రాయిమీద అతడు నూనె పోసాడు. ఈ విధంగా అతడు ఆ రాయిని దేవుని జ్ఞాపకార్థ చిహ్నంగా చేసాడు.
GEN 28:19 ఆ స్థలం పేరు లూజు. అయితే బేతేలు అని దానికి యాకోబు పేరు పెట్టాడు.
GEN 28:20 అప్పుడు యాకోబు ఒక ప్రమాణం చేసాడు. “దేవుడు నాకు తోడుగా ఉంటే, నేను ఎక్కడికి వెళ్లినా దేవుడు నన్ను కాపాడుచు ఉంటే, తినుటకు భోజనం, ధరించుటకు బట్టలు దేవుడు నాకు ఇస్తూ ఉంటే,
GEN 28:21 నా తండ్రి ఇంటికి నేను సమాధానంగా తిరిగి రాగలిగితే, ఇవన్నీ దేవుడు చేస్తే, అప్పుడు యెహోవాయే నా దేవుడు.
GEN 28:22 నేను ఈ రాయిని యిక్కడ నిలబెడతాను. దేవుని కోసం ఇది పరిశుద్ధ స్థలం అని అది తెలియజేస్తుంది. దేవుడు నాకు ఇచ్చే వాటన్నింటిలో పదవ భాగం నేను ఆయనకు ఇస్తాను” అని అతను చెప్పాడు.
GEN 29:1 ఇంకా యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు. తూర్పు దేశానికి అతడు వెళ్లాడు.
GEN 29:2 యాకోబు అలా చూడగానే, పొలాల్లో ఒక బావి కనబడింది. గొర్రెల మందలు మూడు ఆ బావి దగ్గర పండుకొని ఉన్నాయి. ఆ గొర్రెలు నీళ్లు తాగే స్థలం ఆ బావి. ఆ బావిమీద ఒక పెద్ద బండ పెట్టి ఉంది.
GEN 29:3 గొర్రెలన్నీ అక్కడికి రాగానే, ఆ గొర్రెల కాపరులు ఆ బావిమీద బండను దొర్లిస్తారు. అప్పుడు గొర్రెలన్నీ ఆ నీళ్లు తాగుతాయి. ఆ గొర్రెలు పూర్తిగా తాగిన తర్వాత గొర్రెల కాపరులు ఆ బండను మళ్లీ దాని స్థానంలో పెట్టేస్తారు.
GEN 29:4 “సోదరులారా, ఎక్కడి వాళ్లు మీరు?” అని ఆ గొర్రెల కాపరులను యాకోబు అడిగాడు. “మేము హారాను వాళ్లం” అని వారు జవాబిచ్చారు.
GEN 29:5 అందుకు యాకోబు, “నాహోరు కుమారుడు లాబాను తెలుసా మీకు?” అని అడిగాడు. “మాకు తెలుసు” అని గొర్రెల కాపరులు జవాబు ఇచ్చారు.
GEN 29:6 అప్పుడు యాకోబు “ఆయన ఎలా ఉన్నాడు?” అని అడిగాడు. “ఆయన బాగానే ఉన్నాడు, అంతా క్షేమమే. అదిగో చూడు, ఆ వస్తున్నది ఆయన కుమార్తె. ఆమె పేరు రాహేలు, ఆయన గొర్రెలు తోలుకొస్తున్నది” అన్నారు వాళ్లు.
GEN 29:7 “చూడండి, ఇప్పుడు ఇంకా పగలు ఉంది. సూర్యాస్తమయానికి చాలా సమయం ఉంది. రాత్రి కోసం గొర్రెల్ని మందగా చేర్చటానికి ఇంకా వేళ కాలేదు. కనుక వాటికి నీళ్లు పెట్టి, మళ్లీ పొలాల్లోనికి వెళ్లనీయ్యండి” అన్నాడు యాకోబు.
GEN 29:8 కానీ గొర్రెల కాపరులు, “మందలన్నీ ఇక్కడ గుమిగూడేవరకు మేము అలా చేయటానికి వీల్లేదు. అప్పుడు మేము బావిమీద బండ దొర్లిస్తాము, గొర్రెలు నీళ్లు తాగుతాయి” అన్నారు.
GEN 29:9 కాపరులతో యాకోబు మాట్లాడుతుండగానే, రాహేలు తన తండ్రి గొర్రెలతో అక్కడికి వచ్చింది. (ఆ గొర్రెల బాధ్యత రాహేలుది.)
GEN 29:10 లాబాను కుమార్తె రాహేలు. యాకోబు తల్లి రిబ్కాకు సోదరుడు లాబాను. రాహేలును చూడగానే యాకోబు వెళ్లి, బండను దొర్లించి గొర్రెలకు నీళ్లు యిచ్చాడు.
GEN 29:11 అప్పుడు యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని ఏడ్చాడు.
GEN 29:12 తను ఆమె తండ్రి బంధువు అని యాకోబు రాహేలుతో చెప్పాడు. తను రిబ్కా కుమారుడనని రాహేలుతో చెప్పాడు. కనుక రాహేలు యింటికి పరుగెత్తి, తన తండ్రితో చెప్పింది.
GEN 29:13 తన సోదరి కుమారుడు యాకోబును గూర్చిన వార్త లాబాను విన్నాడు. అందుచేత అతణ్ణి కలుసుకొనేందుకు లాబాను పరుగెత్తాడు. లాబాను అతడ్ని కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, తన యింటికి తీసుకొని వచ్చాడు. జరిగినదంతా యాకోబు లాబానుతో చెప్పాడు.
GEN 29:14 అప్పుడు లాబాను, “ఇదంతా భలే బాగుందే, అయితే నీవు నా స్వంత కుటుంబపు వాడివే సుమా” అన్నాడు. అందువల్ల యాకోబు లాబానుతో ఒక నెల అక్కడే నివసించాడు.
GEN 29:15 ఒకనాడు లాబాను, “జీతం లేకుండా నా దగ్గర నీవు ఇలా పనిచేస్తూ ఉండటం సరిగా లేదు. నీవు బంధువుడివి. అంతేగాని బానిసవు కావు. నేను నీకు ఏమి చెల్లించాలి?” అని యాకోబును అడిగాడు.
GEN 29:16 లాబానుకు యిద్దరు కుమార్తెలుండిరి. పెద్దామె లేయా, చిన్నామె రాహేలు.
GEN 29:17 రాహేలు అందగత్తె. లేయా కళ్ల సమస్యగలది.
GEN 29:18 యాకోబు రాహేలును ప్రేమించాడు. యాకోబు “నన్ను, నీ చిన్న కుమార్తె రాహేలును పెళ్లాడనిస్తే, నేను నీకు ఏడు సంవత్సరాల పాటు పనిచేస్తాను” అని లాబానుతో చెప్పాడు.
GEN 29:19 “మరొకర్ని చేసుకోవడం కంటే ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడం మంచిది. కనుక నా దగ్గరే ఉండు” అన్నాడు లాబాను.
GEN 29:20 కనుక యాకోబు అక్కడే ఉండి, లాబాను కోసం ఏడు సంవత్సరాలు పని చేసాడు. అయితే అతడు రాహేలును ప్రేమించాడు గనుక అది చాలా కొద్ది కాలంలాగే కనబడింది అతనికి.
GEN 29:21 ఏడు సంవత్సరాలు అయ్యాక, “రాహేలును నాకు యివ్వండి, పెళ్లి చేసుకొంటాను. నీ దగ్గర నేను చేయాల్సిన కాలం తీరిపోయింది” అని యాకోబు లాబానుతో చెప్పాడు.
GEN 29:22 కనుక ఆ ప్రదేశంలోని ప్రజలందరికి లాబాను విందు ఇచ్చాడు.
GEN 29:23 ఆ రాత్రి లాబాను తన కుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరకు తీసుకు వచ్చాడు. యాకోబు లేయాలు లైంగికంగా కలుసుకొన్నారు.
GEN 29:24 తన దాసి జిల్ఫాను తన కుమార్తెకు దాసీగా లాబాను ఇచ్చాడు.
GEN 29:25 తాను సంభోగించినది లేయా అని తెల్లవారినప్పుడు యాకోబు తెలుసుకొన్నాడు. లాబానుతో యాకోబు, “నీవు నన్ను మోసం చేసావు. నేను రాహేలును పెళ్లి చేసుకోవాలని నీ దగ్గర కష్టపడి పని చేసాను. ఎందుకు నన్ను నీవు మోసం చేసావు?” అన్నాడు.
GEN 29:26 లాబాను చెప్పాడు: “పెద్ద కూతురికి పెళ్లికాక ముందు చిన్న కూతురికి పెళ్లి చేయటానికి మా దేశంలో ఒప్పుకోరు.
GEN 29:27 అయితే పెళ్లి ఆచారంగా వారం రోజులు ముగించు, రాహేలునుకూడ పెళ్లి చేసుకొనేందుకు ఇస్తాను. కానీ నీవు మాత్రం మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేయాలి.”
GEN 29:28 కనుక యాకోబు అలాగే వారం ముగించాడు. అప్పుడు లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు.
GEN 29:29 తన దాసీ బిల్హాను తన కుమార్తె రాహేలుకు దాసీగా ఇచ్చాడు.
GEN 29:30 కనుక యాకోబు రాహేలుతో కూడా సంభోగించాడు. లేయాకంటే రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించాడు. లాబాను దగ్గర మరో ఏడు సంవత్సరాలు యాకోబు పని చేసాడు.
GEN 29:31 లేయాకంటె రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించడం యెహోవా చూశాడు. అందుచేత లేయాకు పిల్లలు పుట్టేలాగు చేసాడు యెహోవా. రాహేలుకు పిల్లలు లేరు.
GEN 29:32 లేయాకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె అతనికి రూబేను అని పేరు పెట్టింది. “నా కష్టాలను యెహోవా చూశాడు. నా భర్త నన్ను ప్రేమించటం లేదు. ఒకవేళ నా భర్త ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడేమో” అని లేయా అతనికి ఈ పేరు పెట్టింది.
GEN 29:33 లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి షిమ్యోను అని ఆమె పేరు పెట్టింది. “నేను ప్రేమించబడటం లేదని తెలిసి యోహోవా నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చాడు” అని చెప్పింది లేయా.
GEN 29:34 లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఆ కుమారునికి ఆమె లేవి అని పేరు పెట్టింది. “ఇప్పుడు నా భర్త నన్ను తప్పకుండా ప్రేమిస్తాడు. అతనికి ముగ్గురు కుమారుల్ని నేను ఇచ్చాను” అనుకొంది లేయా.
GEN 29:35 అప్పుడు లేయాకు మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి యూదా అని ఆమె పేరు పెట్టింది. “నేను ఇప్పుడు యెహోవాను స్తుతిస్తాను” అని చెప్పి అతనికి ఆ పేరు పెట్టింది లేయా. అంతటితో ఆమెకు సంతాన ప్రాప్తి ఆగిపోయింది.
GEN 30:1 తాను యాకోబుకు పిల్లల్ని కనటం లేదని లేయాను రాహేలు తెలుసుకొంది. రాహేలు, తన సోదరి లేయాను గూర్చి అసూయపడింది. అందుచేత “నాకూ పిల్లల్ని యివ్వు, లేకపోతే నేను చస్తాను” అంది యాకోబుతో రాహేలు.
GEN 30:2 యాకోబుకు రాహేలు మీద కోపం వచ్చింది. “నేనేమి దేవుణ్ణి కాను. నీకు పిల్లలు పుట్టకుండా చేసింది దేవుడు” అని చెప్పాడు యాకోబు.
GEN 30:3 అప్పుడు రాహేలు “నా దాసిని బిల్హాను నీవు తీసుకో. ఆమెతో శయనించు. నా కోసం ఆమె బిడ్డను కంటుంది. అప్పుడు ఆమె మూలంగా నేను తల్లినవుతాను” అని చెప్పింది.
GEN 30:4 కనుక రాహేలు తన దాసియైన బిల్హాను యాకోబుకు ఇచ్చింది. యాకోబు బిల్హాతో సంభోగించాడు.
GEN 30:5 బిల్హా గర్భవతి అయింది, యాకోబుకు ఒక కుమారుని కన్నది.
GEN 30:6 “దేవుడు నా ప్రార్థన విన్నాడు. నాకు ఒక కుమారుని ఇవ్వాలని ఆయన నిర్ణయం చేసాడు” అని చెప్పి, రాహేలు ఆ కుమారునికి “దాను” అని పేరు పెట్టింది.
GEN 30:7 బిల్హా మరల గర్భవతియై, యాకోబుకు మరో కుమారుని కన్నది.
GEN 30:8 రాహేలు “నా అక్కతో పోటిలో చాలా కష్టపడి పోరాడాను. నేనే గెలిచాను” అని చెప్పి ఆ కుమారునికి “నఫ్తాలి” అని పేరు పెట్టింది.
GEN 30:9 లేయా తనకు ఇక పిల్లలు పుట్టడం లేదని గ్రహించింది. అంచేత తన దాసి జిల్ఫాను ఆమె యాకోబుకు ఇచ్చింది.
GEN 30:10 అప్పుడు జిల్ఫాకు ఒక కొడుకు పుట్టాడు.
GEN 30:11 లేయా “నేను అదృష్టవంతురాలిని” అనుకొని, ఆ కుమారునికి “గాదు” అని పేరు పెట్టింది.
GEN 30:12 జిల్ఫాకు మరో కుమారుడు పుట్టాడు.
GEN 30:13 “నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు స్త్రీలు నన్ను సంతోషం అని పిలుస్తారు” అని చెప్పి లేయా ఆ కుమారునికి “ఆషేరు” అని పేరు పెట్టింది.
GEN 30:14 గోధుమ కోతకాలంలో రూబేను పొలాల్లోకి వెళ్లాడు. అక్కడ ప్రత్యేకమైన పూలు అతనికి కనబడ్డాయి. ఆ పూలు తెచ్చి రూబేను తన తల్లి లేయాకు ఇచ్చాడు. అయితే రాహేలు, “నీ కొడుకు తెచ్చిన పూలు దయచేసి నాకూ కొన్ని ఇవ్వవూ” అని లేయాను అడిగింది.
GEN 30:15 లేయా, “ఇప్పటికే నీవు నా భర్తను తీసివేసుకొన్నవు. ఇప్పుడేమో నా కొడుకు తెచ్చిన పూలను తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నావా” అంది. కాని రాహేలు “నీ కొడుకు తెచ్చిన పూలు గనుక నీవు నాకు ఇస్తే, ఈ వేళ రాత్రికి నీవు యాకోబుతో శయనించవచ్చు” అని జవాబిచ్చింది.
GEN 30:16 ఆ రాత్రి యాకోబు పొలంనుంచి వచ్చాడు. అతన్ని చూచి, అతన్ని కలుసుకోవటానికి లేయా బయటకు వెళ్లింది. “ఈ వేళ రాత్రి నీవు నాతో పండుకోవాలి. నా కొడుకు తెచ్చిన పూలతో నిన్ను నేను కొన్నాను” అని ఆమె చెప్పింది. కనుక ఆ రాత్రి యాకోబు లేయాతో పండుకొన్నాడు.
GEN 30:17 అప్పుడు దేవుడు లేయాను మళ్లీ గర్భవతిని కానిచ్చాడు. ఆమె అయిదవ కుమారుని కన్నది.
GEN 30:18 లేయా అంది, “నా భర్తకు నా దాసిని ఇచ్చాను గనుక దేవుడు నాకు ప్రతిఫలాన్ని యిచ్చాడు.” అందుకని చెప్పి లేయా అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టింది.
GEN 30:19 లేయా మళ్లీ గర్భవతి అయింది, ఆరో కుమారుణ్ణి కన్నది.
GEN 30:20 లేయా అంది “ఒక చక్కని బహుమానం దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు తప్పక యాకోబు నన్ను స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయనకు నేను ఆరుగురు కుమారుల్ని యిచ్చాను.” కనుక జెబూలూను అని చెప్పి ఆ కుమారునికి పేరు పెట్టింది.
GEN 30:21 తర్వాత లేయాకు కూతురు పుట్టింది. ఆ కూతురుకు దీనా అని పేరు పెట్టింది.
GEN 30:22 అప్పుడు రాహేలు ప్రార్థన దేవుడు విన్నాడు. రాహేలుకు పిల్లలు పుట్టేట్టుగా దేవుడు చేసాడు.
GEN 30:23 రాహేలు గర్భవతి అయింది, ఒక కుమారుణ్ణి కన్నది. “దేవుడు నా అవమానం తొలగించి, నాకూ ఒక కుమారుణ్ణి ఇచ్చాడు” అని చెప్పింది. “దేవుడు నాకు మరో కుమారుణ్ణి అనుగ్రహించు గాక” అంటూ రాహేలు ఆ కుమారునికి యోసేపు అని పేరు పెట్టింది.
GEN 30:25 యోసేపు పుట్టిన తర్వాత లాబానుతో యాకోబు అన్నాడు: “ఇక నా మాతృదేశంలోని నా స్వంత యింటికి నన్ను వెళ్లనివ్వు.
GEN 30:26 నా భార్యల్ని, పిల్లలను నాకు అప్పగించు. నీ దగ్గర 14 సంవత్సరాలు పనిచేసి నేను వాళ్లను సంపాదించుకొన్నాను. నీ దగ్గర నేను మంచి పని చేసానని నీకు తెలుసు.”
GEN 30:27 అతనితో లాబాను అన్నాడు: “నన్ను ఒక్క మాట చెప్పనివ్వు. నీ మూలంగానే యోహోవా నన్ను ఆశీర్వదించాడని నాకు తెలుసు.
GEN 30:28 నీకు ఏం చెల్లించమంటావో చెప్పు, అది నీకు నేను చెల్లిస్తాను.”
GEN 30:29 యాకోబు జవాబిచ్చాడు: “నీ కోసం నేను కష్టపడి పని చేసానని నీకు తెలుసు. నీ గొర్రెల మందలను నేను కాస్తూ ఉండగా అవి విస్తరించాయి, క్షేమంగా ఉన్నాయి.
GEN 30:30 నేను వచ్చిన మొదట్లో నీకు ఉన్నది స్వల్పం. ఇప్పుడు నీకు చాలా విస్తారంగా ఉంది. నీ కోసం నేను ఏదైనా చేసినప్పుడల్లా యోహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇక నా కోసం నేను పని చేసుకోవాలి, నా ఇంటిని నేను కట్టుకోవాలి.”
GEN 30:31 “అలాగైతే నేను నీక ఏమి ఇవ్వాలి?” అని లాబాను అడిగాడు. యాకోబు ఇలా జవాబిచ్చాడు: “నీవు నాకు ఏమీ యివ్వక్కర్లేదు. నేను చేసిన పనికి తగినట్టుగా నీవు నాకు ఇస్తే చాలు. ఈ ఒక్క పని చేయి. నేను మళ్లీ వెళ్లి నీ గొర్రెలను కాస్తాను.
GEN 30:32 అయితే ఈ వేళ నీ గొర్రెల మందల్లో నన్ను నడువనియ్యి, వాటిలో మచ్చలుగాని చారలుగాని ఉన్న వాటన్నిటిని నన్ను తీసుకోనివ్వు. అలాగే నల్ల మేకపిల్లలు అన్నిటిని నన్ను తీసుకోనివ్వు. చారలు మచ్చలు ఉన్న ప్రతి ఆడ మేకను నన్ను తీసుకోనివ్వు. అదే నాకు జీతం.
GEN 30:33 నా నిజాయితీ ఏమిటో భవిష్యత్తులో నీవు తేలిగ్గా తెలుసుకోవచ్చు. నీవు వచ్చి నా మందల్ని చూడవచ్చు. మచ్చలేని మేకగాని, నలుపు లేని గొర్రెగాని నా దగ్గర ఉంటే, దాన్ని నేను దొంగిలించిన్నట్టు నీకు తెలుస్తుంది.”
GEN 30:34 “అది నాకు సమ్మతమే. నీవు అడిగినట్టు మనం చేద్దాం” అన్నాడు లాబాను.
GEN 30:35 అయితే మచ్చలు ఉన్న మేకపోతులన్నింటిని ఆ రోజే లాబాను దాచిపెట్టేసాడు. మచ్చలు ఉన్న ఆడ మేకలన్నింటిని గూడ లాబాను దాచిపెట్టేసాడు. ఈ గొర్రెలను కనిపెట్టి ఉండమని లాబాను తన కుమారులతో చెప్పాడు.
GEN 30:36 కనుక ఆ కుమారులు మచ్చలుగల గొర్రెలలన్నింటిని మరో చోటుకు తోలుకొని వెళ్లారు. మూడు రోజుల పాటు వారు ప్రయాణం చేసారు. యాకోబు అక్కడ ఉండి, మిగిలిన జంతువులన్నింటి విషయం జాగ్రత్త పుచ్చుకొన్నాడు. అయితే అక్కడ ఉన్నవాటిలో మచ్చలు ఉన్నవి గాని చారలు ఉన్నవి గాని ఏ జంతువు లేదు.
GEN 30:37 కనుక బూరగ, బాదాం అను చెట్ల పచ్చటి కొమ్మలు యాకోబు నరికాడు. వాటిలో కొన్ని చువ్వల పైబెరడు యాకోబు తీసివేసినందువల్ల వాటి మీద తెల్ల చారలు కనబడుతున్నాయి.
GEN 30:38 నీళ్లు త్రాగే స్థలాల్లో మందల ముందు యాకోబు ఆ చువ్వలను ఉంచాడు. ఆ జంతువులు నీళ్లు త్రాగటానికి వచ్చినప్పుడు, అక్కడే అవి కలిసేవి.
GEN 30:39 ఆ చువ్వల ముందర మేకలు చూలు కట్టినప్పుడు, మచ్చలు, చారలు, నలుపుగల పిల్లలు వాటికి పుట్టాయి.
GEN 30:40 మచ్చలు, నలుపు ఉన్న జంతువులను మిగతా జంతువులనుండి యాకోబు వేరుచేసాడు. యాకోబు తన జంతువులను లాబాను జంతువులనుండి వేరుగా ఉంచాడు.
GEN 30:41 మందలోని బలమైన జంతువులు ఎదైనప్పుడుల్లా యాకోబు ఆ చువ్వలను వాటి కళ్లముందు ఉంచాడు. ఆ కొమ్మల దగ్గర ఆ జంతువులు చూలు కట్టేవి.
GEN 30:42 అయితే ఒక్కటి, బలహీనమైన జంతువులు ఎదైనప్పుడు యాకోబు ఆ కొమ్మలను అక్కడ పెట్టలేదు. కనుక బలహీనమైన జంతువులకు పుట్టిన పిల్లలన్నీ లాబానువే. బలమైన జంతువులకు పుట్టిన పిల్లలన్నీ యాకోబువి.
GEN 30:43 ఈ విధంగా యాకోబు చాలా ధనికుడయ్యాడు. పెద్ద మందలు, చాలా మంది సేవకులు, ఒంటెలు, గాడిదలు అతనికి ఉన్నాయి.
GEN 31:1 ఒక రోజున లాబాను కొడుకులు మాట్లాడుకోవడం యాకోబు విన్నాడు. “మన తండ్రికి ఉన్నదంతా యాకోబు తీసివేసుకొన్నాడు. యాకోబు ధనికుడైపోయాడు, ఈ ఐశ్వర్యం అంతా మన తండ్రి దగ్గర నుండి యాకోబు తీసుకున్నాడు.” అని వాళ్లు చెప్పుకొన్నారు.
GEN 31:2 అప్పుడు లాబాను ఇదివరలో ఉన్నంత స్నేహంగా తనతో యిప్పుడు లేనట్టు యాకోబు గమనించాడు.
GEN 31:3 అప్పుడు యెహోవా “నీ పూర్వీకుల నివాస దేశానికి నీవు తిరిగి వెళ్లిపో. నేను నీకు తోడుగా ఉంటాను” అని యాకోబుతో చెప్పాడు.
GEN 31:4 కనుక యాకోబు తన గొర్రెలు, మేకలు మందలను ఉంచిన పొలాల్లో తనను కలిసికోమని రాహేలు, లేయాలకు చెప్పాడు.
GEN 31:5 రాహేలు, లేయాలతో యాకోబు ఇలా చెప్పాడు: “మీ తండ్రి నామీద కోపంగా ఉన్నాడు. ఇది వరకు ఎప్పుడూ అతడు నాతో స్నేహంగా ఉండేవాడు, కాని ఇప్పుడు లేడు. అయితే, నా తండ్రి దేవుడు నాతో వున్నాడు.
GEN 31:6 నాకు చేతనైనంత మట్టుకు నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మీ ఇద్దరికి తెలుసు.
GEN 31:7 అయితే మీ తండ్రి నన్ను మోసం చేసాడు. నా జీతం పదిసార్లు మీ తండ్రి మార్చాడు. అయినా ఈ కాలమంతటిలో, లాబాను మోసాలన్నిటి నుండి దేవుడు నన్ను కాపాడాడు.
GEN 31:8 “ఒకసారి లాబాను అన్నాడు: ‘మచ్చలు ఉన్న మేకలన్నీ నీవు ఉంచుకోవచ్చు. ఇది నీ జీతం.’ అతడు ఇలా చెప్పిన తర్వాత జంతువులన్నీ మచ్చలు ఉన్న పిల్లలనే కన్నాయి. కనుక అవి అన్నీ నావే. కానీ అప్పుడు లాబాను, ‘మచ్చలు గల మేకలను నేను తీసుకొంటాను, చారలున్న మేకలన్నీ నీవే. అది నీకు జీతం’ అన్నాడు. అతడు యిలా చెప్పిన తర్వాత జంతువులన్నీ చారలు గల పిల్లల్ని పెట్టాయి.
GEN 31:9 కనుక జంతువులను దేవుడు మీ తండ్రి దగ్గర్నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు.
GEN 31:10 “జంతువులు కలిసే సమయంలో నాకు ఒక కల వచ్చింది. ఎదవుతోన్న మగ మేకలన్నీ మచ్చలు, చారలు గలవేనని నేను చూశాను.
GEN 31:11 కలలో ఆ దేవదూత నాతో మాట్లాడాడు. ఆ దేవదూత, ‘యాకోబూ!’ అన్నాడు. “‘చిత్తం’ అన్నాను నేను.”
GEN 31:12 “ఆ దేవదూత అన్నాడు: ‘చూడు, మచ్చలు, చారలు ఉన్న మేకలు మాత్రమే ఎదవుతున్నాయి. ఇలా జరిగేటట్టు నేను చేస్తున్నాను. లాబాను నీ యెడల చేస్తోన్న అపకారం అంతా నేను చూశాను. కొత్తగా పుట్టిన మేక పిల్లలన్నీ నీకే చెందాలని నేను ఇలా చేస్తున్నాను.
GEN 31:13 బేతేలులో నీ దగ్గరకు వచ్చిన దేవుణ్ణి నేనే. ఆ స్థలంలో నీవు ఒక బలిపీఠం కట్టావు. ఆ బలిపీఠం మీద ఒలీవ నూనె నీవు పోసావు. అక్కడ నాకు నీవు ఒక వాగ్దానం చేసావు. నీవు తిరిగి నీ పుట్టిన స్థలానికి వెళ్లేందుకు ఇప్పుడు సిద్ధపడు.’”
GEN 31:14 రాహేలు, లేయాలు యాకోబుతో అన్నారు: “మా తండ్రి చనిపోయినప్పుడు అతను మాకు ఇచ్చేది ఏమీ లేదు. అతను మమ్మల్ని పరాయి వాళ్లుగా చాశాడు. అతను మమ్మల్ని నీకు అమ్మేసాడు, మరియు అప్పుడు మాకు రావలసిన సొమ్ము అంతా వాడేసుకొన్నాడు.
GEN 31:16 మా తండ్రి దగ్గర్నుండి ఈ ఆస్తి అంతా దేవుడు తీసివేసాడు, ఇప్పుడు అది మనది మన పిల్లలది. కనుక నీవు ఏం చేయాలని దేవుడు నీతో చెప్పాడో అలాగే నీవు చేయాలి!”
GEN 31:17 అందుచేత యాకోబు తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తన కుమారులను, భార్యలను ఒంటెల మీద ఎక్కించాడు.
GEN 31:18 అప్పుడు వాళ్లు, అతని తండ్రి నివసించిన కనాను దేశానికి తిరిగి ప్రయాణం మొదలుబెట్టారు. యాకోబు సంపాదించిన పశువుల మందలన్నీ వారికి ముందుగా నడిచాయి. అతడు పద్దనరాములో నివసించినప్పుడు సంపాదించుకొన్న సమస్తం అతడు తీసికొని వెళ్లాడు.
GEN 31:19 ఈ సమయంలో లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించటానికి వెళ్లాడు. అతడు వెళ్లిపోయాక, రాహేలు అతని ఇంటిలోకి వెళ్లి, తన తండ్రికి చెందిన విగ్రహాల్ని దొంగిలించింది.
GEN 31:20 సిరియావాడైన లాబానును యాకోబు మోసం చేసాడు. అతడు వెళ్లిపోతున్నట్టు లాబానుతో చెప్పలేదు.
GEN 31:21 యాకోబు తన కుటుంబాన్ని, తనకి ఉన్న సమస్తాన్ని తీసుకొని వెంటనే వెళ్లిపోయాడు. వాళ్లు యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండవైపు ప్రయాణం అయ్యారు.
GEN 31:22 యాకోబు పారిపోయినట్టు మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది.
GEN 31:23 కనుక లాబాను తన మనుష్యుల్ని సమావేశపరచి, యాకోబును తరమటం మొదలు పెట్టాడు. ఏడు రోజుల తర్వాత గిలాదు పర్వతం దగ్గర లాబాను యాకోబును చూశాడు.
GEN 31:24 ఆ రాత్రి ఒక దర్శనంలో లాబానుకు దేవుడు ప్రత్యక్షమయ్యి, “నీవు యాకోబుతో చెప్పే ప్రతీ మాట గూర్చి జాగ్రత్త సుమా!” అన్నాడు దేవుడు.
GEN 31:25 మర్నాడు ఉదయాన్నే యాకోబును లాబాను పట్టుకొన్నాడు. కొండమీద యాకోబు గుడారం వేసికొన్నాడు. కనుక లాబాను, అతని మనుష్యులంతా గిలాదు కొండమీద గుడారాలు వేసుకొన్నారు.
GEN 31:26 యాకోబుతో లాబాను అన్నాడు: “నీవెందుకు నన్ను మోసం చేసావు? యుద్ధంలో చెరపట్టిన స్త్రీలవలె నా కూతుళ్లను ఎందుకు తీసుకు పోతున్నావు?
GEN 31:27 నాకు చెప్పకుండా నీవెందుకు పారిపోతున్నావు? నీవు నాతో చెప్పి ఉంటే నీకు నేను విందు చేసేవాణ్ణి. వాయిద్యాలతో సంగీతం, నాట్యం ఉండేవి.
GEN 31:28 కనీసం నా మనవళ్లను, మనవరాళ్లను ముద్దు పెట్టుకోనివ్వలేదు, నా కూతుళ్లకు వీడ్కోలు చెప్పనివ్వలేదు. నీవు ఇలా చేయటం చాలా బుద్ధి తక్కువ పని.
GEN 31:29 నిజంగా నిన్ను బాధించగల శక్తి నాకు ఉంది. అయితే గత రాత్రి నీ తండ్రి దేవుడు నాకు దర్శనం యిచ్చాడు. ఏ విధంగా కూడ నిన్ను బాధ పెట్టవద్దని ఆయన నన్ను హెచ్చరించాడు.
GEN 31:30 నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లిపోవాలన్న ఆశ నీకు ఉన్నట్టు నాకు తెలుసు. అందుకే నీవు బయల్దేరావు. కాని నా యింటి దేవతలను ఎందుకు దొంగిలించావు?”
GEN 31:31 యాకోబు ఇలా జవాబిచ్చాడు: “భయం చేత నీకు చెప్పకుండా బయల్దేరాను. నీ కుమార్తెలను నా దగ్గర్నుండి నీవు తీసుకొంటావేమో అనుకొన్నాను.
GEN 31:32 అంతేగాని నీ విగ్రహాలను మాత్రం నేను దొంగిలించలేదు. ఇక్కడ నాతో ఉన్నవాళ్లలో ఎవరి దగ్గరయినా నీ విగ్రహాలు దొరికితే, అలాంటి వ్యక్తి చంపివేయబడుగాక. నీ మనుష్యులే నాకు సాక్షులు. నీకు చెందినది ఏదైనా ఉందేమో నీవు వెదకవచ్చు. ఏదైనా సరే నీదైతే దాన్ని తీసుకో” లాబాను దేవుళ్లను రాహేలు దొంగిలించినట్లు యాకోబుకు తెలియదు.
GEN 31:33 కనుక లాబాను వెళ్లి యాకోబు గుడారాల్లో వెదికాడు. యాకోబు గుడారంలోను, తర్వాత లేయా గుడారంలోను అతడు వెదికాడు. ఆ తర్వాత బానిస స్త్రీలు ఇద్దరూ ఉంటున్న గుడారంలో అతడు వెదికాడు. కాని అతని నివాసంలో దేవుళ్లు కనబడలేదు. అప్పుడు లాబాను రాహేలు గుడారంలోకి వెళ్లాడు.
GEN 31:34 రాహేలు తన ఒంటె సామాగ్రిలో ఆ దేవుళ్లను దాచిపెట్టి, వాటి మీద కూర్చొంది. లాబాను గుడారం అంతా వెదికాడు, కాని ఆ విగ్రహాలు అతనికి దొరకలేదు.
GEN 31:35 “నాయనా, నా మీద కోపగించకు. నీ యెదుట నేను నిలబడలేక పోతున్నాను. నేను రుతు క్రమంలో ఉన్నాను” అని రాహేలు తన తండ్రితో చెప్పింది. కనుక లాబాను ఆ బస అంతటా వెదికాడు, కాని తన ఇంటి దేవుళ్లు అతనికి కనబడలేదు.
GEN 31:36 అప్పుడు యాకోబుకు చాలా కోపం వచ్చింది. యాకోబు అన్నాడు: “నేనేం తప్పు చేసాను? ఏ ఆజ్ఞను నేను ఉల్లంఘించాను? నన్ను వెంటాడే హక్కు నీకెక్కడిది?
GEN 31:37 నా ఆస్తి అంతా నీవు వెదికావు. నీకు చెందినది ఏమీ నీకు దొరకలేదు. నీకేమైనా దొరికి ఉంటే దాన్ని నాకు చూపించు. మన మనుష్యులకు కనబడేటట్టు దాన్ని ఇక్కడ పెట్టు. మనలో ఎవరిది సరిగా ఉందో మనవాళ్లే నిర్ణయిస్తారు.
GEN 31:38 ఇరవై సంవత్సరాలు నీ కోసం నేను పని చేసాను. ఆ కాలమంతటిలో గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని ఒక్కటి గూడా పుట్టుకలో చావలేదు. నీ మందలోని పొట్టేళ్లలో ఒక్కటి గూడా నేను తినలేదు.
GEN 31:39 ఎప్పుడైనా సరే అడవి మృగాలు గొర్రెల్ని చంపితే, ఆ విలువ నేనే చెల్లించాను. చచ్చిన జంతువును ఎప్పుడూ నీకు చూపెట్టి, ఇది నా తప్పు కాదు అని నేను చెప్పలేదు. అయినా సరే రాత్రింబవళ్లు నీ మందల్ని కాపలా కాచాను.
GEN 31:40 పగలు ఎండకు నా బలం క్షీణించింది. రాత్రి చలి మూలంగా నా కన్నులకు నిద్ర దూరమయింది.
GEN 31:41 20 సంవత్సరాలు ఒక బానిసలా నేను నీకు పని చేసాను. నీ కుమార్తెలను సంపాదించుకోవటానికి మొదట 14 సంవత్సరాలు నేను నీకు పని చేసాను. తర్వాత ఆరు సంవత్సరాలు నీ జంతువుల్ని సంపాదించటంకోసం పని చేసాను. ఆ కాలంలో నా జీతాన్ని నీవు పదిసార్లు మార్చావు.
GEN 31:42 అయితే నా పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడే గనుక నాకు తోడుగా లేకపోతే, నీను నన్ను వట్టి చేతులతో పంపి ఉండేవాడివి. కాని నా కష్టాలను దేవుడు చూశాడు. నేను చేసిన పనిని దేవుడు చూశాడు. నాదే సరి అని గతరాత్రి దేవుడు రుజువు చేసాడు.”
GEN 31:43 యాకోబుతో లాబాను చెప్పాడు: “ఈ అమ్మాయిలు నా కుమార్తెలు. వారి పిల్లలు నాకు చెందినవాళ్లు. ఈ జంతువులన్నీ నావే. ఇక్కడ నీకు కనబడుతోన్న సమస్తం నాదే. అయినప్పటికీ నా కుమార్తెలను, వారి పిల్లలను నా దగ్గర ఉంచుకొనేందుకు నేను చేయగలిగింది ఏమీ లేదు.
GEN 31:44 కనుక నీతో ఒడంబడిక చేసుకొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మనకు ఒడంబడిక ఒకటి కుదిరిందని సూచించేందుకు మనం ఇక్కడ ఒక రాళ్ల కుప్ప వేద్దాం.”
GEN 31:45 కనుక యాకోబు ఒక పెద్ద బండను తెచ్చాడు, అతడు ఒక ఒడంబడిక చేసుకొన్నట్టు సూచనగా దాన్ని నిలువబెట్టాడు.
GEN 31:46 మరికొన్ని రాళ్లు తెచ్చి కుప్పగా వేయుమని అతడు తన సేవకులతో చెప్పాడు. అప్పుడు ఆ రాళ్ల కుప్ప ప్రక్కన వాళ్లు భోజనం చేసారు.
GEN 31:47 ఆ స్థలానికి యగర్ శాహదూత అని లాబాను పేరు పెట్టాడు. కానీ యాకోబు ఆ స్థలానికి గలేదు అని పేరు పెట్టాడు.
GEN 31:48 “మనం ఇద్దరం మన ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప సహాయపడుతుంది” అన్నాడు లాబాను యాకోబుతో. అందుకే ఆ స్థలానికి గలేదు అని యాకోబు పేరు పెట్టాడు.
GEN 31:49 అప్పుడు లాబాను, “మనం ఒకరినుండి ఒకరం విడిపోయేటప్పుడు యోహోవా మనల్ని కాపాడును గాక!” అన్నాడు కనుక ఆ స్థలానికి మిస్పా అని కూడ పేరు.
GEN 31:50 అప్పుడు లాబాను అన్నాడు, “నా కుమార్తెలను నీవు బాధిస్తే, దేవుడు నిన్ను శిక్షిస్తాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు ఇతర స్త్రీలను పెళ్లి చేసుకొంటే దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు.
GEN 31:51 ఇవిగో, ఇవి మన యిద్దరి మధ్య నేను ఉంచిన రాళ్లు. మనమిద్దరం ఒక ఒడంబడిక చేసుకొన్నామని సూచించేందుకు, జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప. ఇది ప్రత్యేక బండ.
GEN 31:52 మనం మన ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప ఈ ప్రత్యేక బండ మనకు తోడ్పడుతాయి. నేనెన్నడూ ఈ రాళ్లు దాటి నీ మీదకు రాను. అలానే నీవు కూడా ఎన్నడూ ఈ రాళ్లు దాటి నామీద పోరాడటానికి రాకూడదు.
GEN 31:53 ఈ ఒప్పందాన్ని గనుక మనం మీరితే, అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి పూర్వికుల దేవుడు మనలను నేరస్థులుగా తీర్పు చెప్పును గాక.” యాకోబు తండ్రియైన ఇస్సాకు, దేవుణ్ణి “భయంకరుడు” అని పిల్చాడు. కనుక యాకోబు ఆ పేరు మీదనే వాగ్దానం చేసాడు.
GEN 31:54 అప్పుడు యాకోబు ఒక పశువును వధించి, ఆ కొండమీద దానిని బలిగా అర్పించాడు. భోజనంలో పాలు పుచ్చుకోమని అతడు తన వాళ్లను పిల్చాడు. భోజనం చేసి, ఆ రాత్రికి వారు ఆ కొండమీదనే గడిపారు.
GEN 31:55 మర్నాడు ఉదయాన్నే లాబాను తన కుమార్తెలకు, వారి పిల్లలకు వీడ్కోలు ముద్దు పెట్టాడు. అతడు వాళ్లను ఆశీర్వదించి తిరిగి తన యింటికి వెళ్లిపోయాడు.
GEN 32:1 యాకోబు కూడ అక్కడ నుండి వెళ్లి పోయాడు. అతడు ప్రయాణం చేస్తుండగా దేవుని దూతలను చూశాడు.
GEN 32:2 యాకోబు వారిని చూసినప్పుడు, “ఇది దేవుని శిబిరం” అన్నాడు. కనుక ఆ స్థలానికి “మహనయీము” అని యాకోబు పేరు పెట్టాడు.
GEN 32:3 యాకోబు అన్న ఏశావు శేయెరు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇది ఏదోం పర్వత ప్రాంతం. యాకోబు ఏశావుకు వార్తాహరులను పంపాడు.
GEN 32:4 “ఏశావుకు ఇలా చెప్పండి అని వార్తాహరులతో చెప్పాడు యాకోబు: ‘మీ సేవకుడైన యాకోబు, నా యజమాని ఏశావుకు చెప్పేదేమిటంటే, ఇన్ని సంవత్సరాలు నేను లాబానుతో నివసించాను.
GEN 32:5 పశువులు, గాడిదలు, మందలు, అనేక మంది సేవకులు, దాసీలు నాకు ఉన్నారు. అవన్నీ నేను నీకు పంపిస్తున్నాను. నీవు మమ్మల్ని చేర్చుకోవాలని మనవి.’”
GEN 32:6 వార్తాహరులు తిరిగి వచ్చి, “నీ అన్న ఏశావును కలుసుకొనేందుకు మేము వెళ్లాం. నిన్ను కలుసుకొనేందుకు అతడు వస్తున్నాడు. అతనితో 400 మంది మనుష్యులు ఉన్నారు” అని యాకోబుతో చెప్పారు.
GEN 32:7 ఆ వార్త యాకోబుకు భయం కలిగించింది. తనతో ఉన్న మనుష్యులందరినీ అతడు రెండు గుంపులుగా విభజించాడు. మందలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు.
GEN 32:8 “ఏశావు వచ్చి ఒక గుంపును హతమార్చినా, మరో గుంపు పారిపోయి తప్పించుకోవచ్చు” అనుకున్నాడు యాకోబు.
GEN 32:9 యాకోబు ఇలా అన్నాడు “నా తండ్రి అబ్రాహాము దేవా! నా తండ్రి ఇస్సాకు దేవా! ఓ యెహోవా, నన్ను మళ్లీ నా కుటుంబం దగ్గరకు, నా స్వదేశానికి నీవే వచ్చేయమన్నావు. నీకు నాకు మేలు చేస్తానన్నావు.
GEN 32:10 నా యెడల నీవు ఎంతో దయ చూపించావు. నాకు ఎన్నో మేళ్లు చేసావు. మొదటిసారి నేను యోర్దాను దాటినప్పుడు, నా చేతి కర్ర తప్ప యింకేమీ నా స్వంతం లేదు. ఇప్పుడు రెండు గుంపులకు సరిపడినంత నాకు ఉన్నది.
GEN 32:11 దయచేసి నా అన్న ఏశావు నుంచి నన్ను కాపాడు. నాకు అతడంటే భయంగా ఉంది. అతడు వచ్చి మమ్మల్ని అందరిని, చివరికి తల్లులను పిల్లలను కూడ చంపేస్తాడని భయంగా ఉంది.
GEN 32:12 నేను నీతో మంచిగా ఉంటాను. నేను నీ కుటుంబాన్ని వర్ధిల్లచేసి, నీ పిల్లల్ని ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తాను. లెక్కింప జాలనంత విస్తారంగా వారుంటారు” అని నీవు నాతో అన్నావు గదా ప్రభూ.
GEN 32:13 యాకోబు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. ఏశావుకు కానుకలుగా ఇచ్చేందుకు కొన్ని వస్తువులను యాకోబు సిద్ధం చేసాడు.
GEN 32:14 యాకోబు 200 ఆడ మేకలను, 20 మేకపోతులను, 200 ఆడ గొర్రెలను, 20 పొట్టేళ్లను తీసుకొన్నాడు.
GEN 32:15 30 ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఎద్దులను, 20 ఆడ గాడిదలను, 10 మగ గాడిదలు యాకోబు తీసుకొన్నాడు.
GEN 32:16 “ఒక్కొక్క రకం జంతువుల మందను యాకోబు తన సేవకులకు అప్పగించాడు. అప్పుడు యాకోబు తన సేవకులతో ఒక్కో రకం జంతువుల మందను వేరు చేయండి నాకు ముందుగా నడుస్తూ, ఒక్కో మందకు మధ్య ఎడం ఉంచండి” అన్నాడు.
GEN 32:17 యాకోబు వారికి ఇవ్వవలసిన ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. మొదటి మంద వెంబడి ఉన్న సేవకులతో యాకోబు “నా అన్న ఏశావు నీ దగ్గరకు వచ్చి, ‘ఇవి ఎవరి జంతువులు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నీవు ఎవరి సేవకుడువి?’ అని అడిగితే,
GEN 32:18 ‘ఇవి నీ సేవకుడైన యాకోబు మందలు. నా యజమాని ఏశావుకు కానుకగా యాకోబు వీటిని పంపించాడు. యాకోబు కూడా మా వెనుక వస్తున్నాడు’ అని నీవు చె ప్పాలి” అన్నాడు.
GEN 32:19 అందరూ అలాగే చేయాలి అని రెండవ సేవకునికి, మూడవ సేవకునికి, మిగిలిన సేవకులందరికి యాకోబు ఆజ్ఞాపించాడు. “ఏశావును మీరు కలుసుకొన్నప్పుడు, ఏశావుకు మీరు ఇలానే చేయాలి.
GEN 32:20 ‘ఇది నీ కోసం కానుక, నీ సేవకుడైన యాకోబు వెనుక ఉన్నాడు’” అని మీరు చె ప్పాలి అన్నాడు యాకోబు. “ఈ కానుకలు ఇచ్చి వీళ్లను ముందు పంపిస్తే ఒకవేళ ఏశావు నన్ను క్షమించి చేర్చుకొంటాడేమో” అనుకొన్నాడు యాకోబు.
GEN 32:21 కనుక యాకోబు ఏశావుకు కానుకలు పంపించాడు. అయితే యాకోబు మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే వుండిపోయాడు.
GEN 32:22 ఆ రాత్రి చాలా గడిచిన తర్వాత యాకోబు లేచి బయల్దేరాడు. అతని భార్యలను, ఇద్దరు దాసీలను, తన పదకొండుమంది పిల్లలను అతడు తనతో కూడ వెంటబెట్టుకొని బయల్దేరాడు. యబ్బోకు నదిని దాటవలసిన చోట యాకోబు దాటాడు.
GEN 32:23 తన కుటుంబాన్ని నది దాటించాడు యాకోబు. తర్వాత యాకోబు తనకి కలిగిన దాన్ని అంతటినీ నది దాటించాడు.
GEN 32:24 అందరికంటే చివర యాకోబు నదిని దాటాడు. అయితే అతడు దాటక ముందు, అతడు ఇంకా ఒంటరిగా ఉండగానే, ఒక మనిషి వచ్చి అతనితో పోరాడాడు. సూర్యుడు ఉదయించే వరకు ఆ మనిషి అతనితో పోరాడాడు.
GEN 32:25 ఆ మనిషి యాకోబును ఓడించలేనట్టు గ్రహించాడు. అందుచేత అతడు యాకోబు కాలును తాకాడు. అప్పుడే యాకోబు కాలి కీలు జారిపోయింది.
GEN 32:26 అప్పుడు ఆ మనిషి, “నన్ను వెళ్లనివ్వు, సూర్యుడు వచ్చేస్తున్నాడు” అని యాకోబుతో అన్నాడు. కాని యాకోబు, “నేను నిన్ను వెళ్లనియ్యను. నీవు నన్ను ఆశీర్వదించాల్సిందే” అన్నాడు.
GEN 32:27 “నీ పేరేమిటి?” ఆ మనిషి అడిగాడు. “నా పేరు యాకోబు” అన్నాడు యాకోబు.
GEN 32:28 అప్పుడు, “నీ పేరు ఇకమీదట యాకోబు కాదు. ఇప్పుడు నీ పేరు ఇశ్రాయేలు. దేవునితోను, మనుష్యులతోను నీవు పోరాడి, ఓడిపోలేదు గనుక నీకు నేను ఈ పేరు పెడుతున్నాను” అన్నాడు ఆ మనిషి.
GEN 32:29 అప్పుడు యాకోబు, “దయచేసి నీ పేరు ఏమిటో చెప్పు” అని అడిగాడు. అయితే ఆ మనిషి “నీవు నా పేరెందుకు అడగాలి?” అన్నాడు. అప్పుడే యాకోబును అతడు ఆశీర్వదించాడు.
GEN 32:30 అందుచేత ఆ స్థలానికి పెనూయేలు అని యాకోబు పేరు పెట్టాడు. “ఇక్కడ దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూసాను. అయినప్పుటికి నా ప్రాణం దక్కింది” అన్నాడు యాకోబు.
GEN 32:31 అతడు పెనూయేలు దాటుతుండగా సూర్యుడు ఉదయించాడు. యాకోబు కాలికి అలా జరిగినందువల్ల అతడు కుంటుతున్నాడు.
GEN 32:32 అందుచేత తొడ గూటి మీద ఉన్న కండరమును ఇశ్రాయేలీయులు ఈ రోజువరకు తినరు, ఎందుకంటే అక్కడే యాకోబుకు దెబ్బ తగిలింది.
GEN 33:1 యాకోబు చూడగా ఏశావు రావడం కనబడింది. ఏశావు, అతనితో 400 మంది మనుష్యులు వస్తున్నారు. యాకోబు తన కుటుంబాన్ని నాలుగు గుంపులుగా చేసాడు. లేయా, ఆమె పిల్లలు ఒక గుంపులో ఉన్నారు, రాహేలు, యోసేపు ఒక గుంపులో ఉన్నారు, ఇద్దరు దాసీలు, వారి పిల్లలు మరి రెండు గుంపుల్లో ఉన్నారు.
GEN 33:2 దాసీలను వారి పిల్లలను యాకోబు ముందు ఉంచాడు. తర్వాత యాకోబు లేయాను ఆమె పిల్లలను ఉంచాడు. ఆ తర్వాత, చివరగా రాహేలును, యోసేపును ఉంచాడు యాకోబు.
GEN 33:3 యాకోబు తానే ఏశావు వస్తున్న వైపు ముందుగా వెళ్లాడు. కనుక ఏశావు దగ్గరకు వచ్చిన మొదటివాడు అతడే. యాకోబు తన అన్న దగ్గరకు నడుస్తూ ఏడు సార్లు నేలమీద సాగిలపడ్డాడు.
GEN 33:4 యాకోబును చూడగానే అతణ్ణి కలుసుకొనేందుకు ఏశావు పరుగెత్తాడు. ఏశావు అతణ్ణి కౌగిలించుకొని హత్తుకొన్నాడు. ఏశావు అతని మెడమీద ముద్దు పెట్టుకొని, వారిద్దరు సంతోషముతో ఏడ్చేసారు.
GEN 33:5 ఏశావు చూడగా స్త్రీలు పిల్లలు అతనికి కనబడ్డారు. “నీతో ఉన్న వీళ్లంతా ఎవరు?” అని అతడు అడిగాడు. “దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు వీళ్లంతాను. దేవుడు నాకు మేలు చేసాడు” అంటూ జవాబు చెప్పాడు యాకోబు.
GEN 33:6 తర్వాత ఇద్దరు దాసీలు, వారితో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లారు. వాళ్లంతా అతని ముందు సాష్టాంగపడ్డారు.
GEN 33:7 తర్వాత లేయా, ఆమెతో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు. తరువాత, రాహేలు, యోసేపు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు.
GEN 33:8 “నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు కనబడిన ప్రజలంతా ఎవరు? పైగా ఆ జంతువులన్నీ దేని కోసం?” అని ఏశావు అడిగాడు. దానికి యాకోబు “నీవు నన్ను స్వీకరించాలని చెప్పి అవన్నీ నీకు నా కానుకలు” అని జవాబిచ్చాడు.
GEN 33:9 కాని ఏశావు, “సోదరా, నాకు నీవు కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. నాకు కావాల్సినంత ఉన్నది” అన్నాడు.
GEN 33:10 యాకోబు అన్నాడు: “అలా కాదు, నేను నిన్ను బతిమలాడుకొంటున్నాను. నీవు నిజంగా నన్ను అంగీకరిస్తుంటే, నీవు నా కానుకలు గూడా అంగికరించాలి. మరలా నేను నీ ముఖం చూడటం నాకెంతో సంతోషంగా ఉంది. దేవుని ముఖము చూసినట్టు ఉంది. నీవు నన్ను అంగీకరించటం చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది.
GEN 33:11 అందుచేత నేను నీకు ఇస్తున్న కానుకలను గూడ స్వీకరించుమని ప్రార్థిస్తున్నా. దేవుడు నాకు ఎంతో మేలు చేసాడు. నాకు కావల్సిన దానికంటే ఎక్కువగా ఉంది.” ఈ విధంగా తన కానుకల్ని తీసుకోమని చెప్పి యాకోబు ఏశావును బతిమలాడాడు. కనుక ఏశావు ఆ కానుకలను స్వీకరించాడు.
GEN 33:12 అప్పుడు ఏశావు, “ఇంక నీవు ప్రయాణం కొనసాగించు. నేను కూడ నీతో వస్తాను” అన్నాడు.
GEN 33:13 కాని యాకోబు అతనితో ఇలా చెప్పాడు: “నా పిల్లలు బలహీనులని నీకు తెలుసు. పైగా నా మందలు, వాటి పిల్లలను గూర్చిన జాగ్రత్త నేను తీసుకోవాలి. ఒక్క రోజునే నేను వాటిని చాలా దూరం నడిపిస్తే అవి చస్తాయి.
GEN 33:14 అందుచేత నీవు ముందు వెళ్లిపో. నేను మెల్లగా నీ వెనుక వస్తా. పశువులు, మిగిలిన జంతువులు క్షేమంగా ఉండగలిగినంత నిదానంగా నేను నడుస్తాను. మరియు నా పిల్లలు కూడ మరీ అలసిపోకుండా నేను మెల్లగా వస్తాను. శేయీరులో నేను నిన్ను కలుసుకొంటాను.”
GEN 33:15 ఏశావు, “అలాగైతే నీకు సహాయంగా నా మనుష్యులను కొందర్ని నీతో ఉంచుతాను” అన్నాడు. కానీ యాకోబు, “అదంతా నీ దయ. కాని అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు” అన్నాడు.
GEN 33:16 కనుక ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం కట్టాడు.
GEN 33:17 అయితే యాకోబు సుక్కోతు వెళ్లాడు. అక్కడ తనకోసం ఒక యిల్లు, తన పశువుల కోసం కొట్టములు కట్టాడు. అందుకే ఆ చోటుకు సుక్కోతు అని పేరు.
GEN 33:18 ఆ తర్వాత, యాకోబు పద్దనరాము నుండి కనానులో ఉన్న షెకెము పట్టణం వరకు తన ప్రయాణాన్ని క్షేమంగా ముగించాడు. ఆ పట్టణానికి సమీపంగా ఒక పొలంలో యాకోబు తన నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు.
GEN 33:19 షెకెము తండ్రియైన హమోరు కుటుంబం దగ్గర యాకోబు ఆ పొలాన్ని కొన్నాడు. యాకోబు నూరు వెండి నాణ్యాలు చెల్లించాడు.
GEN 33:20 దేవుణ్ణి ఆరాధించటానికి యాకోబు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి “ఏల్, ఇశ్రాయేలీయుల దేవుడు” అని పేరు పెట్టాడు.
GEN 34:1 యాకోబు లేయాల కుమార్తె దీనా. ఒక రోజు, ఆ ఊరి స్త్రీలను చూడాలని దీనా బయటకు వెళ్లింది.
GEN 34:2 ఆ దేశం రాజైన హమోరు కుమారుడు షెకెము దీనాను చూసాడు. అతడు ఆమెను బంధించి, బలవంతంగా ఆమెతో సంభోగించాడు.
GEN 34:3 షెకెము దీనాను ప్రేమించాడు. ఆమె తనను పెళ్లి చేసుకునేలా ఒప్పించేందుకు ఆమెతో మాట్లాడాడు.
GEN 34:4 “నేను పెళ్లి చేసుకోవటానికి దయచేసి ఈ అమ్మాయినే తెచ్చి పెట్టమని” షెకెము తన తండ్రితో చెప్పాడు.
GEN 34:5 ఆ యువకుడు తన కూతురికి చేసిన దుష్కార్యాన్ని గూర్తి యాకోబు విన్నాడు. అయితే యాకోబు కుమారులంతా పశువులతోబాటు పొలాల్లో ఉన్నారు. అందుచేత వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు యాకోబు ఏమీ చేయలేదు.
GEN 34:6 అదే సమయంలో షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడేందుకు వెళ్లాడు.
GEN 34:7 జరిగిన దాన్ని గూర్చి యాకోబు కుమారులకు పొలంలోనే తెలిసింది. ఇది విని వాళ్లకు చాలా కోపం వచ్చింది. యాకోబు కూతురుతో శయనించి, షెకెము ఇశ్రాయేలీయుల వంశానికి అవమానం తెచ్చాడు గనుక వారికి పిచ్చి కోపం రెచ్చిపోయింది. షెకెము చాలా చెడ్డపని చేసాడు కనుక ఆ సోదరులంతా పొలాలనుండి వచ్చేసారు.
GEN 34:8 అయితే హమోరు ఆ సోదరులతో మాట్లాడాడు. “నా కుమారుడు షెకెముకు దీనా కావాలని ఉంది. దయచేసి వాడిని ఆమెను పెళ్లి చేసుకోనివ్వండి.
GEN 34:9 మనకు ఒక ప్రత్యేక ఒడంబడిక ఉన్నట్టు ఈ వివాహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు మా మగవాళ్లు మీ అమ్మాయిలను, మీ మగవాళ్లు మా అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు.
GEN 34:10 ఈ దేశంలోనే మీరు కూడ మాతో కలసి ఉండవచ్చును. భూమిని స్వంతం చేసుకొనేందుకు, వ్యాపారం చేసేందుకు ఇక్కడ మీకు స్వేచ్ఛ ఉంటుంది” అన్నాడు.
GEN 34:11 షెకెము కూడ యాకోబుతో, అన్నదమ్ములతో మాట్లాడాడు. షెకెము అన్నాడు: “దయచేసి నన్ను స్వీకరించండి, నేను చేసిన దాని విషయంలో నన్ను క్షమించండి. మీరు నన్నేమి చేయమంటే అది చేస్తా.
GEN 34:12 మీరు నన్ను దీనాను పెళ్లి చేసుకోనిస్తే, మీరు కోరిన కన్యాశుల్కం మీకు ఇస్తా. మీరు ఏమి అడిగితే అది ఇస్తా కాని దీనాను నన్ను పెళ్లాడనివ్వండి.”
GEN 34:13 షెకెముతో, అతని తండ్రితో అబద్ధం చె ప్పాలని యాకోబు కుమారులు నిశ్చయించుకున్నారు. వారి సోదరి షెకెము చేసిన నీచకార్యాన్ని బట్టి ఆ సోదరులు ఇంకా కోపంగానే ఉన్నారు.
GEN 34:14 కనుక ఆ సోదరులు, “నీకు ఇంకా సున్నతి కాలేదు గనుక నిన్ను మా సోదరిని పెళ్లి చేసుకోనివ్వం. మా సోదరి నిన్ను చేసుకోవడం తప్పు అవుతుంది.
GEN 34:15 అయితే నీవు ఈ ఒక్క పని చేస్తే నిన్ను ఆమెను పెళ్లి చేసుకోనిస్తాం. మీ పట్టణంలో ప్రతి పురుషుడూ మాలాగే సున్నతి చేసుకోవాలి.
GEN 34:16 అప్పుడు మీ పురుషులు మా స్త్రీలను, మా పురుషులు మీ స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు మనమంతా ఒక్క ప్రజ అవుతాం
GEN 34:17 సున్నతికి మీరు నిరాకరిస్తే, దీనాను మేము తీసివేసుకొంటాం” అని అతనితో చెప్పారు.
GEN 34:18 ఈ ఒడంబడిక హమోరుకు, షెకెముకు చాలా సంతోషం కలిగించింది.
GEN 34:19 దీనా సోదరులు అడిగినట్టు చేయాలంటే షెకెముకు చాలా సంతోషంగా ఉంది. షెకెము, అతని కుటుంబంలోకెల్లా చాలా గౌరవం గలవాడు.
GEN 34:20 హమోరు, షెకెము వారి పట్టణంలో సమావేశ స్థలానికి వెళ్లారు. ఆ పట్టణంలోని పురుషులతో వారు మాట్లాడి, అన్నారు:
GEN 34:21 “ఈ ఇశ్రాయేలీయులు మనతో నిజంగా స్నేహంగా ఉండాలని కోరుతున్నారు. వాళ్లను మన దేశంలోనే నివసించి వ్యాపారం చేసుకోనిద్దాం. మనందరికి సరిపోయేంత భూమి మనకు ఉంది. మనం వాళ్ల స్త్రీలను స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చు. అలానే వారి పురుషులు వివాహం చేసుకొనేందుకు మన స్త్రీలను సంతోషంగా మనం ఇవ్వవచ్చు.
GEN 34:22 అయితే మన పురుషులంతా ఒక పని చేయడానికి ఒప్పకోవాలి. ఇశ్రాయేలు ప్రజల్లాగే మన మగవాళ్లంతా సున్నతి చేసుకొనేందుకు సమ్మతించాలి.
GEN 34:23 మనం ఇలా చేస్తే, వాళ్ల ఆల మందలు, జంతువులు, వస్తుజాలం అన్నీ మనకి దక్కి, మనం ధనికులం అవుతాం. కనుక మనం వాళ్లతో ఈ ఒడంబడిక చేయాల్సిందే, వాళ్లు మనతోనే ఉంటారు.”
GEN 34:24 సమావేశ స్థలంలో ఈ మాటను విన్న మగవాళ్లంతా షెకెము, హమోరులతో ఏకీభవించారు. ఆ సమయంలో ప్రతి పురుషునికి సున్నతి జరిగింది.
GEN 34:25 మూడు రోజుల తర్వాత, సున్నతి పొందిన మగవాళ్లు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఈ సమయంలో ఆ మనుష్యులు బలహీనంగా ఉంటారని యాకోబు ఇద్దరు కుమారులు షిమ్యోను, లేవీలకు తెలుసు. కనుక వారు పట్టణంలోకి వెళ్లి, ఆ పురుషులందర్నీ అక్కడే చంపేసారు.
GEN 34:26 దీనా సోదరులు షిమ్యోను, లేవీ కలిసి హమోరును, అతని కుమారుని చంపేసారు. అంతట వారు షెకెము యింటినుండి దీనాను తీసుకొని వెళ్లిపోయారు.
GEN 34:27 యాకోబు మిగిలిన కుమారులు ఆ పట్టణంలోకి వెళ్లి, అక్కడ ఉన్న సమస్తం దోచుకొన్నారు. వారి సోదరికి, షెకెము చేసిన దాని విషయంలో వారు ఇంకా కోపంగా ఉన్నారు.
GEN 34:28 కనుక వారి జంతువులన్నింటినీ ఆ సోదరులు తీసుకుపోయారు. వారి గాడిదలను, పట్టణంలో, పొలాల్లో మిగిలినదంతా వారు దోచుకొన్నారు.
GEN 34:29 ప్రజలకు ఉన్నదంతా ఆ సోదరులు దోచుకుపోయారు. చివరికి వారి భార్యలను, పిల్లలను కూడా ఆ సోదరులు తీసుకొని వెళ్లిపోయారు.
GEN 34:30 అయితే షిమ్యోనుతోనూ, లేవీతోనూ యాకోబు అన్నాడు, “మీరు నాకు చాలా కష్టం తెచ్చి పెట్టారు. ఈ దేశంలో ఉన్న ప్రజలంతా నన్ను అసహ్వించుకొంటారు. కనానీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు అంతానాకు వ్యతిరేకంగా లేస్తారు. మనమేమో చాలా కొద్దిమందిమే ఉన్నాం. ఈ దేశంలో ఉన్నవాళ్లంతా ఏకమై మనమీద యుద్ధానికి వస్తే, నన్ను నాశనం చేస్తారు. నాతోబాటే మన ప్రజలందర్నీ నాశనం చేస్తారు.”
GEN 34:31 అయితే ఆ సోదరులు, “ఈ ప్రజలు మా సోదరిని ఒక వేశ్యలా చేస్తే, చూస్తూ ఊరుకోమంటావా? లేదు, మా సోదరికి అలా చేయటం వారిది తప్పు” అని చెప్పారు.
GEN 35:1 “బేతేలు పట్టణం వెళ్లు. అక్కడ నివసించి, ఆరాధనకు బలిపీఠం నిర్మించు. నీవు నీ అన్న ఏశావు దగ్గర్నుండి పారిపోతున్నప్పుడు నీకు అక్కడ ప్రత్యక్షమైన ఏల్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. అక్కడ ఆ దేవుణ్ణి ఆరాధించటానికి ఒక బలిపీఠం తయారు చేసుకో” అని దేవుడు యాకోబుతో చెప్పాడు.
GEN 35:2 కనుక యాకోబు తన కుటుంబం అంతటితో, సేవకులందరితో ఇలా చెప్పాడు: “మీ దగ్గర ఉన్న చెక్క, లోహములతో చేయబడిన ఆ తప్పుడు దేవతలన్నిటిని నాశనం చేయండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. శుభ్రమైన వస్త్రాలను ధరించండి.
GEN 35:3 మనం యిక్కడ్నుండి బేతేలుకు వెళ్లిపోవాలి. ఆ స్థలంలో నాకు కష్టం కలిగినప్పుడు సహాయం చేసినటువంటి దేవునికి బలిపీఠం కట్టాను. ఆ దేవుడే నేను వెళ్లిన ప్రతి చోటా నాతో ఉన్నాడు.”
GEN 35:4 కనుక ప్రజలు వారి దగ్గర ఉన్న అసత్య దేవతలన్నిటిని యాకోబుకు ఇచ్చివేసారు. వారంతా వారి చెవులకు ధరించిన నగలను యాకోబుకు ఇచ్చివేసారు. షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద యాకోబు వీటన్నిటిని పాతి పెట్టాడు.
GEN 35:5 యాకోబు, అతని కుమారులు ఆ స్థలం విడిచి వెళ్లిపోయారు. ఆ ఊరి ప్రజలు వీరిని వెంబడించి, చంపాలనుకొన్నారు. అయినా వారు చాలా భయపడి, యాకోబును వెంబడించలేదు.
GEN 35:6 కనుక యాకోబు, అతని వాళ్లంతా లూజు వెళ్లారు. లూజు ఇప్పుడు బేతేలు అని పిలువబడుతోంది. అది కనాను దేశంలో ఉంది.
GEN 35:7 అక్కడ యాకోబు ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి ఏల్ బేతేలు అని యాకోబు పేరు పెట్టాడు. అతడు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు మొట్టమొదటి సారిగా అక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమైన కారణంగా యాకోబు ఈ పేరును నిర్ణయించాడు.
GEN 35:8 రిబ్కా దాది దెబోరా అక్కడే చనిపోయింది. బేతేలులో సింధూర వృక్షం కింద ఆమెను వారు పాతిపెట్టారు. ఆ స్థలానికి అల్లోను బాకూతో అని వారు పేరు పెట్టారు.
GEN 35:9 పద్దనరాము నుండి యాకోబు తిరిగి వస్తుండగా, దేవుడు మరల అతనికి ప్రత్యక్షమయ్యి, యాకోబును ఆశీర్వదించాడు.
GEN 35:10 “నీ పేరు యాకోబు. కాని, ఆ పేరును నేను మార్చేస్తాను. ఇప్పుడు నీవు యాకోబు అని పిలువబడవు. ‘నీ కొత్త పేరు ఇశ్రాయేలు’ అని ఉంటుంది” కాబట్టి దేవుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
GEN 35:11 అతనితో దేవుడన్నాడు: నేను సర్వశక్తిమంతుడనైన దేవుణ్ణి. కనుక నీకు ఈ ఆశీర్వాదం ఇస్తున్నాను: నీకు చాలా సంతోషం కలిగి, ఒక గొప్ప జనాంగంగా పెరుగుదువు! మరిన్ని జనాంగాలు, మరికొందరు రాజులు నీలో నుండి ఉద్భవిస్తారు.
GEN 35:12 అబ్రాహాము, ఇస్సాకులకు ఒక ప్రత్యేక దేశం నేనిచ్చాను. ఇప్పుడు ఆ దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. పైగా నీ తర్వాత జీవించే నీ ప్రజలందరికీ ఆ దేశాన్ని నేను ఇస్తున్నాను.
GEN 35:13 అంతలో దేవుడు అక్కడ్నుండి వెళ్లిపోయాడు.
GEN 35:14 ఈ స్థలంలో ఒక స్మారక శిల యాకోబు నిలబెట్టాడు. ద్రాక్షారసం, తైలం పోసి ఆ బండను పవిత్రం చేసాడు యాకోబు. ఆ స్థలంలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు గనుక ఇది ఒక ప్రత్యేక స్థలం. యాకోబు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు.
GEN 35:16 యాకోబు, అతని వాళ్లు బేతేలు నుండి ప్రయాణమయ్యారు. ఇంక వారు ఎఫ్రాతా (బెత్లెహేం) చేరుతారనగా, రాహేలుకు ప్రసవ వేదన ప్రారంభమయింది.
GEN 35:17 అయితే ఈ కాన్పులో రాహేలు చాలా కష్టపడుతోంది. ఆమె విపరీతంగా బాధపడుతోంది. రాహేలు పనిమనిషి ఇది చూసి, “రాహేలూ భయపడకు. నీవు మరో కుమారుణ్ణి కంటున్నావు” అని చెప్పింది.
GEN 35:18 కుమారుని కంటూనే రాహేలు చనిపోయింది. చనిపోక ముందు ఆ పిల్లవాడికి బెనోని అని ఆమె పేరు పెట్టింది. అయితే యాకోబు అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.
GEN 35:19 ఎఫ్రాతా మార్గంలో రాహేలు సమాధి చేయబడింది (ఎఫ్రాతా అంటే బెత్లేహేం).
GEN 35:20 రాహేలు గౌరవార్థం, ఆమె సమాధి మీద యాకోబు ఒక ప్రత్యేక బండను ఉంచాడు. ఆ ప్రత్యేక బండ నేటికీ అక్కడ ఉంది.
GEN 35:21 అప్పుడు ఇశ్రాయేలు (యాకోబు) తన ప్రయాణం కొనసాగించాడు. ఏదెరు శిఖరానికి కొద్దిగా దక్షిణంగా అతడు శిబిరం వేసాడు.
GEN 35:22 ఇశ్రాయేలు అక్కడ కొన్నాళ్లపాటు ఉండిపోయాడు. అతడు అక్కడ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు దాసి బిల్హాతో రూబేను శయనించాడు. ఇశ్రాయేలు ఇది విని చాలా కోపగించుకొన్నాడు. యాకోబుకు (ఇశ్రాయేలు) 12 మంది కుమారులు.
GEN 35:23 అతని భార్య లేయా మూలంగా అతనికి ఆరుగురు కుమారులు ఉన్నారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలును.
GEN 35:24 అతని భార్య రాహేలు మూలంగా అతనికి ఇద్దరు కుమారులున్నారు. యోసేపు, బెన్యామీను.
GEN 35:25 రాహేలు పనిమనిషి బిల్హా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దాను, నఫ్తాలి.
GEN 35:26 లేయా పనిమనిషి జిల్ఫా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబుకు (ఇశ్రాయేలుకు) పుట్టిన కుమారులు.
GEN 35:27 కిర్యతర్బాలోని (హెబ్రోను) మమ్రేలోనున్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన చోటు ఇది.
GEN 35:28 ఇస్సాకు 180 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు.
GEN 35:29 ఇస్సాకు చాలకాలం నిండు జీవితాన్ని జీవించాడు. అతడు చనిపోయినప్పుడు వృద్ధుడు. అతని సమాధి చేయబడిన చోటనే, అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతణ్ణి కూడ సమాధి చేశారు.
GEN 36:1 ఏశావు కుటుంబ జాబితా ఇది: (ఎదోము అని కూడ అతనికి పేరు) ఏశావు కనాను దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు.
GEN 36:2 ఏశావు భార్యలు ఎవరంటే: ఆదా, హిత్తీవాడైన ఏలోను కుమార్తె అహోలీబామా, హివ్వీవాడైన సిబ్యోను కుమారుడు అనా కుమార్తె,
GEN 36:3 బాశెమతు, ఇశ్మాయేలు కుమార్తె, నెబాయోతు సోదరి.
GEN 36:4 ఎలీఫజు అనే కుమారుని ఆదా ఏశావుకు కన్నది. రగూయేలు అనే కుమారుని బాశెమతు ఏశావుకు కన్నది.
GEN 36:5 అహోలీబామా ఏశావుకు ముగ్గురు కుమారులను కన్నది: యూషు, యాలాము, కోరహు. వీరు ఏశావు కుమారులు. వీరు కనాను దేశంలో పుట్టారు.
GEN 36:6 ఏశావు కుటుంబం, యాకోబు కుటుంబం కలిసి ఒకే చోట నివసించటం వల్ల ఆ ప్రాంతం వాళ్ల పోషణకు చాలలేదు. కనుక ఏశావు కనాను విడిచిపెట్టి తన సోదరుడు యాకోబుకు దూరంగా మరో దేశం వెళ్లిపోయాడు. ఏశావు తనకు కలిగినదంతా తనతోబాటు తీసుకొని పోయాడు. ఇవన్నీ అతడు కనానులో నివసించినప్పుడు సంపాదించుకొన్నాడు. కనుక తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన బానిసలందరిని, పశువులను, ఇతర జంతువులను ఏశావు తనతో కూడ తెచ్చుకొన్నాడు. కనుక ఏశావు శేయీరు కొండ ప్రాంతానికి తరలి పోయాడు. (ఏశావుకు ఎదోము అని కూడ పేరు). (మరియు ఎదోము, శేయీరు దేశానికి మరో పేరు)
GEN 36:9 ఎదోమి ప్రజలకు ఏశావు తండ్రి. శేయీరు (ఎదోము) కొండ ప్రాంతంలో నివసిస్తోన్న ఏశావు కుటుంబంలోని వాళ్ల పేర్లు యివి:
GEN 36:10 ఏశావు కుమారులు ఎలీఫజు, ఏశావు, ఆదాలకు పుట్టిన కుమారుడు. రగూయేలు, ఏశావు, బాశెమతులకు పుట్టిన కుమారుడు.
GEN 36:11 ఎలీఫజుకు అయిదుగురు కుమారులు: తేమాను, ఓమారు, సెపో, గాతాము మరియు కనజు.
GEN 36:12 ఎలీఫెజుకు తిమ్నా అనే ఒక దాసి కూడ ఉంది. తిమ్నా, ఎలీఫజులకు అమాలేకు పుట్టాడు.
GEN 36:13 రగూయేలుకు ముగ్గురు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు బాశెమతు మూలంగా ఏశావుకు మనుమళ్లు.
GEN 36:14 అనా కుమార్తె అహోలీబామా ఏశావుకు మూడవ భార్య. (అనా సిబ్యోను కుమారుడు) ఏశావు, అహోలీబామాలకు పుట్టిన పిల్లలు: యూషు, యాలాము, కోరహు.
GEN 36:15 ఏశావు ద్వారా వచ్చిన వంశాలు యివి: ఏశావు మొదటి కుమారుడు ఎలీఫజు. ఎలీఫజుకు పుట్టిన వారు: తేమాను, ఓమారు, సెపో, కనజు.
GEN 36:16 కోరహు, గాతాము, అమాలేకు. ఈ వంశాలన్నీ ఏశావు భార్య ఆదానుండి ఉద్భవించాయి
GEN 36:17 ఏశావు కుమారుడు రగూయేలు ఈ కింది కుటుంబాలకు తండ్రి: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. ఈ కుటుంబాలన్నీ ఏశావు భార్య బాశెమతు నుండి ఉద్భవించాయి.
GEN 36:18 అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామాకు యూషు, యగ్లాము, కోరహు పుట్టారు. ఈ ముగ్గురు వారికి పుట్టిన కుటుంబాలకు పెద్దలు.
GEN 36:19 ఈ కుటుంబాలన్నీ ఏశావునుండి ఉద్భవించాయి.
GEN 36:20 ఏశావుకంటె ముందు హోరీవాడైన శేయీరు ఎదోములో నివసించాడు. శేయీరు కుమారులు వీరు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
GEN 36:21 దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఏశావు (ఎదోము) ప్రాంతంనుండి వచ్చిన హోరీయ కుటుంబ నాయకులు.
GEN 36:22 హోరీ, హేమీము. వీరికి లోతాను తండ్రి. (తిమ్నా లోతాను సోదరి.)
GEN 36:23 అల్వాన్, మానహదు, ఏబాలు, షపో, ఓనాము. వీరి తండ్రి శోబాలు.
GEN 36:24 సిబ్యోనుకు ఇద్దరు కుమారులు. అయ్యా, అనా. (అనా తన తండ్రి గాడిదలను కాస్తూ ఉండగా ఎడారిలో ఉష్ణధారలను కనుగొన్నవాడు.)
GEN 36:25 దిషాను, అహోలీబామా అనే వారికి అనా తండ్రి.
GEN 36:26 దిషోనుకు నలుగురు కుమారులు: హెన్దూను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
GEN 36:27 ఏసెరుకు ముగ్గురు కుమారులు: బిల్హాను, జవాను, అకాను.
GEN 36:28 దీషానుకు ఇద్దరు కుమారులు: ఊజు, అరాను.
GEN 36:29 హోరీ కుటుంబాల పెద్దల పేర్లు ఇవి: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
GEN 36:30 దిషోను, ఏసెరు, దీషాను, శేయీరు (ఎదోము) దేశంలో నివసించిన కుటుంబాల పెద్దలు వీరంతాను.
GEN 36:31 అప్పట్లో, ఎదోములో రాజులు ఉన్నారు. ఇశ్రాయేలీయుల రాజులకంటె చాలా ముందే ఎదోములో రాజులు ఉన్నారు.
GEN 36:32 బెయారు కుమారుడు బెల ఎదోమును పాలించిన ఒక రాజు. అతడు దిన్హాబా పట్టణమును పాలించాడు.
GEN 36:33 బెల చనిపోయినప్పుడు యోబాబు రాజయ్యాడు. యోబాబు బొస్రావాడైన జెరహు కుమారుడు.
GEN 36:34 యోబాబు చనిపోయినప్పుడు హుషాము పాలించాడు. హుషాము తేమాని ప్రజల దేశవాసి.
GEN 36:35 హుషాము చనిపోయాక హదదు ఆ ప్రాంతాన్ని పాలించాడు. బదదు కుమారుడు హదదు. (మోయాబు దేశంలో మిద్యానును జయించినవాడు హదదు.) హదదు అవీతు పట్టణంవాడు.
GEN 36:36 హదదు మరణించాక శమ్లా ఆ దేశాన్ని పాలించాడు. శమ్లా మశ్రేకనుండి వచ్చినవాడు.
GEN 36:37 శమ్లా మరణించాక షావూలు ఆ ప్రాంతాన్ని పాలించాడు. యూఫ్రటీసు నదీ ప్రాంతంలోని రహెబోతువాడు షావూలు.
GEN 36:38 షావూలు మరణానంతరం బయల్ హానాను ఆ దేశాన్ని పాలించాడు. అక్బోరు కుమారుడు బయల్ హనాను.
GEN 36:39 బయల్ హనాను మరణించాక హదదు (హదరు) ఆ దేశాన్ని పాలించాడు. హదదు పాపు నగరవాసి. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మత్రేదు కుమార్తె. (మత్రేదు తండ్రి మేజాహాబు).
GEN 36:40 తిమ్నా, అల్వా, యతేతు, అహోలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు, ఈరాము: ఈ ఎదోమీ కుటుంబాలకు పితరుడు ఏశావు. వీటిలో ఒక్కో కుటుంబం, తన కుటుంబం పేరుతోనే పిలువబడే ప్రాంతంలో నివసించింది.
GEN 37:1 యాకోబు కనాను దేశంలో ఉంటూ, అక్కడే నివసించాడు. ఇదీ, అతని తండ్రి నివసించినదీ ఒకటే దేశం.
GEN 37:2 ఇదీ యాకోబు కుటుంబ గాధ. యోసేపు 17 సంవత్సరాల యువకుడు. గొర్రెల్ని, మేకల్ని కాయటం అతని పని. తన సోదరులైన బిల్హా, జిల్ఫా, కుమారులతో కలిసి యోసేపు ఈ పని చేసాడు. (బిల్హా, జిల్ఫా అతని తండ్రి భార్యలు.) అతని సోదరులు చేసే చెడ్డ పనులను గూర్చి యోసేపు తన తండ్రితో చెప్పేవాడు.
GEN 37:3 అతని తండ్రి ఇశ్రాయేలు (యాకోబు) చాలా వృద్ధుడుగా ఉన్నప్పుడు యోసేపు పుట్టాడు. కనుక ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యాకోబు తన కుమారునికి ఒక ప్రత్యేకతగల అంగీ ఇచ్చాడు. ఈ అంగీ చాలా పొడుగ్గా, అందంగా ఉంది.
GEN 37:4 యోసేపు సోదరులు వారి తండ్రి వారందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించటం గమనించారు. అందుచేత వారు వారి సోదరుణ్ణి ద్వేషంచారు. వాళ్లు యోసేపుతో స్నేహభావంతో మాట్లాడలేదు.
GEN 37:5 ఒకసారి యోసేపుకు ఒక ప్రత్యేకమైన కల వచ్చింది. తర్వాత ఈ కల విషయం యోసేపు తన అన్నలతో చెప్పాడు. దీని తర్వాత అతని అన్నలు అతణ్ణి మరింతగా ద్వేషించారు.
GEN 37:6 “నాకో కల వచ్చింది,
GEN 37:7 మనమంతా పొలంలో పని చేస్తున్నాం. మనం గోధుమ పనలు కడ్తున్నాం. నా పన నిలబడింది, దాని చుట్టూ మీ పనలు లేచి నిలబడ్డాయి. అప్పుడు మీ పనలన్నీ నా పనకు సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు యోసేపు.
GEN 37:8 అతని సోదరులు, “అంటే మా మీద నీవు రాజువై అధికారం చేస్తావా?” అని అడిగారు. వారిని గూర్చి యోసేపుకు వస్తోన్న కలల మూలంగా ఇప్పుడు వారు అతణ్ణి ఇంకా ఎక్కువ ద్వేషిస్తున్నారు.
GEN 37:9 అప్పుడు యోసేపుకు మళ్లీ ఒక కల వచ్చింది. ఈ కలను గూర్చి యోసేపు తన సోదరులకు చెప్పాడు. “నాకు ఇంకో కల వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, మరియు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడటం నేను చూసాను” అంటూ చెప్పాడు యోసేపు.
GEN 37:10 ఈ కల విషయమై యోసేపు తన తండ్రితో కూడ చెప్పాడు. కాని అతని తండ్రి అతణ్ణి విమర్శించాడు. “ఇదేం కల? నేనూ, మీ అమ్మ, నీ సోదరులు అందరం నీకు సాష్టాంగపడతామని నీవు నమ్ముతున్నావా?” అన్నాడు అతని తండ్రి.
GEN 37:11 యోసేపు సోదరులు మాత్రం అతని మీద అసూయ పడుతూనే ఉన్నారు. అయితే యోసేపు తండ్రి వీటన్నింటిని గూర్చి చాలా ఆలోచన చేసి వీటి భావం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ వున్నాడు.
GEN 37:12 ఒకరోజు, యోసేపు సోదరులు తమ తండ్రి గొర్రెల్ని మేపుకొనేందుకు షెకెం వెళ్లారు.
GEN 37:13 యాకోబు, “నీ, సోదరులు షెకెంలో నా గొర్రెల్ని కాస్తున్నారు. నీవు అక్కడికి వెళ్లాలి” అని యోసేపుతో చెప్పాడు. “అలాగే నేను వెళ్తా,” అన్నాడు యోసేపు.
GEN 37:14 యోసేపు తండ్రి, “నీవు వెళ్లి నీ సోదరులు క్షేమంగా ఉన్నారో లేదో చూచి, మళ్లీ వచ్చి నా గొర్రెల క్షేమ సమాచారం నాకు చెప్పాలి” అన్నాడు. అందుచేత యోసేపు తండ్రి హెబ్రోను లోయనుండి షెకెముకు అతడ్ని పంపించాడు.
GEN 37:15 షెకెములో యోసేపు తప్పిపోయాడు. అతడు పొలాల్లో తిరుగుతోంటే ఒక మనిషి చూశాడు. “ఏమిటి వెదుకుతున్నావు” అన్నాడు ఆ మనిషి.
GEN 37:16 “నేను నా అన్నల కోసం వెదుకుతున్నాను. వాళ్లు గొర్రెల్ని మేపుకొంటూ ఎక్కడ ఉన్నారో నీవు చెప్పగలవా?” అన్నాడు యోసేపు.
GEN 37:17 ఆ మనిషి “అప్పుడే వాళ్లు వెళ్లిపోయారు గదా. వాళ్లు దోతాను వెళ్తాం అని చెప్పుకోవటం నేను విన్నాను” అన్నాడు. కనుక యోసేపు తన సోదరులను వెంబడించి, దోతానులో వారిని చూడగలిగాడు.
GEN 37:18 యోసేపు రావటం అతని అన్నలు అంత దూరం నుంచే చూసారు. అతణ్ణి చంపేందుకు ఒక పథకం వేయాలని వారు తీర్మానించుకొన్నారు.
GEN 37:19 ఆ సోదరులు వాళ్లలో వారు ఇలా చెప్పుకొన్నారు, “కలలుకనే యోసేపు ఇక్కడికి వస్తున్నాడు.
GEN 37:20 ఇప్పుడు మనకు వీలైనప్పుడే మనం వాణ్ణి చంపివేయాలి. వాని శవాన్ని ఇక్కడే ఏదో ఖాళీ బావిలో పడవేస్తే సరిపోతుంది. అడవి మృగం ఏదో వాణ్ణి చంపేసిందని మన తండ్రితో మనం చెప్పొచ్చు. అప్పుడు అతని కలలన్నీ అర్థము లేనివని వానికి మనం చూపెట్టవచ్చు.”
GEN 37:21 కానీ రూబేను యోసేపును కాపాడాలి అనుకొన్నాడు, “వాణ్ణి మనం చంపొద్దు.
GEN 37:22 వానికి హాని చేయకుండానే ఒక బావిలో పడవేస్తే సరిపోతుంది” అని చెప్పాడు రూబేను. యోసేపును రక్షించి, అతని తండ్రి దగ్గరకు పంపించాలని రూబేను వేసిన పథకం ఇది.
GEN 37:23 యోసేపు తన సోదరుల దగ్గరకు వచ్చాడు. వారు అతని మీద పడి, అందమైన అతని పొడవాటి అంగీని చింపేసారు.
GEN 37:24 తర్వాత, ఎండిపోయి ఖాళీగా ఉన్న ఒక బావిలో అతణ్ణి పడవేసారు.
GEN 37:25 యోసేపు బావిలో పడి ఉంటే, అతని సోదరులు భోజనం చేసేందుకు కూర్చున్నారు. అప్పుడు వారు చూడగా, గిలాదునుండి ఈజిప్టుకు ప్రయాణం చేస్తోన్న వ్యాపారస్తుల బృందం ఒకటి కనబడింది. వారి ఒంటెలు గుగ్గిలం, మస్తకి, బోళం, ఐశ్వర్యాలు మోస్తున్నాయి.
GEN 37:26 కనుక యూదా తన సోదరులతో “మనం మనసోదరుని చంపి, వాని మరణాన్ని దాచిపెడితే మనకేం లాభం?
GEN 37:27 ఈ వ్యాపారస్తులకు గనుక మనం వాణ్ణి అమ్మివేస్తే మనకు లాభం వస్తుంది. పైగా మన సొంత సోదరుని చంపిన అపరాధం మనమీద ఉండదు” అన్నాడు. మిగిలిన సోదరులు సమ్మతించారు.
GEN 37:28 మిద్యానీ వ్యాపారవేత్తలు అటు రాగానే, ఆ సోదరులు యోసేపును బావిలో నుండి బయటకు తీసారు. 20 వెండి నాణాలకు వారతణ్ణి ఆ వ్యాపారవేత్తలకు అమ్మివేసారు. వ్యాపారవేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకువెళ్లారు.
GEN 37:29 ఇంతసేపూ రూబేను అక్కడ తన సోదరులతో లేడు. యోసేపును వారు అమ్మివేసినట్టు అతనికి తెలియదు. రూబేను బావి దగ్గరకు వచ్చినప్పుడు, యోసేపు బావిలో లేడు. రూబేనుకు ఎక్కడాలేని విచారం కలిగింది. తన విషాదాన్ని తెలియజేయడానికి తన గుడ్డలను చింపివేసుకొన్నాడు.
GEN 37:30 రూబేను తన సోదరుల దగ్గరకు వెళ్లి, “పిల్లవాడు బావిలో లేడు, నేనేం చేయాలి?” అని అడిగాడు.
GEN 37:31 ఆ సోదరులు ఒక మేకను చంపి, దాని రక్తాన్ని యోసేపుయొక్క అందమైన అంగీకి పూసారు.
GEN 37:32 తర్వాత ఆ సోదరులు ఆ అంగీని తమ తండ్రికి చూపించారు. “ఈ అంగీ మాకు దొరికింది. ఇది యోసేపుదా?” అంటూ అడిగారు ఆ సోదరులు.
GEN 37:33 తండ్రి అంగీని చూచి, అది యోసేపుదేనని తెలుసుకొన్నాడు. “అవును, అది అతనిదే, ఒకవేళ అడవి మృగం ఏదైనా అతణ్ణి చంపివేసిందేమో. నా కుమారుడు యోసెపును అడవి మృగం ఏదో భక్షించి వేసింది!” అన్నాడు ఆ తండ్రి.
GEN 37:34 యాకోబు తన కుమారుని గూర్చిన దుఃఖంతో తన వస్త్రాలు చింపి వేసుకున్నాడు. అతడు దుఃఖంలో ఉన్నట్టు వ్యక్తం చేసేందుకు ప్రత్యేక వస్త్రలు యాకోబు ధరించాడు. యాకోబు తన కుమారుని విషయం చాలా కాలం దుఃఖంగానే ఉన్నాడు.
GEN 37:35 యాకోబు కుమారులు, కుమార్తెలు అందరూ అరణ్ణి ఓదార్చాలని ప్రయత్నించారు. అయినా యాకోబుకు ఎన్నడూ ఆదరణ కలుగలేదు. యాకోబు “నా మరణ దినంవరకు నా కుమారుని గూర్చి దుఃఖస్తూనే ఉంటాను” అన్నాడు. అందుచేత అతని కుమారుడైన యోసేపు కోసం యోకోబు దుఃఖంలోనే కాలం గడుపుతూ ఉండిపోయాడు.
GEN 37:36 యోసేపును కొన్న మిద్యాని వ్యాపారవేత్తలు దరిమిలా అతణ్ణి ఈజిప్టులో ఫరో సంరక్షక సేనాధిపతి పోతీఫరుకు అమ్మివేసారు.
GEN 38:1 సుమారు అదే సమయంలో యూదా తన సోదరులను విడిచి, హీరా అనే ఒకతని దగ్గర ఉండేందుకు వెళ్లాడు. హీరా అదుల్లాము నివాసి.
GEN 38:2 అక్కడ యూదా ఒక కనానీ అమ్మాయిని కలుసుకొని ఆమెను పెళ్లి చేసుకొన్నాడు. ఆ అమ్మాయి తండ్రి పేరు షూయ.
GEN 38:3 ఆ కనానీ స్త్రీకి ఒక కుమారుడు పుట్టగా, వారు అతనికి ఏరు అని పేరు పెట్టారు.
GEN 38:4 తర్వాత ఆమె మరో కుమారుని కన్నది. ఆ కుమారునికి వారు ఓనాను అని పేరు పెట్టారు.
GEN 38:5 తర్వాత షేలా అనే పేరుగల ఇంకో కుమారుడు ఆమెకు పుట్టాడు. యూదాకు మూడో కుమారుడు పుట్టునప్పుడు, అతడు కజీబులో నివాసం ఉంటున్నాడు.
GEN 38:6 యూదా తన మొదటి కుమారుడైన ఏరుకు భార్యగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేసాడు. ఆ అమ్మాయి పేరు తామారు.
GEN 38:7 కానీ ఏరు చాలా చెడ్డపనులు చేసాడు. అతని విషయంలో యెహోవాకు సంతోషం లేదు. అందుచేత యెహోవా అతణ్ణి చంపేసాడు.
GEN 38:8 అప్పుడు యూదా అతని సోదరుడైన ఓనానుతో “పోయి, చచ్చిన నీ సోదరుని భార్యతో శయనించు. ఆమెకు భర్తలా ఉండు. పిల్లలు పుడితే వారు నీ సోదరుడైన ఏరు పిల్లలుగా పరిగణించ బడతారు” అని చెప్పాడు.
GEN 38:9 ఈ సంబంధంవలన కలిగే పిల్లలు తన పిల్లలుగా పరిగణింపబడరని ఓనానుకు తెలుసు. ఓనాను తామారుతో సంభోగించి, ఇంద్రియమును బయట పడవేసాడు.
GEN 38:10 దీనితో యెహోవాకు కోపము వచ్చి ఆయన ఓనానును చంపేసాడు.
GEN 38:11 అప్పుడు యూదా “నీవు తిరిగి నీ తండ్రి యింటికి వెళ్లిపో. నా చిన్న కుమారుడు షేలా పెద్దవాడయ్యేంత వరకు నీవు మళ్లీ పెళ్లి చేసుకోకు” అని తన కోడలైన తామారుతో చెప్పాడు. షేలా కూడ తన అన్నల్లాగే చస్తాడేమోనని యూదాకు భయం. అతని కోడలు తామారు తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది.
GEN 38:12 ఆ తర్వాత షూయ కుమార్తె, యూదా భార్య చనిపోయింది. యూదాకు దుఃఖ కాలం తీరిపోయ్యాక, అతడు తన స్నేహితుడు, అదుల్లాము మివాసి హీరాతో కలిసి తిమ్నాతునకు వెళ్లాడు. తన గొర్రెల బొచ్చు కత్తిరించాలని యూద తిమ్నాతునకు వెళ్లాడు.
GEN 38:13 తామారు తన మామగారు యూదా తన గొర్రెల బొచ్చు కత్తిరించేందుకు తిమ్నాతునకు వస్తున్నాడని తెలుసుకొంది.
GEN 38:14 తామారు ఎప్పుడు విధవరాలి గుడ్డలే ధరించేది. కనుక ఇప్పుడు వేరే వస్త్రాలు ధరించి, నెత్తిమీద ముసుగు వేసుకొంది. అప్పుడు తిమ్నాతునకు దగ్గర్లో ఎనాయిం అనే పట్టణానికి పోయే మార్గంలో కూర్చొంది. యూదా చిన్న కుమారుడు షేల ఇప్పుడు పెద్దవాడయ్యాడని తామారుకు తెలుసు. అయినా గాని ఆమె అతణ్ణి పెళ్లి చేసికొనే ఏర్పాట్లు యూదా చేయటం లేదు.
GEN 38:15 యూదా ఆ మార్గాన ప్రయాణం చేసాడు. అతడు ఆమెను చూశాడు గాని ఆమె వేశ్య అనుకొన్నాడు. (వేశ్యాలా ఆమె ముఖం మీద ముసుగు వేసుకొంది.)
GEN 38:16 కనుక యూదా ఆమె దగ్గరకు వెళ్లి, “నన్ను నీతో లైంగింకంగా కలవనీ” అని అడిగాడు. (ఆమె తన కోడలు తామారు అని యూదాకు తెలియదు.) “అసలు నీవు ఏ మాత్రం ఇస్తావేంటి?” అంది ఆమె.
GEN 38:17 యూదా, “నా మందలోనుంచి ఒక మేక పిల్లను పంపిస్తా” అని జవాబిచ్చాడు. “సరే, ఒప్పుకొంటాను. కాని నీవు ఆ మేక పిల్లను పంపించేంత వరకు నా దగ్గర ఉంచుకొనేందుకు నీవు యింకేమైన నాకు ఇవ్వాలి సుమా” అని జవాబు చెప్పింది ఆమె.
GEN 38:18 “నేను నీకు మేకపిల్లను పంపిస్తానని రుజువుగా ఉండేందుకు నన్నేమి ఇవ్వమంటావు?” అడిగాడు యూదా. తామారు, “నీవు నీ ఉత్తరాల మీద ఉపయోగించే నీ ముద్ర, దాని దారం, నీ చేతి కర్ర ఇవ్వు” అని చెప్పింది. యూదా అవన్నీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు యూదా తామారుతో సంభోగించగా ఆమె గర్భవతి అయ్యింది.
GEN 38:19 తామారు ఇంటికి వెళ్లి, తన ముఖం మీద ముసుగు తీసివేసింది. మరల విధవ వస్త్రాలే ఆమె ధరించింది.
GEN 38:20 యూదా తామారుకు ఇచ్చిన మాట ప్రకారం ఒక మేకను ఇచ్చి తన స్నేహితుడు హీరాను ఆమె ఇంటికి పంపించాడు. మరియు ఆమె దగ్గర్నుండి ప్రత్యేక ముద్రను, చేతి కర్రను తీసుకొని రమ్మని యూదా అతనితో చెప్పాడు. కానీ హీరాకు ఆమె కనబడలేదు.
GEN 38:21 “ఇక్కడ దారి ప్రక్కగా ఉంటూండే ఆ వేశ్య ఏమయింది?” అని ఏనాయిము దగ్గర కొందరిని అడిగాడు హీరా. “ఇక్కడ ఎన్నడూ వేశ్య నివసించలేదే” అని వాళ్లు అన్నారు.
GEN 38:22 కనుక యూదా స్నేహితుడు యూదా దగ్గరకు తిరిగి వెళ్లి, “ఆ స్త్రీ నాకు కనబడలేదు. అక్కడ ఎన్నడూ వేశ్య లేదని అక్కడ ఉండేవాళ్లు చెప్పారు” అన్నాడు.
GEN 38:23 అందుచేత యూదా, “ఆ వస్తువులు ఆమె దగ్గరే ఉండనివ్వు. మనుష్యులు నన్ను చూచి నవ్వటం నాకు ఇష్టం లేదు. ఆమెకు మేకను ఇవ్వాలని నేను ప్రయత్నంచేసాను, కానీ ఆమె మనకు కనబడలేదు. అది చాలు” అన్నాడు.
GEN 38:24 మూడు నెలల తర్వాత, “నీ కోడలు తామారు ఒక వేశ్యలా పాపం చేసింది, ఇప్పుడు గర్భవతిగా ఉంది” అని యూదాతో చెప్పారు. అప్పుడు యూదా, “ఆమెను బయటకు లాగి చంపేసి, ఆమె శరీరాన్ని కాల్చివేయండి” అన్నాడు.
GEN 38:25 తామారును చంపటానికి మనుష్యులు వెళ్లారు. అయితే ఆమె తన మామగారికి ఒక సందేశం పంపింది. “నన్ను గర్భవతిగా చేసినవాడు ఈ వస్తువుల స్వంతదారుడే. (ప్రత్యేక ముద్ర, చేతి కర్ర ఆమె అతనికి చూపించింది.) ఈ వస్తువులు చూడు. ఇవి ఎవరిది? ఈ ముద్ర, దారం ఎవరివి? ఈ చేతి కర్ర ఎవరిది?”
GEN 38:26 వాటిని యూదా గుర్తుపట్టి, “ఆమెదే సరి. నాదే తప్పు. నేను వాగ్దానం చేసిన ప్రకారం నా కుమారుడైన షేలాను నేను ఆమెకు ఇవ్వలేదు” అన్నాడు. యూదా మళ్లీ ఇక ఆమెతో శయనించలేదు.
GEN 38:27 తామారు ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమెకు కవలలు పుడతారని వారికి తెలిసింది.
GEN 38:28 ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒక శిశువు చేయి బయటకు వచ్చింది. మంత్రసాని ఆ చేతికి ఒక ఎర్ర దారం కట్టి, “ఈ శిశువు ముందు పుట్టాడు” అంది.
GEN 38:29 అయితే ఆ శిశువు తన చేయి లోపలకు లాగేసాడు. అప్పుడు మరో శిశువు ముందు పుట్టాడు. కనుక “మొత్తానికి నీవే ముందు భేదించుకొని పుట్టావన్న మాట” అంది మంత్రసాని. అంచేత వారు పెరెసు అని వానికి పేరు పెట్టారు.
GEN 38:30 తర్వాత రెండో శిశువు పట్టాడు. చేతికి ఎర్రదారం కట్టబడిన శిశువు వీడు. వారు వాడికి జెరహు అనే పేరు పెట్టారు.
GEN 39:1 యోసేపును కొన్న వ్యాపార వేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకు వెళ్లారు. ఫరో సంరక్షకుల అధిపతి పోతీఫరుకు వారు అతన్ని అమ్మేసారు.
GEN 39:2 అయితే యెహోవా యోసేపుకు సహాయం చేసాడు. యోసేపు విజయ సారధి అయ్యాడు. తన యజమాని, ఈజిప్టు వాడైన పోతీఫరు ఇంటిలో యోసేపు నివాసం ఉన్నాడు.
GEN 39:3 యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నట్టు పోతీఫరు తెలుసుకొన్నాడు. యోసేపు చేసిన ప్రతి పనిలో యెహోవా అతనికి తోడుగా ఉన్నట్టు పోతీఫరు గ్రహించాడు.
GEN 39:4 అందుచేత యోసేపు విషయంలో పోతీఫరు చాల సంతోషించాడు. పోతీఫరు యోసేపును తనకు సహాయం చేయనిస్తూ, తన ఇంటి వ్యవహారాలన్నీ పర్యవేక్షింపనిచ్చాడు. పోతీఫరుకు ఉన్న సమస్తంమీద యోసేపు అధికారి.
GEN 39:5 ఆ ఇంటిమీద యోసేపు అధికారిగా చేయబడిన తర్వాత, యెహోవా ఆ ఇంటినీ, పోతీఫరుకు ఉన్న సమస్తాన్నీ ఆశీర్వదించాడు. ఇదంతా యోసేపువల్లనే యెహోవా చేసాడు. పోతీఫరు పొలాల్లో పెరిగే వాటన్నిటినీ యెహోవా ఆశీర్వదించాడు.
GEN 39:6 కనుక పోతీఫరు తన ఇంటిలో అన్ని విషయాల బాధ్యత యోసేపునే తీసుకోనిచ్చాడు. పోతీఫరు తాను భుజించే భోజనం విషయం తప్ప మరి దేనిగూర్చీ చింతించలేదు. యోసేపు చాలా అందగాడు. చూడ చక్కని వాడు.
GEN 39:7 కొన్నాళ్ల తర్వాత యోసేపు యజమాని భార్య యోసేపు మీద మోజుపడసాగింది. ఒకనాడు ఆమె, “నాతో శయనించు” అని అతనితో అంది.
GEN 39:8 కానీ యోసేపు నిరాకరించాడు. అతడు చెప్పాడు: “నా యజమాని తన ఇంటిలో అన్ని విషయాల్లోనూ నన్ను నమ్మాడు. ఇక్కడ ఉన్న ప్రతిదాని గూర్చి అతడు నాకు బాధ్యత పెట్టాడు.
GEN 39:9 నా యజమాని తన ఇంట నన్ను దాదాపుగా అతనికి సమానంగా ఉంచాడు. నేను అతని భార్యతో శయనించకూడదు. అది తప్పు అది దేవునికి వ్యతిరేకంగా పాపం.”
GEN 39:10 ఆమె ప్రతిరోజూ యోసేపుతో మాట్లాడుతున్నప్పటికీ యోసేపు ఆమెతో శయనించేందుకు నిరాకరించాడు.
GEN 39:11 ఒక రోజు యోసేపు తన పని చేసుకొనేందుకని ఇంటిలోనికి వెళ్లాడు. ఆ సమయంలో అతను ఒక్కడే ఇంటిలో ఉన్నాడు.
GEN 39:12 అతని యజమాని భార్య అతని అంగీ పట్టి లాగి, “వచ్చి నాతో శయనించు” అంది అతనితో. అయితే యోసేపు ఇంట్లోనుంచి బయటకు పారిపోయాడు. పైగా అతడు తన అంగీని ఆమె చేతిలోనే వదిలేసాడు.
GEN 39:13 యోసేపు అతని అంగీని తన చేతిలోనే విడిచి వెళ్లినట్టు ఆ స్త్రీ గమనించింది. జరిగిన దాని విషయమై ఆమె అబద్ధం చెప్పాలని నిర్ణయించుకొంది. బయటకు పరిగెత్తింది.
GEN 39:14 ఆమె తన ఇంటిలో ఉన్న పురుషులను పిలిచింది. ఆమె అంది, “చూడండి, మనలను ఆట పట్టించటానికే ఈ హెబ్రీ బానిసను తెచ్చారు. ఇతడు లోనికి వచ్చి నన్ను బలవంతం చేయటానికి ప్రయత్నించాడు. కానీ నేను గట్టిగా కేక పెట్టేసరికి
GEN 39:15 అతను భయపడి పారిపోయాడు. అయితే అతని అంగీ నా దగ్గరే వదిలేసిపోయాడు.”
GEN 39:16 తన భర్త, అంటే యోసేపు యజమాని ఇంటికి వచ్చేంత వరకు ఆమె ఆ అంగీని ఉంచింది.
GEN 39:17 ఆమె తన భర్తతో అదే కథ చెప్పింది. ఆమె, “నీవు ఇక్కడికి తీసుకొని వచ్చిన ఈ హెబ్రీ బానిస నామీద పడటానికి ప్రయత్నం చేసాడు.
GEN 39:18 అయితే అతడు నా దగ్గరకు రాగానే నేను గట్టిగా కేక వేసాను. అతను పారిపోయాడు గాని అతడు అంగీ విడిచిపెట్టేసాడు” అని చెప్పింది.
GEN 39:19 యోసేపు యజమాని అతని భార్య చెప్పిందంతా విన్నాడు. అతనికి చాలా కోపం వచ్చింది.
GEN 39:20 రాజ ద్రోహులను బంధించే ఒక చెరసాల ఉంది. కనుక యోసేపును ఆ చెరసాలలో వేసాడు పోతీఫరు. యోసేపు అందులోనే ఉన్నాడు.
GEN 39:21 అయితే యోసేపుకు యెహోవా తోడుగా ఉన్నాడు. యెహోవా యోసేపుకు తన దయనుచూపెడ్తూనే ఉన్నాడు. కొన్నాళ్లయ్యేటప్పటికి చెరసాల కాపలాదారుల నాయకునికి యోసేపు అంటే ఇష్టం కలిగింది.
GEN 39:22 కాపలాదారుల అధిపతి ఖైదీలందరి మీద యోసేపును నాయకునిగా ఉంచాడు. యోసేపు వారికి నాయకుడు, అయినప్పటికీ వారి చేసిన పనులే అతడు కూడా చేసాడు.
GEN 39:23 చెరసాలలో ఉన్న ప్రతిదాని విషయంలోను ఆ కాపలాదారుల నాయకుడు యోసేపును నమ్మాడు. యెహోవా యోసేపుతో ఉన్నందుచేత ఇలా జరిగింది. యోసేపు చేసే ప్రతి పనిలో అతనికి కార్యసాధన కలిగేటట్టు యెహోవా యోసేపుకు సహాయం చేసాడు.
GEN 40:1 ఆ తరువాత ఫరో సేవకులు ఇద్దరు ఫరోకు అపకారం చేసారు. ఆ సేవకుల్లో ఒకడు రొట్టెలు కాల్చేవాడు. మరొకడు ద్రాక్షా పాత్రలు అందించేవారి పెద్ద.
GEN 40:2 వంటల పెద్ద, ద్రాక్షా పాత్రల, పెద్ద మీద ఫరోకు కోపం వచ్చింది.
GEN 40:3 కనుక వారిని కూడా యోసేపు ఉన్న చెరసాలలోనే వేయించాడు ఫరో రాజు సంరక్షకుల అధికారియైన పోతీఫరు ఈ చెరసాల అధికారి.
GEN 40:4 ఈ ఇద్దరు ఖైదీలను యోసేపు బాధ్యతకు అప్పగించాడు అధికారి. ఆ ఇద్దరు మనుష్యులు కొన్నాళ్ల వరకు అలా జైల్లోనే ఉన్నారు.
GEN 40:5 ఒక రాత్రి ఆ ఇద్దరు ఖైదీలకు కలలు వచ్చాయి. (ఆ ఇద్దరు ఖైదీలు ఈజిప్టు రాజు సేవకులు—ఒకడు రొట్టెలు కాల్చేవాడు, మరొకడు ద్రాక్షా పాత్రల పెద్ద). ఒక్కో ఖైదీకి ఒక్కో కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో భావం ఉంది.
GEN 40:6 మర్నాడు ఉదయం యోసేపు వాళ్ల దగ్గరకు వెళ్లాడు. ఆ ఇద్దరు మనుష్యులు ఏదో చింతిస్తున్నట్టు యోసేపు గమనించాడు.
GEN 40:7 “ఏమిటి, ఈ వేళ మీరు చాలా చింతిస్తున్నట్టు కనబడుతున్నారు?” అని వారిని అడిగాడు యోసేపు.
GEN 40:8 “రాత్రి మాకు కలలు వచ్చాయి కాని మేము కన్న కల మాకు అర్థం కాలేదు. ఆ కలలు ఏమిటో, వాటి భావం ఏమిటో మాకు వివరించే వాళ్లెవరూ లేరు” అని వాళ్లిద్దరు జవాబిచ్చారు. యోసేపు, “కలలను తెలిసికొని, వాటి భావం చెప్పగలవాడు దేవుడు మాత్రమే కనుక దయచేసి మీ కలలు నాకు చెప్పండి” అని వారితో అన్నాడు.
GEN 40:9 కనుక ద్రాక్షా పాత్రల సేవకుడు యోసేపుతో తన కల చెప్పాడు. ఆ సేవకుడు ఇలా చెప్పాడు: “నా కలలో ఒక ద్రాక్షావల్లి కనబడింది.
GEN 40:10 ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలున్నాయి. నేను చూస్తుండగా ఆ తీగెలకు పూలు పూసి, ద్రాక్షాగెలలు అయ్యాయి.
GEN 40:11 నేను ఫరో పాత్ర పట్టుకొని ఉన్నాను. కనుక నేను ఆ ద్రాక్షాలను తీసుకొని ఆ పాత్రలో వాటి రసం పిండాను. అప్పుడు ఆ పాత్ర నేను ఫరోకు ఇచ్చాను.”
GEN 40:12 అప్పుడు యోసేపు అన్నాడు: “ఆ కలను నీకు నేను వివరిస్తాను. మూడు కొమ్మలంటే మూడు రోజులు.
GEN 40:13 మూడు రోజులు గతించక ముందే ఫరో నిన్ను క్షమించి, నిన్ను మళ్లీ నీ పని చేసుకోనిస్తాడు. ఇది వరకు నీవు ఫరో దగ్గర పని చేసిన పని నీవు మళ్లీ చేస్తావు.
GEN 40:14 నీకు విడుదల అయింతర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో. నా మీద దయ ఉంచి, నాకు సహాయం చేయి. నాకుగూడ ఈ చెరసాలలో నుంచి విముక్తి కలిగేటట్టు నా గురించి ఫరోతో చెప్పు.
GEN 40:15 నన్ను అన్యాయంగా బలవంతంగా నా యింటినుండి నా ప్రజలైన హీబ్రూలనుండి తీసుకొనివచ్చారు. నేనేమి తప్పు చేయలేదు. అందుచేత నేను ఈ చెరసాలలో ఉండకూడదు.”
GEN 40:16 మరో సేవకుని కల బాగున్నట్టు రొట్టెలు కాల్చేవాడికి తోచింది. వాడు యోసేపుతో అన్నాడు, “నాకూ ఒక కల వచ్చింది. నా తలమీద రొట్టెల బుట్టలు మూడు ఉన్నట్టు నాకు కనబడింది.
GEN 40:17 పై బుట్టలో అన్ని రకాల కాల్చిన ఆహారాలు ఉన్నాయి. ఈ భోజనం రాజుగారి కోసం. కాని పక్షులు ఈ భోజనాన్ని తినేస్తున్నాయి.”
GEN 40:18 యోసేపు జవాబిచ్చాడు: “ఈ కల అర్థం ఏమిటో నీకు నేను చెబతాను. మూడు బుట్టలు అంటే మూడు రోజులు.
GEN 40:19 మూడు రోజులు గడవక ముందే రాజుగారు నిన్ను ఈ చెరసాలలోనుంచి విడుదల చేస్తారు. తర్వాత రాజుగారు నీ తల నరికేస్తాడు, నీ శరీరాన్ని ఒక స్తంభానికి వేలాడదీస్తాడు, పక్షులు నీ శరీరాన్ని తినివేస్తాయి.”
GEN 40:20 మూడు రోజుల తర్వాత రాజుగారి పుట్టిన రోజు వచ్చింది. ఫరో తన సేవకులందరికీ ఒక విందు చేసాడు. ఆ విందులో ఫరో తన రొట్టెలు కాల్చేవాడిని, ద్రాక్షా పాత్రల సేవకుణ్ణి చెరసాలలోనుంచి బయటకు రప్పించాడు.
GEN 40:21 ద్రాక్షాపాత్రల సేవకుడ్ని ఫరో విడుదల చేసాడు. అతని ఉద్యోగం మరల ఫరో అతనికి ఇచ్చాడు. ద్రాక్షా పాత్రల సేవకుడు ద్రాక్షారసపు పాత్ర ఒకటి ఫరో చేతికి అందించాడు.
GEN 40:22 కానీ ఫరో రొట్టెలు కాల్చే వాడిని చంపేసాడు. ఎలా జరుగుతుందని యోసేపు చెప్పాడో అంతా అలాగే జరిగింది.
GEN 40:23 అయితే ద్రాక్షా పాత్రల సేవకుడు యోసేపుకు సహాయం చెయ్యటం మరచిపోయాడు. యోసేపు విషయం ఫరోతో అతడేమీ చెప్పలేదు. ద్రాక్షాపాత్రల సేవకుడు యోసేపును గూర్చి మర్చిపోయాడు.
GEN 41:1 రెండు సంవత్సరాల తర్వాత ఫరోకు ఒక కల వచ్చింది. ఫరో నైలునది ప్రక్కగా నిలబడినట్టు అతనికి కల వచ్చింది.
GEN 41:2 అప్పుడు ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు రావటం ఫరో చూశాడు. ఆవులు బలిసి అందంగా ఉన్నాయి. ఆవులు అక్కడ నిలబడి గడ్డి తింటున్నాయి.
GEN 41:3 అప్పుడు ఇంక ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు వచ్చాయి. కానీ ఈ ఆవులు చిక్కిపోయి, బక్కగా ఉన్నాయి. అందంగా ఉన్న ఏడు ఆవుల ప్రక్కగా ఈ ఏడు ఆవులు నిలబడ్డాయి.
GEN 41:4 అసహ్యంగా ఉన్న ఏడు ఆవులు అందంగా బలిసి ఉన్న ఏడు ఆవులను తినివేసాయి. అంతలో ఫరో మేల్కొన్నాడు.
GEN 41:5 ఫరో మరల నిద్రపోగా రెండవసారి కల వచ్చింది. ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం అతడు తన కలలో చూశాడు. ఆ ధాన్యపు గింజలు బలంగా, బాగుండటం అతడు చూశాడు.
GEN 41:6 తర్వాత అదే ధాన్యపు మొక్కకు మరో ఏడు వెన్నులు పెరగటం అతడు చూశాడు. అయితే ఈ వెన్నులు పీలగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి.
GEN 41:7 అప్పుడు పీలగా ఉన్న వెన్నులు, బలంగా బాగున్న వెన్నులను తినివేసాయి. ఫరోకు మరల మెళుకువ వచ్చింది. అదంతా కల మాత్రమేనని ఫరో గ్రహించాడు.
GEN 41:8 మర్నాడు ఉదయం ఆ కలల విషయమై ఫరోకు కలవరం కలిగింది. కనుక అతడు ఈజిప్టులోని మంత్రగాళ్లందరిని పిలిపించాడు. విద్వాంసులందరిని అతడు పిలిపించాడు. ఆ కలను గూర్చి ఫరో వాళ్లతో చెప్పాడు. అయితే వాళ్లలో ఒక్కడు కూడా ఆ కలను వివరించలేక పోయారు. దాని భావం చెప్పలేకపోయారు.
GEN 41:9 అప్పుడు ద్రాక్షాపాత్రల సేవకునికి యోసేపు జ్ఞాపకం వచ్చాడు. ఆ సేవకుడు ఫరోతో ఇలా చెప్పాడు: “నాకు జరిగిన ఒక విషయం జ్ఞాపకం వస్తుంది.
GEN 41:10 నా మీద, మరో సేవకుని మీద తమరికి కోపం వచ్చింది. మీరు మమ్మల్ని చెరసాలో వేసారు.
GEN 41:11 చెరసాలలో మా యిద్దరికీ ఒకే రాత్రి కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంది.
GEN 41:12 హెబ్రీ యువకుడు ఒకడు మాతో బాటు ఆ చెరసాలలోనే ఉన్నాడు. రాజు సంరక్షక ధళాధిపతికి అతడు సేవకుడు. మేము మా కలలు అతనితో చెబితే, అతడు వాటిని మాకు వివరించాడు. ఒక్కో కల అర్థం అతడు మాకు చెప్పాడు.
GEN 41:13 అతడు చెప్పిన అర్థాలు సత్యం. నాకు విడుగల అవుతుందని, నా పాత ఉద్యోగం మళ్లీ నాకు లభిస్తుందని అతడు నాకు చెప్పాడు. అది సత్యమే. వంటల పెద్ద మరణిస్తాడని అతడు చెప్పాడు, అదీ సత్యమే.”
GEN 41:14 కనుక ఫరో చెరసాలలోనుంచి యోసేపును పిలిపించాడు. సంరక్షకులు వెంటనే యోసేపును చెరసాలలోనుంచి తీసుకొని వచ్చారు. యోసేపు క్షవరం చేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొన్నాడు. అప్పుడు అతడు వెళ్లి ఫరో ముందర నిలవబడ్డాడు.
GEN 41:15 అప్పుడు ఫరో “నాకో కల వచ్చింది, అయితే ఆ కలను నాకు వివరించగల వాళ్లు ఒక్కళ్లూ లేరు. ఎవరైనా వారి కల నీతో చెబితే నీవు వాటిని వివరించి, భావంకూడ చెప్పగలవని నేను విన్నాను” అని యోసేపుతో అన్నాడు.
GEN 41:16 యోసేపు, “కలలను గ్రహించటంలో నా నైపుణ్యం ఏమీ లేదు. ఆ శక్తి దేవుడికే ఉంది. కనుక దేవుడే ఫరోకు గూడ ఈ పని చేసి పెడ్తాడు” అని జవాబిచ్చాడు.
GEN 41:17 అప్పుడు ఫరో యోసేపుతో చెప్పాడు: “నా కలలో నేను నైలునది పక్కగా నిలబడ్డాను.
GEN 41:18 ఆ నదిలోనుంచి ఏడు ఆవులు బయటకు వచ్చి గడ్డి మేయటం నేను చూశాను. ఈ ఆవులు బలిసి, అందంగా ఉన్నాయి.
GEN 41:19 అప్పుడు మరో ఏడు ఆవులు నదిలో నుంచి రావటం నేను చూశాను. ఈ ఆవులు బక్కచిక్కి రోగిష్టివిగా ఉన్నాయి. ఈజిప్టు దేశం మొత్తంలో నేను చూసిన ఆవుల్లో అవి పరమ అసహ్యంగా ఉన్నాయి.
GEN 41:20 అసహ్యమైన ఈ ఏడు ఆవులు ముందు వచ్చిన అందమైన ఏడు ఆవులను తినివేసాయి.
GEN 41:21 అయితే ఆ ఏడు ఆవులను తినివేసిన తర్వాత కూడ అవి ఇంకా బక్కచిక్కి ఉన్నాయి. వాటిని చూస్తే, అవి ఏడు ఆవులను తిన్న వాటిల్లాగ అగుపించవు. ముందు అవి ఎంత బక్కగా అసహ్యంగా ఉన్నాయో యిప్పుడూ అలానే కనబడ్డాయి. అప్పుడు నేను మేల్కొన్నాను.
GEN 41:22 “తర్వాత నాకు వచ్చిన మరో కలలో ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం నేను చూశాను. ఆ వెన్నులు నిండుగా, చక్కగా, అందంగా ఉన్నాయి.
GEN 41:23 తర్వాత వాటికి యింకా ఏడు వెన్నులు పెరిగాయి. కానీ ఆ వెన్నులు పీలగా, అసహ్యంగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి.
GEN 41:24 అప్పుడు ఏడు మంచి వెన్నులను పీల వెన్నులు తినివేసాయి. “మంత్రాలు తెలిసిన నా మనుష్యులకు, విద్వాంసులకు నేను ఈ కల చెప్పాను. కానీ ఎవ్వరూ ఆ కలను వివరించలేక పోతున్నారు. ఏమిటి దీని భావం?”
GEN 41:25 అప్పుడు ఫరోతో యోసేపు ఇలా చెప్పాడు: “ఈ రెండు కలల భావం ఒక్కటే. ఏమి చేయనున్నాడో అది దేవుడు మీతో చెబతున్నాడు.
GEN 41:26 ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు. ఏడు మంచి ధాన్యపు వెన్నులు ఏడు సంవత్సరాలు. రెండు కలల్లోని సంగతి ఒక్కటే.
GEN 41:27 బక్కచిక్కి ఉన్న ఏడు ఆవులు, పీలగా ఉన్న ఏడు ధాన్యపు వెన్నులు కూడ, ఏడు అంటే, అవి ఈ దేశంలో ఏడు ఆకలి సంవత్సరాలు. ఏడు మంచి సంవత్సరాల తర్వాత ఈ ఏడు సంవత్సరాలు వస్తాయి.
GEN 41:28 త్వరలో ఏమి జరుగుతుందో దాన్ని దేవుడు మీకు చూపెట్టాడు. నేను చెప్పినట్టే ఇది జరుగుతుంది.
GEN 41:29 ఈజిప్టు దేశమంతటా ఏడేళ్లపాటు మంచి పంటలు పండి తినటానికి సమృద్ధిగా ఉంటుంది.
GEN 41:30 అయితే ఆ ఏడు సంవత్సరాల తర్వాత, దేశమంతటా కరువు సంవత్సరాలు ఏడు వస్తాయి. ఈజిప్టులో పండిన పంట ఎంత ఉన్నదానిని మరచిపోతారు. ఈ ఆకలి దేశాన్ని నాశనం చేస్తుంది.
GEN 41:31 సమృద్ధగా భోజనం చేయటం అంటే ఏమిటో ప్రజలు మరచిపోతారు.
GEN 41:32 “ఫరోగారూ, ఒకే విషయాన్ని గూర్చి మీకు రెండు కలలు ఎందుకు వచ్చాయి? దేవుడు తప్పక జరిపిస్తాడని చూపించేందుకు ఇలా జరిగింది. అదీ త్వరలోనే దేవుడు జరిగిస్తాడని సూచిస్తోంది.
GEN 41:33 కనుక ఓ ఫరో, చాలా తెలివి, జ్ఞానం ఉన్న ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మనిషిని ఈజిప్టు దేశం అంతటిమీద అధికారిగా మీరు నియమించాలి.
GEN 41:34 ఆ తర్వాత ప్రజల దగ్గర్నుండి ధాన్యం సేకరించేందుకు మరి కొందర్ని మీరు నియమించాలి. ప్రతీ వ్యక్తి ఏడు మంచి సంవత్సరాల్లో పండించే మంచి పంటలో అయిదవ భాగం ఇవ్వాలి.
GEN 41:35 రాబోయే మంచి సంవత్సరాల కాలంలో ఈ ధాన్యం అంతా సేకరించమని ఈ మనుష్యులకు ఆజ్ఞాపించండి. ఈ ధాన్యం పట్టణాల్లో భద్రం చేయటానికి వాళ్లకు అధికారం ఉందని ఈ మనుష్యులకు చెప్పండి. తర్వాత ఆ ధాన్యం అవసరం వచ్చేంతవరకు వారు దాన్ని కాపాడాలి. ఫరో! ఈ విధంగా ఆ ఆహారం మీ అధీనంలో ఉంటుంది.
GEN 41:36 ఈజిప్టు దేశంలో వచ్చే ఏడు ఆకలి సంవత్సరాల్లో ఈ ధాన్యం సహాయపడుతుంది. అప్పుడు ఈజిప్టు ప్రజలు ఆ ఏడు సంవత్సరాల్లో కరువు కారణంగా మరణించరు.”
GEN 41:37 ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకొన్నారు.
GEN 41:38 “ఈ పని చేసేందుకు యోసేపు కంటే మంచివాడ్ని ఇంకెవరినైనా మీరు కనుగొనగలరా? దేవుని ఆత్మ మూలంగా ఇతడు నిజంగా జ్ఞాని” అని ఫరో తన సేవకులతో చెప్పాడు.
GEN 41:39 కనుక ఫరో, “వీటన్నింటిని దేవుడే నీకు చూపెట్టాడు కనుక నీవు అందరిలో మహా జ్ఞానివై ఉండాలి.
GEN 41:40 అంచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నింటికి విధేయులవుతారు. ఈ దేశంలో నేను ఒక్కడ్ని మాత్రమే నీకంటె గొప్ప అధికారిగా ఉంటాను” అని యోసేపుతో చెప్పాడు.
GEN 41:41 (ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమించినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు వుండినవి.) అప్పుడు ఫరో, “ఇప్పుడు ఈజిప్టు దేశం అంతటి మీద నిన్ను నేను పాలకునిగా నియమిస్తున్నాను” అని యోసేపుతో చెప్పాడు.
GEN 41:42 అప్పుడు ఫరో రాజముద్రగల తన ఉంగరాన్ని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు ధరించటానికి నాణ్యతగల ఒక అంగీని అతడు ఇచ్చాడు. యోసేపు మెడలో ఒక బంగారు గొలుసు ఫరో వేసాడు.
GEN 41:43 రెండో రాజరథం మీద తిరిగమని ఫరో యోసేపుతో చెప్పాడు. ప్రత్యేక సంరక్షకులు అతని రథానికి ముందర నడిచారు. “ప్రజలారా, యోసేపుకు సాష్టాంగపడండి” అంటూ వాళ్లు ప్రజలను హెచ్చరించారు. కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకునిగా నియమించబడ్డాడు.
GEN 41:44 అతనితో ఫరో అన్నాడు: “నేను ఫరోను అంటే రాజును. కనుక నేను ఏమి అయినా చేయాలనుకొంటే అది చేస్తాను. కానీ, ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండ ఒక చేయి ఎత్తకూడదు, కాలు కదపగూడదు.”
GEN 41:45 యోసేపుకు జప్నత్సనేహు అనే మరో పేరు ఫరో పెట్టాడు. ఓను యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతును యోసేపుకు భార్యగా ఫరో ఇచ్చాడు. కనుక ఈజిప్టు దేశం అంతటిమీద యోసేపు పాలకుడయ్యాడు.
GEN 41:46 యోసేపు ఈజిప్టు రాజు కొలువులో పని చేయడం మొదలు బెట్టినప్పుడు అతని వయస్సు 30 సంవత్సరాలు. యోసేపు ఈజిప్టు దేశం అంతటా సంచారం చేసాడు.
GEN 41:47 ఏడు మంచి సంవత్సరాల కాలంలోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి.
GEN 41:48 ఆ ఏడు సంవత్సరాల్లో యోసేపు చాలా ధాన్యం ఈజిప్టులో పొదుపు చేసాడు. ఆహారాన్ని యోసేపు పట్టణాల్లో భద్రపరచాడు. ప్రతి పట్టణం చుట్టు ప్రక్కల పండిన పంటను ఆ పట్టణంలోనే యోసేపు భద్రపరచాడు.
GEN 41:49 యోసేపు విస్తారంగా ధాన్యం చేర్చి పెట్టాడు. సముద్రపు ఇసుకలా ఉంది అదంతాను. కొలిచేందుకు గూడ వీలు లేనంత విస్తారంగా ఉంది అతడు చేర్చిపెట్టిన ధాన్యం.
GEN 41:50 ఓను యాజకుడైన పోతీఫెర కుమార్తె అయిన ఆసెనతు యోసేపుకు భార్య. మొదటి ఆకలి సంవత్సరం రాకముందే యోసేపు ఆసెనెతులకు ఇద్దరు కుమారులు పుట్టారు.
GEN 41:51 మొదటి కుమారుని పేరు మనష్షే. “నా కష్టాలు అన్నింటినీ, నా ఇంటని గూర్చిన విషయాలన్నింటినీ నేను మరచిపోయేటట్టు దేవుడు చేసాడు” అని అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు.
GEN 41:52 యోసేపు తన రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. “నాకు ఎన్నో గొప్ప కష్టాలు వచ్చాయి, గాని అన్ని విషయాల్లో దేవుడు నాకు సాఫల్యాన్ని కార్యసాధనను కల్గించాడు” అని యోసేపు అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు.
GEN 41:53 ఏడు సంవత్సరాల పాటు ప్రజలు తినేందుకు అవసరమైన ఆహారం అంతా వారికి ఉంది. కానీ సంవత్సరాలన్నీ ముగిశాయి. అవసరమైనది అంతా పండింది.
GEN 41:54 అయితే ఏడు సంవత్సరాల ఆకలి కాలం మొదలయింది. సరిగ్గా యోసేపు చెప్పినట్టే ఇది జరిగింది. అన్ని దేశాలలో, అంతట ఏ ఆహారం పండలేదు. తినుటకు ప్రజలకు ఏమీ లేదు. కానీ యోసేపు ధాన్యం భద్రపరచినందువల్ల ఈజిప్టులో ప్రజలు తినుటకు సరిపడినంత ఉంది.
GEN 41:55 కరువు కాలం ప్రారంభం కాగానే ఆహారంకోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. ఫరో, “యోసేపును అడగండి. అతడు ఏమి చేయమంటే అలా చేయండి” అని చెప్పాడు ఈజిప్టు ప్రజలతో.
GEN 41:56 కనుక ఆ దేశంలో ఎక్కడ చూసినా కరువు ప్రబలుతున్నప్పుడు, ధాన్యము భద్రపరచిన గదులలో నుండి యోసేపు ప్రజలకు ధాన్యం ఇచ్చాడు. చేర్చిపెట్టిన ధాన్యం ఈజిప్టు ప్రజలకు యోసేపు విక్రయించాడు. ఈజిప్టులో కరువు చాలా భయంకరంగా ఉంది.
GEN 41:57 ఈజిప్టు చుట్టుపక్కల దేశాల ప్రజలంతా ధాన్యం కొనేందుకు ఈజిప్టు వచ్చారు. కరువు ఈజిప్టులోను, మరి యితర ప్రాంతాలలోను ఎక్కువగా ఉంది. ఈజిప్టు చుట్టుపక్కల దేశాలవారు యోసేపు దగ్గరకు వచ్చారు.
GEN 42:1 ఈ సమయంలో కనాను దేశంలోను కరువు ప్రబలుతోంది. అయితే ఈజిప్టులో ధాన్యం ఉన్నట్టు యాకోబు తెలుసుకొన్నాడు: కనుక యాకోబు తన కుమారులతో ఇలా చెప్పాడు. “ఏమీ చేయకుండా ఇక్కడ ఎందుకు మనం కూర్చోవటం?
GEN 42:2 ఈజిప్టులో అమ్మకానికి ధాన్యం ఉన్నట్టు నేను విన్నాను. అందుచేత మనం అక్కడికి వెళ్లి మనం తినేందుకు ధాన్యం కొనుక్కోవాలి. అప్పుడు మనం చావకుండా బతుకుతాం.”
GEN 42:3 కనుక యోసేపు సోదరులు పదిమంది ధాన్యం కొనేందుకు ఈజిప్టు వెళ్లారు.
GEN 42:4 బెన్యామీనును యాకోబు పంపలేదు. (బెన్యామీను ఒక్కడే యోసేపుకు స్వంత తమ్ముడు). బెన్యామీనుకు ఏదైనా కీడు సంభవిస్తుందేమోనని యాకోబు భయపడ్డాడు.
GEN 42:5 కనానులో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎంతోమంది ప్రజలు కనానునుండి ఈజిప్టు వెళ్లారు. వారిలో ఇశ్రాయేలు కుమారులు కూడ ఉన్నారు.
GEN 42:6 ఆ సమయంలో ఈజిప్టు అంతటి మీద యోసేపు పాలకుడు. ఈజిప్టుకు వచ్చిన ప్రజలకు ధాన్యం అమ్మకం చేసేందుకు గాను నియమింపబడిన అధికారి యోసేపు. అయితే యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చి అతని ఎదుట సాష్టాంగపడ్డారు.
GEN 42:7 యోసేపు తన సోదరులను చూసాడు, వారెవరయిందీ అతనికి తెలుసు, కానీ యోసేపు వారిని ఎరుగనట్టే వారితో మాట్లాడాడు. అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. “ఎక్కడనుండి వచ్చారు మీరు?” అని అతడు అడిగాడు. ఆ సోదరులు “మేము కనాను దేశంనుండి వచ్చాం. ఆహారం కొనేందుకు మేము వచ్చాం” అని జవాబిచ్చారు.
GEN 42:8 ఈ మనుష్యులు తన సోదరులని యోసేపుకు తెలుసును. కానీ అతను ఎవరయిందీ వారికి తెలియదు.
GEN 42:9 అతని అన్నల విషయంలో అతనికి వచ్చిన కలలను యోసేపు జ్ఞాపకం చేసుకొన్నాడు. యోసేపు తన అన్నలతో, “మీరు ఆహారం కొనేందుకు రాలేదు. మీరు గూఢచారులు. మా బలహీనతలు తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు.
GEN 42:10 అయితే ఆ సోదరులు, “లేదండి అయ్యా, మీ సేవకులంగా మేము వచ్చాం. ఆహారం కొనేందుకు మాత్రమే మేం వచ్చాం.
GEN 42:11 మేమంతా అన్నదమ్మలం మా అందరి తండ్రి ఒక్కడే. మేము నిజాయితీగల మనుష్యులం, మేము గూఢచారలం కాము. ఆహారం కొనేందుకు మాత్రమే మేం వచ్చాం” అని అతనితో చెప్పారు.
GEN 42:12 అప్పుడు యోసేపు, “లేదు, లేదు, ఏ విషయంలో మేం బలహీనులమో తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు వారితో.
GEN 42:13 ఆ సోదరులు అన్నారు: “లేదు, మేమంతా అన్నదమ్ములం. మా కుటుంబంలో మొత్తం పన్నెండుమంది సోదరులం. మా అందరికీ తండ్రి ఒక్కడే. మా అందరిలో చిన్న తమ్ముడు ఇంకా ఇంటి దగ్గర మా తండ్రితోనే ఉన్నాడు. మరో తమ్ముడు చాలకాలం క్రిందటే చనిపోయాడు. మీ ముందర మేం సేవకుల్లాంటి వాళ్లం. మేము కనాను దేశం వాళ్లం.”
GEN 42:14 అయితే యోసేపు వారితో ఇలా అన్నాడు: “లేదు, నేను అన్నదే సరియైనట్టు నాకు తెలుస్తోంది. మీరు గూఢచారులు.
GEN 42:15 అయితే మీరు సత్యమే చెబతున్నట్టు మిమ్మల్ని రుజువు చేయనిస్తాను. మీ చిన్నతమ్ముడు ఇక్కడికి వచ్చేంతవరకు మిమ్మల్ని వదలి పెట్టనని ఫరో పేరు మీద ప్రమాణం చేసి చెబతున్నాను మిమ్మల్ని వదలిపెట్టనని.
GEN 42:16 కనుక మీలో ఒకరు తిరిగి వెళ్లి మీ చిన్న తమ్ముడ్ని ఇక్కడికి తీసుకొని రావాలి. అంతవరకు మిగిలిన వారు ఇక్కడే జైల్లో ఉండాలి. మీరు సత్యం చెబతున్నారో లేదో మేం చూస్తాం. అయితే మీరు గూఢచారులనే నా నమ్మకం.”
GEN 42:17 తర్వాత యోసేపు వాళ్లందర్నీ మూడు రోజుల పాటు చెరసాలలో పెట్టాడు.
GEN 42:18 మూడు రోజుల తర్వాత వారితో యోసేపు ఇలా అన్నాడు, “నేను దేవునికి భయపడేవాణ్ణి. అంచేత మీరు సత్యమే చెబతున్నారని రుజువు చేసేందుకు మీకు ఒక అవకాశం ఇస్తాను. ఇలా మీరు చేస్తే నేను మిమ్మల్ని బతకనిస్తాను.
GEN 42:19 మీరు నమ్మకమైన మనుష్యులైతే, మీ సోదరులలో ఒకరు ఇక్కడ జైల్లో ఉండాలి. మిగిలినవారు మీ వాళ్లకోసం ధాన్యం తీసుకొని వెళ్లవచ్చు.
GEN 42:20 అప్పుడు మీ చిన్న తమ్ముడ్ని ఇక్కడికి తీసుకొని రండి. ఈ విధంగా, మీరు సత్యం చెబతున్నారేమో నేను తెలుసుకొంటాను.” ఆ సోదరులు దీనకి ఒప్పుకొన్నారు.
GEN 42:21 “మన చిన్న తమ్ముడికి మనం చేసిన కీడు మూలంగా శిక్ష అనుభవిస్తున్నాం. అతడు కష్టంతో ఉండటం మనం కళ్లారా చూశాం. రక్షించమని అతడు మనల్ని బతిమలాడాడు. కానీ వినటానికి గూడ మనం నిరాకరించాం. అందుకే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం” అని వాళ్లలో వారు చెప్పుకొన్నారు.
GEN 42:22 అప్పుడు రూబేను, “ఆ పిల్లవానికి మీరేమి కీడు చేయకండి అని నేను మీతో చెప్పాను కాని మీరు నా మాట వినకపోయారు. కనుక అతని మరణం మూలంగానే ఇప్పుడు మనం శిక్ష పొందుతున్నాం,” అని వాళ్లతో చెప్పాడు.
GEN 42:23 యోసేపు తన సోదరులతో మాట్లాడేందుకు ఒక అనువాదకుడ్ని వాడుకొన్నాడు. అందుచేత వారి భాష యోసేపు గ్రహించినట్లు ఆ సోదరులకు తెలియదు. కానీ వారు చెప్పిన ప్రతి మాటా యోసేపు విని, గ్రహించాడు.
GEN 42:24 వారి మాటలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి. అందుచేత యోసేపు వాళ్లను విడిచి వెళ్లి ఏడ్చేసాడు. కొంచెం సేపయ్యాక యోసేపు మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ సోదరులలో ఒకడైన షిమ్యోనును పట్టుకొని మిగిలిన సోదరులు చూస్తుండగానే కట్టివేసాడు.
GEN 42:25 వారి సంచులను ధాన్యంతో నింపమని కొందరు సేవకులతో యోసేపు చెప్పాడు. ఈ ధాన్యం కోసం ఆ సోదరులు యోసేపుకు సొమ్ము చెల్లించారు. కానీ యోసేపు ఆ డబ్బు ఉంచుకోలేదు. ఆ డబ్బును తిరిగి వారి సంచుల్లోనే పెట్టేసాడు యోసేపు. అప్పుడు వారి ప్రయాణానికి అవసరమైన వాటన్నింటిని యోసేపు వారికి ఇచ్చాడు.
GEN 42:26 కనుక ఆ సోదరులు ఆ ధాన్యం గాడిదలమీద వేసుకొని వెళ్లిపోయారు.
GEN 42:27 ఆ సోదరులు ఆ రాత్రి ఒకచోట బస చేసారు. ఆ సోదరులలో ఒకడు కొంచెం ధాన్యం తన గాడిద కోసమని తన సంచి తెరిచాడు. అతని డబ్బు అతని సంచిలోనే కనబడింది.
GEN 42:28 అతడు, “చూడండి, ధాన్యంకోసం నేను చెల్లించిన డబ్బు ఇదిగో. ఈ డబ్బును ఎవరో మళ్లీ నా సంచిలో పెట్టేసారు” అని మిగతా సోదరులతో చెప్పాడు. ఆ సోదరులకు చాలా భయం వేసింది, “దేవుడు మనకు ఏం చేస్తున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
GEN 42:29 ఈ సోదరులు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయాలన్నీ యాకోబుతో చెప్పారు.
GEN 42:30 వాళ్లు ఇలా చెప్పారు: “ఆ దేశ పాలకుడు మాతో కఠినంగా మాట్లాడాడు. మేము అక్కడి ప్రజల్ని నాశనం చేయాలనుకొనే గూఢచారులమని అనుకొన్నాడు అతడు.
GEN 42:31 కానీ మేము నిజాయితీపరలం అని, గూఢచారులకు చెందినవాళ్లం కాదని మేము చెప్పాం.
GEN 42:32 మేము పన్నెండుమంది సోదరులం అని చెప్పాం. కనానులో ఇంటి దగ్గర మా తండ్రితో మా చిన్న తమ్ముడు ఒకడు ఉన్నాడని మరియు మా మరియొక చిన్న తమ్ముడు ఒకడు చనిపోయాడని మేము అతనితో చెప్పాం.
GEN 42:33 “అప్పుడు, ఆ దేశపాలకుడు మాతో ఇలా అన్నాడు: ‘మీరు నమ్మకమైన వాళ్లని రుజువు చేయటానికి ఇదొక మార్గం. మీ సోదరులలో ఒకడ్ని నా దగ్గర ఉంచండి. మీ ధాన్యం మీ కుటుంబాలకు తీసుకొని వెళ్లండి.
GEN 42:34 తర్వాత మీ కనిష్ఠ సోదరుడ్ని నా దగ్గరకు తీసుకొని రండి. అప్పుడు నిజంగా మీరు నిజాయితీపరులో, లేక మమ్మల్ని నాశనం చేసేందుకు పంపబడిన గూఢచారులో నాకు తెలుస్తుంది. మీరు చెప్పేది నిజమైతే మీ సోదరుడ్ని మళ్లీ మీకు అప్పగిస్తాను. అతణ్ణి మీకు అప్పగిస్తాను, మా దేశంలో మీరు స్వేచ్ఛగా ధాన్యం కొనుక్కోవచ్చు.’”
GEN 42:35 అప్పుడు ఆ సోదరులు వారి సంచుల్లో నుండి ధాన్యం తీయటానికి వెళ్లగా వారిలో ప్రతి సోదరునికి తన ధాన్యపు సంచిలో తన డబ్బు సంచి కనిపించింది. ఆ సోదరులు, వారి తండ్రి కూడ ఆ డబ్బును చూచి చాలా భయపడిపోయారు.
GEN 42:36 యాకోబు, “నేను నా పిల్లలందర్నీ పోగొట్టకోవాలని మీరు అనుకొంటున్నారా? యోసేపు పోయాడు. షిమ్యోను పోయాడు. ఇప్పుడు బెన్యామీనును గూడ మీరు తీసుకొని పోవాలనుకొంటున్నారు” అని వాళ్లతో అన్నాడు,
GEN 42:37 అప్పుడు రూబేను, “నాయనా, బెన్యామీనును గనుక నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపేసేయ్. నన్ను నమ్ము. బెన్యామీనును నేను మళ్లీ నీ దగ్గరకు తీసుకొని వస్తాను” అని తన తండ్రితో చెప్పాడు.
GEN 42:38 అయితే యాకోబు చెప్పాడు: “బెన్యామీనును మీతో నేను వెళ్లనివ్వను. అతని సోదరుడు మరణించాడు, నా భార్య రాహేలు కుమారులలో ఇతను ఒక్కడే మిగిలాడు. ఈజిప్టు ప్రయాణంలో ఇతనికి ఏమైనా సంభవిస్తే నేను చచ్చిపోతాను. నా వృద్ధాప్యంలో దుఃఖంతోనే మీరు నన్ను సమాధికి పంపిస్తారు.”
GEN 43:1 దేశంలో కరువు చాలా దారుణంగా ఉంది. అక్కడ ఎలాంటి ఆహారం పండటం లేదు.
GEN 43:2 ప్రజలు ఈజిప్టునుండి తెచ్చుకొన్న ధాన్యం అంతా తినేసారు. ధాన్యం అయిపోయినప్పుడు, “మళ్లీ ఈజిప్టు వెళ్లి, మనం తినేందుకు మరింత ధాన్యం కొనండి” అని యాకోబు తన కుమారులతో చెప్పాడు.
GEN 43:3 అయితే యాకోబుతో యూదా చెప్పాడు: “ఆ దేశ పాలకుడు మమ్మల్ని హెచ్చరించాడు. మీ సోదరుడ్ని మీరు నా దగ్గరకు తీసుకొని రాకపోతే నేను మీతో మాట్లాడను.
GEN 43:4 బెన్యామీనును నీవు మాతో పంపిస్తేనే మేము వెళ్లి ధాన్యం కొంటాం.
GEN 43:5 కానీ బెన్యామీనును పంపించేందుకు నీవు ఒప్పుకొనకపోతే మేం వెళ్లం. అతడు లేకుండా తిరిగి రావద్దని ఆయన మమ్మల్ని హెచ్చరించాడు.”
GEN 43:6 “మీకు ఇంకో సోదరుడు ఉన్నాడని అసలు మీరెందుకు చెప్పారు? ఇంత కీడు మీరెందుకు నాకు చేసారు?” ఇశ్రాయేలు (యాకోబు) అడిగాడు.
GEN 43:7 ఆ సోదరులు జవాబు చెప్పారు: “ఆ మనిషి మమ్మల్ని అనేక ప్రశ్నలు వేశాడు. మా విషయం, మా కుటుంబం విషయం అతడు తెలుసుకోవాలనుకున్నాడు, ‘మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? ఇంటి దగ్గర మీకు ఇంకో సోదరుడు ఉన్నాడా?’ అని అతడు మమ్మల్ని అడిగాడు. అతని ప్రశ్నలకు మాత్రమే మేము జవాబిచ్చాం. మా మిగిలిన సోదరుని కూడ తన దగ్గరకు తీసుకొని రమ్మంటాడని మాకు తెలియదు!”
GEN 43:8 అప్పుడు యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో ఇలా చెప్పాడు: “బెన్యామీనును నాతో పంపించు. అతని విషయం నేను జాగ్రత్తగా చూసుకొంటాను. మేము మాత్రం ఈజిప్టు వెళ్లాలి, ఆహారం తీసుకురావాలి. మేము వెళ్లకపోతే మనమూ, మన పిల్లలు అందరం చస్తాం.
GEN 43:9 అతని క్షేమం నేను చూసుకొంటాను. అతని భాద్యత నాది. అతణ్ణి నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే శాశ్వతంగా నీవు నన్ను నిందించవచ్చు.
GEN 43:10 నీవు మమ్మల్ని వెళ్లనిచ్చి ఉంటే ఇప్పటికి రెండు సార్లు వెళ్లి వచ్చే వాళ్లం.”
GEN 43:11 అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు: “ఇదే గనుక నిజంగా సత్యమైతే, అలాగే బెన్యామీనును నీతే తీసుకొని వెళ్లు. అయితే ఆ పాలకునికి కానుకలు తీసుకొని వెళ్లు. మన దేశంలో మనం సంపాదించగలిగినవి కొన్ని తీసుకొని వెళ్లు. కొంచె మస్తకి, కొంచెం తేనె, సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తాచ కాయలు, బాదం కాయలు, అతనికి తీసుకొని వెళ్లండి.
GEN 43:12 ఈ సారి రెండంతల డబ్బు మీతో తీసుకు వెళ్లండి. పోయిన సారి మీరు చెల్లించగా తిరిగి మీకు ఇవ్వబడిన సొమ్ము మళ్లీ తీసుకు వెళ్లండి. ఒకవేళ ఆ పాలకుడు పొరబడ్డాడేమో.
GEN 43:13 బెన్యామీనును తీసుకొని ఆ మనిషి దగ్గరకు తిరిగి వెళ్లు.
GEN 43:14 మీరు ఆ పాలకుని ముందర నిలిచినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను. బెన్యామీను, షిమ్యోనులను అతడు క్షేమంగా తిరిగి వెళ్లనిచ్చేటట్టు నేను ప్రార్థన చేస్తాను. లేనట్లయితే నా కుమారుని పోగొట్టుకొని నేను మరల దుఃఖంలో మునిగిపోతాను.”
GEN 43:15 కనుక ఆ పాలకుని కోసం కానుకలన్నీ తీసుకొన్నారు ఆ సోదరులు. వారు మొదటిసారి తీసుకొని వెళ్లిన దానికి రెట్టింపు సొమ్ము వారితో కూడా తీసుకొని వెళ్లారు. బెన్యామీను ఆ సోదరులతో కలసి ఈజిప్టు వెళ్లాడు.
GEN 43:16 ఈజిప్టులో, వారితోబాటు బెన్యామీను ఉండటం యోసేపు చాశాడు. యోసేపు “ఆ మనుష్యుల్ని నా ఇంటికి తీసుకొని రండి. ఒక పశువును చంపి వంట చేయండి. ఈవేళ మధ్యాహ్నం వాళ్లు నాతోనే భోజనం చేస్తారు” అని తన గృహనిర్వాహకునితో చెప్పాడు.
GEN 43:17 అతను చెప్పినట్టే ఆ సేవకుడు చేసాడు. అతడు వాళ్లను యోసేపు ఇంటికి తీసుకొని వచ్చాడు.
GEN 43:18 వాళ్లు యోసేపు ఇంటికి తీసుకొని రాబడినప్పుడు ఆ సోదరులు భయపడ్డారు. “పోయినసారి మన సంచుల్లో డబ్బు ఉంచబడ్డందువల్లనే మనల్ని ఇక్కడకు తీసుకు వచ్చారు. మనల్ని నేరస్తులుగా నిరూపించటానికి దాన్ని వారు వినియోగిస్తారు. తర్వాత మన గాడిదల్ని దొంగిలించి, మనల్ని బానిసలుగా చేస్తారు” అని వారనుకొన్నారు.
GEN 43:19 కనుక యోసేపు ఇంటికి బాధ్యుడైన వాని దగ్గరకు ఆ సోదరులు వెళ్లారు.
GEN 43:20 వారు చెప్పారు: “అయ్యా, ప్రమాణం చేసి సత్యం చెబతున్నాం. పోయినసారి మేము వచ్చినప్పుడు ఆహారం కొనుగోలు చేసేందుకే మేం వచ్చాం.
GEN 43:21 ఇంటికి వెళ్తూ మార్గంలో మేము మా సంచులు విప్పితే మా ప్రతి ఒక్కరి సంచిలోనూ డబ్బు కనబడింది. ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు. అయితే ఆ డబ్బు మళ్లీ మీకు ఇచ్చేయాలని ఇప్పుడు మాతో తెచ్చాం. పైగా ఇప్పుడు మేము కొనాలనుకొంటున్న ధాన్యంకోసం ఇంకా ఎక్కువ మొత్తంకూడ మళ్లీ ఇప్పుడు తెచ్చాం.”
GEN 43:23 అయితే ఆ సేవకుడు, “భయపడకండి, నన్ను నమ్మండి. మీ దేవుడు, మీ తండ్రి దేవుడు ఆ డబ్బును మీ సంచుల్లో కానుకగా పెట్టి ఉంటాడు. పోయిన సారి మీరు ధాన్యంకోసం డబ్బును మీరు నాకే చెల్లించినట్టు నాకు గుర్తు” అని వారితో చెప్పాడు. ఆ సేవకుడు షిమ్యోనును చెరసాలలోనుంచి బయటకు తీసుకొని వచ్చాడు.
GEN 43:24 ఆ సేవకుడు వాళ్లందరిని యోసేపు ఇంటికి తీసుకొని వెళ్లాడు. అతడు వారికి నీళ్లు ఇస్తే, వాళ్లు కాళ్లు కడుక్కొన్నారు. తర్వాత అతడు వారి గాడిదలకు మేత పెట్టాడు.
GEN 43:25 ఆ సోదరులు తాము యోసేపుతోబాటు భోంచేయబోతున్నట్టు విన్నారు. కనుక వారు అతనికోసం తెచ్చిన కానుకల్ని మధ్యాహ్నంవరకు సిద్ధం చేసుకొన్నారు.
GEN 43:26 యోసేపు ఇంటికి వచ్చాడు, ఆ సోదరులు వారితో తెచ్చిన కానుకలు అతనికి ఇచ్చారు. తర్వాత వారు నేలమీద సాష్టాంగపడ్డారు.
GEN 43:27 వారెలా ఉన్నారని యోసేపు వాళ్లను అడిగాడు, “మీరు నాతో చెప్పిన మీ ముసలి తండ్రి క్షేమంగా ఉన్నాడా? ఆయన ఇంకా బతికే ఉన్నాడా?” అన్నాడు యోసేపు.
GEN 43:28 ఆ సోదరులు, “అయ్యా, మా తండ్రి బాగున్నాడు. ఆయన ఇంకా బతికి ఉన్నాడు” అని జవాబిచ్చారు. మళ్లీ వాళ్లంతా యోసేపు ముందర సాష్టాంగపడ్డారు.
GEN 43:29 అప్పుడు యోసేపు తన సోదరుడు బెన్యామీనును చూశాడు, (బెన్యామీను, యోసేపులు ఒక్క తల్లి పిల్లలు). “మీరు నాతో చెప్పిన మీ కనిష్ఠ సోదరుడు ఇతడేనా?” అని యోసేపు అడిగాడు. అప్పుడు యోసేపు, “కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించు గాక!” అన్నాడు బెన్యామీనుతో.
GEN 43:30 అప్పుడు యోసేపు ఆ గదిలోనుంచి పరుగెత్తిపోయాడు. బెన్యామీను మీద తనకు ఉన్న ప్రేమను అతనికి చూపెట్టాలని యోసేపు ఎంతో ఆశించాడు. అతనికి ఏడ్చెయ్యాలనిపించింది గాని అతడు ఏడ్వటం అతని సోదరులు చూడకూడదు అనుకొన్నాడు. కనుక యోసేపు తన గదిలోనికి పెరుగెత్తి పోయి అక్కడ ఏడ్చాడు.
GEN 43:31 తర్వాత యోసేపు తన ముఖం కడుక్కొని బయటకు వచ్చాడు. అతడు తనను తాను ఓదార్చుకొని, “భోజనానికి వేళ అయ్యింది” అన్నాడు.
GEN 43:32 ఆ సేవకులు యోసేపు ఒక్కడికి ఒక బల్ల దగ్గర వేరుగాను, సోదరులను మరో బల్ల దగ్గర వేరుగాను కూర్చుండబెట్టారు. వారితో భోంచేస్తున్న ఈజిప్టు వారిని వారి మట్టుకే ఒక బల్లదగ్గర కూర్చుండ బెట్టారు. ఈజిప్టువాళ్లు హీబ్రూవారితో కలిసి భోజనం చేయరు, అది ఈజిప్టు మత విరోధం.
GEN 43:33 యోసేపు సోదరులు అతనికి ఎదురుగా ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ సోదరులు జ్యేష్ఠనితో మొదలుబెట్టి కనుష్ఠుని వరకు వరసక్రమంలో కూర్చున్నారు. జరుగుతున్నదంతా ఏమిటా అన్నట్టు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొంటున్నారు.
GEN 43:34 సేవకులు యోసేపు బల్లమీద నుంచే వారికి భోజనం వడ్డిస్తున్నారు. అయితే ఆ సేవకులు మిగిలిన వాళ్లకంటె అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. ఆ సోదరులు దాదాపు మత్తెక్కినంత వరకు యోసేపుతో కలిసి తిని తాగారు.
GEN 44:1 అప్పుడు యోసేపు తన సేవకునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు: “ఈ మనుష్యులు మోసుకొని పోగలిగినంత ధాన్యం వారి సంచుల్లో నింపు. ప్రతి ఒక్కరి సొమ్మును తిరిగి వారి వారి ధాన్యపు సంచుల్లో పెట్టు.
GEN 44:2 అందరిలో చిన్న తమ్ముని సంచిలో డబ్బు పెట్టు. అయితే నా ప్రత్యేకమైన వెండి పాత్రనుకూడ అతని సంచిలో పెట్టు.” ఆ సేవకుడు యోసేపు చెప్పినట్టు చేసాడు.
GEN 44:3 మర్నాటి ఉదయాన్నే ఆ సోదరులు వారి గాడిదలతోబాటు వారి దేశం పంపించబడ్డారు.
GEN 44:4 వారు పట్టణం విడిచిన తర్వాత యోసేపు తన సేవకులతో చెప్పాడు: “నీవు వెళ్లి ఆ మనుష్యుల్ని వెంబడించు. వాళ్లను ఆపుజేసి మేము మీతో మంచిగా ఉన్నాం. అయినా మీరెందుకు మాతో చెడ్డగా ప్రవర్తిస్తున్నారు? మా యజమాని వెండి పాత్రను మీరెందుకు దొంగిలించారు?
GEN 44:5 ఇది నా యజమాని యోసేపు పానం చేసే పాత్ర. రహస్య విషయాలను తెలుసుకొనేందుకు ఆయన ఉపయోగించే పాత్ర ఇది. ఆయన పాత్రను దొంగిలించి మీరు తప్పు చేసారు, అని వాళ్లతో చెప్పు.”
GEN 44:6 అందుచేత ఆ సేవకుడు విధేయుడయ్యాడు. అతడు సవారి చేసి ఆ సోదరులను ఆపుజేసాడు. అతడు చెప్పాల్సిందిగా యోసేపు అతనికి చెప్పిన విషయాలు ఆ సేవకుడు వారితో చెప్పాడు.
GEN 44:7 అయితే ఆ సోదరులు ఆ సేవకునితో ఇలా అన్నారు: “ఆ పాలకుడు యిలా ఎందుకు అన్నాడు? అలాంటిదేమీ మేము చేయము.
GEN 44:8 ఇంతకు ముందు మా సంచుల్లో మాకు దొరికిన డబ్బు మేం తెచ్చి ఇచ్చాం. అందుచేత మీ యజమాని ఇంటినుండి వెండి బంగారం ఏవీ మేము నిజంగా దొంగిలించం.
GEN 44:9 మాలో ఎవరి సంచిలోనైనా సరె ఆ వెండి పాత్ర నీకు కనబడితే, వాడు చావాల్సిందే. అతణ్ణి నీవు చంపేయి, మేము మీకు బానిసలమవుతాం.”
GEN 44:10 “మీరు చెప్పినట్టే చేద్దాం. కాని నేను మాత్రం ఎవర్నీ చంపను. వెండి పాత్ర గనుక నాకు కనబడితే ఆ మనిషి మాత్రం నాకు బానిస అవుతాడు. మిగిలిన వాళ్లు స్వేచ్ఛగా వెళ్లొచ్చు” అన్నాడు ఆ సేవకుడు.
GEN 44:11 అప్పుడు ప్రతి ఒక్క సోదరుడూ తన సంచిని నేలమీద పెట్టి తెరిచాడు.
GEN 44:12 సేవకుడు సంచుల్లో చూశాడు. అతడు జ్యేష్ఠునితో మొదలు బెట్టి కనిష్ఠునితో ముగించాడు. బెన్యామీను సంచిలో ఆ పాత్ర అతనికి కనబడింది.
GEN 44:13 సోదరులకు దుఃఖం వచ్చేసింది. దుఃఖంతో వాళ్లు వారి వస్త్రాలు చింపేసుకొన్నారు. వారు వారి సంచుల్ని మళ్లీ గాడిదలమీద పెట్టి తిరిగి ఆ పట్టణం వెళ్లారు.
GEN 44:14 యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వెళ్లారు. యోసేపు ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ సోదరులంతా నేలమీద సాష్టాంగపడ్డారు.
GEN 44:15 యోసేపు “మీరెందుకు ఇలా చేసారు? రహస్యాలు తెలుసుకొనే ఒక ప్రత్యేక పద్ధతి నా దగ్గర ఉందని మీకు తెలియదా? ఈ పని నాకంటె బాగగా ఇంకెవ్వరూ చేయలేరు” అన్నాడు.
GEN 44:16 యూదా, “అయ్యా, మేం ఇంకేమీ చెప్పలేం. వివరించే దారి యింకొకటి లేదు. మేం నేరస్థులం కాదని చూపించే విధం ఇంకొకటి లేదు. మేము చేసిన మరో పని మూలంగా దేవుడు మమ్మల్ని నేరస్థులుగా తీర్పు తీర్చాడు. కనుక మేము అందరం చివరకు బెన్యామీనుతో కూడ బానిసలవుతాం” అన్నాడు.
GEN 44:17 కానీ యోసేపు, “నేను మిమ్మల్ని అందరినీ బానిసలుగా చేయను. పాత్రను దొంగిలించిన మనిషి ఒక్కడే నాకు బానిస అవుతాడు. మిగిలిన మీరు సమాధానంగా మీ తండ్రి దగ్గరకు వెళ్లవచ్చు” అన్నాడు.
GEN 44:18 అప్పుడు యోసేపు దగ్గరకు యూదా వెళ్లి ఇలా చెప్పాడు: “అయ్యా, దయచేసి తమరితో నన్ను తేటగా చెప్పనివ్వండి. దయచేసి నాపై కోపగించకండి. మీరు ఫరో అంతటి వారని నాకు తెలుసు.
GEN 44:19 క్రితంసారి మేము ఇక్కడు ఉన్నప్పుడు ‘మీకు తండ్రిగాని సోదరుడు గాని ఉన్నాడా?’ అని తమరు అడిగారు.
GEN 44:20 దానికి మేము జవాబు చెప్పాం, మాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ముసలివాడు. మాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడు మా తండ్రికి ముసలితనంలో పుట్టాడు, అందుచేత మా తండ్రికి వాడంటే చాలా ప్రేమ. పైగా ఆ చిన్న కుమారుని అన్న చనిపోయాడు. అందుచేత ఆ తల్లికి పుట్టిన కుమారులలో మిగిలినవాడు ఇతడు ఒక్కడే. మా తండ్రికి ఇతనంటే ఎంతే ప్రేమ.
GEN 44:21 అప్పుడు ‘ఆ సోదరుని నా దగ్గరకు తీసుకొని రండి, నేను అతడ్ని చూడాలి’ అన్నారు తమరు.
GEN 44:22 దానికి మేము ‘ఆ చిన్నవాడు రావటానికి వీల్లేదు. అతడ్ని తన తండ్రిని విడిచిపెట్టలేడు. అతని తండ్రి అతణ్ణి గనక పోగొట్టుకొంటే, అతని తండ్రి దుఃఖంతో మరణిస్తాడు’ అని తమరితో చెప్పాం.
GEN 44:23 కానీ తమరేమో ‘మీరు మీ చిన్న తమ్ముడ్ని తప్పక తీసుకొని రావాల్సిందే, లేకపోతే మీకు ధాన్యం అమ్మేది లేదు’ అన్నారు మాతో.
GEN 44:24 కనుక మేము తిరిగి మా తండ్రి దగ్గరకు వెళ్లి, మీరు మాతో చెప్పినది ఆయనకు చెప్పాం.
GEN 44:25 “తర్వాత మా తండ్రి ‘మీరు మళ్లీ వెళ్లి మనకోసం ధాన్యం కొనండి’ అన్నాడు.
GEN 44:26 మేము మా తండ్రితో ‘మా చిన్న తమ్ముడు లేకుండా మేము వెళ్లలేం. మా చిన్న తమ్ముడ్ని చూచేంత వరకు మళ్లీ మాకు ధాన్యం అమ్మనని ఆ పాలకుడు అన్నాడు’ అని చెప్పాం.
GEN 44:27 అప్పుడు మా తండ్రి మాతో అన్నాడు ‘నా భార్య రాహేలు ఇద్దరు కుమారుల్ని నాకు కన్నది.
GEN 44:28 ఒక కుమారుడ్ని నేను బయటకు వెళ్లనిస్తే, అతణ్ణి అడవి మృగం చంపేసింది. అప్పట్నుండి నేను అతణ్ణి చూడలేదు.
GEN 44:29 రెండో కుమారునిగూడా మీరు నా దగ్గర్నుండి తీసుకొని పోతే, అతనికి ఏమైనా సంభవిస్తే ఆ దుఃఖంతో నేను మరణించాల్సిందే!’
GEN 44:30 కనుక ఇప్పుడు మేము మా కనిష్ఠ సోదరుడు మాతో లేకుండా మేము ఇంటికి వెళ్తే, ఏమి జరుగుతుందో ఊహించండి. మా తండ్రి జీవితంలో ఈ కుర్రవాడు చాలా ముఖ్యం.
GEN 44:31 ఈ కుర్రవాడు మాతో లేకపోవటం గమనిస్తే, మా తండ్రి చనిపోతాడు. ఆ తప్పు మాదే అవుతుంది. మహాగొప్ప దుఃఖంతో మా తండ్రి చనిపోయేటట్టు చెసిన వాళ్లమవుతాం.
GEN 44:32 “ఈ పిల్లవాని విషయం నేను బాధ్యత తీసుకొన్నాను. ‘ఇతణ్ణి మళ్లీ నీ దగ్గరకు తీసుకొని రాకపోతే నా జీవితకాలమంతా నన్ను నీవు నిందించమని’ నా తండ్రితో నేను చెప్పాను.
GEN 44:33 కనుక ఇప్పుడు నేను మీకు మనవి చేసేది, మిమ్మల్ని బ్రతిమాలాడేది ఏమిటంటే, దయచేసి ఈ పిల్లవాణ్ణి తన సోదరులతో వెళ్లనివ్వండి. నేను ఇక్కడే ఉండి, మీకు బానిసను అవుతాను.
GEN 44:34 ఈ పిల్లవాడు నాతో లేకపోతే నేను తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్లలేను. నా తండ్రికి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది.”
GEN 45:1 యోసేపు ఇంకెంతమాత్రం తనను తాను ఓర్చుకోలేక పోయాడు. అక్కడున్న ప్రజలందరి ముందు అతడు గట్టిగా ఏడ్చేసాడు. “అందర్నీ ఇక్కడనుండి వెళ్లిపొమ్మనండి” అన్నాడు యోసేపు. అందుచేత అందరూ అక్కడనుండి వెళ్లిపోయారు. ఆ సోదరులు మాత్రమే యోసేపు దగ్గర ఉన్నారు. అప్పుడు యోసేపు తాను ఎవరయిందీ వారితో చెప్పేసాడు.
GEN 45:2 యోసేపు ఇంకా ఏడుస్తూనే ఉన్నందుచేత, ఫరో ఇంటిలో ఉన్న ఈజిప్టు ప్రజలంతా అది విన్నారు.
GEN 45:3 యోసేపు తన సోదరులతో “మీ సోదరుడు యోసేపును నేనే, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా?” అన్నాడు. కాని ఆ సోదరులు నోటమాట రాలేదు. వారు భయంతో కలవరపడిపోయారు.
GEN 45:4 కనుక యోసేపు మళ్లీ తన సోదరులతో, “నా దగ్గరకు రండి. ఇలా నా దగ్గరకు రమ్మని బ్రతిమాలుతున్నాను రండి” అన్నాడు. కనుక ఆ సోదరులంతా యోసేపుకు దగ్గరగా వెళ్లారు. యోసేపు వాళ్లతో చెప్పాడు, “నేనే మీ సోదరుణ్ణి, యోసేపును. ఈజిప్టుకు బానిసగా మీరు అమ్మిన వాడిని నేనే.
GEN 45:5 ఇప్పుడేమీ బాధపడకండి. మీరు చేసినదాన్ని బట్టి మీ మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. నేను ఇక్కడికి రావటం దేవుని ఏర్పాటు. మీ ప్రాణం కాపాడేందుకు నేను ఇక్కడికి వచ్చాను.
GEN 45:6 భయంకరమైన ఈ కరువు కాలం ఇప్పటికే రెండు సంవత్సరాలనుండి ఉంది. నాట్లు వేయకుండా, కోతలు కోయకుండా ఇంకా అయిదు సంవత్సరాలు గడచిపోవాలి.
GEN 45:7 కనుక మీ వాళ్లందరినీ ఈ దేశంలో నేను రక్షించాలని చెప్పి దేవుడే నన్ను మీకంటె ముందుగా ఇక్కడికి పంపించాడు.
GEN 45:8 నేను యిక్కడికి పంపబడటం మీ తప్పకాదు. అదంతా దేవుని సంకల్పం. దేవుడు నన్ను ఫరోకు తండ్రిలా చేసాడు. ఆయన దివాణం అంతటిమీదను, మొత్తం ఈజిప్టు అంతటికి నేను పాలకుడ్ని.”
GEN 45:9 “కనుక మీరు త్వరగా నా తండ్రి దగ్గరకు వెళ్లండి. ఆయన కుమారుడు యోసేపు పంపిన సందేశం ఇది అని నా తండ్రితో చెప్పండి అన్నాడు యోసేపు. ‘దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద అధికారినిగా చేసాడు. ఇక్కడికి నా దగ్గరకు వచ్చేయండి. ఇంకా వేచి ఉండవద్దు ఇప్పుడే వచ్చేయండి.
GEN 45:10 గోషను దేశంలో నా దగ్గర మీరు నివసిస్తారు. మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ జంతువులు, మీ మందలు ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నాను.
GEN 45:11 వచ్చే అయిదు కరువు సంవత్సరాల కాలంలోనూ నేను మిమ్మల్ని చూచుకొంటాను. అందుచేత మీరూ, మీ కుటుంబాలు, మీ స్వంతది ఏదీ నష్టపోదు.’
GEN 45:12 “యోసేపు తన సోదరులతో మాట్లాడటం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీరు నిజంగా, నేను యోసేపు అని చూడగలుగుతున్నారు. అన్నాడు అతడు. నేనే అని మీ సోదరుడు బెన్యామీనుకు తెలుసు. మీతో మాట్లాడుతున్న నేను మీ సోదరుణ్ణి.
GEN 45:13 కనుక ఇక్కడ ఈజిప్టులో నాకు ఉన్న సమస్త ఘనతను గూర్చి నా తండ్రికి చెప్పండి. మీరు ఇక్కడ చూచిన వాటన్నింటి గూర్చి నా తండ్రికి చెప్పండి. ఇక మీరు త్వరపడి నా తండ్రిని నా దగ్గరకు తీసుకురండి.”
GEN 45:14 అప్పుడు యోసేపు తన తమ్ముడు బెన్యామీనును కౌగలించుకొని ఏడ్చాడు. బెన్యామీను కూడ ఏడ్చాడు.
GEN 45:15 తర్వాత యోసేపు తన సోదరులందరినీ ముద్దు పెట్టుకొని, వారి మీదపడి ఏడ్చాడు. ఆ తర్వాత ఆ సోదరులు అతనితో మాట్లాడటం మొదలు బెట్టారు.
GEN 45:16 యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చినట్లు ఫరోకు తెలిసింది. ఫరో ఇల్లంతా ఈ వార్త పాకిపోయింది. దీని విషయమై ఫరో, ఆతని సేవకులు చాలా సంతోషించారు.
GEN 45:17 కనుక యోసేపుతో ఫరో అన్నాడు: “నీ సోదరులకు కావలసినంత ఆహారం తీసుకొని తిరిగి కనాను దేశం వెళ్లమని చెప్పు.
GEN 45:18 నీ తండ్రిని, వారి కుటుంబాలను తిరిగి ఇక్కడికి నా దగ్గరకు తీసుకొని రమ్మని వారితో చెప్పు. ఈజిప్టులో శ్రేష్ఠమైన భూమిని నివాసానికి నేను నీకు ఇస్తాను. ఇక్కడ మనకు ఉన్న శ్రేష్ఠ ఆహారం నీ కుటుంబం భోంచేస్తారు.”
GEN 45:19 తర్వాత ఫరో అన్నాడు: “మన బండ్లలో మంచి వాటిని కొన్నింటిని మీ సోదరులకు ఇయ్యి. కనాను వెళ్లి, మీ తండ్రిని, స్త్రీలందరిని, పిల్లలను ఆ బండ్లమీద తీసుకొని రమ్మని వారితో చెప్పు.
GEN 45:20 వారి అన్ని సామానులు తెచ్చుకొనే విషయంలో ఏమీ చింత పడవద్దు. ఈజిప్టులో మనకు ఉన్న శ్రేష్ఠ వస్తువులు మనం వారికి ఇద్దాం.”
GEN 45:21 కనుక ఇశ్రాయేలు కుమారులు అలా చేసారు. ఫరో వాగ్ధానం చేసినట్టే యోసేపు వారికి మంచి బండ్లు ఇచ్చాడు. వారి ప్రయాణానికి సరిపడినంత ఆహారం యోసేపు వారికి ఇచ్చాడు.
GEN 45:22 ఒక్కో సోదరునికి ఒక్కో జత చక్కని వస్త్రాలు యిచ్చాడు యోసేపు. అయితే బెన్యామీనుకు అయిదు జతల మంచి బట్టలు యోసేపు ఇచ్చాడు. మరియు 300 వెండి నాణాలు కూడ యోసేపు బెన్యామీనుకు ఇచ్చాడు.
GEN 45:23 యోసేపు తన తండ్రికి కానుకలుకూడా పంపించాడు. ఈజిప్టులోని మంచి వస్తువులు చాలా సంచులనిండా నింపి పది గాడిదలమీద అతడు పంపించాడు. అతని తండ్రి తిరిగి వచ్చేటప్పుడు అవసరమైన ఆహారం, రొట్టె, ధాన్యం విస్తారంగా పది ఆడగాడీదల మీద అతడు పంపించాడు.
GEN 45:24 అప్పుడు యోసేపు అతని సోదరులను వెళ్లమన్నాడు. వారు వెళ్తూ ఉండగా యోసేపు “తిన్నగా ఇంటికి వెళ్లండి. దారిలో పోట్లాడకండి” అని వారితో చెప్పాడు.
GEN 45:25 కనుక ఆ సోదరులు ఈజిప్టు దేశం విడిచి, కనాను దేశంలో ఉన్న తమ తండ్రి దగ్గరకు వెళ్లారు.
GEN 45:26 ఆసోదరులు “నాయనా, యోసేపు బతికే ఉన్నాడు, ఈజిప్టు దేశం అంతటికి అతడే అధికారి” అని అతనితో చెప్పారు. వారి తండ్రి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతడు వాళ్లను నమ్మలేదు.
GEN 45:27 అయితే యోసేపు చెప్పినదంతా ఆ సోదరులు వారి తండ్రికి చెప్పారు. తర్వాత అతనిని ఈజిప్టు తీసుకొని రమ్మని యోసేపు పంపిన బండ్లను యాకోబు చూశాడు. అప్పుడు యాకోబు సంతోషంతో ఉప్పొంగిపొయ్యాడు.
GEN 45:28 “ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. నా కుమారుడు యోసేపు ఇంకా బతికే ఉన్నాడు! నేను మరణించక ముందు అతణ్ణి చూస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.
GEN 46:1 కనుక ఇశ్రాయేలు ఈజిప్టుకు తన ప్రయాణం మొదలు పెట్టాడు. మొదట ఇశ్రాయేలు బెయేర్షెబాకు వెళ్లాడు. అక్కడ తన తండ్రియైన ఇస్సాకు దేవుణ్ణి ఇశ్రాయేలు ఆరాధించాడు. అతడు బలులు అర్పించాడు.
GEN 46:2 ఆ రాత్రి ఒక కలలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. “యాకోబూ, యాకోబూ” అన్నాడు దేవుడు. “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని ఇశ్రాయేలు జవాబు ఇచ్చాడు.
GEN 46:3 అప్పుడు దేవుడు అన్నాడు: “నేను దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి. ఈజిప్టు వెళ్లేందుకు భయపడకు. ఈజిప్టులో నిన్ను ఒక గొప్ప జనంగా నేను చేస్తాను.
GEN 46:4 నీతో కూడ నేను ఈజిప్టుకు వస్తాను. మళ్లీ నేనే నిన్ను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వస్తాను. నీవు ఈజిప్టులో మరిణిస్తావు, కాని యోసేపు నీతో ఉంటాడు. నీవు చనిపోయినప్పుడు అతని స్వంత చేతులే నీ కళ్లను మూస్తాయి.”
GEN 46:5 అప్పుడు యాకోబు బెయేర్షెబా విడిచి, ఈజిప్టుకు ప్రయాణం చేసాడు. అతని కుమారులు, ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రిని, భార్యలను, తమ పిల్లలందరిని ఈజిప్టుకు తీసుకొని వచ్చారు. ఫరో పంపిన బండ్లలో వారు ప్రయాణం చేసారు.
GEN 46:6 తమ పశువులు, కనాను దేశంలో వారికి ఉన్నవి అన్నీ వారితోబాటు ఉన్నవి. కనుక ఇశ్రాయేలు తన పిల్లలందరితో, తన కుటుంబం అంతటితో కలిసి ఈజిప్టు వెళ్లాడు.
GEN 46:7 అతని కుమారులు అతని మనుమళ్లు, అతని కుమార్తెలు, అతని మనమరాళ్లు అతనితో ఉన్నారు. అతని కుటుంబం అంతా అతనితో కలిసి ఈజిప్టుకు వెళ్లారు.
GEN 46:8 ఇశ్రాయేలుతో కలిసి ఈజిప్టు వెళ్లిన అతని కుమారులు, కుటుంబము వాళ్ల పేర్లు: రూబేను యాకోబయొక్క మొదటి కుమారుడు.
GEN 46:9 రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.
GEN 46:10 షిమ్యోను కుమారులు; యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీ స్త్రీ కుమారుడు షావూలు.
GEN 46:11 లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారీ.
GEN 46:12 యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను కనానులో ఉన్నప్పుడే చనిపోయారు) పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు,
GEN 46:13 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువ్యా, యోబు, షిమ్రోను.
GEN 46:14 జెబలూను కుమారులు: సెరెదు, ఏలోను, యహలేలు
GEN 46:15 రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూనులు, యాకోబు భార్య లేయా ద్వారా అతని కుమారులు. లేయా ఆ కుమారులను పద్దనరాములో కన్నది. ఆమె కుమార్తె దీనా కూడ ఉంది. ఈ కుటుంబంలో 33 మంది ఉన్నారు.
GEN 46:16 గాదు కుమారులు: సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, అరోదీ, అరేలీ,
GEN 46:17 ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరీయా, వారి సోదరి శెరహు, హెబెరు, మల్కీయేలు,
GEN 46:18 బెరీయా కుమారులు: వారంతా యాకోబుకు అతని భార్య సేవకురాలు జిల్ఫాద్వారా పుట్టిన కుమారులు. ఈ కుటుంబంలో 16 మంది ఉన్నారు.
GEN 46:19 మరియు అతని భార్య రాహేలు ద్వారా పుట్టిన కుమారుడు బెన్యామీను కూడ యాకోబుతో ఉన్నాడు. (యోసేపు కూడ రాహేలుకు పుట్టినవాడే కాని అతడు అప్పటికే ఈజిప్టులో ఉన్నాడు.)
GEN 46:20 ఈజిప్టులో యోసేపుకు ఇద్దరు కుమారులు: మనష్షే, ఎఫ్రాయిము. (ఓను పట్టణ యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతు యోసేపు భార్య).
GEN 46:21 బెన్యామీను కుమారులు, బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు.
GEN 46:22 వారంతా యాకోబుకు అతని భార్య రాహేలు ద్వారా కలిగిన సంతానం. ఈ కుటుంబంలో 14 మంది ఉన్నారు.
GEN 46:23 దాను కుమారుడు: హుషీము
GEN 46:24 నఫ్తాలి కుమారులు: యహసేలు, గూనీ, యోసేరు, షల్లేము
GEN 46:25 వారు యాకోబు, బిల్హాలకు పుట్టిన కుమారులు (రాహేలు సేవకురాలు బిల్హా). ఈ కుటుంబంలో ఏడుగురు ఉన్నారు.
GEN 46:26 ఇలా యాకోబు సంతానం ఈజిప్టు వెళ్లారు. యాకోబు మూలంగా కలిగిన పిల్లలు మొత్తం 66 మంది. (యాకోబు భార్యలు ఈ లెక్కలో లేరు).
GEN 46:27 మరియు యోసేపు ఇద్దరు కుమారులు కూడ ఉన్నారు. వారు ఈజిప్టులో పుట్టారు. కనుక ఈజిప్టులో యాకోబు కుటుంబంలో 70 మంది ఉన్నారు.
GEN 46:28 యాకోబు మొదట యూదాను యోసేపు దగ్గరకు పంపించాడు. గోషేను దేశంలోని యోసేపు దగ్గరకు యూదా వెళ్లాడు. ఆ తర్వాత యాకోబు, అతని వాళ్లు ఆ దేశంలో ప్రవేశించారు.
GEN 46:29 యోసేపు తన తండ్రి వచ్చేస్తున్నాడని విన్నాడు. గోషేనులో తన తండ్రి ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు యోసేపు తన రథం సిద్ధం చేసుకొని బయల్దేరాడు. యోసేపు తన తండ్రిని చూడగానే అతని మెడమీద పడి కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చాడు.
GEN 46:30 అప్పుడు ఇశ్రాయేలు, “ఇప్పుడు నేను మనశ్శాంతిగా మరణించవచ్చు నీ ముఖం నేను చూశాను, నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను చూడగలిగాను,” అన యోసేపుతో చెప్పాడు.
GEN 46:31 తన సోదరులతోను, తన తండ్రి కుటుంబంతోను యోసేపు ఇలా చెప్పాడు: “నేను వెళ్లి మీరు వచ్చినట్టు ఫరోతో చెబతాను. ఫరోతో నేను ఏమని చెబతానంటే ‘నా అన్నలు, నా తండ్రి కుటుంబం కనాను దేశం విడిచి ఇక్కడ నా దగ్గరకు వచ్చారు.
GEN 46:32 ఈ నా కుటుంబం గొర్రెల కాపరుల కుటుంబం. నిత్యం వాళ్లు పశువుల్ని, మందల్ని కలిగి ఉండేవాళ్లు. వారి పశువుల్ని, వారికి కలిగిన అంతటిని వాళ్లతోబాటు వారు తెచ్చుకొన్నారు.’
GEN 46:33 ఫరో మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేం పని చేస్తారు? అని మిమ్మును అడుగుతాడు.
GEN 46:34 అప్పుడు మీరు ‘మేము గొర్రెల కాపరులం, మా జీవితకాలమంతా మా పశువుల్ని మేపుకొంటూ జీవించాం. మాకు ముందు మా పూర్వీకులు ఇలాగే జీవించారు’ అని చెప్పండి. అప్పుడు ఫరో మిమ్మును గోషేను దేశంలో జీవింపనిస్తాడు. గొర్రెల కాపరులంటే ఈజిప్టు ప్రజలకు యిష్టం లేదు, కనుక మీరు గోషేను దేశంలో ఉండవచ్చు.”
GEN 47:1 యోసేపు ఫరో దగ్గరకు వెళ్లి, “నా తండ్రి, నా సోదరులు, వారి కుటుంబాలు మొత్తం ఇక్కడికి వచ్చారు. వారి పశువులు, కనాను దేశంలో వారికి కలిగినది మొత్తం వారితో తెచ్చుకొన్నారు. వారిప్పుడు గోషెనులో ఉన్నారు” అని చెప్పాడు.
GEN 47:2 యోసేపు తన సోదరులలో అయిదుగురిని తనతో కూడ ఫరో ఎదుటికి తీసుకొని వెళ్లాడు.
GEN 47:3 “మీ వృత్తి ఏమిటి?” అని ఫరో ఆ సోదరులను అడిగాడు. ఆ సోదరులు ఫరోతో, “అయ్యా, మేము గొర్రెల కాపరులం. మాకు ముందున్న మా పూర్వీకులు కూడా గొర్రెల కాపరులే” అని చెప్పారు.
GEN 47:4 “కనాను దేశంలో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. మా పశువులకు అవరమైన గడ్డి ఉన్న పొలాలు ఎక్కడా లేవు. అందుచేత ఈ దేశంలో బతుకుదామని మేము ఇక్కడికి వచ్చాం. మీరు దయచేసి మమ్మల్ని గోషెను దేశంలో ఉండనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం” అని వారు ఫరోతో చెప్పారు.
GEN 47:5 అప్పుడు యోసేపుతో ఫరో చెప్పాడు: “నీ తండ్రి, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చారు.
GEN 47:6 వారు నివసించేందుకు ఈజిప్టులో ఏ స్థలమైనా సరే నీవు వారికోసం కోరుకోవచ్చు. నీ తండ్రికి, నీ సోదరులకు శ్రేష్ఠమైన భూమి ఇవ్వు. గోషెను దేశంలో వారిని ఉండనివ్వు. వారు నైపుణ్యంగల కాపరులైతే, వారు నా పశువులకను కూడ చూసుకోవచ్చు.”
GEN 47:7 అప్పుడు యోసేపు తన తండ్రి యాకోబును ఫరో ఎదుటికి తీసుకొని వచ్చాడు. యాకోబు ఫరోను ఆశీర్వదించాడు.
GEN 47:8 అప్పుడు ఫరో “నీ వయస్సెంత?” అని యాకోబును అడిగాడు.
GEN 47:9 “నేను తక్కువ కాలం ఎక్కువ కష్టాలతో బతికాను. 130 సంవత్సరాలే నేను బతికాను. నా తండ్రి, ఆయన పూర్వీకులు నాకంటె చాలా ఎక్కువ కాలం బతికారు” అని ఫరోతో యాకోబు చెప్పాడు.
GEN 47:10 యాకోబు ఫరోను ఆశీర్వదించాడు. తర్వాత యాకోబు ఫరో ఎదుటి నుండి వెళ్లిపోయాడు.
GEN 47:11 యోసేపు ఫరోకు విధేయుడయ్యాడు. అతడు తన తండ్రికి, తన సోదరులకు ఈజిప్టలో మంచి భూమిని సమీపంగా ఇచ్చాడు. ఈజిప్టులో రామసేసు నగరానికి దగ్గరలోవున్న ఈ భూమి అతి శ్రేష్ఠమైంది.
GEN 47:12 మరియు తన తండ్రికి, సోదరులకు, వారి మనుష్యులందరికీ అవసరమైన ఆహారాన్ని యోసేపు వారికి ఇచ్చాడు.
GEN 47:13 కరువు కాలం మరీ తీవ్రం అయింది. దేశంలో ఎక్కడా ఆహారం లేదు. ఈ కష్టకాలం మూలంగా ఈజిప్టు, కనాను దరిద్రంగా తయారయ్యాయి.
GEN 47:14 ఆ దేశంలో ప్రజలు మరింత ధాన్యం కొన్నారు. యోసేపు ఆ ధనం ఆదా చేసి, దానిని ఫరో ఇంటికి తెచ్చాడు.
GEN 47:15 కొన్నాళ్లకు ఈజిప్టులోను కనానులోను ప్రజల దగ్గర పైకం అయిపోయింది. ధాన్యం కొనేందుకే వారి డబ్బు అంతా ఖర్చు పెట్టారు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్లి, “దయచేసి మాకు ధాన్యం ఇవ్వండి. మా డబ్బు అయిపోయింది. మేము భోజనం చేయకపోతే మీరు చూస్తుండగానే మేము మరణిస్తాం” అని చెప్పారు.
GEN 47:16 “మీ పశువుల్ని ఇవ్వండి, నేను మీకు ఆహారం ఇస్తాను” అని యోసేపు జవాబిచ్చాడు.
GEN 47:17 కనుక ప్రజలు ఆహారం కొనేందుకు వారి పశువులను, గుర్రాలను, మిగిలిన జంతువులన్నిటిని ఉపయోగించారు. ఆ సంవత్సరం యోసేపు వారికి ఆహారం ఇచ్చి, వారి పశువులను తీసుకున్నాడు.
GEN 47:18 అయితే ఆ తర్వాత సంవత్సరం ప్రజల దగ్గర జంతువులు లేవు, ఆహారం కొనేందుకు ఉపయోగించటానికి ఏమీ లేవు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్లి “మా దగ్గర ఇంకేమీ డబ్బు లేదని మీకు తెలుసు. మా పశువులన్నీ మీవే ఇప్పుడు. మా దగ్గర నీవు చూస్తున్న మా శరీరాలు, మా భూమి తప్ప ఇంకేమి లేవు.
GEN 47:19 మీరు చూస్తుండగానే నిశ్చయంగా మేము చనిపోతాం. కానీ, మీరు మాకు ఆహారం ఇస్తే, మేము మా భూమిని ఫరోకు ఇస్తాం, మేము ఆయన బానిసలంగా ఉంటాము. మేము నాట్లు వేయటానికి మాకు విత్తనాలు ఇవ్వండి. అప్పుడు మేము చావక బతుకుతాం. భూమి మా కోసం మరోసారి పంటను ఇస్తుంది” అని చెప్పారు.
GEN 47:20 కనుక యోసేపు ఈజిప్టులోని భూమి అంతటినీ ఫరోకోసం కొన్నాడు. ఈజిప్టులోని ప్రజలంతా వారి భూములను యోసేపుకు అమ్మివేసారు. వారు చాలా కరువుతో ఉన్నందుచేత ఇలా చేసారు.
GEN 47:21 మరియు ప్రజలందకు ఫరోకు బానిసలయ్యారు. ఈజిప్టు అంతటిలో ప్రజలు ఫరోకు బానిసలు.
GEN 47:22 యాజకుల స్వంత భూములను మాత్రమే యోసేపు కొనలేదు. యాజకుల పనికి ఫరో జీతం ఇచ్చాడు గనుక వారు వారి భూములను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆ డబ్బును ఆహారం కొనేందుకు వారు ఉపయోగించుకొనేవారు.
GEN 47:23 యోసేపు ప్రజలతో చెప్పాడు, “ఇప్పుడు మిమ్మల్ని, మీ భూముల్ని ఫరోకోసం నేను కొన్నాను. కనుక నేను విత్తనాలు ఇస్తాను, మీరు మీ భూముల్లో నాట్లు వేయవచ్చును.
GEN 47:24 కోతకాలంలో మీ పంటలో అయిదింట ఒక వంతు ఫరోకు ఇవ్వాలి. అయిదింట నాలుగు వంతులు మీకోసం మీరు ఉంచుకోవచ్చు. మీరు ఉంచుకొనే గింజలను మీ ఆహారం కోసమూ, వచ్చే సంవత్సరం విత్తనాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ కుటుంబాలను, పిల్లలను పోషించుకోవచ్చు.”
GEN 47:25 ప్రజలు, “మీరు మా ప్రాణాలు రక్షించారు. మేము సంతోషంగా మీకు, ఫరోకు బానసలంగా ఉంటాం” అన్నారు.
GEN 47:26 కనుక ఈ సమయంలో యోసేపు ఆ దేశంలో చట్టం చేసాడు. ఆ చట్టం నేటికీ కొనసాగుతుంది. భూమిలోనుండి వచ్చే దిగుబడి అంతటిలోనూ అయిదింట ఒక వంతు ఫరోకు చెందుతుంది అనేది ఆ చట్టం. భూములన్నీ ఫరో స్వంతం. యాజకుల భూమి మాత్రమే ఫరో స్వంతం కాలేదు.
GEN 47:27 ఇశ్రాయేలు (యాకోబు) ఈజిప్టులో ఉన్నాడు. గోషెను దేశంలో నివసించాడు. అతని కుటుంబం పెరిగి చాలా పెద్దది అయింది. ఈజిప్టులో వారు ఆ భూమిని సంపాదించి వర్ధిల్లారు.
GEN 47:28 యాకోబు ఈజిప్టులో 17 సంవత్సరాలు జీవించాడు. కనుక యాకోబు వయస్సు 147 సంవత్సరాలు.
GEN 47:29 తాను త్వరలో చనిపోతానని తెలిసి, ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారుడు యోసేపును తన దగ్గరకు పిల్చాడు. “నీవు నన్ను ప్రేమిస్తే, నీ చేయి నా తొడకింద పెట్టి ప్రమాణం చేయి. నేను చెప్పినట్లు నీవు చేస్తానని, నాకు నీవు నమ్మకంగా ఉంటావని వాగ్దానం చేయి. నేను మరిణించినప్పుడు నన్ను ఈజిప్టులో పాతిపెట్టవద్దు.
GEN 47:30 నా పూర్వీకులు పాతి పెట్టబడిన చోట నన్ను పాతిపెట్టు. ఈజిప్టు నుండి నన్ను తీసుకొనిపోయి, మన కుటుంబ సమాధుల స్థలంలో నన్ను పాతిపెట్టు” అన్నాడు. “నీవు చెప్పినట్టు చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నా” అని యోసేపు జవాబిచ్చాడు.
GEN 47:31 అప్పుడు యాకోబు, “నాకు ప్రమాణం చేయి” అన్నాడు. అందుకు యోసేపు అలా చేస్తానని ప్రమాణం చేసాడు. అంతట ఇశ్రాయేలు పడక మీద తన తల వెనుకకు వాల్చాడు.
GEN 48:1 కొంత కాలం తర్వాత, తన తండ్రి చాలా అస్వస్థతగా ఉన్నాడని యోసేపుకు తెలిసింది. కనుక మనష్షే, ఎఫ్రాయిము అనే తన యిద్దరు కుమారులను తీసుకొని, యోసేపు తన తండ్రి దగ్గరకు వెళ్లాడు.
GEN 48:2 యోసేపు వచ్చినప్పుడు ఎవరో ఇశ్రాయేలుతో చెప్పారు, “నీ కుమారుడు యోసేపు నిన్ను చూడటానికి వచ్చాడు” అని. ఇశ్రాయేలు చాలా బలహీనంగా ఉన్నాడు, అయినప్పటికీ కష్టంగా ప్రయత్నించి తన పడకమీద కూర్చున్నాడు.
GEN 48:3 అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు, “కనాను దేశంలోని ఊజు వద్ద సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడే దేవుడు నన్ను ఆశీర్వదించాడు.
GEN 48:4 దేవుడు నాతో చెప్పాడు: ‘నిన్ను ఒక గొప్ప వంశంగా నేను చేస్తాను. నీకు అనేకమంది పిల్లలను నేను ఇస్తాను, మీరు గొప్ప జనం అవుతారు. మీ వంశీకులు ఈ భూమిని శాశ్వతంగా స్వంతం చేసుకుంటారు.’
GEN 48:5 ఇప్పుడు నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నేను రాకముందు యిక్కడ ఈజిప్టు దేశంలో ఈ ఇద్దరు కుమారులు పుట్టారు. ఎఫ్రాయిము, మనష్షే అనే నీ యిద్దరు కుమారులు నా స్వంత కుమారుల్లాగే ఉంటారు. రూబేను, షిమ్యోనులు నాకెలాగో వారూకూడ నాకు అంతే.
GEN 48:6 కనుక ఈ ఇద్దరు బాలురు నా కుమారులే. నాకు ఉన్న దానంతటిలో వారికి గూడ భాగం ఉంది. అయితే నీకు ఇంకా కుమారులు పుడితే వాళ్లు నీ స్వంత కుమారులుగా ఉంటారు. అయితే వారు ఎఫ్రాయిము మనష్షేలకు కుమారులుగా ఉంటారు. అంటే భవిష్యత్తులో ఎఫ్రాయిము, మనష్షేలు కలిగి ఉండే దానంతటిలో వాళ్లూ భాగస్థులవుతారు.
GEN 48:7 పద్దనరాము నుండి చేసిన ప్రయాణంలో రాహేలు చనిపోయింది. ఇది నాకు చాలా దుఃఖం కలిగించింది. ఆమె కనాను దేశంలో చనిపోయింది. అప్పటికి మేము ఇంకా ఎఫ్రాతా వైపు ప్రయాణం చేస్తున్నాం. ఎఫ్రాతా పోయే మార్గంలో నేను ఆమెను సమాధి చేసాను.” (ఎఫ్రాతా బెత్లెహేము)
GEN 48:8 అప్పుడు యోసేపు కుమారులను ఇశ్రాయేలు చూశాడు. “ఈ పిల్లలు ఎవరు?” అని యోసేపును అడిగాడు.
GEN 48:9 యోసేపు తన తండ్రితో, “వీళ్లు నా కుమారులు. దేవుడు నాకు ఇచ్చిన అబ్బాయిలు వీళ్లే” అని చెప్పాడు. “నీ కుమారులను నా దగ్గరకు తీసుకొని రా! నేను వారిని ఆశీర్వదిస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.
GEN 48:10 ఇశ్రాయేలు వృద్ధుడు గనుక అతని చూపు సరిగ్గా లేదు అందుచేత యోసేపు ఆ బాలురను తన తండ్రికి దగ్గరగా తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు వారిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు.
GEN 48:11 అప్పుడు ఇశ్రాయేలు, “నీ ముఖం మళ్లీ చూస్తానని నేను ఎన్నడూ అనకోలేదు. అయితే చూడు! నిన్ను, నీ పిల్లలను కూడ దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు యోసేపుతో.
GEN 48:12 అప్పుడు యోసేపు ఆ బాలురను ఇశ్రాయేలు ఒడిలోనుండి దించగా, వారు అతని తండ్రి ఎదుట సాగిలపడ్డారు.
GEN 48:13 ఎఫ్రాయిమును అతని కుడి ప్రక్కను, మనష్షేను అతని ఎడమ ప్రక్కను యోసేపు ఉంచాడు. (కనుక ఇశ్రాయేలుకు ఎడమ ప్రక్క ఎఫ్రాయిము, కుడి ప్రక్క మనష్షే ఉన్నారు).
GEN 48:14 కానీ ఇశ్రాయేలు తన చేతులను అటుయిటు మార్చి చిన్న పిల్లవాడు ఎఫ్రాయిము తలమీద తన కుడి చేతిని పెట్టాడు. తర్వాత ఇశ్రాయేలు పెద్దపిల్లవాడు మనష్షే తలమీద తన ఎడమ చేతిని పెట్టాడు. మనష్షే జ్యేష్ఠుడైనప్పటికి అతడు తన ఎడమ చేతిని మనష్షే మీద ఉంచాడు.
GEN 48:15 మరియు ఇశ్రాయేలు యోసేపును ఆశీర్వదించి ఇలా చెప్పాడు: “నా పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు మన దేవుణ్ణి ఆరాధించారు. ఆ దేవుడే నా జీవితమంతా నన్ను నడిపించాడు.
GEN 48:16 అయితే నా కష్టాలన్నింటినుండి నన్ను రక్షించిన దూత. ఆయనే ఈ బాలురను దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ పిల్లలకు నా పేరు ఉంటుంది మన పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకుల పేర్లు వారికి ఉంటాయి. వారు ఈ భూమి మీద గొప్ప వంశాలుగా గొప్ప రాజ్యాలుగా ఎదగాలని నా ప్రార్థన.”
GEN 48:17 తన తండ్రి కుడిచేయి ఎఫ్రాయిము మీద ఉంచినట్లు యోసేపు చూశాడు. ఇది యోసేపుకు సంతోషం గలిగించలేదు. యోసేపు తన తండ్రి చేయి తీసుకొని, ఎఫ్రాయిం తలమీదనుండి తీసి, మనష్షే తలమీద ఉంచాలనుకొన్నాడు.
GEN 48:18 యోసేపు తన తండ్రితో, “నీ కుడి చేయి సరైన వాడిమీద పెట్టలేదు. మనష్షే జ్యేష్ఠుడు” అని చెప్పాడు.
GEN 48:19 అయితే అతని తండ్రి వాదించి చెప్పాడు, “నాకు తెలుసు కొడుకా. మనష్షే జ్యేష్ఠుడు అతడు గొప్ప వాడవుతాడు. అతడు అనేకమంది ప్రజలకు తండ్రి కూడ అవుతాడు. కానీ చిన్నవాడు పెద్దవాడికంటె గొప్ప వాడవుతాడు. మరియు చిన్నవాడి వంశం ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది.”
GEN 48:20 అలా ఇశ్రాయేలు ఆనాడు వారిని ఆశీర్వదించాడు. “ఇశ్రాయేలువారు ఆశీర్వదించుటకు నీ నామాన్ని ఉపయోగిస్తారు. ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు ‘దేవుడు ఎఫ్రాయిము మరియు మనష్షేవలె చేయునుగాక అని వాళ్లంటారు’ అని అతడు చెప్పాడు.” ఈ విధంగా మనష్షేకంటె ఎఫ్రాయిమును గొప్ప చేశాడు ఇశ్రాయేలు.
GEN 48:21 అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు “చూడు, నా మరణ ఘడియ దాదాపు సమీపించింది. అయితే దేవుడు మాత్రం ఇంకా మీతో ఉంటాడు. మీ పూర్వీకుల దేశానికి ఆయన మిమ్మును నడిపిస్తాడు.
GEN 48:22 నీ సోదరలకు ఇవ్వనిది నేను నీకు ఇచ్చాను. అమోరీ ప్రజలనుండి నేను గెలుచుకొన్న పర్వతాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఆ పర్వతం కోసం నా కత్తితో, నా బాణంతో నేను ఆ మనుష్యులతో పోరాడి గెల్చాను.”
GEN 49:1 అప్పుడు యాకోబు తన కుమారులందరినీ తన దగ్గరకు పిలిచాడు. అతడు చెప్పాడు: “నా కుమారులందరూ ఇక్కడ నా దగ్గరకు రండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను మీకు చెబతాను.
GEN 49:2 “యాకోబు కుమారులారా, మీరంతా కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాటలు వినండి.
GEN 49:3 “రూబేనూ, నీవు మొట్టమొదటి కుమారుడవు. పురుషునిగా నా శక్తికి మొదటి ఋజువు నీవే. నా కుమారులందరిలోను గౌరవించదగిన మహా బలశాలివి నీవు. నీవు నా ప్రథమ సంతానం. నా కుమారులందరిలో నీవు మహా బలవంతుడవు, అతిశయాస్పదమైన వాడవు.
GEN 49:4 కానీ నీవు ఉద్రేకంతో అదుపుదప్పిన ప్రవాహం వలే ఉన్నావు. కాబట్టి నీవు ఎక్కువ గౌరవించదగిన కుమారుడవు కావు నీ తండ్రికి చెందిన స్త్రీతో నీవు శయనించావు నీ తండ్రి పడకను నీవు ఎక్కావు. నీవు నా పడకకు అవమానం తెచ్చావు.
GEN 49:5 “షిమ్యోను, లేవీ సోదరులు. తమ ఖడ్గములతో పోరాడటం అంటే వారికి ప్రీతి.
GEN 49:6 రహస్యమందు వారు చెడు కార్యాలను తలస్తారు. వారి పథకాలలో నా ఆత్మ భాగాన్ని కోరటం లేదు, వారి రహస్య సమావేశాలను నేను అంగీకరించను, వారు వారి పగవారిని కోపంతో చంపారు వారు కేవలం సరదాలకు పశువులకు హాని చేసారు.
GEN 49:7 వారి కోపం శాపం అది చాల బలీయమయింది. వారికి కోపం వచ్చినప్పుడు వారు చాలా క్రూరులు యాకోబు దేశంలో వారి వంశాలకు వారి స్వంత భూమి వారికి ఉండదు ఇశ్రాయేలు అంతటిలో వారు చెదరి ఉంటారు.
GEN 49:8 “యూదా, నీ సోదరులు నిన్ను పొగడుదురు. నీవు నీ శత్రువులను ఓడిస్తావు. నీ సోదరులు నీకు సాగిలపడ్తారు.
GEN 49:9 యూదా సింహంలాంటివాడు. కుమారుడా, తాను చంపిన జంతువు దగ్గర నిలిచిన సింహం వంటి వాడవు నీవు. యూదా సింహంవంటి వాడు. అతడు విశ్రాంతికోసం పండుకొంటాడు. అతణ్ణి లేపుటకు ఎవరూ సాహసించరు.
GEN 49:10 యూదా వంశపు పురుషులు రాజులుగా ఉంటారు. అతని కుటుంబం పరిపాలిస్తుంది, అనే సూచన అసలైన రాజు వచ్చేంతవరకు అతని కుటుంబాన్ని విడువదు. అప్పుడు అనేక మంది అతనికి విధేయులై అతణ్ణి సేవిస్తారు.
GEN 49:11 అతడు ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టివేస్తాడు శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి అతడు తన గాడిద పిల్లను కట్టివేస్తాడు. అతడు తన బట్టలు ఉదుకుటకు శ్రేష్ఠమైన ద్రాక్షారసాన్ని ఉపయోగిస్తాడు.
GEN 49:12 ద్రాక్షారసం తాగి అతని కళ్లు ఎరుపెక్కి ఉంటాయి. పాలు తాగి అతని పళ్లు తెల్లగా ఉంటాయి.
GEN 49:13 “జెబూలూను సముద్రానికి సమీపంగా జీవిస్తాడు. అతని తీరం ఓడలకు క్షేమ స్థలంగా ఉంటుంది. అతని భూమి సీదోను వరకు విస్తరిస్తుంది.
GEN 49:14 “ఇశ్శాఖారు చాలా ప్రయాసపడిన గాడిదల వలె ఉంటాడు భారమైన బరువు మోసినందుచేత అతడు పండుకొని ఉంటాడు.
GEN 49:15 అతడు తన విశ్రాంతి స్థలం మంచిదిగా ఉండేటట్టు చూసుకొంటాడు తన భూమి రమ్యమైనదిగా ఉండేటట్టు అతడు చూసుకొంటాడు. తర్వాత అతడు బరువులు మోయుటకు ఒప్పుకొంటాడు. బానిసగా పని చేసేందుకు అతడు ఒప్పుకొంటాడు.
GEN 49:16 “ఇతర ఇశ్రాయేలు వంశస్థుల్లాగే దాను తన ప్రజలకు తర్పు తీరుస్తాడు.
GEN 49:17 దారి ప్రక్కన ఉండే పామువలె దాను ఉండునుగాక త్రోవ దగ్గర పొంచి ఉండే కట్లపామువలె అతడు ఉండుగాక. ఆ పాము గుర్రపు మడిమెను కాటు వేస్తుంది. ఆ గుర్రంమీద స్వారీ చేసే మనిషి గుర్రం మీదనుండి పడిపోతాడు.
GEN 49:18 “యెహోవా, నీ రక్షణకోసం నేను కనిపెట్టకొని ఉన్నాను.
GEN 49:19 “దొంగల గుంపు గాదు మీద పడ్తారు. కానీ గాదు వారిని తరిమివేస్తాడు.
GEN 49:20 “ఆషేరు భూమి మంచి ఆహారాన్ని సమృధ్ధిగా పండిస్తుంది ఒక రాజుకు సరిపోయేలాంటి భోజనం అతనికి ఉంటుంది.
GEN 49:21 “స్వేచ్ఛగా పరుగులెత్తే లేడివంటివాడు. నఫ్తాలి దాటి అందమైన పిల్లల్లా అతని మాటలు ఉంటాయి.
GEN 49:22 “యోసేపు చాలా విజయశాలి నీళ్ల ఊట దగ్గర ఎదిగే ద్రాక్షావల్లిలా కంచెమీద అల్లుకొనే ద్రాక్షా తీగెలా అతడు ఫలిస్తాడు
GEN 49:23 చాలామంది అతనిమీద ఎదురు తిరిగి అతనితో పోరాడారు బాణాలు పట్టుకొనేవారు అతనికి శత్రువులయ్యారు.
GEN 49:24 అయితే తన మహత్తర విల్లుతోను, నైపుణ్యంగల తన చేతులతోను పోరాటం గెల్చాడు అతడు తన శక్తిని యాకోబు యొక్క శక్తిమంతుని నుండి గొర్రెల కాపరినుండి ఇశ్రాయేలు బండనుండి
GEN 49:25 నీ తండ్రి దేవునినుండి పొందుతాడు. “దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సర్వశక్తిమంతుడగు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక! పైన ఆకాశంనుండి ఆశార్వాదములను, అగాధ స్థలముల నుండి ఆశీర్వాదములను ఆయన నీకు అనుగ్రహించుగాక స్తనముల దీవెనలు గర్భపు దీవెనలు ఆయన నీకు ఇచ్చుగాక.
GEN 49:26 నా తల్లిదండ్రులకు ఎన్నెన్నో మేళ్లు జరిగాయి. మరియు నీ తండ్రినైన నేను అంతకంటె ఎక్కువగ ఆశీర్వదించబడ్డాను నీ సోదరులు నీకు ఏమీ లేకుండా నిన్ను విడిచిపెట్టి వేసేందుకు ప్రయత్నించారు అయితే ఇప్పుడు నా ఆశీర్వాదములన్నీ కొండంత ఎత్తుగా నీమీద క్రుమ్మరించబడతాయి.
GEN 49:27 “బెన్యామీను ఆకలిగొన్న తోడేలు వంటివాడు ఉదయాన అతడు చంపుకొని తింటాడు మిగిలిన దానిని అతడు సాయంకాలం పంచుకొంటాడు.”
GEN 49:28 అవి ఇశ్రాయేలు పండ్రెండు కుటుంబాలు. మరియు వారి తండ్రి వారితో చెప్పిన విషయాలు అవి. వారిలో ప్రతి కుమారునికి తగిన ఆశీర్వాదం అతడు వారికి ఇచ్చాడు.
GEN 49:29 తర్వాత ఇశ్రాయేలు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అతడు ఇలా చెప్పాడు, “నేను మరణించినప్పుడు నా ప్రజలతో ఉండాలని నేను కోరుచున్నాను. హిత్తీయుడగు ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకులతో బాటు పాతిపెట్టబడాలని కోరుతున్నాను.
GEN 49:30 ఆ గుహ మమ్రే దగ్గర మక్ఫేలా పొలంలో ఉంది. అది కనాను దేశంలో ఉంది. అబ్రాహాము తనను పాతిపెట్టేందుకు స్థలం ఉండాలని ఎఫ్రోను దగ్గర ఆ భూమి కొన్నాడు.
GEN 49:31 అబ్రాహాము, అతని భార్య శారా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. ఇస్సాకు, అతని భార్య రిబ్కా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. నా భార్య లేయాను నేను ఆ గుహలోనే పాతిపెట్టాను.
GEN 49:32 హిత్తీ మనుష్యుల దగ్గర కొన్న పొలంలో ఉంది ఆ గుహ.”
GEN 49:33 యాకోబు తన కుమారులతో మాట్లాడటం ముగించిన తర్వాత అతడు పండుకొని, పడకమీద తన కాళ్లు చాపుకొని మరణించాడు.
GEN 50:1 ఇశ్రాయేలు మరణించినప్పుడు యోసేపు చాలా విచారించాడు. అతడు తన తండ్రిని కౌగలించుకొని, అతని మీద పడి ఏడ్చి, అతనిని ముద్దు పెట్టుకొన్నాడు.
GEN 50:2 తన తండ్రి దేహమును సిద్ధం చేయుమని అతడు తన సేవకులకు ఆజ్ఞాపించాడు (ఆ సేవకులు వైద్యులు). యాకోబు శరీరాన్ని సమాధి చేసేందుకు వైద్యులు సిద్ధం చేసారు. ఈజిప్టువారి ప్రత్యేక పద్ధతిలో ఆ శరీరాన్ని వారు సిద్ధం చేసారు.
GEN 50:3 ఈజిప్టు వారు ఈ పద్ధతిలో శరీరాన్ని సిద్ధం చేయాలంటే, ఆ శరీరాన్ని సమాధి చేసేందుకు ముందు 40 రోజులు వారికి అవసరం. తర్వాత ఈజిప్టువాళ్లు యాకోబు కోసం దుఃఖించటానికి ప్రత్యేక సమయం తీసుకొన్నారు. ఆ సమయం 70 రోజులు.
GEN 50:4 డెబ్భైరోజుల తర్వాత దఃఖసమయం ముగిసింది. కనుక ఫరో అధికారలతో యోసేపు మాట్లాడాడు. “దయచేసి ఫరోతో ఇది చెప్పండి:
GEN 50:5 ‘నా తండ్రి మరణ ఘడియల్లో నేను ఆయనకు ఒక వాగ్దానం చేసాను. కనాను దేశంలోని ఒక గుహలో నేను ఆయనను సమాధి చేస్తానని నేను వాగ్దానం చేసాను. ఇది ఆయన తనకోసం సిద్ధం చేసుకొన్న గుహ. కనుక దయచేసి వెళ్లి, నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి. అప్పుడు నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను’” అన్నాడు యోసేపు.
GEN 50:6 “నీ మాట నిలబెట్టకో, వెళ్లి నీ తండ్రిని సమాధి చేయి” అని ఫరో జవాబిచ్చాడు.
GEN 50:7 కనుక యోసేపు తన తండ్రిని సమాధి చేసేందుకు వెళ్లాడు. ఫరో అధికారులంతా ఫరో పెద్దలు (నాయకులు) యోసేపుతో కూడ వెళ్లారు. ఫరో నాయకులు, ఈజిప్టులోని పెద్దలందరూ యోసేపుతో వెళ్లారు.
GEN 50:8 యోసేపు కుటుంబంలోని వాళ్లందరూ, అతనితో వెళ్లారు. మరియు తన తండ్రి కుటుంబం అంతా యోసేపుతో వెళ్లారు. పిల్లలు, పశువులు మాత్రమే గోషెను దేశంలో విడువబడటం జరిగింది
GEN 50:9 యోసేపుతో వెళ్లటానికి అందరూ రథాలమీద, గుర్రాలమీద వెళ్లారు. అది చాలా పెద్ద గుంపు అయింది.
GEN 50:10 యోర్దాను నదికి తూర్పున గోరెన్ ఆఠదు కళ్లం దగ్గరకు వారు వెళ్లారు. ఆ స్థలంలో వారు ఇశ్రాయేలు నిమిత్తం భూస్థాపన క్రమాలు దీర్ఘంగా జరిగించారు. ఆ భూస్థాపన క్రమం ఏడు రోజులపాటు కొనసాగింది.
GEN 50:11 గోరెన్ ఆఠదులో జరిగిన భూస్థాపన క్రమాన్ని కనానులో నివసిస్తున్న ప్రజలు చూశారు. వారు “ఆ ఈజిప్టు వాళ్లు ఎంతగా దుఃఖిస్తున్నారో అని చెప్పుకొన్నారు” కనుక ఆ స్థలం ఇప్పుడు ఆబేల్ మిస్రాయిము అని పిలువబడుతుంది.
GEN 50:12 కనుక యాకోబు కుమారులు తమ తండ్రి ఆజ్ఞాపించిన ప్రకారం చేసారు.
GEN 50:13 వారు అతని శరీరాన్ని కనానుకు తీసుకొని వెళ్లి, మక్ఫేలా గుహలో దానిని పాతిపెట్టారు. హిత్తీయుడగు ఎఫ్రోను దగ్గర అబ్రహాము కొన్న పొలంలోని మమ్రే సమీపాన ఉన్న గుహ ఇది. సమాధిస్థలంగా ఉపయోగించేందుకు అబ్రహాము ఆ గుహను కొన్నాడు.
GEN 50:14 యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత, అతనూ, అతనితో ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరూ తిరిగి ఈజిప్టు వెళ్లిపోయారు.
GEN 50:15 యాకోబు మరణించిన తర్వాత యోసేపు సోదరులు దిగులుపడిపోయారు. చాలాకాలం క్రిందట వారు చేసినదాన్ని బట్టి యోసేపు ఇంకా వారిమీద కోపంగా ఉంటాడని వారు భయపడ్డారు. మనము చేసినదాని విషయంలో “బహుశాః యోసేపు మనల్ని ఇంకా ద్వేషించవచ్చు. మరియు మనం అతనికి చేసిన కీడంతటికి తిరిగి పగ తీర్చుకోవచ్చు” అని తమలో తాము అనుకొన్నారు.
GEN 50:16 కనుక ఆ సోదరులు యోసేపుకు ఈ సందేశం పంపించారు: “నీ తండ్రి చనిపోక ముందు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
GEN 50:17 ‘యోసేపుకు వారు చేసిన కీడును దయతో క్షమించమని నేను అతణ్ణి బ్రతిమాలుతున్నానని యోసేపుతో చెప్పండి’ అని అతడు చెప్పాడు. కనుక యోసేపూ, మేము చేసిన తప్పు పనిని దయచేసి ఇప్పుడు క్షమించు. మేము నీ తండ్రి దేవుని దాసులం.” యోసేపు సోదరులు చెప్పిన విషయాలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి, అతడు ఏడ్చేసాడు.
GEN 50:18 యోసేపు సోదరులు అతని దగ్గరకు వెళ్లి అతని ఎదుట సాగిలపడ్డారు. వారు “మేము నీకు దాసులం” అని చెప్పారు.
GEN 50:19 అప్పుడు యోపేసు, “భయపడకండి, నేనేం దేవుణ్ణి కాను. మిమ్మల్ని శిక్షించే హక్కు నాకు లేదు.
GEN 50:20 మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టారు. కాని దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. అనేకమంది ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు. ఈ వేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు.
GEN 50:21 కనుక భయపడవద్దు. నేను మీ కోసం, మీ పిల్లలకోసం జాగ్రత్త పుచ్చుకుంటాను” అని చెప్పాడు. యోసేపు తన సోదరులతో దయగా మాట్లాడాడు. ఆ సోదరులకు యిది నెమ్మది కలిగించింది.
GEN 50:22 యోసేపు తన తండ్రి కుటుంబంతో సహా ఈజిప్టులోనే జీవించటం కొనసాగించాడు. యోసేపు 110 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు.
GEN 50:23 యోసేపు జీవించి ఉన్నప్పుడు, ఎఫ్రాయిముకు పిల్లలు, పిల్లల పిల్లలు పుట్టారు. మరియు అతని కుమారుడు మనష్షేకు మాకీరు అనే పేరుగల ఒక కొడుకు ఉన్నాడు. మాకీరు పిల్లలను చూచేంతవరకు యోసేపు జీవించాడు.
GEN 50:24 యోసేపు మరణం దగ్గరపడినప్పుడు, అతడు, “నేను చనిపోవాల్సిన సమయం దాదాపు వచ్చేసింది. అయితే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని నాకు తెలుసు. ఆయన మిమ్మల్ని ఈ దేశంనుండి బయటకు తీసుకొని వెళ్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబలకు ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు” అని తన సోదరులతో చెప్పాడు.
GEN 50:25 అప్పుడు యోసేపు తన వాళ్లందర్నీ ఒక వాగ్దానం చెయ్యమని అడిగాడు. “దేవుడు మిమ్మల్ని ఆ నూతన దేశానికి నడిపించినప్పుడు, నా యెముకలను మీతో కూడ తీసుకొని వెళ్తామని నాకు వాగ్దానం చేయండి” అన్నాడు యోసేపు.
GEN 50:26 యోసేపు 110 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈజిప్టులో మరణించాడు. వైద్యులు అతని శరీరాన్ని సమాధి చేసేందుకు సిద్ధంచేసి, ఈజిప్టులో సమాధి పెట్టెలో ఆ శరీరాన్ని ఉంచారు.
EXO 1:1 యాకోబు (ఇశ్రాయేలు) తన కుమారులతో పాటు ఈజిప్టు వెళ్లాడు. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఏవంటే:
EXO 1:2 రూబేను, షిమ్యోను, లేవి, యూదా,
EXO 1:3 ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను,
EXO 1:4 దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ప్రతియొక్కరూ కుటుంబ సమేతంగా వచ్చారు.
EXO 1:5 యాకోబు సంతానం మొత్తం డెబ్బయి మంది. (12 మంది కుమారుల్లో మరొకడు యోసేపు. అతను అప్పటికే ఈజిప్టులో వున్నాడు.)
EXO 1:6 తర్వాత యోసేపు, అతని సోదరులు, వారి తరం వారు అందరూ చనిపోయారు.
EXO 1:7 అయితే, ఇశ్రాయేలు ప్రజలకు పిల్లలు చాలామంది ఉన్నారు. వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. ఆ ప్రజలు చాలా బలవంతులు కాగా ఈజిప్టు దేశం వాళ్లతోనే నిండిపోయింది.
EXO 1:8 అప్పుడు ఒక కొత్తరాజు ఈజిప్టును పాలించడం మొదలు పెట్టాడు. ఈ రాజుకు యోసేపు తెలియదు.
EXO 1:9 ఈ రాజు తన ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు జనాన్ని చూడండి. వాళ్లు చాలామంది ఉన్నారు! పైగా వాళ్లు మనకంటె చాలా బలంగా ఉన్నారు!
EXO 1:10 వాళ్లపైన మనం ఏదైనా పథకం వేయాలి. లేకపోతే ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మన శత్రువులతో ఏకం కావచ్చు. అల్లాంటప్పుడు వాళ్లు మనల్ని ఓడించి, మన దగ్గర్నుండి తప్పించుకొని పారిపోవచ్చు.”
EXO 1:11 ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు జీవితాన్ని కష్టతరం చేయాలనుకొన్నారు. అందుచేత బానిసలపైన ఉండే అధికారులను ఇశ్రాయేలీయుల మీద నియమించారు. ఆ యజమానులు ఇశ్రాయేలు ప్రజలను బలవంతం చేసి ఫరోకోసం ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామసేను పట్టణాలను కట్టించారు. (ధాన్యం మొదలైన వాటిని వాళ్లు ఈ పట్టణాల్లో నిల్వ చేసేవాళ్లు)
EXO 1:12 ఇశ్రాయేలీయులు ప్రయాసపడి పనిచేయునట్లు ఈజిప్టు వాళ్లు వారిని బలవంతపెట్టారు. కాని పనిలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా బలవంతం చేయబడితే, అంతగా వాళ్లు పెరిగి విస్తరించిపోయారు. కనుక ఇశ్రాయేలు ప్రజలను చూస్తోంటే, ఈజిప్టు వాళ్లు మరింత ఎక్కువగా భయపడిపోయారు.
EXO 1:13 అందుచేత ఈజిప్టు వారు ఇశ్రాయేలు ప్రజల శరీర శ్రమను మునుపటికన్నా ఎక్కువగా కష్టతరం చేసి బలవంత పెట్టారు.
EXO 1:14 ఇశ్రాయేలీయుల జీవితాన్ని చాలా కష్టతరం చేశారు ఈజిప్టువారు. అడుసు తొక్కి ఇటుకలు చేయడంలో వాళ్లు ఇశ్రాయేలు ప్రజల్ని బలవంతం చేశారు. అలాగే పొలాల్లో పనిచేయడానికి కూడా వాళ్లను చాల బలవంత పెట్టారు. వాళ్లు చేసిన ప్రతి పనిలోనూ వాళ్లను చాల బలవంత పెట్టి ఒత్తిడి చేసారు.
EXO 1:15 షిఫ్రా, పూయా అను ఇద్దరు మంత్రసానులుండే వారు. వీరు ఇశ్రాయేలు స్త్రీల కాన్పు సమయాల్లో సహాయ పడేవారు. ఈజిప్టు రాజు ఈ మంత్రసానులను పిలిచి,
EXO 1:16 “ఈ హీబ్రూ స్త్రీలు పిల్లల్ని కనడంలో మీరు ఇలానే సహాయం చేస్తూ ఉండండి. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆ పిల్లను బ్రతకనివ్వండి, కాని శిశువు మగవాడైతే మాత్రం తప్పక చంపేయండి” అని చెప్పాడు.
EXO 1:17 ఆ మంత్రసానులు దైవ భక్తిగలవాళ్లు గనుక వారు రాజుగారి ఆజ్ఞకు లోబడలేదు. మగ పిల్లలందర్నీ వాళ్లు బ్రతకనిచ్చారు.
EXO 1:18 ఈజిప్టు రాజు ఆ మంత్రసానులను పిలిచి, “మీరు ఎందుకిలా చేసారు? ఆ మగపిల్లల్ని ఎందుకు బ్రతకనిచ్చారు?” అంటూ ప్రశ్నించాడు.
EXO 1:19 “ఈజిప్టు స్త్రీలకంటె హీబ్రూ స్త్రీలకు చాల బలం ఉంది. సహాయం చేసేందుకు మేము వెళ్లేలోపుగానే వాళ్లు పిల్లల్ని కనేసారు.” అంటూ మంత్రసానులు ఫరోతో చెప్పారు.
EXO 1:20 ఆ మంత్రసానుల విషయమై దేవుడు సంతోషించాడు కనుక వాళ్లకూ వారి స్వంత కుటుంబాలు ఉండేటట్టు దేవుడు వారికి మేలు చేశాడు. హీబ్రూ ప్రజలు ఇంకా పిల్లల్ని కంటూనే ఉన్నారు. వాళ్లు చాలా బలవంతులయ్యారు.
EXO 1:22 కనుక ఫరో, “మగశిశువు పుట్టినప్పుడల్లా, మీరు వాడ్ని నైలు నదిలో పడవేయండి. కాని ఆడపిల్లల్ని అందరినీ బ్రతకనియ్యండి” అని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు.
EXO 2:1 లేవీ వంశానికి చెందిన ఒకడు ఉన్నాడు. లేవీ వంశానికి చెందినదాన్నే ఒకామెను అతడు పెళ్లి చేసుకొన్నాడు.
EXO 2:2 ఆమె గర్భవతియై ఒక కుమారుణ్ణి కన్నది. శిశువు చాలా అందంగా ఉండడం చూసి ఆ తల్లి మూడ్నెల్లపాటు ఆ శిశువును దాచి ఉంచింది.
EXO 2:3 అయితే మూడు నెలలు అయ్యాక ఆ శిశువు సంగతి తెలిసిపోతుందేమోనని ఆ తల్లి భయపడింది. అలా తెలిస్తే ఆ శిశువు మగపిల్లవాడు కనుక వాడ్ని చంపేస్తారు. అందుకని ఆమె జమ్ముతో ఒక బుట్టను తయారు చేసి, అది నీళ్లలో తేలడానికిగాను దానికి తారు పూసింది. శిశువును ఆ బుట్టలో పెట్టింది. ఆమె తర్వాత నది ఒడ్డున ఏపుగా పెరిగిన జమ్ములో ఆ బుట్టను పెట్టింది.
EXO 2:4 ఆ పసివాడి అక్క అక్కడే వుండి గమనిస్తూవుంది. ఆమె ఆ పసివాడికి ఏమి జరుగుతుందో చూడాలని అనుకొంది.
EXO 2:5 సరిగ్గా అదే సమయంలో ఫరో కూతురు స్నానం చేయడానికి నది దగ్గరకు వెళ్లింది. ఆమె పని మనుషులు నది గట్టు మీద తిరుగుతూ ఉన్నారు. జమ్ములో ఉన్న బుట్టను ఆమె చూసింది. వెళ్లి ఆ బుట్టను తీసుకు రమ్మని ఆమె తన పనికత్తెల్లో ఒక దానితో చెప్పింది.
EXO 2:6 రాజకుమారి ఆ బుట్ట తెరచి, అందులో ఉన్న మగ పిల్లాడ్ని చూసింది. ఆ పసివాడు ఏడుస్తూ ఉండడం చూసి, ఆమె జాలి పడింది. “వీడు హీబ్రూ పిల్లవాడని” ఆమె చెప్పింది.
EXO 2:7 ఇంకా అప్పటివరకు దాక్కొని ఉన్న ఆ పసివాని అక్క లేచి, “ఈ పసివాడ్ని పెంచటానికి మీకు సహాయం చేసేందుకు ఒక హీబ్రూ స్త్రీని వెదకి తీసుకొని రమ్మంటారా?” అని రాజకుమారిని అడిగింది.
EXO 2:8 “సరే అలాగే తీసుకురా” అంది రాజకుమారి. ఆ పిల్ల వెళ్లి ఆ పసివాడి స్వంత తల్లినే తీసుకొచ్చింది.
EXO 2:9 “ఈ పసివాడ్ని తీసుకొని వెళ్లి పాలిచ్చి నాకోసం పెంచు. పసివాడ్ని జాగ్రత్తగా చూడు. నీకు నేను జీతం ఇస్తాను” అంది ఆ రాజకుమారి. కనుక ఆ స్త్రీతన పసివాణ్ణి తీసుకొని జాగ్రత్తగా పెంచింది.
EXO 2:10 ఆ పసివాడు పెద్దవాడయ్యాడు. కొన్నాళ్లకు ఆ స్త్రీ పిల్లవాడ్ని రాజకుమారి దగ్గరకు తీసుకొచ్చింది. రాజకుమారి ఆ పిల్లవాడ్ని తన సొంత కుమారుడుగా స్వీకరించింది. ఆ పిల్లవాడ్ని నీళ్లలోంచి బయటికి తీసింది కనుక ఆమె వానికి మోషే అని పేరు పెట్టింది.
EXO 2:11 మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. తన ప్రజలు అంటే, హీబ్రూవారు బలవంతంగా చాలా కష్టపడి పని చేయాల్సి ఉన్నట్టు మోషే గ్రహించాడు. ఒకరోజు ఈజిప్టు వాడొకడు హీబ్రూవాడ్ని కొట్టడం మోషే చూసాడు.
EXO 2:12 ఎవరైనా గమనిస్తున్నారేమోనని మోషే అటు ఇటు చూసాడు. తర్వాత మోషే ఆ ఈజిప్టువాడ్ని చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు.
EXO 2:13 మర్నాడు హీబ్రూవాళ్లే ఇద్దరు పోట్లాడుకోవడం మోషే చూసాడు. వారిలో ఒకడిది తప్పని తెలుసుకొని “అతనితో ఎందుకిలా మీవాడ్ని కొడుతున్నావు?” అని అన్నాడు.
EXO 2:14 దానికి అతను జవాబిస్తూ, “మామీద నీవు అధికారివనిగాని, న్యాయమూర్తివనిగాని ఎవరయినా నియమించారా? నిన్న నీవు ఆ ఈజిప్టువాడ్ని చంపినట్టు నన్నూ చంపుతావా?” అన్నాడు. అప్పుడు మోషే భయపడిపోయాడు. “అలాగైతే నేను చేసిన ఆ పని ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని” మోషే తనలో తాను అనుకొన్నాడు.
EXO 2:15 మోషే చేసినదాన్ని గూర్చి విని ఫరో మోషేను చంపెయ్యాలనే నిర్ణయానికొచ్చాడు! కానీ ఫరో దగ్గర్నుండి మోషే పారిపోయాడు. మోషే మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ ఒక బావివద్ద ఆగిపోయాడు.
EXO 2:16 మిద్యానులో ఒక యాజకునికి ఏడుగురు కుమార్తెలు. ఒకరోజు వారు తమ తండ్రిగారి గొర్రెలకు నీళ్లు తీసుకొని రావడానికి ఆ బావి దగ్గరకు వెళ్లారు. వారు ఆ నీళ్ల కుండలను నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
EXO 2:17 కాని అక్కడ ఉన్న కొందరు గొర్రెల కాపరులు ఆ అమ్మాయిలను నీళ్లు చేదుకోనివ్వకుండా వెళ్లగొట్టేస్తున్నారు. కనుక ఆ అమ్మాయిలకు మోషే సహాయం చేసి, వారి గొర్రెల మందకు నీళ్లు పెట్టాడు.
EXO 2:18 తర్వాత వాళ్లు వారి తండ్రి రగూయేలు దగ్గరకు వెళ్లిపోయారు. “ఆయన వారితో ఈ రోజు మీరు చాలా త్వరగా ఇంటికి వచ్చేశారు” అని అన్నాడు.
EXO 2:19 “గొర్రెల కాపరులు కొందరు మమ్మల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈజిప్టు మనిషి ఒకతను సహాయం చేసాడు. అతడే మాకోసం నీళ్లు చేది, మా మందలకు పెట్టాడు” అంటూ జవాబు చెప్పారు ఆ అమ్మాయిలు.
EXO 2:20 అందుకు రగూయేలు “అలాగైతే అతనేడి? అతణ్ణి ఎందుకలా విడిచిపెట్టారు? మీరు అతణ్ణి మనతో భోజనం చేయమని పిలవండి” అన్నాడు తన కూతుళ్లతో.
EXO 2:21 అతనితో కలిసి ఉండటానికి మోషే అంగీకరించాడు. అతను సిప్పోర అనే తన కూతుర్ని మోషేకు భార్యగా ఇచ్చాడు.
EXO 2:22 సిప్పోరాకు కొడుకు పుట్టాడు. అతనికి గెర్షోము అని మోషే పేరు పెట్టాడు. మోషే తనది కాని మరో పరాయి దేశంలో ఉండడం చేత తన కొడుక్కు ఈ పేరు పెట్టాడు.
EXO 2:23 చాలాకాలం గడచిపోయింది. ఈజిప్టురాజు చనిపోయాడు. అప్పటికి ఇశ్రాయేలు వాళ్లు ఇంకా కష్టతరమైన పనులు చేసేందుకు బలవంత పెట్టబడుతూనే ఉన్నారు. వాళ్లు సహాయం కోసం మొరపెడుతూ ఉన్నారు. దేవుడు వారి మొర విన్నాడు.
EXO 2:24 దేవుడు వారి ప్రార్థనలు విని, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసుకొన్న ఒడంబడికను జ్ఞాపకం చేసుకొన్నాడు.
EXO 2:25 ఇశ్రాయేలీయుల కష్టాలను దేవుడు చూచాడు. త్వరలోనే వారి కష్టాలను కడతేర్చాలని ఆయనకు తెలుసు.
EXO 3:1 మోషే మామగారి పేరు యిత్రో (ఈయన మిద్యాను వారికి యాజకుడు). యిత్రో గొర్రెలకు మోషే కాపరి అయ్యాడు. ఒకనాడు మోషే అరణ్యానికి పశ్చిమంగా ఆ గొర్రెల్ని తోలుకుపోయాడు. అక్కడ హోరేబు అనే ఒక కొండ ఉంది. అది దేవుని కొండ.
EXO 3:2 ఆ కొండమీద మండుతున్న ఒక పొదలో యెహోవా దూతను మోషే చూసాడు. ఆ పొద మండిపోతూ కాలిపోకుండా ఉండటం మోషే చూశాడు.
EXO 3:3 అందుచేత మోషే, “ఈ పొద మండుతూ ఉండి కాలిపోకుండా ఎలా వుందో దగ్గరకు వెళ్లి చూడాలి” అనుకొన్నాడు.
EXO 3:4 ఆ పొదను చూచేందుకు మోషే వస్తూ ఉండటం యెహోవా చూశాడు. అందుచేత ఆ పొదలోంచే దేవుడు, “మోషే, మోషే” అని మోషేను పిల్చాడు. “చిత్తం ప్రభూ” అన్నాడు మోషే.
EXO 3:5 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, “ఇక దగ్గరకు రాకు. నీ చెప్పులు విడువు. నీవు నిలబడింది పవిత్ర స్థలం
EXO 3:6 నేను నీ పూర్వీకుల దేవుణ్ణి. నేను అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి.” దేవుణ్ణి చూడాలంటే, భయం వేసింది కనుక మోషే తన ముఖం కప్పుకొన్నాడు.
EXO 3:7 యెహోవా “ఈజిప్టులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నేను చూశాను. ఈజిప్టు వాళ్లు నా ప్రజల్ని బాధపెట్టినప్పుడు వారు మొర పెట్టడం నేను విన్నాను. వారి బాధ నాకు తెలుసు
EXO 3:8 ఈజిప్టు వాళ్ల బారినుండి నా ప్రజల్ని రక్షించేందుకు ఇక నేను దిగి వస్తాను. ఆ దేశం నుండి వాళ్లను బయటకు తెచ్చి, మరో మంచి దేశానికి నడిపిస్తాను. అక్కడ వాళ్లు ఏ కష్టాలూ లేకుండా స్వేచ్ఛగా ఉంటారు. అది మంచి మంచి వాటితో నిండిన చాలా మంచి దేశం. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు, రకరకాల మనుష్యులు అక్కడ నివసిస్తున్నారు.
EXO 3:9 ఇశ్రాయేలీయుల మొరలు నేను విన్నాను. వాళ్ల జీవితాన్ని ఈజిప్టు వాళ్లు ఎంత కష్టతరం చేసారో నేను చూశాను.
EXO 3:10 అందుచేత నేను ఇప్పుడు ఫరో దగ్గరకు నిన్ను పంపిస్తున్నాను. వెళ్లు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుంచి బయటకు తీసుకువెళ్లు” అని చెప్పాడు.
EXO 3:11 అయితే మోషే, “నేనేమీ అంతగొప్ప వాణ్ణి కాదే. ఫరో దగ్గరకు వెళ్లేందుకుగాని, ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయులను బయటకు నడిపించేందుకుగాని నేను ఎంతటివాణ్ణి?” అంటూ దేవుణ్ణి అడిగాడు.
EXO 3:12 “నేను నీకు తోడుగా ఉంటాను గనుక నీవు చేయగలవు. నేనే నిన్ను పంపిస్తున్నాను అనేందుకు రుజువు ఏమిటంటే, నీవు ఈ ప్రజల్ని ఈజిప్టు నుండి బయటికి నడిపించిన తర్వాత నీవు మళ్లీ వచ్చి ఈ కొండమీదనే నన్ను ఆరాధిస్తావు!” అని దేవుడు చెప్పాడు.
EXO 3:13 దానికి మోషే, “నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి ‘మీ పూర్వీకుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని చెబితే, ‘ఆ దేవుడి పేరేమిటి’ అని వాళ్లు నన్ను అడుగుతారు గదా! మరి నేనేమని చెప్పాలి,” అని దేవుణ్ణి అడిగాడు.
EXO 3:14 “‘నేను ఉన్నవాడను’ (అని వారితో చెప్పు) అన్నాడు దేవుడు మోషేతో. ఇశ్రాయేలీయుల దగ్గరకు నీవు వెళ్లినప్పుడు, ‘ఉన్నవాడను,’ అనువాడు నన్ను మీ దగ్గరకు పంపించాడు అని చెప్పు” అన్నాడు దేవుడు మోషేతో.
EXO 3:15 దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: “మీ పూర్వీకులు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు ఎల్లప్పుడూ నా పేరు యెహోవాగానే ఉంటుంది. తరతరాల ప్రజలు ఆ పేరుతోనే నన్ను తెలుసుకొంటారు. ‘యెహోవా నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని వాళ్లతో చెప్పు.
EXO 3:16 “వెళ్లి ఇశ్రాయేలు సమాజంలోని పెద్దలందరిని సమావేశపరిచి, ‘మీ పూర్వీకుల దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షం అయ్యాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాతో మాట్లాడాడు. మిమ్మల్ని గూర్చి ఈజిప్టులో మీకు సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచించాను.
EXO 3:17 ఈజిప్టులో మీరు అనుభవిస్తున్న శ్రమలనుండి మిమ్మల్ని తప్పించాలనే నిర్ణయానికొచ్చాను. ప్రస్తుతం కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు, అనే రకరకాల ప్రజలకు చెందిన ఒక దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. చాలా మంచి మంచి వాటితో నిండిన ఒక మంచి దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను’ అని వాళ్లతో చెప్పు.
EXO 3:18 “పెద్దలు (నాయకులు) నీ మాట వింటారు. అప్పుడు నీవు, పెద్దలు (నాయకులు) కలిసి ఈజిప్టు రాజు దగ్గరకు వెళ్లాలి. ‘హీబ్రూ ప్రజల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు. మూడు రోజుల దూరము అరణ్యంలోనికి ప్రయాణం చేసి వెళ్లమని ఆయన చెప్పాడు. అక్కడ మా యెహావా దేవునికి మేము బలులు అర్పించాలి. అని నీవు అతనితో చెప్పాలి.’
EXO 3:19 “అయితే ఈజిప్టు రాజు మిమ్మల్ని పోనియ్యడని నాకు తెలుసు. అతడు మిమ్మల్ని పోనిచ్చేటట్టు ఒక మహాశక్తి మాత్రమే అతణ్ణి బలవంతం చేస్తుంది.
EXO 3:20 కనుక ఈజిప్టు మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. ఆ దేశంలో అద్భుతాలు జరిగేటట్టు చేస్తాను. నేను అలా చేసిన తర్వాత అతడు మిమ్మల్ని వెళ్లనిస్తాడు.
EXO 3:21 అంతే కాదు ఈజిప్టు వాళ్లు ఇశ్రాయేలు ప్రజలమీద దయ చూపించేటట్టుగా చేస్తాను. అందుచేత మీరు వెళ్లిపోయేటప్పుడు నీ ప్రజలకు వాళ్లు కానుకలను ఇస్తారు.”
EXO 3:22 “హీబ్రూవాళ్లలో ప్రతి స్త్రీ తన పొరుగున ఉండే ఈజిప్టు వాళ్లను, ఆ ఇళ్లలో వుండే వాళ్లందర్నీ అడగ్గానే వాళ్లు ఆమెకు కానుకలు ఇస్తారు. వెండి, బంగారం, మంచి బట్టలు, కానుకలుగా మీవారికి దొరుకుతాయి. మీరు ఈజిప్టు విడిచి వెళ్లేటప్పుడు మీరు ఆ కానుకలను మీ పిల్లలకు పెట్టాలి. ఈ విధంగా ఈజిప్టు ఐశ్వర్యాన్ని మీరు తీసుకోవాలి.”
EXO 4:1 అప్పుడు మోషే, “నీవు నన్ను పంపించావు అని చెబితే ఇశ్రాయేలు ప్రజలు నమ్మరు గదా! ‘యెహోవా నీకు కనబడనే లేదు అంటారు వాళ్లు’” అన్నాడు దేవునితో.
EXO 4:2 అయితే దేవుడు, “నీ చేతిలోనిది ఏమిటి” అని మోషేను అడిగాడు. “ఇది నా చేతికర్ర” అని మోషే జవాబిచ్చాడు.
EXO 4:3 అప్పుడు దేవుడు, “నీ కర్ర కింద పడవెయ్యి” అన్నాడు. మోషే తన కర్రను నేల మీద పడేసాడు. ఆ కర్ర ఒక పాముగా మారిపోయింది. మోషే భయపడి దాని దగ్గర్నుండి పారిపోయాడు.
EXO 4:4 అయితే యెహోవా మోషేతో, “ముందుకు వెళ్లి ఆ పాము తోక అందుకో” అన్నాడు. మోషే ముందుకు వెళ్లి పాముతోక అందుకొన్నాడు. మోషే అలా చేయగానే ఆ పాము మళ్లీ కర్ర అయిపోయింది.
EXO 4:5 “ఈ కర్రను ఇలా ప్రయోగించు, అప్పుడు మీ పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా నీకు ప్రత్యక్షమయ్యాడని నీ ప్రజలు నమ్ముతారు” అన్నాడు దేవుడు.
EXO 4:6 ఆ తర్వాత యెహోవా, “నీకు ఇంకో రుజువు ఇస్తాను. నీ చెయ్యి నీ చొక్కాలోపల పెట్టు” అన్నాడు మోషేతో. కనుక మోషే తన చొక్కా తెరిచి తన చేతిని లోపల పెట్టాడు. మళ్లీ మోషే తన చొక్కాలోనుంచి తన చేతిని బయటికి తీయగానే అది మారిపోయింది. అతని చేతినిండా మంచులాంటి తెల్లని కుష్ఠు మచ్చలు కప్పేసాయి.
EXO 4:7 “నీ చేతిని మళ్లీ నీ చొక్కాలో పెట్టు” అన్నాడు దేవుడు. మోషే తన చేతిని మళ్లీ తన చొక్కాలోపల పెట్టాడు. మోషే అలా పెట్టి మళ్లీ తన చేతిని బయటికి తీయగానే అతని చెయ్యి మారిపోయింది. ఇప్పుడు అతని చెయ్యి బాగైపోయి మళ్లీ మునుపటిలానే ఉంది.
EXO 4:8 “నీకర్రను ఉపయోగించినప్పుడు ప్రజలు నిన్ను నమ్మకపోతే, నీవు ఈ సూచన చూపెట్టినప్పుడు వాళ్లు నిన్ను నమ్ముతారు.
EXO 4:9 నీవు వాళ్లకు ఈ రెండు సూచనలు చూపించాక కూడ వాళ్లు నమ్మటానికి నిరాకరిస్తే, అప్పుడు నైలు నదిలోనుంచి కొన్ని నీళ్లు తీసుకో, ఆ నీళ్లను నేలమీద పొయ్యి. అవి నేలను తాకగానే రక్తం అవుతాయి” అన్నాడు దేవుడు.
EXO 4:10 అయితే మోషే దేవునితో, “కానీ ప్రభూ నేను నిజం చెప్పేస్తున్నాను. నేనేమీ నైపుణ్యంగల మాటకారిని కాను. నాకు మనుష్యులతో చక్కగా మాట్లాడ్డం ఎప్పుడూ చేతకాలేదు. కనీసం ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత కూడ నేను మంచి మాటకారిని కాలేదు. నా మాట నిదానం అనీ, నాకు మంచి పద ప్రయోగంరాదనీ నీకు తెలుసు” అన్నాడు.
EXO 4:11 “మనిషి నోటిని చేసిందెవరు? ఒకన్ని చెవిటివాడిగా లేక మూగవాడిగా చేయగలిగింది ఎవరు? ఒకన్ని గుడ్డివానిగా చేయగలిగింది, చూడగలిగేటట్టు చేయగలిగింది ఎవరు? నీటన్నింటిని చేయగలిగింది నేనే, నేను యెహోవాను,
EXO 4:12 అందుచేత వెళ్లు. నీవు మాట్లాడేటప్పుడు నేను నీతో ఉంటాను. చెప్పాల్సిన మాటలు నేనే నీకు చెబతాను” అని అతనితో యెహోవా అన్నాడు.
EXO 4:13 కానీ మోషే, “నా ప్రభువా, నన్ను విడిచిపెట్టి మరెవర్నయినా పంపించుమని బతిమాలు కొంటున్నాను” అన్నాడు.
EXO 4:14 యెహోవాకు మోషేమీద కోపం వచ్చింది, “లేవీ వంశానికి చెందిన నీ సోదరుడు అహరోనును నేను వాడుకొంటాను. అతనికి మాట్లాడుటలో నైపుణ్యం ఉంది. అహరోను నీ దగ్గరకు వస్తాడు. నిన్ను చూచి సంతోషిస్తాడు,
EXO 4:15 అతడు నీతోకూడ ఫరో దగ్గరకు వస్తాడు. నీవు చెప్పాల్సిందేమిటో నేను నీకు చెబతాను, అది నీవు అహరోనుకు చెప్పాలి. ఫరోతో చెప్పటానికి అహరోను సరైన మాటల్ని సిద్ధం చేసుకొంటాడు.
EXO 4:16 ప్రజలతో కూడ అహరోనే నీ పక్షంగా మాట్లాడుతాడు. అతనికి నీవు ఒక మహారాజులా ఉంటావు. అతనే అధికారంతో నీ తరపున మాట్లాడతాడు.
EXO 4:17 కనుక వెళ్లు. నీతోకూడ నీ కర్ర తీసుకొని వెళ్లు. నీకు నేను తోడుగా ఉన్నానని ప్రజలకు తెలియడానికి నీ కర్రను, మిగతా అద్భుతాలను ప్రయోగించు” అన్నాడు దేవుడు.
EXO 4:18 అప్పుడు మోషే తన మామ యిత్రో ఇంటికి తిరిగి వెళ్లాడు. “ఈజిప్టులో నా ప్రజల దగ్గరకు నేను మళ్లీ వెళతాను, నన్ను పోనివ్వండి. వాళ్లు ఇంకా బతికే ఉన్నారేమో నేను వెళ్లి చూడాలి” అని యిత్రోతో చెప్పాడు మోషే. “నీవు సమాధానంగా వెళ్లొచ్చు” అన్నాడు యిత్రో మోషేతో.
EXO 4:19 తర్వాత మోషే ఇంకా మిద్యానులో ఉండగానే దేవుడు మోషేతో, “ఇప్పుడు నీవు మళ్లీ ఈజిప్టు వెళ్లడం నీకు క్షేమం. నిన్ను చంపాలని చూస్తున్న వాళ్లు ఇప్పుడు చనిపోయారు” అని చెప్పాడు.
EXO 4:20 కనుక మోషే తన భార్యను, తన కొడుకును బయల్దేరదీసి గాడిదల మీద ఎక్కించాడు. తిరిగి ఈజిప్టు దేశానికి ప్రయాణం కట్టాడు. దేవుని శక్తిగల తన కర్రను మోషే తనతో తీసుకొని వెళ్లాడు.
EXO 4:21 మోషే ఈజిప్టుకు ప్రయాణం చేస్తూండగా దేవుడు అతనితో మాట్లాడాడు: “నీవు ఫరోతో మాట్లాడేటప్పుడు నీవు ఏమేమి అద్భుతాలు చేసేందుకు నీకు శక్తి ఇచ్చానో వాటన్నింటినీ చేయాలని జ్ఞాపకం ఉంచుకో! అయితే నేను మాత్రం ఫరో ఇంకా మొండికెత్తేటట్లు చేస్తాను. అతడు ప్రజల్ని వెళ్లనియ్యడు.
EXO 4:22 అప్పుడు నీవు ఫరోతో
EXO 4:23 ‘ఇశ్రాయేలు నా ప్రథమ సంతానంగా పుట్టిన కుమారుడు. నా కుమారుడు వెళ్లి నన్ను ఆరాధించనివ్వు అని నేను నీతో చెబతున్నాను. నీవే గనుక ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వకపోతే, నీ పెద్ద కుమారుణ్ణి నేను చంపేస్తాను.’” అని యెహోవా అనుచున్నాడని అతనితో చెప్పెను.
EXO 4:24 మోషే ఈజిప్టుకు తన ప్రయాణం కొనసాగించాడు. నిద్రపోవాలని అతడు ఒక సత్రములో ఆగాడు. అక్కడ దేవుడు మోషేను కలుసుకొని అతణ్ణి చంపదలచాడు.
EXO 4:25 కాని సిప్పోర పదునైన ఒక కత్తి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసింది. ఆ చర్మం పట్టుకొని ఆమె అతని పాదాలను తాకింది. అప్పుడు ఆమె (మోషేతో) “నీవు రక్త సంబంధమైన భర్తవు అని అంది”
EXO 4:26 సిప్పోర తన కుమారునికి సున్నతి చేసినందువల్ల ఇలా చెప్పింది. అందుచేత దేవుడు మోషేను క్షమించాడు (అతణ్ణి చంపలేదు).
EXO 4:27 యెహోవా అహరోనుతో, “అరణ్యంలోకి వెళ్లి మోషేను కలుసుకో” అని చెప్పాడు. కనుక అహరోను వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకొన్నాడు. అహరోను మోషేను చూడగానే అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు.
EXO 4:28 దేవుడు తనతో చెప్పినదంతా మోషే అహరోనుతో చెప్పాడు. దేవుడు తనను ఎందుకు పంపిందీ, అహరోనుతో చెప్పాడు మోషే. అలాగే అతను చేయాల్సిన అద్భుతాలు, చూపాల్సిన రుజువులు అన్నింటిని మోషే అహరోనుకు వివరించాడు.
EXO 4:29 అందుచేత మోషే, అహరోనూ వెళ్లి ఇశ్రాయేలు పెద్దలందర్నీ సమావేశం చేసారు.
EXO 4:30 అప్పుడు ఆ ప్రజలతో వారు మాట్లాడారు. యెహోవా మోషేతో చెప్పిన విషయాలన్నీ అతడు వాళ్లతో చెప్పాడు. అప్పుడు వాళ్లందరూ చూచేటట్టు మోషే అద్భుతాలు చేసి రుజువు చేసాడు.
EXO 4:31 దేవుడు మోషేను పంపించాడని ఆ ప్రజలు నమ్మారు. ఇశ్రాయేలీయులకు సహాయం చేసేందుకు దేవుడు వచ్చాడని తెలిసి ఆ ప్రజలు దేవుని ముందర తలలు వంచుకొని ఆరాధించారు. వారి కష్టాలను దేవుడు చూసాడని తెలిసి వాళ్లు దేవుడ్ని ఆరాధించారు.
EXO 5:1 మోషే, అహరోనూ ప్రజలతో మాట్లాడిన తరువాత ఫరో దగ్గరికి వెళ్లారు, “‘నా కోసం పండుగ జరుపుకొనేందుకు నా ప్రజల్ని అరణ్యంలోకి వెళ్లనివ్వు’ అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబతున్నాడు,” అని చెప్పారు.
EXO 5:2 అయితే ఫరో, “ఆ యెహోవా ఎవరు? అతనికి నేనెందుకు లోబడాలి? ఇశ్రాయేలీయులను నేనెందుకు వెళ్లనివ్వాలి? యెహోవా అని మీరు చెబతున్న వాడు నాకు తెలియదు. అందుచేత ఇశ్రాయేలీయులను నేను వెళ్లనీయను” అన్నాడు.
EXO 5:3 దానికి మోషే, అహరోనులు, “హీబ్రూ ప్రజల దేవుడు మాతో మాట్లాడాడు. కనుక మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోనికి వెళ్లనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాము. అక్కడ మా యెహోవా దేవునికి ఒక బలి అర్పిస్తాము. ఇది మేము చేయకపోతే ఆయనకు కోపం వచ్చి మమ్మల్ని నాశనం చేస్తాడేమో. ఒక రోగం ద్వారానో, కత్తి చేతనో మమ్మల్ని చంపేస్తాడేమో” అని అన్నారు.
EXO 5:4 కానీ ఫరో, “మోషే, అహరోనూ, ప్రజలను పని చేయనీయకుండా మీరు చేస్తున్నారు. మళ్లీ పోయి పనిచేసుకోమని ఆ బానిసలకు చెప్పండి.
EXO 5:5 పనివాళ్లు చాలా విస్తారంగా ఉన్నారు, మీరేమో వాళ్లను పని చెయ్యనివ్వడం లేదు” అని వాళ్లతో చెప్పాడు.
EXO 5:6 అదేరోజు ఇశ్రాయేలీయుల పని మరింత కష్టతరం చేయమని ఫరో ఆజ్ఞాపించాడు. బానిసలపైనున్న యజమానులతో
EXO 5:7 “ఈ ప్రజలు ఇటుకలు చేసేందుకు గడ్డి ఎప్పుడూ మీరే ఇచ్చారు. కాని ఇప్పుడు ఇటుకలు చేసేందుకు అవసరమైన గడ్డిని వాళ్లే పోయి తెచ్చుకోవాలని వారికి చెప్పండి.
EXO 5:8 అయితే వాళ్లు మాత్రం ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో ఇప్పుడు కూడా అన్ని చేయాల్సిందే. వాళ్లు బద్ధకస్తులయి పోయారు. అందుకే వాళ్లను పోనివ్వుమని నన్ను అడుగుతున్నారు. వాళ్లు చేసేందుకు సరిపడినంత పనిలేదు. అందుకే తమ దేవునికి బలి ఇవ్వడానికి వెళ్లనిమ్మని నన్ను అడుగుతున్నారు.
EXO 5:9 కనుక వీళ్ల పని మరింత కష్టం అయేటట్టు చేయండి. వాళ్లకు బాగా పని చెప్పండి. అప్పుడు మోషే చెప్పే అబద్ధాలు వినేందుకు వాళ్లకు సమయం ఉండదు” అని చెప్పాడు ఫరో.
EXO 5:10 అందుచేత బానిసల పైనున్న ఈజిప్టు యజమానులు, హీబ్రూ ప్రజల నాయకుల దగ్గరకు వెళ్లి, “మీ ఇటుకల కోసం గడ్డి ఇవ్వకూడదని ఫరో నిర్ణయించాడు.
EXO 5:11 మీకు మీరే పోయి గడ్డి తెచ్చుకోవాలి. కనుక వెళ్లి గడ్డి వెదుక్కోండి. అయితే మీరు మాత్రం ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవారో ఇప్పుడు కూడా అన్ని చేయాల్సిందే” అని వాళ్లతో చెప్పారు.
EXO 5:12 కనుక గడ్డికోసం వెదుక్కొంటూ ఆ ప్రజలు ఈజిప్టు దేశ వ్యాప్తంగా వెళ్లిపోయారు.
EXO 5:13 ఆ ప్రజలు మరింత కష్టపడి పనిచేసేటట్టు బానిస యజమానులు వాళ్లని బలవంతం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రజలు అంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో అన్ని చేసేటట్టు వారు వాళ్లను బలవంతపెట్టారు.
EXO 5:14 బానిసలపై ఉండే ఈజిప్టు యజమానులు హీబ్రూ నాయకులను ఏర్పరచుకొని ప్రజలు చేసే పనికి వీళ్లను బాధ్యులుగా చేసారు, “మీరు ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసారో ఇప్పుడు కూడ అన్ని ఎందుకు చెయ్యడం లేదు? ఇది వరకు చేయగలిగారు అంటే, ఇప్పుడూ చేయగల్గుతారు!” అంటూ బానిసలపై ఉండే ఈజిప్టు యజమానులు హీబ్రూ నాయకులను కొట్టారు.
EXO 5:15 అప్పుడు హీబ్రూ నాయకులు ఫరో దగ్గరకు వెళ్లారు, “మేము నీ సేవకులము నీవు మమ్మల్ని ఎందుకు ఇలా చూస్తున్నావు?
EXO 5:16 నీవేమో మాకు గడ్డి ఇవ్వవు. కాని మేము మాత్రం ఇదివరకు ఎన్ని ఇటుకలు చేసామో అన్ని చేస్తూనే ఉండాలని ఆజ్ఞాపించావు. పైగా ఇప్పుడు ఈ యజమానులు మమ్మల్ని కొడుతున్నారు. ఇలా చేయడం నీ మనుష్యులదే తప్పు” అంటూ వారు ఫిర్యాదు చేసి చెప్పారు.
EXO 5:17 ఫరో జవాబిస్తూ, “మీరు సోమరులు, మీకు పని చేయడం ఇష్టంలేదు. అందుకే మిమ్మల్ని పోనివ్వమని నన్ను అడుగుతున్నారు. అందుకే మీరు ఇక్కడ్నుండి వెళ్లిపోయి యెహోవాకు బలులు అర్పించాలని అంటున్నారు.
EXO 5:18 ఇక వెళ్లి పనిచెయ్యండి. మేము మీకు గడ్డి ఇవ్వము కాని మీరు మాత్రం ఇది వరకు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో ఇప్పుడు కూడ అన్ని చేయాలి” అన్నాడు.
EXO 5:19 చిక్కుల్లో పడ్డట్టు ఇశ్రాయేలు పెద్దలకు అర్థమయింది. వారు ఇంతకు ముందు చేసినన్ని ఇటుకలు ఇప్పుడు చేయలేరని ఆ నాయకులకు తెలుసు.
EXO 5:20 వారు ఫరో సమావేశం నుండి వెళ్తూ మోషే, అహరోను ఉన్నచోట ఆగారు. వారికోసం మోషే అహరోనూ వేచియున్నారు.
EXO 5:21 వారు మోషే అహరోనులతో, “మమ్మల్ని వెళ్లనిమ్మని మీరు ఫరోతో చెప్పడం చాల తప్పు. ఫరో, అతని అధికారులు మమ్మల్ని ద్వేషించేటట్టు మీరు చేసారు కనుక యెహోవా మిమ్మల్ని శిక్షించాలి. మమ్మల్ని చంపే అవకాశం మీరే వారికి ఇచ్చారు” అని చెప్పారు.
EXO 5:22 అప్పుడు మోషే యెహోవాను ప్రార్థించి, “ప్రభువా, ఎందుకు ఇలా నీ ప్రజలకు నీవు కీడు చేసావు? నీవు ఇక్కడికి నన్నెందుకు పంపించావు?
EXO 5:23 నన్ను చెప్పమని నీవు చెప్పిన సంగుతులన్నీ నేను ఫరో దగ్గరకు వెళ్లి చెప్పాను. కాని అప్పట్నుంచి నీ ప్రజల విషయంలో అతడు చాల నీచంగా ప్రవర్తిస్తున్నాడు. నీవు వాళ్లు సహాయం కోసం ఏమీ చేయలేదు!” అని చెప్పాడు.
EXO 6:1 అందుకు యెహోవా, “ఫరోకు నేను ఏమి చేస్తానో నీవు ఇప్పుడు చూస్తావు. అతని మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. దానితో అతడు నా ప్రజలను వెళ్లనిస్తాడు. వారు వెళ్లిపోవడానికి అతడు ఎంత ఇష్టపడతాడంటే, అతడే వారిని వెళ్లిపొమ్మని బలవంతం చేస్తాడు” అని మోషేతో చెప్పాడు.
EXO 6:2 మోషేతో దేవుడు ఇలా చెప్పాడు,
EXO 6:3 “యెహోవాను నేనే. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు నేను ప్రత్యక్షమయ్యాను. వాళ్లు, (ఎల్‌షద్దయి) సర్వశక్తిగల దేవుడు అని నన్ను పిలిచారు. నా పేరు యెహోవా అని వారికి తెలియలేదు.
EXO 6:4 వారితో నేను ఒక ఒడంబడిక చేసాను. కనాను దేశం వారికి ఇస్తానని వాగ్దానం చేసాను. వారు ఆ దేశంలో నివసించారు గాని అది వారి స్వంత దేశం కాదు.
EXO 6:5 ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్లకు ఉన్న కష్టాలు నాకు తెలుసు. వారు ఈజిప్టుకు బానిసలుగా ఉన్నారని నాకు తెలుసు. నా ఒడంబడిక కూడా నాకు జ్ఞాపకం ఉంది.
EXO 6:6 కనుక నేను వాళ్లతో నీవు ఇలా చెప్పమన్నట్టు ప్రజలతో చెప్పు. ‘నేనే యెహోవాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను. నేను మిమ్మల్ని స్వతంత్రుల్నిగా చేస్తాను. ఈజిప్టు వాళ్లకు మీరు బానిసలుగా ఉండరు. నేను నా మహాశక్తిని ప్రయోగించి మహా భయంకర శిక్షను ఈజిప్టు వారి మీదికి రప్పిస్తాను. అప్పుడు మిమ్మల్ని నేను రక్షిస్తాను.
EXO 6:7 మీరు నా ప్రజలుగా ఉంటారు. నేనే మీ దేవుడిగా ఉంటాను. నేనే యెహోవాను, మీ దేవుడనని, ఈజిప్టునుండి నేనే మిమ్మల్ని విడిపించానని మీరు తెలుసుకొంటారు.
EXO 6:8 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు నేను ఒక గొప్ప వాగ్దానం చేసాను. అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను యెహోవాను.’”
EXO 6:9 అందుచేత మోషే ఇదంతా ఇశ్రాయేలు వాళ్లతో చెప్పాడు. అయితే, ప్రజలు పనిలో చాలా కష్టపడుచున్నందుచేత మోషేను వారు సహించలేదు. అతని మాట వారు వినలేదు.
EXO 6:10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
EXO 6:11 “ఇశ్రాయేలు ప్రజల్ని తన దేశంనుండి తప్పక వెళ్లిపోనివ్వాలని ఫరో దగ్గరకు వెళ్లి చెప్పు.”
EXO 6:12 అయితే మోషే, “ఇశ్రాయేలు ప్రజలే నా మాట వినరు. అలాంటప్పుడు ఫరో అంతకంటె వినడు. అసలే నాకు మాట్లాడటం చేతకాదు.”q అని అన్నాడు.
EXO 6:13 కాని మోషే, అహరోనులతో యెహోవా మాట్లాడాడు. వారు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలని యెహోవా వారికి ఆజ్ఞాపించాడు. ఫరో దగ్గరికి వెళ్లి అతనితో కూడ మాట్లాడాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు నుండి బయటకు నడిపించుమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు.
EXO 6:14 ఇశ్రాయేలు కుటుంబాల నాయకుల పేర్లు ఇవి: ఇశ్రాయేలు జ్యేష్ఠపుత్రుడు రూబేనుకు హనోకు, పల్లు, హెస్రోన్, కర్మి అనే నలుగురు కుమారులు గలరు.
EXO 6:15 యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావూలు అనువారు షిమ్యోను కుమారులు. (షావూలు కనానీ స్త్రీ ద్వారా పుట్టిన కుమారుడు).
EXO 6:16 లేవీ 137 సంవత్సరాలు బతికాడు. గెర్షోను, కహాతు, మెరారీ అనువారు లేవీ కుమారులు.
EXO 6:17 గెర్షోను కుమారులు లిబ్నీ, షిమీ.
EXO 6:18 కహాతు 133 సంవత్సరాలు బ్రతికాడు. అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనువారు కహాతు కుమారులు.
EXO 6:19 మహలి, ముషి అను వారు మెరారీ కుమారులు. ఈ కుటుంబాలన్ని ఇశ్రాయేలు కుమారుడు లేవీ సంతానం.
EXO 6:20 అమ్రాము 137 సంవత్సరాలు బతికాడు. అమ్రాము తన తండ్రి సోదరి యోకెబెదును వివాహం చేసుకొన్నాడు. ఈ అమ్రాము కుమారులే మోషే, అహరోను.
EXO 6:21 కోరహు, నెపెగు, జిఖ్రీ అనువారు ఇస్హారు కుమారులు.
EXO 6:22 మిషాయేలు, ఎల్జఫను, సిత్రీ అనువారు ఉజ్జీయేలు కుమారులు.
EXO 6:23 అహరోను ఎలీషెబను వివాహం చేసుకొన్నాడు. (ఎలీషెబ అమ్మినాదాబు కుమార్తె. నయసోను సోదరి) అహరోను ఎలీషెబలకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులు పుట్టారు.
EXO 6:24 కోరహు కుమారులు అంటే, అస్సీరు, ఎల్కానా, అబియాసాపు.
EXO 6:25 అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెను పెండ్లాడాడు, వాళ్లు ఫీనెహాసుకు జన్మనిచ్చారు. ఈ మనుష్యులంతా ఇశ్రాయేలు కుమారుడైన లేవీ సంతానం.
EXO 6:26 అహరోను, మోషే ఈ వంశానికి చెందిన వాళ్లు, “ఇశ్రాయేలు ప్రజల వంశాలను నడిపించండి” అని యెహోవా చెప్పింది వీళ్లకే.
EXO 6:27 ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడిన వాళ్లు అహరోను, మోషే, ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు విడిచి పెట్టి వెళ్లనివ్వాల్సిందిగా ఫరోతో చెప్పింది వీళ్లే.
EXO 6:28 ఈజిప్టు దేశంలో దేవుడు మోషేతో మాట్లాడాడు.
EXO 6:29 “నేను యెహోవాను నేను నీతో చెప్పిందంతా ఈజిప్టు రాజుతో చెప్పు” అన్నాడు.
EXO 6:30 “కానీ, నేను చక్కగా మాట్లాడలేను గదా! రాజు నా మాట వినడు” అని జవాబిచ్చాడు మోషే.
EXO 7:1 మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “నేను నీకు తోడుగా ఉంటాను. ఫరోకు నీవు ఒక మహారాజులా ఉంటావు. అహరోను నీ పక్షంగా మాట్లాడే మాటకారిగా ఉంటాడు.
EXO 7:2 నీకు నేను ఆజ్ఞాపించేదంతా అహరోనుతో చెప్పు. నేను చెప్పే విషయాలన్నీ అతను రాజుతో చెబతాడు. ఇక ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఈ దేశాన్ని వదిలిపోనిస్తాడు.
EXO 7:3 అయితే నేను ఫరోను మొండిగా చేస్తాను. (మీరు అతనితో చెప్పే సంగతులను అతడు లెక్క చేయడు) అప్పుడు నేను ఈజిప్టులో అనేక అద్భుతాలు చేస్తాను. అయినా అతను వినేందుకు నిరాకరిస్తాడు.
EXO 7:4 అందుచేత ఈజిప్టును నేను ఘోరంగా శిక్షిస్తాను. తర్వాత నా ప్రజలను ఆ దేశం నుండి నేను బయటకు నడిపిస్తాను.
EXO 7:5 అప్పుడు నేనే యెహోవాను అని ఈజిప్టు ప్రజలు తెలుసుకుంటారు. నేను వాళ్లకు వ్యతిరేకంగా ఉంటాను. నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు. అప్పుడు నేనే నా ప్రజలను ఆ దేశంనుండి బయటకు నడిపిస్తాను.”
EXO 7:6 మోషే, అహరోనులు యెహోవా తమతో చెప్పిన ఈ మాటలకు విధేయులయ్యారు.
EXO 7:7 అప్పటికి మోషే వయస్సు 80 సంవత్సరాలు అహరోను వయస్సు 83 సంవత్సరాలు.
EXO 7:8 మోషే, అహరోనులతో యెహోవా ఇలా అన్నాడు:
EXO 7:9 “మీ శక్తి రుజువు చేయమని ఫరో మిమ్మల్ని అడుగుతాడు. ఒక అద్భుతం చేయమని మిమ్మల్ని అడుగుతాడు. అతని కర్ర నేలమీద పడవేయమని అహరోనుతో చెప్పు. ఫరో చూస్తూ ఉండగానే ఆ కర్ర పావు అవుతుంది.”
EXO 7:10 కనుక మోషే, అహరోను ఫరో దగ్గరకు వెళ్లి యెహోవా చెప్పినట్టు చేసారు. అహరోను తన చేతి కర్రను కింద పడవేసాడు. ఫరో తన అధికారులతో కలసి చూస్తూ ఉండగానే ఆ కర్ర పాముగా అయింది.
EXO 7:11 కనుక రాజు తన విద్వాంసులను, మంత్రగాళ్లను పిలిపించాడు. వాళ్లు మంత్రాలు వేసి, అహరోను చేసినట్లే చేయగల్గారు.
EXO 7:12 వాళ్లు కూడా వారి కర్రలను నేల మీద పడవేసారు. ఆ కర్రలు పాములయ్యాయి, కాని అహరోను కర్ర వాళ్ల కర్రలను మింగేసింది.
EXO 7:13 అయినా సరే ప్రజలను వెళ్లనిచ్చేందుకు ఫరో ఒప్పుకోలేదు. ఎలా జరుగుతుందని యెహోవా చెప్పాడో అలాగే ఇది జరిగింది. మోషే, అహరోనుల మాట వినేందుకు రాజు ఒప్పుకోలేదు.
EXO 7:14 అప్పుడు మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: “ఫరో మొండికెత్తాడు. ప్రజల్ని పోనిచ్చేందుకు ఫరో నిరాకరిస్తున్నాడు.
EXO 7:15 ఉదయాన్నే ఫరో నైలు నదికి వెళ్తాడు. నది ఒడ్డున అతని దగ్గరకు వెళ్లు. పాముగా మారిన ఆ కర్రను నీ వెంట తీసుకొనివెళ్లు.
EXO 7:16 అతనికి ఇలా చెప్పు: ‘హీబ్రూ ప్రజల దేవుడైన యెహోవా నన్ను నీ దగ్గరకు పంపించాడు. అరణ్యంలో నన్ను ఆరాధించటానికి నా ప్రజలను వెళ్లనివ్వు అని నీతో చెప్పమని యెహోవా నాతో చెప్పాడు. ఇప్పటివరకు నీవేమో యెహోవా మాట వినలేదు.
EXO 7:17 కనుక యెహోవా చెబతున్నాడు, నేనే యెహోవానని చెప్పి నీవు ఇలా తెల్సుకొంటావు నా చేతిలో ఉన్న ఈ కర్రతో నైలు నది నీళ్లను నేను కొడతాను. నైలునది రక్తంగా మారిపోతుంది.
EXO 7:18 దానితో నదిలో చేపలన్నీ చస్తాయి, నది కుళ్లు కంపు కొడుతుంది. అంతటితో ఈజిప్టు వాళ్లు నదిలో నీళ్లు తాగలేక పోతారు.’”
EXO 7:19 యెహోవా మోషేకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “వారి నదులు, కాలువలు, చెరువుల మీద, వారు నీరు నిల్వ చేసే ప్రతి స్థలం మీద తన చేతి కర్ర చాపాలని అహరోనుకు చెప్పు. అతను ఇలా చెయ్యగానే నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. చెక్క పాత్రలు, రాతి పాత్రల్లో ఉన్న నీళ్లతో సహా మొత్తం నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి.”
EXO 7:20 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే, అహరోనులు చేసారు. అతను కర్ర పైకెత్తి నైలునది నీళ్లమీద కొట్టాడు. ఫరో, అతని అధికారులు అందరి ముందు అతడు ఇలా చేసాడు. నదిలో నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి.
EXO 7:21 నదిలో చేపలు చచ్చాయి. నది కుళ్లు కంపు కొట్టడం మొదలయింది. అందుచేత ఈజిప్టు వాళ్లు ఆ నదిలో నీళ్లు తాగలేక పోయారు. ఈజిప్టు అంతా రక్తమయం అయిపోయింది.
EXO 7:22 మాంత్రికులు కూడ మాయలు చేసి అలాగే చేసారు. కనుక మోషే, అహరోనుల మాటను ఫరో లెక్కచేయలేదు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.
EXO 7:23 ఫరో ముఖం తిప్పుకొని తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. మోషే, అహరోనులు చేసిన దాన్ని ఫరో అలక్ష్యం చేసాడు.
EXO 7:24 ఈజిప్టు వాళ్లు నదిలో నీళ్లు త్రాగలేక పోయారు. అందుచేత తాగే నీళ్ల కోసం వాళ్లు ఆ నది చుట్టూ బావులు తవ్వారు.
EXO 7:25 నైలు నది నీళ్లను యెహోవా మార్చేసిన తర్వాత ఏడు రోజులు గడిచాయి.
EXO 8:1 మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఫరో దగ్గరకు వెళ్లి, ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు, అని యెహోవా చెబతున్నాడని అతనితో చెప్పు.
EXO 8:2 వారు వెళ్లడానికి ఫరో నిరాకరిస్తే నేను ఈజిప్టును కప్పలతో నింపేస్తాను
EXO 8:3 నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి నదిలోనుంచి వచ్చి మీ ఇళ్లలో దూరుతాయి. అవి మీ పడక గదుల్లో పడకల మీద వుంటాయి. మీ అధికారుల ఇళ్లలో, మీ వంట పాత్రల్లో, నీళ్ల బానల్లో కప్పలే ఉంటాయి.
EXO 8:4 నీవు, నీ ప్రజలు, నీ అధికారులు అందరి మీదికీ కప్పలు వచ్చేస్తాయి.’”
EXO 8:5 అప్పుడు మోషేతో యెహోవా, “కాలువలు, నదులు, చెరువులు, అన్నింటి మీదికీ తన చేతి కర్రను ఎత్తమని అహరోనుతో చెప్పు. కప్పలు బయటకు వచ్చి ఈజిప్టు అంతటా నిండుతాయి” అని చెప్పాడు.
EXO 8:6 కనుక ఈజిప్టు జలాలపై అహరోను తన చేయి ఎత్తగా నీళ్లలో నుండి కప్పలు బయటకు వచ్చి, ఈజిప్టు దేశమంతా నిండిపోవటం మొదలయింది.
EXO 8:7 మాయలు చేసే ఈజిప్టు మాంత్రికులు కూడా అలాగే చేసారు, కనుక ఈజిప్టు మీదికి ఇంకా ఎక్కువ కప్పలు వచ్చాయి.
EXO 8:8 మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు, “నా దగ్గర్నుండి, నా ప్రజల దగ్గర్నుండి కప్పలను తీసివేయుమని యెహోవాను అడగండి. యెహోవాకు బలులు అర్పించేందుకు ప్రజల్ని నేను వెళ్లనిస్తాను” అన్నాడు ఫరో.
EXO 8:9 ఫరోతో మోషే ఇలాగు చెప్పాడు, “కప్పలు ఎప్పుడు పోవాలనుకుంటున్నావో నాతో చెప్పు, నీ కోసం, నీ ప్రజల కోసం, నీ అధికారుల కోసం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడే కప్పలు మిమ్మల్ని, మీ ఇళ్లను విడిచిపెట్టి నదిలోనే ఉండిపోతాయి. (కప్పలు ఎప్పుడు నిన్ను వదిలి పోవాలనుకొంటున్నావు?)”
EXO 8:10 “రేపే” అన్నాడు ఫరో. మోషే అన్నాడు: “నీవు చెప్పినట్టే జరుగుతుంది. మా దేవుడైన, యెహోవాలాంటి దేవుడు ఇంకెవ్వరూ లేరని నీవు తెలుసుకొంటావు.
EXO 8:11 నిన్ను, నీ ఇంటిని, నీ అధికారుల్ని, నీ ప్రజల్ను కప్పలు విడిచిపోతాయి. ఆ కప్పలు నదిలోనే ఉండిపోతాయి.”
EXO 8:12 మోషే, అహరోను ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయారు. ఫరో మీదికి ఆయన పంపిన కప్పల్నిగూర్చి మోషే యెహోవాకు మొరపెట్టాడు.
EXO 8:13 మోషే అడిగిన ప్రకారం దేవుడు చేసాడు. ఇళ్లలో, వాకిళ్లలో, పొలాల్లో కప్పలు చచ్చాయి.
EXO 8:14 అవి కుళ్లిపోయి దేశమంతా కంపు కొట్టడం మొదలయింది.
EXO 8:15 కప్పల బాధ వదలిపోవడం చూచి ఫరో మళ్లీ మొండికెత్తాడు. అతను ఏమి చెయ్యాలని మోషే అహరోనులు అడిగారో, అలా చేయలేదు. ఇదంతా సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.
EXO 8:16 యెహోవా మోషేతో ఇలా అన్నాడు “నీ కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టు ఈజిప్టుదేశ వ్యాప్తంగా దుమ్ము పేలు అవుతాయి. అని అహరోనుతో చెప్పు.”
EXO 8:17 వారు అలా చేసారు. అహరోను తన చేతి కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టాడు. ఈజిప్టు అంతటా దుమ్ము పేలు అయింది. మనుష్యుల మీద జంతువుల మీద పేలు ఎక్కేసాయి.
EXO 8:18 ఈజిప్టు మాంత్రికులు వారి మాయల్ని ప్రయోగించి వారు కూడ అలా చేయాలని ప్రయత్నం చేసారు. కానీ దుమ్ము నుండి పేలు వచ్చేటట్టు చేయలేక పోయారు. జంతువుల మీద, మనుష్యుల మీద పేలు అలాగే ఉండిపోయాయి.
EXO 8:19 కనుక ఇది యెహోవా శక్తివల్లే జరిగిందని మాంత్రికులు ఫరోతో చెప్పారు. కాని ఫరో వారు చెప్పింది ఒప్పుకోలేదు. ఇదీ సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.
EXO 8:20 యెహోవా మోషేతో ఇలా అన్నాడు, “ఉదయాన్నే లేచి ఫరో దగ్గరకు వెళ్లు. ఫరో నదికి వెళ్తాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజల్ని వెళ్లనివ్వు’ అని యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు.
EXO 8:21 ‘నీవు నా ప్రజల్ని వెళ్లనివ్వక పోతే, నీ ఇండ్లలోకి ఈగలు వచ్చేస్తాయి, నీ మీద, నీ అధికారుల మీద ఈగలు పట్టేస్తాయి. ఈజిప్టు గృహాలన్నీ ఈగలతో నిండిపోతాయి. ఈజిప్టు దేశమంతా ఈగలతో నిండిపోతుంది.’
EXO 8:22 అయితే ఈజిప్టు ప్రజలను చూచినట్టు మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని నేను చూడను. నా ప్రజలు నివసిస్తున్న గోషెనులో మాత్రం ఈగలు ఉండవు. ఈ విధంగా నేను అంటే యెహోవాను ఈ భూమి మీద ఉన్నానని నీవు తెలుసుకొంటావు.
EXO 8:23 కనుక రేపు నా ప్రజల్ని నీ ప్రజల కంటే వేరుగా చూస్తాను. అదే నా రుజువు.”
EXO 8:24 అందుచేత యెహోవా అలాగే చేసాడు. ఈజిప్టు మీదికి విస్తారంగా ఈగలు వచ్చేసాయి. ఫరో ఇంట్లోను, అతని అధికారుల ఇండ్లన్నింటిలోను ఈగలు ఉన్నాయి. ఈజిప్టు అంతటా ఈగలు ముసురుకొన్నాయి. ఈగలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి.
EXO 8:25 కనుక మోషే అహరోనుల్ని ఫరో పిలిపించాడు. “ఈ దేశంలోనే ఇక్కడే మీ దేవునికి బలులు అర్పించండి” అని ఫరో వాళ్లతో చెప్పాడు.
EXO 8:26 కానీ మోషే అన్నాడు, “అలా చేయటం సరికాదు. మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించటం చాలా భయంకర విషయం అని ఈజిప్టు వాళ్లు అనుకొంటారు. ఈజిప్టు వాళ్లకు కనబడేటట్టు మేము గనుక ఇలా చేస్తే, ఈజిప్టు వాళ్లు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు.
EXO 8:27 మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోకి వెళ్లనిచ్చి, అక్కడ మా యెహోవా దేవునికి బలులు అర్పించనివ్వు. యెహోవా మమ్మల్ని ఇలాగే చేయమన్నాడు.”
EXO 8:28 అందుకు ఫరో, “మీరు వెళ్లి అరణ్యంలో మీ యెహోవా దేవునికి బలులు అర్పించనిస్తాను. కానీ మీరు మాత్రం మూడు రోజుల ప్రయాణమంత దూరంకంటే ఎక్కువ దూరం వెళ్లకూడదు. ఇక పోయి నాకోసం ప్రార్థించు.” అని మోషేతో అన్నాడు.
EXO 8:29 “సరే రేపు నీ నుండి, నీ ప్రజలనుండి, నీ అధికారుల దగ్గర్నుండి ఈగలను తొలిగించమని నేను పోయి యెహోవాను వేడుకొంటాను. కాని, ప్రజలు బలులు అర్పించకుండా నీవు మాత్రం ఆపు చేయకూడదు” అన్నాడు మోషే.
EXO 8:30 కనుక మోషే ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయి యెహోవాకు ప్రార్థన చేసాడు.
EXO 8:31 మోషే కోరినట్టు యెహోవా చేసాడు. ఫరోనుండి, అతని ప్రజలనుండి అధికారుల నుండి ఈగలను యెహోవా తొలగించాడు. ఈగలు ఒక్కటి కూడా మిగుల లేదు.
EXO 8:32 అయితే ఫరో మళ్లీ మొండికెత్తి ప్రజలను వెళ్ల నివ్వలేదు.
EXO 9:1 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “నన్ను ఆరాధించేందుకు నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల ‘దేవుడైన యెహోవా అంటున్నాడని ఫరో దగ్గరికి వెళ్లి అతనితో చెప్పు.’
EXO 9:2 ఇంకా నీవు వారిని పోనివ్వక ఆపి ఉంచితే
EXO 9:3 పొలాల్లోని నీ జంతువులు అన్నింటి మీద యెహోవా తన శక్తిని ఉపయోగిస్తాడు. నీ గుర్రాలు, నీ గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు అన్నింటికీ భయంకర రోగం వచ్చేటట్టు యెహోవా చేస్తాడు.
EXO 9:4 ఈజిప్టు జంతుజాలంకంటె ఇశ్రాయేలీయుల జంతువుల్ని యెహోవా ప్రత్యేకంగా చూస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన జంతువుల్లో ఏదీ చావదు
EXO 9:5 ఇదంతా జరగటానికి యెహోవా సమయాన్ని నిర్ణయించాడు. రేపు ఈ దేశంలో ఇది జరిగేటట్టు యెహోవా చేస్తాడు.”
EXO 9:6 మర్నాడు ఉదయాన్నే ఈజిప్టు పొలాల్లోని జంతువులన్నీ చచ్చాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు చెందిన జంతువుల్లో ఒక్కటికూడా చావలేదు.
EXO 9:7 ఇశ్రాయేలీయుల జంతువులు ఏవైనా చచ్చాయేమో చూడమని ఫరో మనుష్యుల్ని పంపాడు. ఇశ్రాయేలీయుల జంతువుల్లో ఒక్కటి కూడ చావలేదు. ఫరో మాత్రం మొండిగానే ఉండిపోయాడు. అతడు ప్రజల్ని వెళ్లనివ్వలేదు.
EXO 9:8 మోషే, అహరోనులకు యెహోవా ఇలా చెప్పాడు, “మీ చేతుల నిండా కొలిమిలోని బూడిదను తీసుకోండి. మోషే, ఫరో ముందర గాలిలో ఈ బూడిదను వెదజల్లాలి.
EXO 9:9 ఇది దుమ్ముగా మారి ఈజిప్టు దేశం అంతటా వ్యాపిస్తుంది. ఈజిప్టులో ఎప్పుడెప్పుడు ఏ వ్యక్తిని లేక జంతువును ఈ దుమ్ము తాకుతుందో ఆ చర్మంమీద దద్దుర్లు పుడతాయి.”
EXO 9:10 మోషే, అహరోనులు కొలిమి నుండి బూడిద తీసుకొన్నారు. తర్వాత వెళ్లి ఫరో ఎదుట నిలబడ్డారు. ఆ బూడిదను వారు గాలిలో వెదజల్లారు, మనుష్యుల మీద, జంతువుల మీద దద్దుర్లు పుట్టడం మొదలయింది.
EXO 9:11 చివరికి మాంత్రికులకు కూడా ఆ దద్దుర్లు వచ్చినందువల్ల మోషే ఇలా చేయకుండా మాంత్రికులు కూడా ఆపలేక పోయారు. ఈజిప్టు అంతటా ఇది జరిగింది.
EXO 9:12 అయితే యెహోవా ఫరోను మొండి వాడిగా చేసాడు. అందుచేత మోషే, అహరోనుల మాట వినేందుకు ఫరో ఒప్పుకోలేదు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.
EXO 9:13 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఉదయాన్నే లేచి, ఫరో దగ్గరికి వెళ్లు. ‘నన్ను ఆరాధించడానికి, నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల దేవుడైన, యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు.
EXO 9:14 నీవు గనుక ఇలా చెయ్యకపోతే, అప్పుడు నీ మీద, నీ ప్రజలమీద, నీ అధికారుల మీద నా శక్తి అంతా ప్రయోగిస్తాను. అప్పుడు నాలాంటి దేవుడు ప్రపంచంలోనే లేడని నీకు తెలుస్తుంది.
EXO 9:15 నేను నా శక్తిని ప్రయోగించి, ఒక్క రోగం రప్పించానంటే, అది నిన్ను, నీ ప్రజల్ని భూమి మీద లేకుండా తుడిచి పారేస్తుంది.
EXO 9:16 అయితే ఒక కారణం వల్ల నేను నిన్ను ఇక్కడ ఉంచాను. నా శక్తిని నీవు చూడాలని నిన్ను ఇక్కడ ఉంచాను. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నా విషయం తెల్సుకొంటారు.
EXO 9:17 నీవు ఇంకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నావు. నీవు వాళ్లను స్వతంత్రంగా వెళ్లనివ్వడంలేదు.
EXO 9:18 కనుక రేపు ఈ వేళకు మహా బాధాకరమైన వడగళ్ల వానను నేను కురిపిస్తాను. ఇంతకు ముందు ఎన్నడూ ఈజిప్టు ఒక దేశంగా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకూ ఇలాంటి వడగళ్ల వాన పడలేదు.
EXO 9:19 ఇక నీవు నీ జంతువుల్ని క్షేమంగా ఉండేచోట పెట్టుకోవాలి. ప్రస్తుతం పొలాల్లో ఉన్న నీ స్వంతదైన ప్రతిదాన్నీ భద్రమైన చోట నీవు ఉంచుకోవాలి. ఎందుచేతనంటే పొలాల్లో నిలబడి ఉండే మనిషిగాని జంతువుగాని చచ్చినట్లే. ఇంట్లో చేర్చబడకుండా ఉండే ప్రతి దానిపై నా వడగళ్లు కురుస్తాయి.’”
EXO 9:20 ఫరో అధికారులలో కొందరు యెహోవా మాటను గమనించారు. వాళ్లు వెంటనే వారి పశువులన్నిటినీ, బానిసలందరినీ ఇండ్లలో చేర్చారు.
EXO 9:21 కాని మిగతా వాళ్లు యెహోవా సందేశాన్ని లెక్క చేయలేదు. అలాంటి వారు పొలాల్లో ఉన్న తమ బానిసలందరిని, జంతువులన్నింటిని అక్కడే ఉండ నిచ్చారు.
EXO 9:22 నీ చేతులు గాలిలో పైకి ఎత్తు, “ఈజిప్టు అంతటా వడగళ్ల వాన ప్రారంభం అవుతుంది. ఈజిప్టు పొలాల్లో ఉన్న మొక్కలన్నిటి మీద, జంతువుల మీద, మనుష్యులందరి మీద వడగళ్లు పడతాయి” అని మోషేతో యెహోవా చెప్పాడు.
EXO 9:23 కనుక మోషే తన కర్రను పైకి ఎత్తాడు, ఉరుములు, మెరుపులు వచ్చేటట్టు, భూమి మీద వడగళ్లు కురిసేటట్టు యెహోవా చేసాడు. ఈజిప్టు అంతటా వడగళ్లు పడ్డాయి.
EXO 9:24 వడగళ్లు పడుతోంటే, ఆ వడగళ్లతో పాటు మెరుపులు మెరిసాయి. ఈజిప్టు ఒక రాజ్యంగా ఏర్పడినప్పటి నుండి, ఈజిప్టును ఇంత దారుణంగా దెబ్బతీసిన వడగళ్ల వాన ఇదే.
EXO 9:25 ఈజిప్టు పొలాల్లో ఉన్న సర్వాన్నీ ఈ వడగళ్ల వాన నాశనం చేసింది. మనుష్యుల్ని, జంతువుల్ని, మొక్కల్ని వడగళ్లు నాశనం చేసాయి. వడగళ్ల మూలంగా పొలాల్లోని చెట్లన్నీ విరిగి పోయాయి.
EXO 9:26 ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషేను ఒక్కటే వడగళ్లు పడని ఒకే ఒక చోటు.
EXO 9:27 మోషే అహరోనులను ఫరో పిలిపించాడు. ఫరో వారితో, “ఈ సారి నేను పాపం చేసాను. యెహోవా న్యాయమంతుడు. తప్పు నాది, నా ప్రజలది.
EXO 9:28 వడగళ్లు, ఉరుములు మరీ భయంకరంగా ఉన్నాయి! వాటిని ఆపేయమని దేవుణ్ణి అడుగు. నేను మిమ్మల్ని వెళ్లిపోనిస్తాను. మీరు ఇక్కడ ఉండనక్కర్లేదు.” అని చెప్పాడు.
EXO 9:29 మోషే ఫరోతో చెప్పాడు: “నేను ఈ పట్టణంనుండి యెహోవా ఎదుట నా చేతులు చాచి ప్రార్థిస్తాను. ఉరుములు, వడగళ్లు ఆగిపోతాయి. ఈ భూమిమీద యెహోవా ఉన్నాడని మీరు అప్పుడు తెలుసుకొంటారు.
EXO 9:30 అయినా నీవు నీ అధికారులు ఇంకా యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు.”
EXO 9:31 అప్పుడే జనుము గింజ పట్టింది. యవలు అప్పుడే పూత పట్టాయి. అయిననూ ఈ మొక్కలు నాశనం అయ్యాయి.
EXO 9:32 అయితే గోధుమలు, మిరప ఇతర ధాన్యాలకంట్టె ఆలస్యంగా పక్వానికి వస్తాయి. అందుచేత ఈ మొక్కలు నాశనం కాలేదు.
EXO 9:33 మోషే ఫరోను విడిచి పట్టణం బయటికి వెళ్లాడు. యెహోవా యెదుట అతడు తన చేతులు చాచాడు. ఉరుములు, వడగళ్లు ఆగిపోయాయి. నేలమీద వర్షం కురవడం కూడ ఆగిపోయింది.
EXO 9:34 ఎప్పుడయితే వర్షం, వడగళ్లు, ఉరుములు ఆగిపోవడం ఫరో చూశాడో, అప్పుడు అతను మళ్లీ తప్పు చేసాడు. అతను అతని అధికారులు మళ్లీ మొండికెత్తారు.
EXO 9:35 ఇశ్రాయేలు ప్రజల్ని స్వేచ్ఛగా వెళ్లనిచ్చేందుకు నిరాకరించాడు ఫరో. యెహోవా మోషే ద్వారా చెప్పినట్లే ఇది జరిగింది.
EXO 10:1 యెహోవా మోషేతో, “ఫరో దగ్గరకు వెళ్లు. నేనే అతణ్ణి అతని అధికారులని మొండిగా చేస్తాను. నా మహత్తర అద్భుతాలను నేను వాళ్లకు చూపించాలని నేనే ఇలా చేసాను.
EXO 10:2 అలాగే ఈజిప్టులో నేను చేసిన అద్భుతాలు, ఇతర మహత్యాల విషయం మీరుకూడ మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు చెప్పవచ్చని వీటిని చేసాను. అప్పుడు నేనే యెహోవానని మీరంతా తెల్సుకొంటారు” అని చెప్పాడు.
EXO 10:3 మోషే, అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లారు. “‘ఎంత కాలం నీవు నాకు లోబడకుండా తిరస్కరిస్తావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల యెహోవా దేవుడు అంటున్నాడు అని వారు అతనితో చెప్పారు.
EXO 10:4 నీవు నా ప్రజలను వెళ్లనివ్వకపోతే, రేపు నీ దేశంలోకి మిడతలను తీసుకొస్తాను.
EXO 10:5 నేల అంతా మిడతలతో నిండి పోతుంది. నీకు నేల కనబడనంత విస్తారంగా మిడతలు ఉంటాయి. వడగళ్ల వానలో మిగిలింది యింకేమైనా ఉంటే, దాన్ని కాస్తా మిడతలు తినేస్తాయి. పొలాల్లో చెట్ల ఆకులన్నిటినీ మిడతలు తినేస్తాయి.
EXO 10:6 మీ ఇండ్లు మీ అధికారుల ఇండ్లు, ఈజిప్టులో ఉన్న మొత్తం ఇండ్లన్నీ మిడతలతో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు, తాతలు ఎన్నడైనా చూచిన వాటికంటే ఎక్కువ మిడతలు ఉంటాయి. ఈజిప్టులో మనుష్యులు నివాసం మొదలు పెట్టినప్పటినుండి ఎన్నడైనా ఉన్న మిడతల కంటె ఎక్కువ మిడతలు ఉంటాయి.’” తరువాత మోషే ఫరోను విడిచి, వెనుదిరిగాడు.
EXO 10:7 “ఇంకెన్నాళ్లు ఈ మనుష్యులు మనల్ని చిక్కుల్లో పెడతారు. మగవాళ్లందర్నీ వారి యెహోవా దేవుడ్ని ఆరాధించుకొనేందుకు వెళ్లనివ్వు. నీవు వాళ్లను వెళ్లనియ్యకపోతే, నీవు గుర్తించక ముందే, ఈజిప్టు నాశనం అయిపోతుంది” అని ఫరో అధికారులు అతనితో చెప్పారు.
EXO 10:8 కనుక మోషే అహరోనులను తన దగ్గరకు మళ్లీ తీసుకురమ్మని ఫరో తన అధికారులతో చెప్పాడు. “మీరు వెళ్లి మీ యెహోవా దేవుడ్ని ఆరాధించండి, అయితే ఎవరెవరు వెళ్లుచున్నది నాకు సరిగ్గా చెప్పండి?” అన్నాడు ఫరో.
EXO 10:9 “మా ప్రజలలో పడుచువాళ్లు, వృద్ధులు వెళ్తారు! మాతోబాటు మా కుమారులు మా కుమార్తెలను, మా గొర్రెల్ని మా పశువుల్ని కూడ తీసుకుపోతాం. ఇది మా యెహోవా పండుగ గనుక మేమంతా వెళ్తాము” అని జవాబిచ్చాడు మోషే.
EXO 10:10 ఫరో వాళ్లతో, “నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని వెళ్లనిచ్చే ముందు యెహోవా నిజంగా మీతో ఉండి తీరాలి. చూస్తోంటే,
EXO 10:11 మీరేదో దుర్మార్గం తలపెట్టి నట్లుంది. మగాళ్లు వెళ్లి యెహోవాను ఆరాధించవచ్చు. అసలు మీరడిగింది అదే. అంతేగాని మీరంతా మొత్తం వెళ్లి పోయేందుకు వీల్లేదు” అని చెప్పి మోషే, అహరోనులను ఫరో పంపించి వేసాడు.
EXO 10:12 యెహోవా మోషేతో “ఈజిప్టు మీద నీ చేయి ఎత్తు, మిడతలు వచ్చేస్తాయి. ఈజిప్టు మొత్తం నేలమీద మిడతలు ఆవరించేస్తాయి. వడగళ్లు నాశనం చేయకుండా మిగిలిన పంట అంతటినీ ఆ మిడతలు తినేస్తాయి” అని చెప్పాడు.
EXO 10:13 కనుక మోషే ఈజిప్టు దేశం మీద తన కర్ర ఎత్తగా తూర్పు నుండి బలంగా గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ రోజంతా, రాత్రి అంతా గాలి వీచింది. తెల్లవారేటప్పటికి ఈజిప్టు అంతటా మిడతల్ని తెచ్చి పడేసింది ఆ గాలి.
EXO 10:14 మిడతలు ఈజిప్టు దేశంలోకి ఎగిరివచ్చి నేలమీదంతటా కమ్మాయి. ఈజిప్టులో ఇది వరకు ఎన్నడూ లేనన్ని మిడతలు వచ్చేసాయి. పూర్వం ఎన్నడూ అన్ని మిడతలు ఉండలేదు.
EXO 10:15 నేల అంతా మిడతలు కమ్మేశాయి. దేశం అంతా చీకటి అయిపోయింది. వడగళ్లు నాశనం చేయకుండా మిగిల్చిన చెట్లలో ప్రతి ఫలాన్ని, నేలమీద ఉన్న ప్రతి మొక్కనూ మిడతలు తినేసాయి. మొత్తం ఈజిప్టులో ఎక్కడేగాని ఏ చెట్లకూ మొక్కలకూ ఒక్క ఆకు గూడ మిగల్లేదు.
EXO 10:16 వెంటనే మోషే అహరోనులను పిలిపించాడు ఫరో, “మీకు, మీ యెహోవా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
EXO 10:17 ఈ సారికి నా పాపాలు క్షమించండి. నా దగ్గర్నుండి ఈ మృత్యువును (మిడతలను) తీసివేయమని యెహోవాను అడగండి” అని చెప్పాడు ఫరో.
EXO 10:18 మోషే ఫరో దగ్గరనుండి వెళ్లిపోయి యెహోవాను ప్రార్థించాడు.
EXO 10:19 కనుక యెహోవా ఆ గాలిని మార్చేసాడు. పడమటినుండి గాలి బలంగా వీచేటట్టు చేసాడు. ఆ గాలి మిడతలన్నింటినీ ఎర్ర సముద్రంలోకి కొట్టేసింది. ఈజిప్టులో ఒక్క మిడతకూడ మిగల్లేదు.
EXO 10:20 అయితే యెహోవా ఫరోను మాత్రం ఇంకా మొండిగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో వెళ్లనివ్వలేదు.
EXO 10:21 అప్పుడు యెహోవా, “నీ చెయ్యి పైకెత్తు, ఈజిప్టు చీకటిమయం అవుతుంది. చీకటిలో తడవులాడేటంత కటిక చీకటి కమ్ముతుంది” అని మోషేతో చెప్పాడు.
EXO 10:22 కనుక మోషే తన చేతిని పైకి ఎత్తగానే ఒక చీకటి మేఘం ఈజిప్టును ఆవరించేసింది. ఈజిప్టులో మూడు రోజుల పాటు ఆ చీకటి ఉండిపోయింది.
EXO 10:23 ఎవ్వరూ ఎవ్వర్నీ చూడలేక పోయారు. మూడు రోజుల వరకు ఎవ్వరూ వాళ్ల స్థానాలు విడిచి పెట్టలేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే ప్రదేశాలన్నింటిలో వెలుగు ఉంది.
EXO 10:24 ఫరో మళ్లీ మోషేను పిలిపించి, “వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీరు మీ పిల్లల్ని మీతో కూడా తీసుకొని వెళ్లొచ్చు. కాని మీ గొర్రెల్ని, పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టిండి” అన్నాడు.
EXO 10:25 “మా గొర్రెల్ని, పశువుల్ని మాతో కూడ తీసుకొని వెళ్లడమేకాదు, మేము వెళ్లేటప్పుడు మీరు కూడ కానుకలు, బలి అర్పణలు మాకు యివ్వాలి. మా యెహోవా దేవుడ్ని ఆరాధించడానికి ఈ బలులను మేము వాడుకొంటాము.
EXO 10:26 యెహోవాను ఆరాధించేందుకు మా జంతువుల్ని కూడ మేము తీసుకొని వెళ్తాము. ఒక్క డెక్క కూడ ఇక్కడ విడిచి పెట్టబడదు. యెహోవాను ఆరాధించేందుకు ఏమేమి కావాలో సరిగ్గా మాకూ ఇంకా తెలియదు. మేము వెళ్తున్న చోటికి చేరిన తర్వాతే అది మాకు తెలుస్తుంది. అందుచేత యివన్నీ మేము తీసుకెళ్లాల్సిందే” అని మోషే అన్నాడు.
EXO 10:27 యెహోవా ఫరోను ఇంకా మొండిగా చేసాడు. అందుచేత ఫరో ప్రజలను వెళ్లనివ్వలేదు.
EXO 10:28 అప్పుడు ఫరో మోషేతో, “పో, నా దగ్గర్నుండి వెళ్లిపో! నీవు మళ్లీ ఇక్కడకు రాకూడదు. నన్ను కలుసుకోవాలని మరోసారి వస్తే, నీవు చస్తావు” అన్నాడు.
EXO 10:29 “మోషే ఫరోతో, నీవు చెప్పింది నిజమే. నిన్ను చూడ్డానికి నేను మళ్లీ రాను” అని చెప్పాడు.
EXO 11:1 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఫరో మీదికి, ఈజిప్టు మీదికి నేను ఇంకా నాశనం తీసుకు రావల్సి ఉంది. దాని తర్వాత అతడు మిమ్మల్ని ఈజిప్టు నుండి పంపించి వేస్తాడు. వాస్తవానికి మీరు ఈ దేశం వదలి వెళ్లిపోవాలని అతడు మిమ్మల్ని బలవంతం చేస్తాడు.
EXO 11:2 ఇశ్రాయేలు ప్రజలకు ఈ సందేశం మీరు చెప్పాలి, ‘మీరు స్త్రీలు పురుషులు అందరూ మీ చుట్టు ప్రక్కల వాళ్ల దగ్గరకు వెళ్లి, వారి వెండి, బంగారు వస్తువులన్నీ మీకు ఇమ్మని అడగాలి.
EXO 11:3 ఈజిప్టు వాళ్లకు మీపై దయ కలిగేటట్టు యెహోవా చేస్తాడు.’” అప్పటికే ఈజిప్టు ప్రజలు మరియు ఫరో అధికారులు కూడా మోషేను ఒక మహాత్మునిగా ఎంచుతున్నారు.
EXO 11:4 మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ వేళ మధ్య రాత్రి నేను ఈజిప్టులో తిరుగుతాను.
EXO 11:5 ఫరో పెద్ద కుమారుడు మొదలు ధాన్యం తిరుగలి విసరుతున్న బానిసయొక్క, పెద్ద కుమారుడు వరకు ఈజిప్టులో ప్రతి పెద్ద కుమారుడు మరణిస్తాడు. అలాగే జంతువుల్లో మొదట పుట్టినవన్నీ చస్తాయి.
EXO 11:6 గతంలోకంటె, భవిష్యత్తులోకంటె, ఇప్పుడు ఈజిప్టులోవినబడే ఏడ్పులు మరీ దారుణంగా ఉంటాయి.
EXO 11:7 కాని ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరికీ హాని కలుగదు. కనీసం వారిపై ఒక కుక్క కూడ మొరగడం ఉండదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరుగాని, వారి జంతువుల్లో ఏ ఒక్కటిగాని బాధపడవు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు వాళ్లకంటె, ప్రత్యేకంగా నేను చూశానని మీరు తెలుసుకొంటారు.
EXO 11:8 అప్పుడు మీ బానిసలు (ఈజిప్టు వాళ్లు) సాష్టాంగపడి నన్ను ఆరాధిస్తారు. ‘మీ ప్రజలందరినీ తీసుకొని మీరు వెళ్లిపోండి’ అని వాళ్లే అప్పుడు చెబతారు. అప్పుడు నేను కోపంగా ఫరోను విడిచి వెళ్తాను.”
EXO 11:9 యెహోవా మోషేతో, “నీ మాట ఎందుచేత ఫరో వినలేదు? ఈజిప్టులో నా మహత్తర శక్తిని నేను చూపించ గలిగేందుకే” అని చెప్పాడు.
EXO 11:10 ఆ కారణం చేతనే ఫరో యెదుట మోషే, అహరోనులు ఈ మహా అద్భుతాలన్నీ చేసారు. అందుకే ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని తన దేశం నుండి వెళ్లనియ్యకుండా అంత మొండికెత్తేటట్టు యెహోవా చేసాడు.
EXO 12:1 మోషే, అహారోనులు ఇంకా ఈజిప్టులో ఉండగానే, యెహోవా వాళ్లతో మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు:
EXO 12:2 “ఈనెల మీకు సంవత్సరంలో మొదటి నెలగా ఉంటుంది.
EXO 12:3 ఈ ఆజ్ఞ ఇశ్రాయేలు సమాజం అంతటికీ చెందుతుంది. ఈ నెల పదో రోజున ఒక్కొక్కరు తన ఇంటివారి కోసం ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి.
EXO 12:4 ఒక గొర్రెపిల్లను పూర్తిగా తినగలిగినంత మంది తన ఇంట్లో లేకపోతే, అలాంటి వారు తమ భోజనం తినేందుకు ఇంటి పక్కవాళ్లను ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరూ తినడానికి సరిపడినంతగా గొర్రెపిల్ల ఉండాలి.
EXO 12:5 గొర్రెపిల్ల ఒక సంవత్సరం వయసు గల మగది కావాలి, అది మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఈ జంతువు చిన్న గొర్రె లేక చిన్న మేక కావచ్చును.
EXO 12:6 నెలలో 14వ రోజువరకు మీరు ఆ జంతువును గమనించాలి. ఆ రోజు ఇశ్రాయేలు సమాజంలోని ప్రజలంతా సాయంకాల సమయంలో ఈ జంతువులను చంపాలి.
EXO 12:7 ఈ జంతువుల రక్తం అంతా భద్రం చేయాలి. ఏ ఇండ్లలోనైతే ప్రజలు ఈ ఆహారం భోజనం చేస్తారో ఆ ఇళ్ల ద్వార బంధాల నిలువు కమ్ములమీద, పైకమ్మి మీద ఆ రక్తం చల్లాలి.
EXO 12:8 “ఆ రాత్రే మీరు ఆ గొర్రెపిల్ల మాంసం కాల్చి దాన్ని మొత్తం తినెయ్యాలి. చేదుగా ఉండే ఆకు కూరలు, పొంగని రొట్టె కూడా మీరు తినాలి.
EXO 12:9 గొర్రె పిల్ల మాంసాన్ని మీరు నీళ్లతో వండకూడదు. మొత్తం గొర్రెపిల్లను నిప్పుమీద పేల్చాలి. అప్పటికి ఇంకా ఈ గొర్రెపిల్ల తల, కాళ్లు, ఆంత్రాలతోనే ఉండాలి.
EXO 12:10 ఆ మాంసం అంతా ఆ రాత్రికి రాత్రే మీరు భోంచేయాలి. మాంసంలో ఏమైనా మర్నాటి ఉదయం వరకు మిగిలి పోతే దాన్ని నిప్పులో వేసి కాల్చివేయాలి.
EXO 12:11 “మీరు ఆ భోజనం చేసేటప్పుడు ప్రయాణం చేస్తున్న వారిలా బట్టలు వేసుకోవాలి. మీ అంగీని మీ నడుంకు బిగించాలి. మీరు మీ చెప్పులు తొడుక్కోవాలి. మీ చేతి కర్రను చేతితో పట్టుకోవాలి. ఆతురంగా మీరు భోజనం చేయాలి. ఎందుచేతనంటే, ఇది యెహోవాయొక్క పస్కాబలి (యెహోవా తన ప్రజలను కాపాడి, వారిని ఈజిప్టునుండి త్వరగా బయటకు నడిపించిన సమయం.)
EXO 12:12 “ఈ రాత్రి నేను ఈజిప్టు అంతటా సంచారం చేసి ఈజిప్టులోని ప్రతి పెద్ద కుమారుణ్ణీ చంపేస్తాను. మనుష్యుల్లోను, జంతువుల్లోను, మొదటి సంతానాన్ని నేను చంపేస్తాను. ఈజిప్టు దేవతలందరికీ శిక్ష విధిస్తాను. నేనే యెహోవానని వారికి తెలిసేటట్టు చేస్తాను.
EXO 12:13 అయితే, మీ ఇళ్లమీదనున్ను రక్తం ఒక ప్రత్యేక గుర్తుగా ఉంటుంది. నేను ఆ రక్తాన్ని చూడగానే మీ ఇంటిని దాటి వెళ్లిపోతాను. ఈజిప్టు వాళ్లకు మాత్రం కీడు జరిగేటట్టు చేస్తాను. అయితే, ఆ కీడు, రోగాలు మిమ్మల్ని ఎవరినీ బాధించవు.
EXO 12:14 “కనుక ఈ రాత్రిని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటారు. మీకు అది ఒక ప్రత్యేక పండుగ రోజుగా ఉంటుంది. మీ తర్వాత మీ సంతానము శాశ్వతంగా ఈ పండుగను ఆచరించి యెహోవాను ఘనపర్చాలి.
EXO 12:15 ఈ పండుగనాడు ఏడు రోజుల పాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఈ పండుగ మొదటి రోజున పులిసే పదార్థాన్ని మీ ఇండ్లలోనుంచి తీసివేయాలి. ఈ పండుగ జరిగే మొత్తం ఏడు రోజుల్లోనూ పులిసిన పదార్థాన్ని ఏ ఒక్కరూ తినకూడదు. ఎవరైనా సరే పులిసే పదార్థం తింటే, ఆ వ్యక్తిని ఇశ్రాయేలు వాళ్లనుండి మీరు వేరుచేయాలి.
EXO 12:16 పండుగలో మొదటి రోజున, చివరి రోజున పరిశుద్ధ సమావేశాలు ఉంటాయి. ఈ రోజుల్లో మీరు ఏ పనీ చేయకూడదు. ఇలాంటి రోజుల్లో మీరు భోంచేయటానికి అవసరమైన భోజనాన్ని సిద్ధం చేసుకోవడం ఒక్కటే మీరు చెయ్యొచ్చు.
EXO 12:17 పులియని పిండితో చేసే రొట్టెల పండుగను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుచేతనంటే, సరిగ్గా ఈ రోజే మీ వంశాలన్నింటినీ ఈజిప్టు నుండి నేను బయటకు నడిపిన రోజు. అందుచేత మీ తర్వాత మీ సంతానమంతా ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది శాశ్వతంగా ఉండిపోయే చట్టం.
EXO 12:18 కనుక మొదటి నెల (నిసాను) 14వ రోజు సాయంత్రం నుండి మీరు పులియని రొట్టెలు తినడం మొదలు పెట్టాలి. అదే నెల 21 రోజు సాయంత్రం వరకు అలాంటి రొట్టెలే మీరు తినాలి.
EXO 12:19 ఏడు రోజుల పాటు మీ ఇళ్లలో ఎక్కడా పులిసిన పదార్థం ఉండకూడదు. ఇశ్రాయేలు పౌరుడేకాని, విదేశీయుడేగాని ఏ వ్యక్తిగాని ఈ సందర్భంలో పులిసిన పదార్థం తింటే, మిగిలిన ఇశ్రాయేలీయులందరినుండి ఆ వ్యక్తి వేరు చేయబడాలి.
EXO 12:20 ఈ పండుగ సమయంలో మీరు పులిసిన పదార్థం తినకూడదు. మీరు ఎక్కడ ఉన్నాసరే, పులియని రొట్టెలు మాత్రమే మీరు తినాలి.”
EXO 12:21 కనుక పెద్దలందర్నీ మోషే పిలిచి, “మీ కుటుంబాల కోసం గొర్రెపిల్లల్ని తెచ్చుకొని, పస్కా పండుగకు ఆ గొర్రెపిల్లల్ని తీసుకోండి.
EXO 12:22 హిస్సోపు కొమ్మలు తీసుకొని రక్తంతో నింపిన పాత్రల్లో వాటిని ముంచండి. ద్వారబంధాల నిలువు కమ్ముల మీద, పై కమ్మి మీద ఆ రక్తాన్ని పూయండి. తెల్లారేవరకు ఎవరూ తమ ఇండ్లు విడిచి వెళ్ల కూడదు.
EXO 12:23 ఈజిప్టులో జ్యేష్ఠ సంతానాన్ని చంపడానికి యెహోవా సంచరించే సమయంలో, ద్వారబంధాల నిలువు కమ్ముల మీద పైకమ్మి మీద రక్తాన్ని ఆయన చూస్తాడు. అప్పుడు యెహోవా ఆ ఇంటిని కాపాడుతాడు నాశనకారుడ్ని యెహోవా మీ ఇంట్లోకి రానివ్వడు. మిమ్మల్ని బాధింపనియ్యడు.
EXO 12:24 ఈ ఆజ్ఞ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ చట్టం మీకు, మీ సంతానానికి శాశ్వతంగా ఉంటుంది.
EXO 12:25 యెహోవా మీకు ఇచ్చే దేశానికి వెళ్లిన తర్వాత కూడ మీరు దీన్ని చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలి.
EXO 12:26 ‘ఈ ఆచారం మనం ఎందుకు పాటిస్తున్నాము?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు
EXO 12:27 ‘యెహోవాను ఘనపర్చడం కోసమే ఈ పస్కా పండుగ. ఎందుచేతనంటే, మనం ఈజిప్టులో ఉన్నప్పుడు యెహోవా ఇశ్రాయేలు గృహాలను దాటిపోయాడు యెహోవా ఈజిప్టు వాళ్లను చంపేసాడు. కానీ మన ఇళ్లల్లో వారిని ఆయన రక్షించాడు. అందుచేత ఇప్పుడు ప్రజలు సాష్టాంగపడి యెహోవాను ఆరాధిస్తున్నారు’ అని మీరు చెప్పాలి.” అని అన్నాడు.
EXO 12:28 మోషే అహరోనులకు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అందుచేత యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు చేసారు.
EXO 12:29 అర్ధరాత్రి వేళ ఫరో (ఈజిప్టు రాజ్యపాలకుడు) ఇంట పెద్ద కుమారుడు మొదలుకొని చెరసాలలో కూర్చొన్న ఖైదీ పెద్ద కుమారుని వరకు ఈజిప్టులో పెద్ద కుమారులందర్నీ యెహోవా చంపేసాడు. అలాగే జంతువుల్లో మొదటి సంతానం అన్నీ చచ్చాయి.
EXO 12:30 ఆ రాత్రి ఈజిప్టులో ప్రతీ ఇంటా ఎవరో ఒకరు చనిపోయారు. ఫరో, అతని అధికారులు, ఈజిప్టులోని ప్రజలంతా ఘోల్లున ఏడ్వడం మొదలు పెట్టారు.
EXO 12:31 కనుక ఆ రాత్రి మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు. “మీరు వెంటనే నా ప్రజల్ని విడిచి వెళ్లండి. మీరు చెప్పినట్టే మీరూ, మీ ప్రజలూ చెయ్యండి. వెళ్లి యెహోవాను ఆరాధించండి.
EXO 12:32 మీరు చెప్పినట్టే మీ గొర్రెలను, పశువులను, అన్నింటినీ మీతోబాటు తీసుకొనిపోవచ్చు. వెళ్లండి. నన్నుకూడ ఆశీర్వదించండి.” అని వారితో ఫరో అన్నాడు.
EXO 12:33 వాళ్లను త్వరగా విడిచిపొమ్మని ఈజిప్టు ప్రజలు కూడ వారిని అడిగారు ఎందుకంటే, “మీరు వెళ్లకపోతే మేమందరం చస్తాము” అని వాళ్లు చెప్పారు.
EXO 12:34 తమ రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనేంత సమయం ఇశ్రాయేలు ప్రజలకు లేదు. పిండి ముద్దలున్న పాత్రలను బట్టలో కట్టుకొని వారు వారి భుజాన వేసుకొని మోసుకుపోయారు.
EXO 12:35 అప్పుడు మోషే వారిని ఏమి చేయమని చెప్పాడో అలాగే ఇశ్రాయేలు ప్రజలు చేసారు. వారు వారి పక్క ఇండ్ల వారి దగ్గరకు వెళ్లి బట్టలు, వెండి, బంగారు వస్తువులు ఇమ్మని అడిగారు.
EXO 12:36 ఈజిప్టువారు ఇశ్రాయేలు ప్రజల మీద దయ చూపించేటట్టు యెహోవా చేసాడు. అందుచేత ఈజిప్టు వాళ్లు వారి ఐశ్వర్యాలను ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చారు.
EXO 12:37 ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కట్టి రామసేసునుండి సుక్కోతుకి వెళ్లారు. వారు పురుషులే సుమారు 6,00,000 మంది. ఇందులో పిల్లల సంఖ్యలేదు.
EXO 12:38 గొర్రెలు, పశువులు, ఇతర సామగ్రి చాల విస్తారంగా ఉన్నాయి. వారితో బాటు చాల మంది రకరకాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. వీళ్లు ఇశ్రాయేలీయులు కారు, గాని వారితో కలిసి వెళ్లారు.
EXO 12:39 అయితే ప్రజలకు మాత్రం వారి రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనే సమయం లేదు. వారు తమ ప్రయాణం కోసం ప్రత్యేకమైన భోజనం ఏదీ సిద్ధం చేసుకోలేదు. కనుక పులవని పిండితోనే వారు రొట్టెలు చేసుకోవాల్సి వచ్చింది.
EXO 12:40 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో 430 సంవత్సరాలు జీవించారు.
EXO 12:41 నాలుగువందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆరోజే మొత్తం యెహోవా సైన్యాలన్నీ ఈజిప్టు దేశాన్ని విడిచి వెళ్లిపోయాయి.
EXO 12:42 కనుక యెహోవా చేసిన దానిని ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు. అది చాల ప్రత్యేకమైన రాత్రి కనుక తరతరాలవరకు జ్ఞాపకం చేసుకొంటారు. ఇశ్రాయేలు ప్రజలంతా ఆ రాత్రిని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటారు.
EXO 12:43 మోషే అహరోనులతో యెహోవా యిలా చెప్పాడు: “పస్కా పండుగకు నియమాలు ఇవి. పస్కా భోజనం విదేశీయుడెవరూ తినకూడదు.
EXO 12:44 ఒకడు బానిసను కొంటే, ఆ బానిసకు అతడు సున్నతి చేస్తే అప్పుడు ఆ బానిస పస్కా పండుగ భోజనం చెయ్యవచ్చు.
EXO 12:45 అయితే, ఒక వ్యక్తి కేవలం మీ దేశంలో ఉంటున్నా, లేక మీకోసం పని చేసేందుకు కూలికి కుదుర్చుకొన్నా, అలాంటి వ్యక్తి పస్కా పండుగ భోజనం చెయ్యకూడదు. (పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు మాత్రమే)”
EXO 12:46 “ప్రతి కుటుంబము ఒకే ఇంటిలో భోజనం చేయాలి. భోజనాన్ని ఎవ్వరూ ఇంటి బయట తినకూడదు. మీరు గొర్రెమాంసము తిని దాని ఎముకను విరువకూడదు.
EXO 12:47 ఇశ్రాయేలు ప్రజలందరు ఈ పండుగను ఆచరించాలి.
EXO 12:48 ఇశ్రాయేలు సమాజంలో సభ్యుడు కాని ఏ వ్యక్తి అయినా మీతోబాటు నివసిస్తూ ఉండి యెహోవా పస్కా పండుగలో అతడు పాల్గొనాలనుకొంటే, అతనికి సున్నతి చేయాలి. అప్పుడు అతను కూడ ఇశ్రాయేలు పౌరుడుగా ఆ భోజనంలో పాల్గొనవచ్చు. కాని ఒకడు సున్నతి చేసుకోకపోతే అతను పస్కా పండుగ భోజనంలో పాల్గొన కూడదు.
EXO 12:49 అందరికీ ఇవే నియమాలు వర్తిస్తాయి. మీ దేశంలో నివసిస్తున్న వ్యక్తి పౌరుడైనా సరే, విదేశీయుడైనా సరే యివే నియమాలు వర్తిస్తాయి.”
EXO 12:50 మోషే అహరోనులకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు ప్రజలంతా విధేయులయ్యారు.
EXO 12:51 కనుక అదే రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈజిప్టు దేశం నుండి యెహోవా బయటకు నడిపించాడు. ప్రజలు గుంపులుగా బయల్దేరారు.
EXO 13:1 అప్పుడు యెహోవా మోషేతో యిలా అన్నాడు.
EXO 13:2 “ఇశ్రాయేలులో పెద్దకుమారుడు ప్రతి ఒక్కడూ నాకు చెందుతాడు. ప్రతి స్త్రీకి పుట్టిన పెద్దకుమారుడూ నావాడు. మీ జంతువుల్లో మొదట పుట్టే ప్రతి మగదాన్నీ మీరు నాకు అర్పించాలి.”
EXO 13:3 మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ రోజును జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఈజిప్టులో బానిసలుగా ఉండేవారు. అయితే ఈనాడు యెహోవా తన మహా శక్తిని ప్రయోగించి మిమ్మల్ని విడుదల చేసాడు. మీరు మాత్రం పులిసిన పదార్థంతో రొట్టెలు తినకూడదు.
EXO 13:4 అబీబు మాసంలో ఈనాడు మీరు ఈజిప్టును విడిచి వెళ్తున్నారు.
EXO 13:5 మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసాడు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, అమోరీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసిస్తోన్న దేశాన్ని మీకు ఇస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. యెహోవా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహిస్తోన్న ఆ సుందర దేశానికి నడిపించిన తర్వాత అప్పుడు కూడా మీరు ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మొదటి నెలలో ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆరాధన రోజుగా మీకు ఉండాలి.
EXO 13:6 “ఏడు రోజులపాటు పులియని రొట్టెలే మీరు తినాలి. ఏడోనాడు ఒక గొప్ప విందు ఉంటుంది. ఈ విందు యెహోవా ఘనతను సూచిస్తుంది.
EXO 13:7 కనుక ఏడు రోజులు పులిసిన పదార్థంతో చేయబడ్డ రొట్టెలు ఏవీ మీరు తినకూడదు. మీ దేశం మొత్తంలో ఎక్కడా పులిసిన పదార్థంతో తయారైన రొట్టెలు ఉండకూడదు.
EXO 13:8 ‘యెహోవా ఈజిప్టునుండి మమ్మల్ని బయటకు రప్పించాడు. కనుక మనం ఈ పండుగ చేసుకొంటున్నాము’ అని ఈ రోజు నాడు మీరు మీ పిల్లలతో చెప్పాలి.”
EXO 13:9 “మీరు జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు తోడ్పడుతుంది. అది మీ ముంజేతి మీద కట్టుకొన్న దారం పోగులా ఉంటుంది. అది మీ కళ్లముందు కనబడే ఒక జ్ఞాపికలా ఉంటుంది. యెహోవా ప్రబోధాలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు సహాయ పడుతుంది. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయ పడుతుంది.
EXO 13:10 కనుక ప్రతి సంవత్సరం సరైన సమయంలో ఈ పండుగను జ్ఞాపకం చేసుకోండి.
EXO 13:11 “మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి యెహోవా మిమ్మల్ని నడిపిస్తాడు. కనానీయులు ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈ దేశాన్ని మీకు ఇస్తానని మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసాడు. దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చిన తర్వాత
EXO 13:12 ప్రతి పెద్ద కుమారుణ్ణి ఆయనకు ఇవ్వాలని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే జంతువుల్లో ప్రథమంగా పుట్టిన ప్రతి మగపిల్లనూ యెహోవాకు అర్పించాలి.
EXO 13:13 తొలి పిల్లగా పుట్టిన ప్రతి గాడిదనూ యెహోవా దగ్గర్నుండి మళ్లీ కొనుక్కోవచ్చు. మీరు ఆ గాడిదకు బదులుగా ఒక గొర్రెపిల్లను ఇచ్చి, గాడిదను విడిపించుకోవచ్చును. యెహోవా దగ్గర్నుండి ఆ గాడిదను కొని విడిపించుకోనట్లయితే, దాన్ని చంపేయాలి. మీరు దాని మెడ విరుగగొట్టాలి. అది బలి అర్పణ అవుతుంది. ప్రతి పెద్ద సంతానాన్నీ యెహోవా దగ్గరనుండి మళ్లీ కొనుక్కోవాలి.
EXO 13:14 “మీరెందుకు ఇలా చేస్తున్నారని భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. ‘దీనంతటికీ భావం ఏమిటి?’ అని వారు అంటారు. దానికి మీరు యిలా జవాబిస్తారు. ‘ఈజిప్టు నుండి మనల్ని రక్షించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడు. అక్కడ మనం బానిసలంగా ఉంటిమి. అయితే యెహోవా మనల్ని అక్కడ నుండి బయటకు నడిపించి ఇక్కడకు తీసుకొచ్చాడు.
EXO 13:15 ఈజిప్టులో ఫరో మొండికెత్తాడు. మనల్ని వెళ్లనిచ్చేందుకు అతడు నిరాకరించాడు. కనుక ఆ దేశంలో ప్రతి జ్యేష్ఠ సంతానాన్నీ యెహోవా చంపేసాడు. (పెద్ద కుమారుల్ని, తొలి చూలు జంతువుల్ని యెహోవా చంపేసాడు) ఆ కారణంచేత జంతువుల్లో మొదటి సంతానంగా పుట్టిన ప్రతి మగపిల్లనూ నేను యెహోవాకు అర్పిస్తున్నాను. ఆ కారణంచేతనే నా పెద్ద కుమారుల్లో ప్రతి ఒక్కరినీ నేను యెహోవా దగ్గర్నుండి కొంటున్నాను.’
EXO 13:16 ఇది మీ ముంజేతికి కట్టబడ్డ దారం పోగులాంటిది. అది నీ కంటికి ఒక బాసికంలాంటిది. యెహోవా తన మహత్తర శక్తిచేత మనల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయకరంగా ఉంటుంది.”
EXO 13:17 ఫరో ఈజిప్టును విడిచి వెళ్లనిచ్చాడు. సముద్రం వెంబడి పోయే మార్గంలో ఆ ప్రజలను యెహోవా వెళ్లనీయలేదు. ఈ మార్గం పాలస్తీనాకు దగ్గర దారి. కాని “ప్రజలు ఆ దారిన వెళ్తే యుద్ధం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్లు మనసు మార్చుకొని మళ్లీ ఈజిప్టుకు వెళ్లిపోవచ్చు.”
EXO 13:18 కనుక వారిని ఇంకో మార్గాన యెహోవా నడిపించాడు. ఎర్ర సముద్రం పక్కగా ఉండే అరణ్యంలోనుంచి ఆయన వారిని నడిపించాడు. అయితే, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి పెట్టినప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించి బయల్దేరారు.
EXO 13:19 మోషే తనతో బాటు యోసేపు ఎముకలను తీసుకొని వెళ్లాడు. ఇలా చేయాలనిచెప్పి యోసేపు తాను చనిపోక ముందే ఇశ్రాయేలి కుమారులతో ప్రమాణం చేయించుకొన్నాడు. “దేవుడు మిమ్మల్ని రక్షించినప్పుడు ఈజిప్టులోనుంచి నా ఎముకల్ని మీతో తీసుకు వెళ్లాలని జ్ఞాపకం ఉంచుకోండి” అని తాను చనిపోక ముందు యోసేపు చెప్పాడు.
EXO 13:20 ఇశ్రాయేలు ప్రజలు సుక్కోతు విడిచి ఏతాములో బసచేసారు. ఏతాము ఎడారికి సమీపంగా ఉంది.
EXO 13:21 యెహోవా ముందు దారితీశాడు. పగటి వేళ ప్రజలను నడిపించేందుకు ఒక ఎత్తయిన మేఘ స్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు, మరియు రాత్రివేళ మార్గం చూపించడానికి ఒక ఎత్తయిన అగ్నిస్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు. వాళ్లు రాత్రి సమయంలో కూడ ప్రయాణం చేయగలిగేటట్టు ఆ అగ్ని వారికి వెలుతురు నిచ్చింది.
EXO 13:22 పగటి వేళంతా ఆ ఎత్తయిన మేఘమూ, రాత్రి వేళంతా అగ్ని స్తంభమూ వాళ్లతోటే ఉన్నాయి.
EXO 14:1 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు:
EXO 14:2 “ప్రజలు వెనక్కు తిరిగి పీహ హీరోతుకు ప్రయాణం కట్టమని చెప్పు. మిగ్దోలుకు, సముద్రానికి మధ్య ప్రదేశంలో రాత్రికి బసచేయాలని వారితో చెప్పు. ఇది బయల్సెఫోను దగ్గర్లో ఉంది.
EXO 14:3 ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తప్పిపోయి ఉంటారని ఫరో తలుస్తాడు. పైగా ప్రజలు వెళ్ల గలిగినచోటు ఇంకేమీ ఉండదు అనుకొంటాడు.
EXO 14:4 ఫరోను నేను ధైర్యశాలిగా చేస్తాను. అతడేమో మిమ్మల్ని తరుముతాడు. అయితే ఫరోను, అతని సైన్యాన్ని నేను ఓడిస్తాను. ఇది నాకు కీర్తి తెచ్చి పెడుతుంది. నేనే యెహోవానని ఈజిప్టు వాళ్లు అప్పుడు తెల్సుకొంటారు.” ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు విధేయులై ఆయన చెప్పినట్టు చేసారు.
EXO 14:5 ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారని ఫరోకు ఒక సమాచారం అందింది. ఎప్పుడైతే ఈ సంగతి విన్నారో అప్పుడు వెంటనే ఫరో, అతని అధికారులు తాము చేసిన దాన్ని గూర్చి తమ మనసు మార్చుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల్ని అసలు మనం ఎందుకు వెళ్లనిచ్చాం? వాళ్లను మనం ఎందుకు పారిపోనిచ్చాం? ఇప్పుడు మనం మన బానిసల్ని పోగొట్టుకొన్నాం” అన్నాడు ఫరో.
EXO 14:6 కనుక ఫరో తన యుద్ధరథాన్ని సిద్ధం చేసుకొని, తన మనుష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్లాడు.
EXO 14:7 తన మనుష్యుల్లో బలవంతులయిన వాళ్లు 600 మందిని, రథాలు అన్నింటిని తనతో తీసుకొని వెళ్లాడు. ఒక్కోరథానికి ఒక్కో అధికారి ఉన్నాడు.
EXO 14:8 ఇశ్రాయేలీయులు విజయ సంకేతంగా చేతులు పైకెత్తి వెళ్లి పోతున్నారు. కానీ ఈజిప్టురాజైన ఫరో ఇంకా ధైర్యశాలి అయ్యేటట్టు యెహోవా చేసాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని ఇంకా తరిమాడు.
EXO 14:9 ఈజిప్టు సైన్యంలో అశ్వదళాలు, రథాలు చాల ఉన్నాయి. వారు ఇశ్రాయేలు ప్రజల్ని తరిమి, వారు బయల్సెఫోనుకు తూర్పున పీహహీరోతు వద్ద ఎర్ర సముద్రానికి దగ్గర్లో బస చేస్తూ ఉండగానే వారిని సమీపించారు.
EXO 14:10 ఫరో, అతని సైన్యం తమవైపే రావడం ఇశ్రాయేలు ప్రజలు చూసారు. ప్రజలు చాల భయపడ్డారు. సహాయం చేయమని వారు యెహోవాకు మొరపెట్టారు.
EXO 14:11 మోషేతో వాళ్లు యిలా అన్నారు, “అసలు ఈజిప్టు నుండి నీవు మమ్మల్నెందుకు బయటకు తీసుకొచ్చావు? చావడానికి నీవు మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకురావడం ఎందుకు? మేము హాయిగా ఈజిప్టులోనే చచ్చేవాళ్లం అక్కడ ఈజిప్టులో కావాల్సినన్ని సమాధులున్నాయి.
EXO 14:12 ఇలా జరుగుతుందని మేము నీతో చెప్పాము. ‘దయచేసి మమ్మల్ని విసిగించకు. మమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చి, ఈజిప్టు వాళ్లకు సేవ చేయనియ్యి అని ఈజిప్టులోనే మేము చెప్పాము.’ ఇలా బయటకు వచ్చి ఈఎడారిలో చావడంకంటె ఈజిప్టులోనే ఉండిపోయి బానిసలంగా ఉంటేనే యింకా బాగుండేది మాకు.”
EXO 14:13 కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు: “భయ పడకండి! పారిపోకండి! యెహోవా ఈనాడు మిమ్మల్ని రక్షించటం వేచి చూడండి. ఈ ఈజిప్టు వారిని ఈరోజు తర్వాత మళ్లీ ఎన్నడూ మీరు చూడరు!
EXO 14:14 మీరు ఊరకనే మౌనంగా ఉండటం తప్ప చేయాల్సిందేమీ లేదు. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు.”
EXO 14:15 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఇంకా నీవెందుకు నాకు మొర పెడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజల్ని ముందడుగు వేయమని ఆజ్ఞాపించు
EXO 14:16 నీ చేతిలో కర్రను ఎర్రసముద్రం మీదకు చాపు, ఎర్రసముద్రం రెండుగా విడిపోతుంది. అప్పుడు ప్రజలు ఆరిపోయిన నేలమీద సముద్రంలోనుంచి నడిచి వెళ్లిపోవచ్చు.
EXO 14:17 ఈజిప్టు వాళ్లను ధైర్యంగల వాళ్లుగా నేను చేస్తాను. ఇలా చేసినందువల్ల వారు మిమ్మల్ని తరుముతారు. అయితే ఫరోకంటె, అతని అశ్వదళాలు, రథాలు, అన్నిటికంటె నేను ఎక్కువ శక్తిగలవాడ్ని అని మీకు తెలియజేస్తాను.
EXO 14:18 నేనే యెహోవానని ఈజిప్టు అప్పుడు తెలుసు కొంటుంది. ఫరోను, అతని అశ్వ దళాలను, రథాలను నేను ఓడించినప్పుడు వాళ్లు నన్ను గౌరవిస్తారు.”
EXO 14:19 ఆ సమయంలో యెహోవా దూత ప్రజల వెనక్కు వెళ్లడం జరిగింది. (సాధారణంగా యెహోవా దూత ప్రజలకు ముందర ఉండి వారిని నడిపించడం జరుగుతుంది) కనుక ఎత్తైన మేఘం ప్రజల ముందర నుండి కదలిపోయి, ప్రజల వెనక్కు వెళ్లింది
EXO 14:20 ఈ విధంగా ఈజిప్టు వాళ్లకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఆ మేఘం నిలిచింది. ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉంది. కానీ ఈజిప్టు వారికి అంతా చీకటి. అందుచేత ఆరాత్రి ఈజిప్టు వాళ్లు ఇశ్రాయేలు ప్రజల సమీపానికి రాలేకపోయారు.
EXO 14:21 మోషే ఎర్ర సముద్రం మీదికి తన చేయి ఎత్తగానే తూర్పునుండి ఒక బలమైన గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ గాలి రాత్రి అంతా వీచింది. సముద్రం రెండుగా విడిపోయింది. ఆ గాలి నేలను ఆరిపోయ్యేటట్టు చేసింది.
EXO 14:22 ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో పొడినేల మీద వెళ్లారు. వాళ్లకు కుడిప్రక్క, ఎడమప్రక్క నీళ్లు గోడలా నిలిచాయి.
EXO 14:23 అప్పుడు ఫరో రథాలు, అశ్వదళాలు అన్నీ వాళ్ల వెంట సముద్రంలో ప్రవేశించాయి.
EXO 14:24 ఆ ఉదయం ఎత్తయిన మేఘం నుండి అగ్ని స్తంభం నుండి యెహోవా ఈజిప్టు సైన్నాన్ని చూచాడు. యెహోవా వాళ్లను ఎదుర్కొని ఓడించాడు.
EXO 14:25 రథచక్రాలు బిగిసిపోయి కదలడం లేదు. రథాలను అదుపుచెయ్యడం చాలా కష్టతరంగా ఉంది. “మనం ఇక్కడ్నుంచి పారిపోదాం రండి! యెహోవా మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులకోసం యుద్ధం చేస్తున్నాడు.” అంటూ ఈజిప్టు వాళ్లు కేకలు వేసారు.
EXO 14:26 అప్పుడు యెహోవా మోషేతో, “నీ చేయి సముద్రం మీదికి ఎత్తు, నీళ్లు పడిపోయి ఈజిప్టు రథాలను, అశ్వదళాలను ముంచేస్తాయి.” అని చెప్పాడు.
EXO 14:27 కనుక తెల్లవారు ఝామున మోషే తన చేతిని సముద్రం మీదికి ఎత్తాడు. నీళ్లు యధాస్థానానికి వచ్చి పడ్డాయి. ఈజిప్టు వాళ్లు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈజిప్టు వాళ్లు సముద్రంలో కొట్టుకుపోయేటట్టు యెహోవా చేసాడు.
EXO 14:28 నీళ్లు యధాస్థానానికి మళ్లీ రావడం చేత రథాలను, అశ్వదళాలను కప్పేశాయి. ఇశ్రాయేలు ప్రజలను తరుముకొచ్చిన ఫరో సైన్యాలన్నీ నాశనం చేయబడ్డాయి. వాళ్లలో ఒక్కడూ బతకలేదు.
EXO 14:29 అయితే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం పొడినేల మీద సముద్రాన్ని దాటిపోయారు. వారి కుడి ఎడమ ప్రక్కల్లో నీళ్లు ఒక గోడలా నిలిచిపోయాయి.
EXO 14:30 ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టువాళ్లు చేతినుండి యెహోవాయే రక్షించాడు. ఎర్రసముద్ర తీరాన ఈజిప్టువాళ్ల శవాలను ఇశ్రాయేలు ప్రజలు చూచారు.
EXO 14:31 యెహోవా ఈజిప్టు వాళ్లను ఓడించినప్పుడు ఆయన మహత్తర శక్తిని ఇశ్రాయేలు ప్రజలు చూశారు. అందుచేత ప్రజలు యెహోవాకు భయపడి ఆయనను ఘనపర్చారు. యెహోవాను, ఆయన సేవకుడైన మోషేను నమ్మారు.
EXO 15:1 అప్పుడు మోషే, అతనితో బాటు ఇశ్రాయేలు ప్రజలూ యెహోవాకు ఈ పాట పాడటం మొదలు పెట్టారు. “యెహోవాను గూర్చి నేను గానం చేస్తాను. ఆయన గొప్ప కార్యాలు చేసాడు గనుక గుర్రాలను, రౌతులను ఆయనే సముద్రంలో పడవేసాడు.
EXO 15:2 యెహోవా నా బలం, నన్ను రక్షించేది ఆయనే ఆయన్ను గూర్చి నేను స్తుతిగీతాలు పాడుకొంటాను. యెహోవా నా దేవుడు, ఆయన్ను నేను స్తుతిస్తాను. నా పూర్వీకుల దేవుడు యెహోవా ఆయన్ని నేను ఘనపరుస్తాను.
EXO 15:3 వీరుడు ఆయన పేరే యెహోవా.
EXO 15:4 రథాలను అశ్వదళాలను సముద్రంలో పడవేసాడు యెహోవా ఫరో ప్రధాన అధికారులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
EXO 15:5 లోతైన జలాలు వారిని కప్పేసాయి లోతు నీటిలో బండల్లా వాళ్లు మునిగిపొయ్యారు.
EXO 15:6 “నీ కుడిచేతిలో ఆశ్చర్యం కలిగించేటంత బలం ఉంది. ప్రభూ, నీ కుడిచేయి శత్రువును పటాపంచలు చేసింది.
EXO 15:7 నీకు వ్యతిరేకంగా నిలిచిన వారిని నీ మహా ఘనత చేత నాశనం చేసావు గడ్డిని తగుల బెట్టినట్టు నీ కోపం వారిని నాశనం చేసింది.
EXO 15:8 నీవు విసరిన పెనుగాలి నీళ్లను ఉవ్వెత్తున నిలిపేసింది వేగంగా ప్రవహించే నీళ్లు గట్టి గోడలా అయ్యాయి సముద్రం, దాని లోపలి భాగాలవరకు గడ్డ కట్టెను.
EXO 15:9 “శత్రువు, ‘నేను వాళ్లను తరిమి పట్టుకొంటాను వాళ్ల ఐశ్వర్యాలన్నీ దోచుకొంటాను నేను నా కత్తి ప్రయోగించి, వాళ్ల సర్వస్వం దోచుకొంటాను సర్వం నా కోసమే నా చేతుల్తో దోచుకొంటాను’ అని అన్నాడు.
EXO 15:10 కానీ నీవు వాళ్లు మీదకి గాలి రేపి సముద్రంతో వాళ్లను కప్పేసావు సముద్ర అగాధంలో సీసం మునిగిపోయినట్టు వాళ్లు మునిగిపొయ్యారు.
EXO 15:11 “యెహోవా, నీలాంటి పరాక్రమముగల దేవుడు మరొకడు లేడు పరిశుద్ధతలో నీవు గొప్పవాడవు. స్తుతి కీర్తనలతో ఆరాధించబడుటకు యోగ్యుడవు ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీకు సాటి వేరెవ్వరూ లేరు.
EXO 15:12 నీ కుడి హస్తాన్ని పైకెత్త ప్రపంచాన్నే నాశనం చేయగలవు!
EXO 15:13 నీవు రక్షించిన ప్రజల్ని నీ దయతో నీవు నడిపిస్తావు ఉల్లాసకరమైన నీ పవిత్ర దేశానికి నీ బలంతో నీవు వీళ్లను నడిపిస్తావు.
EXO 15:14 “ఈ గాథను ఇతర జన సమూహాలు వింటారు ఎంతైనా వాళ్లు భయపడ్తారు. ఫిలిష్తీ ప్రజలు భయంతో వణకిపోతారు.
EXO 15:15 తరువాత ఎదోము నాయకులు భయంతో వణకిపోతారు. మోయాబు నాయకులు భయంతో వణకిపోతారు. కనాను ప్రజలు తమ ధైర్యం కోల్పోతారు.
EXO 15:16 ఆ ప్రజలు నీ బలాన్ని చూచి భయంతో నిండిపోతారు యెహోవా ప్రజలు దాటి పొయ్యేంత వరకు ఆ ప్రజల్ని నీవు దాటించేంత వరకు వాళ్లు బండలా మౌనంగా ఉండిపోతారు.
EXO 15:17 యెహోవా నీవు నీ సింహాసనం కోసం సిద్ధం చేసిన నీ పర్వతానికి నీ ప్రజల్ని నడిపిస్తావు ఓ ప్రభో, నీ హస్తాలతో నీ ఆలయాన్ని నిర్మించు
EXO 15:18 “యెహోవా శాశ్వతంగా సదా ఏలునుగాక!”
EXO 15:19 ఫరో గుర్రాలు, రౌతులు, రథాలు సముద్రంలోకి వెళ్లిపొయ్యాయి. సముద్ర జలాలతో యెహోవా వాళ్లను కప్పేసాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు పొడి నేల మీద సముద్రంలో నడిచివెళ్లారు.
EXO 15:20 అప్పుడు అహరోను సోదరి, మహిళా ప్రవక్తి మిర్యాము తంబుర పట్టుకొంది. మిర్యాము, మిగతా స్త్రీలు పాటలు పాడుతూ నాట్యం చేయడం మొదలు పెట్టారు. మిర్యాము ఈ మాటనే మరల మరల పల్లవిగా పలికింది,
EXO 15:21 “ఆయన గొప్ప కార్యాలు చేసాడు గనుక యెహోవాకు గానం చేయండి గుర్రాలను, దాని రౌతులను ఆయన సముద్రంలో పడవేసాడు.”
EXO 15:22 మోషే మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం నుండి దూరంగా నడిపిస్తూనే ఉన్నాడు. ప్రజలు షూరు ఎడారిలోకి వెళ్లారు. ఎడారిలో మూడు రోజులు వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలకు నీళ్లు ఏవీ దొరకలేదు.
EXO 15:23 మూడురోజుల తర్వాత ప్రజలు మారాకు ప్రయాణమై వెళ్లారు. మారాలో నీళ్లున్నాయి గాని అవి త్రాగలేకపోయారు. ఆ నీళ్లు త్రాగలేనంత చేదుగా ఉన్నాయి. అందుకే ఆ స్థలానికి మారా అని పేరు.
EXO 15:24 ప్రజలు మోషేకు ఫిర్యాదు చేయటం మొదలు బెట్టారు, “ఇప్పుడు మేము ఏమి త్రాగాలి?” అన్నారు ప్రజలు.
EXO 15:25 మోషే యెహోవాకు మొర పెట్టాడు. యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టును నీళ్లలో వేసాడు. అతను యిలా చేయగానే ఆ నీళ్లు తాగే మంచి నీళ్లయ్యాయి. ఆ స్థలంలో ప్రజలకు యెహోవా తీర్పు తీర్చి వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆ ప్రజల విశ్వాసాన్ని కూడ యెహోవా పరీక్షించాడు.
EXO 15:26 “మీ యెహోవా దేవునికి మీరు విధేయులు కావాలి. ఆయన ఏవి సరైనవని చెబతాడో వాటిని మీరు చేయాలి. యెహోవా ఆజ్ఞలకు, చట్టానికి మీరు విధేయులైతే, ఈజిప్టు వాళ్లలా మీరు రోగులు అవ్వరు. నేను, యెహోవాను, ఈజిప్టు వాళ్ల మీదకు పంపిన రోగాలు ఏవీ మీ మీదకు పంపించను. నేనే యెహోవాను. మిమ్మల్ని స్వస్థపరచేవాడ్ని నేనే.”
EXO 15:27 అప్పుడు ప్రజలు ఏలీమునకు ప్రయాణమయ్యారు. ఏలీములో 12 నీటి ఊటలు ఉన్నాయి. ఇంకా అక్కడ 70 ఈత చెట్లు ఉన్నాయి. అందుచేత ఆ నీళ్ల దగ్గర వారు బసను ఏర్పాటు చేసుకొన్నారు.
EXO 16:1 తర్వాత ప్రజలు ఏలీము నుండి ప్రయాణం చేసి సీనాయి ఎడారి చేరుకొన్నారు. ఈ స్థలం ఏలీముకి, సీనాయికి మధ్య ఉంది. ఈజిప్టు వదలిన తర్వాత రెండోనెల 15వ రోజున వారు ఈ స్థలానికి వచ్చారు.
EXO 16:2 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ఆ ఎడారిలో వారు మోషే అహరోనులకు ఫిర్యాదు చేసారు.
EXO 16:3 “ఈజిప్టు దేశంలోనే యెహోవా మమ్మల్ని చంపేసి ఉంటే మాకు బాగుండేది. ఈజిప్టులో తినేందుకు మాకు సమృద్ధిగా ఉండేది. మాకు కావాల్సిన భోజనం అంతా మాకు ఉండేది. కానీ ఇప్పుడు నీవు మమ్మల్ని ఈ ఎడారిలోనికి తీసుకొచ్చావు. మేమంతా ఆకలితో ఇక్కడే చస్తాము” అంటూ ప్రజలు మోషే అహరోనులతో చెప్పారు.
EXO 16:4 అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు, “ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాను. ఈ ఆహారం మీరు తినేందుకే. ప్రతిరోజూ ప్రజలు బయటకు వెళ్లి ఆరోజు తాము తినేందుకు ఎంత భోజనం అవసరమో అంతే సమకూర్చు కోవాలి. నేను చెప్పినట్టు ప్రజలు చేస్తారో లేదో చూద్దామని నేను యిలా చేసాను.
EXO 16:5 ఒక్క రోజుకు ఎంత భోజనం సరిపోతుందో సరిగ్గా అంతే ప్రజలు ప్రతిరోజూ తీసుకోవాలి. అయితే శుక్రవారం నాడు ప్రజలు భోజనం సిద్ధం చేసుకొనేటప్పుడు రెండు రోజులకు సరిపడే భోజనం ఉండేటట్టు వారు చూసుకోవాలి.”
EXO 16:6 కనుక మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పారు, “ఈ రాత్రి యెహోవా శక్తి మీరు చూస్తారు. ఈజిప్టు దేశం నుండి ఆయనే మిమ్మల్ని రక్షించాడని మీరు తెలుసుకొంటారు.
EXO 16:7 యెహోవా మహిమను రేపు ఉదయం మీరు చూస్తారు. యెహోవాకు మీరు ఫిర్యాదు చేసారు. ఆయన మా మనవి విన్నాడు. (ఆయన మీకు సహాయం చేస్తాడు) మీరు మా దగ్గర ఫిర్యాదు మీద ఫిర్యాదు చేసారు. మేము ఏ పాటి వారం?”
EXO 16:8 “మీరు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు, యెహోవా మీ ఫిర్యాదులు విన్నాడు. కనుక రాత్రివేళ ఆయన మీకు మాంసం ఇస్తాడు. మీకు అవసరం ఉన్న భోజనం అంతా ప్రతి ఉదయం మీకు ఉంటుంది. నా దగ్గర, అహరోను దగ్గర మీరు ఫిర్యాదు చేస్తూ ఉండినారు. కానీ ఇప్పుడు మేము కొంచెం విశ్రాంతి తీసుకొంటాం. మీరు ఫిర్యాదు చేస్తోంది నా మీద, అహరోను మీద కాదని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు యెహోవాకు విరోధంగా ఫిర్యాదు చేస్తున్నారు” అన్నాడు మోషే.
EXO 16:9 ఆ తర్వాత మోషే అహరోనుతో, “నీవు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు: ‘యెహోవా, మీ ఫిర్యాదులు విన్నాడు గనుక ఆయన ఎదుట సమావేశం అవ్వండి’ అని వారితో చెప్పు అన్నాడు.”
EXO 16:10 అహరోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. వాళ్లంతా ఒక్కచోట చేరారు. అహరోను మాట్లాడుతూ ఉండగా, ప్రజలంతా పక్కకు తిరిగి ఎడారిలోకి చూచారు. యెహోవా మహిమ ఒక మేఘంలా ప్రత్యక్షమవడం వారు చూశారు.
EXO 16:11 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
EXO 16:12 “ఇశ్రాయేలు ప్రజల ఫిర్యాదులు నేను విన్నాను. కనుక నేను చెబతున్న నా మాటలు వారికి చెప్పు. ‘రాత్రివేళ మాంసం మీరు తింటారు. ప్రతి ఉదయం మీకు కావాల్సినంత భోజనం మీరు తింటారు. అప్పుడు మీ యెహోవా దేవుణ్ణి నమ్ముకోవచ్చని మీరు తెలుసుకొంటారు.’”
EXO 16:13 ఆ రాత్రి వారి బస అంతటా పూరీళ్లు (పిట్టలు) వచ్చాయి. (మాంసం కోసం ప్రజలు ఈ పిట్టల్ని పట్టుకొన్నారు) ప్రతి ఉదయం బసకు దగ్గర్లో నేలమీద మంచు కురిసింది.
EXO 16:14 సూర్యోదయం కాగానే ఆ మంచు కరిగిపోయింది. అయితే మంచు పోగానే నేలమీద నూగుమంచు ఉండేది.
EXO 16:15 ఇశ్రాయేలు ప్రజలు అది చూసి “అది ఏమిటి?” అంటూ ఒకళ్లనొకళ్లు ప్రశ్నించుకొన్నారు. ఈ పదార్థం ఏమిటో వారికి అర్థం కాలేదు కనుక వాళ్లు ఈ ప్రశ్న అడిగారు. మోషే వాళ్లతో చెప్పాడు: “మీరు భోజనంచేయడానికి యెహోవా మీకు ఇచ్చిన భోజనం ఇది.
EXO 16:16 ప్రతి వ్యక్తి తనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. మీ కుటుంబంలో ప్రతి వ్యక్తికీ 2 పావుల కొలత ప్రకారం మీలో ఒక్కొక్కరు తీసుకోవాలి అని యెహోవా చెబతున్నాడు.”
EXO 16:17 కనుక ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేసారు. ప్రతి వ్యక్తి ఈ భోజనం కూర్చుకొన్నారు. కొంతమంది మిగతా వాళ్ల కంటె ఎక్కువ కూర్చుకొన్నారు.
EXO 16:18 ఆ ప్రజలు వారి కుటుంబంలో ప్రతివొక్కరికీ ఆ భోజనం పెట్టారు. ఆ భోజన పదార్థం కొలుచుకొన్నప్పుడల్లా, ప్రతి వ్యక్తికీ సరిపడ్డంత మాత్రమే ఉండేది. కాని ఎన్నడూ ఎక్కువ మిగిలేది కాదు. ప్రతి వ్యక్తీ తాను, తన కుటుంబం ఎంత తినగలరో సరిగ్గా అంతే తీసుకొన్నారు.
EXO 16:19 “రేపటికోసం ఆ భోజనం దాచుకోకండి” అని మోషే వారితో చెప్పాడు.
EXO 16:20 కానీ ప్రజలు మోషేకు లోబడలేదు. కొంత మంది మర్నాడు తినవచ్చని తమ భోజనంలో కొంత దాచుకొన్నారు. అలా దాచుకొన్న భోజనం పురుగులు పట్టేసి, కంపు కొట్టేసింది. ఇలా చేసినవాళ్ల మీద మోషేకు కోపం వచ్చింది.
EXO 16:21 ప్రతి ఉదయం ప్రజలు భోజనం కూర్చుకొన్నారు. ప్రతి వ్యక్తీ తాను తిన గలిగినంత కూర్చుకొన్నాడు. అయితే, ఎండ ఎక్కువ కాగానే ఆహారం కరిగిపోయి కనబడకుండా పోయింది.
EXO 16:22 శుక్రవారంనాడు, రెండంతల ఆహారం ప్రజలు కూర్చుకొన్నారు. ఒక్కొక్క మనిషికి 4 పావుల ప్రకారం వారు కూర్చుకొన్నారు. కనుక ప్రజానాయకులు మోషే దగ్గరకు వచ్చి ఈ విషయం తెలియజేసారు.
EXO 16:23 “ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు. ఎందుచేత? రేపు సబ్బాతు కనుక. అది యెహోవాకు ప్రత్యేకంగా విశ్రాంతి రోజు. ఈరోజు వండుకోవాల్సిన భోజనం అంతా వండుకోండి, అయితే మిగతా భోజనం రేపు ఉదయానికి దాచుకోండి” అన్నాడు మోషే వాళ్లతో.
EXO 16:24 కనుక ప్రజలు ఆ భోజనంలో మిగిలినదాన్ని మర్నాటికోసం దాచుకొన్నారు. ఆ భోజనంలో ఏమీ చెడిపోలేదు. అందులో కొంచెము కూడా పురుగుపట్టలేదు.
EXO 16:25 శనివారం నాడు ప్రజలతో మోషే ఇలా చెప్పాడు: “ఈవేళ సబ్బాతు, అంటే యెహోవా విశ్రాంతి రోజు. అందుచేత మీలో ఏ ఒక్కరూ బయట పొలాల్లో ఉండకూడదు. నిన్న కూర్చుకొన్న భోజనాన్ని తినండి.
EXO 16:26 ఆరు రోజుల కోసం మీరు ఆహారం కూర్చుకోవాలి. అయితే ఏడోరోజు విశ్రాంతి రోజు కనుక నేల మీద ప్రత్యేక ఆహారం ఏమీ దొరకదు.”
EXO 16:27 శనివారంనాడు ప్రజల్లో కొంతమంది ఆహారం కూర్చుకోవాలని బయటకు వెళ్లారు కాని వారికి ఆహారం ఏమీ కనబడలేదు.
EXO 16:28 అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు. “నా ఆజ్ఞలకు ఉపదేశాలకు లోబడకుండా ఎన్నాళ్లు మీరు తిరస్కరిస్తారు?
EXO 16:29 చూడండి, శనివారం మీకు విశ్రాంతి రోజుగా చేసాడు యెహోవా. అందుచేత రెండు రోజులకు సరిపడేంత ఆహారం శుక్రవారమే యెహోవా మీకు ఇస్తాడు. కనుక శనివారంనాడు మీలో ప్రతి ఒక్కరూ కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి.”
EXO 16:30 కనుక శనివారంనాడు ప్రజలు విశ్రాంతి తీసుకొన్నారు.
EXO 16:31 ఆ ప్రత్యేక ఆహారాన్ని “మన్నా” అని పిలవడం మొదలుబెట్టారు ప్రజలు. మన్నా కొత్తిమెర గింజల్లా చిన్నగా తెల్లగా ఉండి, తేనెపూసిన పూతరేకుల్లా ఉంది.
EXO 16:32 అప్పుడు మోషే అన్నాడు, “నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటికి రప్పించినప్పుడు ఎడారిలో నేను మీకు ఇచ్చిన ఆహారాన్ని మీ సంతానం వాళ్లు చూడ గలిగేటట్టు ఈ ఆహారం 2 పావులు దాచి ఉంచమని యెహోవా చెప్పాడు.”
EXO 16:33 కనుక మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “ఒక పాత్ర తీసుకొని దానిలో 8 పావులు మన్నా నింపు. ఈ మన్నాను మన సంతానం వారి కోసం దాచిపెట్టు”
EXO 16:34 మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. మన్నా పాత్రను ఒడంబడిక పెట్టె ముందర పెట్టాడు అహరోను.
EXO 16:35 40 సంవత్సరాల పాటు ప్రజలు మన్నా తిన్నారు. కనాను దేశ సరిహద్దుల వచ్చేంతవరకు వారు దాన్ని తిన్నారు
EXO 16:36 (మన్నా కొలిచేందుకు వారి ఉపయోగించిన కొలత ఓమెరు. ఓమెరు అంటే ఏపాలో పదో భాగం.)
EXO 17:1 ఇశ్రాయేలు ప్రజలంతా కలసి సీను అరణ్యమునుండి ప్రయాణమయ్యారు. యెహోవా ఆజ్ఞాపించినట్లెల్లా ఒక తావు నుండి మరో తావుకు వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలు రెఫిదీముకు ప్రయాణం చేసి అక్కడ బసచేసారు. అక్కడ ప్రజలు తాగేందుకు నీళ్లు లేవు.
EXO 17:2 కనుక ప్రజలు మోషే మీదికి లేచి, ఆయనతో వాదించటం మొదలు పెట్టారు. “తాగేందుకు నీళ్లు ఇమ్మని” ప్రజలు మోషేను అడిగారు. అయితే మోషే, “మీరెందుకు నామీదికి ఇలా లేచారు? మీరు యెహోవాను ఎందుకు పరీక్షిస్తున్నారు?” (యెహోవా మనతో లేడని మీరనుకొంటున్నారా?) అని వారితో అన్నాడు.
EXO 17:3 కాని ప్రజలు మాత్రం నీళ్ల కోసం చాల దాహంగా ఉన్నారు. అందుచేత వాళ్లు మోషేకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు, “అసలు నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకొచ్చావు? నీళ్లు లేక మేము, మా పిల్లలు, మా పశువులు చావాలని నీవు మమ్మల్ని యిక్కడికి తీసుకొచ్చావా?” అన్నారు ప్రజలు.
EXO 17:4 కనుక మోషే, “ఈ ప్రజల్ని నేనేమి చేయాలి? నన్ను చంపెయ్యటానకి వాళ్లు సిద్ధంగా ఉన్నారు” అంటూ యెహోవాకు మొరబెట్టాడు.
EXO 17:5 మోషేతో యెహోవా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల ముందుకు వెళ్లు. ప్రజల పెద్దలలో (నాయకులు) కొందర్ని నీ వెంట తీసుకొని వెళ్లు. నీ చేతి కర్రను తీసుకొని వెళ్లు. నీవు నైలునదిని కొట్టిన కర్ర యిది.
EXO 17:6 హోరేబులో (సీనాయి పర్వతం) నీ యెదుట ఒక బండమీద నేను నిలబడతాను. కర్రతో ఆ బండను కొట్టు, దానిలో నుండి నీళ్లు వస్తాయి. అప్పుడు ప్రజలు తాగవచ్చు.” మోషే ఈ పనులు చేసాడు, ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) అది చూచారు.
EXO 17:7 మెరీబా అని మస్సా అని ఆ స్థలానికి మోషే పేరు పెట్టాడు. ఎందుచేతనంటే, ప్రజలు తన మీదికి లేచి యెహోవాను పరీక్షించిన స్థలం ఇది. యెహోవా వారితో ఉన్నాడో లేదో తెల్సుకోవాలని ప్రజలు కోరారు.
EXO 17:8 రెఫిదీము వద్ద అమాలేకీ ప్రజలు వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేసారు.
EXO 17:9 కనుక, “కొందరు మనుష్యుల్ని ఏర్పాటు చేసుకొని రేపు వెళ్లి అమాలేకీయులతో యుద్ధం చేయి. నేనేమో కొండ శిఖరం మీద నిన్ను గమనిస్తూంటాను. దేవుడు నాకు ఇచ్చిన కర్రను నేను పట్టుకొని ఉంటాను,” అని యెహోషువాతో మోషే చెప్పాడు.
EXO 17:10 మోషే మాటకు విధేయుడై యెహోవాషువ మర్నాడు అమాలేకీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో మోషే, అహరోను, హూరు అనువారు కొండ శిఖరం మీదికి వెళ్లారు.
EXO 17:11 మోషే తన చేతి కర్రను ఎప్పుడు పైకి ఎత్తితే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం గెలుస్తున్నారు. అయితే మోషే తన చేయి కిందికి దించగానే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోవడం మొదలవుతుంది.
EXO 17:12 కొంచెం సేపయ్యాక, మోషే చేతులు అలసి పోయి (మోషే చేతుల్ని అలానే పైకి ఎత్తి ఉంచే మార్గం చూడాలను కొన్నారు మోషేతో ఉన్న మనుష్యులు) అందుచేత వాళ్లు ఒక పెద్ద బండ తెచ్చి మోషే కూర్చొనేందుకు వేసారు. అప్పుడు అహరోను మోషే చేతుల్ని పైకి ఎత్తి పట్టి ఉంచాడు. మోషేకు ఒకపక్క అహరోను, మరోపక్క హూరు ఉన్నారు. సూర్యుడు అస్తమించే వరకు వారు ఆయన చేతులను అలాగే పట్టి ఉంచారు.
EXO 17:13 కనుక యెహోషువ (అతని మనుష్యులు) అమాలేకీయులను ఆ యుద్ధంలో ఓడించారు.
EXO 17:14 అప్పుడు యెహోవా, “ఈ యుద్ధాన్ని గురించి వ్రాసి ఉంచు. ఇక్కడ ఏమి జరిగిందో అది ప్రజలు జ్ఞాపకం ఉంచుకొనేటట్టు ఈ సంగతులన్నీ ఒక గ్రంథంలో వ్రాసి ఉంచు. అమాలేకీయులను ఈ భూమి మీద నుండి పూర్తిగ నాశనం చేసేస్తానని యెహోవాషువతో తప్పక చెప్పు” అని మోషేతో అన్నాడు.
EXO 17:15 తర్వాత మోషే ఒక బలిపీఠం నిర్మించాడు, “యెహోవా నా ధ్వజం”. అని మోషే దానికి పేరు పెట్టాడు.
EXO 17:16 “యెహోవా సింహాసనం వైపు నేను నా చేతులు ఎత్తాను. కనుక తను ఎప్పుడూ చేసినట్టే, యెహోవా అమాలేకీయులతో పోరాడాడు,” అన్నాడు మోషే.
EXO 18:1 మోషే మామ యిత్రో, మిద్యానులో యాజకుడు. మోషేకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సహాయం చేసిన ఎన్నో విధానాల గూర్చి యిత్రో విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు నడిపించిన విషయం యిత్రో విన్నాడు.
EXO 18:2 దేవుని పర్వతం దగ్గర మోషే ఉన్నప్పుడు మోషే భార్య సిప్పోరాను వెంటబెట్టుకొని, యిత్రో మోషే దగ్గరకు వెళ్లాడు. (సిప్పోరాను మోషే ఇంటికి పంపించినందు చేత ఆమె మోషే వద్ద లేదు)
EXO 18:3 మోషే ఇద్దరు కుమారులను కూడ యిత్రో తన వెంట తీసుకొని వచ్చాడు. “ఒక దేశంలో నేను పరాయివాణ్ణి అని మోషే చెప్పాడు గనుక. మొదటి కుమారునికి గెర్షోము అని పేరు పెట్టాడు.” “నా తండ్రి దేవుడు నాకు సహాయం చేసాడు. ఈజిప్టు రాజు బారినుండి నన్ను రక్షించాడు” అని మోషే అన్నాడు గనుక.
EXO 18:4 మరో కుమారునికి ఎలీయెజరు అని పేరు పెట్టాడు.
EXO 18:5 దేవుని పర్వతం దగ్గర ఎడారిలో మోషే బస చేస్తున్నప్పుడు యిత్రో మోషే దగ్గరకు వెళ్లాడు. మోషే భార్య, అతని ఇద్దరు కుమారులు యిత్రోతోనే ఉన్నారు.
EXO 18:6 (మోషేకు యిత్రో ఒక సందేశం పంపించాడు), “నేను నీ మామ యిత్రోను. నీ భార్యను, నీ ఇద్దరు కుమారులను నేను నీ దగ్గరకు తీసుకొని వస్తున్నాను,” అన్నాడు యిత్రో.
EXO 18:7 కనుక మోషే తన మామగార్ని కలుసు కొనేందుకు బయటకు వెళ్లాడు. మోషే అతని ఎదుట వంగి, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. వాళ్లిద్దరూ వారి వారి క్షేమాన్ని గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తర్వాత ఇంకా మాట్లాడుకొనేందుకు వాళ్లిద్దరూ మోషే గుడారంలోకి వెళ్లారు.
EXO 18:8 ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోవా చేసినదంతా మోషే యిత్రోకు చెప్పాడు. ఫరోకు, ఈజిప్టు ప్రజలకు యెహోవా చేసిన విషయాల్ని గూర్చి మోషే అతనితో చెప్పాడు. దారిలో వారికి కలిగిన సమస్యలన్నిటిని గూర్చీ మోషే చెప్పాడు. కష్టం వచ్చినప్పుడల్లా ఆ ప్రజల్ని యెహోవా ఏ విధంగా రక్షించిందీ, మోషే తన మామగారితో చెప్పాడు.
EXO 18:9 ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన మంచి పనులన్నింటిని గూర్చి విన్నప్పుడు యిత్రో చాలా సంతోషించాడు. ఈజిప్టు వాళ్ల నుండి, ఇశ్రాయేలు ప్రజలను యెహోవా విడుదల చేసినందుకు యిత్రో సంతోషించాడు.
EXO 18:10 యిత్రో అన్నాడు: “యెహోవాను స్తుతించండి. ఈజిప్టు మనుష్యులనుండి ఆయన మిమ్మల్ని విడిపించాడు. ఫరో బారినుండి యెహోవా మిమ్మల్ని రక్షించాడు.
EXO 18:11 ఈజిప్టు వాళ్లంటె నీ ప్రజలు గొప్ప వాళ్లుగా చేయబడిన విధానాన్ని బట్టి దేవుళ్లందరికంటె యెహోవా గొప్ప వాడని ఇప్పుడు నాకు తెలిసింది.”
EXO 18:12 అప్పుడు యిత్రో బలి అర్పణలు, కానుకలు యెహోవాకు సమర్పించాడు. తర్వాత అహరోను, అశ్రాయేలు పెద్దలు (నాయకులు) మోషే మామగారైన యిత్రోతో కలిసి భోజనం చేసేందుకు వచ్చారు. దేవుడ్ని ఆరాధించేందుకు ఒక ప్రత్యేక పద్ధతిగా వారు ఇలా చేసారు.
EXO 18:13 మర్నాడు ప్రజలకు న్యాయం తీర్చాల్సిన ప్రత్యేక పని మోషేకు ఉంది. (అక్కడ చాలామంది ప్రజలున్నారు) అందుచేత ప్రజలు రోజంతా మోషే ఎదుట నిలబడాల్సి వచ్చింది.
EXO 18:14 ప్రజలకు మోషే న్యాయం తీర్చడం యిత్రో చూసాడు, “నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుచేత నీవు ఒక్కడివే న్యాయమూర్తిగా ఉన్నావు? ప్రజలు రోజంతా నీ దగ్గరకు రావడం ఏమిటి?” అన్నాడు అతను.
EXO 18:15 అప్పుడు మోషే తన మామగారితో చెప్పాడు: “ప్రజలు వారి సమస్యల విషయంలో దేవుని నిర్ణయం ఏమిటో నేను అడిగి తెలుసుకోవాలని నన్ను అడిగేందుకు నా దగ్గరకు వస్తారు.
EXO 18:16 ఎవరిది సరిగ్గా ఉందో నేను నిర్ణయిస్తాను. ఈ విధంగా దేవుడి చట్టాన్ని, ఆయన ప్రబోధాల్ని నేను ప్రజలకు ప్రబోధిస్తాను.”
EXO 18:17 అయితే మోషే మామ అతనితో ఇలా అన్నాడు: “నీవు చేస్తోన్న ఈ పని బాగుండలేదు.
EXO 18:18 నీవు ఒక్కడివీ చెయ్యాలంటే, ఇది చాలా పెద్ద పని. దీనివల్ల నీవు అలసిపోతావు. ఇది ప్రజలు కూడ అలసిపొయ్యేటట్టు చేస్తుంది. ఈ పని నీవు ఒక్కడివీ చేయలేవు.
EXO 18:19 నీకు నేను సలహా ఇస్తాను, ఏమి చేయాలో నీకు చెబతాను, దేవుడు నీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తాను. (నీవు చేయాల్సింది ఇది) ప్రజల సమస్యలను గూర్చి నీవు వింటూ ఉండాల్సిందే. ఈ విషయాలను గూర్చి నీవు దేవునితో చెబుతూ ఉండాల్సిందే.
EXO 18:20 దేవుడి కట్టడలను, విధులను నీవు ప్రజలకు బోధించాలి. కట్టడలను ఉల్లంఘించొద్దని ప్రజలను హెచ్చరించు. సరైన జీవిత విధానం ఏమిటో ప్రజలకు చెప్పు. వాళ్లేమి చేయాలో వాళ్లకు చెప్పు.”
EXO 18:21 అయితే, “ప్రజల్లోనుంచి మంచి మనుష్యుల్ని నీవు ఏర్పాటు చేసుకోవాలి. డబ్బుకోసం నిర్ణయాలు మార్చుకోనటువంటి మనుష్యుల్ని ఏర్పాటు చేసుకో.” “వీళ్లను ప్రజల మీద పరిపాలకులుగా చేయి. 1,000 మంది 100 మందికి, 50 మందికి, చివరకి 10 మందికి పైన పరిపాలకులు ఉండాలి.
EXO 18:22 ఈ పరిపాలకుల్ని ప్రజలకు న్యాయం తీర్చనివ్వు. ముఖ్యమైన వ్యాజ్యము ఏదైనా వుంటే అప్పుడు నిర్ణయంకోసం వాళ్లు నీ దగ్గరకు రావచ్చు. అయితే మిగతా వ్యాజ్యాలను వాళ్లే నిర్ణయించవచ్చు. ఈ విధంగా నీకు తేలిక అవుతుంది. పైగా ఈ మనుష్యులు నీ పనిని నీతోబాటు పంచుకొంటారు.
EXO 18:23 నీవు ఈ నీ పనులు చేస్తే, యెహోవాకు ఇష్టమైతే, నీ పని నీవు కొనసాగించటానికి నీకు చేతనవుతుంది. అదే సమయంలో ప్రజలంతా వారి సమస్యలు పరిష్కారమై ఇంటికి వెళ్లగల్గుతారు.”
EXO 18:24 యిత్రో తనకు చెప్పినట్టు మోషే చేసాడు.
EXO 18:25 ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి మంచి మనుష్యుల్ని మోషే ఏర్పాటు చేసాడు. మోషే వాళ్లను ప్రజలమీద నాయకులుగా చేసాడు. 1,000 మంది ప్రజల మీద 100 మంది ప్రజలమీద 50 మంది ప్రజలమీద 10 మంది ప్రజలమీద పరిపాలకులు ఉన్నారు.
EXO 18:26 ఈ పరిపాలకులే ప్రజలకు న్యాయమూర్తులు. ఎప్పుడైనా సరే ప్రజలు తమ వాదాలను ఈ పరిపాలకుల దగ్గరకు తీసుకురావచ్చు. ప్రాముఖ్యమైన వ్యాఖ్యాలను మాత్రమే మోషే పరిష్కారం చేయాల్సి ఉంటుంది.
EXO 18:27 కొద్దికాలం తర్వాత మోషే తన మామ యిత్రోకు వీడ్కోలు చెప్పాడు. యిత్రో తన స్వగృహానికి వెళ్లిపోయాడు.
EXO 19:1 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి ప్రయాణమైన మూడో నెలలో వారు సీనాయి అరణ్యము చేరుకొన్నారు.
EXO 19:2 ప్రజలు రెఫిదీము విడిచి, సీనాయి అరణ్యమునకు వచ్చారు. పర్వత సమీపంలోని అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు బసచేసారు.
EXO 19:3 అప్పుడు మోషే పర్వతం మీద దేవుడి దగ్గరకు వెళ్లాడు. మోషే ఆ పర్వతం మీద ఉన్నప్పుడు, అతనితో దేవుడు ఇలా చెప్పాడు. “యాకోబు మహా వంశమైన ఇశ్రాయేలు ప్రజలకు ఈ విషయాలు చెప్పు:
EXO 19:4 ‘నా శత్రువులకు నేను చేసిన పనులన్నీ మీరు చూసారు. ఈజిప్టు వాళ్లకు నేను ఏమి చేసానో మీరు చూసారు. పక్షిరాజువలె నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి మోసుకొని వచ్చి, నా దగ్గరకు, ఇక్కడికి తీసుకొచ్చాను.
EXO 19:5 కనుక ఇప్పుడు మీరు నా మాటలకు లోబడాలి అంటున్నాను. నా ఒడంబడికను నిలబెట్టండి. మీరు ఇలా చేస్తే, మీరు వా ప్రత్యేకమైన స్వంత ప్రజలుగా ఉంటారు.
EXO 19:6 మీరు ఒక ప్రత్యేక జాతిగా యాజకుల సామ్రాజ్యంగా మీరు ఉంటారు.’ మోషే, నేను నీతో చెప్పిన ఈ విషయాలు ఇశ్రాయేలు ప్రజలతో నీవు తప్పక చెప్పాలి.”
EXO 19:7 కనుక మోషే పర్వతం దిగివచ్చి ప్రజల పెద్దలను (పరిపాలకులను) సమావేశపర్చాడు. వాళ్లతో చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటినీ మోషే ఆ పెద్దలకు చెప్పాడు.
EXO 19:8 ప్రజలంతా కలిసి మాట్లాడారు. “యెహోవా చెప్పిన దానికంతటికీ మేము విధేయులం” అని వారు చెప్పారు. తర్వాత పర్వతం మీద దేవుని దగ్గరకు మోషే వెళ్లాడు. ప్రజలు ఆయనకు విధేయులవుతారు అని మోషే దేవునితో చెప్పాడు.
EXO 19:9 “దట్టమైన మేఘంలో నేను మీ దగ్గరకు వస్తాను. నేను నీతో మాట్లాడుతాను. నేను నీతో మాట్లాడటం ప్రజలంతా వింటారు. నీవు చెప్పే విషయాలు ప్రజలు ఎల్లప్పుడూ నమ్మేటట్టుగా నేను ఈ పని చేస్తాను.” అని యెహోవా మోషేతో చెప్పాడు. అప్పుడు ప్రజలు చెప్పిన సంగతులన్నీ యెహోవాతో చెప్పాడు మోషే.
EXO 19:10 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ప్రత్యేకమైన ఒక సమావేశంగా ప్రజల్ని ఇవ్వాళ రేపు నీవు సిద్ధం చేయాలి. ప్రజలు తమ బట్టలు ఉదుక్కొని
EXO 19:11 మూడో రోజున నా కోసం సిద్ధంగా ఉండాలి. మూడో రోజున సీనాయి పర్వతం మీదికి యెహోవా దిగివస్తాడు. ప్రజలంతా నన్ను చూస్తారు.
EXO 19:12 అయితే ప్రజలు పర్వతానికి దూరంగా ఉండాలని నీవు తప్పక చెప్పాలి. ఒక గీతగీసి ప్రజలు ఆ గీత దాటి రాకుండా చూడు. ఏ మనిషిగాని, జంతువుగాని పర్వతాన్ని తాకినట్లయితే, చంపేయాలి. బాణాలతో, లేక రాళ్లతో కొట్టి చంపేయాలి. కాని అలాంటి వాణ్ణి ఎవరూ ముట్టుకోకూడదు. బూర ఊదేంత వరకు ప్రజలు వేచి ఉండాలి. అప్పుడే వాళ్లు పర్వతం మీదికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వబడుతుంది,” అని మోషేతో యెహోవా చెప్పాడు.
EXO 19:14 కనుక మోషే పర్వతం దిగి కిందికి వెళ్లాడు. ఆయన ప్రజల దగ్గరికి వెళ్లి, ప్రత్యేక సమావేశం కోసం వాళ్లను సిద్ధం చేసాడు. ప్రజలు వాళ్ల బట్టలు ఉదుక్కొన్నారు.
EXO 19:15 అప్పుడు మోషే ప్రజలతో, “ఇంక మూడు రోజుల్లో యెహోవాతో సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. అంతవరకు పురుషులు స్త్రీలను ముట్టుకోగూడదు” అని చెప్పాడు.
EXO 19:16 మూడవ రోజు ఉదయాన పర్వతం మీద ఉరుములు, మెరుపులు వచ్చాయి. దట్టమైన ఒక మేఘం ఆ పర్వతం మీదికి వచ్చింది. ఒక బూర శబ్దం చాల పెద్దగా వినబడింది. ఆ బసలో ఉన్న ప్రజలంతా భయపడిపోయారు.
EXO 19:17 అప్పుడు పర్వతం దగ్గర దేవుణ్ణి కలుసుకొనేందుకు ప్రజలను వారి బసలోనుంచి మోషే బయటకు నడిపించాడు.
EXO 19:18 సీనాయి పర్వతం పొగతో నిండిపోయింది. కొలిమిలోనుంచి లేచినట్టు పొగ ఆ పర్వతం మీద నుండి పైకి లేచింది. యెహోవా అగ్నిలా ఆ పర్వతం మీదికి వచ్చినందువల్ల యిలా జరిగింది. పైగా పర్వతం అంతా వణకడం మొదలయ్యింది.
EXO 19:19 బూర శబ్దం మరింత గట్టిగా మోగింది. దేవునితో మోషే మాట్లాడినప్పుడల్లా ఉరుములాంటి స్వరంతో యెహోవా జవాబిచ్చాడు.
EXO 19:20 సీనాయి కొండ మీదికి యెహోవా దిగి వచ్చాడు. పరలోకంనుంచి ఆ కొండ శిఖరం మీదికి యెహోవా దిగి వచ్చాడు. అప్పుడు మోషేను తనతో కూడ పర్వత శిఖరం మీదికి రమ్మని యెహోవా పిలిచాడు. కనుక మోషే పర్వతం మీదికి వెళ్లాడు.
EXO 19:21 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు కిందికి వెళ్లి, ప్రజలు నాకు సమీపంగా రాకూడదని, నావైపు చూడకూడదని వారితో చెప్పు. వారు కనుక అలా చేస్తే, వారిలో చాల మంది చస్తారు.
EXO 19:22 నాకు సమీపంగా వచ్చే యాజకులు ఈ ప్రత్యేక సమావేశం కోసం వారిని సిద్ధం చేసుకోవాలని వారితో చెప్పు. వారు ఇలా చేయకపోతే, నేను వాళ్లను శిక్షిస్తాను” అని చెప్పాడు.
EXO 19:23 కానీ మోషే యెహోవాతో “ప్రజలు పర్వతం మీదికి రాలేరు. ఒక గీత గీయమని, ప్రజల్ని ఆ గీత దాటి పవిత్ర స్థలం దగ్గరకు రానివ్వవద్దని నీవే మాకు చెప్పావు” అని అన్నాడు.
EXO 19:24 యెహోవా మోషేతో, “కింద ప్రజల దగ్గరకు వెళ్లి, అహరోనును తీసుకొనిరా. అతణ్ణి నీతోపాటు తీసుకొనిరా, కాని యాజకుల్ని, ప్రజల్ని, రానివ్వవద్దు. వాళ్లు నాకు సమీపంగా వస్తే, నేను వాళ్లను శిక్షిస్తాను” అన్నాడు.
EXO 19:25 మోషే ప్రజల దగ్గరకు కిందికి వెళ్లి, ఈ సంగతులు వారితో చెప్పాడు.
EXO 20:1 అప్పుడు మోషేతో దేవుడు ఈ మాటలు చెప్పాడు:
EXO 20:2 “నేను మీ దేవుణ్ణి. యెహోవాను. ఈజిప్టు దేశం నుండి నేనే మిమ్మల్ని బయటికి రప్పించాను. బానిసత్వం నుండి నేనే మిమ్మల్ని విడుదల చేసాను. (కనుక ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి)
EXO 20:3 “నేను గాక వేరే దేవుళ్లు ఎవ్వరినీ మీరు ఆరాధించకూడదు.
EXO 20:4 “విగ్రహాలు ఏవీ మీరు చేయకూడదు పైన ఆకాశానికి సంబంధించింది గాని, క్రింద భూమికి సంబంధించిందిగాని, భూమి క్రింద నీళ్లకు సంబంధించిందిగాని, దేని విగ్రహాన్ని లేక పటాన్ని చేయవద్దు.
EXO 20:5 ఎలాంటి విగ్రహాల్నీ పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే, యెహోవాను నేనే మీ దేవుణ్ణి. నేను నా ప్రజలు వేరే దేవుళ్లను పూజించటాన్ని ద్వేషిస్తాను. ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడు. ఆ వ్యక్తి సంతానాన్ని మూడు, నాలుగు తరాల వరకు నేను శిక్షిస్తాను.
EXO 20:6 అయితే నా ఆజ్ఞలను ప్రేమించి, విధేయులయ్యే ప్రజలకు వేల తరాలవరకు నేను ఎంతో దయ చూపిస్తాను.
EXO 20:7 “మీ దేవుడైన యెహోవా పేరును మీరు తప్పుగా ప్రయోగించకూడదు. ఒక వ్యక్తి గనుక యెహోవా పేరును తప్పుగా ప్రయోగిస్తే, ఆ వ్యక్తి దోషి. యెహోవా అతణ్ణి నిర్దోషిగా చేయడు.
EXO 20:8 “సబ్బాతును ఒక ప్రత్యేక రోజుగా ఉంచుకోవడం మరచిపోవద్దు.
EXO 20:9 వారానికి ఆరు రోజులు మీరు మీ పని చేసుకోవచ్చు.
EXO 20:10 అయితే, యెహోవా గౌరవార్థం ఏడవరోజు విశ్రాంతి రోజు కనుక ఆ రోజు ఏ వ్యక్తీ పని చేయకూడదు. అంటే మీరు, మీ కొడుకులు, కూతుళ్లు, మీ ఆడ, మగ బానిసలు, చివరికి మీ జంతువులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు కూడాను.
EXO 20:11 ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని వాటిలో ఉండే సమస్తాన్ని చేసాడు. ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకొన్నాడు. ఈ విధంగా ఏడవరోజును యెహోవా ఆశీర్వదించాడు. దాన్ని చాలా ప్రత్యేకమైన రోజుగా యెహోవా చేసాడు.
EXO 20:12 “నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చే దేశంలో నీకు పూర్తి ఆయుష్షు ఉండేటట్టుగా నీవు ఇలా చేయాలి.
EXO 20:13 “నీవు ఎవ్వరినీ హత్య చేయకూడదు.
EXO 20:14 “వ్యభిచార పాపం నీవు చేయకూడదు.
EXO 20:15 “నీవు దొంగతనం చేయకూడదు.
EXO 20:16 “నీ పొరుగువాళ్ల విషయంలో నీవు అబద్ధాలు చెప్పకూడదు.
EXO 20:17 “ఇతరుల వస్తువుల్ని నీవు తీసుకోవాలని ఆశ పడకూడదు. నీ పొరుగు వాడి ఇంటిని, లేక వాని భార్యను, లేక వాని ఆడ, మగ సేవకులను, లేక వాని ఆవులను, లేక అతని గాడిదలను తీసుకోవాలని నీవు ఆశపడకూడదు. నీ పొరుగువానికి చెందినది ఏదీ తీసుకోవాలని నీవు ఆశపడకూడదు.”
EXO 20:18 ఇంతసేపూ లోయలో ప్రజలు కొండమీది ఉరుము శబ్దం వింటూనే ఉన్నారు. మెరుపులు చూస్తునే ఉన్నారు. కొండమీద నుండి పొగ లేవడం వారు చూసారు. ప్రజలు భయపడి వణకిపోయారు. వాళ్లు కొండకు దూరంగా నిలబడి గమనించారు.
EXO 20:19 అప్పుడు ప్రజలు మోషేతో “నీవు మాతో మాట్లాడాలంటే మేము వింటాం. కాని దేవుణ్ణి మాత్రం మాతో మాట్లాడనివ్వకు. అలా జరిగితే మేము చస్తాము,” అని చెప్పారు.
EXO 20:20 అప్పుడు మోషే, “తాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని రుజువు చేయడానికే, యెహోవా వచ్చాడు. మీరు పాపం చేయకుండా ఉండేలా మీరు ఆయనను గౌరవించాలని ఆయన కోరుతున్నాడు” అని ప్రజలకు చెప్పాడు.
EXO 20:21 దేవుడువున్న దట్టమైన మేఘం దగ్గరకు మోషే వెళుతోంటే, ప్రజలు ఆ కొండకు దూరంగా నిలబడ్డారు.
EXO 20:22 అప్పుడు ఈ సంగతులు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమని యెహోవా మోషేతో చెప్పాడు. “ఆకాశం నుండి నేను మీతో మాట్లాడటం మీరు చూసారు.
EXO 20:23 కనుక మీరు బంగారంతోగాని, వెండితోగాని నాకు పోటీగా విగ్రహాలు చేసుకోకూడదు. ఈ అబద్ధపు దేవుళ్లను మీరు చేసుకోకూడదు.
EXO 20:24 “నా కోసం ఒక ప్రత్యేక బలిపీఠం చేయండి. ఈ బలిపీఠం చేయడానికి మట్టి ఉపయోగించండి. ఈ బలిపీఠం మీద దహనబలులు, సమాధాన బలులు, బలిగా నాకు అర్పితం చేయండి. ఇలా చేయటానికి మీ గొర్రెల్ని, పశువుల్ని వాడుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను మీకు చెప్పే ప్రతి చోటా మీరు యిలా చేయాలి. అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
EXO 20:25 మీరు బండలతో బలిపీఠం కడితే, చెక్కబడిన బండలతో దానిని కట్టవద్దు. ఎందుకంటే, పనిముట్లతో మీరు పని చేసినప్పుడు మీరు దానిని అపవిత్రం చేస్తారు. బండల మీద మీరు ఏవైనా పని ముట్లు ప్రయోగిస్తే, ఆ బలిపీఠాన్ని నేను అంగీకరించను.
EXO 20:26 బలిపీఠం మీదికి వెళ్లేందుకు మీరు మెట్లు చేయకూడదు. అలా మెట్లు ఉంటే, ప్రజలు బలిపీఠం వైపుకి చూసినప్పుడు మీ దిగంబరత్వం అంతా వారికి కనబడుతుంది.”
EXO 21:1 (అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు), “ఇవి నీవు ప్రజలకు ఇవ్వాల్సిన మిగతా ఆజ్ఞలు:
EXO 21:2 “హీబ్రూ బానిసను కనుక నీవు కొంటే, ఆ బానిస ఆరు సంవత్సరాలు మాత్రమే నీ సేవ చేయాలి. ఆరు సంవత్సరాల తర్వాత వాడు స్వతంత్రుడవుతాడు. వాడు చెల్లించాల్సింది ఏమీ ఉండదు.
EXO 21:3 ఆ వ్యక్తి నీకు బానిస అయినప్పుడు పెళ్లిగాకుండా ఉంటే అతడు స్వతంత్రుడయినప్పుడు భార్యలేని వానిగానే నీ దగ్గర్నుండి వెళ్తాడు. అయితే అతడు నీకు బానిస అయినప్పుడు పెళ్లయిన వాడైతే, అతడు విడదల చేయబడినప్పుడు తన భార్యను తనతో ఉంచుకొంటాడు.
EXO 21:4 బానిస బ్రహ్మచారి అయితే యజమాని అతనికి ఒక భార్యను ఇవ్వవచ్చు. ఆ భార్యకు కొడుకులు, కూతుళ్లు పుడితే, ఆ స్త్రీ, ఆమె పిల్లలు యజమానికి చెందుతారు. ఆ బానిస సేవాకాలం తీరిపోతే, అప్పుడు అతడు విడుదల చేయబడతాడు.”
EXO 21:5 “అయితే ఒక వేళ ఆ యజమాని దగ్గరే ఉండిపోవాలని బానిస తీర్మానించుకొంటే, ‘నా యజమాని అంటే నాకు ప్రేమ. నా భార్య పిల్లల మీద నాకు ప్రేమ కనుక నాకు స్వతంత్రం అక్కర్లేదు, నేను ఇలాగే ఉండిపోతాను’ అని అతడు తప్పక చెప్పాలి.
EXO 21:6 ఇలా కనుక జరిగితే యజమాని ఆ బానిసను దేవుని దగ్గరకు తీసుకరావాలి. తలుపు దగ్గరకు గాని, ద్వార బంధం దగ్గరకు గాని యజమాని ఆ బానిసను తీసుకు రావాలి. యజమాని ఏదైనా పదునుగల పరికరాన్ని ప్రయోగించి, ఆ బానిస చెవికి రంధ్రం చేయాలి. అప్పుడు బానిస జీవితాంతం ఆ యజమానినే సేవిస్తాడు.”
EXO 21:7 “ఒకడు తన కూతుర్ని బానిసగా అమ్మి వేయాలని నిర్ణయించవచ్చు. ఇలా కనుక జరిగితే, ఆమెను విడుదల చేసేందుకు సంబంధించిన నియమాలు మగ బానిసలను విడుదల చేసే నియమాల్లాంటివి కావు.
EXO 21:8 ఆ స్త్రీ విషయం యజమానికి ఇష్టం లేకపోతే అతడు ఆ స్త్రీని తిరిగి తన తండ్రికి అమ్మివేయవచ్చును. ఒకవేళ ఆ స్త్రీని పెళ్లి చేసుకొంటానని ఆ యజమాని వాగ్దానం చేసి ఉంటే, ఇతరులకు ఆ స్త్రీని అమ్మివేసే అధికారం అతను కోల్పోతాడు.
EXO 21:9 ఆ యజమాని తన కుమారుణ్ణి పెళ్లి చేసుకోవచ్చని వాగ్దానం చేసి ఉంటే, అప్పుడు ఆమె బానిసగా ఎంచబడదు. ఒక కూతురిగా ఆమె చూడబడుతుంది.”
EXO 21:10 “ఒకవేళ యజమాని మరో స్త్రీని పెండ్లాడితే, మొదటి స్త్రీకి భోజనం, బట్ట, అతడు తక్కువ చేయకూడదు. ఆమెకు ఏవేవి అనుభవించటానికి పెళ్లిద్వారా హక్కు లభించిందో వాటన్నిటినీ అతడు ఆమెకు ఇస్తూనే ఉండాలి.
EXO 21:11 ఈ మూడింటినీ మగవాడు ఆమె కోసం చేయాలి. అతడు చేయకపోతే, ఆమెకు ఏ ఖర్చూ లేకుండానే ఆమె విడుదల చేయబడుతుంది. ఆమె అతడకి డబ్బు ఏమీ రుణపడి ఉండదు.”
EXO 21:12 “ఒకడు ఎవరినైనా కొట్టి చంపితే, వాడిని కూడ చంపెయ్యాలి.
EXO 21:13 అయితే ఏదైనా ప్రమాదం జరిగి, ఏ పధకం వెయ్యకుండానే ఒకడు మరొకడ్ని చంపితే, అది దేవుడు జరుగనిచ్చినదే అవుతుంది. భద్రతకోసం ప్రజలు పారిపోయేందుకు ప్రత్యేక స్థలాలు కొన్నింటిని నేను ఏర్పాటు చేస్తాను. కనుక ఆ వ్యక్తి వీటిలో ఒక చోటికి పారిపోవచ్చు.
EXO 21:14 ఒకడు మరొకని మీద కోపంతో, లేక ద్వేషంతో చంపడానికి పధకం వేస్తే, అలాంటి హంతకుడు శిక్షించబడాలి. వానిని నా బలిపీఠం నుండి దూరంగా తీసుక పోయి చంపేయాలి.”
EXO 21:15 “ఎవడైనా తన తండ్రిని గాని, తల్లినిగాని కొడితే వానిని చర పేయ్యాలి.”
EXO 21:16 “బానిసగా అమ్మేందుకు, లేక తనకు బానిసగా ఉండేందుకు ఎవరైనా మరొకడ్ని ఎత్తుకుపోతే, ఆ వ్యక్తిని చంపెయ్యాలి.”
EXO 21:17 “ఎవరైనా తన తండ్రిని లేక తల్లిని శపిస్తే ఆ వ్యక్తిని చంపెయ్యాలి.”
EXO 21:18 “ఇద్దరు వ్యక్తులు జగడమాడుకొని, వారిలో ఒకడు రాతితో గాని, పిడికిలితో గాని మరొకనిని కొడితే, (అలాంటివాడిని ఎలా శిక్షిస్తావు?) దెబ్బ తగిలిన వాడు చావకపోతే, అతడ్ని దెబ్బకొట్టి వాణ్ణి చంపకూడదు.
EXO 21:19 అయితే దెబ్బ తిన్నవాడు కొన్నాళ్లపాటు పడక మీద ఉండాల్సివస్తే, అతణ్ణి కొట్టినవాడే అతణ్ణి పోషించాలి. అతణ్ణి కొట్టినవాడే అతనికి కలిగిన సమయం నష్టానికి పరిహారం చెల్లించాలి. అతడు పూర్తిగా బాగయ్యేవరకు ఆ వ్యక్తి అతణ్ణి పోషించాలి.
EXO 21:20 “కొన్నిసార్లు ప్రజలు తమ ఆడ లేక మగ బానిసలను కొడతారు. అలా కొట్టినతర్వాత బానిస చస్తే, హంతకుడు శిక్షించబడాలి.
EXO 21:21 అయితే బానిస చావకుండా, కొన్ని రొజుల తర్వాత బాగైతే, అప్పుడు ఆ వ్యక్తి శిక్షించబడడు. ఎందుకంటే, బానిసకోసం యజమాని డబ్బు చెల్లించాడు గనుక బానిస అతనికే చెందుతాడు.”
EXO 21:22 “ఇద్దరు మగవాళ్లు పోట్లాడుకొంటునప్పుడు ఒక గర్భవతికి దెబ్బ తగలవచ్చు. ఒకవేళ ఆమె ప్రసవించినా ఆమెకు తీవ్రంగా దెబ్బ తగలకపోతే, ఆమెకు దెబ్బ తగిలించినవాడు డబ్బు చెల్లించాలి. అతడు ఎంత డబ్బు చెల్లించాలి అనే విషయం ఆమె భర్త నిర్ణయిస్తాడు. ఆ నష్టం మొత్తం ఎంత అనేది నిర్ణయించడంలో న్యాయాధిపతులు అతనికి సహాయం చేస్తారు.
EXO 21:23 అయితే, ఆ స్త్రీకి తీవ్రంగా దెబ్బ తగిలితే ఆమెను కొట్టినవాడు శిక్షించబడాలి. ఒక వ్యక్తి చంపబడితే, ఆ వ్యక్తిని చంపిన వాణ్ణి చంపెయ్యాలి. ఒకడి ప్రాణానికి బదులుగా మరొకడి ప్రాణం తియ్యాలి.
EXO 21:24 కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, పాదానికి పాదం,
EXO 21:25 వాతకు వాత, గాయానికి గాయం, కోతకు కోత ఉండాలి.”
EXO 21:26 “ఒకడు ఒక బానిస కంటిమీద గుద్దితే, ఆ బానిసకు ఆ కన్ను గుడ్డిదైతే అప్పుడు ఆ బానిస స్వతంత్రుడిగా వెళ్లిపోవచ్చు. అతని కన్ను అతని విడుదలకు వెలఅవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే.
EXO 21:27 ఒకవేళ యజమాని తన బానిస మూతి మీద కొడితే, ఆ బానిసకు ఒక పన్ను ఊడితే ఆ బానిస స్వతంత్రుడుగా వెళ్లిపోవచ్చు. ఆ బానిస విడుదలకు ఆ బానిస పన్ను వెల అవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే,
EXO 21:28 “ఒక వేళ ఒకడి ఎద్దు ఏ పురుషుణ్ణి గాని, స్త్రీనిగాని చంపితే, అప్పుడు ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. ఎద్దును మీరు తినకూడదు. కాని ఎద్దు యజమాని మాత్రం నేరస్తుడు కాడు.
EXO 21:29 అయితే అంతకు ముందు ఆ ఎద్దు ఎవర్నయినా పొడిచి ఉంటే, దాని యజమానికి హెచ్చరిక ఇవ్వబడి ఉంటే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, ఎందుకంటే, ఆ ఎద్దును అతడు కట్టి వెయ్యలేదు. లేక దాని స్థానంలో దాన్ని బంధించలేదు. కనుక ఎద్దును విచ్చలవిడిగా తిరుగనిస్తే, అది ఎవర్నయినా చంపేస్తే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, మీరు ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. తర్వాత యజమానిని కూడ చంపెయ్యాలి.
EXO 21:30 అయితే చనిపోయిన వాని కుటుంబం డబ్బు తీసుకోవచ్చు. ఒకవేళ వారు అలా డబ్బు తీసుకొంటే, ఎద్దు స్వంతదారుడ్ని చంపకూడదు. కాని న్యాయాధిపతి నిర్ణయించిన డబ్బు అతడు చెల్లించాలి.
EXO 21:31 “ఒకరి కొడుకును లేక కూతుర్ని ఎద్దు చంపేస్తే యిదే చట్టాన్ని పాటించాలి.
EXO 21:32 ఒక ఎద్దు ఒక బానిసను గనుక చంపేస్తే, మరొక కొత్త బానిస కోసం యజమానికి ముప్పయి వెండి నాణాలను ఎద్దు స్వంతదారుడు చెల్లించాలి. ఎద్దును మాత్రం రాళ్లతో కొట్టి చంపాలి. మగ బానిసలకు, ఆడ బానిసలకు ఈ చట్టం సమానంగా వర్తిస్తుంది.”
EXO 21:33 “ఒకడు గొయ్యిగాని, బావిగాని తవ్వి మూత పెట్టక పోవచ్చును. మరొకడి జంతువు వచ్చి ఆ గుంటలో పడితే ఆ గుంట స్వంతదారుడు నేరస్తుడు.
EXO 21:34 ఆ గుంట స్వంతదారుడు ఆ జంతువు కోసం డబ్బు చెల్లించాలి. అయితే ఆ జంతువు కోసం అతడు డబ్బు చెల్లించాక అతడు ఆ జంతువు శవాన్ని ఉంచు కొనేందుకు అనుమతి ఇవ్వాలి.
EXO 21:35 “ఒకవేళ ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును చంపేస్తే అప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మివేయాలి. ఆ ఎద్దును అమ్మిన డబ్బు వాళ్లిద్దరూ సగం సగం తీసుకోవాలి, చంపబడ్డ ఎద్దులో కూడ వాళ్లిద్దరికి సగం సగం వస్తుంది.
EXO 21:36 అయితే ఒకని ఎద్దు అంతకు ముందు ఇతరుల జంతువులను పొడిచి ఉంటే, అతని ఎద్దు విషయం ఆ యజమాని బాధ్యుడు. ఒకవేళ అతని ఎద్దు మరొక ఎద్దును చంపేస్తే, ఆ ఎద్దును స్వేచ్ఛగా తిరుగనిచ్చినందుకు అతడు నేరస్థుడు, అతడు ఎద్దుకు బదులు ఎద్దును ఇవ్వాలి. చంపబడిన ఎద్దుకు బదులుగా అతడు తన ఎద్దును ఇవ్వాలి.”
EXO 22:1 “ఒక ఎద్దును లేక గొర్రెను దొంగతనం చేసిన వాడిని నీవు ఎలా శిక్షిస్తావు? వాడు ఆ జంతువును చంపేసినా లేక అమ్మేసినా అతడు దాన్ని తిరిగి ఇవ్వలేడు. కనుక వాడు దొంగిలించిన ఒక్క ఎద్దుకు బదులు అయిదు ఎడ్ల నివ్వాలి. లేక వాడు దొంగతనం చేసిన ఒక్క గొర్రెకు బదులు నాలుగు గొర్రెలు ఇవ్వాలి. దొంగతనానికి అతడు శిక్ష చెల్లించాలి.
EXO 22:2 వాడికి స్వంతది అంటూ ఏమీ లేకపోతే, వాడ్ని బానిసగా అమ్మాలి. అయితే ఆ జంతువు ఇంకా వాని దగ్గరే ఉంటే, దాన్ని, నీవు చూస్తే అప్పుడు వాడు ఆ దొంగిలించిన ప్రతి జంతువుకు బదులుగా రెండు జంతువుల్ని యజమానికి ఇవ్వాలి. ఆ జంతువు ఎద్దు, గాడిద, గొర్రె, ఏదైనా ఫర్వాలేదు.
EXO 22:4 దొంగ రాత్రివేళ ఒక ఇంటికి కన్నము వేయటానికి ప్రయత్నిస్తూండగా చంపబడితే, వాణ్ణి చంపిన నేరం ఎవ్వరి మీదా ఉండదు. అయితే ఇది పగలు జరిగితే వాణ్ణి చంపిన వాడు నేరస్థుడే (దోషి).
EXO 22:5 “ఒకడు తన పొలంలో లేక ద్రాక్షాతోటలో మంట రాజబెడితే, ఆ మంట పాకిపోయి, పక్కవాడి పొలాన్ని లేక ద్రాక్షా తోటను కాల్చివేస్తే అతడు తన శ్రేష్ఠమైన పంటను తన పొరుగువాడికి నష్టపరిహారంగా ఇవ్వాలి.”
EXO 22:6 “ఒకడు తన పొలంలో ముళ్ల పొదలను తగుల బెట్టడానికి మంట పెట్టవచ్చును. కానీ ఆ మంట పెద్దదై పొరుగువాడి పొలాన్ని లేక పొరుగువాడి పొలంలో పండుతున్న ధాన్యాన్ని కాల్చివేస్తే, అప్పుడు ఆ మంటను రాజబెట్టిన వ్యక్తి తాను కాల్చివేసిన వాటికి బదులుగా డబ్బు చెల్లించాలి.
EXO 22:7 “ఒకడు తన డబ్బును లేక ఇంకేవైనా వస్తువుల్ని పొరుగువాని ఇంట్లో దాచి పెట్టమని తన పొరుగువాణ్ణి అడగవచ్చు. ఆ పొరుగువాడి ఇంట్లోనుంచి ఆ డబ్బు లేక వస్తువులు దొంగిలించబడితే, నీవేం చేయాలి? దొంగను పట్టుకొనేందుకు నీవు ప్రయత్నం చేయాలి. నీవు ఆ దొంగను పట్టుకొంటే, అప్పుడు వాడు ఆ వస్తువుల విలువకు రెండంతలు చెల్లించాలి.
EXO 22:8 కానీ ఆ దొంగను నీవు పట్టుకోలేక పోతే, ఆ ఇంటి యజమాని నేరస్థుడైతే, అప్పుడు దేవుడే న్యాయం తీరుస్తాడు. ఆ ఇంటి యజమాని దేవుని ఎదుటకి వెళ్లాలి. అతడే దొంగిలించి ఉంటే దేవుడు న్యాయం తీరుస్తాడు.”
EXO 22:9 “పోయిన ఒక ఎద్దు లేక గాడిద, గొర్రె లేక వస్త్రం లేక ఇంక దేన్నిగూర్చిగానీ ఇద్దరు వ్యక్తులకు ఒడంబడిక కుదరకపోతే, అప్పుడు నీవేం చేయాలి? ‘ఇది నాది’ అని ఒకడంటే, లేదు, ‘ఇది నాది’ అని ఇంకొకడు అంటాడు. ఆ ఇద్దరు మనుష్యులు దేవుని ఎదుటికి వెళ్లాలి. నేరస్థుడు ఎవరో దేవుడే నిర్ణయిస్తాడు. తప్పుచేసిన వాడు ఆ వస్తువు విలువకు రెండంతలు అవతలి వానికి చెల్లించాలి.
EXO 22:10 “తన జంతువు విషయమై శ్రద్ధ పుచ్చుకోవడం ద్వారా తనకు సహాయం చేయమని ఒకడు తన పొరుగు వాణ్ణి అడగవచ్చు. ఈ జంతువు గాడిద కావచ్చు, ఎద్దు కావచ్చు, గొర్రె కావచ్చు. అయితే ఆ జంతువు చనిపోయినా, ఆ జంతువుకు దెబ్బ తగిలినా లేక ఎవరూ చూడకుండా ఆ జంతువును ఇంకెవరైనా తీసుకొనిపోయినా నీవేం చేయాలి?
EXO 22:11 ఆ జంతువును తాను దొంగిలించలేదని ఆ పొరుగువాడు వివరించి చెప్పాలి. ఇదే కనుక సత్యం అయితే, తాను దొంగతనం చేయలేదని ఆ పొరుగువాడు యెహవాకు ప్రమాణం చేయాలి. జంతువు యజమాని ఈ ప్రమాణాన్ని అంగీకరించాలి. ఆ పొరుగువాడు జంతువుకోసం దాని యజమానికి ఏమీ చెల్లించనక్కర్లేదు.
EXO 22:12 అయితే, ఆ పొరుగు వాడు జంతువును దొంగిలిస్తే, అప్పుడు ఆ జంతువు కోసం దాని యజమానికి అతడు విలువ చెల్లించాలి.
EXO 22:13 ఒకవేళ అడవి మృగాలు ఆ జంతువును చంపేస్తే, ఆ పొరుగువాడు దాని శవాన్ని రుజువుగా తీసుకరావాలి. చంపబడ్డ జంతువు కోసం దాని యజమానికి ఆ పొరుగువాడు ఏమీ చెల్లించనక్కరలేదు.
EXO 22:14 “ఒకడు తన పొరుగు వాని దగ్గర దేన్నయినా బదులు తీసుకొంటే దానికి అతడే బాధ్యుడు. ఒకవేళ ఒక జంతువుకు దెబ్బ తగిలినా లేక ఆ జంతువు చచ్చినా, అప్పుడు ఆ పొరుగువాడు దాని యజమానికి వెల చెల్లించాలి. యజమాని స్వయంగా అక్కడ లేడు గనుక ఆ పొరుగువాడే దానికి బాధ్యుడు.
EXO 22:15 అయితే దాని యజమాని ఆ జంతువుతో కూడా ఉంటే, పొరుగువాడు ఏమీ చెల్లించనక్కరలేదు. లేక, ఆ పొరుగువాడు ఆ జంతువుతో పని చేయించుకొనేందుకుగాను డబ్బు చెల్లిస్తోంటే, ఆ జంతువుకు దెబ్బ తగిలినా, అది చచ్చినా, అతడు ఏమీ చెల్లించనక్కర్లేదు. ఆ జంతువును వాడుకొనేందుకు అతడు చెల్లించిన డబ్బే సరిపోతుంది.
EXO 22:16 “పెళ్లికాని పవిత్రమైన ఒక పడుచుదానితే ఒకవేళ ఒకడికి లైంగిక సంబంధం ఉంటే, అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఆమె తండ్రికి అతడు నిండుగా కట్నం యివ్వాలి.
EXO 22:17 అతణ్ణి పెళ్లి చేసుకొనేందుకు ఆమె తండ్రి అంగీకరించకపోయినా, అతడు ఆ డబ్బు చెల్లించాల్సిందే. ఆమె కోసం పూర్తి మొత్తాన్ని అతడు చెల్లించాలి.
EXO 22:18 “నీవు ఏ స్త్రీనీ కూడా మాయపనులు చెయ్యనివ్వకూడదు. ఒకవేళ ఆమె చేస్తే, అలాంటి దాన్ని నీవు బతకనివ్వకూడదు.
EXO 22:19 “నీవు ఎవ్వర్నీ జంతు సంయోగం చెయ్య నియ్యాకూడదు. ఇలా కనుక జరిగితే, ఆ వ్యక్తిని చంపేయాలి.
EXO 22:20 “ఎవడైనా సరే దేవుడు కాని వాడికి బలి అర్పిస్తే, అలాంటివాడ్ని నాశనం చేయాలి. యెహోవా దేవుడు ఒక్కడికే నీవు బలులు అర్పించాలి.”
EXO 22:21 “జ్ఞాపకం ఉంచుకో ఇదివరకు మీరు ఈజిప్టు దేశంలో పరాయివాళ్లు. కనుక మీ దేశంలో ఉండే విదేశీయులలో ఎవర్నీ మీరు మోసం చేయకూడదు. కొట్టగూడదు.
EXO 22:22 “విధవరాండ్రకు, అనాధలకు మీరు ఎన్నడూ ఎట్లాంటి కీడు చేయకూడదు.
EXO 22:23 ఆ విధవరాండ్రకు లేక అనాధలకు మీరు ఏదైనా కీడు చేస్తే అది నాకు తెలుస్తుంది. వారి శ్రమను గూర్చి నేను వింటాను.
EXO 22:24 అంతేకాదు, నాకు చాల కోపం వస్తుంది. కత్తితో నేను మిమ్మల్ని చంపేస్తాను. అప్పుడు మీ భార్యలు విధవరాండ్రయి పోతారు. మీ పిల్లలు అనాధలు అయిపోతారు.
EXO 22:25 “నా ప్రజల్లో ఒకరు పేదవారైతే, నీవు వానికి డబ్బు అప్పిస్తే, ఆ డబ్బుకు నీవు అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. ఆ డబ్బు త్వరగా తిరిగి ఇచ్చి వేయమని నీవు అతణ్ణి తొందర చేయకూడదు:
EXO 22:26 అతడు నీకు బాకీ ఉన్న డబ్బు నీకు చెల్లిస్తాడని ప్రమాణంగా ఎవరైనా ఒకరు తన అంగీని నీకు ఇవ్వవచ్చును. కాని సూర్యాస్తమయం కాకముందే నీవు ఆ అంగీని తిరిగి ఇచ్చివేయాలి.
EXO 22:27 ఒకవేళ ఆ వ్యక్తికి ఆ అంగీ లేకపోతే, తన శరీరాన్ని కప్పుకొనేందుకు అతనికి ఇంకేమీ లేకపోవచ్చును. అతను నిద్రపోయినప్పుడు చల్లబడిపోతాడు. మరి అతడు నాకు మొరబెడితే, అప్పుడు నేను అతని మొర వింటాను. నేను దయగలవాణ్ణి కనుక నేను వింటాను.
EXO 22:28 “నీ దేవుణ్ణిగాని, నీ ప్రజల నాయకులనుగాని నీవు దూషించగూడదు.
EXO 22:29 “కోత కాలంలో నీ మొదటి గింజల్ని, నీ ఫలాల్లో మొదటి రసాన్ని నీవు నాకు ఇవ్వాలి. సంవత్సరాంతం వరకు వేచి ఉండొద్దు. “నీ పెద్దకుమారుల్ని నాకు ఇవ్వు.
EXO 22:30 అలాగే నీ ఆవుల్లో, గొర్రెల్లో, మొదట పుట్టిన వాటిని నాకు ఇవ్వు. అవి ఏడు రోజులు వాటి తల్లితో ఉండవచ్చు. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి.
EXO 22:31 మీరు నా ప్రత్యేక ప్రజలు. కనుక అడవి మృగాలు చంపిన ఏదో ఒకదాని మాంసం మీరు తినవద్దు. చచ్చిన ఆ జంతువులను కుక్కల్ని తిననివ్వండి.
EXO 23:1 “ప్రజలకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పకండి. న్యాయస్థానంలో మీరు సాక్షులుగా ఉంటే, ఒక దుర్మార్గుడు అబద్ధాలు చెప్పేందుకు సహాయం చేయడానికి ఒప్పుకోవద్దు.
EXO 23:2 “మిగిలిన వారంతా చేస్తున్నారనిచెప్పి నువ్వు ఏదీ చేయవద్దు. ఒక గుంపు ప్రజలు తప్పు చేస్తోంటే, నువ్వు వారితో కలువ వద్దు. నువ్వు చెడ్డ పనులు చేసేటట్టు ఆ ప్రజలు నిన్ను ఒప్పించనియ్యవద్దు. సరియైనది, న్యాయమైనది నువ్వు చెయ్యాలి.
EXO 23:3 “ఒక పేదవానికి తీర్పు జరుగుతోంటే, కొన్నిసార్లు అతని విషయంలో జాలిపడి, కొందరు అతణ్ణి బలపరుస్తారు. నువ్వు అలా చేయకూడదు. (అతనిది సరిగ్గా ఉంటేనే బలపర్చు.)
EXO 23:4 “తప్పిపోయిన ఒక ఎద్దును లేక గాడిదను నీవు చూస్తే, దాన్ని దాని యజమానికి నీవు తిరిగి అప్పగించాలి. ఆ యజమాని నీకు శత్రువైనా సరే, నీవు ఇలా చేయాల్సిందే.
EXO 23:5 మోయలేనంత భారం ఉండడం చేత ఒక జంతువు నడవలేక పోతున్నట్టు నీవు చూస్తే, నీవు ఆగి ఆ జంతువుకు సహాయం చేయాలి. ఆ జంతువు నీ శత్రువులలో ఒకనికి చెందినా సరే నీవు దానికి సహాయం చేయాలి.
EXO 23:6 “ఒక పేదవానికి ప్రజలు అన్యాయం చేయ నివ్వకూడదు నీవు. ఇతరులు ఎవరికైనా తీర్చబడినట్టే తీర్పు తీర్చాలి.
EXO 23:7 “ఏదైనా విషయంలో ఒకడు నేరస్థుడు అని నీవు చెబితే, నీవు చాల జాగ్రత్తగా ఉండాలి. ఒకడి మీద అబద్ధపు నిందలు వేయవద్దు. నిర్దోషియైన ఒకడ్ని తాను చేయని పనికి శిక్షగా ఎన్నడూ మరణించనివ్వవద్దు. ఒక నిర్దోషిని చంపేవాడు ఎవడైనా సరే చెడ్డవాడే, ఆ మనిషిని నేను క్షమించను.
EXO 23:8 “ఒకడు తప్పు చేస్తూ నీవు అతనితో ఏకీభవించాలని చెప్పి, నీకు డబ్బు ఇవ్వ జూస్తే, ఆ డబ్బు తీసుకోవద్దు. అలా చెల్లించిన డబ్బు న్యాయమూర్తులు సత్యాన్ని చూడకుండా చేస్తుంది. అలా చెల్లించిన డబ్బు మంచివాళ్లు అబద్ధాలు చెప్పేటట్టు చేస్తుంది.
EXO 23:9 “విదేశీయుని యెడల నీవు ఎన్నడూ తప్పు చేయకూడదు. మీరు ఈజిప్టు దేశంలో నివసించినప్పుడు మీరు పరాయి వాళ్లేనని జ్ఞాపకం ఉంచుకోవాలి. (ఒకడు తన స్వంతంకాని దేశంలో వుంటే వాడికి ఎలా వుంటుందో మీరు అర్థం చేసుకోవాలి.)
EXO 23:10 “విత్తనాలు చల్లి పంటకోసి, ఆరు సంవత్సరాల పాటు భూమిని సాగుచేయండి.
EXO 23:11 అయితే ఏడో సంవత్సరం భూమిని ఉపయోగించకండి. (ఏడో సంవత్సరం భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉండాలి) మీ పొలాల్లో ఏమీ నాటవద్దు. ఒకవేళ అక్కడ ఏవైనా పంటలు పెరిగితే, వాటిని పేద ప్రజలను తీసుకోనివ్వాలి. మిగిలిపోయిన ఆహారాన్ని అడవి మృగాల్ని తిననివ్వాలి మీ ద్రాక్షాతోటలు, ఒలీవ మొక్కలు, తోటల విషయంలో కూడ మీరు అలాగే చేయాలి.
EXO 23:12 “ఆరు రోజులు పని చేయండి. ఏడోరోజున విశ్రాంతి! మీ బానిసలు, ఇతర పని వాళ్లకు దీనివల్ల విశ్రాంతి, మరియు విరామం లభిస్తుంది. మీ ఎడ్లు, మీ గాడిదలకు కూడ విశ్రాంతి దొరుకుతుంది.
EXO 23:13 “ఈ ఆజ్ఞలన్నింటికీ విధేయులు కావాలని మాత్రం ఖచ్చితంగా తెల్సుకోండి. వేరే దేవుళ్లను పూజించకండి. చివరకి వాళ్ల పేర్లు కూడా మీరు పలుకగూడదు.
EXO 23:14 “ప్రతి సంవత్సరం మూడు ప్రత్యేక పండుగలు మీకు ఉంటాయి. ఈ పండుగల రోజుల్లో మీరు నన్ను ఆరాధించటానికి నా ప్రత్యేక స్థలానికి రావాలి.
EXO 23:15 మొదటి పండుగ పులియని రొట్టెల విందు. ఇది నేను మీకు ఆజ్ఞాపించినట్టే ఉంటుంది. ఈ సమయంలో పులియజేసే పదార్థం వినియోగించ కుండా చేయబడ్డ రొట్టెలు మీరు తింటారు. ఇలా ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. అబీబు మాసంలో మీరు దీన్ని చేయాలి. ఎందుకంటే మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన సమయం యిదే. ఆ సమయంలో ప్రతి వ్యక్తి ఒక బలి అర్పణ నాకు తీసుకురావాలి.
EXO 23:16 “రెండోది పెంతుకోస్తు పండగ. ఈ పండుగ వేసవి పూర్వార్ధంలో అంటే మీ పొలాల్లో మీరు నాట్లు వేసిన పంటల కోత మొదలుబెట్టే సమయంలో ఉంటుంది. మూడోది ఆశ్రయాల పండగ. “ఇది ఆకురాలు కాలంలో ఉంటుంది. ఇది మీ పొలాల్లో పంటలన్నీ కూర్చుకొనే సమయంలో ఉంటుంది.
EXO 23:17 “కనుక యెహోవా ప్రభువుతో ఉండేందుకు సంవత్సరానికి మూడుసార్లు పురుషులంతా ఒక ప్రత్యేక స్థలానికి వస్తారు.
EXO 23:18 “నీవు ఒక జంతువును చంపి దాని రక్తం బలిగా అర్పించేటప్పుడు, పులియజేసే పదార్థంతో చేయబడ్డ రొట్టెలు నీవు అర్పించకూడదు. ఈ బలి అర్పణలోని మాంసం మీరు తినేటప్పుడు ఆ మాంసం అంతా ఒక్క రోజులోనే తినెయ్యాలి. మాంసంలో ఏమీ మర్నాటికి మిగల్చకూడదు.
EXO 23:19 “మీరు మీ పంట కూర్చుకొనే కోత కాలంలో మీరు కోసే ప్రతి దానిలో మొదటి భాగం మీ యెహోవా దేవుని ఆలయానికి తీసుకురావాలి. “దాని తల్లి పాలతో ఉడకబెట్టబడిన మేకపిల్ల మాంసాన్ని మీరు తినకూడదు.”
EXO 23:20 దేవుడు యిలా చెప్పాడు: “మీకు ముందర ఒక దేవదూతను నేను పంపుతున్నాను. మీ కోసం నేను సిద్ధం చేసిన చోటుకి ఈ దేవదూత మిమ్మల్ని నడిపించటం జరుగుతుంది.
EXO 23:21 ఈ దేవదూతకు విధేయులుగా వెంబడించండి. ఆయన మీద తిరుగుబాటు చేయవద్దు. ఆయన విషయంలో మీరు చేసే తప్పిదాలను ఈ దేవదూత క్షమించడు. ఆయనలో నా శక్తి ఉంది.
EXO 23:22 ఆయన చెప్పే ప్రతి దానికీ మీరు లోబడాలి. నేను మీతో చెప్పే ప్రతీదీ మీరు చేయాలి. మీ శత్రువులందరికీ నేను వ్యతిరేకంగా ఉంటాను. మీకు వ్యతిరేకంగా ఉండే ప్రతి వ్యక్తికి నేను విరోధినే.”
EXO 23:23 దేవుడు చెప్పాడు: “ఈ దేశంలోనుంచి నా దూత మిమ్మల్ని నడిపిస్తాడు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వేర్వేరు ప్రజల మీదికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. అయితే వీళ్లందర్నీ నేను ఓడిస్తాను.
EXO 23:24 “వాళ్ల దేవుళ్లను పూజించవద్దు. ఆ దేవుళ్లకు ఎన్నడూ సాష్టాంగపడవద్దు. వాళ్ల జీవిత విధానంలో మీరు ఎన్నడూ జీవించకూడదు. వాళ్ల విగ్రహాల్ని మీరు నాశనం చేయాలి. వాళ్ల దేవుళ్లను వాళ్లు జ్ఞాపకం చేసుకొనేందుకు వాళ్లకు తోడ్పడే వాటన్నిటినీ మీరు విరుగగొట్టాలి.
EXO 23:25 మీ యెహోవా దేవుణ్ణి మీరు సేవించాలి. మీరు ఇలా చేస్తే, భోజన పానీయాలు సమృద్ధిగా ఇచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. సర్వరోగాల్నీ మీలోనుండి తొలగించి వేస్తాను.
EXO 23:26 మీ స్త్రీలంతా పిల్లల్ని కనగల్గుతారు. వారి శిశువుల్లో ఏ ఒక్కరూ పుట్టుకలో చావరు. మిమ్మల్ని అందరినీ సుదీర్ఘ ఆయుష్షుతో బ్రతకనిస్తాను.
EXO 23:27 “మీరు మీ శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు నా మహత్తర శక్తిని మీ ముందర పంపిస్తాను. మీరు మీ శత్రువులందర్నీ ఓడించటానికి నేను మీకు సహాయం చేస్తాను. మీకు వ్యతిరేకంగా ఉండే మనుష్యులు యుద్ధంలో కలవరపడిపోయి, పారిపోతారు.
EXO 23:28 మీకు ముందు కందిరీగలను నేను పంపిస్తాను. ఆ కందిరీగలు మీ శత్రువులు పారిపొయ్యేట్టు చేస్తాయి. హివ్వీ ప్రజలు, కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, మీ దేశాన్ని వదిలేస్తారు.
EXO 23:29 అయితే త్వరగా మీ దేశాన్ని విడిచి పెట్టేటట్టు నేను వాళ్లను బలవంతం చేయను. ఇదంతా నేను ఒక్క సంవత్సరంలోనే చేయను. ఆ ప్రజల్ని నేను అంత వేగంగా వెళ్లగొడితే, దేశం ఖాళీగా ఉంటుంది. అలాగైతే అడవి మృగాలు అధికమై దేశాన్ని ఆక్రమించుకొంటాయి. అవి మీకు చాల తొందర కలిగిస్తాయి.
EXO 23:30 కనుక ఆ ప్రజల్ని చాలా నిదానంగా బయటకు వెళ్లగొడతాను. దేశంలోనికి మీరు చొచ్చుకు పోతూనే ఉంటారు. మరి మీరు ఎక్కడికి వెళ్లినా, అక్కడ ఇతర ప్రజలను నేను బలవంతంగా వెళ్లగొట్టేస్తాను.
EXO 23:31 “ఎర్ర సముద్రం నుండి యూఫ్రటీస్ నదివరకు ఉన్న దేశం అంతా నేను మీకు యిస్తాను. ఫిలిష్తీ సముద్రం (మధ్యధరా సముద్రం) పశ్చిమాన సరిహద్దుగాను, అరేబియా ఎడారి తూర్పు సరిహద్దుగాను ఉంటాయి. అక్కడ నివసిస్తున్న ప్రజల్ని మీరు ఓడించేటట్టు చేస్తాను.
EXO 23:32 “ఆ ప్రజల్లో ఎవరితో గాని లేక వారి దేవుళ్లతోగాని మీరు ఎలాంటి ఒడంబడికలూ చేసుకోకూడదు.
EXO 23:33 వాళ్లను మీ దేశంలో ఉండనివ్వవద్దు. మీరు వాళ్లను ఉండనిస్తే, మీరు పాపం చేయటానికి వాళ్లు కారకులు అవుతారు. ఒకవేళ మీరు వాళ్లను ఉండనిస్తే వాళ్లు ఒక ఉరిలా ఉంటారు. మీరేమో వాళ్ల దేవుళ్లను పూజించటం మొదలు పెడతారు.”
EXO 24:1 మోషేతో దేవుడు ఇలా చెప్పాడు: “నీవు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల డెబ్బయి మంది పెద్దలు (నాయకులు) పర్వతం మీదకు వచ్చి అంత దూరంలోనుంచే నన్ను ఆరాధించాలి.
EXO 24:2 అప్పుడు మోషే తాను మాత్రం యెహోవాకు సమీపంగా రావాలి. మిగతా పురుషులు యెహోవాకు సమీపంగా రాకూడదు. మిగతా ప్రజలు పర్వతం మీదకి కూడా రాకూడదు.”
EXO 24:3 కనుక యెహోవా ఇచ్చిన నియమాలు, ఆజ్ఞలు అన్నింటిని గూర్చీ మోషే ప్రజలతో చెప్పాడు. అప్పుడు ప్రజలంతా, “యెహోవా చెప్పిన ఆజ్ఞలు అన్నింటికీ మేము విధేయులమవుతాము” అన్నారు.
EXO 24:4 కనుక యెహోవా ఆజ్ఞలు అన్నింటినీ మోషే రాసాడు. మర్నాటి ఉదయం పర్వతం దగ్గర మోషే ఒక బలిపీఠం నిర్మించాడు. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒకటి చొప్పున పన్నెండు రాళ్లు నిలబెట్టాడు.
EXO 24:5 అప్పుడు బలులు అర్పించటానికి యువకులను మోషే పంపించాడు. దహన బలులుగా, సమాధాన బలులుగా ఎడ్లను ఈ మనుష్యులు అర్పించారు.
EXO 24:6 ఈ జంతువుల రక్తాన్ని మోషే భధ్రం చేసాడు. రక్తంలో సగాన్ని పాత్రల్లో ఉంచాడు మోషే. మిగతా సగం రక్తాన్ని బలిపీఠం మీద ఆయన పోసాడు.
EXO 24:7 ప్రత్యేక ఒడంబడిక రాయబడ్డ పత్రాన్ని మోషే చదివాడు. ఆయన చదువుతోంది ప్రజలంతా వినగలిగేటట్టు మోషే ఆ ఒడంబడిక పత్రం చదివాడు. అప్పుడు ప్రజలు, “యెహోవా మాకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ మేము విన్నాము. వాటికి విధేయులం అయ్యేందుకు మేము ఒప్పుకొంటున్నాము” అన్నారు.
EXO 24:8 తర్వాత బలి అర్పణ రక్తంతో నిండిన పాత్రలను మోషే పట్టుకొన్నాడు. ఆ రక్తాన్ని ప్రజలమీద మోషే చిలకరించాడు “మీతో యెహోవా ఒక ప్రత్యేక ఒడంబడిక చేసాడు అని ఈ రక్తం సూచిస్తుంది. మీకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే ఈ ఒడంబడికను వివరిస్తాయి,” అని ఆయన చెప్పాడు.
EXO 24:9 అప్పుడు మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు పెద్దలు డెబ్బయి మంది పర్వతం మీదకు వెళ్లారు.
EXO 24:10 పర్వతం మీద ఈ మనుష్యులు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూసారు. ఆకాశం అంత నిర్మలంగా కనబడుతున్న నీలంలాటి దేనిమీదనో దేవుడు నిలబడ్డాడు.
EXO 24:11 ఇశ్రాయేలు నాయకులంతా దేవుణ్ణి చూచారు, కాని దేవుడు వాళ్లను నాశనం చేయలేదు. వాళ్లంతా కలిసి తిని తాగారు.
EXO 24:12 “పర్వతం మీద నా దగ్గరకు రా, నా ప్రబోధాలను, ఆజ్ఞలను పలకలుగా ఉన్న రెండు రాళ్ల మీద రాసాను. ఈ ప్రబోధాలు ప్రజలకోసం. ఆ రాతి పలకలను నేను నీకిస్తాను” అని యెహోవా మోషేతో చెప్పాడు.
EXO 24:13 కనుక మోషే, ఆయన సహాయకుడైన యెహోషువ కలసి దేవుని పర్వతం మీదకు వెళ్లారు.
EXO 24:14 మోషే, “మాకోసం ఇక్కడ వేచి ఉండండి. మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము. నేను లేనప్పుడు అహరోను, హోరు మీ దగ్గరే ఉన్నారు. ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ల దగ్గరకు వెళ్లండి,” అని ఆ పెద్దలతో (నాయకులతో) చెప్పాడు.
EXO 24:15 అప్పుడు మోషే పర్వతం మీదికి వెళ్లాడు. ఆ పర్వతాన్ని మేఘం కప్పేసింది.
EXO 24:16 సీనాయి పర్వతం మీద యెహోవా మహిమ దిగివచ్చింది. ఆరు రోజుల పాటు పర్వతాన్ని మేఘం కప్పేసింది. ఏడోరోజున ఆ మేఘంలోనుంచి యెహోవా మోషేతో మాట్లాడాడు.
EXO 24:17 ఇశ్రాయేలు ప్రజలు యెహవా మహిమను చూడగలిగారు. అది ఆ పర్వతం మీద మండుతున్న అగ్నిలా వుంది.
EXO 24:18 అప్పుడు మోషే ఆ పర్వతం మీద యింకా పైకి ఎక్కి మేఘంలోకి వెళ్లాడు. నలభై పగళ్లూ, నలభై రాత్రులు మోషే ఆ పర్వతం మీదే ఉన్నాడు.
EXO 25:1 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
EXO 25:2 “నాకు కానుకలు తీసుకు రమ్మని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. నాకు ఇవ్వాల్సింది ఏమిటి? ప్రతి మనిషి తన హృదయంలో తీర్మానించుకోవాలి. నా కోసం ఈ కానుకల్ని స్వీకరించు.
EXO 25:3 ప్రజల దగ్గర్నుండి నీవు స్వీకరించాల్సిన వాటి జాబితా యిది: బంగారం, వెండి, కంచు,
EXO 25:4 నీలం వస్త్రం, ఊదారంగు వస్త్రం, ఎరుపు వస్త్రం, మేలిమి వస్త్రం, మేక బొచ్చు,
EXO 25:5 గొర్రె చర్మాలు, మేలురకం తోళ్లు, తుమ్మకర్ర
EXO 25:6 దీపాలకు నూనె, ధూపం. ప్రత్యేక అభిషేక తైలానికి సువాసన చేకూర్చే పరిమళ వస్తువులు,
EXO 25:7 ఇంకా లేత పచ్చరాళ్లు, ఏఫోదు మీద లేక న్యాయ తీర్పుపై వస్త్రం మీద పొదిగించడానికి విలువైన రాళ్లు.”
EXO 25:8 (ఇంకా దేవుడు ఇలా అన్నాడు): “నా కోసం ప్రజలు ఒక పవిత్ర స్థలాన్ని నిర్మిస్తారు. అప్పుడు నేను వారి మధ్య నివసిస్తాను.
EXO 25:9 పవిత్ర గుడారం ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. దానిలో ఏమేమి వస్తువులు ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. సరిగ్గా నేను నీకు చూపించినట్టు ఒడంబడిక పెట్టె తయారు చెయ్యి.
EXO 25:10 “తుమ్మకర్ర ఉపయోగించి ఒక ప్రత్యేక పెట్టె తయారు చెయ్యి. ఈ పెట్టె పొడవు 45 అంగుళాల వెడల్పు 27 అంగుళాలు ఎత్తు 27 అంగుళాలు ఉండాలి.
EXO 25:11 ఆ పెట్టెలోపల, బంగారు రేకుతో పెట్టెను కప్పాలి. ఆ పెట్టె చుట్టూ అంచుల మీద బంగారపు నగిషీబద్ద పెట్టాలి.
EXO 25:12 ఆ పెట్టె చుట్టూ మోసేందుకు నాలుగు బంగారు ఉంగరాలను తయారు చెయ్యాలి. ఆ పెట్టెకు ఒక్కోపక్క రెండేసి చొప్పున నాలుగు మూలలా ఆ ఉంగరాలను అమర్చాలి.
EXO 25:13 తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను తయారు చేయాలి. ఈ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం పొదిగించాలి.
EXO 25:14 ఆ పెట్టె మూలల్లో ఉన్న ఉంగరాల గుండా ఆ కర్రలను పెట్టాలి. ఆ పెట్టెను మోసేందుకు ఈ కర్రలను ఉపయోగించాలి.
EXO 25:15 ఈ కర్రలు ఎప్పుడూ వాటి ఉంగరాల్లోనే ఉండాలి. కర్రలను బయటికి తియ్యవద్దు.”
EXO 25:16 దేవుడు అన్నాడు: “నేను ఒడంబడికను నీకు ఇస్తాను. ఆ ఒడంబడికను ఈ పెట్టెలో పెట్టు.
EXO 25:17 ఆ పెట్టెకు ఒక మూత చెయ్యాలి. స్వచ్ఛమైన బంగారంతో దీన్ని చెయ్యాలి. 45 అంగుళాల పొడవు 27 అంగుళాల వెడల్పుతో దీన్ని చెయ్యాలి.
EXO 25:18 తర్వాత రెండు బంగారు కెరూబు దూతలను చేసి ఆ మూతకు రెండుకొనల మీద పెట్టాలి. కొట్టిన బంగారంతో ఈ దూతల్ని చేయాలి.
EXO 25:19 ఆ మూతకు ఒక కొనమీద ఒక దూతను, మరో కొనమీద మరో దూతను ఉంచాలి. మూత, దూతలు అంతా ఒకే వస్తువుగా చేయాలి.
EXO 25:20 కెరూబులు ఒకదానికి ఎదురుగా ఇంకొకటి ఉండాలి. ఆ దూతల ముఖాలు మూత వైపుకు చూస్తూ ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు మూతను అవరించి ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు ఆకాశం వైపు ఎత్తబడి ఉండాలి.
EXO 25:21 “ఒడంబడిక రుజువు నేనే మీకిచ్చాను. ఆ ఒడంబడికను పెట్టెలో పెట్టి, ప్రత్యేక మూతను పెట్టెమీద పెట్టాలి.
EXO 25:22 నేను నిన్ను కలుసుకొనేటప్పుడు ఆ ఒడంబడిక పెట్టె ప్రత్యేక మూత మీద ఉన్న కెరూబు దూతల మధ్యనుండి నేను మాట్లాడుతాను. అక్కడినుండే నేను నా ఆజ్ఞలన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలకు యిస్తాను.
EXO 25:23 “తుమ్మ కర్రతో ఒక బల్ల తయారు చెయ్యాలి. ఈ బల్ల పొడవు 36 అంగుళాలు వెడల్పు 18 అంగుళాలు ఎత్తు 27 అంగుళాలు ఉండాలి.
EXO 25:24 బల్లను స్వచ్ఛమైన బంగారంతో కప్పాలి. దాని చుట్టూ బంగారపు నగిషీబద్ద పెట్టాలి.
EXO 25:25 తర్వాత 4 అంగుళాల, బంగారు నగీషీ బద్దను బల్ల చుట్టూ చేయాలి. ఇది కూడ స్వచ్ఛమైన బంగారంతో చేయాలి.
EXO 25:26 అప్పుడు నాలుగు బంగారు ఉంగరాలు చేసి, బల్ల నాలుగు మూలలా వాటిని ఉంచాలి. ఒక్కో కాలు దగ్గర ఒక్కో ఉంగరం పెట్టాలి.
EXO 25:27 బల్ల పై భాగానికి చుట్టూవున్న నగిషీ బద్దకు సమీపంగా ఉంగరాలను ఉంచాలి. బల్లను మోసే మోత కర్రలను ఈ ఉంగరాలు పట్టి ఉంచుతాయి.
EXO 25:28 మోత కర్రలు చేసేందుకు తుమ్మ కర్రను ఉపయోగించి వాటికి బంగారంతో తాపడం చేయాలి. వాటితో బల్లను మోయాలి.
EXO 25:29 బల్లమీద ఉండే ప్రతి పళ్లెము, గిన్నె స్వచ్ఛమైన బంగారంతో చేయబడాలి. అర్పితాలను పోసేందుకు ఉపయోగించే పాత్రలు, గిన్నెలు స్వచ్ఛమైన బంగారంతో చెయ్యబడి ఉండాలి.
EXO 25:30 ప్రత్యేకమైన రొట్టెను నా యెదుట బల్ల మీద పెట్టాలి. అవి నా యెదుట ఎల్లప్పుడూ అక్కడ ఉండాలి.
EXO 25:31 “అప్పుడు నీవు ఒక దీపస్తంభం చేయాలి. దీపస్తంభంలో ప్రతి భాగాన్నీ సాగకొట్టబడ్డ స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. అందంగా కనబడేటట్టు దీపానికి పూలు చేయాలి. ఈ పూలలో మొగ్గలు, రేకులు స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. ఇవన్నీ దీప స్తంభంతోపాటు ఒకే వస్తువుగా కలిసి ఉండాలి.
EXO 25:32 “దీపస్తంభానికి ఒక పక్క మూడు కొమ్మలు మరో పక్క మూడు కొమ్మలు మొత్తం ఆరు కొమ్మలు ఉండాలి.
EXO 25:33 ఒక్కో కొమ్మకు మూడు పువ్వులు ఉండాలి. ఈ పువ్వులను మొగ్గలు, రేకులుగల బాదం పూలుగా చేయి.
EXO 25:34 దీప స్తంభానికి మరో నాలుగు పూలు చేయి మొగ్గులు, రేకులుగల బాదం పూవుల్లా చేయబడాలి.
EXO 25:35 కాండమునకు ఇరు ప్రక్కల మూడేసి కొమ్మల చొప్పున దీపస్తంభానికి ఆరు కొమ్మలు ఉండాలి. కొమ్మలు కాండంలో కలిసే మూడు చోట్లలో ఒక్కో దాని కింద మొగ్గలు, రేకులు గల ఒక పువ్వును చేయి.
EXO 25:36 పువ్వులు కొమ్మలతో సహా మొత్తం దీపస్తంభం స్వచ్ఛమైన బంగారంతో చేయబడాలి. ఈ బంగారం అంతా సాగకొట్టబడిన ఒకే ముక్కగా ఉండాలి.
EXO 25:37 అప్పుడు దీపస్తంభం మీదకు ఏడు దీపాలు చేయి. ఈ దీపాలు దీపస్తంభం ఉన్న చోట వెలుగునిస్తాయి.
EXO 25:38 ప్రమిదలు, దీపపు వత్తులను తిప్పే పిడి చేసేందుకు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించు.
EXO 25:39 దీపస్తంభం, దానితోబాటు ఉపయోగించే వస్తువులను చేసేందుకు 75 పౌన్ల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించు.
EXO 25:40 ప్రతీది సరిగ్గా నేను నీకు ఆ పర్వతం మీద చూపించిన ప్రకారమే చేసేందుకు చాల జాగ్రత్తపడు.
EXO 26:1 “పది తెరలతో పవిత్ర గుడారం చెయ్యాలి. సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల బట్టతో ఈ తెరలు చేయాలి. రెక్కలుగల కెరూబుల చిత్ర పటాలను ఒక నిపుణుడు తెరలమీద కుట్టాలి.
EXO 26:2 తెరలన్నీ ఒకే కొలతలో తయారు చేయాలి. ప్రతి తెరా 14 గజాల పొడవు 2 గజాల వెడల్పు ఉండాలి.
EXO 26:3 తెరలను రెండు భాగాలుగా కుట్టాలి. అయిదు తెరలను ఒక విభాగానికి, అయిదు తెరలను మరో విభాగానికి కలిపి కుట్టాలి.
EXO 26:4 చివరి తెర అంచుకు ఉంగరాలు కుట్టాలి. ఈ ఉంగరాలు చేసేందుకు నీలము గుడ్డ ఉపయోగించాలి. తెరల రెండు విభాగాల కింది అంచులకు ఉంగరాలు ఉండాలి.
EXO 26:5 మొదటి విభాగంలోని చివరి తెరకు 50 ఉంగరాలు, రెండో విభాగంలోని చివరి తెరకు 50 ఉంగరాలు ఉండాలి.
EXO 26:6 ఈ ఉంగరాలను జత చేయటానికి 50 బంగారు ఉంగరాలు చెయ్యాలి. పవిత్ర గుడారం అంతా ఒక్కటిగా ఉండటానికి ఇది తెరలన్నింటినీ జత చేస్తుంది.
EXO 26:7 “తర్వాత పవిత్ర గుడారాన్ని కప్పేందుకు ఇంకో గుడారాన్ని నీవు చెయ్యాలి. ఈ గుడారం చేయటానికి మేక వెంట్రుకలతో చేయబడ్డ 11 తెరలను ఉపయోగించు.
EXO 26:8 ఈ తెరలన్నీ ఒకే కొలతలో ఉండాలి. అవి 15 గజాలు పొడవు, 2 గజాలు వెడల్పు ఉండాలి.
EXO 26:9 అయిదు తెరలను ఒక విభాగంగా కలిపి కుట్టాలి. తర్వాత మిగిలిన ఆరు తెరలను మరో విభాగంగా కలిపి కుట్టాలి. ఆరో తెరను గుడారం ముందటి భాగాన్ని కప్పేందుకు ఉపయోగించాలి. తలుపులా తెరచుకొనేందుకు వీలుగా దీన్ని చుట్టిపెట్టాలి.
EXO 26:10 ఒక భాగంలోని చివరి తెర అంచుకు 50 కొలుకులు తయారు చెయ్యాలి. మరో విభాగంలోని చివరి తెర కింది అంచుకు కూడ అలానే చెయ్యాలి. మరో విభాగంలోని చివరి తెర కింది అంచుకు కూడ అలానే చెయ్యాలి.
EXO 26:11 అప్పుడు 50 ఇత్తడి ఉంగరాలు చెయ్యాలి. గుడ్డ ఉంగరాలను జతచేయటానికి ఈ ఇత్తడి ఉంగరాలను ఉపయోగించాలి. ఇలా చేయడంవల్ల తెరలన్నీ కలిసి ఒకే గుడారంగా తయారువుతాయి.
EXO 26:12 ఈ తెరలు పవిత్ర గుడారం కంటె పొడవుగా ఉంటాయి. కనుక తెరల్లో కొంత భాగం గుడారం వెనుకగా వేలాడుతుంటాయి.
EXO 26:13 తెర గుడారం ప్రక్కల్లో వేలాడుతుంటుంది. ఇది గుడారాన్ని భద్రంగా ఉంచుతుంది.
EXO 26:14 పవిత్ర గుడారానికి ఇంకా రెండు పైకప్పులు చేయాలి. ఒకటి ఎర్ర రంగు పూసిన పొట్టేలు చర్మంతో చేయాలి. ఇంకొకటి మేలు రకం తోలుతో చెయ్యాలి.
EXO 26:15 “పవిత్ర గుడారం చట్రానికి ఉపయోగించే పలకలను తుమ్మకర్రతో చెయ్యాలి.
EXO 26:16 చట్రాలు 15 అంగుళాల పొడవు, 27 అంగుళాల వెడల్పు ఉండాలి.
EXO 26:17 ప్రతి చట్రం ఒకేలా ఉండాలి. ప్రతి చట్రానికి పక్క పక్కగా రెండేసి పక్కకర్రలు (దిమ్మలో అమర్చేవి) ఉండాలి.
EXO 26:18 పవిత్ర గుడారం దక్షిణ పక్కకు 20 చట్రాలు చేయాలి.
EXO 26:19 ప్రతి చట్రం కింద పెట్టడానికి రెండేసి వెండిదిమ్మలు చేయాలి. కనుక చట్రాలన్నింటికీ 40 వెండిదిమ్మలు నీవు చేయాలి.
EXO 26:20 పవిత్ర గుడారం ఉత్తరదిక్కుకోసం ఇంకా 20 చట్రాలు చెయ్యాలి.
EXO 26:21 అంటే ఒక్కో చట్రానికి రెండేసి చొప్పున చట్రాలకోసం మొత్తం 40 వెండి దిమ్మలు చెయ్యాలి.
EXO 26:22 గుడారం వెనుక పశ్చిమ కొనకు ఇంకా ఆరు చట్రాలు నీవు చేయాలి.
EXO 26:23 మూలల కోసం రెండు చట్రాలు చెయ్యాలి
EXO 26:24 మూలల్లో ఉండే రెండు చట్రాలు జత చేయాలి. రెండుచట్రాలు అడుగు భాగాన జతపర్చబడాలి. పైభాగంలో ఉన్న ఒక ఉంగరం రెండు చట్రాలను జత పరుస్తుంది.
EXO 26:25 కనుక (గుడారం చివరన) మొత్తం ఎనిమిది చట్రాలు ఉంటాయి. ఒక్కో చట్రం కింద రెండు దిమ్మల చొప్పున మొత్తం 16 వెండి దిమ్మలుంటాయి.
EXO 26:26 “పవిత్ర గుడారం చట్రాలకు తుమ్మ కర్రతో అడ్డకమ్ములు చేయాలి. పవిత్ర గుడారం మొదటి ప్రక్కకు అయిదు అడ్డకమ్ములు ఉండాలి.
EXO 26:27 పవిత్ర గుడారం పశ్చిమాన వెనుకవైపు చట్రానికి అయిదు అడ్డకమ్ములు ఉండాలి. పవిత్ర గుడారం పశ్చిమ దిక్కున చట్రానికి అయిదు అడ్డకమ్ములు ఉండాలి. (అంటే పవిత్ర గుడారం వెనుక)
EXO 26:28 అయిదు చట్రాలకు మధ్య ఉండే అడ్డకమ్మి పైనుండి కిందికి సగం సగంగా ఉండాలి. ఈ కొననుండి ఆకొన వరకు చట్రాల గుండా ఈ అడ్డకమ్మి దూర్చబడాలి.
EXO 26:29 చట్రాలను బంగారంతో తాపడం చేయాలి. అడ్డకమ్ములను పట్టి ఉంచడానికి చట్రాలకు ఉంగరాలు చెయ్యాలి.
EXO 26:30 నేను నీకు పర్వతం మీద చూపించినట్టే, పవిత్ర గుడారం నిర్మించు.
EXO 26:31 “సున్నితమైన వస్త్రంతో గుడారం లోపలి భాగం కోసం ప్రత్యేకమైన ఒక తెరను తయారు చెయ్యాలి. నీలం, ఊదా, ఎరుపు రంగు బట్టతో ఈ తెరను తయారు చేయాలి. కెరూబుల చిత్రపటాలను ఈ బట్టమీద కుట్టాలి.
EXO 26:32 తుమ్మ కర్రతో నాలుగు స్తంభాలు చెయ్యి. బంగారు కొక్కేల ఆ నాలుగు స్తంభాలకు అమర్చు. స్తంభాలకు బంగారు తాపడం చెయ్యి. స్తంభాల కింద నాలుగు వెండి దిమ్మలు పెట్టు. తర్వాత తెరను బంగారు కొక్కేల మీద వ్రేలాడదీయి.
EXO 26:33 కొక్కేల మీద తెరను వేలాడ దీసిన తరువాత, ఒడంబడిక పెట్టెను తెర వెనుక పెట్టు. పవిత్ర స్థానాన్ని, మహా పవిత్ర స్థానాన్ని, ఈ తెర వేరుచేస్తుంది.
EXO 26:34 మహా పవిత్ర స్థానంలో ఒడంబడిక పెట్టె మీద మూత పెట్టు.
EXO 26:35 “పవిత్ర స్థానంలో నీవు చేసిన బల్లను తెర అవతలి ప్రక్క పెట్టు. పవిత్ర గుడారంలో ఉత్తరంగా బల్ల ఉండాలి. పవిత్ర గుడారంలో దక్షిణంగా దీపం ఉండాలి. ఇది బల్ల ప్రక్క అడ్డంగా ఉండాలి.
EXO 26:36 “తర్వాత గుడారం ద్వారానికి ఒక తెర చెయ్యి. తెర చేయటానికి నీలం, ఊదా, ఎరుపు బట్టను సున్నితమైన బట్టను ఉపయోగించు. ఆ బట్టలో చిత్రపటాలను అల్లిక చేయాలి.
EXO 26:37 తలుపుపై ఉండే తెరకు బంగారు కొక్కేలు చేయాలి. బంగారు తాపడం చేయబడ్డ అయిదు తుమ్మకర్ర స్తంభాలు చెయ్యాలి. అయిదు స్తంభాలకూ అయిదు ఇత్తడిదిమ్మలు చేయాలి.
EXO 27:1 “తుమ్మకర్రతో ఒక బలిపీఠం నిర్మించు. బలిపీఠం చతురస్రంగా ఉండాలి. అది 7 1/2 అంగుళాల పొడవు 7 1/2 అంగుళాల వెడల్పు 4 1/2 అంగుళాల ఎత్తు ఉండాలి.
EXO 27:2 బలిపీఠం నలుమూలలా ఒక్కోదానికి ఒక్కో కొమ్మ చేయాలి. అంతా ఒక్క వస్తువుగా ఉండేటట్టు ఒక్కో కొమ్మును దాని మూలకు జత చేయాలి. బలిపీఠాన్ని యిత్తడితో తాపడం చేయాలి.
EXO 27:3 “బలిపీఠం మీద ఉపయోగించబడే పరికరాలు, పాత్రలు అన్నింటినీ ఇత్తడితో చేయాలి. బిందెలు, పారలు, పాత్రలు, పళ్లపారలు, నిప్పునెత్తే పెంకులు ఇత్తడితో చేయాలి. బలిపీఠం నుండి బూడిద ఎత్తి శుభ్రం చేయడానికి యివి ఉపయోగించబడతాయి.
EXO 27:4 ఒక పెద్ద యిత్తడి జల్లెడలాంటి దానిని చేయాలి. తెర నాలుగు మూలలకు నాలుగు యిత్తడి ఉంగరాలు చెయ్యాలి.
EXO 27:5 బలిపీఠానికి అడుగున మెట్టు కింద తెరను పెట్టాలి. కింద నుండి బలిపీఠంలో సగం పై వరకు, తెర ఉంటుంది.
EXO 27:6 “బలిపీఠపు కర్రలు చేయడానికి తుమ్మకర్ర ఉపయోగించి వాటిని ఇత్తడితో తాపడం చేయాలి.
EXO 27:7 బలిపీఠం రెండు వైపులా ఉండే ఉంగరాల్లోనుంచి ఆ కర్రలను దూర్చాలి. బలిపీఠం మోయడానికి ఈ కర్రలను ఉపయోగించాలి.
EXO 27:8 బలిపీఠం గుల్లగా ఉంటుంది. దాని ప్రక్కలు పలకలతో చేయబడతాయి. నేను నీకు పర్వతం మీద చూపించినట్టే బలిపీఠాన్ని తయారు చెయ్యి.
EXO 27:9 (“పవిత్ర గుడారం చుట్టూ తెరలతో గోడకట్టు ఇది గుడారానికి ఆవరణ అవుతుంది.) దక్షిణం వైపున యాభై గజాల పొడవు తెరల గోడ ఉండాలి. సున్నితమైన బట్టతో ఈ తెరలు చేయబడాలి.
EXO 27:10 ఇరవై స్తంభాలు, ఆ స్తంభాల కింద 20 యిత్తడి దిమ్మలు ఉపయోగించాలి. స్తంభాల కొక్కేల తెరల కడ్డీలు వెండితో చేయాలి.
EXO 27:11 దక్షిణ వైపున ఉన్నంత పొడవే ఉత్తరం వైపున కూడా ఉండాలి. దానికి 100 తెరలు, 20 స్తంభాలు, 20 ఇత్తడి దిమ్మలు ఉండాలి. స్తంభాల కొక్కేలు తెరల కడ్డీలు వెండితోనే చేయబడాలి.
EXO 27:12 “ఆవరణం పడమటికొనవైపు 25 గజాల పొడవుగల తెరలతో ఒక గోడ ఉండాలి. ఆ గోడ మీద 10 స్తంభాలు, 10 దిమ్మలు ఉండాలి.
EXO 27:13 ఆవరణ తూర్పు వైపు కూడా 25 గజాల పొడవు ఉండాలి.
EXO 27:14 (ఈ తూర్పు వైపే ఆవరణకు ప్రవేశం) ప్రవేశ ద్వారానికి అన్ని వైపులా ఏడున్నర గజాల పొడవు గల తెరలు ఉండాలి. ఆ పక్క మూడు స్తంభాలు మూడు దిమ్మలు ఉండాలి.
EXO 27:15 అవతల వైపున కూడా ఏడున్నర గజాల పొడవుగల తెరలు ఉండాలి. ఆ పక్కన మూడు స్తంభాలు మూడు దిమ్మలు ఉండాలి.
EXO 27:16 “ఆవరణ ప్రవేశాన్ని కప్పడానికి 10 అంగుళాల పొడవుగల తెర చెయ్యాలి. సున్నితమైన బట్ట నీలం, ఎరుపు, ఊదారంగు బట్టలతో ఆ తెరను చేయాలి. ఆ తెరమీద చిత్ర పటాల అల్లిక ఉండాలి. నాలుగు స్తంభాలు, నాలుగు దిమ్మలు ఉండాలి.
EXO 27:17 ఆవరణ చుట్టూ ఉండే స్తంభాలన్నీ వెండి కడ్డీలతో జత కలపాలి. స్తంభాల కొక్కేలు వెండితోను, స్తంభాల దిమ్మలు యిత్తడితోను చేయాలి.
EXO 27:18 ఆవరణ 50 గజాల పొడవు 25 గజాల వెడల్పు ఉండాలి. ఆవరణ చుట్టు గోడ ఏడున్నర అడుగుల ఎత్తు ఉండాలి. తెరలు సున్నితమైన బట్టతో చేయాలి. స్తంభాలన్నింటి కింద ఉండే దిమ్మల్ని ఇత్తడితోనే చేయాలి.
EXO 27:19 అన్ని పరికరాలు, పవిత్ర గుడారం మేకులు పవిత్ర గుడారంలో ఉపయోగించే ఇతర వస్తువులు అన్నిటినీ ఇత్తడితోనే చేయాలి. మేకులు (ఆవరణ చుట్టూ తెరలకు) అన్నీ ఇత్తడితో చేయాలి.
EXO 27:20 “శ్రేష్ఠమైన ఒలీవ నూనె తీసుకొని రమ్మని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించు. ప్రతి సాయంకాలం వెలిగించాల్సిన దీపం కోసం ఈ నూనె ఉపయోగించు.
EXO 27:21 దీపం విషయం అహరోను, అతని కుమారులు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సన్నిధి గుడారంలో మొదటి గదిలోకి వారు వెళ్తారు. ఇది ఒడంబడిక పెట్టె ఉండే గది బయట (రెండు గదులను వేరు పరచే) తెర ముందర ఉంటుంది. ఇక్కడ సాయంత్రం నుండి తెల్లవారే వరకు యెహోవా ఎదుట దీపాలు తప్పక వెలుగుతూ ఉండేటట్టు వారు బాధ్యత వహిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు, వారి వారసులు శాశ్వతంగా ఈ ఆజ్ఞకు విధేయులు కావాలి.
EXO 28:1 “నీ సోదరుడైన అహరోను, అతని కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి, నీ దగ్గరకు రావాలని చెప్పు. వీళ్లు యాజకులుగా నన్ను సేవిస్తారు.
EXO 28:2 “నీ సోదరుడైన అహరోనుకు ప్రత్యేక వస్త్రాలు చేయించు. ఈ వస్త్రాలు అతనికి గౌరవ మర్యాదలు కల్గిస్తాయి.
EXO 28:3 ఈ బట్టలు తయారుచేయగల నిపుణులు ప్రజల్లో ఉన్నారు. ఈ మనుష్యులకు ప్రత్యేక జ్ఞానం నేనిచ్చాను. అహరోనుకు బట్టలు తయారు చేయుమని వారికి చెప్పు. అతను ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నాడని ఈ బట్టలు చూపెడ్తాయి. అప్పుడు ఒక యాజకునిగా అతడు నన్ను సేవించవచ్చు.
EXO 28:4 ఆ మనుష్యులు చేయాల్సిన బట్టలు ఇవే: న్యాయతీర్పు వస్త్రం ఏఫోదు, చేతుల్లేని ఒక ప్రత్యేక అంగీ, తల కప్పుకొనే బట్ట, ఒక నడికట్టు పట్టి నీ సోదరుడైన అహరోనుకు, అతని కుమారులకోసం ఆ మనుష్యులు ఈ ప్రత్యేక దుస్తులను తయారు చేయాలి. అప్పుడు అహరోను, అతని కుమారులు యాజకులుగా నన్ను సేవించవచ్చు.
EXO 28:5 బంగారు దారాలు, సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల బట్టలను ఉపయోగించాలని ఆ మనుష్యులకు చెప్పు.
EXO 28:6 “ఏఫోదు తయారు చేయటానికి బంగారు దారాలు, సన్నని పేనిన నార బట్ట సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల నూలు ఉపయోగించాలి. నైపుణ్యం గల పనివారు ఈ ఏఫోదు చేస్తారు.
EXO 28:7 ఏఫోదు భుజాల దగ్గర ఒక్కో దాని దగ్గర ఒక్కో భుజం బట్ట వేయబడుతుంది. ఏఫోదు రెండుకొనలు ఈ భుజం బట్టలకు కట్టబడతాయి.
EXO 28:8 “ఏఫోదు మీద వేసుకొనే కండువాను వారు చాల జాగ్రత్తగా వేస్తారు. ఏఫోదులో ఉండేవాటితోనే బంగారు దారాలు, సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగు బట్టతోనే ఈ కండువా తయారు చేయబడుతుంది.
EXO 28:9 “నీవు రెండు లేతపచ్చ రాళ్లు తీసుకోవాలి. ఇశ్రాయేలు పండ్రెండు మంది కుమారుల పేర్లు ఈ రత్నాల మీద చెక్కాలి
EXO 28:10 ఒక రత్నం మీద ఆరు పేర్లు, మరో రత్నం మీద ఆరు పేర్లు రాయాలి. పెద్ద కుమారుడు మొదలుకొని చిన్న కుమారుని వరకు క్రమపద్ధతిలో పేర్లు చెక్కు.
EXO 28:11 ముద్రలు చేసేవాడు ఎలాగైతే చెక్కుతాడో, అలా ఇశ్రాయేలు కుమారుల పేర్లను ఈ రాళ్ల మీద చెక్కు. ఈ రత్నాలను బంగారంలో పొదుగు.
EXO 28:12 అప్పుడు ఏఫోదు మీద ఉండే ఒక్కో భుజం బట్ట మీద ఒక్కో రత్నాన్ని అమర్చు. అహరోను యెహోవా ఎదుట నిలబడ్డప్పుడు ప్రత్యేకమైన ఈ అంగీ ధరిస్తాడు. ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కబడ్డ రెండు రాళ్లు ఏఫోదు మీద ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల్ని గూర్చి తలంచేందుకు ఇది దేవునికి సహాయ పడుతుంది.
EXO 28:13 ఏఫోదు మీద రాళ్లు నిలబడి ఉండేటట్టు మంచి బంగారం ఉపయోగించు.
EXO 28:14 స్వచ్ఛమైన బంగారు గొలుసులను కలిపి తాడు పేనినట్టు మెలిపెట్టు. ఇలాంటివి రెండు బంగారు గొలుసులు చేసి, వాటిని బంగారు అల్లికలకు బిగించు.
EXO 28:15 “ప్రధాన యాజకుని కోసం న్యాయపతకం చేయి, ఏఫోదు చేసినట్టు నైపుణ్యం గల పనివారు ఈ పైవస్త్రం చేయాలి. బంగారు దారాలు, సున్నితమైన నారబట్ట, నీలం, ఎరుపు, ఊదారంగుబట్ట వాళ్లు ఉపయోగించాలి.
EXO 28:16 ఈ న్యాయతీర్పు పైవస్త్రం 9 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు ఉండాలి. అది ఒక సంచి అయ్యేటట్టుగా మడత చేయబడాలి.
EXO 28:17 న్యాయ పతకం మీద అందమైన రత్నాలు నాలుగు వరుసలు పెట్టాలి. ఈ రత్నాల మొదటి వరసలో పద్మరాగం, గోమేధికం, మరకతం ఉండాలి.
EXO 28:18 రెండో వరుసలో ఆకుపచ్చ నీలమణి, పచ్చమరకతం ఉండాలి.
EXO 28:19 మూడో వరుసలో ఎరుపు వన్నె మణి, ఊదారంగు మణి, వంగరంగు మణి ఉండాలి.
EXO 28:20 నాలుగో వరుసలో రక్తవర్ణం రాయి, లేతపచ్చ రాయి, సూర్యకాంతం ఉండాలి. న్యాయతీర్పు పైవస్త్రం మీద ఈ రత్నాలన్నీ నిలబడేట్టు బంగారం ఉపయోగించాలి.
EXO 28:21 ఇశ్రాయేలు కుమారుల్లో ఒకొక్కరికి ఒకొక్కటి చొప్పున న్యాయ తీర్పు పైవస్త్రం మీద పన్నెండు రత్నాలు ఉంటాయి. ఈ రాళ్లలో ఒక్కొదానిమీద ఇశ్రాయేలు కుమారుల్లో ఒక్కొక్కరిది ఒక దాని మీది రాయి. ఒక్కోరాయిలో ఈ పేర్లను ముద్రించినట్టుగా చెక్కు.
EXO 28:22 “న్యాయతీర్పు పైవస్తానికి స్వచ్ఛమైన బంగారంతో గొలుసులు చేయాలి. ఈ గొలుసులు తాడులా ఉంటాయి.
EXO 28:23 బంగారు ఉంగరాలు రెండు చేసి న్యాయపతకం రెండు మూలల్లో పెట్టు.
EXO 28:24 న్యాయతీర్పు పైవస్త్రం మూలల్లో ఉన్న రెండు ఉంగరాల్లోనుంచి ఈ బంగారు గొలుసులు రెంటిని దూర్చాలి.
EXO 28:25 ఆ గొలుసుల అవతలి కొనలను ఏఫోదు ముందర రెండు భుజం బట్టలమీద పెట్టు.
EXO 28:26 ఇంకో రెండు బంగారు ఉంగరాలు చేసి, న్యాయతీర్పు పైవస్త్రం, అవతల ఉన్న మరి రెండుమూలల్లో పెట్టాలి. ఏఫోదు దగ్గరగా ఉన్న న్యాయతీర్పు పైవస్త్రం లోపలి వైపు ఇది.
EXO 28:27 ఇంకా రెండు బంగారు ఉంగరాలు చేసి, ఏఫోదు ముందర భాగంలోని భుజభాగాల అడుగున పెట్టాలి ఏఫోదు దట్టీ పైభాగానికి దగ్గరగా బంగారు ఉంగరాలను ఉంచాలి.
EXO 28:28 న్యాయతీర్పు పైవస్త్రం ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు జత చేయాలి. నడికట్లతో వీటిని జత చేసేందుకు నీలం పతకం ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల న్యాయతీర్పు పైవస్త్రం నడికట్టును పట్టుకొని ఉంటుంది.
EXO 28:29 “అహరోను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు, ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఆయన గుండెమీద ఉంటాయి. న్యాయం తీర్చడానికి ఆయన ధరించే తీర్పు పతకం మీద ఈ పేర్లు ఉంటాయి. ఈ విధంగా ఇశ్రాయేలు కుమారులు పన్నెండు మందిని యెహోవా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాడు.
EXO 28:30 దేవుని నిర్ణయాలు తెలుసుకొనేందుకు ఊరీము, తుమ్మీములను ప్రయోగిస్తాడు. అందుచేత ఊరీము, తుమ్మీములను న్యాయతీర్పు పైవస్త్రములో ఉంచాలి. అహరోను యెహోవా ముందర ఉన్నప్పుడు ఈ విషయాలు అతని గుండెమీద ఉంటాయి. కనుక అహరోను యెహోవా యెదుట ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చే ఒక విధానాన్ని ఎల్లప్పుడూ తనతో తీసుకువెళ్తాడు.
EXO 28:31 “ఏఫోదు పైన ధరించేందుకు ఒక అంగీని చెయ్యాలి. అంగీని నీలంరంగు బట్టతోనే చెయ్యాలి.
EXO 28:32 దాని మధ్యలో తల పట్టేందుకు ఒక రంధ్రం ఉండాలి. అది మెడచుట్టూ చిరిగిపోకుండా గోటు ఉండాలి.
EXO 28:33 నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణం రంగుల బట్టతో దానిమ్మపండు చేయాలి. అంగీ కింది భాగంలో దానిమ్మ పండును వేలాడదీయాలి. దానిమ్మపండు మధ్య బంగారు గంటలు వ్రేలాడదీయాలి.
EXO 28:34 అంగీ అడుగున చుట్టూరా ఒక బంగారు దానిమ్మపండు ఒక గంట, మరో దానిమ్మపండు, మరో గంట ఇలా ఉండాలి.
EXO 28:35 అహరోను యాజకునిగా పని చేసేటప్పుడు ఈ అంగీని ధరించి, యెహోవా ఎదుట పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అతడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటప్పుడు గంటలు మోగుతాయి. ఈ విధంగా అహరోను మరణించడు.
EXO 28:36 “స్వచ్ఛమైన బంగారంతో ఒక బద్ద చేయాలి, “యెహోవా పరిశుద్ధుడు” అనే మాటలు ఒక ముద్రగా తలపాగా చుట్టూ ముందరవైపు కట్టేందుకు నీలం పతకం ఉపయోగించాలి.
EXO 28:38 అహరోను దీన్ని తన తలమీద ధరిస్తాడు. ఇశ్రాయేలీయుల కానుకల విషయంలో దోషాలు ఏమైన ఉంటే ఆ దోషాన్ని అతడు భరించినప్పుడు, ఇది అతన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. ఈ కానుకలు ప్రజలు యెహోవాకు అర్పించేవి. ప్రజల కానుకలను యెహోవా స్వీకరించేటట్టు అహరోను దీనిని ఎప్పుడూ తన తలమీద ధరించాలి.
EXO 28:39 “అంగీని తయారు చేసేందుకు సున్నితమైన నార బట్టను ఉపయోగించాలి. తలపాగా చేసేందుకు సున్నితమైన నారబట్టను ఉపయోగించాలి. నడికట్టు మీద బుట్టా కుట్టాలి.
EXO 28:40 చొక్కాలు, పట్టాలు, తలపాగాలు కూడా తయారు చేయాలి. ఇవి వారికి గౌరవమర్యాదలు కలిగిస్తాయి.
EXO 28:41 నీ సోదరుడైన అహరోనుకు, అతని కుమారులకు ఈ బట్టలు ధరింపజేయాలి. తర్వాత వారు యాజకులని చూపెట్టేందుకుగాను వారి తలమీద ఒలీవనూనె పోయాలి. ఇది వాళ్లను యాజకులుగా చేస్తుంది. ఒక ప్రత్యేక విధానంలో వారు నన్ను సేవిస్తున్నారని ఈ విధంగా నీవు తెలియజేస్తావు. అప్పుడు వారు నన్ను యాజకులుగా సేవిస్తారు.
EXO 28:42 “వారి ప్రత్యేక యాజక వస్త్రాల కింద ధరించేందుకు శ్రేష్ఠమైన బట్టను ఉపయోగించాలి. లోపల ధరించే ఈ వస్త్రాలు నడుంనుండి కాళ్ల వరకు ధరించాలి.
EXO 28:43 అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారములో ఎప్పుడు ప్రవేశించినా, ఈ వస్త్రాలు ధరించాలి. పరిశుద్ధ స్థలంలో యాజకులుగా సేవ చేసేందుకు బలిపీఠం దగ్గరకు ఎప్పుడు వచ్చినా వారు ఈ వస్త్రాలు ధరించాలి. వారు ఈ వస్త్రాలు ధరించకపోతే, తప్పు చేసిన నేరస్థులై చావాల్సి వస్తుంది. అహరోను, అతని తర్వాత అతని కుటుంబం అంతటికీ ఇదంతా నిత్యం కొనసాగే ఒక చట్టంగా ఉండాలి.
EXO 29:1 “అహరోను, అతని కుమారులు యాజకులుగా ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని తెలియజేసేందుకు నీవు చేయాల్సిన దానిని యిప్పుడు నీకు నేను చెబతాను. ఒక గిత్తను, కళంకం లేని రెండు పొట్టేళ్లను సంపాదించు.
EXO 29:2 తర్వాత పులియజేసే పదార్థంలేని సన్నని గోధుమ పిండితో రొట్టె చేయాలి. ఒలీవ నూనెతో కలిపి చేసే రొట్టెలకు గూడ అవే వస్తువులు ఉపయోగించాలి. నూనెతో కలిపి చిన్న చిన్న పల్చటి అప్పడాలు చేయాలి.
EXO 29:3 ఈ రొట్టెలు, అప్పడాలు ఒక బుట్టలో పెట్టాలి. ఆ బుట్టను అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వాలి. అదే సమయంలో గిత్తను రెండు పొట్టేళ్లను కూడ వారికి ఇవ్వాలి.
EXO 29:4 “తర్వాత అహరోనును అతని కుమారులను సన్నిధి గుడారం ముందటి ద్వారం దగ్గరకు తీసుకు రావాలి. నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి.
EXO 29:5 అహరోనుకు అతని చొక్కా తొడిగించాలి. ప్రత్యేక ఏఫోదుతో వుండే అంగీని అతనికి ధరింపజేయాలి. అప్పుడు ఏఫోదును, న్యాయతీర్పు పైవస్త్రాన్ని అతనికి కట్టాలి. అందమైన దట్టీని అతనికి కట్టాలి.
EXO 29:6 తర్వాత అతని తలమీద తలపాగ చుట్టాలి. ప్రత్యేక కిరీటాన్ని బంగారు బద్ద తలపాగా చుట్టూరా ఉంచాలి.
EXO 29:7 అభిషేక తైలము తీసుకొని అతని తలమీద పోయాలి. అహరోను ఈ పనికి ఏర్పరచబడ్డాడని ఇది సూచిస్తుంది.
EXO 29:8 “తర్వాత అతని కుమారులను అక్కడికి తీసుకరావాలి. వారికి తెల్ల అంగీలు ధరింపజేయాలి.
EXO 29:9 అప్పుడు వారి నడుములకు దట్టీలు చుట్టాలి. ధరించేందుకు ప్రత్యేక టోపీలను వారికి ఇవ్వాలి. వారు యాజకులుగా ఉండడం అప్పుడు ప్రారంభం అవుతుంది. శాశ్వతంగా కొనసాగే ప్రత్యేక చట్టంవల్ల వారు యాజకులుగా ఉంటారు. ఈ విధంగా అహరోనును, అతని కుమారులను నీవు యాజకులుగా చేయాలి.
EXO 29:10 “తర్వాత సన్నిధి గుడారం ఎదుటకు గిత్తను తీసుకురావాలి. అహరోను, అతని కుమారులు ఆ గిత్త తల మీద వారి చేతులు పెట్టాలి,
EXO 29:11 “అప్పుడు ఆ సన్నిధి గుడారం ఎదుట ఆ గిత్తను చంపాలి. దీనిని యెహోవా చూస్తాడు.
EXO 29:12 అప్పుడు గిత్త రక్తంలో కొంత తీసుకొని బలిపీఠం దగ్గరకు వెళ్లాలి. బలిపీఠం కొమ్ముల మీద నీ వేళ్లతో కొంచెం రక్తం చిలకరించాలి. మిగిలిన రక్తం అంతా బలిపీఠం అడుగున కుమ్మరించాలి.
EXO 29:13 తర్వాత గిత్త లోపలి కొవ్వు అంతా తీయాలి. కాలేయంలో కొవ్విన భాగాన్ని రెండు మూతగ్రంథులను వాటి చుట్టూ ఉండే కొవ్వును తీసి బలిపీఠం మీద దహించాలి.
EXO 29:14 తర్వాత గిత్త మాంసం, చర్మం, ఇతర భాగాలు తీసుకొని మీ పాళెము వెలుపటికి వెళ్లాలి. అక్కడ, పాళెము వెలుపల వీటిని కాల్చివేయాలి. ఇది యాజకుల పాపాలను తీసివేయు అర్పణ.
EXO 29:15 “తర్వాత పొట్టేళ్లలో ఒకదాని తలమీద తమ చేతులు పెట్టమని అహరోనుకు, అతని కుమారులకు చెప్పు.
EXO 29:16 అప్పుడ ఆ పొట్టేలును చంపి ఆ రక్తం భద్రం చేయాలి. ఆ రక్తాన్ని బలిపీఠం నలువైపుల వెదచల్లాలి.
EXO 29:17 అప్పుడు పొట్టేలును ముక్కలు ముక్కలుగా కోయాలి. పొట్టేలు లోపలి భాగాలను కాళ్లను కడగాలి. వీటిని పొట్టేలు తల ఇతరభాగాలతో కలిపి పెట్టాలి.
EXO 29:18 అప్పుడు ఆ మొత్తాన్ని బలిపీఠం మీద దహించి వేయాలి. ఇది దహించబడ్డ దహన బలి. ఇది యెహోవాకు అర్పించబడింది. యెహోవా అర్పణను వాసన చూస్తాడు. అది ఆయనకు ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. ఇది నిప్పు ఉపయోగించి యెహోవాకు అర్పించే అర్పణ.
EXO 29:19 “ఇంకో పొట్టేలు మీద వారి చేతులు వుంచమని అహరోనుకు, అతని కుమారులకు చెప్పు.
EXO 29:20 ఆ పొట్టేలును చంపి, దాని రక్తం భద్రం చేయాలి. అహరోనుకు, అతని కుమారులకు వారి కుడి చెవి కొనల మీద ఆ రక్తం చల్లాలి. ఇంక వారి కుడి చేతుల బొటన వేళ్ల మీద కొంత రక్తం ఉంచాలి. వారి కుడి పాదాల బొటన వేళ్లపై మరికొంత రక్తం ఉంచాలి. అప్పుడ బలిపీఠం మీద నాల్గువైపులా రక్తం చల్లాలి.
EXO 29:21 తర్వాత బలిపీఠం నుండి కొంత రక్తం తీసుకోవాలి. ప్రత్యేక తైలంతో దాన్ని కలిపి, అహరోను మీద, అతని బట్టల మీద దాన్ని చల్లాలి. ఆయన కుమారుల మీద, వారి బట్టల మీద దాన్ని చల్లాలి, అహరోను, అతని కుమారులు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది సూచిస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే, వారి బట్టలు ఉపయోగించబడుతాయని ఇది సూచిస్తుంది.
EXO 29:22 “అప్పుడు పొట్టేలు నుండి కొవ్వును తీయాలి. (అహరోనును ప్రధాన యాజకునిగా చేసే ఆచార క్రమంలో ఉపయోగించబడే పొట్టేలు ఇది). తోక చుట్టూ ఉండే క్రొవ్వును, శరీరం లోపలి భాగాలను కప్పివుండే కొవ్వును తీయాలి. కాలేయంలో క్రొవ్విన భాగాన్ని తీయాలి. మూతగ్రంధులు రెండింటిని, కుడి కాలును తీయాలి.
EXO 29:23 పులియని పదార్థం లేకుండా నీవు చేసిన రొట్టెలు గల బుట్టను తీసుకొని యెహోవా ముందు పెట్టాలి. బుట్టలోని రొట్టె ఒకటి, ఒలీవ నూనెతో చేసిన రొట్టె ఒకటి, పలుచని చిన్న అప్పడం ఒకటి బుట్టలో నుండి బయటికి తీయాలి.
EXO 29:24 అప్పుడు వీటిని అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వు. యెహోవా యెదుట వీటిని తమ చేతులతో పట్టుకొని ఉండమని వారితో చెప్పు. ఇది యెహోవాకు ప్రత్యేకమైన అర్పణ.
EXO 29:25 అప్పుడు అహరోను, అతని కుమారుల చేతుల్లోనుంచి వీటిని తీసుకొని, పొట్టేలుతో బాటు బలిపీఠం మీద పెట్టు. యెహోవా ఈ దహనబలి అర్పణ వాసన చూసి ఆనందిస్తాడు. ఇది నిప్పు ఉపయోగించి యెహోవాకు ఇచ్చే అర్పణ.
EXO 29:26 “అప్పుడ పొట్టేలుయొక్క బోరను తీసుకోవాలి. (ఇది అహరోను ప్రధాన యాజకునిగా చేసే ఆచార క్రమంలో ఉపయోగించే పొట్టేలు). పొట్టేలు బోరను యెహోవా సన్నిధిలో ఇచ్చి పుచ్చుకొనే ప్రత్యేక అర్పణగా అర్పించాలి. జంతువుల్లోని ఈ భాగం నీది.
EXO 29:27 అప్పుడు అహరోనును ప్రధాన యాజకునిగా చేయుటకు ఉపయోగించి పొట్టేలు రొమ్ము, కాలు తీసుకో, వాటిని అహరోనుకు, అతని కుమారులకు ఇయ్యి. ఇది అర్పణలో ఒక ప్రత్యేక భాగం అవుతుంది.
EXO 29:28 ఇశ్రాయేలు ప్రజలు ఈ భాగాలను అహరోనుకు, అతని కుమారులకు ఎల్లప్పుడూ ఇస్తూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు అర్పణ అర్పించినప్పుడల్లా ఈ భాగాలు ఎప్పుడూ యాజకులకే చెందుతాయి. ఈ భాగాలను వారు యాజకులకు ఇచ్చినప్పుడు అవి యెహోవాకు ఇచ్చినట్టే అవుతుంది.
EXO 29:29 “అహరోను తయారు చేసిన ఆ ప్రత్యేక వస్త్రాలను భద్రం చేయాలి. అతని తర్వాత జీవించే వారందరికీ ఈ వస్త్రాలు చెందుతాయి. వారు యాజకులుగా ఏర్పాటు చేయబడినప్పుడు ఈ వస్త్రాలు ధరిస్తారు.
EXO 29:30 అహరోను తర్వాత అతని కుమారుడు ప్రధాన యాజకుడు అవుతాడు. ఈ కుమారుడు పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేందుకు సన్నిధి గుడారంలోనికి వచ్చినప్పుడు ఆ వస్త్రాలు ధరిస్తాడు.
EXO 29:31 “అహరోనును ప్రధాన యాజకునిగా చేసేందుకు ఉపయోగించిన పొట్టేలు మాంసాన్ని ఒక పవిత్ర స్థలంలో వండాలి.
EXO 29:32 అప్పుడు అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారం ఎదుటి ద్వారం ముందు ఆ మాంసం తినాలి. మరియు బుట్టలోని రొట్టెను కూడ వారు తినాలి.
EXO 29:33 వారు యాజకులుగా చేయబడ్డప్పుడు వారి పాపాలను పరిహరించేందుకు ఈ అర్పణలు ఉపయోగించబడ్డాయి. ఇప్పుడు వారు ఈ అర్పణలను తినాలి.
EXO 29:34 ఆ పొట్టేలు మాంసంలోగాని, ఆ రొట్టెలోగాని ఏమైనా మర్నాటి ఉదయానికి మిగిలి ఉంటే దానిని కాల్చివేయాలి. ఆ రొట్టె, మాంసం ఒక ప్రత్యేక సమయంలో, ఒక ప్రత్యేక విధానంలో మాత్రమే తినవలసినవి గనుక మీరు వాటిని తినకూడదు.
EXO 29:35 “అహరోను, అతని కుమారులకోసం నీవు చేయాలని నేను నీకు ఆజ్ఞాపించిన వీటన్నింటినీ నీవు చేయాలి. వీటిని ఏడురోజుల వ్యవధిలో నీవు చేయాలి.
EXO 29:36 రోజుకు ఒక ఎద్దు చొప్పున ఏడు రోజులు వధించాలి. ఇది అహరోను, అతని కుమారుల పాపముకోసం అర్పణగా ఉంటుంది. బలిపీఠాన్ని పవిత్రం చేసేందుకు నీవు ఈ బలులను ఉపయోగించాలి. బలిపిఠాన్ని పవిత్రం చేసేందుకు దాని మీద ఒలీవ నూనెపోయాలి.
EXO 29:37 ఏడురోజుల పాటు బలిపీఠాన్ని నీవు పవిత్రం చేయాలి. ఆ సమయంలో బలిపీఠం అతిపవిత్రం అవుతుంది.
EXO 29:38 “బలిపీఠం మీద ప్రతిరోజూ ఒక అర్పణ అర్పించాలి. ఒక సంవత్సరం వయస్సుగల రెండు గొర్రె పిల్లల్ని వధించాలి.
EXO 29:39 ఒక గొర్రెపిల్లను ఉదయం, మరో గొర్రెప్లిను ఉదయం, అర్పణ పవిత్రం చేయాలి. గనుక వపొట్టేలు మాంసాన్ని ఒక పవిత్ర ల్లను సాయంత్రం అర్పించాలి.
EXO 29:40 మొదటి గొర్రెపిల్లను నీవు వధించినప్పుడు పదవవంతు సన్నటి గోధుమ పిండిని ఒక పావు ద్రాక్షారసంతో కలిపి అర్పణగా చేయాలి. ఉదయం చేసినట్టే సాయంత్రం రెండో గొర్రెపిల్లను వధించినప్పుడు కూడ పదవవంతు సన్నని పిండిని అర్పించాలి. ఒక పావు ద్రాక్షారసం అర్పించాలి. ఇది యెహోవాకు భోజన అర్పణం అవుతుంది. ఈ అర్పణ నీవు దహించినప్పుడు, యెహోవా దీని సునాసనను చూసి ఆనందిస్తాడు.
EXO 29:42 “ప్రతిరోజూ యెహోవాకు అర్పణగా వీటిని నీవు దహించాలి. సమావేశ గుడారం ముందు ద్వారం దగ్గర, యెహోవా ఎదుట వీటిని చేయాలి. ఇలానే ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. నీవు అర్పణ అర్పించునప్పుడు, యెహోవానైన నేను నిన్ను అక్కడ కలుసుకొని నీతో మాట్లాడుతాను.
EXO 29:43 ఆ స్థలంలో నేను ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకొంటాను. నా మహిమవల్ల ఆ స్థలం పవిత్ర పర్చబడుతుంది.
EXO 29:44 “కనుక సన్నిధి గుడారాన్ని నేను పవిత్రం చేస్తాను. మరియు బలిపీఠాన్ని నేను పవిత్రం చేస్తాను. అహరోను, అతని కుమారులు నాకు యాజకులుగా సేవ చేయగలిగేటట్టు నేను వారిని పవిత్రం చేస్తాను.
EXO 29:45 నేను ఇశ్రాయేలు ప్రజలతో నివసిస్తాను. నేను వారికి దేవుడిగా ఉంటాను.
EXO 29:46 ‘నేనే యెహోవాను, వారి దేవుడ్ని’, అని ప్రజలు తెలుసుకొంటారు. నేను వారితో నివసించేందుకు వారిని ‘ఈజిప్టునుండి బయటికి రప్పించింది నేనే’ అని వారు తెలుసుకొంటారు. నేనే వారి దేవుడైన యెహోవాను.”
EXO 30:1 “తుమ్మ కర్రతో ఒక వేదిక చేయి. ధూపం వేసేందుకు ఈ పీఠమును నీవు ఉపయోగించాలి.
EXO 30:2 వేదికను 18 అంగుళాలు పొడవు, 18 అంగుళాలు వెడల్పు గల చతురస్రముగా నీవు చేయాలి. దీని ఎత్తు 36 అంగుళాలు ఉండాలి. నాలుగు మూలల కొమ్ములు ఉండాలి. ఈ కొమ్ముల్ని వేదికతో కలిపి ఒకటిగా చేయాలి.
EXO 30:3 బలిపీఠం పైభాగాన్ని, అన్ని ప్రక్కలను స్వచ్ఛమైన బంగారం పొదిగించాలి. బలిపీఠం చుట్టూ బంగారు నగిషిబద్ద పెట్టాలి.
EXO 30:4 నగిషీబద్ద అడుగు భాగాన బంగారు ఉంగరాలు నాలు ఉండాలి. ఈ బలిపీఠానికి ఎదురుగా రెండు బంగారు ఉంగరాలు ఉండాలి. బలిపీఠం మోసే కర్రలకోసం ఈ బంగారు ఉంగరాలు ఉపయోగించబడతాయి.
EXO 30:5 తుమ్మకర్రతోనే ఆ కర్రలు చేయాలి. కర్రలకు బంగారు తాపడం చేయాలి.
EXO 30:6 ప్రత్యేక తెరముందు ఈ బలిపీఠాన్ని ఉంచాలి. ఒడంబడిక పెట్టెను తెర అవతల ఉంచాలి. ఆ పెట్టె మూతకు ముందర బలిపీఠం ఉంచాలి. నేను నిన్ను కలుసుకోనే చోటు ఇదే.
EXO 30:7 “ప్రతీ ఉదయం పరిమళ ద్రవ్యాల ధూపాన్ని బలిపీఠం మీద అహరోను వేయాలి. దీపాలు సరిచేసేందుకు వచ్చినప్పుడు అతడు దీనిని చేయాలి.
EXO 30:8 మరల సాయంత్రం అతడు ధూపం వేయాలి. ఇది అతడు సాయంత్రం దీపాలను సరిచేసే వేళ. కనుక ప్రతిరోజూ శాశ్వతంగా యెహోవా ఎదుట ధూపం వేయబడుతుంది.
EXO 30:9 ఇంకే విధమైన ధూపం వేసేందుకు గాని, దహన బలి కోసంగాని ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు. ఏ విధమైన ధాన్యార్పణగాని, పానార్పణంగాని అర్పించేదుకు బలిపీఠాన్ని ఉపయోగించవద్దు.
EXO 30:10 “సంవత్సరానికి ఒక సారి అహరోను యెహోవాకు ఒక ప్రత్యేక బలి అర్పించాలి. ప్రజల పాప పరిహారం నిమిత్తం చెల్లించేందుకు పాపపరిహారార్థ బలి రక్తాన్ని అహరోను ఉపయోగించాలి. ఈ బలిపీఠపు కొమ్ముల దగ్గర అహరోను దీనిని చేయాలి. ఇది, ప్రాయశ్చిత్తార్థ దినం అని పిలువబడుతుంది. ఇది యెహవాకు అతి ప్రత్యేక దినం.”
EXO 30:11 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు,
EXO 30:12 “ఎంత మంది ప్రజలు ఉన్నారో నీకు తెలిసేటట్టు, ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కబెట్టు. ఇలా చేసినప్పుడల్లా, ప్రతి వ్యక్తీ తనకోసం యెహోవాకు పన్ను చెల్లించాలి. ప్రతి వ్యక్తీ ఇలా చేస్తే ఏ విధమైన దారుణం ప్రజలకు సంభంవిచదు.
EXO 30:13 లెక్కించబడ్డ ప్రతి మనిషీ అరతులం చెల్లించాలి. (ఇది అధికార పూర్వకమైన తులంలో సగం, అధికార తులం అంటే 20 గొర్రెలు). ఈ అరతులం యెహోవాకు అర్పణం
EXO 30:14 లెక్కించబడి, 20 సంవత్సరాలు లేక అంతకు ఎక్కువ వయసుగల ప్రతి వ్యక్తీ యెహోవాకు ఈ అర్పణ చెల్లించాలి.
EXO 30:15 ధనికులు అరతులం కంటె ఎక్కువ చెల్లించకూడదు. ప్రజలందరూ ఒకే అర్పణ యెహోవాకు చెల్లించాలి. ఇది మీ ప్రాణం కోసం చెల్లించే అర్పణ.
EXO 30:16 ఇశ్రాయేలు ప్రజల దగ్గర్నుండి ఈ సొమ్ము పోగుచేయి. సన్నిధి గుడారంలో సేవకోసం ఈ సొమ్ము ఉపయోగించు. యెహోవా తన ప్రజలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ చెల్లింపు ఒక విధానం. వారు తమ స్వంత ప్రాణాల నిమిత్తం చెల్లిస్తారు.”
EXO 30:17 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు,
EXO 30:18 “ఇత్తడి గంగాళం ఒకటి చేసి ఇత్తడి పీటమీద దాన్ని పెట్టు. కడుగుకొనేందుకు నీవు దీనిని ఉపయోగించాలి. సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య దీనిని ఉంచి, నీళ్లతో నింపు.
EXO 30:19 ఈ గంగాళంలోని నీళ్లతో అహరోను, అతని కుమారులు వారి కాళ్లు చేతు లు కడుక్కోవాలి
EXO 30:20 సన్నిధి గుడారం ప్రవేశించేటప్పుడు, లేక బలిపీఠం సమీపించేటప్పుడు ప్రతిసారీ వారు నీళ్లతో కడుక్కోవాలి. ఈ విధంగా వారు మరణించరు.
EXO 30:21 మరియు తమ చావకుండా ఉండేందుకు వారు తమ కాళ్లు చేతులు కడుక్కోవాలి. అహరోనుకీ, అతని ప్రజలకీ ఎప్పటికీ కొనసాగే చట్టం యిది. భవిష్యత్తులో జీవించే అహరోను సంతతి వాళ్లందరికీ యిది కొనసాగుతుంది.”
EXO 30:22 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
EXO 30:23 “శ్రేష్ఠమైన సుగంధద్రవ్యాలు సంపాదించు. పరిమళ ధూపం చేయడానికి 500 తులాల స్వచ్ఛమైన గోపరసం, 250 తులాల సువాసనగల లవంగపట్ట, 500 తులాల సుగంధ ద్రవ్యాలు,
EXO 30:24 500 తులాల లవంగపట్ట తీసుకో. వీటన్నింటినీ కొలిచేందుకు అధికారిక కొలత ఉపయోగించు. మరియు మూడు పళ్ల ఒలీవ నూనె తీసుకో.
EXO 30:25 “ఒక పరిమళ అభిషేక తైలంగా చేయటానికి వీటన్నింటినీ కలపాలి.
EXO 30:26 సన్నిధి గుడారం మీద, ఒడంబడిక పెట్టె మీద ఈ తైలం పోయి, వీటికి ఒక ప్రత్యేక ఉద్దేశం వుంది అని ఇది తెలియజేస్తుంది.
EXO 30:27 బల్లమీద, బల్లమీద ఉన్న పాత్రలన్నింటిమీద తైలం పోయి. దీపం మీద, దాని పరికరాలన్నింటి మీద ఈ తైలం పోయి. ధూపవేదిక మీద తైలం పోయి.
EXO 30:28 ఇంకా దేవునికి అర్పణలు దహనం చేసే బలిపీఠం మీద ఈ తైలం పోయి. ఆ బలిపీఠం పైన ఉండే సమస్తం మీద తైలం పోయి. గంగాళంమీద, దాని పీటమీద ఈ తైలం పోయి.
EXO 30:29 వీటన్నింటినీ నీవు పవిత్రం చేయాలి. అవి యెహోవాకు చాల ప్రత్యేకం. వీటిని ఏది తాకినా అది పవిత్రం అవుతుంది.
EXO 30:30 “అహరోను, అతని కుమారుల మీద ఈ తైలంపోయి. వారు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది తెలియజేస్తుంది. అప్పుడు యాజకులుగా వారు నా సేవ చేయవచ్చు.
EXO 30:31 అభిషేక తైలం ఎల్లప్పుడు నాకు ప్రత్యేకమైనదిగా ఉంటుందని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు.
EXO 30:32 సామాన్యమైన సుగంధ తైలంగా ఎవరూ దీనిని వాడకూడదు. ఈ ప్రత్యేక తైలం తయారు చేసిన విధానంలో సుగంధ తైలం తయారు చేయకూడదు. ఈ తైలం పవిత్రం, ఇది మీకు చాల ప్రత్యేకమైనదిగా ఉండాలి.
EXO 30:33 ఎవరైనా ఈ పవిత్ర తైలం వలె సుగంధ తైలం తయారు చేసి అన్యునికి యిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్లో నుండి వేరు చేయబడాలి.”
EXO 30:34 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, “ఈ పరిమళ ద్రవ్యాలను తీసుకరా! జటామాంసి, గోపి చందనం, గంధపుచెక్క స్వచ్ఛమైన సాంబ్రాణి. ఈ పరిమళ ద్రవ్యాలన్నీ సమపాళ్లలో ఉండేటట్టు తప్పక చూడాలి.
EXO 30:35 సుగంధ పరిమళ ధూపంగా ఉండేటట్టు ఈ పరిమళ ద్రవ్యాలన్నిటినీ కలపాలి. పరిమళ తైలం తయారుచేసే వాడు చేసినట్టే దీనిని చేయాలి. మరియు ఈ ధూపంలో ఉప్పు కలుపు. అది దీనిని స్వచ్ఛమైనదిగా, ప్రత్యేకమైనదిగా చేస్తుంది.
EXO 30:36 ధూప ద్రవ్యంలో కొంత మెత్తటి పొడుం అయ్యేంత వరకు నూరాలి. సన్నిధి గుడారంలో, ఒడంబడిక పెట్టె ఎదుట ఆ పొడుం ఉంచు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు. ఈ ధూపపు పొడుంను దాని ప్రత్యేక పని కోసమే నీవు ఉపయోగించాలి.
EXO 30:37 యెహోవా కోసం ఈ ప్రత్యేక విధానంలో మాత్రమే నీవు ఈ ధూపాన్ని ఉపయోగించాలి. ఈ ధూపాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో నీవు తయారు చేయాలి. ఇంకే యితరమైన ధూపం చేయడానికి కూడ ఈ ప్రత్యేక పద్ధతిని వినియోగించవద్దు.
EXO 30:38 ఒక వ్యక్తి, తన కోసం ఈ ధూపం కొంత తయారు చేసి, దాని పరిమళాన్ని అనుభవించాలని కోరవచ్చు. అయితే, అతడు గనుక అలా చేస్తే, వాడు తన ప్రజల నుండి వేరు చేయబడాలి.”
EXO 31:1 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
EXO 31:2 “యూదా గోత్రంలో ఊరు కుమారుడైన బెసలేలును నేను ఏర్పరచుకొన్నాను (హూరు కుమారుడు ఊరు).
EXO 31:3 బెసలేలును నేను దేవుని ఆత్మతో నింపాను. అన్ని రకాల వస్తువులు చేసేందుకు జ్ఞానం, నైపుణ్యం నేను అతనికి ఇచ్చాను.
EXO 31:4 నమూనాలు గీయటంలో బెసలేలు చాల ప్రజ్ఞ గలవాడు. బంగారు, వెండి, ఇత్తడితో అతడు వస్తువులు చేయగలడు.
EXO 31:5 బెసలేలు అందమైన నగలను చెక్కి, పొదుగగలడు. అతడు చెక్క పని చేయగలడు. బెసలేలు అన్ని రకాల పనులు చేయగలడు.
EXO 31:6 అతనితో పని చేయటానికి అహూలియాబును కూడ నేను ఏర్పరచుకొన్నాను. అహూలియాబు దాను గోత్రపు అహీసామాకు కుమారుడు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేయగలిగేటట్టు మిగిలిన పని వాళ్లందరికీ నేను నైపుణ్యం యిచ్చాను.
EXO 31:7 సన్నిధి గుడారం ఒడంబడిక పెట్టె పెట్టెను మూసే కరుణా పీఠము.
EXO 31:8 బల్ల, దానిమీద ఉండాల్సినవన్నీ ధూప వేదిక
EXO 31:9 దహన బలులు దహించే బలిపీఠం బలిపీఠం దగ్గర ఉపయోగించే వస్తువులు గంగాళం, దాని క్రింద పీట.
EXO 31:10 యాజకుడు అహరోనుకు ప్రత్యేక వస్త్రాలన్నీ, అతని కుమారులు యాజకులుగా పరిచర్య చేసేటప్పుడు ధరించాల్సిన ప్రత్యేక వస్త్రాలన్నీ,
EXO 31:11 అభిషేకానికి పరిమళ సువాసనగల తైలం, పవిత్ర స్థలానికి అవసరమైన పరిమళ వాసనగల ధూపం. ఈ పని వాళ్లు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం అన్ని వస్తువులనూ తయారు చేస్తారు.”
EXO 31:12 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
EXO 31:13 “ఇశ్రాయేలు ప్రజలతో దీన్ని చెప్పు; ‘నా ప్రత్యేక విశ్రాంతి రోజులను గూర్చిన నియమాలను మీరు పాటించాలి. రాబోయే తరాలన్నింటిలో మీకు, నాకు మధ్య అవి ఒక గురుతుగా ఉంటాయి కనుక మీరు ఇలా చేయాలి. యెహోవానైన నేనే మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా ఏర్పరచుకొన్నానని ఇది మీకు తెలియజేస్తుంది.
EXO 31:14 “‘సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా చేయి. ఏ వ్యక్తి అయినా సరే సబ్బాతు రోజును మామూలు రోజుగానే పరిగణిస్తే, ఆ వ్యక్తిని చంపేయాలి. సబ్బాతు రోజున ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే ఆ వ్యక్తి తన ప్రజల నుండి వేరు చేయబడాలి.
EXO 31:15 పని చేయడానికి వారంలో ఇంకా ఆరు రోజులున్నాయి. అయితే, ఏడో రోజు చాల ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. సబ్బాతు నాడు ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే వాణ్ణి చంపెయ్యాలి.
EXO 31:16 ఇశ్రాయేలు ప్రజలు సబ్బాతు రోజును జ్ఞాపకం ఉంచుకొని, దాన్ని ఒక ప్రత్యేక రోజుగా చేయాలి. ఇది నాకూ, వారికీ మధ్య శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక
EXO 31:17 ఇశ్రాయేలీయులకూ, నాకూ మధ్య శాశ్వత సంకేతం సబ్బాతు రోజే. యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని చేసాడు. ఏడోరోజున ఏ పని చేయక విశ్రాంతి తీసుకొన్నాడు.’”
EXO 31:18 అలా సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో మాట్లాడ్డం ముగించాడు. అప్పుడు ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలను యెహోవా మోషేకు ఇచ్చాడు. దేవుడు తన వ్రేలితో రాళ్లమీద ఈ ఆజ్ఞలు రాసాడు.
EXO 32:1 చాలాకాలం గడిచిపోయినా, మోషే పర్వతం దిగి రాకపోవడం ప్రజలు గమనించారు. కనుక ప్రజలు అహరోను చుట్టూ చేరారు, “చూడు, ఈజిప్టు దేశం నుండి మోషే మమ్మల్ని బయటకు నడిపించాడు. అయితే అతనికి ఏమయిందో మాకు తెలియదు. అందుచేత మా ముందర నడవడానికి ఒక దేవతను చేసి మమ్మల్ని నడిపించు” అని వారతినితో చెప్పారు.
EXO 32:2 “మీ భార్యలు, కుమారులు, కుమార్తెలకు చెందిన బంగారు వస్తువులను తీసుకురండి” అని అహరోను ప్రజలతో అన్నాడు.
EXO 32:3 కాబట్టి ప్రజలంతా వారి బంగారు వస్తువులను పోగుచేసి వాటిని అహరోను దగ్గరకు తెచ్చారు.
EXO 32:4 ప్రజల దగ్గర నుండి అహరోను బంగారం తీసుకున్నాడు. అప్పుడు వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు. విగ్రహం చెక్కడానికి అహరోను ఉలి ఉపయోగించాడు. (తర్వాత దానికి బంగారం పొదిగించాడు.) అప్పుడు ప్రజలు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు నడిపించింది ఈ దేవుడే” అన్నారు.
EXO 32:5 అహరోను వీటన్నింటినీ చూసాడు. కనుక ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం నిర్మించాడు. అప్పుడు అహరోను ఒక ప్రకటన చేసాడు. “రేపు యెహోవాకు ప్రత్యేక పండుగ” అని చెప్పాడు.
EXO 32:6 మర్నాడు ఉదయం పెందలాడే ప్రజలు మేల్కొన్నారు. వాళ్లు జంతువులను చంపి దహన బలులుగాను, సమాధాన బలులుగాను అర్పించారు. తిని, తాగేందుకు ప్రజలు కూర్చున్నారు. అప్పుడు వాళ్లు విచ్చలవిడిగా సంబరం చేసుకున్నారు.
EXO 32:7 అదే సమయంలో మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఈ పర్వతం దిగి వెళ్లు. నీ ప్రజలు, ఈజిప్టు దేశం నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన ప్రజలు భయంకర పాపం చేసారు.
EXO 32:8 వాళ్లు చేయాలని నేను ఆజ్ఞాపించిన సంగతుల నుండి వాళ్లు చాల త్వరగా తప్పి పోయారు. కరగించిన బంగారంతో వాళ్లు ఒక దూడను చేసుకొన్నారు. వాళ్లు ఆ దూడను పూజిస్తూ దానికి బలులు చెల్లిస్తున్నారు. ‘ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి నిన్ను బయటకు రప్పించిన దేవుడు ఇదే, అని ప్రజలు చెప్పుకొనుచున్నారు.’”
EXO 32:9 “ఈ ప్రజలను నేను చూశాను. వీళ్లు ఎప్పుడూ నన్ను వ్యతిరేకించే మొండి ప్రజలని నాకు తెలుసు.
EXO 32:10 కనుక కోపంతో వాళ్లను నాశనం చేయనివ్వు, అప్పుడు నీలోనుండి ఒక జనాన్ని నేను తయారు చేస్తాను” అని మోషేతో యెహోవా అన్నాడు.
EXO 32:11 అయితే, మోషే తన దేవుడైన యెహవాను బ్రతిమాలుకొని: “ప్రభూ! నీ కోపం చేత నీ ప్రజలను నాశనం చేయకు. నీవే నీ మహాశక్తితో బలంతో ఈ ప్రజలను ఈజిప్టు నుండి తీసుకువచ్చావు.
EXO 32:12 అయితే, నీవే నీ ప్రజలను నాశనం చేస్తే, ‘యెహోవా తన ప్రజలకు చెడ్డకార్యాలను చేయాలని తలపెట్టాడు. అందుకే ఆయన వాళ్లను ఈజిప్టు నుండి బయటకు రప్పించాడు. పర్వతాల్లోనే వాళ్లను చంపాలని ఆయన అనుకున్నాడు. భూమి మీద తన ప్రజల్ని నాశనం చేయాలని ఆయన అనుకొంటున్నాడు’ అని ఈజిప్టు ప్రజలు చెప్పవచ్చు. కనుక నీ ప్రజల మీద కోపగించవద్దు. నీ కోపం విడిచిపెట్టేయి. నీ ప్రజల్ని నాశనం చేయకు.
EXO 32:13 నిన్ను సేవించిన మనుష్యులు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును (యాకోబు) జ్ఞాపకం చేసుకో. నీవు నీ పేరు ప్రయోగించి ఆ మనుష్యులకు వాగ్దానం చేసావు. ‘నీ ప్రజలను ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతగా చేస్తాను. నేను వారికి వాగ్దానం చేసిన ఈ దేశం అంతా నీ ప్రజలకు ఇస్తాను. ఈ దేశం శాశ్వతంగా వారిదే అవుతుంది’ అని నీవు చెప్పావు.”
EXO 32:14 కనుక యెహోవా తన ప్రజలను గూర్చి సంతాపపడ్డాడు. ఆయన చేస్తానన్న కీడును వారికి చేయలేదు. అంటే, ప్రజలను ఆయన నాశనం చేయలేదు.
EXO 32:15 అప్పుడు మోషే పర్వతం దిగి వెళ్లాడు. ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలు మోషే దగ్గర ఉన్నాయి. రాతికి వెనుక, ముందు రెండు వైపుల ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి.
EXO 32:16 దేవుడు తానే ఆ రాళ్లను చేసాడు. మరియు దేవుడే ఆ రాళ్ల మీద ఆజ్ఞలు రాసాడు.
EXO 32:17 వారు పర్వతం దిగి వెళ్తున్నప్పుడు ప్రజలు బస చేసిన చోటు నుండి వచ్చిన శబ్ధం యెహోషువా విన్నాడు, “కింద బసలో యుద్ధధ్వని వినిపిస్తున్నట్టుంది” అని మోషేతో యెహోషువా అన్నాడు.
EXO 32:18 “అందుకు మోషే, అది జయధ్వనులు చేస్తున్న సైన్యం శబ్దం కాదు. ఓటమివల్ల ఒక సైన్యం ఏడుస్తున్న శబ్దమూ కాదు అది, నాకు వినబడుతోన్నది సంగీత శబ్దం” అని జవాబిచ్చాడు.
EXO 32:19 మోషే బసను సమీపించినప్పుడు, అతడు బంగారు దూడను, ప్రజలు నాట్యమాడటమూ చూసాడు. మోషేకు చాలా కోపం వచ్చి, ఆ ప్రత్యేక రాతి పలకలను నేలకేసి కొట్టాడు. పర్వతం కింది భాగంలో ఆ రాతి పలకలు ముక్కలు ముక్కలయ్యాయి.
EXO 32:20 అప్పుడు ప్రజలు చేసిన దూడను మోషే నాశనం చేసాడు. దాన్ని మంటల్లో వేసి కరిగించేసాడు. అప్పుడు ఆ బంగారం దుమ్ము అయ్యేంత వరకు నూరేసాడు. ఆ దుమ్మును నీళ్లలో పడేసి ఇశ్రాయేలు ప్రజల చేత బలవంతంగా ఆ నీళ్లు తాగించాడు.
EXO 32:21 “ఈ ప్రజలు నీకేమి చేసారు? ఇలాంటి చెడ్డ పాపం చేయడానికి నీవెందుకు వాళ్లను నడిపించావు?” అని అహరోనును మోషే అడిగాడు.
EXO 32:22 “అయ్యా, కోపగించకు. ఈ ప్రజలు తప్పు చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని నీకు తెలుసు.
EXO 32:23 ‘ఈజిప్టు నుండి మోషే మమ్మల్ని నడిపించాడు. అయితే అతనికి ఏమయిందో మాకు తెలియదు. కనుక మమ్మల్ని నడిపించేందుకు మా కోసం ఒక దేవతను తయారు చేయి’ అని ప్రజలు నాతో అన్నారు.
EXO 32:24 కనుక ‘మీవద్ద ఉన్న బంగారు నగలను నాకు ఇవ్వండి’ అని ప్రజలతో చెప్పాను. ప్రజలు వారి బంగారం నాకు ఇచ్చారు. నేను ఆ బంగారాన్ని అగ్నిలో వేసాను. అగ్నిలో నుండి ఆ దూడ బయటకు వచ్చింది” అని అహరోను జవాబిచ్చాడు.
EXO 32:25 అహరోను అక్కడ గలభాకు కారణమని మోషే తెలుసుకున్నాడు. శత్రువులంతా చూడుగలిగేటట్టు ప్రజలు వెర్రివాళ్లలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు.
EXO 32:26 కనుక నివాసాల ప్రవేశం దగ్గర మోషే నిలబడ్డాడు. “యెహోవాను వెంబడించాలని కోరేవారు ఎవరో వారు నా దగ్గరకు రావాలి.” అన్నాడు. లేవీ కుటుంబానికి చెందిన ప్రజలంతా మోషే దగ్గరకు పరుగెత్తారు.
EXO 32:27 అప్పుడు మోషే అన్నాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబతున్నాడో నేను మీకు చెబతాను. ‘ప్రతి మనిషీ తన కత్తి తీసుకొని మన బసలో ఒక చివర నుండి మరో చివరకు వెళ్లాలి. ప్రతి మనిషి తన సోదరుణ్ణి, స్నేహితుల్ని, ఇరుగు పొరుగువారిని పంపాల్సి వచ్చినా మీరు వారిని చంపాలి.’”
EXO 32:28 లేవీ కుటుంబానికి చెందిన ప్రజలు మోషే మాటకులోబడ్డారు. ఆ రోజు ఇశ్రాయేలీయులతో సుమారు 3,000 మంది చనిపోయారు.
EXO 32:29 అప్పుడు, “మీ కుమారులను మీ సోదరులను దీవించే వారినిగా యెహవా నేడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు” అని మోషే చెప్పాడు.
EXO 32:30 మర్నాటి ఉదయం ప్రజలందరికీ మోషే, “మీరు భయంకర పాపం చేసారు. అయితే ఇప్పుడు నేను యెహోవా దగ్గరకు పైకి వెళ్తాను. ఆయన మీ పాపం విషయం మిమ్మల్ని క్షమించేందుకు నేనేమైనా చేయగలనేమో” అని చెప్పాడు.
EXO 32:31 కనుక మోషే యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లి, “దయచేసి ఆలకించు! ఈ ప్రజలు చాలా చెడ్డ పాపం చేసి, బంగారంతో దేవుణ్ణి చేసారు.
EXO 32:32 ఇప్పుడు ఈ పాపం విషయం వారిని క్షమించు. నీవు గనుక వారిని క్షమించకపోతే, నీవు వ్రాసిన గ్రంథంలో నా పేరు తుడిచేయి” అన్నాడు.
EXO 32:33 అయితే మోషేతో యెహోవా అన్నాడు, “నాకు వ్యతిరేకంగా ఎవరు పాపం చేస్తారో ఆ ప్రజల పేర్లు మాత్రమే నా గ్రంథంలో నుండి తుడిచి వేస్తాను.
EXO 32:34 కనుక కిందకు వెళ్లి, నేను నీకు చెప్పిన చోటుకు ప్రజలను నడిపించు. నీకు ముందు నా దేవదూత నడుస్తూ నిన్ను నడిపిస్తాడు. పాపం చేసిన వాళ్లను శిక్షించవలసిన సమయం వచ్చినప్పుడు వాళ్లు శిక్షించబడుతారు.”
EXO 32:35 కనుక ఆ ప్రజలకు భయంకర వ్యాధి వచ్చేటట్టు యెహోవా చేసాడు. వారు బంగారు దూడను చేయమని అహరోనుతో చెప్పినందువల్ల ఆయన అలా చేసాడు.
EXO 33:1 అయితే మోషేతో యెహోవా యిలా అన్నాడు: “ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన నీ ప్రజలూ, నీవూ ఇక్కడనుండి వెళ్లిపోవాలి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశానికి వెళ్లండి. నేను వాళ్లకు వాగ్దానం చేసాను. మీ సంతానమునకు ఆ దేశాన్ని ఇస్తానని నేను చెప్పాను.
EXO 33:2 మీకు ముందు వెళ్లడానికి ఒక దూతను నేను పంపిస్తాను. కనానీయులను, అమ్మోరీయులను, హిత్తీయులను పెరిజ్జీయులను. హివ్వీయులను, యెబూసీయులను నేను ఓడిస్తాను. ఆ ప్రజలు మీ దేశాన్ని విడిచి పెట్టేసేటట్టు బలవంతం చేస్తాను.
EXO 33:3 కనుక అనేక మంచి వాటితో నిండిన దేశానికి వెళ్లండి. కానీ నేను మీతో రాను. మీరు చాలా మొండివారు. నేను మీతో వస్తే మార్గంలో కోపంవచ్చి మిమ్మల్ని నేను నాశనం చేయవల్సి వస్తుందేమో.”
EXO 33:4 ఈ దుర్వార్తను ప్రజలు విని చాలా విచారించారు. దీని తర్వాత ప్రజలు నగలు పెట్టుకోలేదు.
EXO 33:5 “మీరు మొండివారు నేను మీతో కొంచెంసేపు ప్రయాణం చేసినా సరే నేను మిమ్మల్ని నాశనం చేయాల్సి వస్తుంది. కనుక మీ నగలన్నీ తీసి వేయండి. అప్పుడు మీ విషయం ఏమి చేయాలో నేను ఆలోచిస్తాను” అని మోషేతో యెహోవా చెప్పినందువల్ల వారు నగలు ధరించలేదు.
EXO 33:6 కనుక హోరేబు కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు వారి నగలన్నీ తీసి వేసారు.
EXO 33:7 గుడారాన్ని, నివాస డేరాలకు కొంత దూరం బయటకు జరిపాడు మోషే. “సన్నిధి గుడారం” అని మోషే దానికి పేరు పెట్టాడు. ఏ వ్యక్తిగాని యెహోవాను ఏదైనా అడగాలంటే, నివాస డేరాలకు వెలుపల ఉన్న సన్నిధి గుడారానికి వెళ్లాల్సి వచ్చింది.
EXO 33:8 ఎప్పుడేనా సరే, బయటకు ఆ గుడారానికి మోషే వెళ్తే ప్రజలంతా అతన్ని గమనిస్తూ ఉండేవారు. ప్రజలంతా వారి గుడారపు ద్వారం దగ్గర నిలబడి మోషే సన్నిధి గుడారంలో ప్రవేశించేవరకు అతణ్ణి గమనించి చుస్తుండేవారు.
EXO 33:9 మోషే సన్నిధి గుడారంలోకి వెళ్లినప్పుడల్లా స్తంభంలా నిలువుగా ఉన్న మేఘం నిలిచి ఉండేది. ఈ విధంగా మోషేతో యెహోవా మాట్లాడతాడు.
EXO 33:10 సన్నిధి గుడారపు ద్వారం దగ్గర మేఘాన్ని చూడగానే ప్రజలు యెహోవాను ఆరాధించుటకు సాష్టాంగపడేవారు.
EXO 33:11 మోషేతో ముఖాముఖీగా యెహోవా మాట్లాడాడు. ఒక మనిషి తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో యెహోవా మాట్లాడాడు. దేవునితో మాట్లాడిన తర్వాత, మోషే ఎప్పుడూ బసకు వెళ్లిపోయేవాడు. నూను కుమారుడైన యెహోషువ అనే ఒక యువకుడు మోషేకు సహాయకుడు. మోషే సన్నిధి గుడారం వదిలినప్పుడల్లా యెహోషువ సన్నిధి గుడారంలో నిలిచి ఉండేవాడు.
EXO 33:12 యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “ఈ ప్రజల్ని నడిపించమని నీవు చెప్పావు. నాతో ఎవర్ని నీవు పంపిస్తావో నీవు చెప్పలేదు. ‘నీవు నాకు బాగా తెలుసు. నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను.’ అని నీవు నాతో చెప్పావు.
EXO 33:13 నిజంగా నేను నీక ఆనందం కలిగించి ఉంటే, నీ మార్గాలు నాకు బోధించు. నేను నిన్ను వాస్తవంగా తెలుసుకోవాలని కోరుతున్నాను. అలాగైతే, నేను ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెడ్తూ ఉండగలుగుతాను. వీళ్లంతా నీ ప్రజలని జ్ఞాపకం ఉంచుకో.”
EXO 33:14 “నేను నీతో కూడా వస్తాను నేను మిమ్మల్ని నడిపిస్తాను” అని యెహోవా జవాబిచ్చాడు.
EXO 33:15 అప్పుడు మోషే ఆయనతో అన్నాడు: “నీవు మాతో రాకపోతే మాత్రం, మమ్మల్ని యిక్కడ నుండి పంపించి వేయకు.
EXO 33:16 మరియు నా విషయంలో, ఈ ప్రజల విషయంలో నీవు సంతోషిస్తున్నట్టు మాకెలా తెలుస్తుంది? నీవు మాతో కూడా వస్తే, అప్పుడు మాకు తెలుస్తుంది. నీవు మాతో రాకపోతే, ఈ భూమి మీద ఉన్న ఏ ఇతర ప్రజలకంటే నేను, ఈ ప్రజలు ప్రత్యేకం కాదు.”
EXO 33:17 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు అడిగినట్టు నేను చేస్తాను. నీ పట్ల నాకు ఆనందం గనుక నేను ఇలా చేస్తాను. నీవు నాకు బాగా తెలుసు.”
EXO 33:18 అప్పుడు మోషే, “అలాగైతే నీ మహిమ నాకు చూపించు” అన్నాడు.
EXO 33:19 అప్పుడు యెహోవా జవాబిచ్చాడు: “నా మంచితనం అంతా నీ ముందు నడిచేటట్లు చేస్తాను. నేను యెహోవాను. నీకు వినబడేటట్టు నా పేరు నేను ప్రకటిస్తాను. నేను ప్రకటించుకున్న వారికి ప్రేమ, దయ నేను చూపెడతాను.
EXO 33:20 కాని నా ముఖం నీవు చూడలేవు. ఏ మనిషీ నన్ను చూచి కూడా బ్రతకలేడు.
EXO 33:21 “అక్కడ నా దగ్గర ఒక చోట ఒక బండ వుంది. నీవు ఆ బండమీద నిలబడవచ్చు.
EXO 33:22 నా మహిమ ఆ స్థలాన్ని దాటి వెళ్తుంది. ఆ బండలోని ఒక పెద్ద సందులో నేను నిన్ను ఉంచి, నేను దాటి వెళ్లేటప్పుడు, నా చేతితో నిన్ను కప్పుతాను.
EXO 33:23 అప్పుడు నేను నా చేయిని తీసివేస్తాను. నీవు నా వెనుకవైపు చూస్తావు. కాని నా ముఖం మాత్రము నీవు చూడలేవు.”
EXO 34:1 అప్పుడు మోషేతో యెహోవా ఇలాగు చెప్పాడు: “ముందు పగులగొట్టబడ్డ రెండు రాతి పలకల్లాంటివే మరో రెండు రాతి పలకలు తయారు చేయి. మొదటి రెండు రాళ్లమీద రాయబడ్డ మాటలే ఈ రాళ్ల మీద నేను రాస్తాను.
EXO 34:2 రేపు ఉదయం సిద్ధంగా ఉండు. సీనాయి కొండమీదికి రమ్ము. అక్కడ కొండ శిఖరం మీద నా ఎదుట నిలబడు.
EXO 34:3 నీతో ఇంక ఏ వ్యక్తీ రావడానికి వీలులేదు. కొండమీద ఎక్కడా ఏ వ్యక్తి కనబడకూడదు. కనీసం ఆ కొండ కిందకూడ నీ పశువుల మందలు కాని, గొర్రెల మందలు గాని మేత కూడ మేయకూడదు.”
EXO 34:4 కనుక మొదటి వాటిలాగే మరో రెండు రాతి పలకలను మోషే చేసాడు. ఆ మర్నాడు ఉదయాన్నే సీనాయి కొండ మీదికి అతడు వెళ్లాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారమే అంతా చేసాడు. ఆ రెండు రాతి పలకలను మోషే తీసుకొని వెళ్లాడు.
EXO 34:5 మోషే కొండ మీద ఉన్నప్పుడు, ఒక మేఘం మీద యెహోవా దిగి వచ్చాడు. అక్కడ మోషే దగ్గర యెహోవా నిలబడ్డాడు. అతడు యెహోవాను పేరుపెట్టి పిలిచాడు.
EXO 34:6 మోషే ఎదుట యెహోవా దాటి వెళ్తూ ఇలా అన్నాడు: “యెహోవా దయ, జాలిగల దేవుడు. యెహోవా త్వరగా కోపపడడు. యెహోవా మహా ప్రేమపూర్ణుడు. యెహోవా నమ్ముకోదగినవాడు.
EXO 34:7 వేలాది తరాలకు దయచూపించే వాడు యెహోవా. ప్రజలు చేసే తప్పులను యెహోవా క్షమిస్తాడు. అయితే నేరస్తులను శిక్షించడం యెహోవా మరచిపోడు. నేరస్తులను యెహోవా శిక్షించడమే కాదు, వారు చేసే తప్పులవల్ల వారి పిల్లలు, మనుమళ్లు, మూడు నాలుగు తరాల వరకు శ్రమ అనుభవిస్తారు.”
EXO 34:8 వెంటనే మోషే సాష్టాంగపడి యెహోవాను ఆరాధించాడు. మోషే ఇలా అన్నాడు:
EXO 34:9 “ప్రభూ, నా విషయం నీకు ఇష్టమైతే దయచేసి మాతోకూడా రమ్ము. వీళ్లు మొండి ప్రజలని నాకు తెలుసు. అయితే మేము చేసిన తప్పుల విషయంలో మమ్మల్ని క్షమించు. మమ్మల్ని నీ ప్రజలుగా స్వీకరించు.”
EXO 34:10 అప్పుడు యెహోవా చెప్పాడు: “నీ ప్రజలందరితో నేను ఈ ఒడంబడికను చేస్తున్నాను. భూమి మీద ఈ జనం కోసం ఇదివరకు ఎన్నడూ చేయని అద్భుతకార్యాలు నేను చేస్తాను. యెహోవానైన నేను మహాఘనుడనని నీతో ఉన్న ప్రజలు చూస్తారు. నేను నీ కోసం చేసే అద్భుత కార్యాలను వారు చూస్తారు.
EXO 34:11 ఈ వేళ నీకు నేను ఆజ్ఞాపిస్తున్న విషయాలకు లోబడు, నీ శత్రువులు నీ దేశము వదలివెళ్లి పోయేటట్టు నేను వారిని బలవంతం చేస్తాను. అమోరీయులను, కనానీయలను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యెబసీయులను నేను బయటకు వెళ్ళగొడతాను.
EXO 34:12 జాగ్రత్తగా ఉండు! నీవు వెళ్తోన్న దేశంలో నివసించే ప్రజలతో ఎలాంటి ఒడంబడిక చేయకు. ఆ ప్రజలతో నీవు ఏదైనా ఒడంబడిక చేస్తే, అది నీకు చిక్కు తెచ్చిపెడుతుంది.
EXO 34:13 అయితే వారి బలిపీఠాలు నాశనం చేయి. వారు పూజించే రాళ్లను విరుగగొట్టు. వారి విగ్రహాలను నరికి వెయ్యి.
EXO 34:14 మరో దేవుడ్ని ఎవర్నీ ఆరాధించవద్దు. నేను ఎల్కానా, రోషముగల యెహోవాను. అది నా పేరు. నేను ఎల్కానా, అంటే రోషముగల దేవుడ్ని.
EXO 34:15 “ఆ దేశములో నివసించే ప్రజలతో ఎలాంటి ఒడంబడిక చేయకుండా జాగ్రత్తగా ఉండు. నీవు గనుక అలా చేస్తే, వారు వారి వారి దేవతలను ఆరాధించేటప్పుడు వాళ్లతో కలవమని ఆ ప్రజలు నిన్ను పిలుస్తారు. వాళ్ల బలుల మాంసం నీవు తినకుండ జాగ్రత్త పడుము.
EXO 34:16 వారి కూతుళ్లు కొందరిని మీ కుమారులకు భార్యలుగా మీరు చేసుకుంటారేమో. ఆ కూతుళ్లు తప్పుడు దేవతలను సేవిస్తారు. మీ కుమారులు కూడా అలాగే చేసేటట్టు వారు నడిపించవచ్చు.
EXO 34:17 “విగ్రహాలు చేసుకోవద్దు.
EXO 34:18 “పులియని రొట్టెల పండుగ ఆచరించు. నేను ఇదివరకు మీతో చెప్పిన ప్రకారము పులియచేసే పదార్థం లేకుండా తయారు చేయబడిన రొట్టెలను ఏడు రోజులపాటు తినాలి. నేను ఏర్పరచుకున్న అబీబు నెలలో దీన్ని చేయాలి. ఎందుకంటే మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నెల అది.
EXO 34:19 “ఒక స్త్రీకి పుట్టిన ప్రథమ శిశువు ఎల్లప్పుడూ నాకే చెందుతుంది. మీ పశువులకు, గొర్రెలకు మొదటిదిగా పుట్టే పిల్లలు కూడా నాకే చెందుతాయి.
EXO 34:20 మొదటిదిగ పుట్టిన ఒక గాడిదను నీవు ఉంచుకోవాలంటే ఒక గొర్రె పిల్లను యిచ్చి నీవు దాన్ని కొనుక్కోవచ్చు. అయితే నీవు ఒక గొర్రె పిల్లను యిచ్చి ఆ గాడిదను కొనకపోతే, ఆ గాడిద మెడ నీవు విరుగగొట్టాలి. ప్రథమ సంతానమైన నీ కుమారులందరినీ నా దగ్గర్నుంచి నీవు కొనాలి. కానుక లేకుండా ఏ మనిషీ నా దగ్గరకు రాకూడదు.
EXO 34:21 “ఆరు రోజులు నీవు పనిచేస్తావు. అయితే ఏడో రోజున నీవు విశ్రాంతి తీసుకోవాలి. నాట్లు వేసేటప్పుడు, కోత కోసేటప్పుడు గూడ నీవు విశ్రాంతి తీసుకోవాలి.
EXO 34:22 “నీవు వారాల పండుగ ఆచరించాలి. గోధుమ కోతలో నుండి మొదటి గింజల్ని ఈ పండుగకు వినియోగించాలి. సంవత్సరాంతములో కోతకాలపు పండుగ ఆచరించాలి.
EXO 34:23 “ప్రతి సంవత్సరమూ మూడుసార్లు మీ పురుషులంతా మీ యజమానీ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోఉండేందుకు వెళ్లాలి.
EXO 34:24 “మీరు మీ దేశంలోకి వెళ్లినప్పుడు, ఆ దేశంలో నుండి మీ శత్రువులను నేను వెళ్లగొట్టి వేస్తాను. మీ సరిహద్దులను నేను విశాలం చేస్తాను. మీకు ఇంకా భూమి లభిస్తుంది. ప్రతి సంవత్సరం మూడు సార్లు మీరు యెహోవా దేవుని ఎదుటకి వెళ్లాలి. ఆ సమయంలో ఎవ్వరూ మీ భూమిని మీ దగ్గర నుండి తీసుకునేందుకు ప్రయత్నించరు.
EXO 34:25 “బలి రక్తం నీవు నాకు అర్పిస్తే పులిసిన పదార్థము ఏదీ దానితోపాటు అర్పించవద్దు. “పస్కా భోజనంలోని మాంసం ఏ మాత్రము మరునాటి ఉదయానికి మిగులకూడదు.
EXO 34:26 “మీ కోతలో నుండి మొట్టమొదటి పంట యెహోవాకు ఇవ్వాలి. మీ యెహోవా దేవుని ఆలయములోనికి వాటిని తీసుకొని రావాలి. “మేక పిల్లను దాని తల్లి పాలతో ఎన్నడూ వండకూడదు.”
EXO 34:27 అప్పుడు మోషేతో యెహోవా, “నేను నీకు చెప్పిన విషయాలన్నీ రాయి. నీతోను, ఇశ్రాయేలు ప్రజలతోను నేను చేసిన ఒడంబడిక విషయాలు అవి” అన్నాడు.
EXO 34:28 నలభై పగళ్లు నలభై రాత్రుళ్లు మోషే అక్కడే యెహోవాతో ఉన్నాడు. ఆ సమయంలో అతను భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. ఒడంబడిక మాటలు అంటే పది ఆజ్ఞలు రెండు రాతి పలకల మీద మోషే వ్రాసాడు.
EXO 34:29 అప్పుడు మోషే సీనాయి పర్వతం కిందికి వచ్చాడు. దేవుని ఆజ్ఞలు రాయబడ్డ ఆ రెండు రాతి పలకలనూ, అతను పట్టుకొచ్చాడు. మోషే యెహోవాతో మాట్లాడాడు. కనుక అతని ముఖం ప్రకాశిస్తూ ఉండినది. అయితే అది మోషేకు తెలియదు.
EXO 34:30 మోషే ముఖం మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉండటం అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు. అందుచేత అతని దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు.
EXO 34:31 అయితే మోషే వాళ్లను పిలిచాడు. కనుక అహరోను, ప్రజానాయకులు అందరూ మోషే దగ్గరకు వెళ్లారు. మోషే వాళ్లతో మాట్లాడాడు.
EXO 34:32 ఆ తర్వాత, ఇశ్రాయేలు ప్రజలంతా మోషే దగ్గరకు వచ్చారు. సీనాయి కొండ మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలను మోషే వారికీ ఇచ్చాడు.
EXO 34:33 మోషే ప్రజలతో మాట్లాడ్డం ముగించగానే తన ముఖం మీద ముసుగు కప్పుకున్నాడు.
EXO 34:34 యెహోవాతో మాట్లాడేందుకు ఆయన ఎదుటికి వెళ్లినప్పుడల్లా మోషే తన ముఖం మీద ముసుగు తీసివేసాడు. తరువాత మోషే బయటకు వచ్చి — యెహోవా ఆజ్ఞాపించిన విషయాలను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేవాడు.
EXO 34:35 మోషే ముఖం ప్రకాశంగా మెరిసిపోతున్నట్టు ప్రజలు చూసేవాళ్లు కనుక మోషే మరల తన ముఖం కప్పుకొనేవాడు. మరల యెహోవాతో మాట్లాడేందుకు వెళ్లేంతవరకు మోషే తన ముఖం పైనుండి ముసుకును తీసే వాడుకాదు.
EXO 35:1 ఇశ్రాయేలు ప్రజలందర్నీ మోషే సమావేశ పర్చాడు. మోషే వారితో చెప్పాడు: “మీరు చేయాలని యెహోవా ఆజ్ఞాపించిన విషయాలు నేను మీకు చెబతాను.
EXO 35:2 “పని చేయడానికి ఆరు రోజులున్నాయి. అయితే ఏడో రోజు మీకు చాల ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. ఆ ప్రత్యేక దినాన విశ్రాంతి తీసుకోవడంవల్ల మీరు యెహోవాను ఘనపరుస్తారు. ఏడో రోజున పనిచేసే వ్యక్తిని చంపెయ్యాలి.
EXO 35:3 సబ్బాతు రోజున మీరు నివసించే స్థలాల్లో నిప్పు కూడ రాజబెట్టకూడదు.”
EXO 35:4 ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే ఇలా చెప్పాడు: “యెహోవా ఆజ్ఞాపించినది ఇదే.
EXO 35:5 యెహోవా కోసం ప్రత్యేక కానుకలు సమకూర్చండి. మీరు ఏమి ఇస్తారో మీలో ప్రతి ఒక్కరూ మీ హృదయంలో తీర్మానం చేసుకోవాలి. అప్పుడు ఆ కానుక యెహోవా కోసం తీసుకుని రావాలి. బంగారం, వెండి, ఇత్తడి.
EXO 35:6 నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట, శ్రేష్ఠమైన సన్నటి బట్ట, మేక బొచ్చు.
EXO 35:7 ఎరుపు రంగు వేసిన గొర్రె తోళ్లు, మంచి చర్మాలు, తుమ్మ కర్ర,
EXO 35:8 దీపాల కోసం ఒలీవ నూనె, అభిషేక తైలం కోసం పరిమళ ద్రవ్యాలు, సువాసన ధూపంకోసం పరిమళ ద్రవ్యాలు,
EXO 35:9 లేతపచ్చ రాళ్లు, యితర నగలు కానుకలుగా తీసుకు రావాలి. యాజకులు ధరించే ఏఫోదు, న్యాయ తీర్పు పైవస్త్రం మీద ఈ రాళ్లు, నగలు అమర్చబడుతాయి.
EXO 35:10 “నైపుణ్యంగల వాళ్లందరూ యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నింటినీ చేయాలి. (యెహోవా ఆజ్ఞాపించిన వస్తువులు ఇవి):
EXO 35:11 పవిత్ర గుడారం, దాని బయటి గుడారం, దాని కప్పు, కొక్కీలు, చట్రాలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు,
EXO 35:12 ఒడంబడిక పవిత్ర పెట్టె, దాని కర్రలు, పెట్టెను మూసే దాని మూత, పెట్టె ఉండే చోటును కప్పి ఉంచే తెర
EXO 35:13 బల్ల, దాని కర్రలు, బల్ల మీద వస్తువులన్నీ, బల్ల మీద ఉండే ప్రత్యేక రొట్టె,
EXO 35:14 వెలుగు కోసం ఉపయోగించే దీప స్తంభం, దీప స్తంభానికి సంబంధించిన వస్తువులన్నీను, దీపాలు, దీపానికి నూనె,
EXO 35:15 ధూపం వేసేందుకు బలిపీఠం, దాని కర్రలు, అభిషేక తైలం, సువాసన గల ధూపద్రవ్యాలు, పవిత్ర గుడారం, ప్రవేశం దగ్గర ద్వారాన్ని కప్పి ఉంచే తెర,
EXO 35:16 అర్పణలు దహించే బలిపీఠం, దాని ఇత్తడి తెర, కర్రలు, బలిపీఠం దగ్గర ఉపయోగించే అన్ని వస్తువులు, గంగాళం, దాని పీట,
EXO 35:17 ఆవరణపు తెరలు, వాటి కర్రలు, దిమ్మలు, ఆవరణ ద్వారపు తెర
EXO 35:18 గుడారం, ఆవరణ గుడారం పట్టి ఉంచే మేకులు, మేకులకు కట్టే తాళ్లు,
EXO 35:19 పరిశుద్ధ స్థలంలో యాజకులు ధరించే ప్రత్యేక నేత వస్త్రాలు. యాజకుడైన అహరోను, అతని కుమారులు ధరించాల్సిన ప్రత్యేక వస్త్రాలు ఇవి. వాళ్లు యాజకులుగా సేవ చేసేటప్పుడు ఈ వస్త్రాలు ధరిస్తారు.”
EXO 35:20 అప్పుడు ప్రజలంతా మోషే దగ్గర్నుంచి వెళ్లిపోయారు.
EXO 35:21 ఇవ్వాలి అనుకొన్న ప్రజలంతా వచ్చి యెహోవాకు కానుక తెచ్చారు. సన్నిధి గుడారం, గుడారంలోని సమస్త సామగ్రి, ప్రత్యేక వస్త్రాలు చేసేందుకు ఈ కానుకలు ప్రయోగించబడ్డాయి.
EXO 35:22 ఇవ్వాలనుకున్న స్త్రీ పురుషులంతా అన్ని రకాల బంగారు వస్త్రాలూ తెచ్చారు. పిన్నులు, చెవిపోగులు, ఉంగరాలు, ఇతర బంగారు వస్తువులు వారు తీసుకు వచ్చారు. వాళ్లంతా వారి బంగారాన్ని యెహోవాకు ఇచ్చారు. ఇది యెహోవాకు ప్రత్యేక అర్పణ.
EXO 35:23 నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్రవర్ణం, ఎరుపు బట్ట ఉన్న ప్రతి వ్యక్తీ వాటిని యెహోవా కోసం తెచ్చాడు. మేక బొచ్చు, లేక ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలు లేక నాణ్యమైన తోలు ఉన్నవారు ఎవరైనా సరే వాటిని యెహోవా కోసం తెచ్చారు.
EXO 35:24 వెండిని లేక ఇత్తడి ఇవ్వాలనుకున్న ప్రతి వ్యక్తీ వచ్చి, దానిని యెహోవాకు కానుకగా తెచ్చారు. తుమ్మకర్ర ఉన్న ప్రతి వ్యక్తీ వచ్చి, దానిని యెహోవాకు కానుకగా ఇచ్చాడు.
EXO 35:25 నిపుణతగల ప్రతి స్త్రీ నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట తయారు చేసింది.
EXO 35:26 సహాయం చేయాలనుకొన్న నైపుణ్యంగల స్త్రీలంతా మేక వెంట్రుకలతో వస్త్రాలు తయారు చేసారు.
EXO 35:27 పెద్దలు లేతపచ్చలు, ప్రశస్తమైన ఇతర రాళ్లు తెచ్చారు. యాజకుని ఏఫోదు, న్యాయతీర్పు పైవస్త్రం మీద ఈ రాళ్లు రత్నాలు అమర్చబడ్డాయి.
EXO 35:28 సుగంధ ద్రవ్యాలు, ఒలీవ నూనె కూడ ప్రజలు తెచ్చారు. సువాసనగల పరిమళ ద్రవ్యం, అభిషేక తైలం, దీపాల నూనె కోసం ఉపయోగించబడ్డాయి.
EXO 35:29 సహాయం చేయాలనుకొన్న ఇశ్రాయేలు ప్రజలంతా యెహవాకు కానుకలు తెచ్చారు. ఈ కానుకలు ఉచితం, మరియు ప్రజలు ఇవ్వాలనుకొన్నారు గనుక వాటిని ఇచ్చారు. మోషేకు, ప్రజలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేసేందుకు ఈ కానుకలు ఉపయోగించబడ్డాయి.
EXO 35:30 అప్పుడు ప్రజలతో మోషే ఇలా అన్నాడు: “చూడండి, యూదా గోత్రానికి చెందిన ఊర్ కుమారుడు బెసలేలును యెహోవా ఏర్పరచుకొన్నాడు. (హోరు కుమారుడు ఊర్).
EXO 35:31 బెసలేలును యెహోవా తన ఆత్మతో నింపాడు. అన్ని రకాల పనులు చేయడానికి యెహోవా అతనికి నైపుణ్యం ఇచ్చాడు.
EXO 35:32 అతడు నమూనాలు చేసి బంగారం, వెండి, ఇత్తడితో వస్తువులు చేయగలడు.
EXO 35:33 ప్రశస్తమైన రాళ్లను రత్నాలను చెక్కిసానబెట్టగలడు. బెసలేలు చెక్కపని చేసి అన్ని రకాల వస్తువులు తయారు చేయగలడు.
EXO 35:34 ఇతరులకు నేర్పించగల నైపుణ్యాన్ని బెసలేలుకు, అహోలీయాబుకు దేవుడు యిచ్చాడు. (దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడు అహోలియాబు).
EXO 35:35 అన్ని రకాల పనులు చేయటానికి ప్రత్యేక నైపుణ్యాన్ని యెహోవా వారికి ఇచ్చాడు. వడ్లవాని పనులు, లోహపు పనులు వారు చేయగలరు. నీలం, ధూమ్రవర్ణం, ఎరుపు, నాణ్యమైన బట్టల మీద బుటా పని వారు చేయగలరు. ఉన్ని వస్త్రాలను వారు నేయగలరు.
EXO 36:1 “కనుక బెసలేలు, అహోలియాబు, ఇంకా నైపుణ్యంగల పురుషులందరూ యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నీ చేస్తారు. ఈ పరిశుద్ధ స్థలం నిర్మించేందుకు అవసరమైన వాటిన్నింటినీ చేయటానికి అవసరమైన జ్ఞానం, అవగాహన దేవుడు ఈ మనుష్యులకు ఇచ్చాడు.”
EXO 36:2 తర్వాత బెసలేలును, అహోలియాబను, యెహోవా నైపుణ్యాన్ని ఇచ్చిన ఇతర నిపుణులను మోషే పిలిచాడు. పనిలో సహాయం చేయాలని వీళ్లంతా వచ్చారు.
EXO 36:3 ఇశ్రాయేలు ప్రజలు కానుకగా తెచ్చిన వస్తువులన్నింటినీ మోషే ఈ మనుష్యులకు ఇచ్చాడు. పవిత్ర గుడారం నిర్మించడానికి వీటన్నింటినీ వారు ఉపయోగించారు. ప్రతి ఉదయం ప్రజలు కానుకలు తెస్తున్నారు.
EXO 36:4 చివరకు నిపుణలైన పని వాళ్లు ఒక్కొక్కరు, ఆ పవిత్ర స్థలంలో వారు చేస్తున్న పని విడిచి పెట్టి, మోషేతో మాట్లాడటానికి వెళ్లారు.
EXO 36:5 “ప్రజలు కానుకలను విపరీతంగా తెచ్చేసారు. గుడారం పని ముగించడానికి కావలసిన దానికంటే మా దగ్గర ఎక్కువే ఉంది” అన్నారు వారు.
EXO 36:6 అప్పుడు, “ఇంక ఏ స్త్రీగాని, పురుషుడుగాని గుడారం కోసం ఏ విధమైన కానుకా తీసుకురాకూడదు” అని బస అంతటికీ మోషే కబురు చేసాడు.
EXO 36:7 పవిత్ర స్థలానికి అవసరమైన దానికంటే ఎక్కువ వస్తువులను ప్రజలు సిద్ధం చేసారు.
EXO 36:8 అప్పుడు నిపుణులు పవిత్ర గుడారం తయారు చేయటం మొదలు పెట్టారు. నీలం, ఎరుపు సన్నని నారబట్టతో పది తెరలు వారు చేసారు. రెక్కలు గల కెరూబుల చిత్రాలను ఆ బట్ట మీద వారు కుట్టి పెట్టారు.
EXO 36:9 ప్రతి తెరా ఒకే కొలత. అది 14 గజాలు పొడువు, 2 గజాల వెడల్పు.
EXO 36:10 అయిదు తెరలు కలిపి ఒక భాగంగాను మిగిలిన అయిదు ముక్కలు కలిపి మరో భాగంగాను కలపబడ్డాయి.
EXO 36:11 తర్వాత మొదటి అయిదు తెరల భాగానికి బట్ట అంచు వెంబడి నీలం గుడ్డతో ఉంగరాలు చేస్తారు. మరో అయిదు ముక్కల భాగానికి కూడ అలానే చేస్తారు.
EXO 36:12 ఒక భాగంలో చివరి తెర మీద 50 ఉంగరాలు మరో భాగంలో చివర తెర మీద 50 ఉంగరాలు ఉన్నాయి. ఈ ఉంగరాలు ఒక దానికి ఒకటి ఎదురెదురుగా ఉన్నాయి.
EXO 36:13 అప్పుడు వారు 50 బంగారు ఉంగరాలు చేసారు. రెండు తెరలను ఒకటిగా కలిపేందుకు ఈ బంగారు ఉంగరాలను వారు ఉపయోగించారు. అందుచేత గుడారం మొత్తం పవిత్ర స్థలంగా కలపబడింది.
EXO 36:14 అప్పుడు పవిత్ర గుడారం పైకప్పు కోసం మేక వెంట్రుకలతో 11 తెరలను పనివారు తయారు చేసారు.
EXO 36:15 మొత్తం 11 తెరలు ఒకే కొలత గలవి. వాటి పొడువు 15 గజాలు వెడల్పు 2 గజాలు.
EXO 36:16 అయిదు తెరలను ఒక భాగంగా కలిపి కుట్టారు. పనివాళ్లు తర్వాత ఆరు తెరలను మరో భాగంగా కలిపి కుట్టారు.
EXO 36:17 మొదటి భాగంలోని చివరి తెర అంచుకు 50 ఉంగరాలు అమర్చారు. మరో భాగంలోని చివరి తెర అంచుకు 50 ఉంగరాలు అమర్చారు.
EXO 36:18 ఈ రెండు భాగాలను ఒక్కటిగా కలిపేందుకు 50 ఇత్తడి కొలుకులను పనివారు తయారు చేసారు.
EXO 36:19 తర్వాత గుడారానికి ఇంకా రెండు పై కప్పులను వారు తయారు చేసారు. ఒక పై కప్పు ఎరుపు రంగు వేసిన గొర్రె చర్మంతోను, మరొకటి నాణ్యమైన తోలుతోను చేయబడ్డాయి.
EXO 36:20 తర్వాత తుమ్మ కర్రతో పనివారు పలకలు చేసారు.
EXO 36:21 ఒక్కో పలక పొడవు 15 అడుగులు వెడల్పు 27 అంగుళాలు.
EXO 36:22 ఒక్కో పలక అడుగున పక్క పక్కగా రెండు కొక్కీలు ఉన్నాయి. పవిత్ర గుడారపు పలకల్లో ప్రతి ఒక్కటీ ఇలాగే చేయబడింది.
EXO 36:23 గుడారం దక్షిణ భాగానికి 20 చట్రాలను వారు తయారు చేసారు.
EXO 36:24 ఆ తర్వాత ఈ 20 చట్రాల కింద పెట్టడానికి 40 వెండి దిమ్మలను వారు చేసారు. ప్రతి పలకకీ రెండేసి దిమ్మలు ఉన్నాయి. ఒక్కో బల్ల కింద ప్రతి పక్కా కర్రలు, ఒక దిమ్మ.
EXO 36:25 గుడారం అవతలి వైపుకు (ఉత్తరం వైపు) కూడా వారు 20 పలకలు చేసారు.
EXO 36:26 ఒక్కో చట్రం కిందా రెండేసి చొప్పున 40 వెండి దిమ్మలు అతడు చేసాడు.
EXO 36:27 పవిత్ర గుడారం వెనుక భాగానికి (పడమటి వైపున) ఆరు పలకలు అతడు చేసాడు.
EXO 36:28 పవిత్ర గుడారం వెనుక వైపు మూలలకు రెండు చట్రాలు అతడు చేసాడు.
EXO 36:29 ఈ చట్రాలు అడుగు భాగాన కలిపి బిగించబడ్డాయి. పై భాగాన అది జతచేయబడ్డ ఉంగరంలో అమర్చబడ్డాయి. ప్రతి మూలకూ అతడు ఇలాగే చేసాడు.
EXO 36:30 కనుక పవిత్ర గుడారం పశ్చిమాన 8 చట్రాలు, 16 వెండి దిమ్మలు అంటే ఒక్కో చట్రం కింద రెండేసి దిమ్మలు ఉన్నాయి.
EXO 36:31 తర్వాత అతడు తుమ్మ కర్రతో అడ్డ కర్రలు చేసాడు — పవిత్ర గుడారం మొదటి పక్కకు 5 అడ్డ కర్రలు,
EXO 36:32 పవిత్ర గుడారం రెండో పక్కకు 5 అడ్డ కర్రలు, గుడారం వెనుక పక్కకు 5 అడ్డ కర్రలు.
EXO 36:33 ఒక్కో చట్రంలోనుంచి దూరి అన్ని చట్రాల గుండా అమర్చబడేటట్టు మధ్య అడ్డ కర్రను అతడు చేసాడు.
EXO 36:34 ఈ చట్రాలను బంగారంతో అతడు తాపడం చేసాడు. అడ్డ కర్రలను పట్టి ఉంచేందుకు బంగారు ఉంగరాలను అతడు చేసాడు.
EXO 36:35 తర్వాత అతి పవిత్ర స్థలం యొక్క ప్రవేశ ద్వారానికి తెరను వారు చేయటానికి నాణ్యమైన సన్నని నారబట్ట, నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణపు బట్ట వారు ఉపయోగించారు. నాణ్యమైన బట్టమీద కెరూబుల చిత్రాలను అతడు కుట్టాడు.
EXO 36:36 తుమ్మ కర్రతో నాలుగు స్తంభాలు చేసి వాటికి బంగారం తాపడం చేసారు. ఆ స్తంభాలకు బంగారు కొక్కీలు వారు చేసారు. ఆ స్తంభాలకు నాలుగు వెండి దిమ్మలను వారు చేసారు.
EXO 36:37 తర్వాత గుడారం ప్రవేశ ద్వారానికి ఒక తెరను వారు తయారు చేసారు. నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్టను వారు ఉపయోగించారు. ఆ బట్ట మీద చిత్ర పటాల బుటాపని వారు చేసారు.
EXO 36:38 తర్వాత ఈ తెరకోసం అయిదు స్తంభాలు, కొక్కీలు వారు చేసారు. స్తంభాల శిఖరాలకు, తెరల కడ్డీలకు అతడు బంగారు తాపడం చేసాడు. స్తంభాలకు అయిదు ఇత్తడి దిమ్మలను వారు చేసారు.
EXO 37:1 తుమ్మ కర్రతో పవిత్ర పెట్టెను బెసెలేలు చేసాడు. ఆ పెట్టె పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు. ఎత్తు 27 అంగుళాలు,
EXO 37:2 పెట్టె లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో అతడు తాపడం చేసాడు. తర్వాత పెట్టె చుట్టూ బంగారు నగిషీబద్ద కట్టాడు.
EXO 37:3 బంగారు ఉంగరాలు నాలుగు చేసి నాలుగు మూలలా వాటిని అమర్చాడు. పెట్టె మోయటానికి ఈ ఉంగరాలు ఉపయోగించబడ్డాయి. ఒక్కో ప్రక్క రెండేసి ఉంగరాలు ఉన్నాయి.
EXO 37:4 తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్రతో చేసి ఆ కర్రలకు స్వచ్ఛమైన బంగారం తాపడం చేసాడు.
EXO 37:5 పెట్టెకు ఒక్కో ప్రక్క ఉంగరాల గుండా కర్రలను దూర్చిపెట్టాడు.
EXO 37:6 తర్వాత స్వచ్ఛమైన బంగారంతో అతడు మూత చేసాడు. దాని పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు.
EXO 37:7 తర్వాత బెసలేలు కొట్టబడ్డ బంగారంతో రెండు కెరూబలను చేసాడు. ఆ కెరూబలను మూత కొనల మీద ఉంచాడు.
EXO 37:8 ఒక కొనమీద ఒక కెరూబను, మరో కొనమీద మరో కెరూబును ఉంచాడు. అంతా ఒకే భాగంలో ఉండేటట్టు ఆ కెరూబులు మూతతో కలిపి చేయబడ్డాయి.
EXO 37:9 కెరూబుల రెక్కలు ఆకాశంవైపు విప్పబడ్డాయి. ఆ కెరూబుల రెక్కలు పెట్టెను కప్పి ఉంచాయి. కెరూబులు ఎదురెదురుగా మూతను చూస్తూ ఉన్నాయి.
EXO 37:10 తర్వాత అతడు తుమ్మ కర్రతో బల్లను చేసాడు. ఆ బల్ల పొడవు 36 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, ఎత్తు 27 అంగుళాలు.
EXO 37:11 అతడు ఆ బల్లను బంగారంతో తాపడం చేసాడు. బల్ల నాలుగు ప్రక్కల బంగారు నగిషీబద్ద చేసాడు.
EXO 37:12 అప్పుడు అతడు ఆ బల్ల చుట్టూ మూడు అంగుళాల చట్రం చేసాడు. ఆ చట్రం మీద బంగారు నగిషీబద్దను అతడు ఉంచాడు.
EXO 37:13 అప్పుడు అతడు ఆ బల్లకు నాలుగు బంగారు ఉంగరాలు చేసాడు. నాలుగు మూలలా నాలుగు బంగారు ఉంగరాలు అతడు అమర్చాడు. అక్కడే నాలుగు కాళ్లు ఉన్నాయి.
EXO 37:14 ఉంగరాలను బల్ల పైభాగంలో చట్రానికి దగ్గరగా అతడు పెట్టాడు. బల్లను మోసేందుకు ఉపయోగించే కర్రలను ఉంగరాలు పట్టి ఉంచుతాయి.
EXO 37:15 తర్వాత బల్లలను మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్ర ఉపయోగించి చేసిన, ఆ కర్రలకు స్వచ్ఛమైన బంగారు పూత పూసాడు.
EXO 37:16 అప్పుడు బల్ల మీద ప్రయోగించే వస్తువులన్నింటినీ తయారు చేసాడు. పానార్పణము పోసేందుకు పళ్లెములు, గరిటెలు, గిన్నెలు, పాత్రలు అతడు తయారు చేసాడు. ఇవన్నీ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడ్డాయి.
EXO 37:17 తర్వాత అతడు దీపస్తంభం చేసాడు. స్వచ్ఛమైన బంగారం ఉపయోగించి, దాని దిమ్మను, స్తంభాన్ని తీర్చిదిద్దాడు. తర్వాత పువ్వుల్లా కనపడే గిన్నెలు చేసాడు. గిన్నెలకు మొగ్గలు, పువ్వులు ఉన్నాయి. అన్నీ స్వచ్ఛమైన బంగారంతోనే చేయబడ్డాయి. ఈ వస్తువులన్నీ ఒకే భాగంగా కలుపబడ్డాయి.
EXO 37:18 దీపస్తంభం ప్రక్కల్లో ఆరు కొమ్మలు ఉన్నాయి. ఒక పక్క మూడు కొమ్మలు, మరో పక్క మూడు కొమ్మలు ఉన్నాయి.
EXO 37:19 ఒక్కో కొమ్మకు మూడేసి బంగారు పూలున్నాయి. ఈ పూలు బాదం పూలవలె చేయబడ్డాయి. వాటికి మొగ్గలు, రేకులు ఉన్నాయి.
EXO 37:20 బంగారంతో చేయబడ్డ నాలుగు పూవులు దీపస్తంభంపు కాండానికి ఉన్నాయి. అవి కూడా మొగ్గలు, రేకులతో బాదం పూవుల్లానే ఉన్నాయి.
EXO 37:21 ఆరు కొమ్మలు రెండేసి చొప్పున మూడు భాగాలుగా ఉన్నాయి. ఒక్కో కొమ్మ విభాగం కింద ఒక్కో మొగ్గ ఉంది.
EXO 37:22 మొగ్గలు, కొమ్మలు, దీపస్తంభం అన్నీ స్వచ్ఛమైన బంగారంతో చేయబడ్డాయి. ఈ బంగారం అంతా కొట్టబడి, ఒకే భాగంగా చేయబడింది.
EXO 37:23 ఈ దీపస్తంభానికి అతడు ఏడు దీపాలు చేసాడు. తర్వాత అతడు పళ్లెం, పట్టకారులు చేసాడు. సమస్తం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది.
EXO 37:24 దీపస్తంభం, దాని పరికరాలు అన్నీ తయారు చేయడానికి అతడు 75 పౌన్ల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాడు.
EXO 37:25 ధూపం వేసేందుకు అతడు ధూప వేదిక చేసాడు. తుమ్మ కర్రతో అతడు దీన్ని చేసాడు. వేదిక చతురస్రాకారం. దాని పొడవు 18 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, ఎత్తు 36 అంగుళాలు. వేదిక మీద నాలుగు కొమ్మలు ఉన్నాయి. ఒక్కొక్క మూలను ఒక్కొక్క కొమ్మ ఉంది. ఈ కొమ్మలు వేదికతో కలిపి ఒకే భాగంగా చేయబడ్డాయి.
EXO 37:26 పై భాగం, అన్ని ప్రక్కలు, కొమ్మలకీ అతడు బంగారు తాపడం చేసాడు. తర్వాత అతడు బలిపీఠం చుట్టూ బంగారు నగిషీబద్ద చేసాడు.
EXO 37:27 బలిపీఠానికి అతడు రెండు బంగారు ఉంగరాలు చేసాడు. బలపీఠం నగిషీబద్దకు అడుగు భాగాన ఒక్కో ప్రక్క ఒక్కోటిగా బంగారు ఉంగరాలను అమర్చాడు. వేదికను మోసే కర్రలను ఈ బంగారు ఉంగరాలు పట్టి వుంచేవి.
EXO 37:28 స్తంభాలను తుమ్మ కర్రతో చేసి, బంగారం తాపడం చేసాడు అతడు.
EXO 37:29 తర్వాత అభిషేకించే పవిత్ర తైలం చేసాడు. స్వచ్ఛమైన పరిమళ వాసనగల ధూపం కూడ అతడు చేసాడు. అత్తరు చేసే నైపుణ్యంగల ఒకని చేత ఇవన్నీ చేయబడ్డాయి.
EXO 38:1 తర్వాత బెసలేలు బలిపీఠం కట్టాడు. ఇది దహన బలులను దహించటానికి ఉపయోగించిన బలిపీఠం. తుమ్మ కర్రతో అతడు బలిపీఠం చేసాడు. బలిపీఠం చతురస్రం, దాని పొడువు ఏడున్నర అడుగులు, వెడల్పు ఏడున్నర అడుగులు, ఎత్తు నాలుగున్నర అడుగులు.
EXO 38:2 ఒక్కొక్క మూలకు ఒక కొమ్మును అతడు చేసాడు. కొమ్ములను బలిపీఠంతో ఏకభాగంగా అతడు చేసాడు. తర్వాత అతడు దాన్నంతటినీ యిత్తడితో తాపడం చేసాడు.
EXO 38:3 తర్వాత బలిపీఠం మీద ఉపయోగించే పరికరాలు అన్నింటినీ అతడు చేసాడు. బిందెలు, గరిటెలు, గిన్నెలు, ముల్లు గరిటెలు, నిప్పు పాత్రలు అతడు చేసాడు.
EXO 38:4 తర్వాత అతడు బలిపీఠం కోసం ఒక వలలాంటి ఇత్తడి జల్లెడ తయారు చేసాడు. ఈ ఇత్తడి జల్లెడ వలలా ఉంది. బలిపీఠం అడుగున అంచు కింద ఉంచబడింది. అది అడుగు భాగాన కింద నుండి బలిపీఠం లోనికి సగం వరకు వుంది.
EXO 38:5 తర్వాత ఇత్తడి ఉంగరాలు చేసాడు. బలిపీఠాన్ని మోసే కర్రలను పట్టి వుంచేందుకు ఈ ఉంగరాలు ఉపయోగించ బడ్డాయి. ఆ ఉంగరాలకు ఇత్తడి జల్లెడ నాలుగు మూలలను అతడు అమర్చాడు.
EXO 38:6 తర్వాత అతడు తుమ్మకర్రతో కర్రలు చేసి, వాటిని యిత్తడితో తాపడం చేసాడు.
EXO 38:7 ఆ కర్రలను ఉంగరాలలో అమర్చాడు అతడు. బలిపీఠం పక్కలో ఉన్న కర్రలు బలిపీఠాన్ని మోసేందుకు ఉపయోగించబడ్డాయి. బలిపీఠం చేయడానికి అతడు తుమ్మ కర్ర పలకలను ఉపయోగించాడు. బలిపీఠం లోపల ఖాళీ గంగాళం వుంది.
EXO 38:8 దాని దిమ్మను అతడు ఇత్తడితో చేసాడు. స్త్రీలు ఇచ్చిన ఇత్తడి అద్దాలను అతడు ఉపయోగించాడు. సమావేశ గుడార ప్రవేశం దగ్గర పరిచర్య చేసే స్త్రీలు వీరు.
EXO 38:9 తర్వాత ఆవరణ చుట్టూ తెరలను అతడు చేసాడు. దక్షిణం వైపు తెరల పొడవు 50 గజాలు.
EXO 38:10 దక్షిణం వైపు 20 స్తంభాల ఆధారంతో తెరలు నిలబడ్డాయి. ఈ తెరలు సన్నని నారతో చేయబడ్డాయి. ఆ స్తంభాలు 20 యిత్తడి దిమ్మల మీద ఉన్నాయి. స్తంభాలకు, కర్రలకు కొక్కీలు వెండితో చేయబడ్డాయి.
EXO 38:11 ఆవరణ ఉత్తరం వైపుకూడ దక్షిణం వైపులాగే ఉంది. 20 ఇత్తడి దిమ్మల మీద 20 స్తంభాలు ఉన్నాయి. స్తంభాలకు, కర్రలకు కొక్కీలు వెండితో చేయబడ్డాయి.
EXO 38:12 ఆవరణ పడమటి వైపు తెరలు 25 గజాలు పొడవు. స్తంభాలు 10, దిమ్మలు 10 ఉన్నాయి. స్తంభాలకు కొక్కెములు బిగించే తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి.
EXO 38:13 ఆవరణ ప్రవేశం తూర్పున ఉంది. తూర్పున 25 గజాలు వెడల్పు,
EXO 38:14 ప్రవేశానికి ఒక ప్రక్క ఏడున్నర గజాలు పొడవు గల ఒక తెర ఉంది. ఆ తెరకు మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి.
EXO 38:15 ప్రవేశానికి మరో పక్క ఇంకో తెర ఉంది. దాని పొడవు కూడ ఏడున్నర గజాలు. ఆ తెరకు కూడా మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి.
EXO 38:16 ఆవరణ చుట్టూ ఉన్న తెరలన్నీ నాణ్యమైన బట్టతో చేయబడ్డాయి.
EXO 38:17 స్తంభాలకు దిమ్మలు ఇత్తడితో చేయబడ్డాయి. కొక్కెములు, తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి. స్తంభాల శిఖరాలు కూడ వెండితో తాపడం చేయబడ్డాయి. ఆవరణలోని స్తంభాలన్నీ తెరల వెండి కడ్డీలతో కలుపబడ్డాయి.
EXO 38:18 నీలం, ఎరుపు ధూమ్రవర్ణం బట్ట, నాణ్యమైన సన్నని నార బట్టతో ఆవరణ ప్రవేశానికి తెర చేయబడింది. నిపుణుడు వీటన్నింటినీ కలిపి కట్టాడు. ఆ తెర 10 గజాలు పొడవు, రెండున్నర గజాలు ఎత్తు ఉంది. ఆవరణలో తెరల వలే అవి కూడ అదే ఎత్తు ఉన్నాయి.
EXO 38:19 ఆ తెర నాలుగు స్తంభాలు, నాలుగు ఇత్తడి దిమ్మల మీద ఆధారపడి ఉంది.
EXO 38:20 స్తంభాల మీద కొక్కెములు వెండితో చేయబడ్డాయి. స్తంభాల శిఖరాలు, బిగించే కడ్డీలు వెండితో చేయబడ్డాయి.
EXO 38:21 పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) తయారు చేసేందుకు ఉపయోగించిన వస్తువులన్నింటినీ రాసి పెట్టమని లేవీ ప్రజలకు మోషే ఆజ్ఞాపించాడు. అహరోను కుమారుడు ఈతామారు ఈ జాబితా బాధ్యత వహించాడు.
EXO 38:22 దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్నీ యూదా వంశాపు హూరు కుమారుడైన ఊరి కుమారుడు బెసలేలు తయారు చేసాడు.
EXO 38:23 ఇంకా దాను వంశాపు అహీమాసాకీ కుమారుడు అహోలీయాబు అతనికి సహాయం చేసాడు. అహోలీయాబు నిపుణుడు, నమూనాలు గీయగలడు. శ్రేష్ఠమైన నారబట్టలతో నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టతో బుటా పని చేయగలవాడు అతడు.
EXO 38:24 పవిత్ర గుడారం కోసం రెండు టన్నులకంటే ఎక్కువ బంగారం యెహోవాకు అర్పణగా ఇవ్వబడింది. (ఆలయపు అధికారిక కొలత ప్రకారం ఇది తూచబడింది).
EXO 38:25 ప్రజలు మూడుముప్పావు టన్నులకు మించి వెండిని యిచ్చారు. (ఇది ఆలయపు అధికారిక కొలత ప్రకారం తూచబడింది).
EXO 38:26 ఇరవై సంవత్సరాలు, అంతకు పైబడ్డ మగవాళ్లందరినీ లెక్కించారు. మొత్తం 6,03,550 మంది మగవారున్నారు. వారిలో ప్రతి ఒక్కడు ఒక వెండి బాకా (అరతులం వెండి) పన్ను చెల్లించాలి. (ఒక వెండి బాకా అంటే అధికారిక కొలత ప్రకారం ఒక అరతులం.)
EXO 38:27 అందులో మూడు ముప్పావు టన్నుల వెండి పవిత్ర గుడారపు 100 దిమ్మలు చేసేందుకు, తెరచేసేందుకు వినియోగించబడింది. ఒక్క దిమ్మకు 75 పౌన్ల వెండి వారు ఉపయోగించారు.
EXO 38:28 కొక్కెములు, తెరల కడ్డీలు చేయటానికి, స్తంభాలకు వెండి తాపడం చేయటానికి మరో 50 పౌన్ల వెండి ఉపయోగించబడింది.
EXO 38:29 ఇత్తడి ఇరవై ఆరున్నర టన్నులకు పైగా యెహోవాకు ఇవ్వబడింది.
EXO 38:30 సన్నిధి గుడార ప్రవేశం దగ్గర దిమ్మలు చేయటానికి ఆ ఇత్తడి ఉపయోగించబడింది. బలిపీఠం, ఇత్తడి తెర చేసేందుకు కూడా వారు ఇత్తడి ఉపయోగించారు. బలిపీఠం కోసం పరికరాలు, పాత్రలు అన్నీ చేయటానికి కూడా ఇదే ఇత్తడి వాడబడింది.
EXO 38:31 ఆవరణ చుట్టూ తెరల దిమ్మలు చేసేందుకు, ప్రవేశం దగ్గర తెరల దిమ్మలు చేసేందుకు కూడా ఇదే ఇత్తడి వాడబడింది. పవిత్ర గుడారానికి, ఆవరణ చుట్టూ ఉన్న తెరలకూ కావల్సిన మేకులు చేసేందుకు కూడా ఇత్తడి ఉపయోగించబడింది.
EXO 39:1 పవిత్ర స్థలంలో యాజకులు పరిచర్య చేసేటప్పుడు ధరించే ప్రత్యేక వస్త్రాలు తయారు చేసేందుకు నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టను పనివారు ఉపయోగించారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు అహరోనుకు గూడ ప్రత్యేక వస్త్రాలు తయారు చేసారు.
EXO 39:2 బంగారు తీగ, శ్రేష్ఠమైన బట్ట, నీలం, ఎరుపు, ధూమ్రవర్ణం గల బట్టతో అతడు ఏఫోదును చేసాడు.
EXO 39:3 బంగారాన్ని సన్నని రేకులుగా వారు కొట్టారు. తర్వాత బంగారాన్ని పొడవైన తీగలుగా కోసారు. నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్ట, నాణ్యమైన బట్టతో బంగారాన్ని కలిపి కొట్టారు. ఇది చాల నైపుణ్యంగల వాని పని.
EXO 39:4 ఏఫోదుకు భుజభాగాలను వారు చేసారు. ఈ భాగాలు బట్ట అంచులకు బిగించబడ్డాయి. అప్పుడు అన్ని భాగాలు కలిసి కట్టబడ్డాయి.
EXO 39:5 దట్టి కూడ ఆలాగే చేయబడింది అది ఏఫోదులో ఒక భాగంగా ఉండేటట్టు కలుపబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే బంగారు తీగ, నాణ్యమైన బట్ట, నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణం బట్టలతో అది చేయబడింది.
EXO 39:6 రత్నాలను బంగారపు జవలలో పనివాళ్లు పొదిగించారు. ఇశ్రాయేలు కుమారుల పేర్లను వారు రత్నాలపై చెక్కారు.
EXO 39:7 తర్వాత ఏఫోదు భుజ భాగాల మీద రత్నాలను వారు అమర్చారు. ఇశ్రాయేలు కుమారులలో ఒక్కొక్కరికి ఒక్కో రత్నం సూచనగా ఉంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇది చేయబడంది.
EXO 39:8 తర్వాత న్యాయతీర్పు పైవస్త్రం బెసలేలు చేసాడు. నిపుణుని పనిగా అది చేయబడింది. బంగారు దారాలు, నీలం, ఎరుపు, ధూమ్రవర్ణం బట్టలతో అది చేయబడింది.
EXO 39:9 న్యాయతీర్పు పైవస్త్రం చతురస్రంగా ఉంది, రెండుగా మడత చేయబడింది. దాని పొడవు 9 అంగుళాలు, వెడల్పు 9 అంగుళాలు.
EXO 39:10 తర్వాత పనివాళ్లు అందమైన రత్నాలను నాలుగు వరుసలుగా దాని మీద పెట్టారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం ఉన్నాయి.
EXO 39:11 రెండవ వరుసలో పద్మరాగం, నీలం, సూర్యకాంతమణి వున్నాయి.
EXO 39:12 మూడవ వరుసలో గారుత్మతకం, యష్మురాయి. ఇంద్రనీలం వున్నాయి.
EXO 39:13 నాలుగవ వరుసలో రక్తవర్ణపు రాయి, సులిమానిరాయి, సూర్యకాంతం ఉన్నాయి. ఈ రత్నాలన్నీ బంగారంలో పొదిగించబడ్డాయి.
EXO 39:14 ఒక పనివాడు ఒక ముద్రను చేసినట్టు, ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఈ పన్నెండు రాళ్లమీద చెక్కబడ్డాయి. ఇశ్రాయేలు కుమారులు ఒక్కొక్కరి పేరు ఒక్కో రాయి మీద ఉంది.
EXO 39:15 న్యాయతీర్పు పైవస్త్రం కోసం స్వచ్ఛమైన బంగారంతో ఒక గొలుసు చేయబడింది. అది తాడుతో అల్లిక చేయబడింది.
EXO 39:16 పనివాళ్లు రెండు బంగారు దిమ్మలు, రెండు బంగారు ఉంగరాలు చేసారు. న్యాయ తీర్పు వస్త్రం పైభాగంలోని రెండు మూలల్లో బంగారు ఉంగరాలు రెండు పెట్టారు.
EXO 39:17 తర్వాత బంగారు గొలుసులు రెంటిని న్యాయతీర్పు వస్త్రానికి మూలల్లో రెండు ఉంగరాలకు కట్టారు.
EXO 39:18 బంగారు తాళ్ల అవతలి కొనలను రెండు జవలకు కట్టారు. తర్వాత ఏఫోదు ఎదుట భాగంలోని రెండు భుజాలకు వారు వాటిని బిగించారు.
EXO 39:19 తర్వాత వారు మరి రెండు బంగారు ఉంగరాలు చేసి, ఏఫోదు అడుగు భాగపు రెండు మూలల్లో పెట్టారు. ఏఫోదు దగ్గర లోపలి భాగంలో వారు ఆ ఉంగరాలను పెట్టారు.
EXO 39:20 భుజభాగాల ముందర అడుగు భాగంలో కూడా రెండు బంగారు ఉంగరాలను వారు పెట్టారు. ఏఫోదు దట్టీకి పైగా బిగింపు కూర్పునకు దగ్గరగా ఈ ఉంగరాలు ఉన్నాయి.
EXO 39:21 తర్వాత నీలి (దారంతో అల్లిన బట్ట) దట్టీతో తీర్పు పతకపు ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు కట్టారు. ఈ విధంగా తీర్పు పతకం నడికట్టును హత్తుకొని ఉంది. అది పడిపోదు. యెహోవా ఆజ్ఞాపించినట్లే వాళ్లు ఇవన్నీ చేసారు.
EXO 39:22 తర్వాత ఏఫోదు అంగీని వారు తయారు చేసారు. నీలం గుడ్డతో దాన్ని తయారు చేసారు. అది ఒక నిపుణుని పనితనం.
EXO 39:23 అంగీ మధ్యలో ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రం చుట్టూ ఒక గుడ్డ ముక్క కట్టబడింది. ఆ గుడ్డ ముక్క గోటు. ఆ రంధ్రం చినిగి పోకుండా ఉంచుతుంది.
EXO 39:24 తర్వాత నాణ్యమైన బట్ట నీలం, ఎరుపు ధూమ్ర వర్ణపు నారబట్ట ఉపయోగించారు. అంగీ అడుగు భాగానికి చుట్టూరా దానిమ్మలను కట్టారు.
EXO 39:25 తర్వాత స్వచ్ఛమైన బంగారంతో గంటలను వారు చేసారు. అంగీ అడుగు భాగాన దానిమ్మలకు మధ్య ఈ గంటలను వారు కట్టారు.
EXO 39:26 అంగీ అడుగు భాగం చుట్టూరా గంటలు, దానిమ్మలు ఉన్నాయి. ప్రతి దానిమ్మకూ మధ్య ఒక గంట వుంది సరిగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే యాజకుడు యెహోవాకు సేవ చేసేటప్పుడు ఈ అంగీని ధరించేవాడు.
EXO 39:27 అహరోనుకు, అతని కుమారులకు చొక్కాలను పనివారు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో ఈ చొక్కాలు చేయబడ్డాయి.
EXO 39:28 ఇంకా పనివాళ్లు నాణ్యమైన బట్టతో తలపాగాలను చేసారు. తలకు లోపలను, ఏఫోదు తీర్పు పతకాల కింద ధరించే బట్టలను వాళ్లు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో వాళ్లు వీటిని తయారు చేసారు.
EXO 39:29 నాణ్యమైన బట్ట నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టతో నడికట్టును వారు తయారు చేసారు. బట్టతో చిత్రపటాలు కుట్టబడ్డాయి. యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇవన్నీ చేయబడ్డాయి.
EXO 39:30 తర్వాత పవిత్ర కిరీటం కోసం ఒక బంగారు బద్ద తయారు చేసారు. దాన్ని స్వచ్ఛమైన బంగారంతో వాళ్లు చేసారు. బంగారం మీద వాళ్లు “యెహోవాకు పవిత్రం.” అనే మాటలు వ్రాసారు.
EXO 39:31 తర్వాత వాళ్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఆ బంగారు బద్దకు ఒక నీలసూత్రం కట్టి దాని తలపాగాకు కట్టారు.
EXO 39:32 కనుక సన్నిధి గుడారపు పని అంతా అయిపోయింది. సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు సమస్తం చేసారు.
EXO 39:33 తర్వాత పవిత్ర సమావేశ గుడారాన్ని వారు మోషేకు చూపించారు. గుడారాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని వాళ్లు అతనికి చూపించారు. ఉంగరాలు, చట్రాలు, కమ్ములు, స్తంభాలు, దిమ్మలు, అన్నీ వాళ్లు అతనికి చూపించారు.
EXO 39:34 ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలతో తయారు చేయబడిన గుడారపు పైకప్పును వారు అతనికి చూపించారు. పొట్టేళ్ల తోలుతో చేయబడ్డ పైకప్పును వారు అతనికి చూపించారు. మరియు శ్రేష్ఠమైన తోలుతో చేయబడ్డ పవిత్ర స్థల ప్రవేశానికి వేసే తెరను కూడా అతనికి చూపించారు.
EXO 39:35 ఒడంబడిక పెట్టెను వారు మోషేకు చూపించారు. ఆ పెట్టెను మోసేందుకు ఉపయోగించే కర్రలను, పెట్టెను మూసివుంచే మూతను వారు అతనికి చూపించారు.
EXO 39:36 బల్లను, గోనెమీద ఉంచే వాటన్నింటిని, దేవుని ప్రత్యేక రొట్టెను వారు మోషేకు చూపెట్టారు.
EXO 39:37 స్వచ్ఛమైన బంగారంతో చేయబడ్డ దీపస్తంభాన్ని, దాని మీద దీపాలను వారు మోషేకు చూపించారు. దీపాలకు ఉపయోగించే నూనె, ఇతర వస్తువులన్నింటిని వారు మోషేకు చూపించారు.
EXO 39:38 బంగారు బలిపీఠం, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం, గుడారపు ప్రవేశాన్ని మూసి వుంచే తెరను వారు అతనికి చూపించారు.
EXO 39:39 ఇత్తడి బలిపీఠమును, ఇత్తడి తెరను వారు అతనికి చూపించారు. బలిపీఠాన్ని మోసేందుకు ఉపయోగించే కర్రలను వారు మోషేకు చూపించారు. బలిపీఠం మీద ఉపయోగించే వస్తువులన్నింటినీ వారు మోషేకు చూపించారు. గంగాళాన్ని గంగాళం కింద ఉండే దిమ్మను వారు అతనికి చూపించారు.
EXO 39:40 ఆవరణలో స్తంభాలు, దిమ్మలతో ఉన్న తెరల గోడను మోషేకు వారు చూపించారు. ఆవరణ ద్వారాన్ని కప్పి ఉంచే తెరను వారు అతనికి చూపించారు. తాళ్లను, పవిత్ర గుడారపు మేకలను వారు. అతనికి చూపించారు. పవిత్ర గుడారంలో, సన్నిధి గుడారంలో ఉన్నవాటన్నింటినీ వారు అతనికి చూపించారు.
EXO 39:41 తర్వాత పవిత్ర గుడారంలో సేవలు చేసే యాజకుల కోసం తయారు చేయబడ్డ వస్త్రాలను వారు మోషేకు చూపించారు. యాజకుడైన అహరోను, అతని కుమారుల కోసం తయారు చేయబడ్డ ప్రత్యేక వస్త్రాలను వారు అతనికి చూపించారు. వారు యాజకులుగా సేవ చేసినప్పుడు ఆ వస్త్రాలు ధరించారు.
EXO 39:42 సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు ఈ పని అంతా చేసారు.
EXO 39:43 పని అంతటినీ మోషే చాలా సునిశితంగా పరిశీలించాడు. సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినట్టే పని జరిగినట్టు మోషే చూసాడు. కనుక వాళ్లను మోషే ఆశీర్వదించాడు.
EXO 40:1 అప్పుడు మోషేతో యెహోవా యిలా చెప్పాడు:
EXO 40:2 “మొదటి నెల మొదటి రోజున పవిత్ర గుడారాన్ని నిలబెట్టు.
EXO 40:3 ఒడంబడిక పెట్టెను సమావేశ పవిత్ర గుడారంలో పెట్టు. తెరతో ఆ పెట్టెను కప్పివేయి.
EXO 40:4 తర్వాత బల్లను లోపలికి తీసుకురా. బల్లమీద ఉండాల్సిన వస్తువులను దాని మీద ఉంచు. తర్వాత దీపస్తంభాన్ని గుడారంలో ఉంచు.
EXO 40:5 ధూపార్పణ కోసం బంగారపు వేదికను గుడారంలో పెట్టు, ఒడంబడిక పెట్టెకు ముందర ఈ వేదికను పెట్టు. తర్వాత పవిత్ర గుడారపు ప్రవేశానికి తెరవేయి.
EXO 40:6 “పవిత్ర గుడారపు (సన్నిధి గుడారం) ప్రవేశానికి ముందర దహనబలి అర్పణల పీఠాన్ని ఉంచు.
EXO 40:7 ఈ బలిపీఠానికి, సన్నిధి గుడారానికి మధ్య గంగాళం ఉంచు. గంగాళంలో నీళ్లు పోయాలి.
EXO 40:8 ఆవరణ చుట్టూ తెరలు తగిలించాలి. తర్వాత ఆవరణ ప్రవేశం దగ్గర తెరవేయాలి.
EXO 40:9 “అభిషేకతైలం ఉపయోగించి పవిత్ర గుడారాన్ని, అందులో ఉండే సమస్తాన్ని అభిషేకించు. ఈ వస్తువుల మీద నీవు తైలం పోసినప్పుడు వాటిని నీవు పవిత్రం చేస్తావు.
EXO 40:10 దహన బలులను దహించే బలిపీఠాన్ని, అభిషేకించు, బలిపీఠం మీద ఉండే సమస్తాన్నీ అభిషేకించు. ఆ బలిపీఠాన్ని నీవు పవిత్రం చేస్తావు. అది అతి పరిశుద్ధంగా ఉంటుంది.
EXO 40:11 తర్వాత గంగాళాన్ని, దాని కింద దిమ్మను అభిషేకించు. ఆ వస్తువులను పవిత్రం చేసేందుకు ఇలా చేయి.
EXO 40:12 “అహరోనును, అతని కుమారులను సన్నిధి గుడారం ప్రవేశం దగ్గరకు తీసుకురా. నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి.
EXO 40:13 తర్వాత అహరోనుకు ప్రత్యేక వస్త్రాలను తొడిగించాలి. తైలంతో అతన్ని అభిషేకించి అతన్ని పవిత్రం చెయ్యి. అప్పుడే అతడు యాజకుడుగా సేవచేయగలడు.
EXO 40:14 తర్వాత అతని కుమారులకు వస్త్రాలు తొడిగించాలి.
EXO 40:15 వాళ్ల తండ్రిని నీవు అభిషేకించినట్టే కుమారులను కూడా అభిషేకించు. అప్పుడు వాళ్లు కూడా యాజకులుగా నా సేవ చేయగలరు. వాళ్లను నీవు అభిషేకించినప్పుడు వాళ్లు యాజకులవుతారు. రాబోయే కాలమంతా ఆ కుటుంబము యాజకులుగా కొనసాగుతారు.”
EXO 40:16 మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం అతడు చేసాడు.
EXO 40:17 కనుక సరైన సమయంలో పవిత్రగుడారం నిలబెట్టబడింది. వారు ఈజిప్టు విడిచిన తర్వాత అది రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు.
EXO 40:18 యెహోవా చెప్పినట్టే పవిత్ర గుడారాన్ని మోషే నిలబెట్టాడు. అతడు దిమ్మలను ముందుగా కింద పెట్టాడు. తర్వాత ఆ దిమ్మల మీద చట్రాలను పెట్టాడు. తర్వాత అతడు కమ్ములను అమర్చి, స్తంభాలను నిలబెట్టాడు.
EXO 40:19 ఆ తర్వాత పవిత్ర గుడారం కప్పును మోషే నిలబెట్టాడు. తర్వాత గుడారపు కప్పు మీద మరో కప్పును అతడు వేసాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటినీ చేసాడు.
EXO 40:20 దేవుని ఆజ్ఞలు రాయబడ్డ రాతి పలకలను ఒడంబడిక పెట్టెలో మోషే పెట్టాడు. ఆ పెట్టెకు కర్రలను మోషే పెట్టాడు. తర్వాత అతడు ఆ పెట్టెకు మూత పెట్టాడు.
EXO 40:21 తర్వాత ఆ పవిత్ర పెట్టెను గుడారంలోకి మోషే తీసుకు వచ్చాడు. సరైన చోట అతడు తెర వేసాడు. ఇది సన్నిధి గుడారంలో పవిత్ర పెట్టెను మరుగు చేస్తుంది. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే వీటన్నింటినీ చేసాడు.
EXO 40:22 తర్వాత సన్నిధి గుడారపు బల్లను మోషే పెట్టాడు. గుడారం ఉత్తరాన అతడు దీన్ని పెట్టాడు. (పవిత్ర స్థలంలో) తెరముందర అతడు దీన్ని పెట్టాడు.
EXO 40:23 తర్వాత యెహోవా సన్నిధిలో బల్ల మీద రొట్టెను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు అతడు దీన్ని చేసాడు.
EXO 40:24 తర్వాత మోషే దీపస్తంభాన్ని సన్నిధి గుడారంలో పెట్టాడు. గుడారం దక్షిణాన, బల్లకు ఎదుట అతడు దీపస్తంభం పెట్టాడు.
EXO 40:25 తర్వాత యెహోవా సన్నిధిలో దీపస్తంభం మీద దీపాలను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు.
EXO 40:26 తర్వాత బంగారపు ధూపవేదికను సన్నిధి గుడారంలో మోషే పెట్టాడు. ఆ వేదికను తెరముందర అతడు పెట్టాడు.
EXO 40:27 తర్వాత ఆ బంగారు బలిపీఠం మీద సువాసనగల పరిమళ ధూపం అతడు వేసాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు.
EXO 40:28 తర్వాత పవిత్ర గుడారం ప్రవేశానికి మోషే తెర వేసాడు.
EXO 40:29 పవిత్ర గుడారం, సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర దహన బలులను దహించే బలిపీఠాన్ని మోషే పెట్టాడు. అప్పుడు ఒక దహన బలి అర్పణను ఆ బలిపీఠం మీద మోషే అర్పించాడు. యెహోవాకు ధాన్యార్పణ కూడ అతడు అర్పించాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటినీ చేసాడు.
EXO 40:30 తర్వాత మోషే సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య గంగాళం ఉంచాడు, కడుక్కొనేందుకు గంగాళంలో నీళ్లు పోసాడు.
EXO 40:31 మోషే, అహరోను, అహరోను కుమారులు వారి కాళ్లు చేతులు కడుక్కొనేందుకు ఈ గంగాళాన్ని ఉపయోగించారు.
EXO 40:32 వారు సన్నిధి గుడారంలో ప్రవేశించినప్పుడల్లా కాళ్లు కడుక్కొనేవారు. వాళ్లు బలిపీఠాన్ని సమీపించిన ప్రతీసారీ వాళ్లను వాళ్లు కడుక్కొనేవారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్లు ఇలా చేసారు.
EXO 40:33 తర్వాత గుడారపు ఆవరణలో తెరలను మోషే తగిలించాడు. మోషే గుడారపు ఆవరణలో బలిపీఠాన్ని పెట్టాడు. తర్వాత అతడు ఆవరణ ప్రవేశం దగ్గర తెరను వేసాడు. కనుక అతడు చేయాలని చెప్పి యెహోవా తనకు అప్పగించిన పని అంతా మోషే ముగించాడు.
EXO 40:34 అంతా ముగించిన తర్వాత సన్నిధి గుడారాన్ని ఒక మేఘం ఆవరించింది. యెహోవా మహిమ ఆ పవిత్ర గుడారాన్ని నింపివేసింది.
EXO 40:35 ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచిపోగా యెహోవా మహిమ దాన్ని నింపేసింది. కనుక మోషే ఆ సన్నిధి గుడారంలో ప్రవేశించలేక పోయాడు.
EXO 40:36 (ప్రజలు ఎప్పుడు సాగిపోవాల్సిందీ చూపెట్టిన మేఘం) పవిత్ర గుడారంనుండి మేఘం పైకి లేచినప్పుడు, ప్రజలు ప్రయాణం మొదలు పెట్టేవారు.
EXO 40:37 అయితే ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచి ఉన్నప్పుడు ప్రజలు సాగిపోయే ప్రయత్నం చేయలేదు. మేఘం లేచేంతవరకు వాళ్లు ఆ స్థలంలోనే ఉండిపోయారు.
EXO 40:38 కనుక యెహోవా మేఘం పగటివేళ పవిత్ర గుడారం మీద నిలిచి ఉండేది. మరియు రాత్రివేళ ఆ మేఘంలో అగ్ని ఉండేది. కనుక ఇశ్రాయేలు ప్రజలంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘాన్ని చూడగలిగారు.
LEV 1:1 యెహోవా దేవుడు మోషేను పిలిచి, సన్నిధి గుడారంలో నుండి అతనితో మాట్లాడాడు. యెహోవా అన్నాడు:
LEV 1:2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తెచ్చినప్పుడు, ఆవుల మందలోనుండి గాని, గొర్రెల మందలోనుండి గాని దానిని తీసుకొని రావాలి.
LEV 1:3 “ఒక వ్యక్తి తన ఆవుల మందలో ఒక దానిని దహనబలిగా అర్పిస్తుంటే, అది నిర్దోషమైన గిత్తయి వుండాలి. ఆ వ్యక్తి ఆ గిత్తను సన్నిధి గుడారపు ద్వారం దగ్గరకు తీసుకొని వెళ్లాలి. అప్పుడు యెహోవా ఆ అర్పణను అంగీకరిస్తాడు.
LEV 1:4 ఈ వ్యక్తి ఆ గిత్త తలమీద తన చేయి పెట్టాలి. ఆ వ్యక్తి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ దహనబలి అర్పణను యెహోవా అంగీకరిస్తాడు.
LEV 1:5 “ఆ వ్యక్తి యొక్క గిత్తను యోహోవా ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజకులు ఆ గిత్త రక్తాన్ని తీసుకొని రావాలి. సన్నిధి గుడారపు ద్వారం దగ్గర బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని వారు చిలకరించాలి.
LEV 1:6 అతడు ఆ పశువు చర్మాన్ని ఒలిచి, ఆ పశువును ముక్కలుగా నరకాలి.
LEV 1:7 యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం మీద కట్టెలు, నిప్పు ఉంచాలి.
LEV 1:8 యాజకులైన అహరోను కుమారులు ఆ ముక్కలను (తల, కొవ్వు) కట్టెలు మీద పెట్టాలి. ఆ కట్టెలు బలిపీఠం మీద నిప్పుల్లో ఉంటాయి.
LEV 1:9 ఆ పశువు లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో యాజకుడు కడగాలి. తర్వాత ఆ పశువు అవయవాలు అన్నింటినీ బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అది అగ్నిపై అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
LEV 1:10 “ఒక వ్యక్తి గొర్రెనుగాని మేకనుగాని దహన బలిగా అర్పిస్తుంటే, ఏ దోషం లేని మగదానిని మాత్రమే అతడు అర్పించాలి.
LEV 1:11 ఆ వ్యక్తి బలిపీఠానికి ఉత్తరాన, యెహోవా ఎదుట ఆ జంతువును వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు, ఆ జంతువు రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.
LEV 1:12 అప్పుడు యాజకుడు ఆ జంతువును ముక్కలుగా నరకాలి. ఆ జంతువు తల, కొవ్వులను యాజకుడు ఉంచుకొంటాడు. ఆ ముక్కలను యాజకుడు కట్టెల మీద చక్కగా పేర్చాలి. బలిపీఠం మీద నిప్పుల్లో ఆ కట్టెలు ఉంటాయి.
LEV 1:13 లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో యాజకుడు కడగాలి. అప్పుడు యాజకుడు ఆ జంతువు అవయవాలన్నింటినీ అర్పించి, బలిపీఠం మీద దహించాలి. అది అగ్నిపై అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
LEV 1:14 “ఒక వ్యక్తి ఒక పక్షిని యెహోవాకు దహన బలిగా అర్పించాలను కొంటే, తెల్ల గువ్వ, లేక పావురం పిల్ల మాత్రమే యివ్వాలి.
LEV 1:15 అర్పణను యాజకుడు ఆ బలిపీఠం దగ్గరకు తీసుకొని రావాలి. యాజకుడు ఆ పక్షి తలను తుంచివేయాలి. అప్పుడు ఆ పక్షిని బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కగా కార్చివెయ్యాలి.
LEV 1:16 యాజకుడు ఆ పక్షి మేత పొట్టను, దాని ఈకలను తీసివేసి, బలిపీఠానికి తూర్పుగా పారవేయాలి. ఇది వారు బలిపీఠపు బూడిదను పారవేసేచోటు.
LEV 1:17 అప్పుడు యాజకుడు ఆ పక్షి రెక్కలను పట్టి చీల్చాలి గాని దానిని రెండు భాగాలుగా విడదీయకూడదు. బలిపీఠం మీద అగ్నిలో ఉన్న కట్టెలపైన ఆ పక్షిని యాజకుడు దహించాలి. అది అగ్నిపైన అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
LEV 2:1 “ఎవరైనా యెహోవాకు ధాన్యార్పణ పెట్టేటప్పుడు అది శ్రేష్ఠమైన పిండిగా ఉండాలి. ఆ వ్యక్తి ఆ పిండిమీద నూనెపోసి, సాంబ్రాణి వేయాలి.
LEV 2:2 అప్పుడు దానిని యాజకులైన అహరోను కుమారుల దగ్గరకు అతడు తీసుకొని రావాలి. సాంబ్రాణిని, నూనె కలిపిన పిండిలో ఒక గుప్పెడు ఆ వ్యక్తి తీసుకోవాలి. అప్పుడు యాజకుడు బలిపీఠపు అగ్నితో ఆ పిండిని జ్ఞాపకార్థ అర్పణగా దహించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటుంది.
LEV 2:3 మిగిలిపోయిన ధాన్యార్పణ అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమములు అన్నింటిలో ఇది అతి పవిత్రం.
LEV 2:4 “పొయ్యిమీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు పెట్టేటప్పుడు అది నూనె కలిపిన శ్రేష్ఠమైన పిండితో చేయబడ్డ పొంగని రొట్టెలు, లేక నూనె రాయబడ్డ పొంగని అప్పడాలు కావాలి.
LEV 2:5 పెనం మీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు తెస్తే అది నూనెతో కలిపిన పొంగని మంచి పిండి కావాలి.
LEV 2:6 దానిని నీవు ముక్కలు చేసి, దాని మీద నూనెపోయాలి. అది ధాన్యార్పణ.
LEV 2:7 నీవు వంట గిన్నెలో వండిన ధాన్యార్పణ తెస్తే అది నూనెతో కలుపబడిన మంచి పిండికావాలి.
LEV 2:8 “ఈ పదార్థాలతో చేయబడిన ధాన్యార్పణను నీవు యెహోవాకు తీసుకొని రావాలి. నీవు వాటిని యాజకుని దగ్గరకు తీసుకొనివెళ్లాలి, అతడు వాటిని బలిపీఠం మీద ఉంచుతాడు.
LEV 2:9 ఇది జ్ఞాపకార్థమైన అర్పణ. అది బలిపీఠం మీద దహించబడాలి. అగ్నిమీద అది దహించ బడుతుంది. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
LEV 2:10 మిగిలిపోయిన ధాన్యార్పణలు అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమాలలో ఇది అతి పవిత్రం.
LEV 2:11 “పులిసిన పదార్థం ఉన్న ధాన్యార్పణ ఏదీ మీరు యెహోవాకు తీసుకొని రాకూడదు. పులిసిన పదార్థంగాని, తేనెగాని యెహోవాకు అర్పణగా అగ్నిమీద దహించకూడదు.
LEV 2:12 మొదటి పంటలో నుండి పులిసిన పదార్థాన్ని, తేనెను యెహోవాకు అర్పణగా మీరు తీసుకొని రావచ్చును. కానీ బలిపీఠం మీద ఇష్టమైన సువాసనగా ఉండేందుకు పులిసిన పదార్థం, తేనె దహించబడకూడదు.
LEV 2:13 నీవు తీసుకొని వచ్చే ప్రతి ధాన్యార్పణలో ఉప్పు తప్పక వేయాలి. నీవు అర్పించు ధాన్యార్పణలో ఉప్పు వేయవలెను.
LEV 2:14 “మొదటి పంటలో నుండి నీవు యెహోవాకు ధాన్యార్పణ అర్పిస్తే, వాటిని పేల్చి తీసుకురావాలి. కొత్త ధాన్యం నుండి వాటిని ఒలిచి తీసుకొని రావాలి. ఇది మొదటి పంటలోనుండి నీ కొరకైన ధాన్యార్పణ అవుతుంది.
LEV 2:15 దానిమీద నూనెను, సాంబ్రాణిని నీవు వేయాలి. అది ధాన్యార్పణ అవుతుంది.
LEV 2:16 ఒలిచిన ధాన్యాన్ని, నూనెలోనుండి కొంతభాగాన్ని, సాంబ్రాణి మొత్తాన్ని జ్ఞాపకార్థ అర్పణగా యాజకుడు దహించాలి. ఇది యెహోవాకు హోమమైయుండును.
LEV 3:1 “ఒక వేళ ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ సమాధాన బలి అయితే, మగ లేక ఆడ జంతువును తన పశువుల మందలోనుండి అతడు యెహోవాకు ఇస్తే ఆ పశువులో ఎలాంటి దోషం ఉండకూడదు.
LEV 3:2 ఆ వ్యక్తి ఆ పశువు తలమీద తన చేతులు ఉంచాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర ఆ పశువును అతడు వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజకులు ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.
LEV 3:3 ఈ వ్యక్తి సమాధాన బలిలోనుంచి యెహోవాకు హోమం చేయాలి. అంత్రములకు, లోపలి అవయవాలకు ఉండే కొవ్వు అంతటినీ అతడు అర్పించాలి.
LEV 3:4 మూత్రపిండాలను ఆ రెండింటి మీద కొవ్వును, నడుం దగ్గర కొవ్వును అతడు అర్పించాలి. మూత్రపిండాలతో బాటు కార్జమును కప్పి ఉండే కొవ్వును అతడు తీయాలి.
LEV 3:5 అప్పుడు ఆ కొవ్వును అహరోను కుమారులు బలిపీఠం మీద దహించాలి. దీనిని వారు అగ్నిలో కట్టెలమీద ఉన్న దహనబలి వేస్తారు. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనను యిచ్చే హోమం.
LEV 3:6 “ఒకవేళ ఆ వ్యక్తి, యెహోవాకు సమాధాన అర్పణగా ఒక జంతువును మందలోనుండి తెస్తే, అది ఆడదిగాని, మగదిగాని దోషం లేనిదిగా ఉండాలి.
LEV 3:7 అతడు ఒక గొర్రెపిల్లను తన అర్పణగా తెస్తే, అతడు దానిని యెహోవా ఎదుటికి తేవాలి.
LEV 3:8 సన్నిధి గుడారం ఎదుట అతడు దాని తలమీద చేయి పెట్టి, దానిని వధించాలి. దాని రక్తాన్ని అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ చిలకరిస్తారు.
LEV 3:9 అప్పుడు అతడు సమాధాన బలిలో నుంచి కొంత యెహోవాకు హోమం చేయాలి. కొవ్వు, కొవ్విన తోకమొత్తం, దాని లోపలి అవయవాల మీద చుట్టూ ఉండే కొవ్వు అతడు తీసుకొని రావాలి. వెన్నుపూస నుండి ఉండే తోకను అతడు కోసి వేయాలి.
LEV 3:10 రెండు మూత్రపిండాలను, వాటిని కప్పి ఉండే కొవ్వును, నడుం దగ్గరనున్న కొవ్వును అతడు అర్పించాలి. కార్జానికి ఉండే కొవ్వుకూడా అతడు అర్పించాలి. మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా అతడు తీయాలి.
LEV 3:11 అప్పుడు యాజకుడు ఆ జంతువును బలిపీఠం మీద దహిస్తాడు. అది యెహోవాకు ప్రజలు అగ్నితో అర్పించిన ఆహారం అవుతుంది.
LEV 3:12 “ఒక వ్యక్తి ఇచ్చే అర్పణ మేక అయితే, అతడు దానిని యెహోవా ఎదుట అర్పించాలి.
LEV 3:13 సన్నిధి గుడార ద్వారం దగ్గర అతడు దాని తల మీద చేయి పెట్టి దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు ఆ మేక రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.
LEV 3:14 తర్వాత ఆ మేకలోని కొంతభాగాన్ని అతడు యెహోవాకు హోమం చేయాలి. లోపలి భాగాల్లోను, వాటి మీదను ఉండే కొవ్వును అతడు అర్పించాలి.
LEV 3:15 రెండు మూతగ్రంథుల్ని, వాటి మీద ఉండే కొవ్వును, ఆ మేక నడుం దగ్గరి కొవ్వును అతడు అర్పణ చేయాలి. కార్జాన్ని కప్పి ఉండే కొవ్వును అతడు అర్పణ చేయాలి. మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా అతడు తీయాలి.
LEV 3:16 మేక అవయవాలను యాజకుడు దహనం చేయాలి. అది అగ్నితో అర్పించబడ్డ ఆహారం అవుతుంది. అది ఇష్టమైన సువాసనగా ఉంటుంది. కొవ్వు మొత్తం యెహోవాకు చెందుతుంది.
LEV 3:17 మీ తరాలన్నింటికీ శాశ్వతంగా ఈ నియమం కొనసాగుతుంది. మీరు ఎక్కడ నివసించినా కొవ్వునుగాని రక్తాన్నిగాని మీరు తినకూడదు.”
LEV 4:1 మోషేతో యెహోవా మాట్లాడి ఇలా అన్నాడు:
LEV 4:2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ప్రమాదవశాత్తు ఎవరైనా పాపం చేసి, చేయకూడదని యెహోవా చెప్పిన వాటిని చేస్తే, అప్పుడు అతడు ఇలా చేయాలి:
LEV 4:3 “అభిషేకించబడిన యాజకుడు పాపం చేసి, ప్రజలమీదికి దోషం రప్పిస్తే, అప్పుడు అతడు తాను చేసిన పాపం నిమిత్తం యెహోవాకు ఒక అర్పణను అర్పించాలి. ఏ దోషమూ లేని ఒక కోడెదూడను అతడు అర్పించాలి. పాపపరిహారార్థ బలిగా ఆ కోడెదూడను అతడు అర్పించాలి.
LEV 4:4 సన్నిధి గుడార ద్వారం దగ్గర యెహోవా ఎదుటకు అభిషేకించబడిన యాజకుడు ఆ కోడెదూడను తీసుకొనిరావాలి. అతడు కోడెదూడ తల మీద తన చేతులు ఉంచి, యెహోవా ఎదుట దానిని వధించాలి.
LEV 4:5 అభిషిక్తుడైన యాజకుడు అప్పుడు ఆ దూడ రక్తాన్ని కొంత తీసుకొని, దానిని సన్నిధిగుడారం దగ్గరకు తీసుకొని రావాలి.
LEV 4:6 యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి, పవిత్రగది తెర ముందు యెహోవా ఎదుట ఏడు సార్లు ఆ రక్తాన్ని చిలకరించాలి.
LEV 4:7 యాజకుడు సుగంధద్రవ్వాల ధూప వేదిక మీద ఆ రక్తంలో కొంత పూయాలి, (ఈ ధూపవేదిక సన్నిధిగుడారంలో యెహోవా ఎదుట ఉంటుంది). ఆ కోడెదూడ రక్తాన్ని అంతా దహన బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. ఆ బలిపీఠం సన్నిధి గుడారపు ద్వారం దగ్గర ఉంటుంది.
LEV 4:8 మరియు అతడు పాప పరిహారార్థపు కోడెదూడ కొవ్వునంతా తీసివేయాలి. లోపలి భాగాలమీద, చుట్టూ ఉండే కొవ్వు అంతా అతడు తీసివేయాలి.
LEV 4:9 రెండుమూత్ర పిండాలను, వాటిమీది కొవ్వును, నడుం దగ్గరనున్న కొవ్వును అతడు తీసుకోవాలి. కార్జాన్ని కప్పి ఉన్న కొవ్వును అతడు తీసుకోవాలి. మరియు అతడు మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా తీసుకోవాలి.
LEV 4:10 సమాధాన బలిలో బలియివ్వబడే కోడెదూడనుండి తీసినట్టే అతడు వీటన్నింటినీ తీయాలి. యాజకుడు దహన బలి పీఠంమీద దాని భాగాలన్నింటినీ కాల్చాలి.
LEV 4:11 కాని, ఆ కోడెదూడ చర్మాన్ని, దాని మాంసం అంతటినీ, దాని తల, కాళ్లు, లోపలి భాగాలను, దాని పేడను యాజకుడు బయటకు తీసుకొనిపోవాలి.
LEV 4:12 బసకు వెలుపల బూడిద పారబోసే ప్రత్యేకమైన చోటుకు ఆ కోడెదూడ కళేబరాన్ని యాజకుడు తీసుకుపోవాలి. అక్కడ కట్టెల మీద నిప్పుతో ఆ కోడెదూడను యాజకుడు కాల్చివేయాలి. బూడిద పారబోసే చోట ఆ కోడెదూడ కాల్చివేయబడుతుంది.
LEV 4:13 “ఒక వేళ ఇశ్రాయేలు జనులంతా తెలియకుండా పాపం చేయటం తటస్థించవచ్చు. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా వారు చేసినట్లయితే వారు అపరాధులు అవుతారు.
LEV 4:14 ఆ పాపం విషయమై వారు తెలుసుకొంటే, అప్పుడు ఆ జనాంగం అంతటి నిమిత్తం పాప పరిహారార్థబలిగా ఒక కోడెదూడను అర్పించాలి. సన్నిధి గుడారం ఎదుటికి వారు ఆ కోడెదూడను తీసుకొనిరావాలి.
LEV 4:15 సమాజపు పెద్దలందరూ, యెహోవా ఎదుట ఆ కోడెదూడ మీద వారి చేతులు ఉంచాలి. యెహోవా ఎదుట ఆ కోడెదూడ వధించబడాలి.
LEV 4:16 అప్పుడు అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తంలో కొంత సన్నిధి గుడారం దగ్గరకు తీసుకొనిరావాలి.
LEV 4:17 యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి, తెరముందు యెహోవా ఎదుట ఏడు సార్లు దాన్ని చిలకరించాలి.
LEV 4:18 అప్పుడు యాజకుడు బలిపీఠం కొమ్ములకు కొంత రక్తం పూయాలి. ఆ బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. ఆ బలిపీఠం సన్నిధి గుడారంలో యెహోవా ఎదుట ఉంది. రక్తాన్నంతా దహన బలిపీఠం సన్నిధి గుడార ద్వారం దగ్గర ఉంది.
LEV 4:19 అప్పుడు యాజకుడు దాని కొవ్వు అంతా తీసి బలిపీఠంమీద దహించాలి.
LEV 4:20 పాప పరిహారార్థ బలిపశువుకు చేసినట్టే అతడు ఈ కోడెదూడకు కూడా చేయాలి ఈ విధంగా యాజకుడు ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాడు. మరియు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు క్షమిస్తాడు.
LEV 4:21 యాజకుడు ఆ కోడెదూడను బస బయటకు తీసుకొని వెళ్లి దానిని కాల్చివేయాలి. ఇదీ మొదటి కోడెదూడకు చేసినట్టే. ఇది మొత్తం సమాజానికి పాప పరిహారార్థ బలి.
LEV 4:22 “చేయకూడదని యెహోవా చెప్పిన ఆజ్ఞలలో దేనినైనా ఒక ఆధికారి పొరబాటున అతిక్రమన చేసినట్లయితే, అప్పడు ఆ అధికారి అపరాధి అవుతాడు.
LEV 4:23 అతడు తన పాపం విషయమై తెలుసుకొంటే, అతడు ఏదోషమూ లేని ఒక మగ మేకను తీసుకొని రావాలి. అది అతని అర్పణ.
LEV 4:24 ఆ అధికారి ఆ మేక మీద తన చేయి ఉంచి, యెహోవా ఎదుట వారు దహనబలి పశువును వధించు చోట దానిని వధించాలి. ఆ మేక పాపపరిహారార్థ బలి.
LEV 4:25 యాజకుడు పాప పరిహారార్థబలిలో కొంత రక్తాన్ని తన వేలితో తీసుకోవాలి. యాజకుడు ఆ రక్తాన్ని దహన బలిపీఠం కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని యాజకుడు దహన బలిపీఠం అడుగున పోయాలి.
LEV 4:26 ఆ మేక కొవ్వు అంతటినీ యాజకుడు బలిపీఠం మీద దహించాలి. సమాధాన బలిలో కొవ్వును దహించినట్లు అతడు దానిని దహించాలి. ఈ విధంగా యాజకుడు అధికారి పాపమునకు ప్రాయశ్చితంచేస్తాడు. మరియు దేవుడు ఆ అధికారిని క్షమిస్తాడు.
LEV 4:27 “చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా ఒక సామాన్యుడు పొరబాటున చేయటం తటస్థించవచ్చు.
LEV 4:28 అతడు తన పాపాన్ని గుర్తించినట్లయితే ఏదోషం లేని ఒక ఆడ మేకను అతడు తీసుకొని రావాలి. అది ఆ వ్యక్తి అర్పణ. అతడు చేసిన పాపం నిమిత్తం అతడు ఆ మేకను తీసుకొని రావాలి.
LEV 4:29 అతడు దాని తల మీద తన చేతిని ఉంచి, దహనబలి స్థలంలో దానిని వధించాలి.
LEV 4:30 అప్పుడు యాజకుడు ఆ మేక రక్తంలో కొంచెంతన వేలితో తీసుకొని, దహనబలిపీఠం కొమ్ములకు దానిని పూయాలి. ఆ మేక రక్తాన్నంతా బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి.
LEV 4:31 తర్వాత సమాధాన బలినుండి కొవ్వు అంతా తీసి వేసినట్టే ఆ మేక కొవ్వు అంతటినీ యాజకుడు తీసివేయాలి. దానిని యెహోవాకు ఇష్టమైన సువాసనగా బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఈ విధంగా ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు.
LEV 4:32 “ఈ వ్యక్తి తన పాపపరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను తీసుకొని వస్తే, అది ఏదోషమూలేని ఆడ గొర్రెయై ఉండాలి.
LEV 4:33 అతడు దాని తలమీద తన చేయి ఉంచి, దహనబలి పశువును వధించే స్థలంలో, పాపపరిహారార్థ బలిగా దానిని కూడా వధించాలి.
LEV 4:34 ఆ పాప పరిహారార్థ బలి రక్తాన్ని యాజకుడు తనవేలితో తీసుకొని, దహన బలిపీఠం కొమ్ములకు పూయాలి. తర్వాత ఆ గొర్రె రక్తాన్నంతా బలిపీఠం అడుగున అతడు పోయాలి.
LEV 4:35 సమాధాన బలిలో గొర్రెపిల్ల కొవ్వునంతా తీసివేసినట్టే, ఆ గొర్రెపిల్ల యొక్క కొవ్వు అంతటినీ యాజకుడు తీసివేయాలి. యాజకుడు యెహోవాకు అర్పించే హోమంలా బలిపీఠం మీద ఆ ముక్కలను దహించాలి. ఈ విధంగా, ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.
LEV 5:1 “ఒక వ్యక్తి హెచ్చరికను వినవచ్చు, లేక ఒక వ్యక్తి తాను యితరులతో చెప్పాల్సిన ఒక విషయాన్ని వినటమో, చూడటమో తటస్థిస్తుంది. ఆ వ్యక్తి తాను చూసిన దాన్ని లేక విన్నదాన్ని చెప్పకపోతే అతడు అపరాధి.
LEV 5:2 “లేక ఒకవేళ ఏదైనా అపవిత్రమైన దాన్ని ఒక వ్యక్తి తాకవచ్చును. అది అపవిత్ర జంతువు శవం గాని, లేక అపవిత్ర పశు శవంగాని, లేక అపవిత్రమైన ఒక పాకెడు జంతువు శవమేగాని కావచ్చును. వాటిని ముట్టుకొన్నట్టు అతనికి తెలియకపోయినా అతడు మాత్రం అపరాధి అవుతాడు.
LEV 5:3 “ఒక మనిషి నుండి అపవిత్రం అయినవి ఎన్నోవస్తాయి. ఒక వ్యక్తి అవతల వ్యక్తిలోని యిలాంటి అపవిత్రమైన వాటిలో దేనినైనా ముట్టుకోవచ్చు అది అతనికి తెలియకపోవచ్చు. అపవిత్రమైనది ఏదో తాను ముట్టుకొన్నానని అతనికి తెలిసినప్పుడు అతడు అపరాధి అవుతాడు.
LEV 5:4 “లేక ఒక వ్యక్తి మంచిగాని చెడుగాని ఒకటి చేస్తానని తొందరపడి వాగ్దానం చేయవచ్చు. మనుష్యులు తొందరపడి చాలా వాగ్దానాలు చేస్తూంటారు. ఒకడు అలాంటి వాగ్దానంచేసి, దానిని మరిచిపోయి, మరల ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొన్నప్పుడు అతను దానిని చేయక పోతే అపరాధి అవుతాడు.
LEV 5:5 కనుక వీటిలో దేని విషయంలో అతడు అపరాధియైనా, అతడు చేసిన తప్పు ఏమిటో అతడు చెప్పాలి.
LEV 5:6 అతడు చేసిన పాపానికి పరిహారంగా అపరాధ పరిహారార్థబలిని యెహోవాకు అర్పించాలి. గొర్రెల మందలోనుండి ఒక ఆడ జంతువును పాప పరిహారార్థబలిగా అతడు తీసుకొని రావాలి. అది గొర్రెపిల్ల కావచ్చును, లేక మేక కావచ్చును. అప్పుడు ఆవ్యక్తి పాపాన్ని తుడిచివేసేందుకు చేయాల్సిన వాటిని యాజకుడు చేస్తాడు.
LEV 5:7 “ఆ వ్యక్తి గొర్రెపిల్లను ఇవ్వలేకపోతే అతడు రెండు గువ్వలనుగాని, రెండు పావురాలను గాని తీసుకొని రావాలి. ఇవి అతని అపరాధ పరిహారార్థబలి. ఒకటి పాపపరిహారార్థ బలికోసం, మరొకటి దహన బలికోసం.
LEV 5:8 ఆ వ్యక్తి వాటిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. పాపపరిహారార్థ బలిగా మొదట ఒక దాన్ని యాజకుడు అర్పిస్తాడు. యాజకుడు దాని తలను మెడనుండి వేరు చేస్తాడు. కానీ ఆ పక్షిని రెండు భాగాలుగా మాత్రం యాజకుడు విడదీయడు.
LEV 5:9 పాప పరిహారార్థబలి రక్తాన్ని బలిపీఠం ప్రక్కలో యాజకుడు చిలకరించాలి. తర్వాత మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. అది పాపపరిహారార్థ బలి.
LEV 5:10 తర్వాత యాజకుడు చట్టం ప్రకారం దహన బలిగా రెండో పక్షిని అర్పించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపాన్ని తుడిచి వేస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.
LEV 5:11 “ఆ వ్యక్తికి రెండు పావురాలను, రెండు గువ్వలను యిచ్చే సామర్థ్యం లేకపోతే తూమెడు మంచి పిండిలో పదోవంతును అతడు తీసుకొని రావాలి. ఇది అతని పాపపరిహారార్థ బలి అర్పణ. ఆ పిండిమీద అతడు నూనె పోయకూడదు. అది పాపపరిహారార్థ బలి గనుక అతడు దానిమీద సాంబ్రాణి కూడా వేయకూడదు.
LEV 5:12 అతడు ఆ పిండిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ పిండిలోనుండి యాజకుడు పిడికెడు పిండిని జ్ఞాపకార్థ అర్పణగా తీసుకోవాలి. యెహోవాకు హోమం వేయు బలిపీఠం మీద యాజకుడు ఆ పిండిని దహించాలి. అది పాపపరిహారార్థ బలి.
LEV 5:13 ఈ విధంగా ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు నిర్మూలిస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు. ధాన్యార్పణలో వలెనే పాపపరిహారార్థ బలిలో మిగిలినది కూడా యాజకునికి చెందుతుంది.”
LEV 5:14 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
LEV 5:15 “యెహోవా పవిత్ర విషయాలకు వ్యతిరేకంగా ఒకడు పొరబాటున ఏదైనా తప్పు చేయవచ్చును. అప్పుడు అతడు ఏ దోషమూ లేని ఒక పొట్టేలును మందలో నుండి తీసుకొని రావాలి. ఇది యెహోవాకు అతని అపరాధ పరిహారార్థ బలి అర్పణ. పవిత్ర స్థానపు అధికారిక కొలత ప్రకారం ఆ పొట్టేలుకు నీవు ధర నిర్ణయించాలి.
LEV 5:16 పవిత్ర విషయానికి విరుద్ధంగా అతడు చేసిన పాపానికి అతడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ ధరకు అయిదో వంతు అతడు కలపాలి. ఈ మొత్తాన్ని అతడు యాజకునికి ఇవ్వాలి. ఈ విధంగా అపరాధ పరిహారార్థ బలి పోట్టేలుతో ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు నిర్మూలిస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.
LEV 5:17 “ఒకడు పాపం చేసి, చేయగూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా చేసినప్పుడు అది అతనికి తెలియకపోయినా ఆ వ్యక్తి అపరాధి అవుతాడు. అతడు తన పాపానికి బాధ్యత వహించాలి.
LEV 5:18 ఆ వ్యక్తి ఏ దోషమూ లేని ఒక పొట్టేలును మందలోనుండి యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ పొట్టేలు అపరాధ పరిహారార్థబలి అర్పణ. ఆ వ్యక్తి తెలియక చేసిన పాపాన్ని ఈ విధంగా యాజకుడు నిర్మూలిస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.
LEV 5:19 ఆ వ్యక్తి చేస్తున్నది పాపం అని అతనికి తెలియకపోయినా అతడు అపరాధి అవుతాడు. కనుక అపరాధ పరిహారార్థ బలిని అతడు యెహోవాకు అర్పించాలి.”
LEV 6:1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
LEV 6:2 “ఒకడు యిలాంటి పాపాలు చేసి, యెహోవాకు విరోధంగా అపరాధం చేయవచ్చు, ఒక వ్యక్తి మరొకరి పక్షంగా దేనికైనా కాపలా కాస్తూండగా దానికి జరిగిన దాన్ని గూర్చి అతడు అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు తాను చేసిన ప్రమాణం విషయంలో అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు దేనినైనా దొంగిలించవచ్చు, లేక ఎవర్నయినా మోసం చేయవచ్చు,
LEV 6:3 లేక ఒకడు పోయింది దొరికినప్పుడు దాన్ని గూర్చి అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు ఏదో చేస్తానని వాగ్దానం చేసి తర్వాత అతడు వాగ్దాన ప్రకారం చేయకపొవచ్చు, లేక ఒకడు ఇంకేదైనా చెడుకార్యం చేయవచ్చు.
LEV 6:4 ఒక వ్యక్తి వీటిలో ఏదైనా చేస్తే, అప్పుడు ఆ వ్యక్తి అపరాధి అవుతాడు. అతడు దొంగతనంగా తీసుకొన్నదిగాని, మోసంచేసి తీసుకొన్నదిగాని, మరోవ్యక్తి భద్రంగా ఉంచమని ఇవ్వగా అతడు తీసుకొన్నదిగాని, దొరికినా అబద్ధం చెప్పి దాన్ని, లేక
LEV 6:5 దేన్ని గూర్చి అతడు అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని అతడు తిరిగి ఇచ్చిచేయాలి. దాని పూర్తివిలువను అతడు చెల్లించాలి. తర్వాత దాని విలువలో అయిదోవంతు అదనంగా అతడు చెల్లించాలి. దాని అసలైన సోంతదారునికి అతడు ఆ మొత్తాన్ని ఇవ్వాలి. అతడు తన అపరాధ పరిహారార్థ బలి తెచ్చిననాడే దీన్ని చెల్లించాలి.
LEV 6:6 ఆ వ్యక్తి అపరాధ పరిహారార్థ బలిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. అది మందలోనుంచి తెచ్చిన పొట్టేలు. ఆ పొట్టేలుకు ఏదోషమూ ఉండకూడదు. అది యాజకుడు నిర్ణయించిన ధరకు తగినదిగా ఉండాలి. అది యెహోవాకు అపరాధ పరిహారార్థ బలి.
LEV 6:7 అప్పుడ యాజకుడు యెహోవా దగ్గరకు వెళ్లి, ఆ వ్యక్తి చేసిన పాపాన్ని నిర్మూలిస్తాడు. అప్పుడు అతణ్ణి దేవుడు క్షమిస్తాడు.”
LEV 6:8 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
LEV 6:9 “అహరోనుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు. ఇది దహనబలి అర్పణ నియమము. రాత్రి అంతా, తెల్ల వారేవరకు దహనబలి అర్పణ బలిపీఠం మీద దహనం అవుతూనే ఉండాలి. బలిపీఠం మీద బలిపీఠపు అగ్ని మండుతూనే ఉండాలి.
LEV 6:10 యాజకుడు తన మేలురకపు అంగీని ధరించాలి. అతడు తన మేలు రకపు చెడ్డీని వేసుకోవాలి. తర్వాత బలిపీఠం మీద దహనబలిని అగ్ని దహించగా మిగిలిన బూడిదను అతడు తీసుకోవాలి. ఈ బూడిదను యాజకుడు బలిపీఠం పక్కగా పోయాలి.
LEV 6:11 అప్పుడు యాజకుడు తన బట్టలు తీసి వేసి వేరే బట్టలు ధరించాలి. తర్వాత అతడు ఆ బూడిదను బస వెలుపల ఒక ప్రత్యేక స్థలానికి తీసుకొని వెళ్లాలి.
LEV 6:12 అయితే బలిపీఠపు అగ్నిని మాత్రం బలిపీఠం మీద మండుతూ ఉండనివ్వాలి. దానిని ఆరిపోనివ్వ కూడదు. ప్రతి ఉదయం బలిపీఠం మీద యాజకుడు కట్టెలను కాల్చుతూఉండాలి. బలిపీఠం మీద అతడు కట్టెలు పేర్చాలి. సమాధాన బలుల కొవ్వును అతడు దహించాలి.
LEV 6:13 ఎల్లప్పుడూ ఆగకుండా బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు.
LEV 6:14 “ధాన్యార్పణలకు గల విధి ఇది. అహరోను కుమారులు యెహోవాకు బలిపీఠం ఎదుట దీనిని తీసుకొని రావాలి.
LEV 6:15 ధాన్యార్పణలోనుంచి పిడికెడు మంచి పిండిని యాజకుడు తీసుకోవాలి. ధాన్యార్పణ మీద నూనె, సాంబ్రాణి ఉండాలి. ధాన్యార్పణాన్ని బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అది ఇష్టమైన సువాసనగాను, యెహోవాకు జ్ఞాపకార్థ అర్పణగాను ఉంటుంది.
LEV 6:16 “మిగిలిపోయిన ధాన్యార్పణాన్ని అహరోను, అతని కుమారులు తినాలి. ధాన్యార్పణ పొంగని రొట్టెలా ఉంటుంది. యాజకులు ఈ రొట్టెను పవిత్ర స్థలంలో తినాలి. సన్నిధి గుడారపు ఆవరలో వారు ఈ ధాన్యార్పణను తినాలి.
LEV 6:17 ధాన్యార్పణను పులిసిన పదార్థం లేకుండా చేయాలి. అగ్నిద్వారా నాకు అర్పించబడిన అర్పణల్లో అది వారి భాగంగా నేను దానిని ఇచ్చాను. పాపపరిహారార్థ బలిలా, అపరాధ పరిహారార్థ బలి అర్పణలా అది కూడ అతి పవిత్రం.
LEV 6:18 యెహోవాకు అగ్నిద్వారా అర్పించబడిన అర్పణల్లోనుంచి అహరోను మగ సంతానం అందరూ తినవచ్చును. మీ తరాలన్నింటికీ ఇది శాశ్వత నియమము. ఈ అర్పణలస్పర్శ వారిని పవిత్రులను చేస్తుంది.”
LEV 6:19 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
LEV 6:20 “అహరోను, అతని కుమారులు యెహోవాకు తీసుకొని రావాల్సిన అర్పణలు ఇవి. అహరోను అభిషేకించబడిన రోజున వారు ఇలా చేయాలి. తూమెడు మంచి పిండిలో పదోవంతు వారు ఎల్లప్పుడూ ధాన్యార్పణగా తీసుకొనిరావాలి. అందులోనుంచి సగం ఉదయం, సగం సాయంత్రం వారు తీసుకొని రావాలి.
LEV 6:21 మంచి పిండిని నూనెతో కలిపి, పెనం మీద దాన్ని చేయాలి. అది ఉడికిన తర్వాత దానిని మీరు లోనికి తీసుకొని రావాలి. ధాన్యార్పణాన్ని మీరు భాగాలుగా చేయాలి. దానిని మీరు యెహోవాకు ఇష్టమైన సువాసనగా దహించాలి.
LEV 6:22 “అహరోను, తర్వాత అతని సంతానంవారు ఎవరైతే అహరోను స్థానంలో అభిషేకించబడతారో వారు ఈ ధాన్యార్పణాన్ని యెహోవాకు పెట్టాలి. ఇది శాశ్వత నియమము, ధాన్యార్పణాన్ని యెహోవాకు పూర్తిగా దహించాలి.
LEV 6:23 యాజకుల ప్రతీ ధాన్యార్పణను పూర్తిగాకాల్చాలి. దానిని తినకూడదు.”
LEV 6:24 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
LEV 6:25 “అహరోను, అతని కుమారులతో ఇలా చెప్పు: పాప పరిహారార్థ అర్పణ విధి ఇది. యెహోవా ఎదుట దహనబలి పశువు వధించబడే చోటనే పాపపరిహారార్థ బలి పశువుకూడ అర్పించ బడాలి. అది అతి పరిశుద్ధం.
LEV 6:26 పాప పరిహారార్థబలిని అర్పించే యాజకుడే దానిని తినాలి. సన్నిధి గుడారం యొక్క ఆవరణలో ఒక పరిశుద్ధ స్థలంలో అతడు దానిని తినాలి.
LEV 6:27 పాప పరి హారార్థబలి మాంసాన్ని తాకిన ప్రతి ఒక్కడూ పరిశుద్ధుడవుతాడు. మరియు తాకిన ప్రతి వస్తువూ పరిశుద్ధం అవుతుంది. “చిలకరించబడిన రక్తం ఏ బట్టలమీద పడినా, మీరు ఆ బట్టలను ఉతకాలి. పరిశుద్ధ స్థలంలో మీరు ఆ బట్టలను ఉతకాలి.
LEV 6:28 పాపపరిహారార్థ బలి గనుక మట్టి పాత్రలో ఉడకబెడితే ఆ పాత్రను పగుల గొట్టివేయాలి. పాపపరిహారార్థ బలిని ఇత్తడి పాత్రలో ఉడకబెడితే ఆ పాత్రను తోమి, నీళ్లతో కడగాలి.
LEV 6:29 “యాజకులలో ప్రతి ఒక్కడూ పాపపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం.
LEV 6:30 కానీ పాపపరిహారార్థ బలి రక్తాన్ని గనుక పరిశుద్ధస్థలాన్ని శుద్ధి చేసేందుకని సన్నిధి గుడారంలోనికి తీసుకొని వెళ్తే, అప్పుడు ఆ పాపపరిహారార్థ బలిని అగ్నిలో కాల్చి వేయాలి. ఆ పాపపరిహారార్థ బలిని యాజకులు తినకూడదు.
LEV 7:1 “అపరాధ పరిహారార్థ బలుల నియమాలు ఇవి. ఇది అతి పరిశుద్ధం.
LEV 7:2 దహనబలి అర్పణలు వారు ఎక్కడ వధిస్తారో అక్కడే అపరాధ పరిహారార్థ బలులను కూడా యాజకుడు వధించాలి. అంతట యాజకుడు అపరాధ పరిహారార్థ బలి రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.
LEV 7:3 “అపరాధ పరిహారార్థ బలిలోని కొవ్వు అంతటినీ యాజకుడు అర్పించాలి. దాని కొవ్విన తోకను, దాని లోపలి భాగాలమీది కొవ్వును,
LEV 7:4 రెండు మూత్ర గ్రంథులను, వాటిమీద కొవ్వును, నడుందగ్గరి కొవ్వును, కార్జం యొక్క కొవ్విన భాగాన్ని అతడు అర్పించాలి. దానిని మూత్ర గ్రంథులతో బాటు అతడు తీసివేయాలి.
LEV 7:5 వీటన్నింటినీ బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అవి యెహోవాకు హోమంగా అర్పించబడ్డ అర్పణలు అవుతాయి. అది అపరాధ పరిహారార్థబలి.
LEV 7:6 “యాజకుని కుటుంబంలో ఏ పురుషుడై నాసరే అపరాధపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం గనుక దాన్ని ఒక పరిశుద్ధ స్థలంలోనే తినాలి.
LEV 7:7 అపరాధి పరిహారార్థ బలి కూడా పాపపరిహారార్థ బలిలాంటిదే. రెండు అర్పణలకు నియమాలు ఒక్కటే. బలులను చేసే యాజకుడు ఆహారంగా ఆ మాంసం తీసుకొంటాడు.
LEV 7:8 బలి అర్పణ చేసే యాజకుడు దహన బలిపశువు చర్మాన్ని కూడా తీసుకోవచ్చును.
LEV 7:9 ధాన్యార్పణ పెట్టే యాజకునికే ప్రతి ధాన్యార్పణ చెందుతుంది. పొయ్యిమీద వండిన ప్రతి ధాన్యార్పణ, పాత్రలోగాని, పెనంమీదగాని వండిన ప్రతి ధాన్యార్పణ ఆ యాజకునిదే అవుతుంది.
LEV 7:10 ధాన్యార్పణలన్నీ అహరోను కుమారులకే చెందుతాయి. అవి పొడివైనా, లేక నూనెతో కలుపబడినా భేదం ఏమీ లేదు. అహరోను కుమారులు (యాజకులు) అందరూ ఈ ఆహారాన్ని పంచుకోవాలి.
LEV 7:11 “ఒక వ్యక్తి యెహోవాకు అర్పించాల్సిన సమాధాన బలులను గూర్చిన విధి ఇది.
LEV 7:12 ఆ వ్యక్తి తన కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు సమాధాన బలులు తేవచ్చును. కృతజ్ఞతలు చెల్లించేందుకు అతడు తన బలిని తీసుకొని వచ్చినట్లయితే, నూనెతో కలుపబడిను పులియని రొట్టెలను, నూనె పూసిన పొంగని అప్పడాలు, నూనెకలిపి కాల్చబడిన గోధుమ పిండివంటలు అతడు అర్పించాలి.
LEV 7:13 సమాధాన బలితో బాటు, పులియని రొట్టెలనుగూడ అతడు అర్పణగా తీసుకొనిరావాలి. ఇది ఒకడు తన కృతజ్ఞతను దేవునికి తెలియజేసేందుకు తీసుకొని రావాల్సిన అర్పణను గూర్చిన విధి.
LEV 7:14 సమాధాన బలుల రక్తాన్ని చిలకరించే యాజకునికి ఆ రొట్టెలలో ఒకటి చెందుతుంది.
LEV 7:15 ఈ సమాధాన బలి అర్పించిన రోజునే దాని మాంసం తినివేయాలి. దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఒక పద్ధతిగా ఒకడు కానుక అర్పిస్తాడు. కాని దాని మాంసంలో ఏమీ మర్నాటి ఉదయం వరకు మిగిలి ఉండకూడదు.
LEV 7:16 “ఒక వ్యక్తి కేవలం దేవునికి ఒక కానుకగా మాత్రమే సమాధాన బలిని తేవచ్చును. లేక ఒక వ్యక్తి దేవునికి ఒక ప్రత్యేక వాగ్దానం చేసుకొని ఉండొచ్చు. అదే నిజ మైతే ఆ బలిని అర్పించిన రోజునే దాన్ని తినివేయాలి. ఒకవేళ ఏమైనా మిగిలితే, మర్నాడు దాన్ని తినివేయాలి.
LEV 7:17 అయితే ఈ బలి పశువు మాంసం మూడోరోజుకు కూడా మిగిలి ఉంటే దానిని నిప్పుమీద కాల్చివేయాలి.
LEV 7:18 సమాధాన బలిలోని మాంసాన్ని ఎవరైనా మూడో రోజున తింటే. ఆ వ్యక్తి విషయంలో యెహోవా సంతోషించడు. ఆ బలిని అతని పక్షంగా యెహోవా లెక్కించడు. ఆ బలి ఆపవిత్రం అవుతుంది. ఆ మాంసంలో ఏదైనా తిన్నవాడు తన పాపానికి తానే బాధ్యుడవుతాడు.
LEV 7:19 “ఏదైనా అపవిత్రమైన దానికి తగిలిన మాంసాన్ని కూడా ప్రజలు తినకూడదు. అలాంటి మాంసాన్ని వారు అగ్నితో కాల్చివేయాలి. పరిశుద్ధమైన ప్రతివ్యక్తీ మాంసం తినవచ్చును.
LEV 7:20 కానీ అపవిత్రమైనవాడు ఒకడు, యెహోవాకు చెందిన సమాధాన బలి మాంసం తిన్నట్లయితే, అతణ్ణి తన ప్రజల్లోనుండి వేరు చేయాలి.
LEV 7:21 “ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా అపవిత్రమైన దాన్ని ముట్టవచ్చు. అది మనుష్యులచేత అపవిత్రం చేయబడిందే కావచ్చు లోక అపవిత్రమైన జంతువు కావచ్చు లేక అసహ్యకరమైన అపవిత్రత కావచ్చును. అలాంటివాడు అపవిత్రుడు. యెహోవాకు చెందిన సమాధాన బలి మాంసం అతడు తిన్నట్లయితే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుండి వేరు చేయాలి.”
LEV 7:22 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
LEV 7:23 “ఇశ్రాయేలు ప్రజలతో పశువుల, గొర్రెల, మేకల కొవ్వును మీరు తినకూడదని చెప్పు.
LEV 7:24 వాటంతట అవే చచ్చినా, లేక యితర జంతువుల చేత చంపబడినా వాటి కొవ్వును మీరు వాడుకోవచ్చును. కాని దాన్ని మాత్రం ఎప్పుడూ తినకూడదు.
LEV 7:25 యెహోవాకు హోమంగా అర్పించబడిన జంతువు కొవ్వును ఒక వ్యక్తి తింటే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుంచి వేరు చేయాలి.
LEV 7:26 “మీరు ఎక్కడ నివసించినాసరే జంతువు రక్తంగాని, పక్షిరక్తంగాని ఎప్పుడూ మీరు తినకూడదు.
LEV 7:27 ఎవరైనా సరే ఈ రక్తాన్ని తింటే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుంచి వేరుచేయాలి.”
LEV 7:28 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
LEV 7:29 “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, ఒక వ్యక్తి సమాధాన బలిని యెహోవాకు తీసుకొని వస్తే ఆ కానుకలో కొంత భాగాన్ని యెహోవాకు ఆ వ్యక్తి ఇవ్వాలి.
LEV 7:30 కానుకలోని ఆ భాగాన్ని హోమంగా కాల్చాలి. ఆ కానుకను అతడు స్వయంగా తన చేతుల్తో తీసుకొని రావాలి. ఆ జంతువు బోరమీదనున్న కొవ్వును, బోరను యాజకుని దగ్గరకు అతడు తీసుకొని రావాలి. ఆ బోర యెహోవా ఎదుట పైకి ఎత్తబడుతుంది. ఇదే ఆ నైవేద్యము.
LEV 7:31 అప్పుడు యాజకుడు బలిపీఠం మీద కొవ్వును దహించాలి. అయితే ఆ జంతువు బోర అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది.
LEV 7:32 సమాధాన బలి పశువు కుడితొడ కూడా మీరు యాజకునికి ఇవ్వాలి.
LEV 7:33 సమాధాన బలి పశువు రక్తాన్ని మరియు కొవ్వును అర్పించే యాజకునికే సమాధాన అర్పణలోని కుడి తొడ చెందుతుంది.
LEV 7:34 నైవేద్యంలోని బోరను, సమాధాన అర్పణలోని కుడి తొడను ఇశ్రాయేలు ప్రజలనుండి నేను తీసుకొని, అహరోనుకు, మరియు అతని కుమారులకు నేను వాటినిస్తున్నాను. ఇది ఇశ్రాయేలు ప్రజలకు శాశ్వతమైన విధి.”
LEV 7:35 యెహోవాకు అగ్నిచేత అర్పించబడు అర్పణల్లో, ఆ భాగాలు అహరోనుకు, అతని కుమారులకు చెందుతాయి. అహరోనుకు, అతని కుమారులు యెహోవాకు యాజకులుగా పని చేసినప్పుడు బలి అర్పణల్లో వారికి కొంతభాగం లభిస్తుంది.
LEV 7:36 యెహోవా, యాజకులను అభిషేకించినప్పుడే ఈ విషయాన్ని చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు ఆ భాగాలను యాజకులకు ఇవ్వవలెను. వారి తరాలన్నింటిలో శాశ్వతంగా వారు ఆ భాగాలను యాజకులకు ఇవ్వాలి.
LEV 7:37 దహన బలి అర్పణ, నైవేద్యము, పాపపరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, యాజకుల నియామకం, సమాధాన బలి విధులు అవి.
LEV 7:38 సీనాయి పర్వతంమీద మోషేకు యెహోవా వాటిని ఇచ్చాడు. సీనాయి ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు వారి అర్పణలు తీసుకొని రావాలని ఆయన ఆజ్ఞాపించిన రోజునే ఈ విధులను యెహోవా ఇచ్చాడు.
LEV 8:1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
LEV 8:2 “అహరోనును, అతని కుమారులను, వారి వస్త్రాలు, అభిషేకించే తైలాన్ని, పాపపరిహారార్థపు కోడెదూడ, రెండు పొట్టేళ్ళను, ఒక గంపెడు పులియని రొట్టెలను నీతో తీసుకొని,
LEV 8:3 ప్రజలందరినీ సన్నిధి గుడారం యొక్క ద్వారం దగ్గర సమావేశపర్చు.”
LEV 8:4 యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే చేసాడు. ప్రజలు సన్నిధి గుడారం దగ్గర సమావేశం అయ్యారు.
LEV 8:5 అప్పుడు మోషే, “చేయవలసినదానిని యెహోవా సెలవిచ్చాడు.”
LEV 8:6 అప్పుడు అహరోనును, అతని కుమారులను మోషే తీసుకొని వచ్చాడు. అతడు వారికి నీళ్లతో స్నానం చేయించాడు.
LEV 8:7 అప్పుడ అహరోనుకు మోషే చొక్కా తొడిగించాడు. అహరోనుకు నడికట్టును మోషే చుట్టాడు. అంతట ఒక నిలువుపాటి అంగీని మోషే అహరోనుకు తొడిగించాడు. తర్వాత మోషే ఏఫోదును అహరోనుకు ధరింపజేసాడు. నైపుణ్యంగా అల్లిక చేయబడిన నడికట్టును మోషే అహరోను నడుముకు బిగించాడు. ఆ విధంగా ఏఫోదును అహరోనుకు మోషే ధరింపజేసాడు.
LEV 8:8 తర్వాత మోషే, న్యాయతీర్పు పైవస్త్రంలో ఊరీము, తుమ్మీములను ఉంచాడు.
LEV 8:9 అహరోను తలమీద తలపాగాను కూడా మోషే పెట్టాడు. ఈ తలపాగా ముందర భాగంలో బంగారు బద్దను మోషే పెట్టాడు. ఈ బంగారు బద్ద పరిశుద్ధ కిరీటం. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇలా చేసాడు.
LEV 8:10 తర్వాత మోషే అభిషేక తైలాన్ని తీసుకొని పవిత్ర గుడారాన్నీ, దానిలోని వస్తువులన్నిటినీ ప్రతిష్ఠించాడు. ఈ విధంగా వాటిని మోషే పరిశుద్ధం చేసాడు.
LEV 8:11 ఆ అభిషేక తైలంలో కొంత బలిపీఠం మీద ఏడుసార్లు మోషే చిలకపించాడు. బలిపీఠం, దాని పరికరాలు, పాత్రలు అన్నింటినీ మోషే ప్రతిష్ఠించాడు. గంగాళాన్ని, దాని పీటను కూడా మోషే ప్రతిష్ఠించాడు. ఈవిధంగా మోషే వాటిని పరిశుద్ధం చేశాడు.
LEV 8:12 అప్పుడు అభిషేక తైలంలో కొంత అహరోను తలమీద మోషే పోసాడు, ఈ విధంగా అహరోనును అతడు పరిశుద్ధం చేశాడు.
LEV 8:13 అప్పుడు మోషే అహరోను కుమారులను తీసుకొనివచ్చి, వారికి ప్రత్యేకమైన చొక్కాలను తొడిగించాడు. అతడు వారికి ప్రత్యేకమైన చొక్కాలను తొడిగించాడు. అతడు వారికి దట్టీలు కట్టాడు. తర్వాత వారి తలలమీద పాగాలను అతడు చుట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే మోషే ఇవన్నీ చేసాడు.
LEV 8:14 అప్పుడు పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను మోషే తీసుకొనివచ్చాడు. పాపపరిహారార్థ బలికొరకైన కోడె దూడ తలమీద అహరోను, అతని కుమారులు వారి చేతులు ఉంచారు.
LEV 8:15 అప్పుడు మోషే ఆ కోడె దూడను వధించి, దాని రక్తాన్ని తీసాడు. మోషే కొంచెం రక్తం తీసుకొని, తన వ్రేలితో దానిని బలిపీఠపు కొమ్ములన్నింటి మీద చల్లాడు. ఈ విధంగా బలిపీఠాన్ని బలులకోసం మోషే సిద్ధం చేసాడు, తర్వాత ఆ రక్తాన్ని బలిపీఠపు అడుగున మోషే పోసాడు. ఈ విధంగా ప్రజల పాపాలను పరిహారం చేసే బలుల కోసం బలిపీఠాన్ని మోషే సిద్ధం చేసాడు.
LEV 8:16 ఆ కోడెదూడ లోపలి భాగాలనుండి కొవ్వు అంతటినీ మోషే తీసాడు. కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని, రెండు మూత్ర పిండాలను, వాటిమీద కొవ్వును మోషే తీసి బలిపీఠం మీద వాటిని దహించాడు.
LEV 8:17 అయితే ఆ కోడెదూడ చర్మాని దాన్ని మాంసాన్ని, దాని పేడను వారి బస వెలుపలకు మోషే తీసుకుపోయాడు. నివాసానికి వెలుపల మంట వేసి అందులో వాటిని మోషే కాల్చివేసాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే అవన్నీ చేసాడు.
LEV 8:18 తర్వాత మోషే దహనబలి పొట్టేలును తీసుకొచ్చాడు. అహరోను, అతని కుమారులు ఆ పొట్టేలు తలమీద వారి చేతులు ఉంచారు.
LEV 8:19 అప్పుడు మోషే ఆ పొట్టేలును వధించి, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు.
LEV 8:20 పొట్టేలును మోషే ముక్కలుగా కోసాడు. లోపలి భాగాలను, కాళ్లను, నీళ్ళతో మోషే కడిగాడు.
LEV 8:21 తర్వాత మొత్తం పొట్టేలును బలిపీఠం మీద మోషే దహించాడు. తలను, భాగాలను, కొవ్వును మోషే దహించాడు. అది హోమంగా అర్పించబడిన దహనబలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. యెహోవా ఆజ్ఞాపించినట్లే మోషే వాటిని చేసాడు.
LEV 8:22 అప్పుడు మోషే మరొక పొట్టేలును తీసుకొచ్చాడు. అహరోనును, అతని కుమారులను యాజకులుగా నియమించుటకు ఈ పొట్టేలు ఉపయోగించబడింది. అహరోను, అతని కుమారులు ఆ పోట్టేలు తలమీద వారి చేతులు ఉంచారు.
LEV 8:23 అప్పుడు మోషే ఈ పోట్టేలును వధించాడు. దాని రక్తంలో కొంత అతడు తీసుకొని, అహరోను చెవి కొనమీద, కుడిచేతి బొటన వేలిమీద, అహరోను కుడికాలి బొటనవేలి మీద వేసాడు.
LEV 8:24 తర్వాత అహరోను కమారులను బలిపీఠం దగ్గరకు మోషే తీసుకొని వచ్చాడు. ఆ రక్తంలో కొంత వారి కుడి చెవుల కొనలమీద, కుడి చేతుల బొటనవేళ్ళమీద, వారి కుడి కాళ్ల బొటనవ్రేళ్ల మీద మోషే వేసాడు. తర్వాత బలిపీఠంచుట్టూ ఆ రక్తాన్ని మోషే చిలకరించాడు.
LEV 8:25 కొవ్వును, కొవ్విన తోకను, లోపలి భాగాలమీద కొవ్వు అంతటినీ, కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని రెండు మూత్ర పిండాలను, వాటి కొవ్వును, కుడి తొడను మోషే తీసాడు.
LEV 8:26 ఒక గంపెడు పులియని రొట్టెలు ప్రతిరోజూ యెహోవా ముందు ఉంచబడ్డాయి. ఆ రొట్టెల్లో నూనె కలిపి చేయబడ్డ రొట్టె ఒకటి, పులియని రొట్టెల్లోనుంచి ఒక రొట్టెను మోషే తీసుకొని, పొట్టేలు కుడి తొడమీద, కొవ్వుమీద ఆ రొట్టె ముక్కల్ని ఉంచాడు.
LEV 8:27 తర్వాత మోషే వాటన్నింటినీ అహరోను, అతని కుమారుల చేతుల్లో పెట్టాడు. నైవేద్యంగా ఆ ముక్కలను యెహోవా ఎదుట మోషే అల్లాడించాడు.
LEV 8:28 అప్పుడు అహరోను అతని కుమారుల చేతుల్లోనుండి మోషే వాటిని తీసుకొన్నాడు. బలిపీఠం మీద దహనబలిగా వాటిని దహించాడు. కాబట్టి అహరోనును, అతని కుమారులను యాజకులుగా నియమించుటకు అర్పణ అది. అది అగ్నితో అర్పించబడిన అర్పణ. అది యెహోవాకు ఇష్టమైన సువాసన.
LEV 8:29 దాని బోరను మోషే తీసుకొని, యెహోవా ఎదుట అర్పణగా దానిని అల్లాడించాడు. యాజకులను నియమించుటలో పొట్టేలు యొక్క ఆ భాగం మోషేకు చెందుతుంది. ఇది యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు జరిగింది.
LEV 8:30 బలిపీఠం మీద ఉన్న అభిషేకతైలం కొంత, రక్తం కొంత మోషే తీసుకొన్నాడు. అందులో కొంచెం అహరోను మీద, అతని వస్త్రాల మీద, మరియు అహకోనుతో ఉన్న అతని కుమారుల మీద, వారి వస్త్రాల మీద కొంచెం చల్లాడు. ఈ విధంగా అహరోనును అతని వస్త్రాలను, అతని కుమారులను వారి వస్త్రాలను మోషే పవిత్రం చేసాడు. బలులు, అర్పణల నియమాలు
LEV 8:31 అప్పుడు అహరోనుతో, అతని కుమారులతో మోషే ఇలా చెప్పాడు: “మీకు నా ఆజ్ఞ జ్ఞాపకం ఉందా? ‘అహరోను, అతని కుమారులు వీటిని తినాలి’ అని నేను చెప్పాను. కనుక నియామక కార్యక్రమంనుండి రొట్టెలు, మాంసం ఉన్న గంప తీసుకోండి. సన్నిధి దగ్గర ఆ మాంసాన్ని ఉడకబెట్టండి. ఆ రొట్టెను ఆ మాంసాన్ని అక్కడే మీరు తినాలి.
LEV 8:32 రొట్టెగాని మాంసాన్నిగాని ఏమైనా మిగిలిపోతే, దాన్ని కాల్చివేయాలి.
LEV 8:33 నియామక క్రమం ఏడు రోజులపాటు ఉంటుంది. మీ అభిషేకం పూర్తి అయ్యేంతవరకు మీరు సన్నిధి గుడారంనుండి బయటకు వెళ్ల కూడదు.
LEV 8:34 ఈ వేళ మనం చేసిన వాటన్నింటినీ చేయుమని యెహోవా ఆజ్ఞాపించాడు. మీ పాపాలను తుడిచివేసేందుకు ఆయన వీటిని ఆజ్ఞాపించాడు.
LEV 8:35 ఏడు రోజుల పాటు రాత్రింబవళ్లు సన్నిధి గుడారం దగ్గరే మీరు నిలిచి ఉండాలి. యెహోవా ఆజ్ఞలకు మీరు విధేయులు కాకాపోతే మీరు చనిపోతారు. ఈ ఆజ్ఞలు నాకు యెహోవా ఇచ్చాడు.”
LEV 8:36 కనుక యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ అహరోను, అతని కుమారులు జరిగించారు.
LEV 9:1 ఎనిమిదో రోజున అహరోనును, అతని కుమారులను మోషే పిలిచాడు. ఇశ్రాయేలు పెద్దలను కూడా అతడు పిలిచాడు.
LEV 9:2 అహరోనుతో మోషే చెప్పాడు, “ఒక కోడెదూడను, పొట్టేలును తీసుకొని రండి. వాటిలో ఏ దోషం ఉండకూడదు. కోడెదూడ పాపపరిహారార్థ (బలి) విషయమై పొట్టేలు దహనబలి. వాటిని యెహోవాకు అర్పించండి.
LEV 9:3 ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి, ‘పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను తీసుకోండి. దహన బలికోసం ఒక కోడెదూడను, ఒక గొర్రెపిల్లను తీసుకోండి. కోడెదూడ, గొర్రెపిల్ల ఒక్క సంవత్సరం వయస్సుగలవి కావాలి. ఆ జంతువుల్లో ఏ దోషమూ ఉండకూడదు.
LEV 9:4 సమాధాన బలుల కోసం ఒక కోడెదూడను, ఒక పొట్టేలును తీసుకోండి. ఆ జంతువులను, నూనెతో కలుపబడ్డ నైవేద్యాన్ని తీసుకొని, వాటిని యెహోవాకు అర్పించండి. ఎందుకంటే ఈవేళ యెహోవా మీకు ప్రత్యక్ష మవుతాడు.’”
LEV 9:5 కనుక ప్రజలంతా సన్నిధి గుడారం దగ్గరకు వచ్చారు. మోషే ఆజ్ఞాపించిన వాటన్నింటినీ వారంతా తీసుకొచ్చారు. ప్రజలంతా యెహోవా ఎదుట నిలబడ్డారు.
LEV 9:6 “యెహోవా ఆజ్ఞప్రకారం మీరు చేసారు కనుక యెహోవా మహిమను మీరు చూస్తారు” అన్నాడు మోషే.
LEV 9:7 అప్పుడు అహరోనుతో మోషే ఈ సంగతులు చెప్పాడు: “వెళ్లి, యెహోవా ఆజ్ఞాపించిన వాటిని జరిగించు. బలిపీఠం దగ్గరకు వెళ్లి, పాపపరిహారార్థ బలులు, దహనబలి అర్పణలు అర్పించు. మీ పాపాలు, ప్రజల పాపాలు తుడిచివేయబడేందుకు వాటిని జరిగించు. ప్రజల బలులను నీవు తీసుకొని, వారి పాపాలను పరిహరించే వాటిని జరిగించు.”
LEV 9:8 కనుక అహరోను బలిపీఠం దగ్గరకు వెళ్లాడు. పాపపరిహారార్థ బలికోసం కోడె దూడను అతడు వధించాడు. ఈ పాపపరిహారార్థ బలి అతని కోసమే.
LEV 9:9 అప్పుడు అహరోను కుమారులు ఆ రక్తాన్ని అహరోను దగ్గరకు తెచ్చారు. అహరోను తన వేలు ఆ రక్తంలో ముంచి, బలిపీఠం కొమ్ములమీద దాన్ని చల్లాడు. తర్వాత అహరోను ఆ రక్తాన్ని బలిపీఠం అడుగున పోసాడు.
LEV 9:10 పాపపరిహారార్థ బలిలోనుంచి కొవ్వును, మూతగ్రంథులను, కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని అహరోను తీసుకొని, బలిపీఠం మీద అతడు వాటిని దహించాడు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్లే అతడు అలా చేసాడు.
LEV 9:11 తర్వాత మాంసాన్ని, చర్మాన్ని పాళెము వెలుపల అగ్నితో అహరోను కాల్చివేసాడు.
LEV 9:12 తర్వాత, దహనబలి పశువును అహరోను వధించాడు. అది ముక్కలుగా కోయబడింది. దాని రక్తాన్ని అహరోను కుమారులు అహరోను దగ్గరకు తీసుకొని వచ్చారు. అహరోను ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాడు.
LEV 9:13 దహనబలి పశువు యొక్క ముక్కలను, దాని తలను అహరోను కుమారులు అహరోనుకు అందించారు. అప్పుడు అహరోను వాటిని బలిపీఠం మీద దహించాడు.
LEV 9:14 దహన బలి పశువు లోపలి భాగాలను, కాళ్లను కూడా అహరోను కడిగాడు. వాటిని బలిపీఠం మీద అతడు కాల్చివేసాడు.
LEV 9:15 తర్వాత ప్రజల అర్పణను అహరోను తీసుకొచ్చాడు. ప్రజల పాప పరిహారార్థ బలిగా మేకను వధించాడు. మొదటిదాని వలెనే అతడు పాప పరిహారార్థంగా ఆ మేకను అర్పించాడు.
LEV 9:16 అహరోను దహనబలి తీసుకొనివచ్చి అర్పించాడు. యెహోవా ఆజ్ఞప్రకారం అహరోను చేసాడు.
LEV 9:17 అహరోను బలిపీఠం దగ్గరకు ధాన్యార్పణను తీసుకువచ్చాడు. అతడు గుప్పెడు ధాన్యార్పణ తీసుకొని, బలిపీఠం మీద ఆనాటి అనుదిన బలిని పక్కగా పెట్టాడు.
LEV 9:18 ప్రజల సమాధాన బలి అర్పణలుగా కోడెదూడను, పొట్టేలును కూడ అహరోను వధించాడు. అహరోను కుమారులు రక్తాన్ని అహరోను దగ్గరకు తెచ్చారు. ఈ రక్తాన్ని అహరోను బలిపీఠం చుట్టూ చిలకరించాడు.
LEV 9:19 కోడెదూడ, పొట్టేలు కొవ్వునుకూడ అహరోను కుమారులు అహరోను దగ్గరకు తెచ్చారు. కొవ్విన తోకను లోపలి భాగాలమీది కొవ్వును మూతగ్రంథులను, కాలేయము యొక్క కొవ్విన భాగాన్ని వారు తీసుకొచ్చారు.
LEV 9:20 కొవ్విన ఈ భాగాలను కోడెదూడ, పొట్టేలు బోరలమీద అహరోను కుమారులు ఉంచారు. కొవ్విన ఈ భాగాలను బలిపీఠం మీద అహరోను కాల్చివేసాడు.
LEV 9:21 మోషే ఆజ్ఞాపించిన ప్రకారం నైవేద్యంగా బోరలను, కుడితొడను యెహోవా ఎదుట అహరోను అల్లాడించాడు.
LEV 9:22 అప్పుడు అహరోను ప్రజల వైపుగా తన చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించాడు. అహరోను పాపపరిహారార్థ బలి అర్పణను, దహనబలి అర్పణను, సమాధాన బలి అర్పణ, అర్పించటం ముగించిన తర్వాత అతడు బలిపీఠం నుండి దిగి వచ్చాడు.
LEV 9:23 మోషే, అహరోనులు సన్నిధి గుడారం లోపలకు వెళ్లారు. వారు బయటకు వచ్చి ప్రజలను ఆశీర్వదించారు. యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను.
LEV 9:24 యెహోవా నుండి అగ్ని వచ్చి బలిపీఠం మీది దహన బలిని, కొవ్వును దహించి వేసింది. ప్రజలంతా ఇది చూచినప్పుడు ఉత్సాహధ్వనిచేసి సాష్టాంగపడ్డారు.
LEV 10:1 అప్పుడు అహరోను కుమారులైన నాదాబు, అబీహులు పాపం చేసారు. ధూపం వేసేందుకు ఒక్కో కుమారుడు ఒక్కో ధూపార్తిని తీసుకొన్నాడు. వారు వేరే నిప్పు తీసుకొని ధూపం అంటించారు. వారు ఉపయోగించాలని దేవుడు ఆజ్ఞాపించిన నిప్పును వారు ఉపయోగించలేదు.
LEV 10:2 కనుక యెహోవా నుండి అగ్ని వచ్చి నాదాబు, అబీహులను నాశనం చేసింది. యెహోవా ఎదుట వారు మరణించారు.
LEV 10:3 అప్పుడు అహరోనుతో మోషే ఇలా చెప్పాడు: “యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ‘నా దగ్గరకు వచ్చే యాజకులు నన్ను గౌరవించాలి. వారికీ, ప్రజలందరికీ నేను పరిశుద్ధుడుగా ఉండాలి.’” కనుక అహరోను తన కుమారుల చావునుగూర్చి ఏమీ అనలేదు.
LEV 10:4 అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలుకు ఇద్దరు కుమారులుండిరి. వారు మిషాయేలు, ఎల్సాఫాను. “పరిశుద్ధ స్థలం ముందునకు వెళ్లండి. మీ సోదరుల శవాలను బస వెలుపలకు తీసుకొని పొండి” అని మోషే వారిద్దరితో చెప్పాడు.
LEV 10:5 కనుక మిషాయేలు, ఎల్సాఫాను మోషేకు విధేయులయ్యారు. నాదాబు, అబీహు శవాలను బస వెలుపలకు వారు మోసుకొని పోయారు. నాదాబు, అబీహు అప్పటికి ఇంకా వారి ప్రత్యేక చొక్కాలు ధరించే ఉన్నారు.
LEV 10:6 అప్పుడు అహరోనుతోను, అతని ఇతర కుమారులు ఎలీయాజరు, ఈ తామారులతో మోషే ఇలా మాట్లాడాడు. “ఏమి విచారపడకండి. మీబట్టలు చింపుకోవద్దు, జుట్టు చిందరవందర చేసుకోవద్దు. మీరు అలాంటివి చేయకుండా ఉంటే మీరు చావకుండా ఉంటారు. అలానే యెహోవా తన ప్రజలందరి మీద కోపగించకుండా ఉంటాడు. ఇశ్రాయేలు జాతి మొత్తం మీ బంధువులే. నాదాబు, అబీహులను యెహోవా కాల్చివేసినందుకు వారంతా ఏడుస్తారు.
LEV 10:7 కాని మీరు మాత్రం సన్నిధి గుడారం వదిలి వెళ్లకూడదు. ఆ ద్వారం నుండి కనుక మీరు బయటకు వెళ్తే మీరు చనిపోతారు. ఎందుచేతనంటే యెహోవా ప్రత్యేక తైలం మీమీద ఉంది.” గనుక అహరోను, ఎలీయాజరు, ఈతామారు మోషేకు విధేయులయ్యారు.
LEV 10:8 అప్పుడు అహరోనుతో యెహోవా అన్నాడు:
LEV 10:9 “మీరు సన్నిధి గుడారంలోనికి వచ్చేటప్పుడు నీవుగాని నీ కుమారులుగాని ద్రాక్షారసం, మద్యం తాగకూడదు. మీరు అలాంటివి చేస్తే చనిపోతారు. మీతరాలన్నింటికీ ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది.
LEV 10:10 పవిత్రం, అపవిత్రం అనే నిర్దిష్టమైన వ్యత్యాసాన్ని మీరు పాటించాలి.
LEV 10:11 యెహోవా తన ఆజ్ఞలను మోషేకు ఇచ్చాడు, వాటిని మోషే ప్రజలకు ఇచ్చాడు. అహరోనూ, నీవు ఆ ఆజ్ఞలు అన్నింటి విషయమై ప్రజలకు ప్రబోధించాలి.”
LEV 10:12 అహరోనుకు ఎలీయాజరు, ఈ తామారు అనే ఇద్దరు కుమారులు ఇంకా బతికి ఉన్నారు. అహరోనుతో, అతని ఇద్దరు కుమారులతో మోషే ఇలా అన్నాడు: “అగ్నిచే దహించబడిన బలులలో ధాన్యార్పణ కొంత మిగిలిపోయింది. ధాన్యార్పణంలోని ఆ భాగాన్ని మీరు తినాలి. అయితే అందులో పొంగే పదార్థం కలుపకుండా మీరు తినాలి. బలిపీఠం దగ్గరే దాన్ని తినాలి. ఎందుచేతనంటే ఆ అర్పణ అతి పరిశుద్ధం.
LEV 10:13 అది యెహోవా కోసం అగ్నిమీద దహించబడిన అర్పణలలో భాగమైయున్నది. ఆ భాగం నీకు నీ కుమారులకు చెందుతుంది అని నీకు నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రబోధిస్తుంది. అయితే ఒక పరిశుద్ద స్థలంలోనే మీరు దాన్ని తినాలి.
LEV 10:14 “మరియు నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నైవేద్యంల్లోనుంచి బోరను తినవచ్చును. మీరు వాటిని పవిత్ర స్థలంలో తినాల్సిన అవసరం లేదు గాని పరిశుభ్రమైన స్థలంలో తినాలి. ఎందుచేతనంటే అవి సమాధాన బలిలోనివి. ఆ కానుకలను ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇస్తారు. ఆ జంతువుల్లో కొంత భాగాన్ని ప్రజలు తింటారు కాని బోర మాత్రం మీ వంతు అవుతుంది.
LEV 10:15 నిప్పుమీద దహించబడిన బలిలో భాగంగా ప్రజలు వారు అర్పించే జంతువుల కొవ్వును తీసుకొని రావాలి. సమాధాన బలిలోని తొడను, నైవేద్యంలోని బోరనుకూడా వారు తీసుకుని రావాలి. అది యెహోవా ఎదుట అల్లాడించబడుతుంది. ఆ తర్వాత అది ఆ అర్పణలో మీ భాగం అవుతుంది. బలి అర్పణల్లోని ఆ భాగం యెహోవా ఆజ్ఞాపించినట్టు శాశ్వతంగా మీ వంతు అవుతుంది.”
LEV 10:16 పాప పరిహారార్థబలి మేక కోసం మోషే చూశాడు. అయితే అప్పటికే అది దహించివేయబడింది. అహరోను కుమారుల్లో మిగిలిన వారి మీద (ఎలీయాజరు, ఈతామారు) మోషేకు చాలా కోపం వచ్చింది.
LEV 10:17 మోషే, “ఆ మేకను మీరు పరిశుద్ధ స్థలంలోనే తినాల్సిఉంది. అది చాలా పరిశుద్ధం. దాన్ని యెహోవా ఎదుట మీరెందుకు తినలేదు? ప్రజల దోషాన్ని తీసివేసేందుకు దాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. ఆ మేక బలి ప్రజల పాపాలను తుడిచి వేసేందుకు ఉద్దేశించబడింది.
LEV 10:18 చూడండి, ఆ మేక రక్తాన్ని పవిత్ర స్థలం లోపలకు మీరు తీసుకొని రాలేదు. నేను ఆజ్ఞాపించిన ప్రకారం మీరు దాన్ని పరిశుద్ధ స్థలంలోనే తినాల్సి ఉంది”! అని అన్నాడు.
LEV 10:19 కాని, మోషేతో అహరోను చెప్పాడు: “చూడు, ఈవేళ వారు తమ పాపపరిహారార్థ బలిని, దహన బలి అర్పణను యెహోవా ఎదుటికి తెచ్చారు. అయితే ఈవేళ నాకు ఏమి జరిగిందో నీకు తెలుసు. పాపపరిహారార్థ బలిని ఈ వేళ నేను తింటే యెహోవా ఆనందిస్తాడని నీవు అనుకొంటావా? లేదు!”
LEV 10:20 మోషే ఇది విన్నప్పుడు ఒప్పుకొన్నాడు.
LEV 11:1 మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు:
LEV 11:2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పండి: మీరు తినదగిన జంతువులు ఏవంటే:
LEV 11:3 ఏ జంతువు డెక్కలు చీలి ఉండి, నెమరు వేస్తుందో దాని మాంసం మీరు తినవచ్చును.
LEV 11:4 “కొన్ని జంతువులు నెమరు వేస్తాయి గాని వాటి డెక్కలు చీలి ఉండవు. అలాంటి జంతువుల్ని తినవద్దు. ఒంటెలు, సిరాయారకపు పొట్టికుందేలు, కుందేలు అలాంటివే కనుక అవి మీకు అపవిత్రం.
LEV 11:7 మరికొన్ని జంతువులకు డెక్కలు చీలి ఉంటాయి గాని అవి నెమరు వేయవు. అలాంటి జంతువుల్ని తినవద్దు. పందులు కూడా మీకు అపవిత్రం.
LEV 11:8 ఆ జంతువుల (పందుల) మాంసం తినవద్దు. వాటి శవాలను కనీసం తాకవద్దు అవి మీకు అపవిత్రం.
LEV 11:9 “సముద్రంలోగాని, నదిలోగాని ఉండే జలచరాలకు రెక్కలు, పొలుసు ఉంటే, మీరు వాటిని తిన వచ్చును.
LEV 11:10 అయితే సముద్రంలోగాని నదిలో గాని ఉండే జలచరం దేనికైనా రెక్కలు, పొలుసు లేకపోతే, వాటని మీరు తినకూడదు. అలాంటిది అసహ్యమయినది. దాని మాంసం తినవద్దు. కనీసం దాని శవాన్ని కూడా తాకవద్దు.
LEV 11:12 సముద్రంలోనూ, నదిలోనూ ఉండే ఏ జలచరానికైనా రెక్కలు, పొలుసులు లేకపోతే అది అసహ్యమయిందిగానే మీరు ఎంచుకోవాలి.
LEV 11:13 “అలానే మీరు తినకూడని పక్షులు ఇవి. ఈ పక్షుల్లో దేనినీ తినవద్దు: పక్షిరాజులు, రాబందులు, క్రౌంచ పక్షులు,
LEV 11:14 గద్ద, అన్నిరకాల గద్దలు,
LEV 11:15 అన్ని రకాల నల్ల పక్షులు,
LEV 11:16 నిప్పుకోళ్లు, కపిరిగాళ్లు, అన్ని రకాల డేగలు,
LEV 11:17 గుడ్లగూబలు, పగిడికంటెలు, పెద్దగుడ్ల గూబలు,
LEV 11:18 నీటి కాకులు, కొంగలు, నల్లబోరువలు,
LEV 11:19 గూడ బాతులు, సంకుబుడి కొంగలు, అన్నిరకాల కొంగలు, కుకుడుగువ్వలు, గబ్బిలాలు.
LEV 11:20 “రెక్కలు ఉండి మొత్తం నాలుగు కాళ్లతో నడిచే జీవులన్నీ అసహ్యమైనవే. రెక్కలు ఉండి, నాలుగు కాళ్లతో నడిచే కీటకాలన్నీ అసహ్యమైనవే. ఆ కీటకాలను తినవద్దు.
LEV 11:21 అయితే కీటకాలకు రెక్కలు ఉండి నాలుగు కాళ్లతో నడిస్తే, వాటికి కనుక పాదాలకు పైగా కీళ్లు ఉండి అవి ఎగురగలిగినవైతే, అలాంటి కీటకాలను మీరు తినవచ్చును.
LEV 11:22 ఏ కీటకాలను మీరు తినవచ్చునంటే: అన్ని రకాల మిడతలు, రెక్కలున్న అన్నిరకాల మిడతలు, అన్ని రకాల పెద్ద మిడతలు, అన్నిరకాల ఆకు మిడతలు.
LEV 11:23 “అయితే రెక్కలు, నాలుగు పాదాలు ఉన్న మిగిలిన కీటకాలు అన్నీ మీకు అసహ్యం.
LEV 11:24 ఆ కీటకాలు మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి. ఈ కీటకాల శవాలను తాకిన ఏ వ్యక్తి అయినా సరే సాయంత్రంవరకు అపవిత్రం అవుతాడు.
LEV 11:25 ఒక వ్యక్తి చచ్చిన కీటకాల్లో ఒకదాన్ని గనుక పట్టుకొంటే ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఈ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడు.
LEV 11:26 “కొన్ని జంతువులకు డెక్కలు చీలి ఉంటాయిగాని డెక్కలు సమానంగా చీలి ఉండవు. కొన్ని జంతువులు నెమరు వేయవు. కొన్ని జంతువులకు డెక్కలు ఉండవు, అవి వాటి పాదాలమీద నడుస్తాయి. ఆ జంతువులన్నీ మీకు అపవిత్రం. వాటిని ఎవరైనా తాకితే వారు అపవిత్రం అవుతారు. ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడు
LEV 11:28 వాటి శవాలను ఎవరైనా ఎత్తితే, ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంత్రంవరకు అపవిత్రుడవుతాడు. ఆ జంతువులు మీకు అపవిత్రము.
LEV 11:29 “ప్రాకే ఈ జంతువులు మీకు అపవిత్రం: ముంగిసలు, పందికొక్కులు అన్ని రకాల పెద్ద బల్లులు.
LEV 11:30 అడవి ఎలుకలు, మొసళ్లు, తొండలు, సరటాలు, ఊసరవెల్లులు.
LEV 11:31 ప్రాకే ఈ జంతువులు మీకు అపవిత్రం. వాటిలో చచ్చిన వాటిని ఎవరైనా తాకితే అలాంటివారు సాయంత్రం వరకు అపవిత్రులవుతారు.
LEV 11:32 “అపవిత్రమైన ఆ జంతువుల్లో ఏదైనా చచ్చి దేనిమీదైనా పడితే, అది అపవిత్రం అవుతుంది. అది చెక్కతో, బట్టతో, తోలుతో చేయబడిన వస్తువులు కానీ, లేక ఏదైనా పనిముట్టుగానీ కావచ్చును. అది ఏదైనాసరే దాన్ని నీళ్లతో కడగాలి. సాయంత్రం వరకు అది అపవిత్రం. తర్వాత అది మరల పవిత్రం అవుతుంది.
LEV 11:33 “అపవిత్రమైన ఆ జంతువుల శవం ఏదైనా మట్టి పాత్రలో పడితే, ఆ ప్రాతలో ఉన్నది ఏదైనా సరే అది అపవిత్రం అవుతుంది. నీవు ఆ పాత్రను పగులగొట్టి తీరాలి.
LEV 11:34 అపవిత్రమైన మట్టి పాత్రలోని నీళ్లు ఏ ఆహారపదార్థం మీద పడినా, అందులోని ఆహారం అపవిత్రం అవుతుంది. అపవిత్రమైన పాత్రలోని పానీయం ఏదైనా అపవిత్రం అవుతుంది.
LEV 11:35 అపవిత్రమైచచ్చిన జంతువుయొక్క అవయవం ఒకటి దేనిమీద పడినా అది అపవిత్రం. అది మట్టి పొయ్యికావచ్చును, మట్టి కుంపటి కావచ్చును. దాన్ని ముక్కలుగా పగులగొట్టాలి. అవి ఇంకెంత మాత్రం పరిశుద్ధంగా ఉండవు. అవి మీకు ఎప్పటికీ అపవిత్రంగానే ఉంటాయి.
LEV 11:36 “నీళ్లు ఊరుతూండే ఊటగాని, బావిగాని, పరిశుద్ధంగా ఉంటుంది. అయితే అపవిత్రమైన ఏ జంతువు శవాన్నీ, తాకిన ఏ వ్యక్తి అయినాసరే అపవిత్రుడు.
LEV 11:37 అపవిత్ర జంతువుల్లోని ఏ శవమైనా, నాట్లువేసే ఏ విత్తనంమీద పడినా, ఆ విత్తనం ఇంకా పరిశుద్ధంగానే ఉంటుంది.
LEV 11:38 అయితే ఆ విత్తనాలమీద నీళ్లు పోసిన తర్వాత అపవిత్ర జంతువుయొక్క శవంలోని ఏ భాగమైనా ఆ విత్తనాలమీద పడితే, అప్పుడు మీకు ఆ విత్తనాలు అపవిత్రం.
LEV 11:39 “మీరు ఆహారానికి ఉపయోగించే జంతువు ఏదైనా చస్తే, దాని శవాన్ని తాకిన వ్యక్తి ఆ సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు.
LEV 11:40 మరియు ఈ జంతు మాంసం తిన్న వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఈ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు. ఆ జంతు శవాన్ని ఎత్తే మనిషి తప్పక తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు.
LEV 11:41 “నేలమీద ప్రాకే ప్రతి జంతువు అసహ్యమయిందే. దాన్ని తినకూడదు.
LEV 11:42 పొట్టతో పాకే జంతువుల్లో దేనిని గాని లేక నాలుగు పాదాలతో నడిచే ఏ జంతువునుగాని లేక చాలా పాదాలుగల జంతువును గాని మీరు తినకూడదు. అవి మీకు అసహ్యమైనవి.
LEV 11:43 అసహ్యమైన ఆ జంతువుల మూలంగా మిమ్మల్ని మీరు హేయం చేసుకోవద్దు. వాటితో మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు.
LEV 11:44 ఎందుచేతనంటే నేను మీ దేవుడైన యెహోవాను గనుక. నేను పరిశుద్ధుడ్ని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. అసహ్యమైన ఆ పాకే జంతువుల మూలంగా మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు.
LEV 11:45 మిమ్మల్ని ఈజిప్టునుండి నేను తీసుకొచ్చాను. మీరు నాకు ప్రత్యేకమైన ప్రజలుగా ఉండేందుకు నేను ఇలా చేసాను. మీకు నేను దేవుడిగా ఉండాలని నేను ఇలా చేసాను. నేను పరిశుద్ధుడ్ని గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి!”
LEV 11:46 భూమిమీద ఉండే పశువులు, పక్షులు, ఇతర జంతువులు అన్నింటిని గూర్చిన నియమాలు అవి. సముద్రంలో ఉండే జలచరాలు, నేలమీద పాకే జంతువులు అన్నింటిని గూర్చిన నియమాలు అవి.
LEV 11:47 పవిత్ర జంతువులు ఏవో అపవిత్ర జంతువులు ఏవో ప్రజలు తేలుసుకోగలిగేందుకే ఆ ప్రబోధాలు. అందుచేత ఏ జంతువుల్ని తినవచ్చో, ఏ జంతువుల్ని తినకూడదో ప్రజలకు తెలుస్తుంది.
LEV 12:1 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
LEV 12:2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: “ఒక స్త్రీ మగ శిశువుకు జన్మనిస్తే ఆ స్త్రీ ఏడు రోజుల వరకు అపవిత్రగావుంటుంది. ఇది ఆమె నెలసరి రక్తస్రావం విషయంలో అపవిత్రంగా ఉన్నట్టే.
LEV 12:3 ఎనిమిదో రోజున ఆ మగ శిశువుకు సున్నతి చేయాలి.
LEV 12:4 అప్పుడు ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అయ్యేందుకు ముప్పయిమూడు రోజులు పడుతుంది. పరిశుద్ధమయింది దేన్నీ ఆమె తాకగూడదు. ఆమె పవిత్రపరచబడటం పూర్తి అయ్యేంతవరకు పరిశుద్ధ స్థలంలో ఆమె ప్రవేశించకూడదు.
LEV 12:5 కానీ ఆ స్త్రీ ఒక ఆడ శిశువుకు జన్మయిస్తే నెలసరి రక్తస్రావ సమయంలో ఉన్నట్టే రెండు వారాలు ఆమె అపవిత్రంగా ఉంటుంది. ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అయ్యేందుకు అరవై ఆరు రోజులు అవుతుంది.
LEV 12:6 “ప్రసవించిన తల్లి పవిత్రం అయ్యేందుకు ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. పవిత్రపర్చబడే ఆ ప్రత్యేక సమయం అయిపోగానే ఆడపిల్ల తల్లియైనా, మగపిల్ల తల్లియైనా, ఆ తల్లి ప్రత్యేకమైన బలి అర్పణలను సన్నిధి గుడారానికి తీసుకొనిరావాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర ఆ బలి అర్పణలను ఒక యాజకునికి ఇవ్వాలి. దహన బలికోసం ఒక సంవత్సరం వయస్సుగల ఒక గొర్రెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురం పిల్లను లేక ఒక గువ్వను ఆమె తీసుకొనిరావాలి.
LEV 12:7 ఒకవేళ ఆ స్త్రీ గొర్రెపిల్లను ఇవ్వలేక పోతే, రెండు పావురపు పిల్లల్నిగాని రెండుగువ్వలనుగాని ఆమె తీసుకొని రావచ్చును. అందులో ఒకటి దహనబలి కోసం, మరొకటి పాప పరిహారార్థ బలికోసం. వాటిని యాజకుడు యెహోవా ఎదుట అర్పిస్తాడు. ఈ విధంగా ఆమెకోసం అతడు ఆమె పాపాలను తుడిచి వేస్తాడు. అప్పుడు ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అవుతుంది. ఒక మగశిశువుకు లేదా ఆడశిశువుకు జన్మనిచ్చే స్త్రీకి అవి నియమాలు.”
LEV 13:1 మోషే, అహరోనులకు యెహోవా ఇలా చెప్పాడు:
LEV 13:2 “ఒక వ్యక్తి చర్మం మీద వాపు ఉండవచ్చును, లేక అది పొక్కుగాని, నిగనిగలాడు మచ్చగాని కావచ్చును. ఆ మచ్చ కుష్ఠురోగంలా కనబడితే, యాజకుడగు అహరోను దగ్గరకు గాని, యాజకులైన అతని కుమారుల దగ్గరకుగాని ఆ వ్యక్తిని తీసుకొనిరావాలి.
LEV 13:3 ఆ వ్యక్తి చర్మంమీది మచ్చను యాజకుడు పరిశీలించాలి. ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబడినా, ఆ మచ్చ అతని చర్మంకంటె లోతుకు ఉన్నా అది కుష్ఠురోగమే. యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించటం ముగించగానే ఆ వ్యక్తి కుష్ఠురోగి అని యాజకుడు ప్రకటించాలి.
LEV 13:4 “కొన్నిసార్లు ఒక వ్యక్తి చర్మంమీద ఒక తెల్లమచ్చ ఉంటుంది. కానీ ఆ మచ్చ చర్మంలోపలికి ఉండదు. అదే నిజమైతే ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు ఇతరులనుండి యాజకుడు వేరు చేయాలి.
LEV 13:5 ఏడో రోజున యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ మచ్చలో మార్పు లేకుండా, అది చర్మంమీద విస్తరించకుండా ఉన్నట్టు యాజకునికి కనబడితే, అప్పుడు ఆ వ్యక్తిని మరో ఏడు రోజులపాటు యాజకుడు ప్రత్యేకించాలి.
LEV 13:6 ఏడు రోజుల తర్వాత మరల ఆ వ్యక్తిని యాజకుడు పరిశీలించాలి. ఆ మచ్చ మానిపోయి, చర్మంమీద విస్తరించకుండా ఉంటే, ఆ వ్యక్తి పరిశుద్ధుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ మచ్చ కేవలం పొక్కే. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, మళ్లీ పవిత్రుడు కావాలి.
LEV 13:7 “అయితే ఆ వ్యక్తి మరల శుద్ధి చేయబడేందుకు తనను తాను యాజకునికి కనబరచుకొన్న తర్వాత, ఆ పొక్కు చర్మంమీద మరలా విస్తరిస్తే, అప్పుడు ఆ వ్యక్తి మరల యాజకుని దగ్గరకు రావాలి.
LEV 13:8 యాజకుడు తప్పక పరిశీలించాలి. ఒకవేళ ఆ పొక్కు చర్మం మీద విస్తరిస్తే, ఆవ్యక్తి అపవిత్రుడని యాజకుడు తప్పక ప్రకటించాలి. అది కుష్ఠురోగం.
LEV 13:9 “ఒక వ్యక్తికి కుష్ఠురోగం ఉంటే అతణ్ణి యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి.
LEV 13:10 యాజకుడు తప్పక ఆ వ్యక్తిని పరిశీలించాలి. చర్మంలో తెల్లని వాపుఉండి, వెంట్రుకలు తెల్లబడి ఉండి, వాపులో చర్మంతెల్లగా కనబడితే
LEV 13:11 అప్పుడు అది ఆ వ్యక్తి చర్మంమీద చాలకాలంగా ఉన్న కుష్ఠురోగం. ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు తప్పక ప్రకటించాలి. కొద్దికాలం ఆ వ్యక్తిని మిగిలిన ప్రజలనుండి యాజకుడు ప్రత్యేకించాలి. ఎందుచేతనంటే ఆ వ్యక్తి అపవిత్రుడు అని అతనికి తెలుసు.
LEV 13:12 “కొన్నిసార్లు చర్మరోగం ఒక వ్యక్తి శరీరమంతటా వ్యాపిస్తుంది. ఆ వ్యక్తి తలనుండి పాదంవరకు చర్మంమీద అంతటా చర్మరోగం ఆవరిస్తుంది. యాజకుడు ఆ వ్యక్తి శరీరమంతా తప్పక చూడాలి.
LEV 13:13 చర్మరోగం శరీరమంతా వ్యాపించినట్టు, అది ఆ వ్యక్తి చర్మాన్ని పూర్తిగా తెలుపు చేసినట్టు యాజకుడు చూస్తే, అప్పుడు ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.
LEV 13:14 అయితే ఆ వ్యక్తి చర్మం పచ్చిగా ఉంటే అతడు పవిత్రుడుకాడు.
LEV 13:15 యాజకుడు చర్మం పచ్చిగా ఉండటం చూసినప్పుడు, ఆ వ్యక్తి అపవిత్రుడని అతడు ప్రకటించాలి. పచ్చి చర్మం పవిత్రం కాదు. అది కుష్ఠురోగం.
LEV 13:16 “చర్మం మరల పచ్చిగా తయారై తెల్లగా మారితే, అప్పుడు ఆ వ్యక్తి తప్పక యాజకుని దగ్గరకు రావాలి.
LEV 13:17 యాజకుడు తప్పక ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ తెల్లబారితే ఆ పొడగల ఆ వ్యక్తి పవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. ఆ వ్యక్తి పవిత్రుడు.
LEV 13:18 “ఒకవేళ దేహపు చర్మంమీద మానిపోయినపుండు ఉండవచ్చును.
LEV 13:19 కాని ఆ పుండు స్థానంలో తెల్లటి వాపుగాని, తెలుపు ఎరుపు కలిసి నిగనిగలాడే మచ్చగానీ ఉండవచ్చును. అప్పుడు దేహం మీది ఈ చోటును యాజకునికి చూపెట్టాలి.
LEV 13:20 యాజకుడు పరిశీలించాలి. వాపు చర్మంకంటె లోతుగా ఉండి, దాని మీది వెంట్రుకలు తెల్లబడి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ మచ్చ కుష్ఠురోగం పుండులోపలనుండి కుష్ఠురోగం బయటపడింది.
LEV 13:21 కానీ యాజకుడు ఆ మచ్చను చూడగా దానిమీద వెంట్రుకలు తెల్లబడక, ఆ మచ్చ చర్మంకంటె లోతుగా ఉండక మానుతున్నట్టు కనబడితే అప్పుడు యాజకుడు, ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు ప్రత్యేకంగా ఉంచాలి.
LEV 13:22 ఒకవేళ ఆ మచ్చయింకా ఎక్కువగా చర్మంమీద విస్తరిస్తే, ఆ వ్యక్తి అపవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠుపొడ.
LEV 13:23 అయితే నిగనిగలాడే ఆ మచ్చ విస్తరించక, ఉన్నచోటనే ఉంటే, అది పాతపుండుకు సంబంధించిన దద్దురు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు తప్పక ప్రకటించాలి.
LEV 13:24 “ఒక వ్యక్తి చర్మంమీద కాలి వాత కావచ్చును. ఒకవేళ ఆ పచ్చి చర్మం తెల్లగా గాని, తెలుపు ఎరుపురంగు మచ్చలా కానీ మారితే యాజకుడు తప్పక దాన్ని పరిశీలించాలి. ఆ తెల్ల మచ్చ చర్మంకంటె లోతుగా ఉన్నట్టుగానీ, ఆ మచ్చ మీది వెంట్రుకలు తెల్లబడినా అది కుష్ఠురోగం. ఆ వాతలోనుంచి కుష్ఠురోగం బయటపడింది. అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠురోగం.
LEV 13:26 కానీ యాజకుడు ఆ మచ్చను చూడగా నిగనిగలాడే మచ్చమీద వెంట్రుకలు లేకుండా ఆ మచ్చ చర్మంకంటె లోతుగా లేకుండ అది మానుతున్నట్టు ఉంటే ఆ వ్యక్తిని ఏడు రోజులపాటు యాజకుడు వేరుచేయాలి.
LEV 13:27 ఏడవ రోజున యాజకుడు ఆ వ్యక్తిని మరల పరిశీలించాలి. ఆ మచ్చ చర్మంమీద విస్తరిస్తే, అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడని యాజకుడు ప్రకటించాలి. అది కుష్ఠురోగం.
LEV 13:28 అయితే నిగనిగలాడే ఆ మచ్చ చర్మంమీద విస్తరించక మానుతుంటే, అది వాత మీది వాపు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది కేవలం వాత మచ్చ మాత్రమే.
LEV 13:29 “ఒక వ్యక్తి తలమీదగాని గెడ్డంమీద గాని పొడరావచ్చును.
LEV 13:30 ఒక యాజకుడు ఆ పొడను పరిశీలించాలి. ఆ పొడ చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడినా, దానిచుట్టూ వెంట్రుకలు పలుచగాను, పసుపుగాను ఉన్నా, ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అది చెడ్డ చర్మరోగం.
LEV 13:31 ఒక వేళ ఆ పొడ చర్మంకంటె లోతుగా లేకపోయినా, దానిలో నల్ల వెంట్రుకలు లేకపోతే ఆ వ్యక్తిని ఏడురోజులపాటు యాజకుడు ప్రత్యేకించాలి.
LEV 13:32 ఏడవ రోజున ఆ పొడను యాజకుడు పరిశీలించాలి. ఆ పొడ విస్తరించకపోయినా, దానిలో పసుపు వెంట్రుకలు పెరగకపోయినా, ఆ పొడ చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా,
LEV 13:33 ఆ వ్యక్తి క్షౌరం చేసుకోవాలి. కానీ అతడు ఆ పొడను కత్తిరించకూడదు. ఆ వ్యక్తిని యింకో ఏడు రోజుల వరకు యాజకుడు ప్రత్యేకించాలి.
LEV 13:34 ఏడవ రోజున యాజకుడు ఆ పొడను పరిశీలించాలి. ఆ పొడ చర్మంలోనికి విస్తరించక, అది చర్మంకంటె లోతుగా ఉన్నట్టు కనబడకపోయినా, ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుకుకొని శుద్ధుడు కావాలి.
LEV 13:35 కానీ ఆ వ్యక్తి పవిత్రుడయిన తర్వాత ఆ పొడ చర్మంమీద వ్యాపిస్తే,
LEV 13:36 యాజకుడు మరల ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ చర్మంమీద వ్యాపిస్తే, పసుపు వెంట్రుకల కోసం యాజకుడు చూడక్కర్లేదు. ఆ వ్యక్తి అపవిత్రుడు.
LEV 13:37 అయితే ఆ వ్యాధి మానిపోయినట్టు యాజకుడు తలిస్తే, దానిలో నల్ల వెంట్రుకలు పెరుగుతుంటే ఆ రోగం మాని పోయింది. ఆ వ్యక్తి పవిత్రుడు. ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.
LEV 13:38 “ఒక వ్యక్తి చర్మంమీద తెల్ల మచ్చలు ఉంటే,
LEV 13:39 ఒక యాజకుడు ఆ మచ్చలను పరిశీలించాలి. ఒకవేళ ఆ వ్యక్తి చర్మంమీది మచ్చలు వాడిపోయి తెలుపుగా ఉంటే అది హానికరము కాని పొక్కులు మాత్రమే. ఆ వ్యక్తి పవిత్రుడు.
LEV 13:40 “ఒక వ్యక్తి తలమీద వెంట్రుకలు ఊడి పోవచ్చును. అతడు పవిత్రుడు. అది కేవలం బట్టతల
LEV 13:41 ఒకని తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోవచ్చును. అతడు పవిత్రుడు. అది కేవలం మరో రకం బట్టతల.
LEV 13:42 కానీ అతని తలమీద ఎరుపు తెలుపు పొడ ఉంటే అది చర్మవ్యాధి.
LEV 13:43 ఒక యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ పొడ వాపు ఎరుపు తెలుపుగా ఉండి, శరీరంలోని ఇతర భాగాల్లో కుష్ఠు రోగంలా కనబడితే,
LEV 13:44 ఆ వ్యక్తి తలమీద కుష్ఠు రోగం ఉంది. ఆ వ్యక్తి అపవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి.
LEV 13:45 “ఒక వ్యక్తికి కుష్ఠు రోగం ఉంటే అతడు ఇతరులను హెచ్చరించాలి. అపవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి అని కేకలు వేయాలి. అతడు తన బట్టలను చింపివేయాలి, తన తల వెంట్రుకలు విరబోసుకోవాలి, తన నోరు కప్పుకోవాలి.
LEV 13:46 ఆ వ్యాధి ఉన్న కాలమంతా అతను అపవిత్రుడే. ఆ వ్యక్తి అపవిత్రుడు. అతడు ఒంటరిగా బతకాలి. అతని నివాసం బసకు వెలుపల ఉండాలి.
LEV 13:47 “కొన్ని బట్టల మీద కుష్ఠుపొడ ఉండవచ్చును. ఆ బట్ట నాణ్యమైనది లేక ఉన్నది కావచ్చు.
LEV 13:48 బట్ట అల్లినది కావచ్చు, కుట్టినది కావచ్చు, లేదా ఒక తోలు మీద కాని, తోలుతో చేయబడిన మరి దేనిమీద కాని ఆ కుష్ఠు పొడ ఉండవచ్చును.
LEV 13:49 ఆ కుష్ఠుపొడ పచ్చగా కానీ ఎర్రగా కానీ ఉంటే దాన్ని యాజకునికి చూపించాలి.
LEV 13:50 ఆ కుష్ఠుపొడను యాజకుడు పరిశీలించాలి. దానిని ఏడు రోజుల వరకు ఒక ప్రత్యేక స్థలంలో అతడు ఉంచాలి.
LEV 13:51 ఏడవ రోజున ఆ కుష్ఠుపొడను యాజకుడు పరిశీలించాలి. ఆ కుష్ఠుపొడ తోలు మీద ఉన్నా బట్టమీద ఉన్నా ఒకటే. ఆ బట్ట కుట్టిందైనా అల్లినదైనా ఒకటే. ఆ తోలు ఉపయోగించబడింది దేని కొరకైనా ఒకటే. కుష్ఠుపొడ వ్యాపిస్తే అది నాశన కరమైనది. ఆ బట్ట లేక తోలు అపవిత్రం. ఆ పొడ అపవిత్రం. ఆ బట్ట లేక తోలును యాజకుడు కాల్చి వేయాలి.
LEV 13:53 “ఆ కుష్ఠుపొడ వ్యాపించినట్టు యాజకునికి కనబడకపోతే, ఆ తోలును లేక ఆ బట్టను ఉతకాలి. అది తోలుగాని, బట్టగాని లేక బట్ట అల్లికగాని, కుట్టింది గాని, దాన్ని ఉతకాల్సిందే.
LEV 13:54 ఆ బట్టను లేక తోలును ఉతకమని ఆ మనుష్యులకు యాజకుడు ఆజ్ఞాపించాలి. అప్పుడు యాజకుడు ఆ బట్టలను ఇంకా ఏడు రోజుల వరకు వేరుపరచాలి.
LEV 13:55 ఆ సమయం తీరగానే యాజకుడు మళ్లీ పరిశీలించాలి. ఆ కుష్ఠుపొడ ఇంకా అలానే కనబడితే అది అపవిత్రం. ఆ పొడ వ్యాపించకపోయినా సరే ఆ బట్టను లేక ఆ తోలును మీరు కాల్చివేయాలి.
LEV 13:56 “కానీ ఒక వేళ, ఆ తోలు ముక్కను లేక ఆ బట్టను యాజకుడు చూచినప్పుడు, కుష్ఠుపొడ వాడిపోయి ఉంటే, ఆ బట్ట మీద లేక తోలు మీద ఉన్న ఆ పొడను యాజకుడు చింపివేయాలి. ఆ బట్ట అల్లికది గాని, పడుగుది కానీ ఫర్వాలేదు.
LEV 13:57 లేదా ఆ బట్టమీద లేక ఆ తోలుమీద కుష్ఠుపొడ తిరిగి రావచ్చును. అలా జరిగతే ఆ కుష్ఠు పొడ వ్యాపిస్తుంది. ఆ చించిన బట్ట ముక్కను లేక తోలు ముక్కను కాల్చివేయాలి.
LEV 13:58 అయితే ఉతకిన తర్వాత కుష్ఠుపొడ మళ్లీ రాకపోతే అప్పుడు ఆ బట్ట ముక్క లేక తోలు ముక్క పవిత్రం. ఆ బట్ట కుట్టిందిగానీ అల్లిందిగానీ ఏదైనా ఫర్వాలేదు. ఆ బట్ట పవిత్రం.”
LEV 13:59 తోలు ముక్కలు లేక బట్టముక్కల మీద కుష్ఠుపొడకు సంబంధించిన నియమాలు అవి. బట్ట కుట్టింది గాని అల్లిందిగాని ఫర్వాలేదు.
LEV 14:1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,
LEV 14:2 “చర్మరోగాలు కలిగి బాగుపడిన ప్రజలకు నియమాలు ఇవీ. “ఆ వ్యక్తిని పవిత్రం చేసేందుకే ఇవే నియమాలు. చర్మవ్యాధి వచ్చిన వ్యక్తిని ఒక యాజకుడు చూడాలి.
LEV 14:3 బస వెలుపల ఆ వ్యక్తి దగ్గరకు యాజకుడు వెళ్లాలి. ఆ చర్మవ్యాధి బాగుపడినదేమో తెలుసుకొనేందుకు యాజకుడు పరిశీలించాలి.
LEV 14:4 ఆ వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉంటే అతణ్ణి ఈ పనులు చేయమని యాజకుడు చెప్పాలి: ప్రాణంతో ఉన్న రెండు పవిత్ర పక్షుల్ని అతడు తీసుకొని రావాలి, ఒక దేవదారు చెక్క ముక్కను, ఎర్రటి గుడ్డ ముక్కను, ఒక హిస్సోపు ముక్కను కూడా అతడు తీసుకొని రావాలి. ఇవన్నీ ఆవ్యక్తిని శుద్ధిచేసే పనికోసమే.
LEV 14:5 ఒక మట్టి పాత్రలో పారుతున్న నీళ్లమీద ఒక పక్షిని చంపమని యాజకుడు చెప్పాలి.
LEV 14:6 అప్పుడుయింకా ప్రాణంతో ఉన్న రెండో పక్షిని, దేవదారు చెక్కముక్క, ఎర్ర గుడ్డ ముక్క, హిస్సోపు ముక్కను యాజకుడు తీసుకోవాలి. పారుతున్న నీళ్లమీద చంపబడిన మొదటి పక్షి రక్తంలో, ప్రాణంతో ఉన్న రెండో పక్షిని, మిగతా వస్తువులను యాజకుడు ముంచాలి.
LEV 14:7 చర్మవ్యాధి ఉన్న వ్యక్తి మీద యాజకుడు ఏడుసార్లు చిలకరించాలి. అప్పుడు ఆ వ్యక్తి పవిత్రుడు అని యాజకుడు ప్రకటించాలి. అప్పుడు యాజకుడు బహిరంగ స్థలానికి వెళ్లి, ప్రాణంతో ఉన్న పక్షిని స్వేచ్ఛగా ఎగిరిపోనివ్వాలి.
LEV 14:8 “తర్వాత ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు తన వెంట్రుకలన్నింటినీ క్షౌరం చేసుకోవాలి. అతడు నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు పవిత్రం అవుతాడు. అప్పుడు ఆ వ్యక్తి బసలోనికి వెళ్లవచ్చును. కానీ అతడు ఏడు రోజులవరకు తన గుడారంబయట ఉండాలి.
LEV 14:9 ఏడవ రోజున అతడు తన వెంట్రు కలన్నీ క్షౌరం చేసుకోవాలి. అతడు తన తల, గడ్డం, కనుబోమలు, వెంట్రుకలు అన్నీ క్షౌరం చేసుకోవాలి. తర్వాత అతడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. అప్పుడు అతడు పవిత్రుడవుతాడు.
LEV 14:10 “ఎనిమిదో రోజున, చర్మవ్యాధి కలిగి ఉండినవాడు ఏ దోషం లేని రెండు మగ గొర్రెపిల్లలను తీసుకొని వెళ్లాలి. ఏ దేషం లోని ఒక్క సంవత్సరపు ఆడ గొర్రె పిల్లను కూడా అతడు తీసుకొని వెళ్లాలి. ధాన్యార్పణ కోసం నూనె కలిపిన మూడు పదోవంతుల మంచి పిండిని అతడు తీసుకొని వెళ్లాలి. ఒక అర్ధసేరు ఒలీవ నూనె ఆ వ్యక్తి తీసుకొని వెళ్లాలి.
LEV 14:11 ఆ వ్యక్తి పవిత్రుడు అని ప్రకటించే యాజకుడు, ఆ వ్యక్తిని, అతని బలులను సన్నిధిగుడార ద్వారం దగ్గర యెహోవా ఎదుటికి తీసుకొని రావాలి.
LEV 14:12 గొర్రె పిల్లల్లో ఒకదాన్ని అపరాధపరిహారార్థ బలిగా అర్పించాలి. ఆ గొర్రెపిల్లను, కొంతనూనెను యెహోవా ఎదుట నైవేద్యంగా అర్పించాలి.
LEV 14:13 పాపపరిహారార్థ బలి, దహనబలి వధించే పవిత్ర స్థలంలోనే యాజకుడు మగ గొర్రెపిల్లను వధించాలి. అపరాధ పరిహారార్థ బలి పాపపరిహారార్థ బలిలాగే ఉంటుంది. అది యాజకునికే చెందుతుంది. అది చాలా పవిత్రం.
LEV 14:14 “అపరాధ పరిహారార్థ బలినుండి కొంత రక్తాన్ని యాజకుడు తీసుకోవాలి. పవిత్ర పర్చబడాల్సిన వ్యక్తికుడి చెవి కొన మీద ఈ రక్తంలో కొంచెం యాజకుడు వేయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలిమీద, కుడి పాదపు బొటనవేలిమీద ఈ రక్తంలో కొంచెం యాజకుడు వేయాలి.
LEV 14:15 యాజకుడు కొంచెం నూనె తీసుకొని తన ఎడమ అర చేతిలో పోసుకోవాలి.
LEV 14:16 అప్పుడు యాజకుడు తన ఎడమ చేతిలో ఉన్న నూనెలో తన కుడి చేత వేలిని ముంచాలి. ఆ నూనెలో కొంచెం యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరించేందుకు ఆవేలిని అతడు ఉపయోగించాలి.
LEV 14:17 పవిత్ర పర్చబడాల్సిన ఆ వ్యక్తి కుడి చెవి కొనమీద యాజకుడు తన అరచేతిలోని నూనె కొంచెం పోయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలిమీద కుడి పాదం బొటనవేలి మీద యాజకుడు ఆ నూనెలో కొంచెం పోయాలి. అపరాధ పరిహారార్థ బలి అర్పణపు రక్తం మీద యాజకుడు ఆ నూనెలో కొంచెం పోయాలి.
LEV 14:18 యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెను పవిత్రపర్చబడాల్సిన వ్యక్తి తలమీద పోయాలి. ఈ విధంగా యెహోవా ఎదుట ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచి వేస్తాడు.
LEV 14:19 “తర్వాత ఆ వ్యక్తి పవిత్రుడయ్యేటట్టు యాజకుడు పాపపరిహారార్థ బలిని అర్పించి, ఆ వ్యక్తి పాపాలను తుడిచివేయాలి. ఆ తర్వాత దహనబలి పశువును యాజకుడు వధించాలి.
LEV 14:20 అప్పుడు యాజకుడు దహనబలి అర్పణను, ధాన్యార్పణను బలిపీఠం మీద అర్పించాలి. ఈ విధంగా ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచివేయాలి. ఆ వ్యక్తి పవిత్రుడవుతాడు.
LEV 14:21 “అయితే ఆ వ్యక్తి పేదవాడై అలాంటి అర్పణలు ఇవ్వలేకపోతే, అపరాధ పరిహారార్థబలిగా ఒక మగ గొర్రెపిల్లను అతడు తీసుకొని రావాలి. యాజకుడు ఆ వ్యక్తి పాపాలను తుడిచివేసేందుకు అది నైవేద్యం. ధాన్యార్పణగా తూములో పదోవంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని ఒక అర్థసేరు నూనెను
LEV 14:22 రెండు గువ్వలను, రెండు పావురపు పిల్లలను అతడు తీసుకొనిరావాలి. పేదవాళ్లుకూడ వాటిని తీసుకొని రాగలుగుతారు. ఒక పక్షి పాపపరిహారార్థబలి కొరకు, మరొకటి దహనబలి.
LEV 14:23 “ఎనిమిదో రోజున సన్నిధి గుడారం దగ్గర యాజకుని వద్దకు అతడు వాటిని తీసుకొని రావాలి. ఆ వ్యక్తి పవిత్రుడయ్యేందుకు వాటిని యెహోవా ఎదుట అర్పించాలి.
LEV 14:24 అపరాధ పరిహారార్థ బలికోసం గొర్రెపిల్లను, నూనెను, యాజకుడు తీసుకొని యెహోవా ఎదుట నైవేద్యంగా వాటిని అల్లాడించాలి.
LEV 14:25 అప్పుడు అపరాధ పరిహారార్థ బలికొరకైన గొర్రెపిల్లను యాజకుడు వధించాలి. అపరాధ పరిహారార్థ బలి రక్తంలో కొంచెం యాజకుడు తీసుకోవాలి. పవిత్రం చేయబడాల్సిన వ్యక్తి కుడి చెవి కొనమీద ఈ రక్తంలో కొంచెం యాజకుడు పోయాలి. ఈ వ్యక్తి కుడి చేతి బొటనవేలిమీద, కుడి పాదం బొటనవేలిమీద యాజకుడు ఈ రక్తం కొంచెం పోయాలి.
LEV 14:26 ఈ నూనెలో కూడ కొంచెం అతని ఎడమ చేతిలో యాజకుడు పోయాలి.
LEV 14:27 యాజకుడు తన కుడిచేతి వేలిని ప్రయోగించి తన ఎడమ చేతిలోని నూనె కొంచెం తీసి యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరించాలి.
LEV 14:28 తర్వాత యాజకుడు తన చేతిలోని నూనె కొంచెం తీసి పవిత్రం కావాల్సిన వ్యక్తి కుడి చెవి కొనమీద వేయాలి. ఆ వ్యక్తి కుడి చేతి బొటన వేలి మీద, కుడి పాదం బొటన వేలిమీద యాజకుడు ఈ నూనెను కొంచెం వేయాలి. అపరాధ పరిహారార్థబలి రక్త స్థానంలో యాజకుడు ఈ నూనె కొంచెం వేయాలి.
LEV 14:29 యాజకుడు తన చేతిలో మిగిలిపోయిన నూనెను, పవిత్రం కావాల్సిన వాని తల మీద పోయాలి. ఈ విధంగా యెహోవా ఎదుట ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచివేస్తాడు.
LEV 14:30 “అప్పుడు ఆ వ్యక్తి ఒక గువ్వ లేక పావురపు పిల్లలలో ఒకదానిని అర్పించాలి. (పేదవారు కూడా ఆ పక్షులను ఇవ్వగలరు, ఆ వ్యక్తి ఇవ్వగలిగిందే ఇవ్వాలి).
LEV 14:31 ఒక పక్షిని పాప పరిహారార్థబలిగాను మరొక దాన్ని దహనబలిగాను ఆ వ్యక్తి అర్పించాలి. అతడు వాటిని ధాన్యార్పణతో బాటు అర్పించాలి. “ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపాలను యెహోవా ఎదుట తుడిచి వేస్తాడు. మరియు ఆ వ్యక్తి పవిత్రం అవుతాడు.”
LEV 14:32 ఒక వ్యక్తి చర్మ వ్యాధినుండి బాగు పడిన తర్వాత అతణ్ణి పవిత్రం చేయటానికి అవీ నియమాలు. “పవిత్రం అయ్యేందుకు నియమం ప్రకారం బలులు అర్పించలేని ప్రజలకు అవీ నియమాలు.”
LEV 14:33 మోషే, అహరోనులతో యెహోవా ఇంకా ఇలా అన్నాడు:
LEV 14:34 “కనాను దేశాన్ని నేను నీ ప్రజలకు ఇస్తున్నాను. నీ ప్రజలు ఆ దేశం చేరుతారు. ఆ సమయంలో ఎవరి యింట్లోనైనా నేను కుష్ఠుపొడను పెరగనీయవచ్చు.
LEV 14:35 ఆ యింటి స్వంతదారుడు యాజకుని దగ్గరకు వచ్చి, ‘కుష్ఠుపొడలాంటిది ఏదో నాయింట్లో కనిపిస్తుంది’, అనిచెప్పాలి.
LEV 14:36 “అప్పుడు యాజకుడు ఆ ఇంటి వారిని ఇల్లు ఖాళీచేయమని ఆజ్ఞాపించాలి.” యాజకుడు కుష్ఠుపొడను చూడటానికి వెళ్లక ముందే వారు ఇల్లు ఖాళీచేయాలి. ఈ విధంగా ఆ ఇంట్లోని అపవిత్రమైన వాటన్నింటినీ యాజకుడు కాపాడవలసిన పనిలేదు. ఆ మనుష్యులు ఇల్లు ఖాళీచేసిన తర్వాత, ఆ ఇంటిని చూడటానికి యాజకుడు లోనికి వెళ్లాలి.
LEV 14:37 యాజకుడు కుష్ఠుపొడను పరిశీలించాలి. ఆ ఇంటి గోడలమీద పొడకు పచ్చటి లేక ఎర్రటి రంధ్రాలు ఉండి, ఆ పొడ గోడల ఉపరితలంలో చొచ్చుకు పోతున్నట్లు కనబడితే,
LEV 14:38 యాజకుడు ఆ ఇంటినుండి బయటకు వెళ్లిపోయి ఏడు రోజులవరకు ఆ ఇంటికి తాళంవేయాలి.
LEV 14:39 “ఏడో రోజున యాజకుడు తిరిగి వచ్చి ఆ ఇంటిని పరిశీలించాలి.” ఆ పొడ ఇంటి గోడలమీద వ్యాపించి ఉంటే,
LEV 14:40 పొడ ఉన్న రాళ్లను లాగి పారవేయమని యాజకుడు ఆ ప్రజలకు ఆజ్ఞాపించాలి. పట్టణం బయట ప్రత్యేకమైన ఒక అపవిత్ర స్థలంలో వారు ఆ రాళ్లను వేయాలి.
LEV 14:41 అప్పుడు యాజకుడు ఆ ఇంటిలోపల అంతా గీకించాలి. అలా గీకిన పెచ్చులను వారు పారవేయాలి. పట్టణం బయట ప్రత్యేకమైన ఒక అపవిత్ర స్థలంలో ఆ పెచ్చులను వారు వేయాలి.
LEV 14:42 అప్పుడు ఆ వ్యక్తి ఆ ఇంటికి కొత్త రాళ్లు పెట్టాలి. అతడు ఆ రాళ్లకు కొత్త అడుసు పూయించాలి.
LEV 14:43 “ఒకవేళ ఒకడు పాతరాళ్లను, పాత పెచ్చులను తీసివేసి, కొత్తరాళ్లు, కొత్త అడుసు పెట్టి ఉండొచ్చు. ఒకవేళ ఆ ఇంటిలో మరల పొడ కనబడవచ్చును.
LEV 14:44 అప్పుడు యాజకుడు లోనికి వచ్చి ఇంటిని పరిశీలించాలి. ఆ పొడ ఇంటిలో వ్యాపించి ఉంటే, అది త్వరగా యితర స్థలాలకు గూడా వ్యాపించే వ్యాధి. అందుచేత ఆ యిల్లు అపవిత్రము.
LEV 14:45 ఆ వ్యక్తి ఆ ఇంటిని కూలగొట్టాలి. ఆ రాళ్లను, పెచ్చులను, చెక్కముక్కలను పట్టణం వెలుపల అపవిత్రమైన ప్రత్యేక స్థలానికి తీసుకొని పోవాలి.
LEV 14:46 ఆ ఇంట్లోకి వెళ్లే ఏ వ్యక్తి అయినాసరే సాయంత్రం వరకు అపవిత్రమవుతాడు.
LEV 14:47 ఎవరైనా ఆ ఇంటిలో భోజనంచేసినా, పండుకొన్నా ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి.
LEV 14:48 “ఆ ఇంట్లో కొత్త అడుసుతో కొత్త రాళ్లు వేసిన తర్వాత యాజకుడు ఆ ఇంటిని పరిశీలించాలి. ఒకవేళ ఆ పొడ ఇంటిలో వ్యాపించకపోతే ఆ ఇల్లు పవిత్రం అని యాజకుడు ప్రకటించాలి. ఎందుచేతనంటే ఆ పొడ పోయింది గనుక!
LEV 14:49 “అప్పుడు ఆ ఇంటిని పవిత్రం చేయటానికి యాజకుడు రెండు పక్షులను, దేవదారు చెక్క ముక్కను, ఒక ఎర్ర గుడ్డ ముక్కను, ఒక హిస్సోపు రెమ్మను తీసుకోవాలి.
LEV 14:50 పారుతున్న నీళ్లలో ఒక మట్టి పాత్రలో యాజకుడు ఒక పక్షిని వధించాలి.
LEV 14:51 తరువాత యాజకుడు దేవదారు చెక్క ముక్కను, హిస్సోపును, ఎర్రగుడ్డ ముక్కను, ప్రాణంతో ఉన్న పక్షిని తీసుకోవాలి. పారుతున్న నీళ్లలో వధించబడిన పక్షి రక్తంలో యాజకుడు వీటన్నింటినీ ముంచాలి. అప్పుడు యాజకుడు ఆ రక్తన్ని ఇంటిమీద ఏడు సార్లు చిలకరించాలి.
LEV 14:52 ఈ విధంగా యాజకుడు ఆ యింటిని పవిత్రం చేయటానికి వీటిని ఉపయోగించాలి.
LEV 14:53 యాజకుడు పట్టణం వెలుపలి బయలు ప్రదేశానికి వెళ్లి, బతికి ఉన్న పక్షిని అక్కడ స్వేచ్ఛగా విడిచిపెట్టాలి. ఈ విధంగా యాజకుడు ఆ యింటిని పవిత్రం చేయాలి. ఆ ఇల్లు పవిత్రం అవుతుంది.”
LEV 14:54 ఏ విధమైన కుష్ఠువ్యాధికి,
LEV 14:55 బట్టమీద లేక ఇంటి మీద కుష్ఠు పొడకు సంబంధించిన నియమాలు అవి.
LEV 14:56 చర్మంమీద వాపులు, దద్దురులు, నిగనిగలాడే మచ్చలకు అవి నియమాలు.
LEV 14:57 వస్తువులు పవిత్రంగా ఉన్నది లేనిదీ ఆ నియమాలు నేర్పిస్తాయి. అలాంటి వ్యాధులకు సంబంధించిన నియమాలు అవి.
LEV 15:1 మోషే, అహరోనులతో యెహోవా యింకా యిలా చెప్పాడు:
LEV 15:2 “ఇశ్రాయేలు ప్రజలకు మీరిలా చెప్పండి: ఎవని దేహంలోనైనా స్రావం ఉంటేవాడు అపవిత్రుడు.
LEV 15:3 వాని శరీరంలోనుండి స్రావం కారుతున్నా లేక నిలిచిపోయినా సరే ఫర్వాలేదు.
LEV 15:4 “స్రావం ఉన్న వ్యక్తి పరుపుమీద పండుకొంటే, ఆ పరుపు అపవిత్రం. ఆ వ్యక్తి కూర్చొనేవన్నీ అపవిత్రం అవుతాయి.
LEV 15:5 ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఈ వ్యక్తి పరుపును తాకితే అతడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానంచేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.
LEV 15:6 ఇంకా స్రావంగల వాడు కూర్చున్న దేనిమీ దనైనా సరే కూర్చున్న ఏ వ్యక్తిగాని తన బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.
LEV 15:7 అలానే స్రావంఉన్న వ్యక్తిని తాకిన ఏ వ్యక్తిగాని తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రం వరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.
LEV 15:8 స్రావంగల వాడు ఒక పవిత్రునిమీద ఉమ్మివేస్తే, ఈ పవిత్రుడు తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. ఈ వ్యక్తి సాయంత్రంవరకు అపవిత్రుడుగా ఉంటాడు.
LEV 15:9 స్రావంగల వ్యక్తి కూర్చొని స్వారీ చేసిన ప్రతి ఆసనం అపవిత్రం అవుతుంది.
LEV 15:10 కనుక స్రావంగలవాని కింద ఉన్న దేనినైనా తాకిన ప్రతి ఒక్కరూ సాయంత్రంవరకు అపవిత్రంగా వుంటారు. స్రావంగల వాని కింద ఉండే వస్తువులను మోసిన వ్యక్తి తన బట్టలు ఉదుకుకొని, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.
LEV 15:11 ఒకవేళ స్రావంగల వ్యక్తి నీళ్లతో తన చేతులు కడుగుకోకుండా మరొక వ్యక్తిని తాకవచ్చును. అప్పుడు అవతల వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.
LEV 15:12 “అయితే స్రావంగల వ్యక్తి ఒక మట్టి పాత్రను తాకితే ఆ పాత్రను పగులగొట్టివేయాలి. స్రావంగల ఈ వ్యక్తి గనుక ఒక చెక్క పాత్రను తాకితే, ఆ పాత్రను నీళ్లతో కడగాలి.
LEV 15:13 “స్రావంగల వాడు తన స్రావం నుండి పవిత్రునిగా చేయబడితే అతడు తన శుద్ధికోసం తానే ఏడు రోజులు లెక్కబెట్టుకోవాలి. అప్పుడు అతడు పారుతున్న నీటిలో తన బట్టలు ఉతుక్కొని, స్నానం చేయాలి. అతడు పవిత్రుడు అవుతాడు.
LEV 15:14 ఎనిమిదో రోజున రెండు గువ్వలను గాని రెండు పావురపు పిల్లలనుగాని ఆ వ్యక్తి తనకోసం తీసుకొని వెళ్లాలి. సన్నిధి గుడారద్వారం దగ్గర యెహోవా ఎదుటికి అతడు రావాలి. ఆ వ్యక్తి రెండు పక్షులను యాజకునికి యివ్వాలి.
LEV 15:15 ఒక పక్షిని పాప పరిహారార్థ బలిగాను, మరో పక్షిని దహనబలిగాను యాజకుడు అర్పించాలి. కనుక యాజకుడు ఆ వ్యక్తిని యెహోవాకు పవిత్రునిగా చేస్తాడు.
LEV 15:16 “ఒకనికి వీర్యస్ఖలనం అవుతోంటే అతడు నీళ్లలో పూర్తిగా స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రంగా ఉంటాడు.
LEV 15:17 ఒకవేళ ఏ బట్టమీద గాని తోలుమీదగాని వీర్యం పడితే, ఆ బట్టను లేక తోలును నీళ్లలో కడగాలి. సాయంత్రంవరకు అది అపవిత్రంగా ఉంటుంది.
LEV 15:18 ఒకవేళ ఒక పురుషుడు ఒక స్త్రీతో శయనించగా వీర్యస్ఖలనమైనప్పుడు ఆ స్త్రీ పురుషులు ఇద్దరూ నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు.
LEV 15:19 “ఒక స్త్రీకి తన నెలసరి రక్తస్రావంనుండి స్రావంతో ఉంటే, ఆమె ఏడు రోజులు అపవిత్రంగా ఉంటుంది. ఎవరైనా ఆమెను తాకితే వారు ఆ రోజు సాయంత్రంవరకు అపవిత్రంగా ఉంటారు.
LEV 15:20 మరియు ఆ స్త్రీ తన నెలసరి రక్తస్రావ సమయంలో పండు కొనేవన్నీ అపవిత్రం అవుతాయి. ఆ సమయంలో ఆమె కూర్చొనేవన్నీ అపవిత్రం అవుతాయి.
LEV 15:21 ఎవరైనా ఆ స్త్రీ పడకను తాకినట్టుయితే ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. సాయంత్రం వరకు ఆ వ్యక్తి అపవిత్రుడు.
LEV 15:22 ఒకవేళ ఎవరైనా ఆమె కూర్చున్న దేనినైనా తాకితే. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. సాయంత్రం వరకు ఆ వ్యక్తి అపవిత్రం.
LEV 15:23 ఒకవ్యక్తి ఆమె పడకను తాకినా, లేక ఆమె కూర్చున్న దేనినైనా తాకినా, ఆ వ్యక్తి ఆ సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు.
LEV 15:24 “మరియు ఒక స్త్రీ నెలసరి రక్తస్రావ సమయంలో ఒక పురుషుడు ఆమెతో లైంగిక పొందు అనుభవిస్తే, ఆ పురుషుడు ఏడురోజులపాటు అపవిత్రంగా ఉంటాడు. ఆ పురుషుడు పండుకొనే ప్రతి పడకా అపవిత్రం అవుతుంది.
LEV 15:25 “ఒక స్త్రీకి నెలసరి రక్తస్రావ సమయంలో గాక, ఆ తర్వాత ఆమెకు రక్తం చాల రోజుల వరకు స్రవిస్తే, అలా రక్తం స్రవించినన్నాళ్లూ, నెలసరి రక్తస్రావంలో వలెనే ఆమె అపవిత్రంగా ఉంటుంది.
LEV 15:26 రక్త స్రావ సమయమంతటిలో ఆ స్త్రీ ఏ పడకమీద పరుండినా సరే, ఆమె నెలసరి రక్తస్రావ సమయంలో వలెనే ఉంటుంది ఆ పడక. ఆమె కూర్చొనేది ఏదైనా సరే, ఆమె నెలసరి రక్తస్రావ సమయంలో అపవిత్రమైనట్టే అపవిత్రం అవుతుంది.
LEV 15:27 ఆ వస్తువులను ఏ వ్యక్తి తాకితే ఆ వ్యక్తి అపవిత్రం అవుతాడు. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. సాయంత్రంవరకు అతడు అపవిత్రుడవుతాడు.
LEV 15:28 ఆ తర్వాత ఆ స్త్రీ తన స్రావంనుండి పవిత్రం అయిన తర్వాత, ఆమె ఏడు రోజులు లెక్క పెట్టాలి. ఆ తర్వాత ఆమె పవిత్రం అవుతుంది.
LEV 15:29 అప్పుడు ఎనిమిదో రోజున ఆమె రెండు గువ్వలను లేదా రెండు పావురపు పిల్లలను తీసుకొని రావాలి. సన్నిధి గుడార ద్వారం వద్ద యాజకుని దగ్గరకు ఆమె వాటిని తీసుకొని రావాలి.
LEV 15:30 అప్పుడు ఒక పక్షిని పాపపరిహారార్థబలిగాను మరో పక్షిని దహనబలిగాను యాజకుడు అర్పించాలి. అలా యాజకుడు యెహోవా ఎదుట ఆమెను పవిత్రం చేయాలి.
LEV 15:31 “అందుచేత ఇశ్రాయేలు ప్రజలు తమ అపవిత్రత విషయంలో వారి అపవిత్రతనుండి ప్రత్యేకించుకోవాల్సిందిగా మీరు హెచ్చరించాలి. మీరు ప్రజలను హెచ్చరించకపోతే, అప్పుడు వారు నా పవిత్ర గుడారాన్ని అపవిత్రం చేస్తారు. అప్పుడు వాళ్లు చావాల్సిఉంటుంది!”
LEV 15:32 స్రావంగల వారి విషయంలో అవి నియమాలు. వీర్యస్ఖలనం వలన అపవిత్రులైన పురుషులను గూర్చిన నియమాలు అవి.
LEV 15:33 మరియు నెలసరి రక్తస్రావం మూలంగా అపవిత్రమైన స్త్రీలకు అవి నియమాలు. అపవిత్రమైన స్త్రీతో శయనించి అపవిత్రమైన ఏ వ్యక్తికైనా అవి నియమాలు.
LEV 16:1 యెహోవాకు ధూపం వేస్తూ అహరోను ఇద్దరు కుమారులూ చనిపోయారు. అది జరిగిన తర్వాత మోషేతో యెహోవా మాట్లాడాడు.
LEV 16:2 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నీ సోదరుడైన అహరోనుతో మాట్లాడు.” పవిత్ర స్థలంలో తెర వెనుకకు అతడు వెళ్లజాలని కొన్ని ప్రత్యేక సమయాలు ఉన్నాయని అతనితో చెప్పు. ఆ తెర వెనుక గదిలో ఒడంబడిక పెట్టె ఉన్నది. ఆ పవిత్ర పెట్టెమీద కరుణాపీఠం ఉంది. ఆ పెట్టెకు పైగా మేఘంలో నేను ప్రత్యక్ష మవుతాను. అందుచేత యాజకుడు ఎల్లప్పుడూ ఆ గదిలోనికి వెళ్లజాలడు. అతడు ఆ గదిలోనికి వెళ్తే, అతడు మరణించవచ్చు!
LEV 16:3 “ప్రాయశ్చిత్తపు రోజున అహరోను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించక ముందు, పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును అతడు అర్పించాలి.
LEV 16:4 అహరోను నీళ్లతో పూర్తిగా స్నానంచేయాలి. అప్పుడు అహరోను ఈ బట్టలు ధరించాలి. అహరోను పవిత్రమైన చొక్కోధరించాలి. లోపల వేసు కొనే బట్టలు శరీరాన్ని అంటిపెట్టుకొనేవిగా ఉండాలి. మేలురకం దట్టిని నడుంకు కట్టుకోవాలి. మేలురకం బట్టతో తలపాగా చుట్టుకోవాలి. ఇవి పవిత్ర వస్త్రాలు.
LEV 16:5 “మరియు పాపపరిహారార్థ బలికోసం రెండు మగ మేకలను, దహనబలికోసం ఒక పొట్టేలును ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుండి అహరోను తీసుకోవాలి.
LEV 16:6 అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించాలి. ఈ పాపపరిహారార్థ బలి తనకోసమే. అప్పుడు అతనిని, అతని కుటుంబాన్ని పవిత్రంచేసే ఆచారాన్ని అహరోను జరిగించాలి.
LEV 16:7 “తర్వాత, అహరోను ఆ రెండు మేకలను సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని రావాలి.
LEV 16:8 ఆ రెండు మేకలకు అహరోను చీట్లు వేయాలి. ఒకచీటి యెహోవాకు, ఇంకొకటి విడిచిపెట్టే అజాజేలుకు.
LEV 16:9 “అప్పుడు అహరోను చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను యెహోవాకు అర్పించాలి. ఈ మేకను అహరోను పాపపరిహారార్థ బలిగా చేయాలి.
LEV 16:10 అయితే విడిచి పెట్టేందుకు చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను ప్రాణంతోనే యెహోవా ఎదుటికి తీసుకొని రావాలి. దాన్ని పవిత్రం చేసే క్రమాన్ని యాజకుడు జరిగించాలి. తర్వాత ఈ మేక అర్యణంలో విడిచిపెట్టబడాలి.
LEV 16:11 “తర్వాత అహరోను తన కోసం ఒక కోడెదూడను పాపపరిహారార్థ బలిగా అర్పించాలి. తనను, తన కుటుంబాన్ని అహరోను పవిత్రం చేసుకోవాలి. అహరోను అతని కోసమే పాపపరిహారార్థ బలిగా ఆ కోడెదూడను వధించాలి.
LEV 16:12 అప్పుడు యెహోవా సన్నిధిలోని ధూపపీఠంనుండి ధూపార్తి నిండా నిప్పులు తీసుకోవాలి. చూర్ణం చేయబడిన పరిమళ ధూపాన్ని రెండు గుప్పెళ్ల నిండా అహరోను తీసుకోవాలి. తెర వెనుక నున్న గదిలోనికి అహరోను ఆ పరిమళ ధూపాన్ని తీసుకొని రావాలి.
LEV 16:13 యెహోవా సన్నిధిలో అహరోను ఆ ధూపాన్ని నిప్పులు మీద వేయాలి. అప్పుడు ఒడంబడిక పెట్టె మీద ఉన్న కరుణా పీఠాన్ని ఆ ధూపపొగ ఆవరిస్తుంది. ఈ విధంగా చేస్తే అహరోను మరణించడు.
LEV 16:14 అహరోను ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసుకొని, తన వేలితో తూర్పుకు కరుణాపీఠం మీదికి చిలకరించాలి. కరుణాపీఠం ముందర అతడు తన వేలితో ఏడుసార్లు రక్తాన్ని చిలకరించాలి.
LEV 16:15 “తర్వాత అహరోను ప్రజలకోసం పాప పరిహారార్థ బలి మేకను వధించాలి. తెరవెనుక ఉన్న గదిలోనికి ఈ మేక రక్తాన్ని అహరోను తీసుకొని రావాలి. కోడెదూడ రక్తంతో ఏమైతేచేసాడో అలాగే మేక రక్తంతోకూడ అహరోను చేయాలి. కరుణాపీఠం మీద, కరుణాపీఠం ఎదుట ఆ మేక రక్తాన్ని అహరోను చిలకరించాలి.
LEV 16:16 ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రమయిన సందర్భాలెన్నో ఉన్నాయి కనుక ఇశ్రాయేలు ప్రజల పాపాలు, నేరాలనుండి ఆ అతిపరిశుద్ధ స్థలాన్ని పవిత్రం చేసేందుకు జరగాల్సిన ప్రాయశ్చిత్తాన్ని అహరోను చేయాలి. అహరోను ఎందుకు ఇవన్నీ చేయాలి? సన్నిధిగుడారం అపవిత్ర ప్రజల మధ్య ఉంటుందిగనుక.
LEV 16:17 “అతి పరిశుద్ధ స్థలాన్ని అహరోను పవిత్రం చేసే సమయంలో సన్నిధిగుడారంలో ఎవ్వరూ ఉండకూడదు. అహరోను బయటకు వచ్చేంతవరకు ఏ వ్యక్తీ లోకిని వెళ్లకూడదు. కనుక అహరోను తనను, తన కుటుంబాన్ని పవిత్రం చేసుకోవాలి. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి.
LEV 16:18 తర్వాత యెహోవా సన్నిధిలో ఉన్న బలిపీఠం దగ్గరకు అహరోను వెళ్లాలి. అహరోను బలిపీఠాన్ని పవిత్రం చేస్తాడు. కోడెదూడ రక్తంలో కొంచెం, మేక రక్తంలో కొంచెం తీసుకొని బలిపీఠం అన్ని వైపులా ఉన్న దాని కొమ్ములకు అహరోను పూయాలి.
LEV 16:19 తర్వాత అహరోను తన వేలితో కొంత రక్తాన్ని బలి పీఠం మీద ఏడుసార్లు చిలకరించాలి. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నింటి నుండి బలిపీఠాన్ని అహరోను పరిశుద్ధంగా, పవిత్రంగా చేయాలి.
LEV 16:20 “అతి పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని, అహరోను పవిత్రం చేస్తాడు. అలా జరిగిన తర్వాత ఆ మేకను ప్రాణంతోనే యెహోవా సన్నిధికి అహరోను తీసుకొని వస్తాడు.
LEV 16:21 బతికే ఉన్న ఆ మేక తలమీద అహరోను తన రెండు చేతులు ఉంచుతాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పాపాలను, నేరాలను ఆ మేకమీద అహరోను ఒప్పుకొంటాడు. ఈ విధంగా అహరోను ప్రజల పాపాలను మేక నెత్తిమీద మోపుతాడు. అప్పుడు ఆ మేకను అరణ్యంలోకి వదిలి పెట్టేస్తాడు. ఈ మేకను అతను తోలివేయటానికి పక్కనే ఒక మనిషి సిద్ధంగా నిలబడి ఉంటాడు.
LEV 16:22 కనుక ప్రజలందరి పాపాలను ఆ మేక తనమీద మోసుకొని ఖాళీ అరణ్యంలోనికి తీసుకొనిపోతుంది. ఆ మేకను తోలు కొనిపోయిన వాడు అరణ్యంలో దానిని విడిచి పెట్టివేయాలి.
LEV 16:23 “అప్పుడు అహరోను సన్నిధి గుడారంలో ప్రవేశించాలి. పవిత్రస్థలంలోనికి వెళ్లినప్పుడు తాను ధరించిన వస్త్రాలను అతడు తీసివేయాలి. వాటిని అక్కడే వదిలివేయాలి.
LEV 16:24 ఒక పవిత్ర స్థలంలో అతడు నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు తన ఇతర ప్రత్యేక వస్త్రాలు ధరించాలి. అతడు బయటకు వచ్చి తనకోసం దహన బలిని, ప్రజలకోసం దహనబలిని అర్పించాలి. అతని కోసం, ప్రజలకోసం అతడు తనను పవిత్రంచేసుకోవాలి.
LEV 16:25 అప్పుడు పాపపరిహారార్థ బలి పశువు యొక్క కొవ్వును అతడు బలిపీఠం మీద దహించాలి.
LEV 16:26 “విడిచిపెట్టే మేకను అరణ్యంలో విడిచి పెట్టిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును.
LEV 16:27 “పాపపరిహారార్థ బలిపశువులైన కోడెదూడను, మేకలను బస వెలుపలికి తీసుకొనిపోవాలి. ఈ జంతువుల రక్తం పవిత్ర వస్తువులను పవిత్రం చేసేందుకు పవిత్ర స్థలానికి తీసుకొని రాబడింది. ఆ జంతువుల చర్మాలను శవాలను, వాటి మలమును యాజకులు అగ్నితో కాల్చివేయాలి.
LEV 16:28 తర్వాత వాటిని కాల్చిన వ్యక్తి తన వస్త్రాలను ఉతుక్కొని, నీళ్లలో స్నానంచేయాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును.
LEV 16:29 “ఆ ఆజ్ఞ మీకు శాశ్వతంగా ఉంటుంది. ఏడవ నెల పదో రోజున మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మీరేమీపని చేయకూడదు. మీ మధ్య నివసిస్తున్న విదేశీ యాత్రికులు ఎవరూ పని చేయకూడదు.
LEV 16:30 ఎందుచేతనంటే ఆ రోజు యాజకుడు మిమ్మల్ని పవిత్రంచేసి, మీ పాపాలను కడిగివేస్తాడు. అప్పుడు మీరు యెహోవాకు పవిత్రం చేయబడిన వారవుతారు.
LEV 16:31 ఇది మీకు చాల ముఖ్యమైన విశ్రాంతి రోజు. మీరు భోజనం చేయకూడదు. ఈ ఆజ్ఞ ఎప్పటికీ కొన సాగుతుంది.
LEV 16:32 “కనుక నియమించబడిన ప్రధాన యాజకుడు, అంటే యాజకత్వం చేసేందుకు నియమించబడ్డ మనిషి. అతడు అన్నింటినీ పవిత్రం చేసే కార్యక్రమాన్ని జరిగిస్తాడు. ఆ యాజకుడు పవిత్ర నార వస్త్రాలు ధరించాలి.
LEV 16:33 అతి పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని అతడు పవిత్రం చేయాలి. యాజకులను, ఇశ్రాయేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి.
LEV 16:34 ఇశ్రాయేలు ప్రజలను పవిత్రం చేసేందుకు ఇవ్వబడ్డ ఆ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరంలో ఒక సారి మీరు వాటిని జరిగించాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల పాపాల మూలంగా వీటిని చేయవలెను.” కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నింటినీ వారు జరిగించారు.
LEV 17:1 మోషేతో యెహోవా చెప్పాడు:
LEV 17:2 “అహరోనుతో, అతని కుమారులతో, ప్రజలందరితో ఇలా చెప్పు.
LEV 17:3 ఇదే యెహోవా ఆజ్ఞ అని వారితో చెప్పు: ఇశ్రాయేలు మనిషి ఒకడు ఒక కోడెదూడను లేక గొర్రెపిల్లను, లేక ఒక మేకను బసలోగాని బస వెలుపలగానీ చంపవచ్చును.
LEV 17:4 ఆ వ్యక్తి ఆ జంతువును సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని రావాలి. ఆ జంతువుయొక్క ఒక భాగాన్ని యెహోవాకు కానుకగా అతడు అర్పించాలి. ఆ వ్యక్తి దాని రక్తాన్ని చిందించాడు. కనుక అతడు తన కానుకను యెహోవా పవిత్ర గుడారానికి తీసుకొని వెళ్లాలి. ఆ జంతువులో ఒక భాగాన్ని యెహోవాకు కానుకగా అతడు తీసుకొని వెళ్లకపోతే, ఆ వ్యక్తి తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి.
LEV 17:5 ప్రజలు వారి సమాధాన బలిని యెహోవాకు అర్పించేందుకే ఈ నియమం. ఇశ్రాయేలు ప్రజలు పొలాల్లో చంపే జంతువులను కూడా తీసుకొని రావాలి. ఆ జంతువులను సన్నిధి గుడార ద్వారం దగ్గర వారు యెహోవాకు అర్పించాలి. ఆ జంతువులను వారు యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి.
LEV 17:6 అప్పుడు ఆ జంతువుల రక్తాన్ని సన్నిధి గుడారం దగ్గర యెహోవా బలిపీఠం మీద యాజకుడు చల్లుతాడు. మరియు ఆ జంతువుల కొవ్వును బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
LEV 17:7 వారు వారి ‘మేక పోతు విగ్రహాలకు’ ఇంక ఎలాంటి బలులూ అర్పించకూడదు. ఆ ఇతర దేవుళ్ళను వారు వెంబడిస్తూ వచ్చారు. అలా వారు వ్యభిచారిణుల్లా ప్రవర్తించారు. ఈ నియమాలు ఎప్పటికీ కొనసాగుతాయి.
LEV 17:8 “ప్రజలతో చెప్పు: ఒక ఇశ్రాయేలు పౌరుడు లేక ఒక యాత్రికుడు, లేక మీ మధ్య నివసిస్తున్న ఒక విదేశీయుడు దహన బలిగాని ప్రాయశ్చిత్త బలిగాని అర్పించవచ్చు.
LEV 17:9 ఆ వ్యక్తి తన బలిని సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని వెళ్లి అక్కడ దానిని యెహోవాకు అర్పించాలి. ఆ వ్యక్తి యిలా చేయకపోతే, అతడు తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి.
LEV 17:10 “రక్తాన్ని తినే వాళ్లకు నేను విరోధిని. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడు కావచ్చు లేక మీ మధ్య నివసించే విదేశీయుడు కావచ్చు. ఆ వ్యక్తిని తన ప్రజల్లోనుంచి నేను వేరు చేస్తాను.
LEV 17:11 ఎందుచేతనంటే దేహానికి ప్రాణం రక్తంలోనే ఉంది. ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించే నియమాలు నేను మీకు ఇచ్చాను. మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకొనేందుకు మీరిలా చేయాలి. మీరు తీసిన ప్రాణానికి విలువ చెల్లింపుగా ఆ రక్తాన్ని మీరు నాకు యివ్వాలి.
LEV 17:12 కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను చెప్పేది ఇదే: మీలో ఎవ్వరూ రక్తం తినవద్దు. మీ మధ్య నివసించే ఏ విదేశీయుడూ రక్తం తినకూడదు.
LEV 17:13 “తినదగిన జంతువును లేక పక్షిని ఎవరైనా పట్టుకొంటే, ఆ వ్యక్తి దాని రక్తాన్ని నేలమీద పోసి మట్టితో కప్పివేయాలి. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడు కావచ్చు లేక మీ మధ్య నివసించే విదేశీయుడు కావచ్చు.
LEV 17:14 మీరెందుకు ఇలా చేయాలి? ఎందుచేతనంటే దాని మాంసంలో ఇంకా రక్తం గనుక ఉంటే, ఆ జంతువు ప్రాణం దాని మాంసంలో ఉంటుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. ఇంకా రక్తంతో ఉన్న మాంసం తినవద్దు. రక్తం తినే ఏవ్యక్తి అయినాసరే తన ప్రజలనుండి వేరు చేయబడాల్సిందే.
LEV 17:15 “మరియు దానంతట అదే చచ్చిన జంతువును తిన్నవాడుగాని, లేక మరో జంతువుచే చంపబడ్డ జంతువును తిన్నవాడుగాని ఆ సాయంత్రం వరకు అపవిత్రుడుగా వుంటాడు. ఆవ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్లతో పూర్తి స్నానం చేయాలి. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడు కావచ్చును, లేక మీ మధ్య నివసిస్తున్న విదేశీయుడు కావచ్చును.
LEV 17:16 ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోక పోయినా, స్నానం చేయకపోయినా అతడు పాపం చేత దోషిగా ఉంటాడు.”
LEV 18:1 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు
LEV 18:2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను యెహోవాను, మీ దేవుణ్ణి.
LEV 18:3 గతంలో మీరు ఈజిప్టులో జీవించారు. ఆ దేశంలో జరిగించిన వాటిని మీరు ఇప్పుడు చేయకూడదు. నేను మిమ్మల్ని కనానుకు నడిపిస్తున్నాను. ఆ ప్రజల ఆచారాలను పాటించవద్దు.
LEV 18:4 మీరు నా నియమాలకు విధేయులై, నా ఆజ్ఞలను పాటించాలి. ఎందుచేతనంటే నేను మీ దేవుడైన యెహోవాను గనుక.
LEV 18:5 అందుచేతనే మీరు నా ఆజ్ఞలను నియమాలను పాటించాలి. నా ఆజ్ఞలకు నియమాలకు విధేయుడయ్యే వ్యక్తి జీవిస్తాడు! నేనే యెహోవాను.
LEV 18:6 “నీ రక్తసంబంధులతో నీవు ఎన్నడూ లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. నేను యెహోవాను.
LEV 18:7 “నీ తండ్రితో, నీ తల్లితో నీవు ఎన్నడూ లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. ఆమె నీ తల్లి, ఆమెతో నీవు లైంగిక సంబంధము కలిగి ఉండకూడదు.
LEV 18:8 నీ తండ్రి యొక్క ఏ భార్యతో check brackets (ఆమె నీ తల్లి కానప్పటికీ) నీవు లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. నీ తండ్రి యొక్క ఏ భార్యతోనైనా నీ తండ్రికి మాత్రమే లైంగిక సంబంధాలు ఉండాలి.
LEV 18:9 “నీ తండ్రి కుమార్తె లేక నీ తల్లి కుమార్తె నీకు సోదరి, ఆమెతో నీకు లైంగిక సంబంధాలు ఉండ కూడదు. నీ సోదరి నీ యింట పుట్టినా, లేక మరోచోట పుట్టినా సరే.
LEV 18:10 “నీ మనుమరాలితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆ పిల్లలు నీలో ఒక భాగం.
LEV 18:11 “నీ తండ్రికి తల్లికి ఒక కుమార్తె ఉంటే, ఆమె నీ సోదరి. ఆమెతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు.
LEV 18:12 “నీ తండ్రి సోదరితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ తండ్రి రక్త సంబంధీకురాలు.
LEV 18:13 నీ తల్లి సోదరితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ తల్లి రక్తసంబంధీకురాలు.
LEV 18:14 నీ తండ్రి సోదరుని భార్యతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. అనగా నీ పినతండ్రి భార్యతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ పినతల్లి.
LEV 18:15 “నీ కోడలితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ కుమారుని భార్య. ఆమెతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు.
LEV 18:16 “నీ సోదరుని భార్యతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. నీ సోదరుడు మాత్రమే తన భార్యతో లైంగిక సంబంధాలు కలిగి ఉండాలి.
LEV 18:17 “తల్లి, కూతుళ్లతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆ తల్లి మనుమరాలితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఈ మనుమరాలు ఆ తల్లి కుమారుని బిడ్డ కావచ్చు, కుమార్తె బిడ్డ కావచ్చు. ఆమె మనుమరాళ్లు ఆమె రక్తసంబంధీకులు. వారితో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం తప్పు.
LEV 18:18 “నీ భార్య బతికి ఉండగా, ఆమె సోదరిని నీకు మరో భార్యగా చేసుకోకూడదు. దీని మూలంగా అక్క చెల్లెళ్లు విరోధులవుతారు. నీ భార్య సోదరితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు.
LEV 18:19 “మరియు ఒక స్త్రీకి నెలసరి రక్తస్రావం అవుతున్నప్పుడు, లైంగిక సంబంధాలకోసం నీవు ఆమె చెంతకు పోకూడదు. ఈ సమయంలో ఆమె అపవిత్రంగా ఉంటుంది.
LEV 18:20 “నీ పొరుగువాని భార్యతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. దీని మూలంగా నీవు అపవిత్రం అవుతావు.
LEV 18:21 “మోలెకు కోసం నీ పిల్లల్లో ఎవరినీ అగ్నిగుండం దాటనియ్యకూడదు. ఒకవేళ నీవు అలా చేస్తే, నీ దేవుని నామం అంటే నీకు గౌరవం లేదని నీవు చూపించినట్టే, నేనే యెహోవాను.
LEV 18:22 “ఒక స్త్రీతో ఉన్నట్టు పురుషునితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. అది భయంకర పాపం!
LEV 18:23 “ఏ జంతువుతోను నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. దీని మూలంగా నీవు అపవిత్రం అవుతావు. అలాగే స్త్రీ జంతువుతో లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదు. అది సృష్టి విరుద్ధం!
LEV 18:24 “అలాంటి వాటిలో దేనిమూలంగాను మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. నేను జనాలను వారి దేశాలనుండి వెళ్లగొట్టి, వారి దేశాలను నేను మీకు యిస్తున్నాను. ఎందుచేతనంటే ఆ ప్రజలు ఆ చెడుకార్యాలు చేసారు.
LEV 18:25 కనుక దేశం మైలపడిపోయింది. అలాంటి కార్యాలతో ఇప్పుడు దేశం రోగభూయిష్టమయింది. మరియు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం ఇప్పుడు వెళ్లగొడుతుంది!
LEV 18:26 “కనుక మీరు నా ఆజ్ఞలకు, నియమాలకు విధేయులు కావాలి. ఆ భయంకర పాపాలు ఏవీ మీరు చేయకూడదు. ఇశ్రాయేలు పౌరులకు, మీ మధ్య నివసించే ప్రజలకు నియమాలు యివి.
LEV 18:27 ఆ దేశంలో మీకు ముందు నివసించిన ప్రజలు ఆ భయంకర సంగతులన్నీ జరిగించారు. అందుచేత దేశం మైలపడింది.
LEV 18:28 మీరూ ఈ పనులు చేస్తే, మీరూ ఆ దేశాన్ని మైల చేస్తారు. మరియు మీకంటె ముందు అక్కడ ఉన్న వాళ్ళను వెళ్ళగొట్టినట్లు అది మిమ్మల్ని కూడ వెళ్ళగొడుతుంది.
LEV 18:29 ఏ వ్యక్తి గాని ఈ దారుణ పాపాలలో దేనినైనా జరిగిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి.
LEV 18:30 ఇతరులు ఆ భయంకర పాపాలు చేశారు. కాని మీరు మాత్రం నా ఆజ్ఞలకు విధేయులు కావాలి. ఆ భయంకర పాపాలేవీ మీరు చేయకూడదు. ఆ భయంకర పాపాలతో మిమ్మల్ని మీరు మైల చేసుకోవద్దు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”
LEV 19:1 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
LEV 19:2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీ దేవుడైన యెహోవాను నేను పవిత్రుణ్ణి కనుక మీరునూ పవిత్రంగా ఉండాలి!
LEV 19:3 “మీలో ప్రతి ఒక్కరూ తన తల్లిని, తండ్రిని గౌరవించాలి, నా ప్రత్యేక విశ్రాంతి దినాలను పాటించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.
LEV 19:4 “విగ్రహాలను పూజించకండి. మీకోసం అచ్చు వేసిన విగ్రహ దేవతలను చేసుకోవద్దు. నేనే మీ దేవుడైన యెహోవాను.
LEV 19:5 “మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించేటప్పుడు, మీరు స్వీకరించబడేందుకు దానిని అర్పించాలి.
LEV 19:6 మీరు దాన్ని అర్పించిన రోజున, ఆ మరునాడు దాన్ని తినవచ్చును. కానీ ఆ బలిలో ఏమైనా మూడో నాటికి మిగిలి ఉంటే దాన్ని మీరు అగ్నితో కాల్చివేయాలి.
LEV 19:7 బలిలోనిది ఏదైనా మూడో రోజున తింటే అది దారుణ పాపం. అది స్వీకరించబడదు.
LEV 19:8 అలా చేసే వ్యక్తి పాపం చేసిన అపరాధి అవుతాడు. ఎందు చేతనంటే యెహోవాకు చెందిన పవిత్ర విషయాలను అతడు గౌరవించలేదు కనుక ఆ వ్యక్తి తన ప్రజల్లోనుంచి వేరు చేయబడాలి.
LEV 19:9 “కోతకాలంలో మీరు మీ పంటకోసేప్పుడు, మొత్తం మీ పొలాల మూలవరకు కోసెయ్యకండి. ఒకవేళ గింజలు ఏమైనా నేలమీద పడితే ఆ గింజలు మీరు ఏరుకోగూడదు.
LEV 19:10 మీ ద్రాక్షా తోటల్లో ద్రాక్షాపండ్లన్నీ ఏరుకోవద్దు. నేలమీద పడిన ద్రాక్షపండ్లను ఏరుకోవద్దు. ఎందుచేతనంటే, పేదవాళ్ళ కోసం, మీ దేశంగుండా ప్రయాణం చేసే వాళ్ళకోసమూ మీరు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడైన యెహోవాను.
LEV 19:11 “మీరు దొంగతనం చేయకూడదు. మీరు ప్రజల్ని మోసం చేయకూడదు. మీరు ఒకరితో ఒకరు అబద్ధం చెప్పకూడదు.
LEV 19:12 నా నామాన్ని ప్రయోగించి దొంగ వాగ్దానాలు చేయకూడదు. మీరు అలా చేస్తే, మీ దేవుని పేరుమీద మీకు భక్తి లేదని మీరు వ్యక్తంచేస్తారు. నేను యెహోవాను.
LEV 19:13 “మీ పొరుగువారికి మీరు కీడు చేయకూడదు. మీరు అతని దగ్గర దోచు కోగూడదు. కూలివాని కూలి మర్నాటి ఉదయం వరకు మీరు బిగబట్టి ఉంచకూడదు.
LEV 19:14 “మీరు చెవిటివారిని శపించకూడదు. గుడ్డివారి యెదుట ఏదీ అడ్డముంచి వారిని పడిపోయే విధంగా చేయకూడదు. కాని నీవు దేవునికి భయపడాలి. నేను యెహోవాను.
LEV 19:15 “తీర్పు విషయంలో మీరు న్యాయంగా ఉండాలి. పేదవాళ్ళని చెప్పి ప్రత్యేకంగా పక్షపాతం చూపెట్టకూడదు. ప్రముఖులనీ పక్షపాతం చూపెట్ట కూడదు. మీ పొరుగు వారికి తీర్పు చెప్పేటప్పుడు మీరు న్యాయంగా ఉండాలి.
LEV 19:16 మీరు ఇతరులను గూర్చి తప్పడు కథలు వ్యాపింపజేస్తూ తిరగకూడదు. నీ పొరుగువాని ప్రాణానికి అపాయం కలిగించేది ఏదీ చేయవద్దు. నేను యెహోవాను.
LEV 19:17 “నీ సోదరుణ్ణి నీ హృదయంలో కూడా నీవు ద్యేషించకూడదు. ఒకవేళ నీ పొరుగువాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని గూర్చి అతనితో మాట్లాడు. అయితే అతణ్ణి క్షమించు.
LEV 19:18 మనుష్యులు నీకు చేసిన కీడును మరచిపో. వారికి తిరిగి కీడు చేయాలని ప్రయత్నించకు. నిన్ను నీవు ప్రేమించుకొన్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు. నేను యెహోవాను.
LEV 19:19 “నా ఆజ్ఞలకు నీవు విధేయత చూపాలి. రెండురకాల పశువులను కలిసి సంతానోత్సత్తి చేయకూడదు. రెండు రకాల విత్తనాలు నీ పొలంలో నీవు చల్లకూడదు. రెండు రకాల మిశ్రమ దారాలతో నేయబడిన బట్టలు నీవు తొడగకూడదు.
LEV 19:20 “మరొకని బానిస స్త్రీతో ఒకడు లైంగిక సంబంధాలు పెట్టుకోవటం సంభవించవచ్చు. అయితే ఈ బానిస స్త్రీ డబ్బుతో ఖరీదు చేయబడలేదు, లేక స్వతంత్రమూ పొందలేదు. ఇలా గనుక జరిగితే వారికి శిక్ష విధించాలి. కానీ వారికి మరణ శిక్ష లేదు. ఎందుచేతనంటే ఆ స్త్రీ స్వతంత్రురాలు కాదు.
LEV 19:21 ఆ మగవాడు సన్నిధి గుడార ద్వారం దగ్గరకు అపరాధ పరిహారార్థ బలి అర్పణను తీసుకొని రావాలి. అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపొట్టేలును అతడు తీసుకొని రావాలి.
LEV 19:22 అతణ్ణి పవిత్రం చేసే కార్యాన్ని యాజకుడు జరిగిస్తాడు. ఆ పొట్టేలును అతడు చేసిన పాపం కోసం అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా ఎదుట యాజకుడు అర్పించాలి. అప్పుడు అతడు చేసిన పాపం విషయంలో అతడు క్షమాపణ పొందుతాడు.
LEV 19:23 “ముందుకు మీరు మీ దేశంలో ప్రవేశిస్తారు. ఆ సమయంలో ఆహారంకోసం మీరు ఎన్నో రకాల చెట్లు నాటుతారు. ఒక చెట్టును నాటిన తర్వాత మూడు సంవత్సరాలవరకు ఆ చెట్టు ఫలం ఏదీ మీరు తినకూడదు. ఆ ఫలాన్ని మీరు ఉపయోగించకూడదు.
LEV 19:24 నాలుగో సంవత్సరం ఆ చెట్టు ఫలం యెహోవాదే అవుతుంది. అది యెహోవాకు పవిత్ర స్తుతి అర్పణ.
LEV 19:25 అప్పుడు అయిదో సంవత్సరం ఆ చెట్టు ఫలం మీరు తినవచ్చు. మరియు ఆ చెట్టు మీకు విస్తార ఫలాన్ని యిస్తుంది. నేను మీ దేవుడైన యెహోవాను.
LEV 19:26 “ఇంకా, రక్తం ఉన్నది. ఏదీ మీరు తినకూడదు. “భవిష్యత్తుగూర్చి ముందుగా చెప్పటానికి మంత్ర తంత్రాలు ఏవీ మీరు ఉపయోగించకూడదు.
LEV 19:27 “మీ తల చుట్టూ పెరిగే వెంట్రుకలను గుండ్రంగా క్షౌరం చేయకూడదు. మీ గడ్డం కొనలు కత్తిరించి వేయకూడదు.
LEV 19:28 చనిపోయిన వాళ్ల జ్ఞాపకార్థం మీరు మీ దేహాలను కోసుకోగూడదు. మీరు మీ ఒంటి మీద పచ్చలు పొడిపించుకోగూడదు. నేను మీ దేవుడైన యోహోవాను.
LEV 19:29 “మీ కుమార్తెను వేశ్యగా మార్చవద్దు. అలా చేయటం ఆమెపై మీకు గౌరవం లేదని వ్యక్తం చేస్తుంది. మీ దేశంలో ప్రజల్ని వేశ్యలు కానీయవద్దు. అలాంటి పాపంతో మీ దేశాన్ని నిండనీయవద్దు.
LEV 19:30 “నా ప్రత్యేక విశ్రాంతి దినాల్లో మీరు పని చేయకూడదు. నా పవిత్రస్థలాన్ని మీరు ఘనంగా చూడాలి. నేను యెహోవాను.
LEV 19:31 “సలహాకోసం కర్ణపిశాచులు, సోదెగాళ్ల దగ్గరకు వెళ్లకూడదు. వాళ్ల దగ్గరకు వెళ్ళొద్దు, వారు మిమ్మల్ని అపవిత్రం చేస్తారు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.
LEV 19:32 “వృద్ధులను గౌరవించండి. వారు గదిలోనికి వచ్చినప్పుడు లేచి నిలబడండి. మీ దేవునికి గౌరవం చూపెట్టండి. నేను యోహోవాను.
LEV 19:33 “మీ దేశంలో నివసిస్తున్న విదేశీయులకు కీడు చేయకండి.
LEV 19:34 మీ స్వంత పౌరులను గౌరవించినట్టే, విదేశీయుల్ని కూడా మీరు గౌరవించాలి. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకొంటారో విదేశీయుల్ని కూడా అలా ప్రేమించాలి. ఎందుచేతనంటే ఒకప్పుడు మీరూ ఈజిప్టులో విదేశీయులే. నేను మీ దేవుడైన యెహోవాను.
LEV 19:35 “ప్రజలు తీర్పు తీర్చేటప్పుడు మీరు న్యాయంగా ఉండాలి. అలానే వస్తువుల్ని తూచేటప్పుడు, కొలిచేటప్పుడ మీరు న్యాయంగా ఉండాలి.
LEV 19:36 మీ తక్కెడలు సమానంగా ఉండాలి. మీ మొగ్గులు ద్రావకాలను సరిగ్గా నింపేవిగా ఉండాలి. మీ త్రాసులు, తూనికరాళ్లు వస్తువుల్ని సరిగ్గా తూచేవిగా ఉండాలి. నేను మీ దేవుడైన యెహోవాను. నేనే మిమ్మన్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొనివచ్చాను!
LEV 19:37 “నా ఆజ్ఞలు, నియమాలు అన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటికి మీరు విధేయులు కావాలి. నేను యెహోవాను!”
LEV 20:1 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
LEV 20:2 “ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు కూడా నీవు చెప్పాలి: మీ దేశంలో ఒక వ్యక్తి తన పిల్లలలో ఒకరిని దొంగదేవత మోలెకునకు అర్పించడం జరగవచ్చు, అప్పుడు ఆ వ్యక్తిని చంపెయ్యాలి. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడైనా నా ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీయుడైనా సరే, ఆ వ్యక్తిమీద మీరు రాళ్లు విసిరి చంపివేయాలి.
LEV 20:3 నేను ఆ వ్యక్తికి విముఖుడ్ని. అతణ్ణి అతని ప్రజల్లోనుంచి నేను వేరుచేస్తాను. ఎందుచేతనంటే అతడు తన పిల్లల్ని మోలెకునకు ఇచ్చాడు. నా పవిత్ర నామం అంటే అతనికి గౌరవం లేదని అతడు వ్యక్తం చేసాడు. నా పవిత్ర స్థలాన్ని అతడు అపవిత్రం చేసాడు.
LEV 20:4 ఒకవేళ సామాన్యులు అతణ్ణి పట్టించుకోక పోవచ్చు, ఒకవేళ తన పిల్లల్ని మోలెకునకు అర్పించినవాణ్ణి వారు పట్టించు కొనక పోవచ్చును,
LEV 20:5 కానీ నేను మాత్రం అతనికి, అతని కుటుంబానికి విరోధంగా ఉంటాను. అతణ్ణి తన ప్రజల్లోనుంచి నేను వేరుచేసేస్తాను. నాకు అపనమ్మకంగా ఉండి, మోలెకును వెంబడించే ఏ వ్యక్తినైనా సరే నేను వేరు చేసేస్తాను.
LEV 20:6 “సలహాకోసం కర్ణపిశాచుల దగ్గరకు, సోదె చెప్పేవారి దగ్గరకు వెళ్ళే ఏ వ్యక్తికైనా సరే నేను విరోధంగా ఉంటాను. అలాంటి వ్యక్తి నాకు అపనమ్మకంగా ఉన్నాడు. కనుక అలాంటి వాణ్ణి తన ప్రజల్లోనుంచి నేను వేరు చేసేస్తాను.
LEV 20:7 “ప్రత్యేకంగా ఉండండి. మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. ఎందుచేతనంటే నేను పవిత్రుడను గనుక. నేను యెహోవాను మీ దేవుణ్ణి.
LEV 20:8 నా ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకొని విధేయులుగా ఉండండి. నేను యెహోవాను మరియు నా ప్రత్యేక ప్రజలుగా నేను మిమ్మల్ని చేసాను.
LEV 20:9 “ఏ వ్యక్తిగాని తన తండ్రిని లేక తల్లిని శపించినట్లయితే ఆ వ్యక్తిని చంపేయాలి. అతడు తన తండ్రిని లేక తల్లిని శపించాడు గనుక అతణ్ణి చెంపేయాల్సిందే.
LEV 20:10 “మగవాడు ఒకడు తన పొరుగువాని భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకొంటే ఆ మగవాడు ఆడది ఇద్దరూ వ్యభిచార అపరాధులే. అందుచేత మగవాడు, ఆడది ఇద్దరూ చంపబడాల్సిందే.
LEV 20:11 ఒక మగవాడు తన తండ్రి భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకొంటే ఆ మగవాడు చంపివేయాలి. ఆ మగవాడు, అతని తండ్రి భార్యను, ఇద్దర్నీ చంపివేయాలి. వాడు తన తండ్రికి విరుద్ధంగా పాపం చేసాడు.
LEV 20:12 “ఒక మగవాడు తన కోడలితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే, వాళ్ళిద్దర్నీ చంపివేయాలి. వాళ్లు చాలా దారుణమైన లైంగిక పాపం చేసారు. వాళ్లు శిక్షించబడాల్సిందే.
LEV 20:13 “ఒక మగవాడు ఒక స్త్రీతో కలిగి ఉన్నట్టుగా మరో మగవాడితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే, వీళ్ళిద్దరు మగవాళ్లూ చాలా దారుణ పాపం చేసినట్టే. వాళ్ళను చంపివేయాల్సిందే. వాళ్ళ శిక్షకు వాళ్లే కారకులు.
LEV 20:14 “ఒక మగవాడు ఒక స్త్రీతో, ఆమె తల్లితో కూడా లైంగిక సంబంధాలు కలిగి ఉంటే అది లైంగిక పాపం. ఆ మగవాడ్ని, ఆడవాళ్లు ఇద్దర్నీ ప్రజలు కాల్చి వేయాలి. మీ ప్రజల మధ్య ఇలాంటి లైంగిక పరమైన పాపం జరగనివ్వకండి.
LEV 20:15 “ఒక మగావాడు ఒక జంతువుతో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే అతణ్ణి చంపివేయాల్సిందే. మరియు మీరు ఆ జంతువును గూడ చంపివేయాలి.
LEV 20:16 ఒక స్త్రీ గనుక ఒక జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకొంటే, ఆ స్త్రీని, జంతువును కూడ మీరు చంపివేయాలి. వారిని చంపేయాలి, వాళ్ళ శిక్షకు వాళ్లే కారకులు.
LEV 20:17 “ఒక సోదరుడు అతని సోదరి అనగా తండ్రి కుమార్తెగాని, తల్లి కుమార్తెగాని ఒకరితో ఒకరు లైంగిక సంబంధం పెట్టుకోవటం చాలా సిగ్గుచేటు. వాళ్లను బహిరంగంగా శిక్షించాలి. వాళ్ల ప్రజల్లోనుంచి వాళ్లను వేరు చేయాలి. తన సోదరితో లైంగిక సంబంధం పెట్టుకొన్న మగవాడు అతని పాపం నిమిత్తం శిక్షపొందాలి.
LEV 20:18 “ఒక స్త్రీ నెలసరి రక్తస్రావ సమయంలో ఒక మగవాడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకొంటే ఆ స్త్రీ పురుషులు ఇద్దర్నీ వాళ్ల ప్రజల్లోనుంచి వేరు చేయాలి. ఆమె రక్తస్రావ స్థానాన్ని వారు బహిర్గతం చేసారు గనుక వాళ్లు పాపం చేసారు.
LEV 20:19 “మీ తల్లి సోదరితో గాని, తండ్రి సోదరితో గాని లైంగిక సంబంధాలు పెట్టుకో గూడదు. అది రక్తసంబంధికుల పాపం. వాళ్ల పాపం మూలంగా వాళ్లు శిక్ష పొందాలి.
LEV 20:20 “ఒకడు తన పినతల్లితో శయనించగూడదు. అతడు, అతని పినతల్లికూడ వారు చేసిన పాపం మూలంగా శిక్ష పొందుతారు. వాళ్లు పిల్లలు లేకుండా చస్తారు.
LEV 20:21 “ఎవడైనా తన సోదరుని భార్యను చేర్చుకోవడం తప్పు. వాడు తన సోదరునికి విరోధంగా పాపం చేసాడు. వాళ్లకూ పిల్లలు ఉండరు.
LEV 20:22 “నా ఆజ్ఞలు, నియమాలు అన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటికి మీరు విధేయులు కావాలి. నేను మిమ్మల్ని మీ దేశానికి నడిపిస్తున్నాను. ఆ దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ఆజ్ఞలకు, నియమాలకు విధేయులైతే ఆ దేశం మిమ్మల్ని వెళ్లగొట్టదు.
LEV 20:23 ఇతర ప్రజల్ని ఆ దేశంలో నుండి నేను వెళ్ల గొట్టేస్తున్నాను. ఎందుచేతనంటే వాళ్లు అలాంటి పాపాలన్నీ చేసారు. ఆ పాపాలంటే నాకు అసహ్యం. కనుక వాళ్లు జీవించినట్టు మీరు జీవించకండి.
LEV 20:24 వాళ్ల దేశం మీది అవుతుంది. అని నేను మీతో చెప్పాను. వాళ్ల దేశాన్ని నేను మీకు యిస్తాను. అది మీ దేశం అవుతుంది. ఆ దేశం చాలా మంచి దేశం. పాలు, తేనెలు ప్రవహించే దేశం అది. నేను మీ దేవుడైన యెహోవాను. “నేను మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకొన్నాను. ఇతరులకంటే మిమ్మల్ని నేను వేరుగా చూసుకొన్నాను.
LEV 20:25 కనుక పవిత్ర జంతువుల్ని అపవిత్ర జంతువులకంటె వేరుగా మీరు చూసుకోవాలి. పవిత్ర పక్షుల్ని అపవిత్ర పక్షుల కంటే వేరుగా మీరు చూసుకోవాలి. అపవిత్ర పక్షులు, జంతువులు, నేలమీద ప్రాకే వాటిలో దేన్నీ మీరు తినవద్దు. నేను వాటిని అపవిత్రంగా చేసాను.
LEV 20:26 నేను మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసాను. అందుచేత మీరు నా కోసం పవిత్రంగా ఉండాలి. ఎందుచేతనంటే నేను యెహోవాను, నేను పవిత్రుణ్ణి.
LEV 20:27 “కర్ణపిశాచి, సోదెచెప్పేవారు, మగవాడు గాని, స్త్రీగాని చంపబడాల్సిందే. రాళ్లతో ప్రజలు వారిని చంపివేయాలి. వాళ్లు శిక్షించబడాలి.”
LEV 21:1 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
LEV 21:2 “యాజకులైన అహరోను కుమారులతో ఈ విషయాలు చెప్పు: అహరోను కుమారులు, యాజకులు: చనిపోయిన వారి శవాన్ని తాకి యాజకుడు అపవిత్రుడు కాకూడదు.
LEV 21:3 అయితే చనిపోయిన వ్యక్తి గనుక తన రక్త సంబంధీకుడైతే. అప్పుడు అతడు ఆ శవాన్ని తాకవచ్చు. చనిపోయిన వ్యక్తి యాజకుని తల్లి లేక తండ్రి, కుమారుడు లేక కుమార్తె, సోదరుడు లేక అవివాహిత సోదరి అయితే యాజకుడు అపవిత్రం కావచ్చు. (ఈ సోదరికి భర్త లేడు గనుక ఆమె అతనికి చాలా దగ్గర అవుతుంది. కనుక ఆమె మరణిస్తే, ఆమెకోసం యాజకుడు మైల పడవచ్చు).
LEV 21:4 కానీ చనిపోయిన వ్యక్తి యాజకుని బానిసల్లో ఒక వ్యక్తి అయితే మాత్రం యాజకుడు మైలపడకూడదు.
LEV 21:5 “యాజకులు వారి తలలు గుండు గీసికో గూడదు. యాజకులు వారి గెడ్డాల కొనలు కత్తిరించగూడదు. యాజకులు వారి దేహాల్లో ఎక్కడా కోసుకోగూడదు.
LEV 21:6 యాజకులు వారి దేవుని కోసం పవిత్రంగా ఉండాలి. దేవుని పేరంటే వారు భక్తి చూపించాలి. ఎందుచేతనంటే వారు నైవేద్యం, హోమం దేవునికి అర్పించువారు. కనుక వారు పవిత్రంగా ఉండాలి.
LEV 21:7 “యాజకుడు దేవుణ్ణి ప్రత్యేకంగా సేవించేవాడు. అందుచేత మరో మగవాడితో లైంగిక సంబంధం ఉన్న స్త్రీని యాజకుడు వివాహం చేసుకోగూడదు. వేశ్యనుగాని, విడువబడిన స్త్రీనిగాని యాజకుడు వివాహం చేసుకోగూడదు.
LEV 21:8 యాజకుడు ప్రత్యేక విధానంలో దేవుణ్ణి సేవించేవాడు. కనుక మీరు అతణ్ణి ప్రత్యేక విధానంలో చూసుకోవాలి. ఎందుచేతనంటే అతడు పవిత్ర వస్తువుల్ని మోసేవాడు గనుక. పవిత్ర రొట్టెల్ని అతడు దేవునికి తీసుకొనివస్తాడు, నేను పరిశుద్ధుడను. నేను యెహోవాను, మరియు నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను.
LEV 21:9 “ఒక యాజకుని కుమార్తె వేశ్య అయితే ఆమె తన పేరును నాశనం చేసికొంటుంది, తన తండ్రికి అవమానం కలిగిస్తుంది. కనుక ఆమెను కాల్చివేయాలి.
LEV 21:10 “ప్రధాన యాజకుడు తన సోదరుల్లోనుంచి ఎంపిక చేయబడినవాడు. అతని తలమీద అభిషేకతైలం పోయబడింది. ఈ విధంగా అతడు ప్రధాన యాజకునిగా ప్రత్యేక పనికి నియమించబడ్డాడు. ప్రత్యేక వస్త్రాలు ధరించేందుకు అతడు ఏర్పాటు చేయబడ్డాడు. కనుక అతడు తన విచారాన్ని బాహాటంగా చూపించే పనులు చేయకూడదు. అతడు తన తల వెంట్రుకలను చింపిరిజుట్టుగా పెరగ నివ్వకూడదు. అతడు తన బట్టలు చింపుకోగూడదు.
LEV 21:11 మృత దేహాన్ని తాకి అతడు అపవిత్రుడు కాకూడదు. అతని స్వంత తండ్రి, తల్లి చనిపోయినా సరే అతడు ఆ శవాన్ని తాకగూడదు.
LEV 21:12 ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంనుండి బయటకు వెళ్లగూడదు. అతడు అలా గనుకచేస్తే, అతడు అపవిత్రుడై, తర్వాత దేవుని పరిశుద్ధ స్థలాన్ని అతడు అపవిత్రం చేయవచ్చు. ప్రధాన యాజకుని తలమీద ప్రత్యేక తైలం పోయబడింది. ఇదే అతణ్ణి మిగిలిన ప్రజలకంటే ప్రత్యేకం చేసింది. నేను పరిశుద్ధుడైన యెహోవాను.
LEV 21:13 “ప్రధాన యాజకుడు కన్యగా ఉన్న స్త్రీని వివాహం చేసుకోవాలి.
LEV 21:14 ఇదివరకే మరొకనితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న స్త్రీని ప్రధాన యాజకుడు వివాహం చేసుకోగూడదు. ఒక వేశ్యనుగాని, విడువబడిన స్త్రీనిగాని, లేక విధవరాలిని గాని ప్రధాన యాజకుడు వివాహం చేసుకోగూడదు. ప్రధాన యాజకుడు తన స్వంత ప్రజల్లోనే ఒక కన్యను వివాహం చేసుకోవాలి.
LEV 21:15 ఈ విధంగా ప్రజలు అతని పిల్లలకు మర్యాదనిస్తారు. ప్రధాన యాజకుణ్ణి అతని ప్రత్యేక పని నిమిత్తం యెహోవానగు నేనే ప్రత్యేకించాను.”
LEV 21:16 మోషేతో యెహోవా చెప్పాడు:
LEV 21:17 “అహరోనుతో చెప్పు: నీ సంతానంలోని పిల్లలు ఎవరైనాసరే ఏదైనా శారీరక లోపం గలవారైతే వారు దేవునికి ప్రత్యేక రొట్టెలు తీసుకొని వెళ్లకూడదు.
LEV 21:18 అంగవిహీనం ఉన్న ఏ మనిషికూడ యాజకునిగా నాకు సేవ చేయకూడదు, నాకు బలులు అర్పించకూడదు. ఎలాంటివారు యాజకులుగా నన్ను సేవించగూడదు అంటే: గుడ్డి వాళ్లు, కుంటివాళ్లు, పాడైపోయిన ముఖం ఉన్నవాళ్లు, చేతులుగాని కాళ్లుగాని విపరీతంగా పొడవు ఉన్నవాళ్లు,
LEV 21:19 కాలైనా, చేయైనా విరిగినవాళ్లు,
LEV 21:20 గూనివాళ్లు, మరుగుజ్జువాళ్లు, కంటిలో లోపాలు ఉన్నవాళ్లు, దురద లేక చర్మ వ్యాధి ఉన్నవాళ్లు, అణగగొట్టబడిన వృషణాలు ఉన్నవాళ్లు.
LEV 21:21 “అహరోను సంతానంలో ఎవరిలోనైనా ఏదోషమైనా ఉంటే అలాంటి వ్యక్తి యెహోవాకు హోమ అర్పణలు అర్పంచకూడదు. ఆ వ్యక్తి ప్రత్యేక రొట్టెల్ని కూడా దేవునికి తీసుకొని వెళ్ల కూడదు.
LEV 21:22 ఆ వ్యక్తి యాజక కుటుంబంలోని వాడు గనుక అతడు పవిత్ర రొట్టెల్ని తినవచ్చును. అతి పవిత్రమైన రొట్టెల్ని కూడా అతడు తినవచ్చును.
LEV 21:23 కానీ అతడు మాత్రం తెరలోపలి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లకూడదు, బలిపీఠం దగ్గరకు గూడ అతడు వెళ్లగూడదు. ఎందుచేతనంటే అతనిలో ఏదో తప్పు ఉంది. అతడు నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేయకూడదు. నేను యెహోవాను ఆ స్థలాల్ని పరిశుద్ధం చేస్తాను!”
LEV 21:24 కనుక అహరోనుతో, అతని కుమారులతో, ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే ఈ సంగతులు చెప్పాడు.
LEV 22:1 యెహోవా దేవుడు మోషేతో ఇలా చెప్పాడు:
LEV 22:2 “అహరోనుతో, అతని కుమారులతో చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు నాకు వస్తువులను అర్పిస్తారు. ఆ వస్తువులు పవిత్రం అవుతాయి. అవినావి. అందుచేత యాజకులైన మీరు వాటిని తీసుకోగూడదు. పవిత్రమైన ఆ వస్తువుల్ని మీరు ఉపయోగిస్తే, నా పవిత్రనామం అంటే మీకు గౌరవం లేదని మీరు వ్యక్తం చేస్తారు. నేను యెహోవాను.
LEV 22:3 మీ సంతానమంతటిలో ఎవరైనా వాటిని తాకితే ఆ వ్యక్తి అపవిత్రం అవుతాడు. ఆ వ్యక్తి నానుండి వేరు చేయబడతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ వస్తువుల్ని నాకు ఇచ్చారు. నేను యెహోవాను.
LEV 22:4 “అహరోను సంతానంలో ఎవరికైనా దారుణమైన చర్మవ్యాధి ఉంటే, లేక స్రావరోగం ఉంటే అతడు పవిత్రం అయ్యేంతవరకు పవిత్రం భోజనం చేసేందుకు వీల్లేదు. అపవిత్రుడైన ఏ యాజకునికైనా ఆ నియమం వర్తిస్తుంది. అలాంటి యాజకుడు ఒక శవం మూలంగా కానీ, లేక తన ఇంద్రియం మూలంగా కానీ అపవిత్రుడు కావచ్చు.
LEV 22:5 అపవిత్రమైన, పాకే జంతువుల్లో దేన్ని తాకినా అతడు అపవిత్రుడు అవుతాడు. మరియు అపవిత్రమైన మరో మనిషిని తాకుట వల్ల అతడు అపవిత్రుడు అవుతాడు. దేని మూలంగా అతడు అపవిత్రమైనా సరే
LEV 22:6 ఒక వ్యక్తి వాటిలో దేనిని తాకినా అతడు సాయంత్రంవరకు అపవిత్రుడవుతాడు. ఆ వ్యక్తి పవిత్ర భోజనాన్ని తినకూడదు. అతడు నీళ్లతో స్నానము చేసినా సరే అతడు పవిత్ర భోజనం తినకూడదు.
LEV 22:7 సూర్యాస్తమయం తర్వాతనే అతడు పవిత్రుడవుతాడు. అప్పడు అతడు పవిత్ర భోజనం తినవచ్చును. ఎందుచేతనంటే ఆ భోజనం అతనికి చెందుతుంది గనుక.
LEV 22:8 “ఒక జంతువు దానంతట అదేచచ్చినా, లేక మరో జంతువుచే చంపబడినా, చచ్చిన ఆ జంతువును యాజకుడు తినకూడదు. ఆ వ్యక్తి ఆ జంతువును తింటే అతడు అపవిత్రుడవుతాడు. నేను యెహోవాను.
LEV 22:9 “యాజకులు నన్ను సేవించేందుకు నిర్ణీత సమయాలు ఉన్నాయి. ఆ సమయాల్లో వాళ్లు జాగ్రాత్తగా ఉండాలి. పవిత్రమైన వాటిని అపవిత్రం చేయకుండా వారు జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు గనుక జాగ్రత్తగా ఉంటే వాళ్లు చావరు. నేనే, యెహోవాను. వాళ్లను ఈ ప్రత్యేక పనికోసం ప్రత్యేకించాను.
LEV 22:10 యాజక కుటుంబంలోని వాళ్లు మాత్రమే పవిత్ర భోజనం తినవచ్చు. యాజకునితో ఉంటున్న అతిధి లేక యాజకుని కూలివాడు పవిత్ర భోజనం తినకూడదు.
LEV 22:11 అయితే యాజకుడు తన స్వంత డబ్బుతో ఒక వ్యక్తిని బానిసగా గనుక కొనివుంటే ఆ వ్యక్తి పవిత్రమైన వాటిలో కొంత తినవచ్చును. యాజకుని ఇంట పుట్టిన బానిసలు కూడ యాజకుని భోజనంలో కొంత తినవచ్చును.
LEV 22:12 యాజకుని కుమార్తె, యాజకుడు కాని వాణ్ణి వివాహం చేసుకోవచ్చు. ఆమె గనుక అలా చేస్తే, అప్పుడు ఆమె పవిత్ర అర్పణల్లోనివి ఏవీ తినకూడదు.
LEV 22:13 ఒక యాజకుని కుమార్తె విధవరాలు కావచ్చును, లేదా విడాకులు పొందవచ్చును. ఆమెను పొషించే పిల్లలు ఆమెకు లేని కారణంగా ఆమె బాల్యంలో నివసించిన తన తండ్రి ఇంటికి తిరిగి వేళ్తే, అప్పుడు ఆమె తన తండ్రి భోజనాన్ని తినవచ్చును. అయితే యాజక కుటుంబంలోని వారు మాత్రమే ఈ భోజనంలో కొంత తినవచ్చును.
LEV 22:14 “ఒక వ్యక్తి పవిత్ర భోజనంలో కొంత పోరబాటున తిన్నట్లయితే ఆ వ్యక్తి అంత పవిత్ర బోజనాన్ని యాజకునికి ఇచ్చివేయాలి. అయిదింట ఒకటి వంతున ఆ భోజనం ఖరీదు గూడ అతడు చెల్లించాలి.
LEV 22:15 “ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు కానుకలుయిస్తారు. ఆ కానుకలు పవిత్రం అవుతాయి. కనుక ఆ పవిత్ర వస్తువుల్ని యాజకుడు అపవిత్రం చేయకూడదు.
LEV 22:16 ఒక వేళ యాజకులు గనుక ఆ వస్తువులు పవిత్రం కావు అన్నట్టు వాటిని చూస్తే, పవిత్ర భోజనం తిన్నప్పుడు వారు వారి పాపాన్ని అధికం చేసుకొన్న వాళ్లవుతారు. యెహోవాను. నేనే వాటిని పవిత్రం చేస్తాను!”
LEV 22:17 యెహోవా దేవుడు మోషేతో ఇలా చెప్పాడు:
LEV 22:18 “అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలు ప్రజలు అందరితో ఇలా చెప్పు: ఒకవేళ ఒక ఇశ్రాయేలు పౌరుడు, లేక ఒక విదేశీయుడు ఒక అర్పణ తీసుకొని రావాలను కొంటాడు. ఒకవేళ అది ఆ వ్యక్తి చేసుకొన్న ఏదో ఒక ప్రత్యేక వాగ్దానంగా కావచ్చు లేక ఒకవేళ ఆ వ్యక్తి ఇవ్వాలనుకొన్న ఒక ప్రత్యేక బలి కావచ్చు.
LEV 22:19 ఆ ప్రజలు నిజంగా దేవునికి కానుకలు ఇవ్వాలని కోరుకొన్నందుచేత వారు తెచ్చే కానుకలు అవి. దోష భూయిష్టమైన ఏ అర్పణా నీవు అంగీకరించగూడదు. అలాంటి అర్పణవల్ల నాకు సంతోషం కలుగదు. కనుక ఒక కోడెదూడ, గొర్రె, మేక అయితే అది మగదైఉండాలి. ఆపైన దానిలో ఏ దోషమూ ఉండకూడదు.
LEV 22:21 “ఒక వ్యక్తి సమాధాన బలి యెహోవాకు తీసుకొని రావచ్చును. ఆ సమాధాన బలి ఆ వ్యక్తి చేసుకొన్న ఏదో ప్రత్యేక వాగ్దానానికి చెల్లింపు కావచ్చును. లేక అది ఆ వ్యక్తి యెహోవాకు అర్పించాలనుకొన్న ఒక ప్రత్యేక కానుక కావచ్చును. అది ఇక కోడెదూడ కావచ్చును లేక గొర్రె కావచ్చును. కానీ అది ఆరోగ్యంగా ఉండాలి. ఆ జంతువులో ఏ దోషమూ ఉండకూడదు.
LEV 22:22 గుడ్డిది, ఎముకలు విరిగింది, కుంటిది లేక స్రావరోగం ఉన్నది, లేక దారుణమైన చర్మవ్యాధి ఉన్నది, ఏ జంతువును మీరు యెహోవాకు అర్పించకూడదు. యెహోవా బలిపీఠపు అగ్నిమీద రోగగ్రస్థమైన జంతువులను మీరు అర్పించకూడదు.
LEV 22:23 “కొన్నిసార్లు ఒక కాలు మరీ పొడవుగానో లేక సరిగ్గా పెరగని ఒక పాదమో ఉన్న ఒక కోడెదూడగాని గొర్రెగాని ఉండవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి అలాంటి జంతువును యెహోవాకు ప్రత్యేక కానుకగా అర్పించాలనుకొంటే, అది అంగీకారం అవుతుంది. అయితే ఆ వ్యక్తి చేసిన ప్రత్యేక వాగ్దానానికి చెల్లింపుగా మాత్రం అది అంగీకరించబడదు.
LEV 22:24 “ఒక జంతువుకు గాయపడ్డ, లేక అణగగొట్టబడిన లేక చినిగిన వృషణాలు ఉంటే అలాంటి జంతువును మీరు యెహోవాకు అర్పించకూడదు.
LEV 22:25 “విదేశీయుల దగ్గర్నుండి జంతువుల్ని యెహోవాకు బలిగా మీరు తీసుకోగూడదు. ఎందుచేతనంటే ఆ జంతువులు ఏ విధంగానైనా దెబ్బతిన్నాయేమో, లేదా వాటిలో ఏదైనా లోపం ఉండొచ్చు అందుచేత అవి అంగీకరించబడవు!”
LEV 22:26 మోషేతో యెహోవా చెప్పాడు:
LEV 22:27 “ఒక కోడెదూడ, లేక ఒక గొర్రె, లేక ఒక మేక పుట్టినప్పుడు ఏడు రోజులు అది తన తల్లితో ఉండాలి, అప్పుడు ఎనిమిదో రోజునగాని ఆ తర్వాతగాని యెహోవాకు హోమంగా అర్పించే బలిగా అది అంగీకరించ బడుతుంది.
LEV 22:28 కానీ ఆ జంతువును, దాని తల్లిని ఒకే రోజున మీరు చంపకూడదు. పశువులకు, గొర్రెలకు యిదే నియమం వర్తిస్తుంది.
LEV 22:29 “ఏదైనా ప్రత్యేక కృతజ్ఞత అర్పణ మీరు యెహోవాకు అర్పించాలని కోరితే, మీరు స్వచ్ఛగా ఆ కానుకను అర్పించవచ్చును. అయితే అది దేవుణ్ణి సంతోషపెట్టే విధానంలో మీరు చేయాలి.
LEV 22:30 మొత్తం జంతువును ఆ రోజే మీరు తినాలి. దాని మాంసంలో ఏమీ మర్నాటి ఉదయానికి మీరు మిగల్చకూడదు. నేను యెహోవాను.
LEV 22:31 “నా ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులవ్వండి. నేను యెహోవాను.
LEV 22:32 నా పవిత్ర నామానికి గౌరవం చూపించండి. ఇశ్రాయేలు ప్రజలకు నేను ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. నేను, యెహోవాను, మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకొన్నాను.
LEV 22:33 నేనే మిమ్మల్ని ఈజిప్టునుండి తీసుకొని వచ్చాను. నేను మీకు దేవుణ్ణి అయ్యాను. నేను యెహోవాను!”
LEV 23:1 మోషేతో యెహోవా చెప్పాడు:
LEV 23:2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: యెహోవా ఏర్పాటు చేసిన పండుగలను పవిత్ర సమావేశాలుగా మీరు ప్రకటించాలి. నా ప్రత్యేక దినాలు ఏవంటే:
LEV 23:3 “ఆరు రోజులు పని చేయండి. అయితే ఏడో రోజు సబ్బాతు, అది పవిత్ర సమావేశం జరిగే రోజు. మీరేమీ పని చేయకూడదు. మీ అందరి గృహాల్లోను ఆది యెహోవా నియమించిన సబ్బాతు.
LEV 23:4 “ఇవి యెహోవా ఏర్పాటు చేసిన పండుగ రోజులు. నిర్ణీత సమాయాల్లో పవిత్ర సమావేశాల్ని గూర్చి మీరు ప్రకటించాలి.
LEV 23:5 మొదటి నెల 14వ రోజు సాయంకాలం యెహోవా పస్కాపండుగ.
LEV 23:6 “అదే నెల 15వ రోజు పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెలను ఏడు రోజులు మీరు తినాలి.
LEV 23:7 ఈ సెలవల్లో మొదటి రోజున మీకు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.
LEV 23:8 ఏడు రోజులవరకు మీరు యెహోవాకు బలి అర్పించాలి. ఏడవ రోజున ఒక పవిత్ర సమావేశం జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.”
LEV 23:9 మోషేతో యెహోవా చెప్పాడు:
LEV 23:10 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇచ్చే దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు అక్కడ పంటలు కోస్తారు. ఆ సమయంలో మీ పంటలోని ప్రథమ పనను యాజకుని దగ్గరకు మీరు తీసుకొని రావాలి.
LEV 23:11 ఆ పనను యాజకుడు యెహోవా ఎదుట అల్లాడిస్తాడు. అప్పుడు మీరు స్వీకరించబడతారు. యాజకుడు ఆదివారం ఉదయం ఆ పనను అల్లాడిస్తాడు.
LEV 23:12 “మీరు పనను అల్లాడించే రోజున, ఒక సంవత్సరపు పోతు గొర్రె పిల్లను మీరు అర్పించాలి. ఆ గొర్రె పిల్లకు ఏ దోషం ఉండకూడదు. ఆ గొర్రెపిల్ల యెహోవాకు దహనబలి.
LEV 23:13 ఒలీవ నూనెతో కలిపిన రెండు పదోవంతుల పిండిని ధాన్యార్పణగా మీరు అర్పించాలి. ముప్పావు ద్రాక్షారసమును కూడా మీరు అర్పించాలి. ఆ అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసన.
LEV 23:14 దేవునికి ఆ అర్పణలు చెల్లించేవరకు, కొత్త ధాన్యంగాని, ఫలాలుగాని, లేక కొత్త ధాన్యంతో చేయబడిన రొట్టెగాని మీరు తినకూడదు. మీరు ఎక్కడ నివసించినా సరే మీ తరాలన్నింటినీ ఈ ఆజ్ఞ కొన సాగుతుంది.
LEV 23:15 “ఆ ఆదివారం మొదలు కొని (నైవేద్యం కోసం మీరు పన తీసుకొని వచ్చిన రోజునుండి) ఏడు వారాలు లెక్కించండి.
LEV 23:16 ఏడవ వారం తర్వాత ఆదివారం నాడు (అంటే యాభై రోజుల తర్వాత) యెహోవాకు మీరు కొత్త ధాన్యార్పణను తీసుకొని రావాలి.
LEV 23:17 ఆ రోజున మీ యిండ్ల నుండి రెండు రొట్టెలు తీసుకొని రండి. ఆ రొట్టె నైవేద్యంకోసం. 4 పావులు గోధుమ పిండిలో, పులిసిన పదార్థం ఉపయోగించి ఆ రొట్టెలు తయారుచేయాలి. అది మీ ప్రథమ పంటల్లోనుంచి మీరు యెహోవాకు అర్పించే కానుక.
LEV 23:18 “ప్రజలు ధాన్యార్పణతో బాటు ఒక దూడను ఒక పొట్టేలును, ఏడాది పోతును, ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి. వాటిలో ఏ దోషమూ ఉండకూడదు. అవి యెహోవాకు దహనబలి అర్పణ. అవి హోమంగా అర్పించబడి, యెహోవాకు కమ్మని సువాసనగా ఉంటాయి.
LEV 23:19 పాప పరిహారార్థ బలిగా ఒక మేకపోతును, సమాధాన బలిగా రెండు ఏడాది మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి.
LEV 23:20 “నైవేద్యంగా ప్రథమ ఫలంలోని రొట్టెతో పాటు వాటిని, రెండు గొర్రెపిల్లలను యెహోవా ఎదుట యాజకుడు అల్లాడించాలి. అవి యెహోవాకు పవిత్రమైనది. అవి యాజకునికి చెందుతాయి.
LEV 23:21 అదే రోజున మీరు ఒక పవిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రోజులలో మీరేమి పని చేయకూడదు. మీ గృహాలన్నింటిలో ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది.
LEV 23:22 “మరియు, మీరు మీ పొలంలో పంట కోసేటప్పుడు పొలం అంచులమట్టుకు కోసి వేయవద్దు. నేలమీద పడే కంకులు ఏరుకోవద్దు. పేదవారికోసమూ, మీ దేశం గుండా ప్రయాణించే విదేశీయుల కోసమూ వాటిని విడిచిపెట్టండి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి!”
LEV 23:23 మరల మోషేతో యెహోవా చెప్పాడు:
LEV 23:24 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు ఏడవ నెల మొదటి రోజున మీకు ప్రత్యేకమైన విశ్రాంతి రోజు ఉండాలి. అప్పుడు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ప్రత్యేక జ్ఞాపకార్థ సమయంగా మీరు బూర ఊదాలి.
LEV 23:25 ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీరు యెహోవాకు హోమ అర్పణలు అర్పించాలి”
LEV 23:26 మోషేతో యెహోవా చెప్పాడు,
LEV 23:27 “ఏడవ నెల పదవరోజు ప్రాయశ్చిత్త దినంగా ఉంటుంది. ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు భోజనం చేయకూడదు, యోహోవాకు మీరు హోమ అర్పణ తీసుకొని రావాలి.
LEV 23:28 ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. ఎందు చేతనంటే అది ప్రాయశ్చిత్త దినం. ఆ రోజు, యాజకులు యెహోవా ఎదుటికి వెళ్లి, మిమ్మల్ని పవిత్రం చేసే ఆచారక్రమాన్ని జరిగిస్తారు.
LEV 23:29 “ఆ రోజున భోజనం చేయకుండా ఉండేందుకు ఎవరైనా తిరస్కరిస్తే, ఆ వ్యక్తిని తన ప్రజలనుండి వేరు చేయాలి.
LEV 23:30 ఆ రోజున ఎవరైనా పని చేస్తే ఆ వ్యక్తిని తన ప్రజల్లోనుంచి నేను నాశనం చేస్తాను.
LEV 23:31 మీరు అసలు ఏమీ పని చేయాకూడదు. మీరు ఎక్కడ నివసించినా ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది.
LEV 23:32 అది మీకు ఒక ప్రత్యేక విశ్రాంతి దినం. మీరు భోజనం చేయకూడదు. నెలలో తొమ్మిదవ రోజు తర్వాత సాయంకాలంనుండి ఈ ప్రత్యేక విశ్రాంతి దినం మీరు ప్రారంభించాలి. ఆ సాయంత్రంనుండి మర్నాటి సాయంకాలం వరకు ఈ ప్రత్యేక విశ్రాంతి దినం కొనసాగుతుంది.”
LEV 23:33 మరల మోషేతో యెహోవా చెప్పాడు,
LEV 23:34 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఏడవ నెల పదిహేనోవ తేదీన పర్ణశాలల పండుగ యెహోవాకు ఈ పండుగ ఏడు రోజులపాటు కొనసాగుతుంది.
LEV 23:35 మొదటి రోజున పవిత్ర సమావేశం ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు.
LEV 23:36 ఏడు రోజులు యెహోవాకు హోమార్పణలు మీరు అర్పించాలి. ఎనిమిదో రోజు మీకు మరో పవిత్ర సమావేశం జరుగుతుంది. మీరు యెహోవాకు హోమార్పణలు అర్పించాలి. ఇది పవిత్ర సమావేశంగా ఉంటుంది. మీరు ఏ పనీ చేయకూడదు.
LEV 23:37 “అవి యెహోవా ప్రత్యేక పండుగలు. ఆ పండుగల్లో పవిత్ర సమావేశాలు జరుగుతాయి. అర్పణలు, బలి అర్పణలు, పానార్పణలు, దహనబలులు, ధాన్యార్పణలు మీరు యెహోవాకు తీసుకొని రావాల్సిన హోమార్పణలు. ఆ కానుకలు తగిన సమయంలో మీరు తీసుకొని రావాలి.
LEV 23:38 యెహోవా సబ్బాతు రోజులు జ్ఞాపకం చేసుకోవటంతోబాటు ఈ పండుగలన్నీ మీరు ఆచరించాలి. యెహోవాకు మీరు అర్పించే మీ ఇతర అర్పణలుగాక ఈ కానుకలు అర్పించాలి. మీ ప్రత్యేక వాగ్దానాల చెల్లింపుగా మీరు అర్పించే అర్పణలు గాక వీటిని మీరు అర్పించాలి. మీరు యెహోవాకు ఇవ్వాలనుకొన్న ప్రత్యేక అర్పణలుకాక ఇవి మీరు ఇవ్వాలి.
LEV 23:39 “ఏడువ నెల పదిహేనొవ రోజున, దేశంలో మీరు పంటలు కూర్చుకొన్నప్పుడు, యెహోవా పండుగను ఏడు రోజుల పాటు మీరు ఆచరించాలి. మొదటి రోజున, ఏడో రోజున మీరు విశ్రాంతి తీసుకోవాలి.
LEV 23:40 మొదటి రోజు పండ్ల చెట్లనుండి మంచి పండ్లు మీరు కూర్చాలి. ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలువల దగ్గరి నిరవంజి చెట్లు మీరు తీసుకోవాలి. మీ యెహోవా దేవుని ఎదుట ఏడు రోజులు మీరు పండుగ ఆచరించాలి.
LEV 23:41 ప్రతి సంవత్సరం ఏడు రోజులు యెహోవాకు పండుగగా మీరు దీనిని ఆచరించాలి. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ఏడవ నెలలో మీరు ఈ పండుగను ఆచరించాలి.
LEV 23:42 ఏడు రోజులు తాత్కాలిక గుడారాల్లో మీరు నివసించాలి. ఇశ్రాయేలీయులలో పుట్టిన వాళ్ళంతా ఆ పర్ణశాలల్లోనే నివసించాలి.
LEV 23:43 ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి నేను బయటకు తీసుకొని వచ్చినప్పుడు, తాత్కాలిక గుడారాల్లో నేను వారిని నివసింపజేసానని మీ సంతానం అంతా తెలుసుకోవాలి. నేను మీ దేవుడనైన యోహోవాను!”
LEV 23:44 కనుక యెహోవా పండుగ రోజులు అన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే చెప్పాడు.
LEV 24:1 మోషేతో యెహోవా చెప్పాడు:
LEV 24:2 “గానుగ ఆడిన ఒలీవలనుండి పవిత్ర తైలం తీసుకొని రమ్మని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించు. ఆ నూనె దీపాల కోసం. ఆ దీపాలు ఆరిపోకుండా వెలగాలి.
LEV 24:3 సన్నిధి గుడారంలో యెహోవా ఎదుట సాయంత్రం నుండి ఉదయం వరకు దీపం వెలిగేటట్లు అహరోను చూసుకొంటాడు. ఇది సాక్ష్యపు తెర ఎదుట ఉంటుంది. అతి పవిత్రస్థలంలో ఈ తెర వెనుకనే ఒడంబడిక పెట్టె ఉంటుంది. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది.
LEV 24:4 యెహోవా ఎదుట స్వచ్ఛమైన బంగారపు దీపస్తంభం మీద దీపాలను అహరోను ఎల్లప్పుడూ వెలగనిస్తూఉండాలి.
LEV 24:5 “మంచి రకం గోధుమ పిండి తీసుకొని, దానితో పన్నెండు రొట్టెలు చేయాలి. ఒక్కో రొట్టెకు నాలుగు పావుల గోధుమపిండి ఉపయోగించాలి.
LEV 24:6 యెహోవా ఎదుట బంగారు బల్లమీద ఆ రొట్టెలను రెండు వరుసలుగా పెట్టాలి. ఒక్కో వరుసలో ఆరు రొట్టెలు ఉండాలి.
LEV 24:7 ఒక్కో వరుసమీద స్వచ్ఛమైన సాంబ్రాణి వేయాలి. ఇది యెహోవాకు అర్పించబడిన హోమాన్ని ఆయనను జ్ఞాపకం చేసుకొనేట్టు చేస్తుంది.
LEV 24:8 ప్రతి సబ్బాతు నాడు అహరోను ఈ రొట్టెలను యెహోవా ఎదుట క్రమంలో ఉంచాలి. శాశ్వతంగా ఇలా చేయాలి. ఇశ్రాయేలు ప్రజలతో ఈ ఒడంబడిక ఎప్పటికీ కొనసాగుతుంది.
LEV 24:9 ఆ రొట్టె అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. వారు ఈ రొట్టెను పరిశుద్ధ స్థలంలో తినాలి. ఎందుచేతనంటే యోహోవాకు హోమంగా అర్పించబడిన అర్పణల్లో అది ఒకటి. ఆ రొట్టె ఎప్పటికీ అహరోను భాగం అవుతుంది.”
LEV 24:10 ఒక ఇశ్రాయేలు స్త్రీకి కుమారుడు ఒకడు ఉన్నాడు. వాని తండ్రి ఈజిప్టువాడు. ఈ ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు ఇశ్రాయేలువాడే. అతడు ఇశ్రాయేలు ప్రజల మధ్య తిరుగుతూ, బసలో పోరాడటం మొదలుపెట్టాడు.
LEV 24:11 ఆ ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు యెహోవా నామాన్ని శపిస్తూ, దూషణ మాటలు మాట్లాడటం మొదలు పెట్టాడు కనుక ప్రజలు అతణ్ణి మోషే దగ్గరకు తీసుకొని వచ్చారు. (అతని తల్లి పేరు షెలోమితు, దాను కుటుంబ వంశానికి చెందిన దిబ్రీ కుమార్తె)
LEV 24:12 ప్రజలు వాణ్ణి బందీగా పట్టి, యెహోవా ఆజ్ఞ వివరంగా తెలియటం కోసం కనిపెట్టారు.
LEV 24:13 అప్పుడు మోషేతో యెహోవా చెప్పాడు:
LEV 24:14 “ఆ శపించినవాణ్ణి బసవెలుపలికి తీసుకొని రండి. తర్వాత అతడు శపిస్తూండగా విన్న ప్రజలందర్నీ సమావేశ పరచండి. వాళ్లు అతని తలమీద చేతులు వేయాలి. తర్వాత ప్రజలంతా వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి.
LEV 24:15 ఇశ్రాయేలు ప్రజలతో నీవు చెప్పు: ఎవడైనా తన దేవుణ్ణి శపిస్తే వాడు ఈ విధంగా శిక్షించబడాలి.
LEV 24:16 యెహోవా నామానికి వ్యతిరేకంగా ఎవరైనా దూషణచేస్తే, వాణ్ణి చంపివేయాలి, ప్రజలంతా వాణ్ణి రాళ్ళతో కొట్టాలి. ఇశ్రాయేలీయులలో పుట్టిన వాడిలా గానే, విదేశీయులు కూడా శిక్షించబడాలి. ఏ వ్యక్తిగాని యెహోవా నామాన్ని శపిస్తే ఆ వ్యక్తిని చంపివేయాలి.
LEV 24:17 “ఇంకా ఒకడు మరొక వ్యక్తిని గనుక చంపేస్తే, అలాంటివాణ్ణి చంపివేయాలి.
LEV 24:18 మరొకరికి చెందిన జంతువును చంపినవాడు ఆ జంతువుకు బదులుగా మరొక జంతువును ఇవ్వాలి.
LEV 24:19 “ఒకడు తన పొరుగువానికి గాయం చేస్తే, వానికి కూడా అలానే చేయాలి.
LEV 24:20 విరిగిన ఎముకకు విరిగిన ఎముక, కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకనికి ఎలాంటి దెబ్బలు తగిలితే, వాటి కారకునికి గూడా అలాంటి దెబ్బలే.
LEV 24:21 కనుక ఒకని జంతువును చంపినవాడు దాని స్థానంలో మరో జంతువును ఇవ్వాలి. అయితే మరొ కడ్ని చంపినవాణ్ణి మాత్రం చంపివేయాలి.
LEV 24:22 “మీకు ఒకే రకం న్యాయం ఉంటుంది. మీ స్వంత దేశంలో ఉండే విదేశీయునికి కూడా అదే న్యాయం ఉంటుంది. ఎందుచేతనంటే నేను మీ దేవుడైన యెహోవాను గనుక.”
LEV 24:23 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడగా, శపించిన వ్యక్తిని బసవెలుపలకు వారు తీసుకొని వచ్చారు. అప్పుడు వాళ్లు రాళ్లతో కొట్టి అతణ్ణి చంపివేసారు. కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు చేసారు.
LEV 25:1 సీనాయి కొండ దగ్గర యెహోవా మోషేతో మాట్లాడాడు. యెహోవా చెప్పాడు:
LEV 25:2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇవ్వబోతున్న దేశంలో మీరు ప్రవేశిస్తారు. ఆ సమయంలో మీరు భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయాన్ని కేటాయించాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ఒక ప్రత్యేక సమయంగా ఉంటుంది.
LEV 25:3 ఆరు సంవత్సరాలు మీరు మీ భూమిలో విత్తనాలు చల్లుకోవాలి. మీ ద్రాక్షా తోటల్లోని తీగెలను ఆరు సంవత్సరాలు మీరు కత్తిరించుకొంటూ, దాని ఫలాన్ని కూర్చుకోవాలి.
LEV 25:4 అయితే ఏడో సంవత్సరం మీరు భూమిని విశ్రాంతి తీసుకోనివ్వాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉంటుంది. మీరు మీ పొలాల్లో విత్తనాలు చల్లకూడదు లేక మీ ద్రాక్షాతోటల్లో తీగలను కత్తిరించకూడదు.
LEV 25:5 మీ పంట కోత అయిపోయిన తర్వాత వాటంతట అవే పెరిగే పంటను మీరు కోయకూడదు. కత్తిరించ బడని ద్రాక్షాతీగెలనుండి ద్రాక్షా పండ్లను మీరు కూర్చగూడదు. భూమికి అది విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది.
LEV 25:6 “భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది గాని మీకు మాత్రం యింకా సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ ఆడ, మగ సేవకులందరికీ సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ కూలి వాళ్లకు, మీ దేశంలో నివసించే విదేశీయులకు ఆహారం ఉంటుంది.
LEV 25:7 మీ పశువులు, ఇతర జంతువులు తినేందుకు సరిపడినంత ఆహారం ఉంటుంది.
LEV 25:8 “ఏడేసి సంవత్సరాల సముదాయంగల ఏడు సంవత్సరాలనుకూడ మీరు లెక్కించాలి. అది 49 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో దేశంలో ఏడు సంవత్సరాలు విశ్రాంతి ఉంటుంది.
LEV 25:9 ప్రాయశ్చిత్తం రోజున పొట్టేలు కొమ్మును మీరు ఊదాలి. అది ఏడో నెల పదోరోజు. పొట్టేలు కొమ్మును మీరు దేశ వ్యాప్తంగా ఊదాలి.
LEV 25:10 50వ సంత్సరాన్ని మీరు ఒక ప్రత్యేక సంవత్సరంగా చేయాలి. మీ దేశంలో నివసించే మనుష్యులందరికీ మీరు స్వతంత్రం ప్రకటించాలి. ఇది బూరధ్వని చేసే మహోత్సవ కాలం అని పిలువబడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి. మరియు మీలో ప్రతి ఒక్కరూ తన కుటుంబానికి తిరిగి వెళ్లాలి.
LEV 25:11 50వ సంవత్సరం మీకు ప్రత్యేక సంబరంగా వుంటుంది. ఆ సంవత్సరములో విత్తనాలు చల్లవద్దు. వాటంతట అవే మొలిచే మొక్కల్ని కోయవద్దు. కత్తిరించబడని ద్రాక్షావల్లులనుండి ద్రాక్షాపండ్లు కూర్చవద్దు.
LEV 25:12 అది బూరధ్వని చేసే మహోత్సవ కాలం. అది మీకు పవిత్ర సమయంగా ఉంటుంది. పొలంనుండి వచ్చే పంటలను మీరు తినాలి.
LEV 25:13 బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ప్రతి వ్యక్తీ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి.
LEV 25:14 “నీ పొరుగువానికి మీ భూమిని అమ్మినప్పుడు నీవు అతనికి మోసం చేయవద్దు. మరియు నీవు అతని వద్ద భూమిని కొన్నప్పుడు అతడ్ని నిన్ను మోసం చేయనీయకు.
LEV 25:15 నీ పొరుగువాని భూమిని నీవు కొనాలనుకొన్నప్పుడు, గడచిన బూరధ్వని చేసే మహోత్సవ కాలంనుండి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్కచూచి, దాన్ని బట్టి ధర నిర్ణయం చేయాలి. ఒకవేళ నీవు భూమి అమ్మితే, పంటలు కోసిన సంవత్సరాలు లెక్కించి, ఆ లెక్క ప్రకారం ధర నిర్ణయించాలి.
LEV 25:16 చాలా సంవత్సరాలు ఉంటే, ఖరీదు ఎక్కువ ఉంటుంది. సంవత్సరాలు తక్కువ ఉంటే ఖరీదు తగ్గించాలి. ఎందుచేతనంటే నీ పొరుగువాడు నిజానికి కొన్ని పంటలు మాత్రమే నీకు అమ్ముతున్నాడు. వచ్చే ఉత్సవంలో ఆ భూమి తిరిగి అతని కుటుంబ పరం అవుతుంది.
LEV 25:17 మీరు ఒకరికి ఒకరు మోసం చేయకూడదు. మీ దేవుణ్ణి మీరు ఘనపర్చాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి.
LEV 25:18 “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి వాటికి విధేయులుగా ఉండండి. అప్పుడు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు.
LEV 25:19 మరియు భూమి మీకు మంచి పంటను ఇస్తుంది. అప్పుడు మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు దేశంలో క్షేమంగా ఉంటారు.
LEV 25:20 “కానీ ఒకవేళ మీరు, ‘మేము విత్తనాలు చల్లి, పంట కూర్చుకొనకపోతే ఏడో సంవత్సరం తినేందుకు మాకు ఏమీ ఉండదు అనవచ్చు.’
LEV 25:21 చింతపడకండి. ఆరవ సంవత్సరంలో నా ఆశీర్వాదాలు మీకు లభించేటట్టుగా నేను ఆజ్ఞాపిస్తాను. భూమి మూడు సంవత్సరాల పాటు పంట ఇస్తూనే ఉంటుంది.
LEV 25:22 ఎనిమిదో సంవత్సరంలో మీరు నాట్లు వేసినప్పుడు, మీరు యింకా పాత పంటనే తింటూ ఉంటారు. ఎనిమిదో సంవత్సరంలో మీరు నాటిన పంట చేతికి అందేవరకు, అంటే తొమ్మిదో సంవత్సరం వరకు పాత పంటనే తింటూ ఉంటారు.
LEV 25:23 “వాస్తవానికి భూమి నాది. అందుచేత మీరు దాన్ని శాశ్వతంగా అమ్మజాలరు. మీరు కేవలం నాతో, నా భూమి మీద నివసిస్తున్న యాత్రికులు, విదేశీయులు.
LEV 25:24 మనుష్యులు వారి భూమిని అమ్మివేయ వచ్చును కానీ ఎల్లప్పుడూ ఆ భూమి తిరిగి ఆ కుటుంబా నిదే అవుతుంది.
LEV 25:25 మీ దేశంలో ఒక వ్యక్తి చాల నిరుపేద కావచ్చును. అతడు తన ఆస్తి అమ్ముకోవాల్సినంత పేదవాడై పోవచ్చును. కనుక అతని రక్తసంబంధీకులు వచ్చి తమ బంధువుకోసం ఆ ఆస్తిని కొనాలి.
LEV 25:26 తన భూమిని తిరిగి తనకోసం కొనేందుకు ఒకనికి రక్తసంబంధి ఎవరూ లేక పోవచ్చును. అయితే తన భూమిని తనకోసం కొనేందుకు కావలసినంత డబ్బు సంపాదించవచ్చు.
LEV 25:27 అప్పుడు అతడు భూమి అమ్మివేసి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్క పెట్టాలి. ఆ లెక్కను ఉపయోగించి ఆ భూమి ధర నిర్ణయం చేయాలి. అప్పుడు అతడు ఆ భూమిని తిరిగి కొనుక్కోవాలి. ఆ భూమి మరల అతని ఆస్తి అవుతుంది.
LEV 25:28 అయితే ఈ వ్యక్తి ఆ భూమిని తిరిగి తనకోసం కొనేందుకు సరిపడినంత డబ్బు అతని వద్ద లేకపోతే, అతడు అమ్మి వేసిన భూమి, వచ్చే బూరధ్వని చేసే మహోత్సవకాలం వరకు దానిని కొన్న వారి స్వాధీనంలోనే ఉంటుంది. అప్పుడు బూరధ్వని చేసే మహోత్సవ సమయంలో ఆ భూమి దాని మొదటి స్వంతదారుల పరం అవుతుంది. కనుక ఆ ఆస్తి తిరిగి దాని అసలైన కుటుంబానికి చెందుతుంది.
LEV 25:29 “ప్రాకారంగల పట్టణంలో ఒకడు తన ఇల్లు అమ్మినట్టయితే, ఆ తర్వాత ఒక పూర్తి సంవత్సరం పాటు ఆ ఇల్లును తిరిగి పొందే హక్కు ఆ వ్యక్తికి ఉంటుంది. ఇంటిని తిరిగి పొందే హక్కు ఒక సంవత్సరంవరకు కొనసాగుతుంది.
LEV 25:30 అయితే ఒక సంవత్సరం పూర్తయ్యేలోపల ఆ ఇంటి స్వంతదారుడు కొనక పోయినట్టయితే, అప్పుడు ప్రాకారంగల పట్టణంలోని ఆ ఇల్లు, దానిని కొన్నవానికి, అతని సంతానానికి స్వంతం అవుతుంది. బూరధ్యని చేసే మహోత్సవ సమయంలో ఆ యిల్లు తిరిగి దాని ప్రథమ స్వంత దారుని వశం కాదు.
LEV 25:31 ప్రాకారాలు లేని పట్టణాలు బహిరంగ పొలాల్లో గుర్తించ బడుతాయి. కనుక అలాంటి పట్టణాల్లో నిర్మించబడిన ఇళ్లు బూరధ్వని చేసే మహోత్సవ సమయంలో తిరిగి వాటి ప్రథమ స్వంత దారులపరం అవుతాయి.
LEV 25:32 “అయితే లేవీయుల పట్టణాల విషయం. లేవీయులు వారికి చెందిన పట్టణాల్లోని వారి ఇళ్లను ఎప్పుడైనా సరే తిరిగి కొనవచ్చును.
LEV 25:33 ఒక వ్యక్తి ఒక లేవీయుని దగ్గర ఒక ఇల్లు కొంటే, లేవీయుల పట్టణంలోని ఆ ఇల్లు బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో తిరిగి లేవీయులకే చెందుతుంది. ఎందుచేతనంటే లేవీయుల పట్టణాలు లేవీ వంశపు ప్రజలకు చెందినవి. ఆ పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలే లేవీయులకు ఇచ్చారు.
LEV 25:34 అలానే, లేవీయుల పట్టణాల చుట్టు ప్రక్కల పొలాలు, పచ్చికబయళ్లు అమ్మేందుకు వీల్లేదు. ఆ పొలాలు శాశ్వతంగా లేవీయులకే చెందుతాయి.
LEV 25:35 “ఒకవేళ మీ దేశ ప్రజల్లో ఒకడు పోషణ సాగనంత పేదరికంలో పడవచ్చు. మీరు అతణ్ణి అతిథిలా మీతో జీవింపనియ్యాలి.
LEV 25:36 మీరు అతనికి అప్పుగా యిచ్చే మొత్తంమీద వడ్డీ కట్టవద్దు. ఆ సోదరుణ్ణి నీతో నివసింపనిచ్చి, నీ దేవుణ్ణి ఘనపరచు.
LEV 25:37 అతనికి వడ్డీకి అప్పు ఇవ్వవద్దు. అతడు భోజనం చేసే ఆహారం మీద లాభాలు గడించేందుకు ప్రయత్నించవద్దు.
LEV 25:38 నేను మీ దేవుడైన యోహోవాను. కనాను దేశాన్ని మీకు ఇచ్చి, మీకు దేవుణ్ణిగా ఉండేందుకు నేనే మిమ్మల్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకునివచ్చాను.
LEV 25:39 “ఒకవేళ నీ సోదరుల్లో ఒకడు మరీ దరిద్రుడై, నీకు బానిసగా అమ్ముడుపోవచ్చును. నీవు అతణ్ణి ఒక బానిసలా పని చేయించకూడదు.
LEV 25:40 అతడు ఒక కిరాయి పనివానిలా, అతిధిలా బూరధ్వని చేసే మహోత్సవ కాలం వరకు నీతో ఉంటాడు.
LEV 25:41 తర్వాత అతడు నిన్ను విడిచి పెట్టవచ్చును. అతడు తన పిల్లలను తీసుకొని తిరిగి తన కుటుంబంలోనికి వెళ్ళిపోవచ్చును. అతడు తన పూర్వీకుల ఆస్తులను తిరిగి పొందవచ్చును.
LEV 25:42 ఎందుచేతనంటే, వాళ్లు నా సేవకులు, ఈజిప్టు బానిసత్వంలో నుండి నేను వాళ్లను తీసుకొనివచ్చాను. వాళ్లు మరల బానిసలు కాకూడదు.
LEV 25:43 ఇలాంటి వ్యక్తిని నీవు కఠినంగా పాలించగూడదు. నీ దేవుణ్ణి నీవు ఘనపర్చాలి.
LEV 25:44 “నీ స్త్రీ, పురుష బానిసల విషయం: మీ చుట్టు పక్కల దేశాలనుండి ఆడ, మగ బానిసలను మీరు తెచ్చుకోవచ్చును.
LEV 25:45 మరియు, మీ దేశంలో నివసిస్తున్న విదేశీయుల పిల్లలు వస్తానంటే వారిని కూడ మీరు బానిసలుగా తీసుకోవచ్చును. ఆ పిల్ల బానిసలు మీకు చెందుతారు.
LEV 25:46 ఈ విదేశీ బానిసలు మీ పిల్లల వశం అయ్యేటట్టు, మీ మరణానంతరం మీరు వారిని మీ పిల్లలకు అప్పగించవచ్చును. వాళ్లు శాశ్వతంగా మీకు బానిసలు. ఈ విదేశీయుల్ని మీరు బానిసలుగా చేసుకోవచ్చును. కానీ మీ స్వంత సోదరులైన ఇశ్రాయేలు ప్రజలను మాత్రం కఠినంగా పాలించగూడదు.
LEV 25:47 “ఒకవేళ ఒక విదేశీయుడు లేక అతిథి మీ మధ్యధనికుడు కావచ్చు, ఒకవేళ మీ దేశంలో ఒకడు దరిద్రుడై మీ మధ్య నివసిస్తున్న ఒక విదేశీయునికి బానిసగా లేక అతని కుటుంబంలో సభ్యునిగా అమ్ముడు పోయాడనుకోండి.
LEV 25:48 ఆ వ్యక్తి తిరిగి కొనబడి, స్వంతంత్రుడు అయ్యేందుకు అతనికి హక్కు ఉంటుంది. అతని సోదరుల్లో ఒకరు అతణ్ణి తిరిగి కొనవచ్చును.
LEV 25:49 అతని పినతండ్రిగాని, పిన తండ్రి కుమారుడు గాని అతణ్ణి కొనవచ్చును. లేక అతని వంశంలో అతని రక్తసంబంధి ఎవరైనా అతణ్ణి కొనవచ్చును. లేక ఒకవేళ ఆ వ్యక్తి తానే సరిపడినంత ధనం సంపాయించు కొంటే, తానే డబ్బు చెల్లించి మరల స్వతంత్రుడు కావచ్చును.
LEV 25:50 “వెల మీరెలా నిర్ణయిస్తారు? అతడు విదేశీయునికి తనను తాను అమ్ముకొన్న సమయంనుండి వచ్చే బూరధ్వని చేసే మహోత్సవ కాలంవరకు ఎన్ని సంవత్సరాలో మీరు లెక్కగట్టాలి. వెల నిర్ణయం చేయటానికి ఆ లెక్కను ఉపయోగించాలి. ఎందుచేతనంటే అవతలి వ్యక్తి యితణ్ణి వాస్తవానికి కొన్ని సంవత్సరాలకోసమే ‘కిరాయికి’ పెట్టుకొన్నాడు.
LEV 25:51 బూరధ్వని చేసే మహోత్సవ కాలానికి ఇంకా చాల సంవత్సరాలు కావాల్సిఉంటే, ఆ వ్యక్తి వెలలో అధిక భాగం తిరిగి చెల్లించాలి. అదంతా సంవత్సరాల సంఖ్యమీద ఆధారపడి ఉంటుంది.
LEV 25:52 ఉత్సవ సంవత్సరానికి మరికొన్ని యేండ్లు మాత్రమే మిగిలి ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి అసలు వెలలో కొద్ది మాత్రమే చెల్లించాలి.
LEV 25:53 అయితే ఆ వ్యక్తి కిరాయి పని వాడిలాగానే ఆ విదేశీయుని దగ్గర ప్రతి సంవత్సరం నివసిస్తాడు. ఆ విదేశీయుడు ఆ వ్యక్తి మీద కఠినంగా ప్రవర్తించకుండును గాక.
LEV 25:54 “ఆ వ్యక్తిని ఎవకూ కొనకపోయినప్పటికి, అతడు స్వతంత్రుడు అవుతాడు. బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో అతడు, అతని పిల్లలు స్వతంత్రులవుతారు.
LEV 25:55 ఎందుచేతనంటే, ఇశ్రాయేలు ప్రజలు నా సేవకులు. వాళ్లు నా సేవకులు. ఈజిప్టు బానిసత్వం నుండి నేను వాళ్లను తీసుకొని వచ్చాను. నేను మీ దేవుడైన యెహోవాను!
LEV 26:1 “మీకోసం మీరు విగ్రహాల్ని చేసుకోవద్దు. విగ్రహాల్ని, జ్ఞాపక చిహ్నాల్ని నిలబెట్టవద్దు. మీరు మొక్కేందుకు మీ దేశంలో రాతి విగ్రహాలను నిలబెట్టవద్దు. ఎందుచేతనంటే, నేను మీ దేవుణ్ణి, యెహోవాను.
LEV 26:2 “నా ప్రత్యేక విశ్రాంతి రోజుల్ని జ్ఞాపకం ఉంచు కొని, నా పవిత్ర స్థలాన్ని గౌరవించండి. నేను యోహోవాను.
LEV 26:3 “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులు అవ్వండి.
LEV 26:4 వాటిని మీరు జరిగిస్తే, నేను మీకు సకాలంలో వర్షాలు కురిపిస్తాను. భూమి పంటను యిస్తుంది, పొలంలో చెట్లు వాటి ఫలాలను ఇస్తాయి.
LEV 26:5 ద్రాక్షాపండ్ల కోతకాలం వచ్చేంతవరకు మీరు గానుగ పట్టడం కొనసాగుతుంది వరు మళ్ళ మొక్కలు నాటడం మొదలు పెట్టేంతవరకు మీరు ద్రాక్షాపండ్లు కూర్చుకోవటం కొనసాగుతుంది. అప్పుడు మీరు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. మరియు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు.
LEV 26:6 నేను మీ దేశానికి శాంతిని ప్రసాదిస్తున్నాను. మీరు ప్రశాంతంగా పండుకొంటారు. ఎవరూ మిమ్మల్ని భయపెట్టేందుకు రారు. హానికరమైన జంతువులను నేను మీ దేశానికి దూరంగా ఉంచుతాను. మరియు సైన్యాలు మీ దేశం గుండా వెళ్లజాలవు.
LEV 26:7 “మీరు మీ శత్రువులను తరిమి, వారిని ఓడిస్తారు. మీరు మీ ఖడ్గంతో వారిని చంపుతారు.
LEV 26:8 మీలో అయిదుగురు 100 మందిని తరుముతారు, మీలో 100 మంది 10,000 మందిని తరుముతారు. మీరు మీ శత్రువులను ఓడించి, మీ ఖడ్గంతో వారిని చంపేస్తారు.
LEV 26:9 “అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. మీకు అధికంగా సంతానం కలుగనిస్తాను. మీతో నా ఒడంబడికను నేను నిలబెడతాను.
LEV 26:10 ఒక సంవత్సరం కంటె ఎక్కువ కాలానికి సరిపోయేంత పంట మీకు ఉంటుంది. మీరు కొత్త పంట కోసుకొంటారు. అయితే కొత్త పంట నిల్వ చేయటానికి స్థలం కావాలి గనుక పాత పంటను పారవేయాల్సి ఉంటుంది.
LEV 26:11 నేను నా పవిత్ర గుడారాన్ని కూడ మీ మధ్య ఉంచుతాను. మీనుండి నేను తిరిగిపోను.
LEV 26:12 నేను మీతో నడుస్తాను, మీ దేవునిగా ఉంటాను. మీరు నా ప్రజలుగా ఉంటారు.
LEV 26:13 నేను యోహోవాను, మీ దేవుణ్ణి. మీరు ఆ ఈజిప్టులో బానిసలుగా ఉన్నారుగాని నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాను. బానిసలుగా భారమైన బరువులు మోసి మీరు చాలా వంగిపోయారు. అయితే మీ భుజాలమీద కాడిని నేను విరుగగొట్టేసాను. నేను మిమ్మల్ని మరల తల ఎత్తుకొని తిరిగేటట్టు చేస్తాను!
LEV 26:14 “అయితే మీరు నాకు విధేయులు కాకుండా, నా ఆజ్ఞలన్నింటినీ పాటించకుండా ఉంటే, అప్పుడు మీకు ఈ కీడులన్నీ జరుగుతాయి.
LEV 26:15 నా ఆజ్ఞలు, నియమాలు పాటించడానికి మీరు నిరాకరిస్తే, మీరు నా ఒడంబడికను ఉల్లంఘించినట్టే.
LEV 26:16 మీరు గనుక అలా చేస్తే అప్పుడు భయంకరమైన సంగతుల్ని మీకు సంభవింపజేస్తాను. నేను మీకు రోగం, జ్వరం వచ్చేటట్టు చేస్తాను. అవి మీ కళ్లను పాడుచేసి, మీ ప్రాణాల్ని తీస్తాయి. మీరు విత్తనాలు జల్లినప్పుడు ఫలితం ఉండదు. మీ శత్రువులు మీ పంటను తినివేస్తారు.
LEV 26:17 నేను మీకు విరోధంగా ఉంటాను గనుక మీ శత్రువులు మిమ్మల్ని ఓడిస్తారు. ఆ శత్రువులు మిమ్మల్ని ద్వేషించి, మీ మీద అధికారం చేస్తారు. ఎవరూ మిమ్మల్ని తరమకుండానే మీరు పారిపోతారు.
LEV 26:18 “ఇవన్నీ జరిగినా మీరు నాకు విధేయులు కాకపోతే, మీ పాపాలకోసం నేను మిమ్మల్ని ఏడంతలుగా శిక్షిస్తాను.
LEV 26:19 మీకు అతిశయ కారణమైన మీ గొప్ప పట్టణాలను నేను కూలగొట్టేస్తాను. ఆకాశంవర్షాన్ని ఇవ్వదు, భూమి పంటనివ్వదు.
LEV 26:20 మీరు కష్టపడి పనిచేస్తారు, కాని దానివల్ల ప్రయోజనం ఉండదు. మీ భూమి పంటలేమీ ఇవ్వదు, మీ చెట్లు వాటి ఫలాలను ఇవ్వవు.
LEV 26:21 “మీరు ఇంకా నాకు వ్యతిరేకంగా తిరిగి, నాకు విధేయులయ్యేందుకు తిరస్కరిస్తే, అప్పుడు ఇంకా ఏడు రెట్లు కఠినంగా నేను మిమ్మల్ని కొడతాను. మీరు ఎక్కువ పాపం చేసినకొద్దీ, మరింత ఎక్కువగా శిక్షించబడతారు.
LEV 26:22 నేను మీ మీదికి అడవి మృగాలను పంపిస్తాను. అవి మీ పిల్లలను మీ దగ్గరనుండి లాక్కొనిపోతాయి. అవి మీ పశువుల్ని నాశనం చేస్తాయి. అవి మీ సంఖ్యను క్షీణింప చేస్తాయి. రహదారులు ఖాళీగా ఉంటాయి గనుక ప్రయాణం చేయటానికి ప్రజలు భయపడతారు.
LEV 26:23 “అన్ని జరిగినా మీరు పాఠం నేర్చుకోకపోతే, ఇంకా అప్పటికీ నాకు మీరు విరుద్ధంగా తిరిగితే,
LEV 26:24 అప్పుడు నేను కూడా మీకు విరుద్ధంగా తిరుగుతాను. నేను, అవును నేనే, మీ పాపాలకోసం ఏడుసార్లు మిమ్మల్ని శిక్షిస్తాను.
LEV 26:25 మీరు నా ఒడంబడికను ఉల్లంఘించారు కనుక నేను మిమ్మల్ని శిక్షిస్తాను. సైన్యాలను నేను మీమీదికి రప్పిస్తాను. భద్రతకోసం మీరు మీ పట్టణాల్లోకి పారిపోతారు. కాని నేను మీ మధ్య వ్యాధుల్ని వ్యాపింప జేస్తాను. అప్పుడు మీ శత్రువు మిమ్మల్ని ఓడించేస్తాడు.
LEV 26:26 ఆ పట్టణంలో మిగిలిపోయిన ధాన్యంలో కొంత భాగం నేను మీకు ఇస్తాను. కానీ తినేందుకు బహుకొంచెం మాత్రమే ఆహారం ఉంటుంది. వారి భోజనాన్ని అంతా ఒక్క పాత్రలో పదిమంది ఆడవాళ్లు వండగలుగుతారు. ఆ భోజనం ముద్దలు ఒక్కొక్కదాన్ని వారు లెక్కబెట్టగలుగుతారు. మీరు తింటారు గాని మీ ఆకలి తీరదు.
LEV 26:27 “మీరు ఇంకా నా మాట వినకపోతే, ఇంకా నాకు విరోధంగా ఉంటే
LEV 26:28 అప్పుడు నేను నిజంగా నా కోపం చూపిస్తాను. నేను, అవును నేనే, మీ పాపాలకోసం ఏడుసార్లు మిమ్మల్ని శిక్షిస్తాను.
LEV 26:29 మీ కుమారులు, కుమార్తెల శరీరాల్ని మీరు తింటారు.
LEV 26:30 మీ ఉన్నత స్థలాలను నేను నాశనం చేస్తాను. మీ ధూప వేధికలను నేను పడగొట్టేస్తాను. మీ శవాలను మీ విగ్రహాల శవాల మీద నేను పడవేస్తాను. మీరు నాకు చాలా అసహ్యంగా ఉంటారు.
LEV 26:31 మీ పట్టణాలను నేను నాశనం చేస్తాను. మీ పరిశుద్ధ స్థలాన్ని నేను శూన్యం చేస్తాను. మీ అర్పణల సువాసన నేను ఆఘ్రాణించను.
LEV 26:32 మీ పట్టణాల్లో నివసించేందుకు వచ్చే మీ శత్రువులు చూచి అదిరి పోయేంతగా మీ దేశాన్ని నేను ఖాళీ చేస్తాను.
LEV 26:33 ఇంకా నేను మిమ్మల్ని రాజ్యాల్లో చెదరగొట్టేస్తాను. నేను నా ఖడ్గం దూసి, మిమ్మల్ని నాశనం చేస్తాను. మీ దేశం శూన్యంగాను, మీ పట్టణాలు చెత్తగాను ఉంటాయి.
LEV 26:34 “మిమ్మల్ని మీ శత్రువులు తమ దేశానికి తీసుకొని పోతారు. మీ దేశం ఖాళీ అయిపోతుంది. అందుచేత మీ భూమికి చివరికి విశ్రాంతి లభిస్తుంది. భూమి దాని విశ్రాంతిని అనుభవిస్తుంది.
LEV 26:35 ఏడేండ్లకు ఒకసారి ఒక సంవత్సరం పాటు భూమికి విశ్రాంతి ఉండాలని ఆజ్ఞ ప్రబోధిస్తుంది. మీరు దానిలో నివసించినప్పుడు దానికి మీరు ఇవ్వని విశ్రాంతిని, భూమి ఖాళీగా ఉన్న ఆ సమయంలో అది పొందుతుంది.
LEV 26:36 శేషించిన ప్రజలు వారి శత్రు దేశంలో ధైర్యం కోల్పోతారు. ప్రతిదానికీ వారు భయపడిపోతారు. గాలికి కొట్టుకొని పోయే ఆకులా వారు అటుఇటు పరుగులెత్తుతారు. ఎవరో వారిని కత్తితో తరుముతున్నట్టు వారు పరుగులెడతారు. వారిని ఎవరూ తరమక ముందే వారు పడిపోతారు.
LEV 26:37 ఎవరో వారిని కత్తితో తరుముతున్నట్టుగా వారు పరుగులెడతారు. వారిని ఎవరూ తరమకుండానే వారు ఒకరిమీద ఒకరు కూలిపోతారు. “మీరు మీ శత్రువులను ఎదిరించి నిలిచే అంతటి బలం మీకు ఉండదు.
LEV 26:38 ఇతర దేశాల్లో తప్పిపోతారు. మీ శత్రుదేశాల్లోనికి మీరు అదృశ్యమవుతారు.
LEV 26:39 కనుక మిగిలిన వాళ్లు వారి పాపంవలన వారి శత్రుదేశంలో క్షీణించిపోయెదరు. వారు కూడా వారి పూర్వీకులవలెనే, వారి పాపంవలన క్షీణించిపోయెదరు.
LEV 26:40 “అయితే ఒకవేళ ప్రజలు వారి పాపాలు ఒప్పుకొంటారేమో. వారు, వారి పూర్వీకుల పాపాలు ఒప్పు కొంటారేమో. ఒకవేళ వారు నాకు విరోధంగా తిరిగినట్టు ఒప్పుకోవచ్చు. ఒకవేళ వారు నాకు విరోధంగా పాపం చేసినట్టు ఒప్పుకోవచ్చు.
LEV 26:41 ఒకవేళ నేను వారికి విరోధంగా తిరిగి వారి శత్రుదేశంలోనికి నేనే వాళ్ళను తీసుకొని పోయినట్టు వారు ఒప్పుకోవచ్చు. ఆ ప్రజలు నన్ను ఎరుగని వాళ్లలా ప్రవర్తించారు. వాళ్లు తగ్గించు కొని, వారి పాపపు శిక్షను స్వీకరిస్తే
LEV 26:42 అప్పుడు యాకోబుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఇస్సాకుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. అబ్రాహాముతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ దేశాన్ని నేను జ్ఞాపకం చేసుకొంటాను.
LEV 26:43 “ఈ దేశం ఖాళీ అవుతుంది. భూమి దాని విశ్రాంతి సమయాన్ని అనుభవిస్తుంది. అప్పుడు మిలిగిన వాళ్లు వారి పాపపు శిక్షను అంగీకరిస్తారు. వారు నా ఆజ్ఞలను ద్వేషించి, నా నియమాలను విధేయులయ్యేందుకు నిరాకరించినందువల్లే వారు శిక్ష పొందినట్టు వారు గ్రహిస్తారు.
LEV 26:44 వాస్తవంగా వారు పాపం చేసారు. అయితే సహాయంకోసం వారు నా దగ్గరకు వస్తే, నేను వారినుండి తిరిగిపోను. వారు వారి శత్రువుల దేశంలో ఉన్నప్పుటికీ నేను వారి మొర అలకిస్తాను. నేను వారిని పూర్తిగా నాశనం చెయ్యను. వారితో నా ఒడంబడికను తెగతెంపులు చేయను. నేను యెహోవాను, వారి దేవుణ్ణి.
LEV 26:45 వారి పూర్వీకులతో నాకుగల ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నేను వారికి దేవునిగా ఉండేందుకు నేను వారి పూర్వీకుల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించాను. ఇతర రాజ్యాలు వాటన్నింటినీ చూసాయి. నేను యెహోవాను!”
LEV 26:46 అవి యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన చట్టాలు, నియమాలు, ప్రబోధాలు. యెహోవాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఆ ఆజ్ఞలే ఒక ఒడంబడిక. సీనాయి పర్వతం దగ్గర ఆ ఆజ్ఞలను యెహోవా ఇచ్చాడు. ఆయన వాటిని మోషేకు ఇవ్వగా, మోషే వాటిని ప్రజలకు యిచ్చాడు.
LEV 27:1 యెహోవా మోషేతో చెప్పాడు:
LEV 27:2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఒకవ్యక్తి యెహోవాకు ఒక ప్రత్యేక వాగ్దానం చేయవచ్చు. ఆ వ్యక్తి ఒక మనిషిని యెహోవాకు అర్పిస్తానని వాగ్దానం చేసి ఉండొచ్చు. అలాగైతే ఆ మనిషి ఒక ప్రత్యేక విధానంలో యెహోవాను సేవించాలి. ఆ మనిషికి యాజకుడు కొంత విలువ నిర్ణయించాలి. ప్రజలు ఆ మనిషిని యెహోవా దగ్గర తిరిగి కొనాలంటే వారు ఆ విలువ చెల్లించాలి.
LEV 27:3 ఇరవై నుండి అరవై సంవత్సరాల వయసుగల ఒక మగవాడి విలువ యాభై తులాల వెండి. (వెండిని తూచేందుకు పవిత్ర స్థలంలోని అధికారిక కొలతనే మీరు ఉపయోగించాలి).
LEV 27:4 ఇరవై నుండి అరవై సంవత్సరాల వయస్సుగల ఒక స్త్రీ విలువ ముప్పైతులాలు.
LEV 27:5 ఐదు నుండి ఇరవై సంవత్సరాల వయస్సుగల ఒక మగవాని విలువ ఇరవైతులాలు. ఐదు నుండి ఇరవై సంవత్సరాల వయస్సుగల ఒక స్త్రీ విలువ పది తులాలు.
LEV 27:6 ఒక నెలనుండి ఐదు సంవత్సరాల వయస్సుగల ఒక మగ శిశువు వెల ఐదు తులాలు. ఆడ శిశువు వెల మూడు తులాలు.
LEV 27:7 అరవై సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న ఒక మగవాని వెల పదిహేను తులాలు. ఒక స్త్రీ వెల పది తులాలు.
LEV 27:8 “ఒక మనిషి ఆ వెల చెల్లించలేనంత పేదవాడైతే ఆ వ్యక్తిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ వ్యక్తి ఎంత మొత్తం చెల్లించగలడు అనే విషయం యాజకుడు తీర్మానిస్తాడు.
LEV 27:9 “కొన్ని జంతువులు యెహోవాకు బలిగా ఉపయోగపడతాయి. అలాంటి ఒక జంతువును ఒక వ్యక్తి తీసుకొని వస్తే, ఆ జంతువు పవిత్రం అవుతుంది.
LEV 27:10 ఆ వ్యక్తి ఆ జంతువునే యోహోవాకు ఇస్తానని వాగ్దానం చేసాడు గనుక దానికి బదులు ఇంకోదాన్ని యివ్వటానికి అతడు ప్రయత్నించకూడదు. ఇంకో దానితో దీన్ని మార్చేందుకు అతడు ప్రయత్నించకూడదు. మంచి జంతువుకు బదులుగా పనికిరాని జంతువును మార్చాలని అతడు ప్రయత్నించకూడదు. పనికిరాని జంతువుకు బదులుగా మంచి జంతువును మార్చాలనీ అతడు ప్రయత్నించకూడదు. ఆ మనిషి అలా జంతువుల్ని మార్చటానికి ప్రయత్నిస్తే, అప్పుడు ఆ జంతువులు రెండూ పవిత్రం అవుతాయి. అందుచేత అవి రెండూ యెహోవాకే చెందుతాయి.
LEV 27:11 “కొన్ని జంతువులు యెహోవాకు అర్పించేందుకు పనికిరావు. అలాంటి అపవిత్ర జంతువును ఒకదాన్ని ఒకడు యోహోవాకు యిచ్చేందుకు తీసుకొనివస్తే, అప్పుడు ఆ జంతువును యాజకుని దగ్గరకు తీసుకొనిరావాలి.
LEV 27:12 యాజకుడు ఆ జంతువుకు విలువ నిర్ణయం చేస్తాడు. యాజకుడు వెల నిర్ణయం చేసిన తర్వాత ఆ జంతువు మంచిదేగాని పనికిరానిదేగాని, దాని వెల అంతే.
LEV 27:13 ఒక వేళ ఆ వ్యక్తి తిరిగి జంతువును కొనుక్కోవాలనుకొంటే, అతడు దాని వెలకు అయిదో వంతు అదనంగా చెల్లించాలి.
LEV 27:14 “ఇప్పుడు ఒక వ్యక్తి తన ఇంటిని యెహోవాకు పవిత్రంగా ప్రతిష్ఠ చేస్తే, యాజకుడు దాని వెల నిర్ణయం చేయాలి. యాజకుడు అలా వెల నిర్ణయిస్తే ఆ ఇల్లు మంచిదేగాని, పనికి రానిదేగాని ఆ వెల అంతే.
LEV 27:15 అయితే ఆ ఇంటిని ఇచ్చిన వ్యక్తి తిరిగి దానిని తీసుకొనగోరితే, దాని విలువకు అయిదోవంతు అదనంగా చెల్లించాలి. అప్పుడు ఆ ఇల్లు ఆ వ్యక్తికి చెందుతుంది.
LEV 27:16 “ఒక వ్యక్తి తన పొలాల్లో కొంత భాగం యెహోవాకు ప్రతిష్ఠ చేస్తే, దానిలో నాటేందుకు ఎంత విత్తనం అవసరం ఉంటుందో అనేదానిమీద ఆ పొలాల వెల ఆధారపడి ఉంటుంది. పది తూముల యవల విత్తనాల వెల ఏబై తులాల వెండితో సమానము
LEV 27:17 ఒకవేళ బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ వ్యక్తి తన పొలాన్ని కానుకగా యిస్తే, యాజకుడు నిర్ణయించేదేదాని వెల అవుతుంది.
LEV 27:18 కానీ ఆ వ్యక్తి బూరధ్వని మహోత్సన కాలం దాటిపోయాక తన పొలాన్ని కానుకగా యిస్తే, దాని ఖచ్చితమైన వెలను యాజకుడు నిర్ణయించాలి. తర్వాత వచ్చే బూరధ్వని మహోత్సవ కాలానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అతడు లెక్కించాలి. అప్పుడు ఆ లెక్క ఆధారంగా వెలకట్టాలి.
LEV 27:19 ఒకవేళ తన పొలాన్ని కానుకగా యిచ్చిన వ్యక్తి తిరిగి తన పొలాన్ని తీసుకోవాలనుకొంటే, దాని వెలకు అయిదో వంతు అతడు అదనంగా చెల్లించాలి. అప్పుడు ఆ పొలం తిరిగి అతనిదే అవుతుంది.
LEV 27:20 “ఆ వ్యక్తి ఆ పొలాన్ని తిరిగి కొనకపోతే, అప్పుడు ఆ పొలం ఎల్లప్పుడూ యాజకులకే చెందుతుంది. ఒకవేళ ఆ భూమిని మరొకరికి అమ్మివేస్తే, ఆ మొదటి వ్యక్తి తిరిగి ఆ పొలం కొనేందుకు వీల్లేదు.
LEV 27:21 ఒకవేళ ఆ వ్యక్తి గనుక ఆ పొలాన్ని మళ్లీ కొనకపొతే, బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ భూమి యోహోవాకు పవిత్రంగా ఉండిపోతుంది. అది శాశ్వతంగా యాజకునిదే అవుతుంది. అది సంపూర్ణంగా యెహోవాకు ఇవ్వబడిన భూమిగా ఉంటుంది.
LEV 27:22 “ఒకవేళ ఒక వ్యక్తి అతడు కొన్న పొలాన్ని యోహోవాకు ప్రతిష్ఠస్తే, అది అతని స్వంత పొలంలో ఒక భాగం కానప్పుడు.
LEV 27:23 యాజకుడు బూరధ్వని చేసే మహోత్సవ కాలంవరకుగల సంవత్సరాలను లెక్కించి, దాని ప్రకారం ఆ పొలం వెల నిర్ణయించాలి. అప్పుడు ఆ భూమి యెహోవాదే అవుతుంది.
LEV 27:24 బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ భూమి దాని స్వంతదారునిది అవుతుంది. ఆ భూమి ఏ కుటుంబంవారి స్వంతమో తిరిగి వారికే దక్కుతుంది.
LEV 27:25 “ఆ ధరలు చెల్లించేందుకు పవిత్రస్థలంలోని అధికారిక కొల తనే మీరు ఉపయోగించాలి. పవిత్ర స్థలంలో అధికారతులం బరువు 20 చిన్నాలు.
LEV 27:26 “పశువుల్ని, గొర్రెల్ని, ప్రజలు యెహోవాకు కానుకగా ఇవ్వవచ్చును. అయితే ఆ జంతువు తొలిచూలు అయితే అది ముందే యెహోవాది. కనుక తొలిచూలు వాటిని ప్రజలు కానుకగా యివ్వలేరు.
LEV 27:27 తొలిచూలు జంతువులను ప్రజలు యెహోవాకు ఇవ్వాలి. అయితే ఆ తొలిచూలు జంతువు అపవిత్రమైనదిగా ఉంటే అప్పుడు ఆ వ్యక్తి తిరిగి దానిని కొనుక్కోవాలి. ఆ జంతువు వెల యాజకుడు నిర్ణయించగా, ఆ వ్యక్తి, దాని వెలకు అయిదోవంతు అదనంగా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి గనుక ఆ జంతువును తిరిగి కొనలేకపోతే, యాజకుడు తానే నిర్ణయించే వెలకు ఆ జంతువును అమ్మివేయాలి.
LEV 27:28 “ప్రజలు యెహోవాకు ఇచ్చే ఒక ప్రత్యేక రకమైన కానుక ఉంది. ఆ కానుక సంపూర్ణంగా యెహోవాదే అవుతుంది. ఆ కానుకను అమ్మటానికి, తిరిగి కొనడానికి వీల్లేదు. ఆ కానుక యెహోవాకు చెందినది. ప్రజలు, జంతువులు, కుటుంబపు ఆస్తిలోని పొలాలు ఆ కానుక కావచ్చును.
LEV 27:29 ఒకవేళ ఆ ప్రత్యేకమైన కానుక ఒక వ్యక్తి అయివుంటే ఆ వ్యక్తిని తిరిగి కొనేందుకు వీల్లేదు. ఆ వ్యక్తి చంపబడవలసినదే.
LEV 27:30 “పంటలన్నింటిలో పదోవంతు యెహోవాకు చెందుతుంది. అంటే పొలాల్లోని పంటలు, చెట్ల ఫలాలు అని అర్ధం. ఆ పదోవంతు యెహోవదే అవుతుంది.
LEV 27:31 కనుక ఎవరైనా తన పదోవంతు తిరిగి తీసుకోవాలి అనుకొంటే. వారు దాని వెలకు అయిదో వంతు అదనంగా చెల్లించి, అప్పుడు దానిని తిరిగి కొనుక్కోవాలి.
LEV 27:32 “ఒక వ్యక్తికిగల పశువులు, గొర్రెలలో నుండి ప్రతి పదో జంతువును యాజకులు తీసుకోవాలి. పదోజంతువు ప్రతీదీ యెహోవాదే అవుతుంది.
LEV 27:33 కోరుకొన్న ఆ జంతువు మంచిదైనా చెడ్డదైనా, దాని స్వంతదారుడు చింతించవలసిన అవసరం లేదు. అతడు ఆ జంతువును మరో జంతువుతో మార్చకూడదు. అలా మరో జంతువుతో దాన్ని మార్చాలని అతడు నిర్ణయించుకొంటే అప్పుడు ఆ రెండు జంతువులూ యెహోవావే అవుతాయి. ఆ జంతువును తిరిగికొనేందుకు వీల్లేదు.”
LEV 27:34 సీనాయి పర్వతం దగ్గర మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అవి. అవి ఇశ్రాయేలు ప్రజలకోసమైన ఆజ్ఞలు.
NUM 1:1 సన్నిధి గుడారంలో మోషేతో యెహోవా ఇలా మాట్లాడాడు. ఇది సీనాయి అరణ్యంలో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన రెండవ సంవత్సరం రెండవ నెల మొదటి రోజు అది, మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
NUM 1:2 “ఇశ్రాయేలు ప్రజలందరి సంఖ్యను లెక్కించు. ప్రతి పురుషుని పేరు అతని వంశం, కుటుంబంతో పాటు జాబితా చేయి
NUM 1:3 ఇశ్రాయేలు పురుషులందరినీ, నీవు, అహరోను లెక్కించాలి. 20 సంవత్సరాలు, అంతకు ఎక్కువ వయస్సు ఉన్న వారిని మీరు లెక్కించాలి. (వారు ఇశ్రాయేలు సైన్యంలో ఉండదగిన వాళ్లు.) వారి వంశాల ప్రకారం వారి జాబితా చేయి.
NUM 1:4 ప్రతి కుటుంబము నుండి ఒక మనిషి మీకు సహాయం చేస్తాడు, ఈ మనిషి తన వంశానికి నాయకుడుగా ఉంటాడు,
NUM 1:5 మీతో ఉండి మీకు సహాయం చేసే పురుషుల పేర్లు ఇవి; రూబేను వంశంనుండి-షెదేయూరు కుమారుడు ఎలీసూరు;
NUM 1:6 షిమ్యోను వంశంనుండి—సూరీషద్దాయి కుమారుడు షెలుమీయేలు
NUM 1:7 యూదా వంశంనుండి అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను.
NUM 1:8 ఇశ్శాఖారు వంశంనుండి సూయారు కుమారుడు నెతనేలు.
NUM 1:9 జెబూలూను వంశంనుండి హెలోను కుమారుడు ఎలీయాబు.
NUM 1:10 యోసేపు సంతానమందు ఎఫ్రాయిము వంశంనుండి అమిహూదు కుమారుడు ఎలీషామాయు మనష్షే వంశంనుండి పెదాసూరు కుమారుడు గమలీయేలు.
NUM 1:11 బెన్యామీను వంశంనుండి గిద్యోనీ కుమారుడు అబీదాను.
NUM 1:12 దాను వంశంనుండి అమీషద్దాయి కుమారుడు అహీయెజెరు.
NUM 1:13 ఆషెరు వంశంనుండి ఒక్రాను కుమారుడు పగీయేలు.
NUM 1:14 గాదు వంశంనుండి దెయూవేలు కుమారుడు ఎలాసాపు;
NUM 1:15 నఫ్తాలి వంశంనుండి ఏనాను కుమారుడు అహీర.”
NUM 1:16 ఈ పురుషులు వారి కుటుంబాలకు నాయకులు, వారి వంశాలకు నాయకులుగా కూడా, ప్రజలు ఈ పురుషులను ఏర్పటు చేసుకొన్నారు.
NUM 1:17 పేరు పేరునా ఈ పురుషులు ఏర్పరచుకోబడ్డారు. కనుక రెండవ నెల మొదటి రోజున ఈ పురుషులను, ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే అహరోనులు పిలిచారు. అప్పుడు ప్రజలు వారి కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం జాబితా చేయబడ్డారు. 20 సంవత్సరాలు, అంతకు పై బడిన పురుషులు అంతా జాబితాలో ఉన్నారు.
NUM 1:19 సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినట్లే మోషే చేసాడు. ప్రజలు సీనా అరణ్యంలో ఉన్నప్పుడే మోషే వారిని లెక్కించాడు.
NUM 1:20 ఇశ్రాయేలు జ్యేష్ఠకుమారుడు రూబేను యొక్క సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు లేక అంతకు ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగలిగిన పురుషులందరి పేర్లు వ్రాయబడ్డాయి. వారు వారి కుటుంబాలు, వంశాలతో కూడ జాబితాలో చేర్చబడ్డారు.
NUM 1:21 రూబేను సంతతినుండి లెక్కించబడిన పురుషుల సంఖ్య మొత్తం 46,500.
NUM 1:22 షిమ్యోను సంతతి లెక్కించబడ్డారు. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు, వారి కుటుంబాలు, వంశాలతో బాటు జాబితాలో చేర్చబడ్డారు.
NUM 1:23 షిమ్యోను సంతతినుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 59,300.
NUM 1:24 గాదు సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు అంతకంటె, ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతో బాటు వారు జాబితాలో చేర్చబడ్డారు.
NUM 1:25 గాదు సంతతి నుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 45,650.
NUM 1:26 యూదా సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగలిగిన పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు, వారి కుటుంబాలు, వంశాలతో బాటు జాబితాలో చేర్చబడ్డారు.
NUM 1:27 యూదా సంతతి నుండి లెక్కించబడ్డ పురుషులు మొత్తం 74,600.
NUM 1:28 ఇశ్శాఖారు సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు కలిగి ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు, వారి కుటుంబాలు, వంశాలతో బాటు జాబితాలో చేర్చబడ్డారు.
NUM 1:29 ఇశ్శాఖారు సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 54,400.
NUM 1:30 జెబులూను సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు వారి కుటుంబాలు, వంశాలతోబాటు జాబితాలో చేర్చబడ్డారు.
NUM 1:31 జెబులూను సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 57,400.
NUM 1:32 యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారు వారి కుటుంబాలు, వంశాలతో బాటు జాబితాలో చేర్చబడ్డారు.
NUM 1:33 ఎఫ్రాయిము సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 40,500.
NUM 1:34 యోసేపు కుమారుడైన మనష్షే సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతోబాటు వారు జాబితాలో చేర్చబడ్డారు.
NUM 1:35 మనష్షే సంతతినుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 32,200.
NUM 1:36 బెన్యామీను సంతతి లెక్కించబడింది, 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతో బాటు వారు జాబితాలో చేర్చబడ్డారు.
NUM 1:37 బెన్యామీను సంతతితో లెక్కించబడిన పురుషులు మొత్తం 35,400.
NUM 1:38 దాను సంతతి లెక్కించబడింది. 20 సంవ త్సరాలు అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతోబాటు వారు జాబితాలో చేర్చబడ్డారు.
NUM 1:39 దాను సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 62,700.
NUM 1:40 ఆషేరు సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతో బాటు వారు జాబితాలో చేర్చబడ్డారు.
NUM 1:41 ఆషేరు సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 41,500.
NUM 1:42 నఫ్తాలి సంతతి లెక్కించబడింది. 20 సంవత్సరాలు అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, యుద్ధంలో పని చేయగల పురుషులందరి పేర్లు జాబితాలో చేర్చబడ్డాయి. వారి కుటుంబాలు, వంశాలతోబాటు వారు జాబితాలో చేర్చబడ్డారు.
NUM 1:43 నఫ్తాలి సంతతిలో లెక్కించబడిన పురుషులు మొత్తం 53,400.
NUM 1:44 ఈ పురుషులందర్నీ మోషే, అహరోను ఇశ్రాయేలు పెద్దలు లెక్కించారు. (పన్నెండుమంది నాయకులు, ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉన్నారు.)
NUM 1:45 ఇశ్రాయేలీయులలో 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉండి, సైన్యంలో పని చేయగల ప్రతి పురుషుడు లెక్కించబడ్డాడు. అ పురుషులు వారి వంశాలతో బాటు లెక్కించబడ్డారు.
NUM 1:46 పురుషుల సంఖ్య మొత్తం 6,03,550.
NUM 1:47 లేవీ వంశపు కుటుంబాలు ఇశ్రాయేలీయులలో ఇతరులతో బాటు జాబితాలో లెక్కించబడలేదు.
NUM 1:48 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,
NUM 1:49 “లేవీ వంశంలోని పురుషులను నీవు లెక్కించకూడదు. ఇశ్రాయేలు ప్రజలలో ఇతరులతో భాగంగా వీరిని చేర్చకు.
NUM 1:50 ఒడంబడిక పవిత్ర గుడారానికి వారు బాధ్యులని లేవీ మనుష్యులతో చెప్పు. దాని విషయం, దానితోబాటు ఉండె వాటన్నింటి విషయం, వారు జాగ్రత్త తీసుకోవాలి. పవిత్ర గుడారాన్ని, దానిలో ఉండే వాటన్నింటినీ వారు మోయాలి. వారి నివాసం దాని చుట్టు ఏర్పపరచుకొని, దానినిగూర్చి జాగ్రత్త తీసుకోవాలి.
NUM 1:51 పవిత్ర గుడారం ఎప్పుడైనా ముందుకు తీసుకుని పోదలిస్తే లేవీ మనుష్యులే అది చేయాలి. ఎప్పుడైనా సరే ఒకచోట పవిత్రగుడారం వేయబడితే, అది లేవీ మనుష్యులే వేయాలి. పవిత్ర గుడారం విషయం జాగ్రత్త తీసుకునేవారు వాళ్లే. లేవీ కుటుంబానికి చెందనివారు ఇంకెవరయినా గుడారాన్ని గూర్చి శ్రద్ధ తీసుకునేందుకు ప్రయత్నిస్తే, అతడు చంపివేయబడతాడు.
NUM 1:52 ఇశ్రాయేలు ప్రజలు వేరు వేరు వంశాలుగా వారి నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి మనిషీ తన కుటుంబ ధ్వజానికి దగ్గరగా డేరాలు వేయాలి.
NUM 1:53 అయితే లేవీ ప్రజలు పవిత్ర గుడారం చుట్టూ డేరాలు వేయాలి. ఒడంబడిక పవిత్ర గుడారాన్ని లేవీ ప్రజలు కాపాడుతారు. ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి కీడూ జరుగకుండా వారు పవిత్ర గుడారాన్ని కాపాడుతారు.”
NUM 1:54 కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన విషయాలన్నింటిలో ఇశ్రాయేలీయులు విధేయులయ్యారు.
NUM 2:1 మోషే, అహరోనులతో యెహోవా ఇలా అన్నాడు:
NUM 2:2 “ఇశ్రాయేలు ప్రజలు వారి డేరాను సన్నిది గుడారం చుట్టూ వేసుకోవాలి. ఒక్కోవంశానికి దాని స్వంత ధ్వజం ఉంటుంది, ఎవరి వంశ ధ్వజం దగ్గర వారు నివాసం చేయాలి.
NUM 2:3 “యూదా డేరా పతాకం తూర్పుపక్క అంటే సూర్యోదయ దిశన ఉంటుంది. యూదా ప్రజలకు అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను నాయకుడు.
NUM 2:4 ఈ విభాగములో 74,600 మంది పురుషులు ఉన్నారు.
NUM 2:5 “యూదావారి పక్కన ఇశ్శాఖారు వంశంవారి డేరా ఉంటుంది. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు వంశానికి నాయకుడు.
NUM 2:6 ఈ విభాగములో 54,400 మంది ఉన్నారు.
NUM 2:7 “జెబూలూను వంశం కూడ యూదా వంశం పక్కగానే ఉంటారు. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూను వారికి నాయకుడు.
NUM 2:8 ఈ విభాగములో 57,400 మంది ఉన్నారు.
NUM 2:9 “యూదా సంతతిలో 1,86,400 మంది పురుషులు ఉన్నారు. వీరంతా వారివారి వంశాల ప్రకారముగా విభజించబడ్డారు. ప్రజలు ఒక చోటనుండి మరో చోటకు తరలి వెళ్లేటప్పుడు యూదా వంశం వారు ముందుగా నడుస్తారు.
NUM 2:10 “పవిత్ర గుడారానికి దక్షిణాన రూబేను డేరా ధ్వజం ఉంటుంది. ఒక్కో వంశం దాని ధ్వజం దగ్గర నివాసం చేస్తారు. షెదేయూరు కుమారుడు ఏలీసూరు రూబేను వారికి నాయకుడు.
NUM 2:11 ఈ విభాగములో 46, 500 మంది ఉన్నారు.
NUM 2:12 “రూబేను వంశానికి పక్కగా షిమ్యోను వంశంవారు నివాసం చేస్తారు. సూరీషద్దాయి కుమారుడు షెలుమీయేలు, షిమ్యోను వారికి నాయకుడు.
NUM 2:13 ఈ విభాగములో 59,300 మంది ఉన్నారు.
NUM 2:14 “గాదు వంశంకూడ రూబేను వారి పక్కగా నివాసంచేస్తారు. రగూయేలు కుమారుడైన ఎలీయాసావు గాదు వారికి నాయకుడు.
NUM 2:15 ఈ విభాగములో 45,650 మంది ఉన్నారు.
NUM 2:16 “మొత్తం రూబేను నివాసంలో ఉన్న విభాగములన్నిటిలో కలిసి 1,51,450 మంది పురుషులు ఉన్నారు. ప్రజలు ఒక చోటనుండి మరోచోటికి తరలి వెళ్లేటప్పుడు రూబేను వంశం రెండో విభాగముగా బయల్దేరుతుంది.
NUM 2:17 “ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు లేవీ వంశంవారు తర్వాత బయల్దేరతారు. సన్నిధి గుడారం వారితో బాటు ఇతర వంశాలవారి మధ్య ఉంటుంది. వారు బయల్దేరి వెళ్లే క్రమంలోనే వారి నివాసం ఏర్పాటు చేసుకొంటారు. ప్రతి వ్యక్తి తన వంశ ధ్వజం దగ్గర ఉంటాడు.
NUM 2:18 “ఎఫ్రాయిము వారి గుడారపు ధ్వజం పడమటి దిక్కున ఉంటుంది. ఎఫ్రాయిము విభాగములు అక్కడ నివసిస్తాయి. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము ప్రజలకు నాయకుడు.
NUM 2:19 ఈ విభాగములో 40,500 మంది ప్రజలు ఉన్నారు.
NUM 2:20 “ఎఫ్రాయిము కుటుంబానికి పక్కగా మనష్షే వంశం నివసిస్తుంది. పెదాసూరు కుమారుడు గమలీయేలు మనష్షే మనుష్యులకు నాయకుడు.
NUM 2:21 ఈ విభాగములో 32,200 మంది మనుష్యులు ఉన్నారు.
NUM 2:22 “బెన్యామీను వంశం కూడ ఎఫ్రాయిము కుటుంబానికి పక్కగా నివాసం చేస్తారు. గిద్యోనీ కుమారుడు అబీదాను బెన్యామీను ప్రజలకు నాయకుడు.
NUM 2:23 ఈ విభాగములో 35,400 మంది మనుష్యులు ఉన్నారు.
NUM 2:24 “ఎఫ్రాయిము నివాసములో మొత్తం 1,08,100 పురుషులు ఉన్నారు. ప్రజలు ఒక చోటునుండి మరోచోటుకు తరలి వెళ్లినప్పుడు వారు మూడో కుటుంబంగా బయల్దేరతారు.
NUM 2:25 “దాను వారి గుడారపు ధ్వజం ఉత్తర దిశనఉంటుంది. దాను కుటుంబ విభాగాలు అక్కడ నివసిస్తాయి. అమీషద్ధాయి కుమారుడైన అహీయెజెరు దాను వారికి నాయకుడు.
NUM 2:26 ఈ విభాగములో 62,700 మంది ప్రజలు ఉన్నారు.
NUM 2:27 “ఆషేరు వంశాల వారు దాను కుటుంబ విభాగము పక్కగా నివాసం చేస్తారు. ఒక్రాను కుమారుడు పగీయేలు, ఆషేరు ప్రజల నాయకుడు.
NUM 2:28 ఈ వంశలో 41,500 మంది ప్రజలు ఉన్నారు.
NUM 2:29 “నఫ్తాలి వంశంకూడ దాను వంశానికి పక్కగా నివాసం చేస్తారు. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి ప్రజల నాయకుడు.
NUM 2:30 ఈ విభాగంలో 53,400 మంది ఉన్నారు.
NUM 2:31 “దాను నివాసంలో మొత్తం 1,57,600 మంది పురుషులు ఉన్నారు. ప్రజలు ఒక చోట నుండి మరో చోటుకు తరలినప్పుడు, వీరు చివరి కుటుంబముగా బయల్దేరతారు. వారు తమ స్వంత ధ్వజం క్రిందనే నివాసం చేస్తారు.”
NUM 2:32 అన్ని నివాసాలలోను ఉన్న మొత్తం వంశాలన్నింటిలో కలిపి 6,03,550 మంది పురుషులు ఉన్నారు.
NUM 2:33 మోషే ఇశ్రాయేలు ప్రజలందరిలో కలిపి లేవీయులను లెక్కించలేదు. ఇది యెహోవా ఇచ్చిన ఆజ్ఞ.
NUM 2:34 కనుక మోషేతో యెహోవా ెచెప్పిన వాటన్నింటికి ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు. యెహోవా వారితో చెప్పినట్టే ఇశ్రాయేలు ప్రజలు వారివారి పతాకాలదగ్గర నివాసం చేసారు. యెహోవా వారితో చెప్పిన విధానంలోనే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసారు. ప్రతి వ్యక్తి తన కుటుంబంతో, వంశంతోనే ఉన్నారు.
NUM 3:1 సీనాయి పర్వతం మీద మోషేతో యెహోవా మాట్లాడిన సమయంలో అహరోను, మోషేల కుటుంబ చరిత్ర ఇది.
NUM 3:2 అహరోనుకు కుమారులు నలుగురు. నాదాబు మొదటి కుమారుడు. ఆ తర్వాత అబీహు, ఎలీయాజరు, ఈతామారు.
NUM 3:3 ఈ కుమారులు అభిషేకించబడిన యాజకులు. యాజకులుగా యెహోవాను సేవించే ప్రత్యేక పని ఈ కుమారులుకు ఇవ్వబడింది.
NUM 3:4 అయితే నాదాబు, అబీహు యెహోవాను సేవిస్తూనే పాపంచేసారు గనుక వారు చనిపోయారు. వారు యెహోవాకు ఒక అర్పణ తయారు చేసారు కాని, యోహోవా అనుమతించని అగ్నిని వారు ఉపయోగించరు. ఇది సీనాయి అరణ్యంలో సంభవించింది. కనుక నాదాబు, అబీహు అక్కడే చనిపోయారు. వారికి కుమారులు లేనందుచేత ఎలీయాజరు, ఈతామారు యాజకులై యెహోవాను సేవించారు. వారి తండ్రి అహరోను జీవించి ఉండగానే వారు ఇలా చేసారు.
NUM 3:5 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
NUM 3:6 “లేవీ కుటుంబంలోని వాళ్లందర్నీ తీసుకునిరా, అహరోను యాజకుని దగ్గరకు వాళ్లను తీసుకునిరా. వారు అహరోనుకు సహాయకులు.
NUM 3:7 అహరోను సన్నిధి గుడారంలో పరిచర్య చేసేటప్పుడు లేవీయులు అహరోనుకు సహాయం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు పవిత్ర గుడారంలో ఆరాధించటానికి వచ్చినప్పుడు వాళ్లందరికి లేవీయులు సహాయం చేస్తారు.
NUM 3:8 సన్నిధి గుడారంలో సామగ్రి అంతటినీ ఇశ్రాయేలు ప్రజలు కాపాడాలి. అది వారి బాధ్యత. కానీ లేవీయులు వీటి విషయం జాగ్రత్త పుచ్చుకొని ఇశ్రాయేలు ప్రజలందరికీ సేవచేస్తారు. పవిత్ర గుడారంలో ఆరాధించటంలో ఇది వారి విధానం.
NUM 3:9 “లేవీయులు అశ్రాయేలు ప్రజలందరిలో నుండి ఏర్పాటు చేసుకోబడ్డారు. ఈ లేవీయులు అహరోనుకు, అతని కుమారులకు సహాయం చేసేందుకు ఏర్పాటు చేయబడ్డారు.”
NUM 3:10 “అహరోనును, అతని కుమారులను యాజకులుగా నీవు నియమించు. వారు, వారి బాధ్యతను నిర్వహిస్తూ యాజకులుగా సేవ చేయాలి, పవిత్ర వస్తువులను సమీపించేందుకు ప్రయత్నించే ఏ వ్యక్తి అయినా చంపివేయబడాలి.”
NUM 3:11 ఇంకా మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
NUM 3:12 “ఇశ్రాయేలీయులు ప్రతి కుటుంబంలోను పెద్దకుమారుణ్ణి నాకు ఇవ్వాలని, నేను నీతో చెప్పాను, కానీ నన్ను సేవించేందుకు ఇప్పుడు లేవీయులను నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. వారు నా వారై ఉంటారు. అందుచేత మిగిలిన ఇశ్రాయేలు ప్రజలంతా వారి పెద్ద కుమారులను నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు.
NUM 3:13 మీరు ఈజిప్టులో ఉన్నప్పుడు, ఈజిప్టు ప్రజల పెద్ద కుమారులందర్ని నేను చంపాను. ఆ సమియంలో ఇశ్రాయేలు పెద్ద కుమారులందరిని నా వాళ్లగా నేను అంగీకరించాను. పెద్ద కుమారుందరు నా వారు, పశువులలో ప్రథమంగా పుట్టినవన్నీ నావే. కానీ మీ పెద్దలందరినీ నేను మీకు తిరిగి ఇచ్చివేస్తున్నాను, మరియు లేవీయులను నా వారిగా చేసుకుంటున్నాను. నేను యెహోవాను.”
NUM 3:14 సీనాయి అరణ్యంలో మోషేతో మరోసారి యెహోవా మాట్లాడాడు: యెహోవా ఇలా చెప్పాడు,
NUM 3:15 “లేవీ వంశంలో ఉన్న లేవీలను, కుటుంబాలను అన్నింటినీ లెక్కించు. ప్రతి పురుషుని, ఒక నెలగాని అంతకంటె ఎక్కువగాని వయస్సు ఉన్న ప్రతి బాలుని లెక్కించు.”
NUM 3:16 కనుక మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. అతడు వాళ్లందర్నీ లెక్కించాడు.
NUM 3:17 లేవీకి ముగ్గురు కుమారులు. వారి పేర్లు: గెర్షోను, కహాతు, మెరారి.
NUM 3:18 ఒక్కో కుమారుడు ఎన్నో వంశాలకు నాయకుడు. గెర్షోను కుటుంబంలో, లిబ్నీ, షిమీ.
NUM 3:19 కహాతు కుటుంబంలో, అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు,
NUM 3:20 మెరారి కుటుంబంలో, మహలి, ముషి. ఇవి లేవీ వంశానకి చెందిన కుటుంబాలు.
NUM 3:21 లిబ్ని, షిమివంశాలు గెర్షోము కుటుంబానికి చెందినవి. అవి గెర్షోనీ వంశాలు.
NUM 3:22 ఈ రెండు కుటుంబాలలోను ఒక నెల వయసు దాటిన బాలురు, పురుషులు 7,500 మంది ఉన్నారు.
NUM 3:23 గెర్షోని కుటుంబాలు పశ్చిమాన నివాసం చేయాలని చెప్పబడింది. పవిత్ర గుడారం వెనుకవైపు వారు నివాసము చేసారు.
NUM 3:24 లాయెలు కుమారుడు ఎలీయా సావు గెర్షోనీ ప్రజల కుటుంబాలకు నాయకుడు.
NUM 3:25 పవిత్ర గుడారం, దాని కప్పు, వెలుపలి గుడారం కాపాడుట పవిత్ర గుడారంలో గెర్షోనీ ప్రజలు బాధ్యత. సన్నిధి గుడారం ప్రవేశంలో ఉన్న తెర బాధ్యత కూడా వారే తీసుకున్నారు.
NUM 3:26 ఆవరణలో తెర బాధ్యత కూడా వారే వహించారు. ఆవరణానికి గల ప్రవేశం యొక్కతెర విషయం కూడా వారే శ్రద్ధ పుచ్చుకున్నారు. పవిత్ర గుడారానికి, బలి పీఠానికి చుట్టూ ఉంది ఈ ఆవరణ. తాళ్ల విషయం, తెరలకు సంబంధించిన వాటన్నింటి విషయం వారే జాగ్రత్త తీసుకున్నారు.
NUM 3:27 అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు వంశాలు కహాతు కుటుంబానికి చెందినవి. వారు కహాతీ వంశపువారు.
NUM 3:28 పురుషులు ఒక నెల వయసు దాటిన బాలురు, 8,600 మంది ఈ కుటుంబంలో ఉన్నారు. పవిత్ర స్థలంలోని వాటిని కాపాడే బాధ్యత కహాతు ప్రజలకు ఇవ్వబడింది.
NUM 3:29 పవిత్ర గుడారం దక్షిణ దిశ కహాతీ వంశానికి ఇవ్వబడింది. ఇది వారు నివాసం చేసిన ప్రదేశం.
NUM 3:30 ఉజ్జీయేలు కుమారుడు ఎలీషాపాను కహాతీ వంశాల నాయకుడు.
NUM 3:31 పవిత్ర పెట్టె, బల్ల, దీపస్తంభం, పవిత్ర స్థలంలోని పాత్రలను కాపాడటం వారి బాధ్యత. తెర విషయం, దానితోబాటు ఉపయోగించిన వస్తువులన్నింటి విషయంకూడా వారు శ్రద్ధ తీసుకున్నారు.
NUM 3:32 అహరోను కుమారుడును యాజకుడైన ఎలియాజరు లేవీ ప్రజానాయకులకు నాయకుడు. పవిత్ర పరికరాలను కాపాడే వారందరిపై ఎలియాజరు పరీశీలకుడు.
NUM 3:33 మహలీ, మూషి కుటుంబాలు మెరారి వంశానికి చెందినవి. ఒక నెల దాటిన బాలురు, పురుషులు మహలీ కుటుంబంలో 6,200 మంది ఉన్నారు.
NUM 3:35 అబీహాయిలు కుమారుడైన సూరీయేలు మెరారి వంశానికి నాయకుడు. పవిత్ర గుడారం ఉత్తర ప్రదేశం ఈ వంశానికి ఇవ్వబడింది. ఇది వారు నివాసం చేసిన ప్రదేశం.
NUM 3:36 పవిత్ర గుడారపు చట్రాలను కాపాడే బాధ్యత మెరారి ప్రజలకు ఇవ్వబడింది. పవిత్ర గుడారపు చట్రాలతో బాటు వాటి పలకలను, అడ్డకర్రలను, స్తంభాలను. దిమ్మలను, పరికరాలను, దానికి సంబంధించిన వాటన్నింటినీ వారు కాపాడారు.
NUM 3:37 పవిత్ర గుడారం చుట్టు ప్రక్కల స్తంభాలన్నింటినీ వారు కాపాడారు. వాటి దిమ్మలు, మేకులు, తాళ్లు కూడ ఇందులో ఉన్నాయి.
NUM 3:38 సన్నిధి గుడారం ఎదుట పవిత్ర గుడారానికి తూర్పున మోషే, అహరోను, అతని కుమారులు విడిదిచేసారు. పవిత్ర స్థలాన్ని కాపాడే బాధ్యత వారికి ఇవ్వబడింది. ఇది ఇశ్రాయేలీయులందరి పక్షంగా వారు చేసారు. వేరే వారెవరైనా పవిత్ర స్థలం దగ్గరగా వస్తే చంపేయాల్సిందే.
NUM 3:39 లేవీ వంశంలో ఒక నెలగాని, అంతకు మించిగాని వయస్సున్న బాలురను పురుషులను లెక్కించమని మోషే, అహరోనులకు యెహోవా ఆజ్ఞాపించాడు. మొత్తం సంఖ్య 22,000.
NUM 3:40 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులలో ఒక నెలగాని అంతకంటె ఎక్కువగాని వయసుగల మొదట పుట్టిన బాలురను, పురుషులను అందరినీ లెక్కించు, వారి పేర్ల జాబితా ఒకటి తయారుచేయి.
NUM 3:41 ఇప్పుడు ఇశ్రాయేలీయుల పెద్ద కుమారులను నేను తీసుకోను. ఇప్పుడు యెహోవానగు నేను లేవీయులను స్వీకరిస్తాను. ఇశ్రాయేలీయులలో ఇతరుల పశువులలో మొదటి ఫలమంతటినీ తీసుకొనే బదులు లేవీయుల పశువుల మొదటి ఫలాన్ని నేను తీసుకుంటాను.”
NUM 3:42 కనుక యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషేచేసాడు. ఇశ్రాయేలు ప్రజలు పిల్లల్లో పెద్ద వారినందరినీ మోషే లెక్కించాడు.
NUM 3:43 ఒక నెల, అంతకంటె ఎక్కువ వయసుగల మొదట పుట్టిన బాలురను, పురుషులను మోషే జాబితా చేసాడు. ఆ జాబితాలో 22,273 మంది ఉన్నారు.
NUM 3:44 మోషేతో యెహోవా ఇంకా ఇలా అన్నాడు:
NUM 3:45 “నేనే, యెహోవాను ఈ ఆజ్ఞ ఇస్తున్నాను: ‘ఇశ్రాయేలీయుల ఇతర కుటుంబాల్లోని మొదట పుట్టిన వారందరి బదులు లేవీయులను తీసుకో. మిగిలిన ప్రజల పశువులకు బదులు లేవీయుల పశువులను నేను తీసుకుంటాను. లేవీయులు నా వారు.
NUM 3:46 లేవీయులు 22,000 మంది ఉన్నారు కానీ, ఇతర కుటుంబాల్లోని పెద్ద కుమారులు 22,273 మంది ఉన్నారు. అనగా లేవీయులకంటె 273 మంది పెద్ద కుమారులు ఎక్కువగా ఉన్నారు.
NUM 3:47 కనుక ఆ 273 మందిలో ప్రతి ఒక్కరి వద్దా అధికారిక కొలతనుపయోగించి అయిదు తులాల వెండి తీసుకో. (ఇది 20 చిన్నములు బరువుగల అధికారిక కొలత.) ఇశ్రాయేలు ప్రజలవద్ద ఆ వెండి వసూలు చేయి.
NUM 3:48 ఆ వెండిని అహరోనుకు అతని కుమారులకు ఇవ్వు. అది 273 మంది ఇశ్రాయేలీయులకు విమోచనా ధనం.’”
NUM 3:49 కనుక 273 మంది కొరకు ఈ ధనాన్ని మోషే వసూలు చేసాడు. ఈ 273 మంది స్థానాన్ని లేవీ వంశం వహించలేకపోయింది.
NUM 3:50 ఇశ్రాయేలు ప్రజలలో మొదట పుట్టినవారినుండి వెండిని మోషే వసూలు చేసాడు. అధికారిక కొలత ప్రకారం 1,365 వెండి తులాలను అతడు వసూలు చేసాడు.
NUM 3:51 యెహోవాకు మోషే విధేయుడయ్యాడు. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అహరోనుకు, అతని కుమారులకు ఆ వెండిని మోషే ఇచ్చాడు.
NUM 4:1 మోషే అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు:
NUM 4:2 “కహాతు వంశంలోని కుటుంబాలకు చెందిన పురుషులను లెక్కించండి. (కహాతు వంశం లేవీ వంశంలోని ఒక భాగం.)
NUM 4:3 సైన్యంలో పని చేసిన వారిలో 30 నుండి 50 సంవత్సరాల వరకు వయసుగల పురుషులందరినీ లెక్కించండి. ఈ పురుషులు సన్నిధి గుడారంలో పని చేస్తారు.
NUM 4:4 సన్నధి గుడారంలో అత్యంత పవిత్ర స్థలాన్ని జాగ్రత్తగా చూసుకోవటం వారి పని.
NUM 4:5 “ఇశ్రాయేలు ప్రజలు ఒక కొత్త స్థలానికి ప్రయాణం చేసినప్పుడు, అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారంలోనికి వెళ్లి, తెరనుదించి, దానితో పవత్ర ఒడంబడిక పెట్టెను కప్పాలి.
NUM 4:6 తర్వాత దీనంతటినీ శ్రేష్ఠమైన తోలుతో కప్పాలి. అప్పుడు దానంతటి మీద నీలం రంగు బట్ట పరచి, దాని మోత కర్రలను పవిత్ర పెట్టె ఉంగరాలలో దూర్చాలి.
NUM 4:7 “తర్వతా పవిత్ర బల్ల మీద ఒక నీలం బట్టను వారు పర్చాలి. అప్పుడు గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, పానము చేయు పాత్రలను వారు ఆ బల్ల మీద పెట్టాలి. ప్రత్యేక రొట్టెలను కూడ ఆ బల్ల మీద పెట్టాలి.
NUM 4:8 అప్పుడు వీటన్నింటిమీద ఒక ఎర్రబట్టను మీరు వేయాలి. తర్వాత శ్రేష్ఠమైన తోలుతో అన్నింటినీ కప్పాలి. అప్పుడు బల్ల ఉంగరాల్లో దండెలను పెట్టాలి.
NUM 4:9 “తర్వాత దీపస్తంభాన్ని, దాని దీపాలను నీలం బట్టతో కప్పాలి. దీపాలను ప్రకాశింప చేసేందుకు వినియోగించిన వస్తువులన్నింటినీ, దీపాలకు ఉపయోగించిన నూనె పాత్రలను కప్పాలి.
NUM 4:10 అప్పుడు ప్రతి దానిని శ్రేష్ఠమైన తోలుతో చుట్టి, వీటిని మోసేందుకు ఉపయోగించే దండెలమీద వీటిని ఉంచాలి.
NUM 4:11 “బంగారు బలిపీఠం మీద నీలం బట్టను పరచాలి. దానిని శ్రేష్ఠమైన తోలుతో కప్పాలి. అప్పుడు బలిపీఠపు ఉంగరాలలో దాని, మోత కర్రలను ఉంచాలి.
NUM 4:12 “తర్వాత పవిత్ర స్థలంలో ఆరాధనకు ఉపయోగించే ప్రత్యేక వస్తులన్నింటినీ సమకూర్చాలి. ఆ వస్తువులను ఒక్క చోట సమకూర్చి, నీలం బట్టతో వాటిని చుట్టి పెట్టాలి. అప్పుడు దాన్ని శ్రేష్ఠమైన తోలుతో కప్పాలి. వీటిని మోసేందుకు ఒక చట్రంమీద వాటిని ఉంచాలి.
NUM 4:13 “ఇత్తడి బలిపీఠపు బూడిదను తీసివేసి, ధూమ్రవర్ణంగల బట్టను దానిమీద పరచాలి.
NUM 4:14 తర్వాత బలిపీఠందగ్గర ఆరాధనకు ఉపయోగించే వస్తులన్నింటినీ సమకూర్చాలి. అవి ఏవనగా, ధూపార్తి, ముండ్ల గరిటెలు, గిన్నెలు, ఇతర పరికారాలు. వీటన్నింటినీ యిత్తడి బలిపీఠం మీద ఉంచాలి. తర్వాత బలిపీఠం మీద శ్రేష్ఠమైన తోలు కప్పాలి. బలిపీఠపు ఉంగరాల్లో దానిమోత కర్రలు ఉంచాలి.
NUM 4:15 “అహరోను, అతని కుమారులు పవిత్ర స్థలంలో పవిత్ర వస్తువులన్నింటినీ కప్పటం అయిన తర్వాత, కహాతు కుటుంబపు పురుషులు లోనికి వెళ్లి, ఆ వస్తువులను మోయటం మొదులు పెట్టవచ్చు. ఈ విధంగా వారు చావకుండేలా పవిత్ర స్థలాన్ని తాకరు.
NUM 4:16 “యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరు పవిత్ర గడారానికి బాధ్యుడు. పవిత్ర స్థలానికి, దానిలోని సమస్తానికి అతడు బాధ్యుడు. దీపాల నూనె, పరిమళ ధూపద్రవ్యాలు, నిత్యార్పణ, అభిషేక తైలం, వీటన్నింటికీ అతడు బాధ్యుడు.”
NUM 4:17 మోషే అహరోనులతో యెహోవా ఈలాగు అన్నాడు:
NUM 4:18 “జాగ్రత్తగా ఉండండి, ఆ కహాతీ మనుష్యుల్ని నాశనం కానివ్వకండి.
NUM 4:19 కహాతీ మనుష్యులు అతి పవిత్ర స్థలాన్ని సమీపించికూడ మరణించకుండా ఉండేటట్టుగా మీరు వీటిని చేయాలి. అహరోను, అతని కుమారులు లోనికి వెళ్లి, కహాతీ మనుష్యులు ఒక్కొక్కరు ఏమేమి చేయాల్సిందీ చూపెట్టాలి. ఒక్కొక్కడు మోయవలసిన వాటిని వారు ఒక్కొక్కనికి ఇవ్వాలి.
NUM 4:20 మీరు ఇలా చేయకపోతే, కహాతీ మనుష్యులు లోనికి వెళ్లి, పవిత్ర వస్తువులను చూచి, అవి ముఖ్యమైనవి కానట్టుగా ఎంచవచ్చును. వారు గనుక అలా ఒక క్షణంపాటుచేస్తే, వారు మరణిస్తారు.”
NUM 4:21 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
NUM 4:22 “గెర్షోను సంతతిలో మనుష్యులందరినీ లెక్కించు. వంశాలుగా, కుటుంబాలుగా వారి జాబితా తయారుచేయి.
NUM 4:23 30 నుండి 50 సంవత్సరాల వయస్సుగలిగి, యుద్ధంలో పనిచేసిన పురుషులందరినీ లెక్కించు. వీరంతా సన్నిధి గుడారాన్ని జాగ్రత్తగా చూసుకునే పని చేస్తారు.
NUM 4:24 “గెర్షోను కుటుంబమువారు చేయాల్సినవి, మోయాల్సినవి ఇవి:
NUM 4:25 పవిత్ర గుడారపు తెరలు, సన్నిధి గుడారం, దాని కప్పు, శ్రేష్ఠమైన తోలుతో చేయబడ్డ కప్పు వారు మోయాలి. సన్నిధి గుడార ప్రవేశం దగ్గర తెరను కూడా వారు మోయాలి.
NUM 4:26 పవిత్ర గుడారం చుట్టూ బలిపీఠం చుట్టూ ఉండే ఆవరణ తెరలన్నీ వారు మోయాలి. మరియు ఆవరణ ప్రవేశానికి ఉండే తెరను కూడా వారు మోయాలి. తెరలకు ఉపయోగించే వస్తువులన్నింటినీ, తాళ్లన్నింటినీ వారే మోయాలి. వీటి విషయంలో ఏది చేయాల్సి వచ్చినా గెర్షోను కుటుంబము వాళ్లే బాధ్యలు.
NUM 4:27 జరుగుతున్న పని అంతటినీ అహరోను, అతని కుమారులు గమనిస్తూ ఉంటారు. గెర్షోను ప్రజలు మోసేవాటిని, చేసేవాటినీ అన్నింటినీ అహరోను, అతని కుమారులు గమనిస్తుంటారు. వారు ఏ వస్తువులు మోయుటకు బాధ్యలో వాటన్నింటిని గూర్చి నీవు వారితో చెప్పాలి.
NUM 4:28 గెర్షోను కుటుంబమువారు సన్నిధి గుడారం కోసం చేయాల్సిన పని ఇది. యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు వారి పనికి బాధ్యుడు.”
NUM 4:29 “మెరారియులలోని వంశాలు, కుటుంబాలలో ఉన్న పురుషులందరినీ లెక్కించు.
NUM 4:30 30 నుండి 50 సంవత్సరాల వయసు కలిగి యుద్ధంలో పని చేసిన పురుషులందరినీ లెక్కించు. వీరు సన్నిధి గుడారం కోసం ఒక ప్రత్యేక పని చేస్తారు.
NUM 4:31 మీరు ప్రయాణం టప్పుడు సన్నిధి గుడారపు పలకలు మోయటం వారి పని. అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలను వారు మోయాలి.
NUM 4:32 ఆవరణ చుట్టూ ఉండే స్తంభాలు కూడ వారు మోయాలి. దిమ్మలను, గుడారపు మేకులను, తాళ్లను, ఆవరణ చుట్టూ ఉండే స్తంభాలకు ఉపయోగించే సమస్తం వారు మోయాలి. పేర్ల జాబితా చేసి, సరిగ్గా ఒక్కో మనిషి ఏమి మోయాలో వారికి చెప్పు.
NUM 4:33 సన్నిధి గుడారపు పనిలో సేవ చేసేందుకు మెరారి ప్రజలు చేయాల్సిన పనులు ఇవి. యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు వారి పనికి బాధ్యుడు.”
NUM 4:34 మోషే, అహరోను, ఇశ్రేయేలు ప్రజా నాయకులు కహాతీ ప్రజలను లెక్కించారు. వంశాలుగా, కుటుంబాలుగా వారు వారిని లెక్కించారు.
NUM 4:35 30 నుండి 50 సంవత్సరాల వయసు గలిగి యుద్ధంలో పని చేసిన పురుషులందరిని వారు లెక్కించారు. సన్నిధి గుడారంకోసం చేయాల్సిన ప్రత్యేక పని వీరికి అప్పగించబడింది.
NUM 4:36 ఈ పని చేసేందుకు అర్హులు 2,750 మంది పురుషులు కహాతు వంశంలో ఉన్నారు.
NUM 4:37 కనుక కహాతు వంశంలోని ఈ పురుషులకు సన్నిధి గుడారం కోసం చేయాల్సిన ప్రత్యేక పని అప్పగించబడింది. మోషేతో యెహోవా చెప్పిన ప్రకారం మోషే, అహరోను యిలా చేసారు.
NUM 4:38 మరియు, గెర్షోను కుటుంబం కూడ లెక్కించబడింది.
NUM 4:39 30 నుండి 50 సంవత్సరాల వయసు ఉండి సైన్యంలో పని చేసిన పురుషులంతా లెక్కించబడ్డారు. సన్నిధి గుడారం కోసం వారు చేయాల్సిన ప్రత్యేక పని ఈ మనుష్యులకు అప్ప గించటం జరిగింది.
NUM 4:40 గెర్షోను వంశాల్లో అర్హులైన పురుషులు 2,630 మంది ఉన్నారు.
NUM 4:41 కనుక గెర్షోను వంశంలోని ఈ మనుష్యులకు సన్నిధి గుడారం కోసం చేయాల్సిన ప్రత్యేక పని అప్పగించటం జరిగింది. మోషేకు యెహోవా చెప్పిన ప్రకారం మోషే, అహరోను ఇలా చేసారు.
NUM 4:42 మరియు మెరారి వంశంలోని పురుషులు లెక్కించబడ్డారు.
NUM 4:43 30 నుండి 50 సంవత్సరాల వయసు ఉండి సైన్యంలో పని చేసిన పురుషులంతా లెక్కించబడ్డారు. సన్నిధి గుడారం కోసం వీరు చేయాల్సిన ప్రత్యేక పని వీరికి అప్పగించబడింది.
NUM 4:44 మెరారి వంశాల్లో అర్హులైన పురుషులు 3,200 మంది ఉన్నారు.
NUM 4:45 కనుక మెరారి వంశంలోని ఈ పురుషులకు వారి ప్రత్యేక పని అప్పగించబడింది. మోషేతో యెహోవా చెప్పిన ప్రకారం మోషే అహరోనులు ఇలా చేసారు.
NUM 4:46 కనుక మోషే, అహరోను, ఇశ్రేయేలు ప్రజా నాయకులు లేవీయులలోని పురుషులందరినీ లెక్కించారు. ప్రతి వంశాన్ని, ప్రతి కుటుంబాన్ని వారు లెక్కించారు.
NUM 4:47 30 నుండి 50 సంవత్సరాల వయసువుండి సైన్యంలో పని చేసిన పురుషులందరూ లెక్కించబడ్డారు. సన్నిధి గుడారం కోసం చేయాల్సిన ప్రత్యేక పని వీరికి అప్పగించబడింది. వారు ప్రయాణం చేసినప్పుడు సన్నిధి గుడారాన్ని మోషే పనిని వారు చేసారు.
NUM 4:48 వారి మొత్తం సంఖ్య 8,500.
NUM 4:49 మోషేకు ఈ ఆజ్ఞను యెహోవా ఇచ్చాడు. ఒక్కో మనిషికి ఒక్కో పని ఇవ్వబడింది. ఏ మనిషి ఏమి మోయాలో ఆ మనిషికి చెప్పబడింది. కనుక యెహోవా ఆజ్ఞ ప్రకారం చేయబడింది. పురుషులంతా లెక్కించబడ్డారు.
NUM 5:1 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
NUM 5:2 “ఇశ్రేయేలు ప్రజలు వ్యాధులు, రోగములు లేకుండవారి నివాసమును కాపాడుకోవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. కుష్ఠురోగం ఉన్న ఏ మనిషినైనా సరే వారి నివాసములో నుండి పంపించి వేయాలని ప్రజలతో చెప్పు. స్రావంగల ప్రతి మనిషికి వారి నివాసంలోనుండి పంపివేయాలని వారితో చెప్పు. శవాన్ని ముట్టిన ప్రతి మనిషినీ వారి నివాసమునుండి పంపివేయాలని వారితో చెప్పు.
NUM 5:3 అతడు స్త్రీగాని, పురుషుడుగాని గొప్పేమీ కాలేదు. రోగాన్ని వ్యాధిని వారు మీ నివాసములో వ్యాపింపజేయకుండునట్లు వారిని మీ నివాసమునుండి బయటకు పంపించివేయండి. మీ నివాసములో మీ మధ్య నేను నివసిస్తున్నాను.”
NUM 5:4 కనుక ఇశ్రేయేలు ప్రజలు దేవుని ఆజ్ఞకు విధేయులయ్యారు. అలాంటి వారిని నివాసము వెలుపలకు వారు పంపించివేసారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు ఇలా చేసారు.
NUM 5:5 మోషేతో యెహోవా ఈలాగు చెప్పాడు:
NUM 5:6 “ఇశ్రేయేలు ప్రజలతో ఇలా చెప్పు: ఒకడు మరొక వ్యక్తికి కీడు చేస్తాడు. (ఒకడు ఇతరులకు కీడు చేస్తే వాడు నిజానికి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.) అతడు దోషి.
NUM 5:7 కనుక అతడు తాను చేసిన పాపం గూర్చి ప్రజలతో చెప్పాలి. తర్వాత అతడు చేసిన తప్పుకు పూర్తిగా విలువ చెల్లించాలి. అతడు ఎవరికి నష్టం కలిగించాడో ఆ మనిషికి చెల్లించాల్సినదానికి ఇంకా ఐదో వంతు కలిపి చెల్లించాలి.
NUM 5:8 కానీ ఒక వేళ ఎవరికైతే అతడు నష్టం కలిగించాడో అతడు చనిపోతాడు. ఒక వేళ నష్టపరిహరం పుచ్చుకొనేందుకు, చనిపోయిన వ్యక్తికి నావాళ్లు అనుటకు ఎవరు ఉండరు. అలాంటప్పుడు తప్పు చేసినవాడు ఆ విలువను యహోవాకు చెల్లించాలి. అతడు పూర్తి మొత్తాన్ని యాజకునికి చెల్లించాలి. యాజకుడు ప్రాయశ్చిత్తార్థపు పొట్టేలును బలిగా అర్పించాలి. తప్పు చేసిన ఆ మనిషి పాపాలు క్షమింపబడుటకు బలిగా పొట్టేలు అర్పించబడాలి. మిగిలిన విలువను యాజకుడు ఉంచు కోవచ్చును.
NUM 5:9 “ఇశ్రేయేలు ప్రజల్లో ఒకడు దేవునికి ఒక ప్రత్యేక కానుక ఇస్తే, దానిని స్వీకరించే యాజకుడు దానిని ఉంచుకోవచ్చును. అది అతనిదే.
NUM 5:10 ఈ ప్రత్యేక కానుకలు అర్పించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. కాని ఎవరైనా అలా ఇస్తే, అవి యాజకునికే చెందుతాయి.”
NUM 5:11 అప్పుడు మోషేతో యోహోవా ఈలాగున చెప్పాడు:
NUM 5:12 “ఇశ్రేయేలు ప్రజలతో ఈ విషయాలు చెప్పు: ఒకని భార్య అతనికి అపనమ్మకంగా ఉంటుంది.
NUM 5:13 ఆమె మరొకనితో శయనించి, తన భర్తకు తెలియకుండా ఈ విషయం దాచిపెడుతుంది. ఆమె చేసిన తప్పునుగూర్చి ఆమె భర్తకు ఎప్పటికి తెలియకపోవచ్చు. ఆమె ఆ పాపం చేసిందని అతనితో చెప్పే వారు ఎవరూ ఉండక పోవచ్చు. మరియు ఆ స్త్రీ తన పాపం విషయం తన భర్తకు చెప్పకపోవచ్చు.
NUM 5:14 కానీ, తన భార్య తనకు వ్యతిరేకంగా పాపం చేసిందని ఆ భర్త అనుమానించటం ప్రారంభం కావచ్చు. అతనిలో కోపం కలుగుతూ వుండవచ్చు. ఆమె పవిత్రంగా లేదని, తనకు నమ్మకంగా లేదని అతనిలో అనుమానం ఏర్పడుతూ ఉండవచ్చు.
NUM 5:15 అలా జరిగితే, అతడు తన భార్యను యాజకుని దగ్గరకు తీసుకునిపోవాలి. ఆ భర్త ఒక అర్పణకూడ తీసుకొని వెళ్లాలి. ఆ అర్పణ తూమెడు యవలపిండిలో పదోవంతు. యవలపిండిలో నూనెగాని సాంబ్రాణిగాని వేయకూడదు. ఈ యవల పిండి యెహోవాకు ధాన్యార్పణ. భర్త రోషం మూలంగా అది అర్పించబడింది. అతని భార్య అతనికి అపనమ్మకంగా ఉందని అతడు నమ్ముతున్నట్టు ఈ అర్పణ సూచిస్తుంది.
NUM 5:16 “యాజకుడు ఆ స్త్రీని యెహోవా ఎదుట నిలువబెడ్తాడు.
NUM 5:17 అప్పుడు యాజకుడు మట్టి పాత్రలో పవిత్ర జలం పోస్తాడు. పవిత్ర గుడాకంలోని నేల మీద మట్టి కొంత తీసుకుని, దానిని ఆ నీళ్లలో వేస్తాడు యాడకుడు.
NUM 5:18 ఆ స్త్రీని యెహోవా ఎదుట నిలచివుండమని యాజకుడు ఆమెను బలవంతం చేస్తాడు. అప్పుడతడు ఆమె తల వెంట్రుకలను వదులుగా విడిచి, ధాన్యార్పణను ఆమె చేతిలో పెడతాడు. ఇది తన భర్త రోషం విషయం అర్పించే యవల పిండి. అదే సమయంలో పవిత్ర జలం ఉన్న మట్టి పాత్రను అతడు పట్టుకొంటాడు. ఇది ఆ స్త్రీకి చిక్కుతెచ్చిపెట్టే పవిత్ర జలం.
NUM 5:19 “అప్పుడు అబద్ధం చెప్పకూడదని యాజకుడు ఆ స్త్రీతో చెబుతాడు. సత్యం చెబుతానని ఆమె వాగ్ధానం చేయాలి. యాజకుడు ఆమెతో ఇలా అంటాడు, ‘నీవు ఇంకో మగవాడితో శయనించి ఉండకపోతే, నీ భర్తను పెళ్లాడిన నీవు, అతనికి వ్యతిరేకంగా పాపం చేసి ఉండకపోతే, కష్టం కలిగించే ఆ జలం నీకు హాని చేయదు.
NUM 5:20 కానీ నీవు నీ భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, నీవు మరో మగవాడితో శయనించి ఉంటే నీకు ఏదో కీడు జరుగుతుంది. నీవు పవిత్రురాలివి కాదు. ఎందు చేతనంటే నీ భర్తకాని వాడైన పర పురుషుడు నీతో శయనించి నిన్ను అపవిత్రం చేసాడు.
NUM 5:21 కనుక నీవు ప్రత్యేక జలం తాగినప్పుడు నీకు గొప్ప కీడు సంభవిస్తుంది. నీ కడుపు ఉబ్బిపోతుంది, ఇంక నీకు పిల్లలు పుట్టరు. నీవు గర్భవతివి అయితే నీ శిశువు చనిపోతుంది. అప్పుడు నీ వాళ్లంతా నిన్ను విడిచిపెట్టేసి, నిన్నుగూర్చి చెడుదా చెప్పుకొంటారు.’ “ఆ స్త్రీ యెహోవాకు ప్రత్యేక ప్రమాణం చేయాలని యాజకుడు ఆమెతో చెప్పాలి. ఆ స్త్రీ అబద్ధం గనుక చెబితే ఈ కీడు తనకు జరుగుతుందని ఒప్పుకోవాలి.
NUM 5:22 ‘నీ శరీరంలో హాని కలిగించే ఈ నీళ్లు నీవు తాగాలి. నీవు పాపం చేసి ఉంటే నీకు పిల్లలు పుట్టరు, నీకు కలిగే ఏ శిశువైనా సరే పుట్టక ముందే చనిపోతుంది’ అని యాజకుడు చెప్పాలి. అప్పుడు ఆ స్త్రీ ‘నీవు చెప్పినట్టు చేయటానికి నేను ఒప్పుకుంటున్నాను’ అని చెప్పాలి.
NUM 5:23 “యాజకుడు ఈ హెచ్చరికలను ఒక పత్రంమీద వ్రాయాలి. అప్పుడు అతడు ఆ మాటలను నీళ్లలోనికి తుడిచివేయాలి.
NUM 5:24 అప్పుడు హాని కలిగించే ఆ నీళ్లను ఆ స్త్రీ తాగుతుంది. ఆ నీళ్లు ఆమెలో ప్రవేశించి, ఆమె దోషి అయితే, ఆమెకు చాల శ్రమ కలిగిస్తాయి.
NUM 5:25 “అప్పుడు యాజకుడు ఆమె దగ్గరనుండి ధాన్యార్పణ తీసుకుని (రోషమునకు అర్పించు అర్పణ) దానిని యెహోవా ఎదుట పైకి ఎత్తుతాడు. తర్వాత బలిపీఠం దగ్గరకు దానిని తెస్తాడు.
NUM 5:26 ఆ తర్వాత యాజకుడు తన చేతినిండా ధాన్యార్పణ పట్టుకొని బలిపీఠం మీద ఉంచుతాడు. అప్పుడు అతడు దానిని దహిస్తాడు. ఆ తర్వాత ఆ నీళ్లు త్రాగమని అతడు ఆ స్త్రీతో చెబుతాడు.
NUM 5:27 ఆ స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం గనుక చేసి ఉంటే, ఆ నీళ్లు ఆమెకు హాని కలిగిస్తాయి. ఆ నీళ్లు ఆమె శరీరంలోనికి పోయి, ఆమెకు చాలా శ్రమ కలిగిస్తాయి. ఆమెలో ఏదైనా శిశువు ఉంటే అది పుట్టక ముందే మరణిస్తుంది, ఆమె ఎన్నటికీ పిల్లలను కనదు. ప్రజలంతా ఆమెకు వ్యతిరేకం అవుతారు.
NUM 5:28 కానీ ఆస్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం చేసి ఉండకపోతే, ఆమె పవిత్రంగా ఉంటే అప్పుడు ఆమె నిర్దోషి అని యాజకుడు చెబుతాడు. అప్పుడు ఆమె మామూలుగా ఉండి పిల్లలను కనగల్గుతుంది.
NUM 5:29 “అందుచేత రోషమునుగూర్చిన ఆజ్ఞ ఇది. తన భర్తతో వివాహం జరిగిన ఒక స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు నీవు చేయాల్సింది ఇది.
NUM 5:30 లేక ఒకడు తన భార్య తనకు వ్యతిరేకంగా పాపం చేసిందని అనుమానించినప్పుడు అతడు చేయాల్సింది ఇది. ఆ స్త్రీని యెహోవా యెదుట నిలువమని యాజకుడు చెప్పాలి. అప్పుడు యాజకుడు ఇవన్నీ చేయాలి. ఇది ఆజ్ఞ.
NUM 5:31 ఇలా చేసినందువల్ల భర్త తప్పు చేసినట్టు కాదు. కానీ ఆ స్త్రీ మాత్రం పాపం చేసి ఉంటే శ్రమ అనుభవిస్తుంది.”
NUM 6:1 మోషేతో యెహోవా ఇలా అన్నాడు:
NUM 6:2 “ఇశ్రేయేలీయులతో ఈ విషయాలు చెప్పు: ఒక పురుషుడు గాని స్త్రీగాని కొన్నాళ్ల పాటు ఒకరినుండి ఒకరు ప్రత్యేకంగా ఉండాలని కోరవచ్చును. ఈ ప్రత్యేకించు కోవటంలో ఉద్దేశం, అతడు ఆ వ్యవధిలో తనను తాను సంపూర్ణంగా యెహోవాకు అర్పించుకోవటమే. అతడు నాజీరు అని పిలువబడతాడు.
NUM 6:3 ఆ కాలంలో అతడు ద్రాక్షామద్యంగాని ఇంకే మత్తు పానీయంగాని తాగకూడదు. ద్రాక్షారసంనుండి తీయబడిన చిరకను గాని ఇంకే మప్త సానీయంగాని అతడు తాగకూడదు. ద్రాక్షాపండ్లుగాని, ఎండిన ద్రాక్షాలుగాని అతడు తినకూడదు, ద్రాక్షారసం తాగకూడదు.
NUM 6:4 వేరుగా ఉండే ఆ ప్రత్యేక సమయంలో ద్రాక్షానుండి వచ్చేది ఏదీ అతడు తినకూడదు. ద్రాక్షాగింజలను, దాని తోలును కూడ అతడు తినకూడదు.
NUM 6:5 “అలా వేరుగా ఉండే కాలంలో అతడు తన తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అతడు వేరుగా ఉండాల్సిన రోజులు గడచిపోయేంతవరకు అతడు పవిత్రంగా ఉండాలి. అతడు తన వెంట్రుకలను పొడవుగా పెరగనివ్వాలి. అతడు దేవునికి చేసిన వాగ్దానంలో అతని తల వెంట్రుకలు ఒక భాగం. ఆ వెంట్రుకలను ఒక కానుకగా అతడు దేవునికి ఇస్తాడు. అందుచేత వేరుగా ఉండే సమయం అయిపోయేంత వరకు అతడు తన తల వెంట్రుకలను పొడవుగా పెంచాలి.
NUM 6:6 “నాజీరు వేరుగా ఉన్న సమయంలో, అతడు శవాన్ని సమీపించకూడదు. ఎందుచేతనంటే అతడు తనను తాను పూర్తిగా యోహోవాకు అర్పించుకొన్నాడు.
NUM 6:7 అతని సొంత తండ్రి లేక తల్లి, సోదరుడు లేక సోదరి చనిపోయినా సరే అతడు వారిని తాకగూడదు. అలా తాకితే అతడు అపవిత్రుడవుతాడు. అతడు ప్రత్యేకించుకొన్నట్టు, పూర్తిగా యెహోవాకు అర్పించు కొన్నట్టు అతడు చూపెట్టుకోవాలి.
NUM 6:8 అతడు వేరుగా ఉన్న కాలమంతటిలో తనను తాను పూర్తిగా యెహోవాకు అర్పించుకొన్నాడు.
NUM 6:9 నాజీరు మరొకనితో ఉన్నప్పుడు, ఆ మరొకడు అకస్మాత్తుగా మరణించవచ్చును. చనిపోయినవానిని నాజీరు ముట్టినట్టయితే నాజీరు అపవిత్రుడవుతాడు. ఇలా జరిగినట్లయితే నాజీరు తన తల వెంట్రుకలను తీసివేయాలి. (ఆ వెంట్రుకలు అతని ప్రమాణంలో ఒక భాగం.) ఏడో రోజున అతడు తన వెంట్రుకలను తీసివేయాలి. ఎందుచేతనంటే ఆ రోజునే అతడు శుద్ధి చయబడ్డాడు.
NUM 6:10 ఎనిమిదో రోజున అతడు రెండు గువ్యలను, రెండు పావురపు పిల్లలను యాజకుని దగ్గరకు తీసుకుని రావాలి. పవిత్ర గుడార ద్వారం దగ్గరే అతడు వాటిని యాజకునికి ఇవ్వాలి.
NUM 6:11 అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలిగా ఒకదాన్ని అర్పిస్తాడు. రెండో దానిని దహన బలిగా అతడు అర్పిస్తాడు. ఈ దహనబలి ఆ మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. (అతడు శవం దగ్గర ఉండటమే అతని పాపం.) అతడు తన తలవెంట్రుకలను దేవునికి ఇస్తానని ఆ సమయంలో మరల ప్రమాణం చేయాలి.
NUM 6:12 అనగా అతడు మరల ప్రత్యేకంగా ఉండేందుకు తనను యెహోవాకు అర్పించుకోవాలని దీని అర్థం. ఒక సంవత్సరం వయసు గల ఒక మగ గొర్రెపిల్లను అతడు తీసుకురావాలి. అపరాధ పరిహారార్థ బలిగా అతడు దీనిని ఇవ్వాలి. అతడు ప్రత్యేకంగా ఉన్న రోజులన్నీ మరచిపోవటం జరిగింది. అతడు మరల ప్రత్యేకంగా ఉండటం ప్రారంభించాలి. అతడు మొదటిసారి ప్రత్యేకంగా ఉన్నప్పుడు శవాన్ని ముట్టినందువల్ల ఇలా చేయాలి.
NUM 6:13 “ఆ మనిషి ప్రత్యేకంగా ఉండాల్సిన సమయం అయిపోయిన తర్వాత అతడు ఇలా చేయాలి: సన్నిధి గుడార ద్వారం దగ్గరకు అతడు వెళ్లాలి.
NUM 6:14 అక్కడ తన అర్పణను అతడు యెహోవాకు ఇవ్వాలి. అతని అర్పణ ఏమిటంటే: దహనబలి కోసం ఒక్క సంవత్సరపు మగ గొర్రెపిల్ల. (ఈ గొర్రెపిల్లకు ఎలాంటి లోపం ఉండకూడదు.) పాప పరిహారార్థబలి కోసం ఒక్క సంవత్సరపు ఆడ గొర్రెపిల్ల. (ఈ గొర్రెపిల్లకు ఎలాంటి లోపం ఉండ కూడదు.) సమాధాన బలికోసం ఒక్క మగ గొర్రె (ఈ గొర్రెకు ఎలాంటి లోపం ఉండ కూడదు.)
NUM 6:15 ఒక గంపనిండా పొంగనిపిండి రొట్టెలు, (నూనెతో చేసిన మంచి గోధుమపిండి రొట్టెలు, ఈ రొట్టెల మీద నూనెపూయాలి). ధాన్యార్పణ, పానార్పణ ఈ కానుకలలో భాగంగా వుండాలి.
NUM 6:16 “అప్పుడు యాజకుడు వీటిని యెహోవాకు అర్పిస్తాడు. పాపపరిహారార్థబలిని, దహనబలిని యాజకుడు అర్పిస్తాడు.
NUM 6:17 రొట్టెలబుట్టను యాజకుడు యెహోవాకు అర్పిస్తాడు. తర్వాత యెహోవాకు సమాధానబలిగా మగ గొర్రెను అతడు వధిస్తాడు. ధాన్యార్పణ, పానార్పణాలతో అతడు దానిని యెహోవాకు అర్పిస్తాడు.
NUM 6:18 “సన్నిధి గుడారపు ప్రవేశం దగ్గరకు వాజీరు వెళ్లాలి. యెహోవాకోసం అతడు పెంచిన తలవెంట్రుకలను అక్కడ అతడు తీసివేయాలి. సమాధాన బలియాగం క్రింద మండుతున్న మంటల్లో ఆ వెంట్రుకలు వేయబడుతాయి.
NUM 6:19 “నాజీరు తన తల వెంట్రుకలు తీసివేసిన తర్వాత, ఉడికిన మగ గొర్రె జబ్బను, గంపలో నుండి పెద్దది ఒకటి, చిన్నది ఒకటి, రెండు రొట్టెలను యాజకుడు అతనికి ఇస్తాడు. ఈ రెండు రొట్టెలు పులియని పిండితో చేయబడినవి.
NUM 6:20 అప్పుడు యాజకుడు వీటిని యెహోవా ముందర అల్లాడిస్తాడు. ఇది నైవేద్యము. ఇవి పవిత్రమైనవి, యాజకునికి చెందుతాయి. మరియు మగ గొర్రె బోర, తొడ యెహోవా ముందర అల్లాడించబడుతాయి. ఇవికూడా యాజకునికి చెందుతాయి. ఆ తర్వాత నాజీరు ద్రాక్షారసం తాగవచ్చును.
NUM 6:21 “ఒక వ్యక్తి నాజీరుగా ప్రత్యేకించబడాలని నిర్ణయించుకొంటే, అప్పుడు అతడు ఈ కానుకలన్నీ యెహోవాకు అర్పించాలి. నాజీరు ప్రయాణానికి సంబంధించిన చట్టం అది. అయితే ఒక వ్యక్తి ఇంతకంటె చాల ఎక్కువే యెహోవాకి ఇవ్వగలిగి ఉండొచ్చు. అలాంటివాడు ఎక్కువ చేస్తానని వాగ్దనంచేస్తే, అతడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. అది కూడ నాజీరు వాగ్దానపు చట్టమే.”
NUM 6:22 మోషేతో యెహోవా ఇలా అన్నాడు:
NUM 6:23 “అహరోను, అతని కుమారులతో ఇలా చెప్పు. ఇశ్రేయేలు ప్రజలను మీరు ఈ విధంగా ఆశీర్వదించాలి. వారు ఇలా అనాలి:
NUM 6:24 ‘యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక.
NUM 6:25 యెహోవా తన ముఖకాంతిని నీపై ప్రకాశింప చేయును గాక. ఆయన తన ప్రేమను నీకు కనబర్చును గాక.
NUM 6:26 యెహోవా నిన్ను చూచి, నీకు సమాధానం అనుగ్రహించును గాక.’
NUM 6:27 అప్పుడు యెహోవా, ఈ విధంగా అహరోను, అతని కుమారులు ఇశ్రేయేలీయులను నా నామమును బట్టి ఆశీర్వదించినట్లు పలికినప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తాను” అని చెప్పాడు.
NUM 7:1 పవిత్ర గుడారాన్ని నిలబెట్టడం మోషే ముగించిన రోజే దానిని అతడు యెహోవాకు ప్రతిష్ఠించాడు. గుడారం మీద, దానిలో ప్రయోగించే పరికరాలన్నింటి మీద ప్రత్యేక తైలం పోసాడు. బలిపీఠం మీద, దానితో ఉపయోగించే వాటన్నింటి మీద మోషే ఆ తైలంపోసాడు. ఇది వీటన్నింటినీ పవిత్రం చేసింది.
NUM 7:2 అప్పుడు ఇశ్రేయేలీయుల నాయకులు అర్పణలు అర్పించారు. వీరు ఒక్కో కుటుంబానికి నాయకులు, వారి వంశాల పెద్దలు. ఈ నాయకులు ప్రజలను లెక్కబెట్టారు.
NUM 7:3 ఈ నాయకులు యెహోవాకు అర్పణలు తెచ్చారు. ఆరు గూడు బండ్లను, వాటిని లాగటానికి పన్నెండు ఎద్దులను వీరు తెచ్చారు. (ఒక్కో ఎద్దును ఒక్కో నాయకుడు ఇచ్చాడు. ఒక్కో నాయకుడు మరో నాయకునితో కలిసి ఒక బండిని ఇచ్చాడు.) పవిత్ర గుడారం దగ్గర నాయకులు వీటిని యెహోవాకు ఇచ్చారు.
NUM 7:4 మోషేతో యెహోవా ఇలా అన్నాడు:
NUM 7:5 “నాయకుల దగ్గర నుండి ఈ కానుకులు స్వీకరించు. సన్నిధి గుడారపు పనిలో ఈ కానుకలను ఉపయోగించవచ్చు. లేవీవాళ్లకు వీటిని ఇవ్వు. వాళ్లు వారి పని చేసుకొనేందుకు ఇవి సహాయపడ్తాయి.”
NUM 7:6 కనుక ఆ బండ్లను, ఎద్దులను మోషే స్వీకరించాడు. వీటిని లేవీ మనుష్యులకు అతడు ఇచ్చాడు.
NUM 7:7 గెర్షోను మనుష్యులకు రెండు బండ్లు, నాలుగు ఎడ్లు అతడు ఇచ్చాడు. వారి పనికోసం ఎడ్లు, బండ్లు వారికి అవసరం.
NUM 7:8 తర్వాత మెరారి మనుష్యులకు నాలుగు బండ్లు, ఎనిమిది ఎడ్లు మోషే ఇచ్చాడు. వారి పనికోసం ఎడ్లు, బండ్లు వారికి అవసరం. ఆ మనుష్యులందరి పనికి యాజకుడైన అహరోను కుమారుడు ఈతమారు బాధ్యుడు.
NUM 7:9 కహాతీ మనుష్యులకు బండ్లుగాని, ఎడ్లుగాని ఏమీ మోషే ఇవ్వలేదు. వీళ్లు పవిత్ర వస్తువులన్నింటినీ వారి భుజాలమీదే మోయాలి. ఇది వారు చేసేందుకు ఇవ్వబడిన పని.
NUM 7:10 బలిపీఠం ప్రతిష్ఠించబడిన తర్వాత నాయకులు వారి అర్పణలు అక్కడకు తీసుకునివచ్చారు. ఆ బలిపీఠం ఎదుట వారు వారి అర్పణలను యెహోవాకు అర్పించారు.
NUM 7:11 “ఒక్కో నాయకుడు ఒక్కో రోజున బలిపీఠం ప్రతిష్ఠలో తన వంతుగా తన అర్పణలు తీసుకుని రావాలి” అని యెహోవా అంతకు ముందే మోషేతో చెప్పాడు.
NUM 7:12 పన్నెండుమంది నాయకుల్లో ప్రతి ఒక్కరూ పవిత్ర గుడారపు ప్రతిష్ఠకోసం తమ అర్పణలను తెచ్చారు. ఆ కానుకలు ఏవనగా: ఒక్కొక్క నాయకుడు 130 తులముల బరువుగల ఒక వెండి పళ్లెం తెచ్చాడు. ఒక్కొక్క నాయకుడు 70 తులాల బరువుగల వెండి గిన్నె తెచ్చాడు. నూనెతో కలిపిన మంచి గోధుమ పిండితో ఆ పళ్లెం, గిన్నె నింపాడు. ఇది ధాన్యార్పణ కోసం ఉపయోగించేది. 10 తులాల బరువుగల బంగారు ధూపార్తిని ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి తెచ్చాడు. ధూపార్తి ధూపంతో నింపబడింది. ఒక్కొక్క నాయకుడు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఒక సంవత్సరపు మగ గొర్రెపిల్లను తీసుకునివచ్చాడు. ఈ జంతువులు దహనబలికోసం. పాపపరిహారార్థ బలిగా ఉపయోగించటంకోసం, ప్రతి నాయకుడూ ఒక మగ మేకను తెచ్చాడు. ప్రతి నాయకుడూ రెండు కోడెదూడలను, ఐదు పొట్టేళ్లను, ఐదు మగ మేకలను, ఒక సంవత్సరపు మగ గొర్రెపిల్లలు ఐదింటిని తీసుకొని వచ్చాడు. ఇవన్నీ సమాధాన బలిగా ఇవ్వబడ్డాయి. మొదటి రోజున యూదా కుటుంబ నాయకుడును, అమ్మీనాదాబు కుమారుడునైన నయస్సోను తన అర్పణలు తీసుకుని వచ్చాడు. రెండో రోజున ఇశ్శాఖారు ప్రజల నాయకుడు, సూయారు కుమారుడైన నెతనేలు తన అర్పణలు తీసుకుని వచ్చాడు. మూడో రోజున జెబూలూను ప్రజల నాయకుడు, హెలోను కుమారుడైన ఎలియాబు తన అర్పణలు తీసుకొనివచ్చాడు. నాలుగో రోజున రూబేను ప్రజల నాయకుడునైన షెదేయూరు కుమారుడునైన ఏలీసూరు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. ఐదో రోజున షిమ్యోను ప్రజల నాయకుడును, సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు తన అర్పణలు తీసుకొని వచ్చాడు. ఆరో రోజున గాదు ప్రజల నాయకుడు, దెయూవేలు కుమారుడునైన ఎలీయాసాపా తన అర్పణలు తీసుకుని వచ్చాడు. ఏడో రోజున ఎఫ్రాయిము ప్రజల నాయకుడును, అమీహోదు కుమారుడు ఎలీషామా తన అర్పణలు తీసుకుని వచ్చాడు. ఎనిమిదో రోజున మనష్షే ప్రజల నాయకుడును, పెదాసూరు కుమారుడునైన గమలీయేలు తన అర్పణలు తీసుకుని వచ్చాడు. తొమ్మిదో రోజున బెన్యామీను ప్రజల నాయకుడును, గిద్యోనీ కుమారుడునైన అబీదాని తన అర్పణలు తీసుకుని వచ్చాడు. పదో రోజున దాను ప్రజల నాయకుడును, అమీషదాయి కుమారుడైన అహీయెజెరు తన అర్పణలు తీసుకుని వచ్చాడు. పదకొండవ రోజున ఆషేరు ప్రజల నాయకుడు, ఒక్రాను కుమారుడైన పగీయేలు తన అర్పణలు తీసుకుని వచ్చాడు. పన్నెండో రోజున నఫ్తాలీ ప్రజల నాయకుడైన, ఏనాను కుమారుడైన అహీర తన అర్పణలు తీసుకుని వచ్చాడు.
NUM 7:84 కనుక ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజల నాయకులనుండి వచ్చిన కానుకలు. మోషే ప్రత్యేక తైలము పోసి బలిపీఠాన్ని ప్రతిష్ఠించిన సందర్భంలో వారు ఈ వస్తువులను తెచ్చారు. వెండి పళ్లెములు పన్నెండు, వెండిగిన్నెలు పన్నెండు, బంగారు ధూపార్తులు పన్నెండు వారు తీసుకుని వచ్చారు.
NUM 7:85 ఒక్కో వెండి పళ్లెం బరువు 130 తులాలు. ఒక్కో గిన్నె బరువు 70 తులాలు. వెండిపళ్లాలు, వెండిగిన్నెలు అన్నీ కలిసి 2,400 తులాల బరువు.
NUM 7:86 ధూపద్రవ్యంతో నిండిన పన్నెండు బంగారు ధూపార్తులలో ఒక్కొక్కటి పది తులాల బరువు. మొత్తం పన్నెండు బంగారు ధూపార్తులు కలిసి 120 తులాల బరువు కలవి.
NUM 7:87 దహలబలి అర్పణకు మొత్తం జంతువులు పన్నెండు కోడెదూడలు, పన్నెండు పొట్టేళ్లు, ఒక్కో సంవత్సరపు మగ గొర్రెపిల్లలు పన్నెండు. ధాన్యార్పణ కూడా ఉంది. పాపపరిహారార్థ బలిగా యెహోవాకు అర్పించేందుకు పన్నెండు మగ మేకలు కూడా ఉన్నాయి.
NUM 7:88 సమాధాన బలిగా వధించి ఉపయోగించేందుకు కూడ నాయకులు జంతువులను ఇచ్చారు. ఈ జంతువులు మొత్తం 24 కోడెదూడలు, 60 పొట్టేళ్లు, 60 మగ మేకలు, ఒక్క సంవత్సరపు మగ గొర్రెపిల్లలు 60 బలిపీఠం ప్రతిష్ఠ సమయంలో ఇవన్నీ అర్పణలుగా ఇవ్వబడ్డాయి. ఈ విధంగా బలిపీఠం మీద ప్రత్యేక తైలాన్ని మోషే పోసిన తర్వాత వారు ప్రతిష్ఠించారు.
NUM 7:89 యెహోవాతో మాట్లాడేందుకు మోషే సన్నిధి గుడారంలోకి వెళ్లాడు. ఆ సమయంలో అతనితో మాట్లాడుతున్న యెహోవా స్వరం అతడు విన్నాడు. ఒడంబడిక పెట్టెపైనున్న కరుణాపీఠంమీది రెండు కెరూబుదూతల మధ్య భాగంనుండి ఆ స్వరం వస్తోంది. ఇలా దేవుడు మోషేతో మాటలాడెను.
NUM 8:1 మోషేతో యెహోవా ఇలా అన్నాడు:
NUM 8:2 “అహరోనుతో మాట్లాడి అతనితో ఇలా చెప్పు, నేను నీకు చూపించిన స్థలంలో ఏడు దీపాలను ఉంచు. దీపస్తంభం ముందు భాగాన్ని ఆ దీపాలు వెలిగించాలి.”
NUM 8:3 అహరోను అలా చేసాడు. అహరోను ఆ దీపాలను సరైన చోట పెట్టి, దీపస్తంభం ముందు భాగాన్ని అవి వెలిగించేటట్టుగా అతడు వాటిని ఉంచాడు. మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు అతడు విధేయుడయ్యాడు.
NUM 8:4 దీపస్తంభం కొట్టబడిన బంగారంతో చేయబడింది. దిమ్మదగ్గర మొదలుకొని బంగారు పూలవరకు అంతా బంగారమే. మోషేకు యెహోవా చూపించిన ప్రకారమే అదంతా చేయబడింది.
NUM 8:5 మోషేతో యెహోవా అలా అన్నాడు:
NUM 8:6 “ఇశ్రాయేలీయులలో ఇతరులనుండి లేవీ ప్రజలను వేరు చేయి. ఆ లేవీ మనుష్యులను శుద్ధి చేయి.
NUM 8:7 వారిని శుద్ధి చేసెందుకు నీవు చేయాల్సింది ఇదే. పాప పరిహారార్థ అర్పణనుండి ప్రత్యేక జలాన్ని వారిమీద చల్లాలి. ఈ జలం వారిని శుద్ధి చేస్తుంది. అప్పుడు వారు శరీరం అంతటా క్షవరం చేసుకొని, వారి బట్టలు ఉదుకు కోవాలి. ఇది వారి శరీరాలను పవిత్రం చేస్తుంది.
NUM 8:8 “అప్పుడు వారు ఒక కోడెదూడను, దానికి సంబంధించిన ధాన్యార్పణను తీసుకోవాలి. ఈ ధాన్యార్ఫణ నూనెతో కలుపబడ్డ గోధుమపిండి. అప్పుడు పాపపరిహారార్థ బలిగా ఇంకో కోడెదూడను తీసుకోవాలి.
NUM 8:9 లేవీ ప్రజలను సన్నిధి గుడారం ఎదుటి భాగంలోనికి తీసుకునిరావాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ చుట్టూరా సమావేశపర్చాలి.
NUM 8:10 అప్పుడు నీవు లేవీ ప్రజలను యెహోవా ఎదుటికి తీసుకునిరావాలి. ఇశ్రాయేలు ప్రజలు వారిమీద తమ చేతులు ఉంచుతారు.
NUM 8:11 అప్పుడు అహరోను లేవీ మనుష్యులను యెహోవా ఎదుట కనపరుస్తాడు. వారు దేవునికి ఒక అర్పణవలె ఉంటారు. ఈ విధంగా యెహోవాకు ప్రత్యేక పని చేసేందుకు లేవీ ప్రజలు సిద్ధంగా ఉంటారు.
NUM 8:12 “లేవీ మనుష్యులు కోడెదూడ తలలమీద చేతులు ఉంచాలని వారితో చెప్పు. ఒక కోడెదూడ పాపపరిహారార్థ బలిగాను మరొక కోడెదూడ దహన బలిగాను యెహోవాకు అర్పించాలి. ఈ అర్పణలు లేవీ ప్రజల పాపాలను కప్పిపుచ్చుతాయి.
NUM 8:13 అహరోను, అతని కుమారుల ఎదుట నిలబడమని లేవీ మనుష్యులతో చెప్పు. అప్పుడు ఒక ప్రతిష్ఠ అర్పణగా లేవీ మనుష్యులను యెహోవాకు అర్పించు.
NUM 8:14 ఈ విధంగా లేవీ మనుష్యులు ప్రత్యేకం అవుతారు. ఇశ్రాయేలీయులలో ఇతరులకు వీరు వేరుగా ఉంటారు. లేవీ ప్రజలు నావారై ఉంటారు.
NUM 8:15 “కనుక లేవీ మనుష్యులను పవిత్రం చేయి. ప్రతిష్ఠార్పణగా వారిని యెహోవాకు అర్పించు. ఇలా చేసిన తర్వాత వారు సన్నిధి గుడారంలోనికి వచ్చి వారి పని చేయవచ్చును.
NUM 8:16 ఈ లేవీయులు నాకు ఇవ్వబడిన ఇశ్రాయేలు ప్రజలు. వారిని నా స్వంత ప్రజలుగా నేను స్వీకరించాను. గతంలో ఇశ్రాయేలీయుల ప్రతి కుటుంబంలో ప్రతి పెద్ద కుమారుడు నాకు ప్రతిష్ఠించబడ్డాడు. అయితే ఇశ్రాయేలుల్లో ఇతరుల జ్యేష్ఠ కుమారుల బదులు లేవీయులు మనుష్యులను నేను స్వీకరించాను.
NUM 8:17 ఇశ్రాయేలీయుల ప్రతి కుటుంబములో మొదట పుట్టిన ప్రతి మగ శిశువు నావాడే. అది మనిషిగాని పశువుగాని నాకే. ఎందుకంటే ఈజిప్టులో మొదట పుట్టిన పిల్లలను, జంతువులనుగూడ నేను చంపేసాను, కనుక మొదట పుట్టినవారు నావారై ఉండాలని పెద్ద కుమారులను మీ నుండి వేరు చేసాను.
NUM 8:18 ఇప్పుడు నేను లేవీ మనుష్యులను తీసుకున్నాను. ఇశ్రాయేలు కుటుంబాల్లో మొదటగా పుట్టిన కుమారులందరి స్థానంలో నేను వీరిని తీసుకున్నాను.
NUM 8:19 ఇశ్రాయేలు ప్రజలందరిలోనుండి లేవీ మనష్యులను నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను వారిని అహరోనుకు అతని కుమారులకు కానుకలుగా ఇచ్చాను. సన్నిధి గుడారం దగ్గర వారు పని చేయాలని నేను కోరుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా వారు సేవ చేస్తారు. ఇశ్రాయేలు ప్రజల పాపాలను కప్పిపుచ్చే బలులు అర్పించుటలో వారు సహాయం చేస్తారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పవిత్ర స్థలాన్ని సమీపించినా ఏ గొప్ప రోగంగాని, కష్టంగాని వారికి కలుగదు.”
NUM 8:20 కనుక మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవాకు విధేయులయ్యారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన దానిని లేవీ మనుష్యులకు వారు జరిగించారు.
NUM 8:21 లేవీ ప్రజలు పవిత్రులయ్యారు. వారు వారిని శుద్ధి చేసుకున్నారు, వారి వస్త్రాలు ఉదుకు కొన్నారు. అప్పుడు అహరోను వారిని యెహోవా ఎదుట ప్రతిష్టార్పణగా అర్పించాడు. వారి పాపాలను క్షమించే అర్పణలను కూడా అర్పించి, అహరోను వారిను పవిత్రం చేసాడు.
NUM 8:22 ఆ తర్వాత లేవీ మనుష్యులు వారి పని చేసుకొనేందుకు సన్నిధి గుడారానికి వచ్చారు. అహరోను, అతని కుమారులు వారిని పర్యవేక్షించారు. లేవీ ప్రజల పనికి వారు బాధ్యులు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞకు అహరోను, అతని కుమారులు విధేయులయ్యారు.
NUM 8:23 మోషేతో యెహోవా చెప్పాడు:
NUM 8:24 “ఇది లేవీ ప్రజలకు ఒక ప్రత్యేక ఆజ్ఞ. 25 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయసుగల ప్రతి లేవీ మనిషి సన్నిధి గుడారం దగ్గరకు వచ్చి అక్కడ పని చేయాలి.
NUM 8:25 అయితే ఒకని వయసు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు, అతడు తన దినచర్యనుండి విశ్రాంతి తీసుకోవాలి. అతడు తిరిగి పని చేయాల్సిన అవసరం లేదు.
NUM 8:26 50 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయసుగల పురుషులు సన్నిధి గుడారం దగ్గర వారి సోదరులకు సహాయం చేయవచ్చును. కాని వారే స్వయంగా ఆ పని చేయకూడదు. వారిని విరమించుకోనివ్వవచ్చు. లేవీ ప్రజలకు వారి పనులను చెప్పేటప్పుడు ఇది చెప్పటం జ్ఞాపకం ఉంచుకో.”
NUM 9:1 సీనాయి అరణ్యంలో మోషేతో యెహోవా మాట్లాడాడు: ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం, ఒక మాసం నాటి మాట ఇది. మోషేతో యెహోవా అన్నాడు:
NUM 9:2 “నిర్ణీత సమయంలో పస్కా విందు భోజనం చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు.
NUM 9:3 ఈ నెల పద్నాల్గవ రోజు ఆ నిర్ణీత సమయం. మసక చీకటి వేళ వారు ఆ విందు భోజనం చేయాలి. మరియు విందునుగూర్చి నేను ఇచ్చిన నియమాలన్నింటినీ వారు జ్ఞాపకం ఉంచుకోవాలి.”
NUM 9:4 కనుక పస్కా విందుభోజనం చేయటం జ్ఞాపకం ఉంచుకోమని ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్పాడు.
NUM 9:5 పద్నాల్గవ రోజున మసక చీకటివేళ సీనాయి అరణ్యంలో ప్రజలు ఇది చేసారు. ఇది మొదటి నెలలో. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం ఇశ్రాయేలీయులు జరిగించారు.
NUM 9:6 అయితే ఆ రోజున కొందరు ప్రజలు పస్కా విందు భోజనం చేయలేకపోయారు. ఒక శవంమూలంగా వారు అపవిత్రులయ్యారు. కనుక ఆ రోజున మోషే అహరోనుల దగ్గరకు వారు వెళ్లారు.
NUM 9:7 “ఒక శవం మూలంగా మేము ‘అపవిత్రులమయ్యాము’ అయితే ఇశ్రాయేలీయుల్లోని ఇతరులతో కలిసి మేము కూడ యెహోవాకు ఈ నిర్ణీత సమయంలో కానుకలు అర్పించటంలోను పస్కా ఆచరించుటలోను యాజకులు అడ్డుకొన్నారు” అని ఆ ప్రజలు మోషేతో చెప్పారు.
NUM 9:8 “దీన్ని గూర్చి యెహోవా ఏమంటాడో నేను అడుగుతాను” అన్నాడు మోషే వారితో.
NUM 9:9 అప్పుడు మోషేతో యెహోవా:
NUM 9:10 “ఇశ్రాయేలీయులతో ఈ విషయాలు చెప్పు, ఒకవేళ సరైన సమయంలో మీరు పస్కాను ఆచరించలేకపోతున్నారేమో. మీరో లేక మీ సంతానంలో వారెవరైనా ఒక శవాన్ని ముట్టినందువల్ల అపవిత్రంగా ఉన్నారేమో. లేదా మీరు ప్రయాణంలో ఉన్నారేమో.
NUM 9:11 అయితే మీరు కూడ పస్కాను ఆచరించగలరు గాని నిర్ణీత సమయంలో కాదు. రెండవ నెల పద్నాలుగో రోజు సందెవేళ మీరు పస్కాను ఆచరించాలి. ఆ సమయంలో మీరు గొర్రెపిల్లను, పులియని రొట్టెలను, చేదు ఆకుకూరలను తినాలి.
NUM 9:12 ఆ భోజనంలో ఏమీ మర్నాటి ఉదయానికి మీరు మిగల్చకూడదు. మరియు ఎముకలు ఏవీ మీరు విరుగగొట్టకూడదు. మీరు పస్కావిందు భోజనం చేసేటప్పుడు నియమాలన్నింటినీ మీరు పాటించాలి.
NUM 9:13 అయితే ఆచరించగల ప్రతి మనిషి పస్కావిందును నిర్ణీత సమయంలో తినాలి. అతడు పవిత్రుడై, ప్రయాణంలో లేకుండా ఉండి పస్కాను ఆచరించకపోతే, అతనికి క్షమాపణ లేదు. అతుడు నిర్ణీత సమయంలో పస్కా విందుభోజనం చేయకపోతే, అప్పుడు అతడ్ని తన ప్రజల్లోనుంచి వెళ్లగొట్టి వేయాలి. ఎందుచేతనంటే నిర్ణీత సమయంలో అతడు తన అర్పణను యెహోవాకు అర్పించలేదు గనుక అతడు దోషి.
NUM 9:14 “ఇశ్రాయేలీయులకు చెందని ఒకడు మీతో నివసిస్తుంటే, అతడు మీతో కలిసి యెహోవా పస్కాలో పాలు పుచ్చుకోవాలనుకోవచ్చు. ఇది అంగీకారమే గాని మీకు ఇవ్వబడిన నియమాలన్నిటినీ అతడు పాటించాలి. మీకోసం ఉన్న నియమాలే మీరు ఇతరులకోసం కూడ పెట్టాలి.”
NUM 9:15 పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) నిలబెట్టిన రోజున ఒక మేఘం దానిమీద నిలిచింది. రాత్రి పూట ఆ మేఘం అగ్నిలా కనబడింది.
NUM 9:16 ఆ మేఘం రాత్రి అంతా పవిత్ర గుడారం మీదే నిలిచి ఉంది.
NUM 9:17 ఆ మేఘం పవిత్ర గుడారం మీద నుండి కదలినప్పుడు ఇశ్రాయేలీయులు దానిని వెంబడించారు. ఆ మేఘం ఆగిపోయినప్పుడు, అక్కడే ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకొన్నారు.
NUM 9:18 ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా సాగిపొమ్మని యెహోవా ఆజ్ఞాపించాడు అలాగే వారు గుడారాలు వేసే స్థలం విషయంకూడా. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఇదే. మేఘం పవిత్రగుడారం మీద నిలిచి ఉండగా, ప్రజలు ఆ చోటనే నివాసం కొనసాగించారు.
NUM 9:19 కొన్నిసార్లు చాలకాలంగా పవిత్ర గుడారంమీదనే ఆ మేఘం నిలిచిపోయేది. ఇశ్రాయేలీయులు యెహోవాకు విధేయులై ముందుకు కదల్లేదు.
NUM 9:20 కొన్నిసార్లు కొద్ది రోజులవరకు మాత్రమే మేఘం పవిత్ర గుడారంమీద నిలిచేది. ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. మేఘం కదిలినప్పుడు వారు ఆ మేఘాన్ని వెంబడించారు.
NUM 9:21 కొన్నిసార్లు ఆ మేఘము రాత్రి మాత్రమే నిలిచి ఉండేది. ఆ మర్నాడు మేఘము కదలగానే, ప్రజలుకూడా వారి సామగ్రి కూర్చుకొని వెంబడించారు. పగలుకాని రాత్రికాని మేఘము కదిలితే అప్పుడు ప్రజలుకూడా బయల్దేరారు.
NUM 9:22 రెండు రోజులుకానీ, ఒక నెలకానీ, ఒక సంవత్సరంకానీ ఆ మేఘము పవిత్ర గుడారంమీద నిలిచిన కూడ ప్రజలు యెహోవాకు విధేయులవుతూనే ఉన్నారు. తర్వాత మేఘము తన స్థానంనుండి లేచి బయల్దేరితే, ప్రజలు కూడ బయల్దేరారు.
NUM 9:23 కనుక ప్రజలు యెహోవా ఆజ్ఞకు విధేయులయ్యారు. యెహోవా వారికి చూపించిన చోట వారు గుడారాలు వేసారు. మరల బయల్దేరమని యెహోవా ఆజ్ఞాపించగానే వారు బయల్దేరారు, మేఘాన్ని వెంబడించారు. యెహోవా ఆజ్ఞకు ప్రజలులోబడ్డారు. ఇది మోషే ద్వారా ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ.
NUM 10:1 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
NUM 10:2 “రెండు వెండి బూరలు చేయించు. వెండిని ఉపయోగించి, బూరలు చేసేందుకు దానిని నలుగ గొట్టాలి. ఆ బూరలు ప్రజలందర్నీ సమావేశపర్చి సేనలను ఎప్పుడు బయలుదేరదీయాలో చెప్పటానికి ఉండవలెను. ప్రజలు ఎక్కడ నివాసం చేయాలి అనేది వారికి చెప్పటానికి ఇది నీకు సహాయకరంగా ఉంటుంది.
NUM 10:3 ఆ రెండు బూరలు ఒక ప్రకటనగా ఉంటాయి. ప్రజలంతా అది విని, సన్నిధి గుడార ప్రవేశం దగ్గర నీ ఎదుట కూడుకొంటారు.
NUM 10:4 నీవు ఒకే బూర ఊదితే నాయకులు (ఇశ్రాయేలు పన్నెండు కుటుంబాల నాయకులు) నీ ఎదుట కూడుకొంటారు.
NUM 10:5 “నీవు ఒక బూరను పదే పదే ఊదితే, తూర్పు వైపున నివాసం చేస్తున్న వంశాలు బయల్దేరాలి.
NUM 10:6 ఒక బూరను నీవు రెండోసారి కూడా అలాగే ఊదితే దక్షిణాన నివాసం చేస్తున్నవారు బయల్దేరాలి. బూర శబ్దం ప్రజలు బయల్దేరాలని చెప్పే ఒక ప్రకటన.
NUM 10:7 ప్రజలందరినీ ఒక్కచోట నీవు సమకూర్చాలంటే, బూరలను మరో విధంగా అంటే ఏకధాటిగా ఒకే శృతిలో ఊదాలి.
NUM 10:8 అహరోను కుమారులు, యాజకులు బూరలు ఊదాలి. ఇది మీకు భవిష్యత్తులో కూడ కొనసాగే ఆజ్ఞ.
NUM 10:9 “మీ స్వంత స్థలంలో మీరు శత్రువుతో యుద్ధం చేయాల్సివస్తే, మీరు వారిమీదికి వెళ్లక ముందు బూరలను గట్టిగా ఊదాలి. అప్పుడు మీ యెహోవా దేవుడు వింటాడు, మీ శత్రువులనుండి ఆయన మిమ్ములను రక్షిస్తాడు.
NUM 10:10 అలాగే మీ ప్రత్యేక సంతోష సమయాల్లోకూడ మీరు బూరలు ఊదాలి. మీ ప్రత్యేక పండుగ దినాల్లోను, నెలల ఆరంభ దినాల్లోను మీ బూరలు ఊదండి. మీ దహన బలులు, మీ సమాధాన బలులు అర్పించేటప్పుడు మీ బూరలు ఊదండి. అది మీరు మీ దేవుని జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరమైన ఒక ప్రత్యేక విషయం. మీరు ఇలా చేయాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. నేను యెహోవాను, మీ దేవుడ్ని.”
NUM 10:11 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన తర్వాత రెండో సంవత్సరం, రెండో నెలలో (20వ రోజు) సన్నిధి గుడారం మీదనుండి మేఘం పైకి లేచింది.
NUM 10:12 అందుచేత ఇశ్రాయేలు ప్రజలంతా సీనాయి అరణ్యంనుండి బయల్దేరి ప్రయాణం మొదలుబెట్టారు. పారాను అరణ్యంలో ఆ మేఘం నిలిచిపోయేంత వరకు, వారు ప్రయాణం చేసారు.
NUM 10:13 మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆ ప్రజలు వారి స్థలాన్ని మార్చటం ఇది మొదటి సారి.
NUM 10:14 యూదా గుడారంలో మూడు విభాగాలు ముందుగా వెళ్లాయి. వారు వారి ధ్వజం క్రిందనే ప్రయాణం చేసారు. మొదటి విభాగం యూదా వంశం. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ విభాగానికి సైన్యాధిపతి.
NUM 10:15 తర్వాత ఇశ్శాఖారు విభాగం. సూయారు కుమారుడైన నెతనేలు ఆ కుటుంబ విభాగానికి సైన్యాధిపతి.
NUM 10:16 ఆ తర్వాత జెబూలూను విభాగం. హెలోను కుమారుడైన ఏలీయాబు ఆ విభాగానికి సైన్యాధిపతి.
NUM 10:17 అప్పుడు సన్నిధి గుడారం దించబడింది. గెర్షోను, మెరారి కుటుంబ పురుషులు పవిత్ర గుడారం మోసారు. కనుక తర్వాత ఈ కుటుంబాల ప్రజలు వరుసలో ఉన్నారు.
NUM 10:18 తర్వాత రూబేను నివాసము నుండి మూడు భాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం క్రింద ప్రయాణం చేసారు. మొదటిది రూబేను వంశం. షెదెయూరు కుమారుడైన ఏలీసూరు ఆ విభాగానికి సైన్యాధిపతి.
NUM 10:19 తర్వాత షిమ్యోను వంశం. సూరిషదాయి కుమారుడైన షెలుమీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి.
NUM 10:20 తర్వాత గాదు వంశం. దెయువేలు కుమారుడు ఎలీయాసాపు ఆ విభాగానికి సైన్యాధిపతి.
NUM 10:21 తర్వాత కహాతు కుటుంబ ప్రజలు. పవిత్ర గుడారం లోపల ఉండే పవిత్ర పరికరాలను వారు మోసారు. ఈ ప్రజలంతా వచ్చేయకముందే పవిత్ర గుడారం నిలబెట్టేందుకు వీలుగా వీరు ఈ సమయంలో వచ్చారు. ప్రజలు కూడా వచ్చారు.
NUM 10:22 తర్వాత ఎఫ్రాయిము నివాసంనుండి మూడు విభాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం క్రిందనే ప్రయాణం చేసారు. మొట్టమొదటి విభాగాం ఎఫ్రాయిము వంశం. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఆ భాగానికి సైన్యాధిపతి.
NUM 10:23 తర్వాత మనష్షే వంశం. పెదాసూరు కుమారుడైన గమలీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి.
NUM 10:24 తర్వాత బెన్యామీను వంశం. గిద్యోనీ కుమారుడైన అబీదాను ఆ విభాగానికి సైన్యాధిపతి.
NUM 10:25 వరుసలో చివరి మూడు వంశాలు మిగిలిన విభాగాలన్నిటికీ వెనుక కాపుగా ఉన్నాయి. ఇవి దాను నివాసానికి చెందినవి. వారు వారి ధ్వజం క్రింద ప్రయాణం చేసారు. మొదటి విభాగం దాను వంశం. అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ విభాగానికి సైన్యాధిపతి.
NUM 10:26 తర్వాత ఆషేరు వంశం. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి.
NUM 10:27 తర్వాత నఫ్తాలి వంశం. ఏనాను కుమారుడైన అహీరా ఆ విభాగానికి సైన్యాధిపతి.
NUM 10:28 ఇశ్రాయేలు ప్రజలు ఒక చోటు నుండి మరో చోటకు బయల్దేరినప్పుడు, వారు వెళ్లిన విధానం అది.
NUM 10:29 మిద్యానీ వాడగు రెవూయేలు కుమారుడు హోబాబు. (రెవూయేలు మోషేకు మామ.) “దేవుడు మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి మేము ప్రయాణం చేస్తున్నాము. కనుక మాతో రమ్ము. మేము నీకు మేలు చేస్తాము. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా మంచివాటిని వాగ్దానం చేసాడు” అని హోబాబుతో మోషే చెప్పాడు.
NUM 10:30 “నేను మీతో రాను, నేను నా సొంతదేశానికి, నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లిపోతాను” అని హోబాబు జవాబిచ్చాడు.
NUM 10:31 అప్పుడు మోషే, “దయచేసి మమ్మల్ని విడువకు. అరణ్యంగూర్చి మాకంటె నీకే ఎక్కువ తెలుసు. నీవు మాకు మార్గదర్శిగా ఉండొచ్చు.
NUM 10:32 నీవు మాతో వస్తే, యెహోవా మాకు ఇచ్చే మంచివాటన్నింటిలో మేము నీకు భాగం ఇస్తాము” అని చెప్పాడు.
NUM 10:33 కనుక హోబాబు ఒప్పుకొన్నాడు యెహోవా పర్వతం దగ్గరనుండి వారు ప్రయాణం మొదలు బెట్టారు. పురుషులు యెహోవా ఒడంబడిక పవిత్ర పెట్టెను పట్టుకొని ప్రజల ముందు నడిచారు. వారు స్థలం కోసం వెదుకుతూ, మూడు రోజులపాటు పవిత్ర పెట్టెను మోసారు.
NUM 10:34 యెహోవా మేఘం ప్రతిరోజూ వారిమీద ఉంది. ప్రతి ఉదయం వారు తమ స్థలం విడిచిపెట్టినప్పుడు, వారిని నడిపించేందుకి మేఘం అక్కడ ఉండేది:
NUM 10:35 ప్రజలు ప్రయాణం మొదలు బెట్టి, పవిత్రపెట్టె వారితో పాటు వెడలగానే, మోషే ఎప్పుడూ ఇలా చెప్పేవాడు: “యెహోవా, లెమ్ము నీ శత్రువులు అన్ని దిక్కుల్లో పారిపోదురు గాక: నీకు వ్యతిరేకంగా ఉన్న మనుష్యులు నీ ఎదుట నుండి పారిపోదురుగాక,”
NUM 10:36 పవిత్ర పెట్టెను, దాని స్థలంలో దాన్ని ఉంచి నప్పుడు, మోషే ఎప్పుడూ ఇలా చెప్పేవాడు, “యెహోవా, లక్షలాదిమంది ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తిరిగి రమ్ము.”
NUM 11:1 ఈ సారి ప్రజలు వారి కష్టాలనుగూర్చి ఫిర్యాదు చేసారు. వారి ఫిర్యాదులను యెహోవా విన్నాడు. యెహోవా వీటిని విన్నప్పుడు ఆయనకు కోపం వచ్చింది. యెహోవా దగ్గరనుండి అగ్ని వచ్చి ప్రజల మధ్య రగులుకొంది. వారున్న స్థలంలో ఒక చివర కొన్ని ప్రాంతాలను అగ్ని కాల్చివేసింది.
NUM 11:2 కనుక ప్రజలు మోషేకు మొరపెట్టుకొన్నారు. మోషే యెహోవాను ప్రార్థించగా అగ్ని కాల్చివేయటం ఆగిపోయింది.
NUM 11:3 అందుచేత ఆ చోటు తబేరా అని పిలువబడింది. ఆ ప్రజల మధ్య యెహోవా అగ్నిని దహింపజేసాడు గనుక ఆ స్థలానికి వారు ఆ పేరు పెట్టారు.
NUM 11:4 ఇశ్రాయేలీయులతో చేరిన విదేశీయులు తినేందుకు ఇంకా ఏవేవో కావాలనికోరటం మొదలు పెట్టారు. త్వరలోనే మొత్తం ఇశ్రాయేలీయులంతా మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ప్రజలు ఇలా అన్నారు, “తినటానికి మాకు మాంసం కావాలి!
NUM 11:5 ఈజిప్టులో మేము తిన్న చేపలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. చేపలు మాకు ఉచితంగా దొరికేవి. మంచి కూరగాయలు— దోసకాయలు, పుచ్చకాయలు, ఆకు కూరలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు మాకు దొరికేవి.
NUM 11:6 కానీ ఇప్పుడు మాకు బలంలేదు. మేము, ఈ మన్నా తప్ప ఇంకేమి తినటంలేదు!”
NUM 11:7 ఆ మన్నా కొత్తివీమెర గింజల్లా ఉండి, చూపునకు చెట్టుమీద జిగురు (బంక)లా ఉంది.
NUM 11:8 ప్రజలు దీనిని పోగుచేసి, నూరి పిండి చేస్తారు. లేక బండలను ఉపయెగించి దాన్ని పొడుం చేస్తారు. తర్వాత ఒక కుండలో దాన్ని వంట చేసేవారు, లేదా తియ్యటి అప్పాలు చేసేవారు. అప్పాలు ఒలీవ నూనెతో చేసిన రొట్టెల్లా రుచిగా ఉన్నాయి.
NUM 11:9 ప్రతి రాత్రీ నేల అంతా మంచుతో తడిసినప్పుడు మన్నా నేలమీద కురిసింది.
NUM 11:10 ప్రితి కుటుంబం వాళ్లు ఫిర్యాదు చేయటం మోషే విన్నాడు. ప్రజలంతా వారివారి గుడారాంల్లో గొణుగుతున్నారు. యెహోవాకు చాల కోపం వచ్చింది. దానితో మోషేకు చాలా చికాకు కలిగింది.
NUM 11:11 మోషే యెహోవాను అడిగాడు, “యెహోవా, నీ సేవకుడనైన నాకు ఇంత కష్టం ఎందుకు కలిగించావు? నేనేమి పొరబాటు చేసాను? నీకు సంతోషం లేకుండేటట్టు నేను చేసింది ఏమిటి? ఈ ప్రజలందరి బాధ్యత నీవు నాకెందుకు ఇచ్చావు?
NUM 11:12 ఈ ప్రజలందరికీ నేను తండ్రిని కానని నీకు తెలుసు. నేను వీరికి జన్మ ఇవ్వలేదనీ నీకు తెలుసు. కానీ పాలిచ్చి పెంచే దాదిలా నేనే వీరిని నా చేతుల్లో ఎత్తుకొని పోవాల్సినట్టు కనబడుతుంది. నేను ఇలా చేసేటట్టుగా నీవెందుకు నన్ను బలవంతం చేస్తున్నావు? నీవు మా పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశానికి నేను వారిని మోసుకొని వెళ్లాలని నీవెందుకు నన్ను బలవంతం చేస్తున్నావు?
NUM 11:13 ఈ ప్రజలందరికీ మాంసం నాదగ్గర లేదు. కానీ వారు నాకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ‘తినటానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు వారు.
NUM 11:14 ఈ ప్రజలందరినీ గూర్చి నేను ఒక్కడినే బాధ్యత వహించలేను. ఈ భారం నాకు చాల బరువుగా ఉంది.
NUM 11:15 వారి కష్టాలన్నీ నీవు నా మీదే పెట్టాలనుకొంటే, ఇప్పుడే నన్ను చంపేయి. నన్ను నీ సేవకునిగా నీవు అంగీకరిస్తే, నన్ను ఇప్పుడే చావనివ్వు. అప్పుడు నా కష్టాలన్నీ తీరిపోతాయి.”
NUM 11:16 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల పెద్దలను (నాయకులను) 70 మందిని నాదగ్గరకు తీసుకునిరా. వీరు ప్రజలలో నాయకులు. సన్నిధి గుడారం దగ్గరకు వారిని తీసుకునిరా. అక్కడ నీతోబాటు వారిని నిలబెట్టు.
NUM 11:17 అప్పుడు నేను దిగివచ్చి, అక్కడ నీతో మాట్లాడతాను. ఇప్పుడు నీ మీదికి వచ్చిన ఆత్మను వారికికూడ నేను కొంత ఇస్తాను. అప్పుడు నీవు ప్రజల బాధ్యత వహించటంలో వారు కూడ నీకు సహాయం చేస్తారు. ఈ విధంగా ఈ ప్రజల బాధ్యత నీవు ఒంటరిగా భరించాల్సిన అవసరం ఉండదు.
NUM 11:18 “ప్రజలతో ఇలా చెప్పు: రేపటికోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. రేపు మీరు మాంసం తింటారు. మీ ఏడ్పు యెహోవా విన్నాడు. ‘తినటానికి మాకు మాంసం కావాలి. ఈజిప్టులోనే బాగుంది మాకు’ అని మీరు చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. కనుక యెహోవా ఇప్పుడు మీకు మాంసం ఇస్తాడు. మీరు అది తింటారు.
NUM 11:19 ఒకటి, రెండు, అయిదు, పది, ఇరవై రోజులకంటె ఎక్కువగానే మీరు అది తింటారు.
NUM 11:20 ఒక నెల అంతా మీరు ఆ మాంసం తింటారు. మొఖం మొత్తేటంతవరకు మీరు ఆ మాంసం తింటారు. యెహోవాకు వ్యతిరేకంగా మీరు ఫిర్యాదు చేసారు కనుక మీకు ఇలా జరుగుతుంది. యెహోవా మీ మధ్య సంచరిస్తూ, మీ అవసరాలను గ్రహిస్తాడు. కానీ మీరు ఆయన ఎదుట ఏడ్చి, ఫిర్యాదు చేసారు! అసలు ‘మేము ఈజిప్టు ఎందుకు విడిచిపెట్టాము’ అన్నారు మీరు.”
NUM 11:21 మోషే అన్నాడు: “యెహోవా, ఇక్కడ 6,00,000 మంది పురుషులు సంచరిస్తున్నారు. ‘నీవేమో వారు ఒక నెలంతా తినటానికి సరిపోయే మాంసం ఇస్తాను అంటున్నావు!’
NUM 11:22 మొత్తం గొర్రెలు, పశువులు అన్నింటినీ వధించినా, ఇంత మంది ప్రజలకు ఒక నెల అంతా భోజనంగా పెట్టాలంటే అది చాలదు. అలానే సముద్రంలో ఉన్న మొత్తం చేపలన్నీ మేము పట్టినా, అవీ వారికి చాలవు.”
NUM 11:23 అయితే, “యెహోవా శక్తిని పరిమితం చేయకు. నేను చేస్తానని చెప్పినవాటిని చేస్తానో లేదో నీవు చూస్తావు” అని మోషేతో యెహోవా చెప్పాడు.
NUM 11:24 కనుక మోషే ప్రజలతో మాట్లాడటానికి బయటకు వెళ్లాడు. యెహోవా చెప్పినది మోషే వారితో చెప్పాడు. అప్పుడు మోషే 70 మంది పెద్దలను సమావేశ పరచాడు. గుడారం చుట్టూ నిలబడమని మోషే వారితో చెప్పాడు.
NUM 11:25 అప్పుడు యెహోవా ఒక మేఘంలో దిగివచ్చి, మోషేతో మాట్లాడాడు. మోషే మీద ఉన్న దేవుని ఆత్మను ఆ 70 మంది పెద్దల మీద ఉంచాడు యెహోవా. ఆత్మ వారిమీదికి దిగిరాగానే వారు ప్రవచించటం మొదలు పెట్టారు. అయితే ఈ ఒక్కసారి మాత్రమే ఆ మనుష్యులు ఇలా చేసారు.
NUM 11:26 ఎల్దాదు, మేదాదు అనే అద్దరు పెద్దలు బయట గుడారం దగ్గరకు వెళ్లలేదు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి గాని వారు వారి గుడారంలోనే ఉండిపోయారు. కానీ దేవుని ఆత్మ వారిమీదకి కూడ వచ్చి నందుచేత, వారుకూడ వారి గుడారంలోనే ప్రవచించటం మొదలుపెట్టారు.
NUM 11:27 ఒక యువకుడు పరుగెత్తి వెళ్లి మోషేతో చెప్పాడు. “ఎల్దాదు, మేదాదు గుడారంలోనే ప్రవచిస్తున్నారు” అని అతడు చెప్పాడు.
NUM 11:28 అయితే నూను కుమారుడైన యెహోషువ “అయ్యా మోషే, నీవు వారిని ఆపివేయాలి” అని మోషేతో చెప్పాడు. (యెహోషువ చిన్నతనం నుండి మోషేకు సహాయకుడుగా ఉన్నాడు.)
NUM 11:29 కానీ మోషే, “ఇప్పుడు నేను నాయకుడ్ని కానని ప్రజలు తలుస్తారేమోనని నీవు భయపడుతున్నావా? యెహోవా ప్రజలు అందరూ ప్రవచిస్తే బాగుటుందని నా ఆశ. వారందరి మీద యెహోవా తన ఆత్మను ఉంచితే బాగుండునని నా ఆశ” అని బదులు చెప్పాడు.
NUM 11:30 అప్పుడు మోషే, ఇశ్రాయేలు నాయకులు అంతా తిరిగి గుడారాలకు వెళ్లిపోయారు.
NUM 11:31 అప్పుడు యెహోవా సముద్రం నుండి గొప్పగాలి వీచేటట్టుగా చేసాడు. ఆ గాలి పూరేళ్లను ఆ ప్రాంతంలోకి విసిరాయి. వారి నివాసాల చుట్టూరా పూరేళ్లు ఎగిరాయి. నేల అంతా పూరేళ్లతో నిండి పోయేటన్ని ఉన్నాయి అవి. నేలమీద మూడు అడుగుల ఎత్తుగా పూరేళ్లు నిండిపోయాయి. ఒక మనిషి ఒక రోజున నడువగలిగినంత దూరం అన్ని దిశల్లో పూరేళ్లు ఉన్నాయి.
NUM 11:32 ప్రజలు బయటకు వెళ్లి ఆ రాత్రి పగలు అంతా పూరేళ్లను ఏరుకొన్నారు. ఆ మర్నాడు అంతా వారు పూరేళ్లు పోగుచేసుకొన్నారు. తక్కువ కూర్చుకొన్నవాడు నూరు తూములుకన్నా ఎక్కువ పూరేళ్లను పోగుచేసుకున్నాడు. తర్వాత ప్రజలు ఆ పూరేళ్లను వారి గుడారాల చుట్టూ ఎండటానికి ఎండలో పరిచారు.
NUM 11:33 ప్రజలు మాంసం తినటం మొదలుపెట్టారు కాని యెహోవాకు చాల కోపం వచ్చింది. ఆ మాంసం ఇంకా వారి నోటిలో ఉండగానే, ప్రజలు దానిని తినటంముగించక ముందే ఆ ప్రజలకు భయంకరమైన రోగం వచ్చేటట్టు చేసాడు యెహోవా. అనేకులు అక్కడే మరణించినందువల్ల అక్కడే పాతిపెట్టబడ్డారు.
NUM 11:34 కనుక ప్రజలు ఆ చోటుకు కిబ్రోత్ హత్తావా అని పేరు పెట్టారు. గొప్ప భోజనం కోసం బలీయమైన కోరికగల వారందరినీ అక్కడ పాతిపెట్టినందువల్ల వారు ఆ చోటుకు ఆ పేరు పెట్టారు.
NUM 11:35 కిబ్రోత్ హత్తావా నుండి ప్రయాణం చేసి ప్రజలు హజేరోతు చేరి అక్కడ నివసించారు.
NUM 12:1 మిర్యాము, అహరోనూ మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. అతని భార్య ఇథియోపియా స్త్రీ గనుక వారు అతణ్ణి విమర్శించారు. మోషే ఇథియోపియా ప్రజల్లోని స్త్రీని వివాహం చేసు కోవటం మంచిది కాదని వారు తలంచారు.
NUM 12:2 “ప్రజలతో మాట్లాడటానికి యెహోవా మోషేను వాడుకొన్నాడు. కానీ మోషే ఒక్కడే ఉన్నాడా? మన ద్వారా కూడ యెహోవా మాట్లాడాడు కదా” అని వారు తమలో తాము అనుకొన్నారు. యెహోవా ఇది విన్నాడు.
NUM 12:3 (మోషే చాలా దీనుడు. అతడు గొప్పలు చెప్పుకోలేదు, సణగ లేదు, భూమి మీద అందరికంటె అతడు దీనుడు.)
NUM 12:4 కనుక యెహోవా అకస్మాత్తుగా మోషే, అహరోను, మిర్యాములతో మాట్లాడాడు. “మీరు ముగ్గురూ ఇప్పుడే సన్నిధి గుడారానికి రండి” అని చెప్పాడు. కనుక మోషే, అహరోను, మిర్యాము గుడారానికి వెళ్లారు.
NUM 12:5 అప్పుడు యెహోవా ఒక మేఘంలో దిగివచ్చాడు. గుడార ప్రవేశం దగ్గర యెహోవా నిలబడ్డాడు. “అహరోను, మిర్యామును” తన దగ్గరకు రమ్మని పిల్చాడు యెహోవా. వాళ్లిద్దరూ ఆయనకు దగ్గరగా రాగానే
NUM 12:6 దేవుడు అన్నాడు: “నా మాటలు వినండి, మీ మధ్యకు నేను ప్రవక్తలను పంపినప్పుడు, యెహోవా నగు నేను వారికి దర్శనంలో కనబడతాను. కలలో నేనే వారితో మాట్లాడతాను.
NUM 12:7 కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు.
NUM 12:8 నేను అతనితో మాట్లాడినప్పుడు ముఖాముఖీగా నేను అతనితో మాట్లాడతాను. అతనితో నేను చెప్పాలనుకొనే విషయాలు వివరంగా నేను చెబుతాను. గూఢార్థపు పొడుపు కథలు నేను ప్రయోగించను. మోషే సాక్షాత్తు యెహోవా రూపాన్ని చూడవచ్చు. కనుక నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మీరెందుకు అంత ధైర్యంగా మాట్లాడారు?”
NUM 12:9 అంతట యెహోవా వారిని విడిచి వెళ్లి పోయాడు. కానీ ఆయనకు వారిమీద చాలా కోపం వచ్చింది.
NUM 12:10 యెహోవా మేఘం గుడారం మీదనుండి పైకి లేచి పోయింది. అప్పుడు అహరోను అటు తిరిగి మిర్యామును చూడగా, ఆమెకు భయంకర కుష్ఠురోగం రావటం అతనికి కనబడింది. ఆమె శరీరం మంచులా తెల్లగా ఉంది.
NUM 12:11 అప్పుడు మోషేతో అహరోను అన్నాడు: “అయ్యా బుద్ధిహీనంగా మేము పాపం చేసాము, మమ్మల్ని క్షమించు.
NUM 12:12 చచ్చి పుట్టిన శిశువులా ఆమె తన శరీరాన్ని పోగొట్టుకోనియ్యకు.” (కొన్ని సార్లు అలాంటి శిశువు సగం శరీరం తినివేయబడిపుడుతుంది.)
NUM 12:13 కనుక మోషే, “ఓ దేవా ఈ రోగంనుండి ఆమెను బాగుచేయి” అని యెహోవాకు మొరపెట్టాడు.
NUM 12:14 “ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేస్తే ఆమెకు ఏడు రోజులు అవమానం కలుగుతుంది. కనుక ఆమెను ఏడురోజులు పాళెమునకు బయట ఉంచండి. ఆ తర్వాత ఆమె తిరిగి లోనికి రావచ్చు” అని యెహోవా జవాబిచ్చాడు.
NUM 12:15 కనుక మిర్యాము ఏడు రోజులపాటు పాళెమునకు వెలుపల ఉంచబడింది. ఆమె మరల లోనికి తీసుకొని రాబడేంతవరకు ప్రజలు అక్కడనుండి కదలలేదు.
NUM 12:16 అది జరిగిన తర్వాత ప్రజలు హజేరోతు విడిచి పారాను అరణ్యనికి ప్రయాణం చేసారు. ప్రజలు ఆ అరణ్యంలో గుడారాలు వేసుకొనిరి.
NUM 13:1 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
NUM 13:2 “కనాను దేశాన్ని తరచి చూడ్డానికి కొందరు మనుష్యుల్ని పంపించు. ఇదే నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చే దేశం. పన్నెండు వంశాల్లో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్కరిని పంపించు.”
NUM 13:3 కనుక యెహోవా ఆజ్ఞకు మోషే విధేయుడయ్యాడు. పారాను అరణ్యంలోనికి నాయకులను అతడు పంపించాడు.
NUM 13:4 వారి పేర్లు ఇవి: రూబేను వంశంనుండి జక్కూరు కుమారుడైన షమ్మూయ.
NUM 13:5 షిమ్యోను వంశంనుండి హోరీ కుమారుడైన షాపాతు.
NUM 13:6 యూదా వంశంనుండి యెపున్నె కుమారుడైన కాలేబు.
NUM 13:7 ఇఖారు వంశంనుండి యోసేపు కుమారుడైన ఇగాలు.
NUM 13:8 ఎఫ్రాయిము వంశంనుండి నూను కుమారుడైన హోషేయ.
NUM 13:9 బెన్యామీను వంశంనుండి రాఫు కుమారుడైన పల్తీ.
NUM 13:10 జెబూలూను వంశంనుండి సోరీ కుమారుడైన గదీయేలు.
NUM 13:11 మనష్షే (యెసేపు వంశాల్లో ఒకటి) వంశంనుండి సూసీ కుమారుడైన గదీ.
NUM 13:12 దాను వంశంనుండి గెమలి కుమారుడైన అమ్మీయేలు.
NUM 13:13 ఆషేరు వంశంనుండి మిఖాయేలు కుమారుడైన సెతూరు.
NUM 13:14 నఫ్తాలి వంశంనుండి వాపెసీ కుమారుడైన నహబీ.
NUM 13:15 గాదు వంశంనుండి మాకీ కుమారుడైన గెయువేలు.
NUM 13:16 ఆ దేశాన్ని చూచి పరిశీలించేందుకు మోషే పంపించిన వారి పేర్లు అవి. (నూను కుమారుడైన హోషేయను మోషే యెహోషువ అని మరో పేరు పెట్టి పిలిచేవాడు.)
NUM 13:17 కనాను దేశాన్ని కనుక్కొనేందుకు మోషే వారిని పంపించినప్పుడు అతడు ఇలా చెప్పాడు: “నెగెవు ఎడారిలోనుండి వెళ్లండి, తర్వాత ఆ కొండల దేశంలోకి వెళ్లండి.
NUM 13:18 ఆ దేశం ఎలా ఉందో చూడండి. అక్కడ నివసిస్తున్న ప్రజలనుగూర్చి తెలుసుకోండి. వారు బలవంతులా? బలహీనులా? వారు కొద్ది మందేనా? చాలమంది ఉన్నారా?
NUM 13:19 వారు నివసిస్తున్న దేశాన్ని గూర్చి తెలుసుకోండి. ఆ భూమి మంచిదా కాదా? వారు నివసించే పట్టణాలు ఎలాంటివి? ఆ పట్టణాలకు గోడలు ఉన్నాయా? ఆ పట్టణాలకు బలీయమైన కాపుదల ఉందా?
NUM 13:20 ఆ దేశాన్ని గూర్చి ఇతర విషయాలు కూడ తెలుసుకోండి. ఆ భూమి, సారమైనదా కాదా? ఆ భూమి మీద చెట్లు ఉన్నాయా? అక్కడనుండి కొన్ని పండ్లు తీసుకుని రావటానికి ప్రయత్నించండి.” (ద్రాక్ష ప్రథమ ఫలాల కాలం ఇది).
NUM 13:21 అప్పుడు వారు ఆ దేశాన్ని పరిశీలించి చూసారు. వారు సీను అరణ్యం నుండి రెహోబు, లెబ్రోహమాతు వరకు వెళ్లారు.
NUM 13:22 నెగెవు ద్వారా ప్రయాణించి హెబ్రోను పట్టణం చేరుకొన్నారు. (ఈజిప్టులోని సోయను పట్టణం కంటె హెబ్రోను ఏడేండ్లు ముందు నిర్మించబడింది.) అక్కడ అహీమాను, షేషయి, తల్మయి నివసించారు. వీరు అనాకీ ప్రజలు.
NUM 13:23 వాళ్లు ఎష్కోలు లోయలో ఒక ద్రాక్ష కొమ్మ కోసారు. ఆ కొమ్మకు ఒక ద్రాక్ష గెల ఉంది. ఇద్దరు మనుష్యులు ఆ గెలను ఒక కర్రకు కట్టి మోసుకొచ్చారు. కొన్ని దానిమ్మ, అంజూరపు పండ్లు కూడ వారు తెచ్చారు.
NUM 13:24 అక్కడ ఇశ్రాయేలు మనుష్యులు ద్రాక్ష గుత్తిని కోసినందుచేత ఆ చోటు ఎష్కోలు అని పిలువబడింది.
NUM 13:25 40 రోజుల పాటు వారు ఆ దేశాన్ని పరిశీలించారు. అప్పుడు వారు తిరిగి వారి నివాసమునకు వచ్చారు.
NUM 13:26 ఆ మనుష్యులు కాదేషు దగ్గర మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తిరిగి వచ్చారు. ఇది పారాను అరణ్యంలో ఉంది. అప్పుడు వారు చూచిన విషయాలన్నింటినీ మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలు అందరితో చెప్పారు. వారు ఆ దేశపు పండ్లను వారికి చూపించారు.
NUM 13:27 ఆ మనుష్యులు మోషేతో ఇలా చెప్పారు: “నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి మేము వెళ్లాము. ఆ దేశం చాలా బాగుంది. అక్కడ పాలు, తేనెలు ప్రవహిస్తున్నాయి! అక్కడ మేము చూచిన పండ్లు ఇవిగో.
NUM 13:28 కానీ అక్కడ నివసిస్తున్న మనుష్యులు చాలా బలము, శక్తి ఉన్న వాళ్లు. వారి పట్టణాలు బలంగా కాపుదలలో ఉన్నాయి. ఆ పట్టణాలు చాల పెద్దవి. అనాకు కుటుంబానికి చెందిన కొందరు మనుష్యుల్ని కూడ మేము అక్కడ చూశాము.
NUM 13:29 అమాలేకీ ప్రజలు నెగెవు లోయలో నివసిస్తున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండల ప్రాంతంలో నివసిస్తున్నారు. కనానీ ప్రజలు సముద్రతీర ప్రాంతంలోను, యోర్దాను నదీతీరంలోను నివసిస్తున్నారు.”
NUM 13:30 అప్పుడు మోషే దగ్గర ఉన్న వాళ్లను నిశ్శబ్దంగా ఉండమన్నాడు కాలేబు. అప్పుడు కాలేబు, “మనం వెళ్లి ఆ దేశాన్ని మనకోసం స్వాధీనం చేసుకోవాలి. తేలికగా మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు” అని చెప్పాడు.
NUM 13:31 కానీ అతనిలో కూడ వెళ్లినవారు, “ఆ మనుష్యులతో మనం పోరాడలేం. వాళ్లు మనకంటె చాల బలంగలవాళ్లు అన్నారు.
NUM 13:32 మనం ఆ దేశ ప్రజలను జయించేందుకు తగిన బలవంతులం కాదు” అని ఇశ్రాయేలు ప్రజలందరితో వారు చెప్పారు. వారు ఇలా చెప్పారు: “మేము చూచిన దేశంనిండా బలాఢ్యులు ఉన్నారు. అక్కడికి వెళ్లిన ఎవరినైనాసరే తేలికగా జయించ గలిగినంత బలంగలవాళ్లు వారు.
NUM 13:33 అక్కడ మేము నెఫీలీ ప్రజలకు చూసాం (నెఫీలీ ప్రజలవాడగు అనాకు సంతానం.) వాళ్ల ముందు నిలబడితే మేము మిడుతల్లా ఉన్నట్టు అనుపించింది. మేమేదో మిడుతలంత చిన్నవాళ్లంగా మమ్మల్ని చూసారు.”
NUM 14:1 ఆ రాత్రి గుడారాలలో ఉన్న ప్రజలంతా గట్టిగా ఏడ్వటం మొదలుపెట్టారు.
NUM 14:2 ఇశ్రాయేలు ప్రజలంతా మోషే, అహరోనులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసారు. ప్రజలంతా కూడి వచ్చి మోషే, అహరోనులతో ఇలా చెప్పారు, “ఈజిప్టులోనో లేక అరణ్యంలోనో మేము చావాల్సింది. మన కొత్త దేశంలో కత్తిచేత చావటంకంటె అదే బాగుండేది.
NUM 14:3 మమ్మల్ని ఈ కొత్త దేశానికి చావటానికి తీసుకొచ్చాడా? మా భార్యల్ని, మా పిల్లల్ని మా దగ్గరనుండి తీసుకుపోయి మమ్మల్ని కత్తులతో చంపేస్తారు. మేము మళ్లీ ఈజిప్టు వెళ్లి పోవటమే మాకు క్షేమం.”
NUM 14:4 అప్పుడు వాళ్లు, “మనం ఇంకో నాయకుడ్ని ఏర్పాటు చేసుకొని, తిరిగి ఈజిప్టు వెళ్లిపోదాము” అని ఒకళ్లతో ఒకరు చెప్పుకొన్నారు.
NUM 14:5 అప్పుడు అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరి ముందు మోషే, అహరోను సాష్టాంగపడ్డారు.
NUM 14:6 ఆ దేశాన్ని కనుక్కొని వచ్చిన ఇద్దరు వ్యక్తులు నూను కుమారుడైన యెహోషువ యెపున్నె కుమారుడైన కాలేబు బట్టలు చించుకున్నారు.
NUM 14:7 ఈ ఇద్దరు మనుష్యులూ అక్కడ సమావేశమైన ఇశ్రాయేలీయులందరితో ఇలా చెప్పారు: “మేము చూచిన దేశం చాలబాగుంది.
NUM 14:8 మనమీద దేవునికి ఇష్టం ఉంటే, ఆయనే మనల్ని ఆ దేశంలోనికి నడిపిస్తాడు. ఆ దేశం పాలు తేనెలు ప్రవహిస్తున్నంత సౌభాగ్యమయినది. ఆ దేశాన్ని మనకు ఇచ్చేందుకు యెహోవా తన శక్తి ప్రయోగిస్తాడు.
NUM 14:9 అంతేగాని మనం యెహోవాకు ఎదురు తిరుగకూడదు. ఆ దేశంలో ప్రజలకు కూడ మనం భయపడకూడదు. మనం వాళ్లను తేలికగా జయించేస్తాం. వాళ్లకు ఎలాంటి భద్రతా లేదు, వాళ్లను క్షేమంగా ఉంచగలిగింది ఏమి లేదు. కానీ మనకు యెహోవా ఉన్నాడు. అందుచేత ఆ మనుష్యుల్ని గూర్చి భయపడకండి!”
NUM 14:10 అప్పుడు అక్కడ చేరిన ఇశ్రాయేలు ప్రజలంతా వీళ్లిద్దర్నీ రాళ్లతో కొట్టి చంపేయాలని మాట్లాడుకొన్నారు. అయితే యెహోవా మహిమ సన్నిధి గుడారం మీదికి దిగివచ్చింది. ఇశ్రాయేలు ప్రజలంతా అది చూడగలిగారు.
NUM 14:11 అప్పుడు మోషేతో, యోహోవా: “ఇంకా ఎన్నాళ్లు ఈ ప్రజలు ఇలా చేస్తారు? వాళ్లు నన్ను నమ్మటంలేదనే వ్యక్తం చేస్తున్నారు. నా శక్తి మీద వాళ్లకు నమ్మకంలేనట్టే కనబడుతోంది. శక్తివంతమైన ఎన్నో సూచనలు నేను వాళ్లకు చూపించిన తర్వాతకూడ వాళ్లు నన్ను నమ్మటానికి నిరాకరిస్తున్నారు. వాళ్లమధ్య నేను ఎన్నో మహాకార్యాలు చేసాను.
NUM 14:12 ఒక భయంకర రోగంతో వాళ్లందరినీ నేను చంపేస్తాను. వాళ్లను నేను నాశనం చేస్తాను. మరో జనాంగాన్ని తయారు చేసేందుకు నిన్ను నేను వాడు కొంటాను. ఆ జనాంగం ఈ ప్రజలకంటె గొప్పదిగా, బలమైనదిగా ఉంటుంది.” అని అన్నాడు.
NUM 14:13 అప్పుడు యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “నీవు అలాగనుక చేస్తే, నీ ప్రజలందరినీ నీవే చంపేసావని ఈజిప్టు ప్రజలు వింటారు. ఈ ప్రజలను ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చేందుకు నీవు నీ గొప్ప శక్తిని ప్రయోగించావు.
NUM 14:14 ఈ గొప్ప శక్తినిగూర్చి ఈ దేశ నివాసులందరికీ ఈజిప్టు ప్రజలు చెప్పారు. ఒక యెహోవా, వాళ్లు ఇప్పటికే నిన్నుగూర్చి విన్నారు. నీవు నీ ప్రజలకు తోడుగా ఉన్నావనీ ప్రతి ఒక్కరూ నిన్ను చూసారనీ వారికి తెలుసు. నీ ప్రజలమీద నిలిచే మేఘాన్ని గూర్చి కూడ ఈ దేశవాసులకు తెలుస్తుంది. పగలు నీ ప్రజలను నడిపించేందుకు నీవు ఆ మేఘాన్ని వాడుకొన్నావు. రాత్రిపూట నీ ప్రజలకు నడిపించటానికి తిరిగి ఆ మేఘం అగ్నిగా మారుతుంది.
NUM 14:15 అందుచేత ఇప్పుడు నీవు ఈ ప్రజలను చంపకూడదు. ఒకవేళ నీవు వారిని చంపితే, నీ శక్తిని గూర్చి విన్న దేశాలన్నీ ఏమంటాయంటే
NUM 14:16 ‘యెహోవా ఈ ప్రజలకు వాగ్దానం చేసిన దేశంలోకి వారిని తీసుకుని రాలేకపోయాడు. అందుకని వాళ్లను అరణ్యంలోనే చంపేసాడు అంటారు.’
NUM 14:17 “కనుక యెహోవా, ఇప్పుడు నీ బలం చూపెట్టాలి. నీవు చూపిస్తానని ప్రకటించిన విధానంలో నీవు చూపించాలి.
NUM 14:18 ‘యెహోవా త్వరగా కోపపడడు. ఆయన మహా ప్రేమమూర్తి. యెహోవా పాపాన్ని ఆయనకు ఎదురు తిరిగేవారిని క్షమిస్తాడు. అయితే నేరస్థులను మాత్రం యెహోవా ఎప్పుడూ శిక్షిస్తాడు. తల్లిదండ్రులు చేసిన పాపాలకుకూడా యెహోవా పిల్లల్ని శిక్షిస్తాడు. వారి తాత ముత్తాతల పాపాలకు యెహోవా పిల్లల్నికూడ శిక్షిస్తాడు’ అని నీవు చెప్పావు.
NUM 14:19 కనుక నీ మహా ప్రేమను ఈ ప్రజలకు చూపించు. వారి పాపం క్షమించు. వారు ఈజిప్టు విడిచినప్పటినుండి నీవు వారిని క్షమించినట్టే ఇప్పుడు కూడా క్షమించు.”
NUM 14:20 యెహోవా జవాబిచ్చాడు: “నీవు అడిగినట్టే నేను ఈ ప్రజలను క్షమించాను.
NUM 14:21 అయితే సత్యం ఏమిటో నీతో చెబుతాను. నేను జీవిస్తున్నంత నిశ్చయంగా, నా శక్తి ఈ భూమి అంతటా ఆవరించినంత నిశ్చయంగా, నేను నీకు ఆ వాగ్దానం చేస్తున్నాను.
NUM 14:22 ఈజిప్టు నుండి నేను బయటకు నడిపించిన ప్రజల్లో ఏ ఒక్కరూ ఆ కనాను దేశాన్ని చూడరు. ఈజిప్టులో నేను చేసిన మహా సూచనలను, నా మహిమను చూసారు ఆ ప్రజలు. అరణ్యంలో నేను చేసిన మహా కార్యాలు వారు చూసారు. అయినా వారు నాకు అవిధేయులై, పదిసార్లు నన్ను శోధించారు.
NUM 14:23 వారి పూర్వీకులకు ఆ గొప్ప దేశాన్ని ఇస్తానని నేను వాగ్ధానం చేసాను. అయితే నాకు ఇలాంటి కీడు చేసిన ఏ వ్యక్తి ఎన్నటికీ ఆ దేశంలో ప్రవేశించడు.
NUM 14:24 కానీ నా సేవకుడైన కాలేబు విషయం వేరు. అతడు పూర్తిగా నన్ను వెంబడిస్తాడు. కనుక అతడు ఇప్పుడు చూసిన ఆ దేశంలోకి అతడ్ని తీసుకొస్తాను. అతని మనుష్యులకు ఆ దేశం దొరుకుతుంది.
NUM 14:25 అమాలేకీ, కనానీ ప్రజలు లోయలో నివసిస్తున్నారు. రేపు ఈ చోటు విడిచి, తిరిగి ఎర్ర సముద్రం మార్గంగా అరణ్యానికి వెళ్లండి.”
NUM 14:26 మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు:
NUM 14:27 “ఈ దుర్మార్గులు ఇంకెన్నాళ్లు ఇలా నా మీద ఫిర్యాదు చేస్తుంటారు? వారి ఫిర్యాదులు, సణుగుడు నేను విన్నాను.
NUM 14:28 కనుక వారితో ఇలా చెప్పు, మీరు ఫిర్యాదు చేసిన విషయాలన్నింటినీ యెహోవా తప్పక జరిగిస్తాడు. మీకు ఏమి సంభవిస్తుందంటే,
NUM 14:29 ఈ అరణ్యంలోనే మీ శరీరాలు చచ్చిపడతాయి. మీలో 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లంతా మన ప్రజల్లో సభ్యులుగా లెక్కించబడ్డారు. మీలో ప్రతి ఒక్కరూ, యెహోవానైన నా మీద ఫిర్యాదు చేసారు.
NUM 14:30 మీకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశంలో మీరు ఒక్కరుకూడా ప్రవేశించరు. యెపున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే ఆ దేశంలోని ప్రవేశిస్తారు.
NUM 14:31 మీరు భయపడి, ఆ కొత్త దేశంలో మీ శత్రువులు మీ పిల్లలను మీ దగ్గరనుండి తీసుకుని పోతారని ఫిర్యాదు చేసారు. అయితే ఆ పిల్లల్నే ఆ దేశంలోకి నేను తీసుకుని వస్తానని నేను మీతో చెబుతున్నాను. మీరు అంగీకరించకుండా నిరాకరించిన వాటిని వారు అనుభవిస్తారు.
NUM 14:32 మీ విషయానికొస్తే, మీ శరీరాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి.
NUM 14:33 “మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 సంవత్సరాలపాటు కాపరులుగా ఉంటారు. మీకు విశ్వాసం లేదు గనుక వారు శ్రమపడుతారు. మీరంతా చచ్ఛేంతవరకు వారు ఈ అరణ్యంలోనే ఉండాలి. అప్పుడు మీ అందరి శరీరాలు ఈ అరణ్యంలోనే పడి ఉంటాయి.
NUM 14:34 మీ పాపాలకోసం 40 సంవత్సరాలు మీరు శ్రమ అనుభవిస్తారు. (ఆ దేశాన్ని కనుగొన్న 40 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో సంవత్సరం చొప్పున.) నేను మీకు వ్యతిరేకంగా ఉండటం ఎంతో దారుణంగా ఉంటుందని మీరు తెలుసుకుంటారు.”
NUM 14:35 “నేను యెహోవాను, నేనే మాట్లాడాను. ఈ దుర్మార్గులందరికీ ఇవన్నీ నేను చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. వీరంతా కలిసి నామీదికి వచ్చారు. అందుచేత వీళ్లంతా ఇక్కడే అరణ్యంలోనే చస్తారు.”
NUM 14:36 ఆ కొత్త దేశాన్ని కనుగొనేందుకు మోషే పంపిచిన మనుష్యులు తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్లో ఫిర్యాదులు వ్యాపింప చేసారు. ఈ దేశంలో ప్రవేశించటానికి సరిపడినంత బలంగల వాళ్లం కాదు అని వారే చెప్పారు.
NUM 14:37 ఇశ్రాయేలు ప్రజల్లో కష్టాలు వ్యాపించటానికి వాళ్లే బాధ్యులు. అందుకని వాళ్లందర్నీ చంపేయటానికి ఒక రోగాన్ని రప్పించాడు యెహోవా.
NUM 14:38 అయతే ఆ దేశాన్ని పరిశీలించటానికి పంపబడ్డవాళ్లలో నూను కుమారుడైన యెహోషువ, యెపున్నె కుమారుడైన కాలేబు కూడ ఉన్నారు. యెహోవా వాళ్లిద్దర్నీ రక్షించాడు. మిగతా పదిమందిని చని పోవునట్లు చేసిన రోగం వారికి రాలేదు.
NUM 14:39 ఈ సంగతులన్నీ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ప్రజలు చాలా, చాలా విచారించారు.
NUM 14:40 మర్నాడు ఉదయాన్నే ప్రజలు కొండల దేశానికి బయల్దేరారు. ఆ ప్రజలు, “మేము పాపము చేసాము. మేము యోహోవా మీద నమ్మకం ఉంచనందుకు మేము విచారిస్తున్నాము. యెహోవా వాగ్దానం చేసిన దేశానికి మేము వెళ్తాము” అన్నాడు.
NUM 14:41 కానీ మోషే ఇలా అన్నాడు: “యెహోవా ఆజ్ఞకు మీరెందుకు విధేయులవటం లేదు? మీకు జయం కలుగదు.
NUM 14:42 మీరు ఆ దేశం వెళ్లవద్దు. యెహోవా మీకు తోడుగా లేడు. మీ శత్రువులు మిమ్మల్ని తేలికగా ఓడించేస్తారు.
NUM 14:43 అక్కడ అమాలేకీయులు, కనానీయులు మీతో పొరాడుతారు. మీరు యెహోవానుండి వేరైపోయారు. అందుచేత మీరు వాళ్లతో యుద్ధం చేసేటప్పుడు ఆయన మీకు తోడుగా ఉండడు. మీరంతా వారి ఖడ్గాలతో చంపబడతారు.”
NUM 14:44 కానీ ప్రజలు మోషేను నమ్మలేదు. వారు అలానే ఆ కొండల దేశంవైపు వెళ్లారు. అయితే మోషేగాని, యెహోవా ఒడంబడిక పెట్టెగాని వారితో వెళ్లలేదు.
NUM 14:45 అప్పుడు ఆ కొండల దేశంలో నివసిస్తున్న అమాలేకీ ప్రజలు, కనానీ ప్రజలు దిగివచ్చి ఇశ్రాయేలు ప్రజలమీద దాడిచేసారు. అమాలేకీ ప్రజలు, కనానీ ప్రజలు తేలికగా వీరిని ఓడించి, హోర్మా వరకు వారిని తరిమికొట్టారు.
NUM 15:1 మోషేతో యెహోవా ఇలా అన్నాడు:
NUM 15:2 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారికి చెప్పు: మీకు నివాసంగా నేను ఇస్తున్న ఒక దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు ఆ దేశంలో ప్రవేశించగానే మీరు యెహోవాకు బలులు అర్పించాలి.
NUM 15:3 ఈ అర్పణల్లో కొన్నింటిని మీరు అగ్నితో దహించాలి. మీ పశువుల మందల్లోనుండి, గొర్రెలమందల్లోనుండి మీరు అర్పణలు ఇవ్వాలి. ఇది యెహోవాకు ప్రీతిని కలిగిస్తుంది. దహనబలులు, బలి అర్పణలు, ప్రత్యేక ప్రమాణాలు, ప్రత్యేక కానుకలు, సమాధాన బలులు, ప్రత్యేక సెలవు దినాలు ఇవన్నీ యెహోవాకు చాల ఇష్టం.
NUM 15:4 “ఆ సమయంలో తన అర్పణను తెచ్చేవాడు యెహోవాకు ధాన్యార్పణ కూడ పెట్టాలి. ఆ ధాన్యార్పణ ముప్పావు ఒలీవ నూనెతో కలపబడ్డ రెండు పడుల పిండి.
NUM 15:5 ఒక గొర్రెపిల్లను దహనబలిగా నీవు అర్పించిన ప్రతిసారీ ముప్పావు ద్రాక్షారసం పానార్పణంగా నీవు సిద్ధం చేయాలి.
NUM 15:6 “మీరు ఒక పొట్టేలును అర్పిస్తుంటే కూడ ధాన్యార్పణ సిద్ధం చేయాలి. ఆ ధాన్యార్పణ ఒక పడి ఒలీవ నూనెతో కలుపబడ్డ నాలుగు పడుల పిండి.
NUM 15:7 ఒక పడి ద్రాక్షారసాన్ని పానార్పణంగా నీవు సిద్ధం చేయాలి. దాన్ని యెహోవాకు అర్పించు. అది ఆయన్ను సంతోషపెడుతుంది.
NUM 15:8 “అర్పణగా, బలిగా, సమాధాన బలిగా, లేక యెహోవాకు ఒక ప్రత్యేక వాగ్దానంగా నీవు ఒక కోడెదూడను సిద్ధం చేయవచ్చు.
NUM 15:9 కనుక ఆ కోడెదూడతోబాటు ధాన్యార్పణ కూడ నీవు తీసుకొనిరావాలి. ఆ ధాన్యార్పణ పడిన్నర ఒలీవ నూనెతో కలుపబడిన ఆరు పడుల గోధుమ పిండి.
NUM 15:10 మరియు పడిన్నర ద్రాక్షారసం పానార్పణంగా తేవాలి. ఈ అర్పణ హోమంలో దహించబడటం యెహోవాకు ఎంతో సంతోషం.
NUM 15:11 నీవు యెహోవాకు అర్పించే ప్రతి కోడెదూడ, పోట్టేలు, గొర్రెపిల్ల, మేక పిల్ల ఈ విధంగా సిద్ధం చేయబడాలి.
NUM 15:12 నీవు అర్పించే ప్రతి జంతువుకూ నీవు ఇలా చేయాలి.
NUM 15:13 “ప్రజలు ఇలా దహన బలులు అర్పించినప్పుడు వారు యెహోవాను సంతోషపెడుతారు. అయితే ఇశ్రాయేలీయుల్లో ప్రతి పౌరుడూ వీటన్నింటినీ నేను నీతో చెప్పినట్టే చేయాలి.
NUM 15:14 మరియు రాబోయే కాలమంతటిలో ఇశ్రాయేలు కుటుంబంలో జన్మించనివాడు మీ మధ్య నివసిస్తుంటే, అతడు కూడా వీటన్నింటికీ విధేయుడు కావాలి. నేను నీకు చెప్పిన విధంగానే అతడు ఇవన్నీ చేయాలి.
NUM 15:15 ఇశ్రాయేలు వంశంలో పుట్టిన మీకు, మీ మధ్య నివసించే ఇతరులకు ఒకే రకమైన నియమాలు ప్రజలకు ఉండాలి. ఈ ఆజ్ఞ ఇప్పటినుండి భవిష్యత్తు వరకు కొనసాగుతుంది. మీరు, మీ మధ్య ఉండే ఇతరులు అంతా ఒకటే యెహోవా ఎదుట.
NUM 15:16 అంటే మీరు ఒకే ఆజ్ఞలు, నియమాలు పాటించాలని దీని భావం. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన మీకు, మీ మధ్య నివసించే ఇతర ప్రజలందరకు ఇవే ఆజ్ఞలు, నియమాలు.”
NUM 15:17 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
NUM 15:18 “ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు చెప్పు: నేను మిమ్మల్ని మరో దేశానికి తీసుకుని వెళ్తున్నాను.
NUM 15:19 ఆ దేశంలో పండే ఆహారం మీరు తినేటప్పుడు దానిలో భాగం యెహోవాకు అర్పణగా మీరు ఇవ్వాలి.
NUM 15:20 మీరు ధాన్యం విసిరి, ముద్దగా చేయాలి. దాన్ని రొట్టెలుగా చేయాలి. ఆ రొట్టెల్లో మొదటిది యెహోవాకు ఇవ్వాలి. అది కళ్లం నుండి వచ్చే ధాన్యార్పణ.
NUM 15:21 ఇప్పుడు, రాబోయే కాలమంతా ఈ అర్పణను మీరు యెహోవాకు ఇవ్వాలి. అనగా మీరు ఆహారంగా విసరు కొనే ధాన్యంలో మొదటిది యెహోవాకు ఇవ్వాలని అర్థం.
NUM 15:22 “మోషేకు యెహోవా ఇచ్చిన ఈ ఆజ్ఞలలో దేనికైనా విధేయులవటం మీరు మరచిపోతే మీరేమిచేయాలి?
NUM 15:23 ఇవి మోషే ద్వారా మీకివ్వబడిన ఆజ్ఞలు. వీటిని యెహోవా మీకు ఇచ్చిన రోజే ఈ ఆజ్ఞలు ప్రారంభం అయ్యాయి. ఈ ఆజ్ఞలు రాబోయే కాలమంతా కొనసాగుతాయి.
NUM 15:24 అయితే వీటిలో ఏదైనా ఒక ఆజ్ఞకు మీరు విధేయులు కాకపోవటం జరుగవచ్చు. మీరు ఒక ఆజ్ఞకు విధేయులవటం మరచిపోయినా, ప్రజలంతా ఆ ఆజ్ఞ మరచిపోయి దోషులైనా, ప్రజలంతా ఒక కోడెదూడను యెహోవాకు అర్పణగా ఇవ్వాలి. ఇది దహనబలి, ఇది యెహోవాను సంతోషపెడుతుంది. కోడె దూడతో బాటు ధాన్యార్పణ, పానార్పణం కూడ ఇవ్వాలని జ్ఞాపకం ఉంచుకోండి. మరియు పాప పరిహర బలిగా ఒక మగ మేకనుకూడ మీరు ఇవ్వాలి.
NUM 15:25 “కనుక ఆ పాపం నిమిత్తం ఆ చెల్లింపును యాజకుడు అర్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరి కోసం అతడు ఇలా చేస్తాడు. వారు పాపం చేస్తున్నట్టు ప్రజలకు తెలియదు. అయితే దాన్నిగూర్చి వారు తెలుసుకొన్నప్పుడు, వారి తప్పిదం నిమిత్తం యెహోవాకు అర్పించేందుకు వారు ఒక అర్పణం తెచ్చారు. అది హోమంలో దహించబడిన పాప పరిహారార్థ అర్పణ.
NUM 15:26 ఇశ్రాయేలు ప్రజలందరు, వారి మధ్య నివసిస్తున్న ఇతర ప్రజలంతా క్షమించబడతారు. వారు చేస్తోంది తప్పు అని వారికి తెలియదు గనుక వారు క్షమించబడతారు.
NUM 15:27 “అయితే ఒక వ్యక్తి మాత్రమే ఒక ఆజ్ఞను పాటించటం మరచిపోతే, అతడు ఒక సంవత్సరపు ఆడ మేకను పాపపరిహారార్థ బలిగా తీసుకుని రావాలి.
NUM 15:28 ఆ పాపం నిమిత్తం యెహోవా ఎదుట యాజకుడు ఆ చెల్లింపును అర్పిస్తాడు. అతని నిమిత్తం యాజకుడు చెల్లింపును అర్పించాడు గనుక అతడు క్షమించ బడతాడు.
NUM 15:29 పాపం చేసినప్పటికి తాను తప్పు చేస్తున్నానని ఎరుగని ప్రతి వ్యక్తికి ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన వారికి, మీ మధ్యలో నివసిస్తున్న ఇతర ప్రజలకు కూడా ఇదే ఆజ్ఞ.
NUM 15:30 “కానీ ఎవరైనా సరే తాను చేస్తోంది తప్పు అని తెలిసికూడ పాపం చేస్తే, అలాంటివాడు యెహోవాకు విరోధంగా జీవిస్తున్నాడు. అతడిని తన ప్రజలనుండి పంపించి వేయాలి. ఇశ్రాయేలు వంశంలో పుట్టిన వానికి, మీ మధ్య నివసించే వానికి ఇది సమానం.
NUM 15:31 అతడు యెహోవా మాటకు అడ్డం తిరిగాడు. అతడు యెహోవా ఆజ్ఞలకు విధేయుడు కాలేదు. అతడు తప్పకుండ మీ మధ్యనుండి వెళ్లగొట్టబడాలి. అతడు దోషిగానే ఉంటాడు.”
NUM 15:32 ఇప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఇంకా అరణ్యంలోనే ఉన్నారు. ఒకడు వంట కట్టెలు చూడటం తటస్థించింది. కనుక అతడు ఆ కట్టెలు ప్రోగుచేస్తున్నాడు కాని అది సబ్బాతు. అతడు ఇలా చేయటం మరికొందరు చూసారు.
NUM 15:33 అతడు కట్టెలు ఏరటం చూచిన వాళ్లు అతన్ని, మోషే, అహరోను దగ్గరకు తీసుకుని వచ్చారు. ప్రజలంతా వాడ్ని చుట్టేసారు.
NUM 15:34 ఆ మనిషిని ఎలా శిక్షించాలో వారికి తెలియదు గనుక వారు అతణ్ణి అక్కడే ఉంచారు.
NUM 15:35 అప్పుడు యెహోవా, “ఆ మనిషిచావాలి. నివాస స్థలపు వెలుపల, ప్రజలంతా వానిమీద రాళ్లు విసరాలి” అని మోషేతో చెప్పాడు.
NUM 15:36 కనుక ప్రజలు అతణ్ణి నివాస స్థలమునుండి వెలుపలకు తీసు కుని వెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన విధంగానే వారు ఇలా చేసారు.
NUM 15:37 మోషేతో యెహోవా అన్నాడు:
NUM 15:38 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు: మీరు నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు నేను మీకు ఒకటి ఇస్తాను. దారం ముక్కలు కొన్ని తీసుకొని వాటిని పేని, మీ బట్టల అంచులకు వాటిని కట్టాలి. ఆ కుచ్చుల్లో ఒక్కొక్క దాని మధ్య ఒక నీలం దారం ఉంచాలి. ఇప్పుడూ, ఇక ముందుకూ ఎప్పటికీ మీరు వాటిని ధరించాలి.
NUM 15:39 మీరు ఈ కుచ్చులను చూచి, యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నింటిని జ్ఞాపకం ఉంచుకో గలుగుతారు. అప్పుడు మీరు ఆ ఆజ్ఞలకు విధేయులవుతారు. ఆజ్ఞలను మరచిపోయి, మీ శరీరాలు, కండ్లు కోరిన ప్రకారం చేయరు.
NUM 15:40 మీరు నా ఆజ్ఞలు అన్నింటికి విధేయులు కావాలని జ్ఞాపకం ఉంచుకొంటారు. అప్పుడు మీరు దేవుని ప్రత్యక ప్రజలుగా ఉంటారు.
NUM 15:41 నేను యెహోవాను, మీ దేవుడ్ని. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చింది నేనే. నేను మీ దేవునిగా ఉండటానికి ఇలా చేసాను. నేను యెహోవాను, మీ దేవుడ్ని.”
NUM 16:1 కోరహు, దాతాను, అబీరాము, ఓను అనవారు మోషేకు ఎదురు తిరిగారు. (కోరహు ఇస్హారు కుమారుడు. ఇస్హారు కహాతు కుమారుడు, కహాతు లేవీ కుమారుడు. దాతాను, అబీరాము సోదరులు ఎలీయాబు కుమారులు. ఓను పెలెతు కుమారుడు) దాతాను, అబీరాము ఓను రూబేను వంశస్థులు.
NUM 16:2 ఈ నలుగురూ ఇశ్రాయేలీయులలో మరో 250 మందిని పోగుజేసి మోషే మీదికి వచ్చారు. ఈ 250 మంది ఇశ్రాయేలీయులలో పేరున్న పెద్ద మనుష్యులు. వారు సభా సభ్యులుగా ఎన్నుకోబడినవారు.
NUM 16:3 వారు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడటానికి గుంపుగా వచ్చి. “మీరు చేసింది మేము ఒప్పు కోవటం లేదు. ఇశ్రాయేలీయుల నివాసంలో ఉన్న వాళ్లంతా పవిత్రులు. వారిలో ప్రతి ఒక్కరూ మంచి వారు. పైగా యెహోవా వారితో ఉన్నాడు. అలాంటప్పుడు మేము ఆ దేశంలో ప్రవేశించం అని చెబుతావేమి? నిన్ను నీవే అందరికంటె గొప్ప చేసుకొంటున్నావు” అని వాళ్లు మోషే, అహరోనులతో అన్నారు.
NUM 16:4 మోషే ఈ సంగతులు వినగానే, వినయంతో సాష్టాంగపడ్డాడు. తాను గర్విష్ఠిని కానని చూపించటానికి
NUM 16:5 అప్పుడు కోరహుతో, అతనితో ఉన్న వాళ్లందరితో మోషే ఇలా అన్నాడు: “వాస్తవానికి ఎవరు యెహోవాకు చెందినవారో రేపు ఉదయం ఆయన తెలియజేస్తాడు. అలాంటివాడిని ఆయన తన దగ్గరకు రానిస్తాడు. ఆ మనిషిని యెహోవా ఎన్నిక చేసి, యెహోవాయే అతడ్ని తన దగ్గరకు తీసుకొస్తాడు.
NUM 16:6 అందుచేత కోరహు, నీవూ, నీ అనుచరులంతా ఇలా చేయాలి.
NUM 16:7 రేపు ధూపార్తుల్లో నిప్పు, సాంబ్రాణి వెయ్యండి. అప్పుడు వాటిని యెహోవా సన్నిధికి తీసుకొనిరండి. నిజంగా పవిత్రుడ్ని యెహోవా ఎంచుకొంటాడు. కానీ, నీవూ, నీ లేవీ సోదరులు తప్పుచేసి మితిమీరిపోయారు.”
NUM 16:8 కోరహుతో మోషే ఇంకా ఇలా అన్నాడు: “లేవీయులారా, నా మాట వినండి.
NUM 16:9 ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని వేరు చేసి, ప్రత్యేకంగా ఉంచినందుకు మీరు సంతోషించాలి. మిగతా ఇశ్రాయేలు ప్రజలందరి కంటె మీరు ప్రత్యేకం. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఆరాధించేందుకు సహాయకరంగా యెహోవా పవిత్ర గుడారంలో ప్రత్యేక పని చేయటానికి యెహోవా మిమ్మల్ని తనకు దగ్గరగా తెచ్చుకొన్నాడు. అది చాలదా?
NUM 16:10 యెహోవా తానే నిన్ను, లేవీ ప్రజలందర్నీ తన దగ్గరకు చేర్చుకొన్నాడు. కానీ ఇప్పుడు మీరే యాజకులు అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.
NUM 16:11 నీవూ, నీ అనుచరులూ యెహోవా మీదికి రావటానికి ఏకమయ్యారు. మీరు అహరోను మీదికివచ్చి, అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం తప్పు.”
NUM 16:12 అప్పుడు ఎలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను మోషే పిల్చాడు. కానీ వాళ్లిద్దరు చెప్పారు: “మేము రాము.
NUM 16:13 పాలు తేనెలు ప్రవహించే మంచి ధనిక దేశంనుండి నీవు మమ్మల్ని బయటకు తీసుకుచ్చావు. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటానికి నీవు మమ్మల్ని ఇక్కడికి తీసుకుచ్చావు. పైగా నీకు మామీద చాల అధికారం ఉన్నట్టు చూపించాలను కొంటున్నావు.
NUM 16:14 మేము నిన్నెందుకు వెంబండించాలి? పాలు తేనెలు ప్రవహించే ఒక కొత్త ధనిక దేశానికి మమ్మల్ని నీవు తీసుకుని రాలేదు. దేవుడు వాగ్దానం చేసిన దేశం నీవు మాకు ఇవ్వలేదు. పొలాలు, ద్రాక్షాతోటలు నీవేమి మాకు ఇవ్వలేదు. ఈ మనుష్యుల్ని నీ బానిసలుగా చేస్తావా? లేదు, మేము రాము.”
NUM 16:15 అందుచేత మోషేకు చాల కోపం వచ్చింది. అతడు యెహోవాతో “వారి కానుకలు స్వీకరించకు. వారి దగ్గరనుండి నేనేమి తీసుకోలేదు, కనీసం ఒక గాడిదను కూడా తీసుకోలేదు. పైగా వారిలో ఎవ్వరికీ నేనేమి కీడు చేయలేదు” అని చెప్పాడు.
NUM 16:16 అప్పుడు మోషే కోరహుతో అన్నాడు: “నీవూ, నీ అనుచరులంతా రేపు యెహోవా ఎదుట నిలబడాలి. మీతోబాటు అహరోనుకూడ యెహోవా ఎదుట నిలబడతాడు.
NUM 16:17 మీలో ప్రతి ఒక్కరూ ఒక ధూపార్తి తీసుకుని, అందులో సాంబ్రాణి వేసి దానిని యెహోవాకు అర్పించాలి. నాయకులకు 250 ధూపార్తులు, నీకు ఒక ధూపార్తి, అహరోనుకు ఒక ధూపార్తి ఉండాలి.”
NUM 16:18 కనుక ప్రతి ఒక్కరూ ఒక్కో ధూపార్తిని సాంబ్రాణితో నింపారు. అప్పుడు వారు సన్నిధి గుడారపు ప్రవేశం దగ్గర నిలబడ్డారు. మోషే, అహరోను కూడ అక్కడ నిలబడ్డారు.
NUM 16:19 కోరహు తన అనుచరులందరినీ సమావేశపర్చాడు (వీళ్లే మోషే, అహరోనులను ఎదిరించినవారు). సన్నిధి గుడార ప్రవేశం దగ్గర వీళ్లందర్నీ కోరహు సమావేశ పర్చాడు. అప్పుడు అక్కడ ప్రతి ఒక్కరికీ యెహోవా మహిమ ప్రత్యక్షం అయింది.
NUM 16:20 మోషే, అహరోనులతో యెహోవా
NUM 16:21 “ఈ మనుష్యులకు దూరంగా వెళ్లిపోండి, నేను వాళ్లను ఇప్పుడే నాశనం చేసేస్తాను” అన్నాడు.
NUM 16:22 అయితే మోషే, అహరోనూ సాష్టాంగపడిపోయి “ఓ దేవా, మనుష్యులందరి ఆత్మలను ఎరిగిన యెహోవా నీవు. మొత్తం ఈ గుంపు అంతటి మీద కోపగించకు. నిజానికి పాపం చేసింది ఒక్కడే” అంటూ మొరపెట్టారు.
NUM 16:23 అప్పుడు యెహోవా మోషేతో
NUM 16:24 “కోరహు, దాతాను, అబీరాము గుడారాల దగ్గరనుండి అందర్నీ దూరంగా వెళ్లిపొమ్మని చెప్పు” అన్నాడు.
NUM 16:25 మోషే లేచి దాతాను, అబీరాము దగ్గరకు వెళ్లాడు. ఇశ్రాయేలు పెద్దలంతా అతన్ని వెంబడించారు.
NUM 16:26 మోషే ప్రజలను ఈ రీతిగా హెచ్చరించాడు: “ఈ దుర్మార్గుల గుడారాల నుండి దూరంగా వెళ్లిపొండి. వారి వాటిని ఏవీ తాకకండి. మీరు తాకితే వారి పాపాలవల్ల మీరుకూడ నాశనం చేయబడతారు.”
NUM 16:27 కనుక వాళ్లంతా కోరహు, దాతాను, అబీరాము గుడారాలనుండి దూరంగా వెళ్లిపోయారు. దాతాను, అబీరాము వారి భార్యలు, పిల్లలు, శిశువులతోబాటు వారి గుడారాల బయట నిలబడి ఉన్నారు.
NUM 16:28 అప్పుడు మోషే చెప్పాడు: “నేను మీతో చెప్పిన విషయాలన్నీ చేసేందుకు యెహోవా నన్ను పంపించాడని నేను మీకు రుజువు చూపిస్తాను. అవన్నీ నా స్వంత తలంపులు కావని నేను మీకు చూపిస్తాను.
NUM 16:29 ఈ మనుష్యులు ఇక్కడే చస్తారు. కానీ సాధారణంగా మనుష్యులు చనిపోయే సామాన్య విధానంలోనే గనుక వీరు మరణిస్తే, నన్ను నిజంగా యెహోవా పంపించలేదని అర్థం.
NUM 16:30 కానీ ఈ మనుష్యులు వేరే విధంగా, మరో క్రొత్తరకంగా మరణించేటట్టు యెహోవా గనుక చేస్తే అప్పుడు వీళ్లు నిజంగా యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసారని మీకు తెలుస్తుంది. భూమి తెరచుకొని వీళ్లను మింగేస్తుంది. వారు సజీవ సమాధి అయిపోతారు. వీరికి చెందినది అంతా వీరితోబాటే లోపలికి వెళ్లిపోతుంది.”
NUM 16:31 మోషే ఈ మాటలు చెబుతూ ఉండగానే ఆ మనుష్యుల కాళ్ల క్రింద భూమి తెరచుకొంది.
NUM 16:32 అది భూమి తన నోరు తెరచి వారిని మింగివేసినట్టుగా ఉంది. వారి కుటుంబాలన్నీ, కోరహు మనుష్యులంతా, వారికి ఉన్నదంతా భూమిలోకి వెళ్లిపోయింది.
NUM 16:33 వారు సజీవంగానే సమాధిలోనికి వెళ్లిపోయారు. వారికి ఉన్నదంతా వారితో బాటే లోపలికి వెళ్లిపోయింది. అప్పుడు వారిమీద భూమి కప్పివేసింది. వారు నాశనమైపోయి, పాళెములో లోకుండా పోయారు.
NUM 16:34 నాశనం చేయబడు తోన్న మనష్యుల అరుపులు ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. అందుచేత వాళ్లంతా “భూమి మనల్నికూడ మ్రింగివేస్తుంది” అంటూ అటు ఇటు పరుగులెత్తారు.
NUM 16:35 తర్వాత యెహోవా దగ్గర్నుండి అగ్ని దిగి వచ్చి, ధూపం వేస్తున్న ఆ 250 మందిని నాశనం చేసింది.
NUM 16:36 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
NUM 16:37 “చచ్చిన ఆ మనుష్యుల మధ్య ఉన్న ధూపార్తులన్నింటినీ వెదకమని యాజకుడైన అహరోను కుమారుడైన ఎలీయాజరుతో చెప్పు. ఆ నిప్పుకణికలను నివాసానికి దూరంగా చల్లండి. ధూపార్తులు ఇంకా పవిత్రమైనవే. ఇవి నాకు వ్యతిరేకంగా పాపం చేసిన మనుష్యులు ఉపయోగించిన ధూపార్తులు. వారి పాపం వారి ప్రాణాలు తీసింది. ధూపార్తులను రేకులుగా కొట్టండి. బలిపీఠం కప్పటానికి ఈ రేకులు వాడండి. అవి యెహోవా ఎదుట అర్పించబడినవి గనుక అవి పవిత్రం. రేకులు చేయబడ్డ ఆ ధూపార్తులు ఇశ్రాయేలు ప్రజలందరకు హెచ్చరికగా ఉండుగాక!”
NUM 16:39 కనుక ఆ మనుష్యుల ఇత్తడి ధూపార్తులను అన్నింటినీ ఎలీయాజరు పోగుచేసాడు. వాళ్లంతా కాల్చివేయబడ్డారు గాని ధూపార్తులు మాత్రం అక్కడ ఉన్నాయి. ఆ ధూపార్తులను వెడల్పు రేకులుగా కొట్టమని కొందరితో చెప్పాడు ఎలీయాజరు. అప్పుడు ఆ వెడల్పు రోకులను అతడు బలిపీఠం చుట్టూ పెట్టాడు.
NUM 16:40 మోషే ద్వారా యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఇలా చేసాడు. అహరోను కుటుంబానికి చెందిన వ్యక్తి మాత్రమే యోహోవా ఎదుట ధూపం వేయాలని ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఇది సహాయకరమైన సూచన. ఇంకొక వ్యక్తి గనుక యోహోవా ఎదుట ధూపం వేస్తే, అతడు కోరహు, అతని అనుచరుల్లా అవుతాడు.
NUM 16:41 మరునాడు ఇశ్రాయేలు ప్రజలంతా మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేసారు. వారు, “యెహోవా ప్రజలను మీరు చంపారు” అన్నారు.
NUM 16:42 మోషే, అహరోనులు సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర నిలబడి ఉన్నారు. మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేయటానికి ప్రజలు ఆచోట చేరారు. అయితే వారు సన్నిద గుడారం వైపు చూచినప్పుడు, మేఘం దానిని అవరించి, యెహోవా మహిమ అక్కడ ప్రత్యక్షమయింది.
NUM 16:43 అప్పుడు మోషే. అహరోనులు సన్నిధి గుడారం ఎదుటకి వెళ్లారు.
NUM 16:44 అప్పుడు యెహోవా మోషేతో
NUM 16:45 “ఇప్పుడు నేను వీళ్లను నాళనం చేస్తాను గనుక మీరు దూరంగా తొలగిపొండి” అని చెప్పాడు. కనుక మోషే, అహరోనులు సాష్టాంగపడ్డారు.
NUM 16:46 అప్పుడు మోషే “నీ ధూపార్తిని బలిపీఠపు నిప్పులతో నింపు. దానిమీద సాంబ్రాణి వేయి. త్వరపడి ప్రజల సమాజం దగ్గరకు వెళ్లి వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయి. యోహోవా వారి మీద కోపంగా ఉన్నాడు. కష్టాలు అప్పుడే మొదలయ్యాయి” అని అహరోనుతో చెప్పాడు.
NUM 16:47 కనుక మోషే చెప్పినట్టు అహరోను చేసాడు. అతడు నిప్పులు, సాంబ్రాణి తీసుకొని ప్రజలందరి మధ్యకు పరుగెత్తాడు, అయితే అప్పుటకే ప్రజల్లో రోగం మొదలయింది. ప్రజలకోసం ప్రాయశ్చిత్తంగా అహరోను ధూపం వేసాడు.
NUM 16:48 బ్రతికి ఉన్నవాళ్లుకు, చచ్చిన వాళ్లకు మధ్య నిలబడ్డాడు అహరోను. అంతటితో ఆ రోగం ఆగిపోయింది.
NUM 16:49 అయితే వారి పాపం నిమత్తం అపరోను ప్రాయశ్చిత్తం చేయకముందే ఆ రోగంవల్ల కోరహు మూలంగా చచ్చినవాళ్లు కాక ఇంకా 14,700 మంది చనిపోయారు.
NUM 16:50 అప్పుడు సన్నిధి గుడార ప్రవేశం దగ్గర ఉన్న మోషే వద్దకు అహరోను తిరిగి వెళ్లాడు. ప్రజల్లో ఆ భయంకర రోగం నిలిచిపోయింది.
NUM 17:1 మోషేతో యెహోవా చెప్పాడు:
NUM 17:2 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు. వారి దగ్గరనుండి పన్నెండు చేతికర్రలు తీసుకునిరా. పన్నెండు వంశాలలో ఒక్కొక్క నాయకుని దగ్గర్నుండి ఒకటి తీసుకో, ఒక్కొక్కరి పేరు ఒక్కో కర్ర మీద వ్రాయి.
NUM 17:3 లేవీ వాళ్ల కర్రమీద అహరోను పేరు వ్రాయి. పన్నెండు వంశాల్లో ప్రతి పెద్దకు ఒక కర్ర ఉండాలి.
NUM 17:4 సన్నిధి గుడారంలో ఒడంబడిక పెట్టె ఎదుట ఈ చేతి కర్రలను పెట్టు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు.
NUM 17:5 ఒక్క మనిషిని నేను ఏర్పాటు చేసుకొంటాను. ఏ మనిషిని నేను ఎంచుకుంటానో నీకు తెలుస్తుంది. ఎందుచేత నంటే అతని కర్రకు కొత్త ఆకులు మొలవటం ప్రారంభమవుతుంది. ఈ విధంగా, ప్రజలు నీకు, నాకు ఎల్లప్పుడు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం నేను ఆపుచేస్తాను.”
NUM 17:6 కనుక మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. పెద్దలంతా ఒక్కొక్కరు ఒక కర్ర అతనికి ఇచ్చారు మొత్తం కర్రల సంఖ్య పన్నెండు. ఒక్కో వంశం నాయకుని దగ్గరనుండి ఒక్కో కర్ర వచ్చింది. వాటి మధ్య అహరోను కర్ర ఉంది.
NUM 17:7 మోషే ఆ చేతి కర్రలను సన్నిధి గుడారంలో ఒడంబడిక పెట్టె దగ్గర యెహోవా ఎదుట ఉంచాడు.
NUM 17:8 ఆ మరునాడు మోషే గుడారంలో ప్రవేశించాడు. లేవీ వంశపు కర్ర, అంటే అహరోను చేతికర్ర కొత్త ఆకులు తొడగటం మొదలు పెట్టినట్టు అతడు చూసాడు. ఆ కర్రకు కొమ్మలుకూడ పెరిగి, బాదంకాయలు కాసింది.
NUM 17:9 కనుక యెహోవా స్థానం నుండి మోషే ఆ కర్రలంటినీ బయటకు తెచ్చాడు. ఆ చేతి కర్రలను ఇశ్రాయేలు ప్రజలకు మోషే చూపించాడు. వాళ్లంతా ఆ కర్రలను చూచి, ఎవరి కర్ర వారు తిరిగి తీసుకున్నారు.
NUM 17:10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “అహరోను చేతి కర్రను మళ్లీ గుడారంలో పెట్టు. ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకంగా ఎదురు తిరుగుచున్న ఈ ప్రజలకు ఇది ఒక హెచ్చరికగా ఉంటుంది. నామీద వారు ఫిర్యాదు చేయటం ఇది ఆపుచేస్తుంది. ఈ విధంగా వారు చావకుండా ఉంటారు.”
NUM 17:11 కనుక మోషే తనకు యెహోవా చెప్పినట్టు చేసాడు.
NUM 17:12 ఇశ్రాయేలు ప్రజలు మేము “చనిపోతామని మాకు తెలుసు. మేము నశించిపోయాము. మేము అంతా నశించిపోయాము.
NUM 17:13 ఎవరైనా యెహోవా పవిత్ర స్థలం సమీపంగా వచ్చినా సరే చస్తారు. మేము అందరము చనిపోతామా?” అని మోషేతో అన్నారు.
NUM 18:1 అహరోనుతో యెహోవా ఇలా చెప్పాడు: “పవిత్ర స్థలానికి వ్యతిరేకంగా ఎలాంటి అపచారాలు జరిగినా ఇక మీదట నీవు, నీ కుమారులు, నీ తండ్రి కుటుంబం బాధ్యులు. యాజకులకు వ్యతిరేకంగా జరిగే అపచారాలకు నీవు, నీ కుమారులు బాధ్యులు.
NUM 18:2 నీ వంశంలో మిగిలిన లేవీ మనుష్యులను కూడ నీతో చేర్చుకో. ఒడంబడిక, పవిత్ర గుడారంలో నీవు, నీ కుమారులు చేయాల్సిన పనిలో వారు మీకు సహాయం చేస్తారు.
NUM 18:3 లేవీ వంశంలోని ఆ మనుష్యులు నీ స్వాధీనంలో ఉంటారు. గుడారంలో జరగాల్సిన పని అంతా వారు చేస్తారు. అయితే పవిత్ర స్థలంలోగాని, బలిపీఠం దగ్గరగాని ఉన్న వస్తువులను వారు సమీపించకూడదు. ఒకవేళ వారు వెళ్తే, వారూ, నీవు కూడా చనిపోతావు.
NUM 18:4 వారు నీతో కలిసి పనిచేస్తారు. సన్నిధి గుడారం విషయమై జాగ్రత్త తీసుకోవటం వారి బాధ్యత. గుడారంలో జరగాల్సిన పని అంతా వాళ్లు చేస్తారు. నీవు ఉన్న చోటికి ఇంకెవ్వరూ రాకూడదు.
NUM 18:5 “పవిత్ర స్థలాన్ని, బలిపీఠాన్ని జాగ్రత్తగా చూసుకోవటం నీ బాధ్యత, ఇశ్రాయేలు ప్రజల మీద నేను మళ్లీ కోపగించుకోవటం నాకు ఇష్టం లేదు.
NUM 18:6 ఇశ్రాయేలు ప్రజలందరిలోనుండి లేవీ ప్రజలను అంటే నీ ప్రజలను నేనే ఏర్పాటు చేసుకొన్నాను. వారు నీకు ఒక కానుక వంటివారు. యెహోవాను సేవించటం, సన్నిధి గుడారం పని చేయటం ఒక్కటే వారి ఉద్దేశ్యం.
NUM 18:7 అయితే నీవు, నీ కుమారులు మాత్రమే యాజకులుగా పని చేయవచ్చు. బలిపీఠం దగ్గరకు వెళ్లగలిగేది మీరు మాత్రమే. మీరు మాత్రమే తెర లోపలకు వెళ్లగలవారు. యాజకునిగా మీ సేవ అనేది నేను మీకు కానుకగా ఇస్తున్నాను. అతి పవిత్ర స్థలాన్ని ఇంకెవరు సమీపించినా వారిని చంపెయ్యాలి.”
NUM 18:8 అప్పుడు యెహోవా అహరోనుతో ఇలా చెప్పాడు: “నాకు అర్పించబడిన అర్పణలన్నింటిమీద నేనే నీకు బాధ్యత ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు నాకు అర్పించే పవిత్ర అర్పణలన్నీ నేను నీకు ఇస్తాను. ఈ కానుకలను నీవూ, నీ కుమారులూ పంచుకోవచ్చు. ఎప్పుడూ అవి మీకే చెందుతాయి.
NUM 18:9 దహించబడని పవిత్ర అర్పణలన్నింటిలో మీకు వంతు ఉంటుంది. ప్రజలు తమ కానుకులను అతి పవిత్ర అర్పణలుగా నా దగ్గరకు తీసుకుస్తారు. ఇవి ధాన్యార్పణలు, పాప పరిహారార్థ అర్పణలు, అపరాధ పరిహారార్థ అర్పణలు. అయితే ఇవన్నీ నీవి, నీ కుమారులవి.
NUM 18:10 అవి అత్యంత పవిత్రమైనవిగా వాటిని తినాలి. నీ కుటుంబంలో మగవారు ప్రతి ఒక్కరూ దానిని తినాలి. అది పవిత్రం అని నీవు చెప్పాలి.
NUM 18:11 “ఇశ్రాయేలు ప్రజలు నైవేద్యంగా ఇచ్చు అర్పణలు అన్నీ నీవే. ఇది నీకూ, నీ కుమారులకు, కుమార్తెలకు నేను ఇస్తున్నాను. ఇది నీ వంతు. నీ కుటుంబంలో పవిత్రంగా ఉన్న ప్రతి వ్యక్తీ దీనిని తినగలుగుతాడు.
NUM 18:12 “శ్రేష్ఠమైన ఒలీవ నూనె అంతయు, శ్రేష్ఠమైన కొత్త ద్రాక్షారసం అంతయు, ధాన్యం అంతయు నేను నీకిస్తున్నాను. ఇవన్నీ యెహోవానైన నాకు ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చేవి. ఇవన్నీ వారి పంట కోతలో ప్రథమ ఫలాలు.
NUM 18:13 ప్రజలు పంటకోత కూర్చినప్పుడు, మొదటివి అన్నీ వారు యెహోవాకు ఇస్తారు. కనుక వీటిని నేను నీకు ఇస్తాను. నీ కుటుంబంలో పవిత్రంగా ఉన్న ప్రతి వ్యక్తీ అది తినవచ్చును.
NUM 18:14 “ఇశ్రాయేలులో యెహోవాకు అర్పించబడిన ప్రతిదీ నీదే.
NUM 18:15 “ఒక కుటుంబంలో, మనిషికి గాని జంతువుకు గాని పుట్టిన మొట్టమొదటిది యెహోవాకు అర్పించబడుతుంది. అది నీదే అవుతుంది. అయితే అపవిత్రంగా పుట్టిన ప్రతి మొదటి శిశువుకు, ప్రతి మొదటి మగ జంతువుకు నీవు వెల చెల్లించాలి. అప్పుడు ఆ మొదటి శిశువు తిరిగి తన కుటుంబానికే చెందుతుంది.
NUM 18:16 వారు ఒక నెల వయసులో ఉన్నప్పుడు వారికోసం నీవు వెల చెల్లించాలి. ఆ వెల అయిదు తులాల వెండి.
NUM 18:17 “అయితే ఆవులలో, గొర్రెలలో మేకలలో మొదట పుట్టిన దానికి నీవు వెల చెల్లింపకూడదు. ఆ జంతువులు పవిత్రం— పరిశుభ్రం. వాటి రక్తం బలిపీఠం మీద చిలకరించి వాటి కొవ్వును దహించాలి. ఇది హోమంగా అర్పించబడిన అర్పణ. దీని వాసన యెహోవానగు నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది.
NUM 18:18 అయితే ఆ జంతువుల మాంసం నీదే అవుతుంది. మరియు నైవేద్యంలోని బోర నీదే. మిగిలిన అర్పణల్లోకుడి తొడ నీదే.
NUM 18:19 పవిత్ర కానుకలుగా ప్రజలు అర్పించేవి ఏవైనా సరే, యెహోవానగు నేను నీకు ఇస్తాను. ఇది నీ వంతు. నీకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు నేను ఇస్తాను, ఇది శాశ్వతంగా కొనసాగే వాగ్ధానం. నీకూ, నీ సంతతికీ నేను ఈ వాగ్దానం చేస్తున్నాను.”
NUM 18:20 అహరోనుతో యెహోవా ఇంకా ఇలా చెప్పాడు: “దేశంలో నీకేమీ స్వాస్థ్యం ఉండదు. ఇతరులు స్వంతంగా కలిగి ఉన్నవి ఏవి నీకు స్వంతంగా ఉండవు. నేను, యెహోవాను నీ స్వంతం. నేను వాగ్దానం చేసిన దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు పొందుతారు. అయితే నీకు మాత్రం నేనే నీ కానుకగా ఉంటాను.
NUM 18:21 “ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోను పదోవంతు నాకు ఇస్తారు. కనుక ఆ పదోవంతును నేను లేవీ ప్రజలకు ఇస్తాను. వారు సన్నిధి గుడారంలో సేవించేటప్పుడు చేసే పనికి ఇది వారికి జీతం.
NUM 18:22 అయితే ఇశ్రాయేలీయుల్లో ఇతరులు ఎన్నడూ సన్నిధి గుడారం సమీపించకూడదు. వారు అలా వెళ్తే, వారి పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చెల్లించి మరీచస్తారు.
NUM 18:23 సన్నిధి గుడారంలో పనిచేసే లేవీ ప్రజలే, దానికి వ్యతిరేకంగా జరిగే పాపాలకు బాధ్యులు. ఈ ఆజ్ఞ భవిష్యత్ కాలంలో కూడ కొనసాగుతుంది. ఇతర ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని లేవీ ప్రజలు మాత్రం పొందరు.
NUM 18:24 అయితే ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోనుండి పదోవంతునాకు ఇస్తారు. కనుక ఆ పదో వంతును నేను లేవీ ప్రజలకు ఇస్తాను. అందుకే లేవీ వాళ్లను గూర్చి నేను ఈ మాటలు చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని ఆ లేవీ ప్రజలు పొందరు.”
NUM 18:25 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
NUM 18:26 “లేవీ ప్రజలతో మాట్లాడి వారికి ఇలా చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోనుండి పదోవంతు యెహోవాకు ఇవ్వాలి. ఆ పదోవంతు లేవీ ప్రజలకు చెందుతుంది. అయితే అందులో పదోవంతు యెహోవా అర్పణగా మీరు ఆయనకు ఇవ్వాలి.
NUM 18:27 పంట కోసిన తర్వాత ధాన్యం, ద్రాక్ష గానుగ నుండి రసం మీకు ఇవ్వబడుతాయి. అప్పుడు అవి కూడ యెహోవాకు మీ అర్పణలు.
NUM 18:28 ఈ విధంగా ఇతర ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు, మీరు కూడ యెహోవాకు అర్పణ ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఇచ్చే పదోవంతు మీకు ఇవ్వ బడుతుంది. దానిలో పదోవంతును మీరు యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి.
NUM 18:29 ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్నదానంతటిలో నుండి పదోవంతు మీకు ఇచ్చినప్పుడు, వాటిలో శ్రేష్ఠమైనవి, అత్యంత పవిత్రమైనవి మీరు ప్రత్యేకించాలి. అది మీరు యెహోవాకు ఇచ్చే పదోవంతు.
NUM 18:30 “మోషే! లేవీ ప్రజలకు ఇది చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు వారి పంటలో నుండి, ద్రాక్షారసంలో నుండి పదోవంతు మీకు ఇస్తారు. అప్పుడు అందులో శ్రేష్ఠమైన భాగం మీరు యెహోవాకు ఇవ్వాలి.
NUM 18:31 మిగిలి పోయినదంతా మీరు, మీ కుటుంబాలు తినవచ్చు. సన్నిధి గుడారంలో మీరు చేసే పనికి ఇది మీకు జీతం.
NUM 18:32 మరియు ఎల్లప్పుడూ దానిలోని శ్రేష్ఠ భాగాన్నే మీరు యెహోవాకు ఇస్తే, మీరు ఎన్నటికీ అపరాధులు కారు. ఇశ్రాయేలు ప్రజల నుండి అనేకుల పవిత్ర అర్పణలని మీరు ఎన్నటికీ గుర్తుంచుకుంటారు. మీరు చావరు.”
NUM 19:1 మోషేతో, అహరోనుతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు:
NUM 19:2 “ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చే ఆజ్ఞలు, ప్రబోధాలు ఇవే. వారు బలంగా ఉన్న ఒక ఎర్ర ఆవును నీ దగ్గరకు తీసుకుని రావాలి. ఆ ఆవుకు ఎలాంటి గాయాలు ఉండకూడదు. ఆ ఆవు ఎన్నడూ కాడి మోసి ఉండకూడదు.
NUM 19:3 ఆ ఆవును యాజకుడైన ఎలీయాజరుకు ఇవ్వాలి. ఎలీయాజరు ఆవును నివాసం యొక్క వెలుపలికి తీసుకునిపోయి, అక్కడ దాన్ని వధించాలి.
NUM 19:4 అప్పుడు యాజకుడైన ఎలీయాజరు దాని రక్తంలో కొంత తన వేలిమీద వేసుకొవాలి. తర్వాత అతడు ఆ రక్తంలో కొంత పవిత్ర గుడారం వైపు చల్లాలి. అతడు ఇలా ఏడు సార్లు చేయాలి.
NUM 19:5 అప్పుడు మొత్తం ఆవు అతని ఎదుట దహించబడాలి. దాని చర్మం, మాంసం, రక్తం, ప్రేగులు అన్నీ దహించాలి.
NUM 19:6 అప్పుడు యాజకుడు ఒక దేవదారు కర్రను, హిస్సోపు కొమ్మను, ఎర్ర నూలును తీసుకుని, ఆవు దహించబడుతున్న అగ్నిలో వేయాలి.
NUM 19:7 అప్పుడు యాజకుడు స్నానం చేసి, నీళ్లతో తన బట్టలు ఉదుకుకోవాలి. అతడు తిరిగి నివాసానికి రావాలి. యాజకుడు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు.
NUM 19:8 ఆ ఆవును దహించే వ్యక్తి స్నానం చేసి, నీళ్లతో తన బట్టలు ఉదుక్కోవాలి. సాయంత్రం వరకు అతడు అపవిత్రంగానే ఉంటాడు.
NUM 19:9 “అప్పుడు పవిత్రుడైనవాడు ఒకడు ఆ ఆవు బూడిదను పోగు చేయాలి. అతడు నివాసానికి బయట పరిశుభ్రమైన స్థలంలో ఆ బూడిదను ఉంచుతాడు ప్రజలు పవిత్రులయ్యేందు కోసం ఒక ప్రత్యేక ఆచారాన్ని పాటించేటప్పుడు ఈ బూడిద ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తి పాపాలను తొలగించేందుకు కూడా ఈ బూడిద ఉపయోగించబడుతుంది.
NUM 19:10 “ఆవు బూడిదను పోగుచేసే వ్యక్తి తన బట్టలు ఉదుక్కోవాలి. అతను సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు. “ఈ నియమం శాశ్వతంగా కొనసాగుతుంది. ఇశ్రాయేలు పౌరులకు, మీతో కలసి నివసిస్తున్న విధేశీయులకు ఈ నియమం వర్తిస్తుంది.
NUM 19:11 ఎవరైనా ఒకరు ఒక శవాన్ని తాకితే, అప్పుడు అతుడు ఏడు రోజులు అపవిత్రంగా ఉంటాడు.
NUM 19:12 ప్రత్యేక జలంతో మూడోరోజున, మళ్లీ ఏడో రోజున అతడు తనను తాను కడుక్కోవాలి. అతడు ఇలా చేయకపోతే అపవిత్రంగానే ఉంటాడు.
NUM 19:13 ఒకడు ఒక శవాన్ని తాకితే అతడు అపవిత్రుడు. అతడు అపవిత్రుడుగానే ఉండి, పవిత్ర గుడారానికి వెళ్తే, అప్పుడు ఆ పవిత్ర గుడారం అపవిత్రం అవుతుంది. కనుక అతనిని ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి తొలగించి వేయాలి. ఒక అపవిత్రునిమీద ప్రత్యేకజలం చల్లకపోతే అతడు అపవిత్రంగానే ఉండిపోతాడు.
NUM 19:14 “తమ గుడారాల్లోనే మరణించే వారిని గూర్చిన నియమం ఇది. ఒకడు తన గుడారంలో మరణిస్తే, ఆ గుడారంలో ఉన్న ప్రతి ఒక్కరూ అపవిత్రులే. ఏడు రోజులపాటు వారు అపవిత్రం అవుతారు.
NUM 19:15 మూతలేని ప్రతి పాత్ర అపవిత్రం అవుతుంది.
NUM 19:16 ఏ మనిషిగాని శవాన్నిగాని ముట్టుకొంటే, ఆ మనిషి అపవిత్రుడుగా ఏడు రోజులు ఉంటాడు. శవం బయట పొలంలో ఉన్నా, లేక యుద్ధంలో చచ్చిన వానిదైనా సరే ఇదే వర్తిస్తుంది. మరియు చచ్చిన మనిషి ఎముకను ఒక దాన్ని ఎవరైనా ముట్టుకుంటే అప్పుడ అతడు అపవిత్రుడౌతాడు
NUM 19:17 “కనుక అతనిని మరల పవిత్రం చేయటానకి దహించబడ్డ ఆవు బూడిదను నీవు ప్రయోగించాలి. పాత్రలో బూడిద మీద స్వచ్ఛమైన నీళ్లు పోయాలి.
NUM 19:18 పవిత్రుడు ఒకడు హిస్సోపు కొమ్మను తీసుకుని, దానిని ఆ నీళ్లలో ముంచాలి. అప్పుడు అతడు గుడారంమీదా, గిన్నెలమీదా, గుడారంలోని మనుష్యులందరి మీదా దానిని చల్లాలి. శవాన్ని ముట్టు కొన్న ఎవరికైనా నీవు ఇలాగే చేయాలి. యుద్ధంలో చంపబడిన ఒకరి శవాన్ని ముట్టుకొనిన ఎవరికైనా సరే, చచ్చిన మనిషి ఎముకను తాకిన ఎవరికైనా సరే నీవు ఇలాగే చేయాలి.
NUM 19:19 “అప్పుడు పవిత్రంగా ఉన్న ఒక మనిషి అపవిత్రంగా ఉన్న వానిమీద మూడో రోజున, మరల ఏడో రోజున ఈ నీళ్లు చల్లాలి. ఏడో రోజున అతడు పవిత్రం అవుతాడు. అతడు తన వస్త్రాలను నీళ్లలో ఉతుక్కోవాలి. ఆ సాయంకాలం అతడు పవిత్రుడవుతాడు.
NUM 19:20 “ఒక వ్యక్తి అపవిత్రుడై, పవిత్రుడుగా చేయబడకపోతే, అతడు ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి వేరు చేయబడాలి. అతనిమీద ప్రత్యేక జలం చల్లబడలేదు. అతడు పవిత్రుడు కాలేదు. కనుక అతడు పవిత్ర గుడారాన్ని అపవిత్రం చేస్తాడేమో.
NUM 19:21 ఇది మీకు శాశ్యత నియమం. ఒక వ్యక్తిమీద ప్రత్యేక జలం చల్లబడితే అతడు తన బట్టలను కూడ ఉదుక్కోవాలి. ఆ ప్రత్యేకజలాన్ని ముట్టినవాడు ఆ సాయంకాలంవరకు మాత్రం అపవిత్రంగానే ఉంటాడు.
NUM 19:22 అపవిత్రుడు ఒకడు ఇంకో వ్యక్తిని ముట్టుకుంటే అతడుకూడా అపవిత్రుడవుతాడు. అతడు ఆ సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు.”
NUM 20:1 మొదటి నెల ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యానికి వచ్చారు. ప్రజలు కాదేషులో నివాసం చేసారు. మిర్యాము చనిపోయి, అక్కడే పాతి పెట్టబడింది.
NUM 20:2 ఆ స్థలంలో ప్రజలకు చాలినంతగా నీళ్లు లేవు. కనుక ప్రజలు మోషే, అహరోనులతో ఫిర్యాదు చేయటానికి సమావేశమయ్యారు.
NUM 20:3 ప్రజలు మోషేతో వాదించారు. వారు ఇలా అన్నారు: “ఒక వేళ మా సోదరుల్లా మేము కూడా యెహోవా ఎదుట మరణించి ఉంటేబాగుండేది.
NUM 20:4 యెహోవా ప్రజలను నీవు ఈ అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చావు? మేమూ, మా పశువులూ ఇక్కడే చావాలని కోరుతున్నావా?
NUM 20:5 ఈజిప్టు నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈ పనికిమాలిన చోటుకు మమ్మల్ని నీవెందుకు తీసుకుచ్చావు? ఇక్కడ ధాన్యం లేదు. అంజూరపు పండ్లు, ద్రాక్షాపండ్లు, దానిమ్మ పండ్లు ఏమీ లేవు. కనీసం తాగటానికి నీళ్లు కూడ లేవు.”
NUM 20:6 కనుక మోషే, అహరోను ఆ జవాన్ని విడిచి, సన్నిధి గుడార ద్వారం దగ్గరకు వెళ్లారు. వారు సాష్టాంగపడగా యెహోవా మహిమ ప్రత్యక్షమయింది.
NUM 20:7 యెహోవా మోషేతో మాట్లాడాడు:
NUM 20:8 “నీ సోదరుడు అహరోనును, ఈ జనాన్ని తీసుకుని ఆ బండ దగ్గరకు వెళ్లు నీ కర్ర కూడా తీసుకుని వెళ్లు. ఆ బండ ఎదుట ప్రజలతో మాట్లాడు. అప్పుడు ఆ బండనుండి నీళ్లు ప్రవహిస్తాయి. అప్పుడు ప్రజలకు, పశువులకు నీవు ఆ నీళ్లు ఇవ్వవచ్చును” అన్నాడు ఆయన.
NUM 20:9 కనుక యెహోవా చెప్పిన ప్రకారం మోషే ఆయన ఎదుటనుండి కర్ర తీసుకున్నాడు.
NUM 20:10 అప్పుడు ప్రజలంతా ఆ బండ ముందు సమావేశం కావాలని మోషే, అహరోను వారితో చెప్పారు. అప్పుడు మోషే, “మీరు ఎప్పుడూ సణుగుతున్నారు. ఇప్పుడు నా మాటవినండి. ఈ బండలోనుండి నీళ్లు వచ్చేటట్టు మేము చేస్తాము”అన్నాడు.
NUM 20:11 మోషే తన చేయి పై కెత్తి రెండుసార్లు ఆ బండను కొట్టాడు. బండనుండి నీళ్లు ప్రవహించటం మొదలయ్యింది. ప్రజలు, పశువులు ఆ నీళ్లు త్రాగారు.
NUM 20:12 అయితే మోషే, ఆహరోనులతో యెహోవా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా చుట్టూచేరారు. కానీ మీరు నాకు ఘనత చూపలేదు. నీళ్లను ప్రవహింప జేసిన శక్తి నా దగ్గరనుండి వచ్చిందని ఇశ్రాయేలు ప్రజలకు మీరు చూపించలేదు. మీరు నన్ను నమ్ముకొన్నట్టుగా మీరు ప్రజలకు చూపించలేదు. ఆ ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని వారికి ఇస్తాను. అయితే వాళ్లను ఈ దేశంలోనికి నడిపించేవాళ్లు మాత్రం మీరు కారు.”
NUM 20:13 ఈ స్థలం మెరీబా జలాలు అని పిలువబడింది. ఇక్కడనే ఇశ్రాయేలు ప్రజలు యెహోవాతో వాదించారు. ఆయన పవిత్రుడని యెహోవా ఇక్కడనే వారికి చూపించాడు.!
NUM 20:14 మోషే కాదేషులో ఉన్నప్పుడు, కొందరు మనుష్యులను ఎదోము రాజు దగ్గరకి పంపి ఈలాగు చెప్పమన్నాడు. ఆ సందేశం ఇది: “మీ సోదరులైన ఇశ్రాయేలీయులు మీతో చెప్పేది ఏమంటే: మాకు కలిగిన కష్టాలన్నీ నీకు తెలుసు.
NUM 20:15 చాల సంవత్సరాల క్రిందట మా పూర్వీకులు ఈజిప్టు వెళ్లారు. చాల సంవత్సరాలు మేము అక్కడ జీవించాము. ఈజిప్టు ప్రజలు మా యెడల కృ-రంగా ఉన్నారు.
NUM 20:16 అయితే మేము యెహోవాను సహాయం అడిగాము. యెహోవా మా మొర విని, మాకు సహాయం చేసేందుకు ఒక దేవదూతను పంపించాడు. యెహోవా మమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. “ఇదిగో ఇప్పుడు మేము నీ దేశ సరిహద్దు అయిన కాదేషులో ఉన్నాము.
NUM 20:17 దయచేసి నీ దేశంలో నుంచి మమ్మల్ని ప్రయాణం చేయనివ్వు. పొలాల్లోనుంచి, ద్రాక్షా తోటల్లోనుంచి మేము నడువము. మీ బావుల్లో దేనినుండి మేము నీళ్లు తాగము. రాజమార్గంలో మాత్రమే మేము ప్రయాణం చేస్తాము. ఆ మార్గర నుండి కుడికి గాని ఎడమకు గాని మేము తొలగము. మీ దేశం దాటిపోయేంత వరకు మేము రాజ మార్గాననే ఉంటాము.”
NUM 20:18 అయితే ఎదోము రాజు, “మీరు మా దేశంలోనుండి ప్రయాణం చేయగూడదు. మా దేశంలోనుండి ప్రయాణం చేయటానికి మీరు ప్రయత్నిస్తే, మేము వచ్చి కత్తులతో మీతో పోరాడుతాము” అని జవాబిచ్చాడు.
NUM 20:19 ఇశ్రాయేలు ప్రజలు, “మేము రహదారి వెంబడే ప్రయాణం చేస్తాము. మా పశువులు మీ నీళ్లు ఏమైనా తాగితే, దానికి మేము వెల చెల్లిస్తాము. మేము మీ దేశంలోనుంచి నడుస్తాము, అంతే. అంతేగాని, దాన్ని మేము తీసుకోము” అని జవాబిచ్చారు.
NUM 20:20 అయితే, “మేము మిమ్మల్ని మా దేశంలోంచి పోనియ్యము” అని ఎదోము జవాబిచ్చాడు. అప్పుడు ఎదోము రాజు బలంగల విస్తార సైన్యాన్ని సమకూర్చుకొని, ఇశ్రాయేలు ప్రజలతో పోరాడటానికి వారి మీదికి వెళ్లాడు.
NUM 20:21 ఇశ్రాయేలు ప్రజలను తన దేశంగుండా వెళ్లనిచ్చేందుకు ఎదోము రాజు నిరాకరించాడు. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కు తిరిగి మరో మార్గంగుండా వెళ్లిపోయారు.
NUM 20:22 ఇశ్రాయేలు ప్రజలంతా కాదేషు నుండి హోరు కొండకు ప్రయాణం చేస్తారు.
NUM 20:23 హోరు కొండ ఎదోము సరిహద్దుకు దగ్గర్లో ఉంది. మోషే, అహరోనులతో యెహోవా చెప్పాడు,
NUM 20:24 “అహరోను తన పూర్వీకుల దగ్గరకు వెళ్తాడు ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశంలో అతడు ప్రవేశించాడు. మోషే, అహరోనూ, మీరు మెరీబా జలాల దగ్గర నేను మీరు ఇచ్చిన ఆజ్ఞకు పూర్తిగా విధేయులు కాలేదుగనుక నేను మీతో ఇలా చెబుతున్నాను:
NUM 20:25 “అహరోనును, అతని కుమారుడైన ఎలీయాజరును హోరు కొండమీదికి తీసుకుని రా.
NUM 20:26 అహరోను ప్రత్యేక దుస్తులు అతని దగ్గరనుండి తీసుకుని, అతని కుమారుడైన ఎలీయాజరుకు వాటిని తొడిగించు. అహరోను కొండమీద మరణిస్తాడు. అతడు తన పూర్వీకుల దగ్గరకు వెళ్తాడు.”
NUM 20:27 యెహోవా ఆజ్ఞకు మోషే విధేయుడయ్యాడు. మోషే, అహరోను, ఎలీయాజరు హోరు కొండ శిఖరం మీదికు వెళ్లారు. వారు వెళ్లటం ఇశ్రాయేలు ప్రజలంతా చూసారు.
NUM 20:28 అహరోను వస్త్రాలన్నీ తీసి అతని కుమారుడైన ఎలీయాజరు మీద వేసాడు మోషే. అప్పుడు అహరోను ఆ కొండ శిఖరం మీద చనిపోయాడు. మోషే, ఎలీయాజరు కొండ దిగి క్రిందికి వచ్చారు.
NUM 20:29 అప్పుడు అహరోను చనిపోయినట్టు ప్రజలంతా తెలుసుకొన్నారు. కనుక ఇశ్రాయేలులో ప్రతి వ్యక్తి 30 రోజులపాటు సంతాపపడ్డారు.
NUM 21:1 కనానీ ప్రజల రాజు పేరు అరాదు. అతడు నెగెవు లోయలో నివసించాడు. ఇశ్రాయేలు ప్రజలు అతారీము దారిన వస్తున్నారని అరాదు రాజు విన్నాడు. కనుక రాజు బయలుదేరి వెళ్లి ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసాడు. వారిలో కొందరిని అతడు బంధించి, బందీలుగా చేసాడు.
NUM 21:2 ఇశ్రాయేలు ప్రజలు యెహోవాతో, “యెహోవా, దయచేసి ఈ ప్రజలను రక్షించు. వారిని మరల మా దగ్గరకు తీసుకునిరా. ఇది నీవు చేస్తే, మేము వారి పట్టణాలను సర్వనాశనం చేస్తాము” అని ప్రమాణం చేసారు.
NUM 21:3 ఇశ్రాయేలు ప్రజల మాట యెహోవా ఆలకించాడు. ఇశ్రాయేలు ప్రజలు కనానీ ప్రజలను ఓడించటానికి యెహోవా సమ్మతించాడు. కనానీ ప్రజలను, వారి పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా నాశనంచేసారు. అందుచేత ఆ స్థలానికి హోర్మ అని పేరు పెట్టబడింది.
NUM 21:4 ఇశ్రాయేలు ప్రజలు హోరు కొండ విడిచి ఎర్ర సముద్రానికి వెళ్లే మార్గంలో ప్రయాణం చేసారు. ఎదోము అనే ప్రాంతాన్ని చుట్టి వచ్చేందుకు వారు ఇలా చేసారు. కానీ ప్రజల్లో సహనం లేదు. ప్రయాణం చేస్తూ దూరాన్ని గూర్చి వారు సణిగారు.
NUM 21:5 దేవునికి, మోషేకు ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడారు. “మమ్మల్ని ఈజిప్టునుండి నీవెందుకు తీసుకుచ్చావు? మేము ఇక్కడ అరణ్యంలోనే చస్తాము! రొట్టెలేదు, నీళ్లు లేవు. ఈ దారుణమైన ఆహారం మాకు అసహ్యము” అన్నారు ప్రజలు.
NUM 21:6 కనుక విష సర్పాలను ఆ ప్రజల మధ్యకు యెహోవా పంపించాడు. ఆ పాములు ప్రజలను కరిచాయి. ఇశ్రాయేలు ప్రజలు చాల మంది చనిపోయారు.
NUM 21:7 ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “యెహోవాకు, నీకు వ్యతిరేకంగా మాట్లాడి మేము పాపం చేసామని మాకు తెలుసు. యెహోవాకు ప్రార్థన చేసి ఈ పాములను తీసివేయమని అడుగు” అని చెప్పారు. కనుక ఆ ప్రజల కోసం మోషే ప్రార్థించాడు.
NUM 21:8 “ఇత్తడి సరం ఒకటి చేసి దాన్ని ఒక స్తంభం మీద ఉంచు. పాము కరిచిన వ్యక్తి ఆ స్తంభం మీది ఇత్తడి సర్పాన్ని చూడాలి. అప్పుడు అతడు చావడు”అని యెహోవా మోషేతో చెప్పాడు.
NUM 21:9 కనుక మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. అతడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి, ఒక స్తంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు ఎవర్నయినా పాము కరిస్తే, ఆ మనిషి స్తంభం మీది ఇత్తడి సర్పాన్ని చూచి బతికాడు.
NUM 21:10 ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కొన సాగించారు. ఓబోతు అనే చోట వారు నివాసం చేసుకొనిరి.
NUM 21:11 తర్వాత ఆ ప్రజలు ఓబోతునుండి ఈయ్యె అబారీము వెళ్లారు. ఇది తూర్పున మోయాబు సమీపంగా అరణ్యంలో ఉంది.
NUM 21:12 తర్వాత ప్రజలు ఆ స్థలం విడిచి, జెరెదు లోయకు ప్రయాణం చేసారు. అక్కడ నివాసాలు చేసుకొనిరి.
NUM 21:13 మళ్లీ ప్రజలు అర్నోను లోయకువచ్చి, అక్కడికి సమీపంలో నివాసం చేసుకొనిరి. ఇవి అమోరీయ దేశానికి దగ్గర్లో ఉన్న అరణ్యంలో ఉంది. మోయాబు ప్రజలను అమోరీ ప్రజలకు అర్నోనులోయ సరిహద్దు.
NUM 21:14 అందుకే యెహోవా యుద్ధాల గ్రంథంలో ఇలా కనబడుతుంది. “సుప్పాలోని వాహేబు, అర్నోను లోయలు,
NUM 21:15 ఆరు అను పట్టణం వరకుగల లోయల పక్క కొండలు. ఈ స్థలాలు మోయాబు సరిహద్దులో ఉన్నాయి.”
NUM 21:16 ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థలం విడిచి బెయేరు చేరారు. ఈ స్థలంలో ఒక బావి ఉంది. యెహోవా “ప్రజలను ఇక్కడికి తీసుకొనిరా. నేను వారికి నీళ్లిస్తాను” అని మోషేతో చెప్పాడు.
NUM 21:17 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పాట పాడారు, “బావీ, ఉప్పొంగి ప్రవహించు, దానిగూర్చి పాడండి!
NUM 21:18 మహాత్ములు ఈ బావి తవ్వారు. ప్రముఖ నాయకులు ఈ బావి తవ్వారు. అధికార దండములతో, కర్రలతో వారు ఈ బావి తవ్వారు. అరణ్యంలో ఇది ఒక కానుక.” మత్తాన అని పిలువబడే ఈ బావి దగ్గర ప్రజలు ఉన్నారు.
NUM 21:19 అప్పుడు ప్రజలు మత్తానానుండి నహలీయేలుకు ప్రయాణం చేసారు. మళ్లీ వారు నహలీయేలు నుండి బామోతుకు ప్రయాణం చేసారు.
NUM 21:20 బామోతునుండి మోయాబు లోయకు ప్రజలు ప్రయాణం చేసారు. ఇక్కడ ఎడారికి ఎదురుగా పిస్గా శిఖరం కనబడుతుంది.
NUM 21:21 అమోరీ ప్రజల రాజు సీహోను దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలు కొందరు మనుష్యుల్ని పంపారు. వారు ఆ రాజుతో
NUM 21:22 “మమ్మల్ని నీ దేశంలో నుండి ప్రయాణం చేయనివ్వు. మేము పొలాల్లోనుంచి గాని, ద్రాక్షా తోటల్లోనుంచిగాని నడువము. నీ బావుల్లోనుంచి నీళ్లు తాగము. రాజ మార్గంలోనే మేము నడుస్తాము. నీ దేశం దాటి వెళ్లేంతవరకు మేము ఆ మార్గంలోనే ఉంటాము” అని చెప్పారు.
NUM 21:23 అయితే సీహోను రాజు ఇశ్రాయేలు ప్రజలను తన రాజ్యంలోనుండి ప్రయాణం చేయనియ్యలేదు. రాజు తన సైన్యాన్ని సమకూర్చుకొని అరణ్యంలోకి నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలమీదికి అతడు వెళ్తూఉన్నాడు. యాహజు అనే చోట ఆ రాజు సైన్యం ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేసారు.
NUM 21:24 కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజును చంపారు. అప్పుడు అర్నోను లోయ మొదలుకొని యబ్భోకు ప్రాంతంవరకు అతని దేశాన్ని వారు స్వాధీనం చేసుకొన్నారు. అమ్మోనీ ప్రజల సరిహద్దు వరకు ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకొన్నారు. అమ్మోనీ ప్రజలు ఆ సరిహద్దును చాల గట్టిగా కాపాడు తున్నందుచేత వారు అంతకంటె ఎక్కువ భూమిని స్వాధీనం చేసుకోలేదు.
NUM 21:25 అమోరీయుల ఈ పట్టణాలన్నింటినీ ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసికొని, అమోరీయుల పట్టణాలన్నింటిలో హెష్బోను, దాని చుట్టు పక్కల ఉన్న చిన్న చిన్న పట్టణాలన్నింటిలోను వారు నివసించటం మొదలు పెట్టారు.
NUM 21:26 సీహోను రాజు నివసించిన పట్టణం హెష్బోను. గతంలో మోయాబు రాజును సీహోను ఓడించాడు. అందువల్ల అర్నోను లోయవరకు మోయాబు దేశాన్ని సీహోను రాజు స్వాధీనం చేసుకొన్నాడు.
NUM 21:27 అందుకే గాయకులు ఇలా పాడతారు: “హెష్బోనూ, నీ నిర్మాణం మళ్లీ జరగాలి. సీహోను పట్టణం మళ్లీ కట్టబడును గాక!
NUM 21:28 హెష్బోనులో అగ్ని రగులుకొంది. ఆ అగ్ని సీహోను పట్టణంలో రగులుకొంది. ఆర్, మోయాబులను అగ్ని నాశనం చేసింది. అర్నోను ఉన్నత స్థలాల కొండలను అది కాల్చేసింది.
NUM 21:29 ఓ మోయాబూ, అది నీకు కీడు. కెమోషు ప్రజలు నాశనం చేయబడ్డారు. అతని కుమారులు పారిపోయారు. అమోరీ ప్రజల రాజైన సీహోను చేత అతని కుమార్తెలు బందీలు చేయబడ్డారు.
NUM 21:30 అయితే మేము ఆ అమోరీలను ఓడించాము. హెష్బోను నుండి దీబోను వరకు నషీమునుండి మేదెబా దగ్గరి నొఫహువరకు వారి పట్టణాలను మేము నాశనం చేసాం.”
NUM 21:31 కనుక ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజల దేశంలో నివాసం ఏర్పరచుకున్నారు.
NUM 21:32 యాజెరు పట్టణాన్ని చూచి రమ్మని మోషే కొందరు మనుష్యుల్ని పంపించాడు. మోషే ఇలా చేసిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న పట్టణాలను కూడ వారు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నివసిస్తున్న అమోరీ ప్రజలు పారిపొయ్యేటట్టుగా ఇశ్రాయేలు ప్రజలు వారిని తరిమివేసారు.
NUM 21:33 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బాషాను దారిన ప్రయాణం చేసారు. బాషాను రాజైన ఓగు తన సైన్యాన్ని సిద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజల మీదికి వెళ్లాడు. ఎద్రేయి అనే చోట అతడు వారితో యుద్ధం చేసాడు.
NUM 21:34 అయితే యెహోవా, “ఆ రాజును గూర్చి భయపడవద్దు. మీరు అతన్ని ఓడించునట్లు నేను చేస్తాను. మొత్తం అతని సైన్యాన్ని, దేశాన్ని కూడ మీరు స్వాధీనం చేసుకొంటారు. అమోరీ ప్రజల రాజైన హెష్బోనులో నివసించిన సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడచేయండి” అని మోషేతో చెప్పాడు.
NUM 21:35 కనుక ఓగును, అతని సైన్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఓడించేసారు. అతన్ని, అతని కుమారులను, అతని సైన్యం అంతటినీ వారు చంపారు. అప్పుడు అతని దేశం అంతా ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకున్నారు.
NUM 22:1 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాలకు ప్రయాణం చేసారు. యెరికోకు ఎదురుగా యొర్దాను నది దగ్గర వారు నివాసాలు కట్టుకొనిరి.
NUM 22:2 ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలకు చేసిన వాటన్నిటినీ సిప్పోరు కుమారుడైన బాలాకు చూసాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలమంది ఉండటం చూచి, మోయాబు రాజైన భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలంటే మోయాబువాళ్లు భయపడ్డారు.
NUM 22:4 మోయాబు రాజు “ఆవు పొలంలో గడ్డి అంతా తినివేసినట్టు ఈ గొప్ప ప్రజా సమూహం మన చుట్టూ ఉన్న మొత్తం నాశనం చేసేస్తుంది” అని మిద్యాను నాయకులతో చెప్పాడు. అప్పట్లో సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు.
NUM 22:5 బెయారు కుమారుడు బిలామును పిలువమని అతడు మనుష్యులను పంపించాడు. బిలాము యూఫ్రటీసు నది దగ్గర పెతోరు అనే చోట ఉన్నాడు. బాలాకు ఈ విధంగా సందేశం పంపాడు: “ఈజిప్టునుండి ఒక కొత్త జాతి ప్రజలు వచ్చారు. దేశం అంతా కమ్మే సేటంతమంది ఉన్నారు వారు. వాళ్లు నా ప్రక్కనే గుడారాలు వేసుకొన్నారు.
NUM 22:6 వీళ్లను ఎదుర్కోటానికి నీవు వచ్చి నాకు సహాయం చేయి. అప్పుడు ఒకవేళ వారిని ఓడించగలనేమో వారి ముందు నా బలం చాలదు. అప్పుడు వారిని నా దేశంనుండి తరిమివేయగలను. నీకు గొప్పశక్తి ఉందని నాకు తెలుసు. నీవు ఎవరినైనా ఆశీర్వదిస్తే, వారికి మేలు జరుగుతుంది. నీవు ఎవరినైనా శపిస్తే వారికి కీడు జరుగుతుంది. అందుచేత వచ్చి ఈ ప్రజలను శపించు. అప్పుడు, నేను వారిని ఈ దేశం నుండి తోలి వేయగలను.”
NUM 22:7 మోయాబు, మిద్యాను నాయకులు వెళ్లిపోయారు. బిలాముతో మాట్లాడటానికి వారు వెళ్లారు. అతని సేవకోసం అతనికి చెల్లించేందుకు వారు డబ్బు తీసుకుని వెళ్లారు. బాలాకు చెప్పిన విషయం వారు అతనికి చెప్పారు.
NUM 22:8 బిలాము, “ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి. నేను యెహోవాతో మాట్లాడి, ఆయన నాకు అచ్చే జవాబు మీకు చెబుతాను” అని వారితో చెప్పాడు. అందుచేత మోయాబు ప్రజా నాయకులు ఆ రాత్రి వారితో ఉండిపోయారు.
NUM 22:9 దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, “నీతో ఉన్న ఈ మనుష్యులు ఎవరు?” అని అడిగాడు.
NUM 22:10 బిలాము దేవునితో చెప్పాడు: “మోయాబు రాజును, సిప్పోరు కుమారుడునైన బాలాకు నాకు ఒక కబురు చెప్పమని వారిని పంపాడు.
NUM 22:11 ఆ సందేశం ఇది: ఈజిప్టునుండి ఒక కొత్త దేశపు జనాంగం వచ్చింది. వారు భూమి అంతా నిండిపొయ్యేంత మంది ఉన్నారు. కనుక వచ్చి వీళ్లను శపించు, అప్పుడు ఒకవేళ నేను వాళ్లతో యుద్ధం చేసి నా దేశంనుండి వెళ్లగొట్ట గలుగుతానేమో.”
NUM 22:12 అయితే దేవుడు, “వాళ్లతో వెళ్లవద్దు. ఈ ప్రజలను నీవు శపించకూడదు. వీరు నా ప్రజలు” అని బిలాముతో చెప్పాడు.
NUM 22:13 మరునాటి ఉదయం బిలాము లేచి, “మీ స్వదేశానికి తిరిగి వెళ్లిపొండి. యెహోవా నన్ను మీతో వెళ్ల నివ్వడు” అన్నాడు.
NUM 22:14 కనుక మోయాబు నాయకులు తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లిపోయి అతనితో, “మాతో రావటానికి బిలాము నిరాకరించాడు” అని చెప్పారు.
NUM 22:15 కనుక బాలాకు మరికొందరు నాయకులను బిలాము దగ్గరకు పంపించాడు. మొదటి సారికంటే ఈ సారి చాల ఎక్కువ మందిని అతడు పంపించాడు. మొదటిసారి అతడు పంపిన వారికంటె వీరు ప్రముఖ నాయకులు.
NUM 22:16 వారు బిలాము దగ్గరకు వెళ్లి చెప్పారు: “సిప్పోరు కుమారుడైన బాలాకు నీతోఇలా చెప్పమన్నాడు. దయచేసి నీవు రాకుండా ఏదీ నిన్ను అడ్డుపెట్టనియ్యకు.
NUM 22:17 నేను అడిగిన దాన్ని నీవు చేస్తే, నేను నీకు విస్తారంగా డబ్బు ఇస్తాను. నీవు వచ్చి, నా పక్షంగా ఈ ప్రజలను శపించు.”
NUM 22:18 కానీ బిలాము ఆ మనుష్యులకు తన జవాబిచ్చాడు. అతడు ఇలా చెప్పాడు: “నా దేవుడైన యెహోవాకు నేను విధేయుడ్ని కావాలి. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయలేను. నేను చెయ్యొచ్చు అని నా ప్రభువు చెబితేనే తప్ప లేకపోతే సామాన్యమైనదైనా గొప్పదైనా నేనేమి చేయలేను. బాలాకు రాజు అందమైన తన భవనమంతా వెండి బంగారాలతో నింపి నాకు ఇచ్చినా సరే, నా ప్రభువు ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయను.
NUM 22:19 అయితే ఇదివరకు వచ్చిన వారిలాగే మీరు ఈ రాత్రి ఇక్కడ వుండవచ్చు. ఈ రాత్రి యెహోవా నాతో ఏమి చెబుతాడో నేను తెలుసుకొంటాను.”
NUM 22:20 ఆ రాత్రి యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, “ఈ మనుష్యులు వారితో కూడ నిన్ను రమ్మని అడగటానికి మళ్లీ వచ్చారు. కనుక నీవు వారితో వెళ్లవచ్చు. అయితే నేను నీతో ఏమి చెబుతానో అలా మాత్రమే చేయాలి” అని చెప్పాడు.
NUM 22:21 మరునాడు ఉదయాన్నే బిలాము లేచి తన గాడిదకు గంత కట్టాడు. అప్పుడు అతడు మోయాబు నాయకులతో వెళ్లాడు.
NUM 22:22 బిలాము తన గాడిద మీద వెళ్తున్నాడు. అతని ఇద్దరు సేవకులు అతనితో ఉన్నారు. బిలాము ప్రయాణం చేస్తుండగా దేవునికు కోపం వచ్చింది. కనుక యెహోవా దూత మార్గంలో బిలాము ఎదుట నిలబడ్డాడు. ఆ దూత బిలామును ఆపుజేయబోతున్నాడు.
NUM 22:23 దారిలో యెహోవా దూత నిలబడటం బిలాము గాడిద చూచింది. ఆ దూత చేతిలో ఖడ్గం ఉంది. కనుక గాడిద దారి తొలగి పక్క పొలంలోకి వెళ్లింది. బిలాము యెహోవా దూతను చూడలేదు. అందుచేత అతనికి తన గాడిద మీద చాల కోపం వచ్చింది. అతడు గాడిదను కొట్టి, మళ్లీ దారి మీదికి వెళ్లేందుకు దాన్ని బలవంతం చేసాడు.
NUM 22:24 తర్వాత ఆ దారిలో ఇరుకైన చోట యెహోవా దూత నిలబడ్డాడు. ఇది రెండు ద్రాక్ష తోటల మధ్యఉంది. దారికి రెండు వైపులా గోడలు ఉన్నాయి
NUM 22:25 మళ్లీ ఆ గాడిద యెహోవా దూతను చూచింది. అందుచేత ఆ గాడిద గోడకు రాసుకొనే అంత దగ్గరగా వెళ్లింది. కనుక బిలాము పాదం గోడకేసి నొక్కేసింది. బిలాము తన గాడిదను మళ్లీ కొట్టాడు.
NUM 22:26 తర్వాత యెహోవా దూత మరో చోట నిలబడ్డాడు. ఇది కూడ ఇరుకు దారి. గాడిద వెనుకకు తిరిగే అంత చోటుకూడ అక్కడలేదు. ఆ గాడిద కుడికి ఎడమకు కూడ తిరుగలేక పోయింది.
NUM 22:27 యెహోవాను ఆ గాడిద మళ్లీ చూచింది. కనుక బిలాముతో సహా ఆ గాడిద కూలబడింది. బిలాముకు ఆ గాడిద మీద చాలా కోపం వచ్చింది. అందుచేత అతడు తన కర్రతో దాన్ని కొట్టాడు.
NUM 22:28 అప్పుడు యోహోవా ఆ గాడిద మాట్లాడేటట్టు చేసాడు. ఆ గాడిదా, “నీవు నా మీద ఎందుకు కోపగించు కొంటున్నావు? నీకు నేనేమి చేసాను? నీవు నన్ను మూడుసార్లు కొట్టావు” అంది బిలాముతో.
NUM 22:29 “నన్ను ఒక వెర్రివాడిలా చేసావు నీవు. నా చేతిలోనే గనుక ఒక కత్తి ఉంటే, ఈ పాటికి నిన్ను నరికేసి ఉండేవాడ్ని” అన్నాడు బిలాము తన గాడిదతో.
NUM 22:30 అయితే ఆ గాడిద “ఎన్నేన్నో సంవత్సరాలుగా నీవు స్వారీ చేస్తున్న నీ సొంత గాడిదను నేను. ఇంతకు ముందు ఎన్నడూ నేను నీకు ఇలా చేయలేదని నీకు తెలుసు” అంది బిలాముతో. “అది నిజమే” బిలాము అన్నాడు.
NUM 22:31 అప్పుడు దారి మీద నిలబడ్డ దేవదూతను బిలాము చూడగలిగేటట్టు చేసెను యోహోవా. ఆ దేవదూతను, అతని కత్తిని బిలాము చూసాడు. అప్పుడు బిలాము నేలమీద సాష్టాంగపడ్డాడు.
NUM 22:32 యెహోవా దూత బిలామును అడిగాడు: “నీవు నీ గాడిదను ఎందుకు మూడుసార్లు కొట్టావు? నీకు నామీద కోపం రావాలి. నిన్ను ఆపు చేయటానికే సరిగ్గా సమయానికి నేను ఇక్కడికి వచ్చాను.
NUM 22:33 గాడిద నన్ను చూచి మూడు సార్లు నా నుండి పక్కకు తప్పుకొంది. ఆ గాడిద కనుక తప్పుకొని ఉండకపోతే నిన్ను చంపేసి ఉండేవాడ్ని. కానీ నీ గాడిదను నేను చంపేవాడ్ని కాదు.”
NUM 22:34 అప్పుడు బిలాము: “నేను పాపం చేసాను. దారి మీద నీవు నిలబడ్డావని నేనెరగను. నేను చేస్తోంది తప్పు అయితే నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను” అని యెహోవా దూతతో చెప్పాడు.
NUM 22:35 “లేదు! ఈ మనుష్యులతో, నీవు వెళ్లవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండు. నీవు చెప్పాలని నేను నీతో చెప్పేమాటలే నీవు చెప్పాలి” అన్నాడు బిలాముతో యెహోవా దూత. కనుక బాలాకు పంపిన మనుష్యులతో బిలాము వెళ్లాడు.
NUM 22:36 బిలాము వస్తున్నాడని బాలాకు విన్నాడు. కనుక అర్నోను సపిహద్దులో ఉన్న మోయాబు పట్టణం దగ్గర అతణ్ణి కలుసుకొనేందుకు బాలాకు వెళ్లాడు. ఇది అతని దేశపు పొలిమేర.
NUM 22:37 బాలాకు బిలామును చూడగానే “నీవు రావాలని ఇది చాలా ముఖ్యమయిందని ఇంతకు ముందే నీతో చెప్పాను. నీవు నా దగ్గరకు ఎందుకు రాలేదు? నేను నీకు ఇప్పుడు ఏమీ చెల్లించ లేకపోవచ్చును” అన్నాడు బిలాముతో.
NUM 22:38 అయితే బిలాము: “ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను. కానీ నీవు అడిగింది మాత్రం నేను చేయలేక పోవచ్చు. చెప్పమని యెహోవా దేవుడు నాకు చెప్పిన సంగతులు మాత్రమే నేను చెప్పగలను,” అని జవాబిచ్చాడు.
NUM 22:39 అప్పుడు బిలాము బాలాకుతోకూడ కిర్యాత్ హుచ్చోతుకు వెళ్లాడు.
NUM 22:40 బాలాకు తన బలి అర్పణగా కొన్ని ఎడ్లను, గొర్రెలను వధించాడు. ఆ మాంసం కొంత బిలాముకు, మరికొంత అతనితో ఉన్న నాయకులకు అతడు ఇచ్చాడు.
NUM 22:41 ఆ మర్నాటి ఉదయం బాలాకు బామోతు బయలు పట్టణానికి బిలామును తీసుకుని వెళ్లాడు. ఆ పట్టణం నుండి వారు ఇశ్రాయేలు ప్రజలు వేసుకొన్న గుడారాలను కొంత చూడగలరు.
NUM 23:1 బిలాము “ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టండి. నాకోసం ఏడు ఎద్దులు, ఏడు పొట్టేళ్లు సిద్ధంచేయండి” అని చెప్పాడు.
NUM 23:2 బిలాము అడిగినట్టే బాలాకు దీన్ని చేసాడు. అప్పుడు బాలాకు, బిలాము ఒక్కో బలిపీఠం మీద ఒక్కో పొట్టేలును, ఒక్కో ఎద్దును వధించారు.
NUM 23:3 అప్పుడు బిలాము, “ఈ బలిపీఠం దగ్గరగా ఉండు. నేను ఇంకో చోటికి వెళ్తాను. అప్పుడు యెహోవా నా దగ్గరకు వచ్చి నేను చెప్పాల్సింది ఏమిటో నాకు చెబుతాడు” అని బాలాకుతో చెప్పాడు. అప్పుడు బిలాము మరో ఉన్నత స్థలానికి వెళ్లిపోయాడు.
NUM 23:4 అక్కడ దేవుడు బిలాము దగ్గరకు వచ్చాడు. “ఏడు బలిపీఠాలు నేను సిద్ధం చేసాను. ఒక్కో బలిపీఠంమీద ఒక్కో ఎద్దును ఒక్కోపొట్టేలును బలిగా నేను వధించాను” అన్నాడు బిలాము.
NUM 23:5 అప్పుడు బిలాము ఏమి చెప్పాల్సిందీ యెహోవా అతనికి చెప్పాడు. అప్పుడు, “తిరిగి వెళ్లి, చెప్పమని నేను నీకు చెప్పిన విషయాలు బాలాకుతో చెప్పు” అన్నాడు యెహోవా.
NUM 23:6 కనుక బిలాము తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులంతా వారితో నిలిచి ఉన్నారు.
NUM 23:7 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు: “తూర్పు కొండల్లో నుండి ఆరాము నుండి మోయాబు రాజైన బాలాకు నన్ను ఇక్కడకు తీసుకుచ్చాడు. వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు! ‘వచ్చి నా పక్షంగా యాకోబును శపించు, వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు!’ అన్నాడు నాతో బాలాకు.
NUM 23:8 దేవుడు ఆ ప్రజలకు వ్యతిరేకంగా లేడు అందుచేత నేనుకూడ వారిని శపించలేను. ఆ ప్రజల విషయమై యెహోవా చెడ్డ విషయాలను చెప్పలేదు అందుచేత నేను అలా చేయలేను.
NUM 23:9 కొండమీద నుండి నేను ఆ ప్రజలను చూస్తున్నాను. ఎత్తయిన కొండల నుండి నేను చూస్తున్నాను. ఒంటరిగా బతుకుతున్న ప్రజలను నేను చూస్తున్నాను, వాళ్లు మరో జనములో భాగంకారు యాకోబు ప్రజలను ఎవరు లెక్కించగలరు.
NUM 23:10 ఇసుక రేణవులకంటె ఎక్కువ ఉన్నారు యాకోబు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల్లో నాలుగోవంతు మనుష్యుల్ని కూడ ఎవరూ లెక్కించలేరు. ఒక మంచి మనిషిగా నన్ను చావనివ్వండి ఆ మనుష్యులు మరణించినంత సంతోషంగా నన్ను మరణించనివ్వండి!”
NUM 23:11 బాలాకు బిలాముతో, “ఏమిటి నీవు నాకు చేసింది? నా శత్రువుల్ని శపించమని నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. కానీ నీవు మాత్రం వాళ్లను ఆశీర్వదించావు” అన్నాడు.
NUM 23:12 కానీ బిలాము, “నేను చెప్పాల్సింది దేవుడు నాకు చెప్పిన విషయాలు మాత్రమే” అని జవాబిచ్చాడు.
NUM 23:13 అప్పుడు, “అలాగైతే, నాతో మరో చోటికి రా. అక్కడకూడ నీవు మనుష్యుల్ని చూడగలవు. అయితే అందర్నీ కాదుగాని కొందర్ని మాత్రం చూడగలవు. అక్కడనుండి నీవు నా కోసం వాళ్లను శపించవచ్చు” అని అతనితో చెప్పాడు బాలాకు.
NUM 23:14 కనుక బాలాకు యోఫీం పొలంలోకి బిలామును తీసుకుని వెళ్లాడు. ఇది పిస్గా కొండ శిఖరం మీద ఉంది. ఆ స్థలంలో బాలాకు ఏడు బలిపీఠాలు కట్టించాడు. అప్పుడు బాలాకు ఒక్కో బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో పొట్టేలును బలిగా వధించాడు.
NUM 23:15 కనుక బిలాము, “ఈ బలిపీఠం దగ్గర ఉండు. నేను వెళ్లి అక్కడ దేవుడ్ని కలుసుకొంటాను” అని బాలాకుతో చెప్పాడు.
NUM 23:16 కనుక యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, అతడు ఏమి చెప్పాల్సిందీ అతనికి తెలియజేసాడు. అప్పుడు యెహోవా, బిలామును వెళ్లి ఆ సంగతులు బాలాకుతో చెప్పమన్నాడు.
NUM 23:17 కనుక బిలాము బాలాకు దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు వారితోబాటు ఉన్నారు. అతడు రావటం చూచి, “ఏమి చెప్పాడు యెహోవా?” అన్నాడు బాలాకు.
NUM 23:18 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు: “బాలాకూ లేచి నా మాట విను. సిప్పోరు కుమారుడా, బాలాకూ, నా మాట విను.
NUM 23:19 దేవుడు మనిషికాడు, ఆయన అబద్ధం చెప్పడు. దేవుడు మానవ కుమారుడు కాడు, ఆయన నిర్ణయాలు మారవు. ఏదైనా చేస్తానని యెహోవా చెబితే ఆయన అలా చేస్తాడు. యెహోవా ఒక వాగ్దానం చేస్తే, ఆయన తన వాగ్దానం ప్రకారం చేస్తాడు.
NUM 23:20 ఆ ప్రజలను ఆశీర్వదించమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. యెహోవా వారిని ఆశీర్వదించాడు కనుక నేను దాన్ని మార్చలేను.
NUM 23:21 దేవునికి యాకోబు ప్రజల్లో తప్పేమీ కనబడలేదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ పాపమూ దేవునికి కనబడలేదు. యెహోవా వారి దేవుడు, ఆయన వారితో ఉన్నాడు. మహారాజు వారితో ఉన్నాడు.
NUM 23:22 దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకొచ్చాడు. అడవి ఎద్దుల్లా వారు బలంగా ఉన్నారు.
NUM 23:23 యాకోబు ప్రజలను ఓడించగల శక్తి ఏదీ లేదు. ఇశ్రాయేలు ప్రజలకు ఎదురు వెళ్లగల మంత్రమూ ఏదీ లేదు. ‘దేవుడు చేసిన మహా కార్యాలను చూడండి’ అని యాకోబును గూర్చి, ఇశ్రాయేలు ప్రజలను గూర్చి మనుష్యులు అంటారు.
NUM 23:24 ఆ ప్రజలు బలమైన సింహంలా ఉంటారు. సింహంలా వారు పోరాడతారు. ఆ సింహం తన శత్రువును తినివేసేంత వరకు విశ్రాంతి తీసుకోదు. తనకు వ్యతిరేకంగా ఉండేవారి రక్తం తాగేంతవరకు ఆ సింహం ఊరుకోదు.”
NUM 23:25 అప్పుడు బాలాకు, “ఆ ప్రజలకు మేలు జరగాలని నీవు అడుగలేదు గాని కీడు జరగాలని కూడ నీవు అడుగలేదు” అన్నాడు బిలాముతో.
NUM 23:26 బిలాము, “యెహోవా నాకు చెప్పిన విషయాలు మాత్రమే చెబుతానని నేను నీకు ముందే చెప్పాను” అని జవాబిచ్చాడు.
NUM 23:27 అప్పుడు బాలాకు, “అలాగైతే నాతో మరో బలిపీఠం దగ్గరకు రా. ఒకవేళ అక్కడ దేవుడు సంతోషించి, అక్కడనుండి ఆ ప్రజలను శపించనిస్తాడేమో” అని బిలాముతో చెప్పాడు.
NUM 23:28 కనుక బాలాకు పీయోరు కొండకు బిలామును తీసుకుని వెళ్లాడు. ఈ కొండ నుండి అరణ్యాన్ని చూడవచ్చు.
NUM 23:29 “ఇక్కడ ఏడు బలిపీఠాలు నిర్మించు. తర్వాత బలికోసం ఏడు ఎద్దుల్ని, ఏడు పొట్టేళ్లను సిద్ధం చేయి” అన్నాడు బిలాము.
NUM 23:30 బిలాము అడిగినట్టు బాలాకు చేసాడు. ప్రతి బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో పొట్టేలును బాలాకు బలిగా వధించాడు.
NUM 24:1 ఇశ్రాయేలును యెహోవా ఆశీర్వదించాలనే కోరుతున్నట్టు బిలాము గమనించాడు. కనుక ఎలాంటి మంత్రాలు ప్రయోగించినా గాని దానిని బిలాము మార్చదలచుకోలేదు. కానీ బిలాము పక్కకు తిరిగి అరణ్యం చూసాడు.
NUM 24:2 బిలాము అరణ్యాన్ని చూచి, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందర్నీ చూసాడు. వారు, వారి కుటుంబాలతో ఆ ప్రదేశాల్లో నివసిస్తున్నారు. అప్పుడు దేవుని ఆత్మ బిలాము మీదికి రాగా
NUM 24:3 బిలాము ఈ విషయాలు చెప్పాడు: “బెయోరు కుమారుడు ఈ విషయాలు చెబుతున్నాడు. నా కళ్లు తేటగా చూస్తున్నాయి కనుక ఈ మాటలు పలుకుతున్నాను.
NUM 24:4 నేను దేవుని మాటలు వింటున్నాను కనుక ఈ మాటలు చెబుతున్నాను. నేను చూడాలని ఆ సర్వశక్తిమంతుడు కోరుతున్న వాటిని నేను చూడ గలుగుతున్నాను. నేను సాగిలపడి తేటగా చూసినవాటిని చెబుతున్నాను.
NUM 24:5 “యాకోబు ప్రజలారా, మీ గుడారాలు చాలా అందంగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలారా, మీ నివాసాలు అందంగా ఉన్నాయి.
NUM 24:6 భూమి మీద మీ గుడారాలు లోయల్లా పరచుకొన్నాయి. అవి నదీ తీరంలో తోటలా ఉన్నాయి. యెహోవా నాటిన అది చక్కటి సువాసనగల మొక్కలా ఉంది. అది నీళ్ల దగ్గర పెరిగే అందమైన చెట్లలా ఉంది.
NUM 24:7 మీకు ఎల్లప్పుడూ తాగటానికి కావాల్సినంత నీరు ఉంటుంది. మీ ఆహారం పండించుకోవటానికి కావాల్సినంత నీరు ఎల్లప్పుడూ ఉంటుంది మీకు. ఆ ప్రజల రాజు అగాగుకంటె గొప్పవాడుగా ఉంటాడు. వారి రాజ్యం చాలా గొప్పది అవుతుంది.
NUM 24:8 “ఆ ప్రజలను ఈజిప్టునుండి దేవుడే బయటకు తీసుకొచ్చాడు. వారు అడవి ఆవు అంతటి బలంగలవారు. తమ శత్రువులందర్నీ వారు ఓడిస్తారు. వారి శత్రువుల ఎముకల్ని వారు విరుగగొడ్తారు. వారి బాణాలు వారి శత్రువుల్ని చంపేస్తాయి.
NUM 24:9 తన ఆహారం మీదికి ఎగబడటానికి సిద్ధంగా వున్న సింహంలా ఇశ్రాయేలీయులున్నారు. వారు నిద్రపోతున్న కొదమ సింహంలా ఉన్నారు. దానిని మేల్కొలి పేందుకు ఎవడికి ధైర్యం చాలదు. నిన్ను ఆశీర్వదించే వారు ఆశీర్వాదం పొందుతారు. నిన్ను ఎవరైనా శపిస్తే వారికి గొప్ప కష్టాలు వస్తాయి.”
NUM 24:10 అప్పుడు బాలాకు బిలాముమీద చాల కోపపడ్డాడు. బిలాముతో బాలాకు అన్నాడు: “నిన్ను వచ్చి నా శత్రువులను శపించుమని పిలిచాను. కానీ నీవు వాళ్లను ఆశీర్వదించావు. వాళ్లను మూడు సార్లు నీవు ఆశీర్వదించావు.
NUM 24:11 ఇప్పుడు ఇంటికి వెళ్లిపో. నీకు చాలా ఇస్తానని నేను నీతో చెప్పాను. అయితే నీవు నీ ప్రతిఫలం పోగొట్టుకొనేటట్టు చేసాడు యెహోవా.”
NUM 24:12 బాలాకుతో బిలాము అన్నాడు: “నీవు నా దగ్గరకు మనుష్యుల్ని పంపించావు. నన్ను రమ్మని వాళ్లు అడిగారు.
NUM 24:13 కానీ వారితో నేను, ‘బాలాకు అతి సుందరమైన తన భవనాన్ని వెండి, బంగారాలతో నింపి ఇవ్వవచ్చుగాక. నేను మాత్రం నన్ను చెప్పమని యెహోవా నాకు చెప్పిన మాటలే చెబుతాను మంచిగాని చెడుగాని, నా అంతట నేనే ఏదీ చెయలేను. యెహోవా ఆజ్ఞాపించినట్లు నేను చేసి తీరాల్సిందే’ అన్నాను. ఈ సంగతులు నేను నీ మనుష్యులతో చెప్పటం నీకు జ్ఞాపకంలేదా?
NUM 24:14 ఇప్పుడు నేను నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్తున్నాను. అయితే నేను నీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నీకూ, నీ ప్రజలకూ ఇశ్రాయేలు ప్రజలు ఇక ముందు ఏమి చేస్తారో నేను నీకు చెబుతాను.”
NUM 24:15 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు: “బెయెరు కుమారుడైన బిలాము మాటలు ఇవి. విషయాలను తేటగా చూడగలవాని మాటలు ఇవి.
NUM 24:16 మాటలను దేవుని దగ్గరనుండి వినగల వాని మాటలు ఇవి. మహోన్నతుడైన దేవుడు నాకు నేర్పినవాటిని నేను నేర్చుకున్నాను. నేను చుడాలని సర్వశక్తుడైన దేవుడు కోరినవాటిని నేను చూసాను. నేను ఆయనకు సాగిల పడుతున్నాను. దేవునికి కావలసినదానిని నేను తేటగా చూడగలను.
NUM 24:17 “యెహోవా రావటం నేను చూస్తున్నాను, కానీ ఇప్పుడే కాదు. ఆయన రాక నేను చూస్తున్నాను, కానీ అది త్వరలోనే జరగదు. యాకోబు వంశంనుండి ఒక నక్షత్రం వస్తుంది. ఇశ్రాయేలు నుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు. ఆ పాలకుడు మోయాబు ప్రజల తలలు చితకగొడ్తాడు. షేతు కుమారులందరి తలలు ఆ పాలకుడు చితకగొడ్తాడు.
NUM 24:18 ఇశ్రాయేలీయులు బలము గలవారవుతారు. అతనికి ఏదోము దేశము, అతని శత్రువైన శేయీరు దొరుకుతాయి.
NUM 24:19 “యాకోబు వంశంనుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు. పట్టణంలో ఇంకా బతికి ఉన్న వాళ్లను ఆ పాలకుడు నాశనం చేస్తాడు.”
NUM 24:20 తర్వాత బిలాము అమాలేకు ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు: “దేశాలన్నింటిలో అమాలేకు అతి బలంగలది. కానీ అమాలేకు కూడ నాశనం చేయబడుతుంది”!
NUM 24:21 తర్వాత బిలాము కెనాతీ ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు: “మీ దేశం క్షేమంగా ఉందని మీ నమ్మకం. ఎత్తయిన కొండమీద పక్షి గూడులా అది కాపాడ బడుతోందని మీ నమ్మకం.
NUM 24:22 అయితే మీరు కెనాతీ ప్రజలు నాశనం చేయబడతారు. అష్షూరు మిమ్మల్ని బందీలుగా చేస్తుంది.”
NUM 24:23 అప్పుడు బిలాము ఈ మాటలు చెప్పాడు: “దేవుడు ఇలా చేసినప్పుడు ఏ వ్యక్తి బతకలేడు.
NUM 24:24 కిత్తీము తీరాలకు ఓడలు వస్తాయి. ఆ ఓడలు అష్షూరు, ఎబెరులను ఓడిస్తాయి. అయితే తర్వాత ఆ ఓడలు కూడ నాశనం చేయ బడతాయి”
NUM 24:25 అప్పుడు బిలాము లేచి, తన స్వంత ఊరికి తిరిగి వెళ్లి పోయాడు.
NUM 25:1 ఇశ్రాయేలు ప్రజలు ఇంకా షిత్తీము దగ్గరే నివాసం చేస్తున్నారు. ఆ సమయంలో పురుషులు మోయాబీ స్త్రీలతో లైంగిక పాపం చేయటం మొదలు పెట్టారు.
NUM 25:2 మోయాబీ స్త్రీలు వారి నకిలీ దేవుళ్లకు బలులు అర్పించేటప్పుడు వచ్చి సహాయం చేయుమని ఆ పురుషులను అహ్యానించారు. యూదులు కొంతమంది ఆ దేవుళ్లను కొలిచి, అక్కడ భోజనం చేసారు. కనుక ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు పెయోరులో బయలు దేవతను కొలవటం మొదలు పెట్టారు. యెహోవాకు ఈ ప్రజలమీద చాల కోపం వచ్చింది.
NUM 25:4 “ఈ ప్రజల నాయకులందర్నీ పిలువు. ప్రజలంతా చూసేటట్టు వారిని చంపు. వారి శరీరాల్ని యెహోవా ఎదుట పడవేయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవా కోపగించడు” అని మోషేతో యెహోవా చెప్పాడు.
NUM 25:5 ఇశ్రాయేలీయుల న్యాయమూర్తులతో “పెయోరులో నకిలీ దేవుడైన బయలును కొలిచేందుకు ప్రజలను నడిపించిన మీ వంశపు నాయకులను ఒక్కొక్కరిని మీరు తెలుసుకోవాలి. తర్వాత మీరు వారిని చంపేయాలి” అని మోషే చెప్పాడు.
NUM 25:6 ఆ సమయంలో మోషే, మరియు ఇశ్రాయేలు పెద్దలూ అంత సన్నిధి గుడార ద్వారం దగ్గర చేరారు. ఇశ్రాయేలు మగవాడొకడు ఒక మిద్యానీ స్త్రీని తన ఇంటికి, తన కుటుంబం దగ్గరకు తీసుకొనివచ్చాడు. మోషే, మరియు పెద్దలూ అందరూ చూసేటట్టుగా వాడు ఇలా చేసాడు. మోషే, ఆ పెద్దలూ చాల విచారపడ్డారు.
NUM 25:7 అహరోను కుమారుడైన ఎలీయాజరు కుమారుడు ఫీనెహసు యాజకుడు ఇది చూసాడు. కనుక అతడు సమాజంనుండి వెళ్లి తన ఈటె తీసుకున్నాడు.
NUM 25:8 ఇశ్రాయేలు పురుషునితోబాటు వాని గుడారంలోకి అతడు వెళ్లాడు. ఆ ఇశ్రాయేలు వానిని మిద్యానీ స్త్రీనీ ఈటెతో అతడు చంపేసాడు. ఆ ఈటెతో అతడు వారిద్దరి శరీరాలూ పొడిచినాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప రోగం పుట్టింది. అయితే వీళ్లద్దర్నీ ఫీనెహసు చంపగానే ఆ రోగం ఆగిపోయింది.
NUM 25:9 ఈ రోగం మూలంగా 24,000 మంది చనిపోయారు.
NUM 25:10 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
NUM 25:11 “యాజకుడు అహరోను కుమారుడైన ఎలీయాజరు కుమారుడు ఫీనెహసు ఇశ్రాయేలు ప్రజలను నా కోపం నుండి రక్షించాడు. నన్ను సంతోష పెట్టేందుకు అతడు ఎంతో కష్టపడి ప్రయత్నించాడు. అతడు నాలాగే ఉన్నాడు. ప్రజల మద్య నా మర్యాద కాపాడటానికి అతడు ప్రయత్నం చేసాడు. అందుచేత నేను అనుకొన్న ప్రకారం ప్రజలను చంపను.
NUM 25:12 కనుక నేను ఫీనెహసుతో ఒక శాంతి ఒడంబడిక చేస్తున్నానని అతనితో చెప్పండి.
NUM 25:13 అతడు, అతని తర్వాత జీవించే అతని కుటుంబీకులు అందరికీ ఒక ఒడంబడిక ఉంటుంది. వారు ఎప్పటికీ యాజకులే. ఎందుచేతనంటే అతడు తన దేవుడి మర్యాద కాపాడటానికి ఎంతో కష్టపడి ప్రయత్నించాడు. అతడు చేసినది ఇశ్రాయేలు ప్రజల తప్పులకు ప్రాయశ్చిత్తం చేసింది.”
NUM 25:14 మిద్యానీ స్త్రీతో బాటు చంపబడ్డ ఇశ్రాయేలు మగవాడు, సాలు కుమారుడైన జిమ్రీ. షిమ్యోను వంశంలో ఒక కుటుంబానికి అతడు నాయకుడు.
NUM 25:15 చంపబడిన మిద్యానీ స్త్రీ పేరు కొజ్బీ. ఆమె షూరు కూమారై. షూరు మిద్యానీ ప్రజల్లో నాయకుడు. అతడు తన వంశానికి పెద్ద.
NUM 25:16 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
NUM 25:17 “మిద్యానీ ప్రజలు మీకు శత్రువులు. మీరు వాళ్లను చంపేయాలి.
NUM 25:18 ఇప్పటికే వాళ్లు మిమ్మల్ని శత్రువులుగా చేసుకున్నారు. మీరు పెయోరు నకిలీ దేవుడిని కొలిచేటట్టుగా వాళ్లు మిమ్మల్ని మోసం చేసారు. మిద్యానీ నాయకుని కుమారై కొజ్బీని మీ వాడొకడు దాదాపు వివాహం చేసుకున్నంత పని చేసారు వారు. అదే ఇశ్రాయేలు ప్రజలకు రోగం వచ్చినప్పుడు చంపబడ్డ స్త్రీకి పెయోరులో ప్రజలు బయలు నకిలీ దేవణ్ణి కొలిచిన కారణంగానే ఆ రోగం వచ్చినది.”
NUM 26:1 ఆ మహా రోగం తర్వాత మోషేతో, అహరోను కుమారుడు యాజకుడైన ఎలీయాజరుతో యెహోవా మాట్లాడాడు:
NUM 26:2 “ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కించండి. ప్రతి కుటుంబాన్నీ చూచి, 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న పురుషులందరిని లెక్కించండి. వీరు ఇశ్రాయేలు సైన్యంలో పని చేయటానికి సమర్థులు” అని ఆయన చెప్పాడు.
NUM 26:3 ఇప్పటికి మోయాబు మైదానంలోనే ప్రజలు నివాసం చేస్తున్నారు. ఇది యెరికోకు ఎదురుగా యోర్దాను నది దగ్గర ఉంది. కనుక మోషే, యాజకుడైన ఎలీయాజరు ప్రజలతో మాట్లాడారు. వారు
NUM 26:4 “20 గాని, అంతకంటె ఎక్కువ వయసు గాని ఉన్న మగవాళ్ల సంఖ్య లెక్కించాలి. ఇది మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ అన్నారు.” ఈజిప్టు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజల జాబితా ఇది:
NUM 26:5 రూబేను సంతతి వాళ్లు వీరే. (యాకోబుకు) ఇశ్రాయేలు పెద్ద కుమారుడు రూబేను. వంశాలు: హనోకు—హనోకీల వంశం పల్లు పల్లువారి వంశం
NUM 26:6 హెస్రోను హెస్రోనీల వంశం కర్మి కర్మీల వంశం
NUM 26:7 రూబేను సంతతిలోని వంశాలు అవి. మొత్తం 43, 730 మంది పురుషులు.
NUM 26:8 పల్లు కుమారుడు ఏలీయాబు.
NUM 26:9 నెమూయేలు, దాతాను, అబీరాము ముగ్గురూ ఏలీయాబు కుమారులు. మోషే, అహరోనులకు ఎదురు తిరిగిన నాయకులు దాతాను, అబీరాము అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవాకు కోరహు ఎదురు తిరిగినప్పుడు వారు కోరహును వెంబడించారు.
NUM 26:10 అప్పుడే భూమి తెరచుకొని, కోరహును, అతని అనుచరులు అందరినీ మింగివేసింది. చనిపోయిన వారి సంఖ్య మొత్తం 250 మంది పురుషులు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇది ఒక హెచ్చరిక, గుర్తు.
NUM 26:11 అయితే కోరహు కుటుంబంలోని ఇతరులు మరణించలేదు.
NUM 26:12 షిమ్యోను సంతతిలోని వంశాలు ఇవి: నెమూయేలు—నెమూయేలీ వంశం యామీను—యామీనీల వంశం యాకీను—యాకీనీల వంశం
NUM 26:13 జెరహు—జెరహీల వంశం షావూలు—వూలీ వంశం
NUM 26:14 షిమ్యోను సంతతిలోని వంశాలు అవి. వారు మొత్తం 22,200 మంది.
NUM 26:15 గాదు సంతతిలోని వంశాలు ఇవి: సెపోను—సెపోనీల వంశం హగ్గి—హగ్గీల వంశం షూనీ—షూనీల వంశం
NUM 26:16 ఓజని—ఓజనీల వంశం ఏరీ—ఏరీల వంశం
NUM 26:17 అరోది—అరోదీల వంశం అరేలి—అరేలీల వంశం
NUM 26:18 అవి గాదు సంతతిలోని వంశాలు. వారు మొత్తం 40,500 మంది పురుషులు.
NUM 26:19 యూదా సంతతిలోని వంశాలు ఇవి: షేలా—షేలావారి వంశం పెరెసు—పెరెసీల వంశం జెరహు—జెరహీల వంశం (యూదా కుమారులు ఏరు, ఓనాను అనే ఇద్దరు కనానులో చనిపోయారు.)
NUM 26:21 పెరెసు వంశాలు ఇవి: హెస్రోను—హెస్రోనీల వంశం హములు—హములీల వంశం
NUM 26:22 యూదా సంతతిలోని వంశాలు ఇవి. పురుషుల సంఖ్య మొత్తం 76,500.
NUM 26:23 ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు ఇవి: తోల — తోలాలీ వారి వంశం పువ్వా — పువ్వీల వంశం
NUM 26:24 యాషుబు — యాషుబీల వంశం షిమ్రోను — షిమ్రోనీల వంశం
NUM 26:25 ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 64,300.
NUM 26:26 జెబూలూను సంతతిలోని వంశాలు: సెరెదు — సెరెదీల వంశం ఏలోను — ఏలోనీల వంశం యహలేలు — యహలేల వంశం
NUM 26:27 జెబూలూను సంతతిలోని వంశాలు అవి. పురుషులు సంఖ్య మొత్తం 60,500.
NUM 26:28 యోసేపు ఇద్దరు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. ఒక్కో కుమారుడు కొన్ని స్వంత వంశాలతో కూడిన ఒక్కో సంతతి అయ్యారు.
NUM 26:29 మనష్షే సంతతి ఏవనగా: మాకీరు — మాకీరువారి వంశం (మాకీరు గిలాదుకు తండ్రి,) గిలాదు — గిలాదీల వంశం
NUM 26:30 గిలాదు వంశాలు: ఈజురు — ఈజరీల వంశం హెలెకు — హెలెకీవారి వంశం
NUM 26:31 అశ్రీయేలు — అశ్రీయేలీల వంశం షెకెము — షెకెమీల వంశం
NUM 26:32 షెమిద — షెమిదీల వంశం హెపెరు — హెపెరీల వంశం
NUM 26:33 హెపెరు కుమారుడు సెలోపెహదు. కానీ అతనికి కుమార్తెలు తప్ప కుమారులు లేరు. అతని కుమార్తెల పేర్లు మహల, నోయా, హోగ్ల, మిల్కా తిర్సా.
NUM 26:34 అవన్నీ మనష్షే సంతతిలోని వంశాలు. పురుషుల సంఖ్య మొత్తం 52,700.
NUM 26:35 ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు ఏవనగా: షుతల — షుతలీల వంశం బేకరు — బేకరీల వంశం తహను — తహనీల వంశం
NUM 26:36 షుతలహు వంశం వాడు ఏరాను. అతని వంశ ఏరానీల వంశం
NUM 26:37 ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 32,500. యోసేపు సంతతికి చెందిన మొత్తం మనుష్యులు వారే.
NUM 26:38 బెన్యామీను సంతతిలోని వంశాలు: బెలా — బెలాలీ వంశం అష్బెలు — అష్బెలీ వంశం అహీరం — అహీరమీయీల వంశం
NUM 26:39 షుపం — షుపామీల వంశం హుపం — హుపామీల వంశం
NUM 26:40 బెలా వంశాలు ఏవనగా: ఆర్దు — ఆర్దీల వంశం నయమాను — నయమానీల వంశం
NUM 26:41 బెన్యామీను సంతతిలోని వంశాలన్నీ అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,600.
NUM 26:42 దాను సంతతిలోని వంశాలు: షూషాము- షూషామల వంశం. అది దాను సంతతిలోని కుటుంబం.
NUM 26:43 షూషామీల వంశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. పురుషుల సంఖ్య మొత్తం 64,400.
NUM 26:44 ఆషేరు సంతతిలోని వంశాలు: ఇమ్నా — ఇమ్నా వారి వంశం ఇష్వి — ఇష్వీల వంశం బెరీయ — బెరీయాల వంశం
NUM 26:45 బెరీయా వంశాలు: హెబెరు — హెబెరీల వంశం మల్కీయేలు — మల్కీయేలీల వంశం.
NUM 26:46 (ఆషేరుకు శెరహు అనే కూతురు కూడ ఉంది.)
NUM 26:47 ఆషేరు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 53,400.
NUM 26:48 నఫ్తాలీ సంతతిలోని వంశాలు: యహసియేలు — యహసియేలీల వంశం గూని — గూనీల వంశం
NUM 26:49 యెసెరు — యెసెరీల వంశం షిల్లేము — షిల్లేమీల వంశం
NUM 26:50 నఫ్తాలీ సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,400.
NUM 26:51 కనుక ఇశ్రాయేలు పురుషుల సంఖ్య మొత్తం 6,01,730.
NUM 26:52 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
NUM 26:53 “ప్రతి వంశానికి దేశం లభిస్తుంది. ఇది నేను వారికి వాగ్దానం చేసిన దేశం. లెక్కించబడిన ప్రజలందరికీ సరిపడినంత భూమి ప్రతి వంశానికి లభిస్తుంది.
NUM 26:54 పెద్ద వంశానికి ఎక్కువ భూమి లభిస్తుంది. చిన్న వంశానికి తక్కువ భూమి లభిస్తుంది. అయితే నేను వాగ్దానం చేసిన దేశం ప్రతి వంశానికీ లభిస్తుంది. మరియు వారికి లభించే భూమి, లెక్కించబడిన వారందరికీ సరిపోయేటంత ఉంటుంది.
NUM 26:55 ప్రతి వంశానికీ ఆ భూమి ఇవ్వబడుతుంది. ఏ వంశం వారి భూమికి ఆ పేరే పెట్టబడుతుంది.
NUM 26:56 ప్రజలకు ఇస్తానని నేనే వాగ్దానం చేసినంతగా ఉంటుంది ఆ భూమి. పెద్ద వంశాలకీ, చిన్నవాటికీ అందివ్వబడుతుంది.”
NUM 26:57 లేవీ సంతతి కూడ లెక్కించబడింది. లేవీ సంతతిలోని వంశాలు ఇవి: గెర్షోను — గెర్షోనీల వంశం కహాతు — కహాతీల వంశం మెరారి — మెరారిల వంశం
NUM 26:58 ఇవి కూడ లేవీ సంతతిలోని వంశాలే: లిబ్నీల వంశం హెబ్రోనీల వంశం మహ్లీ వంశం మూషీల వంశం కోరహీల వంశం అమ్రాము కహాతు వంశం వాడు.
NUM 26:59 అమ్రాము భార్య పేరు యొకెబెదు. ఆమె కూడ లేవీ సంతతిలోనిదే. ఆమె ఈజిప్టులో పుట్టింది. అమ్రాము, యొకెబెదులకు అహరోను, మోషే ఇద్దరు కుమారులు. వారికి మిర్యాము అని ఒక కుమార్తె కూడ ఉంది.
NUM 26:60 నాదాబు, అబీహు, ఎలీయాజరు, ఈతామారులకు తండ్రి అహరోను.
NUM 26:61 కానీ నాదాబు, అబీహు చనిపోయారు. అంగీకారం కాని అగ్నితో దేవునికి అర్పణచేసినందువల్ల వారు చనిపోయారు.
NUM 26:62 లేవీ సంతతిలో పురుషుల సంఖ్య మొత్తం 23,000, అయితే ఇతర ఇశ్రాయేలు మనుష్యులతో వీరు లెక్కించబడలేదు. మిగిలినవారికి యెహూవా వాగ్దానం చేసిన భూమి మాత్రం లేదు.
NUM 26:63 మోషే, యాజకుడైన ఎలీయాజరు ఈ ప్రజలందరినీ లెక్క చేసారు. మోయాబు మైదానాల్లో వారు ఇశ్రాయేలు ప్రజలను లెక్క తీసారు. ఇది యెరికో ఎదుట యోర్దాను నది అవతల జరిగింది.
NUM 26:64 చాలకాలం క్రిందట సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే, యాజకుడైన అహరోనూ లెక్కపెట్టారు. అయితే వాళ్లంతా చనిపోయారు. మోషే మోయాబు మైదానాల్లో లెక్కపెట్టిన వారు వేరు, అంతకుముందు లెక్కపెట్టిన వారు వేరు.
NUM 26:65 వారు అందరూ ఎడారిలోనే చస్తారు అని ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా చెప్పినందువల్ల ఇలా జరిగింది. సజీవంగా ఉన్నవాళ్లు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే.
NUM 27:1 హెసెరు కుమారుడు సెలోపెహాదు. హెసెరుగిలాదు కుమారుడు. గిలాదు మాకీరు కుమారుడు. మాకీరు మనష్షే కుమారుడు. మనష్షే యోసేపు కుమారుడు. సెలోపెహాదుకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా.
NUM 27:2 సన్నిధి గుడారం దగ్గర సమావేశం అవుతోన్న మోషే, యాజకుడైన ఎలీయాజరు, పెద్దలు, ప్రజలు అందరి ముందరకు ఈ అయిదుగురు స్త్రీలూ వెళ్లి సన్నిధి గుడారం ఎదుట నిలబడ్డారు. ఈ ఐదుగురు కూతుళ్లు ఈ విధంగా చెప్పారు:
NUM 27:3 “మనం అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడే మా తండ్రి చనిపోయాడు. అతడు కోరహు గుంపులో చేరినవాడు కాడు. (కోరహు యెహోవానుంచి తొలగి ఎదురు తిరిగినవాడు.) మా తండ్రిది సహజ మరణం. కానీ మా తండ్రికి కుమారులు లేరు.
NUM 27:4 అంటే మా తండ్రి పేరు కొనసాగదు. మా తండ్రి పేరు కొనసాగక పోవటం సక్రమం కాదు. ఆయనకు కుమారులు లేరు గనుక ఆయన పేరు అంతం అవుతుంది. అందుచేత మా తండ్రి సోదరులకు వచ్చే భూమిలో మాకు కొంత ఇవ్వవలసినదిగా మేము మీకు మనవి చేస్తున్నాము.”
NUM 27:5 కనుక ఏమి చేయాలని యెహోవాను మోషే అడిగాడు.
NUM 27:6 అతనిలో యెహోవా ఇలా అన్నాడు,
NUM 27:7 “సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది సరియైనదే. వాళ్లు వారి తండ్రి సోదరులతో పాటు భూమిని పంచుకోవలసినదే. కనుక నీవు వారి తండ్రికిచ్చిన భూమిని వారికి ఉవ్వవలెను.
NUM 27:8 “కనుక ఇశ్రాయేలు ప్రజలకు, ఇలా చట్టం తయారు చేయి. ‘ఒకనికి కుమారులు లేకుండానే అతడు చనిపోతే, అతని ఆస్తి అంతా అతని కుమార్తెకు ఇవ్వవలెను.
NUM 27:9 అతనికి కుమార్తె లేకపోతే, అతని ఆస్తి అంతా అతని సోదరులకు ఇవ్వవలెను.
NUM 27:10 అతనికి సోదరులు లేకపోతే అతని ఆస్తి అంతా అతని తండ్రి సోదరులకు ఇవ్వవలెను.
NUM 27:11 అతని తండ్రికి సోదరులు లేకపోతే, అతని ఆస్తి అంతా, అతని కుటుంబంలో దగ్గర బంధువులకు ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజల్లో ఇది ఒక చట్టంగా ఉండాలి. యెహోవాయే ఈ ఆజ్ఞను మోషేకు ఇస్తున్నాడు.’”
NUM 27:12 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఆ కొండమీదికి ఎక్కుము. యొర్దాను నదికి తూర్పున ఉన్న కొండల్లో అది ఒకటి. ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని నీవు అక్కడ నుండి చూస్తావు.
NUM 27:13 నీవు ఈ దేశాన్ని చూశాక, నీ సోదరుడు అహరోను మరణించినట్టే నీవు మరణిస్తావు.
NUM 27:14 సీను అరణ్యంలో నీళ్లకోసం ప్రజలు కోపగించుకోవటం జ్ఞాపకం చేసుకొనుము. నీవూ, అహరోనూ కూడ నా ఆజ్ఞకు విధేయులయ్యేందుకు నిరాకరించారు. ప్రజల ముందు నీవు నన్ను ఘనపర్చలేదు, పవిత్రంగా చూడలేదు.” (ఇది సీను అరణ్యంలో కాదేషు దగ్గర మెరీబా నీళ్ల సంగతి.)
NUM 27:15 యెహోవాతో మోషే ఇలా అన్నాడు:
NUM 27:16 “ప్రజల ఆలోచనలు తెలిసిన దేవుడు యెహోవా ప్రభువు, నీవే ఈ ప్రజలకోసం మరో నాయకుడిని ఎంచుకోమని మనవి చేస్తున్నాను.
NUM 27:17 ఈ దేశంలోనుండి వీరిని బయటకు నడిపించి, కొత్త దేశంలో చేర్చగల నాయకుడిని ఎంచవలసినదిగా నేను యెహోవాకు మనవి చేస్తున్నాను. అప్పుడు యెహోవా ప్రజలు కాపరి లేని గొర్రెల్లా ఉండరు.”
NUM 27:18 కనుక మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నూను కుమారుడైన యెహోషువ నాయకుడుగా ఉంటాడు. యోహోషువ ఆత్మను పొందినవాడు. అతడిని కొత్త నాయకునిగా చేయి.
NUM 27:19 యాజకుడైన ఎలీయాజరు ఎదుటా, ప్రజలందరి ఎదుటా నిలబడమని అతనితో చెప్పు. అప్పుడు అతడికి కొత్త నాయకునిగా నీవు చేయి.
NUM 27:20 “అతడిని నీవు నాయకునిగా చేస్తున్నావని ప్రజలకు చూపెట్టు, అప్పుడు ప్రజలంతా అతనికి లోబడతారు.
NUM 27:21 ఒకవేళ యెహోషువ ఒక కొత్త నిర్ణయం ఏదైనా చేయాలంటే అతడు యాజకుడైన ఎలీయాజరు దగ్గరకు వెళతాడు. యెహోవా జవాబు తెలుసుకొనేందుకు ఎలీయాజరు ఊరీమును ప్రయోగిస్తాడు. అప్పుడు యెహోషువ, ప్రజలందరూ దేవుడు చెప్పిన వాటిని చేస్తారు. ‘యుద్ధానికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు యుద్ధానికి వెళ్తారు. ఒకవేళ ‘ఇంటికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు ఇంటికి వెళతారు.”
NUM 27:22 మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. యాజకుడైన ఎలీయాజరు ముందు, ప్రజలందరి ఎదుట నిలబడమని యెహోషువాతో చెప్పాడు. మోషే,
NUM 27:23 అప్పుడు అతడే కొత్త నాయకుడు అని చూపెట్టేందుకు అతనిమీద మోషే చేతులు పెట్టాడు. అతనితో యెహోవా చెప్పినట్టే అతడు చేసాడు.
NUM 28:1 అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు:
NUM 28:2 “ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వవలెను. ప్రత్యేక కానుకలను సరైన సమయంలోనే నాకు ఇవ్వవలెనని వారితో చెప్పుము. ధాన్యార్పణలు, దహనబలులు నాకు ఇవ్వాలని వారితో చెప్పుము. ఆ దహనబలుల వాసన యెహోవాకు ఇష్టం.
NUM 28:3 వారు యెహోవాకు ఇవ్వవలసిన దహనబలులు ఇవే. ప్రతిరోజూ పుష్టిగల, ఒక సంవత్సరం వయసున్న రెండు మగ గొర్రె పిల్లలు.
NUM 28:4 ఒక గొర్రెపిల్ల ఉదయం, మరో గొర్రెపిల్లను సాయం కాలమందు అర్పించాలి.
NUM 28:5 మరియు ఒక పావు ఒలీవనూనెతో కలుపబడ్డ రెండుపావుల మంచి పిండి ధాన్యార్పణగా పెట్టాలి.”
NUM 28:6 సీనాయి కొండ దగ్గర వారు ప్రతి దినం అర్పణలు అర్పించటం మొదలుపెట్టారు. ఆ దహనబలి అర్ఫణల వాసన యెహోవాకు ఇష్టమయినది.
NUM 28:7 దహనబలి అర్పణతో బాటు ప్రజలు పానార్పణ కూడ అర్పించాలి. ప్రతి గొర్రె పిల్లతోబాటు వారు ముప్పావు ద్రాక్షారసం అర్పించాలి. పవిత్ర స్థలంలో బలిపీఠం మీద పానార్పణం పోయాలి. ఇది యోహోవాకు కానుక.
NUM 28:8 రెండో గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పించాలి. సరిగ్గా ఉదయార్పణలాగే దీనిని అర్పించాలి. అలాగే అదే రకం పానార్పణం ఇవ్వాలి. ఈ దహనబలి యెహోవాకు సువాసనగా ఉంటుంది.
NUM 28:9 “విశ్రాంతి దినం శనివారం నాడు, ఒక సంవత్సరం వయసుగల లోపంలేని రెండు గొర్రె పిల్లల్ని, తూమెడు పిండిలో రెండు పదోవంతుల మంచి పిండి ఒలీవ నూనెలో కలిపిన పానార్పణం మీరు అర్పించాలి.
NUM 28:10 విశ్రాంతి దినం కోసం ఇది ప్రత్యేక అర్పణ. ప్రతి రోజూ ఇచ్చే అర్పణ పానార్పణం గాక ఇది అదనం.
NUM 28:11 “ప్రతి నెలా మొదటి రోజున ప్రత్యేకమైన దహనబలి మీరు యెహోవాకు అర్పించాలి. ఈ అర్పణలోపంలేని రెండు కోడె దూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరపు గొర్రెపిల్లలు ఏడు.
NUM 28:12 మరియు ఒలీవ నూనెతో కలుపబడిన తూమెడు మంచి పిండితో మూడు పదోవంతులను ధాన్యార్పణగా ప్రతి కోడె దూడతోబాటు అర్పించాలి. అలాగే, ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండిలో ఒక పదోవంతును పొట్టేలుతో బాటు ధాన్యార్పణగా అర్పించాలి.
NUM 28:13 ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండిలో ఒక పదోవంతును ఒక్కో గొర్రెపిల్లతోబాటు ధాన్యార్పణగా అర్పించాలి. ఇది యెహోవాకు సువాసన ఇచ్చే దహనబలి.
NUM 28:14 ప్రతి కోడె దూడతోబాటు పడిన్నర ద్రాక్షారసం, పొట్టేలుతోబాటు ఒక్క పడి ద్రాక్షారసం, ప్రతి గొర్రెపిల్లతోబాటు ముప్పావు ద్రాక్షారసం పానార్పణం. ఇది సంవత్సరంలో నెలనెలా అర్పించాల్సిన దహనబలి.
NUM 28:15 ప్రతి రోజూ అర్పించే దహనబలి, పానార్పణంగాక ఒక మగ మేకను యెహోవాకు మీరు అర్పించాలి. ఆ మేక పాప పరిహారార్థ బలి.
NUM 28:16 “మొదటి నెల (నిసాను) పదునాలుగవ రోజున పస్కా.
NUM 28:17 పులియని రొట్టెల పండుగ అదే నెల పది హేనో రోజున ప్రారంభం అవుతుంది. ఆ పండుగ ఏడు రోజులపాటు ఉంటుంది. పొంగని రొట్టెలు మాత్రమే మీరు తినవచ్చును.
NUM 28:18 ఈ పండుగ మొదటి రోజున మీరు ఒక ప్రత్యేక సభజరపాలి. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు.
NUM 28:19 మీరు యెహోవాకు దహనబలులు అర్పించాలి. దహనబలులు రెండు కోడె దూడలు, ఒక పొట్టేలు, అంగవిహీనం లేని సంవత్సరపు మగ గొర్రె పిల్లలు ఏడు.
NUM 28:20 ఒక్కొక్క కోడె దూడతో తూములో మూడు పదివంతులును, పొట్టేలుతో రెండు పది వంతులును, ఒక్కో గొర్రెపిల్లతో, ఒక్కో పదోవంతు మంచి పిండి ఒలీవ నూనెతో కలిపి ధాన్యార్పణంగా పెట్టాలి.
NUM 28:22 ఒక మగ మేకను కూడ మీరు ఇవ్వాలి. ఆ మేక మీ కోసం పాప పరిహారార్థబలి అవుతుంది. అది మీ పాపాలను కప్పి పుచ్చుతుంది.
NUM 28:23 ప్రతి ఉదయం మీరు అర్పించే దహన బలి అర్పణ కాక ఈ అర్పణలు మీరు అర్పించాలి.
NUM 28:24 “అదే విధంగా ఏడు రోజులపాటు మీరు ఆహార అర్పణలు అర్పించాలి. ప్రతి రోజూ దానిని హోమాంగా మీరు అర్పించాలి. ఈ అర్పణ యెహోవాకు ఇష్టమైన సునాసన. మీరు దహనబలిని, దాని పానార్పణను క్రమంగా అర్పించాలి. ఇవిగాక ఆహారం (ప్రజలకు) మీరు అర్పించాలి.
NUM 28:25 “అప్పుడు పస్కా పండుగ ఏడవ రోజున మీకు ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయరు.
NUM 28:26 “ప్రథమ ఫలాల పండుగలో (వారాల పండుగ) కొత్త ధాన్యంలోనుంచి మీరు ధాన్యార్పణ యెహోవాకు ఇవ్వవలెను. ఆ సమయంలో కూడ మీరు ఒక ప్రత్యేక సభ ఏర్పాటు చేయాలి. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.
NUM 28:27 మీరు దహనబలులు అర్పించాలి. ఆ బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసన. రెండు కోడెదూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరపు మగ గొర్రె పిల్లలు ఏడు మీరు అర్పించాలి.
NUM 28:28 ప్రతి కోడెదూడతోను, నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదోవంతులు, ప్రతి పొట్టేలుతో రెండు పదోవంతులు
NUM 28:29 ఒక్కో గొర్రె పిల్లతో ఒక్కో పదోవంతును మీరు అర్పించాలి.
NUM 28:30 మీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఒక మగ మేకనుకూడ మీరు బలి ఇవ్వవలెను.
NUM 28:31 రోజువారీ దహనబలులు, ధాన్యార్పణాలు గాక వీటిని మీరు అర్పించాలి. జంతువులు అంగహీనము కానివిగా ఉండేటట్టు తప్పక చూడాలి. పానార్పణం పరిశుభ్రమయినదిగా ఉండాలి.
NUM 29:1 “ఏడో నెల మొదటి రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. అది బూర ఊదే రోజు.
NUM 29:2 దహనబలులను మీరు అర్పించాలి. ఆ బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటాయి. ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, పుష్టిగల ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి.
NUM 29:3 కోడె దూడతో బాటు తూములో మూడు పదోవంతుల మంచి పిండి నూనెతో కలిపినది, పొట్టేలుకు రెండు పదోవంతులును,
NUM 29:4 ఏడు గర్రెపిల్లల్లో ఒక్కోదానికి ఒక్కో పదోవంతును మీరు అర్పించాలి.
NUM 29:5 మరియు పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను అర్పించండి.
NUM 29:6 నెలపొడుపు బలులు, దాని ధాన్యార్పణం గాక బలులు అర్పించాలి. ప్రతిదిన బలులు, దాని ధాన్యార్పణం, పానార్పణలకి అదనం. అవి వాటి నియమాల ప్రకారం జరగాలి. అని అగ్నిలో దహించబడాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన.
NUM 29:7 “ఏడో నెల పదో రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏమీ భోజనం చేయకూడదు. ఏ పనీ మీరు చేయకూడదు.
NUM 29:8 దహనబలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటుంది. ఒక కోడె దూడ, ఒక పొట్టేలు, అంగహీనము కాని ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రె పిల్లలను మీరు అర్పించాలి.
NUM 29:9 ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండితూములో మూడు పదోవంతులు ఒక కోడె దూడతోను, రెండు పదోవంతులు పొట్టేలుతోను,
NUM 29:10 ఏడు గొర్రె పిల్లల్లో ఒక్కోదానిలో పదోవంతును మీరు అర్పించాలి.
NUM 29:11 ఒక పోతు మేకను కూడ పాపపరిహారార్థ బలిగా మీరు అర్పించాలి. ప్రాయశ్చిత్త దినపు పాపపరిహారార్థ బలి అర్పణకు ఇది అదనం. ప్రతిదినం బలి, దాని ధాన్యార్పణం, పానార్పణలకు ఇది అదనం.
NUM 29:12 “ఏడోనెల పదిహేనవ రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. ఏడు రోజులు యెహోవాకు ప్రత్యేక పండుగ రోజులుగా మీరు జరుపుకోవాలి.
NUM 29:13 దహన బలులు మీరు అర్పించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. కోడెదూడలు 13, పొట్టేళ్లు 2, పుష్టిగల ఒక సంవత్సరపు గొర్రెపిల్లలు 14 మీరు అర్పించాలి.
NUM 29:14 పధ్నాలుగు కోడె దూడల్లో ఒక్కోదానితో నూనెతో కలుపబడిన మంచి పిండి తూములో మూడు పదోవంతులు, రెండు పొట్టేళ్లలో ఒక్కోదానితో రెండు పదోవంతులు,
NUM 29:15 పదునాలుగు గొర్రెపిల్లల్లో ఒక్కోదానితో ఒక్కో పదోవంతు మీరు అర్పించాలి.
NUM 29:16 ఒక మగమేకను కూడ మీరు అర్పించాలి. రోజువారీ బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం.
NUM 29:17 “ఈ పండుగ రెండోనాడు 12 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
NUM 29:18 కోడెదూడలకు, పొట్టేళ్లకు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణ కూడ మీరు అర్పించాలి.
NUM 29:19 పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను కూడా మీరు అర్పించాలి. రోజువారీ బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం.
NUM 29:20 “ఈ పండుగ మూడోనాడు 11 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
NUM 29:21 కోడెదూడలకు, పొట్టేళ్లకు, గొర్రె పిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.
NUM 29:22 పాపపరిహారార్థ బలిగా ఒక మగమేకను మీరు అర్పించాలి. రోజువారి బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
NUM 29:23 “ఈ పండుగ నాలుగో రోజున 10 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
NUM 29:24 కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.
NUM 29:25 పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
NUM 29:26 “ఈ పండుగ ఐదో రోజున 9 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 అంగహీనముకాని యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
NUM 29:27 కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణ మీరు అర్పించాలి.
NUM 29:28 పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి అర్పణ, దాని ధాన్యార్పణ సానార్పణకు ఇది అదనం.
NUM 29:29 “ఈ పండుగ ఆరోనాడు 8 కోడె దూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల యేడాది గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
NUM 29:30 కోడెదూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్పించాలి.
NUM 29:31 పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినము బలి దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
NUM 29:32 “ఈ పండుగ ఏడోనాడు 7 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 పుష్టిగల గొర్రెపిల్లలు మీరు అర్పించాలి.
NUM 29:33 కోడె దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణం మీరు అర్పించాలి.
NUM 29:34 పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినం బలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం.
NUM 29:35 “ఈ పండుగ ఎనిమిదో రోజు మీకు చాల ప్రత్యేక సమావేశం ఉంటుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు.
NUM 29:36 మీరు ఒక దహనబలి అర్పించాలి. అది హోమార్పణ. యెహోవాకు ఇష్టమైన సువాసన. ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, పుష్టిగల ఏడాది గొర్రెపిల్లలు ఏడింటిని మీరు అర్పించాలి.
NUM 29:37 కోడెదూడకు, పొట్టేలుకు, గొర్రెపిల్లలకు సరైన లెక్క ప్రకారం ధాన్యార్పణ, పానార్పణలు మీరు అర్పించాలి.
NUM 29:38 పాపపరిహారార్థ బలిగా మీరు ఒక మేకను అర్పించాలి. ప్రతి దినము ధాన్యార్పణ, పానార్పణలకు ఇది అదనం.
NUM 29:39 “ప్రత్యేక పండుగ రోజుల్లో మీ దహన బలులను ధాన్యార్పణలను, పానార్పణలను, సమాధాన బలులను మీరు తీసుకొని రావాలి. ఆ అర్పణలను మీరు యెహోవాకు ఇవ్వవలెను. మీరు యెహోవాకు ఇవ్వాలను కొన్న ప్రత్యేక కానుకలు, మీరు చేసిన ప్రత్యేక ప్రమాణాల్లో ఒక భాగము కాకుండా అదనంగా వీటిని అర్పించాలి.”
NUM 29:40 యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటిని గూర్చి ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్పాడు.
NUM 30:1 ఇశ్రాయేలు వంశాల నాయకులతో మోషే మాట్లాడాడు. యెహోవానుండి వచ్చిన ఈ ఆజ్ఞలనుగూర్చి మోషే వారితో చెప్పాడు:
NUM 30:2 “ఒక వ్యక్తి దేవునితో ప్రత్యేక ప్రమాణం చేయాలని కోరినా, లేక దేవునికి ఏదైనా ప్రత్యేకంగా ఇస్తానని అతడు మ్రొక్కుకొనినా, అతడు ఆ ప్రకారం చేయాలి. అయితే అతడు ప్రమాణం ప్రకారం ఖచ్చితంగా చేసి తీరాలి.
NUM 30:3 “ఒక యువతి ఇంకా తన తండ్రి ఇంట్లో నివసిస్తూ ఉండొచ్చు. యెహోవాకు ప్రత్యేకంగా ఏదో ఇస్తానని ఆ యువతి ప్రమాణం చేసి ఉండొచ్చు.
NUM 30:4 ఆ ప్రమాణం గూర్చి ఆమె తండ్రి విని, ఒప్పుకొంటే, ఆ యువతి ప్రమాణం ప్రకారం చేసి తీరాలి.
NUM 30:5 అయితే ఆమె తండ్రి ఆ ప్రమాణం గూర్చి విని, ఒప్పుకొనకపోతే, అప్పుడు ఆ యువతి తన ప్రమాణానికి బాధ్యురాలు కాదు. ఆమె చేసిన ప్రమాణం ప్రకారం ఆమె నెరవేర్చాల్సిన పనిలేదు. ఆమె తండ్రి ఆమెను వారించాడు గనుక యెహోవా ఆమెను క్షమిస్తాడు.
NUM 30:6 “మరియు ఒకని భార్య యెహోవాకు ఏదో ఇస్తానని ఒక ప్రత్యేక ప్రమాణం చేసి ఉండొచ్చు.
NUM 30:7 భర్త ఆ ప్రమాణంగూర్చి విని, ఒప్పుకొంటే, ఆమె చేసిన ప్రమాణాన్ని ఆమె నెరవేర్చి తీరాలి.
NUM 30:8 కానీ ఆ ప్రమాణం గూర్చి భర్త విని, ఒప్పుకొనకపోతే, ఆ భార్య తన ప్రమాణం ప్రకారం చేయనవసరం లేదు. ఆమె భర్త ప్రమాణాన్ని భంగం చేసి ఆమె చెప్పినట్టు ఆమెను చేయనివ్వలేదు. కనుక యోహోవా ఆమెను క్షమిస్తాడు.
NUM 30:9 “ఒక విధవ లేక విడువబడ్డ ఒక స్త్రీ ఒక ప్రత్యేక ప్రమాణం చేయవచ్చు. ఆమె అన్న ప్రకారం తన ప్రమాణాన్ని నెరవేర్చవలసిందే.
NUM 30:10 “ఒక వివాహిత స్త్రీ యెహోవాకు ఏదో ఇస్తానని వాగ్దానం చేసి ఉండొచ్చు.
NUM 30:11 ఆ ప్రమాణం గూర్చి ఆమె భర్త విని, ఆమె మ్రొక్కుబడిని చెల్లింపనిస్తే, ఆమె తన ప్రమాణం ప్రకారం ఖచ్చితంగా చేసి తీరాలి. ఆమె ప్రమాణం ప్రకారం సమస్తం చెల్లించాలి.
NUM 30:12 కానీ ఆమె భర్త ఆ ప్రమాణం గూర్చి విని, ఆమె ప్రమాణం నిలుపు కొనేందుకు నిరాకరిస్తే, ఆమె తన ప్రమాణం ప్రకారం చేయనక్కర్లేదు. ఆమె ఏమి ప్రమాణం చేసినా సరే ఫర్వాలేదు, ఆమె భర్త ఆ ప్రమాణాన్ని భంగం చేయవచ్చు. ఒకవేళ ఆమె భర్త ఆ ప్రమాణాన్ని భంగం చేస్తే యెహోవా ఆమెను క్షమిస్తాడు.
NUM 30:13 ఒక వివాహిత స్త్రీ యెహోవాకు ఏదైనా ఇస్తానని ప్రమాణం చేయవచ్చు, లేక తనకు ఏదైనా పరిత్యజించు కొంటానని ప్రమాణం చేయవచ్చు, లేక మరేదో ప్రత్యేక ప్రమాణాన్ని యెహోవాకు ఆమె చేసి ఉండొచ్చు. ఆ ప్రమాణాల్లో దేనినైనా భర్త భంగం చేయవచ్చును, లేదా ఆ ప్రమాణాలలో దేనినైనా ఆ భర్త ఆమెను నెరవేర్చనీయవచ్చును.
NUM 30:14 భర్త ఏ విధంగా తన భార్యను ఆమె ప్రమాణాలను నెరవేర్చనిస్తాడు? అతడు ప్రమాణాలను గూర్చి విని, వాటిని వారించకపోతే, అప్పుడు ఆ స్త్రీ, ఆమె చేసిన ప్రమాణాలను నెరవేర్చాలి.
NUM 30:15 కానీ భర్త ఆ ప్రమాణాలను గూర్చి విని, వాటిని వారిస్తే, అప్పుడు ఆమె ప్రమాణాలను ఉల్లంఘించినందుకు అతడు బాధ్యుడు.”
NUM 30:16 ఇవి మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు. ఒక పురుషుడు అతని భార్యను గూర్చి, ఒక తండ్రి, ఇంకా చిన్నదిగా ఉండి తన తండ్రి ఇంటనే ఉంటున్న కూతురును గూర్చిన ఆజ్ఞలు ఇవి.
NUM 31:1 యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు:
NUM 31:2 “మిద్యానీయుల విషయం తేల్చేందుకు ఇశ్రాయేలీయులకు నేను సహాయం చేస్తాను. ఆ తర్వాత నీవు మరణిస్తావు.”
NUM 31:3 కనుక మోషే ప్రజలతో మాట్లాడాడు. అతడు వారితో ఇలా చెప్పాడు: “మీ మనుష్యుల్లో కొందిరిని సైనికులుగా ఏర్పరచుకోండి. మిద్యానీయుల విషయం తేల్చేందుకు వారిని యెహోవా వాడుకొంటాడు.
NUM 31:4 ఇశ్రాయేలీయుల్లో ఒక్కోదాని నుండి 1,000 మందిని ఏర్పరచుకోండి.
NUM 31:5 ఇశ్రాయేలు వంశాలన్నింటినుండి మొత్తం 12,000 మంది సైనికులు ఉంటారు.”
NUM 31:6 ఆ 12,000 మందిని మోషే యుద్ధానికి పంపించాడు. యాజకుడైన ఎలీయాజరు కుమారుడైన ఫీనెహాసును వారితో అతడు పంపాడు. పవిత్ర వస్తువుల్ని, కొమ్ములను, బూరలను ఎలీయాజరు తనతో తీసుకుని వెళ్లాడు.
NUM 31:7 యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులతో పోరాడారు. మిద్యానీ మనుష్యులందరిని వారు చంపారు
NUM 31:8 వారు చంపిన వారిలో మిద్యాను రాజులు అయిదుగురు, ఎవీ, రేకెము, సూరు, హోరు, రేబ ఉన్నారు. బెయోరు కొడుకైన బిలామునుకూడ వారు ఖడ్గంతో చంపారు.
NUM 31:9 ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీ స్త్రీలను, పిల్లలను బందీలుగా పట్టుకొన్నారు. వారి గొర్రెలను, పశువులను, ఇతరమైన వాటిని అన్నింటినీ వారు తీసుకున్నారు.
NUM 31:10 అప్పుడు వారి గ్రామాలు, పట్టణాలన్నింటినీ వారు కాల్చివేసారు.
NUM 31:11 మనుష్యులందరినీ, జంతువులన్నింటినీ వారు తీసుకుని
NUM 31:12 మోషే, యాజకుడైన ఎలీయాజరు, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తీసుకుని వచ్చారు. వారు తీసుకున్న వాటన్నింటిని ఇశ్రాయేలీయుల నివాసం దగ్గరకు వారు తీసుకు వెళ్లారు. మోయాబులోని అరాబోతు కొండల దగ్గర ఇశ్రాయేలీయులు నివాసంచేస్తున్నారు. ఇది యెరికో ఎదుట యొర్దాను నదికి తూర్పున ఉంది.
NUM 31:13 అప్పుడు ఆ సైనికులను ఎదుర్కొనేందుకు మోషే, యాజకుడైన ఎలీయాజరు, ఇశ్రాయేలు ప్రజలు వారి గుడారంనుండి బయటకు వెళ్లారు.
NUM 31:14 సైన్యాధిపతుల మీద మోషేకి చాల కోపం వచ్చింది. యుద్ధంనుండి తిరిగి వచ్చిన శతాధిపతుల మీద, సహస్రాధిపతులమీద అతనికి కోపం వచ్చింది.
NUM 31:15 మోషే వారితో అన్నాడు, “ఆ స్త్రీలను మీరెందుకు బ్రతకనిచ్చారు?
NUM 31:16 ఈ స్త్రీలు ఇశ్రాయేలు పురుషులకు తగరు. యెహోవానుండి ప్రజలు తిరిగి పోతారు. అది బిలాము కాలంలాగే ఉంటుంది. బయలు పెయోరు దగ్గర జరిగినట్టే జరుగుతుంది. ఆ రోగం యెహోవా ప్రజలకు మళ్లీ వస్తుంది.
NUM 31:17 ఇప్పుడు మిద్యానీ బాలురను అందరినీ చంపివేయండి. పురుషునితో కాపురం చేసిన ప్రతి మిద్యానీ స్త్రీని చంపివేయండి. పురుష సంయోగం ఎరిగిన మిద్యానీ స్త్రీలలో ప్రతి ఒక్కరినీ చంపేయండి.
NUM 31:18 ఏ పురుషునితోనూ ఎన్నడూ లైంగిక సంబంధంలేని స్త్రీలను మీరు బ్రతకనివ్వవచ్చును.
NUM 31:19 తర్వాత, ఇతరులను చంపిన మీరందరూ ఏడు రోజులు నివాసానికి వెలుపల ఉండాలి. మీరు ఒక మృత దేహాన్ని ముట్టినాసేరే నివాసానికి వెలుపలే ఉండాలి. మూడో రోజున మీరు, మీ బందీలు మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోవాలి.
NUM 31:20 ఏడో రోజున మళ్లీ మీరు అలాగే చేయాలి. మీ బట్టలు అన్నీ మీరు ఉదుక్కోవాలి. తోలు, ఉన్ని, కట్టెతో చేయబడిన వాటిని అన్నింటినీ మీరు కడగాలి. మీరు తప్పక పవిత్రం కావాలి.”
NUM 31:21 అప్పుడు యాజకుడైన ఎలీయాజరు సైనికులతో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: “అవి మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు. యుద్ధంనుండి తిరిగి వచ్చే సైనికులకోసం ఈ ఆజ్ఞలు.
NUM 31:22 అయితే అగ్నిలో వెయాల్సిన వాటి విషయంలో ఆజ్ఞలు వేరుగా ఉన్నాయి. బంగారం, వెండి. ఇత్తడి, ఇనుము, రేకు, సీసం, మీరు అగ్నిలో వేయాలి. తర్వాత వాటిని నీళ్లతో కడగండి, అవి పవిత్రం అవుతాయి. అగ్నిలో వేయజాలని వస్తువులైతే వాటిని కూడ నీళ్లతో మీరు కడగాలి.
NUM 31:24 ఏడో రోజున తప్పక మీరు మీ వస్త్రాలను ఉదుక్కోవాలి. అప్పుడు మీరు పవిత్రం అవుతారు. ఆ తర్వాత మీరు నివాసంలోకి రావచ్చును.”
NUM 31:25 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
NUM 31:26 “సైనికులు యుద్ధంలో పట్టుకొన్న బందీలను, జంతువులను, సామగ్రి అతటినీ, నీవూ, యాజకుడైన ఎలీయాజరూ, నాయకులందరూ లెక్కపెట్టాలి.
NUM 31:27 తర్వాత వాటిని యుద్ధానికి వెళ్లిన సైనికులు, మిగిలిన ఇశ్రాయేలు ప్రజల మధ్య పంచుకోవాలి.
NUM 31:28 యుద్ధానికి వెళ్లిన సైనికుల దగ్గర ఆ సామగ్రిలో కొంత భాగం తీసుకో. ఆ భాగం యెహోవాకు చెందుతుంది. ప్రతి 500 వస్తువుల్లో ఒక వస్తువు యెహోవా భాగం. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు అన్నింటిలోను ఇలాగే.
NUM 31:29 యుద్ధంలో సైనికలు తెచ్చిన వాటిలోని వారి సగభాగంనుండి వాటిని తీసుకో. అప్పుడు వాటిని యాజకుడైన ఎలీయాజరుకు ఇవ్వవలెను. ఆ భాగం యెహోవాకు చెందుతుంది.
NUM 31:30 ఆ తర్వాత ప్రజల సగభాగంలో ప్రతి 50 వస్తువుల్లోనుంచి ఒక వస్తువు తీసుకో. ప్రజలు, పశువులు, గాడిదలు, గొర్రెలు, ఇంకా ఏ జంతువు విషయంలో అయినా ఇలాగే. ఆ భాగం లేవీయులకు ఇవ్వవలెను. (ఎందుచేతనంటే యెహోవా పవిత్ర గుడారపు బాధ్యతను లేవీయులు తీసుకొన్నారు గనుక.)”
NUM 31:31 కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే, ఎలీయాజరు చేసారు.
NUM 31:32 సైనికులు 6,75,000 గొర్రెలను,
NUM 31:33 72,000 పశువులను
NUM 31:34 61,000 గాడిదలను,
NUM 31:35 32,000 మంది స్త్రీలను తీసుకున్నారు. (వారు ఏ పురుషునితోనూ లైంగిక సంబంధం లేని వారు మాత్రమే.)
NUM 31:36 యుద్ధానికి వెళ్లిన సైనికులకు 3,37,500 గొర్రెలు వచ్చాయి.
NUM 31:37 675 గొర్రెలను వారు యెహోవాకు ఇచ్చారు.
NUM 31:38 సైనికులకు 36,000 పశువులు వచ్చాయి. 72 పశువులును వారు యెహోవాకు ఇచ్చారు.
NUM 31:39 సైనికులకు 30,500 గాడిదలు వచ్చాయి. 61 గాడిదలను వారు యెహోవాకు ఇచ్చారు.
NUM 31:40 సైనికుల వంతు 16,000 మంది స్త్రీలు. 32 మంది స్త్రీలను వారు యెహోవాకు ఇచ్చారు.
NUM 31:41 యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం ఆ కానుకలన్నింటిని యెహోవా కోసం యాజకుడైన ఎలీయాజరుకు మోషే ఇచ్చాడు.
NUM 31:42 అప్పుడు మెషే ప్రజల అర్ధ భాగాన్ని లెక్కించాడు. యుద్ధానికి వెళ్లిన సైనికుల దగ్గర మోషే తీసుకున్న ప్రజల భాగం ఇది.
NUM 31:43 3,37,500 గొర్రెలు
NUM 31:44 36,000 పశువులు,
NUM 31:45 30,500 గాడిదలు
NUM 31:46 16,000 మంది స్త్రీలు ప్రజల వంతు.
NUM 31:47 ప్రతి 50 లోంచి ఒకటి యెహోవాకోసం మోషే తీసుకున్నాడు. జంతువులు, మనుష్యుల్లో కూడ ఇలాగే. అప్పుడు అతడు వాటిని లేవీయులకు ఇచ్చాడు. ఎందుచేతనంటే వారు యెహోవా పవిత్ర గుడారం విషయమై బాధ్యత వహించారు గనుక. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే ఇలా చేసాడు.
NUM 31:48 అప్పుడు సైన్యాధికారులు మోషే దగ్గరకు వచ్చారు (1,000 మంది మీద అధికారులు, 100 మంది మీద అధికారులు.)
NUM 31:49 వారు మోషేతో చెప్పారు, “నీ సేవకులమైన మేము మా సైనికులను లెక్కించాము. వారిలో ఎవరినీ మేము విడిచిపెట్టలేదు.
NUM 31:50 కనుక ప్రతి సైనికుని దగ్గర్నుండీ యెహోవా కానుకను మేము తెస్తున్నాము. బంగారంతో చేయబడిన దండపతకాలు, కడియాలు, ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు మేము తెస్తున్నాము. మా పాపాలను కప్పేందుకు ఇది యెహోవాకు కానుక.”
NUM 31:51 కనుక బంగారంతో చేయబడిన ఆ వస్తువులన్నిటినీ మోషే తీసుకొని యాజకుడైన ఎలీయాజరుకు ఇచ్చాడు.
NUM 31:52 1,000 మందిపైనున్న నాయకులు, 100 మందిపైనున్న నాయకులు యెహోవాకు ఇచ్చిన మొత్తం బంగారం బరువు 420 పౌన్లు.
NUM 31:53 సైనికులు యుద్ధంలో తీసుకొన్న మిగిలిన వస్తువులను వారు ఉంచుకొన్నారు.
NUM 31:54 1,000 మందిపైనున్న, 100 మందిపైనున్న అధికారుల దగ్గర బంగారాన్ని మోషే, యాజకుడైన ఎలీయాజరూ తీసుకున్నారు. తర్వాత ఆ బంగారాన్ని సన్నిధి గుడారంలో వారు ఉంచారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఎదుట ఈ కానుక ఒక జ్ఞాపక చిహ్నం.
NUM 32:1 రూబేను, గాదు వంశాలకు చాల విస్తారంగా పశువులు ఉన్నాయి. యాజెరు, గిలాదు ప్రదేశాన్ని ఆ ప్రజలు చూశారు. ఈ ప్రదేశం వారి పశువులకు బాగున్నట్టు వారికి కనబడింది.
NUM 32:2 కనుక రూబేను, గాదు వంశాల వారు మోషే దగ్గరకు వచ్చారు. మోషేతో, యాజకుడైన ఎలీయాజరుతో, ప్రజా నాయకులతో వారు మాట్లాడారు.
NUM 32:3 వారు ఇలా చెప్పారు: “మీ సేవ కులమైన మాకు చాల విస్తారంగా పశువులు ఉన్నాయి. మేము ఏ దేశంతో పోరాడామో అది పశువులకు మంచి ప్రదేశం. (అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఎలాలే, షెబాం, నెబో, బెయోను ఈ ప్రాంతంలో ఉన్నాయి.)
NUM 32:5 మీకు ఇష్టమైతే ఈ ప్రాంతాన్ని మాకు ఇవ్వవలెనని మేము కోరుతున్నాము. యొర్దాను నది ఆవలి వైపునకు మమ్మల్ని తీసుకొని వెళ్లొద్దు.”
NUM 32:6 రూబేను, గాదు వంశాల ప్రజలతో మోషే అన్నాడు: “మీరు మీ సోదరులను యుద్ధానికి వెళ్లనిచ్చి, మీరేమో ఇక్కడ స్థిరపడతారా?
NUM 32:7 ఇశ్రాయేలు ప్రజలను మీరెందుకు అధైర్యపరుస్తున్నారు? నది దాటకుండా, యోహోవా వారికి ఇచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోకుండా చేస్తారు మీరు.
NUM 32:8 మీ తండ్రులు నాకు అలాగే చేసారు. కాదేషు బర్నేయ దగ్గర దేశాన్ని పరిశీలించి రావటానికి గూఢచారులను నేను పంపించాను.
NUM 32:9 వారు ఎష్కోలు లోయవరకు వెళ్లారు. వారు ఆ దేశాన్ని చూశారు. వారే ఇశ్రాయేలు ప్రజలను అధైర్యపర్చారు. యెహోవా ఇచ్చిన దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలను వెళ్ల నీయకుండా వారే అడ్డు చేసారు.
NUM 32:10 ప్రజల మీద యెహోవాకు చాలా కోపం వచ్చింది. యెహోవా ఇలా ప్రమాణం చేసాడు:
NUM 32:11 ‘ఈజిప్టు నుండి వచ్చిన వారిలో 20 సంవత్సరాలుగాని అంతకంటె ఎక్కువ వయసుగాని ఉన్నవారెవరూ ఈ దేశాన్ని చూడలేరు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసాను. ఈ దేశాన్ని ఈ మనుష్యులకు ఇస్తానని నేను వాగ్దానం చేసాను. కానీ వీరు నన్ను వాస్తవంగా అనుసరించిలేదు. కనుక వీరికి ఈ దేశం దక్కదు.
NUM 32:12 కెనెజీ వాడగు యెపున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే వాస్తవంగా యెహోవాను వెంబడించారు!’
NUM 32:13 “ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు చాల కోపం వచ్చింది. అందుచేతనే ప్రజలను 40 సంవత్సరాల పాటు అరణ్యంలోనే యెహోవా వుండనిచ్చాడు. యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసిన ప్రజలందరూ చనిపోయేంతవరకు వారిని యెహోవా అక్కడనే ఉండనిచ్చాడు.
NUM 32:14 ఇప్పుడు మీరు మీ తండ్రులు చేసిన పాపమే మళ్లీ చేస్తున్నారు. పాపాత్ములైన ప్రజలారా, యెహోవా ఆయన ప్రజల మీద మరింత ఎక్కువగా కోపగించాలని మీరు కోరుతున్నారా?
NUM 32:15 మీరు యెహోవాను వెంబడించటం మానివేస్తే, ఇశ్రాయేలీయులు ఇంకా ఎక్కువ కాలం అరణ్యంలో ఉండేటట్టు యెహోవా చేస్తాడు. అప్పుడు మీరు ప్రజలందరినీ నాశనం చేస్తారు!”
NUM 32:16 కానీ రూబేను, మరియు గాదు వంశాల ప్రజలు మోషే దగ్గరకు వెళ్లారు. వారు మోషేకు ఈ విధంగా చెప్పారు: “ఇక్కడ మేము మా పిల్లలకు పట్టణాలు కట్టుకుంటాము. మరియు మేము ఇక్కడ మందలకు కావలసిన దొడ్లు కట్టుకుంటాము.
NUM 32:17 ఇశ్రాయేలీయులను వారివారి స్థలాలకు చేర్చువరకు మేము వారి ముందర యుద్ధానికి సిద్ధపడి సాగిపోతాము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయంచేత ప్రాకారంగల పట్టణాలలో సురక్షితంగా నివాసము వుండనియ్యండి.
NUM 32:18 ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా ఇండ్లకు తిరిగిరాము.
NUM 32:19 యొర్దాను నదికి పశ్చిమ దిక్కునవున్న ఏ భూమినీ మేము తీసుకోము. యొర్దాను నదికి పూర్వ దిక్కున వున్న భూమే మాకు రావలసిన వారసత్వం.”
NUM 32:20 కనుక మోషే వారితో ఇలా చెప్పాడు: “మీరు వీటన్నింటినీ జరిగిస్తే, అప్పుడు ఈ దేశం మీది అవుతుంది. కానీ మీ సైనికులు మాత్రం యెహోవాకు ముందు యుద్ధానికి వెళ్లాలి.
NUM 32:21 మీ సైనికులు యొర్దాను నది దాటి, శత్రువు ఈ దేశాన్ని వదలి వెళ్లేటట్టుచేయాలి.
NUM 32:22 ఈ దేశాన్ని వశం చేసుకునేందుకు యెహోవా మనందరికీ సహాయం చేసిన తర్వాత, మీరు తిరిగి ఇంటికి వెళ్లవచ్చును. అప్పుడు యెహోవా గాని, ఇశ్రాయేలీయులు గాని మిమ్మల్ని దోషులుగా ఎంచరు. అప్పుడు యెహోవా మిమ్మల్ని ఈ దేశాన్ని తీసుకోనిస్తాడు.
NUM 32:23 కానీ మీరు ఇలా చేయకపోతే, మీరు యెహోవా దృష్టిలో పాపం చేసినట్టే. మరియు మీ పాపం కోసం మీరు శిక్ష పొందుతారని గట్టిగా తెలుసుకోండి.
NUM 32:24 మీ పిల్లల కోసం పట్టణాలు, మీ జంతువుల కోసం కొట్టాలు కట్టుకోండి. అయితే. మీరు మీ ప్రమాణం ప్రకారం తప్పక చేయాలి.”
NUM 32:25 అప్పుడు గాదు, రూబేను వంశాల నాయకులు మోషేతో ఇలా చెప్పారు: “మేము నీ సేవకులం, నీవు మా యజమానివి. కనుక నీవు ఏమి చెబితే అది మేము చేస్తాము.
NUM 32:26 మాభార్యలు, పిల్లలు, మాపశువులు గిలాదు పట్టణాల్లోనే ఉంటారు.
NUM 32:27 కానీ, నీ సేవకులమైన మేము మాత్రం యొర్దాను నది దాటతాము అయితే మా యజమాని చెప్పినట్టు మేము యెహోవా ముందర యుద్ధానికి ముందడుగువేస్తాం.”
NUM 32:28 కనుక ఇశ్రాయేలీయులు చేసిన ఈ ప్రమాణాన్ని మోషే, యాజకుడైన ఎలీయాజరు, నూను కుమారుడు యోహోషువ, ఇశ్రాయేలు వంశాల నాయకులు అందరూ విన్నారు.
NUM 32:29 మోషే వారితో చెప్పాడు: “గాదు, రూబేను ప్రజలు యొర్దాను నది దాటుతారు. వారు యెహోవాముందు యుద్ధానికి నడుస్తారు. మీరు దేశాన్ని వశం చేసుకునేందుకు వారు సహాయం చేస్తారు. దేశంలో వారి భాగంగా గిలాదు ప్రాంతాన్ని మీరు వారికి ఇవ్వవలెను.
NUM 32:30 కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు మీకు సహాయం చేస్తామని వారు ప్రమాణం చేస్తున్నారు.”
NUM 32:31 గాదు, రూబేను ప్రజలు జవాబిచ్చారు: “యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మేము చేస్తామని ప్రమాణం చేస్తున్నాము.
NUM 32:32 మేము యొర్దాను నది దాటి, యెహోవా ముందు కనాను దేశంలోకి నడుస్తాము. అయితే ఈ దేశంలో మా భాగం మాత్రం యొర్దాను నది తూర్పు ప్రదేశం.”
NUM 32:33 కనుక గాదు ప్రజలకు, రూబేను ప్రజలకు, మనష్షే వంశంలో సగంమంది ప్రజలకు ఆ ప్రదేశాన్ని మోషే ఇచ్చాడు. (మనష్షే యోసేపు కుమారుడు.) అమోరీవాడగు సీహోను రాజ్యం, బాషాను రాజైన ఓగు రాజ్యం ఆ ప్రదేశంలో ఉన్నాయి. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణాలన్నీ ఆ ప్రదేశంలో ఉన్నాయి.
NUM 32:34 గాదు ప్రజలు దీబోను, అతారోతు, అరోయేరు,
NUM 32:35 అత్రోతు షోపను, యాజెరు, యోగ్‌బహ,
NUM 32:36 బేత్‌ నిమ్రా, బేత్హారాను పట్టణాలు కట్టారు. బలమైన గోడలు గల పట్టణాలను, వారి జంతువులకు కొట్టాలను వారు నిర్మించారు.
NUM 32:37 రూబేను ప్రజలు హెష్బోను, ఏలాలే, కిర్యాతాయిము
NUM 32:38 నెబో, బయల్మెయోను, షిబ్మా పట్టణాలను నిర్మించారు. వారు మరల కట్టిన పట్టణాలకు పాత పేర్లనే ఉపయోగించారు. అయితే నెబో, బయల్మెయోను పేర్లను వారు మార్చివేసారు.
NUM 32:39 మాకీరు వంశం నుండి ప్రజలు గిలాదుకు వెళ్లారు. (మాకీరు మనష్షే కుమారుడు.) వారు ఆ పట్టణాన్ని ఓడించారు. అక్కడ నివసించిన అమోరీయులను వారు ఓడించారు.
NUM 32:40 కనుక మనష్షే వంశంలోని మాకీరుకు గిలాదును మోషే ఇచ్చాడు, కనుక అతని కుటుంబం అక్కడ స్థిరపడింది.
NUM 32:41 మనష్షే వాడైన యాయీరు అక్కడి చిన్న పట్టణాలను ఓడించాడు. అప్పుడు వాటిని యాయీరు పల్లెలు అని అతడు పిల్చాడు.
NUM 32:42 నాతును, దాని సమీపంలోని చిన్న పట్టణాలను నోబహు ఓడించాడు. తర్వాత ఆ స్థలానికి అతడు తన స్వంత పేరు పెట్టాడు.
NUM 33:1 మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలను వంశాలవారీగా ఈజిప్టునుండి బయటకు నడిపించారు. వారు ప్రయాణం చేసిన స్థలాలు ఇవి.
NUM 33:2 ఆ ప్రయాణాలను గూర్చి మోషే ఇలా వ్రాశాడు. యెహోవా కోరిన విషయాలను మోషే వ్రాశాడు. ఆ ప్రదేశాలు ఇవి:
NUM 33:3 మొదటి నెల 15వ తేదిన వారు రామెసేసు నుండి బయల్దేరారు. పస్కా మరునాటి ఉదయం ఇశ్రాయేలు ప్రజలు జయనినాదాలు చేస్తూ ఈజిప్టునుండి బయటకు వచ్చారు. ఈజిప్టు ప్రజలంతా వారిని చూశారు.
NUM 33:4 యెహోవా చంపిన తమ వారందరిని ఈజిప్టువారు సమాధి చేస్తూఉన్నారు. తమ పెద్ద కుమారులందరినీ వారు పాతిపెడ్తూ ఉన్నారు. ఈజిప్టు దేవతల మీద యెహోవా తన తీర్పు తీర్చాడు.
NUM 33:5 ఇశ్రాయేలు ప్రజలు రామెసేసును విడిచి సుక్కోతుకు ప్రయాణం చేసారు.
NUM 33:6 సుక్కోతు నుండి వారు ఏతాముకు ప్రయాణం చేసారు. అక్కడ అరణ్య శివార్లలో ప్రజలు నివాసం చేసారు.
NUM 33:7 వారు ఏతాము విడిచి పీహహీరోతు వెళ్లారు. ఇది బయల్సెపోను దగ్గర ఉంది. మిగ్దోలు దగ్గర ప్రజలు నివాసం చేసారు.
NUM 33:8 ప్రజలు సీహహీరోతు విడిచి, సముద్రం మధ్య నుంచి నడిచారు. వారు అరణ్యంవైపు వెళ్లారు. అప్పుడు వారు ఏతాము అరణ్యంలో మూడు రోజులు ప్రయాణం చేసారు. మారా దగ్గర ప్రజలు నివాసం చేసారు.
NUM 33:9 ప్రజలు మారామ విడిచి ఏలీము వెళ్లి అక్కడ నివాసం చేసారు. అక్కడ 12 నీటి ఊటలు, 70 ఈతచెట్లు ఉన్నాయి.
NUM 33:10 ప్రజలు ఏలీము విడిచిపోయి ఎర్ర సముద్రం దగ్గర నివాసం చేసారు.
NUM 33:11 ప్రజలు ఎర్ర సముద్రం విడిచిపోయి సీను అరణ్యంలో నివాసంచేసారు.
NUM 33:12 ప్రజలు సీను అరణ్యం విడిచి వెళ్లి దోపకాలో నివాసం చేసారు.
NUM 33:13 ప్రజలు దోపకా విడిచి వెళ్లి ఆలూషులో నివాసం చేసారు.
NUM 33:14 ప్రజలు ఆలూషు విడిచి వెళ్లి, రెఫీదీములో నివాసం చేసారు. ఆ స్థలంలోనే ప్రజలు తాగేందుకు నీరు దొరకలేదు.
NUM 33:15 ప్రజలు రెఫీదీము విడిచివెళ్లి, సీనాయి అరణ్యంలో నివాసం చేసారు.
NUM 33:16 ప్రజలు సీనాయి అరణ్యం విడిచివెళ్లి, కిబ్రోతు హత్తావాలో నివాసం చేసారు.
NUM 33:17 ప్రజలు కిబ్రోతు హేత్తావా విడిచివెళ్లి హజేరోతులో నివాసం చేసారు.
NUM 33:18 ప్రజలు హేజేరోతు విడిచివెళ్లి, రిత్మాలో నివాసం చేసారు.
NUM 33:19 ప్రజలు రిత్మా విడిచివెళ్లి రిమ్మోను పారెసులో నివాసం చేసారు.
NUM 33:20 ప్రజలు రిమ్మోను పారెసు విడిచివెళ్లి, లిబ్నాలో నివాసం చేసారు.
NUM 33:21 ప్రజలు లిబ్నా విడిచివెళ్లి రీసాలో నివాసం చేసారు.
NUM 33:22 ప్రజలు రీసా విడిచి వెళ్లి కెహెలాతాలో నివాసం చేసారు.
NUM 33:23 ప్రజలు కెహేలాతా విడిచివెళ్లి షాపెరు కొండ దగ్గర నివాసం చేసారు.
NUM 33:24 ప్రజలు షాపెరు కొండ విడిచివెళ్లి హరాదాలో నివాసం చేసారు.
NUM 33:25 ప్రజలు హరాదా విడిచివెళ్లి మకెలోతులో నివాసం చేసారు.
NUM 33:26 ప్రజలు మకెలోతు విడిచివెళ్లి తాహతులో నివాసం చేసారు.
NUM 33:27 ప్రజలు తాహతు విడిచివెళ్లి తారహులో నివాసం చేసారు.
NUM 33:28 ప్రజలు తారహు విడిచివెళ్లి మిత్కాలో నివాసం చేసారు.
NUM 33:29 ప్రజలు మిత్కా విడిచివెళ్లి హష్మోనాలో నివాసం చేసారు.
NUM 33:30 ప్రజలు హష్మోనా విడిచివెళ్లి మొసెరోతులో నివాసం చేసారు.
NUM 33:31 ప్రజలు మొసేరోతు విడిచివెళ్లి బెనే యాకానులో నివాసం చేసారు.
NUM 33:32 ప్రజలు బెనేయాకాను విడిచివెళ్లి హోర్ హగ్గిద్గాదులో నివాసం చేసారు.
NUM 33:33 ప్రజలు హోర్ హగ్గిద్గాదు విడిచివెళ్లి యొత్బాతాలో నివాసం చేసారు.
NUM 33:34 ప్రజలు యొత్బాతా విడిచివెళ్లి ఎబ్రొనాలో నివాసం చేసారు.
NUM 33:35 ప్రజలు ఎభ్రోనా విడిచివెళ్లి ఎసోన్గెబెరులో నివాసం చేసారు.
NUM 33:36 ప్రజలు ఎసోన్గెబెరులో విడిచివెళ్లి సీను అరణ్యంలోని కాదేషులో నివాసం చేసారు.
NUM 33:37 ప్రజలు కాదేషు విడిచి వెళ్లి హోరులో నివాసం చేసారు. ఇది ఎదోము సరిహద్దు దగ్గర కొండ.
NUM 33:38 యాజకుడు అహరోను యెహోవా మాటకు విధేయుడై హోరు కొండ మీదికి వెళ్లాడు. ఆ స్థలంలోనే అహరోను మరణించాడు. ఐదో నెల మొదటి రోజున అహరోను చనిపోయాడు. అది ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన 40 వ సంవత్సరం.
NUM 33:39 అహరోను హోరు కొండ మీద చనిపోయినప్పుడు అతని వయస్సు 123 సంవత్సరాలు. కనాను దేశంలోని నెగెవు ప్రాంతంలో అరాదు ఒక పట్టణం.
NUM 33:40 ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారని అక్కడ వున్న కనానీ రాజు విన్నాడు.
NUM 33:41 ప్రజలు హోరు కొండ విడిచి సల్మానాలో నివాసం చేసారు.
NUM 33:42 ప్రజలు సల్మానా విడిచివెళ్లి పూనొనులో నివాసం చేసారు.
NUM 33:43 ప్రజలు పూనొను విడిచివెళ్లి ఓబోతులో నివాసం చేసారు.
NUM 33:44 ప్రజలు ఓబోతు విడిచివెళ్లి ఈయ్యె అబారీములో నివాసం చేసారు. ఇది మోయాబు దేశ సరిహద్దులో ఉంది.
NUM 33:45 ప్రజలు ఈయ్యె అబారీము విడిచివెళ్లి దీబోను గాదులో నివాసం చేసారు.
NUM 33:46 ప్రజలు దీబోను గాదు విడిచివెళ్లి అల్మోను దిబ్లాతాయిములో నివాసం చేసారు.
NUM 33:47 ప్రజలు అల్మోను దిబ్లాతాయిములో విడిచివెళ్లి నెబో దగ్గర అబారీము కొండల మీద నివాసం చేసారు.
NUM 33:48 ప్రజలు అబారీము కొండలు విడిచి వెళ్లి యొర్దాను నది దగ్గర అర్బత్ మోయాబులో నివాసం చేసారు. ఇది యెరికో దగ్గర, యొర్దానుకు సమీపంలో వారు నివాసం చేసారు.
NUM 33:49 బెత్యేషిమోతు నుండి తుమ్మ పొలంవరకు వారి నివాసం ఆక్రమించుకొంది. ఇది అర్బత్ మోయాబు అనే చోట ఉంది.
NUM 33:50 అర్బత్ మోయాబు వద్ద మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన అన్నాడు:
NUM 33:51 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు. వారితో ఈ విషయాలు చెప్పు: మీరు యొర్దాను నది దాటుతారు. కనాను దేశంలోనికి మీరు వెళతారు.
NUM 33:52 అక్కడ మీరు చూసే మనుష్యుల దగ్గరనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. చెక్కబడిన వారి ప్రతిమలను విగ్రహాలను అన్నింటినీ మీరు నాశనం చేయాలి. వారి ఉన్నత స్థలాలు అన్నింటినీ మీరు నాశనం చేయాలి.
NUM 33:53 ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొని, మీరు అక్కడ స్థిరపడతారు. ఎందు కనగా ఈ దేశాన్ని నేనే మీకు ఇస్తున్నాను. అది మీ కుటుంబాలకు చెందుతుంది.
NUM 33:54 మీ కుటుంబాలు ప్రతి ఒక్కదానికీ ఆ దేశంలో భాగం ఉంటుంది. దేశంలోని ఒక్కోభాగం ఏ కుటుంబానికి వస్తుందో తెలుసు కొనేందుకు మీరు చీట్లు వేయాలి. పెద్ద కుటుంబాలకు ఆ దేశంలో పెద్ద భాగం ఇవ్వవలెను. చిన్న కుటుంబాలకు ఆ దేశంలో చిన్న భాగం ఇవ్వవలెను. చీట్లు చేసిన నిర్ణయం ప్రకారమే ప్రజలకు భూమి ఇవ్వబడుతుంది. ప్రతి వంశానికి తమ వంతు భూమి ఇవ్వబడుతుంది.
NUM 33:55 “ఆ ఇతర మనుష్యులు దేశాన్ని వదలి పోయేటట్టుగా మీరు చేయాలి. ఆ ప్రజలను మీరు దేశంలో ఉండనిస్తే, వారు మీకు ఎన్నో కష్టాలు కలిగిస్తారు. వారు మీ కళ్లలో పొడుచుకొనే ముళ్లలా, పక్కలో ముళ్లుగాను ఉంటారు. మీరు నివసించబోయే దేశానికి వారు చాల కష్టాలు తెస్తారు.
NUM 33:56 నేను ఏమి చేస్తానో మీకు చూపించాను. ఆ ప్రజలను మీ దేశంలో గనుక మీరు ఉండనిస్తే దానిని నేను మీకు చేస్తాను.”
NUM 34:1 మోషేతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు:
NUM 34:2 “ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వుము. మీరు కనాను గదేశానికి వస్తున్నారు. ఈ దేశాన్ని మీరు జయిస్తారు. కనాను దేశం అంతా మీరు స్వాధీనం చేసుకొంటారు.
NUM 34:3 దక్షిణాన ఎదోము దగ్గర సీను అరణ్యంలో కొంత భాగం మీకు వస్తుంది. మృత సముద్రపు దక్షిణ కొనలో మీ దక్షిణాది సరిహద్దు మొదలవుతుంది.
NUM 34:4 అక్రబ్బీము దక్షిణాన్ని అది దాటిపోతుంది. సీను అరణ్యంనుండి కాదేషు, బర్నేయ, అక్కడ్నుండి హసరద్దారు మళ్లీ అక్కడ్నుండి అస్మోను వరకు ఉంటుంది.
NUM 34:5 అస్మోను నుండి ఈజిప్టు నది వరకు పోయి, మధ్యధరా సముద్రం దగ్గర సరిహద్దు ముగిస్తుంది.
NUM 34:6 మీ పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం.
NUM 34:7 మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం దగ్గర ప్రారంభమై, హోరు కొండవరకు ఉంటుంది. (లెబానోనులో.)
NUM 34:8 హోరు కొండ నుండి లెబోహమత్ వరకు, అక్కడ నుండి సెదాదు వరకు ఉంటుంది.
NUM 34:9 తర్వాత జిప్రోను వరకు వ్యాపించి, హసరేనాన్ దగ్గర అయిపోతుంది. కనుక అది మీ ఉత్తర సరిహద్దు.
NUM 34:10 మీ తూర్ఫు సరిహద్దు ఎనాను దగ్గర ప్రారంభమై షెపాము వరకు వ్యాపిస్తుంది.
NUM 34:11 షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పుగా వ్యాపించి రిబ్లావరకు ఉంటుంది. కిన్నెరెతు సముద్రం (గలలీయ సముద్రం) పక్కగా కొండల వెంబడి సరిహద్దు సాగిపోతుంది.
NUM 34:12 తర్వాత సరిహద్దు యొర్దాను నదీ తీరం వెంబడి కొనసాగుతుంది. మృత సముద్రం దగ్గర అది అయిపోతుంది. అవి మీ దేశం చుట్టూ సరిహద్దులు.”
NUM 34:13 కనుక ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “అది మీకు లభించే దేశం. పది వంశాలు, మనష్షే వంశంలో సగం మంది కలసి చీట్లు వేసుకొని ఆ దేశాన్ని పంచుకోవాలి.
NUM 34:14 రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగంమంది ముందే వారి భూమిని తీసుకున్నారు.
NUM 34:15 ఆ రెండున్నర వంశాల వారు యొర్దాను నదికి తూర్పువైపు యెరికో దగ్గర్లో భూమి తీసుకున్నారు.”
NUM 34:16 అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు:
NUM 34:17 “దేశాన్ని భాగాలు చేసేందుకు యాజకుడైన ఎలీయాజరు, నూను కుమారుడు యెహోషువ నీకు సహయపడతారు. వీరు
NUM 34:18 అన్ని వంశాల నాయకులు. ఒక్కో వంశంనుండి ఒక్కో నాయకుడు ఉంటాడు. వారు దేశాన్ని భాగిస్తారు.
NUM 34:19 ఆ నాయకుల పేర్లు ఇవి: యూదా వంశంనుండి — యెపున్నె కుమారుడు కాలేబు;
NUM 34:20 షిమ్యోను వంశంనుండి — అమ్మిహూదు కుమారుడు షెమూయేలు;
NUM 34:21 బెన్యామీను వంశంనుండి — కిస్లోను కుమారుడు ఎలీదాదు
NUM 34:22 దాను వంశంనుండి — యొగ్లి కుమారుడు బుక్కి
NUM 34:23 మనష్షే (యోసేపు కుమారుడు) వంశంనుండి ఏఫోదు కుమారుడు హన్నీయేలు
NUM 34:24 ఎఫ్రాయిము (యోసేపు కుమారుడు) వంశంనుండి — షిఫ్తాను కుమారుడు కెమూయేలు
NUM 34:25 జెబూలూను వంశంనుండి — పర్నాకు కుమారుడు ఎలీషాపాను
NUM 34:26 ఇశ్శాఖారు వంశంనుండి — అజ్ఞాను కుమారుడు పల్తీయేలు
NUM 34:27 ఆషేరు వంశంనుండి — షెలోమి కుమారుడు అహీహోదు
NUM 34:28 నఫ్తాలి వంశంనుండి — అమ్మీహోదు కుమారుడు పెదహేలు.”
NUM 34:29 ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశాన్ని పంచేందుకు ఆ మనుష్యులను యెహోవా ఏర్పరచుకొన్నాడు.
NUM 35:1 యెహోవా మోషేతో ఇలా మాట్లాడాడు: ఇది మోయాబులో యొర్దాను లోయలో, యొర్దాను నది దగ్గర, యెరికో అవతల జరిగింది. యెహోవా ఇలా చెప్పాడు:
NUM 35:2 “ఇశ్రాయేలు ప్రజలు వారి భాగంలోనుంచి కొన్ని పట్టణాలను లేవీ వారికి ఇవ్వవలెనని వారితో చెప్పుము. ఆ పట్టణాలను, వాటి చుట్టూ ఉండే పచ్చిక బయళ్లను ఇశ్రాయేలు ప్రజలు లేవీ వారికి ఇవ్వవలెను.
NUM 35:3 లేవీయులు ఆ పట్టణాల్లో నివసించగలుగుతారు. వారి పశువులు, వారికి ఉన్న జంతువులు అన్నీ ఆ పట్టణాల చుట్టూ ఉండే పచ్చిక బయళ్లలో మేత మేయగలుగుతాయి.
NUM 35:4 మీ భూమిలో ఎంతభాగం మీరు లేవీయులకు ఇవ్వవలెను. పట్టణాల ప్రాకారాలనుండి 1,500 అడుగుల వరకు భూమి లేవీయులకే చెందుతుంది.
NUM 35:5 మరియు పట్టణానికి తూర్పున 3,000 అడుగులు, పట్టణానికి దక్షిణాన 3,000 అడుగులు, పట్టణానికి పశ్చిమాన 3,000 అడుగులు, పట్టణానికి ఉత్తరాన 3,000 అడుగులు మొత్తం లేవీయులకు చెందుతాయి. ఆ భూమి అంతటికీ మధ్యలో పట్టణం ఉంటుంది,
NUM 35:6 ఆ పట్టణాల్లో ఆరు ఆశ్రయ పురాలుగా ఉంటాయి. ఒక వ్యక్తి ప్రమాద వశాత్తూ మరొకర్ని చంపేస్తే, అప్పుడు అతడు ఆశ్రయంకోసం ఆ పట్టణాలకు పారిపోవచ్చు. ఈ ఆరు పట్టణాలు గాక, ఇంకా 42 పట్టణాలను మీరు లేవీయులకు ఇవ్వాలి.
NUM 35:7 కనుక మీరు మొత్తం 48 పట్టణాలను లేవీయులకు ఇవ్వవలెను. ఆ పట్టణాల చుట్టూ ఉండే భూమిని కూడ మీరు లేవీయులకు ఇవ్వవలెను.
NUM 35:8 ఇశ్రాయేలీయులలో పెద్ద కుటుంబాలు ఉన్న వారు ఎక్కువ భూభాగాలు ఇవ్వవలెను. ఇశ్రాయేలు చిన్న కుటుంబాలవారు చిన్న భూభాగాలు ఇవ్వవలెను. అయితే అన్ని వంశాల వారూ దేశంలోని వారి భాగంలోనుంచి కొన్ని పట్టణాలను మాత్రం తప్పక లేవీవారికి ఇవ్వవలెను.”
NUM 35:9 తర్వాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు:
NUM 35:10 “ప్రజలతో ఈ సంగతులు చెప్పుము. మీరు యొర్దాను నది దాటి కనాను దేశంలో ప్రవేశిస్తారు.
NUM 35:11 ఆశ్రయ పురాలుగా పట్టణాలను మీరు ఏర్పాటుచేయాలి. ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ మరో వ్యక్తిని చంపేస్తే, అప్పుడు అతడు భద్రత కోసం ఆ పట్టణాల్లో ఒకదానికి పారిపోవచ్చును.
NUM 35:12 చనిపోయిన మనిషి కుటుంబంనుండి, దెబ్బకు దెబ్బతీయాలని చూచే వారి బారినుండి అతడు క్షేమంగా ఉంటాడు. అతనికి న్యాయస్థానంలో తీర్పు జరిగేంతవరకు అతడు క్షేమంగా ఉంటాడు.
NUM 35:13 ఆశ్రయపురాలు ఆరు ఉంటాయి.
NUM 35:14 ఆ పట్టణాల్లో మూడు యొర్దాను నదికి తూర్పువైపున ఉంటాయి. ఆ పట్టణాల్లో మూడు యొర్దాను నదికి పశ్చిమాన కనాను దేశంలో ఉంటాయి.
NUM 35:15 ఇశ్రాయేలు పౌరులకు, విదేశీయులకు, యాత్రికులకు ఆ పట్టణాలు క్షేమమైన స్థలాలుగా ఉంటాయి. వారిలో ఎవరైనా సరే మరొకర్ని ప్రమాదవశాత్తూ చంపేస్తే వారు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోగలుగుతారు.
NUM 35:16 “ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇనుప ఆయుధంతో చంపితే, అప్పుడు చంపినవాడూ చావాల్సిందే.
NUM 35:17 ఒక వ్యక్తి బండతో ఇంకో మనిషిని చంపితే, అతడు కూడ చావాల్సిందే. (ఆ బండ సాధారణంగా మనుష్యులను చంపేందుకు ప్రయోగించేది)
NUM 35:18 ఒక వ్యక్తి కర్రను ప్రయోగించి మరొకడ్ని చంపితే, అతడు కూడ చావాల్సిందే. (ఆ కర్ర సాధారణంగా మనుష్యులను చంపేందుకు ప్రయోగించే ఆయుధం)
NUM 35:19 చనిపోయిన వాని కుటుంబ సభ్యుల్లో ఒకరు హంతకుణ్ణి తరిమి చంపవచ్చును.
NUM 35:20 “ఒక వ్యక్తి మరో వ్యక్తిని చేతితో కొట్టి చంపవచ్చు. లేదా ఒక వ్యక్తి మరొకరిని తోసేసి చంపవచ్చు. లేక ఒక వ్యక్తి మరో వ్యక్తిమీద ఏదైనా విసరడం ద్వారా వానిని చంపవచ్చును. ఆ హంతకుడు ద్వేషంతో అలా చేస్తే అతడు హంతకుడు. ఆ మనిషిని చంపివేయాలి. చనిపోయిన వాని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అతనిని తరిమి చంపవచ్చును.
NUM 35:22 “కానీ ఒక వ్యక్తి మరొకర్ని ప్రమాదవశాత్తూ చంపవచ్చును. అతడు తాను చంపిన వాడిని ద్వేషించలేదు. అది కేవలం ప్రమాదవశాత్తూ జరిగింది. లేక ఒక వ్యక్తి మరొకరి మీద ఏదో విసిరినప్పుడు అవతల మనిషి చావవచ్చు — చంపాలని అతడు అలా చేయలేదు.
NUM 35:23 లేక ఒక వ్యక్తి ఒక బండను విసిరివేయవచ్చును. అతడు చూడని మరో వ్యక్తిమీద ఆ బండపడి, అతనిని చంపవచ్చు. అతుడ ఎవరినీ చంపాలని పథకం వేయలేదు. తాను చంపినవాడిని అతడు ద్వేషించలేదు — అది కేవలం ప్రమాదవశాత్తూ జరిగింది.
NUM 35:24 అలా జరిగితే ఏమి చేయాలనేదీ సమాజం నిర్ణయం చేయాలి.
NUM 35:25 చనిపోయిన వాని కుటుంబంలో వారు ఎవరైనా తిరిగి అతడిని చంపవచ్చేమో సమాజపు న్యాయస్థానం నిర్ణయించాలి. న్యాయస్థానం హంతుకుడిని బతుకనివ్వాలని ఒకవేళ నిర్ణయిస్తే, అప్పుడు ఈ వ్యక్తి తన ‘ఆశ్రయపురానికి’ వెళ్లాలి. పవిత్ర తైలంతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు మరణించేంత వరకు అతడు అక్కడే ఉండాలి.
NUM 35:26 “ఆ మనిషి తన ‘అశ్రయ పురం’ హద్దులు దాటి ఎన్నడూ బయటకి వెళ్లకూడదు. అతడు ఆ హద్దులు దాటి బయటికి వెళ్తే, చనిపోయినవాని కుటుంబ సభ్యుల్లో ఒకరు అతన్ని పట్టుకొని చంపివేస్తే, అప్పుడు, ఆ సభ్యుని మీద హత్యా నేరం ఉండదు.
NUM 35:28 ప్రమాదవశాత్తూ చంపిన వ్యక్తి, ప్రధాన యాజకుడు మరణించేంతవరకు తన ‘ఆశ్రయ పురం’లోనే ఉండాలి. ప్రధాన యాజకుడు మరణించాక, అతడు తిరిగి తన చోటికి వెళ్లవచ్చును.
NUM 35:29 మీ ప్రజల పట్టణాలన్నింటిలోనూ ఆ నియమాలు శాశ్వత చట్టంగా ఉంటాయి.
NUM 35:30 “సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే హంతకుడు హంతకునిగా చంపబడాలి. ఒకే ఒక్క సాక్షి ఉంటే ఏ వ్యక్తినీ చంపకూడదు.
NUM 35:31 “ఒక్క వ్యక్తి హంతకుడైతే, అతడ్ని చంపి వేయాలి. డబ్బు తీసుకుని ఈ శిక్షను మార్చవద్దు. ఆ హంతకుడు తప్పక చంపబడాలి.
NUM 35:32 “ఒక వ్యక్తి మరొకర్ని చంపి, ఆశ్రయ పురాలలో ఒక దానికి పారిపోతే, వాడిని ఇంటికి పోనిచ్చేందుకు డబ్బు తీసుకోవద్దు ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు ఆ పట్టణంలోనే ఉండాలి.
NUM 35:33 “నిరపరాధుల రక్తంతో మీ దేశాన్ని నాశనం కాని వ్వవద్దు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేస్తే, ఆ నేరానికి ఒకే శిక్ష. అది ఆ హంతకుడు చంపబడటమే. ఆ నేరంనుండి దేశాన్ని మరే శిక్షకూడ విమోచించదు.
NUM 35:34 నేనే యెహోవాను. నేను మీ దేశంలో ఇశ్రాయేలు ప్రజలతో నివసిస్తాను. ఆ దేశంలో నేను నివసిస్తాను గనుక నిర్దోషుల రక్తంతో దానిని పాడు చేయవద్దు.”
NUM 36:1 యోసేపు కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు మాకీరు. మాకీరు కుమారుడు గిలాదు. గిలాదు వంశపు నాయకులు మోషేతో, ఇశ్రాయేలు వంశాల నాయకులతో మాట్లాడటానికి వెళ్లారు.
NUM 36:2 వారు ఇలా అన్నారు: “అయ్యా, చీట్లు వేసి భూమిని తీసుకోమని యోహోవా మనకు ఆజ్ఞాపించాడు. మరియు అయ్యా, సెలోపెహదు భూమిని అతడు కుమార్తెలకు ఇవ్వవలెనని యెహోవా ఆజ్ఞాపించాడు. సెలోపెహదు మా సోదరుడు.
NUM 36:3 ఒకవేళ మరేదైనా ఇశ్రాయేలు వంశంలోనుండి మరెవరైనా సెలోపెహదు కుమార్తెల్లో ఒకరిని వివాహము చేసుకోవచ్చు. ఆ భూమి మా కుటుంబం నుండి పోతుందా? ఆ మరో వంశంవారు ఆ భూమిని తీసు కుంటారా? చీట్లు వేయడం ద్వారా మాకు లభించిన ఆ భూమిని మేము పొగొట్టు కుంటామా?
NUM 36:4 ప్రజలు వారి భూమిని అమ్మివేయవచ్చు. అయితే బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో భూమి అంతా దని అసలైన సొంతదారులకు తిరిగి ఇవ్వబడుతుంది. ఆ సమయంలో, సెలోపెహదు కుమార్తెలకు చెందిన భూమి ఎవరికి లభిస్తుంది? అలా గనుక జరిగితే మా కుటుంబం శాశ్వతంగా ఆ భూమిని పోగొట్టు కుంటుంది కదా?”
NUM 36:5 మోషే ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ యోహోవానుండి వచ్చింది. “యోసేపు వంశపు మనుష్యులు సరిగ్గా చెప్పారు.
NUM 36:6 ఇది సెలోపెహదు కుమార్తెలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. మీరు ఎవరినైనా వివాహమాడాలనుకుంటే మీ స్వంతవంశంలో వారినే వివాహము చేసుకోవాలి.
NUM 36:7 ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో భూమి ఒక వంశంనుండి మరో వంశానికి మారిపోదు. ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.
NUM 36:8 ఒకవేళ ఎవరైవా స్త్రీకి తన తండ్రి భూమి సంక్రమిస్తే, ఆమె తన స్వంత వంశం వారినే ఎవరినైనా వివాహము చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి వ్యక్తీ తన పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.
NUM 36:9 కనుక ఇశ్రాయేలు ప్రజల్లో ఒక వంశంనుండి మరో వంశానికి భూమి పోకూడదు. ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.”
NUM 36:10 మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు సెలోపెహదు కుమార్తెలు విధేయులయ్యారు.
NUM 36:11 అందుచేత సెలోపెహదు కుమార్తెలు మహలా, తిర్సా, హొగ్గా, మిల్కా, నోయా, వారి తండ్రి సోదరుని కుమారులను వివాహము చేసుకున్నారు.
NUM 36:12 వారి భర్తలు మనష్షే వంశం వారు గనుక వారు భూమి తమ తండ్రి కుటుంబం, వంశం వారికే చెందినది.
NUM 36:13 కనుక అర్బోతు మోయాబు ప్రాంతంలో, శ్రేష్ఠయోర్దాను నది ప్రక్కన, యెరికో దగ్గర మోషేకు యెహోవా ఇచ్చిన చట్టాలు, ఆజ్ఞలు అవి. ఆ చట్టములను, ఆజ్ఞలను మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు.
DEU 1:1 ఇది ఇశ్రాయేలు ప్రజలకు మోషే యిచ్చిన సందేశం. వారు యొర్దాను నదికి తూర్పువైపుగల అరణ్యంల్లో ఉన్నప్పుడు అతడు ఈ విషయాలు వారితో చెప్పాడు. వారు అరాబా లోయలో ఉన్నారు. ఇది సూపుకు అవతల పారాను అరణ్యమునకు, తోపెలు, లాబాను, హజెరోతు, దీజాహాబు పట్టణాలకు మధ్యవుంది.
DEU 1:2 హోరేబు కాండనుండి (సీనాయి) కాదేఘ బర్నేయాకు శేయారు కొండలద్యారా ప్రయాణం పదకొండు రొజులు మాత్రమే పడుతుంది.
DEU 1:3 అయితే ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచినప్పటినుండి ఈ స్థలంలో మోషే వీరితో మాట్లడినప్పటికి 40 సంవత్సరాలు పట్టింది. అది 40వ సంవత్సరం, 11వ నెల ఒకటవ తేది. వారితో చెప్పమని యోహొవా మోషేకు ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ మోషే వారితో మాట్లాడినప్పుడు చెప్పాడు.
DEU 1:4 ఇది సీహోనును, ఓగును యెహోవా ఓడించిన తర్వాత జరిగిన సంగతి. సిహొను అమోరీయుల రాజు. సిహోను హెష్బోనులో నివసించాడు. ఓగు బాషాను రాజు. ఓగు అష్పారోతు, ఎద్రేయిలో నివసించాడు.
DEU 1:5 ఇప్పుడు వారు యోర్దాను నదికి తూర్పున మోయాబు దేశంలో ఉన్నారు, మరియు దేవుడు ఆజ్ఞాపించిన విషయాలను మోషే వివరించటం మొదలుబెట్టాడు. మోషే ఇలా చెప్పాడు:
DEU 1:6 “మన దేవుడైన యెహోవా హొరేబు (సీనాయి) కొండమీద మనతో మాట్లాడాడు. ఆయన అన్నాడు, ‘ఈ కొండ దగ్గర మీరు యిప్పటికి చాలా కాలంనుండి నిలిచి ఉన్నారు.
DEU 1:7 కదిలిపోయేందుకు సర్వ సిద్ధంగా ఉండండి. అమోరీయుల కొండ దేశానికి, దాని చుట్టూవున్న యొర్దాను లోయ, కొండ దేశం, పశ్చిమ పల్లపు ప్రాంతాలు, నెగెవు, సముద్రతీర ప్రాంతం అన్ని చోట్లకూ వెళ్లండి, కనానీ ప్రజల దేశానికి వెళ్లండి,యూఫ్రటిసు మహానది వరకు లెబానోనుకు వెళ్లండి.
DEU 1:8 చూడండి, ఈ దేశమంతా నేను మీకు ఇచ్చాను. మీరు అందులో ప్రవేశించి ఆ దేశాన్ని మీ స్వాధినం చేనుకోండి. మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు నేను వాగ్దానం చేసిన దేశం యిదే. వారికి, వారి సంతతివారికి ఈ దేశాన్ని యిస్తానని నేను వాగ్దానం చేశాను.’”
DEU 1:9 అప్పుడు మోషే అన్నాడు: “‘ఆ సమయంలో నేను మీతో మాట్లాడినప్పుడు నేను ఒంటరిగా మీ విషయంలో శ్రద్ధ తీసుకోలేనని నేను చేప్పాను.
DEU 1:10 మీ దేవుడైన యెహోవా ఇంకా మరింతమంది ప్రజలను అధికం చేయటంతో నేడు మీరు ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అంతమంది ఉన్నారు.
DEU 1:11 మీ పూర్వీ కుల దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకా 1,000 రెట్లు పెంచునుగాక! ఆయన మీకు చేసిన వాగ్దానం ప్రకారమే ఆయన మిమ్మల్ని ఆశీర్వాదించుగాక!
DEU 1:12 కానీ నేను మీ విషయం శ్రద్ధ తీసుకోలేను, నేనొక్కడనే మీ వివాదాలు తీర్చలేను.
DEU 1:13 కనుక ‘ప్రతి వంశంనుండి కొందరు ప్రతినిధులను ఎన్నుకోండి, నేను వారిని మీమీద నాయకులుగా చేస్తాను. అవగాహన, అనుభవం ఉన్న జ్ఞానులను ఎన్ను కోండి’ అని మీతో చెప్పాను.
DEU 1:14 “దానికి అలా చేయటం ‘మంచిదే అనుకొంటున్నాము’ అని మీరు అన్నారు.
DEU 1:15 “కనుక మీరు మీ వంశాలనుండి ఎన్నుకొన్న అవగాహన, అనుభవమున్న జ్ఞానులను మీకు నాయకులుగా నేను చేసాను. వారిలో కొందరిని 1,000 మందికి నాయకులుగాను, కొందరిని 100 మందికి నాయకులుగాను, కొందరిసి 50 మందికి నాయకులుగాను, కొందరిని 10 మందికి నాయకులుగాను నేను చేసాను. నేను వారిని మీ వంశాలకు అధికారాలుగా చేసాను.
DEU 1:16 “ఈ నాయకులను మీకు న్యాయమూర్తులుగా ఉండమని అప్పట్లో నేను వారితో చెప్పాను. ‘మీ ప్రజల వాదాలు వినండి. ఒక్కో వ్యాజ్యెమును సరిగ్గా విచారణ చేయండి. సమస్య ఇశ్రాయేలీయుల ఇద్దరి మధ్యకావచ్చును, లేక ఒక ఇశ్రాయేల వ్యక్తికీ, మరో పరాయి వ్యక్తికీ మధ్య అయినా సరే పర్వాలేదు. మీరు ప్రతి వ్యాజ్యమును సరిగ్గా విచారణ చేయాలి.
DEU 1:17 మీరు విచారణ జరిపేటప్పుడు ఒక వ్యక్తి మరో వ్యక్తికంటె ముఖ్యమైనవాడని మీరు తలచకూడదు. ప్రతివ్యక్తి పైనా ఒకె విధంగా విచారణ జరిగించాలి. మీ నిర్ణయం దేవుని నుండి వస్తుంది. కనుక, ఎవరిని గూర్చి భయపడవద్దు. అయితే మీరు విచారణ జరిపేందుకు ఒక వ్యాజ్యము కష్టతరంగా ఉంటే, దానిని నా దగ్గరకు తీసుకొని రండి. నేను దానిని విచారిస్తాను.’
DEU 1:18 మీరు చేయాల్సిన ఇతర విషయాలన్నింటినీ ఆ సమయంలోనే నేను మీతో చెప్తాను.
DEU 1:19 “అప్పుడు మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మనం చేసాము. మనం హోరేబు (సీనాయి) కొండను విడిచి, ఆమోరీయుల కొండ దేశంవైవు ప్రయాణం చేసాము. మీరు చూసిన ఆ మహా భయంకర అరణ్యం అంతటి గుండా మనం వెళ్లాము. కాదేషు బర్నేయాకు మనం వచ్చాం.
DEU 1:20 అప్పుడు నేను మీతో చెప్పాను: ‘ఇప్పుడు మీరు అమోరీయుల కొండ దేశానికి వచ్చారు. మన యెహోవా దేవుడు ఈ దేశాన్ని మనకు ఇస్తాడు.
DEU 1:21 చూడండి, అదిగో అదే ఆ దేశం. వెళ్లి ఆ దేశాన్ని మీ స్వంతం చేసుకోండి. మీరు ఇలా చేయాలని మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీతో చెప్పాడు. అందుచేత భయపడకండి, దేనిని గూర్చీ చింతపడ కండి!’
DEU 1:22 “అప్పుడు మీరంతా నా దగ్గరకు వచ్చి ‘ఆ దేశాన్ని చూసేందుకు మనకంటే ముందుగా మనుష్యుల్ని పంపిద్దాము, వారు తిరిగి వచ్చి మనం వెళ్లాల్సిన మార్గం మనకు చెబుతారు. మనకు వచ్చే పట్టణాలను గూర్చి కూడ వారు చెప్పగలుగుతారు అన్నారు.’
DEU 1:23 “అది మంచి తలంపు అని నేను అనుకొన్నాను. కనుక ఒక్కోవంశం నుండి ఒకరి చొప్పున మీలోనుండి పన్నెండు మందిని నేను ఎన్నుకొన్నాను.
DEU 1:24 అప్పుడు ఆ మనుష్యులు బయల్దేరి ఆ కొండ దేశానికి వెళ్లారు. వారు ఎష్కోలు లోయకు వచ్చి దానిని పరిశోధించారు.
DEU 1:25 ఆ దేశంలోని ఫలాలు కొన్నింటిని తీసుకొని వారు మా దగ్గరకు తిరిగి తెచ్చారు. వారు మాకు సమాచారం అందిస్తూ ‘అది మన యెహోవా దేవుడు మనకు యిస్తున్న మంచి దేశం’ అని చెప్పారు.
DEU 1:26 “కాని ఆ దేశంలో ప్రవేంశించటానికి మీరు నిరాకరించారు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు లోబడేందుకు మీరు నిరాకరించారు.
DEU 1:27 మీ గుడారాల్లో మీరు ఫిర్యాదులు చేసారు, మీరు అన్నారు: ‘యెహోవా మనలను ద్వేషిస్తున్నాడు. అమెరీయులు మనలను నాశనం చేసేటట్టు, వారికి మనలను అప్పగించటానికే ఆయన మనలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
DEU 1:28 ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్లగలము? మన సోదరులు (పన్నెండుమంది) తెచ్చిన సమాచారంతో వారు మనల్ని భయపెట్టారు. అక్కడి మనుష్యులు మనకంటే పెద్దవాళ్లు, ఎత్తయినవాళ్లు. పట్టణాలు పెద్దవి, వాటి గోడలు ఆకాశమంత ఎత్తు ఉన్నాయి. అక్కడ రాక్షసుల్లాంటి మనుష్యుల్ని మేము చూశాము’ అని వారు చెప్పారు.
DEU 1:29 “అప్పుడు నేను మీతో చెప్పాను: ‘దిగులు పడకండి. ఆ మనుష్యుల విషయం భయపడవద్దు.
DEU 1:30 మీ దేవుడైన యెహోవా మీకు ముందు వెళ్లి, మీ పక్షంగా పోరాడుతాడు. ఆయన ఈజిప్టులో చేసినట్టే దీన్నికూడ చేస్తాడు. ఆయన మీకు ముందుగా వెళ్లటం
DEU 1:31 అరణ్య ములో మీరు చూశారు. ఒక మనిషి తన కుమారుని మోసినట్లు, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎలా మోసిందీ మీరు చూశారు. ఇంత దూరం ఈ స్థలానికి యెహోవా మిమ్మల్ని క్షేమంగా తీసుకొని వచ్చాడు.’
DEU 1:32 “అయినప్పటికీ మీరు యింకా మీ దేపుడైన యెహోవాను విశ్వసించలేదు.
DEU 1:33 మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ పాళెము కోసం స్థలం చూసేందుకు ఆయన మీకు ముందుగా వెళ్లాడు. మీరు ఏ మార్గాన వెళ్లాల్సిందీ మీకు చూపెట్టేందుకు రాత్రివేళ అగ్నిలోను, పగటివేళ మేఘములోను ఆయన మీకు ముందు వెళ్లాడు.
DEU 1:34 “మీరు చెప్పింది యెహోవా విన్నాడు, ఆయనకు కోపం వచ్చింది. ఆయన ఒక గట్టి ప్రమాణం చేసాడు. ఆయన చెప్పాడు:
DEU 1:35 ‘ఇప్పుడు జీవిస్తున్న దుష్టప్రజలైన మీలో ఎవ్వరూ, నేను మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో ప్రవేశించరు.
DEU 1:36 యెపున్నె కుమారుడైన కాలేబు మాత్రమే ఆ దేశాన్ని చూస్తాడు. కాలేబు నడిచిన భూమిని నేను అతనికియిస్తాను. ఆ భూమిని అతని సంతతివారికి నేను యిస్తాను. ఎందుకంటే నేను ఆజ్ఞాపించినది అంతా కాలేబు జరిగించాడు గనుక’.
DEU 1:37 “మీ వల్ల యెహోవా నా మీదకూడా కోపగించాడు. నాతో ఆయన చెప్పాడు: ‘నీవు కూడా ఆ దేశంలో ప్రవేశించజాలవు.
DEU 1:38 అయితే నీ సహాయకుడును నూను కుమారుడైన యెహోషువ ఆ దేశంలో నికి వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అతడే వారిని నడిపిస్తాడు గనుక యెహోషువాను ప్రోత్సహించు.’
DEU 1:39 “మరియు యెహోవా మనతో చెప్పాడు; ‘మీ చిన్న పిల్లలను మీ శ్రతువులు ఎత్తికొనిపోతారని మీరు చెప్పారు గదా, కానీ ఆ పిల్లలే ఆ దేశంలో ప్రవేశిస్తారు. ఒక విషయం తప్పో? ఒప్పో? అని, తెలుసుకోలేనంత చిన్నవాళ్లు గనుక మీరు చేసిన తప్పుకు మీ పిల్లల్ని నేను నిందించను. కనుక వారికే ఆ దేశాన్ని నేను యిస్తాను. ఆ దేశాన్ని మీ పిల్లలే వారి స్వంతంగా తీసుకొంటారు.
DEU 1:40 కానీ మీరు మాత్రం వెనుకకు తిరిగి ఎర్రసముద్ర మార్గంలో అరణ్యానికే వెళ్లాలి.’
DEU 1:41 “అప్పుడు మీరు, ‘మోషే, మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము. అయితే యిదివరకు యెహావా దేవుడు మాకు ఆజ్ఞాపిచిన ప్రకారం యిప్పుడు మేము వెళ్లి పోరాడుతాము’ అని అన్నారు. “అప్పుడు మీరు ఒక్కోక్కరు యుద్ధ ఆయుధాలు ధరించారు. ఆ కొండ దేశంలో ప్రవేశించటం సులభం అని మీరు అనుకొన్నారు.
DEU 1:42 అయితే, ‘అక్కడికి వెళ్లి యుద్ధం చేయవద్దని ప్రజలతో చెప్పు, ఎందుకంటే నేను వారికి తోడుగా ఉండను, వారి శత్రువులు వారిని ఓడించేస్తారు’ అని యెహోవా నాతోచెప్పాడు.
DEU 1:43 “కనుక నేను మీతో మాట్లాడాను. కాని మీరు వినలేదు. యెహోవా ఆజ్ఞకు లోబడేందుకు మీరు నిరాకరించారు. మీ స్వంత శక్తి ప్రయోగించవచ్చని మీరనుకొన్నారు.
DEU 1:44 అందుచేత మీరు ఆ కొండ దేశం మీదికి వెళ్లారు. అప్పుడు ఆ కొండ దేశంలో నివసిస్తున్న అమోరీయులు మీ మీద యుద్ధానికి వచ్చారు. తేనెటీగల దండు మనుష్యులను తరిమినట్టు వారు మిమ్ములను తరిమారు. శేయీరునుండి హోర్మా వరకు మిమ్మల్ని తరిమి, అక్కడ వారు మిమ్మల్ని ఓడించారు.
DEU 1:45 అప్పుడు మీరు తిరిగివచ్చి యెహోవాకు మొర్ర పెట్టారు. కాని యెహోవా మీ మొర్ర వినలేదు. మీ మొర్ర వినటానికి ఆయన నిరాకరించాడు.
DEU 1:46 కనుక చాలా కాలం మీరు కాదేషులోనే ఉండిపోయారు.”
DEU 2:1 “అప్పుడు మనం తిరిగి ఎర్రసముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణం చేసాము. మనంచేయవ లెనని యెహోవా నాతో చెప్పింది అదే. చాలా రోజుల వరకు మనం శేయారు కొండ దేశం గుండా వెళ్లాము.
DEU 2:2 అప్పుడు నాతో యెహోవా అన్నాడు:
DEU 2:3 ‘మీరు ఈ కొండ దేశంగుండా చాలా తిరిగారు. ఉత్తర దిశగా తిరగండి.
DEU 2:4 మరియు మీకు ఇలా చెప్పమని ఆయన నాతో చెప్పాడు: మీరు శేయీరు దేశం గుండా దాటిపోతారు. ఈ దేశం మీ బంధువులైన ఏశావు సంతతివారికి చెందినది. వారు మీకు భయపడతారు. చాలా జాగ్రతగా ఉండండి.
DEU 2:5 వారితో యుద్ధం చేయ కండి. వారి దేశంలో ఏమాత్రం ఒక్క అడుగు కూడ నేను మీకు యివ్వను. ఎందుకంటే శేయీరు కొండ దేశాన్ని ఏశావుకు స్వంతంగా ఉండేందుకు నేను యిచ్చాను.
DEU 2:6 అక్కడ మీరు తినే భోజనానికిగాని తాగే నీటికిగాని మీరు ఏశావు ప్రజలకు వెల చెల్లించాలి.
DEU 2:7 మీరు చేసిన ప్రతిదానిలోనూ మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మహా ఎ డారిలో మీరు నడవటం ఆయనకు తెలుసు. ఈ 40 సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు గనుక మీకు అవసరమైనవి అన్నీ ఎల్లప్పుడూ మీకు దొరికాయి’
DEU 2:8 “కనుక శేయీరులో నివసించే మన బంధువులైన ఏశావు ప్రజలను మనం దాటిపోయాము. ఎలాతు, ఎసియోను గెబరు పట్టణాల నుండి యోర్దాను వెళ్ళే మార్గాన్ని మనం విడిచిపెట్టాం. మనం మళ్లుకొని మోయాబు అరణ్యానికి పోయే మార్గం మీద వెళ్లాము.
DEU 2:9 “యెహోవా నాతో చెప్పాడు: ‘మోయాబు ప్రజలను తొందర పెట్టవద్దు. వారితో యుద్ధం ప్రారంభించవద్దు, వారి దేశంలో ఏ మాత్రం భూమి నేను మీకు యివ్వను. వారు లోతు సంతతివారు, ఆరు పట్టణాన్ని నేను వారికి యిచ్చాను.’”
DEU 2:10 ఇంతకు ముందు ఎమీము ప్రజలు ఆర్‌లో నివసించారు. వారు బలాఢ్యులు, వారు చాలమంది ఉన్నారు. అనాకీము ప్రజల్లాగే వారు చాలా ఎత్తయినవాళ్లు.
DEU 2:11 అనాకీయుల్లాగే ఎమీము కూడ రెఫాయిము ప్రజల్లో ఒక భాగం అనిచెప్పబడింది. కానీ మోయాబీ ప్రజలు వారిని ఎమీయులు అని పిల్చారు.
DEU 2:12 హోరీ ప్రజలు కూడ ఇంతకు ముందు శేయీరులో నివసించారు, కానీ ఏశావు ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. హోరీయులను ఏశావు ప్రజలు నాశనం చేసారు. అప్పుడు హోరీయులు అంతకు ముందు నివసిచిన చోట ఏశావు ప్రజలు నివసించారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా స్వంతంగా యిచ్చిన దేశంలోని ప్రజలకు ఇశ్రాయేలీయులు చేసినట్టు వారు అక్కడ ఉన్నవారికి చేసారు.
DEU 2:13 “యెహోవా నాతో చెప్పాడు: ‘ఇప్పుడు లేచి, జెరెదు వాగు దాటి వెళ్లండి.’ కనుక మనం జెరెదువాగు దాటివెళ్లాం.
DEU 2:14 మనం కాదెషు బర్నెయ విడిచి జెరెదు వాగు దాటునప్పటికి 38 సంవత్సరాలు పట్టింది. ఆ తరం యుద్ధ వీరులంతా చనిపోయారు. ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు.
DEU 2:15 ఆ మనుష్యులు అందరూ గతించి పోయేవరకు యెహోవా వారికి విరోధంగానే ఉన్నాడు.
DEU 2:16 “యుద్ధ వీరులంతా చనిపోయి ప్రజల మధ్య లేకుండా గతించిపోయిన తర్వాత
DEU 2:17 యెహోవా నాతో ఇలా చెప్పాడు:
DEU 2:18 ‘ఈ వేళ మీరు సరిహద్దు ఆర్‌వద్ద దాటి మోయాబులోనికి వెళ్లాలి.
DEU 2:19 మీరు అమ్మోనీయులను సమీపించి నప్పుడు వారిని తొందర పెట్టవద్దు, వారితో యుద్ధం చేయవద్దు, ఎందుకంటే వారి దేశం నేను మీకు యివ్వను. ఎందుకంటే వారు లోతు సంతానం. వారు స్వంతంగా ఉంచుకొనేందుకు ఆ దేశాన్ని నేను వారికి యిచ్చాను.’”
DEU 2:20 (ఆ దేశం రెఫాయిము ప్రజల దేశం అనికూడ చెప్పబడింది అంతకు ముందు అక్కడ నివసించిన ప్రజలు వారు, అమ్మోనీయులు వారిని “జంజుమ్మీలు” అని పిలిచేవాళ్లు.
DEU 2:21 జంజుమ్మీ ప్రజలు చాలా బలం గలవారు, వాళ్లు చాలామంది ఉన్నారు. అనాకీము ప్రజల్లా వారు చాలా ఎత్తయిన మనుషులు. కానీ జంజు మ్మీలను నాశనం చేసేందుకు యెహోవా అమోరీయులకు సహాయంచేశాడు. అమ్మోనీయులు జంజుమ్మీల దేశాన్ని స్వాధీనం చేసుకొని యిప్పుడు అక్కడ నివసిస్తున్నారు.
DEU 2:22 శేయీరులో నివసించే ఏశావు ప్రజలకు (ఎదోమీలు) దేవుడు అలాగే చేశాడు. వారు అక్కడ నివసించే హోరీయులను నాశనం చేశారు. ఇంతకు ముందు హొరీయులు నివసించిన చోట యిప్పటికీ ఏశావు ప్రజలు నివసిస్తున్నారు.
DEU 2:23 క్రేతు ప్రజలలో కొందరికి దేవుడు అలాగే చేశాడు. గాజా చుట్టు పక్కల పట్టణాల్లో ఆవీయ ప్రజలు నివసించారు. అయితే క్రేతునుండి కొందరు ప్రజలు వచ్చి ఆవీయ ప్రజలను నాశనం చేశారు. క్రేతునుండి వచ్చిన ఆ ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని, ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు.)
DEU 2:24 “యెహోవా నాతో యిలా చెప్పాడు: ‘ప్రయాణానికి సిద్ధపడండి. అర్నోను నది లోయ దాటి వెళ్లండి. హెష్బోను రాజు. అమ్మోరీవాడగు సీహోను మీద నేను మీకు శక్తినిస్తాను. అతని దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు నేను మీకు శక్తిని యిస్తున్నాను. కనక అతనితో యుద్ధంచేసి, అతని దేశాన్ని స్వాధీనం చేనుకోవటం మొదలుపెట్టండి.
DEU 2:25 ప్రపంచంలోని ప్రజలంతా మీ విషయం భయపడేలా చేయటం నేను ఈ వేళ ప్రారంభిస్తాను. మిమ్మల్ని గూర్చిన సమాచారం వారు విని, భయంతో వణకిపోతారు. వారు మిమ్మల్ని గూర్చి తలచినప్పుడు వాళ్లు భయంతో వణికిపోతారు.’
DEU 2:26 “కెదెమోతు అరణ్యంనుండి హెష్బోను రాజైన సీహోను దగ్గరకు నేను వార్తాహరులను పంపించాను. వారు సీహోనుకు శాంతి ఒడంబడిక సమాచారం తెలిపారు. వారు చెప్పారు:
DEU 2:27 ‘నీ దెశంగుండా మమ్మల్ని వెళ్లనివ్వు. మేము మార్గంలోనే నిలిచి ఉంటాము. మార్గంనుండి కుడికిగాని, ఎడమకుగాని మేము తొలగము.
DEU 2:28 మేము తినే భోజనానికి, తాగే నీళ్లకు వెండి నీకు చెల్లిస్తాము. మేము నీ దేశంలోనుండి నడచి వెళ్తాము, అంతే.
DEU 2:29 మా దేవుడైన యెహోవా మాకు యిస్తున్న దెశంలో ప్రవేశించేందుకే మేము యోర్దాను నది దాటేంతవరకు మమ్మల్ని నీ దేశంలోనుంచి వెళ్ల నివ్వు. ఇతరులు, అంటే శేయీరులో నివసించే ఏశావు ప్రజలు, ఆర్‌లో నివసించే మోయాబు ప్రజలు వారి దేశంగుడా మమ్మల్ని వెళ్లనిచ్చారు.’
DEU 2:30 “కానీ హెష్బోను రాజైన సీహోను తన దేశంలోంచి మమ్మల్ని పోనివ్వలేదు. మీ దేవుడైన యెహోవా అతణ్ణి చాలా మొండికెత్తేటట్టు చేసాడు. సీహోను రాజును మీ అధికారంక్రింద ఉంటానికే యెహోవా ఇలా చేసాడు. ఇప్పుడు ఆయన దీనిని జరిగించాడు.
DEU 2:31 “సీహోను రాజును, ‘అతని దేశాన్ని నేను మీకు యిస్తున్నాను. ఇప్పుడు దేశాన్ని స్వాధీనం చేసుకోండి’ అని యెహోవా నాకు చెప్పాడు.
DEU 2:32 “అప్పుడు యాహసు దగ్గర మాతో యుద్ధం చేయటానికి సీహోను రాజు, ఆతని ప్రజలందరు బయల్దేరి వచ్చారు.
DEU 2:33 అయితే మన యెహోవా దేవుడు అతణ్ణి మనకు అప్పగించాడు. అతణ్ణి, అతని కుమారులను, ఆతని ప్రజలందరిని మనం ఓడించాము.
DEU 2:34 అప్పట్లో సీహోను రాజుకు చెందిన పట్టణాలన్నింటినీ మనం పట్టుకొన్నాము. ప్రతి పట్టణంలో పురుషులను, స్త్రీలను, పిల్లలను ప్రజలందరినీ మనం పూర్తిగా నాశనం చేసాము. ఎవ్వరినీ మనం బతకనియ్యలేదు.
DEU 2:35 మనం పట్టుకొన్న పట్టణాల్లో పశువులను, విలువైన వస్తువులను మాత్రమే మనం తీసుకొన్నాము.
DEU 2:36 అర్నోను లోయ అంచులోని అరోయేరు పట్టణాన్ని, ఆ లోయ మధ్యలో ఉన్న మరో పట్టణాన్ని మనం ఓడించాము. అర్నోను లోయ, గిలాదుమధ్య ఉన్న పట్టాణాలన్ని మనం ఓడించేటట్టు చేసాడు యెహోవా. ఏ పట్టణం కూడా మన యెదుట నిలువలేకపోయింది.
DEU 2:37 కానీఅమ్మోనీయుల దగ్గరకు కూడ మీరు వెళ్లలేదు. యబ్బోకు నదీ తీరాలకుగాని, కొండ దేశంలోని పట్టణాలకుగాని మీరు వెళ్లలేదు. మన దేవుడైన యెహోవా మనకు ఇవ్వని ఏ స్థలం దగ్గరకూ మీరు వెళ్లలేదు.”
DEU 3:1 “మనం మళ్లుకొని బాషాను మార్గంలో వెళ్లాము. బాషాను రాజు ఓగు, అతని ప్రజలందరు ఎద్రేయి దగ్గర మనతో యుద్ధం చేయటానికి వచ్చారు.
DEU 3:2 ‘ఓగును నేను మీకు అప్పగించాలని నిర్ణయించాను గనుక అతని గూర్బి భయపడవద్దు. అతని మనుష్యులందరిని, అతని దేశన్ని నేను మీకు యిస్తాను. హెష్బోనులో ఏలుబడి చేసిన అమోరీ రాజు సీహోనుకు చేసినట్టే, అతన్ని కూడ మీరు ఓడిస్తారు’ అని యెహోవా నాతో చెప్పాడు.
DEU 3:3 “కనుక బాషానురాజు ఓగును, అతని మనుష్యులందరిని మన యెహోవా దేవుడు మనకు అప్పగించాడు. అతని మనుష్యులు ఎవరూ మిగుల కుండా మనం అతన్ని ఓడించాము.
DEU 3:4 తర్వాత అప్పట్లో ఓగుకు చెందిన పట్టణాలన్నింటినీ మనం స్వాధీనం చేసుకొన్నాము. ఓగు ప్రజల పట్టణాలు అన్నింటినీ, బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రాంతం అంతటిలో 60 పట్టణాలను మనం స్వాధీనం చేసుకొన్నాము.
DEU 3:5 ఎత్తయిన గోడలు, బలమైన కడ్డీలుగల గేట్లతో ఈ పట్టణాలు చాలా బలమైనవి. మరియు గోడలులేని పట్టణాలు కూడా చాలా ఉన్నాయి.
DEU 3:6 హెష్బోను రాజైన సీహోను పట్ణణాలకు మనం చేసి నట్టే వీటినికూడా మనం నాశనం చేసాము. ప్రతి పట్టణాన్ని, వాటిలోని ప్రజలందరిని స్త్రీలు, పిల్లలను సహా మనం సమూలంగా నాశనం చేసాము.
DEU 3:7 అయితే ఆ పట్టణాల్లోని పశువులన్నింటినీ, విలువైన వస్తువులను మనకోసం ఉంచుకొన్నాము.
DEU 3:8 “ఈ విధంగా, అమోరీ ప్రజల ఇద్దరు రాజుల వద్దనుండి దేశాన్ని మన స్వాధీనం చేసుకొన్నాం. ఈ దేశాలు యోర్దాను నదికి తూర్పు వైపున ఉన్నాయి. అర్నోను లోయనుండి హెర్మోను పర్వతంవరకు ఉంది ఈ దేశం.
DEU 3:9 (హెర్మోను కొండను సీదోనీ ప్రజలు షిర్యోను అనీ, అమోరీలు శేనీరు అని పిలుస్తారు)
DEU 3:10 బాషాను అంతటిని సాలెకానుండి, ఎద్రేయివరకు, గిలాదు పీఠభూమిలోని పట్టణాలన్నింటినీ మనం మన స్వాధీనం చేసుకొన్నాం. సల్కా ఎద్రేయి బాషానులోని ఓగు రాజ్యంలో పట్టణాలు.”
DEU 3:11 (ఇంకా జీవించి ఉన్న కొద్దిమంది రెఫాయిము ప్రజల్లో బాషాను రాజు ఓగు ఒక్కడే. ఓగు మంచం ఇనుప మంచం. దాని పొడవు 13 అడుగులు, వెడల్పు 6 అడుగలు. అమ్మోనీ ప్రజలు నివసించే రబ్బా పట్టణంలో ఆ మంచం యింకా ఉంది.)
DEU 3:12 “ఆ సమయంలో ఈ దేశాన్ని మన స్వంతం చేసుకొన్నాము. అర్నోను లోయ ప్రక్కగా అరోయేరు దేశాన్ని, గిలాదు కొండ దేశంలో సగం, వాటి పట్టణాలతో సహారూబేను వంశంవారికి, గాదు వంశంవారికి నేను ఇచ్చాను.
DEU 3:13 గిలాదులో మిగతా సగం, బాషాను అంతా మనష్షే వంశంవారిలో సగం మందికి నేను ఇచ్చాను.” (బాషాను ఓగు రాజ్యం. బాషానులో కొంత భాగం అర్గోబు అని పిలువబడింది. బాషాను ప్రాంతం రెఫాయిము దేశం అనికూడ పిలువబడింది.
DEU 3:14 గెషూరు, మయకాతీతు ప్రజల సరిహద్దువరకు గల మొత్తం అర్గోబు ప్రదేశం అంతా మనష్షే వంశీయుడైన యాయీరు పట్టుకొన్నాడు. ఈ ప్రాంతానికి యాయీరు తన స్వంత పేరు పెట్టుకొన్నాడు. హవ్వీత్‌యాయీరు అని పేరు పెట్టాడు. నేటికీ ఆ ప్రాంతం బాషాను యాయీరు పట్టణాలు అని పిలువ బడుతుంది).
DEU 3:15 “గిలాదును నేను మాకీరుకు ఇచ్చాను.
DEU 3:16 మరియు రూబేను వంశానికి, గాదు వంశానికి గిలాదు వద్ద ప్రారంభం అవుతున్న దేశాన్ని నేను ఇచ్చాను. ఈ దేశం అర్నోను లోయనుండి యబ్బోకు నదివరకు ఉంది. (లోయ మధ్య భాగం ఒక సరిహాద్దు. యబ్బోకు నది అమ్మోనీ ప్రజలకు సరిహద్దు)
DEU 3:17 పడమటి దిక్కున అరాబాలోని యోర్దాను నది వారి ప్రాంతానికి సరిహద్దు. ఈ ప్రాంతానికి ఉత్తరాన కిన్నెరెతు సరస్సు, దక్షిణాన అరాబా సముద్రం (ఉప్పు సముద్రం) ఉన్నాయి. తూర్పున అది పిస్గా కొండచరియల క్రింద ఉంది.
DEU 3:18 “ఆ సమయంలో ఆ వంశాలకు నేను ఈ ఆజ్ఞయిచ్చానః ‘మీరు నివసించడానికి యోర్దాను నదికి యివతలి ప్రక్క దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు యిచ్చాడు. అయితే యిప్పుడు మీ యుద్ధ వీరులు వారి ఆయుధాలు చేతపట్టి మిగతా ఇశ్రాయేలు వంశాలను నది దాటించాలి.
DEU 3:19 మీ భార్యలు, మీ చిన్నపిల్లలు, మీ పశువులు (మీకు పశువులు చాలా ఉన్నాయని నాకు తెలుసు) నేను మీకు యిచ్చిన ఈ పట్టణాల్లో యిక్కడ ఉండాలి.
DEU 3:20 అయితే మీ బంధువులైన ఇశ్రాయేలీయులకు యోర్దాను నదికి అవతల ప్రక్క యెహోవా యిస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకొనేంతవరకు మీరు వారికి సహాయం చేయాలి. ఇక్కడ మీకు శాంతి ఉన్నట్టుగానే అక్కడ వారికి యెహోవా శాంతి నిచ్చేంతవరకు వారికి సహాయం చేయండి. అప్పుడు నేను మీకు ఇచ్చిన ఈ దేశానికి మీరు తిరిగి రావచ్చును.’
DEU 3:21 “అప్పుడు యెహోవాషువతో నేను యిలా చేప్పాను: ‘మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకూ చేసిన వాటన్నింటినీ నీవు చూశావు. నివు ప్రవేశించే రాజ్యాలన్నింటికీ యెహోవా అలాగే చేస్తాడు.
DEU 3:22 మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడుతాడు గనుక ఈ దేశాల రాజులకు నీవు భయపడవద్దు.’
DEU 3:23 “ఆ సమయంలో నేను యెహోవాను బతిమాలాను. నేను చెప్పాను,
DEU 3:24 ‘యెహోవా, నా ప్రభువా నేను నీ సేవకుడిని. నీవు చేసే ఆశ్చర్యకరమైన, శక్తివంతమైన విషయాలలో కొద్ది భాగం మాత్రమే నీవు నాకు చూపించావు అని నాకు తెలుసు. నీవు చేసిన శక్తివంతమైన మహత్కార్యాలను చేయగల దేవుడు ఆకాశంలో గాని భూమి మీదగాని లేడు.
DEU 3:25 యోర్దాను నదికి అవతల ప్రక్క ఉన్న ఆ మంచి దేశాన్ని, సౌందర్యవంతమైన ఆ కొండ దేశాన్ని, లెబానోనును చూడటానికి నన్ను అవతలకు దాటి వెళ్లనియ్యి అని నేను నీకు మనవి చేస్తున్నాను.’
DEU 3:26 “కానీ మీ మూలంగా యెహోవా నామీద కోపగించాడు. ఆయన నా మాట వినడానికి తిరస్కరించాడు. యెహోవా నాతోచెప్పాడు, ‘నీకు ఇది చాలు. ఈ విషయం నాతో యింకా చెప్పవద్దు.
DEU 3:27 పిస్గా కొండ శిఖరం మీదికి వెళ్లు. పడమర ఉత్తరం, తూర్పు, దక్షిణం చూడు. నీవు నీ కళ్లతో చూడవచ్చు గాని నీవు మాత్రం ఎన్నటికీ యోర్దాను నది దాటి వెళ్లజాలవు.
DEU 3:28 నీవు తప్పక యెహోషువకు హెచ్చరికలు యివ్వాలి. అతణ్ణి ప్రాత్సహించి, బలపర్చు. ఎందుకంటే ప్రజలను యెహోషువ యోర్దాను నది దాటిస్తాడు. దేశాన్ని స్వాధీనం చేసుకొని దానిలో నివసించేందుకు యెహోషువ వారిని నడిపిస్తాడు. ఈ దేశాన్నే నీవు చూస్తావు.’
DEU 3:29 “అందుచేత మేము బేత్పెయోరు అవతలివైపు లోయలో నిలిచిపాయాము.
DEU 4:1 “ఇక, ఇశ్రాయేలీయులారా, నేను మీకు ప్రబోధించే చట్టాలు, ఆజ్ఞలు వినండి. వాటికి విధేయులవ్వండి. అప్పుడు మీరు బతికి, మీ పూర్వీకుల దేవుడైన యెహోనా మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు.
DEU 4:2 నేను మీకు ఆజ్ఞాపించిన వాటికి మీరేమీ అదనంగా చేర్చకూడదు. అందులో నుంచి మీరేవీ తీసివేయకూడదు. నేను మీకు ఇచ్చిన మీ యెహోవా దేవుని ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి.
DEU 4:3 “బయల్ పెయోరు వద్ద యెహోవా చేసింది మీరు చూశారు. అక్కడ బయలును వెంబడించిన వాళ్లందరిని మీ దేవుడైన యెహోవా నాశనం చేసాడు.
DEU 4:4 అయితే మీ దేవుడైన యెహోవా వైపు నిలిచి ఉన్న మీరంతా ఈనాడు బతికి ఉన్నారు.
DEU 4:5 “చూడండి, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించిన చట్టాలు, నియమాలు నేను మీకు ప్రబోధించాను. మీరు ఏ దేశంలోనైతే ప్రవేశించి, దానిని మీ స్వంతం చేసుకో బోతున్నారో ఆ దేశంలో మీరు ఈ చట్టాలకు విధేయులు కావాలని వాటిని నేను మీకు ప్రబోధించాను.
DEU 4:6 ఈ ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడండి. మీకు జ్ఞానం, తెలివి ఉన్నట్టు యితర రాజ్యాల ప్రజలకు యిది తెలియజేస్తుంది. ఆ దేశాల ప్రజలు ఈ ఆజ్ఞలను విన్నప్పుడు ‘నిజంగా ఈ గొప్ప రాజ్య ప్రజలు (ఇశ్రాయేలీయులు) జ్ఞానులు, తెలివి గలవారు’ అని చెబుతారు.
DEU 4:7 “మనం దేవునికి మొర్రపెట్టినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, మరి ఏ జాతికీ అంత సమీపంగా ఉండే ఏ దేవుడు లేడు.
DEU 4:8 ఈనాడు నేను మీ ఎదుట ఉంచిన ప్రబోధాలంతటి మంచి ఆజ్ఞలు, నియమాలు కలిగి ఉండేందుకు ఏ జాతికూడ అంత గొప్పది కాదు.
DEU 4:9 కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు చూసిన సంగతులను మీరు బతికి ఉన్నంతకాలం మరచి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు, మీ పిల్లలపిల్లలకు మీరు ఈ సంగతులను ప్రబోధించాలి.
DEU 4:10 హోరేబు కొండ దగ్గర మీరు మీ దోవుడైన యెహోవా యెదుట నిలిచిన రోజును జ్ఞాపకం చేసుకోండి. ‘నేను చెప్పే సంగతులు వినడానికి ప్రజలందరినీ సమావేశపర్చు. అప్పుడు భూమి మీద వారు జీవించి నంతకాలం వారు గౌరవించటం నేర్చుకొంటారు. మరియు వారు ఈ సంగతులను వారి పిల్లలకు ప్రబోధిస్తారు’ అని యెహోవా నాతో చెప్పాడు.
DEU 4:11 మీరు దగ్గరకు వచ్చి కొండ దిగువ నిలబడ్డారు. ఆకాశంవరకు ఎగసిన అగ్నితో ఆ కొండ మండింది. దట్టమైన కారుమబ్బులు, కటిక చీకటి.
DEU 4:12 అప్పుడు అగ్నిలోనుండి యెహోవా మీతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడుతున్న స్వరం మీరు విన్నారు కాని, ఏ ఆకారాన్నీ మీరు చూడలేదు. స్వరం మాత్రమే వినబడింది.
DEU 4:13 యెహోవా తన ఒడంబడికను మీతో చెప్పాడు. పది ఆజ్ఞలను ఆయన మీతో చెప్పి, వాటిని పాటించ మని మీకు ఆజ్ఞాపించాడు. ఆ ఒడంబడిక ఆజ్ఞలను ఆయన రెండు రాతి పలకలమీద రాసాడు.
DEU 4:14 ఆ సమయంలో నేను మీకు ఆజ్ఞలను, నియమాలను ప్రబోధించాలనికూడ యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. మీరు స్వాధీనం చేసుకొని, నివసించబోతున్న దేశంలో మీరు పాటించాల్సిన చట్టాలు ఇవి.
DEU 4:15 “హోరేబు (సీనాయి) కొండమీద ఆగ్నిలో నుండి యెహోవా మీతో మాట్లాడిన రోజున భౌతిక మైన ఎలాంటి రూపంతోను మీరు ఆయనను చూడలేదు. దేవునికి ఆకారం లేదు.
DEU 4:16 కనుక జాగ్రత్తగా ఉండండి. ఏ ప్రాణి రూపంలోనైనా ఒక ప్రతిమను లేక విగ్రహాన్ని చేసుకోవడం ద్వారా పాపంచేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. పురుషునివలె లేక స్త్రీవలె కనబడే విగ్రహాన్ని చేయవద్దు.
DEU 4:17 భూమిమీద జంతువులా కనబడే విగ్రహాన్నిగాని, ఆకాశంలో ఎగిరే పక్షిలాంటి విగ్రహంగాని చేయవద్దు.
DEU 4:18 నేలమీద ప్రాకే దేనివలెగాని, సముద్రపు చేపవలెగాని కనబడే ఏ విగ్రహం చేయవద్దు,
DEU 4:19 మరియు మీరు పైన ఆకాశంలోనికి చూచినప్పుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆకాశంలో మీకు కనిపించే వాటన్నింటిని చూచినప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాటిని పూజించి, సేవించాలనే శోధన మీకు కలుగకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రపంచంలో ఆ పనులు ఇతరులు చేస్తే చేసుకోనిచ్చాడు మీ దేవుడైన యెహోవా.
DEU 4:20 ఆయితే మీరు ఆయన ప్రజలు, యెహోవా మిమ్మును ఉజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఈజిప్టు ఇనుప కొలిమిలాంటిది. ఇప్పుడు మీరు ఉన్నట్టుగా, మిమ్మును ఆయన తన స్వంత ప్రజలుగా చేసేందుకు ఆయన మిమ్మును బయటకు తీసుకొని వచ్చాడు.
DEU 4:21 “మీ మూలంగా యెహోవా నా మీద కొపగించాడు. ఆయన ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు. నేను యోర్దాను నది దాటి అవతలికి వెళ్లకూడదు. మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న ఆ మంచి దేశంలోనికి నేను వెళ్లజాలనని ఆయన నాతో చెప్పాడు.
DEU 4:22 కనుక నేను యిక్కడ ఈ దేశంలోనే చావాలి. నేను యోర్దాను నది దాటి వెళ్లలేను. కానీ మీరు మాత్రం త్వరలోనే దాటి వెళ్లి, మీరు నివసించేందుకు ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు.
DEU 4:23 మీ దేవుడైన యెహోవా మీతో చేసిన ఒడంబడికను మీరు మరచి పోకుండా ఆ కొత్త దేశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేయకూడదని మీ యెహోవా దేవుడు మీతో చెప్పిన ఏ రూపంలోనూ ఒక విగ్రహాన్ని చేయకూడదు.
DEU 4:24 ఎందుకంటే మీ దేవుడైన యెహోవా తన ప్రజలు ఇతర దేవుళ్లను పూజించడం అసహ్యించుకొంటాడు.పైగా యెహోవా నాశనం చేసే అగ్నిలా ఉండగలడు.
DEU 4:25 “మీరు ఆ దేశంలో చాలాకాలం జీవించిన తర్వాత, మీకు పిల్లలు, పిల్లల పిల్లలు కలుగుతారు. మీరు ముసలి వాళ్లవుతారు. అప్పుడు మారిపొయి మీ జీవితాన్ని పాడు చేసుకొనవద్దు. దేని రూపంలోనూ ఒక విగ్రహాన్ని చేయవద్దు. అలాగు యెహోవాకు విరుద్ధరగా కీడు చేస్తే, అది ఆయనకు కోపం పుట్టిస్తుంది.
DEU 4:26 ఆ కీడు మీరు జరిగిస్తే, ఇలా జరుగుతుందని నేడు ఆకాశం భూమి మీమీద సాక్షులుగా ఉంటారు; త్వరలోనే మీరు ఆ దేశంలో ఉండకుండాపోతారు. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ఇప్పుడు మీరు యోర్దాను నది దాటుతున్నారు. కానీ అక్కడ మీరు ఎక్కువ కాలం జీవించరు. మీరు సర్వనాశనం అవుతారు.
DEU 4:27 దేశదేశాలకు యెహోవా మిమ్మల్ని చెదరగొడతాడు. యెహోవా మిమ్మల్ని పంపించే ఆ దేశాల్లో జీవించేందుకు మీరు కొద్దమంది మాత్రమే ఉంటారు.
DEU 4:28 మనుష్యులు చేసిన దేవుళ్లను చెక్కతో రాయితో చేయబడి, కానలేని, వినలేని, తినలేని, వాసన చూడలేని దేవుళ్లను అక్కడ మీరు సేవిస్తారు.
DEU 4:29 అయితే అక్కడ, ఆ ఇతర దేశాల్లో మీరు మీ దేవుడైన యెహోవా కోసం చూస్తారు. మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మీరు ఆయన కోసం చూస్తే, మీరు ఆయనను కనుగొంటారు.
DEU 4:30 మీరు కష్టంలో ఉన్నప్పుడు — ఆ సంగతులన్నీ మీకు సంభవించినప్పుడు – మీరు మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వచ్చి, ఆయనకు విధేయులవుతారు.
DEU 4:31 మీ దేవుడైన యెహోవా కృపగల దేవుడు ఆయన మిమ్మల్ని విడిచి పెట్టడు. ఆయన మిమ్మల్ని నాశనం చేయడు. మీ పూర్వీకులకు ఆయన వాగ్దానం చేసిన ఒడంబడికను ఆయన మరచిపోడు.
DEU 4:32 “ఇంతకు పూర్వం యింత గొప్పది ఏమైనా జరిగిందా? ఎనడూ లేదు. గతాన్ని చూడండి, మీరు పుట్టక ముందు జరిగిన వాటన్నింటినీ గూర్చి ఆలోచించండి. భూమిమీద దేవుడు మనిషిని సృజించిన అనాది కాలానికి వెళ్లండి. ప్రపంచంలో ఎక్కడేగాని, ఎన్నడేగాని, జరిగిన వాటన్నింటినీ చూడండి. ఇంతటి గొప్ప విషయాన్ని గూర్చి ఎన్నడైనా ఎవరైనా విన్నారా? లేదు.
DEU 4:33 దేవుడు అగ్నిలోనుండి మీతో మాట్లాడగా మీరు వినికూడ యింకా బ్రతికే ఉన్నారు. అలా యింకెవరికైనా ఎన్నడైనా జరిగిందా? లేదు.
DEU 4:34 మరియు ఎప్పుడైనా, ఏ దేవుడైనా మరో దేశంలో నుండి తనకోసం ఒక ప్రజను తీసుకొనేందుకు ప్రయత్నించాడా? లేదు. కానీ మీ యెహోవా దేవుడు అద్భుత కార్యాలను చేయటం మీ మట్టుకు మీరే చూశారు. ఆయన తన శక్తిని, బలాన్ని మీకు చూపించాడు. ప్రజలను పరీక్షించిన కఎ్టాలను మీరు చూశారు. అద్భుతాలు మహాత్యాలు మీరు చూశారు. సంభవించిన యుద్ధాలు, భయంకర విషయాలు మీరు చూశారు.
DEU 4:35 ఆయనే దేవుడు అని మీరు తెలుసుకొనేందుకు ఈ సంగతులను యెహోవా మీకు చూపించాడు. ఆయనలాంటి దేవుడు ఇంకొకడు ఎవరూ లేరు.
DEU 4:36 యెహోవా మీకు ఒక పాఠం ప్రబోధించేందుకు పరలోకంనుండి ఆయన తన స్వరాన్ని మిమ్మల్ని విననిచ్చాడు. భూమి మీద ఆయన తన మహా అగ్నిని మిమ్మల్ని చూడనిచ్చి, దానిలోనుండి ఆయన మీతో మాట్లాడాడు.
DEU 4:37 “యెహోవా మీ వూర్వీకులను ప్రేమించాడు. అందుకే వారి సంతతివారైన మిమ్మల్ని ఆయన ఏర్పర చుకొన్నాడు. మరియు అందుకే ఆయన మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. ఆయన మీతో ఉండి తన మహా శక్తితో మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు.
DEU 4:38 మీరు ముందుకు సాగినప్పుడు, మీ ముందు బలమైన గొప్ప రాజులను యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. అయితే వారి దేశంలోనికి యెహోవా మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. మీరు నివసించేందుకు వారి దేశాన్ని ఆయన మీకు యిచ్చాడు. పైగా నేటికీ ఈ దేశం యింకా మీదే.
DEU 4:39 “అందుచేత నేడు మీరు జ్ఞాపకం చేసుకొని, యెహోవా దేవుడని అంగీకరించాలి. పైన ఆకాశంలోను, క్రింద భూమి మీదను ఆయనే దేవుడు. ఇంక వేరే ఏ దేవుడూ లేడు.
DEU 4:40 మరియు ఈ వేళ నేను మీకు యిచ్చే ఆయన చట్టాలు, ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి. అప్పుడు మీకూ, మీ తర్వాత జీవించే పిల్లలకు అంతా శుభం అవుతుంది. శాశ్వతంగా మీదిగా ఉండేందుకు మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న దేశంలో మీరు దీర్ఝకాలం జీవిస్తారు.”
DEU 4:41 అప్పుడు యోర్దాను నదికి తూర్పున మూడు పట్టణాలను మోషే ఏర్పాటు చేసాడు.
DEU 4:42 ప్రమాదవ శాత్తూ ఒక వ్యక్తి మరో వ్యక్తిని చంపేస్తే, ఆ వ్యక్తి ఈ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయి క్షేమంగా ఉండొచ్చు. అతడు చంపేసిన మనిషిని అతడు ద్వేషించలేదు, అతణ్ణి చంపాలని అనుకొలేదు అంటే, అతడు ఈ పట్టణాల్లో ఒకదానికి వెళ్లి, మరణ శిక్షలేకుండా ఉండవచ్చు.
DEU 4:43 మోషే ఏర్పాటు చేసిన ఈ మూడు పట్టణాలు ఏవంటేః రూబేను ప్రజలకోసం అరణ్యపు పీఠభూముల్లోని బేసెరు; గాదు ప్రజలకోసం గిలాదులోని రామోతు, మనష్షే ప్రజలకోసం బాషానులోని గోలాను.
DEU 4:44 ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని మోషేయిచ్చాడు.
DEU 4:45 ఆ ప్రజలు ఈజిప్టునుండి బయటకు వచ్చివ తర్వాత ఈ ప్రబోధాలు, ఆజ్ఞలు, నియమాలు మోషే వారికి యిచ్చాడు.
DEU 4:46 యోర్దాను నదికి తూర్పు వైపున వారు ఉన్నప్పుడు బేత్‌పయోరు అవతల లోయలో మోషే వారికి ఈ ఆజ్ఞలు యిచ్చాడు. హెప్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోను దేశంలో అప్పుడు వారు ఉన్నారు. (వారు ఉజిప్టునుండి బయటకు వచ్చినప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలూ సీహోనును ఓడించారు.
DEU 4:47 వారికోసం ఉంచు కొనేందుకు వారు సిహోను దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. బాషాను రాజైన ఓగు దేశాన్ని కూడ వారు స్వాధీనం చేసుకొన్నారు. ఈ యిద్దరు అమోరీ రాజులు యోర్దాను నది తూర్పువైపున నివసించారు.
DEU 4:48 అర్నోను లోయను ఆనుకొనివున్న అరోయేరు పట్టణం నుండి, హెర్మోను కొండ అనబడిన సిరియోను కొండవరకు ఉంది ఈ దేశం.
DEU 4:49 యోర్దాను నదికి తూర్పునవున్న యోర్దాను లోయ ప్రదేశం అంతా ఈ దేశంలోనే ఉంది. దక్షిణాన మృత సముద్రాన్ని, తూర్పున పిస్గా కొండ చరియను తాకుతుంది ఈ దేశం.)
DEU 5:1 మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపరచి, వారితో యిలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, నేడు మీకు నేను చెప్పే ఆజ్ఞలను, నియమాలను వినండి. ఈ ఆజ్ఞలను నేర్చుకొని, తప్పక వాటికి విధేయులవ్వండి.
DEU 5:2 హోరేబు(సీనాయి) కొండ దగ్గర మన దేవుడైన యెహోవా మనతో ఒక ఒడంబడిక చేసాడు.
DEU 5:3 యెహోవా ఈ ఒడంబడికను మన పూర్వీకలతో చేయలేదుగాని మనతో, అవును నేడు సజీవులుగా ఇక్కడ ఉన్న మన అందరితో చేసాడు.
DEU 5:4 ఆ కొండ దగ్గర యెహోవా మీతో ముఖాముఖిగా మాట్లాడాడు. అగ్నిలో నుండి ఆయన మీతో మాట్లడాడు.
DEU 5:5 ఎందుకంటే మీరు ఆ అగ్నికి భయపడి. కొండమీదికి వెళ్లేందుకు నిరాకరించారు. కనుక ఆ సమయంలో యెహోవా చెప్పిన దానిని మీతో చెప్పడానికి నేను యెహోవాకు, మీకు మధ్య నిలబడ్డాను. యెహోవా ఇలా చెప్పాడు:
DEU 5:6 ‘మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుణ్ణి యెహోవాను నేనే. కనుక మీరు ఈ ఆజ్ఞలకు విధేయలుగా ఉండండి.
DEU 5:7 ‘నన్ను తప్ప మరి ఏ దేవుళ్లనూ ఆరాధించవద్దు.
DEU 5:8 ‘పైన ఆకాశంలోగాని, క్రింద భూమిమీదగాని, ఆ క్రింద సముద్రంలోగాని దేని విగ్రహమైనా, రూపం అయినా చేసుకోవద్దు.
DEU 5:9 ఎలాంటి విగ్రహాలను కూడా పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే నేనే మీ దేవుడైన యెహోవాను. మరియు వాళ్ల పిల్లలను, పిల్లల పిల్లలను, ఆ పిల్లల పిల్లలను నేను శిక్షిస్తాను.
DEU 5:10 అయితే నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలకు విధేయు లయ్యే ప్రజలయెడల నేను చాలా దయ చూపిస్తాను. అలాంటివారి వంశీయుల్లో వెయ్యితరాల వారివరకు నేను దయ చూపిస్తాను.
DEU 5:11 ‘మీ దేవుడైన యెహోవా పేరును వ్యర్థంగా పలుకవద్దు. ఒక వ్యక్తి యెహోవా పేరును వ్యర్థంగా పలికితే ఆతడు దోషి. యెహోవా ఆతణ్ణి నిర్దోషిగా ఎంచడు.
DEU 5:12 ‘సబ్బాతు రోజకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇచ్చేందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి. వారం లోని ఇతర దినాలకంటే విశ్రాంతి దినాన్ని వేరుగా ఉంచమని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞ యిచ్చాడు.
DEU 5:13 మొదటి ఆరు రోజులు మీ పని చేసుకొనేందుకు.
DEU 5:14 ఆయితే ఏడో రోజు మీ దేవుడైన యెహోవా గౌరవార్థం విశ్రాంతి రోజు ఆవుతుంది. కనుక విశ్రాంతి రోజున ఏ వ్యక్తీ పనిచేయకూడదు. అంటే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ ఆడ, మగ బానిసలు, మీ ఆవులు, మీ గాడిదలు, ఏ ఇతర జంతువులు, మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులు, మీ బానిసలు కూడ మీవలెనే విశ్రాంతి తీసుకోగలగాలి.
DEU 5:15 ఈజిప్టులో ఉన్నప్పుడు మీరూ బానిసలే అని మరచిపోవద్దు. మీ దేవుడైన యెహోవా తన మహా శక్తితో ఈజిప్టునుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేసాడు. అందుచేతనే ఎల్లప్పుడూ సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా ఆచరించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.
DEU 5:16 ‘నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. నీవు యిలా చేయాలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞ యిచ్చాడు. నీవు ఈ ఆజ్ఞను పాటిస్తే, నీవు చాలాకాలం బ్రతుకుతావు. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో అంతా శుభం అవుతుంది.
DEU 5:17 ‘ఎవరినీ హత్య చేయవద్దు.
DEU 5:18 ‘వ్యభిచార పాపం చేయవద్దు.
DEU 5:19 ‘ఏమీ దొంగిలించకు.
DEU 5:20 ‘మరో వ్యక్తి చేసిన దాన్నిగూర్చి అబద్ధసాక్షము చెప్పకు.
DEU 5:21 ‘మరొకరికి చెందినవి నీవై యుంటే బాగుండునని ఆశించకు. ఇంకో వ్యక్తి భార్యను, అతని యింటిని, అతని పొలాలను, అతని మగ లేక ఆడ పనివారిని, అతని అవులను, ఆతని గాడిదలనుగాని ఇతరులకు చెందిన దేనినిగాని నీవు ఆశించకూడదు.’”
DEU 5:22 “మీరంతా కలిసి ఆ కొండ దగ్గర ఉన్నప్పుడు మీ అందరికీ ఈ ఆజ్ఞలను యెహోవా యిచ్చాడు. అగ్ని, మేఘం, గాఢాంధకారంలోనుండి వచ్చిన పెద్ద శబ్ధంతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఈ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత యింకేమీ చెప్పలేదు. ఆయన తన మాటలను రెండు రాతి పలకలమీద వ్రాసి వాటిని నాకు ఇచ్చాడు.
DEU 5:23 “పర్వతం అగ్నితో మండిపోతున్నప్పుడు అంధ కారంలోనుంచి వచ్చిన ఆ స్వరం మీరు విన్నారు. అప్పుడు, మీ వంశాల నాయకులు అందరూ, మీ పెద్దలూ నా దగ్గరకు వచ్చారు.
DEU 5:24 వారు అన్నారు: ‘మన దేవుడైన యెహోవా తన మహిమను, మహాత్యాన్ని మాకు చూపించాడు. ఆయన అగ్నిలోనుండి మాట్లాడటం మేము విన్నాము. ఒక మనిషితో దేవుడు మాట్లాడిన తర్వాత కూడ ఆ మనిషి బతకటం సాధ్య మేనని ఈవేళ మేము చూశాము.
DEU 5:25 కానీ మన దేవుడైన యెహోవా మాతో ఇంకొక్కసారి మాట్లాడటం గనుక మేము వింటే మేము తప్పకుండా చస్తాము. ఆ భయంకర అగ్ని మమ్మల్ని నాశనం చేసేస్తుంది. కానీ మేము చావటం మాకు యిష్టంలేదు.
DEU 5:26 సజీవ దేవుడు మాట్లాడటం మేము విన్నట్టుగా వినికూడ బతికిన మనిషి ఎన్నడూ ఎవ్వడూ లేడు.
DEU 5:27 మోషే, నీవు దగ్గరగా వెళ్లి, మన దేవుడైన యెహోవా చెబుతున్న సంగతులన్నీ విను. తర్వాత, యెహోవా నీకు చెప్పే విషయాలన్నీ నీవు మాకు చెప్పు. మేము నీ మాట వింటాము, నీవు చెప్పేది అంతా చేస్తాము.’
DEU 5:28 “మీరు నాతో చెప్పిన సంగతులను యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో అన్నాడు, ‘ఈ ప్రజలు చెప్పిన విషయాలు నేను విన్నాను. వారు చెప్పింది అంతా మంచిదే.
DEU 5:29 వారు ఎల్లప్పుడూ వారి హృదయాల్లో నన్ను గౌరవించి, నా ఆజ్ఞలన్నింటికీ విధేయులైతే బాగుండును అని మాత్రమే నా కోరిక. అప్పుడు వాళ్లకు, వాళ్ల సంతతివారికి సర్వం శుభం అవుతుంది.
DEU 5:30 “‘వెళ్లి, ప్రజలందరినీ వారి గుడారాలకు వెళ్లి పొమ్మని చెప్పు.
DEU 5:31 అయితే మోషే, నీవు యిక్కడ నాకు దగ్గరగా నిలబడు. నీవు వాళ్లకు నేర్పించాల్సిన ఆజ్ఞలు, చట్టాలు, నియమాలు అన్నీ నీకు నేను చెబుతాను. వారు జీవించేందుకు నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఈ పనులు చేయాలి’.
DEU 5:32 “అందుచేత యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసేందుకు మీరు జాగ్రత్తగా వుండాలి. మీరు దేవుణ్ణి అనుసరించటం మానకూడదు.
DEU 5:33 మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన విధంగా మీరు జీవించాలి. అప్పుడు మీరు జీవించడం కొనసాగుతుంది, మీకు అంతా శుభ ప్రదం అవుతుంది. మరియు మీది కాబోతున్న ఆ దేశంలో మీ జీవితం పొడిగించబడుతుంది.
DEU 6:1 “నేను మీకు ప్రబోధించాలని మీ యెహోవా దేవుడు నాకు చెప్పిన ఆజ్ఞలు, నియమాలు, ఇవి: మీరు నివసించేందుకు ప్రవేశిస్తున్న దేశంలో ఈ ఆజ్ఞలకు లోబడండి.
DEU 6:2 మీరూ, మీ సంతతివారు బదికినంత కాలం మీ దేవుడైన యెహోవాను గౌరవించాలి. నేను మీకు యిచ్చే ఆయన నియమాలు, ఆజ్ఞలు అన్నింటికీ మీరు విధేయులు కావాలి. మీరు ఇలా చేస్తే, ఆ కొత్త దేశంలో మీరు దీర్ఘకాలం బతుకుతారు.
DEU 6:3 ఇశ్రాయేలు ప్రజలారా, జాగ్రత్తగా వినండి. ఈ ఆజ్ఞలకు విధేయులుగా ఉండండి. అప్పుడు మీకు అంతా శుభం అవుతుంది. మరియు మీరు ఒక గొప్ప రాజ్యం అవుతారు. ఐశ్వర్యవంతమైన ఆ మంచి దేశంలొ వీటన్నింటినీ మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసాడు.
DEU 6:4 “ఇశ్రాయేలు ప్రజలారా వినండి: యెహోవా ఒక్కడు మాత్రమే మన దేవుడు.
DEU 6:5 మరియు మీరు మీ నిండు హృదయంతోను, మీ నిండు ఆత్మతోను, మీ నిండు బలంతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.
DEU 6:6 ఈవేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలను ఎల్ల ప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి.
DEU 6:7 వాటిని మీ పిల్లలకు నేర్పించేందుకు జాగ్రత్త వహించండి. మీరు మీ యింట్లో కూర్చున్నప్పుడు, మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ ఆజ్ఞలను గూర్చి మాట్లాడుతూ ఉండండి. మీరు పడుకొనేప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుతు ఉండండి.
DEU 6:8 నా ప్రబోధాలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు సహాయకరంగా ఈ ఆజ్ఞలను మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంలా ధరించండి.
DEU 6:9 మీ ఇండ్ల ద్వార బంధాలమీద, గవునుల మీద వాటిని వ్రాయండి.”
DEU 6:10 “మీకు యిస్తానని చెప్పి మీ పూర్వీకులైన అబ్రాహాము ఇస్సాకు, యాకోబులకు ఆయన వాగ్దానం చేసిన ఆ దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకొనివస్తాడు. అప్పుడు మీరు నిర్మించని గొప్ప, ధనిక పట్టణాలను ఆయన మీకు ఇస్తాడు.
DEU 6:11 మీరు సమకూర్చని మంచి వస్తువుల తో నిండిపోయిన గృహాలను ఆయన మీకు ఇస్తాడు. మీరు త్రవ్వని బావులను యెహోవా మీకు ఇస్తాడు. మీరు నాటని ద్రాక్షాతోటలను, ఒలీవ చెట్లను యెహోవా మీకు ఇస్తాడు. భోజనానికి మీకు సమృద్ధిగా ఉంటుంది.
DEU 6:12 “కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చిన యెహోవాను మరచిపోకండి.
DEU 6:13 మీ దేవుడైన యెహోవాను గౌరవించి ఆయనను మాత్రమే సేవించండి. ఆయన పేరు మీద మాత్రమే ప్రమాణాలు చేయాలి. (బూటకపు దేవుళ్ల పేర్లు ఉపయోగించవద్దు).
DEU 6:14 మీరు యితర దేవుళ్లను అనుసరించకూడదు. మీ చుట్టూ నివసించే ప్రజల దేవుళ్లను మీరు అనుసరించకూడదు.
DEU 6:15 మీ దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో ఉన్నాడు. మరియు మీరు ఆ ఇతర దేవుళ్లను వెంబడిస్తే, యెహోవాకు మీ మీద చాలా కొపం వస్తుంది. మిమ్మల్ని ఈ భూమి మీద ఉండకుండా ఆయన నాశనం చేస్తాడు. ఆయన ప్రజలు ఇతర దేవుళ్లను పూజించటం యెహోవా ద్వేషిస్తాడు.
DEU 6:16 “మస్సాలో మీరు ఆయనను పరీక్షించినట్టుగా మీ దేవుడైన యెహోవాను మీరు పరీక్షించకూడదు.
DEU 6:17 మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు తప్పనిసరిగా విధేయులు కావాలి. ఆయన మీకు ఇచ్చిన ప్రబోధాలు, ఆజ్ఞలు అన్నింటినీ మీరు పాటించాలి.
DEU 6:18 సరైనవి, మంచివి, యెహోవాను సంతోషపెట్టేవి మాత్రమే మీరు చేయాలి. అప్పుడు మీకు అంతా మేలు జరిగి, యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీరు ప్రవేశించి, ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు.
DEU 6:19 మరియు యెహోవా చెప్పినట్టు మీరు మీ శత్రువులందరినీ బలవంతంగా బయటకు వెళ్లగొడ్తారు.
DEU 6:20 “భవిష్యత్తులో ‘మన దేవుడైన యెహోవా మనకు ప్రబోధాలు, ఆజ్ఞలు, నియమాలు యిచ్చాడు గదా వాటి అర్థం ఏమిటి?’ అని నీ కుమారుడు నిన్ను అడగవచ్చును.
DEU 6:21 అప్పుడు నీవు నీ కుమారునితో ఇలా చెప్పాలి, ‘మనం ఈజిప్టులో ఫరోకు బానిసలం, అయితే యెహోవా మహా బలంతో ఈజిప్టునుండి మనలను బయటకు తీసుకొని వచ్చాడు.
DEU 6:22 మహాగొప్ప, ఆశ్చర్యకరమైన నిదర్శనాలు, అద్భుతాలు యెహోవా మనకు చూపించాడు. ఈజిప్టు ప్రజలకు, ఫరోకు, ఫరో ఇంటివాళ్లకు ఆయన ఈ సంగతులు జరిగించటం మనం చూశాము.
DEU 6:23 మరియు యెహోవా మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకు ఇచ్చేందుకు ఆయన మనలను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు.
DEU 6:24 ఈ ప్రబోధాలన్నీ పాటించాలని యెహోవా మనకు ఆజ్ఞాపించాడు. అప్పుడు, మనం ఇప్పుడు ఉన్నట్టుగా ఎల్లప్పుడూక్షేమంగా సజీవులంగా ఉండేటట్లు మన దేవుడైన యెహోవా మనలను కాపాడతాడు.
DEU 6:25 మనం పాటించాలని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారం మనం ఆజ్ఞలన్నింటికీ విధేయులం అవటం మనకు మంచిదిగా దేవుడైన యెహోవా చూస్తాడు.’
DEU 7:1 “మీరు స్వాధీనం చేసుకొనేందుకు ప్రవేశించబోతున్న దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్ములను తీసుకొని వస్తాడు. అనేక రాజ్యాలవాళ్లను — హిత్తీయులు, గిర్గాషీయులు, ఆమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీ యులు, యెబూసీయులు – మీకంటె బలంగల ఏడు గొప్ప రాజ్యాల వాళ్లను మీకోసం యెహోవా బలవంతంగా బయటకు వెళ్లగొడ్తాడు.
DEU 7:2 ఈ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా మీ అధికారం క్రింద ఉంచుతాడు. మీరు వారిని ఓడిస్తారు. మీరు వాళ్లను సర్వనాశనం చేయాలి. వాళ్లతో ఏ ఒడంబడిక చేసుకోవద్దు. వాళ్లకు దయ చూపించవద్దు.
DEU 7:3 ఆ ప్రజల్లో ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు, ఆ ఇతర రాజ్యాలకు చెందిన ఎవరినీ మీ కుమారులనుగాని కుమారైలనుగాని పెళ్లి చేసుకోనివ్వవద్దు.
DEU 7:4 ఎందుకంటే మీ పిల్లలు నన్ను వెంబడించకుండా ఆ ఇతరులు వారిని మళ్లిస్తారు. అప్పుడు మీ పిల్లలు ఇతర దేవుళ్లను సేవిస్తారు. కనుక యెహోవా మీ మీద కోపగిస్తాడు. వెంటనే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.
DEU 7:5 “ఈ రాజ్యలకు మీరు చేయాల్సింది యిదే, మీరు వారి బలిపీఠాలను విరుగగొట్టి, వాళ్ల స్మారక శిలలను ముక్కలుగా చేయాలి. వారి ఆశేర స్తంభాలను నరికి వేసి, వారి విగ్రహాలను కాల్చివేయండి.
DEU 7:6 ఎందుకంటే మీరు యెహోవాకు స్వంత ప్రజలు. భూమిమీద మొత్తం ప్రజలందరిలో మీరు ఆయనకు ప్రత్యేక ప్రజగా ఉండేందుకు — కేవలం ఆయనకు మాత్రమే చెందిన వారుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొన్నాడు.
DEU 7:7 యెహోవా ఎందుకు ప్రేమించి, ఏర్పాటు చేసుకొన్నాడు? ఇతర ప్రజలకంటే మీరు ఎక్కువమంది ఉన్నారని కాదు. సమస్త జనులలో మీరే అతి తక్కువ సంఖ్యవారు.
DEU 7:8 అయితే యెహోవా మహాశక్తితో మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. బానిసత్వంనుండి ఆయన మిమ్మల్ని స్వతంత్రులను చేసాడు. ఈజిప్టు రాజు ఫరో అధికారంనుండి ఆయన మిమ్మల్ని విడుదల చేసాడు. ఎందు కంటే యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుకను, మీ పూర్వీకులకు ఆయన చేసిన వాగ్దానాన్ని నిలుపు కోవాలనీ ఆయన అలా చేసాడు.
DEU 7:9 “అందుచేత మీ దేవుడైన యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన నమ్మదగినవాడు అని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన తన ఒడంబడికను నిలబెట్టుకొంటాడు. ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యే వారరందరికీ ఆయన తన ప్రేమ, దయ చూపుతాడు. వేయి తరాలవరకు ఆయన తన ప్రేమ, దయ చూపిస్తూనే ఉంటాడు.
DEU 7:10 అయితే యెహోవాను ద్వేషించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు. వాళ్లను ఆయన నాశనం చేస్తాడు. ఆయనను ద్వేషించే మనిషిని శిక్షించటంలో ఆయన నిదానించడు.
DEU 7:11 కనుక నేడు మీకు నేను ఇస్తున్న ఆజ్ఞలు, చట్టాలు నియమాలు విధేయత చూపే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.
DEU 7:12 “మీరు ఈ ఆజ్ఞలను ఆలకించి, వాటికి జాగ్రత్తగా విధేయులైతే, మీ దేవుడైన యెహోవా మీతో చేసిన ప్రేమ ఒడంబడికను నిలబెట్టుకొంటాడు. మీ పూర్వీకులకు ఆయన యిది వాగ్దానం చేసాడు.
DEU 7:13 ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఆశిర్వదిస్తాడు. మీ ప్రజల సంఖ్య యింకా యింకా పెరిగిపోతుంది. ఆయన మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. మీ పొలాలను మంచి పంటలతో ఆయన ఆశీర్వదిస్తాడు. ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె ఆయన మీకు ఇస్తాడు. మీ ఆవులకు దూడలను, గొర్రెలకు గొర్రె పిల్లలను ఇచ్చి ఆయన ఆశీర్వాదిస్తాడు. మీకు ఇస్తానని ఆయన మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీకు ఈ ఆశీర్వాదాలన్నీ లభిస్తాయి.
DEU 7:14 “ప్రజలదరికంటే మీరు ఎక్కువగా ఆశీర్వదించబడతారు. భార్వాభర్తల ప్రతి జంటకూ పిల్లలు పుడతారు. మీ పశువులకు దూడలు పుడతాయి.
DEU 7:15 సమస్త రోగాలనూ యెహోవా మీ నుండి తొలగించివేస్తాడు. ఇంతకు ముందు ఈజిప్టులో మీకు కలిగిన భయంకర వ్యాధులు ఏవీ ఆయన మీకు రానివ్వడు. కానీ ఈ వ్యాధులన్నింటిని మిమ్మల్ని ద్వేషించేవారిమీద ఆయన ఉంచుతాడు.
DEU 7:16 మీరు ఎవరిని ఓడించేందుకు మీ దేవుడైన యెహోవా సహాయం చేస్తాడో, ఆ ప్రజలందరినీ మీరు నాశనం చేయాలి. వారిమీద జాలి పడవద్దు. మరియప వారి దేవుళ్లను సేవించవద్దు. ఎందు కంటే వారు మీకు ఉరియవుతారు. మీరు వారి దేవుళ్లను సేవిస్తే, మీరు శిక్ష అనుభవిస్తారు.
DEU 7:17 “‘ఈ రాజ్యాలు మనకంటే బలమైనవి. వారిని మనం ఎలా వెళ్లగొట్టగలము?’ అని మీ హృదయంలో అనుకోవద్దు.
DEU 7:18 వారిని గూర్చి మీరు భయపడకూడదు. ఫరోకు, ఈజిప్టు ప్రజలందరకు మీ దేవుడైన యెహోవా చేసిన దానిని మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి.
DEU 7:19 ఆయన వారికి కలిగించిన మహా కష్టాలను మీరు చూశారు. ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు మీరు చూశారు. మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించేందుకు యెహోవా ప్రయోగించిన ఆయన మహాశక్తిని, బలాన్ని మీరు చూశారు. మీరు భయపడే వారందరి మీదా అదే శక్తిని మీ దేవుడైన యెహోవా ప్రయోగిస్తాడు.
DEU 7:20 “మీ దగ్గర్నుండి పారిపోయి, దాక్కున్న వాళ్లందరినీ పట్టుకొనేందుకు మీ దేవుడైన యెహోవా కందిరీగలను సహా పంపిస్తాడు. ఆ ప్రజలందరినీ దేవుడు నాశనం చేస్తాడు.
DEU 7:21 మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు గనుక వారినిగూర్చి భయపడవద్దు. ఆయన మహాగొప్పవాడు. భీకరుడునైన దేవుడు.
DEU 7:22 ఆ రాజ్యాల ప్రజలు మీ దేశాన్ని కొంచెంకొంచెంగా విడిచి వెళ్లి పోయేటట్టు మీ దేవుడైన యెహోవా వారిని బలవంతపెడ్తాడు. వాళ్లందరినీ ఒకేసారిగా మీరు నాశనం చేయరు. మీరు అలా చేస్తే మీకు అడవి మృగాల బాధ విపరీతంగా పెరిగిపోతుంది.
DEU 7:23 అయితే మీ దేవుడైన యెహోవా ఆ రాజ్యాలను మీకు ఇస్తాడు. వారు నాశనం అయ్యేంతవరకు గొప్ప చిక్కుతో యెహోవా వారిని యుద్ధంలో గందరగోళ పరుస్తాడు.
DEU 7:24 వారి రాజులను ఓడించటానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు. మీరు వారిని చంపేస్తారు, వారు ఎన్నడైనా జీవించిన విషయం కూడా ప్రపంచం మరచిపోతుంది. మిమ్మల్ని అడ్డగించటం ఏ మనిషి తరం కాదు. మీరు వాళ్లందరినీ నాశనం చేస్తారు.
DEU 7:25 “మీరు వారి దేవుళ్ల విగ్రహాలను తప్పక కాల్చి వేయాలి. ఆ విగ్రహాల మీద ఉండే బంగారంకానీ వెండి గానీ మీరు తీసుకొంటే బాగుంటుందని మీరు ఆశించ కూడదు. ఆ వెండిగాని, బంగారంగాని మీకోసం మీరు తీసుకోకూడదు. మీరు అలా చేస్తే, మీరు చిక్కులో పెట్టబడతారు. (మీ జీవితాలు నాశనం అవుతాయి) ఎందుకంటే మీ యెహోవా దేవునికి ఆ విగ్రహాలు అసహ్యం.
DEU 7:26 యెహోవా అసహ్యించుకొనే ఆ విగ్రహాల్లో ఒక్కటికూడా మీరు మీ ఇంటిలోనికి తీసుకొని రాకూడదు. ఆ విగ్రహాలను మీరు మీ ఇంట్లోకి తీసుకొనివస్తే, ఆ విగ్రహాలవలె మీరూ కూడా నాశనం చేయబడతారు. మీరు వాటిని బాగా అసహ్యించుకోవాలి. ఆ విగ్రహాలను నాశనం చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు.
DEU 8:1 “ఈ వేళ నేను మీకు యిచ్చే ఆజ్ఞలు అన్నింటినీ మీరు విని, విధేయులు కావాలి. అప్పుడు మీరు జీవిస్తారు. మీరు యింకా యింకా అనేకమందిగా పెరిగి పోతారు. మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసిన దేశంలో మీరు ప్రవేశించి, జీవిస్తారు.
DEU 8:2 ఈ 40 సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అరణ్యంలో నడిపించిన ఈ ప్రయాణం మొత్తం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. మిమ్మల్ని ఆయన దీనులుగా చేయాలి అనుకొన్నాడు. మీరు ఆయన ఆజ్ఞలకు విధేయులవుతున్నారో లేదో, మీ హృదయంలోని సంగతి ఆయన తెలుసుకోవాలి అనుకొన్నాడు.
DEU 8:3 యెహోవా మిమ్మల్ని అణచి వేసి, ఆకలితో ఉండనిచ్చాడు. తర్వాత మీ పూర్వీకులు ఎన్నడూ చూడని, మీకు యింతకు ముందు తెలియని మన్నాతో మిమ్మల్ని ఆయన పోషించాడు. యెహోవా ఎందుకు ఈ సంగతులు జరిగించాడు? ఎందుకంటే మనుష్యుల్ని ఆహరం మాత్రమే బ్రతికించదు అని మీరు తెలుసుకోవాలని ఆయన కోరాడు గనుక. మనుష్యులు యెహోవా నోటనుండి వచ్చే ప్రతి మాటవలన బద్రుకుతారు.
DEU 8:4 గడచిన ఈ 40 సంవత్సరాల్లో మీ బట్టలు చినిగిపోలేదు. మరియు మీ పాదాలు వాచిపోకుండ యెహోవా మిమ్మల్ని కాపాడాడు.
DEU 8:5 ఒక తండ్రి తన కుమారునికి ప్రబోధం చేసినట్టే. మీకు ప్రబోధంచేసి, మిమ్మును సరిదిద్దేందుకే మీ దేవుడైన యెహోవా ఈ సంగతులన్నీ జరిగించాడని మీరు తెలుసుకోవాలి.
DEU 8:6 “మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటికీ మీరు విధేయులు కావాలి. ఆయన మార్గాలలో నడుచుకొని, ఆయనను గౌరవించాలి.
DEU 8:7 నదులు, నీటి మడుగులు ఉండి, కొండల్లో, లోయల్లో నీటి ఊటలు ప్రవహించే మంచి దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మును తీసుకొని వస్తున్నాడు.
DEU 8:8 అది గోధుమ యవలు, ద్రాక్షాతోటలు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లతో నిండిన దేశం. ఒలీవ నూనె, తేెనెగల దేశం అది.
DEU 8:9 అక్కడ మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు ఏమీ లేకుండా ఉండరు. ఆ దేశంలో మీరు ఆ కొండలు తవ్వి రాళ్లు, యినుము, రాగి తీయవచ్చును.
DEU 8:10 మీరు తినాలని ఆశించేవి అన్నీ మీకు దొరుకుతాయి. అప్పుడు మీకు ఆయన యిచ్చిన మంచి దేశం కోసం మీరు మీ దేవుడైన యెహోవాను స్తుతిస్తారు.
DEU 8:11 “జాగ్రత్తగా ఉండండి మీ దేవుడైన యెహోవాను మరచిపోవద్దు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు. చట్టాలు, నియమాలు జాగ్రత్తగా పాటించండి.
DEU 8:12 మీరు తినేందుకు ఆహరం సమృద్ధిగా మీకు ఉంటుంది, మీరు మంచి యిళ్లు కట్టుకొని వాటిలో నివాసం చేస్తారు.
DEU 8:13 మీ పశువులు, మందలు విస్తారంగా పెరుగుతాయి. మీకు మరింత ఎక్కువ వెండి బంగారం ఉంటుంది. మీకు విస్తారంగా వస్తుసామగ్రి ఉంటుంది.
DEU 8:14 అలా జరిగి నప్పుడు మీరు గర్వించకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ దేవుడైన యెహోవాను మీరు మరచిపోకూడదు. మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు దేశంనుండి ఆయనే మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు.
DEU 8:15 భయంకర మైన మహాగొప్ప అరణ్యంలో మిమ్మల్ని యెహోవా నడిపించాడు. ఆ అరణ్యంలో విషసర్పాలు, తేళ్లు ఉండినవి. నేల ఎండిపోయి, ఎక్కడా నీళ్లు లేవు. కానీ యెహోవా మీకు బండలో నుండి నీళ్లు ఇచ్చాడు.
DEU 8:16 మీ పూర్వీకులు ఎన్నడూ ఎరుగని మన్నాతో ఆయన మిమ్మల్ని అరణ్యంలో పోషించాడు. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని దీనులుగా చేయాలను కొన్నాడు. అంతంలో మీకు అంతా మంచి జరగాలని ఆయన కోరాడు.
DEU 8:17 ‘ఈ ఐశ్వర్యం అంతా నా శక్తి సామర్థ్యాలతో సంపాదించాను’ అని ఎన్నడూ మీలో మీరు అనుకోవద్దు.
DEU 8:18 మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఐశ్వర్యం సంపాదించుకొనేందుకు శక్తిని యిచ్చేవాడు ఆయనే అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవా ఎందుకు ఇలా చేస్తాడు? ఎందుకంటే మీ పూర్వీకులతో ఆయన చేసిన ఒడంబడికను ఈ వేళ ఆయన నిలబెట్టుకొంటున్నాడు గనుక.
DEU 8:19 “ఎన్నటికీ మీ దేవుడైన యెహోవాను మరువ కండి. ఇతర దేవుళ్లను పూజించి సేవించేందుకు ఎన్నడూ వాటిని అనుసరించవద్దు. మీరు అలా గనుక చేస్తే, ఈ వేళే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను; నిశ్చయంగా మీరు నాశనం చేయబడతారు.
DEU 8:20 దేశాలను మీరు నాశనం చేసేటట్టు యెహోవా చేసాడు. మీ ఎదుట దేశాలను యెహోవా నాశనం చేస్తున్నట్టుగానే మీరూ నాశనం చేయబడతారు. మీ దేవుడైన యెహోవాకు మీరు విధేయులు కాలేదు గనుక ఇలా జరుగుతుంది.
DEU 9:1 “ఇశ్రాయేలు ప్రజలారా, వినండి, ఈ వేళ మీరు యోర్దాను నది దాటుతారు. మీకంటె బలంగల ఆ గొప్ప రాజ్యాలను బయటకు వెళ్లగొట్టేందుకు మీరు ఆ దేశంలో ప్రవేశిస్తారు. వారి పట్టణాలు చాలా పెద్దవి, వాటి గోడలు ఆకాశమంత ఎత్తున్నాయి.
DEU 9:2 అక్కడి ప్రజలు ఎత్తయిన వాళ్లు, బలం ఉన్నవాళ్లు. వారు అనాకీయ ప్రజలు. ఆ ప్రజలను గూర్చి మీకు తెలుసు. ‘అనాకీయ ప్రజల మీద ఎవడూ గెలవలేడు’ అని మన గూఢచారులు చెప్పటం మీరు విన్నారు.
DEU 9:3 అయితే మీ దేవుడైన యెహోవా నాశనం చేసే అగ్నిలా మీకు ముందర ఆ నదిని దాటుతాడని మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఆ దేశాలను యెహోవా నాశనం చేస్తాడు. వాళ్లు మీ ముందు పతనమయ్యేలా ఆయన చేస్తాడు. ఆ దేశస్తులను మీరు బయటకు వెళ్లగొట్టేస్తారు. త్వరగా మీరు వారిని నాశనం చేస్తారు. ఇలా జరుగుతుందని యెహోవా మీకు వాగ్దానం చేసాడు.
DEU 9:4 “ఆ రాజ్యాల వాళ్లను మీనుండి మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టిన తర్వాత ‘మా స్వంత నీతి జీవితాల మూలంగానే ఈ దేశంలో జీవించేందుకు యెహోవా మమ్మల్ని తీసుకొనివచ్చాడు’ అని మీలో మీరు అనుకోవద్దు. ఆ రాజ్యాలవాళ్లను మీనుండి యెహోవా వెళ్లగొట్టాడు, ఎందుకంటే వారు జీవించిన చెడు మార్గంవల్లనే.
DEU 9:5 మీరు వాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అందులో ప్రవేశిస్తున్నారంటే మీరేదో మంచివాళ్లు, నీతిగా బతుకుతున్నారు అని కాదు. వాళ్లు చెడుమార్గాలలో జీవించడంవల్లనే మీ దేవుడైన యెహోవా వాళ్లను బయటకు వెళ్లగొడుతున్నాడు, మీరు లోనికి వెళ్తున్నారు. మరియు మీ పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు యెహోవా చేసిన వాగ్దానం నెరవేరాలని ఆయన కోరుచున్నాడు.
DEU 9:6 మీరు నివసించేందుకు ఆ మంచి దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు. ఆయితే అది మీ నీతి బ్రతుకు మూలంగా కాదని మీరు తెలుసుకోవాలి. సత్యం ఏమిటంటే మీరు మొండి ప్రజలు.
DEU 9:7 “అరణ్యంలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించారని మరచిపోవద్దు. మీరు ఈజిప్టు దేశంనుండి బయటకు వెళ్లిన రోజునుండి ఈ చోటికి వచ్చిన ఈ రోజువరకు మీరు యెహోవాకు లోబడుటకు నిరాకరించారు.
DEU 9:8 ఇంకా హొరేబు కొండ దగ్గర కూడ మీరు యెహోవాకు కోపం పుట్టించారు. మిమ్మల్ని నాశనం చేయాల్సినంత కోపం వచ్చింది యెహోవకు.
DEU 9:9 రాతి పలకలను స్వీకరించటానికి నేను కొండమీదికి వెళ్లినప్పుడు (యెహోవా మీతో చేసిన ఒడంబడిక పలకలు) 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను కొండమీదనే ఉన్నాను. నేను భోజనంచేయలేదు, నిళ్లు త్రాగలేదు.
DEU 9:10 అప్పుడు ఆ రాతి పలకలను యెహోవా నాకు యిచ్చాడు. ఆ పలకలమీద యెహోవా తన వ్రేలితో రాసాడు. మీరు ఆ కొండ దగ్గర సమావేశమై నప్పుడు అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పినవి అన్ని ఆయన రాసాడు.
DEU 9:11 “కనుక 40 పగళ్లు 40 రాత్రుళ్లు ఆయిపోగానే, ఒడంబడిక రాతి పలకలు రెండింటిని యెహోవా నాకు ఇచ్చాడు.
DEU 9:12 అప్పుడు ‘లేచి త్వరగా ఇక్కడనుండి క్రిందికి వెళ్లు. ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకొనివచ్చిన ప్రజలు వారిని వారే నాశనం చేసుకొన్నారు. నేను వారికి ఆజ్ఞాపించిన విషయాల నుండి త్వరగా వారు తిరిగిపోయారు. వారు బంగారం కరిగించి వారికోసం ఒక విగ్రహం చేసుకొన్నారు’ అని యెహోవా నాతో ఇలా చెప్పాడు.
DEU 9:13 “ఇంకా యెహోవా నాతో ఇలా చెప్పాడు: ‘ఈ ప్రజలను నేను గమనించాను. వాళ్లు చాలా మొండివాళ్లు.
DEU 9:14 వారి పేర్లనుకూడ ఎన్నటికీ ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోకుండా నేను వాళ్లను పూర్తిగా నాశనం చేసేస్తాను. తరువాత ఇశ్రాయేలు ప్రజలుకంటె ఎక్కువ బలం గల యింకా గొప్ప ప్రజలను నీనుండి నేను కలుగ జేస్తాను.’
DEU 9:15 “అప్పుడు నేను వెనక్కు తిరిగి కొండదిగి క్రిందికి వచ్చాను. ఆ కొండ అగ్నితో మండుతోంది. ఒడంబడిక రాతి పలకలు రెండు నా చేతిలో ఉన్నాయి.
DEU 9:16 నేను చూసినప్పుడు కరిగించిన బంగారంతో మీరు మీకోసం ఒక దూడను చేసుకొని, మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయటం గుర్తించాను. యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి మీరు త్వరగా తిరిగిపోయారు.
DEU 9:17 అందుచేత నేను ఆ రెండు రాతి పలకలు తీసుకొని నేలకేసి కొట్టాను. అక్కడ మీ కళ్లముందు ఆ పలకలను నేను ముక్కలుగా విరుగగొట్టేసాను.
DEU 9:18 అప్పుడు నేను మొదటి సారిలాగ 40 పగళ్లు 40 రాత్రుళ్లు యెహోవా యెదుటు నేలమీద సాష్టాంగ పడ్డాను. నేను భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. మీరు అంత ఘోరంగా పాపం చేసారు గనుక నేను యిలా చేసాను. యెహోవా దృష్టికి అపవిత్రమైనది చేసి మీరు ఆయన కోపం పుట్టించారు.
DEU 9:19 యెహోవా భయంకర కోపానికి నేను భయపడి పోయాను. మిమ్మల్ని నాశనం చేసేటంత కోపం మీమీద ఆయనకు కలిగింది. కానీ మరోసారి యెహోవా నా మాట విన్నాడు.
DEU 9:20 అహరోనును నాశనం చేసివేయాలన్నంత కోపం వచ్చింది యెహోవాకు. కనుక ఆ సమయంలో అహరోను కోసం కూడా నేను ప్రార్థించాను.
DEU 9:21 మీరు చేసిన ఆ బంగారు దూడను నేను తీసుకొని దానిని అగ్నితో కాల్చివేసాను. నేను దాన్ని చిన్న ముక్కలుగా చేసాను. ఆ దూడ ముక్కలను ధూళిగా నేను చితకగొట్టాను. తర్వాత ఆ కొండనుండి ప్రవహించే నదిలో ఆ ధూళిని పారవేసాను.
DEU 9:22 “మరియు మీరు తబేరావద్ద, మస్సావద్ద, కిబ్రోత్ హత్తావాలో యెహోవాకు కోపం పుట్టించారు.
DEU 9:23 మీరు కాదేషు బర్నేయానుండి వెళ్లిపోండి అని యెహోవా చేప్పినప్పుడు మీరు విధేయులు కాలేదు. ‘మీరు వేళ్లి నేను మీకు యిచ్చిన దేశంలో నివసించండి’ అని ఆయన చెప్పాడు. కానీ మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులు కాలేదు. మీరు ఆయనను నమ్మలేదు. మీరు ఆయన ఆజ్ఞను వినలేదు.
DEU 9:24 నేను మిమ్మల్ని ఎరిగినప్పటినుండియు మీరు యెహోవాకు విధేయలయ్యేందుకు నిరాకరిస్తున్నారు.
DEU 9:25 “కనుక నేను యెహోవా ఎదుట 40 పగళ్లు 40 రాత్రుళ్లు సాష్టాంగపడ్డాను. ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేస్తానని యెహోవా చేప్పాడు గనుక.
DEU 9:26 నేను యెహోవాకు ప్రార్థన చేసాను. నేను ఇలా చెప్పాను, ‘యెహోవా దేవా, నీ ప్రజలను నాశనం చేయవద్దు. వాళ్లు నీకు చెందినవాళ్లు. నీవే నీ మహాబలం, శక్తి ప్రయోగించి వారిని విడుదల చేసి ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చావు.
DEU 9:27 నీ సేవకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నీవు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజలు ఎంత మొండివారో అది మరచిపో. వారి చెడు మార్గాలను గాని వారి పాపంగాని చూడకు.
DEU 9:28 నీ ప్రజలను నీవు శిక్షిస్తే “యెహోవా తన ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలోనికి ఆయన వారిని తీసుకొని వెళ్లలేకపోయాడు, ఆయన వాళ్లను ద్వేషించాడు, కనుక వాళ్లను చంపివేయడానికి అరణ్యంలోనికి తీసుకు వెళ్లాడు” అని ఈజిప్టువాళ్లు అంటారేమో.
DEU 9:29 ఆయితే యెహోవా, వాళ్లు నీ ప్రజలు, వాళ్లు నీకు చేందిన వాళ్లు. నీ మహాగొప్ప శక్తి, బలంతో నీవే వాళ్లను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చావు.’
DEU 10:1 “ఆసమయంలో యెహోవా నాతో యిలా చెప్పాడు: ‘మొదటి పలకల్లాంటివే రెండు పలకలు రాతితో నీవు చెక్కాలి. అప్పుడు నీవు కొండ ఎక్కి నా దగ్గరకు రావాలి. అలాగే నీ కోసం ఒక చెక్క పెట్టెకూడా చేయాలి.
DEU 10:2 నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే ఆ రాతి పలకలమీద నేను రాస్తాను. అప్పుడు నీవు కొత్త పలకలను ఆ పెట్టెలో పెట్టాలి.’
DEU 10:3 “కనుక నేను తుమ్మ కర్రతో ఒక పెట్టె చేసాను. మొదటి రెండు పలకల్లాంటివే మరి రెండు పలకలు రాతినుండి నేను తొలిచాను. అప్పుడు నేను కొండ మీదికి వెళ్లాను. ఆ రెండు రాతి పలకలు నా చేతిలో ఉన్నాయి.
DEU 10:4 అప్పుడు యెహోవా యింతకు ముందు ఆ పలకల మీద వ్రాసిన ఆ మాటలనే, అంటే ఆ కొండ దగ్గర మీరు సమావేశమైనప్పుడు అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పిన ఆ పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాడు. అప్పుడు యెహోవా ఆ రాతి పలకలను నాకు ఇచ్చాడు.
DEU 10:5 నేను వెనక్కు తిరిగి, కొండ దిగి వచ్చేసాను. ఆ పలకలను నేను చేసిన పెట్టెలో ఉంచాను. వాటిని అందులో పెట్టుమని నాకు యెహోవా ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ ఆ పలకలు ఆ పెట్టెలోనే ఉన్నాయి.”
DEU 10:6 (ఇశ్రాయేలు ప్రజలు యహకాను ప్రజల బావుల దగ్గరనుండి ప్రయాణం చేసి మోసెరుకు వచ్చారు. అక్కడ అహరోను చనిపోయి, పాతిపెట్టబడ్డాడు. అహరోను కుమారుడు ఎలీయాజరు అహరోను స్థానంలో యాజకుడయ్యాడు.
DEU 10:7 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోసెరునుండి గుద్గోదకు వెళ్లారు. మరియు వారు గుద్గోదనుండి నదులుగల యొత్బాతా దేశం వెళ్లారు.
DEU 10:8 ఆ సమయంలోనే యెహోవా తన ప్రత్యేక పని నిమిత్తం, లేవీ వంశాన్ని యితర వంశాలనుండి వేరు చేసాడు. యెహోవా ఒడంబడిక పెట్టెను మోయాల్సిన పని వారిది. యెహోవా ఆంలయలో యాజకులుగా కూడా వారు సహాయం చేసారు. మరియు యెహోవా నామమున ప్రజలను ఆశీర్వాదించాల్సిన పనికూడా వారికి ఉంది. ఈ ప్రత్యేక పని వారు నేటికీ చేస్తున్నారు.
DEU 10:9 అందువల్లనే యితర వంశాలవలె లేవీ వంశం దేశంలో భాగం పొందలేదు. యెహోవాయే లేవీయులకు భాగం. మీ దేవుడైన యెహోవా వారికి వాగ్దానం చేసింది అదే.)
DEU 10:10 “మొదటిసారిలాగే, 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను ఆ కొండమీద ఉండిపోయాను. ఆ సమయంలో యెహోవా నా మాట కూడా విన్నాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేయకూడదని తీర్మానించాడు.
DEU 10:11 యెహోవా ‘వెళ్లి ప్రజలను వారి ప్రయాణంలో నడిపించు. వారు వెళ్లి, వారికి ఇస్తానని వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన దేశంలో నివసిస్తారు’ అని నాతో చెప్పాడు.
DEU 10:12 “ఇశ్రాయేలు ప్రజలారా ఇప్పుడు వినండి. మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా కోరేది ఇదే: మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయన మీతో చెప్పినవన్నీ చేయండి. మీ నిండు హృదయంతో, మీ నిండు ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, సేవించండి.
DEU 10:13 ఈ వేళ నేను మీకు చెబుతున్న యెహోవా చట్టాలను, ఆజ్ఞలను పాటించండి. ఈ చట్టాలు, ఆజ్ఞలు మీ మంచికోసమే.
DEU 10:14 “సర్వం మీ దేవుడైన యెహోవాకే చెందుతుంది. ఆకాశం, మహా ఎత్తయిన ఆకాశం సహా యెహోవాదే. భూమి, దానిమీద ఉన్న సమస్తం మీ దేవుడైన యెహోవాదే.
DEU 10:15 మీ పూర్వీకులను యెహోవా ఎంతో ప్రేమించాడు. వారి సంతతివారై మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఉండేందుకు ఏర్పరచుకొనే అంతగా ఆయన వారిని ప్రేమించాడు. మరి ఏ ఇతర ప్రజ కాకుండ మిమ్మల్నే ఆయన ఎన్నుకొన్నాడు. మీరు నేటికీ ఆయన ఏర్పరచుకొన్న ప్రజలే.
DEU 10:16 “మీరు మీ మొండి వైఖరి విడిచిపెట్టి, మీ హృదయాలను. యెహోవాకు ఇవ్వాలి.
DEU 10:17 ఎందుకంటే యెహోవా మీ దేవుడు గనుక. ఆయన దేవుళ్లకు దేవుడు. ప్రభువులకు ప్రభువు. ఆయనే మహా దేవుడు. ఆయన అద్భుతమైన మహా శక్తిగల పరాక్రమశాలి. యెహోవాకు ప్రతి మనిషీ సమానమే. ఆయన లంచం తీసుకోడు.
DEU 10:18 తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన సహాయం చేస్తాడు. విధవలకు ఆయన సహాయం చేస్తాడు. మన దేశంలో ఉండే విధేశీయులను కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన వారికి భోజనం, బట్టలు యిస్తాడు.
DEU 10:19 అందుచేత ఆ విదేశీయులను మీరుకూడా ప్రేమించాలి. ఎందుకంటే మీ మట్టుకు మీరే ఈజిప్టు దేశంలో విదేశీయులు గనుక.
DEU 10:20 “మీరు మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఎన్నడూ ఆయనను విడువవద్దు. మీరు ప్రమాణాలు చేసేటప్పుడు మీరు ఆయన పేరు మాత్రమే ఉపయోగించాలి.
DEU 10:21 మీరు స్తుతించవలసినది యెహోవాను మాత్రమే. ఆయన మీ దేవుడు. ఆయన మీకోసం అద్భుతమైన గొప్ప కార్యాలు చేసాడు. మీరు ఈ కార్యాలను మీ కళ్లారా చూసారు.
DEU 10:22 మీ పూర్వికులు ఈజిప్టులోనికి వెళ్లినప్పుడు వారు 70 మంది మాత్రమే. ఇప్పుడు మిమ్మల్ని ఎంతో మందిగా, ఆకాశ నక్షత్రాలు ఎన్నో అంతమందిగా మీ దేవుడైన యెహోవా చేసాడు.
DEU 11:1 “అందుచేత మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి. మీరు చేయాలని ఆయన మీతో చేప్పే విషయాలను మీరు చేయాలి. ఆయన చట్టాలకు, ఆజ్ఞలకు, నియమాలకు మీరు ఎల్లప్పుడూ విధేయులు కావాలి.
DEU 11:2 మీకు ప్రబోధం చేసేందుకు మీ దేవుడైన యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ నేడు జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యాలు జరగటం చూచింది, వాటిని అనుభవించింది మీరేగాని మీ పిల్లలు కాదు. యెహోవా ఎంత గొప్పవాడో మీరు చూసారు. ఆయన ఎంత బలంగలవాడో మీరు చూశారు. ఆయన శక్తివంతమైన కార్యాలు మీరు చూసారు.
DEU 11:3 ఆయన చేసిన అద్భుతాలను మీ పిల్లలు కాదు మీరు చూసారు. ఈజిప్టులో, ఈజిప్టు రాజైన ఫరోకు, ఆతని దేశం మొత్తానికి ఆయన చేసిన కార్యాలు మీరు చూశారు. ఈజిప్టు స్తెన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు యెహోవా చేసిన వాటిని మీ పిల్లలు కాదు మీరే చూసారు.
DEU 11:4 వాళ్లు మిమ్మల్ని తరుముతూ ఉంటే, వాళ్లను యెహోవా ఎర్ర సముద్ర నీళ్లతో కప్పివేస్తూ ఉండటం మీరు చూసారు. యెహోవా వాళ్లను సర్వ నాశనం చేయటం మీరు చూసారు.
DEU 11:5 మీరు ఈ చోటికి వచ్చేంత వరకు అరణ్యంలో మీ దేవుడైన యెహోవా మీకోసం చేసిన వాటన్నింటిని చూసిన వారు మీరే మీ పిల్లలు కాదు.
DEU 11:6 రూబేను వంశానికి చెందిన ఎలీయాబు కుమారులు దాతాను, అబీరాములకు యెహోవా ఏమి చేసాడో మీరు చూసారు. భూమి నోరు తెరచినట్టుగా తెరచుకొని ఆ మనుష్యులను మ్రింగి వేయటం ఇశ్రాయేలు ప్రజలంతా చూసారు. అది వారి కుటుంబాలను, వారి గుడారాలను, వారికి ఉన్న ప్రతి పనిమనిషిని, ప్రతి జంతువును మింగి వేసింది.
DEU 11:7 యెహోవా చేసిన ఈ గొప్ప కార్యాలన్నిం టినీ చూసినవాళ్లు మీరే, మీ పిల్లలు కాదు.
DEU 11:8 “కనుక ఈ వేళ నేను మీకు చెప్పే ప్రతి ఆజ్ఞకూ మీరు విధేయులు కావాలి. అప్పుడు మీరు బలంగా ఉంటారు. మీరు యోర్దాను నది దాటగలుగుతారు, మీరు ప్రవేశించ బోతున్న దేశాన్ని స్వాధీనం చేసు కోగలుగుతారు.
DEU 11:9 మరియు ఆ దేశంలో మీ జీవితం సుదీర్గం అవుతుంది. మీ పూర్వీకులకు, వారి సంతతి వారికి ఇస్తానని యెహోవా వాగ్దానం చేసింది ఈ దేశమే. ఇది మంచివాటితో నిండిన దేశం.
DEU 11:10 మీకు లభిస్తున్న ఈ దేశం మీరు వచ్చిన ఈజిప్టు దేశంలాంటిది కాదు. ఈజిప్టు దేశంలో మీరు విత్తనాలు చల్లి, మీ మొక్కలకు నీళ్లు పెట్టడానికి కాలువలనుండి నీళ్లుతోడేందుకు మీ పాదాలు ప్రయోగించారు. కూరగాయల తోటకు నీళ్లు పెట్టినట్టే మీ పొలాలకు మీరు నీళ్లు పెట్టారు.
DEU 11:11 అయితే త్వరలోనే మీకు లభిస్తున్న దేశం అలాంటిది కాదు. ఆ దేశములో కొండలు, లోయలు ఉన్నాయి. ఆకాశంనుండి కురిసే వర్షాల మూలంగా ఆ భూమికి నీరు లభిస్తుంది.
DEU 11:12 మీ దేవుడైన యోహోవా ఆ భూమి విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు. సంవత్సర ఆరంభంనుండి అంతంవరకు మీ దేవుడైన యెహోవా ఆ భూమిని కనిపెట్టుకొని ఉంటాడు.
DEU 11:13 “‘మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతో ప్రేమించాలని, మీ నిండు ఆత్మతో సేవించాలని, నేడు మీకు నేను ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినాలి. మీరు అలా చేస్తే, అప్పుడు
DEU 11:14 సకాలంలో నేను మీ భూమికి వర్షం ఇస్తాను. తొలకరి వాన, కడవరి వాన నేను పంపిస్తాను. అప్పుడు మీరు ధాన్యం, మీ కొత్త ద్రాక్షారసం, మీ నూనె సమకూర్చుకోవచ్చును.
DEU 11:15 మీ పశు వుల కోసం నేను మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను. మీరు ఆహారం తినే సమృద్ధిగా ఉంటుంది.’
DEU 11:16 “అయితే జాగ్రత్తగా ఉండండి. మోసపోవద్దు. ఇతర దేవుళ్లను సేవించి, పూజించేందుకు తిరిగిపోవద్దు.
DEU 11:17 ఆ విధంగా మీరు చేస్తే యెహోవా మీమీద చాలా కోపగిస్తాడు. ఆకాశాలను ఆయన మూసి వేస్తాడు. అప్పుడు వర్షం కురవదు. భూమి మీద పంట పండదు. యెహోవా మీకు ఇస్తున్న మంచి దేశంలో మీరు త్వరగా నశిస్తారు.
DEU 11:18 “నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని మీ హృదయాల్లో భద్రంగా ఉంచుకోండి. మీకు జ్ఞాపకంచేసే సూచనలుగా ఈ ఆజ్ఞలను వ్రాసి మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంగా కట్టుకోండి.
DEU 11:19 ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు నేర్పించండి. మీరు మీ యిండ్లలో కూర్చున్నప్పుడు, మీరు మార్గంలో నడిచేటప్పుడు, మీరు పండుకొన్నప్పుడు, మీరు లేచినప్పుడు, ఈ విషయాలను గూర్చి మాట్లాడండి.
DEU 11:20 మీ గృహాల ద్వారబంధాల మీద, గవునుల మీద ఈ ఆజ్ఞలు వ్రాయండి.
DEU 11:21 అప్పుడు యెహోవా మీ పూర్వీకులకు యిస్తానని వాగ్దానం చేసిన ఆ దేశంలో మీరూ మీ పిల్లలూ దీర్ఘకాలం జీవిస్తారు. భూమికి ప్తెగా ఆకాశాలు ఉన్నంతవరకు మీరు అక్కడ నివసిస్తారు.
DEU 11:22 “మీరు ఆచరించాలని నేను మీతో చెప్పిన ప్రతి ఆజ్ఞకూ విధేయులుగా ఉండేందుకు జాగ్రత్త పడండి. మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, ఆయన మార్గాలన్నింటినీ వెంబడించండి, ఆయనకు నమ్మకంగా ఉండండి.
DEU 11:23 అప్పుడు ఆ దేశంలోనికి వెళ్తారు. ఆ యితర రాజ్యాలన్నింటి జనాలనూ యెహోవా బయటకు వెళ్లగొడ్తాడు. మీకంటే ఎక్కువ బలంగల పెద్ద రాజ్యాలనుండి ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు.
DEU 11:24 మీరు నడిచే భూమి అంతా మీదే అవుతుంది. మీ దేశం దక్షిణాన అరణ్యం మొదలుకొని ఉత్తరాన లెబానోను వరకు మొత్తం వ్యాపించి ఉంటుంది. తూర్పున యూఫ్రటీసు నదినుండి మొత్తం మధ్యధరా సముద్రంవరకు వ్యాపించి ఉంటుంది.
DEU 11:25 మీకు వ్యతిరేకంగా నిలువగల వాడు ఎవడూ ఉండడు. ఆ దేశంలో మీరు ఎక్కుడికి వెళ్లినాసరే ప్రజలు మీకు భయపడేటట్టుగా మీ దేవుడైన యెహోవా చేస్తాడు. ఇంతకు ముందు యెహోవా మీకు వాగ్దానం చేసింది యిదే.
DEU 11:26 “ఈ వేళ నేను మిమ్మల్ని ఒక ఆశీర్వాదమోలేక ఒక శాపమో కోరుకోనిస్తున్నాను.
DEU 11:27 ఈ వేళ నేను మీతో చెప్పిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు లోబడితే మీకు ఆశీర్వాదం లభిస్తుంది.
DEU 11:28 మీరు మీ దేవుడైన యెహోవా మాట వినక, ఈ వేళ నేను మీకు ఆజ్ఞాపించిన మార్గంనుండి మీరు తొలగిపోయి, మీరు ఎరుగని ఇతర దేవుళ్లను అనుసరిస్తే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించేందుకు మీరు నిరాకరిస్తే మీకు శాపం వస్తుంది.
DEU 11:29 “మీరు నివసించబోతున్న దేశానికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు మీరు గెరీజీము కొండమీదికి వెళ్లి, అక్కడనుండి ఆ ఆశీర్వాదాలు చదివి ప్రజలకు వినిపించాలి. అలాగే ఏబాలు కొండమీదికి కూడా మీరు వెళ్లి అక్కడనుండి శాపాలు చదివి ప్రజలకు వినిపించాలి.
DEU 11:30 అరాబాలో నివసించే కనానీ ప్రజల దేశంలో యోర్దాను నదికి ఆవలి ప్రక్క ఈ కొండలు ఉన్నాయి. ఈ కొండలు పశ్చిమాన గిల్గాలు పట్టణానికి దగ్గరగా మోరేలోని సింధూర వృక్షాలకు సమీపంగా ఉన్నాయి.
DEU 11:31 మీరు యోర్దాను నది దాటివెళ్తారు. మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. ఈ దేశం మీది అవుతుంది. మీరు ఈ దేశంలో నివసించేటప్పుడు,
DEU 11:32 ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు, నియమాలు అన్నింటికీ జాగ్రత్తగా లోబడాలి.
DEU 12:1 “కొత్త దేశంలో మీరు మీ జీవితకాలమంతా పాటించేందుకు జాగ్రత్త పడాల్సిన ఆజ్ఞలు, నియమాలు ఉన్నాయి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు జీవించినంత కాలమూ ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి.
DEU 12:2 ఇప్పుడు అక్కడ నివసిస్తున్న రాజ్యాలనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఈ దేశాల ప్రజలు వీరి దేవుళ్లను పూజించిన స్థలాలన్నింటినీ మీరు పూర్తిగా నాశనం చేయాలి. ఎత్తయిన పర్వతాలమీద, కొండలమీద, పచ్చని చెట్ల క్రింద ఈ స్థలాలు ఉన్నాయి.
DEU 12:3 వారి బలిపీఠాలను మీరు పడగొట్టాలి, వారి స్మారక శిలలను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాలి. వారి అషేరా స్తంభాలను కాల్చివేయాలి, మీరు వారి దేవుళ్ల విగ్రహాలను కూలగొట్టండి.
DEU 12:4 “కానీ ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దేవుడైన యెహోవాను ఆరాధించకూడదు.
DEU 12:5 మీ దేవుడైన యెహోవా తన ఆలయం కోసం ఒక ప్రత్యేక స్థలం మీ వంశాలవారి మధ్య నిర్ణయిస్తాడు. యెహోవా తన నామాన్ని అక్కడుంచుతాడు. అది ఆయన ఆలయం ఆయనను ఆరాధించడానికి ఆ స్థలానికి వెళ్లాలి
DEU 12:6 మీ దహనబలులు, మీ బలులు మీ పంట. మరియు జంతువులో దశమ భాగం మీ ప్రత్యేక కానుకలు, యెహోవాకు మీరు వాగ్దానం చేసిన కానుకలు, మీ స్వేచ్ఛార్పణలు, మరియు మీ పశువుల మందలోను, గొర్రెల మందలోను మొట్టమొదటగా పుట్టిన జంతువులను అక్కడికి మీరు తీసుకొని రావాలి.
DEU 12:7 మీరూ, మీ కుటుంబాలూ ఆ చోట సమావేశమై అక్కడ అందరూ కలిసి భోజనం చేయాలి, మీ దేవుడైన యెహోవా అక్కడ మీతో ఉంటాడు. అక్కడ మీరు కష్టపడిన వాటి ఫలాలను భుజిస్తారు. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఆ మంచివాటిని మీకు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకొంటారు.
DEU 12:8 “ఆ సమయంలో మనం ఇంతవరకు ఆరాధిస్తున్న విధానాన్ని మీరు కొనసాగించకూడదు. ఇంతవరకు మనకు యిష్టం వచ్చిన ఏ పద్ధతిలోనైనా దేవుణ్ణి మనం ఆరాధించాం.
DEU 12:9 ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న శాంతియుతమైన దేశంలో మనం యింకా ప్రవేశించలేదు గనుక.
DEU 12:10 ఆయితే మీరు యొర్దాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ఆ దేశంలో నివసిస్తారు. అక్కడ మీ శత్రువులు అందరినుండి యెహోవా మీకు విశ్రాంతి ఇస్తాడు. మరియు మీరు క్షేమంగా జీవిస్తారు.
DEU 12:11 అప్పుడు యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఉండేందుకు ఒక స్థలం ఏర్పాటు చేసుకొంటాడు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు ఆ చోటికి తీసుకొని రావాలి. మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగాలు, మీ ప్రత్యేక కానుకలు, మీరు యెహోవాకు వాగ్దానం చేసిన కానుకలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదటగా పుట్టిన జంతువులు అన్నింటినీ మీరు తీసుకొని రావాలి.
DEU 12:12 మీ పిల్లలు, మీ పనిమనుషులు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులుమీ మనుష్యులందరినీ వెంట తీసుకొని ఆ స్థలానికి రండి. ( ఆ లేవియులకు దేశంలో వారి స్వంత భాగం ఉండదు.) అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలసి సంతోషంగా సమయం గడపండి.
DEU 12:13 మీకు కనబడిన ఏ స్థలంలో అంటే ఆ స్థలంలో మీ దహనబలులు అర్పించకుండా మీరు జాగ్రత్తగా ఉండండి.
DEU 12:14 మీ వంశాలకు చెందిన ఒక ప్రాంతంలో యెహోవా తన ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకొంటాడు. దహన బలులు అర్పించటం, నేను మీతో చెప్పిన యితర పనులు అన్నీ అక్కడే చేయండి.
DEU 12:15 “మీరు నివసించే ఏ స్థలంలోనైనా ఎర్ర జింక, చిన్న దుప్పిలాంటి ఏ మంచి జంతువునైనా మీరు చంపి తినవచ్చును. మీరు కొరినంత మాంసం, మీ దేవుడైన యెహోవా మీకు యిచ్చినంత మీరు తినవచ్చును. పవిత్రంగా ఉన్నవాళ్లు, అపవిత్రంగా ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఈ మాంసం తినవచ్చును.
DEU 12:16 కాని రక్తంతో మాత్రం మీరు తినకూడదు. రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పోయాలి.
DEU 12:17 “మీరు నివసించే స్థలాల్లో మీరు తినకూడనివి కొన్ని ఉన్నాయి. అవి ఏవనగా:దేవునికి చేందిన ధాన్యం, దేవునికి చెందిన మీ కొత్త ద్రాక్షారసం, నూనె భాగాలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదటగా పుట్టినవి, మీరు దేవునికి వాగ్దానం చేసిన ఏ కానుకగాని, ఏ స్వేచ్చార్పణలుగాని, లేక దేవునికి చెందిన ఏ కానుకలేగాని,
DEU 12:18 మీ దేవుడైన యెహోవా నిర్ణయించే ప్రత్యేక స్థలంలో, మీ దేవుడైన యెహోవా మీతో ఉన్న ఆ స్థలంలో మాత్రమే అర్పణలను మీరు తినాలి. మీరు అక్కడికి వెళ్లి, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ పని మనుష్యులందరు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులతో కలిసి మీరు భోజనం చేయాలి. అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలసి సంతోషంగా సమయం గడపండి. మీరు కష్టపడి సంపాదించిన వాటితో ఆనందించండి.
DEU 12:19 మీరు ఎల్లప్పుడూ ఈ భోజనాలను లేవీయులతోకూడ పంచుకొనే విషయంలో ఖచ్చితంగా ఉండండి. మీరు మీ దేశంలో బతికినంతకాలం ఇలా చేయండి.
DEU 12:20 “మీ దేశాన్ని విస్తృతపరుస్తానని మీ దేవుడైన యెహోవా వాగ్దానం చేసాడు. ఆయన అలా చేసినప్పుడు, ఆయన తన ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పరచుకొనే స్థలానికి మీ నివాసం చాలా దూరం కావచ్చు. అది చాలా దూరమై, మాంసం కోసం మీరు ఆకలిగా ఉంటే, అప్పుడు మీ దగ్గర ఉన్న ఏ మాంసమైనా తినవచ్చును. యెహోవా మీకు ఇచ్చిన పశువుల మందలోనుండిగాని, గొర్రెల మందలోనుండిగాని, ఏ జంతువునైనా చంపుకోవచ్చును. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం యిది చేయండి. మీరు నివసించే చోట మీకు యిష్టం వచ్చినప్పుడు ఈ మాంసం తినవచ్చును.
DEU 12:22 జింక, దుప్పి మాంసం తిన్నట్టుగానే మీరు ఈ మాంసం తినవచ్చును. పవిత్రంగా ఉన్నవాళ్లు, అపవిత్రంగా ఉన్నవాళ్లు ఎవరైనా యిలా చేయవచ్చును.
DEU 12:23 రక్తంతో మాత్రం తినకుండ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రాణం రక్తంలోనే ఉంటుంది. ఇంకా ప్రాణం ఉన్న మాంసం మీరు తినకూడదు.
DEU 12:24 రక్తంతో తినవద్దు, ఆ రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పారబోయాలి.
DEU 12:25 సరైనది అని యెహోవా చెప్పిన ప్రతిదీ మీరు చేయాలి. అందుచేత రక్తంతో తినవద్దు. మీకు మీ సంతతివారికి మేలు కలుగుతుంది.
DEU 12:26 “మీరు ప్రతిష్ఠించిన వాటిని, మీ మొక్కు బడులను, మీ దేవుడైన యెహోవా నియమించే ప్రత్యేక స్థలానికి మీరు తీసుకొని వెళ్లాలి.
DEU 12:27 మీరు మీ దహన బలులను ఆ స్థలంలో అర్పించాలి. మీ దహనబలుల రక్తం, మాంసం మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించండి. మీ యితర బలుల విషయంలో రక్తాన్ని మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించండి. అప్పుడు ఆ మాంసం మీరు తినవచ్చును.
DEU 12:28 నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నింటికీ జాగ్రత్తగా విధేయులు కావాలి. మంచివి, సరైనవి మీ దేవుడైన యెహోవాను ఆనందపర్చే పనులు మీరు చేసినప్పుడు మీకూ, మీ సంతతివారికి శాశ్వతంగా మేలు కలుగుతుంది.
DEU 12:29 “ఇతర రాజ్యాల ప్రాంతంలోనికి మీరు వెళ్లినప్పుడు ఆ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టి నాశనం చేస్తాడు. మీరు లోనికి వెళ్లి వారినుండి ఆ దేశం తీసుకొంటారు. వారి దేశంలో మీరు నివసిస్తారు.
DEU 12:30 ఆయితే అది జరిగిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఆ రాజ్యాలవారు పూజించిన దేవుళ్లను గూర్చి తెలుసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు. వారు వారి దేవుళ్లను ఎలా పూజిస్తారో అది మీరు నేర్చుకొనేందుకు ప్రయత్నించవద్దు. వాళ్లు పూజించినట్టు పూజించాలనే ఆలోచన కూడా చేయవద్దు.
DEU 12:31 ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దెవుడైన యెహోవాను ఆరాధించకూడదు. ఎందుకంటే వారు వారి పూజలో యెహోవాకు అసహ్యమైన చెడ్డపనులు అన్నీ చేస్తారు. చివరికి వారు వారి చిన్న బిడ్డలను కూడ వారి దేవుళ్లకు బలి అర్పణగా కాల్చివేస్తారు.
DEU 12:32 “నేను మీకు ఆజ్ఞాపించే సమస్తం జాగ్రత్తగా చేయాలి. నేను మీకు చెప్పేవాటికి మరేమీ కలుపవద్దు, ఏమీ తీసివేయవద్దు.
DEU 13:1 “ఒక ప్రవక్త లేక కలల భావం చెప్పే ఒక వ్యక్తి మీ దగ్గరకు రావచ్చు. మీకు ఏదో ఒక సూచన లేక అద్భుతం చూపిస్తానని ఆతడు మీతో చెప్పవచ్చు.
DEU 13:2 మరియు ఆతడు మీకు చెప్పిన సూచన లేక అద్భుతం నెరవేరవచ్చు. అప్పుడు ఆతడు ఇతర దేవుళ్లను(మీరు ఎరుగని దేవుళ్లను) పూజించమని మీతో చెప్పవచ్చును. ‘మనం ఆ దేవుళ్లనే సేవిద్దాము’ అని అతడు మీతో అనవచ్చును.
DEU 13:3 ఆ మనిషి మాట వినవద్దు. ఎందుకంటె మీరు మీ దేవుణ్ణి మీ నిండు హృదయంతోను, మీ నిండు ఆత్మతోను ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకొనేందుకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు.
DEU 13:4 మీరు మీ దేవుడైన యెహోవాను వెంబడించాలి. మీరు తప్పక ఆయనను గౌరవించాలి. యెహోవా ఆజ్ఞలకు విధేయులై, ఆయన మీతో చెప్పినట్టు చేయండి. యెహోవాను సేవించండి, ఎన్నటికీ ఆయనను విడువకండి.
DEU 13:5 అంతేకాదు కలలను గూర్చి చెప్పే ఆ ప్రవక్తను చంపివేయాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు లోబడటం మానివేయండి అని మీతో చెబుతున్నాడు గనుక. మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చినవాడు యెహోవా. అక్కడి బానిస జీవితంనుండి ఆయనే మిమ్మల్ని రక్షించాడు. మీరు జీవించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన జీవితం నుండి మిమ్మల్ని తప్పించి వేయాలని ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. అందుచేత మీ ప్రజలనుండి చెడుగును తీసివేసేందుకు మీరు ఆ వ్యక్తిని చంపిచచేయాలి.
DEU 13:6 “మీతో సన్నిహితంగా ఉండేవారు ఎవరైనా, మీరు ఇతర దేవుళ్లను పూజించేందుకు రహస్యంగా మిమ్మల్ని ఒప్పించవచ్చు. నీ స్వంత సోదరుడు. నీ కుమారడు, నీ కుమార్తె, నీవు ప్రేమించే నీ భార్య, లేక నీ అతి సన్నిహిత మిత్రుడు కావచ్చు. ‘మనం పోయి యితర దేవుళ్లను పూజిద్దాము’ అని ఆ వ్యక్తి చెప్పవచ్చు. (ఈ దేవుళ్లను మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎన్నడూ ఎరుగరు.
DEU 13:7 ఆ దేవుళ్లు మీకు దగ్గర్లో, దూరంలో, మీ చుట్టు పక్కల రాజ్యాల్లో ఉండే ప్రజల దేవుళ్లు.)
DEU 13:8 మీరు ఆ వ్యక్తితో సమ్మతించకూడదు. ఆతని మాట వినవద్దు. ఆతని మీద జాలిపడవద్దు, అతణ్ణి స్వేచ్ఛగా వెళ్ళిపోనివ్వవద్దు. ఆతణ్ణి కాపాడవద్దు.
DEU 13:9 కాని, మీరు అతణ్ణి చంపాల్సిందే. మీరు అతణ్ణి రాళ్లతో కొట్టి చంపెయ్యాలి. నీవే మొట్టమొదట రాళ్లు తీసుకొని అతని మీద విసరాలి. తర్వాత ప్రజలందరూ రాళ్లు విసిరి అతణ్ణి చంపాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని మీ దేవుడైన యెహోవాకు దూరం చేయాలని ప్రయత్నించాడు. మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు రప్పించిన వాడు యెహోవాయే.
DEU 13:11 అప్పుడు ఉశ్రాయేలు ప్రజలందరు విని భయపడతారు. అంతేకాదు, వారు యిలాంటి చెడ్డపనులు ఇంకేమీ మీ మధ్య జరిగించరు.
DEU 13:12 “మీ దేవుడైన యెహోవా మీరు నివసించేందుకు పట్టణాలు మీకు ఇచ్చాడు. కొన్నిసార్లు ఈ పట్టణాల్లో ఒకదాన్ని గూర్చి మీరు ఏదైనా చెడువార్తా వినవచ్చును. మీరు
DEU 13:13 మీ స్వంత దేశంలోనే దుర్మార్గులు కొందరు వారి పట్టణస్థులను చెడ్డపనులు చేసేందుకు ప్రేరేపిస్తున్నారని వినవచ్చును. ‘మనం వెళ్లి యితర దేవుళ్లను సేవిద్దాము, అని వారు వారి పట్టణస్థులతో అనవచ్చును.’ ( ఈ దేవుళ్లు యింతకు ముందు మీరు ఎన్నడూ ఎరుగని దేవుళ్లు.)
DEU 13:14 మీరు ఇలాంటి వార్త వింటే, అది సత్యమా అని తెలుసుకొనేందుకు మీరు చేయగలిగింది అంతా చేయాలి. అది వాస్తవమేనని మీకు తెలిస్తే-అలాంటి దారుణ విషయం నిజంగానే జరిగిందని మీకు ఋజువైతే
DEU 13:15 అప్పుడు మీరు ఆ పట్టణస్థులను శిక్షించాలి. వాళ్లందరినీ చంపివేయాలి. మరియు వారి పశువులన్నింటినీ చంపివేయండి. మీరు ఆ పట్టణాన్ని పూర్తిగా నాశనం చేయాలి.
DEU 13:16 అప్పుడు మీరు విలువైన వస్తువులన్నింటినీ పోగు చేసి పట్టణం మధ్యకు వాటిని తీసుకొని వెళ్లాలి. ఆ పట్టణాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని మీ దేవుడైన యెహోవాకు దహనబలిగా మీరు కాల్చివేయాలి. ఆ పట్టణం శాశ్వతంగా పాడు దిబ్బగా అవుతుంది. అది ఎన్నటికీ తిరిగి కట్టబడకూడదు.
DEU 13:17 ఆ పట్టణంలో ఉన్న సమస్తం నాశనం చేయబడేందుకు అది యెహోవాకు అప్పగించబడాలి. కనుక ఆ వస్తువుల్లో ఏదీ మీకోసం మీరు ఉంచుకోకూడదు. మీరు ఈ ఆజ్ఞను పాటిస్తే, అప్పుడు యెహోవా మీ మీద కోపం చాలిస్తాడు. యెహోవా మీకు దయను ప్రసాదిస్తాడు. ఆయనకు మీమీద జాలి ఉంటుంది. ఆయన మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ప్రకారం మీ రాజ్యాన్ని విస్తారంగా పెరుగనిస్తాడు.
DEU 13:18 మీరు మీ దేవుడైన యెహోవా మాట ఆలకించి, నేడు నేను మీకు యిస్తున్న ఆజ్ఞలకు విధేయలైతే యిలా జరుగుతుంది. మీ దేవుడైన యెహోవా సరైనవి అని చెప్పేవాటిని మీరు చేయాలి.
DEU 14:1 “మీరు మీ దేవుడైన యెహోవా పిల్లలు. ఎవరైనా చనిపోయినప్పుడు మీ విచారం వ్యక్తం చేయటానికి మిమ్మల్ని మీరు కోనుకోకూడదు. మీ తలలు గుండు గీసుకోకూడదు.
DEU 14:2 ఎందుకంటే మీరు ఇతరులకు వ్యత్యాసంగా ఉన్నారు. మీరు యెహోవాకు ప్రత్యేకమైన ప్రజలు. ప్రపంచంలోని ప్రజలందరిలో నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా ఉండేందుకు ఏర్పాటు చేసుకొన్నాడు.
DEU 14:3 “తినకూడని చెడ్డది అని యెహోవా చెప్పినది ఏదీ తినవద్దు.
DEU 14:4 మీరు ఈ జంతువులను తినవచ్చును: ఆవులు, గొర్రెలు, మేకలు,
DEU 14:5 జింక, దుప్పి, ఎర్రచిన్న జింక, అడవి గొర్రెలు, అడవి మేకలు, లేడి. కొండ గొర్రెలు.
DEU 14:6 గిట్టలు రెండుగా చీలి ఉండి, నెమరు వేసే ఏ జంతువునైనామీరు తినచ్చును.
DEU 14:7 కానీ ఒంటెలను, కుందేళ్లను, పాట్టి కుందేళ్లను తినవద్దు. ఈ జంతువులు నెమరు వేస్తాయి గాని వాటి డెక్కలు చీలి ఉండవు. కనుక ఈ జంతువులు మీకు పవిత్ర ఆహారం కాదు.
DEU 14:8 మరియు మీరు పందుల్ని తినకూడదు. వాటి గిట్టలు చీలి ఉంటాయి గాని అవి నెమరు వేయవు. అందుచేత పందులు మీకు పవిత్ర ఆహారం కాదు. పందిమాంసం ఏమీ తినవద్దు, చచ్చిన పందిని ముట్టుకోవద్దు.
DEU 14:9 “రెక్కలు, పొలుసు ఉన్న ఎలాంటి చేపనైనా తినవచ్చు.
DEU 14:10 కానీ రెక్కలు పొలుసు లేకుండా నీళ్లలో జీవించే దేనినీ మీరు తినవద్దు. అది మీకు పవిత్ర ఆహారం కాదు.
DEU 14:11 “పవిత్రమైన ఏ పక్షినైనా మీరు తినవచ్చును.
DEU 14:12 ఆయితే మీరు తినకూడని పక్షులు ఏవంటే: పక్షిరాజు, ఏ రక్తమైన రాబందు, క్రౌంచు పక్షి, పిల్లిగద్ద, కాకులు, నిప్పుకోళ్లు, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ పైడికంటె ఏ విధమైన గుడ్లగూబ, హంస, గూడ బాతులు, తెల్లబందు, చెరువుకాకి, చీకు బాతు, సారస పక్షి సంకుబుడి కొంగలు, ఏ విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము.
DEU 14:19 “రెక్కలుగల అపవిత్ర పురుగులను దేనినీ తినవద్దు.
DEU 14:20 అయితే పవిత్రమైన ఏ పక్షినైనా మీరు తినవచ్చును.
DEU 14:21 “దానంతట అదే చచ్చిన ఏ జంతువునూ తినవద్దు. చచ్చిన జంతువును మీ ఊళ్లో ఉన్న విదేశీయునికి మీరు ఇవ్వవచ్చు, ఆతడు దాన్ని తినవచ్చు. లేక చచ్చిన జంతువును విదేశీయునికి మీరు అమ్మవచ్చు. కానీ మీ మట్టుకు మీరు చచ్చిన జంతువును తినకూడదు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు చెందిన వారు గనుక. మీరు ఆయనకు ప్రత్యేక ప్రజలు. “గొర్రెపిల్లను దాని తల్లి పాలతో వండవద్దు.
DEU 14:22 “ప్రతి సంవత్సరం మీ పొలాలలో పండే పంటల్లో పదవ వంతు మీరు జాగ్రత్తగా దాచిపెట్టాలి.
DEU 14:23 తర్వాత యెహోవా తనకు ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పరచుకొన్న స్థలానికి మీరు వెళ్లాలి. అక్కడ మీ పంటల్లో పదోవంతు, మీ ధాన్యంలో పదోవంతు, మీ కొత్త ద్రాక్షారసం, మీ నూనె, మీ పశువుల మందలో, గొర్రెల మందలో, మొట్టమొదట పుట్టిన వాటిని మీ దేవుడైన యెహోవాతో కలిసి మీరు తినాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవాను మీరు ఎల్లప్పుడూ గౌరవించటం జ్ఞాపకం ఉంచుకొంటారు.
DEU 14:24 ఆయితే మీరు ప్రయాణం చేయటానికి ఆ స్థలం మీకు చాలా దూరం కావచ్చును. ఒకవేళ మీకు యెహోవా అనుగ్రహించిన పంటలన్నింటిలోని దశమ భాగాలు మీరు మోసుకొని పోలేకపోవచ్చును. ఆలాగనుక జరిగితే యిలా చేయండి:
DEU 14:25 మీ పంటలోని ఆ భాగం అమ్మివేయండి. ఆ ధనం మీతోకూడ తీసుకొని, యెహోవా నిర్ణయించిన ఆ ప్రత్యేక స్థలానికి వెళ్లండి.
DEU 14:26 మీకు యిష్టం వచ్చింది ఏదైనా- ఆవులు, గొర్రెలు, ద్రాక్షారసం, మద్యం లేక మీరు కోరినది ఏ భోజనంగాని యింకేదైనాసరే కొనేందుకు ఆ ధనం వినియోగించండి. తర్వాత మీరు, మీ కుటుంబం మీ దేవుడైన యెహోవాతో కలిసి ఆ స్థలంలో భోజనంచేసి ఆనందించండి.
DEU 14:27 అయితే మీ పట్టణాల్లో నివసించే లేవీయులను నిర్లక్ష్యం చేయవద్దు, ఎందుకంటే మీవలే వారికి భూమిలో భాగం లేదు.
DEU 14:28 “ప్రతి మూడేళ్ల చివరలో, మీ దశమ భాగాలన్నీ ఆ సంవత్సరానికి మీరు తీసుకొని రావాలి. మీ పట్టణంలో ఇతరులు దీనిని వినియోగించుకోగలిగిన ఒక స్థలంలో ఈ ఆహారాన్ని ఉంచాలి.
DEU 14:29 లేవీయులకు వారి స్వంత భూమి లేదు గనుక ఈ ఆహారం వారికోసం ఉంటుంది. మీ పట్టణంలో భోజనం లేని వారికి, విదేశీయులకు, ఆనాథలకు, విధవలకు కూడా ఈ భోజనం ఉంటుంది. ఇలా గనుక మీరు చేస్తే మీరు చేసే ప్రతి దానిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
DEU 15:1 “ప్రతి ఏడు సంవత్సరాల అంతంలో, మీరు అప్పులన్నీ రద్దుచేయాలి.
DEU 15:2 మీరు మీ అప్పులను రద్దు చేయాల్సిన పద్ధతి యిది; మరో ఇశ్రాయేలు మనిషికి అప్పు యిచ్చిన ప్రతి ఇశ్రాయేలు వ్యక్తీ తన అప్పును రద్దుచేయాలి. ఆతడు ఒక సోదరుణ్ణి(ఇశ్రాయేలీయుని) అప్పు తిరిగి చెల్లించమని అడగ కూడదు. ఎందుకంటే ఆ సంవత్సంరలో అప్పులన్నీ రద్దు అయిపొయాయని యెహోవా ప్రకటించాడు గనుక.
DEU 15:3 ఒక విదేశీయుడ్ని మీరు తిరిగి చెల్లించమని అడగవచ్చు. కానీ మరో ఇశ్రాయేలు మనిషి చెల్లించాల్సిన ఏ బాకీనైనా మీరు రద్దుచేయాలి.
DEU 15:4 ఆయితే మీ మధ్య బీద ప్రజలు ఎవరూ ఉండరు. ఎందుకంటే మీరు నివసించుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో యెహోవా మిమ్మల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు.
DEU 15:5 మీరు మీ దేవుడైన యెహోవాకు పూర్తిగా విధేయులైతేనే ఇది జరుగుతుంది. ఈ వేళ నేను మీకు చెప్పిన ప్రతి ఆజ్ఞకూ మీరు జాగ్రత్తగా విధేయులు కావాలి.
DEU 15:6 మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానం ప్రకారం ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరియు మీరు అనేక రాజ్యాలకు అప్పు ఇచ్చేంత ధనం మీకు ఉంటుంది. కాని మీరు మాత్రం ఇతరుల దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు అనేక రాజ్యలను పాలిస్తారు. కానీ ఆ రాజ్యాల్లో ఏదీ మిమ్మల్ని పాలించదు.
DEU 15:7 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు నివసించేటప్పుడు మీ ప్రజల మధ్య ఎవరైనా పేదవారు ఒకరు ఉండవచ్చును. మీరు స్వార్థపరులుగా ఉండకూడదు. ఆ పేద మనిషికి సహాయం చేసేందుకు మీరు నిరాకరించకూడదు.
DEU 15:8 మీరు అతనికి భాగం పంచిపెట్టేందుకు యిష్టపడాలి. ఆ వ్యక్తికి అవసరమైనవి అన్నీ అతనికి అప్పుగా ఇచ్చేందుకు మీరు ఇష్టపడాలి.
DEU 15:9 “ఏడవ సంవత్సరం అంటే అప్పులు రద్దుచేసే సంవత్సరం దగ్గర్లో ఉందని చెప్పి ఎవరికైనా అప్పు ఇచ్చేందుకు ఎన్నడూ తిరస్కరించవద్దు. అలాంటి చెడుతలంపు మీ మనసులో కలుగనియ్యవద్దు. సహాయం కావాల్సిన ఆ వ్యక్తిని గూర్చి నీవు ఎన్నడూ చెడుగా తలంచవద్దు. నీవు అతనికి సహాయం చేసేందుకు నిరాకరించకూడదు. ఆ పేదవానికి నీవు ఏమీ ఇవ్వకపోతే అతడు నీ మీద యెహోవాకు ఆరోపణ చేస్తాడు. మరియు యెహోవా నిన్ను పాపం చేసిన నేరస్థునిగా చూస్తాడు.
DEU 15:10 “పేదవానికి నీవు ఇవ్వగలిగినదంతా ఇవ్వు. అతనికి యిచ్చే విషయంలో చెడుగా భావించకు. ఎందుకంటే ఈ మంచి పని చేసినందుకు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఆయన నీ కార్యాలన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నాలన్నిటిలోనూ, నిన్ను ఆశీర్వాదిస్తాడు.
DEU 15:11 దేశంలో పేద ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారు. అందుకే మీ ప్రజలకు మీ దేశంలో అక్కరలో ఉండే పేద ప్రజలకు ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉండాలని నేను మీకు ఆజ్ఞ యిస్తున్నాను.
DEU 15:12 “మీ ప్రజల్లో ఒకరు — ఒక హెబ్రీ పురుషుడు లేక స్త్రీ మీకు అమ్మబడితే అప్పుడు ఆ వ్యక్తి ఆరు సంవత్సరాలు మీ సేవ చేయాలి. అప్పుడు ఏడవ, సంవత్సరం ఆ వ్యక్తిని నీ దగ్గర్నుండి నీవు స్వేచ్ఛగా పోనివ్వాలి.
DEU 15:13 అయితే నీవు నీ బానిసను స్వేచ్ఛగా పోనిచ్చినప్పుడు, ఏమీ లేకుండానే ఆ వ్యక్తిని పోనివ్వ కూడదు.
DEU 15:14 మీ మందలోనుండి, మీ ధాన్యపుకళ్లములోనుండి, మీ ద్రాక్ష గానుగలోనుండి ఆ వ్యక్తికి మీరు పెద్ద వాటా ఇవ్వాలి. మీ దేవుడైన యెహోవా మీకు మంచివాటిని సమృద్ధిగా యిచ్చి ఆశీర్వదించాడు. అదే విధంగా మీరు కూడా మీ బానిసకు సమృద్ధిగా ఇవ్వాలి.
DEU 15:15 మీరు ఈజిప్టులో బానిసకు అని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షించాడు. అందుచేత మీరు ఇలా చేయాలని నేడు నేను మీతో చెబుతున్నాను.
DEU 15:16 “అయితే మీ బానిసల్లో ఒకరు, ‘నిన్ను నేను విడువను’ అంటారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అతడు ప్రేమించటం చేత, మీ దగ్గర అతడు బాగా బ్రతికినందుచేత అతడుయిలా చెప్పవచ్చును.
DEU 15:17 ఈ సేవకుడు మీ తలుపుకు అతని చెవి ఆనించునట్లు ఉంచి, ఒక కదురును ఉపయోగించి అతని చెవిలో రంధ్రం చేయాలి. అప్పుడు అతడు శాశ్వతంగా మీకు బానిస అవుతాడు. మీ దగ్గరే ఉండిపోవాలి అనుకొనే బానిస స్త్రీలకు కూడ యిలాగే చేయాలి.
DEU 15:18 “మీరు మీ బానిసలను స్వేచ్ఛగా వెళ్లిపోనిచ్చినప్పుడు అది చెడ్ఢ పని అని మీరు తలంచకూడదు. ఒక జీతగానికి నీవు చెల్లించేదానిలో సగం డబ్బుకే అతడు ఆరు సంవత్స రాలు నీ దగ్గర పనిచేసాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు చేసే ప్రతిదానిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
DEU 15:19 “నీ గోవులలోగాని, గొర్రెలలోగాని మొదట పుట్టిన మగవాటన్నింటినీ నీవు యెహోవాకు ప్రతిష్ఠించాలి. ఈ జంతువుల్లో దేనినీ నీ పనికి ఉపయోగించవద్దు. ఈ గొర్రెల్లో దేనినుండీ ఉన్ని కత్తిరించవద్దు.
DEU 15:20 ప్రతి సంవత్సరం నీ గోవుల్లో, గొర్రెల్లో మొట్ట మొదట పుట్టిన జంతువును తీసుకొని, మీ దేవుడైన యెహోవా ఏర్పరచే స్థలంలో దానిని తినండి. యెహోవా మీతో ఉండే ఆ స్థలంలో మీరూ మీ కుటుంబం దానిని తినాలి.
DEU 15:21 “అయితే ఆ జంతువు కుంటిదిగాని, గుడ్డిదిగాని, లేక ఇంకేదైనా దోషంగాని ఉన్నదైతే, ఆ జంతువును మీ దేవుడైన యెహోవాకు మీరు బలిగా అర్పించకూడదు.
DEU 15:22 అయితే మీరు నివసించే స్థలంలో మీరు దాని మాంసం తినవచ్చును. పవిత్రమైన వాళ్లు, అపవిత్రమైన వాళ్లు ఎవరైనాసరే దానిని తినవచ్చును. దీనిని గూర్చిన నియమాలు దుప్పి, జింక మాంసం గూర్చిన లాంటివే.
DEU 15:23 కానీ ఆ జంతువు రక్తం మాత్రం మీరు తాగకూడదు. ఆ రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పోయాలి.
DEU 16:1 “అబీబు నెలలో మీరు మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలి. ఎందుకంటే అబీబు నెలలోనే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రాత్రిపూట ఈజిప్టునుంటి బయటకు రప్పించాడు.
DEU 16:2 యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఏర్పరచుకొనే చోటుకు మీరు వెళ్లాలి. అక్కడ మీ దేవుడైన యెహోవాను గౌరవించేందుకు, పస్కా పండుగ భోజనానికి ఒక ఆవును లేక మేకను మీరు బలి యివ్వాలి.
DEU 16:3 ఈ బలితోపాటు పొంగినది ఏదీ తినవద్దు. ఏడు రోజులపాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఇది “బాధరొట్టె అని పిలువబడుతుంది.” ఈజిప్టు దేశంలో మీ బాధలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది సహాయపడుతుంది. ఎంత త్వరగా మీరు ఆ దేశం విడిచిపెట్టాల్సి వచ్చిందో జ్ఞాపకం ఉందా! మీరు బ్రదికినంత కాలం ఆ రోజును జ్ఞాపకం ఉంచుకోవాలి.
DEU 16:4 దేశవ్యాప్తంగా ఏడు రోజులపాటు ఎక్కడా ఎవరియింటిలో పులియని రొట్టెలు ఉండకూడదు. మరియు మొదటి రోజు సాయంత్రం మీరు బలి అర్పించే మాంసం అంతా తెల్లవారక ముందే తినటం అయిపోవాలి.
DEU 16:5 “మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాలు దేనిలోనైనా పస్కా పండుగ జంతువును మీరు బలి అర్పించకూడదు.
DEU 16:6 మీ దేవుడైన యెహోవా తనకోసం ప్రత్యేక ఆలయంగా ఏర్పాటు చేసుకొన్న స్థలంలో మాత్రమే పస్కా పండుగ జంతువును మీరు బలిగా అర్పించాలి. అక్కడ సాయంకాలం సూర్యుడు అస్తమించినప్పుడు పస్కా పండుగ జంతువును మీరు బలి అర్పించాలి. యెహోవా మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొనివచ్చిన సందర్భము ఇది.
DEU 16:7 మరియు మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనే స్థలంలోనే పస్కా పండుగ మాంసం మీరు వండుకొని తినాలి. అప్పుడు ఉదయాన్నే మీరు తిరిగి మీ గుడారాలకు వెళ్లిపోవాలి.
DEU 16:8 పులియని రొట్టెలను ఆరు రోజులు మీరు తినాలి. ఏడో రోజున మీరు ఏ పనీ చేయకూడదు. ఆ రోజు, మీ దేవుడైన యెహోవా కోసం ప్రత్యేక సమావేశంగా ప్రజలంతా కూడు కొంటారు.
DEU 16:9 “మీరు పంట కోయటం మొదలు పెట్టినప్పటి నుండి ఏడు వారాలు లెక్క కట్టాలి.
DEU 16:10 అప్పుడు మీ దేవుడైన యెహోవాకు వారాల పండుగను మీరు జరుపుకోవాలి. ఒక స్వేచ్ఛార్పణ తీసుకొని రావటంతో దీనిని జరుపుకోండి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడో ఆలోచించి, మీరు ఎంత యివ్వాలి అనేది నిర్ణయించండి.
DEU 16:11 యెహోవా తన ప్రత్యేక ఆలయంగా ఏర్పచుకొనే చోటుకు వెళ్లండి. అక్కడ మీరూ, మీ ప్రజలూ కలికి అక్కడ మీ దేవుడైన యెహోవాతో సంతోషంగా గడపండి. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ సేవకులు, మీ ప్రజలందరినీ మీతో బాటు తీసుకొని వెళ్లండి. అంతే కాదు, మీ పట్టణాలలో నివసించే లేవీయులను, విదేశీయులను, తల్లిదండ్రులు లేని పిల్లలను, విధవలను కూడ తీసుకొని వెళ్లండి.
DEU 16:12 మీరు ఈజిప్టులో బానిసలు అని మరచిపోవద్దు. ఈ ఆజ్ఞలకు మీరు తప్పక విధేయులు కావాలి.
DEU 16:13 “మీ ధాన్యపు కళ్లమునుండి, మీద్రాక్ష గానుగ నుండి మీరు మీ పంటను కూర్చుకొనే ఏడు రోజులకు పర్ణశాలల పండుగ మీరు జరుపుకోవాలి.
DEU 16:14 మీరూ, మీ కుమారులు, మీ కుమారైలు, మీ సేవకులందరూ, మీ పట్టణల్లో నివసించే లేవీయులు, విదేశీయులు, తల్లిదండ్రులు లేని పిల్లలు, విధవలు ఈ పండుగలో సంతోషంగా గడపండి.
DEU 16:15 యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలంలో ఏడు రోజులపాటు ఈ పండుగను మీరు ఆచరించాలి. మీ దేవుడైన యెహోవాను గౌరవించేందుక దీనిని చేయండి. మీ దేవుడైన యెహోవా మీ పంట అంతటినీ, మీరు చేసిన పని అంతటినీ ఆశీర్వదించాడు గనుక బాగా సంతోషించండి.
DEU 16:16 “మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలంలో ఆయనను కలుసుకొనేందుకు సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులంతా రావాలి. ఇది పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ, పర్ణశాలల పండుగలప్పుడు సంభవిస్తుంది. యెహోవాను కలుసుకొనేందుకు వచ్చే ప్రతి వ్యక్తీ ఒక కానుక తీసుకొని రావాలి.
DEU 16:17 ప్రతి మనిషీ ఇవ్వగలిగినంత ఇవ్వాలి. యెహోవా తనకి ఎంత ఇచ్చాడో అనేది గ్రహించి, తాను ఎంత ఇవ్వాలో నిర్ణయించాలి.
DEU 16:18 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి పట్టణంలో మీ వంశాలలో న్యాయమూర్తులను, అధికారులను మీరు నియమించాలి. ఈ న్యాయమూర్తలు, అధికారలు న్యాయంగా సక్రమంగా ప్రజలకు తీర్పు తీర్చాలి.
DEU 16:19 న్యాయ తీర్పును మీరు మార్చకూడదు. మీరు కొందరియెడల పక్షపాతం చూపించకూడదు. ఒక తీర్పులో మీ మనసు మార్చుకొనేందుకు మీరు డబ్బు తీసుకోకూడదు. డబ్బు జ్ఞానుల కళ్లను గుడ్డివి చేస్తుంది, ఒక మంచి వ్యక్తి చెప్పేదానిని మార్చేస్తుంది.
DEU 16:20 మీరు బ్రతికి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకొనేందుకు న్యాయం, మంచి తనం ఉండే తీర్పులనే మీరు ఇవ్వాలి.
DEU 16:21 “మీ దేవుడైన యెహోవాకు మీరు ఒక బలిపీఠం నిలబెట్టినప్పుడు, అషెరా దేవతను ఘనపర్చే చెక్క స్తంభాలు ఏవీ బలిపీఠం పక్కగా మీరు నిలబెట్టకూడదు.
DEU 16:22 మరియు తప్పుడు దేవుళ్లను పూజించేందుకోసం ప్రత్యేకమైన రాయిని మీరు నిలబెట్టకూడదు. మీ దేవుడైన యెహోవా విగ్రహాలను విగ్రహారాధనను అసహ్యించుకుంటాడు.
DEU 17:1 “ఏదైనా దోషం ఉన్న ఆవునుగాని, గొర్రెనుగాని మీరు మీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించకూడదు. ఎందుకంటే, మీ దేవుడైన యెహోవాకు అది అసహ్యం.
DEU 17:2 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పట్టణాల్లో ఒకదానిలో జరిగిన ఒక చెడు విషయాన్ని గూర్చి మీరు వినవచ్చును. మీలో ఒక పురుషడు లేక ఒక స్త్రీ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినట్టు మీరు వినవచ్చును. వారు యెహోవా ఒడంబడికను తప్పిపోయినట్టు
DEU 17:3 వారు ఇతర దేవుళ్లను పూజించినట్టు మీరు వినవచ్చును. లేదా వాళ్లు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను పూజించినట్టు మీరు వినవచ్చును. అది యెహోవానైన నేను మీకు ఇచ్చిన ఆజ్ఞకు విరుద్ధం.
DEU 17:4 ఇలాంటి దుర్వార్త మీరు వింటే, మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇశ్రాయేలీయులలో ఈ దారుణ సంఘటన నిజంగా జరిగింది వాస్తవమా అనేది మీరు తెలసుకోవాలి. అది వాస్తవమని మీకు ఋజువైతే
DEU 17:5 ఆ చెడు కార్యం చేసిన మనిషిని మీరు శిక్షించాలి. ఆ పురుషుని లేక స్త్రీని మీరు మీ పట్టణ ద్వారము దగ్గరకు తీసుకొనివెళ్లి రాళ్ళతో కొట్టి వారిని చంపాలి.
DEU 17:6 ఆయితే ఆ వ్యక్తి చెడుకార్యం చేసాడని ఒక్కరు మాత్రమే సాక్ష్యము చెబితే ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించకూడదు. ఆయితే అది సత్యం అని ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెబితే, అప్పుడు ఆ వ్యక్తిని చంపివేయాలి.
DEU 17:7 ఆ వ్యక్తిని చంపటానికి మొదట ఆ సాక్షులు, తరువాత ప్రజలంతా ఆ వ్యక్తి మీద చేతులు వేయాలి. ఈ విధంగా మీ మధ్యనుండి ఆ చెడును నిర్మూలించాలి.
DEU 17:8 “మీ న్యాయస్థానాలు తీర్పు చెప్పలేనంత కష్టతరమైన సమస్యలు కొన్ని ఉండవచ్చును. అది ఒక హత్యానేరం కావచ్చు లేక ఇద్దరి మధ్య వివాదం కావచ్చును. లేక యిద్దరి మధ్య ఘర్షణలో ఒకరికి హాని కలిగిన విషయం కావచ్చు. మీ పట్టణాల్లో ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చినప్పుడు, ఏది నిజం అనే విషయాన్ని మీ న్యాయమూర్తులు నిర్ధారణ చేయలేక పోవచ్చును. అప్పుడు మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలానికి మీరు వెళ్లాలి.
DEU 17:9 లేవీ వంశానికి చెందిన యాజకుల దగ్గరకు, అప్పటికి పదవిలో ఉన్న న్యాయమూర్తి దగ్గరకు మీరు వెళ్లాలి. ఆ సమస్యను గూర్చి ఏమి చేయాలో వారు నిర్ణయిస్తారు.
DEU 17:10 అక్కడ యెహోవా ప్రత్యేక స్థలంలో వారు వారి తీర్మానాన్ని మీకు తెలియజేస్తారు. మీరు చేయాలని వారు మీకు చెప్పే విషయాలన్నీ మీరు జాగ్రత్తగా చేయాలి.
DEU 17:11 మీరు వారి తీర్మానాన్ని అంగీకరించి, వారి హెచ్చరికలను ఖచ్చితంగా పాటించాలి. మీరు చేయాలని వారు చెప్పేదానికి ఏదీ మీరు వ్యతిరేకంగా చేయకూడదు.
DEU 17:12 “ఆ సమయంలో అక్కడ మీ దేవుడైన యెహోవాను సేవిస్తున్న న్యాయమూర్తికి లేక యాజకునికి విధేయులయ్యేందుకు నిరాకరించిన వ్యక్తిని మీరు శిక్షించాలి. ఆ వ్యక్తి చావాల్సిందే. ఇశ్రాయేలులో ఈ చెడుగును మీరు అరికట్టాలి.
DEU 17:13 ఈ శిక్షనుగూర్చి ప్రజలంతా విని భయం తెచ్చుకొంటారు. వారు ఇకమీదట మొండిగా ఉండరు.
DEU 17:14 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశిస్తారు. మీరు ఆ దేశాన్ని స్వాధినం చేసుకొని దానిలో మీరు నివసిస్తారు. అప్పుడు మీరు ‘మా చుట్టూ ఉన్న రాజ్యాలలాగే మాకూ ఒక రాజును మేము నియమించుకొంటాము’ అంటారు.
DEU 17:15 అలా జరిగినప్పుడు యెహోవా ఏర్పాటు చేసిన రాజునే మీరూ ఏర్పరచుకోవాలి. మీ మీద వుండే రాజు మీ ప్రజల్లో ఒకడై ఉండాలి. ఒక విధేశీయుణ్ణి మీరు రాజుగా చేయకూడదు.
DEU 17:16 రాజు తనకోసం మరీ ఎక్కువ గుర్రాలను సంపాదించుకోకూడదు. ఇంకా గుర్రాలు తీసుకొనివచ్చేందుకు ఆతడు ఈజిప్టుకు మనుష్యలను పంపకూడదు. ఎందుకంటే ‘మీరు ఎప్పుడూ తిరిగి ఆ మార్గాన వెళ్లకూడదు’అని యెహోవా మీతో చెప్పాడు గనుక.
DEU 17:17 మరియు రాజుకు ఎక్కువమంది భార్యలు ఉండకూడదు. ఎందుకంటే అది ఆతణ్ణి యెహోవానుండి మళ్లింపచేస్తుంది గనుక. మరియు రాజు వెండి బంగారాలతో తనను తాను ఐశ్వర్యవంతునిగా చేసుకోకూడదు.
DEU 17:18 “ఆ రాజు పరిపాలన ప్రారంభించినప్పుడు, ధర్మశాస్త్రం నకలు ఒకటి తనకోసం ఒక గ్రంథంలో అతడు రాసుకోవాలి. యాజకుల, లేవీయుల గ్రంథాలనుండి ఆతడు ఆ ప్రతిని తయారు చేసుకోవాలి.
DEU 17:19 రాజు ఆ గ్రంథాన్ని తన దగ్గర ఉంచుకోవాలి. ఆతడు తన జీవితం అంతా ఆ గ్రంథం చదవాలి. ఎందుకంటే అప్పుడే రాజు తన దేవుడైన యెహోవాను గౌరవించటం నేర్చుకొంటాడు. ధర్మశాస్త్రం ఆజ్ఞాపించే ప్రతిదానికీ పూర్తి విధేయత చూపటం కూడ ఆతడు నేర్చుకొంటాడు.
DEU 17:20 అప్పుడు రాజు తన ప్రజలందరికంటే తానే గొప్పవాడ్ని అని తలంచడు. ఆతడు ధర్మశాస్త్రనికి దూరంగా తిరిగి పోకుండా, ఖచ్చితంగా దానిని పాటిస్తాడు. అప్పుడు ఆ రాజు, ఆతని సంతతివారు ఇశ్రాయేలు రాజ్యాన్ని చాలా కాలం పరిపాలిస్తారు.
DEU 18:1 “ఇశ్రాయేలు దేశంలో లేవీ వంశపువారికి భూమిలో ఎలాంటి వాటా దొరకదు. ఆ ప్రజలు యాజకులు సేవచేస్తారు. నిప్పుమీద వంటచేసి, యెహోవాకు అర్పించబడిన బలులు తింటూ వారు బ్రదుకుతారు. లేవీ వంశపు ప్రజల వాటా అదే.
DEU 18:2 ఇతర వంశాల వారిలా ఆ లేవీ ప్రజలకు భూమిలో వాటా ఏమీ ఉండదు. యెహోవాయే లేవీయుల వాటా, యెహోవా ఇది వారికి వాగ్దానం చేసాడు.
DEU 18:3 “మీరు ఒక ఆవును, ఎద్దును, లేక గొర్రెను బలిగా చంపినప్పుడు, జబ్బ, రెండు దవడలు, పొట్ట మీరు యాజకులకు ఇవ్వాలి.
DEU 18:4 మీ మొదటి పంటలోనుండి మీ ధాన్యం, మీ కొత్త ద్రాక్షారసం, నూనె మీరు యాజకులకు ఇవ్వాలి. మీ గొర్రెలనుండి కత్తిరించిన మొదటి ఉన్ని మీరు లేవీయులకు ఇవ్వాలి.
DEU 18:5 ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా మీ వంశాలన్నింటినీ చూసి, శాశ్వతంగా తనకు యాజకులుగా ఉండేందుకు లేవీయుని, అతని సంతతివారిని ఏర్పరచుకొన్నాడు.
DEU 18:6 “ఇశ్రాయేలులోని ఏ పట్టణం నుండియైనా లేవీయుడు యెహోవా నియమించిన స్థలానికి తన ఇష్ట మున్నప్పుడెల్ల రావచ్చు.
DEU 18:7 అప్పుడు ఈ లేవీయుడు తన దేవుడైన యెహోవా పేరుమీద పరిచర్య చేయ వచ్చు. అతడు విధి నిర్వహిస్తున్న తన సోదర లేవీయు లందరిలాగే యెహోవా ప్రత్యేక ఆలయంలో పరిచర్య చేయాలి.
DEU 18:8 ఆ లేవీయుడికి సామాన్యంగా తన కుటుంబానికి వచ్చే వాటా కాకుండా, మిగిలిన లేవీయులతోను సమానంగా వాటా వస్తుంది.
DEU 18:9 “మీ దేవుడైన యెహోవామీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించినప్పుడు అక్కడ ఉండే ఇతర రాజ్యాల ప్రజలు చేసే దారుణమైన పనులు చేయటం నేర్చు కోవద్దు.
DEU 18:10 మీ బలిసీఠాల అగ్నిమీద మీ కుమారులను గాని మీ కుమార్తెలను గాని బలి ఇవ్వవద్దు. జ్యోతిష్యం చెప్పేవానితోగాని, మాంత్రికుని దగ్గర గాని, భూతవైద్యుని దగ్గర గాని సోదెచెప్పేవారి దగ్గరగాని మాట్లాడి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని తెలిసి కొనేందుకు ప్రయత్నించవద్దు.
DEU 18:11 ఎవరినీ యితరుల మీద మంత్ర ప్రభావంతో బంధించనీయవద్దు. మీ మధ్య ఎవ్వరూ కర్ణపిశాచము అడిగేవారుగా గాని, సోదె చెప్పే వాడుగాగాని, ఉండకూడదు. ఎవ్వరూ చనిపోయినవారితో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు.
DEU 18:12 అలాంటివి చేసే వాళ్లంటే మీ దేవుడైన యెహోవాకు అసహ్యం. అందుకే ఆ ఇతర రాజ్యాల వాళ్లను మీ ఎదుట నుండి ఆయన వెళ్లగొట్టేస్తాడు.
DEU 18:13 మీ దేవుడైన యెహోవాకు మీరు నమ్మకంగా ఉండాలి.
DEU 18:14 “మీరు ఆ ఇతర జనాంగాలను మీ దేశంలోనుండి వెళ్లగొట్టాలి. ఆ జనాంగాలు సోదెగాండ్ర మరియు శకునాలు చెప్పువారి మాంత్రికుల మాటలు వింటారు. అయితే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అలాంటి పనులు చేయనియ్యడు.
DEU 18:15 మీ దేవుడైన యెహోవా మీ దగ్గరకు ఒక ప్రవక్తను పంపిస్తాడు. ఈ ప్రవక్త మీ స్వంత ప్రజల్లోనుండి వస్తాడు. అతడు నాలాగే ఉంటాడు. మీరు ఈ ప్రవక్త మాట వినాలి.
DEU 18:16 దేవుడే మీకు ఈ ప్రవక్తను పంపిస్తాడు, ఎందుకంటే మీరు ఆయనను అడిగింది అదే. మీరు హోరేబు (సినాయి) కొండ దగ్గర సమావేశమైనప్పుడు దేవుని స్వరం విని, కోండమీద మహా అగ్నిని చూచి మీరు భయపడ్డారు. అందుచేత ‘మా దేవుడైన యెహోవా స్వరం మరోసారి మమ్మల్ని విననీయవద్దు. ఆ మహా గొప్ప అగ్నినిమాకు కనబడనీయవద్దు, మేము చస్తాము’ అని మీరు అన్నారు.
DEU 18:17 “యెహోవా నాతో ఇలా చెప్పాడు: ‘వారు అడుగుతోంది మంచిదే.
DEU 18:18 నీవంటి ఒక ప్రవక్తను నేను వారికోసం పంపిస్తాను. ఈ ప్రవక్త వారి స్వంత ప్రజల్లో ఒకడే. అతడు చెప్పాల్సిన విషయాలను నేను అతనికి చెబుతాను. నేను ఆజ్ఞాపించేవి అన్నీ అతడు ప్రజలకు చెబుతాడు.
DEU 18:19 ఈ ప్రవక్త నా పక్షంగా మాట్లాడతాడు అతడు నా పక్షంగా మాట్లాడినప్పుడు, ఏ వ్యక్తి అయినా సరే నా ఆజ్ఞలు వినటానికి నిరాకరిస్తే, ఆ వ్యక్తిని నేను శిక్షిస్తాను.’
DEU 18:20 “అయితే ఒక ప్రవక్త చెప్పాల్సిందిగా నేను చెప్పని దానిని చెప్పవచ్చు. అతడు నా పక్షంగా మాట్లాడుతున్నానని ప్రజలతో చప్పవచ్చును. ఇలా జరిగితే ఆ ప్రవక్త చంపబడాల్సిందే. లేక ఇతర దేవుళ్ల పక్షంగా ఒక ప్రవక్త మాట్లాడవచ్చు. ఆ ప్రవక్త కూడా చంపబడాల్సిందే.
DEU 18:21 ‘ప్రవక్త చెబుతోన్న విషయం యెహోవా చెప్పింది కాదు అని మనం ఎలా తెలుసు కోగలము’ అని మీరు తలుస్తూ ఉండవచ్చు.
DEU 18:22 ప్రవక్త యెహోవా పక్షంగా మాట్లాడుతున్నానని చెప్పినప్పుడు, ఆ విషయం జరగకపోతే, అది యెహోవా చెప్పింది కాదు అని అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఈ ప్రవక్త తన స్వంత ఆలోచనలనే చెబుతున్నాడని మీకు తెలుస్తుంది. అతని గూర్చి మీరు భయపడాల్సిన పనిలేదు.
DEU 19:1 “ఇతర రాజ్యాలకు చెందిన దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు. ఆ రాజ్యాలను యెహోవా నాశనం చేస్తాడు. ఆ ప్రజలు నివసించిన చోట మీరు నివపిస్తారు. వారి పట్టణాలు, ఇండ్లు మీరు స్వాధీనం చేసుకొంటారు. అది జరిగి నప్పుడు,
DEU 19:2 దేశాన్ని మీరు మూడు భాగాలు చేయాలి. తర్వాత ఒక్కో ప్రాంతంలో ఉండే ప్రజలందరకి దగ్గరగా ఉండేటట్టు ఆ భాగంలో ఒక ఒక పట్టణాన్ని మీరు ఏర్పరచు కోవాలి. ఆ పట్టణాలకు మీరు త్రోవలు వేయాలి. ఒక వ్యక్తిని చంపిన ఏ వ్యక్తిగాని అక్కడికి పారి పోవచ్చును.
DEU 19:4 “ఎవరినైనా చంపేసి భద్రతకోసం ఈ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయే మనిషికి నియమాలు ఇవి, అతడు ప్రమాదవశాత్తు మరొకరిని చంపినవాడై ఉండాలి. అతడు తాను చంపిన వ్యక్తిని ద్వేషించిన వాడు కాకూడదు.
DEU 19:5 ఒక ఉదాహరణ: ఒక మనిషి మరొక వ్యక్తితో కలసి కట్టెలు కొట్టుకొనేందుకు అడవికి వెళ్లవచ్చును. ఒక చెట్టును నరకడానికి అతడు తన గొడ్డలిని విసురుతాడు కాని ఆ గొడ్డలి దాని పిడినుండి ఊడి పోతుంది. ఆ గొడ్డలి ఊడి వెళ్లి అవతల మనిషికి తగుల్తుంది, అతడు చనిపోతాడు. అప్పుడు ఆ గొడ్డలి విసరిన మనిషి ఆ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయి భద్రంగా ఉండవచ్చును.
DEU 19:6 అయితే ఆ పట్టణం చాలా దూరంగా ఉంటే అతడు కావాల్సినంత వేగంగా పరుగెత్తలేక పోవచ్చును. అతను చంపిన మనిషి బంధువు ఎవరైన అతణ్ణి తరిమి, అతడు ఆ పట్టణం చేరక ముందే పట్టుకోవచ్చును. ఆ దగ్గర బంధువు చాలా కోపంతో అతణ్ణి చంపివేయ వచ్చును. కానీ ఆ మనిషి మరణ పాత్రుడుకాడు. అతడు చంపినవాణ్ణి అతడు ద్వేషించలేదు.
DEU 19:7 కనుక ఈ పనికోసం మూడు పట్టణాలను నిర్ణయించు కోవాల్సిందిగా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
DEU 19:8 “మీ దేవుడైన యెహోవా మీ దేశాన్ని విస్తరింపచేస్తానని మీ తండ్రులకు వాగ్దానం చేసాడు. మీ పూర్వీకులకు ఇస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశం ఆయన మీకు ఇస్తాడు.
DEU 19:9 ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలకు మీరు పూర్తిగా విధేయులై, మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించి, ఎల్లప్పుడూ ఆయన మార్గాలలో జీవిస్తే, ఆయన దీనిని చేస్తాడు. తర్వాత యెహోవా మీ దేశాన్ని విస్తృతపరచినప్పుడు భద్రత కోసం యింకా మూడు పట్టణాలను మీరు ఏర్పాటు చేసుకోవాలి. అవి మొదటి మూడు పట్టణాలకు చేర్చ బడాలి.
DEU 19:10 అప్పుడు మీ స్వంతంగా మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో అమాయక ప్రజలు చంపబడరు. మరియు ఏ మరణం విషయంలోనూ మీరు దోషులుగా ఉండరు.
DEU 19:11 “అయితే ఒకడు మరొకడ్ని ద్వేషించాడను కోండి. అతడు దాగుకొని, తాను ద్వేషించే మనిషిని చంపేందుకు వేచి ఉంటాడు. అతడు ఆ వ్యక్తిని చంపేసి భద్రతకోసం ఈ పట్టణాల్లో ఒక దానికి పారిపోతాడు.
DEU 19:12 అలా జరిగితే అతని స్వగ్రామంలోని పెద్దలు ఎవరినైనా పంపి అతణ్ణి పట్టుకొని ఆశ్రయపురంనుండి తీసుకొని వెళ్లిపోవాలి. అతణ్ణి శిక్షించాల్సిన బాధ్యత గల బంధువులకు ఆ పెద్దలు అప్పగించాలి. ఆ హంత కుడు మరణించాలి.
DEU 19:13 అతని కోసం మీరు విచారించకూడదు. నిర్దోషులను చంపిన పాపంనుండి ఇశ్రాయేలీయులను మీరు తప్పించాలి అప్పుడు మీకు అంతా మేలు అవుతుంది.
DEU 19:14 “నీవు నీ పొరుగువాని సరిహద్దు రాళ్లు తీసివేయకూడదు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో పూర్వీకులు ఈ సరిహద్దు రాళ్లను పెట్టారు.
DEU 19:15 “ఒక వ్యక్తి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏదైనా చేస్తున్నట్టు నేరారోపణ ఉంటే, ఆ వ్యక్తి దోషి అని నిర్దారణ చేయటానికి ఒక్క సాక్ష్యం చాలదు. ఆ వ్యక్తి నిజంగా తప్పు చేసాడని నిరూపించటానికి ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు అవసరం.
DEU 19:16 “ఒక సాక్షి మరో వ్యక్తి తప్పు చేసాడని, అతని మీద అబద్ధం చెప్పి, అతనికి హాని చేయాలని చూడవచ్చును.
DEU 19:17 అప్పుడు ఒకరితో ఒకరు వాదించు కొంటున్న ఆ ఇద్దరు వ్యకులూ యెహోవా ప్రత్యేక ఆలయానికి వెళ్లి, అప్పట్లో నాయకులుగా ఉన్న యాజకులు, న్యాయమూర్తులచే తీర్పు పొందాలి.
DEU 19:18 న్యాయ మూర్తులు జాగ్రత్తగా ప్రశ్నలు వేయాలి. సాక్షి అవతలి వ్యక్తిమీద అబద్ధాలు చెప్పినట్టు వారు తెలుసు కోవచ్చు. ఒకవేళ సాక్షి అబద్ధం చెప్పి ఉంటే
DEU 19:19 మీరు అతణ్ణి శిక్షించాలి. అవతలి వ్యక్తికి ఇతడు ఏమి చేయాలను కొన్నాడో దానినే ఇతనికి మీరు చేయాలి. ఈ విధంగా మీ మధ్యలో ఏలాంటి కీడులేకుండా మీరు చేయాలి.
DEU 19:20 మిగిలిన ప్రజలంతా ఇది విని భయపడతారు. మళ్లీ అలాంటి చెడు కార్యం ఇంకెవ్వరూ ఎన్నడూ చేయరు.
DEU 19:21 “తప్పు చేసిన వాడ్ని మీరు శిక్షించినప్పుడు మీరు విచారించకూడదు. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు తీసివేయాలి. ( నేరస్థునికి శిక్ష విధించినట్టుగానే).
DEU 20:1 “మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటానికి వెళ్లినప్పుడు, మీకుంటె ఎక్కువ గుర్రాలు, రథాలు, మనుష్యులు కనబడితే మీరు వారిని గూర్చి భయపడకూడదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొని వచ్చాడు.
DEU 20:2 “యుద్ధానికి మీరు దగ్గరగా వెళ్లినప్పుడు యాజకుడు సైనికుల దగ్గరకు వెళ్లి, వారితో మాట్లాడాలి.
DEU 20:3 యాజకుడు ఇలా చెప్పాలి, ‘ఇశ్రాయేలు మనుష్యులారా నా మాట వినండి. ఈవేళ మీరు మీ శ్రతువులతో యుద్ధానికి వెళ్తున్నారు. మీ ధైర్యం విడువవద్దు. కలవరపడవద్దు. శత్రువునుగూర్చి భయపడవద్దు.
DEU 20:4 ఎందుకంటే మీ పక్షంగా మీ శత్రువులతో పోరాడేందుకు మీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మీరు విజయం పొందేటట్లు సహాయం చేస్తాడు.’
DEU 20:5 “లేవీ అధికారులు సైనికులతో ఇలా చెప్పాలి: ‘కొత్త ఇల్లు కట్టుకొని దానిని ఇంకా ప్రతిష్ఠించని వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అలాంటివాడు తిరిగి తన ఇంటికి వెళ్లిపోవాలి. అతడు యుద్ధంలో చంపబడతాడేమో. అలాంటప్పుడు మరో మనిషి అతని ఇంటిని ప్రతిష్ఠిస్తాడు.
DEU 20:6 ద్రాక్షాతోటను నాటి, ఇంకా ద్రాక్షాపండ్లు కూర్చు కొననివాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలి. ఆ మనిషి యుద్ధంలో మరణిస్తే, అప్పుడు అతని పొలంలోని ఫలాలను మరొకడు అనుభవిస్తాడు.
DEU 20:7 వివాహం కోసం ప్రధానం జరిగినవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలి. యుద్ధంలో అతడు మరణిస్తే, అతనికి ప్రధానం చేయబడిన స్త్రీని మరొకడు వివాహం చేసుకొంటాడు.’
DEU 20:8 “ఆ లేవీ అధికారులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి. ‘ధైర్యం పోయి, భయపడ్తున్నవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అతడు తిరిగి ఇంటికి వెళ్లాలి. అప్పుడు అతడు మిగిలిన స్తెనికులుకూడా ధెర్యం కోల్పోయెటట్టు చేయకుండా ఉంటాడు.’
DEU 20:9 తర్వాత అధికారులు స్తెన్యంతో మాట్లాడటం అయిపోయిన తర్వాత, స్తెన్యాన్ని నడిపించేందుకు సేనాధిపతులను వారు నియమించాలి.
DEU 20:10 “మీరు ఒక పట్టణం మీద దాడి చేయక ముందు అక్కడి ప్రజలకు మీరు శాంతి రాయబారం పంపించాలి.
DEU 20:11 మీ రాయబారాన్ని వారు అంగీకరిచి, వారి గుమ్మాలు తెరచినట్లయితే ఆ పట్టణంలోని ప్రజలంతా మీకు కప్పం కట్టేవాళ్లవుతారు. మీకు బానిసలై మీకు పని చేయవలసివస్తారు.
DEU 20:12 అయితే ఆ పట్టణం మీతో సమాధానపడేందుకు నిరాకరించి మీతో పోరాడితే అప్పుడు మీరు ఆ పట్టణాన్ని చుట్టుముట్టాలి.
DEU 20:13 మరియు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆ పట్టణం స్వాధీనం చేసుకోనిచ్చినప్పుడు, మీరు దానిలోని పురుషులందరినీ చంపివేయాలి.
DEU 20:14 ఆయితే ఆ పట్టణంలోని స్త్రీలను, పిల్లలను, పశువులను, మిగిలిన సమస్తం మీరు తీసుకోవచ్చును. మీ దేవుడైన యెహోవా వీటిని మీకు ఇచ్చాడు.
DEU 20:15 మీరు నివసించబోయే దేశంలోగాక, మీకు దూరంగా ఉన్న పట్టణాలన్నింటికీ మీరు అలాగే చేయాలి.
DEU 20:16 “ఆయితే మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని పట్టణాలను మీరు స్వాధీనం చేసుకోన్నప్పుడు ప్రతి ఒక్కరినీ మీరు చంపేయాలి.
DEU 20:17 హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు, మొత్తం ప్రజలందరినీ పూర్తిగా మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేయాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించాడు.
DEU 20:18 ఎందుకంటే అలా చేస్తే, మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయమని వారు మీకు నేర్పించజాలరు. వారు వారి దేవుళ్లను పూజించేటప్పుడు చేసే భయంకర పనులు ఏవీ వారు మీకు నేర్పించరు.
DEU 20:19 “మీరు ఒక పట్టణం మీద యుద్ధం చేస్తుంటే, చాలా కాలంవరకు మీరు ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేసి ఉండవచ్చు. ఆ పట్టణం చుట్టూ ఉండే ఫలవృక్షాలను మీరు నరికి వేయకూడదు. ఆ చెట్ల ఫలాలు మీరు తినవచ్చును గాని ఆ చెట్లను నరికి వేయకూడదు. ఈ చెట్లు మీ శత్రువులు కాదు, అందుచేత వాటితో యుద్ధం చేయవద్దు.
DEU 20:20 ఆయితే ఫలాలు ఇవ్వని చెట్లు అని మీకు తెలిసిన వాటిని మీరు నరికివేయ వచ్చును. ఆ పట్టణం మీద యుద్ధం చేయటానికి అవసరమైన ఆయుధాలను తయారు చేసేందుకు ఈ చెట్లను మీరు ఉపయోగించ వచ్చును. ఆ పట్టమం పతనం ఆయ్యేంత వరకు మీరు వాటిని ఉపయోగించవచ్చును.
DEU 21:1 “మీరు నివసించేందుకు, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఒక పొలంలో హత్య చేయబడిన వాడు ఒకడు కనబడవచ్చును. కానీ ఆతణ్ణి చంపింది ఎవరో ఎవరికీ తెలియదు.
DEU 21:2 అప్పుడు మీ నాయకులు, న్యాయమూర్తులు బయటకు వచ్చి, చంపబడిన మనిషి చుట్టూ ఉన్న పట్టణాల దూరాన్ని కొలత వేయాలి.
DEU 21:3 చచ్చిన వానికి అతి దగ్గరగా ఉన్న పట్టణం ఏదో తెలిసినప్పుడు, ఆ పట్టణం పెద్దల వారి మందలో నుండి ఒక ఆవును తీసుకొని రావాలి. అది పెయ్యగా ఉండాలి. అది ఎన్నడూ ఏ పనికీ వినియోగించబడనిది కావాలి.
DEU 21:4 అప్పుడు ఆ పట్టణపు నాయకుడు, నీరు ప్రవహిస్తున్న ఒక లోయలోనికి ఆ ఆవును తీసుకొని రావాలి. ఆ లోయ ఇదివరకు ఎన్నడూ దున్ననిది, మొక్కలు నాటనిదిగా ఉండాలి. అప్పుడు నాయకులు ఆ లోయలో ఆవు మెడను విరుగగొట్టాలి.
DEU 21:5 లేవీ సంతతివారు యాజకులుకూడ అక్కడికి వెళ్లాలి. (యెహోవాను సేవించేందుకు, ఆయన పేరిట ప్రజలను దీవించేందుకు మీ దేవుడైన యెహోవా ఈ యాజకులను ఏర్పాటు చేసుకొన్నాడు. వివాదానికి సంబంధించిన ప్రతి విషయంలో న్యాయం ఎవరిదో యాజకులే నిర్ణయిస్తారు.)
DEU 21:6 ఆ శవానికి అతి సమీపంగా ఉన్న పట్టణపు నాయకులంతా, లోయలో మెడ విరుగగొట్టబడిన ఆవుమీద వారి చేతులు కడుగుకోవాలి.
DEU 21:7 ఈ నాయకులు ఇలా చెప్పాలి, ‘ఈ మనిషిని మేము చంపలేదు. అది జరగటం మేము చూడలేదు.
DEU 21:8 యెహోవా, నీవు విమోచించిన నీ ఇశ్రాయేలు ప్రజలను క్షమించు. నీ ప్రజల్లో నిర్దోషిని ఎవరినీ నిందించబడనీయకు.’ అప్పుడు ఆ హత్య నిమిత్తం వారు నిందించబడరు.
DEU 21:9 అలాంటి పరిస్థితుల్లో ఇలా చేయటమే మీకు సరి. అలా చేయటం ద్వారా నిర్దోషులు ఎవరి హత్యనుగూర్చీ నిందించబడరు.
DEU 21:10 “మీరు మీ శత్రువులతో యుద్ధం చేస్తారు, మీరు వారిని ఓడించేటట్టు మీ దేవుడైన యెహోవా చేస్తాడు. అప్పుడు మీరు మీ శత్రువులను బందీలుగా కొని పోతారు.
DEU 21:11 ఆ బందీలలో అందమైన ఒక స్త్రీని నీవు చూడవచ్చు. నీవు ఆమెను వాంఛించి, నీ భార్యగా చేసుకోవాలని తలంచవచ్చు.
DEU 21:12 అప్పుడు నీవు ఆమెను నీ ఇంటికి తీసుకొని రావాలి. ఆమె తన తల గొరిగించుకొని, గోళ్లు కత్తిరించుకోవాలి.
DEU 21:13 ఆమె ధరించి ఉన్న బట్టలు తీసివేయాలి. ఆమె నీ ఇంటనే ఉండి తన తల్లిదండ్రుల కోసం నెల రోజులు విలపించాలి, ఆ తర్వాత నీవు ఆమె దగ్గరికి పోవచ్చును. ఆమెకు భర్తవు కావచ్చును. ఆమె నీకు భార్య అవుతుంది.
DEU 21:14 కాని ఆమె వలన నీకు సంతృప్తి కలుగకపోతే, తనకు ఇష్టంవచ్చిన చోటికి నీవు ఆమెను పోనివ్వాలి. ఆయితే నీవు ఆమెను అమ్మకూడదు. నీవు ఆమెను బానిసగా చూడరాదు. ఎందుకంటే నీ వలన ఆమెకు అవమానము కలిగింది గనుక.
DEU 21:15 “ఒక పురుషునికి ఇద్దరు భార్యలు ఉండి, వారిలో ఒకదానికంటె మరొక దానిని అతడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉండవచ్చును. ఆ ఇద్దరు భార్యలూ ఆతనికి పిల్లలను కనవచ్చును. ఆతడు ప్రేమించని భార్యకు పుట్టిన బిడ్డ మొదటి బిడ్డ కావచ్చును.
DEU 21:16 ఆతడు తన ఆస్తిని తన పిల్లలకు పంచి ఇచ్చేటప్పుడు జ్యేష్ఠునికి చెందిన ప్రత్యేకమైన ని, తాను ప్రేమించే భార్య కుమారునికి ఆతడు ఇచ్చివేయకూడదు.
DEU 21:17 తన ప్రేమకు పాత్రము కాని మొదటి భార్య బిడ్డను ఆతడు స్వీకరించాలి. ఆతడు అన్నించిలో రెండంతల భాగం మొదటి కుమారునికి ఇవ్వాలి. ఎందుకంటే, ఆ బిడ్డ ఆతని మొదటి బిడ్డ గనుక. ప్రథమ సంతానం హక్కు ఆ బిడ్డకే చెందుతుంది.
DEU 21:18 “ఒకని కుమారుడు మొండివాడు, లోబడడు. ఈ కుమారుడు తండ్రికి గాని తల్లికి గాని విధేయుడు కాడు. తల్లిదండ్రులు ఆ కుమారుని శిక్షిస్తారు. ఆయినప్పటికీ వారి మాట ఆతడు నిరాకరిస్తాడు.
DEU 21:19 అప్పుడు పట్టణ సమావేశ స్థలం దగ్గర ఉండే ఆ పట్టణ నాయకుల దగ్గరకు ఆ తల్లిదండ్రులు వానిని తీసుకొని వెళ్లాలి.
DEU 21:20 ఆ పట్టణ నాయకులతో వారు ఇలా చెప్పాలి: ‘మా కుమారడు మొండివాడు, లోబడటం లేదు. మేము చెప్పిన ఏ పనీ అతడు చేయడు. వాడు విపరీతంగా తిని తాగుతున్నాడు.’
DEU 21:21 అప్పుడు ఆ పట్టణంలోని మనుష్యులు ఆ కుమారుని రాళ్లతో కొట్టి చంపాలి. ఇలా చేయటం ద్వారా ఈ చెడుతనాన్ని మీ నుండి తొలగిస్తారు. ఇశ్రాయేలు ప్రజలంతా దీనిగూర్చి విని భయపడతారు.
DEU 21:22 “ఒక వ్యక్తి మరణ శిక్షకు యోగ్యమైన పాపం చేసి నేరస్థుడు కావచ్చును. అతణ్ణి చంపేసిన తర్వాత ఆతని శవాన్ని ఒక చెట్టుకు వేలాడదీయాలి.
DEU 21:23 అలా జరిగినప్పుడు ఆతని శవం రాత్రి అంతా చెట్టుకు ఉండకూడదు. ఆ మనిషిని మీరు ఆ రోజే తప్పక సమాధి చేయాలి. ఎందుకంటే, చెట్టుమీద వేలాడే మనిషి దేవుని చేత శపించబడ్డాడు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మీరు పాడు చేయకూడదు.
DEU 22:1 “నీ పొరుగు వాని ఆవు లేక గొర్రె తప్పి పోయి తిరగటం నీవు చూసినప్పుడు చూడనట్టు విస్మరించకూడదు. నీవు దాన్ని తప్పక దాని యజమాని దగ్గరకు తీసుకొని వెళ్లాలి.
DEU 22:2 ఆ యజమాని నివాసం నీకు దగ్గర్లో లేకపోతే, లేక అది ఎవరిదో నీకు తెలియకపోతే అప్పుడు ఆ ఆవును లేక గొర్రెను నీ ఇంటికి నీవు తీసుకొని వెళ్లాలి. దాని యజమాని దానికోసం వెదకుకొంటూ వచ్చేంతవకరు నీవు దానిని నీ దగ్గర ఉంచాలి. అప్పుడు నీవు ఆతనికి దానిని తిరిగి ఇచ్చివేయాలి.
DEU 22:3 నీ పొరుగువాని గాడిద, నీ పొరుగువాని బట్టలు, లేక నీ పొరుగువాడు పోగొట్టుకొన్న దేని విషయంలో నైనా నీవు ఇలానే చేయాలి. నీ పొరుగువానికి నీవు సహాయం చేయాలి.
DEU 22:4 “నీ పొరుగువాని గాడిద లేక ఆవు దారిలో పడిపోతే నీవు దానిని చూడనట్టు పోకూడదు. దాన్ని లేవనెత్తటానికి నీవు అతనికి సహాయం చేయాలి.
DEU 22:5 “ఒక పురుషుని బట్టలను ఒక స్త్రీ ధరించకూడదు మరియు పురుషుడు స్త్రీల బట్టలు ధరించకూడదు. ఇలా చేసేవారు ఎవరైనాసరే మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.
DEU 22:6 “నీవు దారిన నడుస్తుండగా ఒక పక్షిగూడును చెట్టుమీదగాని నేలమీదగాని నీవు చూడవచ్చును. తల్లి పక్షి పిల్ల పక్షులతోగాని గుడ్లమీదగాని కూర్చాని ఉంటే పిల్లలతోబాటు తల్లిపక్షిని నీవు తీసుకొనరాదు.
DEU 22:7 పిల్ల పక్షుల్ని నీవు తీసుకొనవచ్చు. కాని నీవు తల్లిని పోనివ్వాలి. ఈ ఆజ్ఞలకు నీవు విధేయుడవైతే నీకు అన్నీ సక్రమంగా జరుగుతాయి, నీవు చాలా కాలం బ్రతుకుతావు.
DEU 22:8 “నీవు కొత్త యిల్లు కట్టినప్పుడు దాని కప్పు చుట్టూ పిట్టగోడ కట్టాలి. అప్పుడు ఆ యింటి మీదనుండి పడి చచ్చిన వారి మరణదోషం నీ మీద ఉండదు.
DEU 22:9 “నీ ద్రాక్షపొలంలో రెండు రకాల విత్తనాలు నీవు విత్తకూడదు. ఎందుకంటే అప్పుడు నీవు విత్తిన విత్తనపు పంట, నీ పొలంలోని ద్రక్ష రెండూ నిష్ప్ర యోజనం.
DEU 22:10 “గాడిదను, ఆవును కలిపి నీవు దున్నకూడదు.
DEU 22:11 “ఉన్ని, నార రెండూ కలిసి నేసిన బట్ట నీవు ధరించకూడదు.
DEU 22:12 “నీవు ధరించే అంగీకు నాలుగు మూలలా కుచ్చులు ఉండాలి.
DEU 22:13 “ఒక పురుషుడు ఒక యువతిని వివాహం చేసుకొని ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండ వచ్చును. ఆ తర్వాత ఆమె నచ్చలేదని అతడు చెప్పవచ్చు.
DEU 22:14 ‘నేను ఈమెను పెళ్లి చేసుకొన్నాను కానీ మేము లైంగికంగా కలిసినప్పుడు ఈమె కన్య కాదని నాకు తెలిసింది’ అని అతడు అబద్ధం చెప్పవచ్చు. ఆమెకు విరోధంగా ఇలా చెప్పటంవల్ల ప్రజలు ఆమెను గూర్చి చెడుగా భావిస్తారు.
DEU 22:15 ఇలా జరిగితే ఆమె తల్లిదండ్రులు ఆ పట్టణ సమావేశ స్థలం దగ్గర పెద్దల వద్దకు ఆమెకన్య అనే రుజువు తీసుకొని రావాలి.
DEU 22:16 ఆ యువతి తండ్రి పెద్దలతో చెప్పాలి, ‘నా కూతుర్ని ఇతనికి భార్యగా నేను ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆమె ఆతనికి ఇష్టం లేదు.
DEU 22:17 ఇతడు నా కూతురి మీద అబద్ధాలు చెప్పాడు. “నీ కూతురు కన్య అనే ఋజువు నాకు కనబడలేదు” అని ఆతడు అన్నాడు. ఆయితే నా కూతురు కన్య, నా దగ్గర ఋజువుంది’ అప్పుడు వారు ఆమె బట్టను పట్టణ పెద్దలకు చూపించాలి.
DEU 22:18 అప్పుడు ఆ పట్టణ పెద్దలు ఆతన్ని పట్టుకొని శిక్షించాలి.
DEU 22:19 నూరు వెండితులాలు వారు ఆతనికి జుల్మానా విధించాలి. ఆమె భర్త ఒక ఇశ్రాయేలు యువతికి అవమానం కలిగించాడు గనుక ఆమె తండ్రికి వారు ఆ ధనం ఇవ్వాలి. ఆ యువతి ఆ పురుషునికి భార్యగా కొనసాగాలి. ఆతడు తన జీవితాంతం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.
DEU 22:20 “ఆయితే ఒకవేళ ఆ భర్త తన భార్యను గూర్చి చెప్పిన విషయాలు నిజం కావచ్చును. ఆమె కన్య అని చెప్పేందుకు ఆ భార్య తల్లిదండ్రుల దగ్గర ఋజువు లేక పోవచ్చును. ఇలా జరిగితే
DEU 22:21 అప్పుడు ఆ పట్టణ నాయకులు ఆ యువతిని ఆమె తల్లిదండ్రుల ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకొని రావాలి. తర్వాత ఆ పట్టణంలోని మనుష్యులు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే, ఇశ్రాయేలులో ఆమె అవమానకరమైన పని చేసింది. ఆమె తన తండ్రి ఇంటిలో ఒక వేశ్యలా ప్రవర్తించింది. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లోనుండి మీరు తీసివేయాలి.
DEU 22:22 “ఒక పురుషడు మరొక పురుషుని భార్యతో లైంగిక సంబధం కలిగి ఉంటే ఆ స్త్రీ, ఆమెతో లైగింక సంబంధం గల ఆ పురుషుడూ ఇద్దరూ చావాలి. చెడ్డది ఏదైనా సరే ఇశ్రాయేలు నుండి తొలగించాలి.
DEU 22:23 “మరొక పురుషునికి ప్రధానం చేయబడిన ఒక యువతిని ఇంకో పురుషుడు కలియవచ్చును. ఆతడు ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చు. ఇది పట్టణంలో జరిగితే
DEU 22:24 మీరు వాళ్లిద్దర్నీ పట్టణ ద్వారం బయటకు తీసుకొని వచ్చి, మీరు వారిని రాళ్లలో కొట్టి చంపాలి. ఆ పురుషుడు మరొకని భార్యను లైగింక పాపానికి వాడుకున్నాడు గనుక మీరు ఆతడ్ని చంపాలి. ఆ యువతి పట్టణంలోనే ఉండి కూడా సహాయం కోరలేదు గనుక మీరు ఆ యువతిని చంపాలి. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లొనుండి మీరు తొలగించాలి.
DEU 22:25 “ఆయితే ప్రధానం చేయబడిన ఒక యువతిని ఒక పురుషుడు పొలంలో చూచి అతనితో లైగింక సంబంధం అనుభవించమని ఆమెను బలవంతం చేస్తే. అప్పుడు ఆ పురుషుడు మాత్రమే చావాలి.
DEU 22:26 ఆ యువతి మరణశిక్షకు పాత్రమైనది ఏమీ చేయలేదు, గనుక మీరు ఆమెను ఏమీ చేయకూడదు. ఒకడు మరోక అమాయకుని మీద దాడి చేసి హత్య చేసిన వంటిదే ఈ వ్యాజ్యెముకూడాను.
DEU 22:27 ఆ పురుషుడు ప్రధానం చేయబడిన యువతిని బయట పొలంలో చూసాడు. ఆ యువతి సహాయం కోసం కేకలు పెట్టింది, కానీ ఆమెకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు.
DEU 22:28 “ఒక పురుషుడు ప్రధానం చేయబడని ఒక కన్యను చూచి, అతనితో లైగింక సంబంధం అనుభవించమని బలవంతం చేయవచ్చును. ఒకవేళ అతడు ఇలా చేయటం ప్రజలు చూస్తే
DEU 22:29 అప్పుడు ఆతడు అమ్మాయి తల్లిదండ్రులకు యాభై తులాల వెండి ఇవ్వాలి. ఆ యువతి అతని భార్య అవుతుంది. ఎందుకంటే అతడు ఆమెను లైంగికంగా వాడుకొన్నాడు గనుక. అతడు తన జీవితాంతం ఆమెను విడాకులు ఇవ్వకూడదు.
DEU 22:30 “ఒక పురుషుడు తన తండ్రి భార్యతో లైంగింక సంబంధం కలిగియుండి తన తండ్రికి ఆవమానం కలిగించకూడదు.
DEU 23:1 “ఈ వ్యక్తులు యెహోవాను ఆరాధించుటలో ఇశ్రాయేలు ప్రజల్లో భాగంగా ఉండకూడదు. వృషణాలు గాయపడినవాడు, పురుషాంగం కోసివేయబడ్డవాడు
DEU 23:2 లేక వివాహం కాని తల్లిదండ్రులకు పుట్టినవాడు. ఇతని సంతతిలో ఏ వ్యక్త్తీ యెహోవా ప్రజల్లో భాగంగా ఉండకూడదు.
DEU 23:3 “అమ్మోనీవాడు, మోయాబువాడు యెహోవా ప్రజలకు చెందడు. వారి సంతానంలో ఎవ్వరూ, చివరికి పదో తరం వారు కూడా యెహోవా ప్రజల్లో భాగం కాజాలరు.
DEU 23:4 ఎందుకంటే, మీరు ఈజిప్టు నుండి వచ్చి నప్పుడు మీ ప్రయాణంలో అమ్మోనీయులు, మోయాబీయులు మీకు భోజనం, నీళ్లు ఇవ్వటానికి నిరాకరించారు. మరియు మిమ్మల్ని శపించేందుకు వారు బిలాముకు డబ్బు ఇచ్చారు గనుక వారు యెహోవా ప్రజల్లో భాగంగా ఉండజాలరు. (యరాము లోని పెతోరు పట్టణపువడైన బెయొరు కుమారుడు బిలాము.)
DEU 23:5 అయితే యెహోవా దేవుడు బిలాము మాట వినకుండా నిరాకరించాడు. శాపాన్ని మీకు ఆశీర్వాదంగా యెహోవా మార్చాడు. ఎదుకంటే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక.
DEU 23:6 అమ్మోనీ ప్రజలతోగాని, మోయాబీ ప్రజలతో గాని సమాధాన పడేందుకు మీరు ఎన్నడూ ప్రయత్నించకూడదు. మీరు జీవించినంత కాలం వారితో స్నేహంగా ఉండవద్దు.
DEU 23:7 “ఎదోము వాణ్ణి మీరు ద్వేషించకూడదు. ఎందు కంటే అతడు మీకు బంధువు. ఈజిప్టు వాణ్ణి మీరు ద్వేషించకూడదు. ఎందుకంటే అతని దేశంలో మీరు పరాయివారుగా ఉన్నారు.
DEU 23:8 ఎదోము, ఈజిప్టు వాళ్ల మూడో తరంవారి పిల్లలు యెహోవా ప్రజల్లో భాగంగా ఉండవచ్చును.
DEU 23:9 “మీ సైన్యం మీ శత్రువుల మీదికి వెళ్లినప్పుడు, మిమ్మల్ని అపవిత్రపరచే వాటన్నింటికీ దూరంగా ఉండండి.
DEU 23:10 రాత్రిపూట కలలో తడిసి అపవిత్రమైన వాడు మీ మధ్య ఎవడైనా ఉంటే అతడు మీ పాళెము నుండి బయటకు వెళ్లిపోవాలి. అతడు పాళెమునుండి దూరంగా ఉండాలి.
DEU 23:11 అయితే సాయంకాలం అతడు స్నానంచేయాలి. సూర్యుడు అస్తమించాక అతడు పాళెములోనికి రావచ్చును.
DEU 23:12 “నీకు పాళెము వెలుపల బహిర్భూమిగా ఒక స్థలం ఉండాలి.
DEU 23:13 మరియు నీ ఆయుధాలతో పాటు ఒఒక కట్టె నీకుఉండాలి; నీవు బహిర్భూమికి వెళ్లవల్సినప్పుడు ఆ కట్టెతో నీవు ఒక గుంట తవ్వుకొని తర్వాత దానిని పూడ్చివేయాలి.
DEU 23:14 ఎందుకంటే మిమ్మల్ని రక్షించి, మీ శ్రతువులను ఓడించటానికి మీ దేవుడైన యెహోవా మీ పాళెములో ఉన్నాడు. అందు చేత మీ పాళెము పవిత్రంగా ఉండాలి. అప్పుడు మీ మధ్యలో అపరిశుభ్రం లేదని చూసి, మీ దగ్గరనుండి వెళ్లిపోడు.
DEU 23:15 “బానిస ఒకడు తన యజమాని దగ్గర్నుండి పారిపోయి నీ దగ్గరకు వస్తే, ఆ బానిసను నీవు తిరిగి అతని యజమానికి అప్పగించకూడదు.
DEU 23:16 ఈ బానిస నీతో, తనకు ఇష్టం వచ్చిన చోట నివసించవచ్చును. అతడు కోరుకొన్న పట్టణంలో నివసించవచ్చు. నీవు అతన్ని తొందరపెట్టకూడదు.
DEU 23:17 “ఇశ్రాయేలు పురుషుడేగాని, స్త్రీగాని ఎన్నటికీ ఆలయ వేశ్య కాకూడదు.
DEU 23:18 ఒక వేశ్య లేక పురుషగామి సంపాదించిన డబ్బును నీ దేవుడైన యెహోవా ఆలయానికి తీసుకొని రాకూడదు. దేవునికి చేసిన మొక్కు బడి చెల్లించటానికి ఎవరూ ఆ డబ్బు ఉపయోగించకూడదు. మీ దేవుడైన యెహోవాకు వ్యభిచారులు అంటే అసహ్యం.
DEU 23:19 “మరో ఇశ్రాయేలు వానికి నీవు డబ్బు అప్పు ఇస్తే నీవు వడ్డీ తీసుకోకూడదు. వడ్డీ ఆర్జించిపెట్టే దేనిమీదగానీ, డబ్బు మీద, ఆహారం మీదగాని వడ్డీ వసూలు చేయవద్దు.
DEU 23:20 ఒక విదేశీయుని దగ్గర నీవు వడ్డీ తీసుకోవచ్చును. కానీ మరో ఇశ్రాయేలు వాని దగ్గర మాత్రం నీవు వడ్డీ తీసుకొకూడదు. ఈ నియమాలు నీవు పాటిస్తే, నీవు నివసించబోయే దేశంలో నీవు చేసే వాటన్నింటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
DEU 23:21 “నీ దేవుడైన యెహోవాకు నీవు ఒక వాగ్దానం చేస్తే, నీ వాగ్దానం అంతటినీ చెల్లించేందుకు వెనుకాడవద్దు. ఎందుకంటే, నీవు దాన్ని చెల్లించాలని నీ దేవుడైన యెహోవా అడుగుతాడు. నీవు వాగ్దానం చేసినదానిని చెల్లించకపోతే అది నీకు పాపం అవుతుంది.
DEU 23:22 నీవు ఆ వాగ్దానం చేయకపోతే నీయందు పాపం వుండదు.
DEU 23:23 కానీ నీవు చేస్తానని చెప్పిన వాటిని మాత్రం నీవు చేయాలి. నీవు నీ దేవుడైన యెహోవాకు స్వచ్ఛందంగా వాగ్దానం చేసినప్పుడు, నీ వాగ్దానం ప్రకారం నీవు చేయాలి.
DEU 23:24 “మరొకరి ద్రాక్షా పొలంగుండా నీవు వెళ్లినప్పుడు, నీవు కోరినన్ని ద్రాక్షాపండ్లు నీవు తినవచ్చును. కానీ నీ బుట్టలో మాత్రం ద్రాక్షాపండ్లు ఏమీ వేసుకోకూడదు.
DEU 23:25 నీవు మరొకరి పంట పొలంలోనుంటి వెళ్లినప్పుడు నీవు నీ చేతుల్తో వెన్నులు త్రుంచుకొని తినవచ్చును. కానీ అవతలివాడి పంట తీసుకొనేందుకు నీవు కొడ వలితో కోయకూడదు.
DEU 24:1 “ఒకడు ఒక స్త్రీని వివాహం చేసుకొన్న తర్వాత ఆమెను గూర్చిన రహస్యం ఏదో తెలిసి ఆమెను ఇష్టపడడు. అతనికి ఆమె ఇష్టం లేకపోతే అతడు విడాకుల పత్రం వ్రాసి, దానిని ఆమెకు ఇవ్వాలి. అప్పుడు అతడు ఆమెను తన ఇంటినుండి పంపించి వేయాలి.
DEU 24:2 ఆమె అతని ఇల్లు విడిచి వెళ్లిపోయాక, ఆమె మరొకనికి భార్య కావచ్చును.
DEU 24:3 అయితే ఒకవేళ ఆ కొత్త భర్తకుకూడా ఆమె నచ్చకపోవటంతో అతడు ఆమెను వెళ్లగొట్టవచ్చును. ఒకవేళ అతడు ఆమెకు విడాకులు ఇచ్చినా, మొదటి భర్త ఆమెను మళ్లీ తన భార్యగా చేర్చుకపోవచ్చును. లేక ఆమె కొత్త భర్తచనిపోతే, మొదటి భర్త ఆమెను మరల తన భార్యగా చేర్చుకొనక పోవచ్చును. అతనికి ఆమె అపవిత్రమయిందిగా ఉంటుంది. అతడు ఆమెను మళ్లీ పెళ్లి చేసుకొంటే, యెహోవాకు అసహ్యమైనదానిని అతడు చేసినవాడవుతాడు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ఇలా పాపం చేయకూడదు.
DEU 24:5 “ఒక పురుషునికి పెళ్లయిన కొత్తలోనే అతణ్ణి సైన్యంలోనికి పంపకూడదు. అతనికి ఎలాంటి ప్రత్యేక పనినీ విధించకూడదు. ఒక్క సంవత్సరం అతడు ఇంటి దగ్గరే ఉండి తన కొత్త భార్యను సంతోషపెట్టేందుకు అతడు స్వేచ్చగా ఉండాలి.
DEU 24:6 “ఒకనికి నీవు ఏదైనా బదులు ఇస్తే, దానికి భద్రతగా అతని తిరుగటి రాయిని నీవు తీసు కోకూడదు. ఎందు కంటే, అది అతని భోజనాన్ని తీసు కొన్నట్టే అవుతుంది గనుక.
DEU 24:7 “ఒకడు తన స్వంత ప్రజల్లోనుండి (ఇశ్రాయేలు వాడ్ని) ఎత్తుకొనిపోయి, అతడ్ని బానిసగా వాడినా, అమ్మినా, ఆ ఎత్తుకు పోయినవాడు చావాల్సిందే. ఈ విధంగా మీ మధ్య ఎలాంటి చెడుగునైనా మీరు తొలగిస్తారు.
DEU 24:8 “కుష్ఠు రోగంవంటి వ్యాధి నీకు ఉంటే, లేవీ యాజకులు నీకు ప్రబోధించేవాటన్నింటినీ నీవు జాగ్రత్తగా పాటించాలి. చేయాల్సిందిగా నేను యాజకులకు చెప్పిన విషయాలను నీవు జాగ్రత్తగా పాటించాలి.
DEU 24:9 మీరు ఈజిప్టునుండి బయటకు వచ్చిన ప్రయాణంలో మిర్యాముకు మీ దేవుడైన యెహోవా చేసినదాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి.
DEU 24:10 “నీవు ఎవరికైనా ఎలాంటి అప్పు ఇచ్చినా, దానికి భద్రతగా దేనినైనా తీసుకొనేందుకు నీవు అతని ఇంటిలోనికి వెళ్లకూడదు.
DEU 24:11 నీవు బయటనే నిలిచి ఉండాలి. అప్పుడు నీవు ఎవరికైతే అప్పు ఇచ్చావో అతడే దానికి భద్రతగా దేనినైనా బయటకు తెచ్చి నీకు ఇస్తాడు.
DEU 24:12 ఒకవేళ అతడు పేదవాడైతే అతని వస్తువును తెల్లవారేవరకు నీ దగ్గర ఉంచుకోకూడదు.
DEU 24:13 అతని వస్తువును ప్రతి సాయంత్రం నీవు అతనికి ఇస్తూ ఉండాలి. అప్పుడు అతడు తన స్వంత బట్టలతో నిద్రపోగల్గుతాడు. అతదు నీకు కృతజ్ఞతలు చెబుతాడు, నీవు ఈ మంచి పని చేసినట్టు నీ దేవుడైన యెహోవా చూస్తాడు.
DEU 24:14 “పేదవాడు, అవసరంలో ఉన్నవాడునైన జీతగాడ్ని నీవు మోసం చేయకూడదు. అతడు నీతోటి ఇశ్రాయేలు వాడైనా, మీ పట్టణాలు ఒక దానిలో నివసిస్తున్న విదేశీయుడై నాసరే.
DEU 24:15 ప్రతి రోజూ సూర్యుడు అస్తమించక ముందే అతని జీతం అతనికి ఇచ్చి వేయాలి. ఎందుకంటే, అతడు పేదవాడు, ఆ డబ్బే అతనికి ఆధారం. నీవు అతనికి అలా చెల్లించకపోతే అతడు నీ మీద యెహోవాకు ఫిర్యాదు చేస్తాడు. నీవు పాప దోషివి అవుతావు.
DEU 24:16 “పిల్లలు చేసిన దేనికోసమైనా తండ్రులను చంపకూడదు. అలాగే తల్లిదండ్రులు చేసిన దేని కోసమూ పిల్లలను చంపకూడదు. ఒక వ్యక్తి స్వయంగా తాను చేసిన కీడు నిమిత్తము చంపబడాలి.
DEU 24:17 “విదేశీయులకు, అనాధలకు న్యాయం జరిగేట్టు నీవు చూడాలి. ఒక విధవ దగ్గర తాకట్టుగా బట్టలు నీవెన్నటికీ తీసుకోకూడద.
DEU 24:18 మీరు ఒకప్పుడు ఈజిప్టులో బానిసలు అని ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడ్నుండి బయటకు తీసుకొనివచ్చాడని మరచిపోవద్దు. అందుకే మీరు పేదవారికి ఇలా చేయాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
DEU 24:19 “నీవు నీ పొలంలో పంటకూర్చుకొంటూ, మరచిపోయి ఒక పన అక్కడే విడిచిపెట్టావనుకో, నీవు మళ్లీ దానికోసం వెళ్లకూడదు. విదేశీయుల కోసం, అనాథల కోసం, విధవల కోసం అది ఉంటుంది. వారికోసం నీవు కొంత ధాన్యం విడిచిపెడితే, నీ ప్రతి పనిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
DEU 24:20 నీవు నీ ఒలీవ చెట్లను రాల్చినప్పుడు కొమ్మలను పరిశీలిం చేందుకు నీవు తిరిగి అక్కడకు వెళ్లకూడదు. నీవు అలా విడిచిపెట్టే ఒలీవలు విదేశీయులకు, అనాథలకు, విధవలకు ఉంటాయి.
DEU 24:21 నీ ద్రాక్షతోటనుండి నీవు ద్రాక్షా పండ్లు కూర్చుకొనేటప్పుడు, నీవు విడిచిపెట్టిన పండ్లు తీసుకొనేందుకు నీవు తిరిగి అక్కడికి వెళ్లకూడదు. ఆ ద్రాక్షాపండ్లు విదేశీయుల కోసం, అనాథల కోసం, విధవల కోసం ఉంటాయి.
DEU 24:22 మీరు ఈజిప్టులో బానిసలుగా ఉండేవారని జ్ఞాపకం ఉంచుకో. అందుకే మీరు పేదవారికి ఇలా చేయాలని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను.
DEU 25:1 “ఇద్దరు మనుష్యులకు వివాదం ఉంటే వారు న్యాయస్థానానికి వెళ్లాలి. న్యాయమూర్తులు వారి వివాదాన్ని విచారించి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయం ప్రకటిస్తారు.
DEU 25:2 నిందితుడు కొరడా దెబ్బలు తినాల్సివస్తే, న్యాయమూర్తి అతణ్ణి బోర్లా పండుకోబెట్టాలి. న్యాయమూర్తి చూస్తూ ఉండగా ఎవరో ఒకరు ఆ దోషిని కొట్టాలి. అతని నేరానికి తగినన్ని దెబ్బలు ఆ దోషిని కొట్టాలి.
DEU 25:3 ఒక మనిషిని ఒకే సారి 40 కంటె ఎక్కువ దెబ్బలు కొట్టకూడదు. అంతకంటె ఎక్కువగా అతడ్ని కొడితే, నీ సోదరుని జీవితం అంటే నీకు లెక్కలేదని తెలుస్తుంది.
DEU 25:4 “నూర్చే ఎద్దు తినకుండా దాని మూతికి చిక్కం వేయకూడదు.
DEU 25:5 “ఇద్దరు సోదరులు కలిసి జీవిస్తుండగా, వారిలో ఒకరు చనిపోవటం, అతనికి కుమారుడు లేకపోవటం జరిగితే, చనిపోయిన సోదరుని భార్య, ఆ కుటుంబానికి దూరస్తుల్ని ఎవరినీ పెళ్లి చేసుకోకూడదు. ఆమె భర్త సోదరుడు ఆమెను భార్యగా స్వీకరించి, ఆమెకు భార్యాధర్మం జరిగించాలి. ఒక భర్త సోదరుని విధులను ఆమె భర్త సోదరుడు ఆమెకు జరిగించాలి.
DEU 25:6 అప్పుడు ఆమెకు పుట్టిన బిడ్డ, ఆ పురుషుని మృత సోదరునికి వారసుడుగా ఉంటాడు. అప్పుడు చనిపోయిన సోదరుని పేరు ఇశ్రాయేలు నుండి రూపు మాసిపోదు.
DEU 25:7 ఒకవేళ ఆ మనుష్యుడు తన సోదరుని భార్యను స్వీకరించడానికి ఇష్టపడకపోతే, ఆమె పట్టణ సమావేశ స్థలం దగ్గర నాయకుల వద్దకు వెళ్లాలి. అతని సోదరుని భార్య, ‘నా భర్త సోదరుడు తన సోదరుని పేరు ఇశ్రాయేలులో సజీవంగా ఉంచేందుకు నిరాకరిస్తున్నాడు. భర్త సోదరుని విధులను అతడు నాకు జరిగించటం లేదు’ అని నాయకులతో చెప్పాలి.
DEU 25:8 అప్పుడు ఆ పట్టణపు నాయకులు అతణ్ణి పిలిపించి, అతనితో మాట్లాడాలి. అతడు మొండివాడై, ‘ఆమెను నేను స్వీకరించను’ అని చెబితే
DEU 25:9 అతని సోదరుని భార్య ఆ నాయకుల ముందుకు రావాలి. ఆమె అతని కాలి నుండి అతని చెప్పు ఊడదీయాలి. అప్పుడు ఆమె అతని ముఖం ముందు ఉమ్మివేయాలి. ‘తన సోదరుని కుటుంబాన్ని ఉద్ధరించని సోదరునికి యిలా చేస్తన్నాను’ అని ఆమె చెప్పాలి.
DEU 25:10 అప్పుడు ఆ సోదరుని కుటుంబం ‘చెప్పు తీయబడ్డ మనిషి కుటుంబంగా’ ఇశ్రాయేలులో చెప్పుకోబడుతుంది.
DEU 25:11 “ఇద్దరు మనుష్యులు ఒకరితో ఒకరు పోట్లాడుతూ వుండవచ్చును. వారిలో ఒకని భార్య తన భర్తకు సహాయం చేయటానికి రావచ్చును. కాని ఆమె అవతల వాని పురుషాంగములను లాగకూడదు.
DEU 25:12 ఆమె అలా చేస్తే ఆమె చేతిని నరికి వేయాలి. ఆమెను గూర్చి విచారించవద్దు.
DEU 25:13 “మనుష్యుల్ని మోసం చేయటానికి తూనికెలో దొంగ రాళ్లు ఉంచవద్దు. మరీ బరువుగా గాని, మరీ తేలికగా గాని ఉండే రాళ్లు ఉపయోగించవద్దు.
DEU 25:14 మరీ పెద్దని లేక చిన్నవిగా ఉండే కొలతలు నీ ఇంటిలో ఉంచవద్దు.
DEU 25:15 సరిగ్గాను, నిజాయితీగాను ఉండే రాళ్లు, కొలతలు నీవు ఉపయోగించాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో నీవు చాలా కాలం జీవిస్తావు.
DEU 25:16 తప్పుడు తూకాలు, కొలతలు ఉపయోగించే వాళ్లను మీ దేవుడైన యెహోవా అసహ్యించుకొంటాడు. అవును, తప్పు చేసే వాళ్లందర్నీ ఆయన అసహ్యించుకొంటాడు.
DEU 25:17 “మీరు ఈజిప్టు నుండి వస్తున్నప్పుడు అమాలేకీయులు మీకు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకోండి.
DEU 25:18 అమాలేకీయులు దేవుణ్ణి గౌరవించలేదు. మీరు అలసి బలహీనంగా ఉన్నప్పుడు వాళ్లు మీమీద దాడి చేసారు. వెనుక నడుస్తోన్న మీ ప్రజలందర్నీ వాళ్లు చంపేసారు.
DEU 25:19 అందుకే అమాలేకీయుల జ్ఞాపకం కూడ ప్రపంచంలో లేకుండా మీరు నాశనం చేయాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించినప్పుడు దీనిని చేయాలి. అక్కడ మీ చుట్టూరా ఉన్న శత్రువులందరి నుండి ఆయన మీకు విశ్రాంతిని ఇస్తాడు. అయితే అమాలేకీయులను నాశనం చేయటం మాత్రం మరచిపోవద్దు.
DEU 26:1 “మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు త్వరలో ప్రవేశిస్తారు. మీరు అక్కడ మీ నివాసం ఏర్పరచుకొన్నప్పుడు
DEU 26:2 మీరు ప్రథమ ఫలాలు కొన్ని తీసుకొని ఒక బుట్టలో పెట్టాలి. యెహోవా మీకు ఇస్తున్న దేశంలో అది మీకు లభించిన ప్రథమ పంట అవుతుంది. ఈ ప్రథమ పంట కొంత ఉన్న ఆ బుట్టను తీసుకొని, మీ దేవుడైన యెహోవా నిర్ణయించే స్థలానికి వెళ్లండి. అది యెహోవా తనకోసం ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పాటు చేసుకొనే స్థలం.
DEU 26:3 అప్పటికి అక్కడ పరిచర్య చేస్తుండే యాజకుని దగ్గరకు మీరు వెళ్లాలి. ‘యెహోవా మనకు ఇస్తానని మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలోనికి నేను వచ్చేసానని నా దేవుడైన యెహోవాకు నేడు నేను ప్రకటిస్తాను’ అని నీవు ఆతనితో చెప్పాలి.
DEU 26:4 “అప్పుడు నీ చేతిలోని బుట్టను యాజకుడు తీసుకొంటాడు. నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట అతడు దానిని క్రింద ఉంచుతాడు.
DEU 26:5 అప్పుడు అక్కడ నీ దేవుడైన యెహోవా ఎదుట నీవు ఇలా చెప్పాలి: ‘నా పూర్వీకుడు ఒక సంచార అరామీయుడు. ఆతడు ఈజిప్టులోనికి వెళ్లి, అక్కడ నివసించాడు. ఆతడు అక్కడికి వెళ్లినప్పుడు అతని కుటుంబంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అయితే అక్కడ ఈజిప్టులో అతడు అనేకమంది ప్రజలుగా, శక్తివంతమైన ఒక గొప్ప జనంగా తయారయ్యాడు.
DEU 26:6 ఈజిప్టువాళ్లు మమ్మల్ని నీచంగా చూశారు. వాళ్లు మమ్మల్ని కష్టపెట్టి, బానిస పని బలవంతంగా మాతో చేయించారు.
DEU 26:7 అప్పుడు మేము మా పూర్వీకుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, వారిని గూర్చి ఆరోపణ చేసాము. యెహోవా మా మొర్ర విన్నాడు. మా కష్టం, మా కఠినమైన పని, మా శ్రమ ఆయన చూశాడు.
DEU 26:8 అప్పుడు యెహోవా తన మహా శక్తి, ప్రభావాలతో ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. గొప్ప అద్భుతాలు, మహాత్మ్యాలు ఆయన చేసినాడు. భయంకరమైన సంగతులు జరిగేటట్టు ఆయన చేసాడు.
DEU 26:9 కనుక ఆయనే మమ్మల్ని ఈ దేశానికి తీసుకొనివచ్చాడు. పాలు, తేనెలు ప్రవహించుచున్న ఈ మంచి దేశాన్ని ఆయన మాకు యిచ్చాడు.
DEU 26:10 ఇప్పుడు యెహోవా, నీవు మాకు యిచ్చిన దేశంలోని ప్రథమ పంటను నీకు తెచ్చాను.’ “తర్వాత నీ పంటను నీ దేవుడైన యెహోవా ఎదుట క్రింద పెట్టాలి. మరియు మీరు ఆయనను ఆరాధించాలి.
DEU 26:11 అప్పుడు మీ దేవుడైన యెహోవా మీకూ, మీ కుటుంబానికీ ఇచ్చిన మంచి పదార్థాలన్నింటినీ మీరు తిని ఆనందించనచ్చును. మీ మధ్య నివసించే లేవీయులు, విదేశీయులతో మీరు వాటిని పంచుకోవాలి.
DEU 26:12 “ప్రతి మూడవ సంవత్సరం దశమభాగాల సంవత్సరం. ఆ సంవత్సరం మీ పంటలోని దశమ భాగాలన్నీ అర్పించటం పూర్తి అయ్యాక దానిని మీరు లేవీయులకు, విదేశీయులకు, ఆనాథలకు, విధవలకు ఇవ్వాలి. అప్పుడు వారు ప్రతి పట్టణంలో తిని తృప్తి పడవచ్చు.
DEU 26:13 మీ దేవుడైన యెహోవాతో మీరు ఇలా చెప్పాలి: ‘నా పంటలోని పవిత్ర భాగాన్ని (దశమ భాగం)నేను నా ఇంటినుండి తీసాను. దానిని లేవీయులకు, విదేశీయులకు, అనాథలకు, విధవలకు నేను ఇచ్చాను. నీవు నాకు ఇచ్చిన ఆదేశాలన్నిటినీ నేను పాటించాను. నేను వాటిని మరచిపోలేదు.
DEU 26:14 నేను దుఃఖ సమయంలో ఈ ఆహారాన్ని తినలేదు. నేను అపవిత్రంగా ఉన్నప్పుడు ఈ ఆహారాన్ని కూర్చలేదు. ఈ ఆహారంలో ఏదీ చనిపోయిన వారికి నేను అర్పించలేదు. యెహోవా, నా దేవా, నేను నీకు విధేయుడనయ్యాను. నీవు నాకు ఆదేశించిన వాటన్నింటినీ నేను చేసాను.
DEU 26:15 పరలోకంలోని నీ పవిత్ర నివాసంనుండి క్రిందికి చూడు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించు. నీవు మా పూర్వీకులకు వాగ్దానం చేసినట్టు మాకు ఇచ్చిన, పాలు, తేనెలు ప్రవహించుచున్న దేశాన్ని నీవు ఆశీర్వదించు.’
DEU 26:16 “ఈ ఆజ్ఞలు, నియమాలు అన్నింటికీ మీరు విధేయులు కావాలని నేడు మీ దేవుడైన యెహోవా మీకు ఆదేశిస్తున్నాడు. మీ నిండు హృదయంతో, మీ నిండు ఆత్మతో వాటిని జాగ్రత్తగా పాటించండి.
DEU 26:17 యెహోవా మీ దేవుడు అని ఈ వేళ మీరు చెప్పారు. ఆయన మార్గాల్లో నడుస్తామనీ, ఆయన ప్రబోధాలను పాటిస్తామనీ, ఆయన చట్టాలకు ఆజ్ఞలకు విధేయులం అవుతామనీ మీరు ప్రమాణం చేసారు. మీరు చేయాల్సిందిగా ఆయన చెప్పే ప్రతిదీ చేస్తామనీ మీరు చెప్పారు.
DEU 26:18 ఈ వేళ యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా స్వీకరించాడు. ఆయన దీన్ని మీకు వాగ్దానం చేసాడు. మీరు ఆయన ఆదేశాలన్నింటికీ విధేయులు కావాలని కూడా యెహోవా చెప్పాడు.
DEU 26:19 యెహోవా తాను చేసిన రాజ్యాలన్నింటికంటె మిమ్మల్ని గొప్పవాళ్లనుగా చేస్తాడు. మెప్పు, కీర్తి, ఘనత ఆయన మీకు ఇస్తాడు. మరియు ఆయన వాగ్దానం చేసినట్టు మీరు ఆయన స్వంత ప్రత్యేక ప్రజలుగా ఉంటారు.”
DEU 27:1 మోషే. ఇశ్రాయేలు నాయకులతో కలసి, ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఆయన చెప్పాడు: “నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలు అన్నింటికీ విధేయులుగా ఉండండి.
DEU 27:2 మీరు యోర్దాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన రోజున, మీరు పెద్ద బండలను నిలబెట్టాలి. ఈ రాళ్లకు సున్నము పూయండి.
DEU 27:3 ఈ ధర్మశాస్త్రంలోని మాటలు అన్నీ ఆ బండలమీద వ్రాయండి. మీరు యోర్దాను నది దాటి వెళ్లిన తర్వాత ఇది మీరు చేయాలి. తర్వాత మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న — పాలు, తేనెలు ప్రవహించుచున్న దేశంలోనికి మీరు వెళ్లాలి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా దీనిని మీకు వాగ్దానం చేసాడు.
DEU 27:4 “మీరు యోర్దాను నది దాటి వెళ్లిన తర్వాత, ఈ వేళ నేను మీకు ఆదేశంచినట్టు ఏబాలు కొండ మీద మీరు ఈ బండలను నిలబెట్టాలి. ఈ బండలకు మీరు సున్నము పూయాలి.
DEU 27:5 మరియు అక్కడి రాళ్లు కొన్ని ఉపయోగించి మీ దేవుడైన యెహోవాకు మీరు ఒక బలిపీఠం కట్టాలి. రాళ్లను కోయటానికి యినుప పనిముట్లు ఉపయోగించవద్దు.
DEU 27:6 మీరు మీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టేటప్పుడు, పగులగొట్టని బండలనే మీరు ఉపయోగించాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవాకు ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పించండి.
DEU 27:7 మరియు మీరు అక్కడ బలి అర్పణలు అర్పించి, సమాధాన బలులను అర్పించాలి. అక్కడ భోజనం చేసి, మీ దేవుడైన యెహోవాతో సంతోషంగా సమయం గడపండి.
DEU 27:8 మీరు నిలబెట్టే బండల మీద ఈ ధర్మశాస్త్రం అంతా చాలా తేటగా మీరు రాయాలి.”
DEU 27:9 లేవీ యాజకులతో కలసి మోషే ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. ఆయన చెప్పాడు: “ఇశ్రాయేలీయులారా, నిశ్శబ్దంగా ఉండి, వినండి. ఈ వేళ మీరు మీ దేవుడైన యెహోవా ప్రజలు అయ్యారు.
DEU 27:10 కనుక మీ దేవుడైన యెహోవా మీకు చెప్పేది అంతా మీరు చేయాలి. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆదేశాలు, చట్టాలకు మీరు విధేయులు కావాలి.”
DEU 27:11 అదే రోజున ప్రజలతో మోషే ఇంకా ఇలా
DEU 27:12 పాడు: “మీరు యోర్దాను నది దాటి వెళ్లిన తర్వాత గెరీజీము కొండమీద నిలబడి ప్రజలకు దీవెనలు ప్రకటించాల్సిన వంశాలు ఏవనగా: షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను.
DEU 27:13 శాపం ప్రకటించటానికి రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను నఫ్తాలి వంశాలు ఏబాలు కొండమీద నిలబడాలి.
DEU 27:14 “అప్పుడు లేవీయులు పెద్ద స్వరంతో ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పాలి:
DEU 27:15 “‘విగ్రహాలను తయారు చేసుకొని, రహస్య స్థలంలో దాచిపెట్టుకొనేవాడు శాపగ్రస్థుడు. ఈ విగ్రహాలు కేవలం ఎవరో చేతిపనివాడు చేసిన చెక్క, రాయి, లోహపు బొమ్మ మాత్రమే, వాటిని యెహోవా అసహ్యించుకొంటాడు.’ “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.
DEU 27:16 “అప్పుడు లేవీయులు ‘తన తల్లినిగానీ తండ్రిని గానీ గౌరవించటం లేదని సూచించే పనులు చేసేవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.
DEU 27:17 “అప్పుడు లేవీయులు ‘తన పొరుగువాని సరిహద్దు రాయి తొలగించినవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.
DEU 27:18 “అప్పుడు లేవీయులు ‘గుడ్డివాడు, దారి తప్పి పోయేటట్టు నడిపించేవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి. “అందుకు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.
DEU 27:19 “అప్పుడు లేవీయులు ‘విదేశీయులకు, అనాథలకు, విధవలకు న్యాయంగా తీర్పు చెప్పనివాడు శాప గ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.
DEU 27:20 “అప్పుడు లేవీయులు, ‘ఒకడు తన తండ్రి భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకోవటం, తన తండ్రిని దిగంబరునిగా చేయటమే గనుక వాడు శాప గ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.
DEU 27:21 “‘ఏ జంతువుతోనై నా లైంగిక సంపర్కం గల వాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.
DEU 27:22 “‘తన పోదరితోగాని, తన తండ్రి కూమారైతోగాని, తన తల్లి కుమారైతోగాని లైంగిక సంబంధం గలవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చేప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.
DEU 27:23 “‘తన అత్తగారితో లైంగిక సంబంధం ఉన్నవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అందుకు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.
DEU 27:24 “అతడు పట్టుబడనప్పటికీ ‘రహస్యంగా మరొకడ్ని చంపినవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అందుకు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.
DEU 27:25 “‘నిర్దోషిని ఒకణ్ణి చంపటానికి డబ్బు తీసుకొనేవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.
DEU 27:26 “‘ధర్మశాస్త్రాన్ని బలపర్చకుండా, దీనికి విధేయుడు కానివాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్‌’ అని చెప్పాలి.
DEU 28:1 “మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులై, ఈ రోజు నేను మీకు చెబుతోన్న ఆయన ఆదేశాలన్నింటినీ పాటిస్తే, అప్పుడు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఈ భూలోక రాజ్యాలన్నింటికంటె ఉన్నత స్థానంలో ఉంచుతాడు.
DEU 28:2 మీరు గనుక మీ దేవుడైన యెహోవాకు విధేయులైతే ఈ ఆశీర్వాదాలన్నీ మీకు లభించి, మీ స్వంతం అవుతాయి.
DEU 28:3 “యెహోవా మీ పట్టణాలు మీ పొలాలను ఆశీర్వాదిస్తాడు.
DEU 28:4 యెహోవా మీకు అధిక సంతానం యిచ్చి ఆశీర్వాదిస్తాడు. మీ పొలాలను మంచి పంటలతో ఆయన ఆశీర్వదిస్తాడు మీ పశువులకు సంతానాభివృద్ధి కలిగిస్తాడు మీకు పశువులు, గొర్రెలు విస్తారంగా ఉంటాయి.
DEU 28:5 మీకు ధాన్యపు పంటలు, ఆహారం సమృద్ధిగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
DEU 28:6 మీరు చేసే ప్రతి పనిలో యెహోవా మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు.
DEU 28:7 “మీ మీదికి వచ్చే మీ శత్రువులను మీరు ఓడించెటట్టు యెహోవా చేస్తాడు. మీ శత్రువు మీ మీదికి ఒకే మార్గంలో వచ్చి, ఏడు మార్గాల్లో పారిపోతాడు.
DEU 28:8 “మీ కొట్టెలు నిండుగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసే ప్రతిదాన్నీ ఆయన ఆశీర్వదిస్తాడు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
DEU 28:9 యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొంటాడు. మీరు మీ దేవుడైన యెహోవా ఆదేశాలకు విధేయులై, ఆయన మార్గాల్లో మీరు జీవిస్తే ఆయన దీనిని మీకు వాగ్దానం చేసాడు.
DEU 28:10 అప్పుడు మీరు యెహోవా పేరు పెట్టబడిన ప్రజలు అని ఆ దేశ ప్రజలంతా తెలుసుకొంటారు. వారు మీకు భయపడతారు.
DEU 28:11 “మరియు యెహోవా దేవుడు మీకు ఎన్నో మంచి వాటిని ఇస్తాడు. ఆయన మీకు ఎంతోమంది పిల్లల్ని ఇస్తాడు. మీ పశువులకు ఆయన ఎన్నో దూడ పిల్లలను ఇస్తాడు. మీకు ఇస్తానని యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ఆయన మీకు మంచి పంట ఇస్తాడు.
DEU 28:12 యెహోవా తన గొప్ప ఆశీర్వాదాల్ని దాచి ఉంచిన ఆకాశాన్ని తెరచి. సరైన సమయంలో మీ భూమిమీద ఆయన వర్షం కురిపిస్తాడు. మీరు చేసే పనులన్నింటినీ యెహోవా ఆశీర్వదిస్తాడు. అనేక రాజ్యాలకు అప్పు ఇచ్చేంత ధనం మీ దగ్గర ఉంటుంది. కానీ మీరు వారి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
DEU 28:13 యెహోవా మిమ్మల్ని తలగానే ఉంచు తాడుగాని తోకగాకాదు. మీరు పైవారు గానే ఉంటారు కాని క్రిందవారుగా ఉండరు. ఈ వేళ నేను మీకు చెబుతున్న మీ దేవుడైన యెహోవా ఆదేశాలకు మీరు విధేయులైతే ఇదంతా జరుగుతుంది. ఈ ఆజ్ఞలకు మీరు జాగ్రత్తగా విధేయులు కావాలి.
DEU 28:14 ఈ వేళ నేను మీకు ఇస్తున్న ప్రభోధాల్లో దేనినుండీ మీరు తప్పి పోకూడదు. మీరు కుడి పక్కకు గాని ఎడమ పక్కకు గాని తొలగిపోకూడదు. మీరు ఇతర దేవుళ్లను సేవించడానికి వారిని వెంబడించ కూడదు.
DEU 28:15 “అయితే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పే విషయాలను మీరు వినకపోతే, ఈ వేళ నేను మీకు చెప్పే ఆయన ఆదేశాలకు, చట్టాలకు మీరు విధేయులు కాకపోతే అప్పుడు మీకు ఇదిగో ఈ చెడ్డ సంగతులన్నీ సంభవిస్తాయి;
DEU 28:16 “మీ పట్టణాల్ని, పొలాల్ని యెహోవా శపిస్తాడు.
DEU 28:17 మీకు పంటలు ఉండకుండేలా యెహోవా మిమ్మల్ని శపిస్తాడు. మీకు సరిపడేటంత ఆహారం ఉండదు.
DEU 28:18 యెహోవా మిమ్మల్ని శపిస్తాడు, మీకు అనేక మంది పిల్లలు కలగరు. ఆయన మీ భూమిని శపిస్తాడు, గనుక మంచి పంటను మీరు పొందరు. ఆయన మీ పశువులను శపిస్తాడు, గనుక అవి ఎక్కువ పిల్లల్ని ఈనవు. ఆయన మీ దూడలను గొర్రె పిల్లలను శపిస్తాడు.
DEU 28:19 మీరు చేసే వాటన్నింటిలో ఎల్లప్పుడూ యెహోవా శపిస్తాడు.
DEU 28:20 “మీరు కీడు చేసి, యెహోవాకు దూరమైతే, మీకు చెడు సంగతులు సంభవించేటట్టు ఆయన చేస్తాడు. మీరు చేసే ప్రతిదానిలో మీకు విసుగు, కష్టం కలుగుతుంది. మీరు త్వరగా, పూర్తిగా నాశనం అయ్యేంతవరకు ఆయన అలా చేస్తూనే ఉంటాడు. ఎదుకంటే మీరు ఆయననుంచి దూరమై, ఆయనను విసర్జించారు.
DEU 28:21 మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, మీరు నివసించేందుకని ప్రవేశిస్తున్న దేశంలో, మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేటంతవరకు మీకు రోగాలు వచ్చేటట్టు ఆయన చేస్తాడు.
DEU 28:22 యెహోవా రోగాలతో మిమ్ములను శిక్షిస్తాడు. మీకు జ్వరం, వాపు వస్తాయి. యెహోవా మీకు భయంకర వేడి కలిగిస్తాడు, భూమిపై వర్షాలు ఉండవు. మీ పంటలు వ్యాధుల మూలంగా లేక వేడి మూలంగా చస్తాయి. మీరు చచ్చేంతవరకు ఈ కీడులన్నీ మీకు సంభవిస్తూనే ఉంటాయి.
DEU 28:23 మీకు పైగా ఆకాశం ఇత్తడిలా తేటగా ఉంటుంది. మీ క్రింద భూమి ఇనుములా గట్టిగా ఉంటుంది.
DEU 28:24 ఆకాశంనుంచి వర్షానికి బదులు ఇసుక, ధూళి యెహోవా పంపిస్తాడు. మీరు నాశనం అయ్యేంతవరకు అది మీ మీదికి వస్తుంది.
DEU 28:25 “మీ శత్రువులు మిమ్మల్ని ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. ఒక్క మార్గం గుండా మీరు మీ శత్రువులమీదకు వెళ్లి, వారి దగ్గర్నుండిఏడు వేర్వేరు మార్గాలలో మీరు పారిపోతారు. మీకు సంభవించే సంగతుల మూలంగా ప్రపంచంలోని ప్రజలంతా భయపడతారు.
DEU 28:26 మీ శవాలు అడవి మృగాలకు, పక్షులకు ఆహారం అవుతాయి. మీ శవాల మీదనుండి వాటిని వెళ్లగొట్టే వారు ఎవరూ ఉండరు.
DEU 28:27 “మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, ఆయన ఈజిప్టు వాళ్లమీదికి పంపిన గడ్డల్లాంటి వాటితో ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు. పుండ్లు. కుష్ఠు, గజ్జితో ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు.
DEU 28:28 మీకు పిచ్చి ఎక్కేట్టుగా చేసి యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మిమ్మల్ని గుడ్డివాళ్లుగా చేసి, కలవరపరుస్తాడు.
DEU 28:29 అప్పుడు గుడ్డివారు తడువులాడే రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుతావు. మీరు చేసే ప్రతిదానిలో మీకు మీరు విఫలులవుతారు. ప్రజలు మరల మరల మిమ్మల్ని బాధించి, మీ దగ్గర్నుండి వస్తువులు దొంగిలిస్తారు. మిమ్మల్ని రక్షించేవారు ఎవరూ ఉండరు.
DEU 28:30 “నీకు ప్రధానం చేయబడిన స్త్రీతో మరొకడు లైగింక సంబంధాలు అనుభవిస్తాడు. నీవు ఇల్లు కడతావు గాని అదులో నీవు నివసించవు. ద్రాక్షతోట నీవు నాటుతావు గాని దానిలో నీవు ఏమీ కూర్చుకోవు.
DEU 28:31 నీ ఆవు నీ కళ్లముందే చంపబడుతుంది గాని నీవు దాని మాంసం ఏమీ తినవు. నీ గాడిద నీ దగ్గర్నుండి బలాత్కారంగా తీసుకొని పోబడుతుంది. అది నీకు తిరిగి ఇవ్వబడదు. నీ గొర్రెలు నీ శత్రువులకు ఇవ్వబడుతాయి. నిన్ను రక్షించేవాడు ఎవడూ ఉండడు.
DEU 28:32 “మీ కొడుకులు, కూతుళ్లు వేరే జాతి ప్రజలకు ఇవ్వబడేందుకు అనుమతించబడతారు. మీ పిల్లలు మీకు కావాలి గనుక మీ కళ్లు బలహీనమై, మీ చూపు మందగించేటంతవరకు మీరు వాళ్లకోసం చూస్తారు. మరియు దేవుడు మీకు సహాయం చేయడు.
DEU 28:33 “మీరు కష్టపడి పండించిన పంట అంతా మీకు తెలియని మరోజాతి తినేస్తుంది. ప్రజలు మిమ్మల్ని చెడుగా చూచి తిడతారు. విరుగగొట్ట బడుతుంటారు.
DEU 28:34 మీరు చూసే విషయాల మూలంగా మీకుపిచ్చెక్కుతుంది.
DEU 28:35 యెహోవా మిమ్మల్ని రసిపుండ్లతో శిక్షిస్తాడు. ఈ పుండ్లు మీ కాళ్ల మీద మోకాళ్లమీద ఉంటాయి. అవి మీ అరికాలు మొదలుకొని మీ నడి నెత్తివరకు నిండి ఉంటాయి. ఈ పుండ్లనుండి మీరు బాగుపడరు.
DEU 28:36 “మీరు ఎరుగని రాజ్యానికి మిమ్మల్ని, మీ రాజును యెహోవా పంపించేస్తాడు. మీరు, మీ పూర్వీకులు కూడా ఆ రాజ్యాన్ని ఎన్నడూ చూడలేదు. చెక్క, రాళ్లతో చేయబడిన ఇతర దేవుళ్లను అక్కడ మీరు పూజిస్తారు.
DEU 28:37 యెహోవా మిమ్మల్ని పంపించే దేశాల్లో, మీకు సంభవించిన సంగతులను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. వాళ్లు మిమ్మల్ని చూసి నవ్వుతారు. మిమ్మల్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు.
DEU 28:38 “పొలాల్లో చల్లటానికి మీరు విస్తారంగా విత్తనాలు తీసుకొని వెళ్తారు. కానీ మీ పంట కొద్దిగానే ఉంటుంది. ఎందుకంటే మిడతలు మీ పంటను తినివేస్తాయి.
DEU 28:39 మీరు ద్రాక్ష తోటలు నాటి, వాటిలో కష్టపడి పని చేస్తారు. కానీ మీరు ద్రాక్ష పండ్లు కూర్చుకోరు, వాటి రసం తాగలేరు. ఎందుకంటే పురుగులు వాటిని తినివేస్తాయి.
DEU 28:40 మీ దేశమంతటా మీకు ఒలీవ చెట్లు ఉంటాయి. కాని ఉపయోగించు కొనేందుకు మీకు ఎలాంటి నూనె ఉండదు. ఎందుచేతనంటే మీ ఒలీవ పండ్లు పాడై రాలిపోతాయి.
DEU 28:41 మీకు కుమారులు, కుమారైలు ఉంటారు. కాని వారిని మీరు ఉంచుకోలేరు. ఎందుచేతనంటే వారు బంధించబడి తీసుకొని పోబడతారు.
DEU 28:42 మీ చెట్లన్నింటినీ, మీ పోలాల్లోని పంటలన్నింటినీ మిడతలు నాశనం చేస్తాయి.
DEU 28:43 మీ మధ్య నివసించే విదేశీయులు మరింత ఎక్కువ అధికారం కూడ పొందుతారు. మీరేమో మీకు ఉన్న అధికారం కూడ పోగొట్టుకొంటారు.
DEU 28:44 మీకు అప్పు ఇచ్చేందుకు విదేశీయుల దగ్గర ధనం ఉంటుంది. కానీ వారికి అప్పు ఇవ్వటానికి మీ దగ్గర ఏమీ ధనం ఉండదు. శిరస్సు దేహాన్ని స్వాధీనంలో ఉంచుకొన్నట్టు వారు మిమ్మల్ని స్వాధీనంలో ఉంచుకొంటారు. మీరు తోకలా ఉంటారు.
DEU 28:45 “ఈ శాపాలన్నీ మీ మీదికి వస్తాయి. మీరు నాశనం అయ్యేంతవరకు అవి మిమ్మల్ని తరుముతూ, పట్టుకొంటూనే ఉంటాయి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పిన వాటిని మీరు వినలేదు. ఆయన మకు ఇచ్చిన ఆదేశాలకు, ఆజ్ఞలకు మీరు విధేయులు కాలేదు.
DEU 28:46 మీకు, మీ సంతతివారికి దేవుడు శాశ్వతంగా తీర్పుతీర్చాడని ఈ శాపాలు ప్రజలకు తెలియజేస్తాయి. మీకు సంభవించే భయంకర విషయాలను చూసి ప్రజలు ఆశ్చర్యపడిపోతారు.
DEU 28:47 “మీ దేవుడైన యెహోవా మీకు చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ మీరు సంతోషంగా, ఆనంద హృదయంతో ఆయనను సేవించలేదు.
DEU 28:48 అందుచేత శత్రువులకు మీరు సేవచేస్తారు. ఆకలి, దాహంతో మీరు దిగంబరులుగా ఉంటారు. మీకు ఏమీ ఉండదు. యెహోవా మిమ్మల్ని నాశనం చేసేంతవరకు ఆయన మీ మెడమీద ఇనుప కాడిని పెడతాడు.
DEU 28:49 “దూరంనుండి మీ మీదికి ఒక రాజ్యాన్ని యెహోవా తీసుకొని వస్తాడు. ఈ రాజ్యం భూమి అవతలి పక్కనుండి వస్తుంది. ఈ రాజ్య భాష మీకు అర్థం కాదు. ఆకాశంనుండి పక్షిరాజు వచ్చినట్టు ఈ రాజ్యం వేగంగా మీ మీదికి వస్తుంది.
DEU 28:50 ఈ రాజ్యం వారి ముఖాలు కఠినంగా ఉంటాయి. వారు ముసలి వాళ్లను లేక్కచేయరు. చిన్నపిల్లల మీద వాళ్లు దయచూపించరు.
DEU 28:51 మీరు నాశనం అయ్యేంతవరకు మీ పశువుల మందలోని దూడలను, మీ నేల పంటను వారు తింటారు. ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, మీ పశువుల్లో దూడలు, మీ మందల్లో గొర్రెలు మీకోసం వారు విడిచిపెట్టరు. మీరు నాశనం అయ్యేంతవరకు ఇలా చేస్తూనే ఉంటారు.
DEU 28:52 “ఈ రాజ్యం మీ పట్టణాలన్నింటినీ చుట్టుముట్టేస్తుంది. మీ పట్టణాల చుట్టూ ఉన్న మీ ఎత్తయిన, బలమైన గోడల్ని మీరు నమ్ముకొంటారు. కానీ మీ దేశం అంతటా ఈ గోడలన్నీ కూలిపోతాయి. అవును, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీ పట్టణాలన్నింటిమీదా ఆ రాజ్యం దాడి చేస్తుంది.
DEU 28:53 శత్రువు మీ పట్టణం చుట్టూ కనిపెట్టుకొని వుండగా, మీరు ఎంతో శ్రమ అనుభవిస్తారు. మీరు ఆకలి భరించలేక మీ పిల్లల్నే తినివేస్తారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన కుమారులు, కుమార్తెల శరీరాలను మీరు తింటారు.
DEU 28:54 “మీలో దయగల అతి మర్యాదస్తుడు కూడా క్రూరుడవుతాడు. ఇతరులతో కూడా క్రూరంగా వుంటాడు. తాను ప్రేమించే భార్యతోగాని, ఇంకను బతికున్న తన పిల్లలతోగాని క్రూరుడై భాగం పంచుకొనేందుకు ఆతడు ఒప్పుకోడు.
DEU 28:55 మీ పట్టణాల మీద దాడి చేసేందుకు వచ్చే శత్రువు అంత తీవ్ర నష్టం కలిగిస్తాడు. గనుక ఆతనికి తినటానికి కూడా ఏమీ మిగులదు. అందుచేత అతడు తన స్వంత పిల్లల్నే కొందర్ని తిలివేస్తాడు. కాని తన కుటుంబంలో ఇంకెవ్వరికీ అతడు ఏమీ ఇవ్వడు.
DEU 28:56 “ఎన్నడూ నేలమీద కాలు మోపనంత సున్నితమైన ధనికురాలు, మీలో ఎంతో గొప్ప దయ, మర్యాద గల స్త్రీ కూడా కఠినంగా ఉండి అలానే చేస్తుంది. ఆమె తన స్వంత ప్రియ భర్తతో లేక తన స్వంత కుమారునితో, స్వంత కుమార్తెతో భాగం పంచుకొనేందుకు నిరాకరిస్తుంది.
DEU 28:57 ఆమె తన మావిని, తాను కన్న తన స్వంత పిల్లలను రహస్యంగా తినేస్తుంది. ఎందుకంటే బొత్తిగా ఆహారం లేదు గనుక. మీ శత్రువు మీ పట్టణాల మీద దాడి చేసి, ఎంతో శ్రమె కలిగించినపుడు ఇలా జరుగుతుంది.
DEU 28:58 “ఈ గ్రంథంలో వ్రాయబడిన చట్టంలోని ఆదేశాలన్నింటికీ మీరు విధేయులు కావాలి. భయంకరమైన, అద్భుతమైన మీ దేవుడైన యెహోవా నామాన్ని మీరు గౌరవించాలి. మీరు విధేయులు కాకపోతే, అప్పుడు
DEU 28:59 యెహోవా మీకు దారుణమైన కష్టాలు కలిగిస్తాడు. మరియు మీ సంతతివారు గొప్ప కష్టాలు చాలకాలం కొనసాగే భయంకర రోగాలు అనుభవిస్తారు.
DEU 28:60 మీరు ఈజిప్టులో చాలా కష్టాలు, రోగాలు చూసారు. అవి మిమ్మల్ని భయస్తుల్నిగా చేసాయి. ప్రభువు ఆ చెడ్డ వాటన్నిటినీ మీ మీదకు రప్పిస్తాడు.
DEU 28:61 ఈ గ్రంథంలో వ్రాయబడని ప్రతి విధమైన ప్రతి రోగాన్ని యెహోవా మీ మీదకు రప్పిస్తాడు. మీరు నాశనం అయ్యేంతవరకు ఆయన ఇలా చేస్తూనే ఉంటాడు.
DEU 28:62 మీరు ఆకాశ నక్షత్రాలు ఉన్నంత మంది ఉండవచ్చు. కానీ మీలో కొంచెంమంది మాత్రమే మిగులుతారు. ఎందుకు మీకు ఇలా జరుగుతుంది? మీరు మీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక.
DEU 28:63 “ఇదివరకు మీకు మేలు చేసి, మీ రాజ్యాన్ని విశాలపరచాలంటే. యెహోవాకు సంతోషం. అదే విధంగా మిమ్మల్ని పాడుచేసి, నాశనం చేయటానికి యోహోవా సంతోషిస్తాడు. మీరు మీ స్వంతంగా తీసుకొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలోనుండి మీరు తొలగించివేయబడతారు.
DEU 28:64 భూమి ఈవైపునుండి ఆ వైపునకు గల ప్రపంచ ప్రజలందరి మధ్యకు యెహోవా మిమ్మల్ని చెదరగొట్టివేస్తాడు. మీరు గాని మీ పూర్వీకులు గాని ఎన్నడూ ఆరాధించని దేవుళ్లను, చెక్క, రాతితో చేసిన దేవుళ్లను మీరు సేవిస్తారు.
DEU 28:65 “ఈ రాజ్యాలలో మీకు ఏ మాత్రం శాంతి ఉండదు. మీరు విశ్రాంతి తీసుకొనే చోటు ఎక్కడా ఉండదు. యెహోవా మీ మనస్సులను చింతతో నింపేస్తాడు. మీ కళ్లు భారంగా ఉంటాయి. మీరు చాలా అల్లకల్లోలంగా ఉంటారు.
DEU 28:66 మీరు ప్రమాదంలో ఎల్లప్పుడూ అనుమానంగా జీవిస్తారు. రాత్రింబవళ్లు మీకు భయం కలుగుతూ ఉంటుంది. మీ జీవితాల విషయం మీకు ఎన్నడూ గట్టి నమ్మకం ఉండదు.
DEU 28:67 ‘ఇది సాయంత్రం ఆయితే బాగుండును’ అని ఉదయాన మీరంటారు. ‘ఇది ఉదయం అయితే బాగుండును’ అని సాయంత్రం అంటారు. ఎందుకంటే మీ హృదయంలో ఉండే భయంవల్ల, మీరు చూసే చెడు సంగతులవల్ల.
DEU 28:68 యెహోవా మళ్లీ మిమ్మల్ని ఓడల్లో ఈజిప్టుకు పంపిస్తాడు. మీరు మళ్లీ ఎన్నటికీ తిరిగి ఆ స్థలానికి తిరిగి వెళ్లనవసరం లేదని నేను మీతో చెప్పాను, కానీ యెహోవా మిమ్మల్ని అక్కడికి పంపిస్తాడు. అక్కడ మీరు మీ శత్రువులకు బానిసలుగా అమ్ముడుబోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ మిమ్మల్ని ఎవరూ కొనరు.”
DEU 29:1 మోయాబు దేశంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో చేయాల్సిందిగా. యెహోవా చెప్పిన ఒడంబడికలో భాగమే ఈ విషయాలు. హోరేబు (సీనాయి) కొండమీద ఇశ్రాయాలు ప్రజలతో యెహోవా చేసిన ఒడంబడిక గాక యిది ఆయన చేసిన మరో ఒడంబడిక.
DEU 29:2 మోషే ఇశ్రాయేలు ప్రజలందిర్నీ సమావేశపర్చాడు. అతను వాళ్లతో ఇలా చేప్పాడు: “ఈజిప్టు దేశంలో యెహోవా చేసిన వాటన్నింటినీ మీరు చూసారు. ఫరోకు, ఫరో నాయకులకు, అతని దేశం అంతటికీ యెహోవా చేసిన వాటిని మీరు చూసారు.
DEU 29:3 ఆయన వాళ్లకు కలిగించన గొప్ప కష్టాలు అన్నీ మీరు చూసారు. ఆయన చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు మీరు చూసారు.
DEU 29:4 కానీ జరిగిందేమిటో ఈ రోజూకూ మీకు అర్థంకాలేదు. మీరు చూసిన దానిని, విన్నదానిని యెహోవా మీకు అర్థం కానివ్వలేదు.
DEU 29:5 40 సంవత్సరాలు యెహోవా మిమ్మల్ని అరణ్యంలో నడిపించాడు. ఆ కాలం అంతటిలో మీ బట్టలు పాతబడలేదు, మీ చెప్పులు అరిగిపోలేదు.
DEU 29:6 మీ వద్ద భోజనం ఏమీలేదు. ద్రాక్షారసంగాని తాగేందుకు మరేదీగాని మీ దగ్గరలేదు. కానీ మీ విషయంలో యెహోవా శ్రద్ధతీసుకొన్నాడు. ఆయన మీ దేవుడైన యెహోవా అని మీరు అర్థం చేసుకోవాలని ఆయన ఇలా చేసాడు.
DEU 29:7 “మీరు ఈ స్థలానికి వచ్చినప్పుడు, హెష్భోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మన మీద యుద్ధానికి వచ్చారు. కానీ మనం వాళ్లను ఓడించాం.
DEU 29:8 అప్పుడు వారి దేశాన్ని మనం స్వాధీనం చేసుకొని, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారికి స్వంతంగా ఇచ్చాము.
DEU 29:9 కనుక ఈ ఒడంబడికలోని ఆదేశాలకు పూర్తిగా లోబడుతుంటే మీరు చేసే ప్రతి దానిలో మీరు విజయం పొందుతూ ఉంటారు.
DEU 29:10 “ఈ వేళ మీరంతా ఇక్కడ మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు. మీ నాయకులు, మీ అధికారులు, మీ పెద్దలు, మిగిలిన మనుష్యులంతా ఇక్కడ ఉన్నారు.
DEU 29:11 మీ భార్యలు, పిల్లలు ఇక్కడ ఉన్నారు. మీ మధ్య నివసిస్తూ, మీ కట్టెలు కొట్టి, మీకు నీళ్లు మోసే విదేశీయులు కూడా ఇక్కడ ఉన్నారు.
DEU 29:12 మీరంతా మీ దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక చేసు కొనేం దుకు ఇక్కడ ఉన్నారు. యెహోవా నేడు మీతో ఈ ఒడంబడిక చేస్తున్నాడు.
DEU 29:13 ఈ ఒడంబడిక మూలంగా యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొంటున్నాడు. మరియు సాక్షాత్తూ ఆయనే మీకు దేవుడుగా ఉంటాడు. ఇది ఆయన మీతో చెప్పాడు. మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన దీనిని వాగ్దానం చేశాడు.
DEU 29:14 యెహోవా ఈ వాగ్దానాలన్నింటితో కూడిన ఈ ఒడంబడికను మీతో మాత్రమే చేయటం లేదు.
DEU 29:15 ఈ వేళ ఇక్కడ మన దేవుడైన యెహోవా యెదుట నిలిచిన మనందరితో ఆయన ఈ ఒడంబడిక చేస్తున్నాడు. అయితే ఈనాడు ఇక్కడ మనతో లేని మన సంతానానికి కూడ ఈ ఒడంబడిక వర్తిస్తుంది.
DEU 29:16 మనం ఈజిప్టు దేశంలో ఎలా జీవించామో మీకు జ్ఞాపకమే. ఇక్కడికి వచ్చే మార్గంలో ఉన్న దేశాల్లోంచి మనం ఎలా ప్రయాణం చేసామో అదీ మీకు జ్ఞాపకమే.
DEU 29:17 చెక్క, రాయి, వెండి, బంగారంతో వారు చేసిన అసహ్యమైన విగ్రహాలను మీరు చూసారు.
DEU 29:18 ఈ వేళ ఇక్కడ ఉన్న పురుషుడుగాని, స్త్రీగాని, కుటుంబంగాని, వంశం గాని మీ దేవుడైన యెహోవా నుండి తిరిగిపోకుండా గట్టి జాగ్రత్తలో ఉండండి. ఏ వ్యక్తి కూడా పోయి ఆ రాజ్యల దేవుళ్లను సేవించకూడదు. అలా చేసేవాళ్లు చేదైన విష ఫలాలు ఫలించే మొక్కల్లా ఉంటారు.
DEU 29:19 “ఒక వ్యక్తి ఈ శాపాలన్నీ విని, ‘నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తూనే ఉంటాను. నాకేమీ కీడు సంభవించదు’ అంటూ తనను తాను ఆదరించుకో వచ్చును. ఆ వ్యక్తి తనకు మాత్రమేగాక ప్రతి ఒక్కరికీ చివరకు మంచి వాళ్లకుకూడ కీడు జరిగిస్తాడు.
DEU 29:20 ఆ వ్యక్తిని యోహోవ క్షమించడు. మరియు, ఆ వ్యక్తిమీద యెహోవాకు కోపం వస్తుంది, యెహోవా ఆ వ్యక్తిని శిక్షిస్తాడు. ఇశ్రాయేలు వంశాలన్నింటి నుండీ యెహోవా అతణ్ణి వేరు చేసేస్తాడు. యెహోవా అతన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఈ గ్రంథంలో వ్రాయబడిన కీడులన్నీ అతనికి సంభవిస్తాయి. ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఒడంబడికలో ఆ విషయాలన్నీ ఒక భాగం;
DEU 29:22 “భవిష్యత్తులో మీ సంతానంవారు, దూరదేశాల్లోని విదేశీయులు మీ దేశం ఎలా పాడైపోయిందో చూస్తారు. యెహోవా దాని మీదికి రప్పించిన రోగాలను వారు చూస్తారు.
DEU 29:23 దేశం అంతా మండే గంధకం, ఉప్పుతో నిష్ప్రయోజనంగా ఉంటుంది. దేశంలో ఏమీ నాట బడదు ఏవీ, చివరకు గురుగులుకూడ పెరగవు. యెహోవా చాలా కోప గించినప్పుడు నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, జెబోయిం పట్టణాల్లా ఈ దేశం ఉంటుంది.
DEU 29:24 “‘యెహోవా ఈ దేశానికి ఎందుకు ఇలా చేసాడు? ఆయనకు ఎందుకు ఇంతకోపం వచ్చింది?’ అని ఇతర రాజ్యాలన్నీ అడుగుతాయి.
DEU 29:25 జవాబు ఇదే: ‘ఇశ్రాయేలు ప్రజలు, వారి పూర్వీకుల దేవుడైన యెహోవా ఒడంబడికను విడిచిపెట్టేసారు గనుక యెహోవాకు కోపం వచ్చింది. యెహోవా వారిని ఈజిప్టు దేశనుండి బయటకు తీసుకొనివచ్చినప్పుడు ఆయన వారితో చేసిన ఒడంబడికను పాటించటం వాళ్లు మానివేసారు.
DEU 29:26 ఇశ్రాయేలు ప్రజలు ఇదివరకు ఎన్నడూ ఆరాధించని ఇతర దేవుళ్లను ఆరాధించటం మొదలు పెట్టారు. ఆ దేవుళ్లను పూజించ వద్దని యెహోవా ఆ ప్రజలతో చెప్పాడు.
DEU 29:27 అందు వల్లనే ఈ దేశప్రజల మీద యెహోవాకు అంతగా కోపం వచ్చింది. అందుచేత ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపాలన్నీ ఆయన వారి మీదికి రప్పించాడు.
DEU 29:28 యెహోవా వారి మీద చాలా కోపగించాడు. కనుక ఆయన వాళ్లను వారి దేశంనుండి బయటకు లాగేసాడు. ఈనాడు వారు ఉన్న మరో దేశంలో ఆయన వాళ్లను ఉంచాడు.’
DEU 29:29 “మన దేవుడైన యెహోవా రహస్యంగా ఉంచిన మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఆ సంగతులు ఆయనకు మాత్రమే తెలసు. ఆయితే యెహోవా తన ధర్మశాస్త్రాన్ని మాత్రం మనల్ని తెలసుకోనిచ్చాడు. ఆ ధర్మశాస్త్రం మనకోసం, మన సంతతివారికోసం. మనం దానికి శాశ్వతంగా విధేయులం కావాలి.
DEU 30:1 “నేను చెప్పిన ఈ సంగతులన్నీ మీకు సంభవిస్తాయి. ఆశీర్వాదాల నుండి మంచి సంగతులు, శాపాలనుండి చెడు సంగతులు మీకు సంభవిస్తాయి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇతర దేశాలకు పంపించివేస్తాడు. అప్పుడు మీరు ఈ విషయాలను గూర్చి తలుస్తారు.
DEU 30:2 ఆ సమయంలో మీరూ, మీ సంతానం మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. నేడు నేను మీకు యిచ్చిన ఆయన ఆదేశాలన్నింటికీ పూర్తిగా విధేయులై, మీ హృదయపూర్తిగా మీరు ఆయనను వెంబడిస్తారు.
DEU 30:3 అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ మీద దయ చూపిస్తాడు. యెహోవా మిమ్మల్ని మళ్లీ స్వతంత్రుల్ని చేస్తాడు. ఆయన మిమ్మల్ని పంపించిన దేశాలనుండి తిరిగి వెనుకకు తీసుకొనివస్తాడు.
DEU 30:4 ఆయన మిమ్మల్ని చివరి భూదిగంతాలవరకు పంపించినాసరే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమావేశపర్చి, అక్కడనుండి తిరిగి వెనుకకు తీసుకొని వస్తాడు.
DEU 30:5 యెహోవా మిమ్మల్ని మీ పూర్వీకుల దేశానికి తీసుకొనివస్తాడు, ఆ దేశం మీదే అవుతుంది. యెహోవా మీకు మేలు చేస్తాడు. మీ పూర్వీకులకు ఉన్నదానికంటె మీకు ఎక్కువ ఉంటుంది.
DEU 30:6 మీ దేవుడైన యెహోవా మీ యొక్కయు మీ సంతానం యొక్కయు హృదయాలు సున్నతి చేస్తాడు. దాన్ని బట్టే మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతోను, మీ నిండు మనస్సుతోను ప్రేమించి బతుకుతారు.
DEU 30:7 “మిమ్మల్ని ద్వేషించి. మీకు కష్టం కలిగించే మీ శత్రువుల మీద ఆ శాపాలన్నింటినీ మీ దేవుడైన యెహోవా రప్పిస్తాడు.
DEU 30:8 మరియు మీరు తిరిగి యెహోవాకు విధేయులవుతారు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆదేశాలన్నింటికీ మీరు విధేయులవుతారు.
DEU 30:9 మీ దేవుడైన యెహోవా మీరు చేసే ప్రతీదీ విజయవంతం చేస్తాడు. ఆయన మీకు చాలా మంది పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. విస్తారమైన దూడలను ఇచ్చి మీ మందలను, మంచి పంటలతో మీ పొలాలను ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోవా మీ యెడల మంచి జరిగిస్తాడు. యెహోవా మీ పూర్వీకులకు మేలు చేసి సంతోషించినట్టు, ఆయన మరల మీకు మేలు చేయటంలో ఆనందిస్తాడు.
DEU 30:10 అయితే మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినవాటిని మీరు చేయాలి. ఈ ధర్మశాస్త్రపు గ్రంథంలో వ్రాయబడిన నియమాలు మీరు పాటించాలి, ఆదేశాలకు మీరు విధేయులు కావాలి, మీ నిండు హృదయంతో, మీ ఆత్మతో మీరు మీ దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. అప్పుడు ఈ మంచి విషయాలన్నీ మీకు సంభవిస్తాయి.
DEU 30:11 “ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞ చాలా కష్టతరమయింది కాదు. అది చాలా దూరమైనదీ కాదు.
DEU 30:12 మేము దానిని విని, దానిని జరిగించేందుకు ‘ఎవరు మా కోసం ఆకాశానికి వెళ్లి దాన్ని తీసుకొని వస్తారు అని మీరు చేప్పేందుకు ఈ ఆదేశం ఆకాశంలో లేదు.’
DEU 30:13 మేము దానిని విని, దానిని జరిగించడానికి ‘మాకోసం ఎవరు సముద్రం దాటి వెళ్లి, దానిని మాకోసం తీసుకొని వస్తారు అని చెప్పటానికి ఈ ఆదేశం సముద్రానికి అవతలపక్క లేదు.’
DEU 30:14 లేదు, మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీరు చేయగలిగేటట్టు మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.
DEU 30:15 “జీవం, మరణం, మంచి చెడుల మధ్య కోరుకొనే అవకాశం ఈ వేళ నేను మీకు యిచ్చాను.
DEU 30:16 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలనీ, ఆయన మార్గాల్లో నడచుకోవాలనీ, ఆయన ఆదేశాలకు, ఆజ్ఞలకు, నియమాలకు విధేయులు కావాలనీ ఈ వేళ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అప్పుడు మీరు బ్రతుకుతారు. మీ దేశం విస్తరిస్తుంది. మరియు స్వంతంగా మీరు తీసుకొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
DEU 30:17 అయితే మీరు యోహోవా నుండి మరలిపోయి, వినడానికి నిరాకరిస్తే, ఇతర దేవుళ్లను పూజించి, సేవించేందుకు మీరు తిప్పివేయబడితే
DEU 30:18 మీరు నాశనం చేయబడతారు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు మీ స్వంతంగా తీసుకొనేందుకు ప్రవేశించాలని సిద్ధంగా ఉన్నయోర్దాను నది అవతలి వైపు దేశంలో మీరు ఎక్కువ కాలం బ్రతకరు.
DEU 30:19 “ఈ వేళ మీరు కోరుకొనేందుకు రెందు విషయాలు మీకు యిస్తున్నాను. మీరు కోరుకొనే దానికి సాక్షులుగా ఉండమని భూమిని, ఆకాశాన్ని నేను అడుగుత్తున్నాను. మీరు జీవం కోరుకోవచ్చు లేదా మరణం కోరుకోవచ్చు. మొదటిది కోరుకుంటే అది ఆశీర్వాదం తెచ్చిపెడ్తుంది. రెండోది కోరుకుంటే అది శాపంతెస్తుంది. అందుచేత జీవం కోరుకోండి. అప్పుడు మీరూ, మీ పిల్లలూ జీవిస్తారు.
DEU 30:20 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనకు విధేయులు కావాలి. ఎన్నటికీ ఆయనను విడిచిపెట్టవద్దు. ఎందు చేతనంటే యెహోవాయే మీకు జీవం, మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు యిస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశంలో మీ దేవుడైన యెహోవా మీకు దీర్ఘాయుష్టు ఇస్తాడు.”
DEU 31:1 అప్పుడు మోషే వెళ్లి, ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పాడు.
DEU 31:2 మోషే వాళ్లతో ఇలా చెప్పాడు, “ఇప్పుడు నాకు 120 సంవత్సరాల వయస్సు. ఇంక మిమ్మల్ని నేను నడిసించలేను. ‘నీవు యోర్దాను నది దాటి వెళ్లవు’ అని యెహోవా నాతో చెప్పాడు.
DEU 31:3 మీ దేవుడైన యెహోవా మీకు ముందు వెళ్తాడు. మీకోసం ఈ రాజ్యాలను ఆయనే నాశనం చేస్తాడు. వారి దగ్గరనుండి వారి రాజ్యాన్ని మీరు తీసుకుంటారు. యెహోషువ మిమ్మల్ని ముందుగా దాటిస్తాడు. ఇది యెహోవా చెప్పాడు:
DEU 31:4 “మోరీ రాజులైన సీహోను, ఓగులకు చేసినట్టే యెహోవా ఈ రాజ్యాలకు చేస్తాడు. ఆ రాజుల దేశానికి చేసిన విధముగానే ఆయన చేస్తాడు. వారి దేశాన్ని యెహోవా నాశనం చేసాడు.
DEU 31:5 మరియు మీరు ఈ రాజ్యాలను నాశనం చేసేటట్టు యెహోవా సహాయం చేస్తాడు. మీరు చేయాలని నేను చేప్పిన విషయాలన్నీ మీరు వాళ్లకు చేయాలి.
DEU 31:6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. ఈ జనాలకు భయపడకండి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో పాటు వెళ్తున్నాడు. యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడు, మీకు సహాయం చేయకుండా ఉండడు.”
DEU 31:7 అప్పుడు మోషే యెహోషువాను పిలిచాడు. మోషే యెహోషువతో చెబుతుంటే ఇశ్రాయేలు ప్రజలంతా విన్నారు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, వారిపూర్వీకులకు యిస్తానని యెహోవా వాగ్దానం చేసిన దేశంలోనికి ఈప్రజలను నీవు నడిపించాలి. ఈ దేశాన్ని తమ స్వంతంగా తీసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలకు నీవు సహాయం చేయాలి.
DEU 31:8 యెహోవా నీకు ముందు వెళ్తాడు. సాక్షాత్తూ ఆయనే నీతో ఉంటాడు. ఆయన నీకు సహాయం చేయకుండా ఉండడు నిన్ను విడువడు, భయపడవద్దు, దిగులుపడవద్దు.”
DEU 31:9 అప్పుడు మోషే ఈ ధర్మశాస్త్రం వ్రాసి, లేవీ సంతానపు యాజకులకు ఇచ్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టె మోసే పని వాళ్లదే. ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు నాయకులందరికి కూడా మోషే యిచ్చాడు.
DEU 31:10 తర్వాత మోషే నాయకులకు ఆజ్ఞాపించాడు. అతను ఇలా చెప్పాడు: “ప్రతి ఏడు సంవత్సరాల ఆఖరిలో, స్వాతంత్ర్యపు సంవత్సరంలో, పర్ణశాలల పండుగ సమయములో ఈ ధర్మశాస్త్రం చదవండి.
DEU 31:11 ఆ సమయంలో మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే ప్రత్యేక స్థలంలో ఆయనను కలుసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలంతా వస్తారు. అప్పుడు ప్రజలు వినగలిగేటట్టు నీవు వారికి ఈ ధర్మశాస్త్రం చదివి విని పించాలి.
DEU 31:12 పురుషులు, స్త్రీలు చిన్నపిల్లలు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు అందరిని సమావేశ పర్చాలి. వాళ్లు ధర్మశాస్త్రాన్ని విని, మీ దేవుడైన యెహోవాను గౌరవించంటం నేర్చుకుంటారు. ఈ ధర్మశాస్త్రంలోని ఆదేశాలకు వారు జాగ్రత్తగా విధేయులవుతారు.
DEU 31:13 ధర్మశాస్త్రం ఎరుగనివారి సంతానంవాళ్లంతా దానిని వింటారు. వాళ్లు మీ దేవుడైన యెహోవాను గౌరవించటం నేర్చుకుంటారు. యోర్దాను నది ఆవలి ప్రక్క మీరు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో మీరు జీవించినంత కాలం వారు ఆయనను గౌరవిస్తారు.”
DEU 31:14 “నీవు చనిపోయే సమయం దగ్గరపడింది. యెహోషువను వెంటబెట్టుకుని. సన్నిధి గుడారం దగ్గరకురా. యెహోషువ చేయాల్సిన పనులు నేను ఆతనికి చెబుతాను” అని మోషేతో యెహోవా ఇలా చెప్పాడు. కనుక మోషే, యెహోషువ సన్నిధి గుడారానికి వెళ్లారు.
DEU 31:15 ఆ గుడారంలో ఒక మేఘస్తంభంలో యెహోవా ప్రత్యక్షమయ్యాడు. మేఘస్తంభం గుడార ద్వారం దగ్గర నిలిచింది.
DEU 31:16 మోషెతో యెహోవా ఇలా చెప్పాడు: “త్వరలో నీవు చనిపోతావు. నీవు నీ పూర్వీకులతో ఉండేందుకు వెళ్లిపోయిన తర్వాత, ఈ ప్రజలు నాకు నమ్మకంగా ఉండరు. నేను వాళ్లతో చేసిన ఒడంబడికను వాళ్లు ఉల్లంఘిస్తారు. వాళ్లు నన్ను విడిచిపెట్టేసి, వారు వెళ్తున్న దేశంలోని ఇతర దేవుళ్లను, అబద్ధపు దేవుళ్లను పూజించటం మొదలు పెడ్తారు.
DEU 31:17 ఆ సమయంలో నేను వారిమీద చాలా కోపగించి, వాళ్లను విడిచి పెడ్తాను. వాళ్లకు సహాయం చేయటానికి నేను ఒప్పుకోను, వాళ్లు నాశనం చేయబడతారు. వాళ్లకు భయంకరమైన సంగతులు జరుగుతాయి, వాళ్లకు కష్టాలు వస్తాయి. అప్పుడు ‘మన దేవుడు మనతో లేడు గనుక ఈ కీడులు మనకు కలిగాయి’ అని వారు అంటారు.
DEU 31:18 వాళ్లు కీడు చేసి, ఇతర దేవుళ్లను పూజించారు గనుక నేను వారికి సహాయం చేయటానికి ఒప్పుకోను.
DEU 31:19 “కనుక ఈ పాట వ్రాసుకొని, ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించు, అది పాడటం వారికి నేర్పించు. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నాకు ఈ పాట సాక్ష్యంగా ఉంటుంది.
DEU 31:20 వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన, మంచి వాటితో నిండిపోయిన దేశం లోనికి నేను వాళ్లను తీసుకొని వెళ్తాను. వారు తినేందుకు కావాల్సినవి అన్నీ వారికి ఉటాయి. ఐశ్వర్యవంతమైన జీవితం వారికి ఉంటుంది. కానీ అప్పుడు వాళ్లు యితర దేవుళ్ల వైపు తిరిగి, వారిని సేవిస్తారు. నా నుండి వాళ్లు తిరిగిపోయి నా ఒడంబడికను ఉల్లంఘిస్తారు.
DEU 31:21 అప్పుడు వాళ్లకు ఎన్నో భయంకర సంగతులు జరుగుతాయి, వారికి ఎన్నో కష్టాలు వస్తాయి. అప్పటికి ఇంకా వారి ప్రజలకు ఈ పాట జ్ఞాపకం ఉంటుంది, వారిది ఎంత తప్పు అని యిది వారికి తెలియజేస్తుంది. నేను వారికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలోనికి నేను యింకా వారిని తీసుకొని వెళ్లలేదు; కానీ వాళ్లు అక్కడ ఏం చేయాలని పథకం వేస్తున్నారో నాకు అప్పుడే తెలుసు.”
DEU 31:22 కనుక ఆ రోజే మోషే ఆ పాట వ్రాసాడు. ఆ పాటను ఇశ్రాయేలు ప్రజలకు ఆతను నేర్పించాడు.
DEU 31:23 తర్వాత నూను కుమారుడైన యెహోషువతో యెహోవా మాట్లాడాడు: ఆతనితో, “దైర్యంగా, నిబ్బరంగా ఉండు. నేను ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన దేశంలోకి నీవు ఆ ప్రజలను నడిపిస్తావు. నేను నీతో ఉంటాను” అని యెహోవా చెప్పాడు.
DEU 31:24 ఈ ఉపదేశాలు అన్నింటినీ మోషే జాగ్రత్తగా ఒక గ్రంథంలో వ్రాసాడు. అతడు ముంగించినప్పుడు
DEU 31:25 లేవీయులకు అతడు ఒక ఆజ్ఞ యిచ్చాడు. (వీళ్లు యెహోవా ఒడంబడిక పెట్టె విషయలో జాగ్రత్త తీసుకుంటారు.) అని మోషే చెప్పాడు,
DEU 31:26 “ఈ ధర్మశాస్త్రపు గ్రంథం తీసుకొని. మీ దేవుడైన యెహోవా ఒడంబడిక పెట్టె పక్కగా పెట్టండి. అప్పుడు అది మీ మీద సాక్ష్యంగా అక్కడ ఉంటుంది.
DEU 31:27 మీరు చాలా మొండి వాళ్లని నాకు తెలుసు. మీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్లాలని మీకు ఉంటుందని నాకు తెలుసు. చూడండి, నేను యింకా మీతో ఉన్న ఈనాడే మీరు యెహోవాకు విధేయులయ్యేందుకు నిరాకరించారు. నేను చనిపోయిన తర్వాత మీరు యెహోవాకు విధేయులయ్యేందుకు ఇంకా ఎక్కువ నిరాకరిస్తారు.
DEU 31:28 మీ వంశాల నాయకుల్ని, మీ అధికారుల్ని అందరిని సమావేశపర్చండి. వారికి నేను ఈ విషయాలు చెబుతాను. భూమిని, ఆకాశాన్ని నేను వారికి విరుద్ధంగా సాక్ష్యం పలికేందుకు పిలుస్తాను.
DEU 31:29 నా మరణం తర్వాత మీరు చెడ్డ వాళ్లవుతారని నాకు తెలసు, మీరు వెంబడించాలని నేను మీకు ఆదేశించిన మార్గంనుండి మీరు తిరిగి పోతారు. అప్పుడు భవిష్యత్తులో చెడ్డ సంగతులు మీకు జరుగుతాయి. ఎందుకంటే, ఏవి చెడ్డవని యెహోవా చెబుతాడో అవే మీరు చేయాలను కుంటారు గనుక. మీరు చేసే పనులు మూలంగా మీరు ఆయనకు కోపం పుట్టిస్తారు.”
DEU 31:30 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ పాట చెప్పాడు. మొత్తం పాట అంతా ముగించేంత వరకు అతడు ఆపుజేయలేదు.
DEU 32:1 “ఆకాశములారా ఆలకించండి, నేను మాట్లాడుతాను. భూమి నానోటి మాటలు వినునుగాక!
DEU 32:2 నా ప్రబోధం వర్షంలా పడుతుంది, నా ఉపన్యాసం మంచులా ప్రవహిస్తుంది, మెత్తటి గడ్డిమీద పడేజల్లులా ఉంటుంది. కూరమొక్కల మీద వర్షంలా ఉంటుంది.
DEU 32:3 యెహోవా నామాన్ని నేను ప్రకటిస్తా! దేవుణ్ణి స్తుతించండి!
DEU 32:4 “ఆయన ఆశ్రయ దుర్గంలో ఉన్నాడు ఆయన పని పరిపూర్ణం! ఎందుకంటే ఆయన మార్గాలన్నీ సరైనవిగనుక. ఆయన సత్యవంతుడు నమ్ముకొదగ్గ దేవుడు.
DEU 32:5 ఆయన చేసేది మంచిది, సరియైనది కూడా. మీరు నిజంగా ఆయన పిల్లలు కారు. మీతప్పుల మూలంగా మీరు ఆయనను సమీపించలేని అపవిత్రులయ్యారు. మీరు వంకర మనుష్యులు, అబద్ధీకులు.
DEU 32:6 యెహోవాకు మీరు చెల్లించవలసిన కృతజ్ఞత ఇదేనా? మీరు బుద్ధిహీనులు, ఆజ్ఞానులు, యెహోవా మీ తండ్రి, ఆయన మిమ్మల్ని చేసాడు. ఆయనే మీ సృష్టికర్త. ఆయన మిమ్మల్ని బల పరచేవాడు.
DEU 32:7 “పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి, అనేక తరాల సంవత్సరాలను గూర్చి ఆలోచించండి. మీ తండ్రిని అడగండి, ఆతడు చెబుతాడు; మీ నాయకుల్ని అడగండి, వాళ్లు మీకు చెబుతారు.
DEU 32:8 రాజ్యాలకు వారి దేశాన్ని సర్వోన్నతుడైన దేవుడు యిచ్చాడు. ప్రజలు ఎక్కడ నివసించాల్సిందీ ఆయనే నిర్ణయించాడు. తర్వాత ఆయన ఇతరుల దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చాడు.
DEU 32:9 ఆయన ప్రజలే యెహోవా వంతు; యాకోబు (ఇశ్రాయేలు) యెహోవాకు స్వంతం.
DEU 32:10 “అరణ్య భూమిలో యాకోబును (ఇశ్రాయేలు) యెహోవా కనుగొన్నాడు, వేడి గాడ్పుల్లో కేకలు పెట్టే పనికిమాలిన అరణ్యంలో యెహోవా యాకోబు దగ్గరకు వచ్చి, ఆతణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకున్నాడు. యెహోవా తన కంటి పాపలా ఆతడ్ని కాపాడాడు.
DEU 32:11 యెహోవా ఇశ్రాయేలీయులకు పక్షి రాజులా ఉన్నాడు. పక్షిరాజు తన పిల్లలను ఎగరటం నేర్పించేందుకోసం అది వాటిని బయటకు తోస్తుంది. అది తన పిల్లలను కాపాడేందుకు వాటితో కలిసి ఎగురుతుంది. అవి పడిపోతున్నప్పుడు వాటిని పట్టుకొనేందుకు తన రెక్కలు చాపుతుంది. మరియు అది తన రెక్కల మీద వాటిని క్షేమ స్థలానికి మోసుకొని వెళ్తుంది. యెహోవా అలాగే ఉన్నాడు.
DEU 32:12 యెహోవా మాత్రమే యాకోబును (ఇశ్రాయేలు) నడిపించాడు. యాకోబు దగ్గర ఇతర దేవతలు లేవు.
DEU 32:13 భూమియొక్క ఉన్నత స్థలాల్లో యాకోబును యెహోవా నడిపించాడు, పొలంలోని పంటను యాకోబు భుజించాడు యాకోబు బండలోనుండి తేనెను చెకుముకి రాతినుండి నూనెను తాగేటట్టు యెహోవా చేసాడు.
DEU 32:14 మందలోనుండి వెన్న, గొర్రెలనుండి పాలు గొర్రెపిల్లలు, పొట్టేళ్లు, బాషాను జాతి మగ మేకలు, అతి శ్రేష్ఠమైన గోధుమలు ఆయన నీకు యిచ్చాడు. ద్రాక్షల ఎర్రటిరసం నుండి ద్రాక్షారసం నీవు త్రాగావు.
DEU 32:15 “కానీ యెష్రూను కొవ్వు పట్టి బలిసిన ఎద్దులా తన్నుతన్నాడు. వాడు బాగా తిని బలిసాడు. వానికి మంచి పోషణ దొరికింది. వాడు తనను చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేసాడు. వాడు ఆ బండను(యెహోవాను) తన రక్షకునిగా అంగీకరించలేదు.
DEU 32:16 యెహోవా ప్రజలు యితర దేవుళ్లను పూజించి ఆయనకు రోషం పుట్టించారు. యెహోవాకు అసహ్యమైన వారి విగ్రహాల మీద ఆయనకు కోపం వచ్చేటట్లు వారు చేసారు.
DEU 32:17 నిజానికి దేవుళ్లు కాని దయ్యాలకు వారు బలులు అర్పించారు. వాళ్లకు తెలియని దేవుళ్లకు వారు బలులు అర్పించారు. ఈ దేవుళ్లు మీ పూర్వీకులు ఎన్నడూ పూజించని కొత్త దేవుళ్లు.
DEU 32:18 మిమ్మల్ని సృష్టించిన ఆశ్రయ దుర్గమును (దేవుణ్ణి) మీరు విడిచిపెట్టేసారు. మీకు జీవం ప్రసాదించిన దేవుణ్ణి మీరు మరచిపోయారు.
DEU 32:19 “యెహోవా కుమారులు, కుమార్తెలు ఆయనకు కోపం పుట్టించినందువల్ల ఆయన అది చూచి తన ప్రజలను నిరాకరించాడు.
DEU 32:20 అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు, ‘వారినుండి నేను నా ముఖం దాచుకొంటాను. వాళ్ల అంతం ఏమిటో నేను చూడగలను. ఎందుకంటే వారు చాలా చెడ్డ తరంవారు వారు అపనమ్మకమైన పిల్లలు.
DEU 32:21 దేవుళ్లు కాని వాటితో వారు నాకు రోషం కలిగించారు. పనికిమాలిన ఈ విగ్రహాలతో వారు నాకు కోపం పుట్టించారు. నిజానికి రాజ్యం కాని ఒక రాజ్యంతో నేను వారికి రోషం పుట్టిస్తాను. ఒక బుద్ధిహీనమైన రాజ్యంతో నేను వారికి కోపం పుట్టిస్తాను. నా కోపం అగ్నిని రాజబెట్టింది; నా కోపం పాతాళ అగాధంవరకు మండుతుంది. భూమిని, దాని పంటను నా కోపం నాశనం చేస్తుంది. నా కోపం పర్వతాల పునాదులకు నిప్పు అంటిస్తుంది.
DEU 32:23 “‘ఇశ్రాయేలీయుల మీద నేను కష్టాలు ఉంచుతాను. నేను వాళ్లమీద నా బాణాలు విసురుతాను.
DEU 32:24 ఆకలిచేత వాళ్లు బలహీనమై సన్నబడిపోతారు. మండే వేడిచేత. భయంకర నాశనం చేతవారు నాశనమైపోతారు. బురదలో పాకే పాముల విషం, మృగాల కోరలు నేను వారిమీదికి పంపిస్తాను.
DEU 32:25 బయట ఖడ్గం దుఃఖాన్ని కలిగిస్తుంది; లోపల ఖడ్గం భయాన్ని పుట్టిస్తుంది. యువకుడ్ని, కన్యనుకూడ అది నాశనం చేస్తుంది. పసివారిని, తలనెరిసిన వృద్ధులను కూడ అది నాశనం చేస్తుంది.
DEU 32:26 “‘నేనంటాను: ఇశ్రాయేలు వాళ్లను నేను దూరంగా ఊదేస్తాను. ప్రజలు ఇశ్రాయేలు వాళ్లను మరచిపోయేటట్టు నేను చేస్తాను.
DEU 32:27 ఆయితే వారి శత్రువు చెప్పేది నాకు తెలసు అది నాకు చికాకు కలిగిస్తుంది. ఇశ్రాయేలీయుల శత్రువు అపార్థం చేసుకొని, “మా స్వంత శక్తితో మేము గెలి చాము అది యోహోవా చేయలేదు’” అనవచ్చును.
DEU 32:28 “వారు తెలివిలేని రాజ్యం, వారికి అవగాహన లేదు.
DEU 32:29 వారు తెలివిగల వాళ్లయితే వారు దీనిని గ్రహిస్తారు. భవిష్యత్తులో వారి అంతం గూర్చి ఆలోచిస్తారు.
DEU 32:30 ఒకడు 1,000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మంది పారిపోయేటట్టు ఎలా చేయగలరు? యెహోవా వారిని వారి శత్రువుకు అప్పగిస్తేనే అలా జరుగుతుంది. ఆ ఆశ్రయ దుర్గం (యెహోవా) ఈ శత్రువులను అమ్మివేస్తే, యెహోవా ఈ శత్రువులను వారికి అప్పగిస్తే మాత్రమే యిలా జరుగుతుంది.
DEU 32:31 ఈ శత్రువుల ఆశ్రయ దుర్గం మన బండ (యెహోవా) వంటి శక్తిమంతుడు కాడు. ఇది సత్యమని మన శత్రువులుకూడ చూడగలరు.
DEU 32:32 ఈ శత్రువుల ద్రాక్ష సొదొమ ద్రాక్ష వంటిది. గొముర్రా పొలాలలోని దాని వంటిది. వారి ద్రాక్షా పండ్లు విషపు ద్రాక్షలు వారి ద్రాక్షా పండ్ల గుత్తులు చేదు.
DEU 32:33 వారి ద్రాక్షారసం కృర సర్పాల విషం నాగు పాముల కఠిన విషం.
DEU 32:34 “ఆ శిక్షను నేను భద్రం చేస్తున్నాను ‘నా గిడ్డంగిలో తాళం వేసి దీనిని నేను భద్రపరుస్తున్నాను అని యెహోవా చెబుతున్నాడు.
DEU 32:35 ప్రజల పాదం తప్పుడు పనుల్లోకి జారినప్పుడు శిక్షించే వాణ్ణి వారి తప్పులకు ప్రజలకు ప్రతిఫలం యిచ్చేవాడ్ని నేనే; ఎందుకంటే వారి కష్టకాలం సమీపంగా ఉంది వారి శిక్ష త్వరగా వస్తుంది గనుక.’
DEU 32:36 “యెహోవా తన ప్రజలకు శిక్ష విధిస్తాడు. వారు ఆయన సేవకులు, ఆయన వారికి దయ చూపిస్తాడు. వారి శక్తి పోయేటట్టు ఆయన చేస్తాడు. బానిసగాని స్వతంత్రుడు గాని వారంతా నిస్సహాయు లయ్యేటట్టు ఆయన చేస్తాడు.
DEU 32:37 అప్పుడు ఆయన ఇలా అంటాడు, ‘అబద్ధపు దేవుళ్లు ఎక్కడ? భద్రత కోసం వారు ఆశ్రయించిన బండ ఎక్కడ?
DEU 32:38 ఈ ప్రజల దేవుళ్లు ప్రజల బలి అర్పణల కొవ్వు తిన్నారు. వారి పానార్పణపు ద్రాక్షారసం వారు తాగారు. కనుక ఈ దేవుళ్లనే లేచి మీకు సహాయం చేయనివ్వండి. వారినే మిమ్మల్ని కాపాడ నివ్వండి!
DEU 32:39 “‘ఉప్పుడు చూడండి, నేనే, నేను మాత్రమే దేవుణ్ణి ఇంకే దేవుడూ లేడు. ప్రజలను బ్రతకనిచ్చేది, చంపేదీ నిర్ణయించే వాడ్ని నేనే. నేను ప్రజల్ని బాధించగలను, బాగు చేయగలను. నా శక్తినుండి ఒక మనిషిని ఏ మనిషి రక్షించ లేడు.
DEU 32:40 ఆకాశం వైపు నేను నాచేయి పైకెత్తి ఈ వాగ్దానం చేస్తున్నాను. నేను శాశ్వతంగా జీవించటం సత్యమయితే, ఈ సంగతులన్నీ జరుగుతాయి అనేది కూడ సత్యమే.
DEU 32:41 నేను ప్రమాణం చేస్తున్నాను, తళతళలాడే నా ఖడ్గానికి నేను పదునుపెడ్తాను. నా శత్రువుల్ని శిక్షించటానికి నేను దానిని నేను ఉపయోగిస్తాను. నేను వారికి తగిన శిక్ష యిస్తాను.
DEU 32:42 నా శత్రువులు చంపబడతారు, ఖైదీలుగా తీసుకొనిపోబడతారు. నా బాణాలు వారి రక్తంతో కప్పబడి ఉంటాయి. నా ఖడ్గం వారి సైనికుల శిరస్సులను ఛేదిస్తుంది.’
DEU 32:43 “దేవుని ప్రజలకోసం సర్వప్రపంచం సంతోషించాలి. ఎందుకంటే వారికి ఆయన సహాయం చేస్తాడు గనుక. తన సేవకులను చంపే వాళ్లను ఆయన శిక్షిస్తాడు గనుక. ఆయన తన శత్రువులకు తగిన శిక్షయిస్తాడు. ఆయన తన ప్రజల్ని, తన దేశాన్ని పవిత్రం చేస్తాడు.”
DEU 32:44 మోషే వచ్చి ఇశ్రాయేలు ప్రజలు వినగలిగేటట్లు ఈ పాటలోని మాటలన్నీ చెప్పాడు. నూను కుమారుడైన యెహోషువ మోషేతో ఉన్నాడు.
DEU 32:45 మోషే ప్రజలకు ఈ ప్రబోధాలు చేయటం ముగించినప్పుడు
DEU 32:46 వాళ్లతో ఆతడు ఇలా చెప్పాడు: “ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆదేశాలన్నింటిని మీరు గమనించి తీరాలి. మరియు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటికీ మీ పిల్లలు విధేయులు కాలావని మీరు వారికి చెప్పాలి.
DEU 32:47 ఈ ప్రబోధాలు ముఖ్యమైనవి కావు అనుకోవద్దు. అవి మీకు జీవం. యోర్దాను నదికి అవతల మీరు స్వాధీనం చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో ఈ ప్రబోధాల ద్వారా మీరు చాలా కాలం జీవిస్తారు.”
DEU 32:48 ఈ రోజే మోషేతో యెహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు,
DEU 32:49 “అబారీము పర్వతాలకు వేళ్లుము. ఎరికో పట్టణం అవతల మోయాబు దేశంలో నెబో కొండమీదికి ఎక్కివెళ్లు. అప్పుడు నీవు ఇశ్రాయేలు ప్రజలు నివసించటానికి నేను వారికి ఇస్తున్న కనాను దేశాన్ని చూడవచ్చు.
DEU 32:50 నీవు ఆ కొండమీద చనిపోతావు. హూరు కొండమీద నీ సోదరుడు ఆహరోను చనిపోయి, తన ప్రజలను చేరుకున్నట్టు నీవు కూడ చనిపోయిన నీ ప్రజలను చేరుకుంటావు.
DEU 32:51 ఎందుకంటే సీను అరణ్యంలో కాదేషు సమీపంలో మెరీబా నీళ్ల దగ్గర నీవు నాకు వ్యతిరేకంగా పాపం చేసావు. అది చూసేందుకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడే ఉన్నారు. నీవు నన్ను గౌరవించలేదు. ఆ సంగతి నీవు ప్రజలకు చూపెట్టావు.
DEU 32:52 కనుక ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని నీవు ఇప్పుడు నీముందర చూడ వచ్చు గాని నీవు దానిలో ప్రవేశించలేవు.”
DEU 33:1 దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన ఆశీర్వాదం ఇది.
DEU 33:2 మోషే చేప్పినది; “యెహోవా సీనాయినుండి వచ్చెను. యెహోవా శేయీరులో ప్రభాత వెలుగులా ఉన్నాడు. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించే వెలుగులా ఉన్నాడు. యెహోవా 10,000 మంది పరశుద్ధులతో వచ్చాడు. ఆయన కుడిచేతి వైపున దేవుని గొప్ప గొప్ప మహా సైనికులు ఉన్నారు.
DEU 33:3 అవును, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తాడు. ఆయన పరిశుద్ధ ప్రజలంతా ఆయన చేతిలో ఉన్నారు. వారు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు. ప్రతి ఒక్కరూ ఆయన ప్రబోధాలు అంగీకరిస్తారు.
DEU 33:4 మోషే మనకు ధర్మశాస్త్రం యిచ్చాడు. అది యాకోబు ప్రజలందరికీ చెందుతుంది.
DEU 33:5 ప్రజలు, వారి నాయకులు సమావేశమైనప్పుడు యెషూరూనుకు రాజు ఉన్నాడు. యెహోవాయే వారి రాజు.
DEU 33:6 “రూబేను మరణించక, జీవించునుగాక! ఆతని వంశంలో అనేకమంది ప్రజలు ఉందురు గాక!”
DEU 33:7 యూదా వంశం గూర్చి మోషే ఈ విషయాలు చెప్పాడు: “యెహోవా, యూదా నాయకుడు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆలకించు. అతణ్ణి తన ప్రజల దగ్గరకు చేర్చు. ఆతణ్ణి బలంవతుణ్ణి చేయి. అతడు తన శత్రువులను ఓడించటానికి సహాయం చేయి!”
DEU 33:8 లేవీని గూర్చి మోషే ఇలా చెప్పాడు. “నీ నిజమైన అనుచరుడు లేవీ ఊరీము, తుమ్మీమునకు కాపలా ఉండేవాడు. నీ పత్యేక మనిషి వాటిని కాపాడుతాడు. మస్సా దగ్గర నీవు లేవీ ప్రజలను పరీక్షించావు వాళ్లు నీ వాళ్లని (నిన్ను ప్రేమించుటకు) మెరీబా నీళ్ల దగ్గర నీవు రుజువు చేసావు.
DEU 33:9 లేవీ తన తండ్రి, తల్లిని గూర్చి చెప్పాడు. ‘వారి విషయం నేను లెక్క చేయను’ అతడు తన సొంత సోదరులను స్వీకరించ లేదు. తన సొంత పిల్లల్ని తెలుసుకో లేదు. లేవీయులు నీ మాటకు విధేయులయ్యారు నీ ఒడంబడికను నిలబెట్టారు.
DEU 33:10 యాకోబుకు నీ నియమాలను ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తారు. వాళ్లు నీ యెదుట ధూపం వేస్తారు. నీ బలిపీఠం మీద పరిపూర్ణ దహన బలులు అర్చిస్తారు.
DEU 33:11 “యోహావా లేవీకి చెందిన వాటిని ఆశీర్వదించు అతడు జరిగించే వాటిని స్వీకరించు. అతని మీద దాడి చేసే వాళ్లను నాశనం చేయి.”
DEU 33:12 బెన్యామీను గూర్చి మోషే ఇలా చెప్పాడు. “యెహోవా బెన్యామీనును ప్రేమిస్తున్నాడు. బెన్యామీను ఆయన చెంత క్షేమంగా జీవిస్తాడు. అతనిని యెహోవా ఎల్లప్పుడూ కాపాడతాడు. మరియు యెహోవా అతని దేశంలో నివసిస్తాడు.”
DEU 33:13 యోసేపును గూర్చి మోషే ఇలా చెప్పాడు: “యెహోవా అతని దేశాన్ని ఆశీర్వదించును గాక. ఆకాశం నుండి శ్రేష్ఠమైన వాటితో భూమి క్రింద దాగి ఉన్న లోతైన ధన సంపదతో
DEU 33:14 సూర్యుని శ్రేష్ఠఫలాలతో మాసాల శ్రేష్ఠపంటలతో
DEU 33:15 ప్రాచీన పర్వతాల నుండి శ్రేష్ఠఫలాలంతో కొండల్లో శాశ్వతంగా ఉంచబడే శ్రేష్ఠ పదార్థాలతో
DEU 33:16 భూమి నుండి శ్రేష్ఠమైన బహుమానాలు, దాని పూర్ణ ఆశీర్వాదాలతో, మండుతూ ఉండే పొదలో నివాసం చేసే యెహోవా కటాక్షంతో, తన సోదరులనుంచి వేరుగా వించబడ్డ యోసేపు తలమీద యోసేపు నడి నెత్తి మీద ఆశీర్వాదం వచ్చునుగాక.
DEU 33:17 యోసేపు దొడ్డిలో మొట్టమొదట పుట్టిన ఎద్దుకు ఎంతో శోభ, ఈ ఎద్దు కొమ్ములు అడవి దున్నపోతు కొమ్ములంత పెద్దవిగా ఉంటాయి. యోసేపు మందలు మనుష్యుల్ని తోసివేస్తాయి. అందర్నీ, భూదిగాంతాల వరకు తోసివేస్తాయి. అవును, మనుష్షేకు వేలాది మంది ప్రజలు ఉన్నారు, అవును, ఎఫ్రాయిముకు పది వేలమంది ప్రజలు ఉన్నారు.”
DEU 33:18 జెబూలూను గూర్చి మోషే చెప్పినది: “జెబూలూనూ, నీవు బయటకు వెళ్లినప్పుడు, ఇశ్శాఖారూ, నీ యింటివద్ద నీ గుడారాలలో సంతోషంగా ఉండు.
DEU 33:19 వారు తమ ప్రజలను కొండకు (కర్మెలు) పిలుస్తారు. అక్కడ వారు సరెన బలులు అర్పిస్తారు. ఎందుకంటే, సముద్రాల్లోని సమృద్ధిని వారు తీసుకొంటారు. ఇసుకలో దిగి ఉన్న ఐశ్వర్యాలను మీరు తీసుకుంటారు గనుక.”
DEU 33:20 గాదును గూర్చి మోషే ఇలా చెప్పాడు: “గాదును విశాలపర్చే దేవునికి స్తోత్రాలు! గాదు సింహంలా పడుకుంటాడు, చేతిని, నడినెత్తిని చీల్చేస్తాడు.
DEU 33:21 శేష్ఠభాగం అతడు తనకోసం ఎంచుకుంటాడు అక్కడ రాజభాగం అతనికి ఉంచబడుతుంది. ప్రజానాయకులు అతని దగ్గరకు వస్తారు ఇశ్రాయేలీయుల యెడల అతడు దయ చూపుతాడు. యెహోవా దృష్టికి మంచివాటిని అతడు చేస్తాడు యెహోవా అతని పక్షంగా తీర్పుతీరుస్తాడు.”
DEU 33:22 దాను గూర్చి మోషే ఇలా చెప్పాడు: “దాను బాషాను నుండి దూకే సింహపు పిల్ల.”
DEU 33:23 నఫ్తాలీ గూర్చి మోషే ఇలా చెప్పాడు. “నఫ్తాలీ, నీవు దయపొంది తృప్తిగా ఉన్నావు, యెహోవా ఆశీర్వాదాలతో నిండిపోయావు, (గలలీ) పశ్చిమ, దక్షిణాల భూమిని నీవు తీసుకో.”
DEU 33:24 ఆషేరును గూర్చి మోషే ఇలా చెప్పాడు: “కుమారులలో ఆషేరు అత్యధికంగా ఆశీర్వదించబడినవాడు; అతణ్ణి తన సోదరులకు ప్రియ మైన వాడ్నిగా ఉండనియ్యుండి. అతణ్ణి తన పాదాలు తైలముతో కడుగ కోనివ్వండి.
DEU 33:25 నీ తాళాలు యినుపవి, యిత్తడిని, నీ బలం జీవితం అంత ఉంటుంది.”
DEU 33:26 “ఓ యెషూరూనూ, దేవునివంటి వాడు ఎవ్వరూ లేరు. దేవుడు తన మహిమతో నీకు సహాయం చేసేందుకు. మేఘాల మీద ఆకాశంలో విహరిస్తాడు.
DEU 33:27 నిత్యుడైన దేవుడు నీకు భద్రతా స్థలం శాశ్వతంగా ఆదుకునే హస్తాలు నీక్రింద ఉన్నాయి. దేవుడు శత్రువును నీదగ్గర నుండి వెళ్లగొట్టేస్తాడు. ‘శత్రువును నాశనం చేయి’ అంటాడు.
DEU 33:28 కనుక ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తాడు, ధాన్యం, ద్రాక్షారసం ఉండే దేశంలో యూకోబు ఊటక్షేమంగా ఉంటుంది. అవును, అతని ఆకాశం మంచును కురిపిస్తుంది.
DEU 33:29 ఇశ్రాయేలూ, నీవు సంతోషంగా ఉన్నావు. యెహోవా చేత రక్షించబడిన దేశంగా నీవలె ఏ దేశమూ లేదు. యెహోవాయే నీకు సహాయం చేసేవాడు. నీ విజయానికి యెహోవాయే ఖడ్గం. నీ శత్రువులు నీకు విధేయులై వస్తారు. వారి అబద్ధపు దేవతం పూజా స్థలాల మీద మీరు నడుస్తారు.”
DEU 34:1 మోషే మోయాబు పల్లపు ప్రాంతాల నుండి యెరికో దాటి నెబో కొండ మీద పిస్గా శిఖరం మీదికి వెళ్లాడు. గిలాదునుండి దానువరకు దేశం మొత్తం యెహోవా మోషేకు చూపించాడు.
DEU 34:2 ఎఫ్రాయిము, మనష్షేల దేశం అంతా, నఫ్తాలీ అంతా యెహోవా అతనికి చూపించాడు. యూదా దేశం మధ్యదరా సముద్రం వరకు ఆయన అతనికి చూపించాడు.
DEU 34:3 నెగెవు ప్రాంతాన్ని, సోయెరు నుండి ఈతచెట్ల పట్టణం యెరికోకు పోయే లోయ అంతా మోషేకు యెహోవా చూపించాడు.
DEU 34:4 “అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానంచేసిన దేశం యిదే. ‘మీ సంతతివారికి ఈ దేశం నేను యిస్తాను’ అని వారితో నేను చెప్పాను. నిన్ను ఆ దేశం చూడ నిచ్చాను, నీవు అక్కడికి వెళ్లలేవు” అని మోషేతో యెహోవా చెప్పాడు.
DEU 34:5 అప్పుడు యెహోవా సేవకుడు మోషే అక్కడ మోయాబు దేశములో చనిపోయాడు. ఇలా జరుగుతుందని యోహావా మోషేతో ముందే చెప్పాడు.
DEU 34:6 బెత్పెయోరు అవతల మోయాబు దేశంలోని లోయలో యెహోవా మోషేను పాతి పెట్టాడు. అయితే మోషే సమాధి ఎక్కడ ఉందో ఈ రోజువరకు ఎవరికీ తెలియదు.
DEU 34:7 మోషే చనిపోయినప్పుడు అతని వయస్సు 120 సంవత్సరాలు. అతని కళ్లు మసక కాలేదు. అతడు ఇంకా బలంగానే ఉన్నాడు.
DEU 34:8 ఇశ్రాయేలు ప్రజలు మోయాబు పల్లపు ప్రాంతాల్లో 30 రోజుల పాటు మోషే కోసం ఏడ్చారు. ఇది పూర్తి సంతాప దినాల సమయము.
DEU 34:9 అప్పుడు నూను కుమారుడైన యెహోషువ మీద మోషే చేతులు పెట్టిన కారణంగా యెహోషువ జ్ఞానాత్మతో పూర్తిగా నిండిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ మాట విన్నారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టు వారు చేసారు.
DEU 34:10 కాని ఆ సమయమునుండి మళ్లీ మోషేవంటి ప్రవక్త జన్మించలేదు. యెహోవా దేవునికి మోషే ముఖాముఖిగా తెలుసు.
DEU 34:11 ఈజిప్టు దేశంలో యెహోవా చేత పంపబడి మోషే చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు, ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు. ఆ అద్భుతాలు, మహాత్కార్యాలు ఈజిప్టులో ఫరోకు, అతని సేవకులందరికీ, ప్రజలందరికి చూపించబడ్డాయి.
DEU 34:12 మోషే చేయగా ఇశ్రాయేలు ప్రజలంతా చూసిన ఆ శక్తివంతమైన ఆశ్చర్యకార్యాలు ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు.
JOS 1:1 యెహోవా సేవకుడు మోషే. నూను కుమారుడైన యెహోషువ, మోషేకు సహాయకుడు. మోషే చనిపోయాక యెహోషువతో యెహోవా మాట్లాడాడు. యెహోషువతో యెహోవా అన్నాడు:
JOS 1:2 “నా సేవకుడు మోషే మరణించాడు. ఇప్పుడు నీవు, ఈ ప్రజలు వెళ్లి యోర్దాను నది దాటండి. ఇశ్రాయేలు ప్రజలైన మీకు నేను ఇస్తున్న దేశంలోకి మీరు వెళ్లాలి.
JOS 1:3 ఈ దేశాన్ని నేను మీకు ఇస్తానని మోషేకు వాగ్దానం చేసాను. కనుక మీరు వెళ్లే ప్రతి చోటునూ నేను మీకు ఇస్తాను.
JOS 1:4 హిత్తీ ప్రజల దేశం అంతా, అంటే ఎడారి, లెబానోను మొదలుకొని మహానది వరకునున్న (యూఫ్రటీసు) దేశమంతా మీదే. మరియు ఇక్కడ నుండి పశ్చిమాన మధ్యధరా సముద్రం వరకు (అది సూర్యాస్తమయ దిశ) మీ సరిహద్దు.
JOS 1:5 నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా వుంటాను. నీ జీవితాంతం నిన్నెవ్వరూ అడ్డగించలేరు. నేను నిన్ను విడిచి పెట్టను. ఎన్నటికీ నిన్ను నేను ఎడబాయను.
JOS 1:6 “యెహోషువా, నీవు బలంగా, ధైర్యంగా ఉండాలి! ఈ ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగేటట్టు నీవు ఈ ప్రజలను నడిపించాల్సి ఉంటుంది. వారి పితరులకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశం ఇది.
JOS 1:7 అయితే నీవు మరో విషయంలో కూడ బలంగా, ధైర్యంగా ఉండాలి. నా సేవకుడు మోషే నీకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించే విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. అతని ప్రబోధాలను నీవు సరిగ్గా పాటిస్తే, నీవు చేసే ప్రతి పనిలోనూ నీకు విజయం కలుగుతుంది.
JOS 1:8 ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఆ గ్రంథాన్ని రాత్రి, పగలు ధ్యానించు. అప్పుడు అందులో వ్రాయబడిన విషయాలను పాటించగలుగుతావు. నీవు ఇలా చేస్తే, నీవు చేసే ప్రతీదీ తెలివిగా, విజయవంతంగా చేయగలుగుతావు.
JOS 1:9 నీవు బలంగా ధైర్యంగా ఉండాలని నేను ఆజ్ఞాపించినట్టు జ్ఞాపకం ఉంచుకో. అందుచేత భయపడవద్దు. ఎందుచేతనంటే? నీవు వెళ్లే ప్రతిచోటా నీ యెహోవా దేవుడు నీకు తోడుగా ఉంటాడు గనుక.”
JOS 1:10 కనుక యెహోషువ ప్రజానాయకులకు ఆదేశాలు ఇచ్చాడు. అతడు చెప్పాడు:
JOS 1:11 “గుడారాల్లోనికి వెళ్లి ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పండి. ప్రజలతో ఇలా చెప్పండి, ‘భోజనం తయారు చేసుకోండి. మూడు రోజుల్లో మనం యోర్దాను నది దాటాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మనం వెళ్లి తీసుకొందాము.’”
JOS 1:12 తర్వాత రూబేను, గాదు, మనష్షే వంశంలో సగభాగం వారితో యెహోషువ మాట్లాడాడు. యెహోషువ చెప్పాడు:
JOS 1:13 “యెహోవా సేవకుడు మోషే మీతో ఏమి చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి. మీకు విశ్రాంతి కోసం మీ దేవుడైన యెహోవా మీకు ఒక స్థలం ఇస్తాడు అని అతడు చెప్పాడు. ఆ దేశాన్ని యెహోవా మీకు యిస్తాడు.
JOS 1:14 ఇప్పుడు యోర్దాను నదికి తూర్పున ఉన్న ఈ దేశాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు ఈ దేశంలో నివసించవచ్చు. అయితే యుద్ధం చేసే మీ పురుషులంతా మీ సోదరులతో కలిసి యోర్దాను నది దాటాలి. మీరు యుద్ధానికి సిద్ధపడి మీ సోదరులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు సహాయపడాలి.
JOS 1:15 విశ్రాంతి కోసం యెహోవా మీకు ఒక స్థలం ఇచ్చాడు. మీ సోదరుల కోసం కూడా యెహోవా అలాగే చేస్తాడు. అయితే యెహోవా దేవుడు వారికి ఇస్తున్న దేశాన్ని మీ సోదరులు స్వాధీనం చేసుకొనేంతవరకు మీ సోదరులకు మీరు సహాయం చేయాలి. అప్పుడు యోర్దానుకు తూర్పున ఉన్న మీ దేశానికి మీరు వెళ్లిపోవచ్చు. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం అది.”
JOS 1:16 అప్పుడు ప్రజలు యెహోషువాకు బదులు చెప్పారు: “మమ్మల్ని ఏమి చేయమని నీవు ఆజ్ఞాపిస్తే, మేము అలా చేస్తాము. నీవు మమ్నల్ని ఎక్కడికి పంపిస్తే మేము అక్కడికి వెళ్తాము.
JOS 1:17 మేము మోషేకు పూర్తిగా విధేయులం అయ్యాము. అలాగే, నీవు చెప్పే ప్రతిదానికీ మేము విధేయులవుతాము. ఒక్క విషయం మాత్రమే మేము యెహోవాను అడుగుతాము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టే నీకునూ తోడుగా ఉండాలని అడుగుతాము.
JOS 1:18 తర్వాత, ఎవరైనా నీ ఆజ్ఞలను తిరస్కరించినా, లేక ఎవరైనా నీమీద తిరుగుబాటు చేసినా అలాంటివాడు చావాల్సిందే. బలంగా, ధైర్యంగా ఉండు!”
JOS 2:1 నూను కుమారుడైన యెహోషువ, ప్రజలు అంతా ఆకాషియా దగ్గర గుడారాలు వేసుకొనిరి. యెహోషువ ఇద్దరు గూఢచారుల్ని పంపించాడు. వీళ్లను యెహోషువ పంపినట్టు మరెవ్వరికీ తెలియదు. “మీరు వెళ్లి ఆ దేశాన్ని చూడండి. ముఖ్యంగా యెరికో పట్టణాన్ని దగ్గరగా చూడండి” అని యెహోషువ ఆ మనుష్యులతో చెప్పాడు. కనుక ఆ మనుష్యులు యెరికో పట్టణం వెళ్లారు. వాళ్లు ఒక వేశ్య ఇంటికి వెళ్లి, అక్కడ వుండిరి. ఆ స్త్రీ పేరి రాహాబు.
JOS 2:2 “మన ప్రజల బలహీనత తెలుసుకొనేందుకు కొందరు ఇశ్రాయేలు మనుష్యులు వచ్చారు” అని యెరికో రాజుతో ఎవరో చెప్పారు.
JOS 2:3 కనుక యెరికో రాజు రాహాబుకు ఇలా కబురంపాడు: “నీ ఇంటికి వచ్చిదాక్కొన్న ఆ మనుష్యుల్ని దాచిపెట్టకు. వాళ్లను బయటకు తీసుకొనిరా. వాళ్లు మన దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు.”
JOS 2:4 ఆ స్త్రీ వాళ్లిద్దర్నీ దాచిపెట్టేసింది. అయితే ఆమె అంది: “ఆ ఇద్దరూ ఇక్కడికి వచ్చిన మాట నిజమే. అయితే వాళ్లు ఎక్కడ్నుండి వచ్చిందీ నాకు తెలియదు.
JOS 2:5 సాయంకాలం, పట్టణ ద్వారాలు మూసివేసే వేళ వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లు ఎక్కడికి వెళ్లిందీ నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు త్వరగా వెళ్తే మీరు వాళ్లను పట్టుకోవచ్చేమో.”
JOS 2:6 అయితే నిజానికి వాళ్లను అటక మీద జనుపకట్టెలో దాచిపెట్టింది.
JOS 2:7 కనుక రాజుగారి మనుష్యులు ఇశ్రాయేలు వాళ్లిద్దరి కోసం వెదుక్కుంటూ వెళ్లిపోయారు. యోర్దాను నది రేవుల దగ్గరకు వారు వెళ్లారు. రాజుగారి మనుష్యులు పట్టణం నుండి బయటకు వెళ్లిన ఆ సమయంలోనే పట్టణ ద్వారాలు మూసివేయబడ్డాయి.
JOS 2:8 ఆ ఇద్దరు మనుష్యులూ అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతున్నారు. అయితే ఆమె అటక పైకి వెళ్లి వాళ్లతో మాట్లాడింది.
JOS 2:9 రాహాబు అంది, “ఈ దేశాన్ని యెహోవా మీ ప్రజలకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు భయం. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరంటే భయమే.
JOS 2:10 యెహోవా మీకు సహాయం చేసిన విధానాల్ని గూర్చి విన్నాము గనుక మాకు భయం. మీరు ఈజిప్టునుండి వచ్చినప్పుడ ఎర్ర సముద్రం ఆరిపోయేటట్టు ఆయన చేసాడని మేము విన్నాము. అమోరీ రాజులైన సీహోను, ఓగులకు మీరు చేసినదాన్ని గూర్చి కూడ మేము విన్నాము. యెర్దాను నదికి తూర్పున ఉన్న ఆ రాజులను మీరు నాశనం చేసిన సంగతి మేము విన్నాము.
JOS 2:11 ఆ సంగతులు మేము విని చాల భయపడిపోయాము ఇప్పుడు మా వాళ్లెవరికీ మీతో పోరాడే ధైర్యంలేదు. ఎందు చేతనంటే పైన ఆకాశాన్ని క్రింద భూమిని మీ యెహోవా దేవుడే పాలిస్తున్నాడు గనుక.
JOS 2:12 ఇప్పుడు మీరు నాతో ఒడంబడిక చేస్తామని మాట ఇవ్వండి. నేను మీకు సహాయం చేసాను, దయ చూపించాను. కనుక మీరు నా కుటుంబానికి దయ చూపిస్తామని యెహోవా ఎదుట ప్రమాణం చేయండి. ఇలా మీరు చేస్తామని దయచేసి నాకు చెప్పండి.
JOS 2:13 నా తండ్రి, తల్లి, సోదరులు, సోదరీలు, వాళ్లందరి కుటుంబాల్ని, నా కుటుంబాన్ని మీరు బ్రతుకనిస్తామని నాకు మాట ఇవ్వండి. చావునుండి మీరు మమ్మల్ని రక్షిస్తామని ప్రమాణం చేయండి.”
JOS 2:14 ఆ మనుష్యలు ఒప్పుకున్నారు. “మీ ప్రాణాల కోసం మా ప్రాణాలు ఇస్తాము. మేము చేస్తోన్న పని గూర్చి ఎవ్వరితో చెప్పకు. తర్వాత మీ దేశాన్ని యెహోవా మాకు ఇచ్చినప్పుడు మేము నీకు దయ చూపిస్తాము. నీవు మా మాట నమ్ము” అని వాళ్లు చెప్పారు.
JOS 2:15 ఆ స్త్రీ ఇల్లు పట్టణం ప్రహారీ గోడమీద కట్టబడింది. అది గోడలో ఒక భాగంగా ఉంది. కనుక ఆమె ఒక తాడు ప్రయోగించి కిటికీలోనుంచి వాళ్లిద్దర్నీ క్రిందికిదించింది.
JOS 2:16 అప్పుడు ఆమె వాళ్లతో అంది: “పొరబాటున కూడా మీరు రాజుగారి మనుష్యులకు కనపడకుండా పడమటి కొండల్లోకి వెళ్లిపోండి. మూడు రోజులు అక్కడ దాక్కోండి. రాజుగారి మనుష్యులు తిరిగి వచ్చాక, మీ దారిన మీరు వెళ్లవచ్చు.”
JOS 2:17 ఆ మనుష్యులు ఇద్దరూ ఆమెతో అన్నారు: “మేము నీకు వాగ్దానం చేసాము. అయితే నీవు ఒక పని చేయాలి. లేకపోతే మా వాగ్దానానికి మేము బాధ్యులంకాదు.
JOS 2:18 మేము తప్పించుకోనేందుకు నీవు ఈ ఎర్రటి తాడు ప్రయోగిస్తున్నావు. మేము ఈ దేశానికి తిరిగి వస్తాము. ఆ సమయంలో ఈ ఎర్రటి తాడును నీవు నీ కిటికీలో కట్టాలి. నీ తండ్రిని, తల్లిని, నీ సోదరులను, నీ కుటుంబం అంతటిని నీవు నీ ఇంట్లో చేర్చాలి.
JOS 2:19 ఈ ఇంట్లో ఉండే ప్రతీ ఒక్కరినీ మేము క్షేమంగా కాపాడుతాము. నీ ఇంట్లో ఉన్న వాళ్లెవరైనా దెబ్బతింటే దానికి మేము బాధ్యులము. నీ ఇంట్లోనుంచి ఎవరైనా బయటకు వెళ్లి, చంపబడితే దానికి మేము బాధ్యులము కాము. అది ఆ వ్యక్తి తప్పు అవుతుంది.
JOS 2:20 ఈ ఒడంబడిక మేము నీతో చేస్తున్నాము. మేము చేస్తోన్న పనిగూర్చి నీవు గనుక ఎవరితోనైనా చెప్పావు అంటే మేము ఈ ఒడంబడికకు కట్టుబడి ఉండనక్కర్లేదు.”
JOS 2:21 “ఇది నాకు సమ్మతమే” అని ఆ స్త్రీ జవాబిచ్చింది. ఆమె వాళ్లకు వీడ్కోలు చెప్పింది, వాళ్లు ఆమె ఇల్లు విడిచి బయల్దేరారు. అప్పుడు ఆమె ఆ ఎర్రటి తాడును కిటికీకి కట్టింది.
JOS 2:22 ఆ మనుష్యులు ఆమె ఇల్లు విడిచి, కొండల్లోకి వెళ్లిపోయారు. మూడు రోజులు వాళ్లు అక్కడే ఉన్నారు. రాజు మనుష్యులు మార్గం అంతా వెదికారు. మూడు రోజుల తర్వాత రాజు మనుష్యులు వెదకటం మానివేసి పట్టణానికి తిరిగి వెళ్లిపోయారు.
JOS 2:23 అప్పుడు ఆ మనుష్యులు ఇద్దరూ యెహోషువ దగ్గరకు ప్రయాణం మొదలుబెట్టారు. వాళ్లు కొండలు విడిచి, నది దాటారు. నూను కుమారుడైన యెహోషువ దగ్గరకు వారు వెళ్లారు. వారు తెలుసుకొన్న సమాచారం అంతా వాళ్లు యెహోషువకు చెప్పారు.
JOS 2:24 వారు యెహోషువతో, “నిజంగా ఆ దేశం అంతా యెహోవా మనకు ఇచ్చాడు. ఆ దేశ ప్రజలందరికీ మనమంటే భయంగా ఉంది” అని చెప్పారు.
JOS 3:1 మరునాడు ఉదయం పెందలాడే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ లేచి షిత్తీము విడిచి పెట్టారు. యోర్దాను నదికి వారు ప్రయాణం చేసారు. నది దాటి అవతలికి వెళ్లకముందు వారు యెర్దాను నది దగ్గర గుడారాలు వేసారు.
JOS 3:2 మూడు రోజుల తర్వాత నాయకులు పాళెమునంతా తిరిగి చూసారు.
JOS 3:3 నాయకులు ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు, “మీ యెహోవా దేవుని ఒడంబడిక పెట్టెను యాజకులు, లేవీయులు మోయటం మీరు చూస్తారు. ఆ సమయంలో మీరు ఉన్న చోటు విడిచి, వాళ్లను వెంబడించాలి.
JOS 3:4 కానీ మరీ సమీపంగా వెంబడి పోకూడదు. ఒక 1,000 గజాలు వారికి వెనుకగా ఉండండి. ఈ మార్గంలో మీరు ఇదివరకు ఎన్నడూ ప్రయాణం చేయలేదు. అందుచేత వారిని వెంబడిస్తే, ఎక్కడికి వెళ్లాల్సిందీ మీకు తెలుస్తుంది” అని వారు చెప్పారు.
JOS 3:5 అప్పుడు యెహోషువ, “మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపు యెహోవా అద్భుత కార్యాలు చేయటానికి మిమ్మల్ని వాడుకొంటాడు” అని ప్రజలతో చెప్పాడు.
JOS 3:6 తర్వాత యెహోషువ, “ఒడంబడిక పెట్టెను తీసుకొని ప్రజలకు ముందుగా నదిని దాటండి” అని యాజకులతో చెప్పాడు. కనుక యాజకులు ఆ పెట్టెను ఎత్తుకొని, ప్రజలకు ముందు మోసు కొనిపోయారు.
JOS 3:7 అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: “ఈ వేళ ఇశ్రాయేలీయులందరి దృష్టిలో నిన్ను ఒక గొప్పవానిగా చేస్తాను. నేను మోషేకు తోడుగా ఉన్నట్టే, నీకూ తోడుగా ఉన్నానని అప్పుడు వాళ్లు తెలుసుకొంటారు.
JOS 3:8 యాజకులు ఒడంబడిక పెట్టె మోస్తారు. యాజకులతో ఇలా చెప్పు, ‘యోర్దాను నదీ తీరానికి నడవండి, సరిగ్గా మీరు నీళ్లలో కాలుపెట్టే ముందు ఆగండి’”
JOS 3:9 అంతట ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు: “రండి, మీ యెహోవా దేవుని మాటలు వినండి.
JOS 3:10 జీవంగల దేవుడు మీతో నిజంగా ఉన్నాడు అనేందుకు ఇదే ఋజువు. నిజంగా ఆయన మీ శత్రువుల్ని ఓడించేస్తాడు అనేందుకు ఇదే ఋజువు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, హివ్వీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, గెర్గేషీ ప్రజలు, అమోరీ ప్రజలు, యెబూసీ ప్రజలు అందరినీ ఆయన ఈ దేశంనుండి వెళ్ల గొట్టేస్తాడు.
JOS 3:11 ఇదే ఋజువు. మీరు యోర్దాను దాటేటప్పుడు, సర్వలోకాధిపతి ఒడంబడిక పెట్టె మీకు ముందుగా వెళ్తుంది.
JOS 3:12 ఇప్పుడు మీలో 12 మందిని ఏర్పాటు చేయండి. ఇశ్రాయేలీయుల 12 వంశాల్లో ఒక్కోదాని నుండి ఒక్కో వ్యక్తిని ఏర్పాటు చేసుకొనండి.
JOS 3:13 సర్వలోకాధికారి అయిన యెహోవా ఒడంబడిక పెట్టెను యాజకులు మోస్తారు. వారు ఆ పెట్టెను మీకు ముందు యెర్దాను నదిలోనికి మోసుకొని వెళ్తారు. వారు నీళ్లలో ప్రవేశించగానే యోర్దాను నదీ ప్రవాహం నిలిచిపోతుంది. నీరు నిలిచిపోయి, ఆ స్థలానికి వెనుక ఆనకట్టు వేసినట్టు నిలిచిపోతాయి.”
JOS 3:14 యాజకులు ఒడంబడిక పెట్టె మోయగా, ప్రజలుతాము గుడారాలు వేసిన చోటునుండి బయల్దేరారు. ప్రజలు యెర్దాను నది దాటడం ప్రారంభించారు.
JOS 3:15 (కోతకాలంలో యోర్దాను నది దాని గట్లు మీద పొర్లి పారుతుంది. అందుచేత నది పొంగుతూ ఉంది.) పెట్టెను మోస్తున్న యాజకులు నది ఒడ్డుకు వచ్చారు. నీళ్లలో వారు నిలిచిపోయారు.
JOS 3:16 సరిగ్గా అప్పుడే నీరు ప్రవహించటం ఆగిపోయింది. (ఆ స్థలం వెనుక నీళ్లు ఆనకట్ట కట్టినట్టు నిలిచిపోయాయి.) నది పొడవునా ఆదాం వరకు (సారెతాను దగ్గర ఒక ఊరు.) నీరు ఎత్తుగా నిలబడ్డాయి. ప్రజలు యెరికో దగ్గర నది దాటారు.
JOS 3:17 ఆ చోట నేల ఆరిపోయింది. యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను ఆ నది మధ్యవరకు మోసుకొని వెళ్లి, అక్కడ నిలిచిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు అందరూ యెర్దాను నదిలో ఆరిన నేలమీద నడచి, ఆవలికి దాటేవరకు యాజకులు అక్కడ వేచి ఉన్నారు.
JOS 4:1 ప్రజలంతా యోర్దాను నది దాటడం ఆయిపోయిన తర్వాత యెహోషువతో యెహోవా చెప్పాడు:
JOS 4:2 “ప్రజల్లోనుండి 12 మందిని ఏర్పాటుచేయి. ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేయి.
JOS 4:3 నదిలో యాజకులు నిలిచిన చోటు చూడమని వారితో చెప్పు. అక్కడ పన్నెండు రాళ్లను వెదికి వాటిని మీతోబాటు తీసుకొని వెళ్లాలి. ఈ రాత్రి మీరు నివాసంచేసే స్థలంలో ఆ రాళ్లను ఉంచండి.”
JOS 4:4 కనుక యెహోషువ ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసాడు. తర్వాత ఆ పన్నెండుమందినీ అతడు సమావేశపర్చాడు.
JOS 4:5 యెహోషువ వాళ్లతో చెప్పాడు: “మీ యెహోవా దేవుని పవిత్ర పెట్టె నీళ్లలో ఉన్న చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కొక్కరాయి అక్కడ ఉంటాయి. ఆ రాతిని మీ భుజంమీద మోయండి.
JOS 4:6 ఈ రాళ్లు మీ మధ్య గుర్తుగా ఉంటాయి. భవిష్యత్తలో మీ పిల్లలు ‘ఈ రాళ్ల భావం ఏమిటి?’ అని మిమ్మల్ని అడుగుతారు.
JOS 4:7 యోర్దాను నదిలో నీరు ప్రవహించకుండా యెహోవా చేసాడు అని మీ పిల్లలతో చెప్పండి. యెహోవా ఒడంబడిక పెట్టె నీళ్లలో దిగగానే నీరు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఆ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు తోడ్పడుతాయి.”
JOS 4:8 కనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువకు విధేయులయ్యారు. యోర్దాను నది మధ్యలోనుండి పన్నెండు రాళ్లు వాళ్లు మోసుకొని వెళ్లారు. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కోరాయిఉంది. యెహోషువకు యోహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఇలా చేసారు. ఆ మనుష్యులు ఆ రాళ్లు మోసుకొనిపోయి వారు నివాసము చేసిన చోట వాటిని ఉంచారు.
JOS 4:9 (యెహోవా యొక్క పవిత్ర పెట్టెను మోస్తున్నప్పుడు యోర్దాను నది మధ్యలో యాజకులు నిలిచిన చోటకూడ యెహోషువ పన్నెండు రాళ్లు ఉంచాడు. నేటికీ ఆ రాళ్లు అక్కడ ఉన్నాయి.)
JOS 4:10 ప్రజలు చేయాల్సింది ఏమిటో చెప్పమని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ చేయాలని మోషే చెప్పిన సంగతులే అవి. కనుక ఆ విషయాలన్నీ జరిగించేంతవరకు పవిత్ర పెట్టెను మోస్తున్న యాజకులు నది మధ్యలోనే నిలబడి ఉన్నారు. ప్రజలు త్వరపడి నది దాటారు.
JOS 4:11 ప్రజలు నదిని దాటిపోవడం అయిపోగానే యాజకులు యెహోవా పెట్టెను ప్రజల ఎదుటికి మోసుకొని వెళ్లారు.
JOS 4:12 రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలోని సగంమంది మగవాళ్లు మోషే వారికి చెప్పిన వాటికి విధేయులయ్యారు. మిగతా మనుష్యుల ముందు వీరు నదిని దాటారు. వీళ్లు యుద్ధానికి సిద్ధపడ్డారు. దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు, మిగిలిన ప్రజలకు సహాయం చేయటానికి వీరు వెళ్తున్నారు.
JOS 4:13 యుద్ధానికి సిద్ధపడిన వారు సుమారు నలభై వేలమంది సైనికులు యెహోవా ఎదుట సాగిపోయారు. యెరికో మైదానాల దిశగా వారు సాగిపోయారు.
JOS 4:14 ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరికీ యెహోషువను ఒక మహామనిషిగా యెహోవా చేసాడు. అప్పట్నుంచి ప్రజలు యెహోషువను గౌరవించారు. మోషేను వారు గౌరవించినట్టే యెహోషువను కూడ వారు జీవితకాలమంతా గౌరవించారు.
JOS 4:15 ఆ పెట్టెను మోస్తున్న యాజకులు ఇంకా నదిలో నిలబడి ఉండగానే,
JOS 4:16 “యాజకులను నదిలోనుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించు” అంటూ యెహోవా, యెహోషువతో చెప్పాడు.
JOS 4:17 కనుక యెహోషువ యాజకులకు, “యెర్దాను నదిలోనుండి బయటకు రండి” అని ఆజ్ఞాపించాడు.
JOS 4:18 యాజకులు యెహోషువకు విధేయులయ్యారు. వారు ఆ పెట్టెను మోసుకొని, నదిలో నుండి బయటకు వచ్చారు. యాజకుల పాదాలు, నది ఆవలి ఒడ్డున నేలను తాకగానే, నదిలో నీరు మరల ప్రవహించటం మొదలయింది. ప్రజలు నదిని దాటి వెళ్లక ముందులాగే నీరు గట్ల మీద పొర్లి పారుతున్నాయి.
JOS 4:19 మొదటి నెల పదో రోజున ప్రజలు యోర్దాను నది దాటారు. యెరికోకు తూర్పున గిల్గాలులో ప్రజలు గుడారాలు వేసారు
JOS 4:20 యోర్దాను నదిలోనుంచి తీసుకొన్న పన్నెండు రాళ్లను ప్రజలు వారితో మోసుకొని వెళ్లారు. ఆ రాళ్లను గిల్గాలులో యెహోషువ నిలువ బెట్టాడు.
JOS 4:21 అప్పుడు యెహోషువ ప్రజలతో చెప్పడు: “‘ఈ రాళ్లు ఏమిటి?’ అని భవిష్యత్తులో మీ పిల్లలు తల్లిదండ్రుల్ని అడుగుతారు
JOS 4:22 ‘ఏ విధంగాెనైతే ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని ఆరిన నేలమీద దాటి వెళ్లారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్లు తోడ్పడుతాయి’ అని పిల్లలతో మీరు చెప్పాలి.
JOS 4:23 మీ యెహోవా దేవుడు ఆ నదిలో నీటి ప్రవాహాన్ని నిలిపివేసాడు. ప్రజలు దానిని దాటిపోయేంతవరకు నది ఎండిపోయింది. ఎర్ర సముద్రం దగ్గర ప్రజలకు యెహోవా ఏమి చేసాడో, యోర్దాను నది దగ్గరకూడ ఆయన అలానే చేసాడు. ప్రజలు దాటి వెళ్లగలిగేందుకు ఎర్ర సముద్రంలో నీళ్లను యెహోవా నిలిపివేశాడని జ్ఞాపకం ఉంచుకోండి.
JOS 4:24 యెహోవాకు మహాశక్తి ఉందని ఈ దేశ ప్రజలంతా తెలుసుకోవాలని ఆయన దీనిని చేసాడు. అప్పుడు ఆ ప్రజలు మీ యెహోవా దేవునికి ఎల్లప్పుడూ భయపడి ఉంటారు.”
JOS 5:1 కనుక ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాటి వెళ్లేంతవరకు యెహోవా దానిని ఎండి పోయేటట్టు చేసాడు. యోర్దాను నదికి పశ్చిమాన ఉన్న రాజులు, మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న కనానీ ప్రజలు ఇది విని చాల భయపడిపోయారు. అంతటితో ఇశ్రాయేలు ప్రజలను ఎదిరించే ధైర్యం వారికి లేక పోయింది.
JOS 5:2 ఆ సమయంలో యెహోవా, “మొనగల రాళ్లతో కత్తులు చేసి, ఇశ్రాయేలు ప్రజలకు మరల సున్నతి చేయు” అని యెహోషువతో చెప్పాడు.
JOS 5:3 కనుక యెహోషువ మొనగల రాళ్లతో కత్తులు చేసాడు. తర్వాత గిబియత్ హార్లత్ దగ్గర అతడు వారికి సున్నతి చేసాడు.
JOS 5:4 ఆ మగవాళ్లకు యెహోషువ ఎందుకు సున్నతి చేసాడంటే; ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు వదిలి పెట్టిన తర్వాత, సైన్యానికి తగిన వాళ్లందరికీ సున్నతి చేయబడింది. అరణ్యంలో ఉన్నప్పుడు ఆ వీరులు చాల మంది యెహోవా మాట వినలేదు. అందుచేత “పాలు, తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని” ఆ మనుష్యులు చూడరని యెహోవా ప్రమాణం చేసాడు. ఆ దేశాన్ని మనకు ఇస్తానని యెహోవా మన పూర్వీకులకు వాగ్దానం చేసాడు కానీ ఆ మనుష్యుల మూలంగా ప్రజలంతా 40 సంవత్సరాలపాటు అరణ్యంలోనే సంచరించాల్సి వచ్చింది. అలా ఆ సైన్యం వాళ్లంతాచావాల్సి ఉంది. పోరాడే ఆ మనుష్యులంతా చనిపోయారు. వారు కుమారులు వారి స్థానాలు వహించారు. అయితే ఈజిప్టునుండి వచ్చేటప్పుడు అరణ్యంలో పుట్టిన బాలురకు ఎవ్వరికి సున్నతి జరగలేదు. అందుచేత యెహోషువ వారికి సున్నతి చేసాడు.
JOS 5:8 ప్రజలందరికీ యెహోషువ సున్నతి చేయటం ముగించాడు. తర్వాత వాళ్లంతా స్వస్థత పడేంతవరకు ఆ గుడారాలలోనే ఉండిపోయారు.
JOS 5:9 ఆ సమయంలో యోహోవా, “మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్నప్పుడు అవమానం పొందారు కానీ నేడు ఆ అవమానాన్ని నేను తొలగించివేసాను” అని యెహోషువతో చెప్పాడు. అందుచేత ఆ స్థలానికి గిల్గాలు అని యెహోషువ పేరు పెట్టాడు. నేటికీ ఆ చోటు గిల్గాలు అనే పిలువబడుతోంది.
JOS 5:10 ఇశ్రాయేలు ప్రజలు యెరికో మైదానాల్లో గిల్గాలులో దిగియున్నప్పుడే వారు పస్కా విందు చేసారు. అది ఆ నెల 14వ తేదీ సాయంత్రం.
JOS 5:11 మరునాడు పస్కా తర్వాత ప్రజలు ఆ దేశంలో పండిన ఆహారం కొంత భోజనం చేసారు. పులుపు పదార్థం లేని రొట్టెను, వేయించిన గింజలను వారు తిన్నారు.
JOS 5:12 ఆ రోజు ప్రజలు ఈ ఆహారం భోజనంచేసిన తర్వాత ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఆగిపోయింది. ఆ తర్వాత ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఇశ్రాయేలు ప్రజలకు లభించలేదు. అప్పట్నుంచి కనాను దేశంలో పండిన పంటనే వారు తిన్నారు.
JOS 5:13 యెహోషువ యెరికోకు సమీపంగా ఉన్నప్పుడు అతడు పైకి చూడగా అతని యెదుట ఒక మనిషినిలిచి ఉండటం కనబడింది. ఆ మనిషి చేతిలో ఒక ఖడ్గం ఉంది. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, “నీవు మా ప్రజల పక్షమా, లేక నీవు మా శత్రువర్గం వాడివా?” అని అడిగాడు.
JOS 5:14 ఆ మనిషి, “నేను శత్రువును కాను. నేను యెహోవా సైన్యములకు సేనాధిపతిని. ఇప్పుడే నేను మీ దగ్గరకు వచ్చాను” అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోషువ, ఆయనను గౌరవిస్తు సాష్టాంగపడి. “నా యజమాని, తన సేవకుడైన నాకు ఏమి సెలవిస్తున్నారు?” అని అడిగెను.
JOS 5:15 అందుకు యెహోవా సైన్యాధిపతి, “నీ చెప్పులు తీసివేయి. ఇప్పుడు నీవు నిలిచిన స్థలం పవిత్ర స్థలము” అని చెప్పాడు. కనుక యెహోషువ ఆయనకు విధేయుడయ్యాడు.
JOS 6:1 యెరికో పట్టణం మూసివేయబడింది. ఇశ్రాయేలు ప్రజలు దగ్గర్లోనే ఉన్నందువల్ల ఆ పట్టణం లోని ప్రజలు భయపడ్డారు. ఎవరూ పట్టణంలోనికి గాని, బయటకు గాని వెళ్లలేదు.
JOS 6:2 అప్పుడు యెహోషువతో యోహోవా చెప్పాడు: “చూడు, యెరికో పట్టణాన్ని నేను నీ స్వాధీనంలో ఉంచాను. దాని రాజు, పట్టణంలోని యుద్ధ వీరులు నీ స్వాధీనంలో ఉన్నారు.
JOS 6:3 నీ సైన్యంతో పట్టణం చుట్టూ రోజుకు ఒక్కసారి ప్రదక్షిణం చేయి. ఇలా ఆరు రోజులు చేయి.
JOS 6:4 పొట్టేలు కొమ్ములతో చేసిన బూరలు ఊదేందుకు ఏడుగురు యాజకులను నియమించుము. పవిత్ర పెట్టెకు ముందుగా నడువుమని యాజకులతో చెప్పు. ఏడో రోజున ఏడుసార్లు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఏడోరోజున వారు ముందడుగు వేయగానే బూరలు ఊదాలని యాజకులతో చెప్పు.
JOS 6:5 యాజకులు బూరలతో పెద్ద శబ్దం చేయాలి. ఆ శబ్దం నీవు వినగానే ప్రజలందర్నీ కేకలు వేయమని చెప్పు. మీరు ఇలా చేయగానే పట్టణం యొక్క గోడలు కూలిపోతాయి. అప్పుడు మీ ప్రజలు సరాసరి పట్టణం లోనికి వెళ్లిపోవాలి.”
JOS 6:6 కనుక నూను కుమారుడైన యెహోషువ యాజకులందర్నీ సమావేశపర్చాడు. “యెహోవా పవిత్ర పెట్టెను మోయండి. ఏడుగురు యాజకులు బూరలు మోయాలని చెప్పండి. ఆ యాజకులు పవిత్ర పెట్టెకు ముందుగా నడవాలి” అని యెహోషువ వారితో చెప్పాడు.
JOS 6:7 “ఇప్పుడు బయల్దేరండి. పట్టణం చుట్టూ నడవండి. ఆయుధాలు ధరించిన సైనికులు యెహోవా పవిత్ర పెట్టె ఎదుట నడవాలి” అని యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించాడు.
JOS 6:8 యెహోషువ ప్రజలతో మాట్లాడటం ముగించగానే, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని నడవటం మొదలుబెట్టారు. ఏడు బూరలను వారు మోసుకొని వెళ్లారు. వారు నడుస్తూ ఉన్నప్పుడు బూరలు ఊదారు. యెహోవా పవిత్ర పెట్టెను మోసే వారు వారి వెనుక నడిచారు.
JOS 6:9 ఆయుధాలు ధరించిన సైనికులు యాజకులకు ముందుగా నడిచారు. పవిత్ర పెట్టె వెనుక నడుస్తోన్న వాళ్లు బూరలు ఊదారు.
JOS 6:10 అయితే యుద్ధనాదం చేయవద్దని యెహోషువ ప్రజలతో చెప్పాడు. “కేకలు వేయకండి. నేను మీతో చెప్పే రోజు వరకు ఒక్క మాటకూడ పలుకకండి. తరువాత మీరు కేకలు వేయవచ్చు” అన్నాడు యోహోషువ.
JOS 6:11 కనుక యెహోవా పవిత్ర పెట్టెను పట్టణంచుట్టూ ఒక్క సారి యాజకులచేత యెహోషువ మోయించాడు. తర్వాత వారు వారి బసకు వెళ్లి ఆ రాత్రి అక్కడే గడిపారు.
JOS 6:12 మర్నాటి ఉదయాన్నే యెహోషువ లేచాడు. యాజకులు యెహోవా పవిత్ర పెట్టెను మరలా మోసారు.
JOS 6:13 మరియు యాజకులు ఏడుగురు ఏడు బూరలు మోసారు. యెహోవా పవిత్ర పెట్టె ఎదుట వారు నడుస్తూ బూరలు ఊదారు. ఆయుధాలు ధరించిన సైనికులు వారికి ముందుగా నడిచారు. యెహోవా పవిత్ర పెట్టె వెనుక నడిచే యాజకులు నడుస్తూ, బూరలు ఊదారు.
JOS 6:14 కనుక రెండో రోజున వాళ్లంతా పట్టణం చుట్టూ ఒక మారు ప్రదక్షిణం చేసారు. ఆ తర్వాత వాళ్లు తిరిగి వారి బసకు వెళ్లిపోయారు. ఆరు రోజులపాటు వారు ఇలానే ప్రతిరోజూ చేసారు.
JOS 6:15 ఏడో రోజు సూర్యోదయాన్నే వారు మేల్కొన్నారు. వారు పట్టణం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణాలు చేసారు. అంతకు ముందు రోజులలో నడచినట్టే నడిచారు, కాని ఆ రోజు పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు.
JOS 6:16 పట్టణం చుట్టూ వారు ఏడోసారి తిరుగగానే, యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడే యెహోషువ ఆజ్ఞ యిచ్చాడు: “ఇప్పుడు కేకలు వేయండి! యెహోవా ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు!
JOS 6:17 ఈ పట్టణం, ఇందులో ఉన్న సమస్తం యోహోవాదే. వేశ్య రాహాబు, ఆమె ఇంటిలో ఉన్న వారు మాత్రమే బ్రతకాలి. మనం పంపిన ఇద్దరికీ రాహాబు సహాయం చేసింది గనుక వారిని చంపకూడదు.
JOS 6:18 మరియు మిగిలిన వాటన్నింటినీ మనం నాశనం చేసివేయాలని జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని తీసుకోవద్దు. మీరు వాటిని తీసుకొని, మన పాళెములోనికి గనుక తీసుకొని వస్తే మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు. పైగా మీరు మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరికీ కష్టం తెచ్చి పెడ్తారు.
JOS 6:19 వెండి, బంగారం మరియు ఇత్తడి, ఇనుముతో చేసిన వస్తువులన్నీ మొత్తం యోహోవాకే చెందుతాయి. వాటన్నింటినీ ఆయన కోసం దాచిపెట్టాలి.”
JOS 6:20 యాజకులు బూరలు ఊదారు. ప్రజలు బూరలువిని కేకలు వేయటం మొదలుబెట్టారు. గోడలు కూలి పోయాయి. ప్రజలు ఏకంగా పట్టణంలో జొరబడి పోయారు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని ఓడించేసారు.
JOS 6:21 ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్ని ప్రజలు నాశనం చేసారు. అక్కడ ప్రాణంతో ఉన్న సమస్తాన్ని వాళ్లు నాశనం చేసారు. పడుచు కుర్రాళ్లను పెద్ద మగవాళ్లను, పడుచు పిల్లల్ని, స్త్రీలను పశువుల్ని, గొర్రెల్ని, గాడిదల్ని వారు చంపేశారు.
JOS 6:22 ఆ దేశాన్ని చూసేందుకు తాను పంపించిన ఇద్దరు మనుష్యులతో యోహోషువ మాట్లాడాడు: “ఆ వేశ్య ఇంటికి వెళ్లండి. ఆమెను బయటకు తీసుకొని రండి. మరియు ఆమెతో ఉన్న వాళ్లందరినీ బయటకు తీసుకొని రండి. మీరు ఆమెతో చేసిన వాగ్దానం ప్రకారం మీరు ఇలా చేయండి.”
JOS 6:23 కనుక ఆ ఇద్దరు మనుష్యులూ ఆ ఇంట్లోకి వెళ్లి, రాహాబును బయటకు తీసుకొని వచ్చారు. ఆమె తండ్రి, తల్లి, సోదరులు, ఆమె కుటుంబం మొత్తం, ఆమెతో ఉన్న వాళ్లందర్నీ వారు బయటకు తీసుకొనివచ్చారు. ఆ మనుష్యులందరినీ ఇశ్రాయేలీయుల పాళెము వెలుపల క్షేమకరమైన చోట వారు ఉంచారు.
JOS 6:24 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణం మొత్తాన్ని తగులబెట్టేసారు. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుముతో చేయబడినవి తప్ప ఆ పట్టణంలో ఉన్న వాటన్నింటినీ వారు కాల్చేసారు. ఇవన్నీ యెహోవా కోసం భద్రం చేయబడ్డాయి.
JOS 6:25 వేశ్య రాహాబును, ఆమె కుటుంబాన్ని, ఆమెతో ఉన్నవారందరినీ యెహోషువ రక్షించాడు. యెరికోను వేగు చూచేందుకు యెహోషువ పంపిన మనుష్యులకు రాహాబు సహాయం చేసింది కనుక యెహోషువ వారిని బ్రదుకనిచ్చాడు. నేటికీ రాహాబు ఇశ్రాయేలు ప్రజల్లో సజీవంగా ఉండిపోయింది.
JOS 6:26 ఆ సమయంలోనే ముఖ్యమైన ఈ వాగ్దానం యెహోషువ చేసాడు: “ఈ యెరికో పట్టణాన్ని మరల ఎవరైనా కట్టడానికి ప్రయత్నిస్తే వారు యెహోవా వలన ప్రమాదానికి గురి అవుతారు. ఈ పట్టణానికి పునాది వేసే మనిషి తన పెద్ద కుమారుణ్ణి పోగొట్టుకుంటాడు. ద్వారాలు నిలబెట్టేవాడు తన చిన్న కుమారుణ్ణి పోగొట్టుకొంటాడు.”
JOS 6:27 కనుక యెహోవా, యెహోషువకు తోడుగా ఉన్నాడు. మరియు యెహోషువ ఆ దేశం అంతటా ప్రసిద్ధి చెందాడు.
JOS 7:1 అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు. యూదా వంశానికి చెందిన జబ్ది మనుమడు, కర్మి కుమారుడు ఆకాను అనే పేరుగలవాడు ఒకడు ఉన్నాడు. నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నింటిని ఆకాను దాచిపెట్టుకున్నాడు. అందుచేత ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు చాల కోపం వచ్చింది.
JOS 7:2 వారు యెరికోను ఓడించిన తర్వాత యెహోషువ హాయి పట్టణానికి కొందరు మనుష్యుల్ని పంపించాడు. బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉంది హాయి. “హాయికి వెళ్లి, ఆ ప్రాంతంలో బలహీనతలు ఏమిటో చూడండి” అని యెహోషువ వారితో చెప్పాడు. కనుక ఆ దేశాన్ని వేగు చూడటానికి ఆ మనుష్యులు వెళ్లారు.
JOS 7:3 తర్వాత ఆ మనుష్యులు యెహోషున దగ్గరకు తిరిగి వచ్చారు. “హాయి బలహీన ప్రాంతం. ఆ దేశాన్ని జయించేందుకు మనకు మన మనుష్యులంతా అవసరం లేదు. అక్కడ యుద్ధానికి రెండువేల మంది లేక మూడు వేల మందిని పంపించు. మన ప్రజలందర్నీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనమీద పోరాడేందుకు అక్కడ కొద్దిమంది మనుష్యులే ఉన్నారు” అన్నారు వారు.
JOS 7:4 కనుక సమారు మూడువేల మంది మనుష్యులు హాయికి వెళ్లారు. కాని హాయివారు ఇశ్రాయేలు మనుష్యులను 36 మందిని చంపివేసారు. పైగా ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారు. హాయివాళ్లు తమ పట్టణ ద్వారాల దగ్గరనుండి షేబారీమువరకు వాళ్లను తరిమివేసారు. హాయివాళ్లు వారిని బాగా కొట్టివేసారు. ఇశ్రాయేలు ప్రజలు అది చూసి, చాలా భయపడిపోయారు, ధైర్యం కోల్పోయారు.
JOS 7:6 యెహోషువ ఇది విని, తన బట్టలు చింపుకొని, పవిత్ర పెట్టె ముందర నేలమీద సాగిలపడ్డాడు. సాయంత్రం వరకు యెహోషువ అక్కడే ఉండిపోయాడు. ఇశ్రాయేలు నాయకులంతా అలానే చేసారు. వారు వారి తలలమీద ధూళి పోసుకొన్నారు.
JOS 7:7 అప్పుడు యెహోషువ చెప్పాడు: “అయ్యో యెహోవా ప్రభువా! మా ప్రజలను నీవే యోర్దాను నది దాటించావు. కానీ నీవెందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చి, అమోరీవాళ్లు మమ్మల్ని నాశనం చేయునట్లు చేశావు. యోర్దాను నది ఆవల మేము తృప్తిపడి, అక్కడే ఉండిపోవాల్సింది.
JOS 7:8 నా ప్రాణం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభూ! ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఇశ్రాయేలీయులు శత్రువులకు లోబడిపోయారు.
JOS 7:9 కనానీ ప్రజలు, ఈ దేశంలోని ప్రజలు అందరూ జరిగిన దానిగూర్చి వింటారు. తరువాత వాళ్లు మా మీదికి వచ్చి, మమ్మల్ని అందర్నీ చంపేస్తారు. అప్పుడు నీ గొప్ప పేరు కాపాడేందుకు నీవు ఏమి చేస్తావు?”
JOS 7:10 యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు: “లేచి నిలబడు! ఎందుకు నీవు సాష్టాంగ పడతావు?
JOS 7:11 ఇశ్రాయేలు ప్రజలు నాకు విరోధంగా పాపం చేసారు. వాళ్లు విధేయులు కావాలని నేను చేసిన ఒడంబడికను వారు ఉల్లంఘించారు. నాశనం చేయాలని నేను ఆజ్ఞాపించిన వాటిలో వారు కొన్ని తీసుకొన్నారు. వారు నా దగ్గర దొంగతనం చేసారు. వాళ్లు అబద్ధం చెప్పారు. ఆ వస్తువుల్ని వాళ్లు వారికోసం దాచుకొన్నారు.
JOS 7:12 అందుచేతనే ఇశ్రాయేలు సైన్యం యుద్ధంలో ఓడిపోయి పారిపోయింది. వారు తప్పు చేసినందువల్లనే ఇలా జరిగింది. వాళ్లు నాశనం కావాలి. నేను ఇంక మీకు సహాయం చేయను. మీరు నాశనం చేయాలని నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేస్తేనే తప్ప నేను ఇక మీదట మీకు తోడుగా ఉండును.
JOS 7:13 “ఇప్పుడు వెళ్లి, ప్రజలను పవిత్రం చేసి, ప్రజలతో ఇలా చెప్పు, ‘మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపటికోసం సిద్ధపడండి. ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడు నాశనం చేయుమని ఆజ్ఞాపించిన వాటిని కొంత మంది దాచిపెట్టుకొన్నారని ఆయన చెబుతున్నాడు. వాటిని మీరు పారవేసేటంతవరకు మీరెన్నటికీ మీ శత్రువుల్ని ఓడించలేరు.
JOS 7:14 “‘రేపు ఉదయం మీరంతా యెహోవా ఎదుట నిలవాలి. అన్ని గోత్రాలూ యెహోవా యెదుట నిలబడాలి. ఒక గోత్రాన్ని యెహోవా నిర్ణయం చేస్తాడు. అప్పుడు ఆ గోత్రం మాత్రమే యెహోవా యెదుట నిలబడాలి. అప్పుడు ఆ గోత్రం నుండి ఒక వంశాన్ని యెహోవా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ వంశం వాళ్లు మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. ఆ వంశంలో నుండి ఒక్క కుటుంబాన్ని మాత్రమే యెహోవా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ ఒక్క కుటుంబం మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. అప్పుడు ఆ కుటుంబంలో ఒక్కొక్క పురుషుని యెహోవా చూస్తాడు.
JOS 7:15 మనం నాశనం చేయాల్సిన వాటిని దాచిపెట్టుకొన్న మనిషి పట్టుబడతాడు. అప్పుడు ఆ మనిషిని అగ్నితో కాల్చి నాశనం చేయాలి. మరియు అతనికి కలిగిన సమస్తం అతనితో బాటు నాశనం చేయబడుతుంది. యెహోవా ఆజ్ఞాపించిన ఒడంబడికను ఆ మనిషి ఉల్లంఘించాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య అతడు మహాఅపరాధం చేసాడు.’”
JOS 7:16 మర్నాడు ఉదయం పెందలాడే ఇశ్రాయేలు ప్రజలందరినీ యెహోవా ఎదుటకు యోహోషువ నడిపించాడు. ఇశ్రాయేలు గోత్రాలన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. యూదా గోత్రాన్ని యెహోవా నిర్ణయించాడు.
JOS 7:17 కనుక యూదా గోత్రములోని వంశాలన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. జెరహు వంశాన్ని యెహోవా నిర్ణయం చేసాడు. అప్పుడు జెరహు వంశంలోని కుటుంబాలు అన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. జబ్ది కుటుంబం నిర్ణయించబడింది.
JOS 7:18 అప్పుడు ఆ కుటుంబంలోని పురుషులంతా యెహోవా ఎదుటికి రావాలని యెహోషువ చెప్పాడు. కర్మీ కుమారుడైన ఆకానును యెహోవా నిర్ణయం చేసాడు. (జిర్మి కుమారుడు కర్మి, జెరహు కుమారుడు జబ్ది).
JOS 7:19 అప్పుడు ఆకానుతో యెహోషువ అన్నాడు: “నా కుమారుడా, (నీ ప్రార్థన చేసుకో) ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించి, నీవు ఒప్పుకో. నీవేం చేసావో నాతో చెప్పు. నా దగ్గర ఏమీ దాచేందుకు ప్రయత్నించకు!”
JOS 7:20 ఆకాను ఇలా జవాబిచ్చాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా నేను పాపం చేసిన మాట నిజమే. నేను చేసింది ఏమిటంటే,
JOS 7:21 యెరికో పట్టణాన్ని అందులో ఉన్న వాటన్నిటినీ మనం పట్టుకొన్నాము గదా! వాటిలో అందమైన ఒక బబులోను అంగీ, రెండు వందల తులాల వెండి, యాభైతులాలకంటె ఎక్కువ బంగారం నేను చూసాను. ఇవన్నీ తప్పక నాకు కావాలనిపించింది. అందుచేత నేను వాటిని తీసుకొన్నాను. నా గుడారంలో నేల తవ్వితే అవి మీకు కనబడుతాయి. వెండి కూడ అంగీ క్రిందనే ఉంది.”
JOS 7:22 కనుక యెహోషువ కొందరు మనుష్యుల్ని ఆ గుడారానికి పంపించాడు. వారు ఆ గుడారానికి పరుగెత్తి వెళ్లి, ఆ వస్తువులు గుడారంలో దాచిపెట్టబడి ఉండటం చూసారు. వెండి కూడా అంగీ క్రిందనే ఉంది.
JOS 7:23 ఆ మనుష్యులు ఆ వస్తువుల్ని గుడారంలోనుంచి వెలుపటికి తీసుకొనివచ్చారు. వారు ఆ వస్తువుల్ని యెహోషువ దగ్గరకు, ప్రజలందరి దగ్గరకు తీసుకొని వెళ్లారు. వారు యెహోవా ఎదుట వాటిని నేలమీద పెట్టారు.
JOS 7:24 అప్పుడు యెహోషువ, ప్రజలు అందరూ కలిసి జెరహు కుమారుడు ఆకానును ఆకోరు లోయకు తీసుకొని వెళ్లారు. వెండి, అంగీ, బంగారం, ఆకాను కుమారులు, కూతుళ్లు, అతని పశువులు, అతని గాడిదలు, అతని గొర్రెలు, అతని గుడారం, అతనికి ఉన్న సర్వమును వారు తీసుకొని వెళ్లారు. వారు వీటన్నింటినీ ఆకానుతోబాటు ఆకోరు లోయకు తీసుకొని వెళ్లారు.
JOS 7:25 అప్పుడు యెహోషువ, “నీవు మాకు ఇంత కష్టం ఎందుకు తెచ్చిపెట్టావో నాకు తెలియదు! కానీ ఇప్పుడు యెహోవా నిన్ను బాధిస్తాడు!” అన్నాడు. అప్పుడు ప్రజలు ఆకాను చచ్చేంతవరకు అతణ్ణి రాళ్లతో కొట్టారు. అతని కుటుంబాన్నికూడ వారు చంపేసారు. అప్పుడు వాళ్లందర్నీ, అతనికి ఉన్నదాన్నంతటినీ ప్రజలు కాల్చివేసారు.
JOS 7:26 వారు ఆకానును కాల్చేసిన తర్వాత, అతని శరీరం మీద చాల రాళ్లు కుప్పగా వేసారు. ఆ రాళ్లు నేటికీ అక్కడ ఉన్నాయి. (కనుక యెహోవా ఆకానును బాధించాడు.) అందుకే ఆ స్థలం ఆకోరు లోయ అని పిలువబడుతుంది. ఆ తర్వాత యెహోవా ప్రజల మీద కోపగించలేదు.
JOS 8:1 అప్పుడు యెహోవా యెహోషువతో చెప్పాడు: “భయపడకు. జడియకు. నీ యుద్ధ వీరులందరినీ హాయి మీదికి నడిపించు. హాయి రాజును ఓడిచేందుకు నేను నీకు సహాయం చేస్తాను. అతని ప్రజల్ని, అతని పట్టణాన్ని, అతని దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను.
JOS 8:2 నీవు యెరికోకు, దాని రాజుకు చేసినట్టే హాయికి, దాని రాజుకుగూడ చేస్తావు. ఈసారి మాత్రమే మీరు ఐశ్వర్యాలన్నీ తీసుకొని మీకోసం దాచుకోవచ్చు. ఆ ఐశ్వర్యాలను మీరు, మీ ప్రజలు పంచుకోండి. ఇప్పుడు మీ సైనికులు కొందర్ని పట్టణం వెనుక మాటు వేయమని చెప్పు.”
JOS 8:3 కనుక యెహోషువ తన సైన్యం అంతటినీ హాయివైపు నడిపించాడు. తర్వాత మంచి పరాక్రమంగల ముప్పయివేలమంది శూరులను యెహోషువ ఏర్పాటు చేసుకొన్నాడు. అతడు వీళ్లందరినీ రాత్రి పూట బయటకు పంపించాడు.
JOS 8:4 యెహోషువ వారికి ఇలా ఆజ్ఞాపించాడు: “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా వినండి. పట్టణం వెనుక ప్రాంతంలో మీరు దాక్కోవాలి. దాడి చేయాల్సిన సమయంకోసం కనిపెట్టి ఉండాలి. పట్టణానికి మరీ దూరంగా వెళ్లకండి. కనిపెడ్తూ, సిద్ధంగా ఉండండి.
JOS 8:5 నేను నాతో ఉన్న మనుష్యులను పట్టణం మీదికి నడిపిస్తాను. పట్టణంలోపలి మనుష్యలు మాతో యుద్ధం చేయటానికి బయటకు వస్తారు. మేము ఇదివ రకువలెనే, వెనుదిరిగి వారి దగ్గర్నుండి పారిపోతాం.
JOS 8:6 ఆ మనుష్యులు పట్టణం నుండి మమ్మల్ని తరుముతారు. ఇదివరకువలెనే మేము వాళ్ల ఎదుట నుండి పారిపోతున్నామని వారు అనుకొంటారు. కనుక మేము పారిపోతాము.
JOS 8:7 అప్పుడు మీరు దాగుకొన్న చోటు నుండి బయటకు వచ్చి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. మీ యెహోవా దేవుడు మీరు గెలిచేందుకు మీకు శక్తి ఇస్తాడు.
JOS 8:8 “యెహోవా చెప్పినట్టే మీరు చేయాలి. నన్ను గమనించండి. దాడి చేసేందుకు నేను మీకు ఆజ్ఞఇస్తాను. మీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత మీరు దాన్ని కాల్చివేయాలి.”
JOS 8:9 అప్పుడు యెహోషువ, వారు దాగుకొనే చోటుకు వారిని పంపించగా, బేతేలు, హాయికి మధ్యగల ఒకచోటికి వారు వెళ్లారు. ఇది హాయికి పశ్చిమాన ఉంది. ఆ రాత్రి యెహోషువ తన మనుష్యుల దగ్గరే ఉండిపోయాడు.
JOS 8:10 మరునాడు ఉదయాన్నే యోహోషువ పురుషులందరినీ సమావేశం చేసాడు. అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు నాయకులు అందరినీ హాయి మీదికి నడిపించారు.
JOS 8:11 యెహోషునతో ఉన్న సైనికులందరూ హాయి మీద దాడి చేశారు. ఆ పట్టణం ఎదుట వాళ్లు ఆగి పోయారు. పట్టణానికి ఉత్తరాన సైన్యం బసచేసింది. సైన్యానికినీ హాయికినీ మధ్య ఒక లోయఉంది.
JOS 8:12 అప్పుడు యెహోషువ ఐదువేల మంది పురుషులను ఏర్పరచుకొన్నాడు. పట్టణానికి పశ్చిమంగా, బేతేలుకు, హాయికి మధ్య ప్రాంతంలో దాగి ఉండమని యెహోషువ వారిని పంపించాడు.
JOS 8:13 కనుక యెహోషువ తన మనుష్యుల్ని యుద్ధానికి సిద్ధం చేసాడు. పట్టణానికి ఉత్తరాన ముఖ్యమైన బస ఉంది. మిగిలిన వాళ్లు పడమటివైపు దాగుకొన్నారు. ఆ రాత్రి యెహోషువ లోయలోనికి దిగి వెళ్లాడు.
JOS 8:14 తర్వాత హాయి రాజు ఇశ్రాయేలు సైన్యాన్ని చూసాడు. రాజు, అతని ప్రజలు లేచి, ఇశ్రాయేలు సైన్యంతో యుద్ధం చేసేందుకు త్వరపడ్డారు. హాయి రాజు పట్టణానికి తూర్పు దిశన బయటికి వెళ్లాడు. కనుక పట్టణం వెనుకవైపు సైనికులు దాగి ఉన్న విషయం అతనికి తెలియదు.
JOS 8:15 యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ హాయివారి చేత వెనుకకు నెట్టబడ్డారు. యెహోషువ, అతని మనుష్యులు ఎడారివైపు తూర్పు దిశగా పారిపోవటం మొదలుబెట్టారు.
JOS 8:16 పట్టణంలో ఉన్న ప్రజలు కేకలు వేస్తూ, యెహోషువను, అతని మనుష్యులను తరమటం మొదలుబెట్టారు. ప్రజలంతా పట్టణం వదలిపెట్టేసారు.
JOS 8:17 హాయి, బేతేలు ప్రజలు అంతా ఇశ్రాయేలు సైన్యాన్ని తరిమారు. పట్టణం బాహాటంగా తెరచి ఉంది పట్టణాన్ని కాపాడేందుకు ఎవరూ అక్కడ ఉండి పోలేదు.
JOS 8:18 యెహోవా “నీ ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకో. ఆ పట్టణాన్ని నేను నీకు ఇస్తాను” అని యెహోషువతో చెప్పాడు. కనుక యెహోషువ తన ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకొన్నాడు.
JOS 8:19 దాగుకొన్న ఇశ్రాయేలు మనుష్యులు ఇది చూసారు. వారు దాగుకొన్న చోటునుండి త్వరగా బయటకు వచ్చి, పట్టణంవైపు త్వరగా బయల్దేరారు. వారు పట్టణంలో ప్రవేశించి, దాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అప్పుడు సైనికులు ఆ పట్టణాన్ని కాల్చి వేసేందుకు మంటలు పెట్టడం మొదలుపెట్టారు.
JOS 8:20 హాయినుండి వచ్చిన మనుష్యులు వెనుకకు తిరిగి చూడగా వారి పట్టణం కాలిపోవటం కనుపించింది. పొగ ఆకాశానికి ఎక్కటం వారు చూసారు. కనుక వారి బలం, ధైర్యం క్షణించిపోయాయి. వారు ఇశ్రాయేలీయులను తర మటం మానివేసారు. ఇశ్రాయేలు మనుష్యులు పారిపోవటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యులతో పోరాటానికి దిగారు. హాయి మనుష్యులు పారిపోయేందుకు క్షేమకరమైన స్థలం ఏమీ లేకపోయింది.
JOS 8:21 యెహోషువ, అతని మనుష్యులు అందరూ, వారి సైన్యం ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటం చూసారు. ఆ పట్టణంనుండి పొగ లేవటంవారు చూసారు. అప్పటికే వారు పరుగెత్తటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యుల మీద పోరాటానికి పరుగెత్తారు.
JOS 8:22 అప్పుడు దాగు కొనియున్న మనుష్యలు పోరాటంలో సహాయం చేసేందుకు పట్టణంలో నుండి బయటకు వచ్చారు. హాయి మనుష్యులకు రెండువైపులా ఇశ్రాయేలు సైన్యంఉంది. హాయి మనుష్యులు చిక్కులోపడ్డారు. ఇశ్రాయేలీయులు వారిని ఓడించారు. హాయి మనుష్యుల్లో ఒక్కరినిగూడ బ్రతకనీయకుండా, శత్రువు ఒక్కడూ తప్పించుకోకుండా వారు పోరాడారు.
JOS 8:23 అయితే హాయి రాజును ప్రాణంతో ఉండనిచ్చారు. యెహోషువ మనుష్యులు అతణ్ణి యెహోషువ దగ్గరకు తీసుకొచ్చారు.
JOS 8:24 యుద్ధ సమయంలో హాయి మనుష్యుల్ని ఇశ్రాయేలు సైన్యం పొలాల్లోనికి, ఎడారిలోనికి తరిమింది. కనుక హాయి మనుష్యులందరినీ ఇశ్రాయేలు సైన్యం చంపటం పూర్తి చేసింది. పొలాల్లో, ఎడారిలో ఉన్న మనుష్యులను చంపటం వారు పూర్తి చేసారు. అప్పుడు ఇశ్రేయేలు మనుష్యులంతా తిరిగి హాయి వెళ్లారు. అప్పుడు ఆ పట్టణంలో ప్రాణంతో ఇంకా బతికి ఉన్న వాళ్లందరినీ వారు చంపేసారు.
JOS 8:25 హాయి పట్టణ ప్రజలంతా ఆ రోజునే చనిపోయారు. పన్నెండువేల మంది పురుషులు, స్త్రీలు
JOS 8:26 ఆ పట్టణాన్ని నాశనం చేసేందుకు తన ప్రజలకు ఒక సంకేతంగా యెహోషువ తన ఈటెను హాయి పట్టణం వైపు ఎత్తి పట్టుకొన్నాడు. ఆ పట్టణంలోని ప్రజలు అందరూ నాశనం చేయబడేంతవరకు యెహోషువ ఆపు చేయలేదు.
JOS 8:27 ఆ పట్టణ ప్రజలు కలిగియున్న వస్తువులను, జంతువులను ఇశ్రాయేలు ప్రజలు తమ కోసం దాచు కొన్నారు. యెహోషువకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు ఇలా చేసేందుకు అనుమతి ఇచ్చాడు.
JOS 8:28 అప్పుడు యెహోషువ హాయి పట్టణాన్ని కాల్చివేసాడు. ఆ పట్టణం ఒక పనికిమాలిన రాళ్ల కుప్ప అయింది. నేటికీ అది అలానే ఉంది.
JOS 8:29 హాయి రాజును యెహోషువ ఒక చెట్టుకు ఉరితీసాడు. ఆ సాయంత్రం వరకు అతణ్ణి అలానే ఆ చెట్టుకు వేలాడనిచ్చాడు. సూర్యాస్తమయం అయినప్పుడు ఆ రాజు దేహాన్ని చెట్టు మీదనుండి దించమని యెహోషువ తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. పట్టణద్వారం దగ్గర వారు అతని దేహాన్ని క్రింద పడవేసారు. తర్వాతవారు అతని దేహాన్ని రాళ్ల గుట్టతో కప్పివేసారు. ఆ రాళ్ల కుప్ప నేటికీ అక్కడ ఉంది.
JOS 8:30 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. ఏబాలు కొండమీద ఆ బలిపీఠాన్ని అతడు కట్టాడు.
JOS 8:31 బలిపీఠాలు కట్టడం ఎలా అనేది యెహోవా సేవకుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియ జేస్తాడు. కనుక మెషే ధర్మశాస్త్ర గ్రంథంలో వివరించబడిన ప్రకారం యెహోషువ బలిపీఠాన్ని నిర్మించాడు. చెక్కబడని రాళ్లతో బలిపీఠం కట్టబడింది. ఆ రాళ్లమీద ఎన్నడూ ఏ పనిముట్టూ ప్రయోగించబడలేదు. ఆ బలిపీఠం మీద వారు యెహోవాకు దహనబలి అర్పణలు అర్పించారు సమాధాన బలులు కూడా వారు అర్పించారు.
JOS 8:32 ఆ స్థలంలోనే మోషే ధర్మశాస్త్రాన్ని యెహోషువ రాళ్లమీద చెక్కాడు. ఇశ్రాయేలు ప్రజలంతా చూసేందుకు వీలుగా అతడు ఇలా చేసాడు.
JOS 8:33 పెద్దలు, అధికారులు, న్యాయమూర్తులు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ పవిత్ర పెట్టె చుట్టూ నిలబడ్డారు. యెహోవా ఒడంబడిక పవిత్ర పెట్టెను మోస్తున్న లేవీ యాజకుల ఎదుట వారు నిలబడ్డారు. యూదా ప్రజలు, యూదులు కానివాళ్లు అందరూ అక్కడ ఉన్నారు. సగం మంది ప్రజలు ఏబాలు కొండ ఎదుటను, మిగిలిన సగం మంది ప్రజలు గెరిజీము కొండ ఎదుటను నిలబడ్డారు యెహోవా సేవకుడు మోషే ప్రజలను ఆశీర్వదించినప్పటిలానే ఉంది ఇప్పుడు కూడ. మోషే మొదటిసారు ఆశీర్వదించినప్పుడు ప్రజలు ఇలాగే నిలబడాలని అతడు చెప్పాడు.
JOS 8:34 అప్పుడు యెహోషువ ధర్మశాస్త్రంలోని మాటలు అన్నీ చదివాడు. ఆశీర్వాదాలను, శాపాలను కూడ యోహోషువ చదివాడు. ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా అతడు చదివాడు.
JOS 8:35 ఇశ్రాయేలు ప్రజలంతా అక్కడ సమావేశం అయ్యారు. స్త్రీలు, పిల్లలు, ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించిన విదేశీయులు అందరూ అక్కడ ఉన్నారు. మరియు మోషే ఇచ్చిన ప్రతి ఆజ్ఞనూ యెహోషువ చదివాడు.
JOS 9:1 యోర్దాను నదికి పశ్చిమాన ఉన్న రాజులు అందరూ ఈ సంగతులు విన్నారు. హిత్తీ, అమోరీ, కనానీ, పెరిజ్జీ, హివ్వీ, యెబూసీ ప్రజలు రాజులు వీరు. వారు కొండ దేశాల్లోనూ, మైదాన దేశాల్లోనూ నివసించారు. మధ్యధరా సముద్ర తీరంలో లెబానోను వరకూ కూడ వారు నివసించారు.
JOS 9:2 ఈ రాజులంతా ఏకమయ్యారు. యెహోషువ మీద, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటానికి వారు పథకాలు వేసారు.
JOS 9:3 యెరికో, హాయి పట్టణాలను యెహోషువ జయించిన విధానాన్ని గూర్చి గిబియోను పట్టణ ప్రజలు విన్నారు.
JOS 9:4 కనుక వారు ఇశ్రాయేలు ప్రజలను మోసం చేయాలని నిర్ణయించారు. వారి పథకం ఇలా ఉంది: పగిలిపోయి, చినిగిపోయిన పాత ద్రాక్షారసం తిత్తులను వారు పోగుచేసారు. వారి జంతువుల వీపుల మీద ఈ పాత ద్రాక్షారసపు తిత్తులను వారు వేసారు. వారు చాల దూరంనుండి ప్రయాణం చేసివచ్చి నట్టు కనబడాలని ఈ పాత తిత్తులను అలా జంతువుల మీద వేసారు.
JOS 9:5 ఆ మనుష్యులు పాదాలకు పాత చెప్పులు తొడుక్కొన్నారు. వాళ్లు పాత బట్టలు వేసుకొన్నారు. ఎండిపోయిన విరిగిపోతున్న పాత రొట్టె కొంత వారు సంపాదించారు. అందుచేత ఆ మనుష్యులు చాలా దూరంనుండి ప్రయాణం చేసివచ్చినట్టు కనబడ్డారు.
JOS 9:6 అప్పుడు వాళ్లు ఇశ్రాయేలీయుల బసకు వెళ్లారు. ఈ బస గిల్గాలు దగ్గర ఉంది. ఆ మనుష్యులు యెహోషువ దగ్గరకు వెళ్లి, “మేము చాల దూరదేశం నుండి ప్రయాణం చేసి వచ్చాము. మేము మీతో శాంతి ఒడంబడిక చేసుకోవాలని కోరుతున్నాం” అని అతనితో చెప్పారు.
JOS 9:7 ఇశ్రాయేలు మనుష్యులు “ఒకవేళ మీరు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారేమో. ఒకవేళ మీరు మాకు దగ్గర్లోనే నివసిస్తున్నారేమో. మీరు ఎక్కడ్నుంచి వచ్చిందీ మేము తెలుసుకొనేంతవరకు మేము మీతో శాంతి ఒడంబడిక కుదుర్చుకోలేం” అని ఈ హివ్వీయుల వారుతో చెప్పారు.
JOS 9:8 హివ్వీ మనుష్యులు యెహోషువతో “మేము నీ దాసులం” అన్నారు. అయితే యెహోషువ, “మీరెవరు? మీరు ఎక్కడ్నుంచి వచ్చారు?” అని అడిగాడు.
JOS 9:9 అప్పుడు ఆ మనుష్యులు ఇలా జవాబిచ్చారు, “మేము నీ దాసులము. మేము చాలా దూరదేశం నుండి వచ్చాం. మీ యెహోవా దేవుని మహాశక్తిని గూర్చి మేము విన్నందుచేత మేము వచ్చాము. ఆయన చేసిన కార్యాలను గూర్చి మేము విన్నాము. ఈజిప్టులో ఆయన చేసిన వాటన్నింటిని గూర్చి మేము విన్నాం.
JOS 9:10 యోర్దాను నది తూర్పు దిశనున్న అమోరీ రాజులు ఇద్దర్ని ఆయన ఓడించినట్టు మేము విన్నాము. వాళ్లు అష్టారోతు దేశంలో హెష్బాను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు.
JOS 9:11 కనుక మా నాయకులు, ప్రజలు మాతో ఏమన్నారంటే, ‘మీ ప్రయాణానికి కావలనసినంత భోజనం మీతో తీసుకొని వెళ్లండి; వెళ్లి ఇశ్రాయేలు ప్రజల్ని కలువండి. మేము మీ సేవకులం, మాతో శాంతి ఒడంబడిక చేయండి అని వాళ్లతో చెప్పండి’ అన్నారు.
JOS 9:12 “మా రొట్టెలు చూడండీ. మేము ఇల్లు విడిచినప్పుడు ఇది తాజాగా వేడిగా ఉండెను. అయితే ఇప్పుడు ఇది ఎండిపోయి, పాసిపోవటం మీరు చూడగలరు.
JOS 9:13 మా ద్రాక్షారసం తిత్తులను చూడండి. మేము ఇల్లు విడిచినప్పుడు, అవి కొత్తవి, ద్రాక్షారసంతో నిండి ఉండినాయి. ఇప్పుడు అవి పాతబడిపోయి, పిగిలిపోతూ ఉండటం మీకు కనబడుతూనే ఉంది. మా బట్టలు, చెప్పులు చూడండి. మా దూర ప్రయాణంవల్ల మేము ధరించినవన్నీ దాదాపు పాడైపోవటం మీరు చూస్తూనే ఉన్నారు.”
JOS 9:14 ఈ మనుష్యులు చెప్పేది సత్యమో కాదో తెలుసుకోవాలి అనుకొన్నారు ఇశ్రాయేలు మనుష్యులు. కనుక వాళ్లు ఆ రొట్టెను రుచి చూసారు-కాని ఏమి చేయాలనే విషయం వారు యెహోవాను అడుగలేదు.
JOS 9:15 వాళ్లతో శాంతి ఒడంబడిక చేసుకొనేందుకు యెహోషువ ఒప్పుకున్నాడు. వాళ్లను బతక నిచ్చేందుకు అతడు అంగీకరించాడు. ఈ ఒడంబడికకు ఇశ్రాయేలు నాయకులు ఒప్పుకున్నారు.
JOS 9:16 మూడు రోజుల తర్వాత, ఆ మనుష్యులు వారి గుడారాలకు చాల దగ్గర్లో నివసిస్తున్నవారేనని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకొన్నారు.
JOS 9:17 కనుక వాళ్లు నివసిస్తున్న చోటుకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్లారు. మూడవ నాడు ఆ ప్రజలు నివసిస్తున్న గిబియోను, కెఫిరా, బెయెరోతు, కిర్యత్యారీము పట్టణాలకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్లారు.
JOS 9:18 కానీ ఇశ్రాయేలు సైన్యం ఆ పట్టణాలమీద యుద్ధం చేయోలని ప్రయత్నించలేదు. వారు ఆ ప్రజలతో శాంతి ఒడంబడిక కుదుర్చుకొన్నారు. వారు ఇశ్రాయేలీయుల యెహోవా దేవుని ఎదుట ఆ ప్రజలకు ప్రమాణం చేసారు. ఆ ప్రమాణం చేసిన నాయకులను ప్రజలంతా నిందించారు.
JOS 9:19 అయితే నాయకులు జవాబు చెప్పారు: “మేము మా వాగ్దానం చేసాము. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుని ఎదుట మేము ప్రమాణం చేసాము. ఇప్పుడు మేము వాళ్లతో యుద్ధం చేయలేము.
JOS 9:20 మనము ఇలా చేయాలి. మనం వాళ్లను బతకనివ్వాలి. మనము వాళ్లకు హాని చేయకూడదు, లేదా మనం వారితో చేసిన ప్రమాణం ఉల్లంఘించిన కారణంగా యెహోవా కోపం మనమీద ఉంటుంది.
JOS 9:21 అందుచేత వాళ్లను బ్రతక నిద్దాం. అయితే వాళ్లు మనకు బానిసలుగా ఉంటారు. వాళ్లు మనకోసం కట్టెలు కొట్టి, మన ప్రజలందరి కోసం నీరు మోస్తారు.” అందుచేత ఆ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆ నాయకులు ఉల్లంఘించలేదు.
JOS 9:22 గిబియోను ప్రజలను పిలిచాడు యెహోషువ. “మీరు ఎందుకు మాతో అబద్ధం చెప్పారు? మీ దేశం మా పాళెము పక్కనే ఉంది. కానీ మీరు చాలా దూర దేశంనుండి వచ్చినట్టు మాతో చెప్పారు.
JOS 9:23 ఇప్పుడు మీ ప్రజలకు చాల కష్టాలు ఎదురవుతాయి. మీ ప్రజలంతా బానిసలుగా ఉంటారు. దేవుని ఆలయం కోసం వాళ్లు కట్టెలు కొట్టాలి, నీరు మోయాలి” అని అతడు చెప్పాడు.
JOS 9:24 గిబియోనీ ప్రజలు జవాబు చెప్పాడు: “మీరు మమ్మల్ని చంపేస్తారని భయంతో మేము మీకు అబద్ధం చెప్పాము. ఈ దేశం అంతా మీకు ఇచ్చేస్తానని దేవుడు తన సేవకుడు మోషేతో చెప్పినట్టు మేము విన్నాము. ఈ దేశంలో నివసిస్తున్న మనుష్యలందరినీ చంపివేయమనికూడా దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. అందుకే మేము మీతో అబద్ధం చెప్పాము.
JOS 9:25 ఇప్పుడు మేము మీకు దాసులం మీకు సరియైనదిగా అనిపించిన ప్రకారం మీరు మాకు ఏమైనా చేయవచ్చు.”
JOS 9:26 కనుక గిబియోను ప్రజలు బానిసలు అయ్యారు. అయితే యోహషువ వారి ప్రాణాలు రక్షించాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్లను చంపకుండా చేసాడు యెహోషువ.
JOS 9:27 యెహోషువ గిబియోను ప్రజలను ఇశ్రాయేలు ప్రజలకు బానిసలుగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజలకోసం, యెహోవా బలిపీఠం ఎక్కడ ఉండాలని యెహోవా కోరితే అక్కడ దానికోసం వారు కట్టెలు నరికి, నీరు మోసారు. ఆ ప్రజలు నేటికీ బానిసలే.
JOS 10:1 అప్పట్లో అదోనీసెదెకు యెరూషలేము రాజు. యెహోషువ హాయిని ఓడించి, దానిని సర్వ నాశనం చేసాడని ఈ రాజు విన్నాడు. యెరికోకు, దాని రాజుకుకూడా యెహోషువ అలానే చేసాడని ఆ రాజు తెలుసుకొన్నాడు. గిబియోను ప్రజలు ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొన్నారని, ఆ ప్రజలు యెరూషలేంకు సమీపంగానే నివసిస్తున్నారని కూడా ఆ రాజు తెలుసుకొన్నాడు.
JOS 10:2 అందుచేత ఈ విషయాల మూలంగా అదోనీ సెదెక్, అతని ప్రజలు చాలా భయపడ్డారు. హాయివలె గిబియోను చిన్న పట్టణం కాదు. ఏ రాజధాని పట్టణమైనా ఎంత పెద్దగా ఉంటుందో, గిబియోను అంత పెద్ద పట్టణం. మరియు ఆ పట్టణంలోని పురుషులంతా మంచి శూరులు. కనుక వారు భయపడ్డారు.
JOS 10:3 యెరూషలేము రాజు అదోనీసెదెక్, హెబ్రోను రాజైన హోహంతో మాట్లాడాడు. యార్మూత్ రాజైన పిరాముతో, లాకీషు రాజు యాఫీయతో, ఎగ్లోన్ రాజైన దెబీరుతో కూడా అతడు మాట్లాడాడు.
JOS 10:4 “మీరు నాతో కూడా గిబియోను మీద దాడి చేసేందుకు వచ్చి సహాయం చేయండి. యెహోషువతో, ఇశ్రాయేలు ప్రజలతో గిబియోను శాంతి ఒడంబడిక కుదుర్చు కొంది” అని యెరూషలేము రాజు వీళ్లను బతిమిలాడాడు.
JOS 10:5 అందుచేత ఈ అయిదుగురు ఆమోరీ రాజులూ వారి సైన్యాలను ఏకం చేసారు. (అయిదుగురు రాజులు ఎవరనగా, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యార్మూత్ రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు) మరియ వారి సైన్యాలు గిబియోను మీదికి వెళ్లాయి. ఆ సైన్యాలు పట్టణాన్ని చుట్టు ముట్టడించి, దానిమీద పోరాటం మొదలు పెట్టాయి.
JOS 10:6 గిల్గాలులో తన పాళెములో ఉన్న యెహోషువ దగ్గరకు గిబియోను పట్టణం లోని ప్రజలు సందేశం పంపించారు. “మేము నీ సేవకులము. మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకు. వచ్చి మాకు సహాయంచేయి. త్వరపడు. మమ్మల్ని రక్షించు. కొండ దేశంలోని అమోరీ రాజులంతా వారి సైన్యాలను ఏకంచేసారు. మామీద వాళ్లు యుద్ధం చేస్తున్నారు” ఇదీ ఆ సందేశం.
JOS 10:7 కనుక యెహోషువ తన సైన్యం అంతటితో గిల్గాలునుండి బయల్దేరాడు. యెహోషువ యొక్క మంచి శూరులంతా అతనితో ఉన్నారు.
JOS 10:8 యెహోవా, “ఆ సైన్యాల విషయమైన భయపడకు. నీవు వాళ్లను జయించేటట్టు నేను చేస్తాను. ఆ సైన్యాల్లో ఏదీ నిన్ను జయించజాలదు” అని యెహోషువతో చెప్పాడు.
JOS 10:9 యెహోషువ, అతని సైన్యం రాత్రంతా గిబియోనుకు ప్రయాణం చేసారు. (యెహోషువ వస్తున్నట్టు శత్రువుకు తెలియదు.) అందుచేత యెహోషువ వారిమీద దాడి చేసి వాళ్లకు ఆశ్చర్యం కలిగించాడు.
JOS 10:10 ఇశ్రాయేలీయులు దాడి చేసినప్పుడు అవతలి సైన్యాలను యెహోవా చాల గలిబిలి చేసాడు. కనుక ఇశ్రాయేలీయులు గొప్ప విజయంతో వారిని ఓడించారు. ఇశ్రాయేలీయులు గిబియోనునుండి వారిని తరిమివేసారు. బేత్‌హోరోను మార్గంవరకు ఇశ్రాయేలీయులు వారిని తరిమివేసారు. అజెకా, మక్కెదా వరకు ఇశ్రాయేలు సైన్యం ఆ మనుష్యుల్ని చంపారు.
JOS 10:11 ఇశ్రాయేలు సైన్యం వారి శత్రువుల్ని బెత్‌హారాన్ నుండి అజెకావరకు దారి పొడవునా తరిమారు. వారు శత్రువును తరుముతూ ఉండగా, యెహోవా ఆకాశంనుండి పెద్ద వడగండ్లు కురిపించాడు. ఈ పెద్ద వడగండ్ల మూలంగా శత్రువులు అనేకమంది చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఖడ్గంతో చంపిన వారికంటె ఈ వడగండ్ల మూలంగానే చాల ఎక్కువమంది మరణించారు.
JOS 10:12 ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలను ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. మరియు ఆ రోజు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నిలిచి యెహోవాతో ఇలా చెప్పాడు: “ఓ సూర్యుడా, గిబియోనుకు పైగా ఆకాశంలో నిలిచి ఉండు, ఓ చంద్రుడా, అయ్యాలోను లోయలో నిలిచి ఉండు.”
JOS 10:13 కనుక సూర్యుడు కదలలేదు. ప్రజలు తమ శత్రువులను ఓడించేంతవరకు చంద్రుడు కూడ నిలిచిపోయాడు. ఇది యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆకాశం మధ్యలో సూర్యుడు స్తంభించిపోయాడు. ఒక రోజంతా అది కదల్లేదు.
JOS 10:14 ఆ రోజుకు ముందు ఎన్నడూ అలా జరుగలేదు. ఆ తర్వాత కూడ ఎన్నడూ మళ్లీ అలా జరుగలేదు. ఆ రోజు మనిషి మాట యెహోవా విన్నరోజు. నిజంగా ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవా యుద్ధం చేసాడు!
JOS 10:15 ఇది జరిగిన తర్వాత యెహోషువా, అతని సైన్యం తిరిగి గిల్గాలు దగ్గర గుడారాలకు వెళ్లిపోయారు.
JOS 10:16 యుద్ధ సమయంలో ఆ అయిదుగురు రాజులూ పారిపోయారు. మక్కెదా సమీపంలో ఒక గుహలో వారు దాగుకొన్నారు.
JOS 10:17 అయితే ఆ అయిదుగురు రాజులు ఆ గుహలో దాగుకోవటం ఎవరో కనుక్కొన్నారు. యెహోషువకు ఈ విషయం తెలిసింది.
JOS 10:18 యెహోషువ చెప్పాడు, “ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండలతో మూసివేయండి. ఆ గుహకు కాపలాగా కొందరు మనుష్యుల్ని అక్కడ ఉంచండి.
JOS 10:19 కానీ మీరు అక్కడ ఉండొద్దు. శత్రువును తరుముతూనే ఉండండి. వెనుకనుండి వారిమీద మీ దాడి కొనసాగించండి. శత్రువుల్ని తిరిగి పట్టణాలకు క్షేమంగా వెళ్లనీయకండి. మీ యెహోవా దేవుడు వారిమీద మీకు విజయం ఇచ్చాడు.”
JOS 10:20 కనుక యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలూ శత్రువులను చంపేసారు. అయితే శత్రువులు కొందరు తప్పించుకొని, వారి పట్టణాలకు వెళ్లి దాగుకోగలిగారు. వీళ్లు చంపబడలేదు.
JOS 10:21 పోరాటం అయిపోయిన తర్వాత యెహోషువ మనుష్యులు మక్కెదా దగ్గర అతని దగ్గరకు తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఒక్కమాట పలికే ధైర్యంగలవాళ్లు ఆ దేశంలో ఒక్కరూ లేకపోయారు.
JOS 10:22 యెహోషువ చెప్పాడు, “గుహను మూసిన బండలను తీసివేసి, ఆ అయిదుగురు రాజులనూ నా దగ్గరకు తీసుకొని రండి” అని.
JOS 10:23 కనుక యెహోషువ మనుష్యులు ఆ అయిదుగురు రాజులనూ గుహలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. ఈ అయిదుగురు రాజులూ యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు.
JOS 10:24 కనుక ఆ ఐదుగురు రాజులనూ వారు యెహోషువ దగ్గరకు తీసుకొని వచ్చారు. యెహోషువ తన మనుష్యులందరినీ ఆ చోటుకి పిలిచాడు. “ఇక్కడికి వచ్చి, ఈ రాజుల మెడలమీద మీ పాదాలు పెట్టండి” అని తన సైన్యాధికారులతో యెహోషువ చెప్పాడు. అందుచేత యెహుషువ సైన్యాధికారులు దగ్గరగా వచ్చారు. వారు ఆ రాజుల మెడలమీద తమ పాదాలు పెట్టారు.
JOS 10:25 అప్పుడు యెహోషువ: “బలంగా, ధైర్యంగా ఉండండి. భవిష్యత్తులో మీరు యుద్ధం చేసే శత్రువులందరికీ యెహోవా ఏమి చేస్తాడో నేను మీకు చూపిస్తాను” అన్నాడు తన మనుష్యులతో.
JOS 10:26 అప్పుడు యెహోషువ ఆ అయిదుగురు రాజులనూ చంపేసాడు. అతడు వారి శరీరాలను ఐదు చెట్లకు వేలాడదీసాడు. యెహోషువ వాళ్లను అలానే సాయంత్రంవరకు చెట్లకు వేలాడనిచ్చాడు.
JOS 10:27 సూర్యాస్తమయమప్పుడు ఆ శవాలను చెట్లనుండి దించమని యెహోషువ తన మనుష్యులతో చెప్పాడు. అప్పుడు వారు ఆ శవాలను, అంతకు ముందు వారు దాగుకొన్న గుహలోనే పడవేసారు. ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండలతో వారు మూసివేసారు. నేటికీ ఆ శవాలు ఆ గుహలోనే ఉన్నాయి.
JOS 10:28 ఆ రోజు యెహోషువ మక్కెదాను జయించాడు. ఆ పట్టణంలోని రాజును, ప్రజలను యెహోషువ చంపేసాడు. మనుష్యులు ఎవ్వరూ ప్రాణాలతో విడిచి పెట్టబడలేదు. యెరికో రాజుకు చేసినట్టే మక్కెదా రాజుకు యెహోషువ చేసాడు.
JOS 10:29 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ మక్కెదానుండి ప్రయాణం చేసారు. వారు లిబ్నా వెళ్లి ఆ పట్టణంపై దాడి చేసారు.
JOS 10:30 ఆ పట్టణాన్ని, దాని రాజును ఇశ్రాయేలు ప్రజలు ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తినీ ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. మనుష్యులెవ్వరూ ప్రాణాలతో విడువబడలేదు. మరియు ప్రజలు యెరికో రాజుకు చేసినట్టే ఆ రాజుకుకూడ చేసారు.
JOS 10:31 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ లిబ్నా విడిచి, లాకీషుకు ప్రయాణమయ్యారు. యెహోషువ, అతని సైన్యం లిబ్నా దగ్గర్లోనే ఉండి, ఆ పట్టణం మీద దాడి చేసారు.
JOS 10:32 ఇశ్రాయేలు ప్రజలు లాకీషు పట్టణాన్ని ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. వారు ఆ పట్టణాన్ని రెండో రోజున ఓడించారు. ఆ పట్టణంలో ప్రతి వ్యక్తినీ ఇశ్రాయేలు ప్రజలు చంపేసారు. లిబ్నాకు అతడు చేసిందికూడ ఇదే.
JOS 10:33 ఇదే సమయంలో గెజెరు రాజైన హోరాము, లాకీషుకు సహాయం చేసేందుకు వచ్చాడు. కానీ అతణ్ణి, అతని సైన్యాన్ని కూడ యెహోషువ ఓడించాడు. అక్కడ మనుష్యులు ఎవరూ బతికి బయటపడలేదు.
JOS 10:34 అప్పుడు యెహోషువ, అతని ప్రజలు అందరూ లాకీషునుండి ఎగ్లోనుకు ప్రయాణ మయ్యారు. వారు ఎగ్లోను చుట్టు పక్కల బసచేసి దానిమీద దాడిచేసారు.
JOS 10:35 ఆ రోజు వారు ఆ పట్టణాన్ని పట్టుకొని, ఆ పట్టణంలో ప్రజలందరినీ చంపేసారు. వారు లాకీషుకు చేసిందికూడ ఇదే.
JOS 10:36 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఎగ్లోను నుండి హెబ్రోనుకు ప్రయాణమయ్యారు. అప్పుడు వారు హెబ్రోను మీద దాడి చేసారు.
JOS 10:37 ఆ పట్టణాన్ని, హెబ్రోను చుట్టుపట్ల ఉన్న చిన్న చిన్న ఊళ్లను వారు పట్టుకొన్నారు. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ ఇశ్రాయేలు ప్రజలు చంపేసారు. అక్కడ ఏ ఒక్కరినీ వారు బ్రతకనియ్యలేదు. వారు ఎగ్లోనుకు చేసింది కూడ ఇదే. వారు ఆ పట్టణాన్ని నాశనంచేసి, అందులోని ప్రజలందరినీ చంపివేసారు.
JOS 10:38 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ తిరిగి దెబీరుకు వెళ్లి, ఆ పట్టణం మీద దాడి చేసారు.
JOS 10:39 వారు ఆ పట్టణాన్ని, దాని రాజును, దెబీరు సమీపంలోవున్న చిన్న చిన్న పట్టణాలన్నింటినీ స్వాధీనం చేసుకొన్నారు. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ వారు చంపేసారు. అక్కడ ఎవరినీ బ్రతకనియ్యలేదు. హెబ్రోనుకు, దాని రాజుకు చేసినట్టే, దెబీరుకు, దాని రాజుకు ఇశ్రాయేలు ప్రజలు చేసారు. లిబ్నాకు, దాని రాజుకు కూడ వారు ఇలానే చేసారు.
JOS 10:40 కనుక నెగెవు, కొండ ప్రాంతపు పట్టణాల రాజులందరినీ, పడమటి కొండ చరియలనూ, తూర్పు కొండ చరియలనూ, యెహోషువ ఓడించేసాడు. ఆ ప్రజలందరినీ చంపివేయుమని ఇశ్రాయేలీయుల దేవుడైన యోహోవా యోహోషువతో చెప్పాడు. అందుచేత ఆ స్థలాల్లో ఎవ్వరినీ యెహోషువ ప్రాణాలతో విడిచిపెట్టలేదు.
JOS 10:41 కాదేషు బర్నేయనుండి గాజా వరకు గల పట్టణాలన్నింటినీ యెహోషువ స్వాధీనం చేసుకొన్నాడు. గోషేను (ఈజిప్టు) దేశం నుండి గిబియోను వరకుగల పట్టణాలన్నింటినీ అతడు స్వాధీనం చేసుకొన్నాడు.
JOS 10:42 ఆ ప్రయాణంలో ఆ పట్టణాలన్నింటినీ, వాటి రాజులందరినీ యెహోషువ పట్టుకొన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేసినందువల్ల యెహోషువ ఇలా చేయగలిగాడు.
JOS 10:43 అప్పుడు యెహోషువ, ఇశ్రేయేలు ప్రజలు అందరు గిల్గాలు లోని వారి గుడారాలకు తిరిగి వెళ్లారు.
JOS 11:1 జరిగిన ఈ సంగతులు అన్నింటిని గూర్చి హాసోరు రాజు యాబిను విన్నాడు. అందుచేత అతడు అనేకమంది రాజుల సైన్యాలను సమకూర్చాలని నిర్ణయించాడు. మదోను రాజైన యోబాబు, షిమ్రోను రాజు, అక్షపు రాజు,
JOS 11:2 ఉత్తరాన కొండదేశం, ఎడారి రాజులు ఇద్దరికి యాబిను సందేశం పంపించాడు. కిన్నెరెత్, నెగెవ్, పడమటి దిగువ కొండల రాజులకు యాబిను సందేశం పంపించాడు. పడమట నఫోత్‌దార్ రాజుకుగూడ యాబిను సందేశం పంపించాడు.
JOS 11:3 యాబిను ఆ సందేశాన్ని తూర్పు, పడమరలలో ఉన్న కనానీ ప్రజల రాజులకు పంపించాడు. కొండ ప్రదేశాల్లో నివసిస్తున్న అమోరీ ప్రజలకు, హిత్తీ ప్రజలకు, పెరిజ్జీ ప్రజలకు, యెబూసీ ప్రజలకు పంపించాడు. మిస్పా ప్రాంతంలో హెర్మోను కొండ దిగువలో నివసిస్తున్న హివ్వీ ప్రజలకుగూడ అతడు ఆ సందేశం పంపించాడు.
JOS 11:4 కనుక ఈ రాజులందరి సైన్యాలు కూడి వచ్చాయి. అక్కడ ఎంతోమంది శూరులు ఉన్నారు, ఎన్నో రథాలు, ఎన్నో గుర్రాలు ఉన్నాయి. అది అతి విస్తారమైన సైన్యం. సముద్ర తీరంలో ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయో అంతమంది ఉన్నట్టున్నారు.
JOS 11:5 ఈ రాజులంతా మెరోము అనే చిన్న నది దగ్గర సమావేశ మయ్యారు. వారు తమ సైన్యాలను ఒకే చోటచేర్చారు. ఇశ్రాయేలీయుల మీద పోరాడేందుకు వారు ఏర్పాట్లు చేసారు.
JOS 11:6 అప్పుడు యెహోవా, “ఆ సైన్యాన్ని చూచి భయపడకు. రేపు ఈ వేళకు మీరు ఆ సైన్యాన్ని ఓడించేటట్టు నేను చేస్తాను. వాళ్లందరినీ మీరు చంపేస్తారు. మీరు వారి గుర్రాల కుడికాళ్ల నరాలను నరికివేసి, వారి రథాలను తగులబెట్టేస్తారు” అని యెహోషువతో చెప్పాడు.
JOS 11:7 యెహోషువ, అతని సర్వసైన్యం శత్రువును ఆశ్చర్యచకితులుగా చేసారు. మెరోము నది వద్ద వారు శత్రువుమీద దాడి చేసారు.
JOS 11:8 ఇశ్రాయేలీయులు వారిని ఓడించేటట్టు చేసాడు యెహోవా. ఇశ్రాయేలీయులు వారిని ఓడించి, మహా సీదోను, మిస్రెపోత్మాయిము, తూర్పున మిస్పాలోయ వరకు వారిని తరిమివేసారు. శత్రువులలో ఒక్కరుకూడ బతకకుండా చచ్చేవరకు ఇశ్రాయేలు సైన్యం పోరాడింది.
JOS 11:9 యెహోషువ ఏమి చేయాలని యెహోవా చెప్పాడో అతడు అలాగే చేసాడు-యెహోషువ వారి గుర్రాల కుడికాళ్ల నరాలను తెగగొట్టి, వారి రథాలను కాల్చివేసాడు.
JOS 11:10 అప్పుడు యెహోషువ వెనుకకు వెళ్లి హసోరు పట్టణాన్ని పట్టుకొన్నాడు. హసోరు రాజును యెహోషువ చంపివేసాడు. (ఇశ్రాయేలీయుల మీద యుద్ధంచేసిన రాజ్యాలన్నింటికీ హసోరు నాయకుడు.)
JOS 11:11 ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ ఇశ్రాయేలు సైన్యం చంపేసింది. వారు ఆ ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేసారు. ప్రాణంతో ఏదీ విడువబడలేదు. అప్పుడు వారు ఆ పట్టణాన్ని కాల్చివేసారు.
JOS 11:12 ఈ పట్టణాలన్నింటినీ యెహోషువ పట్టుకొన్నాడు. వాటి రాజులందరినీ అతడు చంపివేసాడు. ఆ పట్టణాల్లో ఉన్న సమస్తాన్నీ పూర్తిగా యెహోషువ నాశనం చేసాడు. యెహోవా సేవకుడు మోషే ఆజ్ఞాపించినట్టే అతడు ఇలా చేసాడు.
JOS 11:13 కానీ వారి కొండలమీద కట్టబడిన పట్టణాలలోని ఒక్కటికూడ ఇశ్రాయేలు సైన్యం కాల్చివేయలేదు. వారు కాల్చివేసిన కొండ మీద పట్టణం హజోరు మాత్రమే. ఇది యెహోషువ కాల్చిన పట్టణం.
JOS 11:14 ఈ పట్టణాల్లో దొరికిన వాటన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలు వారికోసమే ఉంచుకొన్నారు. ఆ పట్టణంలోని జంతువులన్నింటినీ వారే ఉంచుకొన్నారు. కానీ అక్కడ ప్రజలను అందరినీ చంపివేసారు. మనుష్యులు ఎవరినీ వారు బ్రతకనివ్వలేదు.
JOS 11:15 ఇలా చేయుమని చాలకాలం క్రితమే యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. ఇలా చేయుమని మోషే యెహోషువకు ఆజ్ఞాపించియున్నాడు. కనుక యెహోషువ దేవునికి విధేయుడయ్యాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని యెహోషువ జరిగించాడు.
JOS 11:16 కనుక ఈ దేశం అంతటిలో ఉన్న ప్రజలందరినీ యెహోషువ ఓడించాడు. కొండదేశం, నెగెవు ప్రాంతం, గోషెను ప్రాంతం అంతాను, పడమటి కొండల దిగువ ప్రాంతం, అరాబా ప్రాంతం, ఇశ్రాయేలు పర్వతాలు, వాటి దగ్గర్లో ఉన్న కొండలు అన్నింటిమీదా అతడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు.
JOS 11:17 శేయీరు దగ్గర హాలాకు కొండ నుండి హెర్మోను కొండ దిగువన లెబానోను లోయలో బయల్గాదు వరకు ఉన్న దేశం అంతా యెహోషువ స్వాధీనంలో ఉంది. ఆ దేశంలోని రాజులందరినీ యెహోషువ పట్టుకొని చంపివేసాడు.
JOS 11:18 యెహోషువ ఆ రాజులతో చాల సంవత్సారాలు యుద్ధం చేసాడు.
JOS 11:19 ఆ దేశం మొత్తంలో ఒక్క పట్టణం మాత్రమే ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొంది. గిబియోనులో నివసిస్తున్న హివ్వీ ప్రజలే వారు. మిగతా పట్టణాలన్నీ యుద్ధంలో ఓడించబడ్డాయి.
JOS 11:20 ఆ ప్రజలు తాము చాలా బలంగల వాళ్లమని అనుకోవాలనే యెహోవా కోరాడు. అప్పుడే వారు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తారు. ఈ విధంగా ఆయన వారిని నిర్దాక్షిణ్యంగా నాశనం చేయనిచ్చాడు. మోషే ఏమిచేయాలని యెహోవా ఆజ్ఞాపించాడో అలాగే ఆయన వారిని నాశనం చేయబడనిచ్చాడు.
JOS 11:21 హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా ప్రాంతాల్లోను, కొండదేశంలోను అనాకీ ప్రజల నివసించారు. ఈ అనాకీ ప్రజలతో యెహోషువ యుద్ధం చేసాడు. ఆ ప్రజలందరినీ, వారి పట్టణాలను యెహోషువ పూర్తిగా నాశనం చేసాడు.
JOS 11:22 ఇశ్రాయేలు దేశంలో అనాకీ ప్రజలు ఎవ్వరూ ప్రాణంతో మిగుల లేదు. మిగిలిన అనాకీ ప్రజలు గాజా, గాతు, అష్డోదులలో నివసించారు.
JOS 11:23 ఇశ్రాయేలు దేశం అంతటినీ యెహోషువ స్వాధీనం చేసుకొన్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా మోషేకు చెప్పింది ఇదే. యెహోవా వాగ్దానం చేసినందువల్ల ఆయన ఆ దేశాన్నీ ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. యెహోషువ ఆ దేశాన్ని ఇశ్రాయేలు వంశాలకు పంచిపెట్టాడు. అప్పుడు యుద్ధం ముగిసింది. చివరికి దేశంలో శాంతి నెలకొంది.
JOS 12:1 యోర్ధాను నదికి తూర్పున ఉన్న దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకొన్నారు. అర్నోను లోయనుండి హెర్మోను కొండవరకు, అరా బాకు తూర్పు ప్రాంతాన గల భూమి అంతా ఇప్పుడు వారిదే. ఈ భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఓడించిన రాజుల జాబితా ఇది:
JOS 12:2 హెష్బోను పట్టణంలో నివసిస్తున్న అమోరీ ప్రజల రాజు సీహోను, అర్నోను లోయవద్ద అరోయేరు నుండి యబ్బోకు నదివరకుగల దేశం అంతా అతడు పాలించాడు. ఆ లోయ మధ్యనుండి అతడి దేశంమొదలవుతుంది. అమ్మోనీ ప్రజలకు, వారికి ఇది సరిహద్దు. గిలాదులోని సగం భూమిని సీహోను పాలించాడు.
JOS 12:3 అరాబా తూర్పు ప్రాంతంలో కిన్నెరెతు సముద్రంనుండి అరాబా సముద్రం (ఉప్పు సముద్రం) వరకు అతడు పాలించాడు. బెత్ ఎషిమోతు నుండి దక్షిణాన పిస్గా కొండల వరకు అతడు పాలించాడు.
JOS 12:4 బాషాను రాజు ఓగు రెఫాయిము సంతతివాడు. అష్టారోతు, ఎద్రేయిలో ఓగు దేశాన్ని పాలించాడు.
JOS 12:5 హెర్మోను కొండ, సలెకా, బాషాను ప్రాంతం అంతా ఓగు పాలించాడు. గెషూరు, మాక ప్రజలు నివసించిన చోట అతని దేశం సరిహద్దు. గిలాదులో సగం భూభా గాన్ని కూడ ఓగు పాలించాడు. హెష్బోను రాజు సీహోను భూమికి ఈ భూమి సరిహద్దు.
JOS 12:6 యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఈ రాజులందరినీ ఓడించారు. మరియు ఆ భూమిని రూబేను వంశం, గాదు వంశం మనష్షే వంశంలో సగం భాగానికి మోషే ఇచ్చాడు. ఈ భూమిని వారికి స్వంతంగా ఇచ్చేసాడు మోషే.
JOS 12:7 యోర్దాను నదికి పశ్చిమాన ఉన్న దేశంలోని రాజులందరినీ కూడ ఇశ్రాయేలు ప్రజలు ఓడించారు. ఈ దేశంలో ప్రజలను యెహోషువ నడిపించాడు. ఈ దేశాన్ని యెహోషువ ప్రజలకు ఇచ్చి, పన్నెండు వంశాల వారికి దీనిని పంచిపెట్టాడు. ఇది వారికి ఇస్తానని దేవునిచే వాగ్దానం చేయబడిన దేశం లెబానోను లోయలోని బయెల్‌గాదుకు శేయీరు దగ్గర హాలాకు కొండకు మధ్య ఉంది ఈ భూమి.
JOS 12:8 కొండ దేశం, పశ్చిమాన పడమటి కొండ దిగువ, అరాబా, పర్వతాలు, ఎడారి, నెగెవు దీనిలో ఉన్నాయి. హిత్తీ ప్రజలు, హివ్వీ ప్రజలు, అమోరీ ప్రజలు, కనానీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసించిన దేశం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఓడించిన రాజుల జాబితా ఇది:
JOS 12:9 యెరికో రాజు#1 బేతేలు దగ్గరనున్న హాయి రాజు#1
JOS 12:10 యెరూషలేము రాజు#1 హెబ్రోను రాజు#1
JOS 12:11 యార్ముతు రాజు#1 లాకీషు రాజు#1
JOS 12:12 ఎగ్లోను రాజు#1 గెజెరు రాజు#1
JOS 12:13 దెబీరు రాజు#1 గెదెరు రాజు#1
JOS 12:14 హోర్మా రాజు#1 అరాదు రాజు#1
JOS 12:15 లిబ్నా రాజు#1 అదుల్లాం రాజు#1
JOS 12:16 మక్కెద రాజు#1 బేతేలు రాజు#1
JOS 12:17 తపువ రాజు#1 హెపెరు రాజు#1
JOS 12:18 అఫెకు రాజు#1 లాషారోను రాజు#1
JOS 12:19 మదోను రాజు#1 హిజోరు రాజు#1
JOS 12:20 షిమ్రోన్ మెరోన్ రాజు#1 అక్షపు రాజు#1
JOS 12:21 తానాకు రాజు#1 మెగిద్దో రాజు#1
JOS 12:22 కెదెషు రాజు#1 కర్మెలులోని యొకెనం రాజు#1
JOS 12:23 దోరు పర్వతంలో దోరు రాజు#1 గిల్గాలులోని గోయిం రాజు#1
JOS 12:24 తిర్సా రాజు#1 మొత్తం రాజులు (ముఫ్పై ఒకటి)#31
JOS 13:1 యెహోషువ చాల ముసలివాడై నప్పుడు యెహోవా అతనితో చెప్పాడు: “యెహోషువా, నీవు ముసలివాడవై పోయావు. కానీ నీవు స్వాధీనం చేసుకోవాల్సిన భూమి ఇంకా చాలా ఉంది.
JOS 13:2 ఫిలిష్తీయుల దేశానన్ని, గెషూరు దేశాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు.
JOS 13:3 ఈజిప్టు దగ్గర షీహోరు నది నుండి ఉత్తరాన ఎక్రోను సరిహద్దు వరకు గల ప్రాంతాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. అది కనానీ ప్రజలకు చెందినది. గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోనుల ఐదుగురు ఫిలిష్తీ నాయకులను ఇంకా నీవు జయించాలి. నీవు అవ్వీతీ ప్రజలను,
JOS 13:4 కనాను దేశానికి దక్షిణాన ఉన్న వారిని కూడ నీవు ఓడించాలి.
JOS 13:5 గెబాలీ ప్రజల ప్రాంతాన్ని నీవు ఇంకా ఓడించలేదు. హెర్మోను కొండ దిగువన బయెల్‌గాదుకు తూర్పున లిబోహ-మాత్ వరకు గల లెబానోను ప్రాంతం కూడ ఉంది.
JOS 13:6 “లెబానోనునుండి మిశ్రేఫోత్మాయిము వరకూ గల కొండ దేశంలో సీదోను ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజల కోసం ఈ ప్రజలందరినీ నేను బయటకు వెళ్లగొట్టేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు నీవు భూమిని పంచి పెట్టేటప్పుడు ఈ భూమిని తప్పక జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు చెప్పినట్టు ఇలానే చేయి.
JOS 13:7 ఇప్పుడు తొమ్మిది వంశాలు, మనష్షే సగం వంశం వారికి ఈ భూమిని విభజించు.”
JOS 13:8 మనష్షే వంశంలో మిగిలిన సగం మందికి ఇదివరకే నేను భూమి ఇచ్చాను. రూబేను వంశం వారికి, గాదు వంశం వారికి నేను ఇదివరకే భూమిని ఇచ్చాను. యోర్దాను నది తూర్పున యెహోవా సేవకుడు మోషే వారికి భూమిని ఇచ్చాడు.
JOS 13:9 యోర్దాను నది తూర్పున మోషే వారికి ఇచ్చిన భూమి ఇదే: దీబోను వరకు గల మేదెబా మైదాన ప్రాంతం అంతా ఇందులో ఉంది. అర్నోను లోయదగ్గర అరోయేరు వద్ద ఈ భూమి మొదలవుతుంది, ఆ లోయ మధ్యలోగల పట్టణం వరకు ఆ భూమి విస్తరించి ఉంది.
JOS 13:10 అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన పట్టణాలన్నీ ఆ దేశంలో ఉన్నాయి. రాజు హెష్బోను పట్టణంలో ఉండి పాలించాడు. అమోరీ ప్రజలు నివసించిన ప్రాంతం వరకు ఈ దేశం విస్తరించింది.
JOS 13:11 గిలాదు పట్టణం కూడ ఆ దేశంలో ఉంది. గెషూరు, మాయకా ప్రజలు నివసించిన ప్రాంతంకూడ ఆ దేశంలో ఉంది. హెర్మోను పర్వతం అంతా, సల్కావరకు బాషాను అంతా ఆ దేశంలో ఉంది.
JOS 13:12 ఓగు రాజు రాజ్యమంతా ఆ దేశంలో ఉంది. ఓగు రాజు బాషానులో పాలించాడు. గతంలో అతడు అష్టారోతు, ఎద్రేయీలో పాలించాడు. ఓగు రెఫాయిము ప్రజలనుండి వచ్చినవాడు. గతంలో మోషే ఆ ప్రజలను ఓడించి, వారి దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
JOS 13:13 గెషూరు, మయకా ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు బలవంతంగా బయటకు వెళ్లగొట్టలేదు. నేటికీ ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నారు.
JOS 13:14 లేవీ వంశం ఒక్కటే భూమి ఏమీ లభించని కుటుంబం. దానికి బదులుగా, ఇశ్రాయేలీయుల యెహోవా దేవునికి దహన బలులుగా అర్పించబడిన జంతువులన్నీ లేవీ కుటుంబంవారు తీసుకుంటారు. అదే యెహోవా వారికి వాగ్దానం చేసింది.
JOS 13:15 రూబేను వంశంలో ప్రతి వంశంవారికీ మోషే కొంత భూమి ఇచ్చాడు. వారికి దొరికిన భూమి ఇది:
JOS 13:16 అర్నోను లోయదగ్గర అరోయేరునుండి మేదెబా పట్టణంవరకు గల భూమి. ఆ లోయ మధ్యలో ఉన్న పట్టణం, మైదానం మొత్తం ఇందులో ఉంది.
JOS 13:17 హెష్బోను వరకు ఉంది ఈ భూమి. మైదానంలోని పట్టణాలన్నీ ఈ భూమిలో ఉన్నాయి. ఆ పట్టణాలు దీబోను, బామోత్ బయలు, బేత్‌బయల్మెయోను,
JOS 13:18 యహజ్, కెదెమోతు, మేఫాతు,
JOS 13:19 కిర్యతాయిము, సిబ్మా లోయలోని కొండమీది యెరెత్ షహిరు,
JOS 13:20 బెత్పెయోరు, పిస్గాకొండలు, బెత్ యెషిమోత్.
JOS 13:21 కనుక మైదానంలోని అన్ని పట్టణాలు, అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన ప్రాంతం అంతా ఈ భూమిలో ఉంది. ఆ రాజు హెష్బోను పట్టణం దగ్గర పాలించాడు. అయితే అతణ్ణి, మిద్యాను ప్రజానాయకులను మోషే ఓడించాడు. ఆ నాయకులు ఎవి, రెకెము, సూర్, హోరు, రెబా. (ఈ నాయకులంతా సీహోనుతో చేయి కలిపి పోరాడారు) ఈ నాయకులంతా ఆ దేశంలోనే నివసించారు.
JOS 13:22 బెయోరువాడైన బిలామును ఇశ్రాయేలు ప్రజలు చంపారు. (బిలాము భవిష్యత్తును గూర్చి చెప్పేందుకు మంత్రాలు వేసేవాడు) ఆ పోరాటంలో ఇశ్రాయేలు ప్రజలు చాలమందిని చంపేసారు.
JOS 13:23 రూబేనుకు ఇచ్చిన భూమికి యోర్దాను నదీ తీరం సరిహద్దు. కనుక రూబేను వంశం వారికి ఇవ్వబడిన భూమిలో ఈ పట్టణాలు, పొలాలు అన్నీ చేర్చబడ్డాయి.
JOS 13:24 గాదు వంశం వారికి మోషే ఇచ్చిన భూమి ఇది. ప్రతి ఒక్క వంశానికీ ఈ భూమిని మోషే ఇచ్చాడు.
JOS 13:25 యాజెరు భూమి, గిలాదు పట్టణాలు అన్నీ రబ్బాతు దగ్గర అరోయేరు వరకూ గల అమ్మోనీ ప్రజల భూమిలో సగం మోషే వారికి ఇచ్చాడు.
JOS 13:26 హెష్బోను నుండి రామత్ మిస్పా, బెటోనీము వరకూ గల భూమి ఇందులో ఉంది. మహనయిము నుండి దెబీరువరకు గల ప్రాంతం అంతా ఈ భూమిలో ఉంది.
JOS 13:27 బేతారాము, బెత్‌నిమ్రా, సుక్కోతు, సఫోనులోయ ఈ భూమిలో ఉన్నవే. హెష్బోను రాజు సీహోను పాలించిన మిగిలిన భూమి అంతా ఇందులో ఉంది. ఇది యోర్దాను నదికి తూర్పున ఉన్న భూమి. కిన్నెరతు సముద్రం చివరివరకు ఈ భూమి విస్తరించి ఉంది.
JOS 13:28 ఈ భూమి అంతా గాదు వంశానికి మోషే ఇచ్చినది. ఈ జాబితాలో చేర్చబడిన పట్టణాలు అన్నీ ఈ భూమిలో ఉన్నాయి. ఒక్కోవంశానికి ఆ భూమిని మోషే ఇచ్చాడు.
JOS 13:29 మనష్షే వంశంలో సగం మందికి మోషే ఇచ్చిన భూమి ఇదే. మనష్షే వంశంలోని సగం వంశాలు ఈ భూమిని తీసుకున్నాయి.
JOS 13:30 ఆ భూమి మహనయిము దగ్గర మొదలవుతుంది. బాషాను అంతా, బాషాను రాజు ఓగు పాలించిన దేశం అంతా, బాషానులోని యాయీరు పట్టణాలన్నీ ఆ భూమిలో ఉన్నాయి. (అవి మొత్తం 60 పట్టణాలు)
JOS 13:31 గిలాదులో సగం, అష్టారోతు, ఎద్రేయి కూడ ఆ భూమిలో ఉన్నాయి. (గిలాదు, అష్టారోతు, ఎద్రేయి ఓగు రాజు నివసించిన పట్టణాలు) ఈ భూమి అంతా మనష్షే కుమారుడు మాకీరు కుటుంబానికి ఇవ్వబడింది. ఆ కుమారులు అందరిలో సగం మందికి ఆ భూమి దొరికింది.
JOS 13:32 మోయాబు మైదానాల్లో ఈ వంశాలకు ఈ భూమి అంతటినీ మోషే ఇచ్చాడు. ఇది యెరికోకు తూర్పున యెర్దాను నది అవతల ఉంది.
JOS 13:33 అయితే లేవీ వంశం వారికి మోషే భూమి ఏమీ ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు సాక్షాత్తు ఆయనే లేవీ వంశం వారి పరంగా ఉంటానని వాగ్దానం చేసాడు.
JOS 14:1 యాజకుడైన ఎలీయాజరు, నూను కూమారుడైన యోహోషువ, ఇశ్రాయేలు వంశాలు అన్నింటీ నాయకులు కలిసి ప్రజలకు ఏ భూమి ఇవ్వాలి అనే విషయం నిర్ణయం చేసారు.
JOS 14:2 ప్రజలు ఏ విధంగా వారి భూమిని నిర్ణయించు కోవాల్సిందీ చాలకాలం క్రితమే మోషేకు యెహోవా ఆజ్ఞాపించాడు. తొమ్మిదిన్నర వంశాల వారు ఎవరికి ఏ భూమి అనే విషయం నిర్ణయించేందుకు చీట్లు వేసారు.
JOS 14:3 రెండున్నర వంశాల వారికి యోర్దాను నదికి తూర్పున వారి భూమి వారికి మోషే ఇదివరకే ఇచ్చాడు. అయితే మిగదా ప్రజల్లాలేవీ వంశానికి మాత్రం భూమి ఏమీ ఇవ్వబడలేడు.
JOS 14:4 (పన్నెండు వంశాలకు వారి స్వంత భూమి ఇవ్వబడింది) యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము రెండు వంశాలుగా విభజించబడ్డారు. (మరియు ఒక్కో వంశానికి కొంత భూమి దొరికింది) కానీ లేవీ వంశపు ప్రజలకు భూమి ఏమీ ఇవ్వబడలేదు. వారు నివసించేందుకు కొన్ని పట్టణాలు మాత్రం ఇవ్వబడ్డాయి. (ఈ పట్టణాలు ప్రతి వంశంవారి భూమిలోనూ ఉన్నాయి.) వారి జంతువులకోసం వారికి పొలాలు కూడ ఇవ్వబడ్డాయి.
JOS 14:5 ఇశ్రాయేలు వంశాలకు భూమిని ఇచ్చే విధానం మోషేకు యెహోవా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా ఆజ్ఞాపించినట్టే భూమిని పంచుకొన్నారు.
JOS 14:6 ఒకరోజు యూదా వంశపు మనుష్యులు కొందరు గిల్గాలులో యెహోషువ దగ్గరకు వెళ్లారు. కెనెజీవాడైన యెపున్నె కుమారుడు కాలేబు వారిలో ఒకడు. కాలేబు యెహోషువతో చెప్పాడు, “కాదేషు బర్నేయలో యెహోవా చెప్పిన సంగతులు నీకు జ్ఞాపకమే. యెహోవా తన సేవకుడు మోషేతో మాట్లాడుతూ నిన్ను, నన్ను గూర్చి చెప్పాడు.
JOS 14:7 మనం వెళ్లబోతున్న దేశాన్ని చూచి రమ్మని యెహోవా సేవకుడు మోషే నన్ను పంపాడు. అప్పుడు నా వయస్సు 40 సంవత్సరాలు. నేను తిరిగి వచ్చినప్పుడు ఆ దేశాన్ని గూర్చిన నా అభిప్రాయం నేను మోషేతో చెప్పాను.
JOS 14:8 అయితే నాతోబాటు వెళ్లిన ఇతర ప్రజలు భయపెట్టే విషయాలను వారితో చెప్పారు. కానీ నేను మాత్రం ఆ దేశాన్ని యెహోవా మన స్వాధీనం చేస్తాడని నిజంగా నమ్మాను.
JOS 14:9 కనుక ఆ రోజున మోషే నాకు వాగ్దానం చేసాడు: ‘నీవు వెళ్లిన ఆ భూమి నీదే అవుతుంది. శాశ్వతంగా ఆ భూమి నీ పిల్లలకు స్వంతం అవుతుంది. నా దేవుడైన యెహోవాను నీవు నిజంగా విశ్వసించావు గనుక ఆ భూమిని నేను నీకు ఇస్తాను.’
JOS 14:10 “ఇదిగో చూడు, యెహోవా చేస్తానని చెప్పినట్టే, అప్పటినుండి 45 సంవత్సరాలు ఆయన నన్ను బతికించి ఉంచాడు. ఆ సమయంలో మనం అంతా అరణ్యంలో సంచారం చేసాము. ఇదిగో, ఇప్పుడు నా వయస్సు 85 సంవత్సరాలు.
JOS 14:11 మోషే నన్ను బయటకు పంపించిన నాడు నేను ఎంత బలంగా ఉన్నానో ఇప్పుడూ అంతే బలంగా ఉన్నాను. అప్పటిలాగే పోరాడేందుకు ఇప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను.
JOS 14:12 కనుక చాలకాలం క్రిందట యెహోవా నాకు వాగ్దానం చేసిన ఆ కొండ చరియను ఇప్పుడు నాకు ఇయ్యి. బలాఢ్యులైన అనాకీ ప్రజలు అక్కడ నివసించినట్టు అప్పట్లో నీవు విన్నావు. మరియు ఆ పట్టణాలు చాల పెద్దవి, మంచి కాపుదలలో ఉన్నవి. కానీ ఇప్పుడు, ఒకవేళ యెహోవా నాతో ఉన్నాడేమో, యెహోవా చెప్పినట్టు నేను ఆ భూమిని తీసుకుంటాను.”
JOS 14:13 యెపున్నె కుమారుడైన కాలేబును యెహోషువ ఆశీర్వదించాడు. యెహోషువ అతనికి హెబ్రోను పట్టణాన్ని స్వంతంగా ఇచ్చాడు.
JOS 14:14 ఇప్పటికీ ఆ హెబ్రోను పట్టణం కెనెజీవాడగు యెపున్నె కుమారుడు కాలేబుకు చెంది ఉంది. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుణ్ణి అతుడు నమ్ముకొని విధేయుడైనందువల్ల ఇప్పటికీ ఆ భూమి అతని ప్రజలకే చెంది ఉంది.
JOS 14:15 గతంలో ఆ పట్టణం కిర్యత్ అర్బ అని పిలువబడింది. అనాకీ ప్రజల్లోకెల్లా మహా గొప్పవాడైన అర్బ పేరు ఆ పట్టణానికి పెట్టబడింది. ఆ తర్వాత దేశంలో శాంతి నెలకొంది.
JOS 15:1 యూదాకు ఇవ్వబడిన భూమి ఒక్కో కుటుంబాలకు పంచబడింది. ఆ భూమి ఎదోము సరిహద్దు వరకు, దక్షిణాన తేమాను చివర సీను అరణ్యం వరకు ఉంది.
JOS 15:2 యూదా భూమికి దక్షిణ సరిహద్దు, మృత సముద్రం దక్షిణ కొనలో మొదలవుతుంది.
JOS 15:3 దాని సరిహద్దు దక్షిణాన తేలు కనుమ వరకు పోయి సీనువరకు కొనసాగింది. దక్షిణాన కాదేషు బర్నేయ వరకు సరిహద్దు విస్తరించింది. హెస్రోను దాటి అద్దారు వరకు సరిహద్దు విస్తరించింది. అద్దారునుండి సరిహద్దు మలుపు తిరిగి కర్క వరకు విస్తరించింది.
JOS 15:4 అస్మోను, ఈజిప్టు ఏరు, మధ్యధరా సముద్రం వరకు సరిహద్దు విస్తరించింది. ఆ భూమి అంతా వారి దక్షిణ సరిహద్దు.
JOS 15:5 ఉప్పు సముద్రం నుండి, యోర్దాను నది సముద్రంలోపడే ప్రాంతం వరకు తూర్పు సరిహద్దు. యోర్దాను నది ఉప్పు సముద్రంలో పడే ప్రాంతంలో ఉత్తర సరిహద్దు మొదలవుతుంది.
JOS 15:6 ఉత్తర సరిహద్దు బేత్‌హోగ్లా వరకు విస్తరించి, ఉత్తరాన బేత్ అరాబావరకు కొనసాగింది. ఆ సరిహద్దు బోహను బండవరకు వ్యాపించింది. (రూబేను కుమారుడు బోహను)
JOS 15:7 ఆ తర్వాత ఉత్తర సరిహద్దు ఆకోరు లోయలోనుండి దెబీరు వరకు కొనసాగింది. అక్కడ ఆ సరిహద్దు ఉత్తరానికి, తిరిగి గిల్గాలు వరకు వ్యాపించింది. అదుమ్మీము పర్వతాల మధ్యగా పోయే మార్గం మీద ఉంది గిల్గాలు. అది ఏటికి దక్షిణాన ఉంది. ఎన్‌షెమెషు నీళ్ల వరకు సరిహద్దు వ్యాపించింది. ఎన్‌రొగెలు దగ్గర సరిహద్దు నిలిచిపోయింది.
JOS 15:8 తర్వాత యెబూసు పట్టణానికి దక్షిణాన ఉన్న బెన్‌హిన్నోము లోయగుండా ఆ సరిహద్దు కొనసాగింది. (ఆ యెబూసు పట్టణం పేరు యెరూషలేము) అక్కడ సరిహద్దు కొండ శిఖరం మీదుగా హిన్నోము లోయకు పశ్చిమంగా వెళ్లింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తరపు అంచున ఉంది.
JOS 15:9 అక్కడ నుండి ఆ సరిహద్దు నెప్తోయ నీళ్ల ఊటవరకు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు ఎఫ్రోను కొండ సమీపంలో గల పట్టణాలకు పోయింది. ఆ స్థలంలో ఆ సరిహద్దు మళ్లుకొని బాలాకు పోయింది. (బాలా కిర్యత్ యారీం అనికూడ పిలువబడింది)
JOS 15:10 బాలావద్ద సరిహద్దు పశ్చిమంగా మళ్లుకొని శేయీరు కొండ దేశానికి పోయింది. ఆ సరిహద్దు యారీం కొండకు (కెసలోము అని కూడ పిలువబడింది) ఉత్తర దిశగా కొనసాగి బెత్‌షెమెషు వరకు కొనసాగింది. అక్కడ్నుండి ఆ సరిహద్దు తిమ్నాదాటిపోయింది.
JOS 15:11 అప్పుడు ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరాన ఉన్న కొండకు చేరింది. ఆ చోటనుండి ఆ సరిహద్దు షికెరానుకు మరలి బాలా కొండను దాటిపోయింది. ఆ సరిహద్దు యబ్నేలువరకు కొనసాగి మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది.
JOS 15:12 యూదా దేశానికి పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం. కనుక యూదా దేశం ఈ నాలుగు సరిహద్దుల లోపల ఉంది. యూదా కుటుంబాలు ఈ దేశంలో నివసించాయి.
JOS 15:13 యెపున్నె కుమారుడైన కాలేబుకు యూదా దేశంలో భాగం ఇవ్వాల్సిందిగా యెహోషువను యెహోవా ఆజ్ఞాపించాడు. కనుక దేవుడు ఆజ్ఞాపించిన భూమిని కాలేబుకు యెహోషువ ఇచ్చాడు. హెబ్రోను అనికూడ పిలువబడిన కిర్యత్ అర్బ పట్టణాన్ని యెహోషువ అతనికి ఇచ్చాడు (అనాకు తండ్రి అర్బ)
JOS 15:14 హెబ్రోనులో నివాసం ఉన్న అనాకీ వంశాలు మూడింటిని కాలేబు వెళ్లగొట్టేసాడు. అవి శాషాయి, అహీమాను, తల్మయి వంశాలు. వారు అనాకు కుటుంబంవారు.
JOS 15:15 తర్వాత దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద కాలేబు యుద్ధం చేసాడు. (గతంలో దెబీరును కిర్యత్ సెఫెర్ అనికూడ పిలిచేవాళ్లు)
JOS 15:16 “కిర్యత్ సెఫెర్ మీద దాడి చేసి, ఆ పట్టణాన్ని ఓడించే మగవాడెవడో అతడు నా కుమార్తె అక్సాను పెళ్లాడవచ్చు. అతనికి నా కూతుర్ని బహుమానంగా ఇస్తాను” అన్నాడు కాలేబు.
JOS 15:17 కాలేబు సహోదరుడైన కనజు కుమారుడు ఒత్నియేలు ఆ పట్టణాన్ని ఓడించాడు. కనుక కాలేబు తన కుమార్తె అక్సాను ఒత్నియేలుకు భార్యగా ఇచ్చాడు.
JOS 15:18 తన తండ్రి కాలేబు దగ్గర మరికొంత భూమి అడగాలని ఒత్నియేలు అక్సాను కోరాడు. (ఆక్సా తన తండ్రి దగ్గరకు వెళ్లింది.) ఆమె తన గాడిద మీద నుండి దిగగానే “నీకేం కావాలి?” అని కాలేబు ఆమెను అడిగాడు.
JOS 15:19 “నాకు ఒక ఆశీర్వాదం కావాలి. (నీరుగల భూమి నాకు కావాలి) నీకు నాకు నెగెవులో ఇచ్చిన భూమి ఎడారి భూమి. కనుక నీటి ఊటలు గల భూమి నాకు ఇవ్వాలి” అని అక్సా జవాబిచ్చింది. కనుక మెరకలోను పల్లంలోని నీటి ఊటలు గల భూమిని కాలేబు ఆమెకు ఇచ్చాడు.
JOS 15:20 యూదా వంశానికి దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరికింది. ఒక్కో కుటుంబానికి ఆ భూమిలో భాగం దొరికింది.
JOS 15:21 నెగెవు దక్షిణాన గల పట్టణాలన్నీ యూదా వంశానికి వచ్చాయి. ఈ పట్టణాలు ఎదోము సరిహద్దు సమీపంగా ఉన్నాయి. ఆ పట్టణాల జాబితా ఇది; కబ్జీలు, ఎదెరు, యగురు,
JOS 15:22 కీనా, దిమోనా, అదాదా:
JOS 15:23 కెదేషు, హసోరు, ఇత్నాను
JOS 15:24 జీపు, తెలెం, బెయలోత్
JOS 15:25 హసొర్, హదత్తా, కెరియోతు, హెస్రొను (హసోరు అని కూడ పిలువబడుతుంది)
JOS 15:26 అమాము, షెమ, మొలాదా
JOS 15:27 హసర్‌గద్దా, హెష్మొను, బెత్‌పెలెతు,
JOS 15:28 హసర్‌షువలు, బెయెర్‌షెబ, బిజ్యోత్యా
JOS 15:29 బాలా, ఇయం, ఎజెము,
JOS 15:30 ఎల్తోలద్, కెసిల్, హోర్మ,
JOS 15:31 సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,
JOS 15:32 లెబయొతు, ష్హిలిం, అయిన్ మరియు రిమ్మాన్. మొత్తం మీద 29 పట్టణాలు, వాటి పొలాలు ఉన్నాయి. పడమటి కొండ దిగువల్లోకూడ యూదా వంశం వారికి పట్టణాలు వచ్చాయి. ఆ పట్టణాల జాబితా ఇది:
JOS 15:33 ఎష్తాయోలు, జొర్యా, అష్నా
JOS 15:34 జానోహ, ఎన్‌గన్నీము, తప్పుయ, ఎనాం
JOS 15:35 యార్ముత్, అదుల్లాము శోకో, అజెకా,
JOS 15:36 షరాయిం, అదితాయిము, మరియు గెదెరా (గెదెరో తాయిము అనికూడ పిలువబడింది) మొత్తం మీద 14 పట్టణాలు, వాటి పొలాలు.
JOS 15:37 యూదా వంశంవారికి ఇవ్వబడిన పట్టణాలు సెనాము, హదష, మిగ్దల్‌గాదు,
JOS 15:38 దిలాన్, మిస్సే, యొక్తయెలు
JOS 15:39 లాకీషు, బొస్కతు, ఎగ్లోను
JOS 15:40 కబ్బోన్, లహ్మను, కిత్లషు
JOS 15:41 గెదెరొతు, బెత్‌దాగొను నయమా, మరియు మక్కెదా. మొత్తంమీద 16 పట్టణాలు మరియు వాటి పొలాలు.
JOS 15:42 యూదా ప్రజలకు లభించిన ఇతర పట్టణాలు: లిబ్నా, ఎతెరు, అషను,
JOS 15:43 ఇప్తా, అష్న, నెజిబు
JOS 15:44 కెయిలా, అక్జీబు, మారేషా. మొత్తంమీద 9 పట్టణాలు మరియు వాటి పొలాలు.
JOS 15:45 ఎక్రోను పట్టణం, దాని సమీపంలో గల అన్ని చిన్న పట్టణాలు, పొలాలు యూదా ప్రజలకే దొరికాయి.
JOS 15:46 ఎక్రోనుకు పశ్చిమాన గల ప్రాంతం, అష్డోదుకు సమీపంలో ఉన్న పట్టణాలు, పొలాలు అన్నీ కూడా వారికి లభించాయి.
JOS 15:47 అష్డోదు చుట్టూ ఉన్న ప్రాంతం అంతాను, అక్కడి చిన్న పట్టణాలు యూదా దేశంలో భాగమే. గాజా చుట్టూ ఉన్న ప్రాంతం, పొలాలు, పట్టణాలు కూడా యూదా ప్రజలకే వచ్చాయి. ఈజిప్టు నదివరకు వారి దేశం విస్తరించింది. మరియు వారిదేశం మధ్యధరా సముద్ర తీరం వెంబడి విస్తరించింది.
JOS 15:48 కొండ దేశంలోకూడా యూదా ప్రజలకు పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది: షామిరు, యత్తిరు, శాకొహో,
JOS 15:49 దన్నా, కిర్యత్ సన్నా, (దెబిర్ అనికూడ పిలువబడింది)
JOS 15:50 అనబు, ఎష్తెమో, అనీం
JOS 15:51 గోషెను, హలొను, మరియు గిలో. మొత్తం మీద 11 పట్టణాలు మరియు వాటి పొలాలు.
JOS 15:52 యూదా ప్రజలకు ఈ పట్టణాలు కూడ ఇవ్వబడ్డాయి: అరబు, దూమా, ఎషాను,
JOS 15:53 యనీము, బెత్ తప్పుయా, అఫెకా,
JOS 15:54 హుమతా, కిర్యత్ అర్బ (హెబ్రోను అని కూడ పిలువబడింది) మరియు సీయోరు. 9 పట్టణాలు, వాటి పొలాలు ఉన్నాయి.
JOS 15:55 ప్రజలకు ఈ పట్టణాలు కూడా ఇవ్వబడ్డాయి: మయోను, కర్మెలు, జీపు, యుట్ట,
JOS 15:56 యెజ్రెయేలు, యొకెదియము, జనోవా
JOS 15:57 కయిను, గిబియ మరియు తిమ్నా మొత్తం మీద 10 పట్టణాలు మరియు వాటి పొలాలు.
JOS 15:58 యూదా ప్రజలకు ఈ పట్టణాలు కూడా ఇవ్వ బడ్డాయి: హల్‌హులు, బెత్‌జూరు, గెదొరు,
JOS 15:59 మారాతు, బెత్‌అనొతు మరియు ఎల్‌తెకొను. మొత్తం మీద అవి 6 పట్టణాలు మరియు వాటి పొలాలు.
JOS 15:60 రబ్బ, కిర్యత్‌బెతు (కిర్యత్యారీం అనికూడా పిలువ బడుతుంది) రెండు పట్టణాలు కూడ యూద ప్రజలకు ఇవ్వబడ్డాయి.
JOS 15:61 యూదా ప్రజలకు ఎడారి పట్టణాలు యివ్వబడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది: బెత్ అరాబా, మిద్దిను, సెకాకా
JOS 15:62 నిబ్షాను, ఉప్పు పట్టణం, మరియు ఎన్‌గేది. మొత్తం మీద 6 పట్టణాలు మరియు వాటి పొలాలు.
JOS 15:63 యెరుషలేములో నివసిస్తున్న యెటూసీ ప్రజలను యూదా సైన్యం బయటకు వెళ్లగొట్ట లేక పోయింది. కనుక యెరుషలేములోని యూదా ప్రజల మధ్య యెబూసీ ప్రజలు నేటికీ ఇంకా నివసిస్తూనే ఉన్నారు.
JOS 16:1 యోసేపు కుటుంబానికి లభించిన దేశం ఇది. ఈ దేశం యెరికో సమీపాన యోర్దాను నది దగ్గర ప్రారంభమై యెరికో జలాల వరకు కొనసాగింది. (ఇది యెరికోకు సరిగ్గా తూర్పున ఉంది) ఆ సరిహద్దు యెరికోనుండి పైకి, బేతేలు కొండ ప్రాంతంవరకు వ్యాపించింది.
JOS 16:2 తర్వాత ఆ సరిహద్దు బేతేలు (లూజు)నుండి అతరోత్ వద్ద సరిహద్దువరకు కొనసాగింది.
JOS 16:3 తర్వాత ఆ సరిహద్దు అర్కీయ పశ్చిమాన యాఫ్లెతీయ ప్రజల సరిహద్దువైపు పోయింది. దిగువ బెత్‌హరను వరకూ ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు గెజెరుకు పోయి, సముద్రం వరకు వ్యాపించింది.
JOS 16:4 కనుక మనష్షే, ఎఫ్రాయిం ప్రజలకు వారి భూమి లభించింది. (మనష్షే, ఎఫ్రాయిము యోసేపు కుమారులు)
JOS 16:5 ఎఫ్రాయిము ప్రజలకు ఇవ్వబడిన భూమి ఇది: తూర్పున ఎగువ బేత్‌హోరోను సమీపంలో అతారోతు అద్దారు వద్ద వారి సరిహద్దు మొదలయింది.
JOS 16:6 మరియు పశ్చిమ సరిహద్దు మిస్మెతతు వద్ద మొదలయింది. ఆ సరిహద్దు తూర్పున తానతు షిలోహుకు మళ్లి, యానోయకు విస్తరించింది.
JOS 16:7 అప్పుడు ఆ సరిహద్దు యానోయనుండి క్రిందికి అతారోతు మరియు నారాకు వెళ్ళింది. ఆ సరిహద్దు యెరికోను తాకి, యోర్దాను నది దగ్గర నిలిచిపోయేంతవరకు కొనసాగింది.
JOS 16:8 ఆ సరిహద్దు తప్పూయ మొదలుకొని కానా ఏటివరకు పశ్చిమంగా వ్యాపించి, సముద్రం దగ్గర అంతమయింది. అది మొత్తం ఎఫ్రాయిము ప్రజలకు ఇవ్వబడిన దేశం. ఆ వంశంలోని ఒక్కో కుటుంబానికి ఈ దేశంలో కొంత భాగం దొరికింది.
JOS 16:9 ఎఫ్రాయిము వారి సరిహద్దు పట్టణాలు అనేకం నిజానికి మనష్షే వారి సరిహద్దుల్లోనే ఉన్నాయి. కానీ ఆ పట్టణాలు, ఆ పొలాలు ఎఫ్రాయిము వారికే వచ్చాయి.
JOS 16:10 అయితే గెజరు పట్టణంనుండి కనానీ ప్రజలను ఎఫ్రాయిము ప్రజలు వెళ్లగొట్టలేకపోయారు. కనుక నేటికీ ఎఫ్రాయిము ప్రజల మధ్య కనానీ ప్రజలు నివసిస్తున్నారు. కానీ కనానీ ప్రజలు ఎఫ్రాయిము ప్రజలకు బానిసలుగా అయ్యారు.
JOS 17:1 తర్వాత మనష్షే వంశానికి భూమి ఇవ్వబడింది. యోసేపు మొదటి కుమారుడు మనష్షే. మనష్షే మొదటి కుమారుడు మాకీరు, ఇతడు గిలాదు తండ్రి. మాకీరు గొప్ప వీరుడు, కనుక గిలాదు, బాషాను ప్రాంతాలు మాకీరు వంశానికి ఇవ్వబడ్డాయి
JOS 17:2 మనష్షే వంశంలోని ఇతర కుటుంబాలకు కూడా భూమి యివ్వబడింది. ఆ కుటుంబాలు అబియెజెరు, హెలెకు, అజ్రియెలు, షెకెము, హెఫెరు, షెమిద. యోసేపు కుమారుడగు మనష్షే మిగిలిన కుమారులు వీరంతాను. ఈ మనుష్యుల కుటుంబాలకు కూడ కొంత భూమి లభించింది.
JOS 17:3 హెపెరు కుమారుడు సెలోపెహాదు. గిలాదు కుమారుడు హెపెరు. గిలాదు మాకీరు కుమారుడు, మాకీరు మనష్షే కుమారుడు. కానీ సెలోపెహాదుకు కుమారులు లేరు. అతనికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల పేర్లు మహల, నోయ, హోగ్ల, మీల్కా, తిర్సా.
JOS 17:4 యాజకుడైన ఎలీయాజరు, నూను కుమారుడైన యెహోషువ ఇశ్రాయేలు నాయకులందరి దగ్గరకు ఆ కుమార్తెలు వెళ్లారు. “మగవారికి ఇచ్చినట్టే మాకూ భూమి ఇవ్వాలని మోషేతో యెహోవా చెప్పాడు” అన్నారు ఆ కుమార్తెలు. కనుక ఎలీయాజరు యెహోవాకు విధేయుడై, ఆ కుమార్తెలకు కొంత భూమి యిచ్చాడు. కనుక కుమారులవలెనే ఈ కుమార్తెలకుగూడ కొంత భూమి లభించింది.
JOS 17:5 కనుక మనష్షే వంశానికి యోర్దాను నదికి పశ్చిమాన పది ప్రాంతాలు, యోర్దాను నది ఆవలి ప్రక్క గిలాదు, బాషాను అనే మరి రెండు ప్రాంతాలు ఉన్నాయి.
JOS 17:6 మనష్షే కుమార్తెలకు గూడ కుమారులవలెనే భూమి లభించింది. మనష్షే మిగిలిన కుటుంబాలకు గిలాదు దేశం ఇవ్వబడింది.
JOS 17:7 మనష్షే భూములు ఆషేరు, మిక్మెతాతు మధ్య ప్రాంతంలో ఉన్నాయి. ఇది షెకెము దగ్గర సరిహద్దు దక్షిణాన ఎన్‌తపూయా వరకు వెళ్లింది.
JOS 17:8 తపూయ దేశం మనష్షేకు చెందినదే కాని తపూయ పట్టణం మాత్రం కాదు. తపూయా పట్టణం మనష్షే దేశ సరిహద్దు పక్కగా ఉంది, అది ఎఫ్రాయిము కుమారులకు చెందినది.
JOS 17:9 మనష్షే సరిహద్దు దక్షిణాన కానా ఏటివరకు వ్యాపించింది. ఈ మనష్షే ప్రాంతంలోని పట్టణాలు ఎఫ్రాయిముకు చెందినవి. నదికి ఉత్తరాన ఉంది మనష్షే సరిహద్దు మరియు అది పశ్చిమాన సముద్రం వరకు విస్తరించింది.
JOS 17:10 దక్షిణ దేశం ఎఫ్రాయిముకు చెందినది. ఉత్తర దేశం మనష్షేది. మధ్యధరా సముద్రం పడమటి సరిహద్దు. ఆ సరిహద్దు ఉత్తరాన ఆషేరు దేశాన్ని, తూర్పున ఇశ్శాఖారు దేశాన్ని తాకుతుంది.
JOS 17:11 ఇశ్శాఖారు, ఆషేరు ప్రాంతంలో బెత్‌షియాను, దాని తాలూకు చిన్న పట్టణాలు, ఇచ్చియాము, దాని తాలుకు చిన్న పట్టణాలు మనష్షే స్వంతం. దోరు పట్టణంలో, దాని తాలూకు చిన్న పట్టణాల్లో, ఎన్‌దోరు పట్టణంలో దాని తాలూకు చిన్న పట్టణాల్లో నివసించే ప్రజలంతా మనష్షే స్వంతం. తానాకు, దాని చిన్న పట్టణాల్లో, మెగిద్దో, దాని చిన్న పట్టణాల్లో, నాఫోతు మూడు పట్టణాల్లో నివసించే ప్రజలంతా మనష్షే స్వంతం.
JOS 17:12 మనష్షే ప్రజలు ఆ పట్టణాలను ఓడించలేకపోయారు. కనుక కనానీ ప్రజలు అక్కడనే నివసించటం కొనసాగించారు.
JOS 17:13 అయితే ఇశ్రాయేలు ప్రజలు బలవంతులుగా ఎదిగారు. ఇది జరిగినప్పుడు కనానీ ప్రజలను తమకు బానిసలుగా చేసుకొన్నారు. కానీ ఆ దేశం విడిచి పొమ్మని మాత్రం కనానీ ప్రజలను వారు ఒత్తిడి చేయలేదు.
JOS 17:14 యోసేపు వంశంవారు యెహోషువతో మాట్లాడి “నీవు మాకు ఒక్క ప్రాంతం మాత్రమే ఇచ్చావు. కానీ మేము చాలమందిమి ఉన్నాము. యెహోవా తన ప్రజలకు ఇచ్చిన భూమి అంతటిలో ఒక్క భాగం మాత్రమే మాకు ఎందుకు యిచ్చావు?” అన్నారు.
JOS 17:15 అప్పుడు యెహోషువ, “మీరు గనుక చాలినంతమంది ఉంటే, మీరు కొండ ప్రదేశానికి వెళ్లి, మీకు నివాస స్థలాన్ని చేసుకోండి. ఇది పెరిజ్జీ ప్రజలకు, రెఫాయిము ప్రజలకు చెందిన దేశం. ఇది ఎఫ్రాయిము వారి కొండ ప్రదేశం కాదు. ఎఫ్రాయిము కొండ ప్రదేశం మీకు మరీ చిన్నది అవుతుంది” అని బదులు చెప్పాడు.
JOS 17:16 యోసేపు ప్రజలు, “నిజమే, ఎఫ్రాయిము కొండ దేశం మాకు చాలదు. కానీ కనానీ ప్రజలు నివసిస్తున్న ప్రదేశం ప్రమాదకరమయింది. వారు నైపుణ్యంగల యుద్ధ వీరులు. మరియు బెత్‌షియనులోను, ఆ ప్రాంతంలోని చిన్న పట్టణాలన్నింటిలోను వారికి బలమైన ఆయుధాలు, ఇనుప రథాలు ఉన్నాయి. పైగా యెజ్రెయేలు లోయలోకూడ వాళ్ళున్నారు” అని చెప్పారు.
JOS 17:17 అప్పుడు యోసేపు, ఎఫ్రాయిము, మనష్షే ప్రజలతో యెహోషువ ఇలా చెప్పాడు: “అయితే మీరు చాల విస్తారంగా ఉన్నారు. మీకూ మహాగొప్ప శక్తి ఉంది. మీకు చాల ఎక్కువ భూమిని ఇవ్వాలి.
JOS 17:18 కొండ ప్రదేశం మీదే. అది అడవి అయినా మీరు చెట్లు నరికి మంచి నివాస ప్రదేశంగా దాన్ని మార్చుకోవచ్చు. అది మొత్తం మీ స్వంతం అవుతుంది. కనానీ ప్రజలను మీరు ఆ దేశం నుండి వెళ్లగొట్టివేయాలి. వారికి బలమూ, బలమైన ఆయుధాలూ ఉన్నప్పటికీ మీరు వారిని ఓడించేస్తారు.”
JOS 18:1 ఇశ్రాయేలు ప్రజలంతా షిలోహు అనే ప్రాంతంలో సమావేశం అయ్యారు. అక్కడ సన్నిధి గుడారాన్ని వారు నిలబెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని వారి ఆధీనంలో ఉంచుకొన్నారు. ఆ దేశంలోని శత్రువులందరినీ వారు ఓడించారు.
JOS 18:2 అయితే దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశంలో భాగం పొందని ఇశ్రాయేలు వంశాలు అప్పటికి యింకా ఏడు ఉన్నాయి.
JOS 18:3 కనుక ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు, “మీ దేశాన్ని తీసుకొనేందుకు మీరెందుకు ఇంత కాలం చూస్తూ ఊరకున్నారు. మీ తండ్రుల దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడు.
JOS 18:4 కనుక మీ వంశాల్లో ఒక్కోదాని నుండి ముగ్గురు మనుష్యుల్ని ఏర్పాటు చేసుకోవాలి. దేశాన్ని పరిశీలించి చూచేందుకు నేను ఆ మనుష్యుల్ని బయటకు పంపిస్తాను. ఆ దేశ పటాన్ని వారు తయారు చేస్తారు. తర్వాత వారు తిరిగి నా దగ్గరకు వస్తారు.
JOS 18:5 దేశాన్ని వారు ఏడు భాగాలుగా విభజిస్తారు. యూదా ప్రజలు వారి దేశాన్ని దక్షిణాన ఉంచుకొంటారు. యోసేపు ప్రజలు వారి దేశాన్ని ఉత్తరాన ఉంచుకొంటారు.
JOS 18:6 అయితే మీరు పటం గీసి, దేశాన్ని ఏడు భాగాలుగా విభజించాలి. ఆ పటాన్ని నా దగ్గరకు తీసుకొని రండి, ఏ వంశానికి ఏ భూమి రావాలో అది మనం యెహోవా దేవుడినే నిర్ణయం చేయనిద్దాం.
JOS 18:7 కానీ లేవీ ప్రజలకు మాత్రం ఈ భూముల్లో ఎలాంటి భాగమూ ఉండదు. వారు యాజకులు, వారి పని యెహోవాను సేవించటమే. గాదు, రూబేను, మనష్షే వంశాలలో సగం మంది వారికి వాగ్దానం చేయబడిన దేశాన్ని ఇదివరకే తీసుకొన్నారు. వారు యోర్దాను నదికి తూర్పు వైపున ఉన్నారు. యెహోవా సేవకుడు మోషే ఇదివరకే వారికి ఆ దేశాన్ని ఇచ్చాడు.”
JOS 18:8 కనుక ఏర్పాటు చేయబడిన మనుష్యులు ఆ దేశంలో ప్రవేశించటం మొదలు పెట్టారు. ఆ దేశం యొక్క వివరాలను తయారు చేసి, వాటిని యెహోషువ దగ్గరకు తీసుకొని రావాలి అనేది వారి పథకం. కనుక యెహోషువ, “వెళ్లి దేశాన్ని పరిశీలించి, దాని వివరాలు తయారు చేయండి. అప్పుడు తిరిగి నా దగ్గరకు రండి. అప్పుడు మీకు ఏ భూమి రావాలి అనేది నేను నిర్ణయించేందుకు సహాయం చేయాల్సిందిగా యెహోవాను అడుగుతాను. ఇది మనం ఇక్కడ షిలోహులో చేద్దాం” అని వారితో చెప్పాడు.
JOS 18:9 కనుక ఆ మనుష్యులు ఆ చోటు విడిచి ఆ దేశంలో ప్రవేశించారు. ఆ మనుష్యులు ఆ దేశాన్ని పరిశీలించి, యెహోషువ కొరకు పటాలు తయారుచేసారు. ప్రతి పట్టణాన్నీ వారు పరిశీలించి, దేశం ఏడు భాగాలు అయ్యేటట్టు చేసారు. వారు ఆ పటాలు తయారుచేసి యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. యెహోషువ ఇంకా షిలోహులోని పాళెములోనే ఉన్నాడు.
JOS 18:10 ఆ సమయంలో యెహోషువ యెహోవాను సహాయం కొరకు వేడుకున్నాడు. ఒక్కో వంశానికి ఇవ్వాల్సిన దేశాలను యెహోషువ నిర్ణయించాడు.
JOS 18:11 యూదాకు యోసేపుకు మధ్యగల ప్రాంతంలోని దేశం బెన్యామీను వంశానికి ఇవ్వబడింది. బెన్యామీను వంశంలోని ప్రతి కుటుంబానికీ కొంత భూమి లభించింది. బెన్యామీనుకు నిర్ణయించబడిన భూమి ఇది:
JOS 18:12 ఉత్తర సరిహద్దు యోర్దాను నది దగ్గర మొదలయింది. యెరికో ఉత్తరపు అంచున కొనసాగింది ఆ సరిహద్దు. తర్వాత ఆ సరిహద్దు పశ్చిమాన కొండ దేశంలోనుండి వెళ్లింది. బెత్ అవెనుకు సరిగ్గా తూర్పున చేరేంతవరకు ఆ సరిహద్దు కొనసాగింది.
JOS 18:13 తర్వాత ఆ సరిహద్దు లూజుకు (బేతేలు) దక్షిణంగా విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు అతారోతు అద్దారుకు వెళ్లింది. దిగువ బెత్ హరానుకు దక్షిణాన కొండమీద ఉంది అతారోత్ అద్దార్.
JOS 18:14 బెత్‌హరానుకు దక్షిణంగా ఒక కొండ ఉంది. ఈ కొండ దగ్గర ఆ సరిహద్దు మళ్లుకొని కొండ పడమటి పక్కకు దగ్గర్లో దక్షిణంగా వెళ్లింది. ఆ సరిహద్దు కిర్యత్ బాలాకు (కిర్యత్యారం) పోయింది. ఇది యూదా ప్రజలు నివసించిన ఒక పట్టణం. ఇది పడమటి సరిహద్దు.
JOS 18:15 దక్షిణ సరిహద్దు కిర్యత్యారీము దగ్గర మొదలై నెఫ్తోయ నదివరకు విస్తరించింది.
JOS 18:16 తర్వాత బెన్‌హిన్నోము లోయ దగ్గర కొండ మట్టానికి ఆ సరిహద్దు విస్తరించింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తర దిశ. ఆ సరిహద్దు యెబూసు పట్టణానికి దక్షిణంగా హిన్నోము లోయగుండా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు ఎన్‌రోగెలుకు విస్తరించింది.
JOS 18:17 అక్కడ ఆ సరిహద్దు ఉత్తరంగా మళ్లి ఎన్‌షెమెషుకు పోయింది. ఆ సరిహద్దు గెలిలోతుకు (పర్వతాల్లోని అదుమీము కనుమ దగ్గర ఉంది గెలిలోతు) కొనసాగింది. ఆ సరిహద్దు రూబేను కుమారుడు బోహను కోసం పేరుపెట్టబడిన మహాశిలవరకు క్రిందికి విస్తరించింది.
JOS 18:18 బెత్‌అరబా ఉత్తర ప్రాంతంవరకు ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు అరబాలోనికి విస్తరించింది.
JOS 18:19 తర్వాత ఆ సరిహద్దు బెత్‌హోగ్లా ఉత్తర ప్రాంతంవరకు వెళ్లి, ఉప్పు సముద్రపు ఉత్తర తీరాన ముగిసింది. ఇక్కడే యోర్దాను నది సముద్రంలో పడుతుంది. అది దక్షిణ సరిహద్దు.
JOS 18:20 తూర్పు వైపున యోర్దాను నది సరిహద్దు. కనుక బెన్యామీను వంశానికి ఇవ్వబడిన దేశం ఇది. అవే అన్ని వైపులా సరిహద్దులు.
JOS 18:21 కనుక బెన్యామీను కుటుంబాలు ప్రతీ ఒక్కటీ ఈ దేశాన్ని పొందాయి. మరియు వారి స్వంత పట్టణాలు ఇవి: యెరికో, బెత్‌హోగ్లా, ఎమెక్ కెజిబ్
JOS 18:22 బెత్ అరాబా, సెమరాయిము, బేతేలు
JOS 18:23 అవ్విము, పారా, ఓఫ్రా
JOS 18:24 కెఫెరు అమ్మోని, ఓఫ్ని, గెబ. ఇవి పన్నెండు పట్టణాలు, ఈ పట్టణాల దగ్గర ప్రజలు నివసిస్తున్న చిన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి.
JOS 18:25 బెన్యామీను వంశం స్వంత పట్టణాల్లో గిబియోను, రామా, బెయెరొతు
JOS 18:26 మిస్పే, కెఫిరా, మోసా,
JOS 18:27 రెకెము, ఇర్పెయెలు, తరలా
JOS 18:28 సేలా, ఎలెపు, యెబూసీ పట్టణం (యెరుషలేము), గిబియా, కిర్యత్ ఉన్నాయి. ఇవి పద్నాలుగు పట్టణాలు, వీటి దగ్గర్లో ప్రజలు నివసిస్తున్న చిన్న ప్రాంతాలు కూడ ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ బెన్యామీను వంశానికి లభించిన భూములు.
JOS 19:1 అప్పుడు షిమ్యోను వంశంవారికి, ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ వారి భూములను యెహోషువ పంచిపెట్టాడు. వారికి లభించిన భూమి యూదాకు చెందిన ప్రాంతం లోపల ఉంది.
JOS 19:2 వారికి లభించిన భూమి యిది; బెయెర్ షెబ (షెబ) మోలాదా,
JOS 19:3 హజర్‌షువలు, బాలా, ఎజెము,
JOS 19:4 ఎల్తోలదు, బెతులు, హొర్మా
JOS 19:5 సిక్లగు, బెత్ మార్కాబొదు, హజర్‌సుస
JOS 19:6 బెత్ లబాయొతు మరియు షారుహను. ఇవి పదమూడు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము.
JOS 19:7 అయిను, రిమ్మోను, ఎతెరు, ఆషాను పట్టణాలు కూడా వారికి లభించాయి. ఇవి నాలుగు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము.
JOS 19:8 బాలాత్ బెయెరు వరకు ప్రజలు నివసిస్తున్న అతి చిన్న ప్రాంతాలు కూడ అన్నీ వారికి లభించాయి. (ఇది నెగెవు ప్రాంతంలో ఉన్న రామా వంటిదే.) కనుక షిమ్యోనీ ప్రజల కుటుంబాలకు ఇవ్వబడిన భూములు అవి. ఒక్కో కుటుంబానికి ఈ భూములు లభించాయి.
JOS 19:9 షిమ్యోనీ ప్రజల భూమి యూదా భూభాగంలోనుండి తీసికోబడింది. యూదా వారికి అవసరమైన దానికంటె చాలా ఎక్కువ భూమి ఉంది. కనుక వారి భూమిలో షిమ్యోనీ ప్రజలకు కొంత భాగం లభించింది.
JOS 19:10 తర్వాత భూమి లభించిన వంశం జెబలూను. జెబూలూను వంశంలోని ప్రతి కుటుంబానికీ, వారికి వాగ్దానం చేయబడిన భూమి లభించింది. జెబూలూను సరిహద్దు శారీదు వరకు విస్తరించింది.
JOS 19:11 తర్వాత అది పశ్చిమాన మరాలా వరకు పోయి, దబ్బాషెతు ప్రాంతానికి సమీంపంగా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు యొక్నెయాము దగ్గర ప్రాంతానికి విస్తరించింది.
JOS 19:12 తర్వాత ఆ సరిహద్దు తూర్పుకు మళ్లింది. శారీదు నుండి అది కిస్లోత్ తాబోరు ప్రాంతానికి విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు దబెరాతు. యాఫియకు విస్తరించింది.
JOS 19:13 తర్వాత ఆ సరిహద్దు తూర్పున గాత్ హెఫెరు, ఎత్‌కాసిను వరకు విస్తరించింది. ఆ సరిహద్దు రిమ్మోను వద్ద అంతమయింది. తర్వాత ఆ సరిహద్దు మళ్లుకొని నేయావరకు కొనసాగింది.
JOS 19:14 నేయావద్ద ఆ సరిహద్దు మరల మళ్లుకొని ఉత్తరానికి విస్తరించింది. ఆ సరిహద్దు హన్నాతొన్ వరకు విస్తరించి, ఇఫ్తాయెల్ లోయవరకు కొనసాగింది.
JOS 19:15 ఈ సరిహద్దు లోపల కట్టాత్, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లేహేము పట్టణాలు ఉన్నాయి. మొత్తం మీద పన్నెండు పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఉన్నాయి.
JOS 19:16 కనుక జెబలూనుకు లభించిన పట్టణాలు, ప్రాంతాలు ఇవి. జెబలూను ప్రతి వంశానికీ ఈ భూమి లభించింది.
JOS 19:17 నాలుగవ భాగం ఇశ్శాఖారు వంశంవారికి ఇవ్వబడింది. ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ కొంత భూమి లభించింది.
JOS 19:18 ఆ కుటుంబాలకు వారికి ఇవ్వబడిన భూమి యిది; యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము,
JOS 19:19 హపరాయిము, షియోను, అనాహరతు
JOS 19:20 రబ్బితు, కిష్యోను, ఎబెజు
JOS 19:21 రెమెతు, ఎన్‌గన్నిము, ఎన్‌హద్దా, బెత్‌పెసెసు.
JOS 19:22 వారి దేశ సరిహద్దు తాబోరు, షహజును, బెత్‌షెమెషు అనే ప్రాంతాలను తాకుతుంది. ఆ సరిహద్దు యెర్దాను నది దగ్గర నిలిచిపోయింది. మొత్తం మీద 16 పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఉన్నాయి.
JOS 19:23 ఈ పట్టణాలు, పురాలు ఇశ్శాఖారు వంశానికి యివ్వబడిన దేశంలోని భాగం. ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో భాగం లభించింది.
JOS 19:24 దేశంలోని ఐదవ భాగం ఆషేరు వంశం వారికి ఇవ్వబడింది. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఆ భూమిలో కొంత లభించింది.
JOS 19:25 ఆ వంశానికి ఇవ్వబడిన దేశం ఇది; హెల్కతు, హాలి బెతెను, అక్షాపు,
JOS 19:26 అలమ్మెల్లెకు, అమద్, మిషల్. పడమటి సరిహద్దు కర్మెలు పర్వతం, షీహోరు లిబ్నాతు వరకు కొనసాగింది.
JOS 19:27 తర్వాత ఆ సరిహద్దు తూర్పుకు మళ్లింది. ఆ సరిహద్దు బెత్ దాగొనుకు విస్తరించింది. ఆ సరిహద్దు జెబలూను, ఇఫెలు లోయలను తాకింది. తర్వాత ఆ సరిహద్దు బెత్‌ఎమెక్, నెయీఎల్‌కు ఉత్తరంగా కొనసాగింది. ఆ సరిహద్దు కాబూలుకు ఉత్తరంగా దాటాపోయింది.
JOS 19:28 తర్వాత అబ్దోను, రెహోబు, హమ్మోను, కానా వరకు ఆ సరిహద్దు కొనసాగింది. మహాసీదోను ప్రాంతంవరకు ఆ సరిహద్దు కొనసాగింది.
JOS 19:29 తర్వాత ఆ సరిహద్దు తిరిగి దక్షిణంగా రామాకు విస్తరించింది. ఆ సరిహద్దు బలమైన తుయర పట్టణంవరకు కొనసాగింది. తర్వాత సరిహద్దు మళ్లుకొని హొసాకు పోయింది. సముద్రం దగ్గర అక్జీబు ప్రాంతంలో
JOS 19:30 ఉమ్మా, అఫెకు, రెహోబు దగ్గర సరిహద్దు అయిపోయింది. మొత్తం మీద ఇరవై రెండు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము.
JOS 19:31 ఆషేరు వంశానికి ఇవ్వబడిన దేశంలో ఈ పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఒక భాగం. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో ఒక భాగం లభించింది.
JOS 19:32 నఫ్తాలి వంశం వారికి ఆరో భాగం భూమి యివ్వబడింది. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఆ దేశంలో కొంత భాగం లభించింది.
JOS 19:33 వారి దేశ సరిహద్దు జయ నన్నీములోని సింధూరవనము దగ్గర ప్రారంభమయింది. ఇది హెలెవు సమీపంలో ఉంది. తర్వాత ఆదామి, నెకెబు, యబ్నెయెలు గుండా ఆ సరిహద్దు కొనసాగింది. ఆ సరిహద్దు లక్కుం ప్రాంతం వరకు విస్తరించి, యోర్దాను నది దగ్గర ముగిసింది.
JOS 19:34 తర్వాత ఆ సరిహద్దు అస్నొతు తాబోరుగుండా పడమటికి వెళ్లింది. హుక్కొకు దగ్గర సరిహద్దు నిలిచిపోయింది. దక్షిణాన సరిహద్దు జెబలూను ప్రాంతం వరకు వెళ్లింది. పశ్శిమాన ఆ సరిహద్దు ఆషేరు ప్రాంతం వరకు వెళ్లింది. తూర్పున యోర్దాను నది దగ్గర ఆ సరిహద్దు యూదా వరకు వెళ్లింది.
JOS 19:35 ఈ సరిహద్దుల లోపల కొన్ని బలమైన పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలు జిద్దీము, జేరు, హమ్మాతు, రక్కాతు, కిన్నెరతు
JOS 19:36 అదామా, రామా, హషొరు
JOS 19:37 కెదెషు, ఎద్రేయి, ఎన్‌హసోరు
JOS 19:38 ఇరోను, మిగ్దల్ ఎల్, హోరేం, బెత్‌అనాతు, బెత్‌షెమెషు. మొత్తం మీద పంతొమ్మిది, పట్టణాలు వాటి పొలాలు మొత్తము.
JOS 19:39 ఆ పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న పురాలు నఫ్తాలి వంశం వారికి యివ్వబడిన దేశంలో ఉన్నాయి. ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ ఆ దేశంలో కొంత భాగం లభించింది.
JOS 19:40 తర్వాత దాను వంశానికి భూమి యివ్వబడింది. ఆ వంశంలోని ప్రతి కుటుంబానికి ఆ దేశంలో కొంత భూమి లభించింది.
JOS 19:41 వారికి ఇవ్వబడిన భూమి ఇది: జొర్యా, ఎష్తాయోలు, ఇర్‌షెమెషు
JOS 19:42 షయల్బీను, అయ్యలోను, ఇత్లా,
JOS 19:43 ఎలోను, తిమ్నా, ఎక్రోను
JOS 19:44 ఎలైకే, గిబ్బెతాను, బాలాతా
JOS 19:45 యెహుదు బెనెబెరక్, గాత్ రిమ్మోను
JOS 19:46 మేయర్కోను రక్కోను, యొప్ప దగ్గర ప్రాంతం.
JOS 19:47 అయితే దాను ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవటంలో కష్టం వచ్చింది. అక్కడ బలమైన శత్రువులు ఉన్నారు, వారిని దాను ప్రజలు తేలికగా ఓడించలేకపోయారు. కనుక దాను ప్రజలు వెళ్లి లెషెము మీద యుద్ధం చేసారు. లెషెమును వారు ఓడించి, అక్కడ నివసించిన మనుష్యులను చంపివేసారు. కనుక దాను ప్రజలు లెషెము పట్టణంలో నివసించారు. దాని పేరును వారు దానుగా మార్చి వేసారు, ఎందుకంటే అది ఆ వంశం పితరుని పేరు.
JOS 19:48 దాను వంశానికి యివ్వబడిన దేశం ఈ పట్టణాలు, పురాలు మొత్తము. ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో భాగం లభించింది.
JOS 19:49 కనుక దేశాన్ని విభజించటం, వేర్వేరు వంశాలకు దానిని పంచి ఇవ్వటం నాయకులు ముగించారు. వారు ముగించిన తర్వాత, నూను కుమారుడైన యెహోషువకు గూడ కొంత భూమి ఇవ్వాలని ఇశ్రాయేలు ప్రజలంతా నిర్ణయించారు. ఇది అతనికి వాగ్దానం చేయబడిన భూమి.
JOS 19:50 అతనికి ఈ భూమి రావాలని యెహోవా ఆజ్ఞాపించాడు. కనుక ఎఫ్రాయిము కొండ దేశంలోని తిమ్నాత్ సెరహు పురమును వారు యెహోషువకు ఇచ్చారు. ఈ పట్టణమే తనకు కావాలని యెహోషువ వారితో చెప్పాడు. కనుక యెహోషువ ఆ పట్టణాన్ని మరింత గట్టిగా కట్టి, అక్కడ నివసించాడు.
JOS 19:51 కనుక ఇశ్రాయేలీయుల వేర్వేరు వంశాలకు ఈ భూములన్నీ ఇవ్వబడ్డాయి. ఈ దేశాన్ని విభాగించేందుకు యాజకుడైన ఎలీయేజరు, నూను కుమారుడైన యెహోషువ, ఒక్కో వంశాల నాయకులు షిలోహు అనే స్థలంలో సమావేశం అయ్యారు. సన్నిధి గుడార ప్రవేశం దగ్గర యెహోవా సన్నిధిలో వారు సమావేశమయ్యారు. ఇప్పుడు దేశాన్ని విభాగించటం వారు ముగించారు.
JOS 20:1 అప్పుడు యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు:
JOS 20:2 “నీకు ఒక ఆజ్ఞ ఇచ్చేందుకు నేను మోషేను వాడుకొన్నాను. ప్రత్యేకమైన ఆశ్రయ పురాలను నిర్మించుమని మోషే నీతో చెప్పాడు.
JOS 20:3 ఎవరైనా ఒక వ్యకి మరొక వ్యక్తిని చంపితే, అది ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప, ఆ వ్యక్తిని చంపాలనే ఉద్దేశం లేకపోతే, అప్పుడు అతడు దాగుకొనేందుకు ఒక ఆశ్రయ పురానికి వెళ్ల వచ్చును.
JOS 20:4 “ఆ వ్యక్తి ఇలా చేయాలి. అతడు పారిపోయి, ఆ పట్టణాల్లో ఒకదానికి వెళ్లినప్పుడు, ఆ పట్టణ ప్రవేశందగ్గర అతడు ఆగిపోవాలి. అతడు ద్వారం దగ్గర ఆగిపోయి, జరిగిన విషయాన్ని గూర్చి ప్రజానాయకులకు చెప్పాలి. అప్పుడు ఆ ప్రజానాయకులు అతణ్ణి ఆ పట్టణంలో ప్రవేశింప నియ్యవచ్చును. అతడు వాళ్ల మధ్య నివసించేందుకు వారు అతనికి ఒక స్థలం ఇస్తారు.
JOS 20:5 అయితే వానిని తరుముతున్న వాడు అతణ్ణి వెంబడించి ఆ పట్టణానికి రావచ్చును. ఇలా గనుక జరిగితే ఆ పట్టణ నాయకులు వదలిపెట్టకూడదు. ఆశ్రయం కోసం వారి దగ్గరకు వచ్చిన వ్యక్తిని వారు కాపాడాలి. ఆ వ్యకి చంపినవానిని ఉద్దేశ పూర్వకంగా చంపలేదు గనుక వారు అతణ్ణి కాపాడాలి. అది ప్రమాదవశాత్తు జరిగింది. అతడు కోపంతో, ఆ వ్యక్తిని చంపాలని చేసిన నిర్ణయం కాదు. అది ఏదో అలా జరిగిపోయింది.
JOS 20:6 ఆ పట్టణంలోని న్యాయస్థానం అతనికి తీర్పు తీర్చేంతవరకు అతడు ఆ పట్టణంలో ఉండాలి. మరియు ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు ఆ పట్టణంలోనే ఉండి పోవాలి. తర్వాత అతడు ఏ పట్టణం నుండి పారిపోయాడో అక్కడి తన స్వంత ఇంటికి తిరిగి వెళ్లవచ్చును.”
JOS 20:7 కనుక, “ఆశ్రయ పురాలుగా” పిలువబడేందుకు కొన్ని పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించారు. ఆ పట్టణాలు: నఫ్తాలి కొండ దేశంలోని గలిలయలో కెదెషు, ఎఫ్రాయిము కొండ దేశంలో షెకెము, యూదా కొండ దేశంలో కిర్యత్ అర్బ (హెబ్రోను.)
JOS 20:8 యోర్దాను నది తూర్పు దిక్కున, యెరికో దగ్గర రూబేను దేశంలోని అరణ్యంలో బేసెరు, గాదు దేశంలోని గిలాదులో రామోతు, మనష్షే దేశంలోని బాషానులో గోలాను.
JOS 20:9 ఏ ఇశ్రాయేలీయులు అయినా, వారి మధ్య నివసిస్తున్న ఏవ్యక్తి అయినా ప్రమాదవశాత్తు ఒకరిని చంపినట్లయితే, ఆ వ్యక్తి భద్రతకోసం ఈ ఆశ్రయ పురాలలో ఒక దానికి పారిపోవచ్చును. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ క్షేమంగా ఉంటాడు, అతణ్ణి తరుముతున్న ఎవరిచేతగాని అతడు చంపబడడు. ఆ పట్టణ న్యాయస్థానం, ఆ పట్టణంలో అతనికి న్యాయం తీరుస్తుంది.
JOS 21:1 లేవీ వంశంపు ప్రధానులు యాజకుడైన ఎలీయాజరుతో, నూను కుమారుడు యెహోషువతో, ఇశ్రాయేలీయుల ఇతర వంశాల ప్రధానులతో మాట్లాడేందుకు వెళ్లారు.
JOS 21:2 ఇది కనాను దేశంలోని షిలోహు పట్టణంలో సంభవించింది. “మోషేకు యెహోవా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మేము నివసించేందుకు మీరు మాకు పట్టణాలు ఇవ్వాలని ఆయన ఆజ్ఞాపించాడు. మా పశువులు మేత మేసేందుకు పొలాలుకూడ మీరు మాకు ఇవ్వాలని ఆయన ఆజ్ఞాపించాడు.” అని లేవీ ప్రధానులు వారితో చెప్పారు.
JOS 21:3 కనుక యెహోవా ఆజ్ఞకు ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు. లేవీ ప్రజలకు వారు ఈ పట్టణాలు, ప్రాంతాలు ఇచ్చారు:
JOS 21:4 కహతు వంశంలో ఒక భాగం వారికి పదమూడు పట్టణాలు ఇవ్వబడ్డాయి. యూదా, షిమ్యోను, బెన్యామీను వారికి చెందిన ప్రాంతాల్లో ఈ పట్టణాలు ఉన్నాయి. (కహతు వంశం, లేవీ వంశంలో ఒక భాగం. లేవీ యాజకుడైన అహరోను సంతానము).
JOS 21:5 కహతు వంశంలోని మరో భాగం వారికి పది పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఈ పది పట్టణాలు ఎఫ్రాయిము, దాను, మనష్షే అర్ధగోత్రం వారి ప్రాంతాల్లో ఉన్నాయి.
JOS 21:6 గెర్షోము వంశపు ప్రజలకు పదమూడు పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులోని మనష్షే అర్ధ గోత్రం వారి ప్రాంతాల్లో ఈ పట్టణాలు ఉన్నాయి.
JOS 21:7 మెరారీ కుటుంబం వారికి పన్నెండు పట్టణాలు ఇవ్వబడ్డాయి. రూబేను, గాదు, జెబలూనుకు చెందిన ప్రాంతాల్లో ఈ పట్టణాలు ఉన్నాయి.
JOS 21:8 కనుక ఈ పట్టణాలు, వీటి పరిసరాల్లోని పొలాలు లేవీ ప్రజలకు ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చారు. మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు విధేయులుగా వారు ఇలా చేసారు.
JOS 21:9 యూదా, షిమ్యోనుకు చెందిన దేశంనుండి తీసుకొనబడిన పట్టణాల పేర్లు ఇవి.
JOS 21:10 మొదట నిర్ణయించబడిన పట్టణాలు కహత్ కుటుంబానికి ఇవ్వబడ్డాయి (లేవీ ప్రజలు).
JOS 21:11 కిర్యత్ అర్బ (హెబ్రోను), దాని పొలాలు అన్నీ వారు వారికి ఇచ్చారు. ఇది యూదా కొండ దేశంలో ఉంది. (అనాకు తండ్రి అర్బ). ఆ పట్టణం దగ్గర్లో వారి పశువులు మేసేందుకు పొలాలు కూడ వారికి లభించాయి.
JOS 21:12 అయితే కిర్యత్ అర్బ చుట్టు ఉన్న చిన్న పట్టణాలు, పొలాలు యెపున్నె కుమారుడైన కాలేబుకు చెందినవి.
JOS 21:13 కనుక హెబ్రోను పట్టణాన్ని వారు అహరోను సంతతివారికి ఇచ్చారు. హెబ్రోను ఆశ్రయ పట్టణం. అహరోను సంతతివారికి లిబ్నా
JOS 21:14 యత్తీరు, యష్టెమోయ
JOS 21:15 హోలోను, దెబీరు,
JOS 21:16 అయ్యిను, యుట్ట, బెత్‌షెమెషు పట్టణాలను కూడ వారు ఇచ్చారు. ఈ పట్టణాల చుట్టుపక్కల ఉన్న పొలాలు అన్నింటిని కూడ వారు వీరికి ఇచ్చారు. ఈ రెండు వంశాలకు ఇవ్వబడినవి తొమ్మిది పట్టణాలు.
JOS 21:17 బెన్యామీను సంతతివారికి చెందిన పట్టణాలను కూడా అహరోను సంతతివారికి ఇచ్చారు. ఆ పట్టణాలు గిబియోను, గెబ,
JOS 21:18 అనాతోతు, అల్మాను. ఈ నాలుగు పట్టణాలను, వాటి చుట్టూ ఉన్న పొలాలు అన్నింటినీ వారు వీరికి ఇచ్చారు.
JOS 21:19 కనుక యాజకులకు ఇవ్వబడిన పట్టణాలు ఇవి. ఈ యాజకులు అహరోను సంతానం వారు. మొత్తం మీద అవి పదమూడు పట్టణాలు మరియు వాటి పొలాలు.
JOS 21:20 కొహతీ కుటుంబంలో ఇతర ప్రజలకు ఈ పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఈ పట్టణాలు ఎఫ్రాయిము వంశంనుండి తీసుకోబడ్డాయి.
JOS 21:21 ఎఫ్రాయిము కొండ ప్రదేశంనుండి షెకెము పట్టణం (షెకెము ఒక ఆశ్రయ పట్టణం) వారువారికి గెజెర్
JOS 21:22 కిబ్సాయిము, బెత్‌హారాను కూడ ఇచ్చారు. మొత్తం మీద అవి నాలుగు పట్టణాలు మరియు వాటి పొలాలు.
JOS 21:23 దాను వంశం వారు వారికి ఎత్తేకె, గిబ్బెతాను
JOS 21:24 అయ్యలోను, గాత్ రిమ్మోను ఇచ్చారు. మొత్తం మీద నాలుగు పట్టణాలు మరియు వాటి పొలాలు.
JOS 21:25 మనష్షే వంశంలోని సగంమంది తానాను, గాత్ రిమ్మోను వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టణాల చుట్టూ ఉన్న పొలాలు అన్నీ వారికి ఇవ్వబడ్డాయి.
JOS 21:26 కనుక దీనితో ఇంకా పది పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న భూమి మొత్తం కొహత్ కుటుంబం వారికి ఇవ్వబడ్డాయి.
JOS 21:27 లేవీ వంశంలోని గెర్షోను కుటుంబం వారికి ఈ పట్టణాలు ఇవ్వబడ్డాయి. మనష్షే వంశంలోని సగంమంది బాషానులోని గొలానును వారికి ఇచ్చారు. (గొలాను ఆశ్రయ పట్టణం) మనష్షేకూడ బెష్టెరాను వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ గెర్షోను కుటుంబం వారికి ఇవ్వబడింది.
JOS 21:28 ఇశ్శాఖారు వంశంవారు వారికి కిషియొను, దబెరాతు
JOS 21:29 యార్ముతు, ఎన్‌గన్నీము ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాలు, వాటిచుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ వారి పశువులకోసం ఇశ్శాఖారు వంశానికి ఇచ్చారు.
JOS 21:30 ఆశేరు వంశం వారు వారికి మిషాలు, అబ్దోను
JOS 21:31 హెల్కాతు, రెహబు ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాలు వాటి చుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ వారు వారి పశువుల కోసం ఇచ్చారు.
JOS 21:32 నఫ్తాలి వంశంవారు గలలీయలోని కెదెషును వారికి ఇచ్చారు. (కెదెషు ఆశ్రయ పట్టణం). హమ్మోత్ దోరు, కర్తానుకూడ నఫ్తాలి వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ గెర్షోను కుటుంబం వారికి ఇవ్వబడింది.
JOS 21:33 మొత్తం మీద గెర్షోను కుటుంబం వారికి పద మూడు పట్టణాలు, ఈ పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం పొలాలు లభించాయి.
JOS 21:34 మరో లేవీ కుటుంబం మెరారీ కుటుంబం. మెరారీ కుటుంబం వారికి ఇవ్వబడిన పట్టణాలు ఇవి: జెబలూను వంశంవారు ఇచ్చినవి: యొకెనియము, కర్తా
JOS 21:35 దిమ్నా, నహలాలు. ఈ నాలుగు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ మెరారీ ప్రజలకే ఇవ్వబడింది.
JOS 21:36 రూబేను వంశంవారు వారికి ఇచ్చినవి బెసెరు, యహసు
JOS 21:37 కెదెమోతు, మోఫాతు. ఈ నాలుగు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ మెరారీ కుటుంబానికే ఇవ్వబడింది.
JOS 21:38 గాదు వంశం వారు ఇచ్చినవి గిలాదులోని రామోత్. (గిలాదు ఒక ఆశ్రయ పట్టణం). వారు ఇంకా మహనయీము,
JOS 21:39 హెష్బోను, యాజెరు కూడ ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ గాదువారు వారికి ఇచ్చారు.
JOS 21:40 మొత్తం మీద మెరారీ వారికి ఇవ్వబడినవి పన్నెండు పట్టణాలు.
JOS 21:41 మొత్తం మీద లేవీ వంశానికి నలభై ఎనిమిది పట్టణాలు లభించాయి. ఈ పట్టణాలన్నీ ఇశ్రాయేలు ప్రజల స్వాధీనంలో ఉన్న దేశంలోనే ఉన్నాయి.
JOS 21:42 ఈ పట్టణాలు ప్రతిదాని చుట్టూ పశువులు బతికేందుకు గాను భూమి, పొలాలు ఉన్నాయి.
JOS 21:43 కనుక ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన వాగ్దానం చేసిన దేశం అంతటినీ ఆ ప్రజలకు ఆయన ఇచ్చాడు. ఆ ప్రజలు ఆ దేశాన్ని స్వతంత్రించుకొని అక్కడ నివసించారు.
JOS 21:44 మరియు వారి దేశానికి అన్నివైపులా ఆ ప్రజలు శాంతి కలిగి ఉండేటట్లు యెహోవా చేసాడు. చాలా కాలం క్రిందట వారి పూర్వీకులకు ఆయన వగ్దానం చేసింది ఇదే. వారి శత్రువులు ఎవరూ వారిని ఓడించలేదు. ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రతి శత్రువును ఓడించేటట్టు యెహోవా చేసాడు.
JOS 21:45 ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చేసిన ప్రతి వాగ్దానాన్నీ ఆయన నెరవేర్చాడు. నెరవేరని వాగ్దానాలంటూ ఏమీ లేవు. ప్రతి వాగ్దానం నిజమయింది.
JOS 22:1 అప్పుడు రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగం మంది, అందరినీ ఒక సమావేశానికి పిలిచాడు యెహోషువ.
JOS 22:2 యెహోషువ వారితో అన్నాడు: “మీరు చేయాలని మోషే చెప్పిన వాటన్నింటికీ మీరు విధేయులయ్యారు. మోషే యెహోవా సేవకుడు. మరియు, మీరు నా ఆజ్ఞలన్నింటికి కూడా విధేయులయ్యారు.
JOS 22:3 ఇంకను ఇన్నాళ్లూ ఇశ్రాయేలు ఇతర ప్రజలందరినీ మీరు బలపర్చారు. మీ యెహోవా దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నింటికీ మీరు జాగ్రత్తగా విధేయులయ్యారు.
JOS 22:4 ఇశ్రాయేలు ప్రజలకు శాంతి ఇస్తానని మీ యెహోవా దేవుడు వాగ్దానం చేసాడు. కనుక ఇప్పుడు యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకొన్నాడు. ఇప్పటికి మీరు తిరిగి మీ ఇండ్లకు వెళ్లవచ్చును. మీకు ఇవ్వబడ్డ దేశానికి మీరు తిరిగి వెళ్లవచ్చును. ఇది యోర్దాను నదికి తూర్పున ఉన్న దేశం. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం ఇది.
JOS 22:5 అయితే మోషే మీకు ఇచ్చిన చట్టానికి లోబడుతూనే ఉండాలని జ్ఞాపకం ఉంచుకోండి. మీ యెహోవా దేవుడ్ని ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడటమే ఆ చట్టం. మీరు ఆయనను వెంబడిస్తూనే ఉండాలి, మీకు చేతనైనంత బాగుగా అయనను సేవిస్తూనే ఉండాలి.”
JOS 22:6 తర్వాత యెహోషువ వారికి వీడ్కోలు చెప్పగా, వారు వెళ్లిపోయారు. వారు వారి ఇండ్లకు వెళ్లిపోయారు.
JOS 22:7 బాషాను దేశాన్ని మనష్షే అర్ధ వంశం వారికి మోషే ఇచ్చాడు. మిగిలిన అర్ధం వంశంవారికి యోర్దాను నది పడమటి వైపు దేశాన్ని యెహోషువ ఇచ్చాడు. అక్కడికివారి ఇండ్లకు యోహోషువ వారిని పంపివేసాడు. యెహోషువ వారిని ఆశీర్వదించాడు.
JOS 22:8 “మీ ఇండ్లకు మీ ఐశ్వర్యాలకు తిరిగి వెళ్లండి. మీకు చాల పశువులు, చాల విలువైన నగలు, వెండి, బంగారం ఉన్నాయి. మీకు చాల అందమైన బట్టలు ఉన్నాయి. మరియు మీ శత్రువుల దగ్గర చాల వస్తువులు మీరు తీసుకొన్నారు. వీటన్నింటినీ మీలో మీరు పంచుకోవాలి.” అని అతడు చెప్పాడు.
JOS 22:9 కనుక రూబేను, గాదు, మనష్షే వంశాలవారు మిగిలిన ఇశ్రాయేలు ప్రజలను విడిచి వెళ్లారు. వారు కనానులోని షిలోహులో ఉన్నారు. ఆ స్థలం విడిచి వారు తిరిగి గిలాదు వెళ్లారు. ఇది వారి స్వంత దేశం. ఈ దేశాన్ని మోషే వారికి ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించినందువల్ల అతడు దానిని వారికి ఇచ్చాడు.
JOS 22:10 రూబేను, గాదు, మనష్షే ప్రజలు గెలిలోతు అనే స్థలానికి ప్రయాణం చేసారు. ఇది కనాను దేశంలో యోర్దాను నది దగ్గర ఉంది. ఆ స్థలంలో ప్రజలు ఒక చక్కని బలిపీఠం నిర్మించారు.
JOS 22:11 కానీ ఈ మూడు వంశాలవారు నిర్మించిన బలిపీఠం గూర్చి, ఇంకా షిలోహులోనే ఉన్న ఇతర ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. కనాను సరిహద్దులో గెలిల్‌తో అనే చోట బలిపీఠం ఉన్నదని వారు విన్నారు. అది యోర్దాను నది దగ్గర ఇశ్రాయేలీయుల వైపుగా ఉంది.
JOS 22:12 ఈమూడు వంశాల మీద ఇశ్రాయేలు ప్రజలందరికీ చాల కోపం వచ్చింది. వారు కలుసుకొని, వాళ్లతో యుద్ధం చేయాలని నిర్ణయం చేసారు.
JOS 22:13 కనుక రూబేను, గాదు, మనష్షే ప్రజలతో మాట్లాడేందుకు ఇశ్రాయేలు ప్రజలు కొందరు మనుష్యుల్ని పంపించారు. యాజకుడు ఎలీయాజరు కుమారుడైన ఫీనెహాసు ఈ మనుష్యులకు నాయకుడు.
JOS 22:14 వంశాల నాయకులలో పదిమందిని కూడ వారు అక్కడికి పంపించారు. షిలోహులో ఉన్న ఇశ్రాయేలు వంశాల్లో ఒక్కో దాని నుండి ఒక్కో మనిషి అందులో ఉన్నాడు.
JOS 22:15 కనుక ఈ పదకొండు మంది గిలాదు వెళ్లారు. రూబేను, గాదు, మనష్షే ప్రజలతో మట్లాడటానికి వారు వెళ్లారు. ఆ పదకొండు మంది వారితో అన్నారు:
JOS 22:16 “ఇశ్రాయేలు ప్రజలంతా మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, ‘ఇశ్రాయేలీయుల దేవునికి వ్యతిరేకంగా మీరు ఈ పని ఎందుకు చేసారు? మీరెందుకు యెహోవాకు అడ్డం తిరిగారు? మీకోసం మీరెందుకు బలిపీఠం కట్టుకొన్నారు? ఇది దేవుని చట్టానికి విరుద్ధం అని మీకు తెలుసు.
JOS 22:17 పెయొరు అనే మనిషి జ్ఞాపకం ఉన్నాడా? అతడు ఇలాగే చేసాడు. అతడి పాపం మూలంగా నేటికీ మనం శ్రమ అనుభవిస్తున్నాం. అతడి మహా అపరాధం మూలంగా ఇశ్రాయేలు ప్రజలు అనేకమంది రోగులు అయ్యేటట్టు దేవుడు చేసాడు. ఆ రోగం మూలంగా మనం నేడు కూడ శ్రమపడుతున్నాం.
JOS 22:18 ఇప్పుడు మీరు మళ్లీ అలాగే చేస్తున్నారు. మీరు యెహోవాకు విరోధంగా తిరుగుతున్నారు. యెహోవాను వెంబడించటానికి మీరు నిరాకరిస్తారా? మీరు చేస్తాన్న దానిని మానివేయకపోతే ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరి మీదా యెహోవా కోపగిస్తాడు.
JOS 22:19 “‘ఆరాధించుకొనేందుకు మీ దేశం తగినట్టుగా లేకపోతే, మా దేశంలోనికి రండి. యెహోవా గుడారం మా దేశంలో ఉంది. మీరు కూడ మా దేశంలో కొంత తీసుకొని, అక్కడే నివసించవచ్చు. అంతేకాని యెహోవకు విరోధంగా తిరుగకండి. మరో బలిపీఠం నిర్మించవద్దు. మన యెహోవా దేవుని బలిపీఠం సన్నిధి గుడారంలో ఇదివరకే ఉంది.
JOS 22:20 “‘జెరహు కుమారుడు ఆకాను ఆనేవాడ్ని జ్ఞాపకం చేసుకోండి. నాశనం చేయాల్సిన వస్తువుల విషయంలో అతడు ఆజ్ఞకు లోబడేందుకు ఇష్టపడలేదు. ఆ ఒక్కడు యెహోవా ఆజ్ఞకు ఉల్లంఘించాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలంతా శిక్షపొందారు. ఆకాను అతని అపరాధం మూలంగా చనిపోయాడు. కానీ అతని వలన ఇంకా చాలమంది ప్రజలు కూడ చనిపోయారు.’”
JOS 22:21 రూబేను, గాదు, మనష్షే వంశాల ప్రజలు ఆ పదకొండు మందికీ జవాబు చెప్పారు. వారు చెప్పింది ఇదే:
JOS 22:22 “యెహోవాయే మా దేవుడు. మళ్లీ చెబతున్నాము. యెహోవాయే మా దేవుడు. మేము ఎందుకు ఇలా చేసామో దేవునికి తెలుసు. మీరు కూడ తెలుసుకోవాలని మేము కోరుతున్నాము. మేము చేసినదానికి వీరు విచారణ జరుపవచ్చు. మేము చేసింది తప్పు అనే నమ్మకం మీకు కలిగితే, మీరు మమ్మల్ని చంపవచ్చు.
JOS 22:23 మేము గనుక దేవుని చట్టాన్ని ఉల్లంఘించిఉంటే, మమ్ముల్ని శిక్షించుమని చెప్పి ఆ దేవుడినే మేము అడుగుతాము. ధాన్యార్పణలు, సమాధానబలులు అర్పించేందుకు, దహనబలుల కోసమూ మేము ఈ బలిపీఠం నిర్మించామని మీరు తలుస్తున్నారా? లేదు. ఆ కారణంతో మేము దీన్ని నిర్మించలేదు. మేము ఈ బలిపీఠాన్ని ఎందుకు నిర్మించాము?
JOS 22:24 మేము కూడ మీ దేశంలో భాగస్థులమేనని మీ ప్రజలు భవిష్యత్తులో ఒప్పుకోరేమోనని మేము భయపడ్డాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యోహోవాను మేము ఆరాధించకూడదని అప్పుడు మీ ప్రజలు అంటారు.
JOS 22:25 యోర్దాను నది అవతలి వైపు దేవుడు మాకు భూమి ఇచ్చాడు. అంటే యోర్దాను నది మనల్ని వేరు చేస్తుందని దీని అర్థం. మీ పిల్లలు పెద్దవారై, మీ దేశాన్ని పాలించినప్పుడు, మేమూ మీ వాళ్లమేనని వారికి జ్ఞాపకం ఉండదు. ‘రూబేను, గాదు ప్రజలారా, మీరు ఇశ్రాయేలు ప్రజల మధ్యను చెందినవారు కారు’ అని మాతో వారు అంటారు. అందుచేత మా పిల్లలు యెహోవాను ఆరాధించకుండా మీ పిల్లలు ఆటంకపరుస్తారు.
JOS 22:26 “అందుచేత మేము ఈ బలిపీఠం నిర్మించాలని నిర్ణయించాం. అంతేగాని దీనిని దహనబలులకు, బలులకు ఉపయోగించాలని మేము తలచలేదు.
JOS 22:27 మీరు ఆరాధిస్తున్న, మీరు ఆరాధించే దేవుడినే మేమూ ఆరాధిస్తున్నామనే విషయం మా బలిపీఠం మా ప్రజలకు తెలియజేయాలనేదే అసలైన కారణం. మేము యెహోవాను ఆరాధిస్తామని మీకు, మాకు, మనభవిష్యత్ పిల్లలందరికీ ఈ బలిపీఠం ఋజువుగా ఉంటుంది. మా బలులు, ధాన్యార్పణలు, సమాధాన బలులు యెహోవాకు అర్పిస్తాము. మీ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు, మీవలెనే మేము కూడ ఇశ్రాయేలీయులం అని తెలుసుకోవాలని మా కోరిక.
JOS 22:28 ముందు నాటికి మేము ఇశ్రాయేలీయులకు చెందిన వాళ్లము కాదు అని మీ పిల్లలు చెప్పినట్లయితే ‘చూడండి! మాకు ముందు జీవించిన మా పితరులు ఒక బలిపీఠం నిర్మించారు. ఆ బలిపీఠం సరిగ్గా పవిత్ర గుడారం ముందర ఉన్న బలిపీఠంలాగానే ఉంది. ఈ బలిపీఠాన్ని బలులు అర్పించేందుకు మేము ఉపయోగించము. మేమూ ఇశ్రాయేలు ప్రజల్లో ఒక భాగమే అని ఈ బలిపీఠం తెలియజేస్తుంది’ అని మా పిల్లలు చెప్పగలుగుతారు.
JOS 22:29 “వాస్తవంగా మేము యోహోవాకు వ్యతిరేకంగా ఉండాలనుకోవటం లేదు. ఆయనను వెంబడించటం ఇప్పుడు మానివేయాలని కోరటం లేదు. పవిత్ర గుడారం ఎదుట ఉన్నదే సత్యమైన ఒకే బలిపీఠం అని మాకు తెలుసు. ఆ బలిపీఠం మన యోహోవా దేవునిది.”
JOS 22:30 రూబేను, గాదు, మనష్షే ప్రజలు చెప్పిన ఈ విషయాలను యాజకుడు ఫీనెహాసు, పదిమంది నాయకులు విన్నారు. ఈ మనుష్యులు సత్యమే చెబతున్నారని వారు తృప్తిపడ్డారు.
JOS 22:31 కనుక యాజకుడు ఫీనెహాసు, “యెహోవా మనతో ఉన్నాడని ఇప్పుడు మాకు తెలుసు. మరియు మీరు ఆయనకు విరోధంగా తిరుగలేదని కూడ ఇప్పుడు తెలుస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా చేత శిక్షించబడరు గనుక మేము సంతోషిస్తున్నాము” అన్నాడు.
JOS 22:32 అప్పుడు ఫీనేహాసు, తదితర నాయకులు ఆ చోటువిడిచి, ఇంటికి వెళ్లారు. రూబేను, గాదు ప్రజలను గిలాదు దేశంలో విడిచిపెట్టి, వారు కనానుకు తిరిగి వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వారు తిరిగి వెళ్లి జరిగినది వారికి తెలియజేసారు.
JOS 22:33 ఇశ్రాయేలు ప్రజలు కూడ తృప్తి చెందారు. వారు సంతోషించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. రూబేను, గాదు, మనష్షే ప్రజల మీదికి యుద్ధానికి వెళ్లకూడదని వారు తీర్మానించారు. ఆ దేశాలను నాశనం చేయకూడదని వారు నిర్ణయించారు.
JOS 22:34 మరియు, “యెహోవాయే దేవుడని మేము నమ్ముతున్నట్టు ఈ బలిపీఠం ప్రజలందరికీ తెలియజేస్తుంది” అని రూబేను, గాదు, మనష్షే ప్రజలు చెప్పారు. అందుచేత వారు ఆ బలిపీఠానికి “ఋజువు” అని పేరు పెట్టారు.
JOS 23:1 ఇశ్రాయేలీయులకు వారి చుట్టూ ఉండే శత్రువులనుండి యెహోవా శాంతిని ఇచ్చాడు. ఇశ్రాయేలీయులను యెహోవా క్షేమంగా ఉంచాడు. చాల సంవత్సరాలు గడిచాయి, యెహోషువ వృద్దుడయ్యాడు.
JOS 23:2 ఈ సమయంలో ఇశ్రాయేలు నాయకులు, కుటుంబ పెద్దలు న్యాయమూర్తులు అందరినీ యెహోషువ సమావేశపర్చాడు. యెహోషువ ఇలా చెప్పాడు: “నేను చాల ముసలివాడినయ్యాను.
JOS 23:3 మన శత్రువులకు యోహోవా చేసిన వాటిని మీరు చూసారు. మనకు సహాయం చేసేందుకు అయన అలా చేసాడు. మీ దేవుడైన యోహోవా మీ పక్షంగా పోరాడాడు.
JOS 23:4 పశ్చిమాన మహా సముద్రానికి, యోర్దానుకు మధ్యగల దేశమంతా మీ ప్రజలు తీసుకోవచ్చని నేను మీతో చెప్పినది జ్ఞాపకం ఉంచుకోండి. నేను మీకు ఇస్తానని చెప్పిన దేశం అది. కానీ మీరు ఇంకా దానిని స్వాధీనం చేసుకోలేదు.
JOS 23:5 అక్కడ నివసిస్తున్న ప్రజలకు మీ యెహోవా దేవుడు బలవంతంగా వెళ్లగొట్టేస్తాడు. మీరు ఆ దేశంలో ప్రవేశిస్తారు, అక్కడ నివసిస్తున్న ప్రజలను యెహోవా వెళ్లగొట్టేస్తాడు. మీ దేవుడైన యోహోవా చేసిన వాగ్దానం ఇది.
JOS 23:6 “యెహోవా మనకు ఆజ్ఞాపించిన వాటన్నింటికీ విధేయులుగా ఉండేందుకు మీరు జాగ్రత్తపడాలి. మోషే ధర్మశాస్రంలో రాయబడిన వాటన్నింటికీ విధేయులుగా ఉండండి. ఆ ధర్మశాస్త్రానికి విముఖులు కావద్దు.
JOS 23:7 ఇశ్రాయేలు ప్రజలు కానివాళ్లు ఇంకా కొంతమంది మన మధ్య నివసిస్తున్నారు. ఆ ప్రజలు వారి స్వంత దేవుళ్లను ఆరాధిస్తున్నారు. ఆ ప్రజలతో స్నేహం చేయవద్దు. వారి దేవుళ్లను సేవించవద్దు, ఆరాధించవద్దు.
JOS 23:8 మీ దేవుడైన యెహోవాను వెంబడించటం మీరు కొనసాగించాలి. గతంలో మీరు ఇలా చేసారు. అలాగే మీరు చేస్తూ ఉండాలి.
JOS 23:9 “మహా బలంగల అనేక రాజ్యాలను ఓడించేందుకు యెహోవా మీకు సహాయం చేసాడు. ఆ ప్రజలను యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. ఏ రాజ్యం కూడా మిమ్మల్ని ఓడించలేకపోయింది.
JOS 23:10 యెహోవా సహాయంతో ఇశ్రాయేలీయులలో ఒక్కడు వేయిమంది శత్రువులను ఓడించగలిగాడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడటంవల్లనే ఇది జరిగింది. ఇలా చేస్తానని యెహోవా వాగ్దానం చేసాడు.
JOS 23:11 అందుచేత మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూనే ఉండాలి. మీరు సంపూర్ణులుగా అయనను ప్రేమించాలి.
JOS 23:12 “యెహోవా మార్గంనుండి తొలగిపోవద్దు. ఇశ్రాయేలీయులకు చెందని ఏ ఇతరులతో స్నేహం చేయవద్దు. వారి మనుష్యులను ఎవరినీ పెళ్లాడకండి. అయితే మీరే గనుక ఈ మనుష్యులతో స్నేహం చేస్తే
JOS 23:13 మీ శత్రువులను జయించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు సహాయం చేయడు. కనుక ఈ ప్రజలు మీకు ఒక ఉచ్చుగా ఉంటారు. వారు మీ కళ్లలో పొగలా, ధూళిలా మీకు బాధ కలిగిస్తారు. మరియు ఈ మంచిదేశం నుండి మీరు వెళ్లగొట్టబడుతారు. ఇది మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశం, కానీ మీరు ఈ ఆజ్ఞకు విధేయులు కాకపోతే, దీనిని పోగొట్టు కొంటారు.
JOS 23:14 “ఇది దాదాపు నేను చనిపోవాల్సిన సమయం యెహోవా మీకోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసాడని మీకు తెలుసు, మీరు వాస్తవంగా నమ్ముతున్నారు. ఆయన చేసిన వాగ్దానాలు ఏవీ ఆయన తప్పలేదని మీకు తెలుసు. మనకు ఇచ్చిన ప్రతి వాగ్దానమూ యెహోవా నెరవేర్చాడు.
JOS 23:15 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ప్రతి మంచి వాగ్దానం నిజంగా నెరవేరింది. అయితే అదే విధంగా యెహోవా తన ఇతర వాగ్దానాలను కూడ నెరవేరుస్తాడు. మీరు తప్పు చేస్తే మీకు కీడు కలుగుతుందని ఆయన వాగ్దానం చేసాడు. ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంనుండి బలవంతంగా మిమ్మల్ని వెళ్లగొట్టేస్తానని ఆయన వాగ్దానం చేసాడు.
JOS 23:16 మీ దేవుడైన యోహోవాతో మీరు చేసిన ఒడంబడికను నిలబెట్టుకొనేందుకు మీరు నిరాకరిస్తే ఇలా జరుగుతుంది. మీరు వెళ్లి ఇతర దేవుళ్లకు పూజిస్తే మీరు ఈ దేశాన్ని పోగొట్టుకొంటారు. ఆ ఇతర దేవుళ్లను మీరు పూజించకూడదు. మీరు గనుక అలా చేస్తే మీ మీద యెహోవాకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంనుండి మీరు వెంటనే వెళ్లగొట్టబడతారు.”
JOS 24:1 అప్పుడు ఇశ్రాయేలీయుల వంశాలన్ని షెకెములో సమావేశం అయ్యాయి. వారందరినీ యెహోషువ అక్కడికి పిలిచాడు. అప్పుడు ఇశ్రాయేలు నాయకులను, కుటుంబ పెద్దలను, న్యాయమూర్తులను యెహోషువ పిలిచాడు. వీళ్లంతా దేవుని ఎదుట నిలబడ్డారు.
JOS 24:2 అప్పుడు యెహోషువ ప్రజలందరితో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మీతో చెబతున్నదే నేను మీతో చెబతున్నాను. చాలకాలం క్రిందట మీ పూర్వీకులు యూఫ్రటీసు నదికి ఆవలిపక్క నివసించారు. అబ్రాహాము, నాహోరుల తండ్రి తెరహు వంటి మనుష్యులను గూర్చి నేను చెప్పుచున్నాను. అప్పట్లో వాళ్లు ఇతర దేవుళ్లను పూజించారు.
JOS 24:3 అయితే యెహోవానైన నేను మీ తండ్రి అబ్రాహామును నది ఆవలివైపు దేశంనుండి బయటకు రప్పించాను. నేను అతనిని కనాను దేశంగుండా నడిపించి, అతనికి అనేకమంది పిల్లల్ని ఇచ్చాను. అబ్రాహాముకు ఇస్సాకు అనే కొడుకును నేను ఇచ్చాను.
JOS 24:4 మరియు ఇస్సాకునకు యాకోబు, ఏశావు అనే ఇద్దరు కొడుకులను నేను ఇచ్చాను. శేయీరు చుట్టూరా ఉన్న పర్వతాలను నేను ఏశావుకు ఇచ్చాను. కానీ యాకోబు, అతని కొడుకులు అక్కడ నివసించలేదు. బ్రతికేందుకు వారు ఈజిప్టు వెళ్లారు.
JOS 24:5 “అప్పుడు మోషే, అహరోనులను నేను ఈజిప్టుకు పంపించాను. నా ప్రజలను వారు ఈజిప్టునుండి బయటకు తీసుకొని రావాలని నేను కోరాను. ఈజిప్టు ప్రజలకు అనేకమైన భయంకర సంగతులు జరిగేటట్టు నేను చేసాను. అప్పుడు నేను మీ వాళ్లను ఈజిప్టునుండి బయటకు రప్పించాను.
JOS 24:6 కనుక నేనే మీ పూర్వీకులను ఈజిప్టునుండి బయటకు రప్పించాను. వారు ఎర్ర సముద్రం వరకు వచ్చేటప్పటికి, ఈజిప్టు మనుష్యులు వారిని తరుముతున్నారు. రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు అక్కడ.
JOS 24:7 కనుక యెహోవానైన నన్ను ప్రజలు సహాయం కోరారు. నేను ఈజిప్టు ప్రజల మీదికి మహాగొప్ప కష్టం వచ్చేటట్టు చేసాను. సముద్రం వాళ్లను కప్పివేసేటట్టుగా యోహోవానైన నేను చేసాను. ఈజిప్టు సైన్యానికి నేను చేసిన దీనిని మీ మట్టుకు మీరే చూసారు. “ఆ తర్వాత చాలా కాలం మీరు అరణ్యంలో నివసించారు.
JOS 24:8 అప్పుడు నేను అమోరీయుల దేశానికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఇది యోర్దాను నదికి తూర్పున ఉంది. ఆ ప్రజలు మీతో యుద్ధం చేసారు కాని మీరు వారిని ఓడించేటట్టు నేను చేసాను. ఆ ప్రజలను నాశనం చేసే శక్తి నేను మీకు ఇచ్చాను. అప్పుడు మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
JOS 24:9 “అప్పుడు మోయాబు రాజు, సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాజు బెయొరు కుమారుడైన బిలామును పిలిపించాడు. మిమ్మల్ని శపించమని అతడు బిలామును అడిగాడు.
JOS 24:10 కానీ యెహోవానైన నేను బిలాము మాట వినటానికి నిరాకరించాను. కనుక మీకు మంచి సంగతులు సంభవించాలని అర్థించాడు. అతడు మిమ్మల్ని చాలాసార్లు ఆశీర్వదించాడు. నేను మిమ్మల్ని రక్షించి, కష్టంనుండి బయటకు రప్పించాను.
JOS 24:11 “అప్పుడు మీరు యోర్దాను నది దాటి ప్రయాణంచేసారు. మీరు యెరికో చేరుకొన్నారు. యెరికో పట్టణం ప్రజలు మీతో పోరాడారు. మరియు అమోరీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు మీతో పోరాడారు. కాని వాళ్లందరినీ మీరు ఓడించేటట్టు నేను చేసాను.
JOS 24:12 మీ సైన్యం ముందుకు వెళ్తున్నప్పుడు వారికి ముందుగా కందిరీగలను నేను పంపించాను. ఆ కందిరీగలు మీ శత్రువులను పారిపోయేటట్టు చేసాయి. కనుక మీరు ఖడ్గాలు, బాణాలు ప్రయోగించకుండా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
JOS 24:13 “యెహోవానైన నేను మీకు ఆ దేశాన్ని ఇచ్చాను. మీరు పని చేయాల్సిన అవసరం లేకుండానే ఆ దేశాన్ని నేను మీకు ఇచ్చాను. మీరు నిర్మించని పట్టణాలను నేను మీకు ఇచ్చాను. ఇప్పుడు మీరు ఆ దేశంలో, ఆ పట్టణాల్లో నివసిస్తున్నారు. మీరు నాటకుండానే ద్రాక్షాతోటలు, ఒలీవ మొక్కలు మీకు ఉన్నాయి.”
JOS 24:14 అప్పుడు యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు మీరు యెహోవా మాటలు విన్నారు. కనుక మీరు యెహోవాను గౌరవించి, నిజంగా ఆయనను సేవించాలి. మీ పూర్వీకులు పూజించిన అసత్య దేవుళ్లను పారవేయండి. అది ఎప్పుడో చాలకాలం క్రిందట నదికి అవతల, ఈజిప్టులో జరిగిన విషయం. ఇప్పుడు మీరు యెహోవాను సేవించాలి.
JOS 24:15 “అయితే ఒకవేళ యెహోవాను సేవించటం మీకు ఇష్టం లేదేమో. అది ఈ వేళే మీరు తేల్చుకోవాలి. మీరు ఎవరిని సేవిస్తారో నేడే నిర్ణయించుకోవాలి. మీ పూర్వీకులు నదికి ఆవల నివసించినప్పుడు సేవించిన దేవుళ్లను మీరు సేవిస్తారో? లేదా ఈ దేశంలో నివసించిన అమోరీయుల దేవుళ్లను సేవిస్తారో? మీకు మీరే కోరుకోండి. అయితే, నేను, నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాము!”
JOS 24:16 అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “లేదు, యెహోవాను అనుసరించటం మేము ఎన్నటికీ మానము. ఇక ఇతర దేవుళ్లను ఎన్నటికి మేము సేవించము.
JOS 24:17 మన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించినవాడు యెహోవాయే అని మాకు తెలుసు. ఆ దేశంలో మనం బానిసలం. అయితే అక్కడ యెహోవా మనకోసం మహాగొప్ప కార్యాలు చేసాడు. ఆయనే ఆ దేశంనుండి మనల్ని బయటకు రప్పించాడు, ఇతర దేశాలగుండా మనము ప్రయాణిం చినప్పుడు ఆయనే మనలను కాపాడాడు.
JOS 24:18 తర్వాత ఈ దేశాల్లో నివసించే ప్రజలను ఓడించటానికి యెహోవాయే మనకు సహాయం చేసాడు. ఇప్పుడు మనం ఉన్న ఈ దేశంలో నివసించిన అమోరీ ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేసాడు. కనుక మేము ఆయననే సేవిస్తాం. ఎందుచేతనంటే ఆయనే మన దేవుడు గనుక.”
JOS 24:19 అప్పుడు యెహోషువ అన్నాడు, “(అది నిజం కాదు) మీరు యెహోవాను సరిగ్గా సేవించలేరు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు. తన ప్రజలు ఇతర దేవుళ్లను పూజిస్తే దేవునికి అసహ్యం. అలా మీరు ఆయనకు వ్యతిరేకంగా తిరిగితే దేవుడు మిమ్మల్ని క్షమించడు.
JOS 24:20 మీరు యెహోవాను విడిచిపెట్టి, ఇతర దేవుళ్లను సేవిస్తారు మరియు భయంకర సంగతులను దేవుడు మీకు సంభవింపజేస్తాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తాడు. యెహోవా దేవుడు మీ ఎడల దయగా ఉన్నాడు కానీ మీరు ఆయనకు విరోధంగా తిరిగితే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.”
JOS 24:21 అయితే ప్రజలు, “లేదు, మేము యోహోవానే సేవిస్తాము” అని యెహోషువతో చెప్పారు.
JOS 24:22 అప్పుడు యెహోషువ, “మీ చుట్టూ, ఇక్కడ మీతో ఉన్న ప్రజల చుట్టూ చూడండి. మీరు యెహోవానే సేవించేందుకు నిర్ణయం చేసారని మీకు తెలుసా, మీరు ఒప్పుకొన్నారా? దీనికి మీరంతా సాక్షులేనా?” అన్నాడు. ప్రజలు “అవును, ఇది సత్యం. మేము యెహోవానే సేవిస్తామని మేము నిర్ణయించు కొన్నట్టు మా అందరికీ తెలుసు” అని జవాబిచ్చారు.
JOS 24:23 అప్పుడు యెహోషువ, “అలాగైతే మీ మధ్య ఉన్న అసత్య దేవుళ్లను పారవేయండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి” అని చెప్పాడు.
JOS 24:24 అప్పుడు ప్రజలు “మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాము. మేము ఆయనకే విధేయులమవుతాము” అని యెహోషువతో చెప్పారు.
JOS 24:25 కనుక ఆ రోజున యెహోషువ ప్రజలతో ఒక ఒడంబడిక చేసాడు. ఈ ఒడంబడికను వారు పాటించాల్సిన ఒక చట్టముగా చేసాడు యెహోషువ. షెకెము అనబడిన పట్టణంలో ఇదంతా జరిగింది.
JOS 24:26 దేవుని ధర్మశాస్త్రపు గ్రంథంలో యెహోషువ ఈ సంగతులన్నీ వ్రాసాడు. అప్పుడు యెహోషువ ఒక పెద్ద బండను చూసాడు. (ఈ బండ ఈ ఒడంబడికకు ఋజువు) యెహోవా పవిత్ర గుడారం దగ్గర సింధూర వృక్షం క్రింద ఆ బండను అతడు పెట్టాడు.
JOS 24:27 అప్పుడు యెహోషువ ప్రజలందరితో చెప్పాడు: “ఈనాడు మనం చేసిన సంగతులను జ్ఞాపకం చేసుకునేందుకు ఈ బండ మీకు సహాయకరంగా ఉంటుంది. ఈనాడు యెహోవా మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ బండ ఇక్కడే ఉంది. కనుక ఈ వేళ జరిగిన దానిని మనం జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరంగా ఉంటుంది ఈ బండ. మీమీద ఈ బండ సాక్షి. మీ దేవుడైన యెహోవాకు మీరు విరోధంగా తిరుగకుండా ఈ బండ మిమ్మల్ని వారిస్తుంది.”
JOS 24:28 అప్పుడు యెహోషువ ప్రజలందరినీ వారి ఇండ్లకు వెళ్లిపొమ్మని చెప్పాడు. ప్రతి వ్యక్తీ తన స్వంత స్థలానికి వెళ్లిపోయాడు.
JOS 24:29 ఆ తర్వాత నూను కుమారుడైన యెహోషువ చనిపోయాడు. ఆయన వయస్సు నూటపది సంవత్సరాలు.
JOS 24:30 తిమ్నాత్ సెరహులోని తన స్వంత స్థలంలో యెహోషువ పాతిపెట్టబడ్డాడు. ఇది గాయషుకొండకు ఉత్తరాన ఎఫ్రాయిం దేశంలో ఉంది.
JOS 24:31 యెహోషువ జీవించిన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను సేవించారు. యెహోషువ మరణం తర్వాత కూడా ప్రజలు యెహోవాను సేవించారు. తమ నాయకులు బ్రతికి ఉన్నంతవరకు ప్రజలు యెహోవాను సేవించటం కొనసాగించారు ఇశ్రాయేలీయులకు యెహోవా చేసినవాటిని చూసినవారు ఈ నాయకులు.
JOS 24:32 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టును విడిచినప్పుడు, యోసేపు ఎముకలను వారితోకూడ మోసుకునివచ్చారు. కనుక యోసేవు ఎముకలను షెకెములో ప్రజలు పాతిపెట్టారు. షెకెము తండ్రి, హమోరు కుమారుల దగ్గర యాకోబు కొన్న భూమిలో వారు ఆ ఎముకలను పాతిపెట్టారు. ఆ భూమిని యాకోబవంద వెండి నాణాలకు కొన్నాడు. ఈ భూమి యోసేపు పిల్లలకు చెందినది.
JOS 24:33 అహరోను కుమారుడైన ఎలీయాజరు చనిపోయాడు అతడు గిబియాల్లో పాతిపెట్టబడ్డాడు. ఎఫ్రాయిము కొండ దేశంలో గిబియా ఒక పురం. ఆ పురం ఎలీయాజరు కుమారుడైన ఫీనెహాసుకు ఇవ్వబడింది.
JDG 1:1 యెహోషువ చనిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ప్రార్థన చేసారు: యెహోవాతో, “మా వంశాలలో ఏది ముందుగా వెళ్లి, మా పక్షంగా కనానీయులకు విరోధంగా యుద్ధం చేయాలి?” అని వారు అడిగినారు.
JDG 1:2 యెహోవా, “యూదా వంశస్థులు వెళతారు. నేను వారిని ఈ దేశం తీసుకోనిస్తాను” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.
JDG 1:3 యూదా పురుషులు, వారి సోదరులైన షిమ్యోను వంశంవారిని సహాయం అడిగారు. “సోదరులారా, మనలో ప్రతి ఒక్కరికీ కొంత భూమి ఇస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. మీరు వచ్చి, మా భూమి కోసం పోరాడటంలో సహాయం చేస్తే, అప్పుడు మేము మీ భూమి కోసం పోరాడేందుకు మీకు సహాయం చేస్తాం” అన్నారు యూదా మనుష్యులు. యూదా సోదరులతో కలిసి పోరాడేందుకు షిమ్యోను మనుష్యులు అంగీకరించారు.
JDG 1:4 కనానీయులను, పెరిజ్జీయులను ఓడించుటకు యూదా మనుష్యులకు యెహోవా సహాయం చేశాడు. బెజెకు పట్టణం దగ్గర యూదావారు 10,000 వేల మందిని చంపేసారు.
JDG 1:5 బెజెకు పట్టణంలో బెజెకు పాలకుని యూదా మనుష్యులు చూసి అతనితో పోరాడారు. యూదా వారు కనానీయులను, పెరిజ్జీయులను ఓడించారు.
JDG 1:6 బెజెకు పాలకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ యూదా వారు అతనిని తరిమి పట్టుకొన్నారు. వారు అతనిని పట్టుకున్నప్పుడు అతని కాళ్లు చేతుల బొటన వేళ్లను వారు కోసివేసారు.
JDG 1:7 అప్పుడు బెజెకు పాలకుడు, “డెభై మంది రాజుల కాళ్లు, చేతుల బొటన వేళ్లను నేను కోసివేసాను. ఆ రాజులు నా బల్ల మీదనుండి క్రింద రాలిన ఆహారం ముక్కలు తినవలసి వచ్చేది. ఆ రాజులకు నేను చేసిన దానిని దేవుడు ఇప్పుడు తిరిగి నాకు చెల్లించాడు” అని చెప్పాడు. బెజెకు పరిపాలకుని యూదా మనుష్యులు యెరూషలేము తీసుకుని వెళ్లారు. అతడు అక్కడ మరణించాడు.
JDG 1:8 యూదావారు యెరూషలేము మీద యుద్ధం చేసి దానిని పట్టుకొన్నారు. యెరూషలేము ప్రజలను చంపేందకు యూదావారు వారి ఖడ్గాలు ఉపయోగించారు. తర్వాత వారు పట్టణాన్ని కల్చేశారు.
JDG 1:9 ఆ తర్వాత యూదావారు మరికొంత మంది కనానీయులతో యుద్ధం చేయటానికి వెళ్లారు. నెగెవులోని కొండ దేశంలోను, పశ్చిమ కొండ చరియల్లోను ఆ కనానీయులు నివసించారు.
JDG 1:10 తర్వాత హెబ్రోను పట్టణంలో నివసించిన కనానీయులతో యుద్ధం చేసేందుకు యూదావారు వెళ్లారు. (హెబ్రోను కిర్యతర్బా అని పిలువబడేది.) షేషయి, అహీమాను, తల్మయి అనే వారిని యూదావారు ఓడించారు.
JDG 1:11 యూదా వారు ఆ చోటు విడిచిపెట్టేశారు. దెబీరులో ఉన్న ప్రజలతో యుద్ధం చేయటానికి వారు దెబీరు పట్టణం వెళ్లారు. (గతంలో దెబీరు కిర్యత్సేఫెరు అని పిలువబడింది).
JDG 1:12 యూదావారు యుద్ధం ప్రారంభించక ముందు, ఆ మనుష్యులకు కాలేబు ఒక వాగ్దానం చేసాడు, “కిర్యత్సేఫెరు మీద దాడిచేయాలని నేను కోరుతున్నాను. ఆ పట్టణాన్ని ముట్టడించి, దానిని పట్టుకొనేవాడికి నేను నా కుమార్తె అక్సాను ఇస్తాను. అతనిని నా కుమార్తెను వివాహం చేసుకోనిస్తాను” అని చెప్పాడు కాలేబు.
JDG 1:13 కాలేబుకు కనజు అనే పేరుగల చిన్న తమ్ముడు ఉన్నాడు. కనజుకు ఒత్నీయేలు అను పేరుగల ఒక కుమారుడు ఉన్నాడు. కిర్యత్సేఫెరు పట్టణాన్ని ఒత్నీయేలు పట్టుకున్నాడు. అందుచేత ఒత్నీయేలుకు భార్యగా ఉండేందుకు కాలేబు తన కుమార్తె అక్సాను అతనికి ఇచ్చాడు.
JDG 1:14 అక్సా ఒత్నీయేలుతో కాపురానికి వెళ్లింది. తన తండ్రిని కొంత భూమి అడగమని అక్సాతో చెప్పాడు ఒత్నీయేలు. అక్సా తన తండ్రి దగ్గరకు వెళ్లింది. ఆమె తన గాడిద మీదనుండి దిగగానే, “నీకేం కావాలి?” అని కాలేబు ఆమెను అడిగాడు.
JDG 1:15 అక్సా జవాబిచ్చింది: “నాకు ఒక ఆశీర్వాదం ఇవ్వుము. నీవు నాకు నెగెవులో ఎండిపోయిన ఎడారి భూమి ఇచ్చావు. దయచేసి నీళ్లుగల భూమి నాకు కొంత ఇవ్వుము.” కనుక ఆమె కోరినట్టు కాలేబు ఆమెకు ఇచ్చాడు. అప్పుడు ఎగువ, దిగువ నీటి మడుగులను కాలేబు ఆమెకు ఇచ్చాడు.
JDG 1:16 కెనెతీ ప్రజలు అంజూరపు చెట్ల పట్టణం (యెరికో) విడిచి, యూదా ప్రజలతో వెళ్ళారు. వారు యూదా అరణ్యంలోని ప్రజలతో కలిసి జీవించటానికి అక్కడికే వెళ్లారు. అది అరాదు పట్టణానికి సమీపంగానే నెగెవులో ఉంది. (కెనెతీ ప్రజలు మోషే మామగారి కుటుంబానికి చెందినవారు).
JDG 1:17 కనానీ ప్రజలు కొందరు జెఫతు పట్టణంలో నివసించారు. కనుక యూదావారు, షిమ్యోను వంశం వారు ఆ కనానీయుల మీద దాడిచేశారు. ఆ పట్టణాన్ని వారు పూర్తిగా ధ్వంసం చేశారు. అందుచేత వారు ఆ పట్టణానికి హోర్మా అని పేరు పెట్టారు.
JDG 1:18 యూదావారు గాజా పట్టణాన్ని, దాని చుట్టూరా ఉన్న చిన్న పట్టణాలను పట్టుకొన్నారు. అష్కెలోను, ఎక్రోను పట్టణాలను, వాటి చుట్టూరా ఉన్న చిన్న పట్టణాలను కూడా యూదావారు పట్టుకొన్నారు.
JDG 1:19 యూదావారు యుద్ధం చేసినప్పుడు యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. కొండ దేశంలోని భూమిని వారు స్వాధీనం చేసుకున్నారు. కానీ లోయల్లో ఉన్న ప్రజల వద్ద ఇనుప రథాలు ఉండటం చేత ఆ భూమిని యూదావారు తీసుకోలేక పోయారు.
JDG 1:20 హెబ్రోను దగ్గర ఉన్న భూమిని కాలేబుకు ఇస్తానని మోషే వాగ్దానం చేసాడు. కనుక ఆ భూమి కాలేబు కుటుంబానికి ఇవ్వబడినది. కాలేబు మనుష్యులు అనాకు యొక్క ముగ్గురు కుమారులను ఆ చోటు నుండి బలవంతంగా వెళ్లగొట్టారు.
JDG 1:21 బెన్యామీను వంశపు వారు యెరూషలేము నుండి యెబూసీ ప్రజలను వెళ్లగొట్టలేకపోయారు. కనుక నేటికీ బెన్యామీను ప్రజలతో బాటు యెబూసీ ప్రజలు కూడా యెరూషలేములో నివసిస్తున్నారు.
JDG 1:22 యోసేపు వంశం వారు బేతేలు పట్టణం మీద యుద్ధానికి వెళ్లారు. (పూర్వం బేతేలు లూజు అని పిలువబడింది.) యోసేపు వంశం వారి పక్షంగా యెహోవా ఉన్నాడు. యోసేపు వంశం వారు బేతేలు పట్టణానికి కొందరు గూఢాచారులను పంపించారు. (వీళ్లు బేతేలు పట్టణాన్ని ఓడించే మార్గాల కోసం వెదికారు).
JDG 1:24 గూఢచారులు బేతేలు పట్టణాన్ని గమనించి చూస్తూండగా ఆ పట్టణంలో నుండి ఒక మనిషి బయటకు రావటం వారు చూశారు. ఆ గూఢచారులు, “పట్టణంలోనికి ఒక రహస్య మార్గం మాకు చూపించు. మేము పట్టణం మీద దాడి చేస్తాము. కానీ నీవు మాకు సహాయం చేస్తే, మేము నీకు హాని చేయము” అని అతనితో చెప్పారు.
JDG 1:25 ఆ మనిషి పట్టణంలోనికిగల రహస్య మార్గాన్ని గూఢాచారులకు చూపించాడు. యోసేపు వంశస్థులు బేతేలు ప్రజలను చంపటానికి వారి ఖడ్గాలు ప్రయోగించారు. కానీ వారికి సహాయం చేసిన మనిషికి వారు హాని చేయలేదు. అతని కుటుంబం వారికి కూడ వారు హాని చేయలేదు. అతడు, అతని కుటుంబం స్వేచ్ఛగా వెళ్లనివ్వబడ్డాడు.
JDG 1:26 అతడు హిత్తీ ప్రజలు నివసించే దేశానికి వెళ్లి, ఒక పట్టణం నిర్మించాడు. ఆ పట్టణానికి లూజు అని అతడు పేరు పెట్టాడు. ఆ పట్టణం నేటికీ లూజు అని పిలువ బడుతూవుంది.
JDG 1:27 బేత్షెయానును, తయినాకు, దోరు, ఇబ్లెయామును, మెగిద్దో పట్టణాల్లో, ఆ పట్టణాల చుట్టుపక్కల ఉన్న చిన్న పట్టణాల్లో కనానీ ప్రజలు నివసిస్తున్నారు. మనష్షే వంశం వారు ఆ ప్రజలను ఆ పట్టణాల నుండి వెళ్లగొట్టలేకపోయారు. అందుచేత కనానీయులు ఉండిపోయారు. వారు తమ గృహాలు విడిచిపెట్టేందుకు నిరాకరించారు.
JDG 1:28 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బలవంతులై కనానీ ప్రజలను తమకు బానిసలుగా చేసుకున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రజలందరినీ వారి దేశంనుండి వెళ్లగొట్టలేకపోయారు.
JDG 1:29 (ఎఫ్రాయిము వంశం వారి విషయం కూడ అలాగే జరిగింది.) గెజెరులో కనానీ ప్రజలు నివసిస్తున్నారు. ఎఫ్రాయిము వంశస్తులు ఆ కనాను ప్రజలందరినీ వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. కనుక ఎఫ్రాయిము ప్రజలతోబాటు కనాను ప్రజలు కూడ గెజెరులో నివసించటం కొనసాగించారు.
JDG 1:30 జెబూలూను వంశం వారి విషయంలో కూడ అలాగే జరిగింది. కిత్రోను, నహలోలు పట్టణాల్లో కొందరు కనానీయులు నివసించారు. జెబూలూను ప్రజలు ఆ మనుష్యులను వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. ఆ కనానీయులు ఉండిపోయి, జెబూలూను వారితో నివసించారు. కానీ జెబూలూను వారు ఆ ప్రజలను తమకు బానిసలుగా పని చేయించుకొన్నారు.
JDG 1:31 (ఆషేరు వంశం వారి విషయంలో కూడా అలాగే జరిగింది.) అక్కో, సీదోను, అహ్లాబు, అక్జీబు, హెల్బా, అఫెకు, రెహోబు పట్టణాలనుండి ఇతర మనుష్యులను ఆషేరువారు వెళ్లగొట్టలేదు
JDG 1:32 ఆషేరువారు కనాను ప్రజలను వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. కనుక ఆ కనానీయులు ఆషేరు ప్రజలతో కలిసి జీవించటం కొనసాగించారు.
JDG 1:33 (నఫ్తాలి వంశం వారి విషయంలో కూడా ఇలాగే జరిగింది). బేత్షెమెషు, బేతనాతు పట్టణాలలోని ప్రజలను నఫ్తాలీ ప్రజలు వెళ్లగొట్టలేదు. కనుక నఫ్తాలి ప్రజలు ఇతరులతో కలసి ఆ పట్టణాలలోనే నివసించటం కొనసాగించారు. ఆ కనానీ ప్రజలు నఫ్తాలీ వారికి బానిసలుగా పని చేసారు.
JDG 1:34 అమోరీయులు, దాను వంశం వారిని కొండ దేశంలో నివసించేట్టుగా బలవంతం చేసారు. దాను ప్రజలు లోయలలో నివసించేందుకు అమోరీ ప్రజలు రానివ్వ లేదు. కనుక దాను వారు కొండలలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
JDG 1:35 అమోరీయులు అయ్యాలోను, హెరెసు కొండలోను, షయల్బీములోను నివసించేందుకు అమోరీయులు తీర్మానించుకున్నారు. తరువాత యోసేపువంశం బలమైనదిగా పెరిగింది. అప్పుడు వారు అమోరీయులను తమకు బానిసలుగా పని చేయించుకున్నారు.
JDG 1:36 అమోరీయుల దేశం తేలు కనుమనుండి హస్సెలా వరకు, ఆ పైన హస్సెలాకు అవతల కొండ దేశంలోనికీ విస్తరించింది.
JDG 2:1 యెహోవా దూత గిల్గాలు పట్టణం నుండి బోకీము పట్టణానికి వెళ్లాడు. యెహోవా నుండి వచ్చిన ఒక సందేశాన్ని ఆ దూత ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు. ఇదే ఆ సందేశం: “నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చాను. నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి నేను మిమ్మల్ని నడిపించాను. మీతో నేను చేసిన నా ఒడంబడికను నేను ఎన్నడూ ఉల్లంఘించను.
JDG 2:2 ఈ దేశంలో నివసించే వారితో మీరు ఏ ఒడంబడిక చేసుకోకూడదు. వారి బలిపీఠాలను మీరు నాశనం చేయాలి అని నేను చెప్పాను. కాని మీరు నాకు విధేయులు కాలేదు.
JDG 2:3 “నేను మీకు చెబతాను: ‘ఇతరులను ఇక మీదట ఈ దేశం నుండి బలవంతంగా నేను వెళ్లగొట్టను. ఈ ప్రజలు మీకు ఒక సమస్య అవుతారు. వారు మీకు ఉరిగా ఉంటారు. వారి దేవతలు మీకు ఉరిలాగా ఉంటారు.’”
JDG 2:4 యెహోవా నుండి వచ్చిన ఈ సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవదూత చెప్పగానే ప్రజలు గట్టిగా ఏడ్చారు.
JDG 2:5 కనుక ఇశ్రాయేలీయులు ఏడ్చిన ఆ స్థలానికి బోకీము అని పేరు పెట్టారు. బోకీములో ఇశ్రాయేలీయులు యెహోవాకు బలులు అర్పించారు.
JDG 2:6 అప్పుడు యెహోషువ ప్రజలను ఇంటికి పొమ్మని చెప్పాడు. అందుచేత ప్రతి వంశంవారు నివసించుటకు వారికి యివ్వబడిన భూమిని తీసుకొనుటకు వెళ్లారు.
JDG 2:7 యెహోషువ బ్రతికి ఉన్నంతవరకు ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించారు. యెహోవాషువ మరణించిన తరువాత జీవించిన నాయకుల (పెద్దలు) జీవిత కాలంలో వారు యెహోవాను సేవించారు. ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ ఈ వృద్ధులు చూశారు.
JDG 2:8 నూను కుమారుడు, యెహోవా సేవకుడునగు యెహోవాషువ 110 సంవత్సరాల వయస్సులో మరణించాడు.
JDG 2:9 ఇశ్రాయేలు ప్రజలు, యెహోవాషువకు ఇవ్వబడిన స్థలంలో వారు అతనిని సమాధి చేసారు. అది ఎఫ్రాయిము కొండ దేశంలో గాయషు పర్వతానికి ఉత్తరాన తమ్నాతు హెరెసు దగ్గర ఉంది.
JDG 2:10 ఆ తరం వారంతా చనిపోయాక తరువాత తరం పెరిగింది. యెహోవాను గూర్చిగాని, ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన వాటిని గూర్చిగాని ఈ కొత్త తరం వారికి తెలియదు.
JDG 2:11 అందుచేత ఇశ్రాయేలు ప్రజలు కీడు చేస్తూ తప్పుడు దేవత బయలును సేవించారు. ప్రజలు ఈ కీడు చేయటం యెహోవా చూశాడు.
JDG 2:12 ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు తీసుకుని వచ్చాడు. ఈ ప్రజల పూర్వీకులు యెహోవాను ఆరాధించారు. కాని ఇశ్రాయేలు యెహోవాను అనుసరించటం మానుకొన్నారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసించిన ప్రజలయొక్క తప్పుడు దేవుళ్లను పూజించటం మొదలు పెట్టారు. అది యెహోవాకు కోపం కలిగించింది.
JDG 2:13 ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించటం మానివేసి బయలు, అష్తారోతులను పూజించటం మొదలు పెట్టారు.
JDG 2:14 ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవాకు కోపం వచ్చింది. కనుక శత్రువులు ఇశ్రాయేలీయుల మీద దాడిచేసి వారి ఆస్తులను తీసుకునేట్టుగా యెహోవా చేశాడు. యెహోవా వారి చుట్టూరా ఉన్న వారి శత్రువుల ద్వారా వారు ఓడిపోయేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువులనుండి వారిని వారు కాపాడుకోలేక పోయారు.
JDG 2:15 ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి బయటకు వెళ్లినప్పుడల్లా ఓడిపోయారు. యెహోవా వారి పక్షంగా లేని కారణంచేత వారు ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసిస్తున్న ప్రజల దేవతలను సేవిస్తే, వారు ఓడిపోతారని యెహోవా ముందుగానే వారిని హెచ్చరించాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమ అనుభవించారు.
JDG 2:16 అప్పుడు యెహోవా న్యాయమూర్తులు అనే నాయకులను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల ఆస్తులను తీసుకున్న శత్రువులనుండి వారిని ఈ నాయకులు రక్షించారు.
JDG 2:17 కాని ఇశ్రాయేలు ప్రజలు వారి న్యాయాధిపతుల మాట వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక ఇతర దేవుళ్లను అనుసరించారు. పూర్వం ఇశ్రాయేలీయుల పూర్వీకులు యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యారు. కానీ ఇశ్రాయేలీయులు ఇప్పుడు మారిపోయి, యెహోవాకు విధేయులు కావటం లేదు.
JDG 2:18 ఇశ్రాయేలీయుల శత్రువులు ఇశ్రాయేలు ప్రజలకు అనేకసార్లు చెడు సంగతులు జరిగించారు. అందుచేత ఇశ్రాయేలీయులు సహాయం కోసం ఏడ్చేవారు. ప్రతీసారీ, ప్రజల విషయమై యెహోవా సంతాప పడ్డాడు. ప్రతీసారీ ప్రజలను వారి శత్రువుల నుండి రక్షించేందుకు ఆయన ఒక న్యాయమూర్తిని పంపించాడు. యెహోవా ఎల్లప్పుడూ ఆ న్యాయమూర్తులతో ఉండేవాడు. కనుక ప్రతిసారీ ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల నుండి రక్షించబడ్డారు.
JDG 2:19 అయితే ప్రతీ న్యాయమూర్తి చనిపోయినప్పుడూ, ఇశ్రాయేలీయులు మరల పాపం చేసి, బూటకపు దేవుళ్లను పూజించటం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు చాలా మొండి వాళ్లు వారు తమ చెడు మార్గాలు విడిచి పెట్టేందుకు నిరాకరించారు.
JDG 2:20 అందుచేత ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపగించి, ఆయన చెప్పాడు: “ఈ ప్రజలు నేను వారి పూర్వీకులతో చేసిన ఒడంబడికనే ఉల్లంఘించారు. వారు నా మాట వినలేదు.
JDG 2:21 కనుక నేను ఇంకెంత మాత్రం ఇతర రాజ్యాలను జయించి, ఇశ్రాయేలీయుల కోసం దారి సులభం చేయను. యెహోషువ చనిపోయినప్పుడు ఆ రాజ్యాలు ఇంకా ఈ దేశంలోనే ఉన్నాయి. మరియు ఆ రాజ్యాలను నేను ఈ దేశంలోనే ఉండనిస్తాను.
JDG 2:22 ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించేందుకు నేను ఆ రాజ్యాలను ప్రయోగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు, వారి పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించినట్టుగా, పాటించగలరేమో నేను చూస్తాను.”
JDG 2:23 యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. ఆ రాజ్యాలు వెంటనే దేశం విడిచిపోయేట్టు యెహోవా బలవంతం చేయలేదు. వారిని ఓడించేందుకు ఆయన యెహోషువ సైన్యానికి సహాయం చేయలేదు.
JDG 3:1 ఇతర రాజ్యాల ప్రజలంతా ఇశ్రాయేలీయుల దేశం విడిచిపెట్టేటట్టు యెహోవా బలవంతం చేయలేదు. ఇశ్రాయేలీయులను యెహోవా పరీక్షించాలనుకున్నాడు. ఈ సమయంలో జీవిస్తూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరు కూడ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన యుద్ధాల్లో పాల్గొనలేదు. అందుచేత ఆ ఇతర రాజ్యాలను యెహోవా వారి దేశంలో ఉండనిచ్చాడు. (ఆ యుద్ధాలలో పాల్గొనని ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాలని యెహోవా ఇలా చేసాడు). ఆ దేశంలో యెహోవా ఉండనిచ్చిన రాజ్యాల పేర్లు ఇవి:
JDG 3:3 ఫిలిష్తీయుల అయిదుగురు పరిపాలకులు, కనానీయులు అందరూను, సీదోను ప్రజలు, గయెలు హెర్మోను నుండి లెబోహమాతు వరకు గల లెబానోను కొండల్లో జీవించిన హివ్వీ ప్రజలు.
JDG 3:4 ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించటానికి యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. వారి పూర్వీకులకు మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆదేశాలకు ఇశ్రాయేలు ప్రజలు విధేయులవుతారేమోనని ఆయన చూడాలనుకున్నాడు.
JDG 3:5 కనానీయులతో, హిత్తీ ప్రజలతో, అమోరీ ప్రజలతో, పెరిజ్జీ ప్రజలతో, హివ్వీ ప్రజలతో, యెబూసీ ప్రజలతో కలిసి ఇశ్రాయేలు ప్రజలు జీవించారు.
JDG 3:6 ఇశ్రాయేలు ప్రజలు, ఆ ప్రజల కుమార్తెలను వివాహము చేసుకోవటం మొదలు పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు తమ కుమార్తెలను ఆ మనుష్యుల కుమారులు వివాహము చేసుకోనిచ్చారు. మరియు ఇశ్రాయేలు ప్రజలు ఆ మనుష్యుల దేవుళ్లను పూజించటం మొదలు పెట్టారు.
JDG 3:7 ఇశ్రాయేలు ప్రజలు చెడు పనులు చేసినట్టు యెహోవా చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడు యెహోవాను మరచిపోయి, బయలు మరియు అషేరా అను బూటకపు దేవుళ్లను సేవించారు.
JDG 3:8 ఇశ్రాయేలీయుల మీద యెహోవాకు కోపం వచ్చింది. యెహోవా అరామునహరాయిము రాజు కూషన్రిషాతాయిము ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, వారిని పాలించనిచ్చాడు. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరాల పాటు ఆ రాజు పాలనలో ఉన్నారు.
JDG 3:9 కానీ ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. వారిని రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఒత్నీయేలు. అతడు కనజు అనే వ్యక్తి కుమారుడు. కనజు కాలేబుకు చిన్న తమ్ముడు. ఒత్నీయేలు ఇశ్రాయేలీయులను రక్షించాడు.
JDG 3:10 యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదికి వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి అయ్యాడు. ఇశ్రాయేలీయులను ఒత్నీయేలు యుద్ధానికి నడిపించాడు. అరాము రాజు కూషన్రిషాతాయిమును ఓడించేందుకు యెహోవా ఒత్నీయేలుకు సహాయం చేసాడు.
JDG 3:11 అందుచేత కనజు కుమారుడు ఒత్నీయేలు చనిపోయేంతవరకు నలభై సంవత్సరాలు దేశం శాంతితో ఉండెను.
JDG 3:12 ఇశ్రాయేలు ప్రజలు మరల చెడుకార్యాలు చేయటం యెహోవా చూశాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలను ఓడించేందుకు మోయాబు రాజు ఎగ్లోనుకు యెహోవా శక్తి ఇచ్చాడు.
JDG 3:13 అమ్మోనీ ప్రజలు, అమాలేకు ప్రజల దగ్గర నుండి ఎగ్లోను సహాయం పొందాడు. వారు అతనితో కలిసి, ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేశారు. ఎగ్లోను, అతని సైన్యం ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, ఖర్జూరపు చెట్ల పట్టణం నుండి (యెరికో) వారిని బలవంతంగా వెళ్లగొట్టారు.
JDG 3:14 ఎగ్లోను ఇశ్రాయేలు ప్రజలను పద్దెనిమిది సంవత్సరాలు పాలించాడు.
JDG 3:15 ప్రజలు యెహోవాకు మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఏహూదు. ఏహూదు ఎడమచేతి వాటంగలవాడు. ఏహూదు బెన్యామీను వంశానికి చెందిన గెరా అనే పేరుగల వాని కుమారుడు. మోయాబు రాజు ఎగ్లోనుకు కొంత పన్ను డబ్బు చెల్లించేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును పంపించారు.
JDG 3:16 ఏహూదు అతనికోసం ఒక ఖడ్గం చేసుకున్నాడు. ఆ ఖడ్గానికి రెండంచులున్నాయి, దాని పొడవు పద్ధెనిమిది అంగుళాలు. ఏహూదు ఆ ఖడ్గాన్ని తన కుడి తొడకు కట్టుకొని తన బట్టల క్రింద దానిని కప్పిపెట్టాడు.
JDG 3:17 ఏహూదు మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరకు వచ్చి పన్ను డబ్బు చెల్లించాడు. (ఎగ్లోను చాలా లావు పాటి మనిషి)
JDG 3:18 ఏహూదు ఆ డబ్బును ఎగ్లోనుకు చెల్లించిన తర్వాత, ఆ డబ్బును మోసుకుని వచ్చిన ఆ మనుష్యులను తిరిగి ఇంటికి పంపించివేసాడు.
JDG 3:19 ఏహూదు వెళ్లేందుకు బయలుదేరాడు. గిల్గాలు పట్టణంలో విగ్రహాలను అతడు సమీపించినప్పుడు అతడు వెనుకకు తిరిగాడు. అప్పుడు ఏహూదు, “ఓ రాజా, నీకు చెప్పాల్సిన ఒక రహస్య సందేశం నా దగ్గర ఉంది” అని ఎగ్లోనుతో చెప్పాడు. ఊరకవుండు అన్నాడు రాజు. తర్వాత అతడు సేవకులందరినీ ఆ గదిలోనుండి బయటకు పంపివేసాడు.
JDG 3:20 ఏహూదు ఎగ్లోను రాజు దగ్గరకు వెళ్లాడు. ఎగ్లోను తన వేసవి కాలపు రాజ భవనంలో ఒంటరిగా కూర్చునియున్నాడు. అప్పుడు ఏహూదు, “దేవుని దగ్గరనుండి నీ కోసము ఒక సందేశం నా వద్ద వుంది” అని చెప్పాడు. రాజు తన సింహాసనం నుండి లేచి ఏహూదుకు చాలా దగ్గరగా వచ్చాడు.
JDG 3:21 రాజు తన సింహాసనం నుండి లేచి నిలబడగా, ఏహూదు తన కుడి తొడకు కట్టబడిన ఖడ్గాన్ని తన ఎడమ చేతితో అందుకొని బయటకు తీసాడు. అప్పుడు ఏహూదు ఆ ఖడ్గాన్ని రాజు పొట్టలో పొడిచి వేసాడు.
JDG 3:22 ఆ ఖడ్గం పిడికూడ లోపలకు దిగిపోవునంతగా రాజు కడుపులోనికి దిగిపోయింది. రాజు కొవ్వు ఖడ్గము నిండా అతుక్కుపోయింది. కనుక ఏహోదు ఆ ఖడ్గాన్ని ఎగ్లోను పొట్టలోనే విడిచిపెట్టేసాడు.
JDG 3:23 ఏహూదు గదిలో నుండి బయటకు వెళ్లి దాని తలుపులు మూసి తాళం వేసాడు.
JDG 3:24 ఏహూదు వెళ్లిపోగానే సేవకులు తిరిగి వచ్చారు. ఆ గది తలుపులు తాళము వేసి ఉండటం ఆ సేవకులు చూశారు. కనుక ఆ సేవకులు, “రాజు తన విశ్రాంతి గదిలో మూత్ర విసర్జనకు వెళ్లి ఉంటాడు” అని చెప్పుకున్నారు.
JDG 3:25 అందుచేత ఆ సేవకులు చాలా సేపు వేచి ఉన్నారు. చివరికి వారు దిగులు చెందారు. వారు తాళం చెవి తెచ్చి తలుపులు తెరిచారు. ఆ సేవకులు ప్రవేశించినప్పుడు, వారి రాజు నేల మీద చచ్చిపడి ఉండటం చూశారు.
JDG 3:26 ఆ సేవకులు రాజు కొరకు వేచి ఉండగా, ఏహూదు పారిపోయేందుకు సమయం దొరికింది. ఏహూదు విగ్రహాలను దాటి శెయీరా అను స్థలంవైపు వెళ్లాడు.
JDG 3:27 ఏహూదు శెయీరా అను స్థలం చేరాడు. అప్పుడు అతడు అక్కడ ఎఫ్రాయిమీయుల కొండ దేశంలో బూర ఊదాడు. ఇశ్రాయేలు ప్రజలు బూర శబ్దం విని, ఏహూదు వారిని నడిపిస్తుండగా వారు కొండలు దిగివెళ్లారు.
JDG 3:28 ఏహూదు, “నన్ను వెంబడించండి! మన శత్రువులైన మోయాబు ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును వెంబడించారు. ఎక్కడైతే యోర్దాను నదిని తేలికగా దాటి, మోయాబు దేశంలోనికి వెళ్లవచ్చునో ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు వారు ఏహూదు వెంట వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ ఒక్కరినీ కూడా యోర్దాను నదిని దాటనివ్వలేదు.
JDG 3:29 మోయాబు ప్రజలలో ధైర్యం, బలంగల పదివేల మందిని ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. మోయాబు వాడు ఒక్కడు కూడా తప్పించుకోలేదు.
JDG 3:30 కనుక ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు మోయాబు ప్రజలను పాలించటం మొదలు పెట్టారు. మరియు ఆ దేశంలో ఎనభై సంవత్సరాల వరకు శాంతి ప్రబలింది.
JDG 3:31 ఏహూదు ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన తర్వాత మరో మనిషి ఇశ్రాయేలీయులను రక్షించాడు. ఆ మనిషి పేరు షమ్గరు. అతడు అనాతు కుమారుడు. ఫిలిష్తీ మనుష్యులు ఆరువందల మందిని చంపేందుకు షమ్గరు ఒక ములుకోల (ఎద్దులను తోలే ముల్లుగల కర్ర)ను ప్రయోగించాడు.చ్చింది.
JDG 4:1 చెడ్డవి అని యెహోవా చెప్పిన వాటినే ప్రజలు ఏహూదు చనిపోయిన తర్వాత మరల చేశారు.
JDG 4:2 కనుక కనాను రాజు యాబీను ఇశ్రాయేలీయులను ఓడించేలాగ యెహోవా చేశాడు. యాబీను హాసోరు పట్టణంలో పరిపాలించాడు. సీసెరా అను పేరుగలవాడు యాబీను రాజు సైన్యానికి సేనాధిపతి. హరోషెతు హాగ్గోయిం అనే పట్టణంలో సీసెరా నివసించాడు.
JDG 4:3 సీసెరాకు తొమ్మిదివందల ఇనుప రథాలున్నాయి. అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల ఎడల చాలా క్రూరంగా ఉన్నాడు. కనుక సహాయం కోసం వారు యెహోవాకు మొరపెట్టారు.
JDG 4:4 దెబోరా అనే పేరుగల ఒక ప్రవక్తి ఉంది. ఆమె లప్పీదోతు అను పేరుగల వాని భార్య. ఆ కాలంలో ఆమె ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి.
JDG 4:5 ఒక రోజు దెబోరా ఖర్జూర చెట్టు క్రింద కూర్చుని ఉంది. సీసెరా విషయం ఏమి చెయ్యాలి అని ఆమెను అడిగేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఆమె దగ్గరకు వచ్చారు. ఎఫ్రాయిము కొండ దేశంలో రామా, బేతేలుకు మధ్య దెబోరా యొక్క ఖర్జూర చెట్టు ఉంది.
JDG 4:6 బారాకు అను పేరుగల మనిషికి దెబోరా ఒక వర్తమానం పంపింది. ఆమెను కలుసుకునేందుకు రమ్మని ఆమె అతనిని అడిగింది. బారాకు అబీనోయము అనే పేరుగల వాని కుమారుడు. బారాకు నఫ్తాలి ప్రాంతంలోని కెదెషు పట్టణంలో నివసించేవాడు. దెబోరా బారాకుతో ఇలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడు యెహోవా నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ‘వెళ్లి నఫ్తాలి జెబూలూను వంశాల నుండి పదివేల మంది పురుషులను సమావేశపరచి, ఆ మనుష్యులను తాబోరు కొండకు నడిపించు.
JDG 4:7 యాబీను రాజు సైన్యాధిపతి సీసెరాను నేను నీ దగ్గరకు రప్పిస్తాను. సీసెరాను, అతని రథాలను, మరియు అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నేను రప్పిస్తాను. అక్కడ నీవు సీసెరాను ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను.’”
JDG 4:8 అప్పుడు బారాకు, “నీవు నాతో కూడా వస్తే నేను వెళ్లి ఈ పని చేస్తాను. కాని నీవు నాతో రాకపోతే, నేనూ వెళ్లను”అని దెబోరాతో చెప్పాడు.
JDG 4:9 “ఓ, నేను తప్పకుండా నీతో వస్తాను” అని దెబోరా జవాబిచ్చింది. “కానీ నీ వైఖరి మూలంగా, సీసెరా ఓడించబడినప్పుడు నీవు ఘనత పొందవు. ఒక స్త్రీ సీసెరాను ఓడించేటట్టు యెహోవా చేస్తాడు” అని చెప్పింది. కనుక బారాకుతో కూడ కెదెషు పట్టణానికి దెబోరా వెళ్లింది.
JDG 4:10 కెదెషు పట్టణం దగ్గర జెబూలూను, నఫ్తాలి వంశాలను బారాకు సమావేశ పరిచాడు. ఆ వంశాల నుండి అతనిని వెంబడించేందుకు పదివేల మంది పురుషులను సమావేశపర్చాడు. దెబోరా కూడా బారాకుతో వెళ్లింది.
JDG 4:11 కెనితీ ప్రజలకు చెందిన, హెబెరు అను పేరుగల ఒకడు ఉన్నాడు. (కెనితీ ప్రజలు హోబాబు వంశస్థులు. హోబాబు మోషేకు మామ) జయనన్నీము అనుచోట మస్తకి చెట్టు దగ్గర హెబెరు తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. జయనన్నీము కెదెషు పట్టణానికి దగ్గరగా ఉంది.
JDG 4:12 అబీనోయము కుమారుడు బారాకు తాబోరు కొండ దగ్గర ఉన్నాడని సీసెరాతో ఎవరో చెప్పారు.
JDG 4:13 కనుక సీసెరా తన తొమ్మిదివందల ఇనుప రథాలను సిద్ధం చేసాడు. సీసెరా తన మనుష్యులందరినీ ఒక్క చోట చేర్చాడు. వారు హారోషెతు హగ్గోయిము పట్టణం నుండి కీషోను నది దగ్గరకు సాగిపోయారు.
JDG 4:14 అప్పుడు దెబోరా, “ఈ వేళ నీవు సీసెరాను ఓడించేందుకు యెహోవా సహాయం చేస్తాడు. నీ కోసం యెహోవా ఇప్పటికే మార్గాన్ని చక్కగా తయారు చేశాడని నీకు గట్టిగా తెలుసు” అని బారాకుతో చెప్పింది. కనుక పదివేల మంది మనుష్యులను తాబోరు కొండ నుండి బారాకు నడిపించాడు.
JDG 4:15 బారాకు, అతని మనుష్యులు సీసెరా మీద దాడిచేసారు. యుద్ధ సమయంలో సీసెరాను, అతని సైన్యాన్ని, రథాలను యెహోవా కలవరపర్చాడు. ఏమి చేయాలో వారికి తెలియలేదు. అందుచేత బారాకు, అతని మనుష్యులు సీసెరా సైన్యాన్ని ఓడించారు. కానీ, సీసెరా తన రథాన్ని విడిచిపెట్టి కాలినడకన పారిపోయాడు.
JDG 4:16 బారాకు సీసెరా సైన్యంతో పోరాటం కొనసాంగించాడు. హారోషెతు, హగ్గోయిము వరకూ కూడా సీసెరా రథాలను, సైన్యాన్ని బారాకు, అతని మనుష్యులు తరిమి వేసారు. బారాకు, అతని మనుష్యులు వారి ఖడ్గాలను ఉపయోగించి సీసెరా మనుష్యులను చంపివేసారు. సీసెరా మనుష్యులతో ఒక్కడు కూడా ప్రాణంతో విడువబడ లేదు.
JDG 4:17 కానీ సీసెరా పారిపోయాడు. యాయేలు అను స్త్రీ నివసిస్తున్న గుడారం దగ్గరకు అతడు వచ్చాడు. యాయేలు హెబెరు అనువాని భార్య. అతడు కెనితీ ప్రజల్లో ఒకడు. హెబెరు కుటుంబం హసోరు రాజగు యాబీనుతో సమాధానంగా ఉంది. కనుక సీసెరా యాయేలు గుడారానికి పరుగెత్తాడు.
JDG 4:18 సీసెరా రావటం యాయేలు చూసింది గనుక అతనిని కలుసుకొనేందుకు ఆమె బయటకు వెళ్లింది. యాయేలు, “అయ్యా, నా గుడారంలోనికి రండి. రండి, భయపడవద్దు” అని సీసెరాతో చెప్పింది. కనుక సీసెరా, యాయేలు గుడారంలోనికి వెళ్లాడు. ఆమె అతనిని గొంగళితో కప్పింది.
JDG 4:19 “నాకు దాహంగా వుంది. దయచేసి తాగేందుకు నాకు కొంచెం నీళ్లు ఇవ్వు” అన్నాడు సీసెరా యాయేలుతో. జంతు చర్మంతో చేయబడిన ఒక బుడ్డి యాయేలు దగ్గర ఉంది. అందులో ఆమె పాలు పోసి ఉంచింది. సీసెరా తాగటానికి యాయేలు ఆ పాలు ఇచ్చింది. అప్పుడు ఆమె సీసెరాను కప్పివేసింది.
JDG 4:20 అప్పుడు సీసెరా యాయేలుతో, “వెళ్లి, గుడార ద్వారం దగ్గర నిలువబడు. ఎవరైనా అటువైపు వచ్చి, ‘లోపల ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు” అన్నాడు.
JDG 4:21 కానీ యాయేలు ఒక గుడారపు మేకును, ఒక సుత్తెను చూసింది. యాయేలు త్వరగా సీసెరా దగ్గరకు వెళ్లింది. సీసెరా చాలా అలసిపోయినందువల్ల, నిద్రపోతున్నాడు. యాయేలు గుడారపు మేకును సీసెరా కణతల మీద పెట్టి, సుత్తెతో దిగ గొట్టేసింది. ఆ గుడారపు మేకు సీసెరా కణతల్లో నుండి నేల మీదికి దిగిపోయింది. సీసెరా మరణించాడు.
JDG 4:22 సరిగ్గా అప్పుడే సీసెరా కోసం వెదుక్కొంటూ బారాకు యాయేలు గుడారంవైపు వచ్చాడు. యాయేలు బారాకును కులుసుకొనేందుకు బయటకు వెళ్లి, “ఇక్కడ లోపలికి రా, నీవు వెదుకుతున్న మనిషిని నేను నీకు చూపిస్తాను” అంది. కనుక బారాకు యాయేలుతో కలిసి గుడారంలో ప్రవేశించాడు. అక్కడ కణతల్లో నుండి నేలమీదికి గుడారపు మేకు దిగిపోయి, చచ్చిపడి ఉన్న సీసెరా బారాకుకు కనిపించాడు.
JDG 4:23 ఆ రోజు కనాను రాజు యాబీనును ఇశ్రాయేలు ప్రజలకోసం దేవుడు ఓడించాడు.
JDG 4:24 కనుక ఇశ్రాయేలు ప్రజలు కనాను రాజు యాబీనును ఓడించటంతో మరింత బలవంతులయ్యారు. కనాను రాజు యాబీనును ఇశ్రాయేలు ప్రజలు చివరికి నాశనం చేసారు.
JDG 5:1 ఇశ్రాయేలు ప్రజలు సీసెరాను ఓడించిన రోజున దెబోరా, అబీనోయము కుమారుడు బారాకు ఈ గీతం పాడారు:
JDG 5:2 “ఇశ్రాయేలు మనుష్యులు యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధానికి వెళ్లేందుకు ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చారు. యెహోవాను స్తుతించండి.
JDG 5:3 “రాజులారా, వినండి. అధికారులారా గమనించండి! నేను పాడుతాను. నా మట్టుకు నేనే యెహోవాకు గానం చేస్తాను. యెహోవాకు, ఇశ్రాయేలు ప్రజల దేవునికి నేను సంగీతం గానం చేస్తాను.
JDG 5:4 “యెహోవా, గతంలో నీవు శేయీరు దేశం నుండి వచ్చావు. ఎదోము దేశం నుండి నీవు సాగిపోయావు. నీవు నడువగా భూమి కంపించింది. ఆకాశాలు వర్షించాయి. మేఘాలు నీళ్లు కురిపించాయి.
JDG 5:5 సీనాయి పర్వత దేవుడగు యెహోవా ఎదుట ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి.
JDG 5:6 “అనాతు కుమారుడు షమ్గరు రోజుల్లో యాయేలు రోజుల్లో, రహదారులు ఖాళీ అయ్యాయి. ప్రయాణీకుల ఒంటెలు వెనుక దారుల్లో వెళ్లాయి.
JDG 5:7 “దెబోరా, నీవు వచ్చేవరకు, ఇశ్రాయేలుకు నీవు ఒక తల్లిగా వచ్చేవరకు సైనికులు లేరు ఇశ్రాయేలులో సైనికులు లేరు.
JDG 5:8 “వారు కొత్త దేవతలను అనుసరించాలని కోరుకొన్నారు. అందుచేత వారి పట్టణ ద్వారాల వద్ద వారు పోరాడవలసి వచ్చింది. నలభైవేల మంది ఇశ్రాయేలు సైనికుల్లో ఎవరివద్దా ఒక డాలుగాని, బల్లెంగాని లేదు.
JDG 5:9 “నా హృదయం ఇశ్రాయేలు సైన్యాధికారులతోనే ఉంది. ఈ సైన్యాధికారులు ఇశ్రాయేలీయుల కోసం పోరాడేందుకు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చారు. యెహోవాను స్తుతించండి!
JDG 5:10 “తెల్లగాడిదల మీద ప్రయాణం చేసే ప్రజలారా, వాటి వీపు మీద తివాచీ లపై కూర్చొనే ప్రజలారా, దారిలో ప్రయాణం చేసే ప్రజలారా గమనించండి!
JDG 5:11 యెహోవా విజయాలను గూర్చి ఇశ్రాయేలీయుల మధ్య యెహోవా సైనికుల విజయాలను గూర్చి యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల్లో పోరాడేందుకు వెళ్లినప్పటి విషయాలను గూర్చి పశువులు నీళ్లు త్రాగే చోట్ల తాళాల శబ్దాలతో వారు చెప్పుకొంటున్నారు.
JDG 5:12 “దెబోరా మేలుకో, మేలుకో! మేలుకో, మేలుకో, ఒక పాట పాడు! బారాకూ లెమ్ము! అబీనోయము కుమారుడా, వెళ్లి, నీ శత్రువులను పట్టుకో!
JDG 5:13 “ఆ సమయంలో బతికి ఉన్నవారు నాయకుల దగ్గరకు వచ్చారు. యెహోవా ప్రజలు సైనికులతో కలిసి నా దగ్గరకు వచ్చారు.
JDG 5:14 “అమాలేకు కొండ దేశంలో ఎఫ్రాయిము మనుష్యులు స్థిరపడ్డారు. బెన్యామీనూ, ఆ మనుష్యులు నిన్నూ, నీ ప్రజలను వెంబడించారు. మాకీరు కుటుంబ వంశంనుండి సైన్యాధికారులు దిగి వచ్చారు. జెబూలూను వంశం నుండి ఇత్తడి దండం పట్టి నడిపించు వారు వచ్చారు.
JDG 5:15 ఇశ్శాఖారు నాయకులు దెబోరాతో ఉన్నారు. ఇశ్శాఖారు వంశం వారు బారాకునకు నమ్మకంగా ఉన్నారు. ఆ మనుష్యులు లోయలోనికి కాలి నడకన సాగిపోయారు. “రూబేనీయులలో బహు గొప్పగా హృదయ పరిశోధన జరిగింది.
JDG 5:16 అలాగైతే, మీరంతా గొర్రెల దొడ్ల గోడల వద్ద ఎందుకు కూర్చొన్నారు? రూబేను, వారి సాహస సైనికులు యుద్ధం గూర్చి గట్టిగా తలచారు. కానీ వారు గొర్రెల కోసం వాయించిన సంగీతం వింటూ, ఇంటి వద్దనే కూర్చుండిపోయారు.
JDG 5:17 గిలాదువారు యోర్దానుకు ఆవలివైపున వారి గుడారాల్లోనే ఉండిపోయారు. దాను ప్రజలారా, మీరు మీ ఓడల దగ్గరే ఎందుకు ఉండిపోయారు? ఆషేరు వంశం వారు సముద్ర తీరంలోనే ఉండిపోయారు. క్షేమ కరమైన ఓడ రేవుల్లోనే వారు ఉండి పోయారు.
JDG 5:18 “కానీ జెబూలూను మనుష్యులు నఫ్తాలి మనుష్యులు ఆ కొండల మీద పోరాడేందుకు వారి ప్రాణాలకు తెగించారు.
JDG 5:19 రాజులు వచ్చారు, వారు యుద్ధం చేసారు. కనాను రాజులు మెగిద్దో జలాల వద్ద తానాకు పట్టణం దగ్గర (కనాను రాజులు) యుద్ధం చేసారు. కానీ వారు ఐశ్వర్యం ఏమీ ఇంటికి తీసుకుని పోలేదు.
JDG 5:20 నక్షత్రాలు ఆకాశంలోనుంచి పోరాడాయి. నక్షత్రాలు, వాటి మార్గం నుండి అవి సీసెరాతో పోరాడాయి.
JDG 5:21 కీషోను నది ప్రాచీన నది. ఆ కీషోను నది సీసెరా మనుష్యులను తుడిచిపెట్టింది. నా ప్రాణమా, బలము కలిగి ముందుకు సాగిపో.
JDG 5:22 గుర్రాల డెక్కలు నేలను అదరగొట్టాయి. సీసెరా బలమైన గుర్రాలు పరుగులు తీసాయి.
JDG 5:23 “‘మేరోజు పట్టణాన్ని శపించండి’ అని యెహోవా దూత చెప్పాడు. ‘వారు యెహోవాకు సహాయం చేసేందుకు, యెహోవాకు సైనికులను ఇచ్చేందుకు రాలేదు గనుక వారిని శపించండి.’
JDG 5:24 కనానీయుడైన హెబెరు భార్య యాయేలు. ఆమె స్త్రీలలో దీవెన నొందును.
JDG 5:25 సీసెరా నీళ్లను అడిగెను. యాయేలు అతనికి పాలను ఇచ్చెను. తరువాత సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చియిచ్చెను.
JDG 5:26 మరియు యాయేలు డేరా మేకు చేత పట్టుకొనెను. పనివారు ఉపయోగించు సుత్తెను కుడి చేత పట్టుకొనెను. తరువాత మేకుతో అతని తలను పగులగొట్టెను. అప్పుడు సీసెరా కణత పగిలి అక్కడే పడిపోయెను.
JDG 5:27 యాయేలు పాదాల మధ్య కుప్ప కూలిపోయాడు అతను పడిపోయాడు. అతను అక్కడే పడి ఉన్నాడు! ఆమె పాదాల మధ్య అతడు కుప్పకూలిపోయాడు. అతడు పడిపోయాడు! సీసెరా ఎక్కడ పడ్డాడో అక్కడ కూలిపోయాడు. చనిపోయాడు!
JDG 5:28 “సీసెరా తల్లి కిటికీలోంచి చూసి ఏడుస్తు వున్నది. సీసెరా తల్లి తెరలలో నుండి చూస్తు వున్నది, ‘సీసెరా రథం ఎందుకు ఆలస్యమైంది? అతని రథం, గుర్రాల ధ్వనులు ఎందుకు ఆలస్యం అయ్యాయి.’
JDG 5:29 “ఆమె పరిచారికలలో అతి తెలివిగల ఒకతె ఆమెకు బవాబిస్తుంది. అవును, సేవకురాలు ఆమెకు జవాబిస్తుంది.
JDG 5:30 ‘నిశ్చయంగా వారు గెలిచారు! వారు ఓడించిన ప్రజలనుండి వస్తువులను వారు తీసుకుంటున్నారు! వారిలో వారు ఆ వస్తువులను పంచుకొంటున్నారు! ఒక్కో సైనికుడు ఒకరు లేక ఇద్దరు అమ్మాయిలను తీసుకుంటున్నారు. ఒక వేళ సీసెరా రంగు వేయబడిన ఒక గుడ్డ ముక్క తీసుకుంటున్నాడేమో. అదీ సంగతి! విజయ శాలి సీసెరా ధరించేందుకు ఒకటి రెండు విచిత్ర బుట్టా నేత బట్టలు తెచ్చుకుంటున్నాడు కాబోలు.’
JDG 5:31 “యెహోవా, నీ శత్రువులంతా ఇలానే మరణించెదరు గాక! కానీ నిన్ను ప్రేమించే మనుష్యులందరూ తేటగా ప్రకాశించే సూర్యునిలా ఉందురు గాక!” ఆ దేశంలో 40 సంవత్సరాల వరకు శాంతి నెలకొన్నది.
JDG 6:1 యెహోవా చెడ్డవి అని చెప్పిన సంగతులనే ఇశ్రాయేలు ప్రజలు మరల చేసారు. అందుచేత యెహోవా మిద్యాను ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను ఏడు సంవత్సరాల వరకు ఓడింపనిచ్చాడు.
JDG 6:2 మిద్యాను ప్రజలు చాలా శక్తిగలవారు మరియు ఇశ్రాయేలు ప్రజల పట్ల చాలా క్రూరులు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఆ కొండలలో దాగుకొనే స్థలాలు అనేకం చేసుకున్నారు. వారి భోజనాన్ని గుహలలోను, కనుక్కొనేందుకు కష్టతరమైన స్థలాలలోను దాచుకున్నారు.
JDG 6:3 తూర్పు ప్రాంతంనుండి మిద్యానీయులు, అమాలేకీయులు ఎల్లప్పుడు వచ్చి వారి పంటలను పాడుచేసేవారు గనుక వారు అలా చేశారు.
JDG 6:4 ఆ మనుష్యులు దేశంలో బసచేసి, ఇశ్రాయేలు ప్రజల పంటలను నాశనం చేశారు. గాజా పట్టణం వరకుగల దేశమంతటా ఇశ్రాయేలీయుల పంటలను వారు నాశనం చేశారు. ఇశ్రాయేలీయులు తినేందుకు ఆ ప్రజలు ఏమీ విడిచి పెట్టలేదు. వారి కోసం గొర్రెలుగాని, పశువులుగాని లేక గాడిదలు గాని ఏమీ వారు విడిచిపెట్టలేదు.
JDG 6:5 మిద్యానీయులు వచ్చి ఆ దేశంలో నివాసం చేశారు. వారు వారి కుటుంబాలను వారి పశువులను వారి వెంట తెచ్చుకున్నారు. వారు మిడతల దండులంత మంది ఉన్నారు! వారి మనుష్యులు, వారి ఒంటెలు విస్తారంగా ఉన్నందుచేత లెక్కించుటకు అసాధ్యం అయింది. ఈ మనుష్యులంతా దేశంలోకి వచ్చి దానిని పాడుచేశారు.
JDG 6:6 మిద్యాను ప్రజల మూలంగా ఇశ్రాయేలు ప్రజలు చాలా దరిద్రులయ్యారు కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు.
JDG 6:7 మిద్యానీయులు ఆ చెడ్డ పనులన్నీ చేశారు. కనుక ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు.
JDG 6:8 కనుక యెహోవా వారికి ఒక ప్రవక్తను పంపించాడు. ఇశ్రాయేలీయులతో ఆ ప్రవక్త ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేది ఇదే: ‘మీరు ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉంటిరి. నేను మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసి ఆ దేశం నుండి బయటకు రప్పించాను.
JDG 6:9 ఈజిప్టు యొక్క బలమైన ప్రజలనుండి నేను మిమ్మల్ని రక్షించాను. తర్వాత కనాను దేశ ప్రజలు మిమ్మల్ని బాధ పెట్టారు. కనుక నేను మరల మిమ్మల్ని రక్షించాను. ఆ ప్రజలు వారి దేశం వదిలి పోయేటట్టు నేను చేశాను. మరియు వారి దేశాన్ని, నేను మీకు ఇచ్చాను.’
JDG 6:10 ‘నేనే మీ యెహోవాను, మీ దేవుడనని అప్పుడు మీకు చెప్పాను. మీరు అమోరీయుల దేశంలో నివసిస్తారు. కాని వారి బూటకపు దేవుళ్లను మీరు పూజించకూడదు, అని నేను మీతో చెప్పాను.’ కాని మీరు నాకు విధేయులు కాలేదు.”
JDG 6:11 ఆ కాలంలో, గిద్యోను అను పేరుగల మనిషి దగ్గరకు యెహోవా దూత వచ్చాడు. దేవుని దూత వచ్చి ఒఫ్రాలోని మస్తకి చెట్టు క్రింద కూర్చున్నాడు. ఈ మస్తకి చెట్టు యోవాషు అనే పేరుగలవానిది. యోవాషు అబీయెజీ వంశస్థుడు. యోవాషు గిద్యోనుకు తండ్రి. గిద్యోను ఒక ద్రాక్షా గానుగలో గోధుమలు నలుగకొడుతున్నాడు. యెహోవా దూత గిద్యోను దగ్గర కూర్చున్నాడు. మిద్యానీయులు, తనని (గిద్యోను) చూడకుండునట్లు ద్రాక్షా గానుగ చాటున గోధుమలను నలుగగొట్టుచుండగా,
JDG 6:12 యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమయి, “మహా సైనికుడా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు” అని చెప్పాడు.
JDG 6:13 అప్పుడు గిద్యోను అన్నాడు: “అయ్యా, నేను ప్రమాణం చేస్తున్నాను, యెహోవా మనకు తోడుగా ఉంటే మనకు ఇన్ని కష్టాలెందుకు? మన పూర్వీకులకు ఆయన అద్భుతమైన విషయాలు జరిగించాడు అని మనం విన్నాం. మన పూర్వీకులను ఈజిప్టు నుండి యెహోవా బయటకు రప్పించాడని వారు మనతో చెప్పారు. కాని యెహోవా మనలను విడిచిపెట్టేశాడు. యెహోవా మిద్యానీయులు మనలను ఓడింపనిచ్చాడు.”
JDG 6:14 యెహోవా గిద్యోనువైపు తిరిగి, “నీ శక్తిని ప్రయోగించు. నీవు వెళ్లి మిద్యాను ప్రజల నుండి ఇశ్రాయేలీయులను రక్షించు. వారిని రక్షించేందుకు నేను నిన్ను పంపుతున్నాను!” అని చెప్పాడు.
JDG 6:15 అయితే గిద్యోను, “అయ్యా, నన్ను క్షమించండి, ఇశ్రాయేలీయులను నేను ఎలా రక్షించగలను? మనష్షే వంశంలో నా కుటుంబం అతి బలహీనమైనది. నా కుటుంబంలో అందరికంటే నేను చిన్నవాడను” అని జవాబిచ్చాడు.
JDG 6:16 యెహోవా గిద్యోనుకు జవాబిస్తూ, “నేను నీతో కూడా ఉన్నాను! కనుక మిద్యానీయులను నీవు ఓడించగలవు. అది నీవు ఒకే ఒక్క మనిషితో పోరాడుతున్నట్టుగా కనబడుతుంది.” అని చెప్పాడు.
JDG 6:17 అప్పుడు గిద్యోను యెహోవాతో చెప్పాడు: “నా మీద నీకు దయ ఉంటే, నీవే నిజంగా యెహవా అనేందుకు నాకు ఒక ఋజువు చూపు.
JDG 6:18 దయచేసి ఇక్కడే వేచియుండు. నేను తిరిగి నీ దగ్గరకు వచ్చేంతవరకు వెళ్లిపోవద్దు. నా కానుకను తెచ్చి నీ ఎదుట పెట్టనియ్యి.” యెహోవా, “నీవు తిరిగి వచ్చేవరకూ నేను వేచి ఉంటాను,” అని చెప్పాడు.
JDG 6:19 కనుక గిద్యోను వెళ్లి కాగుతున్న నీళ్లలో ఒక మేక పిల్లను వంటకం చేసాడు. గిద్యోను తూమెడు పిండిని తీసుకుని పొంగని రొట్టె చేసాడు. అప్పుడు గిద్యోను ఆ మాంసాన్ని ఒక బుట్టలో ఉంచి ఉడకపెట్టిన మాంసము యొక్క రసాన్ని ఒక పాత్రలో ఉంచాడు. గిద్యోను ఆ మాంసాన్ని, వండిన మాంసపు రసాన్ని, పొంగని రొట్టెను బయటకు తీశాడు. గిద్యోను ఆ భోజనాన్ని మస్తకి చెట్టు క్రింద యెహోవాకు ఇచ్చాడు.
JDG 6:20 దేవుని దూత, “ఆ మాంసాన్ని, పొంగని ఆ రొట్టెను అదిగో అక్కడ ఉన్న బండ మీద ఉంచు. తర్వాత నీళ్లు పారబోయి” అని గిద్యోనుతో చెప్పాడు. గిద్యోను తనకు చెప్పబడినట్టు చేశాడు.
JDG 6:21 యెహోవా దూత ఒక చేతికర్ర పట్టుకొని ఉన్నాడు. యెహోవా దూత ఆ కర్ర కొనతో మాంసాన్ని, రొట్టెను తాకాడు. అప్పుడు బండనుండి అగ్ని బయలు వెళ్లింది! ఆ మాంసం, రొట్టె పూర్తిగా కాల్చివేయబడ్డాయి! అప్పుడు యెహోవా దూత అదృశ్యమయ్యాడు.
JDG 6:22 గిద్యోను తాను యెహోవా దూతతో మాట్లాడుతున్నట్లు అప్పుడు గ్రహించాడు. కనుక గిద్యోను, “సర్వశక్తిమంతుడైన యెహోవా! యెహోవా దూతను నేను ముఖాముఖిగా చూశాను!” అని అరిచాడు.
JDG 6:23 కానీ యెహోవా, “నిశ్శబ్దంగా ఉండు! భయ పడవద్దు! నీవు చనిపోవు!” అని గిద్యోనుతో చెప్పాడు.
JDG 6:24 కనుక యెహోవాను ఆరాధించేందుకు ఆ స్థలంలో గిద్యోను ఒక బలిపీఠం నిర్మించాడు. ఆ బలిపీఠానికి, “యెహోవాయే శాంతి” అని గిద్యోను పేరు పెట్టాడు. ఒఫ్రా పట్టణంలో ఆ బలిపీఠం ఇంకా నిలిచి ఉంది. ఆబీయెజీ కుటుంబం నివసించే చోట ఒఫ్రా ఉంది.
JDG 6:25 దే రాత్రి గిద్యోనుతో యెహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: “నీ తండ్రికి చెందిన బాగా ఎదిగిన ఎద్దును, అనగా ఏడు సంవత్సరాల ఎద్దును తీసుకో. నీ తండ్రికి బూటకపు బయలు దేవతా బలిపీఠము ఒకటి ఉంది. ఆ బలిపీఠము పక్కగా ఒక కొయ్యస్తంభం ఉంది. బూటకపు దేవత అషేరా ఘనత కోసం ఆ స్తంభం చేయబడింది. బయలు బలిపీఠాన్ని పడదోసేందుకు, అషేరా స్తంభాన్ని విరగగొట్టేందుకు ఆ ఎద్దును ఉపయోగించు.
JDG 6:26 అప్పుడు నీ యెహోవా దేవునికి సరయిన బలిపీఠం నిర్మించు. ఎత్తైన ఈ స్థలంలో బలిపీఠాన్ని నిర్మించు. అప్పుడు బాగా ఎదిగిన ఆ ఎద్దును ఈ బలిపీఠం మీద చంపి దహించు. నీ అర్పణను దహించేందుకు అషేరా స్తంభపు కట్టెను ఉపయోగించు.”
JDG 6:27 కనుక గిద్యోను తన సేవకులు పది మందిని తీసుకొని యెహోవా చేయమని చెప్పినట్టు చేశాడు. కాని తన కుటుంబము వారు, పట్టణము వారు తాను చేస్తున్న దానిని చూస్తారేమోనని గిద్యోను భయపడ్డాడు. తాను ఏమి చేయాలని తనతో యెహోవా చెప్పాడో దానినే గిద్యోను చేశాడు. కానీ అతడు ఆ పనిని పగలు కాక రాత్రివేళ చేశాడు.
JDG 6:28 మరునాడు ఉదయాన్నే ఆ పట్టణ ప్రజలు మేల్కొన్నారు. బయలు బలిపీఠం పాడుచేయబడి ఉండటం వారు చూశారు. అషేరా స్తంభం నరకబడి ఉండటం కూడా వారు చూశారు. అషేరా స్తంభం బయలు బలిపీఠానికి పక్కగా వుంది. గిద్యోను కట్టిన బలిపీఠాన్ని కూడా ఆ మనుష్యులు చూశారు. ఆ బలిపీఠం మీద అర్పించబడిన ఎద్దును వారు చూశారు.
JDG 6:29 ఆ పట్టణస్తులు ఒకర్నొకరు చూసి, “మన బలిపీఠాన్ని ఎవరు పడగొట్టారు? మన అషేర స్తంభాన్ని ఎవరు నరికి వేసారు?” అని చెప్పుకొన్నారు. వారు ఎన్నో ప్రశ్నలు వేసుకొని, ఆ పనులు చేసినదెవరో తెలిసికొనేందుకు ప్రయత్నించారు. “యోవాషు కుమారుడైన గిద్యోను ఈ పని చేసాడు” అని వారితో ఎవరో చెప్పారు.
JDG 6:30 కనుక ఆ పట్టణస్తులు యోవాషు దగ్గరకు వచ్చారు, “నీవు నీ కుమారుని బయటకు తీసుకురా! అతడు బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు. ఆ బలిపీఠం పక్కనే ఉన్న అషేరా స్తంభాన్ని అతడు నరికి వేసాడు. కనుక నీ కుమారుడు చావాల్సిందే” అని వారు యోవాషుతో చెప్పారు.
JDG 6:31 అప్పుడు యోవాషు తన చుట్టూరా ఉన్న జనంతో మాట్లాడాడు: “మీరు బయలు పక్షాన ఉంటారా? మీరు బయలును కాపాడుతారా? ఎవడైనా బయలు పక్షం వహిస్తే ఉదయానికల్లా వాడు చంపబడునుగాక. ఒకవేళ బయలు నిజంగా దేవుడైతే, వాని బలిపీఠాన్ని ఎవరైనా పడగొట్టుతున్నప్పుడు తనను తానే కాపాడుకోవాలి”అని యోవాషు చెప్పాడు.
JDG 6:32 “ఒకవేళ బయలు బలిపీఠాన్ని గిద్యోను పడగొట్టియుంటే అతనితోనే బయలును వాదించమనండి.” అని యోవాషు చెప్పాడు. కనుక ఆ రోజున యోవాషు గిద్యోనుకు యెరుబ్బయెలు అని ఒక కొత్త పేరు పెట్టాడు.
JDG 6:33 మిద్యాను, అమాలేకు తూర్పు ప్రాంతపు ఇతర ప్రజలు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేసేందుకు సమావేశమయ్యారు. ఆ ప్రజలు యోర్దాను నది దాటి వెళ్లి యెజ్రెయేలు లోయలో నివాసం చేశారు.
JDG 6:34 యెహోవా ఆత్మ గిద్యోను మీదికి వచ్చి అతనికి గొప్ప శక్తిని ఇచ్చింది. అబీయెజెరు కుటుంబం తనను వెంబడించేందుకు గిద్యోను ఒక బూర ఊదాడు.
JDG 6:35 మనష్షే వంశం మనుష్యులందరి దగ్గరకు గిద్యోను వార్తాహరులను పంపించాడు. ఆయుధాలు తీసుకుని యుద్ధానికి సిద్ధం కావాలని ఆ వార్తాహరులు మనష్షే మనుష్యులతో చెప్పారు. ఆషేరు, జెబలూను, నఫ్తాలి వంశాలకు కూడా గిద్యోను వార్తాహరులను పంపించాడు. వార్తాహరులు అదే సందేశం తీసుకుని వెళ్లారు. కనుక ఆ వంశాల వారు కూడా గిద్యోనును, అతని మనుష్యులను కలుసుకొనటానికి వెళ్లారు.
JDG 6:36 అప్పుడు గిద్యోను దేవునితో చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు నీవు నాకు సహాయం చేస్తానని చెప్పావు. నాకు ఋజువు చూపు!
JDG 6:37 నేను కళ్ళెంలో గొర్రెచర్మం ఉంచుతాను. చుట్టూరా ఉన్న నేల అంతా పొడిగా ఉండి, ఆ చర్మం మీద మాత్రమే మంచుపడివుంటే, అప్పుడు నీవు చెప్పినట్టే ఇశ్రాయేలును రక్షించేందుకు నీవు నన్ను వాడుకొంటావని నేను తెలుసుకొంటాను.”
JDG 6:38 సరిగ్గా అలాగే జరిగింది. మరునాడు ఉదయాన్నే గిద్యోను లేచి ఆ గొర్రెచర్మాన్ని పిండాడు. ఆ గొర్రె చర్మం నుండి ఒక పాత్ర నిండుగా అతడు నీళ్లు పిండాడు.
JDG 6:39 అప్పుడు గిద్యోను దేవునితో, “నా మీద కోపగించకు. మరొక్క విషయం నిన్ను అడుగనియ్యి. గొర్రెచర్మంతో నిన్ను మరొక్కసారి పరీక్షించనియ్యి. ఈసారి దాని చుట్టూరా ఉన్న నేల మంచుతో తడిసి గొర్రెచర్మం మాత్రం పొడిగా ఉండనియ్యి” అని చెప్పాడు.
JDG 6:40 ఆ రాత్రి దేవుడు సరిగ్గా అలాగే చేసాడు. గొర్రెచర్మం మాత్రం పొడిగా ఉంది, కానీ దాని చుట్టూరా నేల మంచుతో తడిసి ఉంది.
JDG 7:1 మరునాడు ఉదయాన్నే యెరుబ్బయలు, (గిద్యోను) మరియు అతని మనుష్యులందరూ హరోదు బావి దగ్గర దిగారు. మోరె కొండ దిగువన ఉన్న లోయలో మిద్యాను ప్రజలు బసచేసారు. ఇది గిద్యోనుకు, అతని మనుష్యులకు ఉత్తరాన ఉంది.
JDG 7:2 అప్పుడు యెహోవా, “మిద్యాను ప్రజలను ఓడించేందుకు నేను నీ మనుష్యులకు సహాయం చేయబోతున్నాను. కాని ఆ పని కోసం నీ దగ్గర ఉన్న మనుష్యులు చాలా ఎక్కువ మంది. ఇశ్రాయేలు ప్రజలు వారిని వారే రక్షించుకొన్నారని అతిశయించి నన్ను మరచిపోవటం నాకు ఇష్టం లేదు.
JDG 7:3 కనుక ఇప్పుడు నీ మనుష్యులకు ఒక ప్రకటన చెయ్యి. ‘భయపడేవారు ఎవరైనా సరే గిలాదు కొండ విడిచి పోవచ్చును. అలాంటి వారు తిరిగి ఇంటికి వెళ్లి పోవచ్చును’ అని వారితో చెప్పుము” అని గిద్యోనుతో అన్నాడు. ఆ సమయంలో ఇరవైరెండు వేల మంది గిద్యోనును విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఇంకా పదివేల మంది మనుష్యులు మిగిలిపోయారు.
JDG 7:4 “ఇంకా చాలా మంది మనుష్యులున్నారు. ఆ మనుష్యులను నీళ్ల దగ్గరకు క్రిందికి తీసుకుని వెళ్లు, అక్కడ నేను నీ కోసం వారిని పరీక్షిస్తాను. ‘ఇతడు నీతో వెళ్తాడు’ అని నేను చెబితే అతడు వెళతాడు. కాని నేను, ‘అతడు నీతో వెళ్లడు’ అని అంటే ఆ మనుష్యుడు వెళ్లకూడదు” అని గిద్యోనుతో యెహోవా చెప్పాడు.
JDG 7:5 కనుక గిద్యోను ఆ మనుష్యులను నీళ్ల దగ్గరకు క్రిందికి నడిపించాడు. ఆ నీళ్ల దగ్గర గిద్యోనుతో యెహోవా ఇలా చెప్పాడు, “ఈ మనుష్యులను ఈ విధంగా వేరు చెయ్యి. కుక్క గతికినట్లు గతుకుచూ నీళ్లు తాగే వారంతా ఒక గుంపు. మరియు మోకాళ్ల మీద వంగి నీళ్లు తాగే మనుష్యులంతా మరో గుంపుగా చేయబడాలి.”
JDG 7:6 నోటి దగ్గరకు నీళ్లు తెచ్చేందుకు తమ చేతులనుపయోగించి కుక్క గతికినట్లు గతికిన వారు మూడు వందల మంది. మిగిలిన వాళ్లంతా మోకాళ్ల మీద వంగి నీళ్లు తాగారు.
JDG 7:7 యెహోవా గిద్యోనుతో, “కుక్కలా గతికి నీళ్లు తాగిన మూడువందల మందిని నేను వాడుకొంటాను. మిమ్మల్ని రక్షించేందుకు ఆ మనుష్యులను నేను వాడుకొంటాను. మరియు మిద్యాను ప్రజలను ఓడించేట్లుగా నేను చేస్తాను. మిగిలిన మనుష్యులను వారి ఇళ్లకు వెళ్లిపోనియ్యి” అని చెప్పాడు.
JDG 7:8 కనుక మిగిలిన ఇశ్రాయేలు మనుష్యులను గిద్యోను వారి ఇళ్లకు పంపి వేసాడు. గిద్యోను ఆ మూడు వందల మంది మనుష్యులను తన వెంట ఉంచుకొన్నాడు. ఇళ్లకు వెళ్లిపోయిన వారి బూరలను, ఆహార పదార్థాలను ఆ మూడు వందల మంది ఉంచుకొన్నారు. గిద్యోను పాళెమునకు క్రింద లోయలో మిద్యానీయుల పాళెము ఉండెను.
JDG 7:9 రాత్రివేళ గిద్యోనుతో యెహోవా మాట్లాడాడు. అతనితో యెహోవా ఇలా చెప్పాడు: “లెమ్ము, మిద్యాను సైన్యాన్ని నీవు ఓడించేటట్టు నేను చేస్తాను. వారి పాళెము వద్దకు దిగి వెళ్లు.
JDG 7:10 ఒంటరిగా వెళ్లేందుకు నీవు భయపడితే, నీ సేవకుడు పూరాను నీ వెంట తీసుకుని వెళ్లు.
JDG 7:11 మిద్యాను ప్రజల పాళెము లోపలికి వెళ్లు. ఆ మనుష్యులు చెప్పుకుంటున్న విషయాలు విను. ఆ తర్వాత వారి మీద దాడి చేసేందుకు నీకు భయం ఉండదు.” కనుక గిద్యోను, అతని సేవకుడు పూరా శత్రువుల పాళెము చివరి భాగానికి వెళ్లారు.
JDG 7:12 మిద్యాను ప్రజలు, అమాలేకు ప్రజలు, తూర్పు ప్రాంత ప్రజలందరూ ఆ లోయలో విడిదిచేశారు. వారు చాలామంది మనుష్యులు ఉన్నందుచేత వారు ఒక మిడతల దండులా కనిపించారు. సముద్రతీరంలో ఇసుక రేణువులవలె ఆ ప్రజలకు ఒంటెలు ఉన్నట్టు కనిపించింది.
JDG 7:13 గిద్యోను శత్రువుల విడిది దగ్గరకు వచ్చి, అక్కడ ఒక మనిషి మాట్లాడటం విన్నాడు. అతడు తాను చూచిన ఒక కలను గూర్చి తన స్నేహితునితో చెప్పుతున్నాడు, “ఒక గుండ్రని రొట్టె దొర్లుకుంటూ మిద్యాను ప్రజల విడిదిలోకి వచ్చింది. ఆ రొట్టె గుడారాన్ని బలంగా గుద్దుకోవటం చేత ఆ గుడారం తలక్రిందులై నేల మట్టంగా పడిపోయింది” అని ఆ మనిషి చెబుతూ ఉన్నాడు.
JDG 7:14 ఆ మనిషి స్నేహితునికి అతని కల భావం తెలుసు. “నీ కలకు ఒకే ఒక అర్థం ఉంటుంది. ఇశ్రాయేలు వాడగు ఆ మనిషిని గూర్చినదే నీ కల. అది యోవాషు కుమారుడు గిద్యోను గూర్చినది. మిద్యాను సైన్యం అంతటినీ ఓడించేందుకు గిద్యోనుకు దేవుడు సహాయం చేస్తాడని దాని భావం” అని ఆ మనిషి స్నేహితుడు చెప్పాడు.
JDG 7:15 ఆ మనుష్యులు ఆ కలను గూర్చి, దాని భావం గూర్చి చెప్పుకోవటం విన్న తర్వాత గిద్యోను దేవునికి సాష్టాంగ పడ్డాడు. తర్వాత గిద్యోను ఇశ్రాయేలీయుల విడిదికి తిరిగి వెళ్లిపోయాడు. గిద్యోను ప్రజలందరినీ పిలిచి, “లేవండి! మిద్యాను ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని చెప్పాడు.
JDG 7:16 అప్పుడు గిద్యోను మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసాడు. ఒక్కో మనిషికీ ఒక్కో బూరను, ఒక్కో ఖాళీ కుండనూ గిద్యోను ఇచ్చాడు. ప్రతి ఖాళీ కుండలోను మండుతున్న ఒక దివిటీ ఉంది.
JDG 7:17 అప్పుడు గిద్యోను వారితో ఇలా చెప్పాడు: “నన్ను గమనించి నేను చేసినట్టు చేయండి. శత్రువు విడిది చివరి భాగం వరకు నన్ను అనుసరించండి. నా వెంబడి రండి. ఆ విడిది చివరి భాగానికి నేను వెళ్లగానే, సరిగ్గా నేను చేసినట్టే చేయండి.
JDG 7:18 మీరు శత్రువు విడిదిని చుట్టుముట్టండి. నేనూ, నాతో ఉన్న వాళ్లందరూ బూరలు ఊదుతాము. మేము బూరలు ఊదినప్పుడు మీరు కూడా మీ బూరలు ఊదండి. అప్పుడు ‘యెహోవాకు, గిద్యోనుకు విజయం అని కేకలు వేయండి!’”
JDG 7:19 కనుక గిద్యోను, అతనితో ఉన్న వంద మంది శత్రువులు విడిది చివరి భాగానికి వెళ్లారు. కావలి వారు మారిన వెంటనే వారు అక్కడికి వచ్చారు. అది నడిజాము వేళ. గిద్యోను, అతనితో ఉన్న మనుష్యులు వారి బూరలు ఊది, వారి కుండలు పగులగొట్టారు.
JDG 7:20 అప్పుడు గిద్యోను మనుష్యులు మొత్తం మూడు గుంపులవారు వారి బూరలు ఊది వారి కుండలు పగులగొట్టారు. ఆ మనుష్యులు దివిటీలను వారి ఎడమ చేతులలోను, బూరలు వారి కుడిచేతులలోను పట్టుకొన్నారు. ఆ మనుష్యులు వారి బూరలు ఊదుతూ, “యెహోవాకు ఒక ఖడ్గం, గిద్యోనుకు ఒక ఖడ్గం” అని కేకలు వేసారు.
JDG 7:21 గిద్యోను మనుష్యులు వారు ఉన్న చోటనే నిలబడ్డారు. కాని ఆ విడిదిలో మిద్యాను వారు కేకలు వేస్తూ పారిపోవటం మొదలుపెట్టారు.
JDG 7:22 గిద్యోను మూడు వందల మంది మనుష్యులు వారి బూరలు ఊదటం మొదలు పెట్టగానే మిద్యాను మనుష్యులు వారి కత్తులతో వారే ఒకర్నొకరు చంపుకొనేట్టు యెహోవా చేశాడు. సెరేరాతు పట్టణం వైపు ఉన్న బేత్‌షిత్తా పట్టణానికి శత్రుసైన్యం వాళ్లు పారిపోయారు. తబ్బాతు పట్టణం దగ్గర ఉన్న ఆబేల్మెహోలా పట్టణ సరిహద్దు వరకు ఆ మనుష్యులు పారిపోయారు.
JDG 7:23 అప్పుడు నఫ్తాలి, ఆషేరు, మొత్తం మనష్షే వంశాల నుండి వచ్చిన సైనికులు మిద్యాను ప్రజలను తరమవలసిందిగా ఆజ్ఞాపించబడ్డారు.
JDG 7:24 ఎఫ్రాయిము కొండ దేశమంతటికీ గిద్యోను వార్తాహరులను పంపించాడు. “దిగి వచ్చి మిద్యాను ప్రజలను ఎదుర్కొనండి. వీరిని బేత్బారా వరకూ తరిమి, నదిని అదుపు చేసి, యోర్దాను నదిని స్వధీనం చేసుకోండి. మిద్యాను ప్రజలు అక్కడికి చేరక ముందే ఈ పని చేయండి” అని వార్తాహరులు చెప్పారు. కనుక ఎఫ్రాయిము వంశంలోని మనుష్యులందరినీ వారు పిలచారు. బేత్బారా వరకు వారు నదిని స్వాధీనం చేసుకున్నారు.
JDG 7:25 మిద్యాను నాయకులు ఇద్దరిని ఎఫ్రాయిము మనుష్యులు పట్టుకున్నారు. ఈ ఇద్దరు నాయకుల పేర్లు ఓరేబు, జెయేబు, ఓరేబు బండ అనుచోట ఎఫ్రాయిము మనుష్యులు ఓరేబును చంపివేసారు. జెయేబు ద్రాక్షగానుగ అనుచోట వారు జెయేబును చంపివేసారు. ఎఫ్రాయిము మనుష్యులు మిద్యాను వారిని ఇంకా తరుముతూనే ఉన్నారు. కానీ మొదట ఓరేబు, జెయేబు తలలను వారు నరికివేసి ఆ తలలను గిద్యోను వద్దకు తీసుకుని వెళ్లారు. ప్రజలు యోర్దాను నదిని దాటేచోట గిద్యోను ఉన్నాడు.
JDG 8:1 ఎఫ్రాయిము వారికి గిద్యోను మీద కోపం వచ్చింది. ఎఫ్రాయిము వారికి గిద్యోను కనబడినప్పుడు, “ఎందుకు నీవు మాపట్ల ఇలా వ్యవహరించావు. నీవు మిద్యాను ప్రజలమీద యుద్ధానికి వెళ్లినప్పుడు నీవు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?” అని వారు గిద్యోనును అడిగారు.
JDG 8:2 ఎఫ్రాయిము మనుష్యులకు గిద్యోను ఇలా జవాబు ఇచ్చాడు: “మీరు చేసినట్టు నేనేమీ చేయలేదు. మా అబీయెజెరు వంశస్థులకంటె, మీ ఎఫ్రాయిము వారికి ఎక్కువ పంట వచ్చింది. కోతకాలంలో మా వారు కూర్చే ద్రాక్షపళ్లకంటె, మీరు పొలంలో పరిగె విడిచిపెట్టే ద్రాక్షపళ్లు ఎక్కువ ఉంటాయి. అది నిజం కాదా?
JDG 8:3 (అలాగే, ఇప్పుడు కూడా మీకు ఎక్కువ పంట వచ్చింది) మిద్యాను నాయకులు ఓరేబు, జెయేబలను పట్టుకొనేందుకు దేవుడు మీకు అనుమతి ఇచ్చాడు. మీరు చేసినదానితో నా విజయాన్ని నేను ఎలా పోల్చుకోగలను?” గిద్యోను మాటలు ఎఫ్రాయిము వారు విన్నప్పుడు, వారు ముందు కోపపడినంత కోపపడలేదు.
JDG 8:4 అప్పుడు గిద్యోను, అతని మూడు వందల మంది మనుష్యులు యోర్దాను నది దగ్గరకు వచ్చి దానిని దాటి అవతలికి వెళ్లారు. కానీ వారు అలసిపోయి ఆకలితో ఉన్నారు,
JDG 8:5 “నా సైనుకులు భోజనం చేసేందుకు ఏమైనా పెట్టండి. నా సైనికులు చాలా అలసిపోయారు. మిద్యాను రాజులు జెబహు, సల్మున్నాలను మేము ఇంకా తరుముతున్నాము” అని గిద్యోను సుక్కోతు పట్టణం వారితో చెప్పాడు.
JDG 8:6 కానీ సుక్కోతు పట్టణ నాయకులు, “నీ సైనికులు భోజనం చేసేందుకు ఏదైనా మేము ఎందుకు పెట్టాలి? జెబహు, సల్మున్నాలను మీరు ఇంకా పట్టుకోలేదు గదా?” అని గిద్యోనుతో చెప్పారు.
JDG 8:7 అప్పుడు గిద్యోను, “మీరు మాకు భోజనం పెట్టరు. జెబహు, సల్మున్నాలను పట్టుకొనేందుకు యెహోవా నాకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత నేను తిరిగి ఇక్కడికి వస్తాను. అడవి ముళ్లకంపతోను, నూర్చుకొయ్యతోను మిమ్మల్ని కొడతాను” అని చెప్పాడు.
JDG 8:8 గిద్యోను సుక్కోతు పట్టణం విడిచి, పెనూయేలు పట్టణం వెళ్లాడు. సుక్కోతు వారిని అడిగినట్టే, గిద్యోను భోజనం కోసం పెనూయేలు వారిని అడిగాడు. కాని సుక్కోతు వారు ఇచ్చిన జవాబే పెనూయేలు వారు గిద్యోనుకు ఇచ్చారు.
JDG 8:9 కనుక గిద్యోను, “నేను విజయం సాధించిన తర్వాత, నేను ఇక్కడకు తిరిగి వచ్చి ఈ గోపురాన్ని కూలగొట్టేస్తాను” అని పెనూయేలు వారితో చెప్పాడు.
JDG 8:10 జెబహు, సల్మున్నా, వారి సైన్యం కర్కోరు పట్టణంలో ఉన్నారు. వారి సైన్యంలో పదిహేను వేలమంది సైనికులు ఉన్నారు. తూర్పు ప్రాంతపు ప్రజలందరి సైన్యంలో మిగిలిన సైనికులు వీరు. ఆ సైన్యంలో లక్షా ఇరవై వేల మంది బలమైన సైనికులు అప్పటికే చంపివేయబడ్డారు.
JDG 8:11 గిద్యోను, అతని మనుష్యులు గుడారవాసుల మార్గం ఉపయోగించారు. ఆ మార్గం నోబహు, యొగ్భెహ పట్టణాలకు తూర్పున ఉంది. గిద్యోను కర్కోరు పట్టణం వచ్చి శత్రువుమీద దాడి చేశాడు. ఈ దాడిని శత్రుసైన్యం ఊహించలేదు.
JDG 8:12 మిద్యాను ప్రజల రాజులు జెబహు, సల్మున్నాలు పారిపోయారు. కానీ గిద్యోను ఆ రాజులను తరిమి పట్టుకొన్నాడు. గిద్యోను, అతని మనుష్యులు శత్రు సైన్యాన్ని ఓడించారు.
JDG 8:13 అప్పుడు యోవాషు కుమారుడైన గిద్యోను యుద్ధం నుండి తిరిగి వచ్చాడు. గిద్యోను, అతని మనుష్యులు హెరెసు కనుమ అనబడిన పర్వత మార్గం గుండా ప్రయాణం చేసి తిరిగి వచ్చారు.
JDG 8:14 గిద్యోను సుక్కోతు పట్టణం నుండి ఒక యువకుని పట్టుకొన్నాడు. గిద్యోను ఆ యువకుని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ యువకుడు గిద్యోనుకు కొన్ని పేర్లు రాసి ఇచ్చాడు. సుక్కోతు పట్టణపు నాయకులు, పెద్ద మనుష్యుల పేర్లు ఆ యువకుడు రాసిపెట్టాడు. డెభ్భై ఏడు మంది పేర్లు అతడు ఇచ్చాడు.
JDG 8:15 అప్పుడు గిద్యోను సుక్కోతు పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంవారితో “ఇదిగో, జెబహు, సల్మున్నాలు. ‘అలసిపోయిన నీ సైనికులకు మేము భోజనం ఎందుకు పెట్టాలి? మీరు జెబహు, సల్మున్నాలను పట్టుకోలేదుగా?’ అంటూ మీరు నన్ను హేళన చేసారు” అని అతడు చెప్పాడు.
JDG 8:16 గిద్యోను సుక్కోతు పట్టణపు పెద్ద మనుష్యులను పట్టుకొని, వారిని శిక్షించేందుకు అడవినుండి తెచ్చిన ముళ్లకంపతో, నూర్చేడి కొయ్యతో వారిని కొట్టాడు.
JDG 8:17 పెనూయేలు పట్టణంలో ఉన్న గోపురాన్ని కూడా గిద్యోను కూలగొట్టివేశాడు. తరువాత అతడు ఆ పట్టణంలో నివసించేవారిని చంపివేశాడు.
JDG 8:18 అప్పుడు గిద్యోను, “తాబోరు కొండ మీద మీరు కొందరిని చంపేశారు. ఆ మనుష్యులు ఎలా ఉంటారు?” అని జెబహు, సల్మున్నాలను అడిగాడు. “ఆ మనుష్యులు నీలాంటి వారే, వారిలో ప్రతి ఒక్కడూ యువరాజులా కనిపించాడు” అని జెబహు, సల్మున్నాలు జవాబు ఇచ్చారు.
JDG 8:19 “ఆ మనుష్యులు నా సోదరులు! నా తల్లి కుమారులు! యెహోవా తోడు, మీరు గనుక వారిని చంపి ఉండకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని చంపను” అన్నాడు.
JDG 8:20 అప్పుడు గిద్యోను యెతెరువైపు తిరిగాడు. గిద్యోను పెద్ద కుమారుడు యెతెరు. “ఈ రాజులను చంపు” అని గిద్యోను అతనితో చెప్పాడు. కాని యేతెరు చిన్న పిల్లవాడు గనుక అతడు భయపడ్డాడు. కనుక అతడు తన ఖడ్గం బయటకు తీయలేదు.
JDG 8:21 అప్పుడు జెబహు సల్మున్నాలు, “రా, నీవే మమ్మల్ని చంపు. నీవు మగవాడివి, ఈ పని చేయటానికి తగిన బలం ఉన్నవాడివి” అని గిద్యోనుతో చెప్పారు. కావున గిద్యోను లేచి జెబహు, సల్మున్నాలను చంపివేశాడు. అప్పుడు గిద్యోను వారి ఒంటెల మెడల మీద చంద్రాకారంలో ఉన్న నగలను తీసుకున్నాడు.
JDG 8:22 ఇశ్రాయేలు ప్రజలు, “మిద్యాను ప్రజల నుండి నీవు మమ్మల్ని రక్షించావు. కనుక ఇప్పుడు నీవే మమ్మల్ని పాలించు. నీవూ, నీ కుమారుడు, నీ మనుమళ్లు మా మీద అధికారులుగా ఉండాలని మేము కోరుతున్నాము” అని గిద్యోనుతో చెప్పారు.
JDG 8:23 అయితే గిద్యోను, “యెహవాయే మిమ్మల్ని పాలించేవాడు. నేను మీ మీద అధికారిగా ఉండను. నా కుమారుడు మీ మీద ఏలుబడి చేయడు” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.
JDG 8:24 ఇశ్రాయేలు వారు ఓడించిన మనుష్యులలో కొందరు ఇష్మాయేలీయులుండిరి. ఇష్మాయేలు మనుష్యులు బంగారు పోగులు ధరించారు. కనుక గిద్యోను: “మీరు నా కోసం ఈ ఒక్క పనిచేయండి. యుద్ధంలో మీరు తీసుకున్న బంగారు పోగులు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నాకు ఇవ్వండి” అని ఇష్మాయేలు ప్రజలతో చెప్పాడు.
JDG 8:25 కనుక ఇష్మాయేలు ప్రజలు, “నీకు కావలసినది మేము సంతోషంగా ఇస్తాము” అని గిద్యోనుతో చెప్పారు. కనుక వారు ఒక అంగీ నేలమీద పరిచారు.
JDG 8:26 ఆ బంగారు పోగులు ప్రోగు చేయబడినప్పుడు వాటి బరువు నలభై మూడు పౌనులు (1,700 తులములు) అయినది. ఇష్మాయేలు ప్రజలు గిద్యోనుకు ఇచ్చిన ఇతర కానుకలు ఈ బరువులో లేవు. చంద్రాకారములో ఉన్న నగలు, వంకాయరంగు వస్త్రాలు వారు అతనికి ఇచ్చారు. ఈ వస్తువులు మిద్యాను ప్రజల రాజులు ధరించినవి. మిద్యాను రాజుల ఒంటెల మీది గొలుసులను కూడ వారు అతనికి ఇచ్చారు.
JDG 8:27 ఒక ఏఫోదు చేసేందుకు గిద్యోను ఆ బంగారాన్ని ఉపయోగించాడు. అతడు తన స్వంత ఊరు ఒఫ్రాలో ఆ ఏఫోదును ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఏఫోదును పూజించారు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక, ఏఫోదును పూజించారు. గిద్యోను మరియు అతని కుటుంబము పాపం చేసేందుకు ఆ ఏఫోదు ఒక ఉచ్చులా తయారైంది.
JDG 8:28 మిద్యాను ప్రజలు ఇశ్రాయేలు ప్రజల పాలన క్రింద ఉండేందుకు బలవంతం చేయబడ్డారు. మిద్యాను ప్రజలు ఇంకెంత మాత్రం చిక్కు కలిగించలేదు. గిద్యోను జీవించినంత కాలం, నలభై సంవత్సరాలు దేశంలో శాంతి ఉంది.
JDG 8:29 యోవాషు కుమారుడైన యెరుబ్బయలు (గిద్యోను) ఇంటికి వెళ్లాడు.
JDG 8:30 గిద్యోనుకు డెభ్భై మంది సొంత కుమారులు ఉన్నారు. అతనికి చాలా మంది భార్యలు ఉన్నారు గనుక అంతమంది కుమారులు ఉన్నారు.
JDG 8:31 గిద్యోను దాసి ఒకతె షెకెము పట్టణంలో నివసించినది. ఆ దాసి ద్వారా అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి అబీమెలెకు అని అతడు పేరు పెట్టాడు.
JDG 8:32 యోవాషు కుమారుడైన గిద్యోను మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు. గిద్యోను అతని తండ్రి యోవాషుకు స్వంతంగా ఉన్న సమాధిలో పాతిపెట్టబడ్డాడు. ఆ సమాధి అబీయెజీ వంశం వారు నివసించే ఒఫ్రా పట్టణంలో ఉంది.
JDG 8:33 గిద్యోను చనిపోగానే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మరలా నమ్మకంగా ఉండక, వారు బయలును వెంబడించారు. బయలు బెరీతును వారు వారి దేతవగా చేసుకున్నారు.
JDG 8:34 ఇశ్రాయేలు ప్రజలు చుట్టూరా నివసిస్తున్న వారి శత్రువులందరి బారి నుండి యెహోవా వారిని రక్షించినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోలేదు.
JDG 8:35 యెరుబ్బయలు (గిద్యోను), ఇశ్రాయేలు ప్రజల కోసం ఎన్నో మంచిపనులు చేసినప్పటికీ వారు అతని కుటుంబానికి నమ్మకంగా ఉండలేదు.
JDG 9:1 అబీమెలెకు యెరుబ్బయలు (గిద్యోను) కుమారుడు. అబీమెలెకు షెకెము పట్టణంలో నివసిస్తున్న తన మామల దగ్గరకు వెళ్లాడు. అతడు తన మామలతోను, తన తల్లి వంశస్థులందరితోను ఇలా చెప్పాడు:
JDG 9:2 “షెకెము పట్టణపు నాయకులను ఈ ప్రశ్న అడగండి: ‘యెరుబ్బయలు యొక్క డెబ్భయి మంది కుమారులచేత పాలించబడటం మీకు మంచిదా లేక ఒకే మనిషిచేత పాలింపబడుట మంచిదా? నేను మీ బంధువునని జ్ఞాపకం ఉంచుకోండి.’”
JDG 9:3 అబీమెలెకు మాములు షెకెము నాయకులతో మాట్లాడి, వారిని ఆ ప్రశ్న అడిగారు. షెకెము నాయకులు అబీమెలెకు అనుచరులుగా ఉండాలని నిర్ణయం చేసారు. “అతడు మా సోదరుడు గదా” అని ఆ నాయకులు చెప్పారు.
JDG 9:4 కనుక షెకెము నాయకులు డెభ్భై వెండి నాణెములు అబీమెలెకుకు ఇచ్చారు. ఆ వెండి బయలు బెరీతు దేవతా మందిరానికి చెందినది. అబీమెలెకు కొంతమంది కిరాయి మనుష్యులను తెచ్చేందుకు ఆ వెండిని ఉపయోగించాడు. ఈ మనుష్యులు పనికిమాలిన వాళ్లు, నిర్లక్ష్యపు మనుష్యులు. అబీమెలెకు ఎక్కడికి వెళ్లినా వారు అతనిని వెంబడించారు.
JDG 9:5 అబీమెలెకు ఒఫ్రాలోని తన తండ్రి ఇంటికి వెళ్లాడు. అబీమెలెకు తన సోదరులను చంపివేసాడు. అబీమెలెకు తన తండ్రియైన యెరుబ్బయలు (గిద్యోను) కుమారులు డెభ్భై మందిని చంపివేశాడు. అతడు వారందరినీ ఒకే సమయంలో చంపివేశాడు. అయితే యెరుబ్బయలు చిన్న కుమారుడు అబీమెలెకునకు కనబడకుండా దాగుకొని తప్పించుకొన్నాడు. ఆ చిన్న కుమారుని పేరు యోతాము.
JDG 9:6 అప్పుడు షెకెము నాయకులందరూ, మిల్లో ఇంటి వారూ సమావేశం అయ్యారు. షెకెములో స్తంభపు మహావృక్షము (మస్తకి) పక్క ఆ ప్రజలంతా సమావేశమై అబీమెలెకును వారి రాజుగా చేసుకున్నారు.
JDG 9:7 షెకెము పట్టణ నాయకులు అబీమెలెకును రాజుగా చేసారని యోతాము విన్నాడు. అతడు ఇది విన్నప్పుడు వెళ్లి గెరిజీము కొండ శిఖరం మీద నిలబడ్డాడు. యోతాము ఈ కథను గట్టిగా అరచి, ప్రజలకు ఇలా చెప్పాడు: “షెకెము పట్టణ నాయకులారా, నా మాట వినండి. తర్వాత దేవుడు మీ మాట వినును.
JDG 9:8 “ఒకనాడు వృక్షాలన్నీ వాటిని ఏలేందుకు ఒక రాజును ఏర్పాటు చేసుకోవాలని అనుకొన్నాయి. ఆ చెట్లు, ‘నీవే మా రాజుగా ఉండు’ అని ఒలీవ చెట్టుతో అన్నాయి.
JDG 9:9 “కాని ఒలీవ చెట్టు అంది: ‘నా తైలం కోసం మనుష్యులు, దేవుళ్లు నన్ను పొగడుతారు. కేవలం నేను వెళ్లి ఇతర చెట్ల మీద అటూ ఇటూ ఊగేందుకోసం నా తైలాన్ని తయారు చేయడం నేను మానివేయాలా?’
JDG 9:10 “అప్పుడు ఆ చెట్లు అంజూరపు చెట్టుతో, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని అడిగాయి.
JDG 9:11 “కాని, ‘కేవలం ఇతర చెట్ల మీద అటూ ఇటూ ఊగటం కోసం మధురమైన నా మంచి ఫలం ఫలించటం మానివేయాలా?’ అన్నది ఆ అంజూరపు చెట్టు.
JDG 9:12 “అప్పుడు ఆ చెట్లు, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని ద్రాక్షావల్లితో, అన్నాయి.
JDG 9:13 “కాని ద్రాక్షావల్లి, ‘నా ద్రాక్షారసం మనుష్యులను, రాజులను సంతోష పెడుతుంది. కేవలం నేను వెళ్లి ఆ చెట్ల మీద అటూ ఇటూ ఊగటం కోసం నా ద్రాక్షరసం తయారు చేయటం నేను మానివేయాలా?’ అన్నాది.
JDG 9:14 “చివరికి చెట్లన్నీ కలసి, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని ముళ్లకంపతో అన్నాయి.
JDG 9:15 “కాని ఆ ముళ్లకంప, ‘మీరు నన్ను నిజంగా మీ మీద రాజుగా చేయాలని కోరితే మీరు వచ్చి నా నీడలో ఆశ్రయం తీసుకోండి. కాని అలా చేయటం ఇష్టం లేకపోతే అప్పుడు ముళ్ల కంపలో నుండి అగ్ని వచ్చునుగాక. ఆ అగ్ని లెబానోను దేవదారు వృక్షాలను కూడా కాల్చి వేయును గాక’ అని ఆ చెట్లతో చెప్పినది.
JDG 9:16 “అబీమెలెకును మీరు రాజుగా చేసినప్పుడు మీరు పూర్తి నిజాయితీగా ఉన్నట్లయితే, మీరు అతనితో సంతోషించి ఉండేవారు. మరియు మీరు గనుక యెరుబ్బయలు, అతని కుటుంబముతో న్యాయంగా ఉండి ఉంటే మంచిదే. మరియు యెరుబ్బయలును పరామర్శించాల్సినట్టు, పరామర్శించియుంటే మంచిదే.
JDG 9:17 కానీ నా తండ్రి మీ కోసం ఏమి చేశాడో ఆలోచించండి. నా తండ్రి మీ కోసం పోరాడాడు. మిద్యాను ప్రజలనుండి అతడు మిమ్మల్ని రక్షించినప్పుడు తన ప్రాణాన్ని అపాయానికి గురిచేసుకున్నాడు.
JDG 9:18 కానీ ఇప్పుడు మీరు నా తండ్రి వంశానికి విరోధంగా తిరిగారు. నా తండ్రి కుమారులు డెభ్భై మందిని ఒకేసారి మీరు చంపివేసారు. అబీమెలెకును షెకెము పట్టణము మీద రాజుగా మీరు చేశారు. అతడు మీకు బంధువు గనుక మీరు అతనిని రాజుగా చేశారు. కానీ అతడు కేవలం నా తండ్రి యొక్క దాసీ కుమారుడు మాత్రమే!
JDG 9:19 కనుక ఈనాడు యెరుబ్బయలుకు, అతని కుటుంబానికి మీరు సంపూర్ణంగా న్యాయంగా ఉంటే, అబీమెలెకు మీకు రాజుగా ఉన్నందుకు మీరు సంతోషంగా ఉండవచ్చు. మరియు అతడు మీతో సంతోషంగా ఉండవచ్చు.
JDG 9:20 కాని మీరు సరిగ్గా ప్రవర్తించి ఉండకపోతే, షెకెము నాయకులైన మిమ్మల్ని మిల్లో ఇంటివారిని అబీమెలెకు నాశనం చేయును గాక. మరియు అబీమెలెకు కూడా నాశనం చేయబడును గాక.”
JDG 9:21 యోతాము ఇదంతా చెప్పగానే అతడు పారిపోయాడు. అతడు బెయేరు అనే పట్టణానికి తప్పించుకొని పోయాడు. యోతాము అతని సోదరుడైన అబీమెలెకు విషయంలో భయపడినందున ఆ పట్టణంలోనే ఉండిపోయాడు.
JDG 9:22 అబీమెలెకు ఇశ్రాయేలు ప్రజలను మూడు సంవత్సరాలు పాలించాడు.
JDG 9:23 బీమెలెకు చంపిన డెభ్భై మంది యెరుబ్బయలు కుమారులు అబీమెలెకునకు స్వంత సోదరులే. ఈ చెడు కార్యాలు చేయటంలో షెకెము నాయకులు అతనిని బలపర్చారు. కనుక అబీమెలెకునకు షెకెము నాయకులకు మధ్య దేవుడు చిక్కు కలిగించాడు. మరియు అబీమెలెకును బాధించుటకు షెకెము నాయకులు అన్వేషించుట మొదలుపెట్టారు.
JDG 9:25 షెకెము పట్టణ నాయకులకు అబీమెలెకు అంటే ఇంకెంత మాత్రం ఇష్టం లేదు. మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరినీ దాడి చేసి దోచుకొనేందుకు వారు కొండల శిఖరాలన్నిటి మీద మనుష్యులను ఉంచారు. ఆ దాడుల విషయం అబీమెలెకునకు తెలిసిపోయింది.
JDG 9:26 ఎబెదు కుమారుడు గాలు అను పేరుగల మనిషి, అతని సోదరులు షెకెము పట్టణానికి తరలి వచ్చారు. షెకెము పట్టణానికి నాయకులు గాలును నమ్మేందుకు, వెంబడించేందుకు తీర్మానించారు.
JDG 9:27 ఒకరోజు ద్రాక్ష పండ్లు ఏరుకొనేందుకు షెకెము ప్రజలు పొలాలకు వెళ్లారు. ప్రజలు ద్రాక్షరసం చేసేందుకు ద్రాక్షాపండ్లను పిండారు. తరువాత వాళ్లు తమ దేవుని ఆలయంలో ఉత్సవాన్ని జరుపుకున్నారు. ప్రజలు తిని, తాగి అబీమెలెకుపై చెడుగా మాటలాడుకున్నారు.
JDG 9:28 అప్పుడు ఎబెదు కొడుకైన గాలు, “మనము షెకెము ప్రజలమా? మనమెందుకు అతనికి విధేయులవ్వాలి? అబీమెలెకు తనను ఏమనుకొంటున్నాడు? అబీమెలెకు యెరుబ్బయలు కుమారులలో ఒకడు కాడా? అబీమెలెకు జెబులూను తన అధికారిగా నియమించలేదా? మనము అబీమెలెకునకు విధేయులం కాకూడదు. మనము మన స్వంత ప్రజలనే అంటే హామోరు ప్రజలనే అనుసరించాలి. అని వారితో అన్నాడు. (హామోరు షెకెముకు తండ్రి)
JDG 9:29 నీవు నన్ను ఈ ప్రజలకు ముఖ్యాధికారిగా చేస్తే, నేను అబీమెలెకును నాశనం చేస్తాను. నేను అతనికి ‘నీ సైన్యాన్ని సిద్ధం చేసుకుని యుద్ధానికి రా’” అని చెప్తాను.
JDG 9:30 జెబులు షెకెము పట్టణానికి అధిపతియై ఉండెను. ఎబెదు కుమారుడైన గాలు ఈ మాటలను మాట్లాడినప్పుడు జెబలుకు చాలా కోపం వచ్చింది.
JDG 9:31 అప్పుడతడు అరుమ పట్టణంలో ఉన్న అబీమెలెకు దగ్గరకు జెబులు వార్తాహరులను పంపించాడు. ఆ సందేశం యిది: “ఎబెదు కుమారుడు గాలు, మరియు గాలు సోదరులు షెకెము పట్టణం వచ్చారు. వారు మీకు చిక్కులు కలిగిస్తున్నారు. మొత్తం పట్టణాన్ని గాలు మీకు విరోధంగా తిప్పుతున్నాడు.
JDG 9:32 కనుక మీరు, మీ మనుష్యులు ఈ రాత్రికి వచ్చి పట్టణం బయట పొలాల్లో దాగుకోవాలి.
JDG 9:33 తరువాత సూర్యోదయం కాగానే పట్టణం మీద దాడి చేయండి. మీతో యుద్ధం చేయటానికి గాలు, అతని మనుష్యులు బయటకు వస్తారు. ఆ మనుష్యులు పోరాడేందుకు బయటకు రాగానే వారికి మీరు చేయగలిగింది చేయండి.”
JDG 9:34 కనుక ఆ రాత్రివేళ అబీమెలెకు, అతని సైనికులు లేచి పట్టణానికి వెళ్లారు, ఆ సైనికులు నాలుగు గుంపులుగా విడిపోయారు. వారు షెకెము పట్టణానికి దగ్గరలో దాగుకొన్నారు.
JDG 9:35 ఎబెదు కుమారుడు గాలు బయటకు వెళ్లి షెకెము పట్టణ ద్వార ప్రవేశం దగ్గర నిలబడ్డాడు. గాలు అక్కడ నిలబడి ఉండగా అబీమెలెకు, అతని సైనికులు వారి రహస్య స్థలాల నుండి బయటకు వచ్చారు.
JDG 9:36 గాలు ఆ సైనికులను చూశాడు. గాలు, “అదిగో చూడు. ఆ కొండల మీద నుండి మనుష్యులు దిగి వస్తున్నారు” అని అన్నాడు. కాని జెబలు, “నీకు కనబడుతోంది కొండల నీడలు మాత్రమే. ఆ నీడలు సరిగ్గా మనుష్యుల్లాగే కనబడతాయి” అన్నాడు.
JDG 9:37 కాని, “అదిగో చూడు అక్కడ. ఆ చోట నుండి కొందరు మనుష్యుల దండు దిగివస్తోంది. ఆ శకునగాండ్ర వృక్షం పక్కగా ఎవరిదో తల నాకు కనబడుతోంది” అని గాలు మరల చెప్పాడు.
JDG 9:38 నీవు ఇప్పుడు ఎందుకు అతిశయించుట లేదు? “‘అబీమెలెకు ఎవడు? మేము ఎందుకు అతనికి విధేయులము కావాలి?’ అని నీవు అడిగావు. ఈ మనుష్యులను గూర్చి నీవు హేళన చేశావు. ఇప్పుడు వెళ్లి వారితో యుద్ధం చేయి” అని జెబులు గాలుతో చెప్పాడు.
JDG 9:39 కనుక షెకెము నాయకులను అబీమెలెకుతో పోరాడుటకు గాలు తీసుకొని వెళ్లాడు.
JDG 9:40 అబీమెలెకు, అతని మనుష్యులు, గాలును, అతని మనుష్యులను వెంటాడారు. గాలు మనుష్యులు షెకెము పట్టణ ద్వారం వైపు వెనుకకు పరుగెత్తారు. ఆ ద్వారం చేరక ముందే గాలు మనుష్యులు చాలామంది చంపివేయబడ్డారు.
JDG 9:41 అప్పుడు అబీమెలెకు అరుమ పట్టణానికి తిరిగి వచ్చాడు. గాలును, అతని సోదరులను షెకెము పట్టణం నుండి జెబులు బలవంతంగా వెళ్లగొట్టాడు.
JDG 9:42 మరునాడు షెకెము ప్రజలు పొలాల్లో పని చేయటానికి వెళ్లారు. అది అబీమెలెకు తెలుసుకున్నాడు.
JDG 9:43 కనుక అబీమెలెకు తన మనుష్యులను మూడు గుంపులుగా విభజించాడు. షెకెము ప్రజలపై ఆశ్చర్య రీతిగా దాడి చేయాలని అతడు అనుకొన్నాడు. కనుక అతడు తన మనుష్యులను పొలాల్లో దాచి ఉంచాడు. ప్రజలు పట్టణంలో నుండి బయటకు రావటం అతడు చూడగానే అతడు దూకి వారిపై దాడిచేశాడు.
JDG 9:44 అబీమెలెకు, అతని గుంపువారు షెకెము ద్వారం దగ్గర ఒక చోటుకి పరుగెత్తారు. మిగిలిన రెండు గుంపుల వారు పొలాల్లో ఉన్న ప్రజల దగ్గరకు పరుగెత్తి వారిని చంపివేశారు.
JDG 9:45 ఆ రోజంతా అబీమెలెకు, అతని మనుష్యులు షెకెము పట్టణం మీద యుద్ధం చేశారు. అబీమెలెకు, అతని మనుష్యులు షెకెము పట్టణాన్ని పట్టుకొని ఆ పట్టణ ప్రజలను చంపివేశారు. అప్పుడు అబీమెలెకు ఆ పట్టణాన్ని కూలగొట్టి దాని శిథిలాల మీద ఉప్పు చల్లాడు.
JDG 9:46 షెకెము గోపురం దగ్గర కొంతమంది ప్రజలు నివసించేవారు. షెకెమునకు సంభవించిన దాన్ని గూర్చి అక్కడి ప్రజలు విన్నప్పుడు వారు ఏల్‌బెరీతు దేవతా మందిరంలో ఎంతో క్షేమంగా ఉండే గదిలో సమావేశమయ్యారు.
JDG 9:47 షెకెము గోపురపు నాయకులందరూ సమావేశమయ్యారని అబీమెలెకు విన్నాడు.
JDG 9:48 కనుక అబీమెలెకు, అతని మనుష్యులందరు సల్మోను కొండ మీదికి వెళ్లారు. అబీమెలెకు ఒక గొడ్డలి తీసుకుని కొన్ని కొమ్మలు నరికాడు. ఆ కొమ్మలను అతడు తన భుజాల మీద మోసుకుని వెళ్లాడు. అప్పుడు అబీమెలెకు తనతో ఉన్న మనుష్యులతో, “త్వరపడండి, నేను చేసిన పని చేయండి” అని చెప్పాడు.
JDG 9:49 కనుక వారందరు కొమ్మలు నరికి అబీమెలెకును వెంబడించారు. ఏల్‌బెరీతు దేవతా మందిరపు భద్రతాగదికి అడ్డంగా కుప్ప వేసారు. అప్పుడు వారు ఆ కొమ్మలకు నిప్పు అంటించి ఆ గదిలో ఉన్న మనుష్యులను కాల్చివేసారు. కనుక షెకెము గోపురం దగ్గర నివసించే స్త్రీ పురుషులు వెయ్యిమంది చనిపోయారు.
JDG 9:50 అప్పుడు అబీమెలెకు, అతని మనుష్యులు తేబేసు పట్టణం వెళ్లారు. అబీమెలెకు, అతని మనుష్యులు ఆ పట్టణాన్ని పట్టుకున్నారు.
JDG 9:51 కాని ఆ పట్టణం లోపల ఒక బలమైన గోపురం ఉంది. నాయకులు ఇతర స్త్రీ పురుషులు ఆ గోపురమునకు పారిపోయారు. ప్రజలు ఆ గోపురం లోపల ఉండగా వారు లోపల నుండి తాళం వేసారు. తరువాత వారు ఆ గోపురపు కప్పు మీదికి ఎక్కారు.
JDG 9:52 ఆ గోపురం మీద దాడి చేయుటకు అబీమెలెకు, అతని మనుష్యులు దాని దగ్గరకు వచ్చారు. అబీమెలెకు ఆ గోపుర ద్వారం దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ గోపురాన్ని తగులబెట్టాలి అనుకున్నాడు.
JDG 9:53 కాని అబీమెలెకు ఆ గోపుర ద్వారం దగ్గర నిలబడి ఉండగా పై కప్పు మీద ఉన్న ఒక స్త్రీ తిరుగటి రాయి ఒకటి అతని తలమీద వేసింది. ఆ తిరుగుట రాయి అబీమెలెకు తలను చితకగొట్టింది.
JDG 9:54 వెంటనే అబీమెలెకు తన ఆయుధాలు మోసే సేవకునితో, “నీ ఖడ్గం తీసుకుని నన్ను చంపివేయి. ‘అబీమెలెకును ఒక స్త్రీ చంపేసింది’ అని ప్రజలు చెప్పకుండా ఉండేందుకు నీవే నన్ను చంపివేయాలి” అని చెప్పాడు. కనుక ఆ సేవకుడు తన కత్తితో అబీమెలెకును పొడిచివేయగా అబీమెలెకు చనిపోయాడు.
JDG 9:55 అబీమెలెకు చనిపోయినట్టు ఇశ్రాయేలు ప్రజలు చూశారు. కనుక వారంతా తిరిగి ఇంటికి వెళ్లారు.
JDG 9:56 ఆ విధంగా అబీమెలెకు చేసిన చెడు విషయాలు అన్నింటికోసం దేవుడు అతణ్ణి శిక్షించాడు. అబీమెలెకు తన డెభ్భై మంది సోదరులను చంపి తన స్వంత తండ్రికి విరోధంగా పాపం చేసాడు.
JDG 9:57 షెకెము పట్టణ ప్రజలు చేసిన చెడుపనుల కోసం దేవుడు వారిని కూడా శిక్షించాడు. కనుక యోతాము చెప్పిన విషయాలు నిజం అయ్యాయి. (యెరుబ్బయలు చిన్న కుమారుడు యోతాము. యెరుబ్బయలు అనగా గిద్యోను).
JDG 10:1 అబీమెలెకు చనిపోయిన తరువాత ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు దేవుడు మరో న్యాయమూర్తిని పంపించాడు. ఆ మనిషి పేరు తోలా. తోలా, పువ్వా అనే పేరుగల మనిషి కుమారుడు. పువ్వా, దోదో అనే పేరుగల వాని కుమారుడు. తోలా ఇశ్శాఖారు వంశానికి చెందినవాడు. తోలా షామీరు పట్టణంలో నివసించేవాడు. షామీరు పట్టణం ఎఫ్రాయిము కొండ దేశంలో ఉంది.
JDG 10:2 తోలా ఇరవైమూడు సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయమూర్తిగా ఉన్నాడు. తర్వాత తోలా చనిపోయి, షామీరు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.
JDG 10:3 తోలా మరణించిన తరువాత మరో న్యాయమూర్తి దేవుని చేత పంపబడ్డాడు. ఆ మనిషి పేరు యాయీరు. యాయీరు గిలాదు ప్రాంతంలో నివసించేవాడు. యాయీరు ఇరవైరెండు సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయమూర్తిగా ఉన్నాడు.
JDG 10:4 యాయీరుకు ముప్పయి మంది కుమారులు. ఆ ముప్పయి మంది కుమారులు ముప్పయి గాడిదల మీద తిరిగేవారు. వారు గిలాదు ప్రాంతంలోని ముప్పయి పట్టణాల మీద అధికారం చేసేవారు. ఈ రోజు వరకు ఆ పట్టణాలు యాయీరు పట్టణాలు అని పిలువబడుతున్నాయి.
JDG 10:5 యాయీరు మరణించి కామోను పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.
JDG 10:6 మరల ఇశ్రాయేలు ప్రజలు, యెహోవా చెడ్డవి అని చెప్పిన వాటినే చేసారు. బూటకపు దేవతలు బయలు, అష్టారోతులను వారు పూజించటం మొదలు పెట్టారు. వారు అరాము ప్రజల దేవుళ్లను, సీదోను ప్రజల దేవుళ్లను, మోయాబు ప్రజల దేవుళ్లను, అమ్మోను ప్రజల దేవుళ్లను, ఫిలిష్తీయ ప్రజల దేవుళ్లను కూడా పూజించారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను విడిచిపెట్టి ఆయనను సేవించటం మానుకున్నారు.
JDG 10:7 కనుక ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు కోపం వచ్చింది. ఫిలిష్తీ ప్రజలు, అమ్మోను ప్రజలు వారిని ఓడించేటట్టుగా యెహోవా చేసాడు.
JDG 10:8 అదే సంవత్సరం యోర్దాను నదికి తూర్పు వైపునగల గిలాదు ప్రాంతంలో నివసించే ఇశ్రాయేలు ప్రజలను ఆ మనుష్యులు నాశనం చేసారు. అది అమ్మోరీ ప్రజలు నివసించిన దేశం. ఆ ఇశ్రాయేలు ప్రజలు పద్దెనిమిది సంవత్సరాలు శ్రమ అనుభవించారు.
JDG 10:9 అప్పుడు అమ్మోనీయులు యోర్దాను నది దాటి వెళ్లారు. యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము ప్రజల మీద యుద్ధం చేసేందుకు వారు వెళ్లారు. అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలకు అనేక కష్టాలు కలిగించారు.
JDG 10:10 కనుక ఇశ్రాయేలు ప్రజలు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. “దేవా, మేము నీకు విరోధంగా పాపం చేశాము. మేము మా దేవుని విడిచిపెట్టి బూటకపు బయలు దేవతను పూజించాము” అని వారు చెప్పారు.
JDG 10:11 ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా జవాబు చెప్పాడు: “ఈజిప్టు ప్రజలు అమ్మోరీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు మిమ్మల్ని బాధించినప్పుడు మీరు నాకు మొరపెట్టారు. వారి బారినుండి నేను మిమ్మల్ని రక్షించాను.
JDG 10:12 సీదోను ప్రజలు, అమాలేకీయులు, మిద్యానీయులు మిమ్మల్ని బాధించినప్పుడు మీరు నాకు మొరపెట్టారు. ఆ ప్రజల నుండి కూడా నేను మిమ్మల్ని రక్షించాను.
JDG 10:13 కానీ మీరు నన్ను విడిచిపెట్టేశారు. మీరు ఇతర దేవుళ్లను పూజించారు. కనుక మిమ్మల్ని మరల రక్షించటానికి నేను నిరాకరిస్తున్నాను.
JDG 10:14 ఆ దేవుళ్లను పూజించటం మీకు ఇష్టం కనుక వెళ్లి, సహాయం కోసం వాటికి మొరపెట్టండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆ దేవుళ్లనే మీకు సహాయం చేయనీయండి.”
JDG 10:15 కానీ ఇశ్రాయేలు ప్రజలు, “మేము పాపం చేశాము. మమ్మల్ని నీవు ఏమి చేయాలనుకొంటే అలాగే చేయి. కానీ ఈ వేళ నీవు మమ్మల్ని రక్షించు” అని యెహోవాను అడిగారు.
JDG 10:16 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ అన్యదేవతలను పారవేశారు. వారు మరల యెహోవాను ఆరాధించటం మొదలు పెట్టారు. కనుక వారు శ్రమపడుతున్నప్పుడు యెహోవా వారిని చూచి సంతాపపడ్డాడు.
JDG 10:17 అమ్మోనీయులు యుద్ధానికి సమావేశమయ్యారు. గిలాదు ప్రాంతంలో వారు విడిది చేసారు. ఇశ్రాయేలు ప్రజలు ఒక్కచోట సమావేశమయ్యారు. మిస్పా పట్టణం వద్ద ఉంది వారి విడిది.
JDG 10:18 గిలాదు ప్రాంతంలో నివసించే ప్రజల నాయకులు, “అమ్మోను ప్రజలమీద దాడి చేసేందుకు మనల్ని ఎవరు నడిపిస్తారు? ఆ మనిషి, గిలాదు ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ ప్రధాని అవుతాడు” అన్నారు.
JDG 11:1 యెఫ్తా గిలాదు వంశంవాడు. అతడు బలమైన సైనికుడు. అయితే యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. అతని తండ్రి పేరు గిలాదు.
JDG 11:2 గిలాదు భార్యకు చాలామంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులు పెద్దవారైనప్పుడు, యెఫ్తా అంటే వారికి ఇష్టంలేకపోయింది. ఆ కుమారులు యెఫ్తాను అతని స్వగ్రామం నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. “మా తండ్రి ఆస్తిలో నీకు ఎలాంటి భాగం లేదు. నీవు మరో స్త్రీ కుమారుడివి” అని వారు అతనితో చెప్పారు.
JDG 11:3 కనుక యెఫ్తా తన సోదరుల మూలంగా వెళ్లిపోయాడు. అతడు టోబు దేశంలో నివసించాడు. టోబు దేశంలో కొందరు అల్లరి జనం యెఫ్తాను వెంబడించటం మొదలు పెట్టారు.
JDG 11:4 కొంతకాలం తర్వాత అమ్మోనీ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు.
JDG 11:5 అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేస్తున్నారు గనుక గిలాదులోని పెద్దలు (నాయకులు) యెఫ్తా దగ్గరకు వెళ్లారు. యెఫ్తాటోబు దేశం విడిచిపెట్టి, గిలాదుకు తిరిగి రావాలని వారు కోరారు.
JDG 11:6 ఆ పెద్దలు, “మనం అమ్మోనీయులతో యుద్ధం చేయగలిగేటట్టు, నీవు వచ్చి మాకు నాయకునిగా ఉండు” అని యెఫ్తాతో చెప్పారు.
JDG 11:7 కానీ యెఫ్తా, “మీరే నన్ను నా తండ్రి ఇంటి నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. నేనంటే మీకు అసహ్యం. కనుక మీకు కష్టం వచ్చిందని మీరు ఇప్పుడు నా దగ్గరకు రావటం ఎందుకు?” అని గిలాదు దేశపు పెద్దలను (నాయకులను) అడిగాడు.
JDG 11:8 “ఆ కారణం వల్లనే ఇప్పుడు మేము నీ దగ్గరకు వచ్చాము. దయచేసి మాతో వచ్చి అమ్మోనీయుల మీద యుద్ధం చేయి. గిలాదులో నివసిస్తున్న ప్రజలందరి మీద నీవు సైన్యాధికారిగా ఉంటావు” అని గిలాదు పెద్దలు యెఫ్తాతో చెప్పారు.
JDG 11:9 అప్పుడు యెఫ్తా, “నేను గిలాదుకు తిరిగి వచ్చి, అమ్మోనీయులతో యుద్ధం చేయాలని మీరు కోరితే, మంచిదే. కానీ గెలిచేందుకు యెహోవా నాకు సహాయం చేస్తే, అప్పుడు మీకు నేను కొత్త నాయకునిగా ఉంటాను” అని గిలాదు పెద్దలతో చెప్పాడు.
JDG 11:10 గిలాదు పెద్దలు (నాయకులు), “మనం చెప్పుకొంటున్నది అంతా యెహోవా వింటున్నాడు. మేము చేయాలని నీవు చెప్పేది అంతా మేము చేస్తామని వాగ్దానం చేస్తున్నాము” అని యెఫ్తాతో చెప్పారు.
JDG 11:11 కనుక గిలాదు పెద్దలతో యెఫ్తా వెళ్లాడు. ఆ ప్రజలు యెఫ్తాను తమ నాయకునిగా, సైన్యాధికారిగా చేసుకున్నారు. మిస్పా పట్టణంలో యెహోవా ఎదుట యెఫ్తా తన మాటలన్నింటినీ మళ్లీ చెప్పాడు.
JDG 11:12 అమ్మోను ప్రజల రాజు దగ్గరకు యెఫ్తా సందేశకులను పంపించాడు. ఆ సందేశకులు రాజుకు ఈ సందేశం అందించారు: “అమ్మోను ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్యగల సమస్య ఏమిటి? మాపై యుద్ధానికి నీవెందుకు వచ్చావు?”
JDG 11:13 అమ్మోను ప్రజల రాజు, “ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు, వారు మా భూమిని ఆక్రమించుకున్నారు గనుక ఇశ్రాయేలీయులతో మేము యుద్ధం చేస్తున్నాము. అమ్మోను నది నుండి యబ్బోకు నది వరకు, యోర్దాను నది వరకు వారు మా భూమిని ఆక్రమించారు. ఇప్పుడు మా భూమిని శాంతియుతంగా తిరిగి మాకు ఇచ్చివేయమని ఇశ్రాయేలీయులతో చెప్పండి” అని యెఫ్తా సందేశకులతో చెప్పాడు.
JDG 11:14 యెఫ్తా సందేశకులు ఈ సందేశాన్ని తిరిగి యెఫ్తాకు అందించారు. అప్పుడు యెఫ్తా ఆ సందేశకులను తిరిగి అమ్మోనీయుల రాజు దగ్గరకు పంపించాడు.
JDG 11:15 వారు తిరిగి తీసుకుని వెళ్లిన సందేశం ఇది: “యెఫ్తా చెప్పేది ఇది: మోయాబు ప్రజల భూమిగాని, అమ్మోను ప్రజల భూమిగాని ఇశ్రాయేలీయులు తీసుకోలేదు.
JDG 11:16 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోనికి వెళ్లారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రానికి వెళ్లారు. తర్వాత వారు కాదేషు వెళ్లారు.
JDG 11:17 ఇశ్రాయేలీయులు ఎదోము రాజు దగ్గరకు సందేశకులను పంపించారు. ఒక సహాయం కోసం ఆ సందేశకులు అడిగారు. ‘ఇశ్రాయేలు ప్రజలను నీ దేశంలో నుండి పోనియ్యి’ అని వారు అడిగారు. కానీ ఎదోము రాజు మమ్మల్ని వారి దేశంలో నుండి వెళ్లనివ్వ లేదు. అదే సందేశాన్ని మేము మోయాబు రాజుకు కూడ పంపించాము. కానీ మోయాబు రాజుగూడ మమ్మల్ని తన దేశంలోనుండి వెళ్లనివ్వలేదు. కనుక ఇశ్రాయేలు ప్రజలు కాదేషులో నిలిచిపోయారు.
JDG 11:18 “తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నుండి, ఎదోము, మోయాబు దేశాల సరిహద్దుల నుండి తిరిగి వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు దేశానికి తూర్పు దిశగా ప్రయాణం చేశారు. అర్నోను నదికి అవతలవైపు వారు విడిది చేసారు. మోయాబు దేశ సరిహద్దును వారు దాటలేదు. (అర్నోను నది మోయాబు దేశానికి సరిహద్దు.)
JDG 11:19 “తర్వాత ఇశ్రాయేలీయులు అమ్మోరీయుల రాజు సీహోను దగ్గరకు సందేశకులను పంపించారు. సీహోను హెష్బోను పట్టణపు రాజు, “ఇశ్రాయేలు ప్రజలను నీ దేశంలో నుండి వెళ్లనియ్యి. మేము మా దేశానికి వెళ్లగోరుతున్నాము.” అని ఆ సందేశకులు సీహోనుతో చెప్పారు.
JDG 11:20 కానీ అమ్మోరీయుల రాజు సీహోను ఇశ్రాయేలు ప్రజలను తన సరిహద్దులు దాటనివ్వలేదు. సీహోను తన ప్రజలందరినీ సమావేశపరచి, యాహసు దగ్గర విడిది చేసాడు. అప్పుడు అమ్మోరీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసారు.
JDG 11:21 అయితే సీహోనును, అతని సైన్యాన్ని ఓడించేందుకు ఇశ్రాయేలు దేవుడు యెహోవా, ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసాడు. కనుక అమ్మోరీయుల దేశం ఇశ్రాయేలీయుల ఆస్తి అయింది.
JDG 11:22 కనుక అమ్మోరీయుల దేశం అంతా ఇశ్రాయేలీయుల వంశం అయింది. ఆ దేశం అర్నోను నదినుండి యబ్బోకు నదివరకు ఉంది. ఆ దేశం అరణ్యంనుండి యోర్దాను నదివరకు ఉంది.
JDG 11:23 “అమ్మోరీ ప్రజలను వారి దేశంనుండి వెళ్లగొట్టినవాడు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు. మరియు ఆ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోయేట్టు నీవు చేయగలవని అనుకొంటున్నావా?
JDG 11:24 నీ కెమోషు దేవత నీకు ఇచ్చిన దేశంలో నిశ్చయంగా నీవు ఉండవచ్చును. కనుక మా యెహోవా దేవుడు మాకు ఇచ్చిన దేశంలో మేము ఉంటాము.
JDG 11:25 సిప్పోరు కుమారుడు బాలాకు కంటె నీవు మంచివాడవా? అతను మోయాబు దేశానికి రాజు. అతడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమైనా వాదించాడా? అతడు ఇశ్రాయేలు ప్రజలతో నిజంగా యుద్ధం చేశాడా?
JDG 11:26 హెష్బోను పట్టణంలో, దాని చుట్టూరా ఉన్న ఊళ్లలోను మూడువందల సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నివసించారు. ఇశ్రాయేలు ప్రజలు అరోయేరు చుట్టూరా ఉన్న ఊళ్ళలోను మూడువందల సంవత్సరాలు నివసించారు. అర్నోను నది పొడవునా ఉన్న పట్టణాలు అన్నింటిలోనూ ఇశ్రాయేలు ప్రజలు మూడువందల సంవత్సరాలు నివసించారు. ఆ కాలమంతటిలోనూ ఈ పట్టణాలను తీసుకునేందుకు నీవు ఎందుకు ప్రయత్నం చేయలేదు?
JDG 11:27 ఇశ్రాయేలు ప్రజలు నీకు విరోధంగా పాపం చేయలేదు. కానీ నీవు ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా చాలా చెడ్డ పని చేస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలు సరియైనది చేస్తున్నారో, అమ్మోనీయులు సరియైనది చేస్తున్నారో అనేది నిజమైన న్యాయమూర్తి యెహోవా నిర్ణయించునుగాక!”
JDG 11:28 యెఫ్తా దగ్గర్నుండి వచ్చిన ఈ సందేశాన్ని అమ్మోనీయుల రాజు నిరాకరించాడు.
JDG 11:29 అప్పుడు యెహోవా అత్మ యెఫ్తా మీదికి వచ్చింది. గిలాదు, మనష్షే ప్రాంతాలలో యెఫ్తా సంచారం చేశాడు. అతడు గిలాదులోని మిస్పా పట్టణానికి వెళ్లాడు. గిలాదులోని మిస్పా పట్టణంనుండి యెఫ్తా అమ్మోనీయుల దేశంలోనికి వెళ్లాడు.
JDG 11:30 యెహోవాకు యెఫ్తా ఒక ప్రమాణం చేసాడు, “అమ్మోనీయులను నేను ఓడించేటట్టుగా నీవు చేస్తే,
JDG 11:31 ఆ విజయంతో నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటిలోనుండి మొట్టమొదట బయటకు వచ్చేదానిని నేను నీకు అర్పిస్తాను. దానిని నేను దహన బలిగా యెహోవాకు అర్పిస్తాను” అని అతడు చెప్పాడు.
JDG 11:32 అప్పుడు యెఫ్తా అమ్మోనీ ప్రజల దేశం వెళ్ళాడు. అమ్మోనీయులతో యెఫ్తా యుద్ధం చేశాడు. వారిని ఓడించటానికి యెహోవా అతనికి సహాయం చేశాడు.
JDG 11:33 అరోయేరు పట్టణంనుండి మిన్నీతు పట్టణం వరకు అతడు వారిని ఓడించాడు. యెఫ్తా ఇరవై పట్టణాలను పట్టుకొన్నాడు. ఆబేల్కెరామీము పట్టణంవరకు అమ్మోనీయులతో అతడు పోరాడాడు. ఇశ్రాయేలీయులు అమ్మోనీ ప్రజలను ఓడించారు. అది అమ్మోనీ ప్రజలకు ఒక గొప్ప పరాజయం.
JDG 11:34 యెఫ్తా తిరిగి మిస్పా వెళ్లాడు. యెఫ్తా తన ఇంటికి వెళ్లగా, అతని కుమార్తె అతన్ని ఎదుర్కొనేందుకు ఇంటిలో నుండి బయటకు వచ్చింది. ఆమె తంబుర వాయిస్తూ, నాట్యం చేస్తూ వచ్చెను. ఆమె అతనికి ఒక్కతే కుమార్తె. యెఫ్తా ఆమెను ఎంతో ప్రేమించాడు. యెఫ్తాకు ఇంకా కుమారులు, కుమార్తెలు ఎవరూ లేరు.
JDG 11:35 యెఫ్తా ఇంటి నుండి మొట్టమొదట బయటకు వచ్చింది తన కుమార్తె అని అతడు చూడగానే, అతడు తన దుఃఖాన్ని వ్యక్తం చేయటానికి తన బట్టలు చింపివేసికున్నాడు. అప్పుడు అతడు, “అయ్యో, నా కుమారీ, నీవు నన్ను దుఃఖంతో నింపివేశావు. నీవు నన్ను ఎంతో ఎంతో భాధపెట్టేశావు. యెహోవాకు నేను వాగ్దానం చేశాను, దానిని నేను మార్చలేను” అని చెప్పాడు.
JDG 11:36 అప్పుడు అతని కుమార్తె, “నా తండ్రీ, నీవు యెహోవాకు ఒక వాగ్దానం చేశావు. కనుక నీ వాగ్దానం నిలబెట్టుకో. నీవు చెప్పినట్టే చేయి. నీ శత్రువులైన అమ్మోనీయులను ఓడించటానికి యెహోవాయేగదా నీకు సహాయం చేసాడు” అని యెఫ్తాతో చెప్పింది.
JDG 11:37 అప్పుడు యెఫ్తా కుమార్తె, “అయితే నా కోసం ముందుగా ఈ ఒక్కటి చేయి. రెండు నెలలు నన్ను ఏకాంతంగా ఉండనివ్వు. నన్ను కొండలకు వెళ్లనివ్వు. నేను పెళ్లి చేసుకోను, పిల్లలు ఉండరు, కనుక నన్ను నా స్నేహితురాండ్రను కలిసి ఏడ్వనివ్వు” అని తన తండ్రితో చెప్పింది.
JDG 11:38 “వెళ్లి అలాగే చేయి” అని చెప్పాడు యెఫ్తా. రెండు నెలల కోసం యెఫ్తా ఆమెను పంపించివేశాడు. యెఫ్తా కుమార్తె, ఆమె స్నేహితురాండ్రు కొండలలో నివసించారు. ఆమెకు పెళ్లి, పిల్లలు ఉండరు కనుక వారు ఆమె కోసం ఏడ్చారు.
JDG 11:39 రెండు నెలల అనంతరం, యెఫ్తా కుమార్తె తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చింది. యెఫ్తా యెహోవాకు వాగ్దానం చేసిన ప్రకారమే జరిగించాడు. యెఫ్తా కుమార్తెకు ఎవరితోనూ ఎన్నడూ లైంగిక సంబంధాలు లేవు. కనుక ఇశ్రాయేలులో ఇది ఒక ఆచారం అయ్యింది.
JDG 11:40 గిలాదు వాడైన యెఫ్తా కుమార్తెను ఇశ్రాయేలు స్త్రీలు ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటారు. యెఫ్తా కుమార్తె కోసం ఇశ్రాయేలు స్త్రీలు ప్రతి సంవత్సరం నాలుగు రోజుల పాటు ఏడుస్తారు.
JDG 12:1 ఎఫ్రాయిము వంశంలోని మనుష్యులు వారి సైనికులందరినీ సమావేశ పరిచారు. తరువాత వారు నది దాటి సఫోను పట్టణం వెళ్లారు. వారు, “అమ్మోనీయులతో పోరాడేందుకు సహాయంగా నీవు మమ్మల్ని ఎందుకు పిలువలేదు? నీతోపాటే నీ ఇంటిని కాల్చివేస్తాము” అని యెఫ్తాతో అన్నారు.
JDG 12:2 వారికి యెఫ్తా జవాబు చెప్పాడు: “అమ్మోనీయులు మాకు చాలా కష్టాలు కలిగించారు. కనుక నేను, నా ప్రజలు వారి మీద యుద్ధం చేశాము. నేను మిమ్మల్ని పిలిచాను, కాని మాకు సహాయం చేయటానికి మీరు రాలేదు.
JDG 12:3 మీరు మాకు సహాయం చేయరని నాకు తెలిసింది. కనుక నేను నా ప్రాణాన్ని లెక్కచేయలేదు. అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి నేను నది దాటివెళ్లాను. వారిని ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేశాడు. ఇప్పుడు నాతో పోరాడటానికి మీరెందుకు ఈ వేళ వచ్చారు?”
JDG 12:4 అప్పుడు యెఫ్తా గిలాదు మనుష్యులను సమావేశ పరిచాడు. వారు ఎఫ్రాయిము మనుష్యులతో యుద్ధం చేసారు. ఎఫ్రాయిము మనుష్యులు గిలాదు వారిని అవమానించారు గనుక ఆ మనుష్యులతో వారు పోరాడారు. “గిలాదు వారైన మీరు ఎఫ్రాయిము మనుష్యులలో మిగిలిన వారే తప్ప మరేమీ కాదు. మీకు కనీసం సొంత దేశం కూడా లేదు. మీలో కొందరు ఎఫ్రాయిముకు మరికొందరు మనష్షేకు చెందినవారు” అని వారు అన్నారు. గిలాదు మనుష్యులు ఎఫ్రాయిము మనుష్యులను ఓడించారు.
JDG 12:5 ప్రజలు యోర్దాను నదిని దాటే రేవులను గిలాదు మనుష్యులు పట్టుకొన్నారు. ఆ రేవులు ఎఫ్రాయిము దేశానికి పోయేదారులు. ఎఫ్రాయిము వారిలో తప్పించుకున్నవాడు ఎప్పుడైనా నది దగ్గరకు వచ్చి, “నన్ను దాటనివ్వండి” అని చెబితే గిలాదువారు, “నీవు ఎఫ్రాయిము వాడవా?” అని అడుగుతారు. “లేదు” అని వాడు చెబితే
JDG 12:6 “షిబ్బోలెతు అనే మాట పలుకు” అని వారు అంటారు. ఎఫ్రాయిము మనుష్యులు ఆ మాటను సరిగ్గా పలుకలేరు. వారు ఆ మాటను “సిబ్బోలెతు” అని పలుకుతారు. కనుక అటువంటి వారిని ఒకడు “సిబ్బోలెతు” అని చెబితే అతడు ఎఫ్రాయిము వాడని గిలాదు వారికి తెలిసిపోతుంది. కనుక ఆ రేవు దగ్గరే వారు చంపేస్తారు. అలాగున వారు నలభై రెండువేల మంది ఎఫ్రాయిము మనుష్యులను చంపివేశారు.
JDG 12:7 ఆరు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు యెఫ్తా న్యాయమూర్తిగా ఉన్నాడు. అప్పుడు గిలాదు వాడైన యెఫ్తా చనిపోయాడు. వారు అతని పట్టణమైన గిలాదులో అతనిని పాతిపెట్టారు.
JDG 12:8 యెఫ్తా తర్వాత ఇబ్సాను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయ్యాడు. ఇబ్సాను బేత్లెహేము నగరానికి చెందినవాడు.
JDG 12:9 ఇబ్సానుకి ముప్ఫై మంది కొడుకులు, ముప్ఫై మంది కుమార్తెలు ఉన్నారు. తమ బంధువులు కాని వారిని వివాహం చేసుకోవలసిందిగా అతను ముప్ఫై మంది కుమార్తెలను కోరాడు. తమ బంధువులు కాని ముప్ఫై మంది స్త్రీలను అతను కనుగొన్నాడు. వారిని అతని కుమారులు వివాహం చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఇబ్సాను ఏడు సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు.
JDG 12:10 తర్వాత ఇబ్సాను మరణించాడు. అతనిని బేత్లెహేం నగరంలో సమాధి చేశారు.
JDG 12:11 ఇబ్సాను అనంతరం, ఇశ్రాయేలు ప్రజలకు ఏలోను న్యాయాధిపతి అయ్యాడు. ఏలోను జెబూలూను వంశమునుండి వచ్చినవాడు. అతను ఇశ్రాయేలు ప్రజలకు పది సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు.
JDG 12:12 అప్పుడు జెబలూను వంశంనుండి వచ్చిన ఏలోను చనిపోయాడు. ఆయన ఆయ్యాలోను లోని జెబూలూను పట్టణంలో సమాధి చేయబడ్డాడు.
JDG 12:13 ఏలోను మరణానంతరం, హిల్లేలు కుమారుడైన అబ్దోను అనే అతను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయ్యాడు.
JDG 12:14 అబ్దోను పిరాతోను అనే నగరానికి చెందినవాడు. అబ్దోనుకు 40 మంది కుమారులు, 30 మంది మనుమలు ఉన్నారు. వారు డెబ్భయి గాడిదలెక్కి తిరిగారు. ఇశ్రాయేలు ప్రజలకు అబ్దోను ఎనిమిదేళ్ల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు.
JDG 12:15 ఆ తర్వాత హిల్లేలు కుమారుడైన అబ్దోను మరణించాడు. అతనిని పిరాతోను నగరంలో సమాధి చేశారు. పిరాతోను ఎఫ్రాయిము అనే ప్రదేశంలో ఉంది. ఇది కొండదేశం లోనిది, అక్కడ అమాలేకీయుల ప్రజలు నివసించేవారు.
JDG 13:1 ఇశ్రాయేలు ప్రజలు చెడ్డ పనులు చేయడం మళ్లీ యెహోవా చూశాడు. అందువల్ల ఫిలిష్తీయులు వారిని 40 సంవత్సరాల పాటు పరిపాలించేందుకు యెహోవా అనుమతించాడు.
JDG 13:2 జొర్యాకి చెందిన ఒకతను ఉండేవాడు. అతని పేరు మానోహ. అతను దాను వంశానికి చెందినవాడు. మానోహకు ఒక భార్య ఉంది. ఆమె పిల్లలెవరినీ కనలేక పోయింది.
JDG 13:3 యెహోవా దూత మానోహ భార్యకి ప్రత్యక్షమయ్యాడు. అతను ఇలా అన్నాడు: “నీవు పిల్లల్ని కనలేకపోయావు. కాని నీవు గర్భవతివవుతావు. ఒక కొడుకుని కంటావు.
JDG 13:4 ఏ మద్యంగాని, ఘాటైన పానీయంగాని నీవు తాగవద్దు. అపరిశుభ్రమైన ఆహారం కూడా నీవు తినవద్దు.
JDG 13:5 ఎందుకంటే నీవు గర్భవతివై, ఒక కొడుకుని కంటావు. ఒక ప్రత్యేకమైన విధంగా అతను దేవునికి సమర్పించబడతాడు. అతను నాజీరవుతాడు. అందువల్ల ఎప్పుడూ అతని జుట్టు కత్తిరించకు. అతను జన్మించడానికి పూర్వమె అతను దేవుని ప్రత్యేకమైన వ్యక్తిగా వుంటాడు. అతను ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయుల అధికారం నుంచి కాపాడతాడు.”
JDG 13:6 తర్వాత ఆమె తన భర్త వద్దకు వెళ్లి అతనితో జరిగిన విషయం చెప్పింది. ఆమె ఇలా చెప్పింది: “దేవుని వద్దనుండి ఒక మనిషి నా వద్దకు వచ్చాడు. అతను దేవదూతగా కనిపించాడు. అతను నన్ను భయపెట్టాడు. ఎక్కడినుంచి అతను వచ్చాడో, ఆ సంగతి నేను కనుక్కోలేదు. అతను తన పేరు చెప్పలేదు.
JDG 13:7 కాని నాతో ఇలా అన్నాడు: ‘నీవు గర్భవతివి. నీకొక కుమారుడు కలుగుతాడు. మద్యంగాని, ఏ ఇతర ఘాటైన పానీయంగాని తాగవద్దు. అపరిశుభ్రంగా ఉండే ఆహారమూ తినవద్దు. ఎందుకంటే, ప్రత్యేకమైన విధంగా అతను దేవునికి సమర్పించబడతాడు. ఆ బాలుడు దేవుని ప్రత్యేక వ్యక్తి. పుట్టుకకు మునుపటినుంచి మరణించేంత వరకు అతను విలక్షణమైన మనిషి.’”
JDG 13:8 ఆ తర్వాత మానోహ యెహోవాను ప్రార్థించాడు. అతను ఇలా అన్నాడు: “యెహోవా, దేవ దూతను మళ్లీ మా వద్దకు పంపవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. త్వరలోనే బాలుడుగా జన్మించనున్న అతనికి మేము ఏమి చేయాలో అది ఆ దేవదూత మాకు నేర్పాలి”
JDG 13:9 దేవుడు మానోహ ప్రార్థన ఆలకించాడు. దేవదూత మళ్లీ ఆ స్త్రీకి ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఒక పొలంలో కూర్చునివుంది. ఆమె భర్త మానోహ ఆమె వద్ద లేడు.
JDG 13:10 అందువల్ల అది చెప్పాలని భర్త వద్దకు పరుగెత్తి, “ఆ మనిషి తిరిగి వచ్చాడు! మొన్న వచ్చిన అతను ఇక్కడే వున్నాడు.” అని తన భర్తతో చెప్పింది.
JDG 13:11 మానోహ లేచి తన భార్యను అనుసరించాడు. అతను ఆ మనిషి వద్దకు రాగానే, “ఇంతకు మునుపు నా భార్యతో మాటలాడిన వ్యక్తివి నీవేనా” అని అడిగాడు. “నేనే” అన్నాడు దేవదూత.
JDG 13:12 అందువల్ల మానోహ, “నీవు చెప్పినట్లు జరుగుతుందని భావిస్తున్నాను. బాలుడు ఎలాంటి జీవితం గడుపుతాడో, అతడేమి చేస్తాడో చెప్పు” అని అడిగాడు.
JDG 13:13 యెహోవా దూత మానోహతో ఇలా చెప్పాడు: “నేను చెప్పినదంతా నీ భార్య చేయాలి.
JDG 13:14 ద్రాక్షాతీగ మీద పెరిగే దానిని ఆమె తినకూడదు. ఆమె మద్యము తాగకూడదు. అపరిశుభ్రమైన ఆహారం తినకూడదు. ఏమి చేయుమని ఆమెను ఆజ్ఞాపించానో, ఆమె అదంతా చేయాలి.”
JDG 13:15 అప్పుడు ఆ యెహోవా దూతతో మానోహ ఇలా చెప్పాడు: “దయచేసి నీవు మాతోపాటు కొంత సేపు ఉండు. నీవు తినేందుకుగాను ఒక పడుచు మేకను వండిపెట్టాలని అనుకుంటున్నాము.”
JDG 13:16 యెహోవా దూత మానోహతో ఇలా అన్నాడు: “నేను వెళ్లకుండా మీరు చేసినా, నేను మీరు పెట్టే ఆహారం తినను. కాని మీరేదైనా చెయ్యదలుచుకుంటే, అప్పుడు యెహోవాకు దహనబలిని సమర్పించండి.” (ఆ వ్యక్తి నిజంగా యెహోవా దూత అని మానోహ అర్థం చేసుకోలేక పోయాడు).
JDG 13:17 అప్పుడు యెహోవా దూతను, “నీ పేరేమిటి? నీవు చెప్పినదంతా నిజంగా జరిగినప్పుడు, నిన్ను గౌరవించాలని మేమనుకుంటున్నాము. అందువల్లనే నీ పేరు తెలుసుకోదలచాను.”
JDG 13:18 యెహోవా దూత ఇలా చెప్పాడు: “నా పేరు మీరెందుకు అడుగుతున్నారు? ఇది మీరు నమ్మడానికి చాలా ఆశ్చర్యకరము”
JDG 13:19 అప్పుడు మానోహ ఒక బండ మీద ఒక పడుచు మేకను బలి ఇచ్చాడు. మేకను, ధాన్యమును యెహోవాకు, మరియు అద్భుతాలు కావించే వ్యక్తికీ సమర్పించాడు.
JDG 13:20 మానోహ, అతని భార్య జరిగిన వాటిని గమనిస్తూ వచ్చారు. మధ్యస్థానము నుండి ఆకాశానికి పొదలు లేచినప్పుడు, యెహోవా దూత ఆ మంటలలో పరమునకు వెళ్లిపోయాడు! ఎప్పుడైతే అది మానోహ, అతని భార్య చూసారో, నేలకు తాకేలా తమ ముఖాలు వంచి నమస్కరించారు.
JDG 13:21 ఆ వ్యక్తి నిజంగానే యెహోవా దూత అని చివరికి మానోహ గ్రహించాడు. ఆ తర్వాత యెహోవాదూత మళ్లీ మానోహ, మరియు ఆయన భార్య ముందు ప్రత్యక్షం కాలేదు.
JDG 13:22 మానోహ తన భార్యతో ఇలా అన్నాడు: “మనం దేవుణ్ణి చూశాము. ఇందువల్ల తప్పకుండా మనం మరణిస్తాము!”
JDG 13:23 కాని అతని భార్య అతనితో, “మనల్ని చంపాలని దేవుడు భావించడం లేదు. యెహోవా కనక మనల్ని చంపదలచుకుంటే, మనం సమర్పించిన వండిన వస్తువుని, ధాన్యాన్ని ఆయన స్వీకరించి ఉండడు. మనకీ విషయాలను ఆయన చూపివుండడు. పైగా వీటిని మనకు చెప్పి ఉండడు.” అని చెప్పింది.
JDG 13:24 తరువాత ఆ స్త్రీకి బాలుడు జన్మించాడు. అతనికి సమ్సోను అని పేరు పెట్టింది. సమ్సోను పెరిగాడు. యెహోవా అతనిని ఆశీర్వదించాడు.
JDG 13:25 యెహోవా ఆత్మ సమ్సోనులో పనిచేయనారంభించింది. అతనప్పుడు మహెనుదాను నగరంలో ఉన్నాడు. ఆ నగరం జోర్యా, ఎష్తాయోలుకు మధ్య ఉంది.
JDG 14:1 సమ్సోను తిమ్నాతు నగరానికి వెళ్లాడు. అక్కడ ఒక ఫిలిష్తీయుల యువతిని అతను చూశాడు.
JDG 14:2 అతను ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులతో ఇలా అన్నాడు: “తిమ్నాతులో నేనొక ఫిలిష్తీయుల స్త్రీని చూశాను. మీరామెను తీసుకు రావాలి అని నా కోరిక. నేనామెను పెళ్లి చేసుకుంటాను.”
JDG 14:3 అతని తల్లిదండ్రులు ఇలా సమాధానం చెప్పారు: “నీవు పెళ్లి చేసుకోవటానికి! ఇశ్రాయేలు ప్రజల మధ్య తప్పకుండా ఒక స్త్రీ ఉంటుంది. కాని ఫిలిష్తీయుల మధ్యగల ఒక స్త్రీని నీవు పెళ్లి చేసుకుంటావా? ఆ ప్రజలు సున్నతి కూడా చేసుకోలేదు.” కాని సమ్సోను ఇలా అన్నాడు: “ఆ స్త్రీని నా కోసం తీసుకురండి ఆమె నాకు కావాలి.”
JDG 14:4 (యెహోవా ఇది జరగాలని ఆశించినట్టు సమ్సోను తల్లిదండ్రులకు తెలియదు. ఫిలిష్తీయులకు విరుద్ధంగా ఏదో ఒకటి చేయటానికి యెహోవా ఒక అవకాశం కోసం చూడసాగాడు. ఫిలిష్తీయులు అప్పట్లో ఇశ్రాయేలు ప్రజల మీద ఆధిపత్యం చలాయించే వారు.)
JDG 14:5 సమ్సోను తన తల్లిదండ్రుల్ని వెంట బెట్టుకుని తిమ్నాతు నగరానికి వెళ్లాడు. నగరానికి దగ్గరగా ఉన్న ద్రాక్షతోటలదాకా వారు వెళ్లారు. అప్పుడు ఒక పడుచు సింహం ఉన్నట్టుండి గర్జించింది. అది సమ్సోను మీదికి దుమికింది.
JDG 14:6 అప్పుడు యెహోవా ఆత్మ సమ్సోనుని బలపరచగా, గొప్ప శక్తితో, వట్టి చేతులతోనే అతను సింహాన్ని చీల్చివేశాడు. అది అతనికి సులభంగా తోచింది. ఒక పడుచు మేకను చీల్చునంత సులభంగా తోచిందాపని. కాని అతనేమి చేశాడో, ఆ సంగతి తల్లికి గాని తండ్రికి గాని తెలుపలేదు.
JDG 14:7 అందువల్ల సమ్సోను నగరానికి వెళ్లి, ఆ ఫిలిష్తీయుల స్త్రీతో మాట్లాడాడు. ఆమె అతనిని సంతోషపెట్టింది.
JDG 14:8 చాలారోజుల తర్వాత, సమ్సోను ఫిలిష్తీయుల స్త్రీని వివాహమాడేందుకు తిరిగి వచ్చాడు. త్రోవలో చచ్చిపోయిన ఆ సింహాన్ని చూడటానికి వెళ్లాడు. మృత సింహం శరీరం మీద తేనెటీగల గుంపు చూశాడు. అవి కొంచెం తేనె తయారు చేశాయి.
JDG 14:9 తన చేతులతో సమ్సోను ఆ తేనెను తీసుకున్నాడు. ఆ తేనె తింటూ అతను నడిచాడు. తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఆ తేనె కొంచెం వారికి ఇచ్చాడు. వారు కూడా తిన్నారు. కాని మృత సింహం శరీరంనుంచి తాను తేనెను తెచ్చినట్లు సమ్సోను తల్లిదండ్రులకు చెప్పలేదు.
JDG 14:10 సమ్సోను తండ్రి ఆ ఫిలిష్తీయుల స్త్రీని చూసేందుకు వెళ్లాడు. పెళ్లికొడుకు విందు ఇవ్వడం ఆ రోజులలో ఆచారంగా ఉండేది. అందువల్ల సమ్సోను ఒక విందు ఇచ్చాడు.
JDG 14:11 ఫిలిష్తీయుల ప్రజలు అతను విందు యివ్వడం చూసి అతనికి తోడుగా ముప్ఫై మంది మనుషుల్ని పంపారు.
JDG 14:12 అప్పుడు సమ్సోను ముప్ఫై మంది మనుష్యులతో ఇలా అన్నాడు: “నేను మీకో చిక్కు ప్రశ్న చెపుతాను. ఈ విందు ఏడు రోజులపాటు సాగుతుంది. ఈలోగా మీరు సమాధానం వెతకాలి. ఈలోగా కనుక మీరు చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే, నేను మీకు ముప్ఫై నార వస్త్రాలు, ముప్ఫై మార్పు గుడ్డలు ఇస్తాను.
JDG 14:13 కానీ మీకు సమాధానం దొరక్కపోతే అప్పుడు మీరు ముప్ఫైనార వస్త్రాలు, ముప్ఫై మార్పు గుడ్డలను ఇవ్వాలి.” అప్పుడు ఆ ముప్ఫై మంది మనుష్యులు ఇలా అన్నారు. “నీ చిక్కు ప్రశ్న ఏమిటో మాకు చెప్పు. అది మేము వినదలచాము.”
JDG 14:14 సమ్సోను ఈ చిక్కు ప్రశ్న వాళ్లకి చెప్పాడు: “బలమైన దానిలోనుండి తీపి వచ్చింది. తినుదానిలో నుండి తిండి వచ్చింది.” మూడు రోజుల పాటు ఆ ముప్ఫైమంది మనుష్యులు సమాధానం కోసం ప్రయత్నించారు. కాని కనుగొనలేకపోయారు.
JDG 14:15 నాలుగవ రోజున, ఆ మనుష్యులు సమ్సోను భార్య వద్దకు వచ్చారు. వారన్నారు: “మమ్మల్ని పేదవారుగా చేసేందుకు ఇక్కడికి ఆహ్వానించావా? ఆ చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పవలసిందిగా నీవు నీ భర్తను ప్రేరేపించాలి. మా కోసం కనుక నీవు సమాధానం రప్పించకపోతే మేము నిన్ను కాల్చివేస్తాము. అలాగే మీ తండ్రిగారి వద్ద ఉన్న మనుష్యులందరినీ చంపివేస్తాము.”
JDG 14:16 అందువల్ల సమ్సోను భార్య అతనిని సమీపించి విలపించింది. ఆమె అన్నది: “నీవు నన్ను ద్వేషిస్తున్నావు. నీవు నిజంగా నన్ను ప్రేమించడంలేదు. నీవు మా మనుష్యులకో చిక్కు ప్రశ్న ఇచ్చావు. నీవు నాకైనా సమాధానం చెప్పవు.” అప్పుడు సమ్సోను ఇలా అన్నాడు: “నేను నా తల్లిదండ్రులకైనా చెప్పలేదు. నేను నీకు ఎందుకు చెప్పాలి?”
JDG 14:17 విందులోని కడమ యేడు రోజులూ సమ్సోను భార్య ఏడుస్తూ కూర్చుంది. చివరికతను సమాధానం చెప్పాడు. ఏడవ రోజున ఆ చిక్కు ప్రశ్నకు సమాధానం తెలియజేశాడు. ఆమె తనను వేధించుకు తినడంవల్ల ఆమెకు సమాధానం చెప్పాడు. తర్వాత ఆమె తన మనుష్యుల వద్దకు వెళ్లి, చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పింది.
JDG 14:18 ఏడవ రోజున సూర్యుడు అస్తమించేలోగా ఫిలిష్తీయుల మనుష్యులకు సమాధానం లభించింది. వారు సమ్సోను వద్దకు వచ్చి, ఇలా అన్నారు: “తేనె కంటె మధురమైనదేది? సింహంకంటె బలంకలది ఏది?” తర్వాత సమ్సోను వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు కనుక నా ఆవుతోనే దున్నక పోతే మీరు నా చిక్కు ప్రశ్నను పరిష్కరించి ఉండలేరు.”
JDG 14:19 సమ్సోను ఉగ్రుడయ్యాడు. యెహోవా ఆత్మ గొప్ప శక్తితో సమ్సోనుని నింపింది. అతను అష్కెలోను నగరానికి వెళ్లాడు. ఆ నగరంలో అతను ముప్ఫైమంది ఫిలిష్తీయులను చంపివేశాడు. తర్వాత వారి మృత శరీరాల మీది నుంచి అన్ని వస్త్రాలు, సొమ్ములు తీసుకున్నాడు. అతను ఆ వస్త్రాలను తిరిగి తీసుకు వచ్చి, తన చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పిన ఆ ముప్ఫై మంది మనుష్యులకు ఇచ్చివేశాడు. తర్వాత అతను తన తండ్రి ఇంటికి వెళ్లాడు.
JDG 14:20 సమ్సోను తన భార్యను తీసుకుపోలేదు. ఆమె తండ్రి ఇష్టము చొప్పున అటు తరువాత ఆమెను సమ్సోను ప్రాణ స్నేహితుడు ఒకడు భార్యగా అంగీకరించెను.
JDG 15:1 గోధుమ పంట కోతల సమయంలో, సమ్సోను తన భార్యను చూడటానికి వెళ్లాడు. ఆమెకు కానుకగా ఒక పడుచు మేకను తీసుకు వెళ్లాడు. అతను ఇలా అన్నాడు: “నేను నా భార్య గదికి వెళ్ళుతున్నాను.”
JDG 15:2 కాని ఆమె తండ్రి సమ్సోనుని లోపలికి వెళ్లనీయలేదు. ఆమె తండ్రి సమ్సోనుతో ఇలా అన్నాడు; “ఆమెను నీవు ద్వేషించినట్లు భావించాను. అందువల్లనే వివాహమునకు వచ్చిన తోడి పెండ్లి కుమారుడ్ని వివాహము చేసుకోమన్నాను. ఆమె చిన్న చెల్లెలు చాలా సౌందర్యవతి. ఆ చిన్న చెల్లెలిని తీసుకువెళ్లు”
JDG 15:3 కాని సమ్సోను అతనితో ఇలా అన్నాడు; “మీ ఫిలిష్తీయులను బాధించేందుకు తగిన కారణం ఇప్పుడు నాకు కనిపించింది. ఇప్పుడు నన్నెవ్వరూ నిందించరు.”
JDG 15:4 అందువల్ల సమ్సోను బయటికి వెళ్లి మూడు వందల నక్కల్ని పట్టుకున్నాడు. ఒకేసారి రెండేసి నక్కల్ని తీసుకుని వాటి తోకల్ని జతలు జతలుగా కట్టివేశాడు. ప్రతి రెండు నక్కల తోకలకు మధ్య ఒక దివిటీ కట్టి వేశాడు.
JDG 15:5 తరువాత నక్కల తోకల మధ్య ఉన్న దివిటీలు వెలిగించాడు. ఆ తర్వాత ఫిలిష్తీయుల ధాన్యపు రాసుల గుండా నక్కల్ని పరుగెత్తనిచ్చాడు. ఆ విధంగా, అతను వారి పొలాలలో పెరిగిన మొక్కల్నీ, కోసిపెట్టిన ధాన్యపు రాసుల్నీ కాల్చివేశాడు. అతను వాళ్ల ద్రాక్ష తోటల్ని, వాళ్ల ఒలీవ చెట్లని కూడా కాల్చివేశాడు.
JDG 15:6 “ఈ పని ఎవరు చేశారు?” అని ఫిలిష్తీయులు అడిగారు. ఎవరో ఇలా చెప్పారు: “తిమ్నాతుకు చెందిన ఆ మనిషియొక్క అల్లుడైన సమ్సోను ఈ పనిచేశాడు. అతను ఈ విధంగా ఎందుకు చేశాడంటే, అతని మామగారు సమ్సోను భార్యని పెళ్లిలోని అతని స్నేహితునికి ఇచ్చివేశాడు.” అందువల్ల సమ్సోను భార్యనీ, ఆమె తండ్రినీ ఫిలిష్తీయులు కాల్చి వేశారు.
JDG 15:7 అప్పుడు ఫిలిష్తీయులను ఉద్దేశించి సమ్సోను ఇలా అన్నాడు; “మీరు నాకు ఈ విధంగా కీడు చేశారు. అందువల్ల మీకు ఇప్పుడు నేను కీడు చేస్తాను. అప్పుడు నేను మీమీద పగతీర్చుకోవడం మానేస్తాను.”
JDG 15:8 తర్వాత సమ్సోను ఫిలిష్తీయుల మీద దాడిచేశాడు. చాలా మందిని చంపివేశాడు. తర్వాత అతను వెళ్లి ఒక గుహలో నివసించెను. ఏతాము బండ అనే ప్రదేశంలో ఆ గుహ ఉన్నది.
JDG 15:9 అప్పుడు ఫిలిష్తీయులు యూదా ప్రాంతానికి తరలిపోయారు. లేహీ అనే చోట వారు నిలిచారు. వారి సైనికులు అక్కడ విడిదిచేసి యుద్ధానికి సిద్ధపడ్డారు.
JDG 15:10 యూదా వంశానికి చెందిన మనుష్యులు వారిని ఇలా ప్రశ్నించారు: “ఫిలిష్తీయులైన మీరు మాతో యుద్ధం చేసేందుకు ఎందుకు ఇక్కడికి వచ్చారు?” అందుకు వారు ఇలా అన్నారు: “మేము సమ్సోనును పట్టుకోడానికి వచ్చాము. అతనిని మేము మా బందీగా చేసుకోవడానికి వచ్చాము. అతను మా ప్రజలకి చేసిన పనులకు బదులుగా అతనిని శిక్షిస్తాము.”
JDG 15:11 అప్పుడు యూదా వంశస్థులైన మూడువేల మంది మనుష్యులు సమ్సోనును పట్టుకొనుటకు ఏతాము బండకి దగ్గరగా వున్న ఆ గుహ వద్దకు వెళ్లి. అతనితో ఇలా అన్నారు: “నీవు మాకేమి చేశావు? ఫిలిష్తీయులు మమ్మల్ని పరిపాలిస్తున్నారని నీకు తెలియదా?” “వారు నాకు చేసిన కీడుకు బదులుగా వారిని నేను శిక్షించాను.” అని సమ్సోను సమాధానం చెప్పాడు.
JDG 15:12 అప్పుడు వారు సమ్సోనుతో ఇలా అన్నారు: “మేము నిన్ను బంధించడానికి వచ్చాము. మేము నిన్ను ఫిలిష్తీయులకు అప్పజెప్పుతాము.” యూదా నుండి వచ్చిన మనుష్యులతో సమ్సోను ఇలా అన్నాడు: “మీరు నాకు ఏమీ అపకారం చేయమని నాకు మాట ఇవ్వాలి.”
JDG 15:13 యూదా నుండి వచ్చిన మనుష్యులు ఇలా అన్నారు: “అందుకు మేము సమ్మతిస్తున్నాము. మేము నిన్ను బంధించి, ఫిలిష్తీయులకు అప్పజెప్పుతాము. మేము నిన్ను చంపమని మాట ఇస్తున్నాము.” అప్పుడు వారు రెండు కొత్త తాళ్లతో సమ్సోనును బంధించారు. ఆ ప్రాంతంలోని గుహనుంచి అతనిని తీసుకువెళ్లారు.
JDG 15:14 లేహీ అనే చోటికి సమ్సోను రాగానే, ఫిలిష్తీయులు అతనిని కలుసుకోడానికి అక్కడికి వచ్చారు. సంతోషంతో వారు కేకలు వేశారు. అప్పుడు యెహోవా ఆత్మ గొప్ప శక్తితో సమ్సోనును నింపగా, సమ్సోను తాళ్లు తెంపుకున్నాడు. కాలిపోయిన దారంవలె ఆ తాళ్లు బలహీనముగా కనిపించాయి. కరిగిపోయినట్లుగా ఆ తాళ్లు సడలిపోయాయి.
JDG 15:15 సమ్సోను చచ్చిపోయిన ఒక గాడిద దవడ ఎముకను చూశాడు. అతను ఆ దవడ ఎముకను తీసుకున్నాడు. దానితో వేయి మంది ఫిలిష్తీయుల్ని చంపివేశాడు.
JDG 15:16 తర్వాత సమ్సోను అన్నాడు: “గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపాను! గాడిద దవడ ఎముకతో వారిని ఎత్తైన కుప్పగా పేర్చాను!”
JDG 15:17 సమ్సోను ఈలాగు చెప్పిన తర్వాత, ఆ దవడ ఎముకను అతడు క్రిందికి విసరివేశాడు. అందువల్ల ఆ ప్రదేశానికి రామత్లేహీ అనే పేరు వచ్చింది.
JDG 15:18 సమ్సోనుకు బాగా దాహం వేసింది. అందువల్ల అతను యెహోవాను ఉద్దేశించి కేకపెట్టాడు. అతను అన్నాడు: “నేను నీ భక్తుడను. నీవు నాకు మహా విజయం సమకూర్చావు. ఇప్పుడు దప్పిక బాధతో నన్ను మరణం పాలుచేయవద్దు. సున్నతి కూడా చేసుకోని మనుష్యులకు నన్ను పట్టుబడకుండా చెయ్యి”
JDG 15:19 లేహీలోని నేలలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం బద్దలయ్యేలా దేవుడు చేసెను. నీళ్లు వెలికి వచ్చాయి. ఆ నీటిని సమ్సోను తాగి, హాయిపొందాడు. అతను మళ్లీ బలవంతుడయ్యాడు. అందువల్ల అతను ఆ నీటి బుగ్గకి ఎన్ హకోరె అని పేరు పెట్టాడు. నేటికీ లేహీ నగరంలో అది ఉంది.
JDG 15:20 ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను న్యాయాధిపతిగా ఇరవై సంవత్సరాలపాటు వ్యవహరించాడు. ఇది ఫిలిష్తీయులు నివసించిన కాలంలో జరిగింది.
JDG 16:1 ఒకనాడు సమ్సోను గాజా నగరానికి వెళ్లాడు. అక్కడ అతనొక వ్యభిచారిణిని చూశాడు. ఆ రాత్రి ఆమెతో గడిపేందుకు అతను అక్కడికి వెళ్లాడు.
JDG 16:2 ఎవరో ఒకతను గాజా పౌరులతో ఇలా చెప్పాడు: “సమ్సోను ఇక్కడికి వచ్చాడు.” సమ్సోనును చంపాలని వారనుకున్నారు. అందువల్ల వారు నగరాన్ని చుట్టు ముట్టారు. వారు నగర ద్వారం వద్ద దాగివున్నారు. ఆ రాత్రి అంతా సమ్సోను కోసం చాలా వేచివున్నారు. నిశ్శబ్దంగా వారు ఒకరితో ఒకరు, “ప్రొద్దున పొడవగానే, మనం సమ్సోనును చంపుదాము” అని చెప్పుకున్నారు.
JDG 16:3 కాని సమ్సోను ఆ వ్యభిచారిణితో అర్థరాత్రి వరకే ఉన్నాడు. అర్థరాత్రి వేళ సమ్సోను లేచాడు. నగర ద్వారం తలుపుల్ని అతను లాగివేశాడు. గోడనుండి వాటిని సడలింపజేశాడు. సమ్సోను తలుపులను క్రిందికి లాగివేశాడు. రెండు స్తంభాలను, తలుపుల్ని మూసివేసి ఉంచిన అడ్డగడియలను లాగివేశాడు. సమ్సోను, వాటిని తన భుజాల మీద వేసుకుని, హెబ్రోను నగరానికి సమీపాన ఉన్న కొండ మీదికి మోసుకుని పోయాడు.
JDG 16:4 తర్వాత సమ్సోను దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు. ఆమె శోరేకు అనే లోయకు చెందింది.
JDG 16:5 ఫిలిష్తీయుల పరిపాలకులు దెలీలా వద్దకు వెళ్లారు. వారు అన్నారు; “సమ్సోను అంత బలవంతుడు కావడానికి గల కారణమేమిటో తెలుసుకోదలచాము. ఏదో ఒక ఉపాయం పన్ని ఆ రహస్యాన్ని అతని నుంచి రప్పించు. అప్పుడు అతనిని ఎలా పట్టుకొని బంధించాలో తెలుసుకుంటాము. ఆ తర్వాత అతన్ని అదుపులో ఉంచగలము. నీవు కనుక ఇది చేయగలిగితే, నీకు మాలో ఒక్కొక్కరు ఇరవై ఎనిమిది పౌండ్లు వెండి యిస్తాము.”
JDG 16:6 అప్పుడు దెలీలా సమ్సోనుతో, “నీవెందుకు అంత బలవంతుడవైయున్నావో చెప్పు. ఎవరైనా నిన్ను బంధించి నిస్సహాయుణ్ణి చేయగలుగుతారా, చెప్పు?” అని అడిగింది.
JDG 16:7 సమ్సోను బదులు చెప్పాడు, “ఎవరైనా నన్ను ఇంకా తడి ఆరని కొత్త వింటినారులు ఏడింటితో బంధించాలి. అలా ఎవరైనా చేయగలిగితే, అప్పుడు ఇతర మనిషిలాగ బలహీనుణ్ణి అవుతాను.”
JDG 16:8 అప్పుడు ఫిలిష్తీయుల పాలకులు కొత్త వింటి నారులు ఏడు దెలీలా వద్దకు తీసుకువచ్చారు. అవి ఇంకా తడియారలేదు. ఆ వింటి నారులతో దెలీలా సమ్సోనును బంధించింది.
JDG 16:9 కొంతమంది మగవాళ్లు పక్క గదిలో దాగి ఉన్నారు. దెలీలా సమ్సోనుతో ఇలా చెప్పింది; “సమ్సోనూ! ఫిలిష్తీయులు నిన్ను ఇప్పుడు పట్టుకోనున్నారు” అంది. కాని సమ్సోను సులభంగా ఆ వింటినారులు తెంచుకున్నాడు. అగ్నిలో మండిపోయిన దారంలా, బూడిదలా అవి తెగిపోయాయి. అందువల్ల ఫిలిష్తీయులు సమ్సోను బలానికిగల రహస్యాన్ని కనుగొనలేక పోయారు.
JDG 16:10 అప్పుడు దెలీలా సమ్సోనుతో అన్నది: “నీవు నాతో అబద్ధం చెప్పావు. దయచేసి నాకు నిజం చెప్పండి. నిన్ను ఎవరైనా ఎలా బంధించగలరు?”
JDG 16:11 సమ్సోను ఇలా అన్నాడు; “ఎవరైనా నన్ను కొత్త తాళ్లతో కట్టివేయాలి. అంతకు పూర్వం వాడనటువంటి కొత్త తాళ్లతో నన్ను కట్టివేయాలి. ఎవరైనా అలా చేయగలిగితే, నేను ఇతరులవలె బలహీనుణ్ణి అవుతాను.”
JDG 16:12 అందువల్ల దెలీలా కొత్త తాళ్లు తీసుకుంది. వాటితో సమ్సోనును కట్టివేసింది. పక్క గదిలో కొందరు మనుష్యులు దాగి ఉన్నారు. తర్వాత దెలీలా “సమ్సోనూ, ఫిలిష్తీయులు ఇప్పుడు నిన్ను పట్టుకుంటారు.” అన్నది. కాని అతను ఆ తాళ్లు సునాయాసంగా తెంచుకున్నాడు. దారాలను తెంపినంత సులభంగా వాటిని తెంచివేశాడు.
JDG 16:13 తర్వాత దెలీలా, “మళ్లీ నువ్వు అబద్ధం చెప్పావు. నన్ను అవివేకిగా చేశావు. ఇప్పుడైనా చెప్పు, ఎవరైనా నిన్ను ఎలా బంధించగలరో.” అని సమ్సోనుతో చెప్పింది. “నా తలమీది వెంట్రుకలతో ఏడుజడలను అల్లగలిగి, వాటిని ఒక మేకుతో బిగించినట్లయితే అప్పుడ ఇతర మనుష్యుల్లా నేను బలహీనుణ్ణి అవుతాను” అని సమ్సోను చెప్పాడు. తర్వాత సమ్సోను నిద్రపోయాడు. అప్పుడు అతని తలమీది వెంట్రుకలను అల్లింది.
JDG 16:14 తర్వాత దెలీలా గుడారం మేకుతో మగ్గాన్ని నేలకు బిగించింది, అతనిని చూసి ఇలా అన్నది. “సమ్సోనూ, ఫిలిష్తీయులిప్పుడు నిన్ను పట్టుకుంటారు.” సమ్సోను ఆ గుడారం మేకుని, మగ్గాన్ని లాగివేశాడు.
JDG 16:15 అప్పుడు దెలీలా సమ్సోనుతో అన్నది: “‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.’ అని నీవు ఎలా చెప్పగలవు? నా మీద నీకు నమ్మకం కూడా లేదు. నీవు మూడవ సారిగా నన్ను అవివేకిని చేశావు. నీ మహా బలానికిగల రహస్యాన్ని చెప్పనే లేదు.”
JDG 16:16 ఇలా ప్రతిరోజూ ఆమె సమ్సోనును వేధించుకు తినసాగింది. ఆమె అలా వేధించుకు తినడం చూసి అతను విసిగిపోయాడు. మరణం సంభవించేలా అనిపించింది.
JDG 16:17 చివరికి సమ్సోను దెలీలాతో అన్నీ చెప్పాడు. అతను ఇలా అన్నాడు: “నేను నా జుట్టుని గొరిగించుకొనలేదు. నేను పుట్టుటకు మునుపే, నన్ను దేవునికి అర్పించారు. ఎవరైనా నా తలను గొరిగినట్లయితే, అప్పుడు నా బలాన్ని కోల్పోతాను. ఇతర మనుష్యుల్లా నేనప్పుడు బలహీనుణ్ణి అవుతాను.”
JDG 16:18 సమ్సోను తన రహస్యాన్ని చెప్పినట్లుగా దెలీలా గ్రహించింది. ఫిలిష్తీయుల పరిపాలకులకు ఒక సందేశం పంపింది. ఆమె ఇలా చెప్పింది: “మళ్లీ రండి. సమ్సోను నాతో అన్నీ చెప్పాడు.” అందువల్ల ఫిలిష్తీయుల పరిపాలకులు దెలీలా వద్దకు మళ్లీ వచ్చారు. తమతో పాటు వాళ్లు మాట యిచ్చిన ప్రకారం డబ్బు కూడా తీసుకు వచ్చారు.
JDG 16:19 సమ్సోను తన తొడమీద పడుకుని వున్నప్పుడు దెలీలా అతనిని నిద్ర పుచ్చింది. అప్పుడొక వ్యక్తిని లోనికి పిలిచి, సమ్సోను తల వెంట్రుకలను గొరిగి వేయమనింది. ఈ విధంగా సమ్సోనుని ఆమె బలహీనపరిచింది. సమ్సోను బలహీనుడయ్యాడు.
JDG 16:20 అప్పుడు అతణ్ణి లేవమని చెప్పి, “సమ్సోనూ, ఫిలిష్తీయులిప్పుడు నిన్ను పట్టుకోనున్నారు” అని ఆమె చెప్పింది. అతను మేల్కొన్నాడు. ఆలోచన చేశాడు, “నేను పూర్వం చేసినట్లుగా చేసి తప్పించుకుంటాను. స్వతంత్రుణ్ణి అవుతాను.” కాని యెహోవా అతనిని విడనాడి వెళ్లినట్లు సమ్సోను గ్రహించలేదు.
JDG 16:21 ఫిలిష్తీయులు సమ్సోనును పట్టుకున్నారు. వారతని కళ్లు పెరికి వేశారు. గాజా నగరానికి తీసుకుని వెళ్లారు. అతను పారిపోకుండా ఉండేందుకుగాను, సంకెళ్లతో బంధించారు. వారు సమ్సోనును చెరసాలలో ఉంచారు. అతని చేత ధాన్యం విసిరించారు.
JDG 16:22 కాని సమ్సోను వెంట్రుకలు మళ్లీ మొలవసాగాయి.
JDG 16:23 ఫిలిష్తీయుల పాలకులు ఒకటిగా చేరి పండగ చేసుకోవాలనుకున్నారు. తమ దేవుడైన దాగోనుకు పెద్ద బలి కూడా ఇవ్వాలనుకున్నారు. “మన శత్రువైన సమ్సోనును ఓడించేందుకు మన దేవుడు మనకు సహాయం చేశాడు.” అని అనుకున్నారు.
JDG 16:24 సమ్సోనుని చూడగానే వారు తమ దేవుణ్ణి ప్రశంసించారు. వారు ఇలా అన్నారు: “ఈ మనిషి మనవారిని నాశనం చేశాడు. ఈ మనిషి మనవారిలో పలువురిని చంపాడు, కాని మన దేవుడు మన శత్రువుని వశం చేసుకునేందుకు సహాయం చేశాడు!”
JDG 16:25 ఉత్సవ సమయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు వారిలా అన్నారు: “సమ్సోనును వెలికి తీసుకరండి. అతనిని చూసి మేము పరిహాసం చెయ్యాలి.” కనుక చెరసాల నుంచి సమ్సోనును బయటికి తీసుకువచ్చారు. అతనిని పరిహసించారు. దేవుడైన దాగోను గుడిలో స్తంభాల మధ్య సమ్సోనును నిలబెట్టారు.
JDG 16:26 ఒక సేవకుడు సమ్సోను చెయ్యి పట్టుకున్నాడు. అతనితో సమ్సోను, “ఈ ఆలయానికి ఆధారంగా వున్న స్తంభాల మధ్య నన్ను ఉంచువాటిని ఆనుకుని వుంటాను” అన్నాడు.
JDG 16:27 ఆ ఆలయం స్త్రీ పురుషులతో కిటకిటలాడుతున్నది. ఫిలిష్తీయుల పాలకులందరూ అక్కడికి చేరారు. ఆలయ కప్పుమీద సుమారు మూడువేల మంది స్త్రీ పురుషులు ఉన్నారు. వారందరూ సమ్సోనును చూసి ఎగతాళి చేస్తున్నారు.
JDG 16:28 అప్పుడు యెహోవాను సమ్సోను స్తుతించాడు. “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నన్ను మరచిపోవద్దు. దేవుడా, మరొకసారి నాకు బలం ప్రసాదించు. నా రెండు కళ్లనీ చీల్చివేసిన ఈ ఫిలిష్తీయులను శిక్షించేందుకు నాకు శక్తి ఇయ్యి.” అని ప్రార్థించాడు.
JDG 16:29 అప్పుడు ఆలయం మధ్య వున్న రెండు స్తంభాలను సమ్సోను పట్టుకున్నాడు. ఆ రెండు స్తంభాలు ఆలయాన్ని భరిస్తున్నవి. ఆ రెండు స్తంభాలను అతను కౌగిలించుకున్నాడు. ఒక స్తంభం అతని కుడిచేయి వైపున వున్నది. మరొకటి ఎడమ చేతివైపున వున్నది.
JDG 16:30 సమ్సోను ఇలా అన్నాడు; “ఈ ఫిలిష్తీయులతో పాటు నేను మరణిస్తాను” అని, తర్వాత తన శక్తికొద్దీ వాటిని తోశాడు. ఆలయంలోపల వున్న పరిపాలకులు మరియు మనుష్యుల మీద ఆలయం పడిపోయింది. ఈ విధంగా సమ్సోను ఇంకా మరికొందరు ఫిలిష్తీయులను చంపివేశాడు. అతను జీవించిన నాటికంటె మరణ సమయంలోనే, చాలా మందిని చంపి వేశాడు.
JDG 16:31 సమ్సోను యొక్క సోదరులు, అతని కుటుంబంలోని వారందరూ అతని దేహం తీసుకురావడానికి వెళ్లారు. అతనిని తీసుకు వచ్చి, తండ్రి సమాధిలో పాతి పెట్టారు. ఆ సమాధి జోర్యా, ఏష్తాయోలు నగరాల మధ్య ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను ఇరవై సంవత్సరాలపాటు న్యాయాధిపతిగా వ్యవహరించాడు.
JDG 17:1 పర్వత దేశమైన ఎఫ్రాయిములో మీకా అనే ఒక వ్యక్తి వుండేవాడు.
JDG 17:2 మీకా తన తల్లితో, “నీ వద్దనున్న ఇరవై ఎనిమిది పౌండ్ల వెండి దొంగిలించిన వ్యక్తి ఎవరో నీకు తెలియునా! ఆ విషయమై ఒక శాపం ఉన్నట్లు నీవు చెప్పగా విన్నాను. సరే, వెండి నా వద్ద ఉన్నది. అది నేను తీసుకున్నాను” అన్నాడు. “కుమారుడా, నిన్ను యెహోవా ఆశీర్వదించు గాక” అన్నది.
JDG 17:3 మీకా తన తల్లికి ఇరవై ఎనిమిది పౌండ్ల వెండిని తిరిగి ఇచ్చివేశాడు. అప్పుడామె అంది, “నేనీ వెండిని యెహోవాకు విశేష కానుకగా సమర్పిస్తాను. నేను దీనిని నా కుమారునికి ఇస్తాను. అతను ఒక విగ్రహం తయారు చేసి దానిని వెండితో కప్పాలి. అందువల్ల, నా కుమారుడా, ఈ వెండిని తిరిగి నీకే ఇస్తాను.”
JDG 17:4 కాని మీకా ఆ వెండిని తిరిగి తల్లికే ఇచ్చివేశాడు. ఆమె దాదాపు అయిదు పౌండ్ల వెండిని మాత్రమే తీసుకుని, ఆ వెండిని కంసాలి వానికి ఇచ్చింది. వెండి పనిముట్లు తయారు చేసే వ్యక్తి ఒక విగ్రహం తయారు చేసి దానిని వెండితో కప్పాడు. ఆ విగ్రహం మీకా ఇంట్లో ఉంచబడింది.
JDG 17:5 మీకాకు విగ్రహాలు ఆరాధించే ఒక ఆలయం వుండేది. అతను ఒక ఏఫోదు, కొన్ని విగ్రహాలు తయారు చేశాడు. తర్వాత తన కుమారలలో ఒకనిని యాజకునిగా ఎంపిక చేశాడు.
JDG 17:6 (ఆ రోజులలో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. అందువల్ల ప్రతి వ్యక్తీ తనకేది సరి అని అనిపిస్తే, దానినే చేస్తుండేవాడు).
JDG 17:7 లేవీ వంశానికి చెందిన ఒక యువకుడు ఉన్నాడు. అతను యూదాలోని బేత్లోహేముకి చెందిన వాడు. యూదా వంశస్తులతో అతను నివసిస్తూండేవాడు.
JDG 17:8 మరొక నివాసం కోసం అతను అన్వేషిస్తూ, ప్రయాణం చేస్తూవుండగా, అతను మీకా ఇంటికి వచ్చాడు. ఎఫ్రాయిము పర్వత దేశంలో మీకా ఇల్లు ఉంది.
JDG 17:9 “నీవు ఎక్కడినుంచి వచ్చావు?” అని మీకా అతనిని అడిగాడు. ఆ యువకుడు ఇలా సమాధానం ఇచ్చాడు: “నేను లేవీ వంశానికి చెందినవాణ్ణి. యూదాలోని బేత్లెహేమునుంచి వస్తున్నాను. నివసించేందుకు గాను నేనొక చోటు చూస్తున్నాను.”
JDG 17:10 అప్పుడు మీకా అతనితో అన్నాడు: “నీవు నాతో పాటు వుండు. నీవు నాకు తండ్రిగా, నా యాజకునిగా ఉండు. ప్రతి సంవత్సరం నీకు 4 ఔన్సుల వెండి ఇస్తాను. నీకు అన్నవస్త్రాలు కూడా ఇస్తాను.” మీకా చెప్పినట్లుగా లేవీ వంశపు వాడు చేసాడు.
JDG 17:11 మీకాతో పాటు ఉండేందుకు యువకుడైన లేవీ వంశపువాడు సమ్మతించాడు. ఆ యువకుడు మీకా యొక్క సొంత కొడుకులలో ఒకనిలాగ అయ్యాడు.
JDG 17:12 మీకా అతనిని తన యాజకునిగా ఎంపికచేశాడు. అందువల్ల ఆ యువకుడు యాజకుడయ్యాడు. మీకా ఇంట్లో నివసించ సాగాడు.
JDG 17:13 మీకా ఇలా అన్నాడు, “లేవీ వంశపువాడొకడు నా యాజకునిగా వున్నాడు కనుక యెహోవా ఇప్పుడు నాకు మంచిగా ఉండునని నేను భావిస్తున్నాను.”
JDG 18:1 ఆ సమయంలో, ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. పైగా ఆ సమయంలో దాను వంశీయులు ఉండడానికిగాను ఒక చోటుకోసం అన్వేషిస్తున్నారు. తమకు సొంతమనదగిన ప్రదేశం వారికి లేదు. ఇశ్రాయేలుకి చెందిన ఇతర వంశాలవారికి స్వస్థలం ఉంది. కాని దాను వంశీయులకు సొంత ప్రదేశం లేదు.
JDG 18:2 అందువల్ల దాను వంశంవారు ఐదుగురు సైనికులను ఏదైనా ఒక ప్రదేశం అన్వేషించమని చెప్పి పంపించారు. వారు ఒక మంచి ప్రదేశం వెదికేందుకు గాను వెళ్లారు. ఆ ఐదుగురు జోర్యా, ఎష్తాయేలు నగరాల నుండి వచ్చారు. దాను వంశమునకు చెందిన అన్ని కుటుంబాల నుండి వచ్చినవారు. అందువల్లనే వారిని ఎంపిక చేయడం జరిగింది. “వెళ్లి ఏదైనా ఒక చోటు చూడండి” అని వారికి చెప్పబడింది. ఆ ఐదుగురూ కొండ దేశమైన ఎఫ్రాయిముకి వచ్చారు. వారు మీకా ఇంటికి వచ్చారు. ఆ రాత్రి ఇక్కడే గడిపారు.
JDG 18:3 వారు మీకా ఇంటికి అతి సమీపంగా వచ్చేసరికి, ఆ లేవీ యువకుడి కంఠస్వరం విన్నారు. ఆ గొంతుని వారు గుర్తుపట్టారు. అందువల్ల వారు మీకా ఇంటి దగ్గర ఆగిపోయారు. ఆ యువకుణ్ణి “ఎవరు నిన్నీ స్థలానికి తీసుకువచ్చారు? ఇక్కడ నీవేమి చేస్తున్నావు? ఇక్కడ నీ పనేమిటి?” అని వారు అడిగిరి.
JDG 18:4 ఆ యువకుడు మీకా తనకోసం చేసిన పనులను తెలియజేశాడు. “మీకా నన్ను జీతానికి ఉంచుకున్నాడు. నేనతని యాజకుడిని” అని అతను చెప్పాడు.
JDG 18:5 అప్పుడు వారతనితో ఇలా అన్నారు; “దయచేసి మాకోసంగాను దేవుణ్ణి ఏదో ఒకటి అడగండి. ఏదైనా మేము తెలుసుకోదలచాము. ఉండడానికి చోటుకోసం వెతుకుతున్న మా అన్వేషణ విజయవంతమవుతుందా?”
JDG 18:6 యాజకుడు ఆ ఐదుగురితో ఇలా అన్నాడు, “అవుతుంది. నిశ్చింతంగా వెళ్లండి. మీ త్రోవలో, యెహోవా మిమ్మల్ని నడుపుతాడు.”
JDG 18:7 అందువల్ల ఐదుగురు వెళ్లిపోయారు. లాయిషు నగరానికి వారు వచ్చారు. ఆ నగరంలోని ప్రజలు భద్రత కలిగి ఉండడం వారు చూశారు. వారిని సీదోను ప్రజలు పరిపాలించారు. ప్రతిదీ ప్రశాంతంగా శాంతియుతంగా ఉండి, ప్రజలకు అంతా సమృద్ధిగా ఉండినది. తమకు హాని కలిగించే విరోధులు దగ్గరలో వారికి లేరు. పైగా సీదోను నగరానికి దూరంగా వారు నివసిస్తున్నారు. ప్రజలతో ఎలాంటి ఒడంబడికలూ చేసుకోలేదు.
JDG 18:8 ఆ ఐదుగురూ జోర్యా, ఎష్తాయేలు నగరాలకు తిరిగి వెళ్లారు. “సంప్రదింపులు చేశారా?” అని వారి బంధువులు అడిగారు.
JDG 18:9 ఆ ఐదుగురూ ఇలా బదులు చెప్పారు, “మేము ఒక ప్రదేశం చూశాము. అది చాలా బాగున్నది. వారిని మనం ప్రతిఘటించాలి. వేచి ఉండవద్దు! మనం వెళదాము, ఆ ప్రదేశాన్ని తీసుకుందాము.
JDG 18:10 మీరు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు, అక్కడ చాలా ప్రదేశం ఉన్నదని మీరే తెలుసుకుంటారు. అక్కడ అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ప్రజలు ఏ ప్రతిఘటనను ఎదుర్కొంటారని అనుకోవడం లేదని మీరు తెలుసుకుంటారు. దేవుడే మనకు ఆ ప్రదేశం ఇచ్చాడు.”
JDG 18:11 అందువల్ల దాను వంశానికి చెందిన ఆరువందల మంది మనుష్యులు జోర్యా, ఎష్తాయేలు నగరాలకు బయలుదేరారు. యుద్ధానికి వారు సిద్ధంగా ఉన్నారు.
JDG 18:12 లాయిషు నగరానికి వెళ్లే దారిలో, యూదాలోని కిర్యత్యారీము అనే నగరం వద్ద వారు ఆగారు. అక్కడ ఒక గుడారం వేసుకున్నారు. అందువల్లనే కిర్యత్యారీముకి పడమరగా వున్న ప్రదేశానికి మహనెదాను అని పేరు వచ్చింది. నేటికీ అదే పేరు.
JDG 18:13 ఆ ప్రదేశంనుండి, ఆ ఆరువందల మంది మనుష్యులూ కొండ దేశమైన ఎఫ్రాయిముకి ప్రయాణమయ్యారు. ఆ తర్వాత వారు మీకా ఇంటికి వచ్చారు.
JDG 18:14 లాయిషు చుట్టు ప్రక్కల ప్రాంతంలో సంచరించటానికి వెళ్లిన ఆ ఐదుగురూ వాళ్ల బంధువులతో అన్నారు: “ఒక ఇంట్లో ఏఫోదు ఉన్నది. పైగా గృహదేవతలు, చెక్కిన విగ్రహం మరియు వెండి విగ్రహం ఉన్నాయి. మీకేమి చేయాలో తెలుసు వాటిని తీసుకురావాలి.”
JDG 18:15 అందువల్ల వారు మీకా ఇంటి వద్ద నిలిచారు. అక్కడే యువకుడైన లేవీ మనిషి ఉన్నాడు. నీవెలా వున్నావని ఆ యువకుని వారడిగారు.
JDG 18:16 దాను వంశీయులైన ఆ ఆరువందల మంది మనుష్యులు వెలుపల ద్వారం వద్ద నిలిచారు. వారి వద్ద ఆయుధాలు ఉన్నాయి. యుద్ధానికి వారు సిద్ధంగా ఉన్నారు.
JDG 18:17 ఐదుగురు గూఢచారులు ఇంట్లోకి వెళ్లారు. వెలుపల ద్వారం పక్కగా యుద్ధ సన్నద్ధులైన ఆ ఆరువందల మంది మనుష్యులతో యాజకుడు నిలబడివున్నాడు. ఆ మనుష్యులు మలిచిన విగ్రహం, ఏఫోదు, గృహదేవతలు మరియు వెండి విగ్రహం తీసుకున్నారు. యువకుడైన లేవీ యాజకుడు, “మీరేమి చేస్తున్నారు?” అని అడిగాడు.
JDG 18:19 ఆ ఐదుగురు బదులు చెప్పారు: “ఊరక వుండు! ఒక్కమాట కూడా మాట్లాడ వద్దు. మాతో పాటు రా. మా తండ్రిగా, యాజకుడుగా ఉండు. నీవు ఎన్నుకుని తీరాలి. కేవలం ఒక్క వ్యక్తికి తండ్రిగా, యాజకుడుగా ఉండటం మంచిదా? లేక ఇశ్రాయేలు ప్రజలలో ఒక వంశం వారికి యాజకుడుగా ఉండడం మంచిదా?”
JDG 18:20 లేవీ వ్యక్తికిది సంతోషదాయకమయింది. అందువల్ల అతను ఏఫోదు, గృహదేవతలు మరియు విగ్రహం తీసుకొని, దాను వంశం వారివద్ద నుంచి వచ్చిన మనుష్యులతో వెళ్లిపోయాడు.
JDG 18:21 తర్వాత దాను వంశానికి చెందిన ఆ ఆరువందల మంది మనుష్యులు లేవీ యాజకునితో కలిసి వెనుదిరిగి మీకా ఇల్లు విడిచి వెళ్లారు. వారు తమ చిన్న పిల్లలను, తమ జంతువులను తమ అన్ని వస్తువులను వారి ముందు విడిచిపెట్టి వెళ్లారు.
JDG 18:22 దాను వంశమునకు చెందిన ఆ మనుష్యులు ఆ చోటునుండి చాలా దూరం వెళ్లారు. మీకాదగ్గర నివసించే వారు ఒకటిగా కలుసుకున్నారు. తర్వాత దాను మనుష్యుల్ని వెంబడించారు. వారిని పట్టుకున్నారు.
JDG 18:23 దాను మనుష్యుల్ని మీకా మనుష్యులు కేకలు వేయసాగారు. దాను మనుష్యులు నిలబడ్డారు. “సమస్య ఏమిటి? ఎందుకు కేకలు వేస్తున్నారు?” అని మీకాని అడిగారు.
JDG 18:24 మీకా బదులు చెప్పెను: “దాను మనుష్యులైన మీరు నా విగ్రహాలు తీసుకుపోతున్నారు. వాటిని నా కోసం తయారు చేసుకున్నాను. మీరు నా యాజకుని కూడా తీసుకువెళ్తున్నారు. ఇక నాకు ఏమి మిగిలింది? ‘సమస్య ఏమిటి?’ అని మీరెలా అడుగుతారు?”
JDG 18:25 దాను వంశీయులు అందుకు ఇలా అన్నారు: “మాతో నీవు వివాదానికి పాల్పడడం మంచిది కాదు. మాలో కొందరు కోపిష్ఠులు. మమ్మల్ని నీవు కేకలు వేస్తే, వారు నిన్ను ప్రతిఘటించవచ్చు. నీవు, మీ కుటుంబాలవారూ చంపబడవచ్చు.”
JDG 18:26 తర్వాత దాను వంశానికి చెందిన మనుష్యులు వెనుదిరిగి తమ తోవను వెళ్లారు. ఆ మనుష్యులు తనకంటె బలాఢ్యులని మీకా గ్రహించాడు. అందువల్ల అతను ఇంటికి వెళ్లిపోయాడు.
JDG 18:27 కాగా మీకా చేసిన విగ్రహాలను దాను వంశీయులు తీసుకునిపోయారు. మీకాతో ఉండిన యాజకుని కూడా తమతో పాటు తీసుకునిపోయారు. తర్వాత వారు లాయిషుకి వచ్చారు. లాయిషులో నివసిస్తున్న వారి మీద దాడిచేశారు. ఆ మనుష్యులు శాంతముగా ఉన్నారు. వారు దాడిని ఎదురుచూడలేదు. దానుకు చెందిన మనుష్యులు వారిని తమ కత్తులతో చంపివేశారు. తర్వాత నగరాన్ని కాల్చివేశారు.
JDG 18:28 లాయిషులో నివసించేవారికి తమను కాపాడేవారు లేరు. వారు సీదోను నగరానికి చాలా దూరాన నివసించుటచే, ఆ నగర ప్రజలు సహాయం చేయలేకపోయారు. మరియు లాయిషు ప్రజలు అరాము ప్రజలతో ఒడంబడికయేమీ చేసుకొని ఉండలేదు. అందువల్ల వారు సహాయం చెయ్యలేదు. లాయిషు నగరం ఒక లోయలో ఉంది. అది బెతెహోబు పట్టణానికి చెందింది. దాను ప్రజలు ఆ ప్రదేశంలో ఒక కొత్త నగరం నిర్మించుకున్నారు. ఆ నగరం వారి నివాసమయింది.
JDG 18:29 దాను ప్రజలు ఆ నగరానికి కొత్త పేరు పెట్టారు. దానిని లాయిషు అన్నారు. కాని దానిని దాను అని మార్చివేశారు. ఆ నగరానికి ఇశ్రాయేలు కుమారులలో ఒకడైన దాను అను పూర్వీకుని పేరు పెట్టారు.
JDG 18:30 దాను వంశానికి చెందిన ప్రజలు దాను నగరంలో విగ్రహాలు ప్రతిష్ఠించారు. వారు గెర్షోము కుమారుడైన యోనాతానును తమ యాజకునిగా నియమించుకున్నారు. గెర్షోము మోషే కుమారుడు. యోనాతాను మరియు అతని కుమారులు ఇశ్రాయేలు ప్రజల్ని బందీలుగా చేసి బబలోనుకు తీసుకు వెళ్లేంతవరకు దాను వంశం వారికి యాజకులుగా ఉన్నారు.
JDG 18:31 దాను ప్రజలు మీకా చేసిన విగ్రహాలను పూజిస్తూండేవారు. దేవాలయము షిలోహులో ఉన్నంత కాలము వారు ఆ విగ్రహాలను పూజించుచుండిరి.
JDG 19:1 ఆ సమయమున, ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. చాలా దూరానవున్న కొండదేశమైన ఎఫ్రాయిముల్లో లేవీ వంశమునకు చెందిన వ్యక్తి ఉండెను. అతనికి ఒక దాసివుండెను. ఆమె అతనికి భార్యవలె ఉండెను. యూదాలోని బేత్లెహేముకు ఆ దాసి చెందింది.
JDG 19:2 కాని ఆ దాసి లేవీ వంశపు వ్యక్తితో ఒక ఒడంబడిక చేసుకొంది. ఆమె అతనిని విడిచి పెట్టి, యూదాలోని బేత్లెహేములో ఉన్న తన తండ్రి వద్దకు వెళ్లింది. అక్కడ ఆమె నాలుగు నెలలపాటు ఉంది.
JDG 19:3 తర్వాత ఆమె భర్త ఆమెకోసం వచ్చాడు. ఆమెతో అతను ప్రీతిపూర్వకంగా మాటలాడాడు. ఆమె మరల తన వద్దకు రావాలని అలా మాటలాడాడు. అతను తన సేవకుని, రెండు గాడిదలను తీసుకొని వెళ్లాడు. లేవీ వంశపు వ్యక్తి ఆమె తండ్రి ఇంటికి వచ్చాడు. లేవీ వంశపు వ్యక్తిని చూసి ఆమె తండ్రి బయటికి వచ్చి అతనిని అభినందించాడు. ఆమె తండ్రికి చాలా సంతోషం కలిగింది.
JDG 19:4 ఆ స్త్రీ తండ్రి లేవీ వ్యక్తిని ఇంటిలోనికి తీసుకుని వెళ్లాడు. లేవీ వ్యక్తి మామగారు అతనిని ఇంట ఉండుమని కోరాడు. అందువల్ల ఆ లేవీ వ్యక్తి మూడురోజులున్నాడు. అతను తిని, తాగి, మామగారి ఇంట నిదురించాడు.
JDG 19:5 నాలుగవ రోజున, తెల్లవారుజామున వారు మేల్కొన్నారు. లేవీ వంశపు వ్యక్తి బయలుదేరే సన్నాహంలో వున్నాడు. కాని ఆ యువతి తండ్రి తన అల్లుడితో ఇలా అన్నాడు: “మొట్టమొదట ఏమైనా తిను. నీవు తిన్న తర్వాత వెళ్లవచ్చును.”
JDG 19:6 అందువల్ల లేవీ వంశపు వాడు అతని మామగారు తినుటకు, తాగుటకు కలిసి కూర్చొనిరి. ఆ తర్వాత మామగారు అతనితో, “ఈ సాయంకాలందాకా ఇక్కడే వుండి, విశ్రాంతి తీసుకుని, ఆనందించి వెళ్లవచ్చు” అన్నాడు. అందువల్ల ఆ ఇద్దరూ కలసి తిన్నారు.
JDG 19:7 లేవీ వంశపువాడు వెళ్లాలని లేచాడు. కాని అతని మామగారు ఆ రాత్రికి ఉండిపొమ్మని అతనిని వేడుకొన్నాడు.
JDG 19:8 తర్వాత, ఐదవరోజున తెల్లవారు జామునే లేవీ వంశపువాడు మేల్కొన్నాడు. అతడు బయలుదేరే సన్నాహంలో ఉన్నాడు. కాని ఆ స్త్రీ తండ్రి అల్లుడితో ఇలా చెప్పాడు: “మొదట ఏదైనా తిను. నిశ్చింతగా ఈ సాయంకాలందాకా ఉండు.” కనుక వాళ్లిద్దరూ మళ్లీ కలసి తిన్నారు.
JDG 19:9 తర్వాత లేవీ వంశపువాడు, అతని దాసి అతని సేవకుడు బయలుదేరడానికి లేచారు. కాని ఆ యువతి తండ్రి, “చాలా చీకటిపడింది. రోజు చాలావరకు అయిపోయింది. కనుక రాత్రికి ఇక్కడే వుండి సంతోషమనుభవించు. రేపు ఉదయం నీవు తెల్లవారుజామునే మేల్కొని నీ తోవను వెళ్లు” అన్నాడు.
JDG 19:10 కాని లేవీ వంశపువాడు మరోరాత్రికి అక్కడ వుండదలచుకోలేదు. అతను తన రెండు గాడిదలను, తన దాసిని వెంటబెట్టుకున్నాడు. యెబూసు నగరమునకు సమీపించాడు. (యెరూషలేముకు మరోపేరు యెబూసు).
JDG 19:11 ఆ రోజు చాలావరకు అయిపోయింది. యెబూసు నగరము దగ్గరికి వచ్చారు. అప్పుడు సేవకుడు తన యజమానిని చూసి, “యెబూసు నగరం వద్ద మనము ఆగిపోదాము. ఈ రాత్రికి ఇక్కడే ఉందాము” అన్నాడు.
JDG 19:12 కాని అతని యజమాని అయిన లేవీ వంశపు వాడు, “కాదు, మనము తెలియని నగరం లోపలికి వెళ్లకూడదు. అక్కడి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు కాదు. గిబియా నగరమునకు మనము వెళదాము” అన్నాడు.
JDG 19:13 లేవీ వంశపు వ్యక్తి, “పదండి, గిబియా లేక రామా నగరమునకు వెళ్ళుదాము. ఈ రెండు నగరాలలో ఒక దానిలో మనము ఈ రాత్రి గడుపుదాము” అన్నాడు.
JDG 19:14 అందువల్ల లేవీ వంశపువాడు, అతనితో ఉన్న మనుష్యులు పైకి ప్రయాణం చేశారు. గిబియా నగరమును వారు ప్రవేశించే సమయానికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. బెన్యామీను వంశీయుల ప్రదేశంలో గిబియా ఉంది.
JDG 19:15 అందువల్ల వారు గిబియాలో ఆగిపోయారు. ఆ నగరములో ఆ రాత్రికి ఉండాలని వారనుకున్నారు. వారు నగరం మధ్యకు వచ్చి అక్కడ కూర్చున్నారు. కాని ఎవ్వరూ వారిని తమ ఇంటికి రమ్మని పిలవలేదు.
JDG 19:16 ఆ సాయంకాలం పొలంనుంచి ఒక వృద్ధుడు నగరములోనికి వచ్చాడు. అతని ఇల్లు కొండ దేశమయిన ఎఫ్రాయిములో ఉన్నది. కాని ఇప్పుడతను గిబియా నగరములో నివసిస్తున్నాడు. (గిబియా మనుష్యులు బెన్యామీను వంశమునకు చెందిన వారు).
JDG 19:17 ఆ వృద్ధుడు లేవీ వంశపువాడయిన ఆ ప్రయాణికుని చూశాడు. ఆ వృద్ధుడు, “మీరెక్కడికి వెళ్ళుతున్నారు? ఎక్కడినుంచి వచ్చారు?” అని ప్రశ్నించాడు.
JDG 19:18 లేవీ వంశపువాడు సమాధానం చెప్పాడు: “మేము యూదాలోని బేత్లెహేమునుంచి ప్రయాణం చేస్తున్నాము. మేము స్వగృహానికి వెళ్ళుతున్నాము. అయితే ఈ రాత్రి ఎవరూ మమ్ములను ఉండమని ఆహ్వానించలేదు. ఎఫ్రాయిము కొండదేశానికి వెనకవున్న వాళ్లము మేము. నేను స్వగృహమునకు వెళ్ళుతున్నాను.
JDG 19:19 మా గాడిదలకు తగినంత గడ్డి ఆహారం వున్నాయి. మాకు రొట్టె, మద్యము ఉన్నది. అనగా, నాకు, యువతికి మరియు నా సేవకుడికి. మాకేమియు అవసరము లేదు.”
JDG 19:20 వృద్ధుడిట్లు చెప్పాడు: “నీవు మా ఇంట్లో ఉండవచ్చును. నీకు కాలసినదంతా నేనిస్తాను. నగర మధ్యమున మాత్రం రాత్రివేళ ఉండకూడదు.”
JDG 19:21 తర్వాత లేవీ వంశపువానిని, అతని మనుష్యుల్ని అతను తన ఇంటికి తీసుకని వెళ్లాడు. అతని గాడిదలకు ఆయన ఆహారం పెట్టాడు. వారు కాళ్లు కడుగుకున్నారు. ఆ తర్వాత తినుటకు తాగుటకు ఆయన వారికిచ్చాడు.
JDG 19:22 ఆ లేవీ వంశపు వ్యక్తియు, అతనితో వున్న మనుష్యులును సంతోషంగా వుండగా, ఆ నగరమునకు చెందినవారు కొందరు ఇంటిని చుట్టుముట్టారు. వారు దుర్జనులు. వారు తలుపు కొట్టసాగారు. ఆ ఇంటి స్వంతదారైన వృద్ధుని వుద్దేశించి కేకలు వేయసాగారుస. వారు ఇలా అన్నారు; “మీ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తిని వెలుపలికి తీసుకుని రమ్ము. మేమతనితో సంభోగింపదలచినాము.”
JDG 19:23 వృద్ధుడు వెలుపలికి పోయి ఆ దుర్జనులతో మాటలాడెను: “వద్దు, నా స్నేహితులారా! అటువంటి చెడ్డ పనులు చేయవద్దు. అతను మా ఇంటి అతిథి. ఈ మహా పాపకృత్యం మీరు చేయవద్దు అన్నాడు.
JDG 19:24 ఇదుగో చూడండి. ఇక్కడ నా కుమార్తె ఉంది. ఆమెకి ఇంతకు మునుపెన్నడూ సంభోగమననేమో తెలియదు. ఆమెను నేను వెలుపలికి తీసుకు వస్తాను. మరియు ఆయన దాసిని కూడ బయటికి తీసుకు వస్తాను. మీ ఇష్టమొచ్చినట్లు వారిని చేయవచ్చును. మీరు వారిని హింసించవచ్చు. కాని మా యింటికి వచ్చిన వ్యక్తితో పాపకృత్యం చేయవద్దు” అన్నాడు.
JDG 19:25 కాని ఆ చెడ్డ మనుష్యులు వృద్ధుని మాటలు వినదలచుకోలేదు. అందువల్ల లేవీ వంశపువాడు తన దాసిని వెలుపలికి తీసుకువెళ్లి, ఆమెను చెడ్డవారి చెంత ఉంచాడు. ఆ చెడ్డవారు ఆమెను గాయపరిచారు. ఆ రాత్రియంతయు ఆమెను బలాత్కరించారు. తర్వాత తెల్లవారుజామున ఆమెను విడిచిపెట్టారు.
JDG 19:26 తెల్లవారుజామున తన యజమాని నివసిస్తున్న ఇంటికి ఆమె వచ్చింది. ఆమె ముందు తలుపు వద్ద పడిపోయింది. ఆమె అచ్చటనే వెలుతురు వచ్చేవరకు పడివుంది.
JDG 19:27 ఉదయాన లేవీ వంశపువాడు మేల్కొన్నాడు. అతను ఇంటికి వెళ్లవలెనని అనుకొన్నాడు. వెలుపలికి వెళ్లుటకుగాను తలుపు తెరిచాడు. గడపవద్ద ఒక చేయి ఉంది. అక్కడ అతని దాసి ఉంది.
JDG 19:28 లేవీ వంశపువాడు, “లెమ్ము మనము వెళ్లిపోదాం” అనెను. కాని ఆమె సమాధానం చెప్పలేదు ఆమె చనిపోయింది. లేవీ వంశపు వాడు తన దాసిని గాడిదమీద వేసుకుని ఉంటికి వెళ్లాడు.
JDG 19:29 అతను ఇల్లు చేరుకోగానే ఒక కత్తి తీసుకొని దాసిని పన్నెండు భాగాలుగా ఖండించాడు. తర్వాత అతను ఆ పన్నెండు భాగాలను ఇశ్రాయేలు ప్రజలు నివసించిన అన్ని ప్రదేశాలకు పంపిచాడు.
JDG 19:30 ఇది చూసిన వారు, “ఇశ్రాయేలులో ఇంతకు మునుపు ఎన్నడూ ఇలా జరగలేదు, ఈజిప్టునుంచి మనం వచ్చిన నాటినుండి మనం ఇప్పటివరకు ఇలాంటిది చూచి వుండలేదు. దీన్ని గురించి చర్చించి మనమేమి చేయవలెనో చెప్పు” అన్నారు.
JDG 20:1 అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ ఏకమైనారు. వారందరూ మిస్పా నగరంలోని యెహోవా సమక్షమున నిలబడుటకు కలిసివచ్చారు. ఇశ్రాయేలులోని ప్రతిచోటునుండి వచ్చారు. గిలాదులోని ఇశ్రాయేలు మనుష్యులు కూడా వచ్చారు.
JDG 20:2 ఇశ్రాయేలులోని వివిధ వంశాల నాయకులూ వచ్చారు. దేవుని ప్రజలు బహిరంగ సభలో వారు తమతమ స్థానములు అలంకరించారు. నాలుగు లక్షల సైనికులు కత్తులతో ఆ చోట వున్నారు.
JDG 20:3 బెన్యామీను వంశమునకు చెందిన మనుష్యులు ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో సమావేశమైన విషయం తెలుసుకొనిరి. “ఈ భయంకర విషయం ఎలా జరిగిందో మాకు చెప్పండి” అని ఇశ్రాయేలు ప్రజలన్నారు.
JDG 20:4 అప్పుడు చంపబడిన ఆ స్త్రీ భర్త వారితో జరిగిన కథ చెప్పాడు. అతను ఇలా అన్నాడు, “నా దాసి, నేనూ బెన్యామీను ప్రదేశంలోని గిబియా నగరమునకు వచ్చాము. మేమారాత్రి అక్కడ గడిపాము.
JDG 20:5 కాని రాత్రి సమయాన గిబియా నగరపు నాయకులు నేను నివసించే ఇంటికి వచ్చారు. వారు ఇల్లు చుట్టుముట్టారు. నన్ను చంపాలని అనుకున్నారు. వారు నా దాసిని బలాత్కరించారు. ఆమె చనిపోయింది.
JDG 20:6 అందువల్ల నా దాసిని తీసుకుని వచ్చి, ఈమెను పన్నెండు భాగాలుగా ఖండించితిని. తర్వాత ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క వంశంవారికి పంపించాను. నేను మనము స్వీకరించిన పన్నెండు ప్రదేశాలకు పన్నెండు భాగాలను పంపించాను. ఎందుకు చేశాననగా బెన్యామీను ప్రజలు ఈ భయంకర విషయాన్ని ఇశ్రాయేలులో జరిగించారు.
JDG 20:7 కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలారా, మాట్లాడండి. మనమేమి చేయవలెనో మీరు నిర్ణయం తీసుకోండి.”
JDG 20:8 ఒకేసారి, అందరు మనుష్యులూ లేచి నిలబడ్డారు. ముక్తకంఠంతో అన్నారు: “మేమెవ్వరమూ ఇళ్లకి వెళ్లము. అవును. మాలో ఏ ఒక్కరూ తన ఇంటికి తిరిగి వెళ్లడు.
JDG 20:9 ఇప్పుడు గిబియా నగరానికి ఇలా చేద్దాము. ఆ ప్రజల్ని ఏం చేయాలో దేవుడు తోవ చూపడానికి చీట్లు వేద్దాము.
JDG 20:10 ఇశ్రాయేలు విభిన్న వంశాల నుండి ప్రతి వంద మందిలోనుండి పదిమందిని ఎన్నుకుందాము. ప్రతి వేయి మంది నుండి వంద మందిని ఎన్నుకుందాము. ప్రతి పదివేల మందినుండి వేయి మందిని ఎన్నుకుందాము. మనము ఎంపిక చేసిన ఆ మనుష్యులు సైన్యం కోసం పనులు చేస్తారు. తర్వాత బెన్యామీను ప్రదేశంలోని గిబియా నగరానికి సైన్యం తరలి వెళుతుంది. ఇశ్రాయేలు ప్రజల వారైన ఆ మనుష్యుల్ని భయంకరమైన ఆ విషయం జరిపిన వారిని సైన్యం శిక్షిస్తుంది.”
JDG 20:11 అందువల్ల ఇశ్రాయేలుకి చెందిన వారందరూ గిబియా నగరానికి చేరారు. వారేమి చేస్తున్నారో, దానికి వారందరూ సమ్మతించారు.
JDG 20:12 ఇశ్రాయేలు ప్రజలు ఒక సందేశమిచ్చి బెన్యామీను వారి వద్దకు పంపించారు. ఆ సందేశమేమనగా, “మీకు చెందిన కొందరు మనుష్యులు చేసిన ఈ ఘోర కృత్యమేమిటి?
JDG 20:13 గిబియా నగరం నుంచి ఆ దుర్జనుల్ని మా వద్దకు పంపండి. వారిని మాకు అప్పజెప్పండి. మేము వారిని చంపుతాము. ఇశ్రాయేలు ప్రజలనుండి ఆ పాపాన్ని తొలగించదలచాము.” కాని బెన్యామీను వంశానికి చెందిన వారు తమ బంధువులు పంపిన సందేశాన్ని వినదలచుకోలేదు. ఆ బంధువులు ఇశ్రాయేలులోని ఇతర ప్రజలు.
JDG 20:14 బెన్యామీను వంశంవారు తమ నగరములు విడిచి గిబియా నగరమునకు వెళ్లారు. ఇశ్రాయేలులోని ఇతర వంశాలకు చెందినవారితో పోరాడాలని వారు గిబియా వెళ్లారు.
JDG 20:15 బెన్యామీను వంశం వారు ఇరవై ఆరువేలమంది సైనికుల్ని సమకూర్చుకున్నారు. ఆ సైనికులందరూ యుద్ధానికి తర్ఫీదు పొందినవారు. వారు గిబియా నగరం నుండి ఏడువందల మంది తర్ఫీదు పొందిన సైనికులను సమకూర్చుకున్నారు.
JDG 20:16 పైగా ఎడమ చేతి వాటం గల ఏడువందల మంది తర్ఫీదు పొందిన సైనికులు కూడా ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ చాలా సామర్థ్యంతో వడిసెలను ఉపయోగించగలరు. వారందరూ వడిసెలతో తలవెంట్రుక మీదకి గురి తప్పకుండా రాయి విసరిగలిగేవారు.
JDG 20:17 బెన్యామీను తప్ప మిగిలిన ఇశ్రాయేలు వంశాల వారు మొత్తం మీద నాలుగు లక్షల మంది వీరయోధుల్ని సమకూర్చుకున్నారు. ఆ నాలుగు లక్షల మంది వద్ద ఖడ్గాలున్నాయి. ప్రతి ఒక్కరూ సుశిక్షితుడైన సైనికుడు.
JDG 20:18 ఇశ్రాయేలు ప్రజలు బేతేలు నగరం దాకా వెళ్లారు. బేతేలు వద్ద వారు దేవుని ఇలా అడిగారు: “బెన్యామీను వంశం వారిని ఏ వంశం వారు మొదట ఎదుర్కొంటారు?” “యూదా వంశం వారు మొదట ఎదుర్కొంటారు” అని యెహోవా బదులు చెప్పాడు.
JDG 20:19 ఆ మరునాటి ఉదయం ఇశ్రాయేలు ప్రజలు మేల్కొన్నారు. గిబియా నగరం వద్ద ఒక గుడారం వేశారు.
JDG 20:20 తర్వాత ఇశ్రాయేలు సైన్యం బెన్యామీను సైన్యాన్ని ఎదుర్కోడానికి గిబియా నగరం వద్దకి తరలివెళ్లింది.
JDG 20:21 ఆ తర్వాత బెన్యామీను సైన్యం గిబియా నగరం నుండి బయటికి వచ్చింది. బెన్యామీను సైన్యం ఆ రోజు జరిగిన యుద్ధంలో ఇరవై రెండు వేలమంది ఇశ్రాయేలు సైనికుల్ని హతమార్చింది.
JDG 20:22 ఇశ్రాయేలీయులు యెహోవావద్దకు వెళ్లారు. సాయంకాలందాకా విలపించారు. వారు యెహోవాను అడిగారు; “బెన్యామీను ప్రజలతో మళ్లీ మేము యుద్ధం చేయాలా? ఆ మనుష్యులు మా బంధువులు.” “వెళ్లి, వాళ్లతో యుద్ధం చేయండి” అని యెహోవా సమాధానమిచ్చాడు. ఇశ్రాయేలు మనుష్యులు ఒకరినొకరిని ప్రోత్సాహ పరుచుకున్నారు. మొదటి రోజున చేసినట్లుగా, వారు మళ్లీ యుద్ధానికి తరలి వెళ్లారు.
JDG 20:24 అప్పుడు బెన్యామీను సైన్యం దగ్గరికి ఇశ్రాయేలు సైన్యం వచ్చింది. ఇది యుద్ధం రెండవరోజు.
JDG 20:25 రెండవరోజున సైన్యాన్ని ఎదుర్కొనాలని గిబియా నగరం వెలుపలికి బెన్యామీను సైన్యం వచ్చింది, బెన్యామీను సైన్యం ఇశ్రాయేలు సైన్యంలోని పద్దెనిమిది వేలమందిని చంపివేసింది. ఇశ్రాయేలు సైన్యంలోని మనుష్యులు సుశిక్షితులైన సైనికులు.
JDG 20:26 తర్వాత ఇశ్రాయేలు మనుష్యులందరు బేతేలు నగరం దాకా వెళ్లారు. ఆ చోట వారు కూర్చుని యెహోవాను పిలిచారు. సాయంకాలంవరకు ఆ రోజు వారేమీ తినలేదు. వారు దహన బలులు సమాధాన బలులను అర్పించారు.
JDG 20:27 ఇశ్రాయేలు మనుష్యులు యెహోవాను ఒక ప్రశ్న అడిగారు. (ఆ రోజుల్లో దేవుని ఒడంబడిక పెట్టె బేతేలులో ఉంది.
JDG 20:28 ఫినెహాసు యాజకునిగా వుండి దేవుణ్ణి సేవిస్తూ వున్నాడు. ఫినెహాసు ఎలీయాజరు కుమారుడు ఎలీయాజరు అహరోను కుమారుడు) ఇశ్రాయేలు ప్రజలు ఇలా అడిగారు: “బెన్యామీను ప్రజలు మా బంధువులు. మళ్లీ మేము వారిని ప్రతిఘటించడానికి వెళ్లవలెనా? లేకపోతే మేము యుద్ధం ఆపివేయవలెనా?” యెహోవా, “వెళ్లండి, రేపు వారిని ఓడించేందుకు నేను సహాయం చేస్తాను” అన్నాడు.
JDG 20:29 తర్వాత ఇశ్రాయేలు సైన్యం గిబియా నగరం పరిసరాలలో కొందరు మనుష్యులను దాచి ఉంచింది.
JDG 20:30 మూడో రోజున ఇశ్రాయేలు సైన్యం గిబియా నగరంతో యుద్ధానికి తలపడింది. అంతకు మునుపు చేసినట్లుగా, వారు యుద్ధ సన్నద్ధులయ్యారు.
JDG 20:31 బెన్యామీను సైన్యం గిబియా నగరం వెలుపలికి వచ్చింది, ఇశ్రాయేలు సైనికుల్ని ఎదుర్కొనడానికి. ఇశ్రాయేలు సైన్యం వెనుకకు మరలింది. బెన్యామీను సైన్యం తమను తరుముకు రావాలని అలా చేసింది. ఈ విధంగా బెన్యామీను సైన్యం నగరానికి చాలా దూరంలో ఉండాలని మాయోపాయం పన్నబడింది. బెన్యామీను సైన్యం, తాము పూర్వం చేసినట్లుగా, ఇశ్రాయేలు సైనికుల్ని చంపడం మొదలు పెట్టింది. ఇశ్రాయేలుకి చెందిన సుమారు ముఫ్పై మందిని చంపివేయడం జరిగింది. పొలాలో ఉండేవారిని కొందరిని చంపివేశారు. రాజమార్గం మీద ఉన్న వారిని కొందరిని చంపివేశారు. ఒక రాజమార్గం బేతేలు నగరానికి వెళుతుంది. మరొక రాజమార్గం గిబియా నగరానికి వెళుతుంది.
JDG 20:32 “పూర్వంలా మనం జయిస్తున్నాము” అని బెన్యామీను మనుష్యులు అనుకున్నారు. ఇశ్రాయేలు మనుష్యులు పరుగు పెట్టుచున్నారు. కాని అదొక యుక్తి బెన్యామీను మనుష్యులు తమ నగరమునుండి రాజమార్గం మీదికి రావాలని వారు అభిలాషించారు.
JDG 20:33 అందువల్ల అందరు మగవాళ్లూ పరుగెత్తారు. వారు బయల్తామారు అనే చోట ఆగారు. ఇశ్రాయేలుకి చెందిన కొందరు మనుష్యులు గిబియాకి పడమరగా దాగుకొని ఉన్నారు. వారు తాము దాగిన స్థలములనుండి పరుగెత్తి గిబియాను ఎదుర్కొన్నారు.
JDG 20:34 ఇశ్రాయేలుకి చెందిన సుశిక్షితులైన పదివేల మంది సైనికులు గిబియా నగరాన్ని ఎదుర్కొన్నారు. యుద్ధం చాలా ఘోరంగా ఉంది. కాని బెన్యామీను సైన్యానికి ఏమి భయంకరమైన సంఘటన జరుగుతుందో తెలియదు.
JDG 20:35 ఇశ్రాయేలు సైన్యాన్ని ఉపయోగించి యెహోవా బెన్యామీను సైన్యాన్ని ఓడించాడు. ఆనాడు ఇశ్రాయేలు సైన్యం ఇరవై అయిదువేల వంద మంది బెన్యామీను సైనికులను చంపివేసింది. ఆ సైనికులందరూ యుద్ధానికి తర్ఫీదు పొందినవారే.
JDG 20:36 అందువల్ల బెన్యామీను ప్రజలు తాము ఓడిపోయినట్లుగా గ్రహించారు. ఇశ్రాయేలు సైన్యం వెనుదిరిగింది. వారు ఎందుకు వెనుదిరిగారనగా, అశ్చర్యకరమైన దాడిమీద వారు ఆధారపడి ఉన్నారు. గిబియా వద్ద వారి మనుష్యులు కొందరు దాగి ఉన్నారు.
JDG 20:37 దాగివున్న మనుష్యులు గిబియా నగరం వైపు హడావిడిగా పోయారు. వారు అటూ ఇటూ వెళ్లి నగరంలో వున్న ప్రతివాడినీ కత్తులతో చంపివేశారు. ఇప్పుడు
JDG 20:38 ఇశ్రాయేలు మనుష్యులు దాగివున్న మనుష్యుల ద్వారా ఒక యుక్తిపన్నారు. దాగివున్న మనుష్యులు ఒక ప్రత్యేక సూచన పంపాలి. ఒక పెద్ద పొగమేఘం వారు కల్పించాలి.
JDG 20:39 బెన్యామీను సైన్యం ఇశ్రాయేలు సైనికుల్ని సుమారు ముఫ్పై మందిని చంపారు. అందువల్ల, బెన్యామీను మనుష్యులు ఇలా అన్నారు; “మునుపటివలె మేము జయిస్తున్నాము” కాని అప్పుడు ఒక పెద్ద పొగ మేఘం నగరంనుండి వెలువడింది. బెన్యామీను మనుష్యులు చుట్టూ తిరిగి పొగచూశారు. నగరమంతా దగ్ధమవుతోంది. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం పరుగిడిపోవడం ఆపివేశారు. వారు చుట్టు తిరిగి యుద్ధం చేయసాగారు. బెన్యామీను ప్రజలు భయపడ్డారు. అప్పుడు తమకు భయంకరమైన విషయం జరిగినట్లుగా వారు తెలుసుకున్నారు.
JDG 20:42 అందువల్ల బెన్యామీను సైన్యం ఇశ్రాయేలు సైన్యంనుంచి పారిపోయింది. వారు ఎడారివైపు పారిపోయారు. కాని వారు యుద్ధం నుంచి తప్పించుకొనలేకపోయారు. ఇశ్రాయేలు మనుష్యులు తమ నగరాలనుండి వెలుపలికి వచ్చి వారిని చంపారు.
JDG 20:43 ఇశ్రాయేలు మనుష్యులు బెన్యామీను మనుష్యుల్ని చుట్టు ముట్టారు. వారిని వెంటాడసాగారు. వారిని ఆగనీయకుండా తరిమి, గిబియా తూర్పు ప్రదేశాన వారిని వారు ఓడించారు.
JDG 20:44 అందువల్ల బెన్యామీను సైన్యానికి చెందిన పద్దెనిమిది వేలమంది బలవంతులైన వీరయోధులు చంపబడ్డారు.
JDG 20:45 బెన్యామీను సైన్యం ఎడారి వైపుకి పరుగెత్త సాగింది. రిమ్మోనుబండ వద్దకు వారు పరుగెత్తారు. కాని ఇశ్రాయేలు సైన్యం బెన్యామీను తాలూకు ఐదువేల మంది వీరుల్ని, రాజమార్గం పక్కనున్న వారిని చంపింది. బెన్యామీను మనుష్యుల్ని వారు వెంటాడసాగారు. గిదోము అనే పేరుగల ప్రదేశం దాకా వారిని వెంటాడారు. అక్కడ ఇశ్రాయేలు సైన్యం బెన్యామీనుకు చెందిన రెండువేల మందిని చంపివేసింది.
JDG 20:46 ఆనాడు, బెన్యామీను సైన్యంలోని ఇరవై ఐదువేల మంది మనుష్యులు చంపబడ్డారు. వారందరూ తమ ఖడ్గాలతో వీరోచితంగా పోరాడారు.
JDG 20:47 కాని బెన్యామీను తాలూకు ఆరువందల మంది ఎడారికి పారిపోయారు. వారు రిమ్మోను బండ అనే ప్రదేశంవరకు వెళ్లి, అక్కడ నాలుగు నెలల పాటు ఉన్నారు.
JDG 20:48 ఇశ్రాయేలు మనుష్యులు బెన్యామీను దేశానికి తిరిగి వెళ్లారు. ఎదురైన భూమిలోని ప్రతి మనిషిని వారు చంపారు. వారు జంతువులనన్నిటినీ చంపారు. తమకు కనిపించిన వాటిని అన్నిటినీ వారు నాశనం చేశారు. వారు వచ్చిన ప్రతి నగరాన్నీ దగ్ధం చేశారు.
JDG 21:1 మిస్పా వద్ద ఇశ్రాయేలు మనుష్యులు ఒక ప్రతిజ్ఞ చేశారు. అది ఏదనగా, “బెన్యామీను కుటుంబ వంశంవారికి చెందిన ఏ ఒక్కడూ కూడా ఇశ్రాయేలు వాళ్ల కుమార్తెలను వివాహము చేసుకోనియ్యము.”
JDG 21:2 ఇశ్రాయేలు మనుష్యులు బేతేలు నగరానికి వెళ్లారు. అక్కడ సాయంకాలంవరకు వారు దేవుని ముందు కూర్చొని పెద్దగా ఏడ్చారు.
JDG 21:3 వారు దేవునితో, “యెహోవా, నీవు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడవు. ఈ భయంకరమైన విషయం మాకెందుకు సంభవించింది? ఎందుకుగాను ఇశ్రాయేలుకి చెందిన ఒక వంశపు వారు తీసుకు వెళ్లబడ్డారు” అని అడిగారు.
JDG 21:4 ఆ మరుసటి రోజు ఉదయం ఇశ్రాయేలు ప్రజలు ఒక బలిపీఠం నిర్మించారు. ఆ బలిపీఠం మీద వారు దహన బలులు, సమాధాన బలులు దేవునికి సమర్పించారు.
JDG 21:5 “యెహోవా సమక్షంలో మమ్మల్ని కలుసుకోవడానికి రాని ఇశ్రాయేలు వంశాలవారెవరైనా ఉన్నారా?” అని ఇశ్రాయేలు ప్రజలు అడిగారు. ఒక తీవ్రమైన ప్రతిజ్ఞ చేశారు కనుక, వారీ ప్రశ్న అడిగారు. ఇతర ఇశ్రాయేలీయుల వంశముల నుండి మిస్పా నగరం రాకుంటే వారిని హతమార్చుతామని వారు ప్రతిజ్ఞ చేశారు.
JDG 21:6 అప్పుడు బెన్యామీను ప్రజలైన తమ బంధువుల నిమిత్తం ఇశ్రాయేలు ప్రజలు విచారించారు. వారు ఇలా అన్నారు: “నేడు ఇశ్రాయేలు నుండి ఒక వంశం వేరు చేయబడింది.
JDG 21:7 మేము యెహోవా సమక్షాన ఒక ప్రతిజ్ఞ చేశాము. బెన్యామీను మనుష్యులలో ఎవ్వరినీ మా కుమార్తెలలో ఎవ్వరూ వివాహము చేసుకోరాదని ప్రతిజ్ఞ చేశాము. అందువల్ల బెన్యామీను మనుష్యులకు భార్యలు ఎలా కలుగుతారో మేము నిస్సందేహంగా ఎలా చెప్పగలము?” అని అన్నారు.
JDG 21:8 అప్పుడు ఇశ్రాయేలు మనుష్యులు, “ఇశ్రాయేలుకి చెందిన ఏ వంశం వారు మిస్పాకి రాలేదు? మేము దేవుని సమక్షమున ఏకమైనాము. ఒక వంశం ఇక్కడికి రాలేదని మేము అనుకొంటున్నాము” అని అడిగారు. ఆ తర్వాత యాబేష్గీలాదు నగరం నుండి ఎవ్వరూ వచ్చి ఇశ్రాయేలుకి చెందిన ఇతరుల్ని కలుసుకోలేదని వారు కనుగొన్నారు.
JDG 21:9 ఎవరున్నారో, ఎవరు లేరో అని తెలుసుకునేందుకు ఇశ్రాయేలు మనుష్యులు అందరినీ లెక్క పెట్టారు. యాబేష్గీలాదు నుండి ఎవ్వరూ అక్కడ లేరని వారు కనుగొన్నారు.
JDG 21:10 అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు పన్నెండువేల మంది సైనికులను యాబేష్గిలాదు నగరానికి పంపించారు. ఆ సైనికులతో వారు, “యాబేష్గిలాదుకు వెళ్లండి. అక్కడున్న ప్రతి వ్యక్తినీ స్త్రీలను పిల్లలను మీ ఖడ్గాలతో సంహరించండి.
JDG 21:11 మీరు ఇది చెయ్యాలి. యాబేష్గిలాదులో ఉన్న ప్రతి వ్యక్తినీ మీరు చంపాలి. పైగా పురుషునితో సంభోగించిన ప్రతి స్త్రీని కూడా మీరు చంపాలి. కాని పురుషునితో సంభోగము ఎరగని ఏ స్త్రీనీ మీరు చంపకూడదు.” అని చెప్పారు.
JDG 21:12 ఆ పన్నెండువేల మంది సైనికులు యాబేష్గిలాదులో నాలుగువందల మంది యువతులు ఏ పురుషునితోను సంభోగించలేదని తెలుసుకున్నారు. ఆ సైనికులు ఆ యువతులను షిలోహు ప్రాంతానికి తీసుకు వచ్చారు. షిలోహు కనాను ప్రదేశంలో ఉన్నది.
JDG 21:13 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీను వారికి ఒక సందేశం పంపించారు. బెన్యామీను మనుష్యులతో సంధి చేసుకుంటామన్నారు. బెన్యామీను మనుష్యులు రిమ్మోను బండ అనేచోట ఉన్నారు.
JDG 21:14 అందువల్ల బెన్యామీను మనుష్యులు ఇశ్రాయేలుకి తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు యాబేష్గిలాదులో తాము చంపని స్త్రీలను వారికి ఇచ్చారు. కాని బెన్యామీను పురుషులకందరికీ సరిపడ్డ స్త్రీలు లేరు.
JDG 21:15 బెన్యామీను పురుషుల్ని తలచుకుని ఇశ్రాయేలు ప్రజలు విచారించారు. ఇశ్రాయేలుకి చెందిన ఇతర వంశాల నుండి వాళ్లను యెహోవా వేరు చేసినందుకు వారు విచారించారు.
JDG 21:16 ఇశ్రాయేలు ప్రజల నాయకులు ఇలా అన్నారు; “బెన్యామీను వంశానికి చెందిన స్త్రీలు చంపబడ్డారు. ఇంకా సజీవులై ఉన్న బెన్యామీను పురుషులకు మేము భార్యల్ని ఎలా తేగలము?
JDG 21:17 ఇంకా సజీవులై ఉన్న బెన్యామీను పురుషులకు వారి వంశాలు కొనసాగేందుకుగాను పిల్లలు ఉండాలి. ఇశ్రాయేలుకి చెందిన ఒక వంశం మరణించకుండా ఉండడానికి ఇది చేయబడాలి.
JDG 21:18 కాని మేము మా కుమార్తెలు బెన్యామీను పురుషుల్ని వివాహము చేసుకోనియ్యము. మేము ఈ ప్రతిజ్ఞ చేశాము, ‘ఎవరైనా సరే బెన్యామీను పురుషునికి భార్యనిస్తే, అతనికి చెరుపు కలుగుతుంది.’
JDG 21:19 మాకో ఆలోచన ఉంది. షిలోహు నగరంలో ఇప్పుడు యెహోవాకు ఉత్సవం జరిగే కాలం. అక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవం జరుగుతుంది.” (షిలోహు నగరం బేతేలు నగరానికి ఉత్తరాన ఉంది, బేతేలునుంచి షెకెముకు పోయే బాటకి తూర్పున వుంది. అది లెబోనా నగరానికి దక్షిణాన ఉంది.)
JDG 21:20 అందువల్ల బెన్యామీను మనుష్యులకి పెద్దలు (నాయకులు) తమ ఆలోచన తెలియజేశారు. “వెళ్లండి ద్రాక్షతోటల్లో దాగుకొనండి.
JDG 21:21 ఉత్సవంలో షిలోహునుండి యువతులు వచ్చి నాట్యంలో పాల్గొంటారు. వేచివుండండి. మీరే ద్రాక్షాతోటల్లో దాగి ఉన్నారో, అక్కడినుండి మీరు పారిపోండి. మీలో, ప్రతి ఒక్కడూ షిలోహు నగరానికి చెందిన ఒక యువతిని తీసుకునివెళ్లాలి. ఆ యువతుల్ని బెన్యామీను నగరానికి తీసుకుని వెళ్లండి, వివాహము చేసుకోండి.
JDG 21:22 ఆ యువతుల తండ్రులుగాని సోదరులుగాని వెలుపలికి వచ్చి, మాకు ఇది ఫిర్యాదు చేస్తారు. అప్పుడు, ‘బెన్యామీను పురుషుల ఎడల దయకలిగి ఉండండి. వారు ఆ యువతుల్ని వివాహము చేసుకోనివ్వండి. వారు ఈ స్త్రీలను తీసుకున్నారు. కాని మీతో యుద్ధం చెయ్యలేదు. వారు స్త్రీలను తీసుకువెళ్లారు. అందువల్ల దేవునివద్ద చేసిన ప్రతిజ్ఞ మీరు ఉల్లంఘించలేదు. వారికి ఆ యువతులను ఇచ్చి వివాహము చెయ్యమని మీరు ప్రతిజ్ఞ పట్టారు. బెన్యామీను పురుషులకు మీరా యువతులను యివ్వలేదు. వారు మీ వద్దనుంచే ఆ యువతుల్ని తీసుకువెళ్లారు. అందువల్ల మీరు మీ ప్రతిజ్ఞ తప్పలేదు.’” అన్నారు.
JDG 21:23 అందువల్ల బెన్యామీను వంశపు మనుష్యులు చేసినది అదే. ఆ యువతులు నాట్యం చేసేటప్పుడు, ప్రతి పురుషుడూ వారిలో ఒక్కరిని పట్టుకున్నాడు. ఆ యువతులను వారు తీసుకుపోయి, వివాహము చేసుకున్నారు. వారు తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. ఆ దేశంలో బెన్యామీను మనుష్యులు మళ్లీ నగర నిర్మాణం చేసుకున్నారు, వారా భూమిలోనే నివసించారు.
JDG 21:24 తర్వాత ఇశ్రాయేలు మనుష్యులు ఇళ్లకు వెళ్లిపోయారు. వారు తమ దేశానికి, తమ వంశం వద్దకు వెళ్లారు.
JDG 21:25 ఆ రోజుల్లో ఇశ్రాయేలు మనుష్యులకు రాజు లేడు. అందువల్ల ప్రతి ఒక్కడూ తనకు ఏది సరి అని తోచిందో, అదే చేశాడు.
RUT 1:1 పూర్వం న్యాయమూర్తులు ఏలిన కాలంలొ, తినటానికి చాలినంత ఆహారం దొరకని కరువు రోజులు వచ్చాయి. ఎలీమెలెకు అనే ఒకతను యూదాలొని బేత్లెహేము వదలిపెట్టి, అతను, అతని భార్య, అతని యిద్దరు కుమారులు మోయాబు కొండ ప్రదేశంలో బతకడానికి వెళ్లారు.
RUT 1:2 అతని భార్య పేరు నయోమి, అతని యిద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను. వాళ్లు యూదాలోని బేత్లెహేములో ఎఫ్రాతా వంశానికి చెందినవాళ్లు. ఈ కుటుంబం మోయాబులోని కొండ ప్రదేశానికి ప్రయాణము కట్టి అక్కడే ఉండిపోయారు.
RUT 1:3 ఆ తరువాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. అందుచేత నయోమి, ఆమె యిద్దరు కుమారులు మాత్రమే మిగిలారు.
RUT 1:4 మోయాబు దేశపు స్త్రీలను ఆమె కుమారులు పెళ్లాడారు. ఒకని భార్య పేరు ఓర్పా, ఇంకొకని భార్య పేరు రూతు. మోయాబులో సుమారు పది సంవత్సరాలు వాళ్లు నిపసించారు.
RUT 1:5 అంతలో మహ్లోను, కిలియోను కూడా చనిపోయారు. అందుచేత నయోమి ఇటు భర్తగాని, అటు కుమారులుగాని లేని ఒంటరిదయిపోయింది
RUT 1:6 దేవుడు తన ప్రజలకు సహాయం చేసినట్టు, ఆయన తన ప్రజలకు (యూదాలో) ఆహారం దయచేసినట్టు మోయాబు కొండదేశంలో నయోమి విన్నది. అందుచేత నయోమి మోయాబు కొండ దేశము విడిచిపెట్టి తిరిగి తన ఇంటికి వెళ్లి పోవాలని తీర్మానించుకుంది. ఆమె కోడళ్లు కూడా ఆమెతోనే వెళ్లిపోయేందుకు తీర్మానించుకున్నారు.
RUT 1:7 అంతవరకు బతుకుతున్న చోటు విడిచిపెట్టేసి మళ్లీ యూదా దేశము పోయేదారి పట్టి ప్రయాణము మొదలు పెట్టారు.
RUT 1:8 అప్పుడు నయోమి తన కోడళ్లు యిద్దరితో ఇలా అన్నది: “మీరు ఎవరి పుట్టింటికి వారు వెళ్లండి. మీరు చనిపోయిన నా ఇద్దరు కుమారులపైన, నాపైన ఎంతో దయ చూపెట్టారు. అలాగే యెహోవా మీపైన దయ చూపెట్టాలని కోరుకుంటున్నాను.
RUT 1:9 మీరు ఇద్దరూ మళ్లీ పెళ్లాడి మీ భర్తలతో సుఖంగా ఉండేందుకు ఆ దేవుడే మీకు సహాయం చేయాలనేదే నా ప్రార్థన.” నయోమి తన యిద్దరు కోడళ్లను ముద్దు పెట్టుకుంది. దానితో అందరూ ఏడ్వటం మోదలు పెట్టారు.
RUT 1:10 ఆ కోడళ్లు, “మేమూ నీతోనే వచ్చేస్తాము. నీ కుటుంబంలోనే ఉంటాము” అన్నారు.
RUT 1:11 కాని నయోమి ఇలా అన్నది: “నా కుమార్తెలారా! మీ పుట్టిళ్లకు వెళ్లిపొండి. మీరు నాతో రావడం దేనికి? మిమ్మల్ని పెళ్లిచేసుకునేందుకు నా దగ్గర ఇంకెవరూ కుమారులు లేరు.
RUT 1:12 ఇంటికి వెళ్లిపోండి. ఇంకో భర్తను కట్టుకునేందుకు నేను మరీ ముసలిదానను, ఒకవేళ నాకు మళ్లీ పెళ్లవుతుందని నేను అనుకున్నా లాభం లేదు. ఎందుచేతనంటే ఒకవేళ నేను ఈ రాత్రికి రాత్రే గర్భవతినై నాకు ఇద్దరు కుమారులు పుట్టినా
RUT 1:13 మీరు వారిని పెండ్లాడాలంటే వాళ్లు పెద్ద వాళ్లయ్యేంతవరకు మీరు వాళ్లకోసం వేచి ఉండాలి. అన్నాళ్లూ మీరు పెళ్లి చేసుకోకుండా ఆపుజేయడం నాకు మరీ విచారం. ఎందుకంటే, యెహోవా హస్తము నాకు విరోధముగా ఎన్నో పనులు చేసింది.”
RUT 1:14 అప్పుడు ఆ స్త్రీలు మరింతగా ఏడ్చేశారు. ఓర్పా నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది. కాని రూతు ఆమెను హత్తుకుని ఉండిపోయింది.
RUT 1:15 నయోమి అన్నది: “చూడమ్మా! నీ తోడికోడలు తన సొంతవారి దగ్గరకు, వారి దేవుళ్ల దగ్గరకు తిరిగి వెళ్లిపోయినది. నీవు కూడా అలానే చేయి.”
RUT 1:16 కానీ రూతు, “నిన్ను విడిచి నా స్వంతవాళ్ల దగ్గరకు వెళ్లి పొమ్మని నన్ను బలవంతం చేయవద్దు. నేను నీతోనే వస్తాను. నీవు ఎక్కడికి వెళ్తే, నేనూ అక్కడికి వెళ్తాను.నీవు ఎక్కడవుంటే, నేనూ అక్కడే ఉంటాను. నీవారే నావారు, నీ దేవుడే నా దేవుడు.
RUT 1:17 నీవు ఎక్కడ చస్తే నేనూ అక్కడే చస్తాను. అక్కడే సమాధి చేయబడతాను. నేను ఈ మాట నిలబెట్టు కోలేకపోతే, దేవుడే నన్ను శిక్షిస్తాడు. చావుతప్ప ఇంకేది మనలను విడదీయ లేదు.”
RUT 1:18 రూతు తనతోనే రావాలనే పట్టుదలతో ఉన్నట్టు గ్రహించి, నయోమి ఆమెతో వాదించడం మానివేసింది.
RUT 1:19 నయోమి, రూతు కలసి బేత్లెహేము పురము వరకు ప్రయాణము చేశారు. వారిద్దరూ బేత్లెహేము చేరగానే ఆ ఊరివారంతా సంబరపడిపోయి. “ఈమె నయోమి కదూ?” అని చెప్పుకున్నారు.
RUT 1:20 “నన్ను (మధురము) నయోమి అని పిలవకండి. నన్ను మారా అని పిలవండి. ఎందుచేతనంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు నా బతుకును చాలా దఃఖమయం చేశాడు” అన్నది నయోమి వారితో.
RUT 1:21 “నేను వెళ్లినప్పుడు నాకు కావాల్సింది అంతా ఉంది, కాని ఇప్పుడు ఏమీ లేనిదానిగా ఇంటికి తీసుకొచ్చాడు దేవుడు. ఆయన నన్ను దుఃఖమయినిగా చేస్తే, మీరు నన్ను సంతోషం అని పిలవడం దేనికి? సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను చాలా బాధపెట్టాడు.”
RUT 1:22 అలా నయోమి, ఆమె కోడలు రూతు (మోయాబు స్త్రీ) మోయాబు దేశమునుండి తిరిగి వచ్చేశారు. యవల పంటకోత మొదలవుతున్న రోజుల్లో వీరిద్దరూ యూదాలోని బేత్లెహేము పురము చేరుకున్నారు.
RUT 2:1 బేత్లెహేములో నయోమి భర్త ఎలీమెలెకు వంశపు వాడైన బోయజు అనే దగ్గర బంధువు ఒకతను ఉండేవాడు. అతడు గొప్ప శక్తిసంపన్నుడు.
RUT 2:2 ఒక రోజు రూతు నయోమితో, “నేను పొలాల్లోకి వెళితే బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా నామీద జాలిపడి తన పొలంలో తన వెనుక పరిగె ఏరుకోనిస్తారేమో.” అన్నది. “సరే మంచిది బిడ్డా, అలాగే వెళ్లిరా” అన్నది నయోమి.
RUT 2:3 రూతు పొలం వెళ్లి, పంట కోస్తున్న పనివాళ్ల వెనకాల తిరుగుతూ, వాళ్లు విడిచిపెట్టే పరిగె ఏరు కుంటుంది. ఆ పోలము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుకు చెందినది.
RUT 2:4 బోయజు బేత్లెహేమునుండి అప్పుడే పొలముకు వచ్చాడు. “దేవుడే మీకు తోడుగా వుండును గాక!” అంటూ తన పనివాళ్లను అభినందించాడు. పనివాళ్లు “యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక!” అంటూ జవాబిచ్చారు.
RUT 2:5 అప్పుడు ఆయన రూతును చూసి పనివాళ్లపైన నియమించబడ్డ పెద్ద సేవకునితో, “ఎవరి అమ్మాయి ఈమె?” అని అడిగాడు బోయజు.
RUT 2:6 “ఆమె మోయాబు కొండదేశము నుండి నయోమితో పాటు వచ్చిన మోయాబు స్త్రీ.
RUT 2:7 పనివాళ్ల వెనక తిరుగుతూ అక్కడక్కడ మిగిలిపోయిన కంకులను (పరిగె) ఏరుకోనిమ్మని పొద్దున్నే వచ్చి నన్ను ఆడిగింది. అప్పట్నిండి ఆమె ఎడతెరిపి లేకుండా పని చేస్తూనే వుంది. అదిగో ఆ కనబడేదే ఆమె ఇల్లు. కాసేపు మాత్రము అక్కడ విశ్రాంతి తీసుకుంది” అన్నాడు ఆ పెద్ద సేవకుడు.
RUT 2:8 అప్పుడు బోయజు రూతుతో ఇలా అన్నాడు: “నా కుమారీ వినుము. నీవు ఇక్కడే నా పొలంలోనే వుండి పరిగె ఏరుకో. ఇంకెవ్వరి పొలానికీ వెళ్లాల్సిన పనిలేదు. నా ఆడ కూలీలవెనకే పోతూవుండు.
RUT 2:9 మగ వాళ్లు ఏ పొలములో కోత కోస్తుంటారో గమనిస్తూ ఆక్కడ ఆడకూలీల వెనకే ఉండు. నిన్నేమి గొడవ పెట్టొద్దని కుర్రాళ్లతో చెబుతాలే. దాహమైతే నా మనుషులు తాగే పాత్రలోని నీళ్లేతాగు.”
RUT 2:10 రూతు నేల చూపులు చూస్తూ, నేలవరకు వంగి బోయజుతో ఇలా అన్నది. “పరాయిదాననయిన నేను నీ దృష్ఠిలో పడటం, నీ దయకు పాత్రురాలను కావడం ఆశ్చర్యంగావుంది.”
RUT 2:11 బోయజు జవాబిచ్చాడు: “నీ ఆత్తగారు నయోమికి నీవు చేసిన సహాయాన్ని గూర్చి నాకంతా తెలుసు. నీ భర్త చనిపోయిన తర్వాత కూడ నీవు ఆమెకు సహాయము చేశావని నాకు తెలుసు. అంతేకాదు, నీవు నీ తల్లిదండ్రులను నీ స్వదేశాన్ని కూడా విడిచిపెట్టేసి, ఈ దేశము వచ్చేశావు. ఇక్కడి వారెవ్వరూ నీకు తెలియదు. అయినా నయోమితో వచ్చేశావు.
RUT 2:12 నీవు చేసిన ఈ మంచి పనులన్నికీ యెహోవా నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఏ ఇశ్రాయేలు వారి దేవుని దగ్గర ఆశ్రయము కోరి వచ్చావో ఆ యెహోవా దేవుడు నీకు సకల ఐశ్వర్యాలు ప్రసాదించునుగాక! మరియు ఆయన నిన్ను కాపాడునుగాక.”
RUT 2:13 “అయ్యా! నేను కేవలం ఒక పనిమనిషిని, మీ పని మనుషుల్లో కనీసం ఒకదానితో సమానము కాను నేను. అయినా నన్ను గూర్చి ఎంతో దయగా మాట్లాడి, నన్ను ఆదరించారు. మీ దయ నాకు ఉంటే చాలు” ఆన్నది రూతు.
RUT 2:14 మధ్యాహ్న భోజనము వేళ బోయజు, “ఇక్కడికి రా! మా భోజనము తిను.రొట్టెను ద్రాక్షారసములో ముంచుకో” అన్నాడు రూతుతో. కనుక రూతు పనివాళ్లతో కలిసి కూర్చుంది. బోయజు ఆమెకు కోన్ని పేలాలు పెట్టాడు. రూతు తృప్తిగా భోజనము చేసిన తర్వాత ఇంకా కొంచెము మిగిలాయి.
RUT 2:15 తరువాత రూతు లేచి మళ్లి పనికి వెళ్లీంది. బోయజు తన పనివారితో, “పనల మధ్యకూడ ఆమెను ఏరుకోనివ్వండి. ఆమెను అభ్యంతర పెట్టకండి.
RUT 2:16 ఆమె కోసం కొన్ని కంకులు పనల్లోనుంచి జారవిడుస్తూ, ఆమె ఏరుకొనేందుకు వాటిని విడిచిపెట్టండి, అలా ఆమె పనిని సులభం చేయండి.” అని చెప్పాడు.
RUT 2:17 సాయంత్రంవరకు రూతు పొలాల్లో పని చేసింది. తర్వాత ఆమె ఆ కంకులను దుళ్లగొట్టింది. అవి సుమారు ఒక తూమెడు యవల గింజలయ్యాయి.
RUT 2:18 రూతు తాను ఏరుకొన్న గింజలను తన అత్తకు చూపెట్టేందుకని ఊరిలోనికి మోసుకొనిపోయింది. ఆ మధ్యాహ్న భోజనములో మిగిలినదానిని కూడ ఆమెకు ఇచ్చింది.
RUT 2:19 ఆమె అత్త ఇలా అన్నది: “ఈ గింజలన్నీ ఎక్కడ ఏరుకున్నావు? నీవు ఎక్కడ పని చేశావు? నిన్ను గమనించినవాడిని దేవుడు దీవించునుగాక.” రూతు తన అత్తతో, “ఈ వేళ బోయజు అనే ఆయన దగ్గర నేను పని చేశాను” అని చెప్పింది. “యెహోవా అతనిని ఆశీర్వదించునుగాక! బ్రతికిన వాళ్లకు, చచ్చినవాళ్లకు అందరికి దేవుడు దయ చూపెడుతూనేవుంటాడు.” అని తన కోడలితో చెప్పింది నయోమి.
RUT 2:20 “బోయజు మన బంధువే, మనలను కాపాడేవాళ్లలో బోయజు ఒకడు” అని తన కోడలితో చెప్పింది నయోమి.
RUT 2:21 అప్పుడు, “మళ్లీ వచ్చి పని చేసుకోమని, కోత పూర్తి అయ్యేవరకు తన పనివాళ్లతో కలిసే పని చేసుకోమన్నాడు బోయజు” అని చెప్పింది రూతు.
RUT 2:22 దానికి నయోమి తన కోడలు రూతుతో ఇలా చెప్పింది: “అతని ఆడ కూలీలతోనే కలిసి పని చేసుకోవటం మంచిది నీకు. ఇంకేదైనా పొలంలో పనిచేస్తే మరే మగాడైనా నిన్ను బాధించవచ్చు.”
RUT 2:23 అందుచేత రూతు బోయజుగారి ఆడ కూలీలనే సన్నిహితంగా వెంబడిస్తూ, పనిచేసుకొంటూ పోయింది. యవలకోత పూర్తయ్యేవరకు ఆమె గింజలు ఏరుకొంది. గోధుమ కోత అయ్యేంతవరకు కూడ ఆమె అక్కడే పనిచేసింది. రూతు తన అత్తగారు నయోమితో బాటే కలిసి వుంటోంది.
RUT 3:1 రూతు అత్త నయోమి, “చూడు బిడ్డా, ఒకవేళ నీ కోసం నేనొక మంచి భర్తను చూస్తే బాగుంటుందేమో, అది నీకు క్షేమం.
RUT 3:2 (ఒక వేళ బోయజే తగినవాడేమో) బోయజు మనకు చాలా దగ్గర బంధువు. అతని దగ్గర పనిచేసే స్త్రీలతో నీవూ పని చేసావు. ఈ రోజు రాత్రి అతడు కళ్లము దగ్గర పని చేస్తాడు.
RUT 3:3 నీవు పోయి స్నానం ెచేసి బట్టలు కట్టుకో, మంచి బట్టలు కట్టుకొని కళ్లము దగ్గరకు వెళ్లు, అయితే, బోయజు భోజనము చెయ్యటము అయ్యేంత వరకు అతనికి కనబడకు.
RUT 3:4 అతడు భోజనము చేసిన తర్వాత పండుకొని విశ్రాంతి తీసుకుంటాడు. అతను ఎక్కడ పండుకుంటాడో గమనిస్తూ ఉండు. అక్కడికి వెళ్లి, అతని కాళ్లమీదున్న దుప్పటి తొలగించి, అక్కడే అతని దగ్గరే పండుకో. అప్పుడు నీవేమి చేయాలో (పెళ్లి గూర్చి) అతనే నీకు చెప్తాడు.”
RUT 3:5 “నీవు చెప్పినట్టే చేస్తా” అని జవాబిచ్చింది రూతు.
RUT 3:6 రూతు కళ్లము దగ్గరకు వెళ్లింది. ఏమి చేయుమని అత్త చెప్పిందో అదంతా చేసింది రూతు.
RUT 3:7 తిని తాగడం అయినతర్వాత బోయజు బాగా తృప్తిగా ఉన్నాడు. ధాన్యంకుప్ప దగ్గర పండుకునేందుకు వెళ్లాడు బోయజు. అప్పుడు రూతు మెల్లమెల్లగా వెళ్లి అతని కాళ్లమీద దుప్పటి తొలగించింది. అతని పాదాల దగ్గరే ఆమె పండుకొంది.
RUT 3:8 సుమారు మధ్యరాత్రి బోయజు పక్కకు దొర్లాడు ( నిద్రలోనుంచి మేల్కొన్నాడు) అతను చాలా ఆశ్చర్య పోయాడు. తన పాదాల దగ్గర ఒక స్త్రీ పండుకొనివుంది.
RUT 3:9 “ఎవరు నీవు” అన్నాడు బోయజు. “నీ సేవకురాలనైన రూతును. నన్ను కాపాడాల్సింది నీవే. నీ దుప్పటి నా మీద కప్పు” అన్నది రూతు.
RUT 3:10 అందుకు బోయజు, “నా కుమారీ! యెహోవా నిన్ను దీవించునుగాక! నాపై నీవు చాలా దయ చూపెట్టావు. ెమొదట్లో నీవు నయోమి మీద చూపెట్టిన దయకంటె, ఇప్పుడు నామీద చూపెట్టిన దయ చాలా ఎక్కువ. నీవు పెళ్లి చేసుకొనేందుకు ధనవంతుడో, పేదవాడో మరో యువకుడిని చూసుకుని ఉండాల్సింది, కాని నీవు అలా చేయలేదు.
RUT 3:11 కనుక చూడు బిడ్డా! నీవేమి భయపడకు. నీవు అడిగింది నేను చేస్తా. నీవు చాలా మంచిదానివని మన ఊళ్లో అందరికీ తెలుసు.
RUT 3:12 నేను నీకు చాలా దగ్గర బంధువును అనడం కూడ సత్యమే. అయితే, నాకంటే నీకు మరింత దగ్గర బంధువు ఒకాయన ఉన్నాడు.
RUT 3:13 ఈ రాత్రికి నీవు ఇక్కడ ఉండు. ఆయన నీకేమైనా సహాయము చేస్తాడేమో ఉదయాన్నే తెలుసు కుందాము. నీకు సహాయము చేయటానికి ఆయన నిర్ణయం తీసుకొంటే మంచిదే. సహాయం చేయటానికి ఆయన నిరాకరిస్తే మాత్రం దేవుడు సజీవుడు గనుక నేనే నిన్ను పెళ్లాడి ఎలీమెలెకు భూమిని నీ కోసము మళ్లీ కొనియిస్తాను. ఇది నా వాగ్దానం. కనుక తెల్లారే వరకు ఇక్కడే పడుకో.”
RUT 3:14 అందుచేత తెల్లారేవరకు అతని కాళ్ల దగ్గరే పడుకొనింది రూతు. తెల్లవారుఝామునే ఒకరినొకరు గుర్తించే పాటి వెలగు రాకముందే ఆమె లేచివెళ్లి పోయింది. “రాత్రి నీవు నా దగ్గరకు ఇక్కడికి వచ్చిన సంగతి రహస్యముగానే ఉంచుదాము” అన్నాడు బోయజు ఆమెతో.
RUT 3:15 “నీ దుప్పటి నా దగ్గరకు తీసుకురా, దాన్ని తెరచి పట్టుకో” అన్నాడు బోయజు. అందుచేత రూతు తన దుప్పటి తెరచి పట్టుకుంది. ఆమె అత్తగారైన నయోమికి కానుకగా ఒక తూమెడు యవలు కోలిచి ఇచ్చాడు బోయజు. ఆ దుప్పటిని మూట కట్టి ఆమె భుజంమీద పెట్టి, బోయజు ఊళ్లోకి వెళ్లిపోయాడు.
RUT 3:16 రూతు తన ఆత్త నయోమి ఇంటికి వెళ్లిపోయింది. నయోమి (గుమ్మం దగ్గరకు వెళ్లి) “ఎవరది” అని అడిగింది. (రూతు ఇంట్లోకి వెళ్లి) తనకోసము బోయజు చేసిందంతా చెప్పింది.
RUT 3:17 “నీకు కానుకగా ఇమ్మని బోయజు ఈ యవలు నాకు ఇచ్చాడు. నీ కోసము కానుక తీసుకుపోకుండా నేను ఇంటికి వెళ్లకూడదన్నాడు బోయజు” అని చెప్పింది రూతు.
RUT 3:18 “నా కుమారీ, ఏమి జరుగుతుందో తెలిసేంతవరకు నెమ్మదిగా ఉండు. బోయజు మాత్రం ఏమిచేయాలో అది చేసేంతవరకు ఊరుకోడు. ఏమి జరిగేదీ ఈరోజు గడవక ముందే మనము వింటాము.” అన్నది నయోమి.
RUT 4:1 పట్టణ ద్వారము దగ్గర ప్రజలు సమావేశమయ్యే చోటికి బోయజు వెళ్లాడు. బోయజు చెప్పిన దగ్గర బంధువు అటుపైపు వచ్చేంతవరకు బోయజు అక్కడే కూర్చున్నాడు. “మిత్రమా, ఇలా రా! ఇక్కడ కూర్చో” అని బోయజు అతడిని పిల్చాడు.
RUT 4:2 తర్వాత బోయజు కొందరు సాక్షులను పదిమంది పెద్దలను సమావేశ పర్చాడు. వాళ్లను, “అక్కడ కూర్చో”మని చెప్పినప్పుడు వాళ్లు కూర్చున్నారు.
RUT 4:3 అప్పుడు నయోమి దగ్గరి బంధువుతో బోయజు మాట్లాడాడు. “నయోమి మోయాబు దేశమునుండి తిరిగి వచ్చేసింది. మన బంధువు ఎలీమెలెకు భూమిని ఆమె అమ్మేస్తుంది.
RUT 4:4 ఈ ఊరి ప్రజలయెదుట, నా వాళ్ల పెద్దలయెదుట ఈ విషయం నీతో చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈ భూమిని నీవు విడిపించాలనుకుంటే నీవూ కొనుక్కో. ఆ భూమిని విడిపించడం నీకు ఇష్టము లేకపోతే నాకు చెప్పు, ఆ భూమిని విడిపించాల్సిన బాధ్యత నీ తర్వాత నాదే అని నాకు తెలుసు. ఆ భూమిని నీవు తిరిగి కొనకపోతే, నేను కోంటాను” అంటూ బోయజు ఆ దగ్గరి బంధువుతో చెప్పాడు.
RUT 4:5 “నయోమి దగ్గరనుండి నీవు ఆ భూమిని కొంటే, చనిపోయిన వాని భార్య మోయాబు స్త్రీ నీదే అవుతుంది (రూతుకు సంతానం కలిగినప్పుడు ఆ సంతానానికి ఆ భూమి చెందుతుంది) ఆ విధంగా ఆ భూమి చని పోయినవాని కుటుంబానికే చెంది ఉంటుంది” అన్నాడు.
RUT 4:6 ఆ దగ్గరి బంధువు జవాబుగా అన్నాడు: “నేను ఆ భూమిని కొనలేను. ఆ భూమి నాకు చెందాల్సిందే, కాని నేను దాన్ని కొనలేను. ఒకవేళ నేను దాన్ని కొనాల్సివస్తే, నా సొంత భూమిని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. అందుచేత నీవు ఆ భూమిని కొనవచ్చు.”
RUT 4:7 (పూర్వము ఇశ్రాయేలులో ప్రజలు ఆస్తి కొన్నా విడిపించినా ఒకడు తన చెప్పు తీసి అవతల వ్యక్తికి ఇచ్చేవాడు. క్రయ విక్రయాలకు అది వారి రుజువు).
RUT 4:8 “కనుక ఆ భూమిని నీవే కొనుక్కో” అన్నాడు ఆ దగ్గరి బంధువు. తర్వాత ఆ దగ్గరి బంధువు తన చెప్పుతీసి దానిని బోయజుకు ఇచ్చాడు.
RUT 4:9 అప్పుడు బోయజు పెద్దలతోను, ప్రజలందరితోను చెప్పాడు. “ఎలీమెలెకు, కిలియోను, మహ్లూనులకు చెందిన దానినంతటినీ నయోమి దగ్గరనుండి నేను కొంటున్నాను. దానికి నేడు మీరే సాక్షులు.
RUT 4:10 నా భార్యగా ఉండేందుకు రూతును కూడా నేను తీసుకొంటున్నాను. చనిపోయినవాని ఆస్తి అతని కుటుంబానికే ఉండాలని నేను ఇలా చేస్తున్నాను. ఈ విధంగా చేయటంవల్ల చనిపోయిన వాని పేరు అతని దేశానికి, కుటుంబానికి దూరముకాకుండా ఉంటుంది. ఈ వేళ మీరంతా దీనికి సాక్షులు.”
RUT 4:11 పట్టణద్వారము దగ్గర ఉన్న పెద్దలు, ప్రజలు దీనికి సాక్షులు. “ఈ స్త్రీ నీ ఇంటికి వచ్చేస్తుంది యెహోవా ఈమెను రాహేలు, లేయా వలె చేయునుగాక! రాహేలు, లేయాలు ఇశ్రాయేలు వంశపుత్రదాతలు ఎఫ్రాతాలో నీవు శక్తిమంతుడవు అవుదువు గాక. బెత్లెహేములో నీవు ప్రఖ్యాత పురుషుడవవుదువు గాక!
RUT 4:12 తామారు యూదా కుమారుడు పెరెసును కన్నది అతని కుటుంబం చాలా గొప్పది అలాగే రూతు ద్వారా అనేక మంది పిల్లలను యెహోవా నీకు ప్రసాదించును గాక! నీ కుటుంబము కూడ అతని కుటుంబంలాగే గౌరవప్రదమవును గాక!”
RUT 4:13 బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. యెహోవా ఆమెను గర్భవతిని కానిచ్చినప్పుడు ఆమె ఒక కుమారుని కన్నది.
RUT 4:14 ఆ ఊరిలో స్త్రీలు నయోమితో, “నిన్ను ఆదుకొనేందుకు (బోయజు) ఇతడిని ఇచ్చిన యెహోవాని స్తుతించు. “ అతడు ఇశ్రాయేలులో ప్రఖ్యాతి నొందును గాక! అనిరి. మరియు వారు,
RUT 4:15 అతడే నీకు బలాన్ని యిచ్చి, నీ వృద్ధాప్యంలో నిన్ను కాపాడును గాక! నీ కోడలు వల్ల ఇదంతా జరిగింది. ఆమె నీ కోసం ఈ పిల్లవానిని కన్నది. ఆమెకు నీవంటే చాలా ప్రేమ. ఈమె ఏడుగురు కుమారులను కంటే నీకు మేలు.” అని అనిరి.
RUT 4:16 నయోమి పిల్లవాడ్ని తీసుకొని, చేతుల్లో ఎత్తుకొని ఆడించింది.
RUT 4:17 ఆ స్త్రీలు, “ఈ పిల్లవాడు నయోమి కోసమే పుట్టాడు” అన్నారు. ఇరుగు పొరుగువారు ఆతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఓబేదు యెష్షయికి తండ్రి. యెష్షయి రాజైన దావీదుకు తండ్రి.
RUT 4:18 పెరెసు కుటుంబ చరిత్ర ఇది. పెరెసు హెస్రోనుకు తండ్రి.
RUT 4:19 హెస్రోను రాముకు తండ్రి. రాము అమ్మి నాదాబుకు తండ్రి.
RUT 4:20 అమ్మినాదాబు నయసోనుకు తండ్రి. నయసోను శల్మానుకు తండ్రి.
RUT 4:21 శల్మాను బోయజుకు తండ్రి. బోయజు ఓబేదుకు తండ్రి.
RUT 4:22 ఓబేదు యెష్షయికి తండ్రి. యెష్షయి దావీదుకు తండ్రి.
1SA 1:1 ఎల్కానా అనబడే ఒక వ్యక్తి ఉండెను. అతను కొండల దేశమైన ఎఫ్రాయిములోని రామతయి మ్సోఫీము పట్టణవాసి. ఎల్కానా సూపు వంశస్థుడు. అతని తండ్రి యెరోహాము. యెరోహాము ఎలీహు యొక్క కుమారుడు. ఎలీహు తండ్రి తోహు. తోహు ఎఫ్రాయిము వంశపువాడైన సూపు కుమారుడు.
1SA 1:2 ఎల్కానాకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు హన్నా. రెండవ భార్యపేరు పెనిన్నా. పెనిన్నా సంతానవతి. కాని హన్నాకు పిల్లలు కలుగలేదు.
1SA 1:3 ప్రతి సంవత్సరము ఎల్కానా రామతయి మ్సోఫీమునుండి షిలోహుకు వెళ్లి సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించేవాడు. అక్కడ ఆయన బలులు కూడ అర్పించేవాడు. షిలోహులో హొప్నీ, మరియు ఫీనెహాను అనే వారిరువురు యెహోవా యాజకులుగా ఉండిరి. వారిరువురూ ఏలీ అనే ప్రధాన యాజకుని కుమారులు.
1SA 1:4 ప్రతిసారీ బలిఅర్పణలో ఒక భాగం ఎల్కానా తన భార్య పెనిన్నాకు ఇచ్చేవాడు. ఆమె కుమారులకు కూడా భాగాలు ఇచ్చేవాడు.
1SA 1:5 యెహోవా హన్నాను గొడ్రాలుగా చేసినప్పటికీ, ఎల్కానా మాత్రం ఆమెను బాగా ప్రేమించేవాడు గనుక ఆమెకు కూడ ఎల్లప్పుడు అర్పణలో సమానభాగం ఇచ్చేవాడు.
1SA 1:6 పెనిన్నా అదేపనిగా హన్నాను పీడిస్తూ ఆమె మనస్సుకు ఎంతో బాధ కలిగించేది. అందుకు కారణం దేవుడు ఆమెను గొడ్రాలుగా చేయటమే.
1SA 1:7 ప్రతి ఏటా ఇదిలా జరుగుతూ వచ్చింది. షిలోహులోని యెహోవా ఆలయానికి వెళ్లిన ప్రతిసారీ హన్నాను పెనిన్నా కించపరిచేది. ఒకరోజు ఎల్కానా బలి అర్పించుచుండగా హన్నా ఏడ్వసాగింది. భోజనం కూడా చేయలేదు.
1SA 1:8 ఆమె భర్త ఎల్కానా, “ఎందుకు విచారిస్తున్నావనీ, ఎందుకు తినటం లేదనీ, ఎందుకు దుఃఖంతో ఉన్నావనీ ఆమెను అడిగాడు. నీకు నేను ఉన్నాను, నేను నీ భర్తను. పదిమంది కొడుకులకంటె నేను నీకు ఎక్కువ” అని కూడ ఓదార్చాడు.
1SA 1:9 హన్నా అన్న పానాలు పుచ్చుకొన్న తర్వాత, యెహోవాను ప్రార్థించటానికి వెళ్లింది. యెహోవా పవిత్ర ఆలయ ద్వారం పక్కనే యాజకుడు ఏలీ ఆసీనుడైవున్నాడు.
1SA 1:10 హన్నా మిక్కిలి విచారంతో ఉంది. చాలా దుఃఖించి దేవుణ్ణి ప్రార్థించింది.
1SA 1:11 ఒక పెద్ద మొక్కుబడి మొక్కింది. “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నేను ఎంత దుఃఖంలో వున్నానో చూడు. నన్ను జ్ఞాపకముంచుకో! నన్ను మర్చిపోవద్దు. నాకొక కుమారుని కలుగజేస్తే వానిని నేను తిరిగి నీ సేవకై జీవితాంతం విడిచి పెడ్తాను. పైగా అతడు మద్యపానాది వ్యసనాలకు లోనుగాడు. అతడు నాజీరవుతాడు. మరియు అతని తలవెంట్రుకలు ఎవ్వరూ కత్తిపట్టి తీయరు” అని కోరుకున్నది.
1SA 1:12 ఆ విధంగా హన్నా ప్రార్థనలో ఉన్నంతసేపూ ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు.
1SA 1:13 హన్నా అంతరంగంలోనే ప్రార్థిస్తూవుంది. ఆమె పెదవులు కదిలాయి గాని ఆమె గొంతు విప్పలేదు. అందుచేత హన్నా మద్యం సేవించి వుంటుందని ఏలీ భావించాడు.
1SA 1:14 “మద్యం తాగటం మానివేయి. నీ ద్రాక్షా రసాన్ని పారబోయి” అని హన్నాతో ఏలీ చెప్పాడు.
1SA 1:15 “లేదయ్యా, నేను ద్రాక్షారసం గాని, మరేదిగాని సేవించలేదు. నేను నా సమస్యలన్నీ యెహోవాతో చెప్పుకుంటున్నాను.
1SA 1:16 నేనొక చెడ్డ స్త్రీ నని తలంచవద్దు. ఇంత ఎక్కువ సేపు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానంటే నాకు ఎన్నో బాధలు, అంతులేని దుఃఖం ఉన్నాయి” అని హన్నా సమాధాన మిచ్చింది.
1SA 1:17 అంతట ఏలీ, “నీవు సమాధానంతో వెళ్లు. ఇశ్రాయేలు దేవుడు నీ కోర్కెలను నెరవేర్చునుగాక” అని హన్నాను పంపివేశాడు.
1SA 1:18 “నామీద దయ ఉంచండి” అని చెప్పి హన్నా వెళ్లి, కొంచెం ఆహారం తీసుకున్నది. ఆ తరువాత ఆమె మరెప్పుడూ అంత మనోవేదన చెందలేదు.
1SA 1:19 మరునాటి తెల్లవారు ఝామునే ఎల్కానా కుటుంబ సభ్యులంతా లేచి దేవుని ఆరాధించి రామాలో ఉన్న తమ ఇంటికి వెళ్లిపోయారు. ఎల్కానా తన భార్య హన్నాతో శయనించాడు. హన్నాను యెహోవా జ్ఞాపకము చేసుకున్నాడు.
1SA 1:20 మరు సంవత్సరం సమయానికి హన్నా గర్భవతియై, ఒక కుమారుని కని తన కుమారునికి సమూయేలు అని పేరు పెట్టింది. “వీనిపేరు సమూయేలు. ఎందుకంటే వీని కొరకు నేను యెహోవాని ప్రార్థించాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు” అని అన్నది హన్న.
1SA 1:21 ఆ సంవత్సరం ఎల్కానా సకుటుంబంగా షిలోహుకు వెళ్లి యెహోవాకు బలులు సమర్చించి మొక్కిన మొక్కలు తీర్చేందుకు వెళ్లారు.
1SA 1:22 కాని ఈ సారి ఎల్కానాతో హన్నా వెళ్లలేదు. “బిడ్డకు ఆహారం తినే వయస్సు వచ్చిన్నపుడు షిలోహుకు తీసుకుని వెళతాను. అప్పుడతనిని దేవునికి అంకితం చేస్తాను. అతడు నాజీరు అవుతాడు. అది మొదలు శాశ్వతంగా షిలోహులో ఉండిపోతాడు” అని హన్నా ఎల్కానాకు చెప్పింది.
1SA 1:23 “నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి. కుమారుడు స్వయంగా ఆహారం తినగలిగే వయస్సు వచ్చే వరకు ఇంటివద్దనే ఉండు. యెహోవా తన వాగ్దానం నెరవేర్చునుగాక” అని ఆమె భర్త ఎల్కానా అన్నాడు. తన కుమారుని పెంచుతూ హన్నా ఇంటి వద్దనే ఉండి పోయింది.
1SA 1:24 బాలునికి స్వయంగా అన్నం తినే వయస్సు వచ్చినప్పుడు హన్నా అతనిని షిలోహులోని యెహోవా ఆలయానికి తీసుకుని వెళ్లింది. తనతోపాటు మూడు సంవత్సరాల గిత్తదూడను, అరబస్తా పిండిని, ఒక ద్రాక్షారసం సీసాను తీసుకుని వెళ్లినది.
1SA 1:25 యెహోవా ముందరకు వెళ్లి ఎల్కానా యథావిధిగా కోడెదూడను యెహోవాకు బలిగా వధించాడు. అప్పుడు హన్నా బాలుని ఏలీ వద్దకు తీసుకుని వెళ్లింది.
1SA 1:26 అప్పుడామె ఏలీతో, “అయ్యా, నీ జీవము తోడుగా చెప్పుచున్నాను; నేను గతంలో నీ చెంత నిలబడి యెహోవాకి ప్రార్థించిన స్త్రీనే,
1SA 1:27 ఈ బిడ్డ కోసమే నేను ప్రార్థించాను. యెహోవా నా ప్రార్థన ఆలకించి ఈ బిడ్డను నాకు ప్రసాదించాడు.
1SA 1:28 ఇప్పుడు ఈ బిడ్డను తిరిగి యెహోవాకు ఇస్తున్నాను. వీడు జీవితాంతం యోహోవా సేవలో నిమగ్నమై ఉంటాడు” అని అన్నది. హన్న తన కుమారుని అక్కడ వదిలి యెహోవాను ఆరాధించింది.
1SA 2:1 హన్నా దేవుని ఇలా కీర్తించెను: “నా హృదయం దేవునిలో పరవశించి పోతూవుంది. నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను. నా శత్రువులను నేను పరిహసించగలను. నా విజయానికి మురిసిపోతున్నాను.
1SA 2:2 యెహోవా వంటి మరో పరిశుద్ధ దేవుడు లేడు. నీవు తప్ప మరో దేవుడు లేడు! మన దేవుని వంటి బండ మరొకడు లేడు.
1SA 2:3 ఇక డంబాలు పలుకవద్దు! గర్వపు మాటలు కట్టి పెట్టండి! ఎందువల్లనంటే యెహోవా దేవునికి అంతా తెలుసు దేవుడు మనుష్యులను నడిపిస్తాడు, వారికి తీర్పు తీరుస్తాడు.
1SA 2:4 మహా బలశాలుల విల్లులు విరిగిపోతాయి! బలహీనులు బలవంతులవుతారు!
1SA 2:5 ఇది వరకు సమృద్ధిగా భోజనం ఉన్నావారు భోజనం కోసం పని చేయాలి ఇప్పుడు కాని ఇదివరకు ఆకలితో కుమిలేవారికి ఇప్పుడు సమృద్ధిగా భోజనం! గొడ్రాలుకు ఏడుగురు పిల్లలు! సంతానవతికి పుత్రనాశనంతో దుఃఖపాటు.
1SA 2:6 యెహోవా జనన మరణ కారకుడు! దేవుడు నరులను చావుగోతికి తోసివేయ గలడు. ఆయన వారిని మరల బతికించగలడు.
1SA 2:7 యెహోవా కొందరిని పేద వారిగా చేస్తాడు, మరికొందరిని ధనవంతులుగా చేస్తాడు. పతనానికీ, ఉన్నతికీ కారకుడు యెహోవాయే.
1SA 2:8 మట్టిలో ఉండే వారిని యెహోవా ఉన్నతికి తీసుకొని వస్తాడు ఆయన వారి దుఃఖాన్ని నిర్ములిస్తాడు. యెహోవా పేదవారిని ప్రముఖులుగా చేస్తాడు. యువ రాజుల సరసన కూర్చుండబెడ్తాడు. యెహోవా వారిని ఘనులతో బాటు ఉన్న తాసీనులను చేస్తాడు. పునాదుల వరకూ ఈ సర్వజగత్తూ యెహోవాదే! యెహోవా ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు.
1SA 2:9 యెహోవా తన పరిశుద్ధ ప్రజలను కాపాడుతాడు. వారు పడిపోకుండా ఆయన వారిని కాపాడుతాడు. కాని దుష్టులు నాశనం చేయబడతారు. వారు అంధకారంలో పడిపోతారు. వారి శక్తి, వారు జయించేందుకు తోడ్పడదు.
1SA 2:10 యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడు. సర్వోన్నతుడైన దేవుడు ప్రజల గుండెలదిరేలా పరలోకంలో గర్జిస్తాడు. సర్వలోకానికీ యెహోవా తీర్పు ఇస్తాడు! యెహోవా తన రాజుకు శక్తి ఇస్తాడు. ఆయన నియమించిన రాజును బలవంతునిగా చేస్తాడు.”
1SA 2:11 తరువాత ఎల్కానా తన కుటుంబంతో కలిసి రామాలో తన ఇంటికి వెళ్లిపోయాడు. బాలుడు మాత్రం యాజకుడైన ఏలీ పర్యవేక్షణలో షిలోహులో యెహోవా సేవలో వుండిపోయాడు.
1SA 2:12 ఏలీ కుమారులు చెడ్డవారు. వారు యెహోవాను లక్ష్యపెట్టలేదు.
1SA 2:13 యాజకులు ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాలో వారు చింత చేయలేదు. ప్రజలు వచ్చినప్పుడు యాజకులు ఇలా చేయాలి. ఒక వ్యక్తి బలి ఇచ్చిన ప్రతిసారీ ఆ మాంసాన్ని యాజకుడు ఒక కుండలో ఉడకబెట్టాలి. అప్పుడు యాజకుని సేవకుడు మూడు మొనలు గల ఒక కొంకి గరిటెతో రావాలి.
1SA 2:14 యాజకుని సేవకుడు గరిటెను ఉడుకుతోన్న బాణలిలో గుచ్చి తీయాలి. అప్పుడా గరిటె కొనలకు పట్టుకొని ఎంత మాంసం వస్తుందో అది మాత్రం యాజకునికి చెందుతుంది. బలులు ఇవ్వటానికి షిలోహుకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు యాజకులు చేయవలసిన విధి ఇదే.
1SA 2:15 కాని ఏలీ కుమారులు ఆ పద్ధతిని పాటించలేదు. కొవ్వును బలిపీఠం మీద దహించక మునుపే వారి సేవకులు బలులు ఇచ్చేవారి వద్దకు వెళ్లి “యాజకుని వంటకానికై కొంత మాంసం ఇవ్వమనీ, ఉడుకబెట్టిన మాంసం మీనుండి ఆయన తీసుకోడని అనేవారు.”
1SA 2:16 అయితే బలి ఇచ్చే వ్యక్తి గనుక కొవ్వును యధావిధిగా, “ముందు దహించిన తరువాత మీ ఇష్టం వచ్చినంత తీసుకోమని” అంటే యాజకుని సేవకుడు ఒప్పుకొనేవాడు కాదు. “అలా కాదు, ముందుగా మాంసం ఇవ్వండి. మీరు నాకు ఇవ్వక పోతే, బలవంతాన తీసుకోవలసి వస్తుంది!” అని బదులు చెప్పేవాడు.
1SA 2:17 ఈ విధంగా, యెహోవాకు అర్పించబడిన అర్పణలను వారు లక్ష్యపెట్టలేదని హొఫ్నీ, ఫీనెహాసులు వ్యక్తం చేసారు. ఇది చాలా చెడ్డపాపం.
1SA 2:18 కానీ సమూయేలు యెహోవాను సేవించాడు. సమూయేలు ఏఫోదు ధరించిన ఒక బాల సహాయకుడు.
1SA 2:19 ప్రతి సంవత్సరం సమూయేలు తల్లి అతనికై ఒక చిన్న అంగీ తయారుచేసి, తన భర్తతో షిలోహుకు బలి అర్పించేందుకు వెళ్లినపుడు ఆ అంగీని సమూయేలు కొరకు తీసుకొని వెళ్లేది.
1SA 2:20 ఎల్కానాను, అతని భార్యను ఏలీ ఆశీర్వదించేవాడు: “హన్నా ప్రార్థన ఫలితంగా పుట్టిన వానిని మరల యెహోవా సేవకై ఇచ్చారు గనుక అతని స్థానాన్ని భర్తీ చేసే విధంగా హన్నాద్వారా యెహోవా మీకు పిల్లలను కలుగజేయుగాక.” తర్వాత ఎల్కానా, హన్నా ఇంటికి వెళ్లిపోయారు.
1SA 2:21 దేవుని అనుగ్రహం వల్ల హన్నాకు క్రమేపీ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. బాలకుడైన సమూయేలు యెహోవా ఆలయములో దినదినము మంచి స్థితికి ఎదుగు చుండెను.
1SA 2:22 ఏలీ చాలా వృద్ధుడై పోయాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులందరి యెడల తన కుమారులు చేస్తున్న పనులను గూర్చి అతడు నిరంతరం వింటూనే వున్నాడు. పైగా సన్నిధి గుడారపు ద్వారం వద్ద పరిచర్యలు చేసే స్త్రీలతో తన కుమారులు శయనిస్తున్నారని కూడా ఏలీ విన్నాడు.
1SA 2:23 ఏలీ తన కుమారులతో, “మీరు చేసిన చెడ్డ కార్యాలను గూర్చి ఇక్కడ ప్రజలు నాతో చెప్పారు. మీరెందుకు ఈ చెడ్డపనులు చేస్తున్నారు?
1SA 2:24 నా కుమారులారా, ఈ చెడ్డపనులు చేయకండి. యెహోవా ప్రజలు మీ గురించి చెడుగా చెప్పుకుంటున్నారు.
1SA 2:25 ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, దేవుడు ఒక వేళ అతనికి సహాయం చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి యోహవా పట్ల అపచారం చేస్తే ఇక వానికి దిక్కెవరు?” అని అడిగాడు. అయినా ఏలీ కుమారులు తండ్రి సలహాను లెక్కచేయలేదు; కాబట్టి యెహోవా ఏలీ కుమారులను చంపటానికి నిర్ణయించాడు.
1SA 2:26 బాలుడైన సమూయేలు మాత్రం దేవుని దయదయందును, మనుష్యుల దయయందును పెరుగుతూ వచ్చాడు.
1SA 2:27 దేవుని మనిషి ఒకడు ఏలీ వద్దకు వచ్చాడు. ఆ దేవుని మనిషి ఇలా చెప్పాడు “ఈజిప్టు దేశంలో నీ పూర్వీకులు ఫరో ఇంటిలో బానిసలుగా ఉన్నప్పుడు వారికి నేను ప్రత్యక్షమయ్యాను.
1SA 2:28 ఇశ్రాయేలులో వున్న నీ పూర్వీకుని కుటుంబాన్ని నేను ఎన్నుకున్నాను. వారిని యాజకులుగా నియమించాను. నా బలిపీఠం వద్దకు వెళ్లి ధూపం వేయటానికి వారు ప్రత్యేక ఏఫోదు ధరించేలా కోరుకున్నాను. నీ తండ్రి కుటుంబీకులు ఇశ్రాయేలు ప్రజలు అర్పించిన బలి మాంసాన్ని తీసుకునేలాగున చేశాను.
1SA 2:29 అయితే నీవు బలులను, కాను కలను ఎందువలన గౌరవించుట లేదు? నీవు నాకంటే నీ కుమారులనే ఎక్కువ గౌరవిస్తున్నావు. నా కొరకు ఇశ్రాయేలు ప్రజలు తెచ్చిన మాంసాది అర్పణలలో మంచి వాటిని సంగ్రహించి క్రొవ్వెక్కి వున్నావు.”
1SA 2:30 ఆ దేవుని మనిషి ఇంకా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యోహోవా నీ కుటుంబీకులు, నీ తండ్రి కుటుంబీకులు ఆయనను శాశ్వతంగా సేవించే విధంగా అనుగ్రహించాడు. కాని యెహోవా ఇప్పుడిలా సెలవిస్తున్నాడు: ‘అది ఇంక ఎన్నటికీ జరుగదు! నన్ను సేవించే వారినే నేను గౌరవిస్తాను. నన్ను సేవించుటకు నిరాకరించే వారికి అనేక కష్ట నష్టాలు సంభవిస్తాయి.
1SA 2:31 మీ సంతానమంతటినీ నేను నాశనం చేసే సమయమాసన్నమవుతూ ఉంది. అప్పుడు నీ కుటుంబంలో పెరిగి పెద్దవారై ముసలితనాన్ని చూచువాడు ఒక్కడూ ఉండడు.
1SA 2:32 ఇశ్రాయేలు ప్రజలకు మంచి జరుగుతూ ఉండగా, నీ ఇంటి వద్ద మాత్రం కీడు జరుగుతూ ఉంటుంది. నీ కుటుంబంలో మాత్రం ముసలి వాడొకడును ఉండడు.
1SA 2:33 ఒక్కడిని మాత్రం నా బలి పీఠం వద్ద యాజకునిగా సేవచేయటానికి రక్షిస్తాను. కాని, అతడు మాత్రం యాజకునిగా తన కళ్లు మందగించి, బలం ఉడిగి పోయేంత వరకు జీవిస్తాడు. నీ సంతానం వారంతా కత్తివేటుకు బలైపోతారు.
1SA 2:34 నేను చెప్పినవన్నీ నిజమవబోతున్నట్లుగా నీకు ఒక నిదర్శనం ఇస్తున్నాను. నీ ఇరువురు కుమారులైన హొఫ్నీ మరియు ఫీనెహాసు ఒకే రోజు మరణిస్తారు.
1SA 2:35 నాకై నేనే ఒక నమ్మకమైన యాజకుని ఎంచుకుంటాను. ఈ యాజకుడు నేను చెప్పినట్లు విని, నా మాట ప్రకారం చేస్తాడు. ఈ యాజకుని వంశాన్ని నేను స్థిరపరుస్తాను. నేను అభిషిక్తునిగా చేసిన రాజు ఎదుట ఇతడు నా సేవ చేస్తాడు.
1SA 2:36 నీ వంశంలో మిగిలిన వాళ్లంతా ఈ యాజకుని ఎదుట వంగి కొంచెం రొట్టె కోసం లేక కొద్దిగా డబ్బుకోసం దీనంగా ఆశిస్తారు. “మాకు భోజనానికి ఆహారం ఉండేలా మాకు యాజకులుగా ఉద్యోగం ఇప్పించమని అడుగుతారు.’”
1SA 3:1 ఆ రోజుల్లో యెహోవా ఎవరితోనూ ప్రత్యక్షంగా తరచు మాట్లాడేవాడు కాడు. స్వప్న దర్శనాలూ చాలా తక్కువే. ఏలీ పర్యవేక్షణలో బాలకుడైన సమూయేలు యెహోవా సేవలో ఉన్నాడు.
1SA 3:2 ఏలీ కళ్లు బలిహీనమై ఇంచుమించు గుడ్డివాడైపోయాడు. ఒకరోజు అతడు పడుకుని వున్నాడు.
1SA 3:3 సమూయేలు యెహోవా పవిత్ర గుడారంలో పడుకున్నాడు. దేవుని పవిత్ర పెట్టె కూడా గుడారంలోనే వుంది. గుడారంలో యెహోవా దీపం ఇంకా వెలుగుతూనే వుంది.
1SA 3:4 యెహోవా సమూయేలును పిలిచాడు. “ఇక్కడే వున్నాను” అంటూ
1SA 3:5 (ఏలీ తనను పిలిచాడని అనుకొని) సమూయేలు ఏలీ వద్దకు పరుగున పోయాడు. “మీరు పిలిచారుగా అందుకే, వచ్చాను” అన్నాడు. “నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ. సమూయేలు పోయి పడుకున్నాడు.
1SA 3:6 దేవుడు మళ్లీ, “సమూయేలూ!” అని పిలిచాడు. సమూయేలు ఏలీ వద్దకు వెళ్లి, “నేనిక్కడే ఉన్నాను, నన్ను పిలిచారా?” అని అడిగాడు. “నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.
1SA 3:7 సమూయేలుకు ఇంకా యెహోవాతో అనుభవంలేదు. అతనితో యెహోవా ఇంతవరకూ ప్రత్యక్షంగా మాట్లాడి వుండలేదు.
1SA 3:8 మూడవసారి యెహోవా సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ వద్దకు వెళ్లి, “నేను ఇక్కడే వున్నాను; నన్ను పిలిచారా?” అని అన్నాడు. యెహోవా ఆ బాలుని పిలుస్తున్నాడని అప్పుడు ఏలీకి అర్థమయింది.
1SA 3:9 ఏలీ సమూయేలుతో, “నీవు పోయి పడుకో. మళ్లీ ఎవరైనా నిన్ను పిలిస్తే ‘యెహోవా, సెలవియ్యండి! నేను తమ దాసుణ్ణి. నేను వింటున్నాను’” అని చెప్పమన్నాడు. తరువాత సమూయేలు వెళ్లి పక్కమీద పడుకున్నాడు.
1SA 3:10 యెహోవా వచ్చి అక్కడ నిలిచాడు. “సమూయేలూ!, సమూయేలూ” అంటూ మునుపటిలా పిలిచాడు. “చెప్పండి, నేను మీ దాసుడను. నేను వింటున్నాను” అన్నాడు సమూయేలు.
1SA 3:11 యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “చూడు, నేను ఇశ్రాయేలులో ఒక కార్యాం నిర్వహించదలిచాను. దీనిని గురించి విన్న ప్రతి ఒక్కడూ ఆశ్చర్యపోతాడు.
1SA 3:12 నేను ఏలీకి, అతని కుటుంబానికి ఏది చేస్తానని చెప్పివున్నానో అదంతా అప్పుడు చేస్తాను. మొదటినుంచి చివరి వరకు అంతా చేసి తీరుతాను.
1SA 3:13 తన వంశాన్ని శాశ్వతంగా శిక్షిస్తానని ఏలీతో చెప్పాను. అలా ఎందుకు చేయదలిచానంటే తన కుమారులు దైవదూషణ చేసినట్లు, అకృత్యాలకు పాల్పడినట్లు ఏలీకి తెలుసు. అయినా వారిని అదుపులో పెట్టలేక పోయాడు.
1SA 3:14 అందువల్ల ఏలీ వంశం ఎన్ని బలులు, ధాన్యార్పణలు సమర్పించినా వారి పాపాన్ని మాపుకో లేరని నిశ్చితంగా చెప్పి ఉన్నాను.”
1SA 3:15 తెల్లవారేవరకూ సమూయేలు పక్కమీదే ఉన్నాడు. ఆ తరువాత లేచి దేవాలయ ద్వారం తెరిచాడు. దర్శనం గూర్చి ఏలీతో చెప్పటానికి సమూయేలు భయపడ్డాడు
1SA 3:16 కాని ఏలీ, “కుమారుడా సమూయేలూ” అని పిలిచాడు. “ఇక్కడే ఉన్నానయ్యా” అన్నాడు సమూయేలు.
1SA 3:17 “యెహోవా నీతో ఏమన్నాడు? నాతో ఏమీ దాచవద్దు. ఆయన నీకు చెప్పిన సమాచారంలో నీవు ఏమి దాచినా దేవుడు నిన్ను బాగా శిక్షిస్తాడు” అని అన్నాడు.
1SA 3:18 దానితో సమూయేలు ఉన్నది వున్నట్లు ఏలీకి ఏమీ దాచకుండా చెప్పాడు. అది విన్న ఏలీ, “ఆయన యెహోవా. ఆయనకు ఏది మంచిదనిపిస్తే అది చేయనీ” అన్నాడు.
1SA 3:19 సమూయేలు పెరుగుతూ వుండగా యెహోవా అతనికి తోడై ఉండెను. యెహోవా సమూయేలుతో చెప్పిన వర్తమానాలను ఎన్నడూ అబద్ధం కానీయలేదు.
1SA 3:20 అందువల్ల దానునుండి, బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు దేశమంతా సమూయేలును యెహోవా యొక్క నిజమైన ప్రవక్తగా గుర్తించింది.
1SA 3:21 షిలోహులో యెహోవా సమూయేలుకు దర్శనమిస్తూ వచ్చాడు. మాటలోనే సమూయేలుకు యెహోవా ప్రత్యక్షమయ్యేవాడు.
1SA 4:1 సమూయేలును గురించిన వార్త ఇశ్రాయేలు దేశమంతా వ్యాపించింది. ఏలీ పండుముసలి వాడయ్యాడు. ఏలీ కుమారులు యెహోవా ఎదుట దుష్ట కార్యాలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఫిలిష్తీయులంతా ఏకమై ఇశ్రాయేలు మీదికి యుద్ధానికి దిగారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ దాడిని ఎదుర్కోవటానికి కదలి వెళ్లి ఎబెనెజరు అనే చోట కాచుకొని యుండిరి. ఆఫెకు అనే చోట ఫిలిష్తీయులు బసచేశారు.
1SA 4:2 ఫిలిష్తీయులు దాడికి బారులుతీరి నిలువగా యుద్ధం మొదలయింది. యుద్ధంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించి ఇశ్రాయేలు సైన్యంలో సుమారు నాలుగు వేలమంది సైనికులను చంపివేశారు.
1SA 4:3 ఇశ్రాయేలు సైన్యం తమ స్థలాలకు వచ్చారు. వారి నాయకులు, “యెహోవా ఎందువల్ల తమకు ఫిలిష్తీయుల చేతుల్లో ఓటమి కలిగించాడని ఆలోచించారు. వారు తమ యెహోవా ఒడంబడిక పెట్టెను షిలోహునుండి తీసుకుని రావాలని నిర్ణయించారు. ఈ విధంగా యెహోవా మనతో యుద్ధ భూమికి వస్తాడు. ఆయన మన శత్రువు లబారినుండి మనల్ని రక్షిస్తాడు” అని అనుకొన్నారు.
1SA 4:4 ఆ విధంగా అనుకొని షిలోహుకు మనుష్యులను పంపారు. వారు సర్వశక్తిమంతుడైన యెహోవా ఒడంబడిక పెట్టెను తీసుకుని వచ్చారు. పెట్టెపైన కెరూబులు ఉన్నారు. మరియు యెహోవా కూర్చొనే సింహాసనంలా వారు ఉన్నారు. ఏలీ కుమారులు హొఫ్నీ మరియు ఫీనెహాసు ఆ పెట్టెతో వున్నారు.
1SA 4:5 యెహోవా ఒడంబడిక పెట్టె యుద్ధస్థలంలోనికి రాగానే ఇశ్రాయేలు సేనలు పొంగివచ్చే సంతోషంతో భూమి అదిరేలా కేరింతలు పెట్టారు.
1SA 4:6 ఫిలిష్తీయులు ఈ కేకలు విని, “హెబ్రీయుల స్థలములో ఎందుకీ కలకలం?” అని అనుకోసాగారు. అప్పుడు వారు యెహోవా పవిత్రపెట్టె హెబ్రీయుల శిబిరములోకి వచ్చినదని కనుగొన్నారు.
1SA 4:7 ఫిలిష్తీయులు భీతి చెందారు. “హెబ్రీ శిబిరములోకి దేవుడు వచ్చాడు. మనకు సంకట కాలం వచ్చింది. ఇలా ఇదివరకెన్నడూ జరుగలేదు!
1SA 4:8 మనం వ్యాకుల పాటు చెందియున్నాము. ఆ మహా దేవుని నుండి మనలను రక్షించేవారెవరు? ఈజిప్టువాళ్లను గతంలో అనేక రోగాలకు, దారుణ శిక్షలకు గురిచేసి వారిని అష్టకష్టాలపాలు చేసినవాడు ఈ దేవుడే.
1SA 4:9 అయినను ఫిలిష్తీయుసోదరులారా, ధైర్యంగా ఉండండి. లెండి. వీరకిశోరాలై పోరాడండి! గతంలో హెబ్రీయులు మన బానిసలు. కాబట్టి వీరాధివీరులై పోరాడండి. లేదా మీరు హెబ్రీయులకు బానిసలై పోయే ప్రమాదం వుంది” అంటూ ఫిలిష్తీయుల నాయకులు సైనికులను ఉత్తేజపరిచారు.
1SA 4:10 ఫిలిష్తీయులు వీరోచితంగా పోరాడి ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించారు. ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కడూ తన గుడారానికి పారిపోయాడు. ఇది వారికి ఘోర పరాజయం. ముప్పది వేలమంది ఇశ్రాయేలు సైనికులు చనిపోయారు.
1SA 4:11 దేవుని పవిత్ర పెట్టెను ఫిలిష్తీయులు పట్టుకుపోయారు. ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హొఫ్నీ మరియు ఫీనెహాసు చనిపోయారు.
1SA 4:12 అదేరోజు బెన్యామీను వాడొకడు యుద్ధ భూమినుండి పారిపోయాడు. సంభవించిన ఈ గొప్ప విషాదానికి సూచనగా తన బట్టలు చించుకొని, నెత్తిన దుమ్ము చల్లుకొని షిలోహుకు వెళ్లాడు.
1SA 4:13 ఈ బెన్యామీనీయుడు షిలోహు వెళ్లేసరికి ఏలీ నగర ద్వారం దగ్గర ఒక ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. దేవుని పవిత్ర పెట్టె విషయంలో అతను కొంత గాభరాగా వున్నాడు. అందువల్ల అతనక్కడ కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. బెన్నామీనీయుడు పట్టణంలోనికి వెళ్లి ఈ దుర్వార్తను వెల్లడిచేసాడు. షిలోహు పట్టణమంతా ఒక్కతీరున గగ్గోలుపడి ఏడ్చింది.
1SA 4:14 ఏలీ 98 ఏండ్లు వయస్సుగల గుడ్డివానిగా ఉన్నాడు. కనుక అతడు ఏమీ చూడలేక పోయాడు. కాని, ఏడ్పుల ధ్వని ఏలీ విన్నాడు. “ఏమిటీ గొప్ప ఏడ్పుల ధ్వని?” అని ఏలీ అడిగాడు. బెన్యామీనీయుడు ఏలీ దగ్గరకు పరుగెత్తుకు వెళ్లి, జరిగినది అతనితో చెప్పాడు.
1SA 4:16 బెన్యామీనీయుడు తాను ఆ రోజు యుద్ధంనుండి పారిపోయి వచ్చినట్లు చెప్పాడు. “ఏమి జరిగిందో చెప్పు” అన్నాడు ఏలీ.
1SA 4:17 ఈ వార్త తెచ్చిన బెన్యామీనీయుడు ఏలీతో ఇలా చెప్పాడు: “ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు చిత్తుగా ఓడిపోయారు. వారిలో అనేకమంది సైనికులు చనిపోయారు. నీ ఇరువురు కుమారులూ చనిపోయారు. దేవుని పవిత్ర పెట్టెను ఫిలిష్తీయులు తీసుకునిపోయారు.”
1SA 4:18 ఏలీ వృద్ధుడు, స్థూలకాయుడు. బెన్యామీనీయుడు దేవుని పవిత్ర పెట్టెనుగూర్చి చెప్పగానే ఏలీ, ద్వారం దగ్గర ఉన్న తన ఆసనంనుండి వెనుకకుపడి, మెడవిరిగి, చనిపోయాడు. ఇశ్రాయేలీయులను 20 సంవత్సరాల పాటు ఏలీ నడిపించాడు.
1SA 4:19 ఏలీ కోడలు (ఫీనెహాసు భార్య) గర్భవతి. నెలలు బాగా నిండాయి. దేవుని పవిత్ర పెట్టె శత్రువుల చేత పడటం, తన మామ ఏలీ మరణం, తన భర్త ఫీనెహాసు మరణవార్తలు వినగానే ఆమెకు తీవ్రంగా పురుటినొప్పులు వచ్చాయి. ఆమె వంగిపోయి ప్రసవించేసింది.
1SA 4:20 ఆమె చావు ఘడియల్లో ఉండగా, “చింతపడకు, నీకు కొడుకు పుట్టాడు” అంటూ అక్కడ ఉన్న స్త్రీలు ఆమెను ఓదార్చారు. కానీ ఆమె ఏమీ పట్టించుకోకుండానే, “ఇశ్రాయేలు నుండి మహిమ తొలగిపోయింది!” అంటూ తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టింది.
1SA 4:21 తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టటానికి కారణం ఏమంటే, దేవుని పవిత్ర పెట్టె పరుల హస్తగతమయ్యింది; దానికి తోడు తన మామ, భర్త ఇద్దరూ చనిపోయారు.
1SA 4:22 ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను తీసుకొని పోయారు గనుకనే “ఇశ్రాయేలు నుండి మహిమ తొలగిపోయింది” అని ఆమె వాపోయింది.
1SA 5:1 ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎబెనెజరు నుంచి అష్డోదుకి తీసుకుని వెళ్లారు.
1SA 5:2 దేవుని పవిత్ర పెట్టెను వారు దాగోను దేవాలయంలోనికి తీసుకుని పోయి దాగోను విగ్రహం పక్కన వుంచారు.
1SA 5:3 అష్డోదు ప్రజలు ఆ మరునాడు తెల్లవారుఝామునే లేచి దాగోను విగ్రహం బోర్లపడి వుండటం చూశారు. యోహోవా దేవుని పవిత్ర పెట్టె ముందు దాగోను విగ్రహం పడిపోయి ఉంది. అష్డోదు ప్రజలు దాగోను విగ్రహాన్ని తిరిగి యధాస్థానంలో వుంచారు.
1SA 5:4 కాని మరునాటి ఉదయం అష్డోదు ప్రజలు వచ్చి చూడగా దాగోను విగ్రహం మళ్లీ పడిపోయివుంది. దాగోను దేవుని పవిత్ర పెట్టెముందు పడిపోయివున్నాడు. ఈసారి దాగోను తల, చేతులు విరిగిపోయ ఆలయ గుమ్మం మీద పడి ఉన్నాయి. దాగోను మొండెం మాత్రం ఒక్క ముక్కగా మిగిలింది.
1SA 5:5 అందువల్ల ఈ నాటికీ దాగోను యాజకులు గాని, ఇతరులుగాని అష్డోదులో దాగోను ఆలయం గడప తొక్కేందుకు నిరాకరిస్తారు.
1SA 5:6 అష్డోదు ప్రజలకు, వారి ఇరుగు పొరుగు గ్రామాల వారికి యెహోవా తీవ్రంగా శిక్ష విధించాడు. బహు కష్టాలపాలు చేశాడు. వారంతా శరీరం నిండా గడ్డలు కలిగి బాధపడ్డారు. వారి మీదికి ఎలుకల దండును పంపించాడు. వాళ్ల ఓడలలోను, పంట పొలాల్లోను ఎలుకలు విపరీతంగా తిరగటం ప్రారంభించాయి. నగర వాసులంతా భయభ్రాంతులయ్యారు.
1SA 5:7 అ ష్డోదు ప్రజలు అక్కడ జరుగుతున్నదంతా బాగా గమనించారు. “మనల్ని, మన దైవం దాగోనును బాగా శిక్షిస్తూవుంది గనుక, ఇశ్రాయేలు దేవుని పవత్ర పెట్టె ఇక ఏమాత్రం మనతో వుండరాదు.” అని అనుకున్నారు.
1SA 5:8 అష్డోదు ప్రజలు ఫిలిష్తీయుల పాలకులు ఐదుగురినీ ఒక్కచోటికి పిలువనంపారు. “ఇశ్రాయేలీయుల దేవుని పవిత్ర పెట్టె విషయంలో తాము ఏమి చేయాలని వారిని అడిగారు.” అది విన్న పాలకులు, “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించమనగా” వారలా చేశారు.
1SA 5:9 అలా ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించిన పిమ్మట, యెహోవా ఆ నగరాన్ని కూడా శిక్షించాడు. ప్రజలు భయభ్రాంతులయ్యారు. గాతులో చిన్న, పెద్ద అందరినీ కలవరపెట్టాడు. వారికి కూడ శరీరం నిండా కంతులు, గడ్డలు లేచేలా చేశాడు.
1SA 5:10 కనుక ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎక్రోనుకు పంపించారు. కానీ దేవుని పవిత్ర పెట్టె ఎక్రోనుకు చేరగానే అక్కడి ప్రజలు, “ఇశ్రాయేలు ప్రజల దేవుని పవిత్ర పెట్టెను మా ఎక్రోను నగరానికి ఎందుకు తీసుకుని వస్తున్నారు? మమ్ములనందరినీ మీరు చంపదలిచారా?” అంటూ అరవటం మొదలు పెట్టారు.
1SA 5:11 వారు ఫిలిష్తీయుల పాలకులనందరినీ ఒక్క చోటికి పిలిపించి “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టె మమ్మల్నీ, ప్రజలందరినీ చంపకముందే దానిని యధాస్థానానికి పంపించి వేయమన్నారు.” ఎక్రోనీయులు మిక్కిలి భీతి చెందియున్నారు. అక్కడ దేవుని దండన చాలా భయంకరంగా ఉంది.
1SA 5:12 చావగా మిగిలిన వారు శరీరంపై గడ్డలతో బాధపడ్డారు. ఎక్రోను ప్రజల అరుపులు ఆకాశాన్ని తాకు నట్లుగా ఉండెను.
1SA 6:1 దేవుని పవిత్ర పెట్టెను ఏడునెలలు ఫిలిష్తీయులు తమ దేశమందు ఉంచుకున్నారు.
1SA 6:2 ఫిలిష్తీయులు వారి పూజారులను, మాంత్రికులను పిలిచి, “యెహోవా పవిత్ర పెట్టెను మేము ఏమి చేయాలి? ఈ పెట్టెను తిరిగి దాని స్థానానికి పంపాలంటే ఏమి చేయాల్లో మాకు చెప్పండి” అని అడిగారు.
1SA 6:3 “మీరు ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను తిరిగి పంపదలచుకుంటే ఊరక పంపవద్దు. ఆ దేవుడు మీ పాపాలను క్షమించే విధంగా తగిన కానుకలతో పంపాలి. అప్పుడు మీరు స్వస్థపరచబడి పవిత్రపరచబడతారు. దేవుడు మిమ్మల్ని క్షమించి, మిమ్మల్ని శిక్షించటం మానివేయాలంటే మీరు ఇలా చేయాలి” అని ఆ పూజారులు, మాంత్రికులు చెప్పారు.
1SA 6:4 “తమను క్షమించాలంటే ఇశ్రాయేలు దేవునికి ఏమి కానుకలు పంపాలని” ఫిలిష్తీయులు అడిగారు. “ఫిలిష్తీ నాయకులు అయిదుగురు ఉన్నారు. (ఒక్కో పట్టణానికి ఒక్కో నాయకుడు.) మీ ప్రజలందరికీ, నాయకులకు ఒకటే సమస్య ఉంది. కనుక గడ్డల్లాంటి బంగారు ప్రతిరూపాలను మీరు చేయండి. మరియు ఎలుకల్లా కనబడే బంగారు ప్రతిరూపాలను మీరు చేయండి.
1SA 6:5 మరియు దేశాన్ని పాడుచేస్తోన్న ఎలుకల ప్రతిరూపాలు చేయండి. ఈ బంగారు ప్రతి రూపాలను ఇశ్రాయేలు దేవునికి వెలగా ఇవ్వండి. ఒకవేళ అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడు మిమ్మల్ని, మీ దేవుళ్లను, మీ దేశాన్ని శిక్షించటం మానివేస్తాడేమో.
1SA 6:6 ఈజిప్టు వాళ్లలా, ఫరోలా మొండిగా ఉండవద్దు. దేవుడు ఈజిప్టు వాళ్లను శిక్షించాడు. అందుకే ఈజిప్టువాళ్లు ఇశ్రాయేలువాళ్లను ఈజిప్టు విడిచి వెళ్లనిచ్చారు.
1SA 6:7 “మీరు ఒక కొత్త బండిని నిర్మించి, అప్పుడే ఈనిన రెండు ఆవులను తేవాలి. ఆ రెండు ఆవులను ఇదివరలో కాడికట్టి ఉండకూడదు. వాటిని ఆ బండికి కట్టండి. దూడలను ఇంటికి తీసుకుని వెళ్లి వాటిని గాటిలో ఉంచండి. వాటిని తల్లి ఆవుల వెనుక పోనీయవద్దు.
1SA 6:8 యెహోవా పవిత్ర పెట్టెను ఆ బండి మీద ఉంచండి. బంగారు ప్రతిరూపాలను ఒక సంచిలో వేసి పెట్టె పక్కన పెట్టండి. అవి దేవుడు మీ పాపాలను క్షమించగలందులకు మీరిచ్చే కానుకలు. పిమ్మట బండిని మార్గాన వెళ్లనివ్వండి.
1SA 6:9 బండిని కనిపెట్టి వుండండి. బండి గనుక ఇశ్రాయేలులో బేత్షెమెషు దిశగా వెళితే యెహోవా నిజంగా మనకీ భయంకర రోగం కలుగజేసినట్లు అవుతుంది. ఒకవేళ ఆవులు బేత్షెమెషువైపు పోకపోతే, మనల్ని శిక్షించింది ఇశ్రాయేలు దేవుడు కాదని మనం గ్రహించవచ్చు. మన జబ్బు మనకు ఏదో అలా వచ్చేసింది అని మనం భావించాలి” అని అన్నారు యాజకులు, మాంత్రికులు.
1SA 6:10 యాజకులు, మాంత్రికులు చెప్పిన రీతిగా ఫిలిష్తీయులు అంతా చేశాలు. దూడలున్న రెండు ఆవుల్ని తెచ్చి బండికి కట్టి, లేగదూడల్ని ఇంటివద్దనే వుంచారు.
1SA 6:11 ఫిలిష్తీయులు యెహోవా పవిత్ర పెట్టెను, మరియు బంగారు గడ్డలను ఎలుకల బంగారు ప్రతికూపాలను ఆ బండిమీద పెట్టారు.
1SA 6:12 ఆవులు తిన్నగా బేత్షెమెషువైపు వెళ్లాయి, ఆవులు అదేపనిగా అరుస్తూ బాటమీదే సాగి పోయాయి. అవి కుడికిగాని, ఎడమకిగాని తిరగలేదు. బేత్షెమెషు పొలిమేరవరకు ఫిలిష్తీయుల పాలకులు ఆవులను అనుసరించి వెళ్లారు.
1SA 6:13 లోయలో బేత్షెమెషు ప్రజలు ఆ సమయంలో తమ గోధుమ పంట కోస్తున్నారు. వారు తలలు పైకెత్తి చూసినప్పుడు పవిత్ర పెట్టె కనబడింది. మరల పెట్టెను చూడగలిగినందుకు వారు ఎంతో ఆనందపడిరి.
1SA 6:14 బేత్షెమెషు వాడైన యెహోషువ పొలంలోకి వచ్చి ఒక పెద్ద బండ వద్ద బండి ఆగింది. బేత్షెమెషు ప్రజలు బండిని నరికివేశారు. ఆవులను చంపి యెహోవాకు బలి అర్పించారు.
1SA 6:15 లేవీయులు యెహోవా పవిత్ర పెట్టెను క్రిందికిదించారు. బంగారు ప్రతిరూపాలున్న సంచిని కూడ వారు దించారు. ఆ రెండింటినీ లేవీయులు ఆ పెద్ద బండమీద వుంచారు. ఆ రోజు బేత్షెమెషు ప్రజలు దహన బలులను సమర్పించారు.
1SA 6:16 బేత్షెమెషు ప్రజలు చేసిన ఈ సంగతులంతా ఫిలిష్తీయుల పాలకుల ఐదుగురు జాగ్రత్తగా తిలకించి ఎక్రోనునకు ఆ రోజే వెళ్లిపోయారు.
1SA 6:17 ఈ విధంగా వారికి లేచిన గడ్డల ప్రతిరూపాలను బంగారంతో చేయించి ఫిలిష్తీయులు తమ పాప పరిహారంగా యెహోవాకు కానుకలు పంపారు. అదేమాదిరి బంగారు బొమ్మలను ఒక్కొక్కటి చొప్పున ఫిలిష్తీయుల పట్టణాలయిన అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోనులనుండి పంపారు.
1SA 6:18 ఫిలిష్తీయులు ఎలుకల బంగారు ప్రతిరూపాలను కూడ పంపారు. ఐదుగురు ఫిలిష్తీయుల పాలకుల అధీనంలో ఎన్ని పట్టణాలున్నాయో అన్ని బంగారు బొమ్మలను పంపారు ఈ ఫిలిష్తీయుల పట్టణాలలో చుట్టు ప్రాకారాలతో కట్టుదిట్టము చేయబడిన పట్టణాలు, వాటిక్రింద ఉన్న గ్రామాలు చేర్చబడ్డాయి. ఏ బండ మీదయితే బేత్షెమెషు ప్రజలు యెహోవా పవిత్ర పెట్టెను ఉంచారో ఆ పెద్ద బండ బేత్షెమెషువాసి యెహోషువ పొలంలో ఈనాటికీ సాక్షిగావుంది.
1SA 6:19 కాని బేత్షెమెషు ప్రజలు యెహోవా పవిత్ర పెట్టెను చూసినప్పుడు అక్కడ యాజకులు లేరు. అందువల్ల దేవుడు బేత్షెమెషు వారిలో డెబ్బదిమందిని చంపాడు. అంత కఠినంగా తమను దేవుడు శిక్షించినందుకు బేత్షెమెషు వారు దుఃఖించారు.
1SA 6:20 “ఈ యెహోవా పవిత్ర దేవుని ముందర నిలబడగల యాజకుడు ఎక్కడ? ఇక్కడ నుంచి ఈ పెట్టెను ఎక్కడికి తరలించాలి?” అని వారు యోచనచేశారు.
1SA 6:21 బేత్షెమెషు జనం కిర్యత్యారీము ప్రజలకు వర్తమానం పంపారు. “ఫిలిష్తీయులు యెహోవా పవిత్ర పెట్టెను తిరిగి తెచ్చారని, వచ్చి దానిని తమ నగరానికి తీసుకుని పోవలసినదని సందేశం పంపారు.”
1SA 7:1 కిర్యత్యారీము ప్రజలు వచ్చి యెహోవా పవిత్ర పెట్టెను తీసుకొని వెళ్లారు. కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటికి వారు యెహోవా పెట్టెను తీసుకొని వెళ్లారు. పెట్టె విషయంలో జాగ్రత్త పుచ్చు కొనేందుకు అబీనాదాబు కుమారుడగు ఎలియాజరును వారు ప్రత్యేక క్రమం ప్రకారం ఏర్పరిచారు.
1SA 7:2 కిర్యత్యారీములో ఆ పెట్టె ఇరువది సుధీర్ఘ సంవత్సరాలుండెను. ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ భక్తిశ్రద్ధలతో యెహోవా ఎదుట దుఃఖపడి ఆయనను వెదకటం మొదలు పెట్టారు.
1SA 7:3 ఇశ్రాయేలీయులనుద్దేశించి సమూయేలు ఇలా అన్నాడు: “మీ హృదయ పూర్వకంగా మీరంతా యెహోవా దగ్గరకు తిరిగి వస్తున్నట్లయితే, మీరు మీ అన్య దేవుళ్లను విడిచిపెట్టాలి. మీ అష్తారోతు దేవతా విగ్రహాలను విడిచి పెట్టాలి. మిమ్ములను మీరు యెహోవాకు పూర్తిగా సమర్పించుకోండి. ఆయననే ఆరాధించండి. అప్పుడాయన మిమ్మల్ని ఫిలిష్తీయుల బారినుండి తప్పిస్తాడు.”
1SA 7:4 అది విన్న ఇశ్రాయేలీయులు బయలు అష్తారోతు విగ్రహాలన్నిటినీ పారవేసారు. అప్పుడు ఇశ్రాయేలీయులంతా యెహోవాను మాత్రమే సేవించారు.
1SA 7:5 “ఇశ్రాయేలు వారంతా మిస్పావద్ద తప్పక సమావేశం కావాలి. అక్కడ వారి కోసం నేను యెహోవాను ప్రార్థిస్తాను” అని సమూయేలు వారితో చెప్పాడు.
1SA 7:6 ఇశ్రాయేలీయులు మిస్పావద్ద సమావేశం అయ్యారు. వారు నీళ్లు తెచ్చి యెహోవా ముందర పారపోసారు. (ఈ విధంగా వారు ఉపవాసం ప్రారంభించారు.) ఆ రోజు వారు ఏమీ తినకుండా ఉండి, వారి పాపాలు ఒప్పుకోవటం మొదలు పెట్టారు. “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము” అని వారు చెప్పారు. కనుక సమూయేలు ఇశ్రాయేలీయులకు ఒక నయాయమూర్తిగా సేవ చేయటం మిస్పాలో ప్రారంభించాడు.
1SA 7:7 ఇశ్రాయేలు ప్రజలు మిస్పావద్ద సమావేశమవుతున్నట్లు ఫిలిష్తీయులు విన్నారు. ఫిలిష్తీయుల పాలకులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి తరలి వచ్చారు. వారు వస్తున్నారని ఇశ్రాయేలీయులు విని, భయపడ్డారు.
1SA 7:8 వారు సమూయేలుతో “మా కొరకు ప్రభువైన దేవుని ప్రార్థించుట ఆపవద్దు. ఫిలిష్తీయుల బారినుండి మమ్మును రక్షించమని యెహోవాను వేడుము!” అని విన్నవించారు.
1SA 7:9 అప్పుడు సమూయేలు పాలుతాగుతున్న గొర్రెపిల్లను తీసుకుని దానిని పూర్తిగా యెహోవాకు దహన బలిగా దహించాడు. సమూయేలు ఇశ్రాయేలీయుల కోసం యెహోవాను ప్రార్థించాడు. యెహోవా అతనికి జవాబిచ్చాడు.
1SA 7:10 సమూయేలు బలి పశువును దహించుచున్నప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి సమీపిస్తూ ఉన్నారు. కానీ యెహోవా అకస్మాత్తుగా ఒక భయంకర ఉరుమును ఫిలిష్తీయుల వద్ద కలిగించాడు. ఆ ఉరుము ఫిలిష్తీయులను భయపెట్టగా వారు కలవరపడి చిందర వందర అయ్యారు. అప్పుడు సంభవించిన యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఓడించారు.
1SA 7:11 ఇశ్రాయేలు జనం మిస్పా నుండి బయటకు వచ్చి ఫిలిష్తీయులను అందిన వారిని అందినట్లు చంపుతూ బేత్కారు వరకూ తరుముకుంటూ పోయారు.
1SA 7:12 ఇదంతా జరిగిన తర్వాత సమూయేలు జ్ఞాపకార్థంగా మిస్పాకు, షేనుకు మధ్య ఒక ప్రత్యేక రాతిని నిలబెట్టాడు. దానికి సమూయేలు “సహాయ శిల” అని పేరు పెట్టి, “ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసాడు అని చెప్పాడు.”
1SA 7:13 ఫిలిష్తీయులు ఓడించబడ్డారు. మరల వారు ఇశ్రాయేలు దేశంలోనికి అడుగు పెట్టలేదు. సమూయేలు బతికినంత కాలం యెహోవా ఫిలిష్తీయులకు వ్యతిరేకంగానే వున్నాడు.
1SA 7:14 ఫిలిష్తీయులు ఇశ్రాయేలునుండి పట్టణాలను తీసుకున్నారు. ఎక్రోను నుండి గాతు వరకుగల ప్రాంతాల్లోని పట్టణాలను ఫిలిష్తీయులు తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ఆ పట్టణాలను తిరిగి గెలుచుకున్నారు. మరియు ఈ పట్టణాల చుట్టు పక్కల ఉన్న స్థలాన్ని కూడా ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి నెలకొన్నది.
1SA 7:15 సమూయేలు తన జీవిత కాలమంతా న్యాయమూర్తిగా ఇశ్రాయేలీయులను నడిపించాడు.
1SA 7:16 ప్రతి సంవత్సరం సమూయేలు దేశవ్యాప్తంగా సంచారం చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు చెబుతూ ఒక స్థలంనుండి మరో స్థలానికి వేళ్లేవాడు. బేతేలు, గిల్గాలు, మిస్పాకు అతడు వెళ్లాడు. కనుక ఈ స్థలాలన్నింటిలో అతడు ఇశ్రాయేలీయులకు తీర్పు చెబతూ, వారిని పాలించాడు.
1SA 7:17 కానీ సమూయేలు తన ఇల్లు ఉన్న రామకు తిరిగి వెళ్లేవాడు. రామాలో వున్న ప్రజలను కూడ సమూయేలు పాలిస్తూ, తీర్పు చెప్పేవాడు. రామాలో యెహోవాకు ఒక బలిపీఠాన్ని సమూయేలు నిర్మించాడు.
1SA 8:1 సమూయేలు వృద్ధుడయిన పిమ్మట తన కుమారులను ఇశ్రాయేలీయులకు న్యాయాధి పతులుగా నియమించాడు.
1SA 8:2 సమూయేలు మొదటి కుమారుని పేరు యోవేలు. రెండవవాని పేరు అబీయా. వారిద్దరూ బెయేర్షెబాలో న్యాయాధిపతులు.
1SA 8:3 కాని సమూయేలు కుమారులకు తండ్రి నడవడి రాలేదు. యోవేలు, అబీయా, ఇద్దరూలంచం ద్వారా ధన సంపాదనకు పాల్పడినారు. తమ తీర్పులను తారుమారు చేయటానికి ప్రజలను మోసంచేసి రహస్యంగా లంచాలు తీసుకునేవారు.
1SA 8:4 కావున ఇశ్రాయేలు పెద్దలంతా (నాయకులు) సమూయేలును కలుసుకొనుటకు రామా వెళ్లారు.
1SA 8:5 వారు సమూయేలుతో, “నీవు వృద్ధుడవు. పైగా నీ కుమారులు నీ మాదిరిని వెంబడించుట లేదు. కాబట్టి అన్ని రాజ్యాల మాదిరిగా మమ్ములను పాలించటానికి కూడ ఒక రాజును ఇయ్యి” అని అన్నారు.
1SA 8:6 ఇది తప్పు అని సమూయేలు తలచాడు. కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థించాడు.
1SA 8:7 యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “ప్రజలు ఏమి చెపితే దానిని నీవు పాటించు. వారి రాజుగా ఉండేందుకు వారు నన్ను తిరస్కరించారు గాని నిన్ను కాదు.
1SA 8:8 వారు ఎప్పటిలాగే ప్రవర్తిస్తున్నారు. నేను వారిని ఈజిప్టునుంచి రక్షించినప్పుడు, వారు నన్ను వదిలి ఇతర దేవుళ్లను పూజించారు. నీ పట్ల కూడా వారిప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు.
1SA 8:9 అయినా నీవు ప్రజలు చెప్పిన దానిని పాటించు. కాని వారికి ఒక హెచ్చరిక చెయ్యి. రాజు వారికి ఏమి చేస్తాడో ఒకసారి వివరించి చెప్పాలి.”
1SA 8:10 రాజుకొరకు అడుగుతున్న ప్రజలకు సమూయేలు సమాధాన మిచ్చాడు. యెహోవా సెలవిచ్చిన విషయమంతా సమూయేలు ప్రజలకు ఇలా వివరంగా చెప్పాడు:
1SA 8:11 “మిమ్మల్ని పాలించేందుకు మీకు గనుక ఒక రాజు ఉంటే అతడు ఇలా చేస్తాడు: అతడు మీ కుమారులను తనకు సేవ చేసేటట్లు బలవంతంచేస్తాడు. అతడు వారిని బలవంతంగా సైనికులుగా చేస్తాడు. వారిని తన రథాలలో, అశ్వదళాలలో పని చేయిస్తాడు. మీ కుమారులు రాజు రథానికి ముందు పరుగెత్తే సంరక్షకులు అవుతారు.
1SA 8:12 “రాజు మీ కుమారులలో కొంతమందిని వేయిమంది మీద అధికారులుగాను, ఏబదిమంది మీద అధికారులుగాను చేస్తాడు. మీ సంతతిలో మరికొంత మందిని రాజు తన భూమిని సాగు చేయుటకు, మరికొంత మందిని పంట కోయుటకు నియమిస్తాడు. “ఇంకా కొంతమందిని యుద్ధ పరికరాలను, ఆయుధాలను తయారు చేసేందుకు, ఆయన రథాలకు కావలసిన వస్తుసామగ్రిని సమకూర్చటానికి రాజు వినియోగిస్తాడు.”
1SA 8:13 “ఈ రాజు మీ కుమార్తెలను కూడా తీసుకుని, వారిలో కొంతమందిని అత్తరులు చేసేందుకు, మరికొంత మందిని ఆయన ఆహార పదార్థాలు తయారు చేయటానికి వినియోగిస్తాడు.
1SA 8:14 “ఈ రాజు మీ భూములలో శ్రేష్ఠమైన వాటిని, ద్రాక్షాతోటలను, ఒలీవ తోటలను తీసుకుంటాడు. వాటిని తన అధికారులకు, సేవకులకు ఇస్తాడు.
1SA 8:15 మీ పంటలోను, ద్రాక్ష దిగుబడిలోను పదవవంతు ఆయనతీసు కుంటాడు. ఈ పదవ భాగాన్ని రాజు తన అధికారులకు, సేవకులకు ఇస్తాడు.
1SA 8:16 “ఈ రాజు మీ సేవకులను, పనిపిల్లలను కూడ తీసుకుంటాడు. మీకున్న మంచి మంచి పాడి పశువులను, గాడిదలను కూడా తీసుకుంటాడు. వారందరినీ తన స్వంత పనులకు వినియోగించుకుంటాడు.
1SA 8:17 ఆయన మీ గొర్రెల మందలలో పదవవంతు తీసుకుంటాడు. “అసలు మీరు కూడా ఈ రాజుకు బానిసలైపోతారు.
1SA 8:18 ఆ సమయం వచ్చినప్పుడు మీరెన్నుకున్న రాజు మూలంగా మీరు చాలా ఏడుస్తారు. కానీ యెహోవా మాత్రం ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు.”
1SA 8:19 సమూయేలు ఇంత చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా ఇలా అన్నారు: “కాదు! మమ్ములను ఏలటానికి మాకో రాజు కావాలి.
1SA 8:20 అప్పుడు మేము ఇతర రాజ్యాలతో సమాన ప్రతిపత్తిగల వారమవుతాము. మా రాజే మా నాయకుడు. యుద్ధంలో ఆయన మమ్మల్ని నడిపించి, మాకోసం ఆయన యుద్ధం చేస్తాడు.”
1SA 8:21 ప్రజలు చెప్పినదంతా విన్న సమూయేలు వారు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేసాడు.
1SA 8:22 “వారి మాట శిరసావహించమనీ, వారికో రాజును ఇవ్వమనీ” యెహోవా చెప్పాడు. అప్పుడు సమూయేలు అక్కడ సమావేశమైన ప్రజలకు “తమ పట్టణానికి వెళ్లిపొమ్మని చెప్పాడు.”
1SA 9:1 బెన్యామీను గోత్రమునకు చెందిన వారిలో కీషు చాలా ముఖ్యడు. అతను అబీయేలు కుమారుడు. అబీయేలు సెరోరు కుమారుడు. సెరోరు బెకోరతు పుత్రుడు. బెకోరతు బెన్యామీనీయుడైన అఫీయ కుమారుడు.
1SA 9:2 కీషుకు సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. సౌలు చాలా అందగాడు. సౌలుకెంటె ఎక్కువ అందగాడు మరొకడు లేడు. ఇశ్రాయేలీయులందరి లోనూ అతడు ఆజానుబాహుడు.
1SA 9:3 ఒకనాడు కీషు గాడిదలు తప్పిపోయాయి. కనుక “సేవకులలో ఒకరిని తీసుకుని గాడిదలను వెదకవలసిందిగా” కీషు తన కుమారుడైన సౌలుతో చెప్పాడు.
1SA 9:4 ఎఫ్రాయిము కొండలు, షాలిషా దేశమంతా వెదికారు. కాని సౌలు, అతని సేవకుడు గాడిదలను కనుక్కో లేకపోయారు. వారు షయలీము ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కూడా గాడిదలు లేవు. సౌలు బెన్యామీనీయుల దేశ ప్రాంతంలో కూడ తిరిగి వెదికాడు. అయినా అవి దొరకలేదు.
1SA 9:5 చివరికి సౌలు, అతని సేవకుడు కలసి సూపు పట్టణానికి వచ్చారు. సౌలు, “ఇంటికి వెళ్లి పోదామని తన సేవకులనితో అన్నాడు. తన తండ్రి గాడిదల విషయం మర్చిపోయి తమను గురించి కంగారు (చింత) పడతాడని” అన్నాడు సౌలు.
1SA 9:6 “మనము ఈ పట్టణంలోనికి వెళ్దాము. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రజలు అతనిని చాలా గౌరవిస్తారు, ఆయన చెప్పేది నెరవేరుతుంది. ఒకవేళ మనం యిప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిందీ ఆయన చెప్పగలడేమో” అని సేవకుడు సౌలుతో అన్నాడు.
1SA 9:7 “సరే మంచిది. మనం పట్టణంలోనికి వెళ్దాము. కానీ ఆ దైవజనుడికి మనము ఏమి ఇవ్వగలం? మన సంచుల్లో ఆహారం అయిపోయింది. ఆయనకు ఇచ్చేందుకు మన దగ్గర మరి ఏ కానుకలూ లేవు. అందుచేత మనము ఏమి ఇవ్వగలము?” అని సౌలు అన్నాడు.
1SA 9:8 “చూడండి, నా దగ్గర కొంత డబ్బు ఉంది. దానిని ఆ దైవజనుడికి ఇద్దాము. అప్పుడాయన మన ప్రయాణ విషయమై చెపుతాడు” అన్నాడు సేవకుడు.
1SA 9:9 “ఇది మంచి ఆలోచన! వెళదాం పద” అన్నాడు సౌలు. కనుక వారిద్దరూ కలసి దైవ జనుడుండే పట్టణం వైపు బయలుదేరి వెళ్లారు. సౌలు, “సేవకుడు ఆ పట్టణానికి కొండ ఎక్కి వెళ్తున్నారు. మార్గంలో వారు కొందరు యువతులను కలుసుకొన్నారు. వారు నీళ్లకోసం బయటికి వస్తున్నారు.”“దీర్ఘదర్శి ఇక్కడ ఉన్నాడా?” అని వారు ఆ యువతులను అడిగారు. (గతంలో ఇశ్రాయేలీయులు ప్రవక్తను, “దీర్ఘదర్శి” అని పిలిచేవారు. అందుచేత దేవుని నుండి వారు ఏదైనా అడిగి తెలుసుకోవాలనుకొంటే, “దీర్ఘదర్శి దగ్గరకు పోదాం పదండి” అనే వాళ్లు).
1SA 9:12 అది విన్న యువతులు, “అవును ఆ దీర్ఘదర్శి ఇక్కడే ఉన్నాడు. ఆయన ఈ వేళే పట్టణంలోకి వచ్చాడు. వీధిలో ఉన్నాడు ఆరాధనా స్థలంలో సమాధాన బలిలో పాలుపుచ్చుకొనేందుకు కొందరు ప్రజలు ఈ వేళ సమావేశం అవుతున్నారు.
1SA 9:13 మీరు పట్టణంలోకి ప్రవేశించగానే ఆయనను చూడగలరు. మీరు త్వరపడి వెళ్తే, ఆరాధన స్థలంలో ఆయన భోజనానికి వెళ్లక ముందే మీరు ఆయనను చూడగలుగుతారు. దీర్ఘదర్శి వచ్చి బలి పదార్థాలను ఆశీర్వదించే వరకూ ప్రజలు భోజనాలు మొదలు పెట్టరు. వెంటనే వెళ్తే మీరు ఆయనను చూడగలరు” అని ఆ కన్యకలు చెప్పారు.
1SA 9:14 సౌలు, అతని సేవకుడు పట్టణానికి వెళ్లారు. పట్టణంలోకి వెళ్లగానే వారు సమూయేలును చూసారు. ఆరాధనకు వెళ్లే నిమిత్తం సమూయేలు పట్టణంలోనుండి బయటకు వస్తూ వారికి ఎదురయ్యాడు.
1SA 9:15 ఒకరోజు ముందు యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు:
1SA 9:16 “రేపు ఇంచుమించు ఇదే సమయానికి నేను నీ వద్దకు ఒక వ్యక్తిని పంపుతాను. అతడు బెన్యామీనువాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకునిగా ఉండేందుకు నీవు అతనిని అభిషేకించాలి నా ప్రజల బాధ నేను గమనించాను. నా ప్రజల రోదన నేను విన్నాను గనుక ఫిలిష్తీయుల బారినుండి నా ప్రజలను అతడు రక్షిస్తాడు.”
1SA 9:17 సమూయేలు ప్రథమంగా సౌలును చూసినప్పుడు యెహోవా అతనితో, “నేను నీకు చెప్పిన వ్యక్తి ఇతడే; నా ప్రజలను పాలించువాడితడే” అన్నాడు.
1SA 9:18 సౌలు పట్టణ ద్వారం దగ్గర సమూయేలుకు కనబడెను. “దీర్ఘదర్శి ఇల్లెక్కడ?” అని సౌలు సమూయేలును అడిగాడు.
1SA 9:19 “నేను దీర్ఘదర్శిని. నాకు ముందుగా నడుస్తూ ఆరాధనా స్థలానికి వెళ్లు. ఈ రోజు నీవు, నీ సేవకుడు నాతో కలిసి భోజనం చేయాలి. రేపటి ఉదయం నీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పి నిన్ను ఇంటికి పంపుతాను.
1SA 9:20 మూడు రోజులనుండి మీరు పోగొట్టుకున్న గాడిదలను గురించి బాధ పడవద్దు. అవి దొరికాయి. ఇప్పుడు ఇశ్రాయేలు కోరుకుంటున్నది ఎవరిని? నీ తండ్రి కుటుంబాన్ని కదా?” అన్నాడు సమూయేలు.
1SA 9:21 అది విన్న సౌలు, “నేను బెన్యామీను వంశానికి చెందిన వాడిని! ఇశ్రాయేలు అంతటిలో నావంశం చిన్నదిగదా! అందులో నా ఇంటివారు అతి తక్కువ సంఖ్యలో వున్నారే! అలాంటి నన్ను ఇశ్రాయేలు కోరుతూ వుందని ఎందుకు చెబతున్నావు?” అని అడిగాడు.
1SA 9:22 అప్పుడు సమూయేలు సౌలును, అతని సేవకుని భోజనాలు పెట్టే చోటికి తీసుకుని వెళ్లాడు. భోజనాల బల్లవద్ద సౌలుకి, అతని సేవకునికి ప్రముఖ స్థానాలను సమూయేలు ఇచ్చాడు. భోజనాల స్థలంలో సమాధాన అర్పణలో పాలుపుచ్చుకొనేందుకు సుమారు ముప్పది మంది ఆహ్వానించబడ్డారు.
1SA 9:23 వంటవానితో సమూయేలు, “నేను నీకిచ్చిన మాంసాన్ని తీసుకునిరా. ప్రత్యేకంగా భద్రపర్చమని నీతో చెప్పిన మాంస భాగం అది” అన్నాడు.
1SA 9:24 వంటవాడు తొడ మాంసాన్ని తెచ్చి సౌలు ముందు బల్లమీద పెట్టాడు. అప్పుడు సమూయేలు, ఆ మాంసం అతని కోసం ప్రత్యేకించబడిందని సౌలుతో చెప్పాడు. ఈ ప్రత్యేకమైన సందర్భానికోసం అతని కొరకే ఈ మాంసం భద్రపర్చబడింది. కనుక సౌలును దాన్ని స్వీకరించుమని సమూయేలు చెప్పాడు. కావున సౌలు ఆ రోజు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.
1SA 9:25 భోజనాలు అయిన తరువాత వారు ఆరాధనా స్థలం నుండి క్రిందికి దిగి పట్టణంలోనకి వెళ్లారు. ఒక మిద్దెమీద సౌలుకు పడక ఏర్పాటు చేసారు.
1SA 9:26 మరునాడు అక్కడ సౌలు నిద్రపోయాడు. తెల్లవారుఝామున సమూయేలు లేచి మిద్దెమీద ఉన్న సౌలును మేల్కొలిపాడు. “బయల్దేరు, నిన్ను నీ దారిని నేను పంపిస్తాను” అన్నాడు సమూయేలు. సౌలు లేచి సమూయేలుతో కలిసి బయటికి వెళ్లాడు.
1SA 9:27 సౌలు, అతని సేవకుడు సమూయేలుతో కలిసి ఊరి బయటకు రాగానే సమూయేలు సౌలును పిలిచి, “నీ సేవకుణ్ణి మనకు ముందు నడుస్తూ వుండ మని చెప్పు. నేను నీకు చెప్పాల్సిన దేవుని సందేశం ఒకటి ఉంది” అని చెప్పాడు.
1SA 10:1 సమూయేలు ఒక పాత్రలో ప్రత్యేక నూనె తీసుకుని సౌలు తలమీద పోసాడు. సమూయేలు సౌలును ముద్దు పెట్టుకొని, “యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నిన్ను నాయకునిగా ఉండేందుకు అభిషేకించాడు. నీవు దేవుని ప్రజలకు ఆధిపత్యం వహించాలి. చుట్టూరా వున్న శత్రువుల బారినుండి వారిని నీవు కాపాడతావు. యెహోవా తన ప్రజల మీద పాలకునిగా ఉండేందుకు నిన్ను అభిషేకించాడు. ఇది సత్యమని ఋజువు చేసే గుర్తు ఇది.
1SA 10:2 ఈ రోజు నీవు నా వద్దనుండి వెళ్లగానే బెన్నామీను సరిహద్దుల్లో సెల్సహు వద్దనున్న రాహేలు సమాధి దగ్గర నీవు ఇద్దరు వ్యక్తులను కలుస్తావు. ‘నీవు వెదకబోయిన గాడిదలు దొరుకుతాయి. నీ తండ్రి గాడిదలను గూర్చి చింత పడటం మానేసాడు. ఇప్పుడు ఆయన నీ విషయంలో చింతిస్తున్నాడు. నా కుమారుని సంగతి నేనేమి చేయాలి? అని ఆయన అంటున్నాడు’” అని ఆ ఇద్దరు మనుష్యలు నీతో అంటారు.
1SA 10:3 “ఆ తరువాత తాబోరు వద్ద సింధూర మహా వృక్షంవరకూ నీవు ఆగకుండా ప్రయాణం చేస్తావు. అక్కడ మళ్లీ ముగ్గురు మనుష్యులు నిన్ను కలుస్తారు. వారు బేతేలు పట్టణంలో దేవుని ఆరాధించటానికి వెళుతూఉంటారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను మోసు కొని వస్తాడు. రెండవ వానివద్ద మూడు రొట్టెలు ఉంటాయి. మూడవ వానివద్ద ఒక తిత్తినిండా ద్రాక్షారసం ఉంటుంది.
1SA 10:4 ఆ ముగ్గురు వ్యక్తులూ నిన్ను పలకరించి రెండు రొట్టెలు నీకు ఇస్తారు. ఆ రెండిటినీ వారినుండి నీవు తీసుకుంటావు.
1SA 10:5 తరువాత నీవు ఫిలిష్తీయుల కోటవున్న గిబియ-ఎలోహిముకు వెళతావు. నీవు ఆ పట్టణం దరిచేరగానే ఒక ప్రవక్తల గుంపు బయటకు రావటం నీవు చూస్తావు. వీరు ఆరాధనా స్థలంనుండి వస్తూ ఉంటారు. వీణలు, తంబూరా, వేణువు, తంతి వాయిద్యాలను ముందు వాయిస్తూ దేవుని గూర్చిన విషయాలు చెబుతూ వస్తారు.
1SA 10:6 యెహోవా ఆత్మ నీ మీదకు బలంగా వస్తుంది. నీలో గొప్ప పరివర్తనవస్తుంది. ఆ ప్రవక్తలతో పాటు నీవు కూడా దేవుని విషయాలు చెబతావు.
1SA 10:7 ఈ సూచనలన్నీ ఋజువయ్యాక, నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చును. దేవుడు నీకు తోడై ఉంటాడు.
1SA 10:8 “నాకంటె ముందుగా నీవు గిల్గాలుకు వెళ్లు. నేను తురువాత వచ్చి నిన్ను కలుస్తాను. అప్పుడు నేను దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తాను. కానీ, నీవు ఏడు రోజులు ఆగవలసి వుంటుంది. అప్పుడు నిన్ను కలిసి నీవు ఏమి చేయాలో చెబతాను” అన్నాడు.
1SA 10:9 సమూయేలును వదిలి సౌలు వెళ్లిపోవటానికి మరలగానే దేవుడు సౌలుకు హృదయ పరివర్తన కలుగచేసాడు. అతనికి చెప్పబడిన గుర్తులన్నీ ఆ రోజు నిజమయ్యాయి.
1SA 10:10 సౌలు, అతని సేవకుడు గిబియ-ఎలోహిం చేరగానే సౌలు కొంతమంది ప్రవక్తలను కలిసాడు. దేవుని ఆత్మ సౌలు మీదికి అతి శక్తివంతంగా దిగెను. మిగిలిన ప్రవక్తలతో కలసి సౌలుకూడ దేవుని విషయాలు చెప్పసాగాడు.
1SA 10:11 ఇదివరకు సౌలును ఎరిగిన ప్రజలు అతడు ఇతర ప్రవక్తలతో కలసి ప్రవక్తలా మాట్లాడటం చూసారు. వారంతా “కీషు కొడుకు సౌలుకు ఏమయ్యిందో ఏమో! సౌలుకూడా ప్రవక్తలలో ఒకడయ్యాడా?” అంటూ ఆశ్చర్యపోయారు.
1SA 10:12 గిబియ-ఎలోహిములో నివసిస్తున్న ఒకడు, “అవును, అతడు వారి నాయకుడిలా కనబడుతున్నాడు” అన్నాడు. అందుకే, “సౌలుకూడా ప్రవక్తల్లో ఒకడా?” అనే నానుడి ప్రసిద్ధికెక్కింది.
1SA 10:13 దేవుని విషయాలు ప్రవచించటం అయిన తర్వాత సౌలు తన ఇంటివద్ద ఉన్న ఆరాధనా స్థలం దగ్గరకు వచ్చాడు.
1SA 10:14 సౌలు తన సేవకుని కలిసి ఇంటికి వెళ్లగానే అతని పినతండ్రి, “ఎక్కడికి పోయారు” అని వారిని అడిగాడు. “గాడిదలను వెదటటానికి వెళ్లాము. అవి దొరకక పోయేసరికి సమూయేలును చూడటానికి వెళ్లాము.” అని సౌలు చెప్పాడు.
1SA 10:15 “సమూయేలు నీకు ఏమి చెప్పాడో దయచేసి నాకు చెప్పు” అన్నాడు సౌలు పినతండ్రి.
1SA 10:16 “గాడిదలు దొరికినట్లు వెల్లడి చేశాడని సౌలు అన్నాడు.” అంతేగాని రాజ్యాన్ని గురించి సమూయేలు చెప్పినదేదీ సౌలు తన పినతండ్రికి చెప్పలేదు.
1SA 10:17 మిస్పావద్ద యోహోవాను కలుసుకొనేందుకు ఇశ్రాయేలీయులంతా సమావేశం కావాలని సమూయేలు పిలుపునిచ్చాడు.
1SA 10:18 సమూయేలు ఇలా అన్నాడు: “నేను ఇశ్రాయేలును ఈజిప్టునుంచి బయటకు తీసుకుని వచ్చాను. ‘నేను మిమ్మల్ని ఈజిప్టు బంధంనుండి విడుదల చేశాను. మిమ్మల్ని బాధించటానికి ప్రయత్నించిన ఇతర రాజ్యాలనుండి కూడా మిమ్మల్ని రక్షించాను.’ అని ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు చెప్పాడు:
1SA 10:19 మళ్లీ ఇశ్రాయేలీయులతో సమూయేలు ఇలా అన్నాడు: ‘మీ అందరి కష్టనష్టాల నుండి మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తూనే వున్నాడు. కానీ నేడు మీరు మీ దేవుని తిరస్కరించారు. మిమ్మల్ని పాలించటానికి మీకో రాజు కావాలని అడుగుతున్నారు.’ సరే. రండి! మీమీ వంశాల వారీగా, కుటుంబాల వారీగా దేవుని ముందర నిలబడండి.”
1SA 10:20 ఇశ్రాయేలు వంశాల వారినందరినీ సమూయేలు ఒక చోట చేర్చాడు. వారిలో బెన్యామీను వంశం ఎన్నుకోబడింది.
1SA 10:21 బెన్యామీను వంశంలో వున్న కుటుంబాల వారందరినీ గుంపు గుంపుగా వరుసగా నడిపించాడు. వాటిలో మథ్రీ కుటుంబం ఎన్నుకోబడింది. మరల మథ్రీ కుటుంబంలోని వారందరినీ వరుసుగా నడిపించాడు. వారిలో కీషు కుమారుడు సౌలు ఎంపిక చేయబడ్డాడు. సౌలును చూడాలని వచ్చిన ప్రజలు అతనికోసం వెదుకగా అతడు కపిరించలేదు.
1SA 10:22 “ఆ మనిషి ఇక్కడ ఉన్నాడా?” అని ప్రజలు అడిగారు. “సౌలు సామానుల వెనుక దాగి ఉన్నాడని” యెహోవా చెప్పాడు.
1SA 10:23 జనం పరుగెత్తుకుంటూ పోయి సామాన్ల వెనుక దాగుకొని ఉన్న సౌలును తీసుకుని వచ్చారు. సౌలు వారందరిలో నిలబడి ఉన్నపుడు అతను అందరికంటె ఎత్తుగా, ఆజానుబాహుడుగా కనబడ్డాడు.
1SA 10:24 “ఇదిగో చూడండి, యెహోవా ఎంపిక చేసిన మనిషి, ప్రజలలో సౌలువంటివాడు ఒక్కడూ లేడు.” అని సమూయేలు ప్రజలందరితో అన్నాడు. అప్పుడు ప్రజలు, “రాజు దీర్ఘకాలం జీవించునుగాక!” అని అరిచారు.
1SA 10:25 నూతన రాజ్యంలో నిబంధనావళిని సమూయేలు ప్రజలకు వివరించాడు. రాజ్యపరిపాలన నియమాలను, నిబంధనలను ఒక పుస్తకంలో రాసి సమూయేలు యెహోవా ముందర ఉంచాడు. అలా చేసి సమూయేలు ప్రజలను తమ తమ ఇండ్లకు వెళ్లమన్నాడు.
1SA 10:26 సౌలు గిబియాలో వున్న తన ఇంటికి వెళ్లిపోయాడు. దేవుడు అక్కడ వున్న ధైర్యవంతుల హృదయాలను ప్రేరేపించాడు. ఈ ధీరులంతా సౌలు వెంట వెళ్లారు.
1SA 10:27 కాని పనికిమాలినవారు కొందరు “ఈ వ్యక్తి మనలను ఎలా రక్షించగలడు” అని అంటూ సౌలును చులకనగా చేసి ఆయనకు కానుకలను పట్టుకు వెళ్లటానికి నిరాకరించారు. సౌలు ఏమీ పలకలేదు. అమ్మోనీయుల రాజైన నాహాషు గాదీయులను, రూబేనీయులను క్రూరంగా బాధిస్తూండేవాడు. వారిలో ప్రతి ఒక్కడి కుడి కంటినీ రాజు తీసివేస్తూండేవాడు. వారిని ఎవరైనా రక్షించటం కూడా అతడు సహించలేదు. అమ్మోనీయుల రాజైన నాహాషు యొర్దాను నదికి కుడి వైపున ఉన్న ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరి కుడి కన్నూ తోడివేసాడు. కాని ఏడువేలమంది అమ్మో నీయుల నుండి పారిపోయి యాబేష్గిలాదుకు చేరారు.
1SA 11:1 ఒకనెల గడిచంది. తరువాత అమ్మోనీయుడైన నాహాషు తన సైన్యంతో వచ్చి యాబేష్గిలాదు నగరాన్ని ముట్టడించాడు. “నీవు మాతో ఒడంబడిక చేసుకొంటే మేము నీ సేవ చేస్తాము” అని యాబేషు ప్రజలు నాహాషుతో చెప్పారు.
1SA 11:2 “మీలోని ప్రతి ఒక్కని కుడి కంటినీ తోడివేయనిస్తే మీతో సంధికి ఒప్పుకుంటానన్నాడు నాహాషు.” అలా చేస్తే నేను ఇశ్రాయేలునంతటినీ అవమాన పర్చి నట్లువుతుందన్నాడు.
1SA 11:3 అది విన్న యాబేషు ప్రజల నాయకులు “ఏడు రోజులు గడువు ఇవ్వమని అడిగారు. ఇశ్రాయేలు నలుమూలలకు దూతలను పంపుతామనీ, ఎవ్వరూ సహాయం చేయటానికి ముందుకు రాకపోతే లొంగిపోతామనీ” వారు నాహాషుతో అన్నారు.
1SA 11:4 వార్తాహరులు సౌలు నివసిస్తున్న గిబియాకు వెళ్లారు. అక్కడి ప్రజలకు ఆ వార్త అందజేశారు. ప్రజలు ఘోరంగా విలపించారు.
1SA 11:5 సౌలు అప్పుడే తన పొలములోని తన పశువుల దగ్గరనుండి ఇంటికి వస్తూనే ప్రజల రోదన విన్నాడు. “ప్రజలకేమయ్యింది? వారెందుకు విలపిస్తున్నారు?” అని అడిగాడు. అప్పుడు ప్రజలు యాబేషునుండి వచ్చిన దూతలు చెప్పినదంతా వినిపించారు.
1SA 11:6 అది వినగానే సౌలు మీదకు దేవుని ఆత్మ శక్తివంతంగా వచ్చి ఆవరించింది. అతనికి పట్టరాని కోపం వచ్చింది.
1SA 11:7 సౌలు ఒక జత కాడి ఎద్దులను తీసుకుని వాటిని నరికి ముక్కలు చేసి, వాటని ఆ వచ్చిన దూతలకు ఇచ్చి వాటిని ఇశ్రాయేలునలు మూలలకూ తీసుకొని వెళ్లమన్నాడు. వార్తహరులు ఆ ఎడ్ల మాంస ఖండాలను వాడ వాడలా తిప్పుతూ “సౌలును, సమూయేలును వెంబడించని వారి ఎడ్లన్నిటికీ ఇదే గతి పడుతుందని చాటి చెప్పారు.” యెహోవా భయం ప్రజలందరికీ ముంచు కొచ్చింది. వారంతా ఒక్కటై బయటికి వచ్చారు.
1SA 11:8 సౌలు బెజెకు వద్ద వారిని సమావేశపరచినప్పుడు అక్కడ మూడులక్షల మంది ఇశ్రాయేలీయులు, ముప్పదివేలమంది యూదా వారు ఉన్నారు.
1SA 11:9 “గిలాదులో ఉన్న యాబేషుకు వెళ్లండి. ఆ ప్రజలు రేపు మధ్యాహ్నంలోగా రక్షించబడుతారని ఆ ప్రజలతో చెప్పండి” అని సౌలు, అతని సైనికులు యాబేషునుండి వచ్చిన మనుష్యులకు చెప్పారు. సౌలు సమాచారాన్ని యాబేషు ప్రజలకు ఆ దూతలు తెలియజేసినప్పుడు వారు చాలా ఆనందపడ్డారు.
1SA 11:10 యాబేషు ప్రజలు, “రేపు లొంగిపోతామనీ, అప్పుడు వారిని తనకు ఇష్టం వచ్చినట్లు చేయవచ్చనీ” అమ్మోనీయుడైన నాహాషుకు తెలియజేశారు.
1SA 11:11 అ మరునాటి ఉదయం సౌలు తన సైన్యాన్ని మూడు గుంపులుగా విభజించాడు. సూర్యోదయానికి సౌలు సైన్యం అమ్మోనీయుల శిబిరాన్ని చేరింది. అమ్మోనీయుల గస్తీ తిరిగే జట్టు మారుతున్నప్పుడు సౌలు వారిమీద దాడి చేసాడు. సౌలు, అతని సైనికులు అమ్మోనీయులను ఓడించారు. చావగా మిగిలిన అమ్మో నీయులు చెల్లాచెదురై పోయారు. ఏ ఇద్దరూ కూడ కలిసి ఉండే అవకాశం వారికి లేకుండా పోయింది.
1SA 11:12 “సౌలు రాజుగా ఉండటానకి అంగీరకించని వాళ్లెవరు? వారిని ఇక్కడకి తీసుకొని రండి. వారిని చంపేస్తాము” అని ప్రజలు సమూయేలుతో అన్నారు.
1SA 11:13 “వద్దు. ఈ వేళ ఇశ్రాయేలీయులను రక్షించినవాడు యెహోవా. అందుచేత ఈ వేళ ఏ ఒక్కరూ చంపబడకూడదు” అని సౌలు చెప్పాడు.
1SA 11:14 “గిల్గాలుకు వెళదాం రండి. అక్కడ సౌలు రాజరికాన్ని తిరిగి కొనసాగేలా చేద్దాము” అన్నాడు సమూయేలు ప్రజలతో.
1SA 11:15 జనమంతా గిల్గాలుకు వెళ్లారు. అక్కడ యెహోవా ఎదుట వారు సౌలును మళ్లీ రాజుగా ఎన్నుకున్నారు. వారు యెహోవాకు సమాధాన బలులు కూడ అర్పించారు. సౌలు, ఇశ్రాయేలు ప్రజలు గొప్ప సంబరం జరుపుకొన్నారు.
1SA 12:1 సమూయేలు ఇశ్రాయేలు ప్రజలనుద్దేశించి ఇలా అన్నాడు: “మీరు నన్ను కోరినదంతా చేశాను. మీకు ఒక రాజు కావాలంటే ఇచ్చాను.
1SA 12:2 ఇప్పుడు మీకు నాయకత్వం వహించటానికి ఒక రాజు ఉన్నాడు. నేను తల నెరసి ముసలివాడనై పోయాను. నా కుమారులు మీతోనే ఉన్నారు. నా చిన్ననాటి నుంచీ మీకు నేను ఆధిపత్యం వహించాను.
1SA 12:3 ఇప్పుడు నేను మీ సమక్షంలోనే ఉన్నాను. నేనేదైనా తప్పు చేసివుంటే మీరు నాకు వ్యతిరేకంగా వాటిని దేవునికి, ఆయన ఏర్పరచిన రాజుకు చెప్పండి. నేను ఎవరి ఎద్దునే గాని, గాడిదనే గాని దొంగిలించానా? నేనెవరినైనా భాధించటంగాని, మోసగించటంగాని జరిగిందా? నేనెప్పుడైన డబ్బుగాని, ఒక జత చెప్పులుగాని తప్పుపని చేయటానికి తీసుకున్నానా? ఇటువంటి పనులేవైనా చేసి ఉంటే నేను వాటిని తిరిగి ఇచ్చి తప్పు సరిదిద్దుకుంటాను.”
1SA 12:4 “నీవు మమ్ములను మోసం చేయలేదు; బాధపెట్టనూ లేదు. నీవు ఎవరి వద్దా లంచాలు కూడ తీసుకోలేదు” అని ఇశ్రాయేలు జనం అన్నారు.
1SA 12:5 “యెహోవా, ఆయన ఎంపిక చేసిన రాజు కూడ ఈ రోజు మీరు చెప్పిన దానిని విన్నారు. మీరు నాలో ఏ తప్పూ కనుగొనలేదనే దానికి వారిద్దరూ సాక్షులు” అన్నాడు సమూయేలు. అంతట ప్రజలు, “అవును! ఇది సత్యం” అని చెప్పారు.
1SA 12:6 అప్పుడు ప్రజలనుద్దేశించి సమూయేలు, “ఆ దేవుడే సాక్షి. ఆయనే మోషేను, అహరోనును ఎంపికచేసాడు. మీ పూర్వీకులను ఈజిప్టు నుండి ఆయనే విముక్తులను చేసాడు.
1SA 12:7 మీరంతా ఇప్పుడు ఇక్కడ నిలబడండి. ఆ యెహోవా మీ కోసం, మీ పూర్వీకుల సంక్షేమం కోసం చేసిన పనులను వివరిస్తాను.
1SA 12:8 “యాకోబు వెళ్లిన తర్వాత ఈజిప్టు ప్రజలు ఆయన వంశీకుల జీవితాన్ని కష్టతరం చేశారు. కావున వారు యెహోవా సహాయం అర్థించారు. వారి మొర ఆలకించిన యెహోవా మోషేను, అహరోనును అక్కడికి పంపించాడు. వారిద్దరూ మీ పూర్వీకులను ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చి ఈ ప్రాంతానికి నడిపించారు.
1SA 12:9 “కానీ మీ పూర్వీకులు వారి దేవుడైన యెహోవాను మర్చిపోయారు. అప్పుడు యెహోవా వారిని హాసోరు పట్టణ సైన్యాధిపతి సీసెరాకు బానిసలయ్యేలా చేశాడు. తరువాత ఫిలిష్తీయులకు, మోయాబు రాజుకు కూడ యెహోవా వారిని బానిసలు కానిచ్చాడు. వారంతా మీ పూర్వీకులకు వ్యతిరేకంగా పోరాడారు.
1SA 12:10 అయితే మీ పూర్వీకులు సహాయంకోసం యెహోవాకు మొరపెట్టారు. ‘మేము పాపం చేసాము. మేము యెహోవాను విడిచిపెట్టి బయలు, అష్ఠారోతు అనే బూటకపు దేవతలను సేవించాము. అయితే ఇప్పుడు మమ్మల్ని మా శత్రువుల బారినుండి రక్షించు. మేము నిన్ను సేవిస్తాము’ అని చెప్పారు.
1SA 12:11 “యెరుబ్బయలు (గిద్యోను) బెదానను (బారాకు) యెఫ్తా, సమూయేలును పంపి, మీ చుట్టూ ఉన్న శత్రువులనుండి యెహోవా మిమ్మల్ని రక్షించాడు. మీరు క్షేమంగా జీవిస్తున్నారు.
1SA 12:12 కానీ అమ్మోనీయుల రాజైన నాహాషు మీమీద యుద్ధానికి రావటం మీరు చుసినప్పుడు, మీకు మీ దేవుడైన యోహోవా రాజుగా ఉన్నప్పటికీ ‘మమ్ము పాలించటానికి మాకు ఒక రాజు కావాలని’ మీరు కోరుకున్నారు!
1SA 12:13 మీరు ఎంపిక చేసుకొన్న రాజు మీరు కోరుకున్న రాజు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. మీమీద ఒక రాజును యెహోవా నియమించాడు.
1SA 12:14 మీరు యెహోవాను ఘనపరచి, ఆయనను సేవించాలి. ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మీరు పోరాడకూడదు. మరియు మీరు, మిమ్మల్ని పాలిస్తున్న రాజు, మీ దేవుడైన యోహోవాను వెంబడించాలి. మీరు ఆ పనులు చేస్తే, అప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు.
1SA 12:15 కానీ మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, ఆయన ఆజ్ఞలను తిరస్కరిస్తే, ఆయన మీకు వ్యతిరేకి అవుతాడు. ప్రభువు మిమ్మల్ని, మీ రాజును సర్వనాశనం చేస్తాడు.
1SA 12:16 “ఇప్పుడు మీరు నిశ్శబ్ధంగా, నిశ్చలంగా నిలబడండి మీ కళ్లముందే యెహోవా చేసే ఒక మహిమాన్విత కార్యం చూడండి.
1SA 12:17 ఇప్పుడు గోధుమ పంట కోతకు వచ్చింది. ఫెళఫెళమనే ఉరుములు, మెరుపులతో వర్షం కురిపించుమని నేను దేవుని ప్రార్థిస్తాను. అప్పుడు మీరు రాజు కావాలని అడిగి, యెహోవాపట్ల ఎంత పాపం చేశారో మీరే తెలుసుకుంటారు,” అని వివరంగా చెప్పాడు.
1SA 12:18 అలా చెప్పి, సమూయేలు యెహోవాను ప్రార్థించాడు. అదే రోజున యెహోవా ఉరుములతో కూడిన వర్షం పంపించాడు. దానితో యెహోవా అనిన, సమూయేలు అనిన ప్రజలకు విపరీతమైన భయం ఏర్పడింది.
1SA 12:19 ప్రజలు సమూయేలుతో, “నీ సేవకులమైన మాకోసం దేవుడైన యెహోవాను ప్రార్థించు. మమ్మల్ని చనిపోనీయవద్దు. మా పాపాల మూటకుతోడు రాజు కావాలని అడిగే దురాచారాన్ని కూడ సంతరించుకున్నాం” అని వాపోయారు.
1SA 12:20 భయపడవద్దని సమూయేలు వారికి ధైర్యం చెప్పాడు. “మీరు తప్పు చేసిన మాట నిజమే. అయినా యెహోవాకు దూరం కావద్దు. మీ హృదయ పూర్వకంగా యెహోవాకు సేవ చేయండి.
1SA 12:21 విగ్రహాలు వట్టి బొమ్మలే. అవి మీకు సహాయం చేయలేవు. కావున వాటిని పూజించవద్దు. విగ్రహాలు మీకు సహాయమూ చెయ్యలేవు, కాపాడనూలేవు. విగ్రహాలు కేవలం వ్యర్థము!
1SA 12:22 “అయితే యెహోవా తన ప్రజలను విడిచి పెట్టడు. యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొనేందుకు ఆనందించాడు. అందుచేత తనమంచి పేరుకోసం ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు.
1SA 12:23 కావున మీ కోసం ప్రార్థన చేయకుండా నేను మాని వేస్తే అది నా తప్పు అవుతుంది. ఒకవేళ నేను అలా మానివేస్తే యెహోవాకు విరుద్ధంగా పాపం చేసినవాణ్ణి అవుతాను. సరైన మంచి జీవన మార్గాన్ని నేను మీకు ప్రబోధిస్తాను.
1SA 12:24 అయితే మీరు యెహోవా ఎడల భయభక్తులతో ఉండాలి. మీ పూర్ణ హృదయంలో మీరు వాస్తవంగా ఆయనను సేవించాలి. ఆయన మీ కోసం చేసిన ఆశ్చర్యకరమైన పనులన్నీ జ్ఞాపకం చేసుకోండి!
1SA 12:25 మీరు మొండి వైఖరితో చెడుచేస్తూనే ఉంటే ఆయన మిమ్మల్నీ, మీ రాజునూ చీపురుతో పాచిని ఊడ్చి పారవేసినట్లు విసిరేస్తాడు” అని సమూయేలు వారికి వివరించి చెప్పాడు.
1SA 13:1 అప్పటికి సౌలు పరిపాలించటం మొదలు పెట్టి ఒక సంవత్సరం అయింది. అతడు రెండు సంవత్సరాలురు పాలించేసరికి
1SA 13:2 ఇశ్రాయేలునుండి మూడు వేల మందిని సైన్యానికి ఎంపిక చేశాడు. కొండల ప్రాంతమైన బేతేలు పట్టణం దగ్గర మిక్మషులో అతనితోకూడ రెండు వేలమంది ఉన్నారు. బెన్యామీనులోని గిబియాలో యోనాతానుతో ఒక వెయ్యిమంది ఉన్నారు. సైన్యంలో మిగిలిన వారిని సౌలు ఇంటికి పంపేశాడు.
1SA 13:3 యోనాతాను ఫిలిష్తీయులను గెబాలో ఉన్న వారి శిబిరం వద్దనే ఓడించాడు. ఇది విన్న ఫిలిష్తీయులు “హెబ్రీ జనం తిరుగుబాటు చేశారని” అరిచారు. “హెబ్రీ ప్రజలు జరిగినదంతా వినాలని” సౌలు అన్నాడు. ఇదంతా ఇశ్రాయేలు దేశమంతా చాటింపు వేసి చెప్పమని మనుష్యులను పురమాయించాడు సౌలు.
1SA 13:4 ఇశ్రాయేలీయులంతా ఈ వార్త విని, “సౌలు ఫిలిష్తీయులను ఓడించాడు గనుక వాళ్లు మనల్ని ఇప్పుడు మరింత అసహ్యించుకుంటారని” అన్నారు. సౌలును గిల్గాలు వద్ద కలుసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు పిలుపు వచ్చింది.
1SA 13:5 ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై దెబ్బ తీయటానికి సమాయత్తమయ్యారు. వారికి మూడు వేల రథాలు ఉన్నాయి. ఆరువేల మంది అశ్వదళ సైనికులు ఉన్నారు. సముద్ర తీరాన ఇసుక ఉన్నట్లుగా ఫిలిష్తీయుల సైన్యంకూడ లెక్కకు మించి ఉంది. వారంతా పోయి మిక్మషు వద్ద గుడారాలు వేసుకున్నారు. బేతావెనుకు తూర్పుగా మిక్మషు ఉంది.
1SA 13:6 ఇశ్రాయేలు ప్రజలు తాము చాలా విషమ స్థితిలో వున్నట్లు గమనించారు. వారు చిక్కులో పడ్డామని గుర్తించి వారంతా పారిపోయి కొండగుహల్లోను, బండ సందుల్లోను, పొదల్లోను దాక్కున్నారు. మరికొందరు రాతిబండల వెనుక, గోతులలోను, నూతులలోను దాక్కున్నారు.
1SA 13:7 కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు, గిలాదు ప్రాంతాలకు వెళ్లారు. కాని సౌలు గిల్గాలులోనే ఉన్నాడు. తన సైన్యంలోని వారంతా భయంతో వణకిపోయారు.
1SA 13:8 సమూయేలు గిల్గాలులో సౌలును కలుస్తానని చెప్పాడు. అందువల్ల సౌలు గిల్గాలులో ఏడు రోజులు ఉన్నాడు. కాని సమూయేలు రాలేదు. సైనికులు ఒక్కొక్కరే సౌలును వదిలి పోవటం మొదలు పెట్టారు.
1SA 13:9 “దహన బలులను, సమాధాన బలులను తన దగ్గరకు తీసుకుని రమ్మని” చెప్పాడు. అవి వచ్చిన పిమ్మట సౌలు దహన బలులు అర్పించాడు.
1SA 13:10 సౌలు దహనబలి అర్పించి ముగించే సరికి సమూయేలు వచ్చాడు. సౌలు ఆయనను కలుసుకొనేందుకు వెళ్లాడు.
1SA 13:11 సమూయేలు, “నీవు చేసిన పని ఏమిటి?” అని సౌలును అడిగాడు. అందుకు సౌలు, “మిక్మషు వద్ద ఫిలిష్తీయులు కూడుకొంటున్నారు. సైనికులేమో నన్ను విడిచిపెట్టేసి, ఒక్కొక్కరే వెళ్లిపోవటం నేను గమనించాను. నీవేమో సమయానికి ఇక్కడికి రాలేదు.
1SA 13:12 గిల్గాలు వద్ద ఫిలిష్తీయులు నా మీదకు వస్తారని నేననుకున్నాను. అప్పటికి నేను ఇంకా దేవుని సహాయం అర్థించియుండలేదు. అందువల్ల నేను బలవంతంగా దహనబలి అర్పించాను” అని చెప్పాడు.
1SA 13:13 అది విన్న సమూయేలు, “నీవు చాలా అవివేకంగా ప్రవర్తించావు! నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ నీవు పాటించలేదు. నీవు ఆయన ఆజ్ఞన పాటించివుంటే, ఆయన ఇశ్రాయేలు మీద నీ కుటుంబ పాలన ఎప్పటికీ కొనసాగేలా చేసేవాడు.
1SA 13:14 ఇప్పుడు నీ పాలన అంతం అవుతుంది. యెహోవాకు విధేయుడు కావాలని కోరేవాని కోసం యెహోవా చూశాడు. యెహోవా అతనిని కనుగొన్నాడు. యెహోవా అతనిని తన ప్రజలకు కొత్త నాయకునిగా ఎంపిక చేసాడు. నీవు యెహోవా ఆజ్ఞకు విధేయుడవు కాలేదు. కనుక యెహోవా కొత్త నాయకుని ఎంపిక చేసాడు!” అని చెప్పాడు.
1SA 13:15 అప్పుడు సమూయేలు బయల్దేరి గిల్గాలు విడిచి వెళ్లిపోయాడు. సౌలు, అతనితో మిగిలిన సైన్యం గిల్గాలు విడిచి బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు వెళ్లారు. తన వద్ద మిగిలిన సైన్యాన్ని సమీకరించుకొని చూస్తే సౌలు వద్ద ఆరువందల మంది మాత్రమే మిగిలారు.
1SA 13:16 సౌలు, అతని కుమారుడు యోనాతాను, మరియు సైనికులు బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు వెళ్లారు. ఫిలిష్తీయులు మిక్మషులో గుడారాలు వేసుకొనియుండిరి.
1SA 13:17 మెరుపు దాడులు చేసే మూడు దళాలు ఫిలిష్తీయుల శిబిరంనుంచి బయలుదేరాయి. ఒక దళం ఉత్తరంగా షూయాలు ప్రాంతంలో ఓఫ్రా మార్గంలో వెళ్లింది.
1SA 13:18 రెండవది వాయవ్య దిశగా బేత్ హోరోనుకు పోయే మార్గంలో వెళ్లింది. మూడవ దళం తూర్పున సరిహద్దు మార్గంలో వెళ్లింది. ఆ దారి అరణ్య దిశగా జెబోయిము లోయకు సమీపంగా ఉంది.
1SA 13:19 ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ ఇనుముతో ఏ వస్తువూ చేయలేరు. ఇశ్రాయేలులో కమ్మరి ఒక్కడూ లేడు. “(కమ్మరివాళ్లు ఉంటే) ఇశ్రాయేలీయులు కత్తులను ఈటెలను చేయించుకొనెదరు” అని ఫిలిష్తీయులు చెప్పుకొని కమ్మరి వాళ్లు లేకుండా చేసిరి.
1SA 13:20 ఇనుప వస్తువులను ఫిలిష్తీయులు మాత్రమే పదును పెట్టగలరు. అందుచేత ఇశ్రాయేలీయులు వారి నాగళ్లు, పారలు, గొడ్డళ్లు, లేక కొడవళ్లు గనుక పదును చేయాల్సివస్తే, వారు ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది.
1SA 13:21 నాగళ్లు, పారలు సాన బెట్టడానికి ఫిలిష్తీ కమ్మరులు 1/3 వంతు ఔన్సు వెండి పుచ్చుకొనేవారు. మరియు గునపాలు, గొడ్డళ్లు, మునికోల ఇనుప కొనలు సాన బెట్టటానికి వారు 1/6 వంతు ఔన్సు (వెండి) (అక్షరాలషెకెలులో మూడోవంతు) పుచ్చుకొనేవారు.
1SA 13:22 కనుక యుద్ధం రోజున సౌలు వెంట ఉన్న ఇశ్రాయేలు సైనికులు ఎవ్వరి వద్దా (ఇనుప) ఖడ్గాలు, ఈటెలు లేవు. సౌలుకు, అతని కుమారుడు యోనాతానుకు మాత్రమే ఇనుప ఆయుధాలు ఉన్నాయి.
1SA 13:23 మిక్మషు వద్ద కనుమను ఫిలిష్తీ సైనికదళం ఒకటి కాపలా కాస్తూ ఉంది.
1SA 14:1 సౌలు కుమారుడైన యోనాతాను తన ఆయుధాలు మోసే యువకుని పిలిచి “లోయ ఆవలి పక్కన వున్న ఫిలిష్తీయుల గుడారాల వద్దకు వెళదాము” అన్నాడు. కాని ఈ విషయం మాత్రం తన తండ్రికి చెప్పలేదు.
1SA 14:2 మిగ్రోనులో ఒక కొండ కొనలో ఒక దానిమ్మ చెట్టు క్రింద సౌలు కూర్చుని ఉన్నాడు. ఇది అక్కడ ఉన్న కళ్లానికి దగ్గర్లో ఉంది. సౌలుతోకూడ ఆరువందల మంది మనుష్యులు ఉన్నారు.
1SA 14:3 వారిలో ఒకడు అహీయా. ఈకాబోదు సోదరుడగు అహీటూబు కుమారుడు అహీయా. ఈకాబోదు ఫీనెహాసు కుమారుడు. ఫీనెహాసు ఏలీ కుమారుడు. షిలోహు పట్టణంలో యెహోవా యాజకునిగా అహీయా పని చేస్తున్నాడు. అతడు ఏఫోదు అనబడే పవిత్ర వస్త్రం ధరించాడు.
1SA 14:4 కనుమకు ఇరుప్రక్కలా నిటారైన బండ లున్నాయి. యోనాతాను ఆ కనుమగుండా ఫిలిష్తీయుల శిబిరమునకు వెళ్లాలని నిర్ణయించాడు. ఒక పక్కనున్న కొండ పేరు బొస్సేసు. రెండవ పక్కనున్న నిడుపు కొండ కనుమ పేరు సెనే.
1SA 14:5 ఒక బండ మిక్మషు వైపు ఉత్తరానికి ఉంది. మరొక బండ గిబియా వైపు దక్షిణంగా ఉంది.
1SA 14:6 యోనాతాను తన ఆయుధాలు మోసే యువకునితో వారి మీదికి వెళదాము రమ్మన్నాడు. “బహుశః యెహోవా మనకు సహాయం చేయవచ్చు. మనతో ఎక్కువ మంది వున్నారా, తక్కువమంది ఉన్నారా, అన్నది సమస్య కాదు. దేవుడు సంకల్పిస్తే ఇవేమీ అడ్డురావు విజయానికి” అన్నాడు యోనాతాను.
1SA 14:7 “మీ చిత్తమొచ్చినట్లు చేయండి. నేను ఎంతసేపూ నిన్ను కనిపెట్టుకొనే ఉంటాను” అన్నాడు ఆ యువసైనికుడు.
1SA 14:8 “అయితే, రా! ఫిలిష్తీయుల దగ్గరకు పోదాము. వారు మనలను చూసేలా వెళదాము.
1SA 14:9 వాళ్లు గనుక మనల్ని చూసి ‘తాము వచ్చే వరకూ ఆగండని’ అంటే, మనము అప్పడు ఎక్కడ వుంటే అక్కడే ఆగిపోదాము. వారి వద్దకు పోవద్దు.
1SA 14:10 కానీ ‘మా దగ్గరకు పైకి రండి’ అని ఫిలిష్తీయులు చెబితే, మనం వాళ్ల దగ్గరకు ఎక్కి పోదాము. ఎందుకంటే అది దేవుని నుండి వచ్చే గుర్తు గనుక. మనం వారిని ఓడించేలా యెహోవా చేస్తాడని దాని అర్థం.” అని యోనాతాను తన యువ సైనికునితో చెప్పాడు.
1SA 14:11 ఫిలిష్తీయులు వారిని చూసేలా యోనాతాను, అతని సహాయకుడు ఇద్దరూ కలిసి వెళ్లారు. వీరిని చూసిన ఫిలిష్తీయులు వారిలో వారు, “చూడండి! హెబ్రీ సైనికులు వారు దాగిన బొరియలనుండి బయటికి వస్తున్నారు!” అని అనుకున్నారు.
1SA 14:12 శిబిరంలో వున్న ఫిలిష్తీయులు వారిద్దరినీ చూసి, “మావద్దకు పైకి రండి. మీకు మంచి గుణపాఠం చెబతాము” అన్నారు. అది విన్న యోనాతాను తన సహాయకునితో, “నా వెనుకనే కొండ ఎక్కు. యెహోవా ఫిలిష్తీయులను ఇశ్రాయేలుకు అప్పగించాడు!” అని చెప్పాడు.
1SA 14:13 అప్పుడు యోనాతాను తన కాళ్లు, చేతులతో మీదికి ఎగబాకినాడు. భటుడు అతని వెనుకనే అనుసరించాడు. యోనాతాను మరియు అతని సహాయకుడు ఫిలిష్తీయులను ఎదుర్కొన్నారు. మొదటి వధయందు వారు ఇరవై మంది ఫిలిష్తీయులను అర ఎకరము నేల పొడవున చంపారు. యోనాతాను ఎదురుగా వచ్చిన వారితో పోరాడాడు. ఆయుధాలు మోసేవాడు అతని వెనుకనే వస్తూ చావకుండా గాయపడ్డవారిని చంపేసాడు.
1SA 14:15 ఫిలిష్తీయులంతా చాలా భయపడిపోయారు. మెరుపు దాడులను చేయగల దళంవారితో సహా శిబిరంలో ఉన్న వారంతా మిక్కిలిగా భయపడ్డారు. భూమి కూడ కంపించింది! వారు చాలా భయంతో వణకిపోయారు.
1SA 14:16 బెన్యామీను దేశంలోని గిబియా వద్ద ఉన్న సౌలు సైనికులు, ఫిలిష్తీ సైనికులు చెల్లాచెదురై పారిపోవటం చూశారు.
1SA 14:17 సౌలు తనతోకూడ ఉన్న సైన్యంతో “మనుష్యుల్ని లెక్కబెట్టండి. శిబిరాన్ని విడిచిపోయింది ఎవరో నేను తెలుసుకోవాలి” అన్నాడు. వారు లెక్క పెట్టి చూస్తే, అక్కడ లేని వారు యోనాతాను, అతని ఆయుధము మోసేవాడు.
1SA 14:18 “దేవుని పవిత్ర పెట్టెను తెమ్మని” యాజకుడైన అహీయతో సౌలు చెప్పాడు. (ఆ సమయంలో పవిత్ర పెట్టె ఇశ్రాయేలీయుల వద్ద ఉంది).
1SA 14:19 సౌలు యాజకునితో మాట్లాడుతూ వుండగానే ఫిలిష్తీయులలో అలజడి ఎక్కువయ్యింది. అప్పుడు సౌలు అసహనంతో, “నీ ప్రార్థన యిక చాలు, నీ చేతులు క్రిందికి దించు” అని యాజకునితో చెప్పాడు.
1SA 14:20 సౌలు, మరియు అతనితోవున్న సైన్యం సమకూడి యుద్ధానికి దిగారు. ఫిలిష్తీయులు గందరగోళంగా ఉన్నారని వారు గమనించారు. కొంతమంది ఫిలిష్తీయులు తమలో తామే కత్తులతో పొడుచు కొంటున్నట్టువారు చూశారు.
1SA 14:21 గతంలో వారి క్రింద పని చేసిన హెబ్రీయులు కొందరు ఫిలిష్తీయుల శిబిరంలో ఉన్నారు. ఈ హెబ్రీయులు సౌలు, యోనాతానుతో వున్న ఇశ్రాయేలీయులకు మద్దతు ఇచ్చారు.
1SA 14:22 ఎఫ్రాయిము కొండల దేశంలో దాగివున్న ఇశ్రాయేలీయులంతా పారిపోతున్న ఫిలిష్తీయుల గూర్చి విన్నారు. వీరంతా యుద్ధంలో చేరి ఫిలిష్తీయులను తరిమికొట్టారు.
1SA 14:23 ఆ విధంగా ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. యుద్ధం బేతావెను దాటిపోయింది. సైన్యమంతా సౌలు దగ్గర ఉంది. సుమారు పదివేల మంది అతని వద్ద ఉన్నారు. తరువాత ఎఫ్రాయిము రాజ్యంలోని ప్రతి నగరానికీ యుద్ధం వ్యాపించింది.
1SA 14:24 ఆరోజు సౌలు ఒక పెద్ద తప్పు చేశాడు. ఇశ్రాయేలు సైనికులు ఆకలితో నకనకలాడి పోయారు. దీనికంతటికీ కారణం వారిని సౌలు ఒక ప్రమాణం క్రింద వుంచటమే! “సాయంత్రమయ్యేలోగా గాని, లేక నా శత్రువులను నేను ఓడించక ముందుగాని ఎవ్వరైనా భోజనం చేస్తే వారు శపించబడతారు!” అని వారికి సౌలు ముందుగానే చెప్పాడు. దానితో ఇశ్రాయేలు సైనికులు ఎవ్వరూ ఆహారం ముట్టలేదు.
1SA 14:25 ఆ ప్రాంతంలో ఒక తేనెతుట్ట వుంది.
1SA 14:26 సైనికులు దానివద్దకు వచ్చేసరికి వాళ్ల ప్రమాణం జ్ఞాపకం రావటంతో తేనె ముట్టటానికి భయపడిపోయారు.
1SA 14:27 అయితే సౌలు చేయించిన ఈ ప్రమాణం గురించి యోనాతానుకు తెలియదు. అతను తన చేతికర్రను తేనెతుట్టలోనికి గుచ్చి లాగగానే తేనెవచ్చింది. అతడు దానిని తాగగా అతనికి ఎంతో హాయినిచ్చింది.
1SA 14:28 సైనికులలో ఒకడు యోనాతానుకు “నీ తండ్రి సైనికులతో ప్రమాణము చేయించి, ఆహారము పుచ్చుకొనువాడు శపించబడును అని చెప్పాడు. అందువల్లనే ఏ ఒక్క సైనికుడు కూడా ఆ రోజు ఏమీ తినలేదని అన్నాడు. అందువల్లనే సైనికులంతా విపరీతంగా అలసిపోయారని” చెప్పాడు.
1SA 14:29 “మా తండ్రి దేశానికి లేనిపోని తిప్పలు తెచ్చిపెట్టాడు. చూడండి! ఈ తేనెను నేను కొంచెం రుచిచూస్తేనే నాకు చాలా హాయిగా వుంది!
1SA 14:30 ఈ రోజు శత్రువుల వద్ద తీసుకున్న ఆహారమంతా మన సైనికులు గనుక తినివుంటే, వారు ఎంత హాయిగా ఉండేవారు! ఇంకా చాలా మంది ఫిలిష్తీయులను కూడ చంపి ఉండే వాళ్లు!” అన్నాడు యోనాతాను.
1SA 14:31 ఆ రోజు మిక్మషునుండి అయ్యాలోను వరకూగల ఫిలిష్తీయులనందరినీ ఇశ్రాయేలు సైనికులు ఓడించారు. ఆ తరువాత వారు బాగా నీరసించి పోయారు.
1SA 14:32 వారు ఫిలిష్తీయుల గొర్రెలను, పశువులను, దూడలను పట్టుకొన్నారు. ఆకలికి తట్టుకోలేక వారు ఆ పశువులను నేలమీదే చంపి రక్తంతో నిండిన మాంసాన్నే తినివేశారు.
1SA 14:33 ఒక వ్యక్తి వెళ్లి సౌలుతో, “చూశావా! సైనికులంతా యెహోవా పట్ల పాపం చేస్తున్నారు. రక్తం కలసివున్న మాంసాన్నే వారు తింటున్నారు” అని చెప్పాడు. అది విని సౌలు, “మీరు పాపం చేశారు! ఒక పెద్ద బండను ఇక్కడికి దొర్లించండి” అన్నాడు.
1SA 14:34 “నీవు వెళ్లి ప్రతి ఒక్కడ్నీ తన ఎద్దును, గొర్రెను ఇక్కడికి తీసుకుని రమ్మను. వారు వచ్చి తమ పశువులను ఇక్కడ బండ మీద వధించాలి. దేవుని పట్లపాపం చేయవద్దు. రక్తం కలిసివున్న మాంసాన్ని తినకండి” అన్నాడు సౌలు. ఆ రాత్రి ప్రతి ఒక్కడూ తన పశువులను తెచ్చి అక్కడ వధించాడు.
1SA 14:35 తరువాత సౌలు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. అది సౌలు తానే యెహోవాకి నిర్మించిన మొదటి బలిపీఠం.
1SA 14:36 “పదండి! ఈ రాత్రి ఫిలిష్తీయులను తరుముదాము. వాళ్లనందరినీ చంపివేసి వాళ్ల వస్తువులన్నీ తీసుకుందాము!” అన్నాడు సౌలు. “నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి” అని సైనికులు జవాబిచ్చారు. కానీ “మనము దేవుని అడుగు దాము” అని యాజకుడు చెప్పాడు.
1SA 14:37 అందువల్ల సౌలు లేచి, “దేవా! నేను వెళ్లి ఫిలిష్తీయులను తరిమికొట్టనా? మేము వాళ్లను ఓడించేలా సహాయం చేస్తావా?” అని అడిగాడు. కాని ఆ రోజు సౌలుకు యెహోవా సమాధానం ఇవ్వలేదు.
1SA 14:38 “నాయకులందరినీ నా దగ్గరకు తీసుకుని రండి. ఈ వేళ ఎవరు పాపం చేసారో మనము తెలుసు కొందాము.
1SA 14:39 ఇశ్రాయేలును రక్షించే యెహోవా తోడుగా నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. ఈ పాపం నా స్వంత కుమారుడు యోనాతాను చేసినా, అతడు చావాల్సిందే” అని చెప్పాడు సౌలు. సైన్యంలో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.
1SA 14:40 సౌలు ఇశ్రాయేలీయులందరినీ పిలిచి వారందరినీ ఒక పక్కన నిలబెట్టి, తన కుమారునితో కలిసి తానొక పక్కన నిలబడ్డాడు. “మీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయండి” అని సైనికులంతా చెప్పారు.
1SA 14:41 “ఓ ఇశ్రాయేలీయుల దేవుడవై యెహోవా, నీ సేవకుడనైన నా ప్రార్థన ఈ రోజున ఎందుకు ఆలకించలేదు! నేను గాని, నా కుమారుడు యోనాతాను గాని పాపం చేస్తే మాకు ఊరీము పడేలా చేయుము. నీ ప్రజలయిన ఇశ్రాయేలీయులు పాపం చేస్తే, వారికి తుమ్మీము పడేలా చేయము” అని సౌలు ప్రార్థన చేశాడు. సౌలు యోనాతాను పాపం చేసినట్టు ఊరీము పడింది. అందుచేత ప్రజలు నిర్దోషులని తేలటంతో వారు వెళ్లిపోయారు.
1SA 14:42 సౌలు, యోనాతానుల మధ్య మళ్లీ వేస్తే యోనాతాను దోషి అని తేలింది.
1SA 14:43 “ఏమి చేసావో చెప్పు” అని సౌలు యోనాతానును అడిగాడు. “నేను కేవలం నా చేతికర్ర చివరన అంటిన తేనెనురుచి చూసాను. దానికే నేను మరణశిక్ష అనుభవించాలా?” అన్నాడు యోనాతాను.
1SA 14:44 సౌలు “దేవునికి నేను తీవ్రమైన ప్రమాణం చేసాను. నా ప్రమాణాన్ని గనుక నేను నిలబెట్టుకోక పోతే నాకు ఎన్నో దారుణాలు చేయుమని నేను దేవుని అడిగాను. కనుక యోనాతానూ, నీవు మరణించాల్సిందే” అన్నాడు.
1SA 14:45 అయితే సైనికులు, “ఈవేళ ఇశ్రాయేలీయులను మహా విజయానికి నడిపించిన వాడు యోనాతానే. అలాంటప్పుడు యోనాతాను మరణించాలా? వీల్లేదు. సజీవ దేవుని తోడు, యోనాతాను తలమీదనుండి ఒక్క వెంట్రుక నేలరాలదుగాక! ఈ వేళ ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి దేవుడే యోనాతానుకు సహాయం చేసాడు!” ఇని సౌలుతో చెప్పారు. అందుచేత సైనికులు యోనాతానును కాపాడారు. అతడు చంపబడలేదు.
1SA 14:46 కనుక ఫిలిష్తీయులను తరమటం సౌలుమానుకున్నాడు. ఫిలిష్తీయులు వారి స్థలానికి వెళ్లి పోయారు.
1SA 14:47 సౌలు పరిపాలన సాగించిన కాలంలో, ఇశ్రాయేలు చుట్టూవున్న దాని శత్రువులందరితో అతడు యుద్ధం చేశాడు. మోయాబీయులతోను అమ్మోనీయులతోను, ఎదోమీయులతోను, సోబాదేశపు రాజులతోను, ఫిలిష్తీయులతోను సౌలు యుద్ధంచేశాడు. సౌలు ఎక్కడికి వెళితే అక్కడ శత్రువులను ఓడించి విజయంసాధించాడు.
1SA 14:48 సౌలు చాలా ధైర్యవంతుడు. అతడు అమాలేకీయులను సహా జయించాడు. ఇశ్రాయేలును కొల్లగొట్టాలని ప్రయత్నించిన దాని శత్రువులందరినీ సౌలు చీల్చి చెండాడి ఇశ్రాయేలును రక్షించాడు.
1SA 14:49 యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవ, ఈ ముగ్గురూ సౌలు కుమారులు. సౌలు పెద్దకుమార్తె పేరు మేరబు. ఆయన చిన్న కుమర్తె మీకాలు.
1SA 14:50 సౌలు భార్య పేరు అహీనోయము. ఆమె అహిమయస్సు అనే వాని కుమార్తె సౌలు సైన్యాధికారి పేరు అబ్నేరు. అతడు నేరు అనేవాని కుమారుడు. నేరు సౌలు పినతండ్రి.
1SA 14:51 సౌలు తండ్రి కీషు; అబ్నేరు తండ్రి నేరు-ఇద్దరూ అబీయేలు అనే వాని కుమారులు.
1SA 14:52 సౌలు జీవితాంతం ధైర్యశాలిగా ఉన్నాడు. ఫిలిష్తీయులతో తీవ్రంగా పోరాడాడు. సౌలు తన రాజ్యంలో ఎప్పుడయినా, ఎక్కడయినా ఒక ధైర్యవంతుని గాని బలశాలిని గాని చూస్తే వానిని తన కోటలోని ప్రత్యేక సైనిక దళంలో చేర్చుకొనేవాడు.
1SA 15:1 సమూయేలు ఒక రోజు సౌలు వద్దకు వచ్చాడు. గతంలో అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుని చేయటానికి యెహోవా తనను పంపిన విషయం జ్ఞాపకం చేస్తూ, మరో వర్తమానం యెహోవా దగ్గర నుండి తెచ్చినట్లు సమూయేలు చెప్పాడు.
1SA 15:2 సర్వశక్తి మంతుడైన యెహోవా వర్తమానం ఇది: “ఈజిప్టునుండి విముక్తి పొంది ఇశ్రాయేలీయులు బయటికి వచ్చినప్పుడు వారిని కనానుకు పోకుండా ఆపాలని అమాలేకీయులు ప్రయత్నించారు. అమాలేకీయులు ఏమి చేశారో నేను స్వయంగా చూశాను.
1SA 15:3 నీవు ఇప్పుడు వెళ్లు. అమాలేకీయులపై యుద్ధం ప్రకటించు. నీవు అమాలేకీయులను సర్వనాశనం చేయాలి. అంతేగాదు. వారికి చెందిన ప్రతి వస్తువూ నాశనం కావాలి. దేనినీ బతకనివ్వకు. పురుషులను, స్త్రీలను, పిల్లలను పసివాళ్లను, పశువులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను-అన్నింటినీ హతమార్చి వేయాలి.”
1SA 15:4 సౌలు సైన్యాన్ని పిలిచి తెలాయీము వద్ద సమీకరించాడు. సైనికులు రెండు లక్షలమంది ఉన్నారు. అందులో పదివేలమంది యూదాకు చెందినవారు.
1SA 15:5 సౌలు అమాలేకీయుల ఒక నగర సమీపానికి వెళ్లి లోయలో పొంచివున్నాడు.
1SA 15:6 ఆ ప్రాంతంలో కేనీయులు కూడా వున్నారు. సౌలు వారితో అమాలేకీయులను వదిలి వెళ్లిపొమ్మన్నాడు. అలా వెళ్తే అమాలే కీయులతో పాటు వారిని చంపనని చెప్పాడు. “ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి వచ్చినప్పుడు మీరు వారికి కనికరము చూపారు గనుక మిమ్మల్ని చంపను” అని సౌలు అన్నాడు. అది విని అమాలేకీయులనుండి విడి పోయి కేనీయులు వెళ్లిపోయారు.
1SA 15:7 అమాలేకీయులను సౌలు ఓడించాడు. హవీలా నుండి ఈజిప్టు సరిహద్దుల్లోని షూరు పట్టణం వరకూ సౌలు వారితో పోరాడాడు.
1SA 15:8 అమాలేకీయుల రాజైన అగగును మాత్రం సజీవంగా పట్టుకుని అతని సైన్యం అంతటినీ సౌలు చంపేసాడు.
1SA 15:9 సౌలు, మరియు ఇశ్రాయేలు సైనికులు అగగును బతకనిచ్చారు. బలంగా, ఆరోగ్యంగావున్న గొర్రెలను, పశువులను, గొర్రెపిల్లలను కూడా వారు వదిలివేశారు. ప్రయోజన కరమైన వాటన్నింటినీ చంపకుండా విడిచిపెట్టి వారికి అవసరం లేని వాటన్నింటినీ వారు చంపేసారు.
1SA 15:10 యెహోవా వాక్కు సమూయేలు దగ్గరకు వచ్చింది.
1SA 15:11 “సౌలు నన్ను అనుసరించటం మానేశాడు. కావున సౌలును రాజుగా చేసినందుకు బాధపడుతున్నాను. అతడు నా ఆజ్ఞలను శిరసావహించలేదు.” అని యెహోవా చెప్పాడు. ఇది విన్న సమూయేలు గాభరా పడిపోయాడు. రాత్రంతా దుఃఖంతో యెహోవాని ప్రార్థించాడు.
1SA 15:12 మరునాటి తెల్లవారుఝామున సమూయేలు లేచి సౌలును కలుసుకొనేందుకు వెళ్లాడు. కానీ అక్కడి ప్రజలు, “సౌలు కర్మెలుకు వెళ్లాడు. తన గౌరవార్థం అక్కడ ఒక జ్ఞాపక స్తంభం నిలబెట్టడానికి సౌలు వెళ్లాడు. తర్వాత సౌలు అనేక చోట్లకు ప్రయానం చేసి, చివరికి గిల్గాలు వెళ్లాలని ఏర్పాటు చేసుకున్నాడు” అని చెప్పారు. కనుక సౌలు ఉన్న చోటికే సమూయేలు వెళ్లాడు. సౌలు అమాలేకీయుల దగ్గర తీసుకున్నవాటిలో మొదటి భాగాన్ని అప్పుడే అర్పించాడు. సౌలు వాటని దహనబలిగా యెహోవాకు అర్పిస్తున్నాడు.
1SA 15:13 సమూయేలు సౌలు దగ్గరకు వెళ్లాడు: “యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక! యెహోవా ఆజ్ఞలను నేను విధేయుడనయ్యాను” అని సౌలు చెప్పాడు.
1SA 15:14 “ఆజ్ఞ నెరవేర్చితే మరి నేను వింటున్న గొర్రెల, పశువుల అరుపులు ఏమిటి” అని సమూయేలు ప్రశ్నించాడు.
1SA 15:15 సౌలు ఇలా జవాబు చెప్పాడు: “సైనికులు వాటిని అమాలేకీయులనుండి తీసుకున్నారు. నీ దేవుడైన యెహోవాకు దహనబలి చేయటానికి సైనికులు మంచి గొర్రెలను పశువులను కాపాడారు. కాని మిగిలిన వాటన్నిటినీ మేము చంపేశాము.”
1SA 15:16 సమూయేలు, “ఇంక మాట్లాడకు. రాత్రి యెహోవా నాకు ఏమి చెప్పాడో నీవు విను” అన్నాడు సౌలుతో. సౌలు, “సరే నాకు చెప్పు” అన్నాడు.
1SA 15:17 సమూయేలు ఇలా చెప్పాడు: “గతంలో నీవు ప్రముఖుడవు కాదని తలచావు. కాని ఇశ్రాయేలు వంశాలన్నింటికీ నీవు నాయకుడవై నావు. ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా నిన్ను ఎంపిక చేశాడు.
1SA 15:18 యెహోవా నిన్ను ఒక ప్రత్యేక పనిమీద పంపించాడు. ‘వెళ్లి ఆ దుర్మార్గపు అమాలేకీయులనందరినీ చంపివేయి. వాళ్లను పూర్తిగా నాశనం చేయి’ అని యెహోవా చెప్పాడు.
1SA 15:19 కానీ నీవు యెహోవా మాట వినలేదు. వాటిని నీకోసం అట్టే పెట్టుకోవాలను కున్నావు. కనుక ఏది చెడ్డదని యెహోవా చెప్పాడో అదే నీవు చేసావు.”
1SA 15:20 సౌలు, “నేనైతే యెహోవాకు విధేయుడనయ్యాను. యెహోవా పంపిన చోటికి నేను వెళ్లాను. అమాలేకీయులనందరినీ నేను నాశనం చేశాను. వారి రాజు అరగును మాత్రమే నేను తిరిగి తీసుకుని వచ్చాను.
1SA 15:21 సైనికులు మాత్రమే నీ దేవుడైన యెహోవాకు గిల్గాలువద్ద బలి అర్పించేందుకు శ్రేష్ఠమైన గొర్రెలను, పశువులను తీసుకుని వచ్చారు” అన్నాడు.
1SA 15:22 కానీ సమూయేలు, “యెహోవాకు ఎక్కువ ప్రీతి పాత్రమైనది ఏమిటి? దహనబలులు, బలులా? లేక యెహోవా ఆజ్ఞాపాలనయా? దేవునికి బలులు అర్పించటంకంటే, ఆయనకు విధేయుడై ఉండటం శ్రేష్ఠము. పొట్టేళ్ల కొవ్వును అర్పించేకంటే, దేవుని వాక్కు వినటం శ్రేష్ఠము.
1SA 15:23 అవిధేయుడవై ఉండట మంటే మంత్రం వేసే పాపం లాంటిదే. మొండి వైఖరితో నీకు తోచినదే చేయటం విగ్రహారాధనవంటి పాపమే. నీవు యెహోవా ఆజ్ఞను ధిక్కరించావు. ఈ కారణంగా ఇప్పుడు యెహోవా నిన్ను రాజుగా తిరస్కరిస్తున్నాడు.”
1SA 15:24 అప్పుడు సౌలు, “నేను పాపం చేశాను. నేను యెహోవా ఆజ్ఞలకు లోబడలేదు. నీవు చెప్పినట్లుగా నేను చేయలేదు. నేను ప్రజలకు భయపడ్డాను. వారు ఎలా చెప్పితే అలా చేశాను.
1SA 15:25 నా పాపం క్షమించుమని ఇప్పుడు నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను యెహోవాని ఆరాధిస్తాను, నాతో కూడ రా” అని సమూయేలుతో చెప్పాడు.
1SA 15:26 కానీ సమూయేలు, “నేను నీతో మళ్లీ వెనుకకురాను. నీవు యెహోవా ఆజ్ఞ తిరస్కరించావు. ఇప్పుడు యెహోవా నిన్ను ఇశ్రాయేలు రాజుగా తిరస్కరిస్తున్నాడు” అని చెప్పాడు.
1SA 15:27 సమూయేలు వెళ్లిపోవటానికి తిరగగానే, సౌలు ఆయన అంగీ పట్టుకున్నాడు. అంగీ చిరిగిపోయింది.
1SA 15:28 సమూయేలు, “నీవు నా అర గీ చింపేసావు. అదే విధంగా ఈవేళ యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీనుంచి తీసేస్తాడు. నీ స్నేహితుల్లో ఒకరికి ఈ రాజ్యాన్ని యెహోవా ఇచ్చాడు. ఇతడు నీకంటే మంచివాడు.
1SA 15:29 యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెహోవా శాశ్వతంగా జీవిస్తాడు. యెహోవా అబద్ధం చెప్పడు. తన మనస్సు మార్చుకోడు. అనుక్షణం మనస్సుమార్చుకునే మనిషిలాంటివాడు కాదు యెహోవా” అని సౌలుతో చెప్పాడు.
1SA 15:30 సౌలు సమాధానమిస్తూ, “సరే నేను పాపం చేశాను. కాని దయచేసి నాతోకూడ రా. కనీసం నాయకుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట నాకు కొంచెం మర్యాద చూపించు. దేవుడైన యెహోవాను నేను ఆరాధించటానికి నాతోకూడ తిరిగి రా” అన్నాడు.
1SA 15:31 కనుక సమూయేలు సౌలుతో కలిసి వెనుకకు వెళ్లాడు. సౌలు యెహోవాను ఆరాధించాడు.
1SA 15:32 “అమాలేకీయుల రాజైన అగగును తన వద్దకు తీసుకుని రమ్మని” సమూయేలు చెప్పాడు. అగగుసంకెళ్లతో బంధించబడి సమూయేలు ముందుకు వచ్చాడు. “నిశ్చయంగా ఇతడు నన్ను చంపడు” అని అగగు అనుకున్నాడు.
1SA 15:33 కాని సమూయేలు అగగుతో, “నీ కత్తివేటుకు గురిచేసి అనేకమంది పిల్లలను తమ తల్లులకు లేకుండా చేసావు. కనుక ఇప్పుడు నీ తల్లికి పిల్లలు ఉండరు,” అంటూ గిల్గాలులో యెహోవా ఎదుట సమూయేలు అగగును ముక్కలుగా నరికి వేశాడు.
1SA 15:34 అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయాడు. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు.
1SA 15:35 ఆ తరువాత సమూయేలు తన జీవితాంతం సౌలును మళ్లీ ఎన్నడూ చూడలేదు. కాని సౌలు విషయంలో సమూయేలు చాలా దుఃఖించాడు. సౌలును ఇశ్రాయేలేలుకు రాజుగా చేసినందుకు యెహోవా చాలా చింతించాడు.
1SA 16:1 యెహోవా, “ఎంతకాలం ఇలా సౌలుకోసం చింతిస్తావు? ఇశ్రాయేలు రాజుగా సౌలును నేను నిరాకరించాను. నీ కొమ్ములను నూనెతో నింపుకొని వెళ్లు. యెష్షయి అనే మనిషి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. యెష్షయి బేత్లెహేములో నివసిస్తున్నాడు. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా ఎంపిక చేసాను” అని సమూయేలుతో చెప్పాడు.
1SA 16:2 కానీ, “నేను వెళితే ఈ వార్త సౌలు విని నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తాడు” అని సమూయేలు అన్నాడు. “నీవు ఒక కోడెదూడను తీసుకుని బెత్లెహేముకు వెళ్లు. ‘యెహోవాకు నేను ఒక బలి అర్పించటానికి వచ్చాను’ అని చెప్పు.
1SA 16:3 బలి కార్యక్రమానికి యెష్షయిని రమ్మని ఆహ్వానించు. అప్పుడు ఏమి చేయాలో నేను నీకు తెలియచేస్తాను. నేను నీకు చూపిన మనిషిని నీవు తప్పక అభిషేకించాలి” అని యెహోవా చెప్పాడు.
1SA 16:4 యెహోవా చెప్పినట్లు సమూయేలు చేసాడు. సమూయేలు బెత్లెహేముకు వెళ్లాడు. బెత్లెహేము పెద్దలు భయంతో వణకిపోయారు. వారు సమూయేలును కలుసుకొని, “నీవు సమాధానంగానే వచ్చానా?” అని అడిగారు.
1SA 16:5 “అవును నేను సమాధానంగానే వచ్చాను. యెహోవాకు ఒక బలి అర్పించటానికి నేను వచ్చాను. మీరంతా తయారై బలి కార్యక్రమానికి నాతోకూడ రావటానికి సిద్ధపడండి” అని సమూయేలు జవాబు చెప్పాడు. సమూయేలు యెష్షయిని, అతని కుమారులను సిద్ధంచేశాడు. బలి అర్పణలో పాలుపుచ్చుకోమని సమూయేలు వారిని ఆహ్వానించాడు.
1SA 16:6 యెష్షయి, అతని కుమారులు వచ్చినపుడు సమూయేలు ఏలీయాబును చూసాడు. “నిజంగా యెహోవా ఎంపిక చేసిన మనిషి ఇతడే” అని సమూయేలు తలచాడు.
1SA 16:7 అయితే యెహోవా, “ఏలీయాబు ఎంతో అందంగా ఎత్తుగా ఉన్నాడు. కానీ ఆ విషయాలు లక్ష్యపెట్టకు. మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేదు. ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు కానీ యెహోవా హృదయం చూస్తాడు. ఏలీయాబు తగిన వాడు కాడు” అని తెలియజేసాడు.
1SA 16:8 అప్పుడు యెష్షయి తన కుమారుడైన అబీనాదాబును పిలిచాడు. అబీనాదాబు సమూయేలు ఎదుటనడిచాడు. కానీ సమూయేలు, “లేదు యెహోవా ఎంపిక చేసినవాడు ఇతడు కాదు” అన్నాడు.
1SA 16:9 తరువాత షమ్మాను సమూయేలు ఎదుట నడువుమని యెష్షయి చెప్పాడు. కానీ సమూయేలు, “లేదు, ఇతనినికూడ యెహోవా ఎంపిక చేయలేదు” అన్నాడు.
1SA 16:10 తన కుమారులు ఏడుగురిని యెష్షయి సమూయేలుకు చూపించాడు. కానీ, “వీరిలో ఎవ్వరినీ యెహోవా ఎంపిక చేయలేదని” సమూయేలు యెష్షయితో చెప్పాడు.
1SA 16:11 అప్పుడు, “నీ కుమారులంతా వీరేనా?” అని సమూయేలు యెష్షయిని అడిగాడు. “అందరికంటె చిన్నవాడు ఇంకొకడు ఉన్నాడు. కానీ వాడు గొర్రెలను మేపుతున్నాడు” అని యెష్షయి జవాబిచ్చాడు. సమూయేలు, “అతనికి కబురు చేయి. అతన్ని ఇక్కడకు తీసుకునిరా. అతడొచ్చేవరకూ మనం భోజనానికి కూర్చోము” అని చెప్పాడు.
1SA 16:12 యెష్షయి తన చిన్న కుమారుని తీసుకుని వచ్చేందుకు ఒకరిని పంపించాడు. ఈ కుమారుడు ఎర్రని తల వెంట్రుకలతో చక్కగా కనబడేవాడు. అతడు ఎర్రటివాడు మరియు చాలా అందగాడు. “లేచి అతనిని అభిషేకించు. అతడే సుమా!”అని యెహోవా సమూయేలుతో చెప్పాడు.
1SA 16:13 ప్రత్యేక నూనెతో ఉన్న కొమ్మును సమూయేలు తీసుకుని యెష్షయి చిన్న కుమారుని సోదరులందరి ఎదుటనే అతని మీద పోసాడు. ఆ రోజునుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి మహా శక్తివంతంగా వచ్చింది. తరువాత సమూయేలు రామాకు వెళ్లి పోయాడు.
1SA 16:14 యెహోవా ఆత్మ సౌలును విడిచి పెట్టేసాడు. యెహోవా సౌలు మీదికి ఒక దుష్టాత్మను పంపించాడు. అది అతనికి చాలా ఇబ్బంది కలిగించింది.
1SA 16:15 సౌలు సేవకులు అతనితో ఇలా అన్నారు: “దేవుని వద్దనుండి వచ్చిన ఒక దుష్ట ఆత్మ వచ్చి నిన్ను బాధ పెడుతోంది.
1SA 16:16 మాకు ఆజ్ఞ ఇవ్వుము. సితారాను వాయించగలవాని కోసం వెదుకుతాము. యెహోవా దగ్గరనుండి ఆ దుష్ట శక్తి నీ మీదికి వస్తే ఇతడు సితారా వాయిస్తాడు. అప్పుడు ఆ దుష్ట ఆత్మ నిన్ను విడిచిపెట్టేస్తుంది. నీకు ఊరట కలుగుతుంది.”
1SA 16:17 “ఒక మంచి సితార వాయించువానిని చూసి నా దగ్గరకు తీసుకుని రండి” అని సౌలు తన సేవకులతో చెప్పాడు.
1SA 16:18 అప్పుడు నౌకర్లలో ఒకడు, “బేత్లెహేములో యెష్షయి అని ఒక మనిషి ఉన్నాడు. యెష్షయి కొడుకును నేను చూసాను. సితార వాయించటం అతనికివచ్చు. అతడు ధైర్యవంతుడు. బాగా పోరాడగలవాడు. కూడా. అతడు చాతుర్యంగలవాడు. అతడు అందగాడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు.
1SA 16:19 కనుక సౌలు కొందరు మనుష్యులను యెష్షయి దగ్గరకు పంపించాడు. “నీకు దావీదు అనే కొడుకు ఉన్నాడు. అతడు గొర్రెలను కాస్తున్నాడు. అతనిని నా దగ్గరకు పంపించు” అని సౌలు చెప్పినదానిని వారు యెష్షయికి చెప్పారు.
1SA 16:20 కనుక యెష్షయి సౌలుకు కానుకలుగా కొన్ని వస్తువులు సిద్ధం చేసాడు. ఒక గాడిదను, కొంత రొట్టె, ఒక ద్రాక్షారసపు తిత్తి, ఒక మెక పిల్లను యెష్షయి సిద్ధం చేసాడు. యెష్షయి వాటిని దావీదుకు ఇచ్చి అతనిని సౌలు వద్దకు పంపించాడు.
1SA 16:21 కనుక దావీదు సౌలు దగ్గరకు వెళ్లి అతని ఎదుట నిలిచాడు. సౌలు దావీదును చాలా ప్రేమించాడు. దావీదు సౌలుకు ఆయుధాలు మోసే సహాయకుడయ్యాడు.
1SA 16:22 “దావీదును నాతో ఉండనియ్యి. నా సేవ చేయనియ్యి. అతడంటే నాకు చాలా ఇష్టం” అని యెష్షయికి ఒక సందేశం పంపాడు సౌలు.
1SA 16:23 దేవుడు పంపిన దురాత్మ సౌలు మీదికి వచ్చినపుడు దావీదు తన సితార తీసుకుని వాయించేవాడు. ఆ దుష్ట ఆత్మ సౌలును వదిలిపోయేది, అతనికి హాయిగా ఉండేది.
1SA 17:1 ఫిలిష్తీయులు వారి సైన్యాన్ని యుద్ధానికి సమీకరించారు. వారు యూదాలో శోకో అనేచోట సమావేశమయ్యారు. వారి శిబిరం ఏ ఫెస్దమ్మీము అనే పట్టణం వద్ద పెట్టారు. ఏఫెస్దమ్మీము అనే పట్టణం శోకోకు, అజేకాకు మధ్యగా వుంది.
1SA 17:2 సౌలు, మరియు ఇశ్రాయేలు సైన్యాలుకూడా సమావేశం అయ్యారు. ఏలా లోయలో వారి శిబిరం ఉంది. ఫిలిష్తీయులతో యుద్ధానికి సౌలు సైన్యం తయారయ్యింది.
1SA 17:3 ఫిలిష్తీయులు ఒక కొండమీద ఉన్నారు, ఇశ్రాయేలీయులు మరో కొండమీద ఉన్నారు. ఈ రెండు కొండల మధ్య లోయ ఉంది.
1SA 17:4 ఫిలిష్తీయులకు ఒక ప్రఖ్యాత వీరుడు ఉన్నాడు. వానిపేరు గొల్యాతు. వాడు గాతుకు చెందినవాడు. అతని ఎత్తు తొమ్మిది అడుగుల కంటె ఎక్కువ. గొల్యాతు ఫిలిష్తీయుల శిబిరంలో నుంచి బయటికి వచ్చాడు.
1SA 17:5 అతని తలమీద ఒక కంచుటోపీ ఉంది. కంచుతో చేసిన చేప పొలుసులవంటి కవచం అతడు ధరించాడు. ఈ కవచం కంచుతో చెయబడి నూట ఇరవై అయిదు పౌన్ల బరువు ఉంది.
1SA 17:6 గిల్యాతు కాళ్లకు రాగి కవచాలు ఉన్నాయి. కంచు ఈటె ఒకటి అతని మెడమీద కట్టబడి వుంది.
1SA 17:7 గొల్యాతు ఈటెకువున్న కర్రపిడి సాలెవాని మగ్గం వద్దవుండే దోనెలాగా వుంది. ఈటెకత్తి బరువు పది హేను “పౌన్లు.” గొల్యాతు డాలు మోసే భటుడు అతనికి ముందుగా నడిచాడు.
1SA 17:8 గొల్యాతు బయటకు వచ్చి ఇశ్రాయేలు సైనికులకు కేకవేసాడు: “మీ సైనికులు అందురూ యూద్ధానికి బారులు తీసారు ఎందుకు? మీరు సౌలు సేవకులు. నేను ఫిలిష్తీవాడిని. కనుక మీరు ఒకనిని ఎంపిక చేసుకొని నాతో పోరాడేందుకు వానిని పంపించండి.
1SA 17:9 వాడు గనుక నన్ను చంపితే ఫిలిష్తీయులందరు మీ సేవకులవుతారు. కానీ నేను గెలిచి మీవాడిని చంపితే, మీరంతా మాకు సేవకులు అవుతారు. అప్పుడు మీరు మాకు సేవ చేస్తారు!” అన్నాడు అతను.
1SA 17:10 “ఈ రోజు నేనిలా నిలబడి ఇశ్రాయేలు సైన్యాన్ని ఎగతాళి చేస్తున్నాను! నాతో పోరాడటానికీ మీలో ఒకనిని పంపండి” అనికూడ ఆ ఫిలిష్తీయుడు అన్నాడు.
1SA 17:11 గొల్యాతు చెప్పిన వాటిని సౌలు, ఇశ్రాయేలు సైనికులు విన్నారు. వారు చాలా భయపడ్డారు.
1SA 17:12 ఎఫాయుడైన యెష్షయి కుమారుడు దావీదు. యూదాలో ఉన్న బేత్లెహేముకు చెందినవాడు యెష్షయి. అతనికి ఎనమండుగురు కుమారులు. సౌలు కాలంలో యెష్షయి వృద్ధుడు.
1SA 17:13 యెష్షయి. యొక్క ముగ్గురు పెద్ద కుమారులు సౌలుతోపాటు యుద్ధానికి వెళ్లారు. పెద్ద కుమారుడు ఏలీయాబు. రెండవ కుమారుడు అబీనాదాబు. మూడవ కుమారుడు షమ్మా.
1SA 17:14 దావీదు అందరికంటె చిన్న కుమారుడు. పెద్ద కుమారులు ముగ్గురూ సౌలు సైన్యంలో ఉన్నారు.
1SA 17:15 కానీ దావీదు బేత్లెహేములోని తన తండ్రి గొర్రెలను కాసేందుకు అప్పుడప్పుడూ సౌలును వదిలి వెళ్లేవాడు.
1SA 17:16 ఫిలిష్తీయుడైన గొల్యాతు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బయటికి వచ్చి ఇశ్రాయేలు సైన్యం ఎదుట నిలబడేవాడు. ఇలా నలుబది రోజులు ఇశ్రాయేలీయులను గొల్యాతు ఎగతాళి చేసాడు.
1SA 17:17 ఒక రోజు యెష్షయి తన కుమారుడైన దావీదుతో ఇలా చెప్పాడు: “యుద్ధాల శిబిరంలో ఉన్న నీ అన్నలకు తూమెడు వేయించిన గోధుమలు, ఈ పది రొట్టెలు తీసుకుని వెళ్లు.
1SA 17:18 ఈ పది జున్ను ముక్కలు కూడ తీసుకుని వెళ్లి నీ సోదరులున్న వేయి మందిగల పటాలం అధికారికీ ఇయ్యి. నీ సోదరులు ఎలా వున్నారో తెలుసుకొని, వారి యోగక్షేమాలకు గుర్తుగా ఏదైనా తిరిగి తీసుకునిరా.
1SA 17:19 నీ సోదరులంతా ఇప్పుడు సౌలుతోనూ, ఇశ్రాయేలు సైన్యంతోనూ కలిసి ఏలా లోయలో ఉన్నారు. వారు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు.”
1SA 17:20 దావీదు తెల్లవారు ఝామునే లేచి మరో కాపరికి మందను అప్పగించాడు. ఆహారపు మూటను తీసుకుని యెష్షయి చెప్పిన విధంగా బయలుదేరి వెళ్లాడు. దావీదు తన బండిని శిబిరం యొద్దకు తోలుకెళ్లాడు. దావీదు అక్కడికి వచ్చేటప్పటికి, సైనికులు వారి వారి యుద్ధ స్థావరాలకు వెళ్లుచూ ఉన్నారు. సైనికులు యుద్ధ నినాదాలు చేయటం మొదలుబెట్టారు.
1SA 17:21 ఇశ్రాయేలీయులు, ఫిలిష్తీయులు వారి వారి మనుష్యులను యుద్ధంలో సంధించటానికి సమీకరిస్తున్నారు.
1SA 17:22 ఆహార పదార్థాల అజమాయిషీ వహించే వ్యక్తివద్ద దావీదు తను తెచ్చిన ఆహార పదార్థాలను వుంచి, ఇశ్రాయేలు సైనికులు ఉన్న చోటికి పరుగెత్తాడు. తన సోదరులను గూర్చి దావీదు అడిగాడు.
1SA 17:23 దావీదు తన సోదరులతో సంభాషించటం మొదలుబెట్టాడు. అదే సమయానికి ఫిలిష్తీయుల పోరాట వీరుడు గాతీయుడైన గొల్యాతు ఫిలిష్తీ సైన్యంనుండి బయటకు వచ్చాడు. గొల్యాతు ఇశ్రాయేలీయులను మామూలు గానే కవ్వించే కేకలు వేసాడు. ఇది దావీదు విన్నాడు.
1SA 17:24 గొల్యాతును చూడగానే ఇశ్రాయేలు సైనికులు పారిపోయారు. అతడంటే వారందరికీ భయము.
1SA 17:25 ఇశ్రాయేలు మనుష్యుల్లో ఒకడు ఇలా అన్నాడు: “వాడిని మీరు చూసారా? చూడండి వానిని. గొల్యాతు మాటిమాటికీ బయటికి వచ్చి ఇశ్రాయేలీయులను ఎగతాళి చేస్తున్నాడు. వానిని చంపినవానికి రాజు పుష్కలంగా డబ్బుఇస్తాడు. కనుక గొల్యాతును చంపినవాడు ధనవంతుడైపోతాడు; గొల్యాతును చంపినవానికి సౌలు తన కుమార్తెను కూడ ఇచ్చి వివాహము చేస్తాడు. ఇశ్రాయేలులో వాని కుటుంబాన్ని సౌలు స్వేచ్ఛగా ఉండనిస్తాడు.”
1SA 17:26 తన దగ్గర నిలబడిన మనుష్యులను దావీదు అడిగాడు, “ఈ ఫిలిష్తీవానిని చంపి ఇశ్రాయేలులో ఈ పరాభవాన్ని తొలగించిన వానికి బహుమానం ఏమిటి? ఇంతకూ ఈ గొల్యాతు ఎవడు? వాడు సున్నతి సంస్కారం కూడా లేనివాడు! వాడు కేవలం ఒక ఫిలిష్తీయుడే. జీవిస్తున్న దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే అధికారం వానికి ఉందని వాడు ఎలా అనుకుంటున్నాడు?”
1SA 17:27 కనుక ఆ ఇశ్రాయేలువాడు, గొల్యాతును చంపినందుకు లభించే బహుమానం గూర్చి దావీదుకు చెప్పాడు.
1SA 17:28 దావీదు సైనికులతో మాట్లాడుతుండగా అతని పెద్ద అన్న ఏలీయాబు విన్నాడు. దావీదు మీద ఏలీయాబుకు కోపం వచ్చింది. “అసలు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉన్న కొన్ని గొర్రెలను అరణ్యంలో ఎవరి దగ్గర వదిలి పెట్టావు? నాకు తెలుసు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో! చేయుమని చెప్పింది, చేయటం నీకు ఇష్టం లేదు. యుద్ధం చూడటానికే ఇక్కడికి రావాలనుకున్నావు” అంటూ ఏలీయాబు దావీదును నిలదీసాడు.
1SA 17:29 “ఇంతకూ నేనేం చేసాను? నేనేమి తప్పు చేయలేదే! నేను ఊరికే మాట్లాడుతున్నాను” అన్నాడు దావీదు.
1SA 17:30 దావీదు ఇంకొందరి వైపు తిరిగి మళ్లీ అవే ప్రశ్నలు వేశాడు. వారు కూడ ఇంతకు ముందు చెప్పిన సమాధానలే దావీదుకు చెప్పారు.
1SA 17:31 దావీదు పలికినది అంతా కొందరు సౌలుతో చెప్పారు. దావీదును తన దగ్గరకు తీసుకుని రమ్మని సౌలు వాళ్లకు ఆజ్ఞాపించాడు.
1SA 17:32 దావీదు, “ఎవ్వరినీ నిరుత్సాహ పడనియ్యవద్దు. నేను మీ సేవకుడిని. నేను వెళ్లి ఈ ఫిలిష్తీ వానితో పోరాడుతాను” అని సౌలుతో చెప్పాడు.
1SA 17:33 సౌలు, “నీవు ఈ ఫిలిష్తీ గొల్యాతును ఎదిరించి పోరాడలేవు. నీవు కనీసం ఒక సైనికుడివి కూడ కాదు. గొల్యాతు చిన్నప్పటి నుండీ యుద్ధంలో ఆరితేరిన వాడు” అని జవాబిచ్చాడు.
1SA 17:34 అయితే, “నీ సేవకుడనగు నేను నా తండ్రి గొర్రెలను కాపలా కాస్తూ ఉండేవాడిని. ఎప్పుడైనా ఒక సింహంగాని, ఎలుగు బంటిగాని నా మంద మీది కొచ్చి ఒక గొర్రెను పట్టుకుంటే,
1SA 17:35 దానిని నేను తరిమి కొట్టేవాడిని. ఆ అడవి మృగాన్ని నేను ఎదిరించి, దాని నోటినుండి గొర్రెను రక్షించేవాడిని. ఒకవేళ అదే నా మీదికి వస్తే, దాని జూలు పట్టి దానితో పోరాడి, దాన్ని చంపేసేవాడిని.
1SA 17:36 నేను ఒక సింహాన్ని, ఒక ఎలుగుబంటినీ చంపేసాను. అదే విధంగా సున్నతి సంస్కారం లేని ఆ పరాయి ఫిలిష్తీయుడిని నేను చంపేస్తాను. జీవిస్తున్న దేవుని సైన్యాన్ని గొల్యాతు ఎగతాళి చేసాడు గనుక వాడు చస్తాడు.
1SA 17:37 యెహోవా నన్ను సింహంనుండి, ఎలుగుబంటినుండి కాపాడాడు. ఇప్పుడు ఈ ఫిలిష్తీయుడైన గొల్యాతునుండి కూడ ఆ యెహోవాయే నన్ను రక్షిస్తాడు” అని దావీదు సౌలుతో చెప్పాడు. “అయితే వెళ్లు. యెహోవా నీకు తోడైయుండునుగాక!” అని దావీదుతో చెప్పాడు సౌలు.
1SA 17:38 సౌలు తన స్వంత వస్త్రాలను దావీదుకు ధరింపజేసాడు. దావీదు తలమీద ఒక కంచు శిరస్త్రాణం (టోపి), అతని వంటిమీద ఒక కవచం సౌలు పెట్టించాడు.
1SA 17:39 దావీదు ఒక కత్తి ధరించి అటు ఇటు నడవటానికి ప్రయత్నించాడు. సౌలు యుద్ధ వస్త్రాలను దావీదు ధరించటానికి ప్రయత్నించాడు. కానీ ఈ బరువులన్నీ ధరించటం దావీదుకు అలవాటు లేదు. అప్పుడు దావీదు, “ఇవన్నీ వేసుకుని నేను పోరాడలేను. వీటన్నిటికీ నేను అలవాటు పడలేదు,” అని సౌలుతో చెప్పి వాటన్నింటినీ విడిచి వేశాడు.
1SA 17:40 దావీదు తన చేతికర్ర తీసుకున్నాడు. లోయలో ఉన్న మంచి నునుపైన రాళ్లను ఐదింటిని దావీదు ఏరుకొన్నాడు. ఆ అయిదు రాళ్లను తన సంచిలో వేసుకున్నాడు. తన చేతిలో వడిసెలు పుచ్చుకొన్నాడు. అప్పుడు ఫిలిష్తీయుడైన గొల్యాతును ఎదురించేందుకు అతడు వెళ్లాడు.
1SA 17:41 ఫిలిష్తీయుడైన గొల్యాతు నెమ్మదిగా నడుస్తూ దావీదుకు సమీపంగా వస్తున్నాడు. గొల్యాతు కవచంమోసే సహాయకుడు వానికి ముందుగా నడుస్తున్నాడు.
1SA 17:42 గొల్యాతు దావీదును చూచి నవ్వసాగాడు. దావీదు ఒక సైనికుడు కూడ కానట్టు గొల్యాతు చూసాడు. దావీదు కేవలం ఎర్రని ముఖంగల ఒక అందగాడు మాత్రమే.
1SA 17:43 గొల్యాతు దావీదు వైపు చూసి, “నేనేమైనా కుక్కని అనుకున్నావా కర్ర పట్టుకొని వచ్చావు!” అని ఎగతాళి చేశాడు. గొల్యాతు తన దేవుళ్ల పేర్లన్నీ ఉచ్చరిస్తూ దావీదును శపించాడు.
1SA 17:44 “ఇటు రారా! నీ శవాన్ని పక్షులకు, జంతువులకు ఆహారంగా వేస్తాను” అంటూ దావీదు మీద కేకలు వేసాడు గొల్యాతు.
1SA 17:45 “నీవు కత్తి, కవచం, ఈటెలు ధరించి నా దగ్గరకు వస్తున్నావు. కానీ నేను ఇశ్రాయేలు సైన్యాలకు దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా పేరిట నీ దగ్గరకు వస్తున్నాను. ఆయనపై నీవు నిందా వాక్యాలు పలికావు.
1SA 17:46 ఈ రోజు ఆ యెహోవా, నాచేత నిన్ను ఓడిస్తాడు. నిన్ను నేను చంపేస్తాను. ఈ వేళ నేను నీ తల నరికి నీ శవాన్ని పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను. మిగిలిన ఫిలిష్తీయులందరికీ అలానే చేస్తాము. అప్పుడు ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ప్రపంచం అంతా తెలుసుకొంటుంది.
1SA 17:47 ప్రజలను రక్షించాలంటే యోహోవాకు కత్తులు, కటారులు అక్కరలేదని ఇక్కడున్నవారంతా తెలుసుకొంటారు. ఈ యుద్ధం యెహోవాదే! మీ ఫిలిష్తీయులందరినీ ఓడించేలా యెహోవా మాకు సహాయం చేస్తాడు” అని దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతుతో చెప్పాడు.
1SA 17:48 ఫిలిష్తీయుడైన గొల్యాతు దావీదు మీద పడటానికి మెల్లగా దగ్గరగా వెళ్లాడు. దావీదు గొల్యాతును ఎదుర్కోటానికి వేగంగా పరుగెత్తాడు.
1SA 17:49 దావీదు తన సంచిలో నుంచి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి దానిని విసరికొట్టాడు. ఆ రాయి వడిసెల నుండి వెళ్లి గొల్యాతునుదుటి మీద గట్టిగా తగిలింది. ఆ రాయి అతని తలలోనికి లోతుగా దూసుకుపోయింది. గొల్యాతు ఒక్క సారిగా నేలమీద బోర్ల పడిపోయాడు.
1SA 17:50 అలా దావీదు ఫిలిష్తీయుల యోధుణ్ణి కేవలం ఒక రాయి, వడిసెలతోనే ఓడించేసాడు. ఒక్క దెబ్బతో వానిని చంపేసాడు. దానదు చేతిలో కనిసు కత్తికూడ లేదు.
1SA 17:51 కనుక దావీదు పరుగున పోయి పడివున్న గొల్యాతు పక్కన నిలబడ్డాడు. తరువాత దావీదు గొల్యాతు ఒరలోవున్న కత్తిని లాగి దానితోనే గొల్యాతు తలను నరికివేశాడు. అలా దావీదు ఫిలిష్తీయుల వీరుని హతమార్చాడు. ఎప్పుడయితే తమ వీరుడు చావటం మిగతా ఫిలిష్తీయులు చూసారో అప్పుడు వెనుదిరిగి పారిపోయారు.
1SA 17:52 ఇశ్రాయేలు, యూదా సైనికులు జయజయధ్వనులు చేస్తూ ఫిలిష్తీయుల సైనికులను గాతు నగర సరిహద్దుల వరకు, ఎక్రోను నగర ద్వారం వరకు తరిమి తరమి కొట్టారు. చాలామంది ఫిలిష్తీయులను వారు చంపేసారు. వారి శవాలు షరాయిము బాటపైగాతు, ఎక్రోనుల వరకు అంత దూరమూ పడివున్నాయి.
1SA 17:53 ఫిలిష్తీయుల సైన్యాన్ని వెళ్లగొట్టి వచ్చి, ఇశ్రాయేలు సైనికులు ఫిలిష్తీయుల గుడారాల నుంచి చాలా వస్తు సంపదను తీసుకున్నారు.
1SA 17:54 గొల్యాతు తలను దావీదు యెరూషలేముకు తీసుకుని వెళ్లాడు. ఆ ఫిలిష్తీయుల యోధుని ఆయుధాలను కూడా దావీదు తన గుడారములో పెట్టాడు.
1SA 17:55 దావీదు ధైర్యంగా గొల్యాతును ఎదుర్కొన్న తీరును సౌలు గమనించాడు. తన సేనాని అబ్నేరును పిలిచి, “ఆ కుర్రవాని తండ్రి ఎవరని” అడిగాడు. “మీ తోడు అతనెవరో నాకు తెలియదు రాజా” అన్నాడు అబ్నేరు.
1SA 17:56 సౌలు, “ఆ కుర్రవాని తండ్రి ఎవరో తెలుసుకో” అన్నాడు.
1SA 17:57 గొల్యాతును చంపి దావీదు తిరిగి రాగానే అబ్నేరు అతనిని సౌలువద్దకు తీసుకుని వచ్చాడు. దావీదు ఇంకా ఆ ఫిలిష్తీయుని తలను చేతిలో పట్టుకొని ఉన్నాడు.
1SA 17:58 “చిన్నవాడా! నీ తండ్రి ఎవరు?” అని సౌలు అతన్ని అడిగాడు. “బేత్లెహేములో ఉన్న మీ సేవకుడు యెష్షయి కుమారుడను నేను” అని దావీదు జవాబు చెప్పాడు.
1SA 18:1 దావీదు సౌలుతో మాట్లాడటం ముగించాక, యోనాతాను దావీదుకు చాలా సన్నిహితుడయ్యాడు. తనను తాను ప్రేమించుకున్నంతగా యోనాతాను దావీదును ప్రేమించాడు.
1SA 18:2 సౌలు ఆ రోజు నుంచీ దావీదును తన వద్దనే ఉంచుకొన్నాడు. దావీదును ఊరిలోవున్న తన తండ్రి వద్దకు సౌలు పోనీయలేదు.
1SA 18:3 యోనాతాను దావీదుతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఎందువల్లనంటే, దావీదు అంటే యోనాతానుకు ఎనలేని ప్రేమ.
1SA 18:4 యోనాతాను తన అంగీ తీసి దావీదుకు తొడిగాడు. యోనాతాను తన సైనిక దుస్తులు కూడా దావీదుకు ఇచ్చాడు. అంతేగాదు; యోనాతాను తన ఖడ్గం, విల్లంబలు, పటకా అన్నీ దావీదుకు ఇచ్చాడు.
1SA 18:5 సౌలు దావీదును అనేక యుద్ధాలకు పంపాడు అన్నింటిలో అతడు విజయం సాధిస్తూ వచ్చాడు. కాబట్టి అతనిని సైన్యాధికారిగా సౌలు నియమించాడు. దీనికి ప్రజలంతా చాలా సంతోషించారు. సౌలు అధికారులు కూడ సంతేషించారు.
1SA 18:6 దావీదు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజ్యంలోని వివిధ పట్టణాల స్త్రీలు అందరూ దావీదును కలుసుకొనేందుకు బయటకు వచ్చారు. వారు వీణారాగాలతోను, మృదంగతాళ ధ్వనులతోను దావీదు ఎదుట చిరునవ్వులతో నాట్యం చేసారు. ఇదంతా వారు సౌలు యెదుటనే చేసారు.
1SA 18:7 “సౌలు వేల కొలదిగాను హతము చేసెననియు దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు” స్త్రీలంతా జయగీతిక పాడారు.
1SA 18:8 స్త్రీల పాట సౌలును కలవర పెట్టింది. అతనికి చాలా కోపం వచ్చింది. “తాను వేలమందిని మాత్రమే చంపానని దావీదు పదివేల మందిని చంపాడని స్త్రీలు చెబతున్నారే” అని సౌలు పరి పరి విధాల ఆలోచనచేశాడు.
1SA 18:9 అప్పటినుండి సౌలు దావీదును ఒక కంట కనిపెడుతూ వచ్చాడు.
1SA 18:10 ఆ మరుసటి రోజు దేవుని యొద్ద నుండి ఒక దుష్ట ఆత్మ సౌలును బలీయంగా ఆవరించింది. తన ఇంటిలో సౌలు చాలా కిరాతకంగా ప్రవర్తించాడు. ఎప్పటిలాగే దావీదు తన వీణ వాయించాడు. కానీ సౌలు చేతిలో ఒక బల్లెం ఉంది.
1SA 18:11 “దావీదును గోడకు గుచ్చి వేయాలని సౌలు” తలచాడు. రెండుసార్లు సౌలు బల్లెం విసరినాడు. కానీ దావీదు తప్పించుకున్నాడు.
1SA 18:12 యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. యెహోవా సౌలును వదిలివేశాడు. అందువల్ల దావీడు అంటే సౌలుకు భయంవేసింతి
1SA 18:13 సౌలు తన దగ్గరనుండి దావీదును పంపివేసాడు. సౌలు దావీదును వెయ్యిమంది సైనికులకు అధిపతిగా చేసాడు. ఆ సైనికులను దావీదు యుద్ధానికి నడిపించాడు.
1SA 18:14 యెహోవా దావీదుతో ఉన్నాడు గనుక, దావీదు ఏది చేసినా విజయాన్నే సాధిస్తూవచ్చాడు.
1SA 18:15 దావీదు చాలా విజయం సాధిస్తున్నట్టు సౌలు గమనించాడు. దానితో సౌలుకు దావీదు అంటే భయం ఇంకా ఎక్కువయ్యింది.
1SA 18:16 కానీ ఇశ్రాయేలు, యూదా ప్రజలు అందరూ దావీదును ఎక్కువగా ప్రేమించారు. కారణం వారిని యుద్ధంలో దావీదు అతిచాకచక్యంగా నడిపించుటచేత.
1SA 18:17 (కానీ సౌలు దావీదును చంపాలని కోరాడు. దావీదును మోసం చేయటానికి ఒక పథకం వేసాడు). సౌలు, “ఇదిగో నా పెద్ద కుమార్తె మేరబు. నీవు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత నీవు మంచి శక్తిగల సైనికుడివి కావచ్చు. నీవు నాకు ఒక కొడుకులా ఉంటావు. అప్పుడు నీవు వెళ్లి, యెహోవా పక్షంగా యుద్ధాలు చేయి” అని దావీదుతో చెప్పాడు. (ఇది ఒక పన్నాగము). వాస్తవానికి సౌలు, “ఇప్పుడు దావీదును నేనేమీ చంపక్కర్లేదు. నా కోసం ఫిలిష్తీయులే అతనిని చంపుతారులే” అని తలచాడు.
1SA 18:18 అందుకు దావీదు, “మాది గొప్ప కుటుంబంకాదు, నేను గొప్ప వ్యక్తినీ కాను. కనుక నేను రాజుగారి అమ్మాయిని పెళ్లాడలేను” అని అన్నాడు.
1SA 18:19 అందుచేత మేరబు దావీదును పెళ్లి చేసుకొనే సమయం వచ్చేసరికి, సౌలు ఆమెను మెహోలతీవాడైన అద్రియేలు అనేవానికిచ్చి వివాహము చేసాడు.
1SA 18:20 సౌలు యొక్క మరో కుమార్తె మీకాలు దావీదును ప్రేమించింది. మీకాలు దావీదును ప్రేమించినట్టు ప్రజలు సౌలుకు చెప్పారు. అది విని సౌలు సంతోషించాడు.
1SA 18:21 “మీకాలు దావీదును వివాహ మాడటానికి నేను అంగీకరిస్తాను. దావీదును ఉచ్చులో పెట్టేందుకు నేను మీకాలును వినియోగించుకుంటాను. అప్పుడు దావీదును ఫిలిష్తీయుల చేతనే చంపిస్తాను” అనుకొన్నాడు సౌలు. కనుక సౌలు రెండవ సారిగా దావీదుతో, “ఈ వేళ నీవు నా కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు” అని చెప్పాడు.
1SA 18:22 సౌలు తన అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు. “దావీదుతో ఆంతరంగికంగా, ‘రాజుకు నీవంటే చాలా ఇష్టం ఆయన అధికారులకు కూడా నీవంటే ఇష్టం నీవు అతని కుమార్తెను పెళ్లి చేసుకో’ అని చాటుగా దావీదుకు చెప్పండి” అని సౌలు వారితో అన్నాడు.
1SA 18:23 సౌలు అధికారులు అలాగే దావీదుతో చెప్పారు. అది విన్న దావీదు, “రాజుగారి అల్లుడు కావటమంటే అంత తేలికైన పని అనుకుంటున్నారా? (రాజుగారి కుమార్తెకు కట్నం ఇచ్చేందుకు నా దగ్గర డబ్బులేదు.) నేను సామాన్య నిరుపేదను” అని దావీదు జవాబిచ్చాడు.
1SA 18:24 తిరిగి సౌలు అధికారులు దావీదు చెప్పినదంతా సౌలుకు వివరించారు.
1SA 18:25 మళ్లీ సౌలు వారితో, “దావీదు కట్నం చెల్లించనక్కరలేదనీ, కేవలం ఒక వందమంది ఫిలిష్తీయుల సున్నతి చర్మాలను తెస్తే చాలనీ చెప్పండి దానితో సౌలు తన శత్రువుల మీద పగ తీర్చుకున్నట్లవుతుందని చెప్పండి” అన్నాడు. ఈ పని చేస్తే ఫిలిష్తీయులు దావీదును చంపుతారని సౌలు రహస్య పథకం.
1SA 18:26 సౌలు అధికార్లు మళ్లీ దావీదుకు ఈ విషయం చెప్పారు. దావీదు సౌలు అల్లుడు కావటానికి ఇష్టపడ్డాడు. కనుక అతడు వెంటనే పనికి పూనుకున్నాడు.
1SA 18:27 దావీదు తన సైనికులతో బయలుదేరి వెళ్లి రెండువందల మంది ఫిలిష్తీయులను చంపి, వారి సున్నతి చర్మాలను తీసుకుని వచ్చి సౌలుకు ఇచ్చాడు. రాజుగారి అల్లుడు కావాలని కోరి దావీదు ఇలా చేసాడు. అప్పుడు సౌలు దావీదును తన కుమార్తె మీకాలును పెండ్లి చేసుకోనిచ్చాడు.
1SA 18:28 అప్పుడు కూడా యెహోవా దావీదుతో ఉన్నాడని సౌలు అవగాహన చేసుకున్నాడు. పైగా తన కుమార్తె మీకాలు దావీదును ప్రేమస్తూ ఉందని తెలుసుకున్నాడు.
1SA 18:29 దానితో సౌలుకు దావీదు అంటే భయం ఎక్కువయ్యింది. ఆ విధంగా సౌలు దావీదుకు ఎల్లప్పుడూ విరోధంగా ఉండిపోయాడు.
1SA 18:30 ఫిలిష్తీయుల సేనాధిపతులు మాత్రం ఇశ్రాయేలీయులపై తమ దండ్రయాత్రలు సాగిస్తూనే ఉన్నారు. అయితే ప్రతిసారీ దావీదు వారిని ఓడిస్తూనే ఉన్నాడు సౌలు క్రిందవున్న అధికారులందరిలో దావీదు చాలా ఉత్తమ అధికారి. అందువల్ల దావీదు చాలా ప్రసిద్ధిలోకి వచ్చాడు.
1SA 19:1 దావీదును చంపి వేయుమని సౌలు తన కుమారుడైన యోనాతానుకు, మిగిలిన అధికారులకు చెప్పాడు. కానీ యోనాతాను దావీదును చాలా ప్రేమించాడు.
1SA 19:2 యోనాతాను దావీదును హెచ్చరించాడు. “జాగ్రత్తగా ఉండు. సౌలు నిన్ను చంపాలని అవకాశం కోసం చూస్తున్నాడు. ఉదయం పొలానికి వెళ్లి అక్కడ దాగి వుండు.
1SA 19:3 నేను నా తండ్రితో ఆ పొలానికి వస్తాను. నీవు దాగియున్న పొలాల వద్ద మేము నిలబడతాము. నీ విషయంలో నా తండ్రితో నేను మాట్లాడతాను. తరువాత నేను తెలుసు కున్నదంతా నీకు చెబతాను” అని యోనాతాను దావీదుతో చెప్పాడు.
1SA 19:4 యోనాతాను తన తండ్రి సౌలుతో మాట్లాడుతూ దావీదు గుణగణాలను కొనియాడాడు. “నీవు రాజువు. దావీదు నీ సేవకుడు. దావీదు నీకు ఏమీ కీడు చేయలేదు. కనుక అతనికి ఏమీ కీడు చేయకు. దావీదు ఎల్లప్పుడూ నీ ఎడల మేలునే చేసాడు.
1SA 19:5 దావీదు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపాడు. దాని ద్వారా యెహోవా ఇశ్రాయేలు అంతటికీ ఘనవిజయం సమకూర్చి పెట్టాడు. అదంతా నీవు చూశావు, ఆనందించావు. పైగా అటువంటి దావీదుకు నీవు ఎందుకు కీడు తలస్తున్నావు? అతడు అమాయకుడు. అతనిని చంపటానికి తగిన కారణమే లేదు” అని అన్నాడు.
1SA 19:6 యోనాతాను చెప్పినదంతా విని సౌలు ఒక ప్రమాణం చేసాడు. “యెహోవా సజీవంగా ఉన్నాడు అన్నంత నిజంగా, దావీదు చంపబడడు” అని చెప్పాడు సౌలు.
1SA 19:7 కనుక యోనాతాను దావీదును పిలిచి జరిగినదంతా అతనితో చెప్పాడు. అప్పుడు యోనాతాను దావీదును తన తండ్రి వద్దకు తీసుకుని వెళ్లాడు. అప్పటి నుండి దావీదు మొదట్లోలాగే సౌలు దగ్గర ఉన్నాడు.
1SA 19:8 మళ్లీ యుద్ధం వచ్చినప్పుడు దావీదు ఫిలిష్తీయులను ఎదుర్కోవటానికి వెళ్లాడు. దావీదు వారిని తరిమికొట్టాడు, వారు అతని దగ్గరనుండి పారిపోయారు.
1SA 19:9 కానీ ఒక దుష్ట ఆత్మ యెహోవా వద్దనుండి వచ్చి సౌలును ఆవరించింది. సౌలు తన ఇంట్లోనే కూర్చునివున్నాడు. సౌలు చేతిలో అతని ఈటెవుంది. దావీదు సితార వాయిస్తూ ఉన్నాడు.
1SA 19:10 సౌలు తన ఈటెను దావీదు మీదికి విసరి అతనిని వెనుక ఉన్న గోడకు గుచ్చివేయాలని ప్రయత్నించాడు. కాని ఈటెను దావీదు తప్పుకోవటంతో ఈటె గురి తప్పిగోడలోకి దిగిపోయింది. ఆ రాత్రి దావీదు పారిపోయాడు.
1SA 19:11 సౌలు తన మనుష్యులను దావీదు ఇంటికి పంపాడు. వారు దావీదు ఇంటిపై నిఘా వేసి రాత్రి అంతా అక్కడే ఉండి, ఉదయమే అతనిని చంపే ప్రయత్నంలో కనిపెట్టుకొని ఉన్నారు. కానీ దావీదు భార్య మీకాలు అతనిని హెచ్చరించింది. “ఈ రాత్రి నీవు పారిపోయి నీ ప్రాణాలను రక్షించుకో. లేనిచో ఉదయమే నీవు చంపబడతావు” అని ఆమె చెప్పింది.
1SA 19:12 అలా చెప్పి, దావీదును ఒక కిటికిగుండా బయటకుదింపింది. దావీదు తప్పించుకొని పారి పోయాడు.
1SA 19:13 మీకాలు గృహ దేవత విగ్రహాన్ని తెచ్చి పక్కమీద ఉంచి దుప్పట్లు కప్పింది. ఆ విగ్రహం తల మీద కొన్ని మేక వెంట్రుకలు కూడ ఆమె అమర్చింది.
1SA 19:14 దావీదును బంధించమని సౌలు తన సైనికులను పంపాడు. కానీ “దావీదుకు అనారోగ్యంగా వుందని” మీకాలు చెప్పింది.
1SA 19:15 ఈ విషయం తన మనుష్యులు చెప్పేసరికి, “అవసరమైతే దావీదును మంచంతో సహా ఎత్తుకు రండి. నేను అతనిని అవసరమైతే చంపేస్తాను” అని ఆ మనుష్యులతో సౌలు చెప్పాడు.
1SA 19:16 సౌలు మనుష్యులు దావీదు కోసం మళ్లీ దావీదు ఇంటికి వెళ్లి చూడగా పక్కమీద ఉన్నది ఒక దేవతా విగ్రహం మాత్రమేనని, దాని తలమీద ఉన్నవి కేవలం మేక వెంట్రుకలు మాత్రమేననీ వారు తెలుసుకున్నారు.
1SA 19:17 “ఇలా నన్నెందుకు మోసగించావు, నా శత్రువును వదిలిపెట్టావు, వాడు పారిపోయాడు” అని సౌలు మీకాలును అడిగాడు. “తనకు సహాయం చేయకపోతే నన్ను చంపుతానని అతడు బెదిరించాడు. అందుకే నేను అలా చేశానని” మీకాలు జవాబు ఇచ్చింది.
1SA 19:18 దావీదు సౌలు బారి నుండి తప్పించుకుని రామాలోవున్న సమూయేలు వద్దకు వెళ్లాడు. సౌలు తన పట్ల చేసినదంతటినీ దావీడు సమూయేలుకు చెప్పాడు. తరువాత దావీదు, సమూయేలు కలిసి ప్రవక్తల గుడారాలకు వెళ్లారు. దావీదు అక్కడే ఉండి పోయాడు.
1SA 19:19 రామాలో వున్న గుడారాలలో దావీదు ఉంటున్నట్లు సౌలు విన్నాడు.
1SA 19:20 దావీదును బంధించి తీసుకుని రావలసిందిగా సౌలు మనుష్యులను పంపాడు. కానీ వారు ఆ గుడారాలకు వచ్చేసరికి అక్కడ ప్రవక్తల గుంపు ఒకటి ప్రవచిస్తూ ఉండటం కనబడింది. సమూయేలు ఆ ప్రవక్తలకు నాయకత్వం వహించి ఉన్నాడు. దేవుని ఆత్మ సౌలు పంపిన మనుష్యుల మీదికి రాగావారు కూడ దేవుని విషయాలు చెప్పనారంభించారు.
1SA 19:21 ఈ వార్త సౌలు వరకూ పోయింది. అతను మరి కొంతమంది మనుష్యులను పంపాడు. వారుకూడ దేవుని విషయాలు చెప్పటం మొదలు పెట్టారు. కనుక మూడవసారి మళ్లీ సౌలు మనుష్యులను పంపాడు. వారుకూడ దేవుని విషయాలు చెప్పటం మొదలు పెట్టారు.
1SA 19:22 చివరికి సౌలు స్వయంగా బయలుదేరి రామా చేరుకున్నాడు. సేఖూలో ఒక నూర్పిడి కళ్లము దగ్గరవున్న పెద్ద బావి వద్దకు సౌలు వచ్చాడు. “సమూయేలు, దావీదు ఎక్కడ ఉన్నారని” సౌలు అక్కడున్న వారిని అడిగాడు. “రామాదగ్గర ఉన్న నాయోతులో ఉన్నారని” వాళ్లు జవాబు చెప్పారు.
1SA 19:23 అప్పుడు సౌలు రామా దగ్గర్లో వున్న నాయోతుకు వెళ్లాడు. దేవుని ఆత్మ సౌలు మీదికి కూడ రావటంతో అతను దేవుని విషయాలు చెబుతూ ముందుకు నడిచాడు. రామాలో వున్న నాయోతుకు వెళ్లేవరకు సౌలు మరింత ఎక్కువగా దేవుని విషయాలు చెబతూనే ఉన్నాడు.
1SA 19:24 అప్పుడు సౌలు తన బట్టలు విడిచి, సమూయేలు ఎదుట అతడు దేవుని విషయాలు పలికాడు. ఆ పగలూ, ఆ రాత్రి శరీరంమీద బట్టలు లేకుండానే సౌలు గడిపాడు. ఆ కారణం చేతనే, “సౌలుకూడ ప్రవక్తల్లో ఒకడు అయ్యాడా?” అని ప్రజలు అనుకోవటం మొదలయ్యింది.
1SA 20:1 దావీదు రామాలో వున్న నాయోతునుంచి పారిపోయాడు. తిన్నగా యోనాతాను వద్దకు వెళ్లి, “నేనేమి తప్పు చేశాను? నా నేరం ఏమిటి? నీ తండ్రి ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు?” అని అడిగాడు.
1SA 20:2 అది విన్న యోనాతాను ఇలా అన్నాడు, “నా తండ్రి నిన్ను చంపటానికి ప్రయత్నం చేయటం లేదు. నా తండ్రి ముందుగా నాకు చెప్పకుండా ఏ పనీచేయడు. అది అతి ముఖ్యమైన పనిగాని, లేక అతి స్వల్పమైన విషయంగాని మా తండ్రి ఎప్పుడూ నాకు చెబతాడు. ఆయన నిన్ను చంపాలనే తన ఆలోచనను నాకెందుకు చెప్పకుండా ఉంటాడు? లేదు. అది నిజం కాదు!”
1SA 20:3 కానీ దావీదు, “నేను నీ స్నేహితుడనని నీ తండ్రికి బాగా తెలుసు. యోనాతానుకు ఈ విషయం తెలియకూడదు అతనికి తెలిస్తే దావీదుకు చెప్పేస్తాడు అని నీ తండ్రి అనుకుని ఉంటాడు. దేవుడు జీవిస్తున్నాడు అన్నంత నిజంగా, నీవు జీవుస్తున్నావన్నంత నిజంగా నేను మృత్యువుకు చాలా చేరువలో ఉన్నాను.” అని జవాబిచ్చాడు.
1SA 20:4 యోనాతాను, “సరే, ఇప్పుడు నీవు ఏమి చేయమంటే అది నేను చేస్తాను” అని దావీదుతో అన్నాడు.
1SA 20:5 అప్పుడు దావీదు, “అయితే చూడు. రేపు అమావాస్య విందు. నేను రాజుతో కలిసి విందారగించవలసివుంది. కాని రేపు సాయంత్రం వరకు నన్ను పొలాల్లో దాగివుండనీ.
1SA 20:6 నేను రాలేదని నీ తండ్రి గమనించినపుడు ‘దావీదు తన స్వగ్రామమైన బేత్లెహేముకు వెళ్లాలని కోరాడు. ఈ నెలసరి బలి అర్పణకు అతని కుటుంబంవారు స్వంతంగా విందు చేసుకోవాలని కోరారు. కనుక దావీదు తన కుటుంబంతో కలసి ఉండేందుకు తనను వెళ్లనివ్వాల్సిందిగా నన్ను అడిగాడు’ అని నీ తండ్రికి చెప్పు అన్నాడు.
1SA 20:7 ‘సరే మంచిది’ అని మీ తండ్రి అంటే నేను హాయిగా ఉన్నట్లే. కానీ ఆయనకు కోపం వస్తే మాత్రం నాకు కీడు చేస్తాడని నీవు నమ్మవచ్చు.
1SA 20:8 యోనాతానూ! నేను నీ సేవకుడను. నన్ను కనికరించు. యెహోవా ఎదుట నీవు నాతో ఒక ఒడంబడిక చేసావు. నేను దోషినయితే నీకై నీవే నన్ను చంపవచ్చు! కానీ నన్ను మాత్రం నీ తండ్రి వద్దకు తీసుకుని వెళ్లకు” అన్నాడు.
1SA 20:9 యోనాతాను, “లేదు ఎప్పటికీ అలా జరగదు! నా తండ్రి నీకు కీడు తలపెడితే నేను నీకు తెలియజేస్తాను” అని చెప్పాడు.
1SA 20:10 దావీదు, “నీ తండ్రి నిన్ను తిడితే అది నాకెవరు తెలియజేస్తారు?” అన్నాడు.
1SA 20:11 అప్పుడు యోనాతాను, “అయితే, రా! మనం పొలంలోకి వెళదాము” అని అనగా యోనాతాను, దావీదు కలిసి పొలంలోకి వెళ్లారు.
1SA 20:12 యెనాతాను దావీదుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సమక్షంలో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నా తండ్రి నీ విషయంలో ఏ తలంపుతో ఉన్నాడో తెలుసుకుంటానని నీకు ప్రమాణం చేస్తున్నాను. నీ పట్ల ఆయన వైఖరి బాగుందో లేదో తెలుసుకుంటాను. ఆ విషయం మూడురోజుల్లో నీకు పొలానికి కబురు చేస్తాను.
1SA 20:13 నా తండ్రి గనుక నీకు కీడు తలపెడితే, అది నీకు తెలియపర్చి, నిన్ను క్షేమంగా వెళ్లిపోనిస్తాను. ఇది నేను చేయకపోతే యెహోవా నన్ను శిక్షించునుగాక! యెహోవా నా తండ్రికి తోడై యున్నట్లు, నీకు కూడ తోడైవుండునుగాక!
1SA 20:14 నేను జీవించినంత కాలం, నా మీద దయచూపించు. నేను మరణించాక
1SA 20:15 నా కుటుంబంపట్ల నీ దయాదాక్షిణ్యాలు చూపించటం ఎన్నడూ మానవద్దు. ఈ భూమి మీద నీ శత్రువుల నందరినీ యెహోవా నాశనం చేయునుగాక!
1SA 20:16 ఆ సమయంలో యోనాతాను కుటుంబం దావీదునుండి వేరు చేయబడాల్సి వస్తే, అలాగే జరుగనివ్వు. దావీదు శత్రువులను యెహోవా శిక్షించునుగాక!”
1SA 20:17 అప్పుడు యోనాతాను తన మీద దావీదుకు ఉన్న ప్రేమ వాగ్దానాన్ని మరల చూపించమన్నాడు. ఎందువల్ల నంటే యోనాతాను తనను తాను ప్రేమించుకున్నంతగా దావీదును ప్రేమించాడు గనుక అలా చేశాడు.
1SA 20:18 “రేపు అమావాస్య విందుగదా! అక్కడ నీ స్థానం ఖాళీగా వుంటుంది. కనుక నా తండ్రి నీవు రాలేదని గమనిస్తాడు.
1SA 20:19 ఈ కష్టాలన్నీ ప్రారంభమైనప్పుడు నీవు ముందుగా ఎక్కడ దాగివున్నావో అక్కడికే మూడవ రోజున కూడ నీవు వెళ్లు. అక్కడ కొండ పక్కన వేచివుండు.
1SA 20:20 మూడవ రోజున కొండ పక్కగా నేనొక గురిని బాణంతో కొడుతున్నట్టు నేను నటిస్తాను. నేను కొన్ని బాణాలు వదులుతాను.
1SA 20:21 అప్పుడు ఆ వదిలిన బాణాన్ని వెదికేందుకుగాను ఒక కుర్రవానిని పంపుతాను. వానితో నేను ‘మరీ దూరం వెళ్లిపోయావు. బాణాలు అక్కడ నాకు దగ్గర్లోనే ఉన్నాయి గదా, వెనక్కు వచ్చేసి వాటిని తీసుకొనిరా’ అని చెబతాను. నేను గనుక అలా చెబితే అప్పుడు నీవు బయటకి రావచ్చు. యెహెవా జీవిస్తున్నంత వాస్తవంగా నీకు క్షేమం కలుగుతుందని వాగ్దానం చేస్తున్నాను. ప్రమాదం ఏమీ లేదు.
1SA 20:22 కానీ ఒకవేళ ఏదైనా తొందర ఉంటే, ‘బాణాలు చాలా దూరంగా ఉన్నాయి. వెళ్లి వాటిని తీసుకురా’ అని ఆ కుర్రవానితో నేను అంటాను. నేను గనుక అలా చెబితే నీవు తప్పక పారిపోవల్సిందే. అంటే యెహోవా నిన్ను దూరంగా పంపుతున్నాడన్న మాట.
1SA 20:23 మనిద్దరి మధ్యవున్న ఈ ఒడంబడిక జ్ఞాపకం ఉంచుకో. యెహోవా మనకు శాశ్వతంగా సాక్షి” అని యోనాతాను దావీదుకు చెప్పాడు.
1SA 20:24 అప్పుడు దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్య విందు సమయం వచ్చింది. రాజు భోజనం చేయటానికి కూర్చున్నాడు.
1SA 20:25 మామూలుగా కూర్చునే చోటులో గోడ దగ్గరగా రాజు కూర్చున్నాడు. సౌలుకు ఎదురుగా యోనాతాను కూర్చున్నాడు. సౌలుకు పక్కగా అబ్నేరు కూర్చున్నాడు. కానీ దావీదు స్థానం ఖాళీగా ఉంది.
1SA 20:26 ఆరోజు సౌలు ఏమీ అనలేదు. “దావీదుకు ఏమైనా జరిగివుండవచ్చు; లేదా మైలపడి ఉండవచ్చు” అనుకున్నాడు.
1SA 20:27 కానీ మరునాడు, అంటే ఆ నెల రెండో రోజున కూడా దావీదు స్థానం ఖాళీగావుంది. “యెష్షయి కుమారుడు నిన్న, ఈ రోజు కూడా అమావాస్యవిందుకు ఎందుకు రాలేదని సౌలు యోనాతానును” అడిగాడు.
1SA 20:28 “బేత్లెహేము వెళ్లనిమ్మని దామీదు నన్ను అడిగాడు.
1SA 20:29 అతని కుటుంబం వాళ్లున్న బేత్లెహేములో ఒక బలి అర్పణ ఇస్తున్నారని, అతడు చెప్పాడు. అతని సోదరుడు అతనిని రమ్మని పిలిచాడనీ, కాబట్టి తన సోదరులను చూడటానికి అనుమతి ఇమ్మని స్నేహితునిగా అడుగుతున్నాననీ దావీదు చెప్పాడు. అందుచేత దావీదు రాజు విందుకు రాలేక పోయాడు,” అని యోనాతాను చెప్పాడు.
1SA 20:30 సౌలుకు యోనాతాను మీద చాల కోపం వచ్చింది, “మాట తిరస్కరించే బానిస స్త్రీకి పుట్టినవాడివి నీవు! నీవు ఆ స్త్రీలాగే ప్రవర్తిస్తున్నావు. నాకు తెలుసు నీవు దావీదు పక్షాన ఉన్నావని. నీకూ, నిన్ను కన్నతల్లికి తలవంపులు తెస్తున్నావు.
1SA 20:31 యెష్షయి కుమారుడు బతికి ఉన్నంత వరకూ నీవు రాజు కావటంగాని, రాజ్యాన్ని చేపట్టటం గాని జరుగదు. ఇప్పుడే దావీదును నా దగ్గరకు తీసుకునిరా! వాడు చచ్చిన వారితో సమానము!” అన్నాడు సౌలు.
1SA 20:32 “దావీదును ఎందుకు చంపాలి? దావీదు చేసిన నేరం ఏమిటి?” అని యోనాతాను తన తండ్రిని అడిగాడు.
1SA 20:33 సౌలు తన ఈటెను యోనాతాను మీదికి విసరి, అతనిని చంపటానికి ప్రయత్నం చేసాడు. దానితో తన తండ్రి నిజంగానే దావీదును చంపాలని తల పెట్టాడని యోనాతానుకు అర్థమయ్యింది.
1SA 20:34 యోనాతానుకు విపరీతంగా కోపం వచ్చింది. భోజనాల బల్ల వదిలి వెళ్లిపోయాడు. యోనాతాను తన తండ్రి మీద చాల కోపంతో ఆ విందు రెండో రోజు కూడ ఏమీ భోజనంచేయటానికి ఒప్పుకోలేదు. సౌలు తనను పరాభవించినందుకు, దావీదును చంపాలని చూస్తున్నందుకు యోనాతాను కోపగించాడు.
1SA 20:35 ఆ మరునాటి ఉదయం యోనాతాను పొలానికి వెళ్లాడు. వాళ్లనుకున్నట్లుగా దావీదును కలవటానికి అతడు వెళ్లాడు. యోనాతాను తన వెంట ఒక చిన్న పిల్లవానిని కూడ తీసుకుని వెళ్లాడు.
1SA 20:36 “నేను వేసే బాణాన్ని పరుగున పోయి వెదికి తీసుకునిరా” అని యోనాతాను పిల్లవానితో చెప్పాడు. ఆ పిల్లవాడు పరుగెత్తుచుండగా యోనాతాను వాని తల మీదగా అవతలికి బాణాలు వేశాడు.
1SA 20:37 బాణాలు పడిన చోటుకి బాలడు పరుగెత్తాడు. కానీ యోనాతాను “బాణాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి” అని అరిచాడు.
1SA 20:38 “వెళ్లు! త్వరగా వెళ్లు! ఆ బాణాలు తీసుకురా, ఆగకు!” అంటూ యోనాతాను కేకలు వేశాడు. ఆ బాలుడు బాణాలు తీసుకుని తన యజమాని వద్దకు తెచ్చాడు.
1SA 20:39 ఈ సందర్భంలో ఇక్కడ అతి రహస్యంగా ఏమి జరిగిందో ఆ బాలునికి ఏమీ తెలియదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే అది తెలుసు.
1SA 20:40 యోనాతాను తన విల్లు, అంబులను ఆ బాలునికి ఇచ్చి, “పట్టణానికి వెళ్లి పొమ్మ” ని చెప్పాడు.
1SA 20:41 ఆ కుర్రవాడు వెళ్లిపోయాక, కొండ ఆవలి ప్రక్కతాను దాగివున్న చోటనుండి దావీదు బయటకి వచ్చాడు. దావీదు యోనాతాను ముందు ప్రణమిల్లాడు. అలా మూడుసార్లు దావీదు చేశాడు. తరువాత దావీదు, యోనాతాను ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. వారు ఇద్దరూ బాగా ఏడ్చారు. దావీదు యోనాతాను కంటె ఎక్కువగా ఏడ్చాడు.
1SA 20:42 “శాంతితో వెళ్లు. మనము స్నేహితులుగా కొనసాగుతామని యెహోవా నామంతో వాగ్దానం చేసుకున్నాము. మనమధ్య, మన తరువాత మన తరాల వారి మధ్య యెహోవా శాశ్వతంగా సాక్షిగా ఉంటాడని మనము చెప్పుకున్నాము” అని యోనాతాను దావీదుతో అన్నాడు.
1SA 21:1 తరువాత దావీదు వెళ్లిపోయాడు. యోనాతాను తిరిగి పట్టణానికి వెళ్లాడు. అహీమెలెకు అనే యాజకుని చూడటానికి దావీదు నోబు పట్టణానికి వెళ్లాడు. దావీదును చూడగానే అహీమెలెకు భయంతో వణకిపోయాడు. “నీవు ఒంటరిగా ఎందుకున్నావు? నీకు తోడుగా ఎవ్వరూ ఎందుకు లేరు?” అని అహీమెలెకు దావీదును అడిగాడు.
1SA 21:2 దావీదు అహీమెలెకుతో, “రాజు నాకు ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. తాను ఏ పనిమీద నన్ను పంపిస్తున్నాడో అది వేరెవ్వరికీ తెలియ కూడదన్నాడు. నన్ను ఏమి చేయమని ఆయన చెప్పాడో అది ఎవ్వరికీ తెలియకూడదని ఆయన ఆజ్ఞ. నన్ను ఎక్కడ కలవాలో నా మనుష్యులకు నేను చెప్పాను.
1SA 21:3 ఇప్పుడు నీవద్ద ఏమైన ఆహారం ఉన్నదా? నాకు ఐదు రొట్టెలు లేదా ఏది ఉంటే అది ఇవ్వు” అని చెప్పాడు.
1SA 21:4 “తనవద్ద మాములు రొట్టెలేవీ లేవనీ, కేవలం ప్రతి ష్ఠితంగా దేవుని సన్నిధిలో ఉంచిన రొట్టెలు కొంత వున్నాయనీ, తన పరివారమంతా స్త్రీలకు దూరంగా వున్న వారైతే వారు ఈ రొట్టె తినవచ్చనీ” యాజకుడు దావీదుతో అన్నాడు.
1SA 21:5 అది విన్న దావీదు, “మేము ఏ స్త్రీలతోను ఉండలేదు. మేము యుద్ధానికి వెళ్లినప్పుడల్లా, అలాగే మాములు పనులు చేసేటప్పుడు కూడ నా మనుష్యులు తమ శరీరాలను పవిత్రంగా ఉంచు కుంటారు. ఇప్పుడు మేము బయలుదేరిన మా పని ఎంతో పవిత్రమైనది కనుక ఈ వేళ ఇది మరింత సత్యం” అన్నాడు.
1SA 21:6 పవిత్ర రొట్టె తప్ప మరొకటి లేక పోవటంతో యాజకుడు దావీదుకు దానినే ఇచ్చాడు. యాజకులు యెహోవా ఎదుట పీఠంపై ఆరగింపుగా ఉంచే రొట్టె ఇది. ప్రతి రోజూ వారు ఈ రొట్టెను తీసివేసి మళ్లీ కొత్త రొట్టెను దాని స్థానంలో ఉంచుతారు.
1SA 21:7 సౌలు అధికారులలో ఒకడు ఆ రోజున ఇక్కడ ఉన్నాడు. వాని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. వాడు అక్కడ యెహోవా ఎదుట ఉంచబడ్డాడు. దోయేగు సౌలు యొక్క గొర్రెల కాపరులకు నాయకుడు.
1SA 21:8 యాజకుడైన అహీమెలెకును, “ఒక ఈటెగాని, కత్తిగాని అక్కడ ఉన్నదా అని దావీడు అడిగాడు. రాజుపని అతి ముఖ్యమైనదని, తను త్వరగా వెళ్లవలసి ఉందనీ, తాను కత్తిగాని మరి ఏ ఇతర ఆయుధంగాని తేలేదనీ చెప్పాడు.”
1SA 21:9 ఫిలిష్తీయుడైన గొల్యాతు ఆయుద్ధం ఒక్కటే ఇక్కడ ఉందని యాజకుడు చెప్పాడు. “ఏలా లోయలో నీవు వానిని చంపినప్పుడు వాని దగ్గర నీవు తీసుకున్న ఖడ్గం అది. ఆ ఖడ్గం ఒక బట్టలో చుట్టబడి ఏఫోదు అంగీ వెనుక ఉంచబడింది కావాలంటే అది నీవు తీసుకోవచ్చు” అని అహీమెలెకు అన్నాడు. “గొల్యాతు కత్తికి మించిన కత్తిలేదు. దానిని నాకు ఇవ్వుము” అన్నాడు దావీదు.
1SA 21:10 ఆ రోజు సౌలు నుంచి దావీదు అలా పారిపోయాడు. గాతు రాజైన ఆకీషు వద్దకు దావీదు వెళ్లాడు.
1SA 21:11 కానీ ఆకీషు అధికారులకు అది నచ్చలేదు. వారు ఆయనతో ఇలా అన్నారు: “ఇతని పేరు దావీదు. ఇశ్రాయేలు రాజ్యానికి రాజు. ఇశ్రాయేలీయులు పాటలు పాడేది ఇతనిని గూర్చే. అతనికోసం వారు పాటలు పాడి నాట్యం చేస్తారు. ఇశ్రాయేలీయులు ఇదిగో ఈ పాట పాడతారు: “సౌలు వేల కొలదిగా హతము చేసాడు! దావీదు పది వేల కొలదిగా హతము చేసాడు!”
1SA 21:12 ఈ మాటలను దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు గాతు రాజైన ఆకీషును గూర్చి దావీదు చాలా భయపడ్డాడు.
1SA 21:13 అందువల్ల ఆకీషు ముందు, అతని సిబ్బంది ముందు దావీదు పిచ్చి పట్టిన వానిలా నటించుట మొదలు పెట్టాడు. అక్కడున్నంత సేపూ దావీదు పిచ్చివానిలా ప్రవర్తించాడు. మార్గపు తలుపుల మీద అతడు ఉమ్మి వేశాడు. తన ఉమ్ము తన గడ్డం మీద పడేటట్టు ఉమ్మేసాడు.
1SA 21:14 ఆకీషు, “వీని వైపుపు చూడండి! వీడు పిచ్చివాడు! వీడిని నా వద్దకు ఎందుకు తిసుకుని వచ్చారు?
1SA 21:15 ఇప్పటికే నా వద్ద పిచ్చి వాళ్లు చాలామంది ఉన్నారు. నా ముందు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటానికి వీనిని మీరు నా ఇంటికి తీసుకుని రానక్కర్లేదు! ఈ మనిషిని మళ్లీ నా ఇంటికి రానివ్వకండి” అని తన అధికారులతో చెప్పాడు.
1SA 22:1 దావీదు గాతును వదిలి అదుల్లాము గుహలలోకి పారిపోయాడు. అదుల్లాము గుహలో దావీదు ఉన్నట్లు అతని సోదరులు, బంధువులు విన్నారు. దావీదును చూడటానికి వారక్కడికి వెళ్లారు.
1SA 22:2 చాలా మంది ప్రజలు దావీదుతో కలిసారు. కష్టాల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసంతృప్తి చెందిన వారు దావీదు చుట్టూ చేరారు. వారికి దావీదు నాయకుడయ్యాడు. అతనితో కలిసి వారు మొత్తం నాలుగు వందలమంది.
1SA 22:3 దావీదు అదుల్లాము గుహ వదిలి మోయాబులో ఉన్న మిస్పాకు వెళ్లాడు. “దేవుడు నాకు ఏమి చేయనున్నాడో నేను తెలుసుకునే వరకు దయచేసి నా తల్లి దండ్రులను వచ్చి నీతో ఉండనియ్యి” అని దావీదు మోయాబు రాజును అడిగాడు.
1SA 22:4 దావీదు తన తల్లి దండ్రులను మోయాబు రాజువద్ద వదిలి పెట్టాడు. దావీదు కొండలలో దాగి ఉన్నంత కాలం అతని తల్లిదండ్రులు మోయాబు రాజుతోనే ఉన్నారు.
1SA 22:5 గాదు ప్రవక్త దావీదును, “కోటలో వుండవద్దనీ, యూధాకు వెళ్లమని చెప్పాడు.” కనుక దావీదు బయల్దేరి హారేతు అరణ్యానికి వెళ్లాడు.
1SA 22:6 దావీదు, అతని మనుష్యులను గూర్చి తన మనుష్యులకు తెలిసినట్లు సౌలు విన్నాడు. గిబియా వద్ద కొండ మీద ఉన్న ఒక వృక్షం క్రింద సౌలు కూర్చున్నాడు. సౌలు క్రింద అధికారులంతా అతని చుట్టూ నిలబడ్డారు. సౌలు చేతిలో ఒక ఈటె వుంది.
1SA 22:7 సౌలు తన చుట్టూవున్న అధికారులనుద్దేశంచి, “బెన్యామీను మనుష్యులారా వినండి! యెష్షయి కుమారుడు దావీదు మీ అందరికీ భూములు, ద్రాక్షతోటలు ఇస్తాడని మీరను కుంటున్నారా? మీ అందరినీ దావీదు సహస్ర సైన్యాధిపతులుగా, శత దళాధిపతులుగా చేస్తాడని మీరు అనుకుంటున్నారా? అని అడిగాడు.
1SA 22:8 మీరంతా నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు! మీరు రహస్య పథకాలు వేసారు. నా కుమారుడు యోనాతాను యెష్షయి కుమారునితో ఒడంబడిక చేసుకున్నట్లు మీలో ఎవ్వడూ నాకు చెప్పలేదు! నా గురించి మీలో ఒక్కనికీ శ్రద్ధలేదు! దావీదును నా కుమారుడు యోనాతాను ప్రోత్సహించినట్టు మీలో ఒక్కడూ నాకు చెప్పలేదు. నా సేవకుడు దావీదును దాగుకొనుమని, నన్ను ఎదురుదెబ్బ తీయుమని యోనాతాను చెప్పాడు. దావీదు ఇప్పుడు అదే పని చేస్తున్నాడు” అని అన్నాడు.
1SA 22:9 ఎదోమీయుడగు దోయేగు అక్కడ సౌలు అధికారులతో పాటు నిలబడివున్నాడు. “యెష్షయి కుమారుడైన దావీదు అహీటూబు కుమారుడైన అహీమెలె కును నోబులో చూడటానికి వచ్చినపుడు, అతనిని నేను చూసాను.
1SA 22:10 దావీదు కొరకు అహీమెలెకు ప్రార్థన చేయటం, అహీమెలెకు అతనికి ఆహారం ఇవ్వటం, పైగా ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గాన్ని అహీమెలెకు దావీదుకు ఇవ్వటం నేను చూసాను” అని దోయేగు వివరంగా చెప్పాడు.
1SA 22:11 అది విన్న సౌలు అహీటూబు కుమారుడు, యాజకుడైన అహీమెలెకును, అతని బంధువుల నందరినీ తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. అహీమెలెకు బంధువులంతా నోబులో యాజకులు. వారంతా రాజువద్దకు వచ్చారు.
1SA 22:12 “అహీటూబు కుమారుడా, విను” అని సౌలు అహీమెలెకుతో అన్నాడు. “చెప్పండి ప్రభూ,” అన్నాడు అహీమెలెకు.
1SA 22:13 “నీవూ, యెష్షయి కుమారుడైన దావీదూ కలిసి నామీద ఎందుకు రహస్య పథకాలు వేసారు? నీవు దావీదుకు రొట్టె, ఖడ్గం ఇచ్చావు. వాని కోసం నీవు దేవునికి ప్రార్థన చేసావు. ఇప్పుడు దావీదు నన్ను ఎదుర్కోటానికి వేచియున్నాడు.” అన్నాడు అహీమెలెకుతో సౌలు.
1SA 22:14 అహీమెలెకు, “దావీదు నీ పట్ల చాలా విశ్వసంగా ఉన్నాడు. దావీదు అంతటి నమ్మకస్థుడు నీ అధికారులలో మరెవ్వరూ లేరు. దావీదు నీ సొంత అల్లుడు. పైగా నీ అంగరక్షకులందరికీ అతడు అధిపతి. నీ సొంత కుటుంబమంతా దావీదును గౌరవిస్తూ ఉంది.
1SA 22:15 నేను దావీదు కొరకు ప్రార్థన చేయటం అది మొదటి సారికాదు. ఎన్నటికీ కాదు. నన్నుగాని, నా బంధువులనుగాని నిందించవద్దు. మేము నీ సేవకులము. ఇప్పుడు ఏమి జరుగుతూ ఉందనేది నాకేమీ తెలియదు” అని జవాబిచ్చాడు.
1SA 22:16 కానీ రాజు, “అహీమెలెకూ! నీవూ, నీ బంధువులు అంతా చావాల్సిందే!” అన్నాడు.
1SA 22:17 అప్పుడు రాజు తన పక్కనవున్న భటులతో, “వెళ్లి, యెహోవా యాజకులందరినీ చంపండి. వారు దావీదు పక్షంగా ఉన్నారు. దావీదు పారిపోతున్నాడని వారికి తెలుసు. అయినా వారు నాకు ఆ విషయం చెప్పలేదు” అని చెప్పాడు. రాజభటులు యెహోవా యాజకులకు హాని చేసేందుకు నిరాకరించారు.
1SA 22:18 అప్పుడు రాజు దోయేగును పిలిచి, “నీవు వెళ్లి ఆ యాజకులను చంపు” అని ఆజ్ఞాపించాడు. దానితో ఎదోనీయుడైన దోయేగు వెళ్లి యాజకులందరినీ చంపేసాడు. ఆ రోజు ఎనభై అయిదు మంది యాజకులను దోయేగు చంపేసాడు.
1SA 22:19 నోబు యాజకుల యొక్క పట్టణం. నోబు పట్టణంలోని వారందరినీ దోయేగు చంపేసాడు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసివాళ్లు అందరినీ దోయేగు చంపేసాడు. వారి వశువులు, గాడిదలు, గొర్రెలు అన్నిటినీ దోయేగు చంపేసాడు.
1SA 22:20 అయితే అబ్యాతారు తప్పించుకున్నాడు. ఇతడు అహీటూబు మనుమడు. అంటే అహీమెలెకు కుమారుడు. అబ్యాతారు పారిపోయి దావీదును కలుసుకొన్నాడు.
1SA 22:21 సౌలు, యెహోవా యాజకులనందకినీ చంపిన విధమంతా అబ్యాతారు దావీదుకు చెప్పాడు.
1SA 22:22 “ఎదోమీయుడగు దోయేగును ఆ రోజు నోబులో నేను చూసాను, వాడు సౌలుకు తప్పనిసరిగా చెబుతాడని నాకు తెలుసును, కాని నీ తండ్రి కుటుంబం అంతా చనిపోవటానికి నేనే కారకుడను.
1SA 22:23 నిన్ను చంపాలనుకొనే సౌలు నన్నూ చంపాలనుకుంటున్నాడు. నీవు నాతోనే ఉండు. భయపడవద్దు. నాతో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు” అని దావీదు అబ్యాతారుతో అన్నాడు.
1SA 23:1 అక్కడి ప్రజలు దావీదుతో, “ఫిలిష్తీయులు కెయీలా రాజ్యంపై యుద్ధం చేస్తున్నారనీ, నూర్చెడి కళ్లాలనుండి ధాన్యాన్ని కొల్ల గొడుతున్నార” నీ చెప్పారు.
1SA 23:2 “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా?” అని దావీదు యెహోవాని అడిగాడు. “వెళ్లుము ఫిలిష్తీయులను ఎదుర్కొని కెయీలాను కాపాడు.” అని యెహోవా దావీదుకు సమాధాన మిచ్చాడు.
1SA 23:3 కాని దావీదు మనుష్యులు, “మనము యూదాలోనే ఉండి భయపడి పోతున్నాము. ఇక ఫిలిష్తీయుల సైన్యంవున్న చోటికి వెళితే మా భయానికి అంతువుండదు” అన్నారు.
1SA 23:4 దావీదు మళ్లీ యెహోవాను అడిగాడు. యెహోవా, “కెయీలాకు వెళ్లుము ఫిలిష్తీయులను జయించటానికి నేను నీకు సహాయం చేస్తాను” అని దావీదుకు జవాబిచ్చాడు.
1SA 23:5 అప్పుడు దావీదు తన మనుష్యులతో కెయీలాకు వెళ్లాడు. దావీదు మనుష్యులు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వారి పశువులను పట్టుకున్నారు. దావీదు ఫిలిష్తీయులను చిత్తుగా ఓడించి వారి బారినుండి కెయీలా ప్రజలను రక్షించాడు.
1SA 23:6 (అహీమెలెకు కుమారుడు అబ్యాతారు దావీదు వద్దకు పారిపోయినప్పుడు తనతో ఏఫోదు అనబడే యాజకుల అంగీనొక దానిని తీసుకుని వెళ్లాడు).
1SA 23:7 దావీదు కెయీలాలో ఉన్నట్లు ప్రజలు సౌలుకు చెప్పారు. అది విని, “దేవుడు దావీదును నాకిచ్చినట్టే! దావీదు తనకు తాను బోనులో పడ్డాడు. ఎందువల్ల నంటే అతను చుట్టూ ద్వారాలు కటకటాలు ఉన్న పట్టణంలో ప్రవేశించాడు” అన్నాడు సౌలు.
1SA 23:8 సౌలు తన సైన్యాన్ని సమీకరించుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. దావీదును, అతని అనుచరులను ఎదిరించటానికి సౌలు సైన్యం కెయీలాకు వెళ్లేందుకు తయారయింది.
1SA 23:9 తన మీద సౌలు పన్నాగం పన్నుతున్నాడని దావీదు తెలుసుకున్నాడు. “ఏఫోదు తీసుకురా” అని దావీదు అబ్యాతారుకు చెప్పాడు.
1SA 23:10 దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలీయుల యెహోవా దేవా! నా మూలంగా సౌలు కెయీలా పట్టణానికి వచ్చి దానిని నాశనం చేయ సంకల్పించాడని విన్నాను.
1SA 23:11 సౌలు కెయీలాకు వస్తాడా? కెయీలా ప్రజలు నన్ను సౌలుకు అప్పగిస్తారా? ఇశ్రాయేలీయుల యెహోవా దేవా, నేను నీ సేవకుడను! దయచేసి నాకు చెప్పు.” “అవును!” అని యెహోవా జవాబిచ్చాడు.
1SA 23:12 దావీదు, “కెయీలా ప్రజలు నన్ను, నా మనుష్యులను సౌలుకు అప్పగిస్తారా?” అని మళ్లీ అడిగాడు. “అవును!” అని యెహోవా జవాబిచ్చాడు.
1SA 23:13 అది విన్న దావీదు తన మనుష్యులతో కెయీలా వదిలి వెళ్లిపోయాడు. దావీదుతో ఆరువందల మంది వెళ్లారు. ఒక చోటనుండి మరొక చోటికి వారు తరలిపోయారు. దావీదు కెయీలానుండి తప్పించుకున్నాడని విన్న సౌలు కెయీలా నగరానికి వెళ్లలేదు.
1SA 23:14 దావీదు అరణ్యములో ఉన్న దుర్గాలలోను, జీఫు అరణ్యంలోని కొండలలోను తలదాచుకున్నాడు. ప్రతి రోజూ సౌలు దావీదు కోసం వెదుకుతూ ఉండేవాడు. కానీ యెహోవా దావీదును సౌలు పట్టుకొనేలా చేయలేదు.
1SA 23:15 జీఫు అరణ్యంలో హోరేషు వద్ద ఉన్నాడు దావీదు. సౌలు తనను చంపటానికి వస్తున్నాడని భయపడ్డాడు.
1SA 23:16 కానీ సౌలు కుమారుడు యోనాతాను హోరేషులో ఉన్న దావీదును చూడటానికి వెళ్లాడు. యోనాతాను దావీదుకు యెహోవా మీద దృఢవిశ్వాసం కలిగేందుకు సహాయం చేసాడు.
1SA 23:17 యోనాతాను, “భయపడకు, నా తండ్రి సౌలు నిన్ను తాకలేడు. నీవు ఇశ్రాయేలుకు రాజువవుతావు. నేను నీ తరువాత స్థానంలో ఉంటాను. ఇది నా తండ్రికి కూడా తెలుసు” అన్నాడు దావీదుతో.
1SA 23:18 యోనాతాను, దావీదు ఇద్దరూ యెహోవా ఎదుట ఒక ఒడంబడిక చేసుకున్నారు. తరువాత యోనాతాను ఇంటికి వెళ్లిపోయాడు. దావీదు హోరేషులో ఉండిపోయాడు.
1SA 23:19 గిబియాలో ఉన్న సౌలు వద్దకు జీఫు ప్రజలువచ్చి, “తమ రాజ్యంలో దావీదు దాగియున్నట్లు చెప్పారు. యెషిమోనుకు దక్షిణంగా ఉన్న హకీలా కొండ మీద వున్న హోరోషు కోటలో దావీదు ఉన్నట్లు చెప్పారు.
1SA 23:20 ఓ రాజా! ఇప్పుడు మీరు ఏ సమయంలో వచ్చినా దావీదును మీకు పట్టి ఇచ్చే బాధ్యత మాది” అని అన్నారు.
1SA 23:21 అందుకు సౌలు, “నాకు సహాయం చేస్తున్నందుకు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక!
1SA 23:22 వెళ్లండి. అతని గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకొనండి. దావీదు ఎక్కడ ఉంటున్నాడో కనుగొనండి. అతనిని అక్కడ ఎవరు చూశారో కూడా తెలుసుకోండి. సౌలు కంటె దావీదు తెలివైనవాడు, కనుక తనను మోసగిస్తాడు అని అనుకున్నాడు.
1SA 23:23 దావీదు దాక్కొనే స్థలాలన్నీ కూడ తెలుసుకోండి. మళ్లీ నా వద్దకు వచ్చి నాకు పూర్తి సమాచారం తెలియజేయండి. అప్పుడు నేను మీతో వస్తాను. దావీదు ఆ ప్రాంతంలోనే ఉంటే నేను వానిని కనుగొంటాను. అవసరమైతే యూదాలో ప్రతి ఇంటిని శోధించైనా సరే వానిని కనుక్కుంటాను” అన్నాడు.
1SA 23:24 అప్పుడు జీఫువాళ్లు జీఫుకు తిరిగి వెళ్లిపోయారు. సౌలు తరువాత అక్కడికి వెళ్లాడు. దావీదు, అతని అనుచరులు మాయోను అరణ్యంలో ఉన్నారు. అది యెషీమోనుకు దక్షిణంగా ఉన్న ఎడారి ప్రాంతం.
1SA 23:25 సౌలు, అతని సైనికులు దావీదును వెతుక్కుంటూ వెళ్లారు. కాని సౌలు అతనికొరకు వస్తున్నాడని ప్రజలు దావీదును హెచ్చరించారు. దావీదు మాయోను అరణ్యంలోని “కొండ” కు వెళ్లాడు. ఇది సౌలు తెలుసుకున్నాడు. సౌలు దావీదును వెతుక్కుంటూ మాయోను అరణ్యానికి వెళ్లాడు.
1SA 23:26 పర్వతానికి ఒక పక్కన సౌలు ఉన్నాడు. దావీదు, అతని మనుష్యులు అదే పర్వతానికి మరో వైపున ఉన్నారు. సౌలునుండి దూరంగా పోవటానికి దావీదు తొందర పడుతూ ఉన్నాడు. కానీ దావీదును సపరి వారంగా పట్టుకోవాలని సౌలు, అతని సైనికుల ఆ పర్వతం చుట్టూ తిరుగుట ప్రారంభించారు.
1SA 23:27 ఒక సందేశకుడు సౌలు వద్దకు వచ్చి, “ఫిలిష్తీయులు తమ రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారనీ” త్వరగా రమ్మనీ చెప్పాడు.
1SA 23:28 అంతటితో సౌలు దావీదును వెంటాడటం మాని ఫిలిష్తీయులను ఎదుర్కోటానికి వెళ్లాడు. అందువల్ల ప్రజలు ఈ ప్రదేశానికి, “జారుడు బండ” అని పేరు పెట్టారు.
1SA 23:29 దావీదు మోయోను ఎడారి వదలి ఏన్గెదీ దగ్గర ఉన్న కొండస్థలాలకు వెళ్లాడు.
1SA 24:1 సౌలు ఫిలిష్తీయులను తరిమివేసిన పిమ్మట, “దావీదు ఏన్గెదీ ఎడారిలో ఉంటున్నట్లు” ప్రజలు అతనికి చెప్పారు.
1SA 24:2 కనుక సౌలు ఇశ్రాయేలు అంతటినుండీ మూడువేలమందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి, వారిని తీసుకొని వెళ్లి దావీదు కొరకు, అతని అనుచరుల కొరకు వెతకటం మొదలు పెట్టాడు. అడవి మేక బండలు అనే చోట వారు వెదికారు.
1SA 24:3 సౌలు బాట పక్కగావున్న గొర్రెల మంద వద్దకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలోకి కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్లాడు. ఆ గుహలోనే చాలా లోపల దావీదు, అతని మనుష్యులు దాగివున్నారు.
1SA 24:4 సౌలును చూసి దావీదు అనుచరులు అతనితో “యెహోవా చెప్పిన రోజు ఇదే. ‘నీ శత్రువును నీకు అప్పగిస్తాను కనుక ఇప్పుడు నీ శత్రువును నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు అని యెహోవా నీతో చెప్పాడు గదా!’” అన్నారు. అప్పుడు దావీదు మెల్లగా సౌలు వద్దకు పాకుతూ వెళ్లి, సౌలు అంగీని ఒక కొన కోసివేశాడు. సౌలు దావీదును గమనించలేదు.
1SA 24:5 కానీ తర్వాత సౌలు అంగీని కోసివేసినందుకు దావీదు బాధపడ్డాడు.
1SA 24:6 “నా యజమానికి నేను ఇలాంటి పని చేయకుండా యెహోవా నన్ను నివారించునుగాక! సౌలు యెహోవా నియమించిన రాజు. సౌలు యెహోవాచే అభిషేకింపబడిన రాజు గనుక సౌలుకు వ్యతిరేకంగా నేను ఏమీ చేయకూడదు” అని దావీదు తన మనుష్యులతో అన్నాడు.
1SA 24:7 కోపోద్రేకులైన తన మనుష్యులను అదుపు చేయటానికి దావీదు ఈ మాటలు చెప్పాడు. దావీదు వారిని సౌలు మీదికి పోనియ్యలేదు. సౌలు గుహ వదిలి తన దారిన వెళ్లిపోయాడు.
1SA 24:8 అతని వెనుకనే దావీదు బయటికి వచ్చి, “రాజా నా ప్రభూ” అని కేక వేసాడు. సౌలు వెనుదిరిగి చూశాడు. దావీదు వంగి నమస్కరించాడు.
1SA 24:9 “దావీదు నీకు హాని చేయ చూస్తున్నాడని ప్రజలు చెబితే నీవెందుకు ఆ మాటలు వింటున్నావు?
1SA 24:10 యెహోవా ఈ రోజున గుహలో నిన్ను నాకు ఎలా అప్పగించాడో నీ కళ్లతో నీవే చూశావు. కానీ నిన్ను చంపటానికి నేను నిరాకరించాను. నేను నీపట్ల కనికరము చూపాను. ‘సౌలు యెహోవా చేత అభిషేకించబడిన రాజు. నా యజమానికి నేను కీడు చేయను’ అని నేననుకున్నాను.
1SA 24:11 ఇదిగో నీ రాజవస్త్రం ముక్క నా చేతిలో ఉంది చూడు! దీనిని నీ అంగీ నుండి ఒక మూల కోశాను. నిన్ను నేను చంపగలిగి ఉండేవాడిని కానీ చంపలేదు. ఇప్పుడైనా నీవు అర్థం చేసుకో. నేను నీకు ఏ కీడూ తలపెట్టలేదు. నేను నీ ఎడల ఏ తప్పూ చేయలేదు. కాని నీవు మాత్రం నన్ను చంపే ప్రయత్నంలో వెంటాడుతున్నావు.
1SA 24:12 యెహోవాయే న్యాయం తీర్చును గాక! నీవు నాపట్ల తలపెట్టిన కీడుకు యెహోవా నిన్ను శిక్షించవచ్చును. కాని నాకై నేను నీతో పోరాడను.
1SA 24:13 దుష్టులనుండి దుష్టకార్యాలే వస్తాయనే ఒక పాత సామెత ఉంది. ‘కానీ నేను దుర్మార్గం ఏమీ చేయలేదు.’ “నేను దుర్మార్గుడిని కాదు. నేను నీకు హాని చేయను.
1SA 24:14 ఇంతకూ నీవు తరుముచున్నది ఎవరిని? ఇశ్రాయేలు రాజు పోరాడేందుకు వస్తున్నది ఎవరిమీదికి? నిన్ను గాయపర్చే వారినెవరినో నీవు వెంటాడటం లేదు! ఏదో ఒక చచ్చిన కుక్కనో, లేక ఈగనో నీవు తరుము తున్నట్టుగా ఉంది.
1SA 24:15 యెహోవాయే న్యాయమూర్తిగా ఉండి నీకూ నాకూ మధ్య న్యాయం తీర్చును గాక! యెహోవా నన్ను బలపర్చి నేను నిర్దోషినని నిరూపిస్తాడు. ఆయన నన్ను నీ బారినుండి రక్షిస్తాడు” అని రాజైన సౌలుతో దావీదు చెప్పాడు.
1SA 24:16 దావీదు తన మాట ముగించగానే, సౌలు “దావీదూ! నా కుమారుడా, అది నీ స్వరమేనా?” అంటూ ఏడ్వటం మొదలుపెట్టాడు. సౌలు చాలా ఏడ్చాడు.
1SA 24:17 “అవును నీవు చెప్పింది వాస్తవమే. నేను తప్పు చేశాను. నీవు నాపట్ల చాలా మంచితనం చూపించావు. కాని నేనే నీపట్ల చెడుగా ప్రవర్తించాను.
1SA 24:18 నీవు చేసిన మంచి పనులన్నీ నాకు నీవు చెప్పావు. యెహోవా నన్ను నీ వద్దకు తీసుకుని వచ్చాడు. అయినా నీవు నన్ను చంపలేదు.
1SA 24:19 ఇది నీవు నా శత్రువు కాదని నిరూపిస్తుంది. శత్రువు చేజిక్కినపుడు మంచితనంతో ఎవరూ విడిచి పెట్టరు. శత్రువుకు ఎవరూ మేలు చేయరు. ఈ రోజు నీవు నాపట్ల ఇంత మంచిగా ప్రవర్తించినందుకు యెహోవా నీకు ప్రతిఫలం దయచేయును గాక!
1SA 24:20 నీవు ఖచ్చితంగా రాజువు అవుతావని నాకు తెలుసు. ఇశ్రాయేలు రాజ్యాన్ని నీవు పరిపాలిస్తావు.
1SA 24:21 ఇప్పుడు నాకొక మాట ఇవ్వు. యెహోవా నామం పేరిట నీవు నా సంతతి వారిని హతమార్చనని మాటయివ్వు. నా తండ్రి వంశం నుంచి నా పేరు తుడిచివేయనని నీవు నాకు ప్రమాణం చేసి చెప్పు.” అన్నాడు సౌలు.
1SA 24:22 కనుక సౌలుకు దావీదు వాగ్దానం చేసాడు. సౌలు కుటుంబాన్ని నాశనం చేయనని దావీదు వాగ్దానంచేశాడు. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వెళ్లాడు. దావీదు తన అనుచరులతో కొండ స్థలాలకు వెళ్లిపోయాడు.
1SA 25:1 సమూయేలు చనిపోయాడు. సభచేరిన ఇశ్రాయేలీయులు సమూయేలు మృతికి తమ సంతాపాన్ని వెలిబుచ్చురు. రామాలో వున్న ఇతని ఇంటివద్దనే సమూయేలు భౌతిక కాయాన్ని వారు సమాధి చేశారు. అప్పుడు దావీదు పారాను అరణ్యానికి తరలిపోయాడు.
1SA 25:2 మాయోనులో ఒక ధనవంతుడు నివసిస్తుండేవాడు. అతనికి మూడువేల గొర్రెలు, వెయ్యి మేకలు ఉన్నాయి. ఏదో వ్యాపార రీత్యా అతడు కర్మెలులో ఉన్నాడు. కర్మెలులో అతడు తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు.
1SA 25:3 అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఆమె చాలా తెలివైనది, మంచి అందగత్తె, కానీ నాబాలు క్రూరుడు, నీచుడు, కాలేబు సంతతివాడు.
1SA 25:4 దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, నాబాలు తన గొర్రెలనుండి ఉన్ని తీస్తున్నట్లు విన్నాడు.
1SA 25:5 దావీదు పదిమంది యువకులను పిలిచి, “కర్మెలులో వున్న నాబాలు వద్దకు వెళ్లి అతనిని తన పక్షంగా పలుకరించమని” చెప్పాడు.
1SA 25:6 “నీవూ, నీ కుటుంబం బాగున్నారని ఆశిస్తున్నాను! నీకు ఉన్నదంతా క్షేమం అని కూడ నేను భావిస్తున్నాను,
1SA 25:7 నీవు నీ గొర్రెల నుండి ఉన్ని తీస్తున్నట్లు నేను విన్నాను. నీ గొర్రెల కాపరులన కొద్ది రోజులు మా వద్ద ఉన్నారు. అప్పుడు వారికి మేము ఏ హానీ చేయలేదు. వారు కర్మెలులో ఉన్నంత కాలం మేము వారినుండి ఏమి తీసుకోలేదు.
1SA 25:8 నీవు వారి నడిగితే ఇది నిజం అని వారే చెబుతారు. మేము ఈ సంతోష సమయంలో నీ దగ్గరకు వస్తున్నాము. అందుచేత ఈ యువకుల పట్ల నీవు కనికరం చూపించు. దయచేసి నీవు ఇవ్వగలిగింది వారికి ఇవ్వు. నీ స్నేహితుడునైన దావీదు కోసం ఇది చేయి” అని చెప్పమన్నాడు దావీదు.
1SA 25:9 దావీదు మనుష్యులు నాబాలు దగ్గరకు వెళ్లారు. దావీదు సందేశాన్ని వారు నాబాలుకు అందజేశారు.
1SA 25:10 కాని నాబాలు చాలా అసభ్యకరంగా వ్యవహరించాడు. తన వద్దకు వచ్చిన దావీదు సేవకులతో, “ఎవడీ దావీదు? ఎవడీ యెష్షయి కొడుకు? ఇటీవల చాలా మంది బానిసలు తమ యజమానులనుండి పారిపోతున్నారు!
1SA 25:11 నావద్ద రొట్టె, నీళ్లూ ఉన్నాయి. అవి, నావద్ద ఉన్న మాంసం, ఉన్ని తీసే నా సేవకులకు కావాలి. నాకు తెలియని వాళ్లెవరికీ నేను దాన్ని ఇవ్వను,” అని కసురు కున్నాడు నాబాలు.
1SA 25:12 నాబాలు అన్నదంతా దావీదు మనుష్యులు తిరిగి వెళ్లి దావీదుకు చెప్పారు.
1SA 25:13 ఇది విన్న దావీదు తన మనుష్యులను, “తమ కత్తులు తీసుకోమన్నాడు.” కనుక దావీదు అతని మనుష్యులు తమ తమ కత్తులు చేపట్టారు. సుమారు నాలుగు వందర మంది దావీదుతో వెళ్లారు. రెండువందల మంది సామాన్ల వద్ద కాపలా ఉన్నారు.
1SA 25:14 నాబాలు నౌకర్లలో ఒకడు తన యజమాని భార్య అబీగయీలు వద్దకు వెళ్లి, “దావీదు అరణ్యం నుండి కొందరు దూతలను మా యజమాని నాబాలును పలకరించేందుకు పంపాడు. అయితే నాబాలు వారితో నీచంగా ప్రవర్తించాడు అని చెప్పాడు.
1SA 25:15 దావీదు మనుష్యులు మనపట్ల చాలా మర్యాదగా ఉన్నారు. మనకు ఏ అపకారమూ చేయలేదు. మేము గొర్రెలను పొలాలకు తోలుకు వెళ్లినప్పుడు వారు మాతోనే ఉన్నారు. వారు ఎప్పుడూ ఏమీ దొంగిలిచలేదు.
1SA 25:16 రాత్రింబగళ్లు దావీదు మనుష్యులు మమ్మల్ని కాపాడారు. మేము గొర్రెలను మేపుతున్న రోజుల్లో వారు మాకు పెట్టని కోటలా ఉండి మమ్మల్ని కాపాడారు.
1SA 25:17 ఇప్పుడు నీవు ఏమి చేయగలవో నీవే ఆలోచించి నిశ్చయించు. మా యజమాని నాబాలుకూ, అతని కుటుంబానికీ భయంకర ఆపద రాబోతోంది. నాబాలు చెప్పిన మాటలు బుద్ధి తక్కువ మాటలు” అని చెప్పాడు.
1SA 25:18 అబీగయీలు వెంటనే రెండువందల రొట్టెలు, రెండు నిండు ద్రాక్షారసపు తిత్తులు, వండిన ఐదు గొర్రెల మాంసం, సుమారు ఐదు మానికల వండిన ఆహారం, ఒక మూట ఎండు ద్రాక్ష, ఎండిన అంజూరపు పండ్ల అడలు రెండు వందలు, కొన్ని గాడిదల మీద ఎత్తించింది.
1SA 25:19 తరువాత అబీగయీలు తన నౌకర్లతో, “వాటిని తీసుకుని వెళ్లమని, వారి వెనుక తను బయలు దేరి వస్తానని చెప్పింది.” కానీ ఆమె ఇదంతా తన భర్తకు చెప్పలేదు.
1SA 25:20 అబీగయీలు తన గాడిద మీద ఎక్కి పర్వతం అవతలి వైపుకు వచ్చింది. ఎదురుగా వస్తున్న దావీదును, అతని మనుష్యులను ఆమె కలుసుకున్నది.
1SA 25:21 అబీగయీలు దావీదును కలుసుకోక ముందు దావీదు తన అనుచరులతో, “నాబాలు ఆస్తిని అరణ్యంలో నేను అనవసరంగా కాపాడాను. వాని గొర్రెలలో ఒక్కటికూడ తప్పిపోకుండా అదుపు చేయించాను. నేనతనికి అన్నీ మంచి పనులు చేశాను. కానీ అతను నాపట్ల చాలా చెడుగా ప్రవర్తించాడు.
1SA 25:22 రేపటి ఉదయంలోగా నేను నాబాలు కుటుంబంలో ఒక్క మగవాడు కూడా లేకుండా చంపకపోతే యెహోవా నన్ను శిక్షించును గాక!” అన్నాడు.
1SA 25:23 అయితే అబీగయీలు దావీదును చూడగానే వెంటనే గాడిద మీదనుంచి దిగి దావీదుకు సాగిలపడి అభివందనం చేసింది.
1SA 25:24 అబీగయీలు దావీదు పాదాల మీద పడి, “అయ్యా, నన్ను నీతో మాట్లాడనియ్యి. నేను చెప్పేది విను. జరిగిన దానికి నన్నేనిందించు.
1SA 25:25 నీవు పంపిన మనుష్యుల్ని నేను చూడలేదు. ఈ పనికిమాలిన మనిషి నాబాలును నీవు లక్ష్యపెట్టకు. అతను తన పేరుకు తగినట్టే ఉన్నాడు. అతని పేరుకు ‘బుద్ధిహీనుడని’ అర్థం. అతడు నిజంగానే బుద్ధిహీనుడు.
1SA 25:26 నిర్దోషులను చంపకుండా, యెహోవాయే నిన్ను దూరంగా ఉంచాడు. యోహవా జీవిస్తున్నాడు నిజంగా, నీవు జీవిస్తున్నావు నిజంగా నీ శత్రువులంతా, మరియు నీకు కీడు తలపెట్టిన వారంతా నాబాలువలె అవుదురు గాక!
1SA 25:27 నీ కోసం నేను ఈ కానుకలు తెచ్చాను. నిన్ను అనుసరిస్తున్న నీ మనుష్యులకు ఈ కానుకలనివ్వు.
1SA 25:28 తప్పు చేసినందుకు నన్ను క్షమించు. యెహోవా నీ కుటుంబాన్ని బలపరచి నీ కుటుంబంలో అనేక మంది రాజులు పుట్టేలా చేస్తాడని నాకు తెలుసు నీవు ఆయన తరపున యుద్ధాలు చేస్తున్నావు గనుక యెహోవా అలా చేస్తాడు. నీవు జీవించియున్నంత కాలం ప్రజలకు నీలో ఏ తప్పూ కనబడదు.
1SA 25:29 ఒక మనిషి నిన్ను చంపాలని వెంటాడినా, నీ దేవుడైన యెహోవా నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. ఒడిసెలలో పెట్టి విసరిన రాయిలా యెహోవా నీ శత్రువుల ప్రాణాలను విసిరేస్తాడు.
1SA 25:30 నీకు అనేక మంచి వాటిని చేస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. కనుక యెహోవా వాటన్నింటినీ నెరవేరుస్తాడు. ఆయన నిన్ను ఇశ్రాయేలుకు నాయకునిగా చేస్తాడు.
1SA 25:31 అప్పుడు నీవు ఈ బోనులోపడవు. దుర్మార్గాలు చేసిన దోషం నీకు ఉండదు. నిర్దోషులను చంపావనే దోషం నీ మీద ఉండదు. ఆ మహా గొప్ప విజయం నీకు యెహోవా చేకూర్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను” అని వేడుకున్నాది.
1SA 25:32 దావీదు అబీగయీలుకు సమాధానమిస్తూ, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం. నన్ను కలుసుకునేందుకు దేవుడే నిన్ను పంపించాడు.
1SA 25:33 నీవు సరియైన న్యాయ విచారణ చేసినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక! ఈ రోజు నేను నిర్దోషులను చంపకుండా నీవే నన్ను వారించావు.
1SA 25:34 ఇశ్రాయేలీయుల దేవుడైన యోహోవా జీవిస్తున్నంత నిజంగా నీవు గనుక ఇంత త్వరగా ఈరోజు నన్ను కలుసుకొనేందుకు రాకపోతే రేపటి ఉదయం లోపల నాబాలు వంశంలో ఒక్క మగవాడు కూడా మిగిలే వాడు కాదు” అని చెప్పాడు దావీదు.
1SA 25:35 అప్పుడు దావీదు అబీగయీలు తెచ్చిన కానుకలు స్వీకరించి, “శాంతితో ఇంటికి వెళ్లు నీ మాటలు నేను విన్నాను, నీవు కోరినట్టు నేను చేస్తాను” అని దావీదు ఆమెతో చెప్పాడు.
1SA 25:36 అబీగయీలు తిరిగి వచ్చేసరికి నాబాలు ఇంటి వద్దనే ఉన్నాడు. నాబాలు ఒక రాజులా తింటూ ఉన్నాడు. బాగా తాగి, ఉల్లాసంగా ఉన్నాడు. అందుచేత అబీగయీలు మరుసటి రోజు ఉదయం వరకు నాబాలుతో ఏమీ చెప్పలేదు.
1SA 25:37 మరుసటి ఉదయం నాబాలు మామూలుగా ఉన్నాడు. కనుక అతని భార్య జరిగినదంతా అతనితో చెప్పింది. అది వినగానే అతనికి గుండెపోటు వచ్చి రాయిలా బిగుసుకుపోయాడు.
1SA 25:38 ఆ తరువాత పదిరోజులకు నాబాలు చచ్చేటట్టుగా చేసాడు యెహోవా.
1SA 25:39 నాబాలు మరణ వార్త విన్న దావీదు, “యెహోవాకు స్తోత్రం! నాబాలు నన్ను గూర్చి చెడుగా మాట్లాడాడు. కానీ యెహోవా నన్ను బలపర్చాడు. నాబాలు తప్పు చేసాడు గనుక యెహోవా వానిని చచ్చేటట్టు చేసాడు” అని చెప్పాడు. అప్పుడు దావీదు అబీగయీలుకు ఒక వర్తమానం పంపాడు ఆమె తనకు భార్య కావాలని దావీదు అడిగాడు.
1SA 25:40 దావీదు సేవకులు కర్మెలుకు వెళ్లి అబీగయీలును కలిసి, “దావీదు నిన్ను తీసుకుని రమ్మని మమ్ములను పంపించాడు. నీవు అతని భార్యవు కావాలని దావీదు కోరిక” అని చెప్పారు.
1SA 25:41 అబీగయీలు సాగిలపడి సమస్కరించి, “నేను మీ దాసిని మీ సేవకు సిద్ధంగా ఉన్నాను. నేను నా యజమానియైన దావీదు సేవకుల పాదప్రక్షాళనం చేయటానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది.
1SA 25:42 అబీగయీలు వెంటనే ఒక గాడిద మీద ఎక్కి దావీదు పంపిన సేవకులతో కలిసి వెళ్లింది. ఆమెతో అయిదుగురు పనిగత్తెలను కూడ తీసుకుని వెళ్లింది. అబీగయీలు దావీదు భార్య అయింది.
1SA 25:43 యెజ్రెయేలీ వాసి అహీనోయమును కూడ దావీదు వివాహము చేసుకున్నాడు. అహీనోయము, అబీగయీలు ఇద్దరూ దావీదుకు భార్యలయ్యారు.
1SA 25:44 సౌలు కుమార్తె మీకాలు కూడ దావీదుకు భార్యయే గాని, సౌలు ఆమెను గల్లీముకు చెందిన లాయీషు అనే వాని కుమారుడు పల్తీయేలుకు ఇచ్చి మళ్లీ పెళ్లి చేశాడు.
1SA 26:1 జీఫు ప్రజలు సౌలును చూడటానికి గిబియాకు వెళ్లారు. “హకీలా కొండల్లో దావీదు దాగి ఉంటున్నాడు. ఈ కొండ యెషీమోనుకు ఎదురుగా ఉంది” అని వారు సౌలుతో చెప్పారు.
1SA 26:2 జీఫు అరణ్యంలోకి సౌలు వెళ్లాడు. ఇశ్రాయేలు అంతటిలో తాను ఎంపిక చేసుకొన్న మూడువేల మంది సైనికులను సౌలు తన వెంట తీసుకుని వెళ్లాడు. సౌలు, అతని మనుష్యులు దావీదును వెదుక్కుంటూ జీఫు అరణ్యంలోకి వెళ్లారు.
1SA 26:3 సౌలు హకీలా కొండపై గుడారాలు సిద్ధపరచుకొనెను. యెషీమోనుకు ఎదురుగా బాటపక్కలో ఈ స్థలం వుంది. దావీదు అరణ్యంలోనే వుండి, సౌలు తనను వెతుక్కుంటూ వచ్చినట్లు విన్నాడు.
1SA 26:4 దావీదు తన వేగుల వారిని పంపి సౌలు హకీలా కొండకు వచ్చినట్లు తెలుసుకున్నాడు.
1SA 26:5 సౌలు గుడారాలు వేసుకున్న ప్రదేశానికి దావీదు వెళ్లాడు. సౌలు, అబ్నేరు ఇద్దరూ నిద్రిస్తున్న చోటును దావీదు చూశాడు. (నేరు కుమారుడు అబ్నేరు సౌలు సైన్యాలకు సేనాని.) గుడారం మధ్యలో సౌలు నిద్రిస్తూవున్నాడు. సైన్యమంతా అతని చుట్టూ వుంది.
1SA 26:6 హిత్తీయుడైన అహీమెలెకుతోను, సెరూయా కుమారుడయిన అబీషైతోను దావీదు మాట్లాడి, “సౌలు పాళెములోనికి తనతో ఎవరు రాగలరని” అడిగాడు. (అబీషై అనేవాడు యోవాబు తమ్ముడు). “నీతో నేను వస్తా” అని అబీషై చెప్పాడు.
1SA 26:7 చీకటి పడ్డాక దావీదు, అబీషై కలిసి సౌలు మజిలీలోకి వెళ్లారు. సౌలు మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు. సౌలు తల వద్ద అతని ఈటె భూమిలోకి దిగివేసి ఉంది. అతని చుట్టూ సైనికులు, పక్కగా అబ్నేరు నిద్రపోతూ ఉన్నారు.
1SA 26:8 “నీ శత్రువును ఓడించటానికి దేవుడు నీకు ఈ రోజు అవకాశం ఇచ్చాడు. ఒక్క వేటుతో, అతని ఈటెతోనే సౌలును భూమిలోనికి పొడిచి వేస్తాను” అన్నాడు అబీషై దావీదుతో.
1SA 26:9 కానీ దావీదు అబీషైతో ఇలా అన్నాడు, “సౌలును చంపవద్దు! యెహోవాచే ఎంపిక చేయబడిన రాజుకు హాని చేసినవాడు శిక్షించబడాలి.
1SA 26:10 యెహోవా జీవీస్తున్నంత నిజంగా యెహోవా తానే సౌలును శిక్షిస్తాడు. ఒకవేళ సౌలు సహజంగానే చనిపోవచ్చు. లేదా యుద్ధంలో అతడు చంపబడవచ్చు.
1SA 26:11 కానీ యెహోవా చేత అభిషేకించబడిన రాజును నేను మాత్రం చంపకుండా ఉండేటట్టు చేయుమని యెహోవాకు నేను ప్రార్థన చేస్తాను. కనుక సౌలు తలవద్ద ఉన్న ఈటెను, మంచినీటి కూజాను తీసుకోండి. మనము వెళ్లి పోదాము.”
1SA 26:12 కనుక సౌలు తల దగ్గర వున్న ఈటెను, నీటి కూజాను తీసుకుని దావీదు, అబీషై సౌలు గుడారంనుండి బయటకు వెళ్లిపోయారు. ఇదంతా జరగటం ఏ ఒక్కరూ చూడలేదు. ఇది ఎవ్వరికీ తెలియదు. ఒక్క మనిషికూడ కనీసం మేల్కోలేదు! యెహోవా సౌలును, తన సైన్యాన్ని గాఢనిద్రలో పడవేయటంతో వారంతా అలా నిద్రపోయారు.
1SA 26:13 దావీదు ఆవలివైపుకు వెళ్లిపోయాడు. సౌలు గుడారాలకు దూరంగా లోయ అవతల ఉన్న పర్వతం మీద దావీదు నిలబడ్డాడు. అంటే వీరిద్దరి గుడారాలు ఒకదాని కొకటి చాలా దూరంగా ఉన్నాయి.
1SA 26:14 నేరు కుమారుడైన అబ్నేరును, సైన్యాన్ని ఉద్దేశించి దావీదు కేకవేసి “అబ్నేరూ నాకు జవాబు చెప్పు” అన్నాడు. “రాజును పిలుస్తోన్న నీవు ఎవరివి?” అని అబ్నేరు అడిగాడు.
1SA 26:15 అందుకు దావీదు, “నీవు మగావాడివి కదూ! నీవు ఇశ్రాయేలు అంతటిలో చాలా గొప్పవాడివి కదూ! నిజమేనంటావా? అయితే నీవు నీ యజమానుడైన రాజును ఎందుకు కాపాడుకోలేదు? నీ యాజమానియైన రాజును చంపటానికి ఒక సామాన్యుడు నీ గుడారంలోనికి వచ్చాడు!
1SA 26:16 నీవు గొప్ప పొరపాటు చేసావు. యెహోవా జీవిస్తున్నంత నిజంగా నీవూ నీ సైనికులూ చావాలి. ఎందుకంటే యెహోవా చేత అభిషేకించబడ్డ నా యజమానియైన రాజును కాపాడలేదు. నీవు సౌలు తలవద్దవుంచబడిన ఈటె, నీళ్లకూజా ఏమయ్యాయో చూడు. అవి ఏవి?” అని ఎదురు ప్రశ్నవేశాడు.
1SA 26:17 సౌలుకు దావీదు స్వరం తెలుసు. “నా కుమారుడా దావీదూ, అది నీ స్వరమే కదూ?” అన్నాడు సౌలు దావీదుతో. “అవును నా యజమానీ, నా రాజా, ఇది నా స్వరమే” అన్నాడు దావీదు.
1SA 26:18 దావీదు ఇంకా ఇలా అన్నాడు, “రాజా, నీవు నన్నెందుకు ఇలా తరుముతున్నావు? నేను చేసిన నేరం ఏమిటి? దేని విషయంలో నేను దోషిని?
1SA 26:19 రాజా, నా యజమామీ, నా మాట విను! యెహోవా గనుక నీకు నాపై కోపం వచ్చినట్లు చేసి ఉంటె ఆయనకు బలి సమర్పణ చేద్దాము. కానీ మనుష్యుల ప్రేరణవల్ల నామీద నీకు కోపం వచ్చివుంటే యెహోవా వారిని కష్టనష్టాలకు గురిచేస్తాడు. యెహోవా నాకిచ్చిన భూమిని నేను వదిలిపోయేలా మనుష్యుల చేశారు. వెళ్లి ఇతర దేవుళ్లను కొలువమని.
1SA 26:20 పరదేశీయులతో ఉండుమని మనుష్యులు నాకు చెప్పారు. ఇప్పుడు నన్ను యెహోవా సన్నిధికి దూరంగా చావనీయకు. ఇశ్రాయేలు రాజు ఒక పురుగును చంపటానికి వెతుక్కుంటూ బయటకి వచ్చాడు! కొండల్లో కౌజు పిట్టను వేటాడటానికి వచ్చినవానిలా ఉన్నావు నీవు!”
1SA 26:21 అప్పుడు సౌలు, “నేను పాపం చేసాను. నా కుమారుడా దావీదూ, నా దగ్గరకు తిరిగి వచ్చేయి. నా ప్రాణం నీకు ముఖ్యం అని ఈ రోజు నీవు నాకు చూపించావు. అందుచేత నేను నీకు హాని చేసేందుకు ప్రయత్నించను. నేను తెలివి తక్కువగా ప్రవర్తించాను. నేను ఒక పెద్ద తప్పుచేశాను” అన్నాడు.
1SA 26:22 “ఇదిగో రాజు ఈటె. మీలో ఒక యువకుడు వచ్చి దీనిని తీసుకోవచ్చు.
1SA 26:23 మంచిచేసిన ప్రతి వానికీ యెహోవా ప్రతిఫలం ఇప్పిస్తాడు. కీడు చేసిన వానిని ఆయన శిక్షిస్తాడు. ఈ వేళ యెహోవా నేను నిన్ను ఓడించేటట్టు చేసాడు. అయినా యెహోవా చేత అభీషేకించబడిన రాజుకు నేను హాని చేయను.
1SA 26:24 నీ ప్రాణం నాకు ముఖ్యం అని ఈ వేళ నేను నీకు చూపించాను. యెహోవాకు నా ప్రాణం ముఖ్యం అని యెహోవా నీకు చూపిస్తాడు. ప్రతి కష్టంనుంచీ యెహోవా నన్ను రక్షిస్తాడు” అని చెప్పాడు దావీదు.
1SA 26:25 సౌలు, “నా కుమారుడా దావీదూ, దేవుడు నిన్నాశీర్వదించును గాక! నీవు చాలా ఉన్నతమైన కార్యాలుచేస్తావు. నీవు విజయం సాధిస్తావు” అని దావీదుతో చెప్పాడు. దావీదు తన దారిన తాను వెళ్లిపోయాడు. సౌలు తన ఇంటికి తిరిగి వెళ్లాడు.
1SA 27:1 తరువాత దావీదు, “ఏదో ఒకరోజు సౌలు నన్ను పట్టుకుంటాడు. ఈ పరిస్థితిలో నేను ఫిలిష్తీయుల రాజ్యానికి తప్పించుకోవటం ఒక్కటే ఉత్తమ మార్గం. అప్పుడు సౌలు నా కోసం ఇశ్రాయేలు రాజ్యంలో వెదకటం మానేస్తాడు. ఆ విధంగా నేను సౌలునుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు.
1SA 27:2 అందుచేత దావీదు, తన ఆరు వందలమంది అనుచరులతో ఇశ్రాయేలును వదిలి వెళ్లాడు. వారు మాయోకుమారుడైన ఆకీషు వద్దకు వెళ్లారు. ఆకీషు గాతుకు రాజు.
1SA 27:3 దావీదు, అతని మనుష్యులు వారి కుటుంబాలతో సహా ఆకీషు రాజుతో పాటు గాతులో నివాసము ఏర్పాటు చేసుకున్నారు. దావీదు ఇద్దరు భార్యలు యెజ్రెయేలీ వాసి అహీనోయము, మరియు, కర్మెలునివాసి, నాబాలు భార్య విధవరాలునైన అబీగయీలు అతనితో ఉన్నారు.
1SA 27:4 దావీదు గాతుకు పారిపోయాడని ప్రజలు సౌలుతో చెప్పగానే సౌలు అతని కొరకు వెదకటం మానేశాడు.
1SA 27:5 ఆకీషును దావీదు కలసి, “నా విషయమై నీవు సంతోషిస్తే బయట పట్టణంలో ఒక ఊరిలో స్థానమిస్తే అక్కడ ఉంటాను. నేను కేవలం నీ సేవకుడిని మాత్రమే. రాజధానిలో నీతో నేను ఉండుటకంటె నేను అక్కడే ఉండటం మంచిది” అని చెప్పాడు.
1SA 27:6 సిక్లగు అనే ఊరిని అదే రోజున ఆకీషు దావీదుకు ఇచ్చాడు. కావున అప్పటి నుండి సిక్లగు యూదా రాజులకు చెందినదిగా ఉండిపోయింది.
1SA 27:7 ఫిలిష్తీయుల రాజ్యంలో దావీదు ఒక సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాడు.
1SA 27:8 దావీదు, అతని మనుష్యులు కలిసి అమాలేకీయులతోనూ, గెషూరులో నివసిస్తున్న ప్రజలతోనూ యుద్ధానికి వెళ్లారు. దావీదు మనుష్యులు వారిని ఓడించి వారి ఆస్తులను దోచుకున్నారు. ఆ ప్రజలంతా షూరు పట్టణం దగ్గర తెలెమునుండి మొత్తం ఈజిప్టువరకు నివసిస్తూ ఉన్నారు.
1SA 27:9 ఆ ప్రాంతంలో దావీదు వారితో పోరాడి వారిని ఓడించాడు. వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఒంటెలను, దుస్తులను అన్నిటినీ స్వాధీనం చేసుకొని వాటిని ఆకీషుకు ఇచ్చాడు.
1SA 27:10 దావీదు ఇలా చాలాసార్లు చేసాడు. ప్రతిసారీ దావీదు ఎక్కడ యుద్ధం చేసి, సంపద అంతా తెస్తున్నాడు అనే విషయం ఆకీషు అడిగేవాడు. “యూదాకు దక్షిణ ప్రాంతంలో యుద్ధం చేసాననీ యెరహ్మెయేలుకు దక్షిణ భాగాన పోరాడాననీ, కేనీయుల దేశానికి దక్షిణాన పోరాడాను” అనీ ప్రతిసారీ ఒక పేరు చెపుతూ ఉండేవాడు దావీదు.
1SA 27:11 బతికి వున్న ఒక స్త్రీని గాని, పురుషుని గాని దావీదు ఒక్కసారి కూడా గాతుకు తీసుకుని రాలేదు. “అలా చేస్తే వాళ్లు నిజానికి తాను చేస్తున్న పనులన్నీ ఆకీషుకు చెబుతారని దావీదు అనుకున్నాడు.” ఫిలిష్తీయుల దేశంలో ఉన్న అన్ని రోజులూ దావీదు ఇలాగే చేసాడు.
1SA 27:12 ఆకీషు మాత్రం దావీదును నమ్మటం మొదలు పెట్టాడు. “ఇప్పుడు దావీదు యొక్క స్వంత వాళ్లే అతనిని ద్వేషిస్తున్నారు. ఇశ్రాయేలీయులు దావీదును బాగా అసహ్యించుకుంటున్నారు. అందువల్ల దావీదు శాశ్వతంగా నాకు సేవచేస్తాడు” అని ఆకీషు తనలో తాను అనుకున్నాడు.
1SA 28:1 తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై యుద్ధానికి తమ సైన్యాన్ని సిద్ధం చేశారు. ఆకీషు దావీదుతో, “నీవూ, నీ మనుష్యులూ నాతో కలిసి ఇశ్రాయేలీయుల మీద పోరాటానికి వెళ్లాలని గ్రహించావా?” అని అన్నాడు.
1SA 28:2 “ఓ, తప్పకుండా. అప్పుడు నీవే చూస్తావుగా నేను ఏమి చేయగలిగిందీ” అని దావీదు జవాబిచ్చాడు. “చాలా బాగుంది. నిన్ను నా అంగరక్షకునిగా శాశ్వత నియామకం చేస్తాను” అని అన్నాడు ఆకీషు.
1SA 28:3 సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా అతని మరణానికి దుఃఖించారు. అతని స్వంత పట్టణమైన రామాలోనే సమూయేలు శరీరాన్ని ప్రజలు సమాధి చేశారు. అంతకు ముందే సౌలు కర్ణపిశాచముగల వారిని చిల్లంగివారిని ఇశ్రాయేలు నుండి వెడల గొట్టాడు.
1SA 28:4 ఫిలిష్తీయులంతా యుద్ధానికి సిద్ధమై షూనేము అనే చోట గుడారాలు వేసుకున్నారు. సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమీకరించి, గిల్బోవలో గుడారాలు వేసుకున్నాడు.
1SA 28:5 ఫిలిష్తీయుల సైన్యాన్ని చూడగానే సౌలు అదిరిపోయాడు. అతని గుండె భయంతో కొట్టుకుంది.
1SA 28:6 సౌలు యెహోవాను ప్రార్థించాడు. కానీ యెహోవా అతనికి జవాబు ఇవ్వలేదు. కలలోకూడ దేవుడు సౌలుతో మాట్లాడలేదు. అతనికి జవాబు ఇచ్చేందుకు దేవుడు ఊరీము ప్రయోగించ లేదు.
1SA 28:7 చివరికి సౌలు తన మనుష్యులతో, “ఒక కర్ణపిశాచంగల స్త్రీని వెదకండి. నేను వెళ్లి ఏమి జరుగబోతోందో ఆమెను అడుగుతాను” అని చెప్పాడు. “ఏన్దోరులో కర్ణ పిశాచం గల ఒక స్త్రీ వుందని” అతని అధికారులు అతనితో చెప్పారు.
1SA 28:8 అప్పుడు సౌలు గుర్తు తెలియకుండా మారు వేషం వేసుకొని, ఆ రాత్రి ఇద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని ఆ స్త్రీని చూడటానికివెళ్లాడు. “ఆ స్త్రీని దైవావేశంతో తన భవిష్యత్తును చెప్పమన్నాడు. నేను చెప్పిన వ్యక్తిని నీవు పిలువు” అని అన్నాడు.
1SA 28:9 కానీ ఆ స్త్రీ, “సౌలు ఏమి చేసాడో నీకు ఖచ్చితంగా తెలుసు. కర్ణపిశాచముగలవారిని, చిల్లంగివారిని ఇశ్రాయేలు నుండి వెళ్లగొట్టాడు. నీవు నన్ను ఉరివేసి చంపాలని చూస్తున్నావు” అని సౌలుతో అంది.
1SA 28:10 సౌలు యెహోవా పేరును ప్రయోగించి ఆ స్త్రీకి ప్రమాణం చేసాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా చెబుతున్నాను. నీవు ఈ పని చేసినందుకు శిక్షపొందవు” అన్నాడు.
1SA 28:11 “అయితే మాట్లాడేందుకు ఎవరిని రప్పించమంటావు?” అని ఆ స్త్రీ సౌలును అడిగింది. “సమూయేలును” అన్నాడు సౌలు.
1SA 28:12 ఆ స్త్రీ సమూయేలును చూచి చావుకేక వేసింది. “నీవు నన్ను మాయ చేసావు, నీవు సౌలువే” అంది ఆ స్త్రీ సౌలుతో.
1SA 28:13 “అయినా ఏమీ భయపడకు! నీవు ఏమి చూస్తున్నావు?” అన్నాడు సౌలు ఆమెతో. “భూమిలో నుండి ఒక ఆత్మ రావటం నేను చూస్తున్నాను” అంది ఆ స్త్రీ.
1SA 28:14 “అయితే, వాని ఆకారం ఎలా ఉంది?” అని సౌలు అడిగాడు. “అతడు అంగీ ధరించిన ముసలివానిలా కనబడుతున్నాడు” అని ఆ స్త్రీ జవాబిచ్చింది. అది సమూయేలు అని అప్పుడు సౌలుకు తెలిసింది. సౌలు సాష్టాంగపడి నమస్కరించాడు.
1SA 28:15 “నన్నెందుకు ఇబ్బంది పెట్టావు? నన్నెందుకు పైకి రప్పించావు?” అన్నాడు సమూయేలు సౌలుతో. సౌలు, “నేను కష్టంలో వున్నాను. ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వచ్చారు. దేవుడేమో నన్ను విడిచిపెట్టేసాడు. ఆయన నాకు ఇంకెంత మాత్రం జవాబు ఇవ్వటంలేదు. నాకు ఆయన స్వప్నంలోగాని, ప్రవక్తల ద్వారాగాని జవాబు ఇవ్వటం లేదు. అందుకే నేను నిన్ను పిలిపించాను. నా కర్తవ్యమేమిటో నీవు నాకు చెప్పాలి” అన్నాడు.
1SA 28:16 సమూయేలు, “యెహోవా నిన్ను విసర్జించి ఇప్పుడు ఆయన నీ పొరుగువానితో ఉన్నాడు. అందు చేత నీవు నన్నెందుకు పిలిచావు?
1SA 28:17 యెహోవా ఏమి చేస్తానని చెప్పాడో అదే చేసాడు. ఈ విషయాలు నాద్వారా నీకు చెప్పాడు. యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ చేతులనుండి తీసివేసాడు. దానిని నీ పొరుగు వారిలో ఒకనికి ఆయన ఇచ్చాడు. ఆ పొరుగు వాడే దావీదు!
1SA 28:18 నీవు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. నీవు అమాలేకీయులను నాశనం చేయలేదు, వారిమీద యెహోవా ఎంత కోపగించాడో వారికి చూపించలేదు. అందుకే దేవుడు ఈ వేళ నీకు దీనిని చేసాడు.
1SA 28:19 యెహోవా ఇశ్రాయేలును, నిన్ను కూడ ఫిలిష్తీయులకు ఇచ్చివేసాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. రేపు నీవూ, నీ కుమారులు కూడా నాతో పాటు ఇక్కడ ఉంటారు” అని చెప్పాడు.
1SA 28:20 సౌలు వెంటనే నేల మీదుకి ఒరిగిపోయి, అక్కడే పడి ఉన్నాడు. సమూయేలు చెప్పిన వాటి మూలంగా సౌలు భయపడిపోయాడు. ఆ రాత్రి, పగలు సౌలు ఏమీ తినకపోవటంతో చాలా నీరసించి పోయాడు.
1SA 28:21 ఆ స్త్రీ సౌలు వద్దకు వచ్చి, అతను నిజంగానే చాలా భయపడి పోయినట్టు గమనించింది. “చూడు, నేను నీ సేవకురాలిని. నేను నీకు విధేయురాలి నయ్యాను. నేను నా ప్రాణానికి తెగిచి నీవు చెప్పినట్లు చేసాను.
1SA 28:22 దయచేసి ఇప్పుడు నేను చెప్పేది విను. నీకు కొంత ఆహారం ఇస్తాను. నీవు అది తినాలి. అప్పుడు నీ దారిన నీవు వెళ్లటానికి సరిపడే శక్తి నీకు ఉంటుంది” అని ఆమె చెప్పింది.
1SA 28:23 కానీ సౌలు తిరస్కరించాడు. “నేనేమి తినను” అన్నాడు. సౌలు అధికార్లు ఆమెతో కలిసి సౌలును తినమని బతిమలాడారు. చివరకు సౌలు ఒప్పుకుని నేల మీదనుండి లేచి పక్కమీద కూర్చున్నాడు.
1SA 28:24 ఆ స్త్రీ ఇంటివద్ద ఒక బలిసిన ఆవుదూడ వుంది. వెంటనే ఆమె ఆ దూడను చంపింది: కొంత పిండి తీసిస్వయంగా కలిపి దానిని గొట్టకుండా రొట్టెకాల్చింది.
1SA 28:25 ఆ ఆహారాన్ని సాలు ముందు, అతని అధికార్ల ముందు ఆమె పెట్టింది. సౌలు, అతని అధికార్లు భోజనంచేసారు. అదే రోజు రాత్రి వారు బయలుదేరి వెళ్లిపోయారు.
1SA 29:1 ఆఫెకు వద్ద ఫిలిష్తీయులు తమ సైన్యాన్ని సమకూర్చారు. యెజ్రెయేలులో ఊట బావి వద్ద ఇశ్రాయేలు సైనికులు గుడారాలు వేసుకున్నారు.
1SA 29:2 ఫిలిష్తీయుల పాలకులు నూరుమంది దళాలతో, వేయిమంది దళాలతో ముందడుగు వేస్తున్నారు. దావీదు, అతని మనుష్యులు ఆకీషు వెనుక నడుస్తూఉన్నారు.
1SA 29:3 ఫిలిష్తీయుల దళాధిపతులు, “ఈ హెబ్రీవాళ్లు ఇక్కడ ఏమి చేస్తున్నారు” అని అడిగారు. అప్పుడు ఆకీషు ఫిలిష్తీయుల దళాధిపతులతో, “ఇతడు దావీదు. ఇతడు సౌలు అధికారుల్లో ఒకడు. దావీదు చాలా కాలంగా నాతో ఉంటున్నాడు. దావీదు సౌలును విడిచిపెట్టి వచ్చి నా దగ్గర ఉంటున్నప్పటి నుండి ఇతనిలో నాకు ఏ తప్పూ కనబడలేదు,” అని చెప్పాడు.
1SA 29:4 కానీ ఆకీషు మీద ఫిలిష్తీ దళాధిపతులకు చాలా కోపం వచ్చింది. “దావీదును వెనుకకు పంపించు! నీవు ఇతనికిచ్చిన ఊరికి ఇతను తిరిగి వెళ్లిపోవాలి. యుద్ధంలోకి ఇతడు మనతో రావటానికి వీల్లేదు. ఇతను ఇక్కడ ఉన్నాడంటే మన మధ్యలో శత్రువును పెట్టుకున్నట్టే అవుతుంది. ఇతను మన మనుష్యులను చంపితన రాజు సౌలును సంతోష పెడతాడు.
1SA 29:5 ఈ దావీదును గూర్చే ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తూ ‘సౌలు వేల కొలదిగా హతము చేసెననియు, దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు.’ అని పాట పాడారు” అని చెప్పారు ఆ దళాధిపతులు.
1SA 29:6 అందుచేత ఆకీషు దావీదును పిలిచాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా, నీవు నాకు నమ్మకంగా ఉన్నావు. నీవు నా సైన్యంలో పని చేయటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీవు వచ్చిన రోజునుండి నీలో ఏ తప్పూ నాకు కనబడలేదు. ఫిలిష్తీయుల పాలకులు కూడ నీవు మంచివాడివని తలస్తున్నారు.
1SA 29:7 శాంతితో వెనుకకు వెళ్లిపో. ఫిలిష్తీయుల పాలకులకు విరోధంగా ఏమీ చెయ్యకు,” అని ఆకీషు చెప్పాడు.
1SA 29:8 దావీదు, “నేను ఏమి తప్పుచేసాను? నేను నీ దగ్గరకు వచ్చిన రోజునుండి ఈ రోజు వరకు నీవు నాలో ఏమి తప్పు కనుగొన్నావు? నా యజమానివైన రాజు యొక్క శత్రువులతో నన్నెందుకు పోరాడనివ్వవు?” అని దావీదు అడిగాడు.
1SA 29:9 అందుకు ఆకీషు, “నీవు మంచివాడవని నాకు తెలుసు. నీవు దేవుని దగ్గరనుండి వచ్చిన దేవదూతలా ఉన్నావు. కానీ ఫిలిష్తీయుల దళాధిపతి మాత్రం, ‘దావీదు మాతో కలిసి యుద్ధానికి రాకూడదు’ అంటూనే ఉన్నాడు.
1SA 29:10 తెల్లవారు ఝామునే లేచి నీవూ, నీ మనుష్యులూ వెనక్కు వెళ్లిపోవాలి. నేను మీకిచ్చిన నగరానికి తిరిగి వెళ్లండి. నిన్ను గురించి దళాధిపతి చెప్పిన చెడ్డ మాటలను లెక్క చెయకు. నీవు మంచివాడివి. కనుక సూర్యోదయం కాగానే వెళ్లిపోవాలి” అన్నాడు.
1SA 29:11 అంతుచేత దావీదు, అతని మనుష్యులు తెల్లవారుఝామునే లేచి ఫిలిష్తీయుల దేశానికి వెళ్లిపోయారు. ఫిలిష్తీయులు యెజ్రెయేలుకు సాగిపోయారు.
1SA 30:1 దావీదు, అతని మనుష్యులు మూడవ రోజుకు సిక్లగు నగరానికి చేరుకున్నారు. అమాలేకీయులు సిక్లగును ముట్టడివేయుట వారు చూశారు. అమాలేకీయులు నెగెవ్ ప్రాంతం మీద దాడి చేసారు. వారు సిక్లగు మీద దాడి చేసి, పట్టణాన్ని తగులబెట్టారు.
1SA 30:2 సిక్లగులో ఉన్న స్త్రీలను బందీలుగా పట్టుకున్నారు. పడుచువాళ్లను, వృద్ధులను అందరినీ వారు పట్టుకొన్నారు. వారు ఎవ్వరినీ చంపలేదు. కేవలం వారిని బందీలుగా పట్టుకొన్నారు.
1SA 30:3 దావీదు, అతని మనుష్యులు సిక్లగు వచ్చేసరికి పట్టణమంతా తగులబడి పోవటం వారికి కనబడింది. వారి భార్యలు, కొడుకులు, కూతుళ్లు, అంతా బందీలుగా కొనిపోబడ్డారు. అమాలేకీయులు వారిని పట్టుకొన్నారు.
1SA 30:4 దావీదు, అతని సైనికులు సొమ్మసిల్లి పోయేలా గట్టిగా విలపించారు.
1SA 30:5 దావీదు యొక్క ఇద్దరు భార్యలు (యెజ్రెయేలీ అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్య, విధవరాలు అబీగయీలు) కూడ బందీలుగా కొనిపోబడ్డారు.
1SA 30:6 సైన్యంలోని మగవాళ్లంతా వారి కుమారులు, కుమారైలు బందీలుగా తీసుకుని పోబడినందుకు విచారంగా, కోపంగా ఉన్నారు. దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకుంటున్నారు. ఇది దావీదును చాలా తల్లడిల్ల చేసింది. కానీ దావీదు తనదేవుడైన యెహోవా నుంచి బలంపొందాడు.
1SA 30:7 యాజకుడైన అబ్యాతారుతో, “ఏఫోదును తెమ్మని” చెప్పాడు దావీదు.
1SA 30:8 అప్పుడు దావీదు యెహోవాకు ప్రార్థన చేసాడు “మా కుటుంబాలను బందీలుగా తీసుకునిపోయిన వారిని నేను వెంటాడనా? వారిని పట్టుకుంటానా?” అని అడిగాడు, “వారిని వెంటాడు, నీవు వారని పట్టుకుంటావు. మీ కుటుంబాలను రక్షించుకొంటావు” అని యెహోవా ప్రత్యుత్తర మిచ్చాడు.
1SA 30:9 దావీదు తన ఆరువందల మంది మనుష్యులను తనతో బెసోరు సెలయేటి వద్దకు తీసుకుని వెళ్లాడు. కొంతమంది ఆ సెలయేటి వద్ద ఉండిపోయారు. అక్కడ నిలబడిపోయిన చాలా మంది అలసి అలసిపోయి ముందుకు వెళ్లలేనంతి బలహీనంగా ఉన్నందువల్ల అక్కడే ఉండిపోయారు. కనుక దావీదు, మరో 400 మంది కలిసి, అమాలేకీయులను తరుముట కొనసాగించారు.
1SA 30:11 ఈజిప్టు మనిషి ఒకడు పొలాల్లో దావీదు మనుష్యులకు కనబడ్డాడు. వారు ఆ ఈజిప్టు వానిని దావీదు దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఆ ఈజిప్టు వానికి వారు మంచినీళ్లు, కొంచెం ఆహారం ఇచ్చారు.
1SA 30:12 అంజూరపు పళ్లను, రొట్టెను, రెండు గుత్తుల ఎండు ద్రాక్షలను కూడ వారు అతనికి ఇచ్చారు. అవి తిని వాడు కొంత సేదతీరాడు, మూడు పగళ్లు, మూడు రాత్రులు అతడు ఏమీ తినిగాని, తాగిగాని ఎరుగడు.
1SA 30:13 “నీ యజమాని ఎవరు? నీవు ఎక్కడనుండి వస్తున్నావు?” అని దావీదు అడిగాడు అందుకు, “నేను ఈజిప్టు వాడిని. ఒక అమాలేకీయుని బానిసను, మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. అందుచేత నా యజమాని నన్ను వదిలివేశాడు.
1SA 30:14 కెరేతీయులు నివసించే దక్షిణ ప్రాంతాన్ని, యూదా దేశాన్ని, కాలేబు ప్రజలు నివసించే నెగెవ్ ప్రాంతాన్ని మేము ముట్టుడించాము. మేము సిక్లగును కూడ తగులబెట్టాము” అని ఆ ఈజిప్టువాడు దావీదుకు చెప్పాడు.
1SA 30:15 “అయితే మా భార్య పిల్లల్ని తీసుకుని పోయిన ఆ మనుష్యుల దగ్గరకు నీవు నన్ను తీసుకుని వెళతావా?” అని దావీదు ఆ ఈజిప్టు వాడిని అడిగాడు. “నన్ను చంపననీ, నా యజమానికి తిరిగి నన్ను అప్పగించననీ దేవుని ముందర నీవు మాట ఇస్తే వారిని కనుక్కొనేందుకు నేను సహాయం చేస్తాను” అన్నాడు ఆ ఈజిప్టువాడు.
1SA 30:16 ఈజిప్టువాడు దావీదును అమాలేకీయుల దగ్గరకు నడిపించాడు. ఆ సమయంలో వారు తాగుతూ, తింటూ నేలమీద ఇక్కడా అక్కడా పండుకొనివున్నారు. ఫిలిష్తీయుల దేశం నుండి, యూదా దేశం నుండి వారు కొల్లగొట్టిన అస్తిపాస్తులను చూసు కుంటూ సంబరం జరుపు కుంటున్నారు.
1SA 30:17 దావీదు వారిని ఓడించి, చంపేసాడు. సూర్యోదయం నుంచి మరునాటి సాయంత్రం వరకు వారు యుద్ధం చేశారు. సుమారు నాలుగు వందల మంది అమాలేకీ యువకులు మాత్రం ఒంటెలపై దూకి పారిపోయారు వారిలో మిగిలిన వారెవ్వరూ బ్రతికి బయటపడలేదు.
1SA 30:18 దావీదుకు తన ఇద్దరు భార్యలు తిరిగి దొరికారు. అమాలేకీయులు కొల్లగొట్టినదంతా దావీదు తిరిగి తీసుకున్నాడు.
1SA 30:19 ఏమీ ఒదిలిపెట్టబడలేదు. చిన్నాపెద్దా, వారి కూతుళ్లు, కొడుకులు, అందర్నీ వారు తిరిగి తెచ్చుకున్నారు. వారి విలువైన వస్తువులన్నీ వారు తిరిగి తెచ్చుకున్నారు. అమాలేకీయులు దోచుకున్న దంతా వారు తిరిగి తెచ్చుకున్నారు. దావీదు సమస్తం మళ్లీ తెచ్చుకున్నాడు.
1SA 30:20 గొర్రెలన్నిటినీ, పశువులన్నింటినీ దావీదు మరల తెచ్చుకున్నాడు. దావీదు మనుష్యులు వాటిని ముందు నడుపుకుంటూ వచ్చారు. వారు “ఇది దావీదు యొక్క బహుమానం” అన్నారు.
1SA 30:21 అలసి నీరసించి దావీదును వెంబడించలేక బెసోరు సెలయేటి దగ్గర దిగబడిపోయిన రెండు వందలమంది సైనికుల వద్దకు దావీదు తిరిగి వచ్చాడు. వారంతా దావీదును, సైన్యాన్ని చూచి ఎదురేగి ఆహ్యానించారు.
1SA 30:22 అయితే దావీదు వెంట వెళ్లిన గుంపులో కొందరు చెడ్డవాళ్లు, అల్లరి మూక ఉన్నారు. వారు, “ఈ రెండు వందల మంది మనతో రాలేదు. కనుక మనము తీసుకున్న వాటిలో వారికి ఎవరికీ ఏమీ ఇవ్వం. కాకపోతే వారివారి భార్య పిల్లలను మాత్రం వారు తీసుకుని వెళ్లిపోవచ్చు” అన్నారు.
1SA 30:23 అది విన్న దావీదు, “కాదు, సోదరులారా! అలా చేయకండి. యెహోవా మనకు ఇచ్చిన వాటి విషయం ఆలోచించండి. మనపై దాడి చేసిన శత్రువులను యెహోవా మనచేత ఓడించాడు.
1SA 30:24 మీరు చెప్పే దానిని ఎవరూ వినరు. సామానుల వద్ద కాపలా వున్న వారికి, యుద్ధం చేసిన వారికి సమంగానే వాటా వస్తుంది. అందకూ సమంగానే పంచుకోవాలి” అన్నాడు.
1SA 30:25 దావీదు దీనిని ఇశ్రాయేలుకు ఒక నియమంగా, ఒక ఆదేశంగా చేశాడు. ఆ నియమం ఈ నాటికీ అమలులో వుంది.
1SA 30:26 దావీదు సిక్లగుకు వచ్చాడు. అతడు అమాలేకీయుల నుండి తెచ్చిన సంపదలో కొంత భాగాన్ని తన స్నేహితులైన యూదా నాయకులకు పంపాడు. “యెహోవా శత్రువులనుండి మేము తెచ్చిన సంపద లోనుంచి మీకో చిరుకానుక” అని చెప్పి పంపాడు దావీదు.
1SA 30:27 అమాలేకీయులనుంచి తాను తెచ్చిన వస్తువులలో మరికొన్నింటిని బేతేలు నాయకులకు, నెగెవులోని రామోతు, యత్తీరు,
1SA 30:28 అరోయేరు, షిష్మోతు, ఎష్తెమో,
1SA 30:29 రాకాలు మొదలగు యెరహ్మెయేలీ నగరాలకు
1SA 30:30 కేనీయుల, హోర్మా, కోరాషాను, అతాకు
1SA 30:31 మరియు హెబ్రోను నగరాల నాయకులకు దావీదు పంపించాడు. అంతేగాక, దావీదు తన మనుష్యులతో ఎక్కడెక్కడికి వెళ్లాడో ఆ ప్రాంతాల నాయకులకు కూడ వాటిలో కొన్నింటిని దావీదు పంపించాడు.
1SA 31:1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలు సైన్యం చెల్లాచెదురై ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. గిల్బోవ పర్వతంవద్ద చాలా మంది ఇశ్రాయేలీయులు చంపబడ్డారు.
1SA 31:2 ఫిలిష్తీయులు సౌలుతోను, అతని కుమారులతోను భీకరంగా పోరాడారు. సౌలు కుమారులైన యోనాతాను, అబీనాదాబు మరియు మెల్కీషూవలను ఫిలిష్తీయులు చంపివేశారు.
1SA 31:3 సౌలు మీద యుద్ధం దారుణంగా జరిగింది. విలుకాండ్రు సౌలు మీద బాణాలు వేయగా సౌలు శరీరంతూట్లు పడిపోయింది.
1SA 31:4 సౌలు తన ఆయుధాలు మోసేవానిని పిలిచి, “నీ కత్తి దూసి దానితో నన్ను సంహరించు. సున్నతి సంస్కారం లేని ఈ పరాయి వాళ్లు నన్ను గేలి చేయకుండా నన్ను సంహరించు” అని చెప్పాడు. కాని సౌలు సహాయకుడు నిరాకరించాడు. అతడు చాలా భయపడిపోయాడు. అందుచేత సౌలు తన కత్తినే దూసి దానితో తనను తానే చంపుకున్నాడు.
1SA 31:5 అలా సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూశాడు. కనుక వాడు కూడ తన కత్తితో తాను పొడుచుకొని సౌలుతో పాటు చనిపోయాడు.
1SA 31:6 కనుక ఆ ఒక్కరోజున సౌలు, అతని ముగ్గురు కుమారులు, అతని సహాయకుడు అందరూ చనిరపోయారు.
1SA 31:7 లోయకు అవతల నివసిస్తున్న ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలు సైన్యం పారిపోవటం చూశారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం కూడ వారు చూశారు. కనుక ఆ ఇశ్రాయేలీయులు తమ నగరాలను వదిలి పారిపోయారు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఆ నగరాలను ఆక్రమించుకొని వాటిలో నివసించసాగారు.
1SA 31:8 ఆ మరునాడు చనిపోయిన వారివద్దనున్న విలువైన వస్తువులను తీసుకోవటానికి ఫిలిష్తీయులు వచ్చారు. సౌలు, అతని ముగ్గురు కుమారులు గిల్బోవ పర్వతం మీద చనిపోయి ఉన్నట్లు వారు చూశారు.
1SA 31:9 ఫిలిష్తీయులు సౌలు తల నరికి, అతని కవచం తీసుకున్నారు. ఈ వార్తను వారు ఫిలిష్తీయులందరికీ తెలియ జేసి, వారి బూటకపు దేవతల విగ్రహాల దేవాలయానికి కూడ ఆ వార్తను చేరవేశారు.
1SA 31:10 వారు సౌలు కవచాన్ని అష్ఠారోతు దేవత గుడిలో ఉంచారు. ఫిలిష్తీయులు సౌలు శవాన్ని బెత్షాను నగర గోడకు వేలాడదీసారు.
1SA 31:11 ఫిలిష్తీయులు సౌలుకు చేసిన వాటన్నింటిని గూర్చీ యాబేష్గిలాదు నివాసులు విన్నారు.
1SA 31:12 కనుక యాబేషునగరంలో వున్న సైనికులంతా, ఒక రాత్రంతా నడిచి బేత్షాను నగరానికి వెళ్లారు. సౌలు శవాన్ని బేత్షాను నగర గోడ మీదనుంచి వారు దించారు. అలాగే సౌలు కుమారుల శవాలను కూడ ఆ గోడ మీద నుంచి వారు దించారు. అప్పుడు ఆ శవాలన్నిటినీ వారు యాబేషుకు తీసుకుని వెళ్లారు. అక్కడ యాబేషు ప్రజలు సౌలు, అతని ముగ్గురు కుమారుల శవాలకు దహన సంస్కారం చేశారు.
1SA 31:13 తరువాత వారు సౌలు, అతని ముగ్గురు కుమారుల శవాలను తీసుకుని యాబేషులో సింధూర వృక్షం క్రింద సమాధి చేశారు. అప్పుడు యాబేషు ప్రజలు వారి దుఃఖాన్ని వెలిబుచ్చారు. యాబేషు ప్రజలు ఏడు రోజుల పాటు భోజన పానాదులు మానివేశారు.
2SA 1:1 దావీదు అమాలేకీయులను ఓడించిన తర్వాత అతను సిక్లగుకు వచ్చి రెండు రోజులపాటు ఉన్నాడు. ఇది సౌలు మరణించిన తరువాత జరిగింది.
2SA 1:2 మూడవ రోజున సిక్లగుకు ఒక యువసైనికుడు వచ్చాడు. ఇతడు సౌలు శిబిరము నుండి వచ్చాడు. వాని బట్టలు చిరిగిపోయి వున్నాయి. తలనిండా మట్టి పడివుంది అతను దావీదు వద్దకు వచ్చి ప్రణమిల్లాడు.
2SA 1:3 “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని దావీదు వానిని అడిగాడు. “నేను ఇశ్రాయేలీయుల శిబిరము నుండి తప్పించు కొని వచ్చాను” అని దావీదుకు సమాధాన మిచ్చాడు.
2SA 1:4 “దయచేసి యుద్ధంలో ఎవరు గెల్చారో చెప్పు” అని దావీదు అడిగాడు. “జనం యుద్ధభూమి నుండి పారిపోయారు. అనేక మంది హతులయ్యారు. సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయారు” అని చెప్పాడా వ్యక్తి.
2SA 1:5 దావీదు, “సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయినట్లు నీకు ఎలా తెలుసు?” అని అడిగాడు.
2SA 1:6 అందుకు యువసైనికుడు, ఇలా చెప్పెను: “నేను ఆ సమయంలో గిల్బోవ పర్వతం మీదకు రావటం జరిగింది. సౌలు తన ఈటెపై ఆనుకొని వుండటం నేను చూశాను. ఫిలిష్తీయులు తమ రథాల మీద, గుర్రాల మీద సౌలుకు చేరువగా వస్తూవున్నారు.
2SA 1:7 సౌలు వెనుదిరిగి నన్ను చూశాడు. ఆయన నన్ను పిలవగా నన్నేమి చేయమంటారు? అంటూ వెళ్లాను.
2SA 1:8 ‘నీవెవడవు’ అని సౌలు నన్నడిగాడు. నేనొక అమాలేకీయుడనని చెప్పాను.
2SA 1:9 సౌలు నాతో, ‘దయచేసి కొంచెం ఆగి నన్ను చంపివేయుము. నేను తీవ్రంగా గాయపడ్డాను. నేను ఇంచుమించు చనిపోయినట్లే’ అని చెప్పాడు.
2SA 1:10 అందువల్ల నేను ఆగి, ఆయనను చంపాను. ఆయన ఇక బ్రతకనంత తీవ్రంగా గాయపడ్డాడని నాకు తెలుసు. అప్పుడు నేనాయన కిరీటాన్ని, కంకణాన్ని తీసుకొని, వాటిని నా యజమానివైన నీ యొద్దకు తెచ్చాను.”
2SA 1:11 తన దుఃఖాన్ని వెలిబుచ్చటానికి దావీదు తన బట్టలను చించుకున్నాడు. దావీదుతో వున్న మనుష్యులందరూ అలానే చేశారు.
2SA 1:12 వారు మిక్కిలి దుఃఖించారు. సాయంత్రం వరకు వారేమీ తినలేదు. సౌలు, అతని కుమారుడు యోనాతాను ఇరువురూ మరణించినందుకు వారు విలపించారు. మరణించిన యెహోవా ప్రజలకొరకు, ఇశ్రాయేలు కొరకు దావీదు, అతని మనుష్యులు దుఃఖించారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను, తదితర ఇశ్రాయేలీయులు కత్తులతో నరకబడి చంపబడినందుకు వారు విలపించారు.
2SA 1:13 సౌలు మరణవార్త తెచ్చిన ఆ యువసైనికుని, “నీవెక్కడ నుంచి వచ్చావు?” అని దావీదు అడిగాడు. “నేనొక పరదేశీయుని కుమారుడను. అమాలేకీయుడను,” అని ఆ యువసైనికుడు అన్నాడు.
2SA 1:14 “యెహోవాచే ప్రతిష్ఠింపబడిన రాజును చంపటానికి నీవెందుకు భయపడలేదు?” అని దావీదు వానిని అడిగాడు.
2SA 1:15 తరువాత దావీదు తన యువభటులలో ఒకనిని పిలిచి ఆ అమాలేకీయుని చంపుమని చెప్పాడు. యువకుడైన ఇశ్రాయేలు సైనికుడు అమాలేకీయుని చంపివేశాడు. “నీ చావుకు నీవే కారకుడవు. నీకు వ్యతిరేకంగా నీవే మాట్లాడావు! ‘దేవునిచే ఎంపిక చేయబడిన రాజును నేనే చంపానని’ నీవే అన్నావు,” అని దావీదు ఆ అమాలేకీయునుద్దేశించి అన్నాడు.
2SA 1:17 సౌలు, అతని కుమారుడు యోనాతానులను గూర్చి దావీదు ఒక ప్రలాప గీతం పాడాడు.
2SA 1:18 యూదా ప్రజలకు ఈ పాట నేర్పుమని దావీదు తన మనుష్యులకు చెప్పాడు. ఈ పాట “ధనుర్గీతిక” అని పిలవబడింది: ఈ పాటయాషారు గ్రంధంలో ఇలా వ్రాయబడి వుంది.
2SA 1:19 ఓహో! “ఇశ్రాయేలూ నీ సౌందర్యం ఉన్నత స్థలాలపై ధ్వంసం చేయబడింది! బలాఢ్యులు పడిపోయారు!
2SA 1:20 ఈ విషయం గాతులో చెప్పవద్దు, అష్కెలోను వీధులలో ప్రకటించ వద్దు! ఏలయనగా ఫిలిష్తీయుల ఆడపడుచులు సంతసించ వచ్చు, సున్నతి కాని వారి కుమార్తెలు ఉల్లసించవచ్చు!
2SA 1:21 “గిల్బోవ పర్వతాలపై హిమబిందువులు గాని వాన చినుకులు గాని పడకుండుగాక! ఆ పొలాలు బీడులైపోవుగాక! యోధులైన వారి డాళ్లు అక్కడ మలినమైనాయి అభిషిక్తుడైన సౌలు డాలు నూనెతో మెరుగు పెట్టబడలేదు.
2SA 1:22 యోనాతాను విల్లు దానివంతు శత్రు సంహారంచేసింది. సౌలు కత్తి దానివంతు శత్రువులను తుత్తునియలు చేసింది అవి శత్రురక్తాన్ని చిందించాయి యోధుల, కొవ్వును స్పృశించాయి.
2SA 1:23 “సౌలును, యోనాతానును మేము ప్రేమించాము; వారు బ్రతికి వుండగా వారి సహాయ సంపత్తును అనుభవించాము! మరణంలో సైతం సౌలు, యోనాతాను ఎడబాటు ఎరుగరు! వారు పక్షి రాజుల కంటె వేగం గలవారు, వారు సింహాల కంటె బలంగలవారు!
2SA 1:24 ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలు కొరకు ఏడ్వండి! సౌలు మిమ్మల్ని ఎర్రని ఛాయగల దుస్తులతో అలంకరించియున్నాడు; మీ దుస్తులపై బంగారు నగలు పెట్టాడు.
2SA 1:25 “యుద్ధంలో బలవంతులు నేలకొరిగారు! యోనాతాను గిల్భోవ కొండల్లో కన్ను మూశాడు.
2SA 1:26 యోనాతానూ, సహోదరుడా! నీ కొరకై విలపిస్తున్నాను. నీ స్నేహపు మాధుర్యాన్ని చవిచూశాను; నా పట్ల నీ ప్రేమ అద్భతం, అది స్త్రీల ప్రేమకంటే మహోన్నతమైనది!
2SA 1:27 శక్తిమంతులు యుద్ధ రంగంలో నేలకొరిగారు! వారి ఆయుధాలు నాశనమయ్యాయి.”
2SA 2:1 దావీదు యెహోవాకు ప్రార్థన చేసి, “నేను యూదా రాజ్యంలో ఏ నగరానికైనా వెళ్లనా?” అని అడిగాడు. “వెళ్లు” అన్నాడు యెహోవా. “ఎక్కడికి వెళ్లను?” అని దావీదు అడికితే, “హెబ్రోనుకు” అని యెహోవా సమాధానమిచ్చాడు.
2SA 2:2 కావున దావీదు అక్కడికి వెళ్లాడు. ఆయన భార్యలైన యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలు భార్యయు విధవరాలునగు అబీగయీలు ఆయనతో వెళ్లిరి.
2SA 2:3 దావీదు తన మనుష్యులందరినీ వారి వారి కుటుంబాలతో సహా తనవెంట తీసుకొనివెళ్లాడు. వారంతా హెబ్రోను నగర ప్రాంతాలలో తన నివాసాలను ఏర్పరచుకున్నారు.
2SA 2:4 యూదా ప్రజలు వచ్చి దావీదును యూదా రాజ్యానికి రాజుగా అభిషేకం చేశారు. ఆ పని చేసి, “సౌలుకు అంత్యక్రియలు జరిపినది యాబేష్గిలాదు” వారని దావీదుకు చెప్పారు.
2SA 2:5 యాబేష్గిలాదు ప్రజల వద్దకు దావీదు దూతలను పంపాడు. దావీదు మాటగా వారు యాబేషు ప్రజలకు ఈ విధంగా చెప్పారు: “మీ రాజైన సౌలు అస్థికలను మీరు దయతో పాతిపెట్టినందుకు దేవుడు మిమ్మునాశీర్వదించు గాక!
2SA 2:6 దేవుడు ఇప్పుడు మీపట్ల దయగలవాడై, సత్య దృష్టితో వుంటాడు. మీరు సౌలు అస్థికలను పాతిపెట్టినందుకు నేను కూడా మీపట్ల దయగలిగి వుంటాను.
2SA 2:7 మీ రాజైన సౌలు చనిపోయాడు. కనుక ఇప్పుడు యూదావారు నన్ను పట్టాభిషిక్తునిగా చేశారు. అందువల్ల మీరు బలపరాక్రమ సంపన్నులుగా మెలగండి.”
2SA 2:8 నేరు కుమారుడైన అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతిగా ఉన్నాడు. అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్బోషెతును మహనయీమునకు తీసుకొని వెళ్లాడు.
2SA 2:9 అక్కడ అబ్నేరు అతనిని గిలాదు, ఆషేరి, యెజ్రెయేలు, ఎఫ్రాయిము, బెన్యామీను వారిమీద రాజుగా నియమించాడు. అనగా ఇష్బోషెతు ఇశ్రాయేలుకు రాజయ్యాడు.
2SA 2:10 ఇష్బోషెతు సౌలు కుమారుడు. అతడు ఇశ్రాయేలుకు రాజై పాలించేనాటికి నలుబది ఏండ్ల వయస్సువాడు. అతడు రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాని యూదా వంశంవారు దావీదును అనుసరించారు.
2SA 2:11 హెబ్రోనులో యూదా వంశవారికి దావీదు ఏడు సంవత్సరాల ఆరునెలలు రాజుగా ఉన్నాడు.
2SA 2:12 నేరు కుమారుడైన అబ్నేరు, సౌలు కుమారుడైన ఇష్బోషె నౌకరులు మహనయీము వదిలి పయనమైపోయారు. వారు గిబియోను చేరారు.
2SA 2:13 సెరూయా కుమారుడుగు యోవాబు, దావీదు సేవకులు కూడా గిబియోనుకు వెళ్లారు. గిబియోను మడుగువద్ద వారు అబ్నేరును, ఇష్బోషెతు సేవకులను కలిసారు. అబ్నేరు తరపువారంతా కొలనుకు ఒక పక్క కూర్చున్నారు. యోవాబు పక్షం వారు మరొక ప్రక్క కూర్చున్నారు.
2SA 2:14 యోవాబుతో అబ్నేరు, “మన ఇరుపక్షాల యువకులనూ ప్రోత్సహించి వారి మధ్య బలప్రదర్శన ఇక్కడ జరుపుదాము” అన్నాడు. పోటీ నిర్వహించటానికి యోవాబు ఒప్పు కున్నాడు.
2SA 2:15 అప్పుడు యువసైనికులు లేచారు. ఇరుపక్షాల వారూ వారి వారి యువసైనికులను పోటీకి లెక్కపెట్టారు. ఇష్బోషెతు పక్షాన బెన్యామీను వంశీయులు, దావీదు పక్షాన అతని అనుచరులు పన్నెండు మంది చొప్పున ఎంపిక చేయబడ్డారు.
2SA 2:16 ప్రతి ఒక్కడూ తన ప్రత్యర్థి తలను పట్టుకొని తమ కత్తులతో వారి డొక్కలలో పోడుచుకున్నారు. దానితో వారంతా ఒక్క పెట్టున నేలకొరిగారు. అందువల్ల ఆ ప్రదేశం “చురకత్తుల క్షేత్రం” అని పిలవబడింది. ఆ ప్రదేశం గిబియోనులో ఉంది.
2SA 2:17 ఆ రోజు పోటీ ఒక భయంకర పోరాటంగా మారింది. దావీదు సైనికులు అబ్నేరును, ఇశ్రాయేలీయులను ఓడించారు.
2SA 2:18 యోవాబు, అబీషై, అశాహేలు అనువారు ముగ్గురూ సెరూయా కుమారులు. అశాహేలు పరుగులో మిక్కిలి వడి గలవాడు. అడవిలేడిలా వేగంగా పరుగు తీయగలవాడు.
2SA 2:19 అశాహేలు అబ్నేరును తరుముకుంటూ పోయాడు. అశాహేలు తిన్నగా అబ్నేరును అనుసరించి తరిమాడు.
2SA 2:20 అబ్నేరు వెనుదిరిగి చూసి, “నీవు అశాహేలువా?” అని అడిగాడు. “అవును నేనే” అన్నాడు అశాహేలు.
2SA 2:21 “(అబ్నేరు అశాహేలును గాయ పరచేందుకు ఇష్టపడలేదు) అయితే నీవు కుడి పక్కకు గాని, ఎడమ పక్కకు తిరిగి అక్కడ వున్న యువకులలో ఒకడిని పట్టుకుని వాని కవచం నీ కొరకు తీసుకో” అన్నాడు అబ్నేరు. కాని అశాహేలు అబ్నేరును వెంటాడటం మానటానికి ఒప్పుకోలేదు.
2SA 2:22 అబ్నేరు మళ్లీ అశాహేలుతో ఇలా అన్నాడు: “నన్ను తరమటం ఆపివేయుము. నీవు ఆపకపోతే నేను నిన్ను చంపుతాను. నేను నిన్ను చంపిన పక్షంలో నీ సోదరుడైన యోవాబు ముఖం మళ్లీ నేను చూడ లేను!”
2SA 2:23 కాని అశాహేలు అబ్నేరును తరమటం మానలేదు. దానితో అబ్నేరు తన ఈటె ఐనుక భాగంతో అశాహేలు పొట్టలో పాడినాడు ఈటె మడం ఎంత తీవ్రంగా దిగబడిందనగా అది పొట్టలో నుండి వీపు ద్వారా బయటికి వచ్చింది. అశాహేలు అక్కడికక్కడే మరణించాడు. అశాహేలు శవం నేలమీద పడివుంది. అతని మనుష్యులందరూ అక్కడికి వచ్చి ఆగారు. (అశాహేలును చూసేందుకు)
2SA 2:24 కాని యోవాబు, అబీషై లిరువురూ అబ్నేరును వెంటాడసాగారు. వారు అమ్మా కొండ చేరేసరికి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. గిబియోను ఎడారిమార్గంలో గీహ ఎదురుగా అమ్మా కొండవుంది.
2SA 2:25 బెన్యామీనీయులంతా అబ్నేరు వద్దకు వచ్చి కొండ మీద కూడారు.
2SA 2:26 అబ్నేరు యోవాబును పిలిచి, “కత్తివుంటే అది ఎల్లప్పుడూ చంపటానికేనా? నీకు తెలుసు; నిజానికి ఇది విషాదాంతమవుతుంది! తమ సోదరులనే వెంటాడటం మానివేయమని ఆ మనుష్యులకు చెప్పు” అని అన్నాడు.
2SA 2:27 “నీవామాట అన్నావు, మంచిదే. దేవుని జీవంతోడుగా చెపుతున్నాను. నీవు ఇప్పుడు మాట్లాడకుండా వుండివుంటే ఈ జనం వారి సోదరులను తెల్లవారేవరకు తరుముకుంటూ పోయేవారు” అని యోవాబు అన్నాడు.
2SA 2:28 అప్పుడు యోవాబు ఒక బూర వూదాడు. దానితో అతని మనుష్యులు ఇశ్రాయేలీయులను తరమటం మానివేశారు. ఆ తరువాత ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని వారు ఎంతమాత్రం ప్రయత్నం చేయలేదు.
2SA 2:29 అబ్నేరు, అతని మనుష్యులు ఆ రాత్రంతా అరాబహు మైదానం గుండా ప్రయాణం చేసి యొర్దాను నదిని దాటారు. మరునాటి పగలంతా వారు ప్రయాణం చేసి మహనయీముకు చేరారు.
2SA 2:30 యోవాబు అబ్నేరును తరుముట మాని, తిరిగి వచ్చాడు, యోవాబు తన జనాన్ని సమావేశ పర్చినప్పుడు దావీదు అనుచరులలో పందొమ్మిది మంది తప్పియున్నారు. అశాహేలు కూడా లేడు.
2SA 2:31 అబ్నేరు అనుచరులలో మూడువందల అరువది మంది బెన్యామీనీయులను దావీదు సేవకులు వధించారు.
2SA 2:32 దావీదు మనుష్యులు అశాహేలు శవాన్ని బేత్లెహేముకు తీసుకొని వెళ్లి, అక్కడ ఉన్న అతని తండ్రి సమాధిలోనే పాతి పెట్టారు. యోవాబు, అతని మనుష్యులు రాత్రంతా పయనించారు. వారు హెబ్రోను చేరేసరికి సూర్యోదయమయ్యింది.
2SA 3:1 సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి మధ్య దీర్ఘకాలిక యుద్ధం కొనసాగింది. దావీదు రాను రాను బాగా బలపడ్డాడు. సౌలు కుటుంబం నానాటికీ బలహీనమయింది.
2SA 3:2 హెబ్రోనులో దావీదుకు పుత్ర సంతానం కలిగింది. మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి యెజ్రె యేలీయురాలగు అహీనోయము.
2SA 3:3 రెండవ కుమారుడు కిల్యాబు. కిల్యాబు తల్లి అబీగయీలు. ఈమె కర్మెలీయుడగు నాబాలు భార్యయైన విధవరాలు. మూడవ కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము తల్లి గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకా.
2SA 3:4 నాల్గవ కుమారుడు అదోనీయా. అదోనీయా తల్లి హగ్గీతు. ఐదవ కుమారుడు షెఫట్య. షెఫట్య తల్లి అబీటలు.
2SA 3:5 ఆరవ కుమారుడు ఇత్రెయాము. ఇత్రెయాము తల్లి దావీదు భార్యయగు ఎగ్లా. ఈ ఆరుగురు కుమారులు హెబ్రోనులో దావీదుకు కలిగారు.
2SA 3:6 సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి యుద్ధం జరిగిన కాలంలో అబ్నేరు సౌలు సైన్యంలో బలాన్ని పుంజుకున్నాడు.
2SA 3:7 సౌలుకు రిస్పా అనే ఒక దాసి వుండేది. ఆమె సౌలుకు ఇంచుమించు భార్యవలె వుండేది. రిస్పా అయ్యా అనువాని కుమార్తె. ఇష్బోషెతు ఒకనాడు అబ్నేరును పిలిచి, “నా తండ్రి పనిగత్తెతో నీవు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు?” అని అడిగిగాడు.
2SA 3:8 ఇష్బోషెతు అన్న మాటకు అబ్నేరుకు ఎక్కడా లేని కోపం వచ్చింది. అబ్నేరు ఇలా అన్నాడు, “నేను సౌలుకు, అతని కుటుంబానికి చాలా విధేయుడనై వున్నాను! నేను నిన్ను దావీదుకు అప్పగించలేదు; (పైగా అతడు నిన్ను ఓడించేలా చేయనూ లేదు.) యూదావారి తరపున పనిచేస్తూ ఒక రాజద్రోహిగా నేను ఎన్నడూ మెలగలేదు. కాని నీవిప్పుడు నేనొక నీచకార్యం చేసినట్లు మాట్లాడుతున్నావు!
2SA 3:9 నేనిప్పుడు నిశ్చియంగా చెప్తున్నాను. దేవుడు చెప్పిన విషయాలు ఇప్పుడు జరిగేలా నేను తప్పక ప్రయత్నం చేస్తాను! సౌలు వంశంనుండి రాజ్యాన్ని తీసుకొని దావీదుకు ఇస్తానని యోహోవా చెప్పాడు. దావీదును యూదా రాజ్యానికి, ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా చేస్తాడు. దాను నుండి బెయేర్షబా వరకు దావీదు పరిపాలిస్తాడు! ఈ పనులన్నీ నెరవేరేలా నేను సహాయ పడకపోతే దేవుడు నన్ను శిక్షించుగాక!”
2SA 3:11 ఇష్బోషెతు అబ్నేరుతో ఇంకేమీ చెప్పలేక పోయాడు. ఇష్బోషెతు అతనంటే విపరీతంగా భయపడిపోయాడు.
2SA 3:12 అబ్నేరు దావీదు వద్దకు దూతలను పంపాడు. అబ్నేరు తన మాటగా ఇలా చెప్పమన్నాడు: “నీవు ఈ రాజ్యాన్ని ఏలు. నాతో ఒక ఒడంబడిక చేసుకో. నీవు ఇశ్రాయేలంతటికీ రాజయ్యేలా నేను నీకు సహాయపడతాను.”
2SA 3:13 అందుకు దావీదు, “మంచిది! నేను నీతో ఒక ఒడంబడిక చేసుకుంటాను. కాని నిన్నొకటి అడుగుతాను; నీవు సౌలు కుమార్తె మీకాలును తీసుకొని వచ్చేవరకు నేను నిన్ను కలవను” అని చెప్పమన్నాడు.
2SA 3:14 సౌలు కుమారుడు ఇష్బోషెతు వద్దకు దావీదు దూతలను పంపాడు. “నా భార్య మీకాలును తిరిగి నాకు తెచ్చి ఇవ్వు. ఆమె నాకు ప్రధానం చేయబడింది. ఆమెను వివాహమాడటానికి నేను వందమంది ఫిలిష్తియులను చంపియున్నాను” అని చెప్పి పంపాడు.
2SA 3:15 లాయీషు కుమారుడైన పల్తీయేలు అనే వాని నుండి మీకాలును తీసుకొని రమ్మని సౌలు కుమారుడు ఇష్బోషెతు తన మనుష్యులను పంపాడు.
2SA 3:16 మీకాలు భర్త పల్తీయేలు మీకాలుతో కూడా వచ్చాడు. మీకాలును అనుసరించి పల్తీయేలు బహూరీము వరకు ఏడుస్తూవచ్చాడు. కాని అబ్నేరు పల్తీయేలుతో, “ఇంటికి తిరిగి పొమ్మని” చెప్పాడు. అప్పుడు పల్తీయేలు ఇంటికి వెళ్లి పోయాడు.
2SA 3:17 అబ్నేరు ఇశ్రాయేలు నాయకులకు యిలా వర్తమానం పంపించాడు: “మీరు దావీదును మీ రాజుగా చేసుకోవాలని చాలా కాలంగా కోరుకుంటూ వున్నారు.
2SA 3:18 ఆ పని ఇప్పుడు చేయండి! ‘ఇశ్రాయేలీయులైన నా ప్రజలందరినీ ఫిలిష్తీయుల నుండి, వారి తదితర శత్రువుల నుండి రక్షిస్తాననీ; ఈ పని నా సేవకుడైన దావీదు ద్వారా నెరవేరుస్తాననీ’ యెహోవా పలికినప్పుడు ఆయన ఈ దావీదును గురించే చెప్పాడు.”
2SA 3:19 బ్నేరు ఈ విషయాలన్నీ దావీదుతో హెబ్రోనులో చెప్పాడు. ఈ విషయాలు బెన్యామీనీయులందరికీ కూడ చెప్పాడు. అబ్నేరు చెప్పిన విషయాలు బెన్యామీను వంశంవారికీ, ఇశ్రాయేలీయుందరికీ మంచివిగా తోచాయి.
2SA 3:20 అప్పుడు అబ్నేరు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చాడు. అబ్నేరు అతనితో ఇరువది మంది మనుష్యులను తీసుకొని వచ్చాడు. అబ్నేరుకు, అతనితో వచ్చిన మనుష్యులకు దావీదు విందు ఇచ్చాడు.
2SA 3:21 అబ్నేరు దావీదుతో ఇలా అన్నాడు, “ప్రభువైన నా రాజా! నేను ఇశ్రాయేలీయులందరినీ నీ వద్దకు తీసుకొని వస్తాను. అప్పుడు వారంతా నీతో ఒక ఒడంబడిక చేసుకొంటారు. తరువాత నీకు నచ్చిన విధంగా ఇశ్రాయేలును పరిపాలించవచ్చు!” తరువాత దావీదు అబ్నేరును వెళ్లమని చెప్పగా, అబ్నేరు ప్రశాంతంగా వెళ్లిపోయాడు.
2SA 3:22 యోవాబు, దావీదు అధికారులు యుద్ధం నుండి తిరిగి వచ్చారు. వారు శత్రువుల నుండి ఎన్నో విలువైన వస్తువులను కొల్లగొట్టుకొచ్చారు. దావీదు అబ్నేరును శాంతంగా వెళ్లమని పంపివేశాడు. అందువల్ల హెబ్రోనులో దావీదు వద్ద అబ్నేరు లేడు.
2SA 3:23 యోవాబు, అతని సైనికులంతా హెబ్రోనుకు చేరారు. సైన్యం యోవాబుతో, “నేరు కుమారుడైన అబ్నేరు దావీదు రాజు వద్దకు రాగా, ఆయన అబ్నేరును శాంతంగా వెళ్లమని పంపివేశాడు” అని అన్నది.
2SA 3:24 యోవాబు రాజు వద్దకు వచ్చి, “ఏమిటి నీవు చేసిన పని? అబ్నేరు నీ వద్దకు వస్తే, అతనికి ఏ హాని చేయకుండా ఎందుకు పంపించివేశావు!
2SA 3:25 నేరు కుమారుడైన అబ్నేరును నీవెరుగుదువు! అతడు నిన్ను మోసగించటానికి వచ్చాడు! నీవు చేస్తున్నదంతా సమగ్రంగా తెలుసుకోవాలనే తలంపుతో వచ్చాడు!” అని అన్నాడు.
2SA 3:26 యోవాబు దావీదు వద్ద నుండి వెళ్లి, సిరా అనుబావి వద్దకు అబ్నేరు కొరకు తన దూతలను పంపాడు. దూతలు అబ్నేరును వెనుకకు తీసుకొని వచ్చారు. కాని ఇదంతా దావీదుకు తెలియదు.
2SA 3:27 అబ్నేరు హెబ్రోనుకు రాగానే, యోవాబు అతనిని సింహద్వారం మధ్యలో ఏదో రహస్యంగా మాట్లాడాలని ఒక పక్కకు తీసుకొని వెళ్లాడు. కాని యోవాబు తన కత్తితో అబ్నేరు పొట్టలో పొడిచాడు. అబ్నేరు చనిపోయాడు. గతంలో యోవాబు సోదరుడైన అశాహేలును అబ్నేరు చంపాడు. కావున యోవాబు అబ్నేరును చంపివేశాడు.
2SA 3:28 తరువాత ఈ వార్త దావీదు విన్నాడు. దావీదు ఇలా అన్నాడు; “నేను, నా రాజ్యం నేరు కుమారుడైన అబ్నేరు హత్య విషయంలో నిర్దోషులం. యెహోవాకి ఇది తెలుసు.
2SA 3:29 యోవాబు, అతని కుటుంబం దీనంతటికీ బాధ్యులు. అతని కుటుంబమంతా నిందితులే. యోవాబు కుటుంబానికి అనేక కష్టాలు ఎదురువుతాయని నేను నమ్ముతున్నాను. అతని కుటుంబంలో ఎప్పుడూ ఎవరో ఒకరు కుష్టువ్యాధి పీడితుడో, అంగవైకల్యంతో కర్ర పట్టుకు నడిచే వాడో, యుద్ధంలో హతుడయ్యేవాడో, లేదా ఆహారము లేనివాడో వుంటాడని కూడ నేను నమ్ముతున్నాను.”
2SA 3:30 యోవాబు, అతని సోదరుడు అబీషైలిరువురూ అబ్నేరును చంపిన కారణమేమనగా అబ్నేరు వారి సహోదరుడైన అశాహేలును గిబియోను వద్ద యుద్ధంలో చంపాడు.
2SA 3:31 యోవాబుతోను, అతనితో ఉన్న మనుష్యులతోను దావీదు “తమ బట్టలను చింపుకొని, విషాద సూచకంగా వేరే వస్త్రాలు వేసుకోమనీ, అబ్నేరు కొరకు విలపించుమనీ” చెప్పాడు. వారు అబ్నేరును హెబ్రోనులో సమాధి చేశారు. అంత్యక్రియలకు దావీదు హాజరయ్యాడు. దావీదు రాజు, ప్రజలు అబ్నేరు సమాధి వద్ద దుఃఖించారు.
2SA 3:33 దావీదు రాజు అబ్నేరుపై ఈ విషాద గీతిక పాడాడు: “అబ్నేరు ఒక అవివేకిలా హతుడాయెనా?
2SA 3:34 అతని చేతులకు బంధాలులేవు, పాదాలకు గొలుసులు వేయలేదు! అయినా క్రూరుల ముందు నీవు నేలకొరిగావు. ఒరిగి మరణించావు.” అప్పుడు ప్రజలంతా మళ్లీ అబ్నేరు కొరకు విలపించారు.
2SA 3:35 ఆ రోజు ఇంకా పొద్దువుండగానే దావీదును ఆహారం తీసుకోమని కోరటానికి ప్రజలు వచ్చారు. కాని దావీదు ఒక ప్రత్యేకమైన ప్రమాణం చేశాడు. “నేను రొట్టెగాని, తదితరమైన ఆహారంగాని సూర్యాస్తమయం గాకుండా తింటే దేవుడు నన్ను శిక్షించుగాక! నాకు మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టుగాక!” అని అన్నాడు.
2SA 3:36 అసలు అక్కడ ఏమి జరిగిందో ప్రజలంతా చూశారు, కనుక దావీదు రాజు చేసేవాటన్నిటినీ ప్రజలు ఒప్పుకున్నారు.
2SA 3:37 నేరు కుమారుడైన అబ్నేరును చంపినది దావీదు రాజు కాదని యూదా ప్రజలకీ, ఇశ్రాయేలీయులందరికీ ఆ రోజు అర్థమయ్యింది.
2SA 3:38 దావీదు రాజు తన సేవకులతో ఇలా అన్నాడు: “మీకు తెలుసు; ఇశ్రాయేలులో ఈ రోజు ఒక ప్రముఖ నాయకుడు చనిపోయాడు.
2SA 3:39 పైగా ఇదే రోజున నేను రాజుగా అభిషేకించబడ్డాను. ఈ సెరూయా కుమారులు నాకు మిక్కిలి దుఃఖాన్ని కలుగజేశారు. యెహోవా వారికి అర్హమైన శిక్ష విధించుగాక!”
2SA 4:1 హెబ్రోనులో అబ్నేరు చనిరపోయాడని సౌలు కుమారుడు ఇష్బోషెతు విన్నాడు. ఇష్బోషెతు, అతని ప్రజలు చాలా గాభరా చెందారు.
2SA 4:2 సౌలు సైన్యంలో దళాధిపతులైన ఇరువురు సౌలు కుమారుడైన ఇష్బోషెతు వద్దకు వచ్చారు. ఆ ఇరువురిలో ఒకని పేరు బయనా, మరియొకని పేరు రేకాబు. బయానా, రేకాబులిద్దరూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు బెన్యామీను వంశానికి చెందిన వారు. బెయేరోతు పట్టణం బెన్యామీను వంశానికి చెందినది.
2SA 4:3 కాని బెయేరోతు ప్రజలు గిత్తయీముకు పారిపోయి, ఈనాటికీ వారక్కడ నివసిస్తున్నారు.
2SA 4:4 సౌలు కుమారుడైన యోనాతానుకు కుంటివాడైన ఒక కుమారుడున్నాడు. యెజ్రెయేలు వద్ద సౌలు, అతని కుమారుడు యోనాతాను చనిపోయారన్న వార్త వచ్చే సమయానికి యోనాతాను కుమారుడు ఐదేండ్లవాడు. అప్పుడా పిల్లవాని దాది వాని నెత్తుకొని పారి పోయినది. ఖంగారుగా పారిపోయేటప్పుడు, దాది చేతులలో నుండి యోనాతాను కుమారుడు జారిక్రిందపడ్డాడు. అందువల్ల యోనాతాను కుమారుడు కుంటివాడయ్యాడు. వీని పేరు మెఫీబోషెతు.
2SA 4:5 రేకాబు, బయనాలిరువురూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు ఇష్బోషెతు ఇంటికి మిట్ట మధ్యాహ్న సమయంలో వెళ్లారు. ఎండ తీవ్రంగా ఉన్నందున ఇష్బోషెతు విశ్రాంతి తీసుకొంటున్నాడు.
2SA 4:6 రేకాబు, బయనా గోధుమలు తీసుకొని వెళ్లాలనే నెపంతో నట్టింట్లోకి వచ్చారు. ఇష్బోషెతు తన పడకగదిలో పక్కమీద పడుకున్నాడు. రేకాబు, బయనాలిద్దరూ ఇష్బోషెతును పొడిచి చంపారు. వారు అతని తల నరికి దానిని వారితో తీసుకొనిపోయారు. రాత్రంతా ప్రయాణం చేసి,
2SA 4:8 హెబ్రోనుకు వచ్చారు. ఇష్బోషెతు తలను దావీదుకు ఇచ్చారు. రేకాయి, బయనాలు దావీదు రాజుతో ఇలా అన్నారు: “నీ శత్రువైన సౌలు కుమారుడు ఇష్బోషెతు తల ఇదిగో. అతడు నిన్ను చంప ప్రయత్నం చేశాడు! యెహోవా ఈ రోజు సౌలును, అతని కుటుంబాన్ని శిక్షించాడు!”
2SA 4:9 రేకాబు, బయనాలకు సమాధానంగా దావీదు ఇలా అన్నాడు: “యెహోవా జీవము తోడుగా, నిజానికి అతను నన్ను అనేక కష్టాల నుంచి రక్షించాడు.
2SA 4:10 ఒకానొకడు నాకేదో మంచివార్త చెప్పాలన్నట్లు వచ్చాడు. వాడు వచ్చి, ‘సౌలు చచ్చిపోయాడు!’ అని చెప్పాడు. ఆ వార్త నాకు అందచేసినందుకు వానికి నేను పారితోషికము ఇస్తాననుకున్నాడు. కాని నేను వానిని పట్టుకొని సిక్లగు వద్ద చంపివేశాను.
2SA 4:11 కావున మీ చావును కూడ నేను కోరుతున్నాను. ఎందుకనగా దుష్టులు ఒక మంచి వ్యక్తిని అతని పక్కమీదే, అతని ఇంటిలోనే హత్య చేశారు!”
2SA 4:12 దావీదు కొందరు యువకులను పిలిచి రేకాబు, బయనాలను చంపమన్నాడు. అప్పుడా యువకులు రేకాబు, బయనాల కాళ్లు, చేతులు నరికి, హెబ్రోను మడుగు వద్ద వేలాడ దీశారు. తరువాత ఇష్బోషెతు తలను తీసుకొని హెబ్రోనులో అబ్నేరు సమాధి వద్ద పాతి పెట్టారు.
2SA 5:1 అప్పుడు ఇశ్రాయేలు వంశాల వారందరూ హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నారు: “చూడండి; మనమంతా ఒకే కుటుంబం!
2SA 5:2 గతంలో సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల యుద్ధాలలో నీవు మమ్ములను నడిపించావు. మరియు ఇశ్రాయేలును యుద్ధము నుంచి ఇంటికి తిరిగి రప్పించావు. ‘ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నీవు కాపరివవుతావు. ఇశ్రాయేలుకు పాలకుడవవుతావు’ అని యెహోవా నీకు చెప్పాడు.”
2SA 5:3 ఇశ్రాయేలు నాయకులంతా హెబ్రోనులో ఉన్న దావీదు రాజు వద్దకు వచ్చారు. దావీదు రాజు హెబ్రోనులో ఆ వచ్చిన నాయకులతో యెహోవా సమక్షంలో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అప్పుడా నాయకులంతా దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించారు.
2SA 5:4 పరిపాలన చేపట్టే నాటికి దావీదు ముప్పది సంవత్సరాల వాడు. అతడు నలుబది సంవత్సరాలు పాలించాడు.
2SA 5:5 హెబ్రోనులో వుండి యూదా రాజ్యాన్ని ఏడు సంవత్సరాల, ఆరు నెలలు పాలించాడు. పిమ్మట యెరూషలేము నుంచి ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను ముప్పదిమూడు సంవత్సరాలు పాలించాడు.
2SA 5:6 రాజు తన మనుష్యులతో యెబూసీయుల మీదికి దండెత్తి యెరూషలేముకు పోయెను. (యెబూసీయులు) దేశంలో నివాసం ఏర్పరచుకొని స్థిరపడిపోయారు. యెబూసీయులు దావీదుతో, “నీవు మా నగరంలోకి రాలేవు. ఒకవేళ వస్తే, కుంటి, గుడ్డివారు సహితం నిన్ను విరోధిస్తారు” అని అన్నారు.
2SA 5:7 కాని దావీదు సీయోను కోటను వశపర్చుకున్నాడు. తరువాత దానినే దావీదు నగరం అని పిలవటం మొదలు పెట్టారు.
2SA 5:8 ఆ రోజు దావీదు తన మనుష్యులతో, “మీరు యెబూసీయులను ఓడించాలంటే నీటి సొరంగం ద్వారా ఆ ‘కుంటి మరియు గ్రుడ్డి’ శత్రువుల వద్దకు వెళ్లండి” అని అన్నాడు. అందువల్లనే, “కుంటి, గుడ్డివారు ఇంట్లోకి రాలేరని” అంటారు.
2SA 5:9 దావీదు కోటలో నివసించి, దానిని “దావీదు నగరం” అని పిలిచాడు. మిల్లో నుండి చుట్టు పక్కల అనేక భవనాలను దావీదు కట్టించాడు. సీయోను నగరంలో కూడా అనేక కట్టడాలను చేపట్టి లోపల బాగా అభివృద్ధి చేశాడు.
2SA 5:10 సర్వశక్తిమంతుడైన దేవుడు అతనికి తోడైయున్నందున, దావీదు క్రమంగా బలపడి వర్థిల్లాడు.
2SA 5:11 తూరు రాజైన హీరాము కొందరు దూతలను దావీదు వద్దకు పంపాడు. వారితో పాటు దేవదారు కలపను, వడ్రంగులను, శిల్పులను పంపాడు. వారంతా దావీదుకు ఒక భవనం నిర్మించారు.
2SA 5:12 నిజంగా యెహోవా తనను ఇశ్రాయేలుకు రాజును చేసినట్లు దావీదుకు ఆ సమయంలో అర్థమయ్యింది. యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన రాజ్యాన్ని చాలా ముఖ్యమైనదిగా దేవుడు చేసినాడని దావీదు తెలుసుకొన్నాడు.
2SA 5:13 దావీదు యెరూషలేము నుండి పెక్కు మంది దాసీలను, భార్యలను స్వీకరించాడు. హెబ్రోను నుండి యెరూషలేముకు వెళ్లిన పిమ్మట దావీదు ఆ పని చేసాడు. దావీదుకు చాలా మంది కుమారులు, కుమార్తెలు కలిగారు.
2SA 5:14 యెరూషలేములో దావీదుకు కలిగిన కుమారుల పేర్లు: షమ్మూ, యషోబాబు, నాతాను, సొలొమోను,
2SA 5:15 ఇభారు, ఏలీషూవ, నెపెగు, యాఫీయ,
2SA 5:16 ఎలీషామా, ఎల్యాదా మరియు ఎలీపేలెటు.
2SA 5:17 ఇశ్రాయేలీయులు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు వినగానే, ఫిలిష్తీయులంతా దావీదును చంపాలని వెదకటం మొదలు పెట్టారు. కాని ఈ వార్త దావీదు విన్నాడు. అతను ఒక కోటలోకి వెళ్లాడు.
2SA 5:18 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దిగారు.
2SA 5:19 దావీదు ప్రార్థన చేసి, “ఫిలిష్తీయుల మీదికి యుద్దానికి వెళ్లేదా? ఫిలిష్తీయులను ఓడించటంలో నాకు సహాయపడతావా?” అని యెహోవాను అడిగాడు. “వెళ్లు. ఫిలిష్తీయులను ఓడించటంలో నీకు నేను తప్పక సహాయం చేస్తాను” అని యెహోవా చెప్పాడు.
2SA 5:20 అప్పుడు దావీదు బయల్పెరాజీముకు వచ్చి, ఫిలిష్తీయులను ఓడించాడు. “ఆనకట్ట తెగి నీళ్లు పరవళ్లు తొక్కుతూ ప్రవహించినట్లు, యెహోవా నా శత్రువులను నాముందు చెల్లాచెదురై పారిపోయేలా చేసాడు,” అని అనుకున్నాడు దావీదు. ఆ కారణం చేత దావీదు ఆ ప్రదేశానికి బయల్పెరాజీము అని పేరుపెట్టాడు.
2SA 5:21 ఫిలిష్తీయులు పారిపోతూ తమ దేవుళ్ల విగ్రహాలను బయల్పెరాజీము వద్ద వదిలిపోయారు. దావీదు, అతని మనుష్యులు ఆ విగ్రహాన్నిటినీ తీసుకొని వెళ్లారు.
2SA 5:22 ఫిలిష్తీయులు మళ్లీ రెఫాయీము లోయలోకి వచ్చిదిగారు.
2SA 5:23 దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఈ సారి యెహోవా దావీదుతో ఇలా అన్నాడు, “తిన్నగా అక్కడికి వెళ్లవద్దు. వాళ్లను చుట్టుముట్టి సైన్యానికి వెనుకగా వెళ్లు. గులిమిడి చెట్లవద్ద వారిని ఎదుర్కో.
2SA 5:24 చెట్ల మీదకు ఎక్కి కూర్చుని, ఫిలిష్తీయులు యుద్ధానికి నడిచివచ్చే శబ్దం వింటావు. అప్పుడు నీవు త్వరపడాలి. ఎందుకంటే యెహోవా అక్కడ ఫిలిష్తీయులను ఓడించటానికి నీ కొరకు ఉన్నట్లు అది సంకేతం.”
2SA 5:25 యెహోవా తనను ఏమి చేయమని ఆజ్ఞ ఇచ్చాడో దావీదు అదంతా చేశాడు. అతను ఫిలిష్తీయులను ఓడించాడు. అతడు వారిని గెబ నుండి గెజెరు వరకు తరుము కుంటూ పోయి చంపాడు.
2SA 6:1 దావీదు మరల ప్రత్యేకంగా ఉత్తములైన ముప్పదివేల మంది ఇశ్రాయేలు యోధులను సమకూర్చుకొన్నాడు.
2SA 6:2 దావీదు వారిని తీసుకొని యూదాలో ఉన్న బాలాకు ప్రయాణమై వెళ్లాడు. యూదాలోని బాలాలో ఉన్న దేవుని పవిత్ర పెట్టె తీసుకొని, దానిని యెరూషలేముకు బయలు దేర దీసినారు. ఈ పవిత్ర పెట్టె సైన్యములకు అధిపతియైన యెహోవా పరమ పవిత్ర నామంతో పిలవబడుతూ ఉంది. పవిత్ర పెట్టె పైనున్న కెరూబుల మధ్య ఆయన ఆసీనుడైయున్నాడు.
2SA 6:3 దావీదు మనుష్యులు యెహోవా పవిత్ర పెట్టెను ఒక కొత్త బండిపై ఉంచారు. కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుండి వారా పెట్టెను తెచ్చారు. అబీనాదాబు కుమారులైన ఉజ్జా మరియు అహ్యో అనువారు ఆ బండిని తోలారు.
2SA 6:4 కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుండి ఉజ్జా, అహ్యోలిరువురూ ఆ బండిని బయలుదేరదీశారు. బండిపై దేవుని పవిత్ర పెట్టె వున్నది. అహ్యో బండిముందు నడుస్తూ ఉన్నాడు.
2SA 6:5 దావీదు, మరియు ఇశ్రాయేలీయులందరూ యెహోవా ముందు రకరకాల వాద్య విశేషాలు వాయిస్తూ ఉన్నారు. ఈ వాద్య పరికరాలు తమాల వృక్షపు కర్రతో చేయబడ్డాయి. ఆ వాద్య విశేషములలో వీణలు, విచిత్ర వీణలు, మృదంగములు, ఢమరుకములు, తాళములు మొదలగునవి ఉన్నాయి.
2SA 6:6 దావీదు మనుష్యులు నాకోను నూర్పిడి కళ్లం దగ్గరకు రాగానే ఎద్దులు తూలి పడబోయాయి. దానితో బండి మీదవున్న దేవుని ఒడంబడిక పెట్టె ఒరిగి క్రింద పడబోయింది. వెంటనే ఉజ్జా పవిత్ర పెట్టెను పట్టుకున్నాడు.
2SA 6:7 యెహోవాకు ఉజ్జాపై కోపం వచ్చి చంపివేశాడు. దేవుని పవిత్ర పెట్టెను తాకినప్పుడు ఉజ్జా దేవుని గౌరవించినట్లు గాదు. దేవుని పవిత్ర పెట్టెవలన ఉజ్జా చంపబడ్డాడు.
2SA 6:8 ఉజ్జాను యెహోవా చంపినందుకు దావీదు కలత చెందాడు. దావీదు ఆ స్థలానికి “పెరెజ్‌–ఉజ్జా” అని పేరు పెట్టాడు. ఆ ప్రదేశం ఈనాటికీ పెరెజ్‌ – ఉజ్జా అనే పిలవబడుతూ వుంది.
2SA 6:9 ఆ రోజు దావీదు యెహోవా అంటే భయపడిపోయాడు. “ఇప్పుడు దేవుని పవిత్ర పెట్టె నా వద్దకు ఎలా వస్తుంది?” అని అడిగాడు.
2SA 6:10 దావీదు పురములోనికి తనకై తాను దేవుని పవిత్ర పెట్టెను దావీదు తీసుకొని పోవుటకు సుముఖత చూపలేదు. గాతువాడైన ఓబేదెదోము ఇంటిలో పవిత్ర పెట్టెను దావీదు వుంచాడు. బాటమీద నుంచి గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటివరకు పవిత్ర పెట్టెను దావీదు మోసాడు.
2SA 6:11 ఓబేదెదోము ఇంటి వద్ద యెహోవా పవిత్ర పెట్టె మూడు నెలలపాటు వుండెను. కాబట్టి ఓబేదెదోమును, అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు.
2SA 6:12 ప్రజలు దావీదు వద్దకు వచ్చి, “దేవుని పవిత్ర పెట్టె అక్కడున్న కారణాన యెహోవా ఓబేదెదోము కుటుంబాన్ని, అతని వస్తువాహనాలను ఆశీర్వదించాడు” అని చెప్పారు. దానితో దావీదు ఓబేదెదోము ఇంటి నుండి దేవుని ఒడంబడిక పెట్టెను ఆనందోత్సాహాలతో తేవటానికి వెళ్లాడు.
2SA 6:13 యెహోవా పవిత్ర పెట్టెను మోసేవారు ఆరడుగులు నడిచి ఆగగా, దావీదు ఒక ఎద్దును, ఒక బలిసిన దూడను బలియిచ్చాడు.
2SA 6:14 పిమ్మట యెహోవా ముందు దావీదు నృత్యం చేశాడు. ఏఫోదు అనబడే యాజకుల పవిత్ర వస్త్రాన్ని ధరించాడు.
2SA 6:15 యెహోవా పవిత్ర పెట్టెను నగరంలోకి తెస్తూవుండగా దావీదు, ఇశ్రాయేలీయులంతా సంతోషంతో కేకలు వేశారు. బూరలు ఊదారు.
2SA 6:16 సౌలు కుమార్తె మీకాలు ఒక కిటికీ గుండా చూస్తూ వుంది. యెహోవా పవిత్ర పెట్టె నగరంలోనికి వచ్చినప్పుడు, యెహోవా ముందు దావీదు చిందులేస్తూ, నాట్యం చేస్తూవున్నాడు. ఇదంతా మీకాలు చూసి, దావీదును తన మనసులో అవమానించింది.
2SA 6:17 పవిత్ర పెట్టె కొరకు దావీదు ఒక గుడారం నిర్మింపజేశాడు. ఇశ్రాయేలీయులు యెహోవా పవిత్ర పెట్టెను గుడారంలో దాని స్థానంలో నిలిపారు. దావీదు అప్పుడు దహన బలులు, సమాధాన బలులు యెహోవాకు సమర్పించాడు.
2SA 6:18 దహన బలులు, సమాధాన బలులు సమర్పించాక, సర్వశక్తిమంతుడైన యెహోవా పేరిట దావీదు ప్రజలను ఆశీర్వదించాడు.
2SA 6:19 నైవేద్యంగా ఉంచిన రొట్టె, ఎండిన ద్రాక్ష భక్ష్యములు, ఖర్జూరపు పండువేసి చేసిన రొట్టెలను స్త్రీ పురుషులందరికీ, ఇశ్రాయేలీయులందరికీ ప్రసాదంగా పంచి పెట్టాడు. తరువాత వారంతా తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు.
2SA 6:20 దావీదు తన ఇంటి వారిని ఆశీర్వదించటానికి వెళ్లాడు. కాని సౌలు కుమార్తె మీకాలు దావీదును కలవటానికి బయటికి వచ్చింది. “ఇశ్రాయేలు రాజు ఈనాడు తనను తాను ఏమాత్రం గౌరవించుకోలేదు. నీ సేవకుల పని గత్తెల ముందు నీవు నీ బట్టలు విప్పివేశావు. సిగ్గు విడిచి బట్టలు విప్పుకునే ఒక మూర్ఖునిలా ప్రవర్తించావు!” అని బాగా అవమానించింది.
2SA 6:21 అందుకు దావీదు మీకాలుతో ఇలా అన్నాడు: “యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అంతేగాని నీ తండ్రనీ కాదు, లేక అతని కుటుంబంలో మరెవ్వరినీ కాదు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరికీ నాయకునిగా యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అందువల్ల యెహోవా ఎదుట నేను ఉత్సవం చేశాను.
2SA 6:22 బహుశః నీ దృష్టిలో నాకు గౌరవం లేకుండా పోవచ్చు. నాకు నేను ఇంకా కించ పర్చుకోవచ్చు. కాని నీవు చెప్పిన ఆ పనిగత్తెలు మాత్రం నన్ను గౌరవిస్తారు!”
2SA 6:23 ఈ రీతిగా దావీదును అవమానించినందున సౌలు కుమార్తె మీకాలుకు పిల్లలు కలుగలేదు. ఆమె గొడ్రాలుగానే చనిపోయింది.
2SA 7:1 దావీదు తన కొత్త ఇంటిలో నివసించుచున్న కాలంలో యెహోవా ఆయనకు చుట్టూ వున్న శత్రువుల నుండి ఏ బాధలూ లేకుండా శాంతిని సమకూర్చాడు.
2SA 7:2 రాజు(దావీదు) నాతాను అనే ఒక ప్రవక్త వద్దకు వెళ్లి, “చూడండి, నేను దేవదారు కలపతో నిర్మించబడిన ఒక భవంతిలో ఉంటున్నాను. కాని దేవుని పవిత్ర పెట్టె ఇంకా గుడారంలోనే ఉంచబడింది!” అన్నాడు
2SA 7:3 రాజుతో (దావీదు) నాతాను, “వెళ్లు. నీవు వాస్తవంగా ఏమి చేయాలని అనుకుంటున్నావో అది చేయుము. యెహోవా నీతో ఉన్నాడు” అని చెప్పాడు.
2SA 7:4 కాని ఆ రాత్రి యెహోవా వాక్యం నాతానుకు చేరింది.
2SA 7:5 “యెహోవా నాతానును పిలచి ఆయన మాటగా, ఆయన సేవకుడైన దావీదుతో ఇలా చేప్పమన్నాడు: ‘నా కొరకు ఆలయ నిర్మాణం చేయవలసిన వ్యక్తివి నీవు కాదు.
2SA 7:6 ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పుడు నేను ఆలయంలో నివసించలేదు. ఒక గుడారంలో వుంటూనే అటూ ఇటూ పయనించాను. గుడారాన్నే నివాసంగా వినియోగించుకున్నాను.
2SA 7:7 ఇశ్రాయేలు వంశము వారిలో ఏ ఒక్కరికీ దేవదారు కలపతో నాకు ఆలయం నిర్మించే విషయంపై ఒక్క మాటకూడ చెప్పియుండలేదు.’
2SA 7:8 “సర్వశక్తిమంతుడైన యెహోవా నాతానును దావీదుతో ఇంకా ఇలా చెప్పమన్నాడు, ‘నిన్ను నేను పచ్చిక బయళ్ల నుండి పట్టుకొచ్చాను. నీవు గొర్రెలను కాస్తూ వుండగా నిన్ను పట్టుకొచ్చాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నాయకునిగా వుండేందుకు నిన్ను తెచ్చాను.
2SA 7:9 నీవు ఎక్కడికి వెళితే అక్కడికల్లా నేను నీతో వచ్చాను. నీ కొరకు నీ శత్రువులందకరినీ ఓడించాను. ఇప్పుడు ఈ భూమి మీద అతి ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిన్ను నేను చేస్తాను.
2SA 7:10 ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నేనొక స్థలాన్ని ఎంపిక చేస్తాను. ఇశ్రాయేలీయులందరినీ అక్కడ స్థిరపడేలా చేసి వారి స్వంత స్థలంలో వారుండేలా చేస్తాను. ఆ తరువాత వారెన్నడూ కదిలే పనివుండదు. గతంలో నా ఇశ్రాయేలు ప్రజలకు మార్గదర్శకులుగా నేను న్యాయాధిపతులను పంపియున్నాను. కాని దుష్ట జనులు వారిని బాధించారు. అదిప్పుడు జరగదు. నీ శ్రతువులందరి నుండి నీకు శాంతి లభించేలా చేస్తాను. నీ వంశంలో రాజులు వర్ధిల్లేలా చేస్తానని కూడా చెప్తున్నాను.
2SA 7:12 “‘నీకు అంత్యకాలం సమీపించినప్పుడు నీ పూర్వీకుల వద్దనే సమాధి చేయబడతావు. అప్పుడు నేను నీ స్వంత పిల్లలలో ఒకనిని రాజుగా చేస్తాను.
2SA 7:13 అతడు నా నామాన్ని ఘనపర్చే విధంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు. అతని రాజ్యాన్ని శాశ్వత ప్రాతిపదికపై చాలా బలమైనదిగా చేస్తాను.
2SA 7:14 అతనికి తండ్రిగా నేను వ్యవహరిస్తాను. అతడు నాకు కుమారుడు. అతడు పాపం చేస్తే, అతనిని శిక్షించటానికి వేరే ప్రజలను వినియోగిస్తాను. వారు దండములు ధరించి నా తరుపున పనిచేస్తారు.
2SA 7:15 కాని నేనతనిని ప్రేమతో చూడక మానను. నేనతనిపట్ల దాక్షిణ్యాలు కలిగి ఉంటాను. నేను నా ప్రేమను, దయను సౌలునుండి తొలగించాను. నేను నీ వైపునకు తిరిగినప్పుడు, సౌలను పక్కకు నెట్టినాను. నీ వంశానికి నేనది చేయను.
2SA 7:16 నీ వంశం, నీ రాజ్యం శాశ్వతంగా నా ముందు కొనసాగుతాయి.’”
2SA 7:17 నాతాను దావీదుకు అంతా చెప్పాడు. అతను తన దర్శనంలో విన్నదంతా దావీదుకు చెప్పాడు.
2SA 7:18 పిమ్మట దావీదు రాజు లోనికి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ప్రార్థనా పూర్వకంగా యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు, “యెహోవా, నా దేవా, నీకు నేనెందుకంత ముఖ్యుడనయ్యాను? నా కుటుంబం ఎందుకంత ప్రాముఖ్యం గలదయ్యింది? నన్నెందుకు అంత ముఖ్యమైన వాణ్ణిచేశావు?
2SA 7:19 నేనొక సేవకుణ్ణి తప్ప మరేమీ కాను. కాని నీవు నా పట్ల చాలా కరుణతో వున్నావు. భవిష్యత్తులో నా కుటుంబానికి జరిగే కొన్ని మంచి విషయాలు కూడ చెప్పావు. యెహోవా, నా దేవా, నీవిలా ప్రజలతో ఎప్పుడూ మాట్లాడవు. మాట్లాడతావా?
2SA 7:20 నేను నీతో ఎలా ఎల్లప్పుడూ మాట్లాడగలను? యెహోవా, నా దేవా, నేను కేవలం ఒక సేవకుడినని నీకు తెలుసు;
2SA 7:21 ఈ అద్భుత కార్యాలన్నీ నీవు చేస్తానని అన్నావు గనుక జరిపి నిరూపించావు. పైగా నీవు చేయాలనుకున్న దానిలో ఇదొక పని! ఈ గొప్ప విషయాలన్నీ నాకు తెలపాలని నీవు నిశ్చయించావు.
2SA 7:22 ఈ కారణంవలన నీవు గొప్పవాడవు, ఓ నా ప్రభువైన దేవా! యెహోవా నీకు నీవే సాటి. నీవంటి దేవుడు వేరొకరు లేరు. మాకై మేము ఇదంతా విన్నాము.
2SA 7:23 “ఇశ్రాయేలీయులైన నీ ప్రజలవలె మరో జనం ఈ భూమిమీద లేదు. ఆ ప్రజలు అసాధారణమైన వారు. వారు ఈజిప్టులో బానిసలయ్యారు. కాని నీవు వారిని విముక్తి చేసి తీసుకొని వచ్చావు. వారిని నీ ప్రజలుగా చేశావు. ఇశ్రాయేలీయుల కొరకు నీవు గొప్పవైన, అద్భుతమైన క్రియలు నెరవేర్చావు. నీ దేశంకొరకు ఆశ్చర్యకరమైన పనులు చేశావు.
2SA 7:24 ఇశ్రాయేలు ప్రజలను శాశ్వతంగా నీకు అతి సన్నిహితులైన స్వంత ప్రజలుగా చేసుకున్నావు. యెహోవా, నీవు వారి పవిత్ర దేవుడవు.
2SA 7:25 “ప్రభువైన దేవా! ఇప్పుడు నీవు నీ సేవకుడినైన నా నిమిత్తం, మరియు నా కుటుంబం నిమిత్తం ఈ సంగతులు చేసెదనని వాగ్దానము చేసియున్నావు. నీవిచ్చిన వాగ్దానాలు శాశ్వతంగా నిజమయ్యేలా చేయుము! నా కుటుంబాన్ని శాశ్వతంగా ఒక రాజ కుటుంబంగా చేయుము.
2SA 7:26 అప్పుడు నీ నామము మహిమాన్వితం చేయబడుతుంది. ప్రజలంతా, ‘సర్వశక్తిగల యెహోవా, ఇశ్రాయేలును పరిపాలించు దేవుడు. తన సేవకుడైన దావీదు కుటుంబం ఆయన సేవలో బలముతో కొనసాగుతుంది’ అని అందురు.
2SA 7:27 “సర్వశక్తిమంతుడవైన యెహోవా! ఇశ్రాయేలీయుల దేవా నాకు చాలా విషయాలు విశదం చేశావు. ‘నా వంశాభివృద్దికి నీ ఆశీస్సులిచ్చావు.’ నీ సేవకుడనైన నేను అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
2SA 7:28 హోవా, నా దేవా! నీవే దేవునివి. నీవి సత్యవాక్కులు. నీ సేవకుడనైన నాకు ఈ మంచి విషయాలన్నీ వాగ్దానం చేశావు.
2SA 7:29 దయచేసి నా కుటుంబాన్ని దీవించు. నీ ముందు దానిని ఎల్లప్పుడూ వర్ధిల్లేలా చేయుము. యెహోవా, నా దేవా! నీవీ అద్భుత విషయాలు చెప్పావు. నీ దీవెనతో నా కుటుంబం ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడియుండు గాక!”
2SA 8:1 తరువాత దావీదు ఫిలిష్తీయులను ఓడించాడు. వారి రాజధాని నగరాన్ని స్వాధీన పర్చుకున్నాడు.
2SA 8:2 దావీదు మోయాబీయులను కూడ ఓడించాడు. పట్టుబడిన వారందరినీ నేల మీద పరుండేలా చేసి, వారి పొడుగు కొలవటానికి ఒక తాడు తీసుకున్నాడు. రెండు కొలతల పొడవున్న వారందరినీ చంపించాడు. ఒక కొలత పొడవున్న వారందరినీ వదిలిపెట్టాడు. దానితో మోయాబీయులంతా దావీదుకు సేవకులయ్యారు. వారంతా ఆయనకు కప్పము చెల్లించారు.
2SA 8:3 సోబారాజు రెహోబు కుమారుడైన హదదెజరును దావీదు ఓడించాడు. యూఫ్రటీసు నదీ తీరానగల తన ఆధిపత్యాన్ని దావీదు తిరిగి చేజిక్కించుకున్నాడు.
2SA 8:4 హదదెజరు నుండి పదిహేడు వందల మంది గుర్రపు దళము వారిని, ఇరవై వేలమంది కాల్బలము వారిని దావీదు పట్టుకున్నాడు. ఒక వంద మంచి గుర్రాలు మినహా మిగిలిన గుర్రాలన్నిటినీ దావీదు కుంటివానివిగా చేసాడు. ఆ వంద గుర్రాలను రథాలను లాగేందుకు రక్షించాడు.
2SA 8:5 సోబా రాజగు హదదెజరుకు సహయం చేయటానికి దమస్కునుండి సిరియనులు వచ్చిరి. కాని దావీదు ఇరువది రెండువేల మంది సిరియనులను ఓడించాడు.
2SA 8:6 తరువాత దమస్కు అధీనంలోనున్న సిరియా దేశమందు దావీదు రక్షక దళాలను నియమించాడు. సిరియనులు వచ్చి దావీదుకు కప్పము చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయ పరంపర సమకూర్చి పెట్టాడు.
2SA 8:7 హదదెజరు సైనికుల బంగారు డాళ్లను (రక్షకఫలకాలు) దావీదు తీసుకొని యెరూషలేముకు తెచ్చాడు.
2SA 8:8 బెతహు, బేరోతైలనుండి దావీదు లెక్కకు మించి ఇత్తడి సామగ్రి పట్టుకొనిపోయాడు. (బెతహు, బేరోతై అను రెండు నగరాలూ హదదెజరుకు చెందినవి).
2SA 8:9 హదదెజరు సైన్యాన్ని దావీదు ఓడించినట్లు హమాతు రాజైన తోయి విన్నాడు.
2SA 8:10 తోయి తన కుమారుడైన యోరామును దావీదు రాజువద్దకు పంపాడు. యోరాము వచ్చి దావీదును పలకరించి, హదదెజరుతో పోరాడి ఓడించినందుకు ఆయనను అభినందించాడు. (తోయిపై హదదెజరు గతంలో దండెత్తి యుద్ధాలు చేశాడు). యోరాము దావీదు వద్దకు వెండి, బంగారు, ఇత్తడి వస్తువులను కానుకలుగా తెచ్చాడు.
2SA 8:11 దావీదు వాటిని తీసుకొని యెహోవాకి సమర్పించాడు. తాను ఇతర దేశములను ఓడించి తెచ్చి యెహోవాకి సమర్పించిన వెండి బంగారు వస్తువులతో పాటు ఈ సామగ్రిని కూడ ఉంచాడు.
2SA 8:12 తాను జయించిన దేశాలలో సిరియ, మోయాబు, అమ్నోను, ఫిలిష్తీయ, అమాలేకు ఉన్నాయి. సోబా రాజైన రెహోబు కుమారుడు హదదెజరును కూడ దావీదు ఓడించాడు.
2SA 8:13 దావీదు పద్దెనిమిది వేల సిరియనులను ఉప్పులోయలో ఓడించాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి మిక్కిలి కీర్తి గడించాడు.
2SA 8:14 ఎదోములో దావీదు సైన్యాన్ని రక్షణకై నిలిపాడు. ఎదోము రాజ్యమంతటా కాపలా దళాలను నియమించాడు. ఎదోమీయులంతా దావీదుకు సేవకులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా యెహోవా అతనికి విజయాన్ని సమకూర్చి పెట్టాడు.
2SA 8:15 ఇశ్రాయేలంతటినీ దావీదు పరిపాలించాడు. దావీదు తీసుకున్న నిర్ణయాలు తన ప్రజలందరికీ నిష్పక్ష పాతంగా వుండి ఆమోదయోగ్యంగా వుండేవి.
2SA 8:16 సెరూయా కుమారుడైన యోవాబు సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు చరిత్రకారుడు పత్ర లేఖకుడుగా నియమితుడయ్యాడు.
2SA 8:17 అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులుగా ఉన్నారు. శెరాయా అనునతను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు.
2SA 8:18 యెహోయాదా కుమారుడు బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు అధిపతి అయ్యాడు. దావీదు కుమారులు రాజకీయ సలహాదారులైన ప్రముఖ వ్యక్తులుగా నియమితులయ్యారు.
2SA 9:1 “సౌలు కుటుంబంలో ఇంకాఎవరైనా మిగిలియున్నారా? యోనాతాను కోసం ఆ వ్యక్తికి నేను కనికరం చూపదల్చుకున్నాను” అని దావీదు చెప్పాడు.
2SA 9:2 సౌలు కుటుంబానికి చెందిన సీబా అనే ఒక సేవకుడు ఉన్నాడు. దావీదు మనుష్యులు సీబాను దావీదు వద్దకు తీసుకొని వచ్చారు. దావీదు రాజు సీబాతో, “నీవు సీబావేనా?” అని అడిగాడు. “అవును, నీ సేవకుడనైనన సీబానే” అని అన్నాడు సీబా.
2SA 9:3 “అయితే సౌలు కుటుంబంలో ఎవరైనా జీవించివున్నారా? వుంటే ఆ వ్యక్తికి దేవుని కృపను చూపాలని అనుకుంటున్నాను” అని దావీదు చెప్పాడు. దావీదు రాజుతో సీబా యిలా అన్నాడు: “యోనాతాను కుమారుడొకడు ఇంకా జీవించియున్నాడు. అతని రెండు కాళ్లూ అవిటివి.”
2SA 9:4 “ఈ కుమారుడెక్కడున్నాడని” రాజు సీబాను అడిగాడు. “లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్నాడని” సీబా రాజుకు చెప్పాడు.
2SA 9:5 అప్పుడు దావీదు రాజు తన సేవకులను లోదెబారుకు పంపాడు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్న యోనాతాను కుమారుని తీసుకొని రమ్మని చెప్పాడు.
2SA 9:6 యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి వంగి నమస్కరించాడు. “మెఫిబోషెతూ” అని పిలిచాడు దావీదు. “అవునయ్యా! నేను నీ సేవకుడను మీ ముందు వున్నాను” అని అన్నాడు మెఫీబోషెతు.
2SA 9:7 మెఫీబోషెతుతో దావీదు ఇలా అన్నాడు, “భయపడకు. నేను నీపట్ల దయగలిగి ఉంటాను. నీ తండ్రియైన యోనాతాను కారణంగా నేను నీకు సహాయం చేస్తాను. నీ తాతయైన సౌలు భూమినంతా నీకు తిరిగి ఇచ్చివేస్తాను. నీవు ఎల్లప్పుడూ నాతో నా బల్ల వద్ద భోజనం చేస్తావు.”
2SA 9:8 మెఫీబోషెతు మరల దావీదుకు వంగి నమస్కరించాడు. మెఫీబోషెతు ఇలా అన్నాడు: “మీరు మీ సేవకుడనైన నా పట్ల చాలా దయగలిగియున్నారు! పైగా నేను చచ్చిన కుక్కకంటె హీనమైన వాడిని!”
2SA 9:9 పిమ్మట దావీదు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిచి, “సౌలుకు, సౌలు కుటుంబానికి చెందిన ఆస్తి పాస్తులన్నీ నీ యజమాని మనుమడైన మెఫీబోషెతుకు ఇచ్చాను.
2SA 9:10 మెఫీబోషెతు కొరకు ఆ భూమిని నీవు సాగుచేయి. మెఫీబోషెతు కొరకు నీ కుమారులు, సేవకులు కలిసి చేయండి. పంట పండించండి. దానితో నీ యజమాని మనుమడు మెఫిబోషెతుకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. కాని నీ యజమాని మనుమడు నా బల్లవద్ద తినగలిగి వుంటాడు.” సీబాకు పదునైదుగురు కుమారులు, ఇరువైమంది సేవకులు వున్నారు.
2SA 9:11 దావీదు రాజుతో సీబా ఇలా అన్నాడు: “నేను నీ సేవకుడను. రాజైన నా ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా నేను అంతా చేస్తాను.” ఆ ప్రకారంగానే మెఫీబోషెతు దావీదు బల్లవద్ద రాజ కుమారులలో ఒకనిగా భోజనం చేశాడు.
2SA 9:12 మెఫీబోషెతుకు మీకా అనబడే ఒక చిన్న కుమారుడున్నాడు. సీబా కుటుంబంలోని వారంతా మెఫీబోషెతుకు సేవకులయ్యారు.
2SA 9:13 మెఫీబోషెతు రెండు కాళ్లూ కుంటివే. మెఫీబోషెతు యెరూషలేములోనే నివసించాడు. ప్రతిరోజూ మెఫీబోషెతు రాజు భోజనాల బల్ల వద్దనే తినేవాడు.
2SA 10:1 తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోయాడు. అతని తరువాత అతని కుమారుడు హానూను రాజయ్యాడు.
2SA 10:2 మరణవార్త విన్న దావీదు “నాహాషు నాపట్ల చాలా దయగలిగియుండెను. కాబట్టి అతని కుమారుడు హానూను పట్లకూడ నేను దయగలిగి ఉంటాను,” అని అన్నాడు. ఆ ప్రకారం దావీదు తన అధికారులను తండ్రి మరణంతో విచారంలో ఉన్న హానూనును పలకరించి ఓదార్చే నిమిత్తం పంపాడు. దావీదు అధికారులు అమ్మోనీయుల దేశానికి వెళ్లారు.
2SA 10:3 కాని అమ్మోనీయుల నాయకులు వారి రాజైన హానూనును కలిసి, “నీ తండ్రి మరణ సందర్భంగా నిన్ను ఓదార్చటానికి తన మనుష్యులను పంపి నీ తండ్రిని గౌరవించటానికి ప్రయత్నిస్తున్నాడని నీవు అనుకుంటున్నావా? కాదు! దావీదు తన మనుష్యులను నీ నగరాన్ని పరిశీలించి రహస్యాలను తెలసికొనే నిమిత్తం గూఢచారులుగా పంపాడు. వారు నీ మీదకు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు!” అని చెప్పారు.
2SA 10:4 కాబట్టి హానూను దావీదు పంపిన అధికారులను పట్టుకొని, వారి గడ్డాలలో సగభాగం గొరిగించాడు. వారి దుస్తులను కూడ సగంనుంచి తొడలవరకు కత్తిరించి వేశాడు. తరువాత వారిని పంపివేశాడు.
2SA 10:5 ఆ అధికారులు చాలా అవమానం పొందారని విన్న దావీదు కొందరు దూతలను తన అధికారులను కలవటానికి పంపాడు. దూతల ద్వారా, “మీ గడ్డాలు బాగా పెరిగేవరకు మీరు యెరికో పట్టణంలో వుండండి. తరువాత యెరూషలేమునకు తిరిగిరండి,” అని కబురు పంపాడు దావీదు రాజు.
2SA 10:6 అమ్మోనీయులు దావీదు రాజుతో శతృత్వం తెచ్చి పెట్టుకున్నామని తెలుసుకున్నారు. దానితో వారు సైన్యాన్ని సమకూర్చుకొనే ప్రయత్నంలో బేత్రెహోబు, సోబాలలోవున్న సిరియనులను జీతానికి పిలిపించుకొన్నారు. సిరియను కాల్బలము ఇరువది వేల వరకు వుంది. ఒక వెయ్యిమంది సైనికులతో సహా మయకా రాజును, టోబునుండి పన్నెండు వేలమందిని జీతానికి పిలిపించుకొన్నారు.
2SA 10:7 ఈ విషయం దావీదు విన్నాడు. అతడు యోవాబును, అతని సైన్యంలో వీరులందరిని పంపాడు.
2SA 10:8 అమ్మోనీయులు బయటికి వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు. వారు నగర ద్వారం దగ్గర మోహరించారు. సోబానుండి రెహోబు నుండి వచ్చిన సిరియనులు, టోబనుండి, మయకానుండి వచ్చిన మనుష్యులందరూ అమ్మోనీయులతో కలిసి రంగంలో నిలబడలేదు.
2SA 10:9 అమ్మోనీయులు తనకు ముందు, వెనుక కూడ నిలబడి వున్నారని యోవాబు గమనించాడు. అందువల్ల తనతో వచ్చిన ఇశ్రాయేలీయులలో కొందరు నేర్పరులైన వారిని ఎన్నుకుని వారిని సిరియనులతో యుద్ధానికి సిద్ధం చేశాడు.
2SA 10:10 మిగిలిన సైన్యాన్ని అమ్మోనీయుల మీదికి పోవటానికి యోవాబు తన సోదరుడైన అబీషైకి ఇచ్చాడు.
2SA 10:11 యోవాబు అబీషైకి ఇలా చెప్పాడు: “సిరియనులు గనుక బలం పుంజుకొని నన్ను ఓడించేలా వుంటే నీవు వచ్చి నాకు సహాయం చేయము. అమ్మోనీయులు గనుక నీకంటె ఆధిక్యతలో వుంటే నేను వచ్చి నీకు సహాయం చేస్తాను.
2SA 10:12 ధైర్యంగా ఉండు. మన ప్రజలకోసం, మన దేవుని నగరాలకోసం మనమంతా వీరోచితంగా పోరాడదాం! యెహోవా దృష్టికి ఏది మంచిదనిపించుతుందో అది ఆయన చేస్తాడు.”
2SA 10:13 తరువాత యోవాబు, అతని మనుష్యులు సిరియనులను ఎదుర్కొన్నారు. యోవాబు యొక్క, అతని సైన్యం యొక్క ధాటికి తట్టుకోలేక సిరియనులు పారి పోయారు.
2SA 10:14 సిరియనులు పారిపోతున్నట్లు అమ్మోనీయులు చూశారు. దానితో వారుకూడ అబీషైకి భయపడి పారిపోయారు. వారు వారి నగరానికి పోయారు. యోవాబు అమ్మోనీయులతో యుద్ధానంతరం తిరిగి వచ్చి యెరూషలేముకు వెళ్లాడు.
2SA 10:15 ఇశ్రాయేలీయులు తమను ఓడించారని సిరియనులు గుర్తించారు. వారంతా మళ్లీ సమకూడి ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చారు.
2SA 10:16 హదదెజరు తనదూతలను యూఫ్రటీసు నది అవతల నివసిస్తూ ఉన్న సిరియనులనందరినీ తీసుకొని రావలసినదిగా పంపాడు. ఈ సిరియనులంతా హేలాముకు వచ్చారు. వారి నాయకుడు షోబకు. ఇతడు హదదెజరు సైన్యాధిపతి.
2SA 10:17 దావీదు ఇదంతా విని ఇశ్రాయేలీయులనందరనీ కూడ దీశాడు. వారు యోర్దాను నదిని దాటి హేలాముకు వెళ్లారు. అక్కడ సిరియనులు యుద్ధానికి సిద్ధమై వారిని ఎదిరించారు.
2SA 10:18 కాని దావీదు సిరియనులను ఓడించాడు. సిరియనులు ఇశ్రాయేలీయులకు భయపడి పారిపోయారు. దావీదు సిరియను సైన్యంలో ఏడు వందల మంది రథసారధులను, నలుబది వేల మంది గుర్రపు దళం వారిని చంపివేశాడు. అంతేగాదు సిరియను సైన్యాధిపతియైన షోబకును కూడ దావీదు చంపివేశాడు.
2SA 10:19 హదదెజరు సామంత రాజులంతా వారి సైన్యాలను ఇశ్రాయేలీయులు ఓడించినట్లు చూశారు. కావున వారు ఇశ్రాయేలీయులతో సంధి చేసికొని వారిని సేవిస్తూవచ్చారు. మళ్లీ అమ్మోనీయులకు సహాయం చేయటానికి సిరియనులు భయపడి పోయారు.
2SA 11:1 వసంతకాలం వచ్చింది. రాజులు యుద్ధాలకు దిగే తరుణం. దావీదు యోవాబును, ఇతర సేవకులను, ఇశ్రాయేలీయులను సిద్ధంచేసి అమ్మోనీయులను నాశనం చేయటానికి పంపాడు యోవాబు సైన్యం (అమ్మోనీయుల రాజధాని నగరమైన) రబ్బా నగరంపై కూడ దాడి చేసింది. ఈసారి దావీదు యెరూషలేములోనే వుండిపోయాడు.
2SA 11:2 ఆ రోజు సాయంత్రం పడకనుంచి లేచి, రాజు మేడ మీద అటు యిటు తిరుగ సాగాడు. అప్పుడతడు స్నానం చేస్తూ ఉన్న స్త్రీనొక దానిని చూసాడు. ఆమె చాలా అందంగా ఉంది.
2SA 11:3 దావీదు తన సేవకులను పిలువనంపాడు. ఆ స్త్రీ ఎవరని అడుగగా, ఒక సేవకుడు, “ఆమె పేరు బత్షెబ అనీ, ఆమె ఏలీయాము కుమార్తె అనీ చెప్పాడు. ఆమె హిత్తీయుడగు ఊరియాకు భార్య అనికూడ చెప్పాడు.”
2SA 11:4 దావీదు దూతలను పంపి బత్షెబను తన వద్దకు తీసుకొని రమ్మని చెప్పాడు. ఆమె దావీదు వద్దకు వచ్చినప్పుడు, ఆమెతో అతడు సంగమించాడు. ఆమె స్నానాదులు చేసి, శుచియై తన ఇంటికి వెళ్లిపోయింది.
2SA 11:5 కాని “బత్షెబ గర్భవతి” అయింది. ఈ విషయమై దావీదుకు వర్తమానం పంపింది.
2SA 11:6 దావీదు ఒక వర్తమానం యోవాబుకు పంపాడు. “హిత్తీయుడగు ఊరియాను నా వద్దకు పంపుమని” కబురు చేశాడు. అందువల్ల యోవాబు ఊరియాను దావీదు వద్దకు పంపాడు.
2SA 11:7 ఊరియా దావీదు వద్దకు వచ్చాడు. దావీదు అతనిని యోవాబు ఎలా ఉన్నాడనీ, సైనికులెలా వున్నారనీ, యుద్ధం ఎలా కొనసాగుతున్నదనీ అడిగాడు.
2SA 11:8 తరువాత “ఇంటికి పోయి విశ్రాంతి తీసుకోమని” దావీదు ఊరియాకు చెప్పాడు. ఊరియా రాజు ఇంటిని వదిలి బయటికి వచ్చాడు. రాజు ఊరియాకు ఒక బహుమానం కూడ పంపాడు.
2SA 11:9 కాని ఊరియా ఇంటికి పోలేదు. రాజు ఇంటి ఆవరణ ద్వారం వద్ద ఊరియా నిద్రపోయాడు. మిగిలిన రాజ సేవకుల మాదిరిగా అతను కూడా అక్కడే నిద్ర పోయాడు.
2SA 11:10 “ఊరియా ఇంటికి పోలేదని” సేవకులు దావీదుకు చెప్పారు. అప్పుడు దావీదు ఊరియాను పిలిచి, “నీవు చాలా దూరంనుండి వచ్చావు గదా! నీవు ఇంటికి ఎందుకు వెళ్లలేదు?” అని అడిగాడు.
2SA 11:11 దావీదుతో ఊరియా ఇలా అన్నాడు: “పవిత్ర పెట్టె, ఇశ్రాయేలు, యూదా సైనికులు అందరూ గుడారాలలో ఉంటున్నారు. నా యజమాని యోవాబు, నా ప్రభువు (దావీదు రాజు) యొక్క సేవకులందరూ బయట పొలాల్లో గుడారాలు వేసుకొనివున్నారు. కావున నేను ఇంటికి వెళ్లి తాగి, భార్యతో విలాసంగా కాలం గడపటం మంచిది కాదు!”
2SA 11:12 “అయితే ఈ రోజు ఇక్కడే ఉండు. రేపు నిన్ను మళ్లీ యుద్ధానికి పంపివేస్తాను” అని దావీదు ఊరియాతో అన్నాడు. ఊరియా ఆ రోజు యెరూషలేములో ఉన్నాడు. అతడు మరుసటి రోజు తెల్లవారే వరకు వున్నాడు.
2SA 11:13 ఊరియాను తన వద్దకు వచ్చి కన్పించమని దావీదు కబురు పంపాడు. దావీదుతో కలిసి ఊరియా బాగా తాగి, తిన్నాడు. దావీదు ఊరియాకు బాగా తాగ బోశాడు. అయినా ఊరియా ఇంటికి పోలేదు. ఆరోజు సాయంత్రం ఊరియా రాజుగారి సేవకులతో కలిసి రాజభవన ద్వారం వద్ద నిద్రపోవటానికి వెళ్లాడు.
2SA 11:14 మరునాటి ఉదయం దావీదు యోవాబుకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఊరియా ద్వారా పంపాడు.
2SA 11:15 ఆ ఉత్తరంలో దావీదు ఇలా రాశాడు, “యుద్ధం ఎక్కడ ముమ్మరంగా సాగుతూ వుంటుందో అక్కడ ఊరియాను ముందు వరుసలో పెట్టు. అక్కడ వానిని ఒంటరిగా వదిలి వేయి. అలా నిస్సహాయుడై చనిపోయేలా చేయి.”
2SA 11:16 యెవాబు నగరాన్ని పరిశీలించి ఎక్కడ అమ్మోనీయులు ధైర్యంగా ఉన్నారో చూశాడు. అతడా ప్రదేశానికి ఊరియాను పంప నిర్ణయించాడు.
2SA 11:17 ఆ నగర (అమ్మోనీయుల రాజధానియగు రబ్బా) ప్రజలు యోవాబును ఎదిరించటానికి బయటికి వచ్చారు. దావీదు మనుష్యులు కొందరు చంపబడ్డారు. చంపబడిన వారిలో హిత్తీయుడైన ఊరియా ఒకడు.
2SA 11:18 యుద్ధ పరిణామాలపై యోవాబు దావీదుకు ఒక నివేదిక పంపాడు.
2SA 11:19 ఆ దూతతో యుద్ధంలో ఏమి జరిగిందో దావీదురాజుకు వివరంగా చెప్పమన్నాడు.
2SA 11:20 “బహుశః రాజు కలత చెందుతాడు. ‘యోవాబు సైన్యం నగర సమీపానికి ఎందుకు వెళ్లింది? వారు గోడల మీదుగా బాణాలు వేశేవారని తెలియదా?
2SA 11:21 ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలుకును ఎవరు చంపారో మీకు గుర్తుందా? ఆ నగర గొడపై నుండి ఒక స్త్రీ తిరుగలి పై రాయిని విసరివేయగా అబీమెలెకు చనిపోయాడు. ఆ స్త్రీ అతనిని తేబేసువద్ద చంపింది. మీరు ఆ గోడ చెంతకు ఎందుకు వెళ్లారు?’ అని అనవచ్చు. దావీదు రాజు గనుక అలా అంటే నీవు తప్పకుండా ‘నీ సేవకుడు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని చెప్పాలి” అంటూ యోవాబు దూతను పంపాడు.
2SA 11:22 ఆ వచ్చిన దూత లోనికి వెళ్లి యోవాబు చెప్పమన్నట్లు దావీదుకు వివరించి చెప్పాడు.
2SA 11:23 దూత ఇలా చెప్పాడు: “అమ్మోనీయులు మమ్మల్ని పొలాల్లో ఎదుర్కొన్నారు. కాని మేము వారితో నగర ద్వారం వద్ధ పోరాడాము.
2SA 11:24 మీ సేవకులపై నగర గోడల మీద ఉన్న వారు బాణాలు వేశారు. మీ సేవకులలో కొంతమంది చనిపోయారు. మీ సేవకుడు, హిత్తీయుడైన ఊరియా కూడ చనిపోయాడు.”
2SA 11:25 సరే ఈ విషయంపై కలతపడవద్దని యోవాబుతో చెప్పమని దూతతో దావీదు అన్నాడు. “కత్తికి వారూ, వీరూ అనీ తేడా వుండదు. అది అందరినీ చంపుతుంది. రబ్బా నగరంపై దాడి తీవ్రం చేయండి. ఆ నగరం అప్పుడు వశమవుతుంది” అని చెప్పి యోవాబును ప్రోత్సహించుమని దావీదు దూతకు చెప్పాడు.
2SA 11:26 తన భర్త ఊరియా చనిపోయినట్లు బత్షెబ విన్నది. తన భర్తకై విలపించింది.
2SA 11:27 సంతాప దినాలు గడిచాక, దావీదు తన మనుష్యులను పంపి ఆమెను తన ఇంటికి తీసుకొని రమ్మన్నాడు. తరువాత ఆమె దావీదుకు భార్య అయింది. దావీదు వల్ల ఆమెకు కుమారుడు జన్మించాడు. దావీదు చేసిన ఈ చెడ్డ పనిని యోహోవ ఆమోదించలేదు.
2SA 12:1 యెహోవా నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపాడు. నాతాను దావీదు వద్దకు వచ్చి ఇలా చెప్పాడు: “ఒక నగరంలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు ధనవంతుడు. రెండవవాడు దరిద్రుడు.
2SA 12:2 ధనవంతుని వద్ద చాలా గొర్రెలు, పశువులు వున్నాయి.
2SA 12:3 కాని పేదవానివద్ధ తాను కొనుక్కున్న ఒక ఆడ గొర్రెపిల్ల తప్ప మరేమీ లేదు. ఆ గొర్రెపిల్లను పేదవాడు సాకాడు. ఆ పేదవానితో పాటు, అతని పిల్లతో పాటు ఆ గొర్రెపిల్ల కూడ పెరిగింది. ఆ గొర్రెపిల్ల పేదవాని కంచంలో తిని, వాని గిన్నెలో నీళ్లు తాగింది. ఆ పేదవాని రొమ్ము మీద గొర్రెపిల్ల పడుకొని నిద్రపోయేది. పేదవానికి ఆ గొర్రెపిల్ల ఒక కూతురిలా వుండేది.
2SA 12:4 “ఇదిలా వుండగా ఒక యాత్రికుడు ధనవంతుని చూడటానికి ఆ నగరంలో ఆగాడు. ధనికుడు ఆ యాత్రికునికి ఆహారం ఇవ్వపోయాడు. కాని ఆ యాత్రికునికి ఆహారంగా తనకున్న గొర్రెలలో గాని, పశువులలో గాని దేనినీ చంపటానికి ధనికుడు ఇష్టపడలేదు. దానికి బదులు, ధనికుడు ఆ నగరంలో ఉన్న పేదవాని గొర్రెపిల్లను తీసుకొని, చంపి ఆ యాత్రికునికి ఆహారంగా వండించాడు.”
2SA 12:5 ఇది వింటున్న దావీదుకు ధనికునిపై విపరీతంగా కోపం వచ్చింది. “యెహోవా జీవము తోడుగా ఈ పని చేసిన ఆ వ్యక్తి నిశ్ఛయంగా చావవలసిందే!
2SA 12:6 ఆ గొర్రె పిల్ల విలువకు నాలుగింతలు ధనికుడు చెల్లించాలి. ఎందుకంటే వాడు ఈ భయంకరమైన పని చేశాడు. పైగా వాడు దయలేనివాడు!” అని దావీదు నాతానుతో అన్నాడు.
2SA 12:7 “ఆ వ్యక్తివి నీవే అన్నాడు నాతాను దావీదుతో. ఇశ్రాయేలు దేవుడైన యోహోవా నీ విషయంలో ఇలా అంటున్నాడని నాతాను దావీదుతో చెప్పాడు: నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా నేను అభిషిక్తం చేశాను. సౌలునుండి నిన్ను కాపాడాను.
2SA 12:8 అతని కుటుంబాన్ని, భార్యలను నీవు తీసుకొనేలా చేశాను. పైగా ఇశ్రాయేలు పైన, యూదా పైన రాజుగా నియమించాను. ఇవన్నీ చాలవన్నట్లు, నీకు ఇంకా చాలా ఉచ్చాను
2SA 12:9 కావున ఎందువల్ల యెహోవా ఆజ్ఞను తిరస్కరించావు? దేవుడు చెడ్డదని చెప్పిన దానిని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను నీవు కత్తితో చంపించావు. అతని భార్యను నీ భార్యగా చేసుకున్నావు. అవును; నీవు ఊరియాను అమ్మోనీయుల కత్తితో చంపావు!
2SA 12:10 కావున, కత్తి నీ కుటుంబాన్ని వదిలిపెట్టదు. హిత్తీయుడు ఊరియా భార్యను నీవు చేపట్టావు. ఈ రకంగా నీవు నన్ను లక్ష్య పెట్టలేదని నిరూపించుకున్నావు.”
2SA 12:11 “నేను నీకు ఆపద తీసుకువస్తున్నాను. నీ కుటుంబంలో నుండే ఈ ఆపద వస్తుంది. నీ భార్యలందరినీ నీ నుండి నేను తీసివేసి, నీకు అతి సన్నిహితుడైన వానికొకనికి ఇస్తాను. ఆ వ్యక్తి నీ భార్యలందరితో కలియగా, అది అందరికీ తెలుస్తుంది.
2SA 12:12 నీవు బత్షెబతో రహస్యంగా కూడినావు. కాని నేను చేసే పని ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుస్తుంది.”
2SA 12:13 నాతానుతో, “యెహోవా పట్ల నేను పాపం చేశాను” అని దావీదు చెప్పాడు. అప్పుడు నాతాను దావీదుతో ఇలా అన్నాడు, “యెహోవా నీకు పాపవిమోచనం చేశాడు. నీవు చంపబడవు.
2SA 12:14 కాని నీవు చేసిన ఈ పాపకార్యంవల్ల శత్రువులు నీ యెహోవాని అసహ్యించుకునేలా చేశావు. అందువల్ల నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు.”
2SA 12:15 పిమ్మట నాతాను ఇంటికి వెళ్లిపోయాడు. ఊరియాభార్య ద్వారా దావీదుకు పుట్టిన బిడ్డ తీవ్రంగా జబ్బు పడేలా యెహోవా చేశాడు.
2SA 12:16 దావీదు బిడ్డ కొరకు దేవుని ప్రార్థించాడు. దావీదు తినటానికి, తాగటానికి నిరాకరించాడు. అతను తన ఇంట్లోకివెళ్లి లోపలే వుండి పోయాడు. రాత్రంతా నేలమీదే పడుకొని వుండిపోయాడు.
2SA 12:17 దావీదు కుటుంబంలో ముఖ్యలైన వారు వచ్చి దావీదును నేలమీద నుండి లేపటానికి ప్రయత్నించారు. కాని దావీదు లేవ నిరాకరించాడు. వారితో కలిసి భోజనం చేయటానికి కూడ దావీదు నిరాకరించాడు.
2SA 12:18 ఏడవ రోజున శిశువు మరణించింది. శిశువు మరణించిందని దావీదుతో చెప్పటానికి సేవకులు భయపడ్డారు. ఒకరితో ఒకరు వారిలా అనుకోసాగారు, “చూడండి, బిడ్డ బతికివుండగా మనం ఆయనతో మాట్లాడాలని ప్రయత్నం చేశాము. కాని ఆయన మన మాట వినలేదు. ఇప్పుడు బిడ్డ మరణం గురించి మనం తెలియ జేస్తే, అతడు తన ప్రాణానికి ముప్పు వాటిల్లే ఏ పనికైనా పాల్పడవచ్చు!”
2SA 12:19 కాని దావీదు తన సేవకులు గుసగుసలాడు కోవటం గమనించి బిడ్డ మరణించి వుండవచ్చని ఊహించాడు. “బిడ్డ చనిపోయాడా?” అని దావీదు సేవకులను అడిగాడు. “అవును, చనిపోయాడు” అని సేవకులు అన్నారు.
2SA 12:20 దావీదు నేలమీద నుంచి లేచాడు. కాళ్లు చేతులు కడుక్కొని, బట్టలు మార్చుకొని, యెహోవాని ప్రార్థించటానికి ఆలయానికి వెళ్లాడు. తరువాత ఇంటికి వెళ్లి, తినటానికి ఆహారాన్ని అడిగాడు. సేవకులు కొంత ఆహారాన్ని ఇవ్వగా, అతడు తిన్నాడు.
2SA 12:21 దావీదు సేవకులు ఆయనతో ఇలా చెప్పారు, “నీవిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? బిడ్డ బ్రతికి వుండగా నీవు తినటానికి నిరాకరించావు. నీవు ఏడ్చావు. కాని బిడ్డ చనిపోగానే, లేచి భోజనం చేశావు.”
2SA 12:22 అందుకు దావీదు ఇలా చెప్పాడు: “బిడ్డ బతికివుండగా నేను తినలేదు. ఏడ్చాను. ఎందువల్లనంటే యెహోవా నన్ను కనికరించి బిడ్డను బతికించవచ్చు! ఎవరికి తెలుసు! అనుకున్నాను.
2SA 12:23 కాని ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. కావున ఇప్పుడు నేనెందుకు తినటానికి నిరాకరించాలి? నేను బిడ్డను తిరిగి బతికించుకొనగలనా? లేదు! ఏదో ఒక రోజున నేనే వాని దగ్గరకు వెళతాను. అంతేగాని వాడు నా వద్దకు తిరిగి రాలేడు.”
2SA 12:24 దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చాడు. అతడామెతో కలిసి వుండి సంగమించగా, ఆమె గర్భవతి అయింది. ఆమెకు మరొక కుమారుడు జన్మించాడు. దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా సొలొమోనును ప్రేమించాడు.
2SA 12:25 ప్రవక్త నాతాను ద్వారా యెహోవా తన సందేశం పంపాడు. నాతాను వచ్చి సొలొమోనుకు యదీద్యా అని నామకరణం చేశాడు. దేవుని ఆజ్ఞానుసారం నాతాను అలా చేశాడు.
2SA 12:26 యోవాబు అమ్మోనీయుల నగరంపై యుద్ధం చేశాడు. అతడు రాజధాని నగరాన్ని పట్టుకున్నాడు.
2SA 12:27 యోవాబు దావీదు వద్దకు దూతలను పంపి ఇలా చెప్పమన్నాడు: “నేను రబ్బాపై యుద్ధం నిర్వహించాను. నేను జలనగరాన్ని పట్టుకున్నాను.
2SA 12:28 ఇప్పుడు నీవు మిగిలిన సైన్యాన్ని కూడగట్టుకొని వచ్చి రబ్బానగరాన్ని ముట్టడించు. దానిని నాకై నేను వశపర్చుకునేలోగా నీవు వచ్చి పట్టుకో. నేను గనుక వశపర్చుకుంటే, ఆ నగరం నా పేరు మీదుగా పిలువబడుతుంది!”
2SA 12:29 దావీదు తన సైన్యాన్ని కూడదీసికొని రబ్బా నగరానికి వెళ్లాడు. యుద్ధం చేసి ఆ నగరాన్ని వశపర్చుకున్నాడు.
2SA 12:30 దావీదు ఆ రాజు తలనుండి కిరీటాన్ని తీసుకున్నాడు. అది బంగారు కిరీటం. దాని బరువు సుమారు డెబ్బది అయిదు కాసులు. ఈ కిరీటంలో విలువైన వజ్రాలు పొదగబడ్డాయి. ఆ కిరీటాన్ని సైనికులు దావీదు తలపై వుంచారు. ఆ నగరం నుండి దావీదు అనేక విలువైవ వస్తువులను కొల్లగొట్టుకుపోయాడు.
2SA 12:31 అంతేగాదు, దావీదు రబ్బా నగర వాసులను బయటకు తీసుకొని వచ్చాడు. వారందరినీ రంపములతోను, పలుగులతోను, గొడ్డళ్లతోను పని చేయించాడు. వారందరినీ ఇటుకలతో కట్టడాలను నిర్మించేలా చేశాడు. అమ్మోనీయుల నగరాలన్నిటిలో దావీదు ఇలాగే చేయించాడు. తరువాత దావీదు తన సైన్యంతో యెరూషలేముకు వెళ్లిపోయాడు.
2SA 13:1 దావీదుకు అబ్షాలోము అను కుమారుడొకడున్నాడు. అబ్షాలోముకు ఒక సోదరివుంది. ఆమె పేరు తామారు. ఆమె బహుసౌందర్యవతి. దావీదు యొక్క మరో కుమారుడైన అమ్నోను తామారును మోహించాడు.
2SA 13:2 తామారు కన్యక. అందువల్ల ఆమెను తన కామవంఛ తీర్చుకోవటానికి అమ్నోను ఆమెను ఏమీ చేయలేకపోయాడు. కాని అమ్నోను ఆమెను మిక్కిలిగా మోహించాడు. ఆమెను పొందలేక ఆమె ధ్యాసతో అమ్నోను విరహంతో నీరసించిపోయాడు.
2SA 13:3 అమ్నోనుకు యెహోనాదాబు అనే స్నేహితుడొకడున్నాడు. అతడు షిమ్యా కుమారుడు. షిమ్యా దావీదు సోదరుడు. యెహోనాదాబు యుక్తిగల వాడు.
2SA 13:4 యెహోనాదాబు అమ్నోనుతో, “రోజు రోజుకీ నీవు చిక్కిపోతున్నావు! నీవు రాజ కుమారుడవు! తినటానికి కావలసినంత ఉంది. కాని ఎందుకిలా చిక్కి శల్యమై పోతున్నావు? నాతో చెప్పు” అన్నాడు. “నేను తామారును ప్రేమిస్తున్నాను. కాని ఆమె నా తమ్ముడైన అబ్షాలోము సహోదరి” అన్నాడు అమ్నోను.
2SA 13:5 యెహోనాదాబు అమ్నోనుకు ఇలా సలహాయిచ్చాడు: “నీవు పోయి పండుకో, జబ్బు పడిన వానిలా నటించు. అప్పుడు నీ తండ్రి నిన్ను చూసేందుకు వస్తాడు. నీవాయనతో నీ చెల్లెలైన తామారును నీకు ఆహారాన్నిచ్చి సేవ చేయటానికి పంపమను. ఆమె నీ ఎదుట ఆహారం నీవు చూస్తూవుండగా తయారు చేసి ఆమె నీకు పెడుతుందని కూడా చెప్పు.”
2SA 13:6 ఆ సలహా మేరకు అమ్నోను పక్క మీద పడుకుని జబ్బు పడిన వానిలా నటించాడు. అమ్నోనును చూడటానికి దావీదు రాజు వచ్చాడు. “దయచేసి చెల్లెలు తామారును పంపించు. నేను చూస్తూవుండగా ఆమె రెండు ప్రత్యెకమైన రొట్టెలు చేసి పెడుతుంది. ఆమె చేతిమీదగా తింటాను” అని దావీదుతో అమ్నోను చెప్పాడు.
2SA 13:7 దావీదు తామారు ఇంటికి దూతలను పంపాడు. వారు తామారుతో ఆమె సోదరుడు, “అమ్నోను ఇంటికి వెళ్లి అతనికి కొంత ఆహారం చేసిపెట్టమని చెప్పారు.”
2SA 13:8 తన సోదరుడైన అమ్నోను ఇంటికి తామారు వెళ్లింది. అమ్నోను మంచంపై ఉన్నాడు తామారు కొంత పిండి తీసుకొని, దానిని ఆమె స్వయంగా కలిపింది. అమ్నోను చూస్తూవుండగా ఆమె కొన్ని రొట్టెలు చేసింది. తరువాత ఆమె రొట్టెలను కాల్చింది.
2SA 13:9 తామారు రొట్టెలను కాల్చిన పిమ్మట పెనంలో వాటిని తీసుకొని వెళ్లి అమ్నోను ముందు పళ్లెంలో వేసింది. కాని అమ్నోను తినటానికి అంగీకరించలేదు. అమ్నోను తన సేవకులందరినీ, “అతనిని ఒంటరిగా వదిలి వెళ్లి పొమ్మన్నాడు” అమ్నోను గదినుండి సేవకులంతా బయటికి పోయారు.
2SA 13:10 అమ్నోను తామారుతో, “రొట్టెలను లోపలి గది లోనికి తీసుకొనిరా. అప్పుడు నీ చేతిమీదుగా వాటిని తింటాను” అని అన్నాడు. తామారు లోపలి గదిలో వున్న తన సోదరుడైన అమ్నోను వద్దకు వెళ్లింది. ఆమె చేసిన రొట్టెలను తీసుకొని వెళ్లింది.
2SA 13:11 తన చేతుల మీదుగా తింటాడని ఆమె అమ్మోను వద్దకు వెళ్లింది. కాని అమ్నోను తామారును పట్టుకున్నాడు. “చెల్లీ, రా! నాతో కలిసి పడుకో!” అని అన్నాడు.
2SA 13:12 అందుకు తామారు అమ్నెనుతో ఇలా ప్రాధేయపడింది: “వద్దు, సోదరా! నన్ను బలవంతం చేయకు! ఇశ్రాయేలులో ఇలా ఎన్నటికీ జరుగకూడదు! ఈ అవమానకరమైన పని చేయకు!
2SA 13:13 నా కళంకాన్ని నేనెన్నడూ మాపుకోలేను. ఇశ్రాయేలీయులలో నీచకార్యాలు చేసే మూర్ఖులలో నీవొకడివై పోతావు. దయచేసి రాజుతో మాట్లాడు. నన్ను వివాహం చేసికోటానికి ఆయన నీకు అనుమతిస్తాడు.”
2SA 13:14 కాని అమ్నోను తామారు చెప్పే దానిని వినటానికి నిరాకరించాడు. అతడు తామారుకంటె బలవంతుడు. అతడామెను బలాత్కరించి సంగమించాడు.
2SA 13:15 దాని తరువాత అమ్నోను తామారును అసహ్యించుకున్నాడు. ముందు అతనామెనెంతగా ప్రేమించాడో, అంతకు మించి ఇప్పుడు అమ్నోను తామారును అసహ్యించుకున్నాడు. అమ్నోను తామారుతో, “మంచం మీది నుంచి లేచి బయటికి పొమ్మన్నాడు.”
2SA 13:16 అందుకు తామారు అమ్నోనుతో, “కాదు! నీవిప్పుడు మునుపటికంటె ఇంకా ఘోరమైన తప్పు చేస్తున్నావు. నీవు నన్ను పంపివేయటానికి ప్రయత్నిస్తున్నావు!” అనిఅన్నది. కాని అమ్నోను తామారు చెప్పేది వినలేదు.
2SA 13:17 అమ్నోను తన సేవకుణ్ణి లోనికి పిలిచి, “ఇప్పుడే ఈ పిల్లను గదినుండి బయటికి పంపించు! బయటకు నెట్టి తలుపుకు తాళం వేయి” అని చెప్పాడు.
2SA 13:18 అమ్నోను సేవకుడు తామారును బయటికి గెంటి గదికి తాళం పెట్టాడు. తామారు ఒక రంగురంగుల పొడవైన చేతులు, చాలా వదులుగా వుండే అంగీని వేసుకున్నది. ఆ రకమైన అంగీలను పెండ్లికాని రాజ కుమార్తెలు మాత్రమే వేసుకునేవారు.
2SA 13:19 తామారు కొద్దిగా బూడిద తీసుకొని తన నెత్తి మీద పోసుకున్నది. తన రంగు రంగుల అంగీని చింపుకొన్నది. తన చేయి నెత్తిమీద పెట్టుకుని బిగ్గరగా ఏడ్చుకుంటూ పోయింది.
2SA 13:20 తామారు సోదరుడు అబ్షాలోము తామారుతో, “నీ సోదరుడు అమ్నోను నిన్ను చెరచినాడుగా?” అన్నాడు. “అమ్నోను నీ సోదరుడు. కావున చెల్లీ, ప్రస్తుతానికి నీవు మాట్లాడక వుండు. ఇది నిన్ను విపరీతంగా సంక్షోభపెట్టకుండా చూసుకో!” అది విన్న తామారు ఇక ఏమీ మట్లాడ లేదు. నాశనమైన స్త్రీలా, అమె అబ్షాలోము ఇంటి వద్దనే ఉండసాగింది.
2SA 13:21 ఈ వార్త దావీదు రాజు విన్నాడు. ఆయనకు పట్టరాని కోపం వచ్చింది.
2SA 13:22 అబ్షాలోము అమ్నోనును అసహ్యించుకున్నాడు. అబ్షాలోము అమ్నోను నుద్దేశించి మంచిగా గాని, చెడ్డగా గాని ఏమీ అనలేదు. తన సోదరి తామారును చెరచినందుకు అమ్నోనును అసహ్యించుకున్నాడు.
2SA 13:23 రెండు సంవత్సరాల తరువాత అబ్షాలోము కొందరు మనుష్యులను తన గొర్రెల నుండి ఉన్ని తీయటానికి బయల్దాసోరుకు రావించాడు. ఈ కార్యక్రమం చూడటానికి రాజకుమారులందరినీ అబ్షాలోము ఆహ్వానించాడు.
2SA 13:24 అబ్షాలోము రాజు వద్దకు వెళ్లి, “నా గొర్రెల నుండి ఉన్ని తీయటానికి మనుష్యులను పిలిచాను. దయచేసి నీ సేవకులతో వచ్చి ఆ కార్యక్రమం తిలకించ” మని అడిగాడు.
2SA 13:25 “వద్దు, కుమారుడా! మేము రాము. మేమంతా వస్తే అది నీకు చాల శ్రమ అవుతుంది” అని దావీదు రాజు అబ్షాలోముతో అన్నాడు. దావీదును రమ్మని అబ్షాలోము ప్రాధేయపడ్డాడు. దావీదు వెళ్లలేదు గాని అతని పనిని ఆశీర్వదించాడు.
2SA 13:26 “నీవు రాకుంటే, దయచేసి నా సోదరుడు అమ్నోనును నాతో పంపించు” మని అబ్షాలోను అడిగాడు. “అతడు నీతో ఎందుకు రావాలి?” అని దావీదు రాజు అడిగాడు.
2SA 13:27 అయినా అబ్షాలోము వినిపించుకోకుండా అదే పనిగా ప్రాధేయపడి అడిగాడు. చివరికి అమ్నోను, మిగిలిన రాజకుమారులు అబ్షాలోముతో వెళ్లటానికి ఒప్పుకున్నారు.
2SA 13:28 అబ్షాలోము తన సేవకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. “అమ్నోనును ఒక కంట కనిపెట్టి వుండండి. వాడు బాగా తాగిన పిమ్మట ‘అమ్నోనును చంపండి’ అంటాను. ఆ సమయంలో వానిని చంపండి! భయపడకండి నేను మీకు అజ్ఞ ఇస్తున్నాను! నిబ్బరంగా, ధైర్యంగా వుండండి” అని అబ్షాలోము సేవకులతో అన్నాడు.
2SA 13:29 అబ్షాలోము ఆజ్ఞ మేరకు అతని యువసేవకులు అమ్నోనును చంపివేశారు. కాని దావీదు మిగిలిన కుమారులంతా తప్పించుకున్నారు. వారిలో ప్రతి ఒక్కడూ తన కంచర గాడిదపై ఎక్కి తప్పించుకు పోయాడు.
2SA 13:30 రాజకుమారులంతా మార్గమధ్యంలో వుండగానే, ఈ వార్త దావీదుకు చేరింది. “అబ్షాలోము రాజ కుమారులందరినీ చంపివేశాడనీ; ఒక్కడు కూడా మిగల లేదనీ” ఆయనకు వర్తమానం వచ్చింది.
2SA 13:31 దావీదు రాజు తన బట్టలు చింపుకొని నేలమీద పడ్డాడు. దావీదు చెంతనున్న తన సేవకులు కూడా విషాదసూచకంగా తమ బట్టలు కూడా చింపుకున్నారు.
2SA 13:32 దావీదు సోదరుడగు షిమ్యా కుమారుడు యెహోనాదాబు దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “రాజు కుమారులంతా చనిపోయారని అనుకోవద్దు. చనిపోయినది అమ్నోను ఒక్కడు మాత్రమే! అబ్షాలోము ఇదంతా జరిపించాడు.
2SA 13:33 కారణమేమనగా అమ్మోను అబ్షాలోము చెల్లెలు తామారును చెరిచాడు. కాబట్టి అమ్నోను మాత్రము చంపబడ్డాడు.”
2SA 13:34 అబ్షాలోము పరారైనాడు. నగర ప్రహరీ గోడమీద ఒక కావలివాడు నిలబడి వున్నాడు. కొండకు అవతలి పక్కనుండి చాలా మంది రావటం చూశాడు.
2SA 13:35 అది చూసి యెహోనాదాబు దావీదు రాజుతో, “చూడండి, నేను చెప్పింది నిజమైనది. రాజ కుమారులంతా వస్తున్నారు!” అన్నాడు.
2SA 13:36 యెహోనాదాబు ఈ మాటలు అంటూ వుండగానే రాజకుమారులు వచ్చారు. వారు గగ్గోలు పడి ఏడుస్తూవున్నారు. దావీదు, అతని సేవకులందరూ కూడ విలపించసాగారు. వారంతా విపరీతంగా దుఃఖించారు.
2SA 13:37 దావీదు తన కుమారుడైన అమ్నోను కొరకు ప్రతి రోజూ దుఃఖించాడు. అబ్షాలోము తల్మయి రాజు వద్దకు పారిపోయాడు. తల్మయి గెషూరుకు రాజు. అతని తండ్రి పేరు అమీహూదు.
2SA 13:38 అబ్షాలోము గెషూరుకు పారిపోయి అక్కడ మూడ సంవత్సరాలు ఉన్నాడు.
2SA 13:39 అమ్నోను మరణం గూర్చి దావీదురాజు క్రమేపీ ఓడార్చబడ్డాడు. కాని అతడు అబ్షాలోమును గూర్చి మిక్కిలి ఆరాట పడసాగాడు.
2SA 14:1 అబ్షాలోమును గూర్చి దావీదు రాజు మిక్కిలి బెంగపెట్టు కున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు.
2SA 14:2 యోవాబు తన దూతలను తెకోవకు పంపి, అక్కడి నుండి ఒక నేర్పరియైన స్త్రీని తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ స్త్రీతో యోవాబు ఇలా అన్నాడు: “దయచేసి నీవు చాలా దుఃఖంలో ఉన్నట్లు నటించు. విషాదసూ చకమైన బట్టలు వేసుకో, అలంకరణ చేసుకోవద్దు. చనిపోయిన, నీకు ప్రియమైన ఒక వ్యక్తి కోసం చాలా కాలంగా విలపిస్తున్నట్లు ప్రవర్తించు.
2SA 14:3 నేను ఇప్పుడు నీకు చెప్పే మాటలను నీవు రాజు వద్దకు వెళ్లి చెప్పు.” ఈ విధంగా ఆ యుక్తిగల స్త్రీ తో మాట్లాడి, ఆమె రాజుతో ఏమి చెప్పాలో యోవాబు ఆమెకు వివరించాడు.
2SA 14:4 తరువాత తెకోవ నుండి వచ్చిన స్త్రీ రాజు వద్దకు వెళ్లి మాట్లాడింది. ఆమె రాజు ముందు ప్రణమిల్లింది. ఆమె ముఖం నేలకు తాకింది. వంగి నమస్కరించి, “రాజా, నాకు సహాయం చేయండి!” అని ప్రాధేయ పడింది.
2SA 14:5 “ఏమిటి నీ సమస్య?” అని దావీదు రాజు ప్రశ్నించాడు. ఆ స్త్రీ యిలా చెప్పింది: “నేనొక విధవ స్త్రీని! నా భర్త చినిపోయాడు.
2SA 14:6 నాకు ఇద్దరు కుమారులున్నారు. వారిద్దరూ పొలాల్లోకి పోయి దెబ్బలాటకు దిగారు. వాళ్లను నివారించటానికి ఒక్కడు కూడా లేక పోయాడు. ఒక కొడుకు, ఇంకొక కొడుకును చంపివేశాడు.
2SA 14:7 ఇప్పుడు కుటుంబమంతా నామీద కత్తిగట్టారు. హత్యకు పాల్పడిన కొడుకును తెమ్మని ఒత్తిడి తెస్తున్నారు. తన సోదరుని చంపిన కారణంగా వారంతా అతనిని చంపుతామంటున్నారు. నా కొడుకును చంపనిస్తే, తన తండ్రికి ఏకైక వారసుడైన వాడు లేకుండా పోతాడు! నా కుమారుడు అగ్నిలో చివరి నిప్పుకణంలాంటివాడు. ఇప్పుడు ఆ చివరి నిప్పుకణం ఆరిపోబోతూవుంది! దానితో మరణించిన నా భర్త పేరు, ఆస్తి నేలపాలవుతాయి.”
2SA 14:8 ఇది విన్న రాజు, “ఇక నీవు ఇంటికి వెళ్లు. నీ విషయాల పట్ల నేను శ్రద్ధ తీసుకుంటాను” అని ఆమెతో అన్నాడు.
2SA 14:9 తెకోవ స్త్రీ రాజుతో, “ఈ విషయంలో వచ్చే పరిణామాలకు, పర్యవసానానికి నిందంతా నామీదే పడుగాక! నా ప్రభువైన రాజా! నీవు, నీ సింహాసనం ఈ విషయంలో ఏదోషమూ ఎరుగరు!” అని చెప్పింది.
2SA 14:10 “నిన్ను గురుంచి ఎవరైనా దీనిగూర్చి నిన్నేమైన అనినయెడల నా వద్దకు తీసుకొనిరా. వాడు మరల నిన్ను ఏమీ అనడు” అని దావీదు రాజు అన్నాడు.
2SA 14:11 అది విన్న ఆ స్త్రీ రాజును ఇలా వేడుకున్నది: “దయచేసి నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. హంతకులను శిక్షించాలని చూసే ఆ ప్రజలు నా కుమారునికి కీడుచేయకుండా దేవుడు నివారించగలందులకు ఆయనను ప్రార్థించు.” దావీదు ఆమెకు ఇలా అభయమిచ్చాడు: “యెహోవా జీవము తోడుగా ఎవ్వడూ నీ కుమారునికి హాని చేయలేడు. నీ కుమారుని తలలోని ఒక్క వెంట్రుక కూడా క్రింద రాలదు.”
2SA 14:12 ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా! నన్నింకా కొన్ని విషయాలు చెప్పనీయండి” అని అన్నది. చెప్పమన్నాడు రాజు.
2SA 14:13 ఆ స్త్రీ ఇలా అన్నది: “దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇవన్నీ నీవెందుకు చేస్తున్నావు? అవును. ఇవన్నీ చేస్తూ నీవు దోషివని బహిర్గతం చేసుకుంటున్నావు! ఎందువల్లననగా నీవు నీయింటి నుండి పంపివేసిన నీ కుమారుని తిరిగి తీసుకొని రాలేదు.
2SA 14:14 మనమంతా ఏదో ఒక రోజు చనిపోవటమనేది సత్యం. మనమంతా నేల మీద ఒలికిన నీరులాంటివారం. ఈ ఒలికిన నీటిని మట్టిలో నుండి తిరిగి తీయటం ఎవ్వరికీ సాధ్యం కాని పని. కాని దేవుడు ప్రాణాన్ని తీసుకొనడు. ఇండ్లనుండి తరిమి వేయబడిన వారికి దేవుడు ఒక పథకం తయారుచేసి ఉంచుతాడు. అంటే వారు ఆయన నుండి బలవంతంగా దూరం చేయబడలేదు!
2SA 14:15 నా ప్రభువైన రాజా! ఈ మాటలు నీకు చెప్పటానికి నేను వచ్చాను. కారణమేమంటే, ప్రజలు నన్ను భయపెట్టారు! నేను వాళ్లతో నన్ను పోయి రాజుతో మాట్లాడనీయమన్నాను. బహుశః రాజు నా విన్నపం ఆలకింపవచ్చునని అన్నాను.
2SA 14:16 రాజు వింటాడు. విని నన్ను, నా కుమారుణ్ణి చంపజూస్తున్న వారి నుండి రక్షణ కల్పిస్తాడనీ; దేవుడు ప్రసాదించిన ఆస్తిని అనుభవించకుండ చేయజూస్తున్న వారి నుంచి మమ్మల్ని రక్షిస్తాడనీ అనుకున్నాను.
2SA 14:17 నా ప్రభువైన నా రాజు మాటలు మనశ్శాంతినిస్తాయని నాకు తెలుసు. ఎందువల్లనంటే నీవు దేవుని నుండి వచ్చిన దూతలాంటివాడవు. ఏది మంచిదో, ఏది చెడ్డదో నీకు తెలుసు. దేవుడు సదా నీతో వుండు గాక!”
2SA 14:18 అది విని ఆశ్చర్యపడిన రాజైన దావీదు, “నేనొక ప్రశ్న అడుగుతాను. నీవు సమాధనం చెప్పాలి” అన్నాడు. ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా దయచేసి మీ ప్రశ్న అడగండి!” అన్నది.
2SA 14:19 “విషయాలన్నీ మాట్లాడమని యోవాబు నీతో చెప్పాడా?” అని రాజు అడిగాడు. ఆ స్త్రీ ఇలా అన్నది: “నీ ప్రమాణంగా, నా ప్రభువైన రాజా, నీవు నిజం చెప్పావు. నీ సేవకుడైన యోవాబు ఇవన్నీ చెప్పమని నాతో అన్నాడు.
2SA 14:20 యోవాబు ఇలా ఎందుకు చేశాడంటే నీవు పరిస్థితులు నిష్పక్షపాతంగా, రాగ ద్వేషాలు లేకుండా అవగాహన చేసుకొని యుక్తమైన నిర్ణయం తీసుకుంటావని. నా ప్రభువా, నీవు దేవ దూతలా తెలివిగలవాడవు. ఈ భూమిమీద జరిగేదంతా నీకు తెలుసు.”
2SA 14:21 రాజు యోవాబుతో ఇలా అన్నాడు: “చూడండి. నేను మాట ఇచ్చిన విధంగా చేస్తాను. యుకుడైన అబ్షాలోమును దయచేసి తీసుకొని రండి.”
2SA 14:22 యోవాబు తన ముఖం నేలనుతాకి సాష్టాంగపడి నమస్కరించాడు. రాజైన దావీదుకు ఆశీర్వచనం పలికి, “ఈ రోజు నాపట్ల మీరు ప్రసన్నులైయున్నారని నాకు తెలుసు! ఎందువల్లనంటే నేను అడిగినదంతా నీవు చేశావు!” అని అన్నాడు.
2SA 14:23 యోవాబు లేచి గెషూరుకు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకొని వచ్చాడు.
2SA 14:24 అయితే దావీదు రాజు మాత్రం, “అబ్షాలోము తప్పక తన స్వంత ఇంటికి వెళ్లిపోవాలి. అతడు నన్ను చూడటానికి రూకూడదు” అని అన్నాడు. కావున అబ్షాలోము తన స్వంత ఇంటికి వెళ్లిపోయాడు. అబ్షాలోము రాజును చూడటానికి వెళ్లలేక పోయాడు.
2SA 14:25 అబ్షాలోము అందంలో అందరి ప్రశంసలూ పొందిన వాడు. అబ్షాలోమంత అందగాడు ఇశ్రాయేలంతటిలో మరొకడు లేడు. అరికాలు నుండి నడినెత్తివరకు అతనిలో రవ్వంత కూడా లోపం లేదు.
2SA 14:26 ప్రతి సంవత్సరాంతానా అబ్షాలోము తన తల వెండ్రుకలు కత్తిరించి తూచేవాడు. తూకం ప్రకారం రెండు వందల తులముల బరువు ఉండేవి.
2SA 14:27 అబ్షాలోముకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు తామారు. తామారు సౌందర్యవతి.
2SA 14:28 అబ్షాలోము యెరూషలేములో రెండు సంవత్సరాలున్నాడు. అయినా అతనికి రాజదర్శనం నిరాకరింపబడింది.
2SA 14:29 యోవాబు వద్దకు అబ్షాలోము దూతలను పంపాడు. ఈ దూతలు అబ్షాలోమును రాజు వద్దకు పంపమని అడిగారు. కాని యోవాబు అబ్షాలోము వద్దకు రాకపోయెను. రెండవసారి మరొక దూతను అబ్షాలోము పంపాడు. అయినా యోవాబు రావటానికి నిరాకరించాడు.
2SA 14:30 దానితో అబ్షాలోము తన సేవకులను పిలిచి ఇలా అన్నాడు: “చూడండి; యోవాబు పొలం నా పొలానికి పక్కనే వున్నది. తన పొలంలో యవల ధాన్యం పండివుంది. వెళ్లి ఆ యవలధాన్యాన్ని తగుల బెట్టండి.” ఆ మాట మీద అబ్షాలోము సేవకులు వెళ్లి యోవాబు పొలంలో పంటకు నిప్పుపెట్టారు.
2SA 14:31 యోవాబు లేచి అబ్షాలోము ఇంటికి వెళ్లి, “నీ సేవకులు నా పంటను ఎందుకు తగులబెట్టారు” అని అడిగాడు.
2SA 14:32 యోవాబుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “నీకు నేను వర్తమానం పంపాను. ఇక్కడికి నిన్ను రమ్మన్నాను. నేను నిన్ను రాజు వద్దకు పంపాలని అనుకున్నాను గెషూరు నుండి నన్ను ఆయన ఎందుకు రప్పించాడో నిన్ను పంపి అడిగించాలనుకున్నాను. నేను ఆయనను చూడలేను. కావున ఈ పరిస్థితుల్లో నేను గెషూరుకు పోయి అక్కడవుండటం మంచిది! ఇప్పుడు నాకు రాజదర్శనం ఏర్పాటు చేయుము. నేను పాపం చేస్తే ఆయన నన్ను చంపవచ్చు!”
2SA 14:33 అప్పుడు యోవాబు రాజు వద్దకు వచ్చి అబ్షాలోము అన్న మాటలన్నీ చెప్పాడు. రాజు అబ్షాలోమును పిలిపించగా, అబ్షాలోము వచ్చాడు. అబ్షాలోము రాజు ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు.
2SA 15:1 ఇదంతా ఆయిన పిమ్మట అబ్షాలోము తనకై ప్రత్యేకంగా ఒక రథాన్ని మరియు గుర్రములను సమకూర్చుకున్నాడు. తన రథం సాగుతూ వుండగా ముందు వెళ్లటానికి ఏబది మంది సైనికులను ఏర్పాటు చేసుకున్నాడు.
2SA 15:2 అబ్షాలోము ఉదయం పెందలకడలేచి నగర ద్వారం వద్ద నిలబడేవాడు. అక్కడికి ఎవరైనా ఏదైనా సమస్యపై న్యాయం కోరుతూ దావీదు రాజు కొరకు వస్తే, అబ్షాలోము వారిని పిలిచేవాడు. వారిని “ఏ నగరం నుండి వచ్చినారని” అడిగేవాడు. “ఇశ్రాయేలు వంశాలలో ఒకడినని” ఆ వచ్చినవాడు చెప్పేవాడు.
2SA 15:3 అందుకు అబ్షాలోము “చూడు, నీవు నిజమే చెప్తున్నావు. కాని దావీదు రాజు నీవు చెప్పేదివినడు” అని అనేవాడు.
2SA 15:4 అబ్షాలోము ఇంకా ఇలా అనేవాడు, “ఓహో, ఈ రాజ్యంలో నన్నెవరైనా న్యాయాధిపతిగా చేయాలని నేను ఆశిస్తున్నాను. న్యాయం కోరుతూ ఎవరు ఏ సమస్యతో వచ్చినా వారికి తగిన న్యాయం నేనప్పుడు చేయగలుగుతాను. వచ్చిన వాని సమస్యకు తగిన పరిష్కారం కనుగొని సహాయం చేయగలుగుతాను.”
2SA 15:5 ఎవరైనా అబ్షాలోము వద్దకు వచ్చి ప్రణమిల్లి నమస్కరించబోతే, అతను వాని కొరకు ముందుకు వెళ్లి, అతనిని ఆదరంగా తన వద్దకు తీసుకొనేవాడు. తరువాత ఆ వచ్చిన వానిని అతను స్నేహపూర్వకంగా ముద్దు పెట్టుకొనేవాడు.
2SA 15:6 దావీదు రాజు వద్దకు న్యాయం కోసం ఇశ్రాయేలు నుండి ఎవరు వచ్చినా అబ్షాలోము అలా చేసేవాడు. ఈ రకంగా ఇశ్రాయేలు ప్రజలందరి హృదయాలనూ అబ్షాలోము గెలిచాడు.
2SA 15:7 నాలుగేండ్ల తరువాత దావీదు రాజుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “హెబ్రోనులో నేను వుండగా యెహోవాకి నేను మొక్కుకున్నాను. దయచేసి ఆ మొక్కు చెల్లించటానికి నన్ను వెళ్లనీయండి.
2SA 15:8 గతంలో నేను సిరియ దేశమందలి గెషూరులో వుండగా మొక్కాను. నన్ను యెహోవా మరల యెరూషలేముకు తీసుకొని వస్తే యెహోవాను ఆరాధించెదనని మొక్కుకున్నాను.”
2SA 15:9 “ప్రశాంతంగా వెళ్లిరా!” అని దావీదు రాజు అన్నాడు. అబ్షాలోము హెబ్రోనుకు వెళ్లాడు.
2SA 15:10 కాని అబ్షాలోము వేగుల వారిని ఇశ్రాయేలు వంశాల వారందరి వద్దకు పంపాడు. వారు వెళ్లి ప్రజలలో, “మీరు బాకా నాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో రాజయ్యాడు.!” అని కేకలు పెట్టమన్నాడు.
2SA 15:11 అబ్షాలోము తనతో వెళ్లటానికి రెండువందల మందిని ఆహ్వానించాడు. యెరూషలేము నుండి వారంతా అతనితో వెళ్లారు. కాని అతడు ఏమి యుక్తి పన్నుతున్నాడో వారికి తెలియదు.
2SA 15:12 అహీతోపెలు దావీదు సలహాదారులలో ఒకడు. అహీతోపెలు గీలో పట్టణవాసి, అబ్షాలోము బలులు సమర్పించేటప్పుడు అతడు అహీతోపెలును గీలో పట్టణం నుంచి రమ్మని కబురు పంపాడు. అబ్షాలోము పన్నినయుక్తులన్నీ సక్రమంగా సాగుతున్నాయి. ప్రజలు అబ్షాలోమును అధిక సంఖ్యలో బలపర్చ నారంభించారు.
2SA 15:13 ఈ వార్త దావీదుకు చెప్పటానికి ఒక వ్యక్తి వచ్చాడు. “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోమును అనుసరించటం మొదలు పెట్టారు” అని అతడు చెప్పాడు.
2SA 15:14 అది విని దావీదు యెరూషలేములో తనతో ఉన్న సేవకులను పిలిచి ఇలా చెప్పాడు: “మనం ఇప్పుడు అవశ్యంగా తప్పించుకోవాలి! మనం అలా చేయకపోతే అబ్షాలోము మనల్ని వదిలిపెట్టడు. అబ్షాలోము మనల్ని పట్టుకొనే లోపు మనం త్వరపడాలి. అతడు మనందరినీ నాశనం చేస్తాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను కత్తితో నరికి చంపుతాడు.”
2SA 15:15 “మీరు ఏమి చేయాలని మాకు చెపుతారో మేమది చేస్తాము” అని రాజు యొక్క సేవకులు అన్నారు.
2SA 15:16 రాజు (దావీదు) తన ఇంటి వారందరితో కలిసి బయటికి పోయాడు. రాజు తన ఉంపుడుగత్తెలలో పది మందిని ఇంటిని చూస్తూ వుండేటందుకు వదిలి పెట్టాడు.
2SA 15:17 తన ప్రజలందరూ వెంటరాగా రాజు బయలుదేరి వెళ్లాడు. వారు చివరి ఇంటివద్ద ఆగారు.
2SA 15:18 సేవకులంతా రాజు ముందునుంచి వెళ్లారు. కెరేతీయులు, పెలేతీయులు మరియు గిత్తీయులు (ఆరు వందల మంది గాతువారు) అందరూ రాజు ముందు నుంచి నడిచి వెళ్లారు.
2SA 15:19 గిత్తీయుడైన ఇత్తయిని చూచి రాజు, “నీవెందుకు మాతో వస్తున్నావు? తిరిగిపోయి, కొత్త రాజుతో (అబ్షాలోము) వుండిపో. నీవు పరదేశీయుడవు. ఇది నీ స్వదేశం కాదు.
2SA 15:20 నిన్న మాత్రమే నీవు నన్ను కలియటానికి వచ్చావు. ఇప్పుడు నీవు నాతో కలిసి వివిధ ప్రాంతాలు తిరిగే అవసరం వుందా లేదు. తిరిగి వెళ్లిపో నీ సోదరులను కూడ నీతో తీసుకొని వెళ్లు. దయ, విశ్వాసం నీకు అండగా వుండుగాక!” అని అన్నాడు.
2SA 15:21 కాని ఇత్తయి రాజుకు సమాధానమిస్తూ, “యెహోవా జీవము తోడుగా, నీ జీవము తోడుగా నేను నీతోనే వుంటాను! చావుబతుకుల్లో కూడ నేను నీతోనే వుంటాను!” అని అన్నాడు.
2SA 15:22 “అయితే మనం కిద్రోను వాగు దాటుదాము,” అన్నాడు రాజు ఇత్తయితో. అప్పుడు గిత్తీయుడైన ఇత్తయి తన వారితోను, వారి పిల్లలతోను కిద్రోను వాగు దాటాడు.
2SA 15:23 ప్రజలంతా బిగ్గరగా ఏడ్వసాగారు. రాజు (దావీదు) కిద్రోనువాగు దాటాడు. అప్పుడు వారంతా ఎడారివైపు ప్రయాణం సాగించారు.
2SA 15:24 సాదోకు, తనతో వున్న తదితర లేవీయులందరూ దేవుని ఒడంబడిక పెట్టెను మోసుకొని వస్తూవున్నారు. వారు దేవుని పెట్టెనుదించారు. ప్రజలంతా యెరూషలేము నగరం నుండి వెళ్లిపోయే వరకు అబ్యాతారు ప్రార్థన చేస్తూవున్నాడు.
2SA 15:25 సాదోకుతో రాజు (దావీదు) ఈ విధంగా చెప్పాడు: “దేవుని పవిత్ర పెట్టెను యెరూషలేముకు తిరిగి తీసుకొని వెళ్లు. ఒక వేళ యెహోవా నన్ననుగ్రహించితే, ఆయన నన్ను యెరూషలేముకు తిరిగి తీసుకొని వస్తాడు. యెహోవా మరల నన్ను యెరూషలేమును, ఆయన దేవాలయమును చూసేలా చేస్తాడు.
2SA 15:26 కాని దేవుడు నేనంటే ఇష్టంలేదని చెప్పితే ఆయన నాకు వ్యతిరేకంగా తన ఇష్టం వచ్చినట్లు చేయగలడు.”
2SA 15:27 యాజకుడు సాదోకుతో రాజు ఇంకా ఇలా అన్నాడు: “నీవు దీర్ఘదర్శివి. నగరానికి ప్రశాంతంగా వెళ్లు. నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారు డైన యోనాతానును నీతో తీసుకొని వెళ్లు.
2SA 15:28 ప్రజలు ఎడారిలోకి ప్రవేశించే స్థలంలో నేను మీనుండి మళ్లీ సమాచారం వచ్చేవరకు వేచి వుంటాను.”
2SA 15:29 కావున సాదోకు, అబ్యాతారు దేవుని పవిత్ర పెట్టెను తీసుకొని యెరూషలేముకు తిరిగి వెళ్లి అక్కడ వుండి పోయారు.
2SA 15:30 దావీదు ఒలీవల పర్వతం మీదికి వెళ్లాడు. అతడు ఏడుస్తూవున్నాడు. తలమీద ముసుగు వేసికొని, చెప్పులు కూడ లేకుండా వెళ్లాడు. దావీదుతో వున్న మనుష్యులంతా కూడ తలపై ముసుగు వేసుకున్నారు. వారు ఏడుస్తూ దావీదు వెంట వెళ్లారు.
2SA 15:31 ఒక వ్యక్తి దావీదు వద్దకు వచ్చి, “అబ్షాలోముతో కలిసి పథకం వేసిన వారిలో అహీతోపెలు ఒకడు” అని చెప్పాడు. అది విని దావీదు యెహోవాకు “అహీతోపెలు సలహా నిరుపయోగమయ్యేలా చేయమని నిన్ను వేడుకుంటున్నాను” అని ప్రార్థన చేశాడు.
2SA 15:32 దావీదు పర్వతం పైకి వెళ్లాడు. తరుచూ అతను అక్కడ దేవుని ఆరాధించేవాడు. ఆ సమయంలో అర్కీయుడైన హూషై అనువాడు దావీదు వద్దకు వచ్చాడు. హూషై చొక్కా చిరిగివుంది. వాని తలపై దుమ్ము వుంది.
2SA 15:33 దావీదు హూషైతో ఇలా అన్నాడు: “నీవు నాతో వస్తే నేను శ్రద్ద తీసుకోవలసిన వారిలో నీవొకడివవుతావు.
2SA 15:34 కాని నీవు యెరూషలేము నగరానికి వెళితే, అహీతోపెలు సలహాను ఎందుకూ కొరగానిదిగా నీవు చేయగలవు. అబ్షాలోముతో: ఓ రాజా, నేను నీ సేవకుడను.నేను నీ తండ్రిని సేవించాను. కాని ఇప్పుడు నిన్ను సేవింపవచ్చాను, అని చెప్పు.
2SA 15:35 యాజకులైన సాదోకు, అబ్యాతారు నీకు తోడుగా వుంటారు. రాజ గృహంలో నీవు విన్నదంతా వారికి తప్పక చెప్పాలి.
2SA 15:36 సాదోకు కుమారుడు అహిమయస్సు, అబ్యాతారు కుమారుడు యోనాతాను వారికి తోడుగా వుంటారు. నీవు విన్నదంతా వారికి చెప్పి పంపితే, వారు వచ్చి నాకు తెలియజేస్తారు.”
2SA 15:37 అప్పుడు దావీదు స్నేహితుడు హూషై నగరానికి వెళ్లాడు. అబ్షాలోము కూడ నగరానికి చేరియున్నాడు.
2SA 16:1 ఒలీవల పర్వతం మీద దావీదు కొంతవరకు వెళ్లాడు. అక్కడ మెఫీబోషెతు సేవకుడైన సీబా దావీదును కలిశాడు. సీబా వెంట గంతలు కట్టిన రెండు గాడిదలున్నాయి. గాడిదల మీద రెండు వందల రొట్టెలు, ఒక వంద ఎండు ద్రాక్షాగుత్తులు, ఒక వంద అంజూరపు పండ్లు, ఒక ద్రాక్షారసపు తిత్తివున్నాయి.
2SA 16:2 రాజు (దావీదు) సీబాతో, “ఇవన్నీ ఎందుకు?” అని అన్నాడు. “ఈ గాడిదలు రాజకుటుంబంవారు ఎక్కటానికి. ఈ రొట్టెలు, పండ్లు సేవకులు తినటానికి. ఎడారిలో ఎవరైనా అలసిపోతే ఈ ద్రాక్షారసం తాగి సేద తీర్చుకోవచ్చు” అని సీబా అన్నాడు.
2SA 16:3 “మెఫీబోషెతు ఎక్కడ? అని రాజు అడిగాడు. “మెఫీబోషెతు యెరూషలేములోనే వుంటున్నాడు. ఎందువల్లనంటే ఈ రోజు ఇశ్రాయేలీయులు తన తాత! రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చి వేస్తారని ఆశిస్తూవున్నాడు!” అని రాజుకు సీబా సమాధానం చెప్పాడు.
2SA 16:4 “సరే, మంచిది. మెఫీబోషెతుకు చెందినదంతా ఇప్పుడు నేను నీకు ఇస్తాను” అని రాజు సీబాతో చెప్పాడు. అది విని సీబా, “మీకు నేను సమస్కరిస్తున్నాను. మీకు నేనిలా సదా సంతృప్తిని చేకూర్చగలనని ఆశిస్తున్నాను” అని అన్నాడు.
2SA 16:5 దావీదు బహూరీముకు వచ్చాడు. బహూరీమునుండి సౌలు కుటుంబానికి చెందిన వాడొకడు బయటికి వచ్చాడు. వాని పేరు షిమీ. అతను గెరా అనువాని కుమారుడు. దావీదును గురించి చెడు మాటలు మాట్లాడుతూ వాడు బయటికి వచ్చాడు. అతడలా పదే పదే నిందిస్తూ వచ్చాడు.
2SA 16:6 దావీదు మీదికి, అతని సేవకుల మీదికి రాళ్లు విసరటం మొదలు పెట్టాడు. కాని దావీదుతో వున్న మనుష్యులు, సైనికులు దావీదు చుట్టూ చేరారు. చూట్టూ చేరి రక్షణ కల్పించారు.
2SA 16:7 షిమీ దావీదును తిట్టాడు. “బయటికి పో! బయటికి పో! నీవు మంచివాడవు కావు. హంతకుడవు!” అంటూ తిట్టాడు.
2SA 16:8 “యెహోవా నిన్ను శిక్షిస్తాడు! ఎందువలననగా నీవు సౌలు కుటుంబంలోని మనుష్యులను చంపావు! రాజైన సౌలు స్థానాన్ని నీవు సంగ్రహించావు! కాని యెహోవా ఇప్పుడు రాజ్యాన్ని నీ కుమారుడైన అబ్షాలోముకు ఇచ్చాడు! నీవు చేసిన చెడు కార్యాలన్నీ ఇప్పుడు నీకే జరుగుతున్నాయి! ఎందువల్లననగా నీవొక హంతకుడవు!”
2SA 16:9 సెరూయా కుమారుడైన అబీషై రాజుతో, “నా ప్రభువైన రాజును ఈ చచ్చిన కుక్క ఎందుకు తిట్టాలి? నన్ను వెళ్లి షిమీ తల నరికివేయనీయండి!” అని అన్నాడు.
2SA 16:10 అందుకు రాజు ఇలా అన్నాడు: “సెరూయా కుమారులారా నేనేమి చేయగలను! నిజానికి షిమీ నన్ను దూషిస్తున్నాడు! కాని యెహోవా వాని చేత నన్ను శపిస్తున్నాడు!”
2SA 16:11 దావీదు తన సేవకులతోను, అబీషైతోను ఇంకా ఈ విధంగా అన్నాడు, “చూడండి, నా స్వంత కుమారుడే నన్ను చంపజూస్తున్నాడు! బెన్యామీనీయుడైన ఈ మనుష్యుడు (షిమీ) నన్ను చంపటానికి ఇంకా ఎక్కువ హక్కు కలిగి వున్నాడు! అతనిని అలా వదిలి వేయండి. నన్ను గురించి చెడ్డ మాటలు వానిని చెప్పనీయండి. యెహోవాయే ఇవన్నీ వానిచేత పలికిస్తున్నాడు.
2SA 16:12 బహుశః యెహోవా నాకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా గమనిస్తూ వుండవచ్చు. బహుశః యెహోవాయే నాకు మేలు చేయవచ్చు. ఈ రోజు షిమీ చెప్పే చెడ్డ మాటలన్నిటికీ భిన్నంగా ఏదో ఒక మంచి నాకు జరుగువచ్చు!”
2SA 16:13 కావున దావీదు తన మనుష్యులతో కలిసి తన దారిన వెళ్లిపోయాడు. కాని షిమీ దావీదును అనుసరిస్తూనే ఉన్నాడు. కొండ పక్కగా దారికి ఆవలివైపున నడుస్తూ ఉన్నాడు. దారి పోడవునా షిమీ దావీదును దూషిస్తూనే ఉన్నాడు. అంతేగాకుండా దావీదు మీదకు రాళ్లు రువ్వటం, దుమ్ము జల్లటం కూడ చేస్తూనే వున్నాడు.
2SA 16:14 రాజైన దావీదు, అతని అనుచరులు బహూరీము అను చోటికి చేరారు. వారంతా బాగా అలసిపోయారు. వారు బహూరీము వద్ద విశ్రమించారు.
2SA 16:15 అబ్షాలోము, అహీతోపెలు, తదితర ఇశ్రాయేలీయులు యెరూషలేముకు వచ్చారు.
2SA 16:16 అర్కీయుడు, దావీదు స్నేహితుడు అయిన హూషై అబ్షాలోము వద్దకు వచ్చి “రాజు వర్ధిల్లు గాక! రాజు వర్ధిల్లుగాక!” అని అన్నాడు.
2SA 16:17 “నీ స్నేహితుడు దావీదుపట్ల నీవు ఎందుకు రాజభక్తి కలిగియుండలేదు? నీ స్నేహితునితో కలిసి యెరూషలేమును విడిచి ఎందుకు పోలేదు?” అని అబ్షాలోము అడిగాడు.
2SA 16:18 హూషై ఇలా అన్నాడు: “యెహోవా ఎవరిని ఎన్నుకుంటాడో నేను ఆయన మనిషిని. ఈ మనుష్యులు, ఇశ్రాయేలు ప్రజలు నిన్ను ఎంపికచేశారు. నేను నీతోనేవుంటాను.
2SA 16:19 గతంలో నేను నీ తండ్రికి సేవచేశాను. సరే, ఇప్పుడు నేను ఎవరికి సేవ చేయాలి? దావీదు కుమారునికి! అందువల్ల నేను నీకు సేవ చేస్తాను.”
2SA 16:20 “దయచేసి ఇప్పుడు మనం ఏమి చేయాలో చెప్పు” అని అబ్షాలోము అహీతోపెలును అడిగాడు.
2SA 16:21 అబ్షాలోముతో అహీతోపెలు ఇలా అన్నాడు: “నీ తండ్రి తన యొక్క దాసీలను కొంత మందిని ఇల్లు చూస్తూ ఉండమని వదిలి వెళ్లాడు. నీవు వెళ్లి వారితో సాంగత్యము చేయము. దానితో ఇశ్రాయేలీయులందరూ నీ తండ్రి నిన్నసహ్యించు కుంటున్నాడని వింటారు. అప్పుడు నీకు మద్దతు యివ్వటానికి నీ ప్రజలందరికీ తగిన ప్రోత్సాహం దొరుకుతుంది.”
2SA 16:22 తరువాత అబ్షాలోము కొరకు మిద్దె మీద ఒకడేరా వేశారు. అక్కడ తన తండ్రి దాసీలతో అబ్షాలోము సంగమించాడు. ఇశ్రాయేలీయులంతా ఇది చూశారు.
2SA 16:23 ఆ కాలంలో అహీతోపెలు సలహా దావీదు, అబ్షాలోము లిరువురూ చాలా ముఖ్యమైనదిగా భావించేవారు. ఒక వ్యక్తికి దేవుని మాట ఎంత ముఖ్యమో, అహీతోపెలు సలహా కూడా అంత విలువగలదిగా ఉండేది.
2SA 17:1 అహీతోపెలు అబ్షాలోముతో ఇంకా యిలా అన్నాడు: “ఇప్పుడు నన్ను పన్నెండు వేలమంది సైనికులను ఎంపిక చేసుకోనీయ్యి. ఈ రాత్రికి నేను దావీదును వెంటాడతాను.
2SA 17:2 అతడు బాగా అలసిపోయి బలహీన పడ్డాక నేనతనిని పట్టుకుంటాను. అతనిని బెదరగొడతాను. దానితో అతనితో ఉన్న వారంతా పారిపోతారు. నేను రాజైన దావీదును మాత్రమే చంపుతాను.
2SA 17:3 తరువాత ప్రజలందరినీ నేను నీ వద్దకు తీసుకొని వస్తాను. నీవు వెదకుతున్న వ్యక్తి (దావీదు) గనుక చనిపోతే, మిగిలిన ప్రజలంతా శాంతంగా తిరిగి వస్తారు.”
2SA 17:4 ఈ పథకం అబ్షాలోముకు, మిగిలిన ఇశ్రాయేలు నాయకులకు మంచిదనిపించింది.
2SA 17:5 అయినా అబ్షాలోము, “అర్కీయుడైన హూషైని పిలవండి. అతడేమి చెపుతాడో కూడా నేను వినదలిచాను” అని అన్నాడు.
2SA 17:6 అబ్షాలోము వద్దకు హూషై వచ్చాడు. అహీతోపెలు సలహాను హూషైకు అబ్షాలోము వివరించాడు. దానిని అనుసరించవచ్చా? లేదా? తెలియజెప్ప మన్నాడు.
2SA 17:7 హూషై ఈ విధంగా చెప్పాడు, “అహీతోపెలు ఇచ్చిన సలహా ఈ సమయంలో మంచిది కాదు.”
2SA 17:8 నీ తండ్రి, అతని మనుష్యులు చాలా గట్టివారని నీకు తెలుసు. పొలాల్లో తన పిల్లల్ని పొగొట్టుకున్న ఎలుగు బంటివలె వారు మహా కోపంతో వున్నారు. నీ తండ్రి బహు నేర్పరియైన యోధుడు. అతను రాత్రంతా తన మనుష్యులతో కలిసి వుండడు.
2SA 17:9 బహుశః ఈ పాటికి ఆయన ఏ గుహలోనో, మరొక చోటనో దాగి వుండవచ్చు. నీ తండ్రి గనుక నా మనుష్యులను ముందుగా ఎదుర్కొంటే, ప్రజలందరికీ ఆ వార్త తెలిసిపోతుంది. అబ్షాలోము అనుచరులు ఓడి పోతున్నారని వారంతా అనుకుంటారు!
2SA 17:10 సింహాల్లా ధైర్యంగా వుండే నీ మనుష్యులు కూడ చెదరిపోయే అవకాశం వుంది. ఎందువల్లననగా ఇశ్రాయేలీయులంతా నీ తండ్రి బలవంతుడైన యోధుడనీ, ఆయన మనుష్యులు మంచి ధైర్యవంతులనీ ఎరుగుదురు!
2SA 17:11 “నేను చెప్పేదేమంటే ఇప్పుడు నీవు దానునుండి బెయేర్షెబా వరకు వున్న ఇశ్రాయేలీయులనందరినీ చేరదియ్యి. సముద్ర తీరాన ఇసుక రేణువుల్లా నీ వద్ద అనేక మంది ప్రజలు వుంటారు. అప్పుడు నీకై నీవే యుద్ధానికి వెళ్ల వచ్చు.
2SA 17:12 అతను దాగివున్న చోటులోనే మనం దావీదును పట్టుకోవచ్చు. భూమి మీదకు మంచు పడినట్లు మనం దావీదు మీద పడవచ్చు. దావీదును, అతని మనుష్యులందరినీ మనం చంపవచ్చు. వారిలో ఏ ఒక్కడూ వదిలిపెట్టబడడు.
2SA 17:13 ఒకవేళ దావీదు నగరంలోకి తప్పించుకుంటే, ఇశ్రాయేలీయులంతా తాళ్లు పట్టుకు వస్తారు. ఆ నగరాన్నంతా మనం లోయలోకి లాగి వేద్దాం ఇక ఆ నగరంలో ఒక్క చిన్న రాయి కూడ మిగలదు!”
2SA 17:14 “అర్కీయుడైన హూషై ఇచ్చిన సలహా అహీతోపెలు సలహాకంటె చాలా బాగుందని,” అబ్షాలోము, ఇతర ఇశ్రాయేలీయులంతా అన్నారు. ఇదంతా యెహోవా ఏర్పాటు గావున, వారంతా అలా చెప్పారు. యెహోవా అహీతోపెలు ఇచ్చిన మంచి సలహాను వ్యర్థంచేయ సంకల్పించాడు. ఆ విధంగా అబ్షాలోమును శిక్షింప జూశాడు.
2SA 17:15 హూషై ఈ విషయాలన్నీ యాజకులైన సాదోకు మరియు అబ్యాతారుకు చెప్పాడు. అబ్షాలోముకు, ఇశ్రాయేలు నాయకులకు అహీతోపెలు యిచ్చిన సలహాను కూడ హూషై వారికి చెప్పాడు. అంతే గాకుండా తను ఏ సలహా ఇచ్చినది కూడా సాదోకు, అబ్యాతారులకు హూషై వివరించాడు. హూషై ఇలా అన్నాడు:
2SA 17:16 “త్వరగా దావీదుకు ఒక వర్తమానం పంపండి. ప్రజలు ఎక్కడెక్కడైతే ఎడారిలోకి ప్రవేశిస్తారో ఆయా ప్రాంతాలలో దావీదును ఈ రాత్రికి వుండవద్దని చెప్పండి. కాని యొర్దాను నదిని తక్షణమే దాటి వెళ్లమనండి. వారు నదిని గనుక దాటినట్లయితే రాజు, ఆయన అనుచరులు పట్టుబడరు.”
2SA 17:17 యాజకుల కుమారులైన యోనాతాను మరియు అహిమయస్సు కలిసి ఏన్ రోగేలు దగ్గర వేచివున్నారు. వాళ్లు నగరంలోకి వెళ్తున్నట్లు ఎవరూ చూడ కూడదనుకున్నారు. కావున ఒక పనిపిల్ల వారి వద్దకు వచ్చింది. ఆమె వారికి ఒక సమాచారం అందజేసింది. తరువాత యోనాతాను, అహీమయస్సులు ఇరువురూ రాజైన దావీదు వద్దకు వెళ్లి అన్ని విషయాలూ చెప్పారు.
2SA 17:18 అయినా ఒక బాలుడు యోనాతానును, అహిమయస్సును చూశాడు. వారు అబ్షాలోముకు చెప్పటానికి పరుగున పోయాడు. ఇది గమనించిన యోహనాతాను, అహిమయస్సు వెంటనే పారిపోయారు. వారు బహురీములో ఒకని ఇంటికి వెళ్లారు. ఆ ఇంటివాని ఆవర ణలో ఒక బావి వున్నది. యోనాతాను, అహిమయస్సు ఆ బావిలోకి దిగారు.
2SA 17:19 ఇంటివాని భార్య బావి మీద ఒక దుప్పటి కప్పి వేసింది. ఆమె మళ్లీ దాని మీద ధాన్యం పోసింది. అప్పుడా బావి ఒక ధాన్యపు రాశిలా కన్పించింది. అందువల్ల యోనాతాను, అహిమయస్సు అందులో దాగి వున్నారని ఎవరూ అనుకోరు.
2SA 17:20 అబ్షాలోము సైనికులు ఆ ఇంటి యజమానురాలి వద్దకు వచ్చి “అహిమయస్సు, యోనాతాను ఎక్కడ వున్నారు?” అని అడిగారు. “వాళ్లు అప్పుడే వాగు దాటి పోయారని” ఆ స్త్రీ అబ్షాలోము మనుష్యులకు చెప్పింది. అబ్షాలోము మనుష్యులు యోనాతాను, అహిమయస్సులను వెదుక్కుంటూపోయారు. కాని వారిద్దరినీ వారు కనుగొనలేదు. అందుచే అబ్షాలోము సైనికులు యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయారు.
2SA 17:21 అబ్షాలోము మనుష్యులు వెళ్లిపోయిన తరువాత యోనాతాను, అహిమయస్సు బావిలో నుండి బయటికి వచ్చారు. జరిగినదంతా రాజైన దావీదుకు వారు చెప్పారు. వారు దావీదుతో, “త్వరపడండి. నదిని దాటి వెళ్లండి! మీకు వ్యతిరేకంగా అహీతోపెలు ఇవన్నీ చేస్తున్నాడు” అని అన్నారు.
2SA 17:22 వీదు, అతని మనుష్యులు యొర్దాను నదిని దాటి వెళ్లారు. సూర్యోదయానికి ముందే దావీదు, అతని అనుచరులు యొర్దాను నదిని దాటారు.
2SA 17:23 ఇశ్రాయేలీయులు తన సలహా పాటించలేదని అహీతోపెలు గమనించాడు. అహీతోపెలు తన గాడిదపై గంతవేసి దానిపై తన నగరానికి వెళ్లాడు. తన కుటుంబపోషణకు తగిన ఏర్పాట్లు చేసి అహీతోపెలు ఉరిపోసుకొని చనిపోయాడు. అహీతోపెలు చనిపోయినాక అతని శవాన్ని అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు.
2SA 17:24 దావీదు మహనమయీముకు చేరాడు. అబ్షాలోము, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు యొర్దాను నదినిదాటారు.
2SA 17:25 అబ్షాలోము తన సైన్యాధి కారిగా అమాశాను నియమించాడు. అంటే యోవాబు స్థానాన్ని అమాశా ఆక్రమించాడు. ఇత్రా అనేవాని కుమారుడు అమాశా. ఇత్రా ఇష్మాయేలీయుడు అమాశా తల్లి పేరు అబీగయీలు. ఈమె సెరూయా సోదరియగు నాహాషు కుమార్తె. (సెరూయా యోవాబు తల్లి)
2SA 17:26 అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు రాజ్యంలో గుడారాలు వేసుకున్నారు.
2SA 17:27 దావీదు మహనయీముకు చేరాడు. షోబీ, మాకీరు మరియు బర్జిల్లయి అక్కడ వున్నారు. (నాహాషు కుమారుడైన షోబీ అమ్మోనీయుల రాజధానియగు రబ్బాకు చెందినవాడు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు లోదెబారుకు చెందినవాడు. బర్జిల్లయి అనువాడు గిలాదులోని రోగెలీము పట్టణవాసి)
2SA 17:28 “ఎడారిలోవున్న ప్రజలు అలసిపోయి ఆకలిదప్పులు గొనియున్నారు” అని వారు చెప్పినారు. అందువల్ల దావీదు, అతని మనుష్యులు తినటానికి వారు అనేక పదార్థాలు పట్టుకువచ్చారు. వారు పరుపులు, పాత్రలు, కుండలు తెచ్చారు. వారింకా గోధుమలు, యవలు, పిండి, వేపిన ధాన్యం, కాయగూరలు, ఎండబెట్టిన గింజలు, తేనె, వెన్న, గొర్రెలు, ఆవుపాల మీగడ మొదలైనవన్నీ తెచ్చారు.
2SA 18:1 దావీదు తన మనుష్యులను లెక్కబెట్టాడు. సహస్ర దళాధిపతులను, శత దళాధిపతులను తన సైన్యాన్ని నడిపేందుకు ఎంపిక చేశాడు.
2SA 18:2 దావీదు తన సైన్యాన్ని మూడు గుంపులుగా విభజించాడు. తరువాత దావీదు వారిని బయలుదేరదీశాడు. మూడోవంతు సైన్యాన్ని యోవాబు నడిపించాడు. యోవాబు సోదరుడైన సెరూయా కుమారుడగు అబీషై రెండవ గుంపును, గాతువాడైన ఇత్తయి మూడవ దళాన్ని నడిపించారు. “నేను కూడ మీతో వస్తాను” అని రాజైన దావీదు ఆ జనంతో అన్నాడు.
2SA 18:3 కాని ప్రజలు వద్దన్నారు. “వద్దు! నీవు మాతో రాకూడదు! మేము గనుక యుద్ధరంగం నుండి పారిపోతే, అబ్షాలోము మనుష్యులు ఏమీ లెక్క చేయరు. మాలో సగం మంది చనిపోయినా వారు పట్టించుకోరు. కాని నీవు మాలాంటి పదివేల మందికి సమానం. కావున నీవు నగరంలోనే వుండటం మంచిది. మాకు సహాయం కావలసి వచ్చినప్పుడు నీవు మాకు సహాయపడవచ్చు” అని అన్నారు.
2SA 18:4 “సరే, మీరు ఏది మంచిదని తలిస్తే నేనది చేస్తాను” అని రాజు ప్రజలతో అన్నాడు. తరువాత రాజు నగర ద్వారం పక్కన నిలబడ్డాడు. సైన్యం బయటికి వెళ్లింది. వారంతా వందేసి, వెయ్యేసి మంది జట్లుగా బయటికి వెళ్లారు.
2SA 18:5 యోవాబు, అబీషై మరియు ఇత్తయికి రాజు, “నాకొరకు ఈ పని చేయండి. యువకుడైన అబ్షాలోము పట్ల ఉదారంగా ప్రవర్తించండి!” అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సైన్యాధిపతులకు రాజు యిచ్చిన ఆజ్ఞలను ఆ ప్రజలంతా విన్నారు.
2SA 18:6 అబ్షాలోము తరపున వచ్చిన ఇశ్రాయేలీయుల పైకి దావీదు సైన్యం రణరంగంలోకి ప్రవేశించింది. ఎఫ్రాయిము అరణ్యంలో వారు పోరాడారు.
2SA 18:7 దావీదు సైన్యం ఇశ్రాయేలీయులను ఓడించింది. ఆ రోజు ఇరవై వేలమంది చనిపోయారు.
2SA 18:8 యుద్ధం దేశవ్యాప్తంగా జరిగింది. ఆ రోజు కత్తివేటుకు చచ్చిన వారికంటే అడవిలో చిక్కుకొని చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
2SA 18:9 అబ్షాలోము దావీదు సేవకులను కలవటం జరిగింది. అబ్షాలోము తప్పించుకు పోవటానికి ఒక కంచరగాడిదను ఎక్కాడు. ఆ కంచర గాడిద పెద్ద సింధూర వృక్షం కొమ్మల క్రిందుగా వెళ్లింది. కొమ్మలు చిక్కగా అల్లుకొని ఉన్నాయి. అబ్షాలోము తల ఆ కొమ్మల్లో చిక్కుకు పోయింది. తన కంచర గాడిద తన క్రిందనుంచి పారిపోయింది. ఆ విధంగా అబ్షాలోము భూమికి పైగా వేలాడుచున్నాడు.
2SA 18:10 ఇది జరగటం ఒక వ్యక్తి చూశాడు. అతడు పోయి యోవాబుతో, “అబ్షాలోము సింధూర వృక్షం కొమ్మల్లో చిక్కుకొని వేలాడటం నేను చూశాను!” అని చెప్పాడు.
2SA 18:11 “మరి నీవతనిని ఎందుకు చంపిక్రిందపడేలా చేయలేదు? నీకు నేను ఒక నడికట్టును మరియు పది తులముల వెండి ఇచ్చివుండేవాడిని!” అని యోవాబు అన్నాడు.
2SA 18:12 యెవాబుతో అతడిలా అన్నాడు: “నీవు వెయ్యితులముల వెండి ఇచ్చినా నేను రాజకుమారుడిని గాయపర్చేవాడినికాను. ఎందుకనగా, రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి యిచ్చిన ఆజ్ఞ మేమంతా విన్నాము. ‘చిన్నవాడైన అబ్షాలోమును గాయపర్చకుండా ఉదారంగా ప్రవర్తించండి’ అని రాజు అన్నాడు.
2SA 18:13 నేను గనుక అబ్షాలోమును చంపితే రాజు ఎలాగో తెలుసుకుంటాడు. మళ్లీ నీవే నన్ను శిక్షిస్తావు!”
2SA 18:14 “ఈ విధంగా నేను ఇక్కడ నీతో కాలం వృధాచేయను” అని యోవాబు అన్నాడు. అబ్షాలోము ఇంకా చెట్టుకు వేలాడుచూ బతికేవున్నాడు. యోవాబు మూడు ఈటెలను తీసుకున్నాడు. ఆ ఈటెలను అబ్షాలోము మీదికి విసిరాడు. ఆ ఈటెలు అబ్షాలోము గుండెను చీల్చుకుంటూ దూసుకు పోయాయి.
2SA 18:15 యోవాబుకు యుద్ధంలో సహాయపడుతూ అతని వెంట పది మంది యువ సైనికులున్నారు. ఆ పదిమంది అబ్షాలోము చుట్టూచేరి అతనిని చంపివేశారు.
2SA 18:16 యోవాబు బూర ఊది, ప్రజలను పిలిచి అబ్షాలోముతో వున్న ఇశ్రాయేలీయులను వెంటాడటం ఆపమన్నాడు.
2SA 18:17 యోవాబు మనుష్యులు అబ్షాలోము శవాన్నీ తీసి అరణ్యంలో ఒక పెద్ద గోతిలో పడవేశారు. ఆ పెద్ద గోతిని రాళ్లు వేసి పూడ్చి వేశారు. అబ్షాలోము అనుచరులైన ఇశ్రాయేలీయులంతా భయపడి ఇండ్లకు పారిపోయారు.
2SA 18:18 అబ్షాలోము బ్రతికివున్న రోజుల్లో రాజు లోయలో, ఒక స్తంభం నిర్మించాడు. అప్పుడు అబ్షాలోము ఇలా అన్నాడు: “నా పేరు చిరస్థాయిగా నిలవటానికి నాకు కుమారుడు లేడు” అందువల్ల ఆ స్తంభానికి తన పేరే పెట్టుకున్నాడు. ఆ స్తంభం ఈనాటికీ “అబ్షాలోము జ్ఞాపక చిహ్నం” అని పిలవబడుతూవుంది.
2SA 18:19 సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబుతో, “నన్ను పరుగున పోయి ఈ వార్తను రాజైన దావీదుకు చెప్పనీయండి. నీ కొరకు శత్రువును యెహోవా నాశనం చేశాడు” అని చెపుతానన్నాడు.
2SA 18:20 అహిమయస్సుతో యోవాబు ఇలా అన్నాడు: “వద్దు, దావీదుకు ఈ రోజు ఈ వార్తను తీసుకొని పోవటానికి వీలులేదు. ఇంకొక రోజు ఈ వార్తను చేర వేయవచ్చు. అంతేగాని ఈ రోజు మాత్రం వద్దు. ఎందుకంటావా? రాజు యొక్క కుమారుడు చనిపోయాడు గనుక.”
2SA 18:21 తరువాత కూషీయుడైన ఒకనిని యోవాబు పిలిచి, “అతను చూసిన విషయాలన్నీ రాజు వద్దకు వెళ్లి చెప్పమన్నాడు.” కూషీయుడు యోవాబుకు నమస్కరించాడు. తరువాత కూషీయుడు దావీదుకు వార్త చెప్పటానికి పరుగెత్తాడు.
2SA 18:22 కాని సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబుతో, “ఏమి జరిగినా పరవాలేదు. నన్ను కూడా కూషీయుని వెనుక పరుగెత్తుకు వెళ్లనీయండి!” అని ప్రాధేయపడ్డాడు. “కుమారుడా! నీవెందుకు వార్త మోసుకొని పోవాలనుకుంటున్నావు? నీవు తీసుకొని వెళ్లిన ఈ వార్తకు నీకు ఏ బహుమానమూ లభించదు!” అని యోవాబు అన్నాడు.
2SA 18:23 “ఏమి జరిగినా పరవాలేదు; నేను వేగంగా వెళతాను,” అన్నాడు అహిమయస్సు. “అయితే పరుగెత్తు!” అన్నాడు యోవాబు అహిమ యస్సుతో. అప్పుడు యొర్దానులో యగుండా అహిమయస్సు పరుగెత్తాడు. అతడు కూషీయుని దాటి వెళ్లాడు.
2SA 18:24 నగర రెండు ద్వారాల మధ్య దావీదు కూర్చుని వున్నాడు. కావలివాడు ద్వారం మీద వున్న గోడపైకి వెళ్లి పరిశీలించాడు. దూరాన ఒకడు ఒంటరిగా పరుగెత్తుకు రావటం చూశాడు.
2SA 18:25 ఈ విషయం చెప్పటానికి కావలివాడు రాజును పిలిచాడు. “ఒక్కడే గనుక వస్తూవుంటే, వాడు ఏదో వార్త తెస్తూవున్నాడన్నమాట!” అని దావీదు రాజు అన్నాడు. ఆ వ్యక్తి క్రమేపీ నగరాన్ని సమీపించాడు.
2SA 18:26 కావాలివాడు ఇంకొక వ్యక్తి రావటం కూడా చూశాడు. పైనున్న కావలివాడు ద్వారపాలకుని పిలిచి, “చూడు! ఇంకొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు!” అని చెప్పాడు. “అయితే వాడు కూడా వార్త తెస్తున్నాడు!” అని అన్నాడు రాజు.
2SA 18:27 “మొదటి వ్యక్తి సాదోకు కుమారుడైన అహిమయస్సులా పరుగెత్తుతున్నాడని నేను అనుకుంటున్నాను” అని కావాలివాడన్నాడు. “అహిమయస్సు మంచి వ్యక్తి. అతడేదో మంచి వార్త తెస్తూవుండవచ్చు!” అని రాజు అన్నాడు.
2SA 18:28 అహిమయస్సు రాజును పిలిచి, “అంతా బాగున్నది!” అన్నాడు. అహిమయస్సు సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు. “నీ ప్రభుమైన దేవునికి స్తోత్రము. నా ఏలినవాడవైన రాజుకు వ్యతిరేకంగా వున్న వారిని యెహోవా ఓడించాడు,” అని అహిమయస్సుచెప్పాడు.
2SA 18:29 “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని రాజు అడిగాడు. “యోవాబు నన్ను పంపినపుడు అక్కడ పెద్ద కోలాహలం నేను చూశాను. కాని అది ఎందుకో నాకు తెలియదు” అని అహిమయస్సు సమాధానమిచ్చాడు.
2SA 18:30 “ఇటు పైకి వచ్చి, ఇక్కడ వుండు” అన్నాడు. రాజు. అహిమయస్సు పైకి వెళ్లి పక్కన నిలబడి వేచి వున్నాడు.
2SA 18:31 తరువాత కూషీయుడు వచ్చాడు. “నా ఏలినవాడవైన రాజుకు ఒక వార్త! నీకు వ్యతిరేకులైన ప్రజలను యెహోవా ఈ రోజు శిక్షించాడు” అని చెప్పాడు.
2SA 18:32 “యువకుడైన అబ్షాలోము క్షేమంగా వున్నాడా?” అని రాజు కూషీయుని అడిగాడు. “నీ శత్రువులు, నిన్ను గాయపర్చాలని నీకు వ్యతిరేకంగా వచ్చే ఇతర మనుష్యులు ఆ యువకునిలా (అబ్షాలోము) అయిపోతారని నేను అనుకుంటున్నాను” అని కూషీయుడు చెప్పాడు.
2SA 18:33 దానితో అబ్షాలోము చనిపోయాడని రాజుకు అర్థమయింది. రాజు మిక్కిలి కలతపడిపోయాడు. నగర ద్వారం మీద వున్న గది వద్దకు వెళ్లాడు. అక్కడ బాగా విలపించాడు. గదిలోకి వెళ్లాడు. గదిలోకి పోతూ, “నా కుమారుడా, అబ్షాలోమా! నా కుమారుడా, అబ్షాలోమా! నీ బదులు నేను చనిపోయి వుండవలసింది. ఓ అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా!” అని దుఃఖించాడు.
2SA 19:1 ప్రజలు ఈ వార్తను యోవాబుకు అందజేశారు. “చూడు, రాజు దుఃఖిస్తున్నాడు. అబ్షాలోము కొరకు చాలా విచారిస్తున్నాడు” అని వారు యోవాబుకు చెప్పారు.
2SA 19:2 ఆ రోజు దావీదు సైన్యం యుద్ధంలో గెలిచింది. కాని అది వారందరికీ మిక్కిలి సంతాప దినంగా మారింది. విషాదమయ దినమయిన కారణమేమనగా “రాజు తన కుమారుని కొరకు మిక్కిలిగా విచారిస్తున్నాడని” ప్రజలంతా విన్నారు.
2SA 19:3 ప్రజలంతా నిశ్శబ్దంగా నగరంలోకి వచ్చారు. వారంతా యుద్ధంనుండి, పారిపోయి వచ్చిన వారిలా అగుపించారు.
2SA 19:4 రాజు తన ముఖాన్ని కప్పుకున్నాడు. “నా కుమారుడా, అబ్షాలోమా; ఓ అబ్షాలోమా, నా కుమారుడా, నా కుమారుడా!” అని బిగ్గరగా ఏడ్వసాగాడు.
2SA 19:5 యోవాబు రాజు ఇంటికి వచ్చాడు. యోవాబు రాజుతో ఇలా అన్నాడు: “ఈ రోజు నీవు నీ ముఖాన్ని కప్పుకున్నావు. అంతేగాదు, నీవు నీ సేవకుల ముఖాలన్నీ సిగ్గుతో కప్పివేశావు! ఈ రోజు నీ సేవకులు నీ ప్రాణాన్ని కాపాడారు! వారు నీ కుమారుల ప్రాణాలను, కుమార్తెలను, భార్యలను, నీ దాసీలను — అందరినీ కాపాడారు.
2SA 19:6 నీ సేవకులంతా సిగ్గుతో తలవంచు కున్నారు. కారణమేమంటే నిన్ను అసహ్యించుకునే వారిని నీవు ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించేవారిని నీవు అసహ్యించుకుంటున్నావు! నీ క్రింది అధికారులన్నా, నీ మనుష్యులన్నా నీకు లెక్కలేదని ఈ రోజు నీవు స్పష్టంచేశావు. నిజానికి అబ్షాలోము బతికి, మేమంతా చచ్చిపోయి వుంటే నీవు చాలా సంతోషపడి వుండేవాడివని ఈ రోజు నాకు విశదయమయింది!
2SA 19:7 లెమ్ము. ఇప్పుడు నీ సేవకులందరితో మాట్లాడి, వారిని ప్రోత్సహించు! నేను యెహోవా మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను. నీవు గనుక బయటికి వెళ్లి ఈ పని చేయకపోతే, రాత్రయ్యేసరికి నీతో ఒక్కడు కూడా వుండడు! నీ యవ్వనం నుండి ఇప్పటి వరకు నీవను భవించిన కష్టాలన్నిటికంటె, ఇప్పటి నీ పరిస్థితి చాలా అధ్యాన్నమవుతుంది.”
2SA 19:8 అప్పుడు రాజు నగరద్వారం వద్దకు వెళ్లాడు. రాజు నగర ద్వారం వద్ద వున్నాడన్న వార్త వ్యాపించింది. అందుచే ప్రజలంతా ఆయనను చూసేందుకు వచ్చారు. అబ్షాలోమును అనుసరించిన ఇశ్రాయేలీయులంతా ఇండ్లకు పారిపోయారు.
2SA 19:9 ఇశ్రాయేలు వంశాల ప్రజలందరూ ఒకరితో ఒకరు చర్చించటం మొదలు పెట్టారు. వారిలా అనుకున్నారు: “రాజైన దావీదు మనల్ని ఫిలిష్తీయులనుండి, తదితర శత్రువులనుండి కాపాడాడు. దావీదు అబ్షాలోముకు దూరంగా పారిపోయాడు.
2SA 19:10 మనల్ని పాలించటానికి అబ్షాలోమును ఎన్నుకున్నాము, కాని అతనిప్పుడు యుద్ధంలో చనిపోయాడు. కావున మనం మళ్లీ దావీదును రాజుగా చేసుకోవాలి.”
2SA 19:11 దావీదు రాజు యాజకులైన సాదోకుకు, అబ్యాతారుకు వర్తమానం పంపించాడు. దావీదు వారికిలా చెప్పాడు: “యూదా నాయకులతో మాట్లాడండి. వారితో, ‘రాజును (దావీదును) తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు వెనుకబడి వున్నారు? చూడండి. ఇశ్రాయేలీయులంతా రాజును తిరిగి ఇంటికి తీసుకొని వచ్చే విషయం మాట్లాడుతున్నారు.
2SA 19:12 మీరంతా నా సోదరులు. మీరు నా కుటుంబం వారు అయినప్పుడు రాజును తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు చివరివంశం వారవుతున్నారు?’ అని చెప్పండి.
2SA 19:13 అమాశాతో, ‘నీవు నా కుటుంబంలో భాగస్వామివి. నేను నిన్ను యోవాబు స్థానంలో సైన్యాధికారిగా చేయకపోతే దేవుడు నన్ను శిక్షించు గాక!’ అని కూడ చెప్పండి.”
2SA 19:14 దావీదు యూదా ప్రజలందరి హృదయాలను చూర గొన్నాడు. వారంతా ఒకటయ్యేలా చేశాడు. యూదా ప్రజలు దావీదుకు వర్తమానం పంపారు. “నీ సేవకులందరితో కలిసి తిరిగి రమ్ము” అని వారన్నారు.
2SA 19:15 అప్పుడు రాజు (దావీదు) యొర్దాను నది వద్దకు వచ్చాడు యూదా ప్రజలు రాజును కలవటానికి గిల్గాలుకు వచ్చారు. వారు రాజును యొర్దాను నదిని దాటించి తీసుకొని రావటానికి వచ్చారు.
2SA 19:16 గెరా కుమారుడైన షిమీ బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బహూరీములో నివసిస్తూండేవాడు. దావీదు రాజును కలవటానికి షిమీ వేగంగా ముందుకు వచ్చాడు. యూదా ప్రజలతో కలిసి షిమీ వచ్చాడు.
2SA 19:17 వేయిమంది బెన్యామీనీయులు కూడ షిమీతో వచ్చారు. సౌలు కుటుంబమువారి సేవకుడు సీబా కూడా వచ్చాడు. సీబా తన పదునైదుగురు కుమారులను ఇరవై మంది సేవకులను తనతో తీసుకొని వచ్చాడు. వీరంతా దావీదు రాజును కలవటానికి హుటాహుటిని యొర్దాను నది వద్దకు వెళ్లారు.
2SA 19:18 రాజ కుటుంబాన్ని యూదాకు తిరిగి తీసుకొని రావటంలో సహాయపడటానికి ప్రజలు యొర్దాను నదిని దాటి వెళ్లారు. రాజు ఏది కోరితే వారది చేయసాగారు. రాజు నదిని దాటుతూ వుండగా, గెరా కుమారుడైన షిమీ ఆయన వద్దకు వచ్చాడు. అతడు రాజు ముందు సాష్టాంగపడ్డాడు.
2SA 19:19 రాజుతో షిమీ ఇలా అన్నాడు, “నా ప్రభువా, నేను చేసిన పొరపాట్లను పట్టించుకోవద్దు! నా ప్రభువైన రాజా, నీవు యెరూషలేము వదిలి వెళ్లేటప్పుడు నేను నీ పట్ల చేసిన అపచారాలను మనసులో పెట్టుకోవద్దు.
2SA 19:20 పాపం చేసినట్లు నేను తెలుసుకున్నాను. అందువల్ల యోసేపు కుటుంబంలో నుండి నేను ముందుగా నిన్ను నా ప్రభువైన రాజును, కలుసుకోవాలని వచ్చాను.”
2SA 19:21 కాని సెరూయా కుమారుడైన అబీషై ఇలా అన్నాడు: “యెహోవాచే అభిషిక్తము చేయబడిన రాజునకు కీడు జరగాలని కోరుకున్నందుకు షిమీని మనం తప్పక చంపివేయాలి.”
2SA 19:22 దావీదు వారిని వారించి, వారితో, “సెరూయా కుమారులారా, మీకును — నాకును ఏమి పొందిక! ఈ రోజు మీరు నాకు వ్యతిరేకులయ్యారు! ఇశ్రాయేలులో ఏ ఒక్కడూ చంపబడడు. నాకు తెలుసు. ఈ రోజు నేను ఇశ్రాయేలుకు రాజును!” అని అన్నాడు.
2SA 19:23 ఆ తరువాత రాజు షిమీతో, “నీవు చంపబడవు” అని అన్నాడు. పైగా తనకై తాను షిమీని చంపనని రాజు అతనికి ప్రమాణం చేసి చెప్పాడు.
2SA 19:24 సౌలు మనుమడైన మెఫీబోషెతు దావీదు రాజును కలియటానికి వచ్చాడు. రాజు యెరూషలేము వదిలి వెళ్లిన నాటినుండి ప్రశాంతంగా తిరిగి వచ్చేవరకు మెఫీబోషెతు కాళ్లు కడగలేదు; గడ్డం తీసుకోలేదు; తన బట్టలు కూడ ఉతుకుకొనలేదు.
2SA 19:25 మెఫీబోషెతు రాజును కలవటానికి యెరూషలేము నుండి వచ్చాడు. రాజు అతనిని చూచి, “మెఫీబోషెతూ, నేను యెరూషలేము నుండి పారిపోయినప్పుడు నీవెందుకు నాతో రాలేదు?” అని అడిగాడు.
2SA 19:26 అందుకు మెఫీబోషెతు ఇలా అన్నాడు: “నా ప్రభువైన రాజా, నా సేవకుడు (సీబా) నన్ను మోసం చేశాడు! నేను అవిటివాడిని గనుక నా సేవకుడైన సీబాను పిలిచి, ‘ఒక గాడిదపై గంత కట్టి సిద్ధం చేయమన్నాను. దానిపై రాజుతో వెళతానన్నాను.’
2SA 19:27 కాని నా సేవకుడు నన్ను మోసగించాడు. నా గురించి నీకు చెడుగా చెప్పాడు. కాని నా ప్రభువైన రాజు దేవ దూతలాంటివాడు. నీకు ఏది మంచిదనిపించితే అది చేయుము.
2SA 19:28 నా తాత యొక్క కుటుంబాన్నంతటినీ నీవు చంపగలిగియుండే వాడివి. కాని నీవు అలా చేయలేదు. నీ బల్ల వద్ద భోజనం చేసే వారితో కలిసి తినే అర్హత నాకు కలిగించావు. కావున దేనిని గురించీ రాజుకు ఫిర్యాదు చేసే హక్కు నాకు లేదు!”
2SA 19:29 “ఇక నీ సమస్యల గురించి ఏమీ చెప్పకు! ఉన్న భూమిని నీకు, సీబాకు పంచాలని నిర్ణయించాను, అని రాజు మెఫీబోషెతుకు చెప్పాడు.
2SA 19:30 “సీబానే భూమినంతా తీసుకోనిమ్ము! ఎందువల్లనంటే నా ప్రభువైన రాజు శాంతంగా ఇంటికి తిరిగి వచ్చాడు గనుక” అని మెఫీబోషెతు రాజుతో అన్నాడు.
2SA 19:31 గిలాదీయుడగు బర్జిల్లయి రోగెలీ నుండి వచ్చాడు. అతడు రాజుతో యొర్దాను నదివద్దకు వచ్చాడు. రాజును నది దాటించటానికి ఆయనతో కూడ వెళ్లాడు.
2SA 19:32 బర్జిల్లయి పండు ముదుసలి. అతనికి ఎనభై సంవత్సరాలు. మహనయీములో దావీదువుండగా, బర్జిల్లయి ఆయనకు ఆహారాన్ని, తదితర వస్తువులను సమకూర్చాడు. బర్జిల్లయి గొప్ప ధనవంతుడు గనుక ఇవన్నీ చేయగలిగాడు.
2SA 19:33 దావీదు బర్జిల్లయితో ఇలా అన్నాడు, “నాతో నది దాటిరా, నాతో నీవు యెరూషలేములో నివసిస్తే నీ పోషణ బాధ్యత నేను తీసుకుంటాను.”
2SA 19:34 కాని బర్జిల్లయి రాజుతో ఇలా అన్నాడు: “నేను ఎంత వయో వృద్ధుడనో నీకు తెలుసా? నేను నీతో యెరూషలేముకు రాగాలనని నీవనుకుంటున్నావా?
2SA 19:35 నాకు ఎనుబది ఏండ్లు! మంచి చెడుల విచక్షణాజ్ఞానం కూడా తెలియనంత ముసలి వాడినయ్యాను. తినటానికి, తాగటానికి రుచులు కూడ తెలియనంత వయసు మళ్లిన వాడను. గాయనీ గాయకుల స్వరము వినలేనివాడిని. అటువంటి నన్ను గురించి నీవెందుకు చింత చేస్తున్నావు?
2SA 19:36 నీ నుండి నేను బహుమతులు కోరను! నీతో పాటు యోర్దాను నదిని దాటుతాను.
2SA 19:37 తరువాత దయచేసి నన్ను తిరిగి వెళ్లి పోనిమ్ము. అలా నేను నా స్వంత నగరంలో చనిపోయి, నాతల్లి దండ్రుల సమాధిలో వుంచబడతాను. నీ సేవకుడు కింహాము ఇక్కడే వున్నాడు. అతనిని నా ప్రభువైన నీతో తీసుకొని వెళ్లు. అతనితో నీకు ఏ పని కావాలంటే అది చేయించుకో.”
2SA 19:38 “కింహాము నాతోనే వస్తాడు. నీ కొరకు అతని పట్ల నేను దయగలిగి వుంటాను. నీ కొరకు నేనేమైనా చేస్తాను.” అని రాజు సమాధానమిచ్చాడు.
2SA 19:39 రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని ఆశీర్వదించాడు. బర్జిల్లయి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. రాజు, అతని పరివారం నదిని దాటారు.
2SA 19:40 గిల్గాలుకు వెళ్లటానికి రాజు యొర్దాను నదిని దాటినప్పుడు, కింహాము కూడ అతనితో వెళ్లాడు. యూదా ప్రజలంతా, ఇశ్రాయేలు ప్రజలలో సగంమంది, దావీదును నది దాటించారు.
2SA 19:41 ఇశ్రాయేలీయులంతా రాజు వద్దకు వచ్చి, “యూదావారైన మా సోదరులు నిన్ను ఎత్తుకు పోయారు. మళ్లీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరివారాన్నీ తిరిగి తీసుకొని వచ్చారు! ఎందువలన?” అని ప్రశ్నించారు.
2SA 19:42 యూదా ప్రజలంతా ఇశ్రాయేలీయులకు ఇలా సమాధానం చెప్పారు: “మేము ఆ విధంగా ఎందుకు చేశామంటే రాజు మాకు దగ్గర బంధువు కాబట్టి ఈ విషయంలో మీరు మా పట్ల ఎందుకు కోపంగావున్నారో తెలియటం లేదు. అయినా రాజు చేత ఖర్చు పెట్టించి మేము ఏమి తినలేదు! పైగా రాజు మాకు ఏమీ బహుమానాలు ఇవ్వనూలేదు!”
2SA 19:43 అప్పుడు ఇశ్రాయేలీయు ఇలా అన్నారు “రాజును ఎంపిక చేసుకోవటంలో మేము అత్యధిక సంఖ్యలో పాల్గొన్నాము. దావీదులో మాకు పది భాగాలున్నాయి. కావున దావీదుతో వ్యవహారానికి మీకంటె మాకే ఎక్కువ హక్కు వుంది! కాని మీరు మమ్మల్ని లక్ష్యపెట్టలేదు! ఎందువల్ల? నిజానికి రాజును తిరిగి తీసుకొని రావాలని మేము ముందుగా అనుకున్నాము!” కాని యూదా ప్రజలు ఇశ్రాయేలీయులతో బాగా నిందారోపణ చేస్తూ చెడుగా మాట్లాడారు. యూదా వారి మాటలు ఇశ్రాయేలీయులు అన్నవాటికంటె చాలా తీవ్రంగా వున్నాయి.
2SA 20:1 బిక్రి కుమారుడైన షెబ అనే పనికిమాలిన వాడొకడు అక్కడ వుండటం జరిగింది. షెబ అనేవాడు బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బూర వూది, “దావీదులో మనకు భాగం లేదు. యెష్షయి కుమారునితో మనకేమీ సంబంధం లేదు! కావున ఇశ్రాయేలీయులారా, మనమంతా మన గుడారాలకు పోదాం పదండి” అని చెప్పాడు.
2SA 20:2 దానితో ఇశ్రాయేలీయులు దావీదును వదిలి, బిక్రి కుమారుడైన షెబను అనుసరించారు. కాని యూదా ప్రజలు మాత్రం యొర్దాను నది వద్ద నుండి యెరూషలేముకు వచ్చేవరకు దారి పొడవునా వారి రాజైన దావీదుతోనే వున్నారు.
2SA 20:3 దావీదు యెరూషలేములోని తన ఇంటికి వచ్చాడు. గతంలో దావీదు తన ఉపపత్నులను పది మందిని ఇల్లు చక్కదిద్దేందుకై వదిలి వెళ్లాడు. ఇప్పుడు దావీదు ఈ స్త్రీలను ఒక ప్రత్యేకమైన ఇంటిలో వుంచాడు. ఆ ఇంటికి సైనిక కాపలా ఏర్పాటు చేశాడు. ఆ స్త్రీలు తమ జీవితాంతం ఆ ఇంటిలోనే వుండిపోయారు. దావీదు వారికి ఆహారాదులిచ్చాడు గాని, వారితో సాంగత్యం చేయలేదు. వారి మరణ పర్యంతం ఆ స్త్రీలు విధవరాండ్రవలె జీవించారు.
2SA 20:4 రాజు అమాశాను పిలిచి, “యూదా ప్రజలను మూడు రోజులలో నన్ను కలవమని చెప్పు. నీవు కూడా ఇక్కడ వుండాలి” అని అన్నాడు.
2SA 20:5 యూదా ప్రజలందరినీ పిలిచి కూడగట్టుకు రావటానికి అమాశా వెళ్లాడు. కాని రాజు పెట్టిన గడువుకంటె అమాశా ఎక్కువ కాలాన్ని తీసుకున్నాడు.
2SA 20:6 దావీదు అబీషైని పిలిచి, “బిక్రి కుమారుడైన షెబ మనకు అబ్షాలోముకంటె ఎక్కువ ప్రమాద కరమైన మనిషి. కావున నా సైనికులను తీసుకొని షెబను వెంటాడు. షెబ ప్రాకారాలున్న నగరాలలోనికి తప్పించుకునే ముందుగానే నీవు త్వరపడాలి. షెబ గనుక ప్రాకారాలున్న నగరాలలోకి వెళ్లినాడంటే ఇక వాడు మననుండి తప్పించుకున్నట్లే,” అని అన్నాడు.
2SA 20:7 కనుక యోవాబు మనుష్యులు, కెరేతీయులు, పెలేతీయులు, తదితర సైనికులు యెరూషలేము నుండి బయలుదేరి వెళ్లారు. బిక్రి కుమారుడైన షెబను వారు వెంటాడారు.
2SA 20:8 గిబియోను గుట్ట వద్దకు యోవాబు తన సైనికులతో వచ్చినప్పుడు అమాశా వారిని కలవటానికి ఎదురేగాడు. యోవాబు తన సైనిక దుస్తుల్లో వున్నాడు నడికట్టు కట్టుకున్నాడు. అతని ఒరలో కత్తి వున్నది. అమాశాను కలవటానికి యోవాబు ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో తన ఒరలోని కత్తి జారి క్రిందపడింది. యోవాబు ఆ కత్తిని తీసి చేతితో పట్టుకున్నాడు.
2SA 20:9 “సోదరా, నీవు క్షేమమేనా?” అని యోవాబు అమాశాను అడిగినాడు. యోవాబు తన కుడిచేతితో అమాశాను ముద్దు పెట్టుకునేందుకా అన్నట్టు గడ్డం పట్టుకున్నాడు.
2SA 20:10 యోవాబు చేతిలో వున్న కత్తిని అమాశా గమనించలేదు. యోవాబు తన కత్తితో అమాశా పొట్టలో పొడిచాడు. అమాశా పేగులన్నీ బైటకు వచ్చాయి. యోవాబు మళ్లీ పొడిచే అవసరం లేకుండా పోయింది — అమాశా అప్పుడే చనిపోయాడు. యోవాబు, అతని సోదరుడు అబీషై కలిసి బిక్రి కుమారుడు షెబను తరమటం కొనసాగించారు.
2SA 20:11 యోవాబు సైనికులలో యువకుడైన వాడొకడు అమాశా శవం వద్ద నిలబడ్డాడు. ఆ యువకుడు మిగిలిన వారి నుద్దేశించి, “మీలో యోవాబును, దావీదును బలపర్చే ప్రతి ఒక్కడూ యోవాబును అనుసరించి వెళ్లాలి. షెబను వెంటాడటంలో అతనికి సహాయం చేయండి!” అని అన్నాడు.
2SA 20:12 మార్గ మధ్యంలో అమాశ శవం రక్తపు మడుగులో పడివుంది. జనమంతా శవాన్ని చూసే నిమిత్తం అక్కడ ఆగుతూ ఉన్నారు కావున ఆ యువకుడు అమాశా శవాన్ని ప్రక్కనే వున్న పొలంలోనికి లాగి, దాని మీద ఒక బట్ట కప్పాడు.
2SA 20:13 అమాశా శవం బాట మీద నుంచి తీసివేయబడిన పిమ్మట జనమంతా యోవాబును అనుసరించారు. బిక్రి కుమారుడు షెబను తరిమేందుకు వారు యోవాబుతో కలిసి వెళ్లారు.
2SA 20:14 బిక్రి కుమారుడు షెబ ఇశ్రాయేలు వంశపు వారు నివసించే ప్రాంతాల గుండా పోయి ఆబేలు బేత్మయకా నగరాన్ని చేరాడు. బెరీయులందరూ కూడి షెబను అనుసరించారు.
2SA 20:15 యోవాబు, అతని మనుష్యులు ఆబేలు బేత్మయకా వద్దకు వచ్చారు. యోవాబు సైన్యం నగరాన్ని ముట్టడించింది. నగరం చుట్టూవున్న గోడకు వారు ఒక చోట కందకం పూడ్చి బాగా మట్టి పోశారు. అలా మట్టి పోయటంతో వారు గోడ దగ్గరకు వెళ్ల గలిగారు. ఆ గోడను పడగొట్టే ఉద్దేశంతో వారప్పుడు దానిని పగులగొట్టటం మొదలుపెట్టారు.
2SA 20:16 ఇంతలో ఒక వివేకం గల స్త్రీ నగరంలో నుండి కేకలు పెట్టింది. “నే చెప్పేది వినండి. యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పండి. అతనితో నేను మాట్లాడదలిచాను!” అని అరిచింది.
2SA 20:17 ఆ స్త్రీ తో మాట్లాడటానికి యోవాబు దగ్గరగా వచ్చాడు. “యోవాబువు నీవేనా?” అని ఆమె అడిగింది. “అవును. నేనే” అని యోవాబు సమాధానం చెప్పాడు. “అయితే నేను చెప్పేది విను!” అని ఆస్త్రీ యోవాబుతో అన్నది. “వింటున్నాను” అని యోవాబు అన్నాడు.
2SA 20:18 ఆ స్త్రీ ఇలా అన్నది, “పూర్వం ప్రజలు ‘సలహా కొరకు ఆబేలులో అడగమని అనే వారు. అప్పుడు వారి సమస్య తీరిపోయేది.’
2SA 20:19 శాంతిని కోరే వారిలో, ఇశ్రాయేలు పట్ల విశ్వాసముగల వారిలో నేనొక దానిని. ఇశ్రాయేలులో ఒక ముఖ్యనగరాన్ని నీవు నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నావు. యెహోవాకి చెందిన దానిని నీవెందుకు నాశనం చేయ సంకల్పించావు?”
2SA 20:20 “లేదు! లేదు! నేను దేనినీ నాశనం చేయదల్చలేదు మీ పట్టణాన్ని నిర్మూలించను.
2SA 20:21 కాని ఎఫ్రాయిము కొండ ప్రాంతము వాడొకడున్నాడు. వాని పేరు షెబ. అతడు బిక్రి యొక్క కుమారుడు. వాడు దావీదు రాజుపై తిరుగుబాటు చేశాడు. నీవు గనుక వానిని నా కప్పగించితే, నేను నగరాన్ని వదిలి పెడతాను,” అని యోవాబు అన్నాడు. “అయితే సరే! అతని తల గోడ మీది నుంచి మీకు విసరివేయబడుతుంది” అని ఆస్త్రీ యోవాబుతో అన్నది.
2SA 20:22 తరువాత ఆ స్త్రీ నగర ప్రజలందరితో చాలా యుక్తిగా మాట్లాడింది. అది విని ఆ నగరవాసులు బిక్రి కుమారుడు షెబ తల నరికి దానిని గోడ మీదుగా యోవాబుకు విసరివేశారు. అప్పుడు యోవాబు బూర వూదగా సైన్యం నగరం వదిలి వెళ్లిపోయింది. ప్రతివాడూ తన గుడారానికి వెళ్లిపోయాడు. యెరూషలేములో వున్న రాజు వద్దకు యోవాబు వెళ్లాడు.
2SA 20:23 ఇశ్రాయేలు రాజ్యంలో యోవాబు సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. కాని కెరేతీయులకును, పెలేతీయులకును యెహోయాదా కుమారుడైన బెనాయా అధిపతి.
2SA 20:24 వెట్టి చాకిరీ వంటి శరీర కష్టం చేసేదండుకు అదోరాము నాయకత్వం వహించాడు. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు చరిత్రకారుడుగా నియమితుడయ్యాడు.
2SA 20:25 షెవా ప్రధాన కార్యదర్శిగాను; సాదోకు, అబ్యాతారు యాజకులుగాను;
2SA 20:26 మరియు యాయీరీయుడగు ఈరా రాజుకు ప్రధానా చార్యుడుగను వున్నారు.
2SA 21:1 దావీదు కాలంలో ఒకసారి కరువు సంభవించింది. ఆ కరువు మూడు సంవత్సరాలు కొనసాగింది. దావీదు యెహోవాను ప్రార్థించాడు. దావీదు ప్రార్థన ఆలకించి యెహోవా ఇలా అన్నాడు: “సౌలు, మరియు అతని హంతకుల కుటుంబం ఈ కరువుకు కారణం. ఇప్పడీ కాటకం (కష్టం) సౌలు గిబియోనీయులను చంపివేసినందుకు వచ్చింది.”
2SA 21:2 (గిబియోనీయులు ఇశ్రాయేలు వారు కాదు. చావగా మిగిలిన అమ్మోరీయులకు చెందిన ఒక గుంపువారు. ఇశ్రాయేలీయులు వారికి కీడు చేయబోమని గిబియోనీయులకు ప్రమాణ పూర్వకంగా చెప్పియున్నారు. కాని సౌలు ఇశ్రాయేలీయుల పట్ల, యూదా వారి పట్ల ప్రేమకలవాడై గిబియోనీయులను చంపబూనాడు) దావీదు రాజు గిబియోనీయులను పిలిచాడు. అతడు వారితో మాట్లాడాడు.
2SA 21:3 “నేను మీకు ఏమి సహాయం చేయగలను? మీరు యెహోవా ప్రజలను దీవించేలాగున నేను ఇశ్రాయేలు వారి పాపాన్ని పోగొట్టటానికి ఏమి చేయాలి?” అని దావీదు గిబియోనీయులను అడిగాడు.
2SA 21:4 “సౌలు, అతని కుటుంబం వారు చేసిన పాపాలకు పరిహారంగా వెండి బంగారాలు ఇవ్వాలని అడిగే హక్కుగాని, ఇశ్రాయేలులో ఎవ్వరినైనా చంపేహక్కుగాని మాకు లేదు” అని గిబియోనీయులు దావీదుతో అన్నారు. “అయితే మీకు నేనేమి చేయగలను?” అని దావీదు అడిగాడు.
2SA 21:5 అప్పుడు గిబియోనీయులు దావీదుతో ఇలా అన్నారు, “సౌలు మాకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. ఇశ్రాయేలులో మిగిలివున్న మా ప్రజలందరినీ సర్వనాశనం చేయాలని ప్రయత్నించాడు.
2SA 21:6 సౌలు యోహోవాచే ఎంపిక చేయబడిన రాజు. కావున అతని ఏడుగురు కుమారులను మా వద్దకు తీసుకొని రా. వారిని మేము సౌలు యొక్క గిబియా పర్వతం మీద యెహోవా ఎదుట ఉరితీస్తాము.” రాజైన దావీదు, “వారిని మీకు నేను అప్పగించెద” నని అన్నాడు.
2SA 21:7 కాని రాజు యోనాతాను కుమారుడైన మెఫిబోషెతుకు రక్షణ కల్పించాడు. (యోనాతాను సౌలు కుమారుడు) ఆ మేరకు దావీదు యెహోవా పేరు మీద యోనాతానుకు ప్రమాణం చేసియున్నాడు. అందువల్ల రాజు వారిని మెఫీబోషెతుకు హాని చేయించలేదు.
2SA 21:8 అయ్యా కుమార్తెయగు రిస్పాకు సౌలువలన పుట్టిన ఇద్దరు కుమారులను రాజు తీసుకున్నాడు. వారిద్దరి పేర్లు అర్మోని మరియు మెఫీబోషెతు రిస్పా కుమారులైన ఈ ఇద్దరినీ, మరియు సౌలు కుమార్తెయగు మెరాబునకు పుట్టిన ఐదుగురు కుమారులను రాజు తీసుకున్నాడు. (మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలువలన మెరాబునకు పుట్టిన వారీ ఐదుగురు పుత్రులు)
2SA 21:9 దావీదు ఈ ఏడుగురు కుమారులను గిబియోనీయులకు అప్పగించాడు. అప్పుడు గిబియోనీయులు ఈ ఏడుగురిని గిబియా పర్వతంమీద యెహోవా సాన్నిధ్యంలో ఉరితీశారు. ఈ ఏడుగురు కుమారులు కలిసి చనిపోయారు. యవల ధాన్యంపంట కోత ప్రారంభకాలంలో వారు చంపబడ్డారు.
2SA 21:10 అయ్యా కుమార్తె రిస్పా విషాద సూచకమైన ఒక వస్త్రం తీసుకొని కొండ మీద పరచింది. ఆ వస్త్రం పంట కోతలు మొదలు పెట్టినపప్పటి నుండి దానిమీద వర్షం పడే వరకు ఆ కొండ మీద పర్చబడివుంది. పగటి వేళ పక్షులు వచ్చి తన కుమారుల శవాలను ముట్టకుండా రిస్పా చూచేది. రాత్రిళ్లు పొలాల్లో నుంచి జంతువులు వచ్చి కుమారుల శవాలను ముట్టకుండగనూ కాపాడేది.
2SA 21:11 అయ్యా కుమార్తెయు, సౌలు దాసి అగు రిస్పా చేస్తున్నదంతా ప్రజలు దావీదుకు చెప్పారు.
2SA 21:12 అప్పుడు దావీదు యాబేష్గిలాదు వారి నుండి సౌలు యొక్కయు, యోనాతాను యొక్కయు ఎముకలను తీసుకున్నాడు. (యాబేషు వారు ఈ ఎముకలను బేత్షానులోని పధ్రాన వీధి నుండి దొంగిలించారు. బేత్షానులోని ఈ వీధిలోనే గతంలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానుల శవాలను వేలాడదీశారు. గిల్బోవ వద్ద సౌలును చంపిన తరువాత ఫిలిష్తీయులు ఆ శవాలను వేలాడదీశారు)
2SA 21:13 దావీదు గిలాదు నుంచి సౌలు యొక్కయు, అతని కుమారుడైన యోనాతాను యొక్కయు ఎముకలను తెచ్చనాడు. తరువాత ప్రజలు ఉరి తీయబడిన సౌలు యొక్క ఏడుగురి కమారుల శవాలను సేకరించారు.
2SA 21:14 బెన్యామీనులోని సేలా అనేచోట సౌలు యొక్క అతని కుమారుడు యోనాతాను యొక్క ఎముకలను వారు పాతి పెట్టారు. శవాలను మాత్రం సౌలు తండ్రి కీషు సమాధియందు వారు పాతిపెట్టారు. రాజు యొక్క ఆజ్ఞాను సారం ప్రజలు ఇవన్నీ చేశారు. రాజ్యంలోని ప్రజల ప్రార్థన దేవుడు ఆలకించాడు.
2SA 21:15 దావీదుతో ఫిలిష్తీయులు మరల యుద్ధానికి దిగారు. దావీదు తన సైన్యంతో ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి తరలివెళ్లాడు. కాని దావీదు బాగా అలసిపోయి బలహీనపడిపోయాడు.
2SA 21:16 ఇష్బిబే నోబ అనే రెఫాయీముల సంతతి వాడొకడున్నాడు. ఇష్బిబే నోబ ఈటె మూడు వందల షెకెలుల ఇత్తడి ప్రమాణంలోవుంది. వానికొక కొత్త కత్తి కూడావున్నది. వాడు దావీదును చంపయత్నించాడు.
2SA 21:17 కాని సెరూయా కుమారుడైన అబీషై ఆ ఫిలిష్తీయుని చంపి, దావీదు ప్రాణం కాపాడాడు. అప్పుడు దావీదు మనుష్యులు అతనికి ఒక ప్రమాణం చేశారు. “ఇకమీదట నీవు యుద్ధాలు చేయటానికి బయటికి వెళ్లరాదు. ఒక వేళ వెళితేమాత్రం నీవు చంపబడతావు. దానితో ఇశ్రాయేలు ఒక మహానాయకుని కోల్పోతుంది,” అని చెప్పారు.
2SA 21:18 తరువాత గోబు వద్ద ఫిలిష్తీయులతో మరో యుద్ధం జరిగింది. అందులో హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీముల సంతతివాడగు సపును చంపాడు. సపు భయంకరాకారుడు.
2SA 21:19 ఫిలిష్తీయులతో గోబువద్ద మరో యుద్ధం జరిగింది. అక్కడ ఎల్హానాను అనువాడు గిత్తీయుడైన గొల్యాతును సంహరించాడు. ఎల్హానాను బేత్లెహేము వాడైన యహరేయోరెగీము అనువాని కుమారుడు. గొల్యాతు ఈటె సాలి వాని దోనెవలె మందంగా, పొడవుగావుంది.
2SA 21:20 గాతువద్ద మళ్లీ యుద్ధం జరిగింది. అక్కడ మహా కాయుడొకడున్నాడు. వాని కాళ్లకు, చేతులకు ఒక్కొక్కదానికి ఆరేసివ్రేళ్ల చొప్పున మొత్తము ఇరవై నాలుగువున్నాయి. అతడు రాక్షసాకారులగు రెఫాయీముల సంతతివాడు.
2SA 21:21 ఈ మనుష్యుడు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి కాలుదువ్వాడు. దావీదు సోదరుడైన షిమ్యా కుమారుడు యోనాతాను వానిని చంపివేశాడు.
2SA 21:22 ఈ నలుగురూ గాతుకు చెందిన భీకరుడైన రెఫా సంతతివారు. వీరంతా దావీదువలన, అతని సైనికుల వలన చంపబడ్డారు.
2SA 22:1 యెహోవా దావీదును సౌలు నుండి, తదితర శత్రువుల బారి నుండి తప్పించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దావీదు ఈ స్తుతిగీతం ఆలపించాడు:
2SA 22:2 యెహోవా నా కొండ, నా కోట, నా రక్షకుడు!
2SA 22:3 సహాయంకొరకు నేనాయనను ఆశ్రయిస్తాను! ఆయన నా రక్షణ దుర్గం! దేవుడు నా రక్షణ స్థలం! ఆయన శక్తి నన్ను రక్షిస్తుంది! యెహోవా నా ఉన్నత దుర్గము ఆయన నా భద్రమైన తావు. నాకు కీడు రాకుండా కాపాడే రక్షకుడు!
2SA 22:4 యెహోవా స్తుతింపబడుగాక! ఆదుకొమ్మని యెహోవాను వేడుకున్నాను దేవుడు నా శత్రువుల బారి నుండి నన్ను రక్షించును!
2SA 22:5 మృత్యు తరంగాలు నన్ను చుట్టుముట్టాయి, కష్టాలు ముంచుకొచ్చాయి. అవి నన్ను బెదరగొట్టాయి!
2SA 22:6 సమాధి ఉచ్చులు నాచుట్టూ బిగిశాయి, మృత్యు మాయలో చిక్కుకున్నాను!
2SA 22:7 నేను కష్టాల ఊబిలో వున్నాను. అయినా నేను యెహోవాని అర్థించాను. అవును, నేను నా దేవుని పిలిచాను! ఆయన తన ఆలయంలో వున్నాడు, ఆయన నా మొరాలకించాడు; నా ఆక్రందన ఆయన చెవులను చేరింది.
2SA 22:8 భూమి విస్మయం చెంది, కంపించింది, పరలోకపు పునాదులు కదిలి పోయాయి, యెహోవా కోపావేశుడైన కారణాన!
2SA 22:9 ఆయన ముక్కు రంధ్రాల నుండి పొగబారింది, ఆయన నోటి నుండి అగ్ని శిఖలు వెలువడ్డాయి.
2SA 22:10 ఆకాశమును ఛేదించుకొని ఆయన భువికి దిగి వచ్చాడు! ఆయన ఒక కారు మేఘముపై నిలబడ్డాడు!
2SA 22:11 యెహోవా కెరూబు దూతల మీద వేగంగా వచ్చాడు; అవును, ఆయన గాలి రెక్కలపై పయనించటం ప్రజలు చూసారు!
2SA 22:12 యెహోవా కారుచీకటిని తన చుట్టూ డేరావలె కప్పుకున్నాడు. ఆయన వానమబ్బులను ఆకాశంలో పోగు చేస్తాడు.
2SA 22:13 ఆయన తేజస్సు బొగ్గులను మండింప చేసింది!
2SA 22:14 యెహోవా ఆకాశంలో గర్జించాడు ఆ సర్వోన్నతుడు మాట్లాడాడు!
2SA 22:15 యెహోవా బాణములు వేసి శత్రువులను చెల్లాచెదరు చేశాడు. యెహోవా మెరుపులను ప్రసరింప చేశాడు, వారు భయకంపితులై పారిపోయారు.
2SA 22:16 అప్పుడు ప్రజలు సముద్రపు అడుగును చూడ గలిగారు, భూమి పునాదులు బహిర్గతమయ్యాయి.! యెహోవా గర్జించగా అవన్నియూ జరిగాయి, ఆయన నాసికారంధ్రముల నుండి వెలువడిన వేడిగాల్పులకు అలా జరిగాయి!
2SA 22:17 యెహోవా ఆకాశం నుండి చేయిచాచి నన్ను పట్టుకున్నాడు! అనంత జలరాసుల నుండి నన్ను వెలికి తీశాడు;
2SA 22:18 నాబద్ధ శత్రువు నుండి, నన్ను ద్వేషించు వారి నుండి ఆయన నన్ను కాపాడాడు. నా శత్రువులు నిజానికి నా శక్తికి మించిన వారు, కావున వారి నుండి ఆయన నన్ను కాపాడాడు!
2SA 22:19 నా కష్టకాలంలో శత్రువులు నన్నెదిరించగా యెహోవా నన్నాదుకున్నాడు!
2SA 22:20 నాకు నిర్భయత్వమును కలుగ జేశాడు. ఆయనకు నేను ప్రీతిపాత్రుడను గనుక ఆయన నన్ను కాపాడాడు. నేను న్యాయ బద్దమైన పనులు చేయుటచే యెహోవా నన్ను సత్కరించాడు;
2SA 22:21 యెహోవా నన్ను సత్కరించాడంటే నా చేతులు పాపం చేయక పరిశుద్ధంగా వున్నాయి!
2SA 22:22 అంటే, యెహోవా యొక్క న్యాయ మార్గాన్ని నేననుసరించాను!
2SA 22:23 యెహోవా యొక్క తీర్పులు నిత్యం నా మదిలో మెదలుతూనే ఉంటాయి. ఆయన ఆజ్ఞలను నేనెన్నడూ విడనాడను.
2SA 22:24 దేవుని ముందు నేను దోషిని కాను; నేను పాపానికి దూరంగా ఉంటాను!
2SA 22:25 అందువల్లనే యెహోవా నాకు ప్రతిఫలమిచ్చును. ఎందుకంటే, నేను న్యాయబద్ధంగా నివసిస్తాను! దేవుడు గమనించేలా నేను నిష్కళంక జీవితాన్ని గడుపుతాను.
2SA 22:26 నిన్నొక్క వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే, నీవు నీ ప్రేమానురాగాలను వానికి పంచి ఇస్తావు! ఒక వ్యక్తి నీ పట్ల నిజాయితీగా వుంటే నీవు కూడ అతని పట్ల సత్యసంధుడవై వుంటావు!
2SA 22:27 ఎవరైనా నీ పట్ల సత్ప్రవర్తనతో మెలిగితే, నీవు కూడ అతని పట్ల సద్భావం చూపిస్తావు! కాని ఎవరైనా నీకు ప్రతికూలంగా వుంటే, నీవు కూడ ప్రతికూలుడవై వుంటావు!
2SA 22:28 ఆపదలోవున్న వారిని నీవు ఆదుకుంటావు, కాని గర్వాంధులను తిరస్కరిస్తావు. గర్వముగల వానిని అవమానిస్తావు పొగరు బోతులను నేలరాస్తావు!
2SA 22:29 యెహోవా, నీవు నాకు వెలుగైయున్నావు. యెహోవా నా చుట్టూ అలుముకొన్న చీకటిని పారదోలి వెలుగు నిస్తావు.
2SA 22:30 మూకుమ్మడిగా మీద పడే సైనికులను చెండాడేలా నాకు సహాయపడ్డావు. దేవుడిచ్చిన శక్తితో, నేను ప్రాకారాలను దూక గలను!
2SA 22:31 దేవుని మార్గము దోషరహితమైనది; యెహోవా మాట పొల్లుపోనిది. తనను శరణుజొచ్చిన ప్రతి వానినీ యెహోవా రక్షిస్తాడు.
2SA 22:32 యెహోవాను మించిన దేవుడు లేడు; మన దేవునిలా కొండ వంటి మరో అండలేదు.
2SA 22:33 దేవుడు నా రక్షణ దుర్గం; సన్మార్గుల జీవన మార్గంలో దేవుడు నడచి మార్గదర్శకుడవుతాడు!
2SA 22:34 జింక కాళ్ల వేగాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తాడు! ఉన్నత స్థలాల మీద నన్ను నిలకడగా నిలుపుతాడు.
2SA 22:35 దేవుడు నాకు యుద్ధానికి శిక్షణ యిస్తాడు. నా చేతులు ఇత్తడి విల్లంబును వంచి వేయగలవు.
2SA 22:36 డాలువలె నీవు నన్ను రక్షిస్తావు! నీ సహాయం నన్ను ఉన్నతుని చేసింది!
2SA 22:37 నా పాదాలు తడబడకుండా నీవు నా మార్గాన్ని విశాలం చేశావు.
2SA 22:38 నేను నా శత్రువులను తరిమి, వారిని నాశనం చేశాను! వారిని సర్వనాశనం చేసేదాకా నేను వెనుకకు తిరుగను;
2SA 22:39 నేను నా శత్రువులను నాశనం చేశాను, నేను వారిని పూర్తిగా సంహరించాను! వారు మరల తలయెత్తే అవకాశం లేదు! అవును, నేను నా శత్రువులను నా కాలరాశాను!
2SA 22:40 ఎందువల్లననగా నీవు నన్ను యుద్ధంలో బలవంతునిగా చేశావు. నీవే నా శత్రువులను ఓడించినావు.
2SA 22:41 నా శత్రువులు పరుగెత్తి పోయేలా నీవు చేశావు! నన్ను అసహ్యించుకునే వారిని నేను ఓడిస్తాను!
2SA 22:42 నా శత్రవులు సహాయం కోసం తల్లడిల్ల గా వారిని ఆదుకొనే వారొక్కరూ లేకుండిరి!
2SA 22:43 నా శత్రుమూకను తుత్తునియలు చేశాను! వారు నేలమీది ధూళిలా చితికిపోయారు; నా శత్రువులు వీధిలోని బురదగా మారేలాగు వారిని నా పాదములతో అణగ దొక్కాను.
2SA 22:44 నా ప్రజలు నన్ను వ్యతిరేకించినప్పుడు కూడా నీవు నన్ను కాపాడావు! నన్ను రాజ్యాలకు అధిపతిగా చేశావు; నాకు తెలియని ప్రజలు నన్ను సేవిస్తారు!
2SA 22:45 ఇతర రాజ్యాల ప్రజలు నాకు విధేయులవుతారు! నా పేరు వినినంతనే వారు విధేయులవుతారు.
2SA 22:46 అన్య రాజ్యాల వారు నేనంటే భయపడతారు; భయకంపితులై వారి రహస్య స్థావరాల నుండి బయటికి వస్తారు!
2SA 22:47 యెహోవా నిత్యుడు! కొండంత అండ అయిన నా దేవుని నామమును కీర్తించండి! ఆయనను సర్వోన్నతునిగా స్వీకరించండి! అయన నన్ను కాపాడే కొండ;
2SA 22:48 నా కొరకు నా శత్రువులను దండించే దేవుడు, ప్రజలను నా పాలనలోకి తెచ్చు వాడాయన;
2SA 22:49 నా శత్రువుల నుండి నన్ను విముక్తి చేయువాడు ఆయనే! అవును, నా శత్రువులకు మిన్నగా నన్ను ఉన్నతుని చేశావు! నన్ను గాయపర్చనుద్దేశించిన వాని నుండి నన్ను రక్షించావు.
2SA 22:50 యెహోవా! అన్ని రాజ్యాల సమక్షంలో నీకు స్తోత్రములు అర్పిస్తున్నాను!
2SA 22:51 ఆయన నియమించిన రాజుకు దిగ్విజయం కలిగేలా యెహోవా సహాయపడతాడు; ఆయన అభిషిక్తము చేసిన రాజైన దావీదుకు, అతని సంతతికి అనంతంగా దేవుడు తన ప్రేమానురాగాలను పంచి ఇస్తాడు!
2SA 23:1 ఇవి దేవునిచే ఉన్నతుడుగా చేయబడిన వ్యక్తి, “యాకోబు దేవునిచే అభిషిక్తము చేయబడిన రాజు, ఇశ్రాయేలు మధుర గాయకుడు, యెష్షయి కుమారుడు అయిన దావీదు పలికిన తుది పలుకులు. దావీదు ఇలా అన్నాడు:
2SA 23:2 యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడినది. ఆయన పలుకే నా నోటిలో వున్నది.
2SA 23:3 ఇశ్రాయేలు దేవుడు మాట్లాడాడు, ఇశ్రాయేలుకు, ఆశ్రయదుర్గమైన దేవుడు నాతో యిలా అన్నాడు: ‘ఏ వ్యక్తి ప్రజలను న్యాయమార్గాన పరిపాలిస్తాడో, ఏ వ్యక్తి దైవ భీతితో పరిపాలన సాగిస్తాడో
2SA 23:4 ఆ వ్యక్తి అరుణోదయ కాంతిలా ప్రకాశిస్తాడు, ఆ వ్యక్తి మబ్బులేని ప్రాతఃకాలంలా ప్రశాంత గంభీ రంగా వుంటాడు, లేతగడ్డిని చిగురింపజేయు వర్షానంతర సూర్యకాంతిలా ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు.’
2SA 23:5 “గతంలో దేవుడు నా కుటుంబాన్ని బలపర్చలేదు. తరువాత దేవుడు నాతో ఒక శాశ్వత ఒడంబడిక చేశాడు. అది సమగ్రమైన నిబంధనగా దేవుడు రూపొందించాడు. ఈ ఒడంబడికను దేవుడు బలపర్చాడు. దానిని ఆయన ఉల్లంఘించడు! ఈ ఒడంబడిక నాకు మోక్ష సాధనం; నేను కోరినదల్లా ఈ ఒడంబడికనే; ఖచ్చితంగా యెహోవా దానిని వర్ధిల్లేలాగు చేస్తాడు!
2SA 23:6 “కాని దుష్టులు ముండ్లవంటి వారు. జనులు ముండ్లనుచేతబట్టరు. వాటిని తక్షణం విసర్జిస్తారు!
2SA 23:7 వాటిని ఎవరు తాకినా కర్ర, ఇనుము బల్లెములతో గుచ్చివేసినట్లవుతుంది. దుష్టులు కూడ ముండ్ల వంటి వారు వారు అగ్నిలో తోయబడి పూర్తిగా దహింపబడతారు.”
2SA 23:8 దావీదు సైన్యంలో ప్రముఖుల పేర్లు ఇలా వున్నాయి: తక్మోనీయుడగు యోషేబెష్షెబెతు ముగ్గురు యోధుల అధిపతి. ఎస్నీయుడైన అదీనా అని కూడ ఇతడు పిలవబడేవాడు. యోషేబెష్షెబెతు ఒక్క యుద్ధంలోనే ఎనిమిది వందల మందిని చంపివేశాడు.
2SA 23:9 అహోహీయుడైన దోదో కుమారుడు ఎలియాజరు తరువాత ప్రముఖుడు. దావీదు ఫిలిష్తీయులను ఎదిరించిన కాలంలో అతనితో వున్న ముగ్గురు యోధులలో ఎలియాజరు ఒకడు. ఒక పర్యాయము ఫిలిష్తీయలు గుమిగూడి ఇశ్రాయేలీయుల మీదికి యుద్ధానికిరాగా, ఇశ్రాయేలీయులు పారిపోయారు.
2SA 23:10 అప్పుడు ఎలియాజరు మాత్రము అలసిపోయేవరకు ఫిలిష్తీయులతో ఒంటరిగా పోరాడాడు. తన చెయ్యి కత్తి పిడికి అంటుకుపోయేలా గట్టిగా పట్టుకుని విడవకుండా శత్రుసంహారం చేశాడు. ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని సమకూర్చి పెట్టాడు. ఎలియాజరు యుద్ధంలో గెలిచిన తరువాత, జనంతిరిగి వచ్చారు. కాని నిజానికి వారు ఓడిపోయిన శత్రువులను దోచుకోడానికి మాత్రమే వచ్చారు.
2SA 23:11 హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా తరువాత ప్రముఖ సేనాని. ఒక పర్యాయం ఫిలిష్తీయులు వచ్చి నిండుగా పండిన అలసందల చేనువద్ద గుమిగూడారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను చూసి పారి పోయారు.
2SA 23:12 కాని షమ్మా మాత్రం చేను మధ్యలో నిలబడ్డాడు. అతడు చేనును కాపాడుతూ పోరాడాడు. అతడు ఫిలిష్తీయులను హత మార్చాడు. అప్పుడు కూడ యెహావా వారికి ఘన విజయం చేకూర్చాడు.
2SA 23:13 పంట కోతకాలంలో ముప్పై మంది సైనికులలో ఘటికులైన ముగ్గురు ఒక సారి దావీదు వద్దకు వచ్చారు. ఈ ముగ్గురూ అదుల్లాము గుహవద్దకు వచ్చారు. రెఫాయీము లోయలో ఫిలిష్తీయుల సైన్యం గూడారాలు వేసింది.
2SA 23:14 ఆ సమయంలో దావీదు కోటలో వున్నాడు. బేత్లెహేములో కొంత మంది ఫిలిష్తీయుల సైనికులున్నారు.
2SA 23:15 తన స్వగ్రామంలోని నీరు తాగాలనే ప్రగాఢవాంఛ దావీదుకు కలిగింది. “ఓహో, బేత్లెహేము నగర ద్వారం వద్దగల బావి నీరు ఎవరైనా తెచ్చియిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను,” అని దావీదు అన్నాడు. వాస్తవంగా దావీదు దీనిని కోరలేదు; కాని తానలా మట్లాడాడు.
2SA 23:16 కాని ముగ్గురు బలాఢ్యులు మాత్రం ఫిలిష్తీయుల సైనికులను ఛేధించుకుంటూ వెళ్లారు. బేత్లెహేము నగర ద్వారంవద్దగల బావి నుండి నీరు తీసుకున్నారు. దానిని వారు దావీదు వద్దకు తెచ్చారు. కాని దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. అతడా నీటిని యెహోవా ముందు పారబోశాడు.
2SA 23:17 దావీదు యెహోవాతో, “యెహోవా, నేను దీనిని తాగలేను! నా కొరకు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వెళ్లిన వారి రక్తం తాగి నట్లుగా వుంటుంది,” అని అన్నాడు. అందువల్ల దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఈ ముగ్గురు సైనికులు అలా అనేక సాహసకృత్యాలు చేశారు.
2SA 23:18 సెరూయా కుమారుడైన యోవాబు సోదరుడగు అబీషై ఈ ముగ్గురు సైనికులకు నాయకుడు. అబీషై తన ఈటెనుపయోగించి మూడు వందల శత్రుసైనికులను హతమార్చాడు. అతను కూడ ఆ ముగ్గరు సైనికులంత ప్రఖ్యాతి వహించాడు.
2SA 23:19 వారి ముగ్గురు కంటె అబీషై మిక్కిలి ప్రశంసలు పొందాడు. అతడు వారికి నాయకుడయ్యాడు. అంతేగాని వారితో పాటు ఆ కూటమిలో ఒక సభ్యుడు కాదు.
2SA 23:20 యెహోయాదా కుమారుడైన బెనాయా వున్నాడు. అతడు ఒక పరాక్రమశాలి కుమారుడు. అతడు కబ్సెయేలను ఊరివాడు. బెనాయా చాలా సాహసకృత్యాలు చేశాడు. అతడు మోయాబీయుడగు అరీయేలు ఇద్దరు కుమారులను చంపివేశాడు. అంతేగాదు మంచుపడే కాలంలో బెనాయా ఒక గోతిలోదిగి అక్కడ దాగిన ఒక సింహాన్ని చంపాడు.
2SA 23:21 ఈజిప్టుకు చెందిన ఒక బలమైన యోధుణ్ణి చంపాడు. ఆ ఈజిప్టీయుని చేతిలో ఒక ఈటెవుంది. కాని బెనాయా చేతిలో ఒక కర్ర మాత్రమేవుంది. కాని బెనాయా వెళ్లి ఆ ఈజిప్టీయుని చేతిలోని ఈటె లాక్కున్నాడు. తరువాత బెనాయా ఆ ఈటెతోనే ఈజిప్టీయుని పొడిచి చంపాడు.
2SA 23:22 యెహోయాదా కుమారుడైన బెనాయా అటువంటి కార్యాలు చాలా చేశాడు. బెనాయా కూడ ఆ ముగ్గురు యోధులవలె ప్రసిద్ధి గాంచాడు.
2SA 23:23 ముప్పై మంది సైనికులలోను బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది; కాని ఆ ముగ్గురు యోధుల కూటమిలో సభ్యుడు కాలేదు. బెనాయాను దావీదు తన అంగరక్షకులకు నాయకునిగా చేశాడు.
2SA 23:24 యోవాబు సోదరుడగు అశాహేలు ఆ ముప్పై మందిలో ఒకడు. ఆ ముప్పై మందిలో మిగిలిన వారి పేర్లు: బేత్లేహేమీయుడగు దోదో కుమారుడైన ఎల్హానాను,
2SA 23:25 రోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
2SA 23:26 పల్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడగు ఈరా,
2SA 23:27 అనాతోతీయుడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
2SA 23:28 అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహర్తె,
2SA 23:29 నెటోపాతీయుడగు బయానా కుమారుడైన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి,
2SA 23:30 పిరాతోనీయుడైన బెనాయా, గాయషు సెలయేళ్ల ప్రాంతం వాడైన హిద్దయి,
2SA 23:31 అర్బాతీయుడైన అబీయుల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,
2SA 23:32 షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కుమారులలో
2SA 23:33 హరారీయుడైన షమ్మా కుమారుడు యోనాతాను, హరారీయుడైన షారారు కుమారుడగు అహీయాము,
2SA 23:34 మాయకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడగు ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము,
2SA 23:35 కర్మెతీయుడైన హెస్రై, అర్బీయుడైన పయరై,
2SA 23:36 సోబావాడగు నాతాను కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ,
2SA 23:37 అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, (సెరూయా కుమారుడైన యోవాబునకు ఆయుధాలు మోసే సహాయకులు,)
2SA 23:38 ఇత్రీ యుడగు ఈరా, ఇత్రీయుడగు గారేబు,
2SA 23:39 మరియు హిత్తీయుడైన ఊరియా. వీరంతా మొత్తం ముప్పది ఏడుగురు.
2SA 24:1 యెహోవా మరోసారి ఇశ్రాయేలీయుల పట్ల కోపం చెందాడు. యెహోవా దావీదును ఇశ్రాయేలీయులకు వ్యతిరేకమయ్యేలా చేశాడు. యెహోవా దావీదుతో, “వెళ్లు, ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించు” అని అన్నాడు.
2SA 24:2 దావీదు రాజు సైన్యాధక్షుడైన యోవాబును పిలిచి, “దాను నుండి బెయేర్షెబా వరకు తిరిగి ఇశ్రాయేలీయుల వంశాల వారందరినీ లెక్కించు. దానివల్ల వారెంత మంది వున్నారో నాకు తెలుస్తుంది,” అని అన్నాడు.
2SA 24:3 కాని యోవాబు రాజైన దావీదుతో ఇలా అన్నాడు, “ఇప్పటి జనాభా ఎంతైనా వుండనీ; నీ ప్రభువైన దేవుడు అంతకు వంద రెట్లు ప్రజలను నీకు యిచ్చుగాక! ఇది జరుగగా నీవు చూడాలని కాంక్షిస్తున్నాను. అయినా ఈ పని నీవెందుకు తల పెట్టావు?”
2SA 24:4 రాజు అది విని యోవాబును, సైన్యాధికారులను జనాభా లెక్కలు తీయమని తీవ్రంగా ఆజ్ఞాపించాడు. దానితో యోవాబు, సైన్యాధికారులు ఇశ్రాయేలులో జనాభా లెక్కలు తీయటానికి రాజును విడిచి వెళ్లారు.
2SA 24:5 వారు యోర్దాను నదిదాటారు. అరోయేరు వద్ద గుడారాలు వేశారు. వారి గుడారాలు లోయలోని నగరానికి కుడిప్రక్కగా వున్నవి. (నగరం గాదులోయ మధ్యలో వుంది. యాజేరుకు వెళ్లే మార్గంలోనే నగరంవుంది)
2SA 24:6 వారు గిలాదుకు, తహ్తింహోద్షీ దేశానికి వెళ్లారు. వారింకా దానాయానుకు, సీదోను ప్రాంతానికి వెళ్లారు.
2SA 24:7 వారు తూరు కోటను, మరియు హివ్వీయుల, కనానీయుల యొక్క నగరాలను దర్శించారు. వారు యూదా దేశపు దక్షిణ ప్రాంతాన గల బెయేర్షెబా చేరారు.
2SA 24:8 ఇలా దేశమంతా వారు తొమ్మిది నెలల, ఇరువది రోజుల పాటు తిరిగి చివరికి యెరూషలేముకు వచ్చారు.
2SA 24:9 జనాభా పట్టికను యోవాబు రాజుకు సమర్పించాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల జనం ఎనిమిది లక్షలవరకు వున్నారు. యూదాలో ఐదులక్షల మంది వున్నారు.
2SA 24:10 జనాభా లెక్కలు చూసినందుకు దావీదు సిగ్గుపడ్డాడు. దావీదు యెహోవాకి ఇలా విన్నవించుకున్నాడు, “నేను చేసిన ఈ పనివల్ల నేను చాలా పాపం మూటగట్టుకున్నాను. ప్రభూవా, నా పాపాన్ని క్షమించమని వేడుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను.”
2SA 24:11 దావీదు ఉదయం నిద్రలేచే సరికి యెహోవా వాక్యం గాదుకు చేరింది. గాదు ప్రవక్త దావీదుకు సన్నిహితుడు.
2SA 24:12 గాదుకు యెహోవా ఇలా చెప్పాడు: “దావీదు వద్దకు వెళ్లి నా మాటగా ఈ విషయం చెప్పు: యెహోవా మూడు విషయాలు నీ ముందు వుంచుతున్నాడు. ఆయన నీకు చేయవలసిన దాని నొకటి నీవు ఎన్నుకో.”
2SA 24:13 దావీదుతో గాదు ఇలా చెప్పాడు: “నేను చెప్పేవాటిలో ఒక దానిని కోరుకో: ఏడేండ్ల కరువు నీకూ, నీ రాజ్యానికీ రావాలా, లేక నీ శత్రువులు నిన్ను మూడు నెలల పాటు వెన్నంటి తరమాలా, లేక మూడు రోజుల పాటు నీ దేశంలో వ్యాధులు ప్రబలాలా బాగా ఆలోచన చేసి ఈ మూడింటిలో నీవు దేనిని కోరుకుంటున్నావో చెప్పు. నేను నీ నిర్ణయాన్ని నన్ను పంపిన యెహోవాకి అందజేయాలి.”
2SA 24:14 గాదుతో దావీదు, “నిజంగా నేను చాలా క్లిష్ట పరిస్థితిలో పడ్డాను! యెహోవా దయామయుడు కావున ఆయన్నే మమ్మల్ని శిక్షించనీ, నాకు శిక్ష ప్రజలనుండి మాత్రం రానీయకు!” అని అన్నాడు.
2SA 24:15 అందువల్ల యెహోవా ఇశ్రాయేలులో వ్యాధులు ప్రబలేలా చేశాడు. ఉదయం మొదలైన వ్యాధులు నిర్ణయించిన గడువు వరకు ప్రబలినాయి. ఉత్తర దేశంలో దానునుండి దక్షిణ ఇశ్రాయేలులోని బెయేర్షెబా వరకు డెబ్బై వేల మంది చనిపోయారు.
2SA 24:16 దేవదూత యెరూషలేమును నాశనం చేసేందుకు చేయి పైకి లేపాడు. కాని జరిగిన విషాద సంఘటనలకు యెహోవా విచారించాడు. ప్రజలను నాశనం చేసిన దేవదూతతో యెహోవా, “ఇది చాలు! నీ చేయిదించు!” అని అన్నాడు. యోహోవాదూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం వద్దవున్నాడు.
2SA 24:17 ప్రజలను నశింపజేసిన దేవదూతను దావీదు చూశాడు. దావీదు యెహోవాకి యిలా విన్నవించుకున్నాడు, “నేను పాపం చేశాను! నేను తప్పు చేశాను! కాని నా ప్రజలంతా నన్ను గొర్రెలవలె అనుసరించారు! వారు చేసిన తప్పేమీ లేదు! కావున దయచేసి నీ కోపం నామీద, నా తండ్రి కుటుంబం మీద మాత్రమే చూపించు!”
2SA 24:18 ఆరోజు మరల గాదు దావీదు వద్దకు వచ్చి, “యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం మీద యెహోవాకి ఒక బలిపీఠం నిర్మించు మని చెప్పాడు”.
2SA 24:19 గాదు చెప్పిన రీతి దావీదు అంతా చేశాడు. యెహోవా ఆజ్ఞలను దావీదు శిరసావహించాడు. దావీదు అరౌనాను చూడటానికి వెళ్లాడు.
2SA 24:20 అరౌనా తలెత్తి చూడగా అక్కడ రాజు(దావీదు) వున్నాడు. ఆయన మనుష్యులు తన వైపు రావటం చూశాడు. అరౌనా ఎదురేగి తన శిరస్సు నేలను ఆనే వరకు వంగి రాజుకు నమస్కరించాడు.
2SA 24:21 “నా ప్రభువైన రాజు నావద్దకు ఎందుకు వచ్చినట్లు?” అని అడిగాడు అరౌనా. అందుకు దావీదు, “నీనుండి నూర్పిడి కళ్లం కొనడానికి. అది కొని దానిపై యెహోవాకు ఒక బలిపీఠం నిర్మిస్తాను, అప్పడు ఈ వ్యాధులన్నీ అరికట్ట బడతాయి,” అని అన్నాడు.
2SA 24:22 “నా ప్రభువైన రాజు బలికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దహనబలికి కొన్ని ఎద్దులున్నాయి. అగ్నిని ప్రజ్వలింప చేయటానికి గింజలు రాలగొట్టే బల్లలు, మరియు ఎద్దులపై వేసే కాడికర్రలు వున్నాయి!
2SA 24:23 ఓ రాజా! ఇవన్నీ నీకు నేను ఇస్తాను.” అని అరౌనా దావీదుతో అన్నాడు. “నీ ప్రభువైన దేవుడు నీ పట్ల ప్రీతి చెందుగాక!” అని కూడ అన్నాడు.
2SA 24:24 అప్పుడు అరౌనాతో రాజు ఇలా అన్నాడు: “కాదు! నేను నిజం చెప్తున్నాను. నీకు వెలయిచ్చి నీ నుండి ఈ భూమినికొంటాను. నాకు వెల లేకుండా వచ్చిన వాటితో నా ప్రభువైన దేవునికి దహనబలులు ఇవ్వను!” కావున నూర్పిడి కళ్లాన్ని, ఎద్దులను, ఏభైతులాల వెండి వెల ఇచ్చి దావీదు కొన్నాడు.
2SA 24:25 తరువాత యెహోవాకి అక్కడ ఒక బలిపీఠాన్ని దావీదు నిర్మింప జేశాడు. దహనబలులు, సమాధాన బలులు దావీదు అర్పించాడు. దేశంకొరకు దావీదు చేసిన ప్రార్థనను యెహోవా ఆలకించి, ఇశ్రాయేలులో ప్రబలిన వ్యాధులను ఇంకా వ్యాపించకుండా ఆపాడు.
1KI 1:1 దావీదు రాజు బాగా ముసలివాడయ్యాడు. అందువల్ల అతను చలికి తట్టుకోలేకపోయాడు. తన సేవకులు ఎన్ని దుప్పట్లు కప్పినాగాని, అతను చలికి వణకి పోతూనే వున్నాడు.
1KI 1:2 కావున ఆయన సేవకులు ఆయనతో, “నీ ఆలనాపాలనా చూడటానికి వయస్సులో ఉన్న ఒక అమ్మాయిని మేము చూస్త్తాము. ఆమె నీ పక్కలో పండుకొని నీకు తగిన వెచ్చదనం సమకూర్చుతుంది.” అని అన్నారు.
1KI 1:3 అలా చెప్పి రాజు సేవకులు ఇశ్రాయేలు రాజ్యమంతా ఒక చిన్నదాని కొరకు వెదక నారంభించారు. రాజుకు వెచ్చదనాన్ని ఇవ్వగలిగే రూపం, యవ్వనం ఉన్న స్త్రీ కొరకు వారు వెదకసాగారు. చివరకు అబీషగు అనబడే షూనేమీయురాలిని చూచి, ఆమెను రాజు వద్దకు తీసుకొని వచ్చారు.
1KI 1:4 ఆమె చాలా అందగత్తె, ఆమె రాజుపట్ల శ్రద్ధ తీసుకొని, అతనికి సేవలు చేయనారంభించింది. కాని రాజైన దావీదు ఆమెను కూడలేదు.
1KI 1:5 దావీదు కుమారుడు అదోనీయా “నేనే రాజునౌతానని” అనుకొన్నాడు. (అదోనీయా తల్లి పేరు హగ్గీతు) అదోనీయా చాలా అందమైనవాడు. అతడు రాజు కావాలని మిక్కిలి ఉబలాటపడ్డాడు. అందువల్ల తనకు తానే ఒక రథాన్ని, గుర్రాలను సమకూర్చుకున్నాడు. తన ముందు పరుగెత్తుటకు ఏభై మంది మనుష్యులను కూడా నియమించాడు. అతడు అబ్షాలోము తర్వాత పుట్టాడు. దావీదు రాజు ఎప్పుడూ అదోనీయాను మందలించలేదు, విమర్శించలేదు. “ఏమి చేస్తున్నావు?” అని కాని, “అది ఎందుకు చేశావు?” అని కాని అతడు ఎప్పుడూ అడగలేదు.
1KI 1:7 సెరూయా కుమారుడైన యోవాబుతోను, యాజకుడైన అబ్యాతారుతోను అదోనీయా మాట్లాడాడు. అతడు రాజు అయ్యేలాగ వారు సహాయం చేయడానికి అంగీకరించారు.
1KI 1:8 కాని అదోనీయా రాజు కావడానికి ఒప్పుకోని వారిలో యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, ప్రవక్తయైన నాతాను, షిమీ, మరియు దావీదు రాజుయొక్క ప్రత్యేక అంగరక్షకుడైన రేయీ వుండిరి. అందువల్ల వీరు అదోనీయాతో కలియలేదు.
1KI 1:9 అదోనీయా కొన్ని జంతు బలులను అర్పించాడు. అతడు కొన్ని గొర్రెలను, ఆవులను, మరియు కొన్ని బలిసిన కోడెదూడలను సమాధాన బలిగా ఇచ్చాడు. అదోనీయా ఈ బలులన్నీ ఏన్‌రోగేలు దగ్గరవున్న జోహెలేతు అను శిలవద్ద సమర్పించాడు. ఈ ప్రత్యేకమైన పూజా కార్యక్రమానికి అదోనీయా చాలామందిని ఆహ్వానించాడు. రాజైన దావీదుయొక్క ఇతర కుమారులను, యూదా పాలకులు, నాయకులందరినీ అదోనీయా ఆహ్వానించాడు.
1KI 1:10 కాని అదోనీయా ప్రవక్తయగు నాతానును గాని, బెనాయానును గాని, తన తండ్రియొక్క ప్రత్యేక అంగరక్షకుని గాని, లేక తన సోదరుడు సొలొమోనును గాని ఆహ్వానించలేదు.
1KI 1:11 ఇదంతా విన్న నాతాను, సొలొమోను తల్లియైన బత్షెబ వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “హగ్గీతు కుమారుడైన అదోనీయా ఏమి చేస్తున్నాడో నీవు విన్నావా? తనకై తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. మన యజమానియైన దావీదు కూడ ఈ విషయం ఎరుగడు.
1KI 1:12 నీ జీవితం, నీ కుమారుడైన సొలొమోను జీవితం ప్రమాదంలో పడవచ్చు. మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే నీవు ఏమి చేయాలో నేను చెపుతాను.
1KI 1:13 దావీదు రాజు వద్దకు వెళ్లి, ‘నా ప్రభువైన రాజా, నీ తరువాత రాజ్యానికి వారసుడు నా కుమారుడైన సొలొమోను అవుతాడని నీవు ప్రమాణం చేశావు. కాని ఇప్పుడు అదోనీయా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు.
1KI 1:14 నీవు అలా మాట్లాడుతూ వుండగా నేను లోపలికి వస్తాను. వచ్చి, నీవు అదోనీయా గురించి చెప్పినదంతా నిజమని రాజుతో నేను చెపుతాను.”
1KI 1:15 తరువాత బత్షెబ రాజును చూడటానికి ఆయన పడకగదిలోనికి వెళ్లింది. రాజు ముసలివాడయ్యాడు. షూనేమీయురాలగు అబీషగు అక్కడ ఆయనకు సేవచేస్తూ వున్నది.
1KI 1:16 బత్షెబ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసింది. “నీకు ఏమి కావాలి?” అని రాజు ప్రశ్నించాడు.
1KI 1:17 బత్షెబ ఇలా చెప్పసాగింది, “మహారాజా! ప్రభువైన నీ దేవుని పేరు మీద నీవు నాకు ఒక ప్రమాణం చేశావు. ‘నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడు. నా సింహసనం మీద సొలొమోను రాజ్య పాలన చేస్తాడు’ అని అన్నావు.
1KI 1:18 కాని ఇప్పుడు అదోనీయా రాజయ్యాడు. అయినా ఆ విషయం నీకు తెలియదు.
1KI 1:19 సమాధానబలి ఇచ్చే నిమిత్తం అదోనీయా చాలా జంతువులను చంపాడు. అతడు ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. మరియు నీ కుమారులనందరినీ ఆహ్వానించాడు. యాజకుడైన అబ్యాతారును, సైన్యాధ్యక్షుడు యోవాబును కూడ అతడు ఆహ్వానించాడు. కాని అతడు నిన్ను సేవించే నా కుమారుడైన సొలొమోనును మాత్రం ఆహ్వానించ లేదు.
1KI 1:20 మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నిన్ను గమనిస్తూ వున్నారు. నీ తరువాత నీవు ఎవరిని రాజుగా నియమిస్తావో? అని వారు ఎదురు చూస్తూ వున్నారు.
1KI 1:21 నీ మరణానంతం, నీ పితరులతో నీవు సమాధి చేయబడతావు. ప్రజలు మాత్రం నేను, సొలొమోను నేరస్థులమని భావిస్తారు.”
1KI 1:22 బత్షెబ ఇలా రాజుతో మాట్లాడుతూ వుండగా, ప్రవక్తయగు నాతాను రాజును చూడటానికి వచ్చాడు.
1KI 1:23 “ప్రవక్తయగు నాతాను ఇక్కడికి వచ్చాడు” అని సేవకులు రాజుతో చెప్పారు. నాతాను రాజువద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు.
1KI 1:24 నాతాను రాజుతో ఇలా అన్నాడు, “నా ప్రభువా, నీ తరువాత రాజ్య పాలనకు కొత్త రాజుగా అదోనీయాను ప్రకటించావా? నీ తరువాత ప్రజాపాలన చేయటానికి అదోనీయాను నియమించాలని నిర్ణయించావా?
1KI 1:25 ఈ రోజు అతను సమాధాన బలులు అర్పించాడు. అతడు చాలా ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. నీ యొక్క ఇతర కుమారులంనదరిని, సైన్యాధ్యక్షుడిని, యాజకుడైన అబ్యాతారును అతడు పిలిచాడు. ఈ సమయంలో వారంతా అతనితో కలిసి తాగుతూ, తింటూ వేడుక చేసుకొంటున్నారు. పైగా, ‘రాజైన అదోనీయా వర్ధిల్లు గాక!’ అని వారంతా అంటున్నారు.
1KI 1:26 కాని అతను నన్నుగాని, యాజకుడైన సాదోకును గాని, యెహోయాదా కుమారుడైన బెనాయాను గాని, నీ కుమారుడైన సొలొమోనును గాని పిలువలేదు.
1KI 1:27 ఇదంతా చేసింది నీవేనా? మేము నిన్ను సేవిస్తూనీకు విధేయులమైయున్నాము కదా, అయినను నీ తరువాత నీ వారసుడుగా ఎవరిని ఎన్నుకున్నదీ మాకు ఎందుకు చెప్పలేదు?”
1KI 1:28 ఇది విన్న రాజు బత్షెబను పిలువనంపాడు. రాజు ముందుకు బత్షెబ వచ్చింది.
1KI 1:29 అప్పుడు రాజు ఒక ప్రమాణం చేశాడు, “నా ప్రభువైన దేవుడు నాకు సంభవించిన ప్రతి ఆపదనుండి నన్ను కాపాడాడు. నా ప్రభువైన దేవుడు నిత్యుడు. ఆ దైవశక్తితో నేను ప్రమాణం చేస్తున్నాను:
1KI 1:30 గతంలో నీకు నేనిచ్చిన మాటను ఈ రోజు నెర వేర్చుతాను. ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా యొక్క శక్తితో నేనీ ప్రమాణం చేసియున్నాను. నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడని నీకు ప్రమాణం చేశాను. నా తరువాత నా సింహాసనం మీద నా స్థానాన్ని అతడు పొందుతాడని కూడా మాట ఇచ్చాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను.”
1KI 1:31 తరువాత బత్షెబ రాజుముందు సాగిలపడి, “రాజైన దావీదు వర్ధిల్లు గాక!” అని అన్నది.
1KI 1:32 రాజైన దావీదు అప్పుడు “యాజకుడగు సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువనంపాడు.” వారు ముగ్గురూ రాజు వద్దకు వచ్చారు.
1KI 1:33 “మీరు రాజాధికారులను మీతో తీసుకొని, నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిదపై ఎక్కించి దిగువనున్న గిహోను చలమ దగ్గరకు తీసుకొని వెళ్లండి.
1KI 1:34 అక్కడ యాజకుడైన సాదోకు, ప్రవక్తయగు నాతాను అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుని చేయాలి. బూర ఊది ‘ఇదిగో కొత్తరాజు సొలొమోను!’ అని చాటాలి.
1KI 1:35 తరువాత అతనితో కలిసి ఇక్కడకి తిరిగిరండి. అతడు నా సింహాసనం మీద కూర్చుండి, నా స్థానంలో రాజుగా వ్యవహరిస్తాడు. ఇశ్రాయేలు మీద, యూదా మీద రాజుగా వుండటానికి నేనతనిని ఎన్నుకున్నాను,” అని రాజైన దావీదు వారితో అన్నాడు.
1KI 1:36 యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో, “అది చాలా మంచి పని! నీ దేవుడైన యెహోవా అది జరిగేలా చేయునుగాక!
1KI 1:37 యెహోవా ఎల్లప్పుడు మా యజమాని రాజువైన నీకు సహాయ పడుతూ వచ్చాడు. యెహోవా ఇప్పుడు సొలొమోనుకు సహాయపడును గాక! దేవుడు సొలొమోనును కూడా నీకంటె ఘనమైన రాజుగా చేయునుగాక!” అని అన్నాడు.
1KI 1:38 కావున సాదోకు, నాతాను, బెనాయా, రాజు యొక్క సేవకులు రాజాజ్ఞ శిరసావహించారు. సొలొమోనును రాజు యొక్క కంచర గాడిదపై ఎక్కించి వారతనితో గిహోనుకు వెళ్లారు.
1KI 1:39 యాజకుడైన సాదోకు పవిత్ర గుడారము నుండి తనతో నూనె పట్టుకెళ్లాడు. సాదోకు ఆ నూనెను సొలొమోను తలపైపోసి రాజుగా అభిషిక్తుని చేశాడు. వారప్పుడు బాకా వూదగా అక్కడున్న ప్రజలంతా, “సొలొమోను రాజు వర్ధిల్లుగాక!” అని అన్నారు.
1KI 1:40 ఆ ప్రజలంతా సొలొమోనుతో కలిసి నగరానికి వచ్చారు. వారు పిల్లనగ్రోవులను ఊదుతూ, జయజయ ధ్వనులు చేయసాగారు. వారు సంతోషంతో భూమి అదిరేలా కేకలేశారు.
1KI 1:41 ఆ సమయంలో అదోనీయా, మరియు అతనితో ఉన్న అతిథులు భోజనాలు పూర్తి చేస్తున్నారు, వారు బూరనాదం విన్నారు. “నగరంలో ఏమి జరుగుతూ వుంది, మనం వినే శబ్దం ఏమిటి?” అని యోవాబు అడిగాడు.
1KI 1:42 యోవాబు అలా మాట్లాడుతూ వుండగానే యాజకుడైన అబ్యాతారు కుమారుడు యోనాతాను అక్కడికి వచ్చాడు. అదోనీయా అతనిని చూసి “రా, లోనికి రా! నీవు చాలా మంచివాడవు నీవు ఏదైనా మంచివార్తే నాకు తెస్తూ వుండవచ్చు” అని అన్నాడు.
1KI 1:43 కాని యోనాతాను ఇలా సమాధాన మిచ్చాడు, “కాదు! ఇది నీకు శుభవార్త కాదు. మన రాజైన దావీదు సొలొమోనును రాజుగా ప్రకటించాడు.
1KI 1:44 రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, మరియు తన సేవకులను అతనితో పంపాడు. వారు సొలొమోనును రాజు యొక్క స్వంత కంచర గాడిదపై కూర్చుండబెట్టారు.
1KI 1:45 తరువాత యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను ఇరువురూ సొలొమోనుకు గిహోను వద్ద పట్టాభిషేకం చేశారు. వారుప్పుడు నగరానికి తిరిగి వెళ్లారు. ప్రజలు వారిననుసరించి వెళ్లారు. కావున ఇప్పుడు నగరంలో జనంమంతా చాలా సంతోషంగా వున్నారు. ఆ శబ్ధమే మీరిప్పుడు వింటున్నారు.
1KI 1:46 సొలొమోను ఇప్పుడు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు.
1KI 1:47 రాజు యొక్క సేవకులంతా రాజైన దావీదు వద్దకు అతను మంచిపని చేసినట్లు చెప్పటానికి వచ్చారు. వారంతా, ‘దావీదు రాజా, నీవు చాలా గొప్ప రాజువి! కాని నీ దేవుడు సొలొమోనును కూడ ఒక గొప్పరాజుగా చేయాలని ప్రార్థిస్తున్నాము. నీ దేవుడు సొలొమోనును నీకంటె ఖ్యాతిగల రాజుగా చేయును గాక. నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లు చేయునుగాక!’ అని అంటున్నారు. యోనాతాను నగరంలో జరుగుతున్న విషయాలు అదోనీయాతో ఇంకా ఇలా చెప్పసాగాడు: తరువాత రాజైన దావీదు దేవుని ప్రార్థించటానికి తన పక్కమీదే సాష్టాంగ పడ్డాడు.
1KI 1:48 ‘ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవాకు జయమగును గాక! యెహోవా నా కుమారులలో ఒకనిని నా సింహాసనం మీద కూర్చుండ జేశాడు. దేవుడు అది నేను చూడగలిగేలా చేశాడు’ అని దావీదు రాజు అన్నాడు.”
1KI 1:49 ఇది విన్న అదోనీయా, అతిథులందరూ భయపడి అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయారు.
1KI 1:50 అదోనీయా కూడ సొలొమోనుకు భయపడ్డాడు. కావున అతడు బలిపీఠం వద్దకు వెళ్లి, ఆ పీఠపు కొమ్ములను పట్టుకున్నాడు.
1KI 1:51 ఈ లోపు ఒకడు సొలొమోను వద్దకు వెళ్లి, “అదోనీయా నీవంటే చాలా భయపడిపోతున్నాడు. అతడు బలిపీఠం వద్ద ఉన్నాడు. అతడు బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, అక్కడినుండి పోవటం లేదు. సొలొమోను వద్దకు ఎవరైనా వెళ్లి తనను చంపకుండా వుండేలా ప్రమాణం చేయించమని వేడుకుంటున్నాడు” అని చెప్పాడు.
1KI 1:52 అది విన్న సొలొమోను, “అదోనీయా గనుక బుద్ధిమంతునిలా మెలిగితే, అతని తలమీది ఒక్క వెంట్రుక కూడ రాలదని నేను ప్రమాణం చేస్తున్నాను. కాని అతడేమైనా పొరపాటు చేస్తే, వాడు చావటం ఖాయం” అని అన్నాడు.
1KI 1:53 అప్పుడు సొలొమోను కొంతమందిని పంపి అదోనీయాను తీసుకొని రమ్మన్నాడు. వారు అదోనీయాను రాజైన సొలొమోను వద్దకు తీసుకొచ్చారు. అదోనీయా రాజైన సొలొమోను ముందుకు వచ్చి సాష్టాంగపడ్డాడు. “నీవు ఇంటికి వెళ్లు” అని సొలొమోను అతనితో అన్నాడు.
1KI 2:1 దావీదుకు మరణకాలం సమీపించింది. కావున దావీదు సొలొమోనును పిలిచి ఇలా అన్నాడు:
1KI 2:2 “నాకు మరణకాలం సమీపించింది. నీవు మంచివానిగా, సమర్థవంతమైన నాయకునిగా పేరు తెచ్చుకో.
1KI 2:3 దేవుని ఆజ్ఞలన్నీ శిరసావహించు. నీ దేవుడైన యెహోవా మనకిచ్చిన ఆదేశాలన్నిటినీ పాటించు. ఆయన ధర్మశాస్త్రాలను పాటిస్తూ, ఆయన మనకు చెప్పిన వన్నీచేయి. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించిన సూత్రాలన్నిటినీ పాటించు. ఇవన్నీ నీవు పాటిస్తే, నీవు ఏది చేసినా, నీవు వెళ్లిన ప్రతి చోటా నీకు విజయం చేకూరుతుంది.
1KI 2:4 నీవు యెహోవాకు విధేయుడవయివుంటే, ఆయన నాగురించి చేసిన ప్రమాణం నెరవేర్చుతాడు. యెహోవా నాకు చేసిన వాగ్దానమిది: ‘నీవారు నా ఆదేశ సూత్రాలను అనుసరించి తీరాలి. నేను నిర్దేశించినరీతిగా జీవితం గడపాలి. నీ కుమారులు సంపూర్ణ హృదయంతో, ఆత్మసాక్షిగా నాలో విశ్వాసం కలిగివుండాలి. నీ కుమారులు ఇవన్నీ చేస్తే, నీ కుటుంబంలో ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఇశ్రాయేలు ప్రజలపై పాలకుడుగా వుంటాడు.’”
1KI 2:5 “సెరూయా కుమారుడైన యోవాబు నాకు ఏమి చేసినదీ నీవు గుర్తు పెట్టుకోవాలి కూడ. ఇశ్రాయేలు సైన్యాల ఇద్దరు అధిపతులను అతడు చంపాడు. నేరు కుమారుడైన అబ్నేరును, యెతెరు కుమారుడైన అమాశాను అతడు చంపాడు. అతడు వారిని శాంతి నెలకొన్న రోజులలో చంపిన విషయం నీవు గుర్తుంచు కోవాలి. వారు యుద్ధ సమయంలో ప్రజలను చంపారనే కోపంతో అతడా పని చేశాడు. కాని చంపబడిన ఆ ఇద్దరు సేనాధిపతులు అమాయకులు. కావున నేనతనిని శిక్షించాలి.
1KI 2:6 కాని ఇప్పుడు నీవు రాజువు. నీవు ఏది మిక్కిలి తెలివైన పద్దతి అనుకుంటే దానిద్వారా అతనిని శిక్షించాలి. అంటే అతడు ఖచ్చితంగా చంపబడాలి.”
1KI 2:7 “గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుల పట్ల నీవు దయగలిగి వుండాలి. వారిని నీ స్నేహితులుగా స్వీకరించి, వారు నీ బల్లవద్ద విందారగించేలా చూడు. నీ సోదరుడగు అబ్షాలోము నుండి నేను పారిపోయినప్పుడు వారు నాకు సహాయం చేశారు.
1KI 2:8 “గెరా కుమారుడగు షిమీ నీవద్దనే వున్నట్లు నీవు గమనించాలి. ఇతడు బెన్యామీనీయుడు. బహూరీముపురవాసి. నేను మహనయీముకు వెళ్లిన రోజున ఇతడు నాకు వ్యతిరేకంగా చాలా చెడు మాటలు మాట్లాడాడు. ఇతడు మరల యోర్థాను నది వద్ద నన్ను కలవటానికి వచ్చాడు. నేను యెహోవా ముందు ప్రమాణం చేసిషిమీని నేను చంపనని చెప్పాను.
1KI 2:9 కావున నీవు వానిని శిక్షింపకుండా వదలవద్దు. నీవు తెలివిగలవాడవు. వానికి ఏమి చేయాలో నీకు తెలుసు. వాడు వృద్దాప్యంలో ప్రశాంతంగా చనిపోయేలా విడువవద్దు.”
1KI 2:10 ఇవన్నీ చెప్పి దావీదు చనిపోయాడు. దావీదు నగరంలో అతడు సమాధి చేయబడ్డాడు.
1KI 2:11 దావీదు నలభై సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పరిపాలించాడు. అతడు హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పాలించాడు.
1KI 2:12 ఇప్పుడు సొలొమోను తన తండ్రియగు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు రాజు అని చెప్పటానికి ఏరకమైన అనుమానం లేదు
1KI 2:13 ఈ సమయంలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబ వద్దకు వెళ్లాడు. “నీవు సమాధానంతో వచ్చావా?” అని బత్షెబ అతనిని అడిగింది. “అవును. ఐక్యత కోసమే ఈ సందర్శనం.
1KI 2:14 నీకు ఒక విషయం నేను చెప్పాలి” అని అదోనీయా సమాధానం చెప్పాడు. “అయితే మాట్లాడు” అన్నది బత్షెబ.
1KI 2:15 అదోనీయా ఇలా చెప్పాడు: “నీకు గుర్తుండే వుంటుంది, ఈ రాజ్యం ఒకప్పుడు నాది. ఇశ్రాయేలు ప్రజలంతా నేనే వారి రాజుననుకున్నారు. కాని పరిస్థితులు తారుమారైనాయి. ఇప్పుడు నా సోదరుడు రాజైనాడు. దేవుడు అతనిని రాజుగా ఎంపిక చేశాడు.
1KI 2:16 కావున నిన్ను నేనొక విషయం అడగాలనుకుంటున్నాను. దయచేసి దానిని తిరస్కరించవద్దు.” “నీకేం కావాలి?” అని బత్షెబ అడిగింది.
1KI 2:17 “నాకు తెలుసు, రాజైన సొలొమోను నీవు ఏది చేయమంటే అది చేస్తాడని. అందువల్ల దయచేసి షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా యివ్వమని అతనిని అడుగు” అని అదోనీయా అన్నాడు.
1KI 2:18 “మంచిది, నీ తరపున నేను రాజుతో మాట్లాడ తాను” అని బత్షెబ అన్నది.
1KI 2:19 కావున రాజైన సొలొమోనుతో మాట్లాడ్డానికి బత్షెబ అతని వద్దకు వెళ్లింది. సొలొమోను ఆమెను చూచి కలుసుకొనేందుకు నిలబడ్డాడు. ఆమెకు వందనం చేసి, సింహాసనం మీద కూర్చున్నాడు. తన తల్లి కొరకు సేవకులతో మరో ఉన్నతాసనం తెప్పించాడు. అప్పుడామె అతనికి కుడి పక్కగా కూర్చున్నది.
1KI 2:20 “నిన్నొక చిన్న విషయం అడగాలని వచ్చాను. దయచేసి తిరస్కరించవద్దు” అని బత్షెబ అతనితో అన్నది. “నీవు ఏది కావాలంటే అది అడగవచ్చునమ్మా! నేనెప్పుడూ తిరస్కరించను” అని రాజు అన్నాడు.
1KI 2:21 “అయితే షూనేమీయురాలగు అబీషగును నీ సోదరుడైన అదోనీయా వివాహమాడుటకు అనుమతి ఇవ్వు” అని బత్షెబ అన్నది.
1KI 2:22 అది విన్న సొలొమోను రాజు, “అబీషగును అతని కిమ్మనే ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న గనుక అతను రాజు కావటానికి కూడా అనుమతి ఇమ్మని నన్నెందుకు అడగటం లేదు? యాజకుడైన అబ్యాతారు, యోవాబు కూడా అతనికి మద్దతు ఇస్తారేమో!” అని తన తల్లితో అన్నాడు.
1KI 2:23 అప్పుడు సొలొమోను యెహోవాకు ఒక ప్రమాణం చేశాడు. అతనిలా అన్నాడు: “అదోనీయానన్నిది అడిగినందుకు తగిన శాస్తి జరిగేలా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను! ఇది వాని ప్రాణానికే ముప్పుతెస్తుందని ప్రమాణ వూర్వకంగా చెపుతున్నాను!
1KI 2:24 ఇశ్రాయేలు రాజు కావటానికి యెహోవా నాకు అనుమతి ఇచ్చాడు. నా తండ్రియైన దావీదు సింహాసనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. రాజ్యాన్ని నాకు, నా ప్రజలకు ఇచ్చి యెహోవా ఆయన మాట నిలబెట్టుకున్నాడు. అదోనీయా ఈ రోజు ఖచ్చితంగా చనిపోతాడని, ఇవన్నీ నెరవేర్చిన నిత్యుడైన యోహోవా ముందు ప్రమాణం చేసి చెపుతున్నాను!”
1KI 2:25 రాజైన సొలొమోను బెనాయాను పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. బెనాయా బయటికి వెళ్లి అదోనీయాను చంపేశాడు.
1KI 2:26 రాజైన సొలొమోను యాజకుడగు అబ్యాతారును పిలిచి, “నేను నిన్ను చంపివుండే వాడిని. కాని అనాతోతులో వున్న నీ ఇంటికి తిరిగి వెళ్లటానికి అనుమతి ఇస్తున్నాను. నిన్ను ఇప్పుడు చంపను. ఎందు వల్లనంటే నా తండ్రి దావీదుతో కలిసి వెళ్లేటప్పుడు నీవు యెహోవా పవిత్ర పెట్టె మోయుటలో సహాయ పడ్డావు. పైగా నీవు నా తండ్రి కష్ట సమయాలలో నీవాయనకు తోడుగా వున్నావని కూడా నాకు తెలుసు.”
1KI 2:27 అయితే ఇక నుంచి యెహోవా యాజకునిగా కొనసాగటానికి వీల్లేదని అబ్యాతారుతో సొలొమోను చెప్పాడు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో ఇప్పుడిది ఆ రకంగా జరిగింది. యెహోవా ఏలీని గురించి, అతని కుటుంబం గురించి షిలోహులో చెప్పిన దానికి అనుగుణంగా ఇప్పుడిది జరిగింది.
1KI 2:28 యోవాబు జరిగినదంతా విని భయపడి పోయాడు. అతడు అదోనీయాకు మద్దతు యిచ్చాడు గాని, అబ్షాలోముకు వ్యతిరేకి అయ్యాడు. యోవాబు దేవుని గుడారంలోకి పారిపోయి బలిపీఠపు కొమ్ములను పట్టుకొన్నాడు.
1KI 2:29 యోవాబు దేవుని గుడారంలో బలి పీఠం వద్ద వున్నాడని ఎవరో పోయి రాజైన సొలొమోనుకు చెప్పారు. సొలొమోను బెనాయాను పిలచి యోవాబును చంపమన్నాడు.
1KI 2:30 బెనాయా యెహోవా గుడారంలోనికెళ్లి యోవాబుతో, “రాజు అతనిని బయటికి రమ్మంటున్నాడని” చెప్పాడు. “వద్దు, నేనిక్కడే చనిపోతాను” అని యోవాబు అన్నాడు. కావున బెనాయా తిరిగి వెళ్లి యోవాబు అన్న మాటలు రాజుకు చెప్పాడు.
1KI 2:31 “అయితే అతను చెప్పినట్లే చేయుము! వానిని అక్కడే చంపివేయుము. పిమ్మట వానిని పాతిపెట్టుము. అప్పుడు యోవాబు చేసిన పనుల యొక్క దోషం నా కుటుంబానికి, నాకు తగలకుండ పోతుంది. ఈ దోషమెందుకు వచ్చిందనగా యోవాబు అమాయకులను చంపాడు.
1KI 2:32 తనకంటె చాలా మంచివారిద్దరిని యోవాబు హత్య చేశాడు. వారిద్దరు నేరు కుమారుడైన అబ్నేరు, మరియు యెతెరు కుమారుడైన అమాశా. అబ్నేరు ఇశ్రాయేలు సైన్యాధిపతి. అమాశా యూదావారి సైన్యాధిపతి. అతడు వారిని చంపినట్లు నా తండ్రి దావీదుకు తెలియదు. కావున యెహోవా అతనికి తగిన శాస్తి చేస్తాడు.
1KI 2:33 వాళ్ల చావుకు కారణమయిన అపరాధి అతనే. తన కుటుంబం కూడా శాశ్వతంగా ఈ నేరానికి బాధ్యులు. కాని దావీదుకు, అతని సింహాసనానికి దేవుడు శాశ్వతంగా శాంతిని చేకూర్చుతాడు.”
1KI 2:34 కావున యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి యోవాబును చంపాడు. యోవాబు శవాన్ని ఎడారిలో అతని ఇంటి సమీపాన పాతిపెట్టారు.
1KI 2:35 తరువాత యోవాబు స్థానంలో యెహోయాదా కుమారుడైన బెనాయాను సైన్యాధ్యక్షునిగా సొలొమోను నియమించాడు. సొలొమోను అబ్యాతారు స్థానంలో సొదోకును కొత్త ప్రధాన యాజకునిగా కూడా నియమించాడు.
1KI 2:36 తరువాత, షిమీని రాజు పిలిచాడు. రాజు షిమీతో, “ఇక్కడ యెరూషలేములో నీ కొరకై ఒక ఇల్లు నిర్మించుకో. నీవు అందులో నివసిస్తూ, నగరం వదిలి వెళ్లవద్దు.
1KI 2:37 నీవు నగరం వదిలి కిద్రోను వాగు దాటి వెళ్లితే గనుక, ఎవరో ఒకరు నిన్ను చంపుతారు. ఆ తప్పుకు నీవే బాధ్యుడవు” అని అన్నాడు.
1KI 2:38 అది విని షిమీ, “నా రాజా, నీవు చెప్పినది చాలా బాగున్నది. నేను నీకు విధేయుడనై వుంటాను” అని అన్నాడు. షిమీ యెరూషలేములో చాలాకాలం నివసించాడు.
1KI 2:39 కాని మూడు సంవత్సరాల తరువాత షిమీ యొక్క ఇద్దరు బానిసలు పారిపోయారు. వారు గాతు రాజు వద్దకు వెళ్లారు. ఆ రాజు పేరు ఆకీషు. అతడు మయకా కుమారుడు. తన బానిసలు గాతులో వున్నట్లు షిమీ విన్నాడు.
1KI 2:40 తన గాడిదపై గంతవేసి, దానిమీద గాతు రాజైన ఆకీషు వద్దకు వెళ్లాడు. అతడు తన బానిసలును వెదుక్కుంటూ వెళ్లాడు. వాళ్లను అక్కడ పట్టుకుని తన ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు.
1KI 2:41 కాని ఎవ్వరో సొలొమోను వద్దకు వెళ్లి షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి వచ్చాడని చెప్పారు.
1KI 2:42 అందువల్ల సొలొమోను షిమీని పిలిపించాడు. సొలొమోను అతనితో ఇలా అన్నాడు, “యెరూషలేము విడిచి వెళ్లితే నీవు చంపబడతావని నీకు తెలిసేలా నేను నీ చేత యెహోవా పేరు మీద ప్రమాణం చేయించాను. నీవు ఇక్కడినుండి ఎక్కడికైనా వెళ్లితే తత్ఫలితంగా సంభవించే నీ మరణానికి నీవే కారకుడవవుతావని కూడా నిన్ను నేను హెచ్చరించాను. నేను చెప్పినదానికి నీవు ఒప్పుకున్నావు. నాకు విధేయుడవై వుంటానని నీవు అన్నావు.
1KI 2:43 మరి నీ మాటను నీవు ఎందుకు నిలబెట్టుకోలేదు? నా ఆజ్ఞను నీవెందుకు శిరసావహించలేదు?
1KI 2:44 నీవు నా తండ్రి దావీదు పట్ల చేసిన అనేక తప్పులు నీకు గుర్తుండే వుంటాయి. ఆ తప్పులన్నిటికీ యెహోవా నిన్నిప్పుడు శిక్షిస్తాడు.
1KI 2:45 కాని యెహోవానన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు సింహాసనాన్ని ఆయన ఎప్పుడూ సురక్షితంగా ఉంచుతాడు.”
1KI 2:46 పిమ్మట రాజు షిమీని చంపమని బెనాయాకు ఆజ్ఞ యివ్వగా అతను ఆ పని పూర్తి చేశాడు. అప్పుడు సొలొమోను తన రాజ్యాన్ని పూర్తిగా తన అదుపులోకి తెచ్చెకున్నాడు.
1KI 3:1 సొలొమోను ఈజిప్టు రాజైన ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అతనితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. సొలొమోను ఆమెను దావీదు నగరానికి తీసుకొనివచ్చాడు. ఆ సమయంలో సొలొమోను తన భవనాన్ని, దేవాలయాన్ని నిర్మింప చేస్తూనేవున్నాడు. సొలొమోను యెరూషలేము నగరం చుట్టూ ఒక గోడకూడా నిర్మిస్తున్నాడు.
1KI 3:2 దేవాలయం ఇంకా పూర్తి కాలేదు. అందువల్ల అప్పటి వరకు ప్రజలు తమ బలులను గుట్టలపై వున్న బలిపీఠాల వద్దనే అర్పిస్తూండేవారు.
1KI 3:3 యెహోవాను ప్రేమించినట్లుగా సొలొమోను నిరూపించుకున్నాడు. తన తండ్రియగు దావీదు చెప్పిన విషయాలన్నీ నియమంగా పాటించాడు. కాని సొలొమోను ఒక్క విషయంలో మాత్రం తన తండ్రి చెప్పింది చేశాడు. అదేమనగా సొలొమోను గుట్టలపై బలులు అర్పించటం, ధూపం వేయటం, కొన సాగించటం.
1KI 3:4 సొలొమోను రాజు బలులు అర్పించుటకు గిబియోనుకు వెళ్లాడు. అది బలి అర్పణచేసే ప్రదేశాలన్నిటిలో చాలా పేరు గాంచిన గుట్ట. సొలొమోను ఆ బలిపీఠం మీద ఒక వెయ్యి బలులు అర్పించాడు.
1KI 3:5 సొలొమోను గిబియోను వద్ద వున్నప్పుడు యెహోవా ఆయనకు స్వప్నంలో దర్శన మిచ్చాడు. “నీవేదైనా కోరుకో. నీ కోరిక నెరవేర్చుతాను” అని యెహోవా అన్నాడు.
1KI 3:6 సొలొమోను ఇలా అన్నాడు: “నీ సేవకుడగు నా తండ్రి దావీదుకు నీవు మిక్కిలి దయ చూపావు. ఆయన నిన్ననుసరించాడు. ఆయన కూడా మంచివాడై, ధర్మంగా జీవించాడు. నీవాయన కుమారుని రాజ్యా సింహాసనానికి అర్హుణ్ణి చేసినప్పుడు, నీవు ఆయనకు అపూర్వమైన కరుణ చూపావు.
1KI 3:7 నా ప్రభువైన దేవా! నా తండ్రి స్థానంలో రాజ్యపాలన చేసేలా నాకు అనుమతి ఇచ్చావు. కాని నేనింకా పనివానిలా వున్నాను. నేను నిర్వర్తించవలసిన పనులు నెరవేర్చటానికి తగిన వివేకం నాకు కొరతగా ఉంది.
1KI 3:8 నీ సేవకుడనైన నేను నీచేత ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ప్రజల మధ్య వున్నాను. వారి జనాభా పెద్దది. వారు లెక్క పెట్టలేనంత ఎక్కువగా వున్నారు. కావున పాలకుడైన వాడు వారి విషయంలో అనేకానేక నిర్ణయాలు తీసుకోవలసి వుంటుంది.
1KI 3:9 అందువల్ల ఈ ప్రజానీకంపై ధర్మపరిపాలన చేయగల న్యాయ నిర్ణయం చేయగల దక్షత, పరిజ్ఞానము నాకు దయచేయుమని నిన్ను వేడుకుంటున్నాను. ఈ జ్ఞానమువల్ల నేను మంచి చెడుల నిర్ణయం చేయగలుగుతాను. ఈ మహా పరిజ్ఞానములేకుండ, ఈ గొప్ప ప్రజానీకాన్ని పరిపాలించటం అసాధ్యమైన పని.”
1KI 3:10 సొలొమోను ఇది అడిగినందుకు యెహోవా చాలా సంతోషించాడు.
1KI 3:11 అతనితో దేవుడిలా అన్నాడు: “నీవు నీకు దీర్ఘాయుష్షు యిమ్మని అడుగలేదు. నీవు నీ కొరకై ధనదాన్యాదులిమ్మని అడుగలేదు. నీ శత్రునాశనం కూడ నీవు కోరుకోలేదు. మంచిచెడుల విచక్షణా జ్ఞానం, న్యాయనిర్ణయం చేయగల దక్షత నీవు అడిగావు.
1KI 3:12 కావున నీవడిగిన దానిని నీకు దయచేస్తాను. నీకు విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాను. గతంలో నీవంటి వాడెవ్వడూ లేనట్లుగా నీకు జ్ఞానాన్ని కలుగజేస్తాను. భవిష్యత్తులో కూడ నీకు సాటి మరి ఎవ్వడూ వుండడు.
1KI 3:13 పైగా, నీకు పారితోషికంగా నీవు అడుగనవి కూడ నీకు ఇస్తున్నాను. నీ జీవితాంతం నీకు ధనధాన్యాలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. నీయంతటి గొప్పవాడు ఈ ప్రపంచంలో మరో రాజు వుండడు.
1KI 3:14 నాకు విధేయుడవై వుండుమనీ, నా న్యాయమార్గాన్ని, నా ఆజ్ఞలను పాటించుమని నిన్ను నేనడుగుతున్నాను. నీ తండ్రి దావీదువలె నీవు కూడ నడుచుకో. నీవు ఆ విధంగా చేస్తే నీకు దీర్ఘాయుష్షు కూడ నేనిస్తాను.”
1KI 3:15 సొలొమోను మేల్కొన్నాడు. దేవుడు అతనితో కలలో మాట్లాడినట్లు తెలుసుకొన్నాడు. సొలొమోను తరువాత యెరూషలేముకు వెళ్లి యెహోవా ఒడంబడిక పెట్టె ముందు నిల్చున్నాడు. సొలొమోను యెహోవాకు ఒక దహనబలి ఇచ్చాడు. అతనింకా సమాధాన బలులు కూడా దేవునికి చెల్లించాడు. తరువాత అతని పరిపాలనలో అతనికి చేదోడు వాదోడుగావున్న నాయకులకు, అధికారులందరికీ విందు ఇచ్చాడు.
1KI 3:16 ఒక రోజు ఇద్దరు వేశ్యా స్త్రీలు సొలొమోను వద్దకు వచ్చారు. వారు రాజు ముందు నిలబడ్డారు.
1KI 3:17 ఆ ఇద్దరిలో ఒక స్త్రీ ఇలా అన్నది, “అయ్యా, ఈమె, నేను ఒకే ఇంట్లో నివసిస్తూ వుంటాము. మేమిద్దరం గర్భవతుల మైనాము. కాన్పు నెలలు వచ్చాయి. నేనొక బిడ్డను ప్రసవించాను. అప్పుడు ఈమె నా పక్కనేవుంది.
1KI 3:18 మూడు రోజుల తరువాత ఈమె కూడ ఒక బిడ్డను కన్నది. మా ఇద్దరితో పాటు ఇంటిలో మరెవ్వరూ లేరు. కేవలం మేమిద్దరమే వుంటున్నాము.
1KI 3:19 ఒక రోజు రాత్రి ఈ స్త్రీ తన బిడ్డతో నిద్రిస్తూండగా, ఆ బిడ్డ చనిపోయింది.
1KI 3:20 అప్పుడు ఆమె ఆ రాత్రి సమయంలో నేను నిద్రిస్తూండగా నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొన్నది. నా బిడ్డను ఆమె తన పక్కలో వేసుకొన్నది. చనిపోయిన బిడ్డను నా పక్కమీద వుంచింది.
1KI 3:21 మరునాటి ఉదయం నేను లేచి నా బిడ్డకు పాలివ్వబోయాను. కాని బిడ్డ చనిపోయినట్లు గమనించాను. నేను బిడ్డకేసి తేరిపార చూడగా ఆ బిడ్డ నా బిడ్డ కాదని కనుగొన్నాను.”
1KI 3:22 కాని ఆ రెండవ స్త్రీ, “కాదు! బతికివున్న బిడ్డేనా బిడ్డ, చనిపోయిన బిడ్డే నీ బిడ్డ” అని అన్నది. అందుకు మొదటి స్త్రీ ఇలా అన్నది, “కాదు! నీవు పొరాపాటు పడుతున్నావు! చనిపోయిన బిడ్డే నీది. బతికివున్న బిడ్డ నాది!” ఇలా ఆ యిద్దరు స్త్రీలు రాజు ముందు వాదోపవాదాలు చేసుకొన్నారు.
1KI 3:23 ఇదంతా విన్న సొలొమోను, “మీ ఇద్దరిలో ప్రతి ఒక్కరూ బతికివున్న బిడ్డ ‘నాదే’ అంటున్నారు. మీలో ప్రతి ఒక్కరు చనిపోయిన బిడ్డ ఎదుటి వ్యక్తిదని అంటున్నారు” అని అన్నాడు.
1KI 3:24 అప్పుడు సొలొమోను రాజు తన సేవకుడిని పంపి ఒక కత్తి తెప్పించాడు.
1KI 3:25 సొలొమోను రాజు ఇలా అన్నాడు, “ఇప్పుడు మనం ఈ రకంగా చేద్దాం. బతికి వున్న బిడ్డను రెండు ముక్కలుగా నరికేద్దాం. ఆ ఇద్దరు స్త్రీలకు చెరియొక ముక్క ఇద్దాం!”
1KI 3:26 ఇది విన్న ఆ రెండవ స్త్రీ, “ఈ పని చాలా బాగుంటుంది. బిడ్డను రెండు ముక్కలు చేయండి, అప్పుడు మా ఇద్దరిలో ఎవ్వరికీ ఆ బిడ్డ రాకుండా పోతుంది” అని అన్నది. కాని బిడ్డయొక్క నిజమైన తల్లియగు మొదటి స్త్రీ తన బిడ్డపట్ల నిండైన ప్రేమతో రాజుతో, “అయ్యా, దయచేసి బిడ్డను చంపవద్దు! బిడ్డను ఆమెకే ఇవ్వండి,” అని అన్నది.
1KI 3:27 సొలొమోను రాజు అప్పుడిలా అన్నాడు, “బిడ్డను చంపకండి! బిడ్డను మొదటి స్త్రీకి ఇవ్వండి, అసలైన తల్లి ఆమెయే!”
1KI 3:28 ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను రాజు తీర్పును విన్నారు. ఆయన చాలా తెలివైనవాడు కావున అతనిని ప్రజలు చాలా గౌరవించారు. న్యాయ నిర్ణయం చేయుటలో ఆయనకు దేవుడిచ్చిన వివేకం ఉన్నట్లు వారు గమనించారు.
1KI 4:1 ఇశ్రాయేలు ప్రజలందరి పైన సొలొమోను రాజు పరిపాలన సాగించాడు.
1KI 4:2 తన పరిపాలనలో అతనికి సహాయ పడిన ప్రముఖమైన అధికారుల పేర్లు ఇవి: సాదోకు కుమారుడైన అజర్యా ప్రధాన యాజకుడు.
1KI 4:3 షీషా కుమారులైన ఎలీహోరెపు మరియు అహీయా న్యాయస్థానాలలో జరిగే వాగ్వాదములు, తీర్పులు మొదలగు వాటిని గ్రంధస్థం చేసే లేఖకులు. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు చరిత్రకారుడు.
1KI 4:4 యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధ్యక్షుడు. సాదోకు, అబ్యాతారు యాజకులు.
1KI 4:5 నాతాను కుమారుడు అజర్యా మండలాధిపతుల మీద అధికారి. నాతాను కుమారుడైన జాబూదు అంతఃపుర యాజకుడే గాక రాజైన సొలొమోనుకు సలహాదారుడు.
1KI 4:6 అహీషారు రాజు యొక్క ఇంటి నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకొనేవాడు. అబ్దా కుమారుడైన అదోనిరాము బానిసలకు అధిపతి.
1KI 4:7 ఇశ్రాయేలును పరిపాలనా సౌలభ్యం కొరకు మండలాల పేరుతో పన్నెండు ప్రాంతాలుగా విభజించారు. ప్రతి మండల పాలనకు రాజైన సొలొమోను ఒక పాలకుని ఎంపిక చేశాడు. ఈ పన్నెండుగురు మండలాధిపతులు రాజుకు, రాజ కుటుంబానికి ఆహారధాన్యాలు, తదితర తిను బండారాలు సేకరించి పంపేలా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ పన్నెండుగురు పాలకులలో ఒక్కొక్కడు సంవత్సరంలో ఒక్కొక్క నెల చొప్పున ఆహర పదార్థాలు సేకరించి రాజుకు పంపే బాధ్యత వహిస్తాడు.
1KI 4:8 ఆ పన్నెండుగురు మండలాధిపతుల పేర్లు ఇవి: బెన్‌-హూరు కొండల ప్రాంతమైన ఎఫ్రాయిమునందు పాలకుడు:
1KI 4:9 బెన్‌-దెకెరు అనునతను మాకస్సు, షయల్బీము, బేత్షెమెషులోను మరియు ఏలోన్భెధానానులోను;
1KI 4:10 బెన్‌-హెసెదు అనువాడు అరుబ్భోతు, శోకో మరియు హెపెరులోను;
1KI 4:11 బెన్‌-అబీనాదాబు నఫోతు దోరులోను (ఇతడు సొలొమోను కుమారైయగు టాపాతును వివాహ మాడాడు);
1KI 4:12 అహీలూదు కుమారుడైన బయనా అనువాడు తానాకు, మెగిద్దో మరియు సారెతాను పక్కనున్న బేత్షెయాను ప్రాంతమంతటికీ; (ఈ ప్రాంతం యెజ్రెయేలు దిగువ బేత్షెయాను మొదలుకొని ఆబేల్మే హోలా వరకు యొక్నెయాముకు అడ్డముగా వ్యాపించి ఉన్నది)
1KI 4:13 బెన్‌-గెబెరు అనునతను రామోత్గిలాదులోను; (ఇతడు గిలాదులోని మనష్షే కుమారుడైన యాయీరు పట్టణాలు, గ్రామాలపైన పాలకుడు. ఇతనింకా బాషానులో ఉన్న అర్గోబు మండల ప్రాంత మునకు కూడా పాలకుడుగా నియమింపబడ్డాడు. ఈ ప్రాంతంలో చుట్టూ ప్రాకారాలున్న అరువది నగరాలున్నాయి. ఈ నగరాలన్నిటికీ ద్వారాల మీద కంచు కడ్డీలు ఏర్పాటు చేయబడ్డాయి).
1KI 4:14 ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములోను;
1KI 4:15 అహీమయస్సు అనునతడు నఫ్తాలీములోను, ఇతడు సొలొమోను కుమార్తెయగు బాశెమతును వివాహమాడాడు;
1KI 4:16 హూషై కుమారుడగు బయనా ఆషేరులోను, ఆలోతులోను;
1KI 4:17 పరూయహు కుమారుడగు యెహోషాపాతు ఇశ్శాఖారు ప్రాంతంలోను;
1KI 4:18 ఏలా కుమారుడగు షిమీ బెన్యామీనులోను; సొలొమోను కింది అధికారులు, పాలకులు
1KI 4:19 ఊరి కుమారుడైన గెబెరు అనునతడు గిలాదులోను అధిపతులుగా నియమింపబడ్డారు. (గిలాదు ప్రాంతంలో అమోరీయులకు రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు నివసించేవారు). కాని ఆ ప్రాంత మంతటికీ గెబెరు ఒక్కడు మాత్రమే పాలకుడుగా నియమితుడయ్యాడు.
1KI 4:20 యూదాలోను, ఇశ్రాయేలులోను జనాభా విపరీతంగా పెరిగింది. సముద్రతీరాన ఇసుక రేణువులా ప్రజానీకం విస్తరించింది. ప్రజలంతా సుఖసంతోషాలతో తింటూ, తాగుతూ, విలాసంగా జీవిస్తూవున్నారు.
1KI 4:21 యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల రాజ్యం వరకుగల రాజ్యాలన్నిటిపైన సొలొమోను పరిపాలన సాగించాడు. అతని రాజ్యం ఈజిప్టు సరిహద్దుల వరకు వ్యాపించింది. ఈ సామ్రాజ్యాధి పతులంతా సొలొమోను ఆధిపత్యాన్ని అతని జీవితాంతంవరకు అంగీకరించి అతనికి పన్ను చెల్లిస్తూ వచ్చారు.
1KI 4:22 సొలొమోను రాజుకు, ఆయన బల్ల వద్ద భోజనం చేసే వారికి సరిపడు దినసరి ఆహార పదార్థాలు ఈ విధంగా వున్నాయి: ఆరువందల తూముల మెత్తని గోధుమ పిండి; పన్నెండు వందల తూముల ముతక పిండి; మంచి మేపులో ఉన్న పది ఆవులు; పొలాల్లో మేసే ఇరువది ఆవులు; వంద గొర్రెలు; మూడురకాల దుప్పులు; ప్రత్యేకంగా ఎంపిక చేసిన బాతులు మొదలగు పక్షిజాతులు.
1KI 4:24 యూఫ్రటీసు నదికి పశ్చిమ ప్రాంతాన గల రాజ్యాలన్నిటినీ సొలొమోను పరిపాలించాడు. ఈ ప్రాంతం తిప్సహు మొదలు గాజా వరకు వ్యాపించి వున్నది. సొలొమోను సామ్రాజ్యంలో నలుమూలలా శాంతి నెలకొన్నది.
1KI 4:25 సొలొమోను జీవించినంత కాలం యూదాలోను, ఇశ్రాయేలులోని దాను నుండి బెయేర్షెబా వరకు ప్రజలంతా శాంతి భద్రతలతో నివసించారు. ప్రజలు తమ తమ అంజూరపు చెట్ల కింద, ద్రాక్షాలతల కిందను కూర్చుని సుఖశాంతులతో జీవితం గడిపారు.
1KI 4:26 సొలొమోను తన రథాలనులాగే నాలుగు వేలగుర్రాలను ఉంచుటకు తగిన శాలలు ఏర్పాటు చేశాడు. ఆయనకు పండ్రెండు వేల గుర్రాలు వున్నాయి. తన రథాశ్వములకై సొలొమోను నాలుగు వేల గుర్రపు శాలలు కలిగియున్నాడు. సొలొమోనుకు పండ్రెండు వేల మందిగల గుర్రపు దళం కూడా వున్నది.
1KI 4:27 ప్రతినెల పన్నెండు మంది మండలాధిపతులలో ఒక్కొక్కడు చొప్పున సొలొమోను రాజుకు కావలసిన సరుకులన్నిటినీ సమకూర్చి పెట్టేవాడు. రాజు బల్ల వద్ద తినే వారందరికీ ఇవన్నీ సరిపోయేవి.
1KI 4:28 రాజు యొక్క రథాశ్వములకు, స్వారి గుర్రాలకు తగినంత పచ్చగడ్డిని, యవధాన్యమును మండలాధిపతులు సేకరించి సరఫరా చేసేవారు. ప్రతి ఒక్కడూ ఈ ధాన్యాన్ని నియమిత స్థానాలకు చేరవేసేవాడు.
1KI 4:29 సొలొమోనుకు దేవుడు మిక్కిలి జ్ఞానాన్ని ప్రసాదించాడు. సొలొమోను అనేక విషయాలను సూక్ష్మంగా గమనించేవాడు. అతని జ్ఞానం ఊహకందనిది.
1KI 4:30 తూర్పుదేశపు మానవులందరి వివేక జ్ఞానాలకంటె, సొలొమోను జ్ఞాన సంపద మిక్కిలి అతిశయించినది. ఈజిప్టులోనున్న వారి తెలివితేటల కంటె అతని శక్తి యుక్తులు మించినవి.
1KI 4:31 ఈ భూమి మీద ప్రజలందరికంటె అతను తెలివైనవాడు. అతడు ఎజ్రాహీయుడైన ఏతాను కంటె, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అనువారి కంటె మిక్కిలి తెలివైనవాడు. రాజైన సొలొమోను కీర్తి ఇశ్రాయేలు, యూదాల చుట్టు పక్కలనున్న దేశాలకు కూడ వ్యాపించింది.
1KI 4:32 తన జీవిత కాలంలో రాజైన సొలొమోను మూడు వేల సామెతలను రాశాడు
1KI 4:33 సొలొమోను ప్రకృతిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. సొలొమోను అనేక వృక్షజాతులను గూర్చి చెప్పాడు. లెబానోనులోని గొప్ప దేవదారు వృక్షములనుండి, గోడలలో పుట్టి పాకే లతజాతుల మొక్కల వరకు అతనికి తెలుసు. రాజైన సొలొమోను జంతువులను గూర్చి, పక్షులను గూర్చి, పాములు తదితర పాకే క్రిమికీటకాదులు, బల్లులు, చేపలు మొదలగు వాటిని గూర్చి కూడా చెప్పాడు.
1KI 4:34 రాజైన సొలొమోను జ్ఞానమును వినటానికి అన్ని దేశాల నుంచి ప్రజలు వచ్చేవారు. ఇతర దేశాల రాజులు తమ తమ పండితులను, శాస్త్రజ్ఞులను రాజైన సొలొమోను చెప్పే విషయాలను వినటానికి పంపేవారు.
1KI 5:1 హీరాము అనునతను తూరు దేశానికి రాజు. అతను దావీదుకు చిరకాల స్నేహితుడు. దావీదు స్థానంలో సొలొమోను రాజ్యానికి వచ్చాడని విన్న హీరాము తన సేవకులను సొలొమోను వద్దకు పంపాడు.
1KI 5:2 సొలొమోను వారిద్వారా రాజైన హీరాముకు ఇలా చెప్పి పంపాడు:
1KI 5:3 “నా తండ్రియగు రాజైన దావీదు చుట్టుపక్కల రాజ్యాల వారితో అనేక యుద్ధాలు చేసినట్లు నీకు తెలుసు. అందువల్ల యెహోవాయగు తన దేవుని ఘనపరిచేలా ఒక దేవాలయం నిర్మించ లేకపోయాడు. తన శత్రువులందరినీ యెహోవా తాను ఓడించేలా చేసే వరకు రాజైన దావీదు వేచివున్నాడు.
1KI 5:4 కాని ఇప్పుడు యెహోవా దేవుడు నీ రాజ్యాం నలుమూలలా శాంతి నెలకొనేలా చేశాడు. ప్రస్తుతం నాకు శత్రువులు లేరు. నా ప్రజలు నిర్భయంగావున్నారు.
1KI 5:5 “యెహోవా నా తండ్రియగు దావీదుకు ఒక మాట ఇచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు, ‘నీ తరువాత నీ కుమారుని రాజును చేస్తాను. నీ కుమారుడు నా పట్ల గౌరవ సూచకంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు.’ కావున ఇప్పుడు నా యెహోవా దేవునికి ఘనంగా ఒక దేవాలయం నిర్మింపజేస్తున్నాను.
1KI 5:6 అందువల్ల ఈ విషయంలో నీ సహాయం కోరుతున్నాను. నీ మనుష్యులను లెబానోనుకు పంపించు. వారక్కడ నా కొరకు దేవదారు వృక్షాలను పడగొట్టాలి. నా పనివాళ్లు నీ పనివారితో కలిసి పని చేస్తారు. నీ పనివాళ్లకు వేతనంగా నీవు ఎంత నిర్ణయిస్తే అది నేను చెల్లిస్తాను. కాని నీ సహాయం మాత్రం నాకు కావాలి. మా వడ్రంగులు సీదోను వడ్రంగులకు సాటిరారు.”
1KI 5:7 సొలొమోను అడిగినదంతా విన్న హీరాము చాలా సంతోషపడ్డాడు. “ఆ మహా సామ్రాజ్యానికి రాజుగా వ్యవహరించటానికి దావీదుకు ప్రజ్ఞాశాలియైన కుమారుని ప్రసాదించినందుకు దేవునికి ఈ రోజు నమస్కరిస్తున్నాను!” అని రాజైన హీరాము అన్నాడు.
1KI 5:8 అప్పుడు హీరాము ఒక సమాచారాన్ని సొలొమోనుకు యిలా పంపాడు: “నీవు అడిగిన విషయాలన్నీ నేను విన్నాను. నీవు కోరినన్ని దేవదారు వృక్షాలను, సరళపు చెట్లను నీకు యిస్తాను.
1KI 5:9 నా పనివాళ్లు ఆ దూలాలన్నిటినీ లెబానోను నుండి సముద్రతీరానికి చేరవేస్తారు. వాటిని నేను తెప్పలుగా కట్టించి సముద్రంలో వేయించి నీవు కోరిన స్థలానికి చేరేలా చేస్తాను. అక్కడ ఆ దూలాలను విడివిడిగా తీస్తాను. వాటిని నీవు తీసుకోవచ్చు. ఈ సందర్భంగా నీవు నా మాట మన్నించి నా రాజకుటుంబ పోషణకు తగిన ఆహార పదార్థాలను సమకూర్చుతావని ఆశిస్తున్నాను.”
1KI 5:10 ఆ విధంగా హీరాము దేవదారు, సరళపు చెట్ల కలపను సొలొమోనుకు సరఫరా చేయసాగాడు.
1KI 5:11 సొలొమోను కూడ హీరాముకు అతని ఇంటి వారి పోషణకు రెండు లక్షల తూముల గోధుమలు, మూడు వేల ఎనిమిది వందల పడుల స్వచ్ఛమైన ఒలీవగింజల నూనెను ప్రతియేటా పంపాడు.
1KI 5:12 యెహోవా చేసిన వాగ్దానం ప్రకారం ఆయన సొలొమోనుకు గొప్ప జ్ఞానాన్ని కలుగజేశాడు. హీరాము, సొలొమోనుల మధ్య శాంతి, సామరస్యాలు నెలకొన్నాయి. ఆ ఇద్దరు రాజులు ఒక ఒడంబడిక చేసుకున్నారు.
1KI 5:13 రాజైన సొలొమోను ముప్పదివేల మంది ఇశ్రాయేలీయులను ఈ పనిలో సహాయపడటానికి బలవంతంగా కూలిపనికి చేర్చుకున్నాడు.
1KI 5:14 వీరిపై అధికారిగా అదోనీరాము అను వానిని రాజైన సొలొమోను నియమించాడు. సొలొమోను వారిని మూడు జట్లుగా విభజించాడు. ప్రతి జట్టులోను పదివేల మంది వున్నారు. ప్రతి జట్టు లెబానోనులో ఒక నెలపాటు పనిచేసి, రెండు నెలలు ఇంటివద్ద ఉండేవారు.
1KI 5:15 సొలొమోను ఎనుబది వేల మందిని కొండ ప్రాంతంలో పనిచేయటానికి బలవంతపర్చాడు. వీరు రాళ్లు కొట్టి చెక్కాలి. కొట్టిన రాళ్లను చేరవేయటానికి డెబ్బది వేల మంది వున్నారు.
1KI 5:16 ఈ పని చేసే వారిపై పర్యవేక్షణకై మూడు వేల మూడు వందల మంది నియమితులయ్యారు.
1KI 5:17 రాజైన సొలొమోను దేవాలయ పునాదులకు పనికి వచ్చే విలువైన పెద్ద బండలు చెక్కమని పనివారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రాళ్లు అతి నేర్పుగా కొట్టబడేవి.
1KI 5:18 సొలొమోను యొక్క, హీరాము యొక్క శిల్పులు, మరియు బిబ్లోసు నుండి వచ్చన వారును రాళ్లను చెక్కారు. ఈ కట్టడపు పనివారంతా రాళ్లను, దూలాలను, దేవాలయ నిర్మాణానికి తయారు చేశారు.
1KI 6:1 ఆ విధంగా సొలొమోను దేవాలయ నిర్మాణం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో నుండి వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల తరువాత ఇది జరిగింది. అంతేగాకుండా ఇది రాజైన సొలొమోను ఇశ్రాయేలుపై రాజ్యాధిపత్యం వహించిన నాలుగవ సంవత్సరం. ఆ సంవత్సరంలో అది జీప్ అను రెండవ నెల.
1KI 6:2 దేవాలయం పొడవు తొమ్మిది అడుగులు వెడల్పు ముప్పై అడుగులు దాని ఎత్తు నలుబది ఐదు అడుగులు.
1KI 6:3 దేవాలయపు ముఖమండపం పొడవు ముప్పై అడుగులు; వెడల్పు పదిహేను అడుగులు. ఈ మండపం ప్రధాన దేవాలయానికి ముంగిటనే వున్నది. దీని పొడవు దేవాలయం యొక్క వెడల్పుకు సమానంగా వుంది.
1KI 6:4 దేవాలయంలో ఇరుకైన కిటికీలు వున్నాయి. ఈ కిటికీలు చూడటానికి బయటి నుండి ఇరుకుగాను, లోపలి వైపు విశాలంగాను వున్నాయి.
1KI 6:5 పిమ్మట ప్రధాన దేవాలయం గోడల నానుకొని కొన్ని గదులను సొలొమోను కట్టించాడు. ఈ గదులు ఒకదాని మీద ఒకటిగా నిర్మింపబడ్డాయి.
1KI 6:6 కింది అంతస్తులో ఉన్న గదుల వెడల్పు ఏడున్నర అడుగులు మధ్య అంతస్తులో గదుల వెడల్పు తొమ్మిది అడుగులు దాని పైగదుల వెడల్పు పదిన్నర అడుగులు గదులకు ఒక పక్క గోడగా వున్న దేవాలయం గోడ, కింద గదుల గోడకన్న మందము తక్కవ. గదులన్నీ ఆ గోడకు ఆనుకొని కట్టబడినా, వాటి ముఖ్య దూలాలు గోడలోకి చొచ్చుకొని పోకుండా ఆధార శిలలపై పెట్టబడ్డాయి.
1KI 6:7 ఈ దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లన్నీ అవి తీయబడిన గనుల వద్దనే కావలసిన రీతిలో శిల్పులచే చెక్కబడి, మలచబడినందున నిర్మాణ స్థలంలో సుత్తులు, గొడ్డళ్లు, తదితర పనిముట్లు వాడిన శబ్దం వినరాలేదు.
1KI 6:8 దేవాలయం పక్కగా కట్టిన కింది గదులకు ప్రవేశ మార్గం దక్షిణ భాగాన వున్నది. రెండవ అంతస్తుకు వెళ్లటానికి, అక్కడి నుండి మూడవ అంతస్తు గదులకు వెళ్లటానికి మెట్ల మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి.
1KI 6:9 దేవాలయపు పైకప్పును దూలాలతోను, దేవదారు చెక్కలతోను సొలొమోను నిర్మింపజేశాడు. ఆ విధంగా సొలొమోను దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు.
1KI 6:10 దేవాలయం పక్కనున్న కింది అంతస్తు పని కూడా పూర్తి చేశాడు. అది ఏడున్నర అడుగుల ఎత్తు వుంది. అది దేవదారు దూలాలతో దేవాలయానికి జత చేర్చ బడివుంది.
1KI 6:11 సొలొమోనుతో యెహోవా ఇలా అన్నాడు:
1KI 6:12 “నీవు నా న్యాయ సూత్రాలను, ఆజ్ఞలను పాటించి నట్లయితే నీ తండ్రియగు దావీదుకు నీ గురించి నేను చేసిన వాగ్దానం నెరవేర్చుతాను.
1KI 6:13 నా ప్రజలైన ఇశాయేలీయుల మధ్య నీవు నిర్మించే ఈ దేవాలయంలో నేను నివసిస్తాను. నేను ఇశ్రాయేలు ప్రజలను ఎన్నటికి విడనాడను.”
1KI 6:14 సొలొమోను దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు.
1KI 6:15 దేవాలయపు లోపలి పక్క గోడలకు దేవదారు బల్లలు అమర్చబడ్డాయి. కింది నేల భాగం సరళపు మ్రాను చెక్కలతో కప్పబడింది.
1KI 6:16 ముప్పై అడుగుల పొడవు గల ఒక గది దేవాలయానికి వెనుకగా కట్టబడింది. కింది నుంచి కప్పు వరకు అమర్చబడిన దేవదారు చెక్కల పనితనంతో ఈ గది దేవాలయంనుండి వేరు చేయబడింది. ఈ గదికి అతి పవిత్ర స్థలమని పేరు.
1KI 6:17 ఈ మిక్కిలి పరిశుద్ధ స్థలం ముందున్నగది అరువది అడుగుల పొడవు గలిగివున్నది.
1KI 6:18 ఆ దేవదారు చెక్కలపై వికసించిన పువ్వులు, సొర తీగలు మనోహరంగా చెక్కబడ్డాయి. ఆ గది లోపలి భాగమంతా దేవదారు పలకలతో కప్పబడింది. అందువల్ల ఎవ్వరూ గోడ రాళ్లను చూడలేరు.
1KI 6:19 ఆలయ ప్రాంగణానికి వెనుక వున్న ఈ అతి పరిశుద్ధ స్థలము దేవుని ఒడంబడిక పెట్టె వుంచటానికి నిర్మింపబడింది.
1KI 6:20 ఈ అతి పరిశుద్ధ స్థలము ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు ముప్పై అడుగుల ఎత్తు కలిగివుంది.
1KI 6:21 సొలొమోను ఈ అతి పరిశుద్ధ స్థలము లోపలి భాగమంతా శుద్ధ బంగారంతో పొదిగించాడు. ఈ గదికి ముందు బంగారంతో పొదగబడిన ఒక బలిపీఠం నిర్మించబడింది. దాని చుట్టూ బంగారు గొలుసులు చుట్టబడ్డాయి. కెరూబులు రెండూ బంగారు రేకులతో కప్పబడ్డాయి.
1KI 6:22 దేవాలయం మొత్తం బంగారంతో పొదగబడింది. అతి పరిశుద్ధ స్థలము వద్దగల పీఠం కూడా బంగారంతో పొదగబడింది.
1KI 6:23 పనివారు కెరూబులను రెక్కలతో తయారు చేశారు. అవి ఒలీవ కర్రతో చేయబడ్డాయి. ఈ కెరూబులను అతి పరిశుద్ధ స్థలములో వుంచారు. ప్రతి ఒక్క దేవదూత పదిహేను అడుగుల పొడవు వున్నది.
1KI 6:24 రెండు కెరూబులు ఒకే పరిమాణంలో, ఒకే రకంగా నిర్మించబడ్డాయి. ప్రతి కెరూబునికీ రెండు రెక్కలున్నాయి. ప్రతి రెక్క ఏడున్నర అడుగుల పొడవుంది. ఒక రెక్క చివరి నుండి మరో రెక్క చివరి వరకు గల మధ్య దూరం పదిహేను అడుగులు. ప్రతి కెరూబు పదిహేను అడుగుల పొడవులో మలచబడింది.
1KI 6:27 ఈ కెరూబులు అతి పరిశుద్ధ స్థలములో పక్కపక్కన నిలబెట్టబడ్డారు. గది మధ్యలో వారి రెక్కలు ఒక దానితో ఒకటి కలిశాయి. మిగిలిన రెండు రెక్కలు ఆ పక్కగోడ నొకటి ఈ పక్క గోడ నొకటి ఆనుకొని వున్నాయి.
1KI 6:28 రెండు కెరూబులు బంగారంతో పొదగబడ్డాయి.
1KI 6:29 అతి పరిశుద్ధ స్థలము చుట్టూవున్న గోడలమీద, లోపల గదుల గొడల మీద కెరూబులు, తమాల వృక్షాలు, పువ్వులు చిత్రీకరింపబడ్డాయి.
1KI 6:30 అతి పరిశుద్ధ స్థలము, దేవాలయ ప్రాంగణ గది నేలలు బంగారు రేకులతో కప్పబడ్డాయి.
1KI 6:31 అతి పరిశుద్ధ స్థలానికి తలుపులు ఏర్పరచ బడ్డాయి. ఆ తలుపులు ఒలీవ కర్రతో చేయబడ్డాయి. తలుపు ఐదు రకాలుగా తిరిగే విధంగా ఐదు ముఖముల నిలువు కమ్మికి అమర్చబడింది.
1KI 6:32 రెండు తలుపులూ ఒలీవ కర్రతో చేయబడినవే. తలుపుల మీద కెరూబుల, తమల వృక్షాల, పువ్వుల చిత్రాలు మలచబడ్డాయి. తలుపులు బంగారంతో పొదగబడ్డాయి.
1KI 6:33 ప్రధాన గది ద్వారానికి ఒలీవ కర్రతో చేయబడిన చదరపు తలుపు అమర్చబడింది.
1KI 6:34 దాని రెండు తలుపులు సరళపు చెక్కలతో చేయబడ్డాయి.
1KI 6:35 ప్రతి తలుపూ రెండు భాగాలుగా చేయబడింది. దానివల్ల రెండేసి భాగాలు మూయటానికి వీలవుతుంది. తలుపుల మీద కెరూబులు, తమాల వృక్షాలు, పూవులు చెక్క బడ్డాయి. ఈ చెక్కడాలన్నిటి పైన బంగారు పూత వేయబడింది.
1KI 6:36 తరువాత లోపలి ఆవరణం సిద్ధం చేయబడింది. పెరడు చుట్టూ గోడ నిర్మాణం జరిగింది. ఈ గోడలు చెక్కిన మూడు రాళ్ల వరుసతో నిర్మింపబడి, వాటికి ఒక వరుసలో దేవదారు చెక్క అమర్చబడింది.
1KI 6:37 ఆ సంవత్సరంలో దేవాలయ నిర్మాణం పని రెండవ నెలలో ప్రారంభించబడింది. ఆ నెల పేరు జీప్. అది సొలొమోను ఇశ్రాయేలును పాలించటం మొదలు పెట్టిన పిమ్మట నాలుగవ సంవత్సరం.
1KI 6:38 సొలొమోను పాలన పదకొండు సంవత్సరాలు సాగేనాటికి దేవాలయ నిర్మాణం పూర్తయింది. పూర్తి అయ్యేనాటికి ఆ సంవత్సరంలో ఎనిమిదవ నెల జరుగుతూ వుంది. దాని పేరు బూలు. దేవాలయ నిర్మాణం పథకం ప్రకారం పూర్తయింది. దేవాలయ నిర్మాణ పరిసమాప్తికి సొలొమోను ఏడు సంత్సరాలు కృషి చేశాడు.
1KI 7:1 రాజైన సొలొమోను తనకై ఒక రాజభవనం కట్టించాడు. సొలొమోను రాజభవన నిర్మాణానికి పదమూడు సంవత్సరాలు పట్టింది.
1KI 7:2 అతడింకా “లెబానోను అరణ్యపు విశ్రాంతి గృహాన్ని” కూడ ఒకటి కట్టించాడు. అది నూట ఏభై అడుగుల పొడవు, డెబ్బది ఐదు అడుగుల వెడల్పు, మరియు నలభై ఐదు అడుగలు ఎత్తు కలిగివుంది. దానికి నాలుగు వరుసల దేవదారు స్తంభాలు వున్నాయి. వాటి పైన నగిషీ పని చేసిన దేవదారు స్తంభ శీర్షాలు నిలుపబడ్డాయి.
1KI 7:3 స్తంభముల మీద పైకప్పుగా దేవదారు పలకలు పర్చచబడ్డాయి. కప్పు భాగానికి నలభై యైదు దూలాలను పరిచారు. నాలుగు స్తంభాల వరుసల మధ్యనున్న మూడు భాగాలకు ఒక్కొక్క దానికి పదిహేను కొయ్య కడ్డీలు చొప్పున అమర్చబడ్డాయి.
1KI 7:4 ఈ వరుసల మధ్య కిటికీలున్నాయి. అవి ఒకదానికొకటి ఎదురెదురుగా నిర్మింపబడ్డాయి.
1KI 7:5 తలుపులన్నీ చదరంగా వున్నాయి. ప్రతి వరుస చివరనున్న తలుపులు ఒకదానికొకటి ఎదురెదురుగా వున్నాయి.
1KI 7:6 సొలొమోను “స్తంభాలతో ఒక మండపం” నిర్మించాడు. దాని పొడవు డెభ్బై అడుగులు; వెడల్పు నలభై అడుగులు, స్తంభాల నాధారంగా చేసుకొని మండపానికి ముందు ఒక వసారా వుంది.
1KI 7:7 సొలొమోను తమ న్యాయ విచారణ జరుపుటకు సింహాసనమున్న ఒక గదిని కట్టించాడు. దానికి “న్యాయసభాస్థలి” అని పేరు పెట్టాడు. ఆ గదంతా కింది నేలనుండి పైకప్పు దూలాల వరకు దేవదారు చెక్కలతో కప్పబడింది.
1KI 7:8 సొలొమోను నివసించే ఇల్లు ఈ న్యాయ సభాస్థలానికి బాగా వెనుక భాగంలో వుంది. అదే రకమైన మరియొక ఇంటిని తన భార్యకై నిర్మింపజేశాడు. తన భార్య ఈజిప్టు రాజు కుమారై.
1KI 7:9 ఈ భవనాలన్నీ చాలా ఖరీదైన రాళ్లతో కట్టబడ్డాయి. ఈ రాళ్లన్నీ కావలసిన పరిమాణంలో చెక్కబడి, ప్రత్యేక రంపాలతో కోయబడ్డాయి. ఈ రాళ్లు ముందు వెనుక కోయబడ్డాయి. ఈ ఖరీదైన రాళ్లు పునాదుల నుండి పైవరుస వరకు వేయబడ్డాయి. ఆవరణ గోడలకు, ఆవరణలోను రాళ్లు వాడబడ్డాయి.
1KI 7:10 పునాదులకు ఖరీదైన పెద్ద బండలు వేయబడ్డాయి. కొన్ని బండలు పదిహేను అడుగుల పొడవు గలవి; మరికొన్ని పన్నెండు అడుగుల పొడవుగలవై వున్నాయి.
1KI 7:11 ఈ బండల మీద ఇతర ఖరీదైన రాళ్లు, దేవదారు కట్టెలు వేశారు.
1KI 7:12 భవనపు ఆవరణ, దేవాలయపు ఆవరణ, దేవాలయ సింహద్వారపు గోడలు మూడు వరుసల చెక్కిన రాళ్లతో నిర్మింపబడి వాటి మీద దేవదారు దూలాలు వేయబడ్డాయి.
1KI 7:13 రాజైన సొలొమోను తూరు పట్టణం నుండి హీరాము అను వానిని తన వద్దకు పిలిపించాడు.
1KI 7:14 హీరాము తల్లి నఫ్తాలి వంశానికి చెందిన స్త్రీ. మరణించిన తన తండ్రి తూరు పట్టణపువాడు. హీరాము కంచు పనిలో బహు నేర్పరి. మంచి అనుభవజ్ఞుడు. రాజైన సొలొమోను అతనిని పిలవగా హీరాము అంగీకరించి వచ్చాడు. రాజైన సొలొమోను కంచు పనులన్నిటికీ అతనిని అధిపతిగా చేశాడు. కంచుతో చేసే పనులన్నీ హీరాము నిర్వహించాడు.
1KI 7:15 హీరాము రెండు కంచు స్తంభాలు పోత పోశాడు. ఒక్కొక్కటి ఇరువై ఏడు అడుగుల పొడవు, పద్దెనిమిది అడుగుల చుట్టు కొలత (ఉరవు) కలిగి వున్నాయి. అయితే ఈ స్తంభాల లోపలి భాగం బోలుగా వుంది. స్తంభపు అంచు మందం నాలుగు అంగుళాలు.
1KI 7:16 అతడు రెండు స్తంభ శీర్షాలు కూడా తయారు చేశాడు. అవి ఒక్కొక్కటి ఏడున్నర అడుగుల పొడవున వున్నాయి. ఈ స్తంభశీర్షాలను హీరాము తాను పోతపోసిన స్తంభాలపై నిలిపాడు.
1KI 7:17 పిమ్మట గొలుసులతో వలలవంటి అల్లిక తయారు చేసి స్తంభాల మీద నున్న శీర్షాలను కప్పేలా పైనవేశాడు.
1KI 7:18 దానిమ్మకాయల ఆకారంలో వేలాడే బంతులు గల రెండు కంచు గొలుసులను అతడు తయారు చేశాడు. ఈ కంచు దానిమ్మ కాయల వరుసలను స్తంభశీర్షాల మీదనున్న లోహపు వలలమీద చుట్టాడు.
1KI 7:19 ఈ స్తంభశీర్షాలు ఏడున్నర అడుగుల పొడవున వికసించిన పద్మాకారంలో మలచబడ్డాయి.
1KI 7:20 ఈ స్తంభశీర్షాలు కంచు స్తంభాలమీద పెట్టబడ్డాయి. పాత్ర ఆకారంలో ఉన్న వలలపైన అవి పెట్టబడ్డాయి. ఆ ప్రదేశంలో స్తంభశీర్షం చుట్టూ ఇరవై దానిమ్మ కాయలు గల గొలుసు చుట్టబడింది.
1KI 7:21 ఈ రెండు కంచు స్తంభాలను హీరాము దేవాలయపు మండపం వద్ద నిలబెట్టాడు. ఒక స్తంభం దక్షిణ వైపున, మరొక స్తంభం ఉత్తరవైపున నిలుపబడ్డాయి. దక్షిణ స్తంభానికి యాకీను అని, ఉత్తర స్తంభానికి బోయజు అని పేర్లు పెట్టారు.
1KI 7:22 పుష్పాకారంలో వున్న పీటలు కంచుస్తంభాలపై ఉంచబడ్డాయి. ఆ విధంగా స్తంభ నిర్మాణం పని పూర్తయింది.
1KI 7:23 పిమ్మట హీరాము కంచుతో ఒక గుండ్రని కోనేరు తయారు చేశాడు. (దానిని వారు “సముద్రం” అని పిలిచారు) ఆ సముద్రం సుమారు నలభై ఐదు అడుగుల చుట్టు కొలత కలిగివుంది. ఒక అంచునుండి మరొక అంచు వరకు సముద్రం అడ్డుగా పదిహేను అడుగులు వుంది. దాని లోతు ఏడున్నర అడుగులు.
1KI 7:24 దాని చుట్టు బయటి అంచున ఒక కమ్మి ఉన్నది. ఈ కమ్మి కింద రెండు వరుసల కంచు సొరతీగె పొందుపర్చబడింది. అనగా ఈ కంచు సొరతీగ ఒక్క ముక్కగానే చెరువుతో పాటు ఒకే సారి మలచబడింది.
1KI 7:25 ఈ కోనేటిని పన్నెండు కంచు గిత్తల వీపులపై నిలిపారు. ఈ పన్నెండు గిత్తులు చెరువునుండి బయటికి చూస్తున్నాయి. మూడు ఉత్తరానికి, మూడు తూర్పుకు, మూడు దక్షిణానికి, మరి మూడు పడమరకు చూస్తున్నాయి.
1KI 7:26 కంచు చెరువు అంచుమందం నాలుగు అంగుళాలు. చెరువు అంచు గిన్నె అంచులా, విచ్చిన పూరేకులా వున్నది. ఆ చెరువులో సుమారు తొమ్మిది గరిసెల నీరు పట్టుతుంది.
1KI 7:27 హీరాము తరువాత పది కంచు తోపుడు బండ్ల వంటివి తయారుచేశాడు. ఒక్కొక్క దాని పొడవు ఆరు అడుగులు (నాలుగు మూరలు), వెడల్పు ఆరు అడుగులు, మరియు ఎత్తు నాలుగున్నర అడుగులు (మూడు మూరలు),
1KI 7:28 వీటి పక్కలు నాలుగు మూలలుగా వున్న కంచు పలకలతో మూయబడ్డాయి. ఆ నాలుగు మూలలుగా వున్న పలకలు చట్రాలతో బిగించబడ్డాయి.
1KI 7:29 అ పలకల మీద సింహాలు, గిత్త దూడలు, కెరూబులు చిత్రీకరించబడ్డాయి. ఆ సింహాల, గిత్తల బొమ్మలపై వరుస, కింది వరుసలలో పువ్వుల అలంకరణ కంచులోకి దట్టించి ముద్రించబడింది.
1KI 7:30 ప్రతి బండికి నాలుగు కంచు చక్రాలున్నాయి. చక్రాలకు ఇరుసులున్నాయి. మూలల మీద పెద్ద గిన్నెలు నిలపటానికి కంచు ముక్కల ఆధారం వుంది. ఆ కంచు ఆధారాల మీద పూలు చెక్కబడ్డాయి.
1KI 7:31 ఆ గిన్నెలకు పైన అంచు చుట్టూ చట్రముంది. గిన్నెకు పదునెనిమిది అంగుళాల ఎత్తున అదివుంది. గిన్నె మూతి గుండ్రంగా వున్నది. గిన్నెలోతు ఇరువది ఏడు అంగుళాలు. చట్రం మీద కూడ అలంకరణ చెక్కబడి వున్నది. ఈ చట్రం గుండ్రంగా గాక నాలుగు పలకలుగా వుంది.
1KI 7:32 అడుగు చట్రం కింద నాలుగు చక్రాలున్నాయి. చక్రాలు ఇరవై ఏడు అంగుళాల ఎత్తు వున్నాయి. చక్రాల ఇరుసులు బండితో ఒకే రీతిగా చేయబడ్డాయి.
1KI 7:33 వీటి చక్రాలు రథ చక్రాలను పోలి వున్నాయి. చక్రాలలో ప్రతిదీ వాటి మధ్య కడ్డీలు, అంచులు, చువ్వలు, చక్రపు నడిమి భాగం కంచుతో చేయబడింది.
1KI 7:34 ప్రతి బండికీ నాలుగు మూలలా నాలుగు ఆధారాలున్నాయి. అవన్నీ బండితో పాటు ఒకే రీతిగా చేయబడినవే.
1KI 7:35 ప్రతి బండి చుట్టూ పైభాగాన ఒక బొద్దు వంటి చట్రముంది. అది బండితో కలిసి ఏకంగా చేయబడింది.
1KI 7:36 బండి పక్కన గల కంచు పలకలపై కెరూబుల, సింహాల, తమాల వృక్షాల చిత్రాలు మలచబడ్డాయి. ఎక్కడెక్కడ అవకాశం వున్నదో అక్కడ చిత్రాలు, అలంకరణలు చెక్కబడ్డాయి. చుట్టూ అనేక పుష్పాలు చెక్కబడ్డాయి.
1KI 7:37 ఆ రకంగా హీరాము పది బండ్లను తయారు చేశాడు. ప్రతీదీ కరిగించిన కంచును మూసలో పోత పోశారు. కావున అన్ని బండ్లు ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో ఉన్నాయి.
1KI 7:38 హీరాము పిమ్మట పది పెద్ద తొట్లను తయారు చేశాడు. ముందు నిర్మించిన పది బండ్ల మీదికి పది తొట్లను నిర్మించాడు. ప్రతి తొట్టి ఈ అంచు నుండి ఆ అంచు వరకు అడ్డంగా ఆరడుగులు వుంది. ప్రతి తొట్టిలోను ఏడువందల ఇరువది తూముల నీరు పట్టేది.
1KI 7:39 హీరాము ఐదు బండ్లను దేవాలయానికి దక్షిణాన, మిగిలిన ఐదింటిని ఉత్తర భాగాన ఉంచాడు. పెద్ద కోనేటిని దేవాలయానికి ఆగ్నేయ భాగాన నెలకొల్పాడు.
1KI 7:40 హీరాము ఇంకా కొన్ని కుండలను, చిన్నపాటి గరిటెలను, గిన్నెలను తయారు చేశాడు. రాజైన సొలొమోను హీరామును చేయుమని చెప్పిన వన్నీ అతడు పూర్తిచేశాడు. యెహోవా దేవాలయానికై హీరాము చేసిన వస్తువులు ఇవి:
1KI 7:41 రెండు స్తంభాలు; ఆ రెండు స్తంభాల మీద నున్న స్తంభశీర్షాలకు ఏర్పాటు చేసిన గిన్నెలాంటి పాత్రలు; స్తంభాల మీది రెండు శీర్షాల కొరకు ఉంచబడిన రెండు గిన్నెలను కప్పటానికి రెండు అల్లికలు;
1KI 7:42 ఆ అల్లికలకు నాలుగు వందల దానిమ్మకాయల బొమ్మలు; రెండు స్తంభాల మీది శీర్షాలకు అమర్చిన గిన్నెలపై గల అల్లికల మీద దానిమ్మకాయల గొలుసును రెండు వరుసల చొప్పున చుట్టారు.
1KI 7:43 పది బండ్లు; వాటిపైన తొట్టెలు;
1KI 7:44 పన్నెండు గిత్తలపై నిల్పిన ఒక పెద్ద కోనేరు;
1KI 7:45 కుండలు, చిన్న పాటి గరిటెలు, గిన్నెలు, యెహోవా దేవాలయానికి కావలసిన తదితర పాత్రలు; మరియు రాజు ఇంటికి నలభై ఎనిమిది స్తంభాలు; రాజైన సొలొమోను కోరినవన్నీ హీరాము తయారు చేసి పెట్టాడు. అవన్నీ మెరుగు దిద్దిన కంచుతో చేయబడ్డాయి.
1KI 7:46 సొలొమోను ఈ వస్తు సామగ్రిని చేయటానికి పట్టిన కంచును తూకం వేయలేదు. అది తూచటానికి అలివికానంత ఉంది. అందువల్ల వారు ఎంత కంచు వాడినది తెలియదు.
1KI 7:47 ఈ కంచు సామగ్రి అంతా రాజు ఆజ్ఞ ప్రకారం యొర్దాను నది దగ్గర సుక్కోతుకు, సారెతానుకు మధ్య చేయబడ్డాయి. ఈ వస్తు సామగ్రినంతా కంచు కరగించి బంక మట్టితో చేసిన మూసలలో పోసి వారు తయారుచేశారు.
1KI 7:48 దేవాలయం కొరకు అనేక వస్తువులు బంగారంతో చేయటానికి కూడ సొలొమోను ఆజ్ఞ ఇచ్చాడు. బంగారంతో దేవాలయానికి సొలొమోను చేయించిన వస్తువులు ఈ విధంగా వున్నాయి: బంగారు బలిపీఠం; బంగారపు బల్ల (దేవునికి అర్పించు సముఖపు రొట్టెలు ఉంచడానికి).
1KI 7:49 పది దీప స్తంభాలు: (అతి పరిశుద్ధ స్థలము ముందు కుడిపక్కన ఐదు, ఎడమపక్కన ఐదు ఇవి ఉంచబడ్డాయి) బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పటకారులు;
1KI 7:50 గిన్నెలు; దీపాలను కాంతి కొరకై ఎగ దోసేపనిముట్లు; పాత్రలు; పెనాలు; ధూపం వేయటానికి బొగ్గులు వేసే బంగారు ధూపకలశం; దేవాలయం సింహద్వారపు తలుపులు.
1KI 7:51 ఆ రకంగా రాజైన సొలొమోను కోరుకున్న ప్రకారం యెహోవా దేవాలయంయొక్క పని పూర్తి అయింది. అప్పడు రాజైన సొలొమోను తన తండ్రి దావీదు దేవునికి అంకితం చేసిన వస్తువులన్నీ దేవాలయానికి తెచ్చాడు. దేవాలయపు ధనాగారంలో ఆ వెండి బంగారాలు భద్రపరిచాడు.
1KI 8:1 రాజైన సొలొమోను తరువాత ఇశ్రాయేలు పెద్దలం దరి నీ, ఆయా వంశాల ప్రధాన పురుషులను, ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలను ఒక చోటికి పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో తన వద్దకు రమ్మని చెప్పాడు. సీయోను అనబడే దావీదుపురంనుండి దేవుని ఒడంబడిక పెట్టెను దేవాలయానికి తరలించే కార్యక్రమంలో పాల్గొనమని సొలొమోను వారిని కోరాడు.
1KI 8:2 కావున ఇశ్రాయేలీయులందరూ రాజైన సొలొమోను వద్దకు వచ్చారు. ఏతనీము అనబడే మాసంలో పండుగ సందర్భంగా ప్రత్యేక సెలవు రోజున (పర్ణశాలల పండుగ) సమావేశం జరిగింది. అది సంవత్సరంలో ఏడవనెల.
1KI 8:3 ఇశ్రాయేలు పెద్దలందరూ ఆ స్థలానికి వచ్చారు. అప్పుడు యాజకులు పవిత్ర ఒడంబడిక పెట్టె తీసుకున్నారు.
1KI 8:4 యెహోవా ఒడంబడిక పెట్టె సన్నిధి గుడారము, దానిలోని పవిత్ర వస్తువులతో పాటు వారు మోసుకొని వెళ్లారు. లేవీయులు కొందరు ఈ వస్తువులను మోయుటలో సహాయం చేశారు.
1KI 8:5 రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒడంబడిక పెట్టె ముందు సమావేశమయ్యారు. వారప్పుడు ఎవ్వరూ లెక్కపెట్టలేనన్ని గొర్రెలను, పశువులను బలియిచ్చారు.
1KI 8:6 అప్పుడు యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టె దాని అసలైన స్థానంలో ఉంచారు. అది అతి పరిశుద్ధ స్థలము. ఒడంబడిక పెట్టె కెరూబుల రెక్కల కిందుగా ఉంచబడింది.
1KI 8:7 ఒడంబడిక పెట్టె ఉంచబడిన స్థానం మీదుగా కెరూబుల రెక్కలు వ్యాపించి వున్నాయి. ఆ రెక్కలు ఒడంబడిక పెట్టె, దానిని మోయుటకు ఉపయోగించే కోలలను కప్పివేశాయి.
1KI 8:8 ఒడంబడిక పెట్టె మోసే కోలలు (కర్రలు) చాలా పొడవైనవి. అతి పరిశుద్ధ స్థలం ముందు పవిత్ర స్థలంలో ఎవరు నిలబడి చూసినా ఆ కోలలను చివరి వరకు చూడగలరు. కాని వాటినెవరూ బయటి నుండి చూడలేరు. ఈ నాటికీ ఆ కోలలు అదే స్థానంలో వున్నాయి.
1KI 8:9 ఆ ఒడంబడిక పెట్టెలో వున్నవి కేవలం రెండు రాతి ఫలకాలు. ఈ రెండు ఫలకాలను హోరేబు అనే చోట మోషే ఈ ఒడంబడిక పెట్టెలో భద్రపరచాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి బయటికి వచ్చిన తరువాత హోరేబు అనే చోటనే యెహోవా వారితో తన ఒడంబడిక చేశాడు.
1KI 8:10 యాజకులు అతి పరిశుద్ధ స్థలాన్ని వదిలి బయటికి వచ్చిన పిమ్మట, ఒక మేఘం యెహోవా దేవాలయాన్ని కమ్మివేసింది.
1KI 8:11 యెహోవా మహిమతో దేవాలయం నిండిపోగా యాజకులు తమ విధులను నిర్వర్తించలేక పోయారు.
1KI 8:12 అప్పుడు సొలొమోను ఇలా అన్నాడు: “ఆకాశంలో ప్రకాశించటానికి యెహోవా సూర్యుడ్ని కలుగజేశాడు, కాని ఆయన మాత్రం ఒక నల్లని మేఘంలో నివసిస్తానన్నాడు.
1KI 8:13 నిజానికి నేకొక అద్భుతమైన దేవాలయాన్ని నీ కొరకు నిర్మించాను, అది నీవు శాశ్వతంగా నివసించే స్థలం.”
1KI 8:14 ఇశ్రాయేలీయులందరూ అక్కడ నిలబడియున్నారు. రాజైన సొలొమోను వారి వైపు తిరిగి వారిని దీవించుమని దేవునిని అడిగాడు.
1KI 8:15 తరువాత రాజైన సొలొమోను దేవునికి సుధ్ఘీరమైన ప్రార్థన చేశాడు. ఆయనిలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉన్నతుడు. నా తండ్రి దావీదుకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన అన్నీ నెరవేర్చాడు.
1KI 8:16 యెహోవా నా తండ్రితో, ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టునుండి విముక్తులను చేసి తీసుకొని వచ్చాను. కాని నా గౌరవార్థం నాకో దేవాలయం కట్టించటానికి ఇశ్రాయేలు వంశాలు నివసించే ఏ పట్టణాన్నీ నేనింకా ఎన్నుకో లేదు. నా ప్రజలైన ఇశ్రాయేలును ఏలటానికి నేనొక యువరాజును ఎంపిక చేయలేదు. కాని నేను గౌరవింపబడే చోటుగా ఇప్పుడు యెరూషలేమును ఎన్నుకున్నాను. మరియు నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించటానికి దావీదును ఎంపిక చేశాను’ అని చెప్పాడు.
1KI 8:17 “ఇశ్రాయేలు దేవుడై యెహోవాకు ఘనంగా ఒక దేవాలయం కట్టించాలని నా తండ్రి దావీదు మిక్కిలిగా కోరుకున్నాడు.
1KI 8:18 కాని యెహోవా నా తండ్రి దావీదుతో ‘నాకు తెలుసు, నీవు నాకు దేవాలయం కట్టించి గౌరవించాలని మిక్కిలి ఆసక్తితో ఉన్నావు. నాకు దేవాలయ నిర్మాణం చేయాలను కోవటం సంతోషించ తగ్గ విషయం.
1KI 8:19 కాని నాకు దేవాలయం కట్టించేది నీవు కాదు. నేను ఆ పనికి నిన్ను ఎంపిక చేయలేదు. నీ రక్తం పంచుకు పుట్టిన నీ కుమారుడు నాకు దేవాలయ నిర్మాణం చేయిస్తాడు,’ అని అన్నాడు.
1KI 8:20 “కావున యెహోవా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. నా తండ్రి దావీదు స్థానంలో ఇప్పుడు నేను రాజును. యెహోవా కనికరించిన విధంగా ఇప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తున్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను దేవాలయం కట్టించాను.
1KI 8:21 దేవాలయంలో దేవుని ఒడంబడిక పెట్టెకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేశాను. మన పూర్వీకులతో యెహోవా చేసిన ఒక ఒడంబడిక ఆ మందసంలో వుంది. యెహోవా మన పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆ ఒడంబడిక చేశాడు.”
1KI 8:22 పిమ్మట సొలొమోను యెహోవా బలిపీఠం ముందు నిలబడ్డాడు. ప్రజలంతా అతనికి ఎదురుగా నిలబడ్డారు. రాజైన సొలొమోను చేతులు చాపి, ఆకాశంవైపు చూశాడు.
1KI 8:23 అతనిలా అన్నాడు: “ఓ ప్రభూ, ఇశ్రాయేలీయుల దేవా! నీవంటి యెహోవా ఆకాశంలో గాని, భూమి మీద గాని మరొక్కడు లేడు. నీ ప్రజలను నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్నావు. కావున నీవు వారితో ఒక ఒడంబడిక చేసుకున్నావు. నిన్ననుసరించే ప్రజల పట్ల నీ ఒడంబడిక తప్పక అమలు పర్చుతావు.
1KI 8:24 నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుకు నీవు ఆ వాగ్దానం చేశావు. నీవు ఆ వాగ్దానం నెరవేర్చావు. నీ నోటితో నీవే ఆ వాగ్దానం చేశావు. నీ అమోఘమైన శక్తి సంపదతో ఆ వాగ్దానం ఈ రోజు నిజమయ్యేలా చేశావు.
1KI 8:25 ఇశ్రాయేలీయుల దేవుడవైన నా ప్రభువా, నా తండ్రియు నీ సేవకుడు అయిన దావీదుకు నీవు చేసిన ఇతర వాగ్దానాలను కూడ ఇప్పుడు నెరవేర్చు. నీవిలా అన్నావు: ‘నీవు నా ఆజ్ఞలను పాటించినట్లు నీ కుమారులు కూడా నన్ననుసరించే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. వారు అలా చేస్తే నీవు నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఇశ్రేయేలును పాలించటానికి ఒకనిని కలిగి వుంటావు.’
1KI 8:26 ఇశ్రాయేలు దైవమగు ఓ నా ప్రభువా, నీవు నా తండ్రికిచ్చిన ఆ వాగ్దానం కొనసాగించుమని కూడా నేను వేడు కుంటున్నాను.
1KI 8:27 “కాని దేవుడు నిజంగా ఈ భూమి మీద నివసించగలడా? ఈ ఆకాశము, ఉన్నత ఆకాశాలు నిన్ను భరించ జాలవు. నేను నిర్మించిన ఈ నివాసం కూడ ఖచ్చితంగా నిన్ను ఇముడ్చుకోలేదు.
1KI 8:28 దయచేసి నా ప్రార్థనను, నా మనవిని ఆలకించు. నేను నీ సేవకుడను. నీవు నా ప్రభువైన దేవుడవు. నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు.
1KI 8:29 గతంలో నీవు, ‘నేనక్కడ గౌరవింపబడుదు’నని చెప్పావు. దయచేసి ఈ ఆలయాన్ని రాత్రింబవళ్లు కనిపెట్టుకుని ఉండు. ఈ దేవాలయంలో నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు.
1KI 8:30 దయచేసి నీ సేవకుడనైన నేను, ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలంలో చేసే ప్రార్థనలన్నీ ఆలకించు. మాకు తెలుసు నీవు పరలోకంలో నివసిస్తావని, అక్కడ నుండి మా ప్రార్థన ఆలకించి, మమ్మల్ని మన్నించుమని మేము నిన్ను వేడుకుంటున్నాము.
1KI 8:31 “ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, వాడు ఈ బలిపీఠం వద్దకు తేబడతాడు. ఆ వ్యక్తి గనుక నేరం చేయకపోతే, తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ ఒక ప్రమాణం చేస్తాడు.
1KI 8:32 పరలోకంలోనుండి నీవు అది విని, ఆ వ్యక్తి పట్ల న్యాయనిర్ణయం చెయ్యి. దోషిని శిక్షించి, అమాయకుడైన వానిని క్షమించు.
1KI 8:33 “కొన్నిసార్లు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీ పట్ల పాపం చేయవచ్చు; మరియు వారి శత్రువులు వారిని ఓడించవచ్చు. వారు మరల నీ వద్దకు తిరిగివచ్చి నీకు స్తోత్రం చేస్తారు. ఈ దేవాలయంలో వారు నిన్ను వేడుకొంటూ ప్రార్థనలు చేస్తారు.
1KI 8:34 పరలోకంలో నీవు వారి ప్రార్థన దయచేసి విను. నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల పాపాలను క్షమించు. మళ్లీ వారి రాజ్యం వారికి వచ్చేలా చేయి. ఈ రాజ్యం వారి పూర్వీకులకు నీవు ఇచ్చినదే!
1KI 8:35 “మరి కొన్ని సార్లు వారు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే, వారి భూముల్లో వర్షం కురియకుండా నీవు చేస్తావు. వారు మరల ఈ ప్రదేశానికి వచ్చి నిన్ను ప్రార్థించి, స్తుతిస్తారు. నీవు వారిని బాధించినప్పుడు, వారు చేసిన పాపాలకు వారు పశ్చాత్తాపం పొందుతారు.
1KI 8:36 ఇది జరిగినప్పుడు, పరలోకంలో నీవు వారి ప్రార్థన ఆలకించుము. నీ సేవకుడనగు నా తప్పులు, ఇశ్రాయేలు ప్రజల తప్పులను మన్నించు. పరలోకాన్నిగురించి వారికి బోధించు. యెహోవా, అప్పుడు దయచేసి రాజ్యంలో వర్షం కురిపించు. ఈ రాజ్యం వారికి నీవిచ్చినదే!
1KI 8:37 “ఈ నేల బాగా ఎండిపోయి, పంటలు పండక పోవచ్చు. లేక భయంకర వ్యాధి ప్రజలలో వ్యాపించవచ్చు. బహుశా పండిన పంటనంతా క్రిమికీటకాదులు నాశనం చేయవచ్చు. లేక నీ ప్రజలు వారి నగరాలలో శత్రువాత పడవచ్చు లేక నీ ప్రజలలో చాలామంది వ్యాధిగ్రస్థులు కావచ్చు.
1KI 8:38 వీటిలో ఏదైనా జరిగినప్పుడు, ఏ ఒక్కడైనా జరిగిన దానికి పశ్చాత్తాపపడి, చేతులు చాచి ఈ దేవాలయంలో నిలబడి నీకు ప్రార్థన చేస్తే,
1KI 8:39 దయచేసి అతని ప్రార్థన ఆలకించు. పరలోకంలో నీవు నీ నివాసంలో వుండగా దానిని ఆలకించు. ఆలకించి ఈ ప్రజలను మన్నించి, వారికి సహాయం చేయి. ప్రజలు నిజంగా ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోగల శక్తి నీకు తప్ప మరి ఎవ్వరికీ లేదు. కావున ప్రతి వ్యక్తికీ తీర్పు తీర్చి ఏది ఉచితమో వానికి అది చేయి.
1KI 8:40 నీవు అలాగున చేయి. దానివల్ల వారు నీ పట్ల భయభ్రాంతులతో, భక్తి భావంతో మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో సదా జీవిస్తారు.
1KI 8:41 “ఇతర ప్రాంతాల ప్రజలు కూడా నీ ప్రతిభా విశేషాలను గురించి వింటారు. వారు దూర ప్రాంతాలనుండి దేవాలయానికి ప్రార్థనలు చేయటానికి వస్తారు.
1KI 8:43 నీ పరలోక నివాసంనుండి దయచేసి వారి మనవి ఆలకించు. ఇతర ప్రాంతాలవారు నిన్నడిగినదంతా దయచేసి నెరవేర్చు. ఇశ్రాయేలులో నీ ప్రజలు నీపట్ల ఎలాంటి భయభక్తులతో మెలుగుతారో, వారు కూడ అలా నీపట్ల విధేయులైయుంటారు. అప్పుడు సర్వప్రాంతాల ప్రజలంతా నీ గౌరవార్థం నేను కట్టించిన ఈ దేవాలయం గురించి తెలుసుకుంటారు.
1KI 8:44 “కొన్ని సార్లు వారి శత్రువులతో పోరాడటానికి నీవు నీ ప్రజలకు ఆజ్ఞ ఇవ్వవచ్చు. అలాంటప్పుడు వారు నీవు ఎన్నుకున్న ఈ నగరానికి వచ్చిగాని, నీ గౌరవార్థం నేను కట్టించిన ఈ దేవాలయానికి వచ్చిగాని ప్రార్థన చేస్తారు.
1KI 8:45 ఆ సమయంలో పరలోకంలో వున్న నీవు విని వారికి సహాయం చేయి.
1KI 8:46 “నీ ప్రజలు నీ పట్ల పాపం చేస్తారు. ఇది నాకు తెలుసు. ఎందువల్లననగా పాపం చేయని వ్యక్తి లేడు. నీ ప్రజల పట్ల నీకు కోపం వస్తుంది. వారి శత్రువులు వారిని ఓడించేలా చేస్తావు. వారి శత్రువులు వారిని బందీలు చేసి దూర ప్రాంతాలకు తీసుకొని పోతారు.
1KI 8:47 ఆ దూర పరాయి రాజ్యంలో నీ ప్రజలు జరిగిన దానిని జ్ఞాపకం చేసుకుంటారు. వారు చేసిన పాపానికి వారు పశ్చాత్తాప పడతారు. ఆ పరాయి రాజ్యంలో బందీలుగా వుండి వారు నిన్ను ప్రార్థిస్తారు. వారు ‘మేము పాపం చేశాం; మేము తప్పుచేశాం’ అని అంటారు.
1KI 8:48 వారు నిజంగా ఆ పరాయి రాజ్యాలలో నిన్ను ఆశ్రయిస్తే, నీవు వారి పూర్వీకులకు ఇచ్చిన ఈ రాజ్యంవైపుగాని, నీవు ఎన్నుకున్న ఈ నగరంవైపు గాని, నేను నీ గౌరవార్థం కట్టించిన ఈ దేవాలయమువైపు గాని తిరిగి ప్రార్థిస్తే,
1KI 8:49 దయచేసి పరలోకంలో వున్న నీవు వారి ప్రార్థన ఆలకించు.
1KI 8:50 నీ ప్రజల పాపాలన్నిటినీ క్షమించు. నీకు వ్యతిరేకంగా తిరిగినందుకు కూడా వారిని క్షమించు. వారి శత్రువులు వారిపట్ల ఉదారంగా వుండేలా చేయి.
1KI 8:51 వారు నీ ప్రజలే అని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకో. నీవు వారిని ఈజిప్టు నుండి బయటకు తెచ్చినట్లు జ్ఞాపక ముంచుకో. మండుతున్న కొలిమిలోనుండి బయటికి తీసినట్లు వారిని రక్షించావు!
1KI 8:52 “ప్రభువైన దేవా, నా ప్రార్థనలను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ప్రార్థనలను దయచేసి ఆలకించు. వారు ఏ సమయములో నిన్ను నీ సహాయము కోరి ప్రార్థించినా వారి ప్రార్థన విను.
1KI 8:53 ఈ భూలోకంలోవున్న ప్రజానీకమంతటిలో వారిని నీవు నీ ప్రజలుగా ఎంపిక చేశావు. యెహోవా మా పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చినప్పుడు, నీ సేవకుడైన మోషే ద్వారా ఈ వాగ్దానం నీవు చేశావు.”
1KI 8:54 ఈ విధంగా సొలొమోను దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని బలిపీఠం ముందు అతను మోకాళ్ల మీద ఉన్నాడు. తన చేతులను ఆకాశం వైవు చాచి అతడు ప్రార్థించాడు. సొలొమోను ప్రార్థన ముగించిన పిమ్మట లేచి నిలబడ్డాడు.
1KI 8:55 పిమ్మట, పెద్ద గొంతుతో ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవించమని దేవుని అర్థించాడు. సొలొమోను ఇలా అన్నాడు:
1KI 8:56 “యెహోవాకు స్తోత్రము కలుగునుగాక! తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు విశ్రాంతి ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అలాగే ఆయన మనకు విశ్రాంతి ఇచ్చాడు! తన సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనేక శుభప్రదమైన వాగ్దానాలను చేశాడు. యెహోవా ఈ వాగ్ధానాలన్నిటినీ నెరవేర్చాడు.
1KI 8:57 మనదేవుడైన యెహోవాను మనతో ఉండమని అడుగుతున్నాను. ఆయన మన పూర్వీకులతో ఎలావున్నాడో అలాగే మనతో కూడ ఉండమని అడుగుతున్నాను. మనలను ఎన్నడూ వదిలి వుండవద్దని వేడు కుంటున్నాను.
1KI 8:58 ఈ రకంగా మనం ఆయనను ఆశ్రయించి, ఆయనను అనుసరించుదాం. ఆయన మనపూర్వీకులకు ఇచ్చిన న్యాయసూత్రాలను, ఆజ్ఞలను మనము ఆచరిద్దాము.
1KI 8:59 నా ఈ ప్రార్థన, నేనడిగిన అన్ని విషయాలు సదా గుర్తుచుకోమని మన దేవుడైన యెహోవాను అడుగుతున్నాను. తన సేవకుడైన రాజు కొరకు, ఇశ్రాయేలు ప్రజలకొరకు ఇవన్నీ జరిపించమని వేడుకుంటున్నాను. ఇలా ప్రతి రోజూ జరిపించ మని కూడా వేడుకుంటున్నాను.
1KI 8:60 యెహోవా ఇవన్నీ జరిగేలా చేస్తే ప్రపంచ ప్రజలంతా మన దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకుంటారు.
1KI 8:61 మన దేవుడైన యెహోవాకు మీరంతా చెందియున్నారు. కావున మన దేవుడైన యెహోవాకు విధేయులై యుండాలి. ఆయన న్యాయ సూత్రాలను, ఆజ్ఞలను మీరంతా తప్పక అనుసరించాలి. మీరిప్పుడు చేస్తున్నట్లు భవిష్యత్తులో కూడ ఆయన మార్గాన్ని మీర నుసరించాలి.”
1KI 8:62 తరువాత రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులందరు యెహోవాకు బలులు అర్పించారు.
1KI 8:63 సొలొమోను ఇరువది రెండు వేల పశువులను, ఒక లక్షాఇరువది వేల గొర్రెలను బలి ఇచ్చాడు. ఇవి సమాధాన బలులుగా అర్పించారు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులు దేవాలయాన్ని దేవునికి అంకితము చేశారు.
1KI 8:64 రాజైన సొలొమోను ఇంకా ఆ రోజు దేవుని ఆలయము ముందున్న ఆవరణను దేవుని కార్యము కొరకు పవిత్రం చేశాడు. అతనక్కడ దహన బలులు, ధాన్యార్పణలు, జంతువుల కొవ్వును సమాధాన సూచకంగా అర్పించాడు. అతి పరిశుద్ధ స్థలము ముందున్న కంచు బలిపీఠం ఇవన్నీ అర్పించటానికి బహు చిన్నది అగుటచే, రాజైన సొలొమోను ఆవరణలో అర్పించాడు.
1KI 8:65 రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు దేవాలయంలో ఆ విధంగా పండుగ జరుపుకున్నారు. ఉత్తర భాగాన బహుదూరంలో ఉన్న హమాతు కనుమ నుండి దక్షిణాన ఈజిప్టు సరిహద్దు వరకుగల ఇశ్రాయేలీయులంతా పండుగలో పాల్గొన్నారు. లెక్కకు మించిన జనాభా అక్కడ చేరింది. ఏడు రోజులపాటు వారంతా అక్కడ ఆహారపానీయాలు స్వీకరిస్తూ వేడుక చేసుకున్నారు.
1KI 8:66 ఎనిమిదవ రోజు సొలొమోను వారందరినీ తమ ఇండ్లకు వెళ్లమన్నాడు. ప్రజలంతా రాజుకు కృతజ్ఞతా వందనాలు చెప్పి తమ ఇండ్లకు వెళ్లారు. తన సేవకుడై న దావీదుకు, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన సహాయ సంపత్తికి ప్రజలంతా చాలా సంతోషపడ్డారు.
1KI 9:1 సొలొమోను యెహోవా దేవాలయాన్ని, తన రాజ భవనాన్ని నిర్మించటం పూర్తి చేశాడు. తాను నిర్మించదలచుకొన్నవన్నీ పూర్తి చేశాడు.
1KI 9:2 తరువాత యెహోవా సొలొమోనుకు పూర్వం గిబియోను పట్టణంలో ప్రత్యక్షమైనట్లు మళ్లీ కన్పించాడు.
1KI 9:3 యెహోవా అతనితో ఇలా అన్నాడు, “నీ ప్రార్థన విన్నాను. నీవు నన్ను చేయమని అడిగిన విషయాలను కూడా విన్నాను. నీవు ఈ దేవాలయము కట్టించావు. నేను దానిని పవిత్రస్థలంగా చేశాను. కావున నేనక్కడ శాశ్వతంగా ఆరాధించబడతాను. నేను దానిని కనిపెట్టుకుని ఉండి ఎల్లప్పుడూ దానిని గూర్చి ఆలోచన చేస్తాను.
1KI 9:4 నీ తండ్రివలె నీవు సదా నన్ను ఆరాధిస్తూ వుండాలి. అతడు న్యాయవర్తనుడు; నిజాయితీపరుడు. నా న్యాయసూత్రాలను, నేను నిర్దేశించిన కట్టుబాట్లను నీవు పాటించాలి.
1KI 9:5 నీవు ఇవన్నీ పాటిస్తే, ఇశ్రాయేలు రాజు ఎల్లప్పుడూ నీ వంశంలో నుండి వచ్చేలా చేస్తాను. ఈ వాగ్దానం నేను నీ తండ్రి దావీదుకు చేశాను. ఇశ్రాయేలు ఎల్లప్పుడూ అతని సంతానంలోని వాడొకనిచే పరి పాలింపబడుతుందని నేనతనితో చెప్పాను.
1KI 9:6 “అయితే నీవు గాని, నీ సంతతి గాని నన్ను అనుసరించక పోయినా, నా న్యాయసూత్రాలను, నేను నిర్దేశించిన కట్టుబాట్లను పాటించకపోయినా, లేక మీరు ఇతర దేవుళ్లను సేవించి, ఆరాధించినా, నేను ఇచ్చిన రాజ్యంలో నుంచి ఇశ్రాయేలీయులు బయటికి పోయేలా ఒత్తిడి తెస్తాను. ఇశ్రాయేలీయులు నలుగురిలో నవ్వులపాలై, క్రమశిక్షణారాహిత్యంలో ఒక ఉదాహరణగా మిగిలి పోతారు. నేను ఈ దేవాలయాన్ని పవిత్రపరిచాను. ఇది ప్రజలు నన్ను గౌరవించే స్థలం. కాని మీరు నా ఆజ్ఞలను మన్నించకపోతే ఈ దేవాలయాన్ని నేలమట్టం చేస్తాను.
1KI 9:8 ఈ దేవాలయం సర్వనాశనం చేయబడుతుంది. ఇది చూచిన ప్రతివాడూ విస్మయము చెందుతాడు. వారంతా, ‘యెహోవా ఈ రాజ్యానికి, ఈ దేవాలయానికి ఈ భయంకర పరిస్థితిని ఎందుకు కల్పించాడు?’ అని అడుగుతారు.
1KI 9:9 మరికొందరు, ‘ఈ పరిణామం ఎందుకు వచ్చిందంటే ఆ ప్రజలు వారి యెహోవా దేవుని మర్చిపోయారు. వారి దేవుడు వారి పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకుని వచ్చాడు. కాని వారు ఇతర దైవాలను సేవించటం మొదలు పెట్టారు’ అని సమాధానం చెపుతారు.”
1KI 9:10 ఇరవై సంవత్సరాల కాలవ్యవధిలో రాజైన సొలొమోను యెహోవా యొక్క దేవాలయాన్ని, తన రాజగృహాన్ని కట్టించాడు.
1KI 9:11 ఇరవై సంవత్సరాల తరువాత రాజైన సొలొమోను గలిలీయ దేశమందున్న ఇరవై పట్టణాలను తూరు రాజైన హీరాముకు ఇచ్చాడు. హీరాము రాజు ఆలయ నిర్ణాణంలోను, రాజ ప్రాసాద నిర్మాణంలోను సహాయపడి నందుకు, సొలొమోను ఈ పట్టణాలను ఇచ్చాడు. సొలొమోను కోరినంత దేవదారు కలపను, సరళ వృక్షాలను, బంగారాన్ని హీరాము ఇచ్చాడు.
1KI 9:12 కావున సొలొమోను ఇచ్చిన ఆ పట్టణాలను చూడటానికి తూరు నుండి హీరాము బయలుదేరి వెళ్లాడు. హీరాము ఆ పట్టణాలను చూచి తృప్తిపడలేదు.
1KI 9:13 “ఈ పనికిరాని పట్టణాలను నాకు ఎందుకిచ్చనట్లు సోదరా?” అని హీరాము రాజు అన్నాడు. హీరాము రాజు ఆ పట్టణ ప్రాంతాలకు కాబూల్ ప్రాంతమని పేరు పెట్టాడు. ఈ నాటికి ఆ ప్రాంతం కాబూల్ అని పిలవబడుతోంది.
1KI 9:14 హీరాము సుమారు రెండు వందల నలభై మణుగుల బంగారాన్ని రాజైన సొలొమోనుకు పంపాడు.
1KI 9:15 రాజైన సొలొమోను దేవాలయ నిర్మణానికి, రాజభవన నిర్మణానికి బానిసలను బలవంతంగా పని చేయించాడు. ఈ బానిసలను చాలా ఇతర కట్టడాల విషయంలో కూడ రాజైన సొలొమోను వినియోగించుకున్నాడు. అతడు మిల్లోను నిర్మించాడు. అతడింకా నగరానికి చుట్టూ ప్రాకారం కట్టించాడు. అతను హాసోరు, మెగిద్దో, మరియు గెజెరు నగరాలను కూడ పునర్మించాడు.
1KI 9:16 గతంలో ఈజిప్టు రాజు గెజెరు నగరంపై దండెత్తి దానిని తగులబెట్టాడు. అక్కడ నివసించే కనానీయులను చంపేశాడు. ఫరో కుమారైను సొలొమోను వివాహం చేసుకొన్నాడు. పెండ్లి కానుకగా ఫరో ఆ నగరాన్ని సొలొమోనుకు ఇచ్చాడు.
1KI 9:17 సొలొమోను ఆ నగరాన్ని తిరిగి నిర్మించాడు. సొలొమోను దిగువ బేత్ హోరోనును కూడ నిర్మించాడు.
1KI 9:18 రాజైన సొలొమోను బయతాతును, యూదయ అరణ్యములోనున్న తద్మోరు నగరాలను కూడా నిర్మించాడు.
1KI 9:19 రాజైన సొలొమోను ధాన్యాగారములు, తదితర వస్తువులు నిల్వచేయు గోదాములుండు నగరాలను కూడ కట్టించాడు. తన రథాలకు, గుర్రాలకు తగిన శాలలు కూడ నిర్మింపజేశాడు. యెరూషలేములోను, లెబానోను లోను, ఇంకా తాను రాజ్యం చేసిన ప్రాంతాలలోను సొలొమోను రాజు కావాలనుకున్న కట్టడాలను చాలా నిర్మించాడు.
1KI 9:20 ఇశ్రాయేలీయులు కానివారు రాజ్యంలో చాలా మంది వున్నారు. వారు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు.
1KI 9:21 ఇశ్రాయేలీయులు ఈ ప్రజలను నాశనం చేయలేక పోయారు. సొలొమోను వారిని బానిసలుగా పనిచేసేటందుకు బలవంతం చేశాడు. వారంతా ఈ నాటికీ బానిసలే.
1KI 9:22 కాని సొలొమోను ఇశ్రాయేలీయుల నెవ్వరినీ తన బానిసలు కమ్మని బలవంతం చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు సైనికులుగాను, ప్రభుత్వ అధికారులుగాను, ఉద్యోగులుగాను, సైన్యాధిపతులు గాను, రథాధిపతులుగాను, రథసారథులుగాను పని చేశారు.
1KI 9:23 సొలొమోను చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించడానికి ఐదువందల ఏభై మంది అధికారులున్నారు. వారు పనివారి మీద అధికారులు.
1KI 9:24 ఫరో కుమారై దావీదు నగరం నుండి సొలొమోను ఆమెకు కట్టించిన భవనానికి వెళ్లింది. అప్పుడు సొలొమోను మిల్లోను నిర్మించాడు.
1KI 9:25 సంవత్సరానికి మూడుసార్లు సొలొమోను బలిపీఠం మీద దహన బలులు మరియు సమాధాన బలులు అర్పించాడు. ఈ బలిపీఠం సొలొమోను యెహోవా కొరకు నిర్మించింది. రాజైన సొలొమోను యెహోవా ముందు ధూపం వేసేవాడు. కావున దేవాలయ నిర్వహణకు కావలసిన వస్తువులన్నీ అతడు సరఫరా చేసేవాడు.
1KI 9:26 ఎసోన్గెబెరు వద్ద రాజైన సొలొమోను ఓడలను కూడ నిర్మించాడు. ఈ పట్టణం ఏలతు దగ్గర వుంది. ఇది ఎదోము రాజ్యంలో ఎర్ర సముద్రపు తీరాన వుంది.
1KI 9:27 రాజైన హీరాము వద్ద సముద్ర విషయాలలో ఆరితేరిన మనుష్యులు కొందరున్నారు. వీరు తరచు ఓడలలో ప్రయాణం చేసేవారు.సొలొమోను మనుష్యులతో కలిసి సొలొమోను ఓడలలో పని చేయటానికి హీరాము రాజు ఆ మనుష్యులను పంపాడు.
1KI 9:28 సొలొమోను ఓడలు ఓఫీరను స్థలానికి వెళ్లాయి. ఆ ఓడలు ఓఫీరు నుండి ఎనిమిది వందల నలభై మణుగుల బంగారాన్ని రాజైన సొలొమోనుకు తీసుకొని వచ్చాయి.
1KI 10:1 షేబ దేశపు రాణి సొలొమోను ప్రజ్ఞా విశేషాలను గూర్చి విన్నది. జటిలమైన ప్రశ్నలు వేసి అతనిని పరీక్షించాలని ఆమె వచ్చింది.
1KI 10:2 అనేక మంది సేవకులు వెంటరాగా, ఆమె యెరూషలేముకు ప్రయాణమై వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, బంగారం మొదలైన వాటిని అనేక ఒంటెల మీద ఎక్కించి తనతో తీసుకొని వచ్చింది. ఆమె సొలొమోనును కలిసి, ఆమె ఆలోచించ గలిగినన్ని చిక్కు ప్రశ్నలను వేసింది.
1KI 10:3 సొలొమోను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పటానికి ఆమె వేసిన ప్రశ్నలలో ఏ ఒక్కటీ అతనికి కష్టమైనదిగా కన్పించలేదు.
1KI 10:4 షేబ దేశపు రాణి సొలొమోను చాలా తెలివైనవాడని తెలుసుకున్నది. అతను నిర్మించిన అతి సుందరమైన రాజభవనాన్ని కూడ ఆమె తిలకించింది.
1KI 10:5 రాజు బల్లవద్ద విలువైన భోజన పదార్థాలను ఆమె చూసింది. రాజు కింది అధికారులు సమావేశమయ్యే తీరు తెన్నులు ఆమె గమనించింది. రాజభవనంలో సేవచేయుటకు, వారు ధరించే మంచి దుస్తులను ఆమె చూసింది. రాజు ఇచ్చే విందులు, ఆయన దేవాలయంలో అర్పించే బలులు కూడా చూసింది. ఇవన్నీ ఆమెకు ఆనందము ఆశ్చర్యము కలుగజేశాయి.
1KI 10:6 కావున రాజుతో రాణి ఇలా అన్నది, “నీవు చేసే పనుల గురించి, నీ ప్రజ్ఞా ప్రభావాల గురించి నేను నా దేశంలో చాలా విన్నాను. నేను విన్నవన్నీ నిజమని తేలింది!
1KI 10:7 నేనిక్కడికి వచ్చి స్వయంగా నా కళ్లతో నేను చూచే వరకు నేను విన్నవన్నీ నిజమని నమ్మలేదు. ఇప్పుడు నేను విన్న దానికంటె ఎక్కువ ఉన్నట్లు చూశాను. నీ తెలివి తేటలు, నీ సిరిసంపదలను గురించి ప్రజలు నాకు చెప్పినదాని కంటె అవి అతిశయించి వున్నాయి.
1KI 10:8 నీ భార్యలు, నీ సేవకులు చాలా అదృష్టవంతులు! వారికి ఎల్లప్పుడూ నిన్ను సేవించే భాగ్యము, నీ తెలివితేటలను వినే అదృష్టము లభించింది!
1KI 10:9 నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక! నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పట్ల నిరంతర ప్రేమగలిగి వున్నాడు. కావుననే ఆయన నిన్ను రాజుగా చేశాడు; నీవు న్యాయమార్గంలో రాజ్యపాలన చేస్తున్నావు.”
1KI 10:10 పిమ్మట షేబ దేశపు రాణి రెండు వందల నలభై మణుగుల బంగారాన్ని, చాలా సుగంధ ద్రవ్యాలను, రత్నాలను రాజుకు కానుకగా సమర్పించింది. ముందెన్నడూ ఎవ్వరూ ఇశ్రాయేలు రాజ్యాలలోకి తేనన్ని సుగంధ ద్రవ్యాలను షేబ దేశపు రాణి సొలొమోనుకు సమర్పించింది.
1KI 10:11 హీరాము యొక్క ఓడలు కూడ ఓఫీరు నుండి బంగారం తీసుకుని వచ్చాయి. ఆ ఓడలు చాలా కలప, వజ్రాలు కూడ తీసుకుని వచ్చాయి.
1KI 10:12 ఆ కలపను దేవాలయంలోను, రాజభవనంలోను స్తంభాలు చేయటానికి సొలొమోను ఉపయోగించాడు. గాయకులకు సితారను, స్వరమండలమును చేయటానికి కూడ ఆ కలపను అతడు ఉపయోగించాడు. ఇశ్రాయేలు లోనికి ఆ రకమైన కలపను ఎవ్వరూ తేలేదు. అప్పటినుండి మళ్లీ ఎవ్వరూ ఆ విధమైన కట్టెను చూడలేదు.
1KI 10:13 సాటి రాజ్యాధినేతకు ఒక రాజు ఎలాంటి కానుకలు ఇస్తాడో, ఆలాగున రాజైన సొలొమోను షేబ దేశపు రాణికి కానుకలు ఇచ్చాడు. పైగా ఆమె అడిగిన ఇతర వస్తువులను కూడా ఆమెకు సమర్పించాడు. ఆ తరువాత రాణి, ఆమె పరివారము తమ దేశానికి వెళ్లి పోయారు.
1KI 10:14 ప్రతి సంవత్సరం సొలొమోనుకు సుమారు ఒకవెయ్యి మూడు వందల ముప్పది రెండు మణుగుల బంగారం వచ్చేది.
1KI 10:15 ఇదిగాక తర్షీషునుండి వచ్చే ఓడలు బంగారం తెచ్చేవి. వ్యాపారస్తుల నుండి, అరబీ రాజులనుండి, మరియు రాజ్యంలో ఇతర ప్రాంతీయ పాలకుల నుండి కూడా రాజుకు బంగారం వచ్చేది.
1KI 10:16 రాజైన సొలొమోను పలకలుగా కొట్టబడిన బంగారంతో రెండు వందల పెద్ద తరహా డాళ్లను చేయించాడు. ప్రతిడాలు ఆరు వందల తులాల బంగారం కలిగి వుండేది.
1KI 10:17 అతడింకా మూడ వందల చిన్న తరహా డాళ్లను కూడా రేకులు గొట్టిన బంగారంతో చేయించాడు. ప్రతిడాలు నూట అరువది తులాల బంగారం కలిగివుంది. రాజు వాటిని “లెబానోను అరణ్యంలోని” విశ్రాంతి గృహములో ఉంచినాడు.
1KI 10:18 రాజైన సొలొమోను ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని చేయించాడు. దానికి మేలిమి బంగారు పూత పూయించాడు.
1KI 10:19 సింహాసనం ముందు ఆరుమెట్లు వున్నాయి. ఈ సింహాసనపు వెనుక భాగం పైన గుండ్రంగా వుంది. సింహాసనానికి ఇరువైపులా చేతులు వుంచటానికి ఆధారపు కమ్ములు వున్నాయి. సింహాసనపు చేతులు గాక సింహాల విగ్రహాలు కూడ సింహాననానికి ఇరుపక్కల వున్నాయి.
1KI 10:20 ఆరు మెట్లలో ప్రతి మెట్టుకు రెండు పక్కలా రెండు సింహాల బొమ్మలను పెట్టారు. ఏ ఇతర రాజ్యంలోను ఈ రకంగా సింహాలంకరణ చేసి ఉండలేదు.
1KI 10:21 లెబానోను అరణ్యపు భవనంలో గిన్నెలు, పాన పాత్రలు, పనిముట్లు, ఆయుధాలు, అన్నీ శుద్ధ బంగారంతో చేయబడ్డాయి. భవనంలో ఏదీ వెండితో చేయబడలేదు. సొలొమోను కాలంలో బంగారం ఎంత విరివిగా లభించేదనగా ప్రజలు వెండిని విలువైన లోహంగా అసలు పరిగణించనేలేదు!
1KI 10:22 వ్యాపార నిమిత్తం ఇతర దేశాలకు పంపటానికి సొలొమోనుకు చాలా ఓడలున్నాయి. ప్రతి మూడు నెలలకూ ఓడలు తిరిగి వస్తూవుండేవి. ఆ ఓడల నిండా బంగారం, వెండి, దంతం, పశువులు రాజుకొరకు తేబడేవి.
1KI 10:23 ఈ భూమి మీద సొలొమోను మిక్కిలి ప్రఖ్యాతి గాంచిన రాజు. రాజులందరికంటె అతనికి ధనం, తెలివి తేటలు విశేషంగా ఉన్నాయి.
1KI 10:24 ప్రతి చోట ప్రజలు రాజైన సొలొమోనును చూడాలని ఆరాట పడేవారు. యెహోవా అతనికిచ్చిన మహా జ్ఞానాన్ని వారంతావిని తెలుసుకుని ఆనందించాలని కుతూహలపడేవారు.
1KI 10:25 ప్రతి సంవత్సరం రాజును చూడ్డానికి ప్రజలు వచ్చేవారు. వచ్చిన ప్రతివాడూ ఏదో ఒక కానుక పట్టుకు వచ్చేవాడు. వారు వెండి, బంగారు వస్తువులు, దుస్తులు, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచర గాడిదలు మొదలగు వాటిని తెచ్చేవారు.
1KI 10:26 కావున సొలొమోను అనేక రథములను, గుర్రములను కలిగియున్నాడు. అతనికి ఒక వెయ్యి నాలుగు వందల రథములు, పన్నెండు వేల గుర్రములు వున్నాయి. సొలొమోను ప్రత్యేక నగరాలను నిర్మించి ఈ రథాలన్నిటినీ వాటిలో వుంచాడు. కాని రాజైన సొలొమోను కొన్ని రథాలను తనతో యెరూషలేములో వుంచుకున్నాడు.
1KI 10:27 రాజు ఇశ్రాయేలును మిక్కిలి సంపన్న దేశంగా చేశాడు. యెరూషలేము నగరంలో వెండి రాతి గుట్టల్లా, దేవదారు చెక్కల్లా, కొండల్లో, కోనల్లో కాచే మేడి పండ్లలా అతి సామాన్యమై పోయింది.
1KI 10:28 ఈజిప్టు నుంచి, కూషునుంచి సొలొమోను గుర్రములను తెప్పించే వాడు. అతని వర్తకులు వాటిని కూయిలో కొన్ని ఇశ్రాయేలుకు తెచ్చేవారు.
1KI 10:29 ఈజిప్టు నుండి తెచ్చిన రథం ఒక్కటికి ఆరు వందల తులాల వెండి, గుర్రం ఒక్కటికి నూట ఏబది తులాల వెండి చొప్పున చెల్లించేవారు. సొలొమోను గుర్రాలను, రథాలను హిత్తీయుల రాజులకు మరియు అరాము రాజులకు అమ్మెడివాడు.
1KI 11:1 రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులు కాని వారైన అనేక మంది స్త్రీలను ప్రేమించాడు. అలాంటి స్త్రీలలో ఫరో కుమారై, మెయాబీయులు, అమ్మెనీయులు, ఎదోమీయులు, సీదోనీయులు, హిత్తీయులు వున్నారు.
1KI 11:2 గతంలో ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “ఇతర దేశాల వారిని మీరు వివాహం చేసుకోరాదు. ఒక వేళ మీరు అలా చేస్తే ఆ ప్రజలు వాళ్ల దేవుళ్లను మీరు కొలిచేలా చేస్తారు.” కాని సొలొమోను ఈ స్త్రీల వ్యామోహంలో పడ్డాడు.
1KI 11:3 సొలొమోనుకు ఏడు వందల మంది భార్యలున్నారు. (వీరంతా ఇతర దేశాల రాజుల కుమారైలే) అతనికి ఇంకను మూడు వందల మంది బానిస స్త్రీలు ఉపపత్నులుగ ఉన్నారు. అతని భార్యలు అతనిని తప్పుదారి పట్టించి దేవునికి దూరం చేశారు.
1KI 11:4 సొలొమోను వృద్దుడయ్యే సరికి అతని భార్యలు అతడు ఇతర దేవుళ్లను మొక్కేలా చేశారు. తన తండ్రియగు దావీదు యెహోవా పట్ల చూపిన వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలు సొలొమోను చూపలేకపొయాడు.
1KI 11:5 సొలొమోను అష్ఠారోతును ఆరాధించాడు. ఇది ఒక సీదోనీయుల దేవత. మరియు సొలొమోను మిల్కోమును ఆరాధించాడు. ఇది అమ్మోనీయుల ఒక భయంకర విగ్రహం.
1KI 11:6 ఈలాగున సొలొమోను యెహోవా పట్ల అపచారం చేశాడు. తన తండ్రి దావీదువలె సొలొమోను సంపూర్ణంగా యెహోవాని అనుసరించలేదు.
1KI 11:7 కెమోషుకు ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. కెమోషు మోయాబీయుల ఒక ఘోరమైన విగ్రహం. యెరూషలేముకు తూర్పుదిశలో ఒక కొండపై ఆ ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. అదే కొండ మీద మొలెకునకు కూడా ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. మొలెకు అమ్మోనీయులకు చెందిన ఒక భయానక విగ్రహం.
1KI 11:8 ఇతర దేశాలకు చెందిన తన భార్యలందరి నిమిత్తం సొలొమోను ఈ మాదిరి ఆరాధనా స్థలాలను నిర్మించాడు. అతని భార్యలు వారి వారి దేవుళ్లకు ధూపం వేసి, బలులు సమర్పించేవారు.
1KI 11:9 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నుండి సొలొమోను దూరమైనాడు. కావున యెహోవా సొలొమోను పట్ల కోపం వహించాడు. సొలొమోనుకు యెహోవా రెండు సార్లు ప్రత్యక్షమైనాడు.
1KI 11:10 చిల్లర దేవుళ్లను ఆరాధించరాదని యెహోవా సొలొమోనుకు చెప్పాడు: యెహోవా ఆజ్ఞను సొలొమోను పాటించ లేదు.
1KI 11:11 కావున యెహోవా సొలొమోనుతొ ఇలా అన్నాడు, “నాతో నీవు చేసుకొన్న ఒడంబడికను అనుసరించుటకు నీవిష్టపడలేదు. నీవు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. కావున నీ రాజ్యాన్ని నీ నుండి వేరు చేస్తానని నిశ్చయంగా చెప్తున్నాను. దానిని నీ సేవకునికి ఇస్తాను.
1KI 11:12 కాని నీ తండ్రి దావీదును నేను మిక్కిలి ప్రేమించియున్నాను. అందువల్ల నీవు బతికియుండగా నీ రాజ్యం నీ నుండి తీసుకొనను. నీ కుమారుడు రాజు అయ్యే వరకు నేను వేచి వుంటాను. అప్పుడు వాని నుండి దానిని నేను తీసుకుంటాను.
1KI 11:13 అప్పుడు కూడ, రాజ్యాన్నంతా నీ కుమారుని వద్ద నుండి తీసుకోను. అతను పరిపాలించటానికి ఒక తెగను అతనికి వదిలి వేస్తాను. ఉన్నతుడైన నా సేవకుడగు దావీదు కొరకు నేనది చేయదలిచాను. నేను ఎంపిక చేసుకున్న యెరూషలేము నగరం కొరకు నేనలా చేస్తాను.”
1KI 11:14 ఆ సమయంలో ఎదోమీయుడగు హదదు అను వానిని యెహోవా సొలొమోనుకు శత్రువయ్యేలా చేశాడు. అతడు ఎదోము వంశానికి చెందిన వారిలో ఒకడు.
1KI 11:15 అది ఇలా జరిగింది. ఇదివరలో దావీదు ఎదోము రాజ్యాన్ని ఓడించాడు. అప్పుడు దావీదు సైన్యాధిపతిగా యోవాబు వున్నాడు. చనిపోయిన వారిని పాతి పెట్టించేందుకు యోవాబు ఎదోములోకి వెళ్లాడు. కాని అతడు అక్కడవున్న మగవారినందరినీ చంపేశాడు.
1KI 11:16 యోవాబు, ఇశ్రాయేలీయులందరూ ఎదోములో ఆరు నెలలు వున్నారు. ఆ సమయంలోనే వారు ఎదోములో వున్న పురుషులనందరినీ చంపేశారు.
1KI 11:17 కాని అప్పటికి హదదు చాలా చిన్నవాడు. కావున హదదు ఈజిప్టుకు పారిపోయాడు. హదదు తండ్రి యొక్క సేవకులు కొందరు అతనితో కలిసి వెళ్లారు.
1KI 11:18 వారు మిద్యాను దేశము నుండి పారానుకు వెళ్లారు. పారాను దేశంలో వారితో మరి కొందరు కలిశారు. వారంతా కలిసి ఈజిప్టుకు వెళ్లారు. ఈజిప్టు రాజగు ఫరో వద్దకు వెళ్లి సహాయం అర్థించారు. హదదుకు ఒక ఇంటిని, కొంత భూమిని ఫరో ఇచ్చాడు. ఫరో అతనికి అన్ని అండ దండలు ఇచ్చి, ఆహారం కూడా ఏర్పాటు చేశాడు.
1KI 11:19 హదదును ఫరో మిక్కిలి అభిమానించాడు. హదదుకు ఫరో ఒక భార్యను కూడా ఇచ్చాడు. ఆమె ఫరో మరదలే! (ఫరో భార్య పేరు రాణి తహ్పెనేసు)
1KI 11:20 అనగా తహ్పెనేసు యొక్క సోదరి హదదును వివాహమాడింది. వారికి ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరు గెనుబతు. రాణి తెహ్పెనేను గెనుబతును తన పిల్లలతో పాటు ఫరో ఇంటిలోనే పెరగనిచ్చింది.
1KI 11:21 దావీదు చనిపోయినట్లు ఈజిప్టులో వున్న హదదు విన్నాడు. సైన్యాధిపతి యోవాబు కూడ చనిపోయినట్లు అతడు విన్నాడు. అందువల్ల హదదు ఫరో వద్దకు వెళ్లి, “నన్ను నా స్వదేశానికి వెళ్ల నియ్యండి” అని అడిగాడు.
1KI 11:22 “నీకు ఇక్కడ కావలసినవనన్నీ సమకూర్చాను! మరి నీవెందుకు నీ స్వదేశానికి వెళ్లిపోవాలను కుంటున్నావు?” అని ఫరో అన్నాడు. అయితే హదదు మాత్రం, “దయచేసి నన్ను మాత్రం ఇంటికి వెళ్లనీయండి” అని ప్రాధేయపడ్డాడు.
1KI 11:23 సొలొమోనుకు మరొక వ్యక్తి శత్రువయ్యేలా యెహోవా చేశాడు. అతడు ఎల్యాదా కుమారుడైన రెజోను. రెజోను తన యజమాని వద్ద నుండి పారిపోయాడు. సోబా రాజైన హదదెజరు ఇతని యజమాని.
1KI 11:24 దావీదు సోబా సైన్యాన్ని ఓడించిన పిమ్మట రెజోను కొంత మందిని చేరదీసి ఒక చిన్న సైన్యాన్ని తయారు చేశాడు. రెజోను దమస్కుకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. తరువాత అతను దమస్కుకు రాజు అయ్యాడు.
1KI 11:25 రెజోను అరాము దేశమును పాలించాడు. రెజోను ఇశ్రాయేలును అనహ్యించు కొనేవాడు. కావున సొలొమోను బతికినంత కాలం రెజోను ఇశ్రాయేలుకు శత్రువుగానే వున్నాడు. రెజోను, హదదు ఇశ్రాయేలులో చాలా అలజడిని సృష్టించారు.
1KI 11:26 నెబాతు కుమారుడైన యరొబాము సొలొమోను సేవకులలో ఒకడు. యరొబాము ఎఫ్రాయీము ప్రజలవాడు. అతడు జెరేదా పట్టణానికి చెందినవాడు. యరొబాము తల్లి పేరు జెరూహా. అతని తండ్రి మరణించాడు. అతడు రాజుకు వ్యతిరేకి అయ్యాడు.
1KI 11:27 యరొబాము రాజుకు వ్యతిరేకం కావటానికి ఒక కారణం వుంది. సొలొమోను మిల్లో కట్టించి, తన తండ్రి దావీదు నగర గోడను సరిచేస్తూ వున్నాడు.
1KI 11:28 యరొబాము చాలా బలశాలి. అతడు మంచి పనివాడని సొలొమోను గమనించాడు. అందుచే అతనిని యోసేపు వంశంవారు చేసే అతి కష్టమైన పనుల మీద అధికారిగా నియమించాడు.
1KI 11:29 ఒక రోజు యరొబాము యెరూషలేము నుండి ప్రయాణం చేస్తూ వున్నాడు. షిలోనీయుడైన ప్రవక్త అహీయా దారిలో యరొబామును కలిశాడు. అహీయా నూతన వస్త్రం ధరించియున్నాడు. పొలాల్లో వారిద్దరు తప్ప మరెవ్వరూ లేరు.
1KI 11:30 అహీయా తాను ధరించిన నూతన వస్త్రం తీసి దానిని పన్నెండు ముక్కలుగా చించాడు.
1KI 11:31 అప్పుడు అహీయా యరొబాముతో ఈ విధంగా చెప్పాడు: “ఈ వస్త్రంలో పది ముక్కలు నీవు తీసుకో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమి చెప్పినాడనగా: ‘ఈ రాజ్యాన్ని సొలొమోను నుండి దూరం చేస్తాను. అప్పుడు నీకు పది గోత్రాలను ఇస్తాను.
1KI 11:32 కాని దావీదు కుటుంబం ఒక గోత్రపువారిని ఏలటానికి అనుమతి ఇస్తాను. ఇది నా సేవకుడైన దావీదు జ్ఞాపకార్థం, యెరూషలేము నగరం కొరకు నేను దీనిని చేస్తాను. ఇశ్రాయేలు వంశాలవారుండే నగరాలన్నింటిలో యెరూషలేమును నేను ఎన్నుకున్నాను.
1KI 11:33 సొలొమోను నన్ననుసరించటం మానివేసినందుకు నేను ఇదంతా చేయదలిచాను. నన్ను విడిచి అతను సీదోనీయుల దేవత అష్ఠారోతును, మోయాబీయుల దేవత కెమోషును, అమ్మోనీయుల దేవత మిల్కోమును మొక్కుతున్నాడు. ఉత్తమ కార్యాలను, ధర్మ మార్గాన్ని అనుసరించటం సొలొమోను మానివేశాడు. నా న్యాయసూత్రాలను, ఆజ్ఞలను శిరసావహించటం లేదు. తన తండ్రి దావీదు నడచిన మార్గాన అతడు నడుచుట లేదు.
1KI 11:34 కావున అతని నుండి రాజ్యాన్నంతా తీసుకుంటాను. అయినా అతను బతికినంత కాలం తాను రాజుగా వుండేలా చూస్తాను. నా సేవకుడైన దావీదు గౌరవార్థం నేనలా చేస్తాను. నేను దావీదును ఎందుకు ఎన్నుకున్నాననగా అతడు నా ఆజ్ఞలను, నా ధర్మసూత్రాలను అన్నిటినీ పాటించాడు.
1KI 11:35 ఈ రాజ్యాన్ని నేనతని కుమారుని వద్ద నుండి తీసుకుంటాను. మరియు యరొబామా, పది వంశాల వారిని పరిపాలించటానికి నీకు అనుమతి ఇస్తాను.
1KI 11:36 సొలొమోను కుమారుడు ఒక వంశం వారిపై పాలనాధికారం కలిగి వుండేలా చేస్తాను. నా సేవకుడైన దావీదు నా ముందు యెరూషలేములో ఎల్లప్పుడూ రాజ్యం కలిగి వుండేటందుకు ఆ విధంగా చేస్తాను. యెరూషలేమును నా స్వంత నగరంగా నేను ఎన్నుకున్నాను.
1KI 11:37 కాని నీవు కోరినంత మట్టుకు నీవు రాజ్యం చేయగలిగేలా చేస్తాను. ఇశ్రాయేలు నంతటినీ నీవు ఏలుబడి చేస్తావు.
1KI 11:38 నీవు గనుక నా న్యాయ సూత్రాలను, నా ఆజ్ఞలను పాటిస్తూ సన్మార్గంలో నడిస్తే ఇవన్నీ జరిగేలా నేను చేస్తాను. దావీదు నా ధర్మ సూత్రాలను, ఆజ్ఞలను పాటించినట్లు నీవు కూడ పాటిస్తే నేను నీకు తోడైవుంటాను. దావీదుకు చేసినట్లు, నీ వంశం కూడ రాజ వంశమయ్యేలా చేస్తాను. ఇశ్రాయేలును నీకిస్తాను.
1KI 11:39 ఆజ్ఞాపాలన చేయకపోయిన కారణంగా దావీదు సంతానాన్ని నేను శిక్షిస్తాను. కాని వారిని నేను శాశ్వతంగా శిక్షకు గురి చేయను.’”
1KI 11:40 సొలొమోను యరొబామును చంప ప్రయత్నించాడు. కాని యరొబాము ఈజిప్టుకు పారిపోయాడు. ఈజిప్టు రాజగు షీషకు వద్దకు అతను వెళ్లాడు. సొలొమోను చనిపోయేవరకు యరొబాము అక్కడేవున్నాడు.
1KI 11:41 తన పరిపాలనా కాలంలో సొలొమోను అనేకమైన ప్రజ్ఞాప్రాభవాలతో కూడిన పనులను చేశాడు. ఈ విషయాలన్నీ సొలొమోను చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి.
1KI 11:42 యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటిపైన సొలొమోను నలుబది సంవత్సరాలు పరిపాలన చేశాడు.
1KI 11:43 తరువాత సొలొమోను చనిపోయాడు. అతడు తన పూర్వీకులతో సమాధి చేయబడ్డాడు అతడు తన తండ్రియగు దావీదు పురములో సమాధి చేయబడ్డాడు.
1KI 12:1 నెబాతు కుమారుడైన యరొబాము సొలొమోను నుండి తప్పించుకొని ఈజిప్టుకు పారి పోయాడు. అక్కడే వుండి పోయాడు. అతడు సొలొమోను మరణం గురించి విన్నప్పుడు, ఎఫ్రాయీము కొండలలో వున్న జెరేదా అను తన నగరానికి తిరిగి వచ్చాడు. రాజైన సొలొమోను చనిపోయి, తన పూర్వీకులతో పాటు సమాధి చేయబడిన పిమ్మట అతని కుమారుడు రెహబాము అతని స్థానంలో రాజయ్యాడు.
1KI 12:3 ఇశ్రాయేలు ప్రజలంతా షెకెమునకు వెళ్లారు. వారంతా రెహబామును రాజుగా చేయటానికి వెళ్లారు. రెహబాము కూడా రాజు కావటానికి షెకెమునకు వెళ్లాడు.
1KI 12:4 ప్రజలు రెహబాముతో, “నీ తండ్రి మమ్మల్ని బలవంతంగా భరింపరాని శరీర కష్టం చేయించాడు. కాని ఇప్పుడు నీవు మాకు శ్రమ తగ్గించాలి. నీ తండ్రి మాకు విధించిన శరీరకష్టం నీవు మాన్పించాలి. అప్పుడు మేము నీకు సేవ చేస్తాము” అని అన్నారు.
1KI 12:5 దానికి సమాధానంగా రెహబాము, “మూడు రోజుల తరువాత నా వద్దకు రండి. అప్పుడు మీకు నేను సమాధానం చెపుతాను” అని అన్నాడు. కావున ప్రజలంతా వెళ్లిపోయారు.
1KI 12:6 సొలొమోను జీవించిపున్నప్పుడు అతనికి పరిపాలనలో సహాయపడిన కొందరు పెద్దలైన సలహాదారులున్నారు. కావున రాజైన రెహబాము ఈ సందర్భంలో, “ఆ ప్రజలకు ఏమి చెప్పాలని మీరను కొంటున్నారు?” అని సలహా అడిగాడు.
1KI 12:7 పెద్దలు ఇలా అన్నారు, “ఈ రోజు నీవు వారి సేవకునిలా మెలగితే, రేపు వారంతా నిన్ను సేవిస్తారు. నీవు వారితో ప్రేమగా కనికరంతో మాట్లాడితే వారంతా నీ కొరకు ఎల్లప్పుడూ పనిచేస్తారు.”
1KI 12:8 కాని రెహబాము వారి సలహాను పెడచెవిని పెట్టాడు. తన స్నేహితులైన యువకులను మళ్లీ సలహా అడిగాడు.
1KI 12:9 “నీ తండ్రి ఇచ్చిన కఠినమైన పనికంటె తక్కువ పని ఇమ్మని ప్రజలు నన్నడుగుతున్నారు. నేనేమి సమాధానం చెపితే మంచిదని మీరనుకుంటున్నారు? నన్నేమి చెప్పమంటారు?” అని రెహబాము తన స్నేహితులను అడిగాడు.
1KI 12:10 రాజు యొక్క యువ స్నేహితులు, “ఆ ప్రజలు నీ వద్దకు వచ్చి, ‘నీ తండ్రి మమ్మల్ని బండ చాకిరి చేయటానికి బలవంతం చేశాడు. కనుక మా పనిని ఇప్పుడు సులభం చేయుము’ అని అడిగారు కదా! అయితే నీవిప్పుడు కొన్ని డంబాలు పలికి, ‘నా చిటికెనవేలు నా తండ్రి శరీరం కంటె పెద్దదిగా వుంది.
1KI 12:11 నా తండ్రి మిమ్మల్ని బండ చాకిరికి గురిచేశాడు. కాని నేను మిమ్మల్ని ఇంకా కష్టపడేలా చేస్తాను! నా తండ్రి మీచేత పని చేయించటానికి కొరడాలు ఉపయోగించాడు. కాని నేను పదునైన లోహపు ముక్కలతో కూర్చబడిన కొరడాలతో, మిమ్మల్ని చీల్చునట్లుగా కొడతాను’” అని సమాధానం చెప్పమన్నారు.
1KI 12:12 రెహబాము ప్రజలను, “మూడు రోజుల తరువాత తన వద్దకు రమ్మని” చెప్పాడు. కావున మూడు రోజుల తరువాత ఇశ్రాయేలీయులంతా రెహబాము వద్దకు వచ్చారు.
1KI 12:13 అప్పుడు రాజైన రెహబాము వారితో చాలా పౌరుషంగా మాట్లాడాడు. పెద్దలిచ్చిన సలహా రాజు పెడచెవిని పెట్టాడు.
1KI 12:14 తన యువ స్నేహితులు చెప్పినదే చేశాడు. రెహబాము వారితో, “నా తండ్రి మిమ్మల్ని హింసించి శరీర కష్టం చేయించాడు. కాని నేను మీకు ఇంకా కఠినమైన పని ఇస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో కొట్టి పని చేయించాడు. కాని నేను మిమ్మల్ని ఎలా కొడతానంటే మీరు తేళ్లు కుట్టినట్లు బాధపడతారు!” అని చెప్పాడు.
1KI 12:15 కావున రాజు తన ప్రజలు కోరిన దానిని చేయలేదు. ఇదంతా యెహోవాయే తన చిత్తప్రకారం జరిపించాడు. తాను నెబాతు కుమారుడైన యరొబాముకు ఇచ్చిన వాగ్దాం నెరవేరేలాగున యెహోవా ఇది ఈ విధంగా జరిగేలా చేశాడు. షిలోహుకు చెందిన ప్రవక్త అహియా ద్వారా ఈ వాగ్దానం చేశాడు.
1KI 12:16 ఇశ్రాయేలీయులంతా కొత్త రాజు తమ అభ్యర్థన వినలేదని గమనించారు. అందువల్ల ప్రజలు ఇలా అన్నారు: “మనం దావీదు వంశానికి చెందినవారమా? కాదు, యెష్షయి రాజ్యంలో మనకేమైనా వస్తుందా? రాదు! కావున ఇశ్రాయేలు సోదరులారా, మనమంతా మన ఇండ్లకు పోదాం పదండి, దావీదు కుమారుణ్ణి తన ప్రజలను ఏలుకోనీయండి!” తరువాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లపోయారు.
1KI 12:17 అయినా రెహబాము యూదా నగరాలలో ఉన్న ఇశ్రాయేలీయులందరినీ ఏలాడు.
1KI 12:18 కూలిపని చేసే వారిపై అదోరాము అనునతడు అధికారిగా వుండేవాడు. రాజైన రెహబాము అదోరామును ప్రజలతో మాట్లాడేటుందుకు పంపాడు. కాని ఇశ్రాయేలీయులు వానిని రాళ్లతో కొట్టి చంపేశారు. అది విని రాజైన రెహబాము తన రథమెక్కి యెరూషలేముకు తప్పించుకుపోయాడు.
1KI 12:19 అలా ఇశ్రాయేలీయులు దావీదు వంశంపై తిరుగుబాటు చేశారు. వారు ఈనాటికీ దావీదు వంశానికి వ్యతిరేకులుగానే వున్నారు.
1KI 12:20 యరొబాము తిరిగి వచ్చినట్లు ఇశ్రాయేలీయులు విన్నారు. కావున వారతనిని ఒక సభకు ఆహ్వానించి, ఇశ్రాయేలంతటికీ రాజుగా చేశాడు. యూదాగోత్రం వారొక్కరు మాత్రమే దావీదు కుటుంబాన్ని అనుసరించారు.
1KI 12:21 రెహబాము యెరూషలేముకు తిరిగి వెళ్లాడు. అతడు యూదా గోత్రపువారిని బెన్యామీను గోత్రపు వారిని సమావేశపరిచాడు. వారిని ఒక లక్షా ఎనుబదివేల మందిగల ఒక సైన్యంగా తయారు చేశాడు. రెహబాము ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయ సంకల్పించాడు. తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అతని కోరిక.
1KI 12:22 కాని యెహోవా ఒక దైవజ్ఞుని (ప్రవక్త) తో మాట్లాడాడు. అతని పేరు షెమయా. యెహోవా ఆ ప్రవక్తతో ఇలా అన్నాడు:
1KI 12:23 “నీవు వెళ్లి సొలొమోను కుమారుడు, యూదా రాజు అయిన రెహబాముతోను, మరియు యూదా బెన్యామీను ప్రజలతోను మాట్లాడు.
1KI 12:24 మీ సోదరుల మీదికి మీరు యుద్ధానికి వెళ్లవద్దని నా మాటగా వారికి చెప్పు ‘మీలో ప్రతి ఒక్కడూ ఇంటికి వెళ్లాలి. ఇవన్నీ జరిగేలా నేనే చేశాను.’ ఈ విషయం యెహోవా మీకు తెలియ చేయమన్నాడని చెప్పు.” ప్రవక్త వెళ్లి చెప్పగా రెహబాము సైన్యంలోని వారంతా విని యెహోవా ఆజ్ఞ శిరసాపహించారు. వారు ఇండ్లకు వెళ్లారు.
1KI 12:25 యరొబాము తరువాత షెకెమును చాలా బలమైన నగరంగా తీర్చిదిద్దాడు. ఆ నగరం ఎఫ్రాయీము కొండలలో వుంది. యరొబాము అక్కడ నివసించాడు. అతడు పెనూయేలు అను నగరానికి వెళ్లి దానిని కూడ మంచి పటిష్ఠమైన నగరంగా చేశాడు.
1KI 12:26 యరొబాము ఇలా అనుకున్నాడు: “ఇప్పుడు ప్రజలంతా యెరూషలేములో యెహోవా దేవాలయానికి యదా ప్రకారంగా వెళుతూ వుంటే, వారు దావీదు వంశం వారిచే పాలింపబడాలని అనుకుంటారు. యూదా రాజైన రెహబామునే వారు మళ్లీ అనుసరించవచ్చు. ఆ తరువాత వారు నన్ను చంపనూవచ్చు.”
1KI 12:28 అందువల్ల తాను ఏమి చేయాలో తెలియజేయమని రాజు తన సలహాదారులను అడిగాడు. వారి సలహామేరకు అతడు రెండు బంగారు కోడెదూడలను చేయించాడు. రాజైన యరొబాము ప్రజలనుద్దేశించి, “మీరు దేవుని ఆరాధించేందుకు యెరూషలేముకు వెళ్లవద్దు. ఇశ్రాయేలీయులారా, ఇవిగో మిమ్మల్ని ఈజిప్టునుండి తీసుకుని వచ్చిన దేవతలు ఇవే” అని అన్నాడు.
1KI 12:29 అలా అని రాజైన యరొబాము ఒక బంగారు కోడెదూడ బొమ్మను బేతేలునందును, రెండవ దానిని దాను నగర మందును ప్రతిష్ఠించాడు.
1KI 12:30 కాని ఇది ఘోరమైన పాపం. ప్రజలు బేతేలు, దాను నగరాలకు ప్రయాణమై కోడెదూడల విగ్రహాలను ఆరాధించటం మొదలు పెట్టారు.
1KI 12:31 గుట్టల మీద, కొండల మీద యరొబాము ఆరాధనా స్థలాలను కట్టించాడు. వివిధ వంశాల నుండి యాజకులను ఎంపిక చేశాడు. (కేవలం లేవీయులనుండి మాత్రమే అతడు యాజకులను ఎంపిక చేయలేదు).
1KI 12:32 రాజైన యరొబాము ఒక కొత్త పండుగరోజు ప్రకటించాడు. ఇది పస్కా పండుగ వంటిది. అది ఎనిమిదవ నెలలో పదునైదవ రోజు. (ఒకటవ నెల పదిహేనవ రోజున కాదు). యూదాలో బేతేలు నగరంలో వున్న పీఠం వద్ద ఆ రోజున రాజు బలులు సమర్పించాడు. తాను తయారు చేయించిన దూడల బొమ్మలకు రాజు బలులు అర్పించేవాడు. తను ఏర్పాటు చేసిన దేవాలయాలలో సేవ చేయటానికి రాజైన యరొబాము యాజకులను బేతేలు నుండి కూడ తీసుకున్నాడు.
1KI 12:33 కావున రాజైన యరొబాము ఇశ్రాయేలీయులకు పండుగ నిమిత్తం తనకు అనుకూలమైన రోజును మాత్రమే నిర్ణయించాడు. అది ఎనిమిదవ నెలలో పదునైదవ రోజు. ఆ సమయంలో అతను నిర్మించిన బలిపీఠాల వద్ద అతడు బలులు సమర్పించి, ధూపం వేసేవాడు. (ఈ కార్యాలు) అతను బేతేలు నగరంలో నిర్వహించేవాడు.
1KI 13:1 ఒక రోజు యూదా దేశపువాడైన ఒక దైవజనుడ్ని బేతేలు నగరానికి వెళ్లమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దైవజనుడు అక్కడికి వెళ్లే సరికి రాజైన యరొబాము బలిపీఠం వద్ద నిలబడి ధూపం వేస్తూ వున్నాడు.
1KI 13:2 ఆ బలిపీఠానికి వ్యతిరేకంగా మాట్లాడమని యెహోవా దైవజనునికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఇలా చెప్పాడు: “బలిపీఠమా, నీకు యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘దావీదు వంశంలో యోషీయా అనువాడొకడు జన్మిస్తాడు. ఈ యాజకులు ఇప్పుడు కొండలపై, గుట్టలపై ఆరాధిస్తున్నారు కాని ఓ బలిపీఠమా, యోషీయా ఈ యాజకులను నీ మీద పెట్టి, వారిని చంపుతాడు. ఇప్పుడా యాజకులు నీ మీద ధూపం వేస్తున్నారు. కాని యోషీయా నీమీద మానవుల అస్తికలను తగులబెడతాడు. అప్పుడు నీవు దేనికీ ఉపయోగపడవు.’”
1KI 13:3 ఇవి జరిగి తీరుతాయనటానికి దైవజనుడు ఒక సూచనఇచ్చాడు. “యెహోవా ఈ సూచన నాకు తెలియజెప్పాడు. ఈ బలిపీఠం నిలువునా పగిలిపోతుంది. దాని మీది బూడిద కిందికి పడి పోతుంది” అని ప్రవక్త అన్నాడు.
1KI 13:4 బేతేలులో వున్న బలిపీఠాన్ని గురించి దైవజనుడు చెప్పిన సమాచారాన్ని రాజైన యరొబాము విన్నాడు. అతడు తన చేతిని బలిపీఠం మీదినుంచి తీసి ప్రవక్తవైపు చూస్తూ, “అతనిని నిర్బంధించండి!” అని అన్నాడు. రాజు అలా అన్నదే తడవుగా అతని చేయి చచ్చుపడిపోయింది. దానిని అతడు కదల్చలేక పోయాడు.
1KI 13:5 అంతే గాకుండా, బలిపీఠం ముక్కలై పోయింది. దాని మీది బూడిద కిందికి పడిపోయింది. దేవుని సమాచారంగా ఆ దైవజనుడు దీనినే చెప్పాడు.
1KI 13:6 అప్పుడు యరొబాము దైవజనునితో, “దయచేసి నా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. నా చేతిని బాగు చేయమని యెహోవాను అడుగు” అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకొరకు దైవజనుడు యెహోవాను ప్రార్థించాడు. తక్షణమే రాజు చేయి స్వస్థపడింది. అది పూర్వపు చేయిలా ఆరోగ్యవంతంగా వుంది.
1KI 13:7 అప్పుడు రాజు ఆ దైవజ్ఞుడితో, “దయచేసి నాతో నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయి. నేను నీకు ఒక కానుక సమర్పించదలిచాను” అని అన్నాడు.
1KI 13:8 అది విన్న ప్రవక్త రాజుతో, “నేను నీతో నీ ఇంటికి రాను! నీవు నీ రాజ్యంలో సగంభాగం నాకిచ్చినా నేను నీతో రాను! ఈ స్థలంలో నేనేదీ తినను, తాగను.
1KI 13:9 ఏదీ తినకూడదని తాగరాదని యెహోవా ఆజ్ఞ. నేనిక్కడికి వచ్చిన బాట వెంట మళ్లీ ప్రయాణం చేయవద్దని కూడా యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అని అన్నాడు.
1KI 13:10 అందువల్ల అతడు మరో మార్గాన తిరుగు ప్రయాణం సాగించాడు. బేతేలుకు వచ్చిన బాట వెంట తను తిరిగి వెళ్లలేదు.
1KI 13:11 ఆ రోజులలో బేతేలు నగరంలో వృద్ధుడైన ఒక ప్రవక్త నివసిస్తూ వుండేవాడు. ఆ వృద్ద ప్రవక్త యొక్క కుమారులు దైవజనుడు వచ్చి బేతేలు నగరంలో చేసినదంతా తమ తండ్రితో చెప్పారు. రాజైన యరొబాముతో ఆ దైవజనుడు చెప్పినదంతా కూడా వారు తమ తండ్రికి వివరించారు.
1KI 13:12 అయితే “అతడు ఏ మార్గాన వెళ్లాడని” వృద్ధ ప్రవక్త అడిగాడు. యూదానుండి వచ్చిన దైవజనుడు వెళ్లిన దారిని తమ తండ్రికి అతని కుమారులు చూపించారు.
1KI 13:13 వృద్ధ ప్రవక్త తన కుమారులతో అతని గాడిదపై గంత వేయమని చెప్పాడు. వారతిని గాడిదపై గంత వేయగా, దానిపై ఎక్కి ప్రవక్త ప్రయాణమై వెళ్లాడు.
1KI 13:14 ఆ వృద్ధ ప్రవక్త దైవజనుడిని వెతుక్కుంటూ పోయాడు. దైవజనుడు ఒక సింధూర వృక్షం కింద కూర్చుని వుండటం వృద్ద ప్రవక్త చూశాడు. “యూదానుండి వచ్చిన దైవజనుడవు నీవేనా?” అని వృద్ధ ప్రవక్త అడిగాడు. “అవును నేనే” అన్నాడు దైవజనుడు.
1KI 13:15 “అయితే దయచేసి నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయండి” అంటూ వృద్ధ ప్రవక్త అడిగాడు.
1KI 13:16 కాని దైవజనుడిలా అన్నాడు: “నేను నీతో రాలేను. నీతో ఈ ప్రదేశంలో అన్నపానాదులు తీసుకోలేను.
1KI 13:17 ‘అక్కడ నీవేదీ తినరాదు; తాగరాదు. నీవు వెళ్లిన దారిన తిరిగి రాకూడదు; అని కూడ యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు.’”
1KI 13:18 “కాని నేను కూడా నీలాగే ఒక ప్రవక్తను” అన్నాడు ఆ వృద్ధ ప్రవక్త. అతడు ఒక అబద్ధం కూడా చెప్పాడు. “యెహోవా యొక్క దేవదూత నావద్దకు వచ్చాడు. ఆ యెహోవా యొక్క దేవదూత నిన్ను నా ఇంటికి తీసుకుని వెళ్లమని, నాతో నీవు భోజనాదులు చేసేలా అనుమతివ్వమనీ అన్నాడు” అని చెప్పాడు.
1KI 13:19 ఈ మాటలు నమ్మి ఆ దైవజనుడు వృద్ధ ప్రవక్త ఇంటికి వెళ్లాడు. అతనితో కలిసి భోజనాదికములు చేశాడు.
1KI 13:20 వారు బల్లవద్ద కూర్చునివుండగా, యెహోవా వృద్ధ ప్రవక్తతో మాట్లాడాడు.
1KI 13:21 ఆ వృద్ధ ప్రవక్త యూదా దేశపు దైవజనునితో ఇలా అన్నాడు: “ప్రభువాజ్ఞ నీవు పాటించలేదని ఆయన అన్నాడు! యెహోవా ఆదేశించిన దానిని నీవు చేయలేదు.
1KI 13:22 ఈ ప్రదేశంలో నీవు ఏమీ తినరాదనీ, తాగరాదనీ యెహోవా ఆజ్ఞాపించాడు. కాని నీవు తిరిగి వచ్చి భోజనాదికాలు నిర్వర్తించావు. అందువల్ల నీ శవం నీ పితరుల సమాధిలో ఉంచబడదు.”
1KI 13:23 దైవజనుడు భోజనం ముగించాడు. వృద్ధ ప్రవక్త గాడిదపై గంత వేయగా, దైవజనుడు దానిపై వెళ్లాడు.
1KI 13:24 తను ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో ఒక సింహం దైవజనుని మీదపడి చంపేసింది. దైవజనుని శరీరం బాటపై పడివుంది. గాడిద, సింహం శవం పక్కన నిలబడివున్నాయి.
1KI 13:25 కొందరు ఆ దారిన పోతూ, శవం పక్కన సింహం నిలబడివుండటం చూశారు. వృద్ధ ప్రవక్త వున్న నగరానికి వచ్చి, వారు దారిలో చూసినదంతా చెప్పారు.
1KI 13:26 ఆ వృద్ధ ప్రవక్తే యూదా దేశాపు దైవజనుని వెనుకకు తీసుకొని వచ్చాడు. వృద్ధ ప్రవక్త జరిగినదంతావిని, “ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. అందువలన యెహోవా ఒక సింహాన్ని అతనిని చంపటానికి పంపాడు. ఇది చేస్తానని యెహోవా చెప్పియున్నాడు” అని అన్నాడు.
1KI 13:27 “తన గాడిదపై గంతవేయమని” తన కుమారులతో ప్రవక్త చెప్పాడు. తన కుమారులు గాడిదపై గంతవేశారు.
1KI 13:28 వృద్ధ ప్రవక్త దానిపై వెళ్లి శవం బాటపై పడివుండటం చూశాడు. గాడిద, సింహం ఇంకా శవం పక్కన నిలబడి వున్నాయి. పైగా ఆ సింహం శవాన్ని తినటం గాని, గాడిదను గాయపర్చటం గాని చేయలేదు.
1KI 13:29 వృద్ధ ప్రవక్త శవాన్ని తన గాడిదపై వేశాడు. దైవజనుని మృతికి సంతాపం తెలియజేయటానికి శవాన్ని ప్రవక్త వెనుకకు తీసుకుని వచ్చాడు.
1KI 13:30 శవాన్ని ప్రవక్త తన కుటుంబానికి సంబంధించిన సమాధిలో పెట్టాడు. వృద్ధ ప్రవక్త అతని మృతికి సంతాపం తెలియజేశాడు. ఆ ప్రవక్త, “ఓ నా సహోదరుడా, నీ మరణానికి మిక్కిలి విలపిస్తున్నాను” అని అన్నాడు.
1KI 13:31 వృద్ధ ప్రవక్త దైవజనుని శవాన్ని పాతిపెట్టాడు. తరువాత తన కుమారులతో ఇలా అన్నాడు: “నేను చనిపోయినప్పడు నా శవాన్ని ఇదే సమాధిలో ఉంచండి. నా ఎముకలను అతని అస్థికల పక్కనే ఉంచండి.
1KI 13:32 యెహోవా అతని ద్వారా చెప్పిన మాటలు నిజమయి తీరుతాయి. యెహోవా బేతేలులోని బలిపీఠానికి, సమరియ పట్టణాలలోని ఉన్నత స్థలాలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి అతనిని ఉపయోగించుకున్నాడు.”
1KI 13:33 రాజైన యరొబాములో ఏమీ మార్పు రాలేదు. అతడు చెడ్డ పనులు చేస్తూనే వున్నాడు. వేర్వేరు వంశాల నుండి మనుష్యులను అతడు యాజకులుగా ఎంపిక చేస్తూనే వున్నాడు. ఈ యాజకులు ఉన్నత ప్రదేశాలలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు. ఎవరు యాజకుడు కావాలనుకుంటే వారికా అవకాశం ఇవ్వబడింది.
1KI 13:34 ఇది ఒక మహా పాపమై తన రాజ్యం సర్వ నాశనం కావటానికి ప్రధాన కారాణమయ్యింది.
1KI 14:1 ఆ సమయంలో యరొబాము కుమారుడు అబీయా తీవ్రంగా జబ్బు పడ్డాడు.
1KI 14:2 యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు: “నీవు షిలోహుకు వెళ్లు. అక్కడ ప్రవక్త అహీయాను దర్శించు. నేను ఇశ్రాయేలుకు రాజునవుతానని చెప్పిన వాడే ఈ అహీయా. నీవు నా భార్యవని ప్రజలకు తెలియకుండా మారువేషం వేసుకొని వెళ్లు.
1KI 14:3 ప్రవక్త కొరకు పదిరొట్టెలను, తీపి పదార్థాలను, ఒక జాడీ తేనెను కానుకగా పట్టుకు వెళ్లు. తరువాత మన కుమారునికి ఏమి జరుగుతుందో చెప్పమని ఆయనను అడుగు. ప్రవక్తయైన అహీయా అంతా చెపుతాడు.”
1KI 14:4 అందువల్ల రాజు భార్య షిలోహుకు వెళ్లింది. ప్రవక్త అహీయా ఇంటికి వెళ్లింది. అహీయా పండు ముసలి వాడయ్యాడు. చూపుపోయింది.
1KI 14:5 కాని ఈ లోపు యెహోవా అహీయాతో, “యరొబాము భార్య నీ వద్దకు వస్తూవుంది. ఆమె కుమారునికి జబ్బు చేయగా, అతనికి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని వస్తూవుంది” అని తెలియజేశాడు. తరువాత అహీయా ఆమెకు ఏమి చెప్పాలో కూడ యెహోవా వివరించాడు. యరొబాము భార్య అహీయా ఇంటికి వచ్చింది. ఆమె ఎవరో ప్రజలకు తెలియకుండా వుండాలని ఆమె ప్రయత్నిస్తూ వుంది.
1KI 14:6 ఆమె ద్వారం వద్దకు వచ్చినట్లు అహీయా శబ్దం విన్నాడు. వెంటనే అహీయా ఇలా అన్నాడు: “యరొబాము భార్యా, లోపలికి రా, ప్రజలు నిన్ను ఎవరో అనుకోవాలని నీవు ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నీకు ఒక దుర్వార్త చెప్పదలిచాను.
1KI 14:7 నీవు ఇంటికి తిరిగి వెళ్లి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యరొబాముకు చెప్పమన్న వర్తమానం తెలియజేయి. యెహోవా ఇలా అంటున్నాడు: ‘యరొబామా, ఇశ్రాయేలీయులందరిలోను నేను నిన్ను ఎంపిక చేశాను. నా ప్రజలకు నిన్ను పాలకునిగా చేశాను.
1KI 14:8 దావీదు వంశం ఇశ్రాయేలును ఏలుతూ వుంది. కాని వారినుండి రాజ్యాన్ని తీసుకుని, దానిని నేను నీకిచ్చాను. నా సేవకుడగు దావీదువలె నీవు ప్రవర్తించలేదు. అతడు నా ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాడు. పూర్ణ హృదయంతో అతడు నన్ను అనుసరించాడు. నేను అంగీకరించిన వాటినే అతడు చేసేవాడు.
1KI 14:9 కాని నీవు ఘోరమైన పాపాలను చాలా చేశావు. నీ ముందు పాలించిన వారు చేసిన పాపాలకంటె నీవు అతి భయంకరమైన పాపాలు చేశావు. నన్ను వదిలిపెట్టి పెడ మార్గాన పడ్డావు. నీవు విగ్రహాలను, చిల్లర దేవుళ్లను తయారు చేశావు. ఇది నాకు చాలా కోప కారణమయ్యింది.
1KI 14:10 కావున నేను యరొబాము కుటుంబానికి కష్టాలు కలుగజేస్తాను. నీ కుటుంబంలో పురుషులందరినీ చంపివేస్తాను. ఎండిన పేడను అగ్ని దహించి వేయునట్లు నేను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను.
1KI 14:11 నగరంలో చనిపోయిన నీ కుటుంబం వారిని కుక్కలు పీక్కుతింటాయి. పొలాల్లో చనిపోయే నీ కుటుంబంవారిని పక్షులు పొడుచుకు తింటాయి.’ ఇదే యెహోవా వాక్కు.”
1KI 14:12 యరొబాము భార్యతో ప్రవక్త అహీయా ఇంకా ఇలా అన్నాడు: “ఇప్పుడు ఇంటికి వెళ్లు. నీవు నగర ద్వారం ప్రవేశించగానే నీ కుమారుడు చనిపోతాడు.
1KI 14:13 ఇశ్రాయేలంతా వాని కొరకు విలపించి, అతనిని సమాధి చేస్తారు. యరొబాము కుటుంబంలో నీ కుమారుడు ఒక్కడే సమాధి చేయబడతాడు. ఎందువల్లననగా యరొబాము కుటుంబంలో అతడొక్కడే ప్రభువైన ఇశ్రాయేలు దేవుని సంతోషపరిచాడు.
1KI 14:14 యెహోవా ఇశ్రాయేలుపై మరో కొత్త రాజును నియమిస్తాడు. ఆ కొత్త రాజు యరొబాము కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఇది శీఘ్రంగా జరుగుతుంది.
1KI 14:15 అప్పుడు యెహోవా ఇశ్రాయేలును శిక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు నీటిలోని ఎత్తైన గడ్డి అల్లాడినట్లు తల్లడిల్లి పోతారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈ మంచి దేశంనుండి యెహోవా లాగివేస్తాడు. ఈ రాజ్యాన్ని వారి పూర్వికులకు ఆయన ఇచ్చాడు. యూఫ్రటీసు నదికావల వీరు చెల్లాచెదరైపోయేలా చేస్తాడు. ఇది జరుగుతుంది. కారణమేమంటే యెహోవా ఆ ప్రజల పట్ల కోపంగా వున్నాడు. ప్రత్యేకమైన స్తంభాలు నిర్మించి అషేరాను ఆరాధించటం మొదలుపెట్టి ప్రజలాయనకు చాలా కోపం కలుగ జేశారు.
1KI 14:16 యరొబాము పాపం చేశాడు. అతడు పాపం చేసి ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు. కావున ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడేలా యెహోవా చేస్తాడు.”
1KI 14:17 యరొబాము భార్య తిర్సాకు తిరిగి వెళ్లింది. ఆమె ఇంటికి వెళ్లగానే బాలుడు చనిపోయాడు.
1KI 14:18 ఇశ్రాయేలీయులంతా అతని కొరకై విలపించి, అతనిని సమాధిచేశారు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అదే విధంగా ఇది జరిగింది. తన సేవకుడైన ప్రవక్త అహీయా ద్వారా ఈ విషయాలన్నీ చెప్పాడు.
1KI 14:19 రాజైన యరొబాము అనేకమైన ఇతర పనులు చేశాడు. అతడు యుద్ధాలు చేశాడు. ప్రజాపాలన కొనసాగించాడు. అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వివరించబడ్డాయి.
1KI 14:20 యరొబాము రాజుగా ఇరువది రెండు సంవత్సరాలు పరి పాలించాడు. తరువాత అతడు చనిపోగా, వానిని అతని పూర్వీకులతో సమాధి చేశారు. అతని కుమారుడు నాదాబు అతని స్థానంలో రాజైనాడు.
1KI 14:21 యూదాకు రాజయ్యేనాటికి సొలొమోను కుమారుడు రెహబాము 41 సంవత్సరాలవాడు. యెరూషలేము నగరంలో రెహబాము పదిహేడు సంత్సరాలు పాలించాడు. ఈ నగరంలోనే యెహోవా తాను గౌరవింపబడాలని నిశ్చయించాడు. ఇశ్రాయేలు రాజ్యమంతటిలో ఈ నగరాన్నే ఆయన ఎన్నుకున్నాడు. రెహబాము తల్లి అమ్మోనీయురాలగు నయమా.
1KI 14:22 యూదా ప్రజలు యెహోవా దృష్టిలో పాపకార్యాలు చేయటం కొనసాగించారు. వారంటే కోపగించుకొనేలా ప్రజలు యెహోవా పట్ల అనేక పాప కార్యాలు చేశారు. వారికి ముందు నివసించిన వారి పితరులకంటె ఘోరమైన పాపాలను వారు చేశారు.
1KI 14:23 ఆ ప్రజలు ఉన్నత స్థలాలను, స్మారకశిలను, పవిత్ర కొయ్యగుంజలను నిర్మించారు. వీటన్నిటినీవారు కొండల మీద, పచ్చని చెట్ల కింద ఏర్పాటు చేశారు.
1KI 14:24 దేవుని ఆరాధన పేరుతో నీచమైన లైంగిక కార్యాలకు అమ్ముడు పోయే పురుషులు కూడా అక్కడ వున్నారు. యూదా వారు కూడా చాలా చెడుకార్యలకు పాల్పడ్డారు. వారికి ముందు ఈ రాజ్యంలో నివసించిన జనులు కూడా అదే రకపు చెడుకార్యాలు చేశారు. అందుచే యెహోవా రాజ్యాన్ని వారి నుండి తీసుకుని ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు.
1KI 14:25 రెహబాము రాజ్యానికి వచ్చిన ఐదవ సంవత్సరంలో, ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము పైకిదండెత్తి వచ్చాడు.
1KI 14:26 షీషకు దేవాలయ ఖజానాను, రాజభవనాన్ని కొల్లగొట్టాడు. అరాము రాజైన హదదెజరు సైనికుల నుండి దావీదు తీసుకున్న బంగారు డాళ్లను కూడా అతడు ఎత్తుకొనిపోయాడు. దావీదు ఈ డాళ్లను యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. షీషకు బంగారు డాళ్లన్నీ పట్టుకు పోయాడు.
1KI 14:27 అందువల్ల రాజైన రెహబాము వీటికి మారుగా చాలా డాళ్లను చేయించాడు. అయితే ఈ డాళ్లన్నీ బంగారానికి బదులు కంచుతో చేయబడ్డాయి. రాజభవన ద్వార పాలకులకు అతనియొక్క డాళ్లను ఇచ్చాడు.
1KI 14:28 రాజు యెహోవా దేవాలయానికి వెళ్లినప్పుడల్లా తన అంగరక్షకులు వెంట వెళ్లేవారు. వారు డాళ్లను చేతబట్టుకొని వెళ్లేవారు. వారు పని ముగించిన పిమ్మట వాటిని రక్షక భటుల గదిలో గోడకు తగిలించేవారు.
1KI 14:29 రాజైన రెహబాము చేసిన కార్యాలన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంధంలో పొందుపర్చబడ్డాయి.
1KI 14:30 రెహబాము, యరొబాము ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ వుండేవారు.
1KI 14:31 రెహబాము చనిపోగా అతను తన పూర్వికులతో దావీదు నగరంలో సమాధి చేయబడినాడు. (అతని తల్లి అమ్మోనీయురాలగు నయమా) రెహబాము కుమారుడు అబీయాము అతని స్థానంలో రాజయ్యాడు.
1KI 15:1 నెబాతు కుమారుడు యరొబాము ఇశ్రాయేలును పాలిస్తూ పుండెను. అతని పాలనలో పదునెనిమిదో సంవత్సరం గడుస్తూ వుండగా, అబీయాము యూదాకు రాజు అయ్యాడు.
1KI 15:2 అబీయాము మూడు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. ఆమె అబీషాలోము కుమార్తె.
1KI 15:3 పూర్వం తన తండ్రి చేసిన తప్పులన్నీ అతను కూడా చేశాడు. తన తాత దావీదు తన ప్రభవైన యెహోవాకు యథార్థుడై వున్నట్లు, అబీయాము యెహోవాకు విశ్వాసపాత్రుడై వుండలేదు.
1KI 15:4 యెహోవా దావీదును ప్రేమించాడు. అందువల్ల అబీయాముకు యెరూషలేములో ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. అతనికి ఒక కుమారుని కూడ కలుగజేశాడు. యెహోవా ఇంకా యెరూషలేమును సురక్షితంగా వుండేలా చేశాడు. ఇదంతా యెహోవా దావీదు కొరకు చేశాడు.
1KI 15:5 యెహోవా కోరిన ప్రకారం దావీదు అన్నీ సవ్యమైన పనులు చేశాడు. యెహోవా ఆజ్ఞలను సదాపాటించాడు. హిత్తీయుడైన ఊరియా పట్ల తను చేసిన పాపం ఒక్కటి తప్ప, దావీదు యెహోవాకు సదా విధేయుడైయున్నాడు.
1KI 15:6 రెహబాము, యరొబాము ఇద్దరూ ఒకరితో ఒకరు ఎల్లప్పుడు యుద్ధం చేస్తూనే వున్నారు.
1KI 15:7 అబీయాము చేసిన ఇతరమైన పనులన్నీ యూదా రాజుల చరిత్రలో రాయబడ్డాయి. అబీయాము పరిపాలించే సమయంలో అబీయాముకు, యరొబాముకు యుద్ధం జరిగింది.
1KI 15:8 అబీయాము చనిపోయినప్పుడు అతడు దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. అబీయాము కుమారుని పేరు ఆసా. అబీయాము స్థానంలో ఆసా రాజయ్యాడు.
1KI 15:9 యరొబాము పాలన మొదలై ఇరువైయవ సంవత్సరం జరుగుతూండగా, ఆసా రాజ్యానికి వచ్చాడు.
1KI 15:10 ఆసా యెరూషలేములో నలుబది యొక్క సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. మయకా అబ్షాలోము కుమార్తె.
1KI 15:11 ఆసా తన పూర్వికుడైన దావీదువలె యెహావా దృష్టిలో యథార్థమైన వాటిని చేసాడు.
1KI 15:12 ఆ రోజులలో కూడా లైంగిక వాంఛలకై తమ శరీరాలను ఆరాధనా స్థలాలలో అమ్ముకుని చిల్లర దేవుళ్లను పూజించే పురుషులున్నారు. అటువంటి పురుషగాములను ఆసా దేశంనుండి వెళ్ళగొట్టాడు. మరియు ఆసా తన పూర్వికులు తయారు చేసిన విగ్రహాలన్నిటినీ తీసి వేశాడు.
1KI 15:13 తన తల్లి మయకాను రాణి పదవి నుంచి ఆసా తొలగించాడు. కారణ మేమంటే మయకా ఒక హేయమైన అషేరా దేవతా విగ్రహాన్ని తయారు చేయించింది. ఈ భయంకర విగ్రహాన్ని ముక్కలు చేసి ఆసా వాటిని కిద్రోనులోయలో తగులబెట్టాడు.
1KI 15:14 కాని ఆసా ఉన్నత స్థలాలను నాశనం చేయలేదు. తన జీవిత కాలమంతా ఆసా యెహోవాకు విశ్వాస పాత్రుడుగా ఉన్నాడు.
1KI 15:15 ఆసా తండ్రి కొన్ని వస్తువులను యెహోవాకు సమర్పించాడు. ఆసా కూడ కొన్ని కానుకలను యెహోవాకు సమర్పించాడు. వారు బంగారం, వెండి, తదితర వస్తు సామగ్రిని కానుకలుగా సమర్పించారు. అవన్నీ ఆసా దేవాలయంలో వుంచాడు.
1KI 15:16 యూదా రాజుగా ఆసా కొనసాగినంత కాలం, ఇశ్రాయేలు రాజైన బయెషాతో యుద్ధాలు కొనసాగించాడు.
1KI 15:17 బయెషా యూదా వారితో యుద్ధం చేశాడు. ఆసా రాజ్యమైన యూదాకు ప్రజల రాకపోకలను నిలిపివేయమని బయెషా సంకల్పించాడు. అందువల్ల రామానగరాన్ని అతడు చాలా పటిష్ఠపర్చినాడు.
1KI 15:18 దేవాలయం ఖజానా నుండి, రాజభవనం నుండి ఆసా వెండి, బంగారాలను తీశాడు. అతని సేవకులకు వాటినిచ్చి అరాము రాజైన బెన్హదదుకు పంపాడు. (బెన్హదదు తండ్రి పేరు టబ్రిమ్మోను, టబ్రిమ్మోను తండ్రిపేరు హెజ్యోను) అతడు దమస్కు నగరంలో వుంటున్నాడు.
1KI 15:19 అతనికి ఆసా ఇలా వర్తమానం పంపాడు, “నా తండ్రికి, నీ తండ్రికి మధ్య ఒక శాంతి ఒడంబడిక జరిగింది. ఇప్పుడు నీతో నేను కూడ శాంతి ఒడంబడిక నొకదానిని చేసుకోదలిచాను. నీకు వెండి బంగారాలు కానుకలుగా పంపుతున్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషాతో నీకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవలసిందిగా కోరుతున్నాను. అప్పుడు బయెషా నా రాజ్యం వదిలిపోతాడు.”
1KI 15:20 రాజైన బెన్హదదు ఆసా రాజు కోరిన దానికి ఒప్పుకున్నాడు. కావున ఇశ్రాయేలు పట్టణాలమీదికి తన సైన్యాలను పంపాడు. ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు పట్టణాలను ఓడించాడు. కిన్నెరెతు, నఫ్తాలీలను అతడు పూర్తిగా ఓడించాడు.
1KI 15:21 ఈ దండయాత్రలను గురించి బయెషా విన్నాడు. దానితో అతడు రామా నగరాన్ని కట్టు దిట్టం చేయటం మానివేశాడు. అతడు రామా నగరాన్ని వదిలి తిర్సాకు తిరిగి వెళ్లాడు.
1KI 15:22 అప్పుడు రాజైన ఆసా యూదా ప్రజలందరి సహకారాన్ని కోరుతూ ఒక అభ్యర్థన చేశాడు. వారంతా బయెషా రామా నగరాన్ని పటిష్ఠం చేయటానికి వినియోగిస్తున్న రాళ్లను, కలపను తీసుకొనిపోయారు. వాటిని బెన్యామీనీయుల నగరమైన గెబకు, మరియు మిస్పాకు చేరవేశారు. రాజైన ఆసా ఆ రెండు నగరాలను పటిష్టంగా పునర్నిర్మించాడు.
1KI 15:23 ఆసా చేసిన ఇతరమైన అన్ని పనులు, అతని బలం, అతను నిర్మించిన నగరాల విషయం యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆసా ముసలివాడైనప్పుడు, అతని పాదాలలో జబ్బు ఏర్పడింది.
1KI 15:24 ఆసా చనిపోయినప్పుడు, అతని పూర్వికుడైన దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. తరువాత ఆసా కుమారుడు యెహోషాపాతు అతని స్థానంలో రాజు అయ్యాడు.
1KI 15:25 యూదాకు రాజైన ఆసా పాలన రెండవ సంవత్సరం గడుస్తూ వుండగా యరొబాము కుమారుడు నాదాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. నాదాబు ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పాలించాడు.
1KI 15:26 యెహోవా దృష్టిలో అతను చాలా తప్పులు చేశాడు. తన తండ్రి యరొబాము చేసిన తప్పులన్నీ ఇతడూ చేశాడు. యరొబాము ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు.
1KI 15:27 బయెషా అహీయా కుమారుడు. వారు ఇశ్శాఖారు వంశస్థులు. రాజైన నాదాబును చంపి వేయటానికి బయెషా పధకం వేశాడు. అది నాదాబు, ఇశ్రాయేలు వారంతా కలిసి గిబ్బెతోను నగరంపై దాడి జరుపుతున్న సమయం. గిబ్బెతోను ఫిలిష్తీయుల నగరం. అక్కడ నాదాబును బయెషా హత్య చేశాడు.
1KI 15:28 యూదాపై ఆసా పాలన మూడవ సంవత్సరం జరుగుతుండగా ఇది జరిగింది. ఇశ్రాయేలుకు తరువాత బయెషా రాజు అయ్యాడు.
1KI 15:29 బయెషా రాజైన పిమ్మట అతడు యరొబాము కుటుంబాన్ని హతమార్చాడు. యరొబాము కుటుంబంలో ఒక్కడిని కూడా బయెషా ప్రాణంతో వదలలేదు. యెహోవా ఎలా జరుగుతుందని సెలవిచ్చాడో, అదే రీతిలో ఇదంతా జరిగింది. షిలోహులో తన సేవకుడైన అహీయా ద్వారా యెహోవా ఇది పలికాడు.
1KI 15:30 ఇదంతా ఎందుకు జరిగినదనగా రాజైన యరొబాము చాలా పాపకార్యాలు చేశాడు. అంతే కాకుండా, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపకార్యాలు చేయటానికి యరొబాము కారకుడయ్యాడు. హేయమైన తన పనులతో యరొబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం కల్గించాడు.
1KI 15:31 నాదాబు చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
1KI 15:32 బయెషా ఇశ్రాయేలును యేలినంత కాలం యూదా రాజైన ఆసాతో యుద్ధాలు చేస్తూనేవున్నాడు.
1KI 15:33 ఆసా యూదా రాజ్యాన్ని మూడవ సంవత్సరం పాలిస్తూండగా, అహీయా కుమారుడైన బయెషా ఇశ్రాయేలుకు రాజయ్యాడు. బయెషా ఇరువది నాలుగు సంవత్సరాలు తిర్సాలో పరిపాలించాడు.
1KI 15:34 కాని బయెషా యెహోవాకు వ్యతిరేకంగా అనేక దుష్టకార్యాలు చేశాడు. యరొబాము చేసిన పాపాలే ఇతడు కూడ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి యరొబాము కారకుడయ్యాడు.
1KI 16:1 తరువాత యెహోవా హనానీ కుమారుడైన యెహూతో మాట్లాడాడు. యెహోవా రాజైన బయెషాకు వ్యతిరేకంగా మాట్లాడాడు.
1KI 16:2 “నిన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నేను చేశాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలపై నిన్ను యువరాజుగా చేశాను. నీవు కూడా యరొబాము మార్గాన్నే అనుసరించావు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు తప్పుదారి పట్టేలా చేశావు. వారి పాపకార్యాలతో వారు నాకు కోపం కలుగజేశారు.
1KI 16:3 కావున ఓ బయెషా, నిన్ను నీ కుటుంబాన్ని నేను నాశనం చేస్తాను. నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబానికి చేసినదంతా నీ కుటుంబానికి కూడా చేస్తాను.
1KI 16:4 నీ కుటుంబం వారు నగర వీధుల్లో పడి చనిపోతారు. వారి శవాలను కుక్కలుతింటాయి. నీ సంతతిలో కొందరు పొలాల్లో చనిపోతారు. వారి శవాలను పక్షులు తిని పోతాయి.”
1KI 16:5 బయెషా చేసిన ఇతర విషయాలన్నిటిని గురించి, అతని సైనిక బలం గురించి ఇశ్రాయేలు రాజుల చరిత గ్రంధంలో వ్రాయబడింది.
1KI 16:6 బయెషా చనిపోయినప్పుడు అతనిని తిర్సాలో సమాధి చేశారు. అతని కుమారుడు ఏలా అతని స్థానంలో రాజు అయ్యాడు.
1KI 16:7 కావున ప్రవక్తయగు యెహోకు యెహోవా ఒక వర్తమానం అందించాడు. ఆ వర్తమానం బయెషాకు, అతని కుటుంబానికి వ్యతిరేకంగా వుంది. యెహోవా దృష్టిలో నీచమైన కార్యాలనేకం బయెషా చేశాడు. ఇది యెహోవాకు కోపకారణమయ్యింది. అతనికి ముందు యరొబాము సంతతి వారు చేసిన పనులే బయెషా కూడ చేశాడు. బయెషా యరొబాము కుటుంబం వారినందరినీ చంపివేసినందుకు కూడా యెహోవా కోపంగా వున్నాడు.
1KI 16:8 యూదా రాజుగా ఆసా పాలన ఇరువది ఆరవ సంవత్సరం గడుస్తూ వుండగా ఏలా ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఏలా అనువాడు బయెషా కుమారుడు. అతడు తిర్సాలో రెండేండ్లు పరిపాలించాడు.
1KI 16:9 రాజైన ఏలా కింది అధికారులలో జిమ్రీ ఒకడు. ఏలా యొక్క రథబలంలో సగానికి జిమ్రీ అధిపతి. కాని ఏలాకు వ్యతిరేకంగా జిమ్రీ కుట్ర పన్నాడు. రాజైన ఏలా తిర్సాలో ఉన్నాడు. అతడు అర్సాఇంటిలో బాగా మద్యపానం చేసి మత్తుగా ఉన్నాడు. తిర్సాలో వున్న రాజుభవన నిర్వాహకుడు అర్సా.
1KI 16:10 జీమ్రీ ఆ ఇంటిలో ప్రవేశించి రాజైన ఏలాను చంపేశాడు. ఆసా పాలన యూదాలో ఇరువది ఏడవ సంవత్సరం జరుగుతూ వుండగా ఇది జరిగింది. తరువాత ఏలా స్థానంలో జిమ్రీ ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు.
1KI 16:11 జిమ్రీ రాజుగా సింహాసనాన్ని అధిప్ఠించగానే, అతడు బయెషా కుటుంబం వారినందరినీ సంహరించాడు. బయెషా వంశాంలోని మగవారినెవ్వరినీ అతడు ప్రాణాలతో వదలలేదు. బయెషా స్నేహితులను కూడ జిమ్రీ చంపేశాడు.
1KI 16:12 జిమ్రీ ఆ విధంగా బయెషాయొక్క వంశనాశనం గావించాడు. ప్రవక్తయైన యెహూ ద్వారా బయెషాకు వ్యతిరేకంగా ఏమి జరుగుతుందని యెహోవా పలికాడో ఆ రీతిగా ఇది జరిగింది.
1KI 16:13 బయెషా, అతని కుమారుడు ఏలా చేసిన పాపాల ఫలితంగా ఇది జరిగింది. వారు పాపం చేయటమే కాకుండా, ఇశ్రాయేలీయులు పాపం చేయటానికి కూడా వారు కారకులయ్యారు. వారు విగ్రహాలను చేయటానికి పాల్పడినందుకు కూడా యెహోవా కోపగించాడు.
1KI 16:14 ఏలా చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
1KI 16:15 ఆసా పాలన యూదాలో ఇరువది ఏడవ సంవత్సరం జరుగుతూ వుండగా, జిమ్రీ ఇశ్రాయేలుకు రాజయ్యాడు. జిమ్రీ తిర్సాలో ఏడు రోజులు పాలించాడు. అసలు జరిగిన విషయమేమనగా: ఫిలిష్తీయుల నగరమైన గిబ్బెతోను వద్ద ఇశ్రాయేలు సైన్యం దిగియుండెను.
1KI 16:16 రాజుకు వ్యతిరేకంగా జిమ్రీకుట్ర పన్నుతున్నాడని సైనికులు విన్నారు. అతడు రాజును చంపివేశాడని కూడ విన్నారు. అదే రోజున ఇశ్రాయేలీయులు ఒమ్రీని రాజుగా అదే శిబరంలోనే ప్రకటించారు. ఒమ్రీ సైన్యాధ్యక్షుడు.
1KI 16:17 తరువాత ఒమ్రీ, ఇశ్రాయేలు సైన్యం గిబ్బెతోనును వదిలి తిర్సాపైకి దండెత్తి వెళ్లారు.
1KI 16:18 నగరాన్ని ముట్టడించి పట్టుకున్నారని జిమ్రీ తెలుసుకున్నాడు. అతడు రాజభవనంలోకి వెళ్లి దానికి నిప్పుపెట్టాడు. అతడు భవనంతో పాటు కాలిపోయాడు.
1KI 16:19 జిమ్రీ పాపం చేయబట్టి అతడు నాశనయ్యాడు. అతడు పాపం చేశాడు. యెహోవా దృష్టిలో అనేక చెడు కార్యాలు చేశాడు. యరొబాము మాదిరిగానే అతను కూడా పాపం చేశాడు. యరొబాము ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి కారకుడయ్యాడు.
1KI 16:20 జిమ్రీ పన్నిన కుట్ర విషయం, అతను చేసిన తదితర కార్యాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంధంలో వ్రాయబడ్డాయి. జిమ్రీ రాజైన ఏలీకి వ్యతిరేకంగా తిరిగి నప్పుడు జరిగిన సంఘటనలు కూడ ఆ గ్రంథంలో పొందు పర్చబడ్డాయి.
1KI 16:21 ఇశ్రాయేలు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం గీనతు కుమారుడైన తిబ్నీని బలపర్చి, అతనిని రాజుగా చేయ సంకల్పించింది. రెండవ వర్గం ఒమ్రీని అనుసరించింది.
1KI 16:22 ఒమ్రీ అనుచరులు గీనతు కుమారుడైన తిబ్నీ వర్గం వారికంటె బలంగా వున్నారు. అందువల్ల తిబ్నీ చంపబడ్డాడు. ఒమ్రీ రాజయ్యాడు.
1KI 16:23 ఆసా పాలన యూదాలో ముప్పదియొకటో సంవత్సరం జరుగుతూ వుండగా, ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఒమ్రీ ఇశ్రాయేలును పన్నెండు సంవత్సరాలు పాలించాడు. అందులో ఆరు సంవత్సరాలు తిర్సాలో వుండి ఏలాడు.
1KI 16:24 కాని ఒమ్రీ షోమ్రోను కొండను కొన్నాడు. దానిని షెమెరు అను వానియొద్ద నాలుగు మణుగుల వెండి నిచ్చి కొన్నాడు. ఆ కొండ మీద ఒమ్రీ ఒక నగరాన్ని కట్టాడు. ఆ కొండ యజమానియైన షెమెరు జ్ఞాపకార్థం ఆ నగరానికి షోమ్రోను అని పేరు పెట్టాడు.
1KI 16:25 కాని ఒమ్రీ యెహోవా దృష్టిలో అనేక దుష్ట కార్యాలు చేశాడు. తనకు ముందు యేలిన రాజులందరి కంటె అతడు ఎక్కువ పాపం చేశాడు.
1KI 16:26 అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన తప్పులన్నీ చేశాడు. ఇశ్రాయేలీయులు పాపకార్యాలు చేయటానికి యరొబాము కారకుడయ్యాడు. కావున వారంతా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం కలుగజేశారు. యెహోవాకు కోపం రావటానికి కారణ మేమనగా వారు పనికిమాలిన విగ్రహారాధన చేశారు.
1KI 16:27 ఒమ్రీ చేసిన ఇతర కార్యాలు, తన సైనికబలం మొదలగు విషయాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంధంలో వ్రాయబడ్డాయి.
1KI 16:28 ఒమ్రీ చనిపోయాడు. అతనిని షోమ్రోనులో సమాధి చేశారు. అతని కుమారుడు అహాబు అతని స్థానంలో రాజు అయ్యాడు.
1KI 16:29 యూదాలో ఆసా పాలన ముప్పై ఎనిమిదవ సంవత్సరం జరుగుతూండగా ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజైనాడు. షోమ్రోను నుండి ఇరువది రెండు సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పాలించాడు.
1KI 16:30 అహాబు యెహావా చేయవద్దన్న కార్యాలను చేశాడు. తనకు ముందు పాలించాన వారందరికంటె అహాబు ఎక్కువ చెడుకార్యాలు చేశాడు.
1KI 16:31 నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపక్రియలు అహాబుకు చాలా సామాన్యమైనవిగా కన్పించాయి. ఆ తప్పులు చాలవన్నట్లు అతడు ఎత్బయలు కుమారైయగు యెజెబెలును వివాహం చేసుకున్నాడు. ఎత్బయలు సీదోనుకు రాజు. దానితో అహాబు బయలు దేవతను కొలవటం మొదలు పెట్టాడు. అహాబు అతనిని ఆరాధించాడు.
1KI 16:32 షోమ్రోనులో బయలు ఆరాధనకు ఒక ఆలయాన్ని కట్టించాడు. ఆ ఆలయంలో ఒక బలిపీఠం ఏర్పాటు చేశాడు.
1KI 16:33 అషేరా దేవతను ఆరాధించటానికి అహాబు ఒక ప్రత్యేక స్తంభాన్ని నిర్మించాడు. తనకు ముందు యేలిన రాజులందరి కంటె అహాబు ఎక్కువ పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపాన్ని కలుగజేశాడు.
1KI 16:34 అహాబు రాజ్యం చేసే కాలంలో బేతేలు వాడైన హీయేలు యెరికో పట్టణాన్ని పునర్‌నిర్మించాడు. హీయేలు నగర నిర్మాణపు పనిని మొదలు పెట్టగానే, అతని పెద్ద కుమారుడగు అబీరాము చనిపోయాడు. హీయేలు నగర ద్వారాలు నిర్మించేటప్పుడు అతని చిన్న కుమారుడగు సెగూబు చనిపోయాడు. నూను కుమారుడైన యెహోషువ ద్వారా ఏది ఎలా జరుగుతుందని యెహోవా చెప్పాడో ఇదంతా ఆ విధంగా జరిగింది.
1KI 17:1 ప్రవక్తయైన ఏలీయా గిలాదులోని తిష్బీ నగరానికి చెందినవాడు. ఏలీయా వచ్చి రాజైన అహాబుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేను సేవిస్తాను. ఆయన శక్తితో నేను నిశ్చయంగా చెప్పేదేమనగా రాబోవు కొద్ది సంవత్సరాలలో మంచుగాని, వర్షంగాని కురియదు. నేను ఆజ్ఞ ఇస్తేగాని వర్షం పడదు.”
1KI 17:2 తరువాత యెహోవా ఏలీయాతో,
1KI 17:3 “నీవు ఈ ప్రదేశాన్ని వదిలి తూర్పుదిశగా వెళ్లి, కెరీతు వాగువద్ద దాగి వుండు. ఆ వాగు యోర్దాను నదికి తూర్పున ఉన్నది.
1KI 17:4 నీవు ఆ వాగు నీటిని తాగవచ్చు. నీకు ఆహారాన్ని అక్కడికి చేరవేయమని నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చాను” అని అన్నాడు.
1KI 17:5 కావున యెహోవా చెప్పిన విధంగా ఏలీయా చేశాడు. యోర్దాను నదికి తూర్పున వున్న కెరీతువాగు దగ్గర నివసించటానికి అతడు వెళ్లాడు.
1KI 17:6 బొంత కాకులు ప్రతి ఉదయం రొట్టెను, ప్రతి సాయంత్రం మాంసాన్ని తెచ్చి ఇచ్చేవి. ఏలీయా వాగు నీటిని తాగేవాడు.
1KI 17:7 వర్షాలు పడక పోవటంతో, కొంత కాలానికి వాగు ఎండిపోయింది.
1KI 17:8 అప్పుడు యెహోవా ఏలీయాతో ఇలా అన్నాడు:
1KI 17:9 “సీదోనులోని సారెపతు అను పట్టణానికి వెళ్లి, అక్కడ నివసించు. ఆ ప్రదేశంలో ఒక విధవరాలు నివసిస్తూవుంది. నీకు ఆహారం ఇవ్వమని ఆమెను ఆదేశించాను.”
1KI 17:10 కావున ఏలీయా సారెపతు అను పట్టణానికి వెళ్లాడు. అతడు నగర ద్వారం వద్దకు వెళ్లీ సరికి అతనక్కడ ఒక విధవ స్త్రీని చూశాడు. ఆమె వంటకైపుల్లలు ఏరుకొంటూ వుంది. ఏలీయా ఆమెను, “నాకు తాగటానికి ఒక చెంబుతో నీరు తెచ్చి పెడతావా?” అని అడిగాడు.
1KI 17:11 అతనికి నీరు తేవటానికి ఆమె వెళ్తూండగా, “నాకో రొట్టె ముక్క కూడా దయచేసి తీసుకునిరా” అని ఏలీయా అన్నాడు.
1KI 17:12 “నీ దేవుడైన యెహోవా సాక్షిగా నేను చెప్తున్నాను. నా వద్ద రొట్టె లేదు. ఒక జాడీలో కొద్దిపిండి మాత్రం వుంది. కూజాలో కొంచెం ఒలీవ నూనెవుంది. నిప్పు రాజేయటానికి రెండు పుల్లలు ఏరుకోడానికి నేనిక్కడికి వచ్చాను. నేనవి తీసుకొని వెళ్లి మా ఆఖరి వంట చేసుకోవాలి. నేను, నా కుమారుడు అది తిని, తరువాత ఆకలితో మాడి చనిపోతాము” అని ఆ స్త్రీ అన్నది.
1KI 17:13 ఏలీయా ఆమెతో ఇలా అన్నాడు: “ఏమీ బాధపడకు. నీవు చెప్పిన రీతిలో నీవు ఇంటికి వెళ్లి వంట చేసుకో. కాని నీ వద్దవున్న పిండిలో నుంచి ఒకచిన్న రొట్టె ముందుగా చేసి, దానిని నాకు తెచ్చి పెట్టు. తర్వాత నీ కొరకు, నీ బిడ్డ కొరకు వంట చేసుకో.
1KI 17:14 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ పిండి జాడీ ఎప్పుడూ ఖాళీ కాదు. ఆ కూజాలో నూనె ఎప్పుడూ తరిగిపోదు. ఈ రాజ్యంమీద యెహోవా వర్షం కురింపించే వరకు ఇది కొనసాగుతుంది.’”
1KI 17:15 అందువల్ల ఆ స్త్రీ ఇంటికి వెళ్లింది. ఏలీయా ఆమెకు ఏమి చేయమని చెప్పాడో అదంతా చేసింది. ఏలీయా, ఆ స్త్రీ, ఆ కుమారుడు చాలా దినముల వరకు సరిపడు ఆహారం కలిగియున్నారు.
1KI 17:16 పిండిజాడీ, నూనె కూజా ఎన్నడూ ఖాళీ కాలేదు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అంతా అలానే జరిగింది. ఈ విషయాలన్నీ యెహోవా ఏలీయా ద్వారా చెప్పాడు.
1KI 17:17 కొంత కాలం తరువాత ఆ విధవ స్త్రీ కుమారునికి జబ్బు చేసింది. జబ్బు రోజురోజుకు తీవ్రయ్యింది. చివరిగా అతని శ్వాస ఆగిపోయింది.
1KI 17:18 ఆమె ఏలీయా వద్దకు వచ్చి, “నీవు దైవజనుడవు కదా! నీవు నా బిడ్డకు సహాయం చేయగలవా? లేక కేవలం నేను చేసిన తప్పులన్నిటినీ నాకు జ్ఞాపకం చేయటానికే నీవు ఇక్కడికి వచ్చావా? నా కుమారుడు చనిపోయేలా చేయటానికే నీవు వచ్చావా?” అని అడిగింది.
1KI 17:19 “నీవు నీ కుమారుని నాకు ఇవ్వు” అని ఏలీయా ఆమెతో అన్నాడు. ఏలీయా ఆమె వద్ద నుండి బిడ్డను తీసుకుని పై అంతస్తుకు వెళ్లాడు. తను ఉంటున్న గదిలో పక్కమీద బాలుని పడుకోబెట్టాడు.
1KI 17:20 తరువాత ఏలీయా ఇలా ప్రార్థన చేశాడు: “ఓ నా ప్రభవైన దేవా! ఈ విధవరాలు తన ఇంటిలో నాకు ఆశ్రయమిచ్చింది. అటువంటి స్త్రీకి ఇటువంటి ఆపద నీవు కలుగజేస్తావా? ఆమె కుమారుడు చనిపోయేలా చేస్తావా?”
1KI 17:21 పిమ్మట ఏలీయా ఆ బాలుని మీద మూడు సార్లు పడి, “ఓ నా ప్రభువైన దేవా! ఈ బాలుడు మరల జీవించేలా చేయు” మని ప్రార్థించాడు.
1KI 17:22 యెహోవా ఏలీయా ప్రార్థన ఆలకించాడు. బాలుడు శ్వాసపీల్చటం ప్రారంభించాడు. వాడు బతికాడు.
1KI 17:23 ఏలీయా బాలుని కిందికి తీసుకుని వచ్చాడు. బాలుని అతని తల్లికి ఇస్తూ, “చూడు! నీ కుమారుడు బతికాడు” అని ఏలీయా అన్నాడు.
1KI 17:24 “నీవు నిజంగా దైవజనుడవేనని నేను ఇప్పుడు విశ్వసిస్తున్నాను. నిజంగా యెహోవా నీద్వారా మాట్లాడుతున్నాడని నేను తెలుసుకున్నాను” అని ఆ స్త్రీ అన్నది.
1KI 18:1 వర్షాలు లేకుండా పోయి మూడు సంవత్సరాలయ్యింది. అప్పుడు యెహోవా ఏలీయాతో, “నీవు వెళ్లి రాజైన అహాబును కలుసుకో. నేను త్వరలో వర్షం కురిసేలా చేస్తాను” అని చెప్పాడు.
1KI 18:2 కావున ఏలీయా అహాబును కలిసేటందుకు వెళ్లాడు. అప్పుడు షోమ్రోనులో క్షామం నెలకొన్నది.
1KI 18:3 రాజైన అహాబు ఓబద్యాను పిలిపించాడు. ఓబద్యా రాజభవన నిర్వాహకుడుగా పని చేస్తున్నాడు. (ఓబద్యా యెహోవాకు నిజమైన అనుచరుడు.)
1KI 18:4 ఒకసారి యెజెబెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపటం మొదలు పెట్టింది. అప్పుడు ఓబద్యా నూరుమంది ప్రవక్తలను చేరదీసి, వారిని రెండు గుహలలో దాచాడు. ఓబద్యా ఏబది మందిని ఒక గుహలోను, మరో ఏబది మందిని ఒక గుహలోను దాచాడు. ఓబద్యా వారికి ఆహార పానీయాలు ఇచ్చి కాపాడాడు.
1KI 18:5 రాజైన అహాబు ఓబద్యాతో ఇలా అన్నాడు: “నాతో కలిసిరా. మనిద్దరం దేశంలో వున్న నీటి వనరులన్నీ పరిశీలిద్దాము. మనగుర్రాలు, కంచర గాడిదలు బతకటానికి తగిన పచ్చగడ్డి దొరుకుతుందేమో చూద్దాం. అప్పుడు మన పశువులను చంపే అవసరము వుండదు.”
1KI 18:6 నీటి వనరులు వెదకటానికి ఎవరేదిశకు వెళ్లాలో వారు నిర్ణయించుకున్నారు. వారిద్దరూ దేశమంతా తిరగనారంభించారు. అహాబు ఒక దిశలో వెళ్లాడు. ఓబద్యా మరోదిశలో వెళ్లాడు.
1KI 18:7 ఓబద్యా ప్రయాణం చేస్తూండగా అతడు ఏలీయాను కలిశాడు. ఏలీయాను చూడగానే, అతనెవరో ఓబద్యా తెలుసుకున్నాడు. ఓబద్యా ఏలీయాకు సాష్టాంగ నమస్కారం చేసి, “నీవు నా యజమానివైన ఏలీయావే గదా?” అని అడిగాడు.
1KI 18:8 “అవును నేనే. నీవు వెళ్లి నేనిక్కడ వున్నానని నీ యజమాని రాజుకు తెలియజేయి” అని ఏలీయా సమాధానం చెప్పాడు.
1KI 18:9 అందుకు ఓబద్యా ఇలా అన్నాడు: “నేను అహాబుతో నీవెక్కడ వున్నదీ నాకు తెలుసునని చెప్పితే అతడు నన్ను చంపుతాడు! నీ పట్ల నేనేమీ అపచారం చేయలేదు! నేను చనిపోవాలని నీవెందుకు కోరు కుంటున్నావు?
1KI 18:10 నీ దేవుడైన యెహోవా సాక్షిగా చెప్తున్నాను. రాజు నీ కొరకై ప్రతి చోటా చూస్తూన్నాడు! నిన్ను వెదకమని తన మనుష్యులను అన్ని దేశాలకు పంపాడు. ఏ పాలకుడైనా తన దేశంలో నీవు లేవని చెపితే అహాబు అంతటితో ఆగక నీవతని రాజ్యంలో లేవని ప్రమాణం చేయమని బలవంతపెట్టు తున్నాడు.
1KI 18:11 ఈ పరిస్థితుల్లో నేను వెళ్లి నీవిక్కడ వున్నావని చెప్పమంటున్నావా?
1KI 18:12 ఒకవేళ నేను పోయి రాజైన అహాబుతో నీవిక్కడ వున్నావని చెపితే, ఈ లోపు యెహోవా నిన్ను ఇక్కడ నుంచి మరో చోటికి తీసుకుని పోవచ్చు. రాజైన అహాబు వచ్చి నీవిక్కడ లేకపోవటం చూచి, నన్ను చంపేస్తాడు! నేను నా బాల్యం నుండి యెహోవాను ఆశ్రయించియున్నాను.
1KI 18:13 నేను ఏమి చేశానో నీవు వినే వుంటావు! యెజెబెలు యెహోవా యొక్క ప్రవక్తలందరినీ చంపుతూండగా, నేను వంద మంది ప్రవక్తలను గుహలలో దాచాను. ఏభై మంది ప్రవక్తలను ఒక గుహలోను, మరో ఏభై మందిని వేరొక గుహలోను దాచాను. వారికి అన్న పానాదులిచ్చి ఆదుకున్నాను.
1KI 18:14 ఇప్పుడు నన్ను వెళ్లి నీవిక్కడ వున్నట్లు రాజుతో చెప్పమంటున్నావు. రాజు నన్ను చంపేస్తాడు!”
1KI 18:15 అది విన్న ఏలీయా, “సర్వశక్తిమంతుడైన యెహోవా సాక్షిగా ఈ రోజు నేను రాజు ముందు నిలుస్తానని ప్రమాణం చేస్తున్నాను” అని అన్నాడు.
1KI 18:16 అందువల్ల ఓబద్యా రాజైన అహాబు వద్దుకు వెళ్లాడు. ఏలీయా ఎక్కడ వున్నదీ అతనికి చెప్పాడు. రాజైన అహాబు ఏలీయాను చూడటానికి వెళ్లాడు.
1KI 18:17 ఏలీయాను అహాబు చూచి, “నీవేనా? ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించే వాడివి నీవే కదా!” అని అన్నాడు.
1KI 18:18 ఏలీయా ఇలా అన్నాడు, “నేను ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించటం లేదు. కష్టాలన్నీ నీ మూలంగా, నీ తండ్రి కుటుంబం వారివల్ల వచ్చినవే. యెహోవా ఆజ్ఞలను తిరస్కరిస్తూ, బూటకపు దేవుళ్లను పూజిస్తూ, నీవే ఈ కష్టాలన్నిటికీ కారకుడవయ్యావు.
1KI 18:19 ఇశ్రాయేలీయులందరినీ ఇప్పుడు కర్మెలు పర్వతం వద్ద నన్ను కలవమని సమాచారం పంపు. పైగా నాలుగు వందల ఏభై మంది బయలు దేవత ప్రవక్తలను, నాలుగు వందల మంది బూటకపు దేవత అషేరా ప్రవక్తలను అక్కడికి తీసుకొనిరా. రాణీ యెజెబెలు ఈ ప్రవక్తలందరినీ పోషిస్తూ వున్నది.”
1KI 18:20 పిమ్మట అహాబు ఇశ్రాయేలు వారందరినీ, ఆ ప్రవక్తలను కర్మెలు పర్వతం వద్దకు పిలువనంపాడు.
1KI 18:21 ఆ ప్రజలందరి వద్దకు ఏలీయా వచ్చాడు. అతడు వారినుద్దేశించి, “మీరంతా ఎవరిని అనుసరించాలనేది ఎప్పుడు నిర్ణయిస్తారు? యెహోవా నిజమైన దేవుడైతే మీరాయనను అనుసరించండి. బయలు నిజమైన దేవత అయితే మీరా దేవతను అనుసరించండి” అని అన్నాడు. ప్రజలు ఏమీ మాట్లాడలేదు.
1KI 18:22 అందువల్ల ఏలీయా ఇలా అన్నాడు: “ఇక్కడ నేనొక్కడినే యెహోవాయొక్క వ్రవక్తను. నేను ఒంటరిగా వున్నాను. కాని నాలుగు వందల ఏభై మంది బయలు ప్రవక్తలున్నారు.
1KI 18:23 కావున మీరు రెండు ఆబోతులను తీసుకునిరండి. వాటిలో ఒక దానిని బయలు ప్రవక్తలను తీసుకోనివ్యండి. వారు దానిని చంపి ముక్కలు చేయనీయండి. ఆ మాంసాన్ని ఒక చితిపై వుంచండి. కాని ఆ చితికి నిప్పు పెట్టవద్దు. నేను కూడ ఆ రెండవ ఆబోతును అలాగే చేస్తాను. నేనూ ఆ చితికి నిప్పు అంటించను.
1KI 18:24 బయలు దేవత ప్రపక్తలారా! మీరు మీ దేవునికి ప్రార్థించండి. నేను నా యెహోవాను ప్రార్థిస్తాను. ఏ దేవుడైతే ప్రార్థనలను ఆలకించి, చితిని రగిలింప చేస్తాడో అతడే నిజమైన దేవుడు.” ప్రజలంతా ఇది మంచి ఆలోచన అని ఒప్పు కున్నారు.
1KI 18:25 బయలు ప్రవక్తలతో మళ్లీ ఏలీయా ఇలా అన్నాడు: “మీరు చాలా మంది వున్నారు. కనుక పని మీరు ముందు మొదలు పెట్టండి. ఒక ఆబోతును ఎన్నుకుని తయారు చేయ్యండి. కాని నిప్పు మాత్రం రగల్చకండి.”
1KI 18:26 కావున ఆ ప్రవక్తలు తమకివ్వబడిన ఆబోతును తీసుకున్నారు. దానిని తయారు చేశారు. వారు బయలు దేవతకు మధ్యాహ్నం వరకు ప్రార్థనలు చేశారు. “ఓ బయలు దేవతా! మా ప్రార్థనలు ఆలకించు!” అని వేడుకున్నారు. కాని ఎటువంటి చప్పుడూ లేదు. ఎవ్వరూ సమాధాన మియ్యలేదు. వారు నిర్మించిన బలిపీఠం చుట్టూ ప్రవక్తలు నాట్యం చేశారు. కానీ నిప్పు రాజలేదు.
1KI 18:27 మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా వారిని హేళన చేయనారంభించాడు: “బయలు నిజంగా దైవమైతే మీరు బిగ్గరగా ప్రార్థన చేయాల్సివుంటుందేమో! బహుశః అతడు ఆలోచిస్తూ ఉండవచ్చు! లేక అతడు చాలా పని ఒత్తిడిలో ఉండవచ్చు. లేక అతను ప్రయాణం చేస్తూ ఉండవచ్చు! అతడు నిద్రపోతూ ఉండవచ్చు! బహుశః మీరతనిని లేపవలసి ఉంటుంది!” అంటూ అపహాస్యం చేశాడు ఏలీయా.
1KI 18:28 అందువల్ల ఆ ప్రవక్తలు బిగ్గరగా ప్రార్థనలు చేయనారంభించారు. వారు కత్తులతోను, ఈటెలతోను శరీరమంతా చీరుకున్నారు. (అది వారి ఆరాధనా తీరు) వారు రక్తం కారేలాగు ఒళ్లు చీరుకున్నారు.
1KI 18:29 మధ్యాహ్న సమయం దాటి పోయింది. అయినా నిప్పు అంటుకోలేదు. సాయంత్రపు బలుల సమయం అయ్యేవరకు ఆ ప్రవక్తలు తమ భయానక చేష్టలు సాగించారు. బయలు వద్దనుండి సమాధానం లేదు. చితికి ఏమీ జరగలేదు.
1KI 18:30 అప్పుడు ఏలీయా ప్రజలతో, “నా వద్దకు రండి” అని అన్నాడు. వారంతా ఏలీయా చుట్టూ చేరారు. బేతేలులో ఉన్న యెహోవా యొక్క బలిపీఠం నాశనం చేయబడింది. ఏలీయా దానిని మళ్లీ నిర్మించాడు.
1KI 18:31 ఏలీయా పన్నెండు రాళ్లను తీసుకున్నాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కోక్క రాయి చొప్పున ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు పన్నెండు రాళ్లను తీశాడు. యాకోబు పన్నెండు మంది కుమారుల పేర్లతో ఈ గోత్రాలు పిలవబడుతూ వున్నాయి. యాకోబునే యెహోవా ఇశ్రాయేలని పిలిచాడు.
1KI 18:32 ఏలీయా ఈ రాళ్లను యెహోవా గౌరవార్థం బలిపీఠాన్ని నిర్మించటానికి ఉపయోగించాడు. పీఠం చుట్టూ ఏలీయా చిన్న కందకం తవ్వించాడు. అది రెండు షియాల విత్తనాలు నీటితో సహా పట్టేటంత వెడల్పు, లోతుకలిగివుంది.
1KI 18:33 అప్పుడు ఏలీయా కట్టెనంతా బలిపీఠంపై వుంచాడు. అతడు ఆబోతును ముక్కలుగా నరికి, వాటిని పేర్చిన కట్టెలపై వుంచాడు.
1KI 18:34 తరువాత ఏలీయా ప్రజలను నాలుగు జాడీలతో నీరు తీసుకుని మాంసం మీద, కట్టెల మీద చల్లమన్నాడు. వారిని అదే విధంగా మళ్లీ చేయమన్నాడు. ఆయన వారితో మూడవ సారి కూడా అలానే చేయమన్నాడు.
1KI 18:35 ఆ నీరు బలిపీఠం నుండి జారి చుట్టూవున్న కందకాన్ని నింపేసింది.
1KI 18:36 సాయంకాలపు బలులు ఇచ్చే వేళ అయ్యింది. ప్రవక్తయగు ఏలీయా పీఠం వద్దకు వెళ్లి ఇలా ప్రార్థించాడు: “ఓ ప్రభువా! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా! ఇశ్రాయేలీయుల దైవం నీవేనని నిరూపించమని నేనిప్పుడు నిన్నడుగుతున్నాను. నేను నీ సేవకుడనని నిరూపించు. ఈ పనులన్నీ చేయమని నన్ను నీవే ఆదేశించినట్లు కూడ ఈ ప్రజలకు తెలియజేయి.
1KI 18:37 ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. ప్రభూ! నీవే దేవుడవని ఈ ప్రజలకు నిరూపించు. అప్పుడు ఈ ప్రజలందరినీ మరల నీవు నీ దగ్గరకు చేర్చుకుంటున్నావని వీరు తెలుసుకుంటారు.”
1KI 18:38 అప్పుడు యెహోవా అగ్ని పంపించాడు. బలిమాంసాన్ని, కట్టెలను, రాళ్లను, బలిపీఠం చుట్టూవున్న ప్రదేశాన్ని అగ్ని దహించి వేసింది. కందకంలో వున్న నీరు కూడ అగ్నివల్ల ఇగిరి పోయింది.
1KI 18:39 ప్రజలంతా ఇది చూశారు. వారు భూమి మీద సాగిలపడి. “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు! అని స్తుతించసాగారు.”
1KI 18:40 అప్పుడు ఏలీయా, “బయలు దేవత ప్రవక్తలందరినీ పట్టుకొనండి. ఒక్కడినీ పారి పోనీయవద్దు!” అని అన్నాడు. ప్రవక్తలందరినీ ప్రజలు పట్టుకున్నారు. ఏలీయా వారందరినీ కీషోను వాగు దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆ ప్రవక్తలందరినీ చెంపేశాడు.
1KI 18:41 ఏలీయా రాజైన అహాబుతో, “నీవు ఇప్పుడు వెళ్లి అన్నపానాదులు స్వీకరించు. ఒక భారీ వర్షం పడబోతూ వుంది” అని అన్నాడు.
1KI 18:42 రాజైన అహాబు భోజనానికి వెళ్లాడు. అదే సమయంలో ఏలీయా కర్మెలు పర్వతం మీద అతడు వంగి తన మోకాళ్లమధ్య తలను పెట్టాడు.
1KI 18:43 అప్పుడు ఏలీయా తన సేవకునితో సముద్రం చూడమన్నాడు. సముద్రం కనపడే చోటుకు సేవకుడు వెళ్లాడు. “నేనేమీ చూడలేడు” అని సేవకుడు తిరిగి వచ్చి చెప్పాడు. మళ్లీ వెళ్లి చూడమని ఏలీయా అన్నాడు. ఈ విధంగా ఏడుసార్లు జరిగింది.
1KI 18:44 ఏడవసారి నౌకరు తిరిగి వచ్చి ఒక పిడికెడంత మబ్బును చూసినట్లు చెప్పాడు. అది సముద్రం మీది నుంచి వస్తున్నదని అన్నాడు. ఏలీయా తన సేవకునితో, “రాజైన అహాబు వద్దకు వెళ్లి తన రథం సిద్ధం చేసుకొని వెంటనే ఇంటికి వెళ్లమని చెప్పు. అతనిప్పుడు వెళ్లకపోతే వర్షం అతనిని ఆపేస్తుంది” అని అన్నాడు.
1KI 18:45 ఆ తరువాత కొద్ది సేవటికే ఆకాశంలో కారుమేఘాలు కమ్ముకొచ్చాయి. భయంకరంగా గాలి, వాన ప్రారంభమైనాయి. అహాబు తన రథమెక్కి యెజ్రెయేలుకు తిరుగు ప్రయాణం సాగించాడు.
1KI 18:46 యెహోవా శక్తి ఏలీయా మీదికి వచ్చింది. ఏలీయా తన బట్టలను నడుముకు బిగించి కట్టి రాజైన అహాబుకంటె ముందుగా యెజ్రెయేలుకు పరుగెత్తికొని వెళ్లాడు.
1KI 19:1 ఏలీయా చేసిన పనులన్నీ రాజైన అహాబు తన భార్యయగు రాణీ యెజెబెలుకు చెప్పాడు. కత్తి పట్టి ఎలా ప్రవక్తలందరినీ ఏలీయా చంపాడో అహాబు ఆమెకు వివరించాడు.
1KI 19:2 అది విన్న యెజెబెలు ఒక దూతను ఏలీయా వద్దకు పంపింది. ఆమె వర్తమానం ఇలా వుంది: “రేపు ఈ పాటికి నీవు ప్రవక్తలను చంపిన విధంగా నిన్ను నేను చంపుతానని ప్రమాణం చేస్తున్నాను. నేనా పనిలో విజయం సాధించలేని పక్షంలో దేవతలు నన్ను చంపుగాక!”
1KI 19:3 ఇది విన్న ఏలీయా భయపడ్డాడు. తన ప్రాణం కాపాడుకొనేందుకు పారిపోయాడు. అతనితో తన నౌకరును తీసుకుని వెళ్లాడు. వారు యూదాలోని బెయేర్షెబాకు వెళ్లారు. బెయేర్షెబాలో తన నౌకరును ఏలీయా వదిలాడు.
1KI 19:4 తరువాత ఒక రోజంతా ప్రయాణం చేసి ఏలీయా ఎడారిలోకి వెళ్లాడు. ఏలీయా ఒక పొదకింద కూర్చున్నాడు. అతడు చని పోవాలని కోరుకున్నాడు. ఏలీయా యెహోవానిలా ప్రార్థించాడు: “ప్రభువా, నాకిది చాలు. ఇక నన్ను చనిపోనియ్యండి. నా పూర్వికుల కంటె నేను ఉన్నతమైనవాడిని కాను.”
1KI 19:5 ఏలీయా తరువాత చెట్టు కింద పడుకొని నిద్ర పోయాడు. యెహోవా దూత వచ్చి ఏలీయాను తట్టాడు. “నిద్ర లేచి, అహారం తీసుకో!” అన్నాడు దేవదూత.
1KI 19:6 ఏలీయా తన వద్ద నిప్పుల మీద కాల్చిన రొట్టె, ఒక కూజాలో నీరు వున్నట్లు చూశాడు. ఏలీయా ఆ రొట్టెను తిని, నీరు తాగాడు. అతను మరల నిద్రపోయాడు.
1KI 19:7 యెహోవా దేవదూత మళ్లీ అతని వద్దకు వచ్చి, “లేచి ఆహారం తీసుకో, నీవు భోజనం చేయకపోతే నీవు చేయవలసిన వ్రయాణం నీవు నడవలేనంతగా వుంటుంది” అని అన్నాడు.
1KI 19:8 అందుచేత ఏలీయా లేచి అన్న పానాదులు స్వీకరించాడు. ఏలీయా తిన్న ఆహారం అతనికి నలభై రోజులు రాత్రింబగళ్లు నడవగలిగే శక్తి నిచ్చింది. అతడు దేవుని పర్వతం అనబడే హోరేబు పర్వతం వద్దకు వచ్చాడు.
1KI 19:9 అక్కడ ఏలీయా ఒక గుహలోకి వెళ్లి ఆ రాత్రి తలదాచుకున్నాడు. అక్కడ యెహోవా ఏలీయాతో మాట్లాడి, “ఏలీయా! నీవిక్కడెందుకున్నావు!” అని అడిగాడు.
1KI 19:10 ఏలీయా ఇలా సమాధానం చెప్పాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నేను నిన్ను సదా సేవిస్తూ వచ్చాను. నా శక్తికొలదీ నేను నిన్ను ఆరాధించాను. కాని ఇశ్రాయేలు ప్రజలు నీతో చేసుకున్న ఒడంబడికను భంగపర్చారు. నీ బలిపీఠాలను వారు నాశనం చేశారు. వారు నీ ప్రవక్తలను చంపేశారు. నేనొక్కడినే ప్రవక్తగా ఇంకా జీవించి వున్నాను. ఇప్పుడు వారు నన్నూ చంప జూస్తున్నారు!”
1KI 19:11 అందుకు యెహోవా ఏలీయాతో: “నీవు వెళ్లి పర్వతం మీద నా ముందు నిలబడు. నేను నీ పక్కగా వెళతాను” అని అన్నాడు. యెహోవా అలా చేయగా, ఒక పెనుగాలి వీచింది. ఆ గాలి కొండలను రెండుగా చీల్చివేసింది. యెహోవా ముందు ఆ గాలి పెద్దగుట్టలను పిండి చేసింది. కాని ఆ పెనుగాలి యెహోవా మాత్రం కాదు! గాలి తగ్గిన పిమ్మట ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం కూడా యెహోవా కాదు.
1KI 19:12 ఆ భూకంపం పోయిన పిమ్మట అగ్ని పుట్టింది. ఆ అగ్నికూడా యెహోవా కాదు. అగ్ని తరువాత ప్రశాంతత నెలకొనగా, ఒక మృదువైన శబ్దం వినవచ్చింది.
1KI 19:13 ఏలీయా ఆ శబ్దాన్ని విన్నప్పుడు తన అంగీతో తన ముఖం కప్పుకున్నాడు. అతను గుహ ద్వారం వద్దకు వెళ్లి నిలబడ్డాడు. ఇంతలో “ఏలీయా, ఇక్కడెందుకున్నావు?” అంటున్న ఒక కంఠ స్వరం విన్నాడు.
1KI 19:14 ఏలీయా ఇలా అన్నాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, శక్తి వంచన లేకుండా నేను నిన్ను సదా సేవిస్తూవచ్చాను. కాని ఇశ్రాయేలు ప్రజలు వారు నీతో చేసుకున్న ఒప్పుందానికి విఘాతం కలుగజేశారు. నీకై నిర్మించిన బలిపీఠాలను నాశనం చేశారు. నీ ప్రవక్తలను చంపేశారు. జీవించియున్న ప్రవక్తలు మరెవ్వరూ లేరు నేను మినహా. వారిప్పుడు నన్ను చంపజూస్తున్నారు.”
1KI 19:15 యెహోవా ఇలా అన్నాడు: “నీవు వచ్చిన దారిలోనే తిరిగి దమస్కు ఎడారికి వెళ్లు. నగరంలో ప్రవేశించి హజాయేలును అరాము దేశానికి (సిరియా) రాజుగా అభిషేకించు.
1KI 19:16 పిమ్మట నింషీ కుమారుడైన యెహూను ఇశ్రాయేలుపై రాజుగా అభిషిక్తుని చేయి. తరువాత, ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు నీ తర్వాత ప్రవక్తగా అభిషేకంచేయి.
1KI 19:17 హజాయేలు ఖడ్గమునుండి తప్పించుకున్న ప్రతివాడినీ యెహూసంహరిస్తాడు. యెహూ కత్తి పోటునుంచి తప్పించుకున్న ప్రతివాడినీ హజాయేలు చంపేస్తాడు.
1KI 19:18 ఇశ్రాయేలులో ఏడువేల మందిని నేను వదిలి పెడతాను. ఈ ఏడువేల మంది బయలు ముందు ఎన్నడూవంగి నమస్కరించ లేదు. బయలు విగ్రహాల నెన్నడూ వారు ముద్దు పెట్టు కోలేదు.”
1KI 19:19 కావున ఏలీయా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాడు షాపాతు కుమారుడైన ఎలీషాను చూశాడు. ఎలీషా ఎద్దులను కట్టి 12 ఎకరాల పొలం దున్నుతున్నాడు. ఏలీయా వచ్చినప్పుడు ఎలీషా చివరి ఎకరాన్ని దున్నుచుండెను. ఏలీయా సరాసరి ఎలీషా వద్దకు వచ్చాడు. ఏలీయా తన అంగీని తీసి ఎలీషా మీద కప్పాడు.
1KI 19:20 అప్పుడు ఎలీషా పొలంలోవున్న తన ఎద్దులను వదిలి పెట్టాడు. అతడు పరుగెత్తి ఏలీయా వద్దకు వెళ్లి, “నన్ను వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వారి వద్ద వీడ్కోలు తీసుకోనీయండి. తరువాత నేను మీతో వస్తాను” అని అన్నాడు. “అది చాలా మంచిది. వెళ్లు. నిన్ను నేనాపను” అని ఏలీయా అన్నాడు.
1KI 19:21 ఎలీషా వెళ్లి తన ఇంటి వారితో ఒక ప్రత్యేకమైన విందారగించాడు. ఎలీషా వెళ్లి తన ఎద్దులను చంపాడు. ఎడ్లకు కట్టిన కాడి కర్రతో నిప్పుచేసి, ఎడ్ల మాంసాన్ని ఉడకబెట్టాడు. ఆ మాంసాన్ని అందరికీ ఇచ్చాడు. వారంతా ఆ మాంసాన్ని తిన్నారు. ఎలీషా తరువాత ఏలీయాను అనుసరించి వెళ్లాడు. ఎలీషా ఏలీయాకు సహాయకుడయ్యాడు.
1KI 20:1 బెన్హదదు సిరియా రాజు, అతడు తన సైన్యాలన్నిటినీ సమీకరించాడు. తనతో ముప్పై ఇద్దరు రాజులున్నారు. వారికి రథాలు, గుర్రాలు వున్నాయి. వారు సమరియను (షోమ్రోను) ముట్టడించి యుద్ధం చేశారు.
1KI 20:2 ఇశ్రాయేలు రాజైన అహాబు వద్దకు సిరియా రాజు దూతలను పంపాడు.
1KI 20:3 వారు బెన్హదదు మాటగా అహాబుతో ఇలా అన్నారు: “నీవు నీ యొక్క వెండి బంగారాలను నాకు ఇచ్చేయాలి. అంతేగాక నీ భార్యలను, పిల్లలను కూడ తప్పక నాకు ఇచ్చేయాలి.”
1KI 20:4 ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “నా యజమానియైన ఓ రాజా, నేను నీ వాడనని ఒప్పుకుంటాన్నాను. నాకున్నప్రతిదీ నీకు చెందినదే.”
1KI 20:5 దూతలు మరల అహాబు వద్దకు వచ్చారు. వారు బెన్హదదు తరుపున ఇలా అన్నారు, “నీవు నీ వెండి బంగారాలను, నీ భార్యలను, పిల్లలను నాకు ఇవ్వాలని నేనింతకు ముందే చెప్పాను.
1KI 20:6 నేనిప్పుడు నా మనుష్యులను పంపి నీ భవనాన్ని, నీ కింది పాలకుల ఇండ్లను వెదికించాలనుకుంటున్నాను. నా మనుష్యలకు ఏది నచ్చితే అది తీసుకుని వస్తారు.”
1KI 20:7 ఇది విని, రాజైన అహాబు తన దేశంలో వున్న పెద్దల (నాయకుల)తో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. వారితో ఇలా అన్నాడు: “చూడండి! బెన్హదదు కయ్యానికి సిద్దమవుతున్నాడు. నా భార్యలను, పిల్లలను, నా వెండి బంగారాలను నేనతనికి ఇవ్వాలని ముందుగా చెప్పాడు. అవన్నీ ఇవ్వటానికి నేను ఒప్పుకున్నాను. కాని ఇప్పుడతను సర్వం తీసుకోవాలని చూస్తున్నాడు.”
1KI 20:8 ఇది విన్న పెద్దలు (నాయకులు), ఇతర ప్రజలు “బెన్హదదును లెక్క చేయవద్దనీ, అతను చెప్పినట్లు చేయవద్దనీ” అన్నారు.
1KI 20:9 బెన్హదదుకు తిరుగు సమాధానంలో అహాబు ఇలా అన్నాడు: “నేను నీవు ముందు చెప్పిన విధంగా చేస్తాను. కాని నీవు రెండవసారి ఆజ్ఞ ఇచ్చినట్లుగా నేను చేయజాలను.” రాజైన బెన్హదదు మనుష్యులు ఈ సమాచారాన్ని అతనికి అందజేశారు.
1KI 20:10 బెన్హదదు నుంచి మరో వర్తమానం తీసుకుని దూతలు మళ్లీ వచ్చారు. ఆ సమాచారం ఇలా వుంది, “నేను షోమ్రోనును పూర్తిగా నాశనం చేస్తాను. ఆ నగరంలో ఏదీ మిగిలి వుండదని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను! నా మనుష్యులు గుర్తుగా ఇంటికి తెచ్చుకోవటానికి కూడ అక్కడ ఏమీ మిగలదు. నేనిది చేయక పోతే దేవుడు నన్ను సర్వనాశనం చేయుగాక!”
1KI 20:11 రాజైన అహాబు ప్రత్యుత్తరమిస్తూ “బెన్హదదుకు ఇలా చెప్పండి. కవచాన్ని ధరించువాడు దానిని ధరించి విప్పిన వానివలె గొప్పలు చెప్పరాదు” అని చెప్పమన్నాడు.
1KI 20:12 రాజైన బెన్హదదు ఇతర పాలకులతో కలిసి తన డేరాలో వున్నాడు. ఆ సమయంలో అతని దూతలు తిరిగి వచ్చి రాజైన అహాబు ఇచ్చిన సమాధానాన్ని అతనికి అందజేశారు. రాజైన బెన్హదదు నగరాన్ని ముట్టడించటానికి సన్నద్ధులు కండని తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. కావున వారంతా తమ తమ స్థానాలకు వెళ్లారు.
1KI 20:13 అదే సమయంలో ఒక ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: “ఆ పెద్ద సైన్యాన్ని నీవు చూస్తున్నావు గదా! దేవుడనైన నేను నీవు ఆ మహా సైన్యాన్ని ఈ రోజు ఓడించేలా చేస్తాను. అప్పుడు నేనే నిత్యుడనైన యెహోవానని నీవు గుర్తిస్తావు.”
1KI 20:14 “వారిని ఓడించటానికి నీవు ఎవరిని ఉపయోగిస్తావు?” అని అహాబు అడిగాడు. “యువకులైన ప్రభుత్యాధికారులను” అని యెహోవా సెలవిస్తున్నాడని ప్రవక్త అన్నాడు. “ప్రధాన సైన్యాన్ని ఎవరు నడుపుతారు?” అని రాజు అడిగాడు. “నీవే” అని ప్రవక్త అన్నాడు.
1KI 20:15 కావున అహాబు యువ ప్రభుత్యాధికారులను సమాయత్తపరచాడు. వారు రెండు వందల ముప్పై రెండుమంది ఉన్నారు. ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ రాజు సమీకరించాడు. వారంతా ఏడు వేల మందివున్నారు.
1KI 20:16 మధ్యాహ్నమయ్యింది. రాజైన బెన్హదదు, అతనికి తోడుగా ఉన్న మొప్పైరెండు మంది పాలకులు వారి గుడారాలలో బాగా మద్యపానం చేసి మైకంలో వున్నారు. ఈ సమయంలో రాజైన అహాబు దండయాత్ర మొదలయ్యింది.
1KI 20:17 యువ ప్రభుత్యాధికారులు ముందుగా ఎదుర్కొన్నారు. రాజైన బెన్హదదు మనుష్యులు ఆయనతో షోమ్రోను నుండి కొందరు సైనికులు బయటికి వచ్చినట్లు చెప్పారు.
1KI 20:18 “అయితే వారు యుద్ధానికి వస్తూ వుండవచ్చు. లేదా వారు సంధి నిమిత్తమై వస్తూ వుండవచ్చు. ఏది ఏమైనా వారిని సజీవంగా పట్టుకోండి” అని బెన్హదదు అన్నాడు.
1KI 20:19 రాజైన అహాబు యొక్క యువసైనికులు దండయాత్రను నడుపుతున్నారు. ఇశ్రాయేలు సైన్యంవారిని అనుసరిస్తూవుంది.
1KI 20:20 ఇశ్రాయేలు అధికారులలో ప్రతియొక్కడూ తనని ఎదుర్కొన్న శత్రువును చంపి వేశాడు. కావున అరామునుండి వచ్చినవారు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం వారిని తరిమికొట్టింది. రాజైన బెన్హదదు ఒక రథాశ్వము నెక్కి తప్పించుకున్నాడు.
1KI 20:21 రాజైన అహాబు తన సైన్యాన్ని నడిపించి అరాము సైనికుల గుర్రాలను, రథాలను స్వాధీన పర్చుకున్నాడు. ఆ విధంగా రాజైన అహాబు చేతిలో సిరియను సైన్యం ఘోర పరాజయం పొందింది.
1KI 20:22 అప్పుడు ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “ఆరాము రాజైన బెన్హదదు రాబోయే వసంతకాలం నాటికి మళ్లీ నీమీదికి యుద్ధానికి వస్తాడు. ఇప్పుడు నీవు నీ నివాసానికి వెళ్లి నీ సైన్యాన్ని బాగా బలపర్చుకో. అతని దండయాత్ర నుంచి నిన్ను నీవు రక్షించుకోవటానికి తగిన వ్యూహాలు సిద్ధం చేయి.”
1KI 20:23 రాజైన బెన్హదదు సేవకులు కొందరు వచ్చి ఆయనకు ఇలా సలహా ఇచ్చారు, “ఇశ్రాయేలు దేవతలు కొండ దేవతలు. మనం యుద్ధం పర్వత ప్రాంతంలో నిర్వహించాం. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. కావున ఈ సారి మనం మైదాన పాంతంలో యుద్ధం నిర్వహించాలి. అప్పుడు మనం గెలుస్తాం.
1KI 20:24 ఇప్పుడు నీవొకటి చేయాలి. ఈ ముప్పది యిద్దరు పాలకులను సైన్యాలను నడిపించేందుకు అనుమతించద్దు. వారి స్థానంలో దళాధిపతులను నియమించు.
1KI 20:25 తర్వాత నీవు పోగొట్టుకున్నటువంటి సైన్యాన్ని మళ్లీ నీవు భర్తీ చేయాలి. పూర్వపు సైన్యంలో వున్నట్లుగా గుర్రాలను, రథాలను మళ్లీ సేకరించు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యాన్ని మైదాన ప్రాంతంలో మనం ఎదుర్కొందాం. అప్పుడు విజయం మనదే!” బెన్హదదు వారి సలహా పాటించాడు. వారు చెప్పిందంతా చేశాడు.
1KI 20:26 వసంత కాలం వచ్చే సరికి బెన్హదదు అరాము ప్రజలను సమీకరించాడు. ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి అతడు ఆఫెకు నగరానికి వెళ్లాడు.
1KI 20:27 ఇశ్రాయేలీయులు కూడా యుద్ధానికి తయారైనారు. ఇశ్రాయేలు ప్రజలు అరాము సైన్యంతో పోరాడటానికి వెళ్లారు. అరాము సైనికులు దిగిన చోటికి ఎదురుగానే ఇశ్రాయేలు సైనికులు మకాంవేశారు. అరామీయులు ఆ ప్రదేశాన్నంతా ఆక్రమించియుండగా, ఇశ్రాయేలీయులు కేవలం రెండు మేకల మందలవలెవున్నారు.
1KI 20:28 ఇశ్రాయేలు రాజు వద్దకు దైవజనుడొకడు వర్తమానాన్ని తెచ్చాడు. యెహోవా ఇలా చెప్పాడు: “అరాము ప్రజలు ప్రభువునైన నన్ను ఒక కొండ దేవతగా చిత్రీకరించారు. నేను లోయలకు కూడ దేవుడనేనని వారు భావించలేదు. కావున నీవు ఈ పెద్ద సైన్యాన్ని ఓడించేలా చేస్తాను. అప్పుడు సర్వత్రా నేనే ప్రభువునని నీవు తెలుసుకుంటావు.”
1KI 20:29 ఇరు సైన్యాలు ఎదురెదురుగా ఏడు రోజుల పాటు మోకరించి వున్నాయి. ఏడవరోజు యుద్ధం మొదలయ్యింది. ఇశ్రాయేలీయులు ఒక్క రోజులో ఒక లక్ష మంది అరాము సైనికులను చంపేశారు.
1KI 20:30 మిగిలిన వారు ఆఫెకు నగరానికి పారిపోయారు. నగర ప్రాకారపు గోడ విరిగి పడగా ఇరవై ఏడువేల మంది సైనికులు చనిపోయారు. బెన్హదదు కూడ నగరానికి పారిపోయాడు. అతడొక గదిలో దాక్కున్నాడు.
1KI 20:31 ఈ లోపు కొందరు సేవకులు అతనితో ఇలా అన్నారు: “ఇశ్రాయేలు రాజులు కనికరం చూపనున్నట్లు మేము విన్నాం. మనం గోనెబట్టలు ధరించి, తాళ్లు తలకు చుట్టుకుని ఇశ్రాయేలు రాజు వద్దకు వెళ్దాం. బహుశః అతడు మనల్ని బతకనివ్వొచ్చు.”
1KI 20:32 వారు గోనెపట్టలు చుట్టుకుని, తలపై తాళ్లు వేసుకున్నారు. వారు ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, “మీ సేవకుడు బెన్హదదు దయచేసి తనను బతకనివ్వమని అడుగుతున్నాడు” అని చెప్పారు. “అయితే అతడింకా బతికే వున్నాడా? అతడు నా సహోదరుడే!” అన్నాడు అహాబు.
1KI 20:33 బెన్హదదు మనుష్యులు రాజైన అహాబు నిజంగా దయచూపి బెన్హదదును చంపనని నిరూపించే విధంగా ఏదైనా చెప్పాలని కోరుకున్నారు. ఎప్పుడయితే బెన్హదదును నా సహోదరుడని అహాబు అన్నాడో, వచ్చిన మనుష్యులు వెంటనే, “అవును! బెన్హదదు నీ సోదరుడే!” అని అన్నారు. “అతనిని నా వద్దకు తీసుకుని రండి” అని అహాబు అన్నాడు. తరువాత బెన్హదదు రాజైన అహాబు ముందుకు వచ్చాడు. అహాబు అతనిని తనతో తన రథం ఎక్కమన్నాడు.
1KI 20:34 బెన్హదదు అతనితో ఇలా అన్నాడు: “అహాబూ, నా తండ్రి నీ తండ్రి వద్ద నుండి తీసుకున్న పట్టణాలన్నిటినీ నేను నీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి షోమ్రోనులో చేసిన విధంగా, దమస్కులో నీవు కొన్ని వీధులను నిర్మించి, వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు.” అది విన్న అహాబు, “నీవు ఇందుకు ఒప్పుకుంటే నేను నిన్ను వదిలి పెడతాను” అని అన్నాడు. తరువాత ఆ రాజులిద్దరూ ఒక శాంతి ఒడంబడిక కుదుర్చుకున్నారు. రాజైన అహాబు రాజైన బెన్హదదును స్వేచ్ఛగా వదిలాడు.
1KI 20:35 ప్రవక్తలలో ఒకడు మరో ప్రవక్తతో, “నన్ను కొట్టు!” అని అన్నాడు. యెహోవా వలన ప్రేరేపించబడి అతనలా అన్నాడు. కాని ఆ రెండవ ప్రవక్త అతనిని కొట్ట నిరాకరించాడు.
1KI 20:36 అందుచే మొదటి ప్రవక్త ఇలా అన్నాడు; “నీవు యెహోవా ఆజ్ఞను పాటించలేదు. నీవు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లగానే ఒక సింహం నిన్ను చంపేస్తుంది.” ఆ రెండవ ప్రవక్త ఆ ప్రదేశం వదిలి వెళ్లగానే ఒక సింహం వచ్చి అతనిని చంపేసింది.
1KI 20:37 మొదటి ప్రవక్త మరో వ్యక్తి వద్దకు వెళ్లి, “నన్ను కొట్టు!” అన్నాడు. ఈ వ్యక్తి వానిని కొట్టాడు. ప్రవక్తకు బాగా దెబ్బతగిలింది.
1KI 20:38 అందుచే ఆ ప్రవక్త ఒక బట్టతో తన ముఖం కప్పుకున్నాడు. దానివల్ల అతనెవరైనదీ ఎవ్వరూ గుర్తు పట్టలేదు. ప్రవక్త వెళ్లి రాజు కొరకు బాటపై నిలబడ్డాడు.
1KI 20:39 రాజు వచ్చినప్పుడు ప్రవక్త ఆయనతో ఇలా అన్నాడు: “నేను యుద్ధం చేయటానికి వెళ్లాను. మనలో ఒకడు శత్రుసైనికునొకణ్ణి నా వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ శత్రు సైనికునికి కాపలా వుండమనీ, వాడు గనుక పారిపోతే అతని స్థానంలో నేను నా ప్రాణాలను ఇవ్వవలసి వుంటుందనీ మన సైనికుడు నాతో చెప్పాడు. లేదా రెండు మణుగుల వెండి చెల్లించవలసి వుంటుందని అన్నాడు.
1KI 20:40 కాని నేను వేరే పనిలో నిమగ్నమై వుండగా ఆ శత్రుసైనికుడు పారిపోయాడు.” ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “నీవా సైనికుని ఒదిలిపెట్టిన నేరం చేసినట్లు ఒప్పుకున్నావు. దానికి సమాధానం కూడా నీకు తెలుసు. ఆ వ్యక్తి చెప్పినట్లే నీవు చేయాలి.”
1KI 20:41 అప్పుడా ప్రవక్త తన ముఖము మీది బట్టను తీసేశాడు. ఇశ్రాయేలు రాజు వానిని చూచి, అతడు ప్రవక్తలలో ఒకడని తెలుసుకున్నాడు.
1KI 20:42 ప్రవక్త యెహోవా వర్తమానాన్ని రాజుకిలా చెప్పాడు: “చంపబడాలని నేను నిర్దేశించిన వ్యక్తిని నీవు వదిలి పెట్టావు. కావున వాని స్థానంలో నీ ప్రాణం తీసుకోబడుతుంది. అతని ప్రజల స్థానంలో నీ ప్రజలు చనిపోవలసి వుంటుంది.”
1KI 20:43 రాజు షోమ్రోనులో వున్న తన ఇంటికి వెళ్లి పోయాడు. అతని మనస్సు బాగా కలత పడింది. అతడు చింతాక్రాంతుడయ్యాడు.
1KI 21:1 రాజైన అహాబు భవనం షోమ్రోను నగరంలోవుంది. రాజభవనం దగ్గర ఒక ద్రాక్ష తోటవుంది.
1KI 21:2 ఒక రోజు నాబోతును పిలిచి అహాబు ఇలా అన్నాడు: “నీ పొలం నాకు ఇచ్చివేయి. నేను దానిని కూరగాయల తోటగా మార్చాలను కుంటున్నాను. నీ చేను నా భవనానికి దగ్గరగా వుంది. దానికి బదులు దానికంటె మంచి ద్రాక్షతోట నీకు మరొకటి ఇస్తాను. లేదా, నీకు కావాలంటే దాని విలువ డబ్బు రూపంలో చెల్లిస్తాను.”
1KI 21:3 నాబోతు అది విని, “నా భూమిని నీ కెన్నడూ ఇవ్వను. ఇది నా పిత్రార్జితం” అని అన్నాడు.
1KI 21:4 అహాబు ఇంటికి వెళ్లాడు. నాబోతు పట్ల కోపంగా వున్నాడు. అతని మనస్సు కలతపడింది. యెజ్రెయేలు వాడైన నాబోతు చెప్పినది అతనికి గిట్టలేదు. (“నా పిత్రార్జితమైన భూమిని నీకివ్వను” అని నాబోతు అన్నాడు.) అహాబు పక్కపై పడుకున్నాడు. ముఖం తిప్పుకుని భోజనం చేయ నిరాకరించాడు.
1KI 21:5 అహాబు భార్య యెజెబెలు అతని వద్దకు వెళ్లింది. “ఎందుకు నీవు కలత చెంది వున్నావు? నీవెందుకు తినటం లేదు?” అని యెజెబెలు అడిగింది.
1KI 21:6 అహాబు ఇలా సమాధానం చెప్పాడు: “యెజ్రెయేలువాడైన నాబోతును అతని పొలం నాకిమ్మని అడిగాను. దాని పూర్తి ఖరీదు చెల్లిస్తానన్నాను. లేదా, అతను కావాలంటే వేరే పొలం ఇస్తానన్నాను. కాని నాబోతు అతని పొలం ఇవ్వటానికి నిరాకరించాడు.”
1KI 21:7 అది విని యెజెబెలు, “అది సరే! ఇశ్రాయేలుకు రాజువు నీవే కదా! పక్క మీది నుండి లేచి ఆహారం తీసుకో. నీకు హాయిగా వుంటుంది. నాబోతు పొలాన్ని నీకు నేనిప్పిస్తాను” అని అన్నది.
1KI 21:8 తరువాత యెజెబెలు కొన్ని ఉత్తరాలను అహాబు పేరు మీద రాసింది. వాటి మీద అహాబు సంతకం ఆమె చేసింది. అహాబు రాజముద్రను వాటిపై వేసి అంటించింది. ఆమె వాటిని నాబోతు నివసించే నగరంలో వున్న పెద్దలు, నాయకులకు ఇతర ముఖ్యమైన వ్యక్తులకు పంపించింది.
1KI 21:9 ఆమె పంపిన లేఖలో ఇలా వుంది: “ప్రజలందరికి ఉపవాస దినాన్ని ఒకటి ప్రకటించండి. తరువాత పట్టణంలోని ప్రజలందరినీ ఆ రోజు సమావేశం పర్చండి. ఆ సమావేశంలో మనం నాబోతును గురించి మాట్లాడాలి.
1KI 21:10 నాబోతును గురించి ప్రజలకు అబద్ధాలు చెప్పగల కొందరిని సమావేశంలో వుండేలా చూడండి. నాబోతు రాజుకు, దేవునికి వ్యతిరేకంగా దూషణ భాషణ చేయగా తాము విన్నట్లు ప్రజలకు వారు అబద్ధం చెప్పాలి. అప్పుడు నాబోతును నగరం నుండి బయటికి తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపాలి.”
1KI 21:11 అది చదివిన యెజ్రెయేలు నాయకులు (పెద్దలు), ఇతర ప్రముఖులు ఆజ్ఞను శిరసావహించారు.
1KI 21:12 ప్రజలంతా ఉపవాసం చేయాలని ఒక రోజును నిర్ణయించి ప్రకటించారు. ఆ రోజున నియమిత స్థలంలో సమావేశం కావాలని ప్రజలందరికీ పిలుపు ఇచ్చారు. వారు నాబోతును ప్రజల ముందు ఒక ప్రత్యేక స్థానంలో కూర్చుండబెట్టారు.
1KI 21:13 అప్పుడు ఇద్దరు మనుష్యులు లేచి నాబోతు దేవునిని, రాజును గూర్చి దుర్భాషలాడుతూండగా తాము విన్నట్లు ప్రజలకు చెప్పారు. అందువల్ల ప్రజలు నాబోతును నగరం నుండి బయటికి లాక్కొని వెళ్లి, అతనిని రాళ్లతో కొట్టి చంపారు.
1KI 21:14 తరువాత నాబోతు చంపబడ్డాడన్న వర్తమానం నాయకులు యెజెబెలుకు పంపారు.
1KI 21:15 ఈ వార్త విన్న యెజెబెలు వెంటనే అహాబు వద్దకు వెళ్లి, “నాబోతు చనిపోయాడు. ఇప్పుడు నీవు వెళ్లి నీకు కావలసిన పొలాన్ని తీసికో” అని చెప్పింది.
1KI 21:16 కావున అహాబు ద్రాక్షతోటకు వెళ్లి దానిని తన వశం చేసుకున్నాడు.
1KI 21:17 ఇదే సమయంలో యెహావా ఏలీయాతో మాట్లాడాడు. (ఏలీయా తిష్బీయుడైన ప్రవక్త) యెహోవా ఇలా అన్నాడు:
1KI 21:18 “షోమ్రోనులో వున్న రాజైన అహాబు వద్దకు వెళ్లు. అతడు నాబోతుకు చెందిన ద్రాక్షతోటలో వుంటాడు. ఆ పొలాన్ని తన స్వాధీనం చేసుకొనటానికి అహాబు అక్కడికి వెళ్లాడు.
1KI 21:19 యెహోవా అంటున్నాడని నా మాటగా అతనికి ఈ విధంగా చెప్పు: ‘అహాబూ! నీవు నాబోతు అనే వానిని చంపావు. ఇప్పుడు నీవతని పొలం స్వాధీనం చేసుకుంటున్నావు. అందువల్ల నేను చెప్పేదేమనగా నాబోతు చనిపోయిన స్థలంలోనే నీవు కూడ చనిపోతావు. నాబోతు రక్తాన్ని నాకిన కుక్కలు అదే స్థలంలో నీ రక్తాన్ని కూడ నాకుతాయి!’”
1KI 21:20 తరువాత ఏలీయా అహాబు వద్దకు వెళ్లాడు. ఏలీయాను అహాబు చూసి, “నీవు మళ్లీ నావద్దకు వచ్చావు. నీ వెప్పుడూ నాకు వ్యతిరేకివై శత్రువులా ప్రవర్తిస్తున్నావు” అని అన్నాడు. ఏలీయా ఇలా సమాధానమిచ్చాడు: “అవును, నేను మళ్లీ నిన్ను కలుసుకున్నాను. జీవితమంతా యెహోవాకు విరుద్ధగా పాపం చేస్తూనే వచ్చావు.
1KI 21:21 అందువల్ల యెహోవా నీతో ఇలా అంటున్నాడు, నేను నిన్ను నాశనం చేస్తాను. నేను నిన్ను, నీ ఇంటిలోని ప్రతిబాలుణ్ణి, మరియు మగవారినందరినీ చంపేస్తాను.
1KI 21:22 నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబానికి పట్టిన గతే నీ కుటుంబానికి కూడ పడుతుంది. రాజైన బయెషా కుటుంబంవలె నీ కుటుంబం కూడ అయిపోతుంది. ఆ రెండు కుటుంబాలూ సర్వనాశనం చేయబడ్డాయి. అదే విధంగా నీ కుటుంబానికి కూడ చేస్తాను. కారణమేమంటే నీవు నాకు కోపం కల్గించావు. ఇశ్రాయేలు ప్రజలు చెడుకార్యాలు చేసేటందుకు కూడా నీవు కారుకుడవయ్యావు.
1KI 21:23 ఇంకా యెహోవా చెప్పిన దేమనగా నీ భార్యయగు యెజెబెలు శవాన్ని యెజ్రెయేలు నగరంలో కుక్కలు పీక్కు తింటాయి.
1KI 21:24 నీ కుటుంబంలోని వాడెవడు నగరంలో చనిపోయినా వాని శవాన్ని కుక్కలు తింటాయి. వారిలో ఎవడు పొలాల్లో చనిపోయినా వానిని పక్షులు తింటాయి.”
1KI 21:25 అహాబువలె అన్ని తప్పుడు పనులు చేసినవాడు, అంత పాపం మూటగట్టు కున్నవాడు మరొక వ్యక్తి లేడు. అతని భార్య యెజెబెలు అతడా తప్పులు చేయటానికి కారకురాలయింది.
1KI 21:26 కొయ్య బొమ్మలను పూజిస్తూ, అహాబు ఘోరమైన పాపానికి ఒడిగట్టాడు. ఈ రకమైన పనినే అమోరీయులు కూడా చేశారు. అందువల్లనే యెహోవా ఆ రాజ్యాన్ని వారి నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
1KI 21:27 ఏలీయా మాట్లాడటం పూర్తి చేసిన తరువాత అహాబు చాలా ఖిన్నుడయాడు. తన విచారానికి సూచనగా తన బట్టలు చింపుకున్నాడు. తరువాత విచారసూచకంగా ప్రత్యేకమైన బట్టలు ధరించాడు. అహాబు భోజనం మానేశాడు. ఆ ప్రత్యేకమైన బట్టలతోనే నిద్రపోయాడు. అహాబు బహు దుఃఖంతో మిక్కిలి కలతచెందాడు.
1KI 21:28 ప్రవక్తయగు ఏలీయాతో యెహోవా ఇలా అన్నాడు:
1KI 21:29 “అహాబు నాముందు తనను తాను తక్కువ చేసుకుని వినమ్రుడైనట్లు నేను చూస్తున్నాను. అందువల్ల అతను బతికియున్నంత కాలం నేనతనికి ఆపదలు కలుగజేయను. అతని కుమారుడు రాజు అయ్యేవరకు ఆగుతాను. అప్పుడు అహాబు కుటుంబానికి కష్టనష్టాలు కలుగజేస్తాను.”
1KI 22:1 తరువాత రెండు సంత్సరాల కాలంలో ఇశ్రాయేలు, అరాము దేశాల మధ్య శాంతి సామరస్యాలు నెలకొన్నాయి.
1KI 22:2 మూడవ సంవత్సరంలో యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబును చూడటానికి వెళ్లాడు.
1KI 22:3 అదే సమయంలో అహాబు తన అధికారులతో, “రామోత్గిలాదు పట్టణాన్ని అరాము రాజు మనవద్ద నుండి తీసుకున్న సంగతి మీకు జ్ఞాపకమున్నదా? మనం రామోత్గిలాదును తిరిగి తీసుకొని రావటానికి ఏ రకమైన చర్యనూ ఎందుకు తీసుకోలేదు? అది మన పట్టణమై తీరాలి” అని అన్నాడు.
1KI 22:4 అప్పుడు అహాబు తన వద్దకు వచ్చిన రాజైన యెహోషాపాతును, “రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడటానికి నీవు మాతో కలుస్తావా?” అని అడిగాడు. “అవును, నేను మీతో కలుస్తాను. నీ సైన్యంతో సహకరించటానికి నా సైనికులు, గుర్రాలు సిద్ధంగా వున్నాయి.
1KI 22:5 కాని ముందుగా మనం యెహోవాను మనకు సహాయం చేయమని అడగాలి” అని యెహోషాపాతు అన్నాడు.
1KI 22:6 అందుచేత అహాబు ప్రవక్తలందరినీ సమావేశపర్చాడు. ఆ సయయంలో అక్కడ సుమారు నాలుగువందల మంది ప్రవక్తలున్నారు. “నేను వెళ్లి అరాము సైన్యంతో రామోత్గిలాదు వద్ద యుద్ధం చేయవచ్చునా? లేక నేనింకా మరో సమయం కొరకు వేచివుండాలా?” అని అహాబు వారినడిగాడు. “నీవు వెళ్లి ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. యెహోవా నీకు విజయం చేకూర్చుతాడు” అని ప్రవక్తలన్నారు.
1KI 22:7 కాని యెహోషాపాతు, “యెహోవా యొక్క ప్రవక్త మరెవరైనా ఇక్కడ వున్నారా? వుంటే అతడు అహాబు ఏమి చేయాలో దేవుని అడిగి తెలుసుకోవాలి” అని అన్నాడు.
1KI 22:8 “మరో ప్రవక్త వున్నాడు. అతని పేరు మీకాయా, అతడు ఇమ్లా కుమారుడు. కాని నేనతనిని అనహ్యించుకుంటాను. అతడు యెహోవా తరపున మాట్లాడినప్పుడు, అతడెప్పుడూ నాకు మంచి చెప్పడు. నాకు ఇష్టం లేని విషయాలే అతడెప్పుడూ చెపుతాడు” అని అహాబు అన్నాడు. “అహాబు రాజా, నీవు అలా అనకూడదు” అని యెహోషాపాతు అన్నాడు.
1KI 22:9 కావున రాజైన అహాబు తన అధికారులలో ఒకనిని పిలిచి మీకాయా కొరకు వెళ్లి ఎక్కడున్నాడో చూడమన్నాడు.
1KI 22:10 ఆ సమయంలో ఆ రాజులిద్దరూ తమ తమ రాజ దుస్తుల్లో వున్నారు. వారు సింహాసనాల మీద కూర్చుని వున్నారు. అది షోమ్రోను నగర ద్వారం వద్దగల న్యాయస్థానం. ప్రవక్తలందరూ వారి ముందు నిలబడ్డారు. ప్రవక్తలు ప్రత్యేకమైన విషయాలనేకం యెహోవా నుండి తెలుసుకుని ప్రకటిస్తున్నారు.
1KI 22:11 వారిలో కెనయనా కుమారుడు సిద్కియా అను వాడొకడున్నాడు. సిద్కియా కొన్ని ఇనుప కొమ్ములు చేయించి తెచ్చాడు. అతడు అహాబుతో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: “అరాము సైన్యంతో పోరాడటానికి నీవు ఈ ఇనుప కొమ్ములు ఉపయోగిస్తావు. నీవు వారిని ఓడించి, సర్వనాశనం చేస్తావు.”
1KI 22:12 మిగిలిన ప్రవక్తలు కూడ సిద్కియా చెప్పిన దానితో ఏకీభవించారు. ఆ ప్రవక్త ఇంకా ఇలా అన్నాడు: “నీ సైన్యం ఇప్పుడే కదిలి వెళ్లాలి. అరాము సైన్యంతో వారు రామోత్గిలాదు వద్ద పోరు సల్పాలి. నీవా పోరాటంలో గెలుస్తావు. యెహోవా నీవు గెలిచేలా చేస్తాడు.”
1KI 22:13 ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూ వుండగా ప్రభుత్వాధికారి మీకాయాకొరకు వెళ్లాడు. అతడు మీకాయాను చూసి, “ప్రవక్తలంతా రాజు గెలుస్తాడని చెపుతున్నారు. నేననేదేమంటే నీవు కూడా అదే మాదిరిగా చెపితే నీకు చాలా క్షేమకరం” అని అన్నాడు.
1KI 22:14 “కాదు! యెహోవా ప్రసాదించిన శక్తిచేత యెహోవా నన్ను ఏది చెప్పమని ఆజ్ఞయిస్తే అదే చెపుతానని ప్రమాణం చేసియున్నాను” అని మీకాయా సమాధానం చెప్పాడు.
1KI 22:15 తరువాత మీకాయా వచ్చి రాజైన అహాబు ముందు నిలబడ్డాడు. రాజు అతనిని ఇలా అడిగాడు: “మీకాయా, రాజైన యెహోషాపాతు, నేను మా సైన్యాలను కలుపవచ్చా? ఇప్పుడు మేము వెళ్లి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడ వచ్చునా?” “అవును. మీరు వెళ్లి వారితో ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. యెహోవా నిన్ను గెలిపిస్తాడు” అని మీకాయా సమాధానం చెప్పాడు.
1KI 22:16 కాని ఇలా అన్నాడు: “నీవు ఈ మాటలు యెహోవా శక్తితో చెప్పటం లేదు. ఇది నీ ఊహాగానం. అందువల్ల నాకు నిజం చెప్పు! నేనేం చేయాలో యెహోవా శక్తి ఆధారంగా నాకు తెలియజెప్పు! ఎన్నిసార్లు నేను నీకు చెప్పాను!”
1KI 22:17 అందుకు మీకాయా ఇలా అన్నాడతు: “ఏమి జరుగుతుందో నేను చూడగలను. ఇశ్రాయేలు సైన్యం కొండల్లో చిందరవందరై పోతుంది. కాపరిలేని గొర్రెల్లా వారు వికలమైపోతారు. ‘ఈ మనుష్యులకు నాయకుడులేడు. పోరుమాని వారు ఇండ్లకు పోతే మంచిది’ అని యెహోవా అంటున్నాడు.”
1KI 22:18 యెహోషాపాతుతో అప్పుడు అహాబు ఇలా అన్నాడు: “చూడు! నేను చెప్పాను గదా! ఈ ప్రవక్త నన్ను గురించి ఎన్నడూ మంచి చెప్పడు. ప్రతిసారీ నేను విననొల్లని మాటలే అతడు చెపుతాడు.”
1KI 22:19 కాని మీకాయా యెహోవా తరపున మాట్లాడటం కొనసాగించాడు. మీకాయా ఇలా అన్నాడు: “వినండి! ఇవి యెహోవా చెప్పిన మాటలు. యెహోవా పరలోకంలో సింహాసనాసీనుడై వున్నట్లు చూశాను. దేవదూతలు ఆయనకు చేరువలో నిలబడియున్నారు.
1KI 22:20 యెహోవా వారితో ఇలా చెప్పినాడు: ‘మీలో ఎవరైనా రాజైన అహాబును మోసగించగలరా? అతడు రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడేలా చేయాలని నా వాంఛ. అప్పుడతడు చంపబడతాడు.’ దేవదూతలు తాము చేయవలసిన పనిపై ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయారు.
1KI 22:21 అప్పుడు ఒక దేవదూత యెహోవా ముందుకు వచ్చి, ‘నేనతనిని మాయ జేయగలను!’ అని చెప్పాడు.
1KI 22:22 ‘ఎలామాయలో పడవేయగలవు?’ అని యెహోవా అడిగాడు. ‘అహాబు ప్రవక్తలందరినీ కలవరపెడతాను. రాజైన అహాబుతో అన్నీ అబద్ధాలు చెప్పమని ప్రవక్తలను ప్రోత్సహిస్తాను. ప్రవక్తల సమాచారాలన్నీ అబద్ధాలే’ అని దేవదూత అన్నాడు. అందుకు యెహోవా, ‘మంచిది! వెళ్లి అహాబు రాజును మాయలో పడవేయి; నీకు విజయం చేకూరుతుంది’” అని అన్నాడు.
1KI 22:23 మీకాయా తన కథనం ముగించాడు. అతనిలా అన్నాడు: “ఇదీ ఇక్కడ జరిగిన విషయం. యెహోవా నీ ప్రవక్తలను నీతో అబద్దమాడేలా చేశాడు. యెహోవా తనకు తానే నీకు కష్టనష్టాలు రావాలని కోరి నిశ్చయించాడు.”
1KI 22:24 తరువాత ప్రవక్తయగు సిద్కియా, మీకాయా వద్దకు వెళ్లాడు. సిద్కియా మీకాయాను చెంప మీదకొట్టి, “యెహోవా శక్తి నన్ను వదిలి నీద్వారా మాట్లాడుతున్నదని నీవు నిజంగా నమ్ముతున్నావా?” అని అడిగాడు.
1KI 22:25 “నీవు వెంటనే వెళ్లి ఒక చిన్న గదిలో దాగివుండు. అప్పుడు నేను నిజం చెప్తున్నట్లు నీకు తెలుస్తుంది” అన్నాడు మీకాయా.
1KI 22:26 మీకాయాను బంధించమని అహాబు తన అధికారులకు ఆజ్ఞ ఇచ్చాడు. “ఇతనిని బంధించి నగరపాలకుడగు ఆమోను వద్దకు తీసుకుని వెళ్లండి. రాజకుమారుడైన యెవాషును ఇతనిపై తీర్పు చెప్పనీయండి.
1KI 22:27 మీకాయాను కారాగారంలో వుంచమని అతనికి చెప్పండి. వీనికి కేవలం రొట్టె, నీరు మాత్రం ఇవ్వండి. నేను యుద్ధంనుండి ఇంటికి తిరిగి వచ్చేవరకు ఇతనిని అక్కడే వుంచండి” అని రాజైన అహాబు అన్నాడు.
1KI 22:28 అది విన్న మీకాయా ఇలా ప్రకటించాడు: “సర్వప్రజలారా, నే చెప్పేది సావధానంగా వినండి! అహాబు రాజా, యుద్ధం నుండి నీవు క్షేమంగా ఇంటికి తిరిగివస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడి యుండనట్లే.”
1KI 22:29 తరువాత రాజైన అహాబు, మరియు రాజైన యెహోషాపాతు కలిసి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్లారు. గిలాదు అనే ప్రాంతంలో ఇది వుంది.
1KI 22:30 అహాబు యెహోషాపాతుతో ఇలా అన్నాడు: “మనం యుద్ధానికి సిద్ధమవుదాం. నేను రాజునని తెలియకుండా వుండేలాగున తగిన దుస్తులు వేసుకుంటాను. కాని నీవు మాత్రం రాజఠీవి ఉట్టిపడే నీ యొక్క ప్రత్యేక దుస్తులు ధరించు.” ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకున్నాడు. యుద్ధం మొదలయింది.
1KI 22:31 అరాము రాజుకు ముప్పది యిద్దరు రథాధిపతులున్నారు. ఈ ముప్పది యిద్దరు రథాధిపతులకూ ఇశ్రాయేలు రాజు ఎక్కడ వున్నాడో చూడమని చెప్పాడు. ఇశ్రాయేలు రాజును చంపేయమని అరాము రాజు అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు.
1KI 22:32 యుద్దం సాగుతూవుంతడగా ఈ అధిపతులు రాజైన యెహోషాపాతును చూశారు. వారు అతనినే ఇశ్రాయేలు రాజుగా భావించారు. అందుచే వారతనిని చంపటానికి వెళ్లారు. యెహోషాపాతు తను రాజు కాదన్నట్లు అరవటం ప్రారంభించాడు.
1KI 22:33 దానితో అతడు రాజైన అహాబుకాదని తెలుసుకున్నారు. అందుచేత వారతనిని చంపలేదు.
1KI 22:34 కాని ఒక సైనికుడు తన బాణాన్ని గాలిలోకి వదిలాడు. అతడు కావాలని దానిని ఎవరిపైకీ గురిచూసి వదలలేదు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. రాజు కవచం అతని శరీరాన్ని కప్పని చోట బాణం తగిలింది. రాజైన అహాబు తనసారధితో, “నాకు ఒక బాణం తగిలింది. త్వరగా రథాన్ని ఈ ప్రదేశంనుండి బయటికి నడిపించు. యుద్ధంనుండి మనం వెళ్లిపోవాలి” అని అన్నాడు.
1KI 22:35 సైన్యాలు మాత్రం యుద్ధాన్ని కొనసాగించాయి. రాజైన ఆహాబు తన రథం మీదే వుండిపోయాడు. రథంలో ఒక పక్కగా ఆనుకొని వున్నాడు. అతడు అరాము సైన్యంవైపు చూస్తూ వుండిపోయాడు. అతని గాయం నుండి కారిన రక్తం రథంలో పేరుకుపోయింది. బాగా సాయంత్ర మయ్యేసరికి రాజు చనిపోయాడు.
1KI 22:36 సూర్యాస్తమయసమయంలో ఇశ్రాయేలు సైన్యం తమ స్వదేశానికి, నగరానికి తిరిగి వెళ్లటానికి ఆజ్ఞ ఇవ్వబడింది.
1KI 22:37 రాజైన అహాబు ఆ విధంగా చనిపోయాడు. అతని భౌతిక కాయాన్ని కొందరు షోమ్రోనుకు తీసుకొని వెళ్లారు. వారు దానిని అక్కడ సమాధి చేశారు.
1KI 22:38 అహాబు రథాన్ని సైనికులు షోమ్రోనులో ఒక చెరువు వద్ద కడిగారు. అక్కడ కొన్ని కుక్కలు రథం చుట్టూ చేరి రథంలో పేరుకు పోయిన రాజైన అహాబు రక్తాన్ని నాకాయి. పైగా ఆ నీటిలో వేశ్యలు స్నానం చేశారు. ఇవన్నీ ఎలా జరుగుతాయని యెహోవా చెప్పియున్నాడో అలానే జరిగాయి.
1KI 22:39 రాజైన అహాబు తన పరిపాలనాకాలంలో చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి. రాజు తన భవనాన్ని అందంగా తీర్చిదిద్దటానికి ఉపయోగించిన దంతాన్ని గూర్చి కూడ ఆ గ్రంథం వివరిస్తుంది. అందులో రాజు నిర్మించిన నగరాన్ని గూర్చి కూడా వుంది.
1KI 22:40 అహాబు చనిపోయిన పిమ్మట అతని కుమారుడైన అహజ్యా అతని స్థానంలో రాజు అయ్యాడు.
1KI 22:41 ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడి నాలుగవ సంవత్సరంలో యూదాకు రాజయ్యాడు.
1KI 22:42 యెహోషాపాతు రాజు అయ్యే నాటికి ఇతని వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు. యెహోషాపాతు యెరూషలేములో ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. యెహోషాపాతు తల్లి షిల్హీ కుమార్తె. అతని తల్లి పేరు అజూబా.
1KI 22:43 యెహోషాపాతు మంచి వ్యక్తి. గతంలో తన తండ్రి నడచిన రీతినే ఇతడు కూడ నడిచాడు. యెహోవా ఆజ్ఞలను శిరసావహించాడు. కాని యెహోషాపాతు ఉన్నత స్థలాలను తీసివేయలేదు. ఆ స్థలాలలో ప్రజలు బలులు సమర్పించటం, ధూపం వేయటం వంటి ఆరాధనా కార్యక్రమాలు కొనసాగించారు.
1KI 22:44 యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో ఒక శాంతి ఒడంబడికను కుదుర్చుకున్నాడు.
1KI 22:45 యెహోషాపాతు మిక్కిలి ధైర్యవంతుడు. అతడు చాలా యుద్ధాలు చేశాడు. అతడు చేసిన పనులన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
1KI 22:46 వ్యభిచార విషయంగా తమ శరీరాలను అమ్ముకొనే స్త్రీ పురుషులను ఆరాధనా స్థలాలనుండి యెహోషాపాతు వెళ్లగొట్టాడు. తన తండ్రియగు ఆసా రాజ్యం చేసిన కాలంలో ఆ రకమైన స్త్రీ పురుషులు ఆరాధనా స్థలాలలో సేవచేస్తూ వుండేవారు.
1KI 22:47 ఆ కాలంలో ఎదోము దేశానికి రాజు లేడు. అది ఒక పాలనాధికారి అధీనంలో వుండేది. ఆ అధికారి యూదా రాజుచేత ఎంపిక చేయబడేవాడు.
1KI 22:48 రాజైన యెహోషాపాతు సముద్రయానానికి అనువైన ఓడలను నిర్మించాడు. యెహోషాపాతు ఆ ఓడలను ఓఫీరు దేశానికి పంపాడు. ఓడలు బంగారాన్ని తేవాలని అతని ఆశయం. కాని ఓడలు ఎసోన్గెబెరు వద్ద మునిగిపోయాయి. ఓడలు బంగారాన్ని అసలు తేలేక పోయాయి.
1KI 22:49 ఇశ్రాయేలు రాజైన అహజ్యా యెహోషాపాతుకు సహాయం చేయటానికి వెళ్లాడు. యెహోషాపాతుతో నౌకా నిర్మాణ యానాలలో సమర్థులైన వారిని తీసుకొని వస్తానని అహజ్యా అన్నాడు. కాని యెహోషాపాతు అహజ్యా మనుష్యులను వినియోగించుకోడానికి నిరాకరించాడు.
1KI 22:50 యెహోషాపాతు చనిపోయాడు. అతనిని తన పూర్వికులతో దావీదు నగరంలో సమాధిచేశారు. తరువాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు.
1KI 22:51 అహాబు కుమారుడు అహజ్యా, యెహోషాపాతు పాలన యూదాలో పదునేడవ సంవత్సరం జరుగుతుండగా అహజ్యా ఇశ్రాయేలుకు రాజైనాడు. అహజ్యా షోమ్రోనులో రెండు సంవత్సరాలు పాలించాడు.
1KI 22:52 అహజ్యా యెహోవా దృష్టిలో పాపం చేశాడు. తన తండ్రి అహాబు, తన తల్లి యెజెబెలు, మరియు నెబాతు కుమారుడైన యరొబాము నడచిన చెడునడతనే అహజ్యా కూడ అనుసరించాడు. ఈ పాలకులంతా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటానికి కారుకులయ్యారు.
1KI 22:53 అహజ్యా బూటకపు దేవత బయలును ఆరాధించాడు. తనకు ముందున్న తన తండ్రి వలెనే ఆ అసత్య దేవతను కొలిచాడు. తవన ఈ చెడు నడవడితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు చాలా కోపం కలిగించాడు. తనకు ముందున్న తన తండ్రిపట్ల కోపగించినట్లు యెహోవా అహజ్యా పట్ల కూడా కోపంతోపున్నాడు.
2KI 1:1 అహాబు మరణానంతరం, ఇశ్రాయేలు మీద మోయాబు తిరుగుబాటు చేసింది.
2KI 1:2 ఒకరోజు షోమ్రోనులోని తన ఇంటి పై భాగాన అహాజ్యా ఉన్నాడు.ఆ ఇంటి కప్పునుండి కొయ్యకడ్డీల గుండా అహాజ్యా క్రిందపడి, బాగా గాయపడ్డాడు. అహాజ్యా తన దూతల్ని పిలిచి వాళ్లతో, “ఎక్రోను దేవుని బయల్దెబూబుల యాజకుల దగ్గరకి వెళ్లండి. నా గాయాలనుండి నేను బయట పడగలుగుతానో లేదో వారిని అడగండి” అనిచెప్పాడు.
2KI 1:3 కాని తిష్బీయుడైన ఏలీయాతో యెహోవా దూత ఇలా చెప్పాడు: “షోమ్రోను నుంచి అహాజ్యా రాజు కొందరు దూతలను పంపాడు. ఆ మనష్యుల్ని కలుసుకో. ‘ఇశ్రాయేలులో దేవుడున్నాడు. కనుక ఎక్రోను దేవుని బయల్దెబూబుల యాజకులను అడగ టానికి ఎందుకు మీరు అక్కడికి వెళుతున్నారు? అని వారిని అడుగుము.
2KI 1:4 మరియు అహజ్యా రాజుతో ఈ విషయాలు చెప్పమని ఆ దూతలకు ఆజ్ఞాపించుము. బలయల్దెబూబును అడగటానికి నీవు దూతలను పంపించావు. నీవీ విధంగా చేయడంవలన నీవు పడకనుంచి లేవవు, నీవు మరణిస్తావు అని యెహోవా చెప్పాడు.’” తర్వాత అక్కడనుంచి వెళ్లి ఆ మాటలు అహజ్యా సేవకులకు ఏలీయా చెప్పాడు.
2KI 1:5 దూతలు అహజ్యా దగ్గరకు వచ్చారు. “మీరింత త్వరగా ఎందుకు వచ్చారు?” అని అహజ్యా వారిని అడిగాడు.
2KI 1:6 దూతలు అహజ్యాతో ఇట్లన్నారు: “మమ్మల్ని కలుసుకునేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. మమ్మల్ని పంపించిన రాజుకి యెహోవా చెప్పిన మాటలు చెప్పమని అతను చెప్పాడు. ‘ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు, అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్దెబూబుని ప్రశ్నలగటం దేనికి? ఇట్లు చేయటంవల్ల నీవు పడక నుండి లేవవనియు, నీవు మరణిస్తా వనియు యెహోవా చెప్పాడు!’”
2KI 1:7 “మిమ్మల్ని కలుసుకుని మీకు ఈ మాటలు చెప్పిన ఆ వ్యక్తి ఎలా వున్నాడు?” అని అహజ్యా దూతలను అడిగాడు.
2KI 1:8 “ఆవ్యక్తి వెంట్రుకలతో చేసిన వస్త్రము ధరించాడు. నడుముకి ఒక తోలు నడికట్టు ధరించాడు” అని అహజ్యాకు దూతలు సమాధానమిచ్చారు. తర్వాత అహజ్యా, “తిష్బీయుడయిన ఏలీయానే ఆది” అని అన్నాడు.
2KI 1:9 అహజ్యా ఏలియా వద్దకు ఒక నాయకుని మరియు ఏభై మంది మనుష్యుల్ని పంపాడు. ఆ నాయకుడు ఏలీయావద్దకు వెళ్లాడు. అప్పుడు ఏలీయా ఒక కొండ పై భాగాన కూర్చొని వున్నాడు. నాయకుడు, “దేవుని మనిషీ, ‘క్రిందికి దిగమని రాజు చెప్పాడు’” అని పలికాడు.
2KI 1:10 ఏలీయా ఏభైమంది మనుష్యులును, ఆ నాయకుని చూచి, “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ, నీ ఏభై మందిని నాశనం చేయునుగాక” అన్నాడు. అందువల్ల పరలోకం నుండి అగ్ని వచ్చి ఆ నాయకుని, ఏభై మందిని నాశనం చేసింది.
2KI 1:11 అహజ్యా మరల ఏభై మందితో మరొక నాయకుని ఏలీయా వద్దకు పంపాడు. ఆ నాయకుడు ఏలీయాతో, “దేవుని మనిషీ క్రిందికి త్వరగా రమ్ము అని రాజు చెప్పాడు” అని పలికాడు.
2KI 1:12 ఏలీయా ఆ నాయకుని అతని ఏభై మంది మనుష్యులతో “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ నీ ఏభై మంది మనుష్యులను నాశనము చేయుగాక!” అన్నాడు. అప్పుడు దేవుని అగ్ని పరలోకం నుండి వచ్చి వారిని నాశనము చేసింది.
2KI 1:13 అహజ్యా మూడవ నాయకుని ఏభై మంది మనుష్యులతో పంపాడు. ఆ మూడవ నాయకుడు ఏలీయా వద్దకు వచ్చాడు. ఆ నాయకుడు మోకరిల్లి ఏలీయాను అర్థించాడు: “దేవుని మనిషీ, నా జీవితమూ నా ఏభై మంది సేవకుల జీవితములు నీకు విలువగలవై వుండునుగాక!
2KI 1:14 పరలోకం నుండి అగ్ని వచ్చి మొదటి ఇద్దరు నాయకులను వారి ఏభై మంది మనుష్యులను నాశనం చేసింది. మా మీద కరుణ చూపి మమ్ము బ్రతకనిమ్ము.”
2KI 1:15 యెహోవా దూత ఏలీయాతో, “ఆ నాయకునితో పొమ్ము, అతనికి భయపడకుము” అన్నాడు. అందువల్ల ఏలీయా ఆ నాయకునితో కూడా అహజ్యా రాజుని చూడటానికి వెళ్లాడు.
2KI 1:16 అహజ్యాతో ఏలీయా, “యెహోవా నీ విషయమై ఈలాగున చెప్పెను, ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు. అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్దెబూబు వద్దకు ప్రశ్నలడగమని దూతలను ఎందుకు పంపావు? నీవు ఇట్లు చేయడం వలన, నీవు నీ పడకనుండి లేవవు. నీవు మరణిస్తావు” అన్నాడు.
2KI 1:17 ఏలీయా ద్వారా యెహోవా చెప్పినట్లుగా అహజ్యా మరణించాడు. అహజ్యాకి కుమారుడు లేడు. అందువల్ల అహజ్యా తర్వాత యెహోరాము రాజయ్యాడు. యెహోషాపాతు. కుమారుడైన యెహోరాము పరిపాలించాసాగాడు. అతని రెండవ సంవత్సర పాలన కాలంలో యెహోషాపాతు యూదా రాజుగా వున్నాడు.
2KI 1:18 అహజ్యా చేసిన ఇతర పనులు “ఇశ్రాయేలు రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడినవి.
2KI 2:1 సుడిగాలి ద్వారా ఏలీయాని యెహోవా పరలోకానికి తీసుకు వెళ్లేందుకు సమయం దగ్గరపడింది. ఏలీయా ఎలీషాతో గిల్గాలుకు వెళ్లాడు.
2KI 2:2 ఎలీషాతో, “దయచేసి ఇక్కడ వుండుము, ఎందుకనగా యెహోవా నన్ను బేతేలునకు వెళ్లుమని ఆదేశించాడు” అని చెప్పాడు. కాని ఎలీషా, “యెహోవా జీవంతోడు, నా జీవం తోడు నేను నిన్ను విడిచి వెళ్లను” అని ఏలీయాతో చెప్పాడు. అందువల్ల ఆ ఇద్దరు మనష్యులు బేతేలుకు వెళ్లారు.
2KI 2:3 బేతేలులో వున్న ప్రవక్తలు ఎలీషా వద్దకు వచ్చియిట్లన్నారు: “నేడు నీ యజమానిని నీ వద్దనుండి యెహోవా తీసుకొని పోవునన్న విషయం నీకు తెలుసా?” “అవును. నాకు తెలుసు. ఆ విషయం మాటలాడకు.” అని ఎలీషా చెప్పాడు.
2KI 2:4 ఎలీషాతో ఏలీయా, “దయచేసి ఇక్కడ వుండుము. ఎందుకనగా నన్ను యెరికోకు వెళ్లమని యెహోవా ఆదేశించాడు” అనిచెప్పాడు. కాని ఎలీషా, “యెహోవా జీవంతోడు, నా జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్లను” అని చెప్పాడు. అందువల్ల వారిరువురు మనష్యులు యెరికోకు వెళ్లారు.
2KI 2:5 యెరికోలోనున్న ప్రవక్తల బృందం ఎలీషా వద్దకు వచ్చి యిట్లున్నారు. “నేడు నీ యజమానిని నీ వద్దనుండి యెహోవా తీసుకొని పోవునన్న విషయం నీకు తెలుసా?” ఎలీషా, “అవును, నాకు తెలుసు. ఆ విషయమై మాటలాడకు” అనిచెప్పాడు.
2KI 2:6 ఏలీయా ఎలీషాతో, “దయచేసి ఇక్కడ వుండుము. ఎందుకంటే నన్ను యోర్దాను నది వద్దకు వెళ్లమని యెహోవా ఆదేశించాడు” అనిచెప్పాడు. ఏలీయా ఇలా అన్నాడు, “యెహోవా జీవంతోడు, నా జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్లను.” అందువల్ల ఆ ఇరువురు వెళ్లారు.
2KI 2:7 ప్రవక్తల బృందం నుండి ఏభై మంది మనుష్యులు వారిని అనుసరించారు. ఏలీయా ఎలీషాలు యోర్దాను నదివద్ద నిలిచారు. ఆ ఏభై మంది మనుష్యులు ఏలీయా ఎలీషాలకు దూరంగా నిలబడ్డారు.
2KI 2:8 ఏలీయా తన అంగీని తీసి మడత పెట్టి నీటిమీద దానితో కొట్టాడు. నీళ్లు కుడికీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఏలీయా ఎలీషాలు పొడినేల మీద నదిని దాటారు.
2KI 2:9 వారు నదిని దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, “నీనుండి యెహోవా నన్ను తీసుకొని పోవడానికి ముందు నీ కోసం నన్నేమి చేయమంటావు?” అని ఏలీయా అడిగాడు. “నీ ఆత్మ రెండింతల భాగాముగా నామీదికి వచ్చునట్లు చేయి” అని ఎలీషా అడిగాడు.
2KI 2:10 ఏలీయా, “కష్టమైన విషయం నీవు అడిగావు. నన్ను నీనుండి తీసుకొని పోయేటప్పుడు నన్ను చూస్తూ వుంటే అది జరుగుతుంది. కాని నన్ను నీనుండి తీసుకొని పోయెటప్పుడు చూడకుంటే, అప్పుడు, అది జరగదు” అని చెప్పాడు.
2KI 2:11 ఏలీయా ఎలీషాలు ఒకటిగా నడుస్తూ మాటాలాడుతూ వున్నారు. ఉన్నట్టుండి కొన్ని గుర్రాలు, ఒక అగ్నిరథం వచ్చి ఏలీయా ఎలీషాలను వేరు చేసాయి. ఆ గుర్రాలు మరియు రథం ఉన్నాయి. తర్వాత ఒక సుడిగాలి ద్వారా ఏలీయా పరలోకానికి తీసుకొని పోబడ్డాడు.
2KI 2:12 అది ఎలీషా చూచి, నా తండ్రి! “నా తండ్రి! ఇశ్రాయేలు రథం, దాని గుర్రపు సైనికులు” అని అరిచాడు. ఎలీషా ఏలీయాని ఆ తర్వతా ఎన్నడూ చూడలేదు. ఎలీషా తన విచారాన్ని వ్యక్తం చేయడానికి తన వస్త్రాలను రెండుగా చింపివేశాడు.
2KI 2:13 ఏలీయా ధరించు వస్త్రం భూమిమీదికి పడింది. అందువల్ల ఎలీషా దానిని తీసుకున్నాడు. ఎలీషా నీటినికొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ?” అన్నాడు.
2KI 2:14 ఎలీషా నీటిని కొట్టగా నీళ్లు కుడుకీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఎలీషా నదిని దాటాడు.
2KI 2:15 యెరికోలోని ప్రవక్తల బృందం ఎలీషాని చూడగానే, “ఏలీయా ఆత్మ ఇప్పుడు ఎలీషా మీద వున్నది” అన్నారు. ఎలీషాని కలుసుకునేందుకు వారు వచ్చారు. ఎలీషా ముందు వారు నేలకు తాకున ట్లుగా నమస్కరించారు.
2KI 2:16 అతనితో వారు ఇట్లన్నారు: “ఇదుగో, మా వద్ద ఏభై మంది సజ్జనులున్నారు. వారు వెళ్లి నీ యజమానికోసం వెతకనిమ్ము. యెహోవా ఆత్మ ఒకవేళ ఏలీయాని పైకి తీసుకొని పోయి ఏ కొండమీదనో లేక ఏ లోయలోనో పడవేసి వుండవచ్చు.” కాని ఎలీషా, “వద్దు ఏలీయాని వెతకడం కోసం మనుష్యుల్ని పంపవద్దు” అని చెప్పాడు.
2KI 2:17 ప్రవక్తల బృందం అతను ఇబ్బందిలో పడనంత వరకు ప్రార్థంచారు. అప్పుడు ఎలీషా, “బాగున్నది. ఏలీయాని వెతకడం కోసం మనుష్యుల్ని పంపించండి” అని చెప్పాడు. ప్రవక్తల బృందం ఆ ఏభై మంది మనుష్యులను ఏలీయాకోసం పంపారు. మూడు రోజుల పాటు వారు వెతికారు.
2KI 2:18 కనుక ఎలీషా నివసించుచున్న యెరికోకి వారు వెళ్లారు. ఏలీయాని తాము కనుగొనలేక పోయామని వాళ్లు అతనితో చెప్పారు. ఎలీషా, “మీరు వెళ్లవద్దని నేను చెప్పాను” అన్నాడు.
2KI 2:19 ఆ నగర పౌరులు ఎలీషాతో, “అయ్యా, ఈ నగరం చక్కని ప్రదేశంలో వున్నట్టు మీరు చూస్తున్నారు. కాని నీళ్లు మంచివి కావు. అందువల్లనే ఈ ప్రదేశంలో పంటలు పండువు” అని చెప్పారు.
2KI 2:20 “ఒక కొత్త పాత్ర తీసుకురండి. అందులో ఉప్పు వేయండి” అని ఎలీషా చెప్పాడు. పౌరులు పాత్రను ఎలీషా వద్దకు తీసుకు వచ్చారు.
2KI 2:21 తర్వాత భూమినుండి నీరు ప్రవహించే ఆ స్థలం వద్దకు ఎలీషా వెళ్లాడు. ఎలీషా ఆ ఉప్పును నీటిలోకి విసిరాడు. “నేను ఈ నీటిని బాగు చేయుచున్నానని, ఇప్పటినుండి ఈ నీరు మరణము కలిగించదు. పంటలు పండనట్లుగా చేయదు” అని యెహోవా చెప్పాడు.
2KI 2:22 ఆ నీరు పరిశుద్ధ మయ్యింది. ఆ జలము నేటికీ మంచి నీరుగా ఉంది ఎలీషా చెప్పినట్లుగానే అది జరిగెను.
2KI 2:23 ఎలీషా ఆ నగరం నుండి బేతేలుకు వెళ్లాడు. ఎలీషా నగరం చేరడానికి కొండ ఎక్కుతూ ఉన్నాడు. నగరం నుండి కొందరు పిల్లలు బయటకి వస్తున్నారు. ఎలీషాని చూచివారు ఎగతాళి చేశారు. అతనితో వారు ఇట్లు అన్నారు: “ఓ బట్టతల మనిషీ, పైకి వెళ్లుము.”
2KI 2:24 ఎలీషా వెనుదిరిగి ఆ బాలురను చూశాడు. వారి పట్ల చెడు విషయాలు జరగాలని అతను యెహోవాని అర్థించాడు. తర్వత అడవినుండి రెండు ఎలుగు బంట్లు వెలుపలికి వచ్చి ఆ బాలురను ఎదిరించాయి. ఆ ఎలుగుబంట్లు ఆ నలభై రెండు మంది పిల్లలను చీల్చివేశాయి.
2KI 2:25 ఎలీషా బేతేలు వీడి కర్మెలు పర్వతం వద్దకు వెళ్లాడు. మరియు అక్కడ నుండి, ఎలీషా షోమ్రోనుకు మరలి వెళ్లాడు.
2KI 3:1 అహాబు కుమారుడైన యెహోరాము షోమ్రోనులో ఇశ్రాయేలుకు రాజ్యయ్యాడు. యూదా రాజుగా యెహోషాపాతు 18 వ పరిపాలనా సంవత్సరమున అతను పాలించడానికి మొదలు పెట్టాడు. యెహోరాము 12 సంవత్సరములు పరిపాలించాడు.
2KI 3:2 యెహోవా తప్పని చెప్పిన పనులు యెహోరాము చేశాడు. కాని యెహోరాము తన తల్లిదండ్రులవంటి వాడు కాడు. బయలు దేవతను పూజించేందుకు తన తండ్రి నిర్మించిన స్తంభాన్ని అతడు తొలగించాడు. కాని నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను అతడు చేశాడు.
2KI 3:3 యరొబాము ఇశ్రాయేలువారిని పాపములు చేసేటట్లు చేశాడు. యెహోరాము యరొబాము చేసిన పాపాలను ఆపలేకపోయాడు.
2KI 3:4 మోయాబు రాజు మేషా. మేషావద్ద చాలా మేకలుండెను. మేషా 1,00,000 గొర్రెల ఉన్నిని 1,00,000 గొర్రె పొట్టేలుల ఉన్నని ఇశ్రాయేలు రాజుకి ఇచ్చాడు.
2KI 3:5 కాని అహాబు మరణించిన తర్వాత, మోయాబు రాజు ఇశ్రాయేలు రాజ్యపరిపాలనలో నుండి తిరుగుబాటు చేశాడు.
2KI 3:6 తర్వాత యెహోరాము రాజు షోమ్రోను నుండి వెలుపలికి పోయి ఇశ్రాయేలు మనుష్యులందరిని సమీకరించాడు.
2KI 3:7 యెహోరాము యూదారాజైన యెహోషాపాతు వద్దకు దూతలను పంపాడు. యెహోరాము ఇట్లన్నాడు: “మోయాబు రాజు, నా పరిపాలనపై తిరుగబడ్డాడు. మోయాబుతో యుద్ధము చేయడానికి నీవు నాతో కలసెదవా?” యెహోషాపాతు, “అలాగే నేను నీతో కలుస్తాను. మనమిద్దరము ఒక సైన్యమవుదాము. నా ప్రజలు నీ ప్రజలవలె వుంటారు. నా గుర్రములు నీ గుర్రములవలె వుంటాయి.” అని చెప్పాడు.
2KI 3:8 యెహోషాపాతు యెహోరాముతో, “మనము ఏ త్రోవను వెళ్లాలి?” అని అడిగాడు. “మనము ఎదోము ఎడారిద్వారా వెళ్లాలి” అని యెహోరాము సమాధానమిచ్చాడు.
2KI 3:9 అందువల్ల ఇశ్రాయేలు రాజు, యూదా, ఎదోము రాజులతో కలిసి వెళ్లాడు. ఏడు రోజులపాటు వాళ్లు ప్రయాణం చేశారు. తమ సైన్యనానికి గానీ, జంతువులకు గానీ తగినంత నీరు దొరకలేదు.
2KI 3:10 చివరికి ఇశ్రాయేలు రాజు (యెహోరాము) ఇలా చెప్పాడు, “యెహోవా నిజంగానే మన ముగ్గురిని మోయాబు రాజులను ఓడించటానికే ఒకటిగా చేశాడు.”
2KI 3:11 కాని యెహోషాపాతు, “తప్పక యెహోవా యెక్క ఒక ప్రవక్త అక్కడే వున్నాడు. మనమేమి చేయవలెనో యెహోవాని అడగమని మనము ఆ ప్రవక్తను అడుగుదాము” అనిచెప్పాడు. ఇశ్రాయేలు రాజు సేవకుడొకడు, “షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడే వున్నాడు. ఎలీషా ఎలీయా యెక్క సేవకుడు” అనిచెప్పాడు.
2KI 3:12 “యెహోవా మాట ఎలీషాతో ఉన్నది” అని యెహోషాపాతు పలికాడు. అందువల్ల ఇశ్రాయేలు రాజు (యెహోరాము), ఎదోము రాజు మరియు యెహోషాపాతు ఎలీషాని దర్శించటానికి వెళ్లారు.
2KI 3:13 ఇశ్రాయేలురాజు (యెహోరాము)తో ఎలీషా, “నా నుండి నీకేమి కావలెను! నీ తల్లిదండ్రులయొక్క ప్రవక్తల వద్దకు పొమ్ము” అన్నాడు. ఇశ్రాయేలు రాజు ఎలీషాతో, “అలా కాదు. మేము నిన్ను దర్శించుటకే వచ్చాము. మమ్మల్ని మోయాబీయులను ఓడించటానికి మా ముగ్గురి రాజులను దేవుడు ఒకటిగా పిలిచాడు” అని చెప్పాడు.
2KI 3:14 “నేను యూదా రాజయిన యెహోషాపాతును గౌరవిస్తున్నాను. యెహోవా పేరు మీద ప్రయాణం చేసి చెప్తున్నాను. సర్వశక్తిమంతుడైన యెహోవాను నేను సేవిస్తాను. యెహోవా జీవముతోడు యెహోషాపాతు కనుక లేకపోయినచో నేను నిన్ను శ్రద్ధ చేయక నిన్ను పూర్తిగా నిర్లక్ష్యము చేసేవాడిని.
2KI 3:15 కాని ఇప్పుడు వీణ వాయించే వానిని తీసుకొని రమ్ము.” అని ఎలీషా చెప్పాడు. ఆ వ్యక్తి వీణ వాయించగానే, యెహోవా యొక్క శక్తి ఎలీషా మీదికి వచ్చింది.
2KI 3:16 అప్పుడు ఎలీషా, “యెహోవా చెప్పుచున్నది ఇదే. లోయలో రంధ్రాలు చేయండి.
2KI 3:17 యెహోవా చెప్పుచున్నది ఇదే. నీవు పెనుగాలిని చూడవు. నీవు వానను చూడవు. కాని లోయ నీటితో నిండి ఉంటుంది. అప్పుడు నీవు, నీ ఆవులు, జంతువులు తాగటానికి నీరు లభిస్తుంది.
2KI 3:18 ఇది చేయడం యెహోవాకు సులభం మోయాబీయులను ఓడించేలా యెహోవా చేయగలడు.
2KI 3:19 నీవు ప్రతి దృఢమైన నగరముపై మరియు ప్రతి మంచి నగరముపై దాడి చేస్తావు. నీవు ప్రతి మంచి వృక్షాన్ని నరికి వేస్తావు. అన్ని ఊటలను నీవు నిలిపివేయగలవు. నీవు విసిరివేసే రాళ్లతో ప్రతి మంచి స్థలమును నీవు పాడుచేస్తావు” అని పలికాడు.
2KI 3:20 ఉదయాన దేవునికి బలి జరిగే సమయంలో ఎదోము మార్గము నుండి నీరు ప్రవ హించడం ప్రారంభమయ్యింది. లోయనిండింది.
2KI 3:21 మోయాబు లోని ప్రజలు తమతో యుద్ధం చేయడానికి గాను రాజులు వచ్చిన విషయము విన్నారు. కవచములు ధరించడానికి మనుష్యులందరు ఒక్కటిగా వయసు మళ్లిన వారైయున్నారు. వారు సరిహద్దు వద్ద వేచి ఉన్నారు. వారు యుద్ధానికి సిద్ధమయ్యారు.
2KI 3:22 ఆ రోజు ఉదయం వారు పెందలకడనే మేల్కోన్నారు. లోయలోని నీళ్లలో ప్రభాత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అది మోయాబు ప్రజలకు నెత్తురువలె కనిపించింది.
2KI 3:23 “నెత్తురు చూడుడి! రాజులు తమలో తాము పోరాడుకొని వుండవచ్చును. ఒకరి నొకరు నాశనము చేసికొని వుండవచ్చు. మృత శరీరముల నుండి విలువగల వస్తువులు తీసుకొనుటకు గాను మనము వెళ్దాము” అని మోయాబు ప్రజలు చెప్పుకున్నారు.
2KI 3:24 మోయాబు ప్రజలు ఇశ్రాయేలు గుడారము వద్దకు వచ్చారు. కాని ఇశ్రాయేలు వారు వెలుపలికి వచ్చి మోయాబు సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ఇశ్రాయేలు ప్రజల నుండి మోయాబు ప్రజలు పారిపోయారు. ఇశ్రాయేలు వారు మోయాబు దాకా పరుగెత్తుకు పోయి మోయాబు ప్రజలతో యుద్ధం చేశారు.
2KI 3:25 ఇశ్రాయేలు వారు నగరములను ధ్వంసం చేశారు. వారు మోయాబులోని ప్రతి మంచి పట్టణము మీదికి రాళ్లు విసిరివేశారు. నీటి బావులన్నిటినీ పూడ్చి వేసినారు. అన్ని ఊటలను ఆపి వేశారు. అన్ని మంచి చెట్లను నరికివేశారు. కీర్హరెశెతు వరకు వారు యుద్ధం చేస్తు వెళ్లారు. ఇశ్రాయేలు సైని కులు కీర్హరెశెతు చుట్టు ముట్టి, దాని మీద దాడిచేశారు.
2KI 3:26 మోయాబు రాజు ఆ యుద్ధము తనకు కష్టమైనదిగా చూశాడు. అందువల్ల ఖడ్గములు ధరించిన ఏడువందల మంది మనుష్యుల్ని తీసుకొని సైన్యాన్ని ఛేదిండానికి, ఎదోము రాజుని హతమార్చడానికిగాను వెళ్లాడు. కాని వారు ఎదోము రాజుని ఎదుర్కొనలేక పోయారు.
2KI 3:27 తర్వాత మోయాబు రాజు తన పెద్దకొడుకుని వెంట తీసుకొనిపోయాడు. తన అనంతరము రాజు కావలసిన కుమారుడు అతడే. తన కుమారుని ప్రాకారము మీద దహన బలిగా అర్పించాడు. ఇది చూచిన ఇశ్రాయేలీయులు తల కిందులయ్యారు. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాజుని విడిచి తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు.
2KI 4:1 ప్రవక్తల బృందానికి చెందిన ఒకనికి భార్య ఉన్నది. అతడు మరణించాడు. అతని భార్య ఎలీషాతో, “నాభర్తకూడా నీకు ఒక సేవకుడు. ఇప్పుడు నా భర్త మరణించాడు. అతను యెహోవాని గౌరవించెనని నీకు తెలుసు. కాని అతను ఒక మనిషికి అప్పువుండెను. ఇప్పుడా వ్యక్తి నా ఇద్దురు కొడుకులను తీసుకు వెళ్లి వారిని తన బానిసులుగా చేసుకోవలెనని అనుకున్నాడు” అని విన్నవించింది.
2KI 4:2 “నేను నీకెలా సహాయం చేయగలను? మీ ఇంట్లో ఏమున్నదో చెప్పుము” అని ఎలీషా అడిగినాడు. ఆమె, “మా ఇంట్లో ఏమీ లేదు. ఒలీవ నూనెగల ఒక జాడీ వున్నది” అని బదులు చెప్పింది.
2KI 4:3 అప్పుడు ఎలీషా, “వెళ్లి మీ ఇరుగు పొరుగు వారి వద్ద నుంచి పాత్రలు అడిగి తీసుకొనిరా. అవి ఖాళీగా ఉండాలి. చాలా పాత్రలు అడిగి తీసుకో.
2KI 4:4 తర్వాత మీ ఇంటికి పోయి తలుపులు మూసుకో. నీవు నీ కుమారులు మాత్రం ఇంటిలో వుర డాలి. అటు తర్వాత నూనెను ఆ పాత్రలో పోయుము. వాటిని వేరే ఒక చోట ఉంచుము” అని చెప్పాడు.
2KI 4:5 అందువల్ల ఆ స్త్రీ ఎలీషాని విడిచి తన ఇంటిలోకి వెళ్లి తలుపులు మూసుకొనినది. ఆమెయు తన కొడుకులు మాత్రమే ఇంట్లోవున్నారు. ఆమె కుమారులు పాత్రలు తెచ్చారు. ఆమె వాటిలో నూనె పోసింది.
2KI 4:6 ఆమె చాలా పాత్రలు నింపింది. చివరికి, “మరొక పాత్ర తీసుకొని రమ్ము” అని తన కొడుకుతో చెప్పింది. కాని అన్ని పాత్రలు నిండిపోయివున్నాయి. ఒక కుమారుడు ఆమెతో, “ఇక పాత్రలులేవు” అని చెప్పాడు. ఆ సమయంలో జాడీలోని నూనె కూడ పూర్తి అయింది.
2KI 4:7 ఏమి జరిగిందో, అప్పుడు ఆ స్త్రీ ఎలీషాతో చెప్పింది. ఎలీషా ఆమెతో అన్నాడు, “వెళ్లు, నూనెను అమ్మి నీ అప్పు తీర్చి వేయి. నీవు నూనెను అమ్మిన తర్వాత, నీ అప్పును తీర్చిన తర్వాత నీవు నీ కుమారులు మిగిలిన పైకంతో జీవించగలుగుతారు.”
2KI 4:8 ఒకరోజు ఎలీషా షూనేము వెళ్లాడు. ఒక ముఖ్యమైన స్త్రీ షూనేములో నివసిస్తున్నది. ఈ స్త్రీ తన ఇంట విశ్రమించి భోజనం చేయమని ఎలీషాను కోరింది. కనుక ఆ ప్రదేశం మీదుగా ఎలీషా వెళ్లిన ప్రతిసారి అక్కడ ఆగి భోజనం చేసేవాడు.
2KI 4:9 ఆ స్త్రీ తన భర్తతో, “ఇదుగో, నాకు ఎలీషా దేవుని పవిత్ర వ్యక్తిగా గోచరిస్తున్నాడు. ఎప్పుడూ అతను మన ఇంటి మీదుగా వెళ్తాడు.
2KI 4:10 ఎలీషా కోసం మనము ఇంటి పై భాగాన ఒక గదిని కట్టిద్దాము. ఆ గదిలో ఒక మంచము కూడా అమర్చుదాము. అక్కడ ఒక మేజాబల్ల, ఒక కుర్చీ, ఒక దీపం ఉంచుదాము. ఎప్పుడైతే అతను మన ఇంటికి వస్తాడో అప్పుడు దీనిని అతను తన గదిగా వాడుకోవచ్చు” అని చెప్పింది.
2KI 4:11 ఒక రోజు ఎలీషా ఆమె ఇంటికి వచ్చాడు. అతను ఆ గదికి వెళ్లి, అక్కడ విశ్రమించాడు.
2KI 4:12 ఎలీషా తన సేవకుడైన గేహజీతో, “ఆ షూనేము స్త్రీని పిలువుము” అని చెప్పాడు. సేవకుడు షూనేము స్త్రీని పిలిచాడు. ఆమె ఎలీషా ఎదుట నిలిచింది.
2KI 4:13 ఎలీషా తన సేవకునితో ఇట్లనెను: “ఇప్పుడీమెకు చెప్పుము. మాకోసం నీవు చేయదగినంతా చేశావు. నీ కోసం మేమేమి చేయుదుము? మేము నీ పక్షమున రాజుతో గాని, సైన్యం యొక్క నాయకునితో గాని ఏమైనా చెప్పమంటావా?” ఆ స్త్రీ, “నేను నా ప్రజల మధ్య హాయిగా ఇక్కడ నివసిస్తున్నాను” అని బదులు చెప్పింది.
2KI 4:14 “మనమామెకు ఏమి చేద్దాం?” అని ఎలీషా గేహజీని అడిగాడు. “ఆమెకు కొడుకు లేడని నాకు తెలియును. ఆమె భర్త ముసలివాడు” అని ప్రత్యుత్తర మిచ్చాడు.
2KI 4:15 అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువుము” అన్నాడు. అందువల్ల గేహజీ ఆమెను పిలుచుకొని వచ్చాడు. ఆమె వచ్చి అతని ఎదుట నిలబడింది.
2KI 4:16 ఎలీషా ఆమెతో, “వచ్చే వసంత కాలంలో, ఈ పాటికి నీవు నీ సొంత మగ బిడ్డను కౌగిలించుకుని ఉందువు” అన్నాడు. ఆ స్త్రీ, “కాదు దైవజనుడా! నాతో అబద్ధం చెప్పకు” అని చెప్పింది
2KI 4:17 ఆమె గర్భవతి అయింది. ఎలీషా చెప్పినట్లుగా, తరువాత వసంత ఋతువులో ఆమె ఒక కుమారుని ప్రసవించింది.
2KI 4:18 ఆ పిల్లవాడు పెరిగాడు. ఒకరోజు అతను కంకుల్ని కోస్తున్న తన తండ్రిని పనివారిని చూసేందుకు పొలం లోకి వెళ్లాడు. ఆ పిల్లవాడు
2KI 4:19 తండ్రి చూచి, “అయ్యో, నా తల, నా తల పగిలిపోతున్నది” అన్నాడు. “అతనిని ఆ తల్లి వద్దకు ఎత్తుకొని వెళ్లండి” అని తండ్రి తన సేవకునికి చెప్పెను.
2KI 4:20 సేవకుడు ఆపిల్లవానిని అతని తల్లి వద్దకు తీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం దాకా పిల్లవాడు తల్లి తొడమీద కూర్చొని వున్నాడు. తర్వాత ఆపిల్లవాడు మరణించాడు.
2KI 4:21 దైవజనుడైన (ఎలీషా) పడకమీద ఆమె తన పిల్లవానిని ఉంచి ఆమె ఆ గది తలుపు మూసివేసి వెలుపలికి వెళ్లంది.
2KI 4:22 ఆమె తన భర్తను పిలిచి, “ఒక సేవకుని ఒక గాడిదను పంపుము. అప్పుడు నేను దైవజనుని (ఎలీషా) కలుసుకునేందుకు తర్వగా వెళ్లెదను” అని చెప్పింది.
2KI 4:23 ఆమె భర్త, “దైవజనుని (ఎలీషా) వద్దకు నేడెందుకు నీవు వెళ్లుచున్నావు. నేడు అమావాస్య గాని సబ్బాతు రోజుగాని కాదు” అన్నాడు. “ఫరవాలేదు అంతా సక్రమంగానే వుంటుంది” అని ఆమె చెప్పింది.
2KI 4:24 తర్వాత ఆమె గాడిదకు ఒక గంత పరిచింది. ఆ సేవకునితో, మనము తర్వగా వెళదాము, వేగముగా తోలుము, నేను చెప్పేంత వరుకూ నెమ్మదిగా తోలవద్దని చెప్పింది.
2KI 4:25 ఆ స్త్రీ దైవజనుడను (ఎలీషా) చూసేందుకు కర్మెలు పర్వతానికి వెళ్లింది. దైవజనుడు (ఎలీషా) షూనేము స్త్రీ చాలాదూరంనుండి వస్తుండగా చూశాడు.ఎలీషా తన సేవకుడైన గేహజీతో చెప్పాడు “చూడు ఆమె షూనేము స్త్రీ,
2KI 4:26 ఇప్పుడే పరుగెత్తుకుని వెళ్లు, ఆమెను కలుసుకునేందుకు, ‘ఏమి కష్టం? నీవు సరిగా వున్నావా? నీ భర్త సరిగా వున్నడా? నీ బిడ్డ సరిగావున్నాడా? అని ఆమెను కలుసుకొని అడుగుము.’” గేహజీ ఆ విధంగా ఆ షూనేము స్త్రీని అడిగాడు. ఆమె, “అంతా క్షేమము” అని చెప్పింది.
2KI 4:27 కాని ఆ షూనేము స్త్రీ దైవజనుని కోసం కొండ మీదికి వెళ్లి క్రిర దికి వంగి ఎలీషా పాదాలు తాకింది. గేహజీ ఆమెను పక్కకు తొలగించాలని ఆమె దగ్గరికి వచ్చాడు. కాని దైవజనుడు (ఎలీషా) గేహజీని చూచి, “ఆమెను ఉండనీ. ఆమె చాలాబాధగా ఉన్నది. ఆ సంగతి నాకు యెహోవా చెప్పలేదు. యెహోవా ఈ విషయం నాకు చెప్పక దాచాడు.” అని పలికాడు.
2KI 4:28 అప్పుడు షూనేము స్త్రీ, “అయ్యా నాకు కొడుకు కావలయనని నేను చెప్పలేదు గదా. నన్ను మోసం చెయవద్దు” అన్నాను, అని అనగా
2KI 4:29 వెంటనే గేహజీతో, ఎలీషా, “నీవు ఆమెతో వెళ్లడానికి సిద్ధంగా వుండుము. నా చేతికర్ర తీసుకుని వెళ్లుము. ఎవరితోను మాటలాడుటకు ఆగవద్ద. ఎవరినైనా నీవు కలుసుకుంటే, అతనితో నమస్కారము అనికూడా చెప్పకుము. ఒకవేళ ఎవరైన నీకు, ‘నమస్కారము’ అన్నట్లుయితే, అతనికి బదులు చెప్పకుము. నా చేతి కర్రను బిడ్డ ముఖమున ఉంచుము” అని చెప్పాడు.
2KI 4:30 కాని ఆబిడ్డ తల్లి, “నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. యెహోవా జీవంతోడు, నీ జీవం తోడు నీవు రాకుండా నేను వెళ్లను” అంది. అందువల్ల ఎలీషా లేచి, షూనేము స్త్రీని అనుసరించాడు.
2KI 4:31 ఎలీషా మరియు షూనేము స్త్రీ చేరుకునేందుకు ముందుగా, గేహజీ షూనేము స్త్రీ ఇల్లు చేరుకున్నాడు. ఆబిడ్డ ముఖము మీద ఆకర్రను ఉంచాడు. కాని బిడ్డ మాటలాడలేదు. ఏమియు వినిపించిన జాడ కూడా తెలియరాలేదు. అప్పుడు గేహజీ ఎలీషాని కలుసు కోవడానికి వెలుపలికి వచ్చాడు. “బిడ్డ లేవడు” అని గేహజీ ఎలీషాకి చెప్పాడు.
2KI 4:32 ఎలీషా ఇంట్లోకి వెళ్లాడు. తన మంచం మీద ఆ బిడ్డ చనిపోయివున్నాడు.
2KI 4:33 ఎలీషా గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. ఇప్పుడు ఎలీషా మరియు ఆబిడ్డ మాత్రమే గదిలో వున్నారు. అప్పుడు ఎలీషా యెహోవాని ప్రార్థించాడు.
2KI 4:34 ఎలీషా పడక వద్దకు వెళ్లాడు. బిడ్డ మీద పడుకున్నాడు. ఎలీషా తన నోటిని బిడ్డ నోటిమీద వుంచాడు. ఎలీషా తన కండ్లను బిడ్డ కండ్ల మీద వుంచాడు. తరువాత బిడ్డ దేహం వేడి ఎక్కేంత వరకు బిడ్డమీద ఎలీషా పండుకొన్నాడు.
2KI 4:35 తర్వాత ఎలీషా లేచి ఆ గది చుట్టూ తిరిగాడు. వెనుకకు వెళ్లి, బిడ్డ ఏడు సార్లు తుమ్మేంత వరకూ కళ్లు తెరిచేంతవరకూ బిడ్డ మీద పండుకొన్నాడు.
2KI 4:36 ఎలీషా గేహజీని పిలిచి, “ఆ షూనేము స్త్రీని పిలువుము” అని చెప్పాడు. గేహజీ షూనేము స్త్రీని పిలచాడు. ఆమె ఎలీషా వద్దకు వచ్చింది. “నీ కొడుకుని ఎత్తుకో” అని ఎలీషా చెప్పాడు.
2KI 4:37 తర్వాత షూనేము స్త్రీ గదిలోకి వెళ్లి, ఎలీషా పాదాలకు మోకరిల్లింది. ఆ తర్వాత తన పిల్లవాడిని ఎత్తుకుని ఆమె వెలుపలికి వెళ్లింది.
2KI 4:38 ఎలీషా మరల గిల్గాలుకు వెళ్లాడు. అప్పుడా ప్రదేశంలో ఆకలి ఎక్కువగా వుంది. ప్రవక్తల బృందం ఎలీషా ముందు కూర్చున్నారు. ఎలీషా తన సేవకునితో, “పెద్ద కుండను నిప్పుమీద ఉంచుము. ప్రవక్తల బృందానికి కూర తయారుచేయి” అని చెప్పాడు.
2KI 4:39 ఒక వ్యక్తి మూలికలు తీసుకు వచ్చేందుకు పొలం వెళ్లాడు. అతను పిచ్చి ద్రాక్ష చూసి దాని కాయలు తీసుకు వచ్చాడు. ఆకాయలు తన ఒడిలో కట్టుకుని తీసుకుని వచ్చాడు. అతను ఆ కాయలను ముక్కలు చేసి కుండలో వేశాడు. కాని అది ఏరకపు ఫలమో ప్రవక్తల బృందానికి తెలియదు.
2KI 4:40 తర్వాత వారు మనష్యులకు కొంచెం కూర తినడానికి వడ్డించారు. కాని వారు కూర తినడానికి ప్రారంభించాగా, ఎలీషాని పిలిచి, “దైవజనుడా! కుండలో విషం ఉన్నది” అని అన్నారు. ఆ కూర విషంలా వుంది. అందువల్ల అది వారు తినలేకపోయారు.
2KI 4:41 అప్పుడు ఎలీషా, “కొంచెం పిండి తీసుకురండి” అన్నాడు. వారు పిండిని ఎలీషా వద్దకు తీసుకు వచ్చారు. దాన్ని అతను కుండలో వేసి. “మనష్యులకు ఆ కూర వడ్డించండి. వారు భుజిస్తారు” అని ఎలీషా చెప్పాడు. ఆకూరలో ఎలాంటి దోషం లేదు.
2KI 4:42 బయల్షాలిషా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు మొదట పంటవల్ల లభించిన (ఎలీషా) ఇరవై యవల రొట్టెలు, క్రొత్త ధాన్యపు కంకులను, కొన్ని పండ్లను దైవజనునికి ఇచ్చాడు. ఏలీషా అప్పుడు, “వీటని వారికి ఆహారంగా ఇవ్వండి” అన్నాడు.
2KI 4:43 ఎలీషా సేవకుడు, “ఏమిటి? ఇక్కడ వంద మంది ఉన్నారు. నేను వారందరికీ ఈ ఆహారం ఎలా ఇవ్వగలను?” అని అన్నాడు. కాని ఎలీషా, “వారు తినడానికిగాను అది ఇమ్ము. వారది భుజిస్తారు. ఇంకా కొంచెం ఆహారం మిగులు తుంది అని యెహోవా చెప్పాడు” అన్నాడు.
2KI 4:44 అప్పుడు ఎలీషా సేవకుడు ఆ ఆహారమును ప్రవక్తల ముందుంచాడు. ప్రవక్తల బృందం తినడానికి తగినంత ఆహారం ఉండి, పైగా ఇంకా ఆహారం మిగిలి పోయింది. యెహోవా చెప్పినట్లుగానే ఇది జరిగింది.
2KI 5:1 సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమాను. రాజుకి అతడు అతి ముఖ్యుడు. ఎందుకనగా, యెహోవా అతనిని ఉపయోగించుకొని సిరియా విజయం సాధించేలా చేశాడు. నయమాను మహాశక్తి మంతుడు, గొప్పవాడు. కాని కుష్ఠువ్యాధి వలన అతను బాధ పడుతూ ఉన్నాడు.
2KI 5:2 ఇశ్రాయేలులో యుద్ధం చేయాడానికై సిరియను సైన్యం అనేక బృందాల సైనికులను పంపింది. ఇశ్రాయేలీయులను వారి బానిసలుగా గ్రహించారు. ఒక సారి వారు ఇశ్రాయేలునుంచి ఒక అమ్మాయిని తీసుకువచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు సేవకురాలుగా, ఉంది.
2KI 5:3 ఆ అమ్మాయి నయమాను భార్యతో ఇలా చెప్పింది: “నా యజమాని (నయమాను) ప్రవక్తయైన ఎలీషాను కలుసుకోవాలిని నా కోరిక. ఎలీషా షోమ్రోను నివాసి. ఆ ప్రవక్త నయమాను కుష్ఠవ్యాధిని బాగుచేయగలడు.”
2KI 5:4 నయమాను తన యజమాని (సిరియారాజు) వద్దకు వెళ్లాడు. సిరియా రాజుకి ఆ అమ్మాయి చెప్పిన విషయలు నయమాను తెలిపాడు.
2KI 5:5 అప్పుడు సిరియా రాజు, “అయితే ఇప్పుడే వెళ్లు. నేను ఇశ్రాయేలు రాజుకి ఒక లేఖ పంపుతాను” అన్నాడు. అందువల్ల నయమాను ఇశ్రాయేలుకి వెళ్లాడు. నయమాను కొన్ని కానుకలు తీసుకు వెళ్లాడు. ఏడువందల పౌనుల వెండి, అరు వేల బంగారం ముక్కలు మరియు పది దుస్తులు నయమాను తీసుకువెళాడు.
2KI 5:6 సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఇచ్చిన లేఖ కూడా తీసుకు వెళ్లాడు. ఆ లేఖలో ఇలా వుంది: “… నేను ఇప్పుడు నా సేవకుడైన నయమానుని నీ వద్దకు పంపుతున్నాను. అతని కుష్ఠవ్యాధిని నివారించుము.”
2KI 5:7 ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే, తాను తలక్రిందులై నానని విచారంగా ఉన్నానని తెలిపేందుకు తన దుస్తులు చింపివేశాడు. ఇశ్రాయేలు రాజు, “నేను దేవుడినా? కాదు. జీవ మరణాల మీద నాకు శక్తిలేదు. అందువల్ల సిరియా రాజు కుష్ఠవ్యాధితో బాధపడే ఒకనిని స్వస్థపరుచుటకు నా వద్దకు ఎందుకు పంపినట్లు? దానిని గురించి ఆలోచించుము. అది ఒక మాయోపాయమని తెలియుచున్నది. సిరియా రాజు యద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు” అని చెప్పాడు.
2KI 5:8 ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు తెలిసినపుడు ఈ క్రింది సందేశాన్ని రాజు పంపాడు: “మీరు మీ దుస్తులు ఎందుకు చింపివేసుకోన్నారు? నయమానుని నా వద్దకు పంపండి. అప్పుడుతను ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నటు తెలుసు కుంటాడు.”
2KI 5:9 ఈ కారణంగా నయమాను తన గుర్రాలతోను రథాలతోను ఎలీషా ఇంటికి వచ్చాడు. తలుపుకి వెలుపల నుంచున్నాడు.
2KI 5:10 ఎలీషా ఒక దూతను నయమాను వద్దకు పంపాడు. ఆదూత, “వె ళ్లి. ఏడు మారులు యోర్దాను నదిలో స్నానం చేయుము. అప్పుడు నీ చర్మం నయమవుతుంది. నీవు పరిశుద్ధుడవు అవుతావు, శుభ్రపడతావు” అన్నాడు.
2KI 5:11 నయమాను కోపపడి, వెళ్లిపోయాడు. అతను, “ఎలీషా కనీసం వెలుపలికి వచ్చి నా యెదుట నిలబడి తన దేవుడైన యెహోవాని పిలుస్తాడనుకున్నాను. నా ముందర చేయి ఆడించి మరి నా కుష్ఠువ్యాధి బాగుచేస్తాడని ఆశించాను.
2KI 5:12 దమస్కు నదులైన అబానా, ఫర్పరులు ఇశ్రాయేలులోని అన్ని జలాల కంటె మంచివి. నేనెందుకు దమస్కులోని ఆ నదులలో స్నానం చేసి శుద్ధణ్ని కాకూడదు!” అని అనుకొని నయమాను మహోగ్రుడయి కోపంతో వెళ్లిపోయాడు.
2KI 5:13 కాని నయమాను సేవకులు అతనిని సమీపించి అతనితో మాట్లాడారు. వారు ఈ విధంగా అన్నారు: “తండ్రీ ప్రవక్త మిమ్మల్ని ఒక కష్టమైన విషయం చెయ్య మని చెప్పగా, ఆ విధంగా చేయాలి అంతేనా? మీతో సులభమైన పని చెప్పనా, అది కూడా పాటించాలి. ఆయన చెప్పిందేమనగా, కడుగుకొనుము నీవు పరిశుద్ధడవయ్యేదవు.”
2KI 5:14 అందువల్ల దైవజనుడు ఎలీషా చెప్పినట్లుగా నయమాను ఆచరించాడు. నయమాను యోర్దాను నది లోపలికి వెళ్లి ఏడు సార్లు మునిగినాడు. వెంటనే నయమాను పరిశుద్ధడయ్యాడు. నయమాను చర్మం పసిపిల్లవాని చర్మంవలె మృదువుగా వుంది.
2KI 5:15 నయమాను మరియు అతని బృందంవారు దైవజనుడు (ఎలీషా) వద్దకు వచ్చారు. ఎలీషా ఎదుట అతను నిలబడి, “ఇదుగో, ఇశ్రాయేలులో తప్ప యీ ప్రపంచంలో మరెచ్చట కూడా దేవుడు లేడని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు నా కానుకను స్వికరింపుము” అని పలికాడు.
2KI 5:16 కాని ఎలీషా, “నేను యెహోవాను సేవిస్తున్నాను. యెహోవా జీవముతోడు, నేను ఎట్టి కానుకను స్వీకరింపనని వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు. నయమాను క ష్టతరంగా అతనిని సముదా యించుటకు ప్రయత్నించాడు. కాని ఎలీషా తిరస్కరించాడు.
2KI 5:17 అప్పుడు నయమాను, “ఈ కానుకను కనుక నీవు స్వీకరించపోతే, కనీసం ఇదైనా నా కోసం చేయుము. నారెండు కంచర గాడిదలు మీది గంపలను ఇశ్రాయేలు దేశపు మన్నులో నింపుటకు అనుమతింపుము. ఎందుకనగా, ఇతర దేవతలకు నేను ఎన్నటికీ ఎటువర టి బలులు సమర్పించను, యెహోవాకి మాత్రమే సమర్పిస్తాను.
2KI 5:18 ఇది చేయడం వల్ల నన్ను యెహోవా క్షమించునట్లు యెహోవాని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో, నా యజమాని (సిరియా రాజు) రిమ్మోను ఆలయం లోకి వెళ్లి అసత్య దేవతలను పూజిస్తాడు. రిమ్మోను ఆరాధన జరుగునప్పుడు నా సహాయము కొరకు రాజు నా మీద ఆధారపడి వుంటాడు. అందువల్ల నేను రిమ్మోను ఆలయంలో మోకరిల్లుతాను. అలా జరిగినప్పుడు నన్ను క్షమింపుమని యెహోవాని వేడుకొనుచున్నాను” అని పలికాడు.
2KI 5:19 “నెమ్మదికలిగి వెళ్లుము” అని ఎలీషా నయమానుకి చెప్పాడు. అందువల్ల నయమాను ఎలీషాని విడిచి కొంతదూరం వెళ్లాడు.
2KI 5:20 కాని దైవజనుడు అయిన ఎలీషా సేవకుడు గేహజీ, “నా యజమాని (ఎలీషా) సిరియనుండయిన నయమానుని వెళ్లనిచ్చాడు. కాని అతడు తెచ్చిన కానుకను స్వీకరించలేదు. యెహోవా జీవము తోడుగా వెనుకనే నేను పరిగెత్తుకుపోయి, అతని వద్దనుంచి ఏదైనా తీసుకువస్తాను” అని అనుకున్నాడు.
2KI 5:21 అందువల్ల గేహజీ నయమాను వద్దకు పరుగెత్తుకు వెళ్లాడు. తన వెనుక ఎవరో పరిగెత్తుకుని వస్తున్నట్లు నయమాను గ్రహించి. అతను తన రథం దిగి గేహజీని కలుసుకుని, “అంతా సవ్యంగా వుందిగదా” అని నయమాను అడిగెను.
2KI 5:22 “అవును. అంతా సవ్యంగానే వుంది. నా యజమాని (ఎలీషా) నన్ను పంపాడు. ఇద్దరు యువకులు నావద్దకు వచ్చారనీ, కొండ దేశమైన ఎఫ్రాయిము నుంచి ప్రవక్తల బృందానికి వారు చెందిన వారనీ, వారికి డెభైఐదు పౌన్లు వెండి మరియు రెండురకాల దుస్తులు ఇమ్మని ఆయన చెప్పాడు” అని గేహజీ చెప్పాడు.
2KI 5:23 “అయ్యా, నూట ఏభై పౌన్లు తీసుకోండి” అని నయమాను చెప్పాడు. గేహజీ ఆ వెండిని తీసుకునేందుకు నయమాను అతనిని ఒప్పించాడు. నయమాను నూట ఏభై పౌన్లు వెండిని రెండు సంచులలో వేసి, రెండు రకాల దుస్తులు కూడా తీసుకున్నాడు. తర్వాత ఆ వస్తువుల్ని నయమాను తన సేవకులిద్దిరకి ఇచ్చాడు. గేహజీ కొరకు వారు ఆ వస్తువులను మోసుకు వెళ్లారు.
2KI 5:24 గేహజీ కొండ వద్ద రాగేనే, ఈ వస్తువులను అతని సేవకుల వద్దనుంచి తీసుకుని, గేహజీ ఆ సేవకులను పంపివేశాడు. వారు వెళ్లిపోయారు. తర్వాత గేహజీ ఆ వస్తువులను ఇంట్లో దాచాడు.
2KI 5:25 గేహజీ తన యజమాని అయిన ఎలీషా యెదుట నిలబడ్డాడు. గేహజీతో ఎలీషా, “గేహజీ, నీవు ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు. “నేనెక్కడికీ వెళ్లలేదు” అనిగేహజీ చెప్పాడు.
2KI 5:26 “ఇది నిజం కాదు నిన్ను కలుసుకునేందుకు నయమాను తన రథంనుంచి క్రిందికి దిగినప్పుడు నా హృదయం నీతో వున్నది. పైకం, వస్త్రాలు, ఒలివలు, ద్రాక్షలు, గొర్రెలు, ఆవులు లేక స్త్రీ పురుష సేవకులు మొదలైనవి తీసుకునేందుకు ఇది సమయం కాదు.
2KI 5:27 ఇప్పుడు నీకు, నీ వంశానికి నయమాను వ్యాధి సంక్రమిస్తుంది. ఎల్లప్పుడూ నీకు కుష్ఠవ్యాధి వుంటుంది” అని ఎలీషా గేహజీతో చెప్పాడు. ఎలీషాని విడిచి గేహజీ వెళ్లగానే, గేహజీ శరీరం మంచువలె తెల్లగా కనిపించింది. గేహజీకి కుష్ఠవ్యాధి కలిగింది.
2KI 6:1 ప్రవక్తల బృందం ఎలీషాతో ఇలా చెప్పింది: “మేమా ప్రదేశంలో నివసిస్తున్నాము. కాని మాకది చాలా చిన్నదిగా వుంది.
2KI 6:2 యోర్దాను నదివద్దకు వెళ్లి, అడవిలో చెట్లు నరుకుదాము. మనలో ప్రతి ఒక్కరికి ఒక దూలము లభిస్తుంది. అక్కడ నివాసయ్యోగ్యమైన ఇల్లు నిర్మించుకుందాము.” “బాగుంది అలాగే కానివ్వండి” అని ఎలీషా బదులు చెప్పాడు.
2KI 6:3 “మాతో మీరు రండి” అని ఒకడనెను. ఎలీషా “బాగుంది, నేను కూడా మీతో వస్తాను” అని చెప్పాడు.
2KI 6:4 అందువల్ల ఎలీషా ప్రవక్తల బృందంతో పాటు వెళ్లాడు. వారు యోర్దాను నది వద్దకు చేరుకుని కొన్ని చెట్లు నరకసాగారు.
2KI 6:5 కాని ఒక వ్యక్తి ఒక చెట్టు నరికేటప్పుడు, చేతినుండి గొడ్డలి జారిపోయి నీళ్లలో పడింది. అప్పుడతను, “యజమానీ, నేను ఆ గొడ్డలి చేబదులుగా తెచ్చాను” అని అరిచాడు.
2KI 6:6 దైవజనుడైన ఎలీషా, “అది ఎక్కడ పడింది” అని అడిగాడు. గొడ్డలి పడిన చోటును అతను ఎలీషాకు చూపాడు. అప్పుడు ఎలీషా ఒక కొమ్మ నరికి, కర్రను నదిలోకి విసిరివేసేను. ఆ కొమ్మ ఇనుప గొడ్డలి నీళ్లలో తేలునట్లు చేసింది.
2KI 6:7 “గొడ్డలి పైకి తీసుకో” అని ఎలీషా చెప్పాడు. అప్పుడా వ్యక్తి గొడ్డలిని తీసుకున్నాడు.
2KI 6:8 సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని తన సైనికోద్యోగులతో ఆయన సమాలో చన చేస్తున్నాడు. “ఈ చోట దాక్కుని ఇశ్రాయేలు వారు వచ్చినప్పుడు వారిని ఎదుర్కోనండి” అని అతను చెప్పాడు.
2KI 6:9 కాని దైవజనుడు అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకి ఒక సందేశం పంపాడు. ఎలీషా ఇట్లన్నాడు: “జాగ్రత్తగా వుండండి. ఆ స్థలంగుండా పోవద్దు! సిరియా సైనికులు అక్కడ దాగుకొని వున్నారు”
2KI 6:10 ఇశ్రాయేలు రాజు తన మనుష్యులకు సందేశం పంపుతూ దైవజనుడు (ఎలీషా) తనకు హెచ్చరిక చేశాడని తెలియపరిచాడు. ఇశ్రాయేలు రాజు పలువురిని కాపాడగలగాడు.
2KI 6:11 ఇందువల్ల సిరియా రాజు తలక్రిందులయ్యాడు. తన సైనికోద్యోగుల్ని సమావేశ పరచి వారితో, “ఇశ్రాయేలు రాజుకోసం గూఢచారి పని చేస్తున్నదెవరో చెప్పండి” అని అడిగాడు.
2KI 6:12 సిరియా రాజు అధికారులలో ఒకడు, “ప్రభూ, రాజా, మాలో ఎవ్వరమూ గూఢాచారులము కాము. ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకు అనేక రహస్య విషయాలు చెప్పగలడు. మీరు నిద్రించే గృహంలో మీరు మాట్లాడే మాటలు కూడా చెప్పగలడు” అన్నాడు.
2KI 6:13 అప్పుడు సిరియా రాజు, “ఎలీషాని కను గొనండి. అతనిని పట్టుకునేందుకు నేను మనుష్యులను పంపుతాను” అన్నాడు. “ఎలీషా దోతానులో ఉన్నాడు” అని రాజ సేవకులు చెప్పారు.
2KI 6:14 అప్పుడు సిరియా రాజు గుర్రాలు, రథాలు, ఒక పెద్ద సైన్యం దోతానుకు పంపాడు. వారు రాత్రి వేళ చేరి నగరాన్ని చుట్టుముట్టారు.
2KI 6:15 ఆ ఉదయం ఎలీషా సేవకుడు తర్వగా మేల్కోన్నాడు. అతను వెలుపలికి పోయి నగరం చుట్టూ ఒక పెద్ద సైన్యం రథాలు, గుర్రాలు ఉండటం చూశాడు. ఎలీషా సేవకుడు, “నా యజమానీ! మనమేమి చేయగలము” అని ఎలీషాని చూసి అడిగాడు.
2KI 6:16 “భయపడకు, సిరియా కోసం యుద్ధం చేసే సైన్యం కంటె మనకోసం చేసే సైన్యం చాలా పెద్దది” అని ఎలీషా చెప్పాడు.
2KI 6:17 అప్పుడు ఎలీషా ప్రార్థించి ఇలా చెప్పాడు: “యెహోవా, నా సేవకుని కళ్లు తెరిపింపుము. అప్పుడతను చూడగలడు.” యెహోవా ఆ యువకుని కళ్లు తెరిపించాడు. మరియు సేవకుడు కొండ చుట్టూ అగ్నిరథాలు గుర్రాలు వుండటం చుశాడు. అవి ఎలీషా చుట్టూ ఉన్నాయి.
2KI 6:18 ఈ అగ్నిరథాలు గుర్రాలు ఎలీషాకోసం క్రిందికిదిగి వచ్చాయి. ఎలీషా యెహోవాను ప్రార్థించాడు. “ఈ మనష్యులను అంధులను చేయవలసిందిగా నిన్ను ప్రార్థించుచున్నాను” అన్నాడు. ఎలీషా ప్రార్థించిన ప్రాకారం యెహోవా చేశాడు. సిరియా సైనికులు అంధులగునట్లు యెహోవా చేశాడు.
2KI 6:19 సిరియా సైనికులను వుద్దేశించి ఎలీషా, “ఇది సరి అయిన మార్గం కాదు. ఇది సరి అయిన నగరం కాదు. నన్ను అనుసరించండి. మీరు ఎవరుకోసం వెతుకుతున్నారో నేను అతని వద్దకు మిమ్మలను తీసుకుని వెళతాను” అన్నాడు. తర్వాత ఎలీషా సిరియా సైన్యాన్ని షోమ్రోనుకు నడిపించాడు.
2KI 6:20 వారు షోమ్రోనుకు చేరుకోగానే, “యెహోవా, వీరి కళ్లు తెరిపించుము. అప్పుడు వారు చూడగలగు తారు” అని ఎలీషా ప్రార్థించాడు. అప్పుడు యెహోవా వారి కళ్లు తెరిపించాడు.
2KI 6:21 తామప్పుడు షోమ్రోను నగరంలో వునన్నట్లుగా సైనికులు చూశారు. ఇశ్రాయేలు రాజు సిరియా సైన్యాన్ని చూశాడు. ఎలీషాతో ఇశ్రాయేలు రాజు, “తండ్రి వారిని నేను చంపనా,” అని అడిగాడు.
2KI 6:22 “నీ ఖడ్గముతో, విల్లమ్ములతో నీవు యుద్ధంలో పట్టుకున్న ఈ మనుష్యులను నీవు చంపగోరుచున్నావా? సిరియా సైనికులకు రొట్టెలు మంచినీళ్లు ఇమ్ము. వారిని తిని త్రాగనిమ్ము. తర్వాత వారు వారి దేశానికి యజమాని వద్దకు వెళ్తారు” అని ఎలీషా చెప్పాడు.
2KI 6:23 ఇశ్రాయేలు రాజు సిరియా సైన్యానికై చాలా ఆహారం తయారు చేయించాడు. ఆ సైనికులు తిన్నారు, త్రాగారు. తర్వాత ఇశ్రాయేలు రాజుసిరియా సైనికులను వారి దేశానికి పంపించాడు. సిరియా సైనికులు వారు యజమాని వద్దకు వెళ్లారు. సిరియా వారు దాడి చేయడానికై సైనికులెవరినీ ఇశ్రాయేలుకి పంపలేదు.
2KI 6:24 ఇది జరిగిన తర్వాత, సిరియా రాజుయిన బెన్హదదు తన సర్వసైన్యాన్ని సమీకరించి షోమ్రోను నగరాన్ని చుట్టుముట్టి దాడి చేయడానికి వెళ్లాడు.
2KI 6:25 నగరంలోకి ప్రజలు ఆహారం తీసుకురాకుండా సైనికులు చేశారు. అందువల్ల షోమ్రోనులో భయంకరమైన కరవు ఏర్పడింది. అది యెంత కష్టకాలమంటే, ఒక గాడిద తల ఎనభై వెండి రూపాయిలకు మరియు పావురపు పావు రెట్ట ఐదు వెండి రూపాయిలకు అమ్మబడింది.
2KI 6:26 ఇశ్రాయేలు రాజు నగరాన్ని ఆవరించిన ప్రాకారము మీద నడుస్తున్నాడు. ఒక స్త్రీ అతనిని ఉద్దశించి కేక పెట్టింది. “నా ప్రభువా, యజమాని! దయచేసి నాకు సహాయం చెయ్యండి” అని. భయంకరమైన కరవు కాలం షోమ్రోనులో ఏర్పాడుట
2KI 6:27 ఇశ్రాయేలు రాజు, “యెహోవా కనుక సహాయం చేయకపోతే, నేను ఎలా సహాయం చేయగలను? నీకు ఇవ్వదగింది నావద్ద ఏమియులేదు, కళ్లంలో ధాన్యం లేదు. ద్రాక్షరసపు శాలలో ద్రాక్షరసం లేదు.”
2KI 6:28 తర్వాత, “నీకు వచ్చిన కష్టమేమి?” అని ఇశ్రాయేలు రాజు అడిగాడు. ఆస్త్రీ ఇలా బదులు చెప్పింది. “నీవు నీ కుమారుని మాకిచ్చివేయండి. అతనిని చంపి నేడు ఆహారం భుజీస్తాము. ఆ తర్వాత మేము మా కుమారుని రేపు భుజిస్తాము” అని ఈమె చెప్పింది.
2KI 6:29 కాబట్టి మారుణ్ణి ఉడికించి తినేశారు. ఆ మరుసటి రోజు నేను ఆ స్త్రీని ఇలా అడిగాను: “నీవు నీ కుమారుని ఇమ్ము. మేము అతనిని చంపి నేడు భుజిస్తాము. కాని ఆమె తన కుమారుని దానివేసింది.”
2KI 6:30 ఆ స్త్రీ పలుకులు వినగానే, రాజు తాను తలక్రిందులైనానని దుఃఖాన్ని తెలపడానికి తన వస్త్రాలు చింపు కున్నాడు. ఆ గోడమీదుగా రాజు వెళ్తన్నప్పుడు రాజు గోనె పట్ట ధరించాడనీ, అది అతడు తల క్రిందులయన, వ్యసనముయిన స్థతిని తెలుపుతున్నదని ప్రజలు గ్రహించారు.
2KI 6:31 రాజు, “ఈరోజు ఆఖరికి షాపాతు కుమారుడైన ఎలీషా తల కనక అతని దేహం మీద ఉంటే, నన్ను దేవుడు శిక్షించుగాక!” అని చెప్పాడు.
2KI 6:32 ఎలీషా వద్దకు రాజు ఒక దూతను పంపించాడు. ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. మరియు పెద్దలు (నాయకులు) అతనితోపాటు ఉన్నారు. ఆ దూత అక్కడకి చేరుకోవడానికి ముందుగా, పెద్దల్ని ఉద్దేశించి అతను ఇలా అన్నాడు: “చూడండి, ఆ హంతకుని కుమారుడు (ఇశ్రాయేలు రాజు) నా తల నరికి వేసేందుకు మనష్యులను పంపిస్తున్నాడు. ఆ దూత చేరగానే, తలుపు మూసివేయండి తలుపు పట్టుకుని, అతనిని లోపలికి రానివ్వకండి. నేనతని యజమాని అడుగులు అతని వెనుక వస్తున్నట్టు ఆ సవ్వడి మనకు వినిపించునుగదా.”
2KI 6:33 ఎలీషా ఆ పెద్దలతో (నాయకులతో) మాట్లాడు తూండగా, దూత అక్కడికి వచ్చాడు. ఆ సందేశమిది: “యెహోవా నుండి ఈ కష్టం వచ్చింది. ఇంకా యెహోవా కోసం నేనెందుకు వేచివుండాలి.”
2KI 7:1 దేవుని సందేశం వినండి. యెహోవా చెప్పుచున్నాడు. “రేపు ఈపాటికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అది మరల చౌకగా దొరకుతుంది. సమారియా నగర ద్వారం వద్ద ఒక రూపాయికి ఒక సన్నని మేలు రకం పిండి, ఇంకొక రూపాయికి రెండు బుట్టుల (సేరుల) యవలు అమ్మబడును.”
2KI 7:2 తర్వాత రాజుకి దగ్గరగా వున్న అధికారి దేవుని వ్యక్తి ఎలీషాకి సమాధానమిచ్చాడు. “పకలోకపు కిటికీలు యెహోవా తెరిచినా, ఇది జరగదు” అని ఆ అధికారి చెప్పాడు. “నీవు నీకళ్ళతో అది చూడగలవు. కాని ఆ ఆహారం కొంచమైనా నీవు తినలేవు” అని ఎలీషా చెప్పాడు.
2KI 7:3 నగర ద్వారం వద్ద నలుగురు కుష్ఠరోగులుండిరి. వారు ఒకరితో ఒకరు ఇట్లు చెప్పుకున్నారు: “కూర్చుని మరణించాడానికి నిరీక్షిస్తున్నామా?
2KI 7:4 షోమ్రోనులో ఆహారంలేదు. మనము నగరంలోకి వెళితే, మనమక్కడ చనిపోతాము. ఇక్కడ ఉంటే, చనిపోతాము. కనుక మనము సిరియనుల గుడారానికి వెళదాము. వాళ్లు కనుక మనలను అక్కడ ఉండనిస్తే, అప్పుడు మనం బతుకుదాము. వాళ్లు మనలను చంపితే మనము మరిణిద్దాము.”
2KI 7:5 అందువల్ల ఆ సాయంకాలం ఆ నలుగురు కుష్ఠరోగులు సిరియనుల గుడారానికి వెళ్లారు. వారు గుడారం అంచుదాకా వెళ్లారు. అక్కడ మనుష్యులైవ్వరూ లేరు.
2KI 7:6 సిరియనుల గుడారం వారు రథాలు, గుర్రాలు, సైన్యం వస్తున్న సవ్వడిని సిరియనుల సైన్యం వినేలా యెహోవా ఏర్పాటు చేశాడు. అందువల్ల సిరియనుల సైనికులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “ఇశ్రాయేలు రాజు హిత్తీయుల, ఈజీప్టుయుల రాజులను మనకు ప్రతికూలంగా జీతమిచ్చి వాడుకున్నాడు.”
2KI 7:7 ఆసాయంకాలమే సిరియావారు అన్నీ అక్కడే విడిచిపెట్టి పారిపోయారు. వారు తమ గుడారాలు విడిచిపెట్టారు. గుర్రాలు, గాడిదలు మొదలైనవి కూడా విడిచి పెట్టి ప్రాణాలకోసం పారిపోయారు.
2KI 7:8 శిబిరం ప్రారంభమైన చోటికి ఈ కుష్ఠరోగులు వచ్చారు. వారు ఒక గుడారంలోకి వెళ్లారు. వారు తిన్నారు; తాగారు. తర్వాత ఆ కుష్ఠరోగులు వెండి బంగారం వస్త్రాలు మొదలైన వాటిని తీసుకున్నారు. వెండి బంగారాలు వస్త్రాలు వారు దాచివేశారు. తర్వాత వెనక్కి వచ్చి మరొక గుడారంలో ప్రవేశించారు. ఈ గుడారం నుంచి వస్తువులను బయటకి చేరవేశారు. ఈ వస్తువులను కూడా వారు దాచివేశారు.
2KI 7:9 తర్వాత ఈ కుష్ఠరోగులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు: “మనము తప్పు చేస్తున్నాము. నేడు మనకు మంచి వార్త కలదు. కాని మనము మౌనంగా ఉన్నాము. మళ్లీ సూర్యుడు వచ్చేంతవరకు మనము వేచివుంటే, మనము శిక్షింపబడతాము. ఇప్పుడే మనము వెళ్లిపోదాము. రాజు గారి భవనంలో వున్న మనష్యులకు చెపుదాము.”
2KI 7:10 ఆ తరువాత కుష్ఠరోగులు వచ్చి, నగర ద్వారపాలకులతో చెప్పారు: “మేము సిరియావారి శిబిరాలకు వెళ్లాము. కాని మేము ఎవ్వరి గొంతు వినలేదు. అక్కడ ఎవ్వరూ లేరు. గుర్రాలు గాడిదలు ఇంకా కట్టివేయబడివున్నాయి. గుడారాలు అలాగేవున్నాయి. కాని మనుష్యులందురూ వెళ్లిపోయారు.”
2KI 7:11 తర్వాత నగర ద్వారపాలకులు కేకలు వేసి రాజ భవనంలోని వారికి చెప్పారు.
2KI 7:12 అది రాత్రిగడియ. అప్పుడు రాజు పడక నుండి లేచాడు. తన అధికారులతో రాజు, “సిరియా సైనికులు మనకేమి చేస్తున్నారో మీకు చెప్తాను. మనము ఆకలిగా వున్నామని వారికి తెలుసు. పొలాలలో దాగుకొనడానికి వారు విడిదిని విడిచిపెట్టి వెళ్లారు. నగరం వెలుపలికి ఇశ్రాయేలువారు రాగానే, వారిని సజీవంగా మనము పట్టుకోవచ్చు, తర్వాత మనం నగరం ప్రవేశిద్దాము అని వారనుకొంటున్నారు” అని చెప్పాడు.
2KI 7:13 రాజు ఉద్యోగులలో ఒకడు, “నగరంలో ఇంకా మిగిలిన ఐదు గుర్రాలను కొంతమంది పురుషులు తీసుకొని పోనివ్వండి. ఆ గుర్రాలు ఎలాగైన మరణించేవే. నగరంలో ఇంకా మిగిలిన ఇశ్రాయేలువారివలె మరణించేవే, ఈవ్యక్తులను ఏమి జరిగిందో తెలుసుకోడానికి మనము పంపిద్దాము” అని చెప్పాడు.
2KI 7:14 అందువల్ల గుర్రాలు కట్టిన రెండు రథాలను ఆ మనష్యులు తీసుకున్నారు. ఆ మనుష్యులను సిరియను సైన్యము వెనుక పంపాడు. “వెళ్లి ఏమి జరిగిందో చూడండి” అని రాజు చెప్పాడు.
2KI 7:15 యోర్దాను నదిదాకా ఆ మనష్యులు సిరియను సైన్యము వెనుకగా వెళ్లారు. ఆ మార్గమంతటా వస్త్రాలు ఆయుధాలు వున్నాయి. సిరియావారు ఆ వస్తువులను పారిపోయినప్పుడు వదిలి వేశారు. ఆ దూతలు వెనుకకు వెళ్లి షోమ్రోను చేరుకొని రాజుకు చెప్పారు.
2KI 7:16 తర్వాత ఆ ఇశ్రాయేలీయులు సిరియను శిబిరానికి పరిగేత్తుకుని వెళ్లి అక్కడినుండి విలువగల వస్తువులు తీసుకున్నారు. ప్రతి ఒక్కనికి వస్తువులు సమృద్ధిగా వున్నాయి. అందువల్ల యెహోవా చెప్పినట్లుగానే అది జరిగింది. ఒక్క రూపాయికి మేలిరకం పిండి ఒక బుట్టు మరియు ఒక్క రూపాయికి రెండు బుట్టుల యవలు అమ్మబడెను.
2KI 7:17 రాజు తన ఉద్యోగిని సన్నిహితుడయిన వారిని ద్వార సంరక్షణకు ఎంపిక చేసెను. కాని ప్ర జలు విరోధి శిబిరము నుండి వస్తువులను పొందడానికి పరుగెత్తి, వారు ఆ ఉద్యోగిని కిందికి తోసి అతని మీదగా నడిచారు. రాజు దేవుని వ్యక్తి అయిన ఎలీషా ఇంటికి వచ్చినప్పుడు, అతను చెప్పినట్లుగానే ఆ ఉద్యోగి మరిణించాడు.
2KI 7:18 ఎలీషా కూడ ఇలా సూచించాడు: “ఒక్క రూపాయికి మేలిరకం పిండి ఒక బుట్టల మరియు ఒక్కరూపాయికి రెండు బుట్టల యవల అమ్మబడెను. సమారియా నగర ద్వారములవద్దగల అంగడి వీధివద్ద ప్రతివారు కొనగలరు.”
2KI 7:19 కాని ఆ ఉద్యోగి దేవుని వ్యక్తికి చెప్పిన సమాధాన మేమిటంటేః “యెహోవా పరలోకపు కిటికిలు తెరచినా, ఇలా జరగదు” అని. ఎలీషా ఆ ఉద్యోగితో ఇలా చెప్పివుండెను. “నీవు నీ కళ్లతోనే చూడగలవు, కాని నీవు ఆ ఆహారమేమీ భుజింపవు.”
2KI 7:20 ఆ విధంగానే, ఆ ఉద్యోగికి జరిగింది. ప్రజలు ద్వారం దగ్గర అతనిని కిందికి తోసి, అతని మీదగా నడిచారు. అతను మరణించాడు.
2KI 8:1 ఎవరి కొడుకునైతే సజీవునిగా ఎలీషా చేసేనో, ఆ స్త్రీతో ఎలీషా మాటలాడెను. ఎలీషా చెప్పాడు. “నీవు నీ కుటుంబము మరొక దేశానికి వెళ్లాలి. ఎందుకనగా, ఇక్కడ కరువుకాలం ఏర్పాడుతుందని యెహోవా నిశ్చయించినాడు. ఈ విధమైన కరువు ఈ దేశంలో ఏడు సంవత్సరముల పాటు ఉంటుంది.”
2KI 8:2 అందువల్ల ఆ స్త్రీ దేవుని మనిషి చెప్పినట్లుగా చేసింది. తన కుటుంబంతో ఆమె ఫిలిష్తీయుల దేశంలో ఏడేండ్లు ఉండటానికి వెళ్లింది.
2KI 8:3 ఆ ఏడు సంవత్సరములు పూర్తి అయిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంనుంచి తిరిగి వచ్చింది. ఆ స్త్రీ రాజుతో మాట్లడడానికి వెళ్లింది. తన ఇల్లు తన పొలము తనకు చేరునట్లుగా కోరుటకే ఆమె వెళ్లింది.
2KI 8:4 దేవుని వ్యక్తికి (ఎలీషా) సేవకుడైన గేహజీతో రాజు మాట్లాడుతూ ఉన్నాడు. రాజు విధంగా అడిగాడు: “దయచేసి ఎలీషా చేసిన గొప్ప కార్యాలను తెలుపండి.”
2KI 8:5 మృతజీవి ఒకనిని సజీవునిగా ఎలీషా చేసెనన్న విషయాన్ని గేహజీ రాజుకి చెప్పుచున్నాడు. ఆ సమయాన తన కొడుకుని ఎలీషా బ్రతికింపజేసిన ఆ స్త్రీ రాజువద్దకు పోయింది. తన పొలమూ తన యీల్లూ తాను పొందుటకు సహాయం చేయుమని రాజుని అడగటానికి ఆమె వెళ్లింది. గేహాజీ, “నా ప్రభువా, రాజా, ఈమెయే ఆ స్త్రీ. ఇతడే ఎలీషా బ్రతికించిన ఆ కుమారుడు” అని చెప్పాడు.
2KI 8:6 ఏమి కావలెనో చెప్పమని రాజు ఆమెని అడిగాడు. ఆ స్త్రీ రాజుతో చెప్పింది. తర్వాత ఆ స్త్రీ కి సహాయము చేయడానికై రాజు ఒక అధికారిని ఎన్నుకున్నాడు. “ఆమెకున్నదంతా ఆమెకు వచ్చేలా చేయండి. ఆమె దేశం విడిచిపెట్టిన నాటినుంచీ నేటిదాకా కోతలవల్ల ఆమెకు రావలసినదంతా ఇప్పించడి” అని చెప్పాడు.
2KI 8:7 ఎలీషా దమస్కుకు వెళ్లాడు. సిరియా రాజయిన బెన్హదదు జబ్బుతో వున్నాడు. “దేవుని వ్యక్తి ఇచ్చటికి వచ్చాడు.” అని ఒకడు బెన్హదదుకు చెప్పాడు.
2KI 8:8 అప్పుడు బెన్హదదు హజాయేలుతో ఇట్లన్నాడు: “ఒక కానుక తీసుకొని దేవుని వ్యక్తిని కలుసుకొనుము. నేను నా జబ్బునుండి కోలుకొందునో లేదో అతడు యెహోవాని అడగమని అతనితో చెప్పుము.”
2KI 8:9 అందువల్ల హజాయేలు ఎలీషాని కలుసు కొనడానికి వెళ్లాడు. తనతో పాటు హజాయేలు కానుకలు తెచ్చాడు. దమస్కు నుండి అతడు అన్ని రకాల మంచి వస్తువులు తెచ్చాడు. వాటిని మోయడానికి 40 ఒంటెలు కావలసిన వచ్చింది. హజాయేలు ఎలీషా వద్దకు పోయాడు. “నీ అనుచరుడైన సిరియా రాజు నన్ను నీ వద్దకు పంపించాడు. ఆయన జబ్బునుండి కోలు కొనునో లేదో అడగమని, నన్ను పంపెను,” అని హజాయేలు చెప్పాడు.
2KI 8:10 అప్పుడు ఎలీషా, “నీవు బాగుపడెదవని బెన్హదదుతో చెప్పు. కాని నీవు చనిపోదువని నిజముగా యెహోవా నాతో చెప్పాడు.” అన్నాడు.
2KI 8:11 ఎలీషా పైకి క్రిందికి చూడసాగాడు. హజాయేలు ఇబ్బందిలో పడేంతవరకూ అతను చూసెను. దైవజనుడు ఏడవసాగెను.
2KI 8:12 “అయ్యా, మీరెందుకు ఏడుస్తున్నారు?” అని హజయేలు అడిగాడు. “ఇశ్రాయేలు వారికి మీరేమి చెడుపనులు చేయగలరో తెలిసి నేను ఏడుస్తున్నాను. మీరు వారి బలమైన నగరాలను దగ్ధం చేస్తారు. ఖడ్గాలతో మీరు ఆ యువకులను చంపుతారు. వారి పసిపిల్లలను కూడా మీరు హతమారుస్తారు. మీరు వారి గర్భవతులను చీల్చి వేస్తారు” అని ఎలీషా సమాధానం చెప్పాడు.
2KI 8:13 హజయేలు “నేను శక్తిమంతుడను కానని చెప్పాడు. ఈ గొప్ప విషయాలు నేను చేయలేను.” “నీవు సిరియా రాజువి కాగలవని యెహోవా చూపాడు.” అని ఎలీషా సమాధాన మిచ్చాడు.
2KI 8:14 ఆ తర్వాత హజయేలు ఎలీషాని విడిచి తన రాజు వద్దకు వెళ్లాడు. “ఎలీషా నీతో ఏమి చెప్పాడు?” అని బెన్హదదు హజయేలును అడిగాడు. “నీవు జీవించెదవు అని ఎలీషా చెప్పాడు” అని హజయేలు చెప్పాడు.
2KI 8:15 కాని ఆ మరునాడే హజాయేలు ఒక ముతక వస్త్రం తీసుకుని దాన్ని నీటిలో తడిపాడు. తర్వాత బెన్హదదు ముఖాన్ని కప్పివేసి, వుక్కిరి బిక్కిరి చేయడంలో అతడు మరణించాడు. హజాయేలు కొత్తగా రాజు అయ్యాడు.
2KI 8:16 ఇశ్రాయేలుకు రాజైన అహాబు కొడుకు యెహోరాము పరిపాలనలోని, అయిదవ సంవత్సరమున, యూదా రాజైన యెహోషాపాతు కొడుకు యెహోరాము యూదాకు రాజయ్యాడు.
2KI 8:17 యెహోరాము పరిపాలించు నాటికి అతను ముఫ్పై రెండు యేండ్లు వాడు. యెరూషలేములో అతను ఎనిమిదేళ్ల పరిపాలించాడు.
2KI 8:18 కాని పూర్వపు ఇశ్రాయేలు రాజుల చెడు మార్గాలను ఇతడు అనుసరించాడు. అహాబు కుటుంబీ కులు చేసినట్లుగా యెహోవా దృష్ఠికి తప్పు అని ఎంచుబడిన చెడుకార్యాలు చేశాడు.
2KI 8:19 కాని తన సేవకుడైన దావీదుకు వాగ్దానం చేయడంవల్ల యెహోవా యూదాను నాశనం చేయలేదు. అతని వంశానికి చెందిన వారు ఎవరో ఒకరు ఎప్పుడూ రాజుగా వుంటారని దావీదుకు యెహోవా వాగ్దానం చేశాడు.
2KI 8:20 యెహోరాము కాలంలో యూదా పరిపాలన నుండి ఎదోమీయులు విడిపోయి తమకు ఒక రాజుని ఎన్నుకున్నారు.
2KI 8:21 అప్పుడు యెహోరాము అతని రథములన్నిటినీ తీసుకుని జాయీరుకు వెళ్లెను. రాత్రివేళ ఎదోము సైన్యము వారిని చుట్టుముట్టింది. యెహోరాము అతని అధికారులు వారిని ఎదుర్కొని, తప్పించు కున్నారు. యెహోరాము సైనికులందురు పారిపోయి తమ దేశం చేరుకున్నారు.
2KI 8:22 ఈ కారణంచేత ఎదోము వారు యూదా పరిపాలనకు ఎదురు తిరిగారు. అదే సమయమున లిబ్నా కూడా యూదా పరిపాలనకు ఎదురు తిరిగింది.
2KI 8:23 యెహోరాము చేసిన ఇతర పనులన్నియు “యూదా రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి.
2KI 8:24 తరువాత యెహోరాము మరణించాడు. దావీదు నగరంలో తన పూర్వికులతో పాటు అతను సమాధి చేయబడ్డాడు. యెహోరాము కుమారుడైన అహజ్యా కొత్తగా రాజయ్యాడు.
2KI 8:25 అహాబు కుమారుడైన యెహోరాము ఇశ్రాయేలుకు రాజయిన పన్నెండవ సంవత్సరమున, యెహోరాము కుమారుడైన అహజ్యా యూదా రాజ్యానికి రాజయ్యాడు.
2KI 8:26 అహజ్యా పరిపాలన ప్రారంభించినప్పుడు అతని వయస్సు ఇరవైరెండు సంవత్సరములు. అతను యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు. అతని తల్లి పేరు అతల్యా. ఆమె ఇశ్రాయేలు రాజయిన ఒమ్రీ కుమార్తె.
2KI 8:27 యెహోవా తప్పని చెప్పిన పనులనే అహజ్యా చేశాడు. అహాబు వంశీయులవలె అహజ్యా అనేక చెడుకార్యాలు చేశాడు. అతని భార్య అహాబు వంశానికి చెందినదగుట్టచే, అహజ్యా ఈ విధంగా నివసించాడు.
2KI 8:28 యెహోరాము అహాబు వంశానికి చెందినవాడు. సిరియా రాజయిన హజయేలుతో రామోత్గిలాదు అనేచోట యుద్ధం చేసేందుకు అహజ్యా యెహోరాముతో కలిసి వెళ్లాడు. సిరియన్లు యెహోరాముని గాయపరచిరి.
2KI 8:29 ఆ గాయముల నుండి బాగు పడుటకు గాను యెహోరాము రాజు ఇశ్రాయేలుకి తిరిగి వెళ్లిపోయాడు. యెహోరాము యెజ్రెయేలు అనే ప్రదేశానికి పోయాడు. యెహోరాము కుమారుడైన అహజ్యా యూదా యొక్క రాజు. అహజ్యా యెహోరాముని చూడటానికి యెజ్రెయేలు వెళ్లాడు.
2KI 9:1 ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల బృందంలో ఒకనిని పిలిచి, అతనితో ఎలీషా, “ఈ చిన్న నూనె సీసాని నీచేతిలో తీసుకుని వెళ్లాడానికి నీవు సిద్ధంగా ఉండు. రామోత్గిలాదుకు వెళ్లు.
2KI 9:2 నీవక్కడికి చేరుకోగానే, నింషీ కుమారుడైన యెహోషాపాతు కుమారుడగు యెహూనీకు కనిపిస్తాడు. అతని సోదరులలోనుండి అతనిని చాటుగా పిలిచి, తర్వాత ఒక గదిలోకి తీసుకు వెళ్లు.
2KI 9:3 చిన్న నూనె సీసా తీసుకుపోయి, యెహూ తలమీద నూనె పోసి ఈరీతిగా చెప్పు. ఇది యెహోవా చెప్పింది. ఇశ్రాయేలీయుల కొత్తరాజుగా నిన్ను అభిషేకించాను.తర్వాత నీవు తలుపు తెరిచి పారిపో. అక్కడ నిలిచి వుండువద్దు” అన్నాడు.
2KI 9:4 అందువల్ల ఈ యువ ప్రవక్త రామోత్గిలాదుకు వెళ్లాడు.
2KI 9:5 ఆ యువకుడు అక్కడకు చేరగానే, అతను సైన్యాధిపతులు అక్కడ కూర్చుని వుండటం చూశాడు. “అధిపతీ! నీకు నేనొక సందేశం తెచ్చాను” అని ఆ యువకుడు చెప్పాడు. “మేమందరము ఇక్కడ్డున్నాము ఎవరికి సందేశం” అని యెహూ అడిగాడు. “అధిపతీ! నీకే సందేశం” అని యువకుడు చెప్పాడు.
2KI 9:6 యెహూ లేచి ఇంట్లోకి వెళ్లాడు. అప్పుడు యువ ప్రవక్త యెహూను అభిషేకించాడు. ఆ యువ ప్రవక్త యెహూతో ఈ విధంగా చెప్పాడు: “యెహోవా యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే కొత్తరాజుగా నిన్ను అభిషేకించానని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు.
2KI 9:7 నీ రాజైన అహాబు వంశాన్ని నీవు నాశనం చెయ్యాలి. కాబట్టి నా సేవకులు, ప్రవక్తలు, యెహోవా యొక్క మనుష్యుల, మరణానికి కారణమైన, యెజెబెలును శిక్షిస్తున్నాను.
2KI 9:8 అందువల్ల అహాబు వంశీయులందరూ మరణిస్తారు. అహాబు వంశంలో మగపిల్లవాడెవ్వడూ బతకనీయకుండా చేస్తాను. ఆ మగబిడ్డ సేవకుడైనా సరే స్వతంత్రుడైనా సరే భేదము లేదు.
2KI 9:9 నెబాతు కుమారుడైన యరొబాము వంశంవలె, అహీయా కుమారుడైన బయెషా వంశంవలె అహాబు వంశాన్ని చేస్తాను.
2KI 9:10 యెజ్రెయేలు ప్రదేశంలో యెజెబెలుని కుక్కలు తింటాయి, యెజెబెలు సమాధి చేయబడదు.” ఆ తర్వాత యువ ప్రవక్త తలుపు తెరిచి పరుగెత్తుకొని పోయాడు.
2KI 9:11 యెహూ తన రాజ ఉద్యోగుల వద్దకు వెళ్లాడు. ఒక అధికారి యెహూతో, “అంతా మంచిగా వున్నదా? ఈ పిచ్చివాడు నీ వద్దకు ఎందుకు వచ్చాడు?” అని అడిగాడు. ఆ సేవకులకు యెహూ ఇలా సమాధాన మిచ్చాడు. “ఆవ్యక్తిని గురించి నీకు తెలుసు. అతను చెప్పే పిచ్చి విషయాలు నీకు తెలుసు.”
2KI 9:12 అధికారులు, “కాదు నిజం చెప్పు. అతడు ఏమి చెప్పాడు?” అని అడిగాడు. ఆ యువ ప్రవక్త చెప్పిన విషయాలు యెహూ అధికారులకు, “అతడు చెప్పిన దేమనగా, ‘ఇశ్రాయేలుకు కొత్తరాజుగా నేను నిన్ను అభిషేకించానని యెహోవా చెప్పాడు’ అని అతను నాకు చెప్పాడు.”
2KI 9:13 తర్వాత ప్రతి అధికారి వెంటనే తమ దుస్తులు తీసివేసి, యెహూ ఎదుట మెట్లమీద పరిచారు. ఆ తర్వత, “యెహూరాజు” అని బూరఊది ప్రకటించారు.
2KI 9:14 అందువల్ల యెహోషాపాతు కుమారుడైన యెహూ, యెహోరాముకు విరుద్ధంగా పధక రచన చేసెను. యెహోషాపాతు నింషీ కుమారుడు. ఆ సమయమున యెహోరాము మరియు ఇశ్రాయేలు వాళ్లు సిరియాకు రాజయిన హజాయేలుకు వ్యతిరేకంగా రామోత్గిలాదును కాపాడటానికి ప్రయత్నించారు.
2KI 9:15 సిరియా రాజయిన హజాయేలుకు ప్రతికూలంగా యెహోరాము రాజు యుద్ధం చేశాడు. కాని సిరియనులు యెహోరాము రాజును గాయపరిచారు. అతను ఆ గాయాల నుంచి బయటపడటానికి యెజ్రేయేలుకు వెళ్లాడు. అందువల్ల యెహూ అధికారులను ఉద్దేశించి, “నేను కొత్త రాజని మీరు సమ్మతించి నట్లుయితే, ఇప్పుడు ఎవరినీ నగరం నుంచి తప్పంచు కొనకుండా చేయండి. ఎందుకనగా, ఈ విషయం యెజ్రెయేలీయులతో. చెప్పకూడదు” అని పలికాడు.
2KI 9:16 యెజ్రెయేలులో యెహోరాము మంచము పట్టి విశ్రాంతి పొందుచున్నాడు. అందువల్ల యెహూ తనరథమెక్కి, యెజ్రెయేలుకు వెళ్లాడు. యూదా రాజయిన అహజ్యా యెహోరామును చూడడానికి యెజ్రెయేలుకు వచ్చాడు.
2KI 9:17 యెజ్రెయేలులోని ఒక గోపురం మీద ఒక కాపలావాడు నిలబడివున్నాడు. యెహూ యొక్క పెద్ద సైన్యం రావడం అతను చూశాడు. “చాలా మంది మనుష్యులు వచ్చుట చూస్తున్నాను.” అని అతను చెప్పాడు. “వారిని కలుసుకునేందుకు ఎవరినైనా గుర్రం మీద పంపుము. ఆ మనుష్యులు శాంతికోసం వస్తున్నారో లేదో కనుక్కోమని ఈ దూతతో చెప్పుము” అని యెహోరాము చెప్పాడు.
2KI 9:18 అందువల్ల ఆ దూత యెహూని కలుసుకోవడానికి గుర్రమెక్కి వెళ్లాడు. వార్తహరుడు, “మీరు శాంతికోసం వచ్చారా? లేదా అని యెహోరాము, అడుగుతున్నాడు” అని పలికాడు. “శాంతితో నీకేమీ పని లేదు. రమ్ము, నన్ను అనుసరింపుము” అని యెహూ చెప్పాడు. “దూత ఆ బృందం వద్దకు వెళ్లాడు. కాని ఇంత వరకూ తిరిగి రాలేదు” అని కాపలాదారుడు యెహోరాముతో చెప్పాడు.
2KI 9:19 తర్వాత యెహోరాము రెండవ దూతను గుర్రంమీద పంపాడు. ఈ వ్యక్తి యెహూ బృందం వారి వద్దకు వచ్చి, “యెహోరాము రాజు శాంతి అని చెప్పుచున్నాడు” అన్నాడు. “నీకు శాంతితో ఏమీ పనిలేదు. రమ్ము, నన్ను అనుసరింపుము” అని సమాధానమిచ్చాడు.
2KI 9:20 “రెండవ దూత బృందం వద్దకు వెళ్లాడు. కాని అతను కూడా ఇంకా తరిగి రాలేదు. పిచ్చివానివలె, ఒకడు అతని రథం నడుపుతున్నాడు. నింషీ కుమారుడైన యెహూవలె నడుపుతున్నాడు” అని కాపలాదారు యెహోరాముతో అన్నాడు.
2KI 9:21 “నా రథం తీసుకుని రా” అని యెహోరాము చెప్పాడు. అందువల్ల సేవకుడు యెహోరాము యొక్క రథమును తీసుకువచ్చాడు. ఇశ్రాయేలు రాజయిన యెహోరాము, యూదా రాజయిన అహజ్య, ఇద్దరూ రథాలలో యెహూని కలుసుకోడానికి వెళ్లారు. వారు యెజ్రెయేలియుడైన నాబోతు పొలం వద్ద యెహూని కలుసుకున్నారు.
2KI 9:22 యెహోరాము యెహూని చూసి, “యెహూ, నీవు శాంతికోసం వచ్చావా?” అని అడిగాడు. “నీ తల్లి యెజెబెలు వ్యభిచారము, చేతబడితనము ఘోరముగా చేయుచుండగా సమాధానం ఎక్కడనుండి వచ్చును.” అని చెప్పి పారిపోవుచు ఉండెను.
2KI 9:23 యెహోరాము గుర్రాలను వెనక్కి పరుగు తీయించాడు. యెహోరాము అహజ్యాను చూసి “అహజ్యా, ఇది ఒక మాయోపాయం” అన్నాడు.
2KI 9:24 అప్పుడు యెహూ తన బలంకొద్దీ బాణం లాగి యెహోరాముని వీపుమీద కొట్టాగా, ఆ బాణం యెహోరాము గుండెలోనుండి దూసుకొని వెళ్లగా, యెహోరాము తన రథం మీదనే మరణించాడు.
2KI 9:25 యెహూ తన అధిపతియైన బిద్కరుతో, “యెహోరాము దేహాన్ని పైకి ఎత్తి, యెజ్రెయేలులో నాబోతు పొలంలోకి విసిరివేయుము. ఒకసారి జ్ఞాపకం చేసుకో నీవు, నేను యెహోరాము తండ్రి అయిన అహాబుతో కలిసి పయనం చేసినప్పుడు, ఇది అతనికి జరుగునని యెహోవా చెప్పాడు.
2KI 9:26 ‘నిన్న నాబోతు అతని కుమారుల రక్తం నేను చూశాననీ, అందువల్ల ఈ పొలంలో అహాబును శిక్షించెదననీ’ యెహోవా చెప్పెను. కావున, యెహోవా చెప్పినట్లు ఈ కళేబరాన్ని తీసుకొని పొలంలోకి విసరుము అనెను.”
2KI 9:27 యూదా రాజయిన అహజ్యా దీనిని చూసి పారి పోయాడు. అతను ఉద్యానవన గృహంద్వారా తప్పించుకొనడానికి ప్రయత్నించాడు. యెహూ అతనిని అనుసరించాడు. “అహజ్యా తన రథంలోకి వెళ్లినా, అతనిని చంపి వేయుము” అని యెహూ చెప్పాడు. అందువల్ల యెహూ మనుష్యులు అహజ్యాను ఇబ్లె యాము దగ్గర గూరునకు వెళ్లే బాటమీద కొట్టగా అహజ్యా మెగిద్దోకు పారిపోయి అతను అక్కడ మరణించాడు.
2KI 9:28 అహజ్యా సేవకులు అహజ్యా శరీరాన్ని రథంలో తీసుకొని యెరూషలేముకి వెళ్లారు. వారు అహజ్యాను దావీదు నగరంలో అతని పూర్వికుల సమాధిలో సమాధి చేశారు.
2KI 9:29 ఇశ్రాయేలు రాజుగా యెహోరాము పదకొండవ పరిపాలనా సంవత్సరమున అహజ్యా యూదాకు రాజయ్యాడు.
2KI 9:30 యెహూ యెజ్రెయేలుకు వెళ్లాడు. యెజెబెలు ఆ వార్త విన్నది. కనుక ఆమె తనను సింగారించుకుంది జుట్టు సరిదిద్దుకుంది, రంగుపూసుకుంది, శిరోభూషనములు ధరించుకున్న తర్వాత ఆమె కిటికీకి ప్రక్కగా నిలిచి వెలుపలికి చూచింది.
2KI 9:31 యెహూ గుమ్మం ద్వారా నగరం ప్రవేశించాడు. “ఆమె అతనిని చూసి జిమ్రీ వంటివాడా, అతనివలె నీవు నీ యజమానిని చంపివేశావు” సమాధానంగా వచ్చుచున్నావా అని యెజెబెలు అడిగెను.
2KI 9:32 యెహూ కిటికీ పైకి చూశాడు. “నా ప్రక్క ఎవరున్నారు? ఎవరు?” అన్నాడు. ఇద్దరో ముగ్గురో నపుంసకులు యెహూని కిటికి నుండి చూశారు.
2KI 9:33 వారీతో యెహూ, “యెజెబెలుని కిందికి తోసి వేయండి” అన్నాడు. తర్వాత నపుంసకులు యెజెబెలుని కిందికి తోసివేశారు. యెజెబెలు రక్తం కొంచెం గోడమీద చిమ్మింది. గుర్రాలమీద కూడా చిమ్మింది. గుర్రాలు యెజెబెలు శరీరం మీదగా నడిచాయి.
2KI 9:34 యెహూ ఇంట్లోకి వెళ్లి అన్నపానాదులు చేసిన తరువాత, “ఇప్పుడు ఈ శాపగ్రస్తురాలిని చూడండి, ఈమె ఒక రాజు కుమార్తె. అందువల్ల ఆమెను సమాధి చేయండి” అన్నాడు.
2KI 9:35 ఆ మనుష్యులు యెజెబెలుని సమాధి చేయడానికి వెళ్లారు. కాని ఆమె శరీరం వారికి కనబడలేదు. ఆమె కపాలము, ఆమె పాదాలు, ఆమె అరచేతులు మాత్రమే కనిపించాయి.
2KI 9:36 అందువల్ల ఆ మనుష్యులు వెనుదిరిగి వచ్చి యెహూతో చెప్పారు. అప్పుడు “యెహోవా తన సేవకుడు తిష్బీవాడయిన ఏలీయాతో చెప్పాడు. యెజ్రెయేలు ప్రదేశంలో యెజెబెలు శవాన్ని కుక్కలు తింటాయని.
2KI 9:37 యెజ్రెయేలు ప్రదేశపు పొలంలో యెజెబెలు శవం పెంటవలె ఉంటుందనీ, ఇది యెజెబెలని ఎవరూ గుర్తు పట్టలేరనీ ఎలీయా చెప్పాడు.”
2KI 10:1 షోమ్రోనులో అహాబుకి డెబ్భైమంది కుమారులుండిరి. యెహూ ఉత్తరాలు రాసి యెజ్రెయేలు రాజులకు నాయకులకు వాటిని షోమ్రోనుకు పంపాడు. అహాబు కుమారులును పెంచిన ప్రజలకు కూడా ఆ ఉత్తరాలు అతడు పంపాడు. ఆ ఉత్తరాలలో యెహూ ఇట్లు చెప్పాడు:
2KI 10:2 “మీకీ ఉత్తరం చేరగానే, మీ తండ్రి కుమారులలో సర్వశ్రేష్టుడైన వానిని ఎన్నుకోండి. మీకు రథాలు గుర్రాలు వున్నాయి. మీరు బలిష్టమైన నగరంలో ఉంటున్నారు. మీకు ఆయుధాలు కూడా వున్నాయి. మీరెన్నుకున్న అతని కుమారుని తండ్రి సింహాసనం మీద కుర్చోబెట్టండి. తర్వాత మీ తండ్రి వంశం కోసం పోరాడండి.”
2KI 10:4 కాని యెజ్రెయేలు పరిపాలకులు, నాయకులు చాలా భయపడిపోయారు. “ఆ రాజులిద్దరు (యెహోరాము మరియు అహజ్యా) యెహూని ఆపలేక పోయారు. కనుక మనము కూడా అతనిని ఆపలేము” అని వారు అనుకున్నారు.
2KI 10:5 అహాబు గృహ సంరక్షకుడు, నగరాన్ని అదుపులో ఉంచిన వాడు, అహాబు పిల్లలను పెంచిన పెద్దలు ప్రజలు యెహూకి ఒక సందేశం పంపారు. “మేము మీ సేవకులం. మీరేమి చెపితే మేమది చేస్తాము. మేమె వరిని రాజుగా చేసుకోవాలి. మీకు ఏది మంచిదిగా తోస్తే అది మాకు చెయ్యండి” అని తెలియజేసారు.
2KI 10:6 తర్వాత యెహూ రెండవ ఉత్తర ఆ నాయకులకు రాశాడు. “మీరు కనుక నన్ను సమర్థిస్తే నా మాట పాటిస్తే, ఇప్పుడు అహాబు కుమారుల తలలు నరికి వేయండి. రేపు ఈపాటికి వాటిని యెజ్రెయేలులో నా వద్దకు తీసుకురండి” అని యెహూ చెప్పాడు. అహాబుకి డెబ్భైమంది కుమారులు. వారు తమను పెంచిన నగర నాయకులతో ఉన్నారు.
2KI 10:7 ఈ లేఖను నగర నాయకులు అందుకోగానే, వారు రాజ కుమారులు డెబ్భైమందిని తీసుకొని వెళ్లి చంపివేశారు. తర్వాత నాయకులు రాజ కుమారుల తలలను బుట్టలలో వేసి యెజ్రెయేలులోని యెహూకి ఆ బుట్టులు పంపారు.
2KI 10:8 దూత యెహూని సమీపించి అతనికిది చెప్పాడు: “వాళ్లు రాజకుమారుల తలలు తెచ్చారు!” తర్వాత యెహూ, “నగర ద్వారం వద్ద ఉదయం వరకు రెండు వరసలలో ఆ తలలు ఉంచండి” అని చెప్పాడు.
2KI 10:9 ఉదయాన, యెహూ వెలుపలికి వెళ్లి, ప్రజల యెదుట నిలచి వారితో ఇలా అన్నాడు: “మీరు అమాయకులు. చూడండి. నేన నా యజమానికి విరుద్ధంగా పథకాలు వేశాను. నేనతనిని చంపాను. కాని ఆహాబు పిల్లలందరినీ ఎవరు చంపారు? మీరే చంపారు.
2KI 10:10 యెహోవా చెప్పినదంతా జరుగుతుందని మీరు గ్రహించాలి. మరియు యెహోవా అహాబు వంశానికి సంబంధించిన యీ విషయాలు చెప్పేందుకు ఏలీయాని ఉపయెగించాడు. యెహోవా తాను చేస్తానన్న పనులు చేశాడు.”
2KI 10:11 అందువల్ల యెహూ యెజ్రెయేలులో నివసించే అహాబు వంశీయుల నందరనీ చంపివేశాడు. యెహూ ముఖ్యులందరినీ, సన్నిహిత మిత్రుల్ని, యాజకులను చంపివేశాడు. అహాబు వంశంలోని వారు ఎవ్వరూ మిగలలేదు.
2KI 10:12 యెహూ యెజ్రెయేలు విడచి షోమ్రోనుకు వెళ్లాడు. తోవలో యెహూ గొర్రెల కాపరులు శిబిరం అనేచోట ఆగాడు. ఆ చోట గొర్రెల కాపరులు గొర్రెల మీద ఉన్నిని కత్తిరిస్తున్నారు.
2KI 10:13 యూదా రాజయిన అహజ్యా యొక్క బంధువులను యెహూ కలుసుకున్నాడు. “ఎవరు మీరు?” అని యెహూ ప్రశ్నించాడు. వారు, “మేము యూదా రాజయిన అహజ్యా బంధువులము. రాజకుమారులను రాణిగారి పిల్లలను చూసి వెళ్లదామని వచ్చాము” అని సమాధనం చెప్పారు.
2KI 10:14 తర్వాత యెహూ, “వారిని సజీవులుగా తీసుకువెళ్లండి” అని తన మనుష్యులకు చెప్పాడు. యెహూ మనుష్యులు అహజ్యా బంధువులను సజీవులుగా పట్టుకున్నారు. వారు నలభై రెండు మంది. బేతెకెదు బావి వద్ద యెహూ వారిని చంపివేశాడు. యెహూ ఒక్కరిని కూడా ప్రాణాలతో వుండనివ్వలేదు.
2KI 10:15 అక్కడినుంచి యెహూ వెళ్లిన తర్వాత, అతను రేకాబు కుమారుడైన యెహోనాదాబును కలుసుకున్నాడు. యెహూని కలుసుకున్నాడు. యెహోనాదాబు వెళ్లుచున్నాడు.యెహూ యెహోనా దాబును అభినంధించి, “నేను నీకు నమ్మకస్థుడనైన స్నేహితునివలె, నీవు నాకు నమ్మకస్థుడనైన స్నేహితుడవేనా?” అని అడిగాడు. “నేను నీకు నమ్మకస్థుడైన స్నేహితుడినే” అని యెహోనాదాబు బదులు చెప్పాడు. “అలా అయితే, నీ చేయి నాకిమ్ము” అని యెహూ చెప్పాడు. తర్వాత యెహూ యెహోనాదాబును లాగి తన రథంలోకి ఎక్కించుకున్నాడు.
2KI 10:16 “నాతోపాటురా. యెహోవాపట్ల నా భావాలు ఎంత దృఢంగా ఉన్నాయో చూడవచ్చు” అని యెహూ చెప్పాడు. అందువల్ల యెహోనాదాబు యెహూ రథంలో వెళ్లాడు.
2KI 10:17 యెహూ షోమ్రోనుకి వచ్చి, అక్కడ ఇంకా సజీవులై వున్న అహాబు వంశీయులందరిని హతమార్చాడు. యెహూవా ఏలీయాతో చెప్పినట్లుగా, యెహూ అన్ని పనులు చేసాడు.
2KI 10:18 తర్వాత యెహూ ప్రజలందరినీ సమీకరించాడు. వారితో యెహూ, “అహాబు కొద్దిగా బయలు దేవుని సేవించాడు. కాని యెహూ అనే నేను బయలు దేవునికి ఎక్కువ సేవ చేస్తాను.
2KI 10:19 ఇప్పుడు బయలు దేవుని ప్రవక్తలను యాజకులను అందరినీ పిలవండి. బయలు దేవుని పూజించేవారినందరినీ పిలవండి. ఈ సమావేశానికి అందురూ హాజరు అయ్యేలా చూడండి. బయలు దేవునికి నేనొక గొప్పబలి సమర్పించాలి. ఈ సమావేశానికి రానివారిని నేను చంపుతాను” అని చెప్పాడు. కాని యెహూ వారిపట్ల కుయుక్తి పన్నాడు. బయలు ఆరాధకులను యెహూ నాశనం చేయదలచాడు.
2KI 10:20 “బయలుకు ఒక పవిత్ర సమావేశం ఏర్పాటు చేయండి” అని యెహూ చెప్పాడు. మరియు యాజకులు సమావేశం ప్రకటించారు.
2KI 10:21 తర్వాత యెహూ ఇశ్రాయేలు దేశమంతటా ఒక సందేశం పంపాడు. బయలు ఆరాధకులందరూ వచ్చారు. ఎవ్వరూ ఇంట్లో వుండలేదు. బయలు దేవుని మందిరంలో బయలు ఆరాధకుందరూ వచ్చారు. మందిర ప్రజలతో నిండిపోయింది.
2KI 10:22 దుస్తులు దగ్గర ఉంచబడిన వ్యక్తితో యెహూ ఇట్లనెను. “బయలు ఆరాధకులందరికి దుస్తులు తీసుకురండి” అని చెప్పగా ఆ వ్యక్తి బయలు ఆరాధకులందరికి దుస్తులు తీసుకు వచ్చాడు.
2KI 10:23 తర్వాత యెహూ, రేకాబు కుమారుడైన యెహూనాదాబు బయలు మందిరంలోనికి పోయారు. బయలు ఆరాధకులను ఉద్దేశించి, “మీ చుట్టు పక్కల చూడండి. మీతో యెహోవా యొక్క సేవకులెవరూ లేరని చూసుకోండి. బయలు ఆరాధకులు మాత్రమే ఇక్కడున్నారని నిర్దారణ చేసుకోండి” అని యెహూ చెప్పాడు.
2KI 10:24 బయలు ఆరాధకులు గుడిలోకి వెళ్లారు; బలులు మరియు దహన బలులు అర్పించాలనుకున్నారు. కాని వెలుపల, యెహూ ఎనభై మందితో వేచి యున్నాడు. “ఎవ్వరూ తప్పించుకోకుండా చూడండి. ఎవ్వరైనా ఒక్కనినైనా తప్పించినట్లుయితే, ఆ వ్యక్తి తన ప్రాణమునే ఫలితంగా పెట్టవలసి వస్తుంది” అని యెహూ చెప్పాడు.
2KI 10:25 తర్వగా యెహూ తన దహన బలుల అర్పణ పూర్తి చేయగా, అతను కాపలాదారుకు, అధిపతులకు ఇటు చెప్పాడు. “లోపలికి వెళ్లి, బయలు ఆరాధకులను చంపండి. ఆలయంలోనుండి ఎవ్వరూ సజీవంగా బయటికి రాకుండా చూడండి” అని చెప్పాడు. అందువల్ల అధిపతులు ఖడ్గాలు ప్రయోగించి బయలు ఆరాధకులను చంపివేశారు. ఆ తర్వాత కాపలా దార్లు, అధిపతులు బయలు ఆరాధకుల శరీరాలను బయటికి విసిరివేశారు. తర్వాత వారు బయలు దేవత ఆలయంలోని లోపలిగదిలోనికి వెళ్లారు.
2KI 10:26 బయలు ఆలయంలో వున్న జ్ఞాపక శిలలను వారు వెలుపలికి తీసుకువచ్చి, దేవాలయాన్ని దగ్ధం చేశారు.
2KI 10:27 తర్వాత దేవాలయంలోని జ్ఞాపకశిలలను నుగ్గు నుగ్గు చేశారు. బయలు దేవాలయాన్ని కూడా నుగ్గు నుగ్గు చేశారు. వారు బయలు దేవాలయాన్ని ఒక మరుగుదొడ్డిగా మార్చారు. ప్రజలు ఇప్పటికి ఆ ప్రదేశమును ముస్తాబు గదిగా (పాయిఖానాగా) వాడతారు.
2KI 10:28 ఈ విధంగా యెహూ ఇశ్రాయేలులో బయలు ఆరాధనను నాశనం చేశాడు.
2KI 10:29 కాని నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలు పూర్తిగా తొలగలేదు; అందువల్ల ఇశ్రాయేలు పాపం చేయవలసి వచ్చింది. బేతేలు, దానులలో బంగారు దూడలను యెహూ నాశనం చెయ్యలేదు.
2KI 10:30 యెహోవా యెహూని ఉద్దేశించి, “నీవు బాగుగా చేశావు. నేను చెప్పిన సంగతులను నీవు చేశావు. నేను ఆశించిన విధంగా నీవు అహాబు వంశాన్ని నాశనం చేశావు. అందువల్ల నీ సంతతి వారు ఇశ్రాయేలును నాలుగు తరాలవరకూ పరిపాలిస్తారు” అని చెప్పాడు.
2KI 10:31 కాని హృదయపూర్వకంగా యెహూ జాగ్రత్తగా యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ నివసించలేదు. ఇశ్రాయేలును పాపానికి గురిచేసిన యరొబాము పాపాలను యెహూ ఆపలేకపోయాడు.
2KI 10:32 ఆ సమయమున, యెహోవా ఇశ్రాయేలును భాగాలుగా ఛేదింపసాగాడు. సిరియా రాజయిన హజాయేలు ఇశ్రాయేలు ప్రతి సరిహద్దుననున్ను ఇశ్రాయేలు వారిని ఓడించాడు.
2KI 10:33 యోర్దాను నదికి తూర్పునవున్న ప్రదేశాన్ని హజాయేలు జయించాడు. గాదీయులకును, రూబేనీయులకును మరియు మనష్షేవంశాలకు చెందిన ప్రాంతాలను, గిలాదుప్రాంతములన్నీ, అర్నోను లోయ ప్రక్కనున్న అరోయేరు ప్రదేశంలోని గిలాదు, బాషాను ప్రాంతాల వరకూ హజాయేలు జయించాడు.
2KI 10:34 యెహూ కావించిన ఇతర గొప్ప పనులు “ఇశ్రాయేలు రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడినవి.
2KI 10:35 యెహూ మరణించగా, అతని పూర్వికులతో పాటుగా సమాధి చేయబడ్డాడు. షోమ్రోనులో ప్రజలు యెహూని సమాధి చేశారు. అతని తర్వాత, యెహూ కుమారుడైన యెహోయాహాజు ఇశ్రాయేలుకి కొత్తగా రాజయ్యాడు.
2KI 10:36 షోమ్రోనులో ఇశ్రాయేలు మీద యెహూ ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు పరి పాలించాడు.
2KI 11:1 అతల్యా అహజ్యా యొక్క తల్లి. తన కుమారుడు చనిపోయినట్లు ఆమె చూసింది. అందువల్ల ఆమె లేచి రాజవంశం అంతటినీ చంపివేసింది.
2KI 11:2 యెహోషెబ రాజైన యెహోరాము యొక్క కుమార్తె. అహజ్యా సోదరి. యోవాషు రాజ కుమారులలో ఒకడు. మిగిలిన పిల్లలు చంపబడినప్పుడు యెహోషెబ యెవాషును తీసుకుని దాచింది. ఆమె యెవాషును అతని దాదిని ఆమె పడక గదిలో ఉంచింది. అందువల్ల యెవాషెబ మరియు దాది అతల్యాకి తెలియకుండా యెవాషును కాపాడారు. ఆ విధంగా యోవాషు మరణించలేదు.
2KI 11:3 తర్వాత యోవాషు మరియు యెహోషెబా యెహోవా యొక్క ఆలయంలో దాగివున్నారు. అక్కడ యోవాషు ఆరు సంవత్సరములు దాగివున్నాడు. మరియు అతల్యా యూదా దేశాన్ని పరిపాలించింది.
2KI 11:4 ఏడవ సంవత్సరమున ప్రధాన యాజకుడయిన యెహోయాదా సైనికుల అధిపతులను కాపలాదారులను రప్పించాడు. యెహోయాదా వారిని యెహోవా ఆలయములో ఒక చోట సమకుర్చాడు. తర్వాత యెహోయాదా వారితో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడు. ఆలయంలో యెహోయాదా వారిని ఒక వాగ్దానం చేయమని నిర్భందించాడు. అప్పుడు వారికి రాజుగారి కుమారుడైన యెవాషును చూపించాడు.
2KI 11:5 తర్వాత యెహోయాదా వారికొక ఆజ్ఞ విధించాడు. “ఈ పని మీరు చెయ్యాలి. ప్రతి విశ్రాంతి రోజున మీలో మూడోవంతు రావాలి. మీరు రాజభవ నాన్ని కాపలా కాయాలి.
2KI 11:6 మూడోవంతు సూరు ద్వారం వద్ద వుండాలి. మరియు మూడోవంతు కాపలాదారుకు వెనుకాల ద్వారం వద్ద వుండాలి. ఈ విధంగా మీరు ఒక గోడవలె యెవాషును రక్షించాలి.
2KI 11:7 ప్రతి విశ్రాంతి రోజు మీలో రెండువంతుల యెహోవా ఆలయాన్ని కాపలా కాయాలి. యెవాషు రాజుని రక్షించాలి. యెవాషు రాజు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్లినా మీరు అతని వెంట వుండాలి.
2KI 11:8 మొత్తం రాజుని అవరించి వుండాలి. ప్రతి కాపలాదారుడు తన ఆయుధాన్ని చేత ధరించి వుండాలి. మీకు మరీ దగ్గరగా వచ్చే ఎవనినైనా మీరు హతమార్చాలి” అని అన్నాడు.
2KI 11:9 యెహోయాదా యాజకుడు ఆజ్ఞాపించిన అన్నిటినీ అధిపతులు పాటించారు. ప్రతి అధిపతి తన మనుష్యులను తీసుకున్నాడు. ఒక బృందమేమో శనివారంనాడు రాజుకి కాపలాగా ఉండాలి. వారం మిగలిన రోజుల్లో ఇతర బృందాలు కాపలాగా వుండాలి రాజుకి. యెహోయాదా యాజకుని వద్దకు ఆ మనుష్యులందురు వెళ్లారు.
2KI 11:10 మరియు యాజకుడు బల్లెములు, కవచములు అధిపతులకు ఇచ్చాడు. ఆ బల్లెములు కవచములు యెహోవా ఆలయంలో దావీదు ఉంచినవి.
2KI 11:11 ఈ కాపలాదార్లు ఆయుధములు ధరించి ఆలయం కుడి మూలనుంచి మరియు ఆలయం ఎడమ మాలవరుకు నిలబడ్డారు. వారు బలిపీఠం, ఆలయం చుట్టూ నిలబడ్డారు. వారు దేవాలయంలో రాజును కాపాడడానికి ఆయన చుట్టూ నిలబడ్డారు.
2KI 11:12 ఈ మనుష్యులు యోవాషును బయటకు తీసుకొని వచ్చి అతని తల మీద వారు కిరీటం ఉంచారు. దేవునికీ రాజుకీ మధ్య జరిగిన ఒడంబడికను రాజుకి ఇచ్చారు. తర్వాత వారు అతనిని అభిషేకించి కొత్త రాజుగా చేశారు. “రాజు వర్ధిల్లుగాక!” అని వారు కరతాళ ధ్వనులు చేశారు; నినాదాలు చేశారు.
2KI 11:13 రాణి అతల్యా కాపలాదారులు మరియు ప్రజల నుండి శబ్ధం విన్నది. అందువల్ల ఆమె యెహోవా ఆలయం వద్దనున్న ప్రజల దగ్గరకు వెళ్లింది.
2KI 11:14 అతల్యా మామూలుగా రాజు నిలబడే స్తంభం వద్ద రాజుని చూసింది. రాజుకోసం బాకాలూదే నాయకులను ప్రజలను కూడా ఆమె చూసింది. అందరు మనుష్యులు చాలా సంతోషంగా వున్నట్లు ఆమె చూసింది. బూరలు మ్రోగాయి. ఆమె తలక్రిందులయినట్లుగా తెలుపడానికి తన వ స్త్రములు చింపుకొన్నది. తర్వాత అతల్యా, “రాజ ద్రోహం, రాజద్రోహం” అని అరిచింది.
2KI 11:15 సైనికులు అధికారులుగా నున్న అధిపతులకు యాజకుడు అయిన యెహోవాయాదా ఒక ఆజ్ఞ విధించాడు. “ఆలయం వెలుపలికి అత ల్యాను తీసుకొని వెళ్లండి. ఆమె అనుచరులను చంపండి. కాని యెహోవా ఆలయంలో వారిని చంపకండి” అని యెహోయాదా వారికి చెప్పాడు.
2KI 11:16 అందువల్ల సైనికులు అతల్యాను లాగివేశారు. అంతఃపురానికి గుర్రాలు వెళ్లే ప్రవేశంగుండా ఆమె వెళ్లేటప్పుడు ఆమెను చంపివేశారు.
2KI 11:17 తర్వాత యెహోయాదా రాజుకు ప్రజలకు మధ్య ఒక ఒడంబడిక చేశాడు. ఈ ఒడంబడిక రాజు ప్రజలు యెహోవాకి చెందిన వారిని తెలుపుతుంది. యెహోయాదా రాజుకు ప్రజలకు మధ్య కూడా ఒక ఒడంబడిక చేశాడు. ప్రజలకు రాజు ఏమీ చేయాలో ఈ ఒడంబడిక తెలుపుతుంది. ప్రజలు విధేయులై రాజుని అనుసరిస్తారని ఈ ఒడంబడిక తెలుపుతుంది.
2KI 11:18 తర్వాత మనుష్యులు అందరు అసత్య దేవత బయలు ఆలయానికి వెళ్లారు. ఆ మనుష్యులు బయలు విగ్రహాన్ని, అతని బలిపీఠాలను ధ్వంసం చేశారు. వాటిని వారు ముక్కలు ముక్కలుగా చేశారు. ఆ మనుష్యులు బయలు యొక్క యాజకుడు మత్తానును బలిపీఠముల వద్ద చంపివేశారు. అందువల్ల యాజకుడ అయిన యెహోయాదా యెహోవా ఆలయాన్ని ఆ మనుష్యుల అధికారమున నిర్వహణార్థం ఉంచాడు.
2KI 11:19 యాజకుడు మనుష్యులందరిని నడిపించాడు. వారు యెహోవా ఆలయంనుండి రాజు ఇంటివరకు వెళ్లారు. రాజుగారి ప్రత్యేక కాపలాదార్లు, అధిపతులు రాజుతోపాటు వెళ్లారు. మరియు మనుష్యులందరూ వారిని అనుసరించారు. వారు రాజభవన ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లారు. యెవాషు రాజు సింహాసనం మీద ఉన్నాడు.
2KI 11:20 మనుష్యులు అందరు చాలా సంతోషంగా వున్నారు. నగరం శాంతంగా ఉంది. మరియు రాణి అతల్యాను రాజభవనం వద్ద కత్తిలో చంపివేసిన తరువాత
2KI 11:21 యోవాషు రాజయినప్పుడు, అతను ఏడేండ్లవాడు.
2KI 12:1 ఇశ్రాయేలు రాజుగా యెహూ పాలన సాగించిన ఏడవ సంవత్సరంనుండి యోవాషు తన పరిపాలన ప్రారంభించాడు. యెరూషలేములో యోవాషు 40 సంవత్సరములు పాలించాడు. యోవాషు తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా.
2KI 12:2 యెహోవా సరి అయినవని చెప్పిన పనుల యోవాషు జరిగించాడు. జీవితాంతమూ యోవాషు యెహోవా పట్ల విధేయుడై వుండెను. యాజకుడైన యెహోయాదా తనకు నేర్పించిన పనులు అతను చేశాడు.
2KI 12:3 కాని అతను ఉన్నత స్థానాలను నాశనం చెయ్యలేదు. ఆ ఆరాధనా స్థలాలలో నేటికీ ప్రజలు బలులు అర్పిస్తున్నారు, ధూపం వేస్తున్నారు.
2KI 12:4 “యెహోవా ఆలయంలో చాలా ధనం వున్నది. ప్రజలు ఆలయానికి కొన్ని వస్తువులు సమర్పించారు. వారిని లెక్కించినప్పుడు ప్రజలు ఆలయం పన్ను చెల్లించారు. డబ్బు ఇవ్వాలనే వుద్దశ్యంతో వారు ఇచ్చారు. యాజకులైన మీరు ఆ ధనం తీసుకొని యెహోవా ఆలయాన్ని బాగు చేయండి. తాను సేవచేసే ప్రజలనుండి లభించే డబ్బును ప్రతి యాజకుడు వినియోగించాలి. యెహోవా ఆలయానికి ఆ డబ్బుతో మంచిపనులు చేయాలి” అని యాజకులకు యోవాషు చెప్పాడు.
2KI 12:6 కాని యాజకులు మరమ్మతులు చేయలేదు. యోవాషు రాజుగావున్న 23 సంవత్సరమున, యాజకులు అప్పటికి మరమ్మతులు చేయలేదు.
2KI 12:7 అందువల్ల యోవాషు రాజు యెహోయాదా యాజకుని, ఇతర యాజకులను పిలిపించుకున్నాడు. యెవాషు, యెహోయాదా, ఇతర యాజకులతో, “మీరెందుకు ఆలయాన్ని మరమ్మతు చేయలేదు? మీరు సేవించే మనుష్యుల వద్దనుండి మీరు డబ్బును తీసుకోవడం నిలిపివేయండి. ఆ డబ్బును వాడకండి. ఆలయాన్ని మరమ్మతు చేయుటకే అది వినియోగించ బడాలి” అని చెప్పాడు.
2KI 12:8 ప్రజలవద్ద నుండి డబ్బు వసూలు చేయడాన్ని ఆపివేయడానికి యాజకులు సమ్మతించారు. అయితే ఆలయాన్ని బాగు చేయకూడదని నిర్ణయించు కున్నారు.
2KI 12:9 అందువల్ల యాజకుడైన యెహోయాదా ఒక పెట్టె తీసుకుని దానిమీద ఒక రంధ్రం చేశాడు. తర్వాత యెహోయాదా బలిపీఠపు దక్షిణ దిశగా పెట్టెను ఉంచాడు. ఈ పెట్టె యెహోవా ఆలయానికి ప్రజలు వచ్చే ద్వారానికి పక్కగా వున్నది. కొందురు యాజకులు ఆలయంలోని ఆ ద్వారాన్ని కాపలా కాసారు. యెహోవాకి ప్రజలు సమర్పించిన డబ్బును ఆ యాజకులు తీసుకుని, ఆ పెట్టలో వేశారు.
2KI 12:10 తర్వాత ఆలయానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు ఆ పెట్టెలో డబ్బు వేయడం మొదలుపెట్టారు. రాజుగారి కార్యదర్శి, ప్రధాన యాజకుడు ఆ పెట్టెలో డబ్బు చాలా ఉండడం చూసివప్పుడు, వారు ఆ పెట్టె నుండి డబ్బు తీసుకోసాగారు. వారు ఆ డబ్బుని సంచులలో వేసి లెక్కించారు.
2KI 12:11 యెహోవా ఆలయాన పనిచేసే వారికి వారు ఆ డబ్బు ఇచ్చి వేశారు. వడ్రంగులు మరి ఇతర ఆలయ కాపరులకు డబ్బు ఇచ్చారు.
2KI 12:12 రాళ్లు చెక్కే వారికి రాళ్లు మోసేవారికి ఇవ్వడానికి ఆ డబ్బు వినియోగించారు. మరియు కలపకొనడానికి, రాళ్లు ముక్కలు చేయడానికి, ఆలయ మరమ్మతు పనులకు వారు ఆ డబ్బు వినియోగించారు.
2KI 12:13 యెహోవా ఆలయానికి ప్రజలు డబ్బు ఇచ్చారు. కాని యాజకులు ఆ డబ్బుతో వెండి కప్పులు, దీపాలు తీసివేసేందుకు వుపయోగించే కప్పులు, గిన్నెలు బూరలు, బంగారం, వెండి పాత్రలు చేసేందుకు యాజకులు ఆ డబ్బు వినియోగించలేక పోయారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడింది. ఆ పని వారు యెహోవా ఆలయాన్ని బాగుగా చేశారు.
2KI 12:15 ఆ డబ్బునంతా ఎవ్వరూ లెక్కించలేదు. ఆ డబ్బు ఏమి చేయబడినదో చెప్పమని ఏ పనివానిని నిర్భంధించ లేదు. ఎందుకనగా పనివారు నమ్మకస్థులుగా ఉన్నారు.
2KI 12:16 అపరాధ పరహారార్థ బలులు, పాపపరిహారార్థ బలులు సమర్పించు సమయములో ప్రజలు ఆ డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడడం జరిగేదికాదు. ఆ డబ్బు యాజకులకు చెందినది.
2KI 12:17 సిరియారాజు హాజాయేలు. గాతు నగరానికి ప్రతి కూలంగా యుద్ధం చేయడానికి హజాయేలు వెళ్లాడు. హజాయేలు గాతుని ఓడించాడు. తర్వాత అతను యెరూషలేముకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి నిశ్చయించాడు.
2KI 12:18 యెహోషాపాతు, యెహోరాము అహజ్యాలు యూదా రాజులుగా వున్నారు. వారు యోవాషు పూర్వికులు. వారు యెహోవాకు చాలా వస్తువులు సమర్పించారు. ఆ వస్తువులు ఆలయంలో ఉంచబడ్డాయి. యోవాషు కూడా చాలా వస్తువులు యెహోవాకు సమర్పించాడు. యోవాషు ఆలయంలోవున్న అన్ని వస్తువులు, బంగారం తీసుకున్నాడు. తన యింట్లో ఉన్న వాటిని కూడా తీసుకున్నాడు. తర్వాత యోవాషు ఆ విలువగల వస్తువులు సిరియా రాజైన హజాయేలుకి పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేమునుండి వెళ్లిపోయాడు.
2KI 12:19 యోవాషు చేసిన అన్ని ఘనకార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి.
2KI 12:20 యోవాషు అధికారులు అతనికి విరుద్ధంగా పథకం వేశారు. వారు సిల్లాకి వెళ్లే మార్గమున ఉన్న మిల్లో అనే ఇంట్లో యోవాషును చంపివేశారు.
2KI 12:21 షిమాతు కుమారుడైన యోజాకారు, షోమేరు కుమారుడైన యెహోజాబాదు యోవాషు అధికారులు. వారు యోవాషుని చంపివేశారు. దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటుగా యోవాషుని సమాధి చేశారు. యోవాషు కుమారుడైన అహాజ్యా అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
2KI 13:1 యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. అహజ్యా కుమారుడైన యోవాషు యూదా రాజుగా ఉన్న 23వ సంవత్సరమున ఇది జరిగింది. యెహోయా హాజు 17 ఏళ్లపాటు పరిపాలించాడు.
2KI 13:2 యెహోయాహాజు యెహోవా తప్పు అని చెప్పిన పనులను చేశాడు. ఇశ్రాయేలును పాపానికి గురిచేసిన నెబాతు కుమారుడు యరొబాము పాపాలను యెహోయాహాజు అనుసరించాడు. యెహోయాహాజు వీటిని చేయడం మానలేదు.
2KI 13:3 అప్పుడు యెహోవా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా కోపగించెను. సిరియా రాజయిన హజాయేలు, హజాయేలు కుమారుడైన బెన్హదదులకు యెహోవా ఇశ్రాయేలు దేశపు అధికారన్ని ఇచ్చెను.
2KI 13:4 తర్వాత యెహోయాహాజు తనకు సహాయం చేయమని యెహోవాను ప్రార్ధించాడు. యెహోవా అతని మొర ఆలకించాడు. ఇశ్రాయేలు కష్టాలను యెహోవా చూశాడు. సిరియా రాజు ఇశ్రాయేలు వారిని ఎలా కష్టపెట్టెనో కూడా చూశాడు.
2KI 13:5 అందువల్ల ఇశ్రాయేలుని కాపాడేందుకు ఒక వ్యక్తిని యెహోవా పంపాడు. ఇశ్రాయేలువారు సిరియావారి నుండి విడిపింపబడ్డారు. అందువల్ల ఇశ్రాయేలువారు పూర్వం చేసినట్లుగా, తమ ఇళ్లకు పోయారు.
2KI 13:6 కాని ఇశ్రాయేలువారు ఇశ్రాయేలుని పాపానికి గురి చేసిన యరొబాము వంశీయుల పాపాలను ఆపలేదు. యరొబాము చేసిన పాపాలను వారు కొనసాగించారు. వారు షోమ్రోనులో అషెరా స్తంభాలు ఉంచారు.
2KI 13:7 సిరియా రాజు యెహోయాహాజు యొక్క సైన్యాన్ని ఓడించి సైన్యంలోని చాలామందిని సిరియా రాజు నాశనం చేశాడు. అతను ఏబై మంది గుర్రాల సైనికులను, పదిరథాలను, పదివేలమంది సైనికులను మాత్రమే విడిచిపెట్టాడు. యెహోయాహాజు యొక్క సైనికులు నూర్పిడి సమయాన గాలికి చెదర కొట్టబడే ఊక వంటివారైనారు.
2KI 13:8 యెహోయాహాజు చేసిన ఘనకార్యాలన్నీ “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అ నే గ్రంథంలో రాయబడ్డాయి.
2KI 13:9 యెహోయాహాజు మరణించగా, అతని పూర్వికులతో పాటు అతను సమాధి చేయబడ్డాడు. షోమ్రోనులో ప్రజలతనిని సమాధి చేశారు. యెహో యారాజు కుమారుడు యెహోయాషు అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
2KI 13:10 యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. యూదా రాజుగా యెహోయాషు పరిపాలించిన 37వ సంవత్సరంలో ఇది జరిగింది. యెహోయాషు ఇశ్రాయేలీయులను 16 సంవత్సరాలు పరిపాలించాడు.
2KI 13:11 యెహోవా తప్పు అని చెప్పిన కార్యాలను యెహోయాషు జరిగించాడు.నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలు పాపకార్యాలకు గురిచేసిన ఆ చెడు కార్యాలను అతను నివారించలేక పోయాడు. యెహోయాషు ఆ పాపాలు కొనసాగించాడు.
2KI 13:12 యెహోయాషుచేసిన ఆ ఘనకార్యాలు అతను యూదా రాజయిన అమాజ్యాకు ప్రతికూలంగా చేసిన యద్ధాలు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడ్డాయి.
2KI 13:13 యెహోయాషు మరిణించగా, అతని పూర్వికులతో పాటుగా అతడు సమాధి చేయబడ్డాడు. యరొబాము క్రొత్తగా రాజయ్యాడు. యెహోయాషు సింహాసనం మీద యెరొబాము ఆసీనుడయ్యాడు. యెహోయాషు ఇశ్రాయేలు రాజులతో పాటు షోమ్రోనులో సమాధి చేయబడ్డాడు.
2KI 13:14 ఎలీషా జబ్బు పడ్డాడు. తర్వాత ఎలీషా ఆ జబ్బుతో మరిణించాడు. ఇశ్రాయేలు రాజయిన యెహోయాషు ఎలీషాని సందర్శించడానికి వెళ్లి, యెహోయాషు ఎలీషా కోసం విలపించాడు. “నా తండ్రీ, నా తండ్రీ! ఇశ్రాయేలు రథాలకు గుర్రాలకు ఇది సమయమేనా?” అని అడిగాడు.
2KI 13:15 యెహోయాషుతో, “విల్లు, కొన్ని బాణాలు తీసుకొనుము” అని ఎలీషా చెప్పాడు. యెహోయాషు ఒక విల్లు, కొన్ని బాణాలు తీసుకున్నాడు.
2KI 13:16 అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో ఇలా చెప్పాడు: “వింటిమీద నీ చేయి వేయుము.” యెహోయాషు వింటిమీద తన చేయి వేశాడు. తర్వాత ఎలీషా రాజు చేతులమీద తన చేతులు ఉంచాడు.
2KI 13:17 “తూర్పు కిటికి తెరువుము” అని ఎలీషా చెప్పాడు. యెహోయాషు కిటికి తెరిచాడు. తర్వాత, “గురిచూసి బాణం వదులుము” అని ఎలీషా చెప్పాడు. యెహోయాషు బాణం వదిలాడు. అప్పుడు ఎలీషా, “అది యెహోవా యొక్క విజయాస్త్రం! సిరియా మీద విజయాస్త్రం. నీవు సిరియన్లును అఫెకు అనే చోట ఓడిస్తావు. మరియు వారిని నాశనం చేస్తావు” అని చెప్పాడు.
2KI 13:18 “బాణాలు తీసుకో” అని ఎలీషా చెప్పాడు.యెహోయాషు బాణాలు తీసుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజుతో, “నేల మీద కొట్టుము” అని ఎలీషా చెప్పాడు. మూడుసార్లు యెహోయాషు నేలను కొట్టాడు. తర్వాత ఆపివేశాడు.
2KI 13:19 దైవజనుడు అయిన ఎలీషా యెహోయాషుపై కోపగించాడు. “నీవు ఐదు లేక ఆరుసార్లు కొట్టి వుండవలసింది. అప్పుడు నీవు సిరియాను నాశనమయ్యేంత వరకు ఓడించేవాడివి. కాని ఇప్పుడు నీవు సిరియాని మూడు సార్లు మాత్రమే ఓడించగలవు” అని ఎలీషా చెప్పాడు.
2KI 13:20 ఎలీషా మరణించగా, ప్రజలతనిని సమాధి చేశారు. వసంత ఋతువులో ఒకసారి, మోయాబు సైనిక బృందం ఇశ్రాయేలుకు వచ్చింది. యుద్ధంలోని వస్తువులను తీసుకోడానికి వారు వచ్చారు.
2KI 13:21 కొందరు ఇశ్రాయేలువారు చనిపోయిన ఒక వ్యక్తిని సమాధి చేస్తూ ఉన్నారు. వారు సైనిక బృందాన్ని చూశారు. ఇశ్రాయేలు వారు ఆ చనిపోయిన వ్యక్తిని ఎలీషా సమాధిలోకి విసరివేసి పారిపోయారు. ఎలీషా ఎముకలను ఆ చనిపోయిన వ్యక్తి తాకగానే, సజీవుడయ్యాడు; తన కాళ్ల మీద నిలబడగలిగాడు!
2KI 13:22 యెహోయాషు పరిపాలించిన ఆ రోజులలో, సిరియా రాజయిన హజయేలు ఇశ్రాయేలుకు ఇబ్బంది కలిగించాడు.
2KI 13:23 కాని యెహోవా ఇశ్రాయేలు వారిపట్ల దయ వహించాడు. యెహోవా దయాళుడు. ఇశ్రాయేలు వారివైపు తిరిగినాడు మరియు వారిని నాశనం చేయలేదు. ఎందుకంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ఒడంబడిక వల్ల, యెహోవా ఇశ్రాయేలు వారిని నాశనం చేయడు; ఇకను వారిని విసర్జించడు.
2KI 13:24 సిరియా రాజయిన హజాయేలు మరిణించాడు. అతని తర్వాత అతని కుమారుడు బెన్హదదు క్రొత్త రాజయ్యాడు.
2KI 13:25 అతను మరిణించాడానికి పూర్వం, యుద్ధంలో హజాయేలు కొన్ని నగరాలను యెహోయాషు తండ్రి అయిన యెహోయాహాజు నుండి తీసుకొనెను. కాని ఇప్పుడు యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు నుండి యీ నగరాలు మరల పొందెను. యెహోయాషు, బెన్హదదును మూడుసార్లు ఓడించి, ఇశ్రాయేలు నగరాలను మరల తీసుకున్నాడు.
2KI 14:1 యూదా రాజయిన యోవాషు కుమారుడైన అమాజ్యా యెహోయాహాజు కొడుకైన యోవాషు ఇశ్రాయేలు రాజుగా వున్న రెండవ సంవత్సరమున యూదాకు రాజయ్యాడు.
2KI 14:2 అమాజ్యా పరిపాలన ప్రారంభించేనాటికి 25 యేళ్లవాడు. యెరూషలేములో అమాజ్యా 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను.
2KI 14:3 యెహోవా మెచ్చుకున్న పనుల అమాజ్యా జరిగించాడు. తన పూర్వికుడైన దావీదువలె అతను పూర్తిగా దేవుని అనుసరించలేదు. తన తండ్రి అయిన యోవాషు చేసిన పనులన్నీ అతను చేశాడు.
2KI 14:4 అతను ఉన్నత స్థానాలను నాశనం చేయలేదు. ఆ ఆరాధనా స్థలాలలో నేటికి ప్రజలు బలులు అర్పించుచూ; ధూపం వేస్తున్నారు.
2KI 14:5 అమాజ్యాకు తన రాజ్యం మీద మంచి అదుపు వున్న ఆ సమయమున, తన తండ్రిని చంపిన అధికారులను అతను చంపాడు.
2KI 14:6 కాని హంతుకుల పిల్లలను అతను చంపలేదు. యెహోవా మోషే ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞను ఇచ్చాడు; “తమ పిల్లలు చేసినదానికి వారి తల్లిదండ్రులను చంపకూడదు. తమ తల్లిదండ్రులు చేసిన దానికి వారి పిల్లలను చంపకూడదు. అతనే స్వయంగా చేసిన చెడు పనికి అతనినే చంపవలెను.”
2KI 14:7 అమాజ్యా ఉప్పు లోయలో పదివేల మంది ఎదోము వాళ్లను చంపాడు. యుద్ధంలో అమాజ్యా సెలా అనే స్థలాన్ని “యొక్తయేలు” అని వ్యవహరించాడు. ఆ స్థలం నేటికీ “యొక్తయేలు” అని పిలువ బడుచున్నది.
2KI 14:8 అమాజ్యా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు వద్దకు దూతల్ని పంపాడు. యెహోయాహాజు ఇశ్రాయేలు రాజయిన యెహూ కుమారుడు. “మనము ముఖాముఖిగా కలుసుకుని యుద్ధం చేద్దాము” అని అమాజ్యా సందేశం పంపించాడు.
2KI 14:9 ఇశ్రాయేలు రాజయిన యెహోయాషు యూదా రాజయిన అమాజ్యకు బదులు రాశాడు. యెహోయాషు ఇలా చెప్పాడు. “లెబానోను దేవదారు చెట్టుకి లెబానోనులోని ముళ్లపొద ఒక సందేశం పంపింది. అది ఏమనగా, నీవు నీ కుమార్తెను నా కుమారుడికి పెళ్లి చేసుకునేందుకు యిమ్ము. కాని లెబానోనులోని ఒక దుష్ట మృగం ఆ త్రోవను వెళుతూ ముళ్లపొద మీద నడిచింది. నీవు ఎదోముని ఓడించిన మాట నిజమే.
2KI 14:10 కాని నీవు ఎదోము మీద పొందిన విజయానికి నీవు గర్వపడుతున్నావు. నీవు ఎదోములో వుండి మిడి సిపడుతున్నావు. ఇంతకు నీవు ఎందుకు ఆపద తెచ్చుకుంటావు. నీవు ఇలా చేస్తే, నీవు పతనంకాగలవు. మరియు యూదా నీతో పాటు నాశనం కాగలదు.”
2KI 14:11 కాని అమాజ్యా యెహోయాషు ఇచ్చిన హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమాజ్యాకు ప్రతి కూలంగా బేత్షెమెషు అనే చోట యుద్ధం చేయడానికి వెళ్లాడు.
2KI 14:12 ఇశ్రాయేలు యూదాను ఓడించాడు. యూదాకు చెందిన ప్రతి వ్యక్తి పారిపోయాడు.
2KI 14:13 బేత్షెమెషు వద్ద ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమాజ్యాను బంధించాడు. అమాజ్యా యెవాషు కుమారుడు. అతను అహజ్యా కుమారుడు. యెహోయాషు అమాజ్యాను యెరూషలేముకు తీసుకువెళ్లాడు. యెహోయాషు ఎఫ్రాయీము ద్వారం నుంచి కోటి ద్వారం, 600 అడుగుల యెరూషలేము ప్రాకారమును పగలగొట్టాడు.
2KI 14:14 తర్వాత యెహోయాషు యెహోవా ఆలయం లోని బంగారం, వెండి, వస్తువులను రాజభవనంలోని నిధులను తీసుకుపోయాడు. యెహోయాషు ప్రజలను కూడా తన బందీలుగా తీసుకుపోయాడు. తర్వాత అతను షోమ్రోనుకు తిరిగి వెళ్లాడు.
2KI 14:15 యెహోయాషు చేసిన ఘనకార్యములు యూదా రాజయిన అమాజ్యాతో అతను పోరాడిన విధంతో సహా “ఇశ్రాయేలు రాజ్య చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడి వున్నవి.
2KI 14:16 యెహోయాషు మరణించగా, అతనిని అతని పూర్వికులతో పాటు సమాధి చేశారు. ఇశ్రాయేలు రాజులతో పాటుగా షోమ్రోనులో యెహోయాషు సమాధి చేయబడ్డాడు. యెహోయాషు కుమారుడు యరొబాము, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
2KI 14:17 ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడు యెహోయాషు మరణించిన 15 సంవత్సరాల వరకు యూదా రాజయిన యెవాషు కుమారుడు అమాజ్యా బ్రదికాడు.
2KI 14:18 అమాజ్యా జరిగించిన ఘనకార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడివున్నాయి.
2KI 14:19 యెరూషలేములో ప్రజలు అమాజ్యాకు ప్రతి కూలంగా ఒక పధకం వేశారు. అమాజ్యా లాకీషుకు పారిపోయాడు. కాని ప్రజలు లాకీషుకు అమాజ్యా వెనుకాల కొందరు వ్యక్తులను పంపారు. ఆ వ్యక్తులు లాకీషులో అమాజ్యాను చంపివేశారు.
2KI 14:20 ప్రజలు అమాజ్యా దేహాన్ని గుర్రాల మీద వెనక్కి తీసుకువచ్చి, దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటు అమాజ్యాను సమాధి చేశారు.
2KI 14:21 తర్వాత యూదాలోని మనుష్యులందురు అమాజ్యా కుమారుడైన అజర్యాను కొత్త రాజుగా చేశారు. అజర్యా 16 యేండ్లవాడు.
2KI 14:22 అమాజ్యా రాజు మరణించగా, అతని పూర్వికులతో పాటు అతనిని సమాధి చేశారు. తర్వాత అజర్యా ఏలతు పట్టణం మరల నిర్మించి, దానిని యూదాకు స్వాధీన పరిచాడు.
2KI 14:23 యూదా రాజుగా యోవాషు కుమారుడైన అమాజ్యా పరిపాలనలో 15వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు యరొబాము సమరియాలో పరిపాలన ప్రారంభించెను. యరొబాము 41 సంవత్సరాలు పరిపాలించాడు.
2KI 14:24 యెహోవా తప్పు అని చెప్పిన కార్యములు ఈ యరొబాము చేశాడు. నెబాతు కుమారుడు యరొబాము ఇశ్రాయేలు పాపాలకు కారణమైన ఆ పాపకార్యములను యరొబాము ఆపలేదు.
2KI 14:25 హమాతు నుండి అరబా సముద్రం దాకా వ్యాపించిన ఇశ్రాయేలు దేశమును యరొబాము మరల తీసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా తన భక్తుడైన అమిత్తయి కుమారుడు యోనాకు చెప్పినట్లు ఇది జరిగింది. అమిత్తయి గత్హేపెరు నుండి వచ్చిన ఒక ప్రవక్త.
2KI 14:26 ఇశ్రాయేలు వారందరకీ చాలా ఇబ్బందులున్నాయని యెహోవా చూశాడు. సేవకులు స్వతంత్రులూ వున్నారని చూశాడు. ఇశ్రాయేలుకు సహాయం చేయదగిన వ్యక్తి ఎవరూ లేరు.
2KI 14:27 ప్రపంచంలో ఇశ్రాయేలు అన్న పేరుని తీసివేస్తానని యెహోవా చెప్పలేదు. అందువల్ల యెహోవా యెహోయాషు కుమారుడైన యరొబాముని ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు ఏర్పాటు చేసాడు.
2KI 14:28 యరొబాము చేసిన ఘనకార్యాలన్ని “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడినవి. ఇశ్రాయేలుకు గాను దమస్కు మరియు హమాతులను యరొబాము తిరిగి పొందిన కథకూడా ఇందులో పొందుపరచబడింది. (ఈ నగరాలు యూదాకి చెందినవి).
2KI 14:29 యరొబాము మరణించగా, ఇశ్రాయేలీయుల రాజులైన అతని పూర్వికులతో పాటుగా అతను సమాధి చేయబడ్డాడు. యరొబాము కుమారుడైన జెకర్యా, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
2KI 15:1 ఇశ్రాయేలు రాజుగా యరొబాము పరిపాలన చేసే 27వ సంవత్సరమున యూదాకు రాజైన అమాజ్యా కుమారుడు అజర్యా రాజయ్యాడు.
2KI 15:2 అతను పరిపాలన ప్రారంభించేనాటికి, అజర్యా 16 సంవత్సరముల వయస్సు గలవాడు. యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలించాడు. అజ ర్యా తల్లి పేరు యెరూషలేముకు చెందిన యెకొల్యా.
2KI 15:3 తన తండ్రి అమాజ్యావలె, అజర్యా యెహోవా మంచివని చెప్పిన పనులు చేశాడు. అతని తండ్రి అమాజ్యా చేసిన వాటినే అజర్యా అనుసరించాడు.
2KI 15:4 కాని అతను ఉన్నత స్థానాలను పాడు చేయలేదు. ఈ ఉన్నత స్థలాల్లో ప్రజలింకా బలులు అర్పించుచూ; ధూపం వేయు చున్నారు.
2KI 15:5 యెహోవా అజర్యా రాజును కుష్ఠరోగగ్రస్తునిగా చేశాడు. అతను మరణించేంత వరకు కుష్ఠరోగియే. అజర్యా విడిగా ఒక ఇంట్లో ఉన్నాడు. రాజు కుమారుడైన యోతాము రాజభవన సంరక్షణలో శ్రద్ధ వహించాడు. ప్రజలను న్యాయ విచారణ చేశాడు.
2KI 15:6 అజర్యా చేసిన ఘనకార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడినవి.
2KI 15:7 అజర్యా మరణించగా, దావీదు నగరంలో అతని పూర్వీకులతో పాటు సమాధి చేయబడ్డాడు. అజర్యా కుమారుడు యెతాము, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
2KI 15:8 యరొబాము కుమారుడైన జెకర్యా ఇశ్రాయేలులోని షోమ్రోనుపై ఆరు నెలలు పరిపాలించాడు. ఇది యూదా రాజుగా అజర్యా పరిపాలనకు వచ్చిన 38వ సంవత్సరమున జరిగింది.
2KI 15:9 యెహోవా తప్పు అని చెప్పిన పనులు జెకర్యా చేశాడు. అతని పూర్వీకులు చేసిన వాటినే అతను చేసెను. నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలవల్ల ఇశ్రాయేలును పాపమునకు పాల్పడజేసిన ఆ పాపకార్యాలను అతను ఆపలేదు.
2KI 15:10 యాబేషు కుమారుడైన షల్లూము జెకర్యాకు విరోధంగా కుట్రపన్నాడు. షల్లూము జెకర్యాను ప్రజల ముందర చంపివేశాడు. అతని తర్వాత షల్లూము కొత్తగా రాజయ్యాడు.
2KI 15:11 జెకర్యా చేసిన ఇతర పన్నులన్నీ “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడి వున్నవి.
2KI 15:12 ఈవిధంగా యెహోవా చెప్పినవన్నీ నిజమయ్యాయి. యెహూ యొక్క సంతతిలోని నాలుగు తరాల వారు ఇశ్రాయేలు రాజులుగా ఉందురని యెహోవా చెప్పాడు.
2KI 15:13 యాబేషు కుమారుడైన షల్లూము ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఇది యూదా రాజుగా ఉజ్జియా పరిపాలన చేసే 39వ సంవత్సరంలో జరిగింది. షోమ్రోనులో షల్లూము ఒక నెల పరిపాలించాడు.
2KI 15:14 గాదీ కుమారుడైన మెనహేము తిర్సానుండి షోమ్రోనుకు వచ్చాడు. మెనహేము యాబేషు కుమారుడైన షల్లూమును చంపివేశాడు. తర్వాత మెనహేము, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
2KI 15:15 షల్లూము చేసిన అన్ని పనులు జెకర్యాకు విరుద్ధంగా అతని పథకములతో సహా “ఇశ్రయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడ్డాయి.
2KI 15:16 షల్లూము మరిణానంతరం, మెనహేము తిప్సహు ఆ పరిసర ప్రాంతాన్ని ఓడించాడు. అతనికై ప్రజలు నగరద్వారాన్ని తెరవడానికి అంగీకరించలేదు. అందువల్ల మెనహేము వారిని ఓడించాడు. నగరంలోని గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చాడు.
2KI 15:17 అజర్యా యూదా రాజుగా వున్న 39వ సంవత్సరమున, గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలుకు రాజయ్యాడు. షోమ్రోనులో మెనహేము పది సంవత్సరాల పాటు పరిపాలించాడు.
2KI 15:18 యెహోవా చెడ్డవని చెప్పిన పనులు మెనహేము చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలీయులను పాపాలకు గురిచేసిన ఆ పాపాలను మెనహేము ఆపలేదు.
2KI 15:19 అష్షూరు రాజయిన పూలు ఇశ్రాయేలుకు ప్రతి కూలంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. మెనహేము పూలుకు 75,000 పౌన్ల వెండి ఇచ్చాడు. పూలు మెనహేముకి సహాయపడుననీ, మెనహేము రాజ్యాన్ని బలిష్ఠం చేయుననీ అనుకుని అతను అలా చేశాడు.
2KI 15:20 ధనవంతులూ, అధికారం గలవారూ పన్నులు చెల్లించునట్లుగా చేసి మెనహేము డబ్బును వసూలు చేశాడు. మెనహేము ప్రతి వ్యక్తికీ 20 తులాల వెండి పన్నుగా విధించాడు. తర్వాత మెనహేము అష్షూరు రాజుకి ఆ డబ్బు ఇచ్చాడు. అందువల్ల అష్షూరు రాజు ఇశ్రాయేలును విడిచి వెళ్లాడు.
2KI 15:21 మెనహేము చేసిన అన్ని గొప్పకార్యాలు “ఇశ్రాయేలు రాజుల చరితగ్రంథంలో” రాయబడినవి.
2KI 15:22 మెనహేము మరణించగా, అతని పూర్వికులతో పాటు, అతడు సమాధి చేయబడ్డాడు. మెనహేము కుమారుడు పెకహ్యా అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
2KI 15:23 అజర్యా యూదా రాజుగా వున్న 50 వ సంవత్సరమున, మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. పెకహ్యా రెండేండ్లు పాలించాడు.
2KI 15:24 యెహోవా తప్పని చెప్పిన కార్యాలను పెకహ్యా చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలును పాపకార్యాలకు గురిచేసిన ఆ పాపాలను పెకహ్యా ఆపలేదు.
2KI 15:25 పెకహ్యా సైన్యానికి అధిపతి అయిన పెకహు రెమల్యా కుమారుడు. పెకహు రాజైన పెకహ్యాకు విరోధముగా పన్నాగము చేశాడు. అతనిని షోమ్రోనులోని రాజభవనములో అతను చంపాడు. గిలాదునుంచి వచ్చిన 50 మంది మనుష్యులు పెకహ్యాని చంపేటప్పుడు పెకహుతో పాటువున్నారు. అతని తర్వాత పెకహు కొత్తగా రాజయ్యాడు.
2KI 15:26 పెకహ్యా చేసిన అన్ని గొప్పకార్యాలు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడినవి.
2KI 15:27 యూదా రాజుగా అజర్యా వున్న 52వ సంవత్సరమున షోమ్రోనులోని ఇశ్రాయేలుని రెమల్యా కొడుకైన పెకహు పరిపాలించసాగాడు. పెకహు 20 సంవత్సరాలు పరిపాలించాడు.
2KI 15:28 యెహోవా చెడ్డవని చెప్పిన పనులు పెకహు చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలుని పాపానికి గురిచేసిన ఆ పాపాలను పెకహు ఆపలేదు.
2KI 15:29 అష్షూరు పాలకుడైన తిగ్లత్పిలేసెరు ఇశ్రాయేలుకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇశ్రాయేలు రాజుగా పెకహు వున్న కాలంలో ఇది జరిగింది. తిగ్లత్పిలేసరు, ఈయోను, ఆబేల్బేత్మయకా, హాసోరు, గిలాదు, యానోయహు కెదెషు గలిలయ మరియు నఫ్తాలీ ప్రాంతమంతటినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ అన్ని స్థలాలనుండి తిగ్లత్పిలేసరు ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకు వెళ్లాడు.
2KI 15:30 హోషేయా కొడుకు ఏలా, రెమల్యా కొడుకు పెకహు మీద పన్నాగం పన్నాడు. హోషేయా పెకహును చంపివేశాడు. అప్పుడు హోషేయా పెకహుకు పిదప క్రొత్తగా రాజు అయ్యాడు. ఇది ఉజ్జియా కొడుకు యోతాము యొక్క 20వ సంవత్సర యూదా పరిపాలనలో జరిగింది.
2KI 15:31 పెకహు చేసిన అన్ని ఘనకార్యములు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడినవి.
2KI 15:32 ఉజ్జియా కుమారుడైన యోతాము యూదాకు రాజయ్యాడు. రెమల్యా కొడుకైన పెకహు ఇశ్రాయేలు రాజుగా వున్న రెండవ సంవత్సరంలో ఇది జరిగింది.
2KI 15:33 యోతాము రాజయినప్పుడు, అతను 25 యేండ్లవాడు. యోతాము యెరూషలేములో 16 సంవత్సరాలు పాలించాడు. యోతాము తల్లి పేరు యెరూషా. ఆమె సాదోకు కుమార్తె.
2KI 15:34 తన తండ్రి ఉజ్జియావలె, యెహోవా మంచివని చెప్పిన పనులు యోతాము చేశాడు.
2KI 15:35 కాని అతను ఉన్నత స్థలాలను పాడు చేయలేదు. ఈ ఉన్నత స్థలలలో ప్రజలు నేటికి బలులు అర్పించుచూ ధూపం వేయుచున్నారు. యెహోవా ఆలయానికి గల పై ద్వారమును యోతాము నిర్మించాడు.
2KI 15:36 యోతాము చేసిన అన్ని ఘనకార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడినవి.
2KI 15:37 ఆ సమయమున, సిరియా రాజయిన రెజీనును, రెమల్యా కొడుకైన పెకహును యూదాకు ప్రతికులంగా యుద్ధం చేయడానికి యెహోవా పంపాడు.
2KI 15:38 యోతాము మరణించగా, అతని పూర్వికులతో పాటు అతను అతని పూర్వికుడైన దావీదు పేరు మీదగల నగరంలో సమాధి చేయబడ్డాడు. యోతాము కుమారుడు అహాజు అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
2KI 16:1 యోతాము కుమారుడైన అహాజు యూదాకు రాజయ్యాడు. రెమల్యా కుమారుడైన పెకహు ఇశ్రాయేలుకు రాజుగా వున్న 17వ సంవత్సరమున అది జరిగింది.
2KI 16:2 అహాజు రాజయ్యేనాటికి, అతను 20 యేండ్లవాడు. యోరూషలేములో అహాజు 16 సంవత్సరాలు పరిపాలించాడు. యెహోవా చేయుమని చెప్పిన పనులు అహాజు చేయలేదు. తన పూర్వికుడైన దావీదు దేవునికి విధేయుడు. కానీ తన పూర్వీకులవలె అహాజు యెహోవాకి విధేయత చూపలేదు.
2KI 16:3 అహాజు ఇశ్రాయేలు రాజులవలె నివసించాడు. అతను తన కుమారుని కూడా అగ్నిలో బలిగా అర్పించాడు. ఇశ్రాయేలు వారు వచ్చినప్పుడు యెహోవా విడిచి వెళ్లుటకు కారణమైన ఆ జనాంగములు చేసిన భయంకర పాపాలను అతను అనుసరించాడు.
2KI 16:4 అహాజు బలులు అర్పిస్తూ ఉన్నత స్థలాలలో ధూపం వేసాడు; కొండల మీద ప్రతి పచ్చని చెట్టు క్రిందను వెలిగించాడు.
2KI 16:5 సిరియా రాజయిన రెజీను రెమల్యా కుమారుడు మరియు ఇశ్రాయేలు రాజయిన పెకహు యెరూషలేముకు ప్రతికులంగా యుద్ధం చేయడానికి వచ్చారు. రెజీను పెకహు కలిసి అహాజుని చుట్టుముట్టారు; కాని ఓడించలేకపోయారు.
2KI 16:6 ఆ సమయంలో సిరియా రాజయిన రెజీను సిరియా కోసం ఏలతును తిరిగి పొందాడు. ఏలతులో నివసించే యూదా వారినందరిని రెజీను తీసుకుపోయాడు. ఏలతులో స్థిరపడిన సిరియనులు నేటికీ అక్కడే నివసిస్తున్నారు.
2KI 16:7 అష్షూరు రాజయిన తిగ్లత్పిలేసెరు వద్దకు అహాజు దూతలను పంపాడు. సందేశం ఏమనగా: “నేను మీ సేవకుడును. నేను మీకు కుమారునివంటి వాడను. సిరియా రాజు, ఇశ్రాయేలు రాజుల నుండి నన్ను మీరు కాపాడవలెను. వారు నాతో యుద్ధం చేయడానికి వచ్చారు.”
2KI 16:8 యెహోవా ఆలయంలోను, రాజభవన నిధులలోను వున్న వెండి బంగారాలను అహాజు తీసుకొని పోయాడు. తర్వాత అహాజు అష్షూరు రాజుకి కానుక పంపాడు.
2KI 16:9 అష్షూరు రాజు అహాజు మాట ఆలకించాడు. అష్షూరు రాజు దమస్కుకు ప్రతికూలంగా యుద్ధానికి పోయాడు. రాజు ఆ నగరాన్ని వశం చేసుకున్నాడు; ప్రజలను బందీలుగా చేసి దమస్కు నుండి కీరుకి తీసుకునిపోయాడు. అతను రెజీనును కూడా చంపివేశాడు.
2KI 16:10 అహాజు రాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలుసుకునేందుకు దమస్కు వెళ్లాడు. దమస్కులో అహాజు బలిపీఠం చూశాడు. అహాజు రాజు దీని నమూనాని పద్దతిని ఊరియా యాజకునికి పంపాడు.
2KI 16:11 తర్వాత యాజకుడయిన ఊరియా దమస్కు నుండి అహాజు రాజు పంపిన నమూనాననుసరించి ఒక బలిపీఠం నిర్మించాడు. దమస్కు నుండి అహాజు రాకకు పూర్వమే ఊరియా యాజకుడు అదే రకమైన బలిపీఠం నిర్మించాడు.
2KI 16:12 దమస్కు నుండి రాజు రాగానే, అతను బలిపీఠం చూశాడు. ఆ బలిపీఠం వద్ద రాజు బలులు అర్పించాడు.
2KI 16:13 బలిపీఠం మీద అహాజు దహన బలులు ధాన్యార్పణలు అర్పించాడు. అతను పానీయ అర్పణలు, సమాధాన బలులు ఈ బలిపీఠం మీద అర్పించాడు.
2KI 16:14 అహాజు ఆలయం ముందు భాగం నుండి యెహోవా సమక్షంలోవున్న కంచు బలిపీఠం తీసుకున్నాడు. ఈ కంచు బలిపీఠం అహాజు బలిపీఠానికి యెహోవా ఆలయానికి మధ్య వున్నది. తన సొంత బలిపీఠానికి ఉత్తర దిశగా కంచు బలిపీఠం ఉంచాడు.
2KI 16:15 అహాజు ఊరియా యాజకునికి ఆజ్ఞ విధించాడు: “ఉదయపు దహనబలులను, సాయంకాలపు ధాన్యార్పణలను, ఈ దేశంలోని ప్రజల పానీయ అర్పణలకు ఈ పెద్ద బలిపీఠం ఉపయోగించాలి. వండబడిన బలులు దహన బలులు మరి ఇతర బలుల నుండి తీసిన రక్తాన్ని పెద్ద బలిపీఠం మీద చల్లాలీ. కాని అవసరము వచ్చినప్పుడల్లా నేను కంచు బలిపీఠం ఉపయోగిస్తాను.”
2KI 16:16 అహాజు రాజు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఉరియా యాజకుడు జరిగించాడు.
2KI 16:17 యాజకులు తమ చేతులు కడుగుకొనేందుకు బళ్లనిండుగా ఇత్తడి గంగాళాలు, లోతు పళ్లాలు వున్నవి. అహాజు రాజు ఆ గంగాళాలు, లోతు పళ్లెములు తొలగించి బండ్లని ముక్కలు చేశాడు. కంచు స్తంభాల మీద నున్న పెద్ద తొట్టిని తీసివేశాడు. ఆ పెద్ద తొట్టిని చదును చేయబడిన రాయిపై వుంచాడు.
2KI 16:18 ఆలయంలోని ప్రతి భాగంలో సబ్బాతు సమావేశాల కోసం పనివారు మూయబడిన ఒక ప్రదేశం తయారు చేశారు. అహజు రాజు తన కోసం కప్పియున్న మండపము మరియు వెలుపలి ప్రవేశాన్ని తీసివేశాడు. వాటన్నిటినీ యెహోవా ఆలయంనుంచి అహాజు తీసివేశాడు. అష్షూరు రాజుకోసం అహాజు అవి చేశాడు.
2KI 16:19 అహాజు చేసిన ఆ కార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడి ఉన్నాయి.
2KI 16:20 అహాజు మరణించగా అతను దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటు సమాధి చేయబడ్డాడు. అహాజు కుమారుడు హిజ్కియా, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
2KI 17:1 ఏలా కుమారుడైన హోషేయా ఇశ్రాయేలులో షోమ్రోను నుంచి పరిపాలించ సాగాడు. అహాజు యూదా రాజుగా ఉన్న 12వ సంవత్సరమున ఇది జరిగింది. హోషేయా తొమ్మిదేళ్లు పరిపాలించాడు.
2KI 17:2 యెహోవా తప్పనిచెప్పిన పనులు హోషేయా చేశాడు. కాని హోషేయా తనకు పూర్వికులైన ఇశ్రాయేలు రాజులవలె చెడ్డవాడు కాదు.
2KI 17:3 షల్మనేసెరు అష్షూరుకు రాజు. అతను హోషేయాకి ప్రతికూలంగా యుద్ధానికి వెళ్లాడు. షల్మనేసెరు హోషేయాని ఓడించాడు. మరియు హోషేయా అతని సేవకుడయ్యాడు. అందువల్ల హోషేయా షల్మనేసెరుకు పన్ను చెల్లించాడు.
2KI 17:4 తర్వాత, హోషేయా ఈజిప్టు రాజు సహాయం కోరుతూ దూతలను పంపాడు. ఆ రాజు పేరు సో. ఆ సంవత్సరం హోషేయా తాను ప్రతియేడు చేసేవిధంగా అష్షూరు రాజుకి కప్పం కట్టలేదు. అష్షూరు రాజు తనకు విరుద్ధంగా హోషేయా పథక రచన చేసినట్లు తెలుసుకున్నాడు. అందువల్ల అష్షూరు రాజు హోషేయాని ఖైదుచేసి చెరసాలలో వేశాడు.
2KI 17:5 అష్షూరు రాజు ఇశ్రాయేలులో చాలా స్థలాలపై దాడి చేశాడు. తర్వాత షోమ్రోనుకు అతను వచ్చాడు. అతను షోమ్రోనుకి ప్రతికూలంగా మూడు సంవత్సరాలు యుద్ధం చేశాడు.
2KI 17:6 అష్షూరు రాజు ఇశ్రాయేలు రాజుగా హోషేయా వున్న తొమ్మిదో సంవత్సరమున షోమ్రోనును తీసుకున్నాడు. అష్షూరు రాజు చాలా మంది ఇశ్రాయేలు వారిని బంధించి, వారిని బంధీలుగా అష్షూరుకు తీసుకుని వెళ్లాడు. వారినతడు గోజాను వద్ద హాబోరు నదికి ప్రక్కగా హలాహు అనే చోటను, మాదీయుల ఇతర నగరాలలోను నివసింపజేశాడు.
2KI 17:7 ఇశ్రాయేలు వారు తమ యెహోవా దేవునికి విరుద్ధంగా పాపం చేశారు కనుక, ఈ విషయాలు జరిగాయి. ఆ యెహోవాయే ఈజిప్టు నుండి ఇశ్రాయేలు వారిని బయటకు తీసుకువచ్చాడు. మరియు ఈజిప్టు రాజైన ఫరో శక్తి నుండి యెహోవాయే రక్షించాడు. కాని ఇశ్రాయేలు వారు ఇతర దేవుళ్లను పూజించసాగారు. ఈజిప్టు రాజైన ఫరో అధికారం నుండి యెహోవా వారిని సంరక్షించాడు.
2KI 17:8 ఇతర జనాంగములు చేసినట్లుగానే, వారు చేయసాగారు. ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు ఆ జనాంగములను వారిని తమ ప్రదేశము వదిలి వెళ్లాలని యెహోవా చేత నిర్భందించబడ్డారు. ఇశ్రాయేలు వారు కూడా దేవుని వల్లగాక రాజులచే పరిపాలంచబడాలని ఎంచుకున్నారు.
2KI 17:9 ఇశ్రాయేలు వారు తమ యెహోవా దేవునికి విరుద్ధమైన సంగుతులను రహస్యంగా చేశారు. వారు చేసినవి సరి అయినవి కావు! తమ నగరాలన్నిటిలోను ఇశ్రాయేలువారు ఉన్నత స్థలాలు నిర్మించారు. చిన్న పట్టణం నుంచి పెద్ద నగరం దాకా.
2KI 17:10 ఇశ్రాయేలువారు స్మారక శిలలు వేశారు. ప్రతి కొండమీదను పచ్చని చెట్ల క్రిందను అషెరా స్తంభాలు ఏర్పాటు చేశారు.
2KI 17:11 అన్ని ఆరాధనా స్థలాలలోను ఇశ్రాయేలువారు ధూపం వేసేవారు. యెహోవా జనాంగములను తమ కళ్ల ఎదుటే బలవంతంగా విడిచిపెట్టి వెళ్లమని చెప్పిన విధంగా, వారీ పనులు చేసేవారు. ఇశ్రాయేలువారు చేసినచెడుపనులు యెహోవాకి ఆగ్రహం కలిగించాయి.
2KI 17:12 వారు విగ్రహలను కొలిచారు. “మీరీ పని చేయకూడదు” అని యెహోవా ఇశ్రాయేలువారికి చెప్పాడు.
2KI 17:13 ఇశ్రాయేలుని యూదాని హెచ్చరిక చేసేందుకు యెహోవా ప్రతి ప్రవక్తను, దీర్ఘదర్శిని ఉపయోగించాడు. “మీరు చేసే చెడు పనులకు అయిష్టత చూపండి. నా ఆ జ్ఞలను చట్టాలను పాటించండి. మీ పూర్వికులకు నేనిచ్చిన ధర్మశాస్త్రమును మీరు అనుసరించండి. ఈ ధర్మశాస్త్రాన్ని నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అందించాను” అని యెహోవా చెప్పాడు.
2KI 17:14 కాని ప్రజలు ఆ మాటలు వినలేదు. తమ పూర్వికులవలె వారు మొండిగా వుండిరి. వారి పూర్వీకులు తమ యెహోవా దేవుని విశ్వసించలేదు.
2KI 17:15 ప్రజలు యెహోవా చట్టాలను అంగీకరించలేదు. తమ పూర్వికులతో యెహోవా చేసిన ఒడంబడికను అంగీకరింలేదు. వారు యెహోవా చేసిన హెచ్చరికలను పాటించలేదు. ఎందుకు విలువలేని విగ్రహములను వారు కొలిచారు, మరియు వారు ఎందుకు విలువలేనివారయ్యారు. తమ చుట్టూ వున్న జనాంగములవలె వారు ఆ ప్రజల చెడు జీవిత పద్దతిని అనుసరించారు. మరియు యెహోవా ఇశ్రాయేలు ప్రజలను, హెచ్చరించి, ఆ చెడు పనులు చేయవద్దని చెప్పాడు.
2KI 17:16 తమ యెహోవా దేవుని ఆజ్ఞలను ప్రజలు పాటించ డం మానివేశారు. వారు రెండు బంగారు దూడల విగ్రహాలు చేశారు. అషెరా స్తంభాలు వారు ఏర్పాటు చేశారు. వారు ఆకాశంలోని అన్ని నక్షత్రాలను పూజించారు; బయలు దేవతలను కొలిచారు.
2KI 17:17 వారు తమ కొడుకుల్ని, కూతుళ్లని అగ్నిలో వేసి బలి ఇచ్చారు. భవిష్యత్తుని తెలుసుకునేందుకు వారు చేతబడి తనమును ఇంద్రజాలమును ఉపయోగించారు. దుష్కార్యమని యెహోవా చెప్పినదానిని ప్రజలు చేశారు. యెహోవాని ఆగ్రహ పరిచేందుకు వారు అలా చేశారు.
2KI 17:18 అందువల్ల యెహోవా ఇశ్రాయేలుపట్ల చాలా కోపపడ్డాడు; తన దృష్టినుంచివారిని తప్పించాడు. యూదా గోత్రం తప్ప మరి ఇతర ఇశ్రాయేలువారు లేరు.
2KI 17:19 యూదా ప్రజలు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించలేదు. యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలవలె నివసించారు.
2KI 17:20 యెహోవా ఇశ్రాయేలు ప్రజలందరిని త్రోసి పుచ్చాడు. అతడు వారికి ఎన్నో ఇబ్బందులు కలుగ జేశాడు. ఇతరులు తమను నాశనం చేసేటట్లు చేసుకున్నారు. చిట్టచివరికి, ఆయన తన దృష్టినుండి వారిని త్రోసిపుచ్చాడు.
2KI 17:21 యెహోవా దావీదు వంశం నుంచి ఇశ్రాయేలుని విడగొట్టాడు. మరియు ఇశ్రాయేలువారు నెబాతు కుమారుడైన యరొబామును తమ రాజుగా చేసుకున్నారు. యరొబాము యెహోవాని అనుసరించని వారు గా వారిని గురించాడు. ఇశ్రాయేలువారు మహా పాపం చేసేలా యరొబాము చేశాడు. అందువల్ల
2KI 17:22 ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాపాలన్నీ చేశారు.
2KI 17:23 యెహోవా తన దృష్టినుండి ఇశ్రాయేలుని దూరముగా తీసుకుపోయే వరకు, వారు ఆ పాపాలు చేయడం మానలేదు. మరియు ఇలా జరుగునని యెహోవా చెప్పాడు! ఆయన ప్రజలకు ఇలా జరుగుతుందని చెప్పమని తమ దేశంనుండి అష్షూరుకు తీసుకువెళ్లడం జరిగింది. అక్కడ వారు నేటిదాకా వున్నారు.
2KI 17:24 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని షోమ్రోను నుండి వెలుపలికి తీసుకు వచ్చాడు. తర్వాత అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్యా, హమాతు, సెపర్వయీముల నుండి మనుష్యులను తీసుకువచ్చాడు. అతను వారినందరిని షోమ్రోనులో ఉంచాడు. ఆ ప్రజలు షోమ్రోనును గ్రహించి ఆ చుట్టు ప్రక్కల నగరాలలో నివసింపసాగారు.
2KI 17:25 ఈ ప్రజలు షోమ్రోనులో ఉండసాగిన తర్వాత, యెహోవాని వారు గౌరవించలేదు. అందువల్ల ప్రభువు వారిమీదికి సింహాలను పంపించాడు. ఈ సింహాలు కొందరిని చంపివేశాయి.
2KI 17:26 కొందరు అష్షూరు రాజుతో, “నీవు తీసుకువచ్చి షోమ్రోను నగరాలలో నిలిపిన ప్రజలకు ఆ దేశపు దేవుని న్యాయసూత్రాలు తెలియవు. అందువల్ల దేవుడు సింహాలను పంపి వారిని ఎదుర్కొన్నాడు. ఆ ప్రజలకు ఆ ప్రదేశపు దేవుని చట్టాలు తెలియవు కనుక వారిని సింహాలు చంపివేశాయి” అని చెప్పారు.
2KI 17:27 అందువల్ల అష్షూరు రాజు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు షోమ్రోను నుండి కొందరు యాజకులను తీసుకున్నారు. నేను బంధించిన యాజకులలో ఒకరిని తిరిగి షోమ్రోనుకు పంపించండి. ఆ యాజకుడ్ని వెళ్లి అక్కడే వుండనివ్వండి. తర్వాత ఆయాజకుడు ఆ దేశపు దేవుని న్యాయసూత్రాలను వారికి బోధించగలడు.”
2KI 17:28 అందువల్ల అష్షూరులు తీసుకుపోయిన ఒక యాజకుడు బేతేలులో నివసించాడానికి వచ్చాడు. ఈ యాజకుడు యెహోవాని ఎలా గౌరవించాలో వాళ్లకి బోధించాడు.
2KI 17:29 కాని ఆ మనుష్యులందరు తమతమ దేవుళ్ల విగ్రహలను చేసి షోమ్రోనుల ఉన్నత స్థానాలలో ఆలయాలలో ఆ విగ్రహలను ఉంచారు.
2KI 17:30 బబులోను మనుష్యులు అబద్ధపు దేవుడైన సుక్కోల్బెనోతును కల్పించుకున్నారు. కూతా మనుష్యులు అబద్ధపు దేవుడైన నెర్గలుని కల్పించుకున్నారు.
2KI 17:31 అవ్వాకు చెందినవారు అసత్య దేవుడైన నిబ్హజు తర్తాకులను కల్పించుకున్నారు. హమాతు ప్రజలు అబద్ధపు దేవుడైన అషీమాని కల్పించుకున్నారు. మరియు సెపర్వీయుల నుండి వచ్చిన ప్రజలు తమ అసత్యపు దేవుళ్లయిన అద్రమ్మెలెకు, అనెమ్మెలెకుల గౌరవార్థం తమ సంతానాన్ని అగ్నికి ఆహుతి చేశారు.
2KI 17:32 కాని ఆ ప్రజలు యెహోవాని కూడా పూజించారు. ప్రజలనుండి ఉన్నత స్థానాలకు వారు యాజకులను ఎంపిక చేశారు. ఆ ఆరాధనా స్థలాలలో ఈ యాజకులు ఆలయాలలో ప్రజలకోసం బలులు అర్పించారు.
2KI 17:33 వారు యెహోవాని గౌరవించారు; కాని వారు తమ సొంత దేవుళ్లను కూడా సేవించారు. ఆ ప్రజలు తాము తీసుకొని రాబడిన దేశాలలో జరిగించి నట్లుగానే తమ దేవుళ్లను పూజించారు.
2KI 17:34 నేటికీ ఆ ప్రజలు పూర్వం వున్నట్లుగానే నివసిస్తున్నారు. వారు యెహోవాని గౌరవించరు. వారు ఇశ్రాయేలువారి నిబంధనలను, ఆజ్ఞలను పాటించరు. వారు యాకోబు పిల్లలకు (ఇశ్రాయేలు) విధించిన ఆజ్ఞలనుగాని నిబంధనలను గాని పాటించ లేదు.
2KI 17:35 యెహోవా ఇశ్రాయేలువారితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. యెహోవా, “మీరు ఇతర దేవతలను అనుసరించకూడదు. మీరు వారిని పూజించకూడదు; ఆరాధించకూడదు; వారికి బలుల కూడా సమర్పించకూడదు.
2KI 17:36 కాని యెహోవాని అను సరించాలి. ఈజిప్టు నుంచి మిమ్ము తీసుకువకచ్చిన యెహోవాయే దేవుడు. యెహోవా తన గొప్ప శక్తిని మిమ్ము రక్షించడానికి వినియోగించాడు. మీరు యెహోవాని ఆరాధిస్తూ మరియు గౌరవించి ఆయనకి బలులు సమర్పించాలి.
2KI 17:37 ఆయన మీ కోసం రాసిన నిబంధనలు, న్యాయ సూత్రాలు, బోధనలు, ఆజ్ఞలు మొదలైన వాటిని మీరు పాటించాలి. ఎప్పుడూ మీరీ విషయాలు పాటించాలి. మీరు ఇతర దేవతలను గౌరవించరాదు.
2KI 17:38 మీతో నేను చేసిన ఒడంబడిక మీరు మరచిపోకూడదు.
2KI 17:39 మీరు మీ దేవుడైన యెహోవానే గౌరవించాలి. తర్వాత ఆయన మిమ్మును మీ విరోధులనుండి సంరక్షిస్తాడు.” అని ఆజ్ఞాపించాడు.
2KI 17:40 కాని ఇశ్రాయేలువారు వినలేదు. పూర్వం చేసినట్లుగానే వారు అవే పనులు చేయసాగారు.
2KI 17:41 అందువల్ల ఇప్పుడు ఇతర జనాంగంవారు యెహోవాను గౌరవిస్తారు. అలాగే తమ సొంత విగ్రహాలను కూడా పూజిస్తారు. తమ పూర్వికులు చేసినట్లుగానే, వారి పిల్లలు మనుములు, మనుమరాండ్రు అవే పనులు చేస్తున్నారు. ఈ నాటికీ వారు అవే పనులు చేస్తున్నారు.
2KI 18:1 అహాజు కుమారుడైన హిజ్కియా యూదా రాజుగా వుండెను, ఏలా కుమారుడైన హోషేయా ఇశ్రాయేలు రాజుగా ఉన్న మూడవ సంవత్సరమున, హిజ్కియా తన పరిపాలన ప్రారంభించాడు.
2KI 18:2 పరిపాలన ప్రారంభించునాటికి అతను 25 యేండ్లు వాడు. యెరూషలేములో హిజ్కియా 29 యేండ్లు పాలించాడు. అతని తల్లి పేరు అబీ; ఆమె జెకర్యా కుమార్తె.
2KI 18:3 హిజ్కియా తన పూర్వికుడైన దావీదువలె, యెహోవా దృష్టికి మంచి పనులు చేసెను.
2KI 18:4 హిజ్కియా ఉన్నత స్థలాలను ధ్వంసం చేశాడు. అతను స్మారకశిలలను బద్ధలు చేశాడు; అషెరా స్తంభాలను పడగొట్టాడు. ఆ సమయంలో, ఇశ్రాయేలు ప్రజలు మోషే చేసిన ఇత్తడి సర్పానికి ధూపం వెలిగించేవారు. ఈ ఇత్తడి సర్పం “నెహుష్టాను” అని పిలవబడేది. హిజ్కియా ఈ ఇత్తడి సర్పాన్ని ముక్కలు చేశాడు. ఎందుకనగా ప్రజలు ఆ కంచు సర్పాన్ని పూజిస్తున్నారు కనుక.
2KI 18:5 హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను విశ్వసించాడు. యూదాలోని రాజులందరిలో అతనికి పూర్వంగాని, తర్వాతగాని హిజ్కియా వంటి వ్యక్తిలేడు.
2KI 18:6 యెహోవా పట్ల హిజ్కియా అతి విధేయుడు. యెహోవాను అనుసరించడం అతను మానలేదు. మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అతను పాటించాడు.
2KI 18:7 యెహోవా హిజ్కియా పక్షంగా వున్నాడు. అతను చేసిన ప్రతి విషయంలోను హిజ్కియా కృతార్థుడయ్యాడు. హిజ్కియా అష్షూరు రాజు పరిపాలన నుండి తప్పుకున్నాడు. అష్షూరు రాజుని కలవడం హిజ్కియా మాని వేశాడు.
2KI 18:8 హిజ్కియా గాజాకి వెళ్లేదారి అంతటను ఆ చుట్టుప్రక్కల ప్రదేశంలోగల ఫిలిష్తీయులందరినీ ఓడించాడు. చిన్న పట్టణం మొదలుకొని పెద్ద నగరందాకా గల అన్ని ఫిలిష్తీయుల నగరాలను అతను ఓడించాడు.
2KI 18:9 అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోనుకి విరుద్ధంగా యుద్ధం చేయడానికి వెళ్లాడు. అతని సైన్యము నగరాన్ని చుట్టుముట్టింది. హిజ్కియా యూదా రాజుగా ఉన్న నాల్గవ సంవత్సరంలో ఇది జరిగింది. (ఏలా కుమారుడైన హోషేయా ఇశ్రాయేలు రాజుగా ఉన్న ఏడవ సంవత్సరములో ఇది జరిగింది).
2KI 18:10 మూడవ సంవత్సరము చివరను షల్మనేసెరు షోమ్రోనుని పట్టుకున్నాడు. హిజ్కియా యూదా రాజుగా ఉన్న ఆరవ సంవత్సరమున, అతను షోమ్రోనుని వశము చేసుకున్నాడు. (ఇశ్రాయేలు రాజుగా హోషేయా వున్న తొమ్మిదో సంవత్సరమున ఇది జరిగింది).
2KI 18:11 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని బందీలుగా అష్షూరుకు తీసుకుని వెళ్లాడు. వారిని హాలహు లేక హాబోరు (గోజాను నది), మాదీయుల నగరాలలో నివసింపజేశాడు.
2KI 18:12 ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవాను పాటించక పోవడంవల్ల ఇలా జరిగింది. వారు యెహోవా ఒడంబడికను విచ్ఛిన్నం చేశారు. యెహోవా సేవకుడైన మోషే చెప్పిన అన్ని విషయాలను వారు పాటించలేదు. యెహోవా ఒడంబడికను ఇశ్రాయేలు ప్రజలు పెడ చెవిని పెట్టారు. లేక చేయమని చెప్పిన పనులు వారు చేయలేదు.
2KI 18:13 హిజ్కియా రాజుగా వున్న 14వ సంవత్సరమలో అష్షూరు రాజయిన సన్హెరీబు యూదాలోని అన్ని బలిష్ఠ నగరాల మీద దండెత్తి వెళ్లాడు. సన్హెరీబు ఆ నగరాలన్నిటిని ఓడించాడు.
2KI 18:14 అప్పుడు యూదా రాజయిన హిజ్కియా అష్షూరు రాజుకి లాకీషు వద్ద ఒక సందేశం పంపాడు. “నేను తప్పు చేశాను. నన్ను వంటరిగా వదలండి. అప్పుడు మీరు ఏమి కోరినా అది నేనిస్తాను” అని హిజ్కియా చెప్పాడు. తర్వాత అష్షూరు రాజు యూదా రాజయిన హిజ్కియాని 11 టన్నుల వెండి, 1 టన్ను బంగారం ఇమ్మని అడిగాడు.
2KI 18:15 హిజ్కియా యెహోవా ఆలయం నుండి రాజుగారి నిధుల నుంచీ వెండి అంతా తీసి ఇచ్చాడు.
2KI 18:16 ఆ సమయంలో హిజ్కియా యెహోవా మందిరానికి ద్వారము మెట్లకి గల బంగారమంతా తీయించి వేశాడు. హిజ్కియా రాజు ఆ తలుపుల మీద మెట్లమీద బంగారం ఉంచాడు. హిజ్కియా అష్షూరు రాజుకు ఈ బంగారమంతా ఇచ్చివేశాడు.
2KI 18:17 అష్షూరు రాజు అతి ముఖ్యులైన తర్తానును, రబ్బారీసు రబ్బాకేనును అను తన ముగ్గురు సైన్యాధిపతులను, పెద్దసైన్యముతో యెరూషలేములోని హిల్కీయా రాజు వద్దకు పంపాడు. ఆ మనుష్యులు లాకీషు నుంచి యెరూషలేము వెళ్లారు. వారు చేరి “చాకిరేవు” వెళ్లే దారిలోవున్న యెరక కొలను కాలువ దగ్గర నిలబడ్డారు.
2KI 18:18 వారు రాజుని పిలిచారు. హిజ్కియా కుమారుడైన ఎల్యాకీము (ఎల్యాకీము రాజభవన అధికారి), షెబ్నా (కార్యదర్శి), అసాపు కొడుకైన యోవాహును (దస్తావేజులు సంరక్షించేవాడు) వారిని కలుసు కోడానికి వచ్చారు.
2KI 18:19 ఒక సైన్యాధిపతి ఇలా చెప్పాడు, “అష్షూరు మహా రాజు చెప్పుచున్నది: ‘హిజ్కియాతో చెప్పు. నీవు దేనిని విశ్వసిస్తున్నావు?
2KI 18:20 నీ మాటలు విలువలేనివి. యుద్ధంలో “నాకు సహాయంగా వుండదగినంత. సలహా, శక్తివున్నాయి” అని నీవు చెప్పు చున్నావు. కాని నీవు నా పరిపాలన నుండి వేరుపడిన తర్వాత నీవెవరిని నమ్ముతున్నావు?
2KI 18:21 విరిగిపోయిన రెల్లుతో చేయబడిన చేతికర్రను ఊని ఉన్నావు! ఈ చేతికర్ర ఈజిప్టు. ఈ చేతికర్రను ఊని నడిస్తే అది విరిగిపోయి, చేతిలో గుచ్చుకొని గాయపరుస్తుంది. తనను విశ్వసించే వారికందరికీ ఈజిప్టు రాజు అటు వంటివాడు.
2KI 18:22 “మీ దేవుడైన యెహోవాని నమ్ముతున్నట్లు” నీవు చెప్పువచ్చు. కాని ఉన్నత స్థలాలను బలిపీఠాలను హిజ్కియా తొలగించి యెరూషలేములోని బలిపీఠం ఎదురుగా మాత్రమే ఆరాధించాలని యూదా, యెరూషలేము ప్రజలకు చెప్పినట్లు నాకు తెలుసు.
2KI 18:23 ‘నా యాజమాని అయిన అష్షూరు రాజుతో ఇప్పుడు నీవు ఈ ఒడంబడిక చేసుకో. స్వారీ చేయగల మనుష్యులుంటే, నీకు రెండు వేలు గుర్రాలు ఇస్తానని నేను వాగ్గానం చేస్తాను.
2KI 18:24 నా యజమానికి గల చాలా తక్కువ అధిపతిని కూడా నీవు ఓడించలేవు. రథాలకు, అశ్విక వీరులకు నీవు ఈజిప్టు మీద ఆధారపడి వున్నావు.
2KI 18:25 ‘యెహోవా ఆజ్ఞ లేకుండ యెరూషలేమును నాశనం చేయుటకు నేను రాలేదు. “ఈ దేశానికి విరుద్ధంగా వెళ్లి దానిని నాశనము చేయుము” అని యెహోవా నాకు చెప్పాడు.’””
2KI 18:26 అప్పుడు హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా యెవాహు ఆ సైన్యాధిపతితో, “దయచేసి మాతో సిరియా బాషలో మాట్లాడండి. ఆ బాషను మేము అర్థం చేసుకుంటాము. యూదా భాషలో మాతో సంభాషించవద్దు. ఎందుకంటే, గోడమీద ఉన్న వారు ఈ మాటలు వింటారు.” అని చెప్పారు.
2KI 18:27 కాని రబ్షాకే వారితోను ఇట్లనెను: “నా యాజమాని నీతోను నీతోను మీ రాజుతోను మాత్రమే మాటలాడుటకు నన్ను పంపలేదు. గోడమీద కూర్చున్న వారితో కూడా మాటలాడెదను. వారు నీతోపాటు తమ మలమూత్ర ములను సేవిస్తారు.”
2KI 18:28 తర్వాత యూదా భాషలో సిరియా సైన్యాధిపతి బిగ్గరగా అరిచాడు. “అష్షూరు మహారాజు పంపిన ఈ సందేశం వినండి.
2KI 18:29 హిజ్కియా మిమ్మును మోసము చేయడానికి సమ్మతింపకుడి. నా అధికారం నుండి అతను మిమ్మును కాపాడలేడు.
2KI 18:30 యెహోవాను మీరు నమ్మునట్లుగా హిజ్కియాని సేవించవద్దు. యెహోవా మనల్ని కాపాడును, అష్షూరు రాజు ఈ నగరాన్ని ఓడించలేడు” అని హిజ్కియా చెప్పాడు.
2KI 18:31 కాని హిజ్కియా మాటలు వినవద్దు. “అష్షూరు రాజు ఇది చెప్పుచున్నాడు: ‘నాతో సంధి చేసుకోండి. నా దగ్గరికి రండి. అప్పుడు ఒక్కొక్కరు తన సొంత ద్రాక్షలు, తన సొంత అరటి పండ్లు తినివచ్చు, తన సొంత బావినుండి నీరు త్రాగవచ్చు.
2KI 18:32 నేను వచ్చి మిమ్మును దూరంగా మీ సొంత ప్రదేశము వలె ఒక పచ్చిక ప్రదేశానికి తీసుకు వెళ్లేంత వరకు మీరిది చేయవచ్చు. అది ధాన్య్యాంగల ప్రదేశము. కొత్త ద్రాక్షారసం గలది. ద్రాక్షా పొలాలు, రొట్టె గలది. ఒలీవ తేనెగల ప్రదేశమది. అప్పుడు మీరు బ్రతుకవచ్చు; చనిపోరు. కాని హిజ్కియా మాటలు వినకుడి. అతను మీ బుద్ధ మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. యెహోవా మనలను కాపాడ్తాడు. అని అతను చెప్పుచున్నాడు.
2KI 18:33 అష్షూరు రాజునుండి ఇతర దేశాల దేవత లెవరైనా అతని దేశాన్ని రక్షించారా? లేదు.
2KI 18:34 హమాతు, అర్పాదు దేవుళ్లు ఎక్కడున్నారు? సెపర్వాయీము, హేన, ఇవ్వా దేవుళ్లెక్కడున్నారు? నానుండి వారు షోమ్రోనును కాపాడగలిగినారా? లేదు.
2KI 18:35 ఇతర దేశాలలో వున్న ఏ దేవుళ్ళయినా నానుండి తమ భూమిని కాపాడుతారా? లేదు. యెరూషలేముని యెహోవా నానుండి కాపాడుతాడా? లేదు’”
2KI 18:36 కాని ప్రజలు మౌనం వహించారు. వారు ఆ సైన్యాధిపతితో ఒక్కమాట కూడా చెప్పలేదు. కారణం, హిజ్కియా రాజు, “అతనితో ఏమీ మాటలాడ వద్దు” అని వారికి ఆజ్ఞాపించాడు.
2KI 18:37 హిల్కీయా కొడుకైన ఎల్యాకీము (ఎల్యాకీము రాజభవనం అధికారి), షెబ్నా (కార్యదర్శి), ఆసాపు కొడుకైన యెవాహు (దస్తావేజుల సంరక్షకుడు) హిజ్కియా వద్దకు వచ్చారు. తాము తలక్రిందులై నామని తెలపడానికై వారి వస్త్రాలు చింపివేయబడ్డవి. అష్షూరు సైన్యాధిపతి చెప్పిన విషయాలను వారు హిజ్కియాకు చెప్పారు.
2KI 19:1 హిజ్కియా రాజు ఆ విషయములు అన్నియు విన్నాడు. అతను తన వస్త్రాలు చింపుకుని గోనెపట్ట ధరించాడు. (అతను విచారంగాను తలక్రిందులైనట్లుగాను అది తెలుపుతుంది.) తర్వాత అతను యెహోవా ఆలయానికి వెళ్లెను.
2KI 19:2 హిజ్కియా, ఎల్యాకీము (రాజభవన అధికారి) షెబ్నా (కార్యదర్శి) మరియు యాజకులలో పెద్ద వారిని అమోజు కుమారుడైన యెషయాప్రవక్త వద్దకు పంపాడు. తాము విచారంగాను తలక్రిందులైనట్లుగాను తెలుపడానికి గోనెపట్ట ధరించారు.
2KI 19:3 వారు యెషయాతో ఇలా అన్నారు: “ఇది యిబ్బంది రోజనీ, మేము తప్పు చేసినట్లుగా తెలిపే రోజనీ హిజ్కియా చెప్పుచున్నాడు. పిల్లలు పుట్టుటకు ఇది సమయము, అయితే వారికి పుట్టుక ఇచ్చేందుకు తగిన బలము లేదు.
2KI 19:4 అష్షూరు రాజుయొక్క సైన్యాధిపతి సజీవుడైన దేవుని గురించి చెడు విషయాలు చెప్పాడానికి ఇక్కడికి పంపబడియున్నాడు. మీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆ విషయములు వినవచ్చు. యెహోవా ఆ విరోధిని శిక్షించవచ్చు. కనుక ఇంకా మిగిలివున్న వారికోసము ప్రార్థన చేయండి.”
2KI 19:5 హిజ్కియా రాజుయొక్క అధికారులు యెషయా వద్దకు వెళ్లారు.
2KI 19:6 “మీ యాజమాని అయిన హిజ్కియాకి ఈ విషయము చెప్పండి. యెహోవా ఇలా చెప్పుచున్నాడు అష్షూరు రాజు, అధికారులు నన్ను ఎగతాళి చేయడానికి మీకు చెప్పిన విషయాలు విని మీరు భయపడవద్దు.
2KI 19:7 నేనతనిలో ఒక ఆత్మను ప్రవేశపెడుతున్నాను. అతను ఒక వందతి వింటాడు. అప్పుడతను తన దేశానికి తిరిగి పారిపోతాడు. అతని దేశంలోనే ఒక ఖడ్గంతో అతను చంపబడేలా నేను చేస్తాను” అని యెషయా వారితో చెప్పాడు.
2KI 19:8 అష్షూరు రాజు లాకీషు విడిచి వెళ్లినట్లు ఆ సైన్యాధిపతి తెలుసుకున్నాడు. అందువల్ల అతను తన రాజు లిబ్నాకి విరుద్ధముగా పోరు సలుపుతున్నట్లు చూశాడు.
2KI 19:9 అష్షూరు రాజు కూషు రాజైన తిర్హకా గురించి ఒక వదంతి విన్నాడు. “తిర్హకా నీతో యుద్ధము చేయడానికి వచ్చాడు” అన్నదే ఆ వదంతి. అందువల్ల అష్షూరు రాజు మరల హిజ్కియా వద్దకు దూతలను పంపించాడు. ఆ దూతలకు ఈ సందేశం ఇచ్చాడు. ఈ విషయాలు తెలియజేశాడు.
2KI 19:10 “యూదా రాజయిన హిజ్కియాకి ఈ విషయము చెప్పండి. ‘నీవు విశ్వసించే దేవుడు నిన్ను అవివేకిగా చేసే విధంగా చేయకు.అష్షూరు రాజు యెరూషలేముని ఓడించిలేడు; అని అతడు చెప్పుచున్నాడు గదా.
2KI 19:11 అష్షూరు రాజులు ఇతర దేశాలకు వ్యతిరేకంగా చేసిన పనులు నీవు వినియుంటావు. మేము వారిని సర్వ నాశనం చేశాము. నీవు కాపాడుదువా? లేదు.
2KI 19:12 ఆ దేశాల దేవుళ్లు ఆ ప్రజలను కాపాడలేదు. నా పూర్వికులు వారిని సర్వనాశనము చేశారు. వారు గోజాను, హారాను, రెజెపులు తెలశ్శారులోని ఏదోను ప్రజలను నాశనం చేశారు.
2KI 19:13 హమాతు రాజు ఎక్కడ? అర్పాదు రాజు ఎక్కడ? సెపర్వయీము రాజు? హేనా, ఇవ్వా రాజులు? అందురూ ముగింపబడ్డారు.’”
2KI 19:14 హిజ్కియా దూతలనుండి వచ్చిన ఉత్తరాలు చదివాడు. అప్పుడు హిజ్కియా యెహోవా ఆలయము వద్దకు వెళ్లి, యెహోవా ముందు ఆ ఉత్తరాలు వుంచాడు.
2KI 19:15 హిజ్కియా యెహోవాని ప్రార్థించాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, కెరూబుల నడుమ రాజుగా ఆసీనుడవై వున్నావు. దేవుడివి నీవే, ప్రపంచంలోని అన్ని రాజ్యాలకూ నీవే దేవుడివి. నీవు పరలోకము, భూమిని కల్పించావు.
2KI 19:16 ప్రభువా, నా మొర విను, ప్రభువా, కళ్లు తెరువు, ఈ ఉత్తరాలు చూడు. సన్హరీబు సజీవుడైన దేవుని అవమానస్తూ చెప్పిన మాటలు విను.
2KI 19:17 అది నిజము, ప్రభూ. ఆ దేశాలను అష్షూరు రాజులు నాశనం చేశారు.
2KI 19:18 ఆ జనాంగాల దేవుళ్లను వారు అగ్నిలోకి కాల్చివేశారు. కాని వారు నిజమైన దేవుళ్లు కారు. వారు కేవలము రాయి, కర్రలతో, మనుష్యులు చేసిన ప్రతిమలు.
2KI 19:19 కనుక ఇప్పుడు, మా దేవుడువైన యెహోవా, మమ్ము అష్షూరు రాజునుండి కాపాడుము. అప్పుడు భూమిమీది అన్ని రాజ్యములు యెహోవావైన నీవే దేవుడవని తెలుసుకుంటారు.”
2KI 19:20 ఆమోజు కొడుకైన యెషయా హిజ్కియాకి ఈ సందేశము పంపించాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిది చెప్పుచున్నాడు, అష్షూరు రాజు సన్హెరీబుకి విరుద్ధంగా నీవు నన్ను ప్రార్థించావు. అది నేను విన్నాను.
2KI 19:21 “యెహోవా సన్హెరీబును గూర్చి ఇచ్చిన సందేశము: ఈ విధంగా ఉంది: ‘సీయోను (యెరూషలేము) కుమార్తె అయిన ఆ కన్య నీవు ముఖ్యుడవుకాదని భావిస్తున్నది. ఆమె నిన్ను ఎగతాళి చేస్తున్నది. యెరూషలేము కుమార్తె నీ వెనుక తన తల ఆడిస్తున్నది.
2KI 19:22 కాని నువ్వెవరిని అవమానించి యెగతాళి చేసావు? నీవు ఎవరికి విరుద్ధంగా మాట్లాడినావు? నీవు ఇశ్రాయేలు పవిత్రునికి ప్రతికూలుడిగా వచ్చావు నీవు అతని కంటె మంచివాడివిగా ప్రవర్తించావు.
2KI 19:23 నీ దూతల ద్వారా యెహోవాను అవ మానించి నీవు ఇలా చెప్పావు: “ఉన్నత పర్వతాలకు నేను వచ్చాను నా పెక్కు రథాలతో నేను లెబానోను లోపలికి వచ్చాను నేను ఉన్నత దేవదారుల వృక్షాలు మరియు లెబానోనులోని ఉత్తమ సరళ వృక్షాలను చేధించాను. పచ్చని అడవికి నేను వెళ్లాను. అదియె లెబానోనులోని ఉన్నత భాగము.
2KI 19:24 నూతన ప్రదేశాలలో నేను బావులు తవ్వాను మంచినీళ్లు తాగితిని ఈజిప్టు నదులను ఎండించాను.”
2KI 19:25 ఆ దేశము మీదుగా నడిచాను అదే నీవు చెప్పింది, కాని నీవు దేవుడు చెప్పింది వినలేదా? నేను (దేవుడు) పూర్వమే పథకము వేశాను ప్రాచీన కాలం నుండి పథకం వేశాను ఇప్పుడది జరుగునట్లు చేశాను బలిష్ఠమైన ఆ నగరాలు నాశనము చేయుటకును రాతి కుప్పలుగా మార్చుటకును నిన్ను అనుమతించాను.
2KI 19:26 నగరాలలో ఉన్నవారు శక్తివిహీనులు వారు భీతావహులు గందరగోళంలో ఉన్నావారు క్ష్రేత్రంలోని పచ్చికలా మొక్కలవలె వారు ఛేదింపదగిన వారు. వాడుటకు పూర్వము పెరగని విధంగా ఇండ్ల కప్పుల మీద పెరిగే పచ్చికవారు.
2KI 19:27 నీవు ఎప్పుడు క్రింద కూర్చుంటావో నాకు తెలియును. నీవు యుద్ధానికి వెళ్లడం నాకు తెలుసు నీవు ఇంటి దగ్గర ఉండినప్పుడు నా పట్ల విసుగు చెందినది తెలుసును.
2KI 19:28 అవును. నీవు నాపట్ల విసుగు చెందితివి నీ గర్వపు నిందా వాక్యాలు నేను విన్నాను అందువల్ల నీ ముక్కకు గాలం వేస్తున్నాను నీ నోటికి నా కళ్లెము తగిలిస్తున్నాను ఆ తర్వాత నిన్ను వెనుకకు మరల్చి నీవు వచ్చిన తోవనే నడిపిస్తాను.’”
2KI 19:29 తర్వాత యెషయా హిజ్కియాతో ఈలాగు చెప్పెను. “నీకు సహాయము చేయునున్నందుకు ఇది ఒక గుర్తు. ఈ సంవత్సరము తనంతట తానే పెరిగే ధాన్యము నీవు భుజిస్తావు. ఆ మరు సంవత్సరము గింజినుండి పెరిగే ధాన్యము నీవు భుజిస్తావు. కాని ఆ మూడో సంవత్సరము నీవు నాటిన గింజలనుండి లభించే ధాన్యము నీవు భుజిస్తావు. నీవు ద్రాక్షా పొలాలు సాగుచేసి, లభించే ఆ ద్రాక్షలు భుజిస్తావు.
2KI 19:30 తప్పించుకున్న ప్రజలు, యూదా వంశంలో మిగిలిన వారు మరల పండించడము మొదలు పెడతారు.
2KI 19:31 కొద్దిమంది సజీవులై వుంటారు, కనుక వారు యెరూషలేమును విడిచి వెళతారు. తప్పించుకున్న ప్రజలు సీయోను కొండలో నుండి వెలుపలికి వెళతారు. యెహోవా యొక్క గాఢాభిప్రాయం అలా చేస్తుంది.
2KI 19:32 “అందువల్ల అష్షూరు రాజుని గురించి యెహోవా ఇది చెప్తాడు: ‘అతడీ నగరంలోకి రాడు. అతడీ నగరంలో అస్త్రప్రయోగం చెయ్యలేడు. అతడు తన కవచాలు ఈ నగరానికి తీసుకురాడు. నగరములను దాడి చేసేందుకు ముట్టడి దిబ్బను నిర్మించలేడు.
2KI 19:33 అతడు వచ్చిన త్రోవనే తిరిగి వెళ్తాడు. అతడీ నగరంలోకి రాలేడు అని యెహోవా చెప్పుచున్నాడు!
2KI 19:34 నేనీ నగరాన్ని రక్షిస్తాను. నేను నా కొరకు ఇది చేస్తాను నా సేవకుడు దావీదు కొరకు కూడా, ఇది చేస్తాను.’”
2KI 19:35 రాత్రి, యెహోవా దూత వెలుపలికి పోయి అష్షూరు శిబిరములోని 185,000 మందిని చంపాడు. ప్రజలు ఉదయాన మేల్కొనగా, వారు శవాలు చూశారు.
2KI 19:36 అందువల్ల అష్షూరు రాజయిన సన్హెరీబు తిరిగివెళ్లి నీనెవెకి మరలిపోయాడు. అక్కడే అతడు నిలిచాడు.
2KI 19:37 ఒకరోజు సన్హెరీబు తన దేవుడైన నిస్రోకు ఆలయంలో పూజ చేయిస్తూ ఉన్నాడు. అతని కుమారులు అద్రెమ్మెలెకు మరియు షరెజెరు కత్తితో అతనిని చంపారు. అప్పుడు అద్రెమ్మెలెకు మరియు షరెజెరు అరారాతు దేశములోకి తప్పించుకు పోయారు. మరియు సన్హెరీబు కుమారుడు ఎసర్హద్దోను, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
2KI 20:1 ఆ సమయమున, హిజ్కియా వ్యాధిగ్రస్తుడయ్యాడు. దాదాపు మరణం పొందునంతగా వ్యాధిగ్రస్తుడైనాడు. ఆమోజు కుమారుడు “యెషయా ప్రవక్త హిజ్కియా వద్దకు వెళ్లి, ‘నీ ఇంటిని సరిదిద్దుకో. ఎందుకంటే నీవు మరణిస్తావు. నీవు బతకవు’ అని యెహోవా చెప్పుచున్నాడని చెప్పెను.”
2KI 20:2 హిజ్కియా తన ముఖము గోడ వైపుకు త్రిప్పుకుని యెహోవాను ప్రార్థించాడు.
2KI 20:3 “యెహోవా, నిన్ను నేను హృదయస్ఫూర్తిగా సేవించానని జ్ఞాపకము చేసుకో. నీవు మంచివని చెప్పిన పనులు నేను చేశాను” అని ప్రార్థించాడు. ఆ తర్వాత హిజ్కియా బిగ్గరగా విలపించాడు.
2KI 20:4 యెషయా తన మధ్యగది విడిచి వెళ్లడానికి ముందు యెహోవా మాట అతనికి వినవచ్చింది.
2KI 20:5 నా మనుష్యులకు నాయకుడైన హిజ్కియా వద్దకు వెళ్లి అతనితో చెప్పు. మీ పూర్వికులైన దావీదు యొక్క యెహోవా దేవుడనైన నేను, “నీ ప్రార్థన ఆలకించాను. నీ కన్నీళ్లు చూశాను. అందువల్ల నీ రోగమును నయము చేస్తాను. మూడవ రోజున, నీవు యెహోవా యొక్క ఆలయము వద్దకు వెళ్లుము.
2KI 20:6 నేను నీ జీవితానికి పదునైదుయేండ్లు కలుపుతాను. నేను నిన్ను కాపాడతాను. అష్షూరు రాజు శక్తి నుండి నేను నీ నగరాన్ని కాపాడతాను. నేనిది నా కోసము చేస్తున్నాను. ఎందుకంటే నేను నా సేవకుడైన దావీదుకి వాగ్దానం చేశాను కనుక” అని పలికెను.
2KI 20:7 తర్వాత యెషయా, “అత్తికాయల మిశ్రము చేసి దానిని వాచిన చోట వుంచుము” అన్నాడు. అందువల్ల వారు అత్తికాయల మిశ్రం తీసి దానిని హిజ్కియాకు వాచిన చోటవుంచారు. తర్వాత హిజ్కియా స్వస్థపడెను.
2KI 20:8 హిజ్కియా యెషయాతో, “యెహోవా నాకు నయం చేసే సంకేతము ఏమిటి? మూడో రోజున యెహోవా ఆలయానికి నేను వెళ్లడానికి సంకేత మేమిటి?” అని అడిగాడు.
2KI 20:9 “నీ కేది కావాలి? నీడ పది అడుగులు ముందుకి పోవలెనా లేక పది అడుగులు వెనుకకు పోవలెనా? ఇదే నీకు యెహోవా నుంచి వచ్చే సంకేతము. యెహోవా తాను చేస్తానని చెప్పినది చేసేందుకు సంకేతము” అని యెషయా చెప్పాడు.
2KI 20:10 హిజ్కియా, “నీడ పది అడుగులు క్రిందికి వెళ్లడం, నీడకు చాలా సులభమైనది లేదు. నీడని పది అడుగులు వెనుకకు మరల్చుము” అని బదులు చెప్పాడు.
2KI 20:11 తర్వాత యెహోవాని యెషయా ప్రార్థించాడు. మరియు యెహోవా నీడను పదిమెట్లు వెనుకకు మరలునట్లు చేసెను. అది పూర్వము వున్నట్లుగా, మెట్ల మీద వెనుకకు పోయాడు.
2KI 20:12 ఆ సమయమున, బలదాను కొడుకైన బెరోద క్బలదాను బబులోనుకు రాజుగా వున్నాడు. అతను హిజ్కియాకి ఒక కానుక, ఉత్తరాలు పంపాడు. బెరోదక్బలదాను ఇలా చేయడానికి కారణం, హిజ్కియా వ్యాధిగ్రస్తుడైవున్నాడని విన్నందువల్లనే.
2KI 20:13 హిజ్కియా బబులోను నుంచి వచ్చిన మనుష్యుల్ని ఆహ్వానించాడు. వారికి తన ఇంటగల అన్ని విలువగల వస్తువులు చూపించాడు. అతడు తన నిధులలో వున్న వెండి బంగారాలు, మసాలా వస్తువులు, ఖరీదైన పరిమళ తైలము, ఆయుధాలు, మొదలైన వాటిని చూపించాడు. తన మొత్తము రాజభవనములో హిజ్కియాకు కలిగిన దానంతటిలో వారికి చూపనిది ఏదీ లేదు.
2KI 20:14 తర్వాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు వద్దకు వచ్చి అతనిని, “ఈ మనుష్యులేమని చెప్పారు? ఎక్కడినుంచి వచ్చారు?” అని అడిగాడు. “వారు చాలా దూరదేశమైన బబులోను నుంచి వచ్చారు” అని హిజ్కియా చెప్పాడు.
2KI 20:15 “వారు నీ ఇంటిలో ఏమి చూశారు?” అని యెషయా అడిగినాడు. “వారు మాట ఇంట అన్నీ చూశారు. నా నిధులలో వారు చూడనిది ఏదీలేదు.” అని హిజ్కియా సమాధానమిచ్చాడు.
2KI 20:16 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇట్లన్నాడు: “యెహోవా నుంచి వచ్చిన ఈ సందేశము విను.
2KI 20:17 మీ ఇంటగల వస్తువులన్నీ, నేటిదాకా మీపూర్వికులు సమకుర్చిన వస్తువులు బబులోనుకు తీసుకొని పోబడుతుంది. ఏమియు మిగలదు. యెహోవా దీనిని చెప్తున్నాడు.
2KI 20:18 బబులోను వారు నీ కుమారులను తీసుకుపోతారు. మరియు నీకుమారులు బబులోను రాజు అంతఃపురములో నపుంసకులు అవుతారు.”
2KI 20:19 అప్పుడు యెషయాతో, “యెహోవా నుంచి వచ్చిన ఈ సందేశము మంచిది” అని హిజ్కియా చెప్పాడు. హిజ్కియా ఇది కూడా చెప్పాడు: “నా జీవితకాలములో నిజమైన శాంతి నెలకొన్నచో, అది చాలా మంచిది.”
2KI 20:20 హిజ్కియా చేసిన అన్ని సత్కార్యములు నగరంలోకి నీళ్లు రావడానికి గాను అతను జలాశయము, సొరంగ కాలువను, నిర్మించిది కాలువలు వేయించినది కూడా “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడివున్నాయి. హిజ్కియా మరణించగా,
2KI 20:21 అతని పూర్వికులతో పాటుగా, అతనిని సమాధి చేశారు. మరియు హిజ్కియా కుమారుడు మనష్షే అతని తర్వాత కొత్తగా రాజ్యయ్యాడు.
2KI 21:1 మనష్షే పరిపాలన చేయడం మొదలుపెట్టిన నాటికి అతను పన్నెండేళ్లవాడు. అతను 55 సంవత్సరాలు యెరూషలేంలో పరిపాలించాడు. అతని తల్లి పేరు హెఫ్సిబా.
2KI 21:2 యెహోవా తప్పని చెప్పిన పనులు మనష్షే చేశాడు. ఇతర జాతుల వారు చేసినట్లుగా మనెష్షే భయంకరమైన పనులు చేశాడు. (ఇశ్రాయేలు వారు రాగా ఆయా జాతులవారు దేశాన్ని విడిచి వెళ్లునట్లుగా యెహోవా వారిని నిర్భంధిచాడు).
2KI 21:3 తన తండ్రి హిజ్కియా ధ్వంసం చేయించిన ఉన్నత స్థలాలను మనష్షే మరల నిర్మించాడు. బయలు దేవతకు మరల మనష్షే బలిపీఠాలు నిర్మించెను. ఇశ్రాయేలు రాజు అహాబువలె, అషెరా స్తంభము ఏర్పాటు చేశాడు. మనష్షే ఆకాశంలోని నక్షత్రాలను కొలిచాడు.
2KI 21:4 యెహోవా ఆలయంలో మనష్షే అబద్ధపు దేవుళ్లను గౌరవించేందుకు బలిపీఠాలు నిర్మించాడు. “యెరూషలేములో నాపేరు స్థాపిస్తాను.”అని యెహోవా చెప్పిన స్థలం ఇది.
2KI 21:5 యెహోవా ఆలయము యెక్క రెండు ఆవరణాలలో ఆకాశంలోని నక్షత్రాలకు మనష్షే బలిపీఠాలు నిర్మించెను.
2KI 21:6 మనష్షే తన కుమారుని బలిపీఠము మీద దహన బలిగా ఇచ్చాడు. భవిష్యత్తుని తెలుసుకునేందుకు మనష్షే వేర్వేరు మార్గాలు అవలంబించాడు. అతను కర్ణ పిశాచి గలవారిని సోది చెప్పేవారిని దర్శించాడు. యెహోవా తప్పని చెప్పిన పనులు మరింత ఎక్కువగా మనష్షే చేశాడు. అందువల్ల యెహోవాకు కోపము వచ్చింది.
2KI 21:7 మనష్షే అషేరాదేవి విగ్రహం ఒకటి మలిచాడు. దానిని అతను ఆలయంలో ఉంచాడు. ఈ ఆలయం గురించి దావీదుకు, అతని కుమారుడు సొలోమోనుకు యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలులోని నగరములన్నిటి నుండి నేను యెరూషలేమును ఎంపిక చేశాను. నేను నా పేరును యెరూషలేము ఆలయములో ఎన్నటికీ వుంచుతాను.
2KI 21:8 తమ దేశం విడిచి వెళ్లేటట్లుగా నేను ఇశ్రాయేలు ప్రజలను చేయను. అది వారి పూర్వికులకు తెలియబడింది. నేను వారికి ఆజ్ఞాపించినట్లుగా వారు మెలగినచో, నా సేవకుడైన మోషేవారికి ఇచ్చిన బోధనలను పాటించినచో నేను వారిని తమ దేశంలోనే వుండేటట్లు చేస్తాను.”
2KI 21:9 కాని ప్రజలు యెహోవాకు విధేయులు కాలేదు. ఇశ్రాయేలు రావడానికి పూర్వం కనానులోని అన్ని జనాంగముల వారు చేసిన దుష్టకార్యాముల కంటె ఎక్కువగా మనష్షే చేశాడు. మరియు యెహోవా ఆ జనాంగములను నాశనము చేశాడు; ఇశ్రాయేలు ప్రజలు తమ దేశాన్ని గ్రహించుటకు వచ్చినప్పుడు ఇది జరిగింది.
2KI 21:10 తన సేవకులైన ప్రవక్తులను ఈ విషయాలు చెప్పమని యెహోవా వినియోగించాడు.
2KI 21:11 “యూదా రాజైన మనష్షే తనకు పూర్వమున్న ఆ ప్రాంతములో నివసించిన అమోరీయుల కంటె ఎక్కువగా నీచమైన దుష్‌కార్యాలు చేసెను తన విగ్రహాల కారణంగా, యూదాని కూడా పాపం చేయడానికి మనష్షే కారకుడయ్యాడు.
2KI 21:12 అందువల్ల ఇశ్రాయేలు దేవుడు చెప్పుచున్నాడు; ‘చూడండి. విన్న వ్యక్తి కూడా ఆశ్చర్యము చెందేటట్లుగా, నేను యెరూషలేము, యూదాలకు విరుద్ధంగా చాలా కష్టము కలిగిస్తాను.
2KI 21:13 నేను షోమ్రోనులలో కొలత సూత్రాన్ని సాగిదీస్తాను. మరియు యెరూషలేము మీదా అహాబు వంశముయొక్క మట్టపు గుండును సాగదీస్తాను. ఒక వ్యక్తి పాత్రను కడుగవచ్చు; తర్వాత దానిని బోర్లించవచ్చు. నేను, ఆ విధంగా యెరూషలేముకు చేస్తాను.
2KI 21:14 అక్కడ ఇంకా నావారు కొద్ది మంది వుండవచ్చు. కాని నేను వారిని విడిచి పెడ్తాను. నేను వారిని వారి శత్రువుల పరము చేస్తాను. వారి శత్రువులు వారిని బందీలుగా చేస్తారు. వారు యుద్ధాలలో సైనికులు అపహరించుకు వెళ్లే అమూల్య వస్తువుల వంటివారు.
2KI 21:15 ఎందుకని? నేను తప్పని చెప్పిన పనులు వారు చేశారు కనుక. తమ పూర్వికులు ఈజిప్టు నుంచి వెలుపలికి వచ్చిననాటినుంచీ వారు నన్ను కోపానికి గురిచేసారు.
2KI 21:16 మరియు మనష్షే పలువురు అమాయకులను చంపివేశాడు. అతను యెరూషలేముని ఒక కొననుంచి మరొక కొనదాకా రక్తముతో నింపి వేశాడు. ఈ పాపాలన్నీ అదనంగా యూదావారు పాపము చేయడానికి దోహదపడ్డాయి. యెహోవా తప్పు అని చెప్పినవాటిని యూదా చేయునట్లుగా మనష్షే చేశాడు.’”
2KI 21:17 మనష్షే చేసిన అన్ని పనులు పాప కార్యములతో సహా “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడివున్నాయి.
2KI 21:18 మనష్షే మరణించగా, అతని పూర్వికులతో పాటుగా, అతను తన యింటి తోటలో సమాధి చేయబడ్డాడు. ఆ తోటకు, “ఉజ్జా ఉద్యానవనం” అని పేరు పెట్టబడింది. మనష్షే కుమారుడు ఆమోను, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
2KI 21:19 ఆమోను పరిపాలనకు వచ్చేనాటికి 22 యేండ్ల వయస్సుగలవాడు. అతను యెరూషలేములో రెండు సంవత్సరములు పాలించాడు. అతని తల్లి పేరు మెషుల్లెతు ఆమె యొట్బకి చెందిన హారూసు కుమార్తె.
2KI 21:20 యెహోవా తప్పు అని చెప్పిన పనులు ఆమోను చేశాడు.
2KI 21:21 తన తండ్రియైన మనష్షేవలె, ఆమోను కూడా జీవించాడు. తండ్రి పూజించిన ఆ విగ్రహాలనే ఆమోను పూజించి అనుసరించాడు.
2KI 21:22 తన పూర్వికుల దేవుని ఆమోను విడిచిపెట్టాడు. యెహవా ఆశించిన మార్గాలను విడనాడి అతను జీవించాడు.
2KI 21:23 ఆమోను సేవకులు అతనికి వ్యతిరేకంగా పన్నాగాలు పన్ని అతనిని అతని ఇంటిలోనే చంపి వేశారు.
2KI 21:24 సామన్య ప్రజలు, ఏఏ అధికారులు ఆమోనుకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నారో ఆ అధికారులను చంపివేశారు. అప్పుడు ప్రజలు ఆమోను కుమారుడైన యోషీయాను కొత్త రాజుగా నియమించారు.
2KI 21:25 ఆమోను చేసిన ఇతర పనులు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడ్డవి.
2KI 21:26 ఉజ్జా తోటలో ఆమోను సమాధి చేయబడ్డాడు. ఆమోను కుమారుడైన యోషీయా కొత్తగా రాజయ్యాడు.
2KI 22:1 యోషీయా పరిపాలనకు వచ్చేనాటికి, అతను ఎనిమిదేండ్లవాడు. యెరూషలేములో అతను 31 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కతుకి చెందిన అదయా కుమార్తె.
2KI 22:2 యెహోవా మంచివని చెప్పిన పనులు యోషీయా జరిగించాడు. తన పూర్వికుడైన దావీదు వలె, యోషీయా దేవుని అనుసరించాడు. దేవుడు ఆశించిన విధంగా యోషియా దేవుని బోధనలు పాటించాడు.
2KI 22:3 యోషీయా రాజుగా వున్న 18వ సంవత్సరాన, అతను కార్యదర్శి అయిన మెఘల్లాము కొడుకైన అజల్యా కుమారుడు షాఫానును యెహోవా యొక్క ఆలయానికి పంపాడు.
2KI 22:4 “ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా వద్దకు వెళ్లుము. యెహోవా ఆలయానికి ప్రజల తీసుకువచ్చిన ధనాన్ని ఎంచుమని చెప్పుము. ప్రజల వద్దనుంచి ద్వారపాలకులు ఆ ధనము వసూలు చేశారు.
2KI 22:5 యెహోవా ఆలయము మరమ్మతుల కోసము పనివారికి ఆ ధనాన్ని యాజకులు వినియోగించాలి. యెహోవా ఆలయాన్ని పర్యవేక్షించే వారికి యాజకులు ఆ డబ్బు ఇవ్వాలి.
2KI 22:6 ఆ డబ్బును వడ్రంగులకు, రాయి బ్రద్దలు చేసేవారికి, రాతి పనివారికి ఆ డబ్బు ఉపయోగించబడాలి. ఆలయము కోసము కలపకొనేందుకు రాళ్లు కొనేందుకు ఆ డబ్బు వినియోగము కావాలి.
2KI 22:7 పనివారికి ఇచ్చే ధనాన్ని లెక్కించవద్దు. పనివారు నమ్మదగిన వారు” అని యోషీయా చెప్పాడు.
2KI 22:8 ప్రధాన యాజకుడైన హిల్కీయా కార్యదర్శి అయిన షాఫానుతో, “యెహోవా ఆలయములో నేను ధర్మశాస్త్ర గ్రంథము కనుగొన్నాను” అని చెప్పాడు. హిల్కీయా ఆ పుస్తకము షాఫానుకి ఇవ్వగా, షాఫాను అది చదివాడు.
2KI 22:9 కార్యదర్శి షాఫాను యోషీయా రాజు వద్దకు పోయి జరిగిన విషయము చెప్పాడు. “నీ సేవకులు ఆలయములో వున్న ధనమునంతా పోగుజేశారు. యెహోవా ఆలయాన్ని పరీక్షించేవారికి ఆ ధనమును వారు ఇచ్చివేశారు.” అని షాఫాను చెప్పాడు.
2KI 22:10 తర్వాత షాఫాను కార్యదర్శి రాజుతో, “మరియు ప్రధాన యాజకుడు హిల్కీయా నాకు ఈ గ్రంథము ఇచ్చాడు” అని పలికాడు. తర్వాత షాఫాను రాజుకు ఆ పుస్తకము చదివి వినిపించాడు.
2KI 22:11 రాజు ఆ ధర్మశాస్త్ర గ్రంథములోని మాటలు వినగానే, తాను తలక్రిందులైనాననీ విచారం చెందినాననీ తెలిపేందుకు తన వస్త్రాలు చింపివేశాడు.
2KI 22:12 తర్వాత రాజు యాజకుడు హిల్కీయాకు కార్యదర్శి షాఫానుకు, అతని కుమారుడు అహీకాముకు, మీకాయా కుమారుడు అక్బోరుకు, రాజు సేవకుడు అశాయాకు ఆజ్ఞ ఇచ్చాడు.
2KI 22:13 యోషీయా రాజు, “వెళ్లి మనమేమి చేయాలో యెహోవాని అడుగు. నా కోసము, ప్రజల కోసము, యూదా మొత్తానికి యెహోవాని అడుగుము. ఈ పుస్తకములోని మాటలు గురించి అడుగు. యెహోవా మనపట్ల కోపంగా వున్నాడు. మన పూర్వీకులు ఈ పుస్తకములోని మాటలు పాటించక పోవడంవల్ల. మనకోసము రాయబడిన అన్ని ఆజ్ఞలను మనము పాటించలేదు” అని చెప్పాడు.
2KI 22:14 అందువల్ల హిల్కీయా యాజకుడు, అహికాము, అక్బోరు, షాఫాను మరియు అశాయా స్త్రీ ప్రవక్త అయిన హుల్దా వద్దకు వెళ్లారు. హర్హను కుమారుడు తిక్వా కుమారుడైన షల్లూము భార్యయే హుల్దా. అతను యాజకుల వస్త్రాలను జాగరూకతతో చూస్తున్నాడు.హుల్దా యెరూషలేములో రెండవప్రదేశంలో నివసిస్తున్నది. వారు హుల్దా వద్దకు పోయి మాట్లాడారు.
2KI 22:15 తర్వాత హుల్దా వారితో ఇలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు. నా వద్దకు పంపిన మనిషితో చెప్పు.
2KI 22:16 యెహోవా ఇలా చెప్పుచున్నాడు. ఇక్కడ నివసించే ప్రజలకు, ఈ స్థలానికి నేను ఇబ్బంది తెస్తున్నాను. యూదా రాజు చదివిన పుస్తకములో ఈ కష్టాలు లేక ఇబ్బందులు సూచించ బడ్డవి.
2KI 22:17 యూదా ప్రజలు నన్ను విడిచి వెళ్లారు. ఇతర దేవుళ్లకు ధూపము వేశారు. వారు నాకు మహా కోపము తెప్పించారు. వారు ఎక్కువ విగ్రహాలు తయారు చేశారు. అందువల్ల ఈ స్ధలము పట్ల నా కోపమును ప్రదర్శిస్తాను. నా కోపము ఆర్ప శక్యము కానట్టి నిప్పు వంటిది.”
2KI 22:18 “యూదా రాజైన యోషీయా యెహోవా యొక్క సలహా తెలుసుకొనుమని నిన్ను పంపాడు. యోషీయకు విషయాలు చెప్పు. నీవు వినే ఈ మాటలు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. నేనీ స్థలమును గురించీ, ఇక్కడ నివసించే వారిని గురించీ చెప్పిన మాటలు నీవు విన్నావు. నీ హృదయము మృదువైనది. ఈ విషయాలు వినగానే నీవు విచారించావు. ఈ ప్రదేశానికి (యెరూషలేము) భయంకర సంఘటనలు జరుగుతాయని నేను చెప్పాను. నీ విచారాన్ని తెలుపడానికి నీ వస్త్రాలు చింపాను. నీవు విలపించ సాగావు. అందువల్లనే నేను విన్నాను. యెహోవా ఇది చెప్పుచున్నాడు.
2KI 22:20 నీ పూర్వకులతో వుంచడానికి నేను నిన్ను తీసుకువస్తాను. నీవు మరణిస్తావు. ప్రశాంతంగా నీవు నీ సమాధి చేరతావు. అందువల్ల నేను ఈ ప్రదేశానికి (యెరూషలేము) తెచ్చు కష్టాలను నీ కండ్లు చూడలేవు.” అప్పుడు యాజకుడు హిల్కీయా, అహికాము, అక్బోరును, షాఫాను, మరియు యోషీయా రాజుకి ఆ సందేశము చెప్పారు.
2KI 23:1 యూదా నాయకులందరినీ యెరూషలేము నాయకులను తనను కలుసుకోవలసిందిగా యోషీయా రాజు చెప్పాడు.
2KI 23:2 తర్వాత రాజు యెహోవా యొక్క ఆలయము వద్దకు వెళ్లాడు. యూదాలోని మనష్యులందరు మరియు యెరుషలేములో నివసించేవారు. అతనితో పాటు వెళ్లారు. యాజకులు, ప్రవక్తలు, అందరు మనుష్యులు తక్కువ ప్రాముఖ్యము కలవారి నుండి ఎక్కువ ప్రాముఖ్యం కలవారి వరకు అతనితో పాటు వెళ్లారు. తర్వాత అతను ఒడంబడిక పుస్తకము చదివాడు. ఇది యెహోవా యొక్క ఆలయములో కనిపించిన ధర్మశాస్త్ర గ్రంథము. యోషీయా అందరు వినేటట్లుగా పుస్తకము చదివాడు.
2KI 23:3 రాజు స్తంభం ప్రక్కగా నిలబడి యెహోవాతో ఒడంబడిక కుదుర్చుకొన్నాడు. యెహోవా ఆజ్ఞలను, ఒడంబడికను, అతని నిబంధనలను పాటించడానికి అతను సమ్మతించాడు. హృదయపూర్వకంగా అతను వాటికి సమ్మతించాడు. ఆ పుస్తకంలోని ఒడంబడికను పాటించడానికి సమ్మతించాడు. రాజు ఒడంబడికను తాము అంగీకరిస్తున్నట్టుగా ప్రజలందరు నిలబడ్డారు.
2KI 23:4 తర్వాత ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా, ఇతర యాజకులు, ద్వారపాలకులు మొదలైన వారిని రాజు ఆజ్ఞాపించాడు, యెహోవా యొక్క ఆలయము నుండి బయలు అషేరాదేవికి, ఆకాశములోని నక్షత్రాలను గౌరవించేందుకు చేయబడిన అన్ని పాత్రలు తీసుకు రమ్మని తర్వాత యోషీయా ఆ వస్తువులను యెరూషలేముకు వెలుపల కిద్రోను లోయలోని మైదానులలో కాల్చివేశాడు. తర్వాత వారు బూడిదను బెతేలుకు తీసుకు వెళ్లారు.
2KI 23:5 యూదా రాజులు కొందరు సామన్యులను యాజకులుగా ఎంపిక చేశారు. ఆ మనుష్యులు అహరోను వంశానికి చెందినవారు కారు. ఆ అబద్ధపు యాజకులు యూదాలోని ప్రతినగరంలో ఉన్నత స్థానాలలోను యెరూషలేముకు చుట్టుప్రక్కలనున్న పట్టణాలలోను ధూపం వెలిగించారు. వారు బయలునకు సూర్య చంద్రులను, నక్షత్రగణాలను, ఆకాశంలోని అన్ని నక్షత్రాలను గౌరవించేందుకు ధూపం వేసారు. కాని యోషీయా ఆ అబద్ధపు యాజకుల చేతలు ఆపివేశాడు.
2KI 23:6 యోషీయా యెహోవాయొక్క ఆలయము నుండి అషేరా స్తంభము తొలగించాడు. అతను అషేరా స్తంభము యెరూషలేము వెలుపలికి తీసుకువెళ్లి కిద్రోను లోయను చేరి అక్కడ కాల్చివేశాడు. తర్వాత ఆ కాల్చిన వస్తువులను ధూళిగా చేసి, ఆ ధూళిని సామాన్యుల సమాధుల మీద చల్లాడు.
2KI 23:7 తర్వాత యోషీయా రాజు యెహోవా ఆలయంలోని పురుష వ్యభిచారుల ఇండ్లను ధ్వంసము చేశాడు. ఆ ఇండ్లను స్త్రీలు కూడా ఉపయోగించి, అబద్ధపు దేవత అషేరా గౌరవార్థం గుడారపు కప్పులు తయారు చేశారు.
2KI 23:8 ఆ సమయాన యాజకులు బలులు యెరూషలేముకు తీసుకురాలేదు; ఆలయములో బలిపీఠం మీద వాటిని నివేదించలేదు. యూదా అంతటా నగరాలలో యాజకులు నివసించారు. ఆ నగరాలలో వారు ఉన్నత స్థానాలలో ధూపము వేసేవారు. బలులు సమర్పించేవారు. ఆ ఉన్నత స్థలాలు గెబానుండి బెయేర్షెబా వరకు అన్ని చోట్ల వుండేవి. మరియు యాజకులు ఆ పట్టణాలలో పులియని రొట్టెను సామాన్యులతో కలిసి తింటూ ఉన్నారు. [యెరూషలేములో యాజకులకోసం ప్రత్యేకించబడిన స్థలంలో కాదు.] కాని యోషీయా రాజు ఆ ఉన్నత స్థానాలను ధ్వంసము చేసి, యెరూషలేముకి ఆ యాజకులను తీసుకువచ్చాడు. యోషీయా యెహోషువ ద్వారానికి ఎడమ నున్న ఉన్నత స్థానాలను కూడా ధ్వంసము చేశాడు. (యెహోషువ ఆ నగరపు రాజు).
2KI 23:10 అబద్ధపు దేవుడైన మెలెకు గౌరవార్థం ప్రజలు తమ పిల్లలను చంపి బలిపీఠం మీద కాల్చివేసేవారు. ఈ పని బెన్‌హిన్నోము లోయలో తోఫెతు అనేచోట జరిగేది. యోషీయా ఆ స్థలాన్ని ప్రజలు దానిని మరల ఉపయోగించు కొనేందుకు వీలులేనంతగా ధ్వంసము చేశాడు.
2KI 23:11 వెనకటి కాలంలో, యూదా రాజులు యెహోవా యొక్క ఆలయ ప్రవేశ ద్వరం వద్ద కొన్ని గుర్రాలను, ఒక రథాన్ని ఉంచేవారు. నెతన్మెలకు అనే ముఖ్య అధికారి గదికి దగ్గరగా వుండేది. ఆ గుర్రాలూ, రథమూ సూర్యదేవుని గౌరవార్థం నిలపబడేవి. యోషీయా ఆ గుర్రాలను తొలగించి రథాన్ని కాల్చివేశాడు.
2KI 23:12 వెనుకటి రోజుల్లో, యూదా రాజుల అహాబు భవనం కప్పు మీద బలిపీఠాలు అమర్చారు. మనష్షే రాజు కూడా యెహోవా యొక్క ఆలయము రెండు అంగణాలలో బలిపీఠాలు నిర్మించాడు. యోషీయా ఆ బలిపీఠాలన్నిటినీ నాశనము చేశాడు. విరిగిపోయిన ముక్కలను కిద్రోను లోయలోకి విసిరివేశాడు.
2KI 23:13 వెనుకటి కాలములో, సొలొమోను రాజు యెరూషలేముకు దగ్గరలో “నాశన పర్వతము” మీద కొన్ని ఉన్నత స్థలాలు నిర్మించాడు. ఆ కొండకు దక్షిణంగా ఆ ఉన్నత స్థలాలు ఉండేవి. ఆ ఉన్నతస్థలాలలో ఒకటి అష్ఠారోతు గౌరవార్థము కట్టబడింది. సీదోను ప్రజలు ఆరాధంచే హేయమైన విగ్రహమది. మరియు సొలొమోను రాజు మిలోము గౌరవార్థం ఒక ఉన్నత స్థానము నిర్మించాడు. అమ్మోనీయులు కొలిచే హేయమైన విగ్రహ మది. కాని యోషీయా రాజు ఆ ఆరాధనా స్థలాలన్నిటినీ ధ్వంసంచేశాడు.
2KI 23:14 యోషీయా రాజు స్మారక శిలలను పగలగొట్టాడు; అషరా స్తంభాలను విరగగొట్టాడు. తర్వాత అతను ఆ స్థలము మీద మృతజీవుల ఎముకలను వెదజల్లాడు.
2KI 23:15 యోషీయా బేతేలు వద్ద గల బలిపీఠాన్ని ఉన్నత స్థలమును ధ్వంసము చేశాడు. నెబాతు కొడుకైన యరొబాము ఈ బలిపీఠం నిర్మించాడు. యరొబాము ఇశ్రాయేలుని పాపానికి పాల్పడజేశాడు. యోషీయా బలిపీఠపు శిలలను ముక్కలు ముక్కలుగా చేశాడు. యోషీయా బలిపీఠమును ఉన్నత స్థానమును ధ్వంసము చేశాడు. తర్వాత వాటిని ధూళిగా చేశాడు. మరియు అతను అషేరా స్తంభమును కాల్చివేసేను.
2KI 23:16 షీయా చుట్టు ప్రక్కలు చూచెను; కొండమీద సమాధలు కనిపించాయి అతను మనుష్యులను పంపాడు. వారు ఆ సమాధులనుండి ఎముకలు తీసుకువాచ్చారు. తర్వాత బలిపీఠం మీద ఆ ఎముకలను కాల్చాడు. ఈ విధంగా యోషీయా బలిపీఠాన్ని అప విత్రము చేశాడు. దైవజనుడు ప్రకటించెనని యెహోవా యొక్క సందేశం తెలిపినట్లుగా ఇది జరిగింది. యరొబాము బలిపీఠం ప్రక్కగా నిలబడినప్పుడు దైవజనుడు ఇది ప్రకటించాడు. తర్వాత యోషీయా చుట్టుప్రక్కల చూశాడు. దైవజనుడి సమాధి చూశాడు.
2KI 23:17 “నేను చూస్తున్న సమాధి ఏమిటి?” అని యోషీయా అడిగాడు. “యూదానుంచి వచ్చిన దైవజనుని సమాధి ఇది. బేతేలులోని బలిపీఠానికి నీవు చేసిన పనులను ఈ దైవజనుడు చెప్పాడు. ఈ విషయాలను అతను చాలా కాలము క్రిందటనే సూచించాడు” అని ఆ నగర ప్రజలు చెప్పారు.
2KI 23:18 “దైవజనుడను ఒంటరిగా విడిచిపెట్టండి, అతని ఎముకలను కదిలించకండి” అని యోషీయా చెప్పాడు. అందువల్ల వారు అతని ఎముకలు విడిచిపెట్టారు. షోమ్రోను నుంచి వచ్చిన దైవజనుని ఎముకలు కూడా విడిచిపెట్టారు.
2KI 23:19 యోషీయా షోమ్రోను నగరాలలోని ఉన్నత స్థలాలలో వున్న అన్ని ఆలయాలను కూడా ధ్వంసముచేశాడు. ఇశ్రాయేలు రాజులు ఆ ఆలయాలను నిర్మించారు. అది యెహోవాను ఆగ్రహాపరిచింది. యోషీయా బేతేలులోని ఆరాధనాస్థలాలను ధ్వంసము చేసినట్లుగా, ఆ ఆలయాలను కూడా ధ్వంసము చేశాడు.
2KI 23:20 యోషీయా షోమ్రోనులోని ఉన్నత స్థలాలకు చెందిన యాజకులందరినీ చంపివేశాడు. ఆ బలిపీఠముల మీద ఆ యాజకులను చంపాడు. బలిపీఠముల మీద మనుష్యుల ఎముకలు కాల్చాడు. ఈ విధంగా అతను ఆ ఆరాధనా స్థలాలను పాడు చేశాడు. తర్వాత అతను యెరుషలేముకు మరలి వెళ్లాడు.
2KI 23:21 తర్వాత యోషీయా రాజు ప్రజలందరకు ఒక ఆజ్ఞ విధించాడు. “మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించండి. ఒడంబడిక పుస్తకంలో వ్రాయబడినట్లుగా జరపండి” అని అతను చెప్పాడు.
2KI 23:22 న్యాయాధిపతులు ఇశ్రాయేలుని పరిపాలించిన నాటినుంచి ప్రజలు ఈ విధంగా ఆ ఉత్సవము జరపలేదు. ఇశ్రాయేలు రాజులుగాని, యూదా రాజులుగాని పస్కా పండుగను అంత బ్రహ్మాండంగా ఆచరించి వుండలేదు.
2KI 23:23 యోషీయా రాజయిన 18వ సంవత్సరాన యెరూషలేములో యెహోవాకు ఈ ఉత్సవము జరిపారు.
2KI 23:24 కర్ణపిశాచి గలవారిని, సొదె చెప్పువారిని, గృహదేవతలను, విగ్రహాలను, యూదా యెరూషలేమునున్న ప్రజలు పూజించే ఆ భయంకర వస్తువులను యోషీయా నాశనము చేశాడు. హిల్కీయా యాజకుడు యెహోవాయొక్క ఆలయములో కనుగొన్న ధర్మశాస్త్రములోని నియమాలను పాటించేందుకు యోషీయా ఈ విధముగా చేశాడు.
2KI 23:25 అంతకు ముందు యోషీయా వంటి రాజు లేడు. యోషీయా పూర్ణహృదయముతో, పూర్ణ ఆత్మతో శక్తినంతా కూడాగట్టుకుని యెహోవా వైపు నిలిచాడు. యోషీయా వలె మోషే ధర్మశాస్త్రాన్ని ఏ రాజు పాటించి వుండలేదు. ఆ తర్వాత కూడా యోషీయా వంటి మరొక రాజు లేడు.
2KI 23:26 కాని యూదా ప్రజలపట్ల యెహోవా తన ఆగ్రహాన్ని మానలేదు. మనష్షే చేసిన అన్ని పనులకు యెహోవా వారిపట్ల కోపముగా వున్నాడు.
2KI 23:27 “ఇశ్రాయేలు ప్రజలు తమ దేశాన్ని బలవంతంగా వీడునట్లుగా నేను చేశాను. యూదాకు కూడా ఇలాగే చేస్తాను. నా దృష్టినుండి యూదాని మరలిస్తాను. నేను యెరూషలేమును అంగీకరించను. అవును. నేను నగరాన్ని ఏర్పరచుకున్నాను. నేను మాటలాడేటప్పుడు యెరూషలేము గురించి నేను ఇలా అన్నాను: ‘నా పేరు అక్కడ వుంటుంది’ అని. కాని నేను ఆ ప్రదేశంలో వున్న ఆలయాన్ని ధ్వంసము చేస్తాను” అని యెహోవా చెప్పాడు.
2KI 23:28 యోషీయా చేసిన ఇతర పనులు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథములో వ్రాయబడివున్నవి.
2KI 23:29 యెషీయా పరిపాలనా కాలంలో ఈజిప్టు రాజైన ఫరోనెకో యూఫ్రటీసు నది వద్ద అపిరీయా రాజుమీదికి దండెత్తి పోయెను. మెగిద్దోలో ఫరో యోషీయాను కలుసుకోనడానికి వెళ్లాడు. ఫరో యోషీయాను చూసి, అతనిని చంపాడు.
2KI 23:30 యోషీయా అధికారులు అతని దేహాన్ని రథము మీద వుంచి మెగిద్డోనుంచి యెరూషలేము వరకు మోసుకుపోయారు. వారు యోషీయాను అతని సమాధిలో సమాధి చేశారు. తర్వాత సామాన్యులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అభిషేకించారు. వారు యెహోయాహాజును తమ కొత్త రాజుగా చేసు కున్నారు.
2KI 23:31 యెహోయాహాజు రాజగు నాటికి, అతను 23 యేండ్లవాడు. యెరూషలేములో అతను మూడు నెలలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నాకి చెందిన యిర్మీయా కుమార్తె.
2KI 23:32 యెహోయాహాజు యెహోవా తప్పు అని చెప్పిన పనులు చేశాడు. తన పూర్వీకులు చేసిన ఆ పనులనే యెహోయాహాజు చేశాడు.
2KI 23:33 ఫరోనెకో హమాతు దేశములో రిబ్లా చెరసాలలో యెహోయాహాజును బంధించాడు.
2KI 23:34 అందువల్ల యెహోయాహాజు యెరూషలేములో పరిపాలంచలేక పోయాడు. ఫరోనెకో 7,500 తులాల వెండిని, 75 పౌన్ల బంగారమును యూదా కట్టునట్లుగా చేశాడు. ఫరోనెకో యోషీయా కుమారుడైన ఎల్యాకీమును కొత్త రాజుగా చేశాడు. ఫరోనెకో ఎల్యాకీము పేరుని యెహోవాయాకీము అని మార్చాడు. మరియు ఫరోనెకో ఎల్యాకీము యెహోయాహాజుని ఈజిప్టుకు తీసుకుని పోయాడు. యెహోయాహాజు ఈజిప్టులో మరణించాడు.
2KI 23:35 యెహోయాకీము వెండి బంగారాలు ఫరోనెకో ఇచ్చాడు. కాని యెహోయాకీము ప్రజలచేత పన్నులు కట్టింపజేసి ఆ ధనాన్ని ఫరోనెకో ఇచ్చాడు. అందువల్ల ప్రతి వ్యక్తి తనవంతు వెండిని, బంగారాన్ని ఇచ్చాడు. మరియు యెహోయాకీము రాజు ఆ ధనాన్ని ఫరోనెకోకి ఇచ్చాడు.
2KI 23:36 యెహోయాకీము రాజగునాటికి, అతను 25 యేండ్లవాడు. అతను యెరూషలేములో 11 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జెబూదా. ఆమె రూమాకి చెందిన పెదాయా కుమార్తె.
2KI 23:37 యెహోవా తప్పు అని చెప్పిన కార్యములు యెహోయాకీము చేసాడు. తన పూర్వికులు చేసిన పనులే యెహోయాకీము చేశాడు.
2KI 24:1 యెహోయాకీము కాలంలో బబులోను రాజయిన నెబుకద్నేజరు యూదా దేశానికి వచ్చాడు. వచ్చాడు. యెహోయాకీము నెబుద్నేజరుని మూడేండ్లు సేవించాడు. తర్వాత యెహోయాకీము నెబుద్నేజరుకు ప్రతికూలుడై అతని పరిపాలన నుండి విముక్తుడయ్యాడు.
2KI 24:2 యెహోవా బబులోనువారి బృందాలు, సిరియునులు, మోయాబీయులు, అమ్మోనీయులు మొదలైన వారిని యెహోయాకీముకి విరుద్ధంగా యుద్ధము చేయునట్లు చేశాడు. యెహోవా ఆ బృందాలను యూదాని ధ్వంసం చేయమని పంపించాడు. ఇది యెహోవా చెప్పినట్లుగానే జరిగింది. యెహోవా తన సేవకులైన ప్రవక్తలను అవి చెప్పడానికి ఉపయోగించాడు.
2KI 24:3 యూదాలో అవి జరుగేటట్లు యెహోవా ఆజ్ఞాపించాడు. ఈ విధంగా యెహోవా వారిని తన దృష్టినుండి మర్చలాడు. మనష్షే చేసిన పాపాలన్నిటి కారణాన యెహోవా ఇలా చేశాడు.
2KI 24:4 మనష్షే పలువురు అమాయకులను చంపినందువల్ల, యెహోవా ఇదంతా చేశాడు. మనష్షే యెరూష్షే యెరూషలేముని వారి రక్తముతో నింపివేశాడు. మరియు యెహోవా ఆ పాపాలను మన్నించడు.
2KI 24:5 యెహోయాకీము చేసిన ఇతర కార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి.
2KI 24:6 యెహోయాకీము మరణించగా, అతని పూర్వికులతో పాటుగా అతనిని సమాధి చేశారు. యెహోయాకీము కుమారుడు యెహోయాకీను, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
2KI 24:7 బబులోను రాజు ఈజిప్టు వాగుకి యూఫ్రటీసు నదికి మధ్యగల ప్రదేశముంతటని స్వాధీనము చేసుకున్నాడు. ఈ ప్రదేశము అంతకు ముందు ఈజిప్టువారు తమ అదుపులో ఉంచుకున్నారు. అందువల్ల ఈజిప్టు రాజు ఈజిప్టుని ఏ మాత్రమూ విడువదలచుకోలేదు.
2KI 24:8 యెహోయాకీను, పరిపాలను ప్రారంభించిన నాడు, అతను 18 యేండ్లవాడు. అతను యెరూషలేములో 3 మాసాలు పరపాలించాడు. అతని తల్లి పేరు నెహుష్తా ఆమె యెరూషలేముకు చెందిన ఎల్నాతాను కుమార్తె.
2KI 24:9 యెహోవా తప్పని చెప్పిన పనులు యెహోయాకీను చేశాడు. అతను తన తండ్రి చేసిన అవే పనులు చేసాడు.
2KI 24:10 ఆ సమయమున బబులోను రాజైన నెబుద్నెజరు యొక్క అధికారులు యెరూషలేముకు వచ్చి ముట్టిడించారు.
2KI 24:11 తర్వాత బబులోను రాజైన నెబుద్నెజరు నగరానికి వచ్చాడు. ఆయన సైన్యము అప్పటికే నగరాన్ని చుట్టుముట్టుతూ ఉంది.
2KI 24:12 యూదా రాజు యెహోయాకీను బబులోను రాజుని కలుసుకోడానికి వెలుపలికి వచ్చాడు. యెహోయాకీను తల్లి, అతని అధికారులు, నాయకులు, ఉద్యోగులు కూడా అతనితో పాటు వెళ్లారు. అప్పుడు బబులోను రాజు యెహోయాకీనుని బంధించాడు. ఇది నెబుకద్నెజరు పరిపాలనాకాలపు 8వ సంవత్సరమున జరిగింది.
2KI 24:13 నెబుకద్నెజరు యెరూషలేమునుండి, యెహోవా యొక్క ఆలయములోని నిధులన్నటినీ, రాజభవనములోని నిధులన్నిటినీ తీసుకొనెను. నెబుకద్నెజరు ఇశ్రాయేలు రాజయిన సొలొమోను యెహోవా యొక్క ఆలయములో ఉంచిన అన్ని బంగారు పాత్రలను ముక్కలు చేశాడు. యెహోవా చెప్పినట్లుగానే ఇది సంభవించింది.
2KI 24:14 నెబుకద్నెజరు యెరూషలేములోని ప్రజలందరిని బంధించాడు. అతను నాయకులందరినీ, ధనవంతులను బంధించాడు. అతను 10,000 మంది ప్రజలను బందీలుగా తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు పనిలోచెయ్యి తిరిగి వారిని, నిపుణులను తీసుకు వెళ్లాడు. సామాన్యులలోని నిరుపేదలను తప్ప మరెవ్వరిని విడిచి పెట్టలేదు.
2KI 24:15 నెబుకద్నెజరు యెహోయాకీనుని బందీగా చేసి బబులోనుకు తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు పైగా రాజమాతను, అతని భార్యలను, అధికారులను, ప్రముఖ వ్యక్తులను తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు వారిని యెరూషలేము నుండి బబులోనుకి బందీలుగా చేసి తీసుకువెళ్లాడు.
2KI 24:16 7,000 మంది సైనికులుండిరి. నెబుకద్నెజరు సైనికులందరినీ, 1,000 మందిపనిలో చెయ్యి తిరిగినవారినీ, నిపుణులను తీసుకు వెళ్లాడు. ఈవ్యక్తులందురు యుద్ధానికి సిద్ధంగా వుండే సుశిక్షుతులైన సైనికులు. బబులోను రాజు వారినందరినీ బబులోనకు బందీలుగా తీసుకు వెళ్లాడు.
2KI 24:17 బబులోను రాజు మత్తన్యాను కొత్త రాజుగా చేశాడు. మత్తన్యా యెహోయాకీము యొక్క పిన తండ్రి. అతను అతని పేరుని సిద్కియా అని మార్చి వేశాడు.
2KI 24:18 సిద్కియా పరిపాలన ప్రారంభించే నాటికి ఇరవై ఒక్క సంవత్సరములవాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నాకి చెందిన యిర్మీయా కుమార్తె.
2KI 24:19 యెహోవా తప్పు అని చెప్పిన పనులు సిద్కియా చేశాడు. సిద్కియా యెహోయాకీను చేసిన పనులే చేశాడు.
2KI 24:20 యెహోవా యెరూషలేము యూదాల పట్ల ఆగ్రహం చెందాడు. యెహోవా వారిని దూరపరచెను. సిద్కియా తిరుగుబాటు చేసి బబులోను రాజుకు విధేయుడై వుండటానికి సమ్మతించలేదు.
2KI 25:1 అందువల్ల, బబులోను రాజైన నెబుకద్నెజరు అతని మొత్తము సైన్యము యెరూషలేముకు ప్రతికూలముగా యుద్ధము చేయడానికి వచ్చింది. సిద్కియా రాజు యొక్క తొమ్మిదో సంవత్సరాన, 10వ నెలలో 10వ రోజున ఇది సంభవించింది. నెబుకద్నెజరు తన సైన్యాన్ని యెరూషలేము చుట్టు ఉంచి, ప్రజలను నగరం నుండి వెలుపలికిగాని లోపలికిగాని రానీయకుండ చేశాడు. ఆ తర్వాత నగరం చుట్టు అతను ఒక మురికి గోడ నిర్మించాడు.
2KI 25:2 నెబుకద్నెజరు సైన్యము సిద్కియా యూదా రాజుగా వున్న 11వ సంవత్సరము దాకా యెరూషలేము చుట్టూ ఉండెను.
2KI 25:3 నగరంలో కరువు ఘోరంగా తయారయింది. నాలుగవ నెలలో 9వ రోజున నగరంలోని సామాన్యులకు ఆహారము లేకపోయింది.
2KI 25:4 నెబుకద్నెజరు సైన్యము చివరికి నగర ప్రాకారమున బద్దలు చేసింది. ఆ రాత్రి సిద్కియా రాజు అతని సైనికులు పారిపోయారు. వారు రాజుగారి ఉద్యనవనము ద్వారా రహస్య ద్వారాన్ని ఉపయోగించి జంట గోడలద్వారా వెళ్లారు. విరోధి సైనికులు నగరం చుట్టూ వుండిరి. కాని సిద్కియా అతని మనుష్యులు మార్గము మీదికి తప్పించుకుని ఎడారికి పారపోయారు.
2KI 25:5 బబులోని సైన్యము సిద్కియా రాజుని వెన్నంటిపోయి అతనిని యెరికో అనే చోట పట్టుకున్నారు. సిద్కియా సైనికులందరు అతనిని విడిచిపెట్టి పారి పోయారు.
2KI 25:6 బబులోనువారు సిద్కియా రాజుని బబులోను రాజు వద్దకు రిబ్లా అనే చోటికి తీసుకు వెళ్లారు. బబులోనువారు సిద్కియాని శిక్షింప నిశ్చయించారు.
2KI 25:7 వారు సిద్కియా కుమారులను అతని ఎదుటనే చంపివేశారు. ఆ తర్వాత సిద్కియా యొక్క కండ్లు పెరికివేశారు. అతనికి గొలుసులు బిగించి అతనిని బబులోనుకు తీసుకువెళ్లారు.
2KI 25:8 నెబుకద్నెజరు బబులోను రాజుగా వున్న 19 వ సంవత్సరమున, నెబుకద్నెజరు 5 వ నెలలో 7వ తేదీని యెరూషలేముకు వచ్చాడు. నెబూజరదాను నెబుకద్నెజరు అత్యుత్తమ సైనికులకు అధిపతి
2KI 25:9 నెబూజరదాను యెహోవాయొక్క ఆలయమును దగ్ధం చేశాడు. రాజు భవనాన్ని, యెరూషలేములోని అన్ని ఇళ్లను కూడా దగ్ధం చేశాడు. అతను పెద్ద ఇళ్లను కూడా దగ్ధం చేశాడు.
2KI 25:10 అప్పుడు నెబూజరదానుతో పాటువున్న బబులోను సైన్యము యెరూషలేము పరిసరాలలోవున్న ప్రాకారములను కూలదోసింది.
2KI 25:11 నెబూజరదాను నగరంలో ఇంకా మిగిలివున్న ప్రజలను బంధించాడు. నెబూజరదానుకు లోబడిన వారిని సయితము బందీలుగా తీసుకువెళ్లాడు.
2KI 25:12 సామాన్యులలో అతి పేదవారిని మాత్రం నెబూజరదాను విడిచిపెట్టాడు. ద్రాక్షాలు ఇతర పంటలను చూసే నిమిత్తం వారిని అక్కడే నివసింప జేశాడు.
2KI 25:13 బబులోను సైనికులు యెహోవా యొక్క ఆలయములోని అన్ని ఇత్తడి వస్తువులను ముక్కలు చేశారు. వారు కంచు స్తంభాలను, కంచు మట్లను, పెద్ద ఇత్తడి చెరువుని ధ్వంసం చేశారు. తర్వాత ఆ కంచునంతా బబులోనుకు తీసుకువెళ్లాడు.
2KI 25:14 బబులోనువారు యెహోవా యొక్క ఆలయంలో ఉపయోగింపబడే కుండలు, నిప్పు తీసు గరిటలు, దీపాలు చక్కబరిచే ఉపకరణాలు, చెంచాలు, కంచు పాత్రలు మొదలైనవాటిని తీసుకువెళ్లారు.
2KI 25:15 నెబూజరదాను బానలు, పాత్రలు కూడా తీసుకు వెళ్లాడు. బంగారము కోసము బంగారముతో చేయబడిన వస్తువులను వెండి కోసము వెండితో చేయబడిన వస్తువులను కూడా తీసుకువెళ్లాడు.
2KI 25:16 2 కంచు స్తంభాలు (ప్రతి స్తంభం 27 అడుగుల యెత్తు కలవి. స్తంభాల మీద పై పీటలు నాలుగున్నర అడుగుల ఎత్తు కలవి. దానిమ్మ పండు మరియు అల్లిక విన్యాసాలు కంచుతో చేయబడినవి. రెండు స్తంభాల విన్యాసం ఒక మోస్తరుగా వుంటుంది) విశాలమైన కంచు చెరువు. యెహోవాయొక్క ఆలయానికి సొలొమోను సిద్ధపరిచిన రెండు స్తంభములు. ఆ వస్తువుల నుండి గ్రహించిన కంచు తూకం వేయడానికి అలవి కానిది.
2KI 25:18 ఆలయము నుండి నెబూజరదాను ప్రధాన యాజకుడైన శెరాయాను పట్టుకున్నాడు. జెఫన్యా అనే రెండవ యాజకుడు, పవేశమును కాచే ఆముగ్గురు మనుష్యులను తీసుకున్నాడు.
2KI 25:19 నగరంనుండి నెబూజరదాను సైన్యానికి అధికారిగా ఉన్న ఉద్యోగిని నగరంలో మిగిలివున్న ఐదుగురు రాజుగారి సహాదారులను తీసుకున్నాడు. సైన్యాధిపతి యొక్క ఒక కార్యదర్శి. అతను సామాన్య ప్రజలను లెక్కించేవాడు. మరియు అతను వారిలోనుండి కొందరు సైనికులను ఎంచుకునేవాడు. నగరంలో అప్పుడున్న 60 మంది ప్రజలను నెబుకద్నెజరు తీసుకున్నాడు.
2KI 25:20 తరువాత నెబుద్నెజరదాను హమాతు ప్రదేశంలోని రిబ్లా దగ్గర ఉన్న బబులోను రాజువద్దకు ప్రజలందరనీ తీసుకువెళ్లాడు. బబులోను రాజు రిబ్లా అనే చోట వారిని చంపివేశాడు. మరియు యూదా ప్రజలను వారి దేశమునుండి బందీలుగా తీసుకుని పోయెను.
2KI 25:22 బబులోను రాజైన నెబుద్నెజరు యూదా దేశంలో కొందరు ప్రజలను విడచి పెట్టాడు. షాఫాను కుమారుడైన అహీకాం, అతని కుమారుడైన గెదల్యా అనే అతడు ఒకడుండెను. నెబుద్నెజరు యూదా ప్రజల మీద గెదల్యాను అధిపతిగా నియమించాడు.
2KI 25:23 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు కారేహకు కుమారుడైన నెటోఫాతుకు చెందిన తన్హుమెతు కుమారుడైన శెరాయా, మాయాకాతు కుమారుడైన యజన్నా మొదలయిన వారు సైన్యాధిపతులు. ఈ సైన్యాధితులు, వారి మనుష్యులు, బబులోను రాజు గెదల్యాను అధిపతిగా చేసినట్లు విన్నారు. అందువల్ల గెదల్యాను కలుసుకోవడానికి వారు మిస్సాకి వెళ్లారు.
2KI 25:24 ఈ అధికారులకు, వారి మనుష్యులకు గెదల్యా వాగ్దానాలు చేశాడు. గెదల్యా వారితో ఇట్లన్నాడు: “బబులోను అధికారులను చూసి మీరు భయపడకండి. ఇక్కడే ఉండి బబులోను రాజుని కొలవండి. ఆ తరువాత, అంతయు మీకు సక్రమముగా ఉంటుంది.”
2KI 25:25 ఎలీషా కుమారుడైన నెతన్యా కుమారుడు ఇష్మాయేలు రాజు కుటుంబము నుండి వచ్చినవాడు. ఏడవ నెలలో ఇష్మాయేలు మరియు పదిమంది అతని మనుష్యులు గెదల్యా మీద దాడిచేసి మిస్పా వద్ద గెదల్యాతో పాటు ఉన్న కల్దీయులను యూదాలను చంపివేశాడు.
2KI 25:26 అప్పుడు సైన్యాధికారులు అందురు మనుష్యులు ఈజిప్టుకు పారిపోయారు. అతి సామాన్యుడు మొదలుకొని అతి ప్రాముఖ్యము కలవాడి వరకు అందరూ పారి పోయ్యారు. ఎందుకనగా, కల్దీయులనగా వారు భయపడ్డారు.
2KI 25:27 ఆ తర్వాత ఎవీల్మెరోదకు బబలోనుకు రాజయ్యాడు. అతను యూదా రాజైన యెహోయాకీనును చెరసాలనుండి విముక్తి చేసెను. ఇది యెహోయాకీను బంధింపబడిన 37వ సంవత్సరమున సంభవించింది. ఇది ఎవీల్మెరోదకు పరిపాలన ప్రారంభం చేసిన 12వ నెలనుండి 27వ తేదీ వరకు జరిగింది.
2KI 25:28 ఎవీల్మెరోదకు యెహోయాకీను పట్ల దయకలిగి ఉండెను. అతను యెహోయాకీనుకి బబులోనులో తనతో బాటు ఆసీనులయ్యే ఇతర రాజుల కంటె ఎక్కువ ప్రాముఖ్యముగల చోట ఇచ్చాడు.
2KI 25:29 ఎవీల్మెరోదకు యెహోయాకీను చెరసాల దుస్తులు ధరించడం ఆపివేశాడు. మరియు యెహోయాకీను ఒకే మేజాబల్ల మీద కూర్చుని ఎవీల్మెరోదకుతో కలిసి భుజించాడు. ఇట్లు అతని శేష జీవితము వరకు జరిగింది.
2KI 25:30 అందువల్ల ఎవీల్మెరోదకు రాజు యెహోయాకీనుకు అతని శేష జీవితము వరకూ ప్రతిరోజూ భోజనము పెట్టాడు.
1CH 1:1 దాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, యెరెదు హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు.
1CH 1:4 షేము, హాము, యాపెతు.
1CH 1:5 యాపెతు కుమారులెవరనగా: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు మరియు తీరసు.
1CH 1:6 అష్కనజు, రీఫతు, తోగర్మాలనేవారు గోమెరు కుమారులు.
1CH 1:7 ఎలీషా, తర్షీషు, కిత్తీము, రోదానీము అనేవారు యావాను కుమారులు.
1CH 1:8 కూషు, (ఇథియోపియ) మిస్రాయిము, (ఈజిప్టు) పూతు మరియు కనాను అనేవారు హాము కుమారులు.
1CH 1:9 సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా అనేవారు కూషు కుమారులు. షెబ, దదాను అనేవారు రాయమా కుమారులు.
1CH 1:10 నిమ్రోదు అనువాడు కూషు సంతతివాడు. నిమ్రోదు ప్రపంచంలోనే మహా ధైర్యవంతుడు, బలవంతుడైన సైనికుడయ్యాడు.
1CH 1:11 లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు వీరందరికి మిస్రాయిము (ఈజిప్టు) వంశకర్త.
1CH 1:12 అంతేకాదు, పత్రుసీయులకు, కస్లూహీయులకు మరియు కఫ్తోరీయులకు కూడ మిస్రాయిము వంశకర్త. ఫిలిష్తీయులు (పాలస్తీను ప్రజలు) కస్లూహునుండి వచ్చినవారు.
1CH 1:13 కనాను పెద్ద కుమారుని పేరు సీదోను, రెండవ కుమారుడు హేతు. మరియు హిత్తీయులకు
1CH 1:14 యెబూసీయులకు, అమోరీయులకు, గిర్గాషీయులకు,
1CH 1:15 హివ్వీయులకు, అర్కీయులకు, సీనీయులకు,
1CH 1:16 అర్వాదీయులకు, సెమారీయులకు మరియు హమాతీయులకు కూడ కనాను వంశకర్త.
1CH 1:17 షేము కుమారులు ఎవరనగా: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు మరియు అరాము. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు మరియు మెషెకు.
1CH 1:18 అర్పక్షదుకు షేలహు అను కుమారుడు పుట్టాడు. షేలహునకు ఏబెరు అనువాడు పుట్టాడు.
1CH 1:19 ఏబెరుకు ఇద్దరు కుమారులు. ఒకని పేరు పెలెగు. అతని కాలంలో ప్రపంచ జనాభా వివిధ భాషా వర్గాలుగా విడిపోయిన కారణంగా అతనికి పెలెగు అని పేరు పెట్టారు. పెలెగు సోదరుని పేరు యొక్తాను. (
1CH 1:20 అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
1CH 1:21 హదోరము, ఊజాలు, దిక్లాను,
1CH 1:22 ఏబాలు, అబీమాయేలు, షేబ,
1CH 1:23 ఓఫీరు, హవీలా మరియు యోబాబు. వీరంతా యొక్తాను కుమారులు.)
1CH 1:24 అబ్రాహాము సంతానం ఎవరనగా: షేము, అర్పక్షదు, షేలహు,
1CH 1:25 ఏబెరు, పెలెగు, రయూ,
1CH 1:26 సెరూగు, నాహోరు, తెరహు,
1CH 1:27 మరియు అబ్రాహాము పేరుతో పిలవబడిన అబ్రాము.
1CH 1:28 అబ్రాహామునకు ఇస్సాకు, ఇష్మాయేలు అను ఇరువురు కుమారులు.
1CH 1:29 ఇష్మాయేలు సంతానం ఎవరనగా: ఇష్మాయేలు ప్రథమ పుత్రుడు నెబాయోతు. ఇష్మాయేలు ఇతర కుమారులెవరనగా కేదారు, అద్బయేలు, మిబ్శాము,
1CH 1:30 మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,
1CH 1:31 యెతూరు, నాపీషు, కెదెమా అనువారు. వీరంతా ఇష్మాయేలు కుమారులు.
1CH 1:32 కెతూరా అబ్రాహాముకు దాసి. ఆమెకు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు మరియు షూవహు అను కుమారులు కలిగారు. యొక్షానుకు షేబ, దదాను అను కుమారులు పుట్టారు.
1CH 1:33 ఏయిఫా, ఏఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా సంతతివారు.
1CH 1:34 ఇస్సాకు తండ్రి పేరు అబ్రాహాము. ఇస్సాకు కుమారుల పేర్లు ఏశావు, ఇశ్రాయేలు.
1CH 1:35 ఎలీఫజు, రెయూవేలు, యెయూషు, యలాము మరియు కోరహు అనేవారు ఏశావు కుమారులు.
1CH 1:36 తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా మరియు అమాలేకు అనేవారు ఎలీఫజు కుమారులు.
1CH 1:37 నహతు, జెరహు, షమ్మా మరియు మిజ్జ అనువారు రెయూవేలు కుమారులు.
1CH 1:38 లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు మరియు దిషోను అనువారంతా శేయీరు కుమారులు.
1CH 1:39 హోరీ, హోమాను ఇరువురూ లోతాను కుమారులు. తిమ్నా అనే యువతి లోతాను సోదరి.
1CH 1:40 అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము అనువారు శోబాలు కుమారులు. అయ్యా, అనా అను వారిరువురూ సిబ్యోను కుమారులు.
1CH 1:41 అనా కుమారుని పేరు దిషోను. అమ్రాము, ఎష్బాను, ఇత్రాను, కెరాను అనువారు దిషోను కుమారులు.
1CH 1:42 బిల్హాను, జవాను, యహకాను అనువారు ఏసెరు కుమారులు. ఊజు, అరానులిరువురూ దిషాను కుమారులు.
1CH 1:43 ఎదోము రాజుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: ఇశ్రాయేలులో రాజరిక వ్యవస్థ ఏర్పడటానికి చాలాకాలం క్రిందటనే ఏదోములో రాజులు పాలించారు. వీరు ఎవరనగా బెయారు కుమారుడైన బెల, అతని నగరం పేరు దిన్హాబా.
1CH 1:44 బెల చనిపోయిన పిమ్మట అతని స్థానంలో యోబాబు రాజయ్యాడు. యోబాబు తండ్రి పేరు జెరహు. యోబాబు బొస్రా నగరానికి చెందినవాడు.
1CH 1:45 యోబాబు చనిపోయిన తరువాత హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. హుషాము తేమానీయుల దేశపువాడు.
1CH 1:46 హుషాము చనిపోయిన పిమ్మట హదదు రాజయ్యాడు. హదదు తండ్రి పేరు బెదెదు. మోయాబు దేశంలో మిద్యానీయులను హదదు ఓడించాడు. హదదు అవీతు నగరంవాడు.
1CH 1:47 హదదు చనిపోగా శమ్లా రాజయ్యాడు. ఇతడు మశ్రేకా నగరవాసి.
1CH 1:48 శమ్లా చనిపోయిన పిమ్మట షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. షావూలు యూఫ్రటీసు నదీ తీరానగల రహెబోతు పట్టణపు వాడు.
1CH 1:49 షావూలు మరణానంతరం బయల్ — హానాను రాజయ్యాడు. బయల్ — హానాను తండ్రి పేరు అక్బోరు.
1CH 1:50 బయల్ — హానాను చనిపోగా హదదు అతని స్థానంలో రాజయ్యాడు. హదదు నగరం పేరు పాయు. హదదు భార్య పేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. మత్రేదు మేజాహాబు కుమార్తె.
1CH 1:51 కొంత కాలానికి హదదు చనిపోయాడు. అప్పట్లో ఎదోము రాజ్యంలో తిమ్నా, అల్వాయతేతు,
1CH 1:52 అహలీబామా, ఏలా, పీనోను,
1CH 1:53 కనజు, తేమాను, మిబ్సారు,
1CH 1:54 మగ్దీయేలు మరియు ఈరాము నాయకులుగా ఉన్నారు. వీరంతా ఎదోము దేశ నాయకులు.
1CH 2:1 రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,
1CH 2:2 దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు మరియు ఆషేరు అనేవారు ఇశ్రాయేలు కుమారులు.
1CH 2:3 ఏరు, ఓనాను, షేలా అనేవారు యూదా కుమారులు. వీరి తల్లి పేరు బత్ షూయ. ఈమె కనానీయురాలు. యూదా పెద్ద కుమారుడు ఏరు దుష్టుడైనట్లు యెహోవా గమనించాడు. అందువల్ల ఆయన అతనిని చంపివేశాడు.
1CH 2:4 యూదా కోడలు తామారుకు అతని వల్లనే పెరెసు, జెరహు అను కవల కుమారులు కలిగారు. ఆ విధంగా యూదాకు ఐదుగురు కుమారులయ్యారు.
1CH 2:5 పెరెసు కుమారులు హెస్రోను, హామూలు.
1CH 2:6 జెరహు సంతానం ఐదుగురు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార్ద.
1CH 2:7 జిమ్రీ కుమారుడు కర్మీ. కర్మీ కుమారుడు ఆకాను. ఇతడు ఇశ్రాయేలు వారికి అనేక కష్టాలు తెచ్చాడు. ఇతడు యుద్ధంలో తీసుకున్న వస్తువులను దేవునికివ్వకుండా తన వద్దనే వుంచుకొన్నాడు.
1CH 2:8 ఏతాను కుమారుడు అజర్యా.
1CH 2:9 హెస్రోను కుమారులు యెరహ్మయేలు, రాము, కెలూబై.
1CH 2:10 రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను యూదా ప్రజల నాయకుడు.
1CH 2:11 నయస్సోను కుమారుడు శల్మా. శల్మా కుమారుడు బోయజు.
1CH 2:12 బోయజు కుమారుడు ఓబెదు. ఓబెదు కుమారుడు యెష్షయి.
1CH 2:13 యెష్షయి పెద్ద కుమారుడు ఏలీయాబు. యెష్షయి రెండవ కుమారుడు అబీనాదాబు. అతని మూడవ కుమారుడు షమ్మాను (షిమియ).
1CH 2:14 నెతనేలు యెష్షయికి నాల్గవ కుమారుడు. అతని ఐదవ కుమారుడు రద్దయి.
1CH 2:15 యెష్షయి ఆరవ కుమారుడు ఓజెము కాగా ఏడవ కుమారుడు దావీదు.
1CH 2:16 సెరూయా, అబీగయీలు ఇద్దరూ వారి తోడబట్టిన ఆడపిల్లలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కుమారులు.
1CH 2:17 అబీగయీలు కుమారుడు అమాశా. అమాశా తండ్రి పేరు యెతెరు. యెతెరు ఇష్మాయేలీయులవాడు.
1CH 2:18 హెస్రోను కుమారుడు కాలేబు. తన భార్య అజూబా ద్వారా కాలేబు సంతానవంతుడయ్యాడు. అజూబా యెరీయోతు కుమార్తె. యేషెరు, షోబాబు మరియు అర్దోను అనేవారు అజూబా కుమారులు.
1CH 2:19 అజూబా చనిపోయిన పిమ్మట కాలేబు ఎఫ్రాతాను పెండ్లి చేసుకొన్నాడు. కాలేబుకు ఎఫ్రాతావల్ల హూరు అనే కుమారుడు కలిగాడు.
1CH 2:20 ఊరి అనేవాడు హూరు కుమారుడు. ఊరికి బెసలేలు అను కుమారుడు కలిగాడు.
1CH 2:21 పిమ్మట హెస్రోను అరువది సంవత్సరాల వాడైనప్పుడు మాకీరు కుమార్తెను వివాహమాడాడు. మాకీరు అనేవాడు గిలాదుకు తండ్రి. హెస్రోను మాకీరు కుమార్తెను కలియగా ఆమెకు సెగూబు అనేవాడు పుట్టెను.
1CH 2:22 సెగూబుకు పుట్టినవాడు యాయీరు. యాయీరుకు గిలాదు దేశంలో ఇరవైమూడు నగరాలున్నాయి.
1CH 2:23 కాని గెషూరు వారు, అరాము (సిరియ) వారు యాయీరు గ్రామాలను తీసుకొన్నారు. వాటిలో కెనాతు, దాని చుట్టుపట్ల గ్రామాలు వున్నాయి. అవి మొత్తం అరువది చిన్న చిన్న పట్టణాలు. ఈ పట్టణాలన్నీ గిలాదు తండ్రి అయిన మాకీరు సంతతివారికి చెందినవి.
1CH 2:24 హెస్రోను కాలేబదైన ఎఫ్రాతాలో చనిపోయాడు. హెస్రోను చనిపోయిన తరువాత అతని భార్య అబీయా ప్రసవించింది. ఆ పుట్టినవాని పేరు అష్షూరు. అష్షూరుకు పుట్టినవాడు తెకోవ.
1CH 2:25 యెరహ్మయేలు హెస్రోను పెద్ద కుమారుడు. రాము, బూనా, ఓరెను, ఓజెము మరియు అహీయా అనేవారు యెరహ్మెయేలు కుమారులు. యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాము.
1CH 2:26 యెరహ్మెయేలుకు అటారా అనే మరొక భార్య ఉన్నది. అటారా ఓనాముకు తల్లి.
1CH 2:27 యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాముకు కుమారులున్నారు. వారి పేర్లు మయజు, యామీను, ఏకెరు.
1CH 2:28 షమ్మయి, యాదా ఇద్దరూ ఓనాము కుమారులు. నాదాబు, అబీషూరులిద్దరూ షమ్మయి కుమారులు.
1CH 2:29 అబీషూరు భార్య పేరు అబీహయిలు. అబీహయిలు అతనికి ఇద్దరు కుమారులను కన్నది. అబాను, మొలీదు అని వారి పేర్లు.
1CH 2:30 సెలెదు, అప్పయీములిద్దరూ నాదాబు కుమారులు. సెలెదు సంతానం లేకుండానే చనిపోయాడు.
1CH 2:31 అప్పయీము కుమారుని పేరు ఇషీ. ఇషీ కుమారుడు షేషాను. షేషాను కుమారుని పేరు అహ్లయి.
1CH 2:32 షమ్మయి సోదరుని పేరు యాదా. యెతెరు, యోనాతాను ఇద్దరూ యాదా కుమారులు. యెతెరు సంతానం లేకుండానే మరణించాడు.
1CH 2:33 పేలెతు, జాజాలిద్దరూ యోనాతాను కుమారులు. ఇది యెరహ్మెయేలు సంతతి జాబితా.
1CH 2:34 షేషానుకు కుమారులు లేరు. అతనికి అందరూ కుమార్తెలే. షేషాను వద్ద ఈజిప్టుకు చెందిన ఒక సేవకుడున్నాడు. వాని పేరు యర్హా.
1CH 2:35 షేషాను కుమార్తెను, యర్హా వివాహం చేసికొన్నాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరు అత్తయి.
1CH 2:36 అత్తయి కుమారుని పేరు నాతాను. నాతాను కుమారుడు జాబాదు.
1CH 2:37 జాబాదు కుమారుడు ఎఎ్లాలు. ఎఎ్లాలు కుమారుడు ఓబేదు.
1CH 2:38 ఓబేదు కుమారుడు యెహూ. యెహూ కుమారుడు అజర్యా.
1CH 2:39 అజర్యా కుమారుడు హేలెస్సు. హేలెస్సు కుమారుడు ఎలాశా.
1CH 2:40 ఎలాశా కుమారుడు సిస్మాయీ. సిస్మాయీ కుమారుడు షల్లూము.
1CH 2:41 షల్లూము కుమారుడు యెకమ్యా. యెకమ్యా కుమారుడు ఎలీషామా.
1CH 2:42 యెరహ్మయేలు సోదరుడు కాలేబు. కాలేబుకు కొందరు కుమారులున్నారు. అతని మొదటి కుమారుడు మేషా. మేషా కుమారుడు జీపు. జీపు కుమారుడు మారేషా. మారేషా కుమారుడు హెబ్రోను.
1CH 2:43 హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము మరియు షెమ అనువారు.
1CH 2:44 షెమ కుమారుడు రహము. రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి.
1CH 2:45 షమ్మయి కుమారుడు మాయోను. మాయోను కుమారుడు బేత్సూరు.
1CH 2:46 కాలేబు దాసి పేరు ఏయిఫా. ఏయిఫా కుమారులు హారాను, మోజా మరియు గాజేజు అనువారు. హారాను కుమారుని పేరు కూడ గాజేజు.
1CH 2:47 యెహ్దయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా మరియు షయపు.
1CH 2:48 మయకా అనే స్త్రీ కాలేబు యొక్క మరో దాసి. మయకాకు పుట్టిన కుమారులు షెబెరు మరియు తిర్హానా అనేవారు.
1CH 2:49 మయకా ఇంకా షయపు, షెవా అను వారికి కూడ తల్లి. షయపు కుమారుడు మద్మన్నా. షెవా కుమారులు మక్బేనా మరియు గిబ్యా. కాలేబు కుమార్తె పేరు అక్సా.
1CH 2:50 ఇది కాలేబు సంతతి: కాలేబు మొదటి కుమారుని పేరు హూరు. ఇతడు ఎఫ్రాతాకు పుట్టినవాడు. హూరు కుమారుడు శోబాలు. శోబాలు కుమారుని పేరు కిర్యత్యారీము.
1CH 2:51 తరువాతివారు శల్మా మరియు హారేపు. శల్మా కుమారుడు బెత్లేహేము. హారేపు కుమారుడు బేత్గాదేరు.
1CH 2:52 శోబాలు కిర్యత్యారీము స్థాపకుడు. శోబాలు సంతతి వారు: హారోయే మరియు మనుహతీలోని వారిలో సగంభాగం:
1CH 2:53 మరియు కిర్యత్యారీము సంతతి కుటుంబాల వారు. వీరు: ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు. మిష్రాయీయుల సంతతివారే సొరాతీయులు, ఎష్తాయులీయులు.
1CH 2:54 శల్మా సంతతి వారెవరనగా: బేత్లెహేము, నెటోపాతీయులు, అతారోతు, బేత్యోవాబు ప్రజలు; మనుహతీయులలో సగం మందిగా వున్న జారీయులు,
1CH 2:55 మరియు యబ్బేజులో నివసిస్తున్న చరిత్రాది విషయాలు, దస్తావేజులు రాసే లేఖకులు. ఈ లేఖకులు తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులకు చెందిన వంశాల వారు. హమాతు సంతతి వారైన కేనీయులే ఈ లేఖకులు. బేత్ — రేకాబు వంశీయులకు హమాతు మూలపురుషుడు.
1CH 3:1 హెబ్రోను పట్టణంలో దావీదుకు కొందరు కుమారులు పుట్టారు. ఆ కుమారులు ఎవరనగా: దావీదు మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి పేరు అహీనోయము. ఆమె యెజ్రెయేలుకు చెందిన స్త్రీ, రెండవ కుమారుని పేరు దానియేలు. అతని తల్లి పేరు అబీగయీలు. ఆమె కర్మేలుకు చెందినది.
1CH 3:2 మూడవ కుమారుడు అబ్షాలోము. తల్మయి కుమార్తెయగు మయకా అతని తల్లి. తల్మయి గెషూరుకు రాజు. నాల్గవ కుమారుని పేరు అదోనీయా. అతని తల్లి పేరు హగ్గీతు.
1CH 3:3 ఐదవ కుమారుడు షెఫట్య. అతని తల్లి పేరు అబీటలు. ఆరవవాడు ఇత్రెయాము. ఇతని తల్లి దావీదు భార్య ఎగ్లా.
1CH 3:4 దావీదుకు ఈ ఆరుగురు కుమారులు హెబ్రోనులో జన్మించారు. దావీదు అక్కడ ఏడు సంవత్సరాల ఆరు నెలలపాటు పాలించాడు. దావీదు యెరూషలేములో ముప్పదిమూడు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు.
1CH 3:5 దావీదుకు యెరూషలేములో పుట్టిన సంతానమెవరనగా: బత్షెబకు నలుగురు సంతానం. వారు షిమ్యా, షోబాబు, నాతాను మరియు సొలొమోను. బత్షెబ అమ్మీయేలు కుమార్తె.
1CH 3:6 దావీదు యొక్క మరి తొమ్మండుదురు కుమారులు ఎవరనగా: ఇభారు, ఎలీషామా, ఎలీపేలెటు, నోగహు, నెపెగు, యాఫీయ, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు.
1CH 3:9 వారంతా దావీదు కుమారులు. దావీదుకు ఇంకా దాసీ వలన కూడ కుమారులు కలిగారు. తామారు దావీదు కుమార్తె.
1CH 3:10 సొలొమోను కుమారుడు రెహబాము. రెహబాము కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా. ఆసా కుమారుడు యెహోషాపాతు.
1CH 3:11 యెహోషాపాతు కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు అహజ్యా. అహజ్యా కుమారుడు యోవాషు.
1CH 3:12 యోవాషు కుమారుడు అమజ్యా. అమజ్యా కుమారుడు అజర్యా. అజర్యా కుమారుడు యోతాము.
1CH 3:13 యోతాము కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా. హిజ్కియా కుమారుడు మనష్షే.
1CH 3:14 మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను కుమారుడు యోషీయా.
1CH 3:15 యోషీయా కుమారులెవరనగా: యోహానాను మొదటి కుమారుడు. రెండవవాడు యెహోయాకీము. మూడవ కుమారుడు సిద్కియా. నాల్గవవాడు షల్లూము.
1CH 3:16 యెహోయాకీము సంతానంలో యెకొన్యా, అతని కుమారుడు: సిద్కియా, అతని కుమారుడు వున్నారు.
1CH 3:17 యెహోయాకీను బబలోనులో బందీ అయిన పిమ్మట యెకొన్యా సంతానం ఎవరనగా: షయల్తీయేలు,
1CH 3:18 మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా మరియు నెదబ్యా.
1CH 3:19 పెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా, షెలోమీతు మరియు వారి సహోదరి.
1CH 3:20 జెరుబ్బాబెలుకు ఐదుగురు కుమారులు. వారి పేర్లు: హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా మరియు యూషబెస్హెదు.
1CH 3:21 హనన్యా కుమారులు పెలట్యా, యెషయా, రెఫయా, అర్నాను, ఓబద్యా మరియు షెకన్యా.
1CH 3:22 షెకన్యా సంతతిలో షెమయా ఒకడు. షెమయాకు ఆరుగురు కుమారులు: వారు షెమయా, హట్టూషు, ఇగాలు బారియహు, నెయర్యా, షాపాతు.
1CH 3:23 నెయర్యాకు ముగ్గురు కుమారులు: వారు ఎల్యోయేనై, హిజ్కియా, అజీక్రాము.
1CH 3:24 ఎల్యోయేనై కుమారులు ఏడుగురు: వారు హోదవయా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా మరియు అనాని.
1CH 4:1 యూదా కుమారులు ఎవరనగా: పెరెసు, హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు.
1CH 4:2 శోబాలు కుమారుడు రెవాయా. రెవాయా కుమారుడు యహతు. యహతు కుమారులు అహూమై, లహదు అనువారు. అహూమై, లహదు వంశీయులే సొరాతీయులు. అబేయేతాము తండ్రియగు హారేపు సంతతివారెవరనగా
1CH 4:3 అబీయేతాము కుమారులు యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు అనేవారు. వారి సోదరి పేరు హజ్జెలెల్పోని.
1CH 4:4 పెనూయేలు కుమారుడు గెదోరు. ఏజెరు కుమారుడు హూషా. హూరు సంతతి వారెవరనగా: హూరు అనువాడు ఎఫ్రాతాకు పెద్ద కుమారుడు. ఎఫ్రాతా కుమారుడు బేత్లెహేము.
1CH 4:5 తెకోవ తండ్రి పేరు అష్షూరు. తెకోవకు హెలా మరియు నయరా అను ఇద్దరు భార్యలు.
1CH 4:6 నయరాకు అహూజాము, హెపెరు, తేమని, హాయహష్తారీ అనేవారు పుట్టారు. వీరంతా అష్షూరుకు నయరావల్ల పుట్టిన కుమారులు.
1CH 4:7 హెలా కుమారులు జెరెతు, సోహరు, ఎత్నాను మరియు కోజు అనువారు.
1CH 4:8 కోజు కుమారులు ఆనూబు, జోబేబా. అహర్హేలు సంతతి వారందరికీ కోజు మూలపురుషుడు. అహర్హేలు అనేవాడు హారుము కుమారుడు.
1CH 4:9 యబ్బేజు చాలా మంచి వ్యక్తి. అతడు తన సోదరుల కంటె మంచివాడు. “నేనతనికి యబ్బేజు అని నామకరణం చేశాను. ఎందువల్లననగా నేనతనిని ప్రసవించినప్పుడు మిక్కిలి బాధ అనుభవించాను” అని అతని తల్లి చెప్పింది.
1CH 4:10 యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు: “దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకొంటున్నాను! నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపాడుము. అప్పుడు నాకేరకమైన వేదనా ఉండదు.” యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగుజేశాడు.
1CH 4:11 కెలూబు అనువాడు షూవహుకు సోదరుడు. కెలూబు కుమారుని పేరు మెహీరు. మెహీరు కుమారుని పేరు ఎష్తోను.
1CH 4:12 ఎష్తోను కుమారుల పేర్లు బేత్రాఫాను, పాసెయ మరియు తెహిన్నా. తెహిన్నా కుమారుని పేరు ఈర్నాహాషు. వారంతా రేకా నుండి వచ్చిన వారు.
1CH 4:13 కనజు కుమారులు ఇద్దరు: ఒత్నీయేలు, శెరాయా. ఒత్నీయేలుకుహతతు, మెయానొతై అనే ఇద్దరు కుమారులు.
1CH 4:14 మెయానొతై కుమారుని పేరు ఒఫ్రా. శెరాయా కుమారుని పేరు యోవాబు. యోవాబు కుమారుని పేరు గెహరష్షీము. (దీనినే “పని వారి లోయ” అంటారు). హస్త నైపుణ్యం గల పనివారు నివసించే చోటు గనుక ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.
1CH 4:15 యెపున్నె కుమారుని పేరు కాలేబు. కాలేబు కుమారులు ఈరూ, ఏలా, నయము అనేవారు. ఏలా కుమారుని పేరు కనజు.
1CH 4:16 యెహల్లెలేలు కుమారులు జీపు, జీఫా, తీర్యా, అశర్యేలు అనేవారు.
1CH 4:17 ఎజ్రా కుమారుల పేర్లు యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు కుమారులు మిర్యాము, షమ్మయి, ఇష్బాహు అనేవారు. ఇష్బాహు కుమారుడు ఎష్టెమోను. మెరెదు భార్య ఐగుప్తు (ఈజిప్టు) కు చెందిన స్త్రీ. ఆమెకు యెరెదు, హెబెరు, యెకూతీయేలు అను కుమారులు కలిగారు. యెరెదు కుమారుని పేరు గెదోరు. హెబెరు కుమారుని పేరు శోకో. యెకూతీయేలు కుమారుని పేరు జానోహ. బిత్యా వంశావళి ఏదనగా: బిత్యా ఫరో కుమార్తె. ఈమె ఐగుప్తు (ఈజిప్టు) దేశీయురాలు. మెరెదుకు భార్య.
1CH 4:19 మెరెదు మరో భార్య నహము సోదరి. మెరెదు యొక్క ఈ భార్య యూదాకు చెందిన స్త్రీ. మెరెదు భార్యకు పుట్టిన కుమారులు కెయీలా. ఎష్టెమో అనే వారికి తండ్రులయ్యారు. కెయీలా గర్మీయులకు చెందినవాడు. ఎష్టెమో మాయకాతీయులకు చెందినవాడు.
1CH 4:20 షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను మరియు తీలోను. ఇషీ కుమారులు జోహేతు మరియు బెన్జోహేతు.
1CH 4:21 యూదా కుమారుని పేరు షేలహు. షేలహు కుమారులు ఏరు, లద్దా, యోకీము, కోజేబావారి యోవాషు, శారాపు అనేవారు. ఏరు కుమారుని పేరు లేకా. మారేషా అను వానికి, బేత్ అషీబయలో నారబట్టలు నేయు కుటుంబాల వారికి లద్దా తండ్రి. యోవాషు, శారాపులిద్దరూ మోయాబీయుల స్త్రీలను వివాహమాడారు. పిమ్మట వారు బేత్లెహేముకు తిరిగి వెళ్లారు. ఈ వంశాన్ని గురించిన వ్రాతలన్నీ మిక్కిలి ప్రాచీనమైనవి.
1CH 4:23 షేలహు కుమారులు కుమ్మరి పనివారు. వారంతా నెతాయీములోను, గెదేరాలోను నివసించారు. వారా పట్టణాలలో వుంటూ రాజు కొరకు పనిచేశారు.
1CH 4:24 షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు అనేవారు.
1CH 4:25 షావూలు కుమారుని పేరు షల్లూము. షల్లూము కుమారుడు మిబ్శాము. మిబ్శాము కుమారుడు మిష్మా.
1CH 4:26 మిష్మా కుమారుడు హమ్మూయేలు. హమ్మూయేలు కుమారుడు జక్కూరు. జక్కూరు కుమారుడు షిమీ.
1CH 4:27 షిమీకి పదహారుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు కలిగారు. కాని షిమీ సోదరులకె వరికీ సంతానం లేదు. షిమీ సోదరులకు పెద్ద కుటుంబాలు కూడా లేవు. యూదాలో ఇతర కుటుంబాల మాదిరిగా వారి కుటుంబాలు పెద్దవి కావు.
1CH 4:28 షిమీ సంతానం బెయేర్షెబాలోను, మోలాదాలోను, హజర్షువలులోను,
1CH 4:29 బిల్హాలోను, ఎజెములోను, తోలాదులోను,
1CH 4:30 బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను,
1CH 4:31 బేత్మర్కా బేతులోను, హజర్షూసాలోను, బేత్బీరీలోను, షరాయిములోను నివసించారు. దావీదు రాజయ్యేవరకు వారా పట్టణాలలో నివసించారు.
1CH 4:32 ఆ పట్టణాల పరిసరాల్లో ఉన్న ఐదు గ్రామాలేవనగా ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను మరియు ఆషాను.
1CH 4:33 అంతేగాక బయలువరకు అనేక ఇతర గ్రామాలు కూడవున్నాయి. ఈ ప్రదేశాల్లో వారు నివసించారు. పైగా వారు తమ వంశచరిత్రను కూడా రాశారు.
1CH 4:34 ఆయా వంశాల వారి నాయకులు ఈ విధంగా ఉన్నారు: మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడగు యోషా, యావేలు, యోషిబ్యా కుమారుడైన యెహూ (యోషిబ్యా అనేవాడు శెరాయా కుమారుడు: శెరాయా తండ్రి పేరు అశీయేలు); ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అశాయా, అదీయేలు, యెశీమీయేలు, బెనాయా మరియు షిపి కుమారుడైన జీజా. షిపి అనేవాడు అల్లోను కుమారుడు. అల్లోను తండ్రి పేరు యెదాయా. యెదాయా తండ్రి పేరు షిమ్రీ. షిమ్రీ తండ్రి పేరు షెమయా. ఈ మనుష్యుల కుటుంబాలన్నీ బాగా విస్తరించి పెరిగాయి.
1CH 4:39 వారు గెదోరుకు, ఆ పైభూభాగాలకు, తూర్పున ఉన్న లోయ వరకు సంచరించారు. వారు తమ గొర్రెల మందలకు, ఆవుల మందలకు మేత బయళ్లు వెదుకుతూ ఆ ప్రాంతాల వరకు సంచరించారు.
1CH 4:40 పచ్చిక మెండుగా ఉన్న మంచి భూములను వారు కనుగొన్నారు. సారవంతమైన పంట భూములను కూడ వారు చూసారు. ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం విలసిల్లింది. గతంలో హాము సంతతివారు అక్కడ నివసించారు.
1CH 4:41 యూదా రాజు హిజ్కియా కాలంలో ఇది జరిగింది. ఆ మనుష్యులంతా గెదోరుకు వచ్చి, హామీయులతో పోరాడి, వారి గుడారాలన్నిటినీ నాశనం చేశారు. వారింకా అక్కడ నివసించే మెయోనీయులతో కూడ యుద్ధం చేసి వారిని నాశనం చేసారు. ఈనాటి వరకు అక్కడ మెయోనీయులు లేరు. తరువాత ఈ మనుష్యులే అక్కడ నివసించసాగారు. అక్కడ వారి గొర్రెలకు పుష్కలంగా మేత దొరకడంతో వారక్కడ స్థిరపడ్డారు.
1CH 4:42 ఐదువందల మంది షిమ్యోనీయులు కొండల ప్రాంతమైన శేయీరుకు వెళ్లారు. ఇషీ కుమారుల నాయకత్వంలో వారు వెళ్లారు. వారి పేర్లు ఏవనగా: పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు. షిమ్యోనీయులు అక్కడి స్థానిక ప్రజలతో యుద్ధం చేసారు.
1CH 4:43 అక్కడ చాలా కొద్దిమంది అమాలేకీయులు మాత్రమే ఉంటున్నారు. షిమ్యోనీయులు వారిని హతమార్చారు. అప్పటి నుండి ఈనాటి వరకు షిమ్యోనీయులు శేయీరులో నివసిస్తున్నారు.
1CH 5:1 ఇశ్రాయేలు పెద్ద కుమారుని పేరు రూబేను. రూబేను జ్యేష్ఠ కుమారునికి అర్హమైన ప్రత్యేకాధిక్యతలు అందుకోవలసి ఉంది. కాని రూబేను తన తండ్రి భార్యలలో ఒకదానితో శయనించిన కారణంగా, ఆ ప్రత్యేక ఆధిక్యతలు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడ్డాయి. కావున వారి వంశావళిలో రూబేను పేరు జన్మలో మొదటివాడుగా పేర్కొనబడలేదు. వారి అన్నదమ్ములలో యూదా మిక్కిలి బలపరాక్రమాలు గలవాడు. అందువల్ల నాయకులంతా అతని కుటుంబంలో నుంచే వచ్చారు. కాని యోసేపు కుటుంబానికి జ్యేష్ఠ పుత్రునికి లభించే ప్రత్యేక ఆదరణ, ఆధిపత్యాలు లభించాయి. రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ అనేవారు.
1CH 5:4 యోవేలు సంతతి ఈ విధంగా వుంది: షెమయా అనేవాడు యోవేలు కుమారుడు. షెమయా కుమారుడు గోగు. గోగు కుమారుడు షిమీ.
1CH 5:5 షిమీ కుమారుడు మీకా. మీకా కుమారుడు రెవాయా. రెవాయా కుమారుడు బేలు.
1CH 5:6 బేలు కుమారుడు బెయేర. అష్షూరు (అస్సీరియా) రాజైన తిగ్లత్పిలేసెరు బెయేరను ఇల్లు వెడలగొట్టాడు. దానితో బెయేర అష్షూరు రాజుకు బందీ అయ్యాడు. రూబేను వంశానికి బెయేర పెద్ద.
1CH 5:7 యోవేలు సోదరుల పేర్లు, అతని వంశావళి వారి వంశ చరిత్రలో పొందుపర్చబడినట్లే క్రమ పద్ధతిలో సరిగ్గా వ్రాయబడినాయి. అవి ఏవనగా: యెహీయేలు మొదటివాడు. తరువాత జెకర్యా మరియు
1CH 5:8 బెల. బెల తండ్రి పేరు ఆజాజు. ఆజాజు తండ్రి షెమ. షెమ తండ్రి పేరు యోవేలు. వారంతా అరోయేరు నుండి నెబో వరకు, బయల్మెయోను వరకు గల ప్రాంతంలో నివసించారు.
1CH 5:9 బెల వంశీయులు తూర్పు దిశన యూఫ్రటీసు నది ఒడ్డున అడవి అంచువరకుగల ప్రాంతంలో నివసించారు. గిలాదులో వారికి లెక్కలేనన్ని ఆవుల మందలు వున్నందున వారక్కడ నివసించసాగారు.
1CH 5:10 సౌలు రాజుగా ఉన్న కాలంలో బెల వంశీయులు హగ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. తరువాత వారు హగ్రీయులకు చెందిన గుడారాలను ఆక్రమించి వాటిలో నివసించారు. గిలాదుకు తూర్పు ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయుల గుడారాలలో వారునివసించసాగారు.
1CH 5:11 గాదు వంశం వారు రూబేనీయులకు సమీపంలోనే నివసించారు. గాదీయులు బాషాను ప్రాంతంలోను, సల్కా వరకు గల ప్రదేశంలోను నివసించారు.
1CH 5:12 బాషానులో యోవేలు మొదటి నాయకుడు (పెద్ద). షాపాము రెండవ నాయకుడు. పిమ్మట యహనైషాపాత్ ముఖ్యుడయ్యాడు.
1CH 5:13 వారి కుటుంబాలలో ఏడుగురు అన్నదమ్ములు. వారు మిఖాయేలు, మెషుల్లాము, షేబ, యోరై, యకాను, జీయ మరియు ఏబెరు.
1CH 5:14 వీరు అబీహాయిలు సంతతివారు. అబీహాయిలు అనేవాడు హూరీ కుమారుడు. హూరీ తండ్రి పేరు యారోయ. యారోయ తండ్రి గిలాదు. గిలాదు తండ్రి మిఖాయేలు. మిఖాయేలు తండ్రి యెషీషై, యెషీషై తండ్రి యహదో. యహదో తండ్రి బూజు.
1CH 5:15 అహీ అనువాడు అబ్దీయేలు కుమారుడు. అబ్దీయేలు తండ్రి పేరు గూనీ. అహీ వారి వంశ పెద్ద.
1CH 5:16 గాదీయులు గిలాదు ప్రాంతంలో నివసించారు. వారు బాషానులోను, దాని చుట్టుపట్ల గ్రామాలలోను, షారోను సరిహద్దు వరకు గల పొలాలలోను కూడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
1CH 5:17 యోతాము, యరోబాముల కాలంలో ఈ ప్రజల పేర్లన్నీ గాదు వంశ చరిత్రలో వ్రాయబడినాయి. యోతాము యూదాకు రాజు. యరోబాము ఇశ్రాయేలు రాజు.
1CH 5:18 మనష్షే వంశంలో సగం మందిలోను, రూబేను, గాదు వంశాలలోను మొత్తం నలుబది నాలుగువేల ఏడు వందల అరవై మంది యుద్ధ వీరులున్నారు. వారు డాళ్లను, కత్తులను చేపట్టగలవారు. వారు బాణవిద్యలో నేర్పరులు. చాకచక్యంతో యుద్ధం చేయగలవారు.
1CH 5:19 వారు హగ్రీయులతోను, యేతూరు, నాపీషు, నోదాబు వారితోను యుద్ధం చేశారు.
1CH 5:20 మనష్షే వంశం వారు, రూబేను, గాదు వంశాల ప్రజలు యుద్ధంలో దేవుని సహాయం అర్థించి ప్రార్థన చేశారు. వారు దేవునియందు విశ్వాసమున్న వారు గనుక తమకు సహాయపడమని దేవుని అర్థించారు. కావున దేవుడు వారి ప్రార్థన ఆలకించి సహాయపడ్డాడు. హగ్రీయులను యుద్ధంలో ఓడించటానికి దేవుడు వారికి సహాయం చేసాడు. హగ్రీయులతో వున్న ఇతరులను కూడ వారు ఓడించారు.
1CH 5:21 హగ్రీయులకు చెందిన పశు సంపదనంతా వారు వశపర్చుకున్నారు. వారు ఏబై వేల ఒంటెలను, రెండు లక్షల ఏబైవేల గొర్రెలను, రెండువేల గాడిదలను, మరియు ఒక లక్ష మంది మనుష్యులను పట్టుకున్నారు.
1CH 5:22 యద్ధంలో రూబేనీయులకు దేవుని సహాయం ఉన్న కారణంగా హగ్రీయులలో చాలామంది చనిపోయారు. అప్పుడు మనష్షే, రూబేను, గాదు వంశీయులు హగ్రీయుల రాజ్యంలో నివసించసాగారు. వారక్కడ బబులోను (బాబిలోనియా) సైన్యం ఇశ్రాయేలు ప్రజలను బందీలుగా బబలోనుకు పట్టుకుపోయే సమయం వరకు నివసించారు.
1CH 5:23 మనష్షే వంశం వారిలో సగంమంది బాషాను ప్రాంతంలో బెల్‌హెర్మోను వరకు, శెనీరు, హెర్మోను పర్వతం వరకు నివసించారు. వారి ప్రజలు అధిక సంఖ్యలో విస్తరించారు.
1CH 5:24 మనష్షే కుటుంబంలో ఒక సగంమంది కుటుంబ పెద్దలు ఎవరనగా ఏషెరు, ఇషీ, ఎలీయేలు, అజీ్రయేలు, యిర్మీయా, హోదవ్యా మరియు యహదీయేలు. వీరంతా బలపరాక్రమ సంపన్నులు, ప్రసిద్ధి గాంచిన వ్యక్తులు. వారి వారి కుటుంబాలకు వారు పెద్దలు.
1CH 5:25 కాని, వారి పూర్వీకులు ఆరాధించిన దేవుని పట్ల వారు పాపం చేశారు. వారు స్థిరపడినచోట వున్న విగ్రహాలనే వారు ఆరాధించటం మొదలు పెట్టారు. అటువంటి వాళ్లను దేవుడు నాశనము చేసియుండెను.
1CH 5:26 ఇశ్రాయేలు దేవుడు పూలును యుద్ధానికి పురిగొల్పాడు. పూలు అష్షూరు (అస్సీరియా) రాజు. అతనినే తిగ్లత్పిలేసెరు అని కూడ పిలుస్తారు. అతడు మనష్షే, రూబేను, గాదు వంశీయులతో యుద్ధం చేసాడు. వారిని తమ ఇండ్లు వదిలి వేసేలా బలవంతం చేసి బందీలుగా పట్టుకున్నాడు. తరువాత వారిని హాలహు, హాబోరు, హారా పట్టణాలకు, గోజాను నదీ తీరానికి తీసుకొని వెళ్లాడు. అప్పటినుండి ఈనాటికీ ఆ ఇశ్రాయేలీయుల కుటుంబాల వారు అక్కడ నివసిస్తున్నారు.
1CH 6:1 గెర్షోను, కహాతు, మెరారి అనేవారు లేవీ కుమారులు.
1CH 6:2 కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
1CH 6:3 అమ్రాముకు అహరోను, మోషే అనే ఇరువురు కుమారులు, మిర్యాము అనే కుమార్తె ఉన్నారు. అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనేవారు కుమారులు.
1CH 6:4 ఎలియాజరు అనువాడు ఫీనెహాసుకు తండ్రి. ఫీనెహాసు కుమారుడు అబీషువ.
1CH 6:5 అబీషువ కుమారుడు బుక్కీ. బుక్కీ కుమారుడు ఉజ్జీ.
1CH 6:6 ఉజ్జీ కుమారుడు జెరహ్యా. జెరహ్యా కుమారుడు మెరాయోతు.
1CH 6:7 మెరాయోతు కుమారుడు అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు.
1CH 6:8 అహీటూబు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అహిమయస్సు.
1CH 6:9 అహిమయస్సు కుమారుడు అజర్యా. అజర్యా కుమారుడు యోహానాను.
1CH 6:10 యోహానాను కుమారుడు అజర్యా. (యెరూషలేములో సొలొమోను కట్టించిన దేవాలయంలో యాజకునిగా పనిచేసిన వ్యక్తే ఈ అజర్యా).
1CH 6:11 అజర్యా కుమారుడు అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు.
1CH 6:12 అహీటూబు కుమారడు సాదోకు. సాదోకు కుమారుడు షల్లూము.
1CH 6:13 షల్లూము కుమారుడు హిల్కీయా. హిల్కీయా కుమారుడు అజర్యా.
1CH 6:14 అజర్యా కుమారుడు శెరాయా. శెరాయా కుమారుడు యెహోజాదాకు.
1CH 6:15 యెహోవా యూదా వారిని, యెరూషలేము వారిని బయటకు పంపివేసినప్పుడు యెహోజాదాకు కూడ గత్యంతరం లేక వారితో ఇల్లు వదలి పోవలసి వచ్చింది. ఆ ప్రజలు ఒక కొత్త రాజ్యంలో బందీలయ్యారు. యూదా వారిని, యెరూషలేము వారిని బందీలు చేయటానికి యెహోవా నెబకద్నెజరును వినియోగించాడు.
1CH 6:16 లేవీ కుమారులు గెర్షోను, కహాతు, మెరారి అనేవారు.
1CH 6:17 గెర్షోను కుమారులు లిబ్నీ మరియు షిమీ.
1CH 6:18 కహాతుకుమారులు అమ్రాము, ఇస్హారు, మెబ్రోను మరియు ఉజ్జీయేలు.
1CH 6:19 మెరారి కుమారులు మహలి, మూషి. లేవి వంశంలోగల కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయి. మొదట వారి తండ్రి పేరుతో జాబితా వ్రాయబడింది.
1CH 6:20 గెర్షోను సంతతివారు గెర్షోను కుమారుడు లిబ్నీ. లిబ్నీ కుమారుడు యహతు. యహతు కుమారుడు జిమ్మా.
1CH 6:21 జిమ్మా కుమారుడు యోవాహు. యోవాహు కుమారుడు ఇద్దో. ఇద్దో కుమారుడు జెరహు. జెరహు కుమారుడు యెయతిరయి.
1CH 6:22 కహతు సంతతి వారు ఎవరనగా కహతు కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు కోరహు. కోరహు కుమారుడు అస్సీరు.
1CH 6:23 అస్సీరు కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు. ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు.
1CH 6:24 అస్సీరు కుమారుడు తాహతు. తాహతు కుమారుడు ఊరియేలు. ఊరియేలు కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు షావూలు.
1CH 6:25 ఎల్కానా కుమారులు అమాశై, అహీమోతు.
1CH 6:26 ఎల్కానా మరో కుమారుడు జోఫై. జోఫై కుమారుడు నహతు.
1CH 6:27 నహతు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారుడు యెరోహాము. యెరోహాము కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు సమూయేలు.
1CH 6:28 సమూయేలు కుమారులలో పెద్దవాడు యోవేలు. రెండవవాడు అబీయా.
1CH 6:29 మెరారి సంతానం వివరాలు ఏవనగా: మెరారి కుమారుడు మహలి. మహలి కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు షిమీ. షిమీ కుమారుడు ఉజ్జా.
1CH 6:30 ఉజ్జా కుమారుడు షిమ్యా. షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.
1CH 6:31 యెహోవా ఒడంబడిక పెట్టె ఆలయంలో ఉంచిన తరువాత దావీదు కొందరు సంగీత విద్వాంసులను నియమించాడు.
1CH 6:32 వీరు పవిత్ర గుడారంలో దేవునికి స్తుతి గీతాలు ఆలపించేవారు. పవిత్ర గుడారమే సమావేశ గుడారమని పిలవబడేది. సొలొమోను యెరూషలేములో యెహోవాకు ఆలయాన్ని నిర్మించేవరకు ఈ గాయకులు సంగీత సేవ చేసారు. వారికి నిర్దేశించిన నియమావళిని వారు అనుసరించి పని చేసారు.
1CH 6:33 సంగీత సేవ చేసిన వారు, వారి కుమారుల పేర్ల వివరాలు ఇలా వున్నాయి: కహతీయుల సంతతి వారు: హేమాను గాయకుడు. హేమాను తండ్రి పేరు యోవేలు. యోవేలు తండ్రి పేరు సమూయేలు.
1CH 6:34 సమూయేలు తండ్రి ఎల్కానా. ఎల్కానా తండ్రి యెరోహాము. యెరోహాము తండ్రి ఏలీయేలు. ఏలీయేలు తండ్రి తోయహు.
1CH 6:35 తోయహు తండ్రి సూపు. సూపు తండ్రి ఎల్కానా. ఎల్కానా తండ్రి మహతు. మహతు తండ్రి అమాశై.
1CH 6:36 అమాశై తండ్రి ఎల్కానా. ఎల్కానా తండ్రి యోవేలు. యోవేలు తండ్రి అజర్యా. అజర్యా తండ్రి జెఫన్యా.
1CH 6:37 జెఫన్యా తండ్రి తాహతు. తాహతు తండ్రి అస్సీరు. అస్సీరు తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు.
1CH 6:38 కోరహు తండ్రి ఇస్హారు. ఇస్హారు తండ్రి కహాతు. కహాతు తండ్రి లేవి. లేవి తండ్రి ఇశ్రాయేలు.
1CH 6:39 హేమాను బంధువు ఆసాపు. హేమాను ఆసాపు కుడి పక్కన నిలబడేవాడు. ఆసాపు తండ్రి పేరు బెరక్యా. బెరక్యా తండ్రి షిమ్యా.
1CH 6:40 షిమ్యా తండ్రి మిఖాయేలు. మిఖాయేలు తండ్రి బయశేయా. బయశేయా తండ్రి మల్కీయా.
1CH 6:41 మల్కీయా తండ్రి యెత్నీ. యెత్నీ తండ్రి జెరహు. జెరహు తండ్రి అదాయా.
1CH 6:42 అదాయా తండ్రి ఏతాను. ఏతాను తండ్రి జిమ్మా. జిమ్మా తండ్రి షిమీ.
1CH 6:43 షిమీ తండ్రి యహతు. యహతు తండ్రి గెర్షోను. గెర్షోను తండ్రి లేవి.
1CH 6:44 మెరారి సంతతి వారు హేమానుకు, ఆసాపుకు బంధువులు. వారు హేమానుకు ఎడమ పక్కన నిలబడి స్తోత్రగీతాలు పాడేవారు. ఏతాను తండ్రి పేరు కీషీ. కీషీ తండ్రి అబ్దీ. అబ్దీ తండ్రి మల్లూకు.
1CH 6:45 మల్లూకు తండ్రి హషబ్యా. హషబ్యా తండ్రి అమజ్యా. అమజ్యా తండ్రి హిల్కీయా.
1CH 6:46 హిల్కీయా తండ్రి అమ్జీ. అమ్జీ తండ్రి బానీ. బానీ తండ్రి షమెరు.
1CH 6:47 షమెరు తండ్రి మహలి. మహలి తండ్రి మూషి. మూషి తండ్రి మెరారి. మెరారి తండ్రి లేవి.
1CH 6:48 హేమాను, ఆసాపుల సోదరులు లేవి వంశంలోని వారే. లేవి సంతతినంతా లేవీయులని పిలుస్తారు. లేవీయులు యెహోవా పవిత్ర గుడారంలో సేవా కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వారు. పవిత్ర గుడారమనగా దేవుని ఇల్లు.
1CH 6:49 కాని అహరోను, అతని సంతతి వారు మాత్రమే బలిపీఠంపై దహనబలులు అర్పించేందుకు అనుమతించబడ్డారు. వారికి ధూపపీఠం మీద ధూపంవేసే హక్కు కూడ వుంది. ఆలయపు అతిపరిశుద్ధ స్థలంలోని పనంతా వారే చేసేవారు. ఇశ్రాయేలు పాపపరిహారార్థం, ప్రజల పాపాలకు విచార సూచకంగా వారు ఆలయంలో ప్రాయశ్చిత్త కార్యాలు నిర్వహించేవారు. మోషే నిర్దేశించిన నియమాలను, నిబంధనలను వారు తప్పక పాటించేవారు. మోషే దేవుని సేవకుడు.
1CH 6:50 అహరోను కుమారులు ఎవరనగా: అహరోను కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు. ఫీనెహాసు కుమారుడు అబీషూవ.
1CH 6:51 అబీషూవ కుమారుడు బుక్కీ. బుక్కీ కుమారుడు ఉజ్జీ. ఉజ్జీ కుమారుడు జెరహ్య.
1CH 6:52 జెరహ్య కుమారుడు మెరాయోతు. మెరాయోతు కుమారుడు అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు.
1CH 6:53 అహీటూబు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అహిమయస్సు.
1CH 6:54 అహరోను సంతతి వారు నివసించిన ప్రదేశాలు: వారికివ్వబడిన భూములలో స్థావరాలు ఏర్పరచుకొని వారు నివసించారు. లేవీయులకియ్యబడిన భూముల్లో కహాతీయులకు మొదటి భాగం ఇవ్వబడింది.
1CH 6:55 వారికి హెబ్రోను పట్టణం, దాని చుట్టు పక్కల భూములు ఇవ్వబడ్డాయి. ఇది యూదా దేశంలో వుంది.
1CH 6:56 కాని పట్టణానికి దూరంగావున్న భూములు, హెబ్రోను పట్టణానికి దగ్గరలో వున్న గ్రామాలు కాలేబుకు ఇవ్వబడ్డాయి. కాలేబు తండ్రి పేరు యెపున్నె.
1CH 6:57 అహరోను సంతతివారికి హెబ్రోను నగరం ఇవ్వబడింది. హెబ్రోను ఆశ్రయపురం వారికింకా లిబ్నా, యత్తీరు, ఎష్టెమో,
1CH 6:58 హీలేను, దెబీరు,
1CH 6:59 ఆషాను, యుట్ట, బేత్షెమెషు నగరాలు కూడ ఇవ్వబడ్డాయి. ఈ నగరాలతో పాటు వాటి సమీపంలోని పచ్చిక బయళ్ళు కూడ వారికియ్యబడ్డాయి.
1CH 6:60 బెన్యామీను సంతతి వారికి గిబియోను, గెబ, అల్లెమెతు, అనాతోతు నగరాలు ఇవ్వబడ్డాయి. ఈ నగరాలతో పాటు ఆ ప్రాంతాలలోని పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి. పదమూడు నగరాలు కహాతీయుల కుటుంబాల వారికియ్యబడ్డాయి.
1CH 6:61 కహాతు సంతతి వారైన వంశాల వారికి మనష్షే వంశం వారి సగంమందికి పది పట్టణాలు ఇవ్వబడ్డాయి.
1CH 6:62 గెర్షోను సంతతి వారైన వంశాల వారికి పదమూడు నగరాలు ఇవ్వబడ్డాయి. వారికి ఈ నగరాలు ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషాను ప్రాంతాలలో నివసించే కొందరికి మనష్షే వారినుండి సంక్రమించాయి.
1CH 6:63 మెరారీ సంతతి వారైన వంశాల వారికి పన్నెండు నగరాలు వచ్చాయి. వారికి ఈ నగరాలు రూబేను, గాదు, జెబూలూను కుటుంబాల వారినుండి వచ్చాయి. వారికి ఆ నగరాలు చీట్లువేసి ఇచ్చారు.
1CH 6:64 ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ నగరాలను, పొలాలను లేవీయులకు ఇచ్చారు.
1CH 6:65 పైన పేర్కొనబడిన ఆ నగరాలన్నీ చీట్లువేసి యూదా, షిమ్యోను, బెన్యామీను కుటుంబాల వారినుండి తీసుకొనబడి వారికియ్యబడ్డాయి.
1CH 6:66 ఎఫ్రాయిము వంశం వారు కూడ కొందరు కహాతీయుల కుటుంబాల వారికి కొన్ని పట్టణాలను ఇచ్చారు. ఈ పట్టణాలను కూడ చీట్లువేసి ఇచ్చారు.
1CH 6:67 వారికి షెకెము నగరం ఇవ్వబడింది. షెకెము కూడ ఒక రక్షణ (ఆశ్రయ) నగరం. వారికి ఇంకను గెజెరు,
1CH 6:68 యొక్మెయాము, బేత్‌హోరోను,
1CH 6:69 అయ్యాలోను, మరియు గత్రిమ్మోను పట్టణాలు కూడ ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలతో పాటు వారికి పొలాలు కూడ ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలు ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో వున్నాయి.
1CH 6:70 సగం మనష్షే గోత్రం వారి నుండి ఆనేరు, బిలియాము పట్టణాలను ఇశ్రాయేలు వారు తీసుకొని కహాతీయులకు ఇచ్చారు. పట్టణాలతో పాటు కహాతీయులకు పొలాలు కూడ ఇవ్వబడ్డాయి.
1CH 6:71 గెర్షోను ప్రజలకు బాషాను ప్రాంతంలోని గోలాను పట్టణం, మనష్షే సగం వంశం వారి నుండి అష్తారోతు పట్టణం ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలకు దగ్గరలో వున్న పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి.
1CH 6:72 గెర్షోను కుటుంబాల వారికి ఇశ్శాఖారు వంశం నుంచి కెదెషు, దాబెరతు, రామోతు మరియు ఆనేము అను పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల సమీపంలో గల భూములు కూడ వారికివ్వబడ్డాయి.
1CH 6:74 గెర్షోను ప్రజలకు ఆషేరు వంశం నుండి మాషాలు, అబ్దోను, హుక్కోకు మరియు రెహాబు పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల పరిసరాలలోగల భూములు కూడ వారికివ్వబడ్డాయి.
1CH 6:76 గెర్షోను వారు నఫ్తాలి వంశం నుండి గలిలయలోని కెదెషు, హమ్మోను మరియు కిర్యతాయిము పట్టణాలను పొందారు. ఆ పట్టణాలతో పాటు సమీప పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి.
1CH 6:77 మిగిలిన లేవీయులైన మెరారీయులకు జెబూలూను వంశం నుండి యొక్నెయాము, కర్తా, రిమ్మోను మరియు తాబోరు పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల దగ్గరలో గల భూములు కూడ వారికి ఇవ్వబడ్డాయి.
1CH 6:78 మెరారీయులు రూబేను వంశం నుండి అరణ్య ప్రాంతంలోని బేసెరు, యహజా, కెదేమోతు మరియు మేఫాతు పట్టణాలను పొందారు. రూబేను వంశస్థులు యొర్దాను నదికి తూర్పున, యెరికో నగరానికి తూర్పున నివసించారు. మెరారీయులకు పట్టణాలతో పాటు పరిసర భూములు కూడ ఇవ్వబడ్డాయి.
1CH 6:80 మెరారీయులు ఇంకను గాదు వంశం నుండి గిలాదు నందలి రామోతు, మహనయీము, హెష్బోను మరియు యాజెరు పట్టణాలను పొందారు. వారికి పట్టణాలతో పాటు సమీప పొలాలు కూడ ఇవ్వబడ్డాయి.
1CH 7:1 ఇశ్శాఖారుకు నలుగురు కుమారులు. తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను అని వారి పేర్లు.
1CH 7:2 తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, యిబ్శాము, షెమూయేలు అనేవారు. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారు, వారి సంతతివారు వీర సైనికులు. దావీదు రాజుగా ఉన్న కాలంలో వీరి సంఖ్య ఇరవై రెండువేల ఆరువందలు.
1CH 7:3 ఉజ్జా కుమారుడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షీయా అనేవారు. వీరైదుగురు కుటుంబ పెద్దలు.
1CH 7:4 వారి వంశ చరిత్ర పరిశీలిస్తే వారిలో ముప్పది ఆరువేల మంది యుద్ధ సన్నద్ధులైన సైనికులున్నట్లు తెలుస్తుంది. వారికి బహు భార్యలు వున్నందువల్ల వారికి సంతానం ఎక్కువై కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయి.
1CH 7:5 ఇశ్శాఖారు వంశంలో ఎనభై ఏడువేల మంది బలిష్టులైన సైనికులున్నట్లు వారి వంశ చరిత్ర తెలియజేస్తుంది.
1CH 7:6 బెన్యామీనుకు ముగ్గురు కుమారులు. బెల, బేకరు, యెదీయవేలు అని వారి పేర్లు.
1CH 7:7 బెలకు ఐదుగురు కుమారులు. ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు మరియు ఈరీ అని వారి పేర్లు. వారి కుటుంబాలకు వారు పెద్దలు. వారిలో ఇరవై రెండువేల రెండువందల మంది సైనికులున్నట్లు వారివంశ చరిత్ర తెలుపుతుంది.
1CH 7:8 బేకరు కుమారులు జెమీరా, యోవాషు, ఎలీయేజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోత, అబీయా, అనాతోతు, ఆలెమెతు అనేవారు. ఇది బేకరు సంతానం.
1CH 7:9 వీరి వంశ చరిత్ర వారి పెద్దలను విశదపరుస్తుంది. వారిలో ఇరవైవేల రెండు వందల మంది సైనికులున్నట్లు వారి చరిత్ర తెలియజేస్తుంది.
1CH 7:10 యెదీయవేలు కుమారుడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయానా, జేతాను, తర్షీషు, అహీషహరు అనువారు.
1CH 7:11 యెదీయవేలు కుమారులంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారిలో పదిహేడువేల రెండువందల మంది యుద్ధవీరులున్నారు.
1CH 7:12 షుప్పీయులు, హుప్పీయులు అనేవారు ఈరు సంతతివారు. అహేరు కుమారుని పేరు హుషీము.
1CH 7:13 నఫ్తాలి కుమారులు యహసయేలు, గూనీ, యేసెరు, షిల్లేము అనేవారు. వీరందరూ బిల్హా సంతతిగా ఎంచబడిరి.
1CH 7:14 మనష్షే సంతతివారు ఎవరనగా: మనష్షే కుమారుని పేరు అశ్రీయేలు. మనష్షే దాసియగు అరాము (సిరియా) దేశపు స్త్రీకి అశ్రీయేలు జన్మించాడు. ఆమెకు మాకీరు అనే మరొక కుమారుడు కలిగాడు. మాకీరు కుమారుడు గిలాదు.
1CH 7:15 హుప్పీయుల, షుప్పీయుల నుండి ఒక స్త్రీని మాకీరు వివాహం చేసుకొన్నాడు. ఆమె పేరు మయకా. మాకీరు సోదరి పేరు కూడ మయకా. ఈ సోదరి మయకాకుసెలో పెహాదు అని మరో పేరు వుంది. సెలోపెహాదుకు అందరూ కుమార్తెలే.
1CH 7:16 మాకీరు భార్య మయకా ఒక కుమారుని కన్నది. మయకా ఈ కుమారునికి పెరెషు అని పేరు పెట్టింది. పెరెషు సోదరుని పేరు షెరెషు. షెరెషు కుమారుల పేర్లు ఊలాము, రాకెము.
1CH 7:17 ఊలాము కుమారుని పేరు బెదాను. గిలాదు సంతతి వారెవరనగా: గిలాదు తండ్రి పేరు మాకీరు. మాకీరు తండ్రి పేరు మనష్షే.
1CH 7:18 మాకీరు సోదరియగు హమ్మోలెకెతునకు ఇషోదు, అబీయెజెరు, మహలా అనేవారు జన్మించారు.
1CH 7:19 షెమీదా కుమారుల పేర్లు అహోయాను, షెకెము, లికీ, అనీయాము.
1CH 7:20 ఎఫ్రాయిము సంతతివారి పేర్లు ఏవనగా: ఎఫ్రాయిము కుమారుని పేరు షూతలహు. షూతలహు కుమారుడు బెరెదు. బెరెదు కుమారుడు తాహతు. తాహతు కుమారుడు ఎలాదా.
1CH 7:21 ఎలాదా కుమారుడు తాహతు. తాహతు కుమారుడు జాబాదు. జాబాదు కుమారుడు షూతలహు. గాతు నగర నివాసులు కొందరు ఏజెరెను, ఎల్యాదును చంపివేసారు. ఏజెరు, ఎల్యాదులిద్దరూ గాతు ప్రజల ఆవులను, గొర్రెలను దొంగిలించటానికి వెళ్లిన కారణంగా వారిని ప్రజలు చంపివేసారు.
1CH 7:22 ఎజెరు, ఎల్యాదు లిరువురూ ఎఫ్రాయిము కుమారులే. ఏజెరు, ఎల్యాదు చనిపోయినందుకు ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. ఎఫ్రాయిము బంధువులంతా వచ్చి అతనిని ఓదార్చారు.
1CH 7:23 పిమ్మట ఎఫ్రాయిము తన భార్యతో కలియగా ఆమె గర్భవతి అయ్యింది. ఆమె ఒక కుమారుని కన్నది. ఎఫ్రాయిము అతనికి బెరీయా అని పేరు పెట్టాడు. ఎందువల్లననగా అతని కుటుంబానికి అప్పుడు కొంత కీడు జరిగింది.
1CH 7:24 ఎఫ్రాయిము కుమార్తె పేరు షెయెరా. షెయెరా దిగువ బేత్‌హోరోను, ఎగువ బేత్‌హోరోను, దిగువ ఉజ్జెన్‌షెయెరా, ఎగువ ఉజ్జెన్‌షెయెరా అనే పట్టణాలను కట్టించింది.
1CH 7:25 ఎఫ్రాయిము కుమారుని పేరు రెపహు. రెపహు కుమారుని పేరు రెషెపు. రెషెపు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను.
1CH 7:26 తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా.
1CH 7:27 ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ.
1CH 7:28 ఎఫ్రాయిము సంతతి వారు నివసించిన నగరాలు, ప్రదేశాలు ఏవనగా: బేతేలు, దాని పరిసర గ్రామాలు; తూర్పున నహరాను, పడమట గెజెరు, దాని సమీప గ్రామాలు; షెకెము, దాని పరిసర గ్రామాలు మరియు అయ్యా వరకుగల గ్రామాలు.
1CH 7:29 మనష్షే రాజ్య సరిహద్దుల్లో బేత్షెయాను, తానాకు, మెగిద్దో, దోరు పట్టణాలు మరియు వాటి పరిసర గ్రామాలు వున్నాయి. ఈ పట్టణాలలో యోసేపు సంతతి వారు నివసించారు. యోసేపు తండ్రి పేరు ఇశ్రాయేలు.
1CH 7:30 ఆషేరు కుమారులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బేరీయా అనువారు. వారి సోదరి పేరు శెరహు.
1CH 7:31 బెరీయా కుమారులు హెబెరు మరియు మల్కీయేలు. మల్కీయేలు కుమారుడు బిర్జాయీతు.
1CH 7:32 హెబెరు కుమారులు యప్లేటు, షోమేరు, హోతాము అనువారు. షూయా వారి సహోదరి.
1CH 7:33 యప్లేటు కుమారులు పాసకు, బింహాలు, అష్వాతు అనేవారు. వీరంతా యప్లేటు సంతానం.
1CH 7:34 షోమేరు కుమారులు అహీ, రోగా, యెహుబ్బా, అరాము.
1CH 7:35 షోమేరు సోదరుని పేరు హేలెము. హేలెము కుమారులు జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు.
1CH 7:36 జోపహు కుమారులు సూయ, హర్నెపెరు, షూయాలు, బేరీ, ఇమ్రా,
1CH 7:37 బేసెరు, హాదు, షమ్మా, షిల్హా, ఇత్రాను, బెయేర.
1CH 7:38 ఎతెరు కుమారులు యెపున్నె, పిస్పా, అరా.
1CH 7:39 ఉల్లాము కుమారులు ఆరహు, హన్నియేలు, రిజెయా.
1CH 7:40 వీరంతా ఆషేరు సంతతివారు. వారివారి కుటుంబాలకు వారు పెద్దలు. వారు పేరుగాంచిన వ్యక్తులు, యుద్ధవీరులు, మహా నాయకులు. వారి వంశచరిత్ర ప్రకారం వారిలో యుద్ధానికి పనికివచ్చే ఇరవై ఆరువేల మంది సైనికులున్నారు.
1CH 8:1 బెన్యామీను పెద్ద కుమారుని పేరు బెల. బెన్యామీను రెండవ కుమారుని పేరు అష్బేలు. అతని మూడవ కుమారుడు అహరహు.
1CH 8:2 బెన్యామీను నాల్గవ కుమారుడు నోహా. అయిదవవాడు రాపా.
1CH 8:3 బెల కుమారులు అద్దారు, గెరా, అబీహూదు, అబీషూవ, నయమాను, అహోయాహు, గెరా, షెపూపాను, హూరాము అనువారు.
1CH 8:6 ఏహూదు సంతతి వారు గెబలో వారి వారి కుటుంబాలకు పెద్దలు. వారు బలవంతంగా ఇండ్లు విడిచి మనహతుకు పోయేలా చేయబడ్డారు. ఏహూదు సంతతి వారు నయమాను, అహీయా, గెరా అనేవారు. గెరా వారిని బలవంతంగా ఇండ్లు వదిలిపోయేలా చేసాడు. గెరా కుమారులు ఉజ్జా, అహీహూదు.
1CH 8:8 మోయాబు దేశంలో షహరయీము తన భార్యలగు హూషీము, బయరాలకు విడాకులిచ్చాడు. ఇది జరిగిన పిమ్మట మరో భార్య ద్వారా అతనికి పిల్లలు కలిగారు.
1CH 8:9 షహరయీముకు యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము, యోవూజును, షాక్యా, మిర్మా అనే కుమారులు తన భార్యయగు హోదెషు వలన కలిగారు. వారంతా షహరయీము సంతానం. వారు కుటుంబ పెద్దలయ్యారు.
1CH 8:11 షహరయీముకు హూషీము వల్ల అహీటూబు, ఎల్పయలు అనేవారు పుట్టారు.
1CH 8:12 ఎల్పయల కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు, బెరీయా, షెమ అనువారు. ఓనో పట్టణాన్ని, లోదును, దాని చుట్టూ వున్న గ్రామాలను షెమెదు నిర్మించాడు. బెరీయా, షెమ అనువారిద్దరూ అయ్యాలోనులో నివసించే వారి కుటుంబ పెద్దలు. వారు గాతులో నివసిస్తున్న వారిని వెళ్లగొట్టారు.
1CH 8:14 బెరీయా కుమారులు షాషకు, యెరేమోతు,
1CH 8:15 జెబద్యా, అరాదు, ఏదెరు,
1CH 8:16 మిఖాయేలు, ఇష్పా, యోహా అనేవారు.
1CH 8:17 ఎల్పయలు కుమారులు జెబద్యా, మెషుల్లాము, హిజికి, హెబెరు,
1CH 8:18 ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు అనేవారు.
1CH 8:19 షిమీ కుమారులు యాకీము, జిక్రీ, జబ్ది,
1CH 8:20 ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,
1CH 8:21 అదాయా, బెరాయా, షిమ్రాతు అనేవారు.
1CH 8:22 షాషకు కుమారులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,
1CH 8:23 అబ్దోను, జిఖ్రి, హానాను,
1CH 8:24 హనన్యా, ఏలాము, అంతోతీయా,
1CH 8:25 ఇపెదయా, పెనూయేలు అనేవారు.
1CH 8:26 యెరోహాము కుమారులు షంషెరై, షెహర్యా, అతల్యా,
1CH 8:27 యూరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ అనేవారు.
1CH 8:28 వీరంతా కుటుంబ పెద్దలు. వారు తమ వంశ చరిత్రలో నాయకులుగా పేర్కొనబడ్డారు. వారు యెరూషలేములో నివసించారు.
1CH 8:29 యెహీయేలు అనేవాడు గిబియోను తండ్రి. యెహీయేలు భార్య మయకా.
1CH 8:30 యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని ఇతర కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
1CH 8:31 గెదోరు, అహ్యో, జెకెరు, మరియు మిక్లోతు.
1CH 8:32 మిక్లోతు కుమారుని పేరు షిమ్యా. ఈ కుమారులు కూడ వారి బంధువులకు దగ్గరగనే యెరూషలేములో నివసించారు.
1CH 8:33 నేరు కుమారుడు కీషు. కీషు కుమారుడు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, మరియు ఎష్బయలు.
1CH 8:34 యోనాతాను కుమారుడు మెరీబ్బయలు. మెరీబ్బయలు కుమారుడు మీకా.
1CH 8:35 మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు అనేవారు.
1CH 8:36 ఆహాజు కుమారుడు యెహోయాదా. యెహోయాదా కుమారులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ అనేవారు. జిమ్రీ కుమారుడు మెజా.
1CH 8:37 మెజా కుమారుడు బిన్యా. బిన్యా కుమారుడు రాపా. రాపా కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు.
1CH 8:38 ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారి పేర్లు అజీక్రాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వీరంతా ఆజేలు కుమారులు.
1CH 8:39 ఆజేలు సోదరుని పేరు ఏషెకు. ఏషెకు కుటుంబీకులు, ఏషెకు కుమారులెవరనగా: ఏషెకు పెద్ద కుమారుడు ఊలాము, రెండవ కుమారుడు యెహూషు, మూడవ కుమారుడు ఎలీపేలెటు.
1CH 8:40 ఊలాము కుమారులు ధనుర్బాణాలు పట్టగల నేర్పరులు, బలమైన సైనికులు. వారికి చాలా మంది కుమారులు, మనుమలు ఉన్నారు. కొడుకులు, మనుమలు అంతా నూట ఏబది మంది ఉన్నారు. వీరంతా బెన్యామీను సంతతివారు.
1CH 9:1 ఇశ్రాయేలు ప్రజల పేర్లన్నీ వారి వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడ్డాయి. ఆ వంశ చరిత్రలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో చేర్చబడ్డాయి. యూదా ప్రజలు బందీలుగా పట్టుబడి బలవంతంగా బబలోనుకు తీసుకొని పోబడ్డారు. దేవునికి వారు విశ్వాసపాత్రులు కానందువల్ల వారికి అలా జరిగింది.
1CH 9:2 మొట్టమొదటి సారిగా తమ స్థలాలకు, పట్టణాలకు తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు ఉన్నారు.
1CH 9:3 యెరూషలేములో నివసించిన యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే వంశాల ప్రజలు ఎవరనగా:
1CH 9:4 అమీహూదు కుమారుడు ఊతై. అమీహూదు తండ్రి పేరు ఒమ్రీ. ఒమ్రీ తండ్రి పేరు ఇమ్రీ. ఇమ్రీ తండ్రి బానీ. పెరెసు సంతతి వాడు బానీ. యూదా కుమారుడు పెరెసు.
1CH 9:5 యెరూషలేములో నివసించిన షిలోనీయులెవరనగా: షిలోనీయులలో మొదటివాడైన ఆశాయా మరియు అతని కుమారులు.
1CH 9:6 యెరూషలేములో నివసించిన జెరహు వంశం వారిలో యెవుయేలు, అతని బంధువులు వున్నారు. వారంతా మొత్తం ఆరువందల తొంబదిమంది వున్నారు.
1CH 9:7 మెషుల్లాము కుమారుడు సల్లు; మెషుల్లాము తండ్రి హోదవ్యా; హోదవ్యా తండ్రి హసెనూయా అనేవారు యెరూషలేములో నివసించిన బెన్యామీను సంతతివారు.
1CH 9:8 యెహోరాము కుమారుడు ఇబ్నెయా. ఉజ్జీ కుమారుడు ఏలా. మిక్రి కుమారుడు ఉజ్జీ. షెఫట్యా కుమారుడు మెషుల్లాము. రగూవేలు కుమారుడు షెఫట్యా. ఇబ్నీయా కుమారుడు రగూవేలు.
1CH 9:9 యెరూషలేములో తొమ్మిది వందల ఏబదిఆరు మంది బెన్యామీనీయులు ఉన్నట్లు వారి వంశ చరిత్ర తెలుపుతుంది. వీరంతా ఆయా కుటుంబ పెద్దలు.
1CH 9:10 యెరూషలేములో నివసించిన యాజకులు ఎవరనగా: యెదాయా, యెహోయారీబు, యాకీను,
1CH 9:11 మరియు హిల్కీయా కుమారుడైన అజర్యా. మెషుల్లాము కుమారుడు హిల్కీయా. సాదోకు కుమారుడు మెషుల్లాము. మెరాయోతు కుమారుడు సాదోకు. అహీటూబు కుమారుడు మెరాయోతు. ఆలయ నిర్వహణలో అహీటూబు ముఖ్యమైన అధికారి.
1CH 9:12 యెరోహాము కుమారుడు అదాయా అనువాడొకడున్నాడు. యెరోహాము తండ్రి పేరు పసూరు. పసూరు తండ్రి పేరు మల్కీయా. అదీయేలు కుమారుడు మశై అను వాడొకడున్నాడు. అదీయేలు తండ్రి పేరు యహజేరా. యహజేరా తండ్రి పేరు మెషుల్లాము. మెషుల్లాము తండ్రి పేరు మెషిల్లేమీతు. మెషిల్లేమీతు తండ్రి పేరు ఇమ్మెరు.
1CH 9:13 యాజకులంతా మొత్తం పదిహేడు వందల అరవై మంది. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. ఆలయంలో పూజాది కార్యక్రమ నిర్వహణ బాధ్యత వారిదే.
1CH 9:14 యెరూషలేములో నివసించిన లేవీ గోత్రపు వారెవరనగా: హష్షూబు కుమారుడు షెమయా. హష్షూబు తండ్రి పేరు అజీక్రాము. అజీక్రాము తండ్రి పేరు హషబ్యా. హషబ్యా మెరారీ సంతతి వాడు.
1CH 9:15 బకబక్కరు, హెరెషు, గాలాలు మరియు మత్తన్యా కూడా యెరూషలేములో నివసించారు. మత్తన్యా తండ్రి పేరు మీకా. మీకా తండ్రి పేరు జిఖ్రీ. జిఖ్రీ తండ్రి ఆసాపు.
1CH 9:16 ఓబద్యా తండ్రి పేరు షెమయా. షెమయా తండ్రి గాలాలు. గాలాలు తండ్రి యెదూతూను, మరియు ఆసా కుమారుడు బెరక్యా. ఆసా తండ్రి పేరు ఎల్కానా. నెటోపాతీయులు నివసించిన గ్రామాలలోనే ఎల్కానా కూడ నివసించాడు.
1CH 9:17 యెరూషలేములో నివసించిన ద్వారపాలకులు ఎవరనగా: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను మరియు వారి బంధువులు. షల్లూము వారికి నాయకుడు.
1CH 9:18 తూర్పు దిశలో రాజు ప్రవేశించే దేవాలయ ద్వారం వద్ద వీరు నిలబడేవారు. వారు లేవి సంతతికి చెందిన ద్వారపాలకులు.
1CH 9:19 షల్లూము తండ్రి పేరు కోరే. కోరే తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు. షల్లూము, అతని సోదరులు ద్వారపాలకులే. వారు కోరహు వంశం వారు. పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాయటం వారిపని. వారి పూర్వీకులు చేసిన విధంగానే వీరుకూడ ఆ పని నిర్వర్తించారు. వారి పూర్వీకులు పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాస్తూ వుండేవారు.
1CH 9:20 గతంలో ద్వారపాలకుల అధిపతిగా ఫీనెహాసు వ్యవహరించాడు. ఫీనెహాసు తండ్రి పేరు ఎలియాజరు. ఫీనెహాసుకు యెహోవా కృప ఉంది.
1CH 9:21 పవిత్ర గుడారపు ద్వారానికి జెకర్యా కూడ కావలి ఉన్నాడు.
1CH 9:22 పవిత్ర గుడారం ద్వారపాలకులుగా మొత్తం రెండు వందల పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. వారి గ్రామాలలో వారి కుటుంబ చరిత్రలలో వారి పేర్లన్నీ వ్రాయబడినాయి. దావీదు, ప్రవక్తయగు సమూయేలు వారిని ఎంపికచేశారు. ఎందువల్లననగా వారు మిక్కిలి నమ్మకస్తులు.
1CH 9:23 యెహోవా నివాసమైన పవిత్ర గుడారపు ద్వారాలను కాపలా కాసే బాధ్యత ద్వార పాలకులది వారి సంతతి వారిదైయున్నది.
1CH 9:24 తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు నాలుగు పక్కలా ఉన్నాయి.
1CH 9:25 పరిసర గ్రామాలలో నివసించే ఈ ద్వారా పాలకుల బంధువులు అప్పుడప్పుడు వచ్చి వారికి సహాయపడేవారు. వచ్చినప్పుడల్లా వారు ద్వారపాలకులకు ఏడేసి రోజులు సహాయంగా ఉండేవారు.
1CH 9:26 ద్వారపాలకులందరి మీద నలుగురు ద్వార పాలకులు నాయకత్వం వహించేవారు. వారు లేవీయులు. దేవుని నివాసంలో అన్ని గదుల అజమాయిషీ, ధనాగారాల పరిరక్షణ గావించేవారు.
1CH 9:27 వారు రాత్రంతా దేవాలయాన్ని కాపలా కాసేవారు. పైగా ప్రతిరోజూ ఉదయం ఆలయం ద్వారం తెరచే పని కూడ వారిదే.
1CH 9:28 దేవాలయ ఆరాధనలో వాడే పనిముట్ల విషయమై శ్రద్ధ తీసుకొనే ద్వారపాలకులు కొందరున్నారు. ఆ వస్తుసామగ్రిని లోనికి తెచ్చినప్పుడు వారు లెక్కపెట్టేవారు. మళ్లీ వాటిని బయటకు తీసుకొని వెళ్లేటప్పుడు కూడ లెక్క పెట్టేవారు.
1CH 9:29 మరికొందరు ద్వారపాలకులు గర్భగుడిలో సామాన్లు, ఉపకరణాల విషయంలో శ్రద్ధ తీసుకోవటం కోసం ఎంపికచేయబడ్డారు. పిండి, ద్రాక్షారసం, నూనె, ధూపద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల సరఫరా విషయంలో కూడ వారు తగిన శ్రద్ధ తీసుకొనేవారు.
1CH 9:30 కాని సుగంధ ద్రవ్యాలను కలిపే పని మాత్రం యాజకులది.
1CH 9:31 నైవేద్యంగా వినియోగించే రొట్టె చేయటానికి మత్తిత్యా అనే లేవీయుడు నియమించబడ్డాడు. షల్లూము పెద్ద కుమారుడు మత్తిత్యా. షల్లూము అనే వాడు కోరహు సంతతివాడు.
1CH 9:32 విశ్రాంతి దినాన దైవ సన్నిధికి సమర్పించే నైవేద్యపు రొట్టె తయారు చేయటానికి కోరహు సంతతి ద్వార పాలకులలో కొందరు నియమించబడ్డారు.
1CH 9:33 లేవీయులలో దేవాలయ గాయకులుగా వున్న వారు, వారి కుటుంబ పెద్దలు దేవాలయపు గదులలో నివసించేవారు. వారు రాత్రింబవళ్లు దేవాలయ పనిలో నిమగ్నమై వుండుటచేత మరొక పని చేసేవారు కాదు.
1CH 9:34 ఈ లేవీయులంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడిన విధంగా వారంతా పెద్దలు. వారు యెరూషలేములో నివసించారు.
1CH 9:35 గిబియోను తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు గిబియోను పట్టణంలో నివసించాడు. యెహీయేలు భార్య పేరు మయకా.
1CH 9:36 యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని మిగిలిన కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
1CH 9:37 గెదోరు, అహ్యో, జెకర్యా మరియు మిక్లోతు.
1CH 9:38 మిక్లోతు కుమారుడు షిమ్యాను. యెహీయేలు కుటుంబం వారు యెరూషలేములో తమ బంధువుల వద్దనే నివసించారు.
1CH 9:39 నేరు కుమారుని పేరు కీషు. కీషు కుమారుని పేరు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు.
1CH 9:40 యోనాతాను కుమారుని పేరు మెరీబ్బయలు. మెరీబ్బయలు కుమారుడు మీకా.
1CH 9:41 మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ మరియు ఆహాజు.
1CH 9:42 ఆహాజు యెహోయద్దాకు తండ్రి. యెహోయద్దా కుమారుని పేరు యరా. యరా కుమారుల పేర్లు ఆలెమెతు, అజ్మావెతు మరియు జిమ్రీ. జిమ్రీ కుమారుడు మోజా,
1CH 9:43 మోజా కుమారుడు బిన్యా. బిన్యా కుమారుడు రెఫాయా. రెఫాయా కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు.
1CH 9:44 ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారు అజీక్రాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వారంతా ఆజేలు కుమారులు.
1CH 10:1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. అనేకమంది ఇశ్రాయేలు ప్రజలు గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు.
1CH 10:2 ఫిలిష్తీయులు సౌలును, అతని కుమారులను తరుముకుంటూ పోయి, వారిని పట్టుకుని చంపివేశారు. సౌలు కుమారులు యోనాతాను, అబీనాదాబు, మల్కీ షూవలను ఫిలిష్తీయులు చంపివేశారు.
1CH 10:3 సౌలు చుట్టూ యుద్ధం ముమ్మరంగా సాగింది. విలుకాండ్రు సౌలుపై బాణాలు వదిలి గాయపర్చారు.
1CH 10:4 అప్పుడు తన ఆయుధాలు మోసే వానితో సౌలు ఇలా చెప్పాడు: “నీ కత్తి దూసి నన్ను చంపివేయి. నీవలా చేస్తే ఆ పరదేశీయులు వచ్చి నన్ను హింసించి ఎగతాళి చేయరు.” కాని ఆయుధాలు మోసే సౌలు సేవకుడు భయపడ్డాడు. సౌలును చంపటానికి నిరాకరించాడు. అప్పుడు సౌలు తన కత్తినే ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కత్తి మొనపై అతను పడి తనను తాను చంపుకున్నాడు.
1CH 10:5 సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూసాడు. తర్వాత అతను కూడా తన కత్తి మొనపై పడి తనను తాను చంపుకున్నాడు.
1CH 10:6 ఆ విధంగా సౌలు, అతని ముగ్గురు కుమారులు మరణించారు. పైగా సౌలు కుటుంబం వారంతా కలిసి చనిపోయారు.
1CH 10:7 లోయలో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలంతా తమ సైన్యం పారిపోవటం చూసారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం ప్రజలు చూసారు. దానితో వారు కూడ భయపడి తమ పట్టణాలను వదలి పారిపోయారు. తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు వదిలిపోయిన పట్టణాలకు వచ్చి, అక్కడ నివసించసాగారు.
1CH 10:8 శవాలనుండి విలువైన వస్తువులను సేకరించటానికి ఫిలిష్తీయులు మరునాడు వచ్చారు. వారు గిల్బోవ పర్వతం మీద సౌలు శవాన్ని, అతని ముగ్గురు కుమారుల శవాలను చూసారు.
1CH 10:9 ఫిలిష్తీయులు సౌలు శరీరంమీద విలువైన వస్తువులను తీసుకొన్నారు. వారు సౌలు తలను, అతని ఆయుధాలను తీసుకొన్నారు. పిమ్మట వారు తమ దేశం నలుమూలలా ఉన్న బూటకపు దేవుళ్ల గుళ్లకు, ప్రజలకు ఈ వార్తను అందజేయటానికి దూతలను పంపారు.
1CH 10:10 సౌలు ఆయుధాలను ఫిలిష్తీయులు తమ బూటకపు దేవుళ్ల గుళ్లల్లో దాచారు. సౌలు తలను వారు దాగోను గుడిలో వేలాడదీసారు.
1CH 10:11 యాబేష్గిలాదు పట్టణంలో నివసించే వారంతా ఫిలిష్తీయులు సౌలుకు చేసినదంతా విన్నారు.
1CH 10:12 యాబేష్గిలాదులో వున్న యోధులంతా వెళ్లి సౌలు, అతని కుమారుల శవాలను యాబేష్గిలాదుకు తిరిగి తెచ్చారు. ఆ యోధులు సౌలు, అతని కుమారుల ఎముకలను యాబేషులో ఒక పెద్ద చెట్టు క్రింద పాతిపెట్టారు. తర్వాత వారు ఏడు రోజులు ఉపవాసమున్నారు.
1CH 10:13 సౌలు మరణానికి ముఖ్య కారణం అతను యెహోవాపట్ల విశ్వాసంగా లేకపోవటం. సౌలు యెహోవా మాటను లెక్కపెట్టలేదు.
1CH 10:14 యెహోవాకు ప్రార్థన చేయకుండా తన సంశయాలను నివారించుకొనటానికి, కర్ణ పిశాచిగల స్త్రీని ఆశ్రయించాడు. అందువల్ల యెహోవా సౌలును చంపి, రాజ్యాన్ని దావీదుకు అప్పగించాడు. దావీదు తండ్రి పేరు యెష్షయి.
1CH 11:1 ఇశ్రాయేలు ప్రజానీకం హెబ్రోను పట్టణంలో దావీదు వద్దకు వెళ్లారు. వారు దావీదుతో ఇలా అన్నారు: “మేము నీ రక్త మాంసాలను పంచుకు పుట్టిన వాళ్లం (బంధువులం).
1CH 11:2 గతంలో మమ్మల్ని నీవు యుద్ధంలో నడిపించావు. సౌలు రాజుగా వున్నప్పటికీ మమ్మల్ని నడిపిన వాడవు నీవే! యెహోవా నీతో, ‘దావీదూ, ఇశ్రాయేలీయులైన నా ప్రజల కాపరివి నీవే. నా ప్రజలకు నీవు నాయకుడివవుతావు’ అని అన్నాడు.”
1CH 11:3 ఇశ్రాయేలు పెద్దలంతా హెబ్రోను పట్టణంలో దావీదు రాజువద్దకు వచ్చారు. యెహోవా సన్నిధిలో ఆ పెద్దలతో దావీదు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. పెద్దలు దావీదు తలమీద నూనె పోసి అభిషిక్తుని చేశారు. ఆ పని దావీదు ఇశ్రాయేలు రాజు అయినట్లు తెలుపుతుంది. ఇది జరుగుతుందని యెహోవా మాటయిచ్చాడు. ఈ వాగ్దానం యెహోవా సమూయేలు ద్వారా చేశాడు.
1CH 11:4 దావీదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి యెరూషలేముకు వెళ్లారు. ఆ కాలంలో యెరూషలేము “యెబూసు” అని పిలువబడేది. ఆ నగరంలో నివసించే ప్రజలంతా యెబూసీయులనబడేవారు. ఆ నగరవాసులు
1CH 11:5 దావీదుతో, “నీవు మా నగర ప్రవేశం చేయకూడదు” అని అన్నారు. అయినప్పటికి దావీదు ఆ ప్రజలను ఓడించాడు. సీయోను కొండ మీది కోటను దావీదు వశం చేసుకొన్నాడు. ఈ ప్రదేశమే దావీదు నగరమని పిలువబడింది.
1CH 11:6 “మీలో ఎవరు సైన్యాన్ని యెబూసీయుల మీదికి విజయవంతంగా నడిపిస్తారో అతడు నా సైన్యానికంతటికి ముఖ్య అధిపతి అవుతాడు” అని దావీదు ప్రకటించాడు. అది విని యోవాబు దండయాత్రకు నాయకత్వం వహించి నిర్వహించాడు. యోవాబు తండ్రిపేరు సెరూయా. యోవాబు సైన్యాధిపతయ్యాడు.
1CH 11:7 దావీదు తన నివాసం కోటలో ఏర్పరచుకొన్నాడు. అందువల్ల దానికి దావీదు నగరం అని పేరు వచ్చింది.
1CH 11:8 కోట చుట్టూ దావీదు నగరాన్ని నిర్మించాడు. మిల్లో నుండి బయటి ప్రాకారం వరకు అతడు నగరాన్ని నిర్మించాడు. యోవాబు ఆ నగరంలో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయించాడు.
1CH 11:9 రోజురోజుకు దావీదు గొప్పతనం పెరుగుతూ వచ్చింది. సైన్యాలకు అధిపతియైన యెహోవా దావీదుకు తోడైయున్నాడు.
1CH 11:10 దావీదు సైన్యంలో మహావీరులున్నారు. దావీదులాగానే వీరుకూడా శక్తిమంతులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలంతా దావీదు రాజ్యానికి మంచి మద్దతు ఇచ్చారు. ఈ మహావీరులూ, ఇశ్రాయేలు ప్రజానీకం కలసి దావీదును రాజుగా చేశారు. దేవుడు ఇది జరుగుతుందని వాగ్దానం చేశాడు.
1CH 11:11 దావీదు సైన్యంలో మహాయోధులు ఎవరనగా: హక్మనీయులకు చెందిన యాషాబాము ఒకడు. యాషాబాము అధికారులకు పై అధికారి. అతడు తన ఈటెనుపయోగించి మూడు వందల మందిని ఎదిరించాడు. ఆ మూడువందల మందిని ఒక్క వేటుతో చంపివేశాడు.
1CH 11:12 దావీదు యోధులలో ఎలియాజరు మరొకడు. ఎలియాజరు తండ్రి పేరు దోదో. దోదో అహోహీయుల వంశంవాడు. ముగ్గురు మహా యోధుల్లో ఎలియాజరు ఒకడు.
1CH 11:13 పస్దమ్మీములో ఎలియాజరు దావీదుతో వున్నాడు. ఫిలిష్తీయులు ఆ ప్రదేశానికి యుద్ధానికి సిద్ధమై వచ్చారు. ఆ ప్రాంతంలో విరగపండిన యవల చేనువుంది. ఫిలిష్తీయులకు భయపడి ఇశ్రాయేలీయులు ఈ ప్రదేశానికి పారిపోయి వచ్చారు.
1CH 11:14 కాని వారా చేను మధ్యలో నిలబడి పంటను కాపాడుతూ ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని చంపివేశారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకు ఘనవిజయం చేకూర్చాడు.
1CH 11:15 ముప్పై మంది నాయకులలో ముగ్గురు దావీదు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో దావీదు అదుల్లాము గుహగల కొండ వద్ద ఉన్నాడు. అదే సమయంలో ఫిలిష్తీయుల సైనికులు కొందరు రెఫాయిము లోయలో గుడారాలు వేశారు.
1CH 11:16 అప్పుడు దావీదు కోటలో వున్నాడు. ఫిలిష్తీయుల సైన్యం బేత్లెహేములో దిగివుంది.
1CH 11:17 దావీదుకు అప్పుడు దాహం వేసింది. అతడు, “ఓహో, ఇప్పుడు నాకెవరైనా బేత్లెహేము నగర ద్వారం వద్దగల బావి నీరు తాగటానికి తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను!” (దావీదు నిజంగా దీనిని కోరుకోలేదు) అని అన్నాడు.
1CH 11:18 అప్పుడు ఆ ముగ్గురు యోధులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఛేదించుకుంటూపోయి, బేత్లెహేము నగర ద్వారంవద్ద గల బావినుండి నీరు తీసుకొన్నారు. ఆ ముగ్గురు యోధులు నీటిని తెచ్చి దావీదుకు ఇచ్చారు. కాని దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఆ నీటిని యెహోవాకి అర్పణగా పారపోశాడు.
1CH 11:19 దావీదు ఇలా అన్నాడు, “యెహోవా నన్ను ఈ నీటిని తాగకుండా చేయుగాక! ఈ నీటిని నేను తాగటం సరియైనది కాదు. ఎందువల్లననగా ఈ మనుష్యులు ఈ నీటిని తేవటానికి తమ ప్రాణాలను లెక్క చేయలేదు. వారు మృత్యుముఖంలో పడి బయటపడ్డారు.” అందువల్ల దావీదు ఆ నీటిని తాగలేదు. ఆ విధంగా ఆ ముగ్గురు మహాయోధులు వీరోచిత కార్యాలు సాధించారు.
1CH 11:20 ముగ్గురు యోధుల దళానికి యోవాబు సోదరుడు అబీషై నాయకుడు. అతడు మూడు వందల మందిని తన ఈటెతో ఎదిరించి చంపాడు. ముగ్గురు యోధుల్లాగా అబీషై కీర్తి గడించాడు.
1CH 11:21 కాని అతనికి మిగిలిన వారికంటె ఎక్కువ గౌరవం దక్కింది. ముగ్గురిలో ఒకడు కాకపోయినా అతడు అధిపతి అయ్యాడు.
1CH 11:22 యోహోయాదా కుమారుడు బెనాయా ఒక పరాక్రమవంతుని కుమారుడు. అతడు కబ్సెయేలు వంశంవాడు. అతడు కొన్ని సాహస కార్యాలు నెరవేర్చాడు. మోయాబు దేశానికి చెందిన ఇద్దరు గొప్ప యోధులను చంపాడు. అతడు భూమిలో పెద్ద గోతిలోకి వెళ్లి అక్కడ ఒక సింహాన్ని చంపాడు. అది బాగా మంచుపడే రోజున జరిగింది.
1CH 11:23 ఈజిప్టుకు చెందిన బలవంతుడైన సైనికుని కూడ బెనాయా చంపాడు. ఆ మనుష్యుడు ఏడున్నర అడుగుల ఎత్తుగల వాడు. ఆ ఈజిప్టు వాని వద్ద అతి పెద్దదయిన, బరువైన ఒక ఈటె వుంది. అది నేత నేయువాని మగ్గం దోనెవలె వుంది. బెనాయా వద్ద ఒక గదలాంటి ఆయుధం మాత్రమే వుంది. కాని బెనాయా ఆ ఈజిప్టు వాని వద్ద నుండి ఈటెను లాక్కున్నాడు. దానితోనే వానిని చంపివేశాడు.
1CH 11:24 ఇవన్నీ యోహోయాదా కుమారుడు బెనాయా చేసిన పనులు. ముగ్గురు యోధుల్లాగా బెనాయా పేరు పొందిన వ్యక్తి అయ్యాడు.
1CH 11:25 ఆ ముగ్గురి యోధుల కంటె బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది. కాని అతడు ఆ ముగ్గురిలో చేర్చబడలేదు. దావీదు తన అంగరక్షకులకు అధిపతిగా బెనాయాను నియమించాడు.
1CH 11:26 ముఫ్పై మంది వీరులైన సైనికులెవరనగా: యోవాబు సోదరుడైన ఆశాహేలు. దోదో కుమారుడైన ఎల్హానాను. ఎల్హానాను బేత్లెహేము నివాసి.
1CH 11:27 హరోరీయుడైన షమ్మోతు. పెలోనీయుడైన హేలెస్సు.
1CH 11:28 ఇక్కీషు కుమారుడైన ఈరా. ఈరా తెకోవ పట్టణానికి చెందినవాడు. అనాతోతీయుడైన అబీయెజెరు.
1CH 11:29 హుషాతీయుడైన సిబ్బెకై. అహోహీయుడైన ఈలై.
1CH 11:30 నెటోపాతీయుడగు మహరై, బయనా కుమారుడగు హేలెదు. హేలెదు కూడ నెటోపాతీయుడు.
1CH 11:31 రీబయి కుమారుడైన ఈతయి. ఈతయి అనేవాడు బెన్యామీను దేశంలోని గిబియా పట్టణవాసి. పిరాతోనీయుడైన బెనాయా,
1CH 11:32 గాయఘలోయవాడైన హురై, అర్బాతీయుడైన అబీయేలు,
1CH 11:33 బహరూమీయుడైన అజ్మావెతు. షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా
1CH 11:34 హాషేము కుమారుడు హాషేము గిజోనీయుడు. షాగే కుమారుడు యోనాతాను. యోనాతాను హరారీయుడు.
1CH 11:35 శాకారు కుమారుడు అహీయాము. అహీయాము హరారీయుడు. ఊరు కుమారుడు ఎలీపాలు.
1CH 11:36 మెకేరాతీయుడైన హెపెరు. పెలోనీయుడగు అహీయా.
1CH 11:37 కర్మెలీయుడైన హెజ్రో. ఎజ్బయి కుమారుడైన నయరై.
1CH 11:38 నాతాను సోదరుడైన యోవేలు. హగ్రీ కుమారుడగు మిబ్హారు.
1CH 11:39 అమ్మోనీయుడగు జెలెకు. బెరోతీయుడగు నహరై. నహరై అనేవాడు యోవాబు ఆయుధాలు మోసేవాడు. యోవాబు తండ్రి పేరు సెరూయా.
1CH 11:40 ఇత్రీయుడైన ఈరా. ఇత్రీయుడగు గారేబు.
1CH 11:41 హిత్తీయుడైన ఊరియా. అహ్లయి కుమారుడు జాబాదు.
1CH 11:42 షీజా కుమారుడు అదీనా. షీజా అనేవాడు రూబేనీయుడు. అదీనా రూబేను వంశంలో పెద్ద. అతను తనతోవున్న ముగ్గురు యోధులకు నాయకుడు.
1CH 11:43 మయకా కుమారుడు హానాను. మిత్నీయుడైన యెహోషాపాతు.
1CH 11:44 ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా. హోతాము కుమారులు షామా, యెహీయేలు. హోతాము అరోయేరీయుడు.
1CH 11:45 షిమ్రీ కుమారుడు యెదీయవేలు. తిజీయుడగు యోహా. యెదీయవేలు సోదరుడు యోహా.
1CH 11:46 మహవీయుడగు ఎలీయేలు. ఎల్నయము కుమారులైన యెరీబై, యోషవ్యా. మోయాబీయుడైన ఇత్మా.
1CH 11:47 ఎలీయేలు, ఓబేదు, మరియు మెజోబాయా వాడైన యహశీయేలు.
1CH 12:1 దావీదు సిక్లగు పట్టణంలో ఉన్నాడు. ఆ సమయంలో కొందరు మనుష్యులు దావీదును కలుసుకొన్నారు. దావీదు పారిపోయి సౌలుకు కనపడకుండా దాగివున్న రోజులవి. కీషు కుమారుడు సౌలు. ఈ వచ్చిన మనుష్యులు దావీదుకు యుద్ధంలో సహాయపడ్డారు.
1CH 12:2 ఈ మనుష్యులు కుడి చేతితోను, ఎడమ చేతితోను బాణాలు ఒడుపుగా వేయగల నేర్పరులు. వడిసెలకూడ వారు కుడి ఎడమల తేడా లేకుండా తిప్పి రాళ్లు విసరగల సమర్థులు. వారంతా సౌలు బంధువులైన బెన్యామీనీయులు.
1CH 12:3 వారెవరనగా: అహీయెజెరు వారి నాయకుడు. వారిలో యోవాషు కూడ వున్నాడు. అహీయెజెరు, యోవాషులిద్దరూ షెమయా కుమారులు. షెమయా అనేవాడు గిబియావాడు. వారిలో ఇంకా యెజీయేలు, పెలెటు వున్నారు. యెజీయేలు, పెలెటులిరువురూ అజ్మావెతు కుమారులు. బెరాకా, అనాతోతీయుడైన యెహూ అనేవారు కూడ వారితో వున్నారు.
1CH 12:4 గిబియోనీయుడైన ఇష్మయా బలపరాక్రమ సంపన్నుడు. ముప్పై మంది యోధుల్లో ఒకడు మరియు వారి నాయకుడు. యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు కూడ వున్నారు.
1CH 12:5 ఎలూజై, యెరీమోతు, బెయల్యా మరియు షెమర్యా. హరీపీయుడైన షెఫట్యా.
1CH 12:6 ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజేరు, యాషాబాము అనే వారు కోరహు వంశీయులు.
1CH 12:7 యెరోహాము కుమారులైన యోహేలా మరియు జెబద్యా. వారు గెదోరు గ్రామానికి చెందిన వారు.
1CH 12:8 గాదీయులలో కొంతమంది ఎడారి ప్రాంతంలో కోటలో దాగివున్న దావీదును కలిశారు. వారు బాగా యుద్ధ శిక్షణ పొందిన సైనికులు. వారు డాలు పట్టి ఈటెను ఉపయోగించటంలో ఆరితేరినవారు. వారు సింహం లాంటి ముఖాలతో భయంకరంగా వుంటారు. వారు కొండల్లో జింకల్లా పరుగెత్తగలరు.
1CH 12:9 ఏజెరు గాదు సైన్యానికి అధిపతి. ఓబద్యా రెండవ ముఖ్యాధికారి. ఏలీయాబు మూడవ స్థానంలో వున్నాడు.
1CH 12:10 మిష్మన్నా నాల్గవ స్థానంలోను, యిర్మీయా ఐదవ స్థానంలోను వున్నారు.
1CH 12:11 అత్తయి ఆరవ స్థానంలోను, ఏలీయేలు ఏడవ స్థానంలోను వున్నారు.
1CH 12:12 యోహానాను ఎనిమిదవ స్థానంలోను, ఎల్జాబాదు తొమ్మిదవ స్థానంలోను వున్నారు.
1CH 12:13 యిర్మీయా పదవ స్థానంలోను, మక్బన్నయి పదకొండవ వాడుగాను వున్నారు.
1CH 12:14 వారు గాదీయుల సైన్యంలో అధికారులు. వారిలో అతి బలహీనుడైనవాడు కూడ కనీసం వంద మందితో పోరాడగలడు. వారిలో మిక్కిలి బలవంతుడు వేయి మంది శత్రు సైనికులను ఎదుర్కొనగలడు.
1CH 12:15 ఈ గాదు వంశీయులే మొదటి నెలలో యొర్దాను నదికి వరదలు వచ్చే సమయంలో లోయల్లో వుండే వారందరినీ తరిమికొట్టారు. వారా ప్రజలను తూర్పునకు, పడమరకు తరిమివేశారు.
1CH 12:16 బెన్యామీను, యూదా వంశాలకు చెందిన ఇతర ప్రజలు కూడ కోటలో వున్న దావీదు వద్దకు వచ్చారు.
1CH 12:17 దావీదు వారిని కలిసేందుకు ఎదురు వెళ్లి, వారితో ఇలా అన్నాడు: “మీరు శాంతి భావంతో నాకు సహాయం చేయగోరి వస్తే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను! నాతో కలిసి ఉండండి. ఒకవేళ నేను ఏమీ తప్పు చేయకపోయినా మీరు నా మీద నిఘావేసి నన్ను శత్రువులకు అప్పజెప్పటానికి కనుక వస్తే, మన పూర్వీకుల దేవుడు మీరు చేసేది చూచి మిమ్మల్ని శిక్షించుగాక!”
1CH 12:18 అప్పుడు దేవుని ఆత్మ అమాశై మీదికి వచ్చింది. అమాశై ముప్పదిమంది వీరుల నాయకుడు. అమాశై అప్పుడు ఇలా అన్నాడు: “ఓ దావీదూ, మేము నీవారం! ఓ యెష్షయి కుమారుడా, మేము నీతో వున్నాము. శాంతి! నీకు శాంతి కలుగుగాక! నీకు సహాయపడే ప్రజలకు కూడ శాంతి. ఎందువల్లననగా నీ దైవం నీకు సహాయపడుతున్నాడు!” అప్పుడు దావీదు వారికి స్వాగతం పలికి వారిని చేరదీశాడు. తన పక్షాన వారిని దళాధిపతులుగా నియమించాడు.
1CH 12:19 కొందరు మనష్షే వంశంలోని వారు కూడ వచ్చి దావీదు పక్షం వహించారు. అతడు ఫిలిష్తీయులతో కలిసి సౌలుపై యుద్ధానికి వెళ్లినప్పుడు వారు వచ్చి దావీదు పక్షం వహించారు. కాని దావీదు, అతని మనుష్యులు నిజానికి ఫిలిష్తీయులకు సహాయపడలేదు. దావీదు తమకు సహాయం చేసే విషయం ఫిలిష్తీయుల అధికారులు చర్చించి, పిమ్మట అతనిని పంపివేయటానికి నిశ్చయించారు. ఫిలిష్తీయుల పాలకులు ఇలా అన్నారు: “ఒకవేళ దావీదు మధ్యలో తన యజమాని సౌలు వద్దకు వెళ్లిపోతే మన తలలు తెగిపోతాయి!”
1CH 12:20 దావీదు సిక్లగు పట్టణానికి వెళ్లినప్పుడు అతనితో కలిసిన మనష్షీయులు ఎవరనగా: అద్నా, యోజాబాదు, మెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు మరియు జిల్లెతై. వీరిలో ప్రతి ఒక్కడూ మనష్షే వంశీయులలో వెయ్యి మందికి నాయకుడు.
1CH 12:21 దుష్టశక్తులను ఎదుర్కొనటంలో వారు దావీదుకు తోడ్పడ్డారు. ఈ దుష్టులు దేశం మీద పడి ప్రజలను దోచుకోసాగారు. దావీదును చేరిన మనష్షీయులంతా ధైర్యంగల సేనానులు. వారు దావీదు సైన్యంలో అధిపతులయ్యారు.
1CH 12:22 రోజురోజుకూ దావీదు వద్దకు వచ్చి సహాయపడేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దానితో దావీదుకు శక్తివంతమైన ఒక మహా సైన్యం ఏర్పడింది.
1CH 12:23 దావీదును హెబ్రోను పట్టణంలో కలిసిన వారి వివరాలు, సంఖ్యాబలం ఈ విధంగా వున్నాయి: వారు యుద్ధ వీరులు. సౌలు సామ్రాజ్యాన్ని దావీదుకు అప్పజెప్పటానికి వచ్చారు. ఇది ఇలా జరుగుతుందని యెహోవా చెప్పియున్నాడు. వారి బలగం ఏదనగా:
1CH 12:24 యుద్ధానికి అర్హతగల యూదా వంశీయులు ఆరువేల ఎనిమిది వందల మంది వున్నారు. వారు డాళ్లను, ఈటెలను పట్టగల సమర్థులు.
1CH 12:25 షిమ్యోనీయులు ఏడువేల వందమంది వున్నారు. వారంతా ధైర్య సాహసాలుగల సైనికులు.
1CH 12:26 లేవీయులు నాలుగువేల ఆరువందల మంది వున్నారు.
1CH 12:27 యెహోయాదా ఆ వర్గంలో వాడు. అతడు అహరోను కుటుంబ పెద్ద. యెహోయాదాతో మూడువేల ఏడువందల మంది మనుష్యులున్నారు.
1CH 12:28 ఆ వర్గంలో సాదోకు కూడా వున్నాడు. అతడు మంచి ధైర్యంగల యువ సైనికుడు. అతడు తన కుటుంబీకులలో ఇరవై ఇద్దరు అధికారులతో వచ్చాడు.
1CH 12:29 బెన్యామీను వంశం వారు మూడువేలమంది వున్నారు. వారంతా సౌలుకు బంధువులు. అప్పటి వరకు వారిలో అధిక సంఖ్యాకులు సౌలు కుటుంబం పట్ల విశ్వాసంగా వున్నారు.
1CH 12:30 ఎఫ్రాయిము వంశంవారు ఇరవైవేల ఎనిమిది వందలమంది వున్నారు. వారు ధైర్యంగల సేనానులు. వారి వారి కుటుంబాలలో వారు ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు.
1CH 12:31 మనష్షే వంశీయులలో సగంమంది నుండి వచ్చిన వారు పద్దెనిమిదివేల మంది. వారు పేరు పేరున దావీదును రాజుగా చేయటానికి ఎంపిక చేయబడినవారు.
1CH 12:32 ఇశ్శాఖారు వంశీయులలో తెలివైన పెద్దలు రెండు వందల మంది. ఇశ్రాయేలుకు చేయదగిన మంచి యేదో వారు సరియైన సమయంలో గుర్తించారు. వారి బంధువులంతా వారి మాటకు కట్టుబడి వున్నారు.
1CH 12:33 జెబూలూనీయులు ఏబదివేల మంది వున్నారు. వారంతా అనుభవజ్ఞులైన సైనికులు. వారు రకరకాల ఆయుధాలు చేపట్టి యుద్ధానికి సిద్ధంగా వున్నారు. వారు దావీదుకు మిక్కిలి నమ్మకస్తులై వున్నారు.
1CH 12:34 నఫ్తాలీయుల నుండి ఒక వెయ్యిమంది అధిపతులు వచ్చారు. వారికి ముప్పది ఏడువేల మంది అనుచరులు వున్నారు. వారు ఈటెలు, డాళ్లు పట్టి వున్నారు.
1CH 12:35 దాను వంశం నుండి యుద్ధానికి సిద్ధంగా వున్న వారు ఇరవై ఎనిమిదివేల ఆరువందల మంది.
1CH 12:36 ఆషేరు వంశం నుండి కాకలు తీరిన సైనికులు యుద్ధానికి సిద్ధమై నలభై వేలమంది వచ్చారు.
1CH 12:37 యొర్దాను నదికి ఆవలివైపు (నదికి తూర్పు) నుండి రూబేను, గాదు, సగం మనష్షే వంశీయుల నుండి ఒక లక్షా ఇరవై వేల మంది వచ్చారు. వారంతా రకరకాల ఆయుధాలు ధరించియున్నారు.
1CH 12:38 ఆ వచ్చిన మనుష్యులంతా పోరాట యోధులు. దావీదును ఇశ్రాయేలుకంతటికి రాజుగా చేయాలనే కృతనిశ్చయంతో ఆ వీరులందరూ హెబ్రోను పట్టణానికి వచ్చారు. మిగిలిన ఇశ్రాయేలీయులు కూడ దావీదును రాజుగా చేయటానికి ఒప్పుకున్నారు.
1CH 12:39 ఆ మనుష్యులంతా దావీదుతో మూడు రోజులు హెబ్రోనులో గడిపారు. వారి బంధువులంతా తగినన్ని ఆహార పదార్థాలను తయారు చేయటంతో వారు బాగా అన్నపానాదులు సేవించి కాలం గడిపారు.
1CH 12:40 ఇశ్శాఖారు, జెబూలూను మరియు నఫ్తాలి వంశాల వారి ఇరుగు పొరుగు వారు కూడ గాడిదలమీద, ఒంటెలమీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద ఆహార పదార్థాలు వేసుకొని వచ్చారు. వారు కావలసినంత పిండిని, అంజూర పండ్ల భక్ష్యాలను, ఎండుద్రాక్షను, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులను, గొర్రెలను తీసుకొని వచ్చారు. ఇశ్రాయేలంతటా సంతోషం వెల్లివిరిసింది.
1CH 13:1 దావీదు తన సైన్యంలోని సేనాధిపతులతో మాట్లాడాడడు. అతడు శతదళాధిపతులతోను, సహస్రదళాధిపతులతోను మాట్లాడాడు.
1CH 13:2 పిమ్మట దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపర్చాడు. అతడు వారికి ఇలా చెప్పాడు: “మీ అందరికీ ఇది మంచిదనిపించితే, ఇది యెహోవా సంకల్పమే అయితే మనం ఇప్పుడు ఇశ్రాయేలులో మన సోదరులందరికీ ఒక వర్తమానం పంపుదాము. ఈ వర్తమానాన్ని మన సోదరులతో పాటు వారి పట్టణాలలోను, పొలాలలోను నివసిస్తున్న యాజకులకు, లేవీయులకు కూడ అందజేద్దాము. వారందరినీ వచ్చి మనల్ని కలవమని వర్తమానం పంపండి.
1CH 13:3 ఒడంబడిక పెట్టెను మనం యెరూషలేముకు తీసుకొనివద్దాము. సౌలు రాజుగా వున్నన్నాళ్ళూ ఒడంబడిక పెట్టెను మనం అశ్రద్ధ చేశాము.”
1CH 13:4 దావీదు చెప్పిన విషయం సరియైనదని గుర్తించి, ఇశ్రాయేలు ప్రజలంతా అతని సూచనను అంగీకరించారు.
1CH 13:5 కావున ఈజిప్టులోని షీహోరు నది మొదలు లెబో హమాతు పట్టణం వరకుగల ఇశ్రాయేలీయు లందరినీ దావీదు సమావేశపర్చాడు. ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము పట్టణం నుండి తిరిగి తెచ్చే నిమిత్తం వారంతా ఒక చోటికి పిలవబడ్డారు.
1CH 13:6 దావీదు మరియు అతనితో వున్న ఇశ్రాయేలీయులు కలిసి యూదాలోని బాలా పట్టణానికి వెళ్లారు. (బాలా అనేది కిర్యత్యారీముకు మరో పేరు.) ఒడంబడిక పెట్టెను బయటకు తేవటానికి వారక్కడికి వెళ్లారు. ఒడంబడిక పెట్టె అనేది యెహోవా దేవుని పవిత్రపెట్టె. యెహోవా కెరూబుల మధ్య ఆసీనుడై వుంటాడు. ఈ పెట్టె యెహోవా పేరుతో పిలవబడుతుంది.
1CH 13:7 ఒడంబడిక పెట్టెను ప్రజలు అబీనాదాబు ఇంటి నుండి బయటకు తీసారు. వారు దానిని ఒక కొత్త బండిమీద పెట్టారు. ఉజ్జా, అహ్యో అనేవారు బండిని తోలారు.
1CH 13:8 దావీదు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ముందు తమ శక్తికొలది భక్తి శ్రద్ధలతో ఉత్సవం చేస్తున్నారు. వారు భక్తిగీతాలు పాడుతూ, తంబర, సితారాలను వాయిస్తూ, తాళాలు మ్రోగిస్తూ, మద్దెలలు వాయిస్తూ, బూరలు ఊదుతూ వేడుక చేస్తున్నారు.
1CH 13:9 వారు కీదోను నూర్పిడి కళ్ళం వద్దకు వచ్చారు. అక్కడికి రాగానే బండిని లాగే ఎద్దులు కాళ్లు జారి తడబడ్డాయి. దానితో బండిమీద ఉన్న ఒడంబడిక పెట్టె ఇంచుమించు క్రిందపడినంత పని అయ్యింది. అప్పుడు ఉజ్జా తనచేయి చాపి పెట్టెను పట్టుకోబోయాడు.
1CH 13:10 ఉజ్జా పట్ల దేవునికి చాలా కోపం వచ్చింది. ఉజ్జా పెట్టెను ముట్టుకున్న నేరానికి దేవుడు అతనిని చంపివేసాడు. ఉజ్జా దేవుని ముందే పడి చనిపోయాడు.
1CH 13:11 ఉజ్జా పట్ల యెహోవా కోపగించినందుకు దావీదు కలత చెందాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ ప్రదేశం “పెరెజ్ ఉజ్జా” అని పిలవబడుతూ వుంది.
1CH 13:12 ఆ రోజు దావీదు దేవునికి భయపడ్డాడు. “ఒడంబడిక పెట్టెను నా వద్దకు ఏ విధంగా తీసుకొని వెళ్లగలను?” అని అనుకున్నాడు.
1CH 13:13 కావున దావీదు ఒడంబడిక పెట్టెను తనతో దావీదు నగరానికి తీసుకొని వెళ్లలేదు. ఒడంబడిక పెట్టెను ఓబేదెదోము ఇంటివద్ద వదిలిపెట్టాడు. ఓబేదెదోము గాతు నగరంవాడు.
1CH 13:14 మూడు నెలల పాటు ఒడంబడిక పెట్టె ఓబేదెదోము ఇంటిలో అతని ఇంటివారి సంరక్షణలో వుంది. యెహోవా ఓబేదెదోము కుటుంబం వారిని, అతను కలిగివున్న ప్రతి దానిని దీవించాడు.
1CH 14:1 తూరు నగర రాజు పేరు హీరాము. దావీదు వద్దకు హీరాము దూతలను పంపాడు. హీరాము దేవదారు కలపను, రాళ్లు చెక్కే వాస్తు శిల్పులను, వడ్రంగులను దావీదు వద్దకు పంపాడు. దావీదుకు ఒక భవనం నిర్మించటానికి హీరాము వారిని పంపాడు.
1CH 14:2 యెహోవా నిజంగానే తనను ఇశ్రాయేలుకు రాజుగా చేసినట్లు దావీదు అప్పుడు గుర్తించాడు. యెహోవా దావీదును, ఇశ్రాయేలు ప్రజలను బాగా ప్రేమించాడు. అందువల్ల దేవుడు దావీదు రాజ్యాన్ని విస్తరించి, బలమైన రాజ్యంగా రూపొందించాడు.
1CH 14:3 యెరూషలేము నగరంలో దావీదు చాలా మంది స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. అతనికి చాలామంది కొడుకులు, కూతుళ్లు కలిగారు.
1CH 14:4 యెరూషలోములో దావీదుకు పుట్టిన పిల్లల పేర్లు ఏవనగా: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,
1CH 14:5 ఇభారు, ఎలీషూవ, ఎల్పాలెటు,
1CH 14:6 నోగహు, నెపెగు, యాఫీయ,
1CH 14:7 ఎలీషామా, బెయెల్యెదా మరియు ఎలీపెలెటు.
1CH 14:8 దావీదు ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుడయినట్లు ఫిలిష్తీయులు విన్నారు. కావున ఫిలిష్తీయులంతా దావీదును వెదుక్కుంటూ పోయారు. ఆ విషయం దావీదు విని వారిని ఎదుర్కోవటానికి వెళ్లాడు.
1CH 14:9 ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో నివసిస్తున్న వారిపై దాడిచేసి, వారిని దోచుకున్నారు.
1CH 14:10 అప్పుడు దావీదు దేవుని ప్రార్థించి, “దేవా, నేను ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా? వారిని ఓడించేలా నీవు నాకు సహాయం చేస్తావా?” అని అడిగాడు. యెహోవా అందుకు సమాధానంగా, “వెళ్లు, ఫిలిష్తీయులను నీవు ఓడించేలా నేను చేస్తాను” అని చెప్పాడు.
1CH 14:11 తరువాత దావీదు, అతని మనుష్యులు బయల్పెరాజీము పట్టణానికి వెళ్లారు. అక్కడ వారు ఫిలిష్తీయులను ఓడించారు. అప్పుడు దావీదు, “తెగిన ఆనకట్టలో నుండి నీరు ఉరుకులు పరుగులతో ప్రవహించి పోయేలా, దేవుడు నా శత్రువులను నానుండి చెల్లా చెదురు చేశాడు! దేవుడు ఈ కార్యం నాచేత చేయించాడు” అని అన్నాడు. అందువల్లనే ఆ ప్రదేశానికి బయల్పెరాజీము అని పేరు పెట్టబడింది.
1CH 14:12 ఫిలిష్తీయులు వారి విగ్రహాలను బయల్పెరాజీములో వదిలి పెట్టిపోయారు. ఆ విగ్రహాలన్నిటినీ తగులబెట్టమని దావీదు తన ప్రజలకు ఆజ్ఞయిచ్చాడు.
1CH 14:13 రెఫాయీము లోయలో నివసిస్తున్న ప్రజలపై ఫిలిష్తీయులు దాడి చేశారు.
1CH 14:14 దావీదు మరల దేవుని ప్రార్థించాడు. దావీదు ప్రార్థనను దేవుడు ఆలకించాడు. యెహోవా ఇలా అన్నాడు: “దావీదూ, నీవు ఫిలిష్తీయులను ఎదుర్కొన్నప్పుడు కొండమీద నీవు వారి ముందుకు పోవద్దు. దానికి బదులు నీవు వారిని చుట్టుముట్టి వెళ్లు. కంబళి చెట్లు వున్న చోటున దాగివుండు.
1CH 14:15 ఒక కాపలాదారుని చెట్ల మీద కూర్చుండబెట్టు. ఆ చెట్ల క్రింద నుండి వాళ్లు నడిచివెళ్లే అడుగుల చప్పుడు అతడు వినగానే నీవు ఫిలిష్తీయులను ఎదిరించు. నేను నీకు ముందుగా వెళ్లి ఫిలిష్తీయుల సైన్యాన్ని ఓడిస్తాను!”
1CH 14:16 దేవుడు చెప్పిన రీతిగా దావీదు చేసాడు. ఆ విధంగా దావీదు, అతని మనుష్యులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఓడించారు. గిబియోను పట్టణం నుండి గాజెరు వరకు వారు ఫిలిష్తీయుల సైనికులను చంపివేసారు.
1CH 14:17 అప్పుడు దావీదు అన్ని దేశాలలోను పేరు పొందాడు. వివిధ రాజ్యాల వారు దావీదును చూచి భయపడేలా దేవుడు చేశాడు.
1CH 15:1 దావీదు నగరంలో తన కొరకు దావీదు ఇండ్లు కట్టుకున్నాడు. తరువాత ఒడంబడిక పెట్టెను పెట్టటానికి అతడొక ప్రదేశాన్ని సిద్ధం చేశాడు. అతడక్కడ ఒక గుడారం దాని కొరకు నిర్మించాడు.
1CH 15:2 “ఒడంబడిక పెట్టెను మోయటానికి కేవలం లేవీయులు మాత్రమే అనుమతించబడ్డారు. ఒడంబడిక పెట్టెను మోయటానికి, ఆయనను అర్పించటానికి యెహోవా లేవీయులను శాశ్వతంగా ఎంపిక చేశాడు” అని దావీదు చెప్పాడు.
1CH 15:3 తాను ఏర్పాటు చేసిన స్థలానికి ఒడంబడిక పెట్టెను తేవటానికి యెరూషలేము ప్రజలందరినీ దావీదు సమావేశపర్చాడు.
1CH 15:4 అహరోను సంతతి వారిని, లేవీయులను దావీదు పిలిపించాడు.
1CH 15:5 కహాతు సంతతివారు నూట ఇరవై మంది వున్నారు. వారి నాయకుని పేరు ఊరియేలు.
1CH 15:6 మెరారి వంశీయులు రెండు వందల ఇరవై మంది వున్నారు. అశాయా వారికి పెద్ద.
1CH 15:7 గెర్షోను కుటుంబం వారు నూటముప్పది మంది వున్నారు. యోవేలు వారి అధిపతి.
1CH 15:8 ఎలీషాపాను సంతతివారు రెండువందల మంది. షెమయా వారి నాయకుడు.
1CH 15:9 హెబ్రోను సంతతివారు ఎనుబది మంది. ఎలీయేలు వారి నాయకుడు.
1CH 15:10 ఉజ్జీయేలు కుటుంబం వారు నూట పన్నెండు మంది. అమ్మీనాదాబు వారి పెద్ద.
1CH 15:11 యాజకులైన సాదోకును, అబ్యాతారును తన వద్దకు రమ్మని దావీదు కబురు పంపాడు. మరియు లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనువారిని కూడ దావీదు తన వద్దకు రమ్మని కబురు పంపాడు.
1CH 15:12 దావీదు వారితో ఇలా అన్నాడు: “మీరంతా లేవి సంతతి వారికి నాయకులు. మీరు, మీతోటి వారైన ఇతర లేవీయులు పవిత్రంగా వుండి, ఒడంబడిక పెట్టెను నేను ఏర్పాటు చేసిన స్థలానికి తీసుకొనిరండి.
1CH 15:13 కిందటి సారి ఒడంబడిక పెట్టెను ఎలా తీసుకొని రావాలి అనే విషయం మనం యెహోవాను అడుగలేదు. లేవీయులైన మీరు ఒడంబడిక పెట్టెను మోయలేదు. అందువల్ల యెహోవా మనల్ని శిక్షించాడు.”
1CH 15:14 పిమ్మట ఇశ్రాయేలు దేవుని ఒడంబడిక పెట్టెను తీసుకొని రావటానికి యాజకులు, లేవీయులు శుద్ధియైనారు.
1CH 15:15 ఒడంబడిక పెట్టెను మోషే ఆజ్ఞాపించిన విధంగా వారి భుజాలపై మోయటానికి లేవీయులు ప్రత్యేకమైన కర్రలను వినియోగించారు. యెహోవా సెలవిచ్చిన ప్రకారమే వారు ఆ ఒడంబడిక పెట్టెను మోసారు.
1CH 15:16 వారి సోదరులైన గాయకులను తీసుకొని రమ్మని దావీదు లేవీయులతో చెప్పాడు. గాయకులంతా వీణలు, తంబూరాలు, సితారలు, తాళాలు వాయిస్తూ ఆనందంతో హాయిగా పాడాలి.
1CH 15:17 అప్పుడు లేవీయులు హేమానును, అతని సోదరులను, ఆసాపును, ఏతానును తీసుకొని వచ్చారు. హేమాను తండ్రి పేరు యోవేలు. ఆసాపు తండ్రి పేరు బెరెక్యా. ఏతాను తండ్రి పేరు కూషాయాహు. వీరంతా మెరారి సంతతివారు.
1CH 15:18 లేవీయులో రెండవ వర్గం వారు కూడ వున్నారు. వారు జెకర్యా, యహాజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు. వీరంతా లేవీయులకు చెందిన ద్వారపాలకులు.
1CH 15:19 గాయకులైన హేమాను, ఆసాపు, ఏతాను కంచు తాళాలు వాయించేందుకు నియమితులయ్యారు.
1CH 15:20 జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా హెచ్చు స్థాయి వీణలు వాయించాలి.
1CH 15:21 మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు మరియు అజజ్యాహు తగ్గుస్థాయి వీణలు వాయించటానికి నియమింప బడ్డారు. శాశ్వతంగా అది వారిపని.
1CH 15:22 లేవీయుల నాయకుడు కెనన్యా సంగీత కార్యక్రమ నిర్వాహకుడు. కెనన్యా ఈ కార్యక్రమం నిర్వహించటానికి కారణం అతడు ప్రసిద్ధ గాయకుడు కావటమే.
1CH 15:23 ఒడంబడిక పెట్టెకు కాపలాదారులుగా నియమితులైన వారిలో బెరెక్యా, ఎల్కానా వున్నారు.
1CH 15:24 యాజకులైన షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా మరియు ఎలీయెజెరు ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదారు. ఓబేదెదోము, యెహీయాలిరువురూ కూడ ఒడంబడిక మందసానికి కాపలాదార్లు.
1CH 15:25 దావీదు, ఇశ్రాయేలు పెద్దలు, వెయ్యిమంది సైనికులు గల దళాలకు నాయకులు ఒడంబడిక పెట్టెను తీసుకొని రావటానికి వెళ్లారు. వారు దానిని ఓబేదెదోము ఇంటినుండి బయటకు తెచ్చినప్పుడు చాలా ఆనందంగా వున్నారు.
1CH 15:26 ఒడంబడిక పెట్టెను మోసిన లేవీయులకు దేవుడు సహాయపడ్డాడు. వారు ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను బలియిచ్చారు.
1CH 15:27 ఒడంబడిక పెట్టెను మోసిన లేవీయులంతా సన్నని నారబట్టలు ధరించారు. భజన సంకీర్తన నిర్వాహకుడుగా వున్న కెనన్యా, ఇతర గాయకులు సన్నని నారబట్టలు ధరించారు. దావీదు కూడ సన్నని నారబట్టలు ధరించాడు. సన్నని నారతో నేసిన ఏఫోదు అనబడే ఒక అంగీని కూడా దావీదు ధరించాడు.
1CH 15:28 ఇశ్రాయేలు ప్రజలు జయజయ ధ్వనులు చేస్తూ, పొట్టేలు కొమ్మలు, బాకాలు వూదుతూ, వీణలు, స్వరమండలాలు, తాళాలు వాయిస్తూ ఒడంబడిక పెట్టెను తీసుకొని వచ్చారు.
1CH 15:29 దేవుని ఒడంబడిక పెట్టె దావీదు నగరం చేరినప్పుడు మీకాలు కిటికీ గుండా చూసింది. మీకాలు సౌలు కుమార్తె. రాజైన దావీదు చిందులేస్తూ పాటలు పాడటం ఆమె చూసింది. అతనినొక మూర్ఖునిగా భావించడంతో దావీదు పట్ల ఆమెకున్న గౌరవం పోయింది.
1CH 16:1 దేవుని ఒడంబడిక పెట్టెను లేవీయులు తెచ్చి దావీదు దాని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారంలో వుంచారు. పిమ్మట వారు దేవునికి దహన బలులు, సమాధాన బలులు సమర్పించారు.
1CH 16:2 దావీదు దహన బలులు, సమాధాన బలులు ఇచ్చిన తర్వాత యెహోవా పేరుతో ప్రజలను ఆశీర్వదించాడు.
1CH 16:3 అప్పుడతడు ఒక రొట్టెను, ఖర్జూర పండ్లను, ఎండు ద్రాక్షాపండ్లను ఇశ్రాయేలు స్త్రీ పురుషులందరికీ పంచిపెట్టాడు.
1CH 16:4 ఆ తరువాత దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు సేవచేయటానికి కొందరు లేవీయులను దావీదు ఎంపిక చేశాడు. వారు ఇశ్రాయేలు దేవుని ఉత్సవాలు చేయటానికి, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు, ఆయనకు జయజయ ధ్వనులు చేసేందుకు నియమింపబడ్డారు.
1CH 16:5 వీరిలో మొదటి జట్టు వారికి ఆసాపు పెద్ద. ఆసాపు వర్గం వారు తాళాలు మోగించేవారు. జెకర్యా రెండవ జట్టు వారికి అధిపతి. మిగిలిన లేవీయులు ఎవరనగా ఉజ్జీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము మరియు యెహీయేలు. వీరు తీగలు గల వీణాసితార వాద్యాలను వాయించేవారు.
1CH 16:6 యాజకులైన బెనాయా, యహజీయేలు ఎల్లప్పుడూ దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదే వారు.
1CH 16:7 అదే సమయంలో దావీదు ప్రథమంగా ఆసాపు, అతని సోదరులు యెహోవాకి ఈ స్తుతిగీతం పాడే పని అప్పజెప్పాడు.
1CH 16:8 యెహోవాను స్తుతించండి ఆయన నామమును ప్రకటించండి. యెహోవా ఘనకార్యాలను ప్రజలకు చెప్పండి.
1CH 16:9 యెహోవాకి భజన చేయండి! యెహోవాకు స్తుతిగీతాలు పాడండి. యెహోవా మహిమలు ప్రజలకు తెలపండి!
1CH 16:10 యెహోవా పవిత్ర నామం తలంచి గర్వపడండి; యెహోవా సహాయం కోరిన వారందరూ సుఖ సంతోషాలు పొందెదరు గాక!
1CH 16:11 యెహోవాను శరణు కోరండి; ఆయన బలాన్ని ఆశ్రయించండి. ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.
1CH 16:12 యెహోవా చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన నిర్ణయాలను ఆయన చేసిన ఘనకార్యాలను మననం చేసుకోండి.
1CH 16:13 యెహోవా సేవకులగు ఇశ్రాయేలు బిడ్డల్లారా, యాకోబు సంతతి వారలారా మీరు యెహోవా ఎన్నుకున్న ప్రజలు.
1CH 16:14 యెహోవాయే మన దేవుడు ఆయన శక్తి ప్రతి స్థలములో వ్యాపించి వున్నది!
1CH 16:15 తన ఒడంబడికను ఆయన జ్ఞాపకముంచుకుంటాడు. ఆయన మాట వేయితరాల పంట!
1CH 16:16 అది అబ్రాహాముతో యెహోవా చేసుకొన్న ఒడంబడిక. అది యెహోవా ఇస్సాకుకు చేసిన వాగ్దానం
1CH 16:17 యాకోబుకు యెహోవా దానిని శాసనంగా చేశాడు. అది ఇశ్రాయేలుకు యెహోవా నిరంతరం కొనసాగేలా చేసిన ఒడంబడిక.
1CH 16:18 “కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను. వాగ్దానం చేయబడిన రాజ్యం నీకు చెందుతుంది!” అని యెహోవా ఇశ్రాయేలుకు చెప్పియున్నాడు.
1CH 16:19 దేవుని ప్రజలు అప్పుడు కొద్దిమంది మాత్రమే. వారు ఆ రాజ్యంలో పరాయి వారు.
1CH 16:20 వారు ఒక దేశాన్నుండి మరో దేశానికి వెళ్లారు. వారు ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి తరలిపోయారు.
1CH 16:21 కాని ఎవ్వరూ వారికి హాని కలుగజేయకుండా యెహోవా కాపాడాడు. యెహోవా తన ప్రజలను ప్రేమించిన కారణంగా రాజులనే ఆయన మందలించాడు.
1CH 16:22 “నేను ఎన్నుకున్న నా ప్రజలకు కీడు చేయవద్దు; నా ప్రవక్తలకు హాని కలుగు జేయవద్దు!” అని యెహోవా రాజులకు చెప్పియున్నాడు.
1CH 16:23 భూమిపై గల సర్వజనులారా, యెహోవాను భజించండి! యెహోవా మనలను కాపాడుతున్న సువార్తను ప్రతినిత్యం చాటండి!
1CH 16:24 యెహోవా మహిమను అన్ని దేశాలలోను చాటండి. దేవుని అద్భుత కార్యాలను గురించి ప్రజలందరికి తెలియ జెప్పండి!
1CH 16:25 యెహోవా గొప్ప మహిమాన్వితుడు; ఆయనను మిక్కిలిగా సన్నుతించండి అన్య దేవతల కన్న యెహోవా ఘనంగా ఆరాధించబడాలి.
1CH 16:26 ఎందువల్లననగా మిగిలిన ప్రజలందరి దేవుళ్లు విగ్రహాలే! కాని యెహోవా ఈ విశాల ఆకాశాన్ని కలుగజేశాడు.
1CH 16:27 యెహోవా మహిమయు, ఘనతయు కల్గినవాడు. యెహోవా మిక్కిలి ప్రకాశమానంగా వెలుగొందే జ్యోతివంటి వాడు!
1CH 16:28 పలు వంశీకులారా, సర్వ ప్రజలారా, యెహోవా మహిమను, శక్తిని పొగడండి!
1CH 16:29 యెహోవా మహిమను కొనియాడండి ఆయన నామాన్ని ఘనపర్చండి! మీ అర్పణలను యెహోవా సన్నిధికి తీసుకొని రండి యెహోవాను, అతిశయించిన ఆయన పవిత్ర సౌందర్యాన్ని ఆరాధించండి!
1CH 16:30 భూలోక ప్రజలారా, యెహోవా ముందు గజగజ వణకండి. కాని ఆయన ఈ భూమిని బలంగా నిర్మించాడు; అది కదల్చబడదు.
1CH 16:31 భూలోకం, పరలోకాలు సంతోషంగా వుండును గాక! “యెహోవా పరిపాలిస్తున్నాడు” అని ప్రజలు ప్రతిచోట చెప్పుకొందురు గాక!
1CH 16:32 సముద్రము, దానిలోని ప్రతిదీ ఘోషించుగాక! పొలాలు, వాటిలోనివన్నీ తమ సంతోషాన్ని వెలిబచ్చుగాక!
1CH 16:33 అడవిలోని చెట్లన్నీ యెహోవాముందు ఉల్లాసంగా పాడుతాయి! ఎందువల్లననగా యెహోవా వస్తున్నాడు గనుక. ఆయన ప్రపంచానికి తీర్పు ఇవ్వటానికి వస్తున్నాడు.
1CH 16:34 ఆహా, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించు. ఆయన మంచివాడు! యెహోవా ప్రేమ నిరంతరం కొనసాగుతుంది.
1CH 16:35 “మా సంరక్షకుడవగు ఓ దేవా! మమ్ములను రక్షింపుము! మమ్ము ఒక దగ్గరికి చేర్చి మమ్మల్ని పరాయి రాజ్యాల నుండి కాపాడుము. అప్పుడు నీ పవిత్ర నామాన్ని మనసార స్తుతించుకోగలుగుతాము. మేము నీకు స్తుతిగీతాలు పాడగలుగుతాము!” అని యెహోవాకు విన్నవించండి.
1CH 16:36 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు సర్వకాల సర్వావస్థలయందు జయమగు గాక! అప్పుడు ప్రజలంతా “ఆమేన్” అన్నారు! యెహోవాను స్తుతించారు!
1CH 16:37 పిమ్మట ఆసాపును, అతని సోదరులను దావీదు ఒడంబడిక పెట్టె ముందు ఉంచాడు. నిత్యం దాని ముందు సేవ చేయటానికి దావీదు వారిని అక్కడ నియమించాడు.
1CH 16:38 ఓబేదెదోమును, మరి అరువది ఎనిమిది మంది లేవీయులను కూడ ఆసాపుతోను, అతని సోదరులతోను కలిసి సేవచేయటానికి దావీదు నియమించాడు. ఓబేదెదోము, హోసా ద్వార పాలకులు. ఓబేదెదోము తెండ్రి పేరు యెదూతూను.
1CH 16:39 యాజకుడైన సాదోకును, గిబియోనులో ఉన్నత స్థలంలో అతనితో కలిసి దేవుని గుడారంలో సేవ చేసిన ఇతర యాజకులను కూడా దావీదు అక్కడ నియమించాడు.
1CH 16:40 దహన బలిపీఠం మీద ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సాదోకు, ఇతర యాజకులు దహన బలులు సమర్పించారు. యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన ధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా వారాపని చేశారు.
1CH 16:41 హేమాను, యెదూతూను, ఇతర యాజకులు పేరు పేరునా ఎంపిక చేయబడి యెహోవాకు స్తుతిగీతాలు పాడటానికి నియమింపబడ్డారు. ఎందువల్లననగా దేవుని ప్రేమ నిరంతరం కొనసాగుతుంది గనుక.
1CH 16:42 హేమాను, యెదూతూను వారితో వుండి బాకాలు వూదుతూ, తాళాలు వాయించారు. దేవునిపై భక్తిగీతాలు పాడేటప్పుడు వారు ఇతర వాద్య విశేషాలను కూడ వాయించేవారు. యెదూతూను కుమారుడు ద్వారాల వద్ద కాపలాకై నియమింపబడ్డాడు.
1CH 16:43 పిమ్మట అందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. దావీదు కూడ తన కుటుంబం వారిని ఆశీర్వదించటానికి ఇంటికి వెళ్లాడు.
1CH 17:1 దావీదు తన కొత్త ఇంట్లో ప్రవేశించాక యాజకుడైన నాతానును పిలిచి ఇలా అన్నాడు: “చూడండి, నేను దేవదారు కలపతో నిర్మించిన ఇంటిలో వుంటున్నాను. కాని దేవుని ఒడంబడిక పెట్టె మాత్రం గుడారంలోనే వుంది! నేను దేవునికి ఒక ఆలయం నిర్మింపదలిచాను.”
1CH 17:2 “నీవు ఏది చేయదలచుకొంటే అది చేయవచ్చు. దేవుడు నీకు తోడై వున్నాడు” అని నాతాను దావీదుకు సమాధానమిచ్చాడు.
1CH 17:3 కాని ఆ రోజు రాత్రి దేవుని వాక్కు నాతానుకు వినిపించింది.
1CH 17:4 యెహోవా ఇలా అన్నాడు: “నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఈ విషయాలు చెప్పు: యెహోవా ఇలా అంటున్నాడు: ‘దావీదూ, నేను నివసించటానికి ఆలయం కట్టించేది నీవు కాదు.
1CH 17:5 ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు నుండి బయటికి తీసుకొని వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు నేను ఒక ఆలయంలో నివసించలేదు. ఇక్కడికీ, అక్కడికీ నేను గుడారంలో వుండి కదలి వెళ్తూనే వున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేక నాయకులను నేను ఎంపిక చేస్తూ వచ్చాను. ఆ నాయకులు నా ప్రజలకు గొర్రెల కాపరులవలె వున్నారు. ఇశ్రాయేలులో నేను ఒక చోటినుండి మరియొక చోటికి వెళ్లెటప్పుడు ఆ నాయకులెవ్వరితోనూ, మీరు నాకు దేవదారు కలపతో ఒక ఆలయాన్ని ఎందుకు కట్టలేదు? అని నేను అనలేదు.’
1CH 17:7 “కనుక, ఇప్పుడు ఈ విషయాలు నా సేవకుడైన దావీదుకు చెప్పుము: సర్వశక్తిమంతుడగు యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘పొలాల్లో గొర్రెల మందలను కాస్తున్న నిన్ను నేను తీసుకొన్నాను. నా ప్రజలకు నిన్ను రాజుగా చేశాను.
1CH 17:8 నీవు వెళ్లిన ప్రతిచోటా నేను నీతో వున్నాను. నీకు ముందుగా నేను నడిచాను. నీ శత్రువులను సంహరించాను. నిన్ను ఇప్పుడు ఈ భూమిమీద మిక్కిలి ప్రముఖ వ్యక్తిగా చేసాను.
1CH 17:9 ఈ ప్రదేశాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాను. వారు తమ మొక్కలను నాటుతారు. వారి చెట్లక్రింద వారు ప్రశాంతంగా కూర్చుంటారు. ఇక ఏ మాత్రం వారు అవస్థపడవలసిన అవసరం లేదు. దుష్టులెవ్వరూ ఇకమీదట పూర్వంవలె వారిని బాధించరు.
1CH 17:10 ప్రమాదాలు సంభవించినందువల్లనే నా ప్రజలైన ఇశ్రాయేలీయుల సంరక్షణకై నేను నాయకులను ఎంపిక చేశాను. నేనింకా నీ శత్రువులను ఓడిస్తాను. “‘యెహోవా నీకు ఒక నివాసం ఏర్పాటు చేయునని నేను నీకు చెప్పుచున్నాను.
1CH 17:11 నీవు చనిపోయి నీ పూర్వీకులను చేరినప్పుడు నీ సంతానాన్ని నూతన రాజుగా చేస్తాను. కొత్త రాజు నీ కుమారులలో ఒకడవుతాడు. అతని రాజ్యాన్ని నేను బలపర్చుతాను.
1CH 17:12 నీ కుమారుడు నాకొక ఆలయం కట్టిస్తాడు. నీ కుమారుని సంతానం సదా పరిపాలించేలా నేను చేస్తాను.
1CH 17:13 నేను అతనికి తండ్రిలా వుంటాను. అతను నాకు బిడ్డలా వుంటాడు. నీకు ముందు సౌలు రాజుగా వున్నాడు. సౌలుకు నా మద్దతును ఉపసంహరించుకున్నాను. కాని నీ కుమారుని మాత్రం నేను సదా ప్రేమిస్తాను
1CH 17:14 ఎప్పటికీ అతని అధీనంలో నా ఆలయాన్ని, ఈ రాజ్యాన్ని వుంచుతాను. అతని పాలన శాశ్వతంగా కొనసాగుతుంది!’”
1CH 17:15 తనకు కల్గిన దైవ దర్శనాన్ని గురించి, దేవుడు చెప్పిన విషయాలన్నిటి గురించి దావీదుకు నాతాను వివరింగా చెప్పాడు.
1CH 17:16 అది విన్న రాజైన దావీదు పవిత్ర గుడారంలోకి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా దేవా, నీవు నాకు, నా కుటుంబానికి ఎంతో మేలు చేశావు! కారణం మాత్రం నాకు తెలియదు.
1CH 17:17 వాటన్నిటికీ మంచి, భవిష్యత్తులో నా కుటుంబానికి ఏమి జరుగుతుందో కూడ నీవు నాకు తెలియపర్చావు. నన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నీవు పరిగణించావు!
1CH 17:18 నేను ఇంతకంటే ఏమి చెప్పగలను? నీవు నాకు ఎంతో చేసావు! కేవలం నేను నీ సేవకుడను. అది నీకు తెలుసు!
1CH 17:19 యెహోవా, ఈ అద్భుత క్రియ నీవు నాపట్ల జరిపించావు. నీవు సంకల్పించావు గనుక నీవది చేసావు!
1CH 17:20 నీవంటి దేవుడు మరొక్కడు లేడు ప్రభూ! నీవు తప్ప వేరొక దేవుడు లేడు! ఈ విధంగా మరేదైవం అద్భుత కార్యాలు జరిపించినట్లు మేము వినలేదు!
1CH 17:21 ఇశ్రాయేలు వంటి మరో దేశం వున్నదా? లేదు! ఈ అద్భుతకార్యాలు నీవు జరిపించిన దేశం భూమి మీద ఇశ్రాయేలు ఒక్కటే. నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి మాకు స్వేచ్ఛ కలుగజేశావు. ఆ విధంగా నీ ఘనతను చాటావు! నీ ప్రజలకు ముందుగా నీవు నడిచి అన్యులు మా కొరకు వారి రాజ్యాన్ని విడిచి పోయేలా చేశావు!
1CH 17:22 ఇశ్రాయేలును నీవు స్వీకరించి శాశ్వతంగా వారిని నీ ప్రజలుగా చేసుకొన్నావు. ప్రభువా, నీవు వారికి దేవుడవై యున్నావు!
1CH 17:23 “యెహోవా నాకు, నా కుటుంబానికి నీవు ఈ వాగ్దానం చేశావు. సదా నీ మాట నిలబెట్టుకో. దేవా! నీవు చేస్తానని చెప్పినదంతా జరిగేలా చెయ్యి!
1CH 17:24 నీవు నమ్మతగిన వాడవని నిరూపించు తండ్రీ! ప్రజలు నీ పేరును ఎల్లప్పుడూ గౌరవించుదురుగాక! అప్పుడు సర్వశక్తుడగు యెహోవా ఇశ్రాయేలు దైవమని ప్రజలు అంటారు! నేను నీ సేవకుడను! దయచేసి నా కుటుంబాన్ని బలపర్చి, నీ సన్నిధిలో వర్థిల్లేలా చేయి.
1CH 17:25 “నా దేవా, నీవు నాకొక నివాసం ఏర్పాటు చేస్తాను అని అన్నావు. అందుచే నీ సేవకుడనైన నేను మనోధైర్యము కలిగివున్నాను. అందుచే నేను నిన్ను ఈ సంగతులను చేయమని అడుగుతున్నాను.
1CH 17:26 యెహోవా, నీవే దేవుడవు, ఈ మేలు చేస్తానని నీవు నాకు వాగ్దానం చేశావు.
1CH 17:27 యెహోవా, నా కుటుంబాన్ని దీవించటంలో నీవు చాలా ఉదారంగా వ్యవహరించావు! నీ సన్నిధిలో నా కుటుంబం సదా మెలగుతుందని నీవు అన్నావు. నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించావు. యెహోవా, నా కుటుంబం ఎల్లవేళలా నీ ఆశీర్వాదం పొందుతుంది.”
1CH 18:1 తరువాత దావీదు ఫిలిష్తీయులపైకి దండెత్తి వారిని ఓడించాడు. ఫిలిష్తీయులనుండి గాతు నగరాన్ని, దాని చుట్టు ప్రక్కలనున్న పట్టణాలను వశపర్చుకున్నాడు.
1CH 18:2 పిమ్మట దావీదు మోయాబు దేశాన్ని ఓడించాడు. మోయాబీయులు దావీదుకు దాసులయ్యారు. వారు బంగారం, ఇతర కానుకలను దావీదుకు కప్పంగా చెల్లించారు.
1CH 18:3 హదదెజెరు సైన్యంతో కూడ దావీదు యుద్ధం చేశాడు. సోబా రాజు హదదెజెరు. ఆ సైన్యంలో దావీదు హమాతు పట్టణం వరకు యుద్ధం నిర్వహించాడు. దావీదు అలా ఎందుకు యుద్ధం చేశాడనగా హదదెజెరు తన సామ్రాజ్యాన్ని యూఫ్రటీసు నదివరకు విస్తరింపచేయటానికి ప్రయత్నించాడు.
1CH 18:4 హదదెజెరుకు చెందిన వెయ్యి రథాలను, ఏడువేల రథసారధులను, ఇరవైవేల మంది కాల్బలాన్ని దావీదు వశపర్చుకున్నాడు. హదదెజెరుకు చెందిన రథాల గుర్రాలలో చాలా వాటి కాళ్లను దావీదు విరుగగొట్టాడు. కాని వందరథాలను లాగటానికి కావలసినన్ని మంచి గుర్రాలను మాత్రం దావీదు రక్షించాడు.
1CH 18:5 దమస్కు నగరంలోని అరామీయులు (సిరియనులు) హదదెజెరుకు సహాయపడే నిమిత్తం వచ్చారు. హదదెజెరు సోబారాజు. కాని దావీదు వారిని ఓడించి ఇరవై రెండు వేల సిరియను సైనికులను చంపివేశాడు.
1CH 18:6 తరువాత దావీదు అరాము దేశంలోగల దమస్కు నగరంలో తన సైనిక స్థావరాలు నెలకొల్పాడు. అరామీయులు దావీదుకు సేవకులై కప్పం చెల్లించారు. ఆ విధంగా దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయాన్ని చేకూర్చాడు.
1CH 18:7 హదదెజెరు సైన్యాధికారుల నుండి బంగారు డాళ్లను దావీదు తీసుకొని యెరూషలేముకు తెచ్చాడు.
1CH 18:8 తెబహు (టిబ్హతు), కూను పట్టణాల నుండి దావీదు చాలా కంచును పట్టుకువచ్చాడు. ఈ పట్టణాలు హదదెజెరుకు చెందినవి. తరువాత కాలంలో లోహాన్నే సొలొమోను ఆలయానికి, కంచు సముద్రం, కంచు స్తంభాలు, ఇతర వస్తు సామగ్రి చేయటానికి వినియోగించాడు.
1CH 18:9 హమాతు రాజు పేరు తోహూ. సోబారాజు పేరు హదదెజెరు. హదదెజెరు సైన్యాన్నంతా దావీదు ఓడించాడని తోహూ విన్నాడు.
1CH 18:10 తోహూ తన కుమారుడైన హదోరమును రాజైన దావీదు వద్దకు తాను శాంతి కోరుతున్నట్లు, తనను దీవించమని అడగటానికి పంపాడు. హదదెజెరుతో దావీదు యుద్ధం చేసి అతనిని ఓడించిన సందర్భంగా తోహూ ఇది చేసాడు. ఇంతకు ముందు తోహూ కూడ హదదెజెరుతో యుద్ధం చేసియున్నాడు. హదోరము తనతో వెండి, బంగారం, కంచు లోహాలతో చేసిన రకరకాల వస్తువులు దావీదుకు కానుకలుగా తీసుకొని వెళ్లి ఇచ్చాడు.
1CH 18:11 రాజైన దావీదు ఆ వస్తువులన్నిటినీ పవిత్రపరచి యెహోవాకు సమర్పించాడు. పైగా ఎదోము, మోయాబుల నుండి, అమ్మోనీయుల నుండి, ఫిలిష్తీయులనుండి, అమాలేకీయుల నుండి తెచ్చిన వెండి బంగారాలను కూడ దావీదు యెహోవాకి సమర్పించాడు.
1CH 18:12 సెరూయా కుమారుడైన అబీషై “ఉప్పులోయ” అని పిలవబడే స్థలంలో పద్దెనిమిదివేల ఎదోమీయులను చంపివేసాడు.
1CH 18:13 ఎదోములో అబీషై సైనిక స్థావరాలు కూడ ఏర్పాటు చేసాడు. ఎదోమీయులంతా దావీదుకు సేవకులయ్యారు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయం చేకూర్చి పెట్టాడు.
1CH 18:14 ఇశ్రాయేలంతటికీ దావీదు రాజు. ప్రతి పౌరునికీ ఏది మంచిదో, న్యాయమైనదో దావీదు వారికి అది చేశాడు.
1CH 18:15 సెరూయా కుమారుడు యోవాబు దావీదు సైన్యానికి అధిపతి. అహీలూదు కుమారడైన యెహోషాపాతు దావీదు చేసిన విషయాలన్నీ గ్రంథ రూపంలో రాశాడు.
1CH 18:16 సాదోకు, అబీమెలెకు యాజకులు. సాదోకు తండ్రి పేరు అహీటూబు. అబీమెలెకు తండ్రి అబ్యాతారు. షవ్షా లేఖకుడు.
1CH 18:17 కెరేతీయులకు, పెలేతీయులకు (రాజు అంగరక్షకులు) నాయకుడుగా బెనాయా నియమితుడయ్యాడు. బెనాయా తండ్రి పేరు యెహోయాదా. దావీదు కుమారులు ముఖ్యవ్యక్తులై దావీదు రాజుకు సహాయకులుగా వున్నారు.
1CH 19:1 అమ్మోనీయుల రాజు పేరు నాహాషు. నాహాషు చనిపోగా అతని కుమారుడు నూతన రాజయ్యాడు.
1CH 19:2 ఇది విన్న దావీదు, “నాహాషు నాపట్ల చాలా దయతో వున్నాడు. నేను కూడ నాహాషు కుమారుడు హానూను పట్ల దయగలిగి వుంటాను” అని అన్నాడు. కావున తన తండ్రి చనిపోయిన సందర్భంగా హనూనును పలకరించే నిమిత్తం దావీదు తన మనుష్యులను పంపాడు. హానూనును ఓదార్చటానికి దావీదు దూతలు మోయాబు దేశానికి వెళ్లారు.
1CH 19:3 అమ్మోనీయుల పెద్దలు హానూనుతో ఇలా అన్నారు: “నీవు మోసంలో పడవద్దు. దావీదు నిజంగా నిన్ను ఓదార్చటానికి గాని, చనిపోయిన నీ తండ్రి పట్ల గౌరవభావంతో గాని తన మనుష్యులను పంపలేదు! దావీదు తన మనుష్యులను కేవలం నీమీద, నీ రాజ్యం మీద నిఘావేసి రహస్యాలను సేకరించటానికే పంపాడు. నిజానికి దావీదు నీ రాజ్యాన్ని నాశనం చేయ సంకల్పించాడు.”
1CH 19:4 దానితో దావీదు మనుష్యులను హానూను బంధించి వారి గడ్డాలు గొరిగించాడు. తొడల దగ్గర వారి బట్టలు కూడ హానూను కత్తిరించాడు. తరువాత వారిని పంపివేశాడు.
1CH 19:5 దావీదు మనుష్యులు ఆ పరిస్థితిలో ఇంటికి వెళ్లటానికి సిగ్గుతో చాలా బాధపడ్డారు. అది చూసిన కొంత మంది మనుష్యులు దావీదు వద్దకు వెళ్లి అతని మనుష్యులకు జరిగిన అవమానాన్ని తెలియజేశారు. అది విన్న దావీదు తన మనుష్యులకు ఇలా కబురు పంపాడు: “మీ గడ్డాలు పెరిగే వరకు మీరు యెరికో పట్టణంలో వుండండి. తరువాత మీరు ఇండ్లకు తిరిగిరండి.”
1CH 19:6 ఇది జరిగిన పిమ్మట అమ్మోనీయులు తాము దావీదుకు బద్ధశత్రువులైనట్లు గుర్తించారు. దానితో హానూను, అమ్మోనీయులు డెబ్బై ఐదువేల పౌనుల (రెండువేల మణుగులు) వెండిని వెచ్చించి మెసపొతేమియా (అరామ్నహరయీము) నుండి రథాలను, రథసారధులను కొన్నారు. వారింకా అరాములోని మయకా, సోబా నగరాల నుండి కూడ రథాలను, వాటిని తోలే వారిని సేకరించారు.
1CH 19:7 అమ్మోనీయులు ముప్పది రెండువేల రథాలను కొన్నారు. వారు మయకా రాజుకు, అతని సైన్యానికి కొంత సొమ్ము చెల్లించి వారి సహాయాన్ని కూడ అర్థించారు. మయకా రాజు, అతని సైనికులు వచ్చి మెదెబా పట్టణం వద్ద గుడారాలు వేశారు. అమ్మోనీయులు తమ పట్టణాల నుండి బయటకు వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు.
1CH 19:8 అమ్మోనీయులు యుద్ధానికి సిద్ధమవుతున్నారని దావీదు విన్నాడు. అతను యోవాబను, ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ అమ్మోనీయులను ఎదుర్కోటానికి పంపాడు.
1CH 19:9 అమ్మోనీయులంతా బహిరంగంగా వచ్చి యుద్ధానికి సిద్ధంగా వున్నారు. వారు నగర ద్వారం వద్ద వున్నారు. వారికి సహాయంగా వచ్చిన రాజులు వారి సేవలతో బయట పొలాలలో దిగియుండిరి.
1CH 19:10 తనపై యుద్ధం చేయటానికి రెండు సైనిక కూటాలవారు సిద్ధంగా వున్నట్లు యోవాబు చూశాడు. ఒక వర్గం తనముందు, రెండవ వర్గం తన వెనుక వున్నాయి. అప్పుడు యోవాబు ఇశ్రాయేలు సైన్యంలో కాకలు తీరిన వారిని కొంతమందిని ఎంపిక చేశాడు. వారిని అరాము సైన్యంతో పోరాడటానికి పంపాడు.
1CH 19:11 యోవాబు మిగిలిన ఇశ్రాయేలు సైన్యాన్ని అబీషై అధీనంలో వుంచాడు. యోవాబు సోదరుడే అబీషై. ఆ సైనికులు అమ్మోనీయుల సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్లారు.
1CH 19:12 అబీషైతో యోవాబు ఇలా అన్నాడు: “అరాము సైన్యం గనుక నామీద పైచేయిగా వుంటే నీవు నాకు సహాయంగా రావాలి. ఒకవేళ అమ్మోనీయుల సైనికులు గనుక నీ శక్తికి మించివుంటే నేను నీకు సహాయంగా వస్తాను.
1CH 19:13 మన ప్రజల కొరకు, మన దేవుని నగరాల కొరకు పోరాడే ఈ తరుణంలో మనం చాలా ధైర్యంగా వుండాలి! యెహోవా ఏది మంచిదని తలుస్తాడో దానిని ఆయన చేయుగాక!”
1CH 19:14 యోవాబు, అతని సైనికులు కలిసి అరాము నుండి వచ్చిన సైన్యాన్ని ఎదుర్కొన్నారు. అరాము సైన్యం యోవాబు సైనికుల ధాటికి తట్టుకోలేక పారిపోయింది.
1CH 19:15 అరాము సైన్యం పారిపోవటం అమ్మోను సైనికులు చూసి, వారు కూడ పారిపోయారు. వారు అబీషైకి, అతని సైన్యానికి జడిసి పారిపోయారు. అమ్మోనీయులు తమ నగరంలోకి వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
1CH 19:16 ఇశ్రాయేలు తమను ఓడించినట్లు అరాము నాయకులు అర్థం చేసుకున్నారు. యూఫ్రటీసు నదికి తూర్పున నివసిస్తున్న అరామీయులను సహాయంగా రమ్మని వారు కబురు పంపారు. అరాముకు చెందిన హదదెజెరు సైన్యానికి షోపకు అధిపతి. అరాములో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సైన్యాలను కూడ షోపకు నడిపించాడు.
1CH 19:17 అరాము ప్రజలు యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త దావీదు విన్నాడు. అందువల్ల దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమీకరించాడు. దావీదు వారిని యోర్దాను నదిని దాటించాడు. వారు అరామీయులకు ఎదురుపడి నిలబడ్డారు. దావీదు తన సైన్యాన్ని యుద్ధానికి సమాయత్తపరచి అరామీయులతో తలపడ్డాడు.
1CH 19:18 ఇశ్రాయేలీయుల నుండి అరామీయులు పారిపోయారు. దావీదు, అతని సైనికులు కలిసి ఏడువేల మంది అరాము రథసారధులను, నలుబదివేల మంది అరాము సైనికులను చంపివేశారు.
1CH 19:19 ఇశ్రాయేలీయులు తమను ఓడించారని హదదెజెరు సైన్యాధికారులు తెలుసుకొని, దావీదుతో సంధి చేసుకొన్నారు. వారు దావీదుకు సేవకులయ్యారు. అటు తరువాత అరామీయులు ఎన్నడూ అమ్మోనీయులకు సహాయం చేయలేదు.
1CH 20:1 ఆ తరువాత సంవత్సరం (వసంత కాలం) లో యోవాబు ఇశ్రాయేలు సైన్యాన్ని యుద్ధానికి నడిపాడు. సంవత్సరంలో అది రాజులు దండ యాత్రలు చేయటానికి అనువైన సమయం. కాని దావీదు మాత్రం యెరూషలేములోనే వున్నాడు. ఇంతలో ఇశ్రాయేలు సైన్యం అమ్మోను రాజ్యం మీదికి దండెత్తి, దానిని నాశనం చేసింది. పిమ్మట వారు రబ్బా నగరానికి వెళ్లారు. వారు నగరాన్ని చుట్టుముట్టి, ప్రజల రాకపోకలు నిలిపివేసారు. యోవాబు, ఇశ్రాయేలు సైనికులు రబ్బా నగరం నాశనమయ్యే వరకు దానిపై దాడిచేసారు.
1CH 20:2 తరువాత దావీదు వచ్చి ఆ రాజు తలపై కిరీటాన్ని తీసుకున్నాడు. ఆ బంగారు కిరీటం డెబ్బై ఐదు పౌనుల (రెండు మణుగుల) బరువుంది. కిరీటంలో విలువైన రత్నాలు పొదగబడ్డాయి. ఆ కిరీటం దావీదు తలపై పెట్టబడింది. రబ్బా నగరం నుండి దావీదు అనేక విలువైన వస్తు సామగ్రిని తెప్పించాడు.
1CH 20:3 రబ్బా నగర వాసులను దావీదు తీసుకొనివచ్చి వారిచే రంపాలతోను, ఇనుప సమ్మెటలతోను, గొడ్డళ్లతోను బలవంతంగా పని చేయించాడు. ప్రతి అమ్మోనీయుల నగరంలోను దావీదు ఈ విధంగానే చేసాడు. తరువాత దావీదు, అతని సైన్యం యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
1CH 20:4 ఇదంతా అయిన పిమ్మట ఇశ్రాయేలు ప్రజలు గెజెరు పట్టణం వద్ద ఫిలిష్తీయులతో తలపడ్డారు. ఈసారి హుషాతీయుడైన సిబ్బెకై సిప్పయి అను వానిని చంపివేసాడు. సిప్పయి ఫిలిష్తీ యోధుల సంతతివాడు. దానితో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు వారికి బానిసలయ్యారు.
1CH 20:5 ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల పైకి మరోసారి యుద్ధానికి వెళ్లారు. యాయీరు కుమారుడైన ఎల్హానాను అనేవాడు లహ్మీని చంపాడు. లహ్మీ అనేవాడు గొల్యాతు సోదరుడు. గొల్యాతు గాతు పట్టణానికి చెందినవాడు. లహ్మీ చేతిలోని ఈటె చాలా పెద్దది. బరువైనది. అది నేతగాని మగ్గం దోనెవలె వుంటుంది.
1CH 20:6 గాతు పట్టణం వద్ద ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు వారు మరొక యుద్ధం చేశారు. ఈ పట్టణంలో చాలా పొడుగైన మనిషి ఒకడున్నాడు. వాని కాళ్లకు, చేతులకు ఇరవై నాలుగు వేళ్లున్నాయి. వాని ప్రతి చేతికి, ప్రతి కాలికి ఆరేసి వేళ్లు చొప్పున వున్నాయి. అతడు కూడ ఫిలిష్తీయుల రెఫాయిము సంతానంలోనివాడే.
1CH 20:7 ఆ మనుష్యుడు ఇశ్రాయేలు వారిని చూచి ఎగతాళి చేసినప్పుడు, యోనాతాను వానిని చంపివేశాడు. యోనాతాను తండ్రి పేరు షిమ్యా. షిమ్యా దావీదుకు సోదరుడు.
1CH 20:8 ఆ ఫిలిష్తీయులంతా గాతు పట్టణానికి చెందిన రెఫాయిము సంతానమే. దావీదు, అతని సేవకులు కలిసి ఆ రాక్షసులనందరినీ చంపివేసారు.
1CH 21:1 ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా సాతాను పనిచేస్తూవున్నాడు. ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలు తీసేటందుకు అతడు దావీదును ప్రోత్సహించాడు.
1CH 21:2 కావున దావీదు యోవాబను, ఇతర ప్రజా నాయకులను పిలిచి ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కపెట్టి ఎంతమంది వున్నారో చెప్పమన్నాడు. “దేశంలో బెయేర్షెబా నుండి దాను పట్టణం వరకు ప్రతి ఒక్కరినీ లెక్కపెట్టి నాకు చెప్పండి. అప్పుడు దేశ జనాభా వివరాలు నాకు తెలుస్తాయి” అని అన్నాడు.
1CH 21:3 కాని యోవాబు ఇలా సమాధానమిచ్చాడు: “యెహోవా తన రాజ్యాన్ని వందరెట్లు అభివృద్ధి చేయుగాక! నా ఏలినవాడా, మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నీ సేవకులు. ఈ పని నీవెందుకు చేయదలిచావు? దీనివల్ల నీవు ఇశ్రాయేలు ప్రజలందరినీ పాపం చేసిన నేరస్థులుగా చిత్రిస్తున్నావు!”
1CH 21:4 కాని రాజైన దావీదు మొండివైఖరి దాల్చాడు. రాజు చెప్పినట్లు యోవాబు చేయక తప్పలేదు. అందువల్ల యోవాబు ఇశ్రాయేలు దేశంలో ప్రజలను లెక్కిస్తూ నలుమూలలా తిరిగాడు. తరువాత యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చి
1CH 21:5 దేశంలో ఎంత జనాభా వున్నదీ దావీదుకు చెప్పాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల యోధులు పదకొండు లక్షల మంది వున్నారు. యూదాలో కత్తి పట్టగల శూరులు నాలుగు లక్షల డెబ్బది వేలమంది వున్నారు.
1CH 21:6 లేవి, బెన్యామీను వంశీయులను మాత్రం యోవాబు లెక్కించలేదు. రాజైన దావీదు ఆజ్ఞ తనకు ఇష్టం లేనిదైనందుననే యోవాబు ఆ వంశీయులను గణించలేదు.
1CH 21:7 దేవుని దృష్టిలో దావీదు గొప్ప తప్పిదం చేశాడు. అందువల్ల దేవుడు ఇశ్రాయేలు శిక్షించాడు.
1CH 21:8 పిమ్మట దేవునితో దావీదు ఇలా విన్నవించుకున్నాడు: “నేను చాలా తెలివితక్కువ పనిచేశాను. ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయించి నేను ఒక మహాపాపం చేశాను. ఇప్పుడు నీ సేవకుడనైన నా తప్పు మన్నించి నా పాపాన్ని తొలగించమని వేడుకుంటున్నాను.”
1CH 21:9 గాదు ఒక దీర్ఘదర్శి (ప్రవక్త), దావీదుకు భవిష్యత్తును చెప్పే మార్గదర్శకుడు. ఒకనాడు గాదుతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు వెళ్లి దావీదుకు ఇలా చెప్పుము: ‘యెహోవా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: నేను నీకు మూడు పద్ధతులు సూచిస్తున్నాను. వాటిలో నీవు ఒక దానిని ఎంపిక చేయాలి. అప్పుడు నీవు కోరిన విధంగా నిన్ను శిక్షిస్తాను.’”
1CH 21:11 ప్రవక్తయగు గాదు తరువాత దావీదు వద్దకు వెళ్లి ఈ విధంగా చెప్పాడు: యెహోవా సెలవిచ్చునదేమనగా, “దావీదూ, నీకు ఏ శిక్ష కావాలో నీవే కోరుకో మూడు సంవత్సరాల కరువు పరిస్థితి, లేక నీ శత్రువులు కత్తిపట్టి మిమ్మల్ని తరుముకుంటూ రాగా మూడు నెలల పాటు మీరు వారి నుండి పారిపోవుట లేక యెహోవా మిమ్మల్ని మూడు రోజులు శిక్షకు గురిచేయుట. అనగా ఈ మూడు రోజుల్లో దేశమంతా భయంకర వ్యాధులు ప్రబలుతాయి. యెహోవా దూత దేశం నలుమూలలా తిరుగుతూ ప్రజానాశనం చేస్తాడు. దావీదూ, దేవుడు ఇప్పుడు నన్ను పంపియున్నాడు. కావున దేవునికి నేను ఏమి సమాధానం చెప్పాలో నిర్ణయించి నీవు నాకు తప్పక తెలియజేయాలి.”
1CH 21:13 అందుకు ప్రవక్తయగు గాదుతో దావీదు ఇలా అన్నాడు: “నేను ఆపదలో వున్నాను. నాకు శిక్ష విధించటానికి వేరొక మనుష్యుని నిర్ణయం నాకు అక్కరలేదు. యెహోవా దయామయుడు. కావున నన్ను ఎలా శిక్షించాలో యెహోవానే నిర్ణయించనీయండి.”
1CH 21:14 అప్పుడు యెహోవా ఇశ్రాయేలంతా భయంకర వ్యాధులు సోకేలా చేశాడు. దానితో డెబ్బయి వేల మంది ప్రజలు చనిపోయారు.
1CH 21:15 యెరూషలేమును నాశనం చేయటానికి దేవుడు ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత యెరూషలేమును నాశనం చేయ మొదలు పెట్టనప్పుడు యెహోవా చూసి బాధపడ్డాడు. అందువల్ల ఇశ్రాయేలును నాశనం చేయకూడదని ఆయన అనుకున్నాడు. ఇశ్రాయేలును నాశనం చేస్తున్న దేవదూతతో యెహోవా. “అది చాలు! ఆపివేయి” అని అన్నాడు. యెహోవాదూత యెబూసీ యుడగు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్ద నిలబడివున్నాడు.
1CH 21:16 దావీదు తలఎత్తి చూడగా యెహోవాదూత ఆకాశంలో కన్పించాడు. దేవదూత తన ఖడ్గాన్ని యెరూషలేము పైకి చాపివున్నాడు. అప్పుడు దావీదు, తదితర పెద్దలు సాష్టాంగ నమస్కారం చేశారు. దావీదు, ఇతర పెద్దలు తమ సంతాపాన్ని తెలియజేసే ప్రత్యేక దుస్తులు ధరించారు.
1CH 21:17 దావీదు యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు: “పాపం చేసిన వాణ్ణి నేను! జనాభా లెక్కలు తీయమని నేనే ఆజ్ఞాపించాను! నేను పొరపాటు చేశాను! కాని ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమి నేరం చేశారు? నా దేవుడైన యెహోవా, నన్ను, నా కుటుంబాన్ని శిక్షించుము! నీ ప్రజలను నాశనం చేస్తున్న మహావ్యాధులను అరికట్టుము!”
1CH 21:18 అప్పుడు యెహోవాదూత ప్రవక్తయగు గాదుతో ఇలా అన్నాడు: “యెహోవాను ఆరాధించటానికి ఒక బలిపీఠం నిర్మించమని దావీదుకు చెప్పుము. యెబూసీయుడగు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్దనే దావీదు ఆ బలిపీఠాన్ని నిర్మించాలి.”
1CH 21:19 గాదు ఆ విషయాలను దావీదుకు తెలియజేశాడు. దావీదు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్దకు వెళ్లాడు.
1CH 21:20 ఒర్నాను గోధుమ పోతపోస్తున్నాడు. అతను తిరిగి చూసి యెహోవా దూతను గమనించాడు. ఒర్నాను నలుగురు కుమారులూ పారిపోయి దాక్కున్నారు.
1CH 21:21 దావీదు ఒర్నాను వద్దకు వస్తున్నాడు. ఒర్నాను తన కళ్లం వదిలి దావీదు వద్దకు వెళ్లి అతని ముందు సాష్టాంగపడ్డాడు.
1CH 21:22 దావీదు ఒర్నానుతో, “నీ నూర్పిడి కళ్లాన్ని నాకివ్వు. ఈ స్థలంలో యెహోవాని ఆరాధించటానికి నేనొక బలిపీఠాన్ని నిర్మిస్తాను. ఈ కళ్లాన్ని పూర్తి ధరకు నాకు అమ్మివేయి. అప్పుడు ఈ భయంకర వ్యాధులు ఆగిపోతాయి” అని చెప్పాడు.
1CH 21:23 ఒర్నాను దావీదుకు ఇలా సమాధానమిచ్చాడు: “ఈ నూర్పిడి కళ్లాన్ని తీసుకొనండి! నీవు నా ఏలినవాడవైన రాజువు. మీరు కోరిన విధంగా చేయండి. చూడండి, దహన బలులుగా సమర్పించటానికి నేను మీకు పశువులను కూడ ఇస్తాను. పీఠం మీద అగ్ని వెలిగించటానికి మీకు కళ్లంలో వేసే బల్ల చెక్కలను కూడ ఇస్తాను. ధాన్యార్పణను చెల్లించటానికి నేను మీకు గోధుమలు కూడ ఇస్తాను. నేను ఇవన్నీ మీకు ఇస్తాను!”
1CH 21:24 కాని దావీదు ఒర్నానుతో ఇలా అన్నాడు: “వద్దు నేను పూర్తి వెలయిచ్చే దీనిని కొనాలి. నీకు చెందినదేదీ నేను తీసుకొని యెహోవాకి ఇవ్వను. నాకు ఊరకనే వచ్చిన దానినేదీ నేను యెహోవాకి అర్పణగా చెల్లించను.”
1CH 21:25 కావున దావీదు ఒర్నానుకు సుమారు ఆరువందల తులాల (పదిహేను పౌనులు) బంగారం ఇచ్చి ఆ స్థలం తీసుకున్నాడు.
1CH 21:26 యెహోవాను ఆరాధించటానికి అక్కడ దావీదు ఒక బలిపీఠం కట్టించాడు. దావీదు దహన బలులు, సమాధాన బలులు సమర్పించాడు. దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఆకాశం నుండి అగ్నిని కిందికి పంపి యెహోవా దావీదు ప్రార్థనను ఆలకించాడు. దహనబలులు ఇచ్చే పీఠం మీదికి అగ్ని దిగింది.
1CH 21:27 అప్పుడు తన కత్తిని ఒరలో పెట్టుమని యెహోవా తన దూతకు ఆజ్ఞాపించాడు.
1CH 21:28 యెహోవా ఒర్నాను కళ్లంలో తన ప్రార్థన ఆలకించాడని దావీదు తెలుసుకొని ఆయనకు బలులు సమర్పించాడు.
1CH 21:29 (పవిత్ర గుడారం, దహనబలుల బలిపీఠం గిబియోనులో ఎత్తైన స్థలంలో వున్నాయి. ఇశ్రాయేలీయులు ఎడారిలో వున్నప్పుడు మోషే ఈ పవిత్ర గుడారాన్ని తయారు చేశాడు.
1CH 21:30 దావీదు భయపడిన కారణంగా అతను పవిత్ర గుడారంలోకి వెళ్లి దేవునితో మాట్లాడలేక పోయాడు. దావీదు యెహోవా దూతకు, అతని కత్తికి భయపడ్డాడు.)
1CH 22:1 “యెహోవా దేవుని ఆలయం మరియు దహనబలులకు బలిపీఠం ఇశ్రాయేలు ప్రజల ఉపయోగార్థం ఇక్కడ నిర్మింపబడతాయి” అని దావీదు అన్నాడు.
1CH 22:2 ఇశ్రాయేలులో వుంటున్న అన్యజాతి వారందరినీ ఒకచోట చేరుమని దావీదు ఉత్తరువు ఇచ్చాడు. వారిలో నుండి రాళ్లు కొట్టే వారిని ఎంపిక చేశాడు. దేవాలయ నిర్మాణానికి రాళ్లు చెక్కి సిద్ధం చేయటం వారి పని.
1CH 22:3 దేవాలయ ద్వారపు తలుపులకు, బందులకు, మేకులకు కావలసిన ఇనుమును దావీదు సేకరించాడు. బరువు తూకం వేయలేనంత కంచును కూడ దావీదు సమకూర్చాడు.
1CH 22:4 దావీదు ఇంకా లెక్కలేనన్ని దేవదారు దూలాలను కూడా తెప్పించాడు. సీదోను, తూరు నగర ప్రజలు దావీదుకు చాలా దేవదారు కలప పంపారు.
1CH 22:5 దావీదు ఇలా అన్నాడు: “మనం యెహోవాకు ఒక గొప్ప ఆలయం కడదాము. నా కుమారుడు సొలొమోను చిన్నవాడు కావటంతో, అతను నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా నేర్చుకోలేదు. యెహోవా ఆలయం చాలా గొప్పదై వుండాలి. దాని అందచందాలలోను, ఔన్నత్యంలోను ఆ దేవాలయం సాటి రాజ్యాలన్నిటిలోను మేటిదై వుండాలి. అందువల్ల దేవాలయ నిర్మాణానికి అవసరమైన అనేక ఏర్పాట్లు చేస్తాను.” తాను చనిపోయే ముందు దేవాలయ నిర్మాణానికి దావీదు అనేక ఏర్పాట్లు చేశాడు.
1CH 22:6 పిమ్మట దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక ఆలయాన్ని కట్టుమని దావీదు సొలొమోనుకు చెప్పాడు.
1CH 22:7 సొలొమోనుతో దావీదు ఇలా అన్నాడు: “నా కుమారుడా! నా దేవుడైన యెహోవానామమున నేనొక ఆలయం కట్టించాలనుకున్నాను.
1CH 22:8 కాని యెహోవా నాతో, ‘దావీదూ, నీవు చాలా యుద్ధాలు చేసి అనేకమందిని వధించావు. కావున నా పేరుమీద నీవు ఆలయం కట్టించలేవు.
1CH 22:9 కాని నీకొక శాంతి పరుడైన కుమారుడున్నాడు. నీ కుమారునికి శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తాను. తనచుట్టూ వున్న అతని శత్రువులు అతనిని ఏమీ బాధపెట్టరు. అతని పేరు సొలొమోను. సొలొమోను రాజుగా వున్న కాలంలో ఇశ్రాయేలు శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లేలా చేస్తాను.
1CH 22:10 నా పేరు మీద సొలొమోను ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. సొలొమోను నా కుమారినిలా వుంటాడు. నేనతనికి తండ్రిలా వ్యవహరిస్తాను. నేను సొలొమోను రాజ్యాన్ని బలపరుస్తాను. పైగా అతని కుటుంబంలో నుండి ఎవ్వరో ఒక్కరు శాశ్వతంగా రాజవుతూనే వుంటారు!’”
1CH 22:11 దావీదు ఇంకా ఇలా అన్నాడు: “కుమారుడా ఇప్పుడు యెహోవా నీకు తోడై వుండుగాక! యెహోవా నీవు నిర్మిస్తావని చెప్పినట్లు, దేవాలయ నిర్మాణంలో నీవు విజయం సాధించెదవుగాక!
1CH 22:12 యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను సమర్థవంతంగా పాలించే విధంగా యెహోవా నీకు తెలివితేటలు, అవగాహన యిచ్చు గాక! నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించు.
1CH 22:13 ఇశ్రాయేలు సంక్షేమం కొరకు దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, నియమాలను నీవు పాటించే జాగ్రత్త తీసుకొంటే, నీవు విజయం సాధిస్తావు. నీవు శక్తిమంతుడవై, ధైర్యంగావుండు. నీవు భయ పడవద్దు.
1CH 22:14 “సొలొమోనూ! యెహోవా ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయటంలో నేను చాలా కష్టపడ్డాను. నేను రెండు మణుగుల (మూడువేల ఏడువందల ఏభై టన్నులు) బంగారాన్ని, పదికోట్ల మణుగుల (ముఫై ఏడువేల ఐదువందల టన్నులు) వెండిని, తూకం వేయటానికి సాధ్యం కానంత కంచును, ఇనుమును ఇచ్చాను. కలపను, రాయిని కూడ ఇచ్చాను. సొలొమోనూ, నేనిచ్చిన దానికి తోడు నీవింకా కొంత సామగ్రిని సమకూర్చవచ్చు.
1CH 22:15 నీ వద్ద చాలా మంది రాతిని చెక్కే శిల్పులు, వడ్రంగులు వున్నారు. ప్రతి పనిలోనూ నిపుణులైన వారు నీకున్నారు.
1CH 22:16 బంగారం, వెండి, కంచు, ఇనుము పనులలో నేర్పరులు, అనుభవం వున్న వారు నీవద్ద వున్నారు. ప్రవీణతగల పనివారు నీ వద్ద లెక్కకు మించి వున్నారు. ఇప్పుడు పని మొదలు పెట్టు. యెహోవా నీకు తోడై ఉండుగాక!”
1CH 22:17 తరువాత ఇశ్రాయేలు పెద్దలందరికీ తన కుమారుడు సొలొమోనుకు సహాయపడుమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు.
1CH 22:18 ఆ పెద్దలందరికీ దావీదు యిలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా మీతో వున్నాడు. ఆయన మీకు శాంతి నెలకొన్న కాలాన్ని ప్రసాదించాడు. మన చుట్టూ వున్న దేశాలను ఓడించేలా యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవా, ఆయన ప్రజలు ఇప్పుడీ దేశంమీద ఆధిపత్యం వహించి వున్నారు.
1CH 22:19 యెహోవా సంకల్పం నెరవేరటానికి మీరంతా హృదయపూర్వకంగా ఆయనకు అంకితమవ్వండి. యెహోవా దేవునికి పవిత్ర ఆలయాన్ని నిర్మించండి. యెహోవా పేరున ఆలయ నిర్మాణం చేయండి. పిమ్మట ఒడంబడిక పెట్టెను, ఇతర పవిత్ర పరికరాలను ఆలయంలోకి తీసుకురండి.”
1CH 23:1 దావీదు ముసలివాడయ్యాడు. అందువల్ల అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలుకు కొత్త రాజుగా చేసాడు. సొలొమోను దావీదు కుమారుడు.
1CH 23:2 ఇశ్రాయేలు పెద్దలందరినీ దావీదు పిలిపించాడు. అతడు యాజకులను, లేవీయులను కూడ పిలిచాడు.
1CH 23:3 లేవీయులలో ముఫైయేండ్ల వారిని, అంతకు పైబడిన వయస్సు వారిని దావీదు లెక్కించాడు. ఆ లేవీయులు మొత్తం ముప్పై ఎనిమిది వేలమంది వున్నారు.
1CH 23:4 దావీదు ఇలా చెప్పాడు: “ఇరవై నాలుగు వేలమంది లేవీయులు దేవాలయ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆరువేల మంది రక్షక భటులుగాను, న్యాయాధిపతులుగాను వ్యవహరిస్తారు.
1CH 23:5 నాలుగు వేల మంది లేవీయులు ద్వారపాలకులుగా పనిచేస్తారు. మరి నాలుగు వేలమంది లేవీయులు ఆలయ గాయకులుగా వుంటారు. వారికొరకు నేను ప్రత్యేక వాద్యపరికరాలను సిద్ధం చేశాను. వారా వాద్య విశేషాలను యెహోవాను స్తుతించటానికి వినియోగిస్తారు.”
1CH 23:6 దావీదు లేవీయులను మూడు వర్గాలుగా విభజించాడు. ఆ మూడు వర్గాలకు లేవీ ముగ్గురు కుమారులు ఆధిపత్యం వహించారు. గెర్షోను, కహాతు, మెరారి అని ఆ ముగ్గురు కుమారుల పేర్లు.
1CH 23:7 లద్దాను, షిమీ అనేవారు గెర్షోను వంశంలోని వారు.
1CH 23:8 లద్దానుకు ముగ్గురు కుమారులు. అతని పెద్ద కుమారుని పేరు యెహీయేలు. అతని మిగిలిన కుమారుల పేర్లు జేతాము, యోవేలు.
1CH 23:9 షిమీ కుమారులు షెలోమీతు, హజీయేలు, హారాను అనువారు. ఈ ముగ్గురు కుమారులు లద్దాను వంశంలో పెద్దలు.
1CH 23:10 షిమీకి మరి నలుగురు కుమారులు. వారి పేర్లు యహతు, జీజా, యూషు, బెరీయా.
1CH 23:11 యహతు పెద్ద కుమారుడు. జీజా రెండువవాడు. కాని యూషుకు, బెరీయాకు ఎక్కువ మంది పిల్లలు లేరు. కావున యూషు, బెరీయా లిరువురూ ఒకే కుటుంబంగా పరిగిణింపబడ్డారు.
1CH 23:12 కహాతుకు నలుగురు కుమారులు. వారు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
1CH 23:13 అమ్రాము కుమారుల పేర్లు అహరోను, మోషే. అహరోను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా చూడబడ్డాడు. అహరోను, అతని సంతతి వారు ఎల్లకాలమూ ప్రత్యేకమైన వ్యక్తులుగానే ఎంపిక చేయబడ్డారు. వారు శాశ్వత ప్రాతిపదికపై యాజకులుగా వుండటానికి ప్రత్యేకింపబడ్డారు. అందువల్లనే వారు శాశ్వతంగా వేరుచేయబడ్డారు. అహరోను, అతని సంతతి వారు యెహోవా ముందు ధూపం వేయటానికి నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. ఎల్లకాలమూ యెహోవా పేరుమీద వారు ప్రజలను ఆశీర్వదించటానికి ఎంపిక చేయబడ్డారు.
1CH 23:14 మోషే దైవజనుడు. మోషే కుమారులు కూడ లేవి వంశానికి చెందినవారుగానే పరిగణింపబడ్డారు.
1CH 23:15 గెర్షోము, ఎలీయెజెరు అనువారు మోషే కుమారులు.
1CH 23:16 గెర్షోము పెద్ద కుమారుని పేరు షూబాయేలు.
1CH 23:17 ఎలీయెజెరు మొదటి కుమారుని పేరు రెహబ్యా. ఎలీయెజెరుకు కుమారులు మరెవ్వరూ లేరు. కాని రెహబ్యాకు మాత్రం చాలామంది కుమారులు కలిగారు.
1CH 23:18 ఇస్హారు పెద్ద కుమారుని పేరు షెలోమీతు.
1CH 23:19 హెబ్రోను పెద్ద కుమారుని పేరు యెరీయా. హెబ్రోను రెండవ కుమారుడు అమర్యా. మూడవవాడు యహజీయేలు. నాల్గవవాని పేరు యెక్మెయాము.
1CH 23:20 ఉజ్జీయేలు పెద్ద కుమారుని పేరు మీకా. రెండవవాడు యెషీయా.
1CH 23:21 మెరారి కుమారులు మహలి, మూషి అనేవారు. మహలి కుమారుల పేర్లు ఎలియాజరు, కీషు.
1CH 23:22 ఎలియాజరు కుమారులు లేకుండగనే మరణించాడు. అతనికి కేవలం కుమార్తెలు మాత్రం వున్నారు. ఎలియాజరు కుమార్తెలు తమ బంధువులనే వివాహమాడారు. కీషు కుమారులు వారి బంధువులు.
1CH 23:23 మూషి కుమారులు మహలి, ఏదెరు, యెరీమోతు అనే ముగ్గురు.
1CH 23:24 లేవి సంతతివారు వారి వారి వంశకర్తలననుసరించి లెక్కింపబడ్డారు. వారు తమ తమ కుటుంబాలకు పెద్దలు. ప్రతి ఒక్కని పేరు పట్టికలో రాయబడింది. అలా ఎంచబడిన వారిలో ఇరవై ఏండ్లవారు, అంతకు పైబడిన వయస్సువారు వున్నారు. వారు దేవాలయంలో సేవ చేశారు.
1CH 23:25 దావీదు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా తన ప్రజలకు శాంతి సమకూర్చిపెట్టాడు. యెహోవా ఇశ్రాయేలులో శాశ్వతంగా వుండటానికి వచ్చాడు.
1CH 23:26 కావున లేవీయులు ఇక మీదట పవిత్ర గుడారాన్ని గాని, దేవుని సేవలో వినియోగించే ఇతర పరికరాలను గాని మోసే పనిలేదు.”
1CH 23:27 దావీదు ఇశ్రాయేలు వారికి లేవి వంశంవారిని లెక్కించుమని చివరిసారిగా ఆజ్ఞ ఇచ్చాడు. వారు లేవీయులలో ఇరవై ఏండ్లు, అంతకు పైబడిన వారిని లెక్కించారు.
1CH 23:28 అహరోను సంతతివారికి లేవీయులు ఆలయంలో యెహోవా సేవలో తోడ్పడేవారు. వారు ఆలయ ఆవరణ, పక్క గదుల పరిశుభ్రత విషయంలో కూడ శ్రద్ధ తీసుకొనేవారు. అన్ని పవిత్ర వస్తువులను అపవిత్రపడకుండ చూసేవారు. ఆ విధంగా దేవాలయంలో సేవ చేయటం వారి పని.
1CH 23:29 ప్రత్యేకంగా తయారుచేసిన రొట్టెను అర్పణగా ఆలయంలో బల్ల మీద వుంచటం వారి బాధ్యత. పిండి తయారు చేయటం, ధాన్యార్పణను చెల్లించటం, పులియనిరొట్టె తయారుచేయటం కూడ వారి బాధ్యత. రొట్టెలుచేసే పెనాలు, రకరకాల కలగలుపు అర్పణల విషయంలో వారు శ్రద్ధ తీసుకొనేవారు. ఆయా ద్రవ్యాల కొలతల విషయంలో కూడ వారు జాగ్రత్త తీసుకొనే వారు.
1CH 23:30 లేవీయులు ప్రతి ఉదయం నిలబడి యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు అర్పించి, స్తుతి పాటలు పాడేవారు. వారలా ప్రతి సాయత్రం కూడ చేసేవారు.
1CH 23:31 ప్రత్యేక విశ్రాంతి దినాలలోను, అమావాస్య విందుల సమయంలోను మరియు ప్రత్యేక సెలవు దినాలలోను లేవీయులు యెహోవాకి దహన బలులు సమర్పించే వారు. వారు నిత్యం యెహోవా సన్నిధిలో సేవ చేసేవారు. ప్రతిసారీ ఎంతమంది లేవీయులు సేవ చేయాలి అనే విషయంలో వారికి ప్రత్యేక నియమాలుండేవి.
1CH 23:32 కావున తాము ఏఏ పనులు చేయాలో అవన్నీ లేవీయులు నిర్వహించేవారు. వారు పవిత్ర గుడారం, పవిత్ర స్థలాల విషయంలో కూడ వారు తగిన జాగ్రత్తలు తీసుకొనేవారు. ఆ విధంగా వారి బంధువులగు అహరోను వంశీయులకు వారు సహాయపడ్డారు. అహరోను సంతతివారెవరనగా యాజకులు, ప్రధాన యాజకులు. ఆలయంలో యెహోవా సేవలో ఈ యాజకులకు లేవీయులు సహాయపడ్డారు.
1CH 24:1 అహరోను వంశంవారు ఎవరనగా: నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
1CH 24:2 కాని నాదాబు, అబీహులిద్దరూ తమ తండ్రి కంటె ముందుగానే చనిపోయారు. పైగా నాదాబు, అబీహులకు కుమారులు కలుగలేదు. కావున ఎలియాజరు మరియు ఈతామారులిద్దరూ యాజకులుగా సేవచేశారు.
1CH 24:3 ఎలియాజరు, ఈతామారు వంశం వారిని దావీదు రెండు గుంపులుగా విభజించాడు. వారి వారి కార్యాలను సక్రమంగా నిర్వహించటానికి వీలుగా దావీదు వారిని రెండు గుంపులుగా ఏర్పాటు చేశాడు. సాదోకు, అహీమెలెకుల సహాయంతో దావీదు ఈ పనిచేశాడు. సాదోకు ఎలియాజరు సంతతివాడు. అహీమెలెకు ఈతామారు సంతతివాడు.
1CH 24:4 ఈతామారు వంశంలో కంటె ఎలియాజరు సంతతివారిలో ఎక్కువమంది నాయకులున్నారు. ఎలియాజరు సంతతి వారిలో పదహారు మంది నాయకులుండగా, ఈతామారు సంతతివారిలో ఎనిమిది మంది నాయకులు మాత్రమే వున్నారు.
1CH 24:5 ప్రతి వంశంలో నుండి మనుష్యులు ఎన్నుకోబడ్డారు. వారు చీట్లు వేసి ఎంపిక నిర్వహించారు. పవిత్ర స్థలాన్ని అధీనంలో వుంచుకొనేందుకు కొంత మందిని ఎన్నుకొన్నారు. మరికొంత మంది యాజకులుగా సేవచేయటానికి ఎంపిక చేయబడ్డారు. వీరంతా ఎలియాజరు, ఈతామారు వంశాలలోని వారు.
1CH 24:6 షెమయా కార్యదర్శి. ఇతడు నెతనేలు కుమారుడు. షెమయా లేవి సంతతివాడు. షెమయా ఆయా సంతతుల వారి పేర్లన్నీ రాశాడు. రాజైన దావీదు ముందు, వారి పెద్దల ముందు అతడు పేర్లు రాశాడు. యాజకుడైన సాదోకు, అహీమెలెకు, యాజకుల కుటుంబాలలో పెద్దలు, ఇతర లేవీయుల పేర్లు వున్నాయి. అబ్యాతారు కుమారుడు అహీమెలెకు. చీట్లు వేసిన ప్రతిసారీ వారొక మనుష్యుని ఎంపిక చేశారు. ఆ మనుష్యుని పేరు షెమయా రాసేవాడు. కావున ఎలియాజరు, ఈతామారు వంశాలలోని మనుష్యుల మధ్య పని విభజన జరిగింది.
1CH 24:7 మొదట ఎంపిక చేయబడినది యెహోయారీబు వంశంవారు. రెండవ చీటీలో యెదాయా వంశం వారు ఎంపిక చేయబడ్డారు.
1CH 24:8 మూడవ వంశం హారీము వారు. నాల్గవ వంశం శెయొరీము వారు.
1CH 24:9 ఐదవ వంశం మల్కీయాకు చెందినది. ఆరవది మీయామిను వంశానికి చెందినది.
1CH 24:10 ఏడవ చీటీ హక్కోజు వంశానికి పడింది. ఎనిమిదవ చీటీలో అబీయా వంశం ఎంపిక చేయబడింది.
1CH 24:11 తొమ్మిదవ చీటీలో యేషూవ వంశం ఎంపిక అయ్యింది. పదవ వంశం షెకన్యాది.
1CH 24:12 పదకొండవ చీటీ ఎల్యాషీబు వంశానికి పడింది. పన్నెండవది యాకీము వంశానికి వచ్చింది.
1CH 24:13 పదమూడవ చీటీలో హుప్పా వంశం ఎంపిక చేయబడింది. పదునాల్గవ చీటీ యెషెబాబు వంశానికి వచ్చింది.
1CH 24:14 పదిహేనవ చీటి బిల్గా వంశానికి పడింది పదహారవ చీటి ఇమ్మేరు వంశం వారికి వచ్చింది.
1CH 24:15 పదిహేడవ చీటి హెజీరు వంశానికి పడింది. పద్దెనిమిదవది హప్పిస్సేను వంశానికి వచ్చింది.
1CH 24:16 పందొమ్మిదవ చీటీలో పెతహయా వంశం వారు ఎన్నుకోబడ్డారు. ఇరవయ్యో చీటి యెహెజ్కేలు వంశానికి వచ్చింది.
1CH 24:17 ఇరవై ఒకటవ చీటి, యాకీను వంశానికి వచ్చింది. ఇరవై రెండవది గామూలు వర్గానికి వచ్చింది.
1CH 24:18 ఇరవై మూడవ చీటి దెలాయ్యా వంశానికి పడింది. ఇరవై నాల్గవది మయజ్యా వంశానికి వచ్చింది.
1CH 24:19 ఈ వంశాల వారంతా ఆలయంలో సేవ చేయటానికి ఎంపిక చేయబడ్డారు. ఆలయపు సేవలో అహరోను ఆదేశ సూత్రాలను వారు పాటించారు. ఆ నియమాలను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అహరోనుకు ఇచ్చాడు.
1CH 24:20 మిగిలిన లేవి సంతతివారి పేర్లు ఇలా వున్నాయి: అమ్రాము సంతానం నుండి షూబాయేలు. షూబాయేలు సంతానం నుండి యెహెద్యాహు.
1CH 24:21 రెహబ్యా వంశం నుండి పెద్దవాడైన ఇష్షీయా.
1CH 24:22 ఇస్హారీ వంశం నుండి షెలోమోతు. షెలోమోతు వంశం నుండి యహతు.
1CH 24:23 హెబ్రోను పెద్ద కుమారుడు యెరీయా. హెబ్రోను రెండవ కుమారుడు అమర్యా. మూడవ వాడు యహజీయేలు. నాల్గవ కుమారుడు యెక్మెయాము.
1CH 24:24 ఉజ్జీయేలు కుమారుడు మీకా. మీకా కుమారుడు షామీరు.
1CH 24:25 మీకా సోదరుడు ఇష్షీ ఇష్షీ కుమారుడు జెకర్యా.
1CH 24:26 మెరారీ సంతతి వారు మహలి, మూషి మరియు అతని కుమారుడైన యహజీయాహు.
1CH 24:27 మెరారి కుమారుడు యహజీయాహునకు షోహాము, జక్కూరు అను కుమారులు గలరు.
1CH 24:28 మహలి కుమారుడు ఎలియాజరు. కాని ఎలియాజరుకు కుమారులు లేరు.
1CH 24:29 కీషు కుమారుడు యెరహ్మెయేలు.
1CH 24:30 మూషి కుమారులు మహలి, ఏదెరు మరియు యెరీమోతు. వారంతా లేవీయుల కుటుంబాలలో పెద్దలు. వారి పేర్లు వారి కుటుంబాల ప్రకారం వ్రాయబడ్డాయి.
1CH 24:31 వారంతా ప్రత్యేక కార్యాలు నిర్వహించటానికి ఎంపిక చేయబడ్డారు. యాజకులైన వారి బంధువుల వలెనే వారుకూడ చీట్లు వేశారు. వారు రాజైన దావీదు, సాదోకు, అహీమెలెకు, యాజకుల, లేవీయుల పెద్దల ముందు చీట్లు వేశారు. వారి వారి పనులకు కేటాయించేటప్పుడు వారి పెద్ద కుటుంబాలకు, చిన్న కుటుంబాలకు ఒకే రీతి చీట్లు వేయబడ్డాయి.
1CH 25:1 దావీదు, సైన్యాధికారులు కలిసి ఆసాపు కుమారులను ప్రత్యేక సేవల కొరకు కేటాయించారు. ఆసాపు కుమారులు హేమాను, యెదూతూను అనేవారు. ప్రవచనాలు చెప్పటం, తంబుర, సితారులను, తాళాలను వాయిస్తూ దేవుని వాక్యం ప్రకటించటం వారి విశేష సేవా కార్యక్రమం. ఈ విధమైన అసాధారణ సేవలో వున్న వారి పేర్లు ఏవనగా:
1CH 25:2 ఆసాపు కుటుంబం నుండి జక్కూరు, యోసేపు, నెతన్యా మరియు అషర్యేలా. రాజైన దావీదు ప్రవచించటానికి ఆసాపును ఎంపికచేశాడు. ఆసాపు తన కుమారులకు నాయకత్వం వహించాడు.
1CH 25:3 యెదూతూను కుటుంబం నుండి గెదల్యా, జెరీ, యెషయా, షిమీ, హషబ్యా, మత్తిత్యా అనువారు ఆరుగురు. యెదూతూను తన కుమారులకు నాయకత్వం వహించాడు. యెదూతూను ప్రవచించటానికి సితారు వాయించే వాడు. యెహోవాకి వందనాలు చెల్లిస్తూ స్తుతి పాటలు పాడేవాడు.
1CH 25:4 దేవుని సేవలో నిమగ్నమైన హేమాను కుమారులైన బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షూబాయేలు మరియు యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయ్యాతా, గిద్దల్తీ, రోమమ్తీయెజెరు, యెష్బెకాషా, మల్లోతి, హోతీరు మరియు మహజీయోతు.
1CH 25:5 వీరంతా హేమాను కుమారులు. హేమాను దీర్ఘదర్శి (ప్రవక్త) హేమానును బలపరుస్తానని దేవుడు మాటయిచ్చాడు. అందువల్ల హేమాను బహు సంతానవంతుడయ్యాడు. దేవుడు హేమానుకు పధ్నాలుగు మంది కుమారులను, ముగ్గురు కుమార్తెలను కలుగజేశాడు.
1CH 25:6 హేమాను తన కుమారులందరినీ ఆలయంలో భక్తి పాట సంకీర్తనలో పాల్గొనేలా చేసాడు. అతని కుమారులంతా తాళాలు, సితారాలు, వీణలు వాయించేవారు. అది వారు ఆలయంలో సేవచేసే పద్ధతి. రాజైన దావీదు వారిని ఎంపిక చేశాడు.
1CH 25:7 వారితో పాటు వారి బంధువులైన లేవి వంశీయులు కూడ పాటలు పాడటంలో శిక్షణ పొందారు. అలా దేవునికి స్తుతి పాటలు పాడటం నేర్చుకున్న వారిలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది వున్నారు.
1CH 25:8 ప్రతి ఒక్కడూ ఏ పని చేయాలో నిర్ణయించటానికి వారు చీట్లు వేసారు. ప్రతి ఒక్కడూ సమానంగా చూడబడ్డాడు. చీట్లు వేయటంలో చిన్న, పెద్ద, గురువు, శిష్యుడు అనే తేడా లేకుండా అంతా సమానంగా చూడబడ్డారు.
1CH 25:9 మొదటిగా ఆసాపు (యోసేపు) కుమారులు, బంధువుల నుండి పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. రెండవ చీటి ద్వారా గెదల్యా కుమారులు, బంధువుల నుండి మొత్తం పన్నెండు మంది ఎంపికైనారు.
1CH 25:10 మూడవ చీటి జక్కూరు పేరున పడగా అతని కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎన్నుకోబడ్డారు.
1CH 25:11 నాల్గవసారి యిజీ కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎన్నుకోబడ్డారు.
1CH 25:12 ఐదవ చీటీ ద్వారా నెతన్యా కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎంపికైనారు.
1CH 25:13 ఆరవ చీటీ ద్వారా బక్కీయాహు కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎన్నుకోబడ్డారు.
1CH 25:14 ఏడవ చీటీ యెషర్యేలా పేరున వచ్చింది. అతని కుమారులు, బంధువులు, పన్నెండుమంది ఎంపికైనారు.
1CH 25:15 ఎనిమిదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ యెషయా కుమారులు, బంధువులు.
1CH 25:16 తొమ్మిదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ మత్తన్యా కుమారులు, బంధువులు.
1CH 25:17 పదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ షిమీ కుమారులు, బంధువులు.
1CH 25:18 పదకొండవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ అజరేలు కుమారులు, బంధువులు.
1CH 25:19 పన్నెండవ చీటి ద్వారా ఎంపికైన పన్నెండు మందీ హష్బయ్యా కుమారులు, బంధువులు.
1CH 25:20 పదమూడవ చీటి ద్వారా ఎంపికైన పన్నెండు మందీ షూబాయేలు కుమారులు, బంధువులు.
1CH 25:21 పధ్నాల్గవ చీటి మత్తిత్యాకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.
1CH 25:22 పదిహేనవ చీటి యెరేమోతుకు వెళ్లింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.
1CH 25:23 పదహారవ చీటీ ద్వారా పన్నెండుగురు ఎంపిక చేయబడ్డారు. వారు హనన్యా కుమారులు, బంధువులు.
1CH 25:24 పదిహేడవ చీటీ ద్వారా పన్నెండుగురు ఎంపిక చేయబడ్డారు. వారు యొష్బెకాషా కుమారులు, బంధువులు.
1CH 25:25 పద్దెనిమిదవ చీటీ ద్వారా ఎంపికైనవారు పన్నెండు మంది. వారు హనానీ కుమారులు, బంధువులు.
1CH 25:26 పందొమ్మిదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ మల్లోతి కుమారులు, బంధువులు.
1CH 25:27 ఇరవయ్యో చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ ఎలీయ్యాతా కుమారులు, బంధువులు.
1CH 25:28 ఇరవై ఒకటో చీటి హోతీరుకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.
1CH 25:29 ఇరవై రెండవ చీటి గిద్దల్తీకి వచ్చింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.
1CH 25:30 ఇరవై మూడవ చీటి మహజీయోతుకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుమంది ఎంపికైనారు.
1CH 25:31 ఇరవై నాల్గవ చీటీ రోమమ్తీయెజెరుకు వచ్చింది. అతని కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎంపికైనారు.
1CH 26:1 కోరహు వంశం నుండి వచ్చిన ద్వారపాలకుల జట్టులు ఏవనగా: మెషెలెమ్యా మరియు అతని కుమారులు, (మెషెలెమ్యా తండ్రి పేరు కోరే. అతడు ఆసాపు వంశంలోని వాడు.)
1CH 26:2 మెషెలెమ్యా సంతానవంతుడు. జెకర్యా పెద్దవాడు. యెదీయవేలు రెండవవాడు. జెబద్యా మూడవవాడు. యత్నీయేలు నాల్గవవాడు.
1CH 26:3 ఏలాము ఐదవ కుమారుడు. యెహోహనాను ఆరవవాడు. ఎల్యోయేనై ఏడవ కుమారుడు.
1CH 26:4 ఓబేదెదోము, అతని కుమారులు. ఓబేదెదోము పెద్ద కుమారుడు షెమయా. యెహోజాబాదు అతని రెండవ కుమారుడు. యోవాహు మూడవవాడు. శాకారు అతని నాల్గవ కుమారుడు. నెతనేలు అయిదవవాడు.
1CH 26:5 అమ్మీయేలు ఆరవవాడు. ఇశ్శాఖారు అతని ఏడవ కుమారుడు. పెయుల్లెతై అతని ఎనిమిదవ కుమారుడు. దేవుడు నిజంగా ఓబేదెదోమును ఆశీర్వదించాడు.
1CH 26:6 ఓబేదెదోము కుమారుడు షెమయా. షెమయాకు కూడ కుమారులున్నారు. తన తండ్రి కుటుంబంలో షెమయా కుమారులంతా ధైర్యంగల సేనానులు కావటంతే వారు నాయకులయ్యారు.
1CH 26:7 షెమయా కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు, ఎలీహు, మరియు సెమక్యా అనేవారు. ఎల్జాబాదు బంధువులు నేర్పరులైన పనివారు.
1CH 26:8 వారంతా ఓబేదెదోము సంతతివారు. వారు, వారి కుమారులు, బంధువులు అంతా పరాక్రమశాలురు. వారు మంచి రక్షక భటులు. ఓబేదెదోము సంతతివారు అరువది ఇద్దరు.
1CH 26:9 మెషెలెమ్యా కుమారులు, బంధువులు పరాక్రమవంతులు. అతని కొడుకులు, బంధువులు కలిసి పద్దెనిమిది మంది వున్నారు.
1CH 26:10 మెరారీ వంశానికి చెందిన ద్వారపాలకులు ఎవరనగా, హోసా పెద్ద కుమారునిగా షిమ్రీ పరిగణింపబడ్డాడు. నిజంగా షిమ్రీ పెద్ద కుమారుడు కాదు. కాని అతని తండ్రి అతనిని పెద్దవాడుగా ఆదరించాడు.
1CH 26:11 హిల్కీయా అతని రెండవ కుమారుడు. టెబల్యాహు అతని మూడవ కుమారుడు. జెకర్యా నాల్గవవాడు. అంతా కలిసి హోసాకు పదముగ్గురు కుమారులు, బంధువులు వున్నారు.
1CH 26:12 వీరు ద్వారపాలకుల జట్ల నాయకులు. వీరి ఇతర బంధువుల వలెనే ద్వారపాలకులకు ఆలయ సేవలో ఒక విశిష్టమైన పద్ధతి వుంది.
1CH 26:13 ప్రతి కుటుంబానికి ఒక ద్వారం కాపలా కొరకు కేటాయించబడింది. ప్రతి కుటుంబానికీ ద్వారాలు నిర్ణయించటానికి చీట్లు వేయబడ్డాయి. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే భేధం పాటించకుండా అంతా సమంగా చూడబడ్డారు.
1CH 26:14 చీట్లు వేయగా తూర్పు ద్వారం షెలెమ్యాకు వచ్చింది. షెలెమ్యా కుమారుడు జెకర్యాకు కూడ చీట్లు వేయబడ్డాయి. జెకర్యా చాలా తెలివైన సలహాదారు. ఉత్తర ద్వారం జెకర్యాకు వచ్చింది.
1CH 26:15 ఓబేదెదోముకు దక్షిణ ద్వారం వచ్చింది. ఓబేదెదోము కుమారులు విలువైన వస్తువులు దాచే ఇంటి కాపలాకై ఎంపిక చేయబడ్డారు.
1CH 26:16 షుప్పీము, హోసా పడమటి ద్వారం కాపలాకు, ఎగువ మార్గంలో వున్న షల్లెకెతు ద్వారం కాపలాకు ఎంపిక చేయబడ్డారు. భటులు ఒకరి పక్కన ఒకరు వరుసగా నిలబడ్డారు.
1CH 26:17 తూర్పుద్వారం వద్ద ప్రతి రోజూ ఆరుగులు లేవీయులు కాపలా వుండేవారు. ఉత్తర ద్వారం వద్ద ప్రతి రోజూ ఐదుగురు లేవీయులు నిలబడేవారు. దక్షిణ ద్వారం వద్ద నలుగురు లేవీయులు నిలబడేవారు. విలువైన వస్తువులు దాచే ఇంటివద్ద ఇద్దరు లేవీయులు కాపలా వుండేవారు.
1CH 26:18 పడమటి సభాస్థానం వద్ద నలుగురు భటులు కాపలా వుండేవారు. సభాస్థానికి వెళ్లే బాటమీద ఇద్దరు భటులు వుండేవారు.
1CH 26:19 ఇవి ద్వారపాలకుల జట్లు. ఆ ద్వారపాలకులు కోరహు (కోరే), మెరారి సంతతివారు.
1CH 26:20 అహీయా లేవీయుల వంశంవాడు. దేవాలయంలో విలువైన వస్తువుల పరిరక్షణ అహీయా బాధ్యత. పవిత్ర వస్తువులు, పరికరాలు వుంచిన స్థలాలను కాపాడటం కూడా అహీయా బాధ్యత.
1CH 26:21 గెర్షోను తెగవారిలో లద్దాను ఒక కుటుంబపు మూలపురుషుడు. యెహీయేలీ అనేవాడు లద్దాను వంశంలో ఒక నాయకుడు.
1CH 26:22 యెహీయేలీ కుమారులు జేతాము, అతని సోదరుడైన యోవేలు. దేవాలయంలో విలువైన వస్తువులన్నిటి పరిరక్షణ వారి బాధ్యత.
1CH 26:23 ఇతర నాయకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను మరియు ఉజ్జీయేలు వంశాల నుండి ఎంపిక చేయబడ్డారు.
1CH 26:24 ఆలయంలో విలువైన వస్తువులపై కాపలా షూబాయేలు బాధ్యత. షూబాయేలు తండ్రి పేరు గెర్షోము. గెర్షోము తండ్రి పేరు మోషే.
1CH 26:25 షూబాయేలు బంధువుల వివరాలు: ఎలీయెజెరు తరపున అతని బంధువులు ఎవరనగా: ఎలీయెజెరు కుమారుడు రెహబ్యా. రెహబ్యా కుమారుడు యెషయా. యెషయా కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు జిఖ్రీ. జిఖ్రీ కుమారుడు షెలోమీతు.
1CH 26:26 షెలోమీతు, అతని బంధువులు ఆలయానికై దావీదు సేకరించిన వస్తువులన్నిటిపై కాపలా వున్నారు. సైన్యాధికారులు కూడ ఆలయానికి విరాళాలు ఇచ్చారు.
1CH 26:27 వారు యుద్ధాలలో శత్రువుల నుండి తీసుకొన్న వస్తువులలో కొన్నింటిని కూడ విరాళంగా ఇచ్చారు. వాటన్నిటినీ వారు యెహోవా ఆలయ నిర్మాణంలో వినియోగించటానికి ఇచ్చారు.
1CH 26:28 షెలోమీతు, అతని బంధువులు కలిసి దీర్ఘదర్శియగు (ప్రవక్త) సమూయేలు, రాజైన సౌలు, నేరు కుమారుడగు అబ్నేరు, సెరూయా కుమారుడైన యోవాబు ఇచ్చిన పవిత్ర వస్తువులన్నిటి సంరక్షణ బాధ్యత కూడా వహించారు. షెలోమీతు, అతని బంధువులు యెహోవాకు ఇచ్చిన పవిత్ర వస్తువులన్నిటి విషయంలో జాగ్రత్త వహించారు.
1CH 26:29 కెనన్యా ఇస్హారు కుటుంబంలోని వాడు. కెనన్యా, అతని కుమారులు మందిరపు బయట బాధ్యతలు స్వీకరించారు. వారు రక్షకభటులుగాను, న్యాయాధిపతులుగాను ఇశ్రాయేలులో వివిధ ప్రాంతాలలో పని చేశారు.
1CH 26:30 హషబ్యా హెబ్రోను కుటుంబంలోని వాడు. హషబ్యా, అతని బంధువులు దేవుని అన్ని కార్యాలలోను; యోర్దాను నదికి పశ్చిమానగల ఇశ్రాయేలులో రాజుగారి పనులలోను శ్రద్ధ తీసుకొనే వారు. హషబ్యా వర్గంలో పదిహేడువేల మంది బలవంతులున్నారు.
1CH 26:31 వారికి యెరీయా పెద్ద అని హెబ్రోను కుటుంబ చరిత్ర తెలుపుతుంది. దావీదు నలుబది ఏండ్లు రాజుగా వున్న కాలంలో తన ప్రజల వంశ చరిత్రలు చూచి బలపరాక్రమాలుగల వారిని, నేర్పరులైన పనివారిని వెదుకమని ఆజ్ఞాపించాడు. అట్టివారిలో కొంతమంది గిలియాదులో గల యాజేరు పట్టణంలో నివసిస్తున్న హెబ్రోను వంశీయులలో వున్నట్లు కనుగొన్నారు.
1CH 26:32 యెరీయాకు రెండువేల ఏడువందల మంది బలవంతులైన, కుటుంబ పెద్దలైన బంధువులున్నారు. యెహోవా కార్యాలు చేయటంలోను, రాజు పనులు చక్కబెట్టటం లోను రూబేనీయుల, గాదీయుల మరియు మనష్షే సగం వంశీయుల పనిని పరిశీలించేందుకు రాజైన దావీదు యెరీయా బంధువులైన ఆ రెండువేల ఏడువందల మందిని నియమించాడు.
1CH 27:1 సైన్యంలో చేరి రాజు సేవలో నిమగ్నమైన ఇశ్రాయేలీయుల వివరణ: ప్రతి సంవత్సరంలోను ప్రతి సమూహం ఒక నెలపాటు తమ విధికి హాజరయ్యేది. రాజును సేవించిన వారిలో వంశాలకు అధిపతులు, శతదళాధిపతులు, సహస్ర దళాధిపతులు, మరియు రక్షక భటులు వున్నారు. ప్రతి సైనిక విభాగంలోను ఇరవైనాలుగు వేలమంది మనుష్యులున్నారు.
1CH 27:2 మొదటి నెలలో మొదటి దళానికి యాషాబాము అధిపతి. యాషాబాము తండ్రి పేరు జబ్దీయేలు. యాషాబాము దళంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులున్నారు.
1CH 27:3 యాషాబాము పెరెజు సంతతివారిలో ఒకడు. యాషాబాము సైనికాధికారులందరికీ మొదటి నెలలో అధిపతి.
1CH 27:4 రెండవ నెలలో సైనిక దళానికి దోదై అధిపతి. అతడు అహూయహు సంతతివాడు (అహోహీయుడు). దోదై విభాగంలో ఇరవై నాలుగువేల మంది ఉన్నారు.
1CH 27:5 మూడవ అధికారి బెనాయా. మూడవ నెలలో బెనాయా సైనికాధికారి. బెనాయా తండ్రి పేరు యెహోయాదా. యెహోయాదా ప్రముఖ యాజకుడు. బెనాయా దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
1CH 27:6 ముప్పది మంది మహా యోధుల్లోగల బెనాయా ఇతడే. వారిని బెనాయా నడిపించాడు. బెనాయా కుమారుడు అమ్మీజాబాదు. బెనాయా దళానికి నిర్వాహకుడుగా వున్నాడు.
1CH 27:7 నాల్గవ అధికారి అశాహేలు. అతడు నాల్గవ నెలలో దళాధిపతి. అశాహేలు యోవాబు సోదరుడు. తరువాత అశాహేలు కుమారుడు జెబద్యా తన తండ్రి స్థానంలో అధిపతి అయ్యాడు. అశాహేలు దళంలో ఇరవైనాలుగు వేలమంది సైనికులు వున్నారు.
1CH 27:8 ఐదవ అధికారి షమ్హూతు. షమ్హూతు ఐదవ నెలలో అధిపతి. షమ్హూతు ఇశ్రాహేతీయుడు. షమ్హూతు విభాగంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
1CH 27:9 ఆరవ అధిపతి ఈరా. ఈరా ఆరవ నెలలో అధిపతి. ఈరా తండ్రి పేరు ఇక్కెషు. ఇక్కెషు తెకోవ పట్టణంవాడు. ఈరా విభాగంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
1CH 27:10 ఏడవ అధిపతి హేలెస్సు. హేలెస్సు ఏడవ నెలలో అధిపతి. అతడు పెలోనీయుడు. ఎఫ్రాయిము సంతతికి చెందినవాడు. హేలెస్సు దళంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులు వున్నారు.
1CH 27:11 ఎనిమిదవ అధిపతి సిబ్బెకై. సిబ్బెకై ఎనిమిదవ నెలలో అధిపతి. సిబ్బెకై హుషాతీయుడు. అతడు జెరహు సంతతివాడు. సిబ్బెకై విభాగంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులు వున్నారు.
1CH 27:12 తొమ్మిదవ అధిపతి అబీయెజెరు. అబీయెజెరు తొమ్మిదవ నెలలో అధిపతి. అబీయెజెరు అనాతోతు పట్టణం వాడు. అతడు బెన్యామీనీయుడు. అబీయెజెరు దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు.
1CH 27:13 పదవ అధిపతి మహరై. మహరై పదవ నెలలో అధిపతి. మహరై నెటోపాతీయుడు. అతడు జెరహు సంతతివాడు. మహరై దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
1CH 27:14 పదకొండవ అధిపతి బెనాయా. బెనాయా పదకొండవ నెలలో అధిపతి. అతడు పిరాతోనీయుడు. బెనాయా ఎఫ్రాయిము సంతతివాడు. బెనాయా వర్గంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు.
1CH 27:15 పన్నెండవ అధిపతి హెల్దయి. పన్నెండవ నెలలో అధిపతి హెల్దయి. అతడు నెటోపాతీయుడు. హెల్దయి ఓత్నీయేలు కుటుంబీకుడు. హెల్దయి దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు.
1CH 27:16 ఇశ్రాయేలు వంశాలు, వాటి పెద్దలు ఎవరనగా: రూబేను: జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు. షిమ్యోను: మయకా కుమారుడైన షెఫట్య.
1CH 27:17 లేవీ: కెమూయేలు కుమారుడైన హషబ్యా. అహరోను: సాదోకు.
1CH 27:18 యూదా: దావీదు సోదరులలో ఒకడై ఎలీహు. ఇశ్శాఖారు: మిఖాయేలు కుమారుడగు ఒమ్రీ.
1CH 27:19 జెబూలూను: ఓబద్యా కుమారుడైన ఇష్మయా. నఫ్తాలి: అజీ్రయేలు కుమారుడైన యెరీమోతు.
1CH 27:20 ఎఫ్రాయిము: అజజ్యాహు కుమారుడైన హోషేయ. పశ్చిమ మనష్షే: పెదాయా కుమారుడైన యోవేలు.
1CH 27:21 తూర్పు మనష్షే: జెకర్యా కుమారుడైన ఇద్దో. బెన్యామీను: అబ్నేరు కుమారుడగు యహశీయేలు.
1CH 27:22 దాను: యెహోరాము కుమారుడు అజరేలు. వారంతా ఇశ్రాయేలు వంశాలకు అధిపతులు.
1CH 27:23 ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయటానికి దావీదు నిర్ణయించాడు. అయితే వారు అసంఖ్యాకంగా వున్నారు. ఎందువల్లననగా దేవుడు ఇశ్రాయేలు వారిని ఆకాశంలో నక్షత్రాల్లా వృద్ధిచేస్తానని చెప్పాడు. అందువల్ల దావీదు ఇరవై ఏండ్ల వయస్సు వారిని, అంతకు పైబడిన వయస్సు వారిని మాత్రమే లెక్కించమన్నాడు.
1CH 27:24 సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు ప్రారంభించాడు. కాని పూర్తి చేయలేదు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు మిక్కిలి కోపం చెందాడు. అందువల్ల రాజైన దావీదు పాలన గురించిన చరిత్ర గ్రంథంలో జనాభాసంఖ్య చేర్చబడలేదు.
1CH 27:25 రాజుయొక్క ఆస్తి కాపాడటంలో బాధ్యతగల వారెవరనగా: అదీయేలు కుమారుడు అక్మావెతు ఆధీనంలో రాజగిడ్డంగులు వుంచారు. చిన్న చిన్న పట్టణాలలోను, గామాలలోను, పొలాలలోను, దుర్గాలలోను వున్న వస్తువులను భధ్రపరచు గదులకు బాధ్యత, ఉజ్జీయా కుమారుడైన యోనాతానుకు ఇవ్వబడింది.
1CH 27:26 వ్యవసాయ కూలీలపై కెలూబు కుమారుడైన ఎజీ నియమితుడయ్యాడు.
1CH 27:27 ద్రాక్షా తోటల సంరక్షణాధికారి షిమీ, షిమీ రామా పట్టణానికి చెందినవాడు. ద్రాక్షాతోటలనుండి సేకరించిన ద్రాక్షా రసపు నిల్వలు, వాటి పరిరక్షణ బాధ్యత జబ్దికి ఇవ్వబడింది. జబ్ది షెపాము ఊరివాడు.
1CH 27:28 పడమటి కొండల ప్రాంతంలో ఒలీవ చెట్ల, మేడి చెట్ల పరిరక్షణ, నిర్వహణ బాధ్యత బయల్ హనాను వహించాడు. బయల్ హనాను గెదేరీయుడు. ఒలీవ నూనె నిల్వల మీద అధికారి యోవాషు.
1CH 27:29 షారోను ప్రాంతంలో మేసే ఆవుల మీద పర్యవేక్షకుడు షిట్రయి. షిట్రయి షారోను ప్రాంతంవాడు. లోయలోని ఆవుల మీద అధికారి అద్లయి కుమారుడైన షాపాతు.
1CH 27:30 ఒంటెలపై అధికారి ఓబీలు ఇష్మాయేలీయుడు. గాడిదల సంరక్షణాధికారి యెహెద్యాహు. యెహెద్యాహు మేరోనో తీయుడు.
1CH 27:31 గొర్రెల విషయం చూసే అధికారి యాజీజు. యాజీజు హగ్రీయుడు. నాయకులైన ఈ వ్యక్తులందరూ రాజైన దావీదు ఆస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి నియమితులయ్యారు.
1CH 27:32 యోనాతాను తెలివైన సలహాదారు. పైగా లేఖకుడు. యోనాతాను దావీదు పినతండ్రి. రాజకుమారుల యోగక్షేమాలు తెలుసుకోవటానికి హక్మోనీ కుమారుడైన యెహీయేలు నియమింపబడ్డాడు.
1CH 27:33 అహీతోపెలు రాజుకు సలహాదారు (మంత్రి). హూషై రాజుకు స్నేహితుడు (చెలికాడు). హూషై అర్కీయుడు.
1CH 27:34 అహీతోపెలు తరువాత అతని స్థానంలో యెహోయాదా మరియు అబ్యాతారు లిరువురూ రాజుకు సలహాదారులయ్యారు. యెహోయాదా తండ్రి పేరు బెనాయా. యోవాబు రాజు సేనకు అధిపతి.
1CH 28:1 దావీదు ఇశ్రాయేలు పెద్దలందరినీ సమావేశపర్చాడు. వారందరనీ యెరూషలేముకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఆయన పిలిచిన పెద్దలు ఎవరనగా: వంశాల పెద్దలు, రాజ సేవలో వున్న సైనికాధికారులు, వేయిమంది సైనికులకు అధిపతులు, వందమంది గల దళాలకు అధిపతులు, రాజు యొక్క, రాజకుమారుల యొక్క ఆస్తులను, పశువులను కాపాడే అధికారులు, రాజు యొక్క ముఖ్యాధికారులు, పరాక్రమశాలురు మరియు వీర సైనికులు.
1CH 28:2 రాజైన దావీదు నిలబడి వారినుద్దేశించి ఇలా చెప్పాడు: “సోదరులారా, నా ప్రజలారా, మీరంతా నేను చేప్పేది వినండి. యోహోవా ఒడంబడిక పెట్టెను ఉంచటానికి ఒక ఆలయాన్ని కట్టటానికి నేను నా హృదయంలో సంకల్పించాను దేవుని పాదం మోపటానికి ఒక స్థానం నిర్మించాలని నేను అనుకున్నాను. ఆలయ నిర్మాణానికి నేను ఒక పథకం కూడ తయారుచేశాను.
1CH 28:3 కాని దేవుడు నాతో ఇలా అన్నాడు: ‘దావీదూ’ వద్దు. నా పేరు మీద నీవు ఆలయం కట్టించకూడదు. నీవు సైనికుడవై, అనేకమందిని సంహరించావు. అందువల్ల నీవు ఆలయ నిర్మాణం చేయకూడదు.”
1CH 28:4 “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇశ్రాయేలు పన్నెండు వంశాల వారిని నడిపించటానికి యూదా వంశాన్ని ఎంపిక చేశాడు. మళ్లీ ఆ వంశంలో నుండి నా తండ్రి కుటుంబాన్ని యోహోవా ఎంపిక చేశాడు. ఆ కుటుంబంలో నుండి ఇశ్రాయేలును శాశ్వతంగా ఏలటానికి యెహోవా నన్ను ఎంపికచేశాడు! దేవుడు నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయదలచాడు!
1CH 28:5 యెహోవా నాకు చాలా మంది కుమారులను ఇచ్చాడు. వారందరిలో ఇశ్రాయేలుకు నూతన రాజుగా సొలొమోనును మాత్రం యెహోవా ఎంపిక చేసాడు. నిజానికి ఇశ్రాయేలు యెహోవా రాజ్యం.
1CH 28:6 యెహోవా నాతో, ‘దావీదూ, నీ కుమారుడు సొలొమోను నా ఆలయాన్ని, దాని ప్రాంగణాన్ని నిర్మిస్తాడు. ఎందువల్లననగా సొలొమోనును నా కుమారునిగా భావించాను. నేను అతనికి తండ్రిగా వ్యవహరిస్తాను.
1CH 28:7 సొలొమోను ఇప్పుడు నా ధర్మాన్ని, ఆజ్ఞలను పాటిస్తున్నాడు. అతడు నా ధర్మాన్ని, న్యాయాన్ని నిరంతరం పాటిస్తే నేను సొలొమోను రాజ్యాన్ని శాశ్వతంగా బలవంతమైనదిగా చేస్తాను!’” అని అన్నాడు.
1CH 28:8 “ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల ముందు, దేవుని సమక్షాన నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. యెహోవా దేవుని శాసనాలన్నిటినీ మీరు పాటించేలా జాగ్రత్త పడండి! అప్పుడు ఈ మంచి దేశాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. పైగా దీనిని మీరు, మీ తర్వాత మీ సంతతి వారికి కూడ శాశ్వతంగా అందజేయగలరు.
1CH 28:9 “కుమారుడా, సొలొమోనూ! నీ తండ్రి యొక్క దేవుని నీవు తెలుసుకో. పవిత్ర హృదయంతో దేవుని ప్రార్థించు. దేవుని సేవించటానికి హృదయానందం కలిగివుండు. ఎందువల్లననగా, ప్రతివాని మనస్సులో ఏమున్నదో దేవునికి తెలుసు. నీవు ఆలోచించే ప్రతిదీ యెహోవా అర్థం చేసుకుంటాడు! సహాయం కోరి యెహోవాను అర్థిస్తే, నీకు సమాధానం దోరుకుతుంది. నీవు దేవునికి విముఖంగా వుంటే ఆయన నిన్ను శాశ్వతంగా వదిలివేస్తాడు.
1CH 28:10 సొలొమోనూ, తన పవిత్ర స్థలమైన ఆలయాన్ని నిర్మించటానికి యెహోవా నిన్ను ఎంపిక చేశాడని నీవు అర్ధం చేసుకోవాలి. ధైర్యంగా వుండి కార్యం నెరవేర్చు.”
1CH 28:11 పిమ్మట దావీదు ఆలయ నిర్మాణానికి సిద్ధం చేసిన సమూనా పత్రాలను తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చాడు. ఆ పత్రాలలో ఆలయం చుట్టూ నిర్మింప తలపెట్టిన ఆవరణ, మండపాలు, వస్తువులను భద్రపరచు గదులకు పైగదులు, లోపలి గదులు మరియు పాపపరిహారం ప్రాయశ్చిత్తం చేయు స్థానం మొదలగు వాటి నమూనాలు కూడ ఇమిడి వున్నాయి.
1CH 28:12 ఆలయపు అన్ని విభాగాలకూ దావీదు నమూనాలు గీయించాడు. దావీదు ఆ నమూనాలను సొలొమోనుకు ఇచ్చాడు. ఆలయం చుట్టూ ప్రాంగణానికి, ఇతర గదులకు, వస్తువులను భద్రపరచు గదులకు, పవిత్ర వస్తువులను వుంచే కొట్లకు గీచిన నమూనాలను కూడ దావీదు అతనికి ఇచ్చాడు.
1CH 28:13 దావీదు సొలొమోనుకు యాజకులలోను, లేవీయులలోను గల వర్గీకరణలను గూర్చి తెలియ జెప్పాడు. ఆలయపు సేవాకార్యక్రమ వివరాలు, ఆలయంలో వినియోగించే వస్తుసామగ్రి విషయాల గూర్చి దావీదు సొలొమోనుకు వివరించాడు.
1CH 28:14 ఆలయంలో ఉపయోగించే వస్తు సామగ్రి చేయటానికి ప్రతి దానికీ ఎంతెంత వెండి బంగారాలు వినియోగించాలో దావీదు సొలొమోనుకు చెప్పాడు.
1CH 28:15 బంగారు దీపాలకు, వెండి దీపాలకు, దీప స్తంభాలకు విడివిడిగా కొలతలు, నమూనాలు వున్నాయి. ఒక్కొక్క దీప స్తంభానికి, దాని దీపాలకు ఉపయోగించే బంగారం లేక వెండి పరిమాణాన్ని దావీదు సొలొమోనుకు తెలియజేశాడు. అవసరమైన చోట వివిధ దీపస్తంభాలు నెలకొల్పవచ్చు.
1CH 28:16 నైవేద్యంగా పవిత్ర రొట్టెను దేవుని ముందు పెట్టటానికి పనికివచ్చే ప్రతి బల్లకు ఎంత బంగారం వాడాలో దావీదు చెప్పాడు. వెండి బల్లలకు కావలసిన వెండి పరిమాణం కూడా దావీదు చెప్పాడు.
1CH 28:17 శూలాలకు, నీరు చిలికే పాత్రలకు, మూతి వెడల్పు చెంబులకు ఎంతెంత శుద్ధ బంగారం కావాలో దావీదు వివరించాడు. ప్రతి బంగారు పాత్రకు, ప్రతి వెండి పాత్రకు ఎంతెంత బంగారం కావాలో దావీదు చెప్పాడు.
1CH 28:18 ధూప పీఠానికి కావలసిన శుద్ధ బంగారం విషయం దావీదు చెప్పాడు. దేవుని రథమైన రెక్కలుచాపి ఒడంబడిక పెట్టెను కప్పివుండే కెరూబుల నమూనాను కూడా దావీదు సొలొమోనుకు ఇచ్చాడు. ఇదే ధర్మ పీఠం. కెరూబు దూతల ప్రతిమలు బంగారంతో చేయబడ్డాయి.
1CH 28:19 “యెహోవా నాకు సూచించిన మేరకు ఈ నమూనాలన్నీ వ్రాయబడ్డాయి. నమూనాలలో ప్రతి విషయాన్నీ నేను అర్థం చేసుకొనేలా యెహోవా నాకు సహాయపడ్డాడు” అని దావీదు చెప్పాడు.
1CH 28:20 దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇంకా ఇలా అన్నాడు: “నీవు ధైర్యంగా, నిలకడగా వుండు. పని మొదలు పెట్టు. నీవు భయపడవద్దు. ఎందు వల్లననగా నీ దేవుడైన యెహోవా నీతో వున్నాడు. పనంతా పూర్తయ్యే వరకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు. నీవు యెహోవా ఆలయం నిర్మిస్తావు.
1CH 28:21 ఆలయ నిర్మాణ కార్యక్రమంలో యాజకులు, లేవీయులు తమ తమ విధులు నిర్వహించటానికి సిద్ధంగా వున్నారు. నైపుణ్యంగల పనివారంతా నీకు సహాయం చేయటానికి సిద్ధంగా వున్నారు. నీవు ఇచ్చే ప్రతి ఆజ్ఞ అధికారులు, ప్రజలు అంతా శిరసావహిస్తారు.”
1CH 29:1 అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి రాజైన దావీదు ఇలా అన్నాడు: “దేవుడు నా కుమారుడు సొలొమోనును ఎంపిక చేశాడు. సొలొమోను చిన్నవాడు. అందువల్ల తాను చేయవలసిన పనులన్నిటిలో తగిన అనుభవం లేదు. కాని పని మాత్రం అతి ముఖ్యమైనది! ఈ భవనం ప్రజల కొరకు కాదు. ఇది యెహోవా దేవుని ఆలయం.
1CH 29:2 నా దేవుని ఆలయం కట్టించటానికి తగిన నమూనాలు, ఏర్పాట్లు నాశక్తి కొలదీ చేశాను. బంగారంతో చేయదగిన వస్తు సామగ్రికి కావలసిన బంగారం, వెండితో చేయదగిన వస్తువులకు వెండి, కంచు సామగ్రికి కావలసిన కంచు, ఇనుప పనిముట్లకు కావలసిన ఇనుము, కలప సామాన్లు చేయటానికి తగిన కలప ఏర్పాటు చేశాను. పొదగటానికి సులిమాను రాళ్లు అనబడే మణులను, నల్లరాతిని, విలువైన రంగురంగుల రత్నాలను, పాల రాతిని కూడ నేను ఇచ్చాను. ఆలయం నిర్మాణానికి ఈ రకమైన వస్తుసామగ్రిని లెక్కకు మించి ఇచ్చాను.
1CH 29:3 నా దేవుని ఆలయానికి వెండి బంగారు వస్తువులను ప్రత్యేక కానుకలుగా ఇస్తున్నాను. నేనిది ఎందుకు చేస్తున్నానంటే నిజంగా నేను నా దేవుని ఆలయం కట్టించ దలిచాను. ఈ పవిత్ర ఆలయ నిర్మాణానికే ఈ వస్తువులన్నీ నేను ఇస్తున్నాను.
1CH 29:4 ఆరువేల మణుగుల ఓఫీరు దేశపు బంగారాన్ని, పధ్నాలుగు వేల మణుగుల శుద్దమైన వెండిని ఇచ్చాను. ఆలయ భవనాల గోడలపై వెండిరేకుల తొడుగు వేస్తారు.
1CH 29:5 వెండి బంగారాలతో చేయదగిన వస్తువులకు కావలసిన వెండిని, బంగారాన్ని ఇచ్చాను. ఆలయానికి పనికివచ్చే అనేక రకాల వస్తు సామగ్రిని నిపుణతగల పనివారు చేయగలిగేలా నేను వెండిని, బంగారాన్ని సమకూర్చాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులైన మీలో ఎంతమంది ఆరోజు యెహోవా కార్యానికి మనసారా కానుకలు ఇవ్వటానికి సిద్ధంగా వున్నారు?”
1CH 29:6 కుటుంబాల పెద్దలు, ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు, సహస్ర సైనిక దళాధిపతులు, శత దళాధిపతులు రాజకార్య నిర్వాహకులు వెంటనే తమ విలువైన వస్తువులు స్వయంగా అర్పించారు.
1CH 29:7 ఆలయానికి వారిచ్చిన వస్తువులు ఏవనగా: పదివేల మణుగుల బంగారం, ఇరవై వేల మణుగుల వెండి, ముప్పదియారు వేల మణుగుల కంచు, రెండు లక్షల మణుగుల ఇనుము.
1CH 29:8 విలువైన రత్నాలు కలిగివున్న ప్రజలు వాటిని ఆలయానికి యిచ్చారు. యెహీయేలు విలువైన రత్నాలన్నిటి విషయంలో జాగ్రత్త తీసుకొన్నాడు. యెహీయేలు గెర్షోను వంశీయుడు.
1CH 29:9 తమ నాయకులు అంత ఉదారంగా విరాళాలు ఇవ్వటంతో ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. నాయకులు నిండు హృదయంతో విరాళాలు ఇచ్చి సంతోషపడ్డారు. రాజైన దావీదు కూడ ఆనందంగా వున్నాడు.
1CH 29:10 సమావేశపర్చబడిన ప్రజానీకం ముందు దావీదు పిమ్మట యెహోవాకి స్తోత్రం చేశాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, మా తండ్రీ, సదా నీకు స్తోత్రం చేస్తాము.
1CH 29:11 గొప్పతనము, శక్తి, మహిమ, విజయము, గౌరవము అన్నీ నీకు చెందినవే ఎందుకంటే పరలోకమందు, భూమిమీద అన్నీ నీకు చెందినవే, ఓ దేవా, రాజ్యము నీదైయున్నది. నీవు సమస్త ప్రజలపై అధిపతివైయున్నావు.
1CH 29:12 భోగభాగ్యాలు, గౌరవం నీ నుండేవస్తాయి. సమస్తమును పాలించువాడవు నీవు. నీవు బల పరాక్రమసంపన్నుడవు. నీవు ఎవరినైనా గొప్ప వాడినిగా గాని, బలవంతునిగా గాని చేయగల సమర్థుడవు.
1CH 29:13 మా దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించు చున్నాము. మహిమగల నీ నామమును స్తుతిస్తాము!
1CH 29:14 ఈ వస్తువులన్నీ నానుండి, నా ప్రజల నుండి రాలేదు. ఈ వస్తువులన్నీ నీనుండి వచ్చినవే. నీనుండి వచ్చిన వాటినే మేము తిరిగి నీకు సమర్పిస్తున్నాము.
1CH 29:15 మేము కొత్త వారిలా, బాటసారుల్లా వున్నాము. మా పూర్వీకులు కూడ పరాయివారిలా, బాట సారుల్లా వున్నారు. ఆశలేని మా బ్రతుకులు ఈ భూమి మీద నీడలాంటివి. ఎవ్వరూ స్థిరంగా వుండరు.
1CH 29:16 యెహోవా మా దేవా, నీ ఆలయ నిర్మాణానికై మేము ఈ వస్తువులన్నీ సమకూర్చాము. నీ నామము ఘనపర్చబడేలా మేము ఈ ఆలయం నిర్మిస్తాము. కాని ఈ వస్తుసంపదంతా నీ నుండి వచ్చినదే. ప్రతిదీ నీకు చెందినదే.
1CH 29:17 నా దేవా, నీవు ప్రజల హృదయాలను పరీక్షిస్తావని కూడ నాకు తెలుసు. ప్రజలు మంచి పనులు చేస్తే నీవు సంతోషిస్తావు. ఈ వస్తు సముదాయాన్నంతా హృదయ పూర్వకంగా (సదుద్దేశంతో) నేను ఇస్తున్నందుకు సంతోషిస్తున్నాను. నీ ప్రజలంతా అనేక కానుకలు సంతోషంగా నీకు ఇవ్వటానికి ఇక్కడ చేరియున్నట్లు నేను చూశాను.
1CH 29:18 ఓ దేవా, నీవు మా పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలులకు దేవుడివి. నీ ప్రజలు సదా నిన్ను కొలిచేలా వారికి దయచేసి సహయపడుము. వారి హృదయాలెప్పుడూ నీ వైపు తిప్పుకోగలిగేలా వారికి నీవు సహాయపడుము.
1CH 29:19 నీ పట్ల సత్యవర్తనుడై మెలిగేలా నా కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయుము. నీ ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని, నీ నియమ నిబంధనలను అతను ఎల్ల వేళలా పాటించేలా నీవతనికి తోడ్పడుము. ఈ విషయాలలో నీవు సొలొమోనుకు సహాయంచేసి, అతను నేను తలపెట్టిన ఆలయ నిర్మాణకార్యక్రమం పూర్తిచేసేలా తోడ్పడుము.”
1CH 29:20 పిమ్మట దావీదు అక్కడ చేరిన ప్రజాసమూహాన్ని ఉద్ధేశించి, “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి” అని అన్నాడు. తమ పూర్వీకులు కొలిచిన దేవుడగు యెహోవాను ప్రజలంతా స్తుతించారు. యెహోవాకి రాజుకు గౌరవ సూచకంగా వారు సాష్టాంగ నమస్కారం చేశారు.
1CH 29:21 ఆ మరునాడు ప్రజలంతా యెహోవాకి బలులు అర్పించారు. యెహోవాకు వారు దహన బలులు అర్పించారు. వారు వేయి గిత్తలను, వేయి పొట్టేళ్లను, వేయి గొర్రె పిల్లలను బలి ఇచ్చారు. వారు పానార్పణలను కూడ సమర్పించారు. ఇశ్రాయేలు ప్రజలందరి తరపునా లెక్కలేనన్ని బలులు సమర్పించారు.
1CH 29:22 ఆ రోజు ప్రజలంతా బాగా తిని, తాగి ఆనందించారు. యెహోవా అక్కడ వారితో వున్నాడు. వారు చాలా ఆనందంగా వున్నారు. తరువాత దావీదు కుమారుడైన సొలొమోనును వారు రెండవసారి రాజుగా ప్రకటించారు. వారు సొలొమోనును రాజుగాను, సొదోకును యాజకునిగాను అభిషిక్తం చేశారు. యెహోవా నెలకొని వున్నచోటే వారు ఈ పనిచేశారు.
1CH 29:23 తరువాత సొలొమోను యెహోవా సింహాసనం మీద రాజు హోదాలో కూర్చున్నాడు. సొలొమోను తన తండ్రి స్థానాన్ని అలంకరించి వర్థిల్లాడు. ఇశ్రాయేలు ప్రజలంతా సొలొమోను ఆజ్ఞలను పాటించారు.
1CH 29:24 పెద్దలందరు, బలశాలురైన నాయకులు, రాజైన దావీదు కుమారులందరు సొలొమోనును రాజుగా గుర్తించి అతనికి విధేయులై వున్నారు.
1CH 29:25 యెహోవా సొలొమోనును చాలా గొప్ప వ్యక్తినిగా చేసాడు. యెహోవా సొలొమోనును చాలా ఉన్నతమైన వ్యక్తిగా చేస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలంతా గుర్తించారు. రాజుకు ఇవ్వవలసిన గౌరవాభిమానాలను యెహోవా సొలొమోనుకు ఇచ్చాడు. సొలొమోనుకు ముందు మరొక రాజెవ్వడూ అంతటి గౌరవాన్ని పొందియుండలేదు.
1CH 29:26 దావీదు ఇశ్రాయేలుకు నలభై సంవత్సరాలు రాజుగా వున్నాడు. దావీదు యెష్షయి కుమారుడు. దావీదు హెబ్రోను నగరంలో ఏడు సంవత్సరాలు పాలించాడు. తరువాత దావీదు యెరూషలేము నగరం నుండి ముప్పది మూడు సంవత్సరాలు పాలించాడు.
1CH 29:28 దావీదు బాగా వృద్ధుడయినాక మరణించాడు. దావీదు ఉత్తమ జీవితాన్ని దీర్ఘకాలం గడిపాడు. దావీదు అన్ని భోగభాగ్యాలు, గౌరవాభిమానాలు పొందాడు. తరువాత అతని కుమారుడు సొలొమోను నూతన రాజు అయ్యాడు.
1CH 29:29 రాజైన దావీదు ఆదినుండి అంతం వరకు చేసిన పనులన్నీ దీర్ఘదర్శియైన సమూయేలు వ్రాసిన వ్రాతలలోను, ప్రవక్తయగు నాతాను వ్రాతలలోను, దీర్ఘదర్శియైన గాదు వ్రాసిన వృత్తాంతాలలోను పొందుపర్చబడ్డాయి.
1CH 29:30 ఆ వ్రాతలన్నీ ఇశ్రాయేలుకు రాజుగా దావీదు చేసిన పనులన్నిటి గురించి తెల్పుతాయి. అవి దావీదు శౌర్యాన్ని గూర్చి, అతనికి సంభవించిన విషయాలను గూర్చి తెలియజేస్తాయి. ఆ వ్రాతలు ఇశ్రాయేలుకు, దాని పొరుగు రాజ్యాలన్నిటిలో జరిగిన కార్యాలు, వాటి పరిస్థితులను తెలియజేస్తాయి.
2CH 1:1 యెహోవా దేవుని కృపవున్నందువల్ల సొలొమోను చాలా శక్తిమంతుడైన రాజుగా రూపొందాడు. యెహోవా సొలొమోనును గొప్ప వ్యక్తిగా చేశాడు.
2CH 1:2 సొలొమోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. అతడు సైన్యాధికారులతోను, దళాధిపతులతోను, న్యాయాధిపతులతోను, ఇంకను ఇశ్రాయేలులోని ప్రతి ఒక్క నాయకునితోను, ప్రతి కుటుంబ పెద్దతోను మాట్లాడాడు.
2CH 1:3 పిమ్మట సొలొమోను, అతని దగ్గరికి వచ్చిన ప్రజలందరూ కలిసి గిబియోనులో వున్న గుట్టమీదికి (ఉన్నత స్థలం) వెళ్లారు. దేవుని సన్నిధి గుడారం అక్కడ ఉంది. యోహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఎడారిలో వున్నప్పుడు ఈ గుడారాన్ని నిర్మించాడు.
2CH 1:4 దేవుని ఒడంబడిక పెట్టె దావీదు కిర్యత్యారీము నుండి యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. దానిని వుంచటానికి దావీదు యెరూషలేములో ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని ఒడంబడిక పెట్టెను వుంచటానికి దావీదు యెరూషలేములో ఒక గుడారం ఏర్పాటు చేశాడు.
2CH 1:5 బెసలేలు కంచుతో ఒక బలిపీఠాన్ని తయారుచేశాడు. బెసలేలు తండ్రిపేరు ఊరి ఊరి. తండ్రి పేరు హూరు. కాని ఈ కంచు పీఠం గిబియోనులో పవిత్ర గుడారం ఎదుట వుంది. అందువల్ల సొలొమోను, ప్రజలు కలిసి దేవుని సలహా పొందటానికి గిబియోనుకు వెళ్లారు.
2CH 1:6 సన్నిధి గుడారం వద్ద దేవుని ముందున్న కంచుపీఠం వద్దకు సొలొమోను వెళ్లాడు. బలపీఠం మీద సొలొమోను వెయ్యి దహనబలులు అర్పించాడు.
2CH 1:7 ఆ రోజు రాత్రి దేవుడు సొలొమోనుకు స్వప్న దర్శనమిచ్చి యిలా అన్నాడు: “సొలొమోనూ, నీకు ఏమి కావాలో కోరుకో.”
2CH 1:8 సొలొమోను దేవునితో యీలా అన్నాడు: “నా తండ్రి దావీదు పట్ల నీవు చాలా దయకలిగియున్నావు. నా తండ్రి స్థానంలో కొత్త రాజుగా వ్యవహరించటానికి నీవు నన్ను ఎంపిక చేశావు.
2CH 1:9 నా ప్రభువైన దేవా నీవు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేర్చు. ఒక గొప్ప రాజ్యానికి నన్ను రాజుగా ఎంపిక చేశావు. ఇక్కడి జనాభా భూమి మీద ధూళిలా విస్తారంగా వుంది.
2CH 1:10 ఇప్పుడు నాకు తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదించు. దానివల్ల ఈ అశేష ప్రజానీకాన్ని సన్మార్గంలో నడిపించగలను. నీ సహాయం లేకుండా ఈ ప్రజానీకాన్ని ఏ ఒక్కడూ పరిపాలించలేడు!”
2CH 1:11 అది విని సొలొమోనుతో దేవుడు యీలా అన్నాడు: “నీ ప్రవర్తన బాగుంది. నీవు ఐశ్వర్యాన్నిగాని, ధనికులకుండే భోగ భాగ్యాలను గాని, పేరుప్రతిష్ఠలనుగాని కోరలేదు. నీ శత్రువులంతా నాశనం కావాలని కూడా నీవు కోరలేదు. నీవు చాలాకాలం బతకాలని దీర్ఘాయుష్షూ కోరలేదు. నా ప్రజలను పాలించటానికి నీవు తెలివిని, వివేచననూ, జ్ఞానాన్ని ప్రసాదించమని కోరావు. ఈ ప్రజలకు రాజుగా నిన్ను నేను ఎంపిక చేశాను.
2CH 1:12 కావున నీకు నేను తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు ధనాన్ని, భోగ భాగ్యాలను, గౌరవాన్ని కూడ నేను ఇస్తున్నాను. నీకు ముందున్న రాజులెవ్వరూ ఇంతటి ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని పొందియుండలేదు. నీ తరువాత వచ్చే రాజులుకూడ ఇంతటి భాగ్యాన్ని, ఘనతను కలిగియుండరు.”
2CH 1:13 సొలొమోను గిబియోనులోని ఆరాధనా స్థలానికి వెళ్లాడు. సన్నిధి గుడారాన్ని వదిలి, ఇశ్రాయేలు రాజుగా పాలించటానికి యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
2CH 1:14 సొలొమోను గుర్రాలను, రథాలను సేకరించాడు. అతనికి పద్నాలుగువందల రథాలు, పన్నెండువేల గుర్రాలు వున్నాయి. సొలొమోను నగరాలలో ప్రత్యేక రథశాలలు నిర్మించి వాటిని అక్కడ వుంచాడు. యెరూషలేములో కూడా కొన్ని గుర్రాలను, రథాలను సొలొమోను వుంచాడు. యెరూషలేములోనే రాజగృహం కూడా వుంది.
2CH 1:15 యెరూషలేములో సొలొమోను విస్తారంగా వెండి బంగారాలను సేకరించి నిల్వచేశాడు. అతడు వెండి బంగారాలను ఎంత మేరకు సేకరించాడనగా వాటి నిల్వలు సామాన్య రాతిగుట్టల్లా వున్నాయి. సొలొమోను సరళ వృక్షాల కలపను చాలా సేకరించాడు. అతడు సరళ చెట్ల కపలను పల్లపు ప్రాంతాలలో విస్తరించి వున్న మేడి చెట్లంత ఎక్కువగా సేకరించాడు.
2CH 1:16 ఈజిప్టు నుంచి, కవే (సైలీషియా అనబడే దక్షిణటర్కీ ప్రాంతం) నుంచి సొలొమోను గుర్రాలను తెప్పించాడు. రాజు వర్తకులు ఈ గుర్రాలను కవేలో కొనేవారు.
2CH 1:17 రాజు వర్తకులు ఈజిప్టులో ఒక్కొక్క రథాన్ని ఆరువందల తులాల వెండిని, ఒక్కొక్క గుర్రాన్ని నూట యేబది తులాల వెండిని వెచ్చించి కోనేవారు, ఆ కాలంలో వర్తకులు గుర్రాలను, రథాలను హిత్తీయుల రాజులకు, అరాము (సిరియా) రాజులకు కూడ అమ్మేవారు.
2CH 2:1 యెహోవా పేరు ఘనపర్చబడేలా ఆలయ నిర్మాణానికి సొలొమోను సన్నాహం చేశాడు. తన కొరకై ఒక రాజభవనాన్ని కూడ నిర్మించుకోవాలని సొలొమోను తలచాడు.
2CH 2:2 సొలొమోను డెబ్బైవేల మందిని సరుకు చేరవేయటానికి నియమించాడు. ఎనబైవేల మందిని కొండల్లో రాళ్లు కొట్టడానికి అతడు నియమించాడు. పనివాళ్ల మీద నిఘావుంచడానికి మూడువేల ఆరువందల మందిని నియమించాడు.
2CH 2:3 తరువాత సొలొమోను హీరాముకు ఒక వర్తమానం పంపాడు. హీరాము తూరు నగరపు రాజు. సొలొమోను హీరాముకు యిలా చెప్పి పంపాడు: “నీవు నా తండ్రి దావీదుకు సహాయపడినట్లు నాకు కూడ సహాయం చెయ్యి. తను నివసించే భవన నిర్మాణానికి నీవాయనకు సరళ వృక్షాల కలపను పంపావు.
2CH 2:4 నా దేవుడైన యెహోవా గౌరవార్థం నేనొక ఆలయం నిర్మింపదలిచాను. నా ప్రజలు ఆరాధించుకొనటానికి వీలుగా దానిని నా దేవునికి అంకితం చేస్తాను. యెహోవా ముందు ధూపం వేసి, ఆయన సన్నిధిని ప్రతినిత్యం పవిత్రమైన రొట్టెను నైవేద్యంగా వుంచి, బలిపీఠంపై ఉదయం, సాయంత్రం దహనబలులు అర్పిస్తూ, మేము మా దేవుని ఆరాధిస్తాము. సబ్బాతు దినాలలోను, అమావాస్య రోజులందును, మరి ఇతర ప్రత్యేక ఉత్సవదినాలలోను, తనను ఆరాధించుమని మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞ యిచ్చాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు శాశ్వతంగా పాటించే ఒక నియమం.
2CH 2:5 “మా దేవుడు మిగిలిన దైవాలకంటె మహోన్నతుడు గనుక, ఆయనకు నేను నిర్మించే ఆలయం కూడా ఉన్నతంగా ఉంటుంది.
2CH 2:6 నిజానికి మానవ మాత్రుడెవ్వడూ మా దేవునికి ఆలయం నిర్మించలేడు. పరలోక భూలోకాలే మా దేవునికి నిలయాలు కాలేనప్పుడు, నేను ఆయనకు ఆలయం నిర్మాణంచేయ లేను. నేను కేవలం ఆయన సన్నిధిని ధూపం వేయటానికి ఒక పీఠం మాత్రమే నిర్మించగలను.
2CH 2:7 “కావున వెండి బంగారు పనులలోను; కంచు, ఇనుము పనులలోను నేర్పరియైన ఒక పనివానిని ఇప్పుడు నా వద్దకు పంపించు. అతడు ఊదా, నీలిరంగు పదార్థాలు పనిలో కూడా నేర్పరియై ఉండాలి. నావద్ద వున్న యూదా, యెరూషలేము శిల్పులతో కలిసి అతడు చెక్కడపు పనులు చేయగలిగి ఉండాలి. నా తండ్రియగు దావీదు ఇక్కడ ఈ మనుష్యులను ఎంపిక చేశాడు.
2CH 2:8 సరళ వృక్షాల, దేవదారు వృక్షాల, చందనపు చెట్ల కలపను లెబానోను అడవుల నుండి పంపించు. లెబానోనులో చెట్లను కొట్టడంలో నీ మనుష్యులు అనుభవం కలవారని నాకు తెలుసు. నా సేవకులు నీ మనుష్యులకు సహాయపడతారు.
2CH 2:9 సాధ్యమైనంత ఎక్కువ కలపను నాకు పంపించు. నేను నిర్మించబోయే ఆలయం చాల గొప్పదై, అద్భతమైనదిగా వుంటుంది.
2CH 2:10 కలప నరికే పనివారికి ఆహారం నిమిత్తం నేను నాలుగు వందల గరిసెల గోధుములు, నాలుగు వందల గరిసెల యవలు, ఒక లక్షా పదిహేను వేలగేలనుల (మూడూ వేల ఎనిమిది వందల పడులు లేక ఇరువది వేల బాదులు) ద్రాక్షారసమును, అదే పరిమాణములో నూనెను కేటాయిస్తున్నాను.”
2CH 2:11 సొలొమోనుకు సమాధానమిస్తూ, హీరాము ఒక వర్తమానాన్ని పంపాడు. ఆ వర్తమానం ఇలా వుంది: “సొలొమోనూ, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. అందువల్లనే ఆయన నిన్ను వారికి రాజుగా నియమించాడు.”
2CH 2:12 హీరాము తన సందేశంలో ఇంకా యీలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు స్తోత్రం చేయండి! ఆయన ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన రాజైన దావీదుకు ఒక తెలివైన కుమారుని ప్రసాదించాడు. సొలొమోనూ, నీకు తెలివి, అవగాహన వున్నాయి. నీవు యెహోవా కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నావు. నీకొరకు నీవొక రాజభవనాన్ని కూడా నిర్మింప తలపెట్టావు.
2CH 2:13 నేను నీ వద్దకు ఒక నైపుణ్యంగల పనివానిని పంపుతాను. అతడు రకరకాల కళలలో అభిరుచి, అనుభవం వున్నవాడు. అతని పేరు హూరాము అబీ.
2CH 2:14 అతని తల్లి దాను వంశస్థురాలు. అతని తండ్రి తూరు నగరవాసి. హూరాము — అబీ బంగారం, వెండి, కంచు, ఇనుము, రాతి, కలప పనులలో బహు నేర్పరి. హూరాము — అబీ ఊదా, నీలి, ఎర్రపు రంగుల వస్తువుల, ఖరీదైన వస్త్రాల పనులలో కూడమంచి నేర్పరి. పైగా హూరాము — అబీ చెక్కడపు పనులలో కూడా నిపుణుడు. నీవు చూపిన ఏ నమూనానైనా అతడు అర్థం చేసికొని దాని ప్రకారం పనిచేయగల నేర్పరి. అతడు నీ వద్ద వున్న శిల్పులకు, కళాకారులకు సహాయకారిగా వుంటాడు. దావీదు ఏర్పరచిన కళాకారులకు కూడ సహాయపడతాడు. నీ తండ్రియగు దావీదు మాటను నేను అనుసరిస్తాను.
2CH 2:15 “నీవు గోధుములు, యవల, నూనె ద్రాక్షారసం నాకు పంపుతానని రాశావు. వాటిని నా పనివాళ్ల నిమిత్తం పంపించు.
2CH 2:16 లెబానోను దేశంలో మేము కలప నరుకుతాము. నీకు ఎంతకలప కావాలో అంత కలప నరుకుతాము. ఆ కలపనంతా తెప్పలుగా కట్టి యొప్పా పట్టణం నుండి సముద్రం మీద పంపుతాము. తరువాత ఆ కలపను నీవు యెరూషలేముకు మోయించవచ్చు.”
2CH 2:17 అప్పుడు సొలొమోను ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీయులందరినీ లెక్కించాడు. ఇది దావీదు జనాభా లెక్కలు తీయించిన తరువాత జరిగింది. దావీదు సొలొమోను తండ్రి. దేశంలో ఒక లక్షా ఏబై మూడువేల ఆరువందల మంది పరదేశీయులున్నట్లు వారు కనుగొన్నారు.
2CH 2:18 బరువులు మోయటానికి డెబ్బై వేలమంది విదేశీయులను సొలొమోను నియమించాడు. కొండల్లో రాళ్లు చెక్కటానికి ఎనబై వేల మంది విదేశీయులను దావీదు నియమించాడు. పనివారిపై విచారణ చేయడానికి మరి మూడువేల ఆరువందల విదేశీయులను సొలొమోను ఎంపిక చేశాడు.
2CH 3:1 యెరూషలేములో మోరీయా పర్వతం మీద సొలొమోను ఆలయ నిర్మాణం మొదలు పెట్టాడు. ఈ మోరీయా పర్వతం మీదే సొలొమోను తండ్రియైన దావీదుకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. దావీదు సిద్ధపర్చిన స్థలంలోనే సొలొమోను ఆలయాన్ని నిర్మించాడు. ఈ స్థలం ఒర్నానుకు చెందిన నూర్పిడి కళ్లంవద్ద వుంది. ఒర్నాను యెబూసీయుడు.
2CH 3:2 తన పాలన ఇశ్రాయేలులో నాల్గవ సంవత్సరం రెండవ నెల జరుగుతూ వుండగా సొలొమోను ఆలయ నిర్మాణం చేపట్టాడు.
2CH 3:3 ఆలయ నిర్మాణ విషయంలో సొలొమోనుకు కొలతలు యివ్వబడ్డాయి: దాని పునాది తొంబై అడుగుల (అరవై మూరలు) పొడవు: ముప్పై అడుగుల (ఇరవై మూరలు) వెడల్పు. ఆలయ కొలతలు తీసుకొన్నుప్పుడు. సొలొమోను పాత మూర కొలతనే అనుసరించాడు.
2CH 3:4 ఆలయ మండపం పొడవు ముప్పై అడుగులు; ఎత్తు ముప్పై అడుగులు. అతడు మండపము యొక్క లోపలి భాగమంతా మేలిమి బంగారంతో పొదిగించాడు.
2CH 3:5 పెద్దగది గోడల మీద తమాల వృక్షముల (ఖర్జూరపు చెట్లు) చెక్కలు అమర్చాడు. ఆ తమాల వృక్షపు చెక్కలమీద మేలిమి బంగారపు రేకులు తాపించాడు. ఈ బంగారపు రేకుల మీద ఖర్జూరపు చెట్ల బొమ్మలు చెక్కించి గొలుసుల నగిషీ పని చేయించాడు.
2CH 3:6 ఆలయంలో అందం ఇనుమడించే విధంగా విలువైన రత్నాలు పొదిగించాడు. పర్వయీము నుండి తెచ్చిన బంగారాన్ని ఈ పనికి వినియోగించాడు. (అక్కడ బంగారం విస్తారంగా లభించేది. బహుశః ఆ ప్రదేశం ఓఫీరు దేశంలో ఉండి వుండవచ్చు).
2CH 3:7 ఆలయపు లోపలి భాగాన్నంతా బంగారు రేకులతో కప్పించాడు. పై కప్పు దూలాలకు దర్వాజాలకు, గోడలకు, తలుపులకు సొలొమోను బంగారు పూత వేయించాడు. గోడల మీద దేవదూతల (కెరూబులు) చిత్రాలు చెక్కించాడు.
2CH 3:8 తరువాత సొలొమోను అతి పవిత్ర స్థలం ఏర్పాటు చేశాడు. అవి పవిత్ర స్థలం పొడవు ముప్పై అడుగులు; వెడల్పు ముప్పై అడుగులు. ఆలయం వెడల్పంత వెడల్పు దీనికి కూడ వుంది. అతి పవిత్ర స్థలం గోడల నిండా మేలిమి బంగారు రేకులు వేయించాడు. ఈ బంగారపు బరువు ఇరవై మూడు టన్నులు (ఆరువందల తలాంతులు).
2CH 3:9 బంగారపు మేకుల తూకము ఏబై తులాలు. (ఇంచుమించు ఒకటింపావు పౌనులు). పై గదులకు బంగారు పూత వేయించాడు.
2CH 3:10 రెండు కెరూబుల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టించటానికి చేయించాడు. పనివారు ఆ కెరూబుల బొమ్మలకు బంగారు తొడుగు వేశారు.
2CH 3:11 ఆ కెరూబుల ప్రతిదాని రెక్క పొడవు ఏడున్నర అడుగులు ఉంది. ఆ రెండు కెరూబుల నాలుగు రెక్కల పొడవు ముప్పై అడుగులు. మొదటి కెరూబు ఒక రెక్క ఒక పక్క గోడకు ఆనుకొని వుంటుంది. రెండవ రెక్క రెండవ కెరూబు రెక్కకు తగులుతూ వుంటుంది.
2CH 3:12 రెండవ కెరూబు ఒక రెక్క గది గోడకు రెండవ వైపున ఆనుతుంది.
2CH 3:13 రెండు కెరూబుల రెక్కలు మొత్తం ముప్పై అడగులు దూరం వ్యాపించి వుంటాయి. దేవదూతల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలోకి చూస్తున్నట్లు నిలబడి వుంటాయి.
2CH 3:14 నీలం, ఊదా, ఎరుపు పదార్థలతోను, ఖరీదైన పట్టుతోను సొలొమోను తెరలు చేయించాడు. ఈ తెరల మీద కూడ కెరూబుల చిత్రాలు చిత్రించాడు.
2CH 3:15 ఆలయం ముందు రెండు స్తంభాలను ఏర్పాటు చేయించాడు. ఒక్కొక్క స్తంభం ఏబై రెండున్నర అడుగుల (ముప్పైయైదు మూరలు) ఎత్తు వుంటుంది. ఒక్కొక్క స్తంభం యొక్క శిఖరంమీది పీట యెత్తు ఏడున్నర అడుగులు.
2CH 3:16 కంఠాహారం లాంటి గొలుసులను సొలొమోను చేయించాడు. ఆ గొలుసులను స్తంభాల మీద పీటలకు అలంకరించాడు. వంద దానిమ్మ కాయల బొమ్మలు చేయించి గొలుసులకు తగిలించాడు.
2CH 3:17 ఇలా అలంకరించిన స్తంభాలను సొలొమోను ఆలయం ముందు నిలిపాడు. ఒక స్తంభం కుడి పక్క, రెండవ స్తంభం ఎడమ పక్కన నిలిపారు. సొలొమోను కుడి పక్క స్తంభానికి “యాకీను” అని పేరు పెట్టాడు. ఎడమ ప్రక్క స్తంభానికి “బోయజు” అని పేరు పెట్టాడు.
2CH 4:1 ఒక బలిపీఠాన్ని చేయటానికి సొలొమోను కంచును వినియోగించాడు. ఆ కంచు పీఠం ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు, పద్దెనిమిది అడుగుల ఎత్తు గలిగి వుంది.
2CH 4:2 కరిగిన కంచును వినియోగించి సొలొమోను ఒక పెద్ద కోనేరును (సముద్రం) చేయించాడు. ఆ కోనేరు (సముద్రం) గుండ్రని ఆకారంలో వుంది. దాని వ్యాసం పద్దెనిమిది అడుగులు. దాని ఎత్తు ఏడున్నర అడుగులు. దాని చుట్టు కొలత నలుబదియైదు అడుగులు.
2CH 4:3 కోనేరు (సముద్రం) అంచు చుట్టూ పద్దెనిమిది అడుగుల మేరకు కంచుగిత్తల బొమ్మలున్నాయి. ఆ గిత్తలు రెండు వరుసల్లో కోనేరు (సముద్రం)ను పోతపోసినప్పుడే పోతలో వచ్చాయి.
2CH 4:4 ఆ పెద్ద కోనేరు (సముద్రం) పన్నెండు పెద్ద గిత్తల విగ్రహాలపై నిలపబడింది. మూడు గిత్తలు ఉత్తరానికి తిరిగి దక్షిణానికి తిరిగి వున్నారు. మూడు గిత్తలు వున్నాయి. మూడు గిత్తలు పడమటి వైపుకు తిరిగి వున్నాయి. మూడు గిత్తలు తూర్పు వైపుకు చూస్తూవున్నాయి. ఆ పెద్ద కోనేరు (సముద్రం) ఈ గిత్తల మీద నిలపబడింది. ఆ గిత్తలన్నీ వాటి వెనుక భాగాలు మధ్యలో ఒకదానికొకటి ఆనుకొని వుండి నిలబడి వున్నాయి.
2CH 4:5 కంచు కోనేరు (సముద్రం) మందం మూడు అంగుళాలు. కోనేరు సముద్రపు అంచు గిన్నె అంచులాగా వుంది. అంచుతామర పుష్పంలా అగపడుతుంది. దానిలో పదిహేడు వేల ఐదువందల గేలనుల (ముప్పై పుట్లు) నీరు పడుతుంది.
2CH 4:6 సొలొమోను పది వెడల్పైన తొట్టెలను నిర్మించాడు. వాటిలో ఐదింటిని కోనేరు (సముద్రం) సముద్రంకు కుడి పక్కన, ఐదింటిని ఎడమ ప్రక్కన వుంచాడు. ఈ తొట్లను దహన బలులుగా అర్పించే జంతువులను కడగటానికి వినియోగిస్తారు. కాని పెద్ద కోనేరు (సముద్రం) ను మాత్రం యాజకులు తాము బలులు యిచ్చేముందు పవిత్ర స్నానాలు చేయటానికి వినియోగించేవారు.
2CH 4:7 సొలొమోను పది బంగారపు దీప స్తంభాలు చేయించాడు. ఈ దీప ఆలయ స్తంభాలు చేయటానికి, మునుపటి దీపస్తంభాల నమూనాలనే సొలొమోను అను కరించాడు. ఈ దీపస్తంభాలను అతడు ఆలయంలో వుంచాడు. కుడిపక్క ఐదు, ఎడమపక్క ఐదు దీప స్తంభాలను వుంచాడు.
2CH 4:8 సొలొమోను పది బల్లలు చేయించి ఆలయంలో వుంచాడు. ఆలయంలో ఐదు బల్లలు కుడిపక్కన, ఐదు బల్లలు ఎడమపక్కన వుంచాడు. సొలొమోను వంద తొట్లు చేయించటానికి బంగారం వినియోగించాడు.
2CH 4:9 ఆలయం వెలుపల సొలొమోను యాజకుల పురాన్ని, పెద్ద ఆవరణను నిర్మించి వాటికి వెలుపలి ద్వారాలను ఏర్పాటు చేశాడు. ఆ ద్వారాల తలుపులకు కంచు రేకులు తాపడం చేయించాడు.
2CH 4:10 పిమ్మట పెద్ద కంచు కోనేరు (సముద్రం) ను ఆలయంకి కుడి పక్కగా ఆగ్నేయ (తూర్పు-దక్షిణాల మూల) భాగాన వుంచాడు.
2CH 4:11 హూరాము కుండలను, పారలను, గిన్నెలను తయారు చేశాడు. పిమ్మట హూరాము రాజైన సొలొమోను తలపెట్టిన ఆలయంలో తన పనంతా పూర్తి చేశాడు.
2CH 4:12 హూరాము మరి రెండు స్తంభాలు, వాటిపైన వెడల్పు పళ్ళెములను చేశాడు. ఆ స్తంభాలపైనున్న వెడల్పు పళ్లెములను అలంకారంగా కప్పటానికి రెండు వలల్లాంటి అల్లికలను కూడ చేశాడు.
2CH 4:13 ఆ రెండు అల్లికల మీద వేలాడదీయటానికి నాలుగు వందల దానిమ్మకాయల ప్రతిమలు కూడా చేశాడు. అలంకరణగా రెండు వరుసల దానిమ్మకాయల బొమ్మలు చుట్టబడ్డాయి. స్తంభాల మీదనున్న పెద్ద పళ్ళెములను వలలు కప్పివున్నాయి.
2CH 4:14 హూరాము తొట్లను, వాటి కింది కుదురులను కూడా చేశాడు.
2CH 4:15 హూరాము కంచు కోనేరను (సముద్రం), దాని కింది పన్నెండు గిత్తలను చేశాడు.
2CH 4:16 హూరాము పాత్రలను, పారలను, శూలాలను, మరియు రాజైన సొలొమోను నిర్మిస్తున్న ఆలయానికి కావలసిన తదితర వస్తువులను చేశాడు. ఈ వస్తుసామగ్రంతా మెరుగు దిద్దిన కంచుతో చేయబడింది.
2CH 4:17 రాజైన సొలొమోను ముందుగా ఈ వస్తువులను మట్టి మూసలలో పోతపోయించాడు. ఈ మూసలు యోర్దానులోయలో సుక్కోతు, జెరేదాతను పట్టణాల మధ్య తయారు చేయబడ్డాయి.
2CH 4:18 సొలొమోను చేయించిన ఈ రకమైన వస్తుసామగ్రి ఎంత వుందనగా వాటికి పట్టిన కంచును తూచి లెక్క గట్టటానికి ఎవ్వరూ ప్రయత్నించియుండలేదు.
2CH 4:19 సొలొమోను ఆలయానికి కావలసిన సామాన్లు కూడా చేయించాడు. సొలొమోను బంగారు బలిపీఠం చేయించాడు. దైవ సన్నిధిలో నైవేద్యం వుంచాటానికి తగిన బల్లలు చేయించాడు.
2CH 4:20 సొలొమోను దీపస్తంభాలు, దీపాలు మేలిమి బంగారంతో చేయించాడు. అతి పవిత్ర స్థలం ముందు ఈ దీపాలు నిర్ణయించిన ఒక క్రమపద్ధతిలో వెలుగుతాయి.
2CH 4:21 ప్రమిదలు నిలిపే పుష్పాలవంటి కుదుర్లు, ప్రమిదలు, పట్టుకారులు, అన్నీ మేలిమి బంగారంతో సొలొమోను చేయించాడు.
2CH 4:22 వత్తులు ఎగదోయు పని ముట్లను, తొట్లను, గిన్నెలను, సాంబ్రాణి పొగవేయు ధూప కలశాలు చేయటానికి కూడా సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు. ఆలయ ద్వారాలకు, అతి పవిత్ర స్థలం తలుపులకు, ఆలయం తలుపులకు సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు.
2CH 5:1 దానితో సొలొమోను యెహోవా ఆలయ నిర్మాణానికి తలపెట్టిన పనంతా పూర్తయ్యంది. తన తండ్రి దావీదు ఆలయానికిచ్చిన వస్తువులన్నిటినీ సొలొమోను ఆలయంలోకి తెచ్చాడు. వెండి బంగారాలతో చేసిన వస్తువులను, తదితర సామానులన్నిటినీ సొలొమోను లోనికి తెచ్చాడు. ఆ వస్తువులన్నిటినీ సొలొమోను ఆలయపు ఖజానాలో భద్రపర్చాడు.
2CH 5:2 ఇశ్రాయేలు పెద్దలందరిని, వంశానాయకులందరినీ ఇశ్రాయేలులో వున్న వంశపెద్దలందరినీ సొలొమోను పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో సమావేశ పర్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టెను దావీదు నగరం నుండి తెప్పించే ఏర్పాట్లు చేసేటందుకు సొలొమోను ఈ సమావేశం ఏర్పాటు చేశాడు. దావీదు నగరానికే సీయోను అని పేరు.
2CH 5:3 ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక పర్ణశాల పండుగలో ప్రజలంతా రాజైన సొలొమోనును కలిశారు. ఆ సంవత్సరం ఏడవ నెలలో ఈ విందు ఏర్పాటు చేయబడింది.
2CH 5:4 ఇశ్రాయేలు పెద్దలంతా వచ్చిన పిమ్మట లేవీయులు ఒడంబడిక పెట్టెను లేవదీశారు.
2CH 5:5 పిమ్మట యాజకులు, లేవీయులు కలిసి ఒడంబడిక పెట్టెను యెరూషలేముకు మోశారు. యాజకులు, లేవీయులు సన్నిధి గుడారాన్ని, దానిలో వున్న పవిత్ర వస్తువులను యెరూషలేముకు తెచ్చారు.
2CH 5:6 రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలు ఒడంబడిక పెట్టెముందు గుమికూడారు. రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు గొర్రెలను, గిత్తలను, బలియిచ్చారు. బలి యిచ్చిన గొర్రెలు, గిత్త దూడలు ఎవ్వరూ లెక్కపెట్టెలేనన్ని వున్నాయి.
2CH 5:7 తరువాత యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను, దానికై నిర్దేశించిన స్థలానికి తీసుకొని వచ్చారు. ఆ స్థలమే ఆలయంలోని అతి పవిత్ర స్థలం. ఒడంబడిక పెట్టె అతి పవిత్ర స్థలంలో కెరూబుల రెక్కల క్రింద వుంచారు.
2CH 5:8 ఒడంబడిక పెట్టె వుంచబడిన స్థలంమీద కెరూబుల రెక్కలు విప్పివున్నాయి. కెరూబులు ఒడంబడిక పెట్టెమీద, దానిని మోసే కర్రమీద నిలబడివున్నాయి.
2CH 5:9 అతి పవిత్ర స్థలం ముందు నుంచి చూస్తే వాటి చివరలు కనబడేటంత పొడవుగా పెట్టెను మోసే కర్రలు వున్నాయి. కాని ఆలయం బయట నుంచి ఎవ్వరూ ఆ కర్రలను చూడలేరు. ఈనాటికీ ఆ కర్రలు అక్కడ వున్నాయి.
2CH 5:10 ఒడంబడిక పెట్టెలో రెండు శిలాఫలకాలు తప్ప మరేమీ లేవు. (అవి దేవుని పది ఆజ్ఞలున్న ఫలకాలు). హూరేబు పర్వతం మీద ఆ రెండు ఫలకాలను మోషే ఒడంబడిక పెట్టెలో వుంచాడు. ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా ఒక ఒడంబడిక చేసికొన్న చోటే ఈ హోరేబు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి స్వతంత్రులై బయటకు వచ్చిన పిమ్మట జరిగింది.
2CH 5:11 పిమ్మట అతి పవిత్ర స్థలంలోనికి వెళ్లిన యాజకులంతా బయటకు వచ్చారు. వారంతా శుచిగా వున్నారు. అప్పట్లో వారు యాజకులలో ఏ వర్గానికి చెందిన వారు అన్నది ముఖ్యంగాదు. వారంతా అతి పవిత్ర స్థలంలో నుంచి బయటికి వచ్చి తమకు తాము పరిశుద్ధులైనారు.
2CH 5:12 బలిపీఠానికి తూర్పు దిశలో లేవీయులకు చెందిన గాయకులంతా నిలబడ్డారు. ఆసాపు, హేమాను, యెదూతూను వర్గాలకు చెందిన గాయక బృందాల వారంతా అక్కడ వున్నారు. వారి కుమారులు, బంధువులు కూడా అక్కడ వున్నారు. లేవీ గాయకులంతా సన్నని నారతో నేసిన తెల్లని వస్త్రాలు ధరించారు. వారిచేతుల్లో పెద్ద పెద్ద తాళాలు, తంబరలు, సితారలు వున్నాయి. లేవీ గాయకులతో పాటు నూటఇరవై మంది యాజకులున్నారు. ఆ నూట ఇరవై మంది యాజకులు బూరలు ఊదారు.
2CH 5:13 బూరలు ఊదిన వారు, పాటలు పాడినవారు, సొంపుగా ఒక్క మనిషివలె ఊది, పాడారు. వారు యెహోవాకి స్తోత్రం చేసినప్పుడు కృతజ్ఞతలు పలికినప్పుడు ఏక కంఠంగా వినిపించింది. బూరలతోను, తాళాలతోను, ఇతర వాద్య విశేషాలతోను వారు పెద్దశబ్దం వచ్చేలా చేశారు. వారు యీలా పాడారు: “ప్రభువు మంచివాడు, దేవుని కరుణ శాశ్వత మైనది!” అటు తర్వాత ఆలయాన్ని ఒక మేఘం ఆవరించింది.
2CH 5:14 ఆ మేఘంవల్ల యాజకులు తమ సేవా కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. దానికి కారణ మేమనగా యెహోవా యొక్క మహిమ ఆలయాన్ని నింపివేసింది.
2CH 6:1 తరువాత సొలొమోను యీలా అన్నాడు: “యెహోవా, నల్లని మేఘంలో నివసిస్తానని అన్నాడు.
2CH 6:2 ఓ ప్రభూ, నీ కొరకు ఒక ఆలయాన్ని నిర్మించాను. అది ఒక ఉన్నతమైన ఆలయం. శాశ్వతంగా నీవు నివసించటానికి అది నిలయం!”
2CH 6:3 సొలొమోను వెనుదిరిగి తన ముందు నిలబడిఉన్న ప్రజలందరనీ దీవించాడు.
2CH 6:4 సొలొమోను యీలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి! నా తండ్రి దావీదుకు తానేమి చేస్తానని వాగ్దానం చేశాడో, యెహోవా అదంతా నెరవేర్చినాడు. యెహోవా దేవుడు యీలా చెప్పియున్నాడు:
2CH 6:5 ‘నా ప్రజలను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పటినుండి ఇశ్రాయేలు వంశాలవారున్న ఏ నగరాన్నీ నాకు ఒక ఆలయాన్ని కట్టించటానికి నేను కోరుకోలేదు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి నేను ఏ వ్యక్తినీ నాయకునిగా ఎంపిక చేయలేదు.
2CH 6:6 కాని ఇప్పుడు నా పేరు మీద యెరూషలేమును ఎన్నుకున్నాను. పైగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి దావీదును ఎంపిక చేశాను.’
2CH 6:7 “ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు నా తండ్రియగు దావీదు ఒక ఆలయాన్ని నిర్మింప గోరాడు.
2CH 6:8 కాని. యెహోవా నా తండ్రితో, ‘దావీదూ, నీవు నా పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మింప తలచటం బాగానే వుంది.
2CH 6:9 కాని, నీవు ఆలయాన్ని నిర్మించకూడదు. నా పేరు మీద నీ స్వంత కుమారుడు ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు’ అని చెప్పాడు.
2CH 6:10 యెహోవా ఏమి చేస్తానని చెప్పాడో ఇప్పుడది చేశాడు. నా తండ్రి స్థానంలో నేను కొత్త రాజును. దావీదు నా తండ్రి. ఇప్పుడు నేను ఇశ్రాయేలుకు రాజును. అదే యెహోవా చేసిన వాగ్దానం. మరి నేను ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు ఒక ఆలయాన్ని నిర్మించాను.
2CH 6:11 ఒడంబడిక పెట్టెను ఆలయంలో వుంచాను! ఈ ఒడంబడిక పెట్టెలోనే దేవుని పది ఆజ్ఞల రాతిపలకలు వుంచబడినవి. దేవుడు ఈ ఒడంబడికను ఇశ్రాయేలు ప్రజలతో చేసు కొన్నాడు.”
2CH 6:12 సొలొమోను యెహోవా బలిపీఠానికి ఎదురుగా నిలబడ్డాడు. సమావేశమైన ఇశ్రాయేలు ప్రజల కెదురుగా అతడు నిలబడ్డాడు. పిమ్మట సొలొమోను తన రెండు చేతులూ చాచాడు.
2CH 6:13 సొలొమోను కంచుతో ఒక ఎత్తైన వేదిక నిర్మించాడు. దాని పొడవు ఏడున్నర అడుగులు; వెడల్పు ఏడున్నర ఆడుగులు; ఎత్తు ఎడున్నర అడుగులు అతడు దానిని బయట ఆవరణలో మధ్యగా వుంచాడు. అతడు దానిమీదకు ఎక్కి, సమావేశమైన ఇశ్రాయేలు ప్రజానీకం ముందు మోకరించాడు. సొలొమోను తన చేతులను ఆకాశంలోనికి ఎత్తాడు.
2CH 6:14 పిమ్మట సొలొమోను యీలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, నీవంటి దేవుడు భూమిమీదగాని, ఆకాశంలోగాని మరొక్కరు లేరు. ప్రేమ, కరుణతో కూడిన నీ ఒడంబడికను నీవు నిలబెట్టుకున్నావు. నీ ప్రజలంతా పూర్ణహృదయంతో సన్మార్గులై, నిన్ను అనుసరిస్తే నీ ఒడంబడిక కొనసాగిస్తావు.
2CH 6:15 నీ సేవకుడైన దావీదుకు నీవిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చావు. దావీదు నా తండ్రి. స్వయంగా నీ నోటితో ఆ వాగ్దానం చేశావు. ఈనాడు ఆ వాగ్దానాన్ని స్వయంగా నీ చేతులతో నిజమయ్యేలా చేశావు.
2CH 6:16 ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, ఇప్పుడు నీవు నీ సేవకుడైన దావీదుకు ఇచ్చిన మాట నిలబెట్టుము. నీవిలా మాట యిచ్చావు: ‘దావీదూ, నా సన్నిధిలో ఇశ్రాయేలు సింహాసనంపై నీ కుటుంబంలో ఒకడు తప్పక కొనసాగుతాడు. నీ కుమారులు వారు చేసే కార్యాలలో తగిన జాగ్రత్త వహిస్తేనే ఇది జరుగుతుంది. నా ధర్మాశాస్త్రాన్ని నీవు అనుసరించిన రీతిలో, నీ కుమారులు కూడ నా ధర్మాశాస్త్రాన్ని పాటించాలి.’
2CH 6:17 ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, నీ వాగ్దానం నిజమగుగాక! ఈ వాగ్దానం నీ సేవకుడైన దావీదుకు యిచ్చాయున్నావు.
2CH 6:18 “ఓ దేవా, నీవు నిజంగా మానవులతో కలిసి భూమి మీద నివసించవని మాకు తెలుసు. ఆకాశాలు గాని, మహా ఆకాశాలు గాని నిన్ను నిలుపజాలవు! అటువంటప్పుడు నేను నిర్మించిన ఈ చిన్న ఆలయం నిన్ను భరింపలేదని కూడా మాకు తెలుసు!
2CH 6:19 కానీ నీ కరుణ కొరకు నేను చేయు ప్రార్థనను, అభ్యర్థనను ఆలకించు. నా దేవుడైన ప్రభూ, నా మొరాలకించుము! నీ కొరకు నా ప్రార్థనయందు శ్రద్ధ వహించుము. నేను నీ సేవకుడను.
2CH 6:20 ఈ ఆలయాన్ని నీవు కన్నులార రాత్రింబవళ్లు చూడాలని నా ప్రార్థన. ఈ స్థలంలో నీ పేరును ప్రతిష్ఠిస్తావని నీవు చెప్పియున్నావు. ఈ ఆలయాన్ని చూస్తూ నేను చేసే నా ప్రార్థనను నీవు విందువుగాక!
2CH 6:21 నేను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేయు ప్రార్థనలను ఆలకించుము. ఈ ఆలయాన్ని చూస్తూ మేము చేయు ప్రార్థనలయందు లక్ష్యముంచుము. ఆకాశంలో నీవున్న చోటు నుంచే మా ప్రార్థన వినుము. నీవు మా ప్రార్థనలను విన్నప్పుడు మమ్మల్ని మన్నించుము.
2CH 6:22 “ఒక మనిషి వేరొక మనిషిపట్ల అపచారం చేసిన నేరానికి పాల్పడవచ్చు. అది జరిగినప్పుడు నిందితుడు నీపేరు మీద ఒక ప్రమాణం చేయాలి. ఆలయంలోని నీ బలిపీఠం ముందు అతడు ప్రమాణం చేయటానికి వచ్చినప్పుడు
2CH 6:23 నీవు ఆకాశంలోని నీ వాసము నుండి వినుము. అప్పుడు నీ సేవకులను విచారించి చర్య తీసుకొనుము. దుష్టుని శిక్షించుము. అతడు ఇతరులను బాధ పెట్టిన విధంగా తానుకూడా ఆ బాధను అనుభవించేలా చేయుము. మంచి కార్యములు చేసిన వాని నిర్దోషిత్వాన్ని నిరూపింపుము.
2CH 6:24 “నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీపట్ల పాపం చేసిన కారణంగా ఒక శత్రువు వారిని ఓడించవచ్చు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి నీ నామస్మరణ చేసి నిన్నాశ్రయించి ఈ ఆలయంలో నిన్ను ప్రార్థస్తూ వేడుకుంటే,
2CH 6:25 ఆకాశంలో వుండి నీ ఇశ్రాయేలీయుల రోదన విని వారిని క్షమింపుము. నీవు వారికి, వారి పూర్వీకులకు ఇచ్చిన రాజ్యానికి వారిని తిరిగి తీసుకొని రమ్ము.
2CH 6:26 “వర్షాలు లేకుండ ఆకాశం కుంచుకపోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు నీపట్ల పాపం చేసినట్లయితే ఇది జరుగుతుంది. కాని ఇశ్రాయేలీయులు నీ శిక్షకు గురియై తమ తప్పు తెలిసికొని పశ్చాత్తాపము పొంది, ఆలయం వైపు తిరిగి నీ నామస్మరణ చేసి ప్రార్థిస్తే,
2CH 6:27 నీవు ఆకాశంలో నుండి వారి మొరాలకించుము. వారి విన్నపము ఆలకించి వారి పాపాలను క్షమించుము. ఇశ్రాయేలు ప్రజలు నీ సేవకులు. వారు జీవించవలసిన సన్మార్గాన్ని వారికి బోధించుము. నీ రాజ్యంలో వర్షాలు కురిపించుము. నీవు ఈ రాజ్యాన్ని నీ ప్రజలకు ఇచ్చావు.
2CH 6:28 “ఈ రాజ్యంలో కరువు రావచ్చు. వ్యాధులు వ్యాపించవచ్చు. పంటలకు తెగుళ్లు సోకవచ్చు. తోటలకు తేనెమంచు వ్యాధుల, మిడతల, పురుగుల పీడ సంభవించవచ్చు. ఇశ్రాయేలీయుల నగరాలపై శత్రుదాడులు జరిగినప్పుడుగాని, ఇశ్రాయేలులో ఏ రకమైన వ్యాధులు ప్రబలినా,
2CH 6:29 ఇశ్రాయేలు ప్రజలు తమ బాధలు గ్రహించి నిన్ను ప్రార్థించి వేడుకుంటే, ఏ బాధితుడేగాని ఈ ఆలయాన్ని చూస్తూ చేతులెత్తి ప్రార్థిస్తే,
2CH 6:30 నీ నివాస స్థలమైన ఆకాశంనుండి వారి అభ్యర్థన ఆలకించుము. వారి మొరాలకించి, వారిని క్షమించుము. ప్రతి వ్యక్తికి వానికి అర్హమైన దాని నివ్వుము. ఎందువల్లననగా ప్రతివాని హృదయం నీకు తెలుసు. మానవ హృదయాలను తెలుసుకొనే శక్తి నీ వొక్కనికే వుంది.
2CH 6:31 అప్పుడు మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో ప్రజలు నివసించినంత కాలం నీపట్ల భయభక్తులు కలిగి వుంటారు.
2CH 6:32 నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెందని పరదేశీయుడెవడైనా తన సుదూరదేశం నుండి ఇక్కడికి రావచ్చును. అతడు నీ మహోన్నత నామం వినిగాని, తిరుగులేని నీ బాహుబలం గూర్చి వినిగాని, చాచిన నీ చేతుల ప్రభావం వినిగాని రావచ్చును. అతడు వచ్చి నీ ఆలయంవైపు చూస్తూ ప్రార్థన చేస్తే,
2CH 6:33 నీ ఆకాశ నివాసం నుండి వాని ప్రార్థన ఆలకించుము. ఆ పరదేశి కోరిన సహాయాన్ని అందించుము. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ నీ నామ మహిమను, నీ ప్రభావాన్ని తెలుసుకొని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులవలె నీ పట్ల భయ భక్తులతో మెలుగుతారు. దానితో ప్రపంచ ప్రజలంతా నేను నిర్మించిన ఈ ఆలయం నీ పేరు మీద పిలవ బడుతూ వుందని తెలుసుకుంటారు.
2CH 6:34 “నీవు నీ ప్రజలను తమ శత్రువుల మీదికి ఒక చోటికి యుద్దానికి పంపితే, వారు ఈ నగరంవైపు, నేను నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి నిన్ను తలంచి ప్రార్థన చేసిన పక్షంలో
2CH 6:35 వారి ప్రార్థన ఆకాశంనుండి నీవు ఆలకించి తగిన సహాయం చేయుము.
2CH 6:36 “ప్రజలు నీకు విరుద్ధంగా పాపం చేస్తారు. సామాన్యంగా పాపం చేయని మానవులుండరు. అలాగే ఈ ప్రజలు నీపట్ల పాపం చేసినప్పుడు నీకు వారిపై కోపం రావటం సహజం. ఒకానొక శత్రువు వచ్చి వారిని ఓడించి బందీలుగా దూరదేశానికో, దగ్గర దేశానికో తీసుకొని పోయేలా నీవు చేయవచ్చు.
2CH 6:37 కాని వారు బందీలుగా వున్న రాజ్యంలో వున్నప్పుడు వారిలో పరివర్తన వచ్చి నిన్ను ప్రాధేయపడవచ్చు. ‘మేము పాపం చేశాము; మేము తప్పు చేశాము; మేము దుర్మార్గంగా ప్రవర్తించాము,’ అని వారు పరితపించవచ్చు.
2CH 6:38 పరితపించి వారు మళ్లీ హృదయపూర్వకంగా, ఆత్మ సాక్షిగా తాము బందీలుగా వున్న దేశంలోనే వారు నిన్ను ఆశ్రయించవచ్చు. నీవు వారి పితరులకు యిచ్చిన దేశంవైపు, నీవు ఎంపిక చేసిన నీ నగరంవైపు చూస్తూ ని ప్రార్థించవచ్చు. నేను నీ పేరు మీద నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి ప్రార్థించవచ్చు.
2CH 6:39 ఇలా జరిగిన సందర్భంలో ఆకాశంలో నుండి నీవు వారి మొర ఆలకించుము. ఆకాశం నీ నివాసం. నీపట్ల పాపం చేసిన నీ ప్రజలైన వారి ప్రార్థన, వారి మనవి ఆలకించి, వారిని క్షమించి సహాయపడుము.
2CH 6:40 ఓ నాప్రభూ, నీ నేత్రాలను విప్పమని, నీ చెవులను ఒగ్గుమని నేను ప్రాధేయపడుచున్నాను. ఈ స్థానంలో మేము చేసే ప్రార్థనపట్ల శ్రద్ధ వహించుము.
2CH 6:41 “ఓ ప్రభూ, మేలుకో తండ్రీ, నీ మహత్తర శక్తికి నిదర్శనమైన ఒడంబడిక పెట్టెతో నీ విశ్రాంతి ఆలయాన్ని ప్రవేశించుము. నీ యాజకులు రక్షణ పొందుదురు గాక! ఓ ప్రభూ, దేవా, పవిత్రులైన నీ ప్రజలకు సుఖశాంతులను కలుగజేయుము!
2CH 6:42 ఓ దేవా, నీవల్ల అభిషిక్తుడైన వానిని తిరస్కరించవద్దు. నీ సేవకుడైన దావీదు చేసిన విశ్వాసపాత్రమైన కార్యాలను జ్ఞాపక ముంచు కొనుము!”
2CH 7:1 సొలొమోను ప్రార్థన పూర్తి చేసేసరికి ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులను, మిగిలిన అర్పణలను దహించి వేసింది. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది.
2CH 7:2 యెహోవా మహిమ నిండి వున్న ఆలయంలో యాజకులు ప్రవేశించలేక పోయారు.
2CH 7:3 ఆకాశం నుండి అగ్ని దిగిరావటం ఇశ్రాయేలీయులంతా చూశారు. యెహోవా మహిమ ఆలయాన్ని ఆవరించిండటం కూడ వారు చూశారు. వారంతా బాటపై సాష్టాంగ పడ్డారు. వారు యెహోవాను స్తుతించి, నమస్కరించారు. వారింకా యీలా అన్నారు: “ప్రభువు ఉత్తముడు, ఆయన కరుణ ఎప్పటికీ కొనసాగుతుంది.”
2CH 7:4 పిమ్మట రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవా ముందు బలులు అర్పించారు.
2CH 7:5 రాజైన సొలొమోను ఇరవై రెండువేల గిత్తలను, ఒక లక్షా ఇరవైవేల గొర్రెలను బలియిచ్చాడు. రాజు, ప్రజలు అంతా కలిసి ఆలయాన్ని పవిత్రం చేశారు. అది యెహోవా ఆరాధనకై వినియోగింపబడాలి.
2CH 7:6 యాజకులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి సిద్ధంగా నిలబడ్డారు. లేవీయులు కూడ యెహోవా మేళం వాయించే పనిముట్లు పట్టుకుని నిలిచారు. దేవునికి వందనాలర్పించే నిమిత్తం ఈ వాద్య విశేషాలను రాజైన దావీదు చేయించాడు. “దేవుని ప్రేమ అనంతం!” అని యాజకులు, లేవీయులు పలికారు. లేవీయులకు ఎదురుగా నిలబడి యాజకులు బాకాలు ఊదారు. ఇశ్రాయేలీయులందరూ నిలబడ్డారు.
2CH 7:7 ఆలయం ముందున్న ఆవరణ మధ్య భాగాన్ని సొలొమోను ప్రతిష్టంచాడు. అక్కడే సొలొమోను దహనబలులు, సమాధాన బలుల కొవ్వును అర్పించాడు. తాను నిర్మించిన కంచు బలిపీఠం దహనబలులు, ధాన్యపు అర్పణలు, కొవ్వును పెట్టటానికి చాలనందున, సొలొమోను ఆలయ ఆవరణ మధ్య భాగాన్ని వినియోగించాడు.
2CH 7:8 సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలు కలిసి ఏడు రోజులపాటు పండుగ చేశారు. సొలొమోనుతో చాలా మంది జనం వున్నారు. హమాతు పట్టణద్వారం నుండి ఈజిప్టు సెలయేటి వరకు వున్న ప్రాంత మంతటి నుండి జనసమూహాలు వచ్చాయి.
2CH 7:9 ఏడు రోజుల పండుగ ఆచరణ ముగిశాక, ఎనిమిదవ రోజున వారు పవిత్ర సమావేశం ఏర్పాటు చేశారు. బలిపీఠాన్ని వారు పవిత్ర (శుద్ధి) చేశారు. దానిని దైవారాధనలోనే విని యోగిస్తారు. వారు ఏడు రోజులు పండుగ ఆచరించారు.
2CH 7:10 ఆ సంవత్సరం ఏడవ నెల ఇరవై మూడవ రోజు సొలొమోను ప్రజలందరినీ తమ తమ ఇండ్లకు పంపివేశాడు. యెహోవా దావీదుపట్ల, సొలొమోను పట్ల, ఇశ్రాయేలు ప్రజలపట్ల ఎంతో ఉదారంగా వున్నందుకు ప్రజలంతా చాలా సంతోషించారు. వారి హృదయాలు ఆనందమయమయ్యాయి.
2CH 7:11 సొలొమోను ఆలయాన్ని, రాజభవనాన్ని నిర్మించటం పూర్తిచేశాడు. ఆలయ నిర్మాణంలోను, తన ఇంటి నిర్మాణంలోను సొలొమోను అనుకున్న పనులన్నీ పూర్తిచేశాడు.
2CH 7:12 ఆ రాత్రి యెహోవా సొలొమోనుకు దర్శనమిచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు: “సొలొమోనూ, నీ ప్రార్థన నేను విన్నాను. బలులు యివ్వటానికి అనువైన ప్రదేశంగా ఈ స్థలాన్ని నేనే ఎంపిక చేశాను.
2CH 7:13 వర్షాలు లేకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడుగాని, దేశాన్ని నాశనం చేసే విధంగా నేను మిడతల దండులను పంపినుప్పుడుగాని, నేను నా ప్రజలకు వ్యాధులు సొకేలా చేసినప్పుడుగాని,
2CH 7:14 నా పేరు మీద పిలవబడే నా ప్రజలు అణకువతో వుండి నన్ను ప్రార్థిస్తే, నా కొరకు ఎదురు చూస్తే, వారు తమ చెడు మార్గాలను విడనాడితే, నేనప్పుడు ఆకాశం నుండి వారి మొర ఆలకిస్తాను. నేను వారి పాపాలను క్షమిస్తాను. నేను వారి దేశాన్ని బాగు చేస్తాను.
2CH 7:15 నేను నా నేత్రలను తెరచియున్నాను. నా చెవులు ఈ ప్రదేశంలో చేసిన ప్రార్థనలను వింటాయి.
2CH 7:16 ఇక్కడ నా పేరు శాశ్వతంగా ఉండునట్లు నేనీ ప్రదేశాన్ని ఎంపిక చేసి, దానిని పవిత్రంగా మార్చాను. అవును; నా కళ్లు, నా హృదయం ఇక్కడ ఈ ఆలయంలో ఎల్లప్పుడూ వుంటాయి.
2CH 7:17 సొలొమోనూ, నీవిప్పుడు నీ తండ్రి మెలగిన రీతిలో నా ముందు జీవిస్తే, నా ఆజ్ఞలన్నీ పాటిస్తే, నా ధర్మశాస్త్రాన్ని, నియమాలను అనుసరిస్తే,
2CH 7:18 నిన్నొక శక్తి యుక్తులుగల రాజుగా చేస్తాను. నీ రాజ్యాన్ని సుస్థిరమైనదిగా చేస్తాను. నీ తండ్రియైన దావీదుతో అదే ఒడంబడిక చేశాను. ‘దావీదూ, ఇశ్రాయేలు రాజుగా నీ కుటుంబంలో ఒకడు కొనసాగుతాడు’ అని నేను చెప్పియున్నాను.
2CH 7:19 “కానీ నీవు నా ధర్మాన్ని, ఆజ్ఞలను శిరసావహించనిచో, నీవు గనుక అన్యదేవతారాధనకు పాల్పడితే,
2CH 7:20 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నేను వారికిచ్చిన రాజ్యం నుండి బయటకు త్రోసివేస్తాను. నా నామముతో పవిత్రపర్చబడిన ఈ ఆలయాన్ని నేను వదలి వేస్తాను. ఇతర దేశాలన్నీ చెడుమాటలు పలికేలా ఈ ఆలయమును మార్చివేస్తాను.
2CH 7:21 అత్యున్నతంగా గౌరవింపబడిన ఈ ఆలయం ప్రక్కగా వెళ్లే వారెవరైనా చూసి ఆశ్చర్యపోతారు. ‘ఈ రాజ్యానికి, ఈ ఆలయానికి, యెహోవా ఎందుకింత భయంకర పరస్థితి కల్పించాడు?’ అని అనుకుంటారు.
2CH 7:22 పిమ్మట వారు ఈ రకంగా సమాధానం చెప్పుకుంటారు: ‘వారి పూర్వీకుల దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు ప్రజలు అనుసరించలేదు. ఆయనే వారిని ఈజిప్టు నుండి విముక్తి చేసి బయటకు తీసుకొనివచ్చాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు అన్యదేవతలను సేవించారు. వారు విగ్రహాలను కొలిచారు. అందువల్లనే యెహోవా ఈ భయంకర పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలకు కల్పించాడు అని అనుకుంటారు.’”
2CH 8:1 ఆలయ నిర్మాణానికి, తన స్వంత ఇంటి నిర్మాణానికి సొలొమోనుకు ఇరవై సంవత్సరాలు పట్టింది.
2CH 8:2 పిమ్మట హీరాము తనకు ఇచ్చిన పట్టణాలను తిరిగి నిర్మించాడు. ఆ పట్టణాలలో కొంత మంది ఇశ్రాయేలీయులను సొలొమోను నివసింపనిచ్చాడు.
2CH 8:3 దీని తరువాత సొలొమోను సోబాలోని హమాతు నగరాన్ని వశపర్చుకున్నాడు.
2CH 8:4 సొలొమోను తద్మోరు అనే పట్టణాన్ని కూడా ఎడారిలో నిర్మించాడు. హమాతులోని పట్టణాలన్నిటినీ వస్తుసామగ్రులను నిలవచేయటానికి నిర్మించాడు.
2CH 8:5 సొలొమోను ఎగువ బేత్ హోరోను, దిగువ బేత్ హోరోను పట్టణాలను కూడ కట్టించాడు. అతడీ పట్టణాలను బలమైన కోటలుగా తయారు చేశాడు. వాటి చుట్టూ గోడలు, వాటి ద్వారాలు, ద్వారాలకు కడ్డీలు ఏర్పాటు చేశాడు.
2CH 8:6 బయలతు పట్టణాన్ని వస్తువులు నిల్వచేసే ఇతర పట్టణాలను సొలొమోను మళ్లీ కట్టించాడు. రథశాలలున్న పట్టణాలను, గుర్రాలను నడిపే రౌతుల నగరాలన్నిటినీ సొలొమోను కట్టించాడు. యెరూషలేములోను, లెబానోనులోను, తాను రాజుగా వున్న ప్రాంతాలన్నిటిలోను సొలొమోను తనకు కావలసిన వాటినన్నిటినీ కట్టించాడు.
2CH 8:7 ఇశ్రాయేలీయులు నివసిస్తున్న దేశంలో చాలా మంది పరదేశీయులున్నారు. వారిలో హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు వున్నారు. ఆ పరదేశీయులందరినీ సొలొమోను బానిసలుగా పనిచేయించాడు. వారు ఇశ్రాయేలీయులు కారు. వారంతా దేశాన్ని వదలిపోగా మిగిలిన వారంతా పరదేశీయుల సంతతివారు. పైగా వారు ఇశ్రాయేలీయులచే చంపబడకుండా మిగిలిపోయినవారు. ఈవెట్టి చాకిరి ఈనాటికీ కొనసాగుతూనే వుంది.
2CH 8:9 ఇశ్రాయేలీయులైన వారెవరినీ బానిసలుగా చేయమని సొలొమోను వత్తిడి చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను యొక్క పోరాట యోధులు వారు అతని సైనికాధికారులలో ముఖ్యులుగాను, రథాలకు అధిపతులుగాను, రథసారధులకు నాయకులుగాను నియమింప బడ్డారు.
2CH 8:10 కొంతమంది ఇశ్రాయేలీయులు సొలొమోను ముఖ్యాధిపతులకు పైఅధికారులుగా వున్నారు. ప్రజల కార్యకలపాలు తనిఖీ చేయటానికి ఇలాంటివివారు రెండు వందల ఏబై మంది ఉన్నారు.
2CH 8:11 ఫరోరాజు కుమార్తెను దావీదు నగరం నుండి ఆమె కొరకు కట్టించిన భవంతికి సొలొమోను తీసుకొని వచ్చాడు. “నా భార్య రాజైన దావీదు ఇంటిలో నివసించ కూడదు. ఎందువల్లనంటే దేవుని ఒడంబడిక పెట్టె వెళ్లిన ప్రతిచోటూ పవిత్రమైనది” అని సొలొమోను అన్నాడు.
2CH 8:12 యెహోవా బలిపీఠం మీద సొలొమోను దహన బలులు అర్పించాడు.
2CH 8:13 మోషే ఆజ్ఞాపించిన విధంగా సొలొమోను ప్రతిరోజూ బలులు అర్పించాడు. బలులు ప్రతి సబ్బాతు దినాన, ప్రతి అమావాస్య రోజున, మరియు సంవత్సరంలో వచ్చే మూడు పండుగ సెలవు రోజులలోను అర్పించేవారు. ఆ మూడు పండుగలకు పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ మరియు పర్ణశాలల పండుగ అని పేర్లు.
2CH 8:14 తన తండ్రి దావీదు ఉపదేశాలన్నిటినీ సొలొమోను పాటించాడు. సొలొమోను వివిధ కార్యాలకు అర్హతగల యాజక వర్గాలను నియమించాడు. లేవీయులను కూడ వారికి తగిన పనులకు సొలొమోను నియమించాడు. భక్తిగీతాల కార్యక్రమ నిర్వహణ, ఆలయంలో దేవుని సేవలో నిత్యం కావలసిన వస్తువులు చేయుటలో యాజకులకు తోడ్పడటం లేవీయుల పని. ప్రతి ద్వారంవద్ద సేవ చేయటానికి తగిన విధంగా జట్లను సొలొమోను ఎంపిక చేశాడు. ఈ రకంగా చేయమని యెహోవా సేవకుడైన దావీదు ఆజ్ఞాపించాడు.
2CH 8:15 యాజకులకు, లేవీయులకు సొలొమోను ఇచ్చిన ఆదేశాలను ఇశ్రాయేలు ప్రజలు మార్చటంగాని, అనాదరించటంగాని చేయలేదు. కనీసం విలువైన వస్తువుల భద్రత విషయాలలో కూడ వారు ఏ ఒక్క ఆదేశాన్నీ మార్చలేదు.
2CH 8:16 సొలొమోను చేయవలసిన పసంతా పూర్తి అయ్యింది. ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుండి అది పూర్తి అయ్యేవరకు పనియావత్తూ ఒక క్రమ పద్ధతిలో సాగింది. ఆ విధంగా ఆలయం నిర్మింపబడింది.
2CH 8:17 పిమ్మట సొలొమోను ఎసోన్గెబరు, ఏలతు పట్టణాలకు వెళ్లాడు. ఆ పట్టణాలు ఎదోము దేశంలో ఎర్ర సముద్ర తీరంలో వున్నాయి.
2CH 8:18 హీరాము ఓడలను సొలొమోను వద్దకు పంపాడు. హీరాము స్వంత మనుష్యులు ఓడలను నడిపారు. సముద్రయానంలో హీరాము మనుష్యులు ఆరితేరినవారు. హీరాము మనుషష్యులు సొలొమోను సేవకులతో కలిసి ఓఫీరుకు వెళ్లి పదిహేడు టన్నుల బంగారాన్ని రాజైన సొలొమోనుకు తీసుకొని వచ్చారు.
2CH 9:1 షేబ దేశపు రాణి సొలొమోను కీర్తిని గురించి విన్నది. కఠినమైన, చిక్కు ప్రశ్నలు వేసి సొలొమోనును పరీక్షించాలని ఆమె యెరూషలేముకు వచ్చింది. షేబ రాణి తన వెంట అనేకమంది మనుష్యులను తీసుకొని వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, బంగారం, విలువైన రత్నాలు మోసుకొని వచ్చిన ఒంటెలు ఆమెతో వున్నాయి. ఆమె సొలమోను వద్దకు వచ్చి అతనితో మాట్లడింది. ఆమె వద్ద సొలొమోనును అడగటానికి ఎన్నో ప్రశ్నలున్నాయి.
2CH 9:2 ఆమె ప్రశ్నలన్నిటికీ సొలొమోను సమాధాన మిచ్చాడు. వివరించి చెప్పటానికిగాని, సమాధాన మివ్వటానికిగాని సొలొమోనుకు కష్టమైనదేదీ కన్పించలేదు.
2CH 9:3 సొలొమోను జ్ఞానాన్ని, అతడు నిర్మించిన భవంతిని షేబ దేశపు రాణి స్వయంగా చూసింది.
2CH 9:4 సొలొమోను బల్లమీద రాజ భోజన పదార్థలను, అతని ముఖ్య అధికారులనేకమందిని ఆమె చూసింది. అతని సేవకులు పనిచేసే తీరును, వారు ధరించే దుస్తులను ఆమె చూసింది. సొలొమోనుకు ద్రాక్షరసము వడ్డించే వారిని, వారి దుస్తులను ఆమె చూసింది. ఆలయంలో సొలొమోను ఆర్పించిన దహన బలులను కూడ ఆమె చూసింది. షేబ దేశపు రాణి వాటన్నింటినీ చూసి నప్పుడు ఆమె ఆశ్చర్యపడింది!
2CH 9:5 అప్పుడామె రాజైన సొలొమోనుతో యీలా అన్నది: “నీ ఘనమైన కార్యాలను గురించి, నీ అద్భుతమైన తెలివితేటల గురించి నేను నా దేశంలో విన్న విషయాలన్నీ నిజమని తెలుసుకున్నాను.
2CH 9:6 నేనిక్కడికి వచ్చి, నా కన్నులతో స్వయంగా చూచేవరకు నేనా విషయాలను నమ్మలేదు. ఆహా! నీకున్న మహాజ్ఞానంలో కనీసం సగం కూడ నాకు చెప్పబడలేదు! నేను విన్న విషయాలను మించివున్నావు నీవు!
2CH 9:7 నీవు భార్యలు, అధికారులు చాలా అదృష్టవంతులు! నీకు సేవ చేస్తూనే నీ జ్ఞాన వాక్కులను వారు వినగలరు!
2CH 9:8 నీ దేవుడైన ప్రభువుకు వందనాలు! నీ పట్ల ఆయన సంతోషంగా వున్నాడు. అందువల్ల ఆయన తరపున రాజ్యమేలటానికి ఆయన సింహాసనంపై నిన్ను కూర్చోపెట్టాడు. నీ దేవుడు ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు. ఆయన సహాయం ఇశ్రాయేలుకు శాశ్వతంగా వుంటుంది. అందువల్లనే ఏది న్యాయమైనదో, ఏది మంచిదో అది చేయటానికి యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు.”
2CH 9:9 తరువాత షేబ దేశపు రాణి సొలొమోను రాజుకు నాలుగున్నర టన్నుల (రెండు వందల నలబై మణుగులు) బంగారం, లెక్కకు మించి సుగంధ ద్రవ్యాలు, విలువైన రత్నాలు ఇచ్చింది. షేబ దేశపు రాణి ఇచ్చినట్లు రాజైన సొలొమోనుకు ఎవ్వరూ అటువంటి మేలి రకపు సుగంధ ద్రవ్యాలను ఇచ్చివుండలేదు.
2CH 9:10 హీరాము సేవకులు, సొలొమోను సేవకులు ఓఫీరు నుండి బంగారం తీసుకొని వచ్చారు. వారింకా చందనపు కర్రను, విలవైన రత్నాలను తెచ్చారు.
2CH 9:11 ఆలయంలో మెట్ల నిర్మాణానికి, రాజభవన నిర్మాణంలోను రాజైన సొలొమోను చందనపు కర్రను ఉపయోగించాడు. సంగీత విధ్వాంసుల కొరకు తంబరలు, సితరాలు చేయటానికి కూడ సొలొమోను ఈ కర్రను వినియోగించాడు. యూదాలో చందనపు కర్రతో చేయబడిన చిత్రవిచిత్ర కళాఖండాలను ఎవ్వరూ ముందెన్నడూ చూసి వుండలేదు.
2CH 9:12 రాజైన సొలొమోను కూడ షేబ దేశపు రాణికి ఆమెకు కావలసిన వాటిని, అడిగిన ప్రతి దానిని ఇచ్చాడు. తనకు ఇవ్వటానికి ఆమె తెచ్చిన దానికంటె ఎక్కువగానే సొలొమోను ఇచ్చాడు. తరువాత షేబ దేశపు రాణి, ఆమె పరివారం తమ దేశానికి వెళ్లిపోయారు.
2CH 9:13 ఒక్క సంవత్సరంలో సొలొమోను సేకరించిన బంగారం ఇరవై ఐదు టన్నులు (ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు మణుగులు) తూగింది.
2CH 9:14 చార వర్తకులు, వ్యాపారులు సొలొమోనుకు చాలా బంగారం తెచ్చారు. అరబీ రాజులందురూ, దేశంలో ప్రాంతీయ పాలకులూ సొలొమోనుకు వెండి బంగారాలు తెచ్చియిచ్చారు.
2CH 9:15 బంగారు రేకులు తాపిన రెండు వందల పెద్దడాళ్లను సొలొమోను చేయించాడు. ప్రతి డాలుకూ సుమారు ఏడున్నర పౌనుల (ఆరు వందల తులాల) సాగగొట్టిన బంగారం పట్టింది.
2CH 9:16 బంగారు రేకులు వేయించి మూడు వందల చిన్న డాళ్లును కూడ సొలొమోను చేయించాడు. సుమారు మూడు ముప్పాతిక పౌనుల (మూడ వందల తులాల) బంగారం ఒక్కొక్క డాలుకు పట్టింది. లెబానోను అరణ్యంలో కట్టిన భవనంలో రాజైన సొలొమోను ఈ డాళ్లను వుంచాడు.
2CH 9:17 ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని సొలొమోను రాజు చేయించాడు. మేలిమి బంగారపు రేకులు దానికి తాపించాడు.
2CH 9:18 సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. బంగారంతో చేయించిన కాలిపీట దాని ముందు వుంది. సింహాసనానికిరుపక్కల చేతులు ఆనించటానికి తగిన ఆసరా ఏర్పాటు వుంది. చేతి ఆసరాలకు రెండు పక్కలా రెండు సింహపు విగ్రహాలున్నాయి.
2CH 9:19 ప్రతి మెట్టుకూ అటు ఇటు రెండేసి సింహాల విగ్రహాలు చొప్పున ఆరు మెట్లకు పన్నెండు సింహాపు విగ్రహాలు అమర్చబడ్డాయి. ఏ యితర సామ్రాజ్యంలోనూ ఈ రకమైన సింహాసనం చేయించబడలేదు.
2CH 9:20 సొలొమోను రాజు తాగే గిన్నెలన్నీ బంగారంతో చేసినవే. లెబానోను అరణ్య భవనంలో వాడే వస్తుసామగ్రి అంతా శుద్ధ బంగారంతో చేయబడింది. సొలొమోను కాలంలో వెండి విలువైన లోహంగా చూడబడలేదు.
2CH 9:21 తర్షీషు వరకు ప్రయాణం చేసిన ఓడలు సొలొమోను రాజుకు వున్నాయి. హీరాము మనుష్యులు సొలొమోను ఓడలను నడిపేవారు. మూడు సంవత్సరాల కొకసారి ఓడలు వెండి బంగారాలు, ఏనుగు దంతాలు, కోతులు, నెమళ్లు మొదలగు వాటిని తీసుకొని సొలొమోను రాజ్యానికి తిరిగి వచ్చేవి.
2CH 9:22 భూలోకంలో వున్న రాజులందరికంటె సొలొమోను భాగ్యంలోను, తెలివితేటలలోను గొప్ప వాడయ్యాడు.
2CH 9:23 ప్రపంచ దేశాల రాజులంతా సొలొమోను వివేకవంతమైన న్యాయ నిర్ణయాలను వినటానికి అతనిని దర్శించేవారు. సొలొమోనుకు ఆ తెలివితేటలను దేవుడే ప్రసాదించాడు.
2CH 9:24 ప్రతి సంవత్సరం సొలొమోనును దర్శించటానికి వచ్చే రాజులందరూ కాన్కలు తెచ్చేవారు. వారు వెండి బంగారు వస్తువులు, బట్టలు, కవచాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలను తెచ్చేవారు.
2CH 9:25 సొలొమోనుకు గుర్రాలను, రథాలను వుంచటానికి నాలుగువేల శాలలున్నాయి. అతనికి పన్నెండు వేలమంది రథసారధులున్నారు. రథాలకు ప్రత్యేక నగరాలను ఏర్పాటుచేసి, మరికొన్ని తనతో యెరూషలేములో వుంచుకున్నాడు.
2CH 9:26 యూఫ్రటీసు నది మొదలు ఫిలిష్తీయుల దేశం, మరియు ఈజిప్టు సరిహద్దు వరకు వున్న రాజులందరికీ సొలొమోను రాజైయున్నాడు.
2CH 9:27 సొలొమోను రాజు వద్ద నిలవవున్న వెండి యెరూషలేములో కొండ గుట్టల్లా పడివుంది. అతని వద్ద పల్లపు ప్రాంతంలో వున్న మేడిచెట్లంత విస్తారంగా దేవదారు చెట్ల కలపవుంది.
2CH 9:28 ఈజిప్టు నుండి, తదితర దేశాలనుండి ప్రజలు సొలొమోనుకు గుర్రాలను తెచ్చి యిచ్చేవారు.
2CH 9:29 మొదటినుండి చివరివరకు సొలొమోను చేసిన పనులన్నీ ప్రవక్తయైన నాతాను ప్రవచనాలోను, షిలో హువాడైన అహీయా ప్రవచనాలలోను మరియు దీర్ఘదర్శి అయిన ఇద్దో దర్శనాలలోను పొందుపర్చబడినాయి. అహీయా షిలోనీయుడు. ఇద్దో దీర్ఘదర్శి (ప్రవక్త). ఇద్దో యరొబామును గురించి రాశాడు. యరొబాము నెబాతు కుమారుడు.
2CH 9:30 సొలొమోను నలబై యేండ్లపాటు యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటినీ పాలించాడు.
2CH 9:31 పిమ్మట సొలొమోను చని పోయాడు. తన తండ్రి దావీదు నగరంలో ప్రజలతనిని సమాధి చేశారు. సొలొమోను స్థానంలో అతని కుమారుడైన రెహబాము నూతన రాజయ్యాడు.
2CH 10:1 రెహబాము షెకెము పట్టణానికి వెళ్లాడు. ఎందు వల్లననగా ఇశ్రాయేలు ప్రజలంతా రెహబామును రాజుగా అభిషిక్తుని చేయటానికి అక్కడికి వెళ్లారు.
2CH 10:2 యరొబాము అప్పుడు ఈజిప్టులో వున్నాడు. అతడు ఇంతకు పూర్వము సొలొమోను రాజుకు భయపడి పారిపోయి ఈజిప్టులో దాక్కన్నాడు. యరొబాము తండ్రిపేరు నెబాతు. రెహబాము కొత్త రాజు కాబోతున్నట్లు యరొబాము విన్నాడు. అందుకని యరొబాము ఈజిప్టునుండి తిరిగి వచ్చాడు.
2CH 10:3 ఇశ్రాయేలు ప్రజలు తమతో రమ్మని యరొబామును పిలిచారు. అప్పుడు యరొబాము, ఇశ్రాయేలు ప్రజలు అంతా కలిసి రెహబాము వద్దకు వెళ్లారు. వారతనితో యీలా అన్నారు: “రెహబామూ,
2CH 10:4 నీ తండ్రి మాకు జీవితం కష్టమయం చేశాడు. అది మాకు మోయలేని భారమయ్యింది. నీవు మాకాబరువును తేలిక చెయ్యి. అప్పుడు నీకు మేము సేవచేస్తాము.”
2CH 10:5 రెహబాము వారితో “మూడు రోజుల తరువాత మళ్లీ నా వద్దకు రండి” అని అన్నాడు. అందుకని ప్రజలు వెళ్లిపోయారు.
2CH 10:6 రాజైన రెహబాము గతంలో తన తండ్రిగా సొలొమోను వద్ద సేవచేసిన పెద్దలను సంప్రదించాడు. “ఆ ప్రజలకు నేనేమి సమాధానం చెప్పాలని మీరు నాకు సలహా యిస్తున్నారు?” అని అడిగాడు.
2CH 10:7 పెద్దలు రెహబాముతో యిలా అన్నారు: “నీవు గనుక ఆ ప్రజల పట్ల దయగలిగి వుంటే, వారిని సంతోషపెట్టి మంచిమాటలు మాట్లాడితే, వారు నీకు సదా సేవ చేస్తారు.”
2CH 10:8 కాని రెహబాము పెద్దల సలహా పాటించలేదు. పైగా రెహబాము తనతో పెరిగి తనకు సేవచేస్తున్న తన స్నేహితులను సంప్రదించాడు.
2CH 10:9 రెహబాము వారితో యీలా అన్నాడు: “మీరు నాకు ఏమి సలహాయిస్తున్నారు? ఆ ప్రజలకు మనం ఎలా సమాధానం చెప్పాలి? వారు తమ పనిని తేలిక చేయమని నన్ను అడిగారు. నా తండ్రి వారిపై వుంచిన భారాన్ని తగ్గించమని వారు నన్ను కోరుతున్నారు.”
2CH 10:10 అప్పుడు రెహబాముతో పెరిగిన యువకులు అతనికి యిలా సలహా యిచ్చారు: “నీతో మాట్లాడిన ప్రజలకు నీవు చెప్పవలసినది యిది: ‘నీ తండ్రి మా బ్రతుకు భారం చేశాడు. అది పెద్ద బరువు మోసినట్లుగా వుంది. కాని ఆ బరువును తగ్గించమని మేము నిన్ను కోరుతున్నాము’ అని వారన్నారు గదా. కాని రెహబామూ, నీ సమాధానం యిలా వుండాలి: ‘నా చిటికెన వ్రేలు నా తండ్రి నడుముకంటె లావుగా వుంటుంది!
2CH 10:11 నా తండ్రి మీపై చాలా భారం వేశాడు. కాని నేను ఆ బరువును మరింత ఎక్కువ చేస్తాను. నా తండ్రి మిమ్ముల్ని కొరడాలతో కొట్టాడు. కాని నేను లోహపు కొక్కెములున్న కొరడాలతో కొట్టిస్తాను’” అని చెప్పమనిరి.
2CH 10:12 మూడు రోజుల తరువాత యరొబాము, ప్రజలు కలిసి రెహబాము వద్దకు వచ్చారు. “మూడు రోజులలో మీరు నా వద్దకు రండి,” అని రెహబాము చెప్పిన దానికి అనుగుణంగా వారు వెళ్లారు.
2CH 10:13 అప్పుడు రెహబాము రాజు వారితో అల్పబద్ధితో మాట్లాడాడు. రెహబాము రాజు పెద్దల సలహాను పెడ చెవిని పెట్టాడు.
2CH 10:14 యువకులు తనకు సలహా యిచ్చిన రీతిగా రెహబాము రాజు ప్రజలతో మాట్లాడాడు. “నా తండ్రి మీ బరువు ఎక్కువ చేశాడు. కాని నేను దానిని మరింత ఎక్కువ చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో శిక్షించాడు. కాని నేను మిమ్మల్ని లోహపు కొక్కెములున్న కొరడాలతో శిక్షిస్తాను” అని అన్నాడు.
2CH 10:15 ఆ విధంగా రాజైన రెహబాము ప్రజల విన్నపాన్ని వినలేదు. ప్రజలగోడు అతడు వినని కారణమేనగా, పరిస్థితులలో ఈ మార్పు దేవుడు కల్పించటమే. దేవుడే ఇది జరిపించాడు. అహీయా ద్వారా యరొబాముకు దేవుడు చెప్పించిన దానిని నిజం చేసేలా ఇది జరిగింది. అహీయా షిలోనీయుడు. యరొబాము తండ్రి పేరు నెబాతు.
2CH 10:16 రెహబాము రాజు తమ మనవి ఆలకించలేదని ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకున్నారు. అప్పుడు వారు రాజుతో యిలా అన్నారు: “మేము దావీదు కుటుంబంలో భాగస్తులమా? కాదు! యెష్షయి భూముల్లో మాకేమైనా వస్తుందా? రాదు! అందుకని ఇశ్రాయేలీయులారా, మనం మన ఇండ్లకు వెళ్లిపోదాం పదండి. దావీదు సంతతి వాడిని తన ప్రజల్ని ఏలుకో నీయండి!” తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు.
2CH 10:17 ని యూదా పట్టణాలలో ఇంకా కొంతమంది ఇశ్రాయేలీయులు నివసిస్తూ వున్నారు. రెహబాము వారికి కూడ రాజుగానే వున్నాడు.
2CH 10:18 బలవంతంగా పని చేయించబడే జనులమీద అధికారిగా హదోరాము వున్నాడు. రెహబాము అతనిని ఇశ్రాయేలు ప్రజల వద్దకు పంపాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు హదోరామును రాళ్లతో కొట్టి చంపివేశారు. దానితో రెహబాము తన రథంలోనికి దుమికి తప్పించు కున్నాడు. అతడు యెరూషలేముకు పారిపోయాడు.
2CH 10:19 అప్పటి నుండి ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులు దావీదు కుటుంబానికి వ్యతిరేకులై వున్నారు.
2CH 11:1 రెహబాము యెరూషలేముకు వచ్చిన పిమ్మట ఒక లక్షాఎనబై వేలమంది కాకలు తీరిన సైనికులను సమీకరించాడు. ఈ సైనికులను యూదా, బెన్యామీను వంశాల నుండే ఎంపిక చేశాడు. వీరందరినీ ఇశ్రాయేలుపై దాడి చేసి ఆ రాజ్యాన్ని తిరిగి తన ఏలుబడిలోకి తీసుకొని రావటానికి సమీకరించాడు.
2CH 11:2 కాని యెహోవా వాక్కు షెమయాకు వినవచ్చింది. షెమయా దైవజ్ఞుడు. యెహవా యిలా చెప్పాడు:
2CH 11:3 “షెమయా, నీవు వెళ్లి సొలొమోను కుమారుడు, యూదా రాజు అయిన రెహబాముతో మాట్లాడుము. యూదాలోను, బెన్యామీను ప్రాంతంలోను నివసిస్తున్న ఇశ్రాయేలీయులందరితో కూడా మాట్లాడుము. వారికి యీలా చెప్పుము:
2CH 11:4 యెహోవా తెలియజేయునదేమనగా: ‘మీరు మీ సోదరులతో యుద్ధం చేయరాదు! ప్రతి ఒక్కడూ తన ఇంటికి తిరిగి వెళ్లిపోవాలి. ఇదియీలా జరిగేలా నేనే చేశాను’” కావున రాజైన రెహబాము, అతని సైన్యం యెహోవా మాట విని వెనుకకు వెళ్లి పోయారు. వారు యరొబాముపై దాడి చేయలేదు.
2CH 11:5 రెహబాము యెరూషలేములో నివసించాడు. పరాయి రాజుల దండయాత్రల నుండి రక్షణగా అతడు యూదాలో బలమైన నగరాలను నిర్మించాడు.
2CH 11:6 బేత్లెహేము, ఏతాము, తెకోవ,
2CH 11:7 బేత్సూరు, శోకో, అదుల్లాము,
2CH 11:8 గాతు, మారేషా, జీపు,
2CH 11:9 అదోరయీము, లాకీషు, అజేకా,
2CH 11:10 జొర్యా, అయ్యాలోను, మరియు హెబ్రోనులో గల నగరాలను బాగుచేయించాడు. యూదాలోను, బెన్యామీనులోనుగల ఈ నగరాలు బలమైనవిగా తీర్చిదిద్దబడ్డాయి.
2CH 11:11 రెహబాము ఈ నగరాలను బలపర్చిన తరువాత, వాటిలో అధిపతులను, నియమించాడు. ఆ నగరాలకు ఆహార పదార్థాలు, నూనె, ద్రాక్షారసం సరఫరాలను ఏర్పాటు చేశాడు.
2CH 11:12 రెహబాము ప్రతి నగరంలో డాళ్లను, ఈటెలను కూడ వుంచి వాటిని చాలా బలమైనవిగా చేశాడు. యూదా, బెన్యామీను ప్రజల, నగరాలను రెహబాము తన అధీనంలో వుంచుకున్నాడు.
2CH 11:13 ఇశ్రాయేలులో వున్న యాజకులు, లేవీయులు అంతా రెహబాముతో ఒక అవగాహనకు వచ్చి, అతనితో కలిశారు.
2CH 11:14 లేవీయులు తమ పచ్చిక బీళ్లను, వారి స్వంత పొలాలను వదిలి యూదాకు, యెరూషలేముకు వచ్చారు. లేవీయులు ఇది ఎందుకు చేశారనగా యరొబాము, అతని కుమారులు తమను యెహోవా సేవలో, యాజకులుగా పని చేయనీయటానికి తిరస్కరించారు.
2CH 11:15 ఉన్నత స్థలాలలో ఆరాధనలకై యరొబాము తన స్వంత యాజకులను ఎంపిక చేసుకొన్నాడు. ఆ గుట్టల మీద అతడు తాను చేసిన మేక, గిత్త దూడల విగ్రహాలను ప్రతిష్ఠించాడు.
2CH 11:16 లేవీయులు ఇశ్రాయేలును వదిలి పెట్టడంతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాలో విశ్వాసమున్న ఇశ్రాయేలు గోత్రాలవారంతా యెరూషలేముకు వచ్చారు. వారు తామ పూర్వీకుల దేవునికి బలులు అర్పించటానికి వచ్చారు.
2CH 11:17 వారంతా యూదా రాజ్యాన్ని బలమైనదిగా చేశారు. వారు సొలొమోను కుమారుడు రెహబాముకు మూడు సంవత్సరాలపాటు మద్దతు యిచ్చారు. ఆ విధంగా చేయటానికి కారణమేమనగా ఆ సమయంలో వారు దావీదు సొలొమోను నడిచిన రీతిగా నడుచు కున్నారు.
2CH 11:18 రెహబాము మహలతు అనే స్త్రీని వివాహం చేసికొన్నాడు. ఆమె తండ్రి పేరు యెరీమోతు. ఆమె తల్లి పేరు అబీహాయిలు. యెరీమోతు తండ్రి పేరు దావీదు. అబీహాయిలు తండ్రిపేరు ఏలీయాబు. ఏలీయాబు తండ్రిపేరు యెష్షయి.
2CH 11:19 రెహబాముకు మహలతు ద్వారా యూషు, షెమర్యా, జహము అనే కుమారులు పుట్టారు.
2CH 11:20 పిమ్మట రెహబాము మయకాను వివాహం చేసి కొన్నాడు. మయకా అబ్షాలోము మనుమరాలు. రెహబాముకు మయకావల్ల అబీయా, అత్తయి, జీజా, షెలోమీతు అనువారు పుట్టారు.
2CH 11:21 తన ఇతర భార్యల కన్న, దాసీల కన్న, రెహబాము మయకాను ఎక్కువగా ప్రేమించాడు. మయకా అబ్షాలోము మనుమ రాలు. రెహబాముకు పద్ధెనిమిది మంది భార్యలు, అరవై మంది దాసీలు వున్నారు. రెహబాముకు ఇరవై ఎనిమిది మంది కుమారులు, ఇరవై మంది కుమార్తెలు వున్నారు.
2CH 11:22 అబీయాను అతని సోదరులపై నాయకునిగా రెహబాము నియమించాడు. అబీయాను రాజుగా చేసే వుద్దేశంతోనే రెహబాము ఈ పని చేశాడు.
2CH 11:23 రెహబాము చాలా తెలివిగా ప్రవర్తించాడు. తన కుమారులందరినీ యూదా, బెన్యామీను ప్రాంతాలలో వున్న బలమైన నగారాలన్నిటికీ పంపాడు. రెహబాము తన కుమారులకు ఆహారాది వస్తువులను పుష్కలంగా సరఫరా చేశాడు. తన కుమారుకు భార్యలను కూడా అతడు ఎంపిక చేశాడు.
2CH 12:1 రెహబాము చాలా శక్తివంతుడైన రాజయ్యాడు. అతడు తన రాజ్యాన్ని కూడ చాలా బలపర్చాడు. ఆ తరువాత రెహబాము, యూదా వంశంవారు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించుటం మాని వేశారు.
2CH 12:2 రెహబాము రాజయ్యాక ఐదవ సంవత్సరంలో షీషకు యెరూషలేముపై దండెత్తాడు. షీషకు ఈజిప్టుకు రాజు. రెహబాము, యూదా ప్రజలు యెహోవాకు విశ్వాసపాత్రంగా లేకపోవుటచే ఇది జరిగింది.
2CH 12:3 షీషకు వద్ద పన్నెండువేల రథాలు, అరవై వేల మంది గుర్రపు స్వారీ చేయగలవారు, మరియు ఎవ్వరూ లెక్క పెట్టలేనంత మంది సైనికులు వున్నారు. షీషకు యొక్క మహా సైన్యంలో లిబ్యా సైనికులు (లూబీయులు), సుక్కీయులు, ఇథియోఫియనులు (కూషీయులు) వున్నారు.
2CH 12:4 షీషకు యూదాలోని బలమైన నగరాలను ఓడించాడు. పిమ్మట షీషకు తన సైన్యాన్ని యెరూషలేముకు నడిపించాడు.
2CH 12:5 తరువాత ప్రవక్తయగు షెమయా రెహబాము వద్దకు, యూదా నాయకుల వద్దకు వచ్చాడు. ఆ యూదా నాయకులంతా షీషకుకి భయపడి యెరూషలేములో సమావేశమయ్యారు. షెమయా రెహబాముతోను, యూదా నాయకుల తోను యీలా చెప్పాడు, “యెహోవా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ‘రెహబామూ, నీవు మరియు యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టారు. నా ధర్మశాస్త్రాన్ని పాటించటానికి నిరాకరించారు. ఇప్పుడు మిమ్మల్ని నా సహాయం లేకుండా షీషకును ఎదుర్కోటానికి వదిలి పెడుతున్నాను.’”
2CH 12:6 అది విన్న యూదా నాయకులు, రాజైన రెహబాము విచారించి, తమను తాము తగ్గించుకొని విధేయులయ్యారు. “యెహోవా న్యాయమైనవాడు” అని అన్నారు.
2CH 12:7 రాజు, యూదా పెద్దలు విధేయులైనట్లు యెహోవా గమనించాడు. పిమ్మట షెమయాకు యెహోవా వర్తమానం ఒకటి వినవచ్చింది. యెహోవా షెమయాతో యీలా చెప్పాడు: “రాజు, నాయకులు తమను తాము తగ్గించుకున్నారు. కావున వారిని నేను నాశనం చేయను. పైగా వారికి వెంటనే రక్షణ కల్పిస్తాను. యెరూషలేము మీద నా కోపాగ్నిని కురిపించటానికి నేను షీషకును వినియోగించను.
2CH 12:8 కాని యెరూషలేము ప్రజలు మాత్రం షీషకుయొక్క సేవకు లౌతారు. నాకు సేవచేయటం ఇతర దేశాల రాజులను సేవించటంకంటె భిన్నమైనదని వారు తెలిసి కొనేటందుకే ఇది యీలా జరుగుతుంది.”
2CH 12:9 షీషకు యెరూషలేముపై దండెత్తి ఆలయాన్ని కొల్లగొట్టాడు. షీషకు ఈజిప్టు రాజు. అతడింకా రాజభవనంలో వున్న ఖజానాను కూడ కొల్లగొట్టాడు. షీషకు రికిన ప్రతి వస్తువును తీసుకొని, ధనరాశులను పట్టుకుపోయాడు. అతడంకా సొలొమోను చేయించిన బంగారు డాళ్లనుకూడా పట్టుకుపోయాడు.
2CH 12:10 రాజైన రెహబాము బంగారు డాళ్ల స్థానంలో కంచుడాళ్లను చేయించాడు. రాజభవన ప్రధాన ద్వారం వద్ద కాపలా దారుల అధిపతులకు రెహబాము కంచు డాళ్లు యిచ్చాడు.
2CH 12:11 రాజు ఆలయ ప్రవేశం చేసినప్పుడు ద్వారపాలకులు కంచుడాళ్లను వెలికితీసి వాడేవారు. పిమ్మట వారు మళ్ళీ ఆ కంచుడాళ్లను ఆయుధాగారంలో వుంచేవారు.
2CH 12:12 రెహబాము తనను తాను తగ్గించుకున్న తరువాత, యెహోవా అతని పట్ల తన కోపాన్ని ఉపసంహరించుకున్నాడు. అందువల్ల యెహోవా రెహబామును పూర్తిగా నాశనం చేయలేదు. యూదాలో ఇంకా కొంత మంచితనం మిగిలివుంది.
2CH 12:13 యెరూషలేములో రెహబాము చాలా శక్తివంతమైన రాజుగా రూపొందాడు. అతడు రాజయ్యేనాటికి నలబై ఒక్క సంవత్సరాలవాడు. రెహబాము రాజుగా యెరూషలేములో పదిహేడు సంవత్సరాలు వున్నాడు. ఇశ్రాయేలు తెగలన్నిటిలో యెహోవా తనపేరు ప్రతి ష్ఠాపనకు యెరూషలేమునే ఎన్నుకున్నాడు. రెహబాము తల్లి పేరు నయమా. నయమా అమ్మోను దేశస్తురాలు.
2CH 12:14 దేవుడైన యెహోవాను అనుసరించుటం మాని రెహబాము చెడుకార్యాలకు పాల్పడ్డాడు. ఎందుకంటే అతడు యెహోవాని అనుసరించాలని హృదయమందు తీర్మానించు కొనలేదు.
2CH 12:15 రెహబాము రాజైనప్పటి నుండి అతని పాలన అంతమయ్యేవరకు అతను చేసిన విషయాలన్నీ షెమయా రచనలలోను పొందుపర్చబడ్డాయి. షెమయా ఒక ప్రవక్త. ఇద్దో ఒక దీర్ఘదర్శి వీరిద్దరూ కుటుంబ చరిత్రలు రాశారు. రెహబాము, యరొబాము రాజులిద్దరూ పాలించిన కాలంలో వారిద్దరి మధ్య యుద్ధాలు జరిగాయి,
2CH 12:16 రెహబాము చనిపోగా అతనిని దావీదు నగరంలో సమాధిచేశారు. పిమ్మట రెహబాము కుమారుడు అబీయా కొత్తగా రాజయ్యాడు.
2CH 13:1 ఇశ్రాయేలు రాజుగా యరొబాము పద్దెనిమిదవ సంవత్సరంలో కొనసాగుతూ వుండగా, అబీయా యూదాకు కొత్తగా రాజయ్యాడు.
2CH 13:2 అబీయా యెరూషలేములో మూడేండ్లు పాలించాడు. అబీయా తల్లి పేరు మయకా. మయకా తండ్రి పేరు ఊరియేలు. ఊరియేలు గిబియా పట్టణంవాడు. అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది.
2CH 13:3 అబీయాకు నాలుగు లక్షలమంది ధైర్యంగల సైనికులున్నారు. అబీయా ఆ సైన్యాన్ని యద్ధానికి నడిపించాడు. యరొబాముకు ఎనిమిది లక్షలమంది ధైర్యంగల సైనికులున్నారు. అబీయాతో యుద్ధానికి యరొబాము సిద్ధమయ్యాడు.
2CH 13:4 అప్పుడు అబీయా కొండల దేశమైన ఎఫ్రాయిములో వున్న సెమరాయిము పర్వతం మీద నిలబడి యీలా అన్నాడు: “యరొబామూ, ఇశ్రాయేలీయులందరూ నేను చెప్పేది వినండి.
2CH 13:5 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుకు, అతని కుమారులకు శాశ్వతంగా ఇశ్రాయేలు రాజులు కావటానికి హక్కు ఇచ్చాడని మీరు తెలుసుకోవాలి. ఉప్పు ఒడంబడిక ద్వారా దావీదుకు దేవుడు ఈ హక్కు యిచ్చాడు.
2CH 13:6 కాని యరొబాము యెహోవాకు వ్యతిరేకి అయ్యాడు! యరొబాము నెబాతు కుమారుడు. నెబాతు దావీదు కుమారుడైన సొలొమోను అధికారులలో ఒకడు.
2CH 13:7 అయితే పనికి మాలిన, దుష్టవ్యక్తులు యరొబాముకు స్నేహితులయ్యారు. యరొబాము, ఆ చెడ్డ మనుష్యులే రెహబాముకు ఎదురు తిరిగారు అప్పుడు రెహబాము చిన్నవాడు. అనుభవంలేనివాడు. అందువల్ల యరొబామును, అతని చెడు స్నేహితులను రెహబాము అదుపులో పెట్టలేకపోయాడు.
2CH 13:8 “ఓ యరొబామూ! నీవు, నీతో వున్న ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు యెహోవా రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు యెహోవా రాజ్యం దావీదు కుమారులకు చెందుతుంది. మీరు చాలామంది వున్నారు. యరొబాము మీకు బంగారు గిత్తలను చేయించి వాటిని దేవుళ్లవలె పూజించమన్నాడు.
2CH 13:9 మీరు యెహోవా యాజకులను, లేవీయులను వెళ్లగొట్టారు. యాజకులు అహరోను సంతతివారు. మీ స్వంతయాజకులను మీరు ఎంపిక చేసుకున్నారు. ఇది పరదేశీయులు చేసే పద్ధతి. ఒక గిత్తను గాని, ఏడు గొర్రె పొట్టేళ్లనుగాని తీసుకొని తనను పరిశుద్ధునిగా చేసుకోవటానికి ఎవడు వచ్చినా అతడు దేవుళ్ళుకాని విగ్రహాలకు యాజకులు కావచ్చు.
2CH 13:10 “కాని, మా విషయానికి వస్తే యెహోవాయే మా దేవుడు. యూదా ప్రజలమైన మేము దేవునిపట్ల భయభక్తులు కలిగియున్నాము. మేము ఆయనను వదిలిపెట్టలేదు! యెహోవాను సేవించే యాజకులు అహరోను సంతతివారే. యెహోవా సేవలో యాజకులకు లేవీయులు తోడ్పడతారు.
2CH 13:11 వారు దహనబలులు, సుగంధద్రవ్యాలతో ధూపం నిత్యం ఉదయ సాయంకాలాల్లో సమర్పిస్తారు. ఆలయంలో ప్రత్యేకమైన బల్లమీద నైవేద్యపు రొట్టెలను వారు వరుసలలో పెడతారు. వారు ప్రతి సాయంత్రం బంగారు దీపస్తంభం నిలిపి ప్రమిదలు వెలిగిస్తారు. మన దేవుడైన యెహోవా ఆజ్ఞను మేము అనుసరిస్తాము. కాని యరొబామూ, నీవు మరియు నీతోవున్న ఇశ్రాయేలీయులూ యెహోవాను లక్ష్యపెట్టడంలేదు. మీరు ఆయనను వదిలి పెట్టారు.
2CH 13:12 దేవుడే మాకు తోడై వున్నాడు. ఆయనే మా అధిపతి. ఆయన యాజకులు మాతో వున్నారు. మీపై యుద్ధానికి యెహోవా యాజకులు బూరలు ఊది మమ్మల్ని పిలుస్తారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడగు యెహోవా మీదికి యుద్ధానికి పోకండి. ఎందువల్లనంటే, మీరు విజయం పొందలేరు!”
2CH 13:13 కాని యరొబాము కొంతమంది సైనికులను అబీయా సైన్యం వెనుక చాటుగా పొంచి వుండటానికి పంపాడు. యరొబాము సైన్యం అబీయా సైన్యానికి ఎదురుగా వుంది. యరొబాము సైన్యం నుండి రహస్యంగా వెళ్లిన సైనికులు అబీయా సైన్యానికి వెనకగా వున్నారు.
2CH 13:14 యూదాకు చెందిన అబీయా సైన్యంలోని భటులు వెనుదిరిగి చూచినప్పుడు యరొబాము సై న్యం తమను ముందు నుండి, వెనుక నుండి ఎదుర్కొంటునట్లు భావించారు. యూదా సైనికులు యెహోవాను పిలిచారు. యాజకులు బూరలు ఊదారు.
2CH 13:15 పిమ్మట అబీయా సైన్యం కేకలు పెట్టింది. యూదా సైనికులు యుద్ధ నినాదాలు చేసినప్పుడు, దేవుడు యరొబాము సైన్యాన్ని ఓడించాడు. ఇశ్రాయేలు నుండి వచ్చిన యరొబాము సైన్యాన్ని యూదా నుంచి వచ్చిన అబీయా సైన్యం ఓడించింది.
2CH 13:16 యూదా సైనికుల నుండి ఇశ్రాయేలు సైనికులు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించేలా దేవుడు యూదా సైన్యానికి తోడ్పడ్డాడు.
2CH 13:17 అబీయా సైన్యం ఇశ్రాయేలు సైన్యాన్ని చిత్తుగా ఓడించింది. ఐదులక్షల మంది ఇశ్రాయేలు యోధులు చనిపోయారు.
2CH 13:18 ఆ విధంగా అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడ్డారు; యూదా ప్రజలు గెలిచారు. వారి పూర్వీకుల దేవుడైన యెహోవా మీద వారు ఆధారపడిన కారణంగా యూదా సైన్యం విజయం సాధించింది.
2CH 13:19 అబీయా సైన్యం యరొబాము సైన్యాన్ని తరిమి కొట్టింది. అబీయా సైన్యం యరొబాముకు చెందిన బేతేలు, యెషానా, ఎఫ్రోను పట్టణాలను పట్టుకుంది. వారు ఆ పట్టణాలతో పాటు వాటి పరిసర గ్రామాలను కూడా వశపర్చుకున్నారు.
2CH 13:20 అబీయా నివసించియున్నంత కాలం యరొబాము బలమైన రాజు కాలేకపోయాడు. యెహోవా యరొబామును చంపేశాడు.
2CH 13:21 అబీయా మిక్కిలి బలవంతుడైన రాజయ్యాడు అతడు పదునల్గురు స్త్రీలను వివాహమాడాడు. అతడు ఇరువై యిద్దరు కుమారులకు, పదహారుగురు కుమార్తెలకు తండ్రి అయ్యాడు.
2CH 13:22 అబీయా చేసిన ఇతర కార్యాలన్నీ ప్రవక్తయగు ఇద్దో రచనల్లో పొందుపర్చబడ్డాయి.
2CH 14:1 అబీయా తన పూర్వీకులతో నిద్రంచాడు. దావీదు నగరంలో ప్రజలు అతనిని సమాధి చేశారు. పిమ్మట అబీయా కుమారుడు ఆసా అతని స్థానంలో కొత్తగా రాజయ్యాడు. ఆసా పరిపాలనా కాలంలో పది సంవత్సరాలపాటు దేశంలో శాంతి నెలకొన్నది.
2CH 14:2 తన దేవుడైన యెహోవా దృష్టకి మంచివైన, న్యాయమైన పనులు ఆసా చేశాడు.
2CH 14:3 విగ్రహాలను ఆరాధించటానికి వినియోగించిన వింత బలిపీఠాలను ఆసా తొలగించాడు. ఆసా ఉన్నత స్థలాలను తీసివేసి, స్మారక శిలలను పగులగొట్టాడు. అషేరా దేవతా స్తంభాలను కూడా ఆసా విరుగగొట్టాడు.
2CH 14:4 యూదా ప్రజలను దేవుడైన యెహోవాను అనుసరించమని ఆసా ఆదేశించాడు. ఆయన వారి పూర్వీకులు ఆరాధించిన దైవం. అందుచే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పాటించమని ఆసా వారికి ఆదేశించాడు.
2CH 14:5 యూదా పట్టణాలన్నిటి నుండి ఆసా ఉన్నత స్థలాలను, ధూప పీఠాలను తీసివేశాడు. ఆసా రాజుగా వున్న కాలంలో రాజ్యంలో శాంతి నెలకొన్నది.
2CH 14:6 యూదాలో శాంతి విలసిల్లిన కాలంలోనే ఆసా బలమైన నగరాలు నిర్మించాడు. యెహోవా శాంతియుత వాతావరణం కల్పించటంతో ఆసాకు ఆ కాలంలో యుద్ధాలు లేవు.
2CH 14:7 ఆసా యూదా ప్రజలతో యీలా చెప్పాడు: “మనమీ పట్టణాలను నిర్మించి, వాటిచుట్టూ ప్రాకారాలు కట్టిద్దాము. మనం బురుజులను, ద్వారాలను, ద్వారాలకు కడ్డీలను ఏర్పాటు చేద్దాము. ఈ దేశంలో ఇంకను నివసిస్తూండగానే మనమీ పనులు చేద్దాము. ఈ దేశం మనది. ఎందువల్లననగా మన ప్రభువైన దేవుని మనం అనుసరించాము. మనచుట్టూ ఆయన మనకు శాంతియుత వాతావరణం కల్పించాడు.” పిమ్మట వారు నగర నిర్మాణాలు చేపట్టి విజయం సాధించారు.
2CH 14:8 ఆసాకు మూడు లక్షలమంది యూదా వంశాల వారున్న సైన్యం; రెండు లక్షల ఎనబై వేలమంది బెన్యామీను కుటుంబాలకు చెందిన వారు సైన్యం వున్నాయి. యూదా సైనికులు పెద్ద పెద్ద డాళ్లను, ఈటెలను ధరించారు. బెన్యామీను సైనికులు చిన్న డాళ్లను ధరించి, ధనుస్సులతో బాణాలు వేయగల నేర్పరులు. వారంతా బలమైన, ధైర్యంగల సైనికులు.
2CH 14:9 పిమ్మట జెరహు అనేవాడు ఆసా మీదికి దండెత్తాడు. జెరహు ఇథియోపియావాడు. జెరహు సైన్యంలో పదిలక్షలమంది సైనికులు, మూడు వందల రథాలు వున్నాయి. జెరహు సైన్యం మారేషా వరకు చొచ్చుకు వచ్చింది.
2CH 14:10 జెరహును ఎదుర్కోవటానికి ఆసా బయలుదేరి వెళ్లాడు. మారేషా వద్ద జెపాతా లోయలో ఆసా సైన్యం యుద్ధానికి సిద్ధమయ్యింది.
2CH 14:11 ఆసా తన దేవుడైన యెహోవాకు యిలా ప్రార్థన చేశాడు “ప్రభూ, బలవంతుల నుండి బలహీనులను రక్షించేవాడవు నీ వొక్కడివే! ఓ ప్రభూ, మా దైవమా మాకు సహాయం చేయుము! మేము నీమీద ఆధారపడి యున్నాము. ఈ మహా సైన్యాన్ని నీ పేరుతో మేము ఎదిరించబోతున్నాము. యెహోవా, నీవు మా దేవుడవు. నీమీద విజయాన్ని ఎవ్వరికీ చేకూర నీయకుము!”
2CH 14:12 పిమ్మట యెహోవా ఆసా వద్దవున్న యూదా సైన్యాన్ని ఇథియోపియా (కూషు) సైన్యాన్ని ఓడించటానికి వినియోగించాడు. ఇథియోపియా సైన్యం పారిపోయింది.
2CH 14:13 ఆసా సైన్యం ఇథియోపియా సైన్యాన్ని గెరారు పట్టణం వరకు తరుముకుంటూ పోయింది. ఇథియోపియా సైనికులు అనేకమంది చనిపోవటంతో యుద్ధం చేయటానికి మళ్లీ వారు ఒక సైన్యంగా కూడ గట్టుకోలేకపోయారు. యెహోవా చేత, ఆయన సైన్యం చేత వారు అణచివేయబడ్డారు. శత్రుసైన్యం నుండి ఆసా, మరియు అతని సైనికులు అనేక విలువైన వస్తువులను దోచుకన్నారు.
2CH 14:14 సా మరియు అతని సైన్యం గెరారు దగ్గరలో వున్న అన్ని పట్టణాలను ఓడించారు. ఆ పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు యెహోవాకు భయపడిపోయారు. ఆ పట్టణాలలో విలువైన వస్తు సామగ్రి విస్తారంగా వుంది. ఆ విలువైన వస్తువులన్నిటినీ ఆసా సైన్యం దోచుకుంది.
2CH 14:15 ఆసా సైన్యం గొర్రెల కాపరులు నివసించే ప్రాంతాల మీద కూడా దాడి చేసింది. వారు చాలా గొర్రెలను, ఒంటెలను పట్టుకుపోయారు. తరువాత ఆసా సైన్యం యెరూషలేముకు వెళ్లిపోయింది.
2CH 15:1 దేవుని ఆత్మ అజర్యా మీదికి వచ్చింది. అజర్యా ఓబేదు కుమారుడు.
2CH 15:2 ఆసాను కలుసుకోవటానికి అజర్యా వెళ్లాడు. అజర్యా యిలా అన్నాడు: “ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా నేను చేప్పేది వినండి! మీరు యెహోవాను నమ్మకొని ఉన్నన్ని రోజులూ, యెహోవా మీతో వుంటాడు. మీరు యెహోవాను వెదికితే, మీరాయనను కనుగొంటారు. కాని మీరు ఆయనను వదిలివేస్తే, ఆయన మిమ్మల్ని వదిలివేస్తాడు.
2CH 15:3 చాలాకాలం ఇశ్రాయేలుకు ఒక నిజమైన దేవుడు లేకుండా వుండిపోయింది. వారు బోధించే యాజకుడుగాని, ధర్మశాస్త్రంగాని లేకుండా వుండి పోయారు.
2CH 15:4 కాని ఇశ్రాయేలు ప్రజలకు కష్టంవచ్చినప్పుడు వారు మళ్లీ దేవుడైన యెహోవాను ఆశ్రయించారు. ఆయన ఇశ్రాయేలు దేవుడు. వారాయనను వెదకగా, యెహోవా వారికి కన్పించాడు.
2CH 15:5 ఆ కష్టకాలంలో ఏ ఒక్కడూ క్షేమంగా ప్రమాణం చేయగలిగేవాడు కాదు. రాజ్యాలన్నిటిలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పాడ్డాయి.
2CH 15:6 ఒక రాజ్యం మరో రాజ్యాన్ని, ఒక నగరం మరో నగరాన్ని నాశనం చేసికోసాగాయి. దేవుడు వాటిని సర్వవిధాలుగా కల్లోల పెట్టిన కారణంగా ఆ పరిణామాలు వచ్చాయి.
2CH 15:7 కావున ఆసా, నీవు మరియు యూదా, బెన్యామీను ప్రజలు బలవంతులై యుండండి. బలహీనులు కావద్దు. అధైర్యపడవద్దు. ఎందుకంటే, మీ మంచి పనులకు తగిన ఫలితం దొరుకుతుంది!”
2CH 15:8 ప్రవక్త ఓబేదు మాటలు, వర్తమానం విన్న ఆసాకు చాలా ధైర్యం వచ్చింది. తరువాత అతడు యూదా, బెన్యామీను ప్రాంతాలన్నిటిలో వున్న అసహ్యకరమైన విగ్రహాలను తొలగించాడు. తానువశపర్చుకున్న ఎఫ్రాయిము కొండల ప్రాంతంలోని పట్టణాలలో వున్న హేయమైన విగ్రహాలను కూడా ఆసా తొలగించాడు. ఆలయ ముఖమండపంలో వున్న దేవుని బలిపీఠాన్ని కూడా అతడు బాగు చేయించాడు.
2CH 15:9 పిమ్మట యూదా, బెన్యామీను ప్రజలందరినీ ఆసా సమావేశపర్చాడు. అంతేగాక ఎఫ్రాయిము, మనష్షే, మరియు షిమ్యోను కుటుంబాల వారిని కూడా పిలిచాడు. వీరు ఇశ్రాయేలునుండి వలసపోయి యూదాలో స్థిరపడినవారు. వారిలో చాలామంది యూదాకు వచ్చిన కారణమేమంటే, ఆసా దేవుడైన యెహోవా ఆసా పక్షాన వున్నట్లు వారు గమనించారు.
2CH 15:10 ఆసా పరిపాలనలో పదిహేను సంవత్సరాలు దాటి మూడవనెల గడుస్తూవుండగా ఆసా, అతని ప్రజలూ యెరూషలేములో సమావేశమయ్యారు.
2CH 15:11 ఆ సమయంలో వారు ఏడువందల గిత్త దూడలను, ఏడువేల గొర్రెలను, మేకలను యెహోవాకు బలి యిచ్చారు. ఆ జంతువులను, ఇతర విలువైన వస్తువులను ఆసా సైన్యం తమ శత్రువుల నుండి తీసుకొన్నారు.
2CH 15:12 తరువాత వారు తమ పూర్ణ హృదయంతోను, తమ ఆత్మసాక్షితోను యెహోవాను సేవించటానికి ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆయన వారి పూర్వీకులు సేవించిన దేవుడు.
2CH 15:13 ఎవ్వరైనా దేవాధి దేవుని పూజించటానికి నిరాకరిస్తే అతడు చంపబడాలి. అట్టి మనిషి ఉన్నతుడేగాని, అల్పుడేగాని, పురుషుడే గాని, స్త్రీయేగాని ఎవ్వరైనా విచారణ లేకుండా చంపబడవలసినదే.
2CH 15:14 అప్పుడు ఆసా మరియు ప్రజలు యెహోవాకు ఒక వారు ఏకగ్రీవంగా పెద్దగా అరిచారు. వారు బూరులు, పొట్టేలు కొమ్ములు వూదారు.
2CH 15:15 యూదా ప్రజలంతా వారు చేసిన ప్రమాణం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేశారు. గనుక వారికా సంతోషం. పూర్ణ హృదయంతో వారు దేవుని అనుసరించారు. వారు దేవుని కొరకు వెదకి, ఆయనను దర్శించారు. కావున యెహోవా వారికి దేశమంతా శాంతియుత వాతవరణం నెలకొనేలా చేశాడు.
2CH 15:16 ఆసా తన తల్లియైన మయకాను రాజమాత పదవినుండి తొలగించాడు. అషేరా దేవతా స్తంభాన్ని నెలకొల్పటం ద్వారా ఆమె చేయించిన హేయమైన కార్యానికి అతడాపని చేశాడు. అషేరా స్తంభాన్ని ఆసా నరికించి చిన్న చిన్న ముక్కలు చేశాడు. తరువాత అతడా ముక్కలను కిద్రోను లోయలో తగులబెట్టాడు.
2CH 15:17 అయితే యూదాలో వున్న ఉన్నత స్థలాలు తొలగింపబడలేదు. అయినప్పటికి ఆసా హృదయం అతని జీవితాంతం యెహోవాకు విశ్వాసపాత్రంగా వుంది.
2CH 15:18 ఆసా తానూ, తన తండ్రీ దేవునికి సమర్పించిన కానుకలను, ఇతర విలువైన వస్తువులను ఆలయంలో వుంచాడు. ఆ వస్తువులన్నీ వెండి, బంగారాలతో చేయించినవి.
2CH 15:19 ఆసా పాలనలో ముప్పైయైదవ సంవత్సరం వరకు యుద్ధాలు ఏ మాత్రం జరగలేదు.
2CH 16:1 ఆసా పాలనలో ముప్పై ఆరవ సంవత్సరంలో యూదా రాజ్యం మీదికి బయెషా దండెత్తాడు. బయెషా ఇశ్రాయేలు రాజు. అతడు రామా పట్టణానికి వెళ్లి దానిని కోటలా మర్చాడు. రామా పట్టణాన్ని బయెషా ఒక కీలక స్థానంగా వినియోగించి యూదా రాజు ఆసా వద్దకు వెళ్లటానికిగాని, అతని వద్ద నుండి బయటకు రావటానికి గాని ప్రజలకు ఆస్కారం లేకుండా చేశాడు.
2CH 16:2 ఆలయం ఖజానాలో వున్న వెండి, బంగారు నిల్వలను ఆసా తీశాడు. రాజగృహంలో వున్న వెండి, బంగారాలను కూడా అతడు తీశాడు. తరువాత ఆసా తన దూతలను బెన్హదదు వద్దకు పంపాడు. బెన్హదదు అరాము (సిరియా) రాజు. అతడు దమస్కు (డెమాస్కస్) పట్టణంలో నివసిస్తున్నాడు. ఆసా పంపిన వర్తమానం యీలా వుంది.
2CH 16:3 “బెన్హదదూ, మన ఇద్దరి మధ్య ఒక ఒడంబడిక కొనసాగేలా చూడు. అది నీ తండ్రికి, నా తండ్రికి మధ్య కొనసాగిన ఒడంబడికలా వుండాలి. చూడండి, మీకు నేను వెండి బంగారాలు పంపిస్తున్నాను. కనుక నీవిప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషాతో నీకున్న ఒడంబడికను రద్దు చేసుకోవాలి. తద్వారా అతడు నామీదకు రాకుండా, నన్ను ఒంటరిగా వదిలి, నన్ను బాధపెట్టడు.”
2CH 16:4 రాజైన ఆసా వర్తమానాన్ని బెన్హదదు అంగీకరించాడు. బెన్హదదు తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాలపై దాడులు జరపమని పంపాడు. ఆ అధిపతులు ఈయోను, దాను ఆబేల్మాయీము పట్టణాలపై దాడి చేశారు. నఫ్తాలి ప్రాంతంలోవున్న పట్టణాలను కూడ వారు ఎదుర్కొన్నారు. ఈ పట్టణాలలో ధనాగారాలు వున్నాయి.
2CH 16:5 ఇశ్రాయేలు పట్టణాలపై దాడులను గూర్చి బయెషా విన్నాడు. అది విని రామా పట్టణాన్ని దుర్గంగా మార్చే పనిని బయెషా విరమించుకున్నాడు. పనిని మధ్యలో ఆపివేశాడు.
2CH 16:6 ఆ తరువాత రాజైన ఆసా యూదా ప్రజలను సమావేశపర్చాడు. వారంతా రామా పట్టణానికి వెళ్లి బయెషా కోట కట్టించటానికి తెప్పించిన రాళ్లను, కలపను పట్టుకుపోయారు. ఆసా, యూదా ప్రజలు ఆ రాళ్లను, కలపను గెబ, మిస్పా పట్టణాలను బలంగా కట్టడానికి వినియోగించారు.
2CH 16:7 ఆ సమయంలో దీర్ఝదర్శియైన హనానీ యూదా రాజైన ఆసా వద్దకు వచ్చాడు. హనానీ యీలా అన్నాడు: “ఆసా, నీకు సహాయం చేయటానికి నీవు అరాము (సిరియా) రాజుమీద ఆధారపడ్డావు గాని, దేవుడైన యెహోవాపై ఆధారపడలేదు. నీవు దేవుని మీద ఆధారపడవలసింది. నీవు సహాయానికి యెహోవాపై ఆధారపడలేదు గనుక, అరాము రాజు సైన్యం నీ అధీనం నుండి తప్పించుకున్నది.
2CH 16:8 ఇథియోపియనులు లూబీయులు (లిబియావారు) చాలా శక్తివంతమైన పెద్ద సైన్యాలను కలిగియున్నారు. వారికి అనేక రథాలున్నాయి, రథసారధులు వున్నారు. కాని ఆసా, అంత పెద్ద సైన్యాన్ని ఓడించటానికి నీవు యెహోవాను నమ్ముకొని, ఆయన మీద ఆధారపడ్డావు. నీవు వారిని ఓడించేలా యెహోవా నీకు సహాయపడ్డాడు.
2CH 16:9 యెహోవా కండ్లు భూమి నలుమూలలా పరిశీలించి తన పట్ల భక్తి విశ్వాసాలున్న వారిని చూస్తాయి. యెహోవా వారిని బలపర్చి రక్షిస్తాడు. ఆసా, నీవొక బుద్ధిలేని పని చేశావు. అందువల్ల ఇప్పటి నుండి నీవు యుద్ధాలు చేయవలసి వస్తుంది.”
2CH 16:10 అతడు చెప్పిన దానికి హనానీపై ఆసాకు కోపం వచ్చింది. ఆసాకు ఎంత పిచ్చి కోపం వచ్చిందంటే అతడు హనానీని చెరసాలలో పెట్టించాడు. అదే సమయంలో ఆసా కొంతమంది మనుష్యులతో చాలా సంకుచితంగా, కఠినంగా ప్రవర్తించాడు.
2CH 16:11 మొదటి నుండి చివరి వరకు ఆసా చేసిన కార్యాలన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
2CH 16:12 ఆసా రాజుగా కొనసాగిన ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అతని పాదాలకు జబ్బు చేసింది. అతని జబ్బు చాలా ప్రమాదంగా వున్నప్పటికీ, ఆసా యెహోవా నుండి సహాయం కోరలేదు. ఆసా వైద్యుల నుండి వైద్య సహాయంకొరకు చూశాడు.
2CH 16:13 ఆసా తన పరిపాలనలో నలబై ఒకటవ సంవత్సరంలో చనిపోయాడు. ఆ విధంగా ఆసా తన పూర్వీకులతో నిద్రించాడు.
2CH 16:14 దావీదు నగరంలో తనకై తాను సిద్ధ పర్చుకున్న సమాధిలోనే ప్రజలు ఆసాను వుంచారు. ఆసాకు గౌరవ సూచకంగా సుగంధ దినుసులతోను, పరిమళ ద్రవ్యములతోను నిండిన పడక మీద జనులు వుంచి, అతనిని దహించారు.
2CH 17:1 ఆసా స్థానంలో యెహోషాపాతు యూదాకు కొత్తగా రాజయ్యాడు. యెహోషాపాతు ఆసా కుమారుడు. యెహోషాపాతు యూదా రాజ్యాన్ని ఇశ్రాయేలుతో పోరాడగల శక్తిగలదిగా రూపొందించాడు.
2CH 17:2 కోటలుగా మార్చబడిన పట్టణాలన్నిటిలో అతడు సైనిక స్థావరాలను ఏర్పాటు చేశాడు. యెహోషాపాతు యూదాలోను, తన తండ్రియైన ఆసా వశపర్చుకున్న ఎఫ్రాయిము పట్టణాలలోను కోటలు నిర్మించాడు.
2CH 17:3 యెహోవా యెహోషాపాతు పక్షాన వున్నాడు. ఎందువల్లనంటే, యెహోషాపాతు చిన్న వాడైనప్పటికి, తన పూర్వీకుడైన దావీదు చేసిన మంచి పనులన్నీ చేశాడు. యెహోషాపాతు బయలు విగ్రహాలను పూజించలేదు.
2CH 17:4 తన పూర్వీకులు అనుసరించిన యెహోవా కోసమే యెహోషాపాతు నిరీక్షించాడు. అతడు దేవుని ఆజ్ఞలను పాటించాడు. ఇశ్రాయేలు ప్రజలు జీవించిన విధంగా అతడు జీవనాన్ని గడపలేదు.
2CH 17:5 యూదాపై యెహోషాపాతును ఒక శక్తివంతమైన రాజుగా దేవుడు చేశాడు యూదా ప్రజలంతా యెహోషాపాతుకు కానుకులు సమర్పించారు. ఆ విధంగా యెహోషాపాతుకు ఎక్కువ ధనం, గౌరవం లభించాయి.
2CH 17:6 యెహోవా మార్గాల ననుసరించటానికి యెహోషాపాతు హృదయం సంతోషంతో యిష్టపడింది. అతడు ఉన్నత స్థలాలను, అషేరా దేవతా స్తంభాలను యూదా రాజ్యం నుండి తీసివేశాడు.
2CH 17:7 యెహోషాపాతు కొందరు పెద్దలను యూదా రాజ్యంలో ధర్మశాస్త్రాన్ని బోధించేందుకు పంపించాడు. అది యెహోషాపాతు పాలనలో మూడవయేట జరిగింది. ఆ పెద్దలు ఎవరంటే బెన్హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మరియు మీకాయా.
2CH 17:8 ఈ పెద్దలతో పాటు యెహోషాపాతు లేవీయలను కూడ పంపాడు. ఆ లేవీయులు ఎవరంటే షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనీయా, మరియు టోబీయా. యెహోషాపాతు యాజకులైన ఎలీషామా, యెహోరాములను కూడా పంపాడు.
2CH 17:9 ఆ పెద్దలు, లేవీయులు, యాజకులు యూదాలో ప్రజలకు బోధించారు. వారి వద్ద యెహోవా ధర్మ శాస్త్ర గ్రంథం వుంది. వారు యూదా పట్టణాలన్నిటికీ వెళ్లి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించారు.
2CH 17:10 యూదా పొరుగు రాజ్యాల వారు యెహోవాకు భయపడ్డారు. అందువల్ల వారు యెహోషాపాతుపై యుద్ధం ప్రకటించలేదు.
2CH 17:11 కొంతమంది ఫిలిష్తీయులు యెహోషాపాతుకు కానుకలు తెచ్చారు. వారు యెహోషాపాతుకు వెండిని కూడా తెచ్చారు. కారణమేమంటే యెహోషాపాతు చాలా శక్తివంతుడైన రాజని వారికి తెలియటమే. అరబీయులు కొందరు గొర్రెల మందలను యెహోషాపాతుకు కానుకలుగా తెచ్చారు. వారు ఏడువేల ఏడు వందల గొర్రెపొట్టేళ్ళను ఏడువేల ఏడు వందల మేకలను తెచ్చారు.
2CH 17:12 యెహోషాపాతు రాను రాను చాలా బలమైన రాజుగా రూపొందాడు. అతడు యూదా రాజ్యంలో కోటలను, గిడ్డంగుల పట్టణాలను కట్టించాడు.
2CH 17:13 సరుకు నిల్వచేసే ఆ పట్టణాలకు నిత్యావసర, తదితర సామగ్రిని అతడు బాగా రవాణా చేశాడు. బాగా శిక్షణ పొందిన సైనికులను యెరూషలేములో యెహోషాపాతు వుంచాడు.
2CH 17:14 ఈ సైనికులువారి పితరుల వంశాలలో చేర్చబడినవారు. యెరూషలేములో వున్న సైనికుల వివరాలు ఏవనగా: యూదా వంశం నుండి నియమింపబడిన వారిలో సేనాధిపతులున్నారు. అద్నా క్రింద మూడు లక్షల మంది సైనికులున్నారు.
2CH 17:15 యెహోహానాను రెండు లక్షల ఎనబై వేలమంది వున్న సేనకు అధిపతి.
2CH 17:16 అమస్యా రెండు లక్షల మంది సైనికులకు అధిపతి. అమస్యా జిఖ్రీ కుమారుడు. అతడు యెహోవా సేవకు సంతోషంతో అంకితమయ్యాడు.
2CH 17:17 బెన్యామీను వంశం నుండి ఎంపిక చేయబడిన సేనాధిపతుల వివరాలు. ఎల్యాదా క్రింద విల్లంబలు, డాళ్లు పట్టగల రెండు లక్షల మంది సైనికులున్నారు. ఎల్యాదా మిక్కిలి ధైర్యశాలియైన సేనాని.
2CH 17:18 యెహోజా బాదు క్రింద యుద్ధ సన్నద్ధులైన లక్షా నలబై వేల మంది సైనికులున్నారు.
2CH 17:19 ఈ సైనికులంతా రాజైన యెహోషాపాతుకు సేవ చేశారు. రాజుకు యూదాలో వున్న అన్ని కోటలలో ఇతర సైనికులున్నారు.
2CH 18:1 యెహోషాపాతుకు ఎక్కువగా ధనం, గౌరవం లభించాయి. రాజైన అహాబుతో అతడు వివాహం ద్వారా ఒక ఒడంబడిక ఏర్పరచుకొన్నాడు.
2CH 18:2 కొద్ది సంవత్సరాల తరువాత యెహోషాపాతు సమరయ (షోమ్రోను) లో అహాబును చూడటానికి వెళ్లాడు. యెహోషాపాతు, అతని పరివారం యొక్క గౌరవార్థం అహాబు అనేక గొర్రెలను, ఆవులను కోయించాడు. ఆ సమయాన రామోత్గిలాదు పట్టణంపై దాడి చేయటానికి అహాబు యెహోషాపాతును ప్రోత్సహించాడు.
2CH 18:3 “రామోత్గిలాదుపై దండెత్తటానికి నీవు నాతో వస్తావా?” అని అహాబు యెహోషాపాతును అడిగాడు. అహాబు ఇశ్రాయేలు రాజు. యెహోషాపాతు యుదా రాజు అహాబుకు యెషాపాతు యిలా సమాధాన మిచ్చాడు: “నేను నీవంటి వాడను. నా మనుష్యులు నీ మనుష్యుల వంటి వారు. మేము యుద్ధానికి నీతో వస్తాము.
2CH 18:4 కాని ముందుగా మనం యెహోవా వర్తమానం ఏమైనా వుంటుందేమో చూద్దాం,” అని కూడ యెహోషాపాతు అన్నాడు.
2CH 18:5 అందువల్ల అహాబు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించాడు. అహాబు వారితో, “మేము రామోత్గిలాదు పట్టణం మీదికి యుద్ధానికి వెళ్లవచ్చా? లేదా?” అని అన్నాడు. అప్పుడు ప్రవక్తలు, “వెళ్లండి; ఎందువల్లనంటే దేవుడు రామోత్గిలాదును మీరు ఓడించేలా చేస్తాడు” అని అహాబుకు సమాధాన మిచ్చారు.
2CH 18:6 కాని యెహోషాపాతు యిలా అన్నాడు: “ఇక్కడ యెహోవా యొక్క ప్రవక్త ఎవరైనా వున్నారా? యెహోవా ప్రవక్తలలో ఒకని ద్వారా ఆయన ఏమి చెపున్నాడో తెలుసుకోవలసిన అవసరం వుంది.”
2CH 18:7 అప్పుడు రాజైన అహాబు యెహోషాపాతుతో యీలా అన్నాడు: “ఇక్కడ ఇంకా ఒక మనిషి వున్నాడు. మనం అతని ద్వారా యెహోవాను అడుగుదాం. కాని ఈ మనిషిని నేను అసహ్యించుకుంటాను. ఎందువల్ల నంటే అతడు యెహోవా నుండి నాకు ఒక్క మంచి వర్తమానం కూడ అందచేయడు. నాకు ఎప్పుడూ చెడువార్తలే తెస్తాడు. ఆ వ్యక్తి పేరు మీకాయా. అతడు ఇమ్లా కుమారుడు.” కాని యెహోషాపాతు, “అహాబూ నీవు అలా అనరాదు” అని అన్నాడు.
2CH 18:8 అప్పుడు రాజైన అహాబు తన అధికారులలో ఒకనిని పిలిచి, “ఇమ్లా కుమారుడైన మీకాయాను త్వరగా తీసుకొని రమ్మని పంపాడు.”
2CH 18:9 ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా రాజైన యెహోషాపాతు తమతమ రాజదుస్తులు ధరించారు. వారిద్దరు సమరయ (షోమ్రోను) నగర ముఖద్వారం దగ్గర వున్న నూర్పిడి కళ్లం వద్ద తమతమ సింహాసనాలపై కూర్చున్నారు. అక్కడకు వచ్చియున్న నాలుగువందల మంది ప్రవక్తలు రాగల సంగతుల వర్తమానాలను రాజుల ముంగిట చెప్తున్నారు.
2CH 18:10 కెనయనా కుమారుని పేరు సిద్కియా. సిద్కియా కొన్ని ఇనుప కొమ్ములు చేయించుకు వచ్చాడు. సిద్కియా యిలా అన్నాడు: “యెహోవా ఈ రకంగా చెప్పుచున్నాడు: ‘నీవు ఈ ఇనుప కొమ్ములు విని యెగించి, అరామీయులు (సిరియనులు) నశించిపోయే వరకు వారిని పోడుస్తావు.’”
2CH 18:11 ప్రవక్తలంతా అదే విషయం చెప్పారు. వారిలా అన్నారు: “రామోత్గిలాదు పట్టణానికి వెళ్లు. నీకు విజయం చేకూరుతుంది. రాజు అరాము ప్రజలను ఓడించేలా యెహోవా తోడ్పడుతాడు.”
2CH 18:12 మీకాయాను పిలవటానికి వెళ్లిన దూత అతనితో యీలా చెప్పాడు: “మీకాయా, వినండి; ప్రవక్తలంతా ఒకే రీతిగా ప్రవచిస్తున్నారు. రాజుకు విజయం చేకూరుతుందని వారు చెప్తున్నారు. వారు చెప్పినట్లుగానే నీవు కూడా తెలియజేయి. నీవు కూడ మంచి విషయాలే చెప్పు.”
2CH 18:13 “యెహోవా జీవముతోడు నేను నా దేవుడు తెలియజేసిన రీతినే చెపుతాను” అని మీకాయా అన్నాడు.
2CH 18:14 పిమ్మట మీకాయా రాజైన అహాబు వద్దకు వచ్చాడు. రాజు అతనితో, “మీకాయా, మేము రామోత్గిలాదు పట్టణంపై దండెత్తటానికి వెళ్లవచ్చునో, లోదో తెలియజేయి” అని అన్నాడు. అందుకు మీకాయా, “వెళ్లి దాడి చేయి, దేవుడు నీవాప్రజలను ఓడించేలా చేస్తాడు,” అని చెప్పాడు.
2CH 18:15 అహాబు రాజు మీకాయాతో, “గతంలో చాలా సార్లు నిజమే ప్రవచించేలా యెహోవా పేర నీచేత ప్రమాణం చేయించాను,” అని అన్నాడు.
2CH 18:16 అప్పుడు మీకాయా యీలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా పర్వతాలపై చిందరవందరై పోయినట్లు నేను చూశాను. వారు కాపరిలేని గొర్రెల్లా వున్నారు. యెహోవా చెప్పినదేమంటే, ‘వారికి నాయకుడు లేడు. కావున ప్రతి ఒక్కడినీ క్షేమంగా ఇంటికి పోనిమ్ము.’”
2CH 18:17 అది విని ఇశ్రాయేలు రాజు అహాబు యెహోషాపాతుతో యిలా అన్నాడు: “మీకాయా నాకు ఎప్పుడూ యెహోవా నుండి మంచి వార్త తేడని నేను నీకు ముందే చెప్పాను! నా గురించి అతడు తెచ్చేవన్నీ చెడు వర్తమానాలే!”
2CH 18:18 మీకాయా ఇంకా యిలా అన్నాడు: “యెహోవా వర్తమానాన్ని వినండి! యెహోవా తన సింహాసనంపై కూర్చుని వున్నట్లు నేను చూశాను. పరమండల సైన్యమంతా ఆయన చుట్టూ చేరివుంది.
2CH 18:19 యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు అక్కడ చంపబడే విధంగా, యుక్తిగా రామోత్గిలాదుపై అతనిని యుద్ధానికి ఎవరు పంపగలరు?’ అని అడిగినాడు. ఆయన చుట్టూ చేరిన పలువురు పలురకాలుగా చెప్పారు.
2CH 18:20 పిమ్మట ఒక ఆత్మవచ్చి యెహోవా ముందు నిలబడి, ‘అహాబును నేను మోసపుచ్చుతాను’ అని అన్నది. ‘ఎలా?’ అని యెహోవా ఆత్మని అడిగాడు.
2CH 18:21 ‘నేను అసత్యలాడే ఆత్మగా మారి అహాబు ప్రవక్తలలో ప్రవేశించి వారి నోట అబద్ధాలు పలికిస్తాను’ అని ఆత్మ చెప్పింది. అది విని ‘అహాబును మోసగించటంలో నీకు జయమగు గాక! నీవు బయటకు వెళ్లి కార్యము సాధించు’ అని యెహోవా అన్నాడు.
2CH 18:22 “అహాబూ, ఇప్పుడు చూడు; యెహోవా ఒక అసత్య ఆత్మను నీ ప్రవక్తలలో ప్రవేశపెట్టాడు. నీకు కీడు మూడుతుందని యెహోవా చెప్పియున్నాడు.”
2CH 18:23 పిమ్మట సిద్కియా తిన్నగా మీకాయా వద్దకు వెళ్లి చెంపమీద చాచికొట్టాడు. సిద్కియా తండ్రి పేరు కెనయనా. సిద్కియా యిలా అన్నాడు: “మీకాయా, యెహోవా వద్దనుండి వచ్చిన ఆత్మ నన్ను వదిలి నిన్నావరించటానికి ఎటునుండి వచ్చింది?”
2CH 18:24 దానికి మీకాయా “సిద్కియా, నీవు లోపలి గదిలోకి పోయి దాగుకొనే రోజున నీవది తెలుసుకొంటావు!” అని సమాధానమిచ్చాడు.
2CH 18:25 పిమ్మట రాజైన అహాబు యిలా అన్నాడు: “మీకాయాను తీసుకొని వెళ్లి నగరపాలకుడైన ఆమోనుకు, రాజకుమారుడైన యెవాషుకు అప్పజెప్పండి.
2CH 18:26 రాజాజ్ఞగా ఆమోనుకు, యెవాషుకు యిలా చెప్పండి: ‘మీకాయాను చెరసాలలో పెట్టండి. నేను యుద్ధం నుండి తిరిగి వచ్చేవరకు అతనికి రొట్టె నీరు తప్ప ఇతర ఆహారమేదీ యివ్వవద్దు.’”
2CH 18:27 మీకాయా యిలా సమాధానమిచ్చాడు: “అహాబూ, నీవు యుద్ధాన్నుండి క్షేమంగా తిరిగి వస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడి యుండలేదని అర్థం. ఓ ప్రజలారా, నా మాటలు విని జ్ఞాపకం పెట్టుకోండి!”
2CH 18:28 పిమ్మట ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్గిలాదు పట్టణాన్ని ముట్టడించారు.
2CH 18:29 అహాబు యెహోషాపాతుతో, “యుద్ధంలోకి వెళ్లే ముందు నేను నా వేషం మార్చివేస్తాను. కాని నీవు మాత్రం నీ రాజదుస్తులే ధరించు” అని అన్నాడు. ఇశ్రాయేలు రాజు మారువేషం వేసిన పిమ్మట రాజులిద్దరూ యుద్ధానికి వెళ్లారు.
2CH 18:30 అరాము (సిరియా) రాజు తన రథాల అధిపతులకు ఒక ఆజ్ఞ యిచ్చాడు. అతడు వారితో యిలా అన్నాడు: “ఎంత గొప్ప వాడేగాని, ఎంత సామాన్యుడే గాని, మీరు ఎవ్వరితోనూ పోరాడవద్దు. కాని మీరు ఇశ్రాయేలు రాజైన అహాబతోనే యుద్ధం చేయండి.”
2CH 18:31 రథాధిపతులు యెహోషాపాతును చూచినప్పుడు అతడే ఇశ్రాయేలు రాజైన అహాబు అనుకున్నారు! అతన్ని ఎదిరించటానికి వారు యెహోషాపాతు మీదికి తిరిగారు. కాని యెహోషాపాతు కేకలు పెట్టటంతో యెహోవా అతనికి సహాయపడ్డాడు. రథాధిపతులు యెహోషాపాతును వదిలి పోయేలాగు దేవుడు వారి మనస్సు మార్చాడు.
2CH 18:32 వారు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు కాదని తెలిసికొన్నప్పుడు వారతనిని తరమటం మానివేశారు.
2CH 18:33 కాని ఒక సైనికుడు దేనికీ గురిపెట్టకుండా ఒక బాణాన్ని మామూలుగా వదిలాడు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. కవచం కప్పకుండా వున్న అతని శరీర భాగంలో ఆ బాణం తగిలింది. అప్పుడు అహాబు తన రథసారధితో, “రథాన్ని వెనుకకు తిప్పి నన్ను యుద్ధరంగం నుండి బయటకు తీసుకొని వెళ్లు. నేను గాయపడ్డాను.” అని చెప్పాడు.
2CH 18:34 ఆ రోజు యుద్ధం తీవ్రంగా జరిగింది. అహాబు తన రథంలో ఆనుకొని సాయంత్రంమయ్యే వరకు అరామీయులను (సిరియనులు) చూస్తూ నిలబడివున్నాడు. సూర్యుడు అస్తమించే సమయంలో అహాబు చనిపోయాడు.
2CH 19:1 యూదా రాజైన యెహోషాపాతు యెరూషలేములోని తన యింటికి క్షేమంగా తిరిగి వచ్చాడు.
2CH 19:2 దీర్ఘదర్శియగు యెహూ ఎదురేగి యెహోషాపాతును కలిశాడు. యెహూ తండ్రి పేరు హనానీ. యెహోషాపాతుతో యెహో ఈ విధంగా చెప్పాడు: “నీవు దుష్టులకు ఎందుకు సహాయపడ్డావు? యెహోవాను అసహ్యించుకునే వారిని నీ వెందుకు ప్రేమిస్తున్నావు? అందువల్లనే యెహోవా నీపట్ల కోపంగా వున్నాడు.
2CH 19:3 కాని నీ జీవితంలో నీవు కొన్ని మంచి పనులు చేశావు. నీవు అషేరా దేవతా స్తంభాలను ఈ దేశం నుండి తొలగించావు. దేవుని అనుసరించాలని నీ హృదయంలో నిశ్చయించుకున్నావు.”
2CH 19:4 యెహోషాపాతు యెరూషలేములో నివసించాడు. మళ్లీ అతడు ప్రజలను కలియటానికి బెయేర్షెబా పట్టణం నుండి కొండల ప్రాంతమైన ఎఫ్రాయిము వరకు సంచారం చేశాడు. యెహోషాపాతు ప్రజలమధ్య తిరిగి మళ్లీ వారిని తమ పూర్వీకులు ఆరాధించిన యెహోవా వైపుకు తిప్పాడు.
2CH 19:5 యెహోషాపాతు యూదాలో న్యాయాధిపతులను నియమించాడు. యూదాలో కోటలుగల పట్టణాలన్నిటిలో అతడు న్యాయాధిపతులను నియమించాడు.
2CH 19:6 యెహోషాపాతు ఆ న్యాయాధిపతులతో యిలా చెప్పాడు: “మీరు చేసే పనిలో మీరు మిక్కిలి మెళకువతో మెలగండి. ఎందువల్లనంటే మీరు తీర్పు తీర్చేది ప్రజల తరుపున కాదు. యెహోవా తరుపున మీరొక నిర్ణయం తీసుకొనేటప్పుడు యెహోవా మీతో వుంటాడు.
2CH 19:7 కావున మీలో ప్రతి ఒక్కడూ యెహోవాకు భయ పడాలి. మీ పనిలో మీరు జాగ్రత్త వహించండి. ఎందు వల్లనంటే మన దేవుడైన యెహోవా పక్షపాతం లేనివాడు. న్యాయశీలి. యెహోవా ఎన్నడూ కొందరిని మరికొందరికంటె ముఖ్యులుగా చూడక సమంగా చూస్తాడు. తన తీర్పును మార్చటానికి యెహోవా ధనం ఆశించడు.”
2CH 19:8 యెరూషలేములో కొంతమంది లేవీయులను, యాజకులను, మరికొందరు ఇశ్రాయేలు పెద్దలను న్యాయాధిపతులుగా యెహోషాపాతు ఎంపిక చేశాడు. యెరూషలేములో వున్న ప్రజల సమస్యలను పరిష్కరించటానికి వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తారు.
2CH 19:9 యెహోషాపాతు యిలా కొన్ని ఆజ్ఞలను యిచ్చాడు. యెహోషాపాతు యిలా చెప్పాడు: “మీ నిండు హృదయంతో మీరు విశ్వాసపాత్రంగా సేవ చేయాలి. మీరు యెహోవాకు భయపడాలి.
2CH 19:10 హత్యావిషయాలు, చట్టపరమైన, ఆజ్ఞాపరమైన నియమ నిబంధనలకు సంబంధించిన నేరాలు అనేకం మీ దృష్టికి తేబడతాయి. నగరాలలో నివసించే మీ సోదరుల వద్ద నుండి ఈ విషయాలు మీ తీర్పుకు వస్తాయి. మీ వద్దకు వచ్చిన నేరస్తులను, వాదాలాడే వారిని అందరినీ యెహోవాపట్ల పాపం చేయవద్దని మీరు హెచ్చరించాలి. మీరు నమ్మకంగా పనిచేయని ఎడల మీ మీదికి, మీ సోదరుల మీదికి యెహోవా కోపాన్ని రప్పించిన వారవుతారు. నేను చెప్పినట్లు చేయండి. అప్పుడు తప్పు చేశామనే భావన మీకు వుండదు.
2CH 19:11 “అమర్యా ప్రముఖ యాజకుడు. యెహోవాకు సంబంధించిన అన్ని విషయాలలో అతడు మీమీద ఆధిపత్యం వహిస్తాడు. రాజుకు సంబంధించిన విషయాలలో మీకు మార్గదర్శకుడుగా జెబద్యావున్నాడు. జెబద్యా తండ్రి పేరు ఇష్మాయేలు. యూదా వంశంలో జెబద్యా ఒక పెద్ద. ఇంకను లేవీయులు మీకు లేఖకులుగా పని చేస్తారు. మీరు ప్రతి పనీ ధైర్యంగా చేయండి. న్యాయమార్గాన నడిచే ప్రజలకు యెహోవా అండగా వుండుగాక!”
2CH 20:1 తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు కలిసి యెహోషాపాతుతో యుద్ధం ప్రారంభించటానికి వచ్చారు.
2CH 20:2 కొందరు మనుష్యులు యెహోషాపాతు వద్దకు వచ్చి యిలా అన్నారు: “ఎదోము నుంచి ఒక పెద్ద సైన్యం నీమీదికి వస్తూ వుంది. ఆ సైన్యం మృత సముద్రానికి అవతలి పక్క నుండి వస్తూ వుంది. వారు ఇప్పటికే హససోను తామారు అనబడే ఏన్గెదీలో ఉన్నారు.”
2CH 20:3 యెహోషాపాతు భయపడ్డాడు. తాను ఏమి చేయాలో యెహోవాను అడిగి తెలిసికోవాలని యెహోషాపాతు నిశ్చయించాడు. యూదాలో ప్రతి ఒక్కడూ ఉపవాసం చేయలని ఒక నిర్ణీత సమయాన్ని ప్రకటించాడు.
2CH 20:4 యూదా ప్రజలు యెహోవా సహాయం కోరటానికి ఒక చోట సమావేశమయ్యారు. వారు యూదా పట్టణాలన్నిటి నుండీ యెహోవా సహాయం కోరటానికి వచ్చారు.
2CH 20:5 యెహోషాపాతు ఆలయ నూతన ప్రాంగణం ముందు వున్నాడు. యూదా, యెరూషలేము ప్రజల సమావేశంలో అతడు నిలబడ్డాడు.
2CH 20:6 అతడు ఈ విధంగా ప్రార్థించాడు: “మా పూర్వీకుల దేవుడవైన ఓ ప్రభూ, నీవే పరలోక అధిపతివి. ప్రపంచ రాజ్యాలన్నిటినీ ఏలేవాడవు నీవే! నీకు అధికారం, బలం వున్నాయి! నిన్నెదిరించి ఎవ్వడూ నిలువలేడు!
2CH 20:7 నీవు మా దేవుడివి! ఈ దేశంలో నివసించే ప్రజలను బయటకు పొమ్మని ఒత్తడి చేశావు. ఈ పనినీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ముంగిట చేశావు. ఈ రాజ్యాన్ని అబ్రాహాము సంతతివారికి శాశ్వతంగా యిచ్చావు. అబ్రహాము నీ స్నేహితుడు.
2CH 20:8 అబ్రహాము సంతతివారు ఈ రాజ్యంలో నివసించి, నీ పేరు మీద ఒక ఆలయాన్ని కట్టించారు.
2CH 20:9 వారు, ‘యుద్ధాలు, శిక్ష వ్యాధులు, కరువు కాటకాలు మొదలైన ఈతి బాధలు మాకు సంభవించినప్పుడు, ఈ మందిరం ముందు, నీ సన్నిధిని నిలబడతాము. ఈ మందిరం నీ పేరు మీద వుంది. మాకు ఆపద వచ్చినప్పుడు నీకు మొర పెట్టుకొంటాము. అప్పుడు నీవు మా మొరాలకించి మమ్ము రక్షిస్తావు’ అని అన్నారు.
2CH 20:10 “కాని ఇప్పుడు అమ్మోను, మోయాబు, మరియు శేయీరు పర్వత ప్రాంత మనుష్యులు ఇక్కడ వున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను వారి రాజ్యంలోనికి నీవు వెళ్లనీయలేదు అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు వారి జోలికి పోకుండా తిరిగి వచ్చి, వారిని నాశనం చేయలేదు.
2CH 20:11 కాని మేము వారిని నాశనం చేయకుండా వదిలిపెట్టినందుకు వారు మాకు ఏ రకమైన ప్రతిఫలం ఇస్తున్నారో చూడు. నీ దేశం నుండి మమ్మల్ని తరిమి వేయటానికి వారు వచ్చారు. ఈ దేశాన్ని నీవు మాకు యిచ్చి యున్నావు.
2CH 20:12 మా దేవా, ఆ మనుష్యులను శిక్షించుము! మామీదికి దండెత్తి వస్తున్న ఈ మహా సైన్యాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు! మేము ఏమి చేయాలో మాకు తోచటంలేదు! అందువల్ల నీ సహాయం కొరకు ఎదురు చూస్తూన్నాం.”
2CH 20:13 యూదా ప్రజలంతా తమ పసిబిడ్డలు, భార్యలు, పిల్లలతో యెహోవా ముందు నిలబడ్డారు.
2CH 20:14 అప్పుడు యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి వచ్చింది. యహజీయేలు తండ్రి పేరు జెకర్యా. జెకర్యా తండ్రి పేరు బెనాయా. బెనాయా తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు తండ్రి పేరు మత్తన్యా. యహజీయేలు ఒక లేవీయుడు. ఆసాపు సంతతిలోనివాడు. సమావేశం మధ్యలో
2CH 20:15 యహజీయేలు నిలబడి యిలా అన్నాడు: “రాజైన యెహోషాపాతూ, యూదా, యెరూషలేములలో నివసిస్తున్న ప్రజలారా వినండి! యెహోవా మీకు ఈ విధంగా తెలియజెప్పుతున్నాడు: ‘ఈ మహా సైన్యాన్ని చూచి మీరు భయపడవద్దు. చింతించవద్దు. ఎందువల్లననగా ఇప్పుడు యుద్ధం మీది కాదు. ఇది దేవుని యుద్ధం.
2CH 20:16 రేపు మీరు అక్కడకి వెళ్లి ఆ సైన్యంతో యుద్ధం చేయండి. వారు జీజు కనుమ ద్వారా వస్తారు. యెరూవేలు ఎడారికి అవతలి పక్కనున్న లోయ చివర మీరు వారిని చూస్తారు.
2CH 20:17 ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. మీరీ స్థానాలలో దృఢంగా నిలబడండి. యెహోవా మిమ్ముల్ని రక్షించటం మీరు చూస్తారు. యూదా, యెరూషలేము ప్రజలారా భయపడకండి! చింతించవద్దు! యెహోవా మీ పక్షాన వున్నాడు. కావున రేపు వారి మీదికి వెళ్లండి.’”
2CH 20:18 యెహోషాపాతు తన శిరస్సు నేల తాకేలా సాష్టాంగపడ్డాడు. యూదా ప్రజలు, యెరూషలేములో వుంటున్న వారు యెహోవా ముందు సాష్టాంగపడ్డారు. వారంతా యెహోవాను ఆరాధించారు.
2CH 20:19 లేవీయులలో కహాతీయుల కుటుంబాలవారు, కోరహీయులు నిలబడి ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవాకు స్తోత్రం చేశారు. వారు గొంతెత్తి స్తోత్రం చేశారు.
2CH 20:20 తెల్లవారుఝామునే యెహోషాపాతు సైన్యం తెకోవ ఎడారికి వెళ్లింది. వారు బయలుదేరి వెళ్లేటప్పుడు యెహోషాపాతు నిలబడి యిలా అన్నాడు: “యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, నేను చెప్పేది వినండి. మీ దేవుడైన యెహోవాలో విశ్వాసముంచండి. అప్పుడు మీరు దృఢంగా నిలువ గలుగుతారు. యెహోవా ప్రవక్తలలో విశ్వాసముంచండి. మీరు విజయం సాధిస్తారు!”
2CH 20:21 యెహోషాపాతు ప్రజల సలహాను ఆలకించాడు. అతడు గాయకులను నియమించాడు. యెహోవా పరిశుద్ధుడు, అద్భతమైన వాడు గనుక ఆయనను స్తుతించటానికి ఆ గాయకులు ఎంపిక చేయబడ్డారు. వారు సైన్యానికి ముందు నడుస్తూ యెహోవాకు స్తుతి గీతాలు పాడారు. “యెహోవాకు భజన చేయండి; ఆయన ప్రేమ తరగనిది!” అంటూ వారు సంకీర్తన చేశారు.
2CH 20:22 ఆ మనుష్యులు పాడుతూ, దేవుని స్తుతిస్తూ వెళ్తూండగా, అమ్మోను, మోయాబు ప్రజల మీదికి, శేయీరు పర్వత ప్రాంతం వారిమీదికి మాటు వేసిన మనుష్యులను యెహోవా పంపాడు. వారంతా యూదా రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారు. వాళ్లు బాగా దెబ్బలు తిన్నారు.
2CH 20:23 అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వత ప్రాంతం వారితో యుద్ధానికి దిగారు. అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వతప్రాంతం వారిని చంపి నాశనం చేశారు. శేయీరు మనుష్యులను చంపిన తరువాత, వారు మళ్లీ ఒకరి నొకరు చంపుకున్నారు.
2CH 20:24 యూదా సైనికులు ఎడారిలోని కాపలా బురుజు వద్దకు వచ్చారు. వారు శత్రుసైన్యం వైపు పరిశీలించి చూశారు. కాని వారు భూమిమీద పడివున్న శవాలను మాత్రమే చూడగలిగారు, ఒక్కడు కూడా బ్రతికిలేడు.
2CH 20:25 శవాలపైగల విలువైన వస్తువులను తీసుకోవటానికి యెహోషాపాతు, అతని సైన్యం, వచ్చారు. వారు జంతువులను, డబ్బును, బట్టలను, ఇతర విలువైన వస్తువులను చూశారు. యెహోషాపాతు, అతని సైనికులు ఆ వస్తువులన్నిటినీ తీసుకున్నారు. ఆ వస్తువులన్నీ యెహోషాపాతు, అతని మనుష్యులు మోసుకుపోలేనన్ని వున్నాయి. శవాలనుండి తీసుకొన్న వస్తువులను మోసుకుపోవటానికి వారికి మూడు రోజులు పట్టింది. అక్కడ వస్తువులు అంత ఎక్కువగా పడివున్నాయి.
2CH 20:26 నాల్గవ రోజున యెహోషాపాతు, అతని సైన్యం బెరాకా లోయలో సమావేశమైనారు. ఆ స్థలంలో వారు యెహోవాకి ప్రార్థనలు చేశారు. అందువల్ల ఆ స్థలానికి ఈనాటికీ “బెరాకాలోయ” అని పేరు.
2CH 20:27 తరువాత యూదా నుండి, యెరూషలేము నుండి వచ్చిన సైనికులను యెహోషాపాతు యెరూషలేముకు తీసుకొనిపోయాడు. వారి శత్రువులను ఓడించి, యెహోవా వారిని చాలా సంతోషపర్చాడు.
2CH 20:28 వారు మేళతాళాలతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆలయానికి వెళ్లారు.
2CH 20:29 ఇశ్రాయేలు శత్రులతో యెహోవా యుద్ధం చేశాడని విని వివిధ దేశాల రాజులందరూ యెహోవా అంటే భయపడ్డారు.
2CH 20:30 అందువల్ల యెహోషాపాతు రాజ్యంలో శాంతి నెలకొన్నది. యెహోషాపాతు యొక్క దేవుడు అతనికి శాంతియుత వాతావరణాన్ని కల్పించాడు.
2CH 20:31 యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పాలించాడు. యెహోషాపాతు పాలన మొదలయ్యే సరికి ముప్పై ఐదేండ్లవాడు. అతడు యెరూషలేములో ఇరవైయైదు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు అజూబా. అజూబా తల్లిపేరు షిల్హీ.
2CH 20:32 తన తండ్రి ఆసా నడిచిన రీతిగా యెహోషాపాతు ఉత్తమ జీవితాన్ని గడిపాడు. యెహోషాపాతు ఆసా మార్గాన్ని అనుసరించటానికి వెనుకాడలేదు. యెహోవా దృష్టికి మంచి పనులన్నీ యెహోషాపాతు చేశాడు.
2CH 20:33 కాని బూటకపు దేవతల పూజలకు వినియోగించిన గుట్టలను (ఉన్నత స్థలాలను) అతడు తీసివేయలేదు. ప్రజలు కూడా తమ పూర్వీకులు ఆరాధించిన దేవుని అనుసరించటానికి తమ హృదయాలను తిప్పలేదు.
2CH 20:34 యెహోషాపాతు ఆదినుండి అంతంవరకు చేసిన పనులన్నీ యెహో వ్రాసిన గ్రంథాలలో పొందుపర్చబడ్డాయి. యెహో తండ్రిపేరు హనానీ. ఈ విషయాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
2CH 20:35 చివరి రోజుల్లో యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడు. అహజ్యా మిక్కిలి చెడుకార్యాలు చేశాడు.
2CH 20:36 తర్షీషు పట్టణానికి పయనించే ఓడలను చేయించటానికి యెహోషాపాతు అహజ్యాతో కలిశాడు. వారు ఓడలను ఎసోన్గెబెరులో నిర్మించారు.
2CH 20:37 అప్పుడు ఎలీయెజెరు అనే ప్రవక్త యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచించాడు. ఎలీయెజెరు తండ్రి పేరు దోదావాహు. ఎలీయెజెరు మారేషా పట్టణానికి చెందినవాడు. అతడు ఈ రకంగా చెప్పాడు: “యెహోషాపాతూ, నీవు అహజ్యాతో కలిశావు. అందువల్ల యెహోవా నీ పనులను సర్వనాశనం చేస్తాడు.” అలానే అతని ఓడలు పగిలిపోయాయి. అందువల్ల యెహోషాపాతు, అహజ్యాలు తర్షీషుకు ఓడలను పంపలేకపోయారు.
2CH 21:1 యెహోషాపాతు చనిపోగా, అతనిని అతని పూర్వీకుల సరసన సమాధిఛేశారు. అతడు దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. యెహోషాపాతు స్థానంలో అతని కుమారుడు యెహోరాము కొత్త రాజయ్యాడు.
2CH 21:2 యెహోరాము సోదరులు అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, మరియు షెపట్య అనువారు. వీరంతా యెహోషాపాతు కుమారులు. యెహోషాపాతు యూదా రాజ్యానికిరాజు.
2CH 21:3 యెహోషాపాతు తన కుమారులకు వెండి బంగారు వస్తువులు, తదితర విలువైన కానులు యిచ్చాడు అతడు యూదాలో బలమైన కోటలు నిర్మించి యిచ్చాడు. కాని యెహోషాపాతు రాజ్యాన్ని యెహోరాముకు యిచ్చాడు. ఎందువల్లనంటే అతడు పెద్ద కుమారుడు.
2CH 21:4 యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని చేపట్టి తనను తాను పటిష్ట పర్చుకొని స్థిరపడ్డాడు. తరువాత కత్తని వినియోగించి తన సోదరులనందరినీ చంపి వేశాడు. అతడు మరికొందరు ఇశ్రాయేలు పెద్దలను కూడా నరికివేశాడు.
2CH 21:5 యెహోరాము ఏల నారంభించే నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు.
2CH 21:6 అతడు ఇశ్రాయేలు రాజులు నివసించిన రీతిలో జీవితం కొనసాగించాడు. అహాబు కుటుంబం మాదిరిగానే అతడు కూడ నివసించాడు. ఎందువల్ల నంటే అహాబు కుమార్తెనే యెహోరాము వివాహమాడాడు. యెహోరాము యెహోవా దృష్టికి చెడ్డవైన పనులన్నీ చేశాడు.
2CH 21:7 కాని యెహోవా దావీదుతో చేసుకొన్న ఒడంబడిక ప్రకారం ఆయన దావీదు కుటుంబాన్ని నాశనం చేయలేదు. దావీదు కొరకు, ఆయన సంతతివారి కొరకు యెహోవా శాశ్వతంగా ఒక జ్యోతిని వెలిగించుతానని మాట యిచ్చివున్నాడు.
2CH 21:8 యెహోరాము కాలంలోనే యూదా ఆధిపత్యం నుండి ఎదోము విడిపోయి, స్వతంత్ర రాజ్యమయ్యింది. ఎదోమీయులు వారి స్వంత రాజును ప్రకటించుకున్నారు.
2CH 21:9 అందువల్ల యెహోవారాము తన సైన్యాధిపతులతోను, రథాలతోను ఎదోము మీదికి వెళ్లాడు. ఎదోమీయుల సైన్యం యెహోరామును, అతని రథాధిపతులను చుట్టుముట్టింది. కాని యెహోరాము తీవ్రంగా యుద్ధం చేసి చీకటి పడ్డాక బయట పడ్డాడు.
2CH 21:10 అప్పటి నుండి ఈ నాటి వరకు ఎదోము రాజ్యం యూదాపై తిరుగబడుతూనే వుంది. లిబ్నా పట్టణవాసులు కూడా యెహోరాముకు వ్యతిరేకులైనారు. యెహోరాము యెహోవాను విడనాడినందుకు ఫలితంగా ఇదంతా జరిగింది. యెహోవా యెహోరాము పూర్వీకులు ఆరాధించిన దేవుడు.
2CH 21:11 యెహోరాము యూదా కొండలమీద, గుట్టలమీద క్షుద్ర దేవతల పూజలకై స్థలాలను నిర్మించాడు. దేవుడు ఆశించిన దానిని చేయకుండా యెరూషలేము ప్రజలకు యెహోరాము అడ్డుపడ్డాడు. అతడు యూదా ప్రజలను యెహోవాకు దూరం చేశాడు.
2CH 21:12 ప్రవక్తయైన ఏలీయా ద్వారా యెహోరాముకు ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం యిలా వుంది: “దేవుడైన యెహోవా తెలియజేయునదేమనగా: ఆయన మీ పూర్వీకుడైన దావీదు ఆరాధించిన దైవం. యెహోవా చెప్పుచున్నాడు: ‘యెహోరామూ, నీ తండ్రి యెహోషాపాతు నడిచిన మార్గాన్ని నీవు విడనాడినావు. యూదా రాజైన ఆసా నడిచిన మార్గాన్ని కూడ నీవు విడనాడినావు.
2CH 21:13 అంతేకాదు నీవు ఇశ్రాయేలు రాజులు నడచిన పెడమార్గాన్ని అనుసరించావు. దేవుడు ఆశించిన రీతిగా నడవకుండా నీవు యూదా, యెరూషలేము ప్రజలను ఆపావు. అదే నేరాన్ని అహాబు, అతని కుటుంబంవారు చేశారు. వారు దేవుని పట్ల విశ్వాస ఘాతకులైనారు. నీవు నీ సోదరులను హత్యచేశావు. నీకంటె నీ సోదరులు మంచివారు.
2CH 21:14 కావున త్వరలో యెహోవా నీ ప్రజలను కఠినంగా శిక్షిస్తాడు. యెహోవా నీ పిల్లలను భార్యలను శిక్షించి, నీ ఆస్తిని పాడుచేస్తాడు.
2CH 21:15 నీకు పేగుల్లో భయంకరమైన జబ్బు చేస్తుంది. రోజు రోజుకూ నీ జబ్బు ముదురుతుంది. ఆ భయంకరమైన వ్యాధివల్ల నీ ప్రేగులు బయటికి వచ్చేస్తాయి.’”
2CH 21:16 యెహోవా ఫిలిష్తీయులను, ఇథియోపియునులకు (కూషీయులు) దగ్గరలో నివసిస్తున్న అరబీయులను యెహోరాము మీదికి పోయేలా ప్రేరేపించాడు.
2CH 21:17 ఆ ప్రజలు యూదా రాజ్యం మీదికి దండెత్తారు. వారు రాజగృహంలోని ధనాన్నంతా కొల్లగొట్టారు. వారు యెహోరాము కుమారులను, భార్యలను తీసుకొనిపోయారు. యెహోరాము చిన్న కుమారుడు మాత్రం వదిలిపెట్టబడ్డాడు. యెహోరాము చిన్న కుమారుని పేరు యెహోయాహాజు.
2CH 21:18 ఈ సంఘటనలు జరిగిన తరువాత యెహోవా యెహోరాముకు పేగుల్లో నయంకాని వ్యాధిని కలుగజేశాడు.
2CH 21:19 జబ్బు ముదిరి రెండు సంవత్సరాల తరువాత యెహోరాము పేగులు బయటికి వచ్చాయి. భరించలేని బాధతో అతడు చనిపోయాడు. తన తండ్రికి చేసినట్లు ప్రజలు యెహోరాముకు గౌరవసూచకంగా పెద్దమంట వేయలేదు.
2CH 21:20 యెహోరాము రాజయ్యే నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు. యెహోరాము చనిపోయినప్పుడు ఒక్కడు కూడ విచారించలేదు. యెహోరామును ప్రజలు దావీదు నగరంలో సమాధి చేశారుగాని, రాజులను వుంచే చోట అతనిని సమాధి చేయలేదు.
2CH 22:1 యెహోరాము స్థానంలో యెరూషలేము ప్రజలు అహజ్యాను కొత్త రాజునుగా చేసారు. అహజ్యా యెహోరాము యొక్క చిన్న కుమారుడు. అరబీయులతో యెహోరాము మీదికి వచ్చిన ప్రజలు యెహోరాము కుమారులందరినీ చంపివేశారుగాని, చిన్నవానిని మాత్రం వదిలారు. అందువల్ల అహజ్యా యూదాలో పరిపాలించగలిగాడు.
2CH 22:2 అహజ్యా పరిపాలన ఆరంభించే నాటికి ఇరువది రెండేండ్లవాడు. యెరూషలేములో అహజ్యా ఒక్క సంవత్సరం పాలించాడు. అతని తల్లి పేరు అతల్యా. అతల్యా తండ్రి పేరు ఒమ్రీ.
2CH 22:3 అహబు కుటుంబం నివసించిన తీరునే అహజ్యా నివసించాడు. అతడలా నివసించటానికి కారణం అతని తల్లి అతనిని దుష్టకార్యాలకు ప్రేరేపించటమే.
2CH 22:4 యెహోవా దృష్టిలో అహజ్యా పాపకార్యాలు చేశాడు. అహాబు కుటుంబం కూడా అదే చేసింది. అహజ్యా తండ్రి చనిపోయినపిమ్మట అతనికి అహాబు కుటుంబం వారు సలహాదారులయ్యారు. వారు అహజ్యాకు తప్పుడు సలహాలిచ్చారు. ఆ తప్పుడు సలహాలే అతని చావుకు దారితీశాయి.
2CH 22:5 అహాబు కుటుంబం అతని కిచ్చిన సలహనే అహజ్యా పాటించాడు. ఇశ్రాయేలు రాజైన యెరాముతో కలిసి అహజ్యా అరాము (సిరియా) రాజైన హజాయేలుపై యుద్ధానికి రామోత్గిలాదు పట్టణానికి వెళ్లాడు. యెహోరాము తండ్రి ఇశ్రాయేలు రాజైన అహాబు. కాని అరామీయులు (సిరియనులు) యుద్ధంలో యెహోరామును గాయపర్చారు.
2CH 22:6 యెహోరాము తన గాయాలను నయం చేసికోటానికి యెజ్రెయేలుకు తిరిగి వెళ్లాడు. అరాము రాజైన హజాయేలుతో రామోతు వద్ద పోరాడుతూండగా అతడు గాయపడ్డాడు. పిమ్మట యెహోరామును చూడటానికి అహజ్యా (యెహోయహాజు) యెజ్రెయేలు పట్టణానికి వెళ్లాడు. అహజ్యా తండ్రి పేరు యూదా రాజైన యెహోరాము. యెహోరాము తండ్రి పేరు అహాబు. యెహోరాము గాయపడటంతో అతడు యెజ్రెయేలు పట్టణానికి వెళ్లాడు.
2CH 22:7 యెహోరామును చూడటానికి అహజ్యా వెళ్లినప్పుడు దేవుడు అతనికి మరణం కలుగజేశాడు. అహజ్యా వెళ్లి యెహోరాముతో కలిసి యెహూను చూడటానికి వెళ్లాడు. యెహూ తండ్రి పేరు నింషీ. అహాబు వంశాన్ని నాశనం చేయటానికి దేవుడు యెహూను నియమించాడు.
2CH 22:8 అహాబు వంశాన్ని యెహూ నాశనం చేస్తూవున్నాడు. అప్పుడతడు యూదా పెద్దలను, అహజ్యా సేవలో వున్న అతని బంధువులను చూశాడు. యూదా పెద్దలను, అహజ్యా బంధువులను యెహూ చంపివేశాడు.
2CH 22:9 పిమ్మట అహజ్యా కొరకు యెహూ వెదికాడు. అతడు సమరయ (షోమ్రోను) పట్టణంలో దాగుకొనే ప్రయత్నం చేస్తూండగా యెహూ మనుష్యులు అతనిని పట్టుకున్నారు. వారు అహజ్యాను యెహూ వద్దకు తీసుకొని వచ్చారు. వారు అహజ్యాను చంపి, సమాధి చేశారు. “అహజ్యా యెహోషాపాతు వారసుడు. యెహోషాపాతు యెహోవాను నిండు హృదయంతో అనుసరించాడు” అని వారు అన్నారు. యూదా రాజ్యాన్ని సమైక్యంగా వుంచే శక్తి అహజ్యా కుటుంబానికి లేదు.
2CH 22:10 అహజ్యా తల్లి పేరు అతల్యా. తన కుమారుడు చంపబడ్డాడని తెలుసుకోగానే ఆమె యూదాలో రాజ వంశస్తుల నందరినీ చంపివేసింది.
2CH 22:11 కాని యెహోషెబతు అనే స్త్రీ అహజ్యా కుమారుడైన యోవాషును దాచివేసింది. యోవాషును, అతని దాదిని యెహోషెబతు లోపలి పడకగదిలో దాచింది. యెహోషెబతు రాజైన యెహోరాము కుమార్తె. ఆమె యెహోయాదా భర్యా. యెహోయాదా ఒక యాజకుడు. పైగా యెహోషెబతు అహజ్యాకు సోదరి. యెహోషెబతు దాచిన కారణంగా, యోవాషును అతల్యా చంపలేకపోయింది.
2CH 22:12 ఆలయంలో ఆరు సంవత్సరాల పాటు యోవాషు యాజకుల వద్ద దాచబడ్డాడు. ఆ సమయంలో అతల్యా పరిపాలన కొనసాగింది.
2CH 23:1 ఆరు సంవత్సరాల అనంతరం యెహోయాదా తనశక్తిని, ధైర్యాన్ని చూపించాడు. అతడు సైనికాధిపతులతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఆ అధిపతులు ఎవరంటే యెరోహాము కుమారుడు అజర్యా; యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలు; ఓబేదు కుమారుడైన అజర్యా; అదాయా కుమారుడైన మయశేయా; మరియు జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతు.
2CH 23:2 వారు యూదా రాజ్యమంతా తిరిగి, యూదా పట్టణాలలో వున్న లేవీయులను కూడ గట్టారు. వారు ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలనుకూడ కలుపుకున్నారు. పిమ్మట వారు యెరూషలేముకు వెళ్లారు.
2CH 23:3 వీరంతా ఆలయంలో సమావేశమై రాజుతో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నారు. ఆ ప్రజలనుద్దేశించి యెహోయాదా యిలా అన్నాడు: “రాజకుమారుడు పరిపాలిస్తాడు. దావీదు సంతతి వారి విషయంలో యెహోవా ఇదే వాగ్దానం చేశాడు.
2CH 23:4 ఇప్పుడు మీరు చేయవలసినదేమనగా: విశ్రాంతి దినాన విధులకు వెళ్లే యాజకులు, లేవీయులలో మూడవ వంతు వారు ద్వారాల వద్ద కాపలా వుండాలి.
2CH 23:5 మీలో ఒక వంతు రాజు ఇంటి వద్ద వుండాలి. ఇంకొక వంతు ప్రధాన ద్వారం (పునాది ద్వారం) వద్ద నిఘావేయాలి. మిగిలిన వారంతా ఆలయ ఆవరణంలలో వుండాలి.
2CH 23:6 యెహోవా ఆలయంలో ఎవ్వరినీ ప్రవేశించనీయకండి. యాజకుడు, లేవీయులు పరిశుద్ధులు గనుక వారు మాత్రమే సేవ చేయటానికి లోనికి అనుమతిమంపబడాలి. వీరు మినహా, మిగిలిన వారంతా యెహోవా నిర్దేశించిన తమ తమ పనులను యధావిధిగా ఆచరించాలి.
2CH 23:7 లేవీయులు రాజు వద్ద నిలవాలి. ప్రతి ఒక్కడూ తన కత్తిని తప్పక ధరించి వుండాలి. ఎవ్వడేగాని ఆలయంలో ప్రవేశించటానికి ప్రయత్నిస్తే వానిని చంపి వేయండి. రాజు ఎక్కడికి వెళితే అక్కడికి మీరు కూడ అతనితో వెళ్లాలి.”
2CH 23:8 యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినదంతా లేవీయులు, యూదా ప్రజలు అంగీకరించారు. యాజకుల వర్గాలలో ఎవ్వరినీ యాజకుడైన యెహోయాదా ఉపేక్షించి ఊరు కోలేదు. విశ్రాంతి దినాన బయటకు వెళ్లిన వారితో కలిసి ప్రతి సైన్యాధిపతి, అతని మనుష్యులు లోనికి వచ్చారు.
2CH 23:9 యాజకుడైన యెహోయాదా రాజైన దావీదుకు చెందిన ఈటెలను, చిన్న పెద్ద డాళ్లను అధికారులకు ఇచ్చాడు. ఆ ఆయుధాలన్నీ ఆలయంలో వుంచబడ్డాయి.
2CH 23:10 పిమ్మట యెహోయాదా ఎవరెక్కడ నిలబడాలో ఆ మనుష్యులకు చెప్పాడు. ప్రతి ఒక్కడూ తన ఆయుధాన్ని ధరించివున్నాడు. వారంతా ఆలయానికి కుడినుండి ఎడమ ప్రక్కకు బారులుదీరి నిలబడ్డారు. వారు బలిపీఠానికి, ఆలయానికి రాజుకు దగ్గరగా నిలబడ్డారు.
2CH 23:11 వారు రాజకుమారుణ్ణి బయటకు తీసికొని వచ్చి, వాని తలపై కిరీటం పెట్టారు. ఒక ధర్మశాస్త్ర గ్రంథ ప్రతిని అతనికిచ్చారు. తరువాత వారు యోవాషును రాజుగా ప్రకటించారు. యెహోయాదా, అతని కుమారులు కలిసి యోవాషును అభిషిక్తుని చేశారు. వారు “రాజు చిరంజీవియగు గాక!” అని అన్నారు.
2CH 23:12 ప్రజలు ఆలయానికి పరుగెత్తే శబ్దం, రాజును ప్రశంసించే ధ్వనులు అతల్యా విన్నది. ఆమె ఆలయంలో వున్న ప్రజల వద్దకు వచ్చింది.
2CH 23:13 ఆమె రాజును పరికించి చూపింది. ముందు ద్వారం వద్ద రాజస్తంభం దగ్గర రాజు నిలబడి ఉన్నాడు. అధికారులు, బూరలు వూదే వారు రాజుదగ్గర వున్నారు. దేశప్రజలు చాలా సంతోషంగా వున్నారు. వారు బూరలు వూదు తూవున్నారు. సంగీత వాద్య విశేషాలపై గాయకులు పాడుతున్నారు. ప్రజలందరి చేత దేవునికి స్తుతిగీతాలు గాయకులు తమతోపాటు పాడించారు. ఇదంతా చూచి కలత చెందిన అతల్యా తన బట్టలు చింపుకొని “రాజ ద్రోహం! రాజద్రోహం!” అని అరిచింది.
2CH 23:14 యాజకుడైన యెహోయాదా సైన్యాధిపతులను బయటకు రప్పించాడు. “అతల్యాను బయటవున్న సైన్యం వద్దకు తీసుకొని వెళ్లండి. ఆమెను ఎవరైనా అనుసరిస్తే వారిని మీ కత్తులతో నరికి వేయండి” అని వారికి చెప్పాడు. “కాని, అతల్యాను ఆలయంలో మాత్రం చంపవద్దు” అని యాజకుడు సైనికులను హెచ్చరించాడు.
2CH 23:15 తర్వాత అతల్యా రాజ భవనపు అశ్వద్వారం వద్దకు వచ్చినప్పుడు వారామెను పట్టుకున్నారు. ఆమెను ఆ భవనం వద్దనే వారు చంపివేశారు.
2CH 23:16 అప్పుడు యెహోయాదా ప్రజలతోను, రాజుతోను ఒక ఒడంబడిక చేసుకున్నాడు. వారంతా యెహోవా భక్తులై ఆయనను అనుసరించటానికి ఒప్పుకున్నారు.
2CH 23:17 ఆ జనమంతా బయలు విగ్రహం ఆలయంలోకి వెళ్లి దానిని నిలువునా పగులగొట్టారు. బయలు ఆలయంలో వున్న బలిపీఠాలను, ఇతర విగ్రహాలను కూడ వారు నాశనం చేశారు. బయలు పీఠాల ముగింటనే బయలు దేవత యాజకుడైన మత్తానును చంపివేశారు.
2CH 23:18 పిమ్మట యెహోయాదా యెహోవా ఆలయ బాధ్యతలు స్వీకరించే యాజకులను ఎంపిక చేశాడు. ఆ యాజకులు లేవీయులు. ఆలయ యాజమాన్యం పనిని దావీదు వారికి అప్పజెప్పాడు. మోషే ధర్మశాస్త్రానుసారం ఆ యాజకులు యెహోవాకు దహనబలులు సమర్పిస్తారు. దావీదు ఆజ్ఞాపించిన రీతిగా వారు ఆనందోత్సాహాలతో బలులు అర్పించారు.
2CH 23:19 ఏరకంగానైనా సరే అపరిశుభ్రంగా ఎవ్వరూ ఆలయంలో ప్రవేశించకుండా యెహోయాదా ఆలయ ద్వారాల వద్ద కాపలా దారులను నియమించాడు.
2CH 23:20 యెహోయాదా సైన్యాధిపతులను, ప్రజానాయకులను, ప్రాంతీయ పాలకులను, ఇతర ప్రజలందరినీ తనతో తీసికొని వెళ్లాడు. ఆలయం నుండి రాజును కూడ తనతో తీసుకొని పై ద్వారం గుండా రాజభవనానికి వెళ్లాడు. అక్కడ వారు రాజును సింహాససనంపై కూర్చుండబెట్టారు.
2CH 23:21 యూదా ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. అతల్యా కత్తివేటుకు గురియై చనిపోవటంతో యెరూషలేము నగరంలో శాంతి నెలకొన్నది.
2CH 24:1 యోవాషు రాజయ్యేనాటికి ఏడేండ్లవాడు. అతడు యెరూషలేములో నలబై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా. జిబ్యా బెయేర్షెబా పట్టణ కాపురస్థురాలు.
2CH 24:2 యాజకుడైన యెహోయాదా జీవించియున్నంత కాలం యోవాషు యెహోవా సన్నిధిని అన్నీ మంచి పనులు చేశాడు.
2CH 24:3 యోవాషుకు ఇద్దరు భార్యలను యెహోయాదా ఎంపిక చేశాడు. యోవాషుకు కుమారులు, కుమార్తెలు కలిగారు.
2CH 24:4 కొంతకాలం తరువాత ఆలయాన్ని పునరుద్ధరిం చాలని యోవాషు నిర్ణయించాడు.
2CH 24:5 యాజకులను, లేవీయులను, యోవాషు సమావేశపర్చి, “మీరు యూదా పట్టణాలకు వెళ్లి ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలిచ్చే సొమ్మును జమచేయండి. ఆ ధనంతో మీ దేవుని ఆలయాన్ని పునరుద్ధరించండి. ఈ పని త్వరగా చేయండి” అని చెప్పాడు. కాని, లేవీయులు త్వరపడలేదు.
2CH 24:6 ప్రముఖ యాజకుడైన యెహోయాదాను రాజైన యోవాషు పిలిపించి, “యెహోయాదా, యూదా నుండి, యెరూషలేము నుండి లేవీయులు పన్ను వసూలు చేసి తీసుకొని వచ్చేలా నీవు ఎందుకు ఏర్పాటు చేయలేదు? యెహోవా సేవకుడైన మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఆ పన్ను వసూళ్లను పవిత్ర గుడారానికై వెచ్చించే వారుగదా!” అని అన్నాడు.
2CH 24:7 గతంలో అతల్యా కుమారులు ఆలయంలో జొరబడ్డారు. యెహోవా ఆలయంలో పవిత్ర వస్తువులన్నిటినీ వారు బయలు దేవుళ్ల ఆరాధనకు వినియోగించారు. అతల్యా ఒక దుష్ట స్త్రీ.
2CH 24:8 రాజైన యోవాషు ఒక పెట్టె చేయించి దానిని యెహోవా ఆలయ ద్వారం బయట పెట్టించాడు.
2CH 24:9 పిమ్మట లేవీయులు యూదాలోను, యెరూషలేములోను ఒక ప్రకటన చేశారు. ప్రజలందరినీ పన్ను డబ్బు యెహోవా కొరకు తెమ్మని చెప్పారు. వారు ఎడారిలో వున్నప్పుడు యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను చెల్లించమని చెప్పినదే ఈ పన్నుధనం.
2CH 24:10 పెద్దలు, ప్రజలు అంతా చాలా సంతోషపడ్డారు. వారు తమ వంతు ధనాన్ని తెచ్చి ఆ పెట్టెలో వుంచారు. ఆ పెట్టె నిండేవరకు ప్రజలు డబ్బు వేస్తూవచ్చారు.
2CH 24:11 తరువాత లేవీయులు ఆ పెట్టెను రాజాధికారుల యొద్దకు తీసుకొని వెళ్లారు. పెట్టె డబ్బుతో నిండివున్నట్లు వారు చూశారు. రాజు యొక్క కార్యదర్శి, ప్రధాన యాజకుని అధికారి వచ్చి పెట్టెలోని డబ్బును బయటికి తీశారు. మళ్లీ ఆ పెట్టెను యధాస్థానంలో వుంచారు. వారలా అనేక పర్యాయాలు చేసి ధనాన్ని విశేషంగా సేకరించారు.
2CH 24:12 తరువాత రాజైన యోవాషు, యెహోయాదా ఆ ధనాన్ని ఆలయ పునరుద్ధరణకు పనిచేస్తున్న పనివారికి చెల్లించారు. ఆలయపు పనిలో నిమగ్నమైన వారు నిపుణులైన కొయ్యచెక్కడపు (నగిషీ) పనివారిని, వడ్రంగులను ఆలయ పునరుద్ధరణకై కిరాయికి నియమించారు. ఆలయ పునరుద్ధరణ పనికి ఇనుము, కంచు పనులలో మంచి అనుభవం వున్నవారిని కూడా వారు కిరాయికి నియమించారు.
2CH 24:13 పనిమీద తనిఖీకై నియమింపబడిన వారు చాలా నమ్మకస్థులు. ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దాని పూర్వరూపం ఏమాత్రం మార్చకుండా దానిని పునరుద్ధరించి, ఇంకా బలంగా తీర్చిదిద్దారు.
2CH 24:14 పని పూర్తయ్యాక, మిగిలిన డబ్బును రాజైన యోవాషుకు, యెహోయాదాకు వారు తిరిగి యిచ్చి వేశారు. వారాధనాన్ని ఇంకా ఆలయానికి కావలసిన వస్తుసామగ్రికి, పరికరాలకు వినియోగించారు. ఈ వస్తు సామగ్రిని ఆలయ ఆరాధనలోను, దహన బలులు సమర్పించటంలో వినియోగించారు. వెండి బంగారాలతో వారింకా గిన్నెలను, ఇతర పరికరాలను చేయించారు. యాజకులు యెహోవా ఆలయంలో యెహోయాదా బతికివున్నంత కాలం దహనబలులు అర్పించారు.
2CH 24:15 యెహోయాదా వృద్ధుడయ్యాడు. అతడు దీర్ఘకాలం జీవించి పిమ్మట చనిపోయాడు. చనిపోయేనాటికి యెహోయాదా నూటముప్పై యేండ్ల వయస్సువాడు.
2CH 24:16 దావీదు నగరంలో రాజులను వుంచేచోట ప్రజలు యెహోయాదాను సమాధిచేశారు. ఇశ్రాయేలులో యెహోవాకు, ఆయన ఆలయానికి తన జీవిత కాలంలో ఎనలేని సేవ చేసినందువలన ప్రజల తనిని అక్కడ సమాధి చేశారు.
2CH 24:17 యెహోయాదా చనిపోయిన పిమ్మట, యూదా పెద్దలు వచ్చి రాజైన యోవాషుకు తలవంచి నమస్కరించారు. ఆ పెద్దల విన్నపాన్ని రాజు విన్నాడు.
2CH 24:18 రాజు, పెద్దలు కూడ యెహోవా ఆలయాన్ని తిరస్కరించారు. వారి పూర్వీకులు యెహోవా దేవుని ఆరాధించారు. ఇప్పుడు వీరు అషేరా దేవతా స్తంభాలను, ఇతర విగ్రహాలను పూజించటం మొదలు పెట్టారు. రాజు, ప్రజానాయకులు దుష్టనడక నడచిన కారణంగా దేవుడు యూదా, యెరూషలేము ప్రజలపట్ల కోపగించాడు.
2CH 24:19 వారిని మళ్లీ సన్మార్గాన్ని అనుసరింప జేయటానికి యెహోవా వారివద్దకు ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు ప్రజలను హెచ్చరించాను. అయినా ప్రజలు వారి హెచ్చిరికను పెడచెవిని పెట్టారు.
2CH 24:20 దేవుని ఆత్మ జెకర్యా మీదికి వచ్చింది. జెకర్యా తండ్రి యాజకుడైన యెహోయాదా. జెకర్యా ప్రజలముందు నిలబడి యిలా అన్నాడు: “దేవుడు యిలా చెప్తున్నాడు. ‘ప్రజాలారా, యెహోవా ఆజ్ఞాలను మీరు ఎందుకు మీరుతున్నారు.? మీరు విజయవంతులు కాలేరు. మీరు యెహోవాని వదిలిపెట్టారు. అందువల్ల దేవుడు కూడ మిమ్మల్ని వదిలి వేస్తున్నాడు!’”
2CH 24:21 కాని ప్రజలు జెకర్యాకు వ్యతిరేకంగా కుట్రపన్నారు. జెకర్యాను చంపమని రాజు ప్రజలకు ఆజ్ఞ ఇవ్వటంతో, వారతనిని రాళ్లతో కొట్టి చంపారు. ప్రజలీపని ఆలయ ఆవరణలో చేశారు.
2CH 24:22 రాజైన యోవాషు యెహోయాదా తన పట్ల చూపిన కనికరాన్ని గుర్తు పెట్టుకోలేదు. యెహోయాదా జెకర్యా తండ్రి. కాని యెహోయాదా కుమరుడైన జెకర్యాను యోవాషు చంపివేశాడు. తను చనిపోయేముందు జెకర్యా, “నీ వేమీ చేస్తున్నావో యెహోవా చూచి, నిన్ను శిక్షించుగాక!” అని అన్నాడు.
2CH 24:23 సంవత్సరాంతంలో అరాము (సిరియా) సైన్యం యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా, యెరూషలేములపై దండెత్తి ప్రజానాయకులందరినీ చంపివేశారు. వారు విలువైన వస్తువులన్నీ దోచుకుని వాటిని దమస్కు (డెమాస్కస్) రాజుకు పంపించారు. యోవాషు దుర్మార్గత
2CH 24:24 అరాము సైన్యం ఒక చిన్న దండుగా వచ్చినప్పటికీ, యూదాకు చెందిన ఒక మహా సైన్యాన్ని ఓడించగలిగేలా యెహోవా వారికి తోడ్పడ్డాడు. వారి పూర్వీకులు ఆరాధించిన దైవాన్ని యూదా ప్రజలు వదిలి పెట్టిన కారణంగా యెహోవా ఈ పని చేశాడు. అందువల్లనే యోవాషు శిక్షింపబడ్డాడు.
2CH 24:25 అరామీయులు (సిరియనులు) యోవాషును వదిలి వెళ్లేటప్పటికి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. యోవాషు స్వంత సేవకులే అతనిపై కుట్రపన్నారు. యాజకుడైన యెహోయాదా కుమారుడు జెకర్యాను యెవాషు చంపిన కారణంగా వారు అలా ప్రవర్తించారు. యోవాషును అతని పక్క మీదనే సేవకులు హత్యచేశారు. చనిపోయిన యోవాషును ప్రజలు దావీదు నగరంలో సమాధి చేశారు. కాని రాజులను వుంచే చోట మాత్రం అతనిని వారు సమాధి చేయలేదు.
2CH 24:26 జాబాదు మరియు యెహోజాబాదు అనేవారు. యోవాషు మీద కుట్ర పన్నిన సేవకులు. జాబాదు తల్లి పేరు షిమాతు అమ్మోనీయురాలు. యెహోజాబాదు తల్లిపేరు షిమ్రీతు. షిమ్రీతు మోయాబు స్త్రీ.
2CH 24:27 యోవాషు కుమారుల గురించిన వృత్తాంతాలు, అతనిని గురించిన గొప్ప ప్రవచనాలు అతడు ఆలయాన్ని పునరుద్ధరించిన విధము మొదలైన విషయాలన్నీ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయ బడ్డాయి. అతని తరువాత అమజ్యా కొత్త రాజయ్యాడు. అమజ్యా యోవాషు కుమారుడు.
2CH 25:1 రాజు అయ్యేనాటికి అమజ్యా ఇరువదియైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేము నుండి ఇరువై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను. యెహోయద్దాను యెరూషలేముకు చెందిన స్త్రీ.
2CH 25:2 యెహోవా అతని నుండి ఆశించిన పనులన్నీ అమజ్యా నిర్వర్తించాడు. కాని అతడు ఆ పనులను తన పూర్ణ హృదయంతో చేయలేదు.
2CH 25:3 అమజ్యా రాజుగా బలపడ్డాడు. తరువాత రాజైన తన తండ్రిని చంపిన అధికారులను అతడు చంపివేశాడు.
2CH 25:4 కాని అమజ్యా ఆ అధికారుల పిల్లలను మాత్రం చంపలేదు. ఎందువల్లనంటే, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన నియమ నిబంధనలను అతడు పాటించాడు. యెహోవా యిలా ఆజ్ఞాపించాడు: “తమ పిల్లలు చేసిన నేరానికి వారి తండ్రులు చనిపోరాదు. తమ తండ్రులు చేసిన పాపాలకు వారి పిల్లలు చనిపోరాదు. ప్రతి వ్యక్తి తన పాపాలకు ఫలితంగా తానే చనిపోవాలి.”
2CH 25:5 యూదా ప్రజలందరినీ అమజ్యా సమావేశ పర్చాడు. వారందరినీ వారి వారి కుటుంబాల వారీగా విడగొట్టి, సహస్రాధిపతులను, శతాధిపతులను వారిపై నియమించాడు. ఈ అధికారులు యూదా, బెన్యామీనుకు చెందిన సైనికులపై నియమింపబడ్డారు. సైనికులుగా ఎన్నుకోబడిన వారంతా ఇరువది ఏండ్ల యువకులు, అంతకు పైబడినవారు. ఈటెలు, డాళ్లు పట్టి యుద్ధానికి సిద్ధంగా వున్న మూడు లక్షల మంది నిపుణులైన సైనికులున్నారు.
2CH 25:6 ఇశ్రాయేలు నుండి అమజ్యా ఒక లక్ష మంది సైనికులను కిరాయికి నియమించాడు. కిరాయి క్రింద వారికి రెండు వందల మణుగుల వెండిని అతడు చెల్లించాడు.
2CH 25:7 కాని ఒక దైవజ్ఞుడు (ప్రవక్త) అమజ్యా వద్దకు వచ్చాడు. ఆ ప్రవక్త యిలా అన్నాడు: “రాజా ఇశ్రాయేలు సైన్యాన్ని నీతో తీసుకొని వెళ్లవద్దు. యెహోవా ఇశ్రాయేలు పక్షానలేడు. యెహోవా ఎఫ్రాయిము ప్రజలతో లేడు.
2CH 25:8 బహుశా నీవు యుద్ధానికి మంచి కట్టుదిట్టం చేసుకొని సిద్ధంగా వుండవచ్చు. కాని దేవుడు నీవు గెలిచేలా చేయవచ్చు, లేదా ఓడిపోయేలా చేయవచ్చు.”
2CH 25:9 అమజ్యా దైవజ్ఞునితో, “అయితే నేను ఇశ్రాయేలు సైన్యానికి ఇప్పటి వరకు చెల్లించిన డబ్బు సంగతి ఏమిటి?” అని అన్నాడు. దానికి దైవజ్ఞుడు, “ప్రభువైన యెహోవా వద్ద చాలా వుంది. ఆయన నీకు దానికంటె చాలా ఎక్కువ యివ్వగలడు!” అని చెప్పాడు.
2CH 25:10 అందువల్ల అమజ్యా ఇశ్రాయేలు సైన్యాన్ని ఎఫ్రాయిముకు తిప్పి పంపివేశాడు. ఈ సైనికులకు రాజు మీద, యూదా ప్రజలమీద చాలా కోపం వచ్చింది. మిక్కిలి కోపంతో వారు ఇండ్లకు తిరిగి వెళ్లారు.
2CH 25:11 పిమ్మట అమాజ్యా మంచి ధైర్యం తెచ్చుకొని తన సైన్యాన్ని ఎదోము దేశంలో ఉన్న ఉప్పు లోయకు నడిపించాడు. ఆ ప్రదేశంలో శేయీరు (ఎదోము) కు చెందిన పదివేల మందిని అమజ్యా సైన్యం చంపివేసింది.
2CH 25:12 యూదా సైన్యం శేయీరుకు చెందిన పదివేల మందిని బందీలుగా పట్టుకున్నది. ఆ బందీలను శేయీరు నుండి ఒక కొండ శిఖరం మీదికి వారు తీసుకొని వెళ్లారు. అప్పటికి బందీలంతా బతికే వున్నారు. వారందరినీ యూదా సైన్యం కొండ శిఖరం నుండి తోసివేయగా వారి శరీరాలు క్రింద రాళ్ల పైబడి ముక్కలు ముక్కలై పోయాయి.
2CH 25:13 కాని అదే సమయంలో ఇశ్రాయేలు సైన్యం యూదాలో కొన్ని పట్టణాలపై దాడి చేస్తూ వుంది. బేత్‌హోరోను నుండి సమరయ (షోమ్రోను) వరకు వున్న పట్టణాలపై వారు దాడి జరిపారు. వారు కూడ మూడ వేల మందిని చంపి, చాలా విలువైన వస్తువులను కొల్లగొట్టారు. అమజ్యా వారిని తన సైన్యంతో కలిసి యుద్ధానికి రానివ్వక పోవటంతో ఆ సైనికులు చాలా కోపగించి వున్నారు.
2CH 25:14 ఎదోమీయులను (శేయీరు వారిని) ఓడించిన పిమ్మట అమజ్యా ఇంటికి తిరిగి వచ్చాడు. శేయీరు ప్రజలు పూజించే విగ్రహాలన్నిటినీ అతడు తీసుకొని వచ్చాడు. అమజ్యా ఆ విగ్రహాలనే పూజించటం మొదలు పెట్టాడు. అతడా విగ్రహాలకు సాష్టాంగపడి, వాటికి దూపం వేయసాగాడు.
2CH 25:15 అమజ్యా పట్ల యెహోవాకు చాలా కోపం వచ్చింది. యెహోవా అమజ్యా వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త యిలా అన్నాడు: “అమజ్యా, ఆ ప్రజలు పూజించిన దేవుళ్లను నీవెందుకు కొలుస్తున్నావు? ఆ దేవుళ్లు వారి ప్రజలనే నీనుండి కాపాడలేక పోయారు!”
2CH 25:16 ప్రవక్త చెప్పటం ముగించాక, అమజ్యా ప్రవక్తతో యిలా అన్నాడు: “మేము నిన్ను రాజుకు సలహాదారుగా ఎన్నడూ నియమించలేదే! నీవు మాట్లడవద్దు! నీవు నోరు మూయకపోతే నీవు చంపబడతావు!” ప్రవక్త మౌనం వహించాడు. తరువాత ప్రవక్త మళ్లీ యిలా అన్నాడు: “దేవుడు నిన్ను నాశనం చేయటానికే నిశ్చయించాడు. నీవు అటువంటి నీచకార్యాలు చేయటంతో పాటు, నా సలహా కూడ పెడచెవిని పెట్టావు.”
2CH 25:17 యూదా రాజైన అమజ్యా తన సలహాదారులతో సంప్రదించాడు. తరువాత యెహోయాషుకు ఒక వర్తమానం పంపాడు. యెహోయాషు, “మనం ఒకరితో ఒకరు ముఖాముఖి పోరాడదాము” అని అమజ్యా కబురు పంపాడు. యెహోయాషు తండ్రిపేరు యెహోయాహాజు. యెహోయాహాజు తండ్రి పేరు యెహూ. యెహూ ఇశ్రాయేలు రాజు.
2CH 25:18 పిమ్మట యెహోయాషు తన సమాధానాన్ని అమజ్యాకు పంపాడు. యెహోయాషు ఇశ్రాయేలు రాజు. అమజ్యా యూదా రాజు. యెహోయాషు ఈ కథ చెప్పి పంపాడు: “లెబనోనుకు చెందిన ఒక చిన్న ముండ్ల పొద లెబానోనులోని ఒక పెద్ద దేవదారు వృక్షానికి ఒక వర్తమానం పంపింది. ఆ చిన్న ముండ్ల పోద, ‘నా కుమారుణ్ణి నీ కుమార్తెను వివాహం చేసుకోనియ్యి,’ అని అన్నది. కాని ఈలోపల ఒక అడవి జంతువు వచ్చి ఆ చిన్న ముండ్ల పొదను తొక్కి నాశనం చేసేసింది.
2CH 25:19 ‘నేను ఎదోమును ఓడించాను’ అని నీవు గర్వపడుతున్నావు. గొప్పలు చెప్పుకొంటున్నావు. ఇక నీవు ఇంటి వద్దనే వుండు. కోరి కష్టాలు తెచ్చుకోకు. నీవు నాతో యుద్ధం చేస్తే నీవు, యూదా నాశనమవ్వటం ఖాయం.”
2CH 25:20 కాని ఆమజ్యా ఈ సలహా వినటానికి నిరాకరించాడు. ఇదంతా దేవుని సంకల్పంతోనే జరుగుతూవుంది. ఎదోమీయులు కొలిచిన దేవుళ్లను యూదా ప్రజలు ఆరాధించిన నేరానికి, ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయేలా యెహోవా పథకం సిద్ధం చేశాడు.
2CH 25:21 కావున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాను బేత్షెమెషు పట్టణం వద్ద ముఖాముఖి ఎదుర్కొన్నాడు. బేత్షెమెషు పట్టణం యూదాలో వుంది.
2CH 25:22 ఇశ్రాయేలు యూదాను ఓడించింది. యూదా సైన్యంలో ప్రతివాడూ తన ఇంటికి పారిపోయాడు.
2CH 25:23 అమజ్యాను బేత్షేమెషు పట్టణం వద్ద యెహోయాషు పట్టుకుని, యెరూషలేముకు తీసుకొని పోయాడు. అమజ్యా తండ్రి పేరు యోవాషు. యోవాషు తండ్రి పేరు యెహోయాహాజు. యెహోయాషు ఆరువందల అడుగుల (నాలుగువందల మూరలు) మేరకు యెరూషలేము గోడను ఎఫ్రాయిము ద్వారం నుండి మూల ద్వారం వరకు పడగొట్టాడు.
2CH 25:24 పిమ్మట యెహోయాషు వెండిని, బంగారాన్ని, ఇతర పరికరాలన్నిటినీ ఆలయం నుండి పట్టుకుపోయాడు. ఆలయంలో వస్తువుల సంరక్షణ బాధ్యత ఓబేదె దోముది. యెహోయాషు రాజగృహం నుండి విలువైన వస్తువులను కూడ తీసుకొని పోయాడు. కొంతమంది మనుష్యులను బందీలుగా పట్టుకున్నాడు. పిమ్మట అతడు సమరయకు వెళ్లిపోయాడు.
2CH 25:25 యెహోయాషు చనిపోయిన తరువాత అమజ్యా పదిహేను సంవత్సరాలు బతికాడు. అమజ్యా తండ్రిపేరు యూదా రాజైన యోవాషు.
2CH 25:26 మొదటి నుండి చివరి వరకు అమజ్యా చేసిన ఇతర కార్యాలన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి.
2CH 25:27 అమజ్యా యెహోవాకు విధేయుడుగా వుండటం మానివేసినప్పటి నుండి, యెరూషలేము ప్రజలు అమజ్యాకు వ్యతిరేకంగా కుట్రచేశారు. అతడు లాకీషు పట్టణానికి పారిపోయాడు. కాని ప్రజలు కొందరు మనుష్యులను లాకీషు పట్టణానికి పంపగా వారు అమజ్యాను అక్కడ చంపివేశారు.
2CH 25:28 వారతని శావాన్ని గుర్రాలమీద వేసుకొని తెచ్చి యూదా నగరంలో అతని పితరుల దగ్గర సమాధి చేశారు.
2CH 26:1 తరువాత అమజ్యా స్థానంలో కొత్త రాజుగా ప్రజలు ఉజ్జియాను ఎంచుకున్నారు. ఉజ్జియా తండ్రి పేరు అమజ్యా. ఇది జరిగే నాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు.
2CH 26:2 ఎలతు పట్టణాన్ని ఉజ్జియా తిరిగి నిర్మించి యూదాకు యిచ్చాడు. అమజ్యా చనిపోయి, తన పూర్వీకులతో సమాధి చేయబడిన తరువాత ఉజ్జియా ఇది చేశాడు.
2CH 26:3 తాను రాజయ్యేనాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబై రెండు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా. యెకొల్యా యెరూషలేముకు చెందిన స్త్రీ.
2CH 26:4 యెహోవా అతని నుండి ఆశించిన విధంగా ఉజ్జియా తన కార్యకలాపాలు కొనసాగించాడు. తన తండ్రి అమజ్యావలెనే ఉజ్జియా కూడా దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడు.
2CH 26:5 జెకర్యా జీవించి ఉన్న కాలంలోనే ఉజ్జియా దేవుని సేవకుడయ్యాడు. ప్రభువైన యెహోవా పట్ల ఎలా భక్తి విశ్వాసాలు కలిగి వుండాలో జెకర్యా ఉజ్జియాకు నేర్పాడు. ఉజ్జియా యెహోవాకు విధేయుడై వున్నంతకాలం, ఆయన అతనికి విజయం చేకూర్చి పెట్టాడు.
2CH 26:6 ఫిలిష్తీయులతో ఉజ్జియా యుద్ధం చేశాడు. గాతు, యబ్నె, అష్డోదు పట్టణాల చుట్టూ వున్న ప్రాకారాలను అతడు పడగొట్టాడు. అష్టోదు పట్టణానికి దగ్గరగాను, మరియు ఫిలిష్తీయులు నివసించే ప్రాంతాలలోను ఉజ్జియా కొన్ని పట్టణాలను నిర్మించాడు.
2CH 26:7 ఫిలిష్తీయులతోను, గూర్బయలులో నివసిస్తున్న అరబీయులతో, మెహోనీయులతోను ఉజ్జియా జరిపిన యుద్ధాలలో యెహోవా అతనికి విజయం చేకూర్చాడు.
2CH 26:8 అమ్మోనీయులు ఉజ్జియాకు కప్పం చెల్లించారు. ఈజిప్టు సరిహద్దులవరుకు ఉజ్జియా పేరు ప్రతిష్ఠలు వ్యాపించాయి. మిక్కిలి బలపరాక్రమాలు కలవాడగుటచే ఉజ్జియా ప్రసిద్ధిగల వ్యక్తి అయ్యాడు.
2CH 26:9 యెరూషలేములో మూలద్వారాం వద్ద, లోయ ద్వారం వద్ద, మరియు గోడమలుపు వద్ద ఉజ్జియా బురుజులు కట్టించి బాగా బలపర్చాడు.
2CH 26:10 ఎడారిలో సహితం ఉజ్జియా బురుజులు కట్టించాడు. అతడు చాలా బావుల కూడా తవ్వించాడు. కొండల (మన్యం) ప్రాంతంలోను, మైదాన ప్రాంతాలలోను అతనికి పశుసంపద విస్తారంగా వుంది. పంట సాగుకు అనువైన కొండలయందు, మైదానములందు ఉజ్జియాకు వ్యవసాయదారులున్నారు. ద్రాక్షతోటల పెంపకంలో శ్రద్ధవహించే రైతులు కూడ అతనికి వున్నారు. అతడు వ్యవసాయ రంగాన్ని అభిమానించాడు.
2CH 26:11 ఉజ్జియాకు మంచి శిక్షణ పొందిన సైన్యం ఉంది. కార్యదర్శి యెహీయేలు, మరో అధికారి మయశేయా అనేవారు సైన్యాన్ని, వివిధ భాగాలుగా విభజించారు. వారి పైఅధికారి హనన్యా. యెహీయేలు, మయశేయా సైనికులందరినీ లెక్కించి వారిని పటాలాలుగా విభజించారు. హనన్యా రాజాధికారులలో ఒకడు.
2CH 26:12 సైనికులపై అధికారులే రెండువేల ఆరువందల మంది ఉన్నారు.
2CH 26:13 వంశాలవారీ ఎంపికైన సైన్యాధికారుల క్రింద మొత్తం మూడు లక్షల ఏడువేల ఐదువందల మంది యుద్ధంలో కాకలు తీరిన సైనికులున్నారు. ఆ సైనికులు శత్రువుల నుండి రక్షణ పొందటానికి రాజుకు సహాయపడతారు.
2CH 26:14 ఉజ్జియా సైన్యానికి డాళ్లు, ఈటెలు, శిరస్త్రాణాలు కవచాలు విల్లంబలు, ఒడిసెల రాళ్లు సరఫరా చేశాడు.
2CH 26:15 మేధావులు తమ కల్పనా శక్తితో రూపొందించిన యంత్రాలను ఉజ్జియా యెరూషలేములో తయారుచేయించాడు. ఆ యంత్రాలను బురుజుల మీద, గోడలు కలిసిన మూలల మీద ఉంచాడు. ఈ యంత్రాలు బాణాలు వదలటం, బండరాళ్లు విసిరి వేయటం మొదలైన పనులు చేసేవి. ఉజ్జియా చాలా ప్రఖ్యాతి గాంచాడు. దూర ప్రదేశాలలో కూడ ప్రజలు అతని పేరు విన్నారు. అతనికి ఎడతెగని సహాయం అందటంతో అతను చాలా శక్తివంతమైన రాజు అయ్యాడు.
2CH 26:16 ఉజ్జియా గొప్పవాడు కావటంతో పాటు, గర్విష్ఠి కూడా అయ్యాడు. అతని గర్వమే అతని వినాశనానికి కారణమయ్యింది. అతని దేవుడైన యెహోవాకు అతడు విశ్వాసపాత్రుడు కాలేదు. బలిపీఠం మీద ధూపం వేయటానికి అతడు ఆలయంలోకి వెళ్లాడు.
2CH 26:17 యాజకుడైన అజర్యా, మరియు ధైర్యంగల యెహోవా సేవకులు ఎనుబది మంది ఉజ్జియాను వెంబడించి ఆలయంలోకి వెళ్లారు.
2CH 26:18 ఉజ్జియా తప్పు చేస్తున్నట్లు వారతనిని మందలించారు. వారు యిలా అన్నారు: “ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయటం నీ పనికాదు. ఈ పని చేయటం నీకు మంచిది కాదు. యాజకులైన అహరోను సంతానంవారు మాత్రమే యెహోవాకు ధూపం వేయాలి. ధూపం వేసే పవిత్ర కార్యానికి ఈ యాజకులు శిక్షణ పొందారు. ఈ అతిపవిత్ర స్థలం నుండి నీవు బయటకు పొమ్ము. నీవు విశ్వాసంగా లేవు. ప్రభువైన యెహోవా నీ ఈ ప్రవర్తనకు నిన్ను గౌరవించడు!”
2CH 26:19 కాని ఉజ్జియాకు కోపం వచ్చింది. అతని చేతిలో ధూపకలశం ఉంది. యాజకులపట్ల ఉజ్జియా కోపగించుకుంటూ ఉండగనే అతని నుదటిపై కుష్ఠురోగం పుట్టింది. ఆలయంలో ధూపపీఠం పక్కనేవున్న యాజకుల ముందే ఇది జరిగింది.
2CH 26:20 ప్రధాన యాజకుడైన అజర్యా, మరియు ఇతర యాజకులు ఉజ్జియా వైపు చూశారు. అతని నుదటి మీద కుష్ఠు రోగాన్ని వారు చూడగలిగారు. యాజకులు వెంటనే ఉజ్జియాను ఆలయం నుండి బయటికి తరిమేశారు. యెహోవా అతనిని శిక్షకు గురిచేసిన కారణంగా ఉజ్జియా తనకుతానే బయటకు వచ్చాడు.
2CH 26:21 రాజైన ఉజ్జియా కుష్ఠురోగి అయ్యాడు. అతడు యెహోవా ఆలయంలో మళ్లీ ప్రవేశించలేక పోయాడు. ఉజ్జియా కుమారుడు యోతాము రాజగృహ కార్యక్రమాలు నిర్వహిస్తూ, రాజు తరపున ప్రజాపాలకుడయ్యాడు.
2CH 26:22 మొదటి నుండి చివరి వరకు ఉజ్జియా చేసిన ఇతర కార్యాలన్నీ ప్రవక్తయైన యెషయా వ్రాశాడు. యెషయా తండ్రిపేరు ఆమోజు.
2CH 26:23 ఉజ్జియా చనిపోయినప్పుడు అతనిని అతని పూర్వీకుల దగ్గరగా సమాధిచేశారు. ఉజ్జియా కుష్ఠురోగి కావటంవల్ల రాజుల శ్మశాన వాటికకు దగ్గరలోవున్న పొలంలో అతడు సమాధి చేయబడ్డాడు. పిమ్మట ఉజ్జియా స్థానంలో అతని కుమారుడు యోతాము కొత్త రాజు అయ్యాడు.
2CH 27:1 యోతాము రాజయ్యేనాటికి ఇరువదియైదు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు పదహారు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు యెరూషా. యెరూషా సాదోకు కుమార్తె.
2CH 27:2 యెహోవా కోరిన విధంగా యోతాము కార్యకలాపాలు నిర్వర్తించాడు. తన తండ్రి ఉజ్జియా మాదిరిగానే అతడు దేవునికి విధేయుడై వున్నాడు. కాని తన తండ్రి చేసిన విధంగా ధూపం వేయటానికి యోతాము ఆలయం ప్రవేశించలేదు. అయినా ప్రజలు మాత్రం తమ దుష్ట నడతను మానలేదు.
2CH 27:3 ఆలయపు పైద్వారాన్ని యోతాము తిరిగి నిర్మించాడు. ఓపెలు అనే స్థలంలో గోడమీద ఎక్కువ నిర్మాణాన్ని చేపట్టాడు.
2CH 27:4 యూదాలో కొండల ప్రాంతంలో యోతాము పట్టణాలను నిర్మించాడు. యోతాము అరణ్యాలలో కోటలను, బురుజులను కట్టించాడు.
2CH 27:5 యోతాము అమ్మోనీయుల రాజుతోను, అతని సైన్యంతోను పోరాడి వారిని ఓడించాడు. కావున మూడేళ్లపాటు ప్రతి సంవత్సరం అమ్మోనీయులు రెండు వందల మణుగుల వెండి, పదివేల ఏదుముల గోధుమలు, పదివేల ఏదుముల యవలు కప్పంగా చెల్లించారు.
2CH 27:6 తన దేవుడైన యెహోవా పట్ల సత్యవర్తనుడై విధేయుడై నందున యోతాము చాలా శక్తివంతమైన రాజు అయ్యాడు.
2CH 27:7 యోతాము చేసిన ఇతర కార్యాలు, అతడు నిర్వహించిన యుద్ధాలగురించి ఇశ్రాయేలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
2CH 27:8 యోతాము రాజయ్యేనాటికి ఇరువదియైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు.
2CH 27:9 తరువాత యోతాము చనిపోగా, అతనిని తన పూర్వీకులతో సమాధి చేశారు. ప్రజల తనిని దావీదు నగరంలో సమాధి చేశారు. యోతాము స్థానంలో ఆహాజు రాజయ్యాడు. యోతాము కుమారుడే ఆహాజు.
2CH 28:1 ఆహాజు రాజయ్యేనాటికి ఇరవై యేండ్లవాడు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పాలించాడు. తన పూర్వీకుడైన దావీదువలె ఆహాజు మంచి మార్గంలో నడవలేదు. యోహోవా ఆశించిన విధంగా సత్కార్యాలు చేయలేదు.
2CH 28:2 ఇశ్రాయేలు రాజులు అనుసరించిన చెడుమార్గాన్నే ఆహాజు కూడ అనుసరించాడు. బయలు దేవతలను ఆరాధించటానికి అతడు విగ్రహాలను పోతపోయించాడు.
2CH 28:3 బెన్‌హీన్నోము లోయలో ఆహాజు ధూపం వేశాడు. అతడు తన స్వంత కుమారులనే అగ్నిలో కాల్చి దేవతలకు బలియిచ్చాడు. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఒడిగట్టే భయంకర పాపాలకే అతడు కూడా పాల్పడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజ్యంలో ప్రవేశించినప్పుడు యెహోవా బయటకు తరిమివేసిన నీచవ్యక్తులే ఈ ప్రజలు.
2CH 28:4 గుట్టలమీద, కొండలమీద, ప్రతి పచ్చని చెట్టు కిందా ఆహాజు బలులు అర్పించి, ధూపం వేశాడు.
2CH 28:5 ఆహాజు పాపం చేయటంతో అతని దేవుడైన యెహోవా అతనిని అరాము (సిరియా) రాజు చేతిలో ఓడిపోయేలా చేశాడు. అరాము రాజు, అతని సైన్యం ఆహాజును ఓడించి, అనేకమంది యూదా వారిని బందీలుగా పట్టుకున్నారు. అరాము రాజు ఆ బందీలను దమస్కు (డెమాస్కస్) నగరానికి పట్టుకుపోయాడు. ఇశ్రాయేలు రాజైన పెకహు కూడా ఆహాజును ఓడించేలా యెహోవా చేశాడు. పెకహు తండ్రి పేరు రెమల్యా. పెకహు అతని సైన్యం కలిసి ఒక్కరోజులో యూదాకు చెందిన ఒక లక్షా ఇరవై వేలమంది ధైర్యంగల సైనికులను చంపివేశారు. వారి పూర్వీకులు విధేయులైవున్న వారి దేవుడైన యెహోవాకు వారు అవిధేయులై నందువల్ల పెకహు యూదా ప్రజలను ఓడించ గలిగాడు.
2CH 28:7 ఎఫ్రాయిముకు చెందిన జిఖ్రి ధైర్యంగల సైనికుడు. రాజైన ఆహాజు కుమారుడు మయశేయాను, రాజగృహ నిర్వహణాధికారి అజీక్రామును, మరియు ఎల్కానాను జిఖ్రి చంపివేశాడు. రాజు తరపున అధికారం చెలాయించే వారిలో రాజు తరువాతివాడు ఎల్కానా.
2CH 28:8 ఇశ్రాయేలు సైన్యం యూదాలో నివసిస్తున్న తమ బంధువులైన రెండు లక్షల మందిని బందీచేశారు. వారు యూదా నుంచి స్త్రీలను, పిల్లలను, అనేక విలువైన వస్తువులను పట్టుకుపోయారు. ఇశ్రాయేలీయులు ఆ బందీలను, వస్తువులను సమరయకు (షోమ్రోను) తీసుకొనిపోయారు.
2CH 28:9 కాని యెహోవా ప్రవక్తలలో ఒకడు అక్కడ వున్నాడు. ఈ ప్రవక్త పేరు ఓదేదు. సమరయకు తిరిగి వచ్చిన ఇశ్రాయేలు సైన్యాన్ని ఓదేదు కలిశాడు. ఇశ్రాయేలు సైన్యంతో ఓదేదు యిలా అన్నాడు: “మీ పూర్వీకులు ఆరాధించిన దేవుడైన యెహోవా యూదా ప్రజలపట్ల కోపంగా వున్న కారణంగా వారిని మీరు ఓడించగలిగేలా చేశాడు. మీరు యూదా ప్రజలను నీచమైన విధంగా చంపి, శిక్షించారు. ఇప్పుడు యెహోవా మీపట్ల కోపంగా వున్నాడు.
2CH 28:10 మీరు యూదా, యెరూషలేము ప్రజలను బానిసలుగా చేయాలని తలస్తున్నారు. మీరు మీ దేవుడైన యెహోవాపట్ల కూడా పాపం చేశారు.
2CH 28:11 ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు చెరపట్టిన మీ సోదరులను వెనుకకు పంపివేయండి. యెహోవా యొక్క భయం కరయైన కోపం మీమీది వుంది గనుక మీరీపని చేయండి.”
2CH 28:12 ఎఫ్రాయిములో కొంతమంది పెద్దలు ఇశ్రాయేలు సైనికులు యుద్ధం నుండి తిరిగి రావటం చూశారు. ఆ పెద్దలు ఇశ్రాయేలు సైనికులను కలిసి వారిని హెచ్చరించారు. ఆ పెద్దలు యెహానాను కుమారుడు అజర్యా, మెషిల్లేమోతు కుమారుడు బెరెక్యా, షల్లూము కుమారుడు యెహిజ్కియా, మరియు హద్లాయి కుమారుడు అమాశా.
2CH 28:13 వారు ఇశ్రాయేలు సైనికులతో యిలా చెప్పారు: “యూదా నుండి బందీలను ఇక్కడికి తీసుకొని రావద్దు. మీరాపని చేస్తే అది యెహోవా పట్ల మన పాపాన్ని, దోషాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. దానితో ఇశ్రాయేలుపట్ల యెహోవా కోపం పట్టరానిదవుతుంది.”
2CH 28:14 అందువల్ల బందీలను, విలువైన వస్తులను సైనికులు ఆ పెద్దలకు, ఇశ్రాయేలు ప్రజలకు అప్పజెప్పారు.
2CH 28:15 ఇంతకుముందు పేర్కొన్న పెద్దలు (అజర్యా, బెరెక్యా, యెహిజ్కియా, మరియు అమాశా) నిలబడి బందీలకు సహాయపడ్డారు. ఇశ్రాయేలు సైనికులు తీసుకొన్న వారి దుస్తులను పెద్దలు తిరిగి తీసుకొని, దిగంబరంగా ఉన్న బందీలకు యిచ్చారు. పెద్దలు వారికి పాదరక్షలు కూడా యిచ్చారు. యూదా నుండి వచ్చిన బందీలకు అన్నపానాదులు కూడా పెద్దలు యిచ్చారు. సేద తీరటానికి వారికి నూనెతో కూడ వారు మర్దనా చేశారు. పిమ్మట ఆ ఎఫ్రాయిము పెద్దలు నీరసంగా వున్న బందీలను గాడిదలపై ఎక్కించి యెరికో పట్టణంలో తమ ఇండ్లకు తీసుకొని వెళ్లారు. యెరికోకు ఖర్జూర చెట్ల పట్టణమని పేరు. పిమ్మట ఆ నలుగురు పెద్దలు సమరయకు తిరిగి వెళ్లారు.
2CH 28:16 అదే సమయంలో ఎదోమీయులు మళ్లీ వచ్చి యూదా ప్రజలను ఓడించారు. ఎదోముయులు ప్రజలను బందీలుగా పట్టుకుపోయారు. అందువల్ల రాజైన ఆహాజు అష్షూరు రాజు సహాయాన్ని అర్థించాడు.
2CH 28:18 కొండప్రాంతంలోను, దక్షిణ యూదా ప్రాంతంలోనుగల పట్టణాలపై ఫిలిష్తీయులు దాడులు జరిపారు. బేత్షెమెషు, అయ్యాలోను, గెదెరోతు, శోకో, తిమ్నా మరియు గిమ్జో పట్టణాలను ఫిలిష్తీయులు పట్టుకున్నారు. వారా పట్టణాలకు సమీపంలో వున్న గ్రామాలను కూడా ఆక్రమించుకున్నారు. పిమ్మట ఫిలిష్తీయులు వాటిలో నివసించసాగారు.
2CH 28:19 యూదా రాజైన ఆహాజు యూదా ప్రజలను పాపకార్యాలకు ప్రోత్సహించిన కారణంగా యెహోవా వారికి కష్టాలు కల్పించాడు. యెహోవా పట్ల అతడు అసలు విశ్వాసం లేకుండా ప్రవర్తించాడు.
2CH 28:20 అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఆహాజుకు సహాయం చేయటానికి బదులు అతనికి కష్టనష్టాలు కల్గించాడు.
2CH 28:21 ఆహాజు ఆలయం నుండి, రాజగృహం నుండి, యువరాజు ఆలయం నుండి విలువైన వస్తువులు కొన్ని తీశాడు. ఆహాజు వాటిని అష్షూరు రాజుకు యిచ్చాడు. అయినా ఆ పని అతనికి సహాయపడలేదు.
2CH 28:22 ఆహాజు తన కష్టాలతో సతమతమవుతూ మరిన్ని పాపాలు చేసి యెహోవా పట్ల మరీ విశ్వాసంలేని వాడయ్యాడు.
2CH 28:23 దమస్కు ప్రజలు ఆరాధించే దేవతలకు అతడు బలులు అర్పించాడు. దమస్కు ప్రజలు ఆహాజును ఓడించారు. అందువల్ల అతడిలా అనుకున్నాడు: “అరాము (సిరియా) ప్రజలు పూజించే దేవుళ్లు వారికి సహాయపడి వుండవచ్చు. కావున నేను కూడా ఆ దేవుళ్లకు బలులు అర్పిస్తే బహుశః వారు నాకు కూడా సహాయం చేయవచ్చు.” అందువల్ల ఆహాజు ఆ దేవుళ్లను ఆరాధించాడు. ఈరకంగా అతడు పాపం చేసి, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి కారకుడయ్యాడు.
2CH 28:24 ఆహాజు ఆలయంలో వున్న వస్తువులను సేకరించి వాటిని ముక్కలు ముక్కలు చేశాడు. పిమ్మట అతడు ఆలయాన్ని మూసేశాడు. అతడు బలిపీఠాలు తయారు చేయించి, వాటిని యెరూషలేములో ప్రతివీధి చివర నెలకొల్పాడు.
2CH 28:25 యూదాలో ప్రతి పట్టణంలోనూ ఆహాజు ధూపాలు వేసి అన్యదేవతలను ఆరాధించటానికి ఉన్నత స్థలాలను ఏర్పాటు చేశాడు. ఇవన్నీ చేసి ఆహాజు తన పూర్వీకులు ఆరాధించిన ప్రభువైన యెహోవాకు ఎక్కడలేని కోపాన్నీ కల్గించాడు.
2CH 28:26 మొదటి నుండి చివరి వరకు ఆహాజు చేసిన పనులన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాయబడ్డాయి.
2CH 28:27 ఆహాజు చనిపోగా, అతడు అతని పూర్వీకులతోపాటు సమాధి చేయబడ్డాడు. ప్రజలు ఆహాజును యెరూషలేము నగరంలో సమాధి చేశారు. కాని ఆహాజును ఇశ్రాయేలు రాజులను సమాధిచేసే చోట మాత్రం వారు సమాధి చేయలేదు. ఆహాజు స్థానంలో అతని కుమారుడు హిజ్కియా కొత్త రాజయ్యాడు.
2CH 29:1 హిజ్కియా రాజయ్యేనాటికి ఇరువై యైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా. అబీయా జెకర్యా కుమార్తె.
2CH 29:2 ప్రభువైన యెహోవా ఆశించిన మంచి కార్యాలన్నీ హిజ్కియా చేశాడు. తన పూర్వీకుడైన దావీదులా అతడు ప్రతి మంచి పనినీ చేశాడు.
2CH 29:3 హిజ్కియా ఆలయానికి తలుపులు పెట్టించి, ద్వారాలను పటిష్ఠంచేశాడు. హిజ్కియా ఆలయాన్ని మరల తెరిచాడు. అతడు రాజైన మొదటి సంవత్సరం మొదటి నెలలో ఈ పని చేశాడు.
2CH 29:4 యాజకులను, లేవీయులను హిజ్కియా సమావేశపర్చాడు. ఆలయానికి తూర్పు భాగానగల ఖాళీ ప్రదేశంలో అతడు వారిని కలిశాడు. వారితో హిజ్కియా యిలా అన్నాడు: “లేవీయులారా, ఇది వినండి! మీరంతా పవిత్ర సేవా కార్యక్రమానికి సిద్ధంకండి. యెహోవా యొక్క ఆలయాన్ని పవిత్రం చేసే కార్యక్రమానికి అంతా సిద్ధం చేయండి. యెహోవా మీ పితరులు అనుసరించిన దేవుడు. ఆలయానికి చెందని వస్తువులన్నీ అక్కడ నుంచి తీసిపారవేయండి. ఆ వస్తువులు ఆలయాన్ని పవిత్రం చేయజాలవు.
2CH 29:6 మన పూర్వీకులు యెహోవాను వదిలి పెట్టారు. యెహోవా యొక్క ఆలయాన్ని చూడకుండా వారి ముఖాలు తిప్పుకున్నారు.
2CH 29:7 వారు మండప ద్వారాలు మూసివేసి, ఆలయ దీపాలను ఆర్పివేశారు. వారు ఇశ్రాయేలు దేవుని ఆలయపు పవిత్ర స్థానంలో ధూపం వేయటం, దహనబలులు అర్పించటం మానివేశారు.
2CH 29:8 కావున యెహోవా యూదా, యెరూషలేము ప్రజలపట్ల మిక్కిలి కోపంగా వున్నాడు. యెహోవా వారిని శిక్షించాడు. అన్యదేశాలవారు యెహోవా పేరు విని భయపడ్డారు. యూదా, యెరూషలేము ప్రజలను యెహోవా శిక్షించిన తీరు చూసి వారు మిక్కిలి విస్మయం చెందారు. అన్యులు యూదా ప్రజలను చూసి అస్యహించుకుని, సిగ్గుతో తలలు ఆడించారు. ఇవన్నీ నిజమైన విషయాలని మీకు తెలుసు. స్వయంగా మీ కళ్లతో మీరే చూడవచ్చు.
2CH 29:9 అందువల్లనే మీ పూర్వీకులు యుద్ధంలో చంపబడ్డారు. మన కుమారులు, కుమార్తెలు, భార్యలు బందీలుగా చేయబడ్డారు.
2CH 29:10 కావున హిజ్కియానైన నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక చేసుకోదలిచాను. అప్పుడాయిన మనపట్ల ఎంతమాత్రం కోపగించడు.
2CH 29:11 కావున మీరు సోమరితనం మానండి. ఏమాత్రం కాలయాపన చేయవద్దు. యెహోవాకు సేవ చేయటానికి యెహోవాయే మిమ్ముల్ని ఎన్నుకున్నాడు. మీరాయనను సేవించి, ఆయనకు దూపం వేయాలి.”
2CH 29:12 ఆలయాన్ని శుద్ధి చేయటానికి ఉద్యమించిన లేవీయులు ఎవరనగా: కహాతీయుల వంశం నుండి అమాశై కుమారుడైన మహతు, మరియు అజర్యా కుమారుడైన యోవేలు. మెరారీ వంశం నుండి అబ్దీ కుమారుడైన కీషు, మరియు యెహాల్లెలేలు కుమారుడైన అజర్యా. గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యెహోహు; యెవాహు కుమారుడైన ఏదేను. ఎలీషాపాను సంతతిలో షిమ్రీ, యెహియేలు, ఆసాపు సంతతిలో జెకర్యా, మత్తన్యా. హేమాను సంతతిలో యెహీయేలు, షిమీ యెదూతూను సంతతిలో షెమయా, ఉజ్జీయేలు.
2CH 29:15 ఈ లేవీయులు తమ సోదరులనందరినీ పిలిపించి ఆలయాన్ని సంప్రోక్షించటానకి సంసిద్ధులయ్యారు. యెహోవా సంకల్పంతో వచ్చిన రాజాజ్ఞను వారు శిరసావహించారు. వారు ఆలయాన్ని శుద్ధి చేయటానికి లోనికి వెళ్లారు.
2CH 29:16 యాజకులు ఆలయాన్ని పవిత్ర పర్చటానికి అతి పవిత్రస్థలంలోనికి వెళ్లారు. ఆలయంలో వారు చూసిన అపవిత్రమైన వస్తువులన్నిటినీ తీసివేశారు. నిషేధించబడిన వస్తువులన్నిటినీ ఆలయపు ఆవరణలోనికి తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి ఆ నిషిద్ధ వస్తువులన్నిటినీ లేవీయులు కిద్రోను లోయకు తీసికొని వెళ్లి పారవేశారు.
2CH 29:17 మొదటి నెల మొదటి రోజున లేవీయులు పరిశుద్ధ కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు. నెలలో ఎనిమిదవ రోజున లేవీయులు ఆలయ ఆవరణలోకి వచ్చారు. అప్పటి నుంచి మరో ఎనిమిది రోజులపాటు పవిత్రారాధనకు పనికి వచ్చేలా ఆలయాన్ని శద్ధిచేశారు. మొదటి నెలలో పదహారవ రోజున పని ముగించారు.
2CH 29:18 పిమ్మట వారు రాజైన హిజ్కియా వద్దకు వెళ్లారు. వారు ఆయనతో, “హిజ్కియా రాజా, మేము పూర్తి ఆలయాన్ని, దహనబలుల బలిపీఠాలను ఆలయంలో ఇతర పరికరాలను శుభ్రపర్చాము. నైవేద్యపు రొట్టెను వుంచే బల్లను, ఆ బల్ల మీద ఉపయోగించే పరికరాలను శుద్ధి చేశాము.
2CH 29:19 రాజైన అహాబు విశ్వాసంలేనివాడై, తాను రాజుగా వున్నప్పుడు కొన్ని వస్తువులను పారవేశాడు. కాని మేము ఆ వస్తువులన్నిటినీ సేకరించి తిరిగి అక్కడ వుంచి పవిత్ర సేవకార్యక్రమానికి సిద్ధం చేసాము. అవన్నీ ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు వున్నాయి” అని చెప్పారు.
2CH 29:20 రాజైన హిజ్కియా నగర అధికారులను సమవేశపర్చి, మరునాటి తెల్లవారుఝామునే యెహోవా ఆలయానికి వెళ్లాడు.
2CH 29:21 వారు ఏడు గిత్తలను, ఏడు గొర్రె పొట్టేళ్లను, ఏడు గొర్రె పిల్లలను మరియు ఏడు చిన్న మేకపోతులను తెచ్చారు. ఇవి యూదా రాజ్యం తరుపున పాపపరిహారార్థ బలుల నిమిత్తం, పవిత్ర స్థలాన్ని శుద్ధిపర్చటానికి, మరియు యూదా ప్రజల పాపపరిహారం కొరకు తేబడ్డాయి. యెహోవా బలిపీఠం మీద ఆ పశువులను బలియిమ్ముని రాజైన హిజ్కియా అహరోను సంతతి వారైన యాజకులను ఆజ్ఞాపించాడు.
2CH 29:22 కావున యాజకులు గిత్త దూడలను చంపి రక్తాన్ని భద్రపర్చారు. పిమ్మట వారు గిత్త దూడల రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. తరువాత యాజకులు పొట్టేళ్లను చంపి, వాటి రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. ఆ తరువాత యాజకుల గొర్రెపిల్లలను చంపి, వాటి రక్తాన్ని బలిపీఠంమీద చల్లారు.
2CH 29:23 పిమ్మట యాజకులు మేక పోతులను రాజు ముందుకు, అక్కడ చేరిన ప్రజల ముందుకు తెచ్చారు. ఈ మేకలు పాపపరిహారార్థ బలికొరకు తేబడ్డాయి. యాజకులు తమ చేతులను మేకల మీద వుంచి వాటిని చంపారు. యాజకులు మేకల రక్తాన్ని బలిపీఠం మీద పాపపరిహారం కొరకు చిలికించారు. ఇశ్రాయేలు ప్రజల పాపాలను దేవుడు క్షమించుగాకయని వారాపని చేశారు. ఇశ్రాయేలు ప్రజలందరి తరపున ఈ దహనబలులు, పాపపరిహార బలులు అర్పించాలని రాజు చెప్పాడు.
2CH 29:25 దావీదు, రాజుకు దైవజ్ఞుడైన గాదు, మరియు ప్రవక్తయైన నాతాను వీరంతా నిర్దేశించిన రీతిగా రాజైన హిజ్కియా యెహోవా ఆలయంలో తాళములు సర్వమండలములు, సితారలు వాయించటానికి లేవీయులను నియమించాడు. ఇలాగు జరుగవలెనని యెహోవా ప్రవక్తల మూలకంగా ఆజ్ఞాపించియున్నాడు.
2CH 29:26 కావున దావీదు చేయించిన వాద్య పరికరాలు చేతబచ్చుకొని లేవీయులు, బూరలు పుచ్చుకొని యాజకులు సిద్ధంగా నిలబడ్డారు.
2CH 29:27 ఆ తరువాత హిజ్కియా బలిపీఠం మీద దహనబలి అర్పించమని ఆజ్ఞాపించాడు. దహనబలి మొదలైనప్పుడు దైవప్రార్థన కూడ మొదలయ్యింది. బూరలు ఊదబడ్డాయి. ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యాలు వాయించబడ్డాయి.
2CH 29:28 దహనబలి కర్యక్రమం పూర్తయ్యే వరకు సమావేశమైన వారంతా తమ శిరస్సులు వంచారు. సంగీత విద్వాంసులు గానం చేశారు; యాజకులు బూరలుఊదారు.
2CH 29:29 బలులన్నీ పూర్తి అయిన పిమ్మట రాజైన హిజ్కియా, అతనితో వున్న ప్రజలంతా శిరస్సులు వంచి ఆరాధించారు.
2CH 29:30 రాజైన హిజ్కియా, అధికారులు యెహోవాకు స్తుతిగీతాలు పాడుమని ఆజ్ఞ యిచ్చారు. దావీదు, దైవజ్ఞుడగు ఆసాపు రచించిన భక్తిగీతాలు వారు ఆలపించారు. వారు దేవుని కీర్తించి, ఆనదించారు. వారంత శిరస్సులు వంచి దేవుని ఆరాధించారు.
2CH 29:31 తరువాత హిజ్కియా యిలా అన్నాడు: “యూదా ప్రజలారా, ఇప్పుడు మీరు మీ ప్రభువైన యెహోవా సేవకు పునరంకితమయ్యారు. దగ్గరకు రండి. బలులు, కృతజ్ఞతార్పణలు ఆలయానికి తిసుకొని రండి.” తరువాత ప్రజలు బలులు, కృతజ్ఞతా నైవేద్యాలు తెచ్చారు. సమర్పించాలనుకున్నవారు దహనబలులు కూడ తెచ్చారు.
2CH 29:32 సమావేశమైన, ప్రజలు మందిరానికి తెచ్చిన అనేక దహన బలులు యిలా వున్నాయి: డెభ్బై గిత్త దూడలు, వంద పొట్టేళ్లు, మరియు రెండు వందల గొర్రె పిల్లలు. ఈ జంతువులన్నీ యెహోవాకు దహనబలులుగా సమర్పించబడ్డాయి.
2CH 29:33 యెహోవాకు పరిశుద్ధ బలులుగా ఆరు వందల గిత్తలు, మరియు మూడువేల మేకలు, గొర్రెలు వున్నాయి.
2CH 29:34 దహన బలుల జంతువుల చర్మాలు తీయటానికి, వాటిని నరకటానికి తగినంత మంది యాజకులు లేరు. కావున వారి బంధువులగు లేవీయులు కార్యక్రమం పూర్తయ్యే వరకు, ఇతర యాజకులు పవిత్ర సేవా కార్యక్రమానికి సిద్ధమై వచ్చేవరకు సహాయపడ్డారు. లేవీయులు మాత్రం గంభీరంగా తమ ప్రభువైన యెహోవా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. వారు యాజకులకంటె ఎక్కువగా పనిమీద మనస్సు లగ్నం చేశారు.
2CH 29:35 అక్కడ దహనబలులు, సమాధానబలుల కొవ్వు, పానార్పణలు విస్తారంగా జరుపబడ్డాయి. ఆ విధంగా ఆలయంలో అర్చన కార్యక్రమం మళ్లీ మొదలయింది.
2CH 29:36 హిజ్కియా, అతని ప్రజలు దేవుడు తన ప్రజలకొరకు చేసిన ఏర్పాట్ల పట్ల సంతోషం వెలిబచ్చారు. ఈ కార్యక్రమం ఇంత త్వరగా చేయించినందుకు వారిలో ఆనందం వెల్లివిరిసింది.
2CH 30:1 రాజైన హజ్కియా ఇశ్రాయేలు, యూదా ప్రజలందరికీ వర్తమానం పంపించాడు. అతడు ఎఫ్రాయిము, మనష్షే ప్రజలకు కూడా లేఖలు వ్రాశాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పస్కా పండుగ జరిపేందుకు వారిందరినీ యెరూషలేములోని ఆలయానికి రమ్మని హిజ్కియా ఆహ్వానించాడు.
2CH 30:2 పస్కా పండుగ రెండవ నెలలో జరపటానికి అధికారులతోను, యెరూషలేము సమావేశంలోను చర్చించి రాజైన హిజ్కియా నిర్ణయించాడు.
2CH 30:3 పస్కా పండుగను మామూలుగా జరిగే సమయానికి వారు జరుపుకోలేక పోయారు. ఎందువల్లనంటే పవిత్ర సేవా కార్యాక్రమానికి తగినంత మంది యాజకులు సిద్ధం కాలేదు. పైగా ప్రజలందరూ యెరూషలేములో సమావేశం కాలేదు.
2CH 30:4 ఇప్పుడు పండుగ జరిపే తేదీ పట్ల రాజైన హిజ్కియా, సమావేశమైనవారూ సంతృప్తిని వెలిబచ్చారు.
2CH 30:5 పిమ్మట బెయేర్షెబా పట్టణం మొదలు దాను పట్టణం వరకు ఇశ్రాయేలంతటా వారీవిషయమై ప్రకటన చేశారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపటానికి ప్రజలంతా యెరూషలేముకు రావాలని వారు చాటించారు. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించబడిన విధంగా చాలాకాలంగా ఇశ్రాయేలు ప్రజలలో అధిక సంఖ్యాకులు పస్కా పండుగ జరుపలేదు.
2CH 30:6 కావున దూతలు రాజు యొక్క లేఖలను ఇశ్రాయేలు, యూదా ప్రాంతాలన్నిటికీ తీసుకొని వెళ్లారు. ఆలేఖలలో యిలా రాయబడి వుంది: ఇశ్రాయేలు బిడ్డలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు (యాకోబు) విధేయులై వున్న దేవుడైన యెహోవా వైపు తిరగండి. అప్పుడు మీలో ఇంకా బతికివున్న వారి వద్దకు, అష్షూరు రాజు బారినుండి తప్పించుకున్న వారి వద్దకు యెహోవా వస్తాడు.
2CH 30:7 మీ తండ్రులవలెను, మీ సొదరులవలెను మీరు ప్రవర్తించకండి. యెహోవా వారి దేవుడు; కాని వారు ఆయనకు వ్యతిరేకులయ్యారు. అందువల్ల ప్రజలు వారిని అసహ్యించుకునేలా, వారు నిందలపాలయ్యేలా యెహోవా చేశాడు. ఇది నిజమని మీ కళ్లతో మీరే స్వయంగా చూడవచ్చు.
2CH 30:8 మీ ముందు తరంవారివలె మీరు మొండిగా ప్రవర్తించకండి. ఇష్ట పూర్వకమైన మీ హృదయాలతో యెహోవాకు విధేయులు కండి. అతి పరిశుద్ధ స్ధలానికి తరలిరండి. అతి పరిశుద్ద స్థలాన్ని యెహోవా శాశ్వతంగా పవిత్ర పర్చాడు. మీ దేవుడైన యెహోవాను కొలవండి. అప్పుడు యెహోవా యొక్క భయంకరమైన కోపం మీనుండి తొలగిపోతుంది.
2CH 30:9 మీరు తిరిగివచ్చి యెహోవాకు విధేయులైతే, బందీలైన మీ బంధువులు, పిల్లలు వారిని చెరబట్టిన శత్రువుల నుండి కనికరం పొందుతారు. మీ బంధువులు, మీ పిల్లలు మళ్లీ ఈ రాజ్యానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా దయగలవాడు; కరుణా మూర్తి. మీరాయనను ఆశ్రయిస్తే ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలిపెట్టడు.
2CH 30:10 వార్తాహరులు ఎఫ్రాయిము, మనష్షే ప్రాంతాలలో ప్రతి పట్టణానికీ వెళ్లారు. వారు సుదూర ప్రాంతమైన జెబూలూనుకు కూడా వెళ్లారు. కాని అక్కడి ప్రజలు వార్త తెచ్చిన వారిని చూసి నవ్వి, హేళనచేశారు.
2CH 30:11 కాని అషేరు, మనష్షే మరియు జెబూలూను ప్రాంతాలలో కొంతమంది మాత్రం తమను తాము తగ్గించుకొని, అణకువతో యెరూషలేముకు వెళ్లారు.
2CH 30:12 యెహోవా తన వాక్కు ద్వారా రాజైన హిజ్కియా మరియు అతని అధికారులు ఇచ్చిన ఆజ్ఞలకు యూదా ప్రజంతా విధేయులై వుండేలా వారి మనస్సులు మార్చాడు.
2CH 30:13 చాలామంది ప్రజలు జట్లు జట్లుగా పులియని రొట్టెల పండుగ జరుపుకోటానికి రెండవ నెలలో యెరూషలేముకు వచ్చారు. ప్రజాసమూహం పెద్దగా వుంది.
2CH 30:14 యెరూషలేములో బూటకపు దేవుళ్ల ఆరాధనకు నిర్మింపబడ్డ బలిపీఠాలన్నిటినీ అక్కడ చేరిన ప్రజలు తొలగించారు. బూటకపు దేవుళ్లకు నిర్మించిన ధూప పీఠాలను కూడా వారు తీసివేశారు. ఆ బలిపీఠాలన్నిటినీ వారు కిద్రోను లోయలో పారవేశారు.
2CH 30:15 పిమ్మట వారు రెండవ నెల పదునాల్గవ తేదీన పస్కా గొర్రెపిల్లను చంపారు. యాజకులు, లేవీయులు సిగ్గుపడి పవిత్ర సేవా కార్యక్రమానికి పరిశుద్ధులై సిద్ధమయ్యారు. యాజకులు, లేవీయులు దహనబలులు ఆలయానికి తీసుకొనివచ్చారు.
2CH 30:16 యెహోవా సేవకుడైన మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారంతా ఆలయంలో తమ తమ స్థానాలను ఆక్రమించారు. లేవీయులు బలుల రక్తాన్ని యాజకులకిచ్చారు. ఆ రక్తాన్ని యాజకులు బలిపీఠం మీద చిలికించారు.
2CH 30:17 సమావేశమైన వారిలో శుచియై సేవా కార్యాక్రమానికి సిద్ధం కానివారు అనేకమంది వున్నారు. కావున వారు పస్కా గొర్రెపిల్లలను చంపటానికి అనుమతింపబడలేదు. ఆ కారణంగా లేవీయులు పరిశుద్ధులు కాని వారందరి తరుపునా పస్కా బలులు అర్పించవలసి వచ్చింది. లేవీయులు ప్రతి గొర్రెపిల్లను పవిత్రపర్చి బలికి సిద్ధం చేశారు.
2CH 30:18 ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు మరియు జెబూలూను ప్రజలలో చాలామంది పస్కా పండుగుకు శాస్త్రీయంగా తమను తాము పవిత్రపర్చుకోలేదు. మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన రీతిలో వారు పస్కా పండుగను సక్రమంగా జరుపుకోలేదు. కాని హిజ్కియా వారికొరకు ప్రార్థన చేశాడు. హిజ్కియా యిలా ప్రార్థన చేశాడు: “ప్రభువైన యెహోవా, నీవు మంచివాడవు. ఈ ప్రజలు నిజానికి నిన్ను ఆచారంగా ఆరాధించాలనుకున్నారు. కాని ధర్మశాస్త్రం చెప్పిన రీతిగా వారు తమను తాము పవిత్ర పర్చుకోలేదు. దయచేసి వారిని క్షమించు. నీవు మా పూర్వీకులు విధేయులైయున్న దేవుడివి. అతిపవిత్ర స్థానానికి అర్హమైన రీతిలో ప్రజలెవరైనా తమను తాము పవిత్ర పర్చుకొనకపోయినా నీవు వారిని క్షమించ కోరుతున్నాను.”
2CH 30:20 రాజైన హిజ్కియా ప్రార్థన యెహోవా ఆలకించాడు. ఆయన ప్రజలను క్షమించాడు.
2CH 30:21 ఇశ్రాయేలు సంతతివారు యెరూషలేములో ఏడు రోజులపాటు పులియని రొట్టెల పండుగను జరుపుకున్నారు. వారంతా చాలా ఆనందోత్సాహాలతో వున్నారు. లేవీయులు, యాజకులు ప్రతిరోజు తమ శక్తి కొలదీ యెహోవాకు స్తోత్రం చేశారు.
2CH 30:22 యెహోవా సేవా కార్యాక్రమంలో పరిపూర్ణ జ్ఞానంగల లేవీయులందరినీ రాజైన హిజ్కియా ప్రోత్సహించాడు. ప్రజలు పండుగను ఏడు రోజులపాటు జరిపి సమాధన బలులు అర్పించారు. వారు తమ పూర్వీకులు ఆరాధించిన ప్రభువైన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు.
2CH 30:23 ప్రజలంతా అక్కడా మరి ఏడు రోజులు వుండటానికి ఇష్టపడ్డారు. పస్కా పండుగను మరి ఏడు రోజులు జరుపుకున్నందుకు వారు సంతోషించారు.
2CH 30:24 యూదా రాజైన హిజ్కియా ఒక వెయ్యి గిత్తలను, ఏడువేల గొర్రెలను సమావేశమైన ప్రజల ఆహారం నిమిత్తం ఇచ్చాడు. పెద్దలు కూడా వెయ్యిగిత్తలను, పదివేల గొర్రెలను ప్రజలకు ఆహారంగా ఇచ్చారు. చాలామంది యాజకులు పవిత్ర కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు.
2CH 30:25 యూదా నుండి వచ్చిన ప్రజా సమూహం, యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు నుండి వచ్చిన జనం, మరియు ఇశ్రాయేలు నుండి యూదాకు వచ్చిన ఇతర యాత్రీకులు-అందరూ చాలా సంతోషపడ్డారు.
2CH 30:26 అందువల్ల యెరూషలేములో ఆనందం వెల్లివిరిసింది. దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను కాలం తరువాత ఇప్పటివరకు ఇంత వైభవంగా ఏ ఉత్సవం నిర్వహింపబడలేదు.
2CH 30:27 యాజకులు, లేవీయులు లేచి నిలబడి ప్రజలను దీవించుమని యెహోవాను ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. వారి ప్రార్థన యెహోవా పరిశుద్ధ నివాసం చేరింది.
2CH 31:1 పస్కా పండుగ పూర్తి అయ్యింది. యెరూషలేముకు పండుగ నిమిత్తం వచ్చిన ఇశ్రాయేలీయులు యూదాలో వున్న పట్టణాలకు వెళ్లి, అక్కడ వున్న రాతి విగ్రహాలన్నిటినీ ముక్కలు చేశారు. బూటకపు దేవతల ఆరాధనలో వారు ఈ రాతి విగ్రహాలను ఉపయోగించేవారు. ప్రజలు అషేరా స్తంభాలను కూడా నరికివేశారు. యూదా, బెన్యామీను రాజ్యాలలో వున్న ఉన్నత స్థలాలను, బలిపీఠాలను కూలదోశారు. ఎఫ్రాయిము, మనష్షే ప్రాంతాలలో కూడా ఈ ప్రజలు అదే పని చేశారు. బూటకపు దేవతల ఆరాధనలో వినియెగించే వస్తువులన్నీ నాశనమయ్యే వరకు ప్రజలీపని చేస్తూనే వున్నారు. తరువాత ఇశ్రాయేలీయలంతా తమ తమ పట్టణాలకు వెళ్లిపోయారు. ప్రతి వ్యక్తీ తన ఇంటికి వెళ్లిపోయాడు.
2CH 31:2 రాజైన హిజ్కియా మళ్లీ యాజకుల, లేవీయుల వంశాలను వారివారి విధులు నిర్వర్తించటానికి ఎంపిక చేశాడు. ప్రతి గుంపుకీ ప్రత్యేకమైన పని నిర్దేశించబడింది. దహనబలులు, సమాధానబలులు యివ్వటానికి కూడ హిజ్కియా మళ్లీ యాజకులను, లేవీయులను ఎంపిక చేశాడు. ఆ యాజకులు ఆలయంలో సేవ చేసి, దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చేశారు.
2CH 31:3 దహన బలులుగా అర్పించటానికి హిజ్కియా తన స్వంత జంతువులను కొన్నిటిని ఇచ్చాడు. ఈ దహనబలులు ఉదయ, సాయంకాల సమయాలలోను, వారం చివర సబ్బాతు దినాలలోను (శనివారం), అమావాస్యలందు, మరి ఇతర పండుగ దినాలలోను అర్పించేవారు. ఈ కార్యక్రమమంతా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జరిగింది.
2CH 31:4 యాజకులకు, లేవీయులకు చెందిన భాగాన్ని వారికి ఇవ్వమని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు హిజ్కియా ఆజ్ఞాపించాడు. తద్వారా యాజకులు, లేవీయులు తమ పూర్తి కాలాన్ని యెహోవా సేవలో, ధర్మశాస్త్రం బోధించేందుకు వినియోగించగలరు.
2CH 31:5 రాజాజ్ఞ దేశమంతా ప్రచారం చేయబడిన వెంటనే, ఇశ్రాయేలు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. తమ పంటలైన ధాన్యం, ద్రాక్ష, నూనె, తేనె, ఇంకను వారి పొలాల్లో పండిన తదితర పంటల నుండి మొదటి భాగాన్ని విరాళంగా ఇచ్చారు. వారి పంటలో పదవ భాగాన్ని స్వచ్ఛందంగా తీసుకొని వచ్చారు. ఈ సేకరణే చాలా పెద్ద మొత్తమయ్యింది.
2CH 31:6 యూదా పట్టణాలలో నివసిస్తున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలు కూడా తమ పశుసంపదలో పదవవంతు తెచ్చారు. వారింకా యెహోవా కొరకు విడిగా ఒక చోట నిల్వచేసిన వస్తువులలో పదవవంతు తెచ్చారు. వారీ వస్తువులన్నీ తాము ఆరాధించే దేవుడైన యెహోవా నిమిత్తం తెచ్చారు. వారు తెచ్చిన పదార్థాలు, వస్తువులు అన్నీ రాశులుగా పోశారు.
2CH 31:7 మూడవ నెలలో (మే/జూన్) ప్రజలు నిల్వచేసిన వస్తువులన్నీ తేవటం మొదలుపెట్టి ఏడవ నెలలో (సెప్టెంబర్/అక్టోబర్) పూర్తి చేశారు.
2CH 31:8 హిజ్కియా, మరియు ఇతర పెద్దలు వచ్చి ప్రజలు తెచ్చిన వస్తుసంపద రాశులుగా పడివుండటం చూశారు. వారు దేవునికి స్తోత్రం చేసి, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను శ్లాఘించారు.
2CH 31:9 అప్పుడు హిజ్కియా రాసులుగా పడివున్న వస్తుసంపద గురించి యాజకులను, లేవీయులను అడిగి తెలుసుకున్నాడు. రాజైన హిజ్కియా అభివృద్ధి కార్యక్రమం చేపట్టటం
2CH 31:10 సాదోకు కుటుంబానికి చెందిన ప్రముఖ యాజకుడు అజర్యా రాజైన హిజ్కియాతో యిలా చెప్పాడు: “ప్రజలు ఆలయానికి కానుకలు తేవటం మొదలు పెట్టినప్పటి నుండి తినటానికి మాకు సమృద్ధిగా ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. అంతేగాదు, మా వద్ద ఇంకా అనేక పదార్థాలు మిగిలి వున్నాయి. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించాడు. అందుచే మావద్ద ఇదంతా మిగిలివుంది.”
2CH 31:11 పిమ్మట ఆలయంలో సరుకు నిల్వచేసే గదులు కట్టించమని హిజ్కియా యాజకులకు ఆజ్ఞాపించగా, వారు వాటిని కట్టించారు.
2CH 31:12 తరువాత యాజకులు కానుకలను, దశమ భాగాలను, తదితర వస్తువుల్లో యెహోవాకై ప్రత్యేకించబడిన వాటిని తెచ్చారు. అలా సేకరించిన ఆ వస్తుసంపదను ఆలయ గిడ్డంగులలో భద్రపర్చారు. లేవీయుడైన కొనన్యా వీటిపై పర్యవేక్షకుడుగా నియపింపబడ్డాడు. అతని తరువాత అధికారిగా షిమీ నియమితుడయ్యాడు. కొనన్యా సోదరుడే షిమీ.
2CH 31:13 కొనన్యా, అతని సోదరుడు షిమీలిద్దరూ యెహీయేలు, అజజ్యాహు, నహతు, అశాహేలు, యెరీమోతు, యోజాబాదు, ఎలీయేలు, ఇస్మక్యాహు, మహతు మరియు బెనాయాలపై పర్యవేక్షణ అధికారులుగా నియమింపబడ్డారు. రాజైన హిజ్కియా, ఆలయపు నిర్వహణాధికారి అజర్యాలిద్దరూ ఈ మనుష్యులను ఎంపికచేశారు.
2CH 31:14 ప్రజలు దేవునికి ఇచ్చే ఉచిత కానుకల విషయమై శ్రద్ధ తీసుకోనే అధికారి పేరు కోరే. దేవునికి ఇవ్వబడిన కానుకల పంపిణీ విషయంలో ఇతడు శ్రద్ధ తీసుకొంటాడు. దేవునికి ఇవ్వగా పవిత్ర పర్చబడిన ధానాల పంపిణీ విషయంలో కూడా బాధ్యత ఇతనిదే. కోరే తూర్పు ద్వారపాలకుడు. ఇతని తండ్రి లేవీయుడైన ఇమ్నా.
2CH 31:15 ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా మరియు షెకన్యా అనేవారు కోరేకు సహాయ కులుగా పనిచేశారు. వారంతా యాజకులు నివసించే పట్టణాలలో విశ్వాసపాత్రంగా పనిచేశారు. యాజకులలో ప్రతి వర్గం వారి బంధువులకు సేకరించిన వస్తువులను వారు ఇచ్చేవారు. అవే వస్తువులను మిక్కిలి గొప్పవారికి, అతి పేదవారికి కూడ వారివారి భాగాలను వారు ఇచ్చేవారు.
2CH 31:16 లేవీయుల వంశ చరిత్రల్లో చేర్చబడిన మూడేండ్లు అంతకు పైబడిన వయస్సుగల మగ పిల్లలకు కూడ సేకరించిన రాశులనుండి వారు భాగాలను పంచిపెట్టేవారు. ఈ మగవారంతా నిత్యం ఆలయానికి వెళ్లి అనుదిన సేవా కార్యక్రమాలలో తమ తమ విధులు నిర్వర్తించవలిసినవారు. లేవీయులో ప్రతి వంశంవారికి ఒక బాధ్యత అప్పగించబడింది.
2CH 31:17 సేకరించిన వస్తుసంపద నుంచి యాజకులకు తమ భాగం యివ్వబడింది. వారి కుటుంబాల వారీగా వంశ చరిత్రలలో రాయబడిన క్రమంలో ఈ పని జరుపబడింది. సేకరించిన సంపదలో ఇరవైయేండ్లు, అంతకు పైబడిన వయస్సుగల లేవీయులకు వారి వంతు భాగాలు ఇవ్వబడ్డాయి. ఇది వారి వారి బాధ్యతలను బట్టి, వారి వారి కుటుంబాలను బట్టి జరిగింది.
2CH 31:18 లేవీయుల పసిపిల్లలు, భార్యలు, కుమారులు, కుమార్తెలు సేకరించిన సంపదలో భాగస్వాములయ్యారు. వంశచరిత్రలో వ్రాయబడిన లేవీయులందరికీ యిలా భాగాలు ఇవ్వ బడ్డాయి. లేవీయులు విశ్వాస పాత్రంగా సదా పవిత్రులైవుండి, ప్రభుసేవా పరాయణులైనందువల్ల ఆ విధంగా ఏర్పాటు చేయబడింది.
2CH 31:19 అహరోను వంశస్థులైన కొంతమంది యాజకులు లేవీయులు నివసిస్తున్న పట్టణాలకు దగ్గర లో కొన్ని పంట భూములు కలిగియున్నారు. ఆ పట్టణాలలో అహరోను సంతతి వారు కూడ కొందరు నివసిస్తున్నారు. అట్టి అహరోను సంతతి వారికి భాగాలు యివ్వటానికి ప్రతి పట్టణంలోను నివసిస్తున్న పురుషులు పేర్ల వారీగా ఎంపిక చేయబడ్డారు. పురుషులు, లేవీయుల వంశ చరిత్రలో వ్రాయబడినవారు సేకరించిన పదార్థాలలో భాగం పొందారు.
2CH 31:20 రాజైన హిజ్కియా అలాంటి మంచి పనులు యూదా రాజ్యమంతటా చేశాడు. యెహోవా దృష్టికి మంచిదైన న్యాయమైన విశ్వసనీయమైన ప్రతి పనినీ అతడు చేశాడు.
2CH 31:21 తలపెట్టిన ప్రతి పనిలోను, ఆలయంలో సేవకార్యక్రమం పునః ప్రారంభించటంలోను; దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను పాటించటంలోను మరియు అతడు దేవుని అనుసరించటంలోడు అతను విజయం సాధించాడు. హిజ్కియా ఈ పనులన్నీ తన హృదయపూర్వకంగా చేశాడు.
2CH 32:1 హిజ్కియా ఈ పనులన్నీ విశ్వసనీయంగా చేసిన పిమ్మట, అష్షూరు రాజైన సన్హెరీబు యూదా రాజ్యం మీదికి దండెత్తి వచ్చాడు. సన్హెరీబు అతని సైన్యంతో వచ్చి కోటలను మట్టడించి సైనిక స్థావరాలు ఏర్పాటు చేశాడు. అలా చేసి ఆ పట్టణాలను తాను జయించాలని అతడు పన్నాగం పన్నాడు. సన్హెరీబు ఆ పట్టణాలను తాను స్వయంగా గెలవాలని అనుకున్నాడు.
2CH 32:2 యెరూషలేముపై దాడిచేయాటానికే సన్హెరీబు వచ్చాడని హిజ్కియాకు తెలుసు.
2CH 32:3 అప్పుడు హిజ్కియా తన పరిపాలనాధికారుతోను, సైనికాధికారుతోను సంప్రదించాడు. వారు నగరం వెలుపల జలవనరుల నుండినీటి ప్రవాహాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. పాలనాధికారులు, సైనికాధికారులు హిజ్కియాకు తోడ్పడ్డారు.
2CH 32:4 అనేకమంది ప్రజలు కలిసి జలవనరులన్నీ ఆపివేశారు. దేశం మధ్యగా ప్రవహించే కాలువకు కూడ అడ్డకట్టలు వేశారు. “అష్షూరు రాజు ఇక్కడికి వచ్చినప్పుడు అతనికి కావలసినంత నీరు ఇక్కడ దొరకదు” అని వారనుకున్నారు.
2CH 32:5 హిజ్కియా యెరూషలేమును బలమైన నగరంగా తీర్చిదిద్దాడు. అతడు చేసిన పని ఏమనగా: గోడలు పడిపోయిన చోటల్లా అతడు తిరిగి కట్టించాడు. అతడు గోడలమీద బురుజుల నిర్మింపజేసాడు. మొదటి గోడకు బయటగా మరో గోడను కూడ అతడు నిర్మించాడు. పాత యెరూషలేములో తూర్పు భాగాన అతడు మళ్లీ కోటలు నిర్మించాడు. అతడు అనేక ఆయుధాలను, డాళ్లను తయారు చేయించాడు.
2CH 32:6 ప్రజలను నడిపించటానికి వారిపై సైనికాధికారులను నియమించాడు. నగర ద్వారం వద్ద బహిరంగ ప్రదేశంలో అతడీ అధికారులను కలుసుకొన్నాడు. హిజ్కియా ఆ అధికారులతో మాట్లాడి, వారిని ప్రోత్సహించాడు. వారితో అతడిలా అన్నాడు. “మీరు బలంగా, ధైర్యంగా వుండండి. భయపడకండి. అష్షూరు రాజు విషయంలోగాని, అతని మహా సైన్యం విషయంలోగాని మీరు కలత చెందవద్దు. అష్షూరు వారి బలం కంటే మనవద్ద మహాశక్తి సంపద వుంది.
2CH 32:8 అష్షూరు రాజు వద్ద కేవలం మనుష్యల బలమే వుంది. కాని మనవద్ద యెహోవా దైవబలం వుంది. మన దేవుడు మనకు సహాయపడతాడు. మన యుద్ధాలు ఆయనే నిర్వహిస్తాడు!” ఆ విధంగా యూదా రాజైన హిజ్కియా ప్రజలను ఉత్సహపర్చి వారి ధైర్యాన్ని తట్టి లేపాడు.
2CH 32:9 అష్షూరు రాజైన సన్హెరీబు, అతని సైన్యం లాకీషు నగరం దగ్గరగా స్థావరం ఏర్పాటు చేసి దానిని ఓడించాలని వున్నారు. పిమ్మట యూదా రాజైన హిజ్కియా వద్దకు, యెరూషలేములో వున్న యూదా ప్రజల వద్దకు సన్హెరీబు తన సేవకులను పంపాడు. సన్హెరీబు సేవకులు హిజ్కియాకు, యెరూషలేము ప్రజలకు వర్తమానాన్ని పట్టుకు వెళ్లారు.
2CH 32:10 ఆ సేవకులు ఈ విధంగా ప్రకటించారు: “అష్షూరు రాజైన సన్హెరీబు యిలా చెప్పుచున్నాడు: యెరూషలేము ముట్టడిలో వుండగా మీరు దేనిని నమ్ముకొని ఇంకా అక్కడ వుంటున్నారు?
2CH 32:11 హిజ్కియా మిమ్మల్ని మూర్ఖులనుగా చేస్తున్నాడు. యెరూషలేములోనే వుండి ఆకలి దప్పులతో మాడి చనిపోయే విధంగా మీరు మోసగింపబడుతున్నారు. ‘అష్షూరు రాజు నుండి మనల్ని మన ప్రభువైన యెహోవా రక్షిస్తాడు,’ అని హిజ్కియా మీకు చెప్పుచున్నాడు.
2CH 32:12 హిజ్కియా తనకై తాను యెహోవా ఉన్నత స్థలాలను, బలిపీఠాలను తొలగించి వేశాడు. కాని యూదా, యెరూషలేము ప్రజలైన మీకు ఒకే బలిపీఠం మీద పూజచేసి, ధూపం వేయండని చెప్పుచున్నాడు.
2CH 32:13 నిజానికి నేను, నా పూర్వీకులు ఇతర దేశాల ప్రజలకు ఏమి చేసినదీ మీయందరికీ తెలిసినదే. అన్యదేశాల దేవుళ్లు వారి ప్రజలను కాపాడలేక పోయారు. నేను వారి ప్రజలను నాశనం చేయకుండా ఆ దేవుళ్లు నన్ను ఆపలేకపోయారు.
2CH 32:14 నా పూర్వీకులు ఆ రాజ్యలను నాశనం చేశారు. తన ప్రజలను నాశనం చేయకుండా నన్నాపగల దేవుడెవ్వడూ లేడు. కావున మీ దేవుడు నానుండి మిమ్మల్ని కాపాడగలడని మీరనుకుంటున్నారా?
2CH 32:15 హిజ్కియా మిమ్మల్ని మూర్ఖులను చేయటంగాని, మోసపుచ్చటంగాని చేయనీయవద్దు. మీరతనిని నమ్మవద్దు. ఎందువల్లననగా ఏ దేశపు దేవుడే గాని, ఏ రాజ్యపు దేవుడేగాని అతని ప్రజలను నానుండి నా పూర్వీకుల నుండి సురక్షితంగా వుండేలా ఎన్నడూ కాపాడలేడు. కావున మీ దేవుడు మిమ్మల్ని నాశనం చేయకుండ నన్ను ఆపుతాడని మీరు అనుకోవద్దు.”
2CH 32:16 ప్రభువగు యెహోవాకు, దేవుని సేవకుడగు హిజ్కియాకు వ్యతిరేకంగా అష్షూరు రాజు సేవకులు చాలా నీచంగా మాట్లడారు.
2CH 32:17 ఇశ్రాయేలు దేవుడగు యెహోవాను అవమానపరుస్తూ అష్షూరు రాజు లేఖలు కూడ వ్రాశాడు. ఆ లేఖలలో అష్షూరు రాజు యిలా వ్రాశాడు: “నేను అన్యదేశాల ప్రజలను నాశనం చేసేటప్పుడు వారి దేవుళ్లు నన్నాపలేకపోయారు. అలాగే హిజ్కియా దేవుడు కూడ ఆయన ప్రజలను నాశనం చేయకుండ నన్ను ఆపలేడు.”
2CH 32:18 తరువాత అష్షూరు రాజు సేవకులు నగర గోడమీద వున్న యెరూషలేము ప్రజలను చూసి కేకలు పెట్ట అరిచారు. గోడమీద జనాన్ని చూసి ఆ సేవకులు వారికి తెలిసేలా హెబ్రీ భాషలో తి ట్టి అరిచారు. అష్షూరు. అష్షూరు రాజు సేవకులు యెరూషలేము ప్రజలను భయపెట్టేటందుకే అలా చేసారు. యెరూషలేము నగరాన్ని కైవసం చేసికోవాలనే వారలా చేసారు.
2CH 32:19 ప్రపంచ దేశాల ప్రజలు పూజించే దేవుళ్లపట్ల కూడ ఆ సేవకులు చెడుగా మాట్లడారు. కాని ఆ దేవుళ్లు కేవలం మనుష్యులు తమ చేతులతో చేసిన బొమ్మలు. అదేరీతిలో ఆ సేవకులు యెరూషలేము దేవునిపట్ల కూడ నీచంగా మాట్లడారు.
2CH 32:20 రాజైన హిజ్కియా మరియు ఆమోజు కుమారుడు. ప్రవక్తయునగు యెషయా ఈ సమస్య విషయంలో దేవుని ప్రార్థించారు. వారు ఆకాశంవైపు తిరిగి దేవునికి తమ గోడు కష్టాలు చెప్పుకున్నారు.
2CH 32:21 అప్పుడు యెహోవా తన దూత నొకనిని అష్షూరు రాజు ఉండే స్థలానికి పంపించినాడు. ఆ దేవదూత అష్షూరు సైన్యంలోని అందరు సైనికులను, నాయకులను, అధికారులను చంపివేశాడు. దానితో అష్షూరు రాజు పలాయనం చిత్తగించి తన దేశంలోగల తన ఇంటికి పోయాడు. ప్రజలు అతనిని చూసి సిగ్గుపడ్డారు. అతడు తన దేవుని ఆలయానికి వెళ్లగా అక్కడ తన స్వంత కుమారులలో కొందరు అతనిని కత్తులతో నరికి చంపివేశారు.
2CH 32:22 ఆ రకంగా యెహోవా హిజ్కియాను, యెరూషలేము ప్రజలను అష్షూరు రాజైన సన్హెరీబు బారినుండి, ఇతర శత్రువుల బారినుండి రక్షించాడు. యెహోవా హిజ్కియాపట్ల యెరూషలేము ప్రజలపట్ల తగిన శ్రద్ధ తీసుకొన్నాడు.
2CH 32:23 అనేక మంది ప్రజలు యెహోవాకు కానుకలు తీసికొని యెరూషలేముకు వచ్చారు. యూదా రాజైన హిజ్కియాకు కూడా వారు అనేక విలువైన వస్తువులు తెచ్చియిచ్చారు. అప్పటి నుండి హిజ్కియాను అన్ని దేశాల వారు గౌరవించటం మొదలు పెట్టారు.
2CH 32:24 ఆ రోజులలోనే హిజ్కయాకు తీవ్రంగా జబ్బుచేసి చనిపోయే స్థితిలో వున్నాడు. అతడు దేవుని ప్రార్థించాడు. యెహోవా హిజ్కియాతో మాట్లాడి, అతనికి ఒక సూచన ఇచ్చినాడు.
2CH 32:25 కాని హిజ్కియా హృదయం గర్విపడింది. అందువల్ల అతనికి దేవుడు చేసిన మేలుకు అతడు కృతజ్ఞతలు తెలుపలేదు. ఈ కారణంవల్ల దేవుడు హిజ్కియా పట్ల మరియు యూదా, యెరూషలేము ప్రజలపట్ల కోపగించినాడు.
2CH 32:26 కాని హిజ్కియా, యెరూషలేము ప్రజలు మళ్లీ మనస్సు మార్చుకొనినవారై, తమ జీవితాలు మార్చుకున్నారు. వారు విదేయులై గర్వించటం మానుకున్నారు. అందువల్ల హిజ్కియా బ్రతికినంత కాలం దేవుని కోపం వారి మీదికి రాలేదు.
2CH 32:27 హిజ్కియా మహా భాగ్యవంతుడయ్యాడు. గొప్ప గౌరవం లభించింది. వెండి బంగారాలు, విలువైన ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, డాళ్లు, తదితర వస్తువులు భద్రపర్చటానికి అతడు తగిన స్థానాలు ఏర్పాటు చేశాడు.
2CH 32:28 ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం ప్రజలు తనకు పంపిన నూనెను నిల్వచేయటానికి హిజ్కియా గిడ్డంగులు నిర్మించాడు. అన్ని రకాల పశువులశాలలు, గొఱ్ఱెలకు కొట్టములు కూడ నిర్మించాడు.
2CH 32:29 హిజ్కియా చాలా కొత్త పట్టణాలు నిర్మించాడు. పశుసంపద గొఱ్ఱెల మందలు ఎక్కువగా అభివృద్ధి చేశాడు. యెహోవా హిజ్కియాకు లెక్కలేనంత ఐశ్వర్యాన్ని సమకూర్చినాడు.
2CH 32:30 యెరూషలేములో గిహోను ఎగువ కాలువ ప్రవాహానికి అడ్డుకట్టలు లేని నీటిని దావీదు నగరంలో పడమటి దిశన తిన్నగా ప్రవహించేలా మళ్లించినవాడు హిజ్కియాయే. హిజ్కియా చేపట్టిన ప్రతి పనిలోను విజయం సాధించాడు.
2CH 32:31 ఒక పర్యాయం బబులోను పెద్దలు హిజ్కియా వద్దకు దూతలను పంపారు. అప్పుడు దేశాలలో సంభవించిన ఒక అధ్బుత సంఘటన గురించి అడిగి తెలికొన్నారు. వారు వచ్చినప్పుడు హిజ్కియా మనస్సులో ఏమున్నదో పరీక్షించి పూర్తిగా తెలిసికొనటానికి అతనిని యెహోవా ఒంటరిగా వదిలినాడు.
2CH 32:32 హిజ్కియా పాలనలో అతడు చేసిన ఇతర కార్యములను గురించి, అతని భక్తి కార్యక్రమాల గురించి యూదా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథం మరియు ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా దర్శనాలలో వ్రాయబడినాయి.
2CH 32:33 హిజ్కియా చనిపోగా అతడు తన పూర్వీకుల వద్ద సమాధి చేయబడినాడు. దావీదు పూర్వీకుల సమాధులున్న కొండమీద ప్రజలు హిజ్కియాను సమాధి చేశారు. హిజ్కియా చనిపోయినప్పుడు యూదా ప్రజలందరు, మరియు యెరూషలేములో నివసిస్తున్నవారు అతనికి ఘనంగా నివాళులర్పించారు. హిజ్కియా స్థానంలో మనష్షే కొత్త రాజయ్యాడు. మనష్షే హిజ్కియా కుమారుడు.
2CH 33:1 మనష్షే యూదా రాజయ్యేనాటికి పన్నెండు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబైయైదు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు.
2CH 33:2 యెహోవా దృష్టికి చెడ్డవైన పనులన్నీ మనష్షే చేశాడు. అన్యదేశాల వారి భయంకరమైన, పాప భూయిష్టమైన ఆచారాలన్నిటినీ అతడు అనుసరించాడు. ఆ రాజ్యాల వారిని ఇశ్రాయేలీయుల ఎదుటనుండి యెహోవా బయటకు వెడల గొట్టినాడు.
2CH 33:3 తన తండ్రి హిజ్కియా తొలగించిన ఉన్నత స్థలాలన్నీ మనష్షే మళ్లీ నిర్మించాడు. బయలు దేవతలకు పూజా పీఠాలను, అషేరా దేవతా స్తంభాలను మనష్షే నిర్మించాడు. నక్షత్ర మండలాలకు ప్రణమిల్ల, వాటిని అతడు ఆరాధించాడు.
2CH 33:4 యెహోవా ఆలయంలో బూటకపు దేవతలకు మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. కాని “నా నామము యెరూషలేములో శాశ్వతంగా వుంటుంది” అని యెహోవా తన ఆలయ విషయంలో చెప్పియున్నాడు.
2CH 33:5 రెండు ఆలయ ఖాళీ స్థలాలలోను ప్రతి నక్షత్ర మండలానికి ఒక్కొక్కటి చొప్పున మనష్షే బలిపీఠాలను నిర్మించాడు.
2CH 33:6 బెన్‌హిన్నోము లోయలో మనష్షే తన స్వంత పిల్లలను కూడ దేవతలకు బలియిచ్చాడు. మనష్షే భవిష్యత్తును తెలిసికోవటానికి మంత్రతంత్ర విద్యలను ఆశ్రయించి, సోది చెప్పు వారిని, చిల్లంగి వాండ్రను సంప్రదించాడు. కర్ణపిశాచి విద్యలను పాటించే వారిని సోదిచెప్పు వారిని ప్రోత్సహించి వారి సలహాలు తీసికొన్నాడు. దేవుని దృష్టిలో చాలా హేయమైన పనులు చేశాడు. మనష్షే పాపాలు యెహోవాకు కోపం వచ్చేటట్లు చేశాయి.
2CH 33:7 అతడు ఒక దేవతా విగ్రహాన్ని కూడ చేయించి దానిని ఆలయంలో నెలకొల్పాడు. ఈ ఆలయాన్ని గురించి యెహోవా దావీదుకు అతని కుమారుడు. సొలొమోనుకు యిలా చెప్పినాడు: “ఈ ఆలయంలోను, యెరూషలేములోను నా నామమును స్థిరంగా ప్రతిష్టించుతాను. ఇశ్రాయేలు కుటుంబాల వారుంటున్న స్థానములన్నిటిలోను నేను యెరూషలేమును ఎంపిక చేసికొన్నాను.
2CH 33:8 ఇశ్రాయేలీయుల పూర్వీకులకు యివ్వడానికి నిశ్చయించిన ఈ రాజ్యంనుండి మరెన్నడూ నేను వారిని బయటకు వెళ్ల గొట్టను. కాని వారికి నేను ఆజ్ఞాపించిన విషయాలన్నిటినీ వారు తప్పక పాటించాలి. ఇశ్రాయేలు ప్రజలకు అందజేయమని నేను మోషేకు ఇచ్చిన ధర్మాశాస్త్రాన్ని, నియమ నిబంధనలను, ఆజ్ఞలను వారు తప్పక అనుపరించాలి.”
2CH 33:9 యూదా ప్రజలను, యెరూషలేము వాసులను తప్పుడు పనులు చేయటానికి మనష్షే ప్రోత్సహించాడు. ఇశ్రాయేలీయుల ముందు నుండి యెహోవా చేత బలవంతంగా వెళ్లగొట్టబడి నాశనం గావింపబడిన వారి కంటె వారు ఎక్కువ పాపాలు చేశారు.
2CH 33:10 యెహోవా మనష్షేతోను, అతని ప్రజలతోను మాట్లాడినాడుగాని, వారు దేవుని మాట వినటానికి నిరాకరించారు.
2CH 33:11 అందువల్ల అష్షూరు రాజు సైన్యాధికారులను యూదాపై దండెత్తటానికి యెహోవా రప్పించాడు. ఆ అధికారులు మనష్షేను పట్టుకుని, అతనికి సంకెళ్లు వేశారు. మనష్షే చేతులకు వారు ఇత్తడి గొలుసులు తగిలించారు. వారతనిని బందీగా బబులోనుకు పట్టుకుపోయారు.
2CH 33:12 మనష్షే చాలా బాధ అనుభవించాడు. ఆ సమయంలో తన దేవుడగు యెహోవాను వేడుకున్నాడు. తన పితరుల దేవుని ముందర మనష్షే మిక్కిలి విధేయుడైనాడు
2CH 33:13 మనష్షే దేవునికి ప్రార్థన చేసి, తనకు సహాయపడమని వేడుకున్నాడు. యెహోవా మనష్షే మనవి ఆలకించి, అతని విషయంలో బాధపడినాడు. యెహోవా అతనిని యెరూషలేముకు తిరిగి వచ్చి తన సింహాసనాన్ని మళ్లీ అలకరించేలా చేసినాడు. యెహోవాయే నిజమైన దేవుడని మనష్షే అప్పుడు తెలిసికొన్నాడు.
2CH 33:14 ఇది జరిగిన పిమ్మట మనష్షే, దావీదు నగరానికి బయట ఒక గోడ కట్టించాడు. (కిద్రోను) లోయలో మత్స్యద్వారం ముంగిట నున్న గిహోను నీటి బుగ్గకు పశ్చిమంగా ఈ గోడవుంది. మనష్షే ఈ గోడను ఓపెలు కొండ చుట్టూ కట్టించాడు. ఈ గోడ చాలా ఎత్తుగా కట్టించాడు. పిమ్మట యూదాలో వున్న కోటలన్నిటిలో అతడు సైనికాధికారులను నియమించాడు.
2CH 33:15 ఇతర దేవుళ్ల విగ్రహాలన్నిటినీ మనష్షే తీసి పారవేశాడు. ఆలయంలో వున్న విగ్రహాన్ని అతడు తీసివేశాడు. యెరూషలేములో ఆలయ ప్రాకారం మీద అతను నెలకొల్పిన బలిపీఠాలన్నీ తొలగించాడు. ఆ బలిపీఠాలన్నిటినీ యెరూషలేము నగరంనుండి తీసి బయట పారవేశాడు.
2CH 33:16 పిమ్మట అతడు యెహోవా బలిపీఠాన్ని ప్రతిష్ఠించి దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు సమర్పించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనంగా ఆరాధించుమని మనష్షే యూదా ప్రజలందరికి ఆజ్ఞాపించాడు.
2CH 33:17 ప్రజలు ఉన్నత స్థలాలలో బలులు యివ్వటం కొనసాగించారు గాని వారు అవన్నీ వారి దేవుడగు యెహోవాకే అర్పించారు.
2CH 33:18 మనష్షే చేసిన ఇతర విషయాలు, దేవునికి అతడు చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు దేవుని తరపున దీర్ఘదర్శలు అతనిని గురించి చెప్పిన విషయాలు అన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడినాయి.
2CH 33:19 మనష్షే దేవునికి చేసిన ప్రార్థన, దేవుడు దానిని విన్న విధము, అది విని దేవుడు బాధపడిన విషయములు దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో వ్రాయబడినాయి. మనష్షే తనకు తాను విధేయుడు కాక పూర్వం అతడు చేసిన పాపాలు, పొరపాట్లు, అతను ఎక్కడెక్కడ ఇతర దేవుళ్లకు ఉన్నత స్థలాలు, అషేరా దేవతా స్తంభాలు నిలిపిన విషయాలు దీర్ఘదర్శుల గ్రంథంలో రాయబడ్డాయి.
2CH 33:20 మనష్షే చనిపోయినప్పుడు అతనిని తన పూర్వీకులతోపాటు సమాధిచేశారు. ప్రజలతనిని తన స్వంత రాజ గృహంలోనే సమాధి చేశారు. మనష్షే స్థానంలో ఆమోను కొత్తగా రాజయ్యాడు. ఆమోను మనష్షే కుమారుడు.
2CH 33:21 యూదాకు రాజయ్యేనాటికి ఆమోను ఇరువదిరెండేండ్లవాడు. యెరూషలేములో అతడు రెండేండ్లపాటు రాజుగా ఉన్నాడు.
2CH 33:22 దేవుని సన్నిధిలో ఆమోను అన్నీ నీచకార్యాలే చేశాడు. తన తండ్రి మనష్షే చేసిన విధంగా, దేవుడు అతని నుండి ఆశించిన పవిత్ర కార్యాలేవీ ఆమోను చేయలేదు. తన తండ్రి మనష్షే చేయించి వుంచిన చెక్కడపు (నగిషీ) బొమ్మల విగ్రహాలకు ఆమోను బలులు అర్పించాడు. ఆమోను ఆ విగ్రహాలను ఆరాధించాడు.
2CH 33:23 తన తండ్రి మనష్షే పరివర్తన చెందినట్లు, ఆమోను దేవుని ముందు వీధేయుడై మెలగలేదు. పైగా ఆమోను రోజు రోజుకు మరింత పాపం చేయసాగాడు.
2CH 33:24 ఆమోను సేవకులు అతనిపై కుట్రపన్నారు. వారు ఆమోనును అతని స్వంత ఇంటిలోనే హత్యచేశారు.
2CH 33:25 కాని యూదా ప్రజలు రాజైన ఆమోనుపై కుట్ర పన్నిన సేవకులందరీని చంపివేశారు. తరువాత ప్రజలు కొత్త రాజుగా యోషీయాను ఎంపిక చేశారు. యోషీయా ఆమోను కుమారుడు.
2CH 34:1 యోషీయా రాజయ్యేనాటికి ఎనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ముప్పై యొక్క సంవత్సరాలు రాజుగా వున్నాడు.
2CH 34:2 ఏది న్యాయమైనదో అది యోషీయా చేశాడు. యెహోవా చేయుమని చెప్పినవన్నీ అతడు చేశాడు. తన పూర్వీకుడైన దావీదువలె అతడు మంచి కార్యాలు చేశాడు. యోషీయా మంచిపనులు చేయటానికి ఎన్నడూ వెనుకాడలేదు.
2CH 34:3 యోషీయా రాజైన పిమ్మట ఎనిమిదవ సంవత్సరం నుండి తన పూర్వీకుడైన దావీదు కొలిచిన దేవుడినే ఆరాధించాడు. దేవుని అనుసరించే నాటికి యోషీయా ఇంకా చిన్నవాడే. రాజుగా యోషీయా పన్నెండవ సంవత్సరంలో వుండగా యూదా, యెరూషలేములలో వున్న ఉన్నత స్థలాలను, అషేరా దేవతా స్తంభాలను, చెక్కిన, పోతపోసిన విగ్రహాలను నాశనం చేయటం మొదలు పెట్టాడు.
2CH 34:4 బయలు దేవతలకు నిర్మించిన బలిపీఠాలన్నిటినీ ప్రజలు పగులగొట్టారు. వారీపని యోషీయా ఎదుటనే చేశారు. ప్రజలకు అందనంత ఎత్తుగా వున్న ధూప పీఠాలను పిమ్మట యోషీయా పడగొట్టాడు. చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను అతడు పగులగొట్టాడు. అతడా విగ్రహాలన్నిటినీ చూర్ణం చేశాడు. తరువాత యోషీయా ఆ చూర్ణాన్ని బయలుదేవతలను ఆరాధించి, బలులు అర్పించిన వారి సమాధులపై చల్లాడు.
2CH 34:5 బయలు దేవతలకు సేవ చేసిన యాజకుల ఎముకలను ఆ బలిపీఠాలపైనే యోషీయా కాల్చినాడు. ఈ రకంగా యోషీయా యూదాలోను, యెరూషలేములోను విగ్రహాలను, విగ్రహారాధనను తుడిచివేశాడు.
2CH 34:6 మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశాలలో వున్న పట్టణాలలోను, నఫ్తాలి వరకుగల పట్టణాలలో కూడ యోషీయా ఇదేరకంగా చేశాడు. పట్టణాల పరిసరాలలో వున్న పాడుబడ్డ ప్రదేశాలలో కూడ అతడీ పని చేశాడు.
2CH 34:7 యోషీయా పీఠాలన్నీ పగులగొట్టి, అషేరా దేవతా స్తంభాలను పడగొట్టినాడు. విగ్రహాలన్నిటినీ పిండి పిండిగా గొట్టాడు. ఇశ్రాయేలులో బయలు దేవతలకు నిర్మించిన ధూప పీఠాలన్నిటినీ అతడు పగులగొట్టాడు. పిమ్మట యోషీయా యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
2CH 34:8 యోషీయా తన యూదా రాజ్యపాలనలో పదునెనిమిదవయేట షాఫాను, మయశేయా, మరియు యోవాహును పాడవుతున్న యెహోవా ఆలయాన్ని పునరుద్ధరించటానికి పంపాడు. షాఫాను తండ్రిపేరు అజల్యా. మయశేయా నగర పాలకుడు. యోవాహు తండ్రిపేరు యోహాహాజు. యోవాహు లేఖికుడు. జరిగిన వృత్తాంతములన్నిటినీ సేకరించి పుస్తకములో ఎక్కించువాడు. యోషీయా ఆలయాన్ని పునరుద్ధరించి యూదాను, యెరూషలేమును మళ్లీ పవిత్ర పర్చటానికి పూనుకొన్నాడు. ఆమేరకు ఆజ్ఞలు ఇచ్చాడు.
2CH 34:9 ప్రధాన యాజకుడు హిల్కీయా వద్దకు వారు వచ్చారు. ప్రజలు ఆలయానికి ఇచ్చిన కానుకల ధనాన్ని వారు హిల్కీయాకు ఇచ్చారు. ద్వారపాలకులుగా ఉన్న లేవీయులు ఈ ధనాన్ని మనష్షే ఎఫ్రాయిము ప్రజల నుండి మరియు దేశంలో ఇంకను మిగిలియున్న ఇశ్రాయేలీయుల వద్దనుండి సేకరించారు. ఈ ధనాన్ని వారు యూదా, బెన్యామీను ప్రజల నుండి యెరూషలేము ప్రజల నుండి కూడ సేకరించారు.
2CH 34:10 ఆలయపు పనిని పర్యవేక్షించే ఉద్యోగులకు వారు ఈ ధనాన్ని ఇచ్చారు. ఈ అధికారులు ధనాన్ని తిరిగి ఆలయాన్ని తిరిగి కడుతున్న పనివారికి చెల్లించారు.
2CH 34:11 ఆ ధనాన్ని వారు వడ్రంగులకు, శిల్పులకు, చెక్కిన రాళ్లను, కలపను కొనటానికి ఇచ్చారు. భవనాలను తిరిగి నిర్మించటానికి, భవనాలకు కావలసిన దూలాలు తయారు చేయటానికి, ఈ కలపను వినియోగించారు. ఆలయ భవనాల విషయంలో యూదా రాజులు గతంలో తగిన శ్రద్ధ వహించలేదు. ఆ భవనాలన్నీ పాతవై శిధిలాలవస్థలో వున్నాయి.
2CH 34:12 పనివారంతా విశ్వాసంగా పనిచేశారు. వారిపై తనిఖీ అధికారుల పేర్లు యహతు, ఓబద్యా. యహతు, ఓబద్యా లిరువురూ లేవీయులు. వారు మెరారీ వంశీయులు. మిగతా పర్యవేక్షకులు జెకర్యా మరియు మెషుల్లాము. వారు కహాతీయులు. సంగీత వాద్య విశేషములను వాయించుటలో నేర్పురులైన లేవీయులు కూడా బరువులు మోసే కూలీల మీద, ఇతర పనివారిమీద తనిఖీ దారులుగా పనిచేశారు. మరికొందరు లేవీయులు కార్యదర్శులుగాను, అధికారులుగాను, ద్వారపాలకులు గాను పనిచేశారు.
2CH 34:14 ఆలయంలో వున్న ధనాన్ని లేవీయులు బయటకు తెచ్చారు. ఆ సమయంలో యాజకుడగు హిల్కీయా ప్రభువైన యెహోవా మోషేద్వారా అందజేసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు.
2CH 34:15 హిల్కీయా కార్యదర్శియగు షాఫానుతో, “ఆలయంలో నేను ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నా” నని చెప్పాడు. హిల్కీయా గ్రంథాన్ని షాఫానుకు ఇచ్చాడు.
2CH 34:16 షాఫాను ఆ గ్రంథాన్ని రాజైన యోషీయా వద్దకు తెచ్చాడు. షాఫాను రాజు వద్దకు వచ్చి ఆలయ పనిపై తన నివేదిక ఈ విధంగా సమర్పించాడు: “మీ సేవకులు మీరు చెప్పిన విధంగా పని కొనసాగిస్తున్నారు.
2CH 34:17 వారు ఆలయంలోవున్న ధనాన్ని తీసి పనిమీద తనిఖీదారులకు, పనివారికి చెల్లిస్తున్నారు.”
2CH 34:18 తరువాత షాఫాను రాజైన యోషీయాతో, “యాజకుడగు హిల్కీయా నాకొక గ్రంథమిచ్చాడు” అని చెప్పాడు. పిమ్మట షాఫాను ఆ గ్రంథం నుండి రాజుముందు చదవటం మొదలుపెట్టాడు.
2CH 34:19 రాజైన యోషీయా ధర్మశాస్త్ర విషయాలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు.
2CH 34:20 తరువాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడు అహీకాముకు, మీకా కుమారుడు అబ్దోనుకు, కార్యదర్శి షాఫాను మరియు సేవకుడైన ఆశాయాకును ఒక ఆజ్ఞ యిచ్చాడు.
2CH 34:21 రాజు యిలా చెప్పాడు: “మీరు వెళ్లి నా తరుపున ఇశ్రాయేలులోను, యూదాలోను మిగిలివున్న ప్రజల తరపున యెహోవాను మనకు దొరికిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విషయాలను గురించి అడగండి. మన పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించని కారణంగా ఆయన మనపట్ల ఎక్కువ కోపంగా వున్నాడు. ఈ గ్రంథం బోధించిన విషయాలను వారు పాటించలేదు!”
2CH 34:22 హిల్కీయా, రాజసేవకులు కలిసి ప్రవాదినిహుల్దా వద్దకు వెళ్లారు. హుల్దా, షల్లూము భార్య. షల్లూము తాఖతు (తిక్వా) కుమారుడు. తాఖతు హస్రహూ (హస్రా) యొక్క కుమారుడు. హర్హహు (హస్రా) రాజవస్త్రాల విషయంలో శ్రద్ధ తీసికొనే అధికారి. హుల్దా క్రొత్త యెరూషలేములో నివసిస్తూ వుండేది. హిల్కీయా, రాజ సేవకులు జరిగిన సంగతంతా హుల్దాకు తెలిపారు.
2CH 34:23 హుల్దా వారితో యిలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా యిలా తెలియజేస్తున్నాడు రాజైన యోషీయాకు తెలియజేయుము.
2CH 34:24 యెహోవా యిలా చెప్పుచున్నాడు: ‘ఈ ప్రదేశానికి, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు నేను కష్టాలు తెచ్చి పెడతాను. యూదా రాజు ముందర చదివిన పుస్తకంలో వ్రాసిన విధంగా భయంకర పరిస్థితులు తీసికొని వస్తాను.
2CH 34:25 ఇలా ఎందుకు చేస్తాననగా ప్రజలు నన్ను వదిలి అన్య దేవతలకు ధూపం వేయసాగారు. వారు చేసిన నీచ కార్యాలన్నిటితో వారు నాకు కోపం కలుగజేశారు. అందువల్ల ఈ ప్రదేశం మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను. బడబాగ్నిలా నా కోపం చల్లారదు!’
2CH 34:26 “కాని ఈ విషయం యూదా రాజైన యోషీయాకు చెప్పండి. దేవుని అడుగమని అతడు మిమ్మల్ని పంపాడు. ఇంతకు ముందు మీరు విన్న విషయాలపై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు:
2CH 34:27 ‘యోషీయా, నీవు పశ్చాత్తాప పడినావు. నిన్ను నీవు తగ్గించుకొని, నీ దుస్తులు చింపుకున్నావు. నాముందు నీవు విలపించావు. నీ హృదయం మారినది గనుక,
2CH 34:28 నేను నిన్ను నీ పూర్వీకుల వద్దకు తీసుకొని వెళతాను. నీవు నీ సమాధికి ప్రశాంతంగా వెళతావు. ఈ ప్రాంతం మీదికి, ఇక్కడ నివసించే ప్రజల మీదికి నేను రప్పించే గొప్ప నాశనం నీవు చూడవు.’” హిల్కీయా మరియు రాజు సేవకులు ఈ సందేశాన్ని రాజైన యోషీయాకు. అందజేశారు.
2CH 34:29 రాజైన యోషీయా యూదా, యెరూషలేము పెద్దలందరినీ తనను వచ్చి కలవమని పిలిచాడు.
2CH 34:30 రాజు యోహోవా ఆలయానికి వెళ్ళాడు. యూదా ప్రజలందరు, యెరూషలేము వాసులు, యాజకులు, లేవీయులు, ప్రముఖులు, సామాన్య ప్రజానీకం అంతా యోషీయావద్దకు వచ్చారు. ఒడంబడిక గ్రంథంలో వున్న విషయాలన్నీ యోషీయా ప్రజలకు చదివి వినిపించాడు. ఆ గ్రంథం ఆలయంలో దొరికింది.
2CH 34:31 తరువాత రాజు తన స్థానంలో లేచి నిలబడినాడు. అతడు యెహోవాతో ఒక ఒడంబడిక చేసికొన్నాడు. యెహోవాను అనుసరించటానికి, ఆయన ఆజ్ఞలు, ధర్మాశాస్త్రాన్ని నియమాలను పాటించటానికి అతడు అంగీకరించాడు. హృదయపూర్వకంగా, ఆత్మ పూర్వకంగా అనుసరించటానికి యోషీయా అంగీకరించాడు. ఈ గ్రంథంలో వ్రాసిన ఒడంబడికలోని అంశాలను పాటించటానికి యోషీయో అంగీకరించాడు.
2CH 34:32 పిమ్మట యెరూషలేము, బెన్యామీను ప్రజలందరూ ఈ ఒడంబడికను అంగీకరించేలా వారిచే యోషియా ప్రమాణం చేయించాడు. తమ పూర్వీకులు విధేయులైవున్న దేవుని ఒడంబడికకు యెరూషలేము ప్రజలు బద్ధులయ్యారు.
2CH 34:33 పైగా ఇశ్రాయేలీయులకు సంబంధించిన స్థలాలలో వున్న విగ్రహాలన్నిటినీ యోషీయా తీసిపారవేశాడు. దేవుడు ఆ విగ్రహాలను అసహ్యించు కున్నాడు. యోషీయా రాజు ఇశ్రాయేలులో ప్రతి ఒక్కడిని వారి దేవుడగు యెహోవాను ఆరాధించునట్లు చేసెను. యోషీయా జీవించినంతకాలం ప్రజలు తమ పూర్వీకుల దేవుడగు యెహోవాను ఆరాధించటం మానలేదు.
2CH 35:1 యెరూషలేములో యెహోవాకు యోషీయా రాజు పస్కా పండుగ జరిపించాడు. మొదటి నెలలో పదునాల్గవ రోజున పస్కా గొఱెపిల్ల చంపబడింది.
2CH 35:2 వారివారి విధులు నిర్వర్తించటానికి యోషీయా యాజకులను ఎన్నుకొన్నాడు. ఆలయంలో సేవ చేస్తున్నప్పుడు యాజకులను యోషీయా ఉత్సాహపర్చాడు.
2CH 35:3 ఇశ్రాయేలు ప్రజలకు బోధకులుగా వున్నవారితోను, ఆలయంలో సేవ చేయటానికి పవిత్రులైన లేవీయులతోను, యోషీయా మాట్లాడినాడు. ఆ లేవీయులతో అతడిలా అన్నాడు: “సొలొమోను నిర్మించిన ఆలయంలో పవిత్ర పెట్టెను వుంచండి. సొలొమోను దావీదు కుమారుడు. దావీదు ఇశ్రాయేలు రాజు. పవిత్ర పెట్టెను ఇక మీరు మీభుజాల మీద ఒకచోటు నుండి మరియొక చోటికి మోయవద్దు. మీ దేవుడైన యెహోవాకు ఇప్పుడు మీరు సేవ చేయండి. దేవుని ప్రజలగు ఇశ్రాయేలీయులకు సేవ చేయండి.
2CH 35:4 మీమీ వంశాల ప్రకారం ఆలయంలో సేవచేయటానికి సిద్ధమవ్వండి. రాజైన దావీదు, అతని కుమారుడు రాజైన సొలొమోను మీరు చేయాలని చెప్పిన పనులను మీరు చేయండి.
2CH 35:5 కొంత మంది లేవీయులు పవిత్రస్థలంలో నిలబడాలి. ప్రజలలో ప్రతి వంశంవారికి సహాయపడే నిమిత్తం, మీరలా నిలబడండి.
2CH 35:6 పస్కా గొఱెపిల్లను వధించి యెహోవా సేవకు మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసికొనండి. మీ సోదరులైన ఇశ్రాయేలీయుల కొరకు గొఱెపిల్లలను సిద్ధం చేయండి. యెహోవా మనలను ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించండి. యెహోవా తన ధర్మాన్ని మోషేద్వారా మనకు ప్రసాదించాడు.”
2CH 35:7 పస్కా బలులుగా అర్పించేటందుకు ఇశ్రాయేలు ప్రజలకు యోషీయా ముప్పైవేల గొఱ్ఱెలను ఇచ్చాడు. ప్రజలకు అతడింకా మూడువేల పశువులను కూడా ఇచ్చాడు. ఈ జంతువులన్నీ రాజైన యోషీయా పశుసంపద నుండి ఇవ్వబడినాయి.
2CH 35:8 పస్కా పండుగలో వినియోగించే నిమిత్తం ప్రజలకు, యాజకులకు, లేవీయులకు జంతువులను, ఇతర వస్తువులను కూడా యోషీయా అధికారులు ఉదారంగా ఇచ్చారు. ప్రధాన యాజకుడు హిల్కీయా, జెకర్యా, యెహీయేలు అనువారు ఆలయ నిర్వహణాధికారులు. వారు యాజకులకు పస్కాబలుల నిమిత్తం రెండువేల ఆరువందల గొఱ్ఱె పిల్లలను, మేకలను, మరియు మూడువందల గిత్తలను ఇచ్చారు.
2CH 35:9 పైగా కొనన్యా, అతని సోదరులు షెమయా మరియు నెతనేలు, మరియు హషబ్యా, యెహీయేలు, యోజాబాదు లేవీయులకు పస్కా బలులకుగాను ఐదువందల గొఱ్ఱెలను, మేకలను, మరియు ఐదువందల కోడె దూడలను ఇచ్చారు. వారంతా లేవీయుల పెద్దలు.
2CH 35:10 పస్కా సేవ ప్రారంభానికి సమస్తము సిద్ధం చేయబడిన తరువాత యాజకులు, లేవీయులు వారి వారి నియమిత స్థానాలకు వెళ్లారు. రాజు ఆమేరకు వారిని ఆజ్ఞాపించాడు.
2CH 35:11 పస్కా గొఱ్ఱె పిల్లలు చంపబడ్డాయి. తరువాత లేవీయులు ఆ జంతువుల చర్మాలను ఒలిచి, వాటి రక్తాన్ని యాజకులకు ఇచ్చారు. యాజకులు రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు.
2CH 35:12 పిమ్మట బలియిచ్చిన ఆ జంతువులను దహనబలులకుగాను వివిధ వంశాల వారికి యిచ్చారు. మోషే ధర్మశాస్త్రం నిర్దేశించిన విధంగా దహనబలులు జరగటానికే ఇది ఈ విధంగా చేయబడింది.
2CH 35:13 లేవీయులు పస్కా బలుల మాంసాన్ని ధర్మశాస్త్ర ప్రకారం అగ్నిలో కాల్చారు. పవిత్ర అర్పణలను వారు కుండలలోను, పాత్రలలోను, పెనముల మీద వుడకబెట్టారు. వారు తక్షణమే ఆ మాంసాన్ని ప్రజలకు పంచిపెట్టారు.
2CH 35:14 ఇది జరిగిన తరువాత లేవీయులు, అహరోను సంతతి యాజకులు తమ వంతు మంసాన్ని తీసుకున్నారు. ఆ యాజకులు చీకటి పడేవరకు పనిలో నిమగ్నమయ్యారు. దహనబలి మంసాన్ని అర్పణల కొవ్వును కాల్చడంలో వారు కష్టపడి పనిచేశారు.
2CH 35:15 రాజైన దావీదు నిర్ణయించిన స్థలంలో ఆసాపు వంశీయులగు లేవీ గాయకులు నిలబడ్డారు. వారు ఆసాపు, హేమాను, మరియు రాజు యొక్క ప్రవక్త యెదూతూను. ప్రతిద్వారం వద్ద నున్న ద్వారపాలకులు తమ తమ స్థానాలు వదలవలసిన అవసరం లేకుండ వారి సోదరులగు లేవీయులు అన్నీ సిద్ధంచేసి వారి పస్కా అవసరాలన్నీ తీర్చారు.
2CH 35:16 రాజైన యోషీయా ఆజ్ఞాపించిన విధంగా ఆరోజు యెహోవా ఆరాధనకు సమస్తం ఏర్పాటు చేయబడింది. పస్కా పండుగ జరుపబడింది. యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించబడ్డాయి.
2CH 35:17 అక్కడున్న ఇశ్రాయేలీయులంతా పస్కాను, పులియని రొట్టెల పండుగను ఏడు రోజులపాటు జరుపుకున్నారు.
2CH 35:18 ప్రవక్తయగు సమూయేలు జీవించియున్న కాలంనుండి ఈ రకంగా పస్కా పండుగ జరుప బడలేదు! ఇశ్రాయేలు రాజులలో ఏ ఒక్కడు గతంలో ఇంత ఘనంగా పస్కాపండుగ జరుపలేదు. రాజైన యోషీయా, యాజకులు, లేవీయులు, అక్కడున్న యూదా మరియు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము వాసులతో కలిసి పస్కా పండుగను ఘనంగా ఒక ప్రత్యేక పద్ధతిలో జరిపారు.
2CH 35:19 యోషీయా రాజ్యపాలనలో పదునెనిమిదవ సంవత్సరం గడుస్తూ వున్నప్పుడు ఈ పస్కా పండుగ జరుపబడింది.
2CH 35:20 యోషీయా ఆలయం విషయంలో ఈ మంచి పనులన్నీ చేసిన పిమ్మట రాజైన నెకో యూఫ్రటీసు నదీతీర పట్టణమైన కర్కెమీషు మీదికి దండెత్తి వచ్చాడు. నెకో ఈజిప్టు రాజు. రాజైన యోషీయా నెకోను ఎదిరించటానికి బయలుదేరి వెళ్లాడు.
2CH 35:21 కాని నెకో యోషీయా వద్దకు దూతలను పంపాడు. వారు యిలా అన్నారు: “యోషీయా రాజా, ఈ యుద్ధం నీకు సంబంధించినదిగాదు. నేను నీమీద యుద్ధానికి రాలేదు. నేను నా శత్రువుతో పోరాడటానికి వచ్చాను. దేవుడు నన్ను తొందరచేసి పంపినాడు. దేవుడు నా పక్షాన వున్నాడు. కావున నీవు అనవసరమైన శ్రమ తీసుకోవద్దు. నీవు గనుక నాతో యుద్ధం చేస్తే. దేవుడు నిన్ను నాశనం చేస్తాడు!”
2CH 35:22 కాని యోషీయా వెళ్లి పోలేదు. అతడు నెకోతో యుద్ధం చేయటానికే నిశ్చయించాడు. అందువల్ల అతడు తన వేషం మార్చుకొని యుద్ధానికి వెళ్లాడు. దేవుని ఆజ్ఞ విషయంలో నెకో చెప్పిన దానిని యోషీయా వినటానికి నిరాకరించాడు. మెగిద్దో మైదానంలో యుద్ధం చేయటానికి యోషీయా వెళ్లాడు.
2CH 35:23 రాజైన యోషీయా యుద్ధంలో వుండగా, అతడు బాణాలతో కొట్టబడ్డాడు. అతడు తన సేవకులతో, “నన్ను దూరంగా తీసుకొని వెళ్లండి. నేను తీవ్రంగా గాయపడ్డాను!” అని చెప్పాడు.
2CH 35:24 దానితో అతని సేవకులు యోషీయాను అతని రథం నుండి దించి తనతో యుద్ధరంగానికి తెచ్చిన మరియొక రథంలో అతనిని వుంచారు. వారు యోషీయాను యెరూషలేముకు తీసికొని వచ్చారు. రాజైన యోషీయా యెరూషలేములో చనిపోయాడు. తన పూర్వీకులు వుంచబడిన సమాధులలోనే యోషీయా సమాధి చేయబడినాడు. యోషీయా చనిపోయినందుకు యూదా, యెరూషలేము ప్రజలంతా చాలా దుఃఖించారు.
2CH 35:25 యోషీయాపై యిర్మీయా కొన్ని ప్రగాఢ విలాపగీతికులు వ్రాశాడు. ఆ విలాపగీతాలు ఆలపిస్తూ స్త్రీ పురుష గాయకులు ఈనాటికీ యోషీయాను తలచుకొని గౌరవిస్తారు. యోషీయాను తలుస్తూ ఒక విలాపగీతం ఆలపించటం ఇశ్రాయేలీయులకు వాడుక అయ్యింది. ఆ గీతికలు విలాప వాక్య ములలో పొందుపర్చబడినాయి.
2CH 35:26 తాను రాజుగా వున్న కాలంలో యోషీయా మొదటినుండి తన పాలన అంతం అయ్యే వరకు చేసిన ఇతర కార్యములన్నీ ఇశ్రాయేలు, యుదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడినాయి. ఆ గ్రంథం యెహోవాపట్ల అతనికున్న ప్రేమ, యెహోవా ధర్మశాస్త్రాన్ని అతను అనుసరించిన తీరును తెలియజేస్తుంది.
2CH 36:1 యెరూషలేములో కొత్త రాజుగా యూదా ప్రజలు యెహోయాహాజును ఎన్నుకొన్నారు. యెహోయాహాజు యోషీయా కుమారుడు.
2CH 36:2 యుదాకు రాజయ్యేనాటికి యెహోయాహాజు ఇరువది మూడేండ్లవాడు. అతడు యెరూషలేములో మూడు నెలలపాటు రాజుగా వున్నాడు.
2CH 36:3 పిమ్మట ఈజిప్టు రాజైన నెకో యెహోయాహాజును బందీగా పట్టుకున్నాడు. నెకో యూదా ప్రజలను రెండువందల మణుగుల (మూడు ముప్పావు టన్నులు) వెండిని, రెండు మణుగుల (డెబ్బదియైదు పౌనులు) బంగారాన్ని అపరాధ రుసుముగా చెల్లించేలా చేశాడు.
2CH 36:4 యెహోయాహాజు సోదరుని యూదా, యెరూషలేములపై నూతన రాజుగా నెకో నియమించాడు. యెహోయాహాజు సోదరుని పేరు ఎల్యాకీము. పిమ్మట ఎల్యాకీముకు నెకో ఒక క్రొత్త పేరు పెట్టాడు. అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టాడు. కాని యెహోయాహాజును నెకో ఈజిప్టుకు తీసికొని వెళ్లాడు.
2CH 36:5 యూదాకు కొత్త రాజయ్యేనాటికి యెహోయాకీము ఇరువదియైదేండ్లవాడు. యెహోవా కోరిన విధంగా యెహోయాకీము ధ ర్మంగా ప్రవర్తించలేదు. దేవుడైన యెహోవా పట్ల అతడు పాపం చేశాడు.
2CH 36:6 బబులోను (బాబిలోనియా) రాజైననెబుకద్నెజరు యూదాపై దండెత్తి వచ్చాడు. అతడు యెహోయాకీమును బందీగాచేసి అతనికి కంచు గొలుసులు తగిలించాడు. తరువాత యెహోయాకీముమును నెబుకద్నెజరు బబులోనుకు తీసికొని వెళ్లాడు.
2CH 36:7 యెహోవా ఆలయం నుండి నెబుకద్నెజరు కొన్ని వస్తువులను దోచుకుపోయాడు. అతడా వస్తువులను బబులోనుకు పట్టుకుపోయి వాటిని తన స్వంత ఇల్లయిన రాజగృహంలో వుంచాడు.
2CH 36:8 యెహోవాయాకీము చేసిన ఇతర విషయాలు, అతడు చేసిన భయంకరమైన పాపాలు, మరియు అతనిని దోషిగా నిరూపించే అతని ప్రతి కార్యం గురించి ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. యెహోయాకీము స్థానంలో అతని కుమారుడు యెహోయాకీను కొత్తగా రాజయ్యాడు.
2CH 36:9 యూదాకు రాజయ్యేనాటికి యెహోయాకీను పద్దెనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో మూడు నెలల పది రోజులు రాజుగా వున్నాడు. యెహోవా కోరిన విధంగా అతడు తన కార్యాలను నిర్వర్తించలేదు. యెహోవా పట్ల యెహోయాకీను పాపం చేశాడు.
2CH 36:10 వసంత ఋతువులో యెహోయాకీనును పట్టి తెమ్మని రాజైన నెబకద్నెజరు తన మనుష్యులను పంపాడు. వారు యెహోయాకీనును, యెహోవా ఆలయం నుండి కొన్ని ధనరాసులను బబులోనుకు తెచ్చారు. యూదా, యెరూషలేములకు నూతన రాజుగా సిద్కియాను నెబకద్నెజరు నియమించాడు. సిద్కియా అనువాడు యెహోయాకీనుకు బంధువు.
2CH 36:11 యూదాకు రాజుయ్యేనాటికి సిద్కియా ఇరువైఒక సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో పద కొండు సంవత్సరాలు రాజుగా వున్నాడు.
2CH 36:12 యెహోవా కోరినట్లు సిద్కియా ఉత్తమ కార్యాలు చేయలేదు. యెహోవా పట్ల సిద్కియా పాపం చేశాడు. దేవుని ముందు అతడు వినయ విధేయతలు చూపించలేదు. ప్రవక్త యిర్మీయా చెప్పిన విషయాలను పాటించలేదు. యెహోవా సందేశాన్ని యిర్మీయా ప్రవచించాడు.
2CH 36:13 రాజైన నెబుకద్నెజరుపై సిద్కియా తిరుగుబాటు చేశాడు. గతంలో నెబుకద్నెజరుకు విశ్వాసంగా వుంటానని సిద్కియాతో బలవంతంగా నెబుకద్నెజరు ప్రమాణం చేయించాడు. నెబుకద్నెజరుకు విశ్వాసంగా వుంటానని సిద్కియా దేవుని మీద ప్రమాణం చేశాడు. కాని సిద్కియా తన జీవన విధానం మార్చుకొని, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా మాటవిని, ఆయనకు విధేయుడైయుండటానికి నిరాకరించి మొండి వైఖరి దాల్చాడు.
2CH 36:14 యాజకుల నాయకులు, యూదా ప్రజల నాయకులంతా కూడా మరీ ఎక్కువ పాపం చేసి, యెహోవాకు విశ్వాస ఘాతకులయ్యారు. వారు అన్యదేశీయుల చెడు మార్గాన్నే అనుసరించారు. ఆ నాయకులంతా యెహోవా ఆలయాన్ని అపవిత్రపర్చి పాడుచేశారు. యెరూషలేములో ఆలయాన్ని యెహోవా పవి త్రపర్చాడు.
2CH 36:15 తమ పూర్వీకుల దేవుడగు యెహోవా తన ప్రజలను హెచ్చిరించటానికి అనేక పర్యాయములు ప్రవక్తలను పంపినాడు. తన ప్రజలపట్ల, తన ఆలయంపట్ల సానుభూతిగలవాడుగుటచే యెహోవా అలా చేస్తూ వచ్చాడు. యెహోవా తన ప్రజలనుగాని, తన ఆలయాన్నిగాని నాశనం చేయదల్చలేదు.
2CH 36:16 కాని దేవుని యొక్క ప్రజలే దేవుడు పంపిన ప్రవక్తలను ఎగతాళి చేశారు. వారు ప్రవక్తలు చెప్పేదానిని వినలేదు. వారు దేవుని వర్తమానములను అసహ్యించుకున్నారు. ఆఖరికి దేవుడు తన కోపాన్ని ఎంత మాత్రమూ ఆపుకోలేకపోయాడు. దేవుడు తన ప్రజలపట్ల కోపపడ్డాడు. ఆ కోపాన్ని ఆపగల శక్తి ఎవరికీ లేదు.
2CH 36:17 అందువల్ల యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు వారి మీదికి బబులోను రాజును రప్పించాడు. బబులోను రాజు యువకులను ఆలయంలో వుండగానే చంపివేశాడు. అతడు యూదా, యెరూషలేము ప్రజలమీద ఏమాత్రమం కనికరం చూపలేదు. బబులోను రాజు యువకులను, వృద్ధలను కూడ చంపివేశాడు. అతడు పురుషులను, స్త్రీలను చంపాడు. రోగులను, ఆరోగ్యవంతులను కూడ చంపివేశాడు. యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు నెబుకద్నెజరుకు అనుమతి ఇచ్చినాడు.
2CH 36:18 ఆలయంలోని వస్తులన్నిటినీ నెబుకద్నెజరు బబులోనుకు పట్టుకుపోయాడు. ఆలయంలోను, రాజువద్ద, రాజు యొక్క అధికారులవద్దగల విలువైన వస్తువులన్నిటినీ అతడు పట్టుకుపోయాడు.
2CH 36:19 నెబుకద్నెజరు, అతని సైన్యం ఆలయాన్ని తగులబెట్టారు. వారు యెరూషలేము గోడను పడగొట్టి రాజుకు, రాజాధికారులకు చెందిన ఇండ్లన్నీ తగులబెట్టారు. ప్రతి విలువైన వస్తువును వారు తీసికొనటం గాని, లేక నాశనం చేయటంగాని చేశారు.
2CH 36:20 చనిపోగా మిగిలిన ప్రజలను నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వెళ్లి బానిసలుగా పనిచేయించాడు. పర్షియా రాజ్యం (పారసీకము) బబులోను రాజాన్ని ఓడించేవరకు ఆ ప్రజలు బబులోనులో బానిసలుగా వుండి పోయారు.
2CH 36:21 ప్రవక్తయగు యిర్మీయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చెప్పిన విషయాలన్నీ ఆ విధంగా సంభవించాయి. యిర్మీయా ద్వారా యెహోవా యిలా చెప్పినాడు: “ఈ ప్రదేశం డెబ్బది యేండ్లపాటు బంజరు భూమిగా మారిపోతుంది. ప్రజలు సబ్బాతు దినాలను పాటించని కారణాన, దానికి పరిహారంగా ఇది జరుగుతుంది.”
2CH 36:22 పర్షియా (పారసీక) రాజు కోరెషు (సైరస్) పాలన మొదటి సంవత్సరంలో ఈ విధంగా జరిగింది. ప్రవక్తయగు యిర్మీయా ద్వారా యెహోవా ప్రకటించిన విషయాలు ఆయన నిజంగా జరిగేలా చేసినాడు. యెహోవా సైరస్ హృదయాన్ని స్పందింపజేసి, అతనిచే ఒక ఆజ్ఞ వ్రాయించి దూతల ద్వారా తన రాజ్యమంతా ప్రకటింపజేసినాడు:
2CH 36:23 పర్షియా రాజైన కోరెషు తెలియజేయున దేమనగా: ఆకాశమందు ప్రభువైన యెహోవా నన్ను ఈ భూమండలానికంతకు రాజుగా చేసినాడు. యెరూషలేములో ఆయనకొక ఆలయం కట్టించే బాధ్యత నాకు అప్పజెప్పినాడు. దేవుని ప్రజలైన మీరంతా ఇప్పుడు యెరూషలేము వెళ్లటానికి స్వేచ్ఛ కలిగియున్నారు. మీ దేవుడైన యెహోవా మీకు తోడై వుండుగాక.
EZR 1:1 పారశీక రాజ్యానికి కోరెషు రాజైన మొదటి సంవత్సరం, యెహోవా కోరెషును ఒక ప్రకటన చేయవలసిందిగా ప్రోత్సహించాడు. కోరెషు ఆ ప్రకటనను వ్రాయించి, తన రాజ్యపు అన్ని ప్రాంతాలలోనూ చదివి వినిపించే ఏర్పాటు చేశాడు. దేవుడు యిర్మీయా నోట పలికించిన యీ సందేశం వాస్తవ రూపం ధరించేందుకు అనువుగా ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన యిలా సాగింది:
EZR 1:2 “పారశీక రాజు కోరెషు తెలియజేసేది ఏమంటే: పరలోకాధిపతి అయిన యెహోవా దేవుడు భూలోకంలోని దేశాలన్నింటినీ నాకు అప్పగించాడు. యూదా దేశంలోని యెరూషలేములో తనకొక ఆలయాన్ని నిర్మించేందుకుగాను యెహోవా నన్ను ఎంచుకున్నాడు.
EZR 1:3 యెరూషలేములో వున్న ఇశ్రాయేలీయుల దేవుడే ప్రభువైన యెహోవా. మీ మధ్య దేవుని మనుష్యులు ఎవరైనా వున్నట్లయితే, వారిని ఆశీర్వదించ వలసిందిగా నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. యూదా దేశంలోని యెరూషలేముకు మీరు వాళ్లని పోనివ్వాలి. మీరు వాళ్లని దేవుని ఆలయాన్ని నిర్మించనివ్వాలి
EZR 1:4 ఇశ్రాయేలీయుల్లో మిగిలివున్నవాళ్లు ఎక్కడైనా ఉన్నట్లయితే, వాళ్లకి అక్కడి ప్రజలు తోడ్పడాలి. ప్రజలు ఆ హతశేషులకు వెంది బంగారాలు, ఆవులు, వగైరాలు ఇవ్వాలి. యెరూషలేములో దేవాలయ నిర్మాణం కోసం వాళ్లకి కానుకలు ఇవ్వాలి.”
EZR 1:5 యూదా, బెన్యామీను వంశానకు చెందిన కుటుంబాల పెద్దలు యెరూషలేముకు పోయేందుకు సన్నద్ధ మయ్యారు. వాళ్లు యెరూషలోములో దేవాలయ నిర్మాణానికి పోసాగారు. వాళ్లే కాకుండా, దేవుడు ప్రేరేపించిన ప్రతి ఒక్క వ్యక్తి యెరూషలేముకు పోయేందుకు సంసిద్ధుడయ్యాడు.
EZR 1:6 వాళ్ల ఇరుగుపొరుగు వారు వాళ్లకి అనేక కానుకలు సమర్పించారు. వెండి బంగారాలు, ఆవులు, ఖరీదైన ఇతర వస్తువులు ఇచ్చారు. ఇరుగు పొరుగువారు వాళ్లకి ఈ కానుకలన్నీ స్వచ్ఛందంగా ఇచ్చారు.
EZR 1:7 పూర్వం నెబుకద్నెజరు యెరూషలేమునందున్న యెహోవా ఆలయానికి చెందిన కొన్ని వస్తువులు కొల్లగొట్టి, వాటిని తన అబద్ధపు దేవతల ఆలయంలో వుంచాడు. వాటిని ఇప్పుడు కోరెషు మహారాజు బయటికి తీయించాడు.
EZR 1:8 పారశీక రాజైన కోరెషు ఆ వస్తుపులను బయటికి తీసుకురమ్మని తన ఖజానాదారుని ఆదేశించాడు. ఆ ఖజానాదారుని పేరు మిత్రిదాతు. మిత్రిదాతు ఆ వస్తువులను బయటికి తీయించి, వాటిని యూదా నాయకుడైన షేష్బజ్జరుకు అప్పగించాడు.
EZR 1:9 మిత్రిదాతు బయటికి తెచ్చిన దేవాలయ వస్తువుల జాబితా యిది: బంగారు గిన్నెలు 30 వెండి గిన్నెలు 1,000 చాకులు, పెనాలు 29
EZR 1:10 బంగారు పాత్రలు 30 బంగారు పాత్రల వంటివే వెండి పాత్రలు 410 ఇతర పాత్రలు 1,000.
EZR 1:11 వెండి బంగారాలతో చేసిన వస్తువులు కలసి మొత్తం 5,400 వున్నాయి. బబులోను చెరనుండి విడి పింపబడినవారు యెరూషలేముకు తిరిగి వెళ్లేటప్పుడు, షేష్బజ్జరు పై వస్తువులన్నింటినీ తనతో యెరూషలేముకు తీసుకువెళ్లాడు.
EZR 2:1 వీళ్లు బబులోను రాజ్యంలో నిర్బంధం నుంచి తిరిగి వచ్చినవాళ్లు. గతంలో బబులోను రాజైన నెబుకద్నెజరు వీళ్లని బందీలుగా పట్టుకొని, బబులోనుకు తెచ్చాడు. ఇప్పుడు వాళ్లు యెరూషలేముకు, యూదాకు తిరిగివచ్చారు. వాళ్లు తమతమ సొంత పట్టణాలకి తిరిగి వెళ్లారు.
EZR 2:2 జెరుబ్బాబెలుతో పాటు తిరిగివచ్చిన వాళ్లలో యేషూవా, నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అనే వాళ్లున్నారు. బబులోను నుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్ల జాబితా, వాళ్ల సంఖ్యల వివరం ఇది:
EZR 2:3 పరోషు వంశస్థులు 2,172
EZR 2:4 షెపట్యా వంశస్థులు 372
EZR 2:5 అరహు వంశస్థులు 775
EZR 2:6 యెషూవ, యోవాబు వంశాలకి చెందిన పహత్మోయాబు, మోయాబు వంశస్థులు 2,812
EZR 2:7 ఏలాము వంశస్థులు 1,254
EZR 2:8 జత్తూ వంశస్థులు 945
EZR 2:9 జక్కయి వంశస్థులు 760
EZR 2:10 బానీ వంశస్థులు 642
EZR 2:11 బేబై వంశస్థులు 623
EZR 2:12 అజ్గాదు వంశస్థులు 1,222
EZR 2:13 అదొనీము వంశస్థలు 666
EZR 2:14 బిగ్వయి వంశస్థులు 2,056
EZR 2:15 అదీను వంశస్థులు 454
EZR 2:16 అటేరు వంశస్థులు (హిజ్కియా కుటుంబం) 98
EZR 2:17 బెజయి వంశస్థలు 323
EZR 2:18 యోరా వంశస్థలు 112
EZR 2:19 హాషుము వంశస్థులు 223
EZR 2:20 గిబ్బారు వంశస్థులు 95
EZR 2:21 బెత్లెహేము పట్నానికి చెందినవాళ్లు 123
EZR 2:22 నెటోపా పట్టణం వాళ్లు 56
EZR 2:23 అనాతోతు పట్టణంవాళ్లు 128
EZR 2:24 అజ్మావెతు పట్టణంవాళ్లు 42
EZR 2:25 కిర్యాతారీము, కెఫీరా, బెయేరోతు పట్టణాల వాళ్లు 743
EZR 2:26 రమా, గెబా పట్టణాలవాళ్లు 621
EZR 2:27 మిక్మషు పట్టణం వాళ్లు 123
EZR 2:28 బేతేలు, హాయి పట్టణంవాళ్లు 222
EZR 2:29 నెబో పట్టణంవాళ్లు 52
EZR 2:30 మగ్బీషు పట్టణంవాళ్లు 156
EZR 2:31 ఏలాము అనే మరో పట్టణంవాళ్లు 1,254
EZR 2:32 హారీము పట్టణంవాళ్లు 320
EZR 2:33 లోదు, హదీదు, ఓనో పట్టణాలవాళ్లు 725
EZR 2:34 యెరికో పట్టణంవాళ్లు 345
EZR 2:35 సెనాయా పట్టణంవాళ్లు 3,630
EZR 2:36 యాజకులు: యెషూవ కుటుంబానికి చెందిన యెదాయ వంశస్థులు#973
EZR 2:37 ఇమ్మేరు వంశస్థులు#1,052
EZR 2:38 పషూరు వంశస్థులు#1,247
EZR 2:39 హారీము వంశస్థులు#1,017
EZR 2:40 ఇప్పుడిక లేవీయులలో హోదవ్యా కుటుంబానికి చెందిన యేషూవా, కద్మీయేలు వంశస్థులు#74
EZR 2:41 గాయకుల జాబితా: అసాపు వంశస్థులు#128
EZR 2:42 దేవాలయపు ద్వారపాలకుల వంశస్థులు షల్లూము, ఆటేరు, టల్నోను, అక్కూబు, హటీటా, షోబయి వంశస్థులు#139
EZR 2:43 దేవాలయపు ప్రత్యేక సేవకుల వంశస్థులు జీహా, హశూపా, టబ్బాయోతు,
EZR 2:44 కేరోసు, సీయహా, పాదోను,
EZR 2:45 లెబానా, హగాబా, అక్కూబు,
EZR 2:46 హాగాబు, షల్మయి, హానాను,
EZR 2:47 గిద్దేలు, గహరు, రెవాయా,
EZR 2:48 రెజీను, నెకోదా, గజ్జాము,
EZR 2:49 ఉజ్జా, పాసెయ, బేసాయి,
EZR 2:50 అస్నా, మెహూనీము, నెపూసీము,
EZR 2:51 బక్బూకు, హకూపా, హర్హూరు
EZR 2:52 బజ్లీతు, మెహీదా, హర్షా
EZR 2:53 బర్కోసు, సీసెరా, తెమహు
EZR 2:54 నెజీయాహు, హటీపా,
EZR 2:55 సొలొమోను సేవకుల వంశస్థులు: సొటయి, సోపెరెతు, పెరూదా,
EZR 2:56 యహలా, దర్కోను, గిద్దేలు,
EZR 2:57 షెపట్య, హట్టీలు, పొకెరెతు, జెబాయీము మరియు అమి
EZR 2:58 దేవాలయసేవకులూ, మరిము సొలొమోను సేవకుల వంశస్థులు కలిసి మొత్తుం#392
EZR 2:59 తేల్మెలహు తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు పట్టణాలనుంచి యెరూషలేముకు కొందరు వచ్చారు. అయితే వీళ్లు తమ కుటుంబాల వాళ్లయిన ఇశ్రాయేలీయుల కుటుంబాలకు చెందినవాళ్లమని నిరూపించుకో లేకపోయారు. వాళ్లెవరంటే,
EZR 2:60 దెలాయ్యా, టోబీయా, నెకోదా సంతతివారు మొత్తం 652
EZR 2:61 యాజకుల కుటుంబాలకు చెందిన ఈ క్రింది వంశస్థులు వున్నారు: హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వంశస్థులు. (గిలాదుకు చెందిన ఒకడు బర్జిల్లయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతను బర్జిల్లయి సంతతివాడిగా పరిగణించబడ్డాడు.)
EZR 2:62 వీళ్లు తమ వంశ చరిత్రకోసం గాలించారు. కానీ అది వాళ్లకి లభ్యం కాలేదు. వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో నమోదు కాలేదు. తమ పూర్వీకులు యాజకులని వాళ్లు నిరూపించ లేకపోయారు. దానితో, వాళ్లు యాజకులగా సేవ చేయలేకపోయారు.
EZR 2:63 వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులను తినకూడదని రాజ్యాధిపతి ఆజ్ఞ జారి చేశాడు. ఒక యాజకుడు ఊరీము, తుమ్మీము ధరించి, ఏమి చేయాలని దేవుణ్ణి అడిగేంతవరకు వాళ్లు ప్రతిష్ఠితమైన వస్తువులేమీ తినలేకపోయారు.
EZR 2:64 మొత్తంమీద తిరిగివచ్చిన ఆ వంశంలో 42,360 మంది వున్నారు. వాళ్లలో 7,337 మంది స్త్రీ, పురుష సేవకులను పరిగణలోకి తీసుకోకపోతే తేలిన సంఖ్య ఇది. వాళ్లతో 200 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు.
EZR 2:66 వాళ్లకి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి.
EZR 2:68 ఆ వంశం యెరూషలేములోని దేవుని ఆలయానికి చేరుకుంది. తర్వాత కుటుంబ పెద్దలు దేవాలయ నిర్మాణం కోసం తమ కానుకలు సమర్పించారు. పాత దేవాలయం నేలమట్టము చేయబడిన చోటనే కొత్త దేవాలయ నిర్మాణానికి వాళ్లు సమకట్టారు.
EZR 2:69 వాళ్లు దేవాలయ నిర్మాణానికి తమ శక్తి కొద్దీ కానుకలు ఇచ్చారు 1,100 పౌనుల బంగారం, 3 టన్నుల వెండి, యాజకులు ధరించే 100 దుస్తులు వాళ్లు ఇచ్చారు.
EZR 2:70 ఈ విధంగా యాజకులు, లేవీ గొత్రీకులు, తదితరులు కొంతమంది యెరూషలేముకి, దాని చుట్టూవున్న ప్రాంతాలకీ చేరుకున్నారు. ఈ వంశంలో దేవాలయ గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు వున్నారు. తదితర ఇశ్రాయేలీయులు తమతమ సొంత పట్టణాల్లో స్థిరపడ్డారు.
EZR 3:1 అలా ఏడవ నెల నాటికి ఇశ్రాయేలీయులు తమ తమ సొంత పట్టణాలకు చేరుకున్నారు. అప్పుడు వాళ్లందరూ యెరూషలేములో గుమికూడి ఒక ప్రజగా సమైక్యమయ్యారు.
EZR 3:2 యెజాదా కొడుకైన యేషూప, అతనితో వున్న యాజకులూ, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, అతని సహచరులు ఇశ్రాయేలు దేవునికి బలిపీఠం నిర్మించారు. ఇశ్రాయేలీయులు తాము బలులు సమర్పించ గలిగేందుకు వీలుగా ఆ బలిపీఠాన్ని నిర్మించారు. సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో పేర్కొన బడినట్లు వాళ్లు ఆ బలిపీఠాన్ని నిర్మించారు. మోషే యెహోవాకు ప్రత్యేక సేవకుడు.
EZR 3:3 తమకి సమీపంలో నివసిస్తున్న ఇతర ప్రజలంటే వాళ్లు భయపడ్డారు. అయినా, వాళ్లు ఆగకుండా, పాతపునాది మీదనే బలీపీఠాన్ని నిర్మించి, ఉదయంపూటా, సాయంత్రంపూటా దహనబలులు సమర్పిస్తూ వచ్చారు.
EZR 3:4 సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లు వాళ్లు పర్ణశాలల పండుగ చేసుకున్నారు. ఆ పండుగ రోజులు పొడుగునా ప్రతిరోజూ సరైన సంఖ్యలో దహన బలులు సమర్పించారు.
EZR 3:5 అటు తర్వాత, ప్రతి రోజూ నిరంతర దహనబలులు, అమావాస్య రోజున జరిగే బలులు, మరి ఇతర పండుగల రోజులకూ, శెలవు రోజులకూ, స్వేచ్ఛార్ఫణలను యెహోవా ఆజ్ఞ ప్రకారం అర్పించారు. జనం కూడా యెహోవాకు తాము ఇవ్వాలనుకున్న కానుకలు ఇవ్వనారంభిచారు.
EZR 3:6 ఈ విధంగా, ఏడవ నెల మొదటి రోజున, ఆఇశ్రాయేలీయులు యెహోవాకు తిరిగి దహనబలులు ఇవ్వనారంభించారు. దేవాలయం అప్పటికి ఇంకా తిరిగి నిర్మించబడకపోయినా కూడా ఈ బలి అర్పణ సాగింది.
EZR 3:7 చెరనుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు రాళ్లు చెక్కేవాళ్లకు, వడ్రంగులకు డబ్బులిచ్చారు. వాళ్లు తూరు, సీదోను ప్రజలకు ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని ఒలీవనూనెను, లెబానోను నుండి దేవదారు చెట్లమొద్దులను తెచ్చేందుకు ఇచ్చారు. సోలొమోను మొదటిగా దేవాలయం నిర్మించినప్పుడు తెప్పించి నట్లే, వాళ్లు కూడా ఈ దేవదారు చెట్ల మొద్దులను ఓడల్లో సముద్రతీర పట్టణమైన యొప్పేకు తెప్పించాలనుకున్నారు. పారశీక చక్రవర్తి కోరెషు ఇందుకు వారికి అనుమతినిచ్చాడు.
EZR 3:8 యెరూషలేములోని దేవాలయం దగ్గరకు వాళ్లు చేరుకున్నమీదట రెండవ ఏడాది రెండవ నెలలో షయల్తీయేలు కొడుకైన జెరుబ్బాబెలూ, యెజాదా కొడుకైన యేషూవ పని ప్రారంభించారు. వాళ్ల సోదరులు, యాజకులు, లేవీయులు, నిర్బంధంనుంచి యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్లందరూ వాళ్లతో కలిసి పనిచేయ ప్రారంభించారు. లేవీయుల్లో 20 ఏళ్లు నిండినవాళ్లనీ, అంతకు పైబడినవాళ్లనీ యెహోవా దేవాలయ నిర్మాణంలో నాయకులుగా నియమించారు.
EZR 3:9 దేవాలయ నిర్మాణ కార్యకలాపాలను ఈ కింది వారు అజమాయిషీ చేశారు: యేషూవ మరియు అతని కొడుకులు, మరియు అతని సహోదరులు, కద్మీయేలు మరియు అతని కొడుకులు (యూదా వంశస్థులు); హేనాదాదు, మరిము అతని కొడుకులు, లేవీయులందరు.
EZR 3:10 పనివాళ్లు యెహోవా దేవాలయానికి పునాది నిర్మాణాన్ని పూర్తిచేశారు. పునాది పూర్తయ్యాక, యాజకులు యాజకదుస్తులు ధరించి, బూరలు చేతబూనారు. అసాపు కొడుకులు తాళాలు పట్టుకొని నిలబడ్డారు. వాళ్లందరూ యెహోవాను స్తుతించేందు కోసం తమతమ స్థానాల్లో నిలిచారు. ఇదంతా ఇశ్రాయేలు రాజైన దావీదు గతంలో ఆదేశించిన విధంగా జరిగింది.
EZR 3:11 వాళ్లు కృతజ్ఞతాస్తుతులు పాడారు. “యెహోవా మంచివాడు. ఆయన నిజమైన ప్రేమ ఇశ్రాయేలీయుల మీద ఎల్లప్పుడూ నిలిచివుంటుంది” అంటూ వాళ్లు స్తుతి కీర్తనలు పాడారు. చివరిగా అక్కడ ఉన్న మనుష్యులందరూ ఏకమై బిగ్గరగా గొంతెత్తి యెహోవాను కీర్తించారు. యెహోవా దేవాలయానికి పునాది వేయబడిన సందర్భంగా వాళ్లు గొప్పశబ్దంతో యెహోవాకు సోత్రాలు చెల్లించారు.
EZR 3:12 అయితే, చాలామంది వృద్ధ యాజకులు, లేవీయులు, వంశ పెద్దలు విలపించారు. ఎందుకంటే, వాళ్లు వెనకటి దేవాలయాన్ని చూసినవాళ్లు. వాళ్లు ఆ పూర్వవైభవాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ కొత్త దేవాలయాన్ని చూసినప్పుడు బిగ్గరగా ఏడ్చారు. జనంలో మిగిలిన చాలామంది సరదాగా సంతోషంగా కేరింతలు కొడుతూండగా వాళ్లు విలపించారు.
EZR 3:13 ఆ ధ్వనులు చాలాదూరం వరకూ వినబడ్డాయి. వాటిలో ఏవి సంతోషధ్వనులో, ఏవి విలాపాలో ఎవరూ చెప్పుకోలేక పోయారు.
EZR 4:1 ఆ ప్రాంతంలో నివసించే చాలామంది యూదా, బెన్యామీను జాతీయులకు విరోధులు. చెర నుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు దేవాలయం నిర్మిస్తున్నారని విన్న ఆ శత్రువులు జెరుబ్బాబెలు దగ్గరకీ, వంశ పెద్దల దగ్గరికీ వచ్చి, “నిర్మాణంలో మీకు మమ్మల్ని తోడ్పడనివ్వండి. మేమూ మీలాంటివాళ్లమే. మీ దేవుణ్ణి సహాయం నిమిత్తం మేమూ అర్థిస్తాము. అష్షూరు రాజైన ఏస్హరద్దోను మమ్మల్ని ఇక్కడికి తెచ్చినప్పట్నుంచీ మేము మీ దేవునికే బలులు సమర్పించాము” అన్నారు.
EZR 4:3 కాని, జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలుకు చెందిన ఇతర వంశాల పెద్దలూ వాళ్లకి ఇలా సమాధానం చెప్పారు: “కుదరదు, మా దేవుని ఆలయ నిర్మాణంలో మాకు తోడ్పడే అవకాశం మీకు లేదు. యెహోవాకు ఆలయ నిర్మాణం చేసే హక్కు మాది మాత్రమే. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. ఇది పారశీక చక్రవర్తి కోరేషు మాకు ఇచ్చిన ఆజ్ఞ.”
EZR 4:4 ఈ మాటలతో వాళ్లకి కోపం వచ్చింది. దానితో వాళ్లు యూదులకు ఇబ్బందులు కలిగించ నారంభించారు. దేవాలయం నిర్మించకుండా యూదులను వాళ్లు నిరుత్సాహపరచి, నిరోధించసాగారు.
EZR 4:5 వాళ్లు ప్రభుత్వాధి కారులకు లంచాలిచ్చి, వాళ్లు యూదా ప్రజలకు వ్యతిరేకంగా పని చేసేలా చూశారు. ఆ అధికారులు యూదుల దేవాలయ నిర్మాణ పథకాలను భగ్నం చేసేందుకు నిరంతరం కృషిచేశారు. కోరెషు పారశీక చక్రవర్తిగా వున్నకాలంలో దర్యావేషు పారశీక చక్రవర్తి అయ్యేంత వరకూ వాళ్ల యీ ప్రయత్నం కొనసాగింది.
EZR 4:6 యూదులను అడ్డుకొనేందుకుగాను ఆ శత్రువులు పారశీక చక్రవర్తికి లేఖలు సైతం వ్రాశారు. అహష్వేరోషు చక్రవర్తి అయిన ఏడాది వాళ్లోక లేఖ వ్రాశారు.
EZR 4:7 ఆ తరువాత అర్తహషస్త పారసీకానికి కొత్తగా రాజు అయిన కాలంలో, వాళ్లలో కొందరు యూదులమీద నిందారోపణలు చేస్తూ లేఖలు రాశారు. అలా రాసినవాళ్లు: బిష్లాము, మిత్రదాతు, టాబెయేలు, ఆ బృందానికి చెందిన ఇతరులు. వాళ్లు అర్తహషస్తకు ఆ లేఖలు అరమాయికు భాషలో, అరమాయికు లిపిలో వ్రాశారు.
EZR 4:8 అప్పుడు ప్రాంతీయాధికారి రెహూమూ, కార్యదర్శి షిమ్షయి కూడా యెరూషలేము ప్రజలకి వ్యతిరే కంగా ఒక లేఖ వ్రాసి, పారసీక చక్రవర్తి అర్తహాషస్తకి పంపారు. ఆ లేఖలో వాళ్లిలా వ్రాశారు.
EZR 4:9 ప్రాంతీయాధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయీ, న్యాయమూర్తులు, టర్పెలాయేలు, పారసీకం, అర్కె, బబులోను, సూసాకి చెందిన ఏలాము మరియు ఇతర పాంతాల ప్రజలమీది ముఖ్యాధికారులు,
EZR 4:10 గొప్పవాడైన బలవంతుడైన అషురుబనిపాలు సమరియా నగరానికీ, యూఫ్రటీసు నదికి పశ్చిమ ప్రాంతలకూ తరలించిన ప్రజల మహజరు.
EZR 4:11 అర్తహాషస్త ప్రభువుకి, యూఫ్రటీసు నదియొక్క పశ్చిమాన నివసించే తమ దాసులు చేసుకున్న విన్నపం:
EZR 4:12 అర్తహషస్త మహారాజుగారికి, తమరు తమవద్ద నుంచి పంపివేసిన యూదులు ఇక్కడికి చేరుకున్నారు. ఆ యూదులు ఇప్పుడా నగరాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. యెరూషలేము ఒక చెడ్డ నగరం. ఆ నగర ప్రజలు ఎల్లప్పుడూ ఇతర రాజుల మీద తిరగబడుతూవచ్చారు. ఇప్పుడు యూదులు పునాదులు కట్టుదిట్టంచేసి, ప్రాకారాల ు కడుతున్నారు.
EZR 4:13 అంతేకాదు అర్తహషస్త మహాప్రభూ, యెరూషలేము నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యెరూషలేము ప్రజలు తమ వృత్తిపన్నులు చెల్లించడం నిలిపేస్తారు. తమ గౌరవార్థం డబ్బు పంపడం మానేస్తారు. వాళ్లు సుంకం పన్నులు చెల్లించడం కూడా మానేస్తారు. ఏలినవారికి ఆ సొమ్మంతా నష్టమవుతుంది.
EZR 4:14 ప్రభువుల పట్ల మాకు బాధ్యతవుంది. తమకీ నష్టాలు వాటిల్లడం మేము చూడలేము. అందుచేతనే తమకీ విషయాలు తెలియజేసు కుంటున్నాము.
EZR 4:15 అర్తహషస్త మహారాజా, తమకు పూర్వం రాజ్యమేలిన రాజులు వ్రాయించిన చరిత్ర పత్రాలు తమరు పరిశీలించండి. ఆ పత్రాలవల్ల యెరూషలేము ఎల్లప్పుడూ యితర రాజులకు వ్యతిరేకంగా తిరుగబడినట్లు తమకు తెలియవస్తుంది. ఇతర రాజులకూ, రాజ్యాలకూ వీళ్ల తిరుగుబాట్లు పెద్దకీడుగా పరిణమించాయి. ప్రాచీనకాలం నుంచి యీ నగరంలో అనేక తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి! యెరూషలేము నాశనం చేయబడినది సరిగ్గా అందుకే!
EZR 4:16 అర్తహషస్త మహారాజా, ఈ నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతంమీద తమకు అదుపు తప్పిపోతుందని తమకు తెలియజేయాలని కోరుకుంటున్నాము.
EZR 4:17 అప్పుడు అర్తహషస్త చక్రవర్తి వాళ్లకి ఇలా సమాధానం ఇచ్చాడు: ప్రాంతీయాధికారి రెహూముకీ, కార్యదర్శి షిమ్షయికీ, సమరియాలోనూ, యూఫ్రటీసు నదికీ పశ్చిమానా మీతో బాటు నివసించేవారికి, శుభాకాంక్షలు.
EZR 4:18 మీరు మాకు పంపిన లేఖను అనువదించి మాకు వినిపించారు.
EZR 4:19 నా వెనుకటి రాజుల పత్రాలు గాలించవలసిందిగా నేను ఆదేశించాను. ఆ పత్రాలు చదివి వినిపించారు. రాజులకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసిన సుదీర్ఘ చరిత్ర యెరూషలేముకు ఉన్నట్లు మేము కనుగొన్నాము. యెరూషలేములో తరచూ పితూరీలు, తిరుగుబాట్లు సంభవించాయి.
EZR 4:20 యెరూషలేమునూ, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతమంతటినీ శక్తిసంపన్నులైన రాజులు పాలించారు. పన్నులు, రాజుల గౌరవార్థం కానుకలు, సుంకం పన్నులు ఆ రాజులకు చెల్లింపబడ్డాయి.
EZR 4:21 ఇప్పుడిక మీరు చేయవలసినది, వాళ్లని పని నిలిపివేయవలసినదిగా ఆజ్ఞ జారీ చేయడం. యెరూషలేము పునర్నిర్మాణం జరగకుండా మీరా ఆజ్ఞ ఇవ్వాలని నా ఆదేశం.
EZR 4:22 ఈ వ్యవహారంలో అశ్రద్ధ జరగకుండా మీరు జాగ్రత్తవహించాలి. మనం యెరూషలేము పునర్నిర్మాణాన్ని కొనసాగనివ్వరాదు. అదే జరిగితే మాకింక యెరూషలేమునుంచి ఎంత మాత్రమూ డబ్బు ముట్టదు.
EZR 4:23 అర్తహషస్త చక్రవర్తి పంపిన ఈ లేఖ నకలు రెహూముకీ, కార్యదర్శి షిమ్షయికీ, వాళ్లతోవున్న ఇతర ప్రజలకు అందింది. దాన్ని చదివిన మీదట వాళ్లు వెంటనే యెరూషలేములోని యూదుల వద్దకు వెళ్లారు. ఆ యూదుల చేత నిర్మాణపు పనిని వాళ్లు బలవంతాన నిలిపివేయించారు.
EZR 4:24 దానితో, యెరూషలేములోని యెహోవా దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోయింది. పారసీక చక్రవర్తి దర్యావేషు పాలన రెండవ సంవత్సరం దాకా తిరిగి ఈ నిర్మాణ కృషి కొనసాగలేదు.
EZR 5:1 ఆ కాలంలో ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కొడుకు జెకర్యా దేవుని పేరిటి ప్రవచించారు. యూదా, యెరూషలేములలోని యూదులను వాళ్లు ప్రోత్సహించారు.
EZR 5:2 దానితో, షియల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవలు యెరూషలేములోని దేవాలయ నిర్మాణ కృషిని తిరిగి ప్రారంభించారు. దేవుని ప్రవక్తలందరూ వారితో ఉండి, ఆ పనికి తోడ్పడుతూ వచ్చారు.
EZR 5:3 ఆ కాలంలో యూఫ్రటీసునది పశ్చిమ ప్రాంతానికి తతైనైయు అధిపతి. తతైనైయు, షెతర్బోజ్నయి, వారి సహో ద్యోగులు నిర్మాణ కృషి సాగిస్తున్న జెరుబ్బాబెలు, యేషూవ, తదితరుల వద్దకు వెళ్లి, “ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి, దీన్ని సరికొత్తదానిగా రూపొందించడానికి మీకు ఎవరు అనుమతినిచ్చారు?” అని నిలదీశారు.
EZR 5:4 అంతేకాదు, వాళ్లు జెరుబ్బాబెలును, “ఈ భవనం పని చేస్తున్న వాళ్ల పేర్లు యేమిటి?” అని కూడా ప్రశ్నించారు.
EZR 5:5 అయితే, యూదా నాయకుల మీద దేవుని దృష్టివుంది. దర్యావేషు చక్రవర్తికి భవన నిర్మాతలు లేఖలు పంపుకున్నారు. చక్రవర్తి సమాధానం పంపేదాకా, వాళ్లు పనిని నిలుపు చేయవలసిన అవసరం లేకపోయింది. వాళ్లు తమ నిర్మాణ కృషిని కొనసాగించారు.
EZR 5:6 యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతాధిపతి అయిన తతైనైయు, షతర్బోజ్నయి, వారి ముఖ్య సహోద్యోగులు దర్యావేషు చక్రవర్తికి ఒక లేఖ పంపారు.
EZR 5:7 ఆ లేఖ నకలు ఇది: దర్యావేషు చక్రవర్తికి శుభం!
EZR 5:8 దర్యావేషు చక్రవర్తికి మేము ఇందు మూలంగా తెలియజేసేది ఏమంటే, తమ ఆదేశం మేరకు యూదా రాజ్యంలో గొప్ప దేవుని ఆలయానికి మేము వెళ్లాము. యూదాలోని ప్రజలు ఆ ఆలయాన్ని పెద్దపెద్ద రాళ్లతో కడుతున్నారు. గోడల్లో వాళ్లు పెద్ద దూలాలు పరుస్తున్నారు ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారు. వాళ్లు చాలా వేగంగా నిర్మాణం సాగిస్తున్నారు. త్వరలోనే పనిపూర్త వుతుంది.
EZR 5:9 వాళ్లు చేస్తున్న పనిని గురించి మేము వాళ్ల నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడిగాము. “ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మించేందుకూ, కొత్తదానిగా దాన్ని రూపొందించేందుకూ మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?” అని మేము ప్రశ్నించాము.
EZR 5:10 మేము వాళ్లు పేర్లు కూడా అడిగాము. వాళ్లెవరో మీరు తెలుసు కోగలిగేందుకు వీలుగా మేము వాళ్ల పేర్లు వ్రాసి పెట్టాలని అనుకున్నాము.
EZR 5:11 వాళ్లు మాకు ఇచ్చిన సమాధానం యిది: “మేము భూ, పరలోకాల అధిపతియైన యెహోవా దేవుని సేవకులం. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు మహారాజొకడు నిర్మించి ముగించిన దేవాలయాన్ని మేమిప్పుడు తిరిగి నిర్మిస్తున్నాం.
EZR 5:12 కాని, మా పూర్వీకులు దేవునికి కోపం తెప్పించారు. ఆయన వారిని బబులోను రాజైన నెబుకద్నెజరుకు లోబరిచాడు. నెబుకద్నెజరు ఈ దేవాలయాన్ని నిర్మూలించాడు, ప్రజలను బలవంతాన బబులోనుకు బందీలుగా తీసుకుపోయాడు.
EZR 5:13 అయితే, కోరెషు చక్రవర్తి దేవాలయం తిరిగి నిర్మింపబడాలని ఒక ప్రత్యేకాజ్ఞ జారీ చేశాడు.
EZR 5:14 కోరెషు గతంలో యెహోవా దేవాలయం నుంచి కొల్లగొట్టిన వెండి, బంగారు వస్తువులను బబులోనులోని అబద్ధపు దేవత ఆలయంనుంచి బయటికి తీయించాడు. నెబుకద్నెజరు గతంలో ఆ వస్తువులను యెరూషలేములోని ఆలయం నుంచి కొల్లగొట్టి, వాటిని బబులోను లోని తన అబద్ధపు దేవత దేవాలయంలో ఉంచాడు. ఇప్పుడు కోరెషు చక్రవర్తి ఆ వెండి, బంగారు వస్తువులను షేష్బజ్జరుకు ఇచ్చాడు. కోరెషు షేష్బజ్జరును ప్రాంతీ యాధికారిగా నియమించాడు.”
EZR 5:15 కోరెషు షేష్బజ్జరును ఇలా ఆదేశించాడు: “నువ్వీ వెండి, బంగారు వస్తువులను తీసుకుపోయి, వాటిని తిరిగి యెరూషలేములోని దేవాలయంలో పెట్టు. గతంలో ఉన్న చోటనే దేవాలయాన్ని తిరిగి నిర్మింప జేయి.”
EZR 5:16 షేష్బజ్జరు వచ్చి, యెరూషలేములోని దేవాలయానికి పునాదులు నిర్మించాడు. ఆనాటి నుంచి నేటిదాకా పని కొనసాగింది. అయితే, ఆ పని యింకా పూర్తి కాలేదు.
EZR 5:17 ఇప్పుడిక, తమకి సమ్మతమైతే, చక్రవర్తిగారి ఆధికారికా చారిత్రక పత్రాలను గాలించండి. యెరూషలేములో దేవాలయం నిర్మించుమని కోరెషు చక్రవర్తి ఆజ్ఞ జారీచేశారన్న మాట నిజమేనేమో పరిశీలించండి. తర్వాత తమరీ విషయంలో తీసుకున్న నిర్ణయమేమిటో దయచేసి మాకొక లేఖద్వారా తెలియజేయండి.
EZR 6:1 దర్వావేషు చక్రవర్తి తన ముందరి రాజుల చారిత్రక పత్రాలను గాలించవలసిందిగా ఆదేశించాడు. ఆ పత్రాలు బబులోనులో డబ్బును పదిలపరచిన ఖజానాలోనే పదిలపరచబడ్డాయి.
EZR 6:2 మాదీయ రాష్ట్రంలోని ఎగ్బతానా కోటలో చుట్టబడిన పత్రం ఒకటి కనిపించింది. ఆ చుట్టబడిన పత్రం లో యిలా వ్రాయ బడివుంది: అధికార పత్రం:
EZR 6:3 కోరెషు చక్రవర్తి పాలన మొదటి సంవత్సరంలో, కోరెషు యెరూషలేములోని దేవాలయం విషయంలో ఈ కింది ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞలో ఇలా పేర్కొన బడింది: బలులు అర్పించేందుకు అనువైన యెరూషలేము దేవాలయం తిరిగి నిర్మించబడాలి. దానికి పునాదులు వెయ్యనియ్యండి, దేవాలయం (పొడవు 90 అడుగులు, వెడల్పు 90 అడుగులు వుండాలి.)
EZR 6:4 దాని చుట్టూ వుండే గోడ మూడు వరుసల పెద్ద రాళ్లతో, ఒక వరుస పెద్ద కొయ్య దూలాలతో నిర్మింపబడాలి. దేవాలయ నిర్మాణాని కయ్యే ఖర్చులు చక్రవర్తి ఖజానానుంచి చెల్లించాలి.
EZR 6:5 అంతేకాదు, దేవాలయం నుంచి తెచ్చిన వెండి, బంగారు వస్తువులు తిరిగి వాటి వాటి స్థానాల్లో వుంచబడాలి. వెనక, నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలోంచి కొల్లగొట్టి, ఆ వస్తుపులను బబులోనుకు తెచ్చాడు. వాటిని తిరిగి ఆ దేవాలయంలో వుంచాలి.
EZR 6:6 ఇప్పుడిక దర్యావేషునైన నేను, యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంత అధికారియైన తతైనైయు, షెతర్భోజ్నయినీ, ఆ రాజ్యంలో నివసించే అధికారులందరినీ యెరూషలేముకు దూరంగా పుండవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను.
EZR 6:7 అక్కడి పనివాళ్లని వేధించకండి. ఆ దేవాలయ నిర్మాణాన్ని ఆపేందుకు ప్రయత్నించకండి. యూదా పాలనాధికారీ, యూదా నాయకులూ ఆ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలి. ఆ దేవాలయం పూర్వం ఎక్కడున్నదో సరిగ్గా అదేస్థలంలో దాన్ని తిరిగి నిర్మించాలి.
EZR 6:8 ఇప్పుడు నేనీక్రింది ఆజ్ఞను జారీ చేస్తున్నాను. దేవాలయం నిర్మిస్తున్న యూదా పెద్దలకు, మీరు ఈ కింది పనులు చెయ్యాలి. దేవాలయ నిర్మాణ ఖర్చులు పూర్తిగా ఖాజానానుంచి చెల్లింపబడాలి. ఆ సొమ్ము యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలోని రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వసూలు చేయబడాలి. ఆ నిర్మాణం ఆగిపోకుండా వుండేందుకుగాను మీరీ పనులు త్వర త్వరగా చెయ్యాలి.
EZR 6:9 వాళ్లకి ఏమి కావాలన్నా సరే ఇవ్వండి. పరలోక దేవునికి బలి ఇచ్చేందుకు వాళ్లు దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు కావాలంటే, వాటిని వాళ్లకి ఇవ్వండి. యెరూషలేము యాజకులు గోధుమలు, ఉప్పు, ద్రాక్షారసం, నూనె కావాలంటే, వాటిని మీరు ప్రతిరోజూ వాళ్లకి తప్పనిసరిగా ఇవ్వండి.
EZR 6:10 పరలోక దేవుని సంతృప్తి పరచేందుకోసం మీరు వీటిని యూదా యాజకులకు ఇవ్వండి. ఆ యాజకులు నా కోసం, నా కొడుకుల కోసం ప్రార్థన చేసేందుకుగాను మీరు వాటిని వాళ్లకి ఇవ్వండి.
EZR 6:11 దీనికీ తోడు నా మరో ఆజ్ఞ: ఎవరైనా ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే అతని ఇంటి దూలాన్ని ఊడపీకి, దానితో అతని పొట్టలో పొడవాలి. అతని ఇంటిని ధ్వంసంచేసి, దాన్నొక రాళ్ల కుప్పగా మార్చాలి.
EZR 6:12 దేవుడు యెరూషలేములో తన నామమును ఉంచాడు. ఈ నా ఆజ్ఞను ధిక్కరించ ప్రయత్నించే వ్యక్తి ఒక రాజైనా, మరొకడెవడైనా, అతన్ని ఆ దేవుడు ఓడిస్తాడని నేను ఆశిస్తున్నాను, యెరూషలేములోని ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ఏ వ్యక్తి అయినా ప్రయత్నిస్తే, దేవుడు అతన్ని నాశనం చేస్తాడని నేను ఆశిస్తున్నాను. జాగ్రత్త, ఇది నా (దర్యావేషు చక్రవర్తి) తిరుగులేని ఆజ్ఞ. దీన్నీ విధిగా వెంటనే, పూర్తిగా పాటించాలి!
EZR 6:13 సరే, యూఫ్రటీసు నది పశ్చమ ప్రాంత పాలనాధి కారి తతైనైయు, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు దర్యావేషు చక్రవర్తి ఆజ్ఞను సంపూర్ణంగా పాటించారు.
EZR 6:14 దానితో, యూదుల పెద్దలు (నాయకులు) నిర్మాణ కృషిని కొనసాగించారు. ప్రవక్త హగ్గయి, ఇద్దో కొడుకు జెకర్యాల ప్రోత్సాహంతో వాళ్లు జయప్రదమయ్యారు. వాళ్ల దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞాపాలన క్రమంలో యీ పని పూర్తయింది. ఈ పని పూర్తయ్యేందుకు పారసీక చక్రవర్తులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆజ్ఞలు పాలింపబడటం కూడా కారణమే.
EZR 6:15 దేవాలంయ నిర్మాణం అదారు నెల, మూడవ రోజున దర్వావేషు చక్రవర్తి పాలన ఆరవ ఏట పూర్తయింది.
EZR 6:16 అప్పుడిక ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, నిర్భంధంనుంచి వెనక్కి తిరిగి వచ్చిన ఇతరులు ఆ దేవాలయ ప్రతిష్ఠను పెద్ద పండుగలా, ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.
EZR 6:17 వాళ్లు దేవాలయ ప్రతిష్ఠ పండుగను యిలా జరుపుకున్నారు: వాళ్లు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రెపోతులను బలి ఇచ్చారు. వాళ్లు 12 మేకపోతులను ఇశ్రాయేలీయులందరి కొరకు పాపపరిహారార్థ బలిగాయిచ్డారు. అది ఒక్కొక్క వంశానికి ఒకటి చొప్పున 12 వంశాల ఇశ్రాయేలీయులకు.
EZR 6:18 అటు తర్వాత, యెరూషలేము దేవాలయంలో సేవల నిమిత్తం వాళ్లు తమ వంశాల్లోనూ, లేవీయులు తమ వంశాల్లోనూ, యాజకులను ఎంపిక చేశారు. వాళ్లీ కార్యక్రమాలను సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలోని నిబంధనల ప్రకారం చేశారు.
EZR 6:19 మొదటి నెల పద్నాల్గవ రోజున నిర్బంధంనుంచి వెనక్కి తిరిగి వచ్చిన యూదులు పస్కా పండుగ జరుపుకున్నారు.
EZR 6:20 యాజకులు, లేవీయులు ఆ రోజున తమను తాము శద్ధిచేసుకున్నారు. వాళ్లందరూ తమని తాము శుభ్రం చేసుకుని పస్కా పండగ నాడు చేసుకునేందుకు సంసిద్ధులయ్యారు. లేవీయులు నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన యూదులందరి కోసం పస్కా పండుగ గొర్రెపిల్లల్ని బలియిచ్చారు. వాళ్లీ బలిని తమ సోదరులైన యాజకుల కోసం, తమకోసం ఇచ్చారు.
EZR 6:21 అలాగ, నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ పస్కా పండుగ భోజనం చేశారు. ఇతరులు స్నానాదులతో తమని తాము శుభ్రం చేసుకుని, ఆ దేశంలో నివసించే ఇతర మనుష్యుల అపరిశుభ్ర అంశాలనుంచి తమని తాము వేరు చేసుకున్నారు. అలా పరిశుద్ధులైన వాళ్లు కూడా పస్కా పండుగ భోజనంలో పాల్గొన్నారు. వాళ్లు సహాయం కోసం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దగ్గరకు పోగలిగేందుకు, వారు తమ్మును తాము వేరు చేసుకొని పరిశుద్ధ పరచుకొన్నారు.
EZR 6:22 వాళ్లు ఏడు రోజులపాటు పులియని రొట్టెల పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. అష్షూరు రాజు మనోవైఖరిని మార్చి, యెహోవా వాళ్లకెంతో సంతోషం కలిగించాడు. దానితో, అష్షూరు చక్రవర్తి దేవాలయ పునర్నిర్మాణ కృషిని సాగిం చేందుకు వాళ్లకి తోడ్పడ్డాడు.
EZR 7:1 ఈ సంఘటనల తర్వత పారసీక రాజు అర్తహషస్త పాలన కాలంలో ఎజ్రా బబులోను నుంచి యెరూషలేముకి వచ్చాడు. ఎజ్రా శెరాయా కొడుకు. శెరాయా అజర్యా కొడుకు, అజర్యా హిల్కీయా కొడుకు,
EZR 7:2 హిల్కీయా షల్లూము కొడుకు. షల్లూము సాదోకు కొడుకు, సాదోకు అహిటూబు కొడుకు,
EZR 7:3 అహిటూబు అమర్యా కొడుకు. అమర్యా అజర్యా కొడుకు. అజర్యా మెరాయోతు కొడుకు.
EZR 7:4 మెరాయోతు జెరహ్యా కొడుకు. జెరహ్యా ఉజ్జీ కొడుకు. ఉజ్జీ బుక్కీ కొడుకు.
EZR 7:5 బుక్కీ అబీషూవ కొడుకు. అబీషూవ ఫీనెహాసు కొడుకు. ఫీనెహాను ఎలియాజరు కొడుకు. ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కొడుకు.
EZR 7:6 బబులోను నుండి యెరూషలేముకు వచ్చిన ఎజ్రా గొప్ప ఉపదేశకుడు. అతనికి మెషే ధర్మశాస్త్రం యెహోవా ద్వారా ఇవ్వబడింది. యెహోవా ఎజ్రాకి తోడుగా వున్నాడు. అందుకని, అర్తహషస్త మహారాజు ఎజ్రా కోరుకున్నదల్లా ఇచ్చాడు.
EZR 7:7 ఎజ్రాతోబాటు అనేక మంది ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చారు. వాళ్లతో యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వార పాలకులు, ఆలయ సేవకులు వున్నారు. ఆ ఇశ్రాయేలీయులు అర్తహషస్త చక్రవర్తి పాలన ఏడవ సంవత్సరంలో యెరూషలేముకి తిరిగి వచ్చారు.
EZR 7:8 అర్తహషస్త చక్రవర్తిగా అయిన ఏడవ సంవత్సరం, అయిదవ నెలలో ఎజ్రా యెరూషలేముకి చేరుకున్నాడు.
EZR 7:9 ఎజ్రా, అతనితో ఒక బృందం మొదటి నెల మొదటి రోజున బబులోను నుంచి బయల్దేరారు. ఎజ్రా యెరూషలేముకి అయిదవ నెల ఒకటవ రోజున చేరుకున్నాడు. యెహోవా దేవుడు అతనికి తోడుగా వున్నాడు.
EZR 7:10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్ర అధ్యయనానికి, దాన్ని అనుసరించేందుకూ తన కాలమంతటినీ ఎంతో శ్రద్ధగా వినియోగించాడు. ఎజ్రా ఇశ్రాయేలీయులకు యెహోవా ఆజ్ఞలనూ, ఆదేశ సూత్రాలనూ బోధించాలని కోరుకున్నాడు. అంతమాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆజ్ఞలను అనుసరించడంలో వారికి తోడ్పడాలని కూడా అతను కోరుకున్నాడు.
EZR 7:11 ఎజ్రా యాజకుడు, ఉపదేశకుడు, యెహోవా ప్రభువు ఆదేశాలను గురించీ, ధర్మశాస్త్ర నిబంధనలను గురించీ అతనికి బాగా తెలుసు.
EZR 7:12 ఎజ్రా ఉపదేశకునికి అర్తహషస్త మహారాజు పంపిన లేఖనకలు: యాజకుడూ, పరలోక దేవుని ధర్మశ్రాస్త ఉపదేశకుడూ అయిన ఎజ్రాకి: అభివందనాలు!
EZR 7:13 ఈ క్రింది ఆజ్ఞ జారీ చేస్తున్నాను, నా సామ్రాజ్యంలో నివసిస్తున్న ఏ వ్వక్తి, యాజకుడు, లేక లేవీయుడు అయినా ఎజ్రాతోబాటు యెరూషలేముకు పోవాలనుకుంటే, అతనలా పోవచ్చు.
EZR 7:14 ఎజ్రా! నా ఏడుగురు మంత్రులూ, నేనూ, నిన్ను పంపిస్తున్నాం. నువ్వు యూదాకి, యెరూషలేముకి వెళ్లాలి. మీ దేవుని ధర్మశాస్త్రాన్ని మీ ప్రజలు ఎలా ఆచరిస్తున్నారో పరిశీలించు, పర్యవేక్షించు. ఆ ధర్మశాస్త్రం నీ దగ్గర వుంది కదా.
EZR 7:15 నా మంత్రులూ, నేనూ ఇశ్రాయేలు దేవునికి వెండి బంగారాలు యిస్తున్నాం. దేవుడు యెరూషలేములో వుంటాడు. నువ్వు నీతో ఈ వెండి, బంగారాలు తీసుకువెళ్లాలి.
EZR 7:16 అంతేకాదు, నువ్వు బబులోను దేశంలోని రాష్ట్రాలన్నింట్లోనూ పర్యటించి, మీ ఇశ్రాయేలు ప్రజలనుంచీ, యాజకుల నుంచీ, లేవీయుల నుంచీ కానుకలు పోగుచెయ్యి. ఆ కానుకలు యెరూషలేములోని ఆలయ నిర్మాణం నిమిత్తం ఉద్దేశింప బడ్డాయి.
EZR 7:17 ఆ సోమ్మును ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను కొనేందుకు వినియోగించు. ఆ బలుల తోబాటు సమర్పించవలసిన ధాన్యార్పణలనూ, పానార్పణలనూ కొను. తర్వాత యెరూషలేములోని మీ దేవుని దేవాలయంలో వాటిని బలి ఇవ్వు.
EZR 7:18 తర్వాత నువ్వూ, నీ సోదర యూదులూ ఇంకా మిగిలిపోయిన వెండి బంగారాలను మీ ఇష్టం వచ్చిన విధంగా వాడు కోవచ్చు. దాన్ని మీ దేవునికి ప్రీతికరమైన పద్ధతిలో ఉపయోగించు.
EZR 7:19 నువ్వు వస్తువులన్నీ యెరూషలేము దేవుని సన్నిధికి తీసుకుపో. ఆ వస్తువులు మి దేవుని ఆరాధన కోసం.
EZR 7:20 మీ దేవుని ఆలయం కోసం అవసరమైన అనేక ఇతర వస్తువులను కూడ మీరు పొందవచ్చు. నీకు అవసరమైన ఏ వస్తువు కోసమైనా సొమ్మును రాజ ఖజానా నుంచి తీసుకో.
EZR 7:21 అర్తహషస్త చక్రవర్తినైన నేను ఈ క్రింది ఆజ్ఞను జారీచేస్తున్నాను: యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలో రాజధనాన్ని పర్యవేక్షిస్తున్న వ్యక్తులందరికీ ఎజ్రా ఏమి కోరుకుంటే, దాన్ని అతనికి ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఎజ్రా యాజకుడు, పరలోక దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే ఉపదేశకుడు. మీరీ పనిని సత్వరం సంపూర్ణంగా చెయ్యండి.
EZR 7:22 మీరు ఎజ్రా 3,400 కిలో గ్రాముల వెండిని, వెయ్యి తూముల గోధుమను, 2,200 లీటర్ల ద్రాక్షారసమును, 2,200 కిలో గ్రాములు ఒలీవ నూనెను అడిగినంత ఉప్పును యివ్వండి.
EZR 7:23 పరలోక దేవుడు ఎజ్రా కోసం ఏమి ఆదేశిస్తే, దాన్ని మీరు ఎజ్రాకి సత్వరం, సంపూర్ణంగా ఇవ్వండి. మీరీ పనులు పరలోక దేవుని ఆలయంకోసం చెయ్యండి. దేవునికి నా సామ్రాజ్యం మీదా, నా కొడుకుల మీదా కోపం రావడం నాకు యిష్టం లేదు.
EZR 7:24 యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు, దేవాలయంలోని యితర పనివాళ్ల దగ్గర పన్నులు వసూలు చేయడం ధర్మశాస్త్ర విరుద్ధమన్న విషయం మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ల పన్నులు, రాజుగారికి నజరానాలు, ఏ విధమైన సుంకపు పన్నులు చెల్లించ నక్కర్లేదు.
EZR 7:25 ఎజ్రా, మీ దేవుని యొద్ద నుంచి నువ్వు పొందిన వివేకాన్ని వినియోగించి పౌర, మతపర న్యాయాధిపతులను ఎంపికచేసే అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను. వాళ్లు యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ న్యాయాధిపతులుగా వ్యవహరిస్తారు. నీ దేవుని ఆజ్ఞలను ఎరిగిన ప్రజలకందరికీ వారు తీర్పుతీరుస్తారు. దేవుని ఆజ్ఞలను గురించి వారు తెలియని వారికి నేర్పాలి.
EZR 7:26 మీ దేవుని ధర్మశాస్త్రాన్నిగాని, చక్రవర్తి శాసనాన్నిగాని ఎవరైనా మన్నించకపోతే, అతను శిక్షించబడాలి. నేరాన్ని బట్టి అతనికి మరణ దండనో లేక దేశాంతరవాస శిక్షో విధించాలి, లేక అతని ఆస్తిని జప్తు చేయాలి, లేక అతన్ని చెరసాలలో పెట్టాలి.
EZR 7:27 యెరూషలేములో పున్న యెహోవా ఆలయానికి ఘనత చేకూర్చాలనే తలంపును రాజు మదిలో నాటిన ప్రభువుకు మా పూర్వీకుల దేవుడైన యోహోవాకు కీర్తి కలుగునుగాక!
EZR 7:28 చక్రవర్తి, ఆయన మంత్రుల, ఇతరేతర ముఖ్యాధికారుల ఎదుట నాపై నిజమైన ప్రేమను పభువు చూపించాడు. దేవుడైన యెహోవా నాతో ఉన్నాడు, అందుకే నేను ధైర్యంగా ఉన్నాను. యెరూషలేముకు నాతో పోయేందుకు నేను ఇశ్రాయేలీయులు నాయకులను సమీకరించాను.
EZR 8:1 చక్రవర్తి అర్తహషస్త పాలన కాలంలో బబులోను నుంచి యెరూషలేముకు నాతో (ఎజ్రా) పాటు తిరిగివచ్చిన ఆయా కుటుంబాల పెద్దల, తదితరుల పేర్ల జాబితా ఇది:
EZR 8:2 ఫీనేహాసు సంతతి నుంచి గెర్షోము; ఈతామారు సంతతినుంచి దానియేలు; దావీదు సంతతి నుంచి హట్టూషు:
EZR 8:3 షెకన్యా సంతతినుంచి పరోషు; పరోషు సంతతినుంచి జెకర్యా, మరో 150 మంది పురుషులు;
EZR 8:4 పహ త్మోయాబు సంతతినుంచి జెరహ్యా కొడుకు ఎల్యోయేనై, మరో 200 మంది పురుషులు;
EZR 8:5 షెకన్యా సంతతి నుంచి యహజీయేలు కొడుకు షెకన్యా, మరో 300 మంది పురుషులు;
EZR 8:6 అదీను సంతతినుంచి యోనాతాను కొడుకు ఏబెదు, మరో 50 మంది పురుషులు;
EZR 8:7 ఏలాము సంతతి నుంచి అతల్యా కొడుకు యెషయా, మరో 70 మంది పురుషులు;
EZR 8:8 షెపట్య సంతతినుంచి మిఖాయేలు కొడుకు జెబద్యా, మరో 80 మంది పురుషులు;
EZR 8:9 యోవాబు సంతతినుంచి యెహీయేలు కొడుకు ఓబద్యా, మరో 218 మంది పురుషులు;
EZR 8:10 షెలోమీతు సంతతినుంచి యోసిఫ్యా కొడుకు షెలోమీతు, మరో 160 మంది పురుషులు;
EZR 8:11 బేబై సంతతినుంచి బేబై కొడుకు జెకర్యా, మరో 28 మంది పురుషులు;
EZR 8:12 అజ్గాదు సంతతినుంచి హక్యాటాను కొడుకు యెహానాను, మరో 110 మంది పురుషులు;
EZR 8:13 అదోనీకాము సంతతిలో చివరి వారినుంచి ఎలీఫెలెటు; యెహీయేలు, షెమాయా, మరో 60 మంది పురుషులు;
EZR 8:14 బిగ్వయి సంతతినుంచి ఊతైయు, జబ్బూదు, మరో 70 మంది పురుషులు.
EZR 8:15 నేను (ఎజ్రా) వాళ్లందరినీ అహవా వైపు పారే ఒక నది దగ్గర సమావేశపరిచాను. మేము మూడు రోడుల పాటు అక్కడనే యుంటిమి. ఆ బృందంలో యాజకులు పున్నారుగాని, లేవీయులెవ్వరూ లేరన్న విషయం నేను గమనించాను.
EZR 8:16 అందుకని, నేను ఎలియెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, (మరో) ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లూము అనే పెద్దలను పిలిచాను. వీరికి తోడు యోయారీబు, ఎల్నాతాను అనే మరో ఇద్దర్ని (వీళ్లిద్దరూ ఉపాధ్యాయులు) కూడా పిలిచాను.
EZR 8:17 వాళ్లని ఇద్దో వద్దకు పంపించాను. ఇద్దో కాసిఫ్యా పట్టణానికి నాయకుడు. ఇద్దోకీ, అతని బంధుపులకు ఏమి చెప్పాలో వివరించి నేను నా మనుష్యులను అక్కడికి పంపాను. ఇద్దో బంధువులు కాసిఫ్యాలో దేవాలయ సేవకులు దేవాలయంలో పనిచేసే సేవకులను పంపవచ్చునన్న ఆశతో నేను నా మనుష్యులను ఇద్దో దగ్గరికి పంపాను.
EZR 8:18 దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి, ఇద్దో బంధువులు ఈ కిందివాళ్లను మాకు పంపారు: మావీ సంతతి నుంచి షేరేబ్యా అనే ఒక వివేకి (మాలీ లేవీ సంతతుల్లో ఒకడు. లేవీ ఇశ్రాయేలు కొడుకుల్లో ఒకడు. వాళ్లు అతని కొడుకునీ, అన్నదమ్ముల్నీ కూడా పంపారు. మొత్తంమీద ఆ కుటుంబానికి చెందిన వాళ్లు 18 మంది).
EZR 8:19 మెరారీ సంతతివారి నుంచి హషబ్యా, యెషయా (వాళ్లు తమ కొడుకులను, సోదరులను, బందువులను కూడా పంపారు, ఆ కుటుంబం నుంచి మొత్తం మంది మగాళ్లు వచ్చారు)
EZR 8:20 వారితోపాటు 220 మంది దేవాలయ పరిచారకులు వచ్చారు. (వాళ్లు లేవీయులకు సాయం చేసేవాళ్లు. వాళ్ల పూర్వీకులు దావీదు చేత, ముఖ్యాధికారుల చేత ఎంపిక చేయబడినవాళ్లు. వాళ్లందరి పేర్లూ వ్రాసి వుంచబడ్డాయి).
EZR 8:21 అక్కడ, ఆ అహవా నది దగ్గర నేను (ఎజ్రా) మనమందరం ఉపవాసం చెయ్యాలని ప్రకటించాను. మన దేవుని ముందు విధేయత చూపేందుకుగాను మనం ఉపవాసం చెయ్యాలి. మేమూ, మా పిల్లలూ, మాకున్న సమస్త వస్తువులూ క్షేమంగా యెరూషలేము చేరేలా దీవించుమని దేవుణ్ణి వేడు కోవాలనుకున్నాము.
EZR 8:22 మా ప్రయాణ మార్గంలో మా రక్షణ కోసం సైనికుల్నీ, అశ్వికుల్నీ పంపమని అర్తహషస్త చక్రవర్తిని అర్థించడం నాకు సిగ్గుగా తోచింది. మార్గంలో శత్రువులున్నారని నాకు తెలుసు. అయితే అర్తహషస్త చక్రవర్తికి మేమంతకు ముందు ఇలా చెప్పివున్నాము: “మా దేవుడు తనని నమ్మే ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటాడు. అయితే, దేవుడు తనకు ఎడముఖంగా వున్న ప్రతి ఒక్కనిపట్లా చాలా కోపంగా వుంటాడు.”
EZR 8:23 అందుకని, మేము ఉపవాసం వుండి, మా ప్రయాణం గురించి మేము దేవుణ్ణి ప్రార్థించాము. ఆయన మా ప్రార్థనలకు జవాబిచ్చాడు.
EZR 8:24 తర్వాత నేను పన్నెండుగురు ముఖ్య యాజకులను, షెరేబ్యాను, హషబ్యాను, వాళ్ల సొదరులు పది మందిని ఎంపికచేశాను.
EZR 8:25 దేవాలయం కోసం ఇవ్వబడిన వెండిని, బంగారాన్ని తదితర వస్తువులను తూకం వేయించాను. నేను ఎంపికచేసిన పన్నెండుగురు యాజకులకు నేను వాటిని అప్పగించాను. అర్తహషస్త చక్రవర్తి, ఆయన మంత్రులు, ఆయన ముఖ్యాధికారులు, బబులోనులోని ఇశ్రాయేలీయులు అందరూ దేవుని దేవాలయం కోసం యిచ్చిన వస్తువులవి.
EZR 8:26 నేను వాటన్నింటినీ తూకం వేశాను. వెండి 25 టన్నులు వుంది. వెండిగిన్నెలు, వస్తువులు మూడుమ్ముప్పాతిక టన్నులున్నాయి. మూడుమ్ముప్పాతిక టన్నుల బంగారం వుంది.
EZR 8:27 నేను వాళ్లకి 20 బంగారు గిన్నెలు యిచ్చాను. అవి 19 పౌనుల బరువున్నాయి. నేను వాళ్లకి మెరుగు పెట్టిన కంచుతో చేసిన అందమైన రెండు పాత్రలు ఇచ్చాను. అవి బంగారు వస్తువులంతటి విలువైనవి.
EZR 8:28 తర్వాత నేనా పన్నెండుగురు యాజకులతో యిలా చెప్పాను: “యెహోవా దేవుని దృష్టిలో మీరు పవిత్రులు, ఆ వస్తువులు పవిత్రమైనవి. ప్రజలు యీ వెండి బంగారాలను మీ పూర్వీకుల దేవునికి యిచ్చారు.
EZR 8:29 అందుకని, మీరీ వస్తువులను జాగ్రత్తగా కాపాడండి. యెరూషలేములోని దేవాలయ పెద్దలకు మీరు వీటిని అప్పగించేదాకా, యీ వస్తువులకు మీరే బాధ్యులు. మీరు వీటిని ముఖ్య లేవీయులకి, ఇశ్రాయేలు కుటుంబ పెద్దలకీ యిచ్చినప్పుడు వాళ్లు వీటిని తూకం వేసి, యెరూషలేములోని యెహోవా దేవాలయంలోని గదుల్లో పదిలపరుస్తారు.”
EZR 8:30 ఎజ్రా తూకం వేసి తమకిచ్చిన వెండి బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ యాజకులూ, లేవీయులు స్వీకరించి, ఎజ్రా చెప్పినట్లు, వాటిని యెరూషలేము లోని దేవాలయానికి చేర్చేందుకు సంసిద్ధులయ్యారు.
EZR 8:31 మొదటి నెల పన్నెండవ రోజున మేము అహవానది దగ్గరనుంచి యెరూషలేముకు బయల్దేరాము. దేవుడు మాకు తోడుగావుండి, మార్గంలో శత్రువులనుంచీ, దోపిడిగాండ్రనుంచీ మమ్మల్ని కాపాడాడు.
EZR 8:32 చివరకు మేము యెరూషలేము చేరుకున్నాము. మేమక్కడ మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాము.
EZR 8:33 నాల్గవ రోజున దేవాలయానికి వెళ్లి వెండి బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ తూకం వేశాము. మేమా వస్తువులను ఊరియా యాజకుని కొడుకైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో ఫినేహాసు కుమారుడు ఎలీయాజరు వున్నాడు. వాళ్లతోబాటు లేవీయులైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా వున్నారు.
EZR 8:34 మేము అన్ని వస్తువులనూ లెక్క పెట్టి, వాటన్నింటినీ తూకం వేశాము. తర్వాత మేము అప్పటి మొత్తం బరువును వ్రాసి పెట్టాము.
EZR 8:35 అటు తర్వాత నిర్బంధంనుంచి తిరిగివచ్చిన యూదులు ఇశ్రాయేలు దేవునికి దహనబలులు అర్పించారు. వాళ్లు ఇశ్రాయేలీయులందరి కొరకు 12 ఎడ్లను, 96 పోట్టేళ్లను, 77 మగ గొర్రెపిల్లలను, పాప పరిహారార్థబలి నిమిత్తం 12 మేక పోతులను బలి యిచ్చారు. ఇవన్నీ దహసబలిగా ఇవ్వబడ్డాయి.
EZR 8:36 అటుతర్వాత వాళ్లు అర్తహషస్త ఆజ్ఞలను రాజ ప్రతినిధులైన సామంత నాయకులకు, యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతపు పాలనాధికారులకు అందజేశారు. కనుక వారందరూ వచ్చి దేవుని ఆలయపు పనిలో సహాయపడ్డారు.
EZR 9:1 మేమీ పనులన్నీ ముగించాక ఇశ్రాయేలు నాయకులు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు: “ఎజ్రా, ఇశ్రాయేలీయులు తమ చుట్టూ వున్నవారితో తమని తాము వేరుగా నిలుపుకోలేదు. యాజకులు, లేవీయులు సైతం తమ ప్రత్యేకతను కాపాడుకోలేదు. కనాను, హిత్తీ, పెరిజ్జీ, యెబూషీ, అమ్మోను, మెయాబు, ఈజిప్టు అమోరీ జాతులవారు చేసే పాపపు పనులతో ఇశ్రాయేలీయులు చెడుగా ప్రభావితులవుతున్నారు.
EZR 9:2 ఇశ్రాయేలీయులు మన చుట్టూ వున్న ఆయా జాతులవారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు తమ ప్రత్యేకతను నిలుపుకొని వుండవలసింది. కాని. వాళ్లు తమ చుట్టూవున్న ఇతర జాతీయులను పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు నాయకులు, ముఖ్య అధికారులు ఈ విషయంలో చెడ్డ విధానాన్ని అనుసరించారు.”
EZR 9:3 ఈ విషయాలు విన్న నేను నా మనో దుఃఖాన్ని తెలిపేందుకు అంగీని, పైవస్తాన్ని చింపుకున్నాను. నా జుట్టు, గడ్డం పీక్కున్నాను. కలత చెంది దిగ్భ్రాంతుడనై నేను కూర్చుండి పోయాను.
EZR 9:4 అప్పుడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే ప్రతి ఒక్కడూ భయకంపితుడయ్యాడు. చెరనుంచి తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులు దేవుని పట్ల నమ్మక ద్రోహులుగా వ్యవహారించినందుకు వాళ్లందరూ భయపడ్డారు. సాయంత్రపు బలివరకు కలతచెందిన నేను మాటలాడక అక్కడే కూర్చూండిపోయాను. అందరూ నా చుట్టూ మూగారు.
EZR 9:5 సాయంత్రపు బలివేళ అవడంతో, నేను లేచి నిలబడ్డాను. నా అంగీ, పై వస్త్రమూ చీలికలు పేలికలైవున్నాయి. యెహోవా దేవునివైపు చేతులు చాపి ప్రార్థిస్తూ, మోకరిల్లాను.
EZR 9:6 ప్పుడు నేనిలా ప్రార్థించాను: “ఓ దేవా, ఎక్కువ సిగ్గుచేత, కలవరపాటుచేత నేను నీవైపు ముఖము ఎత్తలేకపోతున్నాను. మా పాపాలు, దోషాలు మా తలల ఎత్తును మీరిపోయి ఆకాశాన్ని అంటుతున్నాయి.
EZR 9:7 మా పూర్వీకుల నాటినుంచి నేటి మా తరందాకా మేము అనేకానేక పాపాలు చేశాము. అందుకే మా రాజులూ, యాజకులూ శిక్షింపబడ్డారు. విదేశాల రాజులు మా పైన దాడి చేసి మా ప్రజలను బందీలుగా తీసుకుపోయారు. ఆ రాజులు మా సంపదను కొల్లగొట్టి, మమ్మల్ని అవమానానికి గురిచేశారు. ఈ నాటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.
EZR 9:8 “చివరికి ఇప్పుడు, దేవా, నీవు మాపట్ల దయ చూపావు. మాలో కొద్దిమంది చెరనుంచి తప్పించుకొని ఈ పవిత్ర ప్రాంతంలో నివసించడాన్ని సాధ్యంచేశావు. ప్రభువా, నీవు మాకు కొత్త జీవితం, దాస్యములో నుంచి విముక్తి ప్రసాదించావు.
EZR 9:9 మేము బానిసలుగా వున్నమాట నిజమే, కాని, నీవు మమ్మల్మి శాశ్వతంగా బానిసలుగా ఉండనియ్యవు. నీవు మాపట్ల దయ చూపావు. పారసీక ప్రభువులు మాపట్ల దయ చూపేలా నీవు చేశావు. నీ దేవాలయం ధ్వంసం చేయబడింది. కాని, నీవు మాకు నూతన జీవితం ప్రసాదించి, మేము నీ ఆలయాన్ని తిరిగి నిర్మించి, దాన్ని సరికొత్తదానిలా మలచగలిగే అవకాశం మాకు కల్పించావు. దేవా! యూదా, యెరూషలేములకు రక్షణగా ప్రాకారం కట్టేందుకు నీవు మాకు తోడ్పడ్డావు.
EZR 9:10 “ఇప్పుడు దేవా, నీకు మేము చెప్పగలిగింది ఏముంది? మేము మళ్లీ నీ మాట పాటించడం మానేశాం!
EZR 9:11 దేవా, నువ్వు నీ సేవకులైన నీ ప్రవక్తల ద్వారా ఆ ఆదేశాలను మాకు ఇచ్చావు. నీవు ఇలా అన్నావు, “మీరు స్వంతం చేసుకొని, నివసించబోయే ప్రాంతం అపవిత్రమైన భూమి. అక్కడ నివసిస్తూ వచ్చిన మనుష్యులు చేసిన చెడ్డపనుల మూలంగా అది అపవిత్రమైనది. వాళ్లు ఈ దేశంలో అన్నిచోట్లా ఇలాంటి చెడ్డపనులు చాలా చేశారు. వాళ్లు తమ పాపాలతో ఈ దేశాన్ని అపవిత్రం చేశారు.
EZR 9:12 అందుకని, ఇశ్రాయేలీయులారా, మీ బిడ్డలు వారి బిడ్డలను పెళ్లి చేసుకోకుండా చూడండి. మీరు వాళ్లతో కలవకండి! నా ఆదేశాలను పాటించండి, వారితో శాంతి ఒప్పందం చేయకండి. అప్పుడు మీరు శక్తి కలిగి, దేశంలోని మంచి వాటిని ఆనందంగా అనుభవించగలుగుతారు. అప్పుడు మీరు ఈ దేశాన్ని నిలుపుకొని, దాన్ని మీ బిడ్డలకు సంక్రమింప జేయగలుగుతారు.
EZR 9:13 “మనకి వాటిల్లిన కష్టాలకు మన చెడ్డక్రియలే కారణం. మనం పాపాలు చేశాం, మన దోషాలు అనేకమైనవి. అయితే, ఓ దేవా, నీవు మమ్ముల్ని శిక్షించ వలసినంతగా శిక్షించలేదు. మేము ఘోరమైన పాపాలు ఎన్నో చేశాము. మమ్మల్ని నీవు ఇంకెంతో కఠినంగా శిక్షించియుండవలసింది. మాలో కొందర్ని దాస్యంలో సహితం తప్పించుకోనిచ్చావు.
EZR 9:14 నీ ఆదేశాలను భంగ పరచకూడదని మేము తెలుసుకున్నాము. మేము వాళ్లను పెళ్లి చేసుకోకూడదు. వాళ్లు చేసేవి చాలా చెడ్డ పనులు. దేవా, మేమా చెడ్డవాళ్లతో పెళ్లి పేరంటాలు కొనసాగించి నట్లయితే, నీవు మమ్మల్ని నాశనం చేస్తావని మాకు తెలుసు! అప్పుడిక ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కడూ ప్రాణాలతో మిగిలివుండడు.
EZR 9:15 “యెహోవా, ఇశ్రాయేలు ప్రజలు దేవా, నీవు నీతి మంతుడవై యున్నావు. మాలో కొందర్ని ప్రాణాలతో మిగిల్చావు. మా దోషం కారణంగా, మాలో ఒక్కడుకూడా నీ ముందు నిలిచేందుకు అర్హుడుకాడు.”
EZR 10:1 ఎజ్రా ఎడతెగకుండా శోకిస్తూ, ప్రార్థిస్తున్నాడు. అతడు దేవుని దేవాలయం ముందు విలపిస్తూ సాష్టాంగపడ్డాడు. ఎజ్రా అలా ప్రార్థిస్తూ వుండగా, ఇశ్రాయేలీయుల పెద్దల బృందం ఒకటి పురుషులు, స్త్రీలు, బాలబాలికలు అతని చుట్టూ గుమికూడింది. వాళ్లు కూడా భోరున విలపించసాగారు.
EZR 10:2 అప్పుడు ఏలాము సంతతివాడైన యెహీయేలు కొడుకు షెకన్యా ఎజ్రాతో ఇలా అన్నాడు: “మేము దేవునికి విశ్వాస పాత్రంగా వ్యవహరించలేదు. మేము మా చుట్టూ వున్న పరాయి జాతుల స్త్రీలను పెండ్లాడాము. అయితే, మేమీ పని చేసినా కూడా, ఇశ్రాయేలీయులకు ఇంకా ఆశవుంది.
EZR 10:3 ఇప్పుడిక్కడ మనం మన దేవుని ముందు ఆ స్త్రీలను, వాళ్ల పిల్లలను అందర్నీ బయటికి పంపేస్తామని ఒడంబడిక చేద్దాము. ఎజ్రా సలహానూ, మన దేవుని ఆదేశాలను గౌరవించేవారి సలహాలను పాటించేందుకుగాను మనం యీ పని చేద్దాము. మనం దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము.
EZR 10:4 ఎజ్రా, నువ్వులే, ఇది నీ బాధ్యత, అయితే, మేమూ నీకు తోడ్పాటు ఇస్తాము. అందుకని నువ్వు ధైర్యంగా వుండి ఈ పని నిర్వహించు.”
EZR 10:5 అప్పుడు ఎజ్రా లేచి నిలబడ్డాడు. ముఖ్య యాజకుల చేత, లేవీయుల చేత, ఇశ్రాయేలీయులందరి చేత తాను చెప్పినది చేస్తామని వాగ్దానం చేయించు కున్నాడు.
EZR 10:6 తర్వాత, ఎజ్రా దేవుని ఆలయం ముందునుంచి ఎల్యాషీబు కొడుకు యోహానాను గదికి వెళ్లాడు. ఎజ్రా అక్కడ వున్నప్పుడు తిండి తినలేదు, నీరు తాగలేదు. యెరూషలేముకి చెరనుండి తిరిగి వచ్చిన ప్రజలు చేసిన దేవుని చట్ట ఉల్లంఘన విషయంలో ఇంకా చాలా దుఃఖితుడై పున్న కారణంగానే, అతనలాతిండి తీర్థాలు ముట్టకుండా ఉండిపోయాడు.
EZR 10:7 అటు తర్వాత, అతను యూదా, యెరూషలేములలో అన్నిచోట్లా చాటింపు వేయించాడు. ఆ చాటింపు సందేశంలో నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన యూద వ్యక్తులందరూ యెరూషలేములో సమావేశమవ్వాలని పేర్కొనబడింది.
EZR 10:8 మూడు రోజుల్లో అలా యెరుషలేముకి రాని వ్యక్తి తన ఆస్తినంతటినీ వదులుకోవలసివుంటుంది. అతను నివసిస్తున్న ప్రజాబృందం నుంచి వెలివేయ బడతాడు. ముఖ్య అధికారులూ, యూదా పెద్దలూ (నాయకులూ) యెరూషలేము వెళ్లాలని నిర్ణయం చేశారు.
EZR 10:9 దానితో, మూడు రోజుల్లో యూదా, బెన్యామీను వంశాలను చెందిన పురుషులందరూ యెరూషలేములో సమావేశమయ్యారు. తొమ్మిదోనెల ఇరవయ్యవ రోజున ప్రజలందరూ దేవాలయ ఆవరణలో సమావేశమయ్యారు. సమావేశ లక్ష్యం దృష్ట్యానూ, భారీ వర్షం మూలంగానూ వాళ్లందరూ ఎంతో కలవరపడ్డారు.
EZR 10:10 అప్పుడు ఎజ్రా యాజకుడు ఆ జనాన్ని ఉద్దేశించి యిలా ప్రసంగించాడు: “మీరు దేవునిపట్ల నమ్మకంగా వ్యవహరించలేదు. మీరు విదేశీయులను పెళ్లాడారు. మీరు అలా చేయడం ద్వారా ఇశ్రాయేలును మరింతగా నేరస్థం చేశారు.
EZR 10:11 మీరిప్పుడు నేరం చేసినట్లు యెహోవా ముందు ఒప్పుకోవాలి. యెహోవా మీ పూర్వీకుల దేవుడు. మీరు యెహోవా ఆజ్ఞను పాటించాలి.మీరు మీ చుట్టూ నివసించే అన్య ప్రజలనుంచీ, విదేశీ భార్యలనుంచీ వేరుపడాలి.”
EZR 10:12 అప్పుడు అక్కడ కూడిన అందరూ ఎజ్రాకి బిగ్గరగా ఇలా బదులిచ్చారు, “ఎజ్రా, నీవు చెప్పింది సరైన మాట! మేము నువ్వు చెప్పిన పనులు యెయ్యాలి.
EZR 10:13 అయితే, ఇక్కడ చాలామంది వున్నారు. ఇది వర్షాకాలం. మేమిక్కడ బయట నిలబడి వుండటం కష్టం. మేము చాలా తీవ్రమైన పాపం చేశాము. అందుకని, ఈ సమన్యను ఒకటి రెండు రోజుల్లో పరిష్కరించడం సాధ్యంకాదు.
EZR 10:14 ఇక్కడ సమావేశమైన వాళ్లందరి తరవునా మా నాయకుల్ని నిర్ణయం తీసుకోమనండి. అటు తర్వాత, మా పట్టణాల్లో విదేశీ స్త్రీని పెళ్లి చేసుకున్న ప్రతివ్యక్తి ఒక నిర్ణీత సమయంలో యెరూషలేముకి రావాలి. వాళ్లు ఇక్కడికి తమ పెద్దలతో (నాయకులు) న్యాయాధిపతులతో కలిసి రావాలి. అప్పుడు మనపట్ల దేవుని కోపం ఆగుతుంది.”
EZR 10:15 కొద్దిమంది మాత్రమే ఈ ఏర్పాటును వ్యతిరేకించారు. అశాహేలు కొడుకు యోనాతాను, తిక్వా కొడుకు యహజ్యాయు. మెషుల్లాము, షబ్బెతైయు కూడా యీ తీర్మానాన్ని వ్యతిరేకించారు.
EZR 10:16 చెరనుంచి యెరూషలేముకు తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులందరూ ఈ తీర్మానాన్ని ఆమోదించారు. యాజకుడు ఎజ్రా ఆయా వంశాల నాయకులను ఎంపికచేశాడు. అతను ఒకొక్క వంశం నుంచి ఒక్కొక్కరిని పేర్ల వరుసన ఎన్నుకున్నాడు. పదవ నెల మొదటి రోజున ఎంపిక చేయబడిన వ్యక్తులు కూర్చుని ఒక్కొక్కరి విషయాన్ని విచారణ చేయనారంభించారు.
EZR 10:17 మొదటి నెల మొదటిరోజు నాటికి విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్లందర్మి గురించీ చర్చలు ముగించారు.
EZR 10:18 విదేశీ స్త్రీలను వివాహం చేసుకున్న యాజకుల సంతతివారి పేర్లు యివి: యోజాదాకు కొడుకు యేషూవ వంశీకుల నుంచి యేషూవ సోదరులు, మయశేయ, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా.
EZR 10:19 వీళ్లందరూ తమ భార్యలకు విడాకులు ఇస్తామని ప్రమాణం చేశారు. తర్వాత వాళ్లలో ప్రతి ఒక్కడూ తన నేర పరిహారం నిమిత్తం అపరాధ పరిహారార్థ బలిగా తన మంద నుంచి ఒక్కొక్క పొట్టేలును సమర్పించారు.
EZR 10:20 ఇమ్మేరు సంతతివారు: హనానీ, జెబద్యా
EZR 10:21 హారీము సంతతివారు: మయశేయా, ఏలియా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.
EZR 10:22 పషూరు సంతతివారు: ఎల్యోయేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా.
EZR 10:23 లేవీయుల్లో పరాయి స్త్రీలను పెళ్లి చేసుకున్నవారు: యోజాబాదు, షిమీ, కెలిథా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.
EZR 10:24 గాయకులలో: ఎల్యాషీబు. ద్వారపాలకులలో: షలూము, తెలెము, ఊరి.
EZR 10:25 ఇశ్రాయేలీయుల్లో ఈ క్రిందివారు పరజాతి స్త్రీలను పెళ్లిచేసుకున్నారు. పరోషు సంతతివారు: రమ్యా, యిజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియేజరు, మల్కీయా, బెనాయా.
EZR 10:26 ఏలాము సంతతివారు: మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు,ఏలియా.
EZR 10:27 జత్తూ సంతతివారు: ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా.
EZR 10:28 బేబై వంశీకులు: యెహోహానాను, హనన్యా, జబ్బయి, అత్లాయి.
EZR 10:29 బానీ సంతతివారు: మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షెయాలు, రామోతు.
EZR 10:30 పహత్మోయాబు సంతతివారు: అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్య, బెసలేలు, బన్నూయి, మనష్షే.
EZR 10:31 హారీము సంతతివారు: ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా, షీమ్యోను,
EZR 10:32 బెన్యామీను, మల్లూకు, షెమర్యా.
EZR 10:33 హాషుము సంతతివారు: మతైనై, మత్తత్తా, జాబాదు, ఎలీపేలెటు, యెరేమై, మనష్షే, షిమీ,
EZR 10:34 బానీ సంతతివారు: మయదై, అమ్రాము, ఊయేలు,
EZR 10:35 బెనాయా, బేద్యా, కెలూహు,
EZR 10:36 వన్యా, మెరే మోతు, ఎల్యాషీబు,
EZR 10:37 మత్తన్యా, మతైనై, యహశావు.
EZR 10:38 బిన్నూయి సంతతివారు: షిమీ,
EZR 10:39 షెమర్యా, నాతాను, అదాయా,
EZR 10:40 మక్నద్బయి, షామై, షారాయి,
EZR 10:41 అజరేలు, షెలెమ్యా, షెమర్యా,
EZR 10:42 షల్లూము, అమర్యా, యోసేవు.
EZR 10:43 నెబో సంతతివారు: యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా.
EZR 10:44 పై పురుషులందరూ పరాయి జాతుల స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వాళ్లలో కొందరు ఆ స్త్రీల ద్వారా సంతానం పొందారు కూడా.
NEH 1:1 హకల్యా కుమారుడైన నెహెమ్య మాటలు ఇవి: నెహెమ్యా అనే నేను కిస్లేవు నెలలో రాజధాని నగరమైన షూషనులో ఉన్నాను. అర్తహషస్త రాజ్య పాలన ఇరవయ్యవ ఏట ఇది జరిగింది.
NEH 1:2 నేను షూషనులో వుండగా, నా సోదరుల్లో ఒకడైన హనానీయ, మరి కొందరు యూదా నుంచి వచ్చారు. అక్కడ నివసిస్తున్న యూదులను గురించి నేను వాళ్లని అడిగాను. వాళ్లు చెరనుంచి తప్పించుకొని, ఇంకా యూదాలోనే నివసిస్తున్న యూదులు. నేను వాళ్లని యెరూషలేము నగరం గురించి కూడా అడిగాను.
NEH 1:3 హనానీయ, అతనితో ఉన్న వాళ్లూ ఇలా చెప్పారు: “నెహెమ్యా, చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో వున్నారు. వాళ్లకి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటున్నారు. ఎందుకంటే, యెరూషలేము ప్రాకారం కూల్చబడింది. దాని ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి.”
NEH 1:4 యెరూషలేము ప్రజలను గురించి, ప్రాకారం గురించీ ఈ విషయూలు విన్నాక, నేను చాలా కలత చెందాను. నేను కూర్చుండి విలపించాను. నా విచారానికి అవధి లేకపోయింది. నేను కొన్ని రోజులపాటు ఉపవాసం వుండి, పరలోక దేవునికి ప్రార్థనలు చేశాను.
NEH 1:5 తర్వాత ఈ కింది ప్రార్థన చేశాను: పరలోక దేవా, యెహోవా ప్రభూ, నీవు అత్యంత శక్తిశాలివైన మహా దేవుడివి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు పాటించే మనుష్యులను నువ్యు కటాక్షించి వారితో ప్రేమ ఒడంబడికను అమలుపరుస్తావు.
NEH 1:6 దయచేసి నీవు కళ్లు తెరిచి, చెవులొగ్గి ఈ నీ సేవకుడు రాత్రింబగళ్లు నీ సన్నిధియందు చేస్తున్న ప్రార్థనలను విను. నేను నీ సేవకులైన ఇశ్రాయేలీయుల కోసం ప్రార్థిస్తున్నాను. మేము నీకు వ్యతిరేకంగా పాపాలు చేశామన్న విషయాన్ని నేను ఒప్పుకొంటున్నాను నేనూ, నా తండ్రి కుటుంబంలోని ఇతరులూ నీకు వ్యతిరేకంగా పాపం చేశామని ఒప్పుకొంటున్నాను.
NEH 1:7 ఇశ్రాయేలు ప్రజలమైన మేము నీపట్ల చాలా చెడుగా వ్యవహరించాము. నువ్వు నీ సేవకుడైన మోషే ద్వారా యిచ్చిన ఆజ్ఞలనూ, బోధనలనూ, విధులనూ మేము తృణికరించాము.
NEH 1:8 నువ్వు నీ సేవకుడైన మోషేకి ఇచ్చిన ఉపదేశాన్ని దయచేసి గుర్తుచేనుకో. దేవా, నువ్వు ఆయనకి “మీ ఇశ్రాయేలు ప్రజలు విశ్వసనీయంగా వ్యవహరించక పోయినట్లయితే, మిమ్మల్ని యితర దేశాల మధ్యకు చెదరగొడ్తాను.
NEH 1:9 అలాకాక, మీ ఇశ్రాయేలీయులు నా వద్దకు తిరిగి వచ్చి, నా ఆదేశాలను పాటించి నట్లయితే, అప్పుడు నేనిలా చేస్తాను: మీ ప్రజలు తమ ఇళ్లు వాకిళ్లు వదలటానికి బలవంతం చేయబడినా, భూలోకపు అంచులదాకా పోయినా సరే, నేను వాళ్లని అక్కడనుంచి తిరిగి ఒక్కచోట చేరుస్తాను. ఎక్కడైతే నా నామాన్ని ఉంచుటకు ఏర్పాటు చేసుకున్నానో అక్కడికి తిరిగి వాళ్లని నేను తీసుకొస్తాను” అని చెప్పావు.
NEH 1:10 ఇశ్రాయేలు ప్రజలు నీ సేవకులు, నీ ప్రజలు. నువ్వు నీ గొప్ప శక్తిని వినియోగించి, వాళ్లని విడిపించావు.
NEH 1:11 కాబట్టి ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. నేను నీ దాసుడను. నీ నామం పట్ల గౌరవం ప్రదర్శించాలని ఇష్టపడే నీ సేవకుల ప్రార్థనలు దయచేసి ఆలకించు. ప్రభూ, నేను రాజుకి ద్రాక్షారసం అందించే సేవకుణ్ణి. ఈ విషయం నీకు తెలుసు. అందుకని దేవా, నాకు ఈ నాడు సహాయం చెయ్యి. నేను రాజు సహాయాన్ని అర్థిస్తున్నాను. ఈ నా ప్రయత్నంలో నాకు విజయం చేకూర్చు. రాజుకి నా పట్ల అభిమానం కలిగేలా చెయ్యి.
NEH 2:1 అర్తహషస్త రాజు పాలన ఇరవయ్యవ సంపత్సరం, నీసాను నెలలో, ఎవరో కొంత ద్రాక్షారసం తెచ్చి ఇచ్చారు. నేను ముందు దాన్ని తాగి, పరిక్షించి, తర్వాత దాన్ని రాజుకి అందించాను. నేను రాజు సమక్షంలో వున్నప్పుడెప్పుడూ విచారంగా లేను, కాని అప్పుడు విచారంగా వున్నాను.
NEH 2:2 దానితో, రాజు నన్ను, “నీ ఒంట్లో బాగాలేద ఎందుకలా విచారంగా కనిపిస్తున్నావు? నీ గుండెల్లో విచారం గూడు కట్టుకుందన్నట్లు అనిపిస్తోంది” అని ప్రశ్నించారు. అప్పుడు నేను చాలా భయపడ్డాను.
NEH 2:3 అయితేనేమి, నేను భయపడినా కూడా, రాజుతో, “రాజు చిరంజీవిగా వర్ధిల్లాలి! నా పూర్వీకులు సమాధి చేయబడిన నగరం శిథిలమైంది. ఆ నగర ప్రాకార ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి” అని విన్నవించాను.
NEH 2:4 అప్పుడు రాజు, “నీకు నావల్ల ఏ సహాయం కావాలి?” అని నన్ను అడిగారు. జవాబిచ్చేందుకు ముందు, నేను పరలోక దేవుణ్ణి ప్రార్థించి.
NEH 2:5 రాజుకి ఇలా సమాధానమిచ్చాను. “రాజుకి దయ కలిగితే, నేను తమపట్ల మంచిగా ప్రవర్తించివుంటే, దయచేసి నన్ను నా పూర్వీకులు సమాధి చేయబడిన యెరూషలేము నగరానికి పంపండి. నేను అక్కడికి పోయి, ఆ నగరాన్ని తిరిగి నిర్మించాలని కోరుకొంటున్నాను.”
NEH 2:6 అప్పుడు రాణి రాజుగారి పక్కనే కూర్చుని వుంది. రాజు మరియు రాణీ, “నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది? నువ్విక్కడకి తిరిగి ఎప్పుడు వస్తావు?” అని అడిగారు. నన్ను పంపేందుకు రాజుగారు సంతోషంగా ఒప్పుకున్నారు. అందుకని, నేను తిరిగి వచ్చినప్పుడే అని చెప్పాను.
NEH 2:7 నేను రాజుగారితో ఇంకా యిలా మనవి చేసుకున్నాను: “రాజుగారు దయదలిస్తే మరో కోరిక కూడా కోరుకుంటాను. యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతపు పాలనాధికార్లకు కొన్ని ఉత్తరువు లేఖలు ఇప్పించండి. నేను యూదాకి పోయే మార్గంలో వారివారి ప్రాంతాల్లో క్షేమంగా పోయేందుకు ఆ పాల నాధికార్లు నాకు అనుమతి ఇచ్చేందుకు ఈ లేఖలునాకు అపసరము.
NEH 2:8 నగర ప్రాకార ద్వారాలకూ, గోడలకూ, ఆలయ ప్రాకారానికీ, నా యింటికీ కలప కావాలి. తమ అడవులకు బాధ్యుడైన అధికారి ఆసాపుకి ఒక లేఖ ఇవ్వండి.” రాజుగారు నాకు లేఖలే కాకుండా, నేను కోరినవన్నీ ఇచ్చారు. నా పట్ల దేవుని దయ కారణంగా రాజుగారు ఇవన్నీ చేశారు.
NEH 2:9 సరే, నేను యూఫ్రటిసు నది పశ్చిమ ప్రాంతాల పాలనాధికారి వద్దకు వెళ్లాను. నేను రాజుగారి లేఖలు వారికి యిచ్చాను. రాజుగారు నాకు తోడుగా కొందరు సైనికోద్యోగులను, అశ్విక సైనికులను కూడాపంపారు.
NEH 2:10 నేను చేస్తున్నదేమిటో చూసినవాళ్లు ఇద్దరు, సన్బల్లటు, టోబీయా. వాళ్లు కలత చెందారు. ఇశ్రాయేలు ప్రజలకి తోడ్పడేందుకు ఎవరో వచ్చి నందుకు వాళ్లకి కోపం కలిగింది. సన్బల్లటు హారోనీయుడు, టోబీయా అమ్మెనీయుడు.
NEH 2:11 నేను యెరూషలేముకి పోయి, అక్కడ మూడు రోజులు వున్నాను. తర్వాత రాత్రిపూట కొద్దిమందిని వెంటతీసుకొని బయల్దేరాను. యెరూషలేముకి నేను ఏమి చేయాలన్న సంకల్పం నాకు దేవుడు నా హృదయంలో కలిగించిన దానిని గురించి నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు. నేను స్వారీ చేస్తున్న గుర్రం తప్పనాకు వేరే గుర్రాలేమీ లేవు.
NEH 2:13 చీకట్లో నేను లోయ ద్వారం గుండా బయటికి వెళ్లాను. నేను నక్కల బావి దిక్కుకి సవారీచేస్తూ పోయి, బూడిద రాశుల ద్వారం దగ్గరికి పోయాను. నేను యెరూషలేము గోడలు తనిఖీ చేస్తూ పోయాను. గోడలు శిథిలమయ్యాయి, ద్వారాలు కాలిపోయి వున్నాయి.
NEH 2:14 తర్వాత నేను నీటిబుగ్గ ద్వారంవద్దకు, రాజ కోనేరుల దిశగా స్వారీ చేస్తూ పోయాను. నేను దగ్గరికి పోయేసరికి అక్కడి మార్గం నా గుర్రం పోలేనంతటి యిరుకుగా వుండటం గమనించాను.
NEH 2:15 అందుకని నేను చీకట్లో గోడని పరిశీలిస్తూ లోయపైకి పోయాను. చివరికి నేను వెనక్కి తిరిగి, లోయ ద్వారం గుండా లోనికి పోయాను.
NEH 2:16 అధికారులకీ, ఇశ్రాయేలులోని ప్రముఖులకీ నేనెక్కడికి వెళ్లానో తెలియదు. నేనేమి చేస్తున్నానో తెలియదు. యూదులకి, యాజకులకి, రాజ కుటుంబీకులకి, ఉద్యోగులకి, లేక పని చేయబోయే ఏ యితరులకి నేను అప్పటికింకా ఏమీ చెప్పలేదు.
NEH 2:17 తర్వాత నేను వాళ్లందరికీ యిలా చెప్పాను: “మనకి ఇక్కడున్న ఇబ్బందేమిటో మీరు చూడగలరనుకుంటున్నాను. యెరూషలేము శిథిలాల గుట్టలావుంది. దాని ద్వారాలు మంటలకి కాలిపొయాయి. రండి, యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టెదము. అప్పుడిక మనం ఎప్పటికీ సిగ్గుపడము.”
NEH 2:18 అప్పుడు నేను వాళ్లకి దేవుడు నాపట్ల ఎలాదయ చూపాడో చెప్పాను. రాజుగారు నాతో అన్న మాటలుచెప్పాను. అప్పుడు వాళ్లు, “ఇప్పుడే పని ప్రారంభిద్దాం పదండి!” అన్నారు. దానితో మేమి మంచి పని ప్రారంభించాము.
NEH 2:19 హారోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ ఉద్యోగి టోబీయా, అరబీయుడైన గెషెము మేము తిరిగి నిర్మాణం సాగిస్తున్నామన్న విషయం విన్నారు. వాళ్లు మమ్మల్ని, “ఏమిటి మీరు చేస్తున్న పని? రాజుగారి మీదే తిరుగుబాటు చెయ్య బోతున్నారా?” అంటూ చెడు విధంగా ఎగతాళి చేశారు.
NEH 2:20 అయితే, నేను వాళ్లకిలా బదులు చెప్పాను: “పరలోకమందున్న దేవుడే మా పనిలో మాకు విజయం చేకూరుస్తాడు. దేవుని దాసులమైన మేము ఈ నగరాన్ని తిరిగి నిర్మిస్తున్నాము. ఈ కృషిలో మాకు మీరు సహాయం చెయ్యలేరు. మీ కుటుంబంలో ఏ ఒక్కరూ ఇక్కడ యెరూషలేములో నివసించలేదు. ఈ నేలలో కొంచెం కూడా మీకు చెందదు. మీకు యిక్కడ వుండే హక్కు బొత్తిగా లేదు!”
NEH 3:1 ప్రధాన యాజకుని పేరు ఎల్యాషీబు. ఎల్యాషీబూ, యాజకులైన అతని సోదరులూ పనిలోకి పోయి, గొర్రెల ద్వారాన్ని నిర్మించారు. వాళ్లు ప్రార్థనలు జరిపి యెహోవా పేరిట ఆ ద్వారమును ప్రతిష్ఠ చేశారు. దాని ద్వారాలను ప్రాకారంలో సరైన చోట వుంచారు. ఆ యాజకులు యెరూషలేము ప్రాకారాన్ని హమ్మేయా గోపురం దాకా, హనన్యే గోపురుం దాకా నిర్మించి, అక్కడ ప్రార్థనలు జరిపి, ప్రతిష్ఠించారు.
NEH 3:2 యాజకులు కట్టిన గోడ భాగానికి పక్కనే యెరికోవాసులు గోడను కట్టారు. ఇమ్రీ కుమారుడైన జక్కూరు యెరికోవాసులు కట్టినదానికి పక్కగా గోడ భాగమును కట్టాడు.
NEH 3:3 హస్సెనాయా కుమారులు మత్స్య ద్వారాన్ని నిర్మించారు. వాళ్లు కొయ్య దూలాలను సరిగ్గా అమర్చి, కట్టడానికి తలుపులు పెట్టి, తర్వాత ఆ తలుపులకు గడియలు, తాళాలు అమర్చారు.
NEH 3:4 ఊరియా కుమారుడు మెరేమోతు గోడలో తర్వాత భాగాన్ని నిర్మించాడు. (ఊరియా హక్కోజు కుమారుడు). బెరెక్య కుమారుడు మెషుల్లాము గోడలో తర్వాత భాగాన్ని కట్టాడు. (బెరెక్యా మెషేజబెయేలు కుమారుడు.) బయనా కొడుకు సాదోకు గోడలో తర్వాత భాగము కట్టాడు.
NEH 3:5 తెకోవీయులు గోడలో తర్వాతి భాగాన్ని కట్టారు. అయితే, తెకోవా నాయకులు తమ పాలనాధికారి నెహెమ్యా కోసం పని చేసేందుకు అంగీకరించలేదు.
NEH 3:6 పాసెయ కుమారుడు యెహోయూదా, బెసోద్యా కుమారుడు మెషుల్లాము పాతద్వారం మరమ్మతు చేశారు. వాళ్లు దూలాలను సరిగ్గా ఉంచి, తలుపులను కీలు గుడిదెల మీద నిలిపి, తలుపులకు గడియలు, తాళాలు అమర్చారు.
NEH 3:7 గిబ్యోను వాళ్లూ, మిస్పా వాళ్లూ గోడలో తర్వాత భాగాన్ని నిర్మించారు. గిబ్యోనుకు చెందిన మెలట్యా, మేరోనోతుకి చెందిన యాదోనూ పనిచేశారు. గిబ్యోను, మేరోనోతులు యూఫ్రటిసు నది వశ్చిమ ప్రాంత పాలనాధికారుల అజమాయిషీలో వున్నాయి.
NEH 3:8 హర్శయా కుమారుడు ఉజ్జీయేలు గోడలో తర్వాత భాగాన్ని మరమ్మతు చేశాడు. ఉజ్జీయేలు బంగా రపుపని చేసే కంసాలి. హనన్యా అత్తర్ల తయారీదారు. వీళ్లు వెడల్పు గోడవరకు యెరూషలేమును కట్టి, నిలిపారు.
NEH 3:9 వీరి పక్కన హూరు కుమారుడు రెఫాయా గోడలో తదుపరి భాగాన్ని నిర్మించాడు. రెఫాయా యెరూషలేములో సగం భాగానికి పాలనాధికారి.
NEH 3:10 హరూమఫు కొడుకు యెదాయా గోడలో తర్వాత భాగాన్ని నిలిపాడు. యెదాయా నిలిపిన గోడ భాగం అతని యింటి పక్కనే వుంది. హషబ్మేయా కొడుకు హట్టూషు తర్వాత గోడ భాగాన్ని మరమ్మతు చేశాడు.
NEH 3:11 హారీము కొడుకు మల్కీయా, పహత్మోయాబు కొడుకు హష్షూబు తర్వాత భాగాన్నీ, అగ్ని గుండపు గోపురాన్నీ మరమ్మతు చేశారు.
NEH 3:12 గోడలో తర్వాత భాగాన్ని హల్లోహెషు కొడుకు షల్లూము తన కుమారైల సాయంతో మరమ్మతు చేశాడు. షల్లూము యెరూషలేము రెండవ భాగానికి పాలనాధికారి.
NEH 3:13 హానూను అనేవాడు, జానోవా పట్టణ వాసులూ కలిసి లోయద్వారాన్ని పునర్నిర్మించారు. వాళ్లు దాని తలుపులను కీలుల మీద నిలిపారు. తర్వాత ఆ తలుపులకు వాళ్లు గడియలు, తాళాలు బిగించారు. అంతేకాక, వాళ్లు 500 గజాల గోడను కూడా బాగుచేశారు. వాళ్లు బూడిద రాశి ద్వారందాకా ఉన్న గోడను బాగు చేశారు.
NEH 3:14 రేకాబు కొడుకు మల్కీయా పెంట గుమ్మాన్ని సరిచేశాడు. మల్కీయా, బేత్ హక్కెరెము ప్రాంతానికి అధిపతి. అతను ఆ ద్వారాన్ని నిలిపి, దాని తలుపులను కీలులమీద తగిలించి, వాటికి గడియలను, తాళాలను అమర్చాడు.
NEH 3:15 కొల్హోజె కొడుకు షల్లూము ఇంటి ద్వార గుమ్మాన్ని బాగుచేశాడు. ఇతను మిస్పా ప్రాంతపు అధిపతి. అతను ఆ ద్వారాన్ని బాగుచేసి, దానికి పైకప్పు వేయించాడు. అతను కీలుల మీద తలుపులు నిలిపి, వాటికి గడియలు, తాళాలు అమర్చాడు. రాజుగారి తోట పక్కన వున్న సిలోయము కోనేరువరకువున్న గోడ భాగాన్ని కూడా షల్లూము బాగుచేశాడు. దావీదు నగరం నుంచి కిందికి పోయే మెట్లవరకు వున్న గోడను కూడా అతనే బాగుచేశాడు.
NEH 3:16 అజ్జూకు కొడుకు నెహెమ్యా గోడలో తర్వాత భాగాన్ని బాగుచేసాడు. ఈ నెహెమ్య బేత్‌సూరు సగం ప్రాంతానికి అధిపతి. అతను దావీదు సమాధికి ఎదుట పున్న స్థలంలోని కోనేరును, యుద్ధ వీరుల భవనాన్నీ బాగుచేశాడు.
NEH 3:17 తర్వాత భాగాన్ని లేవి వంశీములు బాగు చేశారు. ఆ లేవీయులు బానీ కుమారుడు రెహూము అజమా యిషీలో పనిచేశారు. కెయిలా ప్రాంతంలో సగం భాగానికి అధిపతి అయిన హషబ్యా తర్వాతి భాగాన్ని బాగుచేశాడు. అతను తన సొంత ప్రాంతానికి చెందిన వాటినే బాగుచేశాడు.
NEH 3:18 వాళ్ల సోదరులు తర్వాతి భాగాన్ని బాగుచేశారు. వాళ్లు హేనాదాదు కుమారుడు బవ్వై పర్యవేక్షణలో పని చేశారు. కెయిలా ప్రాంతపు సగంభాగానికి ఈ బవ్వై అధిపతి.
NEH 3:19 యేషూవ కుమారుడు ఏజెరు తర్వాతి భాగాన్ని బాగుచేశాడు. ఏజెరు మిస్పా అధిపతి. అతను ఆయుధాగారం నుంచి ప్రాకారం మూలదాకా వున్న భాగాన్ని బాగుచేశాడు.
NEH 3:20 జబ్బయి కుమారుడు బారూకు గోడలో తదుపరి భాగాన్ని బాగుచేశాడు. బారూకు విశేషంగా శ్రమించి, ప్రాకారం మూలనుంచి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటిదాకా వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు.
NEH 3:21 హక్కోజు మనుమడు, ఊరియా కుమారుడు అయిన మెరేమోతు ఎల్యాషీబు ఇంటి ముఖ ద్వారం నుంచి, ఆ ఇంటి చివరిదాకా వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు.
NEH 3:22 ప్రాకారపు తదుపరి భాగాన్ని ఆ ప్రాంతంలో నివసించే యాజకులు బాగుచేశారు.
NEH 3:23 బెన్యామీను, హష్షూబులు తమ ఇంటి మందరి గోడ భాగాన్ని బాగుచేశారు. అనన్యా కుమారుడు, మయశేయా కోడుకు అయిన అజర్యా తన ఇంటి పక్కన వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు.
NEH 3:24 హేనాదాదు కొడుకు బిన్నూయి అజర్యా ఇంటి దగ్గర్నుంచి ప్రాకారపు మలుపుదాకా, అక్కణ్నుంచి మూలదాకా గోడభాగాన్ని బాగుచేశాడు.
NEH 3:25 ఊజై కుమారుడు పాలాలు ప్రాకారపు మలుపు నుంచి గోపురం దాకా పనిచేశాడు. రాజుగారి పై అంతస్తు దగ్గర, అది రాజుగారి రక్షకభటుల ఆవరణానికి దగ్గర వున్న గోవురం. పరోషు కొడుకు పెదాయా పొలాలు పక్కన పని చేశాడు.
NEH 3:26 ఆలయ సేవకులు ఓపెలు కొండమీద నివసించేవారు. వాళ్లు జలద్వారం దాకా, దాని దగ్గరవున్న గోపురం దాకా ఉన్న గోడ తదుపరి భాగాన్ని బాగు చేశారు.
NEH 3:27 పెద్ద గోపురం దగ్గర్నుంచి ఓపెలు గోడదాకా ఉన్న ప్రాకార భాగమంతటినీ తెకోవీయులు బాగు చేశారు.
NEH 3:28 తమ ఇండ్లకి ఎదురుగా గుర్రపు గుమ్మానికి పైనున్న ప్రాకార భాగాన్ని యాజకులు బాగుచేశారు. ప్రతి ఒక్క యాజకుడూ తన స్వగృహానికి ఎదుట ఉన్న గోడ భాగాన్ని బాగుచేశాడు.
NEH 3:29 ఇమ్మేరు కొడుకైన సాదోకు తన ఇంటి ముందరి గోడ భాగాన్ని బాగు చేశాడు. షెకన్నాకొడుకైన షెమయా గోడలో అటు తర్వాత భాగాన్ని బాగుచేశాడు. షెమయా తూర్పు ద్వార రక్షకుడు.
NEH 3:30 షలెమ్యా కొడుకు హనన్యా, జాలాఫు కొడుకు హానూనూ గోడలో మిగిలిన భాగాన్ని బాగుచేశారు. (హానూను జాలాపు ఆరవ కొడుకు). బెరెక్యా కొడుకు మెషుల్లాము తన ఇంటి ముందరి గోడ భాగాన్ని బాగుచేశాడు.
NEH 3:31 ఆలయ సేవకుల, వ్యాపారస్తుల ఇళ్లదాకా ఉన్న తదుపరి గోడ భాగాన్ని మల్యీయా బాగుచేశాడు. అంటే, తనిఖీ ద్వారం దగ్గర్నుంచి అన్నమాట. ప్రాకారపు మూలలో ఉన్న గదిదాకా ఉన్న గోడ భాగమంతటినీ మల్కీయా బాగు చేశాడు. మల్కీయా బంగారంపని చేసేవాడు.
NEH 3:32 స్వర్ణకారులూ, వ్యాపారస్థలూ మూలనున్న గదినుంచి గొర్రెల ద్వారం దాకా ఉన్న గోడ భాగాన్ని బాగుచేశారు.
NEH 4:1 మేము యెరూషలేము ప్రాకారాన్ని నిర్మిస్తున్నామన్న వార్తను సన్బల్లటు విన్నాడు. అతను కోపంతో ఉగ్రరూపం దాల్చాడు. అతను యూదులను ఎగతాళి చెయ్యనారంభించాడు.
NEH 4:2 సన్బల్లటు తన మిత్రులతోనూ, షోమ్రోను సైన్యంతోనూ మాట్లాడాడు. అతను ఇలా అన్నాడు: “ఈ బలహీన యూదులు చేస్తున్నపని యేమిటి? మనం ఊరుకొంటామని అనుకుంటున్నారా వీళ్లు? తాము బలులు ఇద్దామనే అను కుంటున్నారా వీళ్లు? బహూశః ఒక్క రోజులో ప్రాకార నిర్మాణం పని పూర్తి చేస్తామని అనుకుంటున్నట్లుంది వీళ్లు. ఈ చెత్త, దుమ్ము గుట్టల్నుంచి రాళ్లకు జీవం పొయడం వీళ్ల తరం కాదు. ఇవి వట్టి బూడిద రాసులు, ధూళి కుప్పలు!”
NEH 4:3 సన్బల్లటుతోనే ఉన్న అమ్మోనీయుడు టోబీయా ఇలా అందుకున్నాడు: “ఈ యూదులు తామేదో గొప్పగా కట్టేస్తున్నామని అనుకుంటున్నట్లుంది. దాని మీద ఒక చిన్న నక్కపిల్ల ఎక్కితే చాలు, వాళ్ల రాతి గోడ కాస్తా కుప్పకూలిపోతుంది!”
NEH 4:4 నెహెమ్యా ఇలా దైవ ప్రార్థన చేశాడు: “ఓ మా దేవా, మా మొర ఆలకించు. వీళ్లకి మేమంటే ద్వేషం. ఈ సన్బల్లటు, టోబీయా మమ్మల్ని అవమానిస్తున్నారు. వాళ్ల నిందలు వాళ్లకే వచ్చేటట్లు చెయ్యి దేవా. బానిసలుగా, చెరబట్టబడిన వాళ్ల మాదరిగా వాళ్లను సిగ్గుపడనియ్యి.
NEH 4:5 వాళ్ల నేరాన్ని తీసివేయవద్దు. వారి పాపాలను క్షమించవద్దు. ప్రాకారం నిర్మిస్తున్న వాళ్లను వీళ్లు అవమానించారు, వాళ్లని వీళ్లు నిరుత్సాహపరిచారు.”
NEH 4:6 మేము యెరూషలేము ప్రాకారాన్ని నిర్మించాము, మేము నగరం చుట్టూ గోడకట్టాము. అయితే, అది ఉండాల్సిన దానికి సగం ఎత్తు మాత్రమే ఉంది. జనం హృదయపూర్వకంగా పనిచేశారు. అందుకే మేము ఇంత మాత్రమైనా కట్టగలిగాము.
NEH 4:7 కాని, సన్బల్లటు, టోబియా, అరబ్బీయులు, అమ్మోనీయులు, అష్డోదువాసులు, కోపంతో నిండు కొనియున్నారు. జనం యెరూషలేము ప్రాకారాలు బాగుచేసే పని కొనసాగిస్తున్నట్లు, గోడల మధ్య కంతలను పూడుస్తున్నట్లు వాళ్లు విన్నారు. ఈ విషయమై వాళ్లు అధికముగా కోపగించుకొని
NEH 4:8 ఒకచోట కూడి యెరూషలేముకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. వాళ్లు యెరూషలేముకు వ్యతిరేకంగా కల్లోలం లేవగొట్టాలనీ, వాళ్లు వచ్చి నగరం మీద పోరాటం జరపాలనీ పథకం పన్నారు.
NEH 4:9 అయితే, మేము మా దేపుణ్ణి ప్రార్థించాము. అంతేకాదు, వాళ్లు వస్తే, వాళ్లని ఎదిరించి పోరాడగలి గేందుకుగాను గోడలమీద రాత్రింబగళ్లు కాపలా కోసం కాపలావారిని పెట్టాం.
NEH 4:10 అప్పుడు యూదా వాసులు తమ నిరుత్సాహాన్ని ఇలా వెలిబుచ్చారు: “పనివాళ్లు అలసిపోతున్నారు. దోవలో బోలెడు దుమ్మూ, రద్దూ పేరుకు పోయాయి. మనం గోడ కట్టడాన్ని కొనసాగించలేము.
NEH 4:11 పోతే, మన శత్రువులేమో ఇలా అంటున్నారు: ‘యూదులపై మనము అక స్మాత్తుగా దాడిచేద్దాము. వాళ్లు మనలను చూడకముందే, మనం ఎవరమో తెలిసికోకముందే మనం వాళ్ల మధ్య ఉంటాము, వాళ్లని చంపేస్తాము. దానితో వాళ్ల పని నిలిచిపోతుంది.’”
NEH 4:12 తర్వాత మన శత్రువుల మధ్య నివసించే మన యూదులు మా దగ్గరికి వచ్చి, “మన శత్రువులు మనచుట్టూ వున్నారు. మేము ఎటు తిరిగితే అటు వాళ్లు ప్రత్యక్షమౌ తున్నారు” అంటూ పదే పదే చెప్పారు.
NEH 4:13 అందుకని, నేను కొందర్ని గోడ బాగా పోట్టిగా వున్న చోట్ల గోడ వెనక కాపలా పెట్టాను. నేను వాళ్లని గోడకి కంతలున్న స్థలాల్లో నిలిపాను. నేను ఆయా కుటుంబాలను ఒక చోట చేర్చి, కత్తులు, శూలాలు, విల్లమ్ములతో నిలిపాను.
NEH 4:14 అప్పుడు నేను ముఖ్యమైన కుటుంబాలతో, ఉద్యోగులతో, మిగిలిన జనంతో ఇల చెప్పాను: “మన శత్రువులంటే భయపడ కండి. మన ప్రభువును తలుచుకోండి. యెహోవా గొప్పవాడు, శక్తిశాలి! మీరు మీ సోదరుల కోసం, మీ కుమారుల కోసం, మీ కుమారైల కోసం పోరాడాలి! మీరు మీ భార్యల కోసము, మీ గృహాల కోసం పోరాడాలి!”
NEH 4:15 తమ పథకాలు మాకు తెలిసిపోయాయన్న విషయం మా శత్రుపులు విన్నారు. తమ పథకాలను దేవుడు భగ్నం చేశాడని వాళ్ల గ్రహించారు. తర్వాత మేమందరం తిరిగి పని ప్రారంభించాము. ప్రతి ఒక్కడూ తను వదిలిన పని భాగానికి తిరిగి వెళ్లాడు.
NEH 4:16 ఆనాటి నుంచి నామనుషుల్లో సగం మంది గోడ కట్టడంలో నిమగ్నులు కాగా, మిగిలిన సగం మంది ఈటెలు, బల్లెములు, విల్లమ్ములు, కవచాలతో కాపలా పనిలో నిమగ్నులయ్యారు. సేనాధిపతులు ప్రాకార నిర్మాణంలో నిమగ్నులైన యూదా ప్రజలందరి వెనుక నిలిచారు.
NEH 4:17 గోడ కట్టేవాళ్లు, వాళ్ల సహాయకులు ఒక చేత్తో పనిముట్లను, మరో చేత్తో ఆయుధాలను పట్టుకున్నారు.
NEH 4:18 పని చేస్తున్న ప్రతి ఒక్క తాపీవాడూ తన పక్కనే ఒక కత్తిని పెట్టుకున్నాడు. శత్రువుల రాకను గురించి హెచ్చరించేందుకు బూర ఊదేవాడు నా పక్కన నిలబడ్డాడు.
NEH 4:19 అప్పుడు నేను ఆయా ప్రముఖ కుటుంబాల వాళ్లను, ఉద్యోగులను, మిగిలిన జనాన్ని ఉద్దేశించి ఇలా చెప్పాను, “ఇది చాలా పెద్ద పని. మనం గోడ పొడుగునా విస్తరించివున్నాము. మనం ఒకరికొకరం దూరంగా వున్నాము.
NEH 4:20 అందుకని, మీకు బూర శబ్దం వినిపించినప్పుడు, అక్కడికి మీరంతా పరుగున రండి. మనమంతా అక్కడ కలుద్దాము. మన దేవుడు మన పక్షాన పోరాడుతాడు!”
NEH 4:21 ఈ విధంగా మేము యెరూషలేము ప్రాకార నిర్మాణపు పని కొనిసాగించాము. మాలో సగం మంది శూలాలు ధరించి నిలబడ్డారు. మేము ఉదయం పొద్దు పొడిచినప్పటినుంచి రాత్రి చుక్కలు పొడిచే దాకా పనిచేశాము.
NEH 4:22 అప్పుడు నేను వాళ్లకి ఈ విషయాలు కూడా చెప్పాను: “ప్రతి ఒక్క తాపీవాడూ, అతని సహాయకుడూ రాత్రిపూట యెరూషలేములోనే వుండిపోవాలి. అప్పుడు వాళ్లు రాత్రాళ్లు కాపలాదార్లుగా, పగళ్లు పని వాళ్లుగా ఉండగలుగుతారు.”
NEH 4:23 సరే, నేనుగాని, నా సోదరులుగాని, నా మనుష్యులు గాని, కాపలావాళ్లగాని, మాలో ఎవ్వరం మా దుస్తులు విప్పలేదు. మాలో ప్రతిఒక్కరూ అన్ని సమయాల్లో, చివరకు నీళ్లకు వెళ్లినప్పుడూ సైతం, ఆయుధాలు ధరించేవున్నాము.
NEH 5:1 తమ యూదా సోదరుల మీద చాలామంది బీదవాళ్లు ఫిర్యాదు చేయసాగారు.
NEH 5:2 వాళ్లలో కొందరు, “మాకు చాలామంది పిల్లపాపలు వున్నారు. మేముతిండి తిని బతికి వుండాలంటే, మాకు ధాన్యము దొరకాలి!” అన్నారు.
NEH 5:3 మరికొందరు, “ఇది కరువు కాలం. మేము ధాన్యము కోసం మా పొలాలు, ద్రాక్షతోటలు, ఇళ్లుకుదువ పెట్టాల్సి వస్తోంది” అని మొత్తుకున్నారు.
NEH 5:4 వేరే కొందరు, “మేము మా పొలాలకీ, ద్రాక్షాతోటలకీ రాజు విధించిన పన్నులు చెల్లించాలి. అయితే, ఆ పన్నులు చెల్లించేందుకు మా దగ్గర పైసలు లేక అప్పులు చేయవలసి వస్తోంది.
NEH 5:5 ఆ ధనికుల్ని చూడండి. మేము వాళ్లలాంటి మనుష్యులం కామా? వాళ్ల కొడుకులకి మా కొడుకులు ఏమైనా తీసి పోయారా? అయితేనేమి, మేము మా కొడుకుల్నీ, కూతుళ్లనీ బానిసలుగా అమ్ముకోవలసి వస్తోంది. ఇప్పటికే మాలో కొంతమందిమి మా కూతుళ్లను బాని సలుగా అమ్ముకోవలసి వచ్చింది! మాకు వేరే గత్యంతరం లేదు! ఇప్పటికే మేము మా పొలాలను, ద్రాక్షాతోటలను కోల్పోయాము! అవి ఇప్పుడు ఇతరుల చేతుల్లోకి పోయాయి” అని వాపోయారు.
NEH 5:6 వాళ్ల ఫిర్యాదులు వినేసరికి నాకు చాలా కోపం వచ్చింది.
NEH 5:7 నన్ను నేనే అణచుకుని, ఆ ధనిక కుటుంబాల దగ్గరికీ, ఉద్యోగులు వద్దకీ వెళ్లి, వారి మీద కోపగించు కొని ఇలా చెప్పాను: “మీరు మీ సోదరులకే అప్పులిచ్చి, వారిని వడ్డీ కట్టమని అడుగుతున్నారు. మీరిది కట్టి పెట్టాలి!” అప్పుడు నేను జనులందర్నీ ఒక చోట సమావేశ పరచి,
NEH 5:8 వాళ్లతో ఇలా చెప్పాను, “మన యూదా సోదరులు ఇతర దేశాల వాళ్లకి బానిసలుగా అమ్మబడుతున్నారు. మనం వాళ్లని కొని, వాళ్లని స్వతంత్రులను చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాము. కాని ఇప్పడు మీరు మళ్లీ వాళ్లని బానిసలుగా అమ్మెస్తున్నారు!” ఆ ధనికులూ, ఉద్యోగులూ మౌనంగా ఉండి పోయారు. వాళ్లకి ఏమి చెప్పేందుకూ తోచలేదు.
NEH 5:9 సరే, నేను ఇంకా ఇలా కొనసాగించాను: “మీరు చేస్తున్న పని సరైనది కాదు. దేవునిపట్ల భయభక్తులు కలిగి వుండాలన్న విషయం మీకు తెలుసు ఇతరులు చేసే సిగ్గుచేటైన పనులు మీరు చెయ్యకూడదు!
NEH 5:10 నా మనుష్యులూ, నా పోదరులూ, నేను కూడా డబ్బూ, ధాన్యము అప్పుగా ఇస్తున్నాను. అయితే, ఆ అప్పుల మీద వడ్డీ చెల్లించమని నిర్బంధించడం మనం మానుకోవాలి!
NEH 5:11 మీరు వాళ్లనుంచి తీసుకున్న పొలాలు, ద్రాక్షాతోటలు, ఒలీవ పొలాలు, ఇళ్లు వాళ్లకి తక్షణం తిరిగి ఇచ్చెయ్యాలి! మీరు వాళ్ల దగ్గర వసూలు చేసిన వడ్డీ సొమ్ము కూడా వాళ్లకి తక్షణం తిరిగి ఇచ్చెయ్యాలి! వాళ్లకి అప్పుగా ఇచ్చిన డబ్బుకీ, ధాన్యానికీ, తాజా ద్రాక్షారసానికి, ఒలీవ నూనెకీ మీరు ఒక శాతం వడ్డి తీసుకుంటున్నారు. మీరు సోమ్ము వాళ్లకి తిరిగి ఇచ్చెయ్యాలి!”
NEH 5:12 అప్పుడా ధనవంతులూ, ఉద్యోగులూ ఇలా సమాధానమిచ్చారు, “మేము వారి ఆస్తులను, వారిమీద వేసిన వడ్డీలను తిరిగి ఇచ్చేస్తాము. మేము వాళ్ల దగ్గర్నుంచి ఇంకేమీ అడగము. నెహెమ్యా, మేమునువ్వు చెప్పినట్లే చేస్తాము.” తర్వాత నేను యాజకులను పిలిచాను. ధనికులచేతా, ఉద్యోగులచేతా తాము చెప్పిన మాటలను అమలు చేస్తామని యాజకుల సమక్షంలో దేవునికి ప్రమాణం చేసేలా చూశాను.
NEH 5:13 తర్వాత నేను నా దుస్తుల మడతలు పోయేలా వాటిని దులిపి, ఇలా చెప్పాను, “తన వాగ్దాన భంగం చేసిన ప్రతివానికీ దేవుడు ఇదే చేస్తాడు. దేవుడు వాళ్లని వాళ్ల ఇళ్ల నుంచి బయటికి విసిరిపారేస్తాడు. తాము కూడబెట్టుకున్న వన్నీ వాళ్లు కోల్పోతారు! ఆ వ్యక్తి తన సర్వస్వం కోల్పోతాడు!” నేను చెప్పిన ఈ విషయాలన్నింటికీ వాళ్లందరూ ఒప్పుకొనెదమని చెప్పిరి. వాళ్లంతా, “ఆమేన్!” అన్నారు. యెహోవాను స్తుతించారు. ఆ మనుష్యులు తాము ఒప్పుకొన్న ప్రకారం అన్ని జరిగించిరి.
NEH 5:14 అంతే కాదు, యూదా ప్రాంతానికి నేను అధికారిగా వున్నంత కాలం, నేనుగాని, నా సోదరులుగాని పాలనాధి కారికి అనుమతింపబడిన ఆహారం ఎన్నడూ తినలేదు. నా ఆహారం కొసే నిమిత్తం నేనెన్నడూ జనాన్ని పన్నులు చెల్లించేలా నిర్బంధించలేదు. నేను అర్తహషస్త రాజ్య పాలనలో ఇరవయ్యవ ఏడాది నుంచి ముప్పై రెండవ ఏడాది దాకా పాలనాధికారిగా వున్నాను. నేను యూదాకి పన్నెండేళ్లపాటు పాలనాధికారిగా వున్నను.
NEH 5:15 కాని, నా కంటె ముందు పాలించిన అధికార్లు జన జీవితాన్ని ఎక్కువ భారం చేశారు. వాళ్లు ప్రతి ఒక్కరినుంచీ నిర్బంధంగా నలభై తులాల వెండిని వసూలు చేశారు. అంతేకాదు, వాళ్లు జనం నుంచి తమ ఆహారాన్నీ, ద్రాక్షారసాన్నీ రాబట్టుకున్నారు. ఆ అధికార్ల కింది నాయకులు కూడా జనం మీద అధికారం చలాయించి, వాళ్ల జీవితాన్ని మరింత దుర్భరం చేశారు. కాని నేను అందుకు భిన్నంగా దేవునియందు భయ భక్తులతో వ్యవహరించాను, అందుకే నేను వాళ్లు చేసిన పనులేవీ చేయలేదు.
NEH 5:16 యెరూషలేము ప్రాకార నిర్మాణానికి నేను బాగా కష్టించి పనిచేశాను. నా మనుష్యులంద రూ ప్రాకార నిర్మాణం కోసం అక్కడ చేరారు. మేము ఏ ఒక్కరి దగ్గరినుంచీ భూమి సంపాదించుకోలేదు!
NEH 5:17 అంతే కాదు, నేను నిత్యం నూట ఏభై మంది యూదులకు భోజనం పెట్టాను. నా భోజనపు బల్ల దగ్గర వాళ్లకి ఎల్లప్పుడూ ప్రవేశం లభించేది. మా చుట్టుపట్ల వున్న ఇతర దేశప్రజలు కూడ నా బల్లదగ్గర భోజనం చేశారు.
NEH 5:18 నాతోబాటు నా భోజనశాలలో భోజనం చేసిన వాళ్లకి ప్రతిరోజూ ఈ కింది ఆహార పదార్థాలు పెట్టాను: ఒక ఆవు, ఆరు మేలైన గొర్రెలు రకరకాల పక్షులు. ప్రతి పది రోజులకీ ఒకసారి రకరకాల ద్రాక్షారసం నా భోజనపు బల్ల వద్దకి తెప్పించబడేవి. అయితేనేమి, నేను మాత్రం పాలనాధికారికి అనుమతింపబడిన ఆహారాన్ని కానేకావాలని అడగలేదు. నా భోజనం కోసం నేనెన్నడూ జనం దగ్గర బలవంతాన పన్నులు వసూలు చేయలేదు. జనం చేస్తున్నపని బాగా కష్టమైనదని నాకు తెలుసు,
NEH 5:19 నా దేవా, ఈ ప్రజలకు నేను చేసిన మేలునంతటినీ జ్ఞాపకముంచు కొని నాకు సహాయం చేయుము.
NEH 6:1 నేను ప్రాకార నిర్మాణం పూర్తి చేశానన్న సంగతిని సన్బల్లటు, టోబీయా, అరబీయుడైన గెషెము మా ఇతర శత్రువులూ విన్నారు. మేము గోడలోని కంతలన్నీ పూడ్చాము. అయితే, ద్వారాలకు మేమింకా తలుపులు అమర్చలేదు.
NEH 6:2 సన్బల్లటూ, గెషెమూ నాకు, “నెహెమ్యా, నువ్వొకసారి వస్తే మనం కలుసు కుందాము. ఓనో మైదానంలోని కెఫీరిము గ్రామంలో కలుసుకోవచ్చు” అని కబురంపారు. అయితే, వాళ్లు నాకు హాని తలపెట్టారని నాకు తెలుసు.
NEH 6:3 అందుకని, దూతల ద్వారా నేను వాళ్లకి, “నేను చాలా ముఖ్యమైన పనిలో నిమగ్నమై వున్నాను. అందు కని, నేను రాలేను. మిమ్మల్ని కలుసు కొనడానికై నేను పని చేయుట ఆపినప్పుడు, పని ఆగుట నాకిష్టము లేదు” అని సమాధానం పంపాను.
NEH 6:4 సన్బల్లటూ, గెషెమూ అదే సందేశాన్ని నాకు నాలుగుసార్లు పంపారు. ప్రతి ఒక్కసారీ నేను వాళ్లకి నే వెనకటి సమాధానమే పంపాను.
NEH 6:5 అప్పుడు అయిదవసారి, సన్బల్లటు అదే సందేశాన్ని తన సహాయకుని ద్వారా నాకు పంపాడు. అతడి చేతిలో విప్పయున్న ఒక లేఖవుంది.
NEH 6:6 ఆ లేఖలో ఇలా పేర్కొనబడింది, “ఒక విషయం నాలుగు పక్కలా ప్రచారమవుతోంది. ఎక్కడ చూసినా జనం అదే చెప్పుకుంటున్నారు. మరి, అన్నట్టు, గెషెము అది నిజమే అంటున్నాడు. నువ్వూ, యూదులూ రాజుగారి మీద తిరగబడాలని కుట్రపన్నుతున్నట్లు జనం చెప్పుకుంటున్నారు. అందుకే నువ్వు యెరూషలేము ప్రాకారం నిర్మిస్తున్నావట. అంతేకాదు, నువ్వు యూదులకు కాబోయే రాజువని కూడా జనం చెప్పుకుంటున్నారు.
NEH 6:7 యెరూషలేములో నిన్ను గురించి ఈ విషయాన్ని ప్రకటించేటందుకు నువ్వు ప్రవక్తలను ఎంపిక చేశావన్న విషయం, ‘యూదాలోఒక రాజు వున్నాడు!’ అన్న విషయం ప్రచారంలో పుంది. “నెహెమ్యా, ఇప్పుడు నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. అర్తహషస్త రాజుగారు ఈ విషయం వింటారు. అందుకని, నువ్వురా, మనం కలిసి కూర్చుని ఈ విషయం మాట్లాడుకుందాము.”
NEH 6:8 అందుకని, నేను సన్బల్లటుకి ఈ కింది సమాధానం పంపాను: “మీరు చెప్తున్నదేమీ ఇక్కడ జరగడం లేదు. ఇదంతా మీ ఊహా కల్పితం మాత్రమే.”
NEH 6:9 మన శత్రువులు మనల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల మట్టుకు వాళ్లు, “ఈ యూదులు భయంతో బిక్కచచ్చి, జావకారిపోయి పని కొనసాగించేందుకు అసమర్థులవుతారు. అప్పుడిక ప్రాకార నిర్మాణం పూర్తికాదు” అనుకుంటున్నారు. కాని నేను, “దేవా, నన్ను బలపరచుము” అని ప్రార్థించాను.
NEH 6:10 నేనొక రోజున దెలాయ్యా కొడుకు షెమయా ఇంటికి వెళ్లాను. దెలాయ్యా మెహేతబేలు కొడుకు. ఇంటి వద్దనే వుండవలసిన షెమయా ఇలా అన్నాడు: “నెహెమ్యా, ఆలయానికి పోయి కూర్చుందాము. లోపలికి పోయి తలుపులు మూసు కుందాము. ఎందుకంటే నిన్ను చంపేందుకు మనుష్యులు వస్తున్నారు. ఈ రాత్రి నిన్ను చంపేందుకు వాళ్లొస్తున్నారు.”
NEH 6:11 అయితే, నేను షెమయాతో ఇలా అన్నాను: “నాలాంటి మనిషి పారిపోవాలంటావా? నాలాంటి వాడు తన ప్రాణం కాపాడు కొనేందుకు దేవాలయంలోకి పారిపోకూడదు, నేనలా వెళ్లను!”
NEH 6:12 షెమయాని దేవుడు పంపించలేదని నాకు తెలుసు. టోబీయా, సన్బల్లటు అతనికి డబ్బు ముట్ట జెప్పారు కనుక, అతను నాకు వ్యతిరేకంగా హితబోధ చేశాడు.
NEH 6:13 నన్ను ఇరుకున పెట్టేందుకూ, భయ పెట్టేందుకూ వాళ్లు షెమయాని కుదుర్చుకున్నారు. భయపడి, ఆలయానికి పారి పోవడం ద్వారా నేను పాపం చెయ్యాలని వాళ్లు కోరుకున్నారు. అప్పుడు, నన్ను భయపె ట్టి, నాకు అపకీర్తి తెచ్చేందుకు నా శత్రుపులకి అవకాశం చిక్కి వుండేది.
NEH 6:14 ఓ నా దేవా, దయచేసి టోబియా, సన్బల్లటులు చేస్తున్న పనులు గమనించు. వాళ్లు చేసిన పాపిష్టి పనులు కూడా గుర్తుచేసుకో. నన్ను భయ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న నోవద్యా అనే ప్రవక్తరాలిని, తదితర ప్రవక్తలను కూడా గుర్తుచేసుకో.
NEH 6:15 ఈ విధంగా యెరూషలేము ప్రాకార నిర్మాణం ఏలూలు తొమ్మిదవనెల ఇరవై ఐదవ రోజువ పూర్తయింది. ఆ గోడ కట్టడం పూర్తిచేసేందుకు ఏెభైరెండు రోజులు పట్టింది.
NEH 6:16 అప్పుడు, మేము గోడ కట్టడం పూర్తి చేసినట్లు మా శత్రువులందరూ విన్నారు. గోడ కట్టడం పూర్తయిందన్న విషయాన్ని మా చుట్టు పక్కల దేశపు ప్రజలందరూ చూశారు. దానితో, వాళ్లు ధైర్యం కోల్పోయారు. ఎందుకంటే, ఈ పని మన దేవుని సహాయం వల్ల జరిగిందని వాళ్లు అర్థం చేసుకున్నారు.
NEH 6:17 అంతేకాదు, ఆ రోజుల్లో, గోడ కట్టడం పూర్తయిన దరిమిలా, యూదాలోని ధనికులు టోబీయాకి ఎన్నో ఉత్తరాలు పంపుతూవచ్చారు. టోబీయా వాళ్ల జాబులకి సమాధానాలు వ్రాస్తూండే వాడు.
NEH 6:18 యూదాలో చాలా మంది అతనికి విధేయులుగా పుంటామని మాట ఇచ్చినందువల్ల, వాళ్లు అతనికి ఆ జాజులు వ్రాశారు. దీనికి కారణం ఏమిటంటే, టోబీయా అరహు కుమారుడైన షెకన్యాకి అల్లుడు. టోబీయా కొడుకు యోహానాను మెషూల్లము కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మెషూల్లము బెరెక్యా కొడుకు.
NEH 6:19 గతంలో వాళ్లు టోబీయాకి ఒక ప్రత్యేక వాగ్దానం చేశారు. అందుకని, వాళ్లు నాకు టోబీయా ఎంతో మంచివాడని చెప్తూ వచ్చారు. నేను చేస్తున్న పసులను గురించి వాళ్లు టోబీయాకి చెప్తూండేవారు. నన్ను భయపెట్టేందుకని టోబీయా నాకు లేఖలు పంపుతూ వచ్చాడు.
NEH 7:1 ఈ విధంగా, మేము ప్రాకార నిర్మాణం పూర్తి చేశాము. తర్వాత మేము ద్వార పాలకులను ఎంపిక చేశాము. ఆలయ గాయకులుగా వుంటూ, యాజకులకు తోడ్పడేవాళ్లను ఎంపిక చేశాము.
NEH 7:2 అటు తర్వాత, నా సోదరుడు హనానీని యెరూషలేముకి అధికారిగా నియమించాను. హనన్యా అనే మరో వ్యక్తిని కోటకి సేనాధిపతిగా నియమించాను. నేను హనానీని ఎందుకు ఎంపిక చేశానంటే, అతను చాలా నిజాయితీ పరుడు. అత్యధిక సంఖ్యాకులు కంటె, అతను అధిక దేవుని భయం కలిగినవాడు.
NEH 7:3 అప్పుడు నేను హనానీనీ, హనన్యానీ ఇలా ఆదేశించాను: “కొన్ని గంటలు పొద్దెక్కిన తర్వాత మాత్రమే మీరు యెరూషలేము ద్వారాలు తెరవాలి. పొద్దుగుంకేలోగానే మీరు తలుపులు మూసి, తాళాలు బిగించాలి. అంతేకాదు, కాపలా పనికి మనుష్యుల్ని యెరూషలేము నుంచి ఎంపిక చెయ్యండి. వాళ్లలో కొంతమందిని నగర రక్షణకిగాను ప్రత్యేక స్థానాల్లో నిలపండి. మిగిలిన వాళ్లని వాళ్ల వాళ్ల ఇళ్ల దగ్గరే పెట్టండి.”
NEH 7:4 అప్పుడు ఆ నగరం విశాలంగా పుంది, కావలసి నంతకన్న ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడింది. అయితే, నగరంలో కొద్దిమందే వున్నారు. ఇళ్లు తిరిగి ఇంకా నిర్మింపబడలేదు.
NEH 7:5 జనం అందర్నీ సమావేశ పరచాలన్న సంకల్పాన్ని దేవుడు నాకు కలిగించాడు. నేను ముఖ్యుల్ని, ఉద్యోగుల్ని, సామాన్యుల్ని అందర్నీ సమావెశానికి పిలిచాను. నేనీ పని కుటుంబాలన్నింటి జాబితా తయారు చేయగలుగుతానన్న భావంతో చేశాను. మొదట దేశమునుండి వెళ్లగాట్టబడిన వారిలో తిరిగి వచ్చిన వాళ్ల కుటుంబాల జాబితాలు నాకు దొరికాయి. అక్కడ వ్రాసివున్న సమాచారం ఇది.
NEH 7:6 చెరనుంచి తిరిగి వచ్చిన వాళ్ల వివరం వుంది. వెనక బబులోను రాజు మెబుకద్నెజరు వీళ్లని బబులోనుకి బందీలుగా పట్టుకుపోయాడు. వాళ్లు ఇప్పుడు యెరూషలేముకీ, యూదాకీ తిరిగి వచ్చారు. వాళ్లలో ప్రతి ఒకడూ తన సొంత పట్టణానికి పోయాడు.
NEH 7:7 ఈ క్రిందివాళ్లు జెరుబ్బాబెలు తో కలిసి వచ్చారు: యేషూవా, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, సహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా. ఇశ్రాయేలుకి చెందిన ఈ క్రింది మనుష్యులు ఈ క్రింది సంఖ్యలో తిరిగి వచ్చారు:
NEH 7:8 పరోషు వంశీయులు 2,172
NEH 7:9 షెపట్యా వంశీయులు 372
NEH 7:10 ఆరహు వంశీయులు 652
NEH 7:11 పహత్మోయాబు వంశీయులు (వీళ్లు యేషూవ, జోయాబు కుదుళ్ల వాళ్లు) 2,818
NEH 7:12 ఏలాము వంశీయులు 1,254
NEH 7:13 జత్తూ వంశీయులు 845
NEH 7:14 జక్కయి వంశీయులు 760
NEH 7:15 బిన్నూయి వంశీయులు 648
NEH 7:16 బేబై వంశీయులు 628
NEH 7:17 అజ్గాదు వంశీయులు 2,322
NEH 7:18 అదోనీకాము వంశీయులు 667
NEH 7:19 బిగ్వయి వంశీయులు 2,067
NEH 7:20 ఆదీను వంశీయులు 655
NEH 7:21 హిజ్కియా కుటుంబానికి చెందిన ఆటేరు వంశీయులు 98
NEH 7:22 హాషూము వంశీయులు 328
NEH 7:23 బేజయి వంశీయులు 324
NEH 7:24 హారీపు వంశీయులు 112
NEH 7:25 గిబియోను వంశీయులు 95
NEH 7:26 బేత్లేహేము, నెటోపా పట్టణాల వాళ్లు 188
NEH 7:27 అనాతోతు పట్టణం వాళ్లు 128
NEH 7:28 బేతజ్మావెతు పట్టణం వాళ్ల 42
NEH 7:29 కిర్యతారీము, కెఫీరా, బేయెరోతు పట్నాల వాళ్లు 743
NEH 7:30 రమా, గెబ పట్టణాల వాళ్లు 621
NEH 7:31 మిక్మషు పట్టణం వాళ్లు 122
NEH 7:32 బేతేలు, ఆయి పట్టణాల వాళ్లు 123
NEH 7:33 రెండవ నెబో పట్టణం వాళ్లు 52
NEH 7:34 రెండవ ఏలాము పట్టణం వాళ్లు 1,254
NEH 7:35 హారిము పట్టణం వాళ్లు 320
NEH 7:36 యెరికో పట్టణం వాళ్లు 345
NEH 7:37 లోదు హదీదు, ఓనో పట్టణాల వాళ్లు 721
NEH 7:38 సెనాయా పట్టణం వాళ్లు 3,930
NEH 7:39 వీళ్లూ యాజకులు: యేషూవా కుటుంబం ద్వారా యెదాయా వంశీయులు#973
NEH 7:40 ఇమ్మేరు వంశీయులు#1,052
NEH 7:41 పషూరు వంశీయులు#1,247
NEH 7:42 హారిము వంశీయులు#1,017
NEH 7:43 లేవీ వంశానికి చెందిన వాళ్లు: యేషువా, హోదేయా, కద్మీయులు#74
NEH 7:44 వీళ్లు గాయకులు: ఆసావు వంశీయులు#148
NEH 7:45 వీళ్లు ద్వారపాలకులు: షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబ, హటీటాం, షోబయి వంశీయులు#138
NEH 7:46 వీళ్లు ఈ కింది వంశాల ఆలయ ప్రత్యేక సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయేలు
NEH 7:47 కేరోసు, సీయహా, పాదోను,
NEH 7:48 లెబానా, హగాబా, షల్మయి,
NEH 7:49 హానాను, గిద్దేలు, గహరు
NEH 7:50 రెవాయ, రెజీను, నెకోదా,
NEH 7:51 గజ్జాము, ఉజ్జా, పాసెయ.
NEH 7:52 బేసాయి, మెహూనీము, నెపూషేసీము.
NEH 7:53 బక్బూకు, హకూఫా, హర్హారు,
NEH 7:54 బజ్లీతు, మెహీదా, హర్షా,
NEH 7:55 బర్కోసు, సీసెరా, తెమాహా,
NEH 7:56 నెజీయహు, హటేపా.
NEH 7:57 సొలొమోను దాసులు వంశాలకు చెందిన వారు: సొటయి, సోపెరెతు, పెరూదా,
NEH 7:58 యహలా, దర్కొను, గిద్దేలు,
NEH 7:59 షెఫట్యా, హట్టీలు, పొకెరెతు, హజ్జెబాయిము, అమోను.
NEH 7:60 ఆలయ సేవకులు, సొలొమోను దాసుల వంశీయులు కలిసి మొత్తం#392
NEH 7:61 కొందరు ఈ క్రింది పట్టణాలనుంచి యెరూషలేముకు వచ్చారు. తేల్మెలెహు, తెత్వెర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు, అయితే, వీళ్లు తమ కుటుంబాలు ఇశ్రాయేలుకి చెందినవో కావో నిరూపించుకోలేక పోయారు.
NEH 7:62 దెలాయ్యా, టోబీయా, నెకొనిదా వంశీయులు#642
NEH 7:63 యాజక కుటుంబాల్లో చేరినవాళ్లు హబాయా, హక్కోజు, బర్జిల్లయి (గిలాదీయులైన బర్జిల్లయి కుమారైలను పెళ్లి చేసుకున్నవాళ్లు బర్జిల్లయి వంశీయులుగా గణింపబడ్డారు.)
NEH 7:64 వీళ్లు తమ కుటుంబ చరిత్రల కోసం గాలించారు, కాని అవి వాళ్లకి దొరకలేదు. తాము యాజకులుగా పని చేయగలిగేందుకు గాను, తమ పూర్వీకులు యాజకులన్న విషయాన్ని వాళ్లు నిరూపించలేక పోయారు. దానితో, వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో చేర్చ బడలేదు.
NEH 7:65 అత్యంత పవిత్రమైన వస్తుపులను వాళ్లకి ఇవ్వరాదని పాలనాధికారి ఆజ్ఞ జారీ చేశాడు. ప్రధాన యాజకుడు ఊరీము, తుమ్మీము ఉపయోగించి దేవుని సంకల్పం తెలుసుకునేందుకోసం అర్థించి ప్రార్థించేదాకా వాళ్లు ఈ అతి పరిశద్ధ వస్తుపుల్లో వేటికీ అర్హులు కాకుండా పోయారు.
NEH 7:66 మొత్తం మీద, ఆ బృందంలో తిరిగి వచ్చిన వాళ్లు 42,360 మంది వున్నారు. వాళ్ల 7,337 దాసదాసీలు ఈ మొత్తం సంఖ్యలో చేర్చబడలేదు. వాళ్లతోబాటు 245 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు.
NEH 7:68 వాళ్లకి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు వున్నాయి.
NEH 7:70 కుటుంబ పెద్దలు కొందరు పనినిర్వహణకు సహాయంగా కొంత డబ్బు ఇచ్చారు. పాలనాధికారి ఖజానాకు 19 పౌనుల బంగారు ఇచ్చాడు. అతను 50 పళ్లాలు, యాజకులు ధరించేందుకు 530 జతల దుస్తులు కూడా ఇచ్చాడు.
NEH 7:71 కుటుంబ పెద్దలు పని నిర్వహణ కోసం 375 పౌనులు, బంగారాన్ని ఖజానాకి ఇచ్చారు. వాళ్లు 1 1/3 టన్నులు వెండిని కూడ ఇచ్చారు.
NEH 7:72 మొత్తంమీద ఇతరులు 375 పౌనుల బంగారము 1 1/3 టన్నుల వెండిని తులాల వెండి, యాజకుల కోసం 67 రకాల దుస్తులు ఇచ్చారు.
NEH 7:73 ఈ విధంగా యాజకులు, లేవీయులు, ద్వార పాలకులు, గాయకులు, ఆలయ సేవకులు తమతమ సొంత పట్టణాలలో స్థిరపడ్డారు. కాగా, ఇతర ఇశ్రాయేలీయులందరూ తమ సొంత పట్టణాల్లో స్థిర పడ్డారు. ఆ సంవత్సరం ఏడవ నెల నాటికి ఇశ్రాయేలీ యులందరూ తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు.
NEH 8:1 ఆ విధంగా, ఇశ్రాయేలీయులందరూ ఆ ఏడాది ఏడవ నెలలో సమావేశమయ్యారు. వాళ్లందరూ నీటి గుమ్మం ముందరి మైదానంలో ఏక మనస్కులై ఒకే మనిషి అన్నట్లు గుమికూడారు. వాళ్లు ఎజ్రా ఉప దేశకుణ్ణి మోషే ధర్మశాస్త్రాన్ని పైకి తీసి పఠించ వలసిందిగా కోరారు. ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రమది.
NEH 8:2 యాజకుడైన ఎజ్రా సమావేశమైన జనం ముందుకి ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. అది నెల మొదటి రోజు. అది ఏడాదిలో ఏడవ నెల. ఆ సమావేశంలో స్త్రీలు, పురుషులు విని, అర్థం చేసుకోగల వయస్కులు వున్నారు.
NEH 8:3 ఎజ్రా ఉదయాన్నుంచి మిట్ట మధ్యాహ్నంవరకు ధర్మశాస్త్రాన్ని చదివాడు. నీటి గుమ్మం ఎదుటవున్న మైదానానికి ఎదురుగా నిలబడి, ఎజ్రా స్త్రీలనీ, పురుషుల్నీ విని అర్థం చేసుకోగల వాళ్లందర్నీ ఉద్దేశించి చదివాడు. జనం అందరూ ధర్మశాస్త్ర గ్రంథం పట్ల భక్తి శ్రద్ధలతో విన్నారు.
NEH 8:4 ఎజ్రా ఈ ప్రత్యేక సందర్భంకోసం నిర్మింపబడిన ఎతైన కొయ్య వేదిక మీద నిలబడ్డాడు. ఎజ్రా కుడి పక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా,హిల్కియా, మయశేయాలు ఉన్నారు. ఎజ్రా ఎడమ పక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాములు వున్నారు.
NEH 8:5 అప్పుడు ఎజ్రా గ్రంథం విప్పాడు. ఎజ్రా ఎతైన వేదిక మీద నిలబడి ఉన్నందున జనులందరూ అతన్ని చూడగలుగుతున్నారు. ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరవగానే, జనం అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు.
NEH 8:6 ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతించాడు. జనులందరూ తమ చేతులు పైకెత్తి బిగ్గరగా, “ఆమేన్! ఆమేన్!” అన్నారు. తర్వాత జనులందరూ నేలమీదవంగి నమస్కరించి యెహోవాను ఆరాధించారు.
NEH 8:7 జనం అక్కడ నిలబడి వుండగా లేవీయులు ధర్మశాస్త్ర నియమాలను జనానికి బోధించారు. అలా బోధించిన లేవీయులు: యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెత్తె, హూదీయా, మయశాయా, కెలీటా, అజర్యా, యెజాబాదు, హానాను, పెలాయా.
NEH 8:8 ఆ లేవీయులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. వాళ్లు జనానికి అర్థం వివరించి దాన్ని సులభం చేశారు. చదివినదాన్ని జనం తేలిగ్గా అర్థం చేసుకోగలిగేందుకు గాను వాళ్లు తాత్పర్యాలను వివరించి చెప్పారు.
NEH 8:9 తర్వాత పాలనాధికారి నెహెమ్యా, యాజకుడును, ఉపదేశకుడునైన ఎజ్రా, జనానికి బోధిస్తున్న లేవీయులు మాట్లాడారు. వాళ్లు, “ఈ రోజు మీ దేవుడైన యెహోవాకి ప్రత్యేక దినం మీరు విచారంగా వుండకండి, ఏడ్వకండి!” అని చెప్పారు. ధర్మశాస్త్రంలోని సందేశాలను వింటూ జనం అందరూ రోదించనారంభించిన మూలంగా వాళ్లీ మాటలు చెప్పారు.
NEH 8:10 నెహెమ్యా ఇలా చెప్పాడు: “పోయి కొవ్విన మాంసంతో భోజనం చేయండి, మధుర ద్రాక్షారసం సేవించండి. ఏ ఆహారమూ తయారు చేసుకోని వాళ్లకికొంత ఆహారమూ పానీయాలూ ఇవ్వండి. ఈ రోజు యెహోవాకి ప్రత్యేకమైన రోజు. విచారాన్ని విడనాడండి! ఎందుకంటే, యెహోవా ఆనందం మీకు పుష్టిని చేకూరుస్తుంది.”
NEH 8:11 జనం శాంతచిత్తులయ్యేందుకు లేవీయులు తోడ్పడ్డారు. “శాంతించండి, మౌనంగా వుండండి. ఇదొక ప్రత్యేక దినం, దుఃఖించకండి.”
NEH 8:12 అప్పుడిక అందరూ విందు భోజనం చేసేందుకు వెళ్లారు. వాళ్లు తమ ఆహార పదార్థాలనీ, పానీయాలనీ పరస్పరం పంచుకున్నారు. ఆ ప్రత్యేక దినాన్ని వాళ్లెంతో సంతోషంగా జరుపుకున్నారు. వాళ్లు చివరికి బోధకులు తమకి బోధించ ప్రయత్నిస్తున్న ధర్మశాస్త్ర గుణపాఠాలను అర్థం చేసుకున్నారు.
NEH 8:13 అటు తర్వాత, నెల రెండవ రోజున అన్ని కుటుంబాల పెద్దలూ ఎజ్రానూ, యాజకులనూ, లేవీయులనూ కలుసుకు నేందుకు వెళ్లారు. వాళ్లందరూ ధర్మశాస్త్రంలోని ప్రవచనాలను అధ్యయనం చేసేందుకు ఉపదేశకుడైన ఎజ్రాచుట్టూ చేరారు.
NEH 8:14 వాళ్లు ధర్మశాస్త్రన్ని అధ్యయనం చేయగా దానిలో ఈ దిగువ ఆజ్ఞలు వాళ్లకి కనిపించాయి యెహోవా మోషే ద్వారా ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ఏడాది ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు యెరూషలేముకు ప్రత్యేకమైన పండుగ జరుపుకు నేందుకు విధిగా పోవాలి. వాళ్లు తాత్కాలిక పర్ణశాలల్లో ఉండాలి. తమ పట్టణాలన్నింటికీ, యెరూషలేముకీ పోయి, ఈ కింది మాటలు ప్రకటించాలి. “పర్వత ప్రాంతానికి పోయి రకరకాల ఒలీవ చెట్ల కొమ్మలు తీసుకురావాలి. కదంబ, తాటి, ఈత ఆకులను, అలాగే నీడనిచ్చే ఇతర మొక్కలను తీసుకురావాలి. ఆ కొమ్మలతో తాత్కాలికమైన పర్ణశాలలు వెయ్యాలి. ధర్మశాస్త్ర గ్రంథం చెప్పినట్లు చెయ్యండి.”
NEH 8:16 సరే, జనం పోయి, ఆ చెట్ల కొమ్మలు తెచ్చారు. తర్వాత వాటితో వాళ్లు తమకి తాత్కాలిక పర్ణశాలలు నిర్మించుకున్నారు. వాళ్లు పర్ణశాలలను తమ ఇళ్ల కప్పులపైనా, తమ ఆవరణల్లోనూ వేసుకున్నారు. వాళ్లు ఆలయ ప్రాంగణంలో, నీటి గుమ్మం దగ్గరి ఖాళీ స్థలంలో, ఎఫ్రాయిము ద్వారం దగ్గర పర్ణశాలలు నిర్మించారు.
NEH 8:17 చెరనుంచి బంధవిముక్తులై తిరిగివచ్చిన ఇశ్రాయేలీయుల బృందమంతా పర్ణశాలలు కట్టు కున్నారు. వాళ్లు తాము కట్టుకున్న పర్ణశాలల్లో నివసించారు. నూను కుమారుడైన యెహోషువా కాలంనుంచి ఆనాటిదాకా ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండుగను ఇంత చక్కగా జరుపుకోలేదు. అందరూ ఎంతో సంతోషించారు!
NEH 8:18 ఆ పండుగ ప్రతి రోజూ, మొదటి రోజునుంచి చివరి రోజు ఎజ్రా వాళ్లకి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ పండగను వారం రోజులపాటు జరుపుకున్నారు. అటు తర్వాత ఎనిమిదో రోజున, ధర్మ శాస్త్రం నిర్దేశించినట్టు ఒక ప్రత్యేక సమావేశం కోసం ఒక చోట కూడారు.
NEH 9:1 తర్వాత అదే నెల 24 వ రోజున, ఇశ్రాయేలీయులు ఒక చోట చేరి సామూహిక ఉపవాసం చేశారు. వాళ్లు విచార సూచకమైన దుస్తులు ధరించారు. (తమ విచారాన్ని చూపేందుకు గాను) నెత్తిన బూడిద పోసుకున్నారు.
NEH 9:2 నిజంగా ఇశ్రాయేలీయులైన వాళ్లు అన్య జనులనుంచి వేరుపడి, ఆలయంలో నిలబడి, తమ పాపాలనూ, తమ పూర్వీకుల పాపాలనూ ఒప్పుకొన్నారు.
NEH 9:3 వాళ్లక్కడ సుమారు మూడు గంటలసేపు నిలబడ్డారు, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని చదివారు, తర్వాత మరో మూడు గంటలు తమ పాపాలు ఒప్పుకొని, యెహోవా ముంగిట సాగిల పడ్డారు.
NEH 9:4 అటు తర్వాత, ఈ క్రింది లేవీయులు మెట్లపైన నిలబడ్డారు: యేషూవా, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ. వాళ్లు ఉచ్చ స్వరాల్లో యెహోవాను పిలిచారు.
NEH 9:5 తర్వాత ఈ లేవీయులు మళ్వీ ప్రసంగించారు: యేషువా, బానీ, కద్మీయేలు, హషబ్నెయా, షెరేబ్యా, హోదీయా, షబన్యా, పెతహాయా, వాళ్లు, “లేచి నిలబడి, ప్రభువైన దేవుణ్ణి స్తుతించండి” అని చెప్పారు. “దేవుడు ఎల్లప్పుడు ఉండును. ఆయన ఎల్లప్పుడూ జీవించును! నీ ఘననామం స్తుతించబడాలి. నీ ఘనమైన నామం సకలాశీర్వచన స్తోత్రాలనూ అధిగమించి పోవాలి!
NEH 9:6 యెహోవా నీవే దేవుడివి!, యెహోవా ఆకాశం, అత్యున్నత పరలోకాలు, వాటిలోవున్న సమస్తాన్ని నీవే సృజించావు! భూమినీ, దానిపైనున్న సమస్తాన్నీ నీవే సృజించావు! సముద్రాలను సృజించింది నీవే. వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించింది నీవే! ప్రతిదానికీ ప్రాణంపోసింది నీవే, దేవదూతలు నీకు నమస్కరిస్తారు. నీ సన్నిధియందు సాగిలపడతారు నిన్ను ఆరాధిస్తారు!
NEH 9:7 యెహోవా, నీవే దేవుడిని. అబ్రామును ఎంచుకున్నది నీవే. అతన్ని బబులోనులోని ఊరునుంచి నడిపించింది నీవే. అబ్రాహాముగా అతని పేరు మార్చింది నీవే.
NEH 9:8 అతడు నీకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండేలా చూసుకున్నావు. అతనితో నీవొక ఒడంబడిక చేసుకున్నావు. అతని సంతతి వారికి వాగ్దానం చేశావు నీవు కనాను, హిత్తీ, అమోరీ, పెరిజ్జీ, యెబూసీ, గిర్గాషి జాతుల దేశాన్ని ఇస్తానన్న. నీ మాటను నీవు నిలుపుకున్నావు! నీవు నిజాయితీగలవాడవు, మాట నిలుపుకున్నావు!
NEH 9:9 మా పూర్వీకులు ఈజిప్టులో బాధలు పడటం చూశావు! సహాయార్థం ఎర్ర సముద్ర తీరానవారి మొరలు ఆలకించావు.
NEH 9:10 నీవు ఫరోకి అద్భుతాలు ప్రదర్శించావు అతని ఉద్యోగులకీ, ప్రజలకీ దిగ్ర్భాంతికరమైన పనులు చేసి చూపావు. మా పూర్వీకుల కంటెతాము గొప్ప అని ఈజిప్టీయులు అనుకోవడం నీకు తెలుసు. అయితే నువ్వు, నీ వెంత గొప్పవాడివో నిరూపించుకొన్నావు! ఈనాటికీ అది వాళ్లు జ్ఞాపకం ఉంచుకొంటారు.
NEH 9:11 నీవు వాళ్ల కళ్ల ముందు ఎర్ర సముద్రాన్ని విభాగించావు. వాళ్లు పొడినేల మీద నడిచి పోయారు! ఈజిప్టు సైనికులు వాళ్లని తరుముతున్నారు కాని, నువ్వు ఆ శత్రువుని సముద్రంలో ముంచేశావు. మరి వాళ్లు ఒక రాయిలా నీటిలో మునిగారు.
NEH 9:12 పగటి పూట మేఘస్థంభంలో వుండి వాళ్లని నడిపించావు, రాత్రివేళ దీపస్ధంభంలో వుండి వాళ్లని నడిపించావు, ఆ విధంగా నీవు వారి మార్గాన్ని వెలిగించితివి. వాళ్లు చేరవలసిన గమ్యాన్ని చూపావు.
NEH 9:13 అప్పుడిక సీనాయి పర్వతం మీదికి దిగి ఆకాశంనుంచి వాళ్లతో మాట్లాడాపు. వాళ్లకి చక్కటి. ధర్మనియమాలిచ్చావు. వాళ్లకి సదుపదేశాలిచ్చావు. మంచి ఆజ్ఞలిచ్చావు, చక్కటి ఆదేశాలిచ్చావు!
NEH 9:14 నీ ప్రత్యేక విశ్రాంతి దినమైన సబ్బాతుని గురించి వాళ్లకి చెప్పావు. వాళ్లకి ఆజ్ఞలు, చట్టాలు, ఉపదేశాలు ఇచ్చేందుకు నీ సేవకుడు మోషేని వినియోగించావు.
NEH 9:15 వాళ్లు ఆకలిగొన్నప్పుడు వాళ్లకి నీవు ఆకాశంనుంచి తిండినిచ్చావు. వాళ్లు దప్పి గొన్నప్పుడు వాళ్లకి నీవు రాయినుంచి మంచి నీళ్లిచ్చావు. వాళ్లకి చెప్పావు, ‘రండి, ఈ భూమి తీసుకోండని’ నీవు నీ శక్తిని వినియోగించి వారికోసం ఆ భూమిని తీసుకున్నావు!
NEH 9:16 కాని వాళ్లు, మా పూర్వీకులు గర్వపడి కన్ను గానక ప్రవర్తించారు. వాళ్లు మొండి వారై నీ ఆజ్ఞలు పాటించక నిరాకరించారు.
NEH 9:17 వాళ్లు నీ మాటలు తిరస్కరించారు. వాళ్లకు నీవు చేసిన ఆశ్చర్యకారాలను అద్భుతాలను మరిచారు. వాళ్లు మొండివారై ఎదురు తిరిగినప్పుడు, వాళ్లు మళ్లీ వెనుకకు తిరిగి బానిసలయ్యారు. “నీవు క్షమాశీలివి! నీవు దయామయుడివి. కరుణామయుడివి. నీవు ఓర్పుగలవాడివి. ప్రేమామయుడవు. అందుకే నీవు వాళ్లను విడువలేదు.
NEH 9:18 వాళ్లు లేగ దూడల బంగారు బొమ్మలు చేసి, “మమ్మల్ని ఈజిప్టు నుంచి వెలికి తెచ్చిన దేవుళ్ళు వీరే, వీరే” అన్నా నీవు వాళ్లని వదిలేయలేదు!
NEH 9:19 నీవెంతో దయామయుడివి! అందుకే వాళ్లని ఎడారిలో వదిలేయలేదు. పగటివేళ మేఘస్థంభాన్ని వాళ్లనుంచి తప్పించలేదు. వాళ్లని నడిపిస్తూనే వచ్చావు. రాత్రివేళ దీపస్తంభాన్ని వాళ్ల దృష్టినుంచి తొలగించ లేదు. వాళ్ల బాటకి వెలుగు చూపుతునే వచ్చి వాళ్లకి మార్గదర్శనం చేస్తూనే వచ్చావు.
NEH 9:20 వాళ్లని వివేకవంతుల్ని చేసేందుకు నీవు వారికి నీ మంచి ఆత్మను ఇచ్చావు. వాళ్లకి ఆహారంగా మన్నానిచ్చావు. వాళ్ల దప్పిక తీర్చేందుకు మంచి నీరిచ్చావు.
NEH 9:21 నీవు వాళ్లని నలుబదియేండ్లు పోషించావు! ఎడారిలో అవసరమైనవన్నీ వాళ్లు పొందారు. వాళ్ల దుస్తులు చీకిపోలేదు. వాళ్ల పాదాలు వాయలేదు, గాయపడలేదు.
NEH 9:22 యెహోవా, నీవు వాళ్లకి రాజ్యాలిచ్చావు, దేశాలిచ్చావు, జనాభా పలచగావున్న సుదూర ప్రాంతాలనిచ్చావు. హెష్బోను రాజైన సీహోను దేశాన్నీ, బాషాను రాజైన ఓగు దేశాన్నీ పొందారు వాళ్లు.
NEH 9:23 యెహోవా నీవు వాళ్ల సంతతివారిని విస్తరింప చేసావు. వాళ్లు ఆకాశంలోని నక్షత్రాలంత మంది ఉండిరి. వాళ్ల పూర్వీకులకి నీవివ్వ జూపిన దేశానికి నీవు వాళ్లని తీసు కొచ్చావు. వాళ్లు ఆ భూమిలో ప్రవేశించి, దాన్ని స్వాధీన పరుచుకున్నారు.
NEH 9:24 ఆ బిడ్డలు ఆ భూమిని వశపరచుకున్నారు. అక్కడ నివసిస్తున్న కనానీయుల్ని వాళ్లు ఓడించారు. ఆ ప్రజలను వాళ్లోడించేటట్టు నీవు చేశావు! ఆ దేశ ప్రజలను, రాజులను నీ ప్రజలేమి చేయదలచుకుంటే, అది చేయనిచ్చావు!
NEH 9:25 వాళ్ల బలీయమైన నగరాలను ఓడించారు. సారవంతమైన భూమిని కైవసం చేసుకున్నారు. మంచి వస్తువులతో నిండిన ఇళ్లూ, అంతకు ముందే తవ్విన బావులూ వాళ్లకి చిక్కాయి. వాళ్లకి ద్రాక్షాతోటలు, ఒలీవ చెట్లు, ఎన్నెన్నో రకాల ఫలవృక్షాలు చిక్కాయి. వాళ్లు కడువునిండ తిని, కొవ్వెక్కారు. వాళ్లకి నీవిచ్చిన ఎన్నెన్నో వింత వస్తుపులు వాళ్లు తనివితీరా అనుభవించారు.
NEH 9:26 మరి తర్వాత వాళ్లు నీకు ఎదురు తిరిగారు! వాళ్లు నీ బోధనలను తోసిపుచ్చారు! వాళ్లు నీ ప్రవక్తల్ని హతమార్చారు. ఆ ప్రవక్తలు చేసిన తప్పిదం జనాన్ని హెచ్చరించడం, వాళ్లని తిరిగి నీ వైపుకి తిప్ప ప్రయత్నించడం. కొరకే కాని మా పూర్వీకులు నీకు ప్రతికూలంగా దారుణా లెన్నో చేశారు!
NEH 9:27 వాళ్ల శత్రువులు వాళ్లని చెరపట్టడానికి అందుకనే నీవు అనుమతించావు. శత్రువులు వాళ్లని నానా ఇబ్బంది పెట్టారు. కష్టాలు ఎదురై నప్పుడు మా పూర్వీకులు సహాయంకోసం నీకు మొర పెట్టుకున్నారు. పరలోకంలో వున్న నీవు వాళ్ల మొర విన్నావు. నీవు చాలా దయాశీలివి. అందు కని నీవు వాళ్లని కాపాడేందుకు మనుషుల్ని పంపావు. ఆ మనుష్యులు వాళ్లని వాళ్ల శత్రువుల నుంచి విడిపించారు.
NEH 9:28 సరే, పరిస్థితులు మెరుగవగానే మా పూర్వీకులు తిరిగి ఎన్నెన్నో దారుణాలు చేయనారంభించారు! నీవు మరలా శత్రువులు వారిని ఓడించి, శిక్షించేటట్టు చేశావు. వాళ్లు మళ్లీ నీకు మొర పెట్టుకున్నారు. పరలోకంలో ఉన్న నీవు ఆ మొర విని వాళ్లకి తోడ్డడావు. నీవెంతో దయామయుడివి! ఇలా జరిగింది ఎన్నెన్నోసార్లు!
NEH 9:29 నీవు వాళ్లని హెచ్చరించావు. మంచి మార్గానికి తిరిగి రమ్మన్నావు. అయితే, వాళ్లు మరీ గర్వపడి, నీ ఆదేశాలను, ఆజ్ఞలను మీరారు. జనం నీ ఆజ్ఞలను పాటిస్తే వాళ్లు నిజంగా బతుకుతారు. కాని మా పూర్వీకులు నీ ఆజ్ఞలు ఉల్లనఘించారు వాళ్లు మొండివారై, నీకు పెడ ముఖమయ్యారు, నీ ఆజ్ఞలు పెడచెవిన పెట్టారు.
NEH 9:30 “నీవు మా పూర్వీకుల పట్ట చాలా ఓర్పువహించావు. వాళ్లు నీతో సరిగా వ్యవహరించక పోయినా చాలా సంవత్సరాలు వాళ్లని సహించావు. నీ ఆత్మతో వాళ్లని హెచ్చరించావు. వాళ్లని హెచ్చరించేందుకు ప్రవక్తల్ని పంపావు. కాని మా పూర్వీకులు వాళ్ల మాటలు వినలేదు. అందుకే నువ్వు వాళ్లని విదేశాల్లోని మనుష్యులకు అప్పగించావు.
NEH 9:31 “అయితే, నీవెంతో దయామయుడివి! వాళ్లని నీవు సర్వనాశనం చేయలేదు. నీవు వాళ్లని విడువలేదు. నీవెంతో దయామయుడివి, దేవా, నీవెంతో కరుణామయుడివి!
NEH 9:32 మా దేవా, నీవు మహా దేవుడివి, భయంకరుడివి, శక్తిశాలియైన యోధుడివి! నీవు దయామయుడివి, విశ్వాసనీయుడివి! ఒడంబడికను తప్పని వాడివి! మాకెన్నో కష్టాలు, కడగళ్లు వచ్చాయి. మా కష్టాలు నీవు పట్టించుకుంటావు! మా ప్రజలందరికీ, మా రాజులకీ, మా పెద్దలకీ, మా యాజకులకీ, మా ప్రవక్తలకీ ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి. అష్షూరు రాజు పాలన కాలం నుంచి నేటిదాకా అవి వున్నాయి! కష్టాలు మమ్మల్ని వెన్నాడుతూనే వున్నాయి!
NEH 9:33 అందుకని దేవా మాకు సంభవించే ప్రతి దాన్నిగురించీ నీదే ఒప్పు, మాదే తప్పు.
NEH 9:34 మా రాజులు, నాయకులు, యాజకులు, మరి మా పూర్వీకులు నీ ధర్మనిబంధనలు పాటించలేదు. వాళ్లు నీ ధర్మశాస్త్రాన్ని మీరారు, నీ హెచ్చరికను ఖాతరు చేయలేదు.
NEH 9:35 తమ స్వదేశంలో నివసించినప్పుడు సైతం మా పూర్వీకులు నీకు సేవ చేయలేదు. వాళ్లు దుష్టుకార్యాలు చేయడం మానలేదు. నీవు వాళ్ల కిచ్చిన అద్భుతమైన వాటన్నిటినీ హాయిగా అనుభవించారు. వాళ్లు సారవంతమైన భూమిని అనుభవించారు సువిశాల దేశాన్ని ఏలుకున్నారు, అయినా, తమ దుర్మార్గాలు వీడలేదు.
NEH 9:36 మరి ఇప్పుడు, మేము బానిసలము. మేమీ భూమిలో ఏ భూమినీ, దేని ఫలసాయాలనూ, ఇక్కడ పెరిగే మంచివాటన్నిటినీ అనుభవించమని మా పూర్వీకులకు నీవిచ్చావో, ఆ భూమిలో మేము ఈనాడు దాసులము.
NEH 9:37 ఈ భూమిలో పంట పుష్కలమైనదే కాని మేము పాపాలు చేశాము కదా, అందుకని ఆ పంట నీవు మా నెత్తిన పెట్టిన రాజులకు పోతుంది. ఆ రాజులు మామీదా, మా పశువుల పైనా పెత్తనం చలాయిస్తారు. తమకిష్టము వచ్చినట్లు వ్యవహరిస్తారు. దేవా, మేము చాలా కష్టాల్లోవున్నాము.
NEH 9:38 వీటన్నింటి మూలంగా, మార్చరాని స్థిరమైన ఒడంబడిక ఒకటి మేము చేసుకుంటున్నాము. మేమీ ఒడంబడికను రాత పూర్వకంగా చేసు కొంటున్నాము. మా నాయకులూ, లేవీయులూ, యాజకులూ ఈ ఒడంబడిక మీద సంతకాలు చేసి, ఒక ముద్రతో దానికి ముద్ర వేస్తున్నారు.”
NEH 10:1 అలా ముద్ర వేయబడిన ఒడంబడిన మీద ఉన్న పేర్లు ఇవి: పాలనాధికారి నెహెమ్యా, నెహెమ్యా హకల్యా కుమారుడు. సిద్కీయా,
NEH 10:2 శెరాయా, అజర్యా, యిర్మీయా,
NEH 10:3 పషూరు, అమర్యా, మల్కీయా,
NEH 10:4 హట్టూషు, షెబన్యా, మల్లూకు,
NEH 10:5 హరిము, మెరేమోతు, ఓబద్యా,
NEH 10:6 దానియేలు, గిన్నెతోను, బారూకు,
NEH 10:7 మెషుల్లాము, అబీయా, మీయామిను,
NEH 10:8 మయజ్యా, బిల్గయి, షెమయా. ఇవన్నీ ఒడంబడిక మీద సంతకాలు పెట్టిన యాజకుల పేర్లు.
NEH 10:9 ముద్రవేయబడిన ఒడంబడిక మీద సంతకాలు పెట్టిన లేవీయుల పేర్లు ఇవి: అజన్యా కుమారుడు యేషువా, హేనాదాదు వంశానికి చెందిన బిన్నూయి, కద్మీయేలు,
NEH 10:10 వాళ్ల సోదరులు: షెబన్యా, హోదీయా, కెలీటా,పెలాయా, హానాను,
NEH 10:11 మీకా, రెహోబు, హషబ్యా,
NEH 10:12 జక్కూరు, షేరేబ్యా, షెబన్యా,
NEH 10:13 హోదీయా, బానీ, బెనీను.
NEH 10:14 ముద్రవేయబడిన ఒడంబడిక మీద సంతకాలు చేసిన నాయకుల పేర్లు: పరోషు, పహత్నోయాబు, ఏలాము, జత్తూ, బానీ,
NEH 10:15 బున్నీ, అజ్గాదు, బేబై,
NEH 10:16 అదోనీయా, బిగ్వయి, అదీను,
NEH 10:17 అటేరు, హిజ్కియా, అజ్జూరు,
NEH 10:18 హోదీయా, హాషుము, బేజయి,
NEH 10:19 హారీఫు, అనాతోతు, నేబై,
NEH 10:20 మగ్పీయాషు, మెషుల్లాము, హెజీరు,
NEH 10:21 మెషేయేలు, సాదోకు, యద్దూవ,
NEH 10:22 పెలట్యా, హానాను, అనాయా,
NEH 10:23 హోషేయ, హనన్యా, హష్షూబు,
NEH 10:24 హల్లోహెషు, పిల్హా, షోబేకు,
NEH 10:25 రెహూము, హషబ్నా, మయశేయా,
NEH 10:26 అహీయా, ఆనాను, అనాను,
NEH 10:27 మల్లూకు, హరీము, బయనా.
NEH 10:28 ఈ విధంగా, ఇప్పుడు వీళ్లందరూ దేవునికి ఈ ప్రత్యేక ప్రమాణం చేస్తున్నారు. తమ ఈ ప్రమాణాన్ని నిలుపుకోకపోతే, తామందరికీ చెడు, కీడు జరపమని వీళ్లంతా అర్థించారు. వీళ్లందరూ దేవుని ధర్మశాస్త్ర నియమాలను అనుసరిస్తాయని ప్రయాణం చేస్తున్నారు ధర్మశాస్త్రం దేవుని సేవకుడైన మోషే ద్వారా మాకు ప్రసాదించబడింది. మన దేవుడైన యెహోవా ఆదేశాలను, నియమ నిబంధనలను, ఉపదేశాలను అన్నింటినీ విధేయతతో పాటిస్తామని వీళ్లందరూ ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణం చేస్తున్నది ఈ మనుష్యులే: మిగిలిన వాళ్లు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, ఆలయ సేవకులు, తమచుట్టూ నివసిస్తున్నవారినుంచి తమని తాము వేరు చేసుకున్న ఇశ్రాయేలీయులందరూ తాము దేవుని ధర్మశాస్త్రాన్ని విదేయతతో పాటించేందుకుగాను వాళ్లు తమని తాము వేరు చేసుకున్నారు. అంతేకాదు, వాళ్లందరి భార్యలు, విని అర్థం చేసుకోగల వాళ్లందరి కొడకులు, కూతుళ్లు కూడా తమని తాము వేరు చేసుకున్నారు. వీళ్లందరూ దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని ప్రమాణం చేసేందుకుగాను తమ సోదరులతోనూ, పెద్దలతోనూ జతకూడారు. తాము దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే, తమకి కీడు కలిగించే శాపాన్ని తలదాల్చేందుకు కూడా సిద్ధపడ్డారు.
NEH 10:30 “మా చుట్టు పక్కల వున్న ఇతర ప్రజలను మా కూతుళ్లు పెళ్లి చేసుకోకుండా, అలాగే మా కొడుకులు ఇతర ప్రజల కూతుళ్లను పెళ్లి చేసుకోకుండానూ చూస్తామని మేము ప్రమాణం చేస్తున్నాము.
NEH 10:31 “మేము సబ్బాతు (విశ్రాంతి) రోజున పని చేయ మని ప్రమాణం చేస్తున్నాము. మా చుట్టూ ఉన్న ఇతర ప్రజలు సబ్బాతు రోజున తిండి గింజలో, ఇతర వస్తువులో అమ్మకానికి తెస్తే ఆ ప్రత్యేక దినానగాని, మరే ఇతర పండగ దినాల్లోగాని మేము వాటిని కొనము. ప్రతి ఏడేళ్లకీ ఒకసారి ఇతరులు మాకియ్యవలసిన బాకీ మొత్తాలను రద్దు చేస్తాము.
NEH 10:32 “దేవుని ఆలయం విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్న ఆదేశాల మేరకు మేమా బాధ్యతను స్వీకరిస్తాము. దేవునికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేందు కోసం మేము ప్రతియేటాతులము వెండిలో మూడోవంతు ఇస్తాము.
NEH 10:33 ఆలయంలో వారు బల్లమీద పెట్టే ప్రత్యేక రొట్టెకోసం, ప్రతి రోజూ అర్పించే ధాన్యార్పణలు దహనబలుల కోసం ఈ సొమ్ము యాజకులచేత వినియోగించబడుతుంది. అలాగే, ఈ సొమ్ము నవధాన్యాలు కొనేందుకు ధూప దీపాలు పెట్టేందుకు ఉపయోగింపబడుతుంది. సబ్బాతు రోజుల్లో, అమావాస్య దినాల్లో నైవేద్యం నిమిత్తం ఈ సొమ్ము వినియుక్తమవుతుంది. అది పవిత్ర బలులకోసం, ఇశ్రాయేలీయులను పరిశుద్ధులను చేసే పాపపరిహారార్థ బలులకోసం వినియోగింప బడుతుంది.
NEH 10:34 “యాజకులము, లేవీయులము, సామాన్య జనమైన మనము చీట్లు వేసుకున్నాము. తద్వారా, మా కుటుంబాల్లో ఏటా మన ఆలయానికి ఏయే నిర్ణీతదినాల్లో కట్టెల మోపులు (సమిధలు) తేవాలో తెల్సుకున్నాము. ఆ కట్టెలు మన దేవుడైన యెహోవా గట్టు మీద హోమం కోసం తెచ్చేవి. అదంతా మేము సరిగ్గా ధర్మశాస్త్రంలో వ్రాసిన నిబంధనల ప్రకారం చెయ్యాలి.
NEH 10:35 “మా పంట చేలనుంచీ, ప్రతి ఒక్క ఫల వృక్షం నుంచీ తోలి ఫలాలను ఏటా యెహోవా ఆరాధనాలయానికి తెచ్చి ఇచ్చే బాధ్యతను మేము స్వీకరిస్తున్నాము.
NEH 10:36 “ధర్మశాస్త్రంలో సరిగ్గా లిఖించబడినట్లే, మేమిలా చేస్తాము: మా తొలిచూలు కొడుకుల్నీ, అలాగే, మొదటి ఈత ఆవుల దూడల్నీ, గొర్రెలు, మేకల పిల్లల్నీ మన దేవుని ఆలయానికి, మన యాజకుల దగ్గరికి తెస్తాము.
NEH 10:37 “యెహోవా ఆలయపు సరుకుల కొట్ల దగ్గరికి తెచ్చి, ఈ కింది వస్తువులు యాజకులకి సమర్పిస్తాము: మొదటివిడత ఆడిన పిండి, ధాన్యార్పణలో మొదటి భాగం, మా ఫల వృక్షాలన్నింటి మొదటి పండ్లు మా కొత్త ద్రాక్షారసం నుంచీ, నూనె నుంచీ మొదటి భాగం, మా పంటల్లొ పదోవంతును లేవీయులకి సమర్పిస్తాము. మేము పనిచేసే ఆయా ప్రాంతాల్లో లేవీయులు వీటిని వసూలు చేస్తారు. అందుకే మేము వారికి ఇస్తాము.
NEH 10:38 ఆ పంట భాగాలు లేవీయులు వసూలు చేసేటప్పుడు, వాళ్లతో అహరోను వంశానికి చెందిన యాజకుడొకడు ఉండాలి. తర్వాత ఆ లేవీయులు ఆ పంటల్ని విధిగా ఆలయానికి తీసుకురావాలి. అప్పుడు వాటిని వాళ్లు ఆలయపు ఖజానాలోని సరుకుల కొట్లలో ఉంచుతారు.
NEH 10:39 ఇశ్రాయేలీయులు, లేవీయులు తమ ఆహార ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, నూనె కానుకలను సరుకుల గదుల వద్దకు తెస్తారు. ఆలయానికి తెచ్చే వస్తువులన్నీ అక్కడ ఉంచబడతాయి. సేవలో వున్న యాజకులు అక్కడే ఉంటారు. గాయకులు, ద్వారపాలకులు కూడా అక్కడేవుంటారు. “మా దేవుని ఆలయాన్ని భద్రంగా చూసు కుంటామని మేమంతా ప్రమాణం చేశాము!”
NEH 11:1 ఇశ్రాయేలు ప్రజల నాయకులు అప్పుడు యెరూషలేము నగరంలోకి నివాసం మార్చారు. మిగిలిన ఇశ్రాయేలీయులు నగరంలోకి ఇంకెవరు రావాలో నిర్ణయించవలసి వచ్చింది. అందుకని వాళ్లు చీట్లు వేశారు. ఇశ్రాయేలీయులు పదిమందిలో ఒకరు పవిత్ర నగరమైన యెరూషలేములో నివసించాలన్నది నిర్ణయం. మిగిలిన తొమ్మండుగురూ తమతమ పట్టణాల్లో నివసించవచ్చు.
NEH 11:2 కొందరు యెరూషలేములో నివసించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వాళ్లు అలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు మిగిలిన వాళ్లు వాళ్లకి కృతజ్ఞత తెలిపారు.
NEH 11:3 యెరూషలేములో నివసించిన నాయకులెవరనగా: (కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయ సేవకులు, సొలోమోను సేవకుల వంశీయులు యూదా పట్టణాల్లో నివసించారు. ఆయా పట్టణాల వాళ్లలో ప్రతి ఒక్కడూ తన సొంత భూమిమీద ఉన్నారు.
NEH 11:4 యూదా, బెన్నామీను వంశాలకు చెందిన ఇతరులు యెరూషలేము నగరంలో నివసించారు.) ఈ క్రింది యూదా వంశీయులు యెరూషలేముకి తరలి వెళ్లారు: ఉజ్జీయా కొడుకు అతాయా (ఉజ్జీయా జెకర్యా కొడుకు. జెకర్యా అమర్యా కొడుకు. అమర్యా షెపట్యా కొడుకు. షెపట్యా మహలేలు కొడుకు. మహలేలు పెరెసు వంశీయుడు),
NEH 11:5 బారూకు కొడుకు మయశేయా (బారూకు కొల్హోజె కొడుకు, కొల్హోజె హజాయా కొడుకు. హజాయా అదాయా కొడుకు. అదాయా యోయారీబు కొడుకు. యోయారీబు జెకర్యా కొడుకు. జెకర్యా షెలా వంశీయుడు).
NEH 11:6 యెరూషలేములో కాపురమున్న పెరెసు వంశీయులు నాలుగు వందల అరవై మంది. వారందరూ ధైర్యశాలులు.
NEH 11:7 యెరూషలేముకి కాపురం మార్చిన బెన్యామీను వంశీయులు: మెషుల్లాము కొడుకు సల్లు (మెషుల్లాము యోవేదు కొడుకు. యోవేదు పెదాయా కొడుకు. పెదాయా కోలాయా కొడుకు కోలాయా మయశేయా కొడుకు. మయశేయా ఈతీయేలు కొడుకు. ఈతీయేలు యెషయా కొడుకు).
NEH 11:8 జెసయ్యను అనుసరించినవారు: గబ్బయి, సల్లయి, వాళ్లు మొత్తం తోమ్మిది వందల ఇరవై ఎనిమిదిమంది.
NEH 11:9 జిఖ్రీ కొడుకు యోవేలు వారికి పర్యవేక్షకుడు. హోసెనూయా కొడుకు యూదా యెరూషలేము నగరవు రెండవ ప్రాంతపు వర్యవేక్షకుడు.
NEH 11:10 యెరూషలేముకి తరలి వెళ్లిన యాజకులు: యోయారీబు కొడుకు యెదాయా, యాకీను,
NEH 11:11 హిల్కీయా కొడుకు శెరాయా (హిల్కీయా మెషూల్లము కొడుకు, మెషూల్లము సాదోకు కొడుకు. సాదోకు మెరాయోతు కొడుకు. మెరాయోతు అహీటూబు కొడుకు. అహీటూబు ఆలయంలో పర్యవేక్షకుడు),
NEH 11:12 వీరి సోదరులు ఎనిమిది వందల ఇరవై రెండు మంది ఆలయ సేవకులు, యెరోహాము కొడుకు అదాయా (యెరోహాము పెలల్యా కొడుకు, పెలల్యా అమ్జీ కొడుకు, అమ్జీ జెకర్యా కొడుకు, జెకర్యా పషూరు కొడుకు, పషూరు మల్కియా కొడుకు),
NEH 11:13 మల్కియా సోదరులు రెండువందల నలభై రెండు మంది (వీళ్లు తమతమ కుటుంబాల పెద్దలు) అజరేలు కొడుకు అమష్షయి (అజరేలు అహాజయి కొడుకు, అహాజయిమెషిల్లేమోతు కొడుకు, మెషిల్లేమెతు ఇమ్మేరు కొడుకు),
NEH 11:14 ఇమ్మేరు సోదరులు నూట ఇరవై ఎనిమిది మంది (వీళ్లు సాహసికులైన సైనికులు) వీరిపై అధికారి హగెదోలీము కొడుకు జబ్దీయేలు.
NEH 11:15 లేవీయుల్లో ఈ కింది వారు యెరూషలేముకు చేరుకున్నారు: షష్షూబు కొడుకు షెమాయా, (హష్షూబు అజీక్రము కొడుకు, అజీక్రము హషబియా కొడుకు, హషబియా బున్నీ కొడుకు),
NEH 11:16 షబ్బెతయి, యోజాబాదు (వీళ్లిద్దరూ లేవీయుల నాయకులు. వీళ్లు ఆలయం బయటి పనుల పర్యవేక్షకులు),
NEH 11:17 మత్తన్యా (మత్తన్యా మీకా కొడుకు, మీకా జబ్ది కొడుకు, జబ్ది ఆసాఫు కొడుకు. ఆసాఫు దైవ స్తోత్రాలు, ప్రార్థన గేయాలు పాడటంలో గాయకులకి నాయకత్వం వహించేవాడు), బక్బుక్యా (తన సోదరులపై అజమాయిషీలో బక్బుక్యాది రెండవ స్థానం), షమ్మూయ కొడుకు అబ్దా, (షమ్మూయ గాలాలు కొడుకు, గాలాలు యెదూతూను కొడుకు.)
NEH 11:18 ఈ విధంగా, పవిత్ర నగరం యెరూషలేముకి తరలి వచ్చిన లేవీయులు రెండు వందల ఎనభై నాలుగు మంది వున్నారు.
NEH 11:19 యెరూషలేముకి తరలి వచ్చిన ద్వార పాలకులు: అక్కూబు, టల్మోను, వాళ్ల సోదరుల్లో నూటడెభ్భై రెండు మంది. వాళ్లు నగర ద్వారాలను శ్రద్ధగా కాపలా కాశారు.
NEH 11:20 ఇశ్రాయేలీయుల్లో ఇతరులు, ఇతర యాజకులు, లేవీయులు యూదాలోని అన్ని పట్టణాల్లోనూ నివసించారు. వాళ్లలో ప్రతి ఒక్కడూ తన పూర్వీకుల సొంత భూమిలోనే నివసించారు.
NEH 11:21 ఆలయ సేవకులు ఓఫెలు కొండ మీద ఉన్నారు. ఆలయ సేవకుల నాయకులు జీహా, గిష్పా.
NEH 11:22 యెరూషలేములోని లేవీయుల నాయకుడు ఉజ్జీ. ఉజ్జీ బానీ కొడుకు (బానీ హషబియా కొడుకు, హషబియా మత్తనయా కొడుకు, మత్తనయా మీకా కొడుకు),ఉజ్జీ ఆసాఫు వంశీయుడు. ఆసాఫు వంశీయులు గాయకులు, ఆలయంలో జరిగే సేవకు వాళ్లు బాధ్యులు.
NEH 11:23 గాయకులు రాజుగారి ఆజ్ఞలకు బద్ధులు. రాజుగారి ఆజ్ఞలు ఏరోజుకారోజు గాయకులు చేయ వలసిన పనులను పేర్కోన్నాయి.
NEH 11:24 రాజుగారు నిర్ధేశించిన పనులు యేమిటో జనులకు చెప్పిన వాడు పెతహయా (పెతహయా మెషెబెయేలు కొడుకు. మెషెబెయేలు జెరహు వంశీయుడు. జెరహు యూదా కొడుకు).
NEH 11:25 యూదా ప్రజలు ఈ కింది పట్టణాల్లో నివసించారు: కిర్యతర్బా, దాని చుట్టూవున్న చిన్న పట్టణాలు, దీబోను, దాని చుట్టూవున్న చిన్న పట్టణాలు; యెకబ్సెయేలు దీని చుట్టూవున్న చిన్న పట్టణాలు,
NEH 11:26 యేషూవ, మెలాదా, బేత్పెలెతు,
NEH 11:27 హజర్‌షువలు, బేర్షెబా, దాని చుట్టూ వున్న చిన్న పట్టణాలు,
NEH 11:28 సిక్లగు, మెకోనా, దాని చుట్టూవున్న చిన్న పట్టణాలు,
NEH 11:29 ఏన్రిమ్మోను, జోరయా, యర్మూతు, జానోహ, అదుల్లాము,
NEH 11:30 వాటి చుట్టూ వున్న చిన్న పట్టణాలు; లాకీషు, దాని చుట్టూవున్న పొలాలు; అజేకా, దాని చుట్టూవున్న చిన్న పట్టణాలు. ఈ విధంగా యూదా ప్రజలు బేర్‌షెబానుంచి హిన్నోము లోయ వరకూ నివాసం వున్నారు.
NEH 11:31 గెబకి చెందిన బెన్యామీను వంశస్థులు మిక్మషు, హాయి, బేతేలు, దాని చుట్టూవున్న చిన్నపట్టణాల్లో,
NEH 11:32 అనాతోతు, నోబు, అనన్యాలలో,
NEH 11:33 హాసోరు, రామా, గిత్తంలలో,
NEH 11:34 హదీదు, జెబోయిము, నెబల్లాటుల్లో,
NEH 11:35 లోదు, ఓనో, చేతి వృత్తుల వాళ్ల లోయలో నివాసం వున్నారు.
NEH 11:36 లేవీయుల కొన్ని బృందాలు బెన్యామీను ప్రాంతానికి మారారు.
NEH 12:1 యూదా దేశానికి తిరిగి వచ్చిన యాజకులు, లేవీయులు వీళ్లు: వీళ్లు షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుతో, యేషూవతో కలిసి తిరిగి వచ్చిన వాళ్లు. వాళ్లు పేర్ల జాబితా ఇది: శెరాయా, యిర్మియా, ఎజ్రా,
NEH 12:2 అమర్యా, మల్లూకు, హట్టూషు,
NEH 12:3 షె కన్యా, రెహూము, మెరే మోతు,
NEH 12:4 ఇద్దో, గిన్నెతోను, అబీయా,
NEH 12:5 మియామీను, మయెద్యా, బిల్గా,
NEH 12:6 షెమయా, యెయారీబు, యెదాయా,
NEH 12:7 సల్లూ, ఆమోకు, హిల్కియా, యెదాయా, యేషూవ కాలంలో వీళ్లు యాజకుల నాయకులు, బంధువులు.
NEH 12:8 లేవీయులు వీళ్లు: యేషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా, మత్తన్యా. మత్తన్యా బంధువులతోబాటు వీళ్లు దేవుని భజనల విషయంలో బాధ్యులు.
NEH 12:9 బక్బుక్యా, ఉన్నీలు ఆ లేవీయుల బంధువులు. వీళ్లిద్దరూ వాళ్లకి ఎదురుగా నిలిచి ఆరాధన సభలో పాల్గానేవారు.
NEH 12:10 యేషూవా యోయాకీము తండ్రి. యోయాకీము ఎలియాషీబు తండ్రి. ఎలియాషీబు యోయాదా తండ్రి.
NEH 12:11 యోయాదా యోనాతాను తండ్రి. యోనాతాను యెద్దూవ తండ్రి.
NEH 12:12 యోయాకీము కాలంలో యాజకుల కుటుంబాల నాయకులు వీళ్లే: శెరాయా కుటుంబ నాయకుడు మెరాయా. యిర్మీయా కుటుంబ నాయకుడు హనన్యా.
NEH 12:13 ఎజ్రా కుటుంబ నాయకుడు మెషుల్లాము. అమర్యా కుటుంబ నాయకుడుయె హోహానాను.
NEH 12:14 మల్లూకు కుటుంబ నాయకుడు యోనాతాను. షెకన్యా కుటుంబ నాయకుడు యోసేపు.
NEH 12:15 హారీము కుటుంబ నాయకుడు అద్నా. మెరే మోతు కుటుంబ నాయకుడు హెల్కయి.
NEH 12:16 ఇద్దో కుటుంబ నాయకుడు జెకర్యా. గిన్నే తోను కుటుంబ నాయకుడు మెషుల్లాము.
NEH 12:17 అబీయా కుటుంబ నాయకుడు జిఖ్రీ, మిన్‌యామీను, మాదేయా కుటుంబాల నాయకుడు పిల్టయి.
NEH 12:18 బిల్గా కుటుంబ నాయకుడు షమ్మూయి. షెమాయా కుటుంబ నాయకుడు యెహోనా తాను.
NEH 12:19 యోయారీబు కుటుంబ నాయకుడు మత్తెనయి. యెదాయా కుటుంబ నాయకుడు ఉజ్జీ.
NEH 12:20 సల్లయి కుటుంబ నాయకుడు కల్లయి. అమోకు కుటుంబ నాయకుడు ఏబెరు.
NEH 12:21 హిల్కియా కుటుంబ నాయకుడు హషబ్యా. యెదాయా కుటుంబ నాయకుడు నెతనేలు.
NEH 12:22 పారసీక రాజు దర్యావేషు పాలనకాలంలో ఎల్యాషీబు, యోదాయా, యోహానాను, యద్దూవ కాలపులేవీ కుటుంబాల పెద్దల, యాజకుల పేర్లు నమోదు చేయబడ్డాయి.
NEH 12:23 లేవీ కుటుంబ నాయకులు, ఎల్యాషిబు కొడుకైన యోహానాను పేర్లు చరిత్ర గ్రంథంలో లిఖించబడ్డాయి.
NEH 12:24 లేవీయుల నాయకులు వీళ్లు: షేరేబ్యా, కద్మీయేలు కొడుకు యేషూవా, వాళ్ల సోదరులు. వాళ్ల సోదరులు వీళ్లకి ఎదురుగా నిలబడి దైవ స్తోత్రాలు, భజన పాటలు పాడేవారు. ఒక బృందం మరో బృందానికి సమాధానంగా పాడుతుంది. దేవుని ప్రతినిధి అయిన దావీదు ఆదేశించిన రీతిలో ఈ స్తుతిపాటలు సాగుతాయి.
NEH 12:25 వెలుపలి ద్వారాల పక్కన వున్న సామాన్ల గదులను కాసే ద్వారపాలకుల పేర్లు: మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు.
NEH 12:26 ఈ ద్వారపాలకులు యెయాకీము కాలంలో కొలుపు చేశారు. యోయాకీము యేషూవా కొడుకు. యేషూవా యోయాదాకు కొడుకు. ఆ ద్వారపాలకులు నెహెమ్యా పాలనాధికారిగా వున్న కాలంలో, యాజకుడు, ఉపదేశకుడు అయిన ఎజ్రా కాలంలో కూడా కొలువుచేశారు.
NEH 12:27 ప్రజలు యెరూషలేము ప్రాకారాన్ని ప్రతిష్ఠించారు. వాళ్లు లేవీయులందర్నీ యెరూషలేముకి తీసుకువచ్చారు. ఆ లేవీయులు తాము నివసించే ఆయా పట్టణాలనుంచి వచ్చారు. వాళ్లు యెరూషలేముకి ప్రాకారం ప్రతిష్ఠించటం కోసం వచ్చారు. లేవీయులు దైవ స్తోత్రాలు పాడేందుకూ, కీర్తనలు పాడేందుకూ వచ్చారు. వాళ్లు స్వరమండల సితారలు, తాళాలు వాయించారు. తంబూరలు మోగించారు.
NEH 12:28 గాయకులందరూ కూడా యెరుషలేముకి వచ్చారు. ఆ గాయకులు యెరూషలేము చుట్టూవున్న పట్టణాల నుంచి వచ్చారు. వాళ్లు నెటోపా పట్టణం నుంచి, బేత్‌గిల్గాలు, గెబ, అజ్‌మావెతుల నుంచి వచ్చారు. ఆ గాయకులు యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో తమకోసం చిన్న చిన్న పట్టణాలు నిర్మించుకున్నారు.
NEH 12:30 యాజకులూ, లేవీయులూ తమని తాము పవిత్రం చేసుకున్నారు. తర్వాత వాళ్లు యెరూషలేము ప్రాకారాలన్నీ ఒక ఆచారములో పవిత్రీకరించారు.
NEH 12:31 అప్పుడు నేను (నెహెమ్యాను) యూదా నాయకులకి పైకెక్కి ప్రాకారం మీద నిలబడమని చెప్పాను. దైవ స్తుతి, కృతజ్ఞత గీతాలు పాడేందుకు రెండు పెద్ద గాయక బృందాలను కూడా ఎంపిక చేశాను. వాటిలో ఒక బృందం కుడివైపున పెంట గుమ్మం దిశగా పోయి ప్రాకారం పైకి ఎక్కాలి.
NEH 12:32 హోషెయా, యూదా నాయకుల్లో సగంమంది ఆ గాయకుల వెంట వెళ్లారు.
NEH 12:33 అజర్యా, ఎజ్రా, మెషుల్లాము,
NEH 12:34 యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా, మొదలైనవారు కూడా వాళ్లతో వెళ్లారు.
NEH 12:35 యాజకుల్లో కొందరు కూడా బూరలు ఊదుతూ వాళ్లని ప్రాకారం దాకా అనుసరించారు, జెకర్యా కూడా వాళ్ల వెంట నడిచాడు ( జెకర్యా యోనాతాను కొడుకు, యోనాతాను షెమయా కొడుకు, షెమయా మత్తనయా కొడుకు, మత్తనయా మీకాయా కొడుకు. మీకాయా జక్కూరు కొడుకు, జక్కూరు అసాఫు కొడుకు).
NEH 12:36 అంతేకాక ఆసాఫు సోదరులు కూడా వున్నారు. వాళ్లు: షెమయా, అజరేలు, మిలయి, గిలలయి, మాయి, నెతనేలు, యూదా, హానానీ. వాళ్లు దగ్గర దైవ జనుడయిన దావీదు తయారు చేసిన సంగీత వాద్యాలు వున్నాయి. ఉపదేశకుడైన ఎజ్రా ప్రాకారానికి ప్రతిష్ఠ చేసే బృందానికి అగ్రభాగాన నడిచాడు.
NEH 12:37 వాళ్లు ఊట గుమ్మం దగ్గరికి వెళ్లారు. వాళ్లు మెట్లు ఎక్కి దావీదు నగరం చేరుకున్నారు. వాళ్లు ప్రహరీగోడపైన నిలబడ్డారు. వాళ్లు దావీదు భవనం దాటి, ఊట గుమ్మం దిశగా గోడమీద నడిచి వెళ్లారు.
NEH 12:38 రెండవ గాయక బృందం రెండో దిశకి ఎడమ దిశకి బయల్దేరింది. వాళ్లు గోడపైకి వెళ్తున్నప్పుడు నేను వాళ్లని అనుసరించాను. జనంలో సగంమంది కూడా వాళ్లని అనుసరించారు. వాళ్లు అగ్ని గుండాల శిఖరాన్ని దాటి, వెడల్పు గోడను చేరుకున్నారు.
NEH 12:39 తర్వాత వాళ్లు ఈ కింది ద్వారాలు దాటారు: ఎఫ్రాయిము గుమ్మము, పురాతన గుమ్మము, మత్స్య గుమ్మము హనాన్యేలు శిఖరము, శతశిఖరము, గొర్రెల ద్వారం దాటి చివరకు కావలి ద్వారం దగ్గర ఆగారు.
NEH 12:40 అటు తర్వాత, ఆ గాయక బృందాలు రెండూ దేవుని ఆలయంలో తమ తమ స్థానాలకు చేరుకున్నాయి. నేను నా స్థానంలో నిలిచాను. అధికారుల్లో సగంమంది ఆలయంలో తమతమ స్థానాల్లో నిలబడ్డారు.
NEH 12:41 తర్వాత ఈ క్రింది యాజకులు ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయ, ఎల్యోయెనై, జెకర్యా, హనన్యా బూరలు పట్టుకుని తమతమ స్థానాల్లో నిలిచారు.
NEH 12:42 తర్వాత, మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజెరు అనే యాజకులు ఆలయంలో తమతమ స్థానాల్లో నిలబడ్డారు. అప్పుడు రెండు గాయక బృందాలూ ఇజ్రహాయా నాయకత్వాన పాడనారంభించాయి.
NEH 12:43 ఈ విధంగా, ఆ ప్రత్యేక దినాన యాజకులు చాలా బలులు అర్పించారు. ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా వున్నారు. దేవుడే వారందరినీ ఆనందపరవశుల్ని చేశాడు. చివరకు స్త్రీలు, పిల్లలు సైతం మహోత్సాహంతో, ఆనందంలో తేలియాడారు. దూర ప్రాంతాలవారు సైతం యెరూషలేము నుంచి వెలువడే ఆనంద కోలాహలాన్ని వినగలిగారు.
NEH 12:44 ఆ రోజున వస్తుపులను భద్రపరచు గదులలో భద్రపరచు కొందరిని నియమించారు. జనం తమ తొలికాపు ఫలాలను, పదోవంతు పంటలను తీసుకు వచ్చారు. వస్తువులను భద్రపరచువారు వాటిని వస్తువులను భద్రపరచు గదులలో పదిలపరిచారు. బాధ్యులుగా వున్న యాజకుల, లేవీయుల విషయంలో యూదా జనసామాన్యం చాలా తృప్తి చెందారు. అందుకని, వాళ్లు గిడ్డంగుల్లో పెట్టేందుకు చాలా వస్తువులు తెచ్చారు.
NEH 12:45 యాజకులూ, లేవీయులూ తమ దేవునిపట్ల భక్తిభావంతో ఈ పనులు చేశారు. వాళ్లు జనాన్ని పరిశుద్ధులను చేసే విధానాలు ఆచరించారు. గాయకులూ, ద్వారపాలకులూ తమ తమ విధులను నిర్వర్తించారు. దావీదూ, సొలొమోనూ ఆదేశించిన పనులన్నీ వాళ్లు చేశారు.
NEH 12:46 (ఎన్నడో పూర్వం, దావీదు కాలంలో, ఆసాపు ప్రధానుడుగా వున్నాడు. అతనికి చాలా స్తోత్రాలూ, దైవసంకీర్తనలూ తెలుసును.)
NEH 12:47 ఈ విధంగా, జెరుబ్బాబెలు, నెహెమ్యాల కాలంలో, ఇశ్రాయేలు ప్రజలందరూ గాయకుల, ద్వార పాలకుల సహాయార్థం ప్రతిరోజూ ఏదో ఒకటి ఇస్తూనే వుండేవారు. జనం కూడా తదితర లేవీయుల కోసం ఏదోఒకటి, ఎంతో కొంత కేటాయించేవారు. పోతే, లేవీయులు అహరోను వంశీకుల (యాజకుల) కోసం కొంత సొమ్ము కేటాయించేవారు.
NEH 13:1 ఆ రోజున మోషే గ్రంథం ప్రజలందరకీ వినిపించేలా బిగ్గరగా పఠింపబడింది. అమ్మోనీయుల్లోగాని, మెయాబీయుల్లోగాని ఏ ఒక్కరూ దేవుని ప్రజల మధ్య ఎల్లప్పుడు ఉండుటకు అనుమతింప బడరన్న నిబంధన మెషే గ్రంథంలో వ్రాసి వుందన్న విషయం జనం గ్రహించారు.
NEH 13:2 ఇశ్రాయేలీయులకి వాళ్లు ఆహారంగాని, నీరుగాని ఇవ్వలేదు. అందుకే ఈ నిబంధన లిఖించబడింది. పైగా ఇశ్రాయేలీయులకు శాపం ఇచ్చేందుకు బిలాముకు డబ్బు కూడా చెల్లించారు. కాని దేవుడు ఆ శాపాన్ని తిప్పికొట్టి, దాన్ని మనకొక వరంగా చేశాడు.
NEH 13:3 ఇశ్రాయేలు ప్రజలు ఆ నిబంధనను విన్నారు. వాళ్లు దాన్ని పాటించారు. విదేశీయుల సంతానాల నుంచి వాళ్లు తమని తాము వేరుజేసుకున్నారు.
NEH 13:4 అయితే, ఇది జరిగేందుకు ముందు, ఎల్వాషీబు టొబీయాకి ఆలయంలో ఒక గది ఇచ్చాడు ఎల్వాషీబు దేవుని ఆలంయంలో వస్తువులను భద్రపరచే గదులకు బాధ్యుడైన యాజకుడు. ఎల్యాషీబు టోబీయాకి సన్నిహిత మిత్రుడు. ఆ గది ధాన్యార్పణలు ధూప సామగ్రి, ఆలయానికి చెందిన గిన్నెలు, వస్తుపులు దాచేందుకు ఉద్దేశింపబడింది. లేవీయులు, గాయకులు ద్వారపాలకుల కోసం పంట ధాన్యాల్లో పదోపంతు కొత్త ద్రాక్షారసం, నూనె కూడా ఆ గదిలోనే ఉంచారు. యాజకులకు వచ్చిన కానుకలను కూడా ఆ గదిలోనే ఉంచారు. కాని, ఎల్యాషీబు ఆ గదిని టోబీయాకి ఇచ్చాడు.
NEH 13:6 ఇదంతా జరుగుతున్నప్పుడు నేను యెరూషలేములో లేను. నేను బబులోనుకి రాజుగారిని కలిసేందుకు వెళ్లాను. అర్తహషస్త బబులోను రాజుగావున్న 32వ ఏట నేను బబులోనుకి వెళ్లాను. తర్వాత, నేనా రాజుగారిని యెరూషలేముకి తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాను.
NEH 13:7 అలా నేను యెరూషలేముకి తిరిగి వచ్చాను. యెరూషలేములో ఎల్యాషీబు చేసిన విచారకరమైన విషయం నేను విన్నాను. ఎల్యాషీబు టోబీయాకి మన దేవుని ఆలయంలో ఒక గది యిచ్చాడు!
NEH 13:8 ఎల్యాషీబు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది. కనుక నేను టోబీయా వస్తువులన్నీ గది బయటికి విసిరేశాను.
NEH 13:9 ఆ గదులను స్వచ్ఛంగా, పరిశుభ్రం చేయాలని ఆజ్ఞనిచ్చాను. తర్వాత నేను గిన్నెలను, వస్తుపులను, ధాన్యాం కానుకలను, ధూప సామగ్రిని తిరిగి ఆ గదుల్లో పెట్టించాను.
NEH 13:10 లేవీయులకి వాళ్ల వంతులను జనం ఇవ్వలేదని కూడా నేను విన్నాను. దానితో లేవీయులూ, గాయకులూ తమ సొంత పొలాల్లో పని చేసుకునేందుకు తిరిగి వెళ్లిపోయారు.
NEH 13:11 అందుకని, నేనా అధికారులకు వాళ్లు చేసింది తప్పని చెప్పాను. “మీరు దేవుని ఆలయం విషయంలో తగిన శ్రద్ధ ఎందుకు తీసుకోలేదు?” అని నేను వాళ్లని నిలదీశాను. తర్వాత, లేవీయులందర్నీ నేను సమావేశపరచాను. నేను వాళ్లకి తమ తమ స్థానాలకి, ఆలయంలో కొలువులకి తిరిగి రమ్మని చెప్పాను.
NEH 13:12 తర్వాత, యూదాలోని వాళ్లందరూ ఆలయంలో తమ ధాన్యంలో పదోవంతును, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెని సమర్పించారు. ఆ వసువులు వస్తువులను భద్రపరచు గదుల్లో ఉంచబడ్డాయి.
NEH 13:13 ఆ గిడ్డంగులకి నేనీ క్రింది వారిని భద్రపరచు వారుగా నియమించాను: యాజకుడు షెలెమ్యా, ఉపదేశకుడు సాదోకు, లేవీయుడు పెదయా. వారికి సహాయకుడుగా హానానును నియమించాను. హానాను జక్కూరు కొడుకు, మత్తన్యా మనుమడు. వీళ్లు విశ్వాసపాత్రులన్న విషయం నాకు తెలుసు. వాళ్లు తమ బంధువులకు ఆయా వస్తువులు అందచేసే విషయంలో బాధ్యులు.
NEH 13:14 దేవా, నేను చేసిన ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుపెట్టుకో, నా దేవుని ఆలయ నిర్మాణంకోసం, దాని కొలువులకోసం నేను చిత్తశుద్ధితో నమ్మకంగా చేసినవన్నీ గుర్తంచుకో దేవా.
NEH 13:15 ఆ రోజుల్లో యూదాలో జనం సబ్బాతు (విశ్రాంతి) నాడు కూడా పనిచేయడం నేను గమనించాను. జనం ద్రాక్షాపళ్లు తొక్కి రసం తీయడం చూశాను. జనం ధాన్యం తీసుకురావడం, దాన్ని గాడిదలమీద మోపడం చూశాను. నగరంలో జ నం ద్రాక్షాను, అత్తిపళ్లను, రకరకాల వస్తువులను తీసుకు రావడం చూశాను. వాళ్లు సబ్బాతు (విశ్రాంతి) రోజున ఈ వస్తుపులన్నింటినీ యెరూషలేముకి తెస్తున్నారు. అందుకని, నేను వాళ్లకి ఈ విషయంలో హెచ్చరిక చేశాను. నేను వాళ్లకి సబ్బాతు రోజున ఆహారం అమ్మ కూడదని చెప్పాను.
NEH 13:16 తూరు నగరానికి చెందిన కొందరు యెరూషలేములో వున్నారు. వాళ్లు చేపలను, రకరకాల వస్తువులను యెరూషలేములోకి తెచ్చి, సబ్బాతు రోజున అమ్ముతున్నారు. యూదులు ఆ వస్తువులను కొంటున్నారు.
NEH 13:17 యూదాలోని ముఖ్యులకు వాళ్లు చేస్తున్నది పొర పాటని చెప్పాను. నేనా ముఖ్యులకి ఇలా చెప్పాను: “మీరు చాలా చెడ్డపని చేస్తున్నారు. మీరు సబ్బాతును నాశనం చేస్తున్నారు. మీరు సబ్బాతును అన్ని ఇతర రోజుల మాదిరిగా మారుస్తున్నారు.
NEH 13:18 మీ పూర్వీకులు కూడా సరిగ్గా ఈ పనులే చేశారన్న విషయం మీకు తెలుసు. అందుకే యెహోవా మనకీ, ఈ నగరానికీ, ఈ ఇబ్బందులూ, విపత్తులూ తెచ్చాడు. మీరు సరిగ్గా అవే పనులు చేస్తున్నారు. అందుకని, ఇలాంటి చెడుగులే ఇశ్రాయేలుకి మరిన్ని దాపురిస్తాయి. ఎందుకంటే, సబ్బాతు రోజు ముఖ్యమైనది కాదన్నట్లు దాన్ని మీరు నాశనం చేస్తున్నారు.”
NEH 13:19 అందుకని, నేనేమి చేశానంటే: ప్రతి శుక్రవారము సాయంత్రము (విశ్రాంతి దినానికి ముందు) చీకటి పడేందుకు సరిగ్గా ముందు, యెరూషలేము ద్వారాలను మూసేసి, తాళాలు బిగించమని ద్వార పాలకులను నేను ఆదేశీంచాను. ఆ తలుపులను సబ్బాతు రోజు ముగిసేదాకా తియ్యరాదు. ద్వారాల దగ్గర నా సొంత మనుషుల్లో కొందర్ని పెట్టాను. సబ్బాతు రోజున యెరూషలేము నగరంలోకి ఎట్టి పరిస్థితిల్లోనూ ఎలాంటి సరుకుల మూటలూ రాకుండా చూడమని నేను వాళ్లని కట్టడిచేశాను.
NEH 13:20 ఒకటి రెండు సార్లు వ్యాపారస్తులూ, చిల్లిర వర్తకులూ రాత్రి పూట యెరూషలేము ప్రాకారం వెలుపల గడపవలసివచ్చింది.
NEH 13:21 అయితే, నేనా వ్యాపారస్తుల్నీ చిల్లిర వర్తకుల్నీ, “రాత్రిపూట ద్వారం ముందర గడపవద్దు. మీరు మరోసారి అలా చేస్తే మిమ్మల్ని పట్టుకొంటాను” అని హెచ్చరించాను. దానితో, అప్పట్నుంచి వాళ్లు తమ సరుకులు అమ్ముకునేందుకు సబ్బాతు రోజున మళ్లీరాలేదు.
NEH 13:22 తర్వాత తమని తాము పరిశుద్ధుల్నీ చేసుకోమని నేను లేవీయుల్ని ఆదేశించాను. వాళ్లలా చెశాక, వాళ్లు పోయి, ద్వారాలను కావలి కాయాలి. సబ్బాతు రోజును ఒక పవిత్ర దినంగా వుంచేందుకు గాను ఇవన్నీ చేశాను. ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో దేవా. నామీద దయవుంచి, ఘనమైన నీ ప్రేమా, దయ నామీద ప్రసరింపచెయ్యి.
NEH 13:23 ఆ రోజుల్లో కొందరు యూదులు అష్టోదు, అమ్మోను, మోయాబు దేశాలకు చెందిన స్త్రీలను పెళ్లి చేసుకున్న విషయం కూడా నేను గమనించాను.
NEH 13:24 ఆ వివాహాల ఫలితంగా పుట్టిన పిల్లల్లో సగం ముందికి యూదా భాషలో మాట్లాడటం చేతకాదు. ఆ పిల్లలు అష్డోదు, అమ్మోను లేక మోయాబు భాష మాట్లడేవారు.
NEH 13:25 అందుకని, వాళ్లు పొరపాటు చేస్తున్నారని నేను వాళ్లకి చెప్పాను. నేను వాళ్లని శపించాను. వాళ్లలో నేను కొందర్ని కొట్టాను కూడా. కొందర్ని జుట్టు పట్టుకొని గుంజాను. వాళ్లచేత నేను బలవంతాన దేవుని సాక్షిగా ప్రమాణం చేయించాను. నేను వాళ్లకి ఇలా చెప్పాను: “మీరు వాళ్ల అమ్మాయిల్ని పెళ్లి చేసుకో కూడదు. ఆ విదేశీయుల కూతుళ్లని మీ అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా చూడండి. అలాగే, మీ అమ్మాయిలు ఆ విదేశీయుల కొడుకుల్ని పెళ్లిచేసుకోకుండా చూడండి.
NEH 13:26 ఇలాంటి పెళ్లిళ్లు సొలొమోను లాంటివాడు సైతం పాపం చేసేందుకు కారణభూతమయ్యాయని మీకు తెలుసు. ఎన్నెన్నో దేశాల్లో సొలొమోనంతటి గొప్ప రాజు లేడు. సొలొమెను దేవుని ప్రేమ పొందినవాడు. దేవుడు సొలొమోనును ఇశ్రాయేలు దేశమంతటికీ రాజును చేశాడు. అలాంటి సొలొమోను సైతం విదేశీ స్త్రీల మూలంగా పాపం చేయవలసి వచ్చింది.
NEH 13:27 మరి ఇప్పుడు మీరు కూడా అలాంటి ఘోర పాపమే చేస్తున్నట్లు వింటున్నాం. మీరు దేవునిపట్ల నమ్మకంగా వ్యవహరించడం లేదు. మీరు విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు.”
NEH 13:28 యోయూదా ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కొడుకు. యోయూదా కొడుకుల్లో ఒకడు హోనానువాసి అయిన సన్బల్లటుకి అల్లుడు. నేను అతని చోటు విడిచిపెట్టేలా చేశాను. నేనతను పారిపోయేలా కట్టడిచేశాను.
NEH 13:29 ఓ నా దేవా, నువ్వు వాళ్లని శిక్షించు. వాళ్లు యాజకత్వాన్ని అపవిత్రం చేశారు. అదేదో అంత ముఖ్యం కాదన్నట్లు వాళ్లు వ్యవహరించారు. యాజకులతోనూ, లేవీయులతోనూ నువ్వు చేసుకున్న ఒడంబడికను వాళ్లు పాటించలేదు.
NEH 13:30 అందుకని నేనా యాజకులనూ, లేవియులనూ శుచులనుగా, పరిశుద్ధులనుగా చేశాను. నేను విదేశీయులందర్నీ, వాళ్లు నేర్పిన వింత విషయాల్నీ తోలగించాను. నేను లేవీయులకీ, యాజకులకీ వాళ్ల అసలైన సొంత విధులనూ, బాధ్యతలనూ అప్పగించాను.
NEH 13:31 జనం కట్టెల కానుకలనూ, తొలి ఫలాలనూ సరైన సమయాల్లో పట్టుకు వచ్చేలా చూశాను. ఓ నా దేవా, నేను చేసిన ఈ మంచి పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో.
EST 1:1 అహష్వేరోషు రాజ్యపాలన కాలంలో జరిగిన సంఘటన యిది. అహష్వేరోషు భారత దేశంనుంచి కూషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలతో కూడిన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.
EST 1:2 అహష్వేరోషు తన రాజధాని నగరమైన షూషనులో సింహాసనాధిష్ఠుతుడై, తన పాలన సాగించాడు.
EST 1:3 అహష్వేరోషు తన రాజ్యపాలను మూడేళ్లు నిండిన సందర్భంగా అధికారులకూ, నాయకులకూ విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకి పారసీక దేశమంతటినుంచి, మాదియా దేశం నుంచి సేనానులూ, ప్రముఖ నాయకులూ హాజరయ్యారు. ఆ విందు నూట ఎనభై రోజులు కొనసాగింది.
EST 1:4 ఆ విందుసాగిన అన్ని రోజులూ అహష్వేరోషు రాజు తన రాజ్యంలోని గొప్ప సంపదను ప్రదర్శించాడు. రాజభవనపు అందాలనూ, ఐశ్వర్యాన్నీ ప్రదర్శిస్తూ వచ్చాడు.
EST 1:5 ఆ నూట ఎనభై రోజుల విందు ముగిశాక అహహ్వేరోషు మరో విందు ఏర్పాటు చేశాడు. అది వారం రోజులపాటు కొనసాగింది. ఆ విందు రాజనగరులోని తోటలో జరిగింది. ఆ విందుకి రాజధాని నగరమైన షూషనులోని ప్రజలందరినీ, అత్యంత ముఖ్యులు మొదలుకొని అత్యల్పులను కూడా ఆహ్వానించాడు.
EST 1:6 ఆ లోపలి తోట చుట్టూ తెలుపు, నీలి తెరలు వేలాడదీ యబడ్డాయి. అవి చలువరాతి స్తంభాలకు, తాపిన వెండి కమ్ములకు అవిసెనార, నూలు తాళ్లతో బిగించ బడ్డాయి. అక్కడ ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు మొదలైన రంగుల విలువైన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి, బంగారాలతో చేసిన పడకలు వున్నాయి.
EST 1:7 అతిథులకు ద్రాక్షాసారా బంగారు పాత్రల్లో అందించ బడింది. చిత్రమేమిటంటే, ఆ పాత్రల్లో ఒకదాన్ని పోలినది మరొకటి లేదు! చక్రవర్తి బాగా ఔదార్యవంతు డేమో, ద్రాక్షాసారాయానికి కొదువ లేకపోయింది.
EST 1:8 చక్రవర్తి ఆజ్ఞమేరకు ద్రాక్షాసారా వడ్డించేవాడు వ్రతి ఒక్క అతిథికీ అతను కోరినంత సారాపోశాడు.
EST 1:9 మహారాణి వష్తి కూడా స్త్రీలకు రాజభవనంలో విందుచేసింది.
EST 1:10 ఆ విందు ఏడవ రోజున చక్రవర్తి అహష్వేరోషు ద్రాక్షారసము ఎక్కువగా సేవించాడు. మంచి మత్తులో వున్న మహారాజు తనను సేవించిన ఏడు మంది సేవకులైన మెహోమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే నపుంసకులకు మహారాణికి కిరీటం ధరింపజేసి, తన ఎదుటకు తీసుకు రావాలని ఆజ్ఞాపించాడు. మహారాణి వష్తి మహా సౌందర్యవతి. ఆమె సౌందర్యాన్ని అధికారులకూ, ప్రముఖులకూ ప్రదర్శించి మెప్పు పొందాలన్నది అతని సంకల్పం.
EST 1:12 ఆ సేవకులు మహారాణికి మహారాజు ఆజ్ఞను విన్నవించారు. కాని, ఆమె అందరి ముందుకు వెళ్లేందుకు నిరాకరించింది. మహారాజుకు అధికంగా కోపం వచ్చింది.
EST 1:13 న్యాయ చట్టం గురించీ, శిక్షలను గురించి నిపుణుల సలహాలు అడగటం మహారాజుకి పరిపాటి. అందుకని, న్యాయనిపుణులైన తన సలహాదారులతో మహారాజు సంప్రదించాడు. మహా రాజుకి సన్నిహితులైన ఆ సలహాదారుల పేర్లు: కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెను, మర్సెనా, మెమూకాను. ఈ యేడుగురూ పారశీక, మాదీయ దేశాల ప్రముఖులు. మహారాజును దర్శించేందుకు ప్రత్యేకమైన అనుమతులు కలిగినవాళ్లు. సామ్రాజ్యంలో అత్యున్నతమైన అధికారులు.
EST 1:15 మహారాజు వాళ్లని ఇలా ప్రశ్నించాడు: “మహారాజుతన నపుంసకుల ద్వరా వష్తి మహారాణికి ఒక ఆజ్ఞ పంపాడు. కాని, ఆమె రాజాజ్ఞను మన్నించలేదు. న్యాయచట్టం ప్రకారం ఆమెపైన ఎలాంటి చర్య తీసుకోవాలి?”
EST 1:16 అప్పుడు మెమూకాను యితర అధికారులు వింటూండగా మహారాజుకి ఇలా సమాధానమిచ్చాడు: “మహారాణి వష్తి చేసినది నేరం. ఆమె మహారాజు అహష్వేరోషు పట్లనే కాక రాజ్యములోని ఆయన సంస్థా నములన్నిటిలోనుండు అధికారుల పట్ల, ప్రముఖుల పట్ల కూడా నేరం చేసింది.
EST 1:17 నేని విషయం ఎందుకు చెప్తున్నానంటే, మహారాణి వష్తి చేసిన యీ ఆజ్ఞోల్లంఘనాన్ని గురించి మిగిలిన స్త్రీలందరూ వింటారు. అప్పుడింక యితర స్త్రీలు కూడా తమ భర్తల పట్ల విధేయత చూపడం మానేస్తారు. వాళ్లు తమ భర్తలతో ఇలా వాదిస్తారు: ‘అహష్వేరోషు మహారాజు వష్తి మహారాణిని రమ్మని ఆజ్ఞాపించారు. కాని, ఆమె వచ్చేందుకు నిరాకరించింది కదా.’
EST 1:18 “పారశీక, మాదీయ నాయకుల భార్యలు ఈనాడు మహారాణి చేసినదాన్ని గురించి విన్నారు. ఆమె చేసిన పనిచేత వాళ్లు ప్రభావితులవుతారు. ఆ స్త్రీలు కూడా మహారాజుగారి ప్రముఖుల పట్ల అలాగే వ్యవహరిస్తారు. దానితో అవిధేయతా, కోపతాపాలూ రెచ్చిపోతాయి.
EST 1:19 “మహారాజు సమ్మతిస్తే, నాదొక సూచన, మహారాజా, మీరు ఒక శాసనం జారీచెయ్యాలి. దాన్ని పారశీక, మాదీయ రాజ్యాల న్యాయచట్టాల్లో నమోదు చేయించాలి. అప్పుడిక పారశీక, మాదియ న్యాయచట్టాలను మార్చడం సాధ్యంకాదు. వష్తి అహష్వేరోషు మహారాజు సమక్షంలోకి యిక ఎన్నడూ రాకూడదు. అంతెకాదు, మహారాజు ఆమె (రాణి) పట్టమహిషిత్వ స్థానాన్ని ఆమెకంటె మెరుగైన స్త్రీకి ఇవ్వాలి.
EST 1:20 మహారాజు ఆజ్ఞ ఆయన సువిశాల సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లోనూ చాటింపబడినాక, స్త్రీలందరూ తమ భర్తలను గౌరవిస్తారు. అప్పుడిక అల్పుల దగ్గర్నుంచి అధికులదాకా స్త్రీలందరూ తమతమ భర్తల్ని గౌరవిస్తారు.”
EST 1:21 మహారాజుకి, ఆయన ముఖ్యాధికారులకీ యీ సలహా నచ్చింది. దానితో అహష్వేరోషు మహారాజు మెమూకాను చేసిన యీ సూచనను శాసనం చేశాడు.
EST 1:22 అహష్వేరోషు తన సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాలకీ, ఆయా ప్రాంతీయ భాషల్లో, యీ తాఖీదును పంసాడు. ఆ తాఖీదుల మేరకు, ప్రతి పురుషుడూ తన కుటుంబానికి యజమానిగా ప్రకటింపబడ్డాడు.
EST 2:1 దరిమిలా కొంత కాలానికి, అహష్వేరోషు మహారాజు కోపం చల్లారింది. అప్పుడాయనకి వష్తీ, ఆమె చేసిన పని, తను జారీచేసిన ఆజ్ఞలు జ్ఞాప్తికి వచ్చాయి.
EST 2:2 అప్పుడు మహారాజు ఆంతరంగిక సేవకులు ఒక సూచన చేశారు, “మహారాజుగారి కోసం అందమైన కన్యల అన్వేషణ జరపాలి.
EST 2:3 మహారాజు తన సామ్రాజ్యం లోని ప్రతి సామంత రాజ్యంలోనూ ఒక్కొక్క నాయకుణ్ణి ఎంపిక చేసుకో వాలి. ఆ నాయకులు అందమైన ప్రతి ఒక్క కన్యనూ రాజధాని నగరమైన షూషనుకి తీసుకురావాలి. ఆ కన్యలను మహారాజుగారి అంతఃపుర స్త్రీల బృందంలో వుంచాలి. ఆ కన్యలు అంతఃపుర స్త్రీలను అదుసాజ్ఞల్లో పుంచే హేగే కొజ్జా అధీనంలోవుంటారు. వాళ్లందరికీ సౌందర్య పోషక క్రియలు జరపాలి.
EST 2:4 అటు తర్వాత వీళ్లలో మహారాజుకి నచ్చిన కన్యను వష్తి స్థానంలో కొత్త మహారాణిని చేయాలి.” ఈ సలహా మహారాజుకి నచ్చింది. ఆయన దాన్ని ఆమోదించాడు.
EST 2:5 రాజధాని నగరం షూషనులో బెన్యామీను గోత్రానికి చెందిన మొర్దెకై అనే ఒక యూదుడు వున్నాడు. మొర్దెకై తండ్రి యాయీరు. యాయీరు తండ్రి కీషు.
EST 2:6 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను బందీగా పట్టుకొన్నాడు యెరూషలేము నుంచి చెరపట్ట బడినవారిలో మొర్దెకై కూడా ఒకడు.
EST 2:7 హదస్సా అనే ఒక అమ్మాయి వుంది. ఆమె మొర్దెకైకి పినతండ్రి కూతురు. ఆమె తల్లితండ్రులు మరణించినప్పుడు, మొర్దకై ఆమెని చేరదీసి, తన సొంత కూతురులా పెంచి పోషించాడు. హదస్సాకి ఎస్తేరు అనే పేరుకూడా వుంది. ఎస్తేరు అందమైన రూపమును సుందర ముఖమును గలదై యుండెను.
EST 2:8 మహారాజుయొక్క ఆజ్ఞ ప్రకటింపబడిన మీదట చాలామంది కన్యలు రాజధాని అయిన షూషను నగరా నికి తరలింపబడ్డారు. వాళ్లందరూ హేగే కొజ్జా అధీనంలో ఉంచబడ్డారు. ఆ యువతుల్లో ఎస్తేరు ఒకతె. ఎస్తేరును రాజభవనానికి తీసుకుపోయి, మిగిలిన అంతఃపుర స్త్రీలతో బాటు హేగే అధీనంలో ఉంచారు.
EST 2:9 ఎస్తేరు హేగేకి నచ్చింది. ఆమె అతనికి అభిమాన ప్రాత్రురాలైంది. దానితో హేగే ఆమెకి సౌందర్యవర్థక పక్రియను త్వరలో పూర్తిచేసి, ఆమెకి ప్రత్యేకమైన భోజన పదార్థాలను సమకూర్చాడు. అప్పుడిక హేగే ఎస్తేరుకీ, ఆమె ఏడుగురు పరిచారికలకీ అంతఃపుర స్త్రీలు నివసించే అతి శ్రేష్ఠమైన స్థలంలో నివాసం ఏర్పాటు చేశాడు.
EST 2:10 తను యూదురాలనన్న విషయాన్ని ఎస్తేరు ఎప్వరికీ చెప్పలేదు. మొర్దెకై వద్దన్నందున ఆమె తన కుటుంబ వివరాలేవీ ఎవ్వరికి తెలియ జెప్పలేదు.
EST 2:11 ఎస్తేరు ఎలాగుందో, ఆమె విషయంలో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకోసం మొర్దెకై ప్రతి రోజూ అంతఃపుర ఆవరణ ముందు అటు ఇటు తిరుగులాడు తుండేవాడు.
EST 2:12 ఎవరైనా ఒక యువతి అహష్వేరోషు మహారాజు సన్నిధానానికి తీసుకుపోబడేందుకు ముందు ఆమె చేయవలసిన పనులు యివి: ఆమె తన పన్నెండు మాసాల సౌందర్యవర్ధక పక్రియను వూర్తి చేయాలి. అంటే, ఆమె ఆరునెలలు పాటు గోపరస తైలాన్ని వాడి, తదుపరి ఆరునెలలు పరిమళ ద్రవ్యాలను, భిన్న భిన్న మైన అలంకరణ సామగ్రులను వాడాలి.
EST 2:13 మహారాజు సముఖానికి తీసుకు వోబడేందుకు ఇదీ పద్దతి. ఆ అమ్మాయికి ఏది కావాలన్నా అంతఃపురం నుంచి ఇవ్వ బడుతుంది.
EST 2:14 ఆ యువతి రాజ భవనానికి సాయంత్రంవూట చేరుకుంటుంది. ఆ మరుసటి ఉదయం ఆమె అంతఃవుర స్త్రీలు నివసించే మరో చోటికి తిరిగి వెళ్తుంది. అప్పుడామె అక్కడ షయష్గజు అనే కొజ్జా అజమాయిషీలో ఉంచబడుతుంది. షయష్గజు కొజ్జా మహారాజు ఉంపుడుగతైల పర్య వేక్షకుడు. మహారాజుకు ఆమెపట్ల ప్రేమ కలిగినప్పుడేగాని ఆ యువతి ఆయన దగ్గరకు వెళ్లరాదు. అప్పుడాయన ఆమెను పేరుపెట్టి తిరిగి తనవద్దకు రమ్మని పిలుస్తాడు.
EST 2:15 ఎస్తేరుకి మహారాజు వద్దకు వెళ్లే వంతు వచ్చి నప్పుడు, ఆమె ఏమీ కావాలని కోరలేదు. అంతఃపుర పర్యవేక్షకుడైన హేగే తనకేమి సూచించాడో అవే తీసుకుంది. (ఎస్తేరు మొర్దెకై పెంపుడు కూతురు, అతని పినతండ్రి అబీహాయిలు కూతురు). ఎస్తేరును చూసిన ప్రతి ఒక్కరికీ ఆమె నచ్చింది.
EST 2:16 చివరికి ఎస్తేరు రాజ భవనంలో మహారాజు సముఖానికి తీసుకెళ్లబడింది. అది సరిగ్గా టెబేతు అనబడే పదోనెల, అహష్వేరోషు పాలనలో ఏడవ సంవత్సరం.
EST 2:17 మహారాజు యువతులందరిలోకీ ఎస్తేరును బాగా ప్రేమించాడు. మిగిలిన కన్యలందరి కంటె ఆమె, ఆయన దయ, అభిమానాలను పొందింది. అందుకని మహారాజు స్వయంగా ఆమె శిరస్సుపై కిరీటం వుంచి, వష్తి స్థానంలో ఆమెను మహారాణిని చేశాడు.
EST 2:18 మహారాజు ఎస్తేరు గౌరవార్థం తన సామంతులకూ, అధికారులకూ పెద్ద విందు చేశాడు. అన్ని సామంత రాజ్యాల్యోనూ ఆ రోజును ఆయన సెలవు దినంగా ప్రకటించాడు. ఉదారవంతుడైన ఆ మహారాజు జనానికి బహుమతులు పంపాడు.
EST 2:19 రెండవసారి యువతులందరూ ఒకటోట చేర్చ బడినప్పుడు మొర్దెకై మహారాజు భవన ద్వరంవద్దనే కూర్చుని పున్నాడు.
EST 2:20 తను యూదురాలనన్న విషయాన్ని ఎస్తేరు యింకా గువ్తంగానే పుంచింది. తన కుటుంబ గోత్రాలను గూరించి ఆమె ఎవ్వరికీ చెప్పలేదు. అది ఆమెకు మొర్దెకై ఇచ్చిన ఆజ్ఞ. తను మొర్దెకై పెంపకంలో ఉన్నప్పటి మాదిరిగానే, యింకా ఆమె అతని ఆజ్ఞలను పాటిస్తోంది.
EST 2:21 మొర్దెకై మహారాజు భవన ద్వారం దగ్గర కూర్చున్న సమయంలో జరిగిన విషయం ఇది: బిగ్తాను, తెరెషు అనే యిద్దరు రాజభవన ద్వార పాలకులు మహారాజువట్ల కుపితులై అహష్వేరోషు మహారాజును హతమార్చాలని కుట్ర పన్నుతున్నారు.
EST 2:22 అయితే, మొర్దకై ఈ కుట్ర వథకాలను కనిపెట్టి ఎస్తేరు మహారాణికీ ఈ విషయం చెప్పాడు. అప్పుడి విషయాన్ని ఆమె మహారాజుకి యెప్పింది. ఈ కుట్రను గురించి తెలుసుకున్నది మెర్దెకై అని కూడా ఆమె మహారాజుకు చెప్పింది.
EST 2:23 తర్వాత ఆ విషయమై విచారణ చేయబడింది. విచారణలో మొర్దెకై చెప్పిన సమాచారం సరైనదేనని తేలింది. మహారాజుము హత్యచేయాలని దుష్ట వథకం వేసిన ద్వారపాలకులిద్దరూ ఉరితీయ బడ్డారు. మహా రాజు సమక్షంలోనే యీ విషయాలన్నీ మహారాజుల చరిత్ర విశేషాల గ్రంథంలో నమోదు చేయ బడ్డాయి.
EST 3:1 ఈ సంఘటనల తర్వాత అహష్వేరోషు మహారాజు హామానుకు గౌరవనీయ స్థానం ఇచ్చాడు. అగాగీయుడైన హామాను హమ్మెదాతా కొడుకు. మహారాజు హామానుకు ఉన్నత పదవి ఇచ్చి, అతన్ని మిగిలిన అధికారులందరికంటె ఉన్నత స్థానంతో ఉంచాడు.
EST 3:2 రాజభవన ద్వారం దగ్గరవుండే అధికారులందరూ హామానుకు మోకరిల్లి, నమస్కరించాలని మహారాజు ఆజ్ఞ జారీచేశాడు. అధికారులందరూ ఈ ఆజ్ఞను పాటించేవారు. అయితే, మొర్దెకై మాత్రం మోకరిల్లేందుకూ, గౌరవాభివందనం చేసేందుకూ నిరాకరించాడు.
EST 3:3 అప్పుడు ద్వారం దగ్గరి ఉద్యోగులు మొర్దెకైని “హామాను ముందు మోకరిల్లాలన్న మహారాజు ఆజ్ఞను నువ్వెందుకు పాటించడర లేదు?” అని ప్రశ్నించారు.
EST 3:4 ఆ రాజోద్యోగులు ప్రతిరోజూ మొర్దెకైతో ఈ విషయమై ప్రస్తావించేవారు. అయితే, హామాను ముందు మోకరిల్లాలన్న ఆజ్ఞను పాటించేందుకు మొర్దెకై తిరస్కరిస్తూ వచ్చాడు. దానితో, ఆ ఉద్యోగులు ఈ విషయాన్ని హామానుకు తెలియ జెప్పారు. మొర్దెకై విషయంలో హామాను ఏమి చేస్తాడో చూద్దా మనుకున్నారు. తను యూదుడనన్న విషయాన్ని మొర్దకై ఆ ఉద్యోగులకు చెప్పాడు.
EST 3:5 మొర్దెకై తన ముందు మోకరిల్లి, గౌరవాభివందనం చేసేందుకు నిరాకరించాడని విన్న హామాను చాలా కోపం చెందాడు.
EST 3:6 మొర్దెకై యూదూడు అన్న విషయం హామానుకు తెలిసింది.అయితే, ఒక్క మొర్దెకైని మాత్రమే చంపడం అతనికి తృప్తికరంగా కనిపించలేదు. మొర్దెకై జాతీయులందర్మీ, అంటే, అహష్వేరోషు సామ్రాజ్యంలోని రాజ్యాలన్నింట్లో గల యూదులందర్నీ సమూలంగా నాశనం చేసే మార్గం ెవెదక నారంభించాడు.
EST 3:7 మహారాజు అహష్వేరోషు పాలనలో పన్నెండవ సంవత్సరం, నీసాను అనబడే మొదటి నెలలో హామానుతన కార్యక్రమానికి మంచి రోజును, నెలను ఎంచు కొనేందుకు చీటీలు వేశాడు. (ఆ రోజుల్లో ఈ చీటీలను “పూరు” అనేవారు). దాంట్లో అదారు అనబడే పన్నెండవ నెల ఎన్నిక చేయబడింది.
EST 3:8 అప్పుడిక హామాను అహష్వేరోషు మహారాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు: “మహారాజా, మీ సామ్రాజ్యంలోని అన్ని సామంత రాజ్యాల్లోనూ చెదురుమదురుగా ఒక జాతివాళ్లు వున్నారు. వాళ్లు ఆ దేశాల ప్రజలతో కలిసివుండక వేరుగా వుంటారు. వాళ్ల ఆచార సంప్రదాయాలు మిగిలిన ప్రజలవాటికి భిన్నమైనవి. వాళ్లు మహారాజు శాసనాలను పాటించరు. వాళ్లను మీ సామ్రాజ్యంలో ఉండనివ్యడం క్షేమ దాయకం కాదు.
EST 3:9 “మహారాజు మన్నిస్తే నాదొక సలహా. ఆ జాతి ప్రజలను హతమార్చేందుకు ఆజ్ఞ జారీ చెయ్యండి. ఇందుకయ్యే ఖర్చుకుగాను నేను 10,000 వెండి నాణ్యాలు రాజ్య ఖజానాలో జమకడతాను. ఈ కార్య క్రమాన్ని నిర్వహించేవారికి వేతనాలు చెల్లిం చేందుకు ఈ మొత్తాన్ని వినియోగించవచ్చు.”
EST 3:10 మహారాజు రాజముద్రిక ఉన్న ఉంగరాన్ని తీసి హామానుకి ఇచ్చాడు. హామాను అగాగీయుడైన హమ్మెదాతా కొడుకు. హామాను యూదులకు బద్ధ శత్రువు.
EST 3:11 మహారాజు హామానుతో ఇలా అన్నాడు, “ఆ సొమ్ము నీ దగ్గరే వుంచుకో. ఆ జాతివాళ్ల విషయంలో నువ్వేమి చెయ్యదలచుకున్నావో చెయ్యి.”
EST 3:12 అటు తర్వాత మొదటి నెల 13వ రోజున మహారాజుగారి లేఖకులు పిలువనంపబడ్డారు. వాళ్లు హామాను ఆజ్ఞలన్నింటినీ ఒక్కొక్క దేశపు భాషాలిపిలో వ్రాశారు. వాళ్లు వాటిని ఆయా ప్రజాబృందాల భాషల్లో వ్రాశారు. వాళ్లు మహారాజు సామంతులకు, ఆయా ప్రాంతాల పాలకులకు ఆ తాఖీదులు పంపారు. వాళ్లు ఆ తాఖీదులను మహారాజు పేరిట, మహారాజు మొద్రికతో పంపారు.
EST 3:13 వార్తాహరులు ఆయా సామంత దేశాలకు యీ తాఖీదు పత్రాలను తీసుకెళ్లారు. యూదులందర్నీ చంపి వేయాలి, ఆ జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయాలి, యిదీ మహారాజు ఆజ్ఞ. అంటే, యూదులందరూ పిల్లపాపలూ, యువతీ యువకులూ, ముసలి, వయస్సులో వున్నవాళ్లు, వయస్సు మళ్లినవాళ్లు, ఒక్కరోజులో హతమార్చ బడాలన్నమాట. ఆ రోజు అదారు అనబడే 12వ నెలలో 13వ రోజు అవుతుంది. ఆ ఆజ్ఞలో మరో అంశం యూదులకు చెందిన వస్తువులన్నింటినీ తీసేసు కోవడం ఈలాగున ఆ తాఖీదు పత్రాలలో వ్రాయబడియున్నది.
EST 3:14 ఆ ఆజ్ఞల ప్రతులు రాజశాసనంగా అందరికీ పంపబడ్డాయి. ఈ తాఖీదును అన్ని సామంత రాజ్యాల్లోనూ శాసనంగా చెల్లుబడి చెయ్యాలి, దాన్ని సామ్రాజ్యంలో అన్ని జాతుల ప్రజలకీ ప్రకటించాలి.
EST 3:15 రాజాజ్ఞ మేరకు వార్తాహరులు హుటాహుటిగా బయల్దేరారు. రాజధాని నగరం షూషనులో కూడా యీ తాఖీదు ప్రతులు పంచబడ్డాయి. మహారాజూ, హామానూ మద్యం సేవిస్తూ కూర్చుండగా, అటు షూషను నగరం గందరగోళంలో మునిగిపోయింది.
EST 4:1 మొర్దకై జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. యూదులకు వ్యతిరేకంగా మహారాజు ఆజ్ఞలను గురించి విన్న మొర్దెకై తన బట్టలు చింపుకొని, తన నెత్తిమీద బూడిద పోసుకొని, విషాడ సూచకమైన దుస్తులు ధరించి, నగరంలోకి పోయిగట్టిగా ఏడ్వ నారంభించాడు.
EST 4:2 కాని, మొర్దెకై రాజభవన ద్వారం వరకు మాత్రమే పోగలిగాడు. అయితే, విషాద సూచక దుస్తులు ధరించిన వారెవరూ ఆ ద్వారంతో ప్రవేశించేందుకు అనుమతింపబడరు.
EST 4:3 రాజాజ్ఞ చేరిన ప్రతి సామంత రాజ్యంలోనూ యూదుల్లో విచారం అలుముకొంది. ఏడ్పులు చెలరేగాయి. వాళ్లు శోకాలు పెడుతూ, ఉపవాసాలుండసాగారు. చాలామంది యూదులు నెత్తిన బూడిద పోసుకొని, సంతాప సూచక దుస్తులు వేసుకొని నేలమీద పడి వున్నారు.
EST 4:4 ఎస్తేరు వరిచారికలు, కొజ్జాలు ఆమె దగ్గరికి వెళ్లి, ఆమెకి మొరైకై గురించి చెప్పారు. దానితో, ఎస్తేరు మహారాణి గాభరా చెందింది, బాగా విచారగ్రస్తి అయింది. విషాద సూచకమైన దుస్తులు వదలి, వాటి స్థానంలో వేసుకొనేందుకు మంచి దుస్తులు ఆమె మొర్దెకైకి పంపింది. కాని, అతను ఆ దుస్తులు ధరించేందుకు నిరాకరించాడు. హతాకు అనే కొజ్జా ఎస్తేరు ప్రధాన సేవకుడు. ఎస్తేరు అతన్ని మొర్దెకై వద్దకు పోయి అతన్ని కలవరపరుస్తున్నదేమిటో, దానికి కారణం ఏమిటో కనుక్కోమని పంపింది.
EST 4:6 రాజభవన ద్వారం ముందర నగరంలోని, ఖాళీ స్థలంలో వున్న మొర్దెకైని హతాకు పోయి కలిశాడు.
EST 4:7 అప్పుడు మొర్దెకై తన విషయంలో జరిగినదంతా హతాకుకి వివరించి చెప్పాడు. యూదులను హత మార్చేందుకు గాను రాజు గారి బొక్కసంలో సరిగ్గా ఎంత మొత్తం సొమ్ము జమ చేస్తానని హామాను వాగ్దానం చేశాడో చెప్పాడు.
EST 4:8 యూదులను చంపేయాలన్న మహారాజు ఆజ్ఞ ప్రతిని కూడా మొర్దెకై హతాకుకి ఇచ్చాడు. ఆ తాఖీదు షూషను నగరమంతటా ఎలా చాటబడిందో చెప్పాడు. ఆ ఆజ్ఞను ఎస్తేరుకి చూపించ మనీ, విషయాలన్నీ వివరించి చెప్పమనీ, మహారాజు దగ్గరికి పోయి, మొర్దెకైకీ, తన స్వజనానికీ, క్షమాభిక్షను అర్థించేలా ఎస్తేరును ప్రోత్సహించమని అతను హతాకుకి చెప్పాడు.
EST 4:9 హతాకు రాణివాసానికి తిరిగి వెళ్లి, మొర్దెకై తనకి చెప్పిన విషయాలన్నీ ఎస్తేరుకి చెప్పాడు.
EST 4:10 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఈ కింది మాటలు చెప్పమని హతాకును ఆజ్ఞాపించింది:
EST 4:11 “మొర్దెకై పిలువ నంపితేగాని స్త్రీగాని, పురుషుడుగాని మహారాజు సన్నిధికి వెళ్లడం నిషిద్ధం. అలా వెళ్లే వ్యక్తి మరణ శిక్షకి గురి అవుతాడు. మహారాజు సామంతులందరికీ, ఆయా సామంత దేశాల ప్రజలందరికీ యీ విషయం తెలుసు. ఆ వ్యక్తిని మహారాజు తన బంగారపు దండంతో అంటినప్పుడు మాత్రమే ఆ మరణ శిక్ష అమలు జరపబడదు. మహారాజు అలా చేస్తే, ఆ వ్యక్తి ప్రాణం నిలుస్తుంది. 30 రోజులుగా మహారాజుగారు నన్ను పిలువనంపలేదు. మరి నేనెలా వెళ్లాలి?”
EST 4:12 అలా ఎస్తేరు పంపిన సందేశానికి బదులుగా మొర్దెకై ఆమెకి ఇలా సమాధనం పంపాడు: “ఎస్తేరూ, నువ్వు రాజభవనంలో వున్నావు, అంతమాత్రాన, యూదులందరిలో నీకొక్కదానికే రక్షణ వుంటుందని భ్రమపడకు.
EST 4:14 ఒకవేళ నువ్విప్పుడు మౌనం వహిస్తే యూదులకు స్వేచ్ఛా సహాయాలు మరొక చోటునుంచి వస్తాయి. కాని నువ్వూ, నీ తండ్రి కుటుంబ సభ్యులూ అందరూ మరణిస్తారు. బహుశా నువ్వీ మహాత్కార్యం కోసమే మహారాణిగా ఈ సమయంలో ఎంచు కోబడ్డావేమో ఆలోచించుకో.”
EST 4:15 అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఈ క్రింది సమాధానం పంపింది: “మొర్దెకై! పోయి షూషను నగరంలోని యూదులందర్నీ కూడగట్టు, నా కోసం ఉపవాసం ఉండండి. నేను మూడు రాత్రులూ పగళ్లూ అన్నపానాలు విసర్జస్తాను. నేను నీలాగే ఉపవాస ముంటాను. అలాగే, నా పరిచారికలు కూడా ఉపవాసం పుంటారు. మా ఉపవాస దినం ముగిశాక, నేను మహారాజు సన్నిధికి వెళ్తాను, ఆయన నన్ను పిలువనంపక పోయినా సరే, వెళ్తాను. పిలుపు రాకుండా మహారాజు సమక్షానికి వెళ్లడం చట్టవిరుద్ధమని నాకు తెలుసు. అయినా సరే, నేను వెళ్తాను. నేను చనిపోతే చని పోతాను.”
EST 4:17 మొర్దెకై అక్కడ్నుంచి వెళ్లిపోయి, ఎస్తేరు చెయ్య మన్నట్లు చేశాడు.
EST 5:1 మూడవ రోజున ఎస్తేరు ప్రత్యేకమైన దుస్తులు ధరించి, రాజ నగరులోని, రాజభవన మెదుటవున్న లోపలి భవనములో నిలిచింది. మహారాజు అక్కడ సింహాసనం మీద కూర్చుని పున్నాడు. ఆయన న్యాయస్థానంలోకి జనం ప్రవేశించే దిశగా చూపు తిప్పి కూర్చున్నాడు.
EST 5:2 అప్పుడు ఆయన దృష్టి లోపలి ఆవరణలో నిలిచివున్న ఎస్తేరుపై పడింది. ఆమెను అక్కడ చూచినంతనే మహారాజు మనస్సు సంతోష భరితమైంది. ఆయన తన చేతిలోని బంగారు దండాన్ని ఆమె వైపు చాసాడు. ఎస్తేరు రాజు దర్బారు మందిరంలోకి పోయి బంగారు దండపు కొనని తాకింది.
EST 5:3 అప్పుడు మహారాజు ఎస్తేరుతో ఇలా అన్నాడు: “మహారాణి, ఏమిటి నీ దిగులు? నువ్వు నన్ను కోరాల నుకున్నదేమిటో కోరుకో, నువ్వేమి కోరుకున్నా, అర్ధ రాజ్యమైనా ఇచ్చేస్తాను.”
EST 5:4 ఎస్తేరు, “నేను తమకీ, హామానుకీ ఒక విందు ఏర్పాటు చేశాను. దయచేసి మీరూ, హామానూ యీ రోజు నా విందుకి రావాలని నా కోరిక” అని అడిగింది.
EST 5:5 అప్పుడు మహారాజు సేవకులకు, “మహారాణి ఎస్తేరు కోర్కెను మేము తీర్చాలి. వెంటనే పోయి, హామానును తొందరగా తీసుకురండి” అని ఆజ్ఞాపించాడు. ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకి మహారాజూ, హామానూ వెళ్లారు.
EST 5:6 వాళ్లు ద్రాక్షారసం సేవిస్తూండగా, మహారాజు ఎస్తేరును మళ్లీ ఇలా అడిగాడు: “ఎస్తేరూ, నువ్వేదైనా కోరుకో. అర్ధ రాజ్యమైనా సరే కోరుకో, నేను నీకిస్తాను.”
EST 5:7 అందుకు ఎస్తేరిలా సమాధానమిచ్చింది, “నేను మిమ్మల్ని కోరదలుచుకున్నది యిదీ మహారాజా!
EST 5:8 తమరికి నా మనవి అంగీకారమై, నేను కోరినది ఇవ్వాల నుకుంటే, రేపు నేనివ్వబోయే మరో విందుకి మీరూ, హామానూ తప్పక వేంచేయాలి. నా అసలు మనవి ఏమిటో నేను అప్పుడు విన్నవించుకుంటాను.”
EST 5:9 హామాను ఆ రోజున రాజభవనం నుంచి ఇంటికి మంచి హుషారుగా, మహానందంగా వెళ్లాడు. కాని, రాజ భవన ద్వారం దగ్గర మరల కనబడిన మొర్దెకై తనని చూసి కూడా లేచి, భయభక్తులతో తనకి నమస్కరించక పోయేసరికి హామానుకు తల కొట్టేసినట్లయింది. అతని కోపం మిన్నుముట్టింది.
EST 5:10 అయినా, హామాను తన కోపాన్ని అదువుచేసుకొని, ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ తన మిత్తులనూ, తన భార్య జెరెషునూ పిలిచి కూర్చోబెట్టి,
EST 5:11 తన ఐశ్వర్యం గురించి గొప్పలు చెప్పడం మొదలెట్టాడు. తనకి చాలా మంది కొడుకులున్నారనీ, మహారాజు తనని ఎన్నో విధాల గౌరవించాడనీ, మిగిలిన నాయకు లందరికంటె మహారాజు తనకి ఉన్నత స్థానమిచ్చాడనీ, చెప్పుకున్నాడు.
EST 5:12 హామాను యింకా ఇలా అన్నాడు, “అంతే ననుకున్నారేమో, కాదు.” “ఎస్తేరు మహారాణి తను యిచ్చిన విందుకి మహారాజుతోబాటు నన్నొక్కడినే ఆహ్వానించింది. రేపు తను యివ్వబోయే మరో విందుకి కూడా మహారాజురో బాటు నన్ను కూడా మహారాణి ఆహ్వానించింది.
EST 5:13 అయినా నాకివన్నీ ఏమంత పెద్దగా ఆనందం కలిగించే విషయాలు కావు. ఆ యూదుడైన మొర్దకై రాజభవన ద్వారం దగ్గర కూర్చొని ఉండటం ఎప్పటి వరకు నేను చూస్తూ ఉంటానో, అప్పటివరకు నేను నిజంగా సంతోషించలేను.”
EST 5:14 అప్పుడు హామాను భార్య జెరెషూ, అతని మిత్రులందరూ ఇలా సలహా యిచ్చారు: “మొర్దెకైని ఉరితీసేందుకుగాను ఒక స్తంభం పాతుమని ఎవరినైనా పురమాయించు! ఆ ఉరికొయ్య 75 అడుగుల పొడుగు పుండాలి! ఇంకేముంది, రేపు ఉదయం మహారాజుతో ఆ ఉరికాయ్య మీద ఆ యూదుని ఉరితీయించమని చెప్పు. మహారాజుతో కలిసి విందుకి వెళ్లు. అప్పుడిక చూసుకో, నీ ఆనందానికి మేరవుండదు.” హామానుకి ఆ సలహా నచ్చింది. వెంటనే అతను ఉరి కంబం సిద్ధం చేయమని ఒకణ్ణి ఆజ్ఞాపించాడు.
EST 6:1 సరిగ్గా ఆ రాత్రి మహారాజుకి నిద్రపట్టలేదు. అందు కని రాజవంశ చరిత్ర గ్రంథాన్ని తెచ్చి తనకి చదివి వినిపించమని ఒక ఉద్యోగికి పురమాయించాడు. (ఆ చరిత్ర గ్రంథంలో ఒక్కొక్క రాజు పరిపాలన కాలంలో సంభవించిన ప్రతి సంఘటనా నమోదు చెయ్యబడుతుంది.)
EST 6:2 ఆ ఉద్యోగి మహారాజుకి ఆ గ్రంథం చదివి వినిపించాడు. ఆహష్వేరోషు మహారాజును హత్య చేసేందుకు జరిగిన కుట్రను గురించీ, బిగ్తాను, తెరెషు అనేయిద్దరు రాజభవన ద్వారపాలకులు ఇద్దరు చేస్తున్నయీ కుట్ర గురించి మొర్దెకై పసిగట్టి ఆ సమాచారాన్ని ఎపరికో తెలియజెయ్యడం గురించి ఆ ఉద్యోగి చదివాడు.
EST 6:3 అప్పుడు మహారాజు, “ఇందుకు ప్రతిఫలంగా ఆ మొర్దెకైకి ఎలాంటి ఆదర సత్కార్యాలు జరిగాయి?” అని ప్రశ్నించాడు. “మొర్దెకైకి ఎలాంటి పారితోషికమూ దొరకలేదు మహారాజా” అని ఉద్యోగులు సమాధానమిచ్చారు.
EST 6:4 హామాను సరిగ్గా అప్పుడే రాజభవనపు వెలుపటి ఆవరణలో ప్రవేశించాడు. తను నాటింపజేసిన ఉరి కంబం మీద మొర్దెకైని ఉరితీయించేందుకు మహారాజు అనుమతిని కోరేందుకే అతను వచ్చాడు. అతని అడుగుల చప్పుడు మహారాజు విన్నాడు. “అవరణ లోపలికి పచ్చింది ఎవరు?” అన్న మహారాజు ప్రశ్నకి
EST 6:5 రాజోద్యోగులు “హామాను ఆవరణలో వేచివున్నాడు మహారాజా” అని సమాధానమిచ్చారు. మహారాజు, “అతన్ని లోపలికి తీసుకురండి” అని ఆదేశించాడు.
EST 6:6 హామాను లోపలికి వచ్చాక మహారాజు అతన్ని, “మహారాజు ఎవరికైనా గౌరవ సత్కార్యాలు చెయ్యాలంటే, ఏం చెయ్యాలి హామానూ” అని ప్రశ్నించాడు. హామాను తనలో తను, “మహారాజు నన్ను కాక మరెవరిని సత్కరించాలని అనుకుంటారు? మహారాజు అంటున్నది నిస్సందేహంగా నన్ను సత్కరించాలనే అయివుంటుంది.” అని తర్కించుకున్నాడు.
EST 6:7 దానితో హమాను మహారాజుకి ఇలా సమాధాన మిచ్చాడు: “మహారాజు గౌరవించాలనుకున్న వ్యక్తి విషయంలో యిలా చెయ్యాలి.
EST 6:8 మహారాజు స్వయంగా ధరించిన రాజవస్త్రాలను సేవకులచేత తెప్పించాలి. మహారాజు స్వారీచేసిన ఒక గుర్రాన్ని కూడా తెప్పించాలి. సేవకులచేత ఆ గుర్రం ముఖాన తురాయివంటి ప్రత్యేకమైన ఒక గుర్తు వేయించాలి.
EST 6:9 తర్వాత ఆ పట్టు వస్త్రాన్ని, ఆ గుర్రాన్నీ ఒక ప్రముఖ ఉద్యోగి వద్ద వుంచాలి. అప్పుడు మహారాజు సత్కరించాలనుకున్న ఆ వ్యక్తిని ఆ ముఖ్య అధికారి గుర్రం మీద కూర్చోబెట్టి నగర వీధుల్లో ఊరేగిస్తూ, ‘ఈయనకి మహారాజు చేస్తున్న సన్మానం ఇది’ అంటూచాటాలి.”
EST 6:10 అప్పుడు మహారాజు హామానుకి ఇలా ఆజ్ఞాశించాడు: “వెన్వెంటనే పోయి, పట్టు వస్త్రాలూ గుర్రము తీసుకువచ్చి. భవనద్వారం దగ్గర కూర్చున్న యూదుడైన మొర్దెకైకి నువ్వు చెప్పిన సత్కార కార్య క్రమమంతా అమలు జరుపుము.”
EST 6:11 హామాను పోయి పట్టు వస్త్రమూ, గుర్రమూ తెచ్చాడు. ఆ వస్త్రాన్ని మొర్దెకైకి కప్పి, అతన్ని గుర్రం మీద కూర్చోబెట్టి, తను గుర్రం ముందు నడుస్తూ మొర్దెకైని నగర విధుల్లో ఊరేగిస్తూ, “మహారాజు సత్కరించ కోరిన వ్యక్తికి జరుగుతున్న సన్మానం ఇదే” అని చాటాడు.
EST 6:12 అటు తర్వాత మొర్దెకై రాజభవన ద్వారం దగ్గరికి తిరిగి వెళ్లాడు. కాని, హామాను సిగ్గుతో తల్లడిల్లుతూ హడావిడిగా ఇంటికి వెళ్లిపోయాడు.
EST 6:13 తన భార్య జెరెషుకీ, తన మిత్రులందరికీ తనకి జరిగిన పరాభవ మంతటిని గురించి సవివరంగా చెప్పాడు. హామాను భార్య, అతనికి ఇంతకు ముందు సలహా ఇచ్చిన మిత్రులూ అతనితో ఇలా అన్నారు: “మొర్దెకై యూదుడే అయితే, నువ్వు జయం పొందడం అసాధ్యం. నీ పతనం యిప్పటికే ప్రారంభమైంది. నీ నాశనం తథ్యం!”
EST 6:14 హామానుతో వాళ్లింకా మాట్లాడుతూనే పున్నారు. అంతలోనే మహారాజుగారి కొజ్జాలు హామాను ఇంటికి వచ్చారు. వాళ్లు హామానుని ఎస్తేరు సన్నద్ధం చేసిన విందుకి వెళ్లేందుకు తొందరచేశారు.
EST 7:1 మహారాజూ, హామానూ మహారాణి ఎస్తేరు విందుకి వెళ్లారు.
EST 7:2 విందు రెండోరోజున వాళ్లు ద్రాక్షారసం సేవిస్తూవుండగా మహారాజు ఎస్తేరును మరల ఇలా అడిగాడు: “మహారాణి ఎస్తేరూ, నీకేం కావాలి? నువ్వేమి కోరుకున్నా సరే, దాన్ని నీకు ఇస్తాను. నీ కోరిక ఏమిటి? నీకు ఏదైనా సరే, చివరకు అర్ధ రాజ్యమైనా సరే ఇస్తాను.”
EST 7:3 అప్పుడు మహారాణి ఎస్తేరు ఇలా సమాధానం యిచ్చింది: “మహారాజా, మీకు నేనంటే ఇష్టంవుంటే, మీరు నన్ను అనుగ్రహిస్తే, నాకూ, నా ప్రజలకీ కూడా ప్రాణదానం చెయ్యండి! నేను కోరుకొనేది అంత మాత్రమే.
EST 7:4 ఎందుకంటే నాశనం చేయబడేందుకు, చంపివేయబడేందుకు, నిర్మూలించ బడేందుకు నేనూ, నా ప్రజలూ అమ్మివేయబడ్డాం. మేము కేవలం బానిసలుగా అమ్మివేయబడివుంటే, నేను ఊరక ఉండి పోదును. ఎందుకంటే, అది మహారాజును విసిగించవల సినంతటి సమస్య అయ్యుండేది కాదు.”
EST 7:5 మహారాజు అహష్వేరోషు మహారాణి ఎస్తేరును ఇలా ప్రశ్నించాడు: “మీ విషయంలో ఇలా చేసింది ఎవరు? నీ ప్రజలకు ఇలా చేయ సాహసించిన వ్యక్తి ఎవరు?”
EST 7:6 “మాకు విరోధి, శత్రువు దుర్మార్గుడైన ఈ హామానే” అని జవాబిచ్చింది ఎస్తేరు. దానితో, మహారాజుకీ ముందు నిలబడ్డ హామాను భయ భీతుడయ్యాడు.
EST 7:7 మహారాజుకి పట్టరాని కోపం వచ్చింది. ఆయన లేచి నిలబడ్డాడు. ద్రక్షారసం అక్కడే వదిలేసి, బయటి తోటలోకి వెళ్లాడు. కాని, హామాను మహారాణిని క్షమాభిక్ష వేడుకునేందుకు అక్కడే నిలిచిపోయూడు. అప్పటికే మహారాజు తనని చంపి వేయాలని నిర్ణయించుకున్నట్లు హామాను గ్రహించినందువల్లనే, మహారాణి ఎస్తేరును క్షమాభిక్ష అడుక్కునేందుకు అక్కడ ఉండి పోయాడు.
EST 7:8 సరిగ్గా తోటనుంచి విందుశాలకి వస్తూన్నప్పుడే ఎస్తేరు వాలి కూర్చున్న శయ్యమీద హామాను పడుతూపుండటం మహారాజు కంటపడింది. మహారాజు కోపస్వరంతో, “నేనీ ఇంట్లో ఉండగానే నువ్వు మహారాణి మిద దాడి చేస్తున్నావా?” అని గర్జించాడు. మహారాజు కేక వినగానే, సేవకులు లోనికి వచ్చి హామానుని పట్టుకున్నారు.
EST 7:9 మహారాజు సేవకుల్లో ఒకడి పేరు హార్బోనా. ఆ కొజ్జా మహారాజుతో ఇలా చెప్పాడు: “హామాను యింటి దగ్గర 75 అడుగల ఉరికంబం పుంది మహారాజా. దానిమీద మొర్దెకైని ఉరి తీయించేందుకు హామాను దాన్ని నిర్మింపజేశాడు. మిమ్మల్మి హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నప్పుడు, ఆ సమాచారాన్ని తెలియజేసి, మీకు సహాయపడినది యీ మొర్దెకైయేనండి.” “హామానుని అదే ఉరికంబం మీద ఉరి తియ్యండి” అని ఆజ్ఞాపించాడు మహారాజు.
EST 7:10 దానితో, మొర్దెకైని ఉరితీయించేందు కోసం హామాను నిర్మించిన ఉరికంబం మీదనే హామాను ఉరితీ యబడ్డాడు.
EST 8:1 అదే రోజున అహష్వేరోషు మహారాజు యూదులకు శత్రువైన హామానుకు చెందిన చర స్థిరాస్తులున్నింటినీ ఎస్తేరు మహారాణికి దత్తం చేశాడు. మొర్దెకై తనకు బంధువన్న విషయాన్ని ఎస్తేరు మహారాజుకి చెప్పింది. అప్పుడు మొర్దెకై మహారాజు దర్శనానికి వచ్చాడు.
EST 8:2 మహారాజు తన రాజముద్రికను హామానునుంచి వెనక్కి తెప్పించి, తన వేలికి పెట్టుకున్నాడు. మహారాజు ఆ ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. అప్పుడింక ఎస్తేర హామానుకి చెందిన ఆస్తులన్నింటి అజమాయిషీనీ మొర్దెకైకి అప్పగించింది.
EST 8:3 తర్వాత ఎస్తేరు మహారాజుతో మళ్లీ మాట్లాడింది. ఆమె రోదిస్తూ మహారాజు పాదాలపైపడి, అగాగీయుడైన హామాను దుష్ట పథకాన్ని రద్దు చేయవలసిందిగా మహారాజును వేడుకుంది. యూదులను హింసించేందుకు హామాను పన్నిన దుష్ట పథకం అది.
EST 8:4 మహారాజు తన బంగారు రాజదండంతో ఎస్తేరును తాకాడు. ఎస్తేరు లేచి, మహారాజు ముందు నిలబడింది.
EST 8:5 అప్పుడు ఎస్తేరు మహారాజుతో ఇలా విన్నవించుకుంది: “మహారాజా, మీకు నేనంటే ఇష్టంవుంటే, తమ దయవుంటే, నా కోసం ఇలా చెయ్యండి. ఇది మంచి ఊహ అను కుంటేనే ఈ పని చేయండి. నేను తమకి ప్రీతిపాత్రురాలినైతే, హామాను పంపిన ఆజ్ఞను రద్దుచేస్తూ ఒక శాసనం చేయండి. అగాగీయుడైన హామాను మహారాజా వారి సామంత దేశాలన్నింటిలోని యూదులందరినీ సమూలంగా నాశనం చేయమని తాఖీదులు జారీచేశాడు.
EST 8:6 నా ప్రజలు ఇలాంటి ఘోరమైన విపత్తులకు గురికావడం నేను సహించలేను. నా కుటుంబ సభ్యులు హతమార్చ బడటం నేను భరించలేను. అందుకే, మహారాజావారిని ఈ ఘోరాన్ని ఆపు చెయ్యవలసిందిగా అర్థిస్తున్నాను.”
EST 8:7 అహష్వేరోషు మహారాజు ఎస్తేరు మహారాణికీ, యూదుడైన మొర్దెకైకీ ఇలా సమాధానమిచ్చాడు, “హామాను యూదులకు శత్రువు కనుకనే వాని అస్తిని ఎస్తేరుకి ఇచ్చాను. నా స్తెనికులు వాడిని ఉరికంబాని కెక్కించి, ఉరిదీశారు.
EST 8:8 ఇప్పుడిక మహారాజు ఆజ్ఞ మేరకు మరో ఆజ్ఞాపత్రం వ్రాయండి. మీకు సర్వోత్తమమని తోచిన పద్ధతిలో, యూదులకు తోడ్పడే విధంగా శాసనాన్ని వ్రాయండి. తర్వాత దానిమీద రాజముద్రికతో ముద్రవేసి మూసెయ్యండి. మహారాజు ఆజ్ఞ మేరకు వ్రాయబడి, దానిమీద రాజముద్రిక గుర్తువేయ బడిన ఏ ఆధికారిక ఆజ్ఞాపత్రాన్ని రద్దుచేయ సాధ్యం కాదు.”
EST 8:9 మహారాజు వెంటనే లేఖకులను పిలువనంపించాడు. మూడవ నెల, అనగా సీవాను నెల 23వ రోజున యీ ఘటన జరిగింది. లేఖకులు మొర్దెకై ఆజ్ఞలన్నింటినీ వ్రాశారు. అవి యూదులకీ, సామంత రాజులకీ, రాజ్యాధిపతులకీ, 127 దేశాల అధికారులకీ పంప బడ్డాయి. ఆ దేశాలు భారత దేశంనుంచి ఇథియోపియాదాకా విస్తరించి వున్నాయి. ఆ ఆజ్ఞాపత్రాలు ఆయా దేశాల భాషల్లో వ్రాయబడ్డాయి. ఆవి ఆయా ప్రజాబృందాల భాషల్లోకి అనువదించబడ్డాయి. కాగా ఆ ఆజ్ఞాపత్రాలు యూదులకు వాళ్ల సోంత భాషలో, సోంతలిపిలో వ్రాయబడ్డాయి.
EST 8:10 మొర్దెకై ఆ ఆజ్ఞలను అహష్వేరోషు మహారాజు ఆమోదంతో వ్రాశాడు. తర్వాత అతను వాటిమీద రాజముద్రికతో ముద్ర వేయించాడు. అప్పుడిక, మొర్దెకై అశ్వారూఢులైన వార్తాహరుల ద్వారా వాటిని పంపించాడు. మహారాజు అశ్వశాలలోని గుర్రాలు అవి.
EST 8:11 ఆ లేఖల్లోని మహారాజు ఉత్తరువు ఇలా సాగింది: పతి ఒక్క నగరంలోని యూదులూ తమ, ప్రాణ రక్షణ కోసం ఒకచోట గుమిగూడేహక్కు కలిగున్నారు. తమ స్త్రీలపైనా, తమ బిడ్డలపైనా ఏ జాతీయులకు చెందిన ఏ సైన్యాన్నయినా సరే నాశనం చేసే, హత మార్చే, పూర్తిగా రూపు మాపే హక్కు వాళ్లకివుంది. యూదులకు తమ శత్రువుల ఆస్తిని వశంచేసుకొనే హక్కూ, నాశనం చేసే హక్కూపున్నాయి.
EST 8:12 యూదులకు ఈ హక్కు ఒక్క రోజే వుంటుంది. ఆ రోజు అదారు అనబడే 12వ నెల 13వ రోజు. అహష్వేరోషు సామ్రాజ్యంలోని దేశాలన్నింట్లోనూ యూదులకు హక్కు దాఖలు చేయబడింది.
EST 8:13 మహారాజు ఆజ్ఞాపత్రపు ప్రతి ఒకటి బయటికి పంపబడింది. అదొక శాసనం అయింది. అది అన్ని సామంత దేశాల్లోనూ శాసనం అయింది. సామ్రాజ్యంలో నివసించే ప్రతి ఒక జాతి ప్రజలకీ ఈ శసనం చాటబడింది. యూదులు ప్రత్యేకమైన ఈ రోజున సర్వసన్నద్ధంగా ఉండేందుకు వీలుగా వాళ్లీపని చేశారు. యూదులు తమ శత్రువులకు బదులు దెబ్బ కొట్టేందుకు ఆ రోజున అనుమతింపబడతారు.
EST 8:14 వార్తాహరులు మహారాజావారి గుర్రాలమీద వేగంగా సాగిపోయారు. మహారాజు ఆ గుర్రాల రౌతులను వేగంగా వెళ్లమని ఆదేశించాడు. ఆ ఆజ్ఞ రాజధాని అయిన షూషను నగరానికి కూడా వర్తింప జేయబడింది.
EST 8:15 మొర్దకై మహారాజు సమక్షం నుంచి బయల్దేరాడు. అతను మహారాజు సమర్పించిన నీలం, తెలుపు, ప్రత్యేక దుస్తులు, ఒకపెద్ద బంగారు కిరీటం ధరించాడు. అతని పైవస్త్రం ఊదా రంగులోపుంది. అది చాలా మంచి ఉన్నితో నేసినది. ఆ రోజున షూషను నగరంలో ప్రత్యేకమైన ఒక ఉత్సవం జరుగుతోంది.
EST 8:16 అది యూదులకు ప్రత్యేకించి ఆనంద దాయకమైన రోజుగా, అందరికీ సంతోషానంద భరితమైన రోజుగా పరిణమించింది.
EST 8:17 మహారాజు ఆజ్ఞ చేరిన ప్రతి దేశంలోనూ, ప్రతి నగరంలోనూ, యూదుల్లో ఆనందో త్సాహాలు వెల్లివిరిశాయి. యూదులు విందులు, వేడుకలు చేసుకున్నారు. ఇతర జాతులకు చెందిన చాలామంది సామాన్య ప్రజలకు యూదులంటే భయంకలిగి, వాళ్లు యూదా మతం పుచ్చుకున్నారు.
EST 9:1 పన్నెండో నెల (అదారు) 13వ రోజున ప్రజలందరూ మహారాజు ఆజ్ఞను మన్నించవలసి వుంది. అది యూదులను ఓడించాలని యూదుల శత్రువులు ఆశించిన రోజు. అయితే, యిప్పుడు ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. తమను ద్వేషించిన తమ శత్రువులకంటె యూదులు ఇప్పుడు బలంగా పున్నారు.
EST 9:2 అహష్వేరోషు మహారాజు సామ్రాజ్యంలోని అన్ని నగరాల్లోని యూదులూ సమావేసమయ్యారు. తమను నాశనం చేయాలని కోరినవారి పైన దాడిచేసేటంత బలాన్ని సమకూర్చుకునేందుకుగాను వాళ్లు సమకూడారు. దానితో, వాళ్లని ఎదిరించి నిలబడగల శక్తిగలవారు ఎవ్వరూ లేకపోయారు. యూదులంటే జనం భయపడ్డారు.
EST 9:3 సామంత రాజ్యాల్లోని అధికారులు, సామ్రాజ్యాధివతులు, రాజ్య పాలకులు, రాజోద్యోగులు అందరూ యూదులకు తోడ్పడ్డారు. వాళ్ల ఈ తోడ్పటుకి మొర్దెకై పట్లనున్న భయమే కారణం.
EST 9:4 మహారాజు భవనంలోని అతి ముఖ్యుల్లో మొర్దెకై ఒకడయ్యాడు. సామంత రాజ్యాల్లోని ప్రతి ఒక్కరికి మొర్దెకై పేరు తెలుసు. అతనికెంత ప్రాముఖ్యం పుందో తెలుసు. మొర్దెకై నానాటికీ మరింత శక్తివంతమైన వ్యక్తి అయ్యాడు.
EST 9:5 యూదులు తమ శత్రువులందర్నీ ఓడించారు. వాళ్లు తమ శత్రువుల్ని హతమార్చేందుకూ, నాశనం చేసేందుకూ కత్తులు ప్రయోగించారు. తమని ద్వేషించినవారి పట్ల యూదులు తమ చిత్తం వచ్చినట్లు వ్యవహరించారు.
EST 9:6 యూదులు రాజధాని అయిన షూషను నగరంలో 500 మందిని హతమార్చి, నాశనం చేశారు.
EST 9:7 యూదులు ఈ క్రిందివారిని కూడా మట్టు పెట్టారు:
EST 9:8 పర్షందాతా, దల్పోను, అస్పాతా,
EST 9:9 పోరాతా, అదల్యా, అరీదాతా, పర్శష్తా, అరీసై, అరీదై, వైజాతా.
EST 9:10 ఈ పదిమందీ హామాను కొడుకులు. హమ్మోదాతా కొడుకైన హామాను యూదులకు గర్భశత్రువు. యూదులు హామాను కొడుకులందరీ చంపేశారుగాని, వాళ్లకి చెందిన ఆస్తిపాస్తులు వేటినీ వాళ్లు తాకలేదు.
EST 9:11 ఆ రోజున రాజధాని అయిన షూషను నగరంలో చంపివేయబడిన వాళ్ల సంఖ్యను మహారాజ తెలుసు కున్నాడు.
EST 9:12 అప్పుడు మహారాజు మహారాణి ఎస్తేరుతో ఇలా అన్నాడు: “షూషను నగరంలో యూదులు హామాను కొడుకులు పదిమందితో బటు 500 మందిని చంపేశారు. ఇప్పుడిక మహారాజు సామ్రాజ్యంలోని యితర సామంత రాజ్యాల్లో ఏమి జరగాలనినువ్వు కోరుకుంటున్నావో చెప్పు. నేను అలా చేయిస్తను. నువ్వు కోరుకో, కోరుకున్నదేదైనా సరే, నేను చేయిస్తాను.”
EST 9:13 ఎస్తేరు ఇలా కోరింది, “మహారాజుకి సమ్మతమైతే, షూషను నగరంలోని యూదులను రేపుకూడాయీ కార్యక్రమం కొనసాగించనివ్వండి, హామాను కొడుకులు పదిమంది కళేబరాలనూ ఉరికంబం మీద వేలాడదీయించండి.”
EST 9:14 మహారాజు అలాగే ఉత్తరువు ఇచ్చాడు. ఆ ఉత్తరువు షూషను నగరంలో మరోక రోజు అమలు జరిగింది. హామాను కోడుకులు పదిమందీ ఉరి కొయ్యలకు వేలాడదీయబడ్డారు.
EST 9:15 అదారు నెల 14వ రోజున షూషను నగరంలో యూదులందరూ గుమికూడి, మరో 300 మంది పురుషులను చంపేశారు. అయితే, వాళ్లకి చెందిన ఏ వస్తువుల్నీ యూదులు ముట్టలేదు.
EST 9:16 అదే సమయంలో యితర సామంత రాజ్యాల్లోని యూదులు కూడా తమని తాము కాపాడుకోగల బలాన్ని పుంజుకునేందుకు గాను వాళ్లు సమావేశ మయ్యారు. వాళ్లు అలా తమ శత్రపులను వదిలించు కున్నారు. యూదులు తమ శత్రువుల్లో 75,000 మందిని హతమార్చారు. అయితే, వాళ్లకి చెందిన వస్తువులు వేటినీ యూదులు చేజిక్కించుకోలేదు.
EST 9:17 అదారు నెల 13వ రోజున యిది జరిగింది. 14వ రోజున యూదులు విశ్రమించారు. యూదులు ఆరోజును తమ సంతోషకరమైన సెలవు దినం చేసుకున్నారు.
EST 9:18 షూషను నగరంలోని యూదులు అదారు నెల 13, 14 తేదీల్లో సమావేశమయ్యారు. తర్వాత 15వ రోజున వాళ్లు విశ్రమించారు. అందుకని, 15వ రోజును వాళ్లు సంతోషకరమైన పండుగ దినం చేసుకున్నారు.
EST 9:19 కాగా దేశంలో, చిన్నచిన్న గ్రామాల్లో జీవించే యూదులు ఈ వూరీము పండుగను అదారు నెల 14వ రోజున జరుపుకుంటారు. వాళ్లీ 14వ రోజును ఆనందదాయకమైన పండుగగా జరుపుకుంటారు. వాళ్లు ఆ రోజున విందులు జరుపుకుంటారు. ఒకరి కొకరు బహూమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
EST 9:20 అప్పుడు జరిగిన ఘటనలన్నింటినీ మొర్దెకై గ్రంథస్తం చేయించాడు. తర్వాత అతను అహష్వేరోషు మహారాజు సామంత రాజ్యాలన్నింటిలోని యూదులందరికీ లేఖలు పంపాడు. అతనా లేఖలను దగ్గర ప్రాంతాలకే కాకుండా దూర ప్రాంతాలకు కూడా పంపాడు.
EST 9:21 ఏటా అదారు నెల 14, 15 తేదీల్లో యూదులందరూ పూరీము పండుగను పాటించాలని తెలియ చెప్పేందుకుగాను మొర్దెకై ఈ పని చేశాడు.
EST 9:22 అవి యూదులు తమ శత్రువులు నిశ్శేషం చేసిన రోజులు. అందుకని యూదులు పండుక దినాలుగా జరుపు కోవాలి. తమ దుఃఖం సంతోషంగా మారిన ఆ నెలను కూడా వాళ్లు పండుగ మాసంగా జరుపుకోవాలి. వాళ్ల రోదన పండుగ దినాలుగా మారిన నెల అది. మొర్దెకై యూదులందరికీ లేఖలు వ్రాశాడు. అతను ఆ రోజులను ఆలందం వెల్లివిరిసే పండుక దినాలుగా జరుపుకోమని యూదులకు ఆజ్ఞాపించాడు. వాళ్లా రోజుల్లో విందులు జరుపుకోవాలి, ఒకరికొకరు బహుమతులు ఇచ్చు కోవాలి, పేదలకు కానుకలివ్వాలి.
EST 9:23 యూదులు మొర్దెకై తమకు వ్రాసిన విధంగా చేసేందుకు అంగీకరించారు. తాము ప్రారంభించిన వేడుకలను కొనసాగించేందుకు సేమ్మతించారు.
EST 9:24 అగాగీయుడైన హామ్మెదాతా కొడుకు హామాను యూదులందరికీ గర్భ శత్రవు. యూదులను నాశనం చేసేందుకుగాను వాళ్లకి వ్యతిరేకంగా అతనొక దుష్ట పథకం వేశాడు. యూదులను నాశనం చేసేందుకూ, నిర్మూలంచేందుకూ అనువైన రోజును ఎంపిక చేసేందుకుగాను అతను చీట్లు వేశాడు. ఆ కాలంలో దాన్ని “పూరు” అనేవారు, అందుకే ఆ పండుగను “పూరీము” అంటారు
EST 9:25 హామాను దుష్కార్యాలు చేశాడు. ఎస్తేరు మహారాజు సన్నిధికి వెళ్లి, మాట్లాడింది. దానితో ఆయన కొత్త ఆజ్ఞలు పంపాడు. ఆ ఆజ్ఞలు హామాను దుష్ట పథకాలను భగ్నం చయడమేగాక, హామాను దుష్ట పథకంలోని దుష్కార్యాలు హామానుకీ, అతని కుటుంబ సభ్యులకీ సంభవించేలా చేశాయి! దానితో హామానూ, అతని కొడుకులూ ఉరికంబాలకు వేలాడదీయబడ్డారు.
EST 9:26 ఆ కాలంలో చీట్లను “పూరీము” అనేవారు, అందుకే ఈ పండుగను “పూరీము” అంటారు. మొర్దెకై ఒక లేఖ వ్రాసి, యూదులను ఈ పండుగ చేసు కోవాల్సిందిగా ఆజ్ఞపించాడు. అందుకే, యూదులు ఏటా ఈ పండుగను రెండు రోజులపాటు జరుపు కోవడం ఆచారం అయింది.
EST 9:28 వాళ్లీ పండుగను తమకు గతంలో జరిగినవాటిని గుర్తుంచు కోగలిగేందుకు గాను జరుపుకుంటారు. యూదులూ, వాళ్లతో చేరేవాళ్లూ ఏటా యీ పండుగను సరైన కాలంలో, సక్రమమైన పద్ధతిలో జరుపుకుంటారు. ప్రతి తరమూ, ప్రతి కుటుంబమూ యీ రెండు రోజులనూ గుర్తుంచు కుంటాయి. వాళ్లీ పండుగను ప్రతి సామంత రాజ్యర లోనూ, ప్రతి పట్టణంలోనూ జరుపుకుంటారు. పూరీము రోజుల్లో పండుగ జరుపుకోవడాన్ని యూదులు ఎన్నడూ మానరు. యూదుల ప్రతి తరమూ, ప్రతి కుటుంబమూ ఈ పండుగను సదా గుర్తుంచు కుంటారు.
EST 9:29 పూరీమును గురించిన ఉత్తరువు లేఖను అబీహాయిలు కూతురు ఎస్తేరు మహారాణీ, యూదుడైన మొర్దెకైలు కలిసి వ్రాశారు. ఈ రెండవ లేఖ నిజమని నిరూపించేందుకుగాను దాన్ని వారు మహారాజు పూర్తి అనుమతి (ఆజ్ఞ)తో వ్రాశారు.
EST 9:30 మొర్దెకై ఆ లేఖలను అహష్వేరోషు మహారాజు వారి 127 సామంత రాజ్యాల్లోని యూదులందరికీ పంపాడు. ఈ పండుగ శాంతినీ, ప్రజల మధ్య పరస్పర విశ్వాసాన్నీ పెంపొందించాలని జనానికి మొర్దెకై సూచించాడు.
EST 9:31 పూరీము పండుగ సంబరాలు మొదలు పెట్టమని చెప్పేందుకుగాను మొర్దెకై ఈ లేఖలు ప్రాశాడు. ఈ కొత్త పండుగను ఎప్పుడు మొదలు పెట్టాలోకూడా అతను ఆ లోఖల్లో వాళ్లకి తెలియచేశాడు. యూదులకు యీ ఉత్తరువును యూదుడైన మొర్దెకై, మహారాణి ఎస్తేరూ పంపారు. తద్వారా వాళ్లు యీ రెండు రోజులు పండుగను తమ తరతరాల యూదుల కోసం స్థిర పరిచారు. తాము ఉపవాసాలు చేసి, జరిగిన చెడుగుల విషయంలో విలపించే ఇతర పండుగలను గుర్తు పెట్టు కూనేటట్లే యూదులు ఈ పండుగను కూడా గుర్తు పెట్టుకుంటారు.
EST 9:32 ఎస్తేరు ఉత్తరువు పూరీము పండుగ నియమాలను స్థిరపరచింది. ఆ విషయాలు గ్రంథాల్లో నమెదు చేయబడ్డాయి.
EST 10:1 అహష్వేరోషు మహారాజు ప్రజల దగ్గర్నుంచి పన్నులు వసూలు చేసేవాడు. సుదూర ప్రాంతాల్లో సముద్ర తీరాన పున్న నగర వాసులతో బాటు, సామ్ర్యాజ్యంలోని ప్రజలందరూ పన్నులు చెల్లించవలసి వచ్చేది.
EST 10:2 అహష్వేరోషు మహారాజు చేసిన ఘనకార్యాలన్నీ మాదీయ, పారశీక రాజ్యాల చరిత్ర గ్రంథంలో లిఖింపబడ్డాయి. అలాగే మొర్దెకై చేసిన కూడా ఆ చరిత్ర గ్రంథాల్లో చేర్చ బడ్డాయి. మహారాజు మొర్దెకైకి ఘన మైన గౌరవస్థానం కల్పించాడు.
EST 10:3 సామ్రాజ్యంలో అహష్వేరోషు తర్వాత ప్రాముఖ్యంలో మొర్దెకైది ద్యితీయ స్థానం. యూదులందరిలో మొర్దెకైయే అతి ముఖ్యమైన వ్యక్తి. అతని తోటి యూదులు అతన్నెంతగానో గౌరవించేవారు. మొర్దెకై తన జాతీయ ప్రజల సంక్షేమ సౌభాగ్యాల కోసం విశేషంగా కృషిచేశాడు. మొర్దెకై యూదులందరికీ శాంతిని చేకూర్చాడు. అందుకే, సాటి యూదులందరికీ మొర్దెకై అంటే ఎంతో గౌరవం.
JOB 1:1 ఊజు దేశంలో ఒక మంచి మనిషి జీవించాడు. అతని పేరు యోబు. యోబు మంచివాడు, నమ్మక మైనవాడు. యోబు తన జీవితాంతము దేవుని ఆరాధించాడు. యోబు చెడు క్రియలకు దూరంగా ఉండేవాడు.
JOB 1:2 యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమారైలుండిరి.
JOB 1:3 యోబుకు ఏడు వేల గొర్రెలు, మూడు వేల ఒంటెలు, వెయ్యి ఎద్దులు, ఐదు వందల ఆడ గాడిదలు సొంతంగా ఉన్నాయి. వీటికి తోడు అతనికి చాలా మంది పనివాళ్లు ఉన్నారు. తూర్పు ప్రాంతంలో యోబు మిక్కిలి ధనవంతుడుగా ఉండేవాడు.
JOB 1:4 యోబు కుమారులు వంతుల ప్రకారం వారి ఇండ్లలో విందులు చేసుకొంటూ, వారి సోదరీలను ఆహ్వానిస్తుండేవారు.
JOB 1:5 యోబు పిల్లలు విందు చేసు కొన్న తర్వాత, అతడు ఉదయం పెందలాడే లేచేవాడు. అతడు తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం ఒక్కోక్క దహనబలి అర్పించేవాడు. “ఒకవేళ నా పిల్లలు నిర్లక్ష్యంగా ఉండి, వారి విందులో దేవునికి విరోధంగా పాపం చేశారేమో” అని అతడు తలచేవాడు. తన పిల్లలు వారి పాపాల విషయంలో క్షమించబడాలని అతడు ఎల్లప్పుడు ఇలా చేస్తూ ఉండేవాడు.
JOB 1:6 అప్పుడు దేవదూతలు యెహోవా సముఖంలో సమావేశమయ్యే రోజు వచ్చింది. అప్పుడు ఆ దేవదూతలతోబాటు సాతానుకూడ వచ్చాడు.
JOB 1:7 “ఎక్కడి నుండి వస్తున్నావు?” అని సాతానును యెహోవా అడిగాడు. “నేను భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నాను” అని యెహోవాకు సాతాను జవాబు చెప్పాడు.
JOB 1:8 అంతట యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు చూశావా? భూమి మీద అతనిలాంటి వారు ఎవ్వరూ లేరు. యోబు నిజంగా మంచి మనిషి మరియు నమ్మకమైనవాడు. అతడు దేవుణ్ణి ఆరాధిస్తాడు. దుర్మార్గపు పనులకు అతడు దూరంగా ఉంటాడు” అని సాతానుతో అన్నాడు.
JOB 1:9 “ఓ తప్పకుండా! కానీ యోబు దేవుణ్ణి ఆరాధించటానికి ఒక గట్టి కారణం ఉంది!
JOB 1:10 అతణ్ణి, అతని కుటుంబాన్ని, అతనికి ఉన్న సర్వాన్ని నీవు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నావు. అతడు చేసే ప్రతిపనిలో నీవు అతణ్ణి విజయుణ్ణి చేస్తున్నావు. అవును, నీవు అతణ్ణి ఆశీర్వదించావు. అతడు చాలా ధనికుడు గనుక అతని పశువుల మందలు, గొర్రెల మందలు దేశం అంతటానిండి ఉన్నాయి.
JOB 1:11 కానీ అతనికి ఉన్న సర్వాన్నీ నీవు గనుక నాశనం చేస్తే అతడు నీకు వ్యతిరేకంగా, నీముఖం మీదనే శపిస్తాడని ప్రమాణం చేస్తున్నాను” అని సాతాను జవాబిచ్చాడు.
JOB 1:12 “సరే, యోబుకు ఉన్న వాటన్నింటికీ నీవు ఏమైనా చేయి. కాని అతని శరీరానికి మాత్రం హానిచేయవద్దు” అని యెహోవా సాతానుతో చెప్పాడు. అప్పుడు సాతాను యెహోవా సన్నిధి నుండి వెళ్లిపోయాడు.
JOB 1:13 ఒకరోజు యోబు కుమారులు, కుమారైలు అతని జ్యేష్ఠ కుమారుని ఇంటివద్ద తినుచూ ద్రాక్షారసం తాగుతూ ఉన్నారు.
JOB 1:14 అంతలో ఒక సందేశకుడు యోబు దగ్గరకు వచ్చి, “ఎడ్లు దున్నుతూ, ఆ దగ్గరలోనే గాడిదలు గడ్డి మేస్తూ వుండగా,
JOB 1:15 షెబాయీయులు మా మీద దాడి చేసి నీ జంతువులను తీసుకొనిపోయారు! నన్ను తప్ప మిగిలిన నీ సేవకులనందరినీ షెబాయీయులు చంపేశారు. నీతో చెప్పటానికే నేనొక్కడినే తప్పించుకొన్నాను” అని చెప్పాడు.
JOB 1:16 ఆ సందేశకుడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే మరో సందేశకుడు యోబు దగ్గరకు వచ్చాడు. “ఆకాశంనుండి మెరుపుల ద్వారా అగ్నిపడి నీ గొర్రెలను, సేవకులను కాల్చివేసింది. నీతో చెప్పేందుకు నేను ఒక్కణ్ణి మాత్రమే తప్పించుకొన్నాను!” అని రెండో సందేశకుడు చెప్పాడు.
JOB 1:17 ఆ సందేశకుడు ఇంకా మాట్లాడు తూండగానే ఇంకో సందేశకుడు వచ్చాడు. “కల్దీయులు పంపిన మూడు గుంపులవారు వచ్చి మా మీద పడి ఒంటెలను తీసుకొని పోయారు. పైగా వారు సేవకులను చంపేశారు. నీతో చెప్పేందుకు నేనొక్కణ్ణి మాత్రం తప్పించుకొన్నాను” అని ఈ మూడో సందేశకుడు చెప్పాడు.
JOB 1:18 మూడో సందేశకుడు ఇంకా చెబుతూ ఉండగానే మరో సందేశకుడు వచ్చాడు. “నీ పెద్ద కుమారుని యింటి వద్ద నీ కుమారులు, కుమారైలు భోజనం చేస్తూ, ద్రాక్షారసం తాగుతూ ఉండగా.
JOB 1:19 అకస్మాత్తుగా ఎడారినుండి ఒక బలమైన గాలి వీచి ఇంటిని పడ గొట్టేసింది. ఆ ఇల్లు నీ కుమారులు, కుమారైల మీద పడగానేవారు మరణించారు. నీతో చెప్పేందుకు నేను ఒక్కణ్ణి మాత్రమే తప్పించుకొన్నాను” అని నాలుగో సందే శకుడు చెప్పాడు.
JOB 1:20 యోబు ఇది వినగానే తన విచారాన్ని, కలవరాన్ని తెలియజేయడానికి తన బట్టలు చింపుకొని, తలగుండు చేసుకొన్నాడు. తరువాత యోబు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించాడు.
JOB 1:21 అతడు ఇలా చెప్పాడు: “నేను ఈ లోకంలో పుట్టినప్పుడు నేను దిగంబరిని, నాకు ఏమీ లేదు. నేను మరణించి లోకాన్ని విడిచి పెట్టేటప్పుడు నేను దిగంబరినిగా ఉంటాను. నాకు ఏమీ ఉండదు. యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామాన్ని స్తుతించండి!”
JOB 1:22 ఇవన్నీ సంభవించినా కానీ యోబు మాత్రం పాపం చేయలేదు. అతడు దేవుణ్ణి నిందించనూలేదు.
JOB 2:1 మరో రోజు దేవదూతలు యెహోవాను కలుసు కొనేందుకు వచ్చారు. సాతాను వారితో కూడా ఉన్నాడు. సాతాను యెహోవాను కలుసుకొనేందుకు వచ్చాడు.
JOB 2:2 “ఎక్కడికి వెళ్లావు?” అని సాతానును యెహోవా అడిగాడు. “నేను భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నాను” అని సాతాను యెహోవాకు జవాబు ఇచ్చాడు.
JOB 2:3 “నా సేవకుడైన యోబును నీవు గమనిస్తున్నావా? భూమి మీద ఎప్వరూ అతని వంటివారు లేరు. నిజంగా అతడు మంచి మనిషి. అతడు తన దేవుడనైన నన్ను మాత్రమే ఆరాధిస్తాడు. చెడుకార్యాలకు అతడు దూరంగా ఉంటాడు. అతనికి ఉన్నవాటన్నింటినీ నిష్కారణంగా నాశనం చేయమని నీవు నన్ను అడిగినప్పటికీ, అతడు ఇంకా నమ్మకంగా ఉన్నాడు” అని సాతానుతో యెహోవా అన్నాడు.
JOB 2:4 “చర్మానికి చర్మం బతికి ఉండటానికి మనిషి తనకు ఉన్నదంతా ఇస్తాడు.
JOB 2:5 అతని శరీరానికి హాని చేసేందుకు నీవు నాకు అనుమతిస్తే, అప్పుడు అతడు నీ ముఖం మీదే శపిస్తాడు!” అని సాతాను జవాబు ఇచ్చాడు.
JOB 2:6 “సరే, యోబు నీ అధికారం కింద ఉన్నాడు. కాని అతనిని చంపేందుకు నీకు అనుమతి లేదు” అని సాతానుతో యెహోవా చెప్పాడు.
JOB 2:7 అప్పుడు సాతాను యెహోవా దగ్గర నుండి వెళ్లిపోయి, యోబుకు బాధకరమైన పుండ్లు కలిగించాడు. యోబు అరికాలు మొదలుకొని నడి నెత్తివరకు, అతని శరీరం అంతటా బాధకరమైన పుండ్లు ఉన్నాయి.
JOB 2:8 కనుక యోబు పెంటకుప్ప దగ్గర కూర్చున్నాడు. అతడు తన పుండ్లను గీకుకొనేందుకు ఒక చిల్లపెంకు ఉపయోగించాడు.
JOB 2:9 యోబు భార్య, “ఇంకా నీవు దేవునికి నమ్మకంగా ఉంటావా? నీ వెందుకు దేవుణ్ణి శపించి, చావకూడదు?” అని అతనితో అంది.
JOB 2:10 యోబు తన భార్యతో, “నీవు తెలివి తక్కువ స్త్రీలా మాట్లాడుతున్నావు! దేవుడు మనకు మంచి వాటిని ఇచ్చినప్పుడు, మనం వాటిని స్వీకరిస్తున్నాం. కనుక కష్టాల్ని కూడా మనం స్వీకరించాలి గాని ఆరోపణ చేయకూడదు” అని జవాబిచ్చాడు. ఇవన్ని జరిగినప్పటికీ కూడా యోబు పాపం చేయలేదు. దేవునికి విరుద్ధంగా ఏమియు మాట్లాడనూలేదు.
JOB 2:11 తేమాను వాడైన ఎలీఫజు, షూహీవాడైన బిల్దదు, నయమాతీవాడైన జోఫరు అనే ముగ్గురు యోబుకు స్నేహితులు. యోబుకు సంభవించిన చెడు సంగతుల నన్నింటిని గూర్చి ఈ ముగ్గురు స్నేహితులూ విన్నారు. ఈ ముగ్గురు స్నేహితులూ వారి ఇండ్లు విడిచి ఒకచోట సమావేశయ్యారు. వారు వెళ్లి యోబుకు సానుభూతి చూపించి, ఆదరించాలని తీర్మానించుకున్నారు.
JOB 2:12 కాని ఆ స్నేహితులు ముగ్గురూ యోబును దూరమునుండి చూచి, అతడు చాలా వేరుగా కనబడటం చేత అతడు యోబు అని సరిగ్గా గుర్తించ లేక పోయారు. వారు గట్టిగా ఏడ్వటం మొదలు పెట్టారు. వారు తమ వస్త్రాలు చింపుకొని, తాము విచారంగాను, కలవరంగాను ఉన్నట్టు తెలియ చేయడానికి తమ తలల మీద దుమ్మెత్తి పోసుకొన్నారు.
JOB 2:13 తరువాత ఆ ముగ్గురు స్నేహితులూ యోబుతో పాటు ఏడు రాత్రుళ్లు, ఏడు పగళ్లు నేలమీద కూర్చున్నారు. యోబు చాలా శ్రమ పడుతూ ఉన్న కారణంగా వారిలో ఏ ఒక్కరూ యోబుతో ఒక్క మాట కూడా పలుకలేదు.
JOB 3:1 అప్పుడు యోబు తన నోరు తెరచి, తాను పుట్టిన రోజును శపించాడు.
JOB 3:2 అతడు ఇలా అన్నాడు: “నేను పుట్టిన ఆ రోజు ఉండకుండా పోవును గాక. ‘పిల్లవాడు పుట్టాడు!’ అని చెప్పబడిన ఆ రాత్రి ఉండకుండా పోవునుగాక. అది పోవునుగాక.
JOB 3:4 ఆ రోజు చీకటి అవును గాక. ఆ రోజును దేవుడులక్ష్యపెట్టకుండును గాక. ఆ రోజున వెలుగు ప్రకాశింపకుండును గాక.
JOB 3:5 ఆ రోజు మరణాంధకారమవును గాక. ఆ రోజును ఒక మేఘము కప్పివేయును గాక. నేను పుట్టిన ఆనాటి వెలుగును కారు మేఘాలు భయపెట్టి వెళ్లగొట్టును గాక.
JOB 3:6 గాఢగంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక. ఆ రాత్రి సంవత్సరపు దినములలో ఒకటిగా ఎంచబడకుండును గాక. ఆ రాత్రిని ఏ నెలలో కూడ చేర్చవద్దు.
JOB 3:7 ఆ రాత్రి ఎవడును జననం కాకపోపును గాక. ఆ రాత్రి ఏ ఆనంద శబ్దం వినుపించకుండా ఉండును గాక.
JOB 3:8 శాపాలు పెట్టే మంత్రగాళ్లు నేను పుట్టిన ఆ రోజును శపించెదరు గాక. సముద్రపు రాక్షసికి కోపం పుట్టించుట ఎట్లో ఎరిగిన మనుషులు వారు.
JOB 3:9 ఆ నాటి వేకువ చుక్క చీకటి అవునుగాక. ఆ రాత్రి ఉదయపు వెలుగుకోసం కనిపెట్టి ఉండును గాక. కానీ ఆ వెలుగు ఎన్నటికీ రాకుండును గాక. ఆ రాత్రి సూర్యోదయపు మొదటి కిరణాలు చూడకుండును గాక.
JOB 3:10 ఎందుకనగా ఆ రాత్రి, నా తల్లి గర్భద్వారాలను మూసివేయలేదు. (అది పుట్టకుండా అరికట్టలేదు) అది నా కన్నులనుండి కష్టాలను దాచలేదు.
JOB 3:11 నేను పుట్టినప్పుడే నేనెందుకు మరణించలేదు? నా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు నేనెందుకు మరణించలేదు?
JOB 3:12 నా తల్లి ఎందుకు నన్ను తన మోకాళ్లమీద పెట్టుకొంది? నా తల్లి స్తనములు నాకెందుకు పాలిచ్చాయి?
JOB 3:13 నేను పుట్టినప్పుడే నేను మరణించి ఉంటే ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండేవాణ్ణి.
JOB 3:14 భూమి మీద బతికిన రాజులు, జ్ఞానులతో బాటు విశ్రాంతిలో ఉంటే ఎంత బాగుండును ఆ రాజులు, జ్ఞానులచే నిర్మింపబడిన ఆ కట్టడాలు ఇప్పుడు నాశనమై పోయాయి.
JOB 3:15 నేను కూడ ఆ పాలకులతో పాటు పాతిపెట్టబడి ఉంటే ఎంత బాగుండును. వారికి బంగారం ఉంది, వారి ఇండ్లను వెండితో నింపుకొన్నారు!
JOB 3:16 నేను పుట్టినప్పుడే చనిపోయి, మట్టిలో పాతి పెట్టబడిన శిశువుగా ఎందుకు ఉండలేదు? ఎన్నడూ వెలుగు చూడని శిశువులా నేను ఉంటే ఎంత బాగుండును.
JOB 3:17 చెడ్డ మనుష్యులు సమాధిలో ఉన్నప్పుడు తొందర కలిగించటం మానివేస్తారు. అలసిపోయిన మనుష్యులకు సమాధిలో విశ్రాంతి లభిస్తుంది.
JOB 3:18 ఖైదీలు కూడా సమాధిలో సుఖంగా ఉంటారు. కాపలాదారుల స్వరం వారు వినరు.
JOB 3:19 ప్రముఖ ప్రజలు, సామాన్య ప్రజలు అన్ని రకాల ప్రజలు సమాధిలో ఉంటారు. మరియు బానిస తన యజమాని నుండి విడుదల అవుతాడు.
JOB 3:20 “శ్రమ పడుతూ, చాలా విచారంగా ఉన్న మనిషిని ఇంకా బతుకుతూ ఉండనియ్యటం ఎందుకు? ఆత్మ వేదనతో ఉన్న వానికి జీవం ఇవ్వబడటం ఎందుకు?
JOB 3:21 ఆ మనిషి చావాలని కోరుకొంటాడు. కాని చావురాదు. విచారంలో ఉన్న ఆ మనిషి దాగి ఉన్న ఐశ్వర్యాలకంటే మరణంకోసం ఎక్కువగా వెదకుతాడు.
JOB 3:22 ఆ మనుష్యులు సమాధిని కనుగొన్నప్పుడు చాలా సంతోషిస్తారు. వారు పాతిపెట్ట బడినప్పుడు ఆనందిస్తారు.
JOB 3:23 దేవుడు వారి భవిష్యత్తును రహస్యంగా ఉంచుతాడు. వారి చుట్టూ ఒక గోడ కడతాడు.
JOB 3:24 నేను భోజనం చేయను. కాని నేను దుఃఖధ్వనులు చేస్తాను. కాని సంతోషంతో కాదు. నా ఆరోపణలు నీళ్లలా ప్రవహిస్తున్నాయి.
JOB 3:25 నాకు ఏదో దారుణం జరుగుతుందేమో అని భయ పడ్డాను. అలానే జరిగింది నాకు!
JOB 3:26 నాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు. నాకు విశ్రాంతి లేదు. కష్టం మాత్రమే ఉంది!”
JOB 4:1 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు జవాబు ఇచ్చాడు: “నీతో ఎవరైనా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది నిన్ను కలవర పెడుతుందా? నేను మాట్లాడాల్సి ఉంది!
JOB 4:3 యోబూ, ఎంతో మంది మనుష్యులకు నీవు ఉపదేశాన్ని చేసావు. బలహీన హస్తాలకు నీవు బలం ఇచ్చావు.
JOB 4:4 తొట్రిల్లిన మనుష్యులకు నీ మాటలు ఆదరణ కలిగించాయి. బలహీనమైన మోకాళ్లను నీవు బలపరిచావు.
JOB 4:5 కాని ఇప్పుడు నీకు కష్టం వస్తే నీవు అధైర్య పడుతున్నావు. కష్టం నిన్ను దెబ్బతీస్తే నీవు తల్లడిల్లి పోయావు!
JOB 4:6 నీవు దేవున్ని ఆరాధిస్తూ ఆయన పట్ల నమ్మకంగా ఉన్నావు. కనుక నీవు నీ విశ్వాస్యతను నమ్ముకోవాలి. నీవు నిర్దోషివి కనుక అదే నీకు నిరీక్షణగా ఉండును గాక.
JOB 4:7 యోబూ, ఇప్పుడు దీనిని గూర్చి ఆలోచించు నిర్దోషియైన మనిషి ఎవ్వరూ, ఎన్నడూ నాశనం చేయబడలేదు. మంచి మనుష్యులు ఎన్నడూ నాశనం చేయబడలేదు.
JOB 4:8 కీడు, కష్టం ప్రారంభించే మనుష్యులను నేను గమనించాను. వారికి కూడా అవే సంభవిస్తాయి.
JOB 4:9 దేవుని శ్వాస ఆ మనుష్యులను చంపేస్తుంది. దేవుని కోపం వారిని నాశనం చేస్తుంది.
JOB 4:10 దుర్మార్గులు సింహాలవలె గర్జించి గుర్రు పెడతారు. కాని దేవుడు దుర్మార్దులను నోరు మూయిస్తాడు. మరియు దేవుడు వారి పళ్లు విరుగగొడతాడు.
JOB 4:11 దుర్మార్గులు తినుటకు ఏమి లేని సింహాలవలె ఉంటారు. వారు చస్తారు, వారి పిల్లలు చెదరి పోతారు.
JOB 4:12 “రహస్యంగా నాకు ఒక సందేశం అందించబడింది. ఆ గుసగుసలు నా చెవులు విన్నాయి.
JOB 4:13 రాత్రివేళ వచ్చే ఒక చెడ్డ కలలా అది నా నిద్రను భంగం చేసింది.
JOB 4:14 నేను భయపడి వణకిపోయాను. నా ఎముకలన్నీ వణకిపోయాయి! ఎలీఫజు మాట్లాడుతున్నాడు
JOB 4:15 ఒక ఆత్మ నా ముఖాన్ని దాటిపోగా నా శరీరం మీది వెంట్రుకలు వేగంగా చలించాయి!
JOB 4:16 ఆత్మ ఇంకా నిలిచి ఉంది. కాని అదేమిటో నేను చూడలేకపోయాను. ఒక ఆకారం నా కళ్ల ఎదుట నిలిచింది. నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు నేను ఒక మెల్లని స్వరం చెప్పడం విన్నాను.
JOB 4:17 ‘ఒక మనిషి దేవుని కంటే ఎక్కువ (నీతిమంతుడు)గా ఉండలేడు. మనిషి తనను చేసిన వానికంటే ఎక్కువ పరిశుద్ధంగా ఉండలేడు.
JOB 4:18 దేవుడు తన పరలోకపు సేవకులను కూడా నమ్మలేడు. తన దేవదూతల విషయంలో కూడా దేవుడు తప్పులు పట్టుకోగలడు
JOB 4:19 కనుక దేవుడు మనుష్యుల విషయంలో మరి ఎక్కవ తప్పులు పట్టుకోగలడు. మనుష్యులు మట్టి ఇండ్లలో నివసిస్తారు. ఈ మట్టి ఇండ్లవునాదులు మట్టిలో ఉన్నాయి. వారు చిమ్మెట కంటే తేలికగా చాపగొట్టబడతారు.
JOB 4:20 సూర్వోదయం, సూర్యాస్తమయం మధ్య ఈ మనుష్యులు మరణిస్త్తారు, వారిని ఎవ్వరూ గుర్తించరు. వారు శాశ్వతంగా నశించిపోతారు.
JOB 4:21 వారి గుడారాల తాళ్లు లాగివేయబడతాయి, ఈ మనుష్యులు బుద్ధిలేకుండా చస్తారు.’”
JOB 5:1 “యోబు, నీవు కావాలంటే గట్టిగా పిలువు. కాని నీకు ఎవ్వరూ జవాబు ఇవ్వరు! నీవు ఏ దేవదూతల తట్టూ తిరుగలేవు!
JOB 5:2 తెలివి తక్కువ మనిషి యొక్క కోపం వానినే చంపివేస్తుంది. బుద్ధిహీనుని అసూయ వానినే చంపివేస్తుంది.
JOB 5:3 బాగా వేరూనుకొని, వృద్ధిపొందుతున్న ఒక బుద్ధి హీనుణ్ణి చూశాను. (అతను బలంగా, క్షేమంగా ఉన్నా ననుకొన్నాడు). అయితే అకస్మాత్తుగా వాని ఇల్లు శపించబడింది.
JOB 5:4 ఆ బుద్ధిహీనుని పిల్లలు క్షేమంగా లేరు. (న్యాయ స్థానంలో) వారిని ఆదుకొనేందుకు నగరద్వారం వద్ద ఎవ్వరూలేరు.
JOB 5:5 ఆ బుద్ధిహీనుని పంటలను ఆకలిగొన్న ప్రజలు తీసుకొంటారు. ఆకలిగొన్న ఆ మనుష్యలు ముండ్లలో పెరుగుతున్న ధాన్యపు గింజలను కూడా తీసుకొంటారు. ఆశగలవారు అతని ఐశ్వర్యాన్ని తీసుకొంటారు.
JOB 5:6 చెడ్డ కాలాలు మట్టిలోనుండి రావు. కష్టం నేలలో నుండి పెరగదు.
JOB 5:7 నిప్పులో నుండి రవ్వలు పైకి లేచినంత నిశ్చయంగా మనిషి కష్టం కోసమే పుట్టాడు.
JOB 5:8 “కాని యోబూ, నేనే గనుక నీవైతే నేను దేవుని తట్టు తిరిగి నా సమస్య ఆయనతో చెబుతాను.
JOB 5:9 దేవుడు చేసే ఆశ్చర్యకరమైన వాటిని మనుష్యులెవ్వరు గ్రహించలేరు. దేవుడు చేసే అద్భుతాలకు అంతం లేదు.
JOB 5:10 దేవుడు భూమి మీద వర్షం కురిపిస్తాడు. ఆయన పొలాలకు నీళ్లు పంపిస్తాడు.
JOB 5:11 దీనుడైన మనిషిని దేవుడు లేవనెత్తుతాడు. దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఆయన చాలా సంతోష పరుస్తాడు.
JOB 5:12 తెలివిగల దుర్మార్గులకు విజయం కలుగకుండా దేవుడు వారి పథకాలను వివారిస్తాడు.
JOB 5:13 దేవుడు తెలివిగల మనుష్యులను వారి కుయుక్తి పథకాల్లోనే పట్టేస్తాడు. అందుచేత తెలివిగల మనిషి యొక్క పథకాలు విజయవంతం కావు.
JOB 5:14 పగటివేళ సైతం ఆ తెలివిగల మనుష్యులు చీక టిలో వలె తడబడుతారు. మధ్యాహ్నపు వేళల్లో సైతం రాత్రిపూటలా తడువులాడుతారు.
JOB 5:15 దేవుడు పేద ప్రజలను మరణం నుండి రక్షిస్తాడు. బలవంతుల హస్తాలనుండి పేదలను ఆయనే రక్షిస్తాడు.
JOB 5:16 కనుక పేద ప్రజలకు నిరీక్షణ ఉంది. న్యాయంగా లేని దుర్మార్గులను దేవుడు నాశనం చేస్తాడు.
JOB 5:17 “దేవుడు సరిదిద్దే మనిషి సంతోషంగా ఉంటాడు. కనుక సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను శిక్షించి నప్పుడు, దానిని తోసిపుచ్చకు.
JOB 5:18 దేవుడు చేసిన గాయాలకు ఆయన కట్లు కడతాడు. ఆయనే గాయపరుస్తాడు, కాని ఆయన చేతులే తిరిగి స్వస్థపరుస్తాయి.
JOB 5:19 ఆరు కష్టాలనుండి ఆయన నిన్ను రక్షిస్తాడు; అవును, ఏడు కష్టాల్లో కూడా నీవు బాధించబడవు.
JOB 5:20 కరువు వచ్చినప్పుడు దేవుడు నిన్ను మరణంనుండి రక్షిస్తాడు. యుద్ధంలో దేవుడు నిన్ను మరణం నుండి కాపాడుతాడు.
JOB 5:21 మనుష్యులు వాడిగల తమ నాలుకలతో నిన్ను గూర్చి చెడుగా మాట్లాడినప్పుడు దేవుడు నిన్ను రక్షాస్తాడు. నాశనం వచ్చినప్పుడు నీవు భయ పడాల్సిన పనిలేదు.
JOB 5:22 నాశనం, కరువును చూసి నీవు నవ్వుతావు. అడవి జంతువులను చూసి నీవు భయపడాల్సిన అవసరం లేదు.
JOB 5:23 నీ ఒడంబడిక దేవునితో ఉంది కనుక నీవు దున్నే పొలాల్లో బండలు ఉండవు. మరియు అడవి మృగాలు ఎన్నటికీ నీ మీద పడవు.
JOB 5:24 నీ గుడారం క్షేమంగా ఉంది గనుక నీవు శాంతంగా జీవిస్తావు. నీవు నీ ఆస్తి లెక్కించగా ఏదీ పోయి ఉండదు.
JOB 5:25 నీకు చాలామంది పిల్లలు ఉంటారు. నేలమీద గడ్డి పరకల్లా నీ పిల్లలు చాలామంది ఉంటారు.
JOB 5:26 కోతకాలం వరకు సరిగ్గా పెరిగే గోధుమలా నీవు ఉంటావు. అవును, నీవు పక్వమయిన వృద్ధాప్యం వరకు జీవిస్తావు.
JOB 5:27 “యోబూ, ఈ విషయాలు మేము పరిశీలించాం. అవి సత్యమైనవని మాకు తెలుసు. అందుచేత యోబూ, మేము చెప్పు సంగతులను విని, నీ మట్టుకు నీవే వాటిని తెలుసుకో.”
JOB 6:1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: “నా శ్రమే గనుక తూచబడితే, నా కష్టం అంతా త్రాసులో ఉంచబడితే,
JOB 6:3 సముద్రాల ఇసుక కంటె నా దుఃఖం ఎక్కువ బరువయిందని నీవు గ్రహిస్తావు! అందుకే నా మాటలు వెర్రిగా కనిపిస్తాయి.
JOB 6:4 సర్వశక్రిమంతుడైన దేవుని బాణాలు నాలో ఉన్నాయి. ఈ బాణాల విషం నా ఆత్మ తాగు తుంది. దేవుని దారుణ విషయాలు అన్నీ కలిపినాకు విరోధంగా ఉంచబడ్డాయి.
JOB 6:5 (ఏ చెడుగూ జరగనప్పుడు మాటలాడడం సులభం) అడవి గాడిద తినేందుకు గడ్డి ఉంటే అదేమి గొడవ చెయ్యదు. ఆవుకు ఆహారం ఉంటే అది ఆరోపణ చెయ్యదు.
JOB 6:6 రుచిలేని భోజనం ఉప్పు లేకుండా తినగలమా? గ్రుడ్డులోని తెల్లసొన రుచిలేనిది.
JOB 6:7 (ఇప్పుడు నీ మాటలు వీటివలెనే ఉన్నాయి) దానిని నేను ముట్టుకో వటానికి గూడా ఒప్పుకోను; అలాంటి భోజనం నన్ను జబ్బు మనిషిలా చేస్తుంది.
JOB 6:8 “నేను అడిగింది నాకు దొరకాలని కోరుకుంటాను. నేను దేనికోసం కనిపెట్టుకొని ఉంటానో, దాన్ని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటాను.
JOB 6:9 దేవుడు నన్ను చితకగొట్టేందుకు ఇష్టపడి, నన్ను చంపివేస్తాడని నేను నిరీక్షిస్తున్నాను!
JOB 6:10 ఆయన నన్ను చంపివేస్తే, ఒక్క విషయంలో నేను ఆదరణ పొందుతాను. ఎడతెగని నా బాధల్లోనే నేను ఒక్క విషయంలో సంతోషిస్తాను. పరిశుద్ధుని ఆదేశాలకు విధేయత చూపేందుకు నేను తిరస్కరించలేదు.
JOB 6:11 “నా బలం క్షిణించిపోయింది, గనుక నేను ఇంకా బతుకుతాను అనే ఆశాకిరణం నాకు లేదు. చివరికి నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. అందుచేత నేను సహనంగా ఉండాల్సిన కారణం ఏమీ లేదు.
JOB 6:12 బండలాంటి బలం నాకు లేదు. నా శరీరం కంచుతో చేయబడలేదు.
JOB 6:13 ఇప్పుడు నాకు నేను సహాయం చేసుకొనే శక్తినాకు లేదు. ఎందుకంటే విజయం నా వద్దనుండి తొలగించి వేయబడింది.
JOB 6:14 “ఒక మనిషి కష్టాల్లో ఉంటే, అతని స్నేహితులు అతని మీద దయ చూపాలి. ఒక మనిషి, తన స్నేహితుడు సర్వశక్తిమంతుడైన దేవుని నుండి దూరంగా పోయినా సరే అతడు ఆ స్నేహితునికి నమ్మకంగా ఉండాలి.
JOB 6:15 కానీ, నా సోదరులారా, మీరు నమ్మకస్థులు కారు. నేను మీ మీద ఆధారపడలేదు. ఒక్కొక్కప్పుడు ప్రవహించి, ఒక్కొక్కప్పుడు నిలిచిపోయే కాలు వల్లా ఉన్నారు మీరు.
JOB 6:16 మంచు గడ్డలు కరిగిపోయే హిమం అడ్డుకొన్నప్పుడు పొంగి ప్రవహించే కాలువల్లా ఉన్నారు మీరు.
JOB 6:17 కానీ ఆ కాలువలు ఎండిపోయిన వేళ ప్రవహించవు. వేడిగాలి వీచినప్పుడు నీళ్లు ఉండవు. కాలువలు ప్రవహించవు.
JOB 6:18 వ్యాపారస్థుల బృందాలు వారి మార్గాలలోని మలుపులు కొసలు తిరిగి పనికిమాలిన నేల మీదకు వెళ్లి అక్కడ మరణిస్తారు.
JOB 6:19 తేమా వర్తక బృందాలు నీళ్లకోసం వెదుకుతారు. షేబా ప్రయాణీకులు ఆశగా (నీళ్ల కోసం) చూస్తూరు.
JOB 6:20 నీళ్లు దొరుకునని వారు గట్టిగా నమ్మారు. కానీ ఈసారి వారు అక్కడికి రాగానే నిరాశ చెందారు.
JOB 6:21 ఇప్పుడు మీరూ ఆ కాలువల్లా ఉన్నారు. మీరు సహాయం చేయరు. మీరు నా కష్టాలు చూచి భయపడుతున్నారు.
JOB 6:22 నాకు ఏమైనా ఇవ్వండి, మీ ఐశ్వర్యంలోనుండి నాకు ధనం ఇవ్వండి అని నేను ఎన్నడూ చెప్పలేదు.
JOB 6:23 ‘శత్రువు బలంనుండి నన్ను రక్షించండి. మూర్ఖులైన వారి నుండి నన్ను రక్షించండి’ అని నేను ఎన్నడూ చెప్పలేదు.
JOB 6:24 “కనుక, ఇప్పుడు నాకు నేర్పించండి. నేను నెమ్మదిగా ఉంటాను. నేను ఏమి తప్పు చేశానో నాకు చూపించండి.
JOB 6:25 నిజాయితీ మాటలు శక్తి గలవి. కానీ మీ వాదాలు దేనినీ రుజువు చేయవు.
JOB 6:26 నేను చెప్పే వాటిని మీరు విమర్శిస్తారా? మరింత నిరుత్సాహం కలిగించే మాటలు పలుకుతారా?
JOB 6:27 అవును, తండ్రులు లేని పిల్లలకు చెందిన వాటిని సంపాదించటం కోసం మీరు జూదమైనా సరే ఆడతారు. మీరు మీ స్నేహితుణ్ణి అమ్ముకొంటారు.
JOB 6:28 కానీ, ఇప్పుడు దయచేసి నా ముఖం పరిశీలించండి. నేను మీతో ఆబద్ధం చెప్పను.
JOB 6:29 కనుక ఇప్పుడు మీ మనసు మార్చుకోండి. అన్యాయంగా ఉండవద్దు. అవును, మళ్లీ ఆలోచించండి. నేను తప్పు ఏమీ చేయలేదు.
JOB 6:30 నేను అబద్ధం చెప్పటం లేదు. నా మాటల్లో చెడు ఏమీ లేదు. తప్పు, ఒప్పు నాకు తెలుసు.”
JOB 7:1 యోబు చెప్పాడు, “మనిషికి భూమి మీద కష్టతరమైన సంషుర్షణ ఉంది. అతని జీవితం రోజు కూలివానిదిలా ఉంది.
JOB 7:2 ఒక ఎండ రోజున కష్టపడి పనిచేసిన తర్వాత చల్లటి నీడ కావాల్సిన బానిసలా ఉన్నాడు మనిషి. జీతంరోజు కోసం ఎదురు చూసే కూలివానిలా ఉన్నాడు మనిషి.
JOB 7:3 అదే విధంగా నాకూ నెల తర్వాత నెల ఇవ్వబడు తోంది. ఆ నెలలు శూన్యంతో, విసుగుతో నిండి పోయి ఉంటాయి. శ్రమ రాత్రుళ్లు ఒకదాని వెంట ఒకటి నాకు ఇవ్వబడ్డాయి.
JOB 7:4 నేను పండుకొన్నప్పుడు, ఆలోచిస్తాను, ‘నేను లేచేందుకు ఇంకా ఎంత సమయం ఉంది?’ అనే రాత్రి జరుగుతూనే ఉంటుంది. సూర్యుడు వచ్చేంతవరకు నేను అటూ యిటూ దొర్లుతూనే ఉంటాను.
JOB 7:5 నా శరీరం పురుగులతోనూ, మురికితోనూ కప్పబడింది. నా చర్మం పగిలిపోయి, రసి కారుతూన్న పుండ్లతో నిండిపోయింది.
JOB 7:6 “నేతగాని నాడెకంటె తొందరగా నా దినాలు గతిస్తున్నాయి. నిరీక్షణ లేకుండా నా జీవితం అంతం అవుతుంది.
JOB 7:7 దేవా, నా జీవితం కేవలం ఒక ఊపిరి మాత్రమే అని జ్ఞాపకం చేసుకో. నా కళ్లు మంచిదానిని దేనినీ మరల చూడవు.
JOB 7:8 నీవు నన్ను ఇప్పుడు చూస్తావు. కానీ నన్ను మరల చూడవు. నీవు నాకోసం చూస్తావు. కాని నేను చనిపోయి వుంటాను.
JOB 7:9 ఒక మేఘం కనబడకుండ మాయమవుతుంది. అదేవిధంగా మరణించిన ఒక మనిషి సమాదిలో పాతి పెట్టబడతాడు. మరల తిరిగిరాడు.
JOB 7:10 అతడు తన ఇంటికి ఎన్నటికీ తిరిగిరాడు. అతనిస్థలం అతన్ని ఇంకెంత మాత్రం గుర్తించదు.
JOB 7:11 “అందుచేత నేను మౌనంగా ఉండను. నేను గట్టిగా మాట్లాడతాను. నా ఆత్మ శ్రమ పడుతోంది. నా ఆత్మ వేదనపడుతోంది గనుక నేను ఆరోపణ చేస్తాను.
JOB 7:12 ఓ దేవా, నీ వెందుకు నాకు కాపలా కాస్తున్నావు? నేను ఏమైనా సముద్రాన్నా, లేక సముద్ర రాక్షసినా?
JOB 7:13 నా పడక నాకు విశ్రాంతి నివ్వాలి నా మంచం నాకు విశ్రాంతి, విరామాన్ని ఇవ్వాలి
JOB 7:14 కాని, దేవా! నీవు నన్ను కలలతో భయపె డుతున్నావు. దర్శనాలతో నన్ను భయపెడుతున్నావు.
JOB 7:15 అందుచేత బతకటం కంటె గొంతు నులుమి చంపబడటం నాకు మేలు.
JOB 7:16 నా బదుకు నాకు అసహ్యం. నేను శాశ్వతంగా జీవించాలని కోరను నన్ను ఒంటరిగా ఉండనివ్వు. నా జీవితానికి అర్థం శూన్యం.
JOB 7:17 దేవా, ఎందుకు మనిషి అంటే నీకు ఇంత ముఖ్యం? నీవు అతనిని ఎందుకు గౌరవించాలి? మనిషికి నీవసలు గుర్తింవు ఎందుకు ఇవ్వాలి?
JOB 7:18 నీవు ప్రతి ఉదయం మనిషిని ఎందుకు దర్శిస్తావు, ప్రతిక్షణం ఎందుకు పరీక్షీస్తావు?
JOB 7:19 దేవా, నీవు ఎన్నడూ నన్ను విడిచి అవతలకు ఎందుకు చూడవు? ఒక క్షణమైన నీవు నన్ను, ఒంటరిగా ఉండనియ్యవు?
JOB 7:20 మనుష్యులను గమనించువాడా, నేను పాపం చేశానంటావా, సరే మరి నన్నేం చేయమంటావు? దేవా, గురిపెట్టేందుకు ప్రయోగంగా నీవు నన్నెందుకు ఉపయోగించావు? నేను నీకు ఒక భారమై పోయానా?
JOB 7:21 నీవు నా తప్పిదాలు క్షమించి, నా పాపాలను ఎందుకు క్షమించకూడదు? త్వరలోనే నేను చచ్చి సమాధిలో ఉంటాను. అప్పుడు నీవు నాకోసం వెదకుతావు. నేను పోయి ఉంటాను.”
JOB 8:1 అప్పుడు షూహీ వాడైన బిల్దదు జవాబిచ్చాడు:
JOB 8:2 “ఎన్నాళ్ల వరకు నీవు అలా మాట్లాడతావు? నీ మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి.
JOB 8:3 దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాడు. సక్రమంగా ఉన్నవాటిని, న్యాయాన్ని లేక నీతిని, సర్వ శక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ చెరపడు.
JOB 8:4 నీ పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, ఆయన వారిని శిక్షించాడు. వారు వారి పాపాలకు వెల చెల్లించారు.
JOB 8:5 అయితే యోబూ, ఇప్పుడు దేవుని వైపు చూడు. ఆ సర్వశక్తిమంతునికి ప్రార్థించు.
JOB 8:6 నీవు పరిశుద్ధంగా, మంచివానిగా ఉంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు. మరియు నీ కుటుంబాన్ని, నీ వస్తువులను అయన తిరిగి నీకు ఇస్తాడు.
JOB 8:7 నీకు మొదట ఉన్నదానికంటె ఎక్కువగా వస్తుంది.
JOB 8:8 “వబూ వృద్ధులను అడిగి వారుతమ పూర్వీకుల నుండి ఏమి నేర్చుకొన్నారో తెలుసుకో.
JOB 8:9 ఎందుకంటే మనం నిన్ననే జన్మించినట్టు ఉంటుంది గనుక. మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన జీవితాలు, ఒక నీడలా ఉన్నవి.
JOB 8:10 చాలాకాలం క్రిందట జీవించిన మనుష్యులు నీకు నేర్పిస్తారు. వారి అవగాహనతో వారు నీకు ఒక జ్ఞాన సందేశం ఇస్తారు.
JOB 8:11 “బిల్దదు చెప్పాడు, ఎండిన నేలమీద జమ్ము ఎత్తుగా పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు పెరుగుతుందా?
JOB 8:12 లేదు, నీళ్లు గనుక ఎండిపోతే అవి వెంటనే ఎండి పోతాయి. వాటిని కోసి, ఉపయోగించలేనంత చిన్నవిగా అవి ఉంటాయి.
JOB 8:13 దేవుణ్ణి మరచిపోయే ఏ మనిషైనా సరే ఆ రెల్లులాగానే ఉంటాడు. దేవుణ్ణి మరచిపోయే మనిషికి భవిష్యత్తు ఉండదు.
JOB 8:14 ఆ మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది. ఆ మనిషి నమ్మకం సాలెగూడును పోలివుంటుంది.
JOB 8:15 ఆ మనిషి సాలెగూటిమీద ఆనుకోగా ఆ గూడు తెగిపోతుంది. అతడు సాలెగూటిని పట్టుకొని ఉంటాడు కాని అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు.
JOB 8:16 సమృద్ధిగా నీళ్లు, సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న మొక్కల్లా అతడు ఉంటాడు. ఆ మొక్క కొమ్ములు తోట అంతటా వ్యాపిస్తాయి.
JOB 8:17 అది దాని వేళ్లను బండల చుట్టూరా అల్లి ఆ బండల్లో ఎదిగేందుకు చోటుకోసం చూస్తూ ఉంటుంది.
JOB 8:18 కాని మొక్క దాని చోటునుండి పెరికివేయబడి నప్పుడు అది అక్కడే ఉండేదని ఎవరికీ తెలియదు. ‘నేను ఇంతకు ముందు ఎన్నడూ నిన్ను చూడలేదు’ అని ఆ తోట అంటుంది.
JOB 8:19 కనుక ఆ మొక్కను ఉన్న సంతోషం అంతా అంతే. తర్వాత బురదలోనుంచి ఇతర మొక్కలు పెరుగుతాయి.
JOB 8:20 నిర్దోషియైన మనిషిని దేవుడు విడువడు. చెడ్డ మనుష్యలకు ఆయన సహాయం చేయడు.
JOB 8:21 అప్పటికీ దేవుడు నీ నోటిని నవ్వుతోను, నీ పెదవులను సంతోష ధ్వనులతోను నింపుతాడు.
JOB 8:22 కానీ నీ శత్రవులను దేవుడు సిగ్గుపరుస్తాడు. దుష్టుల గృహాలను ఆయన నాశనం చేస్తాడు.”
JOB 9:1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
JOB 9:2 “అవును, నీవు చెప్పేది సత్యమే అని నాకు తెలుసు. అయితే మానవుడు దేవుని దృష్టిలో ఎలా నిర్దోషిగా ఉండగలడు?
JOB 9:3 ఒక మనిషి దేవునితో వాదించలేడు. దేవుడు వెయ్యి ప్రశ్నలు అడుగవచ్చు. కానీ ఒక్కదానికి కూడా ఏ మనిషీ జవాబు యివ్వలేడు.
JOB 9:4 దేవుని జ్ఞానం లోతైనది, ఆయన శక్తి గొప్పది. దేవునితో పోరాడిన ఏ మనిషీ బాధపడకుండా తప్పించుకోలేడు.
JOB 9:5 దేవుడు పర్వతాలను కదిలిస్తాడు. కాని వాటికి తెలియదు. ఆయనకు కోపం వచ్చినప్పుడు పర్వతాలను తలక్రిందులు చేస్తాడు.
JOB 9:6 భూమిని కంపింప చేయటానికి దేవుడు భూకంపాలను పంపిస్తాడు. భూమి పునాదులను దేవుడు కంపిపజేస్తాడు.
JOB 9:7 దేవుడు సూర్యునితో మాట్లాడి దానిని ఉదయించకుండా చేయగలడు. ప్రకాశించకుండా, నక్షత్రాలకు ఆయన తాళం వేసి పెట్టగలడు.
JOB 9:8 దేవుడే ఆకాశాలను చేశాడు. మహాసముద్ర తరంగాల మీద ఆయన నడుస్తాడు.
JOB 9:9 “స్వాతి, మృగశీర్షము, కృత్తిక అనేవాటిని చేసినవాడు ఆయనే. దక్షిణ ఆకాశాన్ని దాటిపోయే గ్రహాలను ఆయన చేశాడు.
JOB 9:10 మనుష్యులు గ్రహించలేని ఆశ్చర్యకర కార్యాలను దేవుడు చేస్తాడు. దేవుని మహా అద్భుతాలకు అంతం లేదు.
JOB 9:11 దేవుడు నన్ను దాటి వేళ్లేటప్పుడు నేను ఆయనను చూడలేను. దేవుడు పక్కగా వెళ్లేటప్పుడు ఆయన గొప్పతనాన్ని నేను గ్రహించలేను.
JOB 9:12 దేవుడు దేనినై నా తీసివేస్తే, ఏ ఒక్కరూ ఆయన్ని వారించలేరు. ‘ఏమిటి నీవు చేస్తున్నది?’ అని ఎవ్వరూ ఆయనతో అనలేరు.
JOB 9:13 దేవుడు తన కోపాన్ని తగ్గించుకోడు. రాహాబు సహాయకులకు కూడా దేవుడంటే భయం.”
JOB 9:14 యోబు ఇంకా ఇలా చెప్పాడు: “కనుక నేను దేవునితో వాదించలేను. ఆయనతో వాదించేందుకు నేను వాడాల్సిన మాటలు నాకు తెలియవు.
JOB 9:15 యోబు అనే నేను నిర్దోషిని. కానీ ఆయనకు నేను జవాబు ఇవ్వలేను. నా న్యాయమూర్తిని (దేవుని) ప్రాధేయపడడం మాత్రమే నేను చేయగలిగింది అంతా.
JOB 9:16 ఒకవేళ నేను ఆయనకు మొరపెట్టినా, ఆయన జవాబిచ్చినా, దేవుడు నా ప్రార్థన విన్నాడని నేను నమ్మను.
JOB 9:17 నన్ను అణచివేయటానికి దేవుడు తుఫానులు పంపిస్తాడు. ఏ కారణం లేకుండానే ఆయన నాకు ఇంకా ఎక్కువ గాయాలు కలిగిస్తాడు.
JOB 9:18 దేవుడు నన్ను మళ్లీ శ్వాస పీల్చనీయడు. ఆయన నన్ను ఇంకా ఎక్కువ కష్టపెడతాడు.
JOB 9:19 నేను దేవుణ్ణి ఓడించలేను. దేవుడు శక్తిమంతుడు. దేవుని న్యాయస్థానానికి వెళ్లి నాకు న్యాయం చేకూర్చేటట్టు నేను చేయలేను. దేవుణ్ణి న్యాయస్థానానికి రమ్మని ఆయనను ఎవరు బలవంతం చేస్తారు?
JOB 9:20 యోబు అనే నేను నిర్దోషిని, కాని నేను చెప్పే మాటలు నేను దోషిలా కనబడేటట్టు చేస్తాయి. కనుక, నేను నిర్దోషిని, కాని నా నోరు నేను దోషిని అని ప్రకటిస్తుంది.
JOB 9:21 నేను నిర్దోషిని, కాని నన్ను గూర్చి నేను లక్ష్య పెట్టను. నా సోంత జీవితం నాకు అసహ్యం.
JOB 9:22 జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కనుక ‘దేవుడు నిర్దోషులను, దుర్మార్గులను కూడా నాశనం చేస్తాడు’ అని నేను తలస్తాను.
JOB 9:23 ఏదో ఒక దారుణం జరిగి ఒక నిర్దోషి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అతని శ్రమను చూసి దేవుడు నవ్వుతాడు.
JOB 9:24 భూమిని దుర్మార్గుడు చేజిక్కించుకున్నప్పుడు దేవుడు న్యాయమూర్తులను గుడ్డివాళ్లను చేస్తాడా? ఇది దేవుడు చేయకపోతే ఇంకెవరు చేశారు?
JOB 9:25 “పరుగెత్తేవాని కంటె వేగంగా నా రోజులు గడిచి పోయాయి. నా రోజులు ఎగిరిపోతున్నాయి, వాటిలో సంతోషం లేదు.
JOB 9:26 జమ్ము పడవలు పోయేలా నా రోజులు వేగంగా పోతున్నాయి. పక్షిరాజులు తాము పట్టుకొన్న జంతువుల మీదికి దూసుకు వచ్చినట్టుగా నా రోజులు వేగంగా గడిచి పోతున్నాయి.
JOB 9:27 “నేను ఆరోపణలు చేయను, ‘నేను నా బాధ మరచిపోతాను, నా ముఖం మార్చుకొని, నవ్వుతూ ఉంటాను’ అని ఒక వేళ నేను చెప్పినా,
JOB 9:28 నాకు నా శ్రమ అంతటిని గూర్చి ఇంకా భయమే. ఎందుకంటే నేను దోషిని అని దేవుడు ఇంకా చెబుతున్నాడని నాకు తెలుసు గనుక.
JOB 9:29 నేను దోషిని అని ఇది వరకే తీర్పు తీర్చబడింది. కనుక నేను ఇంకా ఎందుకు వ్రయత్నిస్తూ ఉండాలి. పోనీ దానిని, ‘మర్చిపో’ అని అంటాను నేను.
JOB 9:30 మంచుతో నన్ను నేను కడుగుకొన్నా, సబ్బుతో నేను నా చేతులు కడుగుకొన్నా
JOB 9:31 దేవుడు నన్ను చావు గోతిలొ పడవేస్తాడు. అప్పుడు నా వస్త్రాలే నన్ను ద్వేషిస్తాయి.
JOB 9:32 దేవుడు నాలా మనిషి కాడు. అందుకే నేను ఆయనకు జవాబు ఇవ్వలేను. న్యాయస్థానంలో మేము ఒకరి నొకరం కలుసుకొలేం.
JOB 9:33 మాకు మధ్య నిలబడేందుకు ఎవరైనా ఉంటే బాగుండును. మా ఇద్దరికీ న్యాయంగా తీర్పు తీర్చేవారు ఎవరైనా ఉంటే బాగుండును.
JOB 9:34 దేవుని శిక్షా దండాన్ని తీసువేసుకొనే వారు ఎవరైనా ఉంటే బాగుండును. అప్పుడు దేవుడు నన్ను ఇంకెంత మాత్రము భయపెట్టడు.
JOB 9:35 అప్పుడు నేను దేవునికి భయపడకుండా నేను చెప్పదలచుకొన్నది చెప్పగలుగుతాను. కానీ ఇప్పుడు నేను అలా చేయలేను.
JOB 10:1 “నా స్వంత జీవితం నాకు అసహ్యం. అందు చేత నేను స్వేచ్ఛగా ఆరోపణలు చేస్తాను. నా ఆత్మ చాలా వేదనగా ఉంది కనుక ఇప్పుడు నేను మాట్లాడతాను.
JOB 10:2 నేను దేవునితో చెబుతాను, ‘నన్ను నిందించవద్దు. నేను ఏమి తప్పు చేశాను, నాకు చెప్పు. నా మీద నీకు ఎందుకు విరోధం?
JOB 10:3 దేవా, నీవు నన్ను ఇలా చులకనగా చూడటం నీకు సంతోషమా? చూస్తుంటే, నీవు చేసిన దాని గూర్చి నీకు శ్రద్ధ లేనట్లుంది. దుర్మార్గులు వేసే పథకాలకు నీవు సంతోషిస్తున్నావా?
JOB 10:4 దేవా, నీకు మానవ నేత్రాలు ఉన్నాయా? మనుష్యులు చూసినట్టుగా నీవు సంగతులు చూస్తున్నావా?
JOB 10:5 మా రోజుల్లాగ మీవి కొద్దిపాటి రోజులా? మా సంవత్సరాల్లా మీవి కొన్ని సంవత్సరాలేనా?
JOB 10:6 నీవు నా తప్పుకోసం చూస్తూ నాపాపం కోసం వెదకుతున్నావు.
JOB 10:7 కానీ నేను నిర్దోషిని అని నీకు తెలుసు. అయితే నీ శక్తినుండి నన్ను ఎవ్వరూ రక్షించలేరు!
JOB 10:8 దేవా, నీ చేతులు నన్ను చేశాయి, నా శరీరాన్ని తీర్చిదిద్దాయి. కానీ ఇప్పుడు నీవే నన్ను నాశనం చేస్తున్నావు.
JOB 10:9 దేవా, నీవు నన్ను మట్టిలా చేసావని జ్ఞాపకం చేసుకో. కానీ, నీవు ఇప్పుడు నన్ను మరల మట్టిగా ఎందుకు మారుస్తున్నావు?
JOB 10:10 పాలు ఒలుకబోసినట్టుగా నీవు నన్ను సోస్తున్నావు. నన్ను వెన్న చిలకరించినట్లుగా చేస్తున్నావు.
JOB 10:11 ఎముకల్ని, మాంసాన్ని ఒకటిగా కలిపి నీవు నన్ను చేశావు. తర్వాత చర్మంతో, మాంసంతో నీవు నన్ను కప్పివేశావు.
JOB 10:12 నీవు నాకు జీవం ఇచ్చావు. నాకు చాలా దయ చూపించావు. నా విషయమై నీవు శ్రద్ధ చూపించావు. నా ఆత్మను కాపాడావు.
JOB 10:13 కానీ నీవు నీ హృదయంలో దాచుకొన్నది ఇది. నీ హృదయంలో నీవు రహస్యంగా తలపెట్టింది ఇదేనని నాకు తెలుసు. అవును, నీ మనసులో ఉన్నది ఇదేనని నాకు తెలుసు.
JOB 10:14 ఒకవేళ నేను పాపం చేస్తే, నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించవచ్చునని నీవు నన్ను గమనిస్తూ ఉంటావు.
JOB 10:15 నేను పాపం చేసినప్పుడు, నేను దోషిని. అది నాకు చాలా చెడు అవుతుంది. కానీ నేను నిర్దోషిని అయినా సరే, నేను నా తల ఎత్తుకోలేను. ఎందుకంటే, నేను సిగ్గుతో, బాధతో నిండిపోయాను గనుక.
JOB 10:16 ఒకవేళ నాకు జయం కలిగి నేను అతిశయిస్తోంటే ఒకడు సింహాన్ని వేటాడినట్టు నీవు నన్ను వేటాడుతావు. నీవు మరోసారి నా మీద నీ శక్తి చూపిస్తావు.
JOB 10:17 నాకు విరోధంగా సాక్ష్యం చెప్పేందుకు నీకు ఎల్లప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు. నామీద నీ కోపం ఎక్కువ అవుతుంది. నీవు నా మీదికి కొత్త సైన్యాలను పంపిస్తావు.
JOB 10:18 అందుచేత, దేవా అసలు నీవు నన్ను ఎందుకు పుట్టనిచ్చావు? నన్ను ఎవరూ చూడక ముందే నేను మరణించి ఉంటే ఎంత బాగుండేది.
JOB 10:19 నేను ఎన్నడూ ఒక మనిషిని కాకుండా ఉంటే బాగుండును. నేను నా తల్లి గర్భం నుండి తిన్నగా సమాధికి మోసికొనిపోబడితే ఎంత బాగుండేది.?
JOB 10:20 నా జీవితం దాదాపు అయిపోయింది. కనుక నన్ను ఒంటరిగా వదిలెయ్యి. ఏదో కొద్దిపాటి వసతుల్ని అనుభవించనివ్వు.
JOB 10:21 ఏ చోటునుండి అయితే ఎవ్వరూ ఎన్నడూ తిరిగిరారో, అంధకారం, మరణం ఉండే ఆ చోటుకు నేను వెళ్లక ముందు, నాకు మిగిలి ఉన్న కొద్ది సమయం నన్ను అనుభవించనివ్వు.
JOB 10:22 ఎవ్వరూ చూడలేని, అంధకార ఛాయల, గందరగోళ స్థలానికి నేను వెళ్లకముందు నన్ను అనుభవించ నివ్వు. అక్కడ వెలుగు కూడా చీకటిగా ఉండి ఉంటుంది.’”
JOB 11:1 అప్పుడు నయమాతీ దేశపువాడైన జోఫరు యోబుకు జవాబిచ్చాడు:
JOB 11:2 “ఈ మాటల ప్రవాహానికి జవాబు ఇచ్చి తీరాల్సిందే! ఈ వాగుడు అంతా కలిసి, యోబు చెప్పింది సరే అనిపిస్తోందా? లేదు.
JOB 11:3 యోబూ, నీకు చెప్పేందుకు మా పద్ద జవాబు లేదనుకొంటున్నావా? నీవు దేవునిగూర్చి నవ్వి నప్పుడు, నిన్ను ఎవ్వరూ హెచ్చరించరు అనుకొంటున్నావా?
JOB 11:4 యోబూ! నీవు దేవునితో, ‘నా నమ్మకాలు సరి యైనవే, కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే’ అని చెబుతున్నావు.
JOB 11:5 యోబూ! దేవుడే నీకు జవాబిచ్చి, నీవు చేసేది తప్పు అని చెబితే బాగుండును అని నేను ఆశిస్తున్నాను.
JOB 11:6 అప్పుడు జ్ఞాన రహస్యాలు దేవుడు నీతో చెప్పగలడు. ప్రతి విషయానికీ, నిజంగా రెండు వైపులు ఉంటాయని ఆయన నీతో చెబుతాడు. అది నిజమైన జ్ఞానం! యోబూ! ఇది తెలుసుకో: దేవుడు నిన్ను నిజంగా శిక్షించాల్సిన దానికంటె తక్కువగానే శిక్షిస్తున్నాడు.
JOB 11:7 “యోబూ, దేవుని రహస్య సత్యాలను నీవు గ్రహించగలవా? సర్వశక్తిమంతుడైన దేవుని గొప్పదనాన్నీ, శక్తినీ చూపించే హద్దులను నీవు గ్రహించలేవు.
JOB 11:8 అతని జ్ఞానం ఆకాశమంత ఎత్తయినది! ఆ హద్ధులు సమాధి లోతులకంటె లోతైనవి. కానీ, అది నీవు గ్రహించలేవు!
JOB 11:9 దేవుడు భూమికంటే గొప్పవాడు, సముద్రంకంటే పెద్దవాడు.
JOB 11:10 “దేవుడు ఒకవేళ నిన్ను బంధిస్తే, నిన్ను న్యాయ స్థానానికి తీసుకొనివస్తే, ఏ మనిషీ ఆయనను వారించలేడు.
JOB 11:11 నిజంగా, ఎవరు పనికిమాలిన వాళ్లో దేవునికి తెలుసు. దేవుడు దుర్మార్గాన్ని చూసినప్పుడు, ఆయన దానిని జ్ఞాపకం ఉంచుకొంటాడు.
JOB 11:12 ఒక అడవి గాడిద ఎలాగైతే ఒక మనిషికి జన్మ ఇవ్వలేదో, అలాగే బుద్ధిహినుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు.
JOB 11:13 అయితే యోబూ! దేవుణ్ణి మాత్రమే సేవించటానికి, నీవు నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆయన తట్టు నీవు నీ చేతులు ఎత్తి ఆరాధించాలి.
JOB 11:14 నీ ఇంట్లో ఉన్న పాపం నీవు తొలగించి వేయాలి. నీ గుడారంలో చెడు నివాసం చేయనియ్యకు.
JOB 11:15 అప్పుడు నీవు సిగ్గుపడకుండా దేవుని తట్టు నిశ్చలంగా చూడగలుగుతావు. నీవు బలంగా నిలబడతావు. భయపడవు.
JOB 11:16 యోబూ! అప్పుడు నీవు నీ కష్టం మరచిపోగలవు. నీ కషాలను దొర్లిపోయిన నీళ్లలా నీవు జ్ఞాపకం చేసుకొంటావు.
JOB 11:17 అప్పుడు మధ్యాహ్నపు సూర్యకాంతి కంటె నీ జీవితం ఎక్కువ ప్రకాశమానంగా ఉంటుంది. జీవితపు గాఢాంధకార ఘడియలు సూర్యోదయంలా ప్రకాశిస్తాయి.
JOB 11:18 యోబూ! నిరీక్షణ ఉంది గనుక నీవు క్షేమంగా ఉంటావు. దేవుడు నిన్ను సురక్షితంగా వుంచి నీకు విశ్రాంతినిస్తాడు.
JOB 11:19 నీవు విశ్రాంతిగా పండుకొంటావు. నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, బాధించరు. మరియు అనేక మంది నీ సహాయం వేడుకొంటారు.
JOB 11:20 కానీ, చెడ్డవాళ్లు సహాయం కోసం చూస్తారు, అయితే ఆశ ఏమి ఉండదు. వారు వారి కష్టాలు తప్పించుకోలేరు. వారు చస్తారు అనేది ఒక్కటే వారికి ఉన్న ఆశ.”
JOB 12:1 అప్పుడు యోబు జోఫరుకు ఇలా జవాబు ఇచ్చాడు:
JOB 12:2 “సందేహము లేకుండ, మీరు మాత్రమే జ్ఞానం గల వాళ్లని మీరు తలస్తారు. మీరు చనిపోయినప్పుడు మీతో బాటు జ్ఞానం గతిస్తుందని మీరు తలస్తారు.
JOB 12:3 అయితే మీరు ఎంత జ్ఞాలంగలవాళ్లో నేనూ అంత జ్ఞానంగలవాడిని. నేను మీకంటే తక్కువేమి కాదు. ఇది సత్యం అని ఇతరులకు కూడా తెలుసు.
JOB 12:4 “ఇప్పుడు నా స్నేహితులు నన్ను చూసి నవ్వుతారు. వారిలా అంటారు: ‘వీడు దేవుణ్ణి ప్రార్థించాడు. వీనికి ఆయన జవాబు ఇచ్చాడు.’ కానీ నేను మంచివాణ్ణి, నిర్దోషిని. అయినప్పటికీ ఇంకా నన్ను చూసి నా స్నేహితులు నవ్వుతూనే ఉన్నారు.
JOB 12:5 కష్టాలు లేని మనుష్యులు కష్టాలు ఉన్న వాళ్లను హేళన చేస్తారు. అలార టి వాళ్లు పడిపోతున్న వాళ్లను కొట్టేస్తారు
JOB 12:6 దొంగల గుడారాలకు ఇబ్బంది లేదు. దేవునికి కోపం రప్పించే వాళ్లు శాంతిగా జీవిస్తారు. వారి ఒకే దేవుడు వారి స్వంత బలమే.
JOB 12:7 “అయితే జంతువుల్ని అడగండి, అవి మీకు నేర్పిస్తాయి. లేక ఆకాశ పక్షుల్ని అడగండి, అవి మీకు నేర్పిస్తాయి.
JOB 12:8 లేక భూమితో మాట్లాడండి, అది మీకు నేర్పిస్తుంది. లేక సముద్రపు చేపలను వాటి జ్ఞానం గూర్చి మీతో చెప్పనివ్వండి.
JOB 12:9 వాటిని యెహోవా సృష్టించాడని ప్రతి ఒక్కరికీ తెలుసు.
JOB 12:10 బతికి ఉన్న ప్రతి జంతువూ శ్వాస పీల్చే ప్రతి మనిషీ దేవుని శక్తి క్రిందనే.
JOB 12:11 భోజనం రుచి చూడడం నాలుకకు ఎంత ఆనందమో చెవులు అని వినే మాటలను పరీక్షించవా:
JOB 12:12 ముసలి వాళ్లకు కూడా జ్ఞానం ఉంది. దీర్షాయుష్షు అవగాహన కలిగిస్తుంది. అని మేము అన్నాము.
JOB 12:13 జ్ఞానం, బలం దేవునికి చెందుతాయి. మంచి సలహా మరియు గ్రహింపు ఆయనవే.
JOB 12:14 ఒక వేళ దేవుడు దేనినైనా పడగొడితే మనుష్యులు దాన్ని తిరిగి నిర్మించలేరు. ఒక వేళ దేవుడు ఒక మనిషిని చెరసాలలో పెడితే మనుష్యులు అతనిని విడుదల చేయలేరు.
JOB 12:15 ఒక వేళ దేవుడు గాని వర్షాన్ని ఆపివేస్తే భూమి ఎండి పోతుంది. ఒక వేళ దేవుడు గాని వర్షాన్నిరానిస్తే అది భూమిని వరదతో నింపివేస్తుంది.
JOB 12:16 దేవుడు బలవంతుడు, ఆయన ఎల్లప్పుడూ గెలుస్తాడు. మోసపోయిన వాడు మోసం చేసిన వారూ ఇద్దరూ దేవునికి చెందిన వారే.
JOB 12:17 రాజుల జ్ఞానమును దేవుడు తీసి వేస్తాడు. నాయకులు వెర్రిగా వ్రవర్తించేటట్టు చేస్తాడు.
JOB 12:18 రాజులు వారి బందీలకు గొలుసులు వేస్తారు. కాని దేవుడు వాటిని తీసివేస్తాడు. అప్పుడు దేవుడు ఆ రాజుల మీద నడికట్టు వేస్తాడు.
JOB 12:19 తన వంశాన్ననుసరించి రక్షణ ఉందనుకొనే యాజకుల బలాన్ని దేవుడు అణచి, వాళ్లను క్రిందికి దిగజారేటట్లు చేస్తాడు.
JOB 12:20 నమ్మకమైన సలహాదారులను దేవుడు నిశ్శబ్దం చేస్తాడు. వృద్ధుల జ్ఞానమును ఆయన తీసివేస్తాడు.
JOB 12:21 నాయకులను అప్రముఖులనుగా చేస్తాడు. పాలకుల బలాన్ని ఆయన తీసివేస్తాడు.
JOB 12:22 లోతైన అంధకారంలో నుండి రహస్య సత్యాలను దేవుడు చూపిస్తాడు. మరణం లాంటి చీకటి గల స్థలాలలోనికి ఆయన వెలుగు పంపిస్తాడు.
JOB 12:23 దేవుడు రాజ్యాలను పెద్దవిగా, శక్తిగలవిగా విస్తరింపజేస్తాడు. అప్పుడు ఆయన వాటిని నాశనం చేస్తాడు. ఆయన రాజ్యాలను పెద్దనిగా పెరగనిస్తాడు. అప్పుడు ఆ రాజ్యాల్లోని ప్రజలను ఆయన చెదర గొడతాడు.
JOB 12:24 భూలోక నాయకులను వెర్రివార్ని గాను అర్థం చేసుకోలేని వార్ని గాను దేవుడు చేస్తాడు. మార్గం లేని అరణ్యంలో సంచరించేందుకు ఆయన వారిని పంపిస్తాడు.
JOB 12:25 ఆ నాయకులు చీకటిలో ముందుకు సాగుతారు. వారికి ఏ వెలుగూ లేదు. వారు తాగుబోతుల్లా నడిచేటట్టు దేవుడు వారిని చేస్తాడు.”
JOB 13:1 యోబు ఇలా అన్నాడు: “ఇదంతా ఇదివరకే నా కళ్లు చూశాయి. మీరు చెప్పేది అంతా నేను ఇదివరకే విన్నాను. అదంతా నేను గ్రహించాను.
JOB 13:2 మీకు తెలిసింది అంతా నాకు తెలుసు. నేను మీకంటే తక్కువ కాదు.
JOB 13:3 కానీ (మీతో వాదించటం నాకు ఇష్టం లేదు) సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలిని నేను కోరు తున్నాను. నా కష్టాల గూర్చి నేను దేవునితో వాదించాలని కోరుతున్నాను.
JOB 13:4 కానీ, మీరు ముగ్గురూ మీ అజ్ఞానాన్ని అబద్ధాలతో కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరినీ బాగుచేయలేని పనికిమాలిన వైద్యుల్లా మీరు ఉన్నారు.
JOB 13:5 మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటే బాగుండేది. అది మీరు చేయగలిగిన అతి జ్ఞానంగల పని.
JOB 13:6 “ఇప్పుడు, నా వాదం వినండి. నేను నా విన్నపం చెబుతుండగా, వినండి
JOB 13:7 మీరు దేవుని కోసం అబద్ధాలు చెబుతున్నారా? మీరు చెప్పాలని దేవుడు కోరుతున్నవి మీరు చెప్పు తున్నవి అబద్ధాలే అని మీరు నిజంగా నమ్ము చున్నారా?
JOB 13:8 మీరు నాకు విరోధంగా దేవుని ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్నారా? న్యాయస్థానంలో మీరు దేవుని ఆదుకొంటారా?
JOB 13:9 దేవుడు మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలిస్తే ఆయనకు మంచి ఏమైనా కనబడుతుందా? మీరు మనుష్యులను మోసం చేసినట్టే దేవునిని కూడా మోసం చేయగలమని నిజంగా అనుకొంటున్నారా?
JOB 13:10 మీరు కనుక న్యాయస్థానంలో ఒకరి పక్షం వహించాలని రహస్యంగా నిర్ణయిస్తే దేవుడు విజంగా మిమ్మల్ని గద్దిస్తాడు.
JOB 13:11 దేవుని ప్రభావం మిమ్మల్ని భయపెట్టేస్తుది. ఆయన్ను చూచి మీరు భయపడతారు.
JOB 13:12 (మీరు తెలివిగానూ, జ్ఞానంగానూ మాట్లాడు తున్నాం అనుకొంటారు). కానీ మీ మాటలు బూడిదలా పనికిమాలినవే. మీ వాదాలు మట్టిలా బలహీనమైనవే.
JOB 13:13 “నిశ్శబ్దంగా ఉండి, నన్ను మాట్లాడనివ్వండి. అప్పుడు నాకు ఏం జరగాల్సి ఉందో అది జరగ నివ్వండి.
JOB 13:14 నాకు నేను అపాయంలో చిక్కుకొనుచున్నాను, నా ప్రాణం నా చేతుల్లోకి తీసుకొంటున్నాను.
JOB 13:15 దేవుడు నన్ను చంపివేసినా సరే నేనాయన్ని నమ్ముతూనే వుంటాను. ముఖాముఖిగా, ఆయన ముందు నా విధానాలను రుజువు చేస్తాను.
JOB 13:16 కాని దేవుని ఎదుట నేను ధైర్యంగా ఉన్నాను, గనుక ఒక వేళ ఆయన నన్ను రక్షిస్తాడేమో. చెడ్డ మనిషీ ఎవ్వరూ దేవుణ్ణి ముఖాముఖిగా కలుసు కోడానికి సాహసించరు.
JOB 13:17 నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వివరిస్తూండగా నీ చెవులను విననివ్వవు.
JOB 13:18 ఇప్పుడు నన్ను నేను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను జాగ్రత్తగా నా వాదనలను మీ ముందు ఉంచుతాను. నాదే సరి అని నాకు చూపించబడుతుంది అని నాకు తెలుసు.
JOB 13:19 నాది తప్పు అని ఏ మనిషీ రుజువు చేయలేడు. అలా ఎవరైనా చేయగలిగితే నేను మౌనంగా ఉండి మరణిస్తాను.
JOB 13:20 “దేవా, కేవలం రెండు సంగతులు నాకు దయ చేయుము. అప్పుడు నేను నీవద్ద దాగుకొనను.
JOB 13:21 నన్ను శిక్షించడము ఆపివేయి. నీ భయాలతో నన్ను బెదిరించకు.
JOB 13:22 అప్పుడు నన్ను పిలువు, అప్పుడు నేను నీకు జవాబు ఇస్తాను. లేదా నన్ను నీతో మాట్లాడనివ్వు. నీవు నాకు జవాబు ఇవ్వు.
JOB 13:23 నేను ఎన్ని పాపాలు చేశాను? నేను ఏం తప్పు చేశాను? నా పాపాలు, నా తప్పులు నాకు చూపించు.
JOB 13:24 దేవా, నీవు నన్ను ఎందుకు తప్పిస్తున్నావు? నన్ను నీ శత్రువులా ఎందుకు చూస్తూన్నావు?
JOB 13:25 నీవు నన్ను బెదిరించటానికి ప్రయత్నిస్తున్నావా? నేను (యోబు) గాలి చెదరగొట్టే ఒక ఆకును. ఎండిపోయిన ఒక చిన్న గడ్డిపరక మీద నీవు దాడిచేస్తున్నావు.
JOB 13:26 దేవా, నా మీద నీవు కఠినమైన మాటలు పలుకుతున్నావు. నేను యువకునిగా ఉన్నప్పుడు చేసిన పాపాలకు నీవు నన్ను శ్రమ పెడుతున్నావు. జోఫరుకు యోబు జవాబు
JOB 13:27 నా సాదాలకు నీవు గొలుసులు వేశావు. నేను వేసే ప్రతి అడుగూ నీవు జాగ్రత్తగా గమనిస్తున్నావు. నా అడుగలను నీవు తక్కువ చేస్తున్నావు.
JOB 13:28 అందుచేత కుళ్లిపోయిన దానిలా, చిమ్మెటలు తిని వేసిన గుడ్డ పేలికలా నేను నిష్ప్రయోజనం అయిపోతున్నాను.”
JOB 14:1 యోబు ఈ విధంగా చెప్పాడు: “మనమందరం కష్టంతో నిండిన కొద్దిపాటి జీవితం కోసమేపుట్టాం.
JOB 14:2 మనిషి జీవితం పువ్వులాంటిది. అతడు త్వరగా పెరిగి, తర్వత చస్తాడు. కొంచెం సేపు ఉండి, ఆ తర్వాత ఉండని నీడలాంటిది మనిషి జీవితం.
JOB 14:3 దేవా, నీవు అలాంటి మనిషిని గమనిస్తావా? నీతో తీర్పు పొందటానికి నన్ను నీ ముందుకు తీసుకొనిరమ్ము.
JOB 14:4 “మురికి దానిలొ నుండి శుభ్రమైన దాన్ని ఎవరు తీయగలరు? ఎవ్వరూ తీయలేరు.
JOB 14:5 నరుని జీవితం పరిమితం. దేవా, నరుని మాసాల సంఖ్య నీవు నిర్ణయం చేశావు. నరుడు మార్చజాలని హద్దులు నీవు ఉంచావు.
JOB 14:6 కనుక దేవా, నరునికి దూరంగా చూడు. వానిని ఒంటరిగా విడిచిపెట్టు. అతని కాలం తీరేవరకు అతని కష్టజీవితం అతణ్ణి అనుభవించనివ్వు.
JOB 14:7 “అయితే ఒక చెట్టుకు నీరీక్షణ ఉంది. దాన్ని నరికివేస్తే, అది మరల పెరుగుతుంది. అది కొత్త కొమ్మలు వేస్తూనే ఉంటుంది.
JOB 14:8 భూమిలో దాని వేర్లు పాతవైపోవచ్చును. దాని మొద్దు మట్టిలో చీకిపోవచ్చును.
JOB 14:9 కానీ నీళ్లు ఉంటే అది కొత్త చిగుళ్లు వేస్తుంది. మొక్కల్లా అది కొమ్మలు వేస్తుంది.
JOB 14:10 అయితే మనిషి మరణిస్తాడు. అతని శరీరం పాతి పెట్టబడుతుంది. మనిషి చనిపోయినప్పుడు, అతుడు వెళ్లిపోయాడు.
JOB 14:11 సముద్రంలో నీరు ఇంకిపోయినట్టు, ఒక నది నీరు ఎండిపోయినట్టు
JOB 14:12 సరిగ్గా అదే విధంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతడు పండుకొని, మళ్లీ లేవలేడు. మరణించే మనుష్యులు, ఆకాశాలు ఉండకుండా పోయేంత వరకు మేల్కొనరు, నిద్రించటం మానుకోరు.
JOB 14:13 “మీరు నన్ను నా సమాధిలో దాచిపెడితే బాగుండునని నా (యోబు) ఆశ. నీ కోపం పోయేవరకు, నీవు నన్ను అక్కడ దాచిపెడితే బాగుండు ననిపిస్తుంది నాకు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనేందుకు నీవు ఒక సమయాన్ని ఏర్పరచు కోవచ్చు
JOB 14:14 ఒక మనిషి మరణిస్తే, అతడు మరల బతుకుతాడా? నేను వేచి ఉంటాను, నేను విడుదల అయ్యేంత వరకు కష్టపడి పోరాడుతాను.
JOB 14:15 దేవా, నీవు నన్ను పిలుస్తావు, నేను (యోబు) నీకు జవాబు ఇస్తాను. నన్ను నీవు చేశావు, నన్ను నీవు కోరుతావు
JOB 14:16 అప్పుడు నేను వేసే ప్రతి అడుగూ నీవు గమనిస్తావు. కానీ, నేను చేసిన పాపాలు నీవు జ్ఞాపకం చేసుకోవు.
JOB 14:17 నీవు నా పాపాలు ఒక సంచిలో కట్టివేసి, దూరంగా పారవేయి.
JOB 14:18 “సరిగ్గా ఒక పర్వతం కూలిపోయినట్టు ఒక బండదాని స్థలం నుండి తొలగించబడినట్టు
JOB 14:19 నీళ్లు రాళ్లను కడిగివేసి వాటిని అరగ దీసినట్టు, నీళ్లు నేలమీద మట్టిని కొట్టుకుపోవునట్లు, అదే విధంగా, దేవా నీవు ఒక మనిషి ఆశను నాశనం చేస్తావు.
JOB 14:20 నీవు మనిషిని ఒకసారి ఓడించి ముగిస్తే మనిషి పోయినట్టే. నీవు వాని ముఖాన్ని చావు ముఖంగా మార్చివేసి శాశ్వతంగా వానిని పంపించివేస్తావు.
JOB 14:21 వాని కుమారులు గౌరవించబడినా అది ఎన్నటికీ అతనికి తెలియదు. అతని కుమారుడు చెడు చేస్తే అతడు ఎన్నటికీ దానిని చూడడు.
JOB 14:22 మనిషి తన స్వంత శరీరంతో బాధ అనుభవిస్తాడు. అతడు తన కోసమే ఎక్కువగా దుఃఖిస్తాడు.”
JOB 15:1 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు యోబుకు జనాబిచ్చాడు:
JOB 15:2 “యోబూ! నీవు నిజంగా జ్ఞానం గలవాడవైతే నీవు వట్టి మాటలతో జవాబు ఇవ్వవు. జ్ఞానం గల మనిషి పూర్తిగా తూర్పు వేడిగాలి (పనికిమాలిన మాటల) తో ఉండడు.
JOB 15:3 జ్ఞానం గల మనిషి పనికిమాలిన మాటలతో, అర్థం లేని ఉపన్యాసాలతో వాదిస్తాడని నీవు తలుస్తావా?
JOB 15:4 యోబూ! నీ యిష్టం వచ్చినట్టు నీవు ఉంటే ఎవ్వరూ దేవుణ్ణి గౌరవించరు, ఆయన్ని ప్రార్థించరు. దేవుని సన్నిధియందు చేసే ధ్యానానికి నీవు ఆటంకం తెస్తావు.
JOB 15:5 నీవు చెప్పే విషయాలు నీ పాపాన్ని తేటగా చూపిస్తాయి. యోబూ! నీవు తెలివిగల మాటలు ప్రయోగించి నీ పాపాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నావు.
JOB 15:6 నీది తప్పు అని నేను నీకు రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీ స్వంత నోటితో నీవు పలికే విషయాలే నీ తప్పును తెలియ జేస్తున్నాయి. నీ స్వంత పెదాలు నీకు విరోధంగా మాట్లాడుతున్నాయి.
JOB 15:7 “యోబూ! మొట్ట మొదట పుట్టింది నీవే అని తలుస్తున్నావా? కొండలు చేయబడక ముందే నీవు జన్మించావా?
JOB 15:8 దేవుని రహస్య పథకాలు నీవు విన్నావా? నీ మట్టుకు నీవు ఒక్కడవు మాత్రమే జ్ఞానం గలవాడవని తలుస్తున్నావా?
JOB 15:9 యోబూ! నీకు తెలిసిన దానికంటే మాకు ఎక్కువ తెలుసు. నీవు గ్రహించలేని విషయాలు మేము గ్రహిస్తాం.
JOB 15:10 తల నెరసిన మనుషులు మరియు వృద్ధులు మాతో ఏకీభవిస్తారు. అవును, చివరికి నీ తండ్రీకంటే పెద్ద వాళ్లు కూడా మా పక్షంగా ఉన్నారు.
JOB 15:11 దేవుడు నిన్ను ఆదరించేందుకు ప్రయత్నిస్తాడు కానీ నీకు అది మాత్రమే చాలాదు. సౌమ్యమయిన పద్ధతిలో దేవుని సందేశం మేము నీకు చెప్పాము.
JOB 15:12 యోబూ! నీవెందుకు అర్థం చేసుకోవు? సత్యాన్ని ఎందుకు చూడలేక పోతున్నావు?
JOB 15:13 నీవు ఈ కోపపు మాటలు చెప్పినప్పుడు నీవు దేవునికి విరోధంగా ఉన్నావు.
JOB 15:14 “ఒక మనిషి వాస్తవంగా పరిశుద్ధంగా ఉండలేడు. స్త్రీనుంచి జన్మించిన మనిషి, దేవునితో సరిపడి ఉండ జాలడు.
JOB 15:15 దేవుడు కనీసం తన దూతలను కూడ నమ్మడు. దూతలు నివసించే ఆకాశం కూడా పవిత్రమైనది కాదు.
JOB 15:16 మనవుడు అంతకంటే దౌర్భాగ్యుడు. మానవుడు అసహ్యమైవాడు మరియు పాడైపోయాడు. అతడు మంచి నీళ్లు తాగినట్టుగా కిడును తాగు తాడు.
JOB 15:17 “యోబూ, నా మాట విను. నేను దానిని నీకు వివరిస్తాను. నాకు తెలిసిన దానిని నేను నీతో చెబుతాను.
JOB 15:18 జ్ఞానం గల మనుష్యులు నాతో చెప్పిన విషయాలు నేను నీతో చెబుతాను. ఆ జ్ఞానం గల మనుష్యుల పూర్వీకులు ఈ విషయాలను వారితో చెప్పారు. ఆ జ్ఞానులు రహస్యాలేమీ నా దగ్గర దాచిపెట్టలేదు.
JOB 15:19 వారికే (జ్ఞానులకే) దేశం ఇవ్వబడింది. వారిని ఇబ్బంది పెట్టేందుకు పరాయివాళ్లు ఎవరూ ఆ దేశంలో లేరు.
JOB 15:20 దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధతో శ్రమ పడతాడు. క్రూరమైన మనిషి తన కోసం దాచ బడిన సంవత్సరాలన్నింటిలో శ్రమపడతాడు,
JOB 15:21 భయంకర శబ్దాలు అతని చెవులకు వినిపిస్తాయి మరియు అతడు క్షేమంగా ఉన్నానని అనుకొన్నప్పుడు శత్రువు అతని మీద దాడి చేస్తాడు.
JOB 15:22 దుర్మార్గపు వ్యక్తి చాలా విసిగిపోతాడు. చీకటి నుండి తప్పించుకొనే ఆశ అతనికి ఉండదు. అతణ్ణి చంపివేసేందుకు ఎక్కడో ఒక ఖడ్గం కనిపెడుతూనే ఉంటుంది.
JOB 15:23 అతడు అటూ ఇటూ ఆహారం కోసం ‘ఎక్కడ అది’ అంటూ సంచరిస్తూనే ఉంటాడు. కాని అతని శరీరం రాబందులకు ఆహారం అవుతుంది. అతనికిచావు మూడిందని అతనికి తెలుసు.
JOB 15:24 చింత, శ్రమ అతణ్ణి భయపెడుతున్నాయి. అతణ్ణి నాశనం చేసేందుకు ఒక రాజు సిద్ధంగా ఉన్నట్టు ఈ విషయాలు అతనిపై దాడి చేస్తాయి.
JOB 15:25 ఎందుకంటే దుర్మార్గుడు దేవుని మీద తన పిడికిలి బిగిస్తాడు కనుక దుర్మార్దుడు దేవునికి విధేయుడ య్యేందుకు నిరాకరిస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవునికి విరోధంగా దుర్మార్గుడు బలవంతునిగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.
JOB 15:26 ఆ మనిషి చాలా మొండివాడు. దుర్మార్గుడు తన బలమైన లావుపాటి కేడెముతో దేవుని మీద దాడి చేస్తాడు.
JOB 15:27 దుర్మార్గుడు ధనవంతుడై ముఖం కొవ్వుతో నిండి ఉండివుండవచ్చు. వాని నడుం కొవ్వు పొరలతో బలిసి ఉండవచ్చు.
JOB 15:28 కానీ శిథిలమైన పట్టణాల్లో వాడు నివసిస్తాడు. ఎవరూ నివసించని ఇండ్లలో ఆ దుర్మార్గుడు నివసిస్తాడు. అవి పడిపోయేట్టు ఉన్న శిథిల గృహాలు.
JOB 15:29 దుర్మార్గుడు ధనికుడుగా ఉండవచ్చు. అతని ఐశ్వర్యం ఎక్కువ కాలం ఉండదు. అతని పంటలు ఎక్కువగా పండవు.
JOB 15:30 దుర్మార్గుడు చీకటిని తప్పించుకోలేడు. అగ్గిచేత కొమ్మలు కాలిపోయిన చెట్టులా అతడు ఉంటాడు. దేవుని శ్వాస దుర్మార్గుని తుడిచివేస్తుంది.
JOB 15:31 దుర్మార్గుడు పనికిమాలిన వాటిని నమ్ముకొని తనను తానే మోసం చేసుకోకూడదు. ఎందుకంటే, వానికి ఏమీ దొరకదు కనుక.
JOB 15:32 దుర్మార్గుని ఆయుష్షు తీరిపోకముందే వాడు ముసలివాడై, ఎండిపోతాడు. మళ్లీ ఎన్నటికి వచ్చగా ఉండని ఎండిపోయిన కొమ్మలా అతడు ఉంటాడు.
JOB 15:33 ద్రాక్షాపండ్లు పక్వానికి రాకముందే రాలిపోతున్న ద్రాక్షావల్లిలా దుర్మార్గుడు ఉంటాడు. ఆ వ్యక్తి పూలు రాలిపోయిన ఒలీవ చెట్టులా ఉంటాడు.
JOB 15:34 ఎందుకంటే, దేవుడు లేని ప్రజల పని వ్యర్థము. డబ్బును ప్రేమించే మనుష్యుల ఇండ్లు అగ్నిచేత నాశనం చేయబడతాయి.
JOB 15:35 వారు కష్టాలకు పథకం వేసి దుర్మార్గపు పనులు చేస్తారు. మనుష్యులను మోసం చేసేందుకు వారు ప్రయత్నం చేస్తారు.”
JOB 16:1 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:
JOB 16:2 “ఈ విషయాలు నేను యిదివరకే విన్నాను. మీరు ముగ్గురూ నాకు కష్టమే కలిగిస్తున్నారు కాని ఆదరణకాదు.
JOB 16:3 మీ దీర్గ ఉపన్యాసాలకు అంతం లేదు. మీరెందుకు వాదము కొనసాగిస్తారు?
JOB 16:4 నా కష్టలే మీకు ఉంటే ఇప్పుడు మీరు చెబుతున్న మాటలు నేనూ చెప్పగలను. మీకు విరోధంగా జ్ఞానం గల మాటలు చెప్పి, మిమ్మల్ని చూచి నేను తల ఊపగలను.
JOB 16:5 కాని నేను చెప్పే మాటలతో నేను మిమ్మల్ని ప్రోత్సహించి మీకు ఆశ ఇవ్వగలను.
JOB 16:6 “అయితే నేను చెప్పేది ఏదీ నా బాధ పోయేట్టుగా చేయలేదు. కానీ నేను మాట్లాడకపోతే నాకు ఆదరణ లేదు.
JOB 16:7 నిజంగా దేవా, నీవు నా బలం తీసివేశావు. నా కుటుంబం మొత్తాన్ని నీవు నాశనం చేశావు.
JOB 16:8 నీవు నన్ను కట్టివేశావు. అది ప్రతి ఒక్కరూ చూడగలరు. నా శరీరం రోగంతో ఉంది, నేను భయంకరంగా కనబడుతున్నాను. దాని అర్థం నేను దోషిని అని ప్రజలు తలస్తున్నారు.
JOB 16:9 “దేవుడు నా మీద దాడి చేస్తున్నాడు, ఆయన నా మీద కోపంగా ఉండి నా శరీరాన్ని చీల్చ వేస్తున్నాడు. దేవుడు నా మీద తన పళ్లు కొరుకుతున్నాడు. నా శత్రువుల కళ్లు ద్వేషంతో చూస్తున్నవి.
JOB 16:10 మనష్యలు నన్ను చూచి నప్వుతారు. వాళ్లంతా నా చుట్టూ చేరి నన్ను అవమానించి నా ముఖం మీద కొట్టడానికి సమ్మతిస్తారు.
JOB 16:11 దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు.
JOB 16:12 నా విషయం అంతా బాగానే ఉంది. నేను నెమ్మదిగా జీవిస్తూ వచ్చాను. కాని దేవుడు నన్ను చితుకగొట్టేశాడు. అవును ఆయన నన్ను మెడపట్టి లాగి, నన్ను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాడు. గురి చూసి కొట్టడం అభ్యసించడానికి దేవుడు నన్ను ప్రయోగిస్తున్నాడు.
JOB 16:13 దేవుని విలుకాండ్లు నా చుట్టూరా ఉన్నారు. నా మూత్రపిండాలలో ఆయన బాణాలు కొడుతున్నాడు. ఆయన దయ చూపించడు. ఆయన నా పైత్య రసాన్ని నేలమీద ఒలక బోస్తాడు.
JOB 16:14 మరల మరల దేవుడు నా మీద దాడి చేస్తాడు. యుద్ధంలో సైనికునిలా ఆయన నా మీదకు పరుగెత్తుతాడు.
JOB 16:15 “నేను (యోబు) చాలా విచారంగా ఉన్నాను, కనుక గోనెపట్టతో చేయబడిన బట్టలు నేను ధరిస్తాను. నేను ఇక్కడ దుమ్ములో, బూడిదలో కూర్చొని ఓడిపోయినట్టుగా భావిస్తున్నాను.
JOB 16:16 ఏడ్బుట మూలంగా నా ముఖం ఎర్రబడింది. ఛాయలు నా కళ్ల చుట్టూరా ఉంగరాల్లా ఉన్నాయి.
JOB 16:17 నేను ఎన్నడూ క్రూరమైన నేరం ఏది చేయలేదు. నా ప్రార్థన నిర్మలమయినది.
JOB 16:18 “భూమీ, నా రక్తాన్ని దాచి పెట్టకు. (నాకు జరిగిన చెడుగులను కప్పి పెట్టకు). న్యాయం కోసం అరిచే నా అరుపులను (ప్రార్థనలను) అగిపోనీయకు.
JOB 16:19 ఇప్పుడు కూడ పరలోకంలో ఎవరో ఒకరు ఉన్నారు. నా పక్షంగా (నా పక్కన) ఉండి నాకు సాక్షిగా ఉన్నాడు.
JOB 16:20 నా స్నేహితులు నాకు విరోధంగా ఉన్నారు. కాని నా కన్నులు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి.
JOB 16:21 ఒక మనిషి తన స్నేహితుని కోసం బతిమలాడి నట్టుగా, నా కోసం దేవునిని బతిమలాడే ఒక మనిషి నాకు కావాలి.
JOB 16:22 “నేను ఏ చోట నుండి (మరణం) తిరిగి రానో ఆ చోటికి నేను వెళ్లేందుకు ఇంకా కొద్ది సంవత్సరాలే జరగాల్సి ఉంది.
JOB 17:1 “నా ఆత్మ భగ్నమై పోయింది. విడిచి పెట్టే సేందుకు నేను సిద్ధం. నా జీవితం దాదాపు గతించిపోయింది, సమాధి నాకోసం నిరీక్షిస్తోంది.
JOB 17:2 మనుష్యలు నా చుట్టూరా నిలిచి నన్ను చూసి నవ్వుతున్నారు. వారు నన్ను ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉంటే నేను వారిని గమనిస్తున్నాను.
JOB 17:3 “దేవా, నీవు నన్ను (యోబు) నిజంగా బలపరుస్తున్నావని చూపించు, మరి ఎవ్వరూ నన్ను బలపరచరు.
JOB 17:4 నా స్నేహితుల మనస్సులను నీవు బంధించేశావు, కనుక వారు నన్ను అర్థం చేసుకోరు. దయచేసి వారిని జయించనీయకు.
JOB 17:5 ‘ఒకడు తన స్వంత పిల్లలను నిర్లక్ష్యం చేసి తన స్నేహితులకు సహాయం చేస్తాడు అని ప్రజలు చెబుతారని నీకు తెలుసా?’ కాని ఇప్పుడు నా స్నేహితులే నాకు విరోధం అయ్యారు.
JOB 17:6 దేవుడు నా పేరును (యోబు) ప్రతి ఒక్కరికీ ఒక చెడ్డ పదంగా చేశాడు. ప్రజలు నా ముఖం మీద ఉమ్మి వేస్తారు.
JOB 17:7 నేను చాలా బాధపడుతూ, చాలా విచారంగా ఉన్నాను, కనుక నా కన్నులు దాదాపు గుడ్డివి అయ్యాయి. నా మొత్తం శరీరం ఒక నీడలా చాలా సన్నం అయ్యింది.
JOB 17:8 మంచి మనుష్యులు దీని విషయమై కలవరపడు తున్నారు. దేవుని గూర్చి లక్ష్యపెట్టని ప్రజల విషయమై నిర్దోషులు కలవర పడుతున్నారు.
JOB 17:9 కాని నీతీమంతులు వాళ్ల పద్ధతులనే చేపడతారు. నిర్దోషులు మరింత బలవంతులపుతారు.
JOB 17:10 “కానీ రండి, మీరంతా కలసి, మొత్తం తప్పు నాదే అని నాకు చూపించడానికి మరల ప్రయత్నం చేయండి. మీలో ఎవరూ జ్ఞానం గల వారుకారు.
JOB 17:11 నా జీవితం గతించి పోతోంది. నా ఆలోచనలన్నీ నాశనం చేయబడ్డాయి. నా ఆశ అడుగంటింది.
JOB 17:12 కాని నా స్నేహితులు రాత్రిని పగలు అనుకొంటారు. చీకటి పడినప్పుడు వెలుగు వస్తోంది, అని వారు అంటారు.
JOB 17:13 “నేను కనిపెడుతున్న ఒకే గృహం కనుక పాతాళం అయితే, అంధకార సమాధిలో నేను నా పడక వేసుకొంటే
JOB 17:14 సమాధిని చూచి, ‘నీవు నా తండ్రివి అని’ పురుగులను చూసి, ‘నా తల్లివి’ లేక ‘నా సోదరివి’ అని నేను చెప్పవచ్చు
JOB 17:15 కాని అదే నాకు ఆశ అయితే నాకు ఎలాంటి ఆశలేదు. మరియు ప్రజలు నాయందు ఏ ఆశ చూడలేరు.
JOB 17:16 (నా ఆశ నాతోనే చనిపోతుందా?) అది నేను చని పోయే స్థలంయొక్క లోతుల్లోకి వెళ్తుందా? మన మంతా చేరి బురదలోకి వెళ్తామా?”
JOB 18:1 అప్పుడు షూహీ దేశస్తుడైన బిల్దదు యోబుకు ఇలా జవాబు చెప్పాడు:
JOB 18:2 “యోబూ! ఈ మాటలన్నీ ఎప్పుడు చాలిస్తావు? నీవు మౌనంగా ఉండి వినాలి. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు
JOB 18:3 మేము పశువుల్లా బుద్ధిహీనులం అని నీవు ఎందుకు తలస్తావు?
JOB 18:4 యోబూ! నీ కోపంతో నీకు నీవే హాని చేసు కొంటున్నావు. కేవలం నీ కోసం మనుష్యులు ఈ భూమిని విడిచిపోవాలా? కేవలం నిన్ను తృప్తి పరచటం కోసం దేవుడు పర్వతాలను కదిపిస్తాడని నీవు తలస్తున్నావా?
JOB 18:5 “అవును నిజమే, దుర్మార్గుని దీపం ఆరిపోతుంది. అతని అగ్ని కాలకుండా ఆగిపోతుంది.
JOB 18:6 అతని ఇంటిలోని వెలుగు చీకటి అవుతుంది. అతని పక్కగా ఉన్న దీపం ఆరిపోతుంది.
JOB 18:7 ఆ మనిషి అడుగులు మరల గట్టిగా, వేగంగా ఉండవు. కానీ అతడు నిధానంగా నడుస్తాడు, బలహీనంగా ఉంటాడు. అతని స్వంత దుర్మార్గపు ఆలోచనలే అతడు పడిపోయేట్టు చేస్తాయి.
JOB 18:8 అతని స్వంత పాదాలే అతనిని వలలో పడదోస్తాయి. అతడు బోనులోనికి నడచి, అందులో చిక్కుకొంటాడు.
JOB 18:9 ఒక బోను అతని మడిమెను పట్టేస్తుంది. ఒక బోను అతన్ని గట్టిగా బంధిస్తుంది.
JOB 18:10 అతని కోసం నేలమీద ఒక తాడు దాచబడి ఉంటుంది. అతని తోవలో ఒక బోను సిద్ధంగా ఉంది.
JOB 18:11 అతని చుట్టూరా భయం పొంచి ఉంది. అతడు వేసే ప్రతి అడగు వెనుకా భయం ఉంటుంది.
JOB 18:12 చెడ్డ కష్టాలు అతని కోసం ఆకలితో వున్నాయి. అతడు పడిపోయినప్పుడు పతనం, నాశనం అతని కోసం సిద్ధంగా ఉన్నాయి.
JOB 18:13 భయంకర రోగం అతని చర్మంలో కొన్ని భాగాలను తినివేస్తుంది. అది అతని చేతులను, కాళ్లను కుళ్లిపోచేస్తుంది.
JOB 18:14 దుర్మార్గుడు క్షేమంగా ఉన్న తన ఇంటిలో నుండి తీసుకొని పోబడతాడు. భయాల రాజును ఎదుర్కొ నేందుకు అతడు నడిపించబడతాడు.
JOB 18:15 అతనికి తన ఇంటిలో ఏమీ విడిచిపెట్టబడదు. ఎందుకంటే అతని ఇంటినిండా, మండుతున్న గంధకం చల్లబడుతుంది.
JOB 18:16 కింద అతని వేర్లు ఎండిపోతాయి. పైన అతని కొమ్మలు చస్తాయి.
JOB 18:17 భూమి మీద మనుష్యులు అతనిని జ్ఞాపకం చేసుకోరు. ఏ వ్యక్తికూడ అతన్ని ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసికోడు.
JOB 18:18 మనుష్యులు అతనిని వెలుతురు నుండి నెట్టివేస్తారు. అతడు చీకటిలోనికి శిక్షించబడతాడు. వారు అతన్నిలోకంలో నుండి తరిమివేస్తారు.
JOB 18:19 అతనికి పిల్లలు లేక మనుమలు ఎవ్వరూ ఉండరు. అతని కుమారుల నుండి వారసులు ఉండరు. అతనియింట యింక సజీవంగా ఉండే మనుష్యులు ఎవ్వరూ ఉండరు.
JOB 18:20 దుర్మార్గునికి సంభవించిన దానిని గూర్చి విన్నప్పుడు పడమట ఉన్న ప్రజలు అదిరిపోతారు. తూర్పున ఉన్న ప్రజలు భయంతో మెత్తబడి పోతారు.
JOB 18:21 ఇది నిజం, దుర్మార్గునికి, అతని ఇంటికి ఇలాగే జరుగుతుంది. దేవుని గూర్చి లక్ష్యపెట్టని వానికి ఇలాగే జరుగుతుంది!”
JOB 19:1 అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు:
JOB 19:2 “ఎంతకాలం మీరు నన్ను బాధిస్తారు; మాటలతో నన్ను నలుగగొడతారు?
JOB 19:3 ఇప్పటికి మీరు నన్ను పదిసార్లు అవమానించారు. మీరు నా మీద దాడి చేసేటప్పడు ఎలాంటి సిగ్గూ ఉండదు మీకు.
JOB 19:4 ఒకవేళ నేను పాపం చేసినా, అది నా సమస్య అది మిమ్మల్ని బాధించదు.
JOB 19:5 మీరు కేవలం నా కంటే మంచివాళ్లలా చూపించు కోవాలని కోరుతున్నారు. నా కష్టాలకు కారణం నా తప్పు మాత్రమే అని మీరు అంటారు.
JOB 19:6 కానీ నాకు అపకారం చేసినవాడు దేవుడు. ఆయన నన్ను పట్టుకోవటానికి తన వలను నా చుట్టూరా వేశాడు.
JOB 19:7 ‘నాకు అపకారం జరిగింది.’ అని నేను కేకలు వేస్తాను. నాకు జవాబు ఏమీ రాదు. సహాయం కోసం నేను గట్టిగా కేకలు వేసినా న్యాయం కోసమైనా నా మొర ఎవరూ వినరు.
JOB 19:8 నేను ముందుకు వెళ్లలేకుండా దేవుడు నా మార్గం మూసివేశాడు. నా తోవను ఆయన చీకట్లో దాచి పెట్టేశాడు.
JOB 19:9 నా ఐశ్వర్యాన్ని దేవుడు తీసివేసుకొన్నాడు. నా తలమీద కిరిటాన్ని ఆయన తీసివేసుకొన్నాడు.
JOB 19:10 నేను చచ్చేంతవరకు నన్ను ఈ పక్క నుండి ఆ పక్కవరకు దేవుడు విరుగగొడతాడు. ఒక చెట్టుదాని వేళ్లతో సహా పెల్లగించబడ్డట్టు ఆయన నా ఆశ తీసివేస్తాడు
JOB 19:11 దేవుని కోపం నాకు వ్యతిరేకంగా మండుతుంది. ఆయన నన్ను తన శత్రవు అని పిలుస్తున్నాడు.
JOB 19:12 నా మీద దాడి చేసేందుకు దేవుడు తన సైన్యాన్ని పంపుతాడు. వారు నా చుట్టూరా దుర్గాలు నిర్మిస్తారు. నా గుడారం చుట్టూరా వారు బసచేస్తారు.
JOB 19:13 “నా సోదరులు నన్ను ద్వేషించేటట్టు దేవుడు చేశాడు. నా స్నేహితులందరికీ నేను పరాయివాడను.
JOB 19:14 నా బంధువులు నన్ను విడిచిపెట్టేశారు. నా స్నేహితులు నన్ను మరచిపోయారు.
JOB 19:15 నా ఇంట్లో అతిధులు, పనికతైలు నేనేదో పరాయివాడిలా, విదేశీయునిలా నన్ను చూస్తారు.
JOB 19:16 నేను నా సేవకుని పిలిస్తే వాడు జవాబివ్వడు. సహాయం కోసం నేను బతిమలాడినా నా సేవకుడు జవాబు ఇవ్వడు.
JOB 19:17 నా శ్వాస వాసన అంటే నా బార్యకు అసహ్యం. నా స్వంత సోదరులు నన్ను ద్వేషిస్తారు.
JOB 19:18 చిన్న పిల్లలు కూడా నన్ను గేళి చేస్తారు. నేను వాళ్ల దగ్గరకు వస్తే వాళ్లు నాకు విరోధంగా చెడు సంగతులు మాట్లాడుతారు.
JOB 19:19 నాకు సన్నిహితమైన స్నేహితులు అందరూ నన్ను అనహ్యించుకొంటారు. చివరికి నేను ప్రేమించే మనుష్యలు కూడా నాకు విరోధులయ్యారు.
JOB 19:20 “నేను ఎంత సన్నగా ఉన్నానంటే నా ఎముకల మీద నా చర్మం వ్రేలాడుతూ ఉంది. నాలో నాకు కొద్దిపాటి ప్రాణం మాత్రమే మిగిలి ఉంది.
JOB 19:21 “నన్ను దయ చూడండి, నా స్నేహితులారా, నన్ను దయ చూడండి. దేవుని హస్తం నాకు విరోధంగావుంది.
JOB 19:22 దేవుడు చేసినట్టు, మీరు ఎందుకు నన్ను హింసిస్తారు? నన్ను బాధించి మీరెందుకు ఎన్నడూ తృప్తి చెందటం లేదు?
JOB 19:23 “నేను (యోబు) చెప్పేది ఎవరో ఒకరు జ్ఞాపకం ఉంచుకొని, ఒక గ్రంథంలో వ్రాస్తే బాగుంటుందని నా ఆశ. నేను చెప్పే మాటలు ఒక గ్రంథపు చుట్టలో వ్రాయబడాలని నా ఆశ.
JOB 19:24 నేను చెప్పే మాటలు శాశ్వతంగా ఉండేటట్టు సీసంమీద ఇనుప పోగరతో చెక్కబడాలని లేదా ఒక బండమీద వ్రాయబడాలని నా ఆశ.
JOB 19:25 నన్ను ఆదుకొనేవారు ఎవరో ఒకరు ఉన్నారని నాకు తెలుసు. అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడని నాకు తెలుసు.
JOB 19:26 నేను ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నా చర్మం పాడైపోయిన తర్వాత కూడా నేను దేవుణ్ణి చూస్తానని నాకు తెలుసు.
JOB 19:27 నా స్వంత కళ్లతో నేను దేవుణ్ణి చూస్తాను. సాక్షాత్తూ దేవుణ్ణే, ఇంకెవరినీ కాదు. నాలో నా హృదయం బలహీనం అవుతోంది.
JOB 19:28 “ఒకవేళ మీరు, ‘మనం యోబును ఇబ్బంది పెడ్డాం, అతణ్ణి నిందించటానికి ఏదైనా కారణం వెదుకుదాం’ అనుకొవచ్చును.
JOB 19:29 కానీ మీ మట్టుకు మీరే ఖడ్గానికి భయపడాలి. ఎందుకంటే, పాపంమీద దేవుని కోపం శిక్షను రప్పిస్తుంది. మిమ్మల్ని శిక్షించేందుకు యెహోవా ఖడ్గం ప్రయోగిస్తాడు. అప్పుడు తీర్పు ఉంది అని మీరు తెలుసుకొంటారు.”
JOB 20:1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:
JOB 20:2 “యోబూ! నా తలంపులు నాకు జవాబిస్తాయి. నేను అనుకొంటున్నది ఏమిటో నేను త్వరపడి నీకు చెప్పాలి.
JOB 20:3 మేము చెప్పిన దానికి నీవు ఇచ్చిన జవాబులు మాకు అవమానకంగా ఉన్నాయి. కానీ నేను జ్ఞానం గలవాడను, నీకు ఎలా జవాబు ఇవ్వాలో నాకు ెతెలుసు.
JOB 20:4 “మొట్ట మొదటిసారిగా ఆదాము భూమి మీద చేయ బడినప్పటి నుండి ఒక దుర్మార్గుని సంతోషం ఎక్కువ సేపు ఉండదు అనే విషయం చాలా కాలంగా నీకు తెలిసిందే. దేవుని లక్ష్యపెట్టని వాని ఆనందం కొంతసేపు మాత్రమే ఉంటుంది.
JOB 20:6 ఒకవేళ దుర్మార్గుని గర్వం ఆకాశాన్ని అంటవచ్చు. అతని తల మేఘాలను తాకవచ్చు.
JOB 20:7 కానీ అతని స్వంత మలం పోయినట్లే అతడు శాశ్వతంగా పోతాడు. అతన్ని ఎరిగిన ప్రజలు, ‘అతడు ఎక్కడ?’ అని అన్నారు.
JOB 20:8 ఒక కల వేగంగా ఎగిరిపోయినట్టు అతడు ఎగిరి పోతాడు. ఏ మనిషీ మరల అతణ్ణి చూడడు. అతడు పోయి ఉంటాడు. రాత్రి పూట పీడకలలా అతడు విదిలించబడతాడు.
JOB 20:9 అతనిని చూచిన మనుష్యులు అతన్ని మరల చూడరు అతని కుటుంబం అతన్ని మరల ఎన్నడూ చూడదు.
JOB 20:10 దుర్మార్గుని పిల్లలు, పేదవారి దగ్గర అతడు తీసుకొన్న వాటిని తిరిగి ఇచ్చివేస్తారు. దుర్మార్గుని స్వహస్తాలే తన ఐశ్వర్యాన్ని తిరిగి ఇచ్చివేయాలి.
JOB 20:11 అతడు యువకునిగా ఉన్నప్పుడు, అతని శరీరం బలంగా ఉంది. కాని త్వరలోనే అది మట్టి ఆవుతుంది.
JOB 20:12 “దుర్మార్గుని నోటిలో దుర్మార్గం తియ్యగా ఉంటుంది. అతడు దానిని తన నాలుక కింద దాచిపెడతాడు.
JOB 20:13 చెడ్డ మనిషి తన దుర్మార్గాన్ని అలాగే పెట్టుకొని ఉంటాడు. దానిని పోనియ్యటం అతనికి అసహ్యం. కనుక అతడు దానిని తియ్యని పదార్థంవలె తన నోటిలో ఉంచుకొంటాడు.
JOB 20:14 కానీ అతని భోజనం అతని కడుపులో విషం అవుతుంది. అది అతని లోపల చేదు విషంలా, పాము విషంలా అవుతుంది.
JOB 20:15 దుష్టుడు ఐశ్వర్యం దిగమింగాడు. కానీ అతడు వాటిని కక్కివేస్తాడు. అవును, దుష్టుని కడుపు వాటిని కక్కివేసేట్టుగా దేవుడు చేస్తాడు.
JOB 20:16 దుష్టుడు పాముల విషం పీల్చుతాడు. పాము కోరలు వానిని చంపివేస్తాయి.
JOB 20:17 అప్పుడు నదులు తేనెతో, వెన్నతో ప్రవహించటం చూచి దుష్టుడు ఆనందించ లేడు.
JOB 20:18 దుష్టుడు తన లాభాలను ఇచ్చివేసేలా బలాత్కారం చేయబడతాడు. అతని కష్టార్జితం అనుభవించటానికి అతనికి అనుమతి ఇవ్వబడదు.
JOB 20:19 దుష్టుడు పేద ప్రజలను సక్రమంగా చూడలేదు గనుక. అతడు వారి విషయమై పట్టించుకోలేదు, మరియు అతడు వారి వస్తువులను తీసుకొన్నాడు. ఇంకెవరో కట్టిన ఇండ్లు అతడు తీసివేసుకొన్నాడు.
JOB 20:20 దుష్టునికి ఎన్నటికీ తృప్తిలేదు. వాని ఐశ్వర్యం వానిని రక్షించలేదు.
JOB 20:21 అతడు భోజనం చేసినప్పుడు ఏమీ మిగలదు. అతని విజయం కొనసాగదు:
JOB 20:22 దుర్మార్గునికి సమృద్ధిగా ఉన్నప్పటికీ అతడు కష్టంతో కృంగిపోతాడు. అతని సమస్యలు అతని మీదకు దిగి వస్తాయి.
JOB 20:23 దుర్మార్గుడు తనకు కావలసినదంతా తినివేసిన తర్వాత దేవుడు తన కోపాన్ని ఆ మనిషి మీదకి మళ్లిస్తాడు. దుర్మార్గుని మీద దేవుడు శిక్షా వర్షం కురిపిస్తాడు.
JOB 20:24 ఒకవేళ దుర్మార్గుడు ఇనుప ఖడ్గం నుండి పారి పోతాడేమో కానీ ఒక ఇత్తడి బాణం వానిని కూల గొడుతుంది.
JOB 20:25 ఆ ఇత్తడి బాణం అతని శరీరం అంతటిలో గుచ్చుకొని పోయి అతని వీపులో నుండి బయటకు వస్తుంది. ఆ బాణం యొక్క మెరుపు కొన అతని కాలేయంలో గుచ్చుకు పోతుంది. అతడు భయంతో అదిరిపోతాడు.
JOB 20:26 అతని ఐశ్వర్యాలన్నీ నాశనం చేయబడుతాయి. ఏ మనిషీ ఆరంభించని ఒక అగ్ని అతణ్ణి నాశనం చేస్తుంది. అతని ఇంటిలో మిగిలివున్నదాన్ని అగ్ని నాశనం చేస్తుంది.
JOB 20:27 దుర్మార్గుడు దోషి అని ఆకాశం రుజువు చేస్తుంది. భూమి అతనికి విరోధంగా సాక్ష్యం ఇస్తుంది.
JOB 20:28 అతని ఇంట్లో ఉన్న సమస్తం దేవుని కోప ప్రవాహంలో కొట్టుకొని పోతుంది.
JOB 20:29 దుర్మార్గానికి దేవుడు చేయాలని తలపెడుతోంది అదే. దేవుడు వారికి ఇవ్వాలని తలస్తోంది అదే.”
JOB 21:1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
JOB 21:2 “నేను చెప్పేది వినండి. మీరు వినటమే మీరు నాకు ఇచ్చే ఆదరణ.
JOB 21:3 నేను మాట్లాడేటప్పుడు ఓపిగ్గా ఉండండి. ఆ తర్వాత నేను మాట్లాడటం ముగించాక మీరు నన్ను గేళి చేయవచ్చు.
JOB 21:4 “నేను మనుష్యుల మీద ఆరోపణ చేయటం లేదు. నేను ఓపికగా ఉండకపోవటానికి ఒక మంచి కారణం ఉంది.
JOB 21:5 నన్ను చూచి, అదరిపొండి. మీ నోటిమీద చేయి పెట్టుకొని అదురుతో నన్ను అలానే తేరి చూడండి.
JOB 21:6 నాకు సంభవించిన దానిని గూర్చి తలచినప్పుడు నేను భయపడతాను, నా శరీరం వణకుతుంది.
JOB 21:7 దుర్మార్గులు చాలాకాలం బతుకుతారెందుకు? వారు ముసలివాళ్లవ్వటం, విజయం పొందటం ఎందుకు?
JOB 21:8 దుర్మార్గులు వారితోబాటు వారి పిల్లలు ఎదగటం చూస్తారు. దుర్మార్గులు వారి మనుమలు, మనుమ రాండ్రను చూసేంత వరకు బతుకుతారు.
JOB 21:9 వారి ఇండ్లు భద్రంగా ఉన్నాయి. వారికి భయం లేదు. దుర్మార్గులను శిక్షించడానికి దేవుడు తన దండం ఉపయోగించడు.
JOB 21:10 వారి ఆబోతులు ఆవులను దాటటం తప్పవు. వారి ఆవులకు దూడలు ఉన్నాయి. ఆ దూడలు పుట్టినప్పుడు అవి ఎన్నడూ చావవు.
JOB 21:11 దుర్మార్గులు వారి పిల్లలు ఆడుకొనేందుకు గొర్రె పిల్లల్లా బయటకు పంపిస్తారు. వారి పిల్లలు గంతులు వేస్తారు.
JOB 21:12 స్వరమండలాలు, పిల్లనగ్రోవుల ధ్వనులతోబాటు వారి పిల్లలు పాడుతూ, నాట్యం చేస్తారు.
JOB 21:13 దుర్మార్గులు వారి జీవితకాలంలో విజయం అనుభవిస్తారు. అనగా వారు మరణించి, శ్రమ అనుభవించకుండానే తమ సమాధికి వెళ్తారు.
JOB 21:14 కానీ దుర్మార్గులు, దేవునితో ఇలా చెబుతారు, ‘మమ్మల్ని ఇలా విడిచిపెట్టండి, మేము ఏమి చేయాలని మీరు కోరుతారో అది మాకు లెక్కలేదు’ అంటారు.
JOB 21:15 మరియు దుర్మార్గులు, ‘సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరు? మేము ఆయనను సేవించాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రార్థన చేసిన లాభం లేదు’ అంటారు.
JOB 21:16 “దుర్మార్గులు తమ మూలంగానే వారికి విజయం కలుగుతుందని తలస్తారు. కానీ నేను వారి తలంపును అంగీకరించను.
JOB 21:17 అయితే దుర్మార్గులు దీపం ఆర్పివేయబడటం అనేది, ఎంత తరచుగా జరుగుతుంది? దుర్మార్గులకు ఎన్నిసార్లు కష్టం వస్తుంది? దేవుడు వారి మీద కోపగించి వారిని శిక్షిస్తాడా?
JOB 21:18 గాలి గడ్డిని ఎగురగొట్టినట్టు, బలమైన గావి ఊకను ఎగురగొట్టినట్లు దేవుడు దుర్మార్గులను ఎగుర గొట్టి వేస్తాడా?
JOB 21:19 ‘తండ్రి పాపాల మూలంగా దేవుడు అతని కుమారుణ్ణి శిక్షిస్తాడు’ అని మీరంటారు. కాదు! ఆ దుర్మార్గుడినే దేవుడు శిక్షించనివ్వండి. అప్పుడు ఆ దుర్మార్గుడు తన స్వంత పాపాల కోసమే శిక్షించబడుతున్నట్టు అతనికి తెలుస్తుంది.
JOB 21:20 పాపి తన స్వంత శిక్షను చూడాలి. సర్వశక్తిమంతుడైన దేవుని కోపాన్ని అతడు అనుభవిస్తాడు.
JOB 21:21 దుర్మార్గుని జీవిత కాలం అయిపోయి, అతడు చనిపోయినప్పుడు అతడు విడిచిపెడుతున్న తన కుటుంబం విషయమై అతడు లెక్కచేయడు.
JOB 21:22 “దేవునికి ఎవరూ జ్ఞానం ఉపదేశించలేరు. ఉన్నత స్థానాల్లో ఉండే మనుష్యులకు కూడ దేవుడు తీర్పు తీరుస్తాడు.
JOB 21:23 ఒక వ్యక్తి నిండుగా, విజయవంతంగా జీవించాక మరణిస్తాడు. అతడు పూర్తిగా క్షేమం, సుఖం ఉన్న జీవితం జీవించాడు.
JOB 21:24 అతని శరీరం బాగా పోషించబడింది, అతని ఎముకలు మూలుగతో యింకా బలంగా ఉన్నాయి
JOB 21:25 అయితే మరో మనిషి కష్టతరంగా జీవించి, వేదనగల ఆత్మతో మరణిస్తాడు. అతడు మంచిది ఎన్నడూ, ఏదీ అనుభవించలేదు.
JOB 21:26 వీళ్లద్దరూ ఒకే చోట దుమ్ములో పండుకొని ఉంటారు. వాళ్లిద్దర్నీ పురుగులు పట్టేస్తాయి.
JOB 21:27 “కానీ మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మరియు మీరు నాకు అపకారం చేయాలని తలపెడుతున్నారని నాకు తెలుసు.
JOB 21:28 ‘యువరాజు ఇల్లు ఎక్కడ? దుర్మార్గుడు నివసించిన ఆ ఇల్లు ఏది?’ అని మీరు అంటారు.
JOB 21:29 “కానీ ప్రయాణం చేసే మనుష్యులను మీరు ఎన్నడూ అడగలేదు. వారి కథలను మీరు అంగీ కరించనూ లేదు.
JOB 21:30 విపత్తు కలిగినప్పుడు దుర్మార్గులు వదలిపెట్ట బడుతారు. ఏ రోజు దేవుడు కోపంతో శిక్షిస్తాడో ఆ రోజు వాళ్లు రక్షింపబడతారు.
JOB 21:31 దుర్మార్గుడు చేసిన దుర్మార్గాన్ని గూర్చి దుర్మార్గుని ముఖంమీదే అతణ్ణి విమర్శించే వ్యక్తి ఎవ్వడూ లేడు. అతడు చేసిన కీడుకు అతనిని ఎవ్వరూ శిక్షించరు.
JOB 21:32 దుర్మార్గుడు సమాధికి మోసికొని పోబడినప్పుడు ఒక కాపలావాడు అతని సమాధి దగ్గర నిలుస్తాడు.
JOB 21:33 ఆ దుర్మార్గునికి లోయలోని మట్టి తియ్యగా ఉంటుంది. వాని చావు ఊరేగింపులో వేలాది మంది ఉంటారు.
JOB 21:34 “అందుచేత మీ వట్టి మాటలతో మీరు నన్ను ఆదరించలేరు. మీ జవాబులు ఇంకా అబద్ధాలే!”
JOB 22:1 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు జవాబు యిచ్చాడు:
JOB 22:2 “దేవునికి నరుడు ఉపకారికాగలడా? జ్ఞానం గల వ్యక్తి తప్పక తనకు తానే ఉపయోగికారిగా వుంటాడు.
JOB 22:3 ఒకవేళ నీవు సక్రమమయినదే చేసినప్పటికీ, సర్వ శక్తిమంతుడైన దేవునికి అది సంతోషం కలిగించదు. నీవు ఎల్లప్పుడూ మంచివాడివిగానే వున్నా దేవునికి ఏమీ లాభంలేదు.
JOB 22:4 యోబూ, దేవుడు నిన్ను శిక్షించినది ఆయనను నీవు ఆరాధించినందుకా?
JOB 22:5 కాదు, అది నీవు విస్తారంగా పాపం చేసినందువల్లనే. యోబూ, నీ పాపాలు ఎప్పటికీ నిలిచిపోవు.
JOB 22:6 యోబూ, నీ సోదరులు నీకు ఋణపడి ఉన్న ధనాన్ని నీకు తిరిగి చెల్లించేందుకు నీవు వారిని బలవంతం చేశావు. అది కారణం లేకుండా నీవు చేశావు. ప్రజల దగ్గర్నుండి వస్తాలు నీవు లాగేసు కొని, వారు ధరించటానికి ఏమీ లేకుండా చేశావు.
JOB 22:7 అలసిపోయిన మనుష్యలకు నీవు నీళ్లు ఇవ్వలేదు. ఆకలిగొన్న మనుష్యలకు నీవు అన్నం పెట్టలేదు.
JOB 22:8 యోబూ! నీవు అధికారం, ఐశ్వర్యం గలవాడవై నప్పటికీ నీవు ఆ ప్రజలకు సహాయం చేయలేదు. నీకు చాలా భూమి ఉంది, నీవు చాలా గౌరవం పొందినవాడవు.
JOB 22:9 కాని విధవలకు నీవు ఏమీ ఇవ్వకుండానే వారిని పంపించివేశావు. యోబూ! అనాధ పిల్లలను నీవు దోచుకొని నీవు వారి యెడల చెడుగా ప్రవర్తించావు.
JOB 22:10 అందుకే నీ చుట్టూరా బోనులు ఉన్నాయి. మరియు ఆకస్మిక కష్టం నిన్ను భయ పెడుతుంది.
JOB 22:11 అందుకే నీవు చూడలేనంత కటిక చీకటిగా ఉంది. మరియు అందుకే నీళ్ల ప్రవాహం నిన్ను కప్పేస్తుంది.
JOB 22:12 “ఆకాశంలో అతి ఉన్నత స్థానంలో దేవుడు నివసిస్తాడు. మహా ఎత్తయిన నక్షత్రాలను దేవుడు వంగి కిందికి చూస్తాడు. నక్షత్రాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో నీవు చూడగలవు.
JOB 22:13 కాని యోబూ, ‘నీవు దేవునికి ఏమీ తెలియదు! అంధకార మేఘాల్లోంచి దేవుడు మాకు ఎలా తీర్పు తీరుస్తాడు?
JOB 22:14 ఆయన ఆకాశపు అత్యున్నత స్థానంలో నడిచేటప్పుడు మనం చూడకుండా మేఘాలు ఆయనను కప్పివేస్తాయి.’ అని అంటావు.
JOB 22:15 “యోబూ! దుర్మార్గులు తిరిగే పాత మార్గంలోనే నీవు నడుస్తున్నావు.
JOB 22:16 దుర్మార్గులు మరణించాల్సిన సమయం రాకముందేవారు తీసుకోబడ్డారు. ఒక వరదలో వారు కొట్టుకొని పోయారు.
JOB 22:17 ‘మమ్ముల్ని ఒంటరిగా విడిచిపెట్టండి. సర్వశక్తి మంతడైన దేవుడు మమ్ముల్ని ఏమీ చేయలేడు’ అని దేవునితో చెప్పేవాళ్లు ఆ మనుష్యులే.
JOB 22:18 కానీ ఆ మనుష్యలనే దేవుడు విజయం పొందిన ధనికులుగా చేశాడు. దుర్మార్గులు తలచే పద్ధతి నేను అంగీకరించలేను.
JOB 22:19 దుర్మార్గులు నాశనం అయినప్పుడు మంచివాళ్లు చూచి సంతోషిస్తారు. నిర్దోషులు దుర్మార్గులను చూచి నవ్వుతూ.
JOB 22:20 ‘మన శత్రువులు నిజంగా నాశనం చేయబడ్డారు. వారి ఐశ్వర్యాలను అగ్ని కాల్చేస్తుంది’ అని అంటారు.
JOB 22:21 “యోబూ, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. అప్పుడు నీకు ఆయనతో శాంతి ఉంటుంది. ఇలా నీవు చేస్తే, నీవు ధన్యుడవవుతూ, విజయం పొందుతావు.
JOB 22:22 ఈ ఉపదేశము స్వీకరించి ఆయన మాటలు నీ హృదయంలో భద్రం చేసికో.
JOB 22:23 యోబూ! సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరకు నీవు తిరిగి వస్తే, నీకు మరల మామూలు స్థితి ఇవ్వబడుతుంది. నీవు మాత్రం దుర్మార్గాన్ని నీ ఇంటినుండి దూరంగా తొలగించి వేయాలి.
JOB 22:24 నీ బంగారాన్ని నీవు మట్టిపాలు చేయాలి, ఓఫీరునుండి తెచ్చిన నీ బంగారాన్ని నదుల్లోని బండలకేసి విసిరికొట్టు.
JOB 22:25 సర్వశక్తిమంతుడైన దేవుడే నీకు బంగారంగాను, వెండిగాను ఉండనియ్యి.
JOB 22:26 అప్పుడు నీవు ఎంతో సంతోషిస్తావు. సర్వశక్తి మంతుడైన దేవునిలో ఆనందం కనుగొంటావు. నీవు నీ ముఖాన్ని దేవుని వైపు ఎత్తగలవు.
JOB 22:27 నీవు ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు. నీవు ఏం చేస్తానని ఆయనకు ప్రమాణం చేస్తావో దానిని నీవు చేస్తావు.
JOB 22:28 నీవు చేసే ప్రతి దానిలో విజయం పొందుతావు. నీ త్రోవలో వెలుగు ప్రకాశిస్తుంది
JOB 22:29 గర్విష్ఠులను దేవుడు సిగ్గు పరుస్తాడు కానీ దీనులను దేవుడు రక్షిస్తాడు.
JOB 22:30 నిర్దోషి కాని మనిషిని కూడా దేవుడు రక్షిస్తాడు. నీ చేతుల పవిత్రత మూలంగా అతడు రక్షించ బడతాడు.”
JOB 23:1 అప్పుడు యోబూ ఇలా జవాబు ఇచ్చాడు:
JOB 23:2 “ఈవేళ నేను ఇంకా కోపంగా ఆరోపిస్తూనే ఉన్నాను. దేవుడు నన్ను కఠినంగా శిక్షిస్తున్నాడు, కనుక నేను ఆరోపిస్తూనే ఉంటాను.
JOB 23:3 దేవునిని ఎక్కడ వెదకాలో ఆయన యెద్దకు ఎలా వెళ్లాలో నాకు తెలిస్తే బాగుండేది, అని నా ఆశ.
JOB 23:4 నేను దేవునికి నా గాధ వివరించుకొంటాను. నేను నిర్దోషిని అని చూపించటంకోసం నా నోరు వాదాలతో నిండిపోతుంది.
JOB 23:5 నా వాదాలకు దేవుడు ఎలా జవాబు ఇస్తాడో నేను తెలిసికోవాలిని కోరుతున్నాను. అప్పుడు నేను దేవుని జవాబులు గ్రహిస్తాను.
JOB 23:6 దేవుడు గొప్ప శక్తితో నాకు విరోధంగా ఉంటాడా? లేదు, ఆయన నా మాట వింటాడు!
JOB 23:7 అక్కడ, దేవుని యెదుట ఒక మంచి మనిషి తన గాధను దేవునికి వివరించవచ్చును. అప్పుడు నా న్యాయమూర్తి నన్ను విముక్తుణ్ణి చేయవచ్చును.
JOB 23:8 “కానీ నేను తూర్పుకు వెళ్తే దేవుడు అక్కడ లేడు. ఒకవేళ నేను పడమటికి వెళ్తే ఇంకా దేవుడు నాకు కనబడలేదు.
JOB 23:9 దేవుడు ఉత్తరాన పని చేస్తున్నప్పుడు నాకు ఆయన కనబడడు. దేవుడు దక్షిణంగా తిరిగినప్పుడు ఇంకా ఆయన నాకు కనబడడు.
JOB 23:10 కానీ నేను వేసే ప్రతి అడుగూ దేవునికి తెలుసు. ఆయన నన్ను పరీక్షించటం ముగించినప్పుడు నాలో మైల ఏమీ లేనట్టుగా ఆయన చూస్తాడు. నేను స్వచ్ఛమైన బంగారంలా ఉన్నట్టు ఆయన చూస్త్తాడు.
JOB 23:11 నేను ఎల్లప్పుడూ దేవుడు కోరిన మార్గంలోనే నడిచాను. దేవుని మార్గం అనుసరించకుండా నేను ఎన్నడూ తిరిగిపోలేదు.
JOB 23:12 దేవుడు ఆజ్ఞాపించే వాటినే నేను ఎల్లప్పుడూ చేస్తాను. నా భోజనం కంటే దేవుని నోటినుండి వచ్చే మాటలు నాకు ఇష్టం.
JOB 23:13 “కానీ దేవుడు ఎన్నటికీ మారడు. ఏ మనిషి ఆయనకు విరొధంగా నిలబడలేడు. దేవుడు అనుకొన్నది ఆయన చేస్తాడు.
JOB 23:14 దేవుడు నాకు వ్యతిరేకంగా ఏమి పథకం వేశాడోదాన్ని ఆయన చేస్తాడు. నా కోసం ఆయనకు ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి.
JOB 23:15 అందుకే నేను దేవుని ఎదుట జీవిస్తూ ఉండగా నేను భయపడతాను. వీటన్నింటిని గూర్చీ నేను తలచినప్పుడు దేవునికి నేను భయపడతాను.
JOB 23:16 దేవుడు నా హృదయాన్ని బలహీనం చేస్తాడు. నేనేమో నా ధైర్యం కోల్పోతాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను భయపెడతాడు.
JOB 23:17 కానీ చీకటి నేను మౌనంగా ఉండేటట్టు చేయదు. గాఢాంధకారం నా ముఖాన్ని కప్పేస్తుంది.
JOB 24:1 “సర్వశక్తిమంతుడైన దేవుడు న్యాయవిచారణ కోసం ఒక సమయాన్ని ఎందుకు నిర్ణయించడు? దేవునికి విధేయులయ్యే మనుష్యులు ఆ న్యాయవిచారణ నమయం కోసం అనవసరంగా ఎందుకు వేచి ఉండాలి?”
JOB 24:2 “మనుష్యలు తమ పొరుగు వారి భూమిని ఆక్ర మించేందుకు సరిహద్దు రాళ్లను జరిపివేస్తారు. మనుష్యులు మందలను దొంగిలించి ఇతర పచ్చిక బయళ్లకు వాటిని తోలుకొని పోతారు.
JOB 24:3 అనాధల గాడిదను వారు దొంగాలిస్తారు. ఒక విధవవారి బాకీ తీర్చేంత వరకు ఆమె యొక్క ఆవును వారు తోలుకొని పొతారు.
JOB 24:4 ఇల్లు లేకుండా ఒక చోటు నుండి మరో చోటికి సంచారం చేసేటట్టు ప్రజలను వారు బలవంతం చేస్తారు. పేద ప్రజలంతా ఈ దుర్మార్గుల బారినుండి దాగుకొనేలా బలవంతం చేయబడుతారు.
JOB 24:5 “అరణ్యంలో ఆహారం కోసం వెదకులాడే అడవి గాడిదలా ఉన్నారు ఈ పేద ప్రజలు. పేద ప్రజలకూ వారి పిల్లలకూ ఎడారి ఆహారమును ఇస్తుంది.
JOB 24:6 పేద ప్రజలు ఇంకెంత వరకు వారి స్వంతం కాని పోలాలలో గడ్డి, గడ్డిపరకలు కూర్చుకోవాలి? దుర్మార్గుల ద్రాక్షాతోటల నుండి వారు పండ్లు ఏరుకొంటారు.
JOB 24:7 పేద ప్రజలు బట్టలు లేకుండానే రాత్రిపూట వెళ్లబుచ్చాలి. చలిలో వారు కప్పుకొనేందుకు వారికి ఏమీ లేదు.
JOB 24:8 కొండల్లోని వర్షానికి వారు తడిసిపోయారు. వాతా వరణం నుండి వారిని వారు కాపాడుకొనేందుకు వారికి ఏమీ లేదు కనుక వారు పెద్ద బండలకు దగ్గరలో ఉండాలి.
JOB 24:9 దుర్మార్గులు తండ్రిలేని బిడ్డను తల్లి దగ్గర నుండి లాగివేసుకొంటారు. పేద మనిషియొక్క బిడ్డను వారు తీసివేసుకొంటారు. పేద మనిషి బాకీపడి ఉన్న దానిని చెల్లించటం కోసం దుర్మార్గులు ఆ చిన్న బిడ్డను బానిసగా చేస్తారు.
JOB 24:10 పేద ప్రజలకు బట్టలు లేవు, కనుక వారు దిగంబరులుగా పని చేస్తారు. దుర్మార్గుల కోసం వారు పనలు మోస్తారు. కానీ పేద ప్రజలు ఇంకా ఆకలి తోనే ఉంటారు.
JOB 24:11 పేద ప్రజలు ఒలీవ నూనె పిండుతారు. వారు ద్రాక్షాగానుగను తిప్పుతారు. కానీ వారు ఇంకా దాహంతోనే ఉంటారు.
JOB 24:12 మరణిస్తున్న మనుష్యులు చేస్తున్న విచారకరమైన శబ్దాలు పట్టణంలో వినిపిస్తున్నాయి. బాధించబడిన మనుష్యులు సహాయం కోసం అరుస్తున్నారు. కానీ దేవుడు వినటం లేదు.
JOB 24:13 “వెలుగు మీద తిరుగుబాటు చేసే మనుష్యులు ఉన్నారు. వారు ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడో తెలుసుకోవటం వారికి ఇష్టం లేదు. వారు దేవుని మార్గంలో నడవరు.
JOB 24:14 సరహంతకుడు ఉదయాన్నే లేచి పేద ప్రజలను, అక్కరలో ఉన్న ప్రజలను చంపుతాడు. రాత్రివేళ అతడు దొంగగా మారిపోతాడు.
JOB 24:15 వ్యభిచారం చేసే వాడు రాత్రి కోసం వేచి ఉంటాడు. ‘నన్ను ఎవ్వరూ చూడడం లేదు’ అని అతడు అనుకొంటాడు. కనుక అతడు తన ముఖం కప్పు కొంటాడు.
JOB 24:16 రాత్రి వేళ చీకటిగా ఉన్నప్పుడు దుర్మార్గులు ఇళ్లలో చొరబడతారు. కానీ పగటివేళ వారు వారి స్వంత ఇళ్లలో దాగుకొంటారు. వెలుగును వారు తప్పించు కొంటారు.
JOB 24:17 ఆ దుర్మార్గులకు చీకటి ఉదయంలా ఉంటుంది. చీకటి దారుణాలకు వారు స్నేహితులు.
JOB 24:18 “కాని వరద నీటిపైనున్న నురగవలె దుర్మార్గులు తీసుకొని పోబడతారు. వారి స్వంత భూమి శపించబడింది. కనుక ద్రాక్షా తోటలలో ద్రాక్షాపండ్లు కోసే పనికి వారు వెళ్లరు.
JOB 24:19 వేడిగా, పొడిగా ఉండే గాలి శీతాకాలపు మంచు నీళ్లను తొలగించి వేస్తుంది. అదే విధంగా దుర్మార్గులు కూడా తీసుకొని పోబడతారు.
JOB 24:20 దుర్మార్గుడు చనిపోయినప్పుడు అతని స్వంత తల్లి సహితం వానిని మరిచిపోతుంది. దుర్మార్గుని శరిరాన్ని పురుగులు తినివేస్తాయి. అతడు ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేనికోబడడు. దుర్మార్గులు పడి పోయిన ఒక చెట్టులా నాశనం చేయబడతారు.
JOB 24:21 దుర్మార్గులు గొడ్రాలికి అక్రమాలు చేస్తారు. పిల్లలు లేని స్త్రీని వారు బాధిస్తారు. వారు విధవరాలికి దయ చూపెట్టరు.
JOB 24:22 కానీ బలంగల మనుష్యులను నాశనం చేసేందుకు దేవుడు తన శక్తిని ఉపయోగిస్తాడు. బలంగల మనుష్యులు శక్తిమంతులవుతారు. కాని వారి స్వంత జీవితాలను గూర్చిన నమ్మకం వారికి లేదు.
JOB 24:23 ఒకవేళ దేవుడు శక్తిగల మనుష్యులను కొద్ది కాలం వరకు క్షేమంగా ఉండనిస్తాడేమో కాని దేవుడు వారిని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు.
JOB 24:24 కొద్ది కాలం పాటు దుర్మార్గులు విజయం సాధిస్తారు. ఆ తరువాత వారు అంతమై పోతారు. మనుష్యులందరిలాగే వారూ ఒక చోట చేర్చబడతారు. తర్వాత వారు కోసివేయబడిన ధాన్యపు గింజల్లా మరణిస్తారు.
JOB 24:25 “ఈ విషయాలు సత్యం కాకపోతే, నేను అబద్ధం చెప్పానని ఎవరు రుజువు చేయగలరు? నా మాటలు వట్టివి అని ఎవరు చెప్పగలరు?”
JOB 25:1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు:
JOB 25:2 “దేవుడే పాలకుడు. ప్రతి మనిషీ దేవునికి భయపడి గౌరవించాలి. దేవుడు తన పరలోక రాజ్యాన్ని శాంతిగా ఉంచుతాడు.
JOB 25:3 దేవుని దూతలను ఏ మనిషీ లెక్కించలేడు. దేవుని సూర్యుడు మనుష్యులందరి మీద ఉదయిస్తాడు.
JOB 25:4 కానీ దేవుని ఎదుట ఒక మనిషి నిజంగా మంచి వాడుగా ఉండలేడు. స్త్రీకి జన్మించిన మనిషి నిజంగా పరిశుద్ధంగా ఉండలేడు.
JOB 25:5 దేవుని దృష్టికి చంద్రుడు కూడా ప్రకాశంగా ఉండడు. దేవుని దృష్టికి నక్షత్రాలు పరిశుద్ధంగా లేవు.
JOB 25:6 మనిషి అంతకంటే తక్కువ. మనిషి మట్టి పురుగులాంటివాడు. పనికి మాలిన పురుగులాంటివాడు!”
JOB 26:1 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:
JOB 26:2 “బిల్దదూ, జోఫరూ, ఎలీఫజూ మీరు బలహీనులైన మనుష్యలకు నిజంగా సహాయం చేయగలరు. అవును, మీరు నన్ను ప్రోత్సహించారు. బలహీనమైన నా చేతులను మీరు తిరిగి బలం గలవిగా చేసారు.
JOB 26:3 అవును, జ్ఞానంలేని మనిషికి మీరు అద్భుతమైన సలహా ఇచ్చారు. మీరు చాలా జ్ఞానం ప్రదర్శించారు.
JOB 26:4 ఈ సంగతులు చెప్పటానికి మీకు ఎవరు సహాయం చేశారు. ఎవరి ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించింది?
JOB 26:5 “మరణించిన వారి ఆత్మలు భూమి కింద నీళ్లలో విలవిల్లాడుతున్నాయి.
JOB 26:6 మరణ స్థలం దేవుని దృష్టికి బాహాటం. దేవునికి మరణం మరుగు కాదు.
JOB 26:7 ఉత్తర ఆకాశాన్ని శూన్య అంతరిక్షంలో దేవుడు విస్తరింపజేశాడు. దేవుడు భూమిని శూన్యంలో వేలాడతీశాడు.
JOB 26:8 మేఘాలను దేవుడు నీళ్లతో నింపుతున్నాడు. కానీ నీటి భారం మూలంగా మేఘాలు బద్దలు కాకుండా దేవుడు చూస్తాడు.
JOB 26:9 పున్నమి చంద్రుని దేవుడు కప్పివేస్తాడు. దేవుడు తన మేఘాలను చంద్రుని మీద విస్తరింపచేసి, దానిని కప్పుతాడు
JOB 26:10 మహా సముద్రం మీది ఆకాశపు అంచులను చీకటి వెలుగులకు మధ్య సరిహద్దుగా దేవుడు చేస్తాడు.
JOB 26:11 ఆకాశాలను ఎత్తిపట్టు పునాదులను దేవుడు బెదిరించగా అవి భయంతో వణకుతాయి.
JOB 26:12 దేవుని శక్తి సముద్రాన్ని నిశ్శబ్దం చేస్తుంది. దేవుని జ్ఞానము రాహాబు సహాయకులను నాశనం చేసింది.
JOB 26:13 దేవుని శ్వాస ఆకాశాలను తేటపరుస్తుంది. తప్పించు కోవాలని ప్రయత్నించిన సర్పాన్ని దేవుని హస్తం నాశనం చేస్తుంది.
JOB 26:14 దేవుని శక్తిగల కార్యాల్లో ఇవి కొన్ని మాత్రమే. దేవుని నుండి ఒక చిన్న స్వరం మాత్రమే మనం వింటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, శక్తిగలవాడో ఏ మనిషి నిజంగా అర్థం చేసుకోలేడు.”
JOB 27:1 అప్పుడు యోబు మాట్లాడటం కొన సాగించాడు:
JOB 27:2 “నిజంగా దేవుడు జీవిస్తున్నాడు. మరియు దేవుడు జీవించటం ఎంత సత్యమో ఆయన నాకు అన్యాయం చేశాడు. అనటం కూడ అంతే సత్యం. అవును, సర్వశక్తిమంతుడైన దేవుడు నా జీవితాన్ని బాధించాడు.
JOB 27:3 కానీ నాలో జీవం ఉన్నంతవరకు దేవుని జీవవాయువు నా నాసికా రంధ్రాలలో ఉన్నంతవరకు,
JOB 27:4 నా పెదవులు చెడు సంగతులు మాట్లాడవు. మరియు నా నాలుక ఎన్నడూ ఒక్క అబద్దం చెప్పదు.
JOB 27:5 మీదే సరి అని నేను ఎన్నటికీ అంగీకరించను. నేను నిర్దోషిని అని నేను చచ్చే రోజువరకు చెబుతూనే ఉంటాను.
JOB 27:6 నేను చేసిన సరియైన వాటిని నేను గట్టిగా పట్టు కొని ఉంటాను. సరియైన వాటిని చేయటం నేను ఎన్నటికీ మాని వేయను. నేను బతికి ఉన్నంత కాలం నా మనస్సాక్షి నన్ను బాధించదు.
JOB 27:7 ప్రజలు నాకు వ్యతిరేకులయ్యారు. నా శత్రువులు దుర్మారులు శిక్షించబడినట్టు శిక్షించబడుదురు గాక.
JOB 27:8 దేవుని లక్ష్యపెట్టని మనిషి చనిపోయినప్పుడు అతనికి ఆశ ఏమీ ఉండదు. అతని జీవాన్ని దేవుడు తీసివేసినప్పుడు అతనికి ఆశ లేదు.
JOB 27:9 ఆ దుర్మార్గునికి కష్టాలు వచ్చి, దేవునికి మొరపెడితే దేవుడు వినడు.
JOB 27:10 సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చే సంతోషాన్ని ఆ వ్యక్తి కోరుకొని ఉండాల్సింది. ఆ వ్యక్తి సదా దేవుని ప్రార్థించి ఉండాల్సింది.
JOB 27:11 “దేవుని శక్తిని గూర్చి నీకు నేను నేర్పిస్తాను. సర్వశక్తిమంతుడైన దేవుని పథకాలను నేను దాచి పెట్టను.
JOB 27:12 దేవుని శక్తిని మీరు మీ కళ్లారా చూశారు. కనుక మీరు అలాంటి పనికిమాలిన మాటలు ఎందుకు చెబుతారు?
JOB 27:13 దుర్మార్గులకు దేవుడు తలపెట్టినది ఇదే. సర్వశక్తిమంతుడైన దేవుని నుండి కృర మానవులకు లభించేది ఇదే.
JOB 27:14 ఒకవేళ దుర్మార్గునికి చాలామంది పిల్లలు ఉండ వచ్చునేమో కాని వాని పిల్లలు యుద్ధంలో చంపి వేయబడతారు. దుర్మార్గుని పిల్లలు తినేందుకు సరిపడినంత ఆహారం ఎన్నడూ ఉండదు.
JOB 27:15 దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతని పిల్లలు ఇంకా బతికి ఉంటే భయంకర రోగం వారిని చంపేస్తుంది. అతని కుమారుల విధవలు వారి కోసం విచారించరు.
JOB 27:16 ఒకవేళ దుర్మార్గుడు దుమ్ములా విస్తారమైన వెండిని రాశిగా పోయవచ్చు. ఒకవేళ మట్టి పోగుల్లా అతనికి చాలా బట్టలు ఉండవచ్చును.
JOB 27:17 దుర్మార్గుడు సంపాదిస్తూ విడిచిపోయిన బట్టలను ఒక మంచి మనిషి ధరిస్తాడు. దుర్మార్గుని వెండిని నిర్దోషులు పంచుకొంటారు.
JOB 27:18 దుర్మార్గుడు నిర్మించే యిల్లు ఎక్కువ కాలం నిలువదు. అది సాలె గూడులా ఉంటుంది లేక కావలివాని గుడారంలా ఉంటుంది.
JOB 27:19 దుర్మార్గుడు ధనికునిగా నిద్రకు ఉపక్రమిస్తాడు. కానీ ఆ తర్వాత అతను కళ్లు తెరిచినప్పుడు అతని సంపదంతా పోయినట్లు అతనికి తెలుస్తంది.
JOB 27:20 ఆకస్మిక వరదలా భయాలు అతణ్ణి పట్టు కొంటాయి. రాత్రి వేళ ఒక తుఫాను అతణ్ణి కొట్టు కొని పోతుంది.
JOB 27:21 తూర్పుగాలి అతణ్ణి కొట్టుకొని పొతుంది. అప్పుడు అతడు అంతమై పోతాడు. తుఫాను అతణ్ణి అతని యింటినుండి తుడుచుకుని పోతుంది.
JOB 27:22 తుఫాను బలం నుండి దుర్మార్గుడు పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ తుఫాను అతణ్ణి నిర్దాక్షిణ్యంగా కొడుతుంది.
JOB 27:23 దుర్మార్గుడు పారిపోతూ ఉండగా మనుష్యులు చప్పట్లు కొడతారు. దుర్మార్గుడు తన యింటినుండి పారిపోతూంటే, వానికి విరోధంగా వాళ్లు ఈల వేస్తారు.”
JOB 28:1 “మనుష్యులకు వెండి లభిర చే గనులు ఉన్నాయి. మనుష్యులు బంగారాన్ని కరిగించి, దానిని శుభ్రం చేసే స్థలాలు ఉన్నాయి.
JOB 28:2 మనుష్యలు భూమినుండి ఇనుమును తవ్వుతారు. బండల నుండి రాగి కరిగించబడుతుంది.
JOB 28:3 పనివాళ్లు గుహల్లోకి దీపం తీసుకొని వస్తారు. ఆ గుహల్లో లోపలికి వారు వెదుకుతారు. లోపలిచీకటిలో బండల కోసం వారు వెదుకుతారు.
JOB 28:4 మనుష్యులు నివసించే చోటికి దూరంగా పనివాళ్లు గోతులు తవ్వుతారు. మరి ఏ మనిషీ కూడ గోతులను ఎన్నడూ తాకలేదు. పనివాడు లోతైన ఆ గోతుల్లోనికి తాళ్లతో దిగేటప్పుడు అతడు యితరులకు చాలా దూరంలో ఉంటాడు.
JOB 28:5 భూమిపై నుండి ఆహారం వస్తుంది. కానీ భూమి కింద, వస్తువులను మంట మార్చివేసినట్టు, అది మార్చివేయబడుతుంది.
JOB 28:6 నేలక్రింద బండలలో నీల రత్నాలు లభ్యమవుతాయి. నేల కింద మట్టిలో బంగారం ఉంది.
JOB 28:7 ఆహారం కోసం జంతువులను తినే పక్షులకు భూమికింద మార్గాలు తెలియవు. డేగ కూడా ఈ మార్గం చూడదు.
JOB 28:8 కృర మృగాలు ఈ మార్గంలో నడవలేదు. సింహాలు ఈ మార్గంలో పయనించలేదు.
JOB 28:9 పనివాళ్లు కఠిన శిలలను తవ్వుతారు. ఆ పనివాళ్లు పర్వతాలను తవ్వి, వాటిని ఖాళీ చేస్తారు.
JOB 28:10 పనివాళ్లు బండల్లోనుంచి సొరంగాలు తవ్వుతారు. బండల్లోని ఐశ్వర్యాలు అన్నింటినీ వాళ్లు చూస్తారు.
JOB 28:11 నీళ్లు ప్రవహించకుండా నిలిపేందుకు పనివాళ్లు ఆన కట్టలు కడతారు. దాగి ఉన్న వాటిని వారు వెలుగు లోనికి తీసికొని వస్తారు.
JOB 28:12 “అయితే మనిషికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? గ్రహించటం ఎలా అనేది నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
JOB 28:13 జ్ఞానం చాలా అమూల్యమయిందని మనుష్యులు గ్రహించరు. భూమి మీద నివసించే మనుష్యులకు జ్ఞానం లేదు.
JOB 28:14 ‘జ్ఞానం నాలో లేదు’ అని అగాధ మహాసముద్రం అంటుంది. ‘జ్ఞానం నా దగ్గరా లేదు’ అని సముద్రం అంటుంది.
JOB 28:15 అతి ఖరీదైన బంగారంతో జ్ఞానం కొనలేము. జ్ఞానం ఖరీదు వెండితో లెక్క కట్టబడజాలదు.
JOB 28:16 ఓఫీరు బంగారంతో గాని, విలువైన గోమేధికంతోగాని, నీలంతో గాని, అది కొనబడేది కాదు.
JOB 28:17 బంగారం, స్ఫటికం కంటే జ్ఞానం విలువైనది. బంగారంతో చేయబడిన చాలా ఖరీదైన నగలతో జ్ఞానం కొనబడజాలదు.
JOB 28:18 జ్ఞానం పగడాలకంటె, పచ్చలకంటె విలువగలది. జ్ఞానం కెంపువకంటె ఖరీదైనది.
JOB 28:19 ఇథియోపియా (కూషు)దేశపు పుష్యరాగం జ్ఞానం కంటె విలువైనది కాదు. మేలిమి బంగారంతో మీరు జ్ఞానమును కొనలేరు.
JOB 28:20 “అలాగైతే జ్ఞానం కనుగొనాలంటే మనం ఎక్కడికి వెళ్లాలి? అవగాహన చేసికోవటం నేర్చుకోనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
JOB 28:21 భూమి మీద ప్రతి మనిషి నుండీ జ్ఞానం దాచబడింది. ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా జ్ఞానాన్ని చూడలేవు.
JOB 28:22 ‘మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే విన్నాం’ అని మరణం, నాశనం చెబుతాయి.
JOB 28:23 “కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు. జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు.
JOB 28:24 భూదిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు గనుక ఆయనకు జ్ఞానం తెలుసు. ఆకాశాల కింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు.
JOB 28:25 గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు, మహా సముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన నిర్ణయించినప్పుడు,
JOB 28:26 వర్షాన్ని ఎక్కడ కురిపించాలి, ఉరుములు తుఫానులు ఎటువైపుగా వెళ్లాలి అని దేవుడు నిర్ణయించి నప్పుడు
JOB 28:27 అది దేవుడు జ్ఞానాన్ని చూచిన సమయం, జ్ఞానం యొక్క విలువ ఎంతో చూచేందుకు దానిని పరీ క్షించిన సమయం అవుతుంది. జ్ఞానాన్ని దేవుడు నిర్ధారణ చేశాడు.
JOB 28:28 ‘యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించటం జ్ఞానం అవుతుంది. చెడు సంగతుల నుండి తప్పుకోవటం అవగాహన అవుతుంది’” అని దేవుడు ప్రజలతో చెప్పాడు.
JOB 29:1 యోబు మాట్లాడటం కొనసాగించాడు. యోబు ఇలా అన్నాడు:
JOB 29:2 “దేవుడు నన్ను కాపాడి, నా విషయం జాగ్రత్త తీసు కొన్న ఇటీవలి మాసాల్లో ఉన్నట్టుగానే నా జీవితం ఉంటే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
JOB 29:3 నేను చీకటిలో నడచినప్పుడు నాకు వెలుగు ఇచ్చుటకు నా తలమీద దేవుని వెలుగు ప్రకాశించే సమయం వస్తే బాగుండునని నేను ఆశిస్తున్నాను. (నేను జీవించవలసిన సరియైన మార్గాన్ని దేవుడు నాకు చూపించాడు).
JOB 29:4 నా జీవితం ఎంతో విజయవంతంగా ఉండి దేవుడు నాకు సన్నిహితమైన స్నేహితునిగా ఉండే రోజుల కోసం నేను ఆశిస్తున్నాను. అవి దేవుడు నా ఇంటిని ఆశీర్వదించిన రోజులు.
JOB 29:5 సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకా నాతో ఉండగా నా పిల్లలు నా దగ్గర ఉన్న సమయం కోసం నేను ఆశిస్తున్నాను.
JOB 29:6 అది నా జీవితం ఎంతో బాగున్నప్పటి మాట. నా మార్గం అర తా మీగడతో నిండిపోయినట్టు, నా కోసం ఒలీవ నూనెను నదులుగా ప్రవహించి నట్టు అది కనబడింది.
JOB 29:7 “నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి పట్టణ పెద్దలతో కలిసి ఆరుబయట కూర్చున్న రోజులు అవి.
JOB 29:8 అక్కడ ప్రజలంతా నన్ను గౌరవించేవారు. యువకులు నన్ను చూచినప్పుడు పక్కకు తప్పుకొనేవారు. పెద్దలు నా యెడల గౌరవ సూచకంగా లేచి నిలబడేవారు.
JOB 29:9 ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం నిలిపివేసి నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరులను నిశ్శబ్దంగా ఉంచటానికి).
JOB 29:10 చాలా ప్రముఖ నాయకులు కూడా, నేను వారిని సమీపించినప్పుడు వారి స్వరాలు తగ్గించేవారు. అవును వారి నాలుకలు వారి అంగిట అంటుకొని పోయినట్లు కనిపించేది.
JOB 29:11 నేను మాట్లాడటం విన్నవారు ఎవరైనా సరే, నన్ను గూర్చి మంచి మాటలు చెప్పేవారు. నన్ను చూచిన వారు నన్ను పొగిడారు.
JOB 29:12 ఎందుకంటే, పేదవాడు ఒకడు సహాయం కోసం వేడుకొంటే, నేను సహాయం చేశాను. తల్లి దండ్రులు లేని బిడ్డ విషయం శ్రద్ధ తీసుకోనే వారు ఎవరూ లేనప్పుడు నేను సహాయం చేశాను.
JOB 29:13 మరణించే మనిషీ నన్ను ఆశీర్వదించాడు. అవసరంలో ఉన్న విధవలకు నేను సహాయం చేసాను.
JOB 29:14 సక్రమంగా జీవించటం నాకు వస్త్రం. న్యాయంనాకు అంగీలా, తలపాగాలా ఉండేది.
JOB 29:15 గుడ్డివారికి నా కళ్లతో నేను సహాయం చేశాను. కుంటివారికి నా పాదాలతో నేను సహాయం చేశాను.
JOB 29:16 పేద ప్రజలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను. కష్టాలలో ఉన్న పరాయివారి పక్షం నేను వహించాను.
JOB 29:17 దుర్మార్గుల శక్తిని నేను నాశనం చేశాను. దుర్మార్గుల బారి నుండి నిర్దోషులను నేను రక్షించాను.
JOB 29:18 “నేను ఎల్లప్పుడూ ఇలా తలచేవాణ్ణి. నేను చాలాకాలం బతుకుతాను. తర్యాత నా స్వంత ఇంటిలో మరణిస్తాను.
JOB 29:19 వేర్లు ఎల్లప్పుడూ నీటిని తాకుతూ ఆకులు ఎల్లప్పుడు మంచుతో తడిగా ఉండే చెట్టులా నేను ఉన్నాను.
JOB 29:20 నాలో నా మహిమ ఎల్లప్పుడూ కొత్తదిగా ఉంటుంది. నాచేతిలో ఒక కొత్త విల్లు ఉన్నట్టుగా నేను ఎల్లప్పుడూ బలంగా ఉంటాను.
JOB 29:21 “నేను మాట్లాడటం చాలించిన తరువాత నా మాటలు వింటున్న ప్రజలు చెప్పాల్సింది ఇంకేమీ ఉండేది కాదు. నా మాటలు వారి చెవులకు సౌమ్యంగా వినిపించేవి.
JOB 29:22 ప్రజలు వర్షంకోసం వేచి ఉన్నట్టు, నేను మాట్లాడాలని వారు వేచి ఉండేవారు.
JOB 29:23 నా మాట వసంతకాలపు వర్షంలా ఉండేది నా మాటల్ని వారు పానం చేసేవారు. అధైర్య పడిన వారిని చూచి నేను చిరునవ్వు నవ్వే వాడిని.
JOB 29:24 నా ప్రసన్న ముఖం క్రుంగిన ప్రజలకు మంచి అనుభూతిని కలిగించేది.
JOB 29:25 ప్రజల పట్ల బాధ్యత వహించి నేను నిర్ణయాలు చేసాను. నేను నాయకుణ్ణి అయ్యాను. తన సైన్య దళాలలో ఒక రాజులా నేను జీవించాను. చాలా విచారంలో ఉన్న ప్రజలకు ఆదరణ ఇచ్చే మనిషిలా నేను ఉన్నాను.
JOB 30:1 “కాని యిప్పుడు నన్ను హేళన చేసే వారు నాకంటే చిన్నావారు. ఆ యువకులకు పనికి మాలిన తండ్రులు ఉన్నారు. వారి తండ్రులను నా గొర్రెలను కాపలా కాసే కుక్కలతో కూడా నేను ఉండనివ్వను.
JOB 30:2 నాకు సహాయం చేసేందుకు వాళ్లకు బలం లేదు. వారు అలసిపోయిన వృద్ధులు.
JOB 30:3 ఆ మనుష్యులు చచ్చిన వాళ్లతో సమానం. ఎందు కంటే వారికి ఏమీ లేక ఆకలితో ఉన్నారు. ఎండి పోయిన ఖాళీ నేలను కూడా వారు తినటానికి ప్రయత్నిస్తున్నారు.
JOB 30:4 ఆ మనుష్యులు వారి ఎడారిలోని తుత్తి చెట్లను పెరికి వేస్తారు. తంగేడు చెట్టు వేర్లను వారు తింటారు.
JOB 30:5 ఆ మనుష్యులు ఇతర మనుష్యులు దగ్గర నుండి బలవంతంగా వెళ్లగొట్టబడతారు. మనుష్యులు దొంగల మీద అరచినట్టుగా వారి మీద అరుస్తారు.
JOB 30:6 ఎండిపోయిన నదులలోను, బండలలోను, కొండగుహలలోను, నేలలోని గుంటలలోను నివసించేందుకు వారి వృద్ధులు బలాత్కారం చేయ బడతారు.
JOB 30:7 వారు పొదలలో అరుస్తారు. ముళ్ల కంపల్లో వారంతా ఒక్కచోట చేరుతారు.
JOB 30:8 వాళ్లు పనికిమాలిన అనామకుల గుంపు. వాళ్లు వారి దేశం నుండి బలవంతంగా వెళ్లగాట్టబడిన వాళ్లు.
JOB 30:9 “ఇప్పుడు ఆ మనుష్యుల కొడుకులు నన్ను హేళన చేసేందుకు నన్ను గూర్చి పాటలు పాడుతారు. వాళ్లకు నా పేరు చెడ్డ మాట అయింది.
JOB 30:10 ఆ యువకులు నన్ను ద్వేషిస్తారు, వారు నాకు దూరంగా నిలుస్తారు, వారు నాకంటే మంచివాళ్లము అనుకొంటారు. చివరికి వాళ్లు నా ముఖం మీద ఉమ్మి కూడా వేస్తారు.
JOB 30:11 నా వింటి నారిని దేవుడు తీసుకొని నన్ను బలహీనుణ్ణి చేశాడు. ఆ యువకులు తమని తాము వారించుకొనక నిండు కోపంతో నాకు విరోధంగా తిరుగుతారు.
JOB 30:12 నా కుడి ప్రక్క ఆ యువకులు నామీద పడుతున్నారు. నేను పడిపోయేలా వాళ్లు చేస్తున్నారు. వారు నామీద దాడి చేసి, నన్ను నాశనం చేసేందుకు నా చుట్టూరా పట్టణానికి ముట్టడి దిబ్బ వేసినట్లు వేస్తున్నారు.
JOB 30:13 నేను పారిపోయే మార్గాన్ని ఆ యువకులు కాపలా కాస్తున్నారు. నన్ను నాశనం చేయటంలో వారువిజయం పొందుతున్నారు. వారు నన్ను నాశనం చేయటానికి వారికి ఎవరి సహాయం అవసరం లేదు.
JOB 30:14 గోడలోని కన్నంగుండా వెళ్లిపోయినట్టు వారు నామీద దాడి చేస్తున్నారు. వారు దూకేసి నా మీదకు విరగబడుతున్నారు.
JOB 30:15 భయాలు నన్ను ఆవరించేస్తున్నాయి. వస్తువులనుగాలి చెదరగొట్టినట్లు ఆ యువకులు నా గౌరవాన్ని అవమానపరుస్తున్నారు. నా భద్రత మబ్బులా మాయమవుతోంది.
JOB 30:16 “ఇప్పుడు నా జీవితం దాదాపు అయిపోయింది. నేను త్వరలోనే మరణిస్తాను. శ్రమదినాలు నన్ను పట్టివేశాయి.
JOB 30:17 రాత్రివేళ నా ఎముకలు అన్నీ నొప్పెడతాయి. బాధ నన్ను నమిలివేయటం ఎన్నడూ ఆగిపోలేదు.
JOB 30:18 దేవుడు మహాబలంగా నా చొక్కా పట్టి లాగుతున్నాడు. ఆయన నా బట్టలను నలిపి వేస్తున్నాడు.
JOB 30:19 దేవుడు నన్ను బురదలో పడదోస్తున్నాడు. నేను మట్టిలా, బూడిదలా అయిపోతున్నాను.
JOB 30:20 “దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెడుతున్నాను. కానీ నీవు జవాబు ఇవ్వవు. నేను నిలబడి ప్రార్థన చెస్తాను. కానీ నీవు నాకు జవాబు ఇవ్వవు.
JOB 30:21 దేవా, నీవు నా ఎడల అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు. నన్ను బాధపెట్టేందుకు నీవు నీ శక్తిని ప్రయోగిస్తున్నావు.
JOB 30:22 దేవా, బలమైన గాలి నన్ను కొట్టుకొని పోయేటట్టు నీవు చేస్తున్నావు. నీవు నన్ను తుఫానులో పడదోస్తున్నావు.
JOB 30:23 నీవు నన్ను నా మరణానికి తీసుకొని పోతున్నావని నాకు తెలుసు. మరణం ప్రతి మనిషికి ఏర్పాటు చేయబడిందే.
JOB 30:24 “కానీ అప్పటికే నాశనమయి, సహాయంకోసం అలమటించేవాణ్ణి నిశ్చయంగా ఎవ్వరూ బాధించరు.
JOB 30:25 దేవా, కష్టాల్లో ఉన్న ప్రజల పక్షంగా నేను మొర్ర పెట్టానని నీకు తెలుసు. పేద ప్రజల కోసం నా హృదయం ఎంతో విచారించిందని నీకు తెలుసు.
JOB 30:26 కానీ నేను మంచివాటి కోసం ఎదురు చూస్తే వాటికి బదులు చెడ్డవి జరిగాయి. వెలుగుకోసం నేను చూస్తే చీకటి వచ్చింది.
JOB 30:27 అంతరంగంలో నేను చీల్చివేయబడ్డాను. శ్రమలు ఎన్నటికీ ఆగిపోవు. శ్రమకాలాలు నా యెదుట ఉన్నాయి.
JOB 30:28 నేను ఎల్లప్పుడూ ఎంతో విచారంగా ఉంటానుగాని, నాకు ఆదరణ లభ్యం కాదు. నేను సమాజంలో నిలబడి సహాయం కోసం కేకలు వేస్తాను.
JOB 30:29 నేను అడవి కుక్కలకు సోదరుడినయ్యాను. నిప్పుకోళ్లు నాకు జతగాళ్లు.
JOB 30:30 నా చర్మం చాలా నల్లబడిపోయింది. నా శరీరం జ్వరంతో వేడిగా ఉంది.
JOB 30:31 దుఃఖమయ గీతాలు వాయించేందుకు నా స్వర మండలములను శృతి చేయబడింది. విచారంగా ఏడుస్తున్న శబ్దాలు నా పిల్లనగ్రోవి చేస్తుంది.
JOB 31:1 “ఒక యువతిని కామవాంఛతో చూడ కూడదని నా కళ్లతో నేను ఒప్పందం చేసుకొన్నాను.
JOB 31:2 సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజలకు ఏమి చేస్తున్నాడు? దేవుడు ఉన్నతమైన తన పరలోక గృహంలో ఉండి ప్రజలకు తిరిగి ఎలా ప్రతిఫలం ఇస్తున్నాడు?
JOB 31:3 దుర్మార్గులకు దేవుడు కష్టాన్ని, నాశనాన్ని పంపిస్తాడు. తప్పు చేసేవారికి సర్వనాశనం కలిగిస్తాడు.
JOB 31:4 నేను చేసేది ప్రతిదీ దేవునికి తెలుసు. నేను వేసే ప్రతి అడుగూ ఆయన చూస్తున్నాడు.
JOB 31:5 “నేను అబద్ధాల జీవితం జీవించి ఉంటే, లేక ప్రజలకు అబద్దాలు చెప్పి, మోసం చేసేందుకు నేను పరుగులెత్తి ఉంటే.
JOB 31:6 అప్పుడు నన్ను తూచేందుకు దేవుడు న్యాయపుత్రాసు వాడవచ్చును. అప్పుడు నేను నిర్దోషినని దేవునికే తెలుస్తుంది.
JOB 31:7 నేను సరియైన మార్గం నుండి తొలగిపోతే నా కళ్లు నా హృదయాన్ని దుష్టత్వానికి నడిపించి ఉంటే లేదా నా చేతులు పాపంతో మైలగా ఉంటే,
JOB 31:8 అప్పుడు నేను నాటిన పంటలను ఇతరులు తిని వేయుదురు గాక, నా పంటలు పెరికి వేయబడును గాక.
JOB 31:9 “నేను స్త్రీల పట్ల కామవాంఛ కలిగి ఉంటే లేదా నేను నా పొరుగువాని భార్యతో వ్యభిచార పాపం చేయటానికి అతని ద్వారం దగ్గర వేచి ఉంటే,
JOB 31:10 అప్పుడు నా భార్య మరొకనికి వంట చేయునుగాక. ఇతర వురుషులు ఆమెతో పండుకొందురు గాక.
JOB 31:11 ఎందుకంటే లైంగిక పాపం అవమానకరం. అది శిక్షించబడాల్సిన పాపం.
JOB 31:12 లైంగికపాపం కాల్చివేసి, నాశనంచేసే అగ్నిలాంటిది. లైంగిక పాపంనాకు గల సర్వాన్నీ నాశనం చేస్తుంది.
JOB 31:13 “నా మగ సేవకులు, ఆడ సేవకులు నాకు విరోధంగా ఆరోపణ చేసినప్పుడు, ఒక వేళ నేను వారికి న్యాయం చేకూర్చేందుకు నిరాకరిస్తే,
JOB 31:14 నేను దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నేను ఏమి చేస్త్తాను? నేను చేసిన దాని గూర్చి వివరించు మని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబిస్తాను?
JOB 31:15 దేవుడు నన్ను నా తల్లి గర్భంలోనే చేశాడు. నా సేవకులను కూడా దేవుడే చేసాడు. మమ్ముల్ని ఇద్దరినీ మా తల్లి గర్భంలో దేవుడే రూపొందిచాడు.
JOB 31:16 “పేద ప్రజలకు సహాయం చేసేందుకు నేను ఎన్నడూ నిరాకరించలేదు. విధవలను దిక్కుమాలిన వారిగా నేను ఎన్నడూ ఉండనియ్యలేదు.
JOB 31:17 నా భోజనం విషయంలో నేను ఎన్నడూ స్వార్థంతో ఉండలేదు. అనాధ పిల్లలను నేను ఎన్నడూ ఆకలితో ఉండనీయలేదు.
JOB 31:18 నా జీవిత కాలం అంతా తండ్రిలేని పిల్లలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను. నా జీవిత కాలం అంతా విధవల పట్ల నేను శ్రద్ధ చూపాను.
JOB 31:19 ఎవరో ఒకరు బట్టలు లేక శ్రమపడటం నేను చూచినప్పుడు, లేక పేదవాడు చొక్కా లేకుండా ఉన్నప్పుడు,
JOB 31:20 నేను ఎల్లప్పుడూ వారికి బట్టలు ఇచ్చాను. వారికి వెచ్చదనం కోసం నా గొర్రెల స్వంతబొచ్చు నేను ఉపయోగించాను. అప్పుడు వారు హృదయపూర్వకంగా నన్ను ఆశీర్వదించారు.
JOB 31:21 న్యాయస్థానంలో నేను గెలుస్తానని తెలిసికూడ ఒక అనాధ బిడ్డను నేను మోసం చేస్తే,
JOB 31:22 నేను ఒకవేళ అలాచేస్తే నా భుజం నుండి నా చేయి ఊడి పడిపోవును గాక. నా చేయి దాని కీలు నుండి పడిపోవును గాక.
JOB 31:23 కాని ఆ చెడ్డ పనులు ఏవీ నేను చేయలేదు. ఎందుకంటే, దేవుని శిక్షకు నేను భయపడ్డాను. ఆయన మహాత్మ్యము నన్ను బెదరగొట్టేను.
JOB 31:24 “నా ఐశ్వర్యాలను నేను ఎన్నడూ నమ్ముకొనలేదు. ‘నీవే నా ఆశ అని’ స్వచ్ఛమైన బంగారంతో నేను ఎన్నడూ చెప్పలేదు.
JOB 31:25 నేను ధనికుడను అని ఎన్నడు గర్వంతో నిండి పోలేదు. లేక నేను సంపాదించిన ఐశ్వర్యాలతో మురిసిపోలేదు.
JOB 31:26 నేను ఎన్నడూ ప్రకాశమైన సూర్యుణ్ణి లేక అందమైన చంద్రుణ్ణి ఆరాధించలేదు.
JOB 31:27 సూర్య చంద్రులకు భక్తితో పూజ చేసేందుకు నేను ఎన్నడూ మోసగించబడలేదు.
JOB 31:28 అలాంటిని ఏవైనా, ఎన్నడైనా నేను చేసి ఉంటే అవి నేను శిక్షించబడాల్సిన పాపాలే. ఎందుచేత నంటే ఆ చెడు కార్యాలు చేయటం మూలంగా సర్వశక్తిమంతుడైన దేవునికి నేను అపనమ్మకమైన వాడినవుతాను.
JOB 31:29 “నా శత్రువులు నాశనం చేయబడినప్పుడు నేను ఎన్నడూ సంతోషించలేదు. నా శత్రువులకు కష్టాలు కలిగినప్పుడు నేను ఎన్నడూ నవ్వలేదు.
JOB 31:30 నా శత్రువులను శపించటం ద్వారానూ, వారుచావాలని కోరుకోవటం ద్వారానూ, నేను ఎన్నడూ నా నోటితో పాపం చేయలేదు.
JOB 31:31 పరాయి వాళ్లకు నేను ఎల్లప్పుడూ భోజనం పెట్టినట్లు నా ఇంట్లోని వాళ్లందరకూ తెలుసు.
JOB 31:32 పరాయి వాళ్లు రాత్రి పూట వీధుల్లో నిద్రపోవాల్సిన అవసరం లేకుండా నేను అలాంటి వారిని ఎల్లప్పుడూ నా ఇంటికి ఆహ్వానించేవాడను.
JOB 31:33 ఇతరులు తమ పాపాలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కాని నేను నా దొషాన్ని దాచిపెట్టలేదు.
JOB 31:34 ఎందుకంటే, ప్రజలు ఏమనుకుంటారో అని నేను ఎన్నడూ భయపడలేదు. నేను ఎన్నడూ మౌనంగా ఉండలేదు. బయటకు వెళ్లకుండా ఉండలేదు. ఎందుకంటే, ప్రజలు నన్ను ద్వేషిస్తారనే భయంనాకు లేదు గనుక.
JOB 31:35 “ఆహా, ఎవరైనా నా మాటలు వినేవారు ఉంటే బాగుండును. ఇప్పుడు నేను నా వాదం చెబుతాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు జవాబిచ్చును గాక. నన్ను నిందించే ఆయన, నేను చేశానని నిందించబడుతున్న సంగతులను రాసి పెట్టును గాక.
JOB 31:36 నిశ్చయంగా ఆ రాతను నేను నా భుజం మీద ధరిసాను. నేను దానిని కిరీటంలా ధరిస్తాను.
JOB 31:37 నేను చేసినది సమస్తం దేవునికి నేను వివరిస్తాను. నేను ఒక అధికారిలా నా తలపైకి ఎత్తుకొని దేవుని దగ్గరకు వస్తాను.
JOB 31:38 “నేను సాగుచేస్తున్న భూమిని దాని సొంతదారుని దగ్గర దొంగిలించి తీసుకొని ఉంటే, ఆ భూమిదాని సొంత కన్నీళ్లతో తడిసి ఉంటే,
JOB 31:39 ఆ భూమి పండించిన వాటిని రైతులకు విలువ చెల్లించకుండానే నేను దొంగిలించి ఉంటే,
JOB 31:40 అవును, ఈ చెడుకార్యాలు నేను కనుక చేసి ఉంటే పొలాల్లో గోధుమకు బదులు ముండ్లు, యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక!” యోబు మాటలు సమాస్తం.
JOB 32:1 అప్పుడు యోబు స్నేహితులు ముగ్గురూ యోబుకు జవాబు ఇచ్చే ప్రయత్నం విర మించుకొన్నారు. యోబు తన మట్టుకు తాను నిర్దోషినని అనుకోవడం చేత వారు విరమించుకొన్నారు.
JOB 32:2 ఎలీహు అనే పేరు గల ఒకతను అక్కడ ఉన్నాడు. ఎలీహు బరకెయేలు కుమారుడు. బరకెయేలు బూజు సంతతి వాడు. ఎలీహు రాము వంశస్థుడు. ఎలీహు యోబు మీద చాలా కోపగించాడు. ఎందుకంటే యోబు తన మట్టుకుతానే మంచివాడినని చెప్పు కొంటున్నాడు. మరియు యోబు తాను దేవునికంటే నీతిమంతుణ్ణి అని చెబుతున్నాడు.
JOB 32:3 కాబట్టి ఎలీహు యోబు స్నేహితుల మీద కూడా కోపగించాడు. ఎందు కంటే యోబు స్నేహితులు ముగ్గురూ యోబు ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక యోబుదే తప్పు అని రుజువు చేయలేకపోయారు.
JOB 32:4 అక్కడ ఉన్న వారిలో ఎలీహు చాలా చిన్నవాడు. కనుక ప్రతి ఒక్కరూ మాట్లాడటం అయ్యేంత వరకు అతడు వేచి ఉన్నాడు. అప్పుడు అతడు మాట్లాడటం ప్రారంభించవచ్చు అనుకొన్నాడు.
JOB 32:5 యోబు స్నేహితులు ముగ్గురూ చెప్పాల్సింది ఇంక ఏమీలేదని ఎలీహు చూచినప్పుడు అతనికి కోపం వచ్చింది.
JOB 32:6 కనుక ఎలీహు మాట్లాడటం ప్రారంభించాడు. అతడు ఇలా అన్నాడు: “నేను చిన్నవాడిని. మీరు పెద్దవాళ్లు. అందుకే నేను అనుకొంటున్నది ఏమిటో మీతో చెప్పాడానికి భయపడుతున్నాను.
JOB 32:7 ‘పెద్దవాళ్లు ముందుగా మాట్లాడాలి. చాలా సంవత్సరాలు బతికిన మనుష్యులు తమ జ్ఞానాన్ని పంచి ఇవ్వాలి’ అని నాలో నేను అనుకొన్నాను.
JOB 32:8 కాని ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ, సర్వశక్తిమంతుడైన దేవుని ‘ఊపిరి’ ఆ వ్యక్తికి జ్ఞానం ప్రసాదిస్తుంది.
JOB 32:9 వృద్ధులు మాత్రమే జ్ఞానం గల మనుష్యులు కారు. వయస్సు పైబడిన వాళ్లు మాత్రమే సరియైన అవగాహన గలవారు కారు.
JOB 32:10 “అందువల్లనే ఎలీహు అనే నేను నా మాట వినమని చెబుతున్నాను. నేను తలచేదేమిటో కూడా నేను మీతో చెబుతాను.
JOB 32:11 మీరు మాట్లాడుతూ ఉన్నంతసేపూ నేను సహనంతో వేచి ఉన్నాను. మీరు యోబుకు చెప్పిన జవాబులు నేను విన్నాను.
JOB 32:12 మీరు తెలివిగల మాటలతో యోబుకు జవాబు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నంతసేపూ నేను శ్రద్ధగా విన్నాను. కాని యోబుదే తప్పు అని మీరు ముగ్గురూ రుజువు చేయలేదు. యోబు వాదాలకు మీలో ఒక్కరూ జవాబు చెప్పలేదు.
JOB 32:13 మీరు ముగ్గురూ జ్ఞానం కనుగొన్నట్టు చెప్పలేరు. యోబు వాదాలకు దేవుడే జవాబు చెప్పాలి కాని మనుష్యులు కాదు.
JOB 32:14 కాని యోబు నాతో వాదించలేదు. అందుచేత మీరు ముగ్గురూ ప్రయోగించిన వాదాలను నేను ఉపయోగించను.
JOB 32:15 “యోబూ, నీ ముగ్గరు స్నేహితులూ ఇబ్బంది పడిపోతున్నారు. వారు చెప్పాల్సింది ఇంక ఏమీ లేదు. వారి వద్ద జవాబులు ఇంకేమీ లేవు.
JOB 32:16 ఈ ముగ్గురు మనుష్యులూ మౌనంగా ఉన్నారు, అక్కడే నిలబడ్డారు, జవాబు ఏమీ లేదు. కనుక నేను ఇంకా వేచి ఉండాలా?
JOB 32:17 లేదు! నేను కూడా నా జవాబు చెబుతాను. నేను తలుస్తున్నది కూడ నీతో చెబుతాను.
JOB 32:18 ఎందుకంటే, నేను చెప్పాల్సింది చాలా ఉంది. నాలో ఉన్న ఆత్మ నన్ను మాట్లాడమని బలవంతం చేస్తోంది.
JOB 32:19 కొద్ది సేపట్లో పోర్లిపోయే ద్రాక్షారసంలా నా అంతరంగంలో నేను ఉన్నాను. త్వరలో పగిలిపోబో తున్న కొత్త ద్రాక్షా తిత్తిలా నేను ఉన్నాను.
JOB 32:20 కనుక నేను మాట్లాడాలి. అప్పుడు నాకు బాగుంటుంది. నేను నా పెదాలు తెరచి యోబు ఆరోపణలకు జవాబు చెప్పాలి.
JOB 32:21 ఈ వాదంలో నేను ఎవరి పక్షమూ వహించను. నేను ఎవరినీ పొగడను. నేనేమి చెప్పాలో దానిని చెబుతాను.
JOB 32:22 ఒక మనిషిని ఎలా పొగడాలో నాకు తెలియదు. ఒకరిని ఎలా పొగడాలో నాకు తెలిసి ఉంటే వెంటనే దేవుడు నన్ను శిక్షిస్తాడు.
JOB 33:1 “అయితే యోబూ, దయచేసి నా సందేశాన్నివిను. నేను చెప్పే మాటలు గమనించు.
JOB 33:2 త్వరలోనే నేను మాట్లాడటం మొదలు పెడతాను. చెప్పటానికి నేను దాదాపు సిద్ధంగా ఉన్నాను.
JOB 33:3 నా హృదయం నిజాయితీ గలది. కనుక నిజాయితీగల మాటలను నేను చెబుతాను. నాకు తెలిసిన సంగతులను గూర్చి నేను సత్యం చెబుతాను.
JOB 33:4 దేవుని ఆత్మ నన్ను చేసింది. నా జీవం సర్వశక్తిమంతుడైన దేవుని నుండి వచ్చింది.
JOB 33:5 యోబూ, విను. నీవు చెప్పగలవనుకొంటే నాకు జవాబు చెప్పు. నీవు నాతో వాదించగలిగేందుకు నీ జవాబులు సిద్ధం చేసుకో.
JOB 33:6 దేవుని ఎదుట నీవు, నేను సమానం. మన ఇద్దరిని చేసేందుకు దేవుడు మట్టినే ఉపయోగించాడు.
JOB 33:7 యోబూ, నన్ను గూర్చి భయపడకు. నేను నీ యెడల కఠినంగా ఉండను.
JOB 33:8 “కాని యోబూ, నీవు చెబుతూండగా నేను విన్నది ఇదే.
JOB 33:9 నీవు అన్నావు: ‘యోబు అనే నేను నిర్దోషిని, నేను పాపం చేయలేదు. లేక ఏ తప్పు చేయలేదు. నేను దోషిని కాను.
JOB 33:10 నేను ఏ తప్పు చేయక పోయినప్పటికి దేవుడు నాలో ఏదో తప్పుకనుగొన్నాడు. యోబు అనేనేను దేవుని శత్రువును అని ఆయన తలుస్తున్నాడు.
JOB 33:11 కనుక దేవుడు నా పాదాలకు సంకెళ్లు వేస్తున్నాడు. నేను చేసేది సమస్తం దేవుడు గమనిస్తున్నాడు.’
JOB 33:12 “కాని యోబూ, దీని విషయం నీది తప్పు అని నేను నీ తో చెప్పాలి. ఎందుకంటే దేవునికి అందరి కంటే ఎక్కువ తెలుసు కనుక.
JOB 33:13 యోబూ, నీవు ఎందుకు ఆరోపణ చేస్తూ దేవునితో వాదిస్తావు? దేవుడు చేసే ప్రతిదాని గూర్చీ ఆయన నీకు వివరించటం లేదని నీవెందుకు ఆలోచిస్తావు?
JOB 33:14 అయితే దేవుడు చేసే దాన్ని గూర్చి ఆయన వివరిస్తాడు. దేవుడు వేరువేరు విధానాలలో మాట్లాడతాడు. కానీ మనుష్యులు దాన్ని గ్రహించరు.
JOB 33:15 ఒక వేళ మనుష్యులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలో లేక రాత్రి వేళ దర్శనంలో ఆయన వారి చెవులలో చెబుతాడేమో. అప్పుడు వారు దేవుని హెచ్చరికలు విని చాలా భయపడతారు.
JOB 33:17 మనుష్యులు చెడు సంగతులు జరిగించటం మాని వేయాలని, గర్విష్టులు, కాకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తాడు.
JOB 33:18 మనుష్యులు మరణస్థానానికి వెళ్లకుండా రక్షించాలని హెచ్చరిస్తాడు. ఒక వ్యక్తి నాశనం చేయబడకుండా రక్షించటానికి దేవుడు అలా చేస్తాడు.
JOB 33:19 “లేక ఒక వ్యక్తి పడగ మీద ఉండి దేవుని శిక్ష అనుభవిస్తుప్పుడు దేవుని స్వరం వినవచ్చును. ఆ వ్యక్తిని దేవుడు బాధతో హెచ్చరిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎముకలన్నీ నొప్పి పెట్టిన ట్లు అతడు బాధ పడుతున్నాడు.
JOB 33:20 ఆ వ్యక్తి భోజనం చేయలేడు. శ్రేష్టమైన భోజనం కూడ అసహ్యించుకొనేంతగా అతడు బాధ పడతాడు.
JOB 33:21 అతని చర్మం వేలాడేటంతగా, అతని ఎముకలు పోడుచుకొని వచ్చేంతగా అతని శరీరం పాడైపోతుంది.
JOB 33:22 ఆ మనిషి ఖనన స్థలానికి సమీపంగా ఉన్నాడు. అతని జీవితం చావుకు దగ్గరగా ఉంది.
JOB 33:23 కాని ఒకవేళ ఆ మనిషికి సహాయం చేయటానికి ఒక దేవదూత ఉండునేమో. నిజంగా దేవునికి వేలాది దూతలు ఉంటారు. అప్పుడు ఆ దూతలు ఆ మనిషి చేయాల్సిన సరియైన సంగతిని అతనికి తెలియజేస్తాడు.
JOB 33:24 మరియు ఆ దేవదూత ఆ మనిషి ఎడల దయగాఉంటాడు, ‘ఈ మనిషిని చావు స్థలం నుండి రక్షించండి. అతని పక్షంగా చెల్లించేందుకు నేను ఒక మార్గం కనుగొన్నాను’
JOB 33:25 అప్పుడు ఆ మనిషి శరీరం మరల యవ్వనాన్ని, బలాన్ని పొందుతుంది. ఆ మనిషి యువకునిగా ఉన్నప్పటివలెనే ఉంటాడు.
JOB 33:26 ఆ మనిషి దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు అతని ప్రార్థన వింటాడు. అప్పుడు ఆ మనిషి దేవుని ఆరాధిస్తూ సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే, దేవుడు అతనికి సహజమైన మంచి జీవితాన్ని మరల ఇస్తాడు గనుక.
JOB 33:27 అప్పుడు ఆ మనిషి ప్రజల దగ్గర ఒప్పుకొంటాడు. అతడు చెబుతాడు, ‘నేను పాపం చేశాను. మంచిని నేను చెడుగా మార్చాను. కానీ దేవుడు శిక్షించాల్సి నంత కఠినంగా నన్ను శిక్షించలేదు.
JOB 33:28 నా ఆత్మ ఖనన స్థలానికి వెళ్లకుండా దేవుడు నన్ను రక్షించాడు. నేను చాలాకాలం జీవిస్తాను. నేను మరల జీవితాన్ని అనుభవిస్తాను.’
JOB 33:29 “ఒక మనిషికి దేవుడు ఈ సంగతులను మరల మరల చేస్తాడు.
JOB 33:30 ఆ మనిషిని హెచ్చరించి, అతని ఆత్మను మరణ స్థలం నుండి రక్షించేందుకు. అప్పుడు ఆ మనిషి తన జీవితాన్ని అనుభవించవచ్చు.
JOB 33:31 “యోబూ, నా మాట గమనించు. నా మాటవిను. మౌనంగా ఉండి, నన్ను మాట్లాడనియ్యి.
JOB 33:32 యోబూ, నీవు చెప్పాల్సింది ఏమైనా ఉంటే నన్ను వినని. ఎందుకంటే, నీవు నిర్దోషిని అని రుజువు చేయగోరుతున్నాను గనుక. నీ వాదాన్ని సరిదిద్దేలాగా నాకు వినిపించు.
JOB 33:33 కానీ యోబూ, నీవు చెప్పాల్సింది ఏమీ లేకపోతే నా మాట విను. మౌనంగా ఉండు, జ్ఞానం గలిగి ఉండటం ఎలాగో నేను నేర్పిస్తాను.”
JOB 34:1 అప్పుడు ఎలీహు మాట్లాడటం కొన సాగించాడు:
JOB 34:2 “జ్ఞానంగల మనుష్యులారా, నేను చెప్పే విషయాలు వినండి. తెలివిగల మనుష్యులారా నా మాటలు గమనించండి.
JOB 34:3 చెవి తను వినే సంగతులను పరీక్షిస్తుంది. అదే విధంగా నాలుక, తన తాకే వాటిని రుచి చూస్తుంది.
JOB 34:4 అందుచేత మనం ఈ పరిస్థితిని పరిశీలించాలి. ఏది సరైనదో మనమే నిర్ణయించాలి. ఏది మంచిది అనేది కూడా మనం అంతా ఏకంగా నేర్చు కొంటాం.
JOB 34:5 యోబు అంటున్నాడు, ‘యోబు అనే నేను నిర్దోషిని. కానీ దేవుడు నాకు న్యాయం చేయలేదు.
JOB 34:6 నాది సరిగ్గా ఉంది, కానీ ప్రజలు నాది తప్పు అనుకొంటారు. నేను అబద్దీకుణ్ణి అని వాళ్లు అనుకొంటారు. నేను నిర్దోషిని అయినప్పటికి నా గాయం మానదు.’
JOB 34:7 “యోబులాంటి వ్యక్తి మరొకడు లేడు. మీరు యోబును అవమానించినప్పటికి అతడు లెక్క చేయడు.
JOB 34:8 చెడ్డ వాళ్లతో యోబు స్నేహంగా ఉన్నాడు. దుర్మార్గులతో కలిసి సహవాసం యోబుకు యిష్టం.
JOB 34:9 ‘ఎందుకంటే, ఒకడు దేవునికి విధేయత చూపించేందుకు ప్రయత్నిస్తే దానివల్ల అతనికి ప్రయోజనం ఏమీ కలుగదు’ అని యోబు చెబుతున్నాడు.
JOB 34:10 “కనుక గ్రహించగలిగిన ఓ మనుష్యులారా, నా మాటవినండి. దేవుడు ఎన్నటికీ చెడు చేయడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ తప్పు చేయడు.
JOB 34:11 ఒకడు చేసిన విషయాలనే తిరిగి దేవుడు అతనికి చెల్లిస్తాడు. మనుష్యలకు రావలసిందే దేవుడు వారికి ఇస్తాడు.
JOB 34:12 ఇది సత్యం. దేవుడు తప్పు చేయడు. సర్వశక్తి మంతుడైన దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటాడు.
JOB 34:13 భూమికి పర్యవేక్షకునిగా ఉండేందుకు దేవుణ్ణి ఎవరు నియమించారు? భూభారాన్ని దేవునికి ఎవరు అప్పగించారు? (దేవుడు అన్నింటినీ పుట్టించాడు మరియు అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి.)
JOB 34:14 దేవుడు తన ఆత్మను, తన ప్రాణవాయువును మనుష్యుల్లోనుండి తీసివేయాలని ఒకవేళ అనుకొంటే
JOB 34:15 అప్పుడు భూమి మీద మనుష్యులు అందరూ చని పోతారు. అప్పుడు మనుష్యులు మరల మట్టి అయిపోతారు.
JOB 34:16 “మీరు జ్ఞానంగల వారైతే, నేను చెప్పేది వినండి.
JOB 34:17 న్యాయంగా ఉండటం యిష్టంలేని మనిషి పరిపాలకునిగా ఉండజాలడు. యోబూ, బలమైన మంచి దేవుణ్ణి నీవు దోషిగా తీర్చగలవని నీవు తలుస్తున్నావా?
JOB 34:18 ‘మీరు పనికిమాలిన వాళ్లు’ అని రాజులతో చెప్పేవాడు దేవుడు. ‘మీరు దుర్మార్గులు’ అని నాయకులతో దేవుడు చెబుతాడు.
JOB 34:19 దేవుడు నాయకులను మనుష్యులకంటె ఎక్కువేమీ ప్రేమించడు. దేవుడు ధనికులను దరిద్రుల కంటే ఎక్కువేమీ ప్రేమించడు. ఎందుకంటే, ప్రతి మనిషినీ దేవుడే చేశాడు గనుక.
JOB 34:20 ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా మరణించ వచ్చును. మనుష్యులను దేవుడు రోగులుగా చేస్తాడు. వారు మరణిస్తారు. ఏ కారణం లేకుండానే శక్తిగల మనుష్యులు మరణిస్తారు.
JOB 34:21 “మనుష్యులు ఏమి చేస్తున్నదీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి నడిచే ప్రతి నడత దేవునికి తెలుసు.
JOB 34:22 దుర్మార్గుడు దేవునికి కనబడకుండా దాగుకొనేందుకు చీకటి చోటు ఏమీ లేదు. ఏ చోటైన చీకటిగా ఉండదు.
JOB 34:23 మనుష్యులను మరింత పరీక్షించేందుకు దేవునికి ఒక నిర్ణీత సమయం అవసరం లేదు. మనుష్యులకు తీర్పు తీర్చేందుకు దేవుడు వారిని తన ఎదుటికి తీసుకొని రానవసరం లేదు.
JOB 34:24 దేవుడు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు శక్తివంతమైన వారిని నాశనం చేసి ఇతరులను వారి స్థానంలో ఉంచుతాడు.
JOB 34:25 కనుక మనుష్యులు ఏమి చేస్తారో దేవునికి తెలుసు. అందుకే దేవుడు దుర్మార్గులను రాత్రిపూట ఓడించి, వారిని నాశనం చేస్తాడు.
JOB 34:26 చెడ్డవాళ్లు చేయు దుర్మార్గపు పనులను బట్టి దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఆ చెడ్డవారిని అందరూ చేసేలా ఆయన శిక్షిస్తాడు
JOB 34:27 ఎందుకంటే ఆ చెడ్డవాళ్లు దేవునికి విధేయత కావటం మానివేశారు గనుక. మరియు ఆయన కొరిన వాటిని చేయటం ఆ చెడ్డవాళ్లు లక్ష్య పెట్టలేదు గనుక.
JOB 34:28 పేద ప్రజలను బాధించి, వారు సహాయం కోసం దేవునికి మొర పెట్టేలాగా ఆ చెడ్డవాళ్లు చేశారు. మరియు పేదవారు సహాయం కోసం మొరపెట్టి నప్పుడు ఆయన వింటాడు.
JOB 34:29 కానీ ఒకవేళ పేద ప్రజలకు సహాయం చేయ కూడదని కనుక దేవుడు నిర్ణయంచేస్తే ఎవరూ ఆయనను దోషిగా నిర్ణయించలేరు ఒకవేళ దేవుడు ప్రజలకు తన ముఖం మరుగు చేసికొంటే వారికి సహాయం చేయగలవాడు ఎవడూ ఉండడు. అయితే ఆయన వ్యక్తులను, రాజ్యాలను పాలిస్తాడు.
JOB 34:30 తర్వాత దేవునికి విరోధంగా ఉండి మనుష్యులను మోసగించే వ్యక్తిని దేవుడు పాలకునిగా ఉండనివ్వడు.
JOB 34:31 “ఒకవేళ ఒక వ్యక్తి దేవునితో అనవచ్చును: ‘నేను దోషిని, నేను ఇంకెంత మాత్రం పాపం చేయను.
JOB 34:32 దేవా, నాకు తెలియని విషయాలు నాకు నేర్పించు. నేను తప్పు చేసి ఉంటే ఇకమీదట ఎన్నటికి మరల దానిని చేయను.’
JOB 34:33 కానీ యోబూ, నీవు మారటానికి తిరస్కరిస్తూ ఉండగా, నీవు ఏ విధంగా ప్రతిఫలం కావాలని కోరుకొంటావో అలా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలా? యోబూ, ఇది నీ తీర్మానం, నాది కాదు. నీవు ఏమి అనుకొంటున్నావో నాకు చెప్పు.
JOB 34:34 జ్ఞానం గలిగి, గ్రహింపు ఉన్న ఏ మనిషిగాని నాతో ఏకిభవిస్తాడు. నా మాటలు వినే జ్ఞానం గల మనిషి ఎవరైనా సరే అని అంటారు,
JOB 34:35 ‘యోబు తెలియనివానిలా మాట్లాడతాడు. యోబు చెప్పే మాటలకు అర్థం లేదు.’
JOB 34:36 యోబును పరీక్షించేందుకు అతనికి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తే బాగుండునని, నా ఆశ. ఎందుకంటే ఒక దుర్మార్గుడు జవాబిచ్చినట్టుగా యోబు మనకు జవాబు ఇస్తున్నాడు గనుక.
JOB 34:37 యోబు తన పాపం అంతటికి తిరుగుబాటుతనం అదనంగా కలిపాడు. యోబు మనలను అవమానించి, మన ఎదుట దేవుణ్ణి హేళన చేస్తున్నాడు.”
JOB 35:1 ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు. అతడు అన్నాడు:
JOB 35:2 “యోబూ, నీవు యోబు అనే నేను ‘దేవునికంటె ఎక్కువ సక్రమంగా ఉన్నాను’ అని చెప్పటం న్యాయం కాదు.
JOB 35:3 యోబూ, నీవు దేవుణ్ణి, ‘దేవా, ఒక మనిషి, దేవుని సంతోష పరచుటవలన ఏమి పొందుతాడు? నా పాపం నిన్నెలా బాధిస్తుంది? నేను పాపం చేయక పోతే నాకేం మంచి లభిస్తుంది?’ అని అడుగు.
JOB 35:4 “యోబూ, ఎలీహు అనే నేను నీకు, ఇక్కడ నీతో ఉన్న స్నేహితులకు జవాబు ఇవ్వగోరుతున్నాను.
JOB 35:5 యోబూ, పైన ఆకాశం చూడు. పైకి చూచి, మేఘాలు నీకంటే ఎత్తుగా ఉన్నాయని తెలుసుకో.
JOB 35:6 యోబూ, నీవు పాపం చేస్తే అది దేవుణ్ణి బాధ పెట్టదు. ఒకవేళ నీ పాపాలు చాలా ఉంటే అవి దేవునికి ఏమీ చేయలేవు.
JOB 35:7 యోబూ, నీవు మంచివానిగా ఉంటే అదేమి దేవునికి సహాయం చేయదు. నీనుండి దేవునికి ఏమీ రాదు.
JOB 35:8 యోబూ, నీవు చేసే మంచిచెడ్డలు నీలాంటి వాళ్లను మాత్రమే బాధిస్తాయి. (అవి దేవునికి సహాయకారి కావు మరియు దేవుణ్ణి బాధించవు.)
JOB 35:9 “మనుష్యులు దుర్మార్గంగా, అన్యాయంగా పరామర్శించబడితే సహాయం కోసం వారు మొరపెడతారు. శక్తివంతమైన వాళ్లు తమకు సహాయాన్ని చేయాలని వారు బతిమలాడుతారు.
JOB 35:10 కానీ సహాయం కోసం వారు దేవుని వేడుకోరు. ‘నన్ను తయారు చేసి, నా ఆనందం కోసం రాత్రులలో పాటలు ఇచ్చినటువంటి దేవుడెక్కడ? అని ఎవరూ అనరు.
JOB 35:11 సహాయం కోసం వారు దేవుని అడగరు. దేవుడే మనుష్యుల్ని జ్ఞానం గల వారినిగా చేశాడు. జంతువులను, పక్షులను దేవుడు జ్ఞానంగల వాటినిగా చేయలేదు.’
JOB 35:12 “కాని చెడ్డవాళ్లు గర్వంగా ఉంటారు. కనుక వారు సహాయం కోసం దేవునికి మొరపెడితే దేవుడు వారికి జవాబు ఇవ్వడు.
JOB 35:13 వారి పనికిమాలిన విన్నపం దేవుడు వినడు, అదినిజం. సర్వశక్తిగల దేవుడు వారిపట్ల శ్రద్ధ చూపడు.
JOB 35:14 యోబూ, అదే విధంగా దేవుడు నీకు కనబడలేదని నీవు చెప్పినప్పుడు, దేవుడు నీ మాట వినడు. దేవుణ్ణి కలుసుకొని, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించు కొనే అవకాశంకోసం నిరీక్షిస్తున్నానని నీవు అంటున్నావు.
JOB 35:15 “యోబూ, దేవుడు దుర్మార్గులను శిక్షించడనీ, పాపాన్ని దేవుడు లక్ష్యపెట్టడనీ నీవు తలస్తున్నావు.
JOB 35:16 కనుక యోబు తన పనికిమాలిన మాటలు కొనసాగిస్తున్నాడు. యోబు మాట్లాడుతోంది ఏమిటో అతనికే తెలియదు.”
JOB 36:1 ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు.
JOB 36:2 “యోబూ, నాతో ఇంకొంచెం ఓపికగా ఉండు. దేవుని పరంగా చెప్పాల్సింది ఇంకా ఉందని నేను నీకు చూపిస్తాను.
JOB 36:3 నా జ్ఞానాన్ని అందరితోనూ పంచుకొంటాను. దేవుడు నన్ను సృష్టించాడు. దేవుడు న్యాయంగల వాడని నేను రుజువు చేస్తాను.
JOB 36:4 యోబూ, నేను చెప్పేది ప్రతీదీ సత్యం. నేను చెప్తున్నదేమిటో తెలిసే చెప్తున్నాను.
JOB 36:5 “దేవుడు శక్తివంతమైనవాడు, కానీ ఆయన మనుష్యులను ద్వేషించడు. దేవుడు మహత్తర శక్తిమంతుడు, ఆయన సంకల్పాలు ఆయనకు ఉన్నాయి.
JOB 36:6 దుర్మార్గులను దేవుడు బ్రతుకనివ్వడు. పేద ప్రజలకు దేవుడు ఎల్లప్పుడు న్యాయం జరిగిస్తాడు.
JOB 36:7 ఏది సరైనదో, దాన్ని చేసే ప్రజల విషయం దేవుడు శ్రద్ధ చూపిస్తాడు. మంచి వాళ్లను ఆయన పాలకులుగా ఉండనిస్తాడు. మంచి వాళ్లకు దేవుడు శాశ్వతమైన ఘనత ఇస్తాడు.
JOB 36:8 కానీ మనుష్యులు శిక్షించబడుతూ సంకెళ్లతో ఉంటే ఒకవేళ మనుష్యులు శ్రమపడతూ, కష్టాలు అనుభవిస్తోంటే,
JOB 36:9 వారు చేసిన తప్పు ఏమిటో ఆయన వారికి చెబుతాడు. వారు పాపం చేశారని, వారు అతిశయించారని దేవుడు వారికి చెబుతాడు.
JOB 36:10 దేవుడు వాళ్ల చెవులు వినేలా తెరుస్తాడు. వారు పాపం చేయటం చాలించాలని ఆయన వారికి ఆజ్ఞ ఇస్తాడు.
JOB 36:11 ఆ మనుష్యులు దేవుని మాట విని ఆయనకు విధేయులైతే, దేవుడు వారిని విజయవంతమైన ఆనంద జీవితాన్ని జీవింపనిస్తాడు.
JOB 36:12 కానీ ఆ మనుష్యులు దేవునికి విధేయులయ్యేందుకు నిరాకరిస్తే వారు మృతుల లోకంలో చేరిపోతారు. ఏది నిజమైన జ్ఞానమో తెలియకుండా వాళ్లు (మూర్ఖులుగా) చనిపోతారు.
JOB 36:13 “దేవుని గూర్చి లక్ష్యపెట్టని మనుష్యులు ఎల్లప్పుడూ కక్షతో ఉంటారు. దేవుడు వారిని శిక్షించినప్పటికీ, వారు సహాయం కోసం దేవుని ప్రార్థించ నిరాకరిస్తారు.
JOB 36:14 ఆ మనుష్యులు ఇంకా యవ్వనంలో ఉండగానే మరణిస్తారు. మగ వ్యభిచారులతోబాటు వారుకూడా అవమానంతో మరణిస్తారు.
JOB 36:15 కానీ శ్రమ పడుతున్న మనుష్యులను దేవుడు వారి కష్టాల్లోనుంచి రక్షిస్తాడు. మనుష్యులు మేల్కొని దేవుని మాట వినేలా ఆయన ఆ కష్టాలను ప్రయోగిస్తాడు.
JOB 36:16 “యోబూ, దేవుడు నీ మీద దయ చూపించి, నీ కష్టాల నుండి నిన్ను బయటకు రప్పించి నీకు సహాయం చేయాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నీకు క్షేమకరమైన స్థలం ఇవ్వాలనీ నీ బల్లమీద సమృద్ధిగా భోజనం ఉంచాలనీ కోరుతున్నాడు.
JOB 36:17 కానీ యోబూ, దుర్మార్గులవలె నీవు శిక్షించబడుతున్నావు. దేవుని న్యాయం, తీర్పు నిన్ను పట్టేశాయి.
JOB 36:18 యోబూ, ధనం నీ చేత తప్పు చేయించనీయకుండును గాక. విస్తారమైన ధనాశ చూపించినందువల్ల మోసపోవద్దు.
JOB 36:19 నీ ధనం అంతా ఇప్పుడు నీకు సహాయం చేయలేదని నీకు తెలుసు. శక్తిమంతుల సహాయం కోసం మొరపెట్టినందువల్ల ఏమి లాభం లేదు.
JOB 36:20 ప్రజలు నశించిపోయే సమయంలో రాత్రికోసం ఆశించకు. (వాళ్లు దేవున్నుండి దాక్కోగలమని అనుకొంటున్నారు.)
JOB 36:21 యోబూ, తప్పు చేయకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే నీవు ఈ కష్టాన్ని ఎన్నుకొన్నావు.
JOB 36:22 “దేవునికి చాలా శక్తి ఉంది. దేవుడే అందరిలోకెల్ల గొప్ప ఉపదేశకుడు.
JOB 36:23 ఏమి చేయాలి అనేది దేవునికి ఎవరూ చెప్పలేరు. ‘దేవా నీవు తప్పు చేశావు’ అని ఎవరూ దేవునికి చెప్పలేరు.
JOB 36:24 దేవునిని తాను చేసిన పనిని బట్టి స్తుతించటం మరువకు. మనుష్యులు దేవునిని కీర్తనలతో స్తుతించారు.
JOB 36:25 ప్రతి మనిషీ దేవుని పనిని చూశాడు. మనుష్యులు దేవుని పనిని దూరం నుండి చూశారు.
JOB 36:26 దేవుడు గొప్పవాడు. అది నిజం. ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించలేం. దేవునికి ఎన్ని సంవత్సరాలో ఏ మనిషీ లెక్కించలేడు.
JOB 36:27 “దేవుడు భూమినుండి నీళ్లు తీసుకొని దాన్ని వర్షంగా మారుస్తాడు.
JOB 36:28 ఆయన మేఘాన్ని చేసి వాటి నీళ్లను కుమ్మరిస్తాడు. మనుష్యుల మీద అధిక వర్షం కురుస్తుంది.
JOB 36:29 దేవుడు మేఘాలను ఎలా వ్యాపింపజేస్తాడో మనిషి గ్రహించలేడు. దేవుడు నివసించే ఆకాశంలోనుంచి ఉరుము ఎలా ఉరుముతుందో ఏ మనిషీ గ్రహించలేడు.
JOB 36:30 అగాధ సముద్రాన్ని ఆవరిస్తూ ఆకాశం అంతటా దేవుడు మెరుపును ఎలా విస్తరింపజేస్తాడో చూడు.
JOB 36:31 రాజ్యాలను అదుపులో ఉంచి సమృద్ధిగా ఆహారం ఇచ్చేందుకు దేవుడు ఈ మేఘాలను ప్రయోగిస్తాడు.
JOB 36:32 దేవుడు మెరుపులను తన చేతితో పట్టుకొంటాడు. దేవుడు కోరుకొన్న చోటనే పిడుగుపడేటట్టు దానికి ఆజ్ఞాపిస్తాడు.
JOB 36:33 తుఫాను వస్తోందని ఉరుము తెలియజేస్తుంది. తుఫాను వస్తోందని చివరికి పశువులకు కూడా తెలుసు.
JOB 37:1 “ఉరుములు, మెరుపులు నన్ను భయపెడతాయి. నేను ఈ విషయాలు తలచినప్పుడు నా గుండె చాలా వేగంగా కొట్టుకొంటుంది.
JOB 37:2 ప్రతి ఒక్కరూ వినండి. దేవుని స్వరం ఉరుములా ధ్వనిస్తుంది. దేవుని నోటి నుండి వస్తోన్న ఉరుముశబ్దం వినండి
JOB 37:3 మొత్తం ఆకాశం అంతటా వెలిగేలా దేవుడు తన మెరుపును పంపిస్తాడు. అది భూమి అంతట మెరిసింది.
JOB 37:4 మెరుపు మెరిసిన తర్వాత గర్జించే దేవుని స్వరం వినవచ్చును. దేవుడు తన ఆశ్చర్యకరమైన స్వరంతో ఉరుముతాడు. మెరుపు మెరుస్తూ ఉండగా దేవుని స్వరం ఉరుముతుంది.
JOB 37:5 దేవుడు ఉరిమే స్వరం అద్భుతం. మనం గ్రహించజాలని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు.
JOB 37:6 ‘నేలమీద పడు’ అని ఆయన మంచుతో చెబుతాడు. ‘నేలమీద వర్షించు’ అని దేవుడు వర్షంతో చెబుతాడు.
JOB 37:7 దేవుడు ఏమి చేయగలడో అనేది అయన సృజించిన మనుష్యులంతా తెలుసుకొనేందుకు అలా చేస్తాడు.
JOB 37:8 మృగాలు వాటి గుహల్లోకి పరుగెత్తిపోయి, అక్కడ నివసిస్తాయి.
JOB 37:9 తుఫాను దక్షిణం నుండి వస్తుంది. చలి ఉత్తరం నుండి వస్తుంది.
JOB 37:10 దేవుని ఊపిరి మంచును చేస్తుంది. అది మహాసముద్రాలను గడ్డ కట్టిస్తుంది
JOB 37:11 దేవుడు మేఘాలను నీళ్లతో నింపుతాడు. ఆయన తన మెరుపును మేఘాల ద్వారా విస్తరింప చేస్తాడు.
JOB 37:12 భూమి మీద అంతటికీ చెదరిపోయేలా దేవుడు మేఘాలను ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఏమి చెబితే అది మేఘాలు చేస్తాయి.
JOB 37:13 దేవుడు మనుష్యులను శిక్షించేందుకు, వరదలను లేదా తన ప్రేమ చూపుటకై వర్షం రప్పించేందుకు మేఘాలను తీసుకొని వస్తాడు.
JOB 37:14 “యోబూ, ఒక నిమిషం ఆగి విను. ఆగి, దేవుడు చేసే అద్భుత విషయాలను గూర్చి ఆలోచించు.
JOB 37:15 యోబూ, దేవుడు మేఘాలను ఎలా అదుపు చేస్తాడో నీకు తెలుసా? దేవుడు తన మెరుపును ఎలా ప్రకాశింప చేస్తాడో నీకు తెలుసా?
JOB 37:16 ఆకాశంలో మేఘాలు ఎలా వేలాడుతాయో నీకు తెలుసా? దేవుని జ్ఞానం పరిపూర్ణం. మేఘాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు.
JOB 37:17 లేదు, యోబూ, ఈ సంగతులు నీకు తెలియపు. దక్షిణపు వేడి గాలిలో భూమి నిశ్చలంగా ఉన్నప్పుడు నీకు చెమటపోసి, నీ బట్టలు జిడ్డుగా ఉండటం మాత్రమే నీకు తెలుసు.
JOB 37:18 యోబూ, ఆకాశాన్ని విశాలపరచేందుకు మెరుగుదిద్దిన అద్దంలా దానిని గట్టిగా చేసేందుకు నీవు దేవునికి సహాయం చేయగలవా?
JOB 37:19 “యోబూ, దేవునితో మేము ఏమి చెప్పాలో చెప్పు. మేము చీకటిలో ఉన్నందువల్ల సరియైన మా వాగ్వివాదాన్ని దేవునికి మేము చెప్పలే కున్నాము. (దేవుని సన్నిధిలో) ఏమి చెప్పడానికీ మాకు తెలియడంలేదు.
JOB 37:20 నేను దేవునితో మాట్లాడాలని నేను ఆయనతో చెప్పను. అలా చెప్పటం నాశనం చేయమని అడిగినట్టే ఉంటుంది.
JOB 37:21 ఇప్పుడు ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి ఏ మనిషీ చూడలేడు. గాలి మేఘాలను తరిమి వేసిన తరువాత అది ఆకాశంలో చాలా తేజోవంతంగా ప్రకాశిస్తుంది.
JOB 37:22 (అదే విధంగా దేవుడు ఉన్నాడు) దేవుని బంగారు మహిమ ఉత్తరం నుండి ప్రకాశిస్తుంది. దేవుడు అద్భుత మహిమతో వస్తాడు.
JOB 37:23 సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగా గొప్పవాడు. మనం దేవుని దగ్గరగా వెళ్లలేం. దేవుడు మనుష్యుల్ని ఎల్లప్పుడూ సరిగ్గాను, న్యాయంగాను చూస్తాడు.
JOB 37:24 అందువల్లనే మనుష్యులు దేవుని గౌరవిస్తారు. కానీ తెలివిగల వాళ్లం అనుకొనే గర్విష్ఠులను దేవుడు లక్ష్యపెట్టడు.”
JOB 38:1 అప్పుడు యెహోవా తుఫానులో నుండి యోబుకు జవాబు ఇచ్చాడు. దేవుడు చెప్పాడు:
JOB 38:2 “నా జ్ఞానమును అంగీకరించక పనికిమాలిన, తెలివితక్కువ మాటలతో నన్ను ప్రశ్నించే ఈ మనిషి ఎవరు?
JOB 38:3 యోబూ, మగవాడిలా గట్టిగా ఉండు. నేను నిన్ను అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగాఉండు.
JOB 38:4 “యోబూ, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? నీవు అంత తెలివిగల వాడెవైతే నాకు జవాబు చెప్పు.
JOB 38:5 యోబూ, ప్రపంచం ఎంత పెద్దగా ఉండాలో నిర్ణయించింది ఎవరు? నీకు తెలిసినట్టే ఉంది! కొల బద్దతో ప్రపంచాన్ని ఎవరు కొలిచారు.
JOB 38:6 భూమికి ఆధారాలు దేనిమీద ఉన్నాయి? భూమికి అత్యంత ముఖ్యమైన రాయిని దాని పునాదిలో వేసింది ఎవరు?
JOB 38:7 అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసిపాడాయి. దేవదూతలు కేకలు వేసి, ఎంతో సంతోషించారు.
JOB 38:8 “యోబూ, భూమి అగాధములో నుండి సముద్రం ప్రవహించినప్పుడు దానిని నిలిపేందుకు దాని తలుపులు మూసినవారు ఎవరు?
JOB 38:9 ఆ సమయంలో నేనే సముద్రాన్ని మేఘాలతో కప్పి వేశాను. మరియు సముద్రాన్ని చీకటితో చుట్టి వేశాను.
JOB 38:10 సముద్రానికి హద్దులు నేనే నియమించాను. మూయబడిన ద్వారాల వెనుక నేను దానిని ఉంచాను.
JOB 38:11 నీవు ఇంత మట్టుకు రావచ్చు. కాని ఇంకా ముందుకు రాకూడదు. నీ గర్వపు అలలు ఆగి పోవాల్సింది ఇక్కడే, అని నేను సముద్రంతో చెప్పాను.
JOB 38:12 “యోబూ, ప్రారంభం కావాలని ఉదయంతోను, ప్రారంభం కావాలని రోజుతోను నీ జీవితంలో నీవు ఎప్పుడైనా చెప్పావా?
JOB 38:13 యోబూ, ఉదయపు వెలుగు భూమిని ఆవరించాలని, దుర్మార్గులు తాము దాగుకొనే స్థలాలు విడిచిపెట్టేలా ఉదయపు వెలుగు వారిని బలవంతం చేయాలని నీవు ఎన్నడయినా దానితో చెప్పావా?
JOB 38:14 ఉదయపు వెలుగు కొండలు, లోయలు కనబడేటట్టు చేస్తుంది. పగటి వెలుగు భూమి మీదికి వచ్చినప్పుడు ఆ స్థలాల ఆకారాలు చోక్కా మడతల్లా తేటగా కనబడతాయి. అచ్చు వేయబడిన మెత్తని మట్టిలా ఆ స్థలాలు ఆకారాలు రూపొందు తాయి.
JOB 38:15 దుర్మార్గులకు పగటి వెలుగు ఇష్టం లేదు. అది బాగా ప్రకాశించినప్పుడు, వారు వారి చెడ్డ పనులు చేయకుండా అది వారిని వారిస్తుంది.
JOB 38:16 “యోబూ, సముద్రం మొదలయ్యే దాని లోతైన చోట్లకు నీవు ఎప్పుడైనా వెళ్లావా? మహా సముద్రపు అట్టడుగున నీవు ఎప్పుడైనా నడిచావా?
JOB 38:17 యోబూ, మరణపు చీకటి చోటు ఎదుట నిలిచే ద్వారాలను ఎవరైనా, ఎన్నడయినా నీకు చూపించారా?
JOB 38:18 యోబూ, భూమి ఎంత పెద్దదో నిజంగా నీవు గ్రహిస్తున్నావా? ఇదంతా నీకు తెలిస్తే నాతో చెప్పు.
JOB 38:19 “యోబూ, వెలుగు వచ్చే దిశగా పోయేందుకు ఎటు వెళ్లాలి? చీకటి ఎక్కడ నుండి వస్తుంది?
JOB 38:20 యోబూ, చీకటి వెలుగు ఎక్కడ నుండి వస్తాయో అక్కడికి వాటిని నీవు తీసుకొని వెళ్లగలవా? అవి నివసించే చోటుకు ఎటుగా వెళ్లాలో నీకు తెలుసా?
JOB 38:21 యోబూ, నీవు చాలా ముసలివాడిని కదా? భూమి చేయబడినప్పుడు నీవు అక్కడ ఉన్నావు కనుక నీకు ఈ సంగతులన్నీ తెలుసు అని నాకు గట్టిగా తెలుసు. నీవు లేవూ?
JOB 38:22 “యోబూ, నేను హిమమును, వడగండ్లను నిలువ ఉంచే గిడ్డంగులకు నీవు ఎప్పుడైనా వెళ్లావా?
JOB 38:23 కష్టదినాల్లో ఉపయోగించేందుకు యుద్ధాన్ని, పోరాట దినాలకు ఉపయోగించేందుకు హిమమును, వడగండ్లను నేను దాచిపెడతాను.
JOB 38:24 యోబూ, సూర్యుడు ఎక్కడ నుండి పైకి వస్తాడో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా? భూమి అంతటా వీచేందుకు తూర్పు గాలులు ఎక్కడనుండి వస్తాయో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా?
JOB 38:25 యోబూ, భారీ వర్షం కోసం ఆకాశంలో మార్గాన్ని ఎవరు తవ్వారు? ఉరుములోని మెరుపుకు మార్గం ఎవరు చేశారు?
JOB 38:26 యోబూ, మనుష్యులు ఎవరూ నివసించని చోట నీళ్లు ఉండునట్లు.
JOB 38:27 బీడు భూమిని తృప్తిపరచుటకు దానిని విస్తారమైన గడ్డితో పచ్చగా చేయుటకు నీళ్లు ఇచ్చి, ఈ సంగతులను చేసిన వారు ఎవరు?
JOB 38:28 యోబూ, వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులు ఎక్కడ నుండి వస్తాయి?
JOB 38:29 యోబూ, హిమమునకు తల్లి ఎవరు? ఆకాశంనుండి కురిసే మంచుకు జన్మ ఇచ్చేది ఎవరు?
JOB 38:30 జలాలు బండలా గట్టిగాను మహా సముద్రాల పైభాగాలు గట్టిగాను ఎప్పుడు బిగిసిపోతాయి?
JOB 38:31 “యోబూ, కృత్తిక నక్షత్రాలను నీవు బిగించగలవా? మృగశీర్షకు కట్లు నీవు విప్పగలవా?
JOB 38:32 యోబూ, నక్షత్రరాసులు సరియైన కాలములలో సమకూడునట్టు నీవు చేయగలవా? లేక ఎలుగుబంటిని దాని పిల్లలతో నీవు నడిపించగలవా?
JOB 38:33 యోబూ, ఆకాశాన్ని పాలించే నియమాలు నీకు తెలియునా? భూమి మీద వాటి పాలనను నీవు ప్రారంభించగలవా?
JOB 38:34 “యోబూ, మేఘాలు భారీ వర్షంతో నిన్ను ముంచెత్తునట్లు నీవు కేకవేసి వాటికి ఆజ్ఞలు ఇవ్వగలవా?
JOB 38:35 యోబూ, నీవు కోరిన చోటికి మెరుపును పంపగలవా? మెరుపు నీ దగ్గరకు వచ్చి యోబూ, ‘ఇదిగో మేము వచ్చాం, నీకు ఏమి కావాలి?’ అని అంటాయా?
JOB 38:36 “ఒక మనిషి మనస్సులో జ్ఞానం కలిగించేది ఎవరు? మనస్సుకు గ్రహింపును ఇచ్చేది ఎవరు?
JOB 38:37 యోబూ, మేఘాలను లెక్కించుటకు, అవి వాటి వర్షమును కురియునట్లు వాటికి లంచం ఇచ్చుటకు అంతటి తెలివిగలవారు ఎవరు?
JOB 38:38 ఆ వర్షం దుమ్మును గట్టి పరుస్తుంది. ఆ మట్టి గడ్డలు ఒక్కటిగా అతుక్కుంటాయి.
JOB 38:39 “యోబూ, ఆడ సింహమునకు ఆహారం నీవు కనుగొంటావా? ఆకలితో ఉన్న సింహపు పిల్లలకు నీవు ఆహారం పెడతావా?
JOB 38:40 అవి దాగుకొనే చోట్ల వాటి గుహలలో పండుకొని లేక కూర్చొని ఉంటాయి.
JOB 38:41 యోబూ, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక అటు ఇటు తిరుగునప్పుడు కాకులను పోషించేది ఎవరు?
JOB 39:1 “యోబూ, కొండ మేకలు ఎప్పడు పుట్టాయో నీకు తెలుసా? తల్లి జింక పిల్లను పెట్టెటప్పుడు నీవు గమనిస్తావా?
JOB 39:2 యోబూ, తల్లి కొండ మేక, తల్లి జింక వాటి పిల్లలను ఎన్నాళ్లు మోస్తాయో నీకు తెలుసా? అవి పుట్టడానికి సరైన సమయం ఎప్పుడో నీకు తెలుసా?
JOB 39:3 అవి పండుకొంటాయి, వాటి పిల్లలు పుడతాయి. అప్పుడు వాటి పురిటినొప్పులు పోతాయి.
JOB 39:4 తల్లి కొండ మేక పిల్లలు, తల్లి జింక పిల్లలు పొలాల్లో బలంగా పెరుగుతాయి. అప్పుడు అవి వాటి నివాసాలు వదలి పోతాయి, తిరిగి రావు.
JOB 39:5 “యోబూ, అడవి గాడిదలను స్వేచ్ఛగా తిరుగనిచ్చినది ఎవరు? వాటి తాళ్లు ఊడదీసి, వాటిని స్వేచ్ఛగా పోనిచ్చినది ఎవరు?
JOB 39:6 అడవి గాడిదకు నివాసంగా అరణ్యాన్ని ఇచ్చింది నేనే (యెహోవాను). అవి నివాసం ఉండుటకు ఉప్పు భూములను నేను వాటికి ఇచ్చాను.
JOB 39:7 అడవి గాడిద అల్లరి పట్టణాలకు దగ్గరగా వెళ్లదు. ఏ మనిషీ వాటిని సాధువు చేసి, బండి లాగుటకు బలవంతం చేయలేడు.
JOB 39:8 అడవి గాడిదలు కొండల్లో నివసిస్తాయి. అక్కడే అవి గడ్డి తింటాయి. తినుటకు పచ్చగా ఏమైనా ఉంటుందేమో అని అక్కడే అవి చూస్తాయి.
JOB 39:9 “యోబూ, అడవి ఆబోతు నీకు పని చేయటానికి లోబడుతుందా? రాత్రిపూట అది నీ కొట్టంలో ఉంటుంది?
JOB 39:10 యోబూ, కేవలం తాడుతోనే అడవి ఆబోతు నీ పొలం దున్నేటట్టు చేయగలవా? నీ కోసం అది లోయలను దున్నుతుందా?
JOB 39:11 యోబూ, అడవి ఆబోతు బలాన్ని నీ పని కోసం ఉపయోగించుకొనేందుకు నీవు దానిమీద ఆధార పడగలవా? మహా కష్టతరమైన నీ పని అది చేస్తుంది అనుకొంటావా?
JOB 39:12 నీ ధాన్యాన్ని పోగుచేసి నీ కళ్లం చోటుకు అది తీసుకొని వస్తుందని దాన్ని నీవు నమ్మగలవా?
JOB 39:13 “నిప్పుకోడి సంతోషంగా ఉంది, గనుక అది దాని రెక్కలు రెప రెప లాడిస్తుంది. (కానీ అది ఎగుర లేదు) కానీ నిప్పుకోడి రెక్కలు కొంగ రెక్కల్లాంటివి కావు.
JOB 39:14 నిప్పుకోడి నేలమీద గుడ్లు పెడుతుంది. ఇసుకలో అవి వెచ్చగా అవుతాయి.
JOB 39:15 ఎవరైనా ఆ గుడ్లు మీద నడచి వాటిని పగులగొట్టవచ్చని లేక ఏదైనా అడవి జంతువు వాటిని పగుల గొట్టవచ్చని నిప్పుకోడి మరచిపోతుంది.
JOB 39:16 నిప్పుకోడి తన పిల్లలను చూడదు. ఆ పిల్లలు తనవి కానట్టే చూస్తూంది. దాని పిల్లలు చస్తే దాని ప్రయాస అంతా వ్యర్థం అయిందనే విషయం దానికి లక్ష్యం లేదు.
JOB 39:17 ఎందుకంటే, నేను (దేవుణ్ణి) నిప్పుకోడికి జ్ఞానం ఇవ్వలేదు. నిప్పుకోడి తెలివి తక్కువది. నేను దాన్ని అలాగే చేశాను.
JOB 39:18 కానీ నిప్పుకోడి పరుగెత్తటానికి లేచినప్పుడు గుర్రాన్ని, దాని రౌతును చూచి అది నవ్వుతుంది. ఎందుకంటే, అది గుర్రం కంటే వేగంగా పరుగెత్తుతుంది గనుక.
JOB 39:19 “యోబూ, గుర్రానికి బలం నీవు ఇచ్చావా? లేక దాని మెడ మీద జూలు వెంట్రుకలను నీవు పెట్టావా?
JOB 39:20 యోబూ, మిడత ఎగిరినట్టుగా నీవు గుర్రాన్ని దూకించగలవా? గుర్రం గట్టిగా సకిలిస్తుంది, మనుష్యుల్ని భయపెడ్తుంది.
JOB 39:21 గుర్రం, తనకు చాలా బలం ఉందని సంతోషిస్తుంది. అది నేలమీద కాలితో గీకుతుంది. యుద్ధానికి వెళ్లేటప్పుడు గుర్రం వేగంగా పరుగెత్తుంది
JOB 39:22 భయాన్ని చూచి గుర్రం నవ్వుతుంది. అది భయపడదు. యుద్ధం నుండి అది పారిపోదు.
JOB 39:23 గుర్రం మీద అంబులపొది వణకుతుంది. దానిరౌతువద్ద ఉన్న బల్లెం, ఆయుధాలు సూర్యకాంతిలో తళతళలాడుతాయి.
JOB 39:24 గుర్రం చాలా ఉల్లాసంగా ఉంటుంది. నేలమీద అది చాలా వేగంగా పరుగెత్తుతుంది. బూరధ్వని వింటే గుర్రం ఇంక నిలబడలేదు.
JOB 39:25 బూర మ్రోగినప్పుడు గుర్రం ‘ఓ హో’ అంటుంది. దూరం నుంచే అది యుద్ధాన్ని పసికడుతుంది. సేనాని కేకలు వేసే ఆజ్ఞలను, ఇతర యుద్ధ ధ్వనులను అది వింటుంది.
JOB 39:26 “యోబూ, డేగ దాని రెక్కలు విప్పి దక్షిణంగా ఎగిరేటప్పుడు ఎలా ఎగరాలో డేగకు నీవు నేర్పించావా?
JOB 39:27 యోబూ, పక్షిరాజు ఎగరాలని, పర్వతాల్లో ఎత్తుగా దాని గూడు కట్టుకోవాలని నీవు దానికి ఆజ్ఞాపించావా?
JOB 39:28 పక్షిరాజు కొండ మీద బండపైన నివసిస్తుంది. ఆ బండ పక్షిరాజు యొక్క కోట.
JOB 39:29 పక్షిరాజు తన దుర్గంలోనుండి తన ఆహారం కోసం వెదకుతుంది. దూరంలో ఉన్న ఆహారాన్ని అది చూడగలదు.
JOB 39:30 పక్షిరాజు పిల్లలు రక్తం తాగుతాయి. అవి చచ్చిన శవాల చుట్టూరా చేరుతాయి.”
JOB 40:1 యోబూతో యెహోవా ఇలా చెప్పాడు:
JOB 40:2 “యోబూ, సర్వశక్తిమంతుడైన దేవునితో నీవు వాదించావు. తప్పు చేశానని నీవు నాకు తీర్పు చెప్పావు. ఇప్పుడు నీవు తప్పుచేశావని ఒప్పుకుంటావా? నాకు జవాబు ఇస్తావా?”
JOB 40:3 అప్పుడు దేవునికి యోబు ఇలా జవాబు చెప్పాడు. యోబు అన్నాడు:
JOB 40:4 “నేను ముఖ్యం కాదు. నీకు నేను ఏమి చెప్పగలను? నీకు నేను జవాబు ఇవ్వలేను. నా చేతితో నేను నా నోరు మూసుకొంటాను.
JOB 40:5 నేను ఒకసారి మాట్లాడాను కానీ నేను మరల జవాబు ఇవ్వను. నేను రెండుసార్లు మాట్లాడాను. కానీ నేను ఇంకా ఏమీ చెప్పను.”
JOB 40:6 అప్పుడు యెహోవా తుఫానులోంచి మరల యోబుతో ఇలా మాట్లాడాడు. యెహోవా అన్నాడు:
JOB 40:7 “యోబూ, మగవాడిలా నిలబడు. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నీవు నాకు జవాబు చెప్పు.
JOB 40:8 “యోబూ నేను న్యాయంగా లేనని నీవు తలుస్తున్నావా? నీదే సరిగ్గా ఉన్నట్లు కనబడేలా చేయాలని, నేను తప్పు చేశానని నీవు నన్ను నిందిస్తావా?
JOB 40:9 యోబూ, నీ చేతులు దేవుని చేతులంత బలంగా ఉన్నాయా? నీ స్వరాన్ని నా స్వరంలా ఉరిమేట్టు నీవు చేయగలవా?
JOB 40:10 ఒకవేళ నీవు అలా దేవునిలా చేయగలిగితే నీకు నీవే ఘనత, మహిమ, ఆపాదించుకో. మహిమ, తేజస్సును వస్త్రాల్లా ధరించు.
JOB 40:11 యోబూ, నీవు నావలె ఉంటే గర్విష్ఠులను తక్కువగా చూడు. యోబూ, ఆ గర్విష్ఠుల మీద నీ కోపం కుమ్మరించు. ఆ గర్విష్ఠులను దీనులుగా చేయి.
JOB 40:12 అవును, యోబూ, ఆ గర్విష్ఠులను చూడు. వారిని దీనులనుగా చేయి. దుర్మార్గులను వారు ఉన్న చోటనే చితుకగొట్టు.
JOB 40:13 గర్విష్ఠులందరినీ మట్టిలో పాతిపెట్టు. వారి శరీరాలను చుట్టేసి వారి సమాధులలో పెట్టు
JOB 40:14 యోబూ, నీవు గనుక వీటన్నింటినీ చేయగలిగితే అప్పుడు నిన్ను నీవే రక్షించుకొనుటకు సమర్ధుడ వని నీ దగ్గర నేను ఒప్పుకొంటాను.
JOB 40:15 “యోబూ, నీటి గుర్రాన్ని చూడు. నేను (దేవుణ్ణి) నీటి గుర్రాన్ని చేశాను. మరియు నిన్నూ (యోబు) నేను చేశాను. నీటి గుర్రం ఆవులా గడ్డి తింటుంది.
JOB 40:16 నీటి గుర్రం శరీరంలో చాలా బలం ఉంది. దాని కడుపులోని కండరాలు చాలా శక్తివంతంగా ఉంటాయి.
JOB 40:17 నీటి గుర్రం తోక దేవదారు వృక్షంలా బలంగా నిలుస్తుంది. దాని కాలి కండరాలు చాలా బలంగా ఉంటాయి.
JOB 40:18 నీటి గుర్రం యొక్క ఎముకలు ఇత్తడిలా గట్టిగా ఉంటాయి. దాని కాళ్లు ఇనుప కడ్డీలా ఉంటాయి.
JOB 40:19 నీటి గుర్రం నేను (దేవుణ్ణి) చేసిన మహా అద్భుత జంతువు. కాని నేను దానిని ఓడించగలను.
JOB 40:20 అడవి జంతువులు ఆడుకొనే కొండల మీద నీటి గుర్రం తినే గడ్డి పెరుగుతుంది.
JOB 40:21 తామర చెట్ల కింద నీటి గుర్రం పండుకుంటుంది. జమ్ము గడ్డీ మడుగులలో నీటి గుర్రం దాక్కుంటుంది.
JOB 40:22 తామర మొక్కలు తమ నీడలో నీటి గుర్రాన్ని దాచిపెడతాయి. నది సమీపంగా పెరిగే నిరవంజి చెట్ల కింద అది నివసిస్తుంది.
JOB 40:23 నది వరదలై పొర్లినా నీటి గుర్రం పారిపోదు. యొర్దాను నది దాని ముఖం మీద చిమ్మితే అది భయపడదు.
JOB 40:24 నీటి గుర్రానికి కళ్లు కట్టి ఒక ఉచ్చులో దానిని ఎవరూ పట్టుకొనలేరు.
JOB 41:1 “యోబూ, నీవు మొసలిని గాలముతో పట్టుకొనగలవా? దాని నాలుకను తాడుతో కట్టివేయగలవా?
JOB 41:2 యోబూ, మొసలి ముక్కులోనుంచి తాడును నీవు వేయగలవా? లేక దాని దవడకు గాలపు ముల్లు ఎక్కించగలవా?
JOB 41:3 యోబూ, తన్ను స్వేచ్చగా పోనిమ్మని మొసలి నిన్ను బతిమాలాడుతుందా? అది మర్యాద మాటలతో నీతో మాట్లాడుతుందా?
JOB 41:4 యోబూ, మొసలి నీతో ఒడంబడిక చేసు కుంటుందా? శాశ్వతంగా నిన్ను సేవిస్తానని వాగ్దానం చేస్తుందా?
JOB 41:5 యోబూ, నీవు ఒక పిట్టతో ఆడుకొన గలవా మొసలితో ఆడుకొ గలవా? నీ దాసీలు దానితో ఆడుకొనేందుకు దానికి ఒక తాడు కట్టగలవా?
JOB 41:6 యోబూ, జాలరులు నీవద్ద మొసలిని కొనుటకు ప్రయత్నిస్తారా? వారు దానిని వ్యాపారులకు అమ్మేందుకు దానిని ముక్కలుగా కోయగలరా?
JOB 41:7 యోబూ, మొసలి చర్మం మీదికి ఎన్నో శూలాలు నీవు విసరగలవా? లేక చేపలను వేటాడే అలుగులు అనేకం దాని తలమీద కొట్టగలవా?
JOB 41:8 “యోబూ, ఒక వేళ నీవు నీ చేతిని మొసలి మీద ఉంచితే దానితో నీ గట్టి పోరాటాన్ని నీవు ఎప్పటికీ మరచిపోలేవు. మరియు నీవు దానితో మరల ఎన్నటికీ పోరాడవు.
JOB 41:9 ఒక వేళ నీవు మొసలిని ఓడించగలనని అనుకుంటే అది మరచిపో! అలాంటి ఆశ ఏమీ లేదు! దాన్ని చూస్తేనే నీకు భయం పుడుతుంది.
JOB 41:10 మొసలికి కోపం పుట్టించగలిగినంత ధైర్యంగల మనిషి ఎవరూ లేరు. “కనుక అలాంటప్పుడు యోబూ, నాకువిరోధంగా నిలువగలవాడు ఎవడు?
JOB 41:11 నేను (దేవుణ్ణి) ఎవరికీ ఏమీ బాకీ లేను. ఆకాశమంతటి క్రింద ఉన్న సర్వము నాదే.
JOB 41:12 “యోబూ, మొసలి కాళ్లను గూర్చి, దాని బలం, దాని అందమైన ఆకారం గూర్చి నేను నీతో చెబుతాను.
JOB 41:13 మొసలి చర్మాన్ని ఎవరూ ఊడదీయలేరు. ఒక కళ్లెం పట్టుకొని ఎవ్వరూ దాని సమీపంగా రాజాలరు.
JOB 41:14 మొసలి దవడలు తెరిపించడానికి ఎవరూ దానిని బలవంతం చేయలేరు. దాని దవడల్లోని పళ్లు మనుష్యులను భయపెడతాయి.
JOB 41:15 మొసలి వీపు మీది గట్టి పొలుసుల వరుసలు దగ్గర దగ్గరగా కుదించబడ్డాయి.
JOB 41:16 గాలి జొరబడలేనంత దగ్గర దగ్గరగా ఆ పొలుసులు ఉంటాయి.
JOB 41:17 ఆ పొలుసులు ఒక దానితో ఒకటి జత చేయబడ్డాయి. వాటిని ఊడబెరుకుటకు వీలులేనంత గట్టిగా ఒకదానినొకటి అంటిపెట్టుకొని ఉంటాయి.
JOB 41:18 మొసలి తుమ్మినప్పుడు అది వెలుగు ప్రకాశించినట్టుగా ఉంటుంది. దాని కళ్లు ఉదయపు వెలుగులా ఉంటాయి.
JOB 41:19 దాని నోటి నుండి మండుతున్న జ్వాలలు బయటకు వస్తాయి. నిప్పు కణాలు బయటకు లేస్తాయి.
JOB 41:20 ఉడుకుతూ ఉన్న కుండ కింద కాలుతున్న పిచ్చి మొక్కలనుండి పొగవచ్చినట్టుగా మొసలి ముక్కునుండి పొగ వస్తుంది.
JOB 41:21 మొసలి శ్వాస బొగ్గులను మండిస్తుంది. దాని నోటినుండి అగ్ని జ్వాలలు వస్తాయి.
JOB 41:22 “మొసలి మెడ చాలా బలంగా ఉంటుంది. మనుష్యులు దానిని చూచి భయపడి దాని నుండి పారిపోతారు.
JOB 41:23 మొసలి శరీరంలో బలహీనత ఏమీ లేదు. అది ఇనుములా గట్టిగా ఉంటుంది.
JOB 41:24 మొసలి గుండె బండలా ఉంటుంది. దానికి భయం ఏమీ లేదు. అది తిరుగలి కింది రాయిలా గట్టిగా ఉంటుంది.
JOB 41:25 మొసలి మేల్కొన్నప్పుడు బలమైన మనుష్యులు భయపడతారు. మొసలి తోక ఆడించినప్పుడు వారు పారిపోతారు.
JOB 41:26 ఖడ్గం, బల్లెం, బాణం మొసలిని కొడితే అవి తిరిగి వస్తాయి. ఆ ఆయుధాలు దానికే మాత్రం హాని చేయవు.
JOB 41:27 మొసలికి ఇనుమును గడ్డి పరకలా విరుగ గొట్టడం తేలిక. ఇత్తడిని కుళ్లిపోయిన చెక్కలా విరుగ గొట్టటం తేలిక.
JOB 41:28 బాణలు మొసలిని పారిపోయేటట్టు చేయలేవు. దానిమీద విసిరిన బండలు ఎండి గడ్డిపోచల్లా ఉంటాయి.
JOB 41:29 దుడ్డు కర్రతో మొసలిని కొట్టినప్పుడు అది దానికి ఒక గడ్డి పరకలా అనిపిస్తుంది. మనుష్యులు దాని మీద ఈటెలు విసిరినప్పుడు అది నవ్వుతుంది.
JOB 41:30 మొసలి శరీరం క్రింద ఉన్న చర్మం పగిలి పోయిన చాలా వాడి చిల్లపెంకుల్లా ఉంటుంది. అది నడిచి నప్పుడు మట్టిలో నురిపిడి కొయ్యలా గుంటలు చేస్తుంది.
JOB 41:31 కాగుతున్న కుండలోని నీళ్లను అది బుడగల పొంగిస్తుంది. నూనె మసులుతున్న కుండలా అది నీటిని పొంగిస్తుంది.
JOB 41:32 మొసలి ఈ దినప్పుడు దాని వెనుక ఒక దారి ఏర్పడుతుంది. అది నీళ్లను పొంగింప జేసినప్పుడు దాని వెనుక తెల్లని నురుగు ఉంటుంది.
JOB 41:33 భూమి మీద ఏ జంతువూ మొసలిలాంటిది లేదు. అది భయం లేని జంతువుగా చేయబడింది.
JOB 41:34 మహా గర్విష్ఠి జంతువులను మొసలి చిన్న చూపు చూస్తుంది. క్రూర జంతువులన్నిటికీ అది రాజు.” మరియు మొసలిని చేసినది నేనే, యెహోవాను.
JOB 42:1 అప్పుడు యెహోవాకు యోబూ ఇలా జవాబు చెప్పాడు. యోబు అన్నాడు:
JOB 42:2 “యెహోవా, నీవు అన్నీ చేయగలవని నాకు తెలుసు. నీవు పథకాలు వేస్తావు, నీ పథకాల్లో ఏదీ మార్చబడజాలదు, నిలిపివేయబడదు.
JOB 42:3 ‘నా సలహాను గూర్చి ఈ వెర్రి ప్రశ్నలు అడుగుతున్న ఇతడు ఎవరు?’ అని యెహోవా, నీవు ప్రశ్నించావు. నేను (యోబును) నాకు అర్థం కాని విషయాలు యెహోవాని అడిగాను. నేను తెలిసి కోలేనంత మరీ వివరీతమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలను గూర్చి నేను మాట్లాడాను.
JOB 42:4 “యెహోవా, ‘నీవు నాతో యెబూ, నేను నీతో మాట్లాడుతాను. నేను నిన్ను ప్రశ్నలు అడుగుతాను. నీవు నాకు జవాబు ఇవ్వాలి’ అన్నావు.
JOB 42:5 యెహోవా, ఇదివరకు నిన్ను గూర్చి నేను విన్నాను. కానీ ఇప్పుడు నా స్వంత కళ్లతో నేను నిన్ను చూశాను.
JOB 42:6 కనుక ఇప్పుడు, నన్ను గూర్చి నేను సిగ్గుపడుతున్నాను. యెహోవా, నేను విచారిస్తున్నాను. నేను ఈ ధూళిలో, బూడిదలో కూర్చొని ఉండగానే నేను నా జీవితం, నా హృదయం మార్చుకొంటానని వాగ్దానం చేస్తున్నాను.”
JOB 42:7 యెహోవా యోబుతో మాట్లాడటం చాలించిన తర్వాత, ఆయన ఎలీఫజుతో మాట్లాడినాడు. ఎలీఫజు తేమాను పట్టణస్థుడు. ఎలీఫజుతో యెహోవా ఇలా చెప్పాడు: “నీ మీద, నీ యిద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను. ఎందుకంటే మీరు నన్ను గూర్చి సరిగా చెప్పలేదు. కానీ యోబు నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పాడు. యోబు నా సేవకుడు.
JOB 42:8 కనుక ఎలీఫజూ ఇప్పుడు ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను నీవే తీసుకో. వాటిని నా సేవకుడు యోబు దగ్గరకు తీసుకొని వెళ్లి, మీ నిమిత్తం దహనబలిగా వాటిని అర్పించండి. నా సేవకుడు యోబు మీ కోసం ప్రార్థిస్తాడు. అప్పుడు నేను అతని ప్రార్థనకు తప్పక జవాబు ఇస్తాను. అప్పుడు మీరు శిక్షించబడాల్సిన విధంగా నేను మిమ్మల్ని శిక్షించను. మీరు చాలా అవివేకంగా ఉన్నారు గనుక మీరు శిక్షించబడాలి. మీరు నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పలేదు. కానీ నా సేవుకుడు యోబు, నన్ను గూర్చి స రైన సంగతులు చెప్పాడు.”
JOB 42:9 కనుక తేమానువాడగు ఎలీపజు, షూహి దేశస్థుడైన బిల్దదు, నయమాతీ పట్టణస్థుడైన జోఫరు యెహోవాకు విధేయులయ్యారు. అప్పుడు యెహోవా చెప్పినట్లు వాళ్లు చేశారు. అప్పుడు యెహోవా యోబు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు.
JOB 42:10 కనుక యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించటం ముగించాడు. అప్పుడు యెహోవా యోబుకు మరల విజయం ఇచ్చాడు. యోబుకు అంతకు ముందు ఉన్నదానికి రెండంతలుగా దేవుడు ఇచ్చాడు.
JOB 42:11 యోబు సోదరులు, ఆడపడుచులు అందరూ తిరిగి యోబు ఇంటికి వచ్చారు. అంతకు ముందు యోబును ఎరిగిన ప్రతి ఒక్కరూ అతని ఇంటికి వచ్చారు. వాళ్లంతా యోబుతో కలిసి విందు భోజనం చేశారు. యోబుకు యెహోవా చాలా కష్టం కలిగించాడు గనుక వాళ్లంతా అతనిని ఓదార్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెండి నాణెం, ఒక బంగారు ఉంగరం యోబుకు ఇచ్చారు.
JOB 42:12 యోబు జీవితంలో మొదటి భాగం కంటే రెండో భాగాన్ని యెహోవా అధికంగా ఆశీర్వదించాడు. పద్నాలుగు వేల గొర్రెలు, ఆరు వేల ఒంటేలు, రెండు వేల ఆవులు, వెయ్యి ఆడ గాడిదలు యోబుకు స్వంతం అయ్యాయి.
JOB 42:13 యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమారైలు కూడ ఉన్నారు.
JOB 42:14 యోబు మొదటి కుమారైకు యెమీమా అని పేరు పెట్టాడు. యోబు రెండో కుమార్తెకు కెజీయా అని పేరు పెట్టాడు. యోబు మూడో కుమార్త్తెకు కెరెంహప్పుక్ అని పేరు పెట్టాడు.
JOB 42:15 దేశం అంతటిలో యోబు కుమార్త్తెలు మహాగొప్ప సౌందర్యవతులు. యోబు తన కుమార్తెలకు తన ఆస్తిలో భాగం ఇచ్చాడు. వారి సోదరులు కూడ తమ తండ్రి ఆస్తిలో వాటా పొందారు.
JOB 42:16 కనుక యోబు మరో నూటనలభై సంవత్సరాలు జీవించాడు. అతడు తన పిల్లలను, మనుమలు మనుమరాండ్రను, మునిమనుమలు మనుమరాండ్రను, వారి పిల్లలను చూచేంతవరకు జీవించాడు.
JOB 42:17 యోబు చని చోయినప్పుడు అతడు కడువృద్ధుడు. యోబు సుదీర్గమైన కాలం జీవించాడు.
PSA 1:1 ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే, అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు, అతడు పాపులవలె జీవించనప్పుడు, దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.
PSA 1:2 ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు. ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.
PSA 1:3 కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు. సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు. అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు. అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.
PSA 1:4 అయితే చెడ్డవాళ్లు ఆలా ఉండరు. వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
PSA 1:5 ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు. ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు.
PSA 1:6 ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు, చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.
PSA 2:1 కీర్తన యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది? ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు?
PSA 2:2 యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు, వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు.
PSA 2:3 “దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం. మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.
PSA 2:4 కాని నా ప్రభువా, పరలోకంలో ఉన్న రాజు ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు.
PSA 2:5 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు: “రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను. అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.” మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.
PSA 2:7 యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను. యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను! మరియు నీవు నా కుమారుడివి.
PSA 2:8 నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను. భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు!
PSA 2:9 ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”
PSA 2:10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి. పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి.
PSA 2:11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.
PSA 2:12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు. యెహోవాయందు విశ్వసం ఉంచేవారు సంతోషిస్తారు. కానీ ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.
PSA 3:1 దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్న సమయంలో వ్రాసిన కీర్తన. యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు. అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు.
PSA 3:2 చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు.
PSA 3:3 ఆయితే, యెహోవా, నీవు నాకు కేడెము. నీవే నా అతిశయం. యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా చేస్తావు.
PSA 3:4 యెహోవాకు నేను ప్రార్థిస్తాను. ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు!
PSA 3:5 నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును. ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక!
PSA 3:6 వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును. కానీ ఆ శత్రువులకు నేను భయపడను.
PSA 3:7 యెహోవా, లెమ్ము నా దేవా, వచ్చి నన్ను రక్షించుము! నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట శత్రువుల దవడమీద నీవు కొట్టి, వారి పళ్లన్నీ నీవు విరుగగొడతావు.
PSA 3:8 యెహోవా తన ప్రజలను రక్షించగలడు. యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము.
PSA 4:1 సంగీత నాయకునికి. తంతి వాద్యాలతో పాడదగిన దావీదు కీర్తన. నా మంచి దేవా, నేను నిన్ను ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇమ్ము. నా ప్రార్థన ఆలకించి, నా యెడల దయ చూపించుము! ఎప్పుడైనా నాకు కష్టాలు వస్తే, వాటిని తొలగించుము.
PSA 4:2 ప్రజలారా, ఎన్నాళ్లు మీరు నన్నుగూర్చి చెడ్డమాటలు చెబుతారు? ప్రజలారా, మీరు నన్ను గూర్చి చెప్పుటకు కొత్త అబద్ధాలకోసం చూస్తూనే ఉంటారు. అలాంటి అబద్ధాలు చెప్పటం అంటే మీకు ఇష్టం.
PSA 4:3 యెహోవా తన మంచి ప్రజల మొర వింటాడని మీకు తెలుసు. నేను యెహోవాను ప్రార్థించినప్పుడు, ఆయన నా ప్రార్థన వింటాడు.
PSA 4:4 మిమ్ములను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, అప్పుడు కోప్పడవచ్చు. కాని పాపం చేయవద్దు. మీరు పడకకు వెళ్లినప్పుడు ఆ విషయాలను గూర్చి ఆలోచించండి, అప్పుడు విశ్రాంతి తీసుకోండి.
PSA 4:5 దేవునికి మంచి బలులు అర్పించండి. మరి యెహోవాయందు విశ్వాసం ఉంచండి.
PSA 4:6 “దేవుని మంచితనాన్ని మనకు ఎవరు చూపిస్తారు? యెహోవా! ప్రకాశించే నీ ముఖాన్ని మమ్ముల్ని చూడనిమ్ము.” అని చాలామంది ప్రజలు అంటారు.
PSA 4:7 యెహోవా, నీవు నన్ను చాలా సంతోషపెట్టావు. ధాన్యం, ద్రాక్షారసం మాకు విస్తారంగా ఉన్నందు చేత పంట కోత సమయంలో సంబరపడే దాని కంటే ఇప్పుడు మేము ఎక్కువ సంతోషంగా ఉన్నాము.
PSA 4:8 నేను పడకకు వెళ్లి, ప్రశాంతంగా నిద్రపోతాను. ఎందుకంటె యెహోవా, నీవే నన్ను భద్రంగా నిద్ర పుచ్చుతావు గనుక.
PSA 5:1 సంగీత నాయకునికి. పిల్లన గ్రోవులతో పాడదగిన దావీదు కీర్తన. యెహోవా, నా మాటలు ఆలకించుము. నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్న దాన్ని వినుము.
PSA 5:2 నా రాజా, నా దేవా నా ప్రార్థన ఆలకించుము.
PSA 5:3 యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను. సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను. మరి నీవు నా ప్రార్థనలు వింటావు.
PSA 5:4 యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర వుండడానికి ఇష్టపడవు చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు.
PSA 5:5 గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు. ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు అసహ్యించుకొంటావు.
PSA 5:6 అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు. ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
PSA 5:7 యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు. యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను.
PSA 5:8 యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు. కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము. నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో అది నాకు తేటగా చూపించుము.
PSA 5:9 ఆ మనుష్యులు సత్యం చెప్పరు. వాళ్లు జనాన్ని నాశనం చేయకోరుతారు. వారి నోళ్ళు ఖాళీ సమాధుల్లా ఉన్నాయి. ఆ మనుష్యులు ఇతరులకు చక్కనిమాటలు చెబుతారు. కాని వాళ్లను చిక్కుల్లో పెట్టుటకు మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు.
PSA 5:10 దేవా! వారిని శిక్షించుము. వారి ఉచ్చులలో వారినే పట్టుబడనిమ్ము. ఆ మనుష్యులు నీకు విరోధంగా తిరిగారు కనుక వారి విస్తార పాపాల నిమిత్తం వారిని శిక్షించుము.
PSA 5:11 అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము. ఆ ప్రజలను శాశ్వతంగా సంతోషించనిమ్ము. దేవా, నీ నామమును ప్రేమించే ప్రజలకు భద్రత, బలం ప్రసాదించుము.
PSA 5:12 యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెంలా ఉంటావు.
PSA 6:1 సంగీత నాయకునికి. అష్టమ శృతిమీద తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన. యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు. కోపగించి నన్ను శిక్షించవద్దు.
PSA 6:2 యెహోవా, నా మీద దయ ఉంచుము. నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.
PSA 6:3 నా శరీరం మొత్తం వణకుతోంది. యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.?
PSA 6:4 యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము. నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.
PSA 6:5 చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు. చావు స్థలంలో ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.
PSA 6:6 యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను. నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది. నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుచున్నాయి. నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను.
PSA 6:7 నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు. ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది. ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను అలసటగాను ఉన్నాయి.
PSA 6:8 చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి! ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.
PSA 6:9 యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.
PSA 6:10 నా శత్రువులంతా తంక్రిందులై, నిరాశపడతారు. వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.
PSA 7:1 యెహోవాకు దావీదు పాడిన కీర్తన. బెన్యామీను వంశానికి చెందిన కీషు కుమారుడైన పౌలును గూర్చినది ఈ పాట. యెహోవా నా దేవా, నిన్ను నేను నమ్ముకొన్నాను. నన్ను తరుముతున్న మనుష్యుల బారినుండి నన్ను రక్షించుము. నన్ను తప్పించుము.
PSA 7:2 నాకు నీవు సహాయం చేయకపోతే అప్పుడు నేను సింహంచే పట్టబడి చీల్చబడిన జంతువులాగ ఉంటాను. నేను ఈడ్చుకొని పోబడతాను. ఏ మనిషి నన్ను రక్షించజాలడు.
PSA 7:3 యెహోవా నా దేవా, నేను తప్పు చేసిన దోషిని కాను. నేనేమీ తప్పు చేయలేదు.
PSA 7:4 నా స్నేహితునికి నేనేమీ కీడు చేయలేదు. నా స్నేహితుని శత్రువులకు నేను సహాయం చేయలేదు.
PSA 7:5 కానీ నేను పాపము కలిగియుండిన యెడల శత్రువు నన్ను తరుమనిమ్ము. నన్ను పట్టుకొననిమ్ము, నా జీవితాన్ని నేలమీద తొక్కనిమ్ము. మరియు నా ప్రాణాన్ని మట్టిలోనికి నెట్టివేయనిమ్ము.
PSA 7:6 యెహోవా, లెమ్ము నీ కోపాన్ని చూపెట్టుము. నా శత్రువు కోపంగా ఉన్నాడు కనుక నిలిచివానికి విరోధంగా పోరాడుము. లేచి న్యాయంకోసం వాదించుము.
PSA 7:7 జనాలను నీ చుట్టూ ప్రోగుచేసి, వారి మీద పైనుండి పరిపాలించుము.
PSA 7:8 ప్రజలకు తీర్పు తీర్చుము యెహోవా, నాకు తీర్పు తీర్చుము. నేను సరిగ్గా ఉన్నట్టు రుజువు చేయుము. నేను నిర్దోషిని అని రుజువు చేయుము.
PSA 7:9 చెడ్డవాళ్లను శిక్షించి మంచివాళ్లకు సహాయం చేయుము. దేవా, నీవు మంచివాడవు, మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు.
PSA 7:10 నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక దేవుడు నన్ను కాపాడుతాడు.
PSA 7:11 దేవుడు మంచి న్యాయమూర్తి, మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు.
PSA 7:12 దేవుడు ఒక నిర్ణయం చేస్తే ఆయన తన మనస్సు మార్చుకోడు.
PSA 7:13 ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది.
PSA 7:14 కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు. అలాంటివారు రహస్య పథకాలు వేస్తూ, అబద్ధాలు చెబుతారు.
PSA 7:15 వారు యితరులను ఉచ్చులో వేసి, హాని చేయాలని ప్రయత్నిస్తారు. అయితే వారి స్వంత ఉచ్చుల్లో వారే చిక్కుబడతారు.
PSA 7:16 వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు. ఇతరులయెడల వారు కృ-రంగా ప్రవర్తించారు. అయితే వారు దేనికి పాత్రులో దానిని పొందుతారు.
PSA 7:17 యెహోవా మంచివాడు గనుక నేను ఆయనను స్తుతిస్తాను. మహోన్నతుడైన యెహోవా నామాన్ని నేను స్తుతిస్తాను.
PSA 8:1 సంగీత నాయకునికి. గితీత్ రాగం. దావీదు కీర్తన. యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
PSA 8:2 పరలోకమంతా నీ పిల్లల కీర్తి చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది. నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
PSA 8:3 యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను. నీవు సృష్టించిన సూర్య చంద్ర, నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
PSA 8:4 మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు? నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు? మానవ మాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం? నీవు వానిని గమనించటం ఎందుకు?
PSA 8:5 అయితే మానవుడు నీకు ముఖ్యం. వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు. మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
PSA 8:6 నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికార మిచ్చియున్నావు. ప్రతిదానిని నీవు వాని అధీనంలో వుంచావు.
PSA 8:7 గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
PSA 8:8 ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
PSA 8:9 మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!
PSA 9:1 సంగీత నాయకునికి. ముత్లబ్బేను రాగం. దావీద కీర్తన. పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను.
PSA 9:2 నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు. మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను.
PSA 9:3 నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లు కొన్నారు. కానీ వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు.
PSA 9:4 నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు. యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు.
PSA 9:5 యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు. యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు. బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు.
PSA 9:6 శత్రువు పని అంతం అయిపోయింది. యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు. ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు.
PSA 9:7 అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు. యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు.
PSA 9:8 భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు. యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు.
PSA 9:9 అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు. ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు. యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.
PSA 9:10 నీ నామం తెలిసిన ప్రజలు నీమీద విశ్వాసం ఉంచాలి. యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.
PSA 9:11 సీయెనులో నివసిస్తున్న ప్రజలారా మీరు యెహోవాకు స్తుతులు పాడండి. యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.
PSA 9:12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు. మరి యెహోవా వారిని మరచిపోలేదు.
PSA 9:13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము. నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము. ‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.
PSA 9:14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను. నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”
PSA 9:15 యూదులు కాని ఆ ప్రజలు, ఇతర ప్రజలను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు. కాని, యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే పడ్డారు. ఆ మనుష్యులు ఇతర ప్రజలను పట్టడానికి వలలు మాటున పెట్టారు. కాని, వారి పాదాలే ఆ వలల్లో చిక్కుబడ్డాయి.
PSA 9:16 యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు. యెహోవా చేసిన దాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్
PSA 9:17 దేవుని మరచే ప్రజలు దుష్టులు. ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు.
PSA 9:18 ఆ పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది. కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.
PSA 9:19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము. వారే శక్తిగలవారు అని ప్రజలను తలచనీయకుము.
PSA 9:20 ప్రజలకు పాఠం నేర్పించు. వారు కేవలం మానవ మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము.
PSA 10:1 యెహోవా నీవెందుకు అంత దూరంగా ఉంటావు? కష్టాల్లో ఉన్న ప్రజలు నిన్ను చూడలేరు.
PSA 10:2 గర్విష్ఠులు, దుష్టులు వారి దుష్ట పథకాలు వేస్తారు. మరియు పేద ప్రజలను వారు బాధిస్తారు.
PSA 10:3 దుష్టులు వారికి కావలసిన వాటిని గూర్చి అతిశయ పడతారు. లోభులు యెహోవాను దూషిస్తారు. ఈ విధంగా దుష్టులు యెహోవాను ద్వేషిస్తున్నట్టు వ్యక్తం చేస్తారు.
PSA 10:4 ఆ దుర్మార్గులు చాలా గర్విష్ఠులు కనుక దేవుని అనుసరించరు. వాళ్లు తమ పాపిష్టి పథకాలన్నీ తయారు చేస్తారు. పైగా దేవుడే లేడు అన్నట్టు వారు ప్రవర్తిస్తారు.
PSA 10:5 ఆ దుర్మార్గులు ఎల్లప్పుడూ వంకర పనులే చేస్తుంటారు. కనీసం నీ చట్టాలను, వివేకవంతమైన నీ ఉపదేశాలను కూడా వారు పట్టించుకోరు. దేవుని శత్రువులు ఆయన బోధనలను నిర్లక్ష్యం చేస్తారు.
PSA 10:6 వాళ్లకు కీడు ఎన్నటికీ జరగదని ఆ మనుష్యులు తలుస్తారు. “మాకు ఎన్నడూ కష్ట సమయాలు ఉండవు” అని వారు అంటారు.
PSA 10:7 ఆ మనుష్యులు ఎల్లప్పుడూ దూషిస్తారు. ఇతరుల విషయంలో వారు ఎల్లప్పుడూ చెడు సంగతులే చెబుతారు. దుష్టకార్యాలు చేసేందుకే వారు ఎల్లప్పుడూ పథకం వేస్తుంటారు.
PSA 10:8 ఆ మనుష్యులు రహస్య స్థలాల్లో దాగుకొని ప్రజలను పట్టుకొనేందుకు కనిపెడతారు. ప్రజలను బాధించుటకు వారికోసం చూస్తూ దాగుకుంటారు. నిర్దోషులను వారు చంపుతారు.
PSA 10:9 తినవలసిన జంతువులను పట్టుకోవటానికి ప్రయత్నించే సింహాలవలె వారుంటారు. ఆ దుర్మార్గులు, పేదల మీద దాడిచేస్తారు. దుష్టులు వేసే ఉచ్చులలో పేదలు చిక్కుకొంటారు.
PSA 10:10 పేదలను, బాధపడేవారిని, ఆ దుష్టులు మరల, మరల బాధిస్తారు.
PSA 10:11 అందుచేత ఆ పేదలు ఈ సంగతులను ఇలా ఆలోచించటం మొదలు పెడ్తారు: “దేవుడు మమ్ముల్ని మరచిపోయాడు! దేవుడు మానుండి శాశ్వతంగా విముఖుడయ్యాడు! మాకు ఏమి జరుగుతుందో దేవుడు చూడటం లేదు!”
PSA 10:12 యెహోవా, లేచి ఏదైనా చేయుము! దేవా, దుష్టులను శిక్షించుము! పేదలను మాత్రం మరువ కుము!
PSA 10:13 దుష్టులు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు? ఎందుకంటే దేవుడు వారిని శిక్షించడు అనుకొంటారు గనుక.
PSA 10:14 యెహోవా, దుర్మార్గులు చేసే కృ-రమైన చెడ్డ సంగతులను నీవు నిజంగా చూస్తున్నావు. నీవు వాటిని చూచి వాటి విషయమై ఏదో ఒకటి చేయుము. ఎన్నో కష్టాలతో ప్రజలు నీ దగ్గరకు సహాయం కోసం వస్తారు. యెహోవా, తల్లి దండ్రులు లేని పిల్లలకు సహాయం చేసే వాడివి నీవే. కనుక వారికి సహాయం చేయుము.
PSA 10:15 యెహోవా, దుర్మార్గులను నాశనం చేయుము.
PSA 10:16 యెహోవా నిరంతరం రాజైయున్నాడు. ఆ ప్రజలు ఆయన దేశంలోనుండి నశించెదరు గాక!
PSA 10:17 యెహోవా, పేదలు కోరుకొనే వాటిని గూర్చి నీవు విన్నావు. నీవు వారిని ప్రోత్సాహ పరచెదవు. వారి ప్రార్థనలు ఆలకించెదవు.
PSA 10:18 యెహోవా, అనాథ పిల్లలను కాపాడుము. దుఃఖంలో ఉన్న వారిని ఇంకా ఎక్కువ కష్టాలు పడనీయకుము. దుర్మార్గులు ఇక్కడ ఉండ కుండుటకు చాలా భయపడేటట్టుగా చేయుము.
PSA 11:1 సంగీత నాయకునికి. దావీదు కీర్తన. నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు? “పక్షిలాగ, నీ పర్వతం మీదికి ఎగిరిపో” అని మీరు నాతో చెప్పారు!
PSA 11:2 వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు. వారి బాణాలను వారు గురి చూస్తారు. మరియు చీకటిలోనుండి దుర్మార్గులు నీతి, నిజాయితీగల ప్రజల గుండెల్లోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు.
PSA 11:3 నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది? అప్పుడు నీతిమంతులు ఏమి చేస్తారు?
PSA 11:4 యెహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు. యెహోవా పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు. మరియు జరిగే ప్రతీది యెహోవా చూస్తున్నాడు. మనుష్యులు మంచివాళ్లో, చెడ్డవాళ్లో చూసేందుకు యెహోవా కళ్లు ప్రజలను నిశ్చితంగా చూస్తాయి.
PSA 11:5 యెహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు. చెడ్డవాళ్లు ఇతరులను బాధించటానికి ఇష్టపడతారు. కృ-రమైన ఆ మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
PSA 11:6 వేడి నిప్పులు, మండుతున్న గంధకం, ఆ దుర్మార్గుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా చేస్తాడు. ఆ దుర్మార్గులకు లభించేది అంతా మండుతున్న వేడి గాలి మాత్రమే.
PSA 11:7 అయితే దయగల యెహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు. మంచి మనుష్యులు ఆయన ముఖ దర్శనం చేసుకొంటారు.
PSA 12:1 సంగీత నాయకునికి. షెమినిత్ రాగం. దావీదు కీర్తన. యెహోవా, నన్ను రక్షించుము! మంచి మనుష్యులంతా పోయారు. భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు.
PSA 12:2 మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు. ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు.
PSA 12:3 అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి. పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసి వేయాలి.
PSA 12:4 “మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి. మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.” అని ఆ ప్రజలు ఈ సంగతులు చెప్పుకొంటారు.
PSA 12:5 కానీ యెహోవా చెబుతున్నాడు, “దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు. ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు. కానీ ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.”
PSA 12:6 యెహోవా మాటలు సత్యం, నిర్మలం. నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి. కరిగించబడి ఏడుసార్లు పోయ బడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి.
PSA 12:7 యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు. ఇప్పుడు, శాశ్వతంగానూ నీవు వారిని కాపాడుతావు.
PSA 12:8 మనుష్యుల మధ్యలో దుష్టత్వము చెడుతనము పెరిగినప్పుడు ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.
PSA 13:1 సంగీత నాయకునికి. దావీదు కీర్తన. యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు? నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా? నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
PSA 13:2 నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి? ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి? ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?
PSA 13:3 నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము. నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
PSA 13:4 అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు. నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.
PSA 13:5 యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను. నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
PSA 13:6 యెహోవా నాకు మేలు కార్యాలు చేశాడు. కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.
PSA 14:1 సంగీత నాయకునికి. దావీదు కీర్తన. “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు. బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు. వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.
PSA 14:2 పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు. వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుని ప్రయత్నించాడు. ( వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)
PSA 14:3 కానీ ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు. మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు. కనీసం ఒక్క వ్యక్తి కూడా మంచి పనులు చేయలేదు.
PSA 14:4 దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు. ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు. దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది. ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.
PSA 14:5 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు. కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు. కానీ ఆ దుర్మార్గులు చాలా భయపడి పోయారు. ఎందుకంటే దేవుడు తనుమంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.
PSA 14:7 సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు? ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు. కానీ యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు. ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.
PSA 15:1 దావీదు కీర్తన. యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు? నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
PSA 15:2 ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
PSA 15:3 అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు. ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు. ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పాడు.
PSA 15:4 ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు. ఆయితే యోహోవాను సేవించే వారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు. ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
PSA 15:5 ఆ మనిషి ఎవరికైనా అప్పీస్తే అతడు దాని మీద వడ్డీ తీసుకోడు. నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు. ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.
PSA 16:1 దావీదుకు అభిమాన కావ్యము. దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
PSA 16:2 “యెహోవా, నీవు నా యజమానివి నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభీస్తుంది” అని నేను యోహోవాతో చెప్పాను.
PSA 16:3 దేశములో పవిత్రమైనవి అని పిలుపబడే విగ్రహములకు సంబంధించిన వాటియందు ఆనందించు వారందరు శాపగ్రస్తులగుదురు గాక!
PSA 16:4 కానీ ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది. ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను. ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
PSA 16:5 నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది. యెహోవా, నీవే నన్ను బలపరచావు. యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
PSA 16:6 నా వంతు చాలా అద్భుతమయింది. నా స్వాస్థ్యము చాలా అందమయింది.
PSA 16:7 యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను. రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.
PSA 16:8 నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను. ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు. నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
PSA 16:9 కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి. నా శరీరం కూడ క్షేమంగా బతుకుతుంది.
PSA 16:10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక. నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
PSA 16:11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు. యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది. నీ కుడిపక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.
PSA 17:1 దావీదు ప్రార్థన. యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము. నా ప్రార్థనా గీతం వినుము. యదార్థమైన నా ప్రార్థన వినుము.
PSA 17:2 యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది. నీవు సత్యాన్ని చూడగలవు.
PSA 17:3 నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు దాన్ని లోతుగా చూశావు. రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు. నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తల పెట్టలేదు.
PSA 17:4 నీ ఆదేశాలకు విధేయుడనగుటకు నేను మానవ పరంగా సాధ్యమైనతం కష్టపడి ప్రయత్నించాను.
PSA 17:5 నేను నీ మార్గాలు అనుసరించాను. నీ జీవిత విధానం నుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
PSA 17:6 దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు. కనుక ఇప్పుడు నా మాట వినుము.
PSA 17:7 ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము. నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము. నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
PSA 17:8 నీ కంటిపాపవలె నన్ను కాపాడుము. నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
PSA 17:9 యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారి నుండి నన్ను కాపాడుము.
PSA 17:10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు.
PSA 17:11 ఆ మనుష్యులు నన్ను తరిమారు. ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు. నన్ను నేలకు పడ గొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు.
PSA 17:12 చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు. వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు.
PSA 17:13 యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపొయేటట్టుగా చేయుము. నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
PSA 17:14 యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవ ప్రజల దేశంలో నుండి ఆ దుర్మార్గులను తొలగించుము. యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి వాళ్ల కడుపులను నింపుము. ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది.
PSA 17:15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను. మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.
PSA 18:1 సంగీత నాయకునికి. యెహోవా సేవకుడు దావీదు కీర్తన. సౌలు బారి నుండి, యితర శత్రువుల నుండి యెహోవా దావీదును రక్షించినప్పుడు అతడు వ్రాసిన పాట. “యెహోవా, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను!” అతడీలాగన్నాడు.
PSA 18:2 యెహోవా నా దండ, నా కోట, నా రక్షకుడు. నా దేవుడే నా అండ. నేను ఆశ్రయంకోసం ఆయన యొద్దకు పరుగెత్తుతాను. దేవుడు నా డాలు, ఆయనే శక్తి నన్ను రక్షిస్తాడు. ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుకొను స్థలము.
PSA 18:3 యెహోవాకు నేను మొరపెడ్తాను. యెహోవా స్తుతించబడుటకు అర్హుడు మరియు నా శత్రువుల బారినుండి నేను రక్షించబడుతాను.
PSA 18:4 నా శత్రువులు నా యెదుట ఎన్నో ఉచ్చులు పెట్టారు. మరణకరమైన ఉచ్చులు నా యెదుట ఉన్నాయి. మరణపాశాలు నా చుట్టూరా చుట్టబడి ఉన్నాయి. నాశనకరమైన వరదనీళ్లు నన్ను భయ పెడుతున్నాయి. మరణపాశాలు అన్నీ చుట్టూరా ఉన్నాయి.
PSA 18:6 చిక్కులో పడి, నేను సహాయం కోసం యెహోవాకు మొరపెట్టాను. నేను నా దేవుని ప్రార్థించాను. దేవుడు తన పవిత్ర స్థలం నుండి నా ప్రార్థన విన్నాడు. సహాయంకోసం నేను చేసిన ప్రార్థనలు ఆయన విన్నాడు.
PSA 18:7 యెహోవా నాకు సహాయం చేయటానికి వస్తున్నాడు. భూమి కంపించి వణికినది. పర్వతాలు కంపించాయి. ఎందుకంటే ప్రభువు కోపించాడు.
PSA 18:8 ఆయన ముక్కుల్లో నుండి పొగ లేచింది. యెహోవా నోటి నుండి మండుతున్న జ్వాలలు వచ్చాయి. నిప్పు కణాలు ఆయన నుండి రేగాయి.
PSA 18:9 యెహోవా గగనం చీల్చుకొని దిగి వచ్చాడు. ఆయన పాదాల క్రింద నల్లటి మేఘాలు ఉన్నాయి.
PSA 18:10 ఎగిరే కెరూబులు మీద ఆయన స్వారీ చేశాడు. ఆయన గాలుల మీద పై కెగిరాడు.
PSA 18:11 యెహోవాను ఆవరించిన మహా దట్టమైన మైఘంలో ఆయన మరుగైయున్నాడు. దట్టమైన ఉరుము మేఘంలో ఆయన మరుగై యున్నాడు.
PSA 18:12 అప్పుడు, దేవుని ప్రకాశమానమైన వెలుగు మేఘాలనుండి బయలు వెడలినది. అంతట వడగండ్లు, మెరుపులు వచ్చినవి.
PSA 18:13 యెహోవా యొక్క స్వరం ఆకాశంలో గట్టిగా ఉరిమింది. సర్వోన్నతుడైన దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. వడగండ్లు, మెరుపులు కలిగాయి.
PSA 18:14 యెహోవా తన బాణాలు వేయగా శత్రువు చెదరి పోయాడు, అనేకమైన ఆయన మెరుపు పిడుగులు వారిని ఓడించాయి.
PSA 18:15 యెహోవా, నీవు బలంగా మాట్లాడావు, మరియు నీవు నీ నోటినుండి బలమైన గాలిని ఊదావు. నీళ్లు వెనక్కు నెట్టివేయబడ్డాయి, సముద్రపు అడుగును మేము చూడగలిగాము. భూమి పునాదులను మేము చూడగలిగాము.
PSA 18:16 పై నుండి యెహోవా కిందికి అందుకొని నన్ను రక్షించాడు. నా కష్టాల్లోనుండి ఆయననన్ను బయటకు లాగాడు.
PSA 18:17 నా శత్రువులు నాకంటె బలవంతులు. ఆ మనుష్యులు నన్ను ద్వేషించారు. పైగా వారు నాకంటె బలం కలవారు. అయినను దేవుడు నన్ను రక్షించాడు.
PSA 18:18 నా కష్టకాలంలో ఆ మనుష్యులు నా మీద దాడి చేశారు. కానీ యెహోవా నన్ను బలపర్చాడు.
PSA 18:19 యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన నన్ను కాపాడాడు. ఆయన నన్నుక్షేమ స్థలానికి తీసికొని వెళ్లాడు.
PSA 18:20 నేను నిర్దోషిని కనుక యెహోవా నాకు ప్రతి ఫలమిచ్చాడు. నేను ఏ తప్పు చేయలేదు. కనుక ఆయన నాకు తిరిగి చెల్లించాడు.
PSA 18:21 నేను యెహోవాను అనుసరించాను. నా దేవునికి విరుద్ధంగా నేను చెడు కార్యాలు చెయలేదు.
PSA 18:22 యెహోవా చట్టాలు, అన్నింటినీ నేను జ్ఞాపకం ఉంచుకున్నాను. ఆయన ఆదేశాలను నేను త్రోసివేయ లేదు.
PSA 18:23 ఆయన ఎదుట నేను నిర్దోషిగా ఉన్నాను. నన్ను నేను పాపమునుండి దూరం చేసుకొన్నాను.
PSA 18:24 నేను సరైనదాన్ని చేసినందుకు యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాడు. నా క్రియలు దేవుని ఎదుట నిర్దోషమైనవి. అందుకే ఆయన నాకు మంచి చేస్తాడు.
PSA 18:25 యెహోవా, నమ్మదగిన మనుష్యులకు నీవు నమ్మ దగినవాడవు. మరియు మంచి మనుష్యులకు నీవు మంచివాడవు.
PSA 18:26 యెహోవా, మంచివాళ్లకు, పవిత్రమైన వాళ్లకు నీవు మంచివాడవు, పవిత్రమైన వాడవు. కానీ, గర్విష్ఠులను, టక్కరి వాళ్లను నీవు అణచివేస్తావు.
PSA 18:27 యెహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు. కానీ గర్విష్టులను నీవు ప్రాముఖ్యత లేని వారిగా చేస్తావు.
PSA 18:28 యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు. నా దేవా, నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు.
PSA 18:29 యెహోవా, నీ సహాయంతో నేను సైన్య దళాలతో పరుగెత్తగలను. నీ సహాయంతో, నేను శత్రువు గోడలు ఎక్కగలను.
PSA 18:30 దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా మాటలు సత్యం. ఆయనయందు విశ్వాసం ఉంచేవాళ్లను ఆయన భద్రంగా ఉంచుతాడు.
PSA 18:31 యెహోవా తప్ప నిజమైన దేవుడు ఒక్కడూ లేడు. మన దేవుడు తప్ప మరో బండ లేదు.
PSA 18:32 దేవుడు నాకు బలం ఇస్తాడు. ఆయన నా జీవితాన్ని పావనం చేస్తాడు.
PSA 18:33 దేవుడు నా కాళ్లను లేడి కాళ్లవలె వేగంగా ఉంచుతాడు. ఆయన నన్ను స్థిరంగా ఉంచుతాడు. ఎత్తయిన బండలమీద పడకుండా ఆయన నన్ను కాపాడుతాడు.
PSA 18:34 యుద్ధంలో ఎలా పోరాడాలో దేవుడు నాకు నేర్పిస్తాడు. ఇత్తడి విల్లును ఎక్కు పెట్టుటకు నా చేతులకు ఆయన బలాన్ని ఇస్తాడు.
PSA 18:35 దేవా, నీ డాలుతో నన్ను కాపాడితివి. నీ కుడిచేతితో నన్ను బలపరుచుము. నీ సహాయం నన్ను గొప్పవానిగా చేసినది.
PSA 18:36 నా అడుగులకు నీవు విశాలమైన మార్గాన్నిచ్చావు. నా పాదాలు జారిపోలేదు.
PSA 18:37 నేను నా శత్రువులను తరిమి, వారిని పట్టుకొన్నాను. వారు నాశనం అయ్యేవరకు నేను తిరిగిరాలేదు.
PSA 18:38 నా శత్రువులను నేను ఓడిస్తాను. వారిలో ఒక్కరుకూడా తిరిగి లేవరు. నా శత్రువులు అందరూ నా పాదాల దగ్గర పడ్డారు.
PSA 18:39 దేవా, యుద్ధంలో నాకు బలం ప్రసాదించుము. నా శత్రువులంతా నా యెదుట పడిపోయేట్టు చేయుము.
PSA 18:40 యెహోవా, నా శత్రువులను వెనుదిరిగేటట్లు చేశావు. నీ సహాయంవల్లనే నన్ను ద్వేషించే వారిని నేను నాశనం చేస్తాను.
PSA 18:41 నా శత్రువులు సహాయం కోసం అడిగారు, కానీ ఎవ్వరూ వారికి సహాయం చేసేందకు రాలేదు. వారు యెహోవాకు కూడా మొరపెట్టారు. కాని ఆయన వారికి జవాబు ఇవ్వలేదు.
PSA 18:42 నా శత్రువులను నేను ధూళిగా నలగగొట్టాను. వారు గాలికి చెదరిపోయే దుమ్ములా ఉన్నారు. నేను వాళ్లను వీ ధుల బురదగా పారవేసాను.
PSA 18:43 నాకు వ్యతిరేకంగా పోరాడే మనుష్యుల నుండి నన్ను కాపాడావు. ఆ రాజ్యాలకు నన్ను నాయకునిగా చేయుము. నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తారు.
PSA 18:44 ఆ మనుష్యులు నా గురించి విన్నప్పుడు విధేయులయ్యారు. ఇతర రాజ్యాల ప్రజలు నేనంటే భయపడ్డారు.
PSA 18:45 ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు, కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు. వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు వచ్చారు.
PSA 18:46 యెహోవా సజీవంగా ఉన్నాడు. నా ఆశ్రయ దుర్గమైన వానిని నేను స్తుతిస్తాను. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. అందుచేత ఆయనను స్తుతులతో పైకెత్తండి.
PSA 18:47 నాకోసం నా శత్రువులను శిక్షించాడు. ఆ ప్రజలను ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేసాడు.
PSA 18:48 యెహోవా, నీవే నా శత్రువుల నుండి నన్ను తప్పించావు. కృ-రులైన వారి నుండి నీవు నన్ను రక్షించావు. నాకు విరుద్ధంగా నిలిచినవారిని ఓడించుటకు నీవు నాకు సహాయం చేశావు.
PSA 18:49 కనుక మనుష్యులందరి యెదుట యెహోవాను నేను స్తుతిస్తాను. నీ నామ కీర్తన గానము చేస్తాను.
PSA 18:50 యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు, ఆయన గొప్ప విజయాలిచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు అనగా దావీదుకు, తన సంతానానికీ నిరంతరం ఆయన ఎంతో దయ చూపాడు.
PSA 19:1 సంగీత నాయకునికి. దావీదు కీర్తన. ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి. యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
PSA 19:2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది. ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
PSA 19:3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు. మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
PSA 19:4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది. వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి. అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
PSA 19:5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు. పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
PSA 19:6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు, మరియు ఆవలి దిశకు అది పరిగెడుతుంది. దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
PSA 19:7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం. అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి. యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది. జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
PSA 19:8 యెహోవా చట్టాలు సరియైనవి. అవి మనుష్యులను సంతోషపెడ్తాయి. యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి. ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
PSA 19:9 యెహోవాను ఆరాధించుట మంచిది. అది నిరంతరము నిలుస్తుంది. యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి. అవి సంపూర్ణంగా సరియైనవి.
PSA 19:10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి. సరాసరి తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
PSA 19:11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి. నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
PSA 19:12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు. కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
PSA 19:13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము. ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము. నీవు నాకు సహాయం చేస్తే అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
PSA 19:14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోష పెడ్తాయని నేను ఆశిస్తున్నాను. యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
PSA 20:1 సంగీత నాయకునికి. దావీదు కీర్తన. నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక. యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక.
PSA 20:2 దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక. సీయోను నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక!
PSA 20:3 నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక. నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక.
PSA 20:4 నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక. నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.
PSA 20:5 దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదముగాక. దేవుని నామమునకు. స్తొత్రము క లుగును గాక. నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.
PSA 20:6 ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయర చేస్తాడని నాకు తెలుసు. దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు. ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయెగించాడు.
PSA 20:7 కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు మనుష్యులు వారి గుర్రాలను నమ్ముకొంటారు. కానీ మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము.
PSA 20:8 ఆ ఇతర మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు. కానీ మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!
PSA 20:9 దేవుడు రాజును రక్షించును గాక! మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము.
PSA 21:1 సంగీత నాయకునికి. దావీ దు కీర్తన. యెహోవా, నీ బలం రాజును సంతోషపరుస్తుంది. నీవు అతన్ని రక్షించినప్పుడు అతడు ఎంతగానో సంతోషించాడు.
PSA 21:2 రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు కొన్నింటికోసం అడిగాడు. మరియు యెహోవా, రాజు అడిగిన వాటిని నీవు అతనికిచ్చావు.
PSA 21:3 యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచి వాటిని రాజుకిచ్చావు. బంగారు కిరీటం నీవు అతని తలకు ధరింపజేసావు.
PSA 21:4 దేవా, జీనంకోసం అతడు నిన్ను అడిగాడు. నీవు దానిని అతనికిచ్చావు. నీవు రాజుకు నిరంతరం సాగే దీర్గాయువు నిచ్చావు.
PSA 21:5 రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి గొప్ప కీర్తి ఉంది. నీవు అతనికి గౌరవం, ఘనత ఇచ్చావు.
PSA 21:6 దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు. నీ సన్నిధానము రాజును ఎక్కువగా సంతోషపెస్తుంది.
PSA 21:7 రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు అతన్ని నిరాశపర్చడు.
PSA 21:8 రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు. నిన్ను ద్వేషించే ప్రజలను నీ శక్తి ఓడిస్తుంది.
PSA 21:9 నీవు కనబడినప్పుడు ఆ శత్రువులను వేడి పొయ్యిలోని నిప్పువలె చేస్తావు. యెహోవా కోపము వేడి మంటవలె కాలుస్తుంది. మరియు ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు.
PSA 21:10 ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి. వారు భూమి మీద నుండి తొలగిపోతారు.
PSA 21:11 ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు. చెడుకార్యాలు చేయాలని వారు యోచించారు గాని వారు సాధించలేదు.
PSA 21:12 కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు. ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు.
PSA 21:13 యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు వాయిస్తాము.
PSA 22:1 సంగీత నాయకునికి. అయ్యలెత్ షహరు రాగం. దావీ దు కీర్తన. నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు. సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
PSA 22:2 నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను. కాని నీవు నాకు జవాబు ఇవ్వలేదు. మరియు నేను రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను.
PSA 22:3 దేవా, నీవు పవిత్రుడవు. నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహసనం.
PSA 22:4 మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు. అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు.
PSA 22:5 మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువులు నుంచి వారు తప్పించుకొన్నారు. వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు.
PSA 22:6 అందుచేత నేను మనిషిని కానా, పురుగునా? మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు.
PSA 22:7 నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు. నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు.
PSA 22:8 వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి. ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో! నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.”
PSA 22:9 దేవా, నిజంగా నేను నీ మీద ఆధార పడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగిన వాడవు నీవే. నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆదరించావు.
PSA 22:10 నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు. నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చినప్పటి నుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను.
PSA 22:11 కనుక దేవా, నన్ను విడువకు. కష్టం దగ్గర్లో ఉంది. పైగా నాకు సహాయం చేసే వారు. ఎవ్వరూ లేరు.
PSA 22:12 మనుష్యులు రంకెవేసే ఆబోతుల్లాగా నా చుట్టూ వున్నారు. వారు బలిసిన బాషాను ఆబోతుల వలె నన్ను చుట్టుముట్టియున్నారు. (బాషాను అనగా యొర్దాను నది తూర్పు ప్రాంతం. అది పశువులకు ప్రసిద్దికెక్కిన ప్రాంతం.)
PSA 22:13 ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు. వారి నోళ్లు పెద్దగా తెరచు కొని ఉన్నాయి.
PSA 22:14 నేలమీద పోయబడ్డ నీళ్లలా నా బలం పోయినది. నా ఎముకలు విడిపోయాయి. నా ధైర్యం పోయినది.
PSA 22:15 నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది. నా నాలుక నా అంగిటికి అతుక్కొని పోతోంది. “మరణ ధూళిలో” నీవు నన్ను ఉంచావు.
PSA 22:16 “కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి. ఆ దుష్టుల దండు నన్ను చుట్టు ముట్టింది. సింహంలాగా వారు నా చేతుల్ని, నా పాదాలను గాయపర్చారు.
PSA 22:17 నేను నా ఎముకల్ని చూడగలను. ఆ ప్రజలు నా వైపు తేరి చూస్తున్నారు. వారు నన్ను అలా చూస్తూనే ఉంటారు!
PSA 22:18 ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు. నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు.
PSA 22:19 యెహోవా, నన్ను విడువకుము! నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము!
PSA 22:20 యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము. ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల నుండి రక్షించుము.
PSA 22:21 సింహం నోటినుండి నన్ను రక్షించుము. ఆబోతుకొమ్ములనుండి నన్ను కాపాడుము.
PSA 22:22 యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను. ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
PSA 22:23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి. ఇశ్రాయేలు వంశస్థులారా యెహోవాను ఘనపర్చండి. ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి.
PSA 22:24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు. ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు. యెహోవా వారిని ద్వేషించడు. ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.
PSA 22:25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నీ నుండే వస్తుంది. నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
PSA 22:26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు. యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి. మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
PSA 22:27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని ఆయన వద్దకు తిరిగి వస్తారు.
PSA 22:28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే. ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
PSA 22:29 నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు. సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తలవంచు తారు. మరియు వారి ప్రాణాలను కాపాడుకొన లేనివారు కూడా తల వంచుతారు. చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తలవంచాలి.
PSA 22:30 భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు. యెహోవా విషయమై వారు, నిత్యం చెప్పుతారు.
PSA 22:31 ఇంకా పుట్టని మనుష్యులకు వచ్చి దేవుని మంచి తనం గూర్చి చెబుతారు. దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.
PSA 23:1 దావీ దు కీర్తన. యెహోవా నా కాపరి నాకు కొరత ఉండదు
PSA 23:2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు. ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
PSA 23:3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు. ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
PSA 23:4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
PSA 23:5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాక భోజనం సిద్ధం చేశావు. నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు. నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
PSA 23:6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి. మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
PSA 24:1 దావీదు కీర్తన. భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే. ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
PSA 24:2 జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు. ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.
PSA 24:3 యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు? యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
PSA 24:4 అక్కడ ఎవరు ఆరాధించగలరు? చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ, అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు, అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు. అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.
PSA 24:5 మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు. ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
PSA 24:6 దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు. సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.
PSA 24:7 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి. పురాతన తలుపుల్లారా తెరచుకోండి. మహిమగల రాజులోనికి వస్తాడు.
PSA 24:8 ఈ మహిమగల రాజు ఎవరు? ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైనికుడు. యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.
PSA 24:9 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి! పురాతన తలుపుల్లారా, తెరచుకోండి. మహిమగల రాజులోనికి వస్తాడు.
PSA 24:10 ఆ మహిమగల రాజు ఎవరు? ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.
PSA 25:1 దావీదు కీర్తన. యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
PSA 25:2 నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను. నేను నిరాశచెందను. నాశత్రువులు నన్ను చూచినవ్వరు.
PSA 25:3 నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు. కానీ నమ్మక ద్రోహులు నిరాశపడతారు. వారికి ఏమీ దొరకదు.
PSA 25:4 యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము. నీ మార్గాలను ఉపదేశించుము.
PSA 25:5 నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము. నీవు నా దేవుడవు, నా రక్షకుడవు. రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
PSA 25:6 యెహోవా, నా ఎడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నాయెడల చూపించుము.
PSA 25:7 నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు. యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
PSA 25:8 యెహోవా నిజంగా మంచివాడు. జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
PSA 25:9 దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు. న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
PSA 25:10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను ఆనుసరించే మనుష్యులందరికి ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.
PSA 25:11 యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను. కానీ, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు.
PSA 25:12 ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే అప్పుడు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు.
PSA 25:13 ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు. అతనికిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు వారసత్వంగా పొందుతారు.
PSA 25:14 యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు. ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేసిస్తాడు.
PSA 25:15 నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి. ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు.
PSA 25:16 యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను. నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము.
PSA 25:17 నా కష్టాలనుంచి నన్ను విడిపించుము. నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము.
PSA 25:18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము. నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము.
PSA 25:19 నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము, నా శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని కోరుతున్నారు.
PSA 25:20 దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము. నేను నిన్ను నమ్ముకొన్నాను కనుక నన్ను నిరాశపర్చవద్దు.
PSA 25:21 దేవా, నీవు నిజంగా మంచివాడివి నిన్ను నేను నమ్ముకొన్నాను కనుక నన్ను కాపాడుము.
PSA 25:22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము.
PSA 26:1 దావీదు కీర్తన. యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము. యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.
PSA 26:2 యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి. నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశ్చింతగా చూడుము.
PSA 26:3 నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను. నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.
PSA 26:4 పనికిమాలిన ఆ మనుష్యుల్లో నేను ఒకడ్ని కాను.
PSA 26:5 ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం. ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.
PSA 26:6 యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను. నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.
PSA 26:7 యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను. నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.
PSA 26:8 యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ. మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.
PSA 26:9 యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము. ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము.
PSA 26:10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి. చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచంతీసుకొంటారు.
PSA 26:11 కానీ నేను నిర్దోషిని. కనుక దేవా నన్ను కరుణించి, రక్షించుము.
PSA 26:12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను. యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.
PSA 27:1 దావీ దు కీర్తన. యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు. నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు. యెహోవా నీవే నా జీవిత క్షేమస్థానం. కనుక నేను ఎవరికి భయపడను.
PSA 27:2 దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు. వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు. వారు నా శత్రువులు, విరోధులు. వారు కాలు తప్పి పడిపోదురు.
PSA 27:3 ఆయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను. యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.
PSA 27:4 యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది. నేను అడిగేది ఇదే: “నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట. ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట. యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
PSA 27:5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు. ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు. ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
PSA 27:6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కానీ ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు. అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను. యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
PSA 27:7 యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము. నా మీద దయ చుపించుము.
PSA 27:8 యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది. వెళ్లు నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
PSA 27:9 యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము. కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు. నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
PSA 27:10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు. అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు.
PSA 27:11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము. సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.
PSA 27:12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు. నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.
PSA 27:13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని నిజంగా నేను నమ్ముచున్నాను.
PSA 27:14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము. బలంగా, ధైర్యంగా ఉండుము. యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.
PSA 28:1 దావీదు కీర్తన. యెహోవా, నీవే నా అండవు. సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను. నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు. సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
PSA 28:2 యెహోవా, నేను నా చేతులు ఎత్తి, నీ అతి పవిత్ర స్థలం వైపు ప్రార్థిస్తున్నాను. నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము. నా మీద దయ చూపించుము.
PSA 28:3 యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము. ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం” అని అభినందిస్తారు. కానీ వారి హృదయాల్లో వారి పొరుగు వారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వైస్తున్నారు.
PSA 28:4 యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు. కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము. ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
PSA 28:5 యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు. ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు. వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.
PSA 28:6 యెహోవాను స్తుతించండి. కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
PSA 28:7 యెహోవా నా బలం ఆయనే నా డాలు. నేను ఆయనను నమ్ముకొన్నాను. ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
PSA 28:8 యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.
PSA 28:9 దేవా, నీ ప్రజలను రక్షించుము. నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము. కాపరిలా వారిని నిత్యం నడిపించుము.
PSA 29:1 దావీదు కీర్తన. దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి. ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
PSA 29:2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి. మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
PSA 29:3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు. మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
PSA 29:4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది. ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
PSA 29:5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టును. లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
PSA 29:6 లెబనోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి. షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
PSA 29:7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
PSA 29:8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది. యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
PSA 29:9 యెహోవా స్వరం లేడి భయపడేటట్టు చేస్తుంది. ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు. ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
PSA 29:10 వరదలను యెహోవా అదుపు చేసాడు. మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
PSA 29:11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక. యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
PSA 30:1 దావీ దు కీర్తన.ఆలయ ప్రతిష్ఠ కీర్తన. యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు. నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
PSA 30:2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను. నీవు నన్ను స్వస్థపరచావు.
PSA 30:3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు. నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ ఉండవలసిన పనిలేదు.
PSA 30:4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి. ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
PSA 30:5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది కానీ ఆయన తన ప్రేమను చూపించాడు. నాకు “జీవం” ప్రసాదించాడు. రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను. మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
PSA 30:6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు. నేను ఎన్నటికీ ఓడించబడను.
PSA 30:7 యెహోవా, నీవు నామీద దయ చూపావు. బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు. కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు. మరి నేను చాలా భయపడిపోయాను.
PSA 30:8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను. నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
PSA 30:9 “దేవా, నేను మరణించి సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం? ధూళి నిన్ను స్తుతిస్తుందా? అది నీ నమ్మకమును గూర్చి చెప్పుతుందా?
PSA 30:10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము. యెహోవా, నాకు సహాయం చేయుము.”
PSA 30:11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు. నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు. నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
PSA 30:12 యెహోవా, నా దేవా నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను. ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
PSA 31:1 సంగీత నాయకునికి. దావీదు కీర్తన. యెహోవా, నీవే నా కాపుదల. నన్ను నిరాశపరచవద్దు. నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
PSA 31:2 దేవా నా మాట ఆలకించుము. వేగంగా వచ్చి నన్ను రక్షించి నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము. నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
PSA 31:3 దేవా, నీవే నా బండవు, కోటవు కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
PSA 31:4 నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు. వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
PSA 31:5 యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు. నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను. నన్ను రక్షించుము.
PSA 31:6 వ్యర్థమైన విగ్రహాలను పూజించే వాళ్లంటే నాకు అసహ్యం. యెహోవాను మాత్రమే నేను నమ్ముకొన్నాను.
PSA 31:7 దేవా, నీ దయ నన్ను ఎంతో సంతోషపెడ్తుంది. నా కష్టాలు నీవు చూశావు. నాకు ఉన్న కష్టాలను గూర్చి నీకు తెలుసు.
PSA 31:8 నీవు నన్ను నా శత్రువులకు అప్పగించవు. వారి ఉచ్చుల నుండి నీవు నన్ను విడిపిస్తావు.
PSA 31:9 యెహోవా, నాకు చాలా కష్టాలున్నాయి. కనుక నా మీద దయ ఉచుము. నేను ఎంతో తల్లడిల్లి పోయాను కనుక నా కళ్లు బాధగా ఉన్నాయి. నా గొంతు, కడుపు నొప్పెడుతున్నాయి.
PSA 31:10 నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది. నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి. నా కష్టాలు నా బలాన్ని తొలగించి వేస్తున్నయి. నా బలం తొలగిపోతుంది.
PSA 31:11 నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు. నా పొరుగు వాళ్లంతా నన్ను కూడా ద్వేషిస్తారు. నా బంధువులంతా వీధిలో నన్ను చూచి భయపడతారు. వారు నానుండి దూరంగా ఉంటారు.
PSA 31:12 నేను ఏదో పోయిన పనిముట్టులా ఉన్నాను. నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు.
PSA 31:13 ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు నేను వింటున్నాను. ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. వాళ్లు నన్ను చంపాలని తలుస్తున్నారు.
PSA 31:14 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. నీవే నా దేవుడవు.
PSA 31:15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది. నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
PSA 31:16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము. నన్ను రక్షించుము.
PSA 31:17 యెహోవా, నేను నిన్ను ప్రార్థించాను. కనుక నేను నిరాశచెందను. చెడ్డవాళ్లు నిరాశ చెందుతారు, మౌనంగా వారు సమాధికి వెళ్తారు.
PSA 31:18 ఆ చెడ్డవాళ్లు గర్వించి, మంచి వాళ్లను గూర్చి అబద్ధాలు చెబతారు. ఆ చెడ్డవాళ్లు చాలా గర్విష్ఠులు. కాని అబద్ధాలు చెప్పే వారి పెదవులు నిశ్శబ్దం అవుతాయి.
PSA 31:19 దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు. నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు.
PSA 31:20 మంచివాళ్లకు హాని చేయటానికి చెడ్డవాళ్లు ఒకటిగా గుమికూడుతారు. ఆ చెడ్డవాళ్లు కలహాలు రేపటానికి చూస్తారు. కానీ ఆ మంచివాళ్లను నీవు దాచిపెట్టి కాపాడతావు. మంచివాళ్లను నీవు నీ ఆశ్రయంలో కాపాడుతావు.
PSA 31:21 యెహోవాను స్తుతించండి. పట్టణం శత్రువుల చేత ముట్టడి వేయబడినప్పుడు ఆయన తన అద్భుత ప్రేమను నాకు చూపించాడు. ఈ క్షేమస్థానంలో ఆయన తన ప్రేమను నాకు చూపించాడు.
PSA 31:22 నేను భయపడి, “దేవుడు చూడగలిగిన స్థలంలో నేను లేను” అన్నాను. కానీ దేవా, నేను నిన్ను ప్రార్థించాను. మరియు సహాయం కోసం నేను గట్టిగా చేసిన ప్రార్థనలు నీవు విన్నావు.
PSA 31:23 దేవుని వెంబడించు వారలారా, మీరు యెహోవాను ప్రేమించాలి. యెహోవాకు నమ్మకంగా ఉండే ప్రజలను ఆయన కాపాడుతాడు. కానీ తమ శక్తిని బట్టి గొప్పలు చెప్పే గర్విష్ఠులను యెహోవా శిక్షిస్తాడు.
PSA 31:24 యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి.
PSA 32:1 దావీదు కీర్తన. పాపాలు క్షమించబడిన వాడు ధన్యుడు. తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
PSA 32:2 అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు. తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించని వాడు ధన్యుడు.
PSA 32:3 దేవా నేను నీతో మరల మరల మాట్లాడాను. కానీ నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు. నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
PSA 32:4 దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు. తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.
PSA 32:5 అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను. కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను. నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు. మరియు నీవు నా పాపాలను క్షమించావు.
PSA 32:6 దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి. కష్టాలు మహా ప్రవాహంలా వచ్చి నాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
PSA 32:7 దేవా నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం. నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము. నీవు నన్ను ఆవరించి, కాపాడుము. నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
PSA 32:8 యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి నేను నీకు నేర్చించి, నడిపిస్తాను. నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
PSA 32:9 కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము. ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి. నీవు కళ్లెంను వారు ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”
PSA 32:10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి. కానీ యెహోవాను నమ్ముకొనే వారిని ప్రేమ ఆవరిస్తుంది.
PSA 32:11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి. పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.
PSA 33:1 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి. నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
PSA 33:2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి. యెహోవాకు పదితంతుల స్వర మండలాన్ని వాయించండి.
PSA 33:3 ఆయనకు ఒక కొత్త కీర్తన పాడండి. ఆనంద గీతాన్ని అనందంగా పాడండి.
PSA 33:4 దేవుని మాట సత్యం! ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
PSA 33:5 నీతి, న్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు. యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
PSA 33:6 యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది. భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
PSA 33:7 సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు. మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
PSA 33:8 భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి. ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
PSA 33:9 ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది. ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే అప్పుడు అది ఆగిపోతుంది.
PSA 33:10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు. వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
PSA 33:11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది. ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
PSA 33:12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు. దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
PSA 33:13 యెహోవా పరలోకం నుండి కిందికి చూసాడు. మనుష్యులందరిని ఆయన చూశాడు.
PSA 33:14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
PSA 33:15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు. ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
PSA 33:16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు. ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
PSA 33:17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు. తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
PSA 33:18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు, ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
PSA 33:19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే. ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
PSA 33:20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము. ఆయన మనకి సహాయం, మన డాలు.
PSA 33:21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు, నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
PSA 33:22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము. కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.
PSA 34:1 దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పటిది అలా చేసి దావీదు అతన్ని విడిచిపెట్టాడు. నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
PSA 34:2 దీన జనులారా, విని సంతోషించండి నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
PSA 34:3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి. మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
PSA 34:4 సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు. నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
PSA 34:5 సహాయం కోసం దేవుని తట్టు చూడండి. మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
PSA 34:6 ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు. యెహోవా నా మొర విన్నాడు. నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
PSA 34:7 యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలివుంటాడు. ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
PSA 34:8 యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి. యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
PSA 34:9 యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి. ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం మరేదీలేదు.
PSA 34:10 యౌవనసింహాల బలహీనమై, ఆకలిగొంటాయి. అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరత గావుండదు.
PSA 34:11 పిల్లలారా, నా మాట వినండి. యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
PSA 34:12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే, ఒక వ్యక్తి మంచి దిర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
PSA 34:13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు, ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
PSA 34:14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి. శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
PSA 34:15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
PSA 34:16 కానీ చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు. ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.
PSA 34:17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు. ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటి నుండ రక్షిస్తాడు.
PSA 34:18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు. ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
PSA 34:19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు. కానీ ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
PSA 34:20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు. ఒక్క ఎముక కూడా విరువబడదు.
PSA 34:21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి. చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కానీ ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
PSA 34:22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు. తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.
PSA 35:1 దావీదు కీర్తన. యెహోవా, నా పోరాటాలు పోరాడుము నా యుద్ధాలు పోరాడుము.
PSA 35:2 యెహోవా, కేడెము, డాలు పట్టుకొని, లేచి, నాకు సహాయం చేయుము.
PSA 35:3 ఈటె, బరిసె తీసుకొని నన్ను తరుముతున్న వారతో పోరాడుము. “నేను నిన్ను రక్షిస్తాను” అని, యెహోవా, నా ఆత్మతో చెప్పుము,
PSA 35:4 కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు. ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము. వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము. ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు. వారిని ఇబ్బంది పెట్టుము.
PSA 35:5 ఆ మనుష్యుల్ని గాలికి ఎగిరిపోయే పొట్టులా చేయుము. యెహోవా దూత వారిని తరిమేలా చేయుము.
PSA 35:6 యెహోవా, వారి మార్గం చీకటిగాను, జారిపోయేటట్టు చేయుము. యెహోవా దూత వారిని తరుమును గాక!
PSA 35:7 నేనేమీ తప్పు చేయలేదు. కానీ ఆ మనుష్యులు నన్ను ఉచ్చులో వేసి చంపాలని ప్రయత్నించారు. నేను తప్పు ఏమీ చేయలేదు. కానీ వారు నన్ను పట్టు కోవాలని ప్రయత్నించారు.
PSA 35:8 కనుక యెహోవా, ఆ మనుష్యులను వారి ఉచ్చులలోనే పడనిమ్ము. వారి సోంత ఉచ్చులలో వారినే తొట్రిల్లి పడనిమ్ము. తెలియని ఆపద ఏదైనా వారిని పట్టుకోనిమ్ము.
PSA 35:9 అంతట నేను యెహోవాయందు ఆనందిస్తాను. ఆయన నన్ను రక్షించినప్పుడు నేను సంతోషంగా ఉంటాను.
PSA 35:10 “యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు. యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు. దోచుకొను వారి నుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు” అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబతాను.
PSA 35:11 ఒక సాక్షి సమూహం నాకు హాని చేయాలని తలుస్తున్నది. ఆ మనుష్యులు నన్ను ప్రశ్నలు అడుగుతారు. వాళ్లు దేనిని గూర్చి మాట్లాడుకొంటున్నారో నాకు తెలియదు.
PSA 35:12 నేను మంచి పనులు మాత్రమే చేశాను. కానీ ఆ మనుష్యులు నాకు చెడ్డ వాటినే చేస్తారు. వారు నా ప్రాణం తీయుటకు పొంచియుంటారు.
PSA 35:13 ఆ మనుష్యులు రోగులుగా ఉన్నప్పుడు నేను వారిని గూర్చి విచారించాను. ఉపవాసం ఉండుట ద్వారా నా విచారం వ్యక్తం చేశాను. నా ప్రార్థనకు జవాబు లేకుండా పోయింది.
PSA 35:14 ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను. ఒకని తల్లి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా నేను దుఃఖించాను. ఆ మనుష్యులకు నా విచారాన్ని తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరించాను. దుఃఖంతో నేను నా తల వంచుకొని నడిచాను.
PSA 35:15 అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ మనుష్యులే నన్ను చూసి నవ్వారు. ఆ మనుష్యులు నిజంగా స్నేహితులు కారు. వాళ్లు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు. వాళ్లను నేను కనీసం ఎరుగను.
PSA 35:16 వాళ్లు దుర్భాషలు మాట్లాడి, నన్ను హేళన చేసారు. ఆ మనుష్యులు పళ్లు కొరికి నా మీద కోపం చూపారు.
PSA 35:17 నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగుతూండటం చూస్తూ ఉంటావు? ఆ మనుష్యులు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. యెహోవా, నా ప్రాణాన్ని రక్షించుము. ఆ దుర్మార్గుల బారి నుండి నా ప్రియ జీవితాన్ని రక్షించుము. వాళ్లు సింహాల్లా ఉన్నారు.
PSA 35:18 యెహోవా, మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను. నేను పెద్ద సమూహంతో ఉన్నప్పుడు నిన్ను స్తుతిస్తాను.
PSA 35:19 అబద్ధాలు పలికే నా శత్రువులు నవ్వుకోవటం కొనసాగదు. నా శత్రువులు వారి రహస్య పథకాల నిమిత్తం తప్పక శిక్షించబడతారు.
PSA 35:20 నా శత్రువులు నిజంగా శాంతికోసం ప్రయత్నాలు చేయటంలేదు. ఈ దేశంలో శాంతియుతంగా ఉన్న ప్రజలే చె డు కార్యాలు చేయాలని వారు రహస్యంగా పథకాలు వేస్తున్నారు.
PSA 35:21 నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు చెబతున్నారు. వారు అబద్ధాలు పలుకుతూ, “ఆహా, నీ వేమీ చేస్తున్నావో మాకు తెలుసులే అంటారు.”
PSA 35:22 యెహోవా జరుగుతున్నది ఏమిటో నీకు తప్పక తెలుసు. కనుక మౌనంగా ఉండవద్దు. నన్ను విడిచి పెట్టవద్దు.
PSA 35:23 యెహోవా మేలుకో! లెమ్ము! నా దేవా, నా యెహోవా నా పక్షంగా పోరాడి నాకు న్యాయం చేకూర్చుము.
PSA 35:24 యెహోవా, నా దేవా, నీ న్యాయంతో నాకు తీర్పు తీర్చుము. ఆ మనుష్యులను నన్ను చూచి నవ్వ నీయవద్దు.
PSA 35:25 “ఆహా! మాకు కావాల్సింది మాకు దొరికి పోయింది” అని ప్రజలు చెప్పుకోకుండా చేయుము. “యెహోనా, మేము అతణ్ణి నాశనం చేశాము” అని వాళ్లు చెప్పుకోకుండా చేయుము.
PSA 35:26 నా శత్రువులు అందరూ నిరాశచెంది, ఒక్కుమ్మడిగా సిగ్గుపడేలా చేయుము. నాకు కీడు జరిగినప్పుడు ఆ మనుష్యులు సంతోషించారు. తాము నాకంటె మేలైనవారము అని వారు తలచారు. కనుక ఆ మనుష్యుల్ని అవమానంతోను సిగ్గుతోను నింపి వేయుము.
PSA 35:27 నీతిని ప్రేమించే మనుష్యులారా మీరు సంతోషించండి. ఎల్లప్పుడూ ఈ మాటలు చెప్పండి: “యెహోవా గొప్పవాడు. ఆయన తన సేవకునికి ఉత్తమమైనదాన్ని కోరుతాడు.”
PSA 35:28 యెహోవా, నీవు ఎంత మంచివాడివో ప్రజలకు చెబతాను. నేను ప్రతి దినము స్తుతిస్తాను.
PSA 36:1 సంగీత నాయకునికి యెహోవా సే వకుడైన దావీదు కీర్తన. “నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు.
PSA 36:2 ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు. ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు. కనుక అతడు క్షమాపణ వేడుకోడు.
PSA 36:3 అతని మాటలు కేవలం పనికిమాలిన ఆబద్ధాలే. అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం నేర్చుకోలేడు.
PSA 36:4 రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు. అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ చేయడు. ఏ చెడు కార్యాం చేయటానికైనా అతడు నిరాకరించడు.
PSA 36:5 యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది. నీ నమ్మకత్వం మేఘోలకంటె ఉన్నతం.
PSA 36:6 యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.” నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటే లోతైనది. యెహోవా, నీవు మానవుని, జంతువులను కాపాడుతావు.
PSA 36:7 ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు. కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
PSA 36:8 యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు. అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని తాగనిస్తావు.
PSA 36:9 యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది. నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
PSA 36:10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగిన వారిని ప్రేమించటం కొనసాగించుము. నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
PSA 36:11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము. దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.
PSA 36:12 వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము. “ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు. వారు చితుకగొట్టబడ్డారు. వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.”
PSA 37:1 దావీదు కీర్తన. దుర్మార్గుల పట్ల కోపగించకుము చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
PSA 37:2 గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి. దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
PSA 37:3 నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే నీవు బతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
PSA 37:4 యెహోవాను సేవించటంలో ఆనందించుము. ఆయన నీకు కావల్సిన వాటినియిస్తాడు.
PSA 37:5 యెహోవా మీద ఆధారపడుము ఆయనను నమ్ముకొనుము. జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
PSA 37:6 నీ మంచితనం, న్యాయం మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
PSA 37:7 యెహోవాను నమ్ముకోనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము. చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము. చెడ్డవాళ్లు చెడు తలంపులు తలచగా వారి తలంపులు జయించినప్పుడు కలవర పడకుము.
PSA 37:8 కోపగించ వద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపిస్తే అంతగా తొందరపడిపోకుము.
PSA 37:9 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు. కానీ సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
PSA 37:10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు. అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
PSA 37:11 దీనులు భూమిని జయిస్తారు, వాళ్లు శాంతిని అనుభవిస్తారు.
PSA 37:12 దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు. ఆ దుర్మార్గులు మంచి మనుష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం చేస్తారు.
PSA 37:13 అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు, వారికి సంభవించే సంగతులను ఆయన చూస్తాడు.
PSA 37:14 దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు. మంచి వాళ్లను, నిజాయితి పరులను వాళ్లు చంపాలని చూస్తారు.
PSA 37:15 కానీ వారి విల్లులు విరిగిపోతాయి. వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి.
PSA 37:16 దుష్టుల ఐశ్వర్యంకంటే మంచివాని అల్పభాగమే ఉత్తమమైనది.
PSA 37:17 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు. కానీ మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు.
PSA 37:18 పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు. వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది.
PSA 37:19 కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు. కరువు కాలం వచ్చినప్పుడు మంచి మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది.
PSA 37:20 కానీ దుర్మార్గులు యెహోవాకు శత్రువులు, ఆ దుర్మార్గులు నాశనం చేయబడుతారు. వారు పొలంలోని పువ్వులవలె అదృశ్యమౌతారు. వారు పొగవలె కనబడకుండా పోతారు.
PSA 37:21 దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు. కానీ మంచి మనిషి సంతోషంతో ఇతరులకు ఇస్తాడు.
PSA 37:22 ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు. కానీ ప్రజలకు కీడు జరగాలని గనుక అతడు అడిగితే అప్పుడు ఆ మనుష్యులు నాశనం చేయబడతారు.
PSA 37:23 ఒక సైనికుడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు. వాని నడవడియందు యెహోవా ఆనందిస్తాడు.
PSA 37:24 సైనికుడు తొట్రుపడినా పడిపోడు, ఎందుకంటే యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా చేస్తాడు.
PSA 37:25 నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలివాడినయ్యాను. మంచి మనుష్యులకు దేవుడు సహాయం చేయకుండా విడిచిపెట్టడం నేను ఎన్నడూ చూడలేదు. మంచి మనుష్యుల పిల్లలు భోజనం కోసం భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ చూడలేదు.
PSA 37:26 మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితంగానే ఇస్తూంటాడు. మంచి మనిషి పిల్లలు ఆశీర్వాదం పొందుతారు.
PSA 37:27 నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి పనులు చేస్తే అప్పుడు నీవు శాశ్వతంగా జీవిస్తావు.
PSA 37:28 యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు. ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు. యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడతాడు. కానీ దుష్టులను ఆయన నాశనం చేస్తాడు.
PSA 37:29 మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది. వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు.
PSA 37:30 మంచి మనిషి మంచి సలహా యిస్తాడు. అతని నిర్ణయాలు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉంటాయి.
PSA 37:31 యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి. అతడు సరిగా జీవించే విధానాన్ని విడిచిపెట్టడు.
PSA 37:32 కానీ చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు. మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు.
PSA 37:33 యెహోవా దుష్టుల శక్తికి మంచి వారిని వదిలి వేయడు. మంచి వారిని దోషులుగా ఆయన తీర్చబడనీయడు.
PSA 37:34 యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము. దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను ప్రముఖునిగా చేస్తాడు, మరియు దేవుడు వాగ్దానం చేసిన భూమిని నీవు పొందుతావు.
PSA 37:35 శక్తిమంతులైన దుర్మార్గులను నేను చూశాను. వారి శక్తి ఒక బలమైన, ఆరోగ్యమైన వృక్షంలా పెరుగుతూ వచ్చింది.
PSA 37:36 కానీ తర్వాత వారు లేకుండా పోయారు. నేను వారికోసం చూశాను, కానీ వారు నాకు కనబడలేదు.
PSA 37:37 నీతి, నిజాయితీ కలిగి ఉండి, సమాధానపరచు వారి సంతతి నిలుస్తుంది. అది శాంతి కలిగిస్తుంది.
PSA 37:38 అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు.
PSA 37:39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు. నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
PSA 37:40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు. నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.
PSA 38:1 జ్ఞాపకార్థ దినం కోసం. దావీదు కీర్తన. యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము.
PSA 38:2 యెహోవా, నీవు నన్ను బాధించావు. నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి.
PSA 38:3 నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది. నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి.
PSA 38:4 నేను చెడు కార్యాలు చేసిన దోషిని, ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.
PSA 38:5 నేను తెలివి తక్కువగా ఉన్నాను. ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి.
PSA 38:6 నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను. రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను.
PSA 38:7 నా నడుము వేడిగా కాలిపోతోంది. నా శరీరం అంతా బాధగా ఉంది.
PSA 38:8 నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను. నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.
PSA 38:9 ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు. నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు.
PSA 38:10 నా గుండె తడబడచున్నది. నా బలం పోయింది. నా చూపు దాదాపు పోయింది.
PSA 38:11 నా రోగం మూలంగా నా స్నేహితులు, నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు. నా కుటుంబం నా దగ్గరకు రాదు.
PSA 38:12 నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు. నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడు కొంటున్నారు. వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు.
PSA 38:13 అయితే నేను వినబడని చెవిటి వానిలా ఉన్నాను. మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను.
PSA 38:14 ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటి వానిలా నేను ఉన్నాను. నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.
PSA 38:15 కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను. నా దేవా, నా ప్రభువా నా శత్రువులకు సత్యం చెప్పుము.
PSA 38:16 నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు. నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.
PSA 38:17 నేను పడిపోయేటట్టు ఉన్నాను. నేను నా బాధను మరచిపోలేను.
PSA 38:18 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను. నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను.
PSA 38:19 నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు, వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు.
PSA 38:20 నా శత్రువులు నాకు కీడు చేస్తారు, నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను. మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను. కానీ ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు.
PSA 38:21 యెహోవా, నన్ను విడిచిపెట్టకు. నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు.
PSA 38:22 త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము. నా దేవా నన్ను రక్షించుము.
PSA 39:1 సంగీత నాయకునికి. యెదూతూనునకు. దావీదు కీర్తన. “నేను జాగ్రత్తగా నడచుకొంటాను. నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను. నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.
PSA 39:2 మాట్లాడుటకు నేను తిరస్కరించాను. నేనేమి చెప్పలేదు. కానీ నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
PSA 39:3 నాకు కోపం వచ్చింది. దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది. కనుక నేను ఏదో అన్నాను.
PSA 39:4 యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము. నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము. నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
PSA 39:5 యెహోవా నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు. నా జీవితం నీ ఎదుట శూన్యం. ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.
PSA 39:6 మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబంబిం వంటిది. మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము. కానీ ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.
PSA 39:7 కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది? నీవే నా ఆశ.
PSA 39:8 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు. దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
PSA 39:9 నేను నా నోరు తెరవను. నేను ఏమీ చెప్పను. యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
PSA 39:10 దేవా, నన్ను శిక్షించటం మానివేయుము. నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
PSA 39:11 యెహోవా, తప్పు చేసిన వారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు. వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు. మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.
PSA 39:12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. నేను నీకు మొరపెట్టే మాటలు వినుము. నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు. నేను దాటిపోతున్న ఒక అతిథిని. నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
PSA 39:13 యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము. కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.
PSA 40:1 సంగీత నాయకునికి. దావీదు కీర్తన. నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవి నిచ్చి, నా మొర ఆలకించెను. నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
PSA 40:2 నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు. ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు. ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు. ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
PSA 40:3 ఒక కొత్త కీర్తనను, నాకొక స్తుతి కీర్తనను యెహోవా నా నోట ఉంచాడు. నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు. వారు యెహోవాను నమ్ముకొంటారు.
PSA 40:4 ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు. ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
PSA 40:5 యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు. మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు. నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబతాను. నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.
PSA 40:6 యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు. బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు. దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
PSA 40:7 అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను. నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
PSA 40:8 నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను. నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
PSA 40:9 మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబతాను. యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
PSA 40:10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబతాను. ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను. యెహోవా, ప్రజల ఎడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబతాను. నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
PSA 40:11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు. నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.
PSA 40:12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు. లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు. నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి. నేను వాటిని తప్పించుకో లేను. నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి. నేను ధైర్యాన్ని కోల్పోయాను.
PSA 40:13 యెహోవా, నా దగ్గరకు పరుగెత్తి వచ్చి నన్ను రక్షించుము. త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
PSA 40:14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు. యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము. ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.
PSA 40:15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు. వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము.
PSA 40:16 కానీ నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము. “యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం.
PSA 40:17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయం, నిరుపేద మనిషిని. యెహోవా నన్ను గూర్చి ఆలోచించును గాక! నాకు సహాయం చేయుము. నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.
PSA 41:1 సంగీత నాయకునికి. దావీదు కీర్తన పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు. కష్టాలు వచ్చినప్పుడు యెహోవా ఆ మనిషిని రక్షిస్తాడు.
PSA 41:2 ఆ మనిషిని యెహోవా కాపాడి అతని ప్రాణాన్ని రక్షిస్తాడు. ఆ మనిషికి ఈ దేశంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు అతని శత్రువుల మూలంగా అతన్ని నాశనం కానివ్వడు.
PSA 41:3 ఆ మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు యెహోవా అతనికి బలాన్ని ఇస్తాడు. ఆ మనిషి రోగిగా పడకలో ఉండవచ్చు, కానీ యెహోవా అతనిని బాగుచేస్తాడు.
PSA 41:4 నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపించుము. నేను నీకు విరోధంగా పాపం చేసాను. కాని నన్ను క్షమించి నన్ను బాగుచేయుము.”
PSA 41:5 నా శత్రువులు నన్ను గూర్చి చెడు సంగతులు పలుకుతున్నారు. “వీడెప్పుడు చచ్చి మరువబడుతాడు?” అని వారంటున్నారు.
PSA 41:6 కొందరు మనుష్యులు వచ్చి నన్ను దర్శిస్తున్నారు. కాని వాళ్లు నిజంగా ఏమి తలుస్తున్నారో చెప్పరు. ఆ మనుష్యులు నన్ను గూర్చిన వార్తలు తెలుసుకొనేందుకు మాత్రమేవస్తారు, మరియు వారు వెళ్లి, వారి గాలి కబర్లను ప్రచారం చేస్తారు.
PSA 41:7 నా శత్రువులు నన్ను గూర్చి చెడ్డ సంగతులను రహస్యంగా చెబతారు. వారు నాకు విరోధంగా చెడు సంగతులను తలపెడుతున్నారు.
PSA 41:8 “ఇతడు ఏదో తప్పుచేసాడు, అందుచేత ఇతడురోగి అయ్యాడు. ఇతడు తన పడక మీద నుండి ఎన్నటికి తిరిగి లేవడు” అని వారు అంటారు.
PSA 41:9 నా మంచి స్నేహితుడు నాతో భోజనం చేసాడు. నేను అతన్ని నమ్మాను. కానీ ఇప్పుడు నా మంచి స్నేహితుడు కూడా నాకు విరోధి అయ్యాడు.
PSA 41:10 కనుక యెహోవా, దయతో నన్ను కరుణించి, బాగుపడనిమ్ము. అప్పుడు నేను వారికి తగిన విధంగా చేస్తాను.
PSA 41:11 యెహోవా నా శత్రువులు నన్ను భాధించని ఎడల అప్పుడు నీవు నన్ను స్వీకరించావని నేను తెలుసుకొంటాను.
PSA 41:12 నేను నిర్దోషినైయుండగా నాకు సహాయం చేసితివి. నీ సన్నిధానంలో నీవు నన్ను ఎల్లప్పుడూ నిలుచుండనిస్తావు.
PSA 41:13 ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు స్తుతింపబడును గాక. ఆయన ఎల్లప్పుడూ స్తుతించబడ్డాడు. మరియు ఎల్లప్పుడూ స్తుతించబడతాడు. ఆమేన్ ఆమేన్!
PSA 42:1 సంగీత నాయకునికి. కోరహు కుటుంబంనుండి మస్కిల్. దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు తాగాలని ఆశిస్తుంది. అలాగే దేవా నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
PSA 42:2 సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది. ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
PSA 42:3 నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం. “నీ దేవుడు ఎక్కడ? అంటూనే ఉన్నాడు నా శత్రువు ఎంతసేపూను.”
PSA 42:4 కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము. నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం. అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.
PSA 42:5 నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను? ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను? దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి. ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది. ఆయన నన్ను కాపాడుతాడు.
PSA 42:6 నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను. కనుక నేను నిన్ను యోర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండ నుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.
PSA 42:7 నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాతంలో నుండి పిలుస్తోంది. నీ అలలు, అన్నియు నామీదుగా దాటియున్నవి.
PSA 42:8 ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చుపిస్తాడు. అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.
PSA 42:9 ఆశ్రయ బండ ఆయిన నా దేవునితో, “యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు? నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.
PSA 42:10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు. “నీ దేవుడు ఎక్కడ” అని వారు అన్నప్పుడు “వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.”
PSA 42:11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను? నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను? దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి. నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది. నా సహాయమా! నా దేవా!
PSA 43:1 దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము. నా వివాదం నాలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము. ఆ మనుష్యులు అబద్ధాలు చెబతున్నారు. ఆ ప్రజలు వంకర మనుష్యులు. దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
PSA 43:2 దేవా, నీవే నా క్షేమ స్థానం. నీవు నన్నెందుకు విడిచిపెట్టావు? నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?
PSA 43:3 దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము. నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము.
PSA 43:4 దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను. దేవుని దగ్గరకు నేను వస్తాను. ఆయన నన్ను సంతోషింపజేస్తాడు. దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను.
PSA 43:5 నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను? నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను? దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి. నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది. నా దేవుడే నాకు సహాయము.
PSA 44:1 సంగీత నాయకునికి. కోరహు కుటుంబం వారి దైవ ధ్యానం. దేవా, నిన్ను గూర్చి మేము విన్నాము. మా పూర్వీకుల కాలంలో నీవు చేసిన కార్యాలను గూర్చి మా తండ్రులు మాతో చెప్పారు. చాలా కాలం క్రిందట నీవు చేసిన వాటిని గూర్చి వారు మాతో చెప్పారు.
PSA 44:2 దేవా, నీ మహా శక్తితో ఇతరుల నుండి ఈ దేశాన్ని నీవు తీసుకొన్నావు. మరియు మా తండ్రులను ఇక్కడ ఉంచావు. ఆ విదేశీ ప్రజలను నీవు చితుకగొట్టావు. వారు ఈ దేశం వదిలిపెట్టేలా బలవంతం చేశావు. నీవు మా తండ్రులను స్వతంత్రులుగా చెశావు.
PSA 44:3 ఈ దేశాన్ని మా తండ్రుల ఖడ్గాలు స్వాధీనం చేసి కోలేదు. వారిని విజేతలుగా చేసింది వారి బలమైన హస్తాలు కావు. నీవు మా తండ్రులకు తోడుగా ఉన్న కారణం చేతనే అది జరిగింది. దేవా, నీ మహా శక్తి మా తండ్రులను రక్షించింది. ఎందుకంటే వారిని నీవు ప్రేమించావు గనుకనే!
PSA 44:4 నా దేవా, నీవు నా రాజువు. నీ ఆజ్ఞలే యాకోబు ప్రజలను విజయానికి నడిపించాయి.
PSA 44:5 నా దేవా, నీ సహాయంతో మా శత్రువులను మేము వెనుకకు తోసివేసాము. నీ నామంతో, మా శత్రువుల మీదుగా మేము నడిచాము.
PSA 44:6 నా విల్లును, బాణాలను నేను నమ్ముకోను. నా ఖడ్గం నన్ను రక్షించజాలదు.
PSA 44:7 దేవా, మా విరోధుల నుండి నీవు మమ్మల్ని రక్షించావు. మా శత్రువుల్ని నీ వు సిగ్గుపరచావు.
PSA 44:8 మేము ప్రతిరోజూ దేవుని స్తుతిస్తాము! నీ నామాన్ని శాశ్వతంగా మేము స్తుతిస్తాము!
PSA 44:9 కాని, దేవా, నీవు మమ్ముల్ని విడిచిపెట్టావు. నీవు మమ్ముల్ని ఇబ్బంది పెట్టావు. నీవు మాతో కూడ యుద్ధంలోనికి రాలేదు.
PSA 44:10 మా శత్రువులు మమ్ముల్ని వెనుకకు నెట్టివేయనిచ్చావు. మా శత్రువులు మా ఐశ్వర్యాన్ని దోచుకున్నారు.
PSA 44:11 గొర్రెల్ని ఆహారంగా తినుటకు ఇచ్చినట్టు నీవు మమ్ముల్నిచ్చి వేశావు. రాజ్యాల మద్య నీవు మమ్ముల్ని చెదరగొట్టావు.
PSA 44:12 దేవా, నీ ప్రజలను నీవు విలువ లేకుండా అమ్మి చేశావు. ధర విషయం నీవేమీ వాదించలేదు.
PSA 44:13 మా యిరుగు పొరుగు వారికి నీవు మమ్ముల్ని హాస్యాస్పదం చేశావు. మా యిరుగు పొరుగు వారు మమ్మల్ని చూచి నవ్వుతూ హేళన చేస్తారు.
PSA 44:14 మేము ప్రజలు చెప్పుకొనే హాస్యాస్పద కథలలో పాత్రల్లా ఉన్నాము. ప్రజలు మమ్ముల్ని చూచి నవ్వుతూ వారి తలలు ఊపుతారు.
PSA 44:15 నేను సిగ్గుతో కప్పబడి ఉన్నాను. రోజంతా నా అవమానాన్ని నేను చూస్తున్నాను.
PSA 44:16 నా శత్రువు నన్ను ఇబ్బంది పెట్టాడు. నా శత్రువు నన్ను హేళన చేయడం ద్వారా నా మీద కక్ష సాధిస్తున్నాడు.
PSA 44:17 దేవా, మేము నిన్ను మరచిపోలేదు. అయినప్పటికీ వాటన్నిటినీ నీవు మాకు చేస్తున్నావు. మేము నీతో మా ఒడంబడికపై సంతకం చేసినప్పుడు మేము అబద్ధమాడలేదు!
PSA 44:18 దేవా, మేము నీ నుండి తిరిగిపోలేదు. నిన్ను అనుసరించటం మేము మానుకోలేదు.
PSA 44:19 కాని, దేవా, నక్కలు నివసించే ఈ స్థలంలో నీవు మమ్ముల్ని చితుక గొట్టావు. మరణం అంత చీకటిగా ఉన్న ఈ స్థలంలో నీవు మమ్ముల్ని కప్పివేశావు.
PSA 44:20 మా దేవుని పేరు మేము మరచిపోయామా? అన్యదేవతలకు మేము ప్రార్థించామా? లేదా!
PSA 44:21 నిజంగా ఈ విషయాలు దేవునికి తెలుసు. లోత్తెన రహస్యాలు సహితం ఆయనకు తెలుసు.
PSA 44:22 దేవా, నీకోసం ప్రతి రోజూ చెంపబడుతున్నాము! చంపటానికి నడిపించబడే గొర్రెల్లా ఉన్నాము మేము.
PSA 44:23 నా ప్రభువా, లెమ్ము! నీవేల నిద్రపోవుతున్నావు? లెమ్ము! మమ్ముల్ని శాశ్వతంగా విడిచిపెట్టకుము!
PSA 44:24 దేవా, మానుండి నీవేల దాక్కుంటున్నావు. మా బాధ, కష్టాలు నీవు ఎందుకు మరచిపోయావు?
PSA 44:25 బురదలోకి మేము తోసివేయబడ్డాము. మేము దుమ్ములో బోర్లా పడి ఉన్నాము.
PSA 44:26 దేవా, లేచి మాకు సహాయం చేయుము! నీ మంచితనాన్ని బట్టి మమ్ముల్ని రక్షించుము.
PSA 45:1 సంగీత నాయకునికి, శోషనీయ రాగం కోరహు కుటుంబం రచించిన దైవ ధ్యానం మరిము ఒక ప్రేమగీతం. రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి. నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి.
PSA 45:2 నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు! నీ పెదవులనుండి దయ వెలువడుతుంది కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.
PSA 45:3 నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరుడువలె, మహిమను, ఘనతను ధరించుము.
PSA 45:4 నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము. అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము.
PSA 45:5 నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు.
PSA 45:6 దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది! నీ నీతి రాజదండమయి ఉంది.
PSA 45:7 నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును నీవు ద్వేషిస్తావు. కనుక దేవా, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా నీ దేవుడు కోరుకొన్నాడు.
PSA 45:8 నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగి, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి. నిన్ను సంతోషపరచుటకు దంతం పొదుగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
PSA 45:9 నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమారైలున్నారు. నీ పెండ్లి కుమారై ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.
PSA 45:10 కుమారీ, నా మాట వినుము. నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్నీ మరచిపోకుము.
PSA 45:11 రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయనే నీకు కొత్త భర్తగా ఉంటాడు. నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
PSA 45:12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు. నీ కోసం ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.
PSA 45:13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది. ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
PSA 45:14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది. ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
PSA 45:15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు. సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.
PSA 45:16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు. దేశవ్యాప్తంగా వారిని రాజులుగా నీవు చేస్తావు.
PSA 45:17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను. శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
PSA 46:1 సంగీత నాయకునికి, కోరహు కుమారుల అలామోతు రాగ గీతం. దేవుడు మా ఆశ్రయం, మా శక్తి. ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
PSA 46:2 అందుచేత భూమి కంపించినప్పుడు, మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
PSA 46:3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను, భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
PSA 46:4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి, మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
PSA 46:5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు. సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
PSA 46:6 రాజ్యాలు భయంతో పణకుతాయి. యెహోవా కేక వేయగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
PSA 46:7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
PSA 46:8 చూడండి, యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి. ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
PSA 46:9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు. సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
PSA 46:10 దేవుడు చెబతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకోనండి. రాజ్యాలతో నేను స్తుతించబడతాను. భూమిమీద మహిమపర్చబడతాను.”
PSA 46:11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
PSA 47:1 సంగీత నాయకునికి, కోరహు కుమారుల గీతం. సర్వజనులారా చప్పట్లు కొట్టండి. సంతోషంగా దేవునికి కేకలు వేయండి.
PSA 47:2 మహోన్నతుడగు యెహోవా భీకరుడు. భూలోకమంతటికీ ఆయన రాజు.
PSA 47:3 ఆయన ప్రజలను మనకు లోపరిచాడు. ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు.
PSA 47:4 దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు. యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.
PSA 47:5 బూర మ్రోగగానే యుద్ధనాదం వినబడగానే యెహోవా దేవుడు లేచాడు.
PSA 47:6 దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి.
PSA 47:7 దేవుడు సర్వలోకానికి రాజు. స్తుతిగీతాలు పాడండి.
PSA 47:8 దేవుడు తన పరశుద్ద సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తు న్నాడు.
PSA 47:9 రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశ మయ్యారు. దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును కాపాడును. నాయకులందరూ దేవునికి చెందినవారు. దేవుడు మహోన్నతుడు.
PSA 48:1 కోరహు కుమారుల స్తుతి పాట. యెహోవా గొప్పవాడు. మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు.
PSA 48:2 దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎతైనది. అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది. సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం. అది మహారాజు పట్టణం.
PSA 48:3 ఇక్కడ ఆ పట్టణంలోని, భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు.
PSA 48:4 ఒకప్పుడు రాజులు కొందరు సమావేశ మయ్యారు. వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు. వారంతా కలసి ముందుకు వచ్చారు.
PSA 48:5 ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు, వారు బెదరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
PSA 48:6 ఆ రాజులందరికీ భయం పట్టుకొంది. ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు.
PSA 48:7 దేవా, బలమైన తూర్పుగాలితో తర్షీషు ఓడలను బద్దలు చేశావు.
PSA 48:8 మేము ఏమి విన్నామో దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో చూశాము, మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో. దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు.
PSA 48:9 దేవా, నీ ప్రేమా కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.
PSA 48:10 దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు. భూలోక మంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు. నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
PSA 48:11 సీయోను పర్వతం సంతోషిస్తుంది. మరియు యూదా నగరాలు ఆనందంగా వున్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు.
PSA 48:12 సీయోను చుట్టూ తిరుగుతూ ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి.
PSA 48:13 ఎత్తైన గోడలు చూడండి. సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి. అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు.
PSA 48:14 దేవుడు నిజంగా ఎల్లప్పుడూ శాశ్వతంగా మన దేవుడై ఉంటాడు. ఆయనే మనలను శాశ్వతంగా నడిపిస్తాడు. మరియు ఆయన ఎన్నటికీ మరణించడు!
PSA 49:1 సంగీత నాయకునికి. కోరహు కుమారుల కీర్తన. సర్వ దేశములారా ఇది వినండి. భూమి మీద నివసించే సకల ప్రజలారా ఇది వినండి.
PSA 49:2 ప్రతి మనిషీ, ధనికులు, దరిద్రులు కలసి వినాలి.
PSA 49:3 నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెప్పుతాను. నా ఆలోచనలు బుద్ధినిస్తాయి.
PSA 49:4 సామెతపైనా ఆసక్తినుంచుతాను. ఇప్పుడు నా సితారాను వాయిస్తూ ఇప్పుడు కథను వివరిస్తాను.
PSA 49:5 అపాయాన్ని గూర్చినేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు. నా దుష్ట శత్రువులు నన్ను చుట్టు ముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
PSA 49:6 ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు.
PSA 49:7 ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు. నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు.
PSA 49:8 ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కు నేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు.
PSA 49:9 ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు, మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు.
PSA 49:10 చూడు, వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు. మరియు వారు తమ ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు.
PSA 49:11 శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది. వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు.
PSA 49:12 ధనికులు నిరంతరం జీవించలేరు. వారు జంతువుల్లా మరణిస్తారు.
PSA 49:13 బుద్ధిహీనులకి, మరియు వారు చెప్పేది అంగీకరించే వారికి ఇలాగే జరుగుతుంది.
PSA 49:14 మనుష్యులందరూ గొర్రెల్లా ఉన్నారు. సమాధి వారిదొడ్డి. మరణం వారి కాపరి. వారి శరీరాలు సమాధిలో కుళ్లిపోయి వ్యర్థమైపోతాయి.
PSA 49:15 కాని దేవుడు విలువ చెల్లించి నా ప్రాణాన్ని విమోచిస్తాడు. సమాధి శక్తి నుండి ఆయన నన్ను విడుదల చేస్తాడు.
PSA 49:16 మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడవద్దు. తన ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి భయపడవద్దు.
PSA 49:17 ఆ మనుష్యుడు చనిపోయినప్పుడు వాని వెంటవాడేమీ తీసుకొనిపోడు. వాని ఐశ్వర్యం వానితో సమాధిలోనికి దిగిపోదు.
PSA 49:18 అయినప్పటికీ, అతడు జీవించినంత కాలం సంతోషంగా ఉంటాడు. ఒక మనుష్యుడు తనకు తాను మంచి చేసికొని పొగడ్తలు పొందినా,
PSA 49:19 అతడు తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు. అతడు ఇక వెలుగును ఎన్నటకి చూడడు.
PSA 49:20 మనుష్యుడు తన వైభవంలో ఎక్కువ కాలం నిలిచియుండలేడు.అతడు నశించే మృగంలాంటి వాడు.
PSA 50:1 ఆసాపు కీర్తనలలో ఒకటి. దేవాది దేవుడు యెహోవా మాట్లాడాడు. సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.
PSA 50:2 సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.
PSA 50:3 మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు. ఆయన యెదుట అగ్ని మండుతుంది. ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది.
PSA 50:4 తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని, కింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.
PSA 50:5 “నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి. వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని చెప్పారు.
PSA 50:6 అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి. ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.
PSA 50:7 దేవుడు చెబతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి. ఇశ్రాయేలు ప్రజలారా మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను. నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.
PSA 50:8 నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు. ఇశ్రాయేలు ప్రజలారా మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.
PSA 50:9 మీ ఇంటినుండి యెద్దులను తీసుకోను. మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు.
PSA 50:10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం. వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
PSA 50:11 కొండల్లో వుండే ప్రతి పక్షి నాకు తెలుసు. పొలాల్లో చలించే ప్రతీదీ నా సొంతం
PSA 50:12 నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా సొంతం.
PSA 50:13 నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం తాగను.”
PSA 50:14 దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి, దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి.
PSA 50:15 “ఇశ్రాయేలు ప్రజలారా మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి! నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”
PSA 50:16 దుర్మార్గులతో దేవుడు చెబతున్నాడు, “నా న్యాయ విధులను చదువుటకు నా ఒడంబడికకు బద్దులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది?
PSA 50:17 కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు. నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు.
PSA 50:18 మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడుతారు. వ్యభిచార పాపం చేసే మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి దూకుతారు.
PSA 50:19 మీరు చెడు సంగతులు చెబతారు, అబద్ధాలు పలుకుతారు.
PSA 50:20 మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబతారు. మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు.
PSA 50:21 మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను నేను మీలాంటివాడినని మీరనుకొన్నారు. కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో గద్దిస్తాను. మరియు మీ ముఖంమీద నిందమోపుతాను.
PSA 50:22 నేను మిమ్ములను చీల్చివేయకముందే, దేవుని మరచిన జనాంగమైన మీరు, ఈ విషయంను గూర్చి ఆలోంచించాలి. అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.
PSA 50:23 ఒక వ్యక్తి కృతజ్ఞతా అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు. నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.”
PSA 51:1 సంగీత నాయకునికి. దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన. దేవా నీ నమ్మకమైన ప్రేమ మూలంగా నా మీద దయ చూపించుము. నీ మహా దయ మూలంగా నా పాపాలన్నీ తుడిచివేయుము.
PSA 51:2 దేవా, నా దోషం అంతా తీసివేయుము. నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
PSA 51:3 నేను పాపం చేశానని నాకు తెలుసు. నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
PSA 51:4 తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను. దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను. కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే. నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
PSA 51:5 నేను పాపంలో పుట్టాను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
PSA 51:6 దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు. అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
PSA 51:7 హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము. నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
PSA 51:8 నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము. నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
PSA 51:9 నా పాపాలను చూడకుము! వాటన్నింటినీ తుడిచి వేయుము.
PSA 51:10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
PSA 51:11 నన్ను తోసివేయకుము! నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
PSA 51:12 నీచేత రక్షించబడుట మూలంగా కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము! నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
PSA 51:13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను. వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
PSA 51:14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము. నా దేవా, నీవే నా రక్షకుడవు. నీవు ఎంత మంచివాడవోనని నన్ను పాడనిమ్ము.
PSA 51:15 నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
PSA 51:16 నీవు బలులు కోరటం లేదు. లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
PSA 51:17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.
PSA 51:18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము. యెరూషలేము గోడలను కట్టుము.
PSA 51:19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు. మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.
PSA 52:1 సంగీత నాయకునికి దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది. పెద్ద మనిషి, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
PSA 52:2 వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు. నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది.
PSA 52:3 మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు. సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం.
PSA 52:4 నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడతుంది.
PSA 52:5 అందచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు.
PSA 52:6 మంచి వాళ్లు ఇది చూచి, దేవునిని గౌరవిస్తారు. వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు,
PSA 52:7 “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి. ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.”
PSA 52:8 అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను. నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.
PSA 52:9 దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను. నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.
PSA 53:1 సంగీత నాయకునికి. మాహలతు రాగంలో పాడతగిన దావీదు ధ్యానం. తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు. అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు. సరియైన దాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
PSA 53:2 నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికొరకు చూసే జ్ఞానంగల వాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
PSA 53:3 కానీ ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు. ప్రతి మనిషీ చెడ్డవాడే. మంచి చేసేవాడు లేడు. ఒక్కడూ లేడు.
PSA 53:4 దేవుడు చెబతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు. కాని వారు నన్ను ప్రార్థించరు. ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”
PSA 53:5 కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ భయ పడనంతగా భయపడిపోతారు. ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు. కనుక మీరు వారిని ఓడిస్తారు. దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.
PSA 53:6 ఇశ్రాయేలు ప్రజలారా, సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు? దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు యాకోబు సంతోషిస్తాడు. ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.
PSA 54:1 సంగీత నాయకునికి వాయిద్వాలతో, దావీదు ధ్యానము, జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది. దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము. నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.
PSA 54:2 దేవా నా ప్రార్థనను, నేను చెప్పే సంగతులను ఆలకించుము.
PSA 54:3 పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు. బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.
PSA 54:4 చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
PSA 54:5 తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు. దేవా, నీవు నాకు నమ్మకస్తుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.
PSA 54:6 దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను. యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
PSA 54:7 నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు. మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.
PSA 55:1 సంగీత నాయకునికి వాయిద్వాలతో, దావీదు ప్రార్థన. దేవా నా ప్రార్థన వినుము. దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
PSA 55:2 దేవా దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము. నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
PSA 55:3 నా శత్రువులు నాకు విరోధముగా చెప్పిన దాన్ని బట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను. నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు. వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
PSA 55:4 నాలో నా గుండె ఆదురుతోంది. నాకు చచ్చి పోయేటంత భయంగా ఉంది.
PSA 55:5 నాకు భయము మరియు వణకుగా ఉంది. నేను భయపడిపోయాను.
PSA 55:6 ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.
PSA 55:7 నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.
PSA 55:8 నేను పరుగెత్తి పోదును. నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.
PSA 55:9 నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము. ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
PSA 55:10 పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి. ఈ పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.
PSA 55:11 వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది. ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
PSA 55:12 ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే దానిని నేను భరించగలను. ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే నేను దాక్కోగలను.
PSA 55:13 కానీ, అది నీవే అవటంవల్ల నేను భయపడను. ఎందుకంటే నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.
PSA 55:14 మనం కలిసి మధుర సంభాషణ చేసే వాళ్లము. దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.
PSA 55:15 నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను. వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను. ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.
PSA 55:16 నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను. యెహోవా నాకు జవాబు ఇస్తాడు.
PSA 55:17 సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబతాను. ఆయన నా మాట వింటాడు.
PSA 55:18 నేను చాలా యుద్ధాలు చేశాను. కానీ దేవుడు నన్ను రక్షిస్తాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వస్తాడు.
PSA 55:19 దేవుడు అనాటి కాలంనుండి సింహాసనాసీనుడు. నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు. నా శత్రువులు వారి బతుకులు మార్చుకోరు. వారు దేవునికి భయపడరు, గౌరవించరు.
PSA 55:20 నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు. అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు.
PSA 55:21 అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు. కాని నిజానికి వాడు యుద్ధం తలపెడతాడు. వాని మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి కాని ఆ మాటలు కత్తిలా కోస్తాయి.
PSA 55:22 నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు. మంచి మనష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.
PSA 55:23 కాని దేవా! దుష్టులను దుర్నీతి అనే గుంటలోనికి అణచివేస్తావు. రక్తం చిందించే మనుష్యులు, విశ్వాసఘాతకులు అర్థకాలమైనా జీవించరు. కానీ నేనైతే నీయందే విశ్వ సిస్తాను.
PSA 56:1 సంగీత నాయకునికి రాగం. “దూరపు సింధూర మ్రానులోని పావురము” ఫిలిప్తీయులు దావీదును గాతులో పట్టుకొన్నప్పుడు అతడు రచించిన అనుపదగీతం. దేవా, ప్రజలు నా మీద దాడి చెస్తార గనుక నాకు దయ చూపించుము. రాత్రింబగళ్లు వారు నన్ను తరుముతూ పోరాడుతున్నారు.
PSA 56:2 నా శత్రువులు రోజంతా నా మీద దాడి చేసారు. నాకు విరోధంగా పోరాడేవారు అనేకులు.
PSA 56:3 నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ము కొంటాను.
PSA 56:4 నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను స్తుతిస్తాను.
PSA 56:5 నా శత్రువులు ఎల్లప్పుడూ నా మాటలు మెలితిప్పుతున్నారు. వారు ఎల్లప్పుడూ నాకు విరోధంగా చెడు పథకాలు వేస్తున్నారు.
PSA 56:6 వారంతా కలసి దాక్కొని నా ప్రతీ కదలికనూ గమనిస్తున్నారు. నన్ను చంపుటకు ఏదో ఒక మార్గం కోసం ఎదురు చూస్తున్నారు.
PSA 56:7 దేవా, వారిని తప్పించుకోనియ్యకుము, వారు చేసే చెడ్డ పనుల నిమిత్తం వారిని శిక్షించుము.
PSA 56:8 నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు. నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు నిజంగా నీవు కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు.
PSA 56:9 కనుక సహాయం కోసం నేను నీకు మెర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు. ఇది నాకు తెలుసు. ఏమంటే, దేవుడు నాతో ఉన్నాడు.
PSA 56:10 దేవుడి వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను. యెహోవా నాకు చేసిన వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
PSA 56:11 నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు.
PSA 56:12 దేవా, నేను నీతో ప్రత్యేక ప్రమాణం చేసాను. దాన్ని నెరవేరుస్తాను. నా కృతజ్ఞతార్పణ నేను నీకు యిస్తాను.
PSA 56:13 ఎందుకంటే మరణం నుండి నీవు నన్ను రక్షించావు. నేను ఓడిపోకుండా నీవు కాపాడావు. కనుక బతికి ఉన్న మనుష్యులు మాత్రమే చూడగల వెలుగులో నేను దేవుని ఆరాధిస్తాను.
PSA 57:1 సంగీత నాయకునికి. “నాశనం చేయవద్దు.” దావీదు అనుపదగీతం. గుహలో సౌలు నుండి అతడు పారిపోయినప్పటిది. దేవా, నన్ను కరుణించు నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము. కష్టం దాటిపోయేవరకు నేను నీ శరణు జొచ్చియున్నాను.
PSA 57:2 మహోన్నతుడైన దేవునికి సహోయం కోసం నేను ప్రార్థించాను. దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.
PSA 57:3 పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు. నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యులను ఆయన ఓడిస్తాడు. దేవుడు తన నిజమైన ప్రేమను నాకు చూపిస్తాడు.
PSA 57:4 నా జీవితం ప్రమాదంలో ఉంది. నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు. ఈటెలు, బాణాలు వంటిపదునైన పళ్లు, ఖడ్గంలా పదునైన నాలుకలుగల మనుష్యులను తినే సింహాల్లా వారున్నారు.
PSA 57:5 దేవా నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు. నీ మహిమ భూమిని ఆవరించి ఉంది.
PSA 57:6 నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు. వారు నన్ను ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు. నేను పడుటకు వారు గొయ్యి తవ్వారు. కాని వారే దానిలో పడ్డారు.
PSA 57:7 దేవా, నిన్ను విశ్యసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది. నేను ఆయనకు స్తుతులు పాడుతాసు.
PSA 57:8 నా ఆత్మ, మేలుకోనుము! స్వరమండలమా, సితారా, మేలుకోండి వేకువను మనం మేల్కొందాము
PSA 57:9 నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను. ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతిగీతాలు పాడుతాను.
PSA 57:10 నీ నిజమైన ప్రేమ ఆకాశంలో కెల్లా అత్యున్నత మేఘాలంకంటె ఎత్తయింది.
PSA 57:11 ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు. ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.
PSA 58:1 సంగీత నాయకునికి. “నాశనం చేయవద్దు.”దావీదు అనుపదగీతం. న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు. మీరు ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పటంలేదు.
PSA 58:2 లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు. ఈ దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు.
PSA 58:3 ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు. పుట్టినప్పటి నుండి వారు అబద్దికులే.
PSA 58:4 వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు. వినతలచని తాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు.
PSA 58:5 తాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే వాని నాగ స్వరంగాని వినవు. ఆ దుర్మార్గులు అలాన్నారు.
PSA 58:6 యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు. కనుక యెహోవా, వారి పళ్లు విరుగగొట్టుము.
PSA 58:7 ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయమవుదురుగాక. బాటలోని కలుపు మొక్కల్లా వారు అణగదొక్కబడుదురు గాక.
PSA 58:8 మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక. చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని శిశువులా వారు ఉందురు గాక.
PSA 58:9 కుండకింద వున్న నిప్పువేడిలో అతిత్వరగా కాలి పోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక.
PSA 58:10 మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతోషిస్తాడు. ఆ దుర్మార్గుల రక్తంలో అతడు తన పాదాలు కడుగుకొంటాడు.
PSA 58:11 అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది. లోకానికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.”
PSA 59:1 సంగీత నాయకునికి. “నాశనం చేయవద్దు.”దావీదు అనుపదగీతం. దావీదును చంపేందుకు అతని యింటిని చూచి రమ్మని సౌలు తన మనుష్యులను పంపిన సందర్భం. దేవా, నా శత్రువుల నుండి నన్ను రక్షించుము నాతో పోరాడేందుకు నా మీదికి వచ్చే మనుష్యులను జయించేందుకు నాకు సహాయం చేయుము.
PSA 59:2 కీడు చేసే మనుష్యుల నుండి నన్ను రక్షించుము. ఆ నరహంతకుల నుండి నన్ను రక్షించుము.
PSA 59:3 చూడు బలాఢ్యులు నా కోసం కనిపెట్టి ఉన్నారు. నన్ను చంపేందుకు వారు కనిపెట్టుకున్నారు. నేను పాపం చేసినందువలన లేక ఏదో నేరం చేసినందు వలన కాదు.
PSA 59:4 వారు నన్ను తరుముతున్నారు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు. యెహోవా, వచ్చి నీ మట్టుకు నీవే చూడు!
PSA 59:5 నీవు సర్వశక్తిమంతుడవైన దేవుడవు, ఇశ్రాయేలీయుల దేవుడవు. లేచి జనాంగములన్నిటినీ శిక్షించుము. ఆ దుర్మార్గపు ద్రోహులకు ఎలాంటి దయా చూపించకుము.
PSA 59:6 ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణములోకి వస్తారు. వారు మొరిగే కుక్కల్లా పట్టణమంతా తిరుగుతారు.
PSA 59:7 వారి బెదరింపులు, అవమానాలు వినుము. వారు అలాంటి క్రూరమైన సంగతులు చెబతారు. వాటిని వింటున్నది ఎవరో వారికి అనవసరం.
PSA 59:8 యెహోవా, వారిని చూసి నవ్వుము. ఆ జనాలను గూర్చి ఎగతాళి చేయుము.
PSA 59:9 దేవా, నీవే నా బలం, నేను నీకోసం కనిపెట్టుకొన్నాను. దేవా, నీవే పర్వతాలలో ఎత్తయిన నా క్షేమస్థానం.
PSA 59:10 దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు. నా శత్రువులను జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
PSA 59:11 దేవా, వారిని ఊరకనే చంపివేయకు. లేదా నా ప్రజలు మరచిపోవచ్చును. నా ప్రభువా, నా సంరక్షకుడా, నీ బలంతో వారిని చెదరగొట్టి, వారిని ఓడించుము.
PSA 59:12 ఆ దుర్మార్గులు శపించి ఆబద్ధాలు చెబతారు. వారు చెప్పిన విషయాలను బట్టి వారిని శిక్షించుము. వారి గర్వం వారిని పట్టుకొనేలా చేయుము.
PSA 59:13 నీ కోపంతో వారిని నాశనం చేయుము. వారిని పూర్తిగా నాశనం చేయుము. అప్పుడు యాకోబు ప్రజలనూ, సర్వప్రపంచాన్నీ దేవుడు పాలిస్తున్నాడని మనుష్యులు తెలుసుకొంటారు.
PSA 59:14 అప్పుడు ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణంలోకి వస్తే మొరిగే కుక్కల్లా పట్టణం అంతా తిరుగుతూ ఉంటే
PSA 59:15 అప్పుడు వారు తినుటకు ఏమైనా దొరుకుతుందని వెదకుతూ పోతారు. వారికి ఆహారం దొరకదు. నిద్రించుటకంత స్థలం దొరకదు.
PSA 59:16 మరి నేను నీకు స్తుతి గీతాలు పాడుతాను. ఉదయాలలో నీ ప్రేమయందు ఆనందిస్తాను. ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమ స్థానం, కష్టాలు వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు పరుగెత్తి పోగలను.
PSA 59:17 నేను నీకు నా స్తుతిగీతాలు పాడుతాను. ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమస్థానం. నీవు నన్ను ప్రేమించే దేవుడవు.
PSA 60:1 సంగీత నాయకునికి. “ఒప్పందపు లిల్లి పుష్పం” రాగం. దావీదు అనుపదగీతం. ఉపదేశించదగినది. దావీదు అరమ్న హరాయీమీయులతోను, ఆరమోజబాయీలతోను యుద్ధం చేయగా యోవాబు ఉప్పు లోయలో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పటిది దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు. నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు. దయచేసి మమ్ములను ఉద్దరించుము.
PSA 60:2 భూమి కంపించి పగిలి తెరచుకొనేలా నీవు చేశావు. మా ప్రపంచం పగిలిపోతోంది. దయచేసి దాన్ని బాగు చేయుము.
PSA 60:3 నీ ప్రజలకు నీవు చాలాకష్టాలు కలిగించావు. తగుబోతు మనుష్యుల్లా మేము తూలి పడిపోతున్నాము.
PSA 60:4 నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను స్థిరపరచుటకు ఒక ధ్వజమునెత్తావు.
PSA 60:5 నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు, నా ప్రార్థనకు జవాబు యిచ్చి, నీవు ప్రేమించే ప్రజలను రక్షించుము.
PSA 60:6 దేవుడు తన ఆలయంలో నుండి మాట్లాడుతున్నాడు. “నేను గెలుస్తాను, ఆ విజయం గూర్చి సంతోషిస్తాను. నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని నేను పంచుకొంటాను. షెకెము, సుక్కోతు లోయలను నేను విభజిస్తాను.
PSA 60:7 గిలాదు, మనష్షేనాది. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము. యూదా నా రాజదండము.
PSA 60:8 మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా నేను చేస్తాను. ఎదోము నా చెప్పులు మోసేబానిసగా ఉంటుంది. ఫిలిప్తీ ప్రజలను నేను ఓడిస్తాను.”
PSA 60:9 బలమైన భద్రతగల పట్టణానికి నన్ను ఎవరు తీసుకొని వస్తారు? ఎదోముతో యుద్ధం చేయుటకు నన్ను ఎవరు నడిపిస్తారు?
PSA 60:10 దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు. కాని నీవు మమ్మల్ని విడిచిపెట్టేసావు. దేవుడు మాతోను, మా సైన్యాలతోను వెళ్లడు.
PSA 60:11 దేవా, మా శత్రువులను ఓడించుటకు సహాయం చేయుము. మనుష్యులు మాకు సహాయం చేయలేరు.
PSA 60:12 కాని దేవుని సహాయంతో మేము జయించగలం. దేవుడు మా శత్రువులను ఓడించగలడు.
PSA 61:1 సంగీత నాయకునికి తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన. దేవా, నా ప్రార్థనా గీతం వినుము. నా ప్రార్థన ఆలకించుము.
PSA 61:2 నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా, సహాయం కోసం నీకు మొరపెడతాను. ఎత్తయిన క్షేమస్థలానికి నన్ను మోసికొనిపొమ్ము.
PSA 61:3 నీవే నా క్షేమ స్థానం. నా శత్రువుల నుండి నన్ను కాపాడే బలమైన గోపురం నీవే.
PSA 61:4 నీ గుడారంలో నేను శాశ్వతంగా నివసిస్తాను. నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను.
PSA 61:5 దేవా, నేను నీకిస్తానని చేసిన ప్రమాణం నీవు విన్నావు. కాని నిన్ను ఆరాధించేవారికి ఉన్న సమస్తం నీవద్ద నుండే వస్తుంది.
PSA 61:6 రాజుకు దీర్గాయుష్షు దయచేయుము. అతన్ని శాశ్వతంగా జీవించనిమ్ము.
PSA 61:7 అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము. నీ నిజమైన ప్రేమతో మరియు విశ్వాసంతో అతనిని కాపాడుము.
PSA 61:8 నేను నీ నామాన్ని శాశ్వతంగా స్తుతిస్తాను. నేను ప్రమాణం చేసిన వాటిని ప్రతి రోజూ చేస్తాను.
PSA 62:1 సంగీత నాయకునికి. యెదూతూను రాగం. దావీదు కీర్తన. దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచివుంటాను.
PSA 62:2 దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు. పర్వతం మీద ఎత్తయిన నా క్షేమస్థానం దేవుడే. మహా సైన్యాలు కూడా నన్ను ఓడించలేవు.
PSA 62:3 ఇంకెంత కాలం నా మీద దాడి చేస్తూ ఉంటావు. నేను ఒరిగిపోయిన గోడలా ఉన్నాను. పడిపోతున్న కంచెలా ఉన్నాను.
PSA 62:4 ఆ మనుష్యులు నన్ను నాశనం చేయటానికి పథకాలు వేస్తున్నారు. వారు నన్ను గూర్చి అబద్ధాలు చెబతున్నారు. బహిరంగంగా వారు నన్ను గూర్చి మంచి మాటలు చెబతారు, కాని రహస్యంగా వారు నన్ను శపిస్తారు.
PSA 62:5 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి ఉన్నాను. దేవుడు ఒక్కడే నా నిరీక్షణ.
PSA 62:6 దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తాడు. పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం దేవుడే.
PSA 62:7 నా మహిమా విజయం దేవుని నుండి వస్తుంది. ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం
PSA 62:8 ప్రజలారా, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మిక ఉంచండి. మీ సమస్యలు దేవునితో చెప్పండి. దేవుడే మన క్షేమ స్థానం.
PSA 62:9 మనుష్యులు నిజంగా సహాయం చేయలేరు. నిజంగా సహాయం కోసం నీవు వారిని నమ్ముకోలేవు. వారు గాలిబడగల్లా వట్టి ఊపిరియైయున్నారు.
PSA 62:10 బలవంతంగా విషయాలను చేజిక్కించు కొనుటకు నీ శక్తిని నమ్ముకోవద్దు. దొంగిలించడం ద్వారా నీకు ఏదైనా లాభం కలుగుతుందని తలచవద్దు. నీవు ధనికుడవైతే నీ సహాయం కోసం ధనాన్ని నమ్ముకొన వద్దు.
PSA 62:11 నీవు నిజంగా ఆధారపడదగినది ఒకటి ఉన్నదని దేవుడు చెబతున్నాడు, “బలము దేవుని నుండే వస్తుంది.”
PSA 62:12 నా ప్రభువా, నీ ప్రేమ నిజమైనది. ఒకడు చేసిన వాటిని బట్టి నీవతనికి బహుమానం ఇస్తావు లేదా శిక్షిస్తావు.
PSA 63:1 దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది. దేవా, నీవు నా దేవుడవు. నాకు నీవు ఎంతగానో కావాలి. నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా నీకొరకు దాహంగొని ఉన్నాయి.
PSA 63:2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను. నీ బలము నీ మహిమలను నేను చూశాను.
PSA 63:3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది. నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
PSA 63:4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను. నీ వేరిట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
PSA 63:5 నేను శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను. నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
PSA 63:6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను. రాత్రి ఝాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
PSA 63:7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు. నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
PSA 63:8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది. నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
PSA 63:9 కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు. వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు.
PSA 63:10 ఖడ్గములతో వారు చంపబడతారు. అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి.
PSA 63:11 అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు. ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్దికులందరినీ ఆయన ఓడించాడు.
PSA 64:1 సంగీత నాయకునికి. దావీదు కీర్తన. దేవా, నా ప్రార్థన ఆలకించుము. నా శత్రువులను గూర్చి నేను భయపడుతున్నాను. నా ప్రాణమును కాపాడుము.
PSA 64:2 నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము. ఆ దుర్మార్గుల బారి నుండి నన్ను దాచి పెట్టుము.
PSA 64:3 వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు. వారి నాలుకలు వాడిగల కత్తులవలె ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి.
PSA 64:4 వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను సామాన్యమైన ఒక నిజాయితీ పరుని మీద వేస్తారు. అతడు దానిని గమనించకముందే అతడు గాయ పరచబడ్డాడు.
PSA 64:5 అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు. “వారు వారి ఉరులను పెడతారు.” వారిని ఎవరూ పట్టుకోరని, చూడరని వారనుకొంటారు.
PSA 64:6 మనుష్యులు చాలా యుక్తిగా ఉండగలరు. మనుష్యులు ఏమి తలస్తున్నారో గ్రహించటం ఎంతోకష్టం.
PSA 64:7 కాని దేవుడు తన “బాణాలను”వారిమీద వేయగలడు. అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు.
PSA 64:8 దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం వేస్తారు. కానీ దేవుడు వారి పథకాలను పాడుచేయగలడు. ఆ కీడు వారికే సంభవించేలా ఆయన చేయగలడు. అప్పుడు వారిని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో వారి తలలు ఊపుతారు.
PSA 64:9 దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు. వారు దేవుని క్రియలను ప్రకటిస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని గూర్చి ఎక్కువగా తెలిసికొంటారు. ఆయనకు భయపడి గౌరవించడం వారు నేర్చుకొంటారు.
PSA 64:10 మంచివాళ్లు యెహోవాయందు సంతోషంగా ఉండాలి. వారు ఆయన్ని నమ్ముకోవాలి. మంచి మనుష్యులారా మీరంతా యెహోవాను స్తుతించండి.
PSA 65:1 సంగీత నాయకునికి దావీదు స్తుతి కీర్తన. సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను. నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను.
PSA 65:2 నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు. నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.
PSA 65:3 మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు, ఆ పాపాలను నీవు తీసివేస్తావు.
PSA 65:4 దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు. నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు. మాకు చాలా సంతోషంగా ఉంది! నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
PSA 65:5 దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు. నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు. వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
PSA 65:6 దేవుడు తన మహా శక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు. మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము.
PSA 65:7 ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు. మరియు ప్రపంచంలో “అనేకంగా” ఉన్న మనుష్యులందరినీ దేవుడు చేస్తాడు.
PSA 65:8 దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు. దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసి, ఆస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
PSA 65:9 నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు. నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు. దేవా, నీవు కాలువలను నీళ్లతో నింపుతావు. పంటలు పండింపచేస్తావు. నీవు దీనిని ఇలా చేస్తావు.
PSA 65:10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు. భూములను నీవు నీళ్లతో నానబెడతావు. నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు. అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
PSA 65:11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు. బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
PSA 65:12 ఆరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
PSA 65:13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి. లోయలు ధాన్యంతో నిండిపోయాయి. పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.
PSA 66:1 సంగీత నాయకునికి. ఒక స్తుతి కీర్తన. భూమి మీద ఉన్న సమస్తమా దేవునికి ఆనందధ్వని చేయుము!
PSA 66:2 మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి. స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
PSA 66:3 ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి. దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
PSA 66:4 సర్వలోకం నిన్ను ఆరాధించుగాక. నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.
PSA 66:5 దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి. అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
PSA 66:6 సముద్రాన్ని ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు. ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు. అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
PSA 66:7 దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు. సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు. ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.
PSA 66:8 ప్రజలారా మా దేవుని స్తుతించండి. స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
PSA 66:9 దేవుడు మాకు ఆ జీవాన్ని ఇచ్చాడు. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
PSA 66:10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
PSA 66:11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు. భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
PSA 66:12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు. అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు. కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
PSA 66:13 కనుక నేను నీ ఆలయాలనికి బలులు తీసుకొస్తాను. నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను. నేను నీకు చాలవాగ్దానాలు చేసాను. ఇప్పుడు, నేను వాగ్దానం చేసిన వాటిని నీకు ఇస్తున్నాను.
PSA 66:15 నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను. నేను నీకు పొట్టేళ్లతో ధూపం ఇస్తున్నాను. నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.
PSA 66:16 దేవుని ఆరాధించే ప్రజలారా మీరంతా రండి. దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబతాను.
PSA 66:17 నేను ఆయన్ని ప్రార్థించాను. నేను ఆయన్ని స్తుతించాను.
PSA 66:18 నా హృదయం పవిత్రంగా ఉంది. కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
PSA 66:19 దేవుడు నా మొరను విన్నాడు. దేవుడు నా ప్రార్థన విన్నాడు.
PSA 66:20 దేవుని స్తుతించండి! నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు. దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!
PSA 67:1 సంగీత నాయకునికి వాయిద్యాలతో స్తుతి కీర్తన. దేవా మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము. దయచేసి మమ్ములను స్వీకరించుము.
PSA 67:2 దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము. నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
PSA 67:3 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక! మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
PSA 67:4 దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక! ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
PSA 67:5 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక! మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
PSA 67:6 దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము. మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
PSA 67:7 దేవుడు మమ్మల్ని దీవించుగాక. భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.
PSA 68:1 సంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన. దేవా, లేచి నీ శత్రువులను చెదరగొట్టుము. ఆయన శత్రువులు అందరూ ఆయన దగ్గర్నుండి పారిపోయెదరుగాక!
PSA 68:2 గాలికి ఎగిరిపోయే పొగలా నీ శత్రువులు చెదరిపోవుదురుగాక. అగ్నిలో మైనం కరిగిపోయేలా నీ శత్రువులు నాశనం చేయబడుదురుగాక.
PSA 68:3 కాని మంచి మనుష్యులు సంతోషంగా ఉన్నారు. మంచి మనుష్యులు దేవునితో కలసి సంతోషంగా గడుపుతున్నారు. మంచి మనుష్యులు ఆనందం అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు.
PSA 68:4 దేవుని స్తుతించండి. ఆయన నామమునకు స్తుతులు పాడండి. ఆయనకు మార్గం సిద్ధపరచండి. ఆరణ్యంలో ఆయన తన రథం మీద వెళ్తాడు. ఆయన పేరు యాహ్. ఆయన నామాన్ని స్తుతించండి.
PSA 68:5 ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు. దేవుడు విధవరాండ్రను గూర్చి జాగ్రత్త పుచ్చుకొంటాడు.
PSA 68:6 ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు. దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు.
PSA 68:7 దేవా, నీ ప్రజలను నీవు ఈజిప్టు నుండి బయటకు రప్పించావు. ఎడారిగుండా నీవు నడిచావు.
PSA 68:8 భూమి కంపించింది. దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు ఆకాశం కరిగిపోయింది.
PSA 68:9 దేవా, నీవు వర్షం కురిపించావు మరియు నిస్సారమైన పాత భూమిని నీవు మరల బలపరిచావు.
PSA 68:10 నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి. దేవా, అక్కడ పేద ప్రజలకు నీవు ఎన్నో మంచి వాటిని యిచ్చావు.
PSA 68:11 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నా శుభవార్త చెప్పడానికి అనేక మంది ప్రజలు వెళ్లారు.
PSA 68:12 “శక్తిగల రాజుల సైన్యాలు పారిపోతున్నాయి. యుద్ధం నుండి సైనికులు తెచ్చే వస్తువులు ఇంటి వద్ద స్త్రీలు పంచుకొంటారు.
PSA 68:13 ఇంటి దగ్గర ఉండిపోయిన మనుష్యులు ఆ ఐశ్వర్యాలను సంచుకొంటారు. వారు పావురపు రెక్కలకు వెండిపూత పూస్తారు. ఆ రెక్కలను వారు బంగారు పూతతో తళ తళ మెరిపిస్తారు.”
PSA 68:14 సల్మోను కొండ మీద శత్రురాజులను దేవుడు చెదరగొట్టాడు. వారు పడిపోతున్న మంచులా ఉన్నారు.
PSA 68:15 బాషాను పర్వతం చాలా గొప్ప పర్వతం, బాషాను పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి.
PSA 68:16 బాషాను పర్వతమా, నీవేల సీయోను కొండను చిన్న చూపు చూస్తున్నావు? దేవుడు ఆ కొండను ప్రేమిస్తున్నాడు. యెహోవా తాను శాశ్వతంగా అక్కడ నివసించాలని నిర్ణయించుకొన్నాడు.
PSA 68:17 యెహోవా పరిశుద్ధమైన సీయోను కొండకు వస్తున్నాడు. ఆయన వెనుక ఆయన రథాలు లక్షలాదిగా ఉన్నాయి.
PSA 68:18 ఆయన ఎత్తయిన చోట్లకు వెళ్లాడు. ఆయన తన బందీల బృందాలను నడిపించాడు. ఆయన మనుష్యులనుండి అనగా ఆయనను వ్యతిరేకించిన ప్రజలనుండి కూడ కానుకలు తీసుకొన్నాడు
PSA 68:19 యెహోవాను స్తుతించండి. మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు.
PSA 68:20 ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు. మన యోహోవా దేవుడు మనల్ని మరణంనుండి రక్షిస్తాడు.
PSA 68:21 దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు. దేవుడు తనకు విరోధంగా పోరాడిన వారిని శిక్షిస్తాడు.
PSA 68:22 నా ప్రభువు ఇలా చెప్పాడు: “శత్రువును తిరిగి బాషాను నుండి నేను రప్పిస్తాను. సముద్రపు లోతుల నుండి శత్రువును నేను రప్పిస్తాను.
PSA 68:23 కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు కనుక మీ కుక్కలు వారి రక్తం నాకవచ్చు.”
PSA 68:24 విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు. నా పరిశుద్ధ దేవుడు, నా రాజు విజయంతో ఊరేగింపు నడిపించటం ప్రజలు చూస్తారు.
PSA 68:25 గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు. మధ్యలో ఆడపడుచులు తంబరలు వాయిస్తారు.
PSA 68:26 మహా సమాజంలో దేవుని స్తుతించండి. ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
PSA 68:27 చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు. యూదా మహా వంశం అక్కడ ఉంది. జెబూలూను, నఫ్తాలి నాయకులు అక్కడ ఉన్నారు.
PSA 68:28 దేవా, నీ శక్తి మాకు చూపించుము, దేవా, గత కాలంలో మాకోసం నీవు ఉపయోగించిన నీ శక్తి మాకు చూపించుము.
PSA 68:29 రాజులు వారి ఐశ్వర్యాలను నీ వద్దకు, యెరూషలేములోని మందిరానికి తీసుకొని వస్తారు.
PSA 68:30 ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము. ఆ దేశాలలోని “ఎద్దులు, ఆవులు” నీకు లోబడేలా చేయుము ఆ రాజ్యాలను యుద్ధంలో నీవు ఓడించావు. ఇప్పుడు వారు నీ వద్దకు వెండి తీసుకొని వచ్చు నట్లు చేయుము.
PSA 68:31 వారు ఈజిప్టు నుండి ఐశ్వర్యం తీసుకొని వచ్చేలా చేయుము. దేవా, ఇథియోపియా (కూషు) వారు వారి ఐశ్వర్యాన్ని నీ వద్దకు తెచ్చేలా చేయుము.
PSA 68:32 భూ రాజులారా దేవునికి పాడండి. మన యెహోవాకు స్తుతి కీర్తనలు పాడండి.
PSA 68:33 దేవునికి పాడండి. ప్రాచీన ఆకాశాలలో ఆయన తన రథాల మీద పయనిస్తున్నాడు. ఆయన శక్తిగల స్వరాన్ని ఆలకించండి.
PSA 68:34 మీ దేవుళ్లు అందరి కంటె యెహోవా ఎక్కువ శక్తిగలవాడు. ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలను బలపరుస్తాడు.
PSA 68:35 దేవుడు తన ఆలయంలో ఆశ్చర్యకరుడు. ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు శక్తి, బలాన్ని ఇస్తాడు. దేవుని స్తుతించండి.
PSA 69:1 సంగీత నాయకునికి “పుష్పాల రాగం.” దావీదు కీర్తన. దేవా, నా కష్టాలన్నిటి నుండీ నన్ను రక్షించుము. నా నోటి వరకు నీళ్లు లేచాయి.
PSA 69:2 నిలబడి ఉండుటకు ఏదీ లేదు. నేను మునిగిపోతున్నాను. కింద బురదలోకి దిగజారిపోతున్నాను. లోతైనజలాల్లో నేనున్నాను. అలలు నా చుట్టూకొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.
PSA 69:3 సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను. నా గొంతు నొప్పిగా ఉంది. నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు నేను నీ సహాయం కోసం కని పెట్టి చూశాను.
PSA 69:4 నా తలపైగల వెంట్రుకల కంటే ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు. ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు. వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబతున్నారు. వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు. ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు.
PSA 69:5 దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు.
PSA 69:6 నా దేవా, సర్వశక్తిమంతుడవైన యెహోవా, నా మూలంగా నీ అనుచరులను సిగ్గుపడనియ్యకుము. ఇశ్రాయేలీయుల దేవా, నా మూలంగా నీ ఆరాధకులను ఇబ్బంది పడనీయకుము.
PSA 69:7 నా ముఖం సిగ్గుతో నిండి ఉంది. నీ కోసం ఈ సిగ్గును నేను భరిస్తాను.
PSA 69:8 నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు. నా తల్లి కుమారులు నన్నొక విదేశీయునిలా చూస్తారు.
PSA 69:9 నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది. నిన్ను ఎగతాళి చేసే మనుష్యుల అవమానాలను నేను పొందుతున్నాను.
PSA 69:10 నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను. అందు నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు.
PSA 69:11 నా విచారాన్ని చూపించేందుకు నేను మోటుబట్టలు ధరిస్తున్నాను. ప్రజలు నన్ను గూర్చి పరిహాసాలు చెప్పుకొంటున్నారు.
PSA 69:12 బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు.
PSA 69:13 నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన. నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను. దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను.
PSA 69:14 బురదలో నుండి నన్ను పైకిలాగుము. బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు. నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము. లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము.
PSA 69:15 అలలు నన్ను ముంచివేయనీయకుము. లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము. సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము
PSA 69:16 యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము. నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకోనుము.
PSA 69:17 నీ సేవకునికి విముఖుడవు కావద్దు. నేను కష్టంలో ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము.
PSA 69:18 వచ్చి నా ఆత్మను రక్షించుము. నా శత్రువులనుండి నన్ను తప్పించుము.
PSA 69:19 నా అవమానం నీకు తెలుసు. నా శత్రువులు నన్ను అవమాన పరిచారని నీకు తెలుసు. వారు నన్ను కించపరచటం నీవు చూసావు.
PSA 69:20 సిగ్గు నన్ను కృంగదీసింది. అవమానం చేత నేను చావబోతున్నాను. సానుభూతి కోసం నేను ఎదురు చూశాను. కాని ఏమీ దొరకలేదు. ఎవరైనా నన్ను ఆదరిస్తారని నేను ఎదురుచూశాను. కాని ఎవరూ రాలేదు.
PSA 69:21 వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు. ద్రాక్షా రసానికి బదులుగా చిరకను వారు నాకు ఇచ్చారు.
PSA 69:22 వారి బల్లల మీద భోజన పానాలు పుష్కలంగా ఉన్నాయి. విందులు జరుగుతుంటాయి. వారి భోజనాలే వారికి ఎక్కువ అగును గాక.
PSA 69:23 వారి కన్నులకు చీకటి కలిగి చూడలేక పోదురు గాక! వారి నడుములు ఎడతెగకుండా వణుకునట్లు చేయుము.
PSA 69:24 నీ కోపమును వారిపై కుమ్మరించుము. నీ భయంకర కోపమును వారు సహించనిమ్ము.
PSA 69:25 వారి కుటుంబాలు, ఇండ్లు పూర్తిగా నాశనం చేయబడునుగాక.
PSA 69:26 నీవు వారిని శిక్షించుము. వారు పారిపోతారు. అప్పుడుబాధను గూర్చి వారు మాట్లాడుకుంటారు.
PSA 69:27 వారు చేసిన చెడ్డ పనులకు గాను వారిని శిక్షించుము. నీవు ఎంత మంచి వాడవుగా ఉండగలవో వారికి చూపించవద్దు.
PSA 69:28 జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచివేయుము. మంచి మనుష్యుల పేర్లతో పాటు వారి పేర్లను గ్రంథంలో వ్రాయవద్దు.
PSA 69:29 నేను విచారంగాను, బాధతోను ఉన్నాను. దేవా నన్ను లేవనెత్తుము. నన్ను రక్షించుము.
PSA 69:30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను. కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను.
PSA 69:31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము. ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది.
PSA 69:32 పేద ప్రజలారా మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు. పేద ప్రజలారా ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు.
PSA 69:33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు.
PSA 69:34 ఆకాశమా, భూమీ, సముద్రమా, దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి.
PSA 69:35 యెహోవా సీయోనును రక్షిస్తాడు. యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు. ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు.
PSA 69:36 ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు.
PSA 70:1 సంగీత నాయకునికి. ప్రజలు జ్ఞాపకం చేసికొనేందుకు సహాయంగా దావీదు కీర్తన. దేవా, నన్ను రక్షించుము. దేవా త్వరపడి నాకు సహాయం చేయుము.
PSA 70:2 మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. వారిని నిరాశపరచుము. వారిని అవమానించుము. మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు. వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ.
PSA 70:3 మనుష్యులు నన్ను హేళన చేసారు. వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ.
PSA 70:4 నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు.
PSA 70:5 నేను నిరుపేదని, నిస్సహాయుణ్ణి. దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము. దేవా, నన్ను తప్పించగల వాడవు నీవు ఒక్కడవు మాత్రమే. ఆలస్యం చేయవద్దు!
PSA 71:1 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందును.
PSA 71:2 నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు. నా మాట వినుము. నన్ను రక్షించుము.
PSA 71:3 భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము. నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము. నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.
PSA 71:4 నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
PSA 71:5 నా ప్రభువా, నీవే నా నిరీక్షణ. నేను నా యౌవ్వనకాలంనండి నిన్ను నమ్ముకొన్నాను.
PSA 71:6 నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను. నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు. నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను.
PSA 71:7 ఇతరులకు నేను మాదిరిగా ఉన్నాను. ఎందుకంటే నీవే నా బలానికి ఆధారం.
PSA 71:8 నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతున్నాను.
PSA 71:9 కనుక నేను ముసలివాడినని నన్ను తోసివేయకుము. నా బలము క్షీణిస్తూండగా నన్ను విడిచి పెట్టకుము.
PSA 71:10 నా శత్రువులు నిజంగా నాకు విరోధంగా పథకాలు వేసారు. ఆ మనుష్యులు నిజంగా కలుసుకొని నన్ను చంపుటకు పథకం వేసారు.
PSA 71:11 “దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, వెళ్లి అతన్ని పట్టుకోండి. అతనికి ఎవరూ సహాయం చేయరు” అని నా శత్రువులు అంటున్నారు.
PSA 71:12 దేవా, నన్ను విడిచిపెట్టకుము. దేవా, త్వరపడుము! వచ్చి నన్ను రక్షించుము.
PSA 71:13 నా శత్రువులను ఓడించుము. వారిని పూర్తిగా నాశనం చేయుము. వారు నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్నారు. వారు సిగ్గు, అవమానం అనుభవిస్తారని నా నిరీక్షణ.
PSA 71:14 అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకొంటాను. నేను నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను.
PSA 71:15 నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబతాను. నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబతాను. లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు.
PSA 71:16 యేహోవా, నా ప్రభూ, ని గోప్పతనాన్ని గూర్చి నేను చెబతాను. నిన్ను గూర్చి నీ మంచితనం గూర్చి మాత్రమే నేను మాట్లాడుతాను.
PSA 71:17 దేవా, నేను చిన్న వానిగా ఉన్నప్పటి నుండి నీవు నాకు నేర్పించావు. నీవు చేసే అద్భుత విషయాలను గూర్చి ఈనాటివరకు నేను చెబతూనే ఉన్నాను.
PSA 71:18 దేవా, నేను తల నెరసిన వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు. నీ శక్తి, గొప్పదనాలను గూర్చి ప్రతి కొత్త తరానికీ నేను చెబతాను.
PSA 71:19 దేవా, నీ మంచితనం ఆకాశాల కంటే ఎంతో ఉన్నతమైనది. దేవా, నీ వంటి దేవుడు మరొకడు లేడు. నీవు ఆశ్చర్యకర కార్యాలు చేశావు.
PSA 71:20 నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను చూడనిచ్చావు. కాని వాటిలో ప్రతి ఒక్క దాని నుండి నీవు నన్ను రక్షించావు. మరియు బ్రతికించి ఉంచావు. భూమి లోతులనుండి కూడా నీవు నన్ను తిరిగి పైకి తీస్తావు.
PSA 71:21 ఇదివరకటి కంటే గొప్ప కార్యాలు చేయుటకు నాకు సహాయం చేయుము. నన్ను ఆదరిస్తూనే ఉండుము.
PSA 71:22 స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను. నా దేవా, నీవు నమ్మదగిన వాడవని నేను పాడుతాను. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి నా సితారాతో నేను పాటలు పాడుతాను.
PSA 71:23 నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది. నేను నా పెదవులతో స్తుతి కీర్తనలు పాడుతాను.
PSA 71:24 అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది. నన్ను చంపాలని కోరే ప్రజలు ఓడించబడి అవమానం పొందుతారు.
PSA 72:1 సొలొమోను కీర్తన. దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము. రాజకుమారుడు నీ మంచి తనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము.
PSA 72:2 నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము. నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము.
PSA 72:3 దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము.
PSA 72:4 పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక. నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము.
PSA 72:5 సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను.
PSA 72:6 పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము. నేలమీద పడేజల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము.
PSA 72:7 అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము. చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము.
PSA 72:8 సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి మీద దూర స్థలాలకు అతని రాజ్యాన్ని విస్తరింపనిమ్ము.
PSA 72:9 అరణ్యంలో నివసించే ప్రజలను అతనికి సాగిలపడనిమ్ము అతని శత్రువులందరూ ధూళిలో వారి ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిల పడనిమ్ము.
PSA 72:10 తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక. షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక.
PSA 72:11 రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక. రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక.
PSA 72:12 మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు. మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు.
PSA 72:13 పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు. రాజు వారిని బతికించి ఉంచుతాడు.
PSA 72:14 వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు. ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం.
PSA 72:15 రాజు దీర్గాయుష్మంతుడగును గాక. షేబ నుండి బంగారం అతడు తీసుకొనును గాక. రాజుకోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి. ప్రతిరోజూ అతణ్ణి దీవించండి.
PSA 72:16 పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక. కొండలు పంటలతో నిండిపోవునుగాక. పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక. పొలాలు గడ్డితో నిండి పోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక.
PSA 72:17 రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక. సూర్యుడు ప్రకాశించునంతవరకు ప్రజలు అతని పేరును జ్ఞాపకం చేసికొందురు గాక. అతని మూలంగా ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక. మరియు వారందరూ అతన్ని దీవించెదరుగాక.
PSA 72:18 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి. అ లాంటి అద్భుతకార్యాలు చేయగల వాడు దేవుడు ఒక్కడే.
PSA 72:19 ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి. ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక. ఆమేన్, ఆమేన్!
PSA 72:20 యెష్షయి కుమారుడు దావీదు ప్రార్థనలు ఇంతటితో సమాప్తం.
PSA 73:1 ఆసాపు స్తుతి కీర్తన. దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు. పవిత్ర హృదయాలు కల ప్రజలకు దేవుడు మంచివాడు.
PSA 73:2 నేను దాదాపుగా జారిపోయి, పాపం చేయటం మొదలు పెట్టాను.
PSA 73:3 దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను. ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను.
PSA 73:4 ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు. వారు జీవించుటకు శ్రమపడరు.
PSA 73:5 మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు. ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు లేవు.
PSA 73:6 కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు. వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంతతేటగా ఉన్నాయో ఈ విషయం అంత తేట తెల్లం.
PSA 73:7 ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు. వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు.
PSA 73:8 ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు. వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు.
PSA 73:9 ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు. వారు భూమిని పాలించేవారని తలుస్తారు.
PSA 73:10 కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి వారు చెప్పే సంగతులు నమ్ముతారు.
PSA 73:11 “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు. సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబతారు.”
PSA 73:12 ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు. మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు.
PSA 73:13 కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి? నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి?
PSA 73:14 దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను. నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు.
PSA 73:15 ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను. కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది.
PSA 73:16 ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను. కాని నేను నీ ఆలయానికి వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమైనది.
PSA 73:17 నేను దేవుని ఆలయానికి వెళ్లాను, వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను.
PSA 73:18 దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు. వారు పడిపోయి నాశనం అవడం ఎంతో సులభం.
PSA 73:19 కష్టం అకస్మాత్తుగా రావచ్చును. అప్పుడు ఆ దుర్మార్గులు నాశనం అవుతారు. భయంకరమైన సంగతులు వారికి సంభవించవచ్చు. అప్పుడు వారు అంతమై పోతారు.
PSA 73:20 యెహోవా, మేము మేల్కొన్నప్పుడు మరచి పోయే కలవంటి వారు ఆ మనుష్యులు. మా కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను నీవు కనబడకుండా చేస్తావు.
PSA 73:21 నేను చాలా తెలివి తక్కువ వాడను. ధనికులను దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను. దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను. తెలివి తక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను.
PSA 73:23 నాకు కావలసిందంతా నాకు ఉంది నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. దేవా, నీవు నా చేయిపట్టు కొనుము.
PSA 73:24 దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము. ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు.
PSA 73:25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు. మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి?
PSA 73:26 ఒకవేళ నా మనస్సు, నా శరీరం నాశనం చేయబడుతాయేమో. కాని నేను ప్రేమించే బండ నాకు ఉంది. నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు.
PSA 73:27 దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు. నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
PSA 73:28 కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను. దేవుడు నా యెడల దయ చూపించాడు. నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం. దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబతాను.
PSA 74:1 ఆసాపు ధ్యాన గీతం. దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా? నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా?
PSA 74:2 చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో. నీవు మమ్మల్ని రక్షించావు. మేము నీకు చెందిన వాళ్లం. నీ నివాస స్థానమైన సీయోను పర్వతాన్ని జ్ఞాపకముంచుకోనుము.
PSA 74:3 దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిథిలాల మధ్య నడువుము. శత్రువు నాశనం చేసిన పవిత్ర స్థలానికి మరలా రమ్ము.
PSA 74:4 శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు. యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు వారు జెండాలను ఆలయంలో ఉంచారు.
PSA 74:5 శత్రుసైనికులు గొడ్డలితో కలుపు మొక్కలను నరికే మనుష్యుల్లా ఉన్నారు.
PSA 74:6 ఈ సైనికులు తమ గొడ్డళ్లను సమ్మెటలను ప్రయోగించి దేవా, నీ ఆలయంలోని నగిషీ గల చెక్క పనిని నరికివేశారు.
PSA 74:7 దేవా, ఆ సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు. వారు నీ ఆలయాన్ని నేల మట్టంగా కూల్చివేశారు. ఆ ఆలయం నీ నామ ఘనత కోసం నిర్నించబడింది.
PSA 74:8 శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్ణయించాడు. దేశంలోని ప్రతి ఆరాధనా స్థలాన్నీ వారు కాల్చివేసారు.
PSA 74:9 మా సొంత గుర్తులు ఏవీ మేము చూడలేక పోయాము. ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరు. ఏమి చేయాలో ఎవ్వరికీ తెలియదు.
PSA 74:10 దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి చేస్తాడు? నీ శత్రువు నీ నామమును శాశ్వతంగా అవమానించనిస్తావా?
PSA 74:11 దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా శక్షించావు.? నీవు నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని పూర్తిగా నాశనం చేశావు.
PSA 74:12 దేవా చాల కాలంగా నీవే మా రాజువు. నీవు ఎల్లప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద రక్షణ తెస్తావు.
PSA 74:13 దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు.
PSA 74:14 మకరపు తలలను నీవు చితుకగొట్టావు. దాని శరీరాన్ని అడవి జంతువులు తినివేయుటకు విడిచిపెట్టావు.
PSA 74:15 జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి ప్రపంచాన్ని వరదపాలు చేశావు. మరియు నదులు ఎండిపోవునట్లు నీవు చేశావు.
PSA 74:16 దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు రాత్రిని నీవు ఏలుతున్నావు. సూర్యుని, చంద్రుని నీవే చేశావు.
PSA 74:17 భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియమించావు. వేసవికాలం, చలికాలం నీవే సృష్టించావు.
PSA 74:18 దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు శత్రువు నిన్ను ఆవమానించాడని జ్ఞాపకం చేసుకో. ఆ తెలివి తక్కువ ప్రజలు నీ నామాన్ని ద్వేషిస్తారు.
PSA 74:19 దేవా, ఆ అడవి, మృగాలను నీ పావురాన్ని తీసుకోనివ్వకుము. నీ పేద ప్రజలను శాశ్వతంగా మరచి పోకుము.
PSA 74:20 నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకోనుము. ఈ దేశంలోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది.
PSA 74:21 దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది. వారిని ఇంకెంత మాత్రం బాధపడనివ్వకుము. నిస్సహాయులైన నీ పేద ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
PSA 74:22 దేవా, లేచి పోరాడుము. ఆ తెలివి తక్కువ ప్రజలు ఎల్లప్పుడూ నిన్ను అవమానించారని జ్ఞాపకం చేసుకోము.
PSA 74:23 ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన చెడు సంగతులు మరచిపోకుము. ఎడతెగక నీ శత్రువులు చేసే గర్జనను మరువవద్దు.
PSA 75:1 సంగీత నాయకునికి. “నాశనం చేయకు.” ఆసాపు స్తుతి కీర్తన. దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము. మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము. నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబతున్నాము.
PSA 75:2 దేవుడు ఇలా చెబతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను. న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
PSA 75:3 భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు దాని పునాది స్థంభాలను స్థిర పరచేవాడను నేనే.”
PSA 75:4 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగల వారని, ప్రముఖులమని తలుస్తారు. కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబతాను.”
PSA 75:6 తూర్పునుండిగాని పడమరనుండిగాని ఎడారి నుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
PSA 75:7 దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖడో దేవుడే నిర్ణయిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు. ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
PSA 75:8 దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది. అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలి కలతో నిండివుంది. ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు. దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
PSA 75:9 ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబతాను. ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
PSA 75:10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను. మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.
PSA 76:1 సంగీత నాయకునికి. వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన. యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు. దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
PSA 76:2 దేవుని ఆలయం షాలేములో ఉంది. దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
PSA 76:3 అక్కడ విల్లులను, బాణాలను కేడెములను, కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.
PSA 76:4 దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
PSA 76:5 ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు. వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది. బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకో లేకపోయారు.
PSA 76:6 యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు. రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
PSA 76:7 దేవా, నీవు భీకరుడవు. నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
PSA 76:8 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు. దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు. పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు. భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
PSA 76:10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు. నీవు నీ కోపం చూపిస్తావు. బతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.
PSA 76:11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు. ఇప్పుడు మీరు వాగ్దానం చేసిన దాన్ని ఆయనకు ఇవ్వండి. అన్ని చోట్లనుండీ ప్రజలు తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
PSA 76:12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు. భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.
PSA 77:1 సంగీత నాయకునికి. యెదూతూను రాగం. ఆసాపు కీర్తన. సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను. దేవా నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము.
PSA 77:2 నా దేవా నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను. రాత్రి అంతా నీకోసం నా చేయిచాపి ఉన్నాను. నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.
PSA 77:3 నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు, నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను.
PSA 77:4 నీవు నన్ను నిద్రపోనియ్యవు. నేనేదో చెప్పాలని ప్రయత్నించాను. కాని నేను చాలా కలపరపడి పోయాను.
PSA 77:5 గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను. చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.
PSA 77:6 రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను. నాలో నేను మాట్లాడుకొని గ్రహించుటకు ప్రయత్నిస్తాను.
PSA 77:7 “మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా? ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా?
PSA 77:8 దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా? ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా?
PSA 77:9 కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా? ఆయన జాలి కోపంగా మార్పబడిందా” అని నాకు అనిపిస్తుంది.
PSA 77:10 అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా? అనే విషయం నిజంగా నన్ను బాధిస్తుంది” అని తలచాను.
PSA 77:11 యేహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను. దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
PSA 77:12 నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను. ఆ విషయాలను గూర్చి నేను మాట్లాడాను.
PSA 77:13 దేవా, నీ మార్గాలు పవిత్రం. దేవా, ఏ ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు.
PSA 77:14 నీవు ఆద్భుత కార్యాలు చేసిన దేవుడివి. నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు.
PSA 77:15 నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు. యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు.
PSA 77:16 దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి. లోతైన జలాలు భయంతో కంపించాయి.
PSA 77:17 దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి. ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి. అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో ప్రజ్వరిల్లాయి.
PSA 77:18 పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి. మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది. భూమి కంపించి వణికింది.
PSA 77:19 దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు. కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు.
PSA 77:20 అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు మోషేను, అహరోనును నీవు వాడు కొన్నావు.
PSA 78:1 ఆసాపు ధ్యాన గీతం. నా ప్రజలారా నా ఉపదేశాలను వినండి. నేను చెప్పే విషయాలు వినండి.
PSA 78:2 ఈ కథ మీతో చెబతాను. ఈ పురాతన కథ నేను మీతో చెబతాను.
PSA 78:3 ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు. మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.
PSA 78:4 ఈ కథను మనము మరచిపోము. మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబతారు. మనమంతా యెహోవాను స్తుతిద్దాము. ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబదాము.
PSA 78:5 యాకోబుతో యెహోవా ఒక ఒడంబడికను చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మ శాస్త్రాన్ని ఇచ్చాడు. మన పూర్వీకులకు దేవుడు ఆదేశాలు ఇచ్చాడు. మన పూర్వీకులు తమ సంతతివారికి న్యాయచట్టం బోధించాలని ఆయన వారితో చెప్పాడు.
PSA 78:6 ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మ శాస్త్రాన్ని తెలుసుకొంటారు. కొత్త తరాలు పుడుతాయి వారు పెద్దవారిగా ఎదుగుతారు. వారు వారి పిల్లలకు ఈ కథ చెబతారు.
PSA 78:7 కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు. దేవుడు చేసిన పనులను వారు మరచిపోరు. వారు ఆయన ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు.
PSA 78:8 ఒక వేళ ప్రజలు తమ పిల్లలకు దేవుని ఆదేశాలు ఉపదేశిస్తే, అప్పుడు ఆ పిల్లలు తమ పూర్వీకుల్లా ఉండరు. వారి పూర్వీకులు దేవునికి విరోధంగా తిరిగారు. వారు ఆయనకు విధేయులగుటకు తిరస్కరించారు. ఆయన ఆజ్ఞలకు విధేయులగుటలో వారు మొండి ప్రజలు.
PSA 78:9 ఎఫ్రాయిము కుటుంబ దళంలోని పురుషులు వారి విసురు కర్రలు కలిగి ఉన్నారు. కాని వారు యుద్ధంలో నుండి పారిపోయారు.
PSA 78:10 వారు యెహోవాతో తమ ఒడంబడికను నిలుపు కోలేదు. దేవుని ఉపదేశాలకు విధేయులగుటకు వారు నిరాకరించారు.
PSA 78:11 ఎఫ్రాయిముకు చెందిన ఆ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరచిపోయారు. ఆయన వారికి చూపించిన అద్భుతకార్యాలను వారు మరిచిపోయారు.
PSA 78:12 ఈజిప్టులోను, సోయను వద్దను దేవుడు తన మహాశక్తిని వారి తండ్రులకు చూపెట్టాడు.
PSA 78:13 దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ప్రజలను దాటించాడు. వారికి రెండు వైపులా నీళ్లు బలమైన గోడల్లా నిలబడ్డాయి.
PSA 78:14 ప్రతిరోజూ మేఘం నీడలో దేవుడు ఆ ప్రజలను నడిపించాడు. ప్రతిరాత్రి అగ్నిస్తంభం నుండి వచ్చే వెలుగు చేత దేవుడు వారిని నడిపించాడు.
PSA 78:15 అరణ్యంలో దేవుడు బండను చీల్చాడు. భూమి అగాధం నుండి ఆ ప్రజలకు ఆయన నీళ్లు ఇచ్చాడు.
PSA 78:16 బండ నుండి దేవుడు నీళ్లను ప్రవహింప చేసాడు. అది ఒక నదిలా ఉంది.
PSA 78:17 కాని ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే పోయారు. అరణ్యంలో కూడ సర్వోన్నతుడైన దేవునికి వారు విరోధంగా తిరిగారు.
PSA 78:18 అప్పుడు ఆ ప్రజలు దేవుని పరీక్షించాలని తీర్మానించారు. కేవలం వారి ఆకలిని తృప్తి పరచుటకు ఆహారం కోసం వారు దేవుని ఆడిగారు.
PSA 78:19 వారు దేవునికి విరోధంగా మాట్లాడారు. “ఎడారిలో దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా?
PSA 78:20 దేవుడు బండను కొట్టాడు. కాగా నీళ్ల ప్రవాహం బయటకు వచ్చింది. తప్పక ఆయన మనకు కొంత రొట్టె, మాంసం ఇవ్వగలడు” అని వారన్నారు.
PSA 78:21 ఆ ప్రజలు చెప్పింది యెహోవా విన్నాడు. యాకోబు మీద దేవునికి చాలా కోపం వచ్చింది. ఇశ్రాయేలు మీద దేవునికి చాల కోపం వచ్చింది.
PSA 78:22 ఎందుకంటే ఆ ప్రజలు ఆయనయందు నమ్మకముంచలేదు. దేవుడు వారిని రక్షించగలడని వారు విశ్వసించలేదు.
PSA 78:23 కాని అప్పుడు దేవుడు పైన మేఘాలను తెరిచాడు. వారికి ఆహారంగా ఆయన మన్నా కురిపించాడు. అది ఆకాశపు ద్వారాలు తెరచినట్టు ఆకాశంలోని ధాన్యా గారం నుండి ధాన్యం పోసినట్టు ఉంది.
PSA 78:25 ప్రజలు దేవదూతల ఆహారం తిన్నారు. ఆ ప్రజలను తృప్తిపరచుటకు దేవుడు సమృద్ధిగా ఆహారం పంపించాడు.
PSA 78:26 అంతట దేవుడు తూర్పు నుండి ఒక బలమైన గాలి వీచేలా చేశాడు. వర్షం కురిసినట్లుగా పూరేళ్లు వారిమీద వచ్చి పడ్డాయి. దేవుని మహా శక్తి తేమాను నుండి గాలి వీచేలా చేసింది. ఆ పక్షులు చాలా విస్తారంగా ఉండినందుచేత నీలాకాశం నల్లగా మారిపోయింది.
PSA 78:28 ఆ ప్రజల గుడారాల చుట్టూరా, వారి ఇండ్ల మధ్యలో ఆ పక్షులు వచ్చి పడ్డాయి.
PSA 78:29 తినేందుకు వారికి సమృద్ధిగా ఉంది. కాని తమ ఆకలి తమని పాపం చేసేలా వారు చేసుకున్నారు.
PSA 78:30 వారు వారి ఆకలిని అదుపులో పెట్టుకోలేదు. అందు చేత ఆ పక్షుల రక్తం కార్చివేయక ముందే వారు ఆ పూరేళ్లను తినివేసారు.
PSA 78:31 ఆ ప్రజల మీద దేవునికి చాలా కోపం వచ్చింది వారిలో అనేక మందిని ఆయన చంపివేసాడు. ఆరోగ్యవంతులైన అనేకమంది పడుచువాళ్లు చచ్చేటట్టుగా దేవుడు చేశాడు.
PSA 78:32 కాని ఆ ప్రజలు యింకా పాపం చేశారు. దేవుడు చేయగల ఆశ్చర్యకరమైన విషయాల మీద వారు ఆధారపడలేదు.
PSA 78:33 కనుక దేవుడు వారి పనికిమాలిన జీవితాలను ఏదో విపత్తుతో అంతం చేశాడు.
PSA 78:34 దేవుడు వారిలో కొందరిని చంపినప్పుడల్లా మిగిలిన వారు ఆయన వైపుకు మళ్లుకొన్నారు. వారు పరుగెత్తుకుంటూ దేవుని దగ్గరకు తిరిగి వచ్చారు.
PSA 78:35 దేవుడే తమ బండ అని ఆ ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు. సర్వోన్నతుడైన దేవుడే తమని రక్షించాడని వారు జ్ఞాపకం చేసుకొంటారు.
PSA 78:36 వారు ఆయన్ని ప్రేమిస్తున్నామని అన్నారు, కాని వారి మాట నిజంకాదు. వారు అబద్ధం చేప్పారు.
PSA 78:37 వారి హృదయాలు నిజంగా దేవునితో లేవు. వారు ఒడంబడికకు నమ్మకంగా లేరు.
PSA 78:38 కాని దేవుడు దయకలిగినవాడు. వారి పాపాల విషయంలో ఆయన వారిని క్షమించాడు. ఆయన వారిని నాశనం చేయలేదు. అనేకసార్లు దేవుడు తన కోపాన్ని అణచుకొన్నాడు. దేవుడు తనకు మరీ ఎక్కువ కోపాన్ని రానీయలేదు.
PSA 78:39 వారు కేవలం మనుష్య మాత్రులే అని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు. మనుష్యులు అప్పుడే వీచి, అంతలోనే మాయమై పోయే గాలి వంటివారు.
PSA 78:40 అయ్యో, ఎడారిలో ఆ ప్రజలు దేవునికి అనేక తొందరలు కలిగించారు. ఆ ఎడారి దేశంలో వారు ఆయన్ని ఎంతో దుఃఖ పెట్టారు.
PSA 78:41 ఆ ప్రజలు దేవుని సహనాన్ని మరలా మరలా పరీక్షించారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధునికి నిజంగా వారు ఎంతో బాధ కలిగించారు.
PSA 78:42 ఆ ప్రజలు దేవుని శక్తిని గూర్చి మరచిపోయారు. శత్రువు బారినుండి దేవుడు తమని అనేకసార్లు రక్షించిన విషయం వారు మరచిపోయారు.
PSA 78:43 ఈజిప్టులో ఆయన చేసిన అద్భుతాలను వారు మరచిపోయారు. సోయను పొలాలలో జరిగిన అద్భుతాలను వారు మరచిపోయారు.
PSA 78:44 నదులను దేవుడు రక్తంగా మార్చాడు! ఈజిప్టు వారు నీళ్లు తాగలేకపోయారు.
PSA 78:45 ఈజిప్టు ప్రజలను కుట్టిన జోరీగల దండులను దేవుడు పంపించాడు. ఈజిప్టు వారి బ్రతుకులను పాడు చేయగలిగిన కప్పలను దేవుడు పంపించాడు.
PSA 78:46 దేవుడు వారి పంటలను చీడ పురుగులకు అప్పగించాడు. వారి ఇతర మొక్కలను మిడతలకు అప్పగించాడు.
PSA 78:47 ఈజిప్టు వారి ద్రాక్షాతీగెలను నాశనం చేయటానికి దేవుడు వడగండ్లను వాడుకొన్నాడు. వారి చెట్లను నాశనం చేయుటకు ఆయన హిమమును వాడు కొన్నాడు.
PSA 78:48 దేవుడు వారి జంతువులను వడగండ్ల చేతను వారి పశుపులను పిడుగుల చేతను చంపేశాడు.
PSA 78:49 దేవుడు తన భయంకరమైన కోపాన్ని ఈజిప్టువారికి చూపించాడు. నాశనం చేసే తన దేవదూతలను వారికి విరోధంగా ఉండుటకు ఆయన పంపించాడు.
PSA 78:50 దేవుడు తన కోపాన్ని చూపించుటకు ఒక మార్గం కనుగొన్నాడు. ఆ ప్రజలలో ఎవరినీ ఆయన బతకనివ్వలేదు. వారినందరినీ ఓ భయంకర రోగంతో ఆయన చావనిచ్చాడు.
PSA 78:51 ఈజిప్టులో ప్రథమ సంతానాన్ని దేవుడు చంపివేసాడు. హాము సంతానంలో ప్రతి మొదటి బిడ్డనీ ఆయన చంపివేసాడు.
PSA 78:52 తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను గొర్రెల కాపరిలా నడిపించాడు. ఆయన తన ప్రజలను అరణ్యం లోనికి గొర్రెలను నడిపించినట్లుగా నడిపించాడు.
PSA 78:53 ఆయన తన ప్రజలను క్షేమంగా నడిపించాడు. దేవుని ప్రజలు భయపడాల్సింది. ఏమీ లేదు. వారి శత్రువులను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచి వేసాడు.
PSA 78:54 దేవుడు తన ప్రజలను తన పవిత్ర దేశానికి నడిపించాడు. తన స్వంత శక్తితో సీయోను పర్వతానికి ఆయన నడిపించాడు.
PSA 78:55 ఇతర రాజ్యాలు ఆ దేశాన్ని విడిచిపెట్టేటట్టు దేవుడు వారిని బలవంతం చేసాడు. దేవుడు తన ప్రజలకు వారి వంతు దేశాన్ని ఇచ్చాడు. అందుచేత ఇశ్రాయేలీయులు వారి స్వంత గృహాలలో నివసించారు.
PSA 78:56 కానీ ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడైన దేవున్ని ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖ పెట్టారు. ఆ ప్రజలు దేవుని ఆదేశాలకు విధేయులు కాలేదు.
PSA 78:57 ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లు కొన్నారు. వారు వారి తండ్రుల్లాగే ద్రోహులుగాను, అపనమ్మ కస్తులుగాను ఉన్నారు. వారు మోసకరమైన విల్లులా వంకర తిరిగారు.
PSA 78:58 ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు. దేవతల విగ్రహాలను వారు తయారు చేసి దేవునికి రోషం పుట్టించారు.
PSA 78:59 దేవుడు ఇది విని చాలా కోపగించాడు. మరియు ఇశ్రాయేలీయులను దేవుడు పూర్తిగా తిరస్కరించాడు.
PSA 78:60 షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. ఇది ప్రజల మధ్య నివసించిన దేవుని గుడారం.
PSA 78:61 అప్పుడు దేవుడు ఇతర రాజ్యాల ద్వారా తన ప్రజలను బందీలుగా చేయనిచ్చాడు. దేవుని “అందమైన ఆభరణాన్ని” శత్రువులు తీసుకొన్నారు.
PSA 78:62 తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం చూపించాడు. ఆయన వారిని యుద్ధంలో చంపబడనిచ్చాడు.
PSA 78:63 యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు. పెళ్లి కావాల్సిన యువతులు పెళ్లిపాటలు ఏమి పాడలేదు.
PSA 78:64 యాజకులు చంపివేయబడ్డారు. కాని విధవలు వారి కోసం ఏడ్వలేదు.
PSA 78:65 తాగి కేకలువేసే బలాఢ్యుడైన మనిషివలె, నిద్రనుండి మేల్కోన్న మనిషివలె ప్రభువు లేచాడు.
PSA 78:66 దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని ఓడించాడు. దేవుడు తన శత్రువులను ఓడించి, శాశ్వతంగా వారిని అవమానించాడు.
PSA 78:67 కానీ యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరించాడు. ఎఫ్రాయిము కుటుంబాన్ని దేవుడు కోరుకోలేదు.
PSA 78:68 దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు. మరియు దేవుడు తనకు ప్రియమైన సీయోను పర్వతాన్ని కోరుకొన్నాడు.
PSA 78:69 ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర ఆలయాన్ని నిర్మించాడు. భూమిలాగే, తన పవిత్ర ఆలయం శాశ్వతంగా ఉండేటట్టు దేవుడు నిర్మించాడు.
PSA 78:70 తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొన్నాడు. దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని ఆ పని నుండి తీసివేసాడు.
PSA 78:71 గొర్రెలను కాపాడే పని నుండి దేవుడు దావీదును తొలగించి, తన ప్రజలను, యాకోబు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సొత్తును కాపాడే పని దావీదుకు యిచ్చాడు.
PSA 78:72 మరియు దావీదు పవిత్ర హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. అతడు చాలా జ్ఞానంతో వారిని నడిపించాడు.
PSA 79:1 ఆసాపు స్తుతి కీర్తన. దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు. ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని ఆపవిత్రపరచి నాశనం చేసారు. యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
PSA 79:2 అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు. అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
PSA 79:3 దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు. మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువ బడలేదు.
PSA 79:4 మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి. మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
PSA 79:5 దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా? బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
PSA 79:6 దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము. నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
PSA 79:7 ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి. వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
PSA 79:8 దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము. త్వరపడి. నీ దయ మాకు చూపించుము. నీవు మాకు ఎంతో అవసరం.
PSA 79:9 మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము. నీ స్వంత నామానికి నీవు మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము. మమ్మల్ని రక్షించుము. నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
PSA 79:10 “మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?” అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు. దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము. నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము.
PSA 79:11 దయచేసి, ఖైదీల మూల్గులు వినుము! దేవా, మరణించుటకు ఏర్పరచబడిన ఈ ప్రజలను నీ మహా శక్తివలన రక్షించుము.
PSA 79:12 దేవా, మా చుట్టూరా ఉన్న ప్రజలు మాకు చేసిన వాటిని బట్టి ఏడు మార్లు వారిని శిక్షించుము. ఆ ప్రజలు నిన్ను అవమానించిని సమయాలనుబట్టి వారిని శిక్షించుము.
PSA 79:13 మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం. మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము. దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.
PSA 80:1 సంగీత నాయకునికి. “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన. ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము. యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము. కెరూబలపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
PSA 80:2 ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మాహాత్మ్యం చూపించుము. వచ్చి మమ్మల్ని రక్షించుము.
PSA 80:3 దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము. మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
PSA 80:4 సర్వశక్తిగల యెహోవా దేవా నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా? మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
PSA 80:5 నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు. నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
PSA 80:6 మాపొరుగు వారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు. మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
PSA 80:7 సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము. నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.
PSA 80:8 గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు. ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు. ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు. నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
PSA 80:9 “ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు. దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
PSA 80:10 అది పర్వతాలను కప్పివేసింది. దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
PSA 80:11 దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
PSA 80:12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గొడను నీవెందుకు పడగొట్టావు? ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
PSA 80:13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి. అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
PSA 80:14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
PSA 80:15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము. నీవు పెంచిన ఆ లేతమొక్కలను చూడుము.
PSA 80:16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది. నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు.
PSA 80:17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము. నీవు పెంచిన నీ కుమారుని అదుకొనుము.
PSA 80:18 అతడు మరల నిన్ను విడువడు. అతన్ని బదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
PSA 80:19 సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము. నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.
PSA 81:1 సంగీత నాయకునికి. గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన. సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి. ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
PSA 81:2 సంగీతం ప్రారంభించండి గిలక తప్పెట వాయించండి. స్వరమండలం, సితారాల శ్రావ్యంగా వాయించండి.
PSA 81:3 నెలవంక నాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి. పౌర్ణమినాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
PSA 81:4 అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం. ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
PSA 81:5 ఈజిప్టునుండి యోసేపును దేవుడు తీసుకొనిపోయిన సమయంలో దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు. ఈజిప్టులో నేను గ్రహించని భాషవిన్నాను.
PSA 81:6 దేవుడు ఇలా చెపుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను. నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
PSA 81:7 మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను. తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను. నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”
PSA 81:8 “నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక నేను మీకు యిస్తాను. ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
PSA 81:9 విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను ఎవరినీ ఆరాధించవద్దు.
PSA 81:10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే. ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు, నేను దానిని నింపుతాను.
PSA 81:11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు. ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
PSA 81:12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను. ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
PSA 81:13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
PSA 81:14 అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను. ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
PSA 81:15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు, అందుచేత వారు శిక్షించబడతారు.
PSA 81:16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు. తన ప్రజలకు తృప్తి కలిగెంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”
PSA 82:1 ఆసాపు స్తుతి కీర్తన. దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుస్తున్నాడు. ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
PSA 82:2 ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు? దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.
PSA 82:3 “అనాధలను, పేద ప్రజలను కాపాడండి. న్యాయం జరగని పేద ప్రజల, అనాదుల హక్కులను కాపాడండి.
PSA 82:4 పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి. దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.
PSA 82:5 “ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. వారు గ్రహించరు. వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు. వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
PSA 82:6 నేను (దేవుడు) మీతో చెప్పాను, “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
PSA 82:7 కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు. ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”
PSA 82:8 దేవా, లెమ్ము నీవే న్యాయమూర్తివిగా ఉండుము! దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.
PSA 83:1 ఆసాపు స్తుతి గీతం. దేవా, మౌనంగా ఉండవద్దు! నీ చెవులు మూసికోవద్దు! దేవా, దయచేసి ఊరుకోవద్దు.
PSA 83:2 దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు. నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు.
PSA 83:3 నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు. నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.
PSA 83:4 “ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము. అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబతున్నారు.
PSA 83:5 దేవా, నీకు విరోధంగా పోరాడేందుకు నీవు మాతోచేసిన ఒడంబడికకు విరోధంగా పోరాడేందుకు ఆ ప్రజలంతా ఏకమయ్యారు.
PSA 83:6 ఆ శత్రువులు మనకు విరోధంగా పోరాడేందుకు ఏకమయ్యారు. ఎదోము, ఇష్మాయేలు ప్రజలు; మోయాబు, హగ్రీ సంతతివారు; గెబలువారు; అమ్మోను, అమాలేకీ ప్రజలు; ఫిలిష్తీ ప్రజలు; తూరులో నివసించే ప్రజలంతా మనతో పోరాడుటకు ఏకమయ్యారు.
PSA 83:8 అష్షూరు సైన్నం లోతు వంశస్థులతో చేరి, వారంతా నిజంగా బలముగలవారయ్యారు.
PSA 83:9 దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది దగ్గర సీసెరానును, యాబీనును నీవు ఓడించినట్టు శత్రువును ఓడించుము.
PSA 83:10 ఫన్దోరు వద్ద నీవు వారిని ఓడించావు. వారి దేహాలు నేల మీద కుళ్లిపోయాయి.
PSA 83:11 దేవా, శత్రువుల నాయకులను ఓడించుము. ఓరేబకు, జెయేబుకు నీవు చేసిన వాటిని వారికి చేయుము. జెబహు, సల్మున్నా అనేవారికి నీవు చేసిన వాటిని వారికి చేయుము.
PSA 83:12 దేవా, మేము నీ దేశం విడిచేందుకు ఆ ప్రజలు మమ్మల్ని బలవంత పెట్టాలని అనుకొన్నారు.
PSA 83:13 గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె ఆ ప్రజలను చేయుము. గాలి చెదరగొట్టు గడ్డిలా ఆ ప్రజలను చేయుము.
PSA 83:14 అగ్ని అడవిని నాశనం చేసినట్టు కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు శత్రువును నాశనం చేయుము.
PSA 83:15 దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజలను తరిమివేయుము. సుడిగాలిలా వారిని కంపింపజేసి, విసరివేయుము.
PSA 83:16 దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము. అప్పుడు వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు.
PSA 83:17 దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గు పడునట్లు చేయుము. వారిని అవమానించి, నాశనం చేయుము.
PSA 83:18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసు కొంటారు. నీ పేరు యోహోవా అని వారు తెలుసుకొంటారు. నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు అని వారు తెలుసుకొంటారు.
PSA 84:1 సంగీత నాయకునికి. గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
PSA 84:2 యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను. నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను. నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
PSA 84:3 సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా, పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి. ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి. అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
PSA 84:4 నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.
PSA 84:5 ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు. వారు నిన్నే నడిపించ నిస్తారు.
PSA 84:6 దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నీటి మడుగులు నిలిచే బాకా లోయగుండా వారు పయనిస్తారు.
PSA 84:7 వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయేమార్గంలో ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.
PSA 84:8 సర్వశక్తిమంతుడవై యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే యాకోబు దేవా, నా మాట వినుము.
PSA 84:9 దేవా, మా సంరక్షకుని కాపాడుము. నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.
PSA 84:10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె నీ ఆలయంలో ఓక్కరోజు ఉండుట మేలు. దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
PSA 84:11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు. దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు. యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
PSA 84:12 సర్వశక్తిమంతుడవై యెహోవా, నిన్ను నమ్ముకోనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.
PSA 85:1 సంగీత నాయకునికి. కోరహు కుమారుల స్తుతి కీర్తన యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము. యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
PSA 85:2 యెహోవా, నీ ప్రజలను క్షమించుము! వారి పాపాలు తుడిచివేయుము.
PSA 85:3 యెహోవా, కోపంగాను, ఆవేశంగా నుండవద్దు.
PSA 85:4 మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి, మమ్మల్ని మరల స్వీకరించు.
PSA 85:5 నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?
PSA 85:6 దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము! నీ ప్రజలను, సంతోషింపజేయుము.
PSA 85:7 యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము. మమ్మల్ని రక్షించుము.
PSA 85:8 దేవుడు చప్పేది నేను వింటున్నాను. తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబతున్నాడు. ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
PSA 85:9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు. మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బతుకుతాము.
PSA 85:10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది. మంచితనం, శాంతి, ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
PSA 85:11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా వుంటారు. పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
PSA 85:12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు. భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
PSA 85:13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
PSA 86:1 దావీదు ప్రార్థన. నేను నిరుపేద, నిస్సహాయుణ్ణి. యోహావా, దయతో నా మాట విని నా ప్రార్థనకు జవాబు ఇమ్ము.
PSA 86:2 యెహోవా, నేను నీ అనుచరుడను. దయతో నన్ను కాపాడు. నేను నీ సేవకుడను. నీవు నా దేవుడవు. నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నన్ను రక్షించుము.
PSA 86:3 నా ప్రభువా నా మీద దయ చూపించుము. రోజంతా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను.
PSA 86:4 ప్రభువా, నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను. నన్ను సంతోషపెట్టుము, నేను నీ సేవకుడను.
PSA 86:5 ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు. సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను నీవు నిజంగా ప్రేమిస్తావు.
PSA 86:6 యెహోవా, దయకోసం నేను మొరపెట్టుకునే నా ప్రార్థనలు ఆలకించుము.
PSA 86:7 యెహోవా, నా కష్టకాలంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నీవు నాకు జవాబు యిస్తావని నాకు తెలుసు.
PSA 86:8 దేవా, నీవంటివారు మరొకరు లేరు. నీవు చేసిన వాటిని ఎవ్వరూ చేయలేరు.
PSA 86:9 ప్రభువా, నీవే అందరినీ సృష్టించావు. వారందరూ నిన్ను ఆరాధించెదరు గాక. వాళ్లంతా నీ నామాన్ని ఘనపరిచెదరు గాక.
PSA 86:10 దేవా, నీవు గొప్పవాడవు! నీవు అద్భుత కార్యాలు చేస్తావు. నీవు మాత్రమే దేవుడవు.
PSA 86:11 యెహోవా నీ మార్గాలు నాకు నేర్పించు నేను నీ సత్యాలకు లోబడి జీవిస్తాను. నిన్నారాధించుటయే నా జీవితంలోకెల్లా అతి ముఖ్యాంశంగా చేయుము.
PSA 86:12 దేవా, నా ప్రభువా నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని నేను శాశ్వతంగా కీర్తిస్తాను.
PSA 86:13 దేవా నా యెడల నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. మరణపు అగాథ స్థలం నుండి నీవు నన్ను రక్షిస్తావు.
PSA 86:14 దేవా, గర్విష్టులు నాపై పడుతున్నారు. కృ-రులైన మనుష్యుల గుంపు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. ఆ మనుష్యులు నిన్ను గౌరవించటం లేదు.
PSA 86:15 ప్రభూ, నీవు, దయ, కరుణగల దేవుడవు. నీవు సహనం నమ్మకత్వం, ప్రేమతో నిండి ఉన్నావు.
PSA 86:16 దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము. నాకు బలాన్ని అనుగ్రహించుము. నేను నీ సేవకుడను. నన్ను రక్షించుము. నేను నీ సేవకుడను.
PSA 86:17 దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము. అప్పుడు నా శత్రువులు నిరాశ చెందుతారు. ఎందుకంటే ప్రభూ, నీవు నా యెడల దయ చూపించావని, నాకు సహాయం చేశావని అది తెలియచేస్తుంది.
PSA 87:1 కోరహు కుమారుల స్తుతి కీర్తన. యెరూషలేము కొండల మీద దేవుడు తన ఆలయం నిర్మించాడు.
PSA 87:2 ఇశ్రాయేలులో ఏ ఇతర స్థలాల కంటె సీయోను ద్వారాలు యెహోవాకు ఎక్కువ ఇష్టం.
PSA 87:3 దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులు చెబతారు.
PSA 87:4 దేవుడు తన ప్రజలందరిని గూర్చీ ఒక జాబితా ఉంచుతున్నాడు. దేవుని ప్రజలు కొందరు ఈజిప్టులోను బబలోనులోను జీవిస్తున్నారు. ఆయన ప్రజలు కొందరు ఫిలిష్తీయలో, తూరులో, చివరికి ఇతియోపియాలో జన్మించినట్లు ఆ జాబితా తెలియజేస్తుంది.
PSA 87:5 సీయోను గడ్డ మీద జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తినీ దేవుడు ఎరుగును. సర్వోన్నతుడవైన దేవుడు ఆ పట్టణాన్ని నిర్మించాడు.
PSA 87:6 దేవుడు తన ప్రజలు అందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతాడు. ఒక్కో వ్యక్తి ఎక్కడ జన్మించింది దేవునికి తెలుసు.
PSA 87:7 దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు యెరూషలేము వెళ్తారు. దేవుని ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. “మంచివన్నీ యెరూషలేము నుండి వస్తాయి.” అని వారు అంటారు.
PSA 88:1 కోరహు కుమారుల స్తుతి కీర్తన. సంగీ త నాయకునికి. బాధాకరమైన ఒక వ్యాధిని గూర్చి ఎజ్రాహివాడైన హేమాను ధ్యాన గీతం. యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు. రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
PSA 88:2 దయచేసి నా ప్రార్థనలను గమనించుము. కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము.
PSA 88:3 నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను. మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను.
PSA 88:4 జీవించుటకు బహు బలహీనుడివలె చనిపోయిన మనిషివలె ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు.
PSA 88:5 మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను. నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను. నీనుండీ నీ జాగ్రత్తనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను. మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు.
PSA 88:6 యెహోవా, నీవు నన్ను భూమి కింద సమాధిలో ఉంచావు. నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు.
PSA 88:7 నీవు నా మీద కోపగించావు. నీవు నన్ను శిక్షించావు.
PSA 88:8 నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు. అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు. నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను.
PSA 88:9 నా బాధ అంతటినీ గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి. యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను.
PSA 88:10 యెహోవా, చనిపోయిన వారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు! దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు!
PSA 88:11 చనిపోయిన వాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు. చనిపోయిన వారు మృతులలోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు.
PSA 88:12 చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు. మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు.
PSA 88:13 యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను. ప్రతి వేకువ ఝామునా నేను నిన్ను ప్రార్థిస్తాను.
PSA 88:14 యోహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు? నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు?
PSA 88:15 నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని. నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను.
PSA 88:16 యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు. శిక్ష నన్ను చంపేస్తుంది.
PSA 88:17 నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి. నా నొప్పులు, బాధల్లో నేను మునిగి పోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
PSA 88:18 మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచి పెట్టివేసేటట్టుగా నీవు చేశావు. చీకటి మాత్రమే నాకు మిగిలింది.
PSA 89:1 ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం. యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను. ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
PSA 89:2 యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను. నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!
PSA 89:3 దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను. నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
PSA 89:4 ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను. నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”
PSA 89:5 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి. పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
PSA 89:6 పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు. “దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
PSA 89:7 యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు ఆ దేవ దూతులు భయపడి యెహోవాను గౌరవిస్తారు. వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
PSA 89:8 సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగల వారు ఒక్కరూ లేరు. మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
PSA 89:9 ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు. దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
PSA 89:10 దేవా, నీవు రహబును ఓడించావు. నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
PSA 89:11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వంనీదే. ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
PSA 89:12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు. తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
PSA 89:13 దేవా, నీకు శక్తి ఉంది! నీ శక్తి గొప్పది! విజయం నీదే!
PSA 89:14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది. ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
PSA 89:15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు. వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
PSA 89:16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది. వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
PSA 89:17 నీవే వారి అద్భుత శక్తివి, వారి శక్తి, నీ నుండే లభిస్తుంది.
PSA 89:18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
PSA 89:19 కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు. నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను. ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.
PSA 89:20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను. నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
PSA 89:21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను. మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
PSA 89:22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు. దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
PSA 89:23 అతని శత్రువులను నేను అంతం చేసాను. ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
PSA 89:24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను. నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
PSA 89:25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను. నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
PSA 89:26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’ అని అతడు నాతో చెబతాడు.
PSA 89:27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను. భూ రాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
PSA 89:28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది. అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
PSA 89:29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది. ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
PSA 89:30 అతని సంతతి వారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే, నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.
PSA 89:31 ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞాలను ఉల్లంఘించి, నా ఆదేశాలను పాటించకపోతే
PSA 89:32 అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
PSA 89:33 కానీ వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను. నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.
PSA 89:34 దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను. మా ఒడంబడికను నేను మార్చను.
PSA 89:35 నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్ధానం చేసాను. మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.
PSA 89:36 దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది. సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
PSA 89:37 చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది. ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”
PSA 89:38 కానీ దేవా, ఏర్పరచబడిన నీ రాజు మీద నీకు కోపం వచ్చింది. నీవు అతన్ని ఒంటరి వానిగా విడిచి పెట్టావు.
PSA 89:39 నీ ఒడంబడికను నీవు తిరస్కరించావు. రాజు కిరీటాన్ని నీవు దుమ్ములో పారవేసావు.
PSA 89:40 రాజు పట్టణపు గోడలను నీవు కూలగొట్టావు. అతని కోటలన్నింటినీ నీవు నాశనం చేశావు.
PSA 89:41 రాజు పొరుగువారు అతన్ని చూచి నవ్వుతారు. దారినపోయే మనుష్యులు అతని నుండి వస్తువులు దొంగిలిస్తారు.
PSA 89:42 రాజు శత్రువులందరికీ నీవు సంతోషం కలిగించావు. అతని శత్రువులను యుద్ధంలో నీవు గెలువనిచ్చావు.
PSA 89:43 దేవా, వారిని వారు కాపాడుకొనేందుకు నీవు వారికి సహాయం చేశావు. నీ రాజు యుద్ధంలో గెలిచేందుకు నీవు అతనికి సహాయం చేయలేదు.
PSA 89:44 అతని సింహాసనాన్ని నీవు నేలకు విసరివేశావు.
PSA 89:45 అతని ఆయుష్షు నీవు తగ్గించి వేశావు. నీవు అతన్ని అవమానించావు.
PSA 89:46 యెహోవా, నీవు శాశ్వతంగా మా నుండి మరుగైయుంటావా? నీ కోపం అగ్నిలా ఎప్పటికీ మండుతూ ఉంటుందా? ఎంత కాలం యిలా సాగుతుంది?
PSA 89:47 నా ఆయుష్షు ఎంత తక్కువో జ్ఞాపకం చేసికొనుము. అల్పకాలం జీవించి, తర్వాత మరణించేందుకు నీవు మమ్మల్ని సృష్టించావు.
PSA 89:48 ఏ మనిషీ జీవించి, ఎన్నటికీ చావకుండా ఉండలేడు. ఏ మనిషీ సమాధిని తప్పించుకోలేడు.
PSA 89:49 దేవా, గతంలో నీవు చూపించిన ప్రేమ ఎక్కడ? దావీదు కుటుంబానికి నీవు నమ్మకంగా ఉంటావని అతనికి నీవు వాగ్దానం చేశావు.
PSA 89:50 ప్రభూ, ప్రజలు నీ సేవకులను ఎలా అవమానించారో దయచేసి జ్ఞాపకం చేసుకొనుము. యెహోవా, నీ శత్రువులనుండి ఆ అవమానాలన్నింటినీ నేను వినాల్సి వచ్చింది. ఏర్పరచబడిన నీ రాజును ఆ మనుష్యులు అవమానించారు.
PSA 89:52 యెహోవాను శాశ్వతంగా స్తుతించండి. ఆమేన్, ఆమేన్!
PSA 90:1 దేవుని భక్తుడైన మోషే ప్రార్థన. ప్రభూవా, శాశ్వతంగా నీవే మా నివాసం.
PSA 90:2 పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు. దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు.
PSA 90:3 మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా. తిరిగి రండని నీవు చెప్పుతావు.
PSA 90:4 నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి. గత రాత్రిలా అవి ఉన్నాయి.
PSA 90:5 నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము. మేము గడ్డిలా ఉన్నాము.
PSA 90:6 ఉదయం గడ్డి పెరుగుతుంది. సాయంత్రం అది ఎండిపోయి వుంటుంది.
PSA 90:7 దేవా, నీకు కోపం వచ్చినప్పుడు మేము నాశనం అవుతాము. నీ కోపం మమ్మల్ని భయపెడుతుంది!
PSA 90:8 మా పాపాలు అన్నింటిని గూర్చి నీకు తెలుసు. దేవా, మా రహస్య పాపాలలో ప్రతి ఒక్కటి నీవు చూస్తావు.
PSA 90:9 నీ కోపం నా జీవితాన్ని అంతం చేయవచ్చు. మా సంవత్సరాలు నిట్టూర్పులా అంతమయి పోతాయి.
PSA 90:10 మేము 70 సంవత్సరాలు జీవిస్తాము. బలంగా వుంటే 80 సంవత్సరాలు జీవిస్తాము. మా జీవితాలు కష్టతరమైన పనితోను బాధతోను నిండి ఉన్నాయి. అప్పుడు అకస్మాత్తుగా మా జీవితాలు అంతం అవుతాయి. మేము ఎగిరిపోతాము.
PSA 90:11 దేవా, నీ కోపం యొక్క పూర్తి శక్తి ఏమిటో నిజంగా ఎవరికీ తెలియదు. కాని దేవా, నీ యెడల మాకున్న భయము, గౌరవం నీ కోపమంత గొప్పవి.
PSA 90:12 మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
PSA 90:13 యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము. నీ సేవకులకు దయ చూపించుము.
PSA 90:14 ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము. మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
PSA 90:15 మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు. ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము.
PSA 90:16 వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము. వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము.
PSA 90:17 మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము. మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.
PSA 91:1 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
PSA 91:2 “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.” అని నేను యెహోవాకు చెబతాను.
PSA 91:3 దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
PSA 91:4 కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు. పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.
PSA 91:5 రాత్రివేళ నీవు దేనికి భయపడవు. పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.
PSA 91:6 చీకటిలో దాపురించే రోగాలకు గాని మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.
PSA 91:7 నీ పక్కన వేయిమంది, నీ కుడిచేతి పక్కన పది వేలమంది శత్రుసైనికులను ఓడిస్తావు. నీ శత్రువులు నిన్ను కనీసం తాకలేరు.
PSA 91:8 ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా నీకు కనబడుతుంది.
PSA 91:9 ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక. సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
PSA 91:10 కీడు ఏమీ నీకు జరగదు. నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
PSA 91:11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
PSA 91:12 నీ పాదం రాయికి తగులకుండా దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
PSA 91:13 సింహాల మీద, విషసర్పాల మీద నడిచే శక్తి నీకు ఉంటుంది.
PSA 91:14 యెహోవా చెబతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను. నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
PSA 91:15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు. నేను వారికి జవాబు ఇస్తాను. వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
PSA 91:16 నా అనుచరులకు నేను దీర్గాయుష్షు యిస్తాను. నేను వాళ్లను రక్షిస్తాను.”
PSA 92:1 సబ్బాతుకోసం స్తుతి కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది. సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
PSA 92:2 ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం, రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
PSA 92:3 దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది. సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
PSA 92:4 యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు. నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
PSA 92:5 యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు. నీ తలంపులు మేము గ్రహించటం మాకు ఎంతో కష్టతరం.
PSA 92:6 నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు. మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము.
PSA 92:7 దుర్మార్గులు గడ్డిలా మొలిచినా, చెడ్డవాళ్లు అభివృద్ధి చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు.
PSA 92:8 కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించ బడతావు.
PSA 92:9 యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు. చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడుతారు.
PSA 92:10 కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు. సేదదీర్చే నీ తైలాన్ని నీవు నా మీద పోశావు.
PSA 92:11 నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను. నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను.
PSA 92:12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు. వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
PSA 92:13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాట బడిన మొక్కలవలె బలంగా ఉంటారు. వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
PSA 92:14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు. వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
PSA 92:15 యెహోవా మంచివాడని నేను చెబతున్నాను. ఆయనే నా బండ. ఆయనలో అవినీతి లేదు.
PSA 93:1 యెహోవాయే రాజు! ప్రభావము, బలము, ఆయన వస్త్రములవలె ధరించాడు. కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
PSA 93:2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
PSA 93:3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది. ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
PSA 93:4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి. కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
PSA 93:5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి. నీ పవిత్ర ఆలయం చాలాకాలం వరకు నిలిచి ఉంటుంది.
PSA 94:1 యెహోవా, నీవు మనుష్యులను శిక్షించే దేవుడవు. నీవు వచ్చి మనుష్యులకు శిక్ష తెచ్చే దేవుడవు.
PSA 94:2 నీవు భూలోకమంతటికీ న్యాయమూర్తివి. గర్విష్ఠులకు రావలసిన శిక్షతో వారిని శిక్షించుము.
PSA 94:3 యెహోవా, దుర్మార్గులు ఎన్నాళ్లవరకు తమ సరదా అనుభవిస్తారు? యెహోవా, ఇంకెన్నాళ్లు?
PSA 94:4 ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను గూర్చి ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు?
PSA 94:5 యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు. నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు.
PSA 94:6 మా దేశంలో నివసించే విధవరాండ్రను పరదేశస్తులను ఆ దుర్మార్గులు చంపుతారు. తల్లిదండ్రులు లేని పిల్లలను వారు చంపుతారు.
PSA 94:7 వారు ఆ చెడు కార్యాలు చేయటం యెహోవా చూడటం లేదని వారు చెబతారు. జరుగుతున్న విషయాలను ఇశ్రాయేలీయుల దేవుడు గ్రహించడం లేదని వారు చెబతారు.
PSA 94:8 దుర్మార్గులారా, మీరు బుద్ధిలేనివారు. మీరు మీ పాఠం ఇంకెప్పుడు నేర్చుకొంటారు? దుర్మార్గులారా, మీరు అవివేకులు మీరు గ్రహించుటకు ప్రయత్నం చేయాలి.
PSA 94:9 దేవుడు మన చెవులను చేశాడు. కనుక తప్పని సరిగా ఆయనకు చెవులు ఉంటాయి. జరిగే విషయాలను ఆయన వినగలడు. దేవుడు మన కళ్లను చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయనకు కళ్లు ఉంటాయి. జరుగుతున్న సంగతులను ఆయన చూడగలడు.
PSA 94:10 ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు. ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి నేర్పిస్తాడు.
PSA 94:11 ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు. ప్రజలు గాలి వీచినట్లుగా వుంటారని దేవునికి తెలుసు.
PSA 94:12 యెహోవా శిక్షించిన వాడు సంతోషంగా ఉంటాడు. సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి నేర్పిస్తాడు.
PSA 94:13 దేవా, ఆ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండుటకు నీవు సహాయం చేస్తావు. దుర్మార్గులు వారి సమాధిలో పాతిపెట్టబడేంత వరకు అతడు నెమ్మదిగా ఉండుటకు నీవు అతనికి సహాయం చేస్తావు.
PSA 94:14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు.
PSA 94:15 న్యాయాన్ని తోడుకొని ధర్మం తిరిగి వస్తుంది. అప్పుడు మనుష్యులు మంచివాళ్లుగా, నిజాయితీగల వాళ్లుగా ఉంటారు.
PSA 94:16 దుర్మార్గులకు విరోధంగా పోరాడుటకు ఏ మనిషి నాకు సహాయం చేయలేదు. చెడు కార్యాలు చేసే వారికి విరోధంగా పోరాడుటకు నాతో ఎవ్వరూ నిలువలేదు.
PSA 94:17 యెహోవా నాకు సహాయం చేసి ఉండకపోతే నేను వెంటనే మరణ నిశ్శబ్దంలో నివసించే వాడిని.
PSA 94:18 నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుసు. కాని యెహోవా తన అనుచరుని బల పరిచాడు.
PSA 94:19 నేను చాలా చింతించి తల్లడిల్లిపోయాను. కాని యెహోవా, నీవు నన్ను ఆదరించి సంతోషింప చేశావు.
PSA 94:20 దేవా, వక్ర న్యాయవాదులకు నీవు సహాయం చేయవు. ఆ చెడ్డ న్యాయవాదులు ప్రజల జీవితాలను దుర్భరం చేయటానికే న్నాయచట్టాన్ని ఉపయోగిస్తారు.
PSA 94:21 ఆ న్యాయమూర్తులు మంచి మనుష్యులపై పడుతున్నారు. అమాయక ప్రజలు దోషులని చెప్పి వారిని చంపుతారు.
PSA 94:22 అయితే పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం యెహోవాయే. నా దుర్గమైన దేవుడు నా క్షేమస్థానం.
PSA 94:23 ఆ దుర్మార్గపు న్యాయవాదులు చేసిన చెడు పనులకోసం దేవుడు వారిని శిక్షిస్తాడు. వారు పాపం చేశారు గనుక దేవుడు వారిని నాశనం చేస్తాడు. మన యెహోవా దేవుడు ఆ దుర్మార్గపు న్యాయవాదులను నాశనం చేస్తాడు.
PSA 95:1 రండి, మనం యెహోవాని స్తుతించుదాము. మన రక్షణా బండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము.
PSA 95:2 యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము. సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.
PSA 95:3 ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక. ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.
PSA 95:4 లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
PSA 95:5 మహా సముద్రమూ ఆయనదే ఆయనే దాన్ని సృష్టించాడు. దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు.
PSA 95:6 రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము. మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము.
PSA 95:7 ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలము. మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.
PSA 95:8 దేవుడు చెబతున్నాడు, “మెరీబా దగ్గర మీరు ఉన్నట్టుగా అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకండి.
PSA 95:9 మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు. కానీ అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు.
PSA 95:10 ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను. వారు నమ్మకస్తులు కారని నాకు తెలుసు. ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు.
PSA 95:11 అందుచేత నాకు కోపం వచ్చి, ‘వారు నా విశ్రాంతి దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను.’”
PSA 96:1 యెహోవా చేసిన కొత్త కార్యాలను గూర్చి ఒక కొత్త కీర్తన పాడుడి! సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
PSA 96:2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి. శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
PSA 96:3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి. దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
PSA 96:4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు. ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
PSA 96:5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే. కానీ యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
PSA 96:6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
PSA 96:7 వంశములారా రాజ్యములారా యెహోవా మహిమకు, స్తుతి కీర్తనలు పాడండి.
PSA 96:8 యెహోవా నామాన్ని స్తుతించండి. మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
PSA 96:9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి! భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
PSA 96:10 యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి! కనుక ప్రపంచం నాశనం చేయబడదు. యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
PSA 96:11 ఆకాశములారా సంతోషించండి! భూమీ, ఆనందించుము! సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
PSA 96:12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి! అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
PSA 96:13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి. ప్రపంచాన్ని పాలించుటకు యెహోవా వస్తున్నాడు. న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.
PSA 97:1 యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది. దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి.
PSA 97:2 దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి. నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి.
PSA 97:3 యెహోవా ముందర అగ్నిబయలు వెళ్తూ ఆయన శత్రువులను నాశనం చేస్తుంది.
PSA 97:4 ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది. ప్రజలు దాన్ని చూచి భయపడతారు.
PSA 97:5 యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగి పోతాయి. భూలోక ప్రభువు ఎదుట అవి కరిగి పోతాయి.
PSA 97:6 ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి. ప్రతి మనిషీ దేవును మహిమను చూచును గాక!
PSA 97:7 మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు. వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు. కానీ ఆ ప్రజలు యిబ్బంది పడుతారు. వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు.
PSA 97:8 సీయోనూ, విని సంతోషించుము! యూదా పట్టణములారా, సంతోషించండి! ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు.
PSA 97:9 సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు. ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు.
PSA 97:10 యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు. కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు.
PSA 97:11 మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.
PSA 97:12 మంచి మనుష్యులారా యెహోవాయందు ఆనందించండి. ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి.
PSA 98:1 స్తుతి కీర్తన. యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు గనుక ఆయనకు ఒక కొత్త కీర్తన పాడండి. ఆయన పవిత్ర కుడి హస్తం ఆయనకు విజయం తెచ్చింది.
PSA 98:2 యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు. యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
PSA 98:3 ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు. రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
PSA 98:4 భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
PSA 98:5 స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి. స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
PSA 98:6 బూరలు, కొమ్ములు ఊదండి. మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
PSA 98:7 భూమి, సముద్రం, వాటిలో ఉన్న సమస్త జీవుల్లారా బిగ్గరగా పాడండి.
PSA 98:8 నదులారా చప్పట్లు కొట్టండి. పర్వతములారా ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
PSA 98:9 యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు గనుక ఆయన ఎదుట పాడండి. ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు. నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
PSA 99:1 యెహోవాయే రాజు. కనుక రాజ్యాలు భయంతో వణకాలి. కెరూబు దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు. అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
PSA 99:2 సీయోనులో యెహోవా గొప్పవాడు. ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
PSA 99:3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక. దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
PSA 99:4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు. దేవా నీతిని నీవు చేశావు. యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
PSA 99:5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి. ఆయన పవిత్ర పాదపీఠాన్ని ఆరాధించండి.
PSA 99:6 మోషే, అహరోనులు దేవుని యాజకులలో కొందరు, మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు. వారు యెహోవాను ప్రార్థించారు. దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
PSA 99:7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు. వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు. దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
PSA 99:8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు. నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
PSA 99:9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి. ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి. మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.
PSA 100:1 కృతజ్ఞత కీర్తన. భూమీ, యెహోవాను గూర్చి పాడుము!
PSA 100:2 నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు! ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము.
PSA 100:3 యెహోవా దేవుడని తెలుసుకొనుము. ఆయనే మనలను సృజించాడు. మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము.
PSA 100:4 కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి. స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి. ఆయనను గౌరవించండి ఆయన నామాన్ని స్తుతించండి.
PSA 100:5 యెహోవా మంచివాడు. ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది. ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు.
PSA 101:1 దావీదు కీర్తన. ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను. యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
PSA 101:2 నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను. నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను. యెహోవా నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
PSA 101:3 నాయెదుట ఏ విగ్రహాలు ఉంచుకోను. అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను. నేను అలా చేయను!
PSA 101:4 నేను నిజాయితీగా ఉంటాను. నేను దుర్మార్గపు పనులు చేయను.
PSA 101:5 ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను. మనుష్యులు ఇతరులకంటే తామే మంచి వారమని తలుస్తూ అతిశయించడం నేను జరుగ నివ్వను.
PSA 101:6 నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను. ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను. యదార్థ జీవితాలు జీవించే వాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
PSA 101:7 అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను. అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
PSA 101:8 ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను. దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.
PSA 102:1 శ్రమపడుతున్న వ్యక్తి ప్రార్థన. బలహీనంగా ఉండి తన ఆరోపణలను యెహోవాకు చెప్పాలని అతడు తలంచినప్పటిది. యెహోవా, నా ప్రార్థన విను. సహాయం కోసం నేను పెడుతున్న నా మొర వినుము.
PSA 102:2 యెహోవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నా నుండి తిరిగి పోకుము. నా మాట వినుము. సహాయం కోసం నేను మొర పెట్టినప్పుడు వెంటనే నాకు జవాబు ఇమ్ము.
PSA 102:3 పొగ వెళ్లినట్లుగా నా జీవితం వెళ్లిపోతుంది. నా జీవితం నిదానంగా కాలిపోతున్న మంటలా ఉంది.
PSA 102:4 నా బలం పోయింది. నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను. నా కష్టాల మూలంగా నేను నా ఆహారాన్ని తినటం కూడా మరచిపోయాను.
PSA 102:5 నా విచారం వల్ల నా బరువు తగ్గిపోతూంది.
PSA 102:6 అరణ్యంలో నివసిస్తున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను. శిథిలమైన పాత కట్టడాలలో బతుకుతున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను.
PSA 102:7 నేను నిద్రపోలేను. పై కప్పు మీద ఒంటరిగా నివసించే పక్షిలా నేను ఉన్నాను.
PSA 102:8 నా శత్రువులు నన్ను ఎల్లప్పుడూ అవమానిస్తారు. నన్ను హేళన చేసే మనుష్యులు నన్ను శపించేటప్పుడు నా పేరు ప్రయోగిస్తారు.
PSA 102:9 నా అధిక విచారమే నా భోజనం. నా కన్నీళ్లు నా పానీయాల్లో పడతాయి.
PSA 102:10 ఎందకంటే, నీవు నా మీద కోపగించావు. యెహోవా, నీవు నన్ను లేవనెత్తావు, నీవు నన్ను కిందకు విసిరేశావు.
PSA 102:11 సాయంకాలమయ్యేసరికి దీర్గమైన నీడలు అంతం అయిపోయినట్లు, నా జీవితం దాదాపుగా అంతం అయి పోయింది. నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను.
PSA 102:12 ఆయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు. నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది.
PSA 102:13 నీవు లేచి సీయోనును ఆదరిస్తావు. నీవు సీయోనుయెడల దయగా ఉండే సమయం వస్తూంది.
PSA 102:14 యెరుషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు.
PSA 102:15 జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు. దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను గౌరవిస్తారు.
PSA 102:16 ఎందుకంటే యెహోవా సీయోనును మరల నిర్మిస్తాడు. యెరూషలేము మహిమను ప్రజలు మరల చూస్తారు.
PSA 102:17 దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు. దేవుడు వారి ప్రార్థనలు వింటాడు.
PSA 102:18 రాబోయే తరం వారు చదువుకొనేందుకు ఈ సంగతులు రాసి పెట్టు. అప్పుడు. భవిష్యత్తులో ఆ ప్రజలు యెహోవాను స్తుతిస్తారు.
PSA 102:19 యెహోవా పైవున్న తన పవిత్ర స్థానం నుండి కిందకు చూస్తాడు. యెహోవా పరలోకం నుండి కింద భూమిని చూస్తాడు.
PSA 102:20 ఖైదీల ప్రార్థనలు ఆయన వింటాడు. మరణశిక్ష విధించబడిన ప్రజలను ఆయన విడుదల చేస్తాడు.
PSA 102:21 సీయోను ప్రజలు యెహోవాను గూర్చి చెబతారు. వారు యెహోవా నామాన్ని యోరూషలేములో స్మరిస్తారు.
PSA 102:22 జనసమూహములు కలిసి పోగుచేయ బడునప్పుడు రాజ్యాలు యెహోవాకు సేవచేయటానికి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది.
PSA 102:23 నాలో బలం పోయింది. నా జీవితం తక్కువగా చేయబడింది.
PSA 102:24 కనుక నేను ఇలా చెప్పాను, “నేను ఇంకా యువకునిగా ఉండగానే నన్ను చావనివ్వకు. దేవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.
PSA 102:25 చాలా కాలం క్రిందట నీవు ప్రపంచాన్ని సృష్టించావు. ఆకాశాన్ని నీ స్వహస్తాలతో చేశావు.
PSA 102:26 ప్రపంచం, ఆకాశం అంతం ఆవుతాయి. కానీ నీవు శాశ్వతంగా జీవిస్తావు. అవి బట్టల్లా పాడైపోతాయి. మరియు వస్త్రాలు మార్చినట్టుగా నీవు వాటిని మార్చి వేస్తావు. అవన్నీ మార్చివేయబడతాయి.
PSA 102:27 కాని, దేవా, నీవు ఎన్నటికీ మారవు. నీవు శాశ్వతంగా జీవిస్తావు!
PSA 102:28 ఈ వేళ మేము నీ సేవకులము. భవిష్యత్తులో మా సంతతి వారిక్కడ నివసిస్తారు. మరియు వారి సంతతి వారిక్కడ నిన్ను ఆరాధిస్తారు.”
PSA 103:1 దావీదు కీర్తన. నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము. నా సర్వ అంగములారా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
PSA 103:2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము. ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
PSA 103:3 మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు. మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
PSA 103:4 దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు. ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
PSA 103:5 దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు. ఆయన మనలను పక్షిరాజు పిల్లవలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
PSA 103:6 యెహోవా న్యాయం కలవాడు. ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
PSA 103:7 దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు. తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
PSA 103:8 యెహోవా జాలిగలవాడు, దయగలవాడు. దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
PSA 103:9 యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు. యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
PSA 103:10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం. కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
PSA 103:11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా తన అనుచరుల ఎడల దేవుని ప్రేమ ఉన్నది.
PSA 103:12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం తీసివేశాడు.
PSA 103:13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు. అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.
PSA 103:14 మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు. మనం మట్టిలో నుండి చేయబడ్డామని దేవునికి తెలుసు.
PSA 103:15 మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు. మన జీవితాలు గడ్డిలాంటివని ఆయనకు తెలుసు. మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని దేవునికి తెలుసు.
PSA 103:16 ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడి పోతుంది. త్వరలోనే ఆ పువ్వు ఎక్కడ ఎగురుతుందో నీవు చూడలేకపోతావు.
PSA 103:17 కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు. దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల, ఎంతో మంచివాడుగా ఉంటాడు.
PSA 103:18 దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు. దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
PSA 103:19 దేవుని సింహాసనం పరలోకంలో ఉంది. మరియు ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు.
PSA 103:20 దేవదూతలారా, యెహోవాను స్తుతించండి దేవదూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే శక్తిగల సైనికులు. మీరు దేవుని మాట విని ఆయన ఆదేశాలకు విధేయులవ్వండి.
PSA 103:21 యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి. మీరు ఆయన సేవకులు, దేవుడు కోరేవాటిని మీరు చేస్తారు.
PSA 103:22 అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు. ఆవన్నీ యెహోవాను స్తుతించాలి! నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!
PSA 104:1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు! యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు. మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు.
PSA 104:2 ఒక వ్యక్తి నిలువుపాటి అంగీ ధరించినట్లుగా నీవు వెలుగును ధరిస్తావు. ఆకాశాలను నీవు తెరగా పరుస్తావు.
PSA 104:3 దేవా వాటికి పైగా నీవు నీ ఇంటిని నిర్మించావు. దట్టమైన మేఘాలను నీవు నీ రథంగా ఉపయోగిస్తావు. గాలి రెక్కల మీద నీవు ఆకాశంలో ప్రయాణం చేస్తావు.
PSA 104:4 దేవా, నీ దూతలను నీవు గాలిలా చేశావు. నీ సేవకులను అగ్నిలా చేశావు.
PSA 104:5 దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు. కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు.
PSA 104:6 దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పివేశావు. నీళ్లు పర్వతాలను కప్పివేశాయి.
PSA 104:7 కానీ నీవు ఆజ్ఞ ఇవ్వగానే, నీళ్లు వేగంగా వెళ్లిపోయాయి. దేవా, నీవు నీళ్లతో చెప్పగానే నీళ్లు వెంటనే వెళ్లిపోయాయి.
PSA 104:8 పర్వతాలనుండి లోయల్లోనికి, ఆ తరువాత నీవు వాటికోసం చేసిన స్థలాల్లోకి నీళ్లు ప్రవహించాయి.
PSA 104:9 సముద్రానికి నీవు హద్దులు నియమించావు. నీళ్లు భూమిని కప్పివేసేట్టుగా మరల ఎన్నటికీ ఉప్పొంగవు.
PSA 104:10 దేవా, నీటి ఊటలనుండి నీటి కాలవలలోనికి నీవే నీళ్లను ప్రవహింప చేస్తావు. పర్వతాల జలధారల ద్వారా నీవు నీటిని కిందికి కాలువలా ప్రవహింపజేసావు.
PSA 104:11 నీటి ప్రవాహాలు అడవి జంతువులన్నిటికీ నీళ్లను ఇస్తాయి. అక్కడ నీళ్లు తాగటానికి అడవి గాడిదలు కూడ వస్తాయి.
PSA 104:12 నీటి మడుగుల చెంత నివసించుటకు అడవి పక్షులు వస్తాయి. సమీపంలో ఉన్న చెట్ల కొమ్మల మీద నుండి అవి పాడుతాయి.
PSA 104:13 దేవుడు పర్వతాల మీదికి వర్షం పంపిస్తాడు. దేవుడు చేసిన పనులు భూమికి అవసరమైన ప్రతి దాన్నీ ఇస్తాయి.
PSA 104:14 దేవా, పశువులకు ఆహారంగా గడ్డి ఎదిగేలా నీవు చేస్తావు. మేము పెంచుటకు ప్రయాసపడే మొక్కల్ని నీవు మాకిస్తావు. ఆ మొక్కలే ఈ భూమి మీద నుండి మాకు లభించే ఆహారం.
PSA 104:15 దేవా, మమ్మల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం నీవు మాకు ఇస్తావు. మా చర్మాన్ని నునుపు చేసే తైలాన్ని నీవు మాకిస్తావు. మమ్మల్ని బలంగలవారిగా చేయుటకు నీవు మాకు భోజనం ఇస్తావు.
PSA 104:16 లెబానోను మహా దేవదారు వృక్షాలను దేవుడు నాటాడు. ఆ మహా వృక్షాలు ఎదుగుటకు వాటికి సమృద్ధిగా నీళ్లున్నాయి.
PSA 104:17 పక్షులు ఆ వృక్షాలపై గూళ్లు పెడతాయి. పెద్దకొంగలు దేవదారు వృక్షాలలో నివాసం చేస్తాయి.
PSA 104:18 పెద్ద కొండలు అడవి మేకలకు నివాసం, పెద్ద బండలు కుందేళ్లు దాక్కొనే చోట్లు.
PSA 104:19 దేవా, కాల సూచికగా ఉండుటకు నీవు మాకు చంద్రుణ్ణిచ్చావు. దాని మూలంగా పండుగ రోజులను తెలుసుకోగలుగుతాము. ఎక్కడ అస్తమించాలో సూర్యునికి ఎల్లప్పుడూ తెలుసు.
PSA 104:20 చీకటిని నీవు రాత్రిగా చేశావు. ఆ సమయాన అడవి జంతువులు బయటికి వచ్చి చుట్టూరా సంచరిస్తాయి.
PSA 104:21 సింహాలు దాడి చేసేటప్పుడు గర్జిస్తాయి. అవి దేవుడు వాటికిచ్చే ఆహారంకోసం ఆయనను ఆడుగుతున్నట్టు ఉంటుంది.
PSA 104:22 మరల సూర్యుడు ఉదయించినప్పుడు ఆ జంతువులు తిరిగి వాటి నివాసాలకు వెళ్లి విశ్రమిస్తాయి.
PSA 104:23 అప్పుడు ప్రజలు వారి పనుల కోసం బయటకు వెళ్తారు. సాయంత్రం వరకు వారు పని చేస్తారు.
PSA 104:24 యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు. భూమి నీ కార్యాలతో నిండిపోయింది. నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.
PSA 104:25 మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి కొన్ని చిన్నవి. మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి.
PSA 104:26 మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి. నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం ఆ సముద్రంలో ఆడుకుంటుంది.
PSA 104:27 దేవా, ఆ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారంయిస్తావు.
PSA 104:28 దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు. మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి.
PSA 104:29 నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు అవి భయపడిపోతాయి. వాటి ప్రాణం వాటిని విడిచి నప్పుడు అవి బలహీనమై చస్తాయి. మరియు అవి మరలమట్టి అయిపోతాయి.
PSA 104:30 కాని యెహోవా, నీ ఆత్మను పంపినపుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి. భూమి మరల కొత్తదిగా అవుతుంది.
PSA 104:31 యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక. యెహోవా చేసిన వాటిని ఆయన అనుభవించునుగాక.
PSA 104:32 యెహోవా భూమివైపు చూసేటప్పుడు అది వణకుతుంది. ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది.
PSA 104:33 నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను. నేను బతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను.
PSA 104:34 నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను. యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.
PSA 104:35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక. దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు! యెహోవాను స్తుతించు!
PSA 105:1 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము. ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
PSA 105:2 యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము. ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
PSA 105:3 యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి ఆతిశయించు. యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
PSA 105:4 బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి. సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
PSA 105:5 యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
PSA 105:6 దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు. దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
PSA 105:7 యెహోవా మన దేవుడు. యెహోవా సర్వలోకాన్నీ పాలిస్తాడు.
PSA 105:8 దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి. 1,000 తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి.
PSA 105:9 దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు. ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.
PSA 105:10 యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు.
PSA 105:11 “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.” అని దేవుడు చెప్పాడు.
PSA 105:12 అబ్రాహాము కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం చేశాడు. మరియు వారు కనానులో నివసిస్తున్న యాత్రికులు మాత్రమే.
PSA 105:13 దేశం నుండి దేశానికి, రాజ్యం నుండి రాజ్యానికి వారు ప్రయాణం చేసారు.
PSA 105:14 కానీ యితర మనుష్యులు ఆ కుటుంబాన్ని బాధించనియ్యకుండా దేవుడు చేసాడు. వారిని బాధించవద్దని దేవుడు రాజులను హెచ్చరించాడు.
PSA 105:15 “నేను ఏర్పాటు చేసుకొన్న నా ప్రజలను బాధించవద్దు. నా ప్రవక్తలకు ఎలాంటి కీడూ చేయవద్దు.” అని దేవుడు చెప్పాడు.
PSA 105:16 దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు. ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు.
PSA 105:17 అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు యోసేపు అనే మనిషిని పంపించాడు. యోసేపు ఒక బానిసవలె అమ్మబడ్డాడు.
PSA 105:18 యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు. అతని మెడకు వారు ఒక ఇనుప కంటె వేశారు.
PSA 105:19 యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేంతవరకు అతడు బానిసగా యోసేపు చెప్పింది సరియైనది అని యెహోవా సందేశం రుజువు చేసింది.
PSA 105:20 కనుక యోసేపును విడుదల చేయమని ఈజిప్టు రాజు ఆదేశించాడు. అనేక మందికి అధికారిగా ఉన్న అతనిని కారాగారం నుండి వెళ్లనిచ్చాడు.
PSA 105:21 అతడు యోసేపును తన ఇంటికి యజమానిగా నియమించాడు. రాజ్యంలో అన్ని విషయాలను గూర్చి యోసేపు జాగ్రత్త తీసుకొన్నాడు.
PSA 105:22 యోసేపు యితర నాయకులకు హెచ్చరిక ఇచ్చాడు. పెద్ద మనుష్యులకు యోసేపు నేర్చించాడు.
PSA 105:23 తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు. యాకోబు హాము దేశంలో నివసించాడు.
PSA 105:24 యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది. వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు.
PSA 105:25 కనుక ఈజిప్టు ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు. ఈజిప్టువారు బానిసలకు విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు.
PSA 105:26 కనుక దేవుడు తన సేవకుడైన మోషేను, తాను ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును పంపించాడు.
PSA 105:27 హాము దేశంలో అనేక అద్భుతాలు చేయటానికి దేవుడు మోషే, అహరోనులను వాడుకొన్నాడు.
PSA 105:28 దేవుడు కటిక చీకటిని పంపించాడు. కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు.
PSA 105:29 కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు. వాళ్ల చేపలన్నీ చచ్చాయి.
PSA 105:30 ఆ దేశం కప్పలతో నింపివేయబడింది. రాజు గదులలో కూడ కప్పలు ఉన్నాయి.
PSA 105:31 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు, దోమలు వచ్చాయి. అన్నిచోట్లా అవే ఉన్నాయి.
PSA 105:32 దేవుడు వర్షాన్ని వడగండ్లుగా చేశాడు. ఈజిప్టువారి దేశంలో అన్ని చోట్లా అగ్ని మెరుపులు కలిగాయి.
PSA 105:33 ఈజిప్టువారి ద్రాక్షా తోటలను, అంజూరపు చెట్లను దేవుడు నాశనం చేశాడు. వారి దేశంలో ప్రతి చెట్టునూ దేవుడు నాశనం చేసాడు.
PSA 105:34 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మిడుతలు, పచ్చిగడ్డి మిడుతలు వచ్చాయి. అవి లెక్కింపజాలనంత విస్తారంగా ఉన్నాయి.
PSA 105:35 మిడుతలు, పచ్చిగడ్డి మిడుతలు దేశంలోని మొక్కలన్నింటినీ తినివేశాయి. నేల మీద పంటలన్నింటినీ అవి తినివేశాయి.
PSA 105:36 అప్పుడు ఈజిప్టు దేశంలో ప్రతి మొదటి సంతానాన్నీ దేవుడు చంపేశాడు. వారి జ్యేష్ఠ కుమారులను దేవుడు చంపివేశాడు.
PSA 105:37 అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు. వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు. దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు.
PSA 105:38 దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది. ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు.
PSA 105:39 దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు. రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు.
PSA 105:40 ప్రజలు భోజనం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు. దేవుడ వారికి ఆకాశం నుండి సమృద్ధిగా రొట్టెను యిచ్చాడు.
PSA 105:41 దేవుడు బండను చిల్చగా నీళ్లు ఉబకుతూ వచ్చాయి. ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.
PSA 105:42 దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు. దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు.
PSA 105:43 దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు.
PSA 105:44 అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు.
PSA 105:45 దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు. వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు. యెహోవాను స్తుతించండి.
PSA 106:1 యెహోవాను స్తుతించండి! యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 106:2 యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు. ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
PSA 106:3 దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు. ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.
PSA 106:4 యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
PSA 106:5 యెహోవా, నీ జనులకు నీవు చేసేమంచి వాటిలో నన్ను పాలుపొందనిమ్ము నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము. నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.
PSA 106:6 మా పూర్వికుల్లా మేము కూడా పాపం చేసాము. మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.
PSA 106:7 యెహోవా, ఈజిప్టులో నీవు చేసిన అద్భుతాలను మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నీ అపరిమితమైన ప్రేమను వారు జ్ఞాపకముంచుకోలేదు. కాని, ఎర్రసముద్రం వద్ద మహోన్నతుడైన దేవునికి విరోధంగా ఎదురు తిరిగారు.
PSA 106:8 అయినా ఆయన తన నామము కోసం వారిని రక్షించాడు, ఎందుకంటే తన మహాశక్తిని వారికి తెలియజేయాలని.
PSA 106:9 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముద్రం ఎండిపోయింది. దేవుడు మన పూర్వీకులను లోతైన సముద్రంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, దానిమీద నడిపించాడు.
PSA 106:10 మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు రక్షించాడు. వారి శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు.
PSA 106:11 అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో ముంచేశాడు కప్పివేసాడు. వారి శత్రువులు ఒక్కరూ తప్పించుకోలేదు!
PSA 106:12 అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు. వారు ఆయనకు స్తుతులు పాడారు.
PSA 106:13 కాని దేవుడు చేసిన వాటిని మన పూర్వీకులు వెంటనే మరచిపోయారు. వారు దేవుని సలహావినలేదు.
PSA 106:14 మన పూర్వీకులు ఎడారిలో ఆకలిగొన్నారు. అరణ్యంలో వారు దేవుణ్ణి పరీక్షించారు.
PSA 106:15 కాని మన పూర్వీకులు అడిగిన వాటిని దేవుడు వారకి ఇచ్చాడు. అయితే దేవుడు వారికి ఒక భయంకర రోగాన్ని కూడా ఇచ్చాడు.
PSA 106:16 ప్రజలు మోషే మీద అసూయ పడ్డారు. యెహోవా పవిత్ర యాజకుడు అహరోను మీద వారు అసూయపడ్డారు.
PSA 106:17 కనుక ఆ అసూయాపరులను దేవుడు శిక్షించాడు. భూమి తెరచుకొని దాతానును మింగివేసింది. తరువాత భూమి మూసుకొంటూ అబీరాము సహచరులను కప్పేసింది.
PSA 106:18 అప్పుడు ఒక అగ్ని ఆ ప్రజాసమూహాన్ని కాల్చివేసింది. ఆ అగ్ని ఆ దుర్మార్గులను కాల్చివేసింది.
PSA 106:19 హోరేబు కొండవద్ద ప్రజలు ఒక బంగారు దూడను చేశారు. వారు ఆ విగ్రహాన్ని ఆరాధించారు.
PSA 106:20 ఆ ప్రజలు గడ్డి తినే ఒక ఎద్దు విగ్రహాన్ని వారి మహిమ గల దేవునిగా మార్చేశారు.
PSA 106:21 మన పూర్వీకులు వారిని రక్షించిన దేవుణ్ణి గూర్చి మర్చిపోయారు. ఈజిప్టులో అద్భుతాలు చేసిన దేవుణ్ణి గూర్చి వారు మర్చిపోయారు.
PSA 106:22 హాము దేశంలొ దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. దేవుడు ఎర్ర సముద్రం దగ్గర భీకర కార్యాలు చేశాడు.
PSA 106:23 దేవుడు ఆ ప్రజలను నాశనం చేయాలని కోరాడు. కాని దేవుడు ఏర్పరచుకొన్న సేవకుడు మోషే ఆయనను నివారించాడు. దేవునికి చాలా కోపం వచ్చింది. కాని దేవుడు ఆ ప్రజలను నాశనం చేయకుండా మోషే అడ్డుపడ్డాడు.
PSA 106:24 అంతట ఆ ప్రజలు ఆనందకరమైన కనాను దేశంలోనికి వెళ్లేందుకు నిరాకరించారు. ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలను ఓడించుటకు దేవుడ వారికి సహాయం చేస్తాడని ఆ ప్రజలు నమ్మలేదు.
PSA 106:25 మన పూర్వీకులు దేవునికి విధేయులవుటకు నిరాకరించారు.
PSA 106:26 అందుచేత వారు అరణ్యంలోనే మరణిస్తారని దేవుడు ప్రమాణం చేసాడు.
PSA 106:27 వారి సంతతివారిని ఇతర ప్రజలు ఓడించేలా చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు. మన పూర్వీకులను రాజ్యాలలో చెదరగొడతానని దేవుడు ప్రమాణం చేసాడు.
PSA 106:28 బయల్పెయోరు దగ్గర దేవుని ప్రజలు బయలు దేవత పూజలో పాల్గొన్నారు. చచ్చినవారికి, విగ్రహానికి బలియిచ్చిన మాంసాన్ని దేవుని ప్రజలు తిన్నారు.
PSA 106:29 దేవుడు తన ప్రజల మీద చాలా కోపగించాడు. మరియు దేవుడు వారిని రోగులనుగా చేసాడు.
PSA 106:30 కాని ఫీనెహాసు దేవుని ప్రార్థించాడు. దేవుడు రోగాన్ని ఆపుచేసాడు.
PSA 106:31 ఫీనెహాసు చాలా మంచి పని చేసాడు అని దేవునికి తెలుసు. మరియు శాశ్వతంగా ఎప్పటికి దేవుడు దీనిని జ్ఞాపకం చేసుకొంటాడు.
PSA 106:32 మెరీబా వద్ద ప్రజలకు కోపం వచ్చింది. మోషేతో ఏదో చెడు కార్యాము వారు చేయించారు.
PSA 106:33 ఆ ప్రజలు మోషేను చాలా కలవర పెట్టారు. అందుచేత మోషే అనాలోచితంగా మాటలు అనేశాడు.
PSA 106:34 కనానులో నివసిస్తున్న ఇతర రాజ్యాలను నాశనం చేయమని యెహోవా ప్రజలకు చెప్పాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు.
PSA 106:35 ఇశ్రాయేలు ప్రజలు ఇతర ప్రజలతో కలిసి పోయారు. ఇతర ప్రజలు చేస్తున్న వాటినే వీరు కూడా చేశారు.
PSA 106:36 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలకు ఉచ్చుగా తయారయ్యారు. ఆ ఇతర ప్రజలు పూజిస్తున్న దేవుళ్లను దేవుని ప్రజలు పూజించటం మొదలు పెట్టారు.
PSA 106:37 దేవుని ప్రజలు తమ స్వంత బిడ్డలను సహితం చంపి ఆ బిడ్డలను ఆ దయ్యాలకు బలియిచ్చారు.
PSA 106:38 దేవుని ప్రజలు నిర్దోషులను చంపివేసారు. వారు తమ స్వంత బిడ్డలనెచంపి ఆ బూటకపు దేవుళ్లకు అర్పించారు.
PSA 106:39 కనుక ఆ ఇతర ప్రజల పాపాలతో దేవుని ప్రజలు మైలపడ్డారు. దేవుని ప్రజలు తమ దేవునికి అపనమ్మకస్తులై ఆ ఇతర ప్రజలు చేసిన పనులనే చేసారు.
PSA 106:40 దేవునికి తన ప్రజల మీద కోపం వచ్చింది. దేవుడు వారతో విసిగిపోయాడు!
PSA 106:41 దేవుడు తన ప్రజలను ఇతర రాజ్యాలకు అప్పగించాడు. వారి శత్రువులు వారిని పాలించేటట్టుగా దేవుడు చేసాడు.
PSA 106:42 దేవుని ప్రజలను శత్రువులు వారిని తమ అదుపులో పెట్టుకొని వారికి జీవితాన్నే కష్టతరం చేసారు.
PSA 106:43 దేవుడు తన ప్రజలను అనేకసార్లు రక్షించాడు. కాని వారు దేవునికి విరోధంగా తిరిగి వారు కోరిన వాటినే వారు చేశారు. దేవుని ప్రజలు ఎన్నెన్నో చెడ్డపనులు చేసారు.
PSA 106:44 కాని దేవుని ప్రజలు ఎప్పుడు కష్టంలో ఉన్నా వారు సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టారు. ప్రతిసారి దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు.
PSA 106:45 దేవుడు తన ఒడంబడికను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ తన గొప్ప ప్రేమతో వారిని ఆదరించాడు.
PSA 106:46 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు. అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు.
PSA 106:47 మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు. నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా నా జనముల మద్యనుండి మమ్మల్ని సమీకరించుము. కనుక ఆయనకు మనం స్తుతులు పాడగలం.
PSA 106:48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి. దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా జీవిస్తాడు. మరియు ప్రజలందరూ, “ఆమేన్! యెహోవాను స్తుతించండి!” అని చెప్పారు.
PSA 107:1 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన ప్రేమ శాశ్వతం.
PSA 107:2 యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి. వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి.
PSA 107:3 అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు. తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు.
PSA 107:4 ప్రజల్లో కొందరు ఎండిన ఎడారిలో సంచరించారు. వారు నివసించుటకు ఒక పట్టణంకోసం ఆ ప్రజలు వెదకుతున్నారు. కానీ వారికి ఒక్కపట్టణం కూడా దొరకలేదు.
PSA 107:5 ఆ ప్రజలు ఆకలితో, దాహంతో ఉండి బలహీనం అయ్యారు.
PSA 107:6 అప్పుడు వారు సహాయం కోసం యెహోవాకు ఏడ్చి, మొరపెట్టి వేడుకొన్నారు. యెహోవా ఆ ప్రజలను వారి కష్టాలన్నింటి నుండి రక్షించాడు.
PSA 107:7 ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.
PSA 107:8 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెప్పండి! ప్రజల కోసం, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
PSA 107:9 దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదార్థాలతో దేవుడు నింపుతాడు.
PSA 107:10 దేవుని ప్రజల్లో కొందరు కటిక చీకటి కారాగారాల్లో కటకటాల వెనుక ఖైదీలుగా ఉన్నారు.
PSA 107:11 ఎందుకంటే దేవుడు చెప్పిన విషయాలకు ఆ ప్రజలు విరోధంగా పోరాడారు. సర్వోన్నతుడైన దేవుని సలహా వినుటకు వారు నిరాకరించారు.
PSA 107:12 ఆ ప్రజలు చేసిన పనుల మూలంగా దేవుడు వారికి జీవితాన్ని కష్టతరం చేశాడు. వారు తొట్రిల్లి, పడిపోయారు. మరి వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేకపోయారు.
PSA 107:13 ఆ ప్రజలు కష్టంలో ఉన్నారు; కనుక వారు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నారు. వారి కష్టాలనుండి యెహోవా వారిని రక్షించాడు.
PSA 107:14 దేవుడు వాళ్లను వారి కటిక చీకటి కారాగారాలనుండి బయటకు రప్పించాడు. మరియు వారు బంధించబడిన తాళ్లను దేవుడు తెంచివేసాడు.
PSA 107:15 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి. ప్రజలకోసం ఆయన చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
PSA 107:16 దేవా, మా శత్రువులను ఓడించుటకు మాకు సహాయం చేయుము. వారి ఇత్తడి తలుపులను దేవుడు పగులగొట్టగలడు. వారి ద్వారాల మీది ఇనుప గడియలను దేవుడు చితకగొట్టగలడు.
PSA 107:17 కొందరు ప్రజలు తమ తిరుగూబాటు మార్గాల ద్వారా తెలివితక్కువ వాళ్లయ్యారు. మరియు వారి పాపాలవల్ల కష్టాన్ని అనుభవించారు.
PSA 107:18 ఆ మనుష్యులు తినటానికి నిరాకరించారు, వారు చావుకు సమీపించారు.
PSA 107:19 వారు కష్టంలో ఉన్నారు, అందుచేత సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. యెహోవా వారిని వారి కష్టాల నుండి రక్షించాడు.
PSA 107:20 దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ప్రజలను స్వస్థపర్చాడు. కనుక ఆ ప్రజలు సమాధి నుండి రక్షించబడ్డారు.
PSA 107:21 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి. ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
PSA 107:22 యెహోవా చేసిన వాటన్నింటికీ కృతజ్ఞతగా ఆయనకు బలులు అర్పించండి. యెహోవా చేసిన పనులను గూర్చి సంతోషంగా చెప్పండి.
PSA 107:23 కొందరు ఓడలో సముద్రం మీద ప్రయాణం చేశారు. వారు సముద్రాల మీద వ్యాపారం చేశారు.
PSA 107:24 ఆ ప్రజలు యెహోవా చేయగలిగిన సంగతులను చూశారు. సముద్రం మీద యెహోవా చేసిన ఆశ్చర్యకార్యాలను వారు చూశారు.
PSA 107:25 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బలమైన గాలి వీచటం మొదలయింది. అలలు అంతకంతకు పెద్దవయ్యాయి.
PSA 107:26 అలలు ఆకాశమంత ఎత్తు లేస్తున్నాయి. తుఫాను మహా ప్రమాదకరంగా ఉండటంచేత మనుష్యులు ధైర్యాన్ని కోల్పోయారు.
PSA 107:27 ఆ మనుష్యులు తూలిపోతూ, తాగుబోతుల్లా పడి పోతున్నారు. నావికులుగా వారి నైపుణ్యం నిష్ప్రయోజనం.
PSA 107:28 వారు చిక్కులో పడ్డారు. అందుచేత సహాయం కోసం వారు యెహోవాకు మొర పెట్టారు. మరియు యెహోవా వారిని వారి కష్టాల్లోనుంచి రక్షించాడు.
PSA 107:29 దేవుడు తుఫానును ఆపివేసి, అలలను నెమ్మది పర్చాడు.
PSA 107:30 సముద్రం నిమ్మళించినందుకు నావికులు సంతోషించారు. వారు వెళ్లాల్సిన స్థలానికి దేవుడు వారిని క్షేమంగా నడిపించాడు.
PSA 107:31 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి. ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
PSA 107:32 మహా సమాజంలో యెహోవాను స్తుతించండి. పెద్దలు సమావేశమైనప్పుడు ఆయనను స్తుతించండి.
PSA 107:33 దేవుడు నదులను ఎడారిగా మార్చాడు. నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు.
PSA 107:34 సారవంతమైన భూమిని పనికి మాలిన ఉప్పు భూమిగా దేవుడు మార్చాడు. ఎందుకంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు చేసిన చెడ్డపనులవల్లనే.
PSA 107:35 దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు. ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా చేశాడు.
PSA 107:36 దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి నడిపించాడు. ఆ ప్రజలు నివాసం ఉండుటకు ఒక పట్టణాన్ని నిర్మించాడు.
PSA 107:37 ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. పొలంలో ద్రాక్షలు వారు నాటారు. వారికి మంచి పంట వచ్చింది.
PSA 107:38 దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. వారి కుటుంబాలు పెద్దవయ్యాయి. వారికి ఎన్నెన్నో పశువులు ఉన్నాయి.
PSA 107:39 విపత్తు, కష్టాల మూలంగా వారి కుటుంబాలు చిన్నవిగా బలహీనంగా ఉన్నాయి.
PSA 107:40 దేవుడు వారి నాయకులను ఇబ్బంది పెట్టి అవమానించాడు. బాటలు లేని ఎడారిలో దేవుడు వారిని తిరుగులాడనిచ్చాడు.
PSA 107:41 అయితే, అప్పుడు దేవుడు ఆ పేద ప్రజలను వారి దౌర్భాగ్యం నుండి తప్పించాడు. ఇప్పుడు వారి కుటుంబాలు గొర్రెల మందల్లా పెద్దవిగా ఉన్నాయి.
PSA 107:42 మంచి మనుష్యులు యిది చూచి సంతోషిస్తారు. కాని దుర్మార్గులు యిది చూచి ఏమి చెప్పాలో తెలియక ఉంటారు.
PSA 107:43 ఒక వ్యక్తి తెలివిగలవాడైతే అతడు ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొంటాడు. ఒక వ్యక్తి తెలివిగలవాడైతే నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రహిస్తాడు.
PSA 108:1 దావీదు స్తుతి కీర్తన దేవా, నా హృదయం నా ఆత్మ నిశ్చలముగానున్నది. నేను పాడుటకు, స్తుతి కీర్తనలు వాయించుటకు సిద్ధంగా ఉన్నాను.
PSA 108:2 స్వర మండలములారా, సితారలారా మనం సూర్యున్ని మేల్కొలుపుదాం
PSA 108:3 యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము. ఇతర ప్రజల మధ్య మేము నిన్ను స్తుతిస్తాము.
PSA 108:4 యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది. నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది.
PSA 108:5 దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము! సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము.
PSA 108:6 దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము. నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము.
PSA 108:7 యెహోవా తన ఆలయము నుండి మాట్లాడి యిలా చెప్పాడు, “యుద్ధంలో నేను గెలుస్తాను! ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను. (ఈ భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను) నా ప్రజలకు షెకెమును ఇస్తాను. వారికి సుక్కోతులోయను ఇస్తాను.
PSA 108:8 గిలాదు, మనష్షే నావి. ఎఫ్రాయిము నా శిరస్త్రాణం. యూదా నా రాజ దండం.
PSA 108:9 మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం. ఎదోము నా చెప్పులు మోసే బానిస. ఫిలిష్తీయులను జయించాక నేను విజయంతో కేకలు వేస్తాను.”
PSA 108:10 శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు? ఎదోమును జయించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు?
PSA 108:11 దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో నీవు వెళ్లవు అని అనటం నిజమేనా?
PSA 108:12 దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము మనుష్యులు మాకు సహాయం చేయలేరు!
PSA 108:13 దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు. దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు.
PSA 109:1 సంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన. దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు.
PSA 109:2 దుర్మార్గులు నన్ను గూర్చి అబద్ధాలు చెబతున్నారు. నిజం కాని సంగతులు ఆ అబద్ధికులు చెబతున్నారు.
PSA 109:3 ప్రజలు నన్ను గూర్చి ద్వేషపూరిత విషయాలు చెబతున్నారు. ఏ కారణం లేకుండానే ప్రజలు నా మీద దాడి చేస్తున్నారు.
PSA 109:4 నేను వారిని ప్రేమిస్తున్నాను. కాని వారు నన్ను ద్వేషిస్తున్నారు. కనుక దేవా, ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
PSA 109:5 ఆ ప్రజలకు నేను మంచి పనులు చేశాను. కాని వారు నాకు చెడ్డపనులు చేస్తున్నారు. నేను వారిని ప్రేమించాను. కాని వారు నన్ను ద్వేషించారు.
PSA 109:6 నా శత్రువు చేసిన చెడు కార్యాల కోసం అతనిని శిక్షించుము. వానిదే తప్పు అని రుజువు చేయగల ఒక మనిషిని చూడుము.
PSA 109:7 నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయవాదిని తీర్పు చెప్పనీయుము. నా శత్రువు చెప్పే ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయుము.
PSA 109:8 నా శత్రువును త్వరగా చావనీమ్ము. నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక!
PSA 109:9 నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని భార్య విధవరాలు అగుగాక!
PSA 109:10 వాళ్లు వారి ఇల్లు పోగొట్టుకొని భిక్షగాళ్లు అగుదురు గాక!
PSA 109:11 నా శత్రువు ఎవరికైతే పైకం బాకీ ఉన్నాడో వాళ్లు అతనికి ఉన్నదంతా తీసుకోనివ్వుము. అతని కష్టార్జితం అంతా తెలియని వాళ్లెవరినో తీసికోనివ్వుము.
PSA 109:12 నా శత్రువుకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ. అతని పిల్లలకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
PSA 109:13 నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము. తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక.
PSA 109:14 నా శత్రువు తండ్రి పాపాలను, తల్లి పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
PSA 109:15 ఆ పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ. ప్రజలు నా శత్రువును పూర్తిగా మరచిపోయేటట్టు యెహోవా వారిని బలవంతం చేస్తాడని నా ఆశ.
PSA 109:16 ఎందుకంటే, ఆ దుర్మార్గుడు ఎన్నడూ ఏ మంచీ చేయలేదు. అతడు ఎన్నడూ ఎవిరనీ ప్రేమించలేదు. అతడు నిరుపేద, నిస్సహాయ ప్రజలకు జీవితం ఎంతో కష్టకరం చేసాడు.
PSA 109:17 ప్రజలకు సంభవించే చెడు సంగతులు శాపము చూడటానికి ఆ దుర్మార్గులునికి ఎంతో ఇష్టం. కనుక ఆ చెడు సంగతులు అతనికే సభవించనిమ్ము. ప్రజల కోసం మంచి సంగతులు జరగాలని ఆ దుర్మార్గుడు ఎన్నడూ అడుగలేదు. కనుక అతనికి మంచి సంగతులేవీ జరుగనివ్వకుము.
PSA 109:18 శాపాలే వానికి వస్త్రాలుగా ఉండనిమ్ము. దుర్మర్గులు తాగేమదుకు శాపాలే నీళ్లుగా నీళ్లుగా ఉండనిమ్ము శాపాలే వాని శరీరం మీద తైలంగా ఉండనిమ్ము.
PSA 109:19 శాపాలే ఆ దుర్మార్గునికి చుట్టే వస్త్రాలుగా ఉండనిమ్ము. శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండనిమ్ము.
PSA 109:20 నా శత్రువుకు వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. నన్ను చంపాలని చూస్తున్న మనుష్యులందరికీ వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
PSA 109:21 యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు. నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము.
PSA 109:22 నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని, నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది.
PSA 109:23 దినాంతంలో దీర్గ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనుపిస్తుంది. ఎవరో నలిపివేసిని నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
PSA 109:24 నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి. నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను.
PSA 109:25 చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు. వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు.
PSA 109:26 దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము! నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము.
PSA 109:27 అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు. నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు.
PSA 109:28 ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు. వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము. అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను.
PSA 109:29 నా శత్రువులను ఇబ్బంది పెట్టుము! వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము.
PSA 109:30 యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను.
PSA 109:31 ఎందుకంటే, నిస్సహాయ ప్రజల పక్షంగా యెహోవా నిలిచి ఉన్నాడు. వారిని మరణానికి అప్పగించాలని ప్రయత్నించే వారి నుండి దేవుడు వారిని రక్షిస్తాడు.
PSA 110:1 దావీదు స్తుతి కీర్తన. “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.” అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు.
PSA 110:2 నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది.
PSA 110:3 నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు. నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది. ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది.
PSA 110:4 యెహోవా ఒక వాగ్దానం చేసాడు. యెహోవా తన మనస్సు మార్చుకోడు. “నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు. నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా వున్నట్లు ఉంది.”
PSA 110:5 నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు. ఆయన కోపమముతో రాజులను చితకగొడతాడు.
PSA 110:6 దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు. ఆ గొప్ప దేశంలో దేవుడు చచ్చిన వారి శవాలతో నేలనిండి పోయింది!
PSA 110:7 మార్గంలోని సెలయేటినుండి రాజు మంచినీరు తాగుతాడు. ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు.
PSA 111:1 యెహోవాను స్తుతించండి! మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో నేను నా హృదయ పూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.
PSA 111:2 యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.
PSA 111:3 దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.
PSA 111:4 దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కనుక యెహోవా దయ, జాలిగలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.
PSA 111:5 దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
PSA 111:6 దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.
PSA 111:7 దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా. ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.
PSA 111:8 దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి. ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.
PSA 111:9 దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు. దేవుని నామం అద్భుతం, పవిత్రం!
PSA 111:10 దేవుడంటే భయము, భక్తివుంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది. దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు. శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.
PSA 112:1 యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.
PSA 112:2 ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు. మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు.
PSA 112:3 ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు. అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది.
PSA 112:4 మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు. దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు.
PSA 112:5 ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చేగుణం కలిగి ఉండటం, అతనికి మంచిది. తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది.
PSA 112:6 ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు. ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడుతాడు.
PSA 112:7 మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు. ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు.
PSA 112:8 ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు. అతడు తన శత్రువులను ఓడిస్తాడు.
PSA 112:9 ఆమనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు. అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి.
PSA 112:10 దుష్టులిది చూచి కోపగిస్తారు. వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు. దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు.
PSA 113:1 యెహోవాను స్తుతించండి! యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి! యెహోవా నామాన్ని స్తుతించండి.
PSA 113:2 ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
PSA 113:3 తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి, సూర్యుడు అస్తమించే స్థలం వరుకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
PSA 113:4 యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు. ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
PSA 113:5 ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు. దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
PSA 113:6 ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే ఆయన తప్పక కిందికి చూడాలి.
PSA 113:7 దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు. భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
PSA 113:8 ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు. ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
PSA 113:9 ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును. కానీ దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు. యెహోవాను స్తుతించండి!
PSA 114:1 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు. యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
PSA 114:2 ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు. ఇశ్రాయేలు ఆయన రాజ్యం ఆయింది.
PSA 114:3 ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది. యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
PSA 114:4 పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి. కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.
PSA 114:5 ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు? యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
PSA 114:6 పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు? కొండలూ మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?
PSA 114:7 యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
PSA 114:8 బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే. ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.
PSA 115:1 యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది. నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.
PSA 115:2 మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?
PSA 115:3 దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు.
PSA 115:4 ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే. ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి.
PSA 115:5 ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు. వాటికి కళ్లున్నాయి కానీ అవి చూడలేవు.
PSA 115:6 వాటికి చెవులున్నాయి కానీ అవి వినలేవు. వాటికి ముక్కులున్నాయి కానీ అవి వాసన చూడలేవు.
PSA 115:7 వాటికి చేతులు ఉన్నాయి కానీ అవి తాకలేవు. వాటికి కాళ్లు ఉన్నాయి కానీ అవి నడవలేవు. వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు.
PSA 115:8 ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు.
PSA 115:9 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము. యెహోవా వారి బలము, ఆయన వారి డాలు.
PSA 115:10 అహరోను వంశస్తులు యెహోవాను నమ్ముతారు. యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు.
PSA 115:11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు. యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.
PSA 115:12 యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు. యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు. యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు.
PSA 115:13 యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.
PSA 115:14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
PSA 115:15 యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.
PSA 115:16 ఆకాశం యెహోవాకు చెందుతుంది. కానీ భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.
PSA 115:17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు. కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.
PSA 115:18 ఆయితే మనం యెహోవాను స్తుతిస్తాం. మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము! యెహోవాను స్తుతించండి!
PSA 116:1 యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం.
PSA 116:2 సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం.
PSA 116:3 నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి. సమాధి నా చుట్టూరా మూసికొంటుంది. నేను భయపడి చింతపడ్డాను.
PSA 116:4 అప్పుడు నేను యెహోవా నామం స్మరించి, “యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను.
PSA 116:5 యెహోవా మంచి వాడు, జాలిగల వాడు. యెహోవా దయగలవాడు.
PSA 116:6 నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధతీసుకొంటాడు. నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు.
PSA 116:7 నా ఆత్మా, విశ్రమించు! యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు.
PSA 116:8 దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు. నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు. నేను పడిపోకుండా నీవు నన్ను పట్టికొన్నావు.
PSA 116:9 సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.
PSA 116:10 “నేను నాశనమయ్యాను!” అని నేను చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొనే ఉన్నాను.
PSA 116:11 నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే” అని చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే ఉన్నాను.
PSA 116:12 యెహోవాకు నేను ఏమివ్వగలను? నాకు ఉన్నదంతా యెహోవాయే నాకిచ్చాడు.
PSA 116:13 నన్ను రక్షించినందుకు నేను ఆయనకు పానార్పణం యిస్తాను. యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
PSA 116:14 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను. ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి యెదుటికి వెళ్తాను.
PSA 116:15 యెహోవా అనుచరులలో ఎవరి మరణమైనా ఆయనకు ఎంతో దుఃఖకరము. యెహోవా, నేను నీ సేవకుల్లో ఒకడ్ని.
PSA 116:16 నేను నీ సేవకుడను. నీ సేవకులలో ఒకరి కుమారుడ్ని నేను. యెహోవా, నీవే నా మొదటి గురువు.
PSA 116:17 నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను. యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
PSA 116:18 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను. ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి ఎదుటికి వెళ్తాను.
PSA 116:19 యెరూషలేములో ఆయన ఆలయానికి నేను వెళ్తాను. యెహోవాను స్తుతించండి!
PSA 117:1 సర్వ దేశములారా, యెహోవాను స్తుతించండి. సర్వ ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
PSA 117:2 దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు శాశ్వతంగా మన పట్ల నమ్మకంగా ఉంటాడు. యెహోవాను స్తుతించండి!
PSA 118:1 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
PSA 118:2 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
PSA 118:3 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యాజకులారా, మీరు చెప్పండి.
PSA 118:4 “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.
PSA 118:5 నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను, యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
PSA 118:6 యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయ పడను. నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
PSA 118:7 యెహోవా నా సహాయకుడు; నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
PSA 118:8 మనుష్యులను నమ్ముకొనుటకంటే యెహోవాను నమ్ముట మేలు.
PSA 118:9 మీ నాయకులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు.
PSA 118:10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు. యెహోవా శక్తిలో నేను నా శత్రువులను ఓడించాను.
PSA 118:11 శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు. యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
PSA 118:12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు. కాని వేగంగా కాలిపోతున్న పాదలా వారు అంతం చేయబడ్డారు. యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
PSA 118:13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు. కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
PSA 118:14 యెహోవా నా బలం, నా విజయ గీతం! యెహోవా నన్ను రక్షిస్తాడు!
PSA 118:15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
PSA 118:16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
PSA 118:17 నేను జీవిస్తాను! కాని మరణించను. మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబతాను.
PSA 118:18 యెహోవా నన్ను శక్షించాడు, కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
PSA 118:19 మంచి గుమ్మములారా నా కోసం తెరచుకోండి, నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
PSA 118:20 అవి యెహోవా గుమ్మాలు. ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
PSA 118:21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
PSA 118:22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూల రాయి అయ్యింది.
PSA 118:23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు. అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
PSA 118:24 ఈ వేళ యెహోవా చేసిన రోజు. ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
PSA 118:25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి. దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
PSA 118:26 యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.” యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
PSA 118:27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు. బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల వద్దకు గొర్రెపిల్లను మోసి కొని రండి.”
PSA 118:28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను నిన్ను స్తుతిస్తున్నాను.
PSA 118:29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 119:1 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు. ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
PSA 119:2 యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు. వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
PSA 119:3 ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు. వారు యెహోవాకు విధేయులవుతారు.
PSA 119:4 యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు. ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
PSA 119:5 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
PSA 119:6 అప్పుడు నేను నీ ఆజ్ఞలను ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
PSA 119:7 అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదిని నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
PSA 119:8 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను. కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము
PSA 119:9 యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు? నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
PSA 119:10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను. దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
PSA 119:11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను. ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
PSA 119:12 యెహోవా, నీకే స్తుతి. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
PSA 119:13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
PSA 119:14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
PSA 119:15 నీ నియమాలను నేను చర్చిస్తాను. నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
PSA 119:16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను. నీ మాటలు నేను మరచిపోను.
PSA 119:17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము. తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు వీధేయుడను అవుతాను.
PSA 119:18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
PSA 119:19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి. యోహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
PSA 119:20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి చదవాలని కోరుతున్నాను.
PSA 119:21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు. ఆ గర్విష్టులకు కీడులే సంభవిస్తాయి. నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
PSA 119:22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు. నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
PSA 119:23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు. అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
PSA 119:24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్టమైన స్నేహితుడు. అది నాకు మంచి సలహా ఇస్తుంది.
PSA 119:25 నేను త్వరలోనే చనిపోతాను. యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము.
PSA 119:26 నా జీవితం గూర్చి నేను నీతో చెప్పాను. నీవు నాకు జవాబు ఇచ్చావు. ఇప్పుడు నాకు నీ న్యాయ చట్టాలు నేర్పించు.
PSA 119:27 యెహోవా, నీ న్యాయ చట్టాలు గ్రహించుటకు నాకు సహాయం చేయుము. నీవు చేసిన ఆశ్చర్య కార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము.
PSA 119:28 నేను అలసిపోయి విచారంగా ఉన్నాను. ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము.
PSA 119:29 యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకు, నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము.
PSA 119:30 యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని కోరుకొన్నాను. జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను జాగ్రత్తగా చదువుతాను.
PSA 119:31 యెహోవా, నేను నీ ఒడంబడికకు కట్టుబడతాను. నన్ను నిరాశ పరచవద్దు.
PSA 119:32 నేను నీ ఆజ్ఞలవైపు పరుగెత్తి విధేయుడనవుతాను. యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను ఎంతో సంతోష పెడతాయి.
PSA 119:33 యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము. నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను.
PSA 119:34 గ్రహించుటకు నాకు సహాయం చేయుము. నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను. నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను.
PSA 119:35 యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు. నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను.
PSA 119:36 నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము.
PSA 119:37 యెహోవా, ఆయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము. నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము.
PSA 119:38 యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము. నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు.
PSA 119:39 యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు. జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి.
PSA 119:40 చూడు, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను. నా యెడల మంచితనం చూపించి నన్ను బతుక నిమ్ము.
PSA 119:41 యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము. నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము.
PSA 119:42 అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది. యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను.
PSA 119:43 నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను.
PSA 119:44 యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
PSA 119:45 అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను. ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక.
PSA 119:46 యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను. వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను.
PSA 119:47 యెహోవా, నీ ఆజ్ఞలను చదువటము నాకు ఆనందం. ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ.
PSA 119:48 యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను. మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను.
PSA 119:49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము. ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
PSA 119:50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు నీ మాటలు నన్ను మరల బతికించాయి.
PSA 119:51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు. కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
PSA 119:52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను. యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
PSA 119:53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే నాకు చాలా కోపం వస్తుంది.
PSA 119:54 నా మట్టుకైతే, నీ న్యాయ చట్టాలు నా ఇంటపాటల్లా ఉంటాయి.
PSA 119:55 యెహోవా రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను. నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
PSA 119:56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను కనుక నాకు ఈలాగు జరుగుతుంది.
PSA 119:57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను.
PSA 119:58 యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధార పడుతున్నాను. నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
PSA 119:59 నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను. మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను.
PSA 119:60 ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను.
PSA 119:61 దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు. అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
PSA 119:62 నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.
PSA 119:63 నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను. నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను.
PSA 119:64 యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
PSA 119:65 యెహోవా, నీ సేవకుడవైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు. నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
PSA 119:66 యెహోవా నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు. నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
PSA 119:67 నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను. కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
PSA 119:68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
PSA 119:69 నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడ్డ అబద్ధాలు చెబుతారు. కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
PSA 119:70 ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు. నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
PSA 119:71 శ్రమపడటం నాకు మంచిది. నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
PSA 119:72 యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి. 1,000 వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.
PSA 119:73 యెహోవా, నీవు నన్ను చేశావు, నీ చేతులతో నన్ను నిలబెడుతావు. నీ ఆదేశాలు నేర్చుకొని గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
PSA 119:74 యెహోవా, నీ అనుచరులు నన్ను చూచి సంతోషిస్తారు. నీవు చెప్పే విషయాలను నేను నమ్ముతాను. కనుక వారికి చాలా సంతోషం.
PSA 119:75 యెహోవా, నీ నిర్ణయాలు న్యాయంగా ఉంటాయని నాకు తెలుసు. నీవు నన్ను శిక్షించటం నీకు సరియైనదే.
PSA 119:76 ఇప్పుడు నిజమైన నీ ప్రేమతో నన్ను ఆదరించుము. నీ వాగ్దాన ప్రకారం నన్ను ఆదరించుము.
PSA 119:77 యెహోవా, నన్ను ఆదరించి, నన్ను బతుకనిమ్ము. నీ ఉపదేశములలో నిజంగా నేను ఆనందిస్తాను.
PSA 119:78 నాకంటే తామే మంచివాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి అబద్ధం చెప్పారు కనుక వారిని సిగ్గుపరచు. యెహోవా, నేను నీ ఆజ్ఞలను అద్యయనం చేస్తాను.
PSA 119:79 నీ అనుచరులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము. నీ ఒడంబడిక తెలిసిన మనుష్యులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
PSA 119:80 యెహోవా, నన్ను నీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధేయుడను కానిమ్ము. అందుచేత నేను అవమానించబడను.
PSA 119:81 నీవు నన్ను రక్షిస్తావని నిరీక్షిస్తూ నేను చనిపోబోతున్నాను. కాని యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నమ్ముతాను.
PSA 119:82 నీవు వాగ్దానం చేసిన వాటికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కాని నా కళ్లు అలసిపోతున్నాయి. యెహోవా, నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు?
PSA 119:83 నేను పొగలో ఎండిపోయిన ద్రాక్ష తొక్కలా ఉన్నప్పుడు కూడా నీ న్యాయ చట్టాలను నేను మరచిపోలేదు.
PSA 119:84 నేను ఎంత కాలం జీవిస్తాను? యెహోవా, నన్ను హింసించే మనుష్యులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు?
PSA 119:85 కొందరు గర్విష్ఠులు వారి అబద్ధాలతో నన్ను పొడిచారు. మరి అది నీ ఉపదేశాలకు విరుద్ధం.
PSA 119:86 యెహోవా, మనుష్యులు నీ ఆజ్ఞలన్నింటిని నమ్మగలరు. అబద్దికులు నన్ను హింసిస్తారు. నాకు సహాయం చేయుము!
PSA 119:87 ఆ అబద్ధీకులు నన్ను దాదాపుగా నాశనం చేశారు. నేను మాత్రం నీ ఆదేశాలను అనుసరించటం మానలేదు.
PSA 119:88 యెహోవా, నిజమైన నీ ప్రేమ చూపించి నన్ను జీవించనిమ్ము. నీవు చెప్పే వాటిని నేను చేస్తాను.
PSA 119:89 యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగుతుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొనసాగుతుంది.
PSA 119:90 నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు. యెహోవా, భూమిని నీవు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది.
PSA 119:91 నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి. యెహోవా, అన్నీ నీ సేవకుల్లా నీ ఆజ్ఞకు లోబడుతాయి.
PSA 119:92 నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే, నా శ్రమ నన్ను నాశనం చేసిఉండేది.
PSA 119:93 యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను.
PSA 119:94 యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము. ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను.
PSA 119:95 దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయత్నించారు. అయితే నీ ఒడంబడిక నాకు తెలివినిచ్చింది.
PSA 119:96 నీ ధర్మశాస్త్రానికి తప్ప ప్రతిదానికీ ఒక హద్దు ఉంది.
PSA 119:97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో! దినమంతా అదే నా ధ్యానం.
PSA 119:98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే జ్ఞానవంతునిగా చేస్తుంది.
PSA 119:99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది. ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
PSA 119:100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను. కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
PSA 119:101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
PSA 119:102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
PSA 119:103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
PSA 119:104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగవాణ్ణి చేస్తాయి, అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
PSA 119:105 యెహోవా, నీ వాక్యాలు నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
PSA 119:106 నీ న్యాయ చట్టాలు మంచివి. నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
PSA 119:107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను. దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
PSA 119:108 యెహోవా, నా స్తుతి అంగీకరించు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
PSA 119:109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది. కానీ యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచి పోలేదు.
PSA 119:110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు కానీ నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
PSA 119:111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను. అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
PSA 119:112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.
PSA 119:113 స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం. నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను.
PSA 119:114 నన్ను దాచిపెట్టి, కాపాడుము. యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
PSA 119:115 యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకు. నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
PSA 119:116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము. నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.
PSA 119:117 యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడుతాను. నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను.
PSA 119:118 యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు. ఎందుకంచే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు.
PSA 119:119 యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు. కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
PSA 119:120 యెహోవా, నీవంటే నాకు భయం, నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను.
PSA 119:121 యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను. నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు.
PSA 119:122 నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము. యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము.
PSA 119:123 యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు. కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి.
PSA 119:124 నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను. నీ న్యాయ చట్టాలు నాకు నేర్చించుము.
PSA 119:125 నేను నీ సేవకుడను నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
PSA 119:126 యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం. ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు.
PSA 119:127 యెహోవా, నీ ఆజ్ఞలు మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం.
PSA 119:128 నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను. తప్పుడు బోధలు నాకు అసహ్యం.
PSA 119:129 యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం, అందుకే నేను దానిని అనుసరిస్తాను.
PSA 119:130 ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది. నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది.
PSA 119:131 యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను. నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను.
PSA 119:132 దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము. నీ నామమును ప్రేమించే వారికి సరియై నవి ఏవో వాటిని చేయుము.
PSA 119:133 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము. నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు.
PSA 119:134 యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము. నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
PSA 119:135 యెహోవా, నీ సేవకుని అంగీకరించి నీ న్యాయచట్టాలు నేర్పించుము.
PSA 119:136 ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను.
PSA 119:137 యెహోవా, నీవు మంచివాడవు. నీ చట్టాలు న్యాయమైనవి.
PSA 119:138 ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి. యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము.
PSA 119:139 నా ఉత్సాహం నాలో కృంగిపోయినది. ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు.
PSA 119:140 యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది. అదంటే నాకు ప్రేమ.
PSA 119:141 నేను యువకుడను ప్రజలు నన్ను గౌరవించరు. కానీ నేను నీ ఆజ్ఞలు మరచిపోను.
PSA 119:142 యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది. నీ ఉపదేశాలు నమ్మదగినవి.
PSA 119:143 నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి. కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము.
PSA 119:144 నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది. నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
PSA 119:145 యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను. నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను.
PSA 119:146 యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను నన్ను రక్షించుము. నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను.
PSA 119:147 యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను. నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను.
PSA 119:148 నీ వాక్యాన్ని ధ్యానించుటకు నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను.
PSA 119:149 నీవు దయతో నా మాట విను. యెహోవా, నీ న్యాయ శాస్త్రాను సారముగా నన్ను జీవింప నిమ్ము.
PSA 119:150 మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు. యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు.
PSA 119:151 యెహోవా, నీవు నాకు సన్నిహి తంగా ఉన్నావు. నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి.
PSA 119:152 నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను.
PSA 119:153 యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము. నీ ఉపదేశాలను నేను మరువలేదు.
PSA 119:154 యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము. నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము.
PSA 119:155 దుష్టులు జయించరు ఎందుకంటే, వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు.
PSA 119:156 యెహోవా, నీవు చాలా దయగలవాడవు. నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించ నిమ్ము
PSA 119:157 నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు. కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు.
PSA 119:158 ఆ ద్రోహులను నేను చూస్తున్నాను. ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు.
PSA 119:159 చూడు, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను. యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము.
PSA 119:160 యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి. నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది.
PSA 119:161 ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు. కానీ నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను.
PSA 119:162 యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో, నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది.
PSA 119:163 అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను. యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం.
PSA 119:164 నీ మంచి న్యాయ చట్టాలను బట్టి నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను.
PSA 119:165 నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది. ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు.
PSA 119:166 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను.
PSA 119:167 నేను నీ ఒడంబడికను అనుసరించాను. యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ.
PSA 119:168 నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను. యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు.
PSA 119:169 యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము. నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము.
PSA 119:170 యెహోవా, నా ప్రార్థన వినుము. నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము.
PSA 119:171 నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగి పోతాను.
PSA 119:172 నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము. నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి.
PSA 119:173 నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించు కొన్నాను గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము.
PSA 119:174 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను. కానీ నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి.
PSA 119:175 యెహోవా, నన్ను జీవించనిమ్ము నిన్ను స్తుతించనిమ్ము. నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము.
PSA 119:176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను. యెహోవా, నా కోసం వేదకుతూ రమ్ము. నేను నీ సేవకుడను. మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.
PSA 120:1 యాత్ర కీర్తన. నేను కష్టంలో ఉన్నాను. సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను. ఆయన నన్ను రక్షించాడు.
PSA 120:2 యెహోవా, మోసకరమైన నాలుకనుండి, నాకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పిన వారినుండి నన్ను రక్షించుము.
PSA 120:3 అబద్దికులారా, యెహోవా మిమ్మల్ని ఎలా శిక్షిస్తాడో మీకు తెలుసా? మీరేమి పొందుతారో మీకు తెలుసా?
PSA 120:4 మిమ్మల్ని శిక్షించటానికి దేవుడు సైనికుని వాడిగల బాణాన్ని, మండుతున్న నిప్పులను ఉపయోగిస్తాడు.
PSA 120:5 అబద్ధికులారా, మీ దగ్గర్లో నివసించటం మెషెకులో నివసించటంలాగే ఉంటుంది. అది కేదారు గుడారాల్లో నివసించినట్టే ఉంటుంది.
PSA 120:6 శాంతిని ద్వేషించే ప్రజలతో నేను చాలా ఎక్కువ కాలం జీవించాను.
PSA 120:7 నాకు శాంతి కావాలి. అది నేను చెప్పినట్లు ఆ ప్రజలకు యుద్ధం కావాలి.
PSA 121:1 యాత్ర కీర్తన. కొండల తట్టు నేను చూసాను. కానీ నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
PSA 121:2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి నాకు సహాయం వస్తుంది.
PSA 121:3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు. నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
PSA 121:4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు. దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
PSA 121:5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు. యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
PSA 121:6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు. రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
PSA 121:7 ప్రతి అపాయం నుండి యోహోవా నిన్ను కాపాడుతాడు. యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
PSA 121:8 నీవు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు. ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
PSA 122:1 దావీదు యాత్ర కీర్తన. “మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.
PSA 122:2 ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచిఉన్నాము.
PSA 122:3 కొత్త యెరూషలేము ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది.
PSA 122:4 దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు. యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్తారు.
PSA 122:5 ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహాసనాలు వేసుకొనే స్థలం అది. దావీదు వంశపు రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు.
PSA 122:6 యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి. “నిన్ను ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.
PSA 122:7 నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.”
PSA 122:8 నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను, శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
PSA 122:9 మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.
PSA 123:1 యాత్ర కీర్తన. దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను. నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు.
PSA 123:2 బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు. బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు. అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడుతాము. దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురు చూస్తాము.
PSA 123:3 యెహోవా, మా మీద దయ చూపించుము. మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము.
PSA 123:4 ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది. మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.
PSA 124:1 దావీదు యాత్ర కీర్తన. గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో? ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
PSA 124:2 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో? ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
PSA 124:3 అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా వాళ్లు మనల్ని సజీవంగా మింగేసిఉండేవాళ్లు.
PSA 124:4 అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా, మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
PSA 124:5 అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.
PSA 124:6 యెహోవాను స్తుతించండి. మన శత్రువులు మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.
PSA 124:7 మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము. వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
PSA 124:8 మనకు సహాయం యోహోవా దగ్గర నుండే వచ్చింది. భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
PSA 125:1 యాత్ర కీర్తన. యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు. వారు ఎన్నటికీ కదలరు. వారు శాశ్వతంగా కొనసాగుతారు.
PSA 125:2 యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి. అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.
PSA 125:3 దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు. దుర్మార్గులు అలా చేస్తే అప్పుడు మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం మొదలు పెడతారేమో.
PSA 125:4 యెహోవా, మంచి మనుష్యులకు మంచి వాడవుగా ఉండుము. పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచి వాడవుగా ఉండుము.
PSA 125:5 యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము. వాళ్లు వక్రమైన పనులు చేస్తారు. ఇశ్రాయేలులో శాంతి ఉండనిమ్ము.
PSA 126:1 యాత్ర కీర్తన. యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి తిరిగి వెసుకకు తీసకొనివచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
PSA 126:2 మేము నవ్వుకుంటున్నాము. మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలు పెట్టే వాళ్లము. “దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
PSA 126:3 ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పు కొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్మాము!
PSA 126:4 యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము. ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
PSA 126:5 విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా వుండవచ్చు, కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
PSA 126:6 అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు, కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.
PSA 127:1 సోలొమోను యాత్ర కీర్తన. ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు. పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే కాపలా వాళ్లు వారి సమయం వృధా చేసికొంటున్నట్టే.
PSA 127:2 నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పనిచేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే అయితే నీవు నీ సమయం వృదా చేనుకొంటున్నట్టే. దేవుడు తనకి ప్రియమైనవాళ్ల విషయం శ్రద్ధ తీసుకొంటాడు. వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన శ్రద్ద తీసుకొంటాడు.
PSA 127:3 పిల్లలు యెహోవానుండి లభించే కానుక. వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం.
PSA 127:4 యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటి వారు.
PSA 127:5 తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే వాడు చాలా సంతోషంగా ఉంటాడు. ఆ మనిషి ఎన్నటికీ ఓడించబడడు. బహిరంగ స్థలాల్లో అతని కుమారులు అతని శత్రువులనుండి అతణ్ణి కాపాడుతారు.
PSA 128:1 యాత్ర కీర్తన. యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు. ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.
PSA 128:2 నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు. ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
PSA 128:3 ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది. బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
PSA 128:4 యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
PSA 128:5 యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశీస్తున్నాను. నీవ నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
PSA 128:6 నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను. ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.
PSA 129:1 యాత్ర కీర్తన. నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు. ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము.
PSA 129:2 నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు కానీ వారు ఎన్నడూ జయించలేదు.
PSA 129:3 నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు. నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.
PSA 129:4 అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు.
PSA 129:5 సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు. వారు పోరాటం మానివేసి పారిపోయారు.
PSA 129:6 ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలచిన గడ్డిలాంటి వాళ్లు. ఆ గడ్డి ఎదుగక ముందే చస్తుంది.
PSA 129:7 పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకద. ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
PSA 129:8 ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని చెప్పారు.” “యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.
PSA 130:1 యాత్ర కీర్తన. యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను. కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
PSA 130:2 నా ప్రభువా, నా మాట వినుము. సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
PSA 130:3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటి బట్టి నీవు శిక్షిస్తే ఒక్క మనిషి కూడా మిగలడు.
PSA 130:4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము. అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
PSA 130:5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను. నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది. యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
PSA 130:6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను. ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
PSA 130:7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో. నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది. యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
PSA 130:8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
PSA 131:1 యాత్ర కీర్తన. యెహోవా, నేను గర్విష్ఠిని కాను. నేను ప్రముఖుడిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను. నేను గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను. నాకు మరీ కష్టతరమైన వాటిని గూర్చి నేను చింతించను.
PSA 131:2 నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది. తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా నా ప్రాణం మౌనంగా, మ్మదిగా ఉంది.
PSA 131:3 ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో. ఇప్పుడు ఆయనను నమ్ముకో, ఎప్పటికీ ఆయన్నే నమ్ముకో.
PSA 132:1 యాత్ర కీర్తన. యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకోమ్ము.
PSA 132:2 కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు. ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దైవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
PSA 132:3 దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను. నేను నా పడక మీద పండుకొనను,
PSA 132:4 నేను నిద్రపోను, నేను నా కండ్లకు విశ్రాంతి నివ్వను,
PSA 132:5 యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను! ఇశ్రాయేలీయుల మహ శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”
PSA 132:6 ఎఫ్రాతాలో మేము దాని గూర్చి విన్నాం. ఒడంబడికపెట్టెను కిర్యత్యారీము దగ్గర మేము కనుగొన్నాము.
PSA 132:7 మనం పవిత్ర గూడారానికి వెళ్దాం రండి. దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం.
PSA 132:8 యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము. యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము.
PSA 132:9 యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము. నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు.
PSA 132:10 నీ సేవకుడైన దావీదు కోసం నీవు ఏర్పరచు కొన్న రాజును నిరాకరించవద్దు.
PSA 132:11 యెహోవా దావీదుతో ఒక స్థిరప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు. దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు.
PSA 132:12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే అప్పుడు నీ వర శంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యోహోవా చెప్పాడు.
PSA 132:13 యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు. తన నివాసస్థలంగా దాన్ని కోరు కొనియున్నాడు.
PSA 132:14 యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం. నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను.
PSA 132:15 సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను. ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది.
PSA 132:16 యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను. మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు.
PSA 132:17 ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ములేచేలా చేస్తాను. నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను.
PSA 132:18 దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను. కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.”
PSA 133:1 దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి. సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
PSA 133:2 అది యాజకుని తల మీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది. అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
PSA 133:3 అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండ మీద పడుతున్న మంచులా ఉంటుంది. సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.
PSA 134:1 యాత్ర కీర్తన. యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి! రాత్రి అంతా ఆలయంలో సేవించిన సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి.
PSA 134:2 సేవకులారా, మీ చేతులు ఎత్తి యెహోవాను స్తుతించండి.
PSA 134:3 యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక! యెహోవా ఆకాశాన్ని, భూమిని చేశాడు.
PSA 135:1 యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.
PSA 135:2 యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి! ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
PSA 135:3 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.
PSA 135:4 యెహోవా యాకోబును కోరుతున్నాడు. యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.
PSA 135:5 యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!
PSA 135:6 ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో, అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలను కొంటే అది చేస్తాడు.
PSA 135:7 భూమికి ప్తెగా మేఘాలను దెవుడు చేస్తాడు. మెరుపులను, వర్షాన్ని దెవుడు చేస్తాడు. దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.
PSA 135:8 ఈజిప్టు మనుష్యులలో జ్యేష్టులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.
PSA 135:9 దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు. ఫరోకు, అవి అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.
PSA 135:10 దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు. బలమైన రాజులను దేవుడు చంపేసాడు.
PSA 135:11 అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు. బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు. కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.
PSA 135:12 వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.
PSA 135:13 యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది. యెహోవా, ప్రజలు నిన్ను జనాంగాల్ని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
PSA 135:14 యెహోవా జనాంగాల్ని శిక్షించాడు. కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.
PSA 135:15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే. వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.
PSA 135:16 ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కానీ అవి మాట్లాడలేవు. కళ్లు వున్నాయి కానీ అవి చూడలేవు.
PSA 135:17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కానీ అవి వినలేవు. ముక్కులు ఉన్నాయి కానీ అవి వాసన చూడలేవు.
PSA 135:18 మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు. ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.
PSA 135:19 ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు! అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.
PSA 135:20 లేవీ వంశమా, యెహోవాను స్తుతించు! యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
PSA 135:21 సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి, యెహోవా స్తుతించబడును గాక! యెహోవాను స్తుతించండి!
PSA 136:1 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:2 దేవుళ్లకు దేవుణ్ణి స్తుతించండి! ఆయన నిజమైన ప్రేమ నిరంతరం ఉంటుంది.
PSA 136:3 యెహోవా దేవున్ని స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:4 ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే ఆయన్ని మాత్రమే స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ ఎల్లప్పుడు ఉంటుంది.
PSA 136:5 జ్ఞానంచేత ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ ఎల్లకాలం ఉంటుంది.
PSA 136:6 దేవుడు సముద్రం మీద ఆరిన నేలను చేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:7 దేవుడు గొప్ప జ్యోతులను చేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:8 దేవుడు పగటిని ఏలుటకు సూర్యుణ్ణి చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:9 దేవుడు రాత్రిని ఏలుటకు చంద్రుని, నక్షత్రాలను చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:10 దేవుడు ఈజిప్టు మనుష్యులలో మొదటివారిని, జంతువులలోను మొదటివాటిని చంపేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:11 దేవుడు ఈజిప్టునుండి ఇశ్రాయేలును విడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:12 దేవుడు తన గొప్ప శక్తిని బలాన్ని చూపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:13 దేవుడు ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:14 దేవుడు తన ఇశ్రాయేలును ఎర్రసముద్రంలో నుండి నడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:15 దేవుడు ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:16 దేవుడు తన ప్రజలను ఉడారిలో నడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:17 దేవుడ శక్తిగల రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:18 దేవుడు బలమైన రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:19 దేవుడు ఆమోరీయుల రాజైన సీహోనును ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:20 దేవుడు భాషాను రాజైన ఓగును ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:21 దేవుడు వారి దేశాన్ని ఇశ్రాయేలీయులకు యిచ్చాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:22 దేవుడు ఆ దేశాన్ని ఒక కానుకగా ఇశ్రాయేలీయులకు యిచ్చాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:23 దేవుడు, మనం ఓడించబడినప్పుడు మనలను జ్ఞాపకం చేసికొన్నాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:24 దేవుడు మన శత్రువుల నుండి మనలను రక్షించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:25 దేవుడు ప్రతి ప్రాణికి ఆహారం యిస్తాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 136:26 పరలోకపు దేవుని స్తుతించండి! ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
PSA 137:1 బబులోను నదుల దగ్గర మనం కూర్చొని సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం.
PSA 137:2 దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లుకు మన సితారాలు తగిలించాము.
PSA 137:3 బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు. సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు. సియోను గూర్చి పాటలు పాడుమని వారు మనకు చెప్పారు.
PSA 137:4 కానీ విదేశంలో మనం యెహోవాకు కీర్తనలు పాడలేము!
PSA 137:5 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి పోతే నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండి పోవును గాక!
PSA 137:6 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి పోతే నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకు పోవును గాక! నేను ఎన్నటికీ నిన్ను మరువనని వాగ్దానం చేస్తున్నాను.
PSA 137:7 యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను! యెహోవా, యెరూషలేము పడిన రోజున ఎదోమీయులు ఏమిచేసారో జ్ఞాపకం చేసుకోనుము. దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు.
PSA 137:8 బబులోనూ, నీవు నాశనం చేయబడతావు! నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించ బడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక!
PSA 137:9 నీ చంటి బడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు.
PSA 138:1 దావీదు కీర్తన. దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను. దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
PSA 138:2 దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను. నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను. నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
PSA 138:3 దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను. నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.
PSA 138:4 యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక! నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
PSA 138:5 ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను. యెహోవా మహిమ గొప్పది.
PSA 138:6 దేవుడు గొప్పవాడు. అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు. గర్వష్టులు చేసే పనులు యెహోవాకు తెలుసు. కానీ ఆయన వారికి సన్ని హితంగా ఉండడు.
PSA 138:7 దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బతికించుము. నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
PSA 138:8 యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము. యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
PSA 139:1 సంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన. యెహోవా, నీవు నన్ను పరీక్షించావు. నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
PSA 139:2 నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు. దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
PSA 139:3 యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు. నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
PSA 139:4 యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
PSA 139:5 యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు. నీవు నెమ్మదిగా నీ చేయినామీద వేస్తావు.
PSA 139:6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది. గ్రహించటం నాకు కష్టతరం.
PSA 139:7 నేను వెళ్లే ప్రతీచోటా నీ ఆత్మ ఉంది. యెహోవా, నేను నీ నుండి తప్పించుకోలేను.
PSA 139:8 నేను ఆకాశానికి ఎక్కితే, నీవు అక్కడ ఉన్నావు. పాతాళానికి నేను దిగిపోతే నీవు అక్కడ కూడా ఉన్నావు.
PSA 139:9 యెహోవా, సూర్యుడు ఉదయించే తూర్పు దిశకు నేను వెళ్తే నీవు అక్కడ ఉన్నావు. పశ్చిమంగా సముద్రం దగ్గరకు వెళ్తే, నీవు అక్కడ ఉన్నావు.
PSA 139:10 అక్కడ కూడ నీవు నీ కుడిచేయి చాచి, ఆ చేతితో నన్ను నడిపిస్తావు.
PSA 139:11 యెహోవా, నేను నీకు కనబడకుండా దాగుకోవాలని ప్రయత్నిస్తే, “పగలు రాత్రిగా మారిపోయింది. తప్పక చీకటి నన్ను దాచిపెడుతుంది” అని చెప్పవచ్చు
PSA 139:12 కాని యెహోవా, చీకటి నీకు చీకటి కాదు. రాత్రి నీకు పగటి వెలుగువలె ఉంటుంది.
PSA 139:13 యెహోవా, నా శరీరమంతటినీ నీవు చేశావు. నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
PSA 139:14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను. నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
PSA 139:15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు నా తల్లి గర్భంలో దాగి ఉండి, నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
PSA 139:16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు. ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
PSA 139:17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం. నీకు ఎంతో తెలుసు.
PSA 139:18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి. కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.
PSA 139:19 దేవా, దుర్మార్గులను చంపివేయుము. ఆ హంతకులను నా దగ్గర నుండి తీసివేయుము.
PSA 139:20 ఆ చెడ్డ మనుష్యులు నిన్ను గూర్చి చెడు సంగతులు చెబుతారు. వారు నీ నామాన్ని గూర్చి చెడు సంగతులు చెబుతారు.
PSA 139:21 యెహోవా, నిన్ను ద్వేషించే ప్రజలను నేను ద్వేషిస్తాను. నీకు విరోధంగా తిరిగే మనుష్యులను నేను ద్వేషిస్తాను.
PSA 139:22 నేను వారిని పూర్తిగా ద్వేషిస్తాను! నీ శత్రువులు నాకూ శత్రువులే.
PSA 139:23 యెహోవా, నన్ను చూచి నా హృదయాన్ని తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా తలంపులు తెలుసుకొనుము.
PSA 139:24 చూచి నాలో చెడు తలంపులు ఏమి లేవని తెలుసుకొనుము. శాశ్వతంగా ఉండే నీ మార్గంలో నన్ను నడిపించుము.
PSA 140:1 సంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన. యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రుల నుండి నన్ను కాపాడుము.
PSA 140:2 ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు.
PSA 140:3 వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది.
PSA 140:4 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు.
PSA 140:5 ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు. నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు. నా దారిలో వారు ఉచ్చు పెడతారు.
PSA 140:6 యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
PSA 140:7 యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు. నీవు ఇనుప టొపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు.
PSA 140:8 యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు. వారి పథకాలు నెగ్గనీయకు.
PSA 140:9 యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము. ఆ మనుష్యులు చెడు కార్యాలు తల పెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చెయుము.
PSA 140:10 వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము. నా శత్రువులను అగ్నిలో పడవేయుము. వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము.
PSA 140:11 యెహోవా, ఆ అబద్దికులను బతుకనియ్యకుము. ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము.
PSA 140:12 పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు. నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు.
PSA 140:13 యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తాను. నీ సన్నిధానంలో వారు నివసిస్తారు.
PSA 141:1 దావీదు స్తుతి కీర్తన. యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను. నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము. త్వరపడి నాకు సహాయం చేయుము.
PSA 141:2 యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము. నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము.
PSA 141:3 యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము. నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము.
PSA 141:4 నా హృదయం ఏ చెడు సంగతులవైపూ మొగ్గేలా అనుమతించవద్దు. చెడ్డ మనుష్యులతో చేరకుండా, తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయుము. చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విషయాల్లో నన్ను బాగస్థుడను కాకుండా చేయుము.
PSA 141:5 ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు. అది నాకు మంచిదే. వారి విమర్శను నేను అంగీకరిస్తాను. నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది.
PSA 141:6 ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు కిందికి పడదోయబడతారు. అప్పుడు నేను చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు.
PSA 141:7 మనుష్యులు నేలను తవ్వి దున్నుతారు. మట్టి వెదజల్లబడుతుంది. అదే విధంగా ఆ దుర్మార్గుల యెముకలు వారి సమాధిలో వెదజల్లబడుతాయి.
PSA 141:8 యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను నీ తట్టు చూస్తున్నాను. నేను నిన్ను నమ్ముకొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము.
PSA 141:9 ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము. ఆ దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము.
PSA 141:10 నేను హాని లేకుండా తప్పించుకొనగా ఆ దుర్మార్గులు తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము.
PSA 142:1 దావీదు ధ్యాన గీతం. అతడు గూహలో ఉన్నప్పటి ప్రార్థన. సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను. యెహోవాను నేను ప్రార్థిస్తాను.
PSA 142:2 నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను. నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
PSA 142:3 నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు. నా ప్రాణం నాలో మునిగిపోయింది. అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.
PSA 142:4 నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు. పారిపోవుటకు నాకు స్థలం లేదు. నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.
PSA 142:5 కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను. యెహోవా, నీవే నా క్షేమ స్థానం. యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.
PSA 142:6 యెహోవా, నా ప్రార్థన విను. నీవు నాకు ఎంతో అవసరం. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము. నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
PSA 142:7 ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము. యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను. నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై, నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.
PSA 143:1 దావీదు స్తుతి కీర్తన. యెహోవా, నా ప్రార్థన వినుము. నా ప్రార్థన ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబుయిమ్ము. నిజంగా నీవు మంచివాడవని, నమ్మకమైన వాడవని నాకు చూపించుము.
PSA 143:2 నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు. నీ ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతునిగా ఎంచబడడు.
PSA 143:3 కానీ నా శత్రువులు నన్ను తరుముతున్నారు. వారు నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు. ఆ శాశ్వత చీకటి సమాధిలోనికి నన్ను తోసి వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.
PSA 143:4 నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది. నేను నా ధైర్యాన్ని పోగొట్టుకొంటున్నాను.
PSA 143:5 కానీ చాలకాలం క్రిందట జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసికొంటాను. నీ క్రియలన్నిటినీ నేను ధ్యానిస్తున్నాను. యెహోవా, నీవు నీ శక్తితో చేసిన అనేక అద్భుత కార్యాలను గూర్చి నేను ధ్యానిస్తున్నాను.
PSA 143:6 యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నాను. ఎండిన భూమి వర్షం కోసం ఎదురు చూచినట్టుగా నేను నీ సహాయం కోసం ఎదురు చుస్తున్నాను.
PSA 143:7 యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము! నేను నా ధైర్యం పోగొట్టుకొన్నాను. నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము. సమాధిలో చచ్చిపడిన శవాల్లా ఉండనీయకుము.
PSA 143:8 యెహోవా, ఈ ఉదయం నీ నిజమైన ప్రేమను నాకు చూపించుము నేను నిన్ను నమ్ముకొన్నాను. సరియైన మార్గాన్ని నాకు చూపించుము. నేను నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను!
PSA 143:9 యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
PSA 143:10 నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము. నీవు నా దేవుడవు.
PSA 143:11 యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు నన్ను జీవించనిమ్ము. నీవు నిజంగా మంచివాడవని నాకు చూపించి నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
PSA 143:12 యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి, నన్ను చంపటానికి చూస్తున్న నా శత్రువులను ఓడించుము. ఎందుకంటే నేను నీ సేవకుడను.
PSA 144:1 దావీదు కీర్తన. యెహోవా నా దుర్గం యెహోవాను స్తుతించండి. యెహోవా నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తాడు. యెహోవా నన్ను పోరాటానికి సిద్ధం చేస్తాడు.
PSA 144:2 యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. పర్వతం మీద ఎత్తయిన స్థలంలో యెహోవా నా క్షేమ స్థానం. యెహోవా నన్ను రక్షిస్తాడు, యెహోవా నా కేడెం. నేను ఆయనను నమ్ముతాను. నేను నా ప్రజలను పాలించుటకు యెహోవా నాకు సహాయం చేస్తాడు.
PSA 144:3 యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం? నీవు మనుష్యకుమారులను ఎందుకు గమనిస్తావు?
PSA 144:4 మనిషి జీవితం గాలి బుడగలాంటిది. వాని జీవితం దాటిపోతున్న నీడలాంటిది.
PSA 144:5 యెహోవా, ఆకాశం తెరచి దిగి రమ్ము. పర్వతాలను తాకు, వాటినుండి పొగ వస్తుంది.
PSA 144:6 యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము. నీ బాణాలు వేసి, వారు పారిపోవులట్లు చేయుము.
PSA 144:7 యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను రక్షించుము. ఈ శత్రు సముద్రంలో నన్ను మునిగి పోనీయకుము. ఇతరుల నుండి నన్ను రక్షించుము.
PSA 144:8 ఈ శత్రువులు అబద్ధీకులు. వారు అసత్య విషయాలు చెబుతారు.
PSA 144:9 యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకర కార్యాలను గూర్చి నేను కొత్త కీర్తన పాడగలిగేలా నన్ను రక్షించుము. పది తంతుల సితారాతో నిన్ను నేను స్తుతిస్తాను.
PSA 144:10 రాజులు యుద్ధాల్లో జయించుటకు యెహోవా సహాయం చేస్తాడు. యెహోవా సేవకుడు దావీదును అతని శత్రువు ఖడ్గాలనుండి ఆయన రక్షించాడు.
PSA 144:11 ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము. ఈ శత్రువులు అబద్ధీకులు. వారు అసత్యాలు చెబుతారు.
PSA 144:12 మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను. మన కుమార్తెలు రాజభవన నిర్మాణానికి చెక్కబడిన మూల స్థంభాలవలె ఉంటారు.
PSA 144:13 మన ధ్యానపు కొట్టాలు అన్ని రకాల పంటలతో నిండి ఉంటాయని నేను ఆశిస్తున్నాను. మన పొలాల్లోని గొర్రెలు వేలకు వేలుగా పిల్లల్ని పెడతాయని నేను ఆశిస్తున్నాను.
PSA 144:14 మన బలమైన పశువులు భారమైన బరువులను లాగగలవని నేను ఆశిస్తున్నాను. శత్రువులు ఎవరూ మన మీద దాడి చేయటానికి రారని నేను ఆశిస్తున్నాను. మనం ఎన్నటికీ యుద్ధానికి వెళ్లం అని నేను ఆశిస్తున్నాను. మన వీధుల్లో ప్రమాదాల కేకలు ఏమీ ఉండవని నేను ఆశిస్తున్నాను.
PSA 144:15 ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు. యెహోవా ఎవరికి దేవుడో ఆ మనుష్యులు చాలా సంతోషిస్తారు.
PSA 145:1 దావీదు ప్రార్థన. నా దేవా, నా రాజా నిన్ను నేను స్తుతిస్తాను. నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
PSA 145:2 ప్రతిరోజూ నిన్న నేను స్తుతిస్తాను. ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
PSA 145:3 యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు. ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
PSA 145:4 యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు. నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
PSA 145:5 ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు. నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
PSA 145:6 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు. నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
PSA 145:7 నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు. యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.
PSA 145:8 యెహోవా దయగల వాడు, కరుణగల వాడు. యెహోవా సహనంగల వాడు, ప్రేమ పూర్ణుడు.
PSA 145:9 యెహోవా, అందరి యెడలా మంచివాడు. దేవుడ చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
PSA 145:10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి. నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
PSA 145:11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు. నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
PSA 145:12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు. మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
PSA 145:13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. నీవు శాశ్వతంగా పాలిస్తావు.
PSA 145:14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు. కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
PSA 145:15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం సీవైపు చూస్తాయి. సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
PSA 145:16 యెహోవా, నీవు నీ గుప్పిడి విప్పి, జీవిస్తున్న సకల ప్రాణులకూ వాటికి కావాల్సినవన్నీ యిస్తావు.
PSA 145:17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది. యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమ చూపిస్తాడు.
PSA 145:18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు. యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
PSA 145:19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు. యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు. మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
PSA 145:20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు. దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
PSA 145:21 నేను యెహోవాను స్తుతిస్తాను! ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!
PSA 146:1 యెహోవాను స్తుతించండి! నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
PSA 146:2 నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
PSA 146:3 సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు. మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
PSA 146:4 మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడుతారు. అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
PSA 146:5 సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు. ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
PSA 146:6 భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు. సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు. యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
PSA 146:7 అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు. ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు. చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
PSA 146:8 గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు. కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు. మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
PSA 146:9 మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు. విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు. అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
PSA 146:10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను. సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను. యెహోవాను స్తుతించండి!
PSA 147:1 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. మన దేనునికి స్తుతులు పాడండి. ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం.
PSA 147:2 యెహోవా యెరూషలేమును నిర్మించాడు. బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు.
PSA 147:3 పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి, వారి గాయాలకు కట్లు కడతాడు.
PSA 147:4 దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు. వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.
PSA 147:5 మన ప్రభువు చాలా గొప్పవాడు ఆయన చాలా శక్తిగలవాడు. ఆయన పరజ్ఞానానికి పరిమితం లేదు.
PSA 147:6 పేదలను యెహోవా బలపరుస్తాడు. కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.
PSA 147:7 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. స్వరమండలాలతో మన దేవుని స్తుతించండి.
PSA 147:8 దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు. పర్వతాల మీద దేవుడు గడ్డని మొలిపిస్తాడు.
PSA 147:9 జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు. పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.
PSA 147:10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు.
PSA 147:11 యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.
PSA 147:12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము. సీయోనూ, నీ దేవుని స్తుతించుము!
PSA 147:13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బల పరుస్తాడు. నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
PSA 147:14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు. ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.
PSA 147:15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు. దానికి వెంటనే అది లోబడుతుంది.
PSA 147:16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచుకురిసేటట్టు దేవుడు చేస్తాడు. ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.
PSA 147:17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లను పడేలా చేస్తాడు. ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.
PSA 147:18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది. మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.
PSA 147:19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.
PSA 147:20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు. ఇతర మనుష్యులకు దేవుడ తన న్యాయ చట్టం ఉపదేశించలేదు. యెహోవాను స్తుతించండి!
PSA 148:1 యెహోవాను స్తుతించండి! పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
PSA 148:2 సకల దూతలారా, యెహోవాను స్తుతించండి! ఆయన సర్వ సైనికులారా ఆయనను స్తుతించండి!
PSA 148:3 సూర్యచంద్రులారా యెహోవాను స్తుతించండి. ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
PSA 148:4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి. ఆకాశం పైగా ఉన్న జలములారా ఆయనను స్తుతించండి.
PSA 148:5 యెహోవా నామాన్ని స్తుతించండి. ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
PSA 148:6 ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు. ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
PSA 148:7 భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు! మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా యెహోవాను స్తుతించండి.
PSA 148:8 అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, తుఫాను గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
PSA 148:9 పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను, దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
PSA 148:10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
PSA 148:11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు. నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
PSA 148:12 యువతీ యువకులను దేవుడు చేశాడు. వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
PSA 148:13 యెహోవా నామాన్ని స్తుతించండి! ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి! భూమిపైన, ఆకాశంలోను ఉన్న సమస్తం ఆయనను స్తుతించండి!
PSA 148:14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు. దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు. ఎవరి పక్షంగా ఆయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!
PSA 149:1 యెహోవాను స్తుతించండి. యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి! ఆయన అనుచరులును కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
PSA 149:2 ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలసి అనందించనివ్వండి. సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
PSA 149:3 ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ నాట్యమాడుతూ దేవుని స్తుతించ నివ్వండి.
PSA 149:4 యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు. దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు. ఆయన వారిని రక్షించాడు!
PSA 149:5 దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి. పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.
PSA 149:6 ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక. ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
PSA 149:7 వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక. వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
PSA 149:8 ఆ రాజులకు, ప్రముఖులకు దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
PSA 149:9 దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు. దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు. యెహోవాను స్తుతించండి!
PSA 150:1 యెహోవాను స్తుతించండి! దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి! ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి!
PSA 150:2 ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి! ఆయన గొప్పతనమంతటికోసం ఆయనను స్తుతించండి!
PSA 150:3 బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి! స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి!
PSA 150:4 తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి! తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి!
PSA 150:5 పెద్ద తాళాలతో దేవుని స్తుతించండి! పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి!
PSA 150:6 సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి! యెహోవాను స్తుతించండి.
PRO 1:1 ఈ మాటలు దావీదు కుమారుడైన సొలొమోను చెప్పిన సామెతలు. సొలొమెను ఇశ్రాయేలీయుల రాజు.
PRO 1:2 ప్రజలు జ్ఞానము కలిగి, సరైన వాటిని చేయటం తెలుసుకొనేందుకు ఈ సంగతులు రాయబడ్డాయి. నిజమైన అవగాహన కలిగి ఉండేందుకు ప్రజలకు ఈ మాటలు సహాయం చేస్తాయి.
PRO 1:3 ప్రజలు జీవించేందుకు శ్రేష్ఠమైన విధానాన్ని ఈ మాటలు నేర్పిస్తాయి. నీతి, నిజాయితీ, మంచితనం కలిగి ఉండేందుకు సరైన మార్గాన్ని ప్రజలు నేర్చుకుంటారు.
PRO 1:4 జ్ఞానమును నేర్చుకోవాల్సిన సాధారణ మనుష్యులకు జ్ఞానముగల ఈ మాటలు నేర్చిస్తాయి. యువతీ యువకులు ఈ మాటల మూలంగా జ్ఞానము, దాని ప్రయోగాన్ని నేర్చుకొంటారు.
PRO 1:5 ఈ మాటల్లోని ఉపదేశాలను జ్ఞానముగలవారు కూడ జాగ్రత్తగా అనుసరించాలి. అప్పుడు వాళ్లు ఇంకా ఎక్కువ నేర్చుకొని, ఇంకా జ్ఞానముగల వారు అవుతారు. మంచి చెడుల తారతమ్యం తెలుసుకోవటంలో నిపుణతగల వారు యింకా ఎక్కువ అవగాహన సంపాదిస్తారు.
PRO 1:6 అప్పుడు జ్ఞానముగల కథలు, పొడుపు కథలు మనుష్యులు గ్రహించగలుగుతారు. జ్ఞానముగల వారు చెప్పే విషయాలను మనుష్యులు గ్రహించగలుగుతారు.
PRO 1:7 ఒక వ్యక్తి యెహోవాను గౌరవించి, ఆయనకు విధేయత చూపించటమే, నిజమైన తెలివికి మూలము. కానీ పాపాన్ని ప్రేమించే మనుష్యులు జ్ఞానాన్ని, సరైన ఉపదేశాన్ని ద్వేషిస్తారు.
PRO 1:8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశానికి నీవు విధేయుడవు కావాలి. మరియు నీ తల్లి ఉపదేశాలు కూడ నీవు పాటించాలి.
PRO 1:9 నీ తల్లిదండ్రుల మాటలు నీ తలను మరింత అందంగా తీర్చిదిద్దే పూల కిరీటంలా ఉంటాయి. ఆ ఉపదేశాలు నీ మెడకు అందమైన హారంలా ఉంటాయి.
PRO 1:10 నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే ప్రజలు తమతో కూడ పాపాన్ని చేయించటానికి పయత్నిస్తారు. నీవు వారిని అనుసరించకూడదు.
PRO 1:11 ఆ పాపులు ఇలా చెప్పవచ్చు: “మాతో వచ్చేయి! మనం దాక్కొని, ఎవరినైనా అమాయకుణ్ణి చంపటానికి కనిపెడదాం.
PRO 1:12 ఎవరైనా ఒక నిర్దోషిమీద మనం దాడి చేద్దాం. మనం అతణ్ణి చంపుదాం. ఆ మనిషిని పితృ లోకానికి మనం పంపిద్దాం. అతణ్ణి మనం నాశనం చేసి, సమాధికి పంపిద్దాం.
PRO 1:13 చాలా ధనం, విలువ చేసే అన్ని రకాల వస్తువులు మనం దొంగిలిద్దాం. ఈ వస్తువులతో మనం మన గృహాలు నింపుకొందాం.
PRO 1:14 కనుక మాతో వచ్చి, వీటిని చేయటానికి మాకు సహాయం చేయి. మనకు దొరికే వస్తువులన్నింటినీ మనం అందరం పంచుకొందాం.”
PRO 1:15 నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే మనుష్యులను వెంబడించవద్దు. వారు జీవించే విధానంలో మొదటి మెట్టు కూడా నీవు ఎక్కవద్దు.
PRO 1:16 ఆ చెడ్డ మనుష్యులు కీడు చేయటానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. వారు ఎంతసేపూ మనుష్యులను చంపాలని ఆశిస్తూంటారు.
PRO 1:17 ఒక పక్షి నిన్ను చూస్తూండగా ఆ పక్షిని పట్టాలని వల వేయటం నిష్ప్రయోజనం. కనుక ఆ దుర్మార్గులను కనిపెట్టి ఉండు. జాగ్కత్తగా ఉండు. ఆ దుర్మార్గులు ఇతరులను చంపాలని ఉచ్చు వేస్తున్నారు.
PRO 1:18 కానీ నిజానికి వారికి వారే ఉచ్చు వేసుకొంటారు. వారి స్వంత ఉచ్చుతో వారే నాశనం చేయబడుతారు.
PRO 1:19 ఇవి దురాశ పరుల పద్ధతులు అలాంటి దురాశ అది కలిగివున్నవారికి ప్రాణాంతక మవుతుంది.
PRO 1:20 ఇలా విను! జ్ఞానము ప్రజలకు ఉపదేశించటానికి ప్రయత్నిస్తుంది. ఆమె (జ్ఞానము) వీధుల్లో, సంతల్లో అరుస్తుంది.
PRO 1:21 రద్దీగల వీధి మూలల్లో ఆమె (జ్ఞానము) పిలుస్తోంది. ఆమె (జ్ఞానము) తన మాటలు వినేందుకు ప్రజలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తూ పట్టణ ద్వారాల దగ్గర ఉంటూ (జ్ఞానము) చెపుతుంది:
PRO 1:22 “మీరు వెర్రివాళ్లు. ఇంకెన్నాళ్లు మీరు ఇలా వెర్రి పనులు చేస్తూనే ఉంటారు? ఎన్నాళ్లు మీరు తెలివిని ద్వేషీస్తూ ఉంటారు?
PRO 1:23 మీరు పశ్చాత్తాపపడి నా సలహా, నా ఉపదేశం విని ఉంటే, నాకు తెలిసింది అంతా నేను మీతో చెప్పి ఉండేదాన్ని. నాకు ఉన్న తెలివి అంతా మీకు ఇచ్చి ఉండేదాన్ని.
PRO 1:24 “కానీ మీరు నా మాట వినేందుకు తిరస్కరించాను. సహాయం చేయటానికి నేను ప్రయత్నించాను. సహాయం చేయటానికి నేను ప్రయత్నించాను. నేను నా చేయి అందించాను. కానీ నా సహాయం స్వీకరించటానికి మీరు నిరాకరించారు.
PRO 1:25 నా సలహా అంతటినీ మీరు నిర్లక్ష్యం చేసి, తిప్పికొట్టారు. నా మాటలు స్వీకరించటానికి మీరు నిరాకరించారు.
PRO 1:26 అందుచేత నేను మీ కష్టం చూచి నవ్వుతాను. మీకు కష్టం కలగటం చూచి నేను సరదా పడతాను.
PRO 1:27 గొప్ప కష్టం తుఫానులా మీ మీదికి వస్తుంది. సమస్యలు ఒక బలమైన గాలిలా మీ మీద కొడతాయి. మీ కష్టాలు, మీ విచారం మీ మీద మహా గొప్ప భారంగా ఉంటాయి.
PRO 1:28 “ఈ సంగతులన్నీ జరిగినప్పుడు మీరు నా సహాయం కోసం అడుగుతారు. కానీ నేను మీకు సహాయం చేయను. మీరు నాకోసం వెదుకుతారు, కానీ మీరు నన్ను కనుగొనలేరు.
PRO 1:29 మీరు ఎన్నడూ నా తెలివిని కోరుకోలేదు, గనుక నేను మీకు సహాయం చేయను. మీరు యెహోవాకు భయపడి ఆయనను గౌరవించుటకు నిరాకరించారు.
PRO 1:30 నా సలహా మాటలు వినేందుకు ప్రజలారా మీరు నిరాకరించారు. నేను సరైనదారి మీకు చూపించినప్పుడు మీరు నా మాట వినేందుకు నిరాకరించారు.
PRO 1:31 కనుక మీరు మీ స్వంత విదానంలోనే పనులు చేసుకోవాలి. మీ స్వంత కీడు మార్గాల్లో జీవిస్తూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు.
PRO 1:32 “అవివేకులు జ్ఞానాన్ని అనుసరించేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తారు. వారి బుద్ధిహీన పధ్ధతులలో కొనసాగటం వారికి సంతోషం, అదే వారిని చంపుతుంది.
PRO 1:33 కానీ, నాకు విధేయత చూపే వ్యక్తి క్షేమంగా జీవిస్తాడు. ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. అతడు కీడుకు భయపడాల్సిన అవసరం ఉండదు.”
PRO 2:1 నా కుమారుడా, నేను చెప్పే ఈ సంగతులు అంగీకరించు. నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో.
PRO 2:2 జ్ఞానం చెప్పేది విని, గ్రహించటానికి నీ శక్తి కొలది ప్రయత్నించు.
PRO 2:3 జ్ఞానం కోసం గట్టిగా మొరపెట్టు, అవగాహన కోసం గట్టిగా అడుగు.
PRO 2:4 వెండికోసం వెదకినట్టు జ్ఞానం కోసం వెదుకు. దాచబడిన ధనం కోసం వెదకినట్టు దానికోసం వెదకు.
PRO 2:5 వీటిని నీవు చేస్తే అప్పుడు నీవు యెహోవాను గౌరవించటం నేర్చుకొంటావు.నీవు నిజంగా దేవుణ్ణి గూర్చి నేర్చుకొంటావు.
PRO 2:6 యెహోవా జ్ఞానము ప్రసాదిస్తాడు. జ్ఞానము, అవగాహన ఆయన నోటి నుండి వస్తాయి.
PRO 2:7 ఆయన నిజాయితీ పరులకు మంచి జ్ఞానం దాచి సమకూర్చి ఇస్తాడు. ఆయన నిజాయితీగా నడుచుకొనేవారికి కవచం లాంటివాడు.
PRO 2:8 ఇతరుల యెడల న్యాయంగా ఉండేవాళ్లను ఆయన కాపాడతాడు. ఆయన తన పవిత్ర ప్రజలను కాపాడతాడు.
PRO 2:9 కనుక యెహోవా తన జ్ఞానమును ప్రసాదిస్తాడు. అప్పుడు మంచివి, న్యాయమైనవి మరియు సరియైనవి నీవు గ్రహిస్తావు.
PRO 2:10 నీ హృదయంలోనికి జ్ఞానం వస్తుంది, నీ ఆత్మ జ్ఞానం కలిగి ఆనందిస్తుంది.
PRO 2:11 జ్ఞానం నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి కాస్తుంది.
PRO 2:12 దుర్మార్గులు జీవించే చెడు మార్గంలో జీవించకుండ జ్ఞానము, వివేచన మిమ్మల్ని వారిస్తాయి. ఆ మనుష్యులు వారు చెప్పే వాటిలో కూడా దుర్మార్గులు
PRO 2:13 వారు మంచితనం విడిచి పెట్టి, ఇప్పుడు చీకట్లో (పాపంలో) జీవిస్తున్నారు.
PRO 2:14 వారు తప్పుచేసి సంతోషిస్తూ, దుర్మార్గపు చెడు మార్గాలలో ఆనందిస్తున్నారు.
PRO 2:15 ఆ మనుష్యులు నమ్మదగిన వారు కారు వారు అబద్ధాలాడి మోసం చేస్తారు. కానీ మీ జ్ఞానం,వివేచన వాటన్నిటి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.
PRO 2:16 మరో దేశపు స్త్రీ ఎవరైనా నీవు ఆమెతో పాపము చేసేందుకు నిన్ను ఒప్పించేందుకని, దుర్మార్గులు తియ్యటి మాటల ప్రయోగించవచ్చు.
PRO 2:17 ఆమె చిన్నదిగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంది కాని ఆమె తన భర్తను విడిచి పెట్టింది. ఆమె తన వివాహ ప్రమాణాన్ని నిలుపుకోవటం లేదు. ఆమె తన దేవుని నిబంధనను మర్చిపోతుంది. కాని లేదు అని ఆమెతో చెప్పేందుకు జ్ఞానం నీకు సహోయం చేస్తుంది.
PRO 2:18 నీవు బలహీనుడవై ఆమె ఇంట ప్రవేశిస్తే నాశనం (మరణం) వైపు మొదటి మెట్టు మీద నడచినట్టే. నీవు ఆమెను అలానే వెంబడిస్తే ఆమె నిన్ను సమాధికి నడిపిస్తుంది.
PRO 2:19 ఆమె ఒక సమాధిలా ఉంది. ఒకవేళ ఏ పురుషుడైనా ఆ స్త్రీ దగ్గరకు వెళ్తే, అతడు ఎన్నటికీ తిరిగి రాడు. ఆ మనిషి జీవితం మరలా ఎన్నటికి మొదటిలా ఉండదు.
PRO 2:20 కనుక నీవు మంచి మనుష్యుల అడుగుజాడలను అనుసరించేలా, మంచి మనుష్యులు జీవించే విధంగా జీవించునట్లు జ్ఞానం సహాయం చేస్తుంది.
PRO 2:21 సరిగ్గా జీవించే ప్రజలు దేశాన్ని తామే స్వంతంగా కలిగి ఉంటారు. మంచిని జరిగించే మనుష్యులు వారి భూమిలో జీవిస్తారు.
PRO 2:22 కానీ దుర్మార్గులు వారి భూమిని పోగొట్టుకొంటారు. ఆ దుర్మార్గులు దేశం నుండి తొలగించి వేయబడతారు.
PRO 3:1 నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోకు. నీవు చేయాలని నేను చెప్పిన సంగతులు జ్ఞాపకం ఉంచుకో.
PRO 3:2 నీకు నేను నేర్పిస్తున్న ఈ సంగతులు నీకు సుదీర్గమైన సంతోష జీవితాన్ని ఇస్తాయి.
PRO 3:3 ప్రేమించటం ఎన్నటికీ చాలించకు. ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండు. ఈ విషయాలను నీ జీవితంలో ఒక భాగంగా ఎంచుకో. వాటిని నీ మెడ చుట్టూ కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో.
PRO 3:4 అప్పుడు దేవుని దృష్టియందును, మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవనిపించుకొందువు.
PRO 3:5 పూర్తిగా యెహోవాను నమ్ముకో! నీ స్వంత తెలివి మీద ఆధారపడవద్దు.
PRO 3:6 నీవు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు.
PRO 3:7 నీ స్వంత జ్ఞానం మీద ఆధార పడవద్దు. కాని యెహోవాను గౌరవించి, దుర్మార్గానికి దూరంగా ఉండు.
PRO 3:8 నీవు ఇలా చేస్తే, అప్పుడు నీ శరీరానికి మంచి ఆరోగ్యమునూ నీ ఎముకలకు సత్తువా కలుగుతుంది.
PRO 3:9 నీ ఆరోగ్యంతో యెహోవాను ఘనపరచు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆయనకు ఇమ్ము.
PRO 3:10 అప్పుడు నీకు కావలసినవి అన్నీ నీకు ఉంటాయి. నీ కొట్టాలు ధాన్యంతో నిండి ఉంటాయి, నీ పీపాల్లో ద్రాక్షారసం పొర్లుతూ ఉంటుంది.
PRO 3:11 నా కుమారుడా, నీవు తప్పు చేస్తున్నావని కొన్ని సార్లు యెహోవా నీకు చూపిస్తాడు. కాని ఈ శిక్షను గూర్చి కోపించకు. దాని నుండి నేర్చు కొనేందుకు ప్రయత్నించు.
PRO 3:12 ఎందుకంటే, యెహోవా తాను ప్రేమించే మనుష్యులను ఆయన సరిచేస్తాడు. అవును, తాను ప్రేమించే కుమారుని శిక్షించే ఒక తండ్రిలాంటివాడు దేవుడు.
PRO 3:13 జ్ఞానమును సంపాదించి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ మనిషి అర్థం చేసుకోవటం మొదలు పెట్టినప్పుడు అతడు ధన్యుడు.
PRO 3:14 జ్ఞనము మూలంగా వచ్చే లాభం వెండి కంటే మంచిది. జ్ఞానము మూలంగా వచ్చే లాభం మంచి బంగారు కంటే మేలు.
PRO 3:15 జ్ఞానము నగల కంటే ఎంతో ఎక్కువ విలువ గలది. నీవు కోరుకో దగినది ఏదీ జ్ఞానము అంతటి విలువ గలది కాదు!
PRO 3:16 జ్ఞానము సుదీర్గ జీవితాన్ని, ఐశ్వర్యాలు, ఘనతలను నీకు ఇస్తుంది.
PRO 3:17 జ్ఞానముగల మనుష్యులు శాంతి, సంతోషం, కలిగి జీవిస్తారు.
PRO 3:18 జ్ఞానము జీవవృక్షంలా ఉంటుంది. దానిని స్వీకరించే వారికి అది నిండు జీవితాన్ని ఇస్తుంది. జ్ఞానమును కలిగినవారు నిజంగా సంతోషంగా ఉంటారు.
PRO 3:19 భూమిని చేయుటకు యెహోవా తన తెలివిని ఉపయోగించాడు. ఆకాశాలను చేయుటకు యెహోవా తెలివి ఉపయోగించాడు.
PRO 3:20 నీళ్లను చేయుటకు యెహోవా తెలివి ప్రయోగించాడు. ఆయన జ్ఞానము ద్యారా ఆకాశాలు వర్షాన్ని కురిపిస్తాయి.
PRO 3:21 నా కుమారుడా, నీ జ్ఞానము, వివేకాన్ని భద్రంగా ఉంచుకో. వీటిని పోగొట్టుకోవద్దు.
PRO 3:22 జ్ఞానము, వివేకము నీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి.
PRO 3:23 అప్పుడు నీవు క్షేమంగా జీవిస్తావు, నీవు పడిపోకుండా ఉంటావు.
PRO 3:24 నీవు పండుకొనునప్పుడు నీవు భయపడవు. నీవు విశ్రాంతి తీసుకొనునప్పుడు నీ నిదప్రశాంతంగా ఉంటుంది.
PRO 3:25 నీకు ఆకస్మికంగా సంభవించబోయేవాటిని గూర్చి భయపడకు. ఎందుకంటే యెహోవా నీతో ఉన్నాడు. ఆయన నిన్ను క్షేమంగా ఉంచుతాడు. మరియు ఆ చెడ్డ విషయాలు చెడ్డ మనుష్యులకే సంభవిస్తాయి.
PRO 3:27 మేలు చేయుట నీచేతనైనప్పుడు దాన్ని పొందదగినవారికి చేయకుండా వెనుదీయకుము.
PRO 3:28 నీ పొరుగు వాడు అతని స్వంత వస్తువులను తిరిగి ఇచ్చి వేయుమని నిన్ను అడిగితే వాటిని అప్పుడే అతనికి ఇచ్చివేయుము. “తిరిగి రేపు రమ్మని” అతనితో చెప్పవద్దు.
PRO 3:29 నీ పొరుగువాడు నీతో శాంతియుతంగా జీవిస్తున్నాడు, గనుక అతనికి విరోధంగా కీడు తల పెట్టవద్దు.
PRO 3:30 మరో వ్యక్తి నీ యెడల ఎలాంటి తప్పూ చేయకపోతే అతనిని న్యాయస్థానానికి తీసుకొని పోవద్దు.
PRO 3:31 కొంతమంది మనుష్యులు తేలికగా కోపం తెచ్చుకొని వెంటనే కీడు చేస్తారు. వారు జీవించే విధంగా జీవించకు.
PRO 3:32 ఎందుకంటే దుర్మార్గులను యెహోవా ద్వేషిస్తాడు. కాని సక్రమంగా జీవించే ప్రజలను యెహోవా బలపరుస్తాడు.
PRO 3:33 దుర్మార్గుల కుటుంబాలకు యెహోవా విరోధంగా ఉంటాడు. కాని సక్రమంగా జీవించే వారి కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు.
PRO 3:34 ఒక వేళ ఒక వ్యక్తి గర్వించి, ఇతరులకంటే అతడే మంచివాడని తలచి, హేళన చేస్తే యెహోవా అతనిని శిక్షించి, అతని గూర్చి హేళన చేస్తాడు. కాని దీనులకు యెహోవా సహాయం చేస్తాడు.
PRO 3:35 జ్ఞానముగల మనుష్యులు దేవుని వెంబడిస్తారు. జ్ఞానముగల మనుష్యులను యెహోవా ఘనపరుస్తాడు. బుద్దిహీనులు దేవుణ్ణి వెంబడించరు. బుద్దిహీనులు అవమానించబడతారు.
PRO 4:1 కుమారులారా, “మీ తండ్రి ఉపదేశములు వినండి.” మీరు గ్రహించగలుగునట్లు గమనించండి.
PRO 4:2 ఎందుకనగా నేను మీకు నేర్పిస్తున్న సంగతులు ప్రాముఖ్యమైనవి, మంచివి. అందుచేత నా ఉపదేశములు ఎన్నడూ మరువవద్దు.
PRO 4:3 నేను నా తండ్రికి పసివాడను. నేను నా తల్లికి ఒకే కూమారుణ్ణి.
PRO 4:4 నా తండ్రి నాకు నేర్పిస్తూ నాతో ఇలా చెప్పాడు: “నేను చెప్పే సంగతులు జ్ఞాపకం ఉంచుకో, నీవు నా ఆజ్ఞలకు విధేయుడవైతే జీవిస్తావు.
PRO 4:5 జ్ఞానము, వివేకం సంపాదించు! నా మాటలు మరువకు. నా ఉపదేశాలు ఎల్లప్పుడూ పాటించు.
PRO 4:6 జ్ఞానమునుండి తొలగిపోవద్దు. అప్పుడు జ్ఞానము నిన్ను కాపాడుతుంది. జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానము నిన్ను భద్రంగా కాపాడుతుంది.
PRO 4:7 “జ్ఞానము సంపాదించాలని నీవు తీర్మానించినప్పుడే జ్ఞానము మొదలవుతుంది. అందుచేత జ్ఞానము సంపాదించేందుకు నీకున్న సమస్తం వినియోగించు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు.
PRO 4:8 జ్ఞానాన్ని ప్రేమించు. జ్ఞానం నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. జ్ఞనాన్ని అతి ముఖ్యమైనదిగా ఎంచు, జ్ఞానము నీకు ఘనత తెచ్చి పెడుతుంది.
PRO 4:9 ఆమె (జ్ఞానము) అందమైన మాలను నీతల మీద ఉంచుతుంది. సోగసైన కిరీటమును నీకు బహూకరిస్తుంది.”
PRO 4:10 కనుక నా మాట విను. నేను చెప్పే సంగతులను జరిగించు. అప్పుడు నీవు ఎక్కువ కాలం జీవిస్తావు.
PRO 4:11 జ్ఞానాన్ని గూర్చి నేను నీకు నేర్పిస్తున్నాను. నేను నిన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నాను.
PRO 4:12 ఈ మార్గాన్ని అనుసరించు, అప్పుడు నీ పాదం ఉచ్చులో చిక్కుకోదు. నీవు తూలిపోకుండా పారిపోవచ్చు. నీవు చేయాలని ప్రయత్నించే వాటిలో నీవు క్షేమంగా ఉంటావు.
PRO 4:13 ఈ పాఠాలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఈ పాఠాలు మరచిపోకు. అవే నీకు జీవం!
PRO 4:14 దుర్మార్గులు నడిచే మార్గాన్ని అనుసరించకు. అలా నడుచుకొనవద్దు. వారిలా ఉండేందుకు ప్రయత్నించవద్దు.
PRO 4:15 దుర్మార్గానికి దూరంగా ఉండు. దానికి దగ్గరగా వెళ్లవద్దు. దానిని దాటి తిన్నగా వెళ్లిపో.
PRO 4:16 చెడ్డవాళ్లు ఏదో ఒక చెడు చేసేటంత వరకు నిద్రపోలేరు. ఆ మనుష్యులు మరో వ్యక్తిని బాధించేటంతవరకు నిద్రపోలేరు.
PRO 4:17 ఆ మనుష్యులు దౌర్జన్యము అనే మద్యం తాగుతూ దుర్మార్గము అనే రొట్టెను తింటారు. ఇతరులను బాధించకుండా జీవించలేరు.
PRO 4:18 మంచి మనుష్యులు ఉదయకాంతిలా ఉంటారు. సూర్యోదయమౌతుంది. ఆ రోజు మరింత ప్రకాశవంతంగా సంతోషంగా తయారవుతుంది.
PRO 4:19 చెడు మనుష్యులు చీకటి రాత్రివలె ఉంటారు. వారు చీకటిలో తప్పిపోయి, వారికి కనపడని వాటి మీద పడిపోతూవుంటారు.
PRO 4:20 నా కుమారుడా, నేను చెప్పే విషయాలు గమనించు. నా మాటలు జాగ్రత్తగా విను.
PRO 4:21 నా మాటలు నిన్ను విడిచి పోనియ్యకు. నేను చెప్పే సంగతులు జ్ఞాపకం ఉంచుకో.
PRO 4:22 నా ఉపదేశము వినేవారికి అది జీవం కలిగిస్తుంది నా మాటలు శరీరానికి మంచి ఆరోగ్యంలాంటివి.
PRO 4:23 నీవు తలంచే విషయాలలో నీవు జాగ్రత్తగా ఉండటమే నీకు అతి ముఖ్యమైన విషయం. నీ తలంపులు నీ జీవితాన్ని ఆధీనంలో ఉంచుకుంటాయి.
PRO 4:24 సత్యమును వక్రం చేయవద్దు, సరికాని మాటలు చేప్పవద్దు. అబద్ధాలు చెప్పకు.
PRO 4:25 నీ యెదుట ఉన్న జ్ఞానముగల మంచి ఆశయాలనుండి నిన్ను నీవు తిరిగి పోనివ్వకు.
PRO 4:26 సరైన విధంగా జీవించుటకు చాలా జాగ్రత్తగా ఉండు, అప్పుడు నీకు స్థిరమైన మంచిజీవితం ఉంటుంది.
PRO 4:27 తిన్నని మార్గం విడిచిపెట్టకు అది మంచిది, సరైనది. కాని కీడు నుండి ఎల్లప్పుడూ తిరిగిపో.
PRO 5:1 నా కుమారుడా, నా జ్ఞానోపదేశము విను. వివేకము గల నా మాటలు గమనించు.
PRO 5:2 అప్పుడు జీవించుటకు సరైన మార్గం నీవు తెలుసుకుంటావు. నీవు జ్ఞానివి అని నీ మాటలు తెలియజేస్తాయి.
PRO 5:3 మరోకరి భార్య పెదవులు తేనెలా తియ్యగా ఉండవచ్చు. ఆమె ముద్దులు తైలం కంటే మెత్తగా ఉండవచ్చు.
PRO 5:4 కాని అంతలో కక్ష, బాధ, మాత్రమే ఆమె తెచ్చి పెడుతుంది. ఆ బాధ విషమంత చేదుగాను, ఖడ్గమంత వాడిగాను ఉంటుంది.
PRO 5:5 ఆమె పాదాలు చావుకు దారితీస్తాయి. ఆమె నిన్ను తిన్నగా సమాధికి నడిపిస్తుంది.
PRO 5:6 ఆమెను వెంబడించవద్దు! ఆమె సరైన మార్గాలో నుంచి తప్పి పోయింది. అది ఆమెకు తెలియదు, జాగ్రత్తగా ఉండు! జీవమార్గాన్ని వెంబడించు!
PRO 5:7 నా కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు మరచిపోవద్దు.
PRO 5:8 వేశ్యకు దూరంగా ఉండండి. ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు కూడ వెళ్లవద్దు.
PRO 5:9 ఒకవేళ నీవు అలా చేస్తే నీ మీద ప్రజలకున్న గౌరవం పోగొట్టుకుంటావు. ఇతరులు నీవు సంవత్సరాలు తరబడి సంపాందించినది అంతా తీసివేసుకుంటారు.
PRO 5:10 నీకు తెలియని ప్రజలు నీ ఐశ్వర్యమంతా తీసివేసుకుంటారు. నీ కష్టార్జితం ఇతరుల పాలవుతుంది.
PRO 5:11 నీ జీవితాంతం కూడూ నీవు మూల్గుతావు. నీ శరీరం, నీకు ఉన్న సమస్తం హరించుకుపోతుంది.
PRO 5:12 అప్పుడు నీవు, “నా తల్లిదండ్రుల మాటలు నేనెందుకు వినలేదు? నా ఉపదేశకుల మాటలు నేనెందుకు వినలేదు? క్రమ శిక్షణతో ఉండుటకు నేను నిరాకరించాను, సరిదిద్దబడుటకు నేను నిరాకరించాను.
PRO 5:14 ఇప్పుడు అంతంలో, నా జీవితం వ్యర్ధం అయిపోయినట్లు నేను చూస్తున్నాను. మనుష్యులంతా నా అవమానం చూస్తున్నారు” అని నీవు అంటావు.
PRO 5:15 నీ స్వంత బావి నుండి ప్రవహించు నీళ్లు మాత్రమే త్రాగు. మరియు నీ నీళ్లను బయట వీధుల్లోకి ప్రవహించ నీయకు. (నీ స్వంత భార్యకు ఒక్కదానికి మాత్రమే, నిన్ను నీవు అప్పగించుకో. నీవు నీ ప్రత్యేక ప్రేమను ఇవ్వాల్సింది ఆమెకు మాత్రమే. నీ కుటుంబానికి వెలుపల పిల్లలకు నీవు తండ్రివి కావద్దు).
PRO 5:17 నీ పిల్లలు నీకు మాత్రమే చెందినవారై ఉండాలి. నీ స్వంత ఇంటికి వెలుపలి వారితో నీవు నీ పిల్లల్ని పంచుకోరాదు.
PRO 5:18 అందుచేత నీ స్వంత భార్యతో సంతోషించు. నీవు యువకుడుగా ఉన్నప్పుడు నీవు పెళ్లాడిన స్త్రీతో అనుభవించు.
PRO 5:19 ఆమె అందమైన లేడి వంటిది, అందమైన దుప్పిలాంటిది. ఆమె ప్రేమ నిన్ను పూర్తిగా తృప్తిపరచనివ్వు. ఆమె ప్రేమ నిన్ను బంధించి వేస్తుంది.
PRO 5:20 మరొకని భార్య నిన్ను అదే విధానంల్లో బంధించనియ్యకు. మరొకని ప్రేమ నీకు అవసరం లేదు.
PRO 5:21 ప్రతి మనిషి చేసే ప్రతీది యెహోవా తేటగా చూస్తాడు. మనుష్యులు చేసే ప్రతీదాన్ని యెహోవా క్షుణ్ణంగా చూస్తాడు.
PRO 5:22 దుర్మార్గుని పాపాలు వానినే పట్టుకొంటాయి. అతని పాపాలు అతణ్ణి బంధించే పాశాల్లా ఉంటాయి.
PRO 5:23 ఈ మనిషి క్రమశిక్షణలో ఉంచేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తాడు. అతడు తన స్వంత బుద్దిహీనమైన కోరికల వల్లనే పట్టు బడతాడు.
PRO 6:1 నా కుమారుడా, ఇంకొకని అప్పుకు బాధ్యునిగా ఉండకు. ఆ వ్యక్తి తన అప్పు చెల్లించలేనని చెబితే, అది నీవే చెల్లిస్తానని వాగ్దానం చేశావా? మరో మనిషి అప్పులకు నిన్ను నీవే బాధ్యునిగా చేసుకొన్నావా?
PRO 6:2 అలాగైతే నీవు పట్టుబడ్డట్టే! నీ మాటలే నిన్ను చిక్కుల్లో పెట్టేశాయి!
PRO 6:3 నీవు ఆ మనిషి శక్తి కింద ఉన్నావు. కనుక అతని దగ్గరకు వెళ్లి, నిన్ను నీవే విముక్తుని చేసుకో. అతని బాకీ నుండి నిన్ను విడిపించు మని నీవు అతణ్ణి బ్రతిమాలు.
PRO 6:4 నిద్రపోయి, విశ్రాంతి తీసుకోనేంతవరకు వేచి ఉండవద్దు.
PRO 6:5 వేటగాని బారినుండి పారిపోతున్న లేడివలె ఆ ఉచ్చు నుండి తప్పించుకో. ఉచ్చులో నుండి పారిపోతున్న పక్షివలె, నిన్ను నీవే నిడుదల చేసుకో.
PRO 6:6 సోమరీ, నీవు చీమల దగ్గరకు వెళ్లి చీమలు ఏమిచేస్తుంటాయో చూడు. చీమ దగ్గర నేర్చుకో.
PRO 6:7 చీమకు పాలకుడు, అధికారి, నాయకుడు అంటూ ఎవరూలేరు.
PRO 6:8 కానీ చీమ, దాని ఆహారాన్ని వేసవిలో కూర్చుకొంటుంది. చీమ, దాని ఆహారాన్ని దాచుకొంటుంది.చలికాలంలో దానికి సమృద్ధిగా ఆహారం ఉంటుంది.
PRO 6:9 సోమరీ, ఇంకెంతనేపు నీవు అక్కడ పండుకొంటావు. నీ విశ్రాంతి నుండి నీవు యింకెప్పుడు లేస్తావు?
PRO 6:10 “నాకు ఇంకొంచెం నిద్ర కావాలి. యింకాకొంచెంసేపు నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను” అని సోమరి చెబుతాడు.
PRO 6:11 కాని అతడు నిద్రపోతాడు, మళ్లీ నిద్రపోతాడు; అతడు దరిద్రుడంటే దరిద్రుడవుతాడు. త్వరలోనే అతనికి ఏమీ ఉండదు. ఒక దొంగవాడు వచ్చి సమస్తం దోచుకున్నట్టు ఉంటుంది.
PRO 6:12 దుర్మార్గుడు, పనికిమాలినవాడు అబద్ధాలు చెబుతాడు. చెడ్డ సంగతులే చెబుతాడు.
PRO 6:13 అతడు కన్నుగీటి, సూచనలు చేసి మనుష్యులను మోసం చేస్తాడు.
PRO 6:14 ఆ మనిషి దుర్మార్గుడు. ఎంతసేపూ అతడు దుర్మార్గపు పథకాలే వేస్తాడు. అన్నిచోట్లా అతడు చిక్కులు పెడుతుంటాడు.
PRO 6:15 కాని అతడు శిక్షించబడతాడు. కష్టం అతనికి అకస్మాత్తుగా వచ్చేస్తుంది. అతడు త్వరగా నాశనం చేయబడతాడు. అతనికి ఎవరూ సహాయం చేయరు.
PRO 6:16 ఈ ఆరు విషయాలను యెహోవా అసహ్యించుకొంటాడు: కాదు ఏడును ఆయన అసహ్యించుకొంటాడు.
PRO 6:17 ఇతరులకంటే తానే మంచివాడు అనుకొనే మనిషి. అబద్దాలు చెప్పే మనిషి. నిర్దోషులను చంపే మనిషి.
PRO 6:18 చెడ్డపనులు చేయాలని త్వరపడే మనిషి. దుర్మార్గం చేయాలని కోరే మనిషి.
PRO 6:19 అబద్ధం వెంబడి అబద్ధం చెప్పే మనిషి. వాదాలకు పూనుకొని ప్రజల మధ్య కలహాలు పెట్టే మనిషి.
PRO 6:20 నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో. మరియు నీ తల్లి ఉపదేశాలు మరువకు.
PRO 6:21 వారి మాటలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. వారి ఉపదేశములను నీ జీవితంలో ఒక భాగంగా చేసుకో.
PRO 6:22 నీవు ఎక్కడికి వెళ్లినా వారి ఉపదేశములు నీకు దారి చూపిస్తాయి. నీవు నిద్రపోయినప్పుడు అవి నిన్ను కనిపెట్టుకొని ఉంటాయి. మరియు నీవు మేల్కొన్నప్పుడు అవి నీతో మాట్లాడి నిన్ను నడిపిస్తాయి.
PRO 6:23 నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు, ఉపదేశములు నీకు సరైన దారి చూపించే వెలుగులా ఉంటాయి. నీవు జీవమార్గాన్ని వెంబడించేందుకు నిన్ను అవి సరిదిద్ది, నీకు శిక్షణ ఇస్తాయి.
PRO 6:24 నీవు చెడు స్త్రీ దగ్గరకు వెళ్లకుండా వారి ఉపదేశము నిన్ను వారిస్తుంది. తన భర్తను విడిచిపెట్టేసిన భార్య మెత్తటి మాటల నుండి వారి మాటలు నిన్ను కాపాడుతాయి.
PRO 6:25 ఆ స్త్రీ అందమైనది కావచ్చు. కాని ఆ అందం నీలో నిన్ను మండింపచేసి శోధించ నీయకు. ఆమె కండ్లను నిన్ను బంధించనియ్యకు.
PRO 6:26 ఒక వేశ్య ఖర్చు ఒక రొట్టె ముక్క కావచ్చు. కాని మరో పురుషుని భార్య నీ జీవితమంతా ఖర్చు చేయవచ్చు.
PRO 6:27 ఒకడు తన మీద నిప్పువేసుకుంటే అతని బట్టలు కూడా కాలిపోతాయి.
PRO 6:28 ఒకడు వేడి నిప్పుల మీద కాలు పెడితే అతని పాదం కాలుతుంది.
PRO 6:29 మరొకడి భార్యతో పండుకొనే ఏ మనిషి విషయమైనా ఇంతే. ఆ మనిషి నష్టపోతాడు.
PRO 6:30 ఒకడు ఆకలితో ఉండి తినుటకు భోజనం దొంగిలించవచ్చు. ఒకవేళ అతడు పట్టుబడితే అతడు దొంగిలించిన దానికి ఏడు రెట్లు అదనంగా చెల్లించాలి. అతనికి ఉన్న సమస్తం దీని మూలంగా ఖర్చు కావచ్చును. కాని ఇతరులు గ్రహిస్తారు. అతని మీద వారికి గల గౌరవం అంతా పోదు.
PRO 6:32 అయితే, వ్యభిచారం చేసే పురుషుడు బుద్ధిహీనుడు. అతడు తనకు తానే నాశనం చేసుకుంటాడు. తన నాశనానికి తానే కారణం అవుతాడు.
PRO 6:33 ప్రజలకు అతని మీద ఉన్న గౌరవం అంతా పోతుంది. మరియు ఆ అవమానాన్ని అతడు ఎన్నటికీ మరచిపోడు.
PRO 6:34 ఆ స్త్రీ యొక్క భర్తకు రోషం వస్తుంది. ఆ భర్తకు చాలా కోపం వస్తుంది. అవతలి వాడిని శిక్షించేందుకు ఇతడు చేయగలిగింది ఏదైనా చేసేస్తాడు.
PRO 6:35 ఏ విధంగా చెల్లించినా ఎంత డబ్బు చెల్లించినా అతని కోపాన్ని ఆపేందుకు చాలదు!
PRO 7:1 నా కుమారుడా, నా మాటలు జ్ఞాపకం ఉంచుకో నేను నీకు ఇచ్చే ఆజ్ఞలు మరువకు.
PRO 7:2 నా ఆజ్ఞలకు విధేయుడవు కమ్ము, నీకు జీవం కలుగుతుంది. నా ఉపదేశాన్ని కనుపాపలాగ ఎంచుకో. (నీ జీవింతలోకెల్లా అతి ముఖ్యమైనది).
PRO 7:3 నా ఆజ్ఞలను ఉపదేశాలను ఎల్లప్పుడూ నీతో ఉంచుకో. వాటిని నీ వ్రేళ్లకు కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో.
PRO 7:4 జ్ఞానాన్ని నీ సోదరిగా ఎంచు. తెలివిని నీ కుటుంబంలో ఒక భాగంగా చూసుకో.
PRO 7:5 అప్పుడు అవి పరస్త్రీనుండి నిన్ను కాపాడు తాయి. నిన్ను పాపములోకి ఈడ్చివేయగల చక్కటి మాటలనుండి నిన్ను కాపాడతాయి.
PRO 7:6 ఒక రోజు నేను నా కిటికీలో నుండి బయటకు చూసాను.
PRO 7:7 నాకు బుద్ధిలేని యువకులు చాలా మంది కనబడ్డారు. మరీ బుద్ధిలేని ఒక యువకుడిని నేను చూసాను.
PRO 7:8 ఒక చెడ్డ స్త్రీ ఇంటి దగ్గర వీధిలోకి అతడు నడిచాడు. ఆ యువకుడు ఆ స్త్రీ ఇంటిమూలకు నడిచాడు.
PRO 7:9 సూర్యుడు అస్తమిస్తూండగా దాదాపు చీకటి పడింది. రాత్రి మొదలవుతూంది.
PRO 7:10 ఆ స్త్రీ అతనిని కలుసుకొనేందుకు తన ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె వేశ్యలా బట్టలు ధరించింది. ఆమె అతనితో పాపం చేయటానికి ప్రయత్నిస్తుంది.
PRO 7:11 పాపం గూర్చి ఆమె లెక్కచేయలేదు. మంచి చెడును గూర్చి ఆమె లెక్క చేయలేదు. ఆమె తన ఇంటివద్ద ఎన్నడూ నిలిచి వుండదు.
PRO 7:12 కాని ఆమె వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా దొరుకుతారు అని చూస్తూ ఆమె అన్ని మూలలకూ వెళ్తుంది.
PRO 7:13 ఆమె ఆ యువకుడ్ని గట్టిగా పట్టేసి ముద్దు పెట్టుకుంది. సిగ్గులేకుండా ఆమె ఇలా చప్పింది:
PRO 7:14 “ఈవేళ నేను సాంగత్య బలి అర్చించాలి. నేను ఇస్తానని వాగ్దానం చేసింది అంతా ఇచ్చేశాను. (ఇంకా నా దగ్గర భోజనం చాలా మిగిలి ఉంది).
PRO 7:15 అందుచేత నిన్ను కూడా నా దగ్గరకు రమ్మని ఆహ్యానించటానికి నేనిలా బయటకు వచ్చాను. నేను నీకోసం ఎంతో ఎంతో వెదికాను. ఇప్పుడు నీవు కనబడ్డావు!
PRO 7:16 నా మంచం మీద శుభ్రమైన దుప్పట్లు నేను పరిచాను. అవి చాలా, అందమైన ఈజిప్టు దుప్పట్లు.
PRO 7:17 నా మంచం మీద నేను పరిమళాలు, బోళం, అగరు పోల్చిన చెక్క నేను ఉపయోగించాను.
PRO 7:18 వచ్చేయి, తెల్లారే వరకు మనం వలపు తీర్చుకొందాం. రాత్రంతా మనం హాయిగా అనుభవించవచ్చు.
PRO 7:19 నా భర్త వెళ్లిపోయాడు. అతడు వ్యాపారం పని మీద వెళ్లిపోయాడు.
PRO 7:20 దీర్ఘప్రయాణానికి సరిపడినంత ధనం అతడు తీసుకొని వెళ్లాడు. రెండు వారాల వరకు అతడు తిరిగి ఇంటికి రాడు.”
PRO 7:21 ఆ యువకుని శోధించటానికి ఆ స్త్రీ ఆ మాటలు ప్రయోగించింది. ఆమె మెత్తని మాటలు అతణ్ణి మాయ చేశాయి.
PRO 7:22 ఆ యువకుడు ఉచ్చులోనికి ఆమెను వెంబడించాడు. వధకు తీసుకొనిపోబడుతున్న ఎద్దులా ఉన్నాడు అతడు. బోనులోనికి నడుస్తున్న జింకలా అతడు ఉన్నాడు.
PRO 7:23 దాని గుండెల్లోకి బాణం గుచ్చడానికి వేటగాడు సిద్దంగా ఉన్నట్టు ఉంది. వలలోకి ఎగురుతోన్న పక్షిలా ఉన్నాడు ఆ యువకుడు. అతడు చిక్కుకొన్న అపాయం అతనికి తెలియదు.
PRO 7:24 కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు గమనించండి.
PRO 7:25 చెడు స్త్రీని మిమ్మల్ని పట్టుకోనివ్వకండి. ఆమె మార్గాలు వెంబడించకండి.
PRO 7:26 ఆమె చాలా మంది పురుషులను పడ వేసింది. ఆమె చాలా మంది పురుషులను నాశనం చేసింది.
PRO 7:27 ఆమె ఇల్లు మరణ స్థానం. ఆమె మార్గం తిన్నగా మరణానికి నడిపిస్తుంది!
PRO 8:1 జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి! మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది.
PRO 8:2 మార్గం ప్రక్కగా, దారులు కలిసే చొట కొండ శిఖరము మీద అవి నిలబడ్డాయి.
PRO 8:3 పట్టణంలోకి ద్వారాలు తెరచుకొనే చోట అవి వున్నాయి. తెరువబడిన ద్వారాల్లోనుంచి అవి పిలుస్తున్నాయి.
PRO 8:4 జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, మిమ్మల్ని నేను పిలుస్తున్నా మనుష్యులందరినీ నేను పిలుస్తున్నా.
PRO 8:5 మీరు బుద్ధిహీనులైతే, జ్ఞానం గలిగి ఉండటం నేర్చుకోండి. అవివేకులారా, తెలివిగలిగి ఉండటం నేర్చుకోండి.
PRO 8:6 వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి. సరైన విషయాలు నేను మీకు చెబుతాను.
PRO 8:7 నా మాటలు సత్యం. చెడు అబద్ధాలు నాకు అసహ్యం.
PRO 8:8 నేను చెప్పే విషయాలు సరైనవి. నా మాటల్లో తప్పుగాని, అబద్ధంగాని ఏమీలేదు.
PRO 8:9 తెలివిగల వాడికి ఈ విషయాలన్నీ తేటగా ఉంటాయి. తెలివిగల మనిషి ఈ సంగతులు గ్రహిస్తాడు.
PRO 8:10 నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండికంటె విలువైనది. ఆ తెలివి మంచి బంగారం కంటె ఎక్కువ విలువగలది.
PRO 8:11 జ్ఞానము ముత్యాలకంటె విలువగలది. ఒకడు కోరుకోదగిన దేని కంటే కూడ జ్ఞానము ఎక్కువ విలువగలది.
PRO 8:12 “నేను జ్ఞానాన్ని, నేను మంచి తీర్పుతో జీవిస్తాను. తెలివితో, మంచి పథకాలతో నేను ఉండటం మీరు చూడగలరు.
PRO 8:13 ఒక మనిషి యెహోవాను గౌరవిసే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు. నేను (జ్ఞానము) గర్విష్ఠులను, ఇతరులకంటె మేమే గొప్ప అనుకొనేవాళ్లను అసహ్యించుకొంటాను. చెడు మార్గాలు, అబద్ధపు నోరు నాకు అసహ్యం.
PRO 8:14 కానీ మంచి నిర్ణయాలు చేయటానికి, మంచితీర్పు చెప్పటానికి మనుష్యులకు నేను (జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను. తెలివీ శక్తిని నేను వారికి ఇస్తాను!
PRO 8:15 రాజులు పరిపాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తారు. న్యాయ చట్టాలు చేయటానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు.
PRO 8:16 భూమిమీద ప్రతీ మంచి పాలకుడూ తన కింద ఉన్న ప్రజలను పాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తాడు.
PRO 8:17 నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను. నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను కనుగొంటారు.
PRO 8:18 నేను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి. నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను.
PRO 8:19 నేను ఇచ్చేవి మేలిమి బంగారంకంటె మంచివి. నా కానుకలు స్వచ్ఛమైన వెండికంటే మంచివి.
PRO 8:20 నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను. సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను.
PRO 8:21 నన్ను ప్రేమించే మనుష్యులకు నేను ఐశ్వర్యం ఇస్తాను. అవును, వారి గృహాలను ఐశ్వర్యాలతో నేను నింపుతాను.
PRO 8:22 “ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం క్రిందట యెహోవాచేత చేయబడింది నేనే
PRO 8:23 నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను. ప్రపంచం ప్రారంభం గాక ముందే నేను చేయబడ్డాను.
PRO 8:24 నేను (జ్ఞానము) మహా సముద్రాలు పుట్టక ముందే పుట్టాను. నీళ్లు లేక ముందు నేను చేయబడ్డాను.
PRO 8:25 నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను.
PRO 8:26 యెహోవా భూమిని చేయకముందే నేను (జ్ఞానము) పుట్టాను. పొలాలకంటె ముందు నేను పుట్టాను. ప్రపంచంలోని మొదటి ధూళిని, దేవుడు చేయక ముందే నేను పుట్టాను.
PRO 8:27 యెహోవా ఆకాశాలను చేసినప్పుడు నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను. యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు, మహా సముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను.
PRO 8:28 ఆకాశంలో యెహోవా మేఘాలను ఉంచకముందే నేను పుట్టాను. మహా సముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు నేను అక్కడ ఉన్నాను.
PRO 8:29 సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు నేను అక్కడ ఉన్నాను. యెహోవా అనుమతించిన దానికంటె నీళ్లు ఎత్తుగా పోవు, భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను.
PRO 8:30 నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు. ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను.
PRO 8:31 యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూచి ఉప్పొంగి పోయాడు. అక్కడ ఆయన మనుష్యుల విషయమై సంతోషించాడు.
PRO 8:32 “పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి. మీరు నా మార్గాలు వెంబడిస్తే మీరు కూడా సంతోషంగా ఉండగలరు
PRO 8:33 నా ఉపదేశాలు విని బుద్ధిమంతులుకండి. వినుటకు తిరస్కరించకుడి.
PRO 8:34 ఏ వ్యక్తి అయితే వింటాడో అతడు సంతోషంగా ఉంటాడు. అతను అనుదినం నా ద్వారాల దగ్గర వేచి యుంటాడు.
PRO 8:35 నన్ను కనుగొనినవాడు జీవమును కనుగొనును యెహోవా వద్దనుండి అతడు మంచివాటిని పొందును.
PRO 8:36 అయితే నాకు విరోధముగా పాపముచేయు వ్యక్తి తనకు తానే హాని చేసుకొనును. నన్ను అసహ్యించు కొనువారు మరణమును ప్రేమించెదరు.”
PRO 9:1 జ్ఞానము తన నివాసమును కట్టుకొనెను. దానికి ఏడు స్తంభములను ఆమె నిలబెట్టెను.
PRO 9:2 ఆమె (జ్ఞానము) భోజనం సిద్ధం చేసి, ద్రాక్షారసమును కలిపి, భోజనమును బల్లపైఉంచెను.
PRO 9:3 అప్పుడు ఆమె (జ్ఞానము) తన సేవకులను, ప్రజలను నగరములోని ఎత్తయిన స్థలమునకు తనతో పాటు తినుటకు ఆహ్వానించెను. కొండ మీదికి వచ్చి, ఆమెతో కూడ భోజనం చేసేందుకు మనుష్యులను ఆహ్వానించుటకు తన సేవకులను ఊళ్లోనికి పంపింది.
PRO 9:4 “నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న మనుష్యులారా, మీరు రండి” అని ఆమె చెప్పింది. బుద్దిహీనులను కూడా ఆమె పిలిచింది.
PRO 9:5 “నా జ్ఞాన భోజనం ఆరగించండి, రండి. నేను చేసిన ద్రాక్షారసం తాగండి.
PRO 9:6 మీ పాత బుద్ధిహీన పద్ధతులు విడిచి పెట్టండి. మీకు జీవం ఉంటుంది. తెలివిగల మార్గాన్ని అనుసరించండి” అని ఆమె చెప్పింది.
PRO 9:7 ఒక గర్విష్ఠికి, అతడు చేసింది తప్పు అని చూపించటానికి నువ్వు ప్రయత్నిస్తే అతడు నిన్నే విమర్శిస్తాడు. ఆ మనిషి దేవుని జ్ఞానము గూర్చి హేళన చేస్తాడు. ఒక దుర్మార్గుడిదే తప్పని నీవు చెబితే అతడు నిన్ను హేళన చేస్తాడు.
PRO 9:8 కనుక ఒకడు ఇతరుల కంటే తాను మంచి వాడినని తలిస్తే అతనిది తప్పు అని అతనికి చెప్పవద్దు. దానివల్ల అతడు నిన్ను ద్వేషిస్తాడు. కాని జ్ఞానముగల ఒక మనిషికి సహాయం చేయటానికి నీవు ప్రయత్నిస్తే అతడు నిన్ను గౌరవిస్తాడు.
PRO 9:9 జ్ఞానముగల ఒక మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా జ్ఞానము గలవాడవుతాడు. ఒకవేళ మంచి మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా ఎక్కువ నేర్చు కుంటాడు.
PRO 9:10 యెహోవా యెడల భయము కలిగి యుండుటు జ్ఞానము సంపాదించుటకు మొదటి మెట్టు. యెహోవాను గూర్చిన జ్ఞానము తెలివి సంపాదించుటకు మొదటి మెట్టు.
PRO 9:11 నీకు జ్ఞానము ఉంటే అప్పుడు నీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది.
PRO 9:12 నీవు జ్ఞానివి అయితే వీ మంచి కోసమే నీవు జ్ఞానముగలవాడవు అవుతావు. కాని నీవు గర్వంగలవాడవై, యితరులను హేళన చేస్తే అప్పుడు నీ కష్టానికి నిన్ను నీవే నిందించుకోవాలి.
PRO 9:13 బుద్ధిహీనుడు గట్టిగా అరిచే చెడు స్త్రీలాంటివాడు. ఆమెకు తెలివి లేదు.
PRO 9:14 ఆమె తన ఇంటి గుమ్మంలో కూర్చూంటుంది. పట్టణంలో కొండ మీద తన కుర్చీలో ఆమె కూర్చుంటుంది.
PRO 9:15 ప్రజలు ఆ ప్రక్కగా నడచినప్పుడు ఆమె వారిని పిలుస్తుంది. ఆ మనుష్యులకు ఆమెయందు ఆసక్తి లేదు. కాని
PRO 9:16 “నేర్చుకోవాల్సిన ప్రజలారా రండి” అని ఆమె అంటుంది. బుద్ధిహీనులను కూడ ఆమె ఆహ్వానించింది.
PRO 9:17 “మీరు నీళ్లు దొంగిలిస్తే అవి మీ స్వంత నీళ్లకంటే ఎక్కువ రుచిగా ఉంటాయి. మీరు రొట్టెను దొంగిలిస్తే మీరు స్వయంగా తయారు చేసుకొనే రొట్టెకంటె అది ఎక్కువ రుచిగా ఉంటుంది” అని ఆమె చెబుతుంది.
PRO 9:18 ఆమె ఇల్లు దయ్యాలతో మాత్రమే నిండి వుందని ఆ బుద్ధిహీనులకు తెలియదు. మరణస్థానపు లోతుల్లోకి వారిని ఆహ్వానించింది!
PRO 10:1 ఇవి సొలొమోను సామెతలు (జ్ఞానముగల మాటలు): జ్ఞానముగల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు. కాని బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దు:ఖం కలిగిస్తాడు.
PRO 10:2 ఒకడు చెడు కార్యములు చేయుట వలన అతనికి డబ్బు వస్తే అది పనికిమాలిన డబ్బు అవుతుంది. కాని మంచిని జరిగించిన ఎడల అది మరణం నుండి నిన్ను రక్షించగలుగుతుంది.
PRO 10:3 యెహోవా మంచి మనుష్యుల విషయమై శ్రద్ధ పుచ్చుకొంటాడు. వారికి అవసరమైన భోజనాన్ని ఆయన వారికి ఇస్తాడు. కాని దుర్మార్గులకు అవసరమైన వాటిని యెహోవా తొలగించి వేస్తాడు.
PRO 10:4 బద్ధకస్తుడు వేదవాడుగా ఉంటాడు. కాని కష్టపడి పనిచేసేవాడు ధనికుడు అవుతాడు.
PRO 10:5 తెలివిగల వాడు సకాలంలో పంట కూర్చుకొంటాడు. కాని కోత కాలంలో నిద్రపోయేవాడు అవమానము కలిగించే కుమారుడు.
PRO 10:6 మంచి మనిషిని ఆశీర్వదించమని మనుష్యులు దేవుని అడుగుతారు. ఆ మంచి విషయాలను చెడ్డవారు చెప్పవచ్చు కాని వారు తల పెడుతున్న చెడు విషయాలను వారి మాటలే కప్పిపుచ్చుతాయి.
PRO 10:7 మంచి మనుష్యుల కార్యములను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరము. కాని చెడ్డవారి పేరు మరువ బడును.
PRO 10:8 జ్ఞానముగల మనిషితో ఎవరైనా ఏదైనా చేయుమని చెబితే అతడు విధేయుడవుతాడు. కాని బుద్ధిహీనుడు వాదించి తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు.
PRO 10:9 నిజాయితీగల ఒక మంచి మనిషి క్షేమంగా ఉంటాడు. కాని మోసం చేసే కపటియైన వ్యక్తి పట్టు బడతాడు.
PRO 10:10 సత్యమును దాచిపెట్టే మనిషి కష్టాలు కలిగిస్తాడు. బాహాటంగా మాట్లాడేవాడు శాంతి కలిగిస్తాడు.
PRO 10:11 ఒక మంచి మనిషి మాటలు జీవితాన్ని మెరుగు పరుస్తాయి. కానీ ఒక దుర్మార్గుని మాటలు అతని అంతరంగంలో ఉన్న చెడును చూపిస్తాయి.
PRO 10:12 ద్వేషం వాదాలు పుట్టిస్తుంది. కానీ మనుష్యులు చేసే ప్రతి తప్పునూ ప్రేమ క్షమిస్తుంది.
PRO 10:13 జ్ఞానముగల వారు వినదగిన మాటలు చెబుతారు. కానీ బుద్ధిహీనులు వారి పాఠం వారు నేర్చుకొనక ముందే శిక్షించబడాలి.
PRO 10:14 జ్ఞానముగల వారు నెమ్మదిగా ఉంటారు, కొత్త విషయాలు నేర్చుకొంటారు. కానీ బుద్ధిహీనులు మాట్లాడి వారికి వారే కష్టాలు తెచ్చుకొంటారు.
PRO 10:15 ధనికుడ్ని ఐశ్వర్యం కాపాడుతుంది. మరియు పేదవాడ్ని పేదరికం పాడు చేస్తుంది.
PRO 10:16 ఒక మనిషి మంచి చేస్తే, అతనికి బహుమానం ఇవ్వబడుతుంది. అతనికి జీవం యివ్వబడుతుంది.దుర్మార్గత శిక్షను మాత్రమే తెచ్చి పెడుతుంది.
PRO 10:17 తన శిక్ష మూలంగా నేర్చుకొన్నవాడు ఇతరులు జీవించటానికి సహాయం చేయగలుగుతాడు. అయితే నేర్చుకొనేందుకు అంగీకరించని వాడు మనుష్యులను తప్పు త్రోవలో మాత్రమే నడిపించగలడు.
PRO 10:18 తన ద్వేషాన్ని దాచిపెట్టేవాడు అబద్ధం చెబుతూ ఉండవచ్చు. కానీ బుద్ధిహీనుడు తాను మాత్రమే ప్రచారం చేసేందుకు చెప్పేటటువంటి మాటల కోసం ప్రయత్నిస్తాడు.
PRO 10:19 అధికంగా మాట్లాడేవాడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. జ్ఞానముగలవాడు ఊరక ఉండుట నేర్చుకొంటాడు.
PRO 10:20 మంచి మనిషి మాటలు స్వచ్ఛమైన వెండిలా ఉంటాయి. కానీ దుర్మార్గుని తలంపులు పనికి మాలినవిగా ఉంటాయి.
PRO 10:21 ఒక మంచి మనిషి మాటలు అనేకులకు సహాయం చేస్తాయి. కానీ బుద్ధిహీనుని మూర్ఖత్వం అతన్నే పాడు చేస్తాయి.
PRO 10:22 యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. మరియు ఆ ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు.
PRO 10:23 బుద్ధిహీనుడు తప్పు చేయుటలో ఆనందిస్తాడు. కానీ జ్ఞానముగలవాడు జ్ఞానములో ఆనందిస్తాడు.
PRO 10:24 దుర్మార్గుడు తాను భయపడే విషయాల మూలంగా ఓడించబడుతాడు. కానీ మంచివాడు తాను కోరుకొనే వాటిని పోందుతాడు.
PRO 10:25 సుడిగాలి వీచినప్పుడు దుర్మార్గులు నాశనమవుదురు. కానీ మంచివాళ్లకు శాశ్వతమైన పునాది వుంటుంది. వాళ్లు శాశ్వతంగా ఉంటారు.
PRO 10:26 బద్ధకస్తుణ్ణి ఎన్నడూ నీ కోసం ఏదీ చేయనీయకు. నీ నోట చిరకలా, లేక నీ కళ్లలో పొగలా అతడు నిన్ను చికాకు పెడతాడు.
PRO 10:27 నీవు యెహోవాను గౌరవిస్తే, నీవు చాలా కాలం బతుకుతావు. కానీ దుర్మార్గులు వారి జీవితంలోనుండి కొన్ని సంవత్సరాలు పోగొట్టుకొంటారు.
PRO 10:28 మంచి మనుష్యులు నిరీక్షించే విషయాలు సంతోషం కలిగిస్తాయి. దుర్మార్గులు నిరీక్షించే విషయాలు నాశనం తెచ్చి పెడతాయి.
PRO 10:29 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. కానీ తప్పుచేసే వారిని యెహోవా నాశనం చేస్తాడు.
PRO 10:30 మంచి మనుష్యులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారు. కానీ దుర్మార్గులు బలవంతంగా దేశం నుండి వెళ్లగొట్టబడతారు.
PRO 10:31 మంచి మనుష్యులు జ్ఞానముగల మాటలు చెబుతారు. కానీ కష్టం తెచ్చి పెట్టే వాని మాటలు వినటం మనుష్యులు మానివేస్తారు.
PRO 10:32 మంచి మనుష్యులకు సరైన సంగతులు చెప్పటం తెలుసు. కానీ దుర్మార్గులు కష్టం తెచ్చిపెట్టే మాటలు చెబుతారు.
PRO 11:1 వస్తువులను సరిగ్గా తూచలేని త్రాసులను కొందరు మనుష్యులు ఉపయోగిస్తారు. మనుష్యులను మోసం చేయటానికి వారు ఆ త్రాసులను ఉపయోగిస్తారు. ఆ తప్పుడు త్రాసులు యెహోవాకి అసహ్యం. కానీ సరిగ్గా ఉండే త్రాసులు యెహోవాకు ఇష్టం.
PRO 11:2 గర్వించి, గొప్పలు చెప్పుకొనే మనుష్యులు ఎన్నిక లేని వారవుతారు. కానీ దీనులు జ్ఞానముగల వారవుతారు.
PRO 11:3 మంచి, నిజాయితీగల మనుష్యులు నిజాయితీ పంథాను అనుసరిస్తారు. కానీ దుర్మార్గులు ఇతరులను మోసం చేసినప్పుడు వారిని వారే నాశనం చేసుకొంటారు.
PRO 11:4 దేవుడు మనుష్యులకు తీర్చు తీర్చేనాడు, డబ్బుకి విలువ ఏమీ ఉండదు. కానీ మంచితనం మనుష్యులను మరణం నుండి రక్షిస్తుంది.
PRO 11:5 ఒక మంచి మనిషి గనుక నిజాయితీగా ఉంటే, అతని జీవితం సులభంగా ఉంటుంది. కానీ దుర్మార్గుడు అతడు చేసే చెడు పనుల మూలంగా నాశనం చేయ బడతాడు.
PRO 11:6 నిజాయితీగల మనిషిని మంచితనం రక్షిస్తుంది. కానీ దుర్మార్గులు వారు చేయాలనుకొన్న చెడు విషయాల ఉచ్చులో పట్టుబడతారు.
PRO 11:7 దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతనికి నిరీక్షణ ఏమీలేదు. అతడు ఆశించినది అంతా పోతుంది అదంతా మొత్తం ఏ విలువలేనిది అవుతుంది.
PRO 11:8 మంచి మనిషి కష్టాన్ని తప్పించుకొంటాడు. ఆ కష్టం మరొక దుర్మార్గునికి సంభవిస్తుంది.
PRO 11:9 ఒక దుర్మార్గుడు చప్పే విషయాల మూలంగా అతడు ఇతరులను బాధించగలడు. కానీ మంచి మనుష్యులు వారి జ్ఞానము చేత కాపాడబడుతారు.
PRO 11:10 మంచి మనుష్యులకు విజయం కలిగినప్పుడు పట్టణం అంతా సంతోషిస్తుంది. దుర్మార్గులు నాశనం చేయబడినప్పుడు ప్రజలు సంతోషంతో కేకలు వేస్తారు.
PRO 11:11 నిజాయితీగల మనుష్యులు వారు నివసిస్తున్న పట్టణానికి తమ దీవెనలు ఇచ్చినప్పుడు, అది గొప్పది అవుతుంది. కానీ ఒక దుర్మార్గుడు చెప్పే విషయాలు ఒక పట్టణాన్ని నాశనం చేయగలవు.
PRO 11:12 బుద్ధిహీనుడు ఇతరులను విమర్శిస్తాడు. అయితే జ్ఞానముగలవానికి ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు.
PRO 11:13 ఇతరులను గూర్చి రహస్యాలు చెప్పే వారెవరూ నమ్మదగినవారు కారు. కానీ నమ్మదగిన మనిషి చెప్పు మాటలను వ్యాపింపచేయడు.
PRO 11:14 ఒక దేశానికి సమర్ధత లేని నాయకులు ఉంటే, ఆ దేశం పతనం అవుతుంది. అయితే అనేకమంది మంచి సలహాదారులు ఆ దేశాన్ని క్షేమంగా ఉంచుతారు.
PRO 11:15 ఇంకో మనిషి బాకీ నీవు చెల్లిస్తానని వాగ్దానం చేస్తే, అప్పుడు నీవు విచారిస్తావు. అలాంటి వ్యవహారాలను నీవు తిరస్కరిస్తే నీవు క్షేమంగా ఉంటావు.
PRO 11:16 దయగల, మర్యాదస్థురాలు గౌరవం సంపాదిస్తుంది. చొచ్చుకుపోయే పురుషులు ధనం మాత్రమే సంపాదిస్తారు.
PRO 11:17 దయగల మనిషి లాభం పొందుతాడు.కానీ నీచుడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు.
PRO 11:18 దుర్మార్గుడు మనుష్యులను మోసం చేసి, వారి డబ్బు తీసుకొంటాడు. అయితే న్యాయంగా ఉండి, సరైనది చేసేవాడు నిజమైన బహుమానం పొందుతాడు.
PRO 11:19 నిజంగా, మంచితనం జీవాన్ని తెచ్చిపెడ్తుంది. కానీ దుర్మార్గులు దుర్మార్గాన్ని వెంటాడి, మరణం తెచ్చుకొంటారు.
PRO 11:20 దుర్మార్గం చేయటానికి ఇష్టపడే వాళ్లు యెహోవాకు అసహ్యం. అయితే మంచిని చేసేందుకు ప్రయత్నించే వాళ్ల విషయం యెహోవాకు సంతోషం.
PRO 11:21 దుర్మార్గులు నిశ్చయంగా శిక్షించబడతారు అనేది సత్యం. మంచివాళ్లు స్వతంత్రులుగా చేయబడతారు.
PRO 11:22 ఒక స్త్రీ అందంగా ఉండి, అవివేకంగా ఉంటే అది అందమైన బంగారు ఉంగరం పంది ముక్కుకు ఉన్నట్టే ఉంటుంది.
PRO 11:23 మంచి మనుష్యులకు వారు కోరిందిలభించి నప్పుడు దాని అంతం ఎల్లప్పుడూ మంచిదిగానే ఉంటుంది. కానీ దుర్మార్గులకు వారు కోరింది లభించినప్పుడు, చివరికి అది చిక్కుగానే ఉంటుంది.
PRO 11:24 ఒక మనిషి ధారాళంగా ఇస్తే, అప్పుడు అతనికి అంతకంటే ఎక్కువ లభిస్తుంది. కాని ఒకడు ఇచ్చేందుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు దరిద్రుడు అవుతాడు.
PRO 11:25 ధారాళంగా ఇచ్చే మనిషి లాభం పోందుతాడు. నీవు యితరులకు సహాయం చేస్తే, అప్పుడు నీకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది.
PRO 11:26 తన ధాన్యం అమ్మేందుకు నిరాకరించే దురాశగల మనిషి మీద ప్రజలు కోపగిస్తారు. అయితే ఇతరులకు ఆహారం పెట్టేందుకు తన ధాన్యం అమ్మేవాని విషయంలో ప్రజలు సంతోషిస్తారు.
PRO 11:27 మంచిని చేయుటకు ప్రయత్నించే మనిషిని ప్రజలు గౌరవిస్తారు. కాని దుర్మార్గం చేసే మనిషికి కష్టం మాత్రమే వస్తుంది.
PRO 11:28 తన ఐశ్వర్యాలను నమ్ముకొనే మనిషి పడిపోతాడు.కాని, మంచి మనిషి పచ్చటి చిగురాకులా పెరుగుతాడు.
PRO 11:29 ఒక మనిషి గనుక తన కుటుంబానికి కష్టం కలిగిస్తే అతనికి లాభం ఏమీ కలుగదు. చివరికి బుద్ధిహీనుడు జ్ఞానముగల మనిషికి సేవ చేయుటకు బలవంతం చేయబడతాడు.
PRO 11:30 మంచి మనిషి చేసే విషయాలు జీవవృక్షంలా ఉంటాయి. ఒక జ్ఞానముగల మనిషి ప్రజలకు కొత్త జీవితం ఇస్తాడు.
PRO 11:31 మంచి మనుష్యులకు భూమి మీద ప్రతిఫలం ఇవ్వబడితే, నిశ్చయంగా దుర్మార్గులు, పాపులు వారికి తగిన దానిని పోందుతారు.
PRO 12:1 ఒక మనిషి జ్ఞానము కలిగి ఉండాలి అనుకొంటే, అతడు తప్పు చేసినప్పుడు దానిని ఎవరైనా అతనికి చెప్పగా అతనికి కోపంరాదు. తాను చేసింది తప్పు అని ఎవరైనా తనకు చెప్పటం ఇష్టంలేని మనిషి మూర్ఖుడు.
PRO 12:2 మంచి మనిషి విషయం యెహోవా సంతోషిస్తాడు. కాని దుర్మార్గుని దోషిగా యెహోవా తీర్చు చెబుతాడు.
PRO 12:3 దుర్మార్గపు మనిషి ఎన్నడూ క్షేమంగా ఉండడు. అయితే మంచి మనుష్యులు సురక్షితంగా ఉండగలరు.
PRO 12:4 మంచి భార్య విషయమై భర్త సంతోషించి అతిశయిస్తాడు. కాని ఒక స్త్రీ తన భర్తను అవమానిస్తే, అప్పుడు ఆమె అతని శరీరంలో ఒక వ్యాధిలా ఉంటుంది.
PRO 12:5 మంచి మనుష్యులు తాము చేయాలని తలపెట్టే విషయాల్లో నిజాయితీగా, న్యాయంగా ఉంటారు. కాని దుర్మార్గుడు నీతో చెప్పే విషయాలను నమ్మవద్దు.
PRO 12:6 దుర్మార్గుల మాటలు రక్తంకోసం పొంచి వుంటాయి. కాని మంచి మనుష్యుల మాటలు వారిని అపాయం నుండి తప్పిస్తాయి.
PRO 12:7 దుర్మార్గులు నాశనం చేయబడగా ఇంకేమీ మిగులదు. అయితే మంచి మనుష్యులు వెళ్లిపోయిన తరువాత చాలా కాలం వరకు మనుష్యులు వారిని జ్ఞాపకం చేసికొంటారు.
PRO 12:8 జ్ఞానము గల మనిషిని ప్రజలు పొగుడుతారు. కాని మూర్ఖుడైన మనిషిని ప్రజలు గౌరవించరు.
PRO 12:9 భోజనం లేకపోయినా, ప్రముఖునిలా నటించే మనిషిలా ఉండటంకంటె, ప్రముఖుడు కాకపోయినా కష్టపడి పనిచేసే మనిషిలా ఉండటం మేలు.
PRO 12:10 మంచి మనిషి తన పశువుల విషయం శ్రద్ధ తీసుకొంటాడు. కానీ దుర్మార్గులు దయగా ఉండలేరు.
PRO 12:11 తన పొలంలో పనిచేసే రైతుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. కాని పనికిమాలిన ఆలోచనలతో సమయం వృధా చేసేవాడు బుద్ధిహీనుడు.
PRO 12:12 దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు పసులు చేయాలని చూస్తుంటారు. కానీ మంచివాళ్లకు చెట్ల వేర్లవలెలోతుకు చొ చ్చుకొనిపోయే బలం ఉంటుంది.
PRO 12:13 దుర్మార్గుడు తెలివి తక్కువ విషయాలు మాట్లాడి, తన మాటలచేత పట్టుబడతాడు. కానీ మంచి మనిషి అలాంటి కష్టం నుండి తప్పించుకొంటాడు.
PRO 12:14 ఒక వ్యక్తి తాను చెప్పే మంచి విషయాల మూలంగా బహుమానం పొందుతాడు. అదే విధంగా అతడు చేసే పనివల్ల అతనికి లాభం కలుగుతుంది.
PRO 12:15 బుద్ధిహీనుడు ఎల్లప్పుడూ తన స్వంత విధానమే మంచిదని తలస్తాడు. కానీ జ్ఞానముగలవాడు ఇతరులు తనతో చెప్పే మాటలు వింటాడు.
PRO 12:16 బుద్ధిహీనుడు త్వరగా కలవరం చెందుతాడు. అయితే ఇతరులు ఏదైనా తప్పు చెప్పినప్పుడు తెలివిగలవాడు త్వరగా క్షమిస్తాడు.
PRO 12:17 ఒక వ్యక్తి సత్యం చెబితే, అతడు చెప్పే విషయాల్లో నిజాయితీ గలవాడే. కానీ ఒకడు అబద్ధాలు గనుక చెబితే, అది కష్టాలకు దారి తీస్తుంది.
PRO 12:18 ఒక వ్యక్తి ఆలోచన లేకుండా మాట్లాడితే, అప్పుడు ఆ మాటలు ఖడ్గంలా బాధించవచ్చు. అయితే జ్ఞానముగలవాడు అతడు చెప్పే విషయాల గూర్చి జాగ్రత్తగా ఉంటాడు. అతని మాటలు ఆ బాధను నయం చేయవచ్చును.
PRO 12:19 ఒక వ్యక్తి అబద్ధం చెబితే, ఆ మాటలు వేగంగా వ్యర్థం అవుతాయి. కానీ సత్యం శాశ్వతంగా జీవిస్తుంది.
PRO 12:20 దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టం కలిగించాలని కోరుకొంటారు. అయితే శాంతికోసం పని చేసేవారు సంతోషంగా ఉంటారు.
PRO 12:21 మంచి మనుష్యులు యెహోవా చేత క్షేమంగా కాపాడబడుతారు.కానీ చెడ్డవాళ్లకు చాలా కష్టాలు ఉంటాయి.
PRO 12:22 అబద్ధాలు చెప్పే వాళ్లంటే యెహోవాకు అసహ్యం. అయితే సత్యం చెప్పే వాళ్ల విషయం యెహోవాకు సంతోషం.
PRO 12:23 చురుకైనవాడు తనకు తెలిసిన అన్నీ విషయాలూ చెప్పడు. కానీ బుద్ధిహీనుడు అన్నీ చెప్పి, తాను బుద్ధిహీనుడను అని చూపెట్టుకొంటాడు.
PRO 12:24 కష్టపడి పనిచేసే మనుష్యులు ఇతరుల మీద అధికారులుగా నియమించబడుతారు. అయితే సోమరి బానిసలా పనిచేయాల్సి ఉంటుంది.
PRO 12:25 చింతించటం ఒక మనిషి సంతోషాన్ని తీసివేయగలదు. కానీ దయగల ఒక మాట ఒక మనిషిని సంతోష పెట్టగలదు.
PRO 12:26 మంచివాడు తన చుట్టూవున్న వాళ్లకంటే ఎక్కువ పొందుతాడు. దుర్మార్గుల చెడు నడతలే వాళ్లను చెడు మార్గాలలో పెట్టి, విజయం నుండి తప్పిస్తాయి.
PRO 12:27 బద్ధకస్తుడు తాను కోరుకొనే వాటి వెనుక వెళ్లడు. కానీ కష్టపడి పనిచేసే వానికి ఐశ్వర్యాలు వస్తాయి.
PRO 12:28 నీవు సరైన విధంగా జీవిస్తే, అప్పుడు నీకు నిజమైన జీవం ఉంటుంది. అదే శాశ్వతంగా జీవించటానికి మార్గం.
PRO 13:1 ఒక తెలివిగల కుమారుడు అతడు ఏమి చేయాలని అతని తండ్రి చెబుతాడో, దానిని జాగ్రత్తగా వింటాడు. కానీ గర్విష్ఠి వినడు. తనది తప్పు అని అతడు ఎన్నడూ నమ్ముడు.
PRO 13:2 మంచి వాళ్లు, తాము చెప్పే మంచి విషయాలకు బహుమానం పొందుతారు. కానీ దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు చేయాలని ఆలోచిస్తారు.
PRO 13:3 తాను చెప్పే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఉండే మనిషి తన ప్రాణం కాపాడుకొంటాడు. కానీ ఆలోచన లేకుండా మాట్లాడే మనిషి నాశనం చేయబడతాడు.
PRO 13:4 బద్ధకస్తునికి వస్తువులు కావాలి, కానీ అతడు వాటిని ఎన్నటకీ పొందలేడు. కానీ కష్టపడి పని చేసేవాళ్లు, తాము కోరుకొనే వాటిని పొందుతారు.
PRO 13:5 మంచివాళ్లు అబద్ధాలను అసహ్యించుకొంటారు. దుర్మార్గులు అవమానించబడతారు.
PRO 13:6 మంచితనం, నిజాయితీగల మనిషిని మంచితనం కాపాడుతుంది. కానీ పాపం చేయాలని ఇష్టపడేవాడికి కీడు కలుగుతుంది.
PRO 13:7 కొంతమంది మనుష్యులు ధనికుల్లా నటిస్తారు, కానీ వారికి ఏమి వుండదు. ఇతరులు పేదవాళ్లలా నటిస్తారు, కానీ వాస్తవానికి వారు ధనికులు.
PRO 13:8 ఒక ధనికుడు తనప్రాణం కాపాడుకొనేందుకు వెల చెల్లించాల్సి వస్తుందేమో. కానీ పేదవాళ్లకు అలాంటి బెదిరింపులు ఏమీ వుండవు.
PRO 13:9 ఒక మంచి మనిషి ప్రకాశవంతంగా వెలిగే దీపంలా ఉంటాడు. కానీ దుర్మార్గుడు ఆరిపోయే దీపంలా ఉంటాడు.
PRO 13:10 ఇతరులకంటె తామే మంచివాళ్లము అనుకొనే మనుష్యులు కష్టం మాత్రమే కలిగిస్తారు. అయితే ఇతరులు తమకు చెప్పే విషయాలను వినేవారు జ్ఞానము గలవారు.
PRO 13:11 డబ్బు సంపాదించటంకోసం ఒక వ్యక్తి మోసం చేస్తే, ఆ డబ్బు త్వరలోనే పోతుంది. అయితే తన డబ్బును కష్టపడి సంపాదించే మనిషి దానిని మరీ ఎక్కువగా పెంచుకొంటాడు.
PRO 13:12 నిరీక్షణ లేకపోతే హృదయానికి దు:ఖం. నీవు కోరుకొన్నది సంభవిస్తే, అప్పుడు ఆనంద భరితుడవు.
PRO 13:13 ఒక వ్యక్తికి ఇతరులు సహాయం చేయటానికి ప్రయత్నించినప్పుడు అతడు వినిపించుకోకపోతే, అప్పుడు అతడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. అయితే ఇతరులు తనకు చెప్పిన సంగతులను గౌరవించేవాడు బహుమానం పొందుతాడు.
PRO 13:14 జ్ఞానముగల మనిషి యొక్క ఉపదేశాలు జీవాన్ని ఇస్తాయి. ఆ మాటలు మరణ బంధకాల నుండి తప్పించుకొనుటకు సహాయం చేస్తాయి.
PRO 13:15 తెలివిగల మనిషిని మనుష్యులు గౌరవిస్తారు. కానీ ఒక వ్యక్తి నమ్మదగిన వాడు కానప్పుడు అతనికి కష్టం కలుగుతుంది.
PRO 13:16 జ్ఞానముగల మనిషి ఏదైనా చేయకముందే అతడు ఆలోచిస్తాడు. అయితే బుద్దిహీనుడు చేసే బుద్దిహీనత వలన అతడు మూర్ఖుడౌతాడు.
PRO 13:17 ఒక వార్తాహరుడు నమ్మజాలని వాడైతే, అప్పుడు అతని చుట్టూ కష్టం ఉంటుంది. అయితే ఒక వ్యక్తి నమ్మదగిన వాడైతే శాంతి ఉంటుంది.
PRO 13:18 ఒక వ్యక్తి తన తప్పుల మూలంగా నేర్చుకొనేందుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు పేదవాడై, సిగ్గుపడతాడు. కానీ ఒక మనిషి విమర్శింట బడినప్పుడు, శిక్షించబడినప్పుడు వినుపించుకొంటే లాభం పొందుతాడు.
PRO 13:19 ఒక మనిషి ఏదైనా కోరుకొని దానిని పొందితే, అతనికి చాలా సంతోషం. కానీ మూర్ఖులు కీడునే కోరుకొంటారు. వారు మారుటకు అంగీకరించరు.
PRO 13:20 జ్ఞానముగల వారితో స్నేహంగా ఉండు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. కానీ బుద్ధిహీనులను నీ స్నేహితులుగా నీవు ఎంచుకొంటే అప్పుడు నీవు కష్టాల్లో పడతావు.
PRO 13:21 పాపులు ఎక్కడికి వెళ్లినా కష్టం వారిని తరుముతుంది. కానీ మంచివాళ్లకు మంచి సంగతులు జరుగుతాయి.
PRO 13:22 మంచి మనిషి దగ్గర అతడు తన పిల్లలకు, మనవలకు ఇచ్చేందుకు ఐశ్వర్యం ఉంటుంది. చివరికి చెడ్డవాళ్లకు ఉన్నవి అన్నీ మంచివాళ్ల పాలవుతాయి.
PRO 13:23 ఒక పేదవానికి విస్తారమైన ఆహారం పండించగల మంచి భూమి ఉండవచ్చును. కానీ అతడు చెడు నిర్ణయాలు చేసి, ఆకలితో ఉంటాడు.
PRO 13:24 ఒక వ్యక్తి తన పిల్లలను నిజంగా ప్రేమిస్తే, వారు తప్పు చేసినప్పుడు అతడు వారిని సరిదిద్దుతాడు. నీవు నీ కుమారుని ప్రేమిస్తే, అతనికి సరైన మార్గం నేర్పించేందుకు నీవు జాగ్రత్తగా ఉంటావు.
PRO 13:25 మంచి వాళ్లకు నిజంగా వారికి కావాల్సినవి ఉంటాయి. కానీ దుర్మార్గుకి అవసరత కలిగివుంటుంది.
PRO 14:1 జ్ఞానముగల స్త్రీ తన ఇల్లు ఎలా ఉండాలో అలా చేసుకొనేందుకు జ్ఞానము ప్రయోగిస్తుంది. కానీ బుద్ధిహీనురాలు ఆమె చేసే బుద్ధిహీనమైన పనుల మూలంగా తన ఇల్లు నాశనం చేసికొంటుంది.
PRO 14:2 సరిగ్గా జీవించే మనిషి యెహోవాను గౌరవిస్తాడు. కానీ నిజాయితీ లేని మనిషి యెహోవాను ద్వేషిస్తాడు.
PRO 14:3 బుద్ధిహీనుని మాటలు అతనికి కష్టం తెచ్చిపెడతాయి. కాని జ్ఞానముగలవాని మాటలు అతణ్ణి కాపాడతాయి.
PRO 14:4 పని చేయటానికి ఎద్దులు లేకపోతే గాదెలో ధాన్య ముండదు ఒక గొప్ప పంట పండించటానికి మనుష్యులు ఎద్దు బలాన్ని ఉపయోగించవచ్చు.
PRO 14:5 సత్యవంతుడు అబద్ధం చెప్పడు. అతడు మంచి సాక్షి. కాని నమ్మదగని వ్యక్తి ఎన్నడూ సత్యం చెప్పడు అతడు చెడ్డ సాక్షి.
PRO 14:6 ఇతరులకంటె తాను మంచివాడను అని తలంచే గర్విష్ఠుడు ఒకవేళ జ్ఞానిగా ఉండాలి అనుకోవచ్చు. కానీ ఆ గర్విష్ఠుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు. అయితే నిజంగా జ్ఞానముగల వానికి (దేవుని నమ్మినవానికి) తెలివి సులభంగా అబ్బుతుంది.
PRO 14:7 తెలివి తక్కువ వానితో స్నేహం చేయవద్దు. తెలివి తక్కువ మనిషి నీకు నేర్పించగలది ఏమీ లేదు.
PRO 14:8 తెలివిగల మనుష్యులు వారు చేసే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తారు, గనుక వారు జ్ఞానము గలవారు. కానీ బుద్ధిహీనులు మోసం చేసి జీవించవచ్చు. అనుకొంటారు గనుక వారు తెలివితక్కువ వారు.
PRO 14:9 తెలివి తక్కువ వాడు, తాను చేసిన చెడు విషయాలకు శిక్ష పొందాలి అనే మాటను గూర్చి నవ్వేస్తాడు. కానీ మంచి మనుష్యులు క్షమాపణ పొందటానికి చాలా కష్టపడి ప్రయత్నిస్తారు.
PRO 14:10 ఒక మనిషి విచారంగా ఉంటే దాని ప్రభావం అతను ఒక్కడే అనుభవిస్తాడు. అదే విధంగా ఒక మనిషి సంతోషంగా ఉంటే అతను ఒక్కడు మాత్రమే ఆ ఆనందం అనుభవిస్తాడు.
PRO 14:11 దుర్మార్గుని ఇల్లు నాశనం చేయబడుతుంది. కానీ మంచివాని ఇల్లు శాశ్వతంగా ఉంటుంది.
PRO 14:12 సరిగ్గా ఉంది అని మనుష్యులు తలంచే ఒక మార్గం ఉంది. కానీ ఆ మార్గం మరణానికి మాత్రమే దారి తీస్తుంది.
PRO 14:13 ఒక మనిషి నవ్వుతూ ఉన్నా, అతడు విచారంగానే ఉండవచ్చు. నవ్యటం అయిపొయ్యాకగూడ ఆ విచారం అలాగే ఉంటుంది.
PRO 14:14 దుర్మార్గులు చేసే చెడుపనులకు వారికి పూర్తిగా చెల్లించబడుతుంది (శిక్షించబడుతారు). మరియు మంచివాళ్లు చేసే మంచి పనులకు పూర్తిగా బహుమానం పొందుతారు.
PRO 14:15 బుద్ధిహీనుడు ఏది వింటే అది నమ్ముతాడు. కానీ జ్ఞానము గలవాడు ప్రతిదాని గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తాడు.
PRO 14:16 జ్ఞానముగలవాడు యెహోవాను గౌరవిస్తాడు, దుర్మార్గానికి దూరంగా ఉంటాడు. కానీ బుద్ధిహీనుడు ఆలోచన లేకుండా పనులు చేస్తాడు జాగ్రత్తగా ఉండడు.
PRO 14:17 త్వరగా కోపగించుకొనేవాడు బుద్ధిహీనమైన పనులు చేస్తాడు. కాని జ్ఞానముగలవాడు ఓర్పు కలిగి ఉంటాడు.
PRO 14:18 తెలివితక్కువ వారు తమ తెలివితక్కువ తనాన్ని బట్టి శిక్షించబడుతారు. కానీ జ్ఞానముగలవారికి తెలివి బహుమానంగా ఇవ్వబడుతుంది.
PRO 14:19 చివరికి చెడ్డవారిమీద మంచి వాళ్లు గెలుస్తారు. చెడ్డవాళ్లు మంచివాళ్లకు నేవ చేయుటకు బలవంతం చేయబడుతారు.
PRO 14:20 పేదవానికి స్నేహితులు ఎవ్వరూ ఉండరు. అతనికి పొరుగువారు కూడ ఉండరు. కానీ ధనికులకు చాలా మంది స్నేహితులు ఉంటారు.
PRO 14:21 ఇతరులకంటే నీవే మంచివాడవని తలచటం తప్పు. నీవు సంతోషంగా ఉండాలంటే పేదవారి యెడలదయ కలిగి ఉండు.
PRO 14:22 దుర్మార్గం చేయాలనే వ్యక్తి ఎవరైనా సరే అతడు తప్పు చేస్తున్నాడు. అయితే మంచి జరిగించడానికి ప్రయత్నించే వ్యక్తికి, అతన్ని ప్రేమించి అత న్ని నమ్ముకొనే స్నేహితులు ఉంటారు.
PRO 14:23 నీవు కష్టపడి పని చేస్తే, అప్పుడు నీవు కోరుకొనేవి నీకు ఉంటాయి. కాని నీవు మాట్లాడటం తప్ప పని ఏమి చేయకపోతే నీవు పేదవానివిగా ఉంటావు.
PRO 14:24 జ్ఞానముగలవారు ఐశ్వర్యాన్ని బహుమానంగా పొందుతారు. కాని బుద్ధిహీనులు తెలివితక్కువ తనాన్ని బహుమానంగా పొందుతారు.
PRO 14:25 సత్యం పలికే మనిషి ఇతరులకు సహాయం చేస్తాడు. అబద్ధాలు చెప్పే మనిషి ఇతరులకు హాని చేస్తాడు.
PRO 14:26 యెహోవాను గౌరవించే మనిషి క్షేమంగా ఉంటాడు. మరియు అతని పిల్లలు క్షేమంగా జీవిస్తారు.
PRO 14:27 యెహోవా యెడల భక్తి నిజమైన జీవాన్ని ప్రసాదిస్తుంది. అది ఒక వ్యక్తిని మరణవు ఉచ్చునుండి రక్షిస్తుంది.
PRO 14:28 ఒక రాజు అనేకమంది ప్రజలను పాలిస్తే అతడు గొప్పవాడు. కాని ప్రజలు ఎవ్వరూ లేకపోతే అప్పుడు ఆ రాజు యొక్క విలువ శూన్యం.
PRO 14:29 సహనంగల మనిషి చాలా తెలివిగలవాడు. త్వరగా కోపపడు మనిషి బుద్ధిహీనుడని కనపరచుకుంటాడు.
PRO 14:30 ఒక మనిషి మనస్సులో శాంతి ఉంటే అతని శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ అసూయ శరీరంలో వ్యాధి కలిగిస్తుంది.
PRO 14:31 పేద ప్రజలకు కష్టాలు కలిగించే మనిషి దేవుణ్ణి గౌరవించటం లేదని చూపెడతాడు. ఇద్దరినీ దేవుడే చేశాడు. కాని ఒక మనిషి పేద ప్రజల యెడల దయ కలిగి ఉంటే, అప్పుడు అతడు దేవుని గౌరవిస్తాడు.
PRO 14:32 కష్టకాలంలో దుర్మార్గులు ఓడించబడతారు. కాని మంచివాళ్లు మరణ సమయంలో కూడా విజయం పొందుతారు.
PRO 14:33 జ్ఞానముగల మనిషి ఎల్లప్పుడూ జ్ఞానముగల విషయాలే తలుస్తాడు. కాని బుద్ధిహీనునిక జ్ఞానమును గూర్చి అసలు ఏమీ తెలియదు.
PRO 14:34 మంచితనం ఒక దేశాన్ని గొప్పగా చేస్తుంది. కాని పాపం వలన ఏ ప్రజలకైనా అవమానమే కలుగుతుంది.
PRO 14:35 ఒక రాజుకు జ్ఞానముగల నాయకులు ఉంటే అతడు సంతోషిస్తాడు. కాని తెలివితక్కువ నాయకుల విషయమై రాజుకు కోపం.
PRO 15:1 శాంతియుతమైన జవాబు కోపాన్ని పోగొడ్తుంది. కాని దురుసు జవాబు కోపాన్ని పెంచుతుంది.
PRO 15:2 జ్ఞానముగల మనిషి మాట్లాడినప్పుడు ఇతరులు వినాలని ఆశిస్తారు. కాని బుద్ధిహీనుడు మాట్లాడేది తెలివితక్కువ తనమే అవుతుంది.
PRO 15:3 అన్నిచోట్లా జరిగేవాటన్నింటినీ యెహోవా చూస్తాడు. దుర్మార్గులను, మంచి వాళ్లను యెహోవా గమనిస్తాడు.
PRO 15:4 దయగల మాటలు జీవవృక్షంలా ఉంటాయి. కాని అబద్ధాల మాటలు ఒక మనిషి ఆత్మను అణచివేస్తాయి.
PRO 15:5 తెలివితక్కువ వాడు తన తండ్రి సలహా వినేందుకు నిరాకరిస్తాడు. కాని జ్ఞానముగలవాడు మనుష్యులు అతనికి నేర్పించటానికి ప్రయత్నించినప్పుడు జాగ్రత్తగా వింటాడు.
PRO 15:6 మంచి మనుష్యులు అనేక విషయాలలో ఐశ్వర్యవంతులుగా ఉంటారు. కాని ఒక దుర్మార్గునికి ఉన్నవి అతనికి కష్టం మాత్రమే కలిగిస్తాయి.
PRO 15:7 జ్ఞానము గలవాడు మాట్లాడినప్పుడు అతడు జ్ఞానముతో మాట్లాడుతాడు. కాని బుద్ధిహీనులు వినదగినది ఏమీ చెప్పరు.
PRO 15:8 దుర్మార్గులు అర్పించే అర్పణలు యెహోవాకు అసహ్యం. అయితే మంచి మనిషి చేసే ప్రార్థనలు వినటం యెహోవాకు సంతోషం.
PRO 15:9 దుర్మార్గులు జీవించే విధానం యెహోవాకు అసహ్యం. మంచి పనులను చేయాలని ప్రయత్నించే మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
PRO 15:10 ఒక వ్యక్తి అక్రమంగా జీవించటం మొదలు పెడితే అతడు శిక్షించబడుతాడు. సరిదిద్దబడటానికి ఇష్టపడని మనిషి నాశనం చేయబడతాడు.
PRO 15:11 మరణస్థానంలో జరిగేదానితో సహా, సమస్తం యెహోవాకు తెలుసు. కనుక మనుష్యుల హృదయాల్లో, మనస్సుల్లో ఏమి జరుగుతుందో యెహోవాకు నిశ్చయంగా తెలుసు.
PRO 15:12 బుద్ధిహీనుడు తప్పు చేసినప్పుడు అది అతనికి చెబితే ఇష్టం ఉండదు. అతడు జ్ఞానముగల వారిని సలహా అడగటానికి నిరాకరిస్తాడు.
PRO 15:13 ఒక వ్వక్తి సంతోషంగా ఉంటే అతని ముఖం ఆనందంగా ఉంటుంది. అయితే ఒక మనిషి హృదయంలో విచారం ఉంటే, అప్పుడు అతని స్వభావంలో ఆ దు:ఖం వ్యక్తం అవుతుంది.
PRO 15:14 జ్ఞానముగలవాడు ఇంకా ఎక్కువ తెలివి సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ బుద్ధిహీనునికి ఇంకా ఎక్కువ బుద్ధిహీనత కావాలి.
PRO 15:15 కొంతమంది పేదవాళ్లు ఎంతసేపూ విచారం గానే ఉంటారు. అయితే హృదయాల్లో సంతోషంగల పేదవాళ్లకు జీవితం ఒక పెద్ద విందులా ఉంటుంది.
PRO 15:16 ధనికునిగా అనేక కష్టాలు కలిగి ఉండటంకంటె, దరిద్రునిగా ఉండి యెహోవాను గౌరవించటం మేలు.
PRO 15:17 ద్వేషం ఉన్నచోట విస్తారంగా భోజనం చేయటంకంటే, ప్రేమగల చోట కొద్దిగా భోజనం చేయటం మేలు.
PRO 15:18 త్వరగా కోపపడేవారు కష్టాన్ని కలిగిస్తారు. కానీ స హనంగల మనిషి శాంతిని కలిగిస్తాడు.
PRO 15:19 బద్ధకస్తునికి అంతటా కష్టమే ఉంటుంది. కానీ నిజాయితీగల మనుష్యులకు జీవితం తేలిగ్గా ఉంటుంది.
PRO 15:20 జ్ఞానముగల కుమారుడు తన తండ్రికి సంతోషం కలిగిస్తాడు. అయితే బుద్ధిహీనుడు తన తల్లికి అవమానం తెస్తాడు.
PRO 15:21 తెలివితక్కువ వానికి తెలివితక్కువ తనమే ఆనందం. కానీ జ్ఞానముగలవాడు సరైన వాటినే చేయటానికి జాగ్రత్తపడతాడు.
PRO 15:22 ఒక వ్యక్తి సరిపడినంత సలహా తీసుకొనకపోతే, అతని తలంపులు విఫలమవుతాయి. అయితే ఒక వ్యక్తి జ్ఞానముగలవారు తనకు చెప్పే విషయాలు వింటే విజయం పొందగలడు.
PRO 15:23 ఒక మనిషి మంచి జవాబు ఇచ్చినప్పుడు సంతోషిస్తాడు. మరియు సరైన సమయంలో సరైన మాట చెప్పటం చాలా మంచిది.
PRO 15:24 జ్ఞానముగల మనిషి చేసే పనులు విజయానికి నడిపిస్తాయి. అతడు మరణ స్థానానికి దిగజారిపోకుండా ఆ విషయాలు అతనిని వారిస్తాయి.
PRO 15:25 గర్విష్ఠికి ఉన్న గృహమును యెహోవా నాశనం చేస్తాడు. అయితే విధవరాలి వస్తువులను యెహోవా కాపాడుతాడు.
PRO 15:26 చెడు ఆలోచనలు యెహోవాకు అసహ్యం. కానీ దయగల మాటల విషయంలో యెహోవా సంతోషిస్తాడు.
PRO 15:27 ఒక వ్యక్తి వస్తువులు సంపాదించటం కోసం దురాశపడితే అతడు తన కుటుంబానికి కష్టం తెచ్చి పెడ్తాడు. కానీ లంచగొండితనాన్ని ద్వేషించే నిజాయితీపరుడు బతుకుతాడు.
PRO 15:28 మంచి మనుష్యులు జవాబు చెప్పక ముందు ఆలోచిస్తారు. అయితే దుర్మార్గులు ఆలోచించక ముందే మాట్లాడేస్తారు. అది వారికి కష్ఠం కలిగిస్తుంది.
PRO 15:29 యెహోవా దుర్మార్గులకు చాలా దూరంగా ఉంటాడు. కానీ మంచివాళ్ల ప్రార్థనలు ఆయన ఎల్లప్పుడూ వింటాడు.
PRO 15:30 నవ్వుతూ ఉండే మనిషి ఇతరులను సంతోషపెడ్తాడు. శుభవార్త మనుష్యులకు మంచి సంతోషాన్ని కలిగిస్తుంది.
PRO 15:31 ఒక మనిషి తాను తప్పు చేసిననప్పుడు, దానిని సరిదిద్దుటకు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినేవాడు చాలా జ్ఞానముగలవాడు.
PRO 15:32 ఒకడు నేర్చుకొనేందుకు నిరాకరిస్తే అతడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు. అయితే ఒక మనిషి తాను చేసింది తప్పు అని చెప్పినప్పుడు వినే మనిషి మరీ ఎక్కువగా గ్రహిస్తాడు.
PRO 15:33 యెహోవాను గౌరవించువాడు జ్ఞానము గలిగి ఉండటానికి నేర్చుకొంటున్నాడు. ఒక వ్యక్తి నిజంగా యెహోవాను గౌరవించేముందు, వినమ్రుడవాలి.
PRO 16:1 మనుష్యులు తమ ఆలోచనలు చేస్తారు. అయితే ఆ విషయాలు జరిగేటట్టుగా చేసేవాడు యెహోవాయే.
PRO 16:2 ఒకడు తాను చేసేది అంతా సరిగ్గా ఉంది అనుకొంటాడు. అయితే మనుష్యులు చేసే వాటికిగల అసలైన కారణాలు ఏమిటో యెహోవా తీర్పు చెబుతాడు.
PRO 16:3 నీవు చేసే ప్రతీదానిలో సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరుగు, నీవు జయంపొందుతావు.
PRO 16:4 ప్రతీదానికీ యెహోవా ఏర్పాటు ఒకటి ఉంది. యెహోవా ఏర్పాటులో దుర్మార్గులు నాశనం చేయబడతారు.
PRO 16:5 ఇతరులకంటే తానే మంచివాడిని అనుకొనే ప్రతి మనిష యెహోవాకు అసహ్యుడు. ఆ గర్విష్ఠుల నందరినీ యెహోవా తప్పక నాశనం చేస్తాడు.
PRO 16:6 నిజమైన ప్రేమ, నమ్మకం నిన్ను పవిత్రం చేస్తాయి. యెహోవాను గౌరవించు, నీవు దుర్మార్గానికి దూరంగా ఉంటావు.
PRO 16:7 ఒక వ్యక్తి యెహోవాను సంతోషపెట్టే విధంగా మంచి జీవితం జీవిస్తూంటే అప్పుడు అతని శత్రువులు కూడా అతనితో సమాధానంగా ఉంటారు.
PRO 16:8 మోసం చేసి విస్తారంగా సంపాదించుటకంటే, సరైన విధంగా కొంచెం మాత్రమే సంపాదించుట మేలు.
PRO 16:9 ఒక మనిషి తాను చేయాలనుకొనే వాటి విషయంలో పథకాలు వేయవచ్చు. అయితే ఏమి జరుగు తుంది అనేది నిర్ణయించే వాడు యెహోవా.
PRO 16:10 ఒక రాజు మాట్లాడితే, అతని మాటలు చట్టం అవుతాయి. అతని నిర్ణయాలు ఎల్లప్పుడూ న్యాయంగా ఉండాలి.
PRO 16:11 త్రాసులు, తూనిక రాళ్లు అన్నీ నిజాయితీగా ఉండాలని యెహోవా కోరుతాడు, వ్యాపార ఒప్పందాలన్నీ న్యాయంగా ఉండాలని ఆయన కోరుతాడు.
PRO 16:12 కీడు చేసే మనుష్యులను రాజులు అసహ్యించుకొంటారు. మంచితనం అతని రాజ్యాన్ని మరింత బలమైనదిగా చేస్తుంది.
PRO 16:13 రాజులు సత్యం వినాలని కోరుతారు. అబద్ధాలు చేప్పని ప్రజలు రాజులకు ఇష్టం.
PRO 16:14 రాజుకు కోపం వస్తే, అతడు ఎవరినైనా చంపవచ్చును. జ్ఞానముగలవాడు రాజును సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు.
PRO 16:15 రాజు సంతోషంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీ విషయమై రాజు సంతోషిస్తే, అది మేఘం నుండి కురిసిన వర్షపు ఊటలా ఉంటుంది.
PRO 16:16 జ్ఞానము బంగారంకంటె చాలా ఎక్కువ విలువగలది. అవగాహన వెండికంటె చాలా ఎక్కువ విలువగలది.
PRO 16:17 మంచి మనుష్యులు దుర్మార్గానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ తమ జీవితాలు జీవిస్తారు. తన జీవితం కాపాడుకొనేవాడు తన ఆత్మను భద్రము చేసుకొంటున్నాడు.
PRO 16:18 ఒక వ్యక్తి గనుక గర్వంగా ఉంటే, అప్పుడు అతడు నాశనకరమైన అపాయంలో ఉన్నాడు. ఒక మనిషి ఇతరులకంటె తానే మంచివాడినని అనుకొంటే అతడు ఓడిపోయే ప్రమాదంలో ఉన్నాడు.
PRO 16:19 ఇతరులకంటె గొప్పవాళ్లం అనుకొనే వాళ్లతో ఐశ్వర్యాలు పంచుకోవటంకంటె, దీనులైన, పేదవాళ్లతో కలిసి జీవించటం మేలు.
PRO 16:20 మనుష్యులు తనకు నేర్పించుటకు ప్రయత్నించినప్పుడు, వినే వ్యక్తి లాభం పొందుతాడు. యెహోవాను నమ్ముకొనేవాడు ఆశీర్వదించబడుతాడు.
PRO 16:21 ఒకవేళ ఒక మనిషి జ్ఞానముగల వాడైతే అది ప్రజలు తెలుసుకొంటారు. జాగ్రత్తగా ఎంచుకొని మాటలు మాట్లాడే మనిషి, చాలా ఒప్పించదగినవాడుగా ఉంటాడు.
PRO 16:22 జ్ఞానముగల వారికి అది నిజమైన జీవాన్ని తెచ్చిపెడుతుంది. కానీ బుద్ధిహీనులు మరింత బుద్ధిహీనంగా ఉండటమే నేర్చుకొంటారు.
PRO 16:23 జ్ఞానముగల మనిషి మాట్లాడక ముదు ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు. అతడు చెప్పే మాటలు మంచివి, వినదగినవి.
PRO 16:24 దయగల మాటలు తేనెలా ఉంటాయి. వాటిని అంగీకరించటం సులభం, అవి నీ ఆరోగ్యానికి మంచివి.
PRO 16:25 మనుష్యుల దృష్టికి సరైనదిగా కనుపించే మార్గం ఒకటి ఉంది. కానీ ఆ మార్గం మరణానికి మాత్రమే నడిపిస్తుంది.
PRO 16:26 పనివాని ఆకలి అతణ్ణి పని చేయిస్తూనే ఉంటుంది. అతడు భోజనం చేయగలిగేటట్టు, అతని ఆకలి అతణ్ణి పని చేయిస్తుంది.
PRO 16:27 పనికిమాలిన మనిషి చెడు పనులు చేయాలని పథకం వేస్తాడు. అతని సలహా నిప్పులా నాశనం చేస్తుంది.
PRO 16:28 చిక్కులు పేట్టేవారు ఎల్లప్పుడూ సమస్యలు పుట్టిస్తూంటారు. చెప్పుడు మాటలు వ్యాపింపజేసేవాడు సన్నిహితులైన మిత్రుల మధ్య చిక్కు కలిగిస్తాడు.
PRO 16:29 త్వరగా కోపం వచ్చే మనిషి తన స్నేహితులకు చిక్కు తెచ్చిపెడ్తాడు. మంచిది కాని మార్గంలో అతడు వారిని నడిపిస్తాడు.
PRO 16:30 కన్నుగీటి, చిరునవ్వునవ్వేవాడు ఏదో అక్రమం, కీడు తలపెడ్తున్నాడు.
PRO 16:31 నెరసిన తల వెంట్రుకలు, మంచి జీవితాలు జీవించిన వారికి మహిమ కిరీటం.
PRO 16:32 బలమైన ఒక సైనికునిగా ఉండటంకంటే సహనం గలిగి ఉండటం మంచిది, ఒక పట్టణం అంతటిని స్వాధీనం చేసికోవటంకంటే, నీ కోపాన్ని స్వాధీనం చేసికోవటం మేలు.
PRO 16:33 నిర్ణయాలు చేయటానికి మనుష్యులు చీట్లు వేస్తారు. కానీ నిర్ణయాలు ఎల్లప్పుడూ దేవుని దగ్గర్నుండి వస్తాయి.
PRO 17:1 ఇంట్లో ప్రతి ఒక్కరూ వాదులాడుతూ ఆ ఇంటినిండా భోజనం ఉండటంకంటె, శాంతి కలిగి భోంచేయటానికి ఒక ఎండిపోయన రొట్టెముక్క ఉంటే చాలు.
PRO 17:2 యజమాని యొక్క సోమరిపోతు కుమారుని మీద తెలివిగల సేవకుడు ఆధిపత్యం సంపాదిస్తాడు. తెలివిగల ఆ సేవకుడు అన్నదమ్ములతో పాటు పిత్రార్జితము పంచుకొంటాడు.
PRO 17:3 బంగారం, వెండి శుద్ధి చేయబడేందుకు అగ్నిలో వేయబడతాయి. అయితే మనుష్యుల హృదయాలను పవిత్రం చేసేవాడు యెహోవా.
PRO 17:4 దుర్మార్గులు ఇతరులు చెప్పే దుర్మార్గుపు సంగతులు వింటారు. అబద్ధాలు చెప్పేవారు కూడా అబద్ధాలు వింటారు.
PRO 17:5 కొంతమంది పేదవాళ్లను హేళన చేస్తారు. సమస్యలు ఉన్నవాళ్లను చూచి వారు ఎగతాళి చేస్తారు. వారిని సృష్టించిన దేవుణ్ణి వారు గౌరవించరు అని ఇది సూచిస్తుంది. ఈ దుర్మార్గులు శిక్షించబడుతారు.
PRO 17:6 మనుమలు మనుమరాళ్లు ముసలివాళ్లను సంతోషపెడ్తారు. మరియు పిల్లలు వారి తల్లిదండ్రులను గూర్చి అతిశయిస్తారు.
PRO 17:7 ఒక బుద్ధిహీనుడు అధికంగా మాట్లాడటం జ్ఞానముగల పనికాదు. అదే విధంగా ఒక అధికారి అబద్ధాలు చెప్పటం జ్ఞానముగల పనికాదు.
PRO 17:8 లంచం కళ్లను మెరిపించే ఒక ప్రకాశవంతమైన వెలగల రాయిలాంటిది, అది ఇచ్చేవారి మనస్సును మారుస్తుంది. ఎక్కడికి వెళ్లినా అదిపని చేస్తుంది అనుకొంటారు.
PRO 17:9 నీ విషయంలో తప్పు చేసినవాణ్ణి నీవు క్షమిస్తే, మీరు స్నేహితులుగా ఉంటారు. కానీ అతడు చేసిన తప్పును నీవు ఇంకా జ్ఞాపకం చేసికొంటూనే ఉంటే, అది మీ స్నేహానికి హాని చేస్తుంది.
PRO 17:10 తెలివిగలవాడు తాను చేసే తప్పుల మూలంగా నేర్చుకొంటాడు. కానీ బుద్ధిహీనుడు నూరు పాఠాల తర్వాత కూడా ఏమీ నేర్చుకోడు.
PRO 17:11 దుర్మార్గుడు తప్పు మాత్రమే చేయాలని కోరుతాడు. అంతంలో అతణ్ణి శిక్షించేందుకు దేవుడు ఒక దూతను పంపిస్తాడు.
PRO 17:12 ఒక తల్లి ఎలుగుబంటి, దాని పిల్లలు ఎత్తుకొనిపోబడి, కోపంగా ఉన్నప్పుడు దాన్ని కలుసుకోవటం చాలా ప్రమాదకరం. కానీ తెలివి తక్కువ పనులు చేయటంలో నిమగ్నం అయిపోయి ఉన్న బుద్ధిహీనుణ్ణి కలుసుకోవటంకంటే అది మేలు.
PRO 17:13 నీకు మంచి పనులు చేసేవారికి నీవు చెడు పనులు చేయకు. నీవు గనుక చేస్తే, మిగిలిన నీ జీవితం అంతా నీకు కష్టాలే ఉంటాయి.
PRO 17:14 నీవు వాదం మొదలు పెడ్తే అది ఆనకట్టకు గండి కొట్టినట్టే ఉంటుంది. అందుచేత వాదం అలా అలా పెద్దది కాక ముందే దాన్ని నిలిపివేయి.
PRO 17:15 ఏ తప్పూ చేయని వాణ్ణి శిక్షించటం, దోషిని క్షమించటం ఇవి రెండూ యెహోవాకు అసహ్యం.
PRO 17:16 బుద్ధిహీనునికి డబ్బు ఉంటే అది వ్యర్థం అవుతుంది. ఎందుకంటే జ్ఞాని అయ్యేందుకు ఆ డబ్బును బుద్ధిహీనుడు ఉపయోగించడు.
PRO 17:17 స్నేహితుడు అన్ని వేళలా ప్రేమిస్తాడు. నిజమైన సోదరుడు ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో కూడా నిన్ను బలపరుస్తాడు.
PRO 17:18 మరొకని అప్పులకు బాధ్యత వహిస్తానని బుద్ధిహీనుడు మాత్రమే వాగ్దానం చేస్తాడు.
PRO 17:19 జగడాల్లో ఆనందించేవాడు పాపంలోనూ ఆనందిస్తాడు. నిన్ను గూర్చి నీవు అతిశయిస్తే, నీవు కష్టాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది.
PRO 17:20 దుర్మార్గునికి లాభం ఉండదు. అబద్ధాలు చెప్పే వాడికి కష్టాలు ఉంటాయి.
PRO 17:21 తెలివితక్కువ కుమారుడున్నా తండ్రికి విచారం. బుద్ధిహీనుని తండ్రికి సంతోషం ఉండదు.
PRO 17:22 సంతోషం ఒక మంచి మందులాంటిది. కానీ దు:ఖం ఒక రోగంలాంటిది.
PRO 17:23 దుర్మార్గుడు మోసం చేయటానికి రహస్యంగా డబ్బు తీసికొంటాడు.
PRO 17:24 జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన దాన్ని చేసేందుకే తలుస్తూ ఉంటాడు. కానీ బుద్ధిహీనుడు ఎంతసేపూ అందనివాటి కోసం కలగంటూ ఉంటాడు.
PRO 17:25 తెలివి తక్కువ కుమారుడు తన తండ్రికి దు:ఖం కలిగిస్తాడు. మరియు తెలివి తక్కువ కుమారుడు తనకు జన్మ నిచ్చిన తల్లికి విచారం కలిగిస్తాడు.
PRO 17:26 ఏ తప్పు చేయని వానిని శిక్షించటం తప్పు. నాయకులు నిజాయితీగా ఉన్నప్పుడు వారిని శిక్షించటం తప్పు.
PRO 17:27 జ్ఞానముగలవాడు మాటల్ని జాగ్రత్తగా ప్రయోగిస్తాడు. జ్ఞానముగలవాడు త్వరగా కోపగించు కోడు.
PRO 17:28 బుద్ధిహీనుడు కూడా నేమ్మదిగా ఉన్నప్పుడు జ్ఞానిలా కనిపిస్తాడు. అతడు ఏమీ చెప్పకపోతే జ్ఞానము గలవాడు అని ప్రజలు అనుకొంటారు.
PRO 18:1 ఇతరులు అంటే గిట్టనివాడు తాను చేసే వాటిలో స్వార్థపరుడుగా ఉంటాడు. ప్రజలు మంచి సలహాను ఇచ్చినప్పుడు అతడు కోపగించు కుంటాడు
PRO 18:2 బుద్ధిహీనుడు గ్రహించటానికి ఇష్టపడడు. ఆ వ్యక్తి ఎంతసేపూ తన స్వంత ఆలోచనలే చెప్పాలనుకొంటాడు.
PRO 18:3 ఎక్కడ పాపం ఉంటుందో, అక్కడ అవమానం ఉంటుంది. ఎక్కడ అవమానం, ఉంటుందో అక్కడ ఘనత ఉండదు.
PRO 18:4 ఒక వ్యక్తి చెప్పే విషయాలు జ్ఞానముగలవిగా ఉండవచ్చు. ఆ మాటలు లోతైన మహా సముద్రంలా లేక ప్రవహిస్తున్న ఏరులా ఉండవచ్చును.
PRO 18:5 ఒకడు నేరస్థుడైతే వానికి సహాయం చేయవద్దు.అతడు తప్పు ఏమీ చేయకపోతే అతని యెడల న్యాయంగా ఉండు.
PRO 18:6 బుద్ధిహీనుడు తాను చేప్పే మాటలవల్ల తనకు తానే కష్టం కలిగించుకొంటాడు. అతని మాటల వలన వివాదం మొదలు కావచ్చును.
PRO 18:7 బుద్ధిహీనుడు మాట్లాడినప్పుడు అతడు తనను తానే నాశనం చేసుకొంటాడు. అతని స్వంత మాటలే అతన్ని పట్టేస్తాయి.
PRO 18:8 మనుష్యులకు ఎంతసేపూ ముచ్చట్లు వినటం ఇష్టం. ఆ ముచ్చట్లు పొట్టలోనికి పోతోన్న మంచి భోజనంలా ఉంటాయి.
PRO 18:9 బద్దకస్థుడు నాశనం చేసే వాని అంతటి చెడ్డవాడు.
PRO 18:10 యెహోవా పేరులో ఎంతో బలం ఉంది. అది బలమైన ఒక దుర్గంలాంటిది. మంచివాళ్లు ఆ దుర్గం దగ్గరకు పరుగెత్తి వెళ్లి, క్షేమంగా ఉంటారు.
PRO 18:11 ధనికులు వారి ఐశ్వర్యం వారిని కాపాడుతుంది అనుకొంటారు. అది ఒక బలమైన కోటలా ఉంది అని వారు తలుస్తారు.
PRO 18:12 ఒక దీనుడు గౌరవించబడతాడు. కానీ గర్విష్ఠుడు పతనం అవుతాడు.
PRO 18:13 ఒకడు పూర్తిగా వినక ముందే జవాబిస్తే అతడు ఇబ్బంది పడిపోయి, తాను తెలివితక్కువ వాడిని అని చూపించుకొంటాడు.
PRO 18:14 ఒక మనిషి వ్యాధితో ఉన్నప్పుడు అతని మనస్సు అతణ్ణి బ్రతికించి ఉంచగలదు. కానీ ఆ మనిషి అంతా పోయింది అనుకొంటే అప్పుడు ఆశ అంతా పదలు కొన్నట్టే!
PRO 18:15 జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని అనుకుంటాడు. మరింత జ్ఞానము కోసం అతడు జాగ్రత్తగా వింటాడు.
PRO 18:16 ఒక ప్రముఖ వ్యక్తిని నీవు కలుసుకోవాలి అని అంటే అతనికి ఒక కానుక ఇవ్వాలి. అప్పుడు నీవు అతనిని తేలికగా కలుసుకోగలవు.
PRO 18:17 ఇంకో మనిషి వచ్చి ప్రశ్నించే అంత వరకు మొదలు మాట్లాడిన వానిది సరిగ్గా ఉన్నట్టే కనిపిస్తుంది.
PRO 18:18 ఇద్దరు శక్తిగల మనుష్యులు వాదిస్తోంటే వారి వాదాన్ని తీర్మానించటానికి చీట్లు వేయటమే శ్రేష్ఠమైన పద్ధతి.
PRO 18:19 నీ స్నేహితునికి నీవు సహాయం చేస్తే అతడు ఒక బలమైన పట్టణపు గోడలా నిన్ను కాపాడుతాడు. వివాదాలు కోట గుమ్మాల అడ్డగడియవలె ప్రజలను వేరుపరుస్తాయి.
PRO 18:20 నీవు చెప్పే విషయాలు నీ జీవితం మీద ఏదో విధంగా పనిచేస్తాయి. తన నోటి ఫలముచేత ఒక మనిషి నింపబడుతాడు.
PRO 18:21 జీవం, మరణం, తెచ్చే మాటలు నాలుక మాట్లాడ గలదు. ప్రజలు మాట్లాడటం ఇష్టపడేవారు. అది ఏమి తెచ్చునో దాన్ని తీసుకొనుటకు సిద్దముగా ఉండ వలయును.
PRO 18:22 నీకు భార్య దొరికినట్లయితే నీవు మేలు పొంది నట్టే. నీ విషయమై యెహోవాకు సంతోషం.
PRO 18:23 పేదవాడు సహాయము కొరకు అడుక్కుంటాడు. కాని ధనికుడు కఠినముగా సమాధానము చెప్పవచ్చు.
PRO 18:24 ఒక మనిషికి స్నేహితులు చాలా మంది ఉంటే అది అతనిని పాడు చేయవచ్చును. కాని ఒక సోదరుని కంటే ఒక మంచి స్నేహితుడు మేలు.
PRO 19:1 అబద్ధాలు చెప్పి, మోసం చేసే బుద్ధిహీనునిగా ఉండుటకంటే, నిజాయితీగల పేదవానిగా ఉండుట మేలు.
PRO 19:2 దేనిగూర్చిగాని ఉద్వేగ పడిపోవటం మాత్రం చాలదు. నీవు చేస్తేంది ఏమిటో కూడా నీకు తెలిసి ఉండాలి. నీవు తొందరపడి ఏదీ చేయకూడదు. లేకపోతే నీవు తప్పు చేసేస్తావు.
PRO 19:3 ఒక మనిషి యొక్క బుద్ధిహీనత అతని జీవితాన్ని పాడు చేస్తుంది. కానీ అతడు యెహోవాను నిందిస్తాడు.
PRO 19:4 ఒకడు ధనవంతుడైతే అతని ఐశ్వర్యం అతనికి అనేకమంది మిత్రులను తెచ్చి పెడ్తుంది. కానీ ఒకడు పేదవాడైతే అతని స్నేహితులంతా అతనిని విడిచి పెట్టేస్తారు.
PRO 19:5 మరొకనికి విరోధంగా అబద్ధం చెప్పేవాడు శిక్షించబడుతాడు. అబద్ధాలు చెప్పేవాడు క్షేమంగా ఉండడు.
PRO 19:6 అధికారులతో అనేకమంది స్నేహంగా ఉండాలని కోరుకొంటారు, కానుకలు ఇచ్చే వానితో ప్రతి ఒక్కరూ స్నేహంగా ఉండాలని కోరుకొంటారు.
PRO 19:7 ఒక మనిషి పేదవాడైతే, అతని కుటుంబం కూడా అతనికి విరోధంగా ఉంటుంది. అతని స్నేహితులంతా అతని దగ్గరనుండి వెళ్లిపోతారు. ఆ పేదవాడు సహాయం కోసం వారిని భిక్షం అడగవచ్చు. కానీ వారు అతని దగ్గరకు కూడా వెళ్లరు.
PRO 19:8 తెలివిని సంపాదించుకొనుటకు ప్రయత్నించే మనిషి తనను తాను ప్రేమిస్తున్నట్టు సూచిస్తాడు. జ్ఞానమును ప్రేమించేవాడు లాభం పొందుతాడు.
PRO 19:9 అబద్ధాలు చెప్పేవాడు శిక్షించబడతాడు. అబద్ధాలు చెబుతూనే ఉండేవాడు నాశనం చేయబడతాడు.
PRO 19:10 బుద్ధిహీనుడు ధనవంతునిగా ఉండకూడదు. అది రాజకుమారుల మీద బానిస పరిపాలన చేసినట్టుగా ఉంటుంది.
PRO 19:11 ఒక మనిషి జ్ఞానము గలవాడైతే, ఆ జ్ఞానము అతనికి సహనాన్ని ఇస్తుంది. అతని యెడల తప్పు చేసిన వారిని అతడు క్షమించటం అతనికి ఘనతగా ఉంటుంది.
PRO 19:12 ఒక రాజు కోపంగా ఉన్నప్పుడు అది సింహగర్జనలా ఉంటుంది. కాని అతడు నీతో సంతోషంగా ఉంటే అది మృదువైన వర్షంలా ఉంటుంది.
PRO 19:13 తెలివి తక్కువ కుమారుడు తన తండ్రిని నాశనం చేయగలడు. వాదులాడే భార్య ఎడతెగక కారే నీటి చుక్కల మాదిరి విసుగు కలిగించేదిగా ఉంటుంది.
PRO 19:14 మనుష్యులు ఇండ్లు, ధనం వారి తలిదండ్రులనుండి పొందుతారు. అయితే మంచి భార్య యెహోవా నుండి దొరికే వరం.
PRO 19:15 సోమరివానికి నిద్ర చాలా ఎక్కువ వస్తుంది. కాని అతడు చాలా ఆకలిగా కూడా ఉంటాడు.
PRO 19:16 దైవాజ్ఞకు విధేయునిగా ఉండేవాడు తన ఆత్మను క్షేమంగా ఉంచుకొంటాడు. కాని దైవాజ్ఞను వినుటకు నిరాకరించేవాడు మరణిస్తాడు.
PRO 19:17 పేద ప్రజలకు డబ్బులిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అతడు చేసే పనుల కోసం యెహోవా అతనికి బహుమానం ఇస్తాడు.
PRO 19:18 నీ కుమారునికి బోధించి, వాడు తప్పు చేసినప్పుడు వానిని శిక్షించు. అదొక్కటే ఆశ. అలా చేయటానికి తిరస్కరిస్తే తనను తానే నాశనం చేసుకొనుటకు నీవు అతనికి సహాయం చేస్తున్నావు.
PRO 19:19 ఒకడు తేలికగా కోపం తెచ్చుకొంటే అతడు దాని విలువ చెల్లించాలి. అతడు కష్టంలో నుండి బయట పడుటకు నీవు అతనికి సహాయం చేస్తే అతడు తిరిగి నీకూ అలానే చేస్తాడు.
PRO 19:20 సలహా విని నేర్చుకో. అప్పుడు నీవు జ్ఞానముగలవాడవు అవుతావు.
PRO 19:21 మనుష్యులు ఎన్నో పథకాలు వేస్తారు. కాని యెహోవా కోరేవి మాత్రమే జరుగుతాయి.
PRO 19:22 నిజాయితీ, మరియు విశ్వసనీయత మనిషిలో కోరదగ్గవి. విశ్వసనీయత కోల్పోవడం కంటే బీదవాడుగా ఉండటం మేలు.
PRO 19:23 యెహోవా యెడల గౌరవం నిజమైన జీవానికి నడిపిస్తుంది. అప్పుడు మనిషికి శాంతి ఉంటుంది. కష్టంలో క్షేమంగా ఉంటాడు.
PRO 19:24 సోమరి తనను పోషించుకొనేందుకు తాను చేయాల్సిన పనులు కూడ చేయడు. తన పళ్లెంలోని భోజనం తన నోటి వద్దకు ఎత్తుకోటానికి కూడా అతనికి బద్ధకమే.
PRO 19:25 దేనికీ గౌరవం చూపనివారు శిక్షించబడాలి. అప్పుడు బుద్ధిహీనులు ఒక పాఠం నేర్చుకొంటారు. జ్ఞానముగల మనిషి విమర్శించ బడినప్పుడు నేర్చుకొంటాడు.
PRO 19:26 ఒక వ్యక్తి తన తండ్రి దగ్గర దొంగతనం చేసి తన తల్లిని బలవంతంగా వెళ్లగొడితే, అతడు చాలా దుర్మార్గుడు. అతడు తనకు తానే సిగ్గు, అవమానం తెచ్చుకొంటాడు.
PRO 19:27 నేర్చుకొనేందుకు నీవు నిరాకరిస్తే, అప్పటికే నీకు తెలిసిన విషయాలను త్వరలోనే నీవు మరచిపోతావు.
PRO 19:28 సాక్షి నమ్మకంగా లేకపోతే అప్పుడు తీర్పు న్యాయంగా ఉండదు. దుర్మార్గులు చెప్పే విషయాలు మరింత దుర్మార్గం తెచ్చి పెడతాయి.
PRO 19:29 ఇతరులకంటే తానే మంచి వాడిని అనుకొనే మనిషి శిక్షించబడతాడు. బుద్ధిహీనుడు తనకోసం దాచబడిన శిక్షను పొందుతాడు.
PRO 20:1 ద్రాక్షారసం నిన్ను ధైర్యవంతునిగా చేస్తుంది. మద్యము కొట్లాటలు పుట్టిస్తుంది. విపరీతమైన తాగుబోతు బుద్ధిహీనుడు.
PRO 20:2 ఒక రాజు కోపం సింహగర్జనలా ఉంటుంది. నీవు రాజుకు కోపం పుట్టిస్తే నీ ప్రాణం పోగొట్టుకుంటావు.
PRO 20:3 ఏ బుద్ధిహీనుడైనా ఒక వివాదం మొదలు పెట్టగలడు. కనుక వివాదాలకు దూరంగా ఉండే మనిషిని గౌరవించాల్సిందే.
PRO 20:4 సోమరి మనిషికి విత్తనాలు చల్లటానికి కూడా బద్ధకమే. అందుచేత కోత సమయంలో అతడు భోజనం కోసం చూస్తాడు, కాని ఏమీ దొరకదు.
PRO 20:5 ఒక మనిషి ఆలోచనలను నీవు చూడలేవు. అవి లోతైన నీళ్లలాంటివి. అయితే జ్ఞానముగలవాడు, ఒకరు ఏమి తలస్తున్నారో గ్రహించగలడు.
PRO 20:6 చాలామంది మనుష్యులు నమ్మకంగా ఉన్నామని, నిండు ప్రేమతో ఉన్నామని చెబుతారు, కాని నిజంగా అలా ఉన్నవారిని కనుగొనడం చాలా కష్టం.
PRO 20:7 ఒక మంచి మనిషి మంచి జీవితం జీవిస్తాడు. మరియు అతని పిల్లలు ఆశీర్వదించబడతారు.
PRO 20:8 రాజు కూర్చొని ప్రజలకు తీర్పు చెప్పేటప్పుడు దుర్మార్గాన్ని ఆయన స్వంత కళ్లతో చూడగలడు.
PRO 20:9 ఒక మనిషి ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన దానినే చేస్తానని నిజంగా చెప్పగలడా? తనలో పాపం లేదని ఎవరైనా నిజంగా చెప్పగలరా? లేదు!
PRO 20:10 అన్యాయపు తూనిక రాళ్లు, కొలతలు ఉపయోగించి ఇతరులను మోసం చేసే వాళ్లంటే యెహోవాకు అసహ్యం.
PRO 20:11 ఒక బిడ్డ తాను చేసే పనుల మూలంగా తన మంచి లేక చెడు చూపిస్తుంది. ఆ బిడ్డను నీవు గమనించి నిజాయితీ, మంచితనం ఆ బిడ్డకు ఉన్నాయో లేదో నీవు తెలిసికోవచ్చు.
PRO 20:12 మనకు చూసేందుకు కళ్లు, వినేందుకు చెవులు ఉన్నాయి. వాటిని మన కోసం యెహోవా చేశాడు!
PRO 20:13 నీవు నిద్రను ప్రేమిస్తే, నీవు నిరుపేదవు అవుతావు. పనిచేసేందుకు నీ సమయాన్ని ఉపయోగించు. అప్పుడు నీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది.
PRO 20:14 “నీవద్ద ఏదైనా కొనే మనిషి, బాగుండలేదు! చాలా ఖరీదు ఉంది!” అని చెబుతాడు. తరువాత అతడు వెళ్లిపోయి, తాను ఒక మంచి వ్యవహారం చేసినట్టుగా ఇతరులతో చెప్పుకొంటాడు.
PRO 20:15 జ్ఞానముగల విషయాలు చెప్పటం బంగారం కంటే, ముత్యాలకంటే చాలా ఎక్కువ విలువగలది.
PRO 20:16 మరో మనిషి అప్పులకు నీవు బాధ్యత వహిస్తే నీవు నీ చొక్కా పోగొట్టుకొంటావు.
PRO 20:17 దగాచేసి సంపాదించిన ఆహారము ఒక మనుష్యునికి తీపిగా వుంటుంది. కాని తర్వాత అతని నోరు మట్టితో నిండుతుంది. మోసం చేసి నీవు ఏదైనా సంపాదిస్తే అది మంచిదానిలా కనబడవచ్చు. కాని చివరికి దాని విలువ శూన్యం.
PRO 20:18 నీవు పథకాలు వేయకముందు మంచి సలహా తీసికో. నీవు గనుక ఒక యుద్ధం ప్రారంభిస్తూంటే నిన్ను నడిపించేందుకు మంచి మనుష్యులను చూసుకో.
PRO 20:19 ఇతరులను గూర్చి చెప్పుడు మాటలు చెప్పే మనిషి నమ్మదగిన వాడు కాడు. కనుక అధిక ప్రసంగం చేసే మనిషితో స్నేహంగా ఉండవద్దు.
PRO 20:20 ఒక వ్యక్తి తన తల్లికిగాని తండ్రికిగాని విరోధముగా మాట్లాడితే, అప్పుడు ఆ వ్యక్తి చీకటిగా మారిపోతున్న వెలుగులా ఉంటాడు.
PRO 20:21 నీ ఐశ్వర్యాన్ని నీవు తేలికగా సంపాదించి ఉంటే, అది నీకు ఎక్కువ విలువగలది కాదు.
PRO 20:22 ఎవరైనా నీకు విరోధంగా ఏదైనా చేస్తే, నీ అంతట నీవే అతన్ని శిక్షించటానికి ప్రయత్నించకు. యెహోవా కోసం వేచి ఉండు. అంతంలో ఆయన నీకే విజయం ఇస్తాడు.
PRO 20:23 అన్యాయపు త్రాసులు, తూనికలు ఉపయోగించి ఇతరులను మోసం చేసేవాళ్లంటే యెహోవాకు అసహ్యం. అవి ఆయన్ని సంతోషవరచవు.
PRO 20:24 ప్రతి మనిషికీ ఏమి జరుగుతుంది. అనే విషయం నిర్ణయించేది యెహోవా, అలాంటప్పుడు ఎవరైనా సరే వారి జీవితంలో ఏమి జరుగుతుందో ఎలా గ్రహించగలరు?
PRO 20:25 దేవునికి నీవు ఏదైనా ఇస్తానని వాగ్దానం చేయక ముందే జాగ్రత్తగా ఆలోచించుకో, తర్వాత అలాంటి వాగ్దానం చేసి ఉండకపోతే మంచిది అనిపించవచ్చు.
PRO 20:26 ఏ మనుష్యులు దుర్మార్గులో జ్ఞానముగల రాజు నిర్ణయిస్తాడు. మరియు ఆ ప్రజలను ఆ రాజు శిక్షిస్తాడు.
PRO 20:27 ఒక మనిషి అంతరంగంలో ఉండే విషయాలు తెలిసికొనే సమర్ధుడు యెహోవా.
PRO 20:28 ఒక రాజు న్యాయంగా, నిజాయితీగా ఉంటే, అతడు తన అధికారాన్ని ఉంచుకోగలుగుతాడు. ప్రజలు అతన్ని ప్రేమిస్తే, అతడు తన పరిపాలన కొనసాగిస్తాడు.
PRO 20:29 ఒక యువకుని బలాన్ని బట్టి మనం అతణ్ణి మెచ్చుకొంటాం. కానీ నెరసిన తలను చూచి ఒక వృద్ధుని మనం గౌరవిస్తాం అతడు పూర్ణ జీవితం జీవించినట్టు అది సూచిస్తుంది.
PRO 20:30 మనం శిక్షించబడితే, మనం తప్పు చేయటం మానివేస్తాం. నొప్పి ఒక మనిషిని మార్చగలదు.
PRO 21:1 (రైతులు తమ పొలాలకు నీళ్లు పెట్టటానికి చిన్న చిన్న కాలువలు తవ్వుతారు. ఒక కాలువను మూసి ఇంకొక కాలువకు నీళ్లు మళ్లిస్తారు) నీరు ప్రవహించు కాలువలాగ రాజు హృదయము యెహోవా చేతిలో వున్నది. ఆయన తన ఇష్టము వచ్చిన వైపుకు తిప్పుతాడు.
PRO 21:2 ఒక మనిషి తాను చేసేది అంతా సరైనదే అను కొంటాడు. అయితే మనుష్యులు చేసే వాటికి అసలైన కారణాలను యెహోవా చెబుతాడు.
PRO 21:3 సరైనవి, న్యాయమైనవి చేయుము. బలులకంటె వాటిని యెహోవా ఎక్కువ ప్రేమిస్తాడు.
PRO 21:4 ఇతరులు పనికిమాలిన వాళ్లు అన్నట్టు కళ్లతోను, హృదయ నేత్రాలతోను చూచేవారు పాపులు. ఇతరుల కంటె మేము మంచివాళ్లం అని నమ్మే హృదయం పాప భూయిష్టం.
PRO 21:5 జాగ్రత్తగల ఏర్పాటులు లాభం తెచ్చిపెడ్తాయి. కానీ నీవు జాగ్రత్త లేకుండా, మరీ తొందరపడి పనులు చేస్తే, నీవు దరిద్రుడివి అవుతావు.
PRO 21:6 ఐశ్వర్యవంతుడివి కావాలని నీవు మోసం చేస్తే, నీ ఐశ్వర్యం త్వరలోనే పోతుంది. మరియు నీ ఐశ్వర్యాలు నీ మరణానికి దారి తీస్తాయి.
PRO 21:7 దుర్మార్గులు చేసే దుష్ట కార్యాలు వారినే నాశనం చేస్తాయి. సరైనది చేయటానికి వారు నిరాకరిస్తారు.
PRO 21:8 దుర్మార్గులు ఎల్లప్పుడూ ఇతరులను మోసం చేయాలని ప్రయత్నిస్తారు. కానీ మంచి వాళ్లు నిజాయితీగా న్యాయంగా ఉంటారు.
PRO 21:9 వివాదం పెట్టాలని కోరుకునే భార్యతో కలసి ఒక ఇంటిలో ఉండటం కంటే, ఇంటి కప్పు మీద నివసించటం మేలు.
PRO 21:10 దుర్మార్గులు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువ దుర్మార్గం చేయాలని కోరుతూంటారు. ఆ మనుష్యులు వారి చుట్టూరా ఉండే వారి మీద ఎలాంటి దయ చూపించరు.
PRO 21:11 ఒక వ్యక్తి ఇతరులకంటే తానే మంచివాడిని అని తలచినప్పటికి, అతడు శిక్షించబడితే ప్రతి ఒక్కరూ ఒక పాఠం నేర్చుకొంటాడు. జరిగే సంగతుల మూలంగా జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ నేర్చుకొంటాడు. ఆ వ్యక్తి ఇంకా, ఇంకా ఎక్కువ తెలివి సంపాదిస్తాడు.
PRO 21:12 దేవుడు మంచివాడు. దేవునికి దుర్మార్గులు ఎవరో తెలుసు, ఆయన వారిని శిక్షిస్తాడు.
PRO 21:13 పేద ప్రజలకు సహాయం చేసేందుకు ఒక వ్యక్తి తృణీకరిస్తే తర్వత అతనికి అవసరమైనప్పుడు ఏ సహాయమూ దొరకదు.
PRO 21:14 ఒక వ్యక్తికి నీ మీద కోపం ఉంటే అతనికి రహస్యంగా ఒక కానుక ఇవ్వు. రహస్యంగా ఇచ్చిన కానుక గొప్ప కోపాన్ని వారించగలదు.
PRO 21:15 న్యాయమైన తీర్పు మంచి మనుష్యులను సంతోషింపజేస్తుంది. కాని దుర్మార్గులను అది భయపెడుతుంది.
PRO 21:16 ఒక మనిషి జ్ఞానమార్గాన్ని విసర్జిస్తే అతడు నాశనానికే పోతున్నాడు.
PRO 21:17 ఒక మనిషికి సరదా మాత్రమే అతి ముఖ్యం అయితే ఆ మనిషి దరిద్రుడు అవుతాడు. ఒకవేళ అతడు ద్రాక్షారస, భోజన ప్రియుడు అయితే అతడు ఎన్నటికీ ధనికుడు కాలేడు.
PRO 21:18 మంచి మనుష్యులకు దుర్మార్గులు చేసే దుర్మార్గపు పనులన్నిటికీ తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నిజాయితీ లేని మనుష్యులు నిజాయితీగల వాళ్లకు చేసే వాటన్నింటికీ శిక్ష చెల్లించాల్సి ఉంటుంది.
PRO 21:19 వివాదం అంటే మక్కువ పడే కోపిష్టి భార్యతో ఉండటంకంటే ఎడారిలో నివసించటం మేలు.
PRO 21:20 జ్ఞానము గలవాడు తనకు అవసరమైన వాటిని భద్రం చేసికొంటాడు. కాని తెలివి తక్కువవాడు దొరికిన దాన్ని దొరికినంత త్వరగానే వాడేస్తాడు.
PRO 21:21 ఎల్లప్పుడూ ప్రేమ, దయ చూపించాలని ప్రయత్నించే మనిషి మంచి జీవితం, ఐశ్వర్యం, ఘనత కలిగి ఉంటాడు.
PRO 21:22 జ్ఞానముగలవాడు దాదాపు ఏదైనా చేయగలడు. బలంగల మనుష్యులు కాపలా కాస్తున్న పట్టణంపై అతడు దాడి చేయగలడు. వారిని కాపాడుతాయని సమ్ముకొన్న గోడలను అతడు నాశనం చేయగలడు.
PRO 21:23 ఒక మనిషి అతడు చేప్పే విషయాలలో జాగ్రత్తగా ఉంటే అతడు కష్టం నుండి తనను తాను తప్పించుకోగలడు.
PRO 21:24 ఇతరులకంటే తానే మంచివాడిని అనుకొనే వాడు గర్విష్ఠి. తాను చేసే పనుల ద్వారా అతడు తను దుర్మార్గుడని చూపిస్తాడు.
PRO 21:25 సోమరి తను ఇంకా ఇంకా కావాలని కోరినప్పుడు తనను తానే నాశనం చేసికొంటాడు. అతడు వాటికోసం పనిచేసేందుకు నిరాకరిస్తాడు గనుక, తనను తానే నాశనం చేసికొంటాడు. కాని మంచి మనిషికి పుష్కలంగా ఉంటుంది గనుక అతడు యివ్వగలడు.
PRO 21:27 దుర్మార్గులు బలులు అర్పించినప్పుడు, ముఖ్యంగా ఆ దుర్మార్గులు యెహోవా దగ్గర నుండి ఏదైనా సంపాదించాలని ప్రయత్నించినప్పుడు ఆయన సంతోషించడు.
PRO 21:28 అబద్ధాలు చేప్పేవాడు నాశనం చేయబడతాడు. ఆయితే ఆ అబద్ధాలు వినే వ్యక్తి అతనితో పాటునాశనం చేయబడతాడు.
PRO 21:29 మంచివాడు తాను చేస్తున్నది సరైనది అని ఎల్లప్పుడూ తెలిసే ఉంటాడు. కాని దుర్మార్గుడు నటించాల్సి ఉంటుంది.
PRO 21:30 ఒక పథకానికి యెహోవా విరోధంగా ఉంటే దానిని విజయవంతం చేయగలిగినంత జ్ఞానముగలవాడు ఎవడూ లేడు.
PRO 21:31 మనుష్యులు గుర్రాలను, సమస్తాన్ని యుద్ధం కోసం సిద్ధం చేయవచ్చు, కాని యెహోవా వారికి విజయం ఇస్తేనే తప్పవారు జయించలేరు.
PRO 22:1 ఐశ్వర్యవంతునిగా ఉండుటకంటే గౌరవింపబడటం మేలు. బంగారం, వెండి కంటే మంచి పేరు ఎక్కువ ముఖ్యం.
PRO 22:2 ధనికులు, దరిద్రులు అంతా ఒక్కటే. వాళ్లందంనీ యెహోవాయే సృష్టించాడు.
PRO 22:3 జ్ఞానముగలవారు కష్టం రావటం చూచి దాని దారిలో నుండి తప్పుకొంటారు. కానీ తెలివి తక్కువ వాళ్లు తిన్నగా కష్టంలోనికి వెళ్లి, దాని మూలంగా శ్రమపడతారు.
PRO 22:4 యెహోవాను గౌరవించి దీనుడవుగా ఉండు. అప్పుడు నీకు ఐశ్వర్యం, ఘనత నిజజీవం ఉంటాయి.
PRO 22:5 దుర్మార్గులు అనేక కష్టాలవల్ల పట్టుబడతారు. అయితే తన ఆత్మ విషయం జాగ్రత్త గలవాడు కష్టాలకు దూరంగా ఉంటాడు.
PRO 22:6 ఒక బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే, జీవిచుటకు సరైన మార్గం నేర్చించు. అప్పుడు ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు కూడ ఆ మార్గంలోనే జీవించటానికి కొనసాగిస్తాడు.
PRO 22:7 పేదవాళ్లు ధనికులకు సేవకులు. అప్పు పుచ్చు కొనేవాడు, అప్పు ఇచ్చేవానికి సేవకుడు.
PRO 22:8 కష్టాలను విస్తరించే మనిషి కష్టాల పంటనే కోస్తాడు. ఆ మనిషి ఇతరులకు కలిగించిన కష్టాల మూలంగా చివరికి అతడు నాశనం చేయబడతాడు.
PRO 22:9 ధారాళంగా ఇచ్చేవాడు ఆశీర్వదించబడతాడు. అతడు తన ఆహారం పేదవారితో పంచుకొంటాడు. గనుక ఆశీర్వదించబడుతాడు.
PRO 22:10 ఒక వ్యక్తి యితరులకంటె తానే మంచివాడిని అని తలిస్తే, వానిని బలవంతంగా వెళ్లగొట్టండి. అతడు వెళ్లి పోయినప్పుడు అతనితోబాటు ఆ కష్టం కూడా వెళ్లిపోతుంది. అంతటితో వివాదాలు అంతరిస్తాయి.
PRO 22:11 పవిత్ర హృదయం, దయగల మాటలను నీవు ప్రేమిస్తే రాజు నీ స్నేహితుడు అవుతాడు.
PRO 22:12 యెహోవాను ఎరిగిన మనుష్యులను ఆయన కాపాడుతూ, భద్రంగా ఉంచుతాడు. కానీ ఆయనకు విరోధంగా ఉండే వారిని ఆయన నాశనం చేస్తాడు.
PRO 22:13 “నేను ఇప్పుడు పనికి వెళ్లలేను. బయట సింహాం ఉంది. అది నన్ను చంపేస్తుందేమో” అంటాడు సోమరివాడు.
PRO 22:14 వ్యభిచార పాపం ఒక లోతైన గొయ్యలాంటిది. ఆ గొయ్యలో పడే మనిషి అంటే యెహోవాకు చాలా కోపం వస్తుంది.
PRO 22:15 పిల్లలు తెలివి తక్కువ పనులు చేస్తారు. కానీ నీవు వారిని శిక్షిస్తే, వారు అలాంటి పనులు చేయకుండా ఉండటం నేర్చుకొంటారు.
PRO 22:16 నిన్ను నీవే ధనికుణ్ణి చేసుకొనేందుకుగాను, పేదవాళ్లను బాధించటం, ధనికులకు కానుకలు ఇవ్వటం ఇవి రెండూ నిన్ను దరిద్రునిగా చేస్తాయి.
PRO 22:17 నేను చెప్పే మాటలు విను. జ్ఞానులు చెప్పిన మాటలు నేను నీకు నేర్పిస్తాను. ఈ ఉపదేశాల ద్వారా నేర్చుకో.
PRO 22:18 వీటిని నీవు జ్ఞాపకం ఉంచుకోవటం నీకు మంచిది. ఒకవేళ నీ పెదవులు ఒప్పుకొనేందుకు అలవాటు పడితే అది నీకు సహాయంగా ఉంటుంది.
PRO 22:19 ఈ విషయాలు ఇప్పుడు నీకు నేను నేర్పిస్తాను. నీవు యెహోవాను సమ్ముకోవాలని నేను కోరుతున్నాను.
PRO 22:20 నీ కోసం నేను ముప్పయి సూక్తులు వ్రాశాను. ఇవి సలహాలు, జ్ఞానముగల మాటలూను.
PRO 22:21 ఈ మాటలు సత్యమైన ముఖ్య విషయాలను నీకు నేర్పిస్తాయి. అప్పుడు నిన్ను పంపినవానికి నీవు మంచి జవాబులు ఇవ్వగలవు.
PRO 22:22 పేదవారివద్ద నుండి దొంగిలించటం సులభం. కానీ అలా చేయవద్దు. న్యాయస్థానంలో పేదవాణ్ణి అణగ తొక్కవద్దు.
PRO 22:23 యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. ఆయన వారిని బలపరుస్తాడు, వారివద్ద నుండి తీసి కొన్నవి ఎవరినైనా సరే వారి వస్తువులను ఆయన తీసివేస్తాడు.
PRO 22:24 త్వరగా కోపపడే వానితో స్నేహంగా ఉండవద్దు. త్వరగా వెర్రి ఎక్కేవానికి దగ్గరగా పోవద్దు.
PRO 22:25 నీవు వెళ్తే, నీవు కూడ అతనిలా ఉండటం నేర్చుకొంటావేమో! అలా అయితే అతనికి ఉన్న చిక్కులే నీకూ ఉంటాయి.
PRO 22:26 మరో వ్యక్తి అప్పులకు నీదే బాధ్యత అని ప్రమాణం చేయవద్దు.
PRO 22:27 అతని అప్పు నీవు తీర్చలేక పోతే, అప్పుడు నీకు ఉన్నవన్నీ నీవు పోగొట్టుకొంటావు. నీవు పండుకొనే నీ పడకను నీవు ఎందుకు పోగొట్టుకోవాలి?
PRO 22:28 నీ పూర్వీకులు ఎప్పుడో గుర్తించిన ఆస్తి సరిహద్దు గీతను ఎప్పుడూ జరిపివేయవద్దు.
PRO 22:29 ఒక వ్యక్తి తన పనిలో నిపుణతగలవాడై ఉంటే. అతడు రాజుల సేవ చేయటానికి అర్హుడవుతాడు. ప్రముఖులు కాని వారి వద్ద అతడు పని చేయాల్సిన అవసరం ఉర డదు.
PRO 23:1 నీవు ఒక ప్రముఖునితో భోజనానికి కూర్చున్నప్పుడు, నీవు ఎవరితో ఉన్నావో జ్ఞాపకం ఉంచుకో.
PRO 23:2 నీకు చాలా ఆకలిగా ఉన్నాసరే, ఎప్పుడూ మరీ ఎక్కువ తినవద్దు.
PRO 23:3 అతడు వడ్డించే శ్రేష్ఠమైం భోజనం మరీ ఎక్కువ తినవద్దు. అది ఒక ఎత్తుకావచ్చు.
PRO 23:4 ధనవంతుడు కావాలనుకొని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీవు బుద్ధిమంతుడవైతే ఓర్పుతో ఉండు.
PRO 23:5 పక్షులు రెక్కలెలా విచ్చుకొని ఎగురుతాయో అదే విధంగా డబ్బు చాలా తొందరగా వెళ్లిపోతుంది.
PRO 23:6 స్వార్థపరునితో కలిసి భోజనం చేయవద్దు. అతనికి వచ్చిన ప్రత్యేక భోజన పదార్థాలకు దూరంగా ఉండు.
PRO 23:7 అతడు ఎంతసేపూ ఖర్చు గూర్చి ఆలోచించే రకం. “తినుము, తాగుము” అని అతడు నీతో చెప్పవచ్చు. కాని అతడు నిజంగా కోరుకునేది అదికాదు.
PRO 23:8 అతని భోజనం నీవు తింటే, నీవు రోగివి కావచ్చు. నీవు యిబ్బంది పడిపోతావు.
PRO 23:9 తెలివి తక్కువ వానికి నేర్పించెందుకు ప్రయత్నించకు. జ్ఞానముగల నీ మాటలను అతడు ఎగతాళి చేస్తాడు.
PRO 23:10 ఆస్తి పాత సరిహద్దు గీతను ఎన్నడూ జరపవద్దు. మరియు అనాధలకు చెందిన భూమిని ఎన్నడూ తీసికొనవద్దు.
PRO 23:11 యెహోవా నీకు విరోధంగా ఉంటాడు. యెహోవా శక్తిగలవాడు, అనాధలను ఆయన కాపాడుతాడు.
PRO 23:12 నీ ఉపదేశకుని మాటలు విని నీకు చేతనైనంత నేర్చుకో.
PRO 23:13 ఒక బిడ్డకు శిక్ష అవసరమైనప్పుడెల్లా శిక్షించు. వానిని దెబ్బలు కొట్టడం వానికేమీ బాధ కలిగించదు.
PRO 23:14 నీవు వానిని కొట్టినట్లయితే నీవు వాని జీవితం కాపాడవచ్చు.
PRO 23:15 నా కుమారుడా, నీవు జ్ఞానముగల వాడివైతే నాకెంతో సంతోషం.
PRO 23:16 నీవు సరైన సంగతులు చెబుతూ ఉంటే నేను విని నా హృదయంలో ఎంతో సంతోషిస్తాను.
PRO 23:17 దుర్మార్గులను చూచి అసూయపడకు. అయితే యెహోవాను గౌరవించేందుకు ఎల్లప్పుడూ నీవల్ల అయినంత గట్టిగా ప్రయత్నించు.
PRO 23:18 ఎల్లప్పుడూ ఆశ ఉంటుంది. ఆ ఆశ ఎన్నటికీ పోదు.
PRO 23:19 కనుక నా కుమారుడా ఆలకించి, జ్ఞానముగలవానిగా ఉండు. సరైన జీవితం జీవించేందుకు ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ఉండు.
PRO 23:20 ద్రాక్షారసం విపరీతంగా తాగుతూ, విపరీతంగా భోజనం చేసే వారితో స్నేహంగా ఉండవద్దు.
PRO 23:21 విపరీతంగా తాగి, విపరీతంగా తినే మనుష్యులు దరిద్రులు అవుతారు. తిని, తాగి నిద్రపోవటమే వాళ్లు చేసేది అంతాను. కనుక త్వరలోనే వారికి ఏమీ ఉండదు.
PRO 23:22 నీ తండ్రి నీతో చెప్పే విషయాలు విను. నీ తండ్రి లేకుండా నీవు ఎన్నడూ పుట్టి ఉండేవాడివి కావు. నీ తల్లి వృద్ధురాలైనప్పుడు కూడా ఆమెను గౌరవించు.
PRO 23:23 సత్యము, జ్ఞానము, అభ్యాసము, వివేకము, ఇవి డబ్బు చెల్లించదగినంత విలువగలవి. అవి అమ్మేందుకు మరీ విపరీతమైన విలువగలవి.
PRO 23:24 ఒక మంచి మనిషి యొక్క తండ్రి చాలా సంతోషంగా ఉంటాడు. ఒక మనిషికి జ్ఞానముగల బిడ్డ ఉంటే, ఆ బిడ్డ ఆనందం కలిగిస్తుంది.
PRO 23:25 అందుచేత నీ విషయంలో నీ తల్లిదండ్రులను సంతోషించనివ్వు. నీ తల్లిని ఆనందించనిమ్ము.
PRO 23:26 నా కుమారుడా, నేను చెప్పే దానిని జాగ్రత్తగా వినుము. నా జీవితం నీకు మాదిరిగా ఉంచుకో.
PRO 23:27 వేశ్యలు, చెడు స్త్రీలు ఒక ఉచ్చులాంటివారు. నీవు బయట పడలేనంత లోతైన బావిలాంటివారు.
PRO 23:28 ఒక చెడు స్త్రీ, ఒక దొంగలా నీ కోసం పొంచి ఉంటుంది.అనేక మందిని పాపులు అయ్యేటట్టుగా ఆమె చేస్తుంది.
PRO 23:29 ద్రాక్షారసం, ఘాటు పానీయాలు విపరీతంగా తాగే మనుష్యులకు అవి చాలా చెడు అవుతాయి. ఆ మనుష్యులకు చాలా కొట్లాటలు, వివాదాలు ఉంటాయి. వారి కళ్లు ఎర్రగా ఉండి వారు తూలిపోతూ, వాళ్లను వాళ్లే బాధ పెట్టుకుంటారు. వారు ఈ కష్టాలను తప్పించుకొని ఉండగలిగేవారే.
PRO 23:31 అందుచేత ద్రాక్షారసం విషయం జాగ్రత్తగా ఉండు. అది అందంగా, ఎర్రగా ఉంటుంది. పాత్రలో అది మెరుస్తుంది. నీవు దానిని తాగినప్పుడు బాగున్నట్టు అనిపిస్తుంది.
PRO 23:32 కాని అంతలో అది ఒక సర్పంలా కాటువేస్తుంది.
PRO 23:33 ద్రాక్షారసం నీవు వింత విషయాలను చూచేటట్టుగా చేస్తుంది. నీ మనస్సు గందరగోళం అవుతుంది.
PRO 23:34 నీవు పండుకొన్నప్పుడు నీవు ఉప్పొంగుతున్న సముద్రంమీద ఉన్నట్టుగా నీవు అనుకొంటావు. నీవు ఒక ఓడమీద పండుకొన్నట్టుగా నీకు అనిపిస్తుంది.
PRO 23:35 “వారు నన్ను కొట్టారు. కానీ నాకేమీ అనిపించలేదు. వారు నన్ను కొట్టురు. కాని అది నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు నేను లేవలేను. నేను మరోసారి తాగాలి” అని నీవు చెబుతావు.
PRO 24:1 దుర్మార్గులను చూచి అసూయపడవద్దు. వారితో వుండేందుకు నీ సమయం వ్యర్థం చేసుకోకు.
PRO 24:2 కీడు చేయాలని వారు వారి హృదయాల్లో పథకం వేస్తారు. వారు మాట్లాడేది అంతా కష్టం కలిగించాలని మాత్రమే.
PRO 24:3 మంచి గృహాలు జ్ఞానము, వివేకము మీద కట్టబడతాయి.
PRO 24:4 జ్ఞానంవల్ల గదులు అన్నీ ప్రశస్తమైన మరియు సంతోషకరమైన సంపదలతో నింప బడతాయి.
PRO 24:5 జ్ఞానము ఒక మనిషిని శక్తివంతం చేస్తుంది. తెలివి ఒక మనిషికి బలం ఇస్తుంది.
PRO 24:6 నీవు యుద్ధం ప్రారంభించక ముందు జాగ్రత్తగా పథకాలు వేయాలి. నీవు విజయం కావాలి అని అనుకొంటే నీకు మంచి సలహాదారులు చాలా మంది ఉండాలి.
PRO 24:7 బుద్ధిహీనులు జ్ఞానమును గ్రహించలేరు. మనుష్యులు ముఖ్యమైన విషయాలను చర్చిస్తున్నప్పుడు బుద్దిహీనులు ఏమీ చెప్పలేరు.
PRO 24:8 నీవు కష్టాలు కలిగించాలని ఎల్లప్పుడూ తలుస్తూంటే, నీవు కష్టాలు పెట్టే మనిషివి అని ప్రజలు తెలుసుకొంటారు. మరియు వారు నీ మాట వినరు.
PRO 24:9 బుద్ధిహీనుడు చేయాలని తలపెట్టే విషయాలు పాపం. ఇతరుల కంటే తానే మంచి వాడిని అనుకోనే మనిషిని ప్రజలు అసహ్యించుకొంటారు.
PRO 24:10 కష్ట సమయాలలో నీవు బలహీనంగా ఉంటే అప్పుడు నీవు నిజంగా బలహీనుడివే.
PRO 24:11 మనుష్యులు ఒక వ్యక్తిని చంపాలని ప్రయత్నిస్తూంటే నీవు వానిని రక్షించుటకు ప్రయత్నించాలి.
PRO 24:12 “ఇది నా పని కాదు” అని నీవు చెప్పకూడదు. యెహోవాకు అంతా తెలుసు. నీవు వాటిని ఎందుకు చేస్తావో ఆయనకు తెలుసు. యెహోవా నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు. నీవు చేసే పనులకు యెహోవా నీకు బహుమానం ఇస్తాడు.
PRO 24:13 నా కుమారుడా, తేనె తాగు. అది మంచిది. తేనెపట్టులోని తేనె తియ్యగా ఉంటుంది.
PRO 24:14 అదే విధంగా జ్ఞానము నీ ఆత్మకు మంచిది. నీకు జ్ఞానము ఉంటే, అప్పుడు నీకు ఆశ ఉంటుంది. నీ ఆశకు అంతం ఉండదు.
PRO 24:15 మంచిమనిషి దగ్గర దొంగతనం చేయాలని లేకవాని ఇల్లు తీసివేసుకోవాలని కోరుకొనే దొంగలా ఉండవద్దు.
PRO 24:16 ఒక మంచి వాడు ఏడుసార్లు పడిపోయినా సరే, అతడు ఎల్లప్పుడూ మరల నిలబడతాడు. కానీ దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టంచేత ఓడించబడతారు.
PRO 24:17 నీ శత్రువుకు కష్టాలు వచ్చినప్పుడు సంతోషపడకు. అతడు పడిపోయినప్పుడు సంతోషపడకు.
PRO 24:18 నీవు అలా చేస్తే, అది యెహోవా చూస్తాడు. నీ విషయంలో యెహోవా సంతోషించడు. అప్పుడు యెహోవా ఒకవేళ నీ శత్రువుకు సహాయం చేయవచ్చు.
PRO 24:19 దుర్మార్గులను నీకు చింత కలిగించనీయకు.దుర్మార్గుల విషయమై అసూయపడకు.
PRO 24:20 ఆ దుర్మార్గులకు ఆశ లేదు. వారి వెలుగు చీకటి అవుతుంది.
PRO 24:21 నా కుమారుడా, యెహోవాను మరియు రాజును గౌరవించు. వారికి విరోధంగా ఉండేవారితో చేరవద్దు.
PRO 24:22 ఎందుకంటే, అలాంటి వాళ్లు త్వరగా నాశనం చేయబడవచ్చు. దేవుడు, రాజుకూడ వారి శత్రువులకు ఎంత కష్టం కలిగించగలరో నీకు తెలియదు.
PRO 24:23 ఇవి జ్ఞానుల మాటలు: ఒక న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. ఒకడు తనకు తెలిసినవాడైనంత మాత్రాన ఆయన అతనిని బలపరచకూడదు.
PRO 24:24 ఒక నేరస్థుడు స్వేచ్చగా వెళ్లిపోవచ్చని గనుక న్యాయమూర్తి చెబితే, అప్పుడు ప్రజలు అతనికి విరోధంగా ఉంటారు. అతని గూర్చి దేశాలే చెడుగా చెప్పుకుంటాయి.
PRO 24:25 అయితే ఒక న్యాయమూర్తి ఒక నేరస్తుని శిక్షిస్తే, అప్పుడు ప్రజలంతా అతనితో కలిసి ఆనందిస్తారు.
PRO 24:26 నిజాయితీగల జవాబు ప్రజలందరికీ సంతోషం కలిగిస్తుంది అది పెదాలమీద ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది.
PRO 24:27 నీ పొలంలో నాట్లు వేయక ముందు నీ ఇల్లు కట్టుకోవద్దు. నీవు నివసించేందుకు ఒక గృహం కట్టు కొనకముందే, నీవు ఆహారం పండించటానికి సిద్ధంగా ఉన్నట్టు గట్టిగా తెలుసుకో.
PRO 24:28 గట్టి కారణం లేకుండా ఎవరికీ విరోధంగా మాట్లాడవద్దు. మరియు అబద్దాలు మాట్లాడకు,
PRO 24:29 “అతడు నాకు హాని చేశాడు, గనుక నేను అతనికి అలానే చేస్తాను. అతడు నాకు చేసిన వాటిని బట్టి నేను అతణ్ణి శిక్షిస్తాను” అని చెప్పవద్దు.
PRO 24:30 ఒక సోమరివాని పొలం పక్కగానే నేను నడిచాను. జ్ఞానములేని ఒక మనిషి ద్రాక్షాతోట పక్కగా నేను నడిచాను.
PRO 24:31 ఆ పొలాల నిండా కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. నేలమీద పనికిమాలిన మొక్కలు పెరుగుతున్నాయి. పొలాల చుట్టూ గోడ విరిగిపోయి పడి పోతుంది.
PRO 24:32 నేను అది చూచి, దాని గూర్చి ఆలోచించాను. అప్పుడు ఈ విషయాల నుండి నేను ఒక పాఠం నేర్చుకున్నాను.
PRO 24:33 కొంచెం నిద్ర, కొంచెం విశ్రాంతి, నీ చేతులు ముడుచుకొని, ఒక నిద్ర తియ్యటం.
PRO 24:34 ఈ విషయాలు నిన్ను త్వరగా దరిద్రుని చేస్తాయి. నీకు ఏమీ ఉండదు. ఒక దొంగ అకస్మాత్తుగా వచ్చి అంతా దోచుకొని పోయినట్టుగా అది ఉంటుంది.
PRO 25:1 ఇవి సొలొమోను చెప్పిన మరికొన్ని జ్ఞానసూక్తులు: యూదా రాజు హిజ్కియా సేవకులు నకలు చేసిన మాటలు ఇవి:
PRO 25:2 మనం తెలిసికోగూడదని దేవుడు కోరే విషయాలను దాచి పెట్టేందుకు ఆయనకు అధికారం ఉంది. కాని ఒక రాజు విషయమును పరిశోధించుట మూలంగానే ఘనపర్చబడతాడు
PRO 25:3 ఆకాశం మనకు పైన చాలా ఎత్తుగాను, భూమి మన కింద చాలా లోతువరకును ఉన్నాయి. రాజుల మనస్సులు కూడ అదే విధంగా ఉంటాయి. మనం వాటిని గ్రహించలేం.
PRO 25:4 వెండి నుండి పనికిమాలిన పదార్థాలను నీవు తీసివేసినట్లయితే అప్పుడు పనివాడు దానితో అందమైన వస్తువులు చేయగలడు.
PRO 25:5 అదే విధంగా ఒక రాజు సమక్షం నుండి దుర్మార్గవు సలహాదారులను నీవు తొలగించి వేస్తే అప్పుడు మంచితనం అతని రాజ్యాన్ని బలమైనదిగా చేస్తుంది.
PRO 25:6 ఒక రాజు ఎదుట నిన్ను గూర్చి నీవు అతిశయించవద్దు. నీవు చాలా ప్రఖ్యాత వ్యక్తివి అని చెప్పుకోవద్దు.
PRO 25:7 రాజుగారే నిన్ను ఆహ్వానించటం చాలా మంచిది. కాని నిన్ను నీవే ఆహ్వానించుకొంటే అప్పుడు నీవు ఇతరుల ఎదుట ఇబ్బంది పడవచ్చును.
PRO 25:8 నీవు చూచిన దానిని గూర్చి న్యాయమూర్తికి చెప్పుటకు త్వరపడవద్దు. నీవు చెప్పింది తప్పు అని మరో వ్యక్తి గనుక చెబితే అప్పుడు నీవు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
PRO 25:9 నీవూ మరో వ్యక్తి ఏకీభవించలేకపోతే ఏమి చేయాలి? అనే విషయం, మీ మధ్యనే నిర్ణయం కావాలి. మరో వ్యక్తి రహస్యాన్ని చెప్పవద్దు.
PRO 25:10 నీవలా చేస్తే నీకు అవమానం కలుగుతుంది. ఆ చెడ్డ పేరు నీకు ఎప్పటికీ పోదు.
PRO 25:11 సమయానికి తగిన రీతిగా పలుక బడిన మంచిమాటలు వెండి పళ్లెంలో ఉంచిన బంగారు పండులా ఉంటుంది.
PRO 25:12 జ్ఞానముగల ఒక మనిషి నీకు ఒక హెచ్చరిక ఇస్తే బంగారు ఉంగరాలకంటే లేక మేలిమి బంగారు నగలకంటే అది ఎక్కువ విలువగలది.
PRO 25:13 నమ్మదగిన వార్తాహరుడు అతనిని పంపిన వారికి ఎంతో విలువగలవాడు. అతడు కోతకాలపు ఎండ రోజుల్లో చల్లటి నీళ్లలాంటివాడు.
PRO 25:14 కానుకలు ఇస్తామని వాగ్దానం చేసి, వాటిని ఎన్నడూ ఇవ్వని వారు వర్షం కురిపించని మేఘాలు, గాలిలాంటివారు.
PRO 25:15 సహసంగా మాట్లాడటం ఏ వ్యక్తినేగాని, చివరికి ఒక అధికారి ఆలోచననేగాని మార్పుతుంది. నిదానంగా మాట్లాడటం చాలా శక్తివంతమైనది.
PRO 25:16 తేనె మంచిది. కానీ దానిని మరీ ఎక్కువగా తినవద్దు. నీవలా చేస్తే నీకు జబ్బు వస్తుంది.
PRO 25:17 అదే విధంగా నీ పొరుగు వాని ఇంటికి మరీ తరచుగా వెళ్లవద్దు. నీవలా చేస్తే అప్పుడు అతడు నిన్ను అసహ్యించు కోవటం మొదలు పెడతాడు.
PRO 25:18 సత్యం చెప్పని మనిషి ప్రమాదకరమైనవాడు.అతడు ఒక గునపం, లేక ఖడ్గం లేక వాడిగల బాణం లాంటివాడు.
PRO 25:19 కష్టకాలంలో అబద్ధీకుని మీద ఎన్నడూ ఆధారపడవద్దు. ఆ మనిషి నొప్పెడుతున్న పన్నులా లేక కుంటిపాదంలా ఉంటాడు. నీకు అతడు ఎంతో అవసరమైనప్పుడే అతడు నిన్ను బాధపెడతాడు.
PRO 25:20 ధు:ఖంలో ఉన్న మనిషి దగ్గర ఆనంద గీతాలు పాడటం అతనికి చలిపెడుతున్నప్పుడు అతని గుడ్డలు తీసివేయటంలా ఉంటుంది. అది సోడా, చిరకా మిళితం చేసినట్టు ఉంటుంది.
PRO 25:21 నీ శత్రువు ఆకలితో ఉన్నప్పుడు తినేందుకు అతనికి భోజనం పెట్టు. నీ శత్రువు దాహంతో ఉంటే తాగేందుకు అతనికి నీళ్లు యివ్వు.
PRO 25:22 నీవు ఇలా చేస్తే నీవు అతనిని సిగ్గుపడేలా చేస్తావు. అది మండుతున్న నిప్పులు అతని తల మీద ఉంచినట్టు ఉంటుంది. మరియు నీ శత్రువుకు నీవు మంచి చేశావు గనుక యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు.
PRO 25:23 ఉత్తరం నుండి వీచే గాలి వర్షాన్ని తెస్తుంది. అదే విధంగా చెప్పుడు మాటలు కోపం రప్పిస్తాయి.
PRO 25:24 వివాదం కోరుకొనే భార్యతో కలిసి ఇంటిలో ఉండటంకంటె, ఇంటికప్పు మీద బతకటం మేలు.
PRO 25:25 దూరస్థలం నుండి వచ్చిన శుభవార్త నీకు వేడిగా, దాహంగా ఉన్నప్పుడు చల్లటి నీళ్లు తాగినట్టు ఉంటుంది.
PRO 25:26 ఒక మంచి మనిషి బలహీనుడై ఒక దుర్మార్గుని వెంబడిస్తే, అది మంచి నీళ్లు బురద నీళ్లు అయినట్టుగా ఉంటుంది.
PRO 25:27 నీవు చాలా ఎక్కువ తేనెను తింటే అది నీకు మంచిది కాదు. అదే విధంగా నీకోసం మరీ ఎక్కువ ఘనత తెచ్చుకోవాలని ప్రయత్నించకు.
PRO 25:28 ఒక మనిషి తనను తాను అదుపులో ఉంచుకోలేకపోతే, అప్పుడు అతడు కూలిపోయిన గోడలుగల పట్టణంలా ఉంటాడు.
PRO 26:1 తెలివి తక్కువ వానిని గౌరవించటం వ్యర్థం. అది వేసవిలో మంచులా, కోతకాలంలో వర్షంలా ఉంటుంది.
PRO 26:2 నీకు చెడు సంగతులు సంభవించాలని ఒక మనిషి కోరుకొంటే చింతపడవద్దు. నీవు తప్పు ఏమీ చేయక పోతే నీకేమీ చెడు సంభవించదు. ఆ మనిషి మాటలు నీ పక్కగా ఎగురుతూ, ఎన్నడూ ఆగని పక్షుల్లా ఉంటాయి.
PRO 26:3 గుర్రాన్ని చబుకుతో కొట్టాలి. గాడిదకు కళ్లెం పెట్టాలి. బుద్ధిహీనుణ్ణి బెత్తంతో కొట్టాలి.
PRO 26:4 ఇక్కడ ఒక కష్టతరమైన పరిస్థితి ఉంది. ఒక బుద్ధి హీనుడు ఒక మూర్ఖ ప్రశ్న నిన్ను అడిగితే, నీవు మూర్ఖ జవాబు ఇవ్వవద్దు, అలా ఇస్తే నీవుకూడ బుద్ధిహీనునిలా కనబడతావు.
PRO 26:5 కానీ ఒక బుద్ధిహీనుడు ఒక మూర్ఖ ప్రశ్న అడిగితే, అప్పుడు నీవు తగిన మూర్ఖపు జవాబు ఇవ్వాలి, లేకపోతే అతడు తాను చాలా తేలివిగలవాడిని అనుకొంటాడు.
PRO 26:6 తెలివి తక్కువ వాణ్ణి ఎన్నడూ నీ సందేశం తీసికొని వెళ్లనివ్వకు. నీవు అలా చేస్తే, నీ స్వంత కాళ్లు కోసి కొన్నట్టు ఉంటుంది. నీవు కష్టం అడిగి తెచ్చుకొంటావు.
PRO 26:7 బుద్ధిహీనుడు జ్ఞానముగలది చెప్పటానికి ప్రయత్నించినప్పుడు, అది ఒక కుంటివాడు నడవటానికి ప్రయత్నించిట్టు ఉంటుంది.
PRO 26:8 బుద్ధిహీనునికి గౌరవం చూపించటం వడిసెలలో బండను కట్టడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది.
PRO 26:9 ఒక బుద్ధిహీనుడు జ్ఞానముగల మాట చెప్పటానికి ప్రయత్నిస్తే, అది ఒక తాగుబోతువాడు తన చేతిలోని ముల్లు తీసికోవటానికి ప్రయత్నించినట్టు ఉంటుంది.
PRO 26:10 ఒక బుద్ధిహీనుణ్ణి లేక దారిన పోయే వాళ్లను ఎవరినంటే వారిని కూలికి పెట్టుకోవటం ప్రమాదకరం. ఎవరికి హాని జరుగుతుందో నీకు తెలియదు.
PRO 26:11 ఒక కుక్క ఆహారం తింటుంది. తరువాత దానికి జబ్బుచేసి, వాంతి చేసికొంటుంది. తర్వాత ఆ కుక్క ఆ ఆహారాన్ని మళ్లీ తింటుంది. ఒక బుద్ధిహీనుని విషయం కూడ అలానే ఉంటుంది. అతడు బుద్ధిహీనమైన అదే పనిని మరల మరల చేస్తాడు.
PRO 26:12 ఒక మనిషి జ్ఞానము లేకుండానే జ్ఞానిని అని తలిస్తే అతడు బుద్ధిహీనునికంటె దౌర్భాగ్యుడు.
PRO 26:13 “నేను ఇల్లు విడిచి వెళ్లలేను. వీధిలో సింహంఉంది” అంటాడు ఒక సోమరి.
PRO 26:14 ఒక సోమరి ఒక తలుపులాంటివాడు. ఒక తలుపు దాని బందుల మీద తిరిగినట్టు తన పడక మీద అటు ఇటు తిరగటమే అతడు చేసేది అంతాను. అతడు ఎన్నడూ ఎక్కడికి వెళ్లడు.
PRO 26:15 ఒక సోమరి మనిషి తన పళ్లెంలో నుండి తన భోజనాన్ని తన నోటి వరకు గూడ ఎత్తని మరీ బద్ధకస్తుడు.
PRO 26:16 ఒక సోమరి మనిషి తాను చాలా జ్ఞానము గలవాడను అనుకుంటాడు. వారి తలంపులకు మంచి కారణాలు ఇవ్వగలిగిన ఏడుగురు మనుష్యులకంటే తాను చాలా ఎక్కువ తెలివిగల వాడనని అతడు తలస్తాడు.
PRO 26:17 ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంలో పాల్గొనడం ప్రమాదకరం. అది దారిన పోతూ ఒక కుక్క చెవులు పట్టి లాగినట్టు ఉంటుంది.
PRO 26:18 మరో మనిషిని మాయచేసి, ఊరకనే సరదాగా అలా చేసాను అనేవాడు, అగ్ని బాణాలు గాలిలోకి కొట్టి, ప్రమాదవశాత్తు ఎవరినో చంపిన పిచ్చివాడిలా ఉంటాడు.
PRO 26:20 మంటకు కట్టెలు లేకపోతే మంట చల్లారి పోతుంది. అదే విధంగా చెప్పుడు మాటలు లేకపోతే వివాదం సమసిపోతుంది.
PRO 26:21 బొగ్గలు బూడిదను మండింపచేస్తూ ఉంటాయి. కట్టెలు మంటను మండిస్తూ ఉంటాయి. అదే విధంగా చిక్కులు పెట్టే మనుష్యులు వివాదాన్ని బతకనిస్తారు.
PRO 26:22 మనుష్యులు చెప్పుడు మాటలను ప్రేమిస్తారు. అది మంచి ఆహారాన్ని భోంచేసినట్టు ఉంటుంది.
PRO 26:23 ఒక దుర్మార్గపు పథకాన్ని దాచిపెట్టే మంచి మాటలు ఒక చవకబారు మట్టి కుండ మీద వెండి పూతలా ఉంటాయి.
PRO 26:24 ఒక దుర్మార్గుడు తాను చెప్పే విషయాల ద్వారా తాను మంచివానిలా చూపెట్టు కుంటాడు. కాని అతడు తన దుర్మార్గపు పథకాలను తన హృదయంలో దాచి పెడతాడు.
PRO 26:25 అతడు చెప్పే విషయాలు మంచివిగా కనబడవచ్చు. కాని అతణ్ణి నమ్మవద్దు. అతని హృదయం దురాలోచనలతో నిండిపోయింది.
PRO 26:26 అతడు తన దుర్మార్గపు పథకాలను చక్కని మాటలతో దాచిపెడతాడు. కాని అతడు నీచుడు. చివరికి అతడు చేసే దుర్మార్గవు విషయాలను మనుష్యులందరు చూస్తారు.
PRO 26:27 ఒక మనిషి ఇతరులను ఇక్కట్టులో పెట్టాలని ప్రయత్నించి, గొయ్యి తవ్వితే అతడు తానే ఆ గోతిలో పడతాడు. మరో మనిషి మీదకు ఒక బండను దొర్లించాలని ప్రయత్నిస్తే అతడు తనను తానే చితుక గొట్టుకుంటాడు.
PRO 26:28 అబద్ధాలు చెప్పే మనిషి తనకు భోధించే వారిని ద్వేషిస్తాడు. మరియు ఒక మనిషి చెప్పే విషయాలు అర్థవంతంగా చెప్పకపోతే అతడు తనను తానే బాధించుకొంటాడు.
PRO 27:1 భవిష్యత్తులో జరిగే దానిని గూర్చి అతిశయించవద్దు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు.
PRO 27:2 నిన్ను నీవే ఎన్నడూ పొగడుకోవద్దు. ఆ పని ఇతరులను చేయనివ్వు.
PRO 27:3 మోయుటకు ఒక బండ బరువుగాను యిసుక గట్టిగాను ఉంటాయి. కాని ఒక బుద్ధిహీనుని కోపము మూలంగా కలిగిన కష్టాన్ని మోయటం ఆ రెండింటి కంటే సహించడం కష్టం.
PRO 27:4 కోపం క్రూరమైంది. నీచమైంది. అది నాశనం కలిగిస్తుంది. కాని అసూయ మరీ దౌర్భాగ్యం.
PRO 27:5 దాచబడిన ప్రేమకంటె బహిరంగ విమర్శ మేలు.
PRO 27:6 ఒక స్నేహితుడు అప్పుడప్పుడు నిన్ను బాధించవచ్చు. కాని ఎల్లప్పుడూ ఇలాగే చేయాలని అతడు కోరుకోడు. ఒక శత్రువు విషయం వేరుగా ఉంటుంది. ఒక శత్రువు నీ మీద దయగా ఉన్నప్పటికీ అతడు నిన్ను బాధించగోరుతాడు.
PRO 27:7 నీకు ఆకలి లేకపోతే అప్పుడు నీవు తేనె కూడా తినలేవు. కాని ఆకలిగా ఉంటే ఏదైనా తినేస్తావు దాని రుచి బాగులేకున్నా సరే.
PRO 27:8 తన ఇంటికి దూరంగా ఉన్న మనిషి తన గూటికి దూరంగా ఉన్న పక్షిలాంటివాడు.
PRO 27:9 పరిమళాలు, సువాసన వస్తువులు నిన్ను సంతోష పెడ్తాయి. కాని ఆపత్తు నీ మనశ్శాంతిని భంగం చేస్తుంది. అదే రీతిగా స్నేహితుని హృదయం నుండి వచ్చే మధుర మైన హితవు వుంటుంది.
PRO 27:10 నీ స్నేహితులను, నీ తండ్రి స్నేహితులను మరువకు. మరియు నీకు కష్టం వస్తే సహాయం కోసం చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లవద్దు. చాలా దూరంలో ఉన్న నీ సోదరుని ఇంటికి వెళ్లడం కంటే నీ దగ్గరలో ఉన్న నీ పొరుగువారిని అడగటం మంచిది.
PRO 27:11 నా కుమారుడా జ్ఞానము కలిగివుండు. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. అప్పుడు నన్ను విమర్శించే వారికి ఎవరికైనా సరే నేను జవాబు చెప్పగలను.
PRO 27:12 జ్ఞానముగల వారు చిక్కు వస్తూ వుండటం గమనించి, దాని దారిలో నుండి తప్పుకుంటారు. కాని బుద్ధిహీనుడు సూటిగా చిక్కులోకి వెళ్లి దాని మూలంగా శ్రమపడతాడు.
PRO 27:13 మరో మనిషి అప్పుల కోసం నీవు బాధ్యత వహిస్తే, నీవు నీ చొక్కా పోగొట్టుకుంటావు.
PRO 27:14 “శుభోదయం” అని గట్టిగా అరుస్తూ తెల్లవారకట్లనే నీ పొరుగు వారిని మేలుకొలుపవద్దు. అది అతనికి ఒక శాపం అనుకుంటాడే కాని దీవెన అనుకోడు.
PRO 27:15 ఎప్పుడూ వివాదం పెట్టుకోవాలని చూచే భార్య వర్షపు రోజున ఆగకుండా కురిసే చినుకుల్లాంటిది.
PRO 27:16 ఆ స్త్రీని వారించటం పెను గాలిని వారించ ప్రయత్నించినట్టే ఉంటుంది. అది నీ చేతితో నూనె పిండేందుకు ప్రయత్నించినట్టు ఉంటుంది.
PRO 27:17 ఇనుప కత్తులను పదును చేసేందుకు ఇనుప ముక్కలను మనుష్యులు వాడుతారు. అదే విధంగా మనుష్యులు ఒకరి నుండి ఒకరు నేర్చుకొని ఒకరిని ఒకరు పదును చేస్తారు.
PRO 27:18 అంజూరపు చెట్ల విషయం శ్రద్ధగలవాడు దాని ఫలాలు తినగలుగుతాడు. అదే విధంగా తన యజమానుని విషయమై శ్రద్ధగలవాడు ప్రతిఫలం పొందుతాడు. అతని యజమాని అతని గూర్చి శ్రద్ధ పుచ్చుకుంటాడు.
PRO 27:19 ఒక మనిషి నీళ్లలోనికి చూసినప్పుడు అతడు తన స్వంత ముఖాన్నే చూడగలుగుతాడు. అదే విధంగా ఒక మనిషి హృదయం నిజానికి అతడు ఎలాంటివాడో తెలియచేస్తుంది.
PRO 27:20 మరణస్థానం మరియు నాశన స్థలము ఎన్నటికీ తృప్తిపడవు. మానవుని కన్నులు కూడ ఎన్నటికీ తృప్తినొందవు.
PRO 27:21 బంగారాన్ని, వెండిని శుద్ధి చేయటానికి మనుష్యులు అగ్నిని ఉపయోగిస్తారు. అదే విధంగా ఒక మనిషికి ప్రజలు ఇచ్చే మెప్పుద్వారా అతడు పరీక్షించబడతాడు.
PRO 27:22 ఒక బుద్ధిహీనుని నీవు పొడుంగా నూర్చినా అతనిలోని తెలివి తక్కువ తనాన్ని నీవు బయటకు నెట్టివేయలేవు.
PRO 27:23 నీ గొర్రెలను, పశువులను జాగ్రత్తగా చూసుకో, నీకు చేతనైనంత బాగా వాటిని గూర్చి శ్రద్ధ తీసికో.
PRO 27:24 ఐశ్వర్యం శాశ్వతంగా ఉండదు. రాజ్యాలు కూడా శాశ్వతంగా ఉండవు.
PRO 27:25 మనుష్యులు ఎండుగడ్డి కోస్తే కొత్త గడ్డి పెరగటం మొదలవుతుంది. తరువాత కొండల మీద వెరుగుతున్న ఆ గడ్డిని వారు కోస్తారు.
PRO 27:26 (అందుచేత నీకు ఉన్న దానితో సంతృప్తిగా ఉండు.) నీ గొర్రెపిల్లల బొచ్చు నుండి నీవు బట్టలు చేసికోవచ్చు. నీ మేకలు అమ్మగా వచ్చిన డబ్బుతో నీవు భూమి కొనవచ్చును.
PRO 27:27 మిగిలిన నీ మేకలు సమృద్ధిగా పాలు ఇస్తాయి. కనుక నీకు, నీ కుటుంబానికి కూడా సరిపడినంత ఆహారం ఉంటుంది. నీ దాసీలను ఆరోగ్యవంతులుగా చేస్తుంది.
PRO 28:1 దుర్మార్గులకు ప్రతిదానిగూర్చీ భయమే. అయితే మంచి మనిషి సింహం అంత ధైర్యంగా ఉంటాడు.
PRO 28:2 ఒక దేశంలో పాపాలు చాలా ఉంటే, ఆ దేశాన్ని అనేక మంది నాయకులు పాలించటానికి ప్రయత్నిస్తారు. అయితే బలమైన రాజ్యానికి చాలాకాలం దాన్ని పాలించగల మంచి జ్ఞానముగల ఒకే నాయకుడు ఉంటాడు.
PRO 28:3 ఒక అధికారి తన బీద ప్రజలకు కష్టం కలిగిస్తే, అతడు పంటలను పాడు చేసే భారీ వర్షంలా ఉంటాడు.
PRO 28:4 న్యాయచట్టానికి లోబడేందుకు నీవు తిరస్కరిస్తే, నీవు దుర్మార్గుల పక్షాన ఉన్నట్టే. కానీ నీవు న్యాయచట్టానికి లోబడితే, నీవు వారికి విరోధంగా ఉన్నట్టే.
PRO 28:5 దుర్మార్గులు న్యాయాన్ని అర్థం చేసికోరు. యెహోవాను ప్రేమించే వారు దానిని అర్థం చేసుకొంటారు.
PRO 28:6 ధనికుడై దుర్మార్గునిగా ఉండటంకంటె, దరిద్రుడై నిజాయితీగా ఉండటం మేలు.
PRO 28:7 న్యాయచట్టానికి విధేయుడయ్యే మనిషి తెలివి గలవాడు. కానీ పనికిమాలిన వాళ్లతో స్నేహం చేసే వ్యక్తి తన తండ్రికి అవమానం తెస్తాడు.
PRO 28:8 పేద ప్రజలను మోసం చేసి మరి వారిపై ఎక్కువ వడ్డీ వేసి నీవు ధనికుడవైతే నీ ధనం పోగొట్టుకొంటావు. వారి యెడల దయగల మరో మనిషికి అది చెందుతుంది.
PRO 28:9 ఒక మనిషి దేవుని ఉపదేశాలు వినేందుకు తిరస్కరిస్తే, అప్పుడు దేవుడు అతని ప్రార్థనలు వినేందుకు తిరస్కరిస్తాడు.
PRO 28:10 ఒక చెడ్డ మనిషి ఒక మంచి మనిషికి హాని చేసేందుకు పథకాలు వేయవచ్చు. కానీ ఆ చెడ్డ మనిషి తన గోతిలో తానే పడిపోతాడు. మరియు మంచి మనిషికి మంచి సంగతులే సంభవిస్తాయి.
PRO 28:11 ధనికులు జ్ఞానముగల వారమని ఎల్లప్పుడూ తలస్తారు. అయితే జ్ఞానముగల పేదవాడు సత్యమును చూడగలడు.
PRO 28:12 మంచి మనుష్యులు నాయకులైనప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. అయితే ఒక దుర్మార్గుడు ఎన్నుకోబడినప్పుడు ప్రజలంతా వెళ్లిపోయి దాక్కుంటారు.
PRO 28:13 తన పాపాలు దాచిపెట్టడానికి ప్రయత్నించే మనిషి ఎన్నటికీ విజయం పొందడు. కాని ఒక మనిషి తాను తప్పులు చేశానని ఒప్పుకొని మరియు తన పాపాలు విడిచినట్లయితే దేవుడు మరియు ప్రతి ఒక్కరూ అతని యెడల దయ చూపిస్తారు.
PRO 28:14 ఒక మనిషి గనుక ఎల్లప్పుడూ యెహోవాను గౌరవిస్తే ఆ మనిషి ఆశీర్వదించబడతాడు. కాని ఒక మనిషి మొండిగా ఉండి, యెహోవాను గౌరవించేదుకు తిరస్కరిస్తే అతనికి కష్టం వస్తుంది.
PRO 28:15 ఒక దుర్మార్గుడు బలహీనుల మీద పరిపాలన చేస్తే అతడు కోపంగా ఉన్న ఒక సింహంలా లేక పోట్లాడేందుకు సిద్ధంగా ఉన్న ఒక ఎలుగుబంటిలా ఉంటాడు.
PRO 28:16 ఒక అధికారి జ్ఞానము లేనివాడైతే అతడు తన కిందునున్న ప్రజలను బాధిస్తాడు. కాని నిజాయితీ గలిగి, మోసాన్ని అసహ్యించుకొనే అధికారి చాలాకాలం పరిపాలిస్తాడు.
PRO 28:17 ఒక మనిషి మరో మనిషిని చంపి నేరస్తుడైతే ఆ మనిషికి ఎన్నటికీ శాంతి ఉండదు. ఆ మనిషిని బల పరచవద్దు.
PRO 28:18 ఒక మనిషి సరిగ్గా జీవిస్తూ ఉంటే అప్పుడు అతడు క్షేమంగా ఉంటాడు. కాని ఒక మనిషి దుర్మార్గుడైతే అతడు తన అధికారాన్ని పోగొట్టుకుంటాడు.
PRO 28:19 కష్టపడి పనిచేసే వాడికి తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. కాని కలలు కంటూ తన సమయాన్ని వ్యర్థం చేసే మనిషి ఎల్లప్పుడూ పేదవానిగా ఉంటాడు.
PRO 28:20 దేవుని వెంబడించే మనిషిని ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే కేవలం ధనికుడు కావాలని మాత్రమే ప్రయత్నించే మనిషి శిక్షించబడతాడు.
PRO 28:21 ఒక న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. కేవలం ఒక వ్యక్తి తనకు తెలిసిన వాడైనంత మాత్రాన అతడు వానిని బలపరచ కూడదు. అయితే కొందరు న్యాయమూర్తులు కొద్దిపాటి డబ్బు చెల్లింపునకే వారి నిర్ణయాలు మార్చివేస్తారు.
PRO 28:22 ఒక స్వార్థపరుడు ధనికుడు కావాలని మాత్రమే కోరుకుంటాడు. ఆ మనిషి దరిద్రుడు అయ్యేందుకు చాలా దగ్గరలో ఉన్నాడని అతడు గ్రహించడు.
PRO 28:23 ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడని అతనితో చెప్పటం ద్వారా నీవు సహాయం చేస్తే, తర్వాత అతడు నిన్ను గూర్చి సంతోషిస్తాడు. ఎల్లప్పుడూ పొగిడే మనుష్యుల కంటే అది చాలా మంచిది.
PRO 28:24 కొందరు మనుష్యులు వారి తల్లిదండ్రుల దగ్గర దొంగతనం చేస్తారు. “అదేమీ తప్పుకాదు” అని వారు అంటారు. కానీ ఒక వ్యక్తి ఇంటిలోపలకు వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాటన్నిటినీ పగలకొట్టడం ఎంత చెడ్డదో, అదీ అంత చెడ్డదే.
PRO 28:25 ఒక స్వార్థపరుడు కష్టం కలిగిస్తాడు. కాని యెహోవాను సమ్ముకునేవాడు ప్రతిఫలం పొందుతాడు.
PRO 28:26 ఒక మనిషి తనను తానే నమ్ముకొంటే అతడు బుద్ధిహీనుడు. కానీ ఒక మనిషి జ్ఞానముగలవాడైతే అతడు నాశనాన్ని తప్పించు కొంటాడు.
PRO 28:27 ఒక మనిషి పేద ప్రజలకు ఇచ్చినట్లయితే అప్పుడు అతనికి అవసరమైనవన్నీ ఉంటాయి. కాని ఒక వ్యక్తి పేద ప్రజలకు సహాయం చేసేందుకు నిరాకరిస్తే అప్పుడు అతనికి చాలా చిక్కు కలుగుతుంది.
PRO 28:28 ఒక దుర్మార్గుడు పాలించేందుకు ఎన్నుకోబడితే అప్పుడు ప్రజలంతా దాక్కుంటారు. కాని ఆ దుర్మార్గుడు ఓడించబడితే అప్పుడు మరలా మంచివారు పాలన చేస్తారు.
PRO 29:1 ఒక మనిషి మొండివాడై, అతడు చేస్తున్నది తప్పు అని ప్రజలు అతనితో చెప్పినప్పుడల్లా అతనికి మరింత కోపం వస్తే అప్పుడు ఆ మనిషి ఆకస్మాత్తుగా నాశనం చేయబడతాడు. ఆశ ఏమీ ఉండదు.
PRO 29:2 పాలించేవాడు మంచి మనిషి అయితే ప్రజలంతా సంతోషిస్తారు.కాని ఒక దుర్మార్గుడు పాలన చేస్తే అప్పుడు ప్రజలంతా నిట్టూర్చి ఆరోపణ చేస్తారు.
PRO 29:3 ఒక మనిషి జ్ఞానమును ప్రేమిస్తే అప్పుడు అతని తండ్రికి చాలా సంతోషం. కాని ఒక మనిషి తన డబ్బును వేశ్యల కోసం వ్యర్థం చేస్తే అప్పుడు అతడు తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకొంటాడు.
PRO 29:4 ఒక రాజు న్యాయంగా ఉంటే, అప్పుడు ఆ రాజ్యం బలంగా ఉంటుంది. కాని రాజు స్వార్థపరుడై ప్రజల కోసం చేసే పనులన్నిటికి వారు అతనికి డబ్బు చెల్లించాల్సి వస్తే, అప్పుడు ఆ దేశం బలహీనంగా ఉంటుంది.
PRO 29:5 ఒక వ్యక్తి మనుష్యులకు చక్కని మాటలు చెప్పి తాను కోరింది సంపాదించాలని ప్రయత్నిస్తే, అప్పుడు అతడు తనకు తానే ఒక ఉచ్చు పెట్టుకుంటున్నట్టు అవుతుంది.
PRO 29:6 దుర్మార్గులు వారి స్వంత పాపం మూలంగానే ఓడించబడతారు. కాని ఒక మంచి మనిషి పాడుతూ సంతోషంగా ఉండగలడు.
PRO 29:7 మంచి మనుష్యులు పేద ప్రజలకోసం సరైనదానిని చేయాలని కోరుతారు. కాని చేడ్డవాళ్లు ఏమీ పట్టించుకోరు.
PRO 29:8 ఇతరులకంటే మేమే మంచివాళ్లం అనుకొనే మనుష్యులు చాలా చిక్కులు కలిగిస్తారు. వారు మొత్తం పట్టణాలనే గందరగోళం చేయగలరు. కాని జ్ఞానముగల మనుష్యులు శాంతి కలిగిస్తారు.
PRO 29:9 జ్ఞానముగల మనిషి తెలివి తక్కువ వానితో ఒక సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తే ఆ తెలివి తక్కువ వాడు వాదం పెట్టుకొని మూర్ఖంగా మాట్లాడుతాడు. ఆ ఇద్దరూ ఎన్నటికీ ఏకీభవించరు.
PRO 29:10 నరహంతకులు నిజాయితీగల మనుష్యులను ఎల్లప్పుడూ ద్వేషిస్తారు. ఆ దుర్మార్గులు నిజాయితీగల మంచి మనుష్యులను చంపాలని అనుకొంటారు.
PRO 29:11 తెలివితక్కువ వానికి త్వరగా కోపం వస్తుంది. కాని జ్ఞానముగల మనిషి సహాసం కలిగి తనను తాను సంబాళించుకొంటాడు.
PRO 29:12 ఒక పాలకుడు అబద్ధాలు వింటే అప్పుడు అతని అధికారులంతా దుర్మార్గులు అవుతారు.
PRO 29:13 ఒక పేద మనిషి, పేదవాని దగ్గర దొంగిలించే మనిషి ఒక విధంగా ఇద్దరూ ఒకటే. వారిద్దరినీ యెహోవా చేశాడు.
PRO 29:14 ఒక రాజు పేదవారి యెడల న్యాయంగా ఉంటే అతడు చాలా కాలం పరిపాలిస్తాడు.
PRO 29:15 దెబ్బలు కొట్టటం, ఉపదేశాలు పిల్లలకు మంచివి. ఒక బిడ్డను తన ఇష్టానుసారంగా తల్లిదండ్రులు చేయనిస్తే అప్పుడు ఆ బిడ్డ తన తల్లికి అవమానం తీసికొని వస్తాడు.
PRO 29:16 దుర్మార్గులు గనుక దేశాన్ని పాలిస్తూంటే, అప్పుడు ఎక్కడ చూసినా పాపమే ఉంటుంది. కాని చివరికి మంచి మనుష్యులు జయిస్తారు.
PRO 29:17 నీ కుమారుడు తప్పు చేసినప్పుడు వానిని శిక్షించు, అప్పుడు వాడిని గూర్చి నీవు ఎల్లప్పుడూ అతిశయిస్తావు. వాడు నిన్ను ఎన్నడూ సిగ్గుపడనియ్యడు.
PRO 29:18 ఒక దేశం గనుక దేవునిచే నడిపించబడకపోతే అప్పుడు ఆ దేశంలో శాంతి ఉండదు. కానీ దేవుని న్యాయచట్టానికి లోబడే దేశం సంతోషంగా ఉంటుంది.
PRO 29:19 ఒక సేవకునితో నీవు ఊరక మాటలే చెబితే అతడు పాఠం నేర్చుకోడు. ఆ సేవకుడు నీ మాటలు గ్రహించవచ్చుగాని అతడు లోబడడు.
PRO 29:20 ఒక మనిషి ఆలోచన లేకుండా మాట్లాడితే వానికి ఆశ లేదు. ఆలేచన లేకుండా మాట్లాడే ఒక మనిషికంటే ఒక బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ ఉంది.
PRO 29:21 నీ సేవకునికి కావలసినవి అన్నీ నీవు ఎల్లప్పుడూ ఇస్తూఉంటే చివరికి వాడు మంచి సేవకునిగా ఉండడు.
PRO 29:22 కోపంగల మనిషి చిక్కు కలిగిస్తాడు. మరియు కోపపడే మనిషి అనేక పాపాలతో దోషిగా ఉంటాడు.
PRO 29:23 ఒక మనిషి ఇతరులకంటే తానే మంచి వాడిని అనుకొంటే అదే అతనిని నాశనం చేస్తుంది. కాని ఒక మనిషి వినమ్రంగా ఉంటే అప్పుడు యితరులు అతనిని గౌరవిస్తారు.
PRO 29:24 కలిసి పని చేసే ఇద్దరు దొంగలు శత్రువులు. ఒక దొంగ మరో దొంగను బెదిరిస్తాడు. కనుక అతడు సత్యం చేప్పేందుకు న్యాయస్థానంలో బలవంతం చేయబడితే మాట్లాడేందుకు కూడ అతడు ఎంతో భయపడతాడు.
PRO 29:25 భయం ఒక ఉచ్చులాంటిది. కాని యెహోవాయందు నీవు నమ్మకం ఉంచితే, నీవు క్షేమంగా ఉంటావు.
PRO 29:26 చాలా మంది మనుష్యులు ఒక అధికారికి స్నేహితులుగా ఉండాలని కోరుకొంటారు. కాని ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేవాడు యెహోవా మాత్రమే.
PRO 29:27 నిజాయితీ లేని మనుష్యులను మంచి మనుష్యులు అసహ్యించుకొంటారు. మరియు దుర్మార్గులు నిజాయితీగల మనుష్యులను అసహ్యించుకొంటారు.
PRO 30:1 యాకె కుమారుడు ఆగూరు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి: అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు ఇచ్చిన సందేశం:
PRO 30:2 భూమి మీద నేను అతి దౌర్భాగ్యుడను. నేను గ్రహించాల్సిన విధంగా గ్రహించటంలేదు.
PRO 30:3 జ్ఞానము కలిగి ఉండటం నేను నేర్చుకోలేదు. మరియు దేవుని గురించి నాకు ఏమీ తెలియదు.
PRO 30:4 ఏ మనిిషీ ఎన్నడూ పరలోకంలోని సంగతులను గూర్చి నేర్చుకోలేదు. ఏ మనిిషీ ఎన్నడూ గాలిని తన చేతిలో పట్టుకోలేదు. ఏ మనిిషీ ఎన్నడూ నీటిని ఒక గుడ్డ ముక్కలో పట్టుకోలేడు. ఏ మనిిషీ ఎన్నడూ భూమి హద్దులను నిజంగా తెలిసికోలేడు. ఈ సంగతులను తెలిసికో గలిగిన మనిషి ఎవరైనా ఉంటే ఆ మనిషి ఎవరు? అతని కుటుంబం ఎక్కడ ఉంది?
PRO 30:5 దేవుడు చెప్పే ప్రతి మాటా పరిపూర్ణం. దేవుని దగ్గరకు వెళ్లే మనుష్యులకు ఆయన ఒక క్షేమస్థానం
PRO 30:6 కనుక దేవుడు చెప్పే విషయాలను మార్చేందుకు ప్రయత్నించకు. నీవు అలా చేస్తే ఆయన నిన్ను శిక్షించి, నీవు అబద్ధాలు చెబుతున్నట్టు రుజువు చేస్తాడు.
PRO 30:7 యెహోవా, నేను చనిపోక ముందు నా కోసం రెండు పనులు చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.
PRO 30:8 అబద్ధాలు చెప్పకుండా ఉండేందుకు నాకు సహాయం చేయి. నన్ను మరీ ధనికునిగా లేక మరీ దరిద్రునిగా చేయవద్దు. ప్రతిరోజూ నాకు అవసరమైన వాటిని మాత్రమే అనుగ్రహించు.
PRO 30:9 నాకు అవసరమైన దానికంటే నాకు ఎక్కువగా ఉంటే, అప్పుడు నీతో నాకు అవసరం లేదని నేను తలస్తాను. కాని నేను దరిద్రుడనైతే ఒకవేళ నేను దొంగతనం చేస్తానేమో. అప్పుడు నేను యెహోవా నామానికి అవమానం తెస్తాను.
PRO 30:10 ఒక సేవకునికి విరోధంగా అతని యజమానితో చెడ్డ మాటలు ఎన్నడూ చెప్పవద్దు. నీవు అలా చేస్తే ఆ యజమాని నిన్ను నమ్మడు. నీవు దోషివని అతడు తలస్తాడు.
PRO 30:11 కొందరు మనుష్యులు వారి తండ్రులకు విరోధంగా మాట్లాడతారు. మరియు వారి తల్లులను గౌరవించరు.
PRO 30:12 కొందరు చాలా మంచివాళ్లం అనుకొంటారుగాని వారు చాలా చెడ్డవాళ్లు.
PRO 30:13 కొంతమంది చాలా మంచివాళ్లం అనుకొంటారు. వారు యితరులకంటే చాలా మంచివాళ్లు అనుకొంటారు.
PRO 30:14 ఖడ్గాల్లాంటి పళ్లు ఉన్నవారు కొందరు ఉంటారు. వారి దవడలు కత్తుల్లా ఉంటాయి. వారు పేద ప్రజలనుండి సమస్తం దోచుకోవటానికి వారి సమయం అంతా ఉపయోగిస్తారు.
PRO 30:15 కొంతమంది వారికి చేతనైనంత మట్టుకు అంతా తీసికోవాలి అనుకొంటారు. “నాకివ్వు, నాకివ్వు, నాకివ్వు” అనటం మాత్రమే వారు చెప్పేది అంతాను. ఎన్నటికీ తృప్తిపడనివి మూడు ఉన్నాయి వాస్తవానికీ సరిపడినంతగా ఎన్నడూ లేనివి నాలుగు ఉన్నాయి.
PRO 30:16 చావు స్థలం, పిల్లలు లేని స్త్రీ, వర్షం కావాల్సిన బీడుభూమి, వారించజాలని వేడి నిప్పు.
PRO 30:17 తన తండ్రిని ఎగతాళి చేసే మనిిషీ, తన తల్లికి లోబడని మనిషీ ఎవరైనా సరే శి క్షించబడుతారు. అది అతని కళ్లు రాబందులు, లేక కృ-రపక్షులు తినివేసినట్టు ఉంటుంది.
PRO 30:18 నేను గ్రహించేందుకు కష్టతరమైనవి మూడు సంగతులు ఉన్నాయి వాస్తవానికి నేను గ్రహించనివి నాలుగు సంగతులు ఉన్నాయి.
PRO 30:19 ఆకాశంలో ఎగిరే పక్షిరాజు, ఒక బండ మీద పాకుచున్న ఒక పాము, మహా సముద్రంలో తిరిగే ఓడ, ఒక స్త్రీతో ప్రేమలోవున్న మగవాడు.
PRO 30:20 తన భర్తకు నమ్మకంగా లేని ఒక భార్య తాను ఏమీ తప్పు చేయనట్టు నటిస్తుంది. ఆమె భోంచేస్తుంది, స్నానం చేస్తుంది, నేను ఏమీ తప్పు చేయలేదు అంటుంది.
PRO 30:21 భూమి మీద చిక్కు కలిగించేవి మూడు సంగతులు ఉన్నాయి. వాస్తవానికి భూమి భరించలేనివి నాలుగు ఉన్నాయి.
PRO 30:22 రాజైన ఒక సేవకుడు, తనకు కావాల్సినవి అన్నీ కలిగి ఉన్న ఒక బుద్ధిహీనుడు,
PRO 30:23 ద్వేషంతో పూర్తిగా నిండిపోయినా, ఒక భర్తను పొంద గలిగిన స్త్రీ, ఏ స్త్రీ దగ్గర సేవ చేస్తుందో, ఆ స్త్రీ మీద అధికారిణి అయిన దాసి.
PRO 30:24 భూమి మీద చిన్నవిగా ఉన్నవి నాలుగు ఉన్నాయి. అయితే ఇవి చాలా జ్ఞానము గలవి.
PRO 30:25 చీమలు చిన్నవి, బలహీనమైనవి. కానీ అవి వేసవి కాలం అంతా ఆహారం నిల్వచేసు కొంటాయి.
PRO 30:26 కుందేలు చిన్న జంతువు. కానీ అది బండల్లో నివాసం ఏర్పాటు చేసు కోగలుగుతుంది.
PRO 30:27 మిడతలకు రాజు లేడు. కానీ అవన్నీ కలిసికట్టుగా పని చేయగలుగుతున్నాయి.
PRO 30:28 బల్లులు నీవు చేతితో పట్టుకోగలిగినంత చిన్నవి. కానీ అవి రాజుల గృహాలలో నివసించటం నీవు చూడ గలవు.
PRO 30:29 నడుస్తున్నప్పుడు ముఖ్యమైనవిగా కనుపించేవి మూడు ఉన్నాయి. నిజానికి నాలుగు ఉన్నాయి.
PRO 30:30 సింహం జంతువులలోకెల్ల చాలా బలమైనది. అది దేనికీ భయపడదు.
PRO 30:31 చాలా గర్వంగా నడిచే కోడి పుంజు, ఒక మేక పోతు, తన ప్రజల మధ్య ఉన్న రాజు.
PRO 30:32 నీవు తెలివితక్కువ వాడవై యుండి ఇతరులకంటె నీవే మంచివాడవు అని తలిస్తే, మరియు నీవు దుర్మార్గాన్ని తల పెడితే, నీవు ఆగిపోయి, నీవు చేస్తున్నదాన్ని గూర్చి ఆలోచించాలి.
PRO 30:33 ఒక మనిషి పాలను చిలికి వెన్న చేస్తాడు. ఒకడు మరొకని ముక్కు మీద కొడితే, రక్తం వస్తుంది. అదే విధంగా నీవు ప్రజలకు కోపం పుట్టిస్తే నీవు చిక్కు కలిగిస్తావు.
PRO 31:1 లెమూయేలు రాజు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి. ఈ విషయాలను అతని తల్లి అతనికి నేర్పించింది.
PRO 31:2 నీవు నా కుమారుడవు. నేను ప్రేమించే నా కుమారుడివి. నాకు కావాలని నేను ప్రార్థించిన కుమారుడివి నీవు.
PRO 31:3 స్త్రీలకోసం నీ బలం వ్యర్థం చేయవద్దు. స్త్రీలే రాజులను నాశనం చేసేవాళ్లు. వారికోసం నిన్ను నీవు వ్యర్థం చేసుకోవద్దు.
PRO 31:4 లెమూయేలూ, రాజులు ద్రాక్షారసం తాగటం జ్ఞానముగల పనికాదు. మద్యము కోరుట పరిపాలకులకు జ్ఞానముగల పనికాదు.
PRO 31:5 వారు విపరీతంగా తాగేసి న్యాయచట్టం చెప్పేదానిని మరచి పోవచ్చు. అప్పుడు వారు పేద ప్రజల హక్కులు అన్నీ తీసివేస్తారు.
PRO 31:6 మద్యం పేద ప్రజలకు ఇమ్ము. ద్రాక్షారసం కష్టంలో ఉన్న ప్రజలకు ఇమ్ము.
PRO 31:7 అప్పుడు వారు అది తాగి, వారు పేదవాళ్లు అనే మాట మరచిపోతారు. వాళ్లు తాగేసి వారి కష్టాలన్నీ మరచిపోతారు.
PRO 31:8 ఒకడు తనకు తానే సహాయం చేసికోలేకపోతే అప్పుడు నీవు అతనికి సహాయం చేయాలి. కష్టంలో ఉన్న ప్రజలందరికీ నీవు సహాయం చేయాలి.
PRO 31:9 సరైనవి అని నీకు తెలిసిన విషయాల కోసం నీవు నిలబడు. మనుష్యులందరికీ న్యాయంగా తీర్పు తీర్చు. పేద ప్రజల, నీ అవసరం ఉన్న ప్రజల హక్కులను కాపాడు.
PRO 31:10 “పరిపూర్ణమైన స్త్రీ” దొరకటం ఎంతో కష్టం. కాని ఆమె నగలకంటె ఎంతో ఎక్కువ అమూల్యం.
PRO 31:11 ఆమె భర్త ఆమెను నమ్మగలడు. అతడు ఎన్నడూ దరిద్రునిగా ఉండడు.
PRO 31:12 మంచి భార్య తన జీవితకాలం అంతా తన భర్తకు మంచినే చేస్తుంది. ఆమె ఎన్నడూ అతనికి చిక్కు కలిగించదు.
PRO 31:13 ఆమె ఉన్నిబట్ట తయారు చేస్తూ ఎల్లప్పుడూ పనిలో నిమగ్నమవుతుంది.
PRO 31:14 ఆమె దూరము నుండి వచ్చిన ఓడలా ఉంటుంది. అన్ని చోట్ల నుండీ ఆమె ఆహారం తీసుకొని వస్తుంది.
PRO 31:15 ఆమె అతి వేకువనే మేలుకొంటుంది. తన కుటుంబానికి భోజనం, తన పని వారికి భోజనం ఆమె వండుతుంది.
PRO 31:16 ఆమె పొలాన్ని చూస్తుంది. దాన్నికొంటుంది. ఆమె ద్రాక్షతోట నాటేందుకు ఆమె దాచుకొన్న డబ్బు ఉపయోగిస్తుంది.
PRO 31:17 ఆమె చాలా కష్టపడి పని చేస్తుంది. ఆమె బలంగా ఉండి తన పని అంతా చేసుకో గలుగుతుంది.
PRO 31:18 ఆమె తయారు చేసిన వాటిని అమ్మినప్పుడు ఆమె ఎల్లప్పుడూ లాభం సంపాదిస్తుంది. మరియు రాత్రి చాలా పొద్దుపోయేదాకా ఆమె పని చేస్తుంది.
PRO 31:19 ఆమె స్వంతంగా దారం తయారు చేసికొని తన స్వంత బట్ట నేస్తుంది.
PRO 31:20 ఆమె ఎల్లప్పుడూ పేద ప్రజలకు పెడుతుంది. అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది!
PRO 31:21 చలిగా ఉన్నప్పుడు ఆమె తన కుటుంబం విషయం దిగులు పడదు. ఆమె వారందరికి మంచి వెచ్చని దుస్తులు ఇస్తుంది.
PRO 31:22 ఆమె దుప్పట్లు నేసి పడకలమీద పరుస్తుంది. నన్నని నారతో చేయబడ్డ వస్త్రాలు ఆమె ధరిస్తుంది.
PRO 31:23 ఆమె భర్తను ప్రజలు గౌరవిస్తారు. అతడు దేశ నాయకులలో ఒకడు.
PRO 31:24 ఆమె మంచి వ్యాపార దక్షతగల స్త్రీ. ఆమె బట్టలు, నడికట్లు తయారు చేసి వాటిని వ్యాపారస్థులకు అమ్ముతుంది.
PRO 31:25 ఆమె బలంగా ఉంటుంది. మరియు, ప్రజలు ఆమెను గౌరవిస్తారు. ఆమె స్థానము బలంగాను మరియు సురక్షితంగాను ఉంటుంది. భవిష్యత్తును గురించి సంతోషిస్తుంది.
PRO 31:26 ఆమె మాట్లాడినప్పుడు జ్ఞానముగా ఉంటుంది. ఆమె జ్ఞానం ఉపదేశముతోనిండి ఉంటుంది.
PRO 31:27 ఆమె ఎన్నడూ బద్ధకంగా ఉండదు. కాని ఆమె తన ఇంటి విషయాలను గూర్చి జాగ్రత్త తీసుకొంటుంది.
PRO 31:28 ఆమె పిల్లలు పెద్దవారై ఆమెను ఘనపరుస్తారు. మరియు ఆమె భర్త ఆమెను గూర్చి ఎన్నో మంచి విషయాలు చెబుతాడు.
PRO 31:29 “ఎంతో మంది స్త్రీలు మంచి భార్యలు అవుతారు. కాని నీవు శ్రేష్ఠమైన దానివి” అని ఆమె భర్త చెబుతాడు.
PRO 31:30 సౌందర్యము, అందము నిన్ను మోసగించవచ్చు. అయితే యెహోవాను గౌరవించే స్త్రీ పొగడబడాలి.
PRO 31:31 ఆమెకు అర్హమైన ప్రతిఫలం రావాలి. ఆమె చేసిన విషయాల కోసం ప్రజలు ఆమెను బహిరంగంగా ఘనపర్చాలి.
ECC 1:1 ఇవి దావీదు కుమారుడును, యెరూషలేము రాజు అయిన ప్రసంగి చెప్పిన ప్రవచనాలు.
ECC 1:2 అన్నీ పరమ అర్థరహితాలు. “సమస్తం వృధా కాలయాపన!” అంటాడు ప్రసంగి.
ECC 1:3 ఈ జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా? (లేదు!)
ECC 1:4 ఒక తరం మారి మరొకతరం వస్తుంది.కాని, ఈ భూమి శాశ్వతంగా ఉంటుంది.
ECC 1:5 సూర్యుడు ఉదయించును మరియు అస్తమించును. మరల ఉదయించే చోటుకు త్వరగా వెళతాడు.
ECC 1:6 గాలి దక్షిణ దిశకి వీస్తుంది, తి రిగి ఉత్తర దిశకి వీస్తుంది. గాలి చుట్టూ తిరిగి తిరిగి చివరకు తాను బయల్దేరిన చోటుకే రివ్వున వస్తుంది.
ECC 1:7 నదులన్నీ మరల మరల ఒక్క చోటుకే ప్రవహిస్తాయి. అవన్నీ సముద్రంలోకే పోయి పడినా సముద్రం నిండదు.
ECC 1:8 ఆయా విషయాలను మాటలు పూర్తిగా వివరించలేవు. అయితేనేమి, మనుష్యులు మాట్లాడు తూనే వుంటారు. మాటలు మళ్లీ మళ్లీ మన చెవుల్లో పడుతునే వుంటాయి. అయినా, మన చెవులకి తృప్తి తీరదు. మన కళ్లు ఎన్నింటినో చూస్తూ ఉంటాయి. అయినా మనకి తనివి తీరదు.
ECC 1:9 అన్నీ ఆదినుంచి ఉన్నట్లే కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు జరిగినవే ఇక ముందూ ఎల్లప్పుడూ జరుగుతాయి. ఆ జీవితంలో కొత్తదంటూ ఏదీ లేదు.
ECC 1:10 ఎవరైనా, “చూడండి, ఇదిగో ఇది కొత్తది” అని చెప్పవచ్చుగాక. కాని, అది ఎప్పుడూ ఇక్కడ ఉన్నదే. మనం పుట్టక ముందు అది ఇక్కడ ఉన్నదే!
ECC 1:11 పూర్వం ఎప్పుడో జరిగిన విషయాలు మనుష్యులకి గుర్తుండవు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు భవిష్యత్తులో జనానికి గుర్తుండవు. దానికి తర్వాత, అప్పటివాళ్లకి, తమ పూర్వపు వాళ్లు చేసిన పనులు గుర్తుండవు.
ECC 1:12 ప్రసంగి అనే ఉపదేశకుడినైన నేను యెరూషలేములోని ఇశ్రాయేలు రాజును.
ECC 1:13 నేను విద్యను అభ్యసించి, దానివల్ల లభ్యమైన జ్ఞానాన్ని ఈ జీవితంలో జరిగే అన్ని విషయాలనూ అవగాహన చేసుకొనేందుకు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలో, ఇది దేవుడు మనకి అప్పగించిన చాలా కఠినమైన పని అని నేను గ్రహించాను.
ECC 1:14 ఈ భూమి మీద జరిగేవాటన్నింటినీ నేను పరిశీలనగా చూశాను. అవన్నీ వ్యర్థమని గ్రహించాను. అది గాలిని మూటగట్ట ప్రయత్నించడం వంటిది.
ECC 1:15 (వీటిని వేటినీ మనం మార్చలేము.) వంకరగా వున్నదాన్ని అది తిన్నగా వుందని మనం చెప్పలేము. ఏదైనా ఒకటి అక్కడ లేనప్పుడు అది అక్కడ వుందని మనం చెప్పలేము.
ECC 1:16 “నేను చాలా తెలివైనవాడిని. నాకంటె ముందు యెరూషలేమును పాలించిన రాజులందరికంటె నేను వివేకవంతుడిని. వివేకం, జ్ఞానం వీటి గూర్చి నాకు తెలుసు!” అని నాలో నేను అనుకున్నాను.
ECC 1:17 వివేకం, జ్ఞానం వెర్రితనం మరియు బుద్ధి తక్కువ ఆలోచనలు చెయ్యడంకంటె ఎలా మెరుగైనవో తెలుసుకోవాలని తీర్మానించుకున్నాను. కాని, ఆ క్రమంలో వివేకం సంపాదించ ప్రయత్నించడం గాలిని పోగుచేసి, మూటగట్ట ప్రయత్నించడం వంటిదేనని నేను గ్రహించాను.
ECC 1:18 వివేకం పెరిగే కొద్ది మనిషికి నిరాశా నిస్పృహలు పెరుగుతాయి. వివేకం పెరిగిన మనిషి మరింత దుఃఖాన్ని కూడగట్టుకుంటాడు.
ECC 2:1 నాలో నేను, “నేను సరదాగా గడపాలి. నేను నా శాయశక్తులా సమస్త సుఖాలూ అనుభవించాలి” అనుకున్నాను. కాని, అది కూడా నిష్ప్రయోజనమైన పనే అని గ్రహించాను.
ECC 2:2 (ఎల్లప్పుడు) సరదాగా నవ్వుతూ గడపడం మూర్ఖత్వం. సరదాగా గడిపేయడం ద్వారా కలిగే మేలేమీ లేదు.
ECC 2:3 అందుకని, కడుపునిండా ద్రాక్షారసం తాగుతూ మనస్సును జ్ఞానంతో నింపుదామని అనుకున్నాను. సంతోషంగా వుండాలన్న ప్రయత్నంలో నేనీ మూర్ఖత్వానికి చోటిచ్చాను. తమ స్వల్పకాల జీవితంలో జనానికి ఏది మంచిదో కనుక్కోవాలనుకున్నాను.
ECC 2:4 అప్పుడిక నేను పెద్ద పెద్ద పనులు చెయ్య నారంభించాను. నేను నాకోసం భవనాలు కట్టించాను. ద్రాక్షాతోటలు నాటించాను.
ECC 2:5 తోటలు వేయించాను, ఉద్యానవనాలు నెలకొల్పాను. నేను రకరకాల పండ్ల చెట్లు నాటించాను.
ECC 2:6 నేను నాకోసం నీటి మడుగులు తవ్వించి, వాటిలోని నీటిని పెరుగుతున్న చెట్లకు పోసేందుకు వినియోగించాను.
ECC 2:7 నేను మగ, ఆడ బానిసలను ఖరీదు చేశాను. నా భవనంలోనే కొందరు బానిసలు పుట్టారు. నాకు బోలెడు గొప్ప వస్తువులు ఉన్నాయి. నాకు పశువుల మందలు, గొర్రెల మందలు ఉన్నాయి. యెరూషలేములో ఏ ఒక్కనికన్న నాకు ఎక్కువ వస్తువులు ఉన్నాయి.
ECC 2:8 నేను దండిగా వెండి బంగారాలు కూడబెట్టాను. ఆయా రాజుల, రాజ్యాల సంపదలను కొల్లగొట్టాను. నా ఆస్థానంలో గాయనీ, గాయకులు ఉన్నారు. నేను ఏ ఒకరినైన కోరుకోగలను.
ECC 2:9 నేను బాగా ధనవంతుణ్ణీ, కీర్తిమంతుణ్ణీ అయ్యాను. యెరూషలేములో నా వెనుకటి వారందరికంటె నేను గొప్పవాడినయ్యాను. పోతే, నా జ్ఞానం వివేకం నాకు సహాయం చేశాయి.
ECC 2:10 నేను చూసి, కోరుకున్నదల్లా నేను పొందాను. నేను చేసినవన్నీ నా మనస్సుకి తృప్తిని కలిగించాయి. నేను చేసిన శ్రమ అంతటికీ ప్రతిఫలం నా ఈ ఆనందమే.
ECC 2:11 అయితే, అటు తర్వాత నేను చేసినవాటన్నింటినీ నేనొకసారి సమీక్షించుకున్నాను. నేను పడ్డ శ్రమ అంతటినీ బేరీజు వేసుకున్నాను. అదంతా వృథా శ్రమ అన్న నిర్ణయానికి వచ్చాను! అది గాలిని మూట కట్టుకొనే ప్రయత్నంలాంటిది. ఈ జీవితంలో మనం చేసే పనులన్నింటి వల్లా మనం పొందే లాభం ఏమీ లేదు.
ECC 2:12 ఒక రాజు చేయగలినదానికంటె ఎక్కువ మరొక డెవడూ చేయలేడు. నీవీనాడు చేయాలని కోరుకో గలవాటన్నింటినీ ఏదో ఒక రాజు ఎన్నడో చేసేవున్నాడు. (రాజు చేసేపనులు సైతం కూడా వ్యర్థమేనని నేను గ్రహించాను.) అందుకని జ్ఞానార్జన గురించీ, మూర్ఖపు పనులు, మతిలేని పనులు చేయడం గురించీ నేను మరోసారి ఆలోచించ నారంభించాను.
ECC 2:13 చీకటి కంటే వెలుగు మెరుగైనట్లే, మూర్ఖత్వంకంటె జ్ఞానం మెరుగైనదని నేను గ్రహించాను.
ECC 2:14 అదెలాగంటే: తెలివైనవాడు తానెక్కడికి వెళ్తన్నది గ్రహించేందుకు తన మనస్సును కళ్లలా ఉపయోగించుకుంటాడు. కాగా, ఒక మూర్ఖుడు అంధకారంలో నడుస్తున్న వ్యక్తి వంటివాడు. అయితే, బుద్ధిమంతుడిది, బుద్ధిహీనుడిది కూడా ఒకటే గతి అని నేను గ్రహించాను. (ఇద్దరూ మరణిస్తారు)
ECC 2:15 నాలో నేను ఇలా అనుకున్నాను, “ఒక బుద్ధిహీనుడికి పట్టే గతే నాకూ పడుతుంది. మరి జ్ఞానార్జన కోసం నేనెందుకు అంతగా తంటాలు పడినట్లు?” నేనింకా ఇలా అనుకున్నాను: “జ్ఞానార్జనకూడా ప్రయోజనం లేనిదే.”
ECC 2:16 జ్ఞానవంతుడూ, అజ్ఞానీ ఇద్దరూ మరణిస్తారు! మరి జనం వివేకినీ శాశ్వతంగా గుర్తుంచుకోరు, అవివేకినీ శాశ్వతంగా గుర్తుంచుకోరు. భవిష్యత్తులో, వాళ్లు చేసిన పనులన్నింటినీ మరచిపోతారు. కాగా వాస్తవంలో వివేకికీ, అవివేకికీ మధ్య తేడా యేమీ లేదు.
ECC 2:17 దీనితో నాకు జీవితం పట్ల ద్వేషం కలిగింది. ఈ జీవితంలో అన్నీ వ్యర్థమైనవే, గాలిని మూట కట్టుకొన ప్రయత్నించడం వంటివే అనిపించి, నాకు విచారం కలిగింది.
ECC 2:18 దానితో, నేను వెనక చేసిన గట్టి శ్రమ అంతటినీ ద్వేషించనారంభించాను. నేను గట్టి కృషిచేశాను. అయితే, నా కృషిఫలితాలను నా తర్వాత తరాలవాళ్లు అనుభవిస్తారని గ్రహించాను. నేను వాటిని నాతో తీసుకుపోలేను.
ECC 2:19 నేను వేటికోసం అధ్యయనం చేశానో, వేటి కోసం పాటుపడ్డానో, వాటన్నింటిపైనా మరొకడెవడో అదుపు కలిగివుంటాడు. అతడు వివేకి అవుతాడో, అవివేకి అవుతాడో నాకు తెలియదు. ఇది కూడ తెలివి లేనిది.
ECC 2:20 అందుకని, నేను చేసిన శ్రమ అంతా నాకు విచారమే కలిగించింది.
ECC 2:21 తన వివేకం, జ్ఞానం, నైపుణ్యం వీటన్నింటనీ వినియోగించి ఒకడు బాగా కష్టించి పని చేయవచ్చు. కాని, అతను మరణిస్తాడు, అతని శ్రమ ఫలితాలన్నింటిని ఇతరులు పొందుతారు. వాళ్లు ఏ శ్రమా చెయ్యలేదు. కాని, వాళ్లకి అన్నీ లభ్యమవుతాయి. ఇది నాకు చాలా విచారం కలిగిస్తుంది. ఇది అన్యాయమే కాదు, అర్థరహితం కూడా.
ECC 2:22 ఒక మనిషి ఈ జీవితంలో నానా తంటాలూపడి, ఎంతో శ్రమ చేస్తాడు. చివరికి అతని చేతికి చిక్కేదేమిటి?
ECC 2:23 చచ్చేదాకా అతను అనుభవించేది బాధలు, నిరాశా నిస్పృహలు, చేసేది (గొడ్డు) చాకిరీ. రాత్రి పూటకూడా మనిషి మనస్సు విశ్రాంతికి నోచు కోదు. ఇది కూడా అర్థరహితమైనదే.
ECC 2:24 జీవితంలో సుఖాలు అనుభవించేందుకు నాకంటె ఎక్కువగా ప్రయత్నించిన మనషి మరొకడెవడైనా ఉన్నాడా? లేడు! నేను గ్రహించిన దేమిటంటే: మనిషి చెయ్యగలిగిన అత్యుత్తమమైన పని యేమిటంటే, తినడం, తాగడం, తాను చేసి తీరవలసిన పనిని సరదాగా చెయ్యడం. దేవుని ఆదేశం కూడా ఇదేనని నేను గ్రహించాను.
ECC 2:26 మనిషి మంచి చేసి, దేవుణ్ణి సంతృప్తి పరిస్తే, అప్పుడిక దేవుడు ఆ మనిషికి వివేకాన్నీ, జ్ఞానాన్నీ, సుఖసంతోషాలనీ అనుగ్రహిస్తాడు. అయితే, పాపాలు చేసేవాడికి దేవుడు ప్రయాసపడే పని, పోగు చేసే పని, కుప్పలుగా పోసే పని మాత్రమే ఇస్తాడు. దేవుడు చెడ్డవానినుంచి తీసుకొని మంచివానికి ఇస్తాడు. అయితే, ఈ పని అంతా వ్యర్థమైనదిగానూ, గాలిని మూటకట్టుకొనే ప్రయత్నంగానూ కనిపిస్తుంది.
ECC 3:1 ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది. ఈ భూమి మీద ప్రతీది సరైన సమయంలో సంభవిస్తుంది.
ECC 3:2 పుట్టేందుకొక సమయం వుంది, చనిపోయేందుకొక సమయం వుంది. మొక్కలు నాటేందుకొక సమయం వుంది, మొక్కలు పెరికేందుకొక సమయం వుంది.
ECC 3:3 చంపేందుకొక సమయం వుంది, గాయం మాన్పేందుకొక సమయం వుంది. నిర్మూలించేందుకొక సమయం వుంది, నిర్మించేందుకొక సమయం వుంది.
ECC 3:4 ఏడ్చేందుకొక సమయం వుంది, నవ్వేందుకొక సమయం వుంది. దుఃఖించేందుకొక సమయం వుంది. సంతోషంతో నాట్య మాడేందుకొక సమయం వుంది.
ECC 3:5 ఆయుధాలు పడవేసేందుకొక సమయం వుంది, వాటిని తిరిగి చేపట్టేందుకుకొక సమయం వుంది. ఒకరిని కౌగిలించు కొనేందుకొక సమయం వుంది, ఆ కౌగిలిని సడలించేందుకొక సమయం ఉంది.
ECC 3:6 దేన్నయినా వెదికేందుకొక సమయం వుంది, అది పోగొట్టుకొనేందుకొక సమయం వుంది. వస్తువులు పదిల పర్చు కొనే సమయం వుంది, వాటిని పారవేసే సమయం వుంది.
ECC 3:7 వస్త్రం చింపేందుకొక సమయం వుంది, దాన్ని కుట్టేందుకొక సమయం వుంది. మౌనానికొక సమయం వుంది. మాట్లాడేందు కొక సమయం వుంది.
ECC 3:8 ప్రేమించేందుకొక సమయం వుంది, ద్వేషించేందుకొక సమయం వుంది. సమరానికొక సమయం వుంది, శాంతికొక సమయం వుంది.
ECC 3:9 మనిషి చేసే కష్ట భూయిష్టమైన పనికిగాను అతనికి నిజంగా ఏమైనా లభిస్తుందా? (ఉండదు!)
ECC 3:10 చేసేందుకు దేవుడు మనకిచ్చే కష్ట భూయిష్టమైన పనులన్నీ ఏమిటో నేను గుర్తించాను.
ECC 3:11 తన జగత్తును గురించి ఆలోచించే సామర్థ్యాన్ని దేవుడు మనకి యిచ్చాడు. అయితే దేవుడు చేసే వాటన్నింటినీ మనం ఎన్నడూ పూర్తిగా తెలుసు కోలేము. అయితేనేమి, దేవుడు అన్ని పనుల్నీ సరిగ్గా సరైన సమయంలోనే చేస్తాడు.
ECC 3:12 తాము బతికినంత కాలము సంతోషంగా ఉండటం, తనివితీరా సుఖాలు అనుభవించడం ఇవి మనుష్యులు చేయవలసిన అత్యుత్తమమైన పని అన్న విషయం నేను గ్రహించాను.
ECC 3:13 ప్రతి మనిషి తినాలి, తాగాలి, తాను చేసే పనిని ఆహ్లాదంగా చెయ్యాలి ఇది దేవుడు కోరుకునేది. ఇవి దేవుడిచ్చిన వరాలు.
ECC 3:14 దేవుడు చేసేది ప్రతీది శాశ్వతంగా కొనసాగు తుందని నేను తెలుసుకున్నాను. దేవుడు చేసినదానికి మనుష్యులు దేన్నీ ఎంతమాత్రం జోడించలేరు మరియు దేవుడు చేసే పనినుండి దేనినీ తీసుకొనలేరు. మనుష్యులు తనని గౌరవించేందుకే దేవుడు ఇదంతా చేశాడు.
ECC 3:15 గతంలో జరిగినవేవో జరిగాయి, (మరి మనం వాటిని మార్చలేము.) భవిష్యత్తులో జరగ బోయేవేవో జరుగుతాయి. (మనం వాటిని మార్చలేము) అయితే, ఎవరైతే చెడ్డగా చూడబడ్డారో, వారికి దేవుడు మంచి చెయ్యాలని కోరుకుంటాడు.
ECC 3:16 ఈ ప్రపంచములో యీ విషయాలన్నీ నేను చూశాను. న్యాయ స్థానాల్లో మంచితనము, న్యాయము నిండుగా ఉండాలి, అయితే అక్కడ మనం కను గొంటుంది చెడుగు.
ECC 3:17 అందుకని, నాలో నేను ఇలా అనుకున్నాను: “దేవుడు ప్రతి పనికి ఒక కాలాన్ని ఎంచుకున్నాడు. అంతేకాదు, మనుష్యులు చేసే పనులన్నింటిని విచారించేందుకు దేవుడు ఒక ప్రత్యేక కాలాన్ని ఎంచుకున్నాడు. దేవుడు మంచివాళ్లని విచారిస్తాడు, చెడ్డవాళ్లని విచారిస్తాడు.”
ECC 3:18 మనుష్యులు ఒకరిపట్ల మరొకరు వ్యవహరించే తీరును గమనించిన నేను నాలో నేనిలా అనుకున్నాను, “తాము జంతువుల మాదిరిగా వున్నామన్న విషయాన్ని మనుష్యులు గమనించాలని దేవుడు కోరుకున్నాడు.
ECC 3:19 మనిషి జంతువుకంటే మెరుగైనవాడా? (కాడు) ఎందుకని? ఎందుకంటే, అన్ని నిష్ర్పయోజనం కనుక. మనుష్యులూ మరణిస్తారు. జంతువులూ మరణిస్తాయి. ఒకే ‘ఊపిరి’ మనుష్యుల్లోనూ, జంతువుల్లోనూ ఉన్నది. చనిపోయిన జంతువుకి, మనిషికి మధ్య తేడా ఏమైనా ఉందా?
ECC 3:20 అన్ని ఒక్క చోటుకే పోతాయి. అవి ఏ మట్టినుంచి పుట్టాయో చివరికి ఆ మట్టిలోకే పోతాయి.
ECC 3:21 మనిషి ఆత్మకి ఏమి జరుగుతుందో ఎవరికెరుక? జంతువు ఆత్మ పాతాళానికి పోతే, మనిషి ఆత్మ పైకి దేవుని దగ్గరికి వెళ్తుందేమో ఎవరికి తెలుసు?”
ECC 3:22 అందుకని, మనిషి తాను చేసే పనిలో ఆనందం పొందడమే అత్యుత్తమమైనదని నేను గ్రహించాను. అదే వాళ్ల భాగ్యం. (మరో విషయంయేమంటే, భవిష్యత్తు గురించి మనిషి దిగులు పెట్టుకోకూడదు.) ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు మనిషికి ఎవ్వరూ తోడ్పడలేరు.
ECC 4:1 నేను చూసిన మరో విషయం ఏ మిటంటే, చాలా మంది సరిగ్గా చూడరు. వాళ్లు కన్నీళ్లు పెట్టు కోవడం నేను చూశాను. ఆ విచారగ్రస్తుల్ని ఓదార్చే వాళ్లు ఎవరూ లేరన్న విషయం, క్రూరులైనవాళ్ల చేతుల్లోనే అధికారమంతా ఉందన్న విషయం కూడా నేను గమనించాను. ఆ క్రూరుల చేతుల్లో బాధలుపడేవాళ్లకు ఉపశమనం కలిగించే వాడెవడూ లేడని నేను గమనించాను.
ECC 4:2 ఇంకా బతికున్నవాళ్ల కంటె చనిపోయిన వాళ్ల పరిస్థితులే మెరుగ్గా ఉన్నాయని నేను తీర్మానించు కున్నాను.
ECC 4:3 (పురింట్లోనే చనిపోయే వాళ్ల) పరిస్థితి అంతకంటే కూడా మెరుగ్గా ఉంది! ఎందుకంటే, ఈ ప్రపంచంలో జరిగే ఏ చెడుగునూ వాళ్లెన్నడూ చూడరు.
ECC 4:4 తర్వాత నేనిలా అనుకున్నాను, “మనుష్యులు మరింత కష్టపడి పనిచేస్తారెందుకు?” కొందరు విజయం సాధించి ఇతరులకంటె మెరుగవాలని ప్రయత్నించడం నేను చూశాను. ఎందుకంటే, వాళ్లలో ఈర్ష్య ఉంది. తమకి ఉన్నదానికంటె ఇతరులు అధికంగా కలిగివుండటం వాళ్లకి ఇష్టం లేదు. ఇది కూడా బుధ్ది హీనత. ఇది గాలిని మూట కట్టుకొనే ప్రయత్నం.
ECC 4:5 కొందరు ఇలా అంటారు: “ఏమీ చెయ్యకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం మూర్ఖత్వం. మీరు పనిచెయ్యకపోతే పస్తులుండి చస్తారు.”
ECC 4:6 బహుశాః ఈ మాట నిజమే కావచ్చు. మరికొన్ని సంపాదించు కోవాలని సదా తంటాలు పడటం కంటె, ఉన్న కొద్దివాటితో తృప్తి చెందడం మెరుగని నా ఉద్దేశం.
ECC 4:7 మతిమాలిన మరో విషయం నేను గమనించాను,
ECC 4:8 ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి కుటుంబం ఉండకపోవచ్చు. ఒక కొడుకో, ఒక సోదరుడో ఉండక పోవచ్చు. అయితేనేమి, అతను రెక్కలు విరుచుకొని అతిగా పని చేస్తూనే ఉంటాడు. తనకి ఉన్నదానితో అతను ఎన్నడూ తృప్తిచెందడు. అతను నిర్విరామంగా కష్టించి పనిచేసి, “నేనిలా ఎందుకు రెక్కలు విరుచుకొని పనిచేస్తున్నట్లు? నేను నా జీవితాన్ని హాయిగా ఎందుకు గడపకూడదు?” అని అడగడు. ఇది కూడా చెడ్డదే అర్థరహితమైనదే.
ECC 4:9 ఒకరికంటె ఇద్దరు మెరుగు. ఇద్దరు కలిసి పనిచేస్తే, తాము చేసే పనికి ఎక్కువ ప్రతిఫలం పొందుతారు.
ECC 4:10 ఒకడు పడిపోతే రెండోవాడు అతనికి సహాయం చెయ్యగలుగుతాడు. ఒంటరిగాడు పడి పోయినప్పుడు అతను నిస్సహాయుడవుతాడు. అక్కడ అతనికి సాయిపడేవాడు ఎవడూ వుండడు.
ECC 4:11 ఇద్దరు జంటగా పడుకుంటే, వాళ్లకి వెచ్చగా ఉంటుంది. ఒంటిరిగా నిద్రించేవాడికి వెచ్చదనం ఉండదు.
ECC 4:12 ఒంటరి వ్యక్తిని శత్రువు ఓడించగలుగుతాడు. అయితే, అదే శత్రువు ఇద్దర్ని ఓడించలేడు. అదే ముగ్గురుంటే, ఇంకా ఎక్కువ బలం కలిగివుంటారు. ముప్పేట తాడును తెంచలేనట్లే, వాళ్లని దెబ్బతియ్యడం చాలా కష్టసాధ్యమవుతుంది.
ECC 4:13 వృద్ధుడే అయినా బుద్ధిహీనుడైన రాజుకంటె, బీదవాడే అయినా బుద్ధిశాలి అయిన యువ నాయకుడు మేలు. ఆ ముసలి రాజు హెచ్చరికలను చెవిన పెట్టడు.
ECC 4:14 ఆ యువ రాజు రాజ్యంలో పేదవాడై పుట్టి ఉండవచ్చు. బహుశాః అతను చెరనుండి బయటకు వచ్చిన రాజు అవ్వొచ్చు.
ECC 4:15 నేనీ ప్రపంచంలో మనుష్యుల్ని పరిశీలించాను. నాకీ విషయం తెలుసు: జనం ఆ యువకుణ్ణే అనుసరిస్తారు. అతనే కొత్త రాజు అవుతాడు.
ECC 4:16 తండోపతండాలుగా జనం అ యువకుణ్ణి అనుసరిస్తారు. అయితే, దరిమిలా, ఆ జనమే అతనంటే ఇష్టపడరు. ఇది అర్థరహితమే. ఇది గాలిని మూటగట్ట ప్రయత్నించడం లాంటిదే.
ECC 5:1 దేవుణ్ణి ఆరాధించేందుకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మూఢ జనం మాదిరిగా బలులు ఇవ్వడం కంటె (దైవవాణిని) వినడం మేలు. మూఢులు తరచు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. వాళ్లకి తమ పనులు చెడ్డవని కూడా తెలియదు.
ECC 5:2 దేవునికి మీరు మొక్కులు మొక్కేటప్పుడు మీరు జాగ్రత్తగా వహించండి. దేవునికి మీ సమర్పణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆవేశంలో తొందరపడి నోరుజారకండి. దేవుడు పైన పరలోకంలో ఉన్నాడు, మీరు క్రింద భూమిమీద వున్నారు. అందుకని దేవునికి వేడుకొనుట కొద్దిగా మాత్రమే మీరు చెయ్యండి. (ఈ కింది లోకోక్తి లోని వాస్తవాన్ని గమనించండి)
ECC 5:3 అధిక వ్యాకుల మనస్కులు పీడకలలు కంటారు, బుద్ధిహీనులు అతిగా వాగుతారు.
ECC 5:4 దేవునికి నువ్వేదైనా మొక్కకుంటే, దాన్ని చెల్లించు. నువ్వు మొక్కుకున్నదాన్ని చెల్లించడంలో ఆలస్యం చేయకు. బుద్ధిహీనుల విషయంలో దేవుడు ప్రసన్నుడు కాడు. దేవునికి ఇస్తానన్నదాన్ని నువ్వాయనకి ఇయ్యి.
ECC 5:5 ఏదైనా వాగ్దానం చేసి దాన్ని చేయలేక పోవడం కంటె, అసలేమి మొక్కుకోక పోవడమే మేలు.
ECC 5:6 అందుకని, నీ మాటలు పాపకారణం కాకుండా చూసుకో. “నేను అన్న మాట అర్థం అది కాదు!” అని నీ యాజకుడితో చెప్పబోకు. నువ్వాపని చేస్తే, దేవునికి నీ మాటల పట్ల కోపం రావచ్చు, నువ్వు శ్రమించి సాధించిన దాన్నంతటినీ నాశనం చెయ్యవచ్చు.
ECC 5:7 నీ పనికిమాలిన స్వప్నాలూ, బీరాలూ (నీకు హాని కలిగించకుండా) చూసుకో. నువ్వు దేవుని పట్ల భక్తి కలిగి ఉండు.
ECC 5:8 ఏ దేశమైనా తీసుకో. బీదవాళ్లు రెక్కలు ముక్కలు చేసుకొని పని చేయక గత్యంతరం లేని పరిస్థితి నువ్వు చూస్తావు. బీదల విషయంలో ఇది అన్యాయ వర్తన అని, బీదల హక్కులకు ఇది విరుద్ధమని నువ్వు చూడగలుగుతావు. అయితే, నువ్విందుకు ఆశ్చర్యపడబోకు! వాళ్లచేత అలా బలవంతాన పనిచేయించే అధికారి పైన, మరో అధికారి ఉంటాడు. ఈ ఇద్దరు అధికారులపైనా పెత్తనం చలాయించి పనిచేయించే మరో పై అధికారి వుంటాడు.
ECC 5:9 రాజు కూడా బానిసే. అతడి రాజ్యం అతని యజమాని.
ECC 5:10 డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు తనకి ఉన్న డబ్బుతో ఎన్నడూ తృప్తి చెందడు. ఐశ్వర్యాన్ని ప్రేమించేవాడు తనికి ఇంకా ఇంకా వచ్చి పడినా తృప్తి చెందడు. ధన వ్యామోహం కూడా అర్థరహిత మైనదే.
ECC 5:11 ఒక వ్యక్తికి ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే, దాన్ని ఖర్చు పెట్టడంలో తోడ్పడే “మిత్రులు” అంత ఎక్కువ మంది ఉంటారు. దానితో, వాస్తవంలో ఆ ధనికుడు పొందే లాభమేమీ ఉండదు. అతను తన సంపదని చూసుకుని మురిసిపోగలడు. అంత మాత్రమే.
ECC 5:12 రోజంతా చెమటోర్చి కష్టపడేవాడు యింటికి తిరిగి వచ్చి తక్కువగా తిన్నా లేక ఎక్కువగా తిన్నా నిశ్చింతగా నిద్రపోతాడు. శ్రమజీవికి తినేందుకు కొంచెమే వున్నా, ఎక్కువ వున్నా అతనికి అదేమంత ముఖ్యంకాదు. కాని, ధనికుడికి తన సంపద విషయంలో బెంగతో నిద్రపట్టదు.
ECC 5:13 ఈ ప్రపంచంలో చాలా విచారకరమైన విషయం ఒకటి నేను గమనించాను. ఒకడు భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేస్తాడు.
ECC 5:14 తర్వాత ఏదో విపత్తు వచ్చి, తన ఆస్తి సర్వస్వం కోల్పోతాడు. అప్పుడిక తన కొడుక్కి ఇచ్చేందుకు అతని దగ్గర గుడ్డి గవ్వకూడా మిగలదు.
ECC 5:15 తల్లి గర్భం నుంచి వ్యక్తి పుట్టినప్పుడు అతని దగ్గర ఏమీ ఉండదు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు తనతో తీసుకెళ్లేది ఏమీ ఉండదు. అతను ఆయా వస్తువుల కోసం చచ్చేలా శ్రమిస్తాడు. కాని, తాను చనిపోయి నప్పుడు అతను తన వెంట తీసుకువెళ్ల గలిగింది ఏమీ ఉండదు.
ECC 5:16 ఇది చాలా విచారకరమైన విషయం. తను ఈ లోకంలోకి ఎలా వస్తాడో అలాగే పోతాడు. కాగా, “గాలిని మూటగట్టుకొనేందుకు చేసే ప్రయత్నం” వల్ల మనిషికి ఒరిగేదేమిటి?
ECC 5:17 దుఃఖంతో, విచారంతో నిండిన రోజులు. నిరాశా నిస్పృహలు అనారోగ్యాలు, చికాకులు చివరికి అతనికి మిగిలేవి ఇవే!
ECC 5:18 ఈ భూమిమీద ఉత్తమమైనది ఏమనగా, తనకున్న స్వల్ప జీవితకాల వ్యవధిలో మనిషి అన్న పానాలు తృప్తిగా సేవించాలి, తన పని ఫలితాన్ని సుఖంగా అనుభవించాలి. దేవుడు అతనికి ఇచ్చినది ఈ కొద్ది రోజులు మాత్రమే అన్న విషయాన్ని దృష్టిలో వుంచు కోవాలి ఇదే మనిషి చేయగలిగినదన్న విషయాన్ని నేను గమనించాను.
ECC 5:19 దేవుడు ఒక వ్యక్తికి సంపదని, ఆస్తిని వాటిని హాయిగా అనుభవించే శక్తినీ ఇస్తే, ఆ వ్యక్తి వాటిని అనుభవించాలి. ఆ వ్యక్తి తనకున్న వాటిని స్వీకరించాలి. దేవుని వరమైన తన పనిని సంతోషంగా చెయ్యాలి.
ECC 5:20 మనిషి ఆయుష్షు సుదీర్గమైనది కాదు కనుక, అతని విషయాలన్నీ తన జీవితం పొడుగునా గుర్తుంచు కోవాలి. ఆ మనిషి ఇష్టంగా చేసే పనిలో దేవుడు అతన్ని నిమగ్నుణ్ణి చేస్తాడు.
ECC 6:1 నేను ఈ ప్రపంచంలో అసమంజసమైన మరో విషయాన్ని గమనించాను. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
ECC 6:2 దేవుడు ఒక మనిషికి గొప్ప సంపద, ఆస్తి మరియు గౌరవమూ ప్రసాదిస్తాడు. అతనికి కావలసినవన్నీ, అతను కోరుకోగలిగిన సమస్తం వుంటాయి. అయితే, ఆ వ్యక్తి వాటిని అనుభవించకుండా చేస్తాడు దేవుడు. ఒక అపరిచితుడు వస్తాడు, వాటన్నింటినీ చేజిక్కించుకుంటాడు. ఇది కూడా అర్థరహితమైన చాలా చెడ్డ విషయమే.
ECC 6:3 ఒక వ్యక్తి దీర్ఘకాలం జీవించవచ్చు. అతనికి వంద మంది సంతానం ఉండవచ్చు. అయితే, ఈ మంచి విషయాలు అతనికి తృప్తి కలిగించలేదనీ, అతని మరణానంతరం ఏ ఒక్కరూ అతన్ని జ్ఞాపకం ఉంచుకోరనీ అనుకోండి, అప్పుడు అతనికంటె పురిట్లోనే చనిపోయే శిశువు మెరుగని నేనంటాను.
ECC 6:4 మృత శిశువుగా పుట్టడం నిజంగానే అర్థరహితం. పేరైనా లేని ఆ శిశువుని చటుక్కున తీసుకుపోయి సూర్యరశ్మి చొరని చీకటి సమాధిలో పూడ్చేస్తారు.
ECC 6:5 సూర్యరశ్మినైనా చూడని ఆ శిశువుకి బొత్తిగా ఏది ఏమాత్రం తెలియదు. కాని, దేవుడు తనకిచ్చిన మంచివాటిని అనుభవించని ఆ మనిషికంటె ఆ శిశువు ఎక్కువ ప్రశాంతిని అనుభవిస్తుంది.
ECC 6:6 ఆ మనిషి రెండు వేల సంవత్సరాలు బతకవచ్చుగాక. అయినా అతను తనకు ఇచ్చిన జీవితాన్ని అనుభవించక పోతే అతనికంటె గర్భంలో చనిపోయిన శిశువు సులభమయిన మార్గంతో ఆ అంత్యదశను పొందిందనవచ్చు.
ECC 6:7 మనిషి చచ్చేలా పాటుపడతాడు తిండి కోసం. అయితే, అతను ఎన్నడూ తృప్తి చెందడు.
ECC 6:8 వివేకవంతుడు అవివేకికంటె విశేషమైనవాడు కాడు. అంత కంటె, ఉన్నదున్నట్లు జీవితాన్ని స్వీకరించడం తెలిసిన బీదవాడు మేలు
ECC 6:9 ఉన్నదానితో తృప్తి చెంది సంతోషంగా ఉండటం ఎప్పుడూ ఇంకా ఇంకా ఏదో కావాలని అశించడం మేలు. ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకోవడం వృధా ప్రయాసం. అది గాలిని మూట గట్టుకొనేందుకు చేసే ప్రయత్నమే.
ECC 6:10 మనిషి ఎందుకు సృష్టింపబడ్డాడు? మనిషిగా ఉండేందుకు మాత్రమే. దీన్ని గురించి చర్చించడం వృధా ప్రయాసమే. దీన్ని గురించి మనిషి దేవునితో చర్చించలేడు. ఎందుకంటే, మనిషికంటె దేవుడు శక్తిమంతుడు. సుదీర్ఘంగా వాదించినంత మాత్రాన ఈ వాస్తవం మారిపోదు.
ECC 6:12 భూమిమీద స్వల్ప కాలం జీవించే మనిషికి, ఆ స్వల్ప కాలంలో అతనికి ఏది అత్యుత్తమమైనదో ఎవరికి తెలుస్తుంది? అతని జీవితం నీడలా గడిచిపోతుంది. తర్వాత ఏమి జరుగుతుందో ఎవరూ అతనికి చెప్పలేరు.
ECC 7:1 మంచి పరిమళ ద్రవ్యంకంటె మంచి పేరు (గౌరవం) కలిగివుండటం మేలు. జన్మ దినం కంటె మరణ దినం మేలు.
ECC 7:2 విందుకి పోవడంకంటె, మరణించినవారి అంత్య క్రియలకి హాజరవడం మేలు. ఎందుకంటే, పుట్టిన వాళ్లెవరూ గిట్టకమానరు, బతికున్న ప్రతివాడు ఈ విషయం గుర్తుంచుకోవాలి.
ECC 7:3 నవ్వుకంటె దుఃఖం మరింత మేలు, ఎందుకంటే, మన ముఖం విచారగ్రస్త మైనప్పుడు, మన మనస్సు మెరుగవుతుంది.
ECC 7:4 అవివేకి సరదాగా హాయిగా గడపాలని మాత్రమే ఆలోచిస్తాడు, కాని, వివేకి మృత్యువు గురించి ఆలోచిస్తాడు.
ECC 7:5 మూర్ఖుడి పొగడ్త పొందడం కంటె, వివేకిచే విమర్శింప బడటం మేలు.
ECC 7:6 మూర్ఖుల ఇక ఇకలూ పకపకలూ, కుండ కింద చిటపట మండే ముళ్లలా ఉంటాయి. (కుండ వేడైనా ఎక్కకముందే, ఆ ముళ్లు చురచుర మండి పోతాయి.) ఇది కూడా నిష్ర్పయోజనమే.
ECC 7:7 వడైనా తగినంత డబ్బు ముట్టచెప్పితే వివేక వంతుడైనా తన వివేకాన్ని విస్మరిస్తాడు. ఆ డబ్బు అతని విచక్షణను నాశనం చేస్తుంది.
ECC 7:8 ఏదైనా మొదలెట్టడం కంటె దాన్ని ముగించడం మేలు. అహంభావం, అసహనం కంటె సాధుత్వం, సహనము మేలు.
ECC 7:9 తొందరపడి కోపం తెచ్చుకోకు ఎందుకంటే అది అవివేకం (మూర్ఖులు అవి చేస్తారు)
ECC 7:10 “గడిచి పోయిన రోజులే మేలు” అనబోకు. “అప్పుడు జరిగినదేమిటి?” ఇది అవివేకమైన ప్రశ్న.
ECC 7:11 నీకు ఆస్తితో బాటు జ్ఞానం కూడా ఉంటే మరింత మంచిది. నిజానికి, వివేకవంతులు కావలసిన దానికంటే అధికంగానే ఐశ్వర్యాన్ని పొందుతారు.
ECC 7:12 వివేకవంతుడు సంపన్నుడవగలడు. ధనం అండ అయినట్టే వివేకం అండ అవుతుంది. కాని జ్ఞానంయొక్క ప్రయోజనం ఏమంటే, వివేకం తన యజమానికి అండ అవుతుంది.
ECC 7:13 దేవుడు చేసినవాటిని పరిశీలించి చూడండి. వాటిలో ఏదైనా ఒకటి పొరపాటైనదని నువ్వు అనుకున్నా వాటిలో ఏ ఒక్కదాన్ని నువ్వు మార్చలేవు!
ECC 7:14 రోజులు బాగున్నప్పుడు, నువ్వు దాన్ని అనుభవించు. కాని, రోజులు బాగుండనప్పుడు, దేవుడు మనకి మంచి రోజులు, చెడ్డ రోజులు వ్రాసి పెట్టాడన్న విషయం మరచిపోకు. ముందేమి జరుగుతుందో ఏ ఒక్కరికీ తెలియదు.
ECC 7:15 నా స్వల్ప జీవిత కాలంలో నేను అన్ని చూశాను. మంచివాళ్లు చిన్న వయస్సులోనే మరణించడం చూశాను. చెడ్డవాళ్లు సుదీర్ఘకాలం జీవించడం చూశాను.
ECC 7:16 అందుకని అ కాలంగా నిన్ను నువ్వే చంపుకోవడం దేనికి? అతి మంచిగా కాని, అతి చెడ్డగా కాని ఉండకు. అతి తెలివిగా కాని అతి మూర్ఖంగా కాని ఉండకు. నీ ఆయువు తీరక ముందే నువ్వెందుకు చనిపోవాలి?
ECC 7:18 దీనిని పట్టుకో గాని దానిని చేయి విడువకుండా ఉండటం మేలు. దేవునికి భయపడేవారు కూడా కొన్ని మంచికార్యాలు, కొన్ని చెడ్డకార్యాలు చేస్తారు.
ECC 7:19 ఎప్పుడు మంచి పనులే చేసి, ఎన్నడూ పాపాలు చేయని మంచివాడంటూ లేడని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్ఞానం మనిషికి శక్తిని చేకూరుస్తుంది. నగరంలో పదిమంది (మూర్ఖులైన) నాయకులకంటె ఒక్క వివేకవంతుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు.
ECC 7:21 జనం చెప్పే మాటలన్ని చెవిని చొరనీయకు. నీ స్వంత నౌకరే నీ గురించి చెడ్డ మాటలు చెప్పడం నువ్వు వినవచ్చు.
ECC 7:22 నీవు కూడా అనేకసార్లు యితరులను గురించి చెడ్డ మాటలు చెప్పియుండ వచ్చునని నీకు తెలుసు.
ECC 7:23 నేను నా వివేకాన్ని వినియోగించి, ఈ విషయాలన్నింటిని గురించి ఆలోచించాను. నేను సరైన వివేకిగా వుండాలని కోరుకున్నాను. కాని అది దుస్సాధ్యం.
ECC 7:24 విషయాలెందుకిలా ఉన్నాయో నేను అర్థం చేసుకోలేను. దాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా చాలా కష్టమే.
ECC 7:25 నేను అధ్యయనం చేసి, సరైన జ్ఞానాన్ని అన్వేషించేందుకు చాలా గట్టి ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్కదానికి హేతువును కనుక్కునేందుకు నేను ప్రయత్నించాను. (నేనేమి తెలుసుకున్నాను?) చెడ్డగా ఉండటం మూర్ఖత్వమనీ, మూర్ఖంగా వ్యవహరించడం పిచ్చితనమనీ నేను తెలుసుకున్నాను.
ECC 7:26 (కొందరు) స్త్రీలు వలల మాదిరిగా ప్రమాద కారులు అన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ల హృదయాలు వలల్లాంటివి, వాళ్ల చేతులు గొలుసుల్లాంటివి. ఆ స్త్రీల చేతుల్లో చిక్కడం మరణం కంటె హీనం. దేవుణ్ణి అనుసరించే వ్యక్తి అలాంటి స్త్రీలనుండి పారిపోతాడు. అయితే, పాపులు సరిగ్గా వాళ్లకే చిక్కుతారు.
ECC 7:27 ప్రసంగి ననే నేను చెప్పేదేమిటంటే, “వీటన్నింటికీ సమాధానాలు కనుగొనగలనేమోనని నేను పై విషయాలన్నీ మొత్తంగా పరిశీలించాను. సమాధానాల కోసం నేనిప్పటికీ అన్వేషిస్తూనే వున్నాను. అయితే, నేను కనుగొన్నది ఇది: నాకు వెయ్యి మందిలో ఒక్క మంచి మగాడు కనిపించగా, వెయ్యి మందిలో ఒక్క మంచి స్త్రీ కూడా కనిపించలేదు.
ECC 7:29 “నేను తెలుసుకున్న మరో విషయం: దేవుడు మనుష్యుల్ని నిజాయితీగల (మంచి) వాళ్లుగా సృష్టించాడు. కాని, మనుష్యులు చెడ్డగా ఉండేందుకు అనేక మార్గాలు కనుగొన్నారు.”
ECC 8:1 ఆయా విషయాలను ఒక జ్ఞాని అర్థం చేసుకుని, వివరించి చెప్పగలిగినట్లు మరొకరెవరూ చెయ్య లేరు. అతని జ్ఞానం అతనికి ఆనందాన్నిస్తుంది. జ్ఞానంవల్ల ముఖంలో విచారం తొలగి, ఆనందం చోటు చేసుకుంటుంది.
ECC 8:2 నేను చెప్పేదేమిటంటే, నువ్వు ఎల్లప్పుడూ రాజాజ్ఞను పాలించాలి. నువ్వు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కనుక నువ్వీ పని చెయ్యాలి.
ECC 8:3 రాజుకి సలహాలు ఇచ్చేందుకు భయపడకు. చెడ్డదాన్ని దేన్ని సమర్థించకు. కాని ఒక విషయం గుర్తుంచుకో: రాజు తనకు సంతోషం కలిగించే ఆజ్ఞలు ఇస్తాడు.
ECC 8:4 రాజుకి ఆజ్ఞలు ఇచ్చే అధికారం ఉంది. రాజు ఏమి చెయ్యాలో అతనికి ఎవరూ చెప్పలేరు.
ECC 8:5 రాజాజ్ఞను పాటించే వ్యక్తి క్షేమంగా వుంటాడు. అయితే, వివేకవంతుడికి ఈ పని చేయవలసిన సరైన తరుణం ఏదో, ఆ సరైన పని ఎప్పుడు చెయ్యాలో తెలుస్తుంది.
ECC 8:6 మనిషి ఏ పనైనా చెయ్య వలసినప్పుడు, దానికి సరైన సమయం, సరైన మార్గం వుంటాయి. (ప్రతి వ్యక్తీ ప్రయత్నించి, తాను చెయ్య వలసింది ఏమిటో నిర్ణయించుకోవాలి.) తనకి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏమి జరుగుతుందో తెలియనప్పుడు కూడా అతనీ పని చెయ్యాలి.
ECC 8:7 ఎందుకంటే, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఏ ఒక్కరూ చెప్పలేరు గనుక.
ECC 8:8 తన ఆత్మ తొలగిపోకుండా నిలుపుకోగల శక్తి ఏ ఒక్కరికి లేదు. తన మృత్యువును ఆపు చేయగల శక్తి ఏ ఒక్కరికీ లేదు. యుద్ధ సమయంలో తన ఇష్టంవచ్చిన చోటుకి పోగల స్వేచ్ఛ సైనికుడికి ఎలా వుండదో, అలాగే ఒక వ్యక్తి పాపం చేస్తే, ఆ పాపం అతన్ని స్వేచ్ఛగా వుండనివ్వదు.
ECC 8:9 నేనీ విషయాలన్నీ గమనించాను. ఈ ప్రపంచంలో జరిగే విషయాలను గురించి నేను తీవ్రంగా ఆలోచించాను. మనుష్యులు ఎప్పుడూ యితరుల మీద అధికారం చలాయించే శక్తిని సంపాదించుకునేందుకు తంటాలు పడుతూ ఉంటారన్న విషయం నేను గమనించాను. ఇది వాళ్లకి చెరుపు చేస్తుంది.
ECC 8:10 దుర్మార్గులకి ఘనంగా అంత్యక్రియలు జరగడం కూడా నేను చూశాను అంత్యక్రియలు ముగించి, మనుష్యులు ఇళ్లకి తిరిగివెళ్లేటప్పుడు, చనిపోయిన దుర్మార్గుణ్ణి గురించి మంచి మాటలు చెప్పడం నేను విన్నాను. ఆ దుర్మార్గులు అనేకానేమైన చెడ్డ పనులు చేసిన పట్టణాల్లో కూడా అర్థరహితమైన పని జరిగింది. అది అర్థరహితమైనది.
ECC 8:11 కొన్ని సందర్భాల్లో, మనుష్యులు చేసిన చెడ్డ పనులకుగాను, వాళ్లు వెంటనే శిక్షింపబడరు. శిక్ష తాపీగా వస్తుంది. దానితో, యితరులకి కూడా చెడ్డ పనులు చెయ్యాలన్న కోర్కె కలుగుతుంది.
ECC 8:12 ఒకానొక పాపి నూరు చెడు పనులు చేసియుండవచ్చు, అతను దీర్గాయుష్షు కలిగియుండవచ్చు. అయినప్పటికీ, దేవుడిపట్ల విధేయత, గౌరవం కలిగివుండటం మేలన్న విషయం నాకు తెలుసు.
ECC 8:13 దుర్మార్గులు దేవుణ్ణి గౌరవించరు. అందుకని, నిజంగానే వాళ్లకి మంచి ఫలితాలు లభించవు. ఆ దుర్మార్గులు దీర్గకాలం జీవించరు. (సూర్యుడు కిందకి వాలిన కొద్ది) పొడుగయ్యే నీడల్లాగా వాళ్ల జీవితాలు దీర్గంకావు.
ECC 8:14 న్యాయంగా కనిపించని మరొకటి కూడా భూమి మీద సంభవిస్తూ ఉంటుంది. చెడ్డవాళ్లకి చెడు, మంచి వాళ్లకి మంచి జరగాలి. కాని, కొన్ని సందర్భాల్లో మంచి వాళ్లకి చెడు, చెడ్డవాళ్లకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇది సరైనది కాదు.
ECC 8:15 అందుకని, జీవితాన్ని హాయిగా అనుభవించడం మరింత మెరగైనదని నేను తీర్మానించుకున్నాను. ఈ ప్రపంచంలో మనుష్యులు చెయ్య గలిగిన అత్యుత్తమమైన పనేమిటంటే, తినడం, తాగడం, జీవితాన్ని హాయిగా అనుభవించడమే. కనీసం అలా చేస్తేనైనా, తమ జీవితకాలంలో దేవుడు తమకిచ్చిన కఠిన శ్రమని మనుష్యులు సరదాగా సంతోషంగా చేసేందుకు అది తోడ్పడుతుంది.
ECC 8:16 ఈ ప్రపంచంలో మనుష్యులు చేసే పనులను నేను శ్రద్ధగా పరిశీలించాను. మనుష్యులు ఎంత హడావుడిగా ఉంటారో నేను చూశాను. వాళ్లు రాత్రింబగళ్లు శ్రమిస్తారు. వాళ్లు దాదాపు నిద్రేపోరు.
ECC 8:17 దేవుడు చేసేవాటిలో అనేకం కూడా నేను చూశాను. ఈ భూమిమీద దేవుడు చేసేదాన్నంతటినీ మనుష్యులు అర్థంచేసుకోలేరు. మనిషి వాటిని అర్థం చేసుకు నేందుకు ఎంతైనా ప్రయత్నించవచ్చు. కాని, అతను అర్థంచేసుకోలేడు. దేవుడు చేసినదాన్ని తాను అర్థం చేసుకున్నానని ఒక జ్ఞాని అనవచ్చు. కాని, అది నిజంకాదు.వాటన్నింటినీ ఏ ఒక్కడూ అర్థం చేసుకోలేడు.
ECC 9:1 నేనీ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించాను. సజ్జనులు, వివేకవంతులు చేసేవాటినీ, వాళ్లకి సంభవించేవాటినీ దేవుడు అదుపుచేస్తాడన్న విషయం నేను గమనించాను. తాము ప్రేమించబడతారో లేక ద్వేషింప బడతారో మనుష్యులకి తెలియదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనుష్యులకి తెలియదు.
ECC 9:2 అయితే, మనుష్యులందరికీ ఉమ్మడి అంశం ఒకటుంది మనుష్యులందరూ మరణించడమే అది! మంచివాళ్లూ మరణిస్తారు, చెడ్డవాళ్లూ మరణిస్తారు. చావు పరిశుద్ధులకీ వస్తుంది అపరిశుద్ధలకీ వస్తుంది. చావు బలులు ఇచ్చేవాళ్లకీ వస్తుంది, ఇవ్వనివాళ్లకీ వస్తుంది. పాపి ఎలా చనిపోతాడో, మంచివాడూ సరిగ్గా అలాగే చనిపోతాడు. దేవునికి ప్రత్యేకమైన ప్రమాణాలు చేసేవాళ్లూ ఆ ప్రమాణాలు చెయ్యనివాళ్ల మాదిరిగానే చనిపోతారు.
ECC 9:3 ఈ జీవితంలో సంభవించే వాటన్నింట్లోనూ పరమ దౌర్భాగ్యమైనదేమిటంటే, అందరూ ఒకేలాగ గతించడమే. అయితే, మనుష్యులు ఎల్లప్పుడూ పాపపు ఆలోచనలూ, మూర్ఖపు ఆలోచనలూ చేస్తూ వుంటారు, ఇది బాగా చెడ్డదే. ఆ ఆలోచనలు మరణానికి దారితీస్తాయి.
ECC 9:4 మనిషి ఇంకా బతికివుంటే, అతను ఎవరైనా, అతనికి ఆశ ఉంటుంది. అయితే, ఈ నానుడి నిజం చచ్చిన సింహం కంటె, బతికివున్న కుక్క మేలు.
ECC 9:5 బతికివున్న మనుష్యులకి తాము చనిపోతామన్న విషయం తెలుసు. అయితే చనిపోయిన మనుష్యులకి యేమీ తెలియదు. చనిపోయినవాళ్లకి యిక యే ప్రతిఫలము ఉండదు. జనం వాళ్లని త్వరలోనే మరచిపోతారు.
ECC 9:6 ఒక వ్యక్తి చనిపోయాక, అతని ప్రేమ, ద్వేషం, ఈర్ష్య అన్నీ అంతరించిపోతాయి. చనిపోయినవాళ్లు భూమిమీద జరిగే వేటిలోనూ ఏమీ, ఎన్నడు ఇక పాలుపంచుకోలేరు.
ECC 9:7 అందుకని, పో, పోయి తిండి తిను, దాంట్లోని ఉల్లాసాన్ని అనుభవించు. నీ ద్రాక్షారసం సేవించి, ఆనందం పొందు. ఈ పనులు దేవుని దృష్టిలో తప్పేమీ కావు.
ECC 9:8 చక్కటి దుస్తులు ధరించి, నిన్ను నీవు బాగా కనిపించేలా చూసుకో.
ECC 9:9 నువ్వు ప్రేమించే భార్యతో సుఖం అనుభవించు. నీ స్వల్పకాలిక జీవితంలో ప్రతి ఒక్క రోజునూ సుఖంగా గడుపు. దేవుడు నీకీ భూమిమీద ఈ స్వల్ప జీవితాన్ని ఇచ్చాడు, నీకున్నదంతా ఇంతే. అందుకని, నువ్వు ఈ జీవితంలో చేయవలసిన పనిని సరగాదా చెయ్యి.
ECC 9:10 నీకు పని దొరికిన ప్రతి సారి, నువ్వ దాన్ని నీ శాయశక్తులా అత్యుత్తమంగా చెయ్యి. సమాధిలో పనేమీ ఉండదు. అక్కడ ఆలోచన, జ్ఞానం, వివేకం ఏ ఒక్కటి ఉండదు. మనందరి గమ్యమూ ఆ మృత్యు స్థానమే.
ECC 9:11 ఈ ప్రపంచంలో నేను చూసిన సక్రమం కాని విషయాలు ఇంకా ఉన్నాయి: అతి వేగంగా పరిగెత్తేవాడు పరుగు పోటీలో ఎల్లప్పుడూ గెలవలేడు. అత్యంత బలీయమైన సైన్యమైనా యుద్ధంలో ఎల్లప్పుడూ గెలవలేదు. మిక్కిలి వివేకవంతుడు కూడా తాను సంపాదించిన ఆహారాన్ని ఎల్లప్పుడూ పొందలేడు. మిక్కిలి చురుకైనవాడు కూడా సంపదను ఎల్లప్పుడూ సాధించు కోలేడు. విద్యావంతుడికైనా ఎల్లప్పుడూ తనికి యోగ్యమైన ప్రశంస లభ్యంకాదు. చెడు కాలము దాపురించి నప్పుడు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి.
ECC 9:12 తనకి మరు క్షణంలో ఏమి జరగనున్నదో మనిషికి ఎన్నడూ తెలియదు. మనిషి వలలో చిక్కిన చేపలాంటివాడు. ముందేమి జరగబోతున్నదీ ఆ చేపకి తెలియదు. అతను పంజరంలో చిక్కిన పక్షిలాంటివాడు, ఆ పక్షికి ముందేమి జరగనున్నది తెలియదు. అదే విధంగా, మనిషి కూడా తనకి ఆకస్మికంగా సంభవించే కీడుల బోనులో చిక్కుకుంటాడు.
ECC 9:13 ఈ భూమిమీద ఒక వ్యక్తి వివేకవంతమైన ఒక పని చెయ్యడం కూడా నేను చూశాను. అది చాలా ముఖ్యమైన పని అని నాకు అనిపించింది.
ECC 9:14 స్వల్ప జనాభా కలిగిన ఒక చిన్న పట్టణం వుంది. ఒక గొప్ప రాజు ఆ పట్టణం మీదకి దండెత్తి, దాని చుట్టూ తన సేనలను నిలిపాడు.
ECC 9:15 కాని, ఆ పట్టణంలో ఒక జ్ఞాని వున్నాడు. ఆ జ్ఞాని పేదవాడు. అయితే, అతను తన జ్ఞానాన్ని తన పట్టణాన్ని కాపాడేందుకు వినియోగించాడు. అన్నీ ముగిసిపోయాక, జనం అతన్ని గురించి మరచిపోయారు.
ECC 9:16 అయినప్పటికీ, ఆ జ్ఞానం ఆ బలం కంటె మెరుగైనదని నేనంటాను. ఆ జనం ఆ పేదవాని జ్ఞానం గురించి మరిచిపోయారు. అతని మాటలను ఆ జనం పట్టించుకోవడం మానేశారు. (అయినా కూడా ఆ జ్ఞానం మెరుగైనదని నేను నమ్ముతాను.)
ECC 9:17 మూర్ఖుడైన ఒక రాజు వేసే కేకల కంటె ఒక జ్ఞాని పలికే మెల్లని పలుకులు మరెంతో మెరుగైనవి.
ECC 9:18 యుద్ధంలో ఆయుధాల కంటె జ్ఞానం గొప్పది. అయితే ఒక్క మూర్ఖుడు ఎన్ని మంచి పనుల్నైనా పాడు చేయగలడు.
ECC 10:1 అత్యంత పరిమళ భరితమైన తైలాన్ని గబ్బు పట్టించేందుకు చచ్చిన కొద్దిపాటి ఈగలేచాలు. అదే విధంగా, జ్ఞానాన్నీ, గౌరవాన్నీ, మంటగలిపేందుకు కొద్దిపాటి మూర్ఖత్వం చాలు.
ECC 10:2 వివేకవంతుడి ఆలోచనలు అతన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. అయితే, అవివేకి అలోచనలు అతన్ని తప్పు మార్గంలో నడిపిస్తాయి.
ECC 10:3 మూర్ఖుడు అలా దారి వెంట పోయేటప్పుడు సైతం తన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తాడు. దానితో, వాడొక మూర్ఖుడన్న విషయాన్ని ప్రతి ఒక్కడూ గమనిస్తాడు.
ECC 10:4 యజమాని కేవలం నీపట్ల కోపం ప్రదర్శించినంత మాత్రాన నువ్వు నీ కొలువు వదిలెయ్యబోకు. నువ్వు ప్రశాంతంగా, సాయంగా వుంటే, పెద్ద పెద్ద పొర పాట్లను కూడా నువ్వు సరిదిద్దవచ్చు.
ECC 10:5 ప్రపంచంలో జరిగే మరో అంశం నా దృష్టికి వచ్చింది. అది సమంజసమైనది కాదు. సాధారణంగా అది పరిపాలకులు చేసే పొరపాటు:
ECC 10:6 అవివేకులకు ముఖ్యమైన పదవులు, జ్ఞాన సంపన్నులకు అప్రధానమైన పదవులు కట్టబెడతారు.
ECC 10:7 సేవకులుగా ఉండదగినవాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తుండగా, అధికారులుగా ఉండదగిన వాళ్లు (వాళ్ల సరసన బానిసల మాదిరిగా) నడుస్తూవుండటం నేను చూశాను.
ECC 10:8 గొయ్యి తవ్వే వ్యక్తి, తానే దానిలో పడవచ్చు. గోడ కూలగొట్టేవాణ్ణి పాము కాటెయ్యవచ్చు.
ECC 10:9 పెద్దబండలను దొర్లించేవాడికి వాటివల్లనే గాయాలు కావచ్చు. చెట్లు నరికేవాడికి కూడా ప్రమాదం లేకపోలేదు, (ఆ చెట్లు అతని మీద కూలవచ్చు.)
ECC 10:10 అయితే, పరిజ్ఞానంవుంటే, ఏ పనైనా సులభతరం అవుతుంది. మొండి కత్తితో కొయ్యడం చాలా కష్టం. అయితే, మనిషి దానికి పదును పెడితే, అప్పుడు పని సులభతరమవుతుంది. (జ్ఞానం అంత సున్నిత మైనది.)
ECC 10:11 ఒక వ్యక్తికి పాముల్ని ఎలా అదుపు చేయాలో తెలియవచ్చు. కాని, అతను అందుబాటులో లేనప్పుడు పాము ఎవరినైనా కాటేస్తే ఆ నైపుణ్యం వ్యర్థమే. (జ్ఞానం అలాంటిది.)
ECC 10:12 వివేకవంతుడి మాటలు ప్రశంసా పాత్రలు. అయితే అవివేకి మాటలు వినాశకరమైనవి.
ECC 10:13 ఆదిలోనే మూర్ఖుడు అవకతవకగా మాట్లాడతాడు. చివర్లో ఇక అతనివి ఉన్మత్త ప్రలాపాలుగా ముగుస్తాయి.
ECC 10:14 అజ్ఞాని ఎడతెగకుండా (తను చెయ్యబోయే వాటిని గురించి) మాట్లాడతాడు. అయితే, భవిష్యత్తులో ఏమి జరగబోయేది ఎవరికీ తెలియదు. తర్వాత ఏమి జరిగేది. ఏ ఒక్కడికి తెలియదు.
ECC 10:15 తన గమ్యానికి చేరుకునే మార్గం యేమిటో తెలుసుకునే నేర్పు మూర్ఖుడికి వుండదు, అందుకే అతను జీవితకాలమంతా కష్టించి పని చెయ్యాలి.
ECC 10:16 రాజు శిశుప్రాయుడైనా, బానిస అయినా ఆ రాజ్యానికి చాలా చెరుపు జరుగుతుంది. అధికారులు తిండిపోతులై, తమ కాలమంతా భోజన పానాదులతోనే వినియోగించేవాళ్లయితే, ఆ దేశానికి చాలా చెరుపే జరుగుతుంది.
ECC 10:17 ఒక దేశపు రాజు కులీనుడైతే, ఆ దేశానికి ఎంతో మంచి జరుగుతుంది. దేశాధికారులు తిండిపోతులు, తాగుబోతులు కాక, శక్తి పుంజుకు నేందుకు మాత్రమే అన్నపానాలు మితంగా సేవించే వారైతే, ఆ దేశానికి ఎంతో క్షేమం.
ECC 10:18 మనిషి మరి బద్ధకస్తుడైతే అతని ఇల్లు కురవనారంభిస్తుంది, ఇంటి పైకప్పు కూలి పోతుంది.
ECC 10:19 మనుష్యులకి తిండి సంతృప్తి నిస్తుంది, ద్రాక్షారసం వాళ్లని మరింత ఆనంద పరుస్తుంది. అయితే, డబ్బుంటే అనేక సమస్యలు పరిష్కారమవుతాయి.
ECC 10:20 రాజును గురించి చెడుగా మాట్లాడకు. రాజును గురించి చెడ్డ ఆలోచనలు కూడా చేయకు. నీ యింట నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ధనికులను గురించి చెడుగా మాట్లాడకు. ఎందుకంటావేమో, గోడలకి చెవులుంటాయి. నువ్వన్న మాటలన్నీ పిట్టలు చేర వేస్తాయి. వాళ్లకి చేరుతాయి.
ECC 11:1 నువ్వెక్కడకి వెళ్లినా అక్కడ మంచి పనులు చెయ్యి. కొంతకాలం గడిచాక నీ మంచి పనులనే విత్తులు మొలకలెత్తి పంట రూపంలో నీకు తిరిగి వస్తాయి.
ECC 11:2 నీకున్నది వేర్వేరు వాటిమీద మదుపు పెట్టు. ప్రపంచంలో ఏమి చెడుగులు సంభవించనున్నాయో నీకు తెలియదు.
ECC 11:3 (నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలిగిన విషయాలు కొన్ని వున్నాయి.) మేఘాలు నీళ్లతో నిండివుంటే, అవి నేలపై వర్షిస్తాయి. చెట్టు నేలపైన కూలితే కూలినది ఉత్తరానికైనా, దక్షిణానికైనా అది పడ్డచోటునే వుంటుంది.
ECC 11:4 (అయితే, కొన్ని విషయాలు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోలేవు. అలాంటప్పుడు, నువ్వు సాహసించి ఏదో ఒకటి చెయ్యాలి.) మంచి వాతావరణం పరిస్థితులకోసం ఎదురు చూసేవాడు ఎన్నడూ తన విత్తనాలు చల్లలేడు. ప్రతి మేఘమూ వర్షించేస్తుందని భయపడే వాడు తన పంట కుప్పలు ఎన్నడూ నూర్చుకోలేడు.
ECC 11:5 గాలి ఎటు వీస్తుందో నీకు తెలియదు. బిడ్డ తన తల్లి గర్భంలో ఎలా పెరుగుతుందో నీకు తెలియదు. అలాగే, దేవుడు యేమి చేస్తాడో నీకు తెలియదు, కాని, అన్నీ జరిపించేది ఆయనే.
ECC 11:6 అందుకని, ప్రొద్దుటే నాట్లు వెయ్యడం మొదలెట్టు. సాయంత్రమయ్యేదాకా పని చాలించకు. ఎందుకంటే, ఏవి నిన్ను సంపన్నుని చేస్తాయో నీకు తెలియదు. ఏమో, నీ పనులు అన్నీ జయప్రదమవుతాయేమో.
ECC 11:7 బతికి ఉండటం మంచిది! సూర్యకాంతి కళ్లకి యింపు గొలుపుతుంది.
ECC 11:8 నువ్వు ఎంత కాలం జీవించినా, నీ జీవితంలో ప్రతి ఒక్క రోజునూ అనుభవించు. అయితే, ఏదో ఒక రోజున నువ్వు మరణించక తప్పదని గుర్తుంచుకో. నీ జీవిత కాలంకంటె, నీ మరణానంతర కాలం చాలా ఎక్కువ. నువ్వు మరణించాక, నువ్వు చెయ్యగలిగినది శూన్యం, ఏమీ ఉండదు.
ECC 11:9 అందుకని, యువజనులారా, మీ యౌవ్వన కాలంలోనే మీరు సుఖాలు అనుభవించండి. ఆనందంగా ఉండండి! మీ మనస్సుకి ఏది తోస్తే, మీరు ఏది కోరుకుంటే అది చెయ్యండి. అయితే, మీరు చేసే పనులన్నింటికీ దేవుడు మిమ్మల్ని విచారిస్తాడని మాత్రం మరిచిపోకండి.
ECC 11:10 మీ కోపానికి మీరు లొంగిపోకండి. మీ శరీరం మిమ్మల్ని పాప మార్గాన నడపకుండా చూసుకోండి. ప్రజలు జీవిత ప్రారంభ దశలో తాము యౌవనస్థలుగా ఉన్నప్పుడు తెలివిలేని పనులు చేస్తారు.
ECC 12:1 చెడ్డకాలం దాపురించక ముందు (నీవు ముసలి వాడవు కాకముందు), “నా జీవితం వృథా చేసు కున్నాను” అని నువ్వు వాపోయే వయస్సు రాక ముందు, నువ్వింకా యౌవ్వనావస్థలో వుండగానే నీ సృష్టికర్తని నువ్వు గుర్తుచేసుకో.
ECC 12:2 సూర్య చంద్రులూ, నక్షత్రాలూ నీ కంటి దృష్టికి ఆనని కాలం దాపురించక పూర్వం, (నువ్వింకా యౌవన ప్రాయంలో ఉండగానే, నీ సృష్టికర్తని నువ్వు జ్ఞాపకం చేసుకో). ఒక తుఫాను తర్వాత మరొక తుఫాను వచ్చినట్లే, (కష్టాలు పదే పదే వస్తాయి).
ECC 12:3 ఆ వయస్సులో నీ చేతులు శక్తి కోల్పోతాయి. నీ కాళ్లు బలము లేక వంగుతాయి. నీ పళ్లు ఊడిపోతాయి, నువ్వు నీ ఆహారం నమలలేవు. నీ కళ్లు మసకబారతాయి.
ECC 12:4 నీ వినికిడి శక్తి మందగిస్తుంది. వీధుల్లోని శబ్దాలు నీకు వినిపించవు. నీ గోధుమలు విసిరే తిరగలి శబ్దం కూడా నీకు వినిపించదు. స్త్రీలు పాడే పాటలు కూడా నువ్వు వినలేవు. అయితే, పక్షి చేసే కిలకిలారావానికే నీకు వేకువజామున మెలుకువ వచ్చేస్తుంది. (మరెందుకో కాదు, నీకు నిద్రరాదు, అందుకు.)
ECC 12:5 ఎత్తయిన ప్రదేశాలంటే నీకు భయం వేస్తుంది. నీ దోవలో ఏ చిన్న వస్తువు ఉన్నా, దానిమీద కాలువేస్తే ఎక్కడ బోల్తాపడిపోతానో అని నీకు బెదురు కలుగు తుంది. నీ జుట్టు నెరిసి, బాదం చెట్టు పూతలా కనిపిస్తుంది. నువ్వు కాళ్లీడ్చుకుంటూ మిడతలా నడుస్తావు. నువ్వు నీ కోరికను కోల్పోతావు (జీవించటానికి). అప్పుడిక నువ్వు నీ శాశ్వత నివాసానికి (సమాధిలోకి) పోతావు. (నీ శవాన్ని సమాధికి మోసుకెళ్తూ) విలాపకులు వీధుల్లో గుమిగూడి శోకనాలు పెడతారు.
ECC 12:6 నీ వెండి మొలతాడు తెగక ముందే, బంగారు గిన్నె నలగక ముందే. బావి దగ్గర పగిలిన మట్టి కుండలా, (నీ జీవితం వృథా కాక ముందే) పగిలి బావిలో పడిపోయిన రాతి మూతలా నీ జీవితం వృథా కాకముందే నీ యౌవనకాలంలోనే నువ్వు నీ సృష్టికర్తను స్మరించుకో.
ECC 12:7 మట్టిలో నుంచి పుట్టిన నీ శరీరం నువ్వు మరణించినప్పుడు తిరిగిఆ మట్టిలోనే కలిసి పోతుంది. కానీ, దేవుని దగ్గర్నుంచి వచ్చిన నీ ఆత్మ నువ్వు మరణించినప్పుడు తిరిగి ఆ దేవుడి దగ్గరకే పోతుంది.
ECC 12:8 అంతా వ్యర్థం, శుద్ధ అర్థరహితం. ఇదంతా కాలాన్ని వ్యర్థం చెయ్యడం అంటాడీ ప్రసంగి!
ECC 12:9 ప్రసంగి గొప్ప జ్ఞాని. ఆయన తన జ్ఞానాన్ని జనానికి బోధ చేసేందుకు వినియోగించాడు. అనేక వివేకవంతమైన బోధనలను అయన ఎంతో శ్రద్ధగా అధ్యయనం చేసి, జాగ్రత్తగా విభజించాడు.
ECC 12:10 ప్రసంగి సరైన పదాలు ఎంచుకునేందుకు చాలా శ్రమించాడు. ఆయన యధార్థమైన, ఆధారపడదగిన ఉపదేశాలు రచించాడు.
ECC 12:11 జ్ఞానుల మాటలు, జనం తమ పశువులను సరైన బాటలో నడిపేందుకు ఉపయోగించే ముల్లు కర్రల వంటివి. ఆ ఉపదేశాలు విరగని గట్టి గూటాల వంటివి. (నీకు సరైన జీవన మార్గాన్ని చూపే సరైన మార్గదర్శులుగా నువ్వా బోధనల పైన ఆధారపడవచ్చు) ఆ జ్ఞానోపదేశాలన్నీ ఒకే కాపరి (దేవుని) నోట నుండి వచ్చినవి.
ECC 12:12 అందుకని కుమారుడా, (ఆ ఉపదేశాలను అధ్యయనం చెయ్యి) అయితే ఇతర గ్రంథాలను గురించి ఒక హెచ్చరిక. రచయితలు గ్రంథాలు ఎప్పుడూ వ్రాస్తూనే ఉన్నారు. అతిగా అధ్యయనం చేయడం నీకు చాలా అలసట కలిగిస్తుంది.
ECC 12:13 సరే, ఈ గ్రంథంలోని విషయాలన్నీ చదివి మనం నేర్చుకోవలసింది ఏమిటి? మనిషి చేయగలిగిన అత్యంత ముఖ్యమైన పనేమిటంటే, దేవుని పట్ల భయ భక్తులు కలిగివుండటం, దేవుని ఆజ్ఞలు పాటించడం. ఎందుకంటే, మనుష్యులు చేసే పనులన్నీ గుప్త కార్యాలతో బాటు దేవునికి తెలుసు. ఆయనకి మనుష్యుల మంచి పనులను గురించీ చెడ్డ పనులను గురించీ సర్వం తెలుసు. మనుష్యుల పనులేవీ దేవుని విచారణకు రాకుండా పోవు.
SOL 1:1 సొలొమోను అత్యద్భుత గీతం
SOL 1:2 ముద్దులతో నన్ను ముంచెత్తు, ఎందుకంటే ద్రాక్షా మద్యంకన్నా బాగుంటుంది నీ ప్రేమ.
SOL 1:3 నీ పరిమళ ద్రవ్యం అద్భుతమైన సువాసననిస్తుంది, కాని మిక్కిలి ఉత్తమ పరిమళ ద్రవ్యం కన్నా నీ పేరు తియ్యనైనది. అందుకే యువతులు నిన్ను ప్రేమిస్తారు.
SOL 1:4 నన్ను నీతో తీసికొనిపో! మనం పారిపోదాం పద! రాజు తన గదిలోనికి నన్ను తీసుకు పోయాడు. మేము ఆనందిస్తాం నీకోసం హాయిగా ఉంటాం. జ్ఞాపక ముంచుకో, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా బాగుంటుంది మంచి కారణంతోనే యువతులు నిన్ను ప్రేమిస్తారు.
SOL 1:5 యెరూషలేము పుత్రికలారా, నేను నల్లగా అందంగా ఉన్నాను. కేదారు, సల్మా
SOL 1:6 నేనెంత నల్లగా ఉన్నానో చూడవద్దు, సూర్యుడు నన్నెంత నల్లగా చేశాడో చూడవద్దు. నా సోదరులు నా మీద కోపగించారు. వాళ్ల ద్రాక్షా తోటలకు కాపలా కాయుమని నన్ను బలవంత పెట్టారు. అందువల్ల నన్ను గురించి నేను శ్రద్ధ తీసుకోలేక పోయాను.
SOL 1:7 నా ఆత్మ అంతటితోను నిన్ను ప్రేమిస్తాను! నీ గొర్రెల్ని ఎక్కడ మేపుతావో? మధ్యాహ్నం వాటిని ఎక్కడ పడుకో బెడతావో నాకు చెప్పు. నీతో ఉండటానికి నేను రావాలి లేదా నీ మిత్రుల గొర్రెల కోసం పాటుపడే అద్దెకు తీసుకున్న స్త్రీ అవుతాను!
SOL 1:8 నువ్వు అంత అందమైనదానవు! నిజంగా నీకు తెలుసు ఏమి చెయ్యాలో. వెళ్లు, గొర్రెలను అను సరించు. నీ చిన్న మేకల్ని గొల్లవాళ్ల గుడారాల వద్ద మేపు.
SOL 1:9 నా ప్రియులారా, ఫరోరథాలు లాగుతున్న మగ గుర్రాల్ని ఆకర్షించే ఆడ గుర్రం కన్నా నువ్వు నన్ను ఎక్కువ సంతోషపరుస్తున్నావు. ఆ గుర్రాలకు అందమైన అలంకరణలున్నాయి. వాటి ముఖాల పక్కన, వాటి మెడల చుట్టూ
SOL 1:10 నీకోసం చేసిన అలంకరణలివిగో, బంగారు తలకట్టు వెండి గొలుసు. నీ బుగ్గలు ఎంతో అందంగా ఉన్నాయి బంగారు అలంకరణలతో, నీ మెడ ఎంతో అందంగా ఉంది వెండి అల్లికలతో.
SOL 1:12 నా పరిమళ ద్రవ్యపు సువాసన తన మంచంమీద పడుకున్న రాజును చేరుతుంది.
SOL 1:13 రాత్రంతా నా స్తనాల మధ్య పడివున్న నా మెడలోవున్న చిన్న గోపరసం సంచిలాంటి వాడు నా ప్రియుడు.
SOL 1:14 ఏన్గెదీ ద్రాక్షాతోటల దగ్గరున్న గోరంటు పూల గుత్తిలాంటివాడు నా ప్రియుడు.
SOL 1:15 నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు! ఓహో! నువ్వు సుందరంగా ఉన్నావు! నీ కళ్లు పావురాల్లా వున్నాయి.
SOL 1:16 నా ప్రియుడా, నువ్వెంతో సొగసుగా ఉన్నావు! అవును, అత్యంత మనోహరంగా ఉన్నావు! మన శయ్య స్వచ్ఛంగా సంతోషకరంగా ఉంది
SOL 1:17 మనింటి దూలాలు దేవదారువి వాసాలు జాజి పలకలవి.
SOL 2:1 నేను మైదానంలో కుంకుమ పువ్వును లోయలలో కస్తూరి పుష్పాన్ని.
SOL 2:2 నా ప్రియురాలా, ఇతర స్త్రీల మధ్య నీవు ముళ్ల మధ్య కస్తూరి పుష్పంలా ఉన్నావు!
SOL 2:3 నా ప్రియుడా, ఇతర పురుషుల మధ్య నీవు అడవి చెట్ల మధ్య ఆపిలు చెట్టులా ఉన్నావు! ఆనంద భరితనై నేనతని నీడన కూర్చుంటాను! నా ప్రియుని నీడలో కూర్చుని నేను ఆనందిస్తాను, అతని పండు నాకెంతో తియ్యగా వుంది.
SOL 2:4 నా ప్రియుడు నన్ను మద్యగృహానికి తీసుకుని వెళ్లాడు, నా మీద అతని ఉద్దేశం ప్రేమ.
SOL 2:5 ఎండు ద్రాక్షాలతో నాకు బలాన్నివ్వండి, ఆపిలు పండ్లతో నా అలసట తీర్చండి, ఎందుకంటే నేను ప్రేమతో బలహీనమయ్యాను.
SOL 2:6 నా ప్రియుని ఎడమ చేయి నా తల కింద ఉంది, అతని కుడి చేయి నన్ను పట్టుకొంది,
SOL 2:7 యెరూషలేము స్త్రీలారా, నాకు వాగ్దానం చెయ్యండి, దుప్పులమీదా అడవి లేళ్ల మీదా ఒట్టేసి, నేను సిద్ధపడేవరకూ. ప్రేమను లేపవద్దు, ప్రేమను పురికొల్పవద్దు.
SOL 2:8 నా ప్రియుని గొంతు వింటున్నాను. అదిగో అతడు వస్తున్నాడు. పర్వతాల మీది నుంచి దూకుతూ కొండల మీది నుంచి వస్తున్నాడు.
SOL 2:9 నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు లేదా లేడి పిల్లలా ఉన్నాడు. మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు, కిటికీలోనుంచి తేరి పార చూస్తూ, అల్లిక కిటికీలోనుంచి చూస్తూ
SOL 2:10 నా ప్రియుడు నాతో అంటున్నాడు, “లే, నా బంగారు కొండా, నా సుందరాంగీ, మనం పోదాంపద!
SOL 2:11 చూడు, శీతాకాలం వెళ్లిపోయింది, వానలు వచ్చాయి వెళ్లాయి.
SOL 2:12 పొలాల్లో పూలు వికసిస్తున్నాయి ఇది పాడే సమయం! కోలాహలపు పావురాలు తిరిగి వచ్చాయి.
SOL 2:13 అరటి చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి. పూలు పూస్తున్న ద్రాక్షా తీగల వాసన చూడు. లే, నా బంగారు కొండా, నా సుందరాంగీ, మనం పోదాం పద!”
SOL 2:14 ఇక్కడ ఈ పర్వతం మీద కనపడని ఎత్తైన శిఖరంమీద గుహల్లో దాక్కొన్న నా పావురమా! నిన్ను చూడనిమ్ము, నీ గొంతు విననిమ్ము, నీ గొంతు ఎంతో మధురం, నువ్వెంతో సుందరం!
SOL 2:15 మాకోసం గుంటనక్కల్ని పట్టుకో ద్రాక్షాతోటల్ని పాడుసే చిన్న గుంటనక్కల్ని! మా ద్రాక్షాతోట ఇప్పుడు పూతమీద ఉంది.
SOL 2:16 నా ప్రియుడు నావాడు, నేను అతని దానను! అతడు పద్మాల నడుమ గొర్రెలను మేపుతున్నాడు!
SOL 2:17 రోజు తన చివరి శ్వాసను విడిచినప్పుడు నీడలు పరుగెత్తినప్పుడు, నా ప్రియుడా, చీలిన పర్వతాల మీద దుప్పిలా, లేడిపిల్లలా తిరుగు!
SOL 3:1 రాత్రి నా పక్క మీద, నేను ప్రే మించిన వానికోసం చూస్తాను. అతని కోసం చూశాను, కాని అతణ్ణి కనుగొనలేకపోయాను!
SOL 3:2 ఇప్పుడు మేల్కొంటాను! నగరమంతా తిరుగుతాను. వీధుల్లోను కూడలి స్థలాల్లోను సంత వీధుల్లోనూ నేను ప్రేమించిన వ్యక్తికోసం చూస్తాను. అతని కోసం చూశాను, కాని అతణ్ణి కనుక్కోలేక పోయాను!
SOL 3:3 నగరంలో పాహరా తిరిగే కావలివాళ్లు నన్ను చూశారు. వారినడిగాను, “నేను ప్రేమించిన వ్యక్తిని మీరు చూశారా?”
SOL 3:4 కావలివాళ్లను దాటిన వెంటనే నేను ప్రేమించిన వ్యక్తిని కనుక్కున్నాను! అతణ్ణి పట్టుకున్నాను. అతణ్ణి పోనివ్వలేదు, నా తల్లి ఇంటికి అతణ్ణి తీసుకొని పోయేవరకూ నన్ను కన్న తల్లి గదికి తీసుకొని పోయేవరకూ.
SOL 3:5 యెరూషలేము స్త్రీలారా, నాకు వాగ్దానం చెయ్యండి, దుప్పులమీదా అడవి లేళ్లమీదా ఒట్టు పెట్టి, నేను సిద్ధపడేవరకూ. ప్రేమను లేపవద్దు, ప్రేమను పురికొల్పవద్దు.
SOL 3:6 పెద్ద జనం గుంపుతో ఎడారినుండి వస్తున్న ఈ స్త్రీ ఎవరు? కాలుతున్న గోపరసం, సాంబ్రాణి ఇతర సుగంధ ద్రవ్యాల నుండి పొగమబ్బులు వచ్చినట్లుగా వారి వెనుక దుమ్ము లేస్తోంది.
SOL 3:7 చూడు, సొలొమోను ప్రయాణపు కుర్చీ! అరవైమంది సైనికులు దానిని కాపలా కాస్తున్నారు. బలశాలురైన ఇశ్రాయేలు సైనికులు!
SOL 3:8 వారందరూ సుశిక్షుతులైన పోరాటగాండ్రు, వారి పక్కనున్న కత్తులు, ఏ రాత్రి ప్రమాదానికైనా సిద్ధం!
SOL 3:9 రాజు సొలొమోను తనకోసం ఒక ప్రయాణపు కుర్చీ చేయించాడు, దాని కొయ్య లెబానోనునుండి వచ్చింది.
SOL 3:10 దాని కాళ్లు వెండితో చేయబడ్డాయి, ఆధారాలు బంగారంతో చేయబడ్డాయి, కూర్చొనే భాగం ధూమ్ర వర్ణం వస్త్రంతో కప్పబడింది. యెరూషలేము స్త్రీల ప్రేమతో అది పొదగబడింది.
SOL 3:11 సీయోను స్త్రీలారా, బయటకు రండి రాజు సొలొమోనును చూడండి అతని పెండ్లి రోజున అతడు చాలా సంతోషంగా ఉన్న రోజున అతని తల్లి పెట్టిన కిరీటాన్ని చూడండి!
SOL 4:1 నా ప్రియులారా, నువ్వెంతో అందంగా ఉన్నావు! ఓహో, నువ్వు సుందరంగా ఉన్నావు! నీ మేలి ముసుగు కింద నీళ్ళు పావురాల్లా ఉన్నాయి. నీ శిరోజాలు పొడుగ్గా జారుతున్నాయి గిలాదు పర్వత సానువుల కింద నృత్యం చేసే మేకపిల్లల్లా.
SOL 4:2 అప్పుడే స్నానం చేసి వస్తున్న ఆడ మేకల్లా నీ పళ్లు తెల్లగావున్నాయి. అవన్నీ కవలపిల్లల్ని కంటాయి, వాటిలో ఒక్కదానికి కూడా పిల్ల చావ లేదు.
SOL 4:3 నీ పెదవులు ఎర్ర పట్టు దారంలా ఉన్నాయి. నీ నోరు అందంగా ఉంది నీ మేలి ముసుగు కింది నీ చెక్కిళ్లు రెండు దానిమ్మపండు చెక్కల్లా ఉన్నాయి.
SOL 4:4 నీ మెడ పొడుగ్గా సన్నగా దావీదు గోపురంలా ఉంది శక్తిమంతులైన సైనికుల డాళ్లు వెయ్యిడాళ్ళు దాని గోడల మీద అలంకరించడం కోసం ఆ గోపురాన్ని కట్టారు.
SOL 4:5 నీ స్తనాలు, తెల్ల కలువల్లో మేస్తున్న కవల జింక పిల్లల్లా ఉన్నాయి కవల దుప్పి పిల్లల్లా ఉన్నాయి.
SOL 4:6 పగలు తన తుది శ్వాస విడిచేటప్పుడు నీడలు పారిపోయేటప్పుడు నేను ఆ గోపరస పర్వతానికి వెడతాను ఆ సాంబ్రాణి కొండకు వెతాను.
SOL 4:7 నా ప్రియురాలా! నీ శరీరమంతా అందంగానే ఉంది. నీకెక్కడా వికారమైన గుర్తుల్లేవు!
SOL 4:8 నా పెళ్లికూతురా! లెబానోను నుండి నాతోరా లెబానోనునుండి నాతోరా. అమాన పర్వత శిఖరాన్నుండి శెనీరు హెర్మోనుల కొండకొనల నుండి సింహగుహల నుండి చిరుత పులుల పర్వతాలనుండి రా!
SOL 4:9 నా ప్రేయసీ! నా ప్రియ వధూ నన్ను ఉద్రేక పరుస్తావు. ఒకే ఒక చూపుతో నీ హారంలోని ఒకే ఒక రత్నంతో నా హృదయాన్ని దోచుకున్నావు.
SOL 4:10 నా ప్రేయసీ! నా ప్రియ వధూ! నీ ప్రేమ చాలా సుందరమైనది ద్రాక్షారసంకన్నా నీ ప్రేమ గొప్పది, నీ పరిమళ ద్రవ్యపు సువాసన ఏ రకమైన సుగంధ ద్రవ్యంకన్నా గొప్పది!
SOL 4:11 నా ప్రియవధూ నీ పెదవులు తేనె లూరుతున్నాయి నీ నాలుక (కింద) నుంచి తేనే, పాలూ జాలువారు తున్నాయి నీ దుస్తులు మధుర పరిమళాన్ని గుబాళిస్తున్నాయి.
SOL 4:12 నా ప్రియా, నా వధూ, నీవు పరిశుద్ధురాలివి మూయబడిన ఉద్యానవనం, మూయబడిన జలా శయం, బిగించబడిన జలధారల వంటి దానివి.
SOL 4:13 నీ శరీరమొక తోటను పోలినది దానిమ్మ వృక్షాలతో తదితర మధుర ఫల వృక్షాలతో గోరింట, జటా మాంసి,
SOL 4:14 కుంకుమ పువ్వు, నిమ్మగడ్డి, లవంగ, సాంబ్రాణి బోళం, అగరు యిత్యాది అతి శ్రేష్ట సుగంధ ద్రవ్యాలనిచ్చే తరులతాదులతో నిండిన నందనవనాన్ని పోలినది.
SOL 4:15 నీవు ఉద్యాన జలాశయం వంటిదానివి మంచినీటి ఊటల బావిలాంటిదానివి, లెబానోను పర్వతం నుంచి జాలువారే సెలయేరు వంటిదానివి.
SOL 4:16 ఉత్తర పవనమా లే! దక్షిణ పవనమా రా! నా ఉద్యానవనంపై వీచి, దాని మధుర సౌరభాన్ని వెద జల్లండి. నా ప్రియుడు తన ఉద్యానవనానికి రావాలి అందలి మధుర ఫలాలు ఆరగించాలి.
SOL 5:1 నా ప్రియ సఖీ, నా ప్రియ వధూ, నేను నా తోటలో ప్రవేశించాను, నేను నా బోళం సుగంధ ద్రవ్యాలను ఏరుకున్నాను, తేనె తాగాను తేనె పొర తిన్నాను నేను నా మధుక్షీరాలు సేవించాను. ప్రియాతి ప్రియ నేస్తాల్లారా తినండి, తాగండి! ప్రేమను జుర్రి మత్తిల్లండి!
SOL 5:2 నేను నిద్రించానేగాని నా హృదయం మేల్కొనేవుంది. నా ప్రియుడు తలుపు తట్టి ఇలా అనడం విన్నాను “నా ప్రియ సఖీ, ప్రేయసీ నా గువ్వపిట్టా, సుగుణ ఖనీ! నా తల మంచుతో తడిసింది నా జుట్టు రేమంచు జడికి నానింది.”
SOL 5:3 “నేను నా వస్త్రం తోలగించాను, దాన్ని తిరిగి ధరించాలని అనిపించలేదు. నేను నా పాదాలు కడుక్కున్నాను. అవి తిరిగి మురికి అవడం ఇష్టం లేక పోయింది.”
SOL 5:4 తలుపు సందులో నా ప్రియుడు చేతినుంచాడు నేనతని పట్ల జాలినొందాను.
SOL 5:5 నా చేతుల నుంచి జటామాంసి జారగా, నా వేళ్ల నుంచి జటామాంసి పరిమళ ద్రవం తలుపు గడియ పైకి జాలువారగా నేను నా ప్రియునికి తలుపు తీయ తలంచాను.
SOL 5:6 నేను నా ప్రియుడికి తలుపు తెరిచాను, కాని అప్పటికే నా ప్రియుడు వెనుదిరిగి వెళ్లిపోయాడు! అతడు వెళ్లిపోయినంతనే నా ప్రాణం కడగట్టింది. నేనతని కోసం గాలించాను. కాని అతడు కనిపించలేదు. నేనతన్ని పిలిచాను, కాని అతడు బదులీయలేదు.
SOL 5:7 నగరంలో పారా తిరిగేవారు నాకు తారసిల్లారు నన్ను కొట్టి, గాయపరిచారు. ప్రాకారం కావలివారు నా పై దుస్తును కాజేశారు.
SOL 5:8 యెరూషలేము స్త్రీలారా, నా ప్రియుడు మీ కంట పడితే చెప్పండి, నీ ప్రియురాలు నీ ప్రేమతో కృంగి కృశించి పోతోందని.
SOL 5:9 అతిలోక సుందరి, ఇతర ప్రియులకంటె నీ ప్రియుని విశేషం ఏమిటి? ఇతర ప్రియుల కన్న నీ ప్రియుడు వేటివేటిలో ఎక్కువా? అంతగా ఎక్కువ కనుకనేనా, మాచేత ప్రమాణం చేయించుకున్నావు?
SOL 5:10 నా ప్రియుడు కమిలి ప్రకాశించు కాయమ్ము కలవాడు, పదివేలలోనైన రాణించగలవాడు.
SOL 5:11 మేలిమి బంగారు పోలిన శిరస్సు గలవాడు తుమ్మెద రెక్కలవంటి నొక్కు నొక్కుల కారునల్లటి శిరో జాలవాడు.
SOL 5:12 అతని కనులేమో సెలయేటి ఒడ్డున ఎగిరేటి గువ్వల పోలు పాల మునిగిన పావురాల పోలు బంగారం తాపిన రత్నాల పోలు.
SOL 5:13 అతడి చెక్కిళ్లు సుగంధ ఉద్యానాల పరిమళ పుష్పరాశుల పోలు అతని పెదవులు బోళంతో తడిసిన అత్తరు వారు కెందామరలు.
SOL 5:14 అతని చేతులు వజ్రాలు పొదిగిన బంగారు కడ్డీల పోలు అతని కాయము నీలాలు తాపిన నున్నటి దంత దూలమ్ము పోలు.
SOL 5:15 అతని పాదాలు బంగారు దిమ్మమీది పాలరాతి స్తంభాల పోలు అతని సుదీర్ఘ శరీరం లెబానోను పర్వతం మీది నిటారైన దేవదారు వృక్షాన్ని తలపింపజేయు.
SOL 5:16 ఔనౌను, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు అత్యంత వాంఛనీయుడు, అతని అధరం అత్యంత మధురం అతనే నా ప్రియుడు, నా ప్రాణ సఖుడు.
SOL 6:1 అతిలోక సుందరి, ఎచ్చటికి వెళ్ళాడు నీ ప్రియుడు? ఏ దిక్కు కెళ్లాడు? నీ ప్రియుని మాకు తెలుపు వెదుకుటకు మేము నీకు తోడ్పడతాము.
SOL 6:2 ఎర్రటి పద్మాలను ఏరుకొనుటకు నా ప్రియుడు వెళ్లాడు ఉద్యాన వనానికి సుగంధాలు వెదజల్లు పూలమొక్కల మళ్లకి గొర్రెల మేప పోయాడు తోటలకు కెందామరల కోసి రాశి వేయుటకు
SOL 6:3 మేపు నా ప్రియుడు నావాడు నేనతనిదానను ఈనాడు ఏనాడు. నేను ఎర్రని పద్మాల నడుమ గొర్రెలు మేపుతున్న నా ప్రియునిదానను.
SOL 6:4 ఓ నా ప్రియసఖీ, నీవు తిర్సా నగరమంత సుందర మైనదానివి, యెరూషలేమంత ఆహ్లాదకరమైన దానివి, నగర దుర్గాలంతటి భయంకరురాలివి.
SOL 6:5 నీవు నా వైపు చూడకు! నీ చూపులు నన్ను పురికొల్పి ఉన్మత్తున్ని చేస్తాయి గిలాదు పర్వత చరియల నుండి గెంతులేస్తూ దిగివచ్చే గొర్రెపిల్లల మాదిరిగా నీ సుదీర్ఘ శిరోజాలు జాలువారు తున్నాయి.
SOL 6:6 జోడు జోడు పిల్లల్ని కని ( వాటిలో ఏ ఒక్కటి పిల్లల్ని కోల్పోని) అప్పుడే శుభ్రంగా స్నానం చేసి వస్తున్న తెల్లటి ఆడ గొర్రెల బారులా ఉంది నీ పలువరుస
SOL 6:7 బురఖా కింద నీ కణతలు దానిమ్మ చెక్కల్లా వున్నాయి.
SOL 6:8 అరవై మంది రాణులు ఎనభై మంది సేవకురాండ్రు లెక్కకు మించిన కన్యలు ఉందురుగాక నాకు.
SOL 6:9 కాని, నా గువ్వ పిట్ట నిష్కళంకురాలు ఒక్కతే (నాకైన స్త్రీ) ఆమె తన తల్లికి ముద్దుబిడ్డ. తన తల్లికి గారాల కూచి! కన్యలే ఏమి, రాణులు, సేవకు రాండ్రు కూడా ఆమెను చూచినంతనే ప్రశంసిస్తారు.
SOL 6:10 ఎవరా యువతి? అరుణోదయంలా మెరుస్తోంది. చంద్రబింబమంత అందమైనది సూర్యుడంత ధగ ధగలాడుతోంది, పరలోక సేనకులంతటి విభ్రాంతి గొలుపు ఆ యువతి ఎవరు?
SOL 6:11 నేను బాదం తోపుకి వెళ్లాను ఫలసాయమెలా ఉందో చూసేందుకు ద్రాక్షా తీగెలు పూశాయేమో చూసేందుకు దానిమ్మలు మొగ్గతొడిగాయేమో చూసేందుకు,
SOL 6:12 నేనింకా గ్రహించక ముందే నా తనువు నన్ను రాజోద్యోగుల రథాల్లోకి చేర్చినది
SOL 6:13 షూలమ్మీతీ తిరిగిరా, తిరిగిరా మేము నిన్ను చూసేందుకు తిరిగి రా, తిరిగి రా, మహనయీము నాట్యమాడు షూలమ్మీతీ నేల తేరిపార చూస్తారు?
SOL 7:1 రాకుమారీ, ఆ పాదరక్షల్లో నీ పాదాలెంతో అందంగా ఉన్నాయి నీ తొడల వంపులు శిల్పి మలిచిన ఆభరణాల్ల ఉన్నాయి.
SOL 7:2 నీ నాభి గుండ్రటి కలశంలా ఉంది దానికెన్నడూ ద్రాక్షారసం కొరత లేకుండుగాక. నీ ఉదరం పద్మ వలయితమైన గోధుమ రాశిలా ఉంది.
SOL 7:3 నీ స్తనాలు లేజవరాలైన జింక అప్పుడే కన్న కవల పిల్లల్లా ఉన్నాయి.
SOL 7:4 నీ మెడ దంతపు గోపురంలా ఉంది నీ నేత్రాలు బాత్ రబ్బీన్ సరసన ఉన్న హెష్బోనులోని తటా కాల్లా ఉన్నాయి. నీ నాసిక దమస్కు దిక్కుకి చూచే లెబానోను శిఖరంలా ఉంది.
SOL 7:5 నీ తల కర్మెలు పర్వతంలా, నీ తల నీలాలు పట్టుకుచ్చుల్లా వున్నాయి. నీ సుదీర్ఘ కేశాలు చూసిన రాజు కూడా నీ వశం అవుతాడు.
SOL 7:6 నీవు అతిలోక సుందరివి! అత్యంత మనోహరివి! ప్రియదర్శినివి! అందమైన, ఆహ్లాదకరమైన యువతివి!
SOL 7:7 నీవు తాళవృక్షంలా పొడుగరివి. నీ స్తనాలు తాటిపళ్ల గెలల్లా వున్నాయి.
SOL 7:8 నాకు ఆ చెట్టుపైకి ఎక్కాలని, దాని మట్టలు పట్టాలని ఉంది. నీ స్తనాలు ద్రాక్షా గుత్తుల్లా నీ ఊపిరి ఆపిలు సువాసనలా ఉన్నాయి.
SOL 7:9 నీ నోరు శ్రేష్టమైన ద్రాక్షారసంలా అది నీ నోట జాలువారి నిద్రాముద్రిత ప్రియుని అధరాలను స్పృజించే మధువులా ఉండాలి.
SOL 7:10 నేను నా ప్రియునిదానను నన్నతను వాంఛిస్తాడు!
SOL 7:11 ఓ నా ప్రియుడా రా, చేలల్లోకి పోదాము రా, పల్లెల్లో రేయి గడుపుదాము రా,
SOL 7:12 పెందలకడ లేచి ద్రాక్షాతోటలకు పోదాము ద్రాక్షా తీగలు మొగ్గ తొడిగాయో లేదో ఆ మొగ్గలు విచ్చుకున్నాయో లేదో దానిమ్మ చెట్లు విరబూశాయో లేదో తనివితీరా చూద్దాము. రా. అక్కడ నేనిచ్చునా ప్రేమ అందుకొన రా.
SOL 7:13 ప్రేమ వర్ధక మండ్రేక ఓషధుల్నీ మా గుమ్మాన వేలాడే పరిమళభరితమైన పువ్వుల్నీ చూడు! ఓ నా ప్రియుడా, నీకై దాచి ఉంచాను ఎన్నెన్నో పండువీ, దోరవీ పండ్లు తిని చూడు!
SOL 8:1 తల్లి పాలు కుడిచేనాచిన్నారి తమ్ముడిలా నువ్వు చిట్టి పాపవే అయితే, నువ్వు నాకు బయట అగుపిస్తే, నిన్ను నేను ముద్దాడగలిగి ఉండేదాన్ని. అప్పుడు నన్నెవరూ తప్పు పట్టేవారు కారు!
SOL 8:2 నేను నిన్ను నాకు అన్నీ నేర్పిన మా తల్లి ఇంటి గదిలోనికి తీసుకుపోయి ఉండేదాన్ని. దానిమ్మ పళ్లరసంతో చేసిన సురభిళ మధువును నీకు ఇచ్చి ఉండేదాన్ని.
SOL 8:3 అతను తన ఎడమ చేతిని నా తల కింద ఉంచి తన కుడిచేతితో పొదివి పట్టుకుంటాడు.
SOL 8:4 యెరూషలేము స్త్రీలారా మీరు నాకొక వాగ్దానం చేయండి నా ప్రేమ స్వయం ప్రేరితమయ్యేదాకా, ప్రేమను జాగృతం చేయకండి ప్రేమను పురిగొల్పకండి.
SOL 8:5 ఎడారి వెంట, తన ప్రియుని ఆనుకొని వస్తున్న ఈ స్త్రీ ఎవరు? ఆపిలు చెట్టు నీడలో నిన్ను తట్టి నే లేపాను. అచ్చటే నీ తల్లి తన గర్భాన నిన్ను మోసింది, కన్నది.
SOL 8:6 నీ హృదయ పీఠం మీద నా రూపం ముద్రించు, నీ వేలికి ముద్రికలా ధరించు. మృత్యువంత బలమైనది ప్రేమ కోపాతిరేకం స్మశాననంతో సమమైనది. రోష విస్ఫులింగాలు జ్వాల అవుతాయి జ్వాలలు పెచ్చు మీరి మహాజ్వాల అవుతాయి.
SOL 8:7 ఉప్పెన కూడా ప్రేమజ్వాలను ఆర్పజాలదునది జలాలూ ప్రేమను ముంచెత్తజాలవు. ఒకడు ప్రేమ కోసం తన సర్వస్వం ధరపోస్తే, అతణ్ణి ప్రజలు మూర్ఖుడిగా పరిగణించరు. ఎవడూ తప్పు పట్ట జాలడు!
SOL 8:8 మాకు ఉన్నదొక చిన్న చెల్లెలు ఆమెకింకా యుక్త వయస్సు రాలేదు. దాన్ని వివాహం చేసుకొనుటకు ఒక పురుషుడు వస్తే, మా చెల్లెలి విషయంలో మేమేమి చెయ్యాలి?
SOL 8:9 అది ప్రాకారమైతే, దాని చుట్టూ వెండి నగిషీ చేస్తాము అది తలుపైతే, దాని చుట్టూ దేవదారు పలకలతో అంచులు అలంకరిస్తాము.
SOL 8:10 నేను ప్రాకారం వంటిదాన్ని నా వక్షోజాలు గోపుర ప్రాయాలు అతనికి నేనంటే తనివి, తృప్తి!
SOL 8:11 బయలు హామోనులో సొలొమోనుకొక ద్రాక్షాతోట ఉంది. ఆ తోటనాతడు కొందరు రైతులకు కౌలుకిచ్చాడు. వారిలో ఒక్కొక్క రైతు వెయ్యి వెండి షెకెళ్లు ఇచ్చాడు.
SOL 8:12 సొలొమోనూ, ఆ వెయ్యి షెకెళ్లూ నీ వే ఉంచుకో, వాటిలో యిన్నూరేసి ఒక్కొక్క రైతుకిచ్చేసెయ్యి అతుడు తెచ్చిన ద్రాక్షాలకు మింజువలె కానైతే, నా ద్రాక్షాతోట నా ఒద్దికలోనే ఉంటుంది!
SOL 8:13 ద్రాక్షాతోటలో కూర్చున్న ఓ సఖీ, నీ చెలికత్తెలు నీ స్వరం వింటున్నారు, నీ మధుర స్వరాన్ని నన్నూ విననీయి.
SOL 8:14 ప్రియ సఖా, వేగిరం వచ్చెయ్యి. జింకలూ, లేడి పిల్లల్లా పరిమళ వృక్ష సముదాయం పెరిగిన పర్వతాలపై నుంచి చెంగుచెంగున వచ్చెయ్యి.
ISA 1:1 ఆమోజు కుమారుడు యెషయా దర్శనం ఇది. యూదాకు, యెరూషలేముకు సంభవించే సంగతులను దేవుడు యెషయాకు చూపించాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదాకు రాజులుగా ఉన్న కాలవ్యవధిలో ఈ సంగతులను యెషయా చూశాడు.
ISA 1:2 ఆకాశమా, భూమీ యెహోవా మాట వినండి! యెహోవా ఇలా చెబుతున్నాడు. “నా పిల్లల్ని నేను పెంచాను. నా పిల్లలు పెరగటానికి నేను సహాయం చేసాను. కానీ నా పిల్లలు నా మీద తిరగబడ్డారు.
ISA 1:3 ఎద్దుకు తన కామందు తెలుసు. గాడిదకు దాని సొంతదారుడు మేత పెట్టే చోటు తెలుసు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు నేను తెలియదు. నా ప్రజలు గ్రహించరు.”
ISA 1:4 ఇశ్రాయేలు ప్రజలు దోషులు. ఈ దోషం ప్రజలు మోయాల్సిన భారమైన బరువులా ఉంది. ఆ ప్రజలు చెడు కుటుంబాలకు చెందిన దుర్మార్గపు పిల్లల్లా ఉన్నారు. వారు యెహోవాను విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుడు) అ ప్రజలు అవమానించారు. వాళ్లు దేవుణ్ణి విడిచిపెట్టి, పరాయి వాళ్లలా ఉన్నారు.
ISA 1:5 దేవుడు చెబుతున్నాడు: “ప్రజలారా నేనెందుకు మిమ్మల్ని శిక్షిస్తూనే ఉండాలి?నేను మిమ్మల్ని శిక్షించాను. కాని మీరు మారలేదు. మీరు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతి తల, ప్రతిగుండె వ్యాధితో ఉన్నాయి.
ISA 1:6 మీ అరికాలు మొదలుకొని మీ నడినెత్తి వరకు శరీరమంతా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు ఉన్నాయి. మీ పుండ్లను గూర్చి మీరు శ్రద్ద తీసుకోలేదు. మీ పుండ్లు శుభ్రం చేయబడలేదు. వాటికి కట్లు కట్టలేదు.
ISA 1:7 “మీ దేశం పాడైపోయింది. మీ పట్టణాలు అగ్నితో కాల్చివేయబడ్డాయి. మీ దేశాన్ని మీ శత్రువులు స్వాధీనం చేసుకొన్నారు. సైన్యం నాశనం చేసిన దేశంలా మీ భూమి పాడు చేయబడింది.”
ISA 1:8 ఇప్పుడు సీయోను కుమార్తె (యెరూషలేము) ద్రాక్ష తోటలో విడువబడిన ఖాళీ గుడారర లా ఉంది. దోస పాదుల్లో విసర్జించబడిన పాత గుడిసెలాగ ఉంది. అది శత్రువులచేత ఓడించబడిన పట్టణంలా ఉంది.
ISA 1:9 ఇది నిజమే, కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా కొద్ది మంది ప్రజలను బతకనిచ్చాడు. సొదొమ, గొమొర్రా పట్టణాల్లా మనం సర్వనాశనం చేయబడలేదు.
ISA 1:10 సొదొమ నాయకులారా, యెహోవా సందేశం వినండి. గొమొర్రా ప్రజలారా, దేవుని ఉపదేశాలు వినండి.
ISA 1:11 దేవుడు అంటున్నాడు: “ఇంకా ఎందుకు మీరు నాకు బలులు అర్పిస్తూనే ఉన్నారు? మీ మేకల బలులు, దూడల కొవ్వు, గొర్రెలు, మేకలు నాకు వెక్కసం అయ్యాయి.
ISA 1:12 మీరు నన్ను కలుసుకొనేందుకు వచ్చినప్పుడు, నా ఆవరణం అంతా తిరుగుతారు. మిమ్మల్ని ఇలా చేయమన్నది ఎవరు?
ISA 1:13 “నా కోసం పనికిమాలిన బలులు ఇక మీదట తీసుకొని రావద్ద. మీరు నాకు అర్పించే ధూపం నాకు అసహ్యం మీ అమావాస్య, సబ్బాతు, పవిత్ర రోజుల పండుగలను నేను సహించను. మీ పరిశుద్ధ సమావేశాలలో మీరు చేసేది నాకు అసహ్యం.
ISA 1:14 మీ నెలసరి సమావేశాలు, సభలు నాకు బొత్తిగా అసహ్యం. ఈ సమావేశాలు నాకు చాలా బరువులా తయారయ్యాయి. ఆ బరువులు మోయటం నాకు విసుగు.
ISA 1:15 “మీరు నన్ను ప్రార్థించాలని మీ చేతులు పైకి ఎత్తుతారు కానీ నేను మిమ్మల్ని చూడటానికి కూడా ఒప్పుకోను. మీరు మరిన్ని ప్రార్థనలు చేస్తారు కాని నేను మీ ప్రార్థనలు వినేందుకు ఒప్పుకోను. ఎందుకంటే మీ చేతులు రక్తమయము.
ISA 1:16 “మిమ్మల్ని మీరు కడుక్కోండి. మిమ్మల్ని మీరు పరిశుభ్రం చేసుకోండి. మీరు చేస్తున్న చెడు పనులు చాలించండి. ఆ చెడు పనులు చూడటం నాకు ఇష్టం లేదు. తప్పు చేయటం మానివేయండి.
ISA 1:17 మంచి పనులు చేయటం నేర్చుకోండి. ఇతరుల విషయంలో న్యాయంగా ఉండండి. ఇతరులను బాధించే వారిని శిక్షించండి. తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేయండి. భర్తలు చనిపోయిన స్త్రీలకు సహాయం చేయండి.”
ISA 1:18 యెహోవా చెబుతున్నాడు, “రండి, ఈ విషయాలు మనం పరిష్కరించుకొందాము. మీ పాపాలు కెంపులాగా ఎర్రగా ఉన్నా సరే వాటిని కడగవచ్చు, మీరు మంచులా తెల్లగా అవుతారు. మీ పాపాలు చాలా ఎర్రగా ఉన్నా సరే మీరు మాత్రం ఉన్నిలాగ తెల్లగా మారవచ్చును.
ISA 1:19 “నేను చెప్పే మాటలు మీరు వింటే అప్పుడు ఈ దేశపు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు.
ISA 1:20 కానీ మీరు వినేందుకు నిరాకరిస్తే, మీరు నాకు వ్యతిరేకమే. మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేసేస్తారు.” యెహోవా తానే ఈ విషయాలు చెప్పాడు.
ISA 1:21 దేవుడు చెబుతున్నాడు: “యెరూషలేమును చూడండి. అది నన్ను నమ్మి వెంబడించిన పట్టణం. అది ఓ వేశ్య అయ్యేట్టుగా చేసింది ఏమిటి? ఇప్పుడు అది నన్ను వెంబడించటం లేదు. యెరూషలేము న్యాయంతో నిండి ఉండాలి. యెరూషలేము నివాసులు యెహోవా కోరిన విధంగా జీవించాలి, కానీ ఇప్పుడు నరహంతకులు అక్కడ నివసిస్తున్నారు.
ISA 1:22 “మంచితనం వెండిలాంటిది. కానీ మీ వెండి పనికిమాలినదిగా తయారయింది. మీ ద్రాక్షారసం నీళ్లతో కలపబడి నిస్సారమయింది.
ISA 1:23 మీ అధికారులు తిరుగుబాటు దారులు, దొంగల స్నేహితులు. మీ అధికారులు అందరూ లంచాలు అడుగుతారు, తప్పుడు పనులు చేయటం కోసం డబ్బు స్వీకరిస్తారు. మీ అధికారులంతా ప్రజలను మోసం చేసేందుకు డబ్బు పుచ్చు కొంటారు. మీ అధికారులు అనాథ పిల్లలకు సహాయం చేసేందుకు ప్రయత్నం చేయరు. భర్తలు చనిపోయిన స్త్రీల అవసరాలను గూర్చి మీ అధికారులు వినిపించుకోరు.”
ISA 1:24 ఈ విషయాలన్నింటి మూలంగా, ఆ యజమాని, సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల మహాబలశాలి ఇలా చెబుతున్నాడు, “నా శత్రువులారా, నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఇంకెంత మాత్రం మీరు నాకు కష్టం కలిగించరు.
ISA 1:25 వెండిని శుద్ధిచేయటానికి మనుష్యులు క్షారం వాడుతారు. అదే విధంగా మీ తప్పులన్నిటినీ నేను శుద్ధి చేసేస్తాను. మీలోంచి పనికిమాలిన వాటన్నింటినీ నేను తీసివేస్తాను.
ISA 1:26 ఆరంభంలో మీకు ఉన్నమాదిరి న్యాయమూర్తుల్ని నేను మళ్లీ తీసుకొని వస్తాను. మీ సలహాదారులు చాలాకాలం క్రిందట మీకు ఉన్న సలహాదారుల్లా ఉంటారు. అప్పుడు మీరు ‘మంచి, నమ్మకమైన పట్టణం’” అని పిలువబడతారు.
ISA 1:27 దేవుడు మంచివాడు, ఆయన సరైన వాటినే చేస్తాడు. కనుక ఆయన సీయోనును, తన దగ్గరకు తిరిగి వచ్చే ప్రజలను రక్షిస్తాడు.
ISA 1:28 అయితే నేరుస్థులు, పాపులు అందురూ నాశనం చేయబడతారు. (వారు యెహోవాను వెంబడించని ప్రజలు.)
ISA 1:29 మీరు పూజించటానికి ఏర్పరచుకొనే మస్తకివృక్షాలు, ప్రత్యేక వనాలు చూచి భవిష్యత్తులో ప్రజలు సిగ్గుపడతారు.
ISA 1:30 మీరు ఎండిపోతున్న ఆకుల మస్తకి వృక్షాల్లా ఉంటారు. కనుక ఇలా జరుగుతుంది. నీళ్లులేక ఎండిపోతున్న తోటలా మీరుంటారు.
ISA 1:31 శక్తిమంతులైన ప్రజలు ఎండిపోయిన చిన్న చెక్క ముక్కల్లా ఉంటారు. ఆ ప్రజలు చేసే పనులు నిప్పు రాజబెట్టే నిప్పురవ్వల్లా ఉంటాయి. శక్తిమంతులైన ప్రజలూ, వారు చేసే పనులూ కాలిపోవటం మొదలవుతుంది. ఆ అగ్నిని ఎవరూ ఆర్పివేయలేరు.
ISA 2:1 యెరూషలేము, యూదాలను గూర్చి ఆమోజు కూమారుడు యెషయా ఈ సందేశం చూశాడు.
ISA 2:2 యెహోవా ఆలయం ఒక కొండమీద ఉంది. చివరి రోజుల్లో ఆ కొండ, పర్వతాలన్నింటిలో ఎత్తయినదిగా చేయబడుతుంది. ఆ పర్వతం కొండల శిఖరాలన్నింటికంటె ఎత్తు చేయబడుతుంది. అన్ని రాజ్యాల ప్రజలూ అక్కడికి వెళ్తారు.
ISA 2:3 అనేకమంది ప్రజలు అక్కడికి వెళ్తారు. “మనం యెహోవా పర్వతానికి వెళ్దాం. యాకోబు దేవుని మందిరానికి మనం వెళ్లాలి. అప్పుడు యెహోవా తన జీవన విధానం మనకు ఉపదేశిస్తాడు. మనం ఆయనను వెంబడిస్తాం” అని వాళ్లు చెబుతారు. దేవుని ఉపదేశాలు, యెహోవా సందేశం యెరూషలేములో, సీయోను కొండమీద ప్రారంభమై, ప్రపంచం అంతటికీ వ్యాపిస్తుంది.
ISA 2:4 అప్పుడు అన్ని రాజ్యాల ప్రజలకూ యెహోవా న్యాయమూర్తిగా ఉంటాడు. అనేకుల వాదాలను దేవుడు అంతంజేస్తాడు. ఆ మనుష్యులు తమ పోరాటానికి తమ ఆయుధాలు ఉపయోగించటం మానివేస్తారు. వారు తమ ఖడ్గాలతో నాగటి నక్కులు చేస్తారు. వారు, తమ ఈటెలను మొక్కలు కత్తిరించే పరికరాలుగా ప్రయోగిస్తారు. ప్రజలు ప్రజలతో పోరాటం మానివేస్తారు. ప్రజలు యుద్ధానికి మళ్లీ ఎన్నడూ శిక్షిణ పొందరు.
ISA 2:5 యాకోబు వంశస్తులారా, మీరు యెహోవాను వెంబడించాలి.
ISA 2:6 మీరు మీ ప్రజలను విడిచిపెట్టేశారు కనుక నేను మీతో దీనిని చెబుతున్నాను. తూర్పు దేశాల తప్పుడు అభిప్రాయాలతో మీ ప్రజలు నిండి పోయారు. ఫిలిష్తీయుల్లాగే మీ ప్రజలు జ్యోతిష్యం చెప్పటానికి ప్రయత్నించారు. ఆ వింత అభిప్రాయాలను మీ ప్రజలు పూర్తిగా స్వీకరించారు.
ISA 2:7 ఇతర స్థలాలకు చెందిన వెండి బంగారాలతో మీ దేశం నిండిపోయింది. అక్కడ చాలా చాలా ఐశ్వర్యాలున్నాయి. మీ దేశం గుర్రాలతో నిండిపోయింది. అక్కడ ఎన్నెన్నో రథాలు ఉన్నాయి.
ISA 2:8 ప్రజలు పూజించే విగ్రహాలతో మీ దేశం నిండిపోయింది. ప్రజలే చేసిన ఆ విగ్రహాలను ప్రజలు పూజిస్తారు.
ISA 2:9 ప్రజలు మరింతగా చెడిపోయారు. ప్రజలు మరీ హీనస్థితికి దిగజారి పోయారు. దేవా, నిజంగా నీవు వాళ్లను క్షమించవు గదూ?
ISA 2:10 వెళ్లి ధూళిలో, బండల చాటున దాక్కొనండి. యెహోవాను గూర్చి మీరు భయపడాలి. ఆయన మహా ప్రభావం నుండి మీరు దాక్కోవాలి.
ISA 2:11 గర్విష్ఠులు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఆ గర్విష్ఠులు అవమానంతో నేలమీద సాగిలపడ్తారు. ఆ సమయంలో యెహోవా మాత్రమే ఇంకా ఉన్నతుడుగా నిలుస్తాడు.
ISA 2:12 యెహోవా ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రోజు అహంకారులను, అతిశయం గలవారిని యెహోవా శిక్షిస్తాడు. అప్పుడు ఆ గర్విష్ఠులు ఎన్నికలేనివారుగా చేయబడతారు.
ISA 2:13 గర్విష్ఠులైన ఆ మనుష్యులు లెబానోను కేదారు వృక్షాల్లా ఉంటారు. వారు బాషాను మహా మస్తకి వృక్షాల్లా ఉంటారు. కానీ ఆ మనుష్యులను దేవుడు శిక్షిస్తాడు.
ISA 2:14 గర్విష్ఠులైన ఆ ప్రజలు ఎత్తయిన పర్వతాల్లా, కొండల్లా ఉన్నారు.
ISA 2:15 ఆ గర్విష్ఠులు ఎత్తయిన గోపురాల్లా చాలా బలమైన గోడల్లా ఉన్నారు. కానీ ఆ ప్రజలను దేవుడు శిక్షిస్తాడు.
ISA 2:16 ఆ గర్విష్ఠులు తర్షీషు గొప్ప ఓడల్లా ఉన్నారు. (ఈ ఓడలు చాలా విలువైన వస్తువులతో నిండి ఉంటాయి.) కానీ ఆ గర్విష్ఠులను దేవుడు శిక్షిస్తాడు.
ISA 2:17 ఆ సమయంలో ప్రజలు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఇప్పుడు గర్వంగా ఉన్న మనుష్యులు నేలమీద సాగిలపడతారు. మరియు ఆ సమయంలో యెహోవా మాత్రమే ఉన్నతంగా నిలుస్తాడు.
ISA 2:18 విగ్రహాలు (అబద్ధపు దేవతలు) అన్నీ తొలగి పోతాయి.
ISA 2:19 బండల చాటున, నేల బీటల్లో మనుష్యులు దాక్కొంటారు. యెహోవాను గూర్చి ఆయన మహా ప్రభావం గూర్చి ప్రజలు భయపడ్తారు. ఇదంతా భూమిని గజగజ వణకించుటకు యెహోవా నిలబడినప్పుడు జరుగుతుంది.
ISA 2:20 ఆ సమయంలో ప్రజలు వారి వెండి, బంగారు విగ్రహాలను పారవేస్తారు. (ప్రజలు పూజించుటకు మనుష్యులే ఆ విగ్రహాలను తయారు చేశారు.) ప్రజలు ఆ విగ్రహాలను నేలమీది కన్నాలలో ఉండే ఎలుకలకు, గబ్బిలాలకు వేస్తారు.
ISA 2:21 అప్పుడు ప్రజలు బండ సందులలో దాక్కొంటారు. యెహోవాను గూర్చి, ఆయన మహా శక్తిని గూర్చి భయపడి వారు అలా చేస్తారు. భూమిని గజగజ వణికించుటకు యెహోవా నిలబడినప్పుడు ఇది జరుగుతుంది.
ISA 2:22 మిమ్మల్ని రక్షించుట కోసం ఇతరులను నమ్ముకోవటం మీరు మానివేయాలి. వాళ్లూ మనుష్యులే, మనుష్యులు మరణిస్తారు. అందుచేత వాళ్లు కూడా దేవునిలా బలం గల వాళ్లు అని మీరు తలంచవద్దు.
ISA 3:1 నేను మీకు చెబుతున్న ఈ విషయాలు గ్రహించండి. యెరూషలేము, యూదాలు ఆధారపడే వాటన్నింటిని, ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా తొలగించి వేస్తాడు. భోజనం, నీళ్లు మొత్తం దేవుడు తీసివేస్తాడు.
ISA 3:2 వీరులందరిని, శూర సైనికులందరిని దేవుడు తొలగించి వేస్తాడు. న్యాయమూర్తులను, మాంత్రికులను, పెద్దలను అందరిని దేవుడు తొలగించి వేస్తాడు.
ISA 3:3 సైనిక అధికారులను, ప్రభుత్వ అధికారులను దేవుడు తొలగించివేస్తాడు. నైపుణ్యంగల సలహాదార్లను, మంత్రాలు వేస్తూ, జ్యోతిష్యం చెప్పటానికి ప్రయత్నించే తెలివిగల వాళ్లందరిని దేవుడు తొలగించి వేస్తాడు.
ISA 3:4 దేవుడు చెబుతున్నాడు: “యువకులు మీకు నాయకులయ్యేట్టు నేను చేస్తాను.
ISA 3:5 ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు విరోధం అవుతారు. చిన్నవాళ్లు పెద్దవాళ్లను గౌరవించరు. సామాన్యులు ప్రముఖులను లెక్కచేయరు.”
ISA 3:6 ఆ సమయంలో ఒకడ తన స్వంత కుటుంబంలోంచి తన సోదరుణ్ణి ఒకణ్ణి పట్టుకొచ్చి, “నీకు రాజ వస్త్రము ఉంది గనుక నీవే మాకు నాయకుడివి. ఈ శిథిలాలు అన్నింటి మీద నీవే నాయకుడివి” అని అతనితో చెబుతాడు.
ISA 3:7 అయితే ఆ సోదరుడు లేచి, “నేను నీకు సహాయం చేయలేను. సరిపడినంత ఆహారంగాని బట్టలుగాని నా ఇంట్లో లేవు. నన్ను మీ నాయకుడిని చేయవద్దు” అని చెబుతాడు.
ISA 3:8 యెరూషలేము తొట్రిల్లి, తప్పు చేసింది గనుక ఇలా జరుగుతుంది. యూదా పతనమై, యెహోవాను వెంబడించటం మానివేసింది. వారు చెప్పేవి, చేసేవి యెహోవాకు విరుద్ధం. యెహోవా మహిమ నేత్రాలు వీటన్నింటిని తేటగా చూస్తాయి.
ISA 3:9 మనుష్యులు తప్పు చేసిన దోషులని వారి ముఖాలు చెబుతున్నాయి. ైపెగా వారు వారి పాపము గూర్చి అతిశయిస్తున్నారు. వారు సొదొమ పట్టణ ప్రజల్లా ఉన్నారు. వారి పాపాన్ని ఎవరు చూసినా లెక్క చేయరు. అది వారికి ఎంతో కీడు. వాళ్లకు వాళ్లే చాలా కష్టం తెచ్చుకొన్నారు.
ISA 3:10 మంచి వారికి మంచి సంగతులు జరుగు తాయని మంచి వారితో చెప్పుము. వారు చేసే మంచి పనులకు వారికి బహుమానం లభిస్తుంది.
ISA 3:11 కానీ చెడ్డ వాళ్లకు అది చాలా చెడుగా ఉంటుంది. వారికి చాలా కష్టం వస్తుంది. వారు చేసిన చెడు పనులన్నింటి కోసం వారు శిక్షించబడతారు.
ISA 3:12 చిన్న పిల్లలు నా ప్రజలను ఓడించేస్తారు. స్త్రీలు నా ప్రజల మీద ఏలుబడి చేస్తారు. నా ప్రజలారా మీ మార్గ దర్శకులు మిమ్మల్ని తప్పు దారిలో నడిపిస్తున్నారు. సరియైన దారినుండి వారు మిమ్మల్ని తప్పించేస్తున్నారు.
ISA 3:13 ప్రజలకు తీర్పు తీర్చేందుకు యెహోవా నిలుస్తాడు.
ISA 3:14 పెద్దలు, నాయకులు చేసిన పనుల మూలంగా యెహోవా వారికి తీర్పు తీరుస్తాడు. యెహోవా చెబుతున్నాడు, “మీరు ద్రాక్ష తోటలను తగులబెట్టేశారు (యూదా) పేద ప్రజల దగ్గర్నుండి మీరు తీసుకొన్న వస్తువులు ఇంకా మీ ఇండ్లలో ఉన్నాయి.
ISA 3:15 నా ప్రజలను బాధించుటకు మీకు హక్కు ఎక్కడిది? పేద ప్రజల ముఖాలను కృంగదీయుటకు మీకు హక్కు ఎక్కడిది?” నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
ISA 3:16 యెహోవా అంటున్నాడు: “సీయోను స్త్రీలు చాలా గర్విష్ఠులయ్యారు. వారు ఇతరుల కంటె మంచి వాళ్లము అన్నట్టు తలలు పైకెత్తి నడుస్తున్నారు. ఆ స్త్రీలు ఓర చూపులు చూస్తారు. కాళ్ల గజ్జెలు మోగిస్తూ వయ్యారంగా కులుకుతూ నడుస్తారు.”
ISA 3:17 సీయోనులో ఆ స్త్రీల తలలమీద నా ప్రభువు పుండ్లు పుట్టిస్తాడు. ఆ స్త్రీలు వారి తలలు విరబోసు కొనేట్టుగా యెహోవా చేస్తాడు.
ISA 3:18 ఆ సమయంలో, వారు గర్వించే వస్తువులన్నింటినీ యెహోవా తొలగించి వేస్తాడు, అందమైన కాలి గజ్జలు, సూర్యహారాలు, చంద్రహారాలు,
ISA 3:19 చెవులదుద్దులు, కడియాలు, మేలి ముసుగులు,
ISA 3:20 రుమాళ్లు, పట్టా గొలుసులు, నడుముకు ధరించే వడ్డాణాలు, పరిమళాల బరిణెలు, హారాల మీద అలంకారాలు,
ISA 3:21 ముద్ర ఉంగరాలు, ముక్కు కమ్ములు,
ISA 3:22 శ్రేష్ఠమైన వస్త్రాలు, ఉత్తరీయాలు, దుప్పట్లు సంచులు,
ISA 3:23 అద్దాలు, మేలిమి వస్త్రాలు, తలపాగాలు, శాలువాలు.
ISA 3:24 ఇప్పుడు ఆ స్త్రీలకు సువాసనల పరిమళాలు ఉన్నాయి కానీ ఆ సమయంలో వారి పరిమళాలు కుళ్లుగాను మురుగుడుగాను అవుతాయి. ఇప్పుడు వాళ్లు వడ్డాణాలు పెట్టుకొంటున్నారు. కానీ ఆ సమయంలో వారు కట్టుకొనేందుకు తాళ్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు వారి తల వెంట్రుకలు అలంకారంగా అల్ల బడుతున్నాయి. కానీ ఆ సమయంలో వారి తలలు గుండ్లు గీయబడతాయి. వారికి శిరోజాలు ఉండవు. ఇప్పుడు వారికి విందు వస్త్రాలు ఉన్నాయి. కాని అప్పుడు విచారం వ్యక్తం చేసే వస్త్రాలే వారికి ఉంటాయి. ఇప్పుడు వారి ముఖాల మీద సౌందర్య చిహ్నాలు ఉన్నాయి. కానీ అప్పుడు వారి ముఖాల మీద వాతలు ఉంటాయి.
ISA 3:25 ఆ సమయంలో మీ పురుషులు ఖడ్గాలతో చంపబడతారు. మీ వీరులు యుద్ధంలో చస్తారు.
ISA 3:26 పట్టణ ద్వారాల దగ్గర సమావేశ స్థలాల్లో ఏడ్పు, దుఃఖం ఉంటుంది. దొంగలు, బందిపోటులు సర్వం దోచుకొన్న స్త్రీలాగ యెరూషలేము శూన్యంగా కూర్చుని ఉంటుంది. ఆమె నేల మీద కూర్చుని ఏడుస్తుంది.
ISA 4:1 ఆ కాలంలో ఏడుగురు స్త్రీలు ఒక్క మగవాణ్ణి పట్టుకొని, “మా స్వంత భోజనం మేముతింటాము, మా స్వంత బట్టలు మేము కట్టు కొంటాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి, మా అవమానం తొలగించుము” అని చెబుతారు.
ISA 4:2 ఆ సమయంలో యెహోవా మొక్క (యూదా) చాలా అందంగా, గొప్పగా ఉంటుంది. అప్పటికి ఇంకా ఇశ్రాయేలులో జీవించి ఉండే ప్రజలు ఆ దేశంలో పండే వాటిని చూచి ఎంతో గర్విస్తారు.
ISA 4:3 ఆ సమయంలో ఇంకా సీయోనులో, యెరూషలేములో జీవిస్తున్న ప్రజలు పరిశుద్ధ (ప్రత్యేక) ప్రజలు అని పిలువ బడతారు. ఒక ప్రత్యేక జాబితాలో పేర్లు ఉన్న ప్రజలందరికీ ఇలా జరుగుతుంది. బతికేందుకు అనుమతించబడిన ప్రజల జాబితా అది.
ISA 4:4 సీయోను స్త్రీల కల్మషాన్ని యెహోవా కడిగి వేస్తాడు. యెరూషలేములోని రక్తమంతా యెహోవా కడిగివేస్తాడు. దేవుడు న్యాయ ఆత్మను ప్రయోగించి, న్యాయంగా తీర్పు తీరుస్తాడు. మరియు ఆయన దహించే ఆత్మను ప్రయోగించి, సమస్తాన్నీ శుద్ధి చేస్తాడు.
ISA 4:5 ఆయన తన ప్రజలతో ఉన్నట్టు ఆ సమయంలో దేవుడు రుజువు చేస్తాడు. పగలు పొగల మేఘాన్ని, దేవుడు చేస్తాడు. రాత్రి ప్రకాశించే అగ్ని జ్వాలను దేవుడు చేస్తాడు. ఇవి ప్రతి ఇంటిమీద, ఆకాశంలోను, సీయోను కొండమీద, ప్రజల ప్రతి సమావేశం మీద నిలిచి ఉంటాయి. ప్రతి వ్యక్తి మీద కాపుదల ఉంటుంది.
ISA 4:6 ఆ కాపుదల ఒక భద్రతా స్థలం. ఆ కాపుదల సూర్యుని వేడినుండి ప్రజలను కాపాడుతుంది. అన్ని రకాల వర్షాలు వరదల నుండి దాగుకొనేందుకు ఆ కాపుదల క్షేమ స్థానంగా ఉంటుంది.
ISA 5:1 ఇప్పుడు నేను నా స్నేహితునికి (దేవుడు) ఒక పాట పాడుతాను. నా స్నేహితునికి తన ద్రాక్షావనం మీద (ఇశ్రాయేలు) ఉన్న ప్రేమను గూర్చిన పాట ఇది. మంచి సారవంతమైన భూమిలో నా స్నేహితునికి ఒక ద్రాక్షతోట ఉంది.
ISA 5:2 నా స్నేహితుడు పొలందున్ని చదును చేశాడు. అక్కడ మంచి ద్రాక్ష మొక్కల్ని అతడు నాటాడు. ఆ పొలం మధ్యలో అతడు ఒక గోపురం కట్టాడు. అక్కడ మంచి ద్రాక్షలు పండుతాయని నా స్నేహితుడు ఎదురు చూశాడు. కాని అక్కడ కారు ద్రాక్షలేపండాయి.
ISA 5:3 కనుక దేవుడు చెప్పాడు: “యెరూషలేములో నివసిస్తున్న ప్రజలారా, ఓ యూదా మనిషి, నన్ను గూర్చి, నా ద్రాక్షాతోట గూర్చి ఆలోచించు.
ISA 5:4 నా ద్రాక్షా తోటకు సహాయపడుటకు ఇంతకంటె ఎక్కువ నేనేం చేయాలి? నేను చేయగలిగింది అంతా చేశాను. మంచి ద్రాక్షలు పండుతాయని నేను ఎదురు చూశాను. కానీ కారు ద్రాక్షాలే ఉన్నాయి ఎందుకు అలా జరిగింది?
ISA 5:5 “నా ద్రాక్షాతోటకు నేను ఏమి చేస్తానో ఇప్పుడు నేను మీతో చెబుతాను. తోటను కాపాడుతోన్న ముళ్ల కంచెను నేను లాగివేసి దాన్ని కాల్చేస్తాను. దాని రాతి గోడను నేను కూలగొట్టేస్తాను. ఆ రాళ్లు కాళ్ల కింద తొక్కబడతాయి.
ISA 5:6 నా ద్రాక్షా తోటను నేను బీడు భూమిగా చేస్తాను. దాని మొక్కల్ని ఎవరూ లెక్క చేయరు. ఆ పొలంలో ఎవ్వరూ పని చేయరు. కలుపు మొక్కలు, ముళ్ల పొదలు అక్కడ పెరుగుతాయి. ఆ పొలం మీద వర్షించ వద్దని మేఘాలకు నేను ఆజ్ఞాపిస్తాను.”
ISA 5:7 సర్వశక్తిమంతుడైన యెహోవాకు చెందిన ద్రాక్షాతోట ఇశ్రాయేలు రాజ్యం యెహోవాకు ప్రియమైన ద్రాక్షావల్లి యూదా మనిషి. యెహోవా న్యాయం కోసం నిరీక్షించాడు. కాని అక్కడ చంపటం మాత్రమే ఉంది. అంతా లక్షణంగా ఉంటుంది అని యెహోవా నిరీక్షించాడు. కానీ అక్కడ బాధించబడిన ప్రజల ఆర్త ధ్వనులే ఉన్నాయి.
ISA 5:8 మీరు చాలా కిక్కిరిసి నివసిస్తారు. ఇంక దేనికి స్థలంలేనంతగా మీరు ఇళ్లు నిర్మించేస్తారు. కానీ యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడు. మీరు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. దేశం మొత్తంలో మీరు మాత్రమే ఉంటారు.
ISA 5:9 సర్వశక్తిమంతుడైన యెహోవా నాతో ఇలా చెప్పాడు, నేను అది విన్నాను, “ఇప్పుడు చాలా ఇళ్లు ఉన్నాయి. అయితే ఆ ఇళ్లన్నీ నాశనం చేయబడుతాయని నేను ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు అందమైన పెద్ద భవనాలు ఉన్నాయి. కానీ ఆ ఇళ్లు ఖాళీ అయిపోతాయి.
ISA 5:10 ఆ సమయంలో ఒక పదెకరాల ద్రాక్షాతోట కొంచెం మాత్రమే ద్రాక్షారసం ఇస్తుంది. చాలా బస్తాల గింజలతో కొద్దిపాటి ధాన్యం మాత్రం దిగుబడి అవుతుంది.”
ISA 5:11 మీరు ఉదయాన్నే లేచి మద్యం తాగాలని చూస్తుంటారు. ద్రాక్షారసంతో మత్తెక్కి రాత్రి చాలాసేపు మెళకువగా ఉంటారు.
ISA 5:12 మీరు ద్రాక్షారసంతో, సితారాలు, డప్పులు, పిల్లన గ్రోవులు, ఇతర సంగీత వాయిద్యాలతో మీరు విందులు చేసుకొంటారు. యెహోవా చేసిన కార్యాలు మీరు చూడరు. యెహోవా హస్తాలు ఎన్నెన్నో కార్యాలు చేశాయి. కాని మీరు వాటిని గమనించరు. అందుచేత అది మీకు చాలా కీడు.
ISA 5:13 యెహోవా చెబుతున్నాడు: “నా ప్రజలు బంధించబడి తీసుకొని పోబడతారు. ఎందుకంటే వారు నిజంగా నన్నెరుగరు. ఇశ్రాయేలులో నివసిస్తున్న మనుష్యులు ఇప్పుడు చాలా ప్రముఖలు. వారి సుఖ జీవనాలతో వారు సంతోషంగా ఉన్నారు. అయితే ఆ గొప్ప వాళ్లంతా దప్పిగొంటారు, ఆకలితో ఉంటారు.
ISA 5:14 అప్పుడు వారు చనిపోతారు, పాతాళం మరింత మంది మనుష్యులతో నిండిపోతుంది. ఆ మరణ స్థానం అపరిమితంగా దాని నోరు తెరుస్తుంది. అప్పుడు ఆ మనుష్యులంతా ఆ పాతాళంలోకి వెళ్లిపోతారు.”
ISA 5:15 ఆ మనుష్యులు తగ్గించబడతారు. ఆ గొప్పవాళ్లంతా తలలు వంచి నేలమీదికి చూస్తారు.
ISA 5:16 సర్వశక్తిమంతుడైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు, ఆయన గొప్పవాడని ప్రజలు తెలుసుకొంటారు. పవిత్ర దేవుడు సరైన వాటినే చేస్తాడు, ప్రజలు ఆయనను గౌరవిస్తారు.
ISA 5:17 ఇశ్రాయేలు ప్రజలు వారి దేశం విడిచి వెళ్లిపోయేట్టుగా దేవుడు చేస్తాడు, దేశం శూన్యం అవుతుంది. గొర్రెలు వాటికి ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తాయి. ఒకప్పుడు ధనికులదైన భూమిమీద గొర్రె పిల్లలు నడుస్తాయి.
ISA 5:18 ఆ మనుష్యుల్ని చూడండి. మనుష్యులు తాళ్లతో బండ్లను లాగినట్టు, వాళ్లు తమ పాపాల్ని దోషాన్ని వారి వెనుక లాగుతున్నారు.
ISA 5:19 వాళ్లు అంటారు: “దేవుడు చేయాలనుకొనే పనులు ఆయన త్వరగా చేస్తే బాగుండును. అప్పుడు జరిగేది ఏమిటో మాకు తెలుస్తుంది. యెహోవా పథకం త్వరగా జరిగిపోతే బాగుండును. ఆయన పథకం ఏమిటో అప్పుడు మాకు తెలుస్తుంది.”
ISA 5:20 ఆ మనుష్యులు మంచివాటిని చెడ్డవి అంటారు, చెడ్డవాటిని మంచివి అంటారు. వెలుగును చీకటి అని, చీకటిని వెలుగు అని వాళ్లు అనుకొంటారు. వాళ్లు చేదును తీపి, తీపిని చేదు అనుకొంటారు.
ISA 5:21 వాళ్లు చాలా తెలివిగల వాళ్లు అని ఆ మనుష్యులు తలస్తారు. వాళ్లు చాలా జ్ఞానంగలవాళ్లు అని తలస్తారు.
ISA 5:22 ద్రాక్షారసం తాగటంలో ఆ మనుష్యులు చాలా ప్రసిద్ది. మద్యము కలపటంలో వారు ప్రముఖులు.
ISA 5:23 మీరు వారికి డబ్బు చెల్లిస్తే, వారు నేరస్థుల్ని క్షమించేస్తారు. కానీ వారు మంచి వాళ్లకు న్యాయం జరుగనివ్వరు.
ISA 5:24 ఆ మనుష్యులకు చెడు సంగతులు సంభవిస్తాయి. గడ్డి, ఆకులు అగ్నితో కాల్చివేయబడినట్టు, వారి సంతతి వారు పూర్తిగా నాశనం చేయబడతారు. చచ్చి, ధూళిగా తయారయ్యే వేరులా వారి సంతానం వారు పూర్తిగా నాశనం చేయబడతారు. అగ్ని నాశనం చేసిన ఒక పువ్వులా వారి సంతతి వారు నాశనం చేయబడతారు. దాని బూడిద గాలితో కొటుకొని పోతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని ఉపదేశాలకు విధేయులయ్యేందుకు వారు నిరాకరించారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) సందేశాన్ని ఆ ప్రజలు అసహ్యించుకొన్నారు.
ISA 5:25 అందుచేత యెహోవా తన ప్రజల మీద చాలా కోపగించాడు. యెహోవా తన చేయి పైకెత్తి, వాళ్లను శిక్షిస్తాడు. పర్వతాలు సహా భయపడి పోతాయి. చచ్చిన శవాలు చెత్తలా వీధుల్లో పడి ఉంటాయి. కానీ దేవుడు మాత్రం ఇంకా కోపంగానే ఉంటాడు. ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన హస్తం ఇంకా పైకెత్తబడిఉంటుంది.
ISA 5:26 చూడండి! చాలా దూరంలో ఉన్న దేశాలకు దేవుడు ఒక సంకేతం ఇస్తున్నాడు. దేవుడు ఒక పతాకాన్ని ఎగుర వేస్తున్నాడు, మరియు ఆ ప్రజలను పిలిచేందుకు ఆయన ఈల వేస్తున్నాడు. శత్రువు దూరదేశం నుండి వస్తున్నాడు. త్వరలోనే శత్రువు దేశంలో ప్రవేశిస్తాడు. వారు చాలా వేగంగా కదలుతున్నారు.
ISA 5:27 శత్రువు ఎన్నటికీ అలసిపోడు, పడిపోడు. వారెన్నటికీ నిద్రబోతులుగా నిద్రపోరు. వారి ఆయుధ పట్టాలు ఎల్లప్పుడూ సిద్దమే. వారి చెప్పుల తాళ్లు ఎప్పటికి తెగిపోవు.
ISA 5:28 శత్రువుల బాణాలు చాలా పదునుగా ఉంటాయి. వారి బాణాలన్నీ కొట్టడానికి సిద్ధంగా ఉంటాయి. గుర్రాల డెక్కలు బండలా గట్టిగా ఉంటాయి. వాటి రథాల వెనుక ధూళి మేఘాలుగా లేస్తుంది.
ISA 5:29 శత్రువు గట్టిగా అరిస్తే, అది సింహగర్జనలా ఉంటుంది. అది కొదమ సింహపు గర్జన అంత గట్టిగా ఉంటుంది. శత్రువు తాను పోరాడుతున్న ప్రజలను ఎదురులేకుండా పట్టి లాగుకొని పోతాడు. ప్రజలు కొట్టుమిట్టాడి, తప్పించుకొనేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్లను రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు.
ISA 5:30 కనుక “సింహం” గట్టిగా సముద్ర ఘోషలా గర్జిస్తుంది. బంధించబడిన ప్రజలు నేలమీదికే చూస్తుంటారు, అప్పుడు చీకటి మాత్రమే ఉంటుంది. దట్టమైన ఈ మేఘంలో వెలుగంతా చీకటిగానే ఉంటుంది.
ISA 6:1 ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరం నా ప్రభువును నేను చూశాను. మహా ఎత్తయిన సింహాసనంమీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అంగీతో దేవాలయం నిండిపోయింది.
ISA 6:2 సెరాపులనే దేవదూతలు ఆయన పైగా నిలబడ్డారు. ఒక్కొక్క సెరాపు దేవదూతకు ఆరు రెక్కలు ఉన్నాయి. ఆ దేవదూతలు వారి ముఖాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు, పాదాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు మరియు ఎగిరేందుకు రెండేసి రెక్కలు ఉపయోగించారు.
ISA 6:3 దేవదూతలు ఒకరితో ఒకరు, “ప్రభువైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన మహిమ భూలోకమంతా నిండిపోయింది” అని ఘనంగా స్తుతిస్తున్నారు.
ISA 6:4 వారి స్వరాలు గడప కమ్ముల్ని కదలించి వేశాయి. అంతలో దేవాలయం ధూమంతో నిండిపోవటం మొదలయింది.
ISA 6:5 “అయ్యో! నాకు శ్రమ, నేను నాశనమయ్యాను. నేను అశుద్ధమైన పెదవులున్న వాడను, నేను అపరిశుద్ధమైన పెదవులున్న జనుల మధ్య నివసిస్తున్నాను. సైన్యములకధిపతియైన యెహోవాను నేను చూశాను.”
ISA 6:6 బలిపీఠం మీద అగ్ని ఉంది. సెరాపు దేవదూతల్లో ఒకరు ఆ అగ్నిలో నుండి మండుచున్న ఒక నిప్పుకణాన్ని తీయటానికి ఒక పట్టకారు ఉపయోగించారు. మండుతున్న ఆ నిప్పుకణం చేతపట్టుకొని ఆ దేవదూత నా దగ్గరకు ఎగిరి వచ్చాడు.
ISA 6:7 ఆ సెరాపు దేవదూత ఆ వేడి నిప్పుకణంతో నా నోటిని తాకాడు. అప్పుడు ఆ దూత, “చూడు, ఈ వేడి నిప్పుకణం నీ పెదాలను తాకింది గనుక నీవు చేసిన తప్పులన్నీనీలో నుండి పోయాయి. ఇప్పుడు నీ పాపాలు తుడిచివేయబడ్డాయి.” అని చెప్పాడు.
ISA 6:8 అప్పుడు నా ప్రభువు స్వరం నేను విన్నాను. “నేను ఎవర్ని పంపగలను? మా కోసం ఎవరు వెళ్తారు?” అన్నాడు యెహోవా. కనుక నేను “ఇదుగో నేను ఉన్నాను, నన్ను పంపించు” అన్నాను.
ISA 6:9 అప్పుడు యెహోవా చెప్పాడు, “వెళ్లి, ప్రజలతో ఇది చెప్పు: ‘మీరు దగ్గరగా వచ్చి వింటారు గాని గ్రహించరు! దగ్గరగా వచ్చి చూస్తారు గాని నేర్చుకోరు.’
ISA 6:10 ప్రజల్ని గందరగోళం చేయి. ప్రజలు విని, చూచే విషయాలు వారు గ్రహించకుండా ఉండేటట్టు చేయి. నీవు ఇలా చేయకపోతే, ప్రజలు వారి చెవులతో వినే విషయాలను నిజంగానే గ్రహించవచ్చు. ప్రజలు వారి మనస్సుల్లో నిజంగానే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వారు అలా కనుక చేస్తే, ఆ ప్రజలు మళ్లీ నా దగ్గరకు తిరిగి వచ్చి, స్వస్థత పొందుతారేమో (క్షమాపణ)!”
ISA 6:11 అప్పుడు నేను “ప్రభూ, ఎన్నాళ్లు నేను ఇలా చేయాలి?” అని అడిగాను. యెహోవా జవాబిచ్చాడు, “పట్టణాలు నాశనం చేయబడి, ప్రజలు వెళ్లిపోయేంత వరకు ఇలా చేయి. ఇళ్లలో మనుష్యులు ఎవ్వరూ నివసించకుండా ఉండే అంతవరకు ఇలా చేయి. దేశం నాశనం చేయబడి, నిర్జనం అయ్యేంతవరకు ఇలా చేయుము.”
ISA 6:12 ప్రజలు దూరంగా వెళ్లిపోయేట్టు యెహోవా చేస్తాడు. దేశంలో విస్తారమైన ప్రదేశాలు నిర్జనంగా ఉంటాయి.
ISA 6:13 అయితే పదోవంతు ప్రజలు దేశంలో ఉండేందుకు అనుమతించబడతారు. ఈ ప్రజలు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు గనుక వీరు నాశనం చేయబడరు. ఈ ప్రజలు సింధూర వృక్షంలాంటి వారు. చెట్టు నరికి వేయబడినప్పుడు, దాని మొద్దు విడువబడుతుంది. ఈ మొద్దు (మిగిలిన ప్రజలు) చాలా ప్రత్యేకమైన విత్తనం.
ISA 7:1 ఆహాజు యోతాము కుమారుడు. యోతాము ఉజ్జియా కుమారుడు. సిరియా రాజు రెజీను రెమల్యా కుమారుడు, పెకహు ఇశ్రాయేలు రాజు. ఆహాజు యూదాకు రాజుగా ఉన్న కాలంలో, రెజీను, పెకహు యెరూషలేము మీద యుద్ధానికి వెళ్లారు. కాని వారు ఆ పట్టణాన్ని ఓడించలేక పోయారు.
ISA 7:2 దావీదు కుటుంబానికి ఒక సందేశం ఇవ్వబడింది. “అరాము (సిరియా) సైన్యం, ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) సైన్యం ఒకటిగా కలిశాయి. రెండు సైన్యాలు కలిసి బసచేస్తున్నాయి” అనేది ఆ సందేశం. అహాజు రాజు ఈ సందేశం విన్నప్పుడు అతడు, ప్రజలు చాలా భయపడిపోయారు. అరణ్యంలో గాలికి కొట్టుకొనే చెట్లలా వారు భయంతో వణకి పోయారు.
ISA 7:3 అప్పుడు యెషయాతో యెహోవా చెప్పాడు, “నీవూ, నీ కుమారుడూ షెయార్యాషూబు వెళ్లి ఆహాజుతో మాట్లాడండి. పైకోనేటిలోకి నీళ్లు ప్రవహించే చోటికి వెళ్లండి. ఇది చాకలివాని పొలానికి పోయే దారిలో ఉంది.
ISA 7:4 “ఆహాజుతో చెప్పండి, జాగ్రత్తగా ఉండండి, గాని నెమ్మదిగా ఉండండి. భయపడవద్దు. వాళ్లిద్దరు మనుష్యులు, అంటే రెజీను, రెమల్యా కుమారుడు మిమ్మల్ని భయపెట్టనివ్వకండి. వాళ్లు కాలిపోయిన రెండు కట్టెల్లాంటి వాళ్లు. గతంలో వాళ్లు వేడిగా మండుతూండేవాళ్లు. కాని ఇప్పుడు వాళ్లు వట్టి పొగ మాత్రమే. రెజీను, సిరియా, రెమల్యా కుమారుడు కోపంగా ఉన్నారు.
ISA 7:5 వారు మీకు విరోధంగా పథకాలు వేశారు.
ISA 7:6 మనం వెళ్లి యూదా మీద యుద్ధం చేయాలి. యూదాను మనలో మనం పంచుకొందాం. టాబెయేలు కుమారుణ్ణి యూదాకు క్రొత్త రాజుగా చేద్దాము” అని వారన్నారు.
ISA 7:7 నా దేవుడైన యెహోవా చెబుతున్నాడు, “వారి పథకం పనిచేయదు. అది సంభవించదు.
ISA 7:8 రెజీను దమస్కుకు పాలకునిగా ఉన్నంతవరకు అది జరుగదు. ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) ఇప్పుడు ఒక రాజ్యం. కానీ అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) రాజ్యంగా ఉండదు.
ISA 7:9 ఎఫ్రాయిముకు షోమ్రోను రాజధానిగా ఉన్నంత వరకు, రెమల్యా కుమారుడు దాని పాలకునిగా ఉన్నంతవరకు వారి పథకం నెరవేరదు. ఈ సందేశాన్ని నీవు నమ్మకపోతే ప్రజలు నిన్ను నమ్మగూడదు.”
ISA 7:10 అప్పుడు యెహోవా ఆహాజుతో మాట్లాడటం కొనసాగించాడు.
ISA 7:11 యెహోవా చెప్పాడు: “ఈ సంగతులు సత్యం అని నీ మట్టుకు నీవు రుజువు చేసుకొనేందుకు ఒక సూచన కోసం అడుగు. నీకు కావాల్సిన ఏ సూచన కోసమైనా నీవు అడగవచ్చు. ఆ సూచన పాతాళమంత లోతునుండి రావచ్చు, లేక ఆ సూచన ఆకాశమంత ఎత్తునుండి అయినా రావచ్చును.”
ISA 7:12 కాని ఆహాజు, “రుజువుగా సూచన కావాలి అని నేను అడగను. యెహోవాను నేను పరీక్షించను” అన్నాడు.
ISA 7:13 అప్పుడు యెషయా చెప్పాడు, “దావీదు వంశమా, జాగ్రత్తగా ఆలకించు. మీరు ప్రజల సహనాన్ని పరీక్షిస్తారు. కానీ అది మీకు ముఖ్యంకాదు. కనుక మీరు ఇప్పుడు నా దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నారు.
ISA 7:14 కాబట్టి ఆయనే మీకు ఒక సూచన చూపిస్తాడు. ఇదిగో ఒక కన్య గర్భము ధరించి, ఒక కుమారుడ్ని కని, ఆయన్ని ఇమ్మానుయేలు అనే పేరుతో పిలుస్తుంది.
ISA 7:15 అతను పెరుగు, తేనె తినును చెడును విసర్జించి మంచిని చేపట్టి తెలివి వచ్చేవరకు అతను ఇలా జీవిస్తాడు.
ISA 7:16 కానీ ఆ బాలుడు మంచి, చెడులను తెలుసుకొనక ముందే ఎఫ్రాయిము (ఇశ్రాయేలు), సిరియా నిర్జనం అయి పోతాయి. మీరు ఆ ఇద్దరు రాజులను గూర్చి భయపడుతున్నారు.
ISA 7:17 “కానీ మీరు యెహోవాను గూర్చి భయపడాలి. ఎందుకంటే యెహోవా మీకు కొన్ని కష్టకాలాలను తీసుకొని వస్తాడు. మీ ప్రజలకు, మీ తండ్రివంశ ప్రజలకు ఆ కష్టాలు వస్తాయి. దేవుడేమి చేస్తాడు? మీ మీద యుద్ధం చేయటానికి అష్షూరు రాజును యెహోవా తీసుకొని వస్తాడు.
ISA 7:18 “ఆ సమయంలో యెహోవా ‘జోరీగల్ని’ రప్పిస్తాడు. (ఆ ‘జోరీగలు’ ఇప్పుడు ఈజిప్టు నదుల దగ్గర ఉన్నాయి) మరియు యెహోవా కందిరీగల్ని రప్పిస్తాడు. (కందిరీగలు ఇప్పుడు అష్షూరు దేశంలో ఉన్నాయి.) ఈ శత్రువులు మీ దేశానికి వస్తారు.
ISA 7:19 ఈ శత్రువులు అరణ్యపు బండ సందుల దగ్గర మెట్టల లోయల్లోను, పొదల దగ్గర, నీటి మడుగుల దగ్గర ఉంటాయి.
ISA 7:20 యూదాను శిక్షించటానికి యెహోవా అష్షూరును వాడుకొంటాడు. అష్షూరు కూలికి వినియోగించబడే మంగలి కత్తిలా ఉపయోగించబడుతుంది. అది యూదా తలమీద, కాళ్లమీద, వెంట్రుకలను యెహోవా తానే గీసేస్తున్నట్టుగా ఉంటుంది. అది యూదా గడ్డాన్ని యోహోవా గీసేస్తున్నట్టుగా ఉంటుంది.
ISA 7:21 “ఆ సమయంలో ఒక మనిషి ఒక ఆవును, రెండు గొర్రెలను మాత్రమే ప్రాణంతో ఉంచుకో గలుగుతారు.
ISA 7:22 ఆ ఒక్క మనిషి తినడానికి సరిపోయే పెరుగు, పాలు మాత్రమే ఉంటాయి. దేశంలో ప్రతి మనిషి పెరుగు, తేనె మాత్రమే తింటారు.
ISA 7:23 ఈ దేశంలో వెయ్యేసి ద్రాక్షా వల్లులు ఉన్న పొలాలు ఇప్పుడు ఉన్నాయి. ఒక్కో ద్రాక్ష వల్లి వెయ్యి వెండి నాణాల విలువ చేస్తుంది. కానీ ఈ పొలాలు గచ్చ పొదలు, బలు రక్కసి చెట్లతో నిండిపోతాయి.
ISA 7:24 దేశం అడవిగా తయారై, వేట ప్రదేశంగా మాత్రమే ఉపయోగ పడుతుంది.
ISA 7:25 ఒకప్పుడు ఈ కొండల మీద ప్రజలు పనిచేసి, ఆహారం పండించారు. కానీ ఆ సమయంలో మనుష్యులు అక్కడికి వెళ్లరు. దేశమంతా గచ్చ పొదలతో, బలు రక్కసి చెట్లతో నిండిపోతుంది. గొర్రెలు, పశువులు మాత్రమే ఆ స్థలాలకు వెళ్తాయి.”
ISA 8:1 యెహోవా నాతో చెప్పాడు, “వ్రాయటానికి ఒక పెద్ద పలక తీసుకో. ఘంటంతో (పెన్నుతో) ఈ మాటలు వ్రాయి: ‘మహేరు, షాలాల్, హాష్ బజ్.’ (అంటే ‘త్వరలోనే దోపిడి, దొంగతనం జరుగుతుంది’ అని అర్థం.)”
ISA 8:2 సాక్షులుగా నమ్మదగిన కొందరు మనుష్యుల్ని నేను సమావేశపర్చాను. (వీళ్లు ఊరియా, యెబెరెక్యా, జెకర్యా) నేను ఈ విషయాలు రాయటం ఈ మనుష్యులు గమనించారు.
ISA 8:3 తర్వాత నేను ప్రవక్తి దగ్గరకు వెళ్లాను. నేను ఆమెతో ఉన్న తర్వాత ఆమె గర్భవతియై, ఒక కుమారుని కన్నది. అప్పుడు యెహోవా నాతో చెప్పాడు, “పిల్లవాడికి మహేరు షాలాల్ హాష్‌బజ్” అని పేరు పెట్టు.
ISA 8:4 ఎందుకంటే ఆ పిల్లవాడు “అమ్మా” “నాన్నా” అనటం నేర్చుకొనక ముందే దమస్కు, షోమ్రోనుల ధనం, ఐశ్వర్యాలు దేవుడు తీసుకొని, వాటిని దేవుడు అష్షూరు రాజుకు ఇచ్చివేస్తాడు.
ISA 8:5 దేవుడు మళ్లీ నాతో మాట్లాడాడు.
ISA 8:6 నా ప్రభువు చెప్పాడు: “ఈ ప్రజలు నిదానంగా ప్రవహించే షిలోహు జలాలను స్వీకరించేందుకు నిరాకరించారు. రెజీను, రెమల్యా కుమారునితో (పెకహు) వీళ్లు సంతోషపడి పోతున్నారు.
ISA 8:7 అందుచేత చూడు నా యెహోవా మహా గొప్ప యూఫ్రటీసు నదీ ప్రవాహంలాగా అష్షూరును దాని శక్తి అంతటిని తీసుకొని వస్తున్నాడు. వారు ఒక నది పొంగి పొర్లేలా, ప్రవాహంలా మీ దేశంలోనికి వస్తారు.
ISA 8:8 ఆ నదిలోంచి నీళ్లు పొంగి యూదాలోకి ప్రవహిస్తాయి. యూదా గొంతుల వరకు నీళ్లు పొంగి, యూదాను దాదాపుగా ముంచేస్తాయి. “ఇమ్మానుయేలూ, నీ దేశం అంతటినీ ముంచి వేసేంతగా ఈ వరద విస్తరిస్తుంది.”
ISA 8:9 సర్వ దేశాల్లారా, యుద్ధానికి సిద్ధపడండి. కాని మీరు ఓడిపోతారు. దూర దేశాలన్నీ ఆలకించండి. యుద్ధానికి సిద్ధపడండి. కానీ మీరు ఓడిపోతారు
ISA 8:10 యుద్ధానికి మీ వ్యూహాలు పన్నండి. కానీ మీ వ్యూహాలు అన్నీ ఓడిపోతాయి. మీ సైన్యాలకు ఆజ్ఞాపించండి. కానీ మీ ఆజ్ఞలు నిష్ప్రయోజనమే. ఎందుకంటే, దేవుడు మాతో ఉన్నాడు గనుక.
ISA 8:11 యెహోవా తన మహా శక్తితో నాతో మాట్లాడాడు. ఈ ఇతర మనుష్యుల్లా ఉండొద్దని యెహోవా నన్ను హెచ్చరించాడు.
ISA 8:12 “ప్రతివారూ ఇతరులు తమకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నట్టు చెబుతున్నారు. నీవు ఆ విషయాలు నమ్మవద్దు. ఆ ప్రజలు భయపడే వాటికి నీవు భయపడవద్దు. వాటిగూర్చి నీవు భయపడవద్దు” అని యెహోవా నాతో చెప్పాడు.
ISA 8:13 సర్వశక్తిమంతుడైన యెహోవా ఒక్కడే మీరు భయపడాల్సిన వాడు. మీరు గౌరవించాల్సిన వాడు ఆయనే. మీరు భయపడాల్సింది ఆయనకే.
ISA 8:14 మీరు యెహోవాను గౌరవించి, ఆయనను పవిత్రునిగా ఎంచుకొంటే, అప్పుడు ఆయనే మీకు క్షేమస్థానంగా ఉంటాడు. కానీ మీరు ఆయనను గౌరవించరు. కనుక మీరు పడిపోయేట్టు చేసే బండ ఆయనే. ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబాలను తొట్రిల్లేలా చేసే బండ ఆయనే. యెరూషలేము ప్రజలందరినీ పట్టుకొనే బోను యెహోవాయే.
ISA 8:15 (అనేకమంది మనుష్యులు ఈ బండ తగిలి పడిపోతారు. వాళ్లు పడిపోయి, విరిగిపోతారు. వారు బోనులో పట్టుబడతారు.)
ISA 8:16 యెషయా చెప్పాడు, “ఒక ఒడంబడిక చేసి, దాన్ని ముద్రించండి. నా ఉపదేశాలను భవిష్యత్తు కోసం భద్రపర్చండి. నన్ను అనుసరించే వాళ్లు చూస్తూ ఉండగా దీనిని చేయండి.”
ISA 8:17 ఆ ఒడంబడిక ఇదేః యెహోవా మాకు సహాయం చేసేవరకు నేను వేచి ఉంటాను. యాకోబు (ఇశ్రాయేలు) వంశం విషయం యెహోవా సిగ్గు పడుతున్నాడు. ఆయన వాళ్లను చూచేందుకు నిరాకరిస్తున్నాడు. కానీ నేను యెహోవా కోసం నిరీక్షిస్తాను. ఆయనే మమ్మల్ని రక్షిస్తాడు.
ISA 8:18 “ఇశ్రాయేలు ప్రజలకు నేనూ, నా పిల్లలే సూచనగా రుజువుగా ఉన్నాము. సీయోను కొండమీద నివాసం చేసే సర్వశక్తిమంతుడైన యెహోవా మమ్మల్ని పంపించాడు.”
ISA 8:19 కొంతమంది, “జ్యోతిష్కుల దగ్గరకు, మాంత్రికుల దగ్గరకు వెళ్లి, ఏమి చేయాలో తెలుసుకోండి” అంటున్నారు. (ఈ జ్యోతిష్కులు, మాంత్రికులు పిట్టల్లా కిచకిచలాడి తమకి చాలా తెలివిగల తలపులు ఉన్నట్టు మనుష్యులు తలచాలని గుసగుసలాడుతారు.) అయితే వాళ్లు వాళ్ల దేవుణ్ణి సహాయం అడుక్కోవాలి అని నేను చెబుతున్నాను. ఆ జ్యోతిష్కులు, మాంత్రికులు వారు ఏమి చేయాలి అనేది చచ్చిపోయిన వాళ్లను అడుగుతారు. బతికి ఉన్న వాళ్లు చచ్చిన వాళ్లను ఏదైనా ఎందుకు అడగాలి?
ISA 8:20 మీరు ఉపదేశాలను, ఒడంబడికను అనుసరించాలి. ఈ ఆదేశాలు మీరు అనుసరించకపోతే, మీరు తప్పు ఆదేశాలను పాటించవచ్చు. (తప్పు ఆదేశాలు అంటే జ్యోతిష్కులు, మాంత్రికులు దగ్గర్నుండి వచ్చేవి. అవి ఎందుకూ పనికి రాని ఆదేశాలు. ఆ ఆదేశాలను పాటించటర వల్ల మీకేమీ లాభం ఉండదు.)
ISA 8:21 ఆ తప్పు ఆదేశాలను మీరు పాటిస్తే దేశంలో కష్టాలు, ఆకలి ఉంటాయి. ప్రజలు ఆకలితో ఉంటారు. అప్పుడు వాళ్లకు కోపం వచ్చి రాజును, అతని దేవుళ్లను తిడతారు. అప్పుడు వాళ్లు సహాయం కోసం దేవునివైపు చూస్తారు.
ISA 8:22 వారు వారి దేశంలో చుట్టూరా చూస్తే, కష్టం కృంగదీసే చీకటి దేశంనుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన ప్రజల దుఃఖపు చీకటి మాత్రమే వారికి కనబడుతుంది. మరియు ఆ చీకట్లో పట్టుబడిన మనుష్యులు తమను తాము విడిపించు కోలేరు.
ISA 9:1 గతంలో జెబూలూను దేశం, నఫ్తాలి దేశం ముఖ్యంకాదు అనుకొన్నారు. కానీ ఉత్తరార్థంలో దేవుడు ఆ దేశాన్ని గొప్ప చేస్తాడు. సముద్రం దగ్గర దేశం, యొర్దాను నది అవతల దేశం, యూదులు కానివారు నివసించే గలిలయ.
ISA 9:2 ఇప్పుడు ఆ ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. కానీ వారు గొప్ప వెలుగు చూస్తారు. మరణంలాంటి చీకటిచోట ఆ ప్రజలు జీవిస్తున్నారు. కానీ “గొప్ప వెలుగు” వారిమీద ప్రకాశిస్తుంది.
ISA 9:3 దేవా, నీవే రాజ్యాన్ని పెద్ద చేస్తావు. ప్రజల్ని నీవు సంతోషపరుస్తావు. ఆ ప్రజలు వారి సంతోషాన్ని నీకు తెలియజేస్తారు. అది కోతకాలపు సంతోషంలా ఉంటుంది. ప్రజలు యుద్ధంలో గెలిచిన సామగ్రిని పంచుకొన్నప్పుడు కలిగిన సంతోషంలా ఉంటుంది.
ISA 9:4 ఎందుకంటే, భారాన్ని నీవు తొలగించేస్తావు కనుక. ప్రజల వీపుల మీద నుండి భారమైన కాడిని నీవు తొలగించేస్తావు గనుక. నీ ప్రజలను శిక్షించేందుకు శత్రువు వినియోగించే కొరడాను నీవు తొలగించేస్తావు. అది నీవు మిద్యాను ఓడించిన సమయంలా ఉంటుంది.
ISA 9:5 యుద్ధంలో కదం తొక్కిన ప్రతి కాలిజోడు నాశనం చేయబడుతుంది. రక్తపు మరకలైన యుద్ధ వస్త్రం ప్రతీది నాశనం చేయబడుతుంది. అవన్నీ అగ్నిలో పడద్రోయబడతాయి.
ISA 9:6 మనకు ఒక బాలుడు పుట్టియున్నాడు. మనకు ఒక కుమారుడు ఇవ్వబడియున్నాడు. ఆయన భుజం మీద ప్రభుత్వమున్నది. “ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, శక్తిగల దేవుడు, నిత్యం జీవించే తండ్రి, సమాధాన రాజు” అనేది ఆయన పేరు.
ISA 9:7 ఆయన రాజ్యంలో శాంతి, శక్తి ఉంటాయి. దావీదు వంశపు ఈ రాజుకు అది కొనసాగుతుంది. ఈ రాజు మంచితనం, న్యాయపు తీర్పు ప్రయోగించి, రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ పాలిస్తాడు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు తన ప్రజల మీద బలీయమైన ప్రేమ ఉంది. ఈ బలీయమైన ప్రేమ ఆయనను ఈ పనులు చేసేటట్టుగా చేస్తుంది.
ISA 9:8 యాకోబు (ఇశ్రాయేలు) ప్రజలకు విరోధంగా నా ప్రభువు ఒక ఆదేశం ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు విరోధంగా ఇవ్వబడిన ఆదేశానికి విధేయత చూపబడుతుంది.
ISA 9:9 అప్పుడు ఎఫ్రాయిం (ఇశ్రాయేలు)లో ప్రతి వ్యక్తి, చివరికి సమరయ నాయకులు కూడా దేవుడు తమని శిక్షించాడని తెలుసుకొంటారు. ఇప్పుడు ఆ ప్రజలు చాలా గర్వంగా, అతిశయంగా ఉన్నారు.
ISA 9:10 “ఈ ఇటుకలు పడిపోవచ్చు గాని మేము మళ్లీ నిర్మిస్తాం. ఇంకా గట్టి రాయితో మేము నిర్మిస్తాం. ఈ చిన్న చెట్లు నరికి వేయబడవచ్చును. కానీ మేము అక్కడ కొత్త చెట్లు వేస్తాము. ఆ కొత్త చెట్లు ఇంకా పెద్దగా, గట్టిగా ఉంటాయి.” అని ఆ ప్రజలు అంటారు.
ISA 9:11 అందుచేత ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసేందుకు యెహోవా మనుష్యుల్ని చూస్తాడు. వారి మీదికి రెజీను శత్రువులను యెహోవా తీసుకొని వస్తాడు.
ISA 9:12 తూర్పు నుండి సిరియన్లను, పడమటినుండి ఫిలిష్తీయులను యెహోవా తీసుకొని వస్తాడు. ఆ శత్రువులు తమ సైన్యాలతో ఇశ్రాయేలును ఓడిస్తారు. కానీ యెహోవా మాత్రం ఇంకా ఇశ్రాయేలు మీద కోపంగానే ఉంటాడు. యెహోవా ఆ ప్రజలను శిక్షించటానికి ఇంకా సిద్ధంగానే ఉంటాడు.
ISA 9:13 దేవుడు ప్రజలను శిక్షిస్తాడు గాని వాళ్లు మాత్రం పాపం చేయటం మానరు. వాళ్లు ఆయన దగ్గరకు మళ్లుకోరు. సర్వశక్తిమంతుడైన యెహోవాను వారు అనుసరించరు.
ISA 9:14 అందుచేత యెహోవా ఇశ్రాయేలీయుల తల, తోక కత్తిరించి వేస్తాడు. కాండాన్ని కొమ్మను కూడ ఒక్క రోజునే యెహోవా నరికి వేస్తాడు.
ISA 9:15 (తల అంటే పెద్దలు ప్రముఖ నాయకులు తోక అంటె అబద్ధాలు చెప్పే ప్రవక్తలు.)
ISA 9:16 ప్రజలను నడిపించే మనుష్యులు వారిని తప్పు త్రోవన నడిపిస్తున్నారు. కనుక వారిని అనుసరించే ప్రజలు నాశనం చేయబడతారు.
ISA 9:17 మనుష్యులు అంతా చెడ్డవాళ్లే. అందుచేత యువకుల విషయం యెహోవాకు సంతోషం లేదు. వారి విధవలకు, అనాధలకు యెహోవా దయ చూపించడు. ఎందుకంటే, ప్రజలంతా చెడ్డవాళ్లే గనుక. దేవునికి విరోధమైన వాటిని మనుష్యులు చేస్తారు. మనుష్యులు అబద్ధాలు చెబుతారు. అందుచేత దేవుడు మనుష్యులమీద కోపంగానే ఉంటాడు. దేవుడు మనుష్యుల్ని శిక్షిస్తూనే ఉంటాడు.
ISA 9:18 చెడు అనేది చిన్న నిప్పులాంటిది. ఆ నిప్పుమొదట పొదలను, ముళ్లకంపల్ని తగలెడుతుంది: తర్వాత అరణ్యంలో ఉండే పెద్ద పొదలను ఆ నిప్పు తగలెడుతుంది. చివరికి అది పెద్ద అగ్నిగా మారుతుంది. అంతా పొగలో కలిసిపోతుంది.
ISA 9:19 సర్వశక్తిమంతుడైన యెహోవా కోపంగా ఉన్నాడు, కనుక దేశం కాల్చి వేయబడుతుంది. మనుష్యులంతా ఆ అగ్నిలో కాల్చి వేయబడతారు. ఎవ్వడూ తన సోదరుణ్ణి రక్షించే వ్రయత్నం చేయడు.
ISA 9:20 ప్రజలు కుడిపక్క ఏదో కొంత చేజిక్కించుకున్నా ఆకలిగానే ఉంటారు. ఎడమ పక్కన వాళ్లు ఏదో తింటారు, అయినా వాళ్లకు కడుపు నిండదు. అప్పుడు ప్రతివాడూ తిరిగి, తన స్వంత శరీరాన్నే తింటాడు.
ISA 9:21 (అంటే ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా మనష్షే యుద్ధం చేస్తాడు. మనష్షేకు వ్యతిరేకంగా ఎఫ్రాయిము యుద్ధం చేస్తాడు. తర్వాత వాళ్లిద్దరు యూదా మీద తిరగబడతారు అని అర్థం.) యెహోవా ఇశ్రాయేలు మీద ఇంకా కోపంగానే ఉన్నాడు. యెహోవా ఇంకా తన ప్రజల్ని శిక్షించటానికి సిద్ధంగానే ఉన్నాడు.
ISA 10:1 చెడు చట్టం వ్రాసే చట్టాల నిర్మాతలను చూడండి. ప్రజలకు జీవితాన్ని దుర్బరం చేసే చట్టాలు ఆ నిర్మాతలు రాస్తారు.
ISA 10:2 ఆ చట్ట నిర్మాతలు పేద ప్రజలకు న్యాయం చేకూర్చలేదు. పేద ప్రజల హక్కులను వారు తీసి వేస్తారు. వారు విధవల వద్ద, అనాధల వద్ద ప్రజలను దొంగిలించనిస్తారు.
ISA 10:3 చట్ట నిర్మాతలారా, మీరు చేసిన పనులను మీరు వివరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరేమి చేస్తారు? దూరదేశంనుండి మీ నాశనం వస్తుంది. సహాయం కోసం మీరు ఎక్కడికి పరుగెత్తుకు వెళ్లారు? మీ ధనం, మీ ఐశ్వర్యాలు మీకేం సాయం చేయవు.
ISA 10:4 ఒక ఖైదీలా మీరు శిరస్సు వంచాలి. చచ్చిన వాడిలా మీరు పడిపోతారు. కాని దానివల్ల మీకు సహాయం జరగదు. దేవుడు ఇంకా కోపంగానే ఉంటాడు. దేవుడు ఇంకా మిమ్మల్ని శిక్షించటానికి సిద్ధంగానే ఉంటాడు.
ISA 10:5 దేవుడు అంటాడు: “అష్షూరును నేను ఒక కర్రలా వాడుకొంటాను. కోపంతో నేను ఇశ్రాయేలును శిక్షించడానికి అష్షూరును వాడుకొంటాను.”
ISA 10:6 చెడుకార్యాలు చేసే వారిమీద యుద్ధం చేయటానికి నేను అష్షూరును పంపిస్తాను. వాళ్ల మీద నేను కోపంగా ఉన్నాను. వారిమీద యుద్ధం చేయమని అష్షూరుకు నేను ఆజ్ఞాపిస్తాను. వారిని అష్షూరు ఓడించి, వారి ఐశ్వర్యాలను కొల్లగొట్టుకొంటారు. ఇశ్రాయేలీయులు, వీధుల్లో అష్షూరు వారి పాదాల కింద తొక్కబడే ధూళిలా ఉంటారు.
ISA 10:7 “అయితే అష్షూరును నేను వాడుకొంటాను అనే విషయం వారికి తెలియదు. అష్షూరు నాకు ఒక సాధనం అని అతనికి తెలియదు. ఇతరులను నాశనం చేయటమే అష్షూరుకు కావాలి. అష్షూరు అనేక రాజ్యాలను నాశనం చేయాలని మాత్రమే పథకం వేస్తుంది.
ISA 10:8 అష్షూరు తనకు తాను ఇలా చెప్పుకొంటాడు, ‘నా నాయకులంతా రాజుల్లాంటి వాళ్లు.
ISA 10:9 కల్కో పట్టణం కర్కెమీషు పట్టణంలా ఉంటుంది. అర్పాదు పట్టణం హమాతు పట్టణంలా ఉంటుంది. షోమ్రోను పట్టణం దమస్కు పట్టణంలా ఉంటుంది.
ISA 10:10 అనేక విగ్రహాలున్న ఆ రాజ్యాలను నేను ఓడించేశాను, ఇప్పుడు అవి నా అధికారంలో ఉన్నాయి. వాళ్లు పూజించే విగ్రహాలు యెరూషలేము, సమరయలో ఉన్న విగ్రహాలకంటె గొప్పవి.
ISA 10:11 షోమ్రోనును, దాని విగ్రహాలను నేను ఓడించాను. యెరూషలేమును, దాని ప్రజలు తయారుచేసిన విగ్రహాలను కూడ నేను ఓడిస్తాను.’”
ISA 10:12 యెరూషలేముకు, సీయోను కొండకు నా ప్రభువు చేయదలచిన వాటిని చేయటం ముగిస్తాడు. అప్పుడు యెహోవా అష్షూరును శిక్షిస్తాడు. అష్షూరు రాజు చాలా గర్విష్ఠి. అతడు గర్వం చేత చాలా చెడ్డ పనులు చేశాడు. అందుచేత దేవుడు అతణ్ణి శిక్షిస్తాడు.
ISA 10:13 అష్షూరు రాజు అంటున్నాడు: “నేను చాలా తెలివిగలవాడ్ని. నా స్వంత జ్ఞానం, శక్తి మూలంగా నేను ఎన్నోగొప్ప కార్యాలు చేశాను. అనేక రాజ్యాల్ని నేను ఓడించాను. వారి ఐశ్వర్యం నేను దోచుకొన్నాను. వారి ప్రజలను నేను బానిసలుగా చేసుకొన్నాను. నేను చాలా శక్తిగలవాణ్ణి.
ISA 10:14 ఒకడు పక్షి గూటిలోనుండి గుడ్లు తీసినట్టుగా, నేను నా స్వంత చేతుల్తో ఈ ప్రజలందరి సంపదలు తీసుకొన్నాను. ఒక పక్షి తన గూడును, గుడ్లను తరచు విడిచిపెడ్తుంటుంది. ఆ గూటిని కాపాడేందుకు ఏమీ లేదు. కిచకిచలాడ్తూ, తన రెక్కలతో, ముక్కుతో కొట్లాడేందుకు అక్కడ ఏ పక్షి లేదు. అందుచేత మనుష్యులు ఆ గుడ్లు తీసుకొంటారు. ఆదే విధంగా భూలోకంలోని మనుష్యులందరినీ నేను తీసుకొనకుండా నన్ను ఆపగలిగిన వాడు ఎవడూ లేడు.”
ISA 10:15 గొడ్డలి, దానిని ప్రయోగించే వానికంటె గొప్పదేంకాదు. రంపం, దానితో కోసే వానికంటె గొప్పదేంకాదు. కాని అష్షూరు తాను దేవునికంటే ముఖ్యం అనుకొంటుంది. ఎవరినైనా శిక్షించేందకు ఒకడు బెత్తం తీసుకొని ప్రయోగిస్తే, అతనికంటె ఆ బెత్తం ఎక్కువ శక్తి గలది, ముఖ్యమయింది అన్నట్టు ఉంటుంది.
ISA 10:16 అష్షూరు చాల గొప్పవాడ్ని అని అనుకొంటాడు. కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా అష్షూరు మీదికి గొప్ప రోగం పంపిస్తాడు. ఒక రోగి బరవు కోల్పోయినట్టు అష్షూరు తన ఐశ్వర్యాన్ని శక్తిని పోగొట్టు కొంటాడు. అప్పుడు అష్షూరు మహిమ నాశనం అవుతుంది. సర్వం పోయేవరకు మండుతూ ఉండే అగ్నిలా అది ఉంటుంది.
ISA 10:17 ఇశ్రాయేలు వెలుగు (దేవుడు) అగ్నిలా ఉంటాడు. ఆ పరిశుద్ధుడు ఒక జ్వాలలా ఉంటాడు. మొట్టమొదట పొదలను, ముళ్లకంపలను కాల్చేసే అగ్నిలా ఆయన ఉంటాడు.
ISA 10:18 ఆ తర్వాత అగ్ని మహా వృక్షాలను, ద్రాక్షాతోటలను కాల్చివేస్తుంది. చివరికి సర్వం, ప్రజలతో సహా నాశనం చేయబడుతుంది. దేవుడు అష్షూరును నాశనం చేసినప్పుడు అలా ఉంటుంది. అష్షూరు కుళ్లిపోతున్న మొద్దులా ఉంటుంది.
ISA 10:19 అరణ్యంలో కొన్ని చెట్లు మాత్రం నిలిచి ఉండవచ్చు. కానీ అవి ఒక పిల్లవాడు కూడ లెక్కబెట్ట గలిగినన్ని ఉంటాయి.
ISA 10:20 ఆ సమయంలో ఇశ్రాయేలులో ఇంకా బతికి ఉన్నవారు, యాకోబు వంశ ప్రజలు, వారిని కొట్టేవాని మీద ఆధారపడరు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడైన యెహోవా మీద నిజంగా ఆధారపడటం వారు నేర్చుకొంటారు.
ISA 10:21 యాకోబు వంశంలో మిగిలిన ప్రజలు శక్తివంతుడైన దేవువి మరల వెంబడిస్తారు.
ISA 10:22 మీ ప్రజలు చాలామంది ఉన్నారు. వారు సముద్రపు ఇసుకలా ఉన్నారు. కానీ ఆ ప్రజల్లో కొద్ది మంది మాత్రమే యెహోవా దగ్గరకు తిరిగి వచ్చేందుకు మిగిలి ఉంటారు. ఆ ప్రజలు దేవుని దగ్గరకు తిరిగి వస్తారు. కాని ముందు మీ దేశం నాశనం చేయబడుతుంది. దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు ప్రకటించాడు. ఆ తర్వాత దేశానికి మంచి కలుగుతుంది. అది నిండుగా ప్రవహిస్తున్న నదిలా ఉంటుంది.
ISA 10:23 నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా నిశ్చయంగా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు.
ISA 10:24 నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా చెబుతున్నాడు: “సీయోనులో నివసిస్తున్న నా ప్రజలారా, అష్షూరు గూర్చి భయపడకండి. గతంలో ఈజిప్టు మిమ్మల్ని కొట్టినట్టు అతడు మిమ్మల్ని కొడతాడు. మిమ్మల్ని కొట్టిడానికి అష్షూరు బెత్తం ఉపయోగించినట్టు అది ఉంటుంది.
ISA 10:25 అయితే కొంచెం కాలం కాగానే నా కోపం నిలిచిపోతుంది. అష్షూరు మిమ్మల్ని తగినంతగా శిక్షించిందని నేను తృప్తి పడతాను.”
ISA 10:26 అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా కొరడాతో అష్షూరును కొడతాడు. గతంలో యెహోవా ఓరేబు బండ దగ్గర మిద్యానును ఓడించాడు. యెహోవా అష్షూరు మీద దాడి చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. గతంలో యెహోవా ఈజిప్టును శిక్షించాడు. ఆయన సముద్రం మీద కర్ర ఎత్తి, తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు నడిపించాడు. యెహోవా తన ప్రజలను అష్షూరు నుండి రక్షించి నప్పుడు కూడ అలాగే ఉంటుంది.
ISA 10:27 మీరు మీ భుజాల మీద కాడిపైన మోయాల్సిన బరువుల్లాంటి కష్టాలు అష్షూరు మీకు కలిగిస్తాడు. కాని ఆ కాడి మీ మెడమీద నుండి తొలగించ బడుతుంది. మీ (దేవుడు) బలం చేత ఆ కాడి విరుగగొట్టబడుతుంది.
ISA 10:28 “శిథిలాల” (ఆయాతు) దగ్గర సైన్యం చొరబడుతుంది. సైన్యం “కళ్లం” (మిగ్రోను) మీద నడచిపోతుంది. సైన్యం తన ఆహారాన్ని “గిడ్డంగిలో” దాచు కొంటుంది.
ISA 10:29 సైన్యం రేవు దగ్గర (మాబారా) నది దాటుతుంది. గెబలో సైన్యం నిద్రపోతుంది. రామా భయపడుతుంది. సౌలు గిబ్యాలో ప్రజలు పారిపోతారు.
ISA 10:30 బాత్ గల్లీము గట్టిగా కేకలు వేయి! లాయిషా, ఆలకించు! అనాతోతూ, నాకు జవాబు చెప్పు,
ISA 10:31 మద్మేనా ప్రజలు పారిపోతున్నారు. గిబాని ప్రజలు దాక్కుంటున్నారు.
ISA 10:32 ఈ రోజే సైన్యం నోబు దగ్గర నిలుస్తుంది. యెరూషలేము పర్వతంలో సీయోను కొండకు విరోధంగా యుద్ధం చేయటానికి సైన్యం సిద్ధం అవుతుంది.
ISA 10:33 చూడండి! మన ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ మహా వృక్షాన్ని (అష్షూరు) నరికి వేస్తాడు. యెహోవా తన మహా శక్తతో దీన్ని చేస్తాడు. గొప్ప వాళ్లు, ప్రముఖులు నరికివేయబడి, ముఖ్యత లేని వారవుతారు.
ISA 10:34 యెహోవా తన గొడ్డలితో అరణ్యం నరికి వేస్తాడు. లెబానోనులో మహా వృక్షాలు (ప్రముఖ వ్యక్తులు) పడిపోతాయి.
ISA 11:1 యెష్షయి మొద్దునుండి (వంశం నుండి) ఒక చిగురు (శిశువు) పుడుతుంది. యెష్షయి వేరులనుండి అంకురం ఎదుగుతుంది.
ISA 11:2 ఆ శిశువులో యెహోవా ఆత్మ ఉంటుంది. జ్ఞానం, అవగాహన, నడిపింపు, శక్తిని ఆత్మ ఇస్తుంది. ఈ శిశువు యెహోవాను తెలుసుకొని, ఘనపర్చటానికి ఆత్మ సహాయం ఉంటుంది.
ISA 11:3 ఈ శిశువు యెహోవాను ఘనపరుస్తాడు. అందువల్ల శిశువు సంతోషంగా ఉంటాడు. ఈ శిశువు కనబడే వాటిని బట్టి తీర్పు తీర్చడు. అతడు వినేవిషయాలను బట్టి తీర్పు తీర్చడు.
ISA 11:4 బీదలకు అతడు న్యాయంగా, నిజాయితీగా తీర్పుచెబుతాడు. దేశంలో పేద ప్రజలకు జరగాల్సిన విషయాల్లో నిర్ణయాలు చేయాల్సినప్పుడు అతడు న్యాయంగా ఉంటాడు. ప్రజలు కొట్టబడాలని అతడు నిర్ణయిస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు, ఆ ప్రజలు కొట్టబడతారు. ఎవరైనా చావాలని అతడు నిర్ణయం చేస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు. ఆ దుష్టులు చంపబడతారు. మంచితనం, న్యాయం ఈ శిశువుకు బలం ప్రసాదిస్తాయి. అవి అతడు తన నడుముకు కట్టుకొనే పట్టాలా ఉంటాయి.
ISA 11:6 ఆ సమయంలో తోడేళ్లు గొర్రెపిల్లలతో కలిసి శాంతిగా జీవిస్తాయి. పెద్ద పులులు మేక పిల్లలతో కలిసి శాంతంగా పండుకొంటాయి. దూడలు, సింహాలు, ఎద్దులు కలిసి శాంతిగా జీవిస్తాయి. ఒక చిన్న పిల్లాడు వాటిని తోల్తాడు.
ISA 11:7 ఆవులు, ఎలుగుబంట్లు కలిసి శాంతిగా జీవిస్తాయి. వాటి పిల్లలన్నీ కలసి పండుకొంటాయి, ఒక దానిని ఒకటి బాధించవు. సింహాలు, ఆవుల్లా గడ్డి మేస్తాయి. చివరికి సర్పాలు కూడా మనుష్యులకు హాని చేయవు.
ISA 11:8 ఒక చిన్నబిడ్డ నాగుపాముపుట్ట దగ్గర ఆడుకొంటుంది. విషసర్పం పుట్టలో ఒకచిన్న పాప చేయి పెట్టగలుగుతుంది.
ISA 11:9 అంతా శాంతిగా ఉంటుందనీ, ఎవరూ ఒకరిని ఒకరు బాధించుకోరనీ ఈ విషయాలు తెలియ జేస్తున్నాయి. నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం చేయాలని ఆశించరు. ఎందుకంటే, ప్రజలు వాస్తవంగా యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రంనీళ్లతో నిండిపోయినట్టు, వారు దైవజ్ఞానంతో నిండిపోయి ఉంటారు.
ISA 11:10 ఆ సమయంలో యెష్షయి కుటుంబంలో ఒక ప్రత్యేక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఒక పతాకంలా ఉంటాడు. రాజ్యాలన్నీ తన చుట్టూ సమావేశం కావాలని ఈ “పతాకం” చూపిస్తుంది. తాము చేయాల్సిన వాటిని గూర్చి రాజ్యాలు అతణ్ణి అడుగుతాయి. అతడు ఉండే స్థలం మహిమతో నిండిపోతుంది.
ISA 11:11 ఆ సమయంలో నా ప్రభువు (దేవుడు) మరలతన చేయిచాచి, మిగిలిన తన ప్రజలను తీసుకొంటాడు. దేవుడు ఇలా చేయటం రెండోసారి. (అష్షూరు, ఉత్తర ఈజిప్టు, దక్షిణ ఈజిప్టు, ఇథియోపియ, ఏలాము, బబులోను, హమాతు ప్రపంచంలోని దూర దేశాలన్నింటిలో మిగిలి ఉన్న దేవుని ప్రజలు వీరు.)
ISA 11:12 దేవుడు ఈ “పతాకాన్ని” మనుష్యులందరికీ ఒక సంకేతంగా నిలబెడతాడు. ఇశ్రాయేలు, యూదా ప్రజలు బలవంతంగా వారి దేశంనుండి వెళ్ల గొట్టబడ్డారు. ఆ ప్రజలు భూమిమీద దూర దేశాలన్నింటికీ చెదర గొట్టబడ్డారు. అయితే దేవుడు వాళ్లందరినీ మళ్లీ ఒక చోట సమావేశపరుస్తాడు.
ISA 11:13 ఆ సమయంలో ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) యూదాపై అసూయపడదు. యూదాకు శత్రువులు ఎవ్వరూ మిగిలి ఉండరు. మరియు యూదా, ఎఫ్రాయిముకు కష్టం కలిగించదు.
ISA 11:14 అయితే ఎఫ్రాయిము, యూదా కలిసి ఫిలిష్తీయుల మీద దాడిచేస్తారు. ఈ రెండు రాజ్యాలు భూమి మీద ఒక చిన్న జంతువును పట్టుకొనేందుకు, కిందగా ఎగిరే రెండు పక్షుల్లా ఉంటారు. వారిద్దరూ కలిసి తూర్పు ప్రజల ఐశ్వర్యాలు దోచుకొంటారు. ఎదోము, మోయాబు, అమ్మోను ప్రజలను ఎఫ్రాయిము, యూదా తమ ఆధీనంలో ఉంచుకొంటారు.
ISA 11:15 యెహోవా కోపగించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అదే విధంగా యూఫ్రటీసు నదిమీద యెహోవా తన చేయి ఊపుతాడు. ఆయన నదిని కొడ్తాడు. ఆ నది ఏడు చిన్న నదులుగా విభజించబడుతుంది. ఆ చిన్న నదులు లోతుగా ఉండవు. ప్రజలు చెప్పులతోనే ఆ నదులు దాటగలుగుతారు.
ISA 11:16 దేవుని శేషజనం అష్షూరును విడిచి వెళ్లటానికి వారికి దారి ఉంటుంది. అది, ఇశ్రాయేలీయులను దేవుడు ఈజిప్టు నుండి బయటకు నడిపించినప్పటిలా ఉంటుంది.
ISA 12:1 ఆ సమయంలో మీరంటారు: “యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను. నీకు నామీద కోపం వచ్చింది. కానీ ఇప్పుడు నామీద కోపగించకుము. నీ ప్రేమ నాకు చూపించు.”
ISA 12:2 దేవుడు నన్ను రక్షిస్తున్నాడు. ఆయన్నే నేను నమ్ముకొంటాను. నాకేం భయంలేదు. ఆయన నన్ను రక్షిస్తాడు. యెహోవా, యెహోవాయే నా బలం. ఆయన నన్ను రక్షిస్తున్నాడు. నేను ఆయనకు స్తోత్రగీతాలు పాడుతాను.
ISA 12:3 రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చు కోండి. అప్పుడు మీరు సంతోషిస్తారు.
ISA 12:4 “యెహోవాకు స్తోత్రాలు! ఆయన నామం ఆరాధించండి! ఆయన చేసిన కార్యాలను గూర్చి ప్రజలందరితో చెప్పండి” అని అప్పుడు మీరు అంటారు.
ISA 12:5 యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి. ఎందుకంటే, ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనుక. దేవుని గూర్చిన ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించండి. పజలందర్నీ ఈ విషయాలు తెలుసుకోనివ్వండి.
ISA 12:6 సీయోను ప్రజలారా, ఈ సంగతులను గూర్చికేకలు వేయండి. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు శక్తివంతంగా మీతో ఉన్నాడు. అందుచేత, సంతోషంగా ఉండండి!
ISA 13:1 బబులోను విషయంలో విచారకరమైన ఈ సందేశాన్ని ఆమోజు కుమారుడు యెషయాకు దేవుడు చూపించాడు.
ISA 13:2 దేవుడు చెప్పాడు: “పతాకాన్ని బోడి కొండమీద ఎగుర వేయండి. మగ సిపాయిలను పిలువండి. మీ చేతులు ఊపండి. ప్రముఖుల ద్వారాల్లోంచి ప్రవేశించమని వారితో చెప్పండి.”
ISA 13:3 దేవుడు చెప్పాడు: “వాళ్లను నేను ప్రజల్లో నుండి వేరు చేశాను. నేనే వాళ్లకు సారథ్యం వహిస్తాను.” నేను కోపంగా ఉన్నాను. ప్రజలను శిక్షించటం కోసం నేను నా పరాక్రమవంతుల్ని సమావేశపర్చాను. ఆనంద భరితులైన ఈ మనుష్యులను గూర్చి నేను గర్విస్తున్నాను.
ISA 13:4 “కొండల్లో పెద్ద శబ్దం అవుతోంది. ఆ శబ్దం వినండి! అది విస్తారమైన ప్రజల శబ్దంలా ఉంది. అనేక రాజ్యాల ప్రజలు కూడుకొంటున్నారు. సర్వశక్తిమంతుడైన యెహోవా తన సైన్యాలను ఒక్కటిగా చేరుస్తున్నాడు.
ISA 13:5 ఈ సైన్యం, యెహోవా, చాలా దూరదేశంనుండి వస్తున్నారు. ఆకాశపు అంచుల ఆవలినుండి వారు వస్తున్నారు. యెహోవా తన కోపం ప్రదర్శించటానికి ఈ సైన్యాన్ని ఒక ఆయుధంలా వాడుకొంటాడు. ఈ సైన్యం దేశం మొత్తాన్ని నాశనం చేస్తుంది.”
ISA 13:6 యెహోవా ప్రత్యేక దినం దగ్గర్లో ఉంది. అందు చేత ఏడ్చి, మీ కోసం దుఃఖపడండి. శత్రువు మీ ఐశ్వర్యాలు దొంగిలించే సమయం వస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు దానిని సంభవింపజేస్తాడు.
ISA 13:7 ప్రజలు వారి ధైర్యం కోల్పోతారు. భయం ప్రజలను బలహీనులను చేస్తుంది.
ISA 13:8 ప్రతి వ్యక్తీ భయపడుతూంటాడు. స్త్రీ ప్రసవవేదనలా, వారి భయం వారికి కడుపులో బాధ పుట్టిస్తుంది. వారి ముఖాలు అగ్నిలా ఎర్రగా మారుతాయి. ఈ భయం చూపులు వారి పొరుగువారందరి ముఖాలమీద కూడా కనబడతాయి గనుక ప్రజలు ఆశ్చర్య పడతారు.
ISA 13:9 చూడండి, యెహోవా ప్రత్యేక దినం వచ్చేస్తుంది. అది చాలా భయంకర దినం. దేవుడు మహా కోపంతో, దేశాన్ని నాశనం చేస్తాడు. పాపం చేసే వాళ్లందరినీ దేవుడు దేశంలోనుండి బలవంతంగా వెళ్లగొట్టేస్తాడు.
ISA 13:10 ఆకాశాలు చీకటి అవుతాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశించవు.
ISA 13:11 దేవుడు చెబుతున్నాడు, “నేను ప్రపంచానికి కీడు జరిగిస్తాను. చెడ్డవాళ్ల పాపాన్ని బట్టి వాళ్లను నేను శిక్షిస్తాను. గర్విష్ఠుల గర్వం పోయేట్టు నేను చేస్తాను. ఇతరుల యెడల నీచంగా ప్రవర్తించే వారి అతిశయాన్ని నేను నిలిపివేస్తాను.
ISA 13:12 కొద్దిమంది ప్రజలు మాత్రమే మిగిలి ఉంటారు. బంగారం దొరకటం అరుదులాగే మనుష్యులు కూడ అరుదుగా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ మనుష్యులు స్వచ్చమైన బంగారం కంటె ఎక్కువ విలువగలిగి ఉంటారు.
ISA 13:13 నేను, నా కోపంతో ఆకాశాన్ని వణికిస్తాను. భూమి స్థానం తప్పుతుంది.” సర్వశక్తిమంతుడైన యెహోవా తన కోపం ప్రదర్శించిన రోజున అది జరుగుతుంది.
ISA 13:14 అప్పుడు బబులోను ప్రజలు గాయపడిన జింకల్లా పారిపోతారు. కాపరి లేని గొర్రెల్లా వారు పారిపోతారు. యుద్ధానికి వచ్చే ప్రతి సైనికుడూ వెనుదిరిగి తన స్వదేశానికి, స్వజనుల దగ్గరకు పారిపోతాడు.
ISA 13:15 అయితే శత్రువు బబులోను ప్రజలను తరుముతాడు. మరియు శత్రువు ఒక మనిషిని పట్టుకొన్నప్పుడు, అతనిని శత్రువు ఖడ్గంతో చంపేస్తాడు.
ISA 13:16 వారి ఇండ్లలో సమస్తం దోచుకోబడుతుంది. వారి భార్యలు మానభంగం చేయబడతారు. ప్రజలు చూస్తూ ఉండగానే వారి పిల్లలను చచ్చేవరకు కొడతారు.
ISA 13:17 దేవుడు చెబుతున్నాడు: “చూడండి, మాదీయసైన్యాలు బబులోను మీద దాడి చేసేట్టు నేను చేస్తాను.” మాదీయ సైన్యాలకు వెండి బంగారాలు చెల్లించినా సరే, వారు దాడి చేయటం ఆపు చేయరు.
ISA 13:18 సైనికులు దాడి చేసి బబులోను యువకులను చంపేస్తారు. పిల్లల మీద కూడ ఆ సైనికులు జాలి చూపించరు. బాలుర యెడల ఆ సైనికులు దయ చూపించరు.
ISA 13:19 బబులోను నాశనం చేయబడుతుంది. అది సొదొమ గొమొర్రాల సర్వనాశనంలా ఉంటుంది. దేవుడు ఈ వినాశం కలుగచేస్తాడు, అక్కడ ఏమీ మిగిలి ఉండదు. “రాజ్యాలన్నింటిలో బబులోను చాలా అందమయింది. బబులోను ప్రజలకు వారి పట్టణం గూర్చి చాలా అతిశయం.
ISA 13:20 కానీ బబులోను అందంగా ఇక ఉండదు. భవిష్యత్తులో ప్రజలు యికమీదట అక్కడ నివసించరు. అరబ్బులు అక్కడ వారి గుడారాలు వేయరు. గొర్రెలను అక్కడ మేపేందుకు కాపరులు వాటిని అక్కడికి తీసుకొనిరారు.
ISA 13:21 అక్కడ నివసించే జంతువులు అడవి మృగాలు మాత్రమే. ప్రజలు బబులోనులోని ఇండ్లలో నివసించరు. ఆ ఇండ్ల నిండాగుడ్లగూబలు, పెద్ద పక్షులు ఉంటాయి. అడవి మేక పోతులు ఆ ఇండ్లలో ఆడుతూంటాయి.
ISA 13:22 బబులోనులోని అందమైన గొప్ప భవనాలలో అడవి కుక్కలు, తోడేళ్లు మొరుగుతూ ఉంటాయి. బబులోను అంతం అయిపోతుంది. బబులోను అంతం దగ్గర్లో ఉంది. బబులోను నాశనాన్ని తర్వాత వరకు వేచి ఉండనివ్వను.”
ISA 14:1 భవిష్యత్తులో యెహోవా, తన ప్రేమను యాకోబుకు మరల చూపిస్తాడు. ఇశ్రాయేలీయులను యెహోవా మరల ఏర్పాటు చేసికొంటాడు. ఆ సమయంలో యెహోవా ఆ ప్రజలకు వారి దేశాన్ని ఇస్తాడు. అప్పుడు యూదులు కాని వారు, యూదా ప్రజల్లో చేరిపోతారు. ఈ ఇద్దరూ ఒకటిగా యాకోబు వంశం అవుతారు.
ISA 14:2 ఆ రాజ్యాలు ఇశ్రాయేలు ప్రజలను ఇశ్రాయేలు దేశంలో చేర్చుకుంటారు. ఇతర రాజ్యాలకు చెందిన ఆ స్త్రీ పురుషులు ఇశ్రాయేలుకు బానిసలు అవుతారు. గతంలో ఆ ప్రజలే ఇశ్రాయేలు ప్రజలను తమకు బానిసలుగా చేసుకొన్నారు. కాని ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజ్యాలను ఓడించి, వారి మీద ఏలుబడి చేస్తారు.
ISA 14:3 యెహోవా మీ కష్టమైన పని తీసివేసి, మిమ్మల్ని ఆదరిస్తాడు. గతంలో మీరు బానిసలు. ప్రతి కష్టమైన పనినీ మనుష్యులు మీతో బలవంతంగా చేయించారు. అయితే యెహోవా మీకు ఈ కష్టతరమైన పనిని అంతం చేస్తాడు.
ISA 14:4 ఆ సమయంలో, బబులోను రాజును గూర్చి మీరు ఈ పాట పాడటం మొదలు పెడ్తారు. ఆ రాజు మమ్మల్ని పాలించినప్పుడు నీచంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని పాలన అయిపోయింది.
ISA 14:5 చెడ్డ పాలకుల దండాన్ని యెహోవా విరుగగొడతాడు. వారి అధికారాన్ని యెహోవా తొలగించి వేస్తాడు.
ISA 14:6 బబులోను రాజు కోపంతో ప్రజలను కొట్టాడు దుష్టుడైన ఆ పాలకుడు ప్రజలను కొట్టడం మానలేదు దుష్టుడైన ఆ పాలకుడు కోపంతో ప్రజలను పాలించాడు. ప్రజలకు కీడు చేయటం అతడు ఎన్నడూ ఆపు జేయలేదు.
ISA 14:7 అయితే ఇప్పుడు దేశం మొత్తం విశ్రాంతి తీసుకొంటూంది. దేశం నెమ్మదిగా ఉంది. ప్రజలు ఇప్పుడు ఉత్సవం చేసుకోవటం మొదలు బెడుతున్నారు.
ISA 14:8 నీవు ఒక దుష్ట రాజువు కానీ ఇప్పుడు నీ పని అయిపోయింది. చివరికి తమాల వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి. లెబానోను దేవదారు వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి. ఆ చెట్లు అంటున్నాయి, “రాజు మమ్మల్ని నరికి వేశాడు. కానీ ఇప్పుడు రాజే పడిపోయాడు. అతడు మళ్లీ ఎన్నటికీ నిలబడడు.”
ISA 14:9 నీవు వస్తున్నందుకు, మరణస్థానమైన పాతాళం హర్షిస్తుంది. భూలోక నాయకులందరి ఆత్మలనూ పాతాళం నీ కోసం మేల్కొలుపుతుంది. పాతాళం, రాజులను వారి సింహాసనాల మీదనుండి లేపి నిలబెడుతుంది. నీ రాకకు వారు సిద్ధంగా ఉంటారు.
ISA 14:10 ఈ నాయకులంతా నిన్ను హేళన చేస్తారు. “ఇప్పుడు నీవు కూడా మాలాగే చచ్చిన శవానివి. ఇప్పుడు నీవూ మాలాగే ఉన్నావు.” అని వారంటారు.
ISA 14:11 నీ గర్వం పాతాళానికి పంపబడింది. నీ సితారాల సంగీతం, నీ గర్విష్ఠి ఆత్మ రాకను ప్రకటిస్తున్నాయి. కీటకాలు నీ శరీరాన్ని తినివేస్తాయి. వాటి మీద నీవు పరుపులా పడి ఉంటావు. పురుగులు దుప్పటిలా నీ శరీరాన్ని కప్పేస్తాయి.
ISA 14:12 ఓ ప్రకాశవంతమైన నక్షత్రమా! ఉదయ పుత్రా! నీవు ఆకాశంనుండి ఎలా పడిపోయావు.? జనాంగాన్ని పతనం చేసే నీవు భూమి మీదికి ఎలా నరికి వేయబడ్డావు.
ISA 14:13 నీలో నీవు ఎల్లప్పుడూ ఇలా చెప్పు కొన్నావు: “సర్వోన్నతుడైన దేవునిలా నేనూ ఉంటాను. పైన ఆకాశాల్లోకి నేను వెళ్లిపోతాను. నేను, నా సింహాసనాన్ని దేవుని నక్షత్రాలకంటె పైకి హెచ్చిస్తాను. పరిశుద్ధ సభా పర్వతం మీద నేను కూర్చుంటాను. దాగియున్న ఆ కొండ మీద దేవుళ్లను నేను కలుసుకొంటాను.
ISA 14:14 మేఘాల మీద నేను బలిపీఠం దగ్గరకు వెళ్తాను. నేను, మహోన్నతుడైన దేవునిలా ఉంటాను.”
ISA 14:15 కానీ అది జరుగలేదు. నీవు దేవునితో ఆకాశంలోనికి వెళ్లలేదు. అగాధపు గోతి లోనికి పాతాళానికి నీవు కిందికి తీసుకొని రాబడ్డావు.
ISA 14:16 ప్రజలు నిన్ను చూచి, నీ విషయం ఆలోచిస్తారు. నీవు కేవలం చచ్చిన శవం మాత్రమేనని ప్రజలు గమనిస్తారు. ప్రజలు అంటారు, “భూలోక రాజ్యాలన్నింటిలో భయం పుట్టించినవాడు ఇతడేనా?
ISA 14:17 పట్టణాలను నాశనం చేసినవాడు ఇతడేనా? దేశాన్ని ఎడారిగా మార్చినవాడు ఇతడేనా? యుద్ధంలో మనుష్యుల్ని బంధించి, వారిని ఇంటికి వెళ్లనీయనివాడు ఇతడేనా?”
ISA 14:18 భూమిమీద ప్రతి రాజూ ఘనంగా మరణించాడు. ప్రతి రాజుకూ స్వంత సమాధి ఉంది.
ISA 14:19 అయితే నీవు, దుష్ట చక్రవర్తివి నీ సమాధిలోనుండి తోసి వేయబడ్డావు. నరకబడిన చెట్టు కొమ్మలా నీవున్నావు. ఆ కొమ్మ నరకబడి, పారవేయబడింది. నీవు యుద్ధంలో చచ్చిపడిన వానిలా ఉన్నావు. మిగతా సైనికులు వాని మీద నడిచారు. ఇప్పుడు చచ్చిన ఇతరుల్లాగే ఉన్నావు. నీవు చావు గుడ్డల్లో చుట్టబడ్డావు.
ISA 14:20 ఇంకా ఎంతోమంది రాజులు చనిపోయారు. వారందరికీ వారి సమాధులు ఉన్నాయి. కానీ నీవు వాళ్లను చేరవు. ఎందుకంటే, నీవు నీ స్వంత దేశాన్ని నాశనం చేశావు గనుక నీ స్వంత ప్రజల్నే నీవు చంపేశావు. నీవు చేసినట్టు నీ పిల్లలు నాశనం చేయటం కొనసాగించారు. నీ పిల్లలు ఆపుజేయబడతారు.
ISA 14:21 అతని పిల్లలను చంపటానికి సిద్ధపడండి. వారి తండ్రి దోషి గనుక వాళ్లను చంపండి. అతని పిల్లలు మళ్లీ ఎన్నటికీ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోరు. అతని పిల్లలు మళ్లీ ఎన్నటికీ ప్రపంచాన్ని తమ పట్టణాలతో నింపరు.
ISA 14:22 “నేను నిలబడి ఆ ప్రజలకు విరోధంగా యుద్ధం చేస్తాను. ప్రఖ్యాత బబులోను పట్టణాన్ని నేను నాశనం చేస్తాను. బబులోను ప్రజలందరినీ నేను నాశనం చేస్తాను. వారి పిల్లలను, మనుమళ్లను, మునిమనుమళ్లను నేను నాశనం చేస్తాను” అని సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు. యెహోవా తానే ఆ విషయాలు చెప్పాడు.
ISA 14:23 “బబులోనును నేను మార్చేస్తాను. ఆ స్థలం మనుష్యుల కోసం కాదు, జంతువుల కోసమే. ఆ స్థలం నీ టి మడుగు అవుతుంది. బబులోనును తుడిచి వేయటానికి ‘నాశనం అనే చీపురును’ నేను ప్రయోగిస్తాను” అని యెహోవా చెప్పాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ సంగతులు చెప్పాడు.
ISA 14:24 సర్వశక్తిమంతుడైన యెహోవా ఒక ప్రమాణం చేశాడు. యెహోవా చెప్పాడు, “సరిగ్గా నేను తలచినట్టే ఈ సంగతులు జరుగుతాయని నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ విషయాలు సరిగ్గా నా పథకం ప్రకారమే జరుగుతాయి.
ISA 14:25 అష్షూరు రాజును నేను నా దేశంలో నాశనం చేస్తాను. నా కొండలపై నేను ఆ రాజు మీద నడుస్తాను. ఆ రాజు నా ప్రజలను తనకు బానిసలుగా చేశాడు. వారి మెడల మీద అతడు ఒక కాడిపెట్టాడు. యూదా మెడమీద నుండి ఆ కాడి తొలగించి వేయబడుతుంది. ఆ భారం తొలగించబడుతుంది.
ISA 14:26 నేను నా ప్రజల కోసం చేయాలనీ ఉద్దేశించిన సంగతి అది. రాజ్యాలన్నింటినీ శిక్షించటానికి నేను నా చేతి బలంప్రయోగిస్తాను.”
ISA 14:27 యెహోవా ఒక పథకం వేసినప్పుడు ఆ పథకాన్ని ఎవ్వరూ అడ్డగించలేరు. ప్రజలను శిక్షించేందుకు యెహోవా తన చేయి పైకెత్తినప్పుడు, దానిని ఎవ్వరూ అడ్డగించలేరు.
ISA 14:28 విచారకరమైన ఈ సందేశం ఆహాబు రాజు చని పోయిన సంవత్సరం ఇవ్వబడింది.
ISA 14:29 ఓ ఫిలిష్తీ దేశమా, నిన్ను కొట్టే రాజు చనిపోయాడని నీవు సంతోషిస్తున్నావు. కానీ నీవు నిజంగా సంతోషపడకు. అతని పరిపాలన అంతమయిపోయింది, నిజమే. కానీ రాజు కుమారుడు వస్తాడు. పరిపాలిస్తాడు. అది ఒక సర్పం తనకంటె మరింత ఎక్కువ ప్రమాదకరమైన సర్పానికి జన్మ ఇచ్చినట్టు ఉంటుంది.
ISA 14:30 కానీ నా దీన ప్రజలు మాత్రం క్షేమంగా భోజనం చేయగలుగుతారు. వారి పిల్లలు క్షేమంగా ఉంటారు. మీ దీనప్రజలు పండుకొని, క్షేమంగా ఉంటారు. కానీ నేను మీ కుటుంబాన్ని ఆకలితో చంపేస్తాను. మిగిలిన మీ ప్రజలంతా చనిపోతారు.
ISA 14:31 పట్టణ ద్వారం దగ్గర ఉండే ప్రజలారా కేక వేయండి. పట్టణ ప్రజలారా, గట్టిగా కేకలు వేయండి. ఫిలిష్తియాలోని ప్రజలారా, మీరు భయపడతారు. మీ ధైర్యం వేడి మైనంలా కరిగిపోతుంది. ఉత్తరంగా చూడండి. అక్కడ ధూళి మేఘం ఉంది. అష్షూరు నుండి ఒక సైన్యం వస్తోంది. ఆ సైన్యంలో మనుష్యులంతా బలంగా ఉన్నారు.
ISA 14:32 ఆ సైన్యం, వారి దేశానికి సందేశం తీసుకువెళ్లే వారిని పంపుతుంది. ఆ సందేశకులు వారి ప్రజలకు ఏమని చెబుతారు? ఫిలిష్తియా ఓడిపోయింది. అని వారు ప్రకటిస్తారు. కానీ సీయోనును యెహోవా బలపర్చాడు. ఆయన దీన ప్రజలు భద్రత కోసం అక్కడికి వెళ్లారు.
ISA 15:1 ఇది మోయాబును గూర్చి విచారకరమైన సందేశం: ఒక రాత్రి ఆర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది. ఆ రాత్రి పట్టణం నాశనం చేయబడింది. ఒక రాత్రి కిర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది. ఆ రాత్రే పట్టణం నాశనం చేయబడింది.
ISA 15:2 రాజ కుటుంబం, దీబోను ప్రజలు ఉన్నతమైన పూజాస్థలాల్లో మొరపెట్టేందుకు వెళ్తున్నారు. నెబో కోసం, మేదెబా కోసం మోయాబు ప్రజలు మొరపెడ్తున్నారు. ప్రజలంతా వారి విచారం వ్యక్తం చేయటానికి తలలు బోడిగుండ్లు చేసుకొన్నారు.
ISA 15:3 మోయాబు అంతటా ఇంటి కప్పుల మీద, వీధుల్లో ప్రజలు నల్ల బట్టలు ధరిస్తున్నారు. ప్రజలు ఏడుస్తున్నారు.
ISA 15:4 హెష్బోను, ఏలాలేయు పట్టణాల ప్రజలు చాలా గట్టిగా ఏడుస్తున్నారు. చాలా దూరంలో ఉన్న యహసు పట్టణంలో మీరు వారి ఏడ్పులు వినవచ్చును. చివరికి సైనికులు కూడా భయపడుతున్నారు. సైనికులు భయంతో వణకుచున్నారు.
ISA 15:5 మోయాబు విషయంలో దుఃఖంతో నా హృదయం ఘోషిస్తుంది. ప్రజలు భద్రత కోసం పారిపోతున్నారు. దూరంలో ఉన్న సోయరుకు వారు పారిపోతున్నారు. ఎగ్లాతు షెలిషియాకు వారు పారిపోతున్నారు. ప్రజలు కొండ మార్గంగా లూహీతుకు వెళ్తున్నారు. ప్రజలు ఏడుస్తున్నారు. ప్రజలు హొరొనయీము మార్గంలో వెళ్తున్నారు. ప్రజలు చాలా గట్టిగా విలపిస్తున్నారు.
ISA 15:6 కానీ నిమ్రీము యేరు ఎడారిలా ఎండిపోయింది. మొక్కలన్నీ చచ్చాయి. ఏదీ పచ్చగా లేదు.
ISA 15:7 అందుచేత ప్రజలు వారి స్వంత సామగ్రి సర్దుకొని మోయాబు విడిచిపెడ్తున్నారు. వారు ఆ సామగ్రిమోస్తూ నిరవంజి చెట్ల నది దగ్గర సరిహద్దు దాటుతున్నారు.
ISA 15:8 ఏడ్వటం మోయాబు అంతటా వినబడుతుంది. చాలా దూరంలో ఉన్న ఎగ్లయీము పట్టణంలో ప్రజలు ఏడుస్తున్నారు. బెయేరేలీము పట్టణంలో ప్రజలు ఏడుస్తున్నారు.
ISA 15:9 దీమోను పట్టణపు నీళ్లు పూర్తిగా రక్తమయం అయిపోయాయి. మరియు నేను (యెహోవాను) దీమోనుకు ఇంకా ఎక్కువ కష్టాలు కలిగిస్తాను. మోయాబులో నివసిస్తున్న కొద్దిమంది శత్రువునుండి తప్పించుకొన్నారు. కానీ ఆ ప్రజలను తిని వేయటానికి నేను సింహాలను పంపిస్తాను.
ISA 16:1 ఆ దేశపు రాజుకు మీరు ఒక కానుక పంపాలి. సెలానుండి అరణ్యంగుండా సీయోను కుమార్తె కొండకు (యెరూషలేము) మీరు ఒక గొర్రెపిల్లను పంపాలి.
ISA 16:2 మోయాబు స్త్రీలు అర్నోను నది దాటేందుకు ప్రయత్నిస్తారు. సహాయం కోసం వారు ఒకచోట నుండి మరోచోటుకు పరుగులెత్తుతారు. వారు, గూడు నేల కూలినప్పుడు తప్పిపోయిన చిన్న పిట్ట పిల్లలా ఉంటారు.
ISA 16:3 “మాకు సహాయం చేయండి, మేం ఏం చేయాలో మాకు చెప్పండి! మధ్యాహ్నపు ఎండనుండి నీడ కాపాడినట్టు మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడండి. మా శత్రువుల నుండి మేం పారిపోతున్నాం మమ్మల్ని దాచిపెట్టండి. మమ్మల్ని మా శత్రువులకు అప్పగించకండి అని వారంటారు.
ISA 16:4 ఆ మోయాబు ప్రజలు వారి ఇండ్లనుండి బలవంతంగా వెళ్లగొట్టిబడ్డారు. కనుక వాళ్లను మీ దేశంలో నివాసం ఉండనియ్యండి. వారి శత్రువులనుండి వారిని కాపాడండి.” దోచుకోవటం ఆగిపోతుంది. శత్రువు ఓడించబడతాడు. ఇతరులను బాధించే పురుషులు దేశం నుండి వెళ్లిపోతారు.
ISA 16:5 అప్పుడు కొత్త రాజు వస్తాడు. ఈ రాజు దావీదు వంశంవాడు. ఆయన నిజాయితీ పరుడు. ఆయన ప్రేమ, దయగలవాడు. ఈ రాజు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. సరియైనవి, మంచివి ఆయన చేస్తాడు.
ISA 16:6 మోయాబు ప్రజలు చాలా గర్విష్ఠులని, మోసగాళ్లని మేము విన్నాం. ఈ ప్రజలు తిరుగు బాటు దారులు, గర్విష్ఠులు. అయితే వారి గొప్పలన్నీ వట్టి మాటలే.
ISA 16:7 ఆ గర్వం చేత మొత్తం మోయాబు దేశం శ్రమ అనుభవిస్తుంది. మోయాబు ప్రజలంతా ఏడుస్తారు. ప్రజలు విచారిస్తారు. గతంలో వారికి ఉన్నవన్నీ మళ్లీ కావాలనుకొంటారు. కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు కావాలని వారు కోరుకొంటారు.
ISA 16:8 హెష్బోను పొలాలు, సిబ్మా ద్రాక్ష వల్లులు, ద్రాక్ష పండ్లు ఫలించటం లేదని ప్రజలు విచారంగా ఉంటారు. విదేశీ పాలకులు ద్రాక్ష వల్లులను నరికివేశారు. శత్రుసైన్యాలు యాజరు పట్టణం వరకు చాలా దూరం, అరణ్యంలోనికి విస్తరించారు. సముద్రం వరకు వారు విస్తరించారు.
ISA 16:9 “ద్రాక్ష పండ్లు నాశనం చేయబడ్డాయి. కనుక యాజరు, సిబ్మా ప్రజలతోబాటు నేనూ ఏడుస్తాను. పంట ఉండదు గనుక హెష్బోను, ఏలాలే ప్రజలతోబాటు నేనూ ఏడుస్తాను. వేసవి పండ్లు ఏమీ ఉండవు. సంతోషపు కేకలు అక్కడ ఉండవు.
ISA 16:10 కర్మెలులో పాటలు పాడటం మరియు సంతోషం ఉండదు. పంట కోత సమయంలో సంతోషం అంతా నేను నిలిపివేస్తాను. ద్రాక్షపండ్లు ద్రాక్షరసం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ అవన్నీ వ్యర్థం అవుతాయి.
ISA 16:11 అందుచేత మోయాబు గూర్చి నాకు చాలా విచారం కీర్హరెశు గూర్చి నాకు చాలా విచారం ఈ పట్టణాల గూర్చి నాకు ఎంతెంతో దుఃఖం.
ISA 16:12 మోయాబు ప్రజలు ఎత్తయిన వారి పూజాస్థలాలకు వెళ్తారు. ప్రజలు ప్రార్థించాలని ప్రయత్నిస్తారు. కానీ సంభవించిన సంగతులన్నీ వారు చూస్తారు, ప్రార్థించలేనంత బలహీనులవుతారు.”
ISA 16:13 మోయాబును గూర్చి ఈ విషయాలు యెహోవా ఎన్నోసార్లు చెప్పాడు.
ISA 16:14 ఇప్పుడు “మూడు సంవత్సరాల్లో (కూలీ వాని కాలం లెక్క ప్రకారం) ఆ ప్రజలందరూ ఉండరు, వారికి అతిశయాస్పదమైనవన్నీ పోతాయి. కొంతమంది మనుష్యులు మిగిలి ఉంటారు. కానీ వారు ఎక్కువ మంది ఉండరు” అని యెహోవా చెబుతున్నాడు.
ISA 17:1 ఇది దమస్కుకు విచారకరమైన సందేశం. దమస్కుకు ఈ సంగతులు సంభవిస్తాయని యెహోవా సెలవిస్తున్నాడు: “దమస్కు ఇప్పుడు పట్టణం కానీ దమస్కు నాశనం చేయబడుతుంది. దమస్కులో శిథిలాలు మాత్రమే మిగుల్తాయి.
ISA 17:2 ప్రజలు అరోయేరు పట్టణాలు విడిచి పెట్టేస్తారు. ఆ ఖాళీ పట్టణాల్లో గొర్రెల మందలు విచ్చలవిడిగా తిరుగుతాయి. వాటిని పట్టించుకొనే వాడు ఎవ్వడూ ఉండడు.
ISA 17:3 ఎఫ్రాయిము ప్రాకార పట్టణాలు (ఇశ్రాయేలు) నాశనం చేయబడతాయి. దమస్కులో ప్రభుత్వం అంతమవుతుంది. ఇశ్రాయేలుకు సంభవించినదే సిరియాకు సంభవిస్తుంది. ప్రముఖులంతా తీసుకొని పోబడతారు.” ఆ సంగతులు జరుగుతాయని సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు.
ISA 17:4 ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఐశ్వర్యం అంతాపోతుంది. వ్యాధి మూలంగా చాలా బరువు తగ్గిపోయినమని షిలా యాకోబు ఉంటాడు.
ISA 17:5 ఆ సమయం రెఫాయీము లోయలో ధాన్యపు కోతలా ఉంటుంది. పొలంలో పెరిగిన మొక్కలను పనివాళ్లు ఒక చోట వేస్తారు. తర్వాత మొక్కల నుండి గింజలను వారు కోస్తారు. ధాన్యం వారు కుప్పవేస్తారు.
ISA 17:6 ఆ సమయం, ప్రజలు ఒలీవ పండ్లు కోసే సమయంలో ఉంటుంది. ప్రజలు ఒలీవ చెట్లనుండి ఒలీవ పండ్లు రాల్చుతారు. అయితే సాధారణంగా చెట్లకొమ్మలకు కొన్ని ఒలీవ పండ్లు మిగిలిపోతాయి. కొన్ని పై కొమ్మలకు నాలుగైదు ఒలీవ పండ్లు మిగిలి పోతాయి. ఆ పట్టణాలకు గూడ అలానే ఉంటుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ సంగతులు చెప్పాడు.
ISA 17:7 ఆ సమయంలో ప్రజలు వారిని చేసిన దేవునివైపు చూస్తారు. వారి కన్నులు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని చూస్తారు.
ISA 17:8 ప్రజలు, వారు చేసిన గొప్ప వాటిని నమ్ముకోరు. అబద్ధపు దేవుళ్ల కోసం వారు తయారు చేసిన ప్రత్యేక తోటలకు, బలిపీఠాలకు వారు వెళ్లరు.
ISA 17:9 ఆ కాలంలో కోటలుగల పట్టణాలన్నీ ఖాళీగా ఉంటాయి. ఆ పట్టణాలు, ఆ దేశానికి ఇశ్రాయేలు ప్రజలు రాకముందు ఉన్న కొండలు, అడవుల్లా ఉంటాయి. గతంలో ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారంటే ప్రజలంతా పారిపోయేవారు. భవిష్యత్తులో దేశం మళ్లీ ఖాళీగా ఉంటుంది.
ISA 17:10 మిమ్మల్ని రక్షించే దేవుణ్ణి మీరు మరచిపోయారు గనుక ఇలా జరుగుతుంది. దేవుడే మీ భద్రతా స్థానం అని మీరు జ్ఞాపకం ఉంచుకోలేదు. చాలా దూర స్థలాల నుండి మీరు కొన్ని మంచి ద్రాక్షా వల్లులను తెచ్చి నాటవచ్చును గాని ఆ మొక్కలు ఎదగవు.
ISA 17:11 ఒకనాడు మీరు మీ ద్రాక్ష వల్లులను నాటి, వాటిని పెంచటానికి ప్రయత్నం చేస్తారు. మర్నాడు మొక్కలు పెరగటం మొదలవుతుంది. అయితే కోతకాలంలో మొక్కల నుండి పండ్లు కోయటానికి మీరు వెళ్తారు గాని అవి మొత్తం చచ్చి ఉండటం మీరు చూస్తారు. ఆ మొక్కలన్నింటినీ ఒక రోగం చంపేస్తుంది.
ISA 17:12 ఎంతెంతో మంది ప్రజలు చెప్పేది విను. సముద్ర ఘోషలా వారు గట్టిగా ఏడుస్తున్నారు. ఆ ఘోషవిను. ఆ ఏడుపు సముద్రపు ఘోషలా ఉండి. సముద్రంలో అలలూ అలలూ ఢీకొన్న ఘోషలా ఉంది.
ISA 17:13 ప్రజలు ఆ అలల్లా ఉంటారు. దేవుడు ఆ ప్రజలతో కఠినంగా మాట్లాడతాడు. వారు పారిపోతారు. ప్రజలు గాలికి కొట్టుకొని పొయ్యే పొట్టులా ఉంటారు. ప్రజలు తుఫానుకు కొట్టుకొని పొయ్యే కలుపు మొక్కల్లా ఉంటారు. గాలి విసురుతుంది కలుపు కొట్టుకొని పోతుంది.
ISA 17:14 ఆ రాత్రి ప్రజలు చాలా భయంగా ఉంటారు. తెల్లవారే సరికి ఏమీ మిగలదు. కనుక మన శత్రువులకు ఏమీ లభించదు. వారు మన దేశం వస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు.
ISA 18:1 ఇథియోపియా నదుల తీరంలో దేశాన్ని చూడు. దేశం కీటకాలతో నిండిపోయింది. నీవు వాటి రెక్కల పటపట శబ్దం వినవచ్చు.
ISA 18:2 ఆ దేశం సముద్రం మీద జమ్ము పడవల్లో మనుష్యులను ఆవలికి పంపిస్తుంది. వేగంగా పోయే సందేశహరులు, ఎత్తుగా బలంగా ఉండే మనుష్యుల దగ్గరకు వెళ్తారు. (ఎత్తుగా బలంగా ఉండే ఈ మనుష్యులంటే అన్ని చోట్ల ప్రజలకు భయం. వారు బలంగల రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను జయిస్తుంది. నదుల మూలంగా విభజించబడిన దేశంలో వారు ఉన్నారు).
ISA 18:3 వారికి ఏదో కీడు జరుగుతుంది అని ఆ ప్రజలకు హెచ్చరిక చేయి. ఆ రాజ్యానికి ఈ సంగతి సంభవించటం ప్రపంచంలోని ప్రజలంతా చూస్తారు. ఒక కొండ మీద ఎగురవేసిన పతాకంలా ప్రజలు ఈ విషయాన్ని తేటగా చూస్తారు. ఎత్తయిన ఈ మనుష్యులకు సంభవించే ఆ సంగతిని గూర్చి భూలోకంలో జీవించే ప్రజలంతా వింటారు. యుద్ధానికి ముందు ఊదే శంఖంలా వారు దీనిని తేటగా వింటారు.
ISA 18:4 యెహోవా చెప్పాడు: “నా కోసం సిద్ధం చేయ బడిన స్థలంలో నేను ఉంటాను. ఈ సంగతులు సంభవించటం నేను మౌనంగా చూస్తాను.
ISA 18:5 అందమైన ఒక వేసని రోజు, మధ్యాహ్నం ప్రజలు విశ్రాంతి తీసుకొంటూ ఉంటారు. (అది వర్షాలు లేని ఎండాకాలపు కోత సమయం, ఉదయపు మంచు మాత్రమే ఉంటుంది) అప్పుడు ఏదో జరుగుతుంది. అది పూవులు వికసించిన తరువాత సమయం క్రొత్త ద్రాక్షలు మొగ్గ తొడిగి, పెరుగుతూ ఉంటాయి. అయితే కోతకు ముందు శత్రువు వచ్చి, మొక్కలు నరికేస్తాడు. శత్రువు ద్రాక్షలను చితుకగొట్టి, పారవేస్తాడు.
ISA 18:6 కొండ పక్షులు, అడవి జంతువులు తినటానికి ఆ ద్రాక్ష తీగలు విడిచిపెట్టబడతాయి. వేసవిలో ఆ ద్రాక్షతీగల మీద పక్షులు నివాసం ఉంటాయి. ఆ చలికాలం అడవి జంతువులు ఆ ద్రాక్షతీగలను తింటాయి.”
ISA 18:7 ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవాకు ఒక అర్పణ తీసుకొని రాబడుతుంది. ఎత్తుగా బలంగా ఉండే ఆ ప్రజలు దగ్గర్నుండే ఆ కానుక వస్తుంది. (ఎత్తుగా, బలంగా ఉండే ఈ ప్రజలంటే అన్ని చోట్ల మనుష్యులందరికీ భయమే. వారు చాలా బలమైన రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను ఓడిస్తుంది. నదులచే విభజించబడిన దేశంలో వారు ఉన్నారు.) ఈ కానుక, సీయోను కొండలోని యెహోవా స్థానానికి తీసుకొని రాబడుతుంది.
ISA 19:1 చూడండి! వేగంగా పోయే మేఘం మీద యెహోవా వస్తున్నాడు. యెహోవా ఈజిప్టులో ప్రవేశిస్తాడు, అప్పుడు ఈజిప్టు అబద్ధ దేవుళ్లంతా భయంతో వణికిపోతారు. ఈజిప్టు ధైర్యంగలది కానీ ఆ ధైర్యం వేడి మైనంలా కరగిపోతుంది.
ISA 19:2 దేవుడు చెబుతున్నాడు: “ఈజిప్టు ప్రజలు వారికి వారే విరోధంగా పోరాడుకొనేట్టు నేను చేస్తాను. మనుష్యులు వారి సోదరులతో పోరాడుతారు. పొరుగువారు పొరుగువారికి విరోధం అవుతారు. పట్టణాలు పట్టణాలకు విరోధం అవుతాయి. రాష్ట్రాలు రాష్ట్రాలకు విరోధం అవుతాయి.
ISA 19:3 ఈజిప్టు ప్రజలు గందరగోళ పడిపోతారు. వారు చేయాల్సింది ఏమిటి అని ప్రజలు వారి అబద్ధ దేవుళ్లను, జ్ఞానులను అడుగుతారు. ప్రజలు వారి మాంత్రికులను, భూత వైద్యులను అడుగుతారు. కానీ వారి సలహా నిష్ప్రయోజనం.”
ISA 19:4 సర్వశక్తిమంతుడైన యెహోవా, ప్రభువు చెబుతున్నాడు, “నేను (దేవుణ్ణి) ఈజిప్టును కఠినమైన యజమానికి అప్పగిస్తాను. శక్తిగల ఒక రాజు ప్రజలను పాలిస్తాడు.”
ISA 19:5 నైలునది ఎండిపోతుంది.
ISA 19:6 నదులన్నీ చెడ్డకంపు కొడ్తాయి. ఈజిప్టులో కాలువలు ఎండిపోయి, నీరు ఉండకుండా పోతుంది. నీటి మొక్కలు అన్నీ కుళ్లిపోతాయి.
ISA 19:7 నదీ తీరాల్లోని మొక్కలన్నీ ఎండిపోయి, కొట్టుకొని పోతాయి. నది మహా విశాలంగా ఉన్న చోటగూడా మొక్కలు చస్తాయి.
ISA 19:8 “నైలునదిలో చేపలుపట్టే జాలరులు అందరూ దుఃఖపడి ఏడుస్తారు. వారు తమ ఆహారంకోసం నైలు నదిమీద ఆధారపడతారు. కానీ అది ఎండిపోతుంది.
ISA 19:9 బట్టలు తయారు చేసే వాళ్లంతా చాలా దుఃఖపడతారు. పీచువస్త్రాలు తయారు చేయటానికి ప్రజలకు పీచు కావాలి. కానీ నది ఎండిపోయి ఈ పీచు మొక్కలు పెరగవు.
ISA 19:10 నీళ్లు నిల్వ చేసేందుకు ఆనకట్టలు కట్టే వారికి పని ఉండదు గనుక దుఃఖంగా ఉంటారు.
ISA 19:11 “సోయను పట్టణ నాయకులు తెలివి తక్కువ వాళ్లు. ఫరోయొక్క ‘తెలివిగల నాయకులు’ తప్పుసలహాలు ఇస్తారు. వారు తెలివిగల వాళ్లని ఆ నాయకులు అంటారు. వారు పూర్వపు రాజుల కుటుంబాలకు చెందినవాళ్లం అంటారు. కానీ వారు, వాళ్లు అనుకొన్నంత తెలివిగలవాళ్లు కారు.”
ISA 19:12 ఈజిప్టూ, నీ జ్ఞానులు ఎక్కడ? సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టు కోసం వేసిన పథకం ఏమిటో ఆ జ్ఞానులు తెలుసుకోవాలి. ఏం జరుగ బోతుందో అది నీకు చెప్పాల్సినవాళ్లు వారే.
ISA 19:13 సోయను నాయకులు వెర్రివాళ్లుగా చేయబడ్డారు. నోపు నాయకులు దొంగ సంగతులు నమ్మేసారు. అందుచేత నాయకులు ఈజిప్టును తప్పుత్రోవను నడిపించారు.
ISA 19:14 ఆ నాయకులను యెహోవా గందరగోళపర్చాడు. వాళ్లు తిరుగులాడుచూ, ఈజిప్టును తప్పుదారిలో నడిపిస్తారు. ఆ నాయకులు చేసేది అంతా తప్పే. వాళ్లు త్రాగి రోగంతో వీధిలో దొర్లాడే వాళ్లలా ఉన్నారు.
ISA 19:15 ఆ నాయకులు చేయగలిగింది ఏమీ లేదు. (ఈ నాయకులే “తలలు, తోకలు.” వారే, “మొక్కల కొమ్ములు, కాండాలు.”)
ISA 19:16 ఆ కాలంలో ఈజిప్టు వాళ్లు బెదరిపోయిన ఆడవాళ్లలా ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు వారు భయపడతారు. ప్రజలను శిక్షించటానికి యెహోవా తన చేయి పైకి ఎత్తుతాడు, వారు భయపడతారు.
ISA 19:17 యూదా దేశం, ఈజిప్టు ప్రజలందరికి భయం పుట్టించే దేశం అవుతుంది. ఈజిప్టులో ఎవరైనా సరే యూదా పేరు వింటే భయపడతారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టులో భయంకర సంగతులు జరగాలని పథకం వేసాడు గనుక ఇవి జరుగుతాయి.
ISA 19:18 ఆ కాలంలో ప్రజలు కనాను భాష (యూదుల బాష) మాట్లాడే పట్టణాలు ఈజిప్టులో అయిదు ఉంటాయి. ఈ పట్టణాల్లో ఒక దానికి “నాశన పట్టణం” అని పేరు పెట్టబడుతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవాను వెంబడిస్తాం అని ప్రజలు ప్రమాణం చేస్తారు.
ISA 19:19 ఆ కాలంలో ఈజిప్టు కేంద్రంలో యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది. యెహోవాకు సన్మాన సూచకంగా ఈజిప్టు సరిహద్దులో ఒక స్తంభం ఉంటుంది.
ISA 19:20 సర్వశక్తిమంతుడైన యెహోవా శక్తివంతమైన పనులు చేస్తాడు అని చూపించేందుకు ఇది ఒక సంకేతం. యెహోవా దగ్గర్నుండి సహాయం కావాలని ప్రజలు మొర పెట్టినప్పుడల్లా, యెహోవా సహాయం పంపిస్తాడు. ప్రజలను రక్షించి, కాపాడుటకు ఒక వ్యక్తిని యెహోవా పంపిస్తాడు. ఆ ప్రజలకు అక్రమమైన వాటిని జరిగించే మనుష్యుల బారినుండి ఆ వ్యక్తి వారిని విమోచిస్తాడు.
ISA 19:21 ఆ సమయంలో ఈజిప్టులోని ప్రజలు యెహోవాను వాస్తవంగా తెలుసుకొంటారు. ఈజిప్టు ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రజలు దేవుణ్ణి సేవిస్తారు, అనేక బలులు అర్పిస్తారు. వారు యెహోవాకు ప్రమాణాలు చేస్తారు. వారు ఆ ప్రమాణాలను నిలబెట్టుకొంటారు.
ISA 19:22 ఈజిప్టు ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. మరియు అప్పుడు ఆయన వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు) వారు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. యెహోవా వారి ప్రార్థనలు వింటాడు, వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు).
ISA 19:23 ఆ కాలంలో ఈజిప్టు నుండి అష్షూరుకు రాజమార్గం ఉంటుంది. అప్పుడు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు వెళ్తారు, ఈజిప్టు నుండి ప్రజలు అష్షూరు వెళ్తారు. ఈజిప్టు అష్షూరుతో కలిసి పనిచేస్తుంది.
ISA 19:24 ఆ కాలంలో ఇశ్రాయేలు, అష్షూరు, ఈజిప్టు కలిసి దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకొంటారు. ఇది దేశానికి ఆశీర్వాదం.
ISA 19:25 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ దేశాలను ఆశీర్వదిస్తాడు. “ఈజిప్టూ, మీరే నా ప్రజలు అష్షూరూ, నిన్ను నేను సృష్టించాను. ఇశ్రాయేలూ, నీవు నా స్వంతం. మీరంతా ఆశీర్వదించబడిన వాళ్లు” అని ఆయన అంటాడు.
ISA 20:1 అష్షూరు రాజు సర్గోను. అష్డోదు మీద యుద్ధం చేయటానికి సర్గోను తర్తానును ఆ పట్టణం మీదికి పంపించాడు. తర్తాను అక్కడికి వెళ్లి ఆ పట్టణాన్ని పట్టుకొన్నాడు.
ISA 20:2 ఆ సమయంలో ఆమోజు కుమారుడు యెషయా ద్వారా యెహోవా మాట్లాడాడు: “వెళ్లు, నీ నడుముకు కట్టిన దుఃఖవస్త్రం తీసివేయి. నీ పాదాల జోళ్లు తీసివేయి” అని యెహోవా చెప్పాడు. యెషయా యెహోవాకు విధేయుడయ్యాడు. మరియు యెషయా బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా అక్కడ అంతా తిరిగాడు.
ISA 20:3 అప్పుడు యెహోవా చెప్పాడు: “బట్టలు లేకుండ, చెప్పులు లేకుండా యెషయా మూడు సంవత్సరాలు తిరిగాడు. ఇది ఈజిప్టు, ఇథియోపియాకు సంకేతం.
ISA 20:4 అష్షూరు రాజు ఈజిప్టును, ఇథియోపియాను ఓడిస్తాడు. అష్షూరు బందీలను పట్టుకొని, వారి దేశాల నుండి తీసుకొనిపోతాడు. పెద్దవాళ్లు, యువతీ యువకులు బట్టలు చెప్పులు లేకుండానే తీసుకొని పోబడతారు. వారు సాంతం నగ్నంగా ఉంటారు. ఈజిప్టు ప్రజలు అవమానిం చబడతారు.
ISA 20:5 ప్రజలు సహాయం కోసం ఇథియోపియా వైపుచూస్తారు. ఆ ప్రజలు భగ్నమైపోతారు. ఈజిప్టు ఔన్నత్యం చూచి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. అలాంటి ప్రజలు అవమానించబడతారు.”
ISA 20:6 సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రజలు, “ఆ దేశాలు మాకు సహాయం చేస్తాయని వాటిని నమ్ముకొన్నాము. అవి మమ్మల్ని అష్షూరు రాజు నుండి విమోచిస్తాయని మేం వాటి దగ్గరకు పరుగెత్తాం. కానీ వాటిని చూడండి. ఆ దేశాలు పట్టుకోబడ్డాయి, మరి మనం ఎలా తప్పించు కోగలుగుతాం?” అని అంటారు.
ISA 21:1 సముద్రతీరంలో ఉన్న అడవి ప్రాంతానికి విచారకరమైన సందేశం: అరణ్యం నుండి ఏదో వస్తోంది? నెగెవ్‌నుండి వీచే గాలిలా అది వస్తోంది. అది ఒక భయంకర దేశం నుండి వస్తోంది.
ISA 21:2 జరుగబోయే దారుణమైన ఒక సంగతి నేను చూసాను. దేశద్రోహులు నీకు విరోధంగా లేవటం నేను చూశాను. వ్రజలు నీ ఐశ్వర్యం తీసుకోవటం నేను చూశాను. ఏలాము, వెళ్లి ఆ ప్రజలతో యుద్ధం చేయి. మాద్యా, పట్టణం చుట్టూరా నీ సైన్యాలను ఉంచి, దాన్ని జయించు. ఆ పట్టణంలో చెడు సడుగులన్నింటినీ నేను అంతం చేస్తాను.
ISA 21:3 ఆ భయంకర విషయాలు నేను చూశాను, ఇప్పుడు నేను భయపడ్తున్నాను. నా భయంవల్ల నా కడుపులో దేవేస్తోంది. ఆ బాధ ప్రసవవేదనలా ఉంది. నేను వినే విషయాలు నన్ను చాలా భయపెట్టేస్తాయి. నేను చూచే విషయాలు నన్ను భయంతో వణకిస్తాయి.
ISA 21:4 నేను దిగులుగా ఉన్నాను, భయంతో వణకిపోతున్నాను. సంతోషకరమైన నా సాయంపూట, భయం పుట్టే రాత్రిగా తయారయింది.
ISA 21:5 అంతా బాగానే వుందని ప్రజలు తలస్తున్నారు. ప్రజలు అంటారు: “బల్ల సిద్ధం చేయండి! బల్లమీద బట్ట పరచండి! తినండి! తాగండి!” కానీ ప్రజలు, “నాయకులారా, లేవండి, యుద్ధానికి సిద్ధపడండి” అని చెప్పాలి.
ISA 21:6 ఎందుకంటే నా ప్రభువు, నాతో ఈ విషయాలు చెప్పాడు: “వెళ్లి, పట్టణాన్ని కాపాడేందుకు ఒక మనిషికోసం చూడు.
ISA 21:7 కావలివాడు గుర్రాల మీద సైనికుల్ని, గాడిదలు, లేక ఒంటెలను చూస్తే కావలివాడు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినాలి.”
ISA 21:8 అప్పుడు ఆ కావలివాడు సింహం అనే హెచ్చరిక మాట గట్టిగా చెప్పాలి. కావలివాడు యెహోవాతో చెప్పాడు: “నా ప్రభూ! ప్రతిరోజూ నేను కావలి కాస్తూ కావలి గోపురం మీద ఉన్నాను. ప్రతిరాత్రి నేను నిలబడి కావలి కాస్తూనే ఉన్నాను, కానీ
ISA 21:9 అదిగో, వాళ్లు వచ్చేస్తున్నారు, బారులుతీరిన మనుష్యులు, గుర్రాల మీద సైనికులు నాకు కనబడుతున్నారు.” అప్పుడు పురుషుల్లో ఒకడు అన్నాడు: “బబులోను ఓడించబడింది. బబులోను నేల మట్టంగా కూలిపోయింది. దాని అబద్ధ దేవుళ్ల విగ్రహాలన్నీ నేలకు కొట్టబడ్డాయి ముక్కలు ముక్కలుగా విరిగి పోయాయి.”
ISA 21:10 యెషయా చెప్పాడు, “నా ప్రజలారా, ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవానుండి నేను విన్న వాటన్నింటినీ మీకు చెప్పాను. కళ్లంలో ధాన్యంలా మీరు చితుకగొట్ట బడతారు.”
ISA 21:11 దూమాను గూర్చిన విచారకరమైన సందేశం: శేయీరునుండి ఎవరో నన్ను పిలిచి అడుగుతున్నారు, “కావలివాడా, రాత్రి ఎంత వేళయింది? కావలివాడా, రాత్రి ఎంత వేళయింది?”
ISA 21:12 కావలివాడు జవాబిచ్చాడు, “ఉదయం అవుతుంది, రాత్రి కూడా అవుతుంది. నీవు అడగాల్సింది ఏమైనా ఉంటే తిరిగి వచ్చి అడుగుము.”
ISA 21:13 అరేబియాను గూర్చి విచారకరమైన సందేశం: దెదానునుండి వచ్చిన ఒంటెల ప్రయాణీకులు అరబి ఎడారిలో కొన్ని చెట్ల దగ్గర రాత్రి గడిపారు.
ISA 21:14 దాహంతో ఉన్న కొందరు ప్రయాణీకులకు వారు నీళ్లు ఇచ్చారు. ప్రయాణం చేస్తున్న కొందరు ప్రజలకు తేమా ప్రజలు భోజనం పెట్టారు
ISA 21:15 చంపడానికి సిద్ధంగా ఉన్న కత్తులనుండి ఆ ప్రజలు పారిపోతూ ఉన్నారు. గురిపెట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్న బాణాలనుండి వారు పారిపోతున్నారు. కష్టతరమైన యుద్ధంనుండి వారు పారిపోతున్నారు.
ISA 21:16 ఆ సంగతులు జరుగుతాయని నా ప్రభువైన యెహోవా నాతో చెప్పాడు: “ఒక్క సంవత్సరంలో (కూలివాని కాలమానం ప్రకారం) కేదారు ఘనత అంతా పోతుంది.
ISA 21:17 ఆ సమయంలో కేదారు మహా వీరుల్లో కొద్దిమంది విలుకాండ్రు మాత్రమే బతికి ఉంటారు.” ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఈ సంగతులు నాకు చెప్పాడు.
ISA 22:1 దర్శన లోయను గూర్చిన విచారకరమైన సందేశం: ప్రజలారా మీకు ఏమయింది? మీరు ఎందుకు మీ ఇంటి కప్పుల మీద దాక్కొంటున్నారు?
ISA 22:2 గత కాలంలో ఈ పట్టణం చాలా పని తొందరగా ఉండేది ఈ పట్టణం చాలా అల్లరిగా చాలా ఉల్లాసంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నీ ప్రజలు చంపి వేయబడ్డారు. కానీ కత్తులతో కాదు. ప్రజలు మరణించారు కానీ యుద్ధం చేస్తూ కాదు.
ISA 22:3 మీ నాయకులంతా ఒక్కుమ్మడిగా పారి పోయారు కానీ వాళ్లంతా బాణాలు లేకుండానే బంధించబడ్డారు. నాయకులంతా కలిసి దూరంగా పారిపోయారు. కానీ వాళ్లు బంధించబడ్డారు.
ISA 22:4 అందుకే నేనంటాను, “నా వైపు చూడవద్దు! నన్ను ఏడ్వనివ్వండి. యెరూషలేము నాశనం గూర్చి నన్ను ఆదరించాలని పరుగెత్తి రాకండి.”
ISA 22:5 యెహోవా ఒక ప్రత్యేక దినం ఏర్పాటు చేసుకొన్నాడు. ఆనాడు తిరుగుబాట్లు, గందరగోళంగా ఉంటుంది. దర్శనపు లోయలో ప్రజలు ఒకరినొకరు తొక్కుకుంటారు. పట్టణ ప్రాకారాలు కూలగొట్ట బడతాయి. లోయలో ఉన్న ప్రజలు కొండమీద పట్టణంలో ఉన్న ప్రజలను చూచి కేకలు వేస్తారు.
ISA 22:6 ఏలాము గుర్రాల సైనికులు వారి బాణాల సంచులు తీసుకొని యుద్ధానికీ స్వారీ చేస్తారు. కీరుప్రజలు వారి డాళ్లతో శబ్దాలు చేస్తారు.
ISA 22:7 సైన్యాలు మీ ప్రత్యేక లోయలో కలుసుకొంటాయి. లోయంతా రథాలతో నిండిపోతుంది. గుర్రాల సైనికులు పట్టణ ద్వారాల ముందు ఉంటారు.
ISA 22:8 యూదా వారు అరణ్య భవనంలో దాచుకొన్న వారి ఆయుధాలను ఆ సమయంలో ప్రయోగించాలని కోరుకొంటారు. యూదాను కాపాడుతున్న గోడలను శత్రువు కూలగొట్టేస్తాడు.
ISA 22:9 దావీదు పట్టణపు గోడలు బీటలు వారటం మొదలవుతుంది, ఆ బీటలు మీరు చూస్తారు. కనుక మీరు ఇళ్లను లెక్కబెట్టి, ఆ ఇండ్ల రాళ్లను గోడలు బాగుచేయటానికి ఉపయోగిస్తారు. పాత కాలువ నీళ్లు నిల్వచేయటానికి రెండు గోడల మధ్య మీరు ఖాళీ ఉంచుతారు, మీరు నీటిని నిల్వచేస్తారు. ఇదంతా మిమ్మల్ని మీరు కాపాడుకొనేందుకు చేస్తారు. కానీ వీటన్నింటినీ చేసిన దేవుణ్ణి మీరు నమ్ముకోరు. వీటన్నింటినీ చాలకాలం క్రిందట చేసిన వానిని (దేవుణ్ణి) మీరు చూడరు.
ISA 22:12 కనుక నా ప్రభువు సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రజలను ఏడ్చి, చనిపోయిన వారి స్నేహితుల కోసం దుఃఖంగా ఉండమని చెబుతాడు. ప్రజలు గుండ్లు గీసికొని, విచార సూచక వస్త్రాలు ధరిస్తారు.
ISA 22:13 అయితే చూడండి, ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రజలు ఇలా అంటున్నారు: మనం వేడుక చేసుకొందాం పశువుల్ని, గొర్రెల్ని వధించండి మీరు భోజనం తిని, ద్రాక్షరసం తాగండి తినండి, తాగండి, ఎందుకంటె రేపు మనం చస్తాం.
ISA 22:14 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు నాతో చెప్పాడు, నేను నా చెవులారా దానిని విన్నాను: “మీరు చెడుకార్యాలు చేసిన అపరాధులు. ఈ అపరాధం క్షమించబడక ముందే మీరు మరణిస్తారని నేను ప్రమాణం చేస్తున్నాను.” నా ప్రభువు సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
ISA 22:15 నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు నాతో చెప్పాడు: “ఆ సేవక షెబ్నా దగ్గరకు వెళ్లు. ఆ సేవకుడు భవనం అధికారి.
ISA 22:16 నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు?నీ కుటుంబం వారు ఎవరైనా ఇక్కడ సమాధి చేయబడ్డారా? నీవెందుకు ఇక్కడ సమాధి తయారు చేస్తున్నావు?”అవి ఆ సేవకుడ్ని అడుగు. యెషయా చెప్పాడు, “ఈ మనిషిని చూడండి! ఎత్తయిన స్థలంలో అతడు తన సమాధి సిద్ధం చేసుకొంటున్నాడు. తన సమాధి కోసం అతడు బండను తొలుస్తున్నాడు.
ISA 22:17 “ఓ మనిషీ, యెహోవా నిన్ను చితక గొట్టేస్తాడు. యెహోవా నిన్ను ఒక చిన్న ఉండలా చుట్టేసి, చాలా దూరంలో చేతులు చాచుకొని ఉన్న మరోదేశంలోకి నిన్ను విసరివేస్తాడు. అక్కడ నీవు చస్తావు.” యెహోవా చెప్పాడు: “నీ రథాల మూలంగా నీకు చాలా గర్వం. కానీ ఆ దూరదేశంలో నీ క్రొత్త పాలకునికి ఇంకా మంచి రథాలు ఉంటాయి. అతని స్థలంలో నీ రథాలు ఎన్నదగినవిగా కనబడవు.
ISA 22:19 ఇక్కడి నీ ప్రముఖపదవినుండి నిన్ను నేను వెళ్లగొడతాను. నీ ప్రముఖపదవినుండి, నీ క్రొత్త పాలకుడు నిన్ను తీసుకొని వెళ్లిపోతాడు.
ISA 22:20 ఆ సమయంలో హిల్కీయా కుమారుడు, నా సేవకుడు ఎల్యాకీమును నేను పిలుస్తాను.
ISA 22:21 నేను నీ అంగీ తీసి ఆ సేవకుని మీద వేస్తాను. నీ నడికట్టు అతనికి ఇస్తాను. నీ ముఖ్య పదవి అతనికి ఇస్తాను. యెరూషలేము ప్రజలకు, యూదా వంశానికి ఈ సేవకుడు ఒక తండ్రిలా ఉంటాడు.
ISA 22:22 “దావీదు ఇంటి తాళపు చెవిని అతని మెడలో నేను కడతాను. అతడు ఒక ద్వారం తెరిస్తే, అది తెరచుకొనే ఉంటుంది. ఏ మనిషీ దాన్ని మూసి వేయలేడు. అతడు ఒక ద్వారం మూసివేస్తే, ఆ ద్వారం మూసికొనే ఉంటుంది. ఏ మనిషీ దానిని తెరవలేడు. ఆ సేవకుడు తన తండ్రి ఇంటిలో ఘనమైన పీఠంలా ఉంటాడు.
ISA 22:23 గట్టిచెక్కకు కొట్టబడిన మేకులా అతణ్ణి నేను బలంగా చేస్తాను.
ISA 22:24 అతని తండ్రి ఇంటిలో ఘనమైన వాటిని, గొప్పవాటిని నేను అతని మీద వేలాడదీస్తాను. పెద్దలు, పిల్లలు అందరూ అతని మీద ఆధారపడతారు. ఆ మనుష్యులు ఆయన మీద వేలాడుతోన్న చిన్ పాత్రల్లా, పెద్ద నీళ్ల చెంబుల్లా ఉంటారు.
ISA 22:25 “ఆ సమయంలో, ప్రస్తుతం గట్టి చెక్కకు కొట్టబడిన మేకు (షెబ్నా) బలహనమవుతుంది, విరిగిపోతుంది. ఆ మేకు నేలమీద పడిపోతుంది, ఆ మేకుకు వేలాడుతున్న వస్తువులన్నీ నాశనం అవుతాయి. అప్పుడు, ఈ సందేశంలో నేను చెప్పిన సంగతులు అన్నీ సంభవిస్తాయి.” (యెహోవా చెప్పాడు గనుక ఆ సంగతులు జరుగుతాయి.)
ISA 23:1 తూరును గూర్చి విచారకరమైన సందేశం: తర్షీషు ఓడలారా, మీరు విచారించండి. మీ ఓడరేవు పాడుచేయబడింది. ( ఈ ఓడల మీద ఉన్న ప్రజలు కిత్తీయుల దేశం నుండి ప్రయాణం చేస్తూఉండగా వారికి ఈ వార్త చెప్పబడింది).
ISA 23:2 సముద్ర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలారా ఆగండి, దుఃఖించండి. తూరు, “సీదోను వ్యాపారి.” సముద్ర పక్కన ఉన్న ఆ పట్టణం సముద్రాల మీదుగా వ్యాపారులను పంపింది, ఆ మనుష్యులు మిమ్మల్ని ఐశ్వర్యాలతో నింపారు.
ISA 23:3 ఆ మనుష్యులు ధాన్యం కోసం వెదుకుతూ సముద్రాల మీద ప్రయాణం చేశారు. నైలునది దగ్గర పండే ధాన్యం తూరు మనుష్యులు కొని, ఆ ధాన్యాన్ని ఇతర దేశాలకు విక్రయించేవారు.
ISA 23:4 సీదోనూ, నీవు చాలా దుఃఖించాలి. ఎందుకంటే, ఇప్పుడు సముద్రం, సముద్రపు కోట చెబతున్నాయి. నాకు పిల్లలు లేరు. నాకు ప్రసవవేదన కలగలేదు నేను పిల్లలను కనలేదు నేను బాల బాలికలను పెంచలేదు.
ISA 23:5 తూరును గూర్చిన వార్త ఈజిప్టు వింటుంది. ఈ వార్త ఈజిప్టును దుఃఖంతో బాధిస్తుంది.
ISA 23:6 ఓడలారా మీరు తర్షీషుకు తిరిగి రావాలి. సముద్రం దగ్గర్లో నివసిస్తున్న ప్రజలారా మీరు విచారించాలి.
ISA 23:7 గతకాలంలో మీరు తూరు పట్టణాన్ని అనుభవించారు. అనాది నుండీ ఆ పట్టణం పెరుగుతూనే ఉంది. ఆ పట్టణం ప్రజలు జీవనోపాది కోసం దూర దేశాలు తిరిగారు.
ISA 23:8 తూరు పట్టణం చాలామంది నాయకులను తయారు చేసింది. ఆ పట్టణపు వ్యాపారులు యువరాజుల్లా ఉన్నారు. క్రయ విక్రయ దారులు ఎక్కడ చూచినా గౌరవించబడ్డారు. కనుక తూరుకు వ్యతిరేకంగా పథకాలు వేసింది ఎవరు?
ISA 23:9 సర్వశక్తిమంతుడైన యెహోవాయే. వాళ్లను ప్రముఖులుగా ఉండకుండా చేయాలని ఆయన నిర్ణయించాడు.
ISA 23:10 తర్షీషు ఓడలారా, మీరు తిరిగి మీ దేశం వెళ్లిపోండి. సముద్రం ఒక చిన్న నదిలా దాటండి. మిమ్మల్ని ఇప్పుడు ఆపు చేయడు.
ISA 23:11 యెహోవా సముద్రం మీద తన హస్తం చాపాడు. తూరుకు విరోధంగా యుద్ధం చేసేందుకు యెహోవా రాజ్యాలను సమ కూరుస్తున్నాడు. తన భద్రతా స్థలం తూరును నాశనం చేయమని యెహోవా కనానుకు ఆదేశిస్తున్నాడు.
ISA 23:12 “సీదోను కన్యా నీవు పాడు చేయబడతావు నీవు ఇంకెంత మాత్రం ఆనందించవు” అని యెహోవా చెబతున్నాడు. అయితే తూరు ప్రజలు, “కిత్తీము మాకు సహాయం చేస్తుంది” అంటున్నారు. కానీ మీరు సముద్రం దాటి కీత్తీము వెళ్తే అక్కడ మీకు విశ్రాంతి స్థలం దొరకదు.
ISA 23:13 అందుచేత తూరు ప్రజలు, “బబలోను ప్రజలు మాకు సహాయం చేస్తారు” అంటున్నారు. కానీ కల్దీయుల దేశం చూడండి. బబలోను ఇప్పుడు ఒక దేశం కాదు. బబులోను మీద అష్షూరు దాడి చేసి దాని చుట్టూ యుద్ధ గోపురాలు కట్టింది. అందమైన గృహాలనుండి సైన్యం సమస్తం దోచుకొంది. అష్షూరు బబలోనును అడవి మృగాలకు స్థావరంగా చేసింది బబులోనును వారు శిథిలాలుగా మార్చేశారు.
ISA 23:14 అందుచేత, తర్షీషు ఓడలారా, దుఃఖించండి మీ క్షేమ స్థానం (తూరు) నాశనం చేయబడుతుంది.
ISA 23:15 ప్రజలు తూరును డెబ్భయి సంవత్సరాలపాటు మరచిపోతారు. (అది ఒక రాజు పరిపాలనా కాలవ్యవధి) డెబ్భయి సంవత్సరాల తర్వాత తూరు ఈ పాటలోని వేశ్యలా ఉంటుంది.
ISA 23:16 ప్రజలు మరచిన ఓ ఆడదానా నీ స్వర మండలం తీసుకొని పట్టణంలో నడు. నీ పాటను చక్కగా వాయించు నీ పాటను తరచుగా పాడు. అప్పుడు ప్రజలు నిన్ను జ్ఞాపకం ఉంచుకొంటారు.
ISA 23:17 డెబ్భయి సంవత్సరాల తర్వాత తూరు విషయం యెహోవా పునః పరిశీలిస్తాడు, ఆయన దానికి తన నిర్ణయం తెలియజేస్తాడు. తూరు మళ్లీ వ్యాపారం చేస్తుంది. భూమి మీద రాజ్యాలన్నింటికీ తూరు ఒక వేశ్యలా ఉంటుంది.
ISA 23:18 కాని తూరు తాను సంపాదించిన ధనం ఉంచుకోదు. తూరు తన వ్యాపారం ద్వారా సంపాదించిన ధనం యెహోవా కోసం దాచబడుతుంది. యెహోవాను సేవించే వారికి ఆ ధనాన్ని తూరు ఇస్తుంది. కనుక యెహోవా సేవకులు తృప్తి పడేంతవరకు భోజనం చేస్తారు, మంచి దుస్తులు ధరిస్తారు.
ISA 24:1 చూడండి, యెహోవా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు. దేశంలోంచి పూర్తిగా సమస్తం యెహోవా శుద్ధి చేస్తాడు. యెహోవా ప్రజలను బలవంతంగా దూరం వెళ్లగొడతాడు.
ISA 24:2 ఆ కాలంలో సామాన్య ప్రజలు యాజకులు ఒక్కటే, బానిసలు, యజమానులు ఒక్కటే. ఆడ బానిసలు, యజమానురాండ్రు ఒక్కటే. అమ్మేవారు కొనేవారు ఒక్కటే. అప్పు ఇచ్చే వాళ్లు, పుచ్చుకొనే వాళ్లు ఒక్కటే. వడ్డీకి ఇచ్చేవారు, వడ్డీకి తీసుకొనేవారు ఒక్కటే.
ISA 24:3 ప్రజలంతా దేశంలో నుండి వెళ్లగొట్టబడతారు. సంపద దోచుకోబడుతుంది. యెహోవా ఆదేశించాడు గనుక ఇది జరుగుతుంది.
ISA 24:4 దేశం ఖాళీగా దుఃఖంగా ఉంటుంది. ప్రపంచం ఖాళీగా బలహీనంగా ఉంటుంది. ఈ దేశంలోని గొప్ప ప్రజానాయకులు బలహీనులు అవుతారు.
ISA 24:5 దేశంలోని ప్రజలు దేశాన్ని మైల చేసారు. ఇది ఎలా జరిగింది? ప్రజలు దేవుని ఉపదేశాలకు విరోధంగా తప్పుడు పనులు చేశారు. దేవుని చట్టాలకు ప్రజలు విధేయులు కాలేదు. ప్రజలు చాలాకాలం క్రిందట దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నారు. కానీ ఆ ప్రజలే దేవునితో గల ఒడంబడికను ఉల్లంఘించారు.
ISA 24:6 ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలు తప్పుచేసిన అపరాధులు. అందుచేత దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు. ప్రజలు శిక్షించబడతారు. కొద్దిమంది ప్రజలు మాత్రమే బతుకుతారు.
ISA 24:7 ద్రాక్ష వల్లులు చస్తున్నాయి. కొత్త ద్రాక్షరసం చెడి పోయింది. గతంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రజలు విచారంగా ఉన్నారు.
ISA 24:8 ప్రజలు వారి ఆనందం ప్రదర్శించటం మానివేశారు. ఆనంద ధ్వనులన్నీ ఆగిపోయాయి. సితారా, మృదంగ సంగీత సంతోషం సమసిపోయింది.
ISA 24:9 ప్రజలు వారి ద్రాక్షరసం తాగేటప్పుడు సంతోషంగా పాటలు పాడారు. మద్యం తాగేవాడికి దాని రుచి ఇప్పుడు చేదుగా ఉంది.
ISA 24:10 “పూర్తి గందరగోళం” అనేది ఈ పట్టణానికి సరిపోయే మంచి పేరు. పట్టణం నాశనం చేయబడింది. ప్రజలు ఇళ్లలో ప్రవేశించలేరు. ద్వారాలు బంధించబడ్డాయి.
ISA 24:11 ప్రజలు ఇంకా బజారుల్లో ద్రాక్షరసం కోసం అడుగుతున్నారు. కానీ సంతోషం అంతా పోయింది. ఆనందం దూరంగా తీసుకుపోబడింది.
ISA 24:12 పట్టణానికి నాశనం మాత్రమే మిగిలింది. చివరికి తలుపులు కూడా చితుక గొట్టబడ్డాయి.
ISA 24:13 కోతకాలంలో ప్రజలు ఒలీవ చెట్లనుండి ఒలీవ పండ్లు రాల్చుతారు. కానీ చెట్లకు కొన్ని ఒలీవ పండ్లే మిగిలి ఉన్నాయి. రాజ్యాల మధ్య ఈ దేశానికి గూడ అలానే ఉంటుంది.
ISA 24:14 విడిచి పెట్టబడిన ప్రజలు కేకలు వేయటం మొదలు పెడ్తారు. ప్రజలు సముద్ర ఘోషకంటె గట్టిగా కేకలు వేస్తారు యెహోవా గొప్పతనంవల్ల ప్రజలు సంతోషిస్తారు.
ISA 24:15 ఆ ప్రజలు అంటారు: “తూర్పు దిశనున్న ప్రజలారా యెహోవాను స్తుతించండి! దూర దేశాల ప్రజలారా, యెహోవాను స్తుతించండి! యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు.”
ISA 24:16 భూలోకంలో ప్రతి చోటనుండి యెహోవాకు స్తుతి కీర్తనలు మనం వింటాము. ఈ కీర్తనలు మంచి దేవుణ్ణి స్తుతిస్తాయి. కానీ నేనంటాను: “చాలు, నాకు సరిపోయింది! నేను చూస్తున్న సంగతులు భయంకరం. దేశ ద్రోహులు ప్రజలమీద తిరుగబడి వారిని బాధిస్తున్నారు.”
ISA 24:17 దేశంలో నివసిస్తున్న ప్రజలకు ప్రమాదం నాకు కనబడుతోంది. వారికి భయం, గుంటలు, ఉచ్చులు నాకు కనబడుతున్నాయి.
ISA 24:18 ప్రమాదాన్ని గూర్చి ప్రజలు వింటారు. వారు భయపడిపోతారు. కొంతమంది ప్రజలు పారిపోతారు. కానీ వారు గుంటల్లో, ఉచ్చుల్లో పడిపోతారు వాళ్లలో కొంతమంది ఆ గుంటల్లో నుండి ఎక్కి బయటపడ్తారు. కానీ వారు మరోఉచ్చులో పట్టుబడతారు. పైన ఆకాశంలో తూములు తెరచుకొంటాయి. వరదలు మొదలవుతాయి. భూమి పునాదులు వణకటం ప్రారంభం అవుతుంది.
ISA 24:19 భూకంపాలు వస్తాయి. భూమి పగిలి తెరచుకొంటుంది.
ISA 24:20 లోకంలో పాపాలు చాలా భారంగా ఉన్నాయి. అందుచేత భూమి ఆ భారం కింద పడిపోతుంది. ప్రాచీన గృహంలా భూమి వణుకుతుంది తాగుబోతు వాడిలా భూమి పడిపోతుంది. భూమి ఇక కొనసాగలేదు.
ISA 24:21 ఆ సమయంలో, పరలోక సైన్యాలకు పరలోకంలోను భూరాజులకు భూలోకంలోను యెహోవా తీర్పు తీరుస్తాడు.
ISA 24:22 ఎందరెందలో ప్రజలు ఒకటిగా సమావేశం చేయబడతారు. కొంతమంది ప్రజలు గోతిలో బంధించబడ్డారు. వీరిలో కొంతమంది చెరలో ఉన్నారు. కానీ చివరికి, చాలా కాలం తర్వాత వీరికి తీర్పు తీర్చబడుతుంది.
ISA 24:23 యెహోవా యెరూషలేములో సీయోను కొండమీద రాజుగా పాలిస్తాడు. పెద్దల యెదుట ఆయన మహిమ ఉంటుంది. చంద్రుడు సిగ్గుపడి, సూర్యుడు అవమానం పొందే అంత ప్రకాశమానంగా ఉంటుంది ఆయన మహిమ.
ISA 25:1 యెహోవా, నీవు నా దేవుడివి నిన్ను నేను ఘనపరుస్తాను, నీ నామం స్తుతిస్తాను. అద్భుతమైన కార్యాలు నీవు చేసావు. చాలాకాలం క్రిందట నీవు చెప్పిన మాటలు పూర్తిగా సత్యము. నీవు జరుగుతుందని చెప్పినట్టు సమస్తం జరిగింది.
ISA 25:2 పట్టణాన్ని నీవు నాశనం చేసావు. అది బలీ యమైన కోటగోడలతో కాపాడబడ్డ పట్టణం. కానీ ఇప్పుడు అది ఒక రాళ్లకుప్ప మాత్రమే విదేశీ భవనం నాశనం చేయబడింది. అది ఎన్నటికీ కట్టబడదు.
ISA 25:3 బలమైన రాజ్యాల ప్రజలు నిన్ను ఘనపరుస్తారు. బలమైన పట్టణాల బలాఢ్యులు నీకు భయపడతారు.
ISA 25:4 యెహోవా, అక్కరలో ఉన్న పేద ప్రజలకు నీవు క్షేమ స్థానంగా ఉన్నావు. అనేక సమస్యలు ఈ ప్రజల్ని ఓడించటం మొదలు పెట్టాయి. కానీ నీవు వారిని కాపాడుతావు. యెహోవా, నీవు వరదలనుండి, వేడి నుండి ప్రజలను కాపాడే గృహంలా ఉన్నావు. కష్టాలు భయంకర గాలుల్లో, వర్షంలా ఉన్నాయి. వాన గోడమీద పడి జారి పోతుంది, కాని ఇంట్లో ఉన్న మనుష్యులకు దెబ్బ తగలదు.
ISA 25:5 శత్రువులు కేకలు వేసి శబ్దం చేస్తారు. భయంకర శత్రువులు సవాళ్లు విసరుతారు. అయితే దేవా, నీవు వారిని ఆపుజేస్తావు. వేడి, పొడి కాలంలో వేడి భూమిని నిస్సారం చేస్తుంది. అదేవిధంగా నీవు శత్రువులకంటె బలం ఉన్నవాడివి దట్టమైన మేఘాలు వేసవి వేడిని ఆపుజేస్తాయి. అదే విధంగా, భయంకర శత్రువుల కేకలు నీవు ఆపుజేస్తావు.
ISA 25:6 ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రజలందరికీ ఈ కొండ మీద విందు చేస్తాడు. ఆ విందులో శ్రేష్ఠమైన భోజనాలు, ద్రాక్షరసాలు ఉంటాయి. మాంసం లేతగా బాగుంటుంది.
ISA 25:7 కానీ ఇప్పుడు రాజ్యాలన్నింటినీ, ప్రజలనూ కప్పి వేసే ముసుగు ఉంది. ఈ ముసుగు “మరణం” అని పిలువబడుతుంది
ISA 25:8 కానీ మరణం శాశ్వతంగా నాశనం చేయబడుతుంది మరియు నా ప్రభువు యెహోవా ప్రతి ఒక్కరి చెంపల మీదా ప్రతీ కన్నీటి బొట్టునూ తుడిచి వేస్తాడు. గతంలో ఆయన ప్రజలు అందరూ విచారంగా ఉన్నారు. అయితే దేవుడు ఆ విచారాన్ని భూమి మీద నుండి తీసి వేస్తాడు. ఇలా జరుగుతుంది అని యెహోవా చెప్పాడు గనుక ఇదంతా జరుగుతుంది.
ISA 25:9 ఆ సమయంలో ప్రజలు అంటారు, “ఇదిగో మన దేవుడు ఇక్కడ ఉన్నాడు. మనం కనిపెడ్తున్నవాడు ఈయనే. మనల్ని రక్షించటానికి ఈయన వచ్చాడు. మనం మన యెహోవా కోసం కనిపెడుతున్నాం. అందుచేత యెహోవా మనలను రక్షించినప్పుడు మనం ఆనందించి, సంతోషంగా ఉందాం.”
ISA 25:10 యెహోవా హస్తం (శక్తి) ఈ కొండ మీద ఉంది. మరియు మోయాబు ఓడించబడుతుంది. యెహోవా శత్రువును అణగ త్రొక్కుతాడు. చెత్త కుప్ప మీద వరిగడ్డిపై నడిచినట్టుగా అది ఉంటుంది.
ISA 25:11 ఈత కొట్టేవానిలా యెహోవా తన చేతులు చాపుతాడు అప్పుడు ప్రజలు అతిశయించే వాటన్నిటినీ యెహోవా సమ కూరుస్తాడు వారు తయారు చేసిన అందమైన వాటన్నింటినీ యెహోవా సమకూరుస్తాడు. యెహోవా వాటన్నింటినీ కింద పారవేస్తాడు
ISA 25:12 ప్రజల ఎత్తయిన గోడల, భద్రతా స్థలాలు అన్నింటిని యెహోవా నాశనం చేస్తాడు. యెహోవా వాటిని నేల ధూళిలో పార వేస్తాడు.
ISA 26:1 ఆ సమయంలో యూదాలో ప్రజలు ఈ పాటలు పాడుతారు: యెహోవా మాకు రక్షణనిస్తాడు మాకు ఒక బలమైన పట్టణం ఉంది. మా పట్టణానికి బలమైన గోడలు, భద్రత ఉన్నాయి.
ISA 26:2 తలుపులు తెరవండి, మంచివాళ్లు ప్రవేశిస్తారు. ఆ ప్రజలు దేవుని యొక్క మంచి జీవన విధానాన్ని అవలంబిస్తారు.
ISA 26:3 యెహోవా, నీవే నిజమైన శాంతి ప్రసాదిస్తావు నీ మీద ఆధారపడే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు. నీయందు విశ్వాస ముంచే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు.
ISA 26:4 కనుక ఎల్లప్పుడు యెహోవాను విశ్వసించాలి. నీవు యెహోవాను నిజంగా శాశ్వతంగా విశ్వసించాలి.
ISA 26:5 అయితే గర్వించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేస్తాడు. అక్కడ నివసించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు. ఆ ఎత్తయిన పట్టణాన్ని నేలమట్టానికి ఆయన పడద్రోస్తాడు అది ధూళితో పడిపోతుంది.
ISA 26:6 అప్పుడు పేదలు, దీనులైన ప్రజలు ఆ శిథిలాల మీద నడుస్తారు.
ISA 26:7 మంచి వాళ్లను నిజాయితీయే జీవన విధానం మంచి మనుష్యులు సూటి సత్య మార్గం అవలంబిస్తారు. మరియు దేవా, ఆ మార్గాన్ని అనుసరించటానికి దానిని నీవు తేలికగా మృదువుగా చేస్తావు.
ISA 26:8 కానీ యెహోవా, మేము నీ న్యాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నాం. నిన్ను, నీ నామాన్ని మా ఆత్మలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాయి.
ISA 26:9 నా ఆత్మ రాత్రిపూట నీతో ఉండాలని ఆశిస్తుంది. ప్రతి నూతన దినపు సంధ్యా సమయంలో నీతో ఉండాలని నా ఆత్మ నాలో కోరుతుంది. దేశంలోనికి నీ న్యాయ మార్గం వచ్చినప్పుడు ప్రజలు సరైన జీవన విధానం నేర్చుకొంటారు.
ISA 26:10 చెడ్డవాడికి నీవు దయ మాత్రమే చూపిస్తే వాడు మంచి చేయటం నేర్చుకోడు. చెడ్డవాడు మంచి ప్రపంచంలో జీవించినప్పటికీ వాడు చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు. ఆ చెడ్డ వ్యక్తి యెహోవా గొప్ప తనాన్ని ఎప్పటికీ చూడకపోవచ్చు.
ISA 26:11 కానీ, యెహోవా, అలాంటి ప్రజలను నీవు శిక్షిస్తే వారు దానిని చూస్తారు. యెహోవా నీ ప్రజల మీద నీకు ఉన్న బలమైన ప్రేమను నీవు చెడ్డ మనుష్యులకు చూపించు. అప్పుడు చెడ్డవాళ్లు సిగ్గుపడ తారు. నీ శత్రువులు నీ స్వంత అగ్నిలో కాలిపోతారు.
ISA 26:12 యెహోవా, మేము చేయాలని ప్రయత్నించిన వాటన్నింటినీ చేయటంలో నీదే విజయం. కనుక మాకు శాంతి ప్రసాదించు.
ISA 26:13 యెహోవా, నీవే మా దేవుడివి. అయితే గతంలో మేము ఇతర ప్రభువులను అనుసరించాం. మేము ఇతర యజమానులకు చెందిన వాళ్లం కానీ ప్రజలు ఇప్పుడు ఒకే ఒక్క పేరు, నీపేరు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలని మేము కోరుతున్నాం.
ISA 26:14 ఆ అబద్ధ దేవుళ్లు జీవం లేనివి ఆ దయ్యాలు మరణం నుండి మళ్లీ లేవవు నీవు వాటిని నాశనం చేయాలని నిర్ణయించావు. మేము వాటిని జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసే వాటన్నింటినీ నీవు నాశనం చేశావు.
ISA 26:15 నీవు ప్రేమించే దేశానికి నీవు సహాయం చేశావు ఇతరులు ఆ దేశాన్ని జయించకుండ నీవు నిలిపివేశావు.
ISA 26:16 యెహోవా, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకొంటారు. నీవు ప్రజలను శిక్షించినప్పుడు వారు మౌన ప్రార్థనలు నీకు చేస్తారు.
ISA 26:17 యెహోవా, మేం నీతో లేనప్పుడు మేం ప్రసవవేదన పడుతున్న స్త్రీలా ఉంటాం ఆమె ఏడుస్తుంది, ప్రసవ బాధ పడుతుంది.
ISA 26:18 అదే విధంగా మాకు బాధ ఉంది మేము కంటాము, కాని, గాలిని మాత్రమే. ప్రపంచానికి మేం కొత్త మనుష్యుల్ని తయారు చేయం. దేశానికి మేం రక్షణ కలిగించం
ISA 26:19 కాని యెహోవా చెప్పేదేమంటే, “నీ ప్రజలు మరణించారు కానీ వారు మళ్లీ లేస్తారు నా ప్రజల శరీరాలు మరణం నుండి లేస్తాయి. భూమిలోని మృతులు లేచి, సంతోషిస్తారు. నిన్ను కప్పియున్న మంచు, ఒక కొత్త రోజు వెలుతురులా ఉంది. ఒక కొత్త కాలం వస్తోందని అది సూచిస్తుంది ప్రజలు ఇప్పుడు భూమిలో పాతిపెట్ట బడ్డారు, కాని వారు నూతన జీవం పొందుతారు.”
ISA 26:20 నా ప్రజలారా, మీ గదుల్లోకి వెళ్లండి. తలుపులకు తాళాలు వేసుకోండి. కొద్దికాలం పాటు మీ గదుల్లో దాక్కోండి. దేవుని కోపం తగ్గేంతవరకు దాక్కోండి.
ISA 26:21 యెహోవా తన నివాసం విడిచి వస్తున్నాడు. ప్రపంచంలోని మనుష్యులు చేసిన చెడు కార్యాలను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. చంపబడిన వారి రక్తాన్ని భూమి చూపిస్తుంది భూమి ఇక ఎన్నటికీ చని పోయిన వాళ్లను కప్పెట్టదు
ISA 27:1 ఆ సమయంలో వంకర సర్పమైన మకరానికి ఆయన తీర్పు తీర్చును. యెహోవా తన ఖడ్గం ప్రయోగిస్తాడు కఠినమైన, తన శక్తిగల ఖడ్గంతో ఆయన మకర సర్పాన్ని ఆ మెలికల సర్పాన్ని శిక్షిస్తాడు. ఆ పెద్ద ప్రాణిని సముద్రం లోనే యెహోవా చంపేస్తాడు.
ISA 27:2 ఆ సమయంలో సంతోషకరమైన ద్రాక్షతోటను గూర్చి ప్రజలు పాటలు పాడుతారు.
ISA 27:3 “యెహోవాను, నేనే ఆ తోట విషయం శ్రద్ధతీసుకుంటాను. సరైన సమయంలో తోటకు నీళ్లు పెడతాను. రాత్రింబవళ్లు ఆ తోటను నేను కాపాడుతాను. ఆ తోటకు ఎవ్వరూ హాని చేయరు.
ISA 27:4 నేను కోపంగా లేను. కానీ యుద్ధంలో ఎవరైనా సరే ముళ్ల పొదల కంచె వేస్తే అప్పుడు నేను దాని మీదికి వెళ్లి దానిని కాల్చివేస్తాను.
ISA 27:5 అయితే ఎవరైనా భద్రత కోసం నా దగ్గరకు వస్తే నాతో సమాధాన పడాలని కోరితే, అలాంటివాడు వచ్చి నాతో సమాధానపడాలి.
ISA 27:6 ప్రజలు నా దగ్గరకు వస్తారు మంచి వేరుల గలమొక్కలా యాకోబు బలంగా ఉండేందుకు ఆ ప్రజలు సహాయం చేస్తారు. వికసించ మొదలు బెట్టిన మొక్కలా ఇశ్రాయేలు ఎదుగునట్లు ఆ ప్రజలు చేస్తారు. అప్పుడు చెట్ల ఫలాల్లా, ఇశ్రాయేలు పిల్లలతో దేశం నిండిపోతుంది.”
ISA 27:7 యెహోవా తన ప్రజలను ఎలా శిక్షిస్తాడు? గతంలో శత్రువులు ప్రజలను బాధించారు. యెహోవా కూడా అదే విధంగా బాధిస్తాడా? గతంలో ఎందరెందరో చంపివేయబడ్డారు. యెహోవా కూడా అలాగే చేసి, అనేక మందిని చంపేస్తాడా?
ISA 27:8 యెహోవా తన ప్రజల భయాన్ని వెళ్లగొట్టేసి, వారిలో తనకుగల వివాదాన్ని పరిష్కరిస్తాడు. ఇశ్రాయేలీయులలో యెహోవా కఠినంగా మాట్లాడుతాడు. ఆయన మాటలు ఎడారి వేడి గాడ్పులా మండుతాయి.
ISA 27:9 యాకోబు దోషం ఎలా క్షమించబడుతుంది? అతని పాపాలు తీసివేయబడేట్లుగా ఏం సంభవిస్తుంది? ఈ సంగతులు సంభవిస్తాయి: బలిపీఠం బండలు ధూళిగా చితుకగొట్టబడతాయి. తప్పు దేవుళ్లను పూజించేందుకు ఉపయోగించే విగ్రహాలు, బలిపీఠాలు నాశనం చేయబడతాయి.
ISA 27:10 ఆ సమయంలో మహా పట్టణం ఖాళీగా, ఎడారిలా ఉంటుంది. ప్రజలంతా పారిపోయి ఉంటారు. ఆ పట్టణం పచ్చిక బయలులా ఉంటుంది. అక్కడ దూడలు గడ్డి తింటాయి. ద్రాక్ష కొమ్మల ఆకులను పశువులు తింటాయి.
ISA 27:11 ద్రాక్ష వల్లులు ఎండిపోతాయి. రెమ్మలు విరిగి పోతాయి. ఆ రెమ్మలను ఆడవాళ్లు పొయ్యిలో కట్టెలుగా ఉపయోగిస్తారు. ప్రజలు అర్థం చేసుకొనేందుకు నిరాకరిస్తారు. కనుక దేవుడు వారి సృష్టికర్త, వారిని ఆదరించడు. వారి సృష్టికర్త వారి మీద దయ చూపించడు.
ISA 27:12 ఆ సమయంలో యెహోవా తన ప్రజలను ఇతరులనుండి ప్రత్యేకించటం ప్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది దగ్గర ఆయన ప్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది మొదలు ఈజిప్టు నదివరకు గల తన ప్రజలందరినీ యెహోవా సమావేశ పరుస్తాడు. మీరు ఇశ్రాయేలీయులు ఒక్కొక్కరుగా, ఒకే చోట చేర్చబడుతారు.
ISA 27:13 నా ప్రజలు అనేకమంది ఇప్పుడు అష్షూరులో నశించారు. నా ప్రజలు కొంతమంది ఈజిప్టుకు పారిపోయారు. అయితే ఆ సమయంలో గొప్పబూర ఊదబడుతుంది. ఆ ప్రజలంతా యెరూషలేముకు తిరిగి వస్తారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద యెహోవా యెదుట ఆ ప్రజలు సాష్టాంగ పడతారు.
ISA 28:1 షోమ్రోనును చూడండి! ఎఫ్రాయిము తాగుబోతులు ఆ పట్టణానికి గూర్చి గర్విస్తున్నారు. చూట్టూ ఐశ్వర్యవంతమైన లోయగలకొండ మీద ఆ పట్టణం ఆసీన మయింది. షోమ్రోను ప్రజలు తమ పట్టణం అందమైన పూలకిరీటం అనుకొంటారు. కానీ వారు మద్యంతో మత్తెక్కి ఉన్నారు మరియు “అందమైన ఈ కిరీటం” కేవలం చస్తున్న ఒక మొక్క మాత్రమే.
ISA 28:2 చూడు, బలమూ, ధైర్యమూ గల ఒకడు నా ప్రభువు దగ్గర ఉన్నాడు. ఆ వ్యక్తి వడగండ్ల వర్షపు తుఫానులా దేశంలోనికి వస్తాడు. తుఫాను వచ్చినట్టు ఆయన దేశంలోనికి వస్తాడు. దేశాన్ని వరదలో ముంచెత్తే బలమైన నీటి ప్రవాహంలా ఆయ ఉంటాడు. ఆ కిరీటాన్ని (సమరయి) ఆయన నేలకేసి కొడ్తాడు.
ISA 28:3 ఎఫ్రాయిము తాగుబోతులు, తమ “అందమైన కిరీటం” గూర్చి గర్విస్తున్నారు. కానీ ఆ పట్టణం కాళ్ల కింద తొక్కబడుతుంది.
ISA 28:4 చుట్టూరా ఐశ్వర్యవంతమైన లోయగల ఆ పట్టణం ఒక కొండమీద ఆసీనమై ఉంది. అయితే ఆ “అందాల పూల కిరీటం” కేవలం చస్తున్న ఒక మొక్క మాత్రమే ఆ పట్టణం వసంత కాలానికి ముందు కాసే అంజూర పండులా ఉంటుంది. ఒక వ్యక్తి ఆ అంజూరాలు ఒకటి చూస్తే అతడు వెంటనే అంజూరం తెంపి, తింటాడు.
ISA 28:5 ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన యెహోవా “సౌందర్య కిరీటం” అవుతాడు. విడువబడిన తన ప్రజలకు ఆయనే “పూల అద్భుత కిరీటం” అవుతాడు.
ISA 28:6 అప్పుడు ప్రజలకు తీర్పు తీర్చే న్యాయమూర్తులకు యెహోవా జ్ఞానం ప్రసాదిస్తాడు. పట్టణ ద్వారం దగ్గర యుద్ధాలలో ఉండే ప్రజలకు యెహోవా బలం ప్రసాదిస్తాడు.
ISA 28:7 కానీ ఆ నాయకులు ఇప్పుడు తాగి మత్తులుగా ఉన్నారు. యాజకులు, ప్రవక్తలు అందరూ ద్రాక్షరసం, మద్యం తాగి మత్తెక్కి ఉన్నారు. వారు తూలి పడుతున్నారు. ప్రవక్తలు వారి దర్శనాలు చూచినప్పుడు మత్తులుగా ఉన్నారు. న్యాయమూర్తులు వారి నిర్ణయాలు చేసేటప్పుడు మత్తులుగా ఉన్నారు.
ISA 28:8 ప్రతిబల్లా వాంతులతో నిండిపోయింది. ఎక్కడా శుభ్రమైన స్థలం లేదు.
ISA 28:9 యెహోవా ప్రజలకు ఒక పాఠం నేర్పించాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రజలు తన ఉపదేశాలను గ్రహించేట్టు చేయాలని యెహోవా ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రజలు చిన్న శిశువుల్లా ఉన్నారు. కొన్నాళ్ల నుంచే తల్లి పాలు తాగటం మొదలు పెట్టిన చిన్న శిశువుల్లా వారు ఉన్నారు.
ISA 28:10 కనుక వాళ్లు చిన్న శిశువులు అన్నట్టే యెహోవా వాళ్లతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక ఆజ్ఞ, అక్కడ ఒక ఆజ్ఞ ఇక్కడ ఒక నియమం, అక్కడ ఒక నియమం ఇక్కడ ఒక పాఠం, అక్కడ ఒక పాఠం.
ISA 28:11 యెహోవా ఈ వింత విధానంలో మాట్లాడటం ప్రయోగిస్తాడు, ఈ ప్రజలతో మాట్లాడటానికి ఆయన ఇతర భాషలు ఉపయోగిస్తాడు.
ISA 28:12 గతంలో దేవుడు ఆ ప్రజలతో మాట్లాడి “ఇదిగో విశ్రాంతి స్థలం, ఇదే శాంతి స్థలం. అలసిపోయిన మనుష్యులు వచ్చి విశ్రాంతి తీసుకోండి. ఇదే శాంతి స్థలం” అని చెప్పాడు. కానీ ప్రజలు దేవుని మాట వినపించుకోలేదు.
ISA 28:13 అందుచేత దేవుని మాటలు విదేశీ భాషలా ఉన్నాయి: ఇక్కడ ఒక ఆజ్ఞ, అక్కడ ఒక ఆజ్ఞ ఇక్కడ ఒక నియమం, అక్కడ ఒక నియమం ఇక్కడ ఒక పాఠం, అక్కడ ఒక పాఠం. వారు చేసిందే వారికి నచ్చింది. కనుక ప్రజలు వెనక్కు తగ్గి, ఓడించబడ్డారు. ప్రజలు పట్టుబడి, బంధించబడ్డారు.
ISA 28:14 యెరూషలేములో ఉన్న నాయకులారా, యెహోవా సందేశ ం మీరు వినాలి. కానీ ఇప్పుడు ఆయన మాట వినడానికి మీరు నిరాకరిస్తున్నారు.
ISA 28:15 “మరణంతో మేము ఒక ఒడంబడిక చేసుకున్నాం. చావు స్థలం, పాతాళంతో మాకు ఒక ఒప్పందం ఉంది. కనుక మేము శిక్షించబడం. శిక్ష మమ్మల్ని బాధించకుండానే దాటి పోతుంది. మా మాయలు అబద్ధాల చాటున మేము దాక్కొంటాం” అని మీరు చెబతున్నారు.
ISA 28:16 ఆ విషయాల మూలంగా, నా ప్రభువు యెహోవా చెబతున్నాడు: “సీయోనులో నేల మీద నేను ఒక బండను, ఒక మూలరాయిని ఉంచుతాను. ఇది చాలా ప్రశస్తమైన రాయి. ముఖ్యమైన ఈ బండమీదనే సమస్తం నిర్మించబడుతుంది. ఆ బండను విశ్వసించిన వారు నిరాశ చెందరు.
ISA 28:17 “ఒక గోడ తిన్నగా ఉన్నట్టు చూపించటానికి మనుష్యులు గుండు కట్టిన దారం ఉపయోగిస్తారు. అదే విధంగా ఏది సరైనదో చూపించేందుకు నేను న్యాయం, మంచితనం ఉపయోగిస్తాను. చెడ్డ వాళ్లయిన మీరు మీ అబద్ధాలు, మాయల వెనుక దాగుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు శిక్షించబడతారు. మనం దాగుకొనే స్థలాలను నాశనం చేసేందుకు వస్తున్న తుఫాను, లేక వరదలా అది ఉంటుంది.
ISA 28:18 మరణంతోటి మీ ఒడంబడిక తుడిచి వేయబడుతుంది. పాతాళంతో మీ ఒడంబడిక మీకు సహాయం చేయదు. “ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మిమ్మల్ని తన పాద ధూళిగా చేస్తాడు.
ISA 28:19 ఆ వ్యక్తి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్లిపోతాడు. మీ శిక్ష భయంకరంగా ఉంటుంది. మీ శిక్ష ఉదయం పెందలాడే వచ్చి, చాలా రాత్రి వరకు ఉంటుంది. “అప్పుడు మీకు ఈ కథ అర్థం అవుతుంది:
ISA 28:20 ఒక మనిషి చాల పొట్టి మంచం మీద నిద్రపోయేందుకు ప్రయత్నించాడు. కప్పుకొనేందుకు సరిపడేంత వెడల్పు లేని దుప్పటి అతని దగ్గర ఉంది. మంచం, దుప్పటి నిష్ప్రయోజనమే, మీ ఒడంబడికలు అలాంటివే.”
ISA 28:21 యెహోవా పెరాజీము వద్ద చేసినట్టు యుద్ధం చేస్తాడు. గిబియోను లోయలో ఆయన కోపగించినట్టు యెహోవా కోపగిస్తాడు. తర్వాత యెహోవా చేయాల్సిన వాటిని చేస్తాడు. యెహోవా కొన్ని వింత పనులు చేస్తాడు. అయితే ఆయన తన పని ముగిస్తాడు. ఆయన పని ఒక కొత్తవాని పని.
ISA 28:22 మీరు వాటికి వ్యతిరేకంగా పోరాడకూడదు. మీరు గనుక పోరాడితే మీ చూట్టూ ఉన్న తాళ్లు మరింత బిగిసిపోతాయి. నేను విన్న మాటలు మారవు. భూమి అంతటినీ పాలించే సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి ఆ మాటలు వచ్చాయి. ఆ విషయాలు జరిగించ బడతాయి.
ISA 28:23 నేను మీతో చెప్పే సందేశాన్ని శ్రద్ధగా వినండి.
ISA 28:24 ఒక రైతు తన పొలాన్ని ఎప్పటికీ దున్నుతూనే ఉంటాడా? లేదు. అతడు ఎప్పుడూ భూమిని చదును చేస్తూనే ఉంటాడా? లేదు.
ISA 28:25 రైతు భూమిని సిద్ధంచేసి, విత్తనాలు వేస్తాడు. రైతు వేర్వేరు విత్తనాలను వేర్వేరు పద్ధతుల్లో వేస్తాడు. రైతు నల్ల జీలకర్ర విత్తనాలు వెదజల్లుతాడు. తెల్ల జీలకర్ర విత్తనాలను రైతు నేలమీద చెల్లుతాడు. రైతు గోధుమలను వరుస క్రమంలో నాటుతాడు. రైతు యవలను దాని ప్రత్యేక స్థలంలో నాటుతాడు, మిరప మొలకలను తన పొలంగట్ల మీద నాటుతాడు.
ISA 28:26 మీకు ఒక పాఠం నేర్పించేందుకు మన దేవుడు దీనిని వాడుతున్నాడు. దేవుడు తన ప్రజలను శిక్షించినప్పుడు న్యాయంగానే ఉన్నాడు అని ఈ ఉదాహరణ తెలియజేస్తుంది.
ISA 28:27 నల్ల జీలకర్ర దంచటానికి రైతు, పదును పళ్లున్న పెద్ద పలకల్ని ఉపయోగిస్తాడా? లేదు. జీలకర్ర దంచటానికి రైతు బండిని ఉపయోగిస్తాడా? లేదు. ఆ విత్తనాల మీద గుల్లలను రాల్చడానికి అతడు ఒక చిన్న కర్రను ఉపయోగిస్తాడు.
ISA 28:28 ఒక స్త్రీ రొట్టె చేసేటప్పుడు ఆమె తన చేతులతో ముద్దనుచేసి, పిసుకుతుంది. కానీ ఆమె ఎప్పటికీ అదే పని చేస్తూ ఉండదు. అదే విధంగా యెహోవా తన ప్రజలను శిక్షిస్తాడు. బండి చక్రంతో ఆయన వారిని భయపెడతాడు గాని ఆయన వారిని పూర్తిగా చితుకగొట్టడు. అనేక గుర్రాలు వారిని అణగ తొక్కనీయడు.
ISA 28:29 ఇది సర్వశక్తిమంతుడైన యెహోవా సందేశం యెహోవా అద్భుతమైన సలహా ఇస్తాడు. దేవుడు నిజంగా జ్ఞానం గలవాడు.
ISA 29:1 దేవుడు చెబతున్నాడు, “అరీయేలును చూడండి! అరీయేలు, దావీదు మజిలీ చేసిన పట్టణం. దాని పండుగలు సంవత్సరం సంవత్సరం కొన సాగుతున్నాయి.
ISA 29:2 అరీయేలును నేను శిక్షించాను ఆ పట్టణం దుఃఖంతో, ఏడ్పుతో నిండిపోయింది. కానీ అది ఎప్పటికీ నా అరీయేలే.
ISA 29:3 “నీ చుట్టూ సైన్యాలను ఉంచాను అరీయేలూ. నీకు విరోధంగా నేను యుద్ధగోపురాలను లేపాను.
ISA 29:4 నీవు ఓడించబడి, నేల మట్టం చేయబడ్డావు. ఇప్పుడ ఒక పిశాచి స్వరంలా నీ స్వరం నేలల్లోంచి నాకు వినవస్తోంది. ధూళిలోంచి మెల్లగా వినబడే స్వరంలా నీ మాటలు వినవస్తున్నాయి.”
ISA 29:5 అక్కడ చాలామంది కొత్తవాళ్లు దుమ్ముకణాల్లా ఉన్నారు. గాలికి ఎగిరే పొట్టులాంటి క్రూరమైన మనుష్యులు చాలామంది అక్కడ ఉన్నారు.
ISA 29:6 సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్మల్ని శిక్షించాడు. ఉరుములు, భూకంపాలు, మహా గొప్ప శబ్దాలు ప్రయోగించి యెహోవా మిమ్మల్ని శిక్షించాడు తుఫానులు, బలమైన గాలులు, కాల్చివేసే అగ్ని ఉపయోగించి యెహోవా నాశనం చేశాడు.
ISA 29:7 అరీయేలు మీద ఎన్నెన్నో దేశాలు యుద్ధం చేశాయి. అది రాత్రి వేళ కలిగే భయంకరపీడ కలలాంటిది. అరీయేలు చుట్టూ సైన్యాలు వచ్చేసి దాని ని శిక్షించాయి.
ISA 29:8 కానీ ఆ సైన్యాలకు గూడ అది ఒక కలలా ఉంటుంది ఆ సైన్యాలకు అవసరమైనవి దొరకవు. ఆకలితో ఉన్నవానికి అన్నం గూర్చి కలవచ్చినట్టు ఉంటుంది. వాడు మేల్కొన్నప్పుడు ఆకలి అలానే ఉంటుంది. దప్పిగొన్నవాడు నీళ్లను గూర్చి కలగన్నట్టు ఉంటుంది. వాడు మేల్కోంటాడు, దాహంతోనే ఉంటాడు. సీయోనుకు విరోధంగా పోరాడే రాజ్యాలన్నింటి విషయంలోను ఇదే సత్యం. ఆ రాజ్యాలకు కావాలనుకొన్నవి దొరకవు.
ISA 29:9 ఆశ్చర్యపడండి, విస్మయం చెందండి! మీరు మత్తులవుతారు కాని ద్రాక్షరసంతో కాదు, చూచి ఆశ్చర్యపడండి! మీరు తూలి, పడతారు కానీ మద్యంతో కాదు.
ISA 29:10 యెహోవా మిమ్మల్ని నిద్రబచ్చుతాడు యెహోవా మీ కళ్లు మూస్తాడు (ప్రవక్తలే మీ కళ్లు) యెహోవా మీ తలలు కప్పుతాడు (ప్రవక్తలే మీ తలలు.)
ISA 29:11 ఈ సంగతులు సంభవిస్తాయి, కానీ మీరు గ్రహించరు అని నేను మీతో చెబతున్నాను. మూసివేయబడి, ముద్ర వేయబడిన పుస్తకంలోని మాటల్లాంటివి నా మాటలు చదవటం వచ్చిన వానికి మీరు వుస్తకం ఇచ్చి, చదవమని వానితో చెప్పండి. కానీ ఆ వ్యక్తి, “ఈ పుస్తకం నేను చదవలేను. ఇది మూయబడి ఉంది. నేను దీన్ని తెరువలేను” అంటాడు.
ISA 29:12 లేకపోతే చదవటం రానివాడికి మీరు ఆ పుస్తకం ఇచ్చి, వాడిని చదవమని చెప్పండి. ఆ వ్యక్తి, “నాకు చదవటం రాదు గనుక నేను చదవలేను” అంటాడు.
ISA 29:13 నా ప్రభువు అంటున్నాడు, “ఈ ప్రజలు నన్ను ప్రేమిస్తున్నామని వారు అంటారు. వారి నోటి మాటలతో నన్ను ఘనపరుస్తారు. కానీ వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. మానవపరమైన నియమాలను కంఠస్థం చేయటం తప్ప వారు నాకు చూపించే గౌరవం ఇంకొకటి లేదు.
ISA 29:14 అందుచేత శక్తిగల, అద్భుత కార్యాలు ఇంకా చేస్తూనే ఉండి, నేను ఈ ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాను. వారి జ్ఞానులు తమ జ్ఞానం పోగొట్టుకొంటారు. వారి జ్ఞానులు గ్రహించలేక పోతారు.”
ISA 29:15 ఆ ప్రజలు విషయాలను యెహోవాకు తెలియకుండా దాచిపెట్టాలని ప్రయత్నిస్తారు. యెహోవా గ్రహించలేడు అని వారు అనుకొంటారు. వారు తమ చెడుకార్యాలను చీకట్లో చేస్తారు. “మనల్ని ఎవరూ చూడలేరు. మనం ఎవరయిందీ ఎవరూ తెలుసుకోలేరు” అని వారు చెప్పుకొంటారు.
ISA 29:16 మీరు గందరగోళం అయ్యారు. మట్టి, కుమ్మరికి సమానం అని అనుకొంటారు మీరు. “నీవేమి నన్ను తయారు చేయలేదు” పొమ్మని సృష్టించబడినది, తనను సృష్టించిన వానితో చెప్పొచ్చని మీరు తలస్తారు. “నీకు తెలియదులే” అని కుమ్మరితో కుండ చెప్పినట్టుంది ఇది.
ISA 29:17 అసలు సత్యం ఇది. కొంచెం కాలం తర్వాత కర్మెలు పర్వతంలాగే లెబానోను పర్వతం కూడ మంచినేల అవుతుంది. మరియు కర్మెలు పర్వతం దట్టమైన అరణ్యంలా ఉంటుంది.
ISA 29:18 చెవిటివారు కూడ గ్రంథంలోని మాటలు వింటారు. గ్రుడ్డివారు చీకటి, మంచుగుండా చూస్తారు.
ISA 29:19 పేద ప్రజలను యెహోవా సంతోషపరుస్తాడు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధునిలో పేద ప్రజలు ఆనందిస్తారు.
ISA 29:20 నీచులు, కృ-రులు అంతమయిన తర్వాత ఇది జరుగుతుంది. చెడు కార్యాలు చేయటంలో ఆనందించే వాళ్లు పోయిన తర్వాత ఇది జరుగుతుంది.
ISA 29:21 (ఆ మనుష్యులు మంచివాళ్ల గూర్చి అబద్ధం చెబతారు. వారు న్యాయస్థానంలో ప్రజలను మోసం చేయాలని చూస్తారు. నిర్దోషులను వారు నాశనం చేయాలని చూస్తారు.)
ISA 29:22 కనుక యాకోబు వంశంతో యెహోవా మాట్లాడుతున్నాడు. (ఈ యెహోవాయే అబ్రాహామును విడిపించింది. ) యెహోవా చెబు తున్నాడు: “ఇప్పుడు యాకోబు (ఇశ్రాయేలు ప్రజలు) ఇబ్బందిపడడు, సిగ్గుపడడు.
ISA 29:23 అతడు తన పిల్లలందర్నీ చూస్తాడు, నా నామం పవిత్రం అని చెబతాడు. ఈ ప్రజలందర్నీ నా చేతులతో నేనే చేశాను, యాకోబు యొక్క పరిశుద్ధుడు (దేవుడు) చాలా ప్రత్యేకం అని ఈ ప్రజలు చెబతారు. ఈ ప్రజలు ఇశ్రాయేలు దేవుణ్ణి సన్మానిస్తారు.
ISA 29:24 ఈ ప్రజల్లో చాలా మందికి అర్థం గాక చెడ్డపనులు చేశారు. ఈ ప్రజలు అర్థం చేసికోలేదు కానీ వాళ్ల పాఠం వాళ్లు నేర్చుకొంటారు.”
ISA 30:1 యెహోవా చెప్పాడు, “ఈ పిల్లల్ని చూడండి. వాళ్లు నాకు లోబడరు. వాళ్లు పథకాలు వేస్తారు గాని సహాయం చేయమని నన్ను అడగరు. ఇతర దేశాలతో వారు ఒడంబడికలు చేసుకుంటారు. కానీ నా ఆత్మ ఆ ఒడంబడికలను కోరటంలేదు. ఈ ప్రజలు ఇంకా మరిన్ని పాపాలు వారికి చేర్చుకొంటున్నారు.
ISA 30:2 ఈ ప్రజలు సహాయం కోసం ఈజిప్టుకు దిగివెళ్తున్నారు కానీ చేయాల్సిన సరైన పని అదేనా అని వారు నన్ను అడగలేదు. ఫరోచేత తాము రక్షించబడతామని వారు నిరీక్షిస్తున్నారు. వాళ్లను ఈజిప్టు కాపాడాలని వారి కోరిక.
ISA 30:3 “అయితే నేను మీకు చెబతున్నాను, ఈజిప్టులో దాగుకోవటం మీకేం సహాయపడదు. ఈజిప్టు మిమ్మల్ని కాపాడజాలదు.
ISA 30:4 మీ నాయకులు సోయనుకు వెళ్లారు, మీ రాయబారులు హానేసుకు వెళ్లారు.
ISA 30:5 కానీ వారు నిరాశ చెందుతారు. వారికి సహాయం చేయలేని దేశం మీద వారు ఆధారపడ్తున్నారు. ఈజిప్టు నిష్ప్రయోజనమయింది. ఈజిప్టు ఏ సహాయం చేయలేదు. ఈజిప్టు కేవలం సిగ్గు, అవమానం కలిగిస్తుంది.”
ISA 30:6 నెగెవ్‌లో జంతువులను గూర్చి విచారకరమైన సందేశం: నెగెవ్ ప్రమాదకరమైన స్థలం. ఈ దేశంనిండా సింహాలు, సివంగులు, తాపకరమైన త్రాచుపాములు ఉంటాయి. కానీ కొంతమంది ప్రజలు నెగెవ్‌గుండా ప్రయాణం చేస్తున్నారు. వారు ఈజిప్టు వె ళ్తున్నారు. ఆ మనుష్యులు వారి ధనాన్ని గాడిదల మీద వేశారు. ఆ మనుష్యులు వారి సంపదలను ఒంటెల మీదవేశారు. అంటే ఆ ప్రజలు సహాయం చేయలేని రాజ్యంమీద ఆధారపడుతున్నారని దీని అర్థం.
ISA 30:7 ఈజిప్టు పనికిమాలిన దేశం ఈజిప్టు సహాయం విలువ శూన్యం. కనుక ఈజిప్టును, “ఏమీ చేయలేని మహా సర్పం” అని నేను పిలుస్తాను.
ISA 30:8 ఇప్పుడు, ప్రజలందరూ చూడగలిగేట్టు దీనిని ఒక పలక మీద వ్రాయి. దీనిని ఒక గ్రంథంలో వ్రాయి. చివరి దినాలకోసం దీనిని వ్రాయి. అది ఎప్పుడో భవిష్యత్తులో చాలాకాలం తర్వాత.
ISA 30:9 తల్లిదండ్రులకు విధేయులు కాని పిల్లల్లా ఉన్నారు ఈ ప్రజలు. వారు అబద్ధాలు చెప్పి, యెహోవా ఉపదేశాలు ఆలకించేందుకు నిరాకరిస్తారు.
ISA 30:10 వారు ప్రవక్తలతో చెబతారు: “మేము చేయాల్సిన వాటిని గూర్చి దర్శనాలు చూడకండి. మాతో సత్యం చెప్పకండి. మాకు చక్కని విషయాలు చెప్పి, మాకు హాయి కలిగించండి. మాకోసం మంచి వాటినే చూడండి.
ISA 30:11 నిజంగానే జరిగే వాటిని చూడటం మానేయండి. మా దారిలోంచి తప్పుకోండి. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని గూర్చి మాకు చెప్పటం చాలించండి.”
ISA 30:12 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు (దేవుడు) చెబతున్నాడు: “యెహోవా నుండి వచ్చిన ఈ సందేశాన్ని అంగీకరించటానికి మీరు నిరాకరించారు. మీ సహాయం కోసం మీరు పోరాటం మీద, అబద్ధాల మీద ఆధారపడాలని కోరుకొంటున్నారు.
ISA 30:13 ఈ విషయాల్లో మీరు దోషులు గనుక మీరు బీటలు వారిన గోడల్లా ఉన్నారు. ఆ గోడ పడిపోయి చిన్న చిన్న ముక్కలైపోతుంది.
ISA 30:14 ఆ ముక్కలు పనికిమాలినవి. ఆ ముక్కలు మంటల్లోంచి ఒక నిప్పుకణం తెచ్చేందుకు పనికిరావు, చెరువులోంచి నీళ్లు తెచ్చేందుకు పనికిరావు.”
ISA 30:15 “మీరు తిరిగి నా దగ్గరకు వస్తే మీరు రక్షించబడుతారు. మీరు నన్ను విశ్వసిస్తే, మీకు ఉన్న ఒకే బలం మీకు వస్తుంది. అయితే మీరు మౌనంగా ఉండాలి” అంటున్నాడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, యెహోవా, నా ప్రభువు. కానీ అలా చేయటం మీకు ఇష్టం లేదు.
ISA 30:16 మీరు “మేము ఎక్కి పారిపోయేందుకు మాకు గుర్రాలు అవసరం” అంటారు. అది నిజమే, మీరు గుర్రాల మీద పారిపోతారు. కానీ శత్రువు మిమ్మల్ని తరుముతాడు. మరియు వీ గుర్రాలకంటె మీ శత్రువు వేగం ఎక్కువ.
ISA 30:17 ఒక శత్రువు బెదిరిస్తే, మీ వాళ్లు వేయిమంది పారిపోతారు. శత్రువులు అయిదుగురు బెదిరిస్తే, మీరు మొత్తం వారినుండి పారిపోతారు. మీ సైన్యంలో మిగిలేదల్లా, ఏదో ఒక కొండమీద జెండా కర్ర మాత్రమే.
ISA 30:18 యెహోవా మీకు తన దయ చూపించాలని కోరుతున్నాడు. యెహోవా కనిపెడ్తున్నాడు. యెహోవా లేచి, మిమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాడు. యెహోవా దేవుడు న్యాయవంతుడు, యెహోవా సహాయం కోసం వేచి ఉండే ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడతాడు.
ISA 30:19 యెహోవా ప్రజలు సీయోను కొండమీద యెరూషలేములో నివసిస్తారు. మీరు ఏడుస్తూనే ఉండరు. యెహోవా మీ ఏడ్పువింటాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. యెహోవా మీ మొర వింటాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు.
ISA 30:20 గతంలో నా ప్రభువు (దేవుడు) మీకు దుఃఖం, విచారం ఇచ్చాడు. అది మీరు ప్రతిరోజూ రొట్టెతిన్నట్లు నీళ్లు తాగినట్టుగా ఉండేది. అయితే, దేవుడు మీ ఉపదేశకుడు, ఆయన ఇకమీదట మీనుండి దాగు కొని ఉండడు. మీ ఉపదేశకుని మీరు మీ కళ్లారా చూస్తారు.
ISA 30:21 అప్పుడు మీరు తప్పుచేసి, తప్పు మార్గంలో పోతే (కుడికి కావచ్చు, ఎడమకు కావచ్చు) “ఇదే సరైన మార్గం, మీరు ఇలా వెళ్లాలి” అని ఒక స్వరం మీ వెనుకనుండి చెప్పటం మీరు వింటారు.
ISA 30:22 వెండి బంగారాల పూత విగ్రహాలు మీకు ఉన్నాయి. ఆ తప్పుడు దేవుళ్లు మిమ్మల్ని మైల (పాప భూయిష్టం) చేశారు. కానీ ఆ తప్పుడు దేవుళ్లను కొలవటం మీరు చాలిస్తారు. పనికిమాలిన మైలగుడ్డల్లా ఆ దేవుళ్లను మీరు పారవేస్తారు.
ISA 30:23 ఆ కాలంలో యెహోవా మీకు వర్షం పంపిస్తాడు. భూమిలో మీరు విత్తనాలు నాటుతారు, భూమి మీకు పంట పండిస్తుంది. మీకు విస్తారమైన పంట లభిస్తుంది. మీ పశువులకు మీ పొలాల్లో విస్తారమైన మేత ఉంటుంది. మీ గొర్రెలకు విశాలమైన బీళ్లు ఉంటాయి.
ISA 30:24 మీ పశువులకు, గాడిదలకు కావలసినంత ఆహారం ఉంటుంది. ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీ పశువులు తినే మేతను పరచేందుకు మీరు చేటను, జల్లెడను ఉపయోగించాల్సి వస్తుంది.
ISA 30:25 ప్రతి పర్వతం, కొండపైన నీటి వాగులు నిండుగా ప్రవహిస్తాయి. అనేక మంది ప్రజలు మరణించిన తర్వాత గోపురాలు కూలగొట్టబడిన తర్వాత ఈ సంగతులు జరుగుతాయి.
ISA 30:26 ఆ సమయంలో చంద్రకాంతి సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది. సూర్యకాంతి ఇప్పటికంటె ఏడు రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక్కరోజు సూర్య కాంతి నిండు వారపు కాంతిలా ఉంటుంది. యెహోవా తన ప్రజల గాయాలను కట్టి, వారు తిన్న దెబ్బల బాధను స్వస్థపరచిన తరువాత ఈ సంగతులు జరుగుతాయి.
ISA 30:27 చూడండి! చాలా దూరం నుండి యెహోవా పేరు వస్తోంది. ఆయన కోపం దట్టమైన పొగ మేఘాలతో కూడిన అగ్నిలా ఉంది. యెహోవా నోరు కోపంతో నిండి ఉంది, ఆయన నాలుక మండుతోన్న మంటలా ఉంది.
ISA 30:28 యెహోవా ఊపిరి (ఆత్మ) గొంతు వరకు పొంగిన మహా నదిలా ఉంది. యెహోవా రాజ్యాలకు తీర్పు తీరుస్తాడు. “నాశనం చేసే జల్లెడలో” ఆయన వారిని జల్లించినట్లు ఉంటుంది. యెహోవా వారిని అదుపులో ఉంచుతాడు. ఒక జంతువును అదుపులో ఉంచే కళ్లెం, మనుష్యుల దవడల్లో ఉంచినట్టుగా అది ఉంటుంది.
ISA 30:29 ఆ సమయంలో మీరు ఆనందగీతాలు పాడుతారు. ఆ సమయంలో మీరు ఒక పండుగ ప్రారంభించిన రాత్రిలా ఉంటుంది. యెహోవా పర్వతానికి నడిచేటప్పుడు మీరు ఎంతో సంతోషిస్తారు. ఇశ్రాయేలీయుల బండ యెహోవాను ఆరాధించేందుకు వెళ్లే మార్గంలో పిల్లనగ్రోవి వినేటప్పుడు మీరు ఎంతగానో సంతోషిస్తారు.
ISA 30:30 యెహోవా ప్రజలంతా తన మహా స్వరం ఆలకించేట్టు చేస్తాడు. యెహోవా తన శక్తిగల హస్తం కోపంగా దిగి రావటం ప్రజలంతా చూచేట్టుగా చేస్తాడు. ఆ హస్తం సమస్తం కాల్చివేసే మహా మంటలా ఉంటుంది, విస్తారమైన వడగండ్లు, వర్షంతో నిండిన గొప్ప తుఫానులా ఉంటుంది యెహోవా శక్తి.
ISA 30:31 అష్షూరు యెహోవా స్వరం విన్నప్పుడు భయపడుతాడు. యెహోవా అష్షూరును దండంతో కొడతాడు.
ISA 30:32 యెహోవా అష్షూరును కొడతాడు, అది డప్పుల మీద, సితార మీద సంగీతం వాయించినట్టుగా ఉంటుంది. యెహోవా తన గొప్ప హస్తంతో అష్షూరును ఓడిస్తాడు.
ISA 30:33 తోపెతు చాలాకాలంగా సిద్ధం చేయబడి ఉంది. అది రాజుకోసం సిద్ధంగా ఉంది. అది చాలా లోతుగా వెడల్పుగా చేయబడింది. అక్కడ చాలా పెద్దగా కట్టెలు పేర్చి ఉన్నాయి. అగ్ని ఉంది. మరియు యెహోవా ఊపిరి (ఆత్మ) అగ్ని గంధక ప్రవాహంలా వచ్చి, దానిని కాల్చివేస్తుంది.
ISA 31:1 సహాయం కోసం ఈజిప్టుకు దిగి వెళ్తున్న ఆ ప్రజలను చూడండి. ప్రజ లు గుర్రాల కోసం అడుగుతున్నారు. గుర్రాలు వారిని రక్షిస్తాయని వారను కొంటున్నారు. ఈజిప్టు రథాలు, గుర్రాలపై సైనికులు వారిని కాపాడుతారని ఆ ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఆ సైన్యం చాలా పెద్దది. కనుక వారు క్షేమంగా ఉన్నాం అని ప్రజలు అనుకొంటున్నారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుడు) ప్రజలు విశ్వసించటం లేదు. ప్రజలు సహాయం కోసం యెహోవాను అడుగుట లేదు.
ISA 31:2 అయితే జ్ఞానం గలవాడు యెహోవాయే మరియు వారికి కష్టం రప్పించేవాడూ యెహోవాయే యెహోవా ఆదేశాన్ని ప్రజలు మార్చజాలరు. యెహోవా లేచి దుష్టుల మీద (యూదా)పోరాడుతాడు. వారికి సహాయం చేయాలని ప్రయత్నించే వారి (ఈజిప్టు) మీద యెహోవా పోరాడుతాడు.
ISA 31:3 ఈజిప్టు ప్రజలు కేవలం మానవమాత్రులే దేవుడు కారు. ఈజిప్టు గుర్రాలు కేవలం జంతువులే, ఆత్మకావు. యెహోవా తన హస్తం చాపగా, సహాయకుడు (ఈజిప్టు) ఓడించబడతాడు. సహాయం కోరిన ప్రజలు (యూదా) పతనం అవుతారు. ఆ మనుష్యులంతా ఒక్కుమ్మడిగా నాశనం చేయబడతారు.
ISA 31:4 “ఒక సింహంగాని, సింహపు పిల్లగాని తినటానికి ఒక జంతువును పట్టుకొంటే, ఆ సింహం, చచ్చిన జంతువు మీద నిలబడి గర్జిస్తుంది. ఆ సమయంలో ఆ గొప్ప సింహాన్ని ఏదీ భయపెట్టలేదు. మనుష్యులు వ చ్చి, సింహం మీద కేకలు వేస్తే, సింహం భయపడదు. మనుష్యులు పెద్ద ధ్వని చేయవచ్చు కానీ సింహం మాత్రం పారిపోదు” అని యెహోవా నాతో చెప్పాడు. అదే విధంగా సర్వశక్తిమంతుడైన యెహోవా సీయోను కొండమీద దిగివస్తాడు. ఆ కొండ మీద యెహోవా పోరాడతాడు.
ISA 31:5 పక్షులు వాటి గూళ్ల చుట్టూ ఎగిరినట్టు, సర్వశక్తిమంతుడైన యెహోవా యెరూషలేమును కాపాడుతాడు. యెహోవా దానిని రక్షిస్తాడు. యెహోవా “దానిపై దాటి”, యెరూషలేమును రక్షిస్తాడు.
ISA 31:6 ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని మీద తిరుగుబాటు చేశారు. మీరు తిరిగి దేవుని దగ్గరకు రావాలి.
ISA 31:7 మీరు తయారు చేసిన వెండి, బంగారు విగ్రహాలను ప్రజలు పూజించటం అప్పుడు మాని వేస్తారు. మీరు ఆ విగ్రహాలను తయారు చేసినప్పుడు మీరు నిజంగా పాపం చేసారు.
ISA 31:8 నిజమే, అష్షూరు ఖడ్గం చేత ఓడించబడుతుంది, కానీ ఆ ఖడ్గం మానవ ఖడ్గం కాదు. అష్షూరు ఓడించబడుతుంది. కానీ ఆ నాశనం మనిషి ఖడ్గం ద్వారా జరగదు. అష్షూరు దేవుని ఖడ్గం నుండి పారిపోతుంది. కానీ యువకులు పట్టుబడి, బానిసలవుతారు.
ISA 31:9 వారి భద్రతా స్థలం నాశనం చేయబడుతుంది. వారి నాయకులు ఓడించబడి, వారి పతాకాన్ని విడిచిపెడ్తారు. ఆ విషయాలన్నీ యెహోవా చెప్పాడు. యెహోవా అగ్ని (బలిపీఠం) సీయోను మీద ఉంది. యెహోవా కొలిమి (బలిపీఠం) యెరూషలేములో ఉంది.
ISA 32:1 నేను చెప్పే విషయాలు విను. ఒక రాజు మంచిని పెంచే విధంగా పాలించాలి. నాయకులు ప్రజలను నడిపించేటప్పుడు వారు న్యాయమైన తీర్మానాలు చేయాలి.
ISA 32:2 ఇలా జరిగితే, అప్పుడు గాలి వాన నుండి దాగుకొనే చోటులా ఉంటాడు ఆ రాజు. అది ఎండిన భూమిలో నీటి కాలువలు ప్రవహించినట్టుగా ఉంటుంది. వేడి ప్రదేశంలో ఒక పెద్ద బండ చాటున చల్లని నీడలా ఉంటుంది అది.
ISA 32:3 ప్రజలు సహాయం కోసం రాజువైపు తిరుగుతారు, వారు ఆయన చెప్పే మాటలు నిజంగా వింటారు.
ISA 32:4 ఇప్పుడు గందర గోళంలో పడిన మనుష్యులు గ్రహించగలుగుతారు. ఇప్పుడు తేటగా మాట్లాడలేని మనుష్యులు, అప్పుడు తేటగా, వేగంగా మాట్లాడగలుగుతారు.
ISA 32:5 వెర్రివాళ్లు గొప్పవాళ్లని పిలువబడరు. రహస్య పథకాలు వేసే వారిని ప్రజలు గౌరవించరు.
ISA 32:6 తెలివి తక్కువ వాడు తెలివి తక్కువ సంగతులు చెబతాడు, అతడు చెడ్డపనులు చేయాలని తన మనసులో ఆలోచిస్తాడు. తెలివి తక్కువ వాడు తప్పు పనులు చేయాలనుకొంటాడు. తెలివి తక్కువ వాడు యెహోవాను గూర్చి చెడ్డ మాటలు చెబతాడు. తెలివి తక్కువ వాడు ఆకలితో ఉన్న వాళ్లను అన్నం తిననీయడు. తెలివి తక్కువ వాడు దప్పిగొన్న వారిని నీళ్లు తాగనివ్వడు.
ISA 32:7 ఆ తెలివి తక్కువ వాడు చెడును సాధనంగా వాడుకొంటాడు. పేద ప్రజల దగ్గర్నుండి సమస్తం దోచుకొనేందుకు అతడు పథకం వేస్తాడు. ఆ తెలివి తక్కువ వాడు పేద ప్రజలను గూర్చి అబద్ధాలు చెబతాడు. వాని అబద్ధాలు పేదవారికి న్యాయం జరుగకుండా చేస్తాయి.
ISA 32:8 అయితే మంచి నాయకుడు మంచి పనులు చేయాలని ఆలోచిస్తాడు. ఆ మంచి పనులే అతణ్ణి మంచి నాయకుడ్ని చేస్తాయి.
ISA 32:9 స్త్రీలు కొందరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. మీరు క్షేమం అనుకొంటున్నారు. కానీ మీరు లేచి, నేను చెప్పే మాటలు వినాలి.
ISA 32:10 స్త్రీలారా మీరు ఇప్పుడు క్షేమంగా ఉన్నాం అనుకొంటున్నారు. కానీ ఒక సంవత్సరం తర్వాత మీకు కష్టం వస్తుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం మీరు కూర్చుకొనేందుకు ద్రాక్షపండ్లు ఉండవు గనుక మీరు ద్రాక్షపండ్లు ఏరుకోరు.
ISA 32:11 స్త్రీలారా మీరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. కానీ మీరు భయపడాలి. స్త్రీలారా, ఇప్పుడు మీరు క్షేమంగా ఉన్నాం అనుకొంటున్నారు. కానీ మీరు దిగులుపడాలి. మీ అందమైన వస్త్రాలు తీసివేసి, విచార వస్త్రాలు ధరించండి. ఆ బట్టలు మీ నడుములకు చుట్టుకోండి.
ISA 32:12 దుఃఖంతో నిండిన మీ రొమ్ములను ఆ దుఃఖవస్త్రాలతో కప్పుకొనండి. మీ పొలాలు ఖాళీగా ఉన్నాయి గనుక ఏడ్వండి. మీ ద్రాక్ష తోటలు ఒకప్పుడు ద్రాక్ష పండ్లు ఇచ్చాయి కానీ ఇప్పుడు అవి ఖాళీ.
ISA 32:13 నా ప్రజల భూమి కోసం ఏడ్వండి, ముళ్లకంపలు, గచ్చ పొదలు మాత్రమే అక్కడ పెరుగుతాయి గనుక ఏడ్వండి. పట్టణం కోసం, ఒకప్పుడు ఆనందంతో నిండిన అన్ని గృహాల కోసం ఏడ్వండి.
ISA 32:14 ప్రజలు రాజధాని నగరం విడిచి పెట్టేస్తారు. రాజ భవనం, గోపురాలు ఖాళీగా విడిచిపెట్టబడతాయి. ప్రజలు ఇండ్లలో నివసించరు. వారు గుహలలో నివసిస్తారు. అడవి గాడిదలు, గొర్రెలు పట్టణంలో నివసిస్తాయి. పశువులు అక్కడ గడ్డి మేయటానికి వెళ్తాయి.
ISA 32:15 దేవుడు పైనుండి తన ఆత్మను మనకు ఇచ్చేంతవరకు ఇది కొనసాగుతుంది. ఇప్పుడు దేశంలో మంచి లేదు. అది ఒక అరణ్యంలా ఉంది. కానీ భవిష్యత్తులో ఆ అరణ్యం కర్మెలు దేశంలా ఉంటుంది, అక్కడ న్యాయమైన తీర్పు వుంటుంది. మరియు కర్మెలు పచ్చని అడవిలా ఉంటుంది. అక్కడ మంచితనం ఉంటుంది.
ISA 32:17 ఆ మంచితనం శాంతి, భద్రతలు తెచ్చిపెడ్తుంది.
ISA 32:18 అందమైన శాంతి వనంలో నా ప్రజలు నివసిస్తారు. క్షేమకరమైన గుడారాల్లో నా ప్రజలు నివసిస్తారు. నెమ్మదైన, శాంతస్థలాల్లో వారు నివసిస్తారు.
ISA 32:19 కానీ ఈ సంగతులు జరుగక ముందు అరణ్యం కూలిపోవాలి. ఆ పట్టణం ఓడించబడాలి.
ISA 32:20 మీలో కొంతమంది ప్రతి కాలువ దగ్గరా విత్తనాలు విత్తుతారు. మీ పశువలను, గాడిదలను మీరు స్వేచ్చగా తిరుగ నిస్తారు, తిననిస్తారు. మీరు చాలా సంతోషంగా ఉంటారు.
ISA 33:1 మీరు యుద్ధం చేసి ప్రజల దగ్గర్నుండి దొంగిలిస్తారు, ఆ ప్రజలు మాత్రం మీ దగ్గర ఎన్నడూ ఏమీ దొంగిలించలేదు. మీరు ప్రజల మీద దాడిచేస్తారు. ఆ ప్రజలు మిమ్మల్ని ఎన్నడూ ఎదిరించ లేదు. కనుక మీరు దొంగిలించటం మాని వేసినప్పుడు ఇతరులు మీ దగ్గర దొంగిలించటం మొదలు పెడ్తారు. మీరు ప్రజల మీద పడటం మానివేసినప్పుడు, ఆ ప్రజలు మీ మీద పడటం మొదలు పెడ్తారు. అప్పుడు మీరంటారు.
ISA 33:2 దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు “యెహోవా మామీద దయ చూపు నీ సహాయం కోసం మేము కనిపెట్టాం యెహోవా, ప్రతి ఉదయం మాకు బలం దయచేయి. మేం కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించు.
ISA 33:3 నీ శక్తిగల స్వరం ప్రజలను భయపెడ్తుంది కనుక వారు నీ దగ్గర్నుండి పారిపోతారు. నీ మహాత్మ్యం రాజ్యాలనే పారిపోయేట్టు చేస్తుంది.”
ISA 33:4 మీరు యుద్ధంలో వస్తువులు దొంగిలించారు. ఆ వస్తువులు మీ దగ్గర్నుండి తీసుకోబడతాయి. చాలా, చాలామంది వచ్చి మీ ధనాన్ని దోచుకొంటారు. అది మిడతలు వచ్చి మీ పంటలన్నింటినీ తినివేసే సందర్భంలాగా వుంటుంది.
ISA 33:5 యెహోవా ఎంతో గొప్పవాడు. ఆయన మహాఉన్నత స్థలంలో ఉంటాడు. సీయోనును న్యాయంతో, మంచితనంతో యెహోవా నింపుతాడు.
ISA 33:6 యెరూషలేమూ, నీవు దేవుని జ్ఞానంతో, తెలివితో ఐశ్వర్యవంతంగా ఉన్నావు. నీవు రక్షణతో ఐశ్వర్యవంతంగా ఉన్నావు. నీవు యెహోవాను గౌరవిస్తావు. అది నిన్ను ఐశ్వర్యవంతురాలిగా చేస్తుంది. కనుక నీవు కొనసాగుతావు అని నీవు తెలుసుకోవచ్చు.
ISA 33:7 కానీ, విను! బయట దేవదూతలు ఏడుస్తున్నారు. శాంతి సందేశం తీసుకొనివచ్చే ఆ దూతలు చాలా గట్టిగా ఏడుస్తున్నారు.
ISA 33:8 రోడ్లు నాశనం అయ్యాయి. వీధుల్లో ఎవ్వరూ నడవటం లేదు. ప్రజలు వారు చేసుకున్న ఒడంబడికలను ఉల్లంఘించారు. సాక్షుల రుజువులను అంగీకరించటానికి ప్రజలు నిరాకరిస్తున్నారు. ఎవ్వరూ ఇతరులను గౌరవించటంలేదు.
ISA 33:9 దేశం వ్యాధిగ్రస్తమై, చస్తూ ఉంది. లెబానోను చస్తూ ఉంది, షారోను లోయ ఎండిపోయి, ఖాళీగా ఉంది. బాషాను, కర్మెలులో ఒకప్పుడు అందమైన మొక్కలు పెరిగాయి కానీ ఆ మొక్కలు ఎదగటం మానేశాయి.
ISA 33:10 యెహోవా చెబతున్నాడు, “ఇప్పుడు నేను లేచి నా మహిమను చూపిస్తాను. నేను ఇప్పుడు ప్రజలకు ప్రముఖుడనవుతాను.
ISA 33:11 ప్రజలారా మీరు పనికి మాలిన పనులు చేశారు. ఆ పనులు గడ్డిలా, గడ్డిపోచలా ఉన్నాయి. అవి దేనికే పనికిరావు. మీ ఆత్మ అగ్నిలా ఉండి మిమ్మల్ని కాల్చేస్తుంది.
ISA 33:12 మనుష్యుల ఎముకలుసున్నంలా అయ్యేంత వరకు వారు కాల్చబడుతారు. ప్రజలు ముళ్లకంపల్లా, ఎండిపోయిన పొదల్లా త్వరగా కాలిపోతారు.
ISA 33:13 “దూరదేశాల్లో ఉన్న ప్రజలారా నేను చేసిన కార్యాలను గూర్చి వినండి. నాకు దగ్గర్లో వున్న ప్రజలారా, మీరు నా శక్తిని గూర్చి తెలుసుకోండి.”
ISA 33:14 సీయోనులో పాపులు భయపడుతున్నారు. చెడ్డ పనులు చేసేవారు భయంతో వణకుతున్నారు. “మనల్ని నాశనం చేసే ఈ అగ్నిలో నుండి మనలో ఎవరైనా బతకగలమా? శాశ్వతంగా మండుతూ ఉండే ఈ అగ్ని దగ్గర ఎవరు బతకగలరు?” అని వారంటున్నారు.
ISA 33:15 మంచివాళ్లు, నిజాయితీపరులు డబ్బుకోసం ఇతరులను బాధించని వాళ్లు ఆ అగ్నిగుండా బతుకుతారు. ఆ ప్రజలు లంచాలు నిరాకరిస్తారు. ఇతరులను హత్య చేసే పథకాలను గూర్చి వినటానికి గూడ వారు నిరాకరిస్తారు. చెడ్డ పనులు చేసేందుకు వేసిన పథకాలను చూచేందుకు గూడా వారు నిరాకరిస్తారు.
ISA 33:16 ఆ ప్రజలు ఉన్నతమైన స్థలాల్లో క్షేమంగా జీవిస్తారు. ఎత్తయిన బండల కోటలలో వారు భద్రంగా కాపాడబడతారు. ఆ ప్రజలకు ఆహారం, నీళ్లు ఎల్లప్పుడూ ఉంటాయి.
ISA 33:17 రాజును (దేవుణ్ణి) ఆయన సంపూర్ణ సౌందర్యంలో మీరు చూస్తారు. ఆ మహా దేశాన్ని మీరు చూస్తారు.
ISA 33:18 గతంలో మీకు కలిగిన కష్టాలను గూర్చి మీరు ఆలోచిస్తారు. “ఆ ఇతర దేశాల మనుష్యులు ఎక్కడ? మనకు అర్థం కాని భాషలు వాళ్లు మాట్లాడారు. ఇతర దేశాల అధికారులు, పన్ను వసూలు చేసే వాళ్లు అంతా ఏమయ్యారు? మన రక్షణ గోపురాలను లెక్కించిన ఆ గూఢచారులు ఎక్కడ? వాళ్లంతా పోయారు!” అని మీరు అనుకొంటారు.
ISA 33:20 మన మతపరమైన పండుగల పట్టణం సీయోనును చూడు. ఆ అందమైన విశ్రాంతి స్థలం యెరూషలేమును చూడు. ఎన్నటికీ కదలని ఒక గుడారంలా ఉంది యెరూషలేము. దానిని తన స్థానంలో ఉంచే మేకులు ఎన్నటికి పెరికి వేయబడవు. దాని తాళ్లు ఎన్నటికీ తెగిపోవు.
ISA 33:21 ఎందుకంటే, శక్తిగల యెహోవా అక్కడ ఉన్నాడు గనుక. ఆ దేశం ఏరులు, పెద్ద నదులు ఉన్న దేశం. కాని ఆ నదుల్లో శత్రు పడవలుగాని లేక బలమైన ఓడలుగాని ఏమీ ఉండవు. ఆ పడవల్లో పనిచేసే మనుష్యులారా, మీరు మీ త్రాళ్ల పని విడిచి పెట్టవచ్చును. ఓడ కొయ్యను చాలినంత గట్టిగా చేయలేరు. మీరు మీ తెర చాపలను తెరువలేరు. ఎందుకంటే, యెహోవాయే మన న్యాయమూర్తి మన చట్టాలను యెహోవా చేస్తాడు. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు. అందుచేత యెహోవా మనకు విస్తారమైన ఐశ్వర్యం ఇస్తాడు. కుంటివాళ్లు సహా యుద్ధంలో గొప్ప ఐశ్వర్యాలు సంపాదిస్తారు.
ISA 33:24 అక్కడ జీవించే ఏ మనిషీ “నాకు జబ్బు” అని చెప్పడు. అక్కడ నివసించే ప్రజలు పాపాలు క్షమించబడిన ప్రజలు.
ISA 34:1 సకల రాజ్యములారా, దగ్గరగా వచ్చి, వినండి. ప్రజలారా, మీరంతా దగ్గరగా ఉండి వినండి. భూమి, భూమిమీద ఉన్న ప్రజలు అందరూ ఈ సంగతులు వినాలి.
ISA 34:2 సకల రాజ్యాల మీదా, వాటి సైన్యాల మీదా యెహోవా కోపంగా ఉన్నాడు. యెహోవా వాళ్లందర్ని నాశనం చేస్తాడు వాళ్లందరు చెంపబడేట్టు యెహోవా చేస్తాడు.
ISA 34:3 వారి శరీరాలు బయట పారవేయబడుతాయి. ఆ శవాలనుండి కంపువస్తుంది. వారి రక్తం కొండల నుండి ప్రవహిస్తుంది.
ISA 34:4 ఆకాశాలు కాగితం చుట్టలా చుట్టబడతాయి. నక్షత్రాలు చచ్చి, ద్రాక్ష లేక అంజూర చెట్ల ఆకులు రాలినట్లు రాలిపోతాయి. ఆకాశంలోని నక్షత్రాలన్నీ కరిగి పోతాయి.
ISA 34:5 “ఆకాశంలో నా ఖడ్గం రక్తసిక్తమైనప్పుడు ఇది జరుగుతుంది” అని యెహోవా చెబతున్నాడు. చూడండి! యెహోవా ఖడ్గం ఎదోముగుండా దూసుకొనిపోతుంది. ఆ ప్రజలు దోషులని యెహోవా తీర్పు చెప్పాడు, గనుక వారు చావాల్సిందే.
ISA 34:6 ఎందుకంటే, బొస్రాలో, ఎదోములో చంపబడే సమయం ఒకటి ఉండాలని యెహోవా నిర్ణయించాడు గనుక.
ISA 34:7 కనుక పొట్టేళ్లు, పశువులు, బలమైన కోడెదూడలు చంపబడుతాయి. దేశం వాటి రక్తంతో నిండిపోతుంది. దుమ్ము వాటి కొవ్వుతో నిండిపోతుంది.
ISA 34:8 శిక్షా సమయం ఒకటి యెహోవా ఏర్పాటు చేశాడు గనుక ఆ సంగతులు జరుగుతాయి. ప్రజలు సీయోనుకు చేసిన కీడులకు వారు బదులు చెల్లించటానికి యెహోవా ఒక సంవత్సరాన్ని ఎంచుకొన్నాడు.
ISA 34:9 ఎదోము నదులు వేడి తారులా ఉంటాయి. ఎదోము నేల మండుతున్న గంధకంలా ఉంటుంది.
ISA 34:10 అగ్ని రాత్రింబవళ్లు మండుతూ ఉంటుంది. అగ్నిని ఎవ్వరూ ఆర్పివేయలేరు. ఎదోమునుండి పొగ శాశ్వతంగా లేస్తుంది. ఆ దేశం శాశ్వతంగా ఎప్పటికీ నాశనం చేయబడుతుంది. ఆ దేశంగుండా మళ్లీ ఎవ్వరూ ఎన్నడూ ప్రయాణం చేయరు.
ISA 34:11 పక్షులు, చిన్న జంతువులు ఆ దేశాన్ని స్వంతంగా వాడుకొంటాయి. గుడ్లగూబలు, కాకులు అక్కడ నివసిస్తాయి. ఆ దేశం “శూన్య ఎడారి” అని పిలువబడుతుంది.
ISA 34:12 స్వతంత్రులు, నాయకులు అంతా పోతారు. వారు పాలించేందుకు అక్కడ ఏమీ మిగిలి ఉండదు.
ISA 34:13 అక్కడి అందమైన గృహాలన్నింటిలో ముళ్ల కంపలు, పిచ్చిపొదలు పెరుగుతాయి. అడవి కుక్కలు, గుడ్లగూబలు ఆ ఇండ్లలో నివసిస్తాయి. అడవి జంతువులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొంటాయి. అక్కడ పెరిగే గడ్డి దుబ్బుల్లో పెద్ద పక్షులు నివసిస్తాయి.
ISA 34:14 అడవి పిల్లులు నక్కలతో కలిసి అక్కడ నివసిస్తాయి. అడవి మేకలు వాటి స్నేహితులను పిలుచుకొంటాయి. రాత్రులు తిరిగే జంతువులు అక్కడ విశ్రాంతి స్థలం చూచుకొంటాయి.
ISA 34:15 పాములు అక్కడ పుట్టలు పెడ్తాయి. పాములు అక్కడ గుడ్లు పెడ్తాయి. గుడ్లు పగులుతాయి పాము పిల్లలు ఆ చీకటి స్థలాల్లో పాకుతాయి. చచ్చిన శవాలను తినే పక్షులు, ఆడవాళ్లు వారి స్నేహితురాళ్లను కలుసుకొన్నట్టుగా అక్కడ కలుసుకొంటాయి.
ISA 34:16 యెహోవా గ్రంథాన్ని చూడండి. అక్కడ ఏమి వ్రాసి ఉందో చదవండి. ఏమీ తప్పిపోలేదు. ఆ జంతువులు కలిసి ఉంటాయని ఆ గ్రంథములో వ్రాయబడిఉంది. వాటిని ఒక్క చోట చేరుస్తానని దేవుడు చెప్పాడు. కనుక దేవుని ఆత్మ వాటిని ఒక్క చోట చేర్చటం జరుగుతుంది.
ISA 34:17 వాటి విషయంలో చేయాల్సిన దాన్ని దేవుడు నిర్ణయం చేశాడు. అప్పుడు దేవుడు వాటికి ఒక చోటు నిర్ణయించాడు. దేవుడు ఒక గితగీసి, వాటి స్థలం వాటికి చూపించాడు. అందుచేత ఆ దేశం ఆ జంతువులకు శాశ్వతంగా స్వంతం. సంవత్సరం వెంబడి సంవత్సరం అవి అక్కడే నివసిస్తాయి.
ISA 35:1 ఎండిన అరణ్యం సంతోషిస్తుంది. అరణ్యం ఉల్లసించి, కస్తూరి పుష్పంలా పూస్తుంది.
ISA 35:2 అరణ్యం వికసించే పూలతో నిండిపోయి దాని సంతోషాన్ని వ్యక్తం చేయటం మొదలు పెడ్తుంది. అరణ్యం ఆనందంతో నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. లెబానోను అరణ్యంలా, కర్మెలు పర్వతంలా, షారోనులోయలా అరణ్యం సౌందర్యంగా ఉంటుంది. ప్రజలంతా యెహోవా మహిమ చూస్తారు గనుక ఇలా జరుగుతుంది. ప్రజలు మన యెహోవా మాహాత్మ్యం చూస్తారు.
ISA 35:3 బలహీనమైన చేతుల్ని మళ్లీ బలపర్చండి. బలహీనమైన మోకాళ్లను బలపర్చండి.
ISA 35:4 ప్రజలు భయంతో, కలవరపడుతున్నారు. “బలంగా ఉండండి, భయపడవద్దు” అని ఆ మనుష్యులతో చెప్పండి. చూడండి, మీ దేవుడు వచ్చి, మీ శత్రువులను శిక్షిస్తాడు. ఆయన వచ్చి మీ బహుమానం మీకు ఇస్తాడు. యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడు.
ISA 35:5 అప్పుడు గుడ్డివాళ్లు మళ్లీ చూస్తారు. వారి నేత్రాలు తెరువబడతాయి. అప్పుడు చెవిటివాళ్లు వినగలుగుతారు. వారి చెవులు తెరువబడుతాయి.
ISA 35:6 కుంటివాళ్లు లేడిలా గంతులు వేస్తారు. ఇప్పుడు మాట్లాడలేని మూగవాళ్లు, వారి కంఠం ఎత్తి ఆనంద గీతాలు పాడుతారు. అరణ్యంలో జల ఊటలు పారటం మొదలైనప్పుడు ఇది జరుగుతుంది. ఎండిన భూమిలో నీటి ఊటలు ప్రవహిస్తాయి.
ISA 35:7 ఇప్పుడు నీళ్లలా కనిపించే ఎండమావుల్ని ప్రజలు చూస్తున్నారు. కానీ ఆ సమయంలో నిజంగానే నీళ్ల కొలనులు ఉంటాయి. ఎండిన భూమిలో బావులు ఉంటాయి. భూమిలో నుండి నీళ్లు ఉబకుతాయి. ఒకప్పుడు అడవిమృగాలు ఏలిన చోట ఎత్తయిన నీటి మొక్కలు పెరుగుతాయి.
ISA 35:8 ఆ సమయంలో అక్కడ ఒక రాజమార్గం ఉంటుంది. ఈ రాజమార్గం “పవిత్ర రాజమార్గం” అని పిలువబడుతుంది. ఆ రాజమార్గంలో చెడ్డవాళ్లను నడవనీయరు. తెలివి తక్కువ వాళ్లెవరూ ఆ మార్గానికి వెళ్లరు. మంచివాళ్లు మాత్రమే ఆ మార్గంలో వెళ్తారు.
ISA 35:9 ఆ మార్గంలో అపాయాలు ఏమీ ఉండవు. ప్రజలకు హానిచేసేందుకు ఆ మార్గంలో సింహాలు ఉండవు ప్రమాదకరమైన జంతువులు ఏమీ ఆ మార్గంలో ఉండవు. ఆ మార్గం దేవుడు రక్షించే ప్రజలకోసమే ఉంటుంది.
ISA 35:10 దేవుడు తన ప్రజలను స్వతంత్రులను చేస్తాడు. ఆ ప్రజలు ఆయన దగ్గరకు తిరిగి వస్తారు. ప్రజలు సీయోను లోనికి వచ్చినప్పుడు సంతోషిస్తారు. ఆ ప్రజలు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. వారి సంతోషం వారి తలల మీద ఒక కిరీటంలా ఉంటుంది. వారి సంతోషం, ఆనందం వారిని సంపూర్ణంగా నింపేస్తాయి. విచారం, దుఃఖం దూరదూరాలకు పారిపోతాయి.
ISA 36:1 యూదాకు హిజ్కియా రాజు. అష్షూరుకు సన్హెరీబు రాజు. హిజ్కియా రాజైన పదునాలుగవ సంవత్సరంలో సన్హెరీబు యూదా పట్టణాల మీద యుద్ధం చేశారు. మరియు సన్హెరీబు ఆ పట్టణాలను ఓడించేశాడు.
ISA 36:2 యెరూషలేము మీద యుద్ధం చేయటానికి సన్హెరీబు తన సైన్యాధిపతి పంపించాడు. ఆ సైన్యాధిపతి లాకీషును విడిచి, యెరూషలేములోని హిజ్కియా దగ్గరకు వెళ్లాడు. ఆ సైన్యాధిపతి బలమైన తన సైన్యాన్ని తనతో కూడా నడిపించాడు. ఆ సైన్యాధిపతి, అతని సైన్యం చాకలివాని పొలం దగ్గర ఉన్న దారికి వెళ్లారు. మెట్ట మీది కొలను నుండి వచ్చే జంట కాల్వల దగ్గర ఈ మార్గం ఉంది.
ISA 36:3 ఆ సైన్యాధిపతితో మాట్లాడుటకు ముగ్గురు మనుష్యులు యెరూషలేము నుండి బయటకు వెళ్లారు. వీరు హిల్కీయా కుమారుడు ఎల్యాకీము, ఆసాపు కుమారుడు యోవాహు, షెబ్నా, ఎల్యాకీము రాజభవన సంరక్షకుడు. యెహోవా అధికార పత్రాలు భద్ర పరచేవాడు; షెబ్నా రాజ్యపు కార్యదర్శి.
ISA 36:4 సైన్యాధిపతి వారితో చెప్పాడు, “మీరు రాజైన హిజ్కియాతో ఈ సంగతులు చెప్పండి: “‘మహారాజు, అష్షూరు రాజు చెబతున్నాడు, మీ సహాయం కోసం మీరు దేనిని నమ్ముకొంటున్నారు?
ISA 36:5 మీరు గనుక మీ బలాన్నీ, తెలివిగల మీ యుద్ధ తంత్రాలనూ నమ్ముకొంటే అవన్నీ నిష్ప్రయోజనమే అని నేను చెబతున్నాను. అవి వట్టి మాటలు తప్ప ఇంకేమీ లేదు. కనుక మీరు నాకు విరోధంగా ఎందుకు యుద్ధం చేస్తారు?
ISA 36:6 ఇప్పుడు నేను మళ్లీ అడుగుతున్నాను, మీ సహాయం కోసం మీరు ఎవరిని నమ్ముకొంటున్నారు? మీ సహాయం కోసం మీరు ఈజిప్టు మీద ఆధారపడ్తున్నారా? ఈజిప్టు విరిగిపోయిన కర్రలా ఉంది. ఆధారంగా మీరు దానిమీద ఆనుకొంటే, అది మీకు బాధ మాత్రమే కలిగిస్తుంది, మీ చేతికి గాయం చేస్తుంది. ఈజిప్టు రాజు ఫరో సహాయంకోసం అతని మీద ఆధారపడే వాళ్లెవ్వరూ అతణ్ణి నమ్మలేరు.
ISA 36:7 “‘అయితే మీరు అనవచ్చు, “మా సహాయం కోసం మేం మా దేవుడు యెహోవాను విశ్వసిస్తున్నాం” అని. అయితే యెహోవా బలిపీఠాలను, ఆరాధించే ఉన్నత స్థలాలను హిజ్కియా నాశనం చేసేశాడు అని నేనంటున్నాను. ఇది నిజం, అవునా? యూదాకు, యెరూషలేముకు హిజ్కియా ఈ సంగతులు చెప్పటం సత్యం, “ఇక్కడ యెరూషలేములో ఒకే బలిపీఠం దగ్గర మీరు ఆరాధిస్తారు.”
ISA 36:8 “‘అయినా మీరు ఇంకా యుద్ధం చేయాలనే అనుకొంటే, నా ప్రభువు, అష్షూరు రాజు మీతో ఈ ఒడంబడిక చేస్తాడు! యుద్ధ రంగంలో స్వారీ చేయగల రెండువేల మంది మీకు ఉంటే, నేను మీకు అన్ని గుర్రాలు ఇస్తాను.
ISA 36:9 అలాగైనా సరే, నా యజమాని బానిసల్లో ఒక్కడిని, చివరికి ఒక చిన్న అధికారిని కూడా మీరు ఓడించలేరు. అందుచేత ఈజిప్టు సైనికుల మీద రథాల మీద ఎందుకు మీరు ఆధారపడతారు?
ISA 36:10 “‘మరియు నేను వచ్చి ఈ దేశంలో యుద్ధం చేసినప్పుడు యెహోవా నాతో ఉన్నాడని కూడ జ్ఞాపకం ఉంచుకోండి. నేను పట్ణణాలను నాశనం చేసినప్పుడు యెహోవా నాతో ఉన్నాడు. “లేచి నిలబడే ఈ దేశానికి వెళ్లి, దీన్ని నాశనం చేయి’”” అని యెహోవా నాతో చెప్పాడు.
ISA 36:11 ఎల్యాకీము, షెబ్నా, యోవాహు, “దయచేసి సిరియా భాషలో మాతో మాట్లాడు. మా యూదా భాషలో మాతో మాట్లాడవద్దు. నీవు యూదా భాషలో మాట్లాడితే, నగరం గోడమీద మనుష్యులు అర్థం చేసుకొంటారు” అని ఆ సైన్యాధిపతితో చెప్పారు.
ISA 36:12 కానీ సైన్యాధిపతి, “మీకూ, మీ యజమానుడు హిజ్కియాకూ మాత్రమే చెప్పమని మా యజమాని నన్ను పంపించలేదు. ఆ గోడల మీద కూర్చొన్న మనుష్యులతో కూడ చెప్పమని నా యజమాని నన్ను పంపించాడు. ఆ మనుష్యులకు ఆహారంగాని భోజనం గాని ఉండదు. వాళ్లు కూడా మీలాగే, వారి మల మూత్రాలనే తిని, తాగుతారు” అని చెప్పాడు.
ISA 36:13 అప్పుడు సైన్యాధికారి లేచి, పెద్ద స్వరంతో మాట్లాడాడు. అతడు యూదా భాషలో మాట్లాడాడు.
ISA 36:14 సైన్యాధికారి చెప్పాడు, “మహారాజు అష్షూరు రాజు మాటలు వినండి: “‘హిజ్కియా మిమ్మల్ని మోసం చేయనివ్వ కండి. అతడు మిమ్మల్ని రక్షించలేడు.
ISA 36:15 “యెహోవా మీద విశ్వాసం ఉంచండి, యోహోవా మనలను రక్షిస్తాడు. అష్షూరు రాజు మన పట్టణం గెలవకుండా యెహోవా చేస్తాడు’ అని హిజ్కియా చెప్పినప్పుడు అతని మాటలు నమ్మవద్దు.”
ISA 36:16 “‘హిజ్కియా చెప్పే ఆ మాటలు వినవద్దు. అష్షూరు రాజు మాట వినండి. అష్షూరు రాజు చెబతున్నాడు, “మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. ప్రజలారా, మీరు పట్టణం వదలి పెట్టి నా దగ్గరకు రండి. అప్పుడు ప్రతి ఒక్కరు స్వతంత్రులుగా ఇంటికి వెళ్లవచ్చును. ప్రతి ఒక్కరు తన స్వంత ద్రాక్షవల్లినుండి ద్రాక్షపండ్లు తినేందుకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన స్వంత అంజూరపు చెట్టు ఫలాలు తినే స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన స్వంత బావి నుండి నీళ్లు తాగే స్వేచ్ఛ ఉంటుంది.
ISA 36:17 నేను వచ్చి, మీ స్వంత దేశంలాంటి దేశానికి మిమ్మల్ని ఒక్కొక్కరిని తీసుకొని వెళ్లేంత వరకు మీరు ఇలా చేయవచ్చు. ఆ కొత్త దేశంలోమీకు మంచి ధాన్యం, కొత్త ద్రాక్షరసం ఉంటాయి. ఆ దేశంలో భోజనం, ద్రాక్షవనాలు ఉంటాయి.”
ISA 36:18 “‘హిజ్కియా మిమ్మల్ని వెర్రి వాళ్లనుగా చేయనియ్యకండి. “యెహోవా మనలను రక్షిస్తాడు.” అని అతడు అంటాడు. అయితే యితర రాజ్యాల్లోని యితర దేవుళ్లు ఎవరైనా సరే వారిని అష్షూరు బలంనుండి రక్షించారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు.
ISA 36:19 ఆ ప్రజల్లో ప్రతి ఒక్కరినీ మేము ఓడించాం. హమాతు, అర్పదు దేవుళ్లు ఏమయ్యారు? వారు ఓడించబడ్డారు. సెపర్యయీం దేవతలు ఎక్కడ? వారు ఓడించబడ్డారు. సమరయ దేవుళ్లు ఆ ప్రజలను నా బలంనుండి రక్షించారా? లేదు.
ISA 36:20 ఆ రాజ్యాలన్నింటిలో నా బలం నుండి తన ప్రజలను రక్షించగలిగిన ఒక్క దేవుని పేరు నాకు చెప్పండి. నేను వాళ్లందర్నీ ఓడించేశాను. అందుచేత నా బలంనుండి యెహోవా యెరూషలేమును రక్షించజాలడు.’”
ISA 36:21 యెరూషలేములో ని ప్రజలు చాలా మౌనంగా ఉన్నారు. ఆ సైన్యాధికారికి వారు జవాబు చెప్పలేదు. (హిజ్కియా ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. “ఆ సైన్యాధికారికి జవాబు చెప్పవద్దు” అని హిజ్కియా ఆజ్ఞాపించాడు.)
ISA 36:22 అప్పుడు రాజభవన అధికారి (హిజ్కియా కుమారుడు ఎల్యాకీము) రాజ్య కార్యదర్శి (షెబ్నా) అధికార పత్రాలు భద్రపరిచే అధికారి ( ఆసాపు కుమారుడు యోవాహు) వారి బట్టలు చింపివేశారు. ( వారు చాలా విచారించినట్టు ఇది సంకేతం ) ఆ ముగ్గురు మనుష్యులూ హిజ్కియా దగ్గరకు వెళ్లి, సైన్యాధికారి తమతో చెప్పిన సంగతులన్నీ అతనితో చెప్పారు.
ISA 37:1 సైన్యాధికారి సందేశం హిజ్కియా విన్నాడు. ఆ సందేశం అతడు విన్నప్పుడు, హిజ్కియా తన బట్టలు చింపేసుకొన్నాడు. అప్పుడ హిజ్కియా సంతాప సూచకమైన ప్రత్యేక వస్త్రాలు ధరించి యెహోవా మందిరానికి వెళ్లాడు.
ISA 37:2 రాజభవన అధికారిని (ఎల్యాకీము), రాజ్య కార్యదర్శిని (షెబ్నా), యాజకుల్లో పెద్దలను, ఆమోజు కుమారుడు యెషయా దగ్గరకు హిజ్కియా పంపించాడు. ఈ ముగ్గురు మనుష్యులూ సంతాప వస్త్రాలు ధరించారు.
ISA 37:3 ఈ మనుష్యులు యెషయాతో చెప్పారు: “ఈ రోజు దుఃఖం, విచారం వ్యక్తం చేసే ప్రత్యేక సంతాపదినంగా ఉండాలని హిజ్కియా రాజు ఆదేశించాడు. ఇది చాలా విచారకరమైన రోజుగా ఉంటుంది. ఆ రోజు శిశువు జన్మించాల్సినప్పట్టకీ, తల్లిలో నుండి బయటకు వచ్చే శక్తి లేక అది బయటకు రాని రోజులా అది ఉంటుంది.
ISA 37:4 ఒక వేళ, మీ దేవుడు యెహోవా, ఆ సైన్యాధికారి చెప్పిన సంగతులు వింటాడేమో జీవంగల దేవుణ్ణి గూర్చి చాలా చెడ్డ మాటలు మాట్లాడేందుకు అష్షూరు రాజు సైన్యాధికారిని పంపించాడు. మరియు మీ దేవుడు యెహోవా ఆ చెడు సంగతులు విన్నాడు. మిగిలి ఉన్న కొద్దిమంది ఇశ్రాయేలు ప్రజల కోసం దయచేసి ప్రార్థించండి.”
ISA 37:5 హిజ్కియా సేవకులు యెషయా దగ్గరకు వెళ్లారు.
ISA 37:6 యెషయా వాళ్లతో చెప్పాడు: “మీ యజమానియైన హిజ్కియాకు ఈ విషయాలు చెప్పండి: యెహోవా చెప్పునదేమనగా, ‘సైన్యాధిపతి నుండి విన్న మాటలకు మీరు భయపడవద్దు. అష్షూరు రాజు దగ్గర నుండి వచ్చిన ఆ “కుర్రవాళ్లు” నన్ను గూర్చి చెప్పిన చెడు విషయాలు నమ్మవద్దు.
ISA 37:7 చూడండి, అష్షూరుకు విరోధంగా నేను ఒక ఆత్మను పంపిస్తాను. అష్షూరు రాజు యొక్క దేశానికి ఒక ప్రమాదం గూర్చి హెచ్చరిక చేస్తూ అతనికి సమాచారం అందుతుంది. కనుక అతడు తిరిగి తన దేశం వెళ్లిపోతాడు. ఆ సమయంలో అతని స్వంత దేశంలోనే నేను అతణ్ణి ఒక ఖడ్గంతో చంపేస్తాను.’”
ISA 37:8 అష్షూరు రాజుకు సమాచారం అందింది. “ఇథియోపియా రాజు తిర్హాకా నీతో యుద్ధం చేయటానికి వస్తున్నాడు” అని ఆ సమాచారం తెలియజేసింది. కనుక అష్షూరు రాజు లాకీషు పట్టణం విడిచి లిబ్నాకు వెళ్లాడు.సైన్యాధికారి ఇది విని, అష్షూరు రాజు యుద్ధం చేస్తున్న లిబ్నా పట్టణం వెళ్లాడు. అప్పుడు సైన్యాధికారి హిజ్కియా దగ్గరకు సందేశంకులను పంపిచాడు. సైన్యాధికారి చెప్పాడు.
ISA 37:10 “యూదా రాజు హిజ్కియాతో మీరు ఈ సంగతులు చెప్పండి: ‘నీవు నమ్ముకొన్న దేవుని ద్వారా వెర్రివాడవు కావద్దు. “అష్షూరు రాజు చేత యెరూషలేమును దేవుడు ఓడిపోనివ్వడు!” అని చెప్పవద్దు.
ISA 37:11 వినండి, అష్షూరు రాజులను గూర్చి మీరు విన్నారు. ప్రతి దేశంలోని ప్రజలను వారు ఓడించారు. మరియు అష్షూరు రాజు నిన్నుకూడ ఓడించి, చంపుతాడు.
ISA 37:12 ఆ ప్రజల దేవుళ్లు వాళ్లను రక్షించారా? లేదు. నా తండ్రులు (పూర్వీకులు) వారిని నాశనం చేశారు. గోజాను, హారాను, రెజెపు పట్టణాలను, తెలశ్శారులో నివసిస్తున్న ఏదేను ప్రజలను నా ప్రజలు ఓడించారు.
ISA 37:13 హమాతు, అర్పాదు రాజులు ఎక్కడ? సెపర్వయీము రాజు ఎక్కడ? హేన, ఇవ్వా రాజులు ఎక్కడ? వారి పని అయిపోయింది. వాళ్లంతా నాశనం చేయబడ్డారు.’”
ISA 37:14 హిజ్కియా ఆ మనుష్యుల దగ్గర నుండి ఆ ఉత్తరం అందుకొని, దానిని చదివాడు. అప్పుడు హిజ్కియా యెహోవా మందిరానికి వెళ్లాడు. హిజ్కియా ఉత్తరం తెరిచి, దానిని యెహోవా ముందర దానిని పరిచాడు.
ISA 37:15 హిజ్కియా యెహోవాను ప్రార్థించటం మొదలు పెట్టాడు. హిజ్కియా చెప్పాడు:
ISA 37:16 సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, కెరూబు దూతల మధ్య నీవు రాజుగా ఆసీనుడవయ్యావు. భూలోక రాజ్యాలన్నింటినీ పాలించే దేవుడవు నీవు ఒక్కడవే, భూమ్యాకాశాలను నీవే చేశావు.
ISA 37:17 నా ప్రార్థన ఆలకించు! నీ నేత్రాలు తెరచి, సన్హెరీబు పంపిన ఈ వార్త చూడు. సన్హెరీబు నాకు ఈ సందేశం పంపించాడు జీవముగల దేవుడవైన నిన్ను గూర్చి చెడు విషయాలను ఈ సందేశం చెబతోంది.
ISA 37:18 యెహోవా, అష్షూరు రాజులు నిజంగానే అన్ని దేశాలనూ, వాటి స్థలాలనూ నాశనం చేశారు.
ISA 37:19 ఆ దేశాల దేవుళ్లను అష్షూరు రాజులు కాల్చివేశారు. అయితే వారు నిజమైన దేవుళ్లు కారు. అవి కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే. అవి కేవలం రాయి, చెక్క మాత్రమే. అందుకే వాటిని వారు నాశనం చేయగలిగారు.
ISA 37:20 కానీ నీవు యెహోవా, మా దేవుడివి. కనుక అష్షూరు రాజు బలంనుండి దయతో మమ్మల్ని రక్షించు. అప్పుడు నీవే యెహోవా అని, నీవు మాత్రమే దేవుడవు అని మిగిలిన రాజ్యాలన్నీ తెలుసుకొంటాయి.
ISA 37:21 అప్పుడు ఆమోజు కుమారుడు యెషయా హిజ్కియాకు ఒక సందేశం పంపించాడు. యెషయా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు నీవు ప్రార్థన చేశావు, ‘సన్హెరీబు దగ్గర్నుండి వచ్చిన సందేశాన్ని గూర్చి నీవు ప్రార్థించావు.’
ISA 37:22 “యెహోవా నీ ప్రార్థన విన్నాడు, నన్ను నీ దగ్గరకు రమ్మన్నాడు. ఇదే యెహోవా నుండి వచ్చిన సందేశం: ‘ఓ సీయోను పెండ్లి కుమార్తె (యెరూషలేము) ప్రజలు నీ దగ్గర దొంగిలించారు ప్రజలు నిన్ను ఎగతాళి చేశారు. యెరూషలేము కుమారీ ప్రజలు నిన్ను గూర్చి చెడు విషయాలు తలచారు.
ISA 37:23 ఓ అష్షూరు రాజా, నన్ను గూర్చి నీవు చెడు విషయాలు చెప్పావు. నీవు నాకు విరోధంగా మాట్లాడావు. నేను ఎవరినో నీకు తెలుసా? నీ కళ్లు పైకెత్తి ఆకాశం వైపు చూడు. ఇశ్రాయేలీయుల పరి శుద్ధుణ్ణి గూర్చి నీవు చెడు విషయాలు చెప్పినట్టు నీవు చూస్తావు.
ISA 37:24 యెషయా ఇంకా ఇలా చెప్పాడు, నా ప్రభువు యెహోవాను గూర్చి చెడు సంగతులు చెప్పడానికి నీవు నీ సేవకులను వాడుకొన్నావు. నీవు ఇలా అన్నావు: “నేను చాలా శక్తిమంతుణ్ణి. నాకు ఎన్నెన్నో రథాలు ఉన్నాయి. లెబానోను మహాపర్వతాల మీదుగా దాటించి నా రథాలను నేను తీసుకొని వచ్చాను. లెబానోను మహా వృక్షాలను (సైన్యాలను) అన్నింటినీ నేను నరికివేశాను.
ISA 37:25 ఈజిప్టులోని ప్రతి నదికీ నేను వెళ్లాను. ఆ నదులన్నింటి నీళ్లతో నేను నా చేతులు నింపుకొన్నాను. నేను ఆ నీళ్లు తాగాను. నా స్వంత శక్తితో, ఈజిప్టులోని నదులన్నింటినీ (శక్తిని) నేను నాశనం చేశాను.”
ISA 37:26 “‘అని నీవు చెప్పావు. అయితే నేను చెప్పినది నీవు వినలేదా? అష్షూరు రాజా, దేవుడనైన నేనే ఆ సంగతులను చేశానని నిశ్చయంగా నీవు ఎప్పుడో విన్నావు. చాలాకాలం కిందట నేను అష్షూరును చేశాను. ఇప్పుడు నిన్ను ఇక్కడికి నేనే తీసుకొని వచ్చాను. మిగిలిన ఇతర పట్టణాలను నిన్ను నాశనం చేయనిచ్చాను. నా పనిలో నేనే నిన్ను వాడు కొని, ఆ పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేశాను.
ISA 37:27 ఆ పట్టణాల్లో జీవించిన మనుష్యులు బలహీనులు. ప్రజలు భయపడేవాళ్లు, సిగ్గుపడే వాళ్లు. ఆ మనుష్యులు పొలంలో గడ్డిలాంటి వాళ్లు. వారు ఇండ్ల కప్పుల మీద మొలకెత్తే గడ్డిలాంటి వారు. ఆ గడ్డి ఎదుగక ముందే వేడి ఎడారి గాలికి కాలి పోతుంది.
ISA 37:28 నీ సైన్యం, నీ యుద్ధాలు అన్నింటిని గూర్చినాకు తెలుసు. నీవు ఎప్పుడు విశ్రాంతి తీసుకొన్నావో నాకు తెలుసు. నీవు ఎప్పుడు యుద్ధానికి వెళ్లావో నాకు తెలుసు. యుద్ధంనుండి నీవు ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చావో నాకు తెలుసు. నీవు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు.
ISA 37:29 నీవు నా మీద కోపంగా ఉన్నవు, నన్ను గూర్చి చెడ్డగా మాట్లాడావు. నీవు చెప్పిన విషయాలు నేను విన్నాను. కనుక నిన్ను నేను శిక్షిస్తాను. నీ ముక్కుకు నేను గాలం వేస్తాను; నీ నోటికి నేను కళ్లెం వేస్తాను. అప్పుడు నీవు నా దేశాన్ని విడిచి, నీవు వచ్చిన దారినే పోయేట్టు నేను నిన్ను వెళ్లగొడతాను.’”
ISA 37:30 అప్పుడు యెహోవా హిజ్కియాతో చెప్పాడు: “హిజ్కియా, ఈ మాటలు సత్వమని నీకు చూపించటానికి నీకు నేను ొక గురుతు ఇస్తాను. ఈ సంవత్సరం తినేందుకు మీరు ధాన్యపు గింజలు నాటారు. కనుక పోయిన సంవత్సరపు పంటనుండి విచ్చలవిడిగా పండిన ధాన్యాన్ని ఈ సంవత్సరం మీరు తింటారు. కానీ మూడు సంవత్సరాలకు మీరు నాటుకొన్న ధాన్యం మీరు తింటారు. ఆ పంటలను మీరు కోస్తారు. తినేందుకు మీకు సమృద్ధిగా ఉంటుంది. మీరు ద్రాక్ష వల్లులు నాటి, వాటి ఫలాలు తింటారు.
ISA 37:31 “యూదా వంశంలో కొంతమంది ప్రజలు రక్షించబడతారు. ఆ కొద్దిమంది మనుష్యులు చాలా పెద్దరాజ్యంగా తయారవుతారు. ఆ ప్రజలు భూమిలో లోతుగా వేర్లు తన్ని, బలంగా ఎదిగే మొక్కల్లా ఉంటారు. అప్పుడు ప్రజలకు నేలమీద విస్తారమైన ఫలం (పిల్లలు) ఉంటుంది.
ISA 37:32 ఎందుకంటే, యెరూషలేము నుండి కొద్ది మంది మనుష్యులు బతికివస్తారు. సీయోను కొండనుండి బతికిన వారు వస్తారు.” సర్వశక్తిమంతుడైన యెహోవా బలీయమైన ప్రేమ దీనిని చేస్తుంది.
ISA 37:33 కనుక అష్షూరు రాజు గురించి యెహోవా చెబతున్నాడు, “నీవు ఈ పట్టణంలో ప్రవేశించవు. నీవు ఈ పట్టణం మీద ఒక బాణంకూడ వేయవు. నీ డాళ్లతో నీవు ఈ పట్టణం మీద యుద్ధానికి కదలిరాలేవు. పట్టణం గోడలకు నీవు ఒక్క దిబ్బను కూడ కట్టలేవు.
ISA 37:34 నీవు వచ్చిన దారినే నీ దేశానికి తిరిగి వెళ్లిపోతావు. నీవు ఈ పట్టణర లో ప్రవేశించవు. ఈ సందేశం యెహోవా దగ్గర్నుండి వచ్చింది.
ISA 37:35 ఈ పట్టణాన్ని నేను కాపాడి, రక్షిస్తాను. నా కోసమూ, నా సేవకుడు దావీదు కోసమూ నేను దీనిని చేస్తాను.”
ISA 37:36 కనుక యెహోవా దూత వెళ్లి, అష్షూరి వారి బసలో ఒక లక్ష ఎనభై అయిదు వేలమంది మనుష్యులను చంపేశాడు. మర్నాడు ఉదయం మనుష్యులు లేచి చూడగా, వారి చుట్టూ చచ్చిన శవాలే. వారికి కనబడ్డాయి.
ISA 37:37 కనుక అష్షూరు రాజు నీనెవెకు తిరిగి వెళ్లి అక్కడే ఉండిపోయాడు.
ISA 37:38 ఒక రోజు సన్హెరీబు అతని దేవుడు నిస్రోను గుడిలో పూజిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతని ఇద్దరు కుమారులు, అద్రమ్మెలెకు, షెరెజెరు కత్తితో అతనిని చంపేశారు. తర్వాత ఆ కుమారులు అరారాతుకు పారిపోయారు. అందుచేత సన్హెరీబు కుమారుడు ఎసర్హద్దోను అష్షూరుకు కొత్త రాజు అయ్యాడు.
ISA 38:1 ఆ కాలంలో హిజ్కియాకు జబ్బు చేసింది. అతనికి దాదాపు మరణ పరిస్థితి ఏర్పడింది. ఆమోజు కుమారుడు యెషయా ప్రవక్త అతన్ని చూడటానికి వెళ్లాడు. “నేను ఈ సంగతులు నీతో చెప్పాలని యెహోవా నాకు చెప్పాడు. ‘త్వరలోనే నీవు మరణిస్తావు. కనుక నీవు చనిపోయినప్పుడు నీ కుటుంబం వారు ఏం చేయాలో నీవు వారితో చెప్పాలి. నీవు మళ్లీ బాగుపడవు’ అని యెషయా రాజుతో చెప్పాడు.”
ISA 38:2 హిజ్కియా దేవాలయపు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అతడు చెప్పాడు,
ISA 38:3 “యెహోవా, నేను నీ యెదుట ఎల్లప్పుడూ నమ్మకమైన పవిత్ర హృదయంతో జీవించానని దయచేసి జ్ఞాపకం చేసికొనుము. నీవు మంచివి అనే పనులే నేను చేశాను.” తర్వాత హిజ్కియా గట్టిగా ఏడ్వటం మొదలు బెట్టాడు.
ISA 38:4 యెహోవా దగ్గర్నుండి యెషయా ఈ సందేశాన్ని స్వీకరించాడు;
ISA 38:5 “హిజ్కియా దగ్గరకు వెళ్లి అతనితో చెప్పు, నీ పూర్వీకుడైన దావీదు దేవుడు, యెహోవా చెప్పే సంగతులు ఇవి, ‘నీ ప్రార్థనలు నేను విన్నాను, నీ దుఃఖపు కన్నీళ్లు నేను చూశాను. నేను నీ ఆయుష్షు పదిహేను సంవత్సరాలు ఎక్కువ చేస్తాను.
ISA 38:6 అష్షూరు రాజు నుండి నిన్ను నేను కాపాడుతాను. నిన్ను, ఈ పట్టణాన్ని నేను రక్షిస్తాను.’”
ISA 38:7 యెహోవా చెప్పిన వాటిని చేస్తాడని నీకు చూపించేందుకు యిదే సంకేతం.
ISA 38:8 “చూడు, ఆహాజు మెట్ల మీద ఉన్న నీడను పది అడుగులు వెనుకకు వెళ్లేటట్టు నేను చేస్తున్నాను. దిగిపోయిన సూర్యుని నీడ పది అడుగులు వెనుకకు వెళ్తుంది.”
ISA 38:9 హిజ్కియా రోగమునుండి స్వస్థత పొంది నప్పుడు వ్రాసిన ఉత్తరం:
ISA 38:10 నేను వృద్ధుడనయ్యేంత వరకు బతుకుతానని నాలో నేను అనుకొన్నాను. కానీ నేను పాతాళ ద్వారాలగుండా వెళ్లాల్సిన సమయం అది. ఇప్పుడు నేను నా సమయమంతా అక్కడే గడపాలి.
ISA 38:11 కనుక నేను చెప్పాను: “సజీవుల దేశంలో ప్రభువైన యెహోవాను నేను మరల చూడను. భూమిమీద మనుష్యులు జీవించుట నేను మరలచూడను.
ISA 38:12 నా ఇల్లు, నా గొర్రెల కాపరి గుడారంలాగి వేయబడి నానుండి తీసివేయబడుతుంది. మగ్గమునుండి ఒకడు బట్టను చుట్టి కత్తిరించినట్టు నా పని అయిపోయింది. ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొనివచ్చావు.
ISA 38:13 రాత్రి అంతా నేను సింహంలా గట్టిగా అరిచాను. అయితే సింహం ఎముకలు నమిలినట్టు నా ఆశలు అణగ దొక్కబడ్డాయి. ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చావు.
ISA 38:14 నేను గువ్వలా మూల్గాను. నేను పక్షిలా ఏడ్చాను. నా కళ్లు క్షిణించాయి కానీ నేను ఆకాశం తట్టు చూస్తూనే ఉన్నాను. నా ప్రభువా, నాకు కష్టాలు ఉన్నాయి. నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుము.”
ISA 38:15 నేనేం చెప్పగలను? జరిగేదేమిటో నా ప్రభువా నాకు చెప్పాడు. నా యజమాని దానిని జరిగిస్తాడు. నా ఆత్మలో నాకు ఈ కష్టాలు కలిగాయి. కనుక ఇప్పుడు నేను జీవితాంతం దీనుడనుగా ఉంటాను.
ISA 38:16 నా ప్రభూ, నా ఆత్మ మరల జీవించేట్టుగా ఈ కష్ట సమయాన్ని ఉపయోగించు నా ఆత్మ బలపడి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేయుము. నేను బాగుపడేందుకు సహాయం చేయి. మరల జీవించేందుకు నాకు సహాయం చేయుము.
ISA 38:17 చూడండి, నా కష్టాలు తొలగి పోయాయి. ఇప్పుడు నాకు శాంతి ఉంది. నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు. నీవు నన్ను సమాధిలో మురిగి పోనివ్వలేదు. నీవు నా పాపాలన్నీ క్షమించావు. నీవు నా పాపాలను దూరంగా పారవేశావు.
ISA 38:18 చచ్చినవాళ్లు నీకు స్తుతులు పాడరు. పాతాళంలోని ప్రజలు నిన్ను స్తుతించరు. చచ్చినవాళ్లు సహాయం కోసం నిన్ను నమ్ముకోరు వారు భూగర్భంలోనికి వెళ్తారు, మరల ఎన్నటికీ మాట్లాడరు.
ISA 38:19 నేడు నాలాగే బతికి ఉన్న మనుష్యులే నిన్ను స్తుతించేవారు. నీవు నమ్మదగిన వాడవని ఒక తండ్రి తన పిల్లలతో చెప్పాలి.
ISA 38:20 కనుక నేను అంటాను: “యెహోవా నన్ను రక్షించాడు కనుక మా జీవిత కాలమంతా మేము యెహోవా ఆలయంలో పాటలు పాడి, వాయిద్యాలు వాయిస్తాం.”
ISA 38:21 అప్పుడు యెషయా, “నీవు అంజూరపు పండ్లను దంచి, నీ పుండ్ల మీద వేయాలి, అప్పుడు, నీవు స్వస్థపడతావు” అని హిజ్కియాతో చెప్పాడు.
ISA 38:22 కానీ హిజ్కియా, “నేను బాగవుతానని రుజువు చేసేందుకు యెహోవా దగ్గర్నుండి వచ్చే గురుతు ఏమిటి? నేను యెహోవా మందిరానికి వెళ్ల గలుగుతానని రుజువుచేసే సంకేతం ఏమిటి?” అని యెషయాను అడిగాడు.
ISA 39:1 ఆ కాలంలో బలదాను కుమారుడు మెరోద క్బలదాను బబలోనుకు రాజు. మెరోదక్ ఉత్తరాలు, కానుకలు హిజ్కియాకు పంపించాడు. హిజ్కియా జబ్బుపడి బాగయ్యాడని విన్నందువల్ల మెరోదక్ కానుకలు పంపించాడు.
ISA 39:2 ఈ కానుకలు హిజ్కియాకు చాలా సంతోషం కలిగించాయి. అందుచేత హిజ్కియా, మెరోదక్ మనుష్యులను తన రాజ్యంలోని ప్రత్యేక వస్తువులను చూడనిచ్చాడు. తన సకల ఐశ్వర్యాలు, వెండి, బంగారం, ఖరీదైన తైలాలు, పరిమళాలు ఆ మనుష్యులకు హిజ్కియా చూపించాడు. యుద్ధంలో ఉపయోగించే కత్తులు, డాళ్లు హిజ్కియా చూపించాడు. హిజ్కియా దాచి ఉంచినవన్నీ వారికి చూపించాడు. తన ఇంట్లో, రాజ్యంలో ఉన్నవి అన్నీ హిజ్కియా వారికి చూపించాడు.
ISA 39:3 ప్రవక్త యెషయా, హిజ్కియా దగ్గరకు వెళ్లి, “ఈ మనుష్యులు ఏమన్నారు? వాళ్లు ఎక్కడ్నుంచి వచ్చారు?”అని అతన్ని అడిగాడు. “ఈ మనుష్యులు చాలా దూరదేశం నుండి నా దగ్గరకు వచ్చారు. ఈ మనుష్యులు బబలోను నుండి వచ్చారు.” అని హిజ్కియా చెప్పాడు.
ISA 39:4 కనుక యెషయా, “నీ రాజ్యంలో వాళ్లు ఏమి చూశారు?” అని అతణ్ణి అడిగాడు. “నా రాజభవనంలో సమస్తమూ వాళ్లు చూశారు. నా ఐశ్వర్యాలన్నీ నేను వారికి చూపించాను” అని చెప్పాడు హిజ్కియా.
ISA 39:5 హిజ్కియాతో యెషయా ఇలా చెప్పాడు: “సర్వ శక్తిమంతుడైన యెహోవా మాటలు ఆలకించు.
ISA 39:6 భవిష్యత్తులో, నీకు ఉన్నదంతా బబలోనుకు తీసుకొని పోబడుతుంది. ధనం అంతా తీసుకొని పోబడుతుంది. ఏమీ విడువబడదు. సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు ఇది.
ISA 39:7 బబలోను రాజు నీ కుమారులను నీనుండి పుట్టే కుమారులను తీసుకొని పోతాడు. నీ కుమారులు బబలోను రాజభవనంలో అధికారులు అవుతారు.”
ISA 39:8 హిజ్కియా, “యెహోవానుండి వచ్చిన ఈ మాటలు వినుటకు నాకు ఇంపుగా ఉన్నాయి” అని యెషయాతో చెప్పాడు. (“నేను రాజుగా ఉన్నంత వరకు కష్టం ఏమీ ఉండదు, శాంతి ఉంటుంది” అనుకొన్నందువల్ల హిజ్కియా ఇలా చెప్పాడు.)
ISA 40:1 మీ దేవుడు చెబతున్నాడు, “ఆదరించండి, నా ప్రజలను ఆదరించండి!
ISA 40:2 యెరూషలేముతో దయగా మాట్లాడండి. ‘నీ సేవాసమయం అయిపోయింది నీ పాపాలకు విలువ నీవు చెల్లించావు’ అని యెరూషలేముతో చెప్పండి యెరూషలేము చేసిన ప్రతి పాపానికి రెండేసి సార్లు యెహోవా యెరూషలేమును శిక్షించాడు.”
ISA 40:3 వినండి! ఒక మనిషి గట్టిగా ఎడారిలో బోధిస్తున్న శబ్దం మీరు వినగలరు. “యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి. ఎడారిలో మన దేవుని కోసం తిన్ననిదైన ఒక రాజమార్గాన్ని వేయండి. కరకు సమనేలగా చేయండి.
ISA 40:4 ప్రతి లోయనూ పూడ్చండి ప్రతి పర్వతాన్ని కొండను చదును చేయండి. వంకర మార్గాలను చక్కగా చేయండి. కరకు నేలను సమనేలగా చేయండి.
ISA 40:5 అప్పుడు యెహోవా మహిమ కనబడుతుంది మనుష్యులందరూ కలిసి యెహోవా మహిమను చూస్తారు. సాక్షాత్తూ యెహోవాయే ఈ సంగతులు చెప్పాడు కనుక ఇది జరుగుతుంది.”
ISA 40:6 ఒక స్వరం పలికింది, “మాట్లాడు” అని. కనుక ఆ మనిషి అన్నాడు, “నేనేమి చెప్పను?” ఆ స్వరం అంది, “ఇలా చెప్పు: మనుష్యులు అందరూ గడ్డిలా ఉన్నారు. మనుష్యుల మంచి తనం కొత్త గడ్డి పరకలా ఉంది.
ISA 40:7 యెహోవా నుండి ఒక బలమైన గాలి గడ్డిమీద వీస్తుంది. ఆ గడ్డి ఎండిపోయి, చస్తుంది. సత్యం ఏమిటంటే: మనుష్యులంతా గడ్డి.
ISA 40:8 గడ్డి చచ్చిపోయి ఎండిపోతుంది. కానీ మన దేవుని మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.”
ISA 40:9 సీ యోనూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది. ఎత్తయిన పర్వతం మీదకు ఎక్కి గట్టిగా ప్రకటించు. యెరూషలేమూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది. భయపడవద్దు. గట్టిగా మాట్లాడు. యూదా పట్టణాలన్నింటికి ఈ విషయాలు చెప్పు: “చూడు, ఇదిగో మీ దేవుడు!
ISA 40:10 చూడు, యెహోవా, నా ప్రభువు శక్తితో వస్తున్నాడు. మనుష్యులందరినీ పాలించుటకు ఆయన తన శక్తిని ప్రయోగిస్తాడు. యెహోవా తన ప్రజలకు ప్రతిఫలం తెస్తాడు. వారి జీతం యెహోవా దగ్గర ఉర ది
ISA 40:11 గొర్రెల కాపరి తన గొర్రెలను నడిపించినట్టు యెహోవా తన ప్రజలను నడిపిస్తాడు. యెహోవా తన హస్తాన్ని (శక్తిని) ఉపయోగించి తన గొర్రెలను ఒక చోట చేరుస్తాడు. గొర్రెపిల్లలను యెహోవా పట్టుకొని వాటిని ఆయన తన చేతుల్లో ఎత్తుకొంటాడు. వాటి తల్లులు ఆయన చెంత నడుస్తాయి.”
ISA 40:12 మహా సముద్రాలను తన పిడికిటిలో కొలిచింది ఎవరు? ఆకాశాన్ని కొలిచేందుకు తన చేతిని ఉపయోగించింది ఎవరు? భూమిమీద ధూళి అంతటినీ కొలి చేందుకు పాత్రను ఉపయోగించింది ఎవరు? పర్వతాలను, కొండలను తూకం వేసేందుకు త్రాసులను ఉపయోగించింది ఎవరు? యెహోవాయే.
ISA 40:13 యెహోవా చేయాల్సింది ఏమిటో ఆయన ఆత్మకు ఎవరూ చెప్పలేదు. యెహోవా చేసిన వాటిని ఎలా చేయాలో ఆయనకు చెప్పిన వారెవరూ లేరు.
ISA 40:14 యెహోవా ఎవరి సహాయమైనా అడిగాడా? న్యాయంగా ఉండటం ఎలా అనేది ఎవరైనా యెహోవాకు నేర్పించారా? యెహోవాకు ఎవరైనా తెలివిని ఉపదేశించారా? యెహోవా జ్ఞానాన్ని వినియోగించటం ఆయనకు ఎవరైనా నేర్పించారా? లేదు. ఇవన్నీ యెహోవాకు ముందే తెలుసు.
ISA 40:15 చూడండి, యెహోవా లోకంలో రాజ్యాలన్నీ ఒక చిన్న భాగమే. రాజ్యాలు చేదలోనుంచి జారే ఒక బొట్టు వంటివి. దూర దేశాలన్నింటినీ యెహోవా తీసుకొని ఆయన వాటిని తన త్రాసులో వేస్తే అవి చిన్న ధూళి కణాల్లా ఉంటాయి.
ISA 40:16 యెహోవాకు సమిధలుగా లెబానోను చెట్లన్నీ చాలవు. లెబానోను జంతువులన్నీ యెహోవాకు బలి అర్పణగా చాలవు.
ISA 40:17 లోక రాజ్యాలన్నింటినీ దేవునితో నీవు పోలిస్తే రాజ్యాలు శూన్యం దేవునితో పోలిస్తే రాజ్యాలన్నీ కలిసి ఏ మాత్రం విలువ చేయవు.
ISA 40:18 నీవు దేనినైనా దేవునితో పోల్చగలవా? లేదు నీవు దేవుని పటము చేయగలవా? లేదు.
ISA 40:19 కానీ కొందరు మనుష్యులు బండనుండి చెక్కనుండి విగ్రహాలు చేసి వాటికి దేవుళ్లని పేరుపెడుతున్నారు. ఒక పనివాడు ఒక విగ్రహం చేస్తాడు. బంగారం పనివాడు ఆ విగ్రహానికి బంగారం పూత పూస్తాడు. అప్పుడు అతడు ఆ విగ్రహానికి వెండి గొలుసులు చేస్తాడు.
ISA 40:20 పేదవాడు ఖరీదైన ఆ విగ్రహాలు కొనలేడు. కనుక పేదవాడు కుళ్లిపోని ఒక చెట్టును చూస్తాడు. తర్వాత ఒక మనిషికి డబ్బిచ్చి దానిమీద ఒక దేవుని బొమ్మ చెక్కిస్తాడు. అదీ, పేదవాని దేవుడు. మరి ఆ “దేవుడు” కనీసం కదలడు.
ISA 40:21 తప్పకుండా సత్యం నీకు తెలుసు కదూ? తప్పక అది నీవు విన్నావు. ఆదిలోనే ఎవరో ఒకరు నీతో సత్యం చెప్పారు. భూమిని చేసింది ఎవరో తప్పక నీకు తెలుసు.
ISA 40:22 నిజమైన దేవుడు భూగోళానికి పైగా కూర్చుని ఉంటాడు. ఆయనతో పోల్చి చూస్తే మనుష్యులు మిడతల్లా ఉంటారు. ఆయన ఆకాశాలను బట్ట తెరచినట్టు తెరిచాడు. ఆయన ఆకాశాలను ఒక గుడారంలా దాని కింద కూర్చునేందుకు పరిచాడు.
ISA 40:23 నిజమైన దేవుడు పరిపాలకులను పాము ఖ్యత లేనివారినిగా చేస్తాడు. ఆయన ఈ లోకపు న్యాయ మూర్తులను పూర్తిగా నిష్ప్రయోజకులనుగా చేస్తాడు.
ISA 40:24 ఆ పరిపాలకులు మొక్కల్లా ఉన్నారు వారు భూమిలో నాటబడ్డారు కానీ వారు నేలలో వేరు తన్నుకొనక ముందే దేవుడు ఆ మొక్కల మీద గాలి విసరజేస్తాడు. దాంతో అవి చచ్చి, ఎండి పోతాయి. గాలి వాటిని గడ్డి పరకల్లా కొట్టుకొని పోజేస్తుంది.
ISA 40:25 పరిశుద్ధుడు (దేవుడు) చెబతున్నాడు: “నన్ను నీవు ఎవరితోనైనా పోల్చగలవా? లేదు. నాకు ఎవరు సమానం కాదు.”
ISA 40:26 పైన ఆకాశాలను చూడు ఆ నక్షత్రాలన్నింటినీ ఎవరు సృష్టించారు? ఆకాశంలోని ఆ “సైన్యాలు” అన్నింటిని ఎవరు సృష్టించారు? ప్రతి నక్షత్రం దాని పేరుతో సహా ఎవరికి తెలుసు? సత్యవంతుడైన దేవుడు చాలా బలం, శక్తి గలవాడు, అందుచేత ఈ నక్షత్రాల్లో ఒక్కటి కూడ తప్పిపోదు.
ISA 40:27 యాకోబూ, ఇది నిజం! ఇశ్రాయేలూ, దీనిని నీవు నమ్మాలి! “నేను జీవించే విధము యెహోవా చూడలేదు దేవుడు నన్ను కనుగొని శిక్షించాడు అని నీవెందుకు చెపుతున్నావు?”
ISA 40:28 యెహోవా అలసిపోడు, ఆయనకు విశ్రాంతి అవసరంలేదు. భూమిమీద దూర స్థలాలన్నింటినీ యెహోవాయే సృష్టించాడు యెహోవా నిత్యమూ జీవిస్తాడు.
ISA 40:29 బలహీనులు బలంగా ఉండేటట్టు యెహోవా సహాయం చేస్తాడు. శక్తిలేని వాళ్లను ఆయన శక్తి మంతులుగా చేస్తాడు.
ISA 40:30 యువకులు అలసిపోతారు, వారికి విశ్రాంతి కావాలి. చివరికి బాలురు కూడ తొట్రిల్లి, పడిపోతారు.
ISA 40:31 కాని యెహోవా మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడే మనుష్యులు తిరిగి బలంగల వాళ్లవుతారు. అది వారు పక్షి రాజులా రెక్కలు కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. వారు విశ్రాంతి అవసరం లేకుండా పరుగుల మీద పరుగులు తీస్తూ ఉంటారు. వారు అలసి పోకుండా నడుస్తారు.
ISA 41:1 యెహోవా చెబతున్నాడు: “దూర దేశాల్లారా, మౌనంగా ఉండి నా దగ్గరకు రండి. దేశాల్లారా ధైర్యంగా ఉండండి. నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. మనం కలిసికొందాం. ఎవరిదిసరియైనదో నిర్ణయించేద్దాం.
ISA 41:2 ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి: తూర్పునుండి వస్తోన్న ఆ మనిషిని మేల్లొలిపింది ఎవరు? మంచితనం నాతో కూడ నడుస్తుంది. అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను ఓడిస్తాడు. వారు ధూళి అవుతారు. అతడు తన విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు. వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టులా పారిపోతారు.
ISA 41:3 అతడు సైన్యాలను తరుముతాడు, ఎన్నడూ బాధనొందడు. అతడు అంతకు ముందు ఎన్నడూ వెళ్లని స్థలాలకు వెళ్తాడు.
ISA 41:4 ఈ సంగతులు జరిగేట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు చేశారు? ఆదినుండి మనుష్యులందరినీ పిలిచింది ఎవరు? యెహోవాను నేనే ఈ సంగతులను చేశాను. యెహోవా నేనే మొట్ట మొదటి వాడ్ని ఆరంభానికి ముందే నేను ఇక్కడ ఉన్నాను. అన్నీ ముగింపు అయన తర్వాత కూడ నేను ఇక్కడ ఉంటాను.
ISA 41:5 దూర దూర స్థలాలూ మీరంతా చూచి భయపడండి. భూమ్మీద దూరంగా ఉన్న స్థలాలూ మీరంతా భయంతో వణకండి. మీరంతా దగ్గరగా రండి, నా మాటలు వినండి.
ISA 41:6 “పనివాళ్లూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకొంటారు. ఒకరిని ఒకరు బలపర్చుకొంటారు.
ISA 41:7 ఒక పనివాడు ఒక విగ్రహం చేసేందుకు కర్ర కోస్తాడు. ఆ వ్యక్తి కంసాలికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మరో మనిషి సుత్తెతో లోహాన్ని మెత్తగా చేస్తాడు. అప్పుడు ఆ పనివాడు దాగలితో పని చేసేవాడ్ని ప్రోత్సహిస్తాడు. ‘ఈ పని బాగుంది, లోహం ఊడిపోదు’ అంటాడు ఈ చివరి పనివాడు. అందుచేత అతడు ఆ విగ్రహాన్ని ఒక పీటకు మేకులతో బిగిస్తాడు. విగ్రహం పడిపోదు. అది ఎప్పటికీ కదలదు.”
ISA 41:8 యెహోవా చెబతున్నాడు: “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి యాకోబూ, నిన్ను నేను ఏర్పరచుకొన్నాను. నీవు అబ్రాహాము వంశంవాడివి. అబ్రాహామును నేను ప్రేమించాను.
ISA 41:9 భూమిమీద నీవు చాలా దూరంగా ఉన్నావు. నీవు చాలా దూర దేశంలో ఉన్నావు. అయితే నేను నిన్ను పిలిచి, నీవు నా సేవకుడివి. నేను నిన్ను ఏర్పరచుకొన్నాను. నేను నీకు విరోధంగా తిరుగలేదు అని చెప్పాను.
ISA 41:10 దిగులుపడకు, నేను నీతో ఉన్నాను. భయపడకు, నేను నీ దేవుణ్ణి. నేను నిన్ను బలంగా చేశాను. నేను నీకు సహాయం చేస్తాను. నేను మంచితనపు కుడిహస్తంతో నిన్ను బలపరుస్తాను.
ISA 41:11 చూడు, కొంతమంది మనుష్యులు నీ మీద కోపంగా ఉన్నారు. కానీ వాళ్లు సిగ్గుపడతారు. నీ శత్రువులు అదృశ్యమై నశిస్తారు.
ISA 41:12 నీ విరోధుల కోసం నీవు వెదకుతావు. కానీ నీవు వారిని కనుగొనలేవు. నీకు విరోధంగా యుద్ధం చేసినవాళ్లు పూర్తిగా కనబడకుండా పోతారు.
ISA 41:13 నేను యెహోవాను, నీ దేవుణ్ణి నేను నీ కుడిచేయి పట్టుకొన్నాను. నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను. అని నేను నీతో చెబతున్నాను.
ISA 41:14 పశస్తమైన యూదా, భయపడకు ప్రియమైన నా ఇశ్రాయేలు ప్రజలారా భయపడవద్దు. నిజంగా నేను మీకు సహాయం చేస్తాను.” సాక్షాత్తూ యెహోవాయే ఆ మాటలు చెప్పాడు. “ఇశ్రాయేలు పరిశుద్ధుడు (దేవుడు), నిన్ను రక్షించేవాడు ఈ సంగతులు చెప్పాడు:
ISA 41:15 చూడు, నిన్ను నేను ఒక కొత్త నూర్పిడి చెక్కగా చేశాను. ఈ పనిముట్టుకు పదునైన పండ్లు చాలా ఉన్నాయి. ధాన్యపు గింజల గుల్లలు పగులగొట్టుటకు రైతులు దీనిని ఉపయోగిస్తారు. నీవు పర్వతాలను అణగ దొక్కి, చితుక గొడ్తావు. కొండలను నీవు పొట్టులా చేస్తావు.
ISA 41:16 వాటిని గాలిలో విసిరివేస్తావు. గాలి దానిని విసరి, చెదరగొడ్తుంది. అప్పుడు నీవు యెహోవాయందు సంతోషంగా ఉంటావు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) గూర్చి నీవు ఎంతగానో అతిశయిస్తావు.
ISA 41:17 “పేదలు, అక్కరలో ఉన్నవారు నీళ్లకోసం వెదకుతారు. కానీ వారికి ఏమీ దొరకవు. వారు దాహంతో ఉన్నారు. వారి నాలుకలు పిడచకట్టాయి. నేను వారి ప్రార్థనలకు జవాబిస్తాను. నేను వాళ్లను విడువను, చావనివ్వను.
ISA 41:18 ఎండిపోయిన కొండల మీద నేను నదులను ప్రవహింపజేస్తాను. లోయలో నీటి ఊటలను నేను ప్రవహింపజేస్తాను. అరణ్యాన్ని నీటి సరసుగా నేను చేస్తాను. ఎండిన భూములలో నీటి బుగ్గలు ఉబకుతాయి.
ISA 41:19 అరణ్యంలో వృక్షాలు పెరుగుతాయి. దేవదారు వృక్షాలు, తుమ్మ చెట్లు గొంజి చెట్లు, తైలవృక్షాలు తమాల వృక్షాలు, సరళ వృక్షాలు అక్కడ ఉంటాయి.
ISA 41:20 ఈ సంగతులు జరగడం ప్రజలు చూస్తారు. యెహోవా శక్తిచేత ఇవి జరిగాయని వారు తెలుసుకొంటారు. ప్రజలు ఈ సంగతులు చూస్తారు. వారు గ్రహించటం మొదలుబెడతారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు (దేవుడు) ఈ సంగతులను చేసినట్టు వారు తెలుసుకొంటారు.”
ISA 41:21 యాకోబు రాజు, యెహోవా చెబతున్నాడు: “రండి మీ వివాదాలు నాతో చెప్పండి. మీ రుజువులు చూపించండి, సరియైన విధంగా మనం నిర్ణయంచేద్దాం.
ISA 41:22 జరుగుతోన్న వాటిని గూర్చి, మీ విగ్రహాలు (అబద్ధపు దేవతలు) వచ్చి మాతో చెప్పాలి. మొదట్లో ఏమి జరిగింది? భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? మాతో చెప్పండి. మేమి జాగ్రత్తగా వింటాం. అప్పుడు తర్వాత ఏము జరుగుతుంది అనేది మాకు తెలుస్తుంది.
ISA 41:23 ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు గాను మేము ఎదురు చూడాల్సిన వాటిని గూర్చి చెప్పండి. అప్పుడు మీరు నిజంగానే దేవుళ్లు అని మేము నమ్ముతాం. ఏదో ఒకటి చేయండి. ఏదైనా సరే మంచిగాని చెడుగాని చేయండి. అప్పుడు మీరు బతికే ఉన్నారని మాకు తెలుస్తుంది. మేము మిమ్మల్ని వెంబడించగలుగుతాం.
ISA 41:24 “చూడండి, తప్పుడు దేవుళ్లారా, మీరు శూన్యం కంటె తక్కువ. మీరు ఏమీ చేయలేరు. ఉత్త పనికి మాలిన మనిషి మాత్రమే మిమ్మల్ని పూజించాలను కొంటాడు.”
ISA 41:25 “ఉత్తరాన నేను ఒక మనిషిని మేల్కొపాను. సూర్యోదయమయ్యే తూర్పు దిశనుండి అతడు వస్తున్నాడు. అతడు నా నామాన్ని ఆరాధిస్తాడు. కుమ్మరి మట్టి ముద్దను తొక్కుతాడు. అదే విధంగా ఈ ప్రత్యేక మనిషి రాజులను అణగదొక్కుతాడు.
ISA 41:26 “ఇది జరుగక ముందే దీనినిగూర్చి మాతో ఎవరు చెప్పారు? ఆయన్ను మనం దేవుడు అని పిలవాలి. మీ విగ్రహాల్లో ఒకటి ఈ సంగతులను మాకు చెప్పిందా? లేదు. ఆ విగ్రహాల్లో ఏదీ మాకేమీ చెప్పలేదు. ఆ విగ్రహాలు ఒక్క మాట కూడ చెప్పలేదు. మరియు మీరు చెప్పే ఒక్క మాట కూడ ఆ అబద్ధపు దేవుళ్ళు వినలేవు.
ISA 41:27 ఈ విషయాలను గూర్చి యెహోవాను, నేనే మొట్టమొదట సీయోనుకు చెప్పాను. ‘చూడండి, మీ ప్రజలు తిరిగి వస్తున్నారు’ అనే ఒక సందేశం ఇచ్చి ఒక సందేశహరుని యెరూషలేముకు నేను పంపించాను.”
ISA 41:28 ఆ తప్పుడు దేవుళ్లను నేను చూశాను. వారిలో ఎవరూ ఏమీ చెప్పగల తెలివి లేనివాళ్లు. వాళ్లను నేను ప్రశ్నలు అడిగాను. కానీ వారు ఒక్క మాట కూడా పలుకలేదు.
ISA 41:29 ఆ దేవుళ్లంతా శూన్యంకంటె తక్కువ. వాళ్లు ఏమీ చేయలేరు. ఆ విగ్రహాలు బొత్తిగా పనికి మాలినవి.
ISA 42:1 “నా సేవకుణ్ణి చూడండి! నేను అతన్ని బలపరుస్తాను. నేను ఏర్పరచుకొన్నవాడు అతడే. అతని గూర్చి నేను ఎంతో ఆనందిస్తున్నాను. నా ఆత్మను నేను అతనిలో ఉంచాను. జనాలన్నింటికి అతడు న్యాయం చేకూరుస్తాడు.
ISA 42:2 అతడు వీధుల్లో కేకలు వేయడు అతడు గట్టిగా అరిచి శబ్దం చేయడు.
ISA 42:3 అతడు సౌమ్యుడు అతడు నలిగిన గడ్డిపరకను గూడ విరువడు. మిణుకు మిణుకు మంటున్న మంటనుగూడ అతడు ఆర్పడు. అతడు న్యాయాన్ని ప్రయోగించి ఏది సత్యమో తెలుసుకొంటాడు.
ISA 42:4 లోకానికి న్యాయం చేకూర్చేవరకు అతడు బలహీనం కాడు, నలిగిపోడు. దూర స్థలాల్లోని ప్రజలు అతని ఉపదేశాలను విశ్వాసిస్తారు.”
ISA 42:5 యెహోవా, సత్యదేవుడు ఈ సంగతులు చెప్పాడు: (ఆకాశాలను యెహోవా చేశాడు. ఆకాశాలను భూమిమీద విస్తరింపజేసినవాడు యెహోవా. ఆయనే భూమిమీద సమస్తం చేసాడు. భూమిమీద మనుష్యులందరికి ఆయనే జీవం ప్రసాదిస్తాడు. భూమిమీద నడిచే ప్రతి వ్యక్తికి ఆయనే ప్రాణం పోస్తాడు.)
ISA 42:6 “మీరు సరైనది చేయాలని నిన్ను పిలిచింది నేనే, యెహోవాను. నేను నీ చేయి పట్టుకొంటాను. నేను నిన్ను కాపాడుతాను. ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది. అని తెలియజేసేందుకు నీవే ఒక సంకేతం నీవు ప్రజలందరి కోసం ప్రకాశించే వెలుగుగా ఉంటావు.
ISA 42:7 గుడ్డివాళ్ల కళ్లు నీవు తెరుస్తావు. వాళ్లు చూడగలుగుతారు. అనేక మంది ప్రజలు చెరలో ఉన్నారు. ఆ ప్రజలను నీవు విడుదల చేస్తావు. అనేక మంది ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. ఆ బందీ గృహంనుండి నీవు వారిని బయటకు నడిపిస్తావు.
ISA 42:8 “నేను యెహోవాను. నా పేరు యెహోవా నేను నా మహిమను మరొకరికి ఇవ్వను. నాకు చెందాల్సిన స్తుతిని విగ్రహాలను (అబద్ధపు దేవుళ్ళను) తీసుకోనివ్వను.
ISA 42:9 కొన్ని సంగతులు జరుగుతాయని మొదట్లోనే నేను చెప్పాను, ఆ సంగతులు జరిగాయి. ఇప్పుడు, భవిష్యత్తులో జరుగబోయే సంగతులను గూర్చి, అవి జరుగక ముందే నేను మీకు వాటిని గూర్చి చెబతాను.”
ISA 42:10 యెహోవాకు కొత్త కీర్తన పాడండి. భూమి మీద చాలా దూరంలో ఉన్న సర్వ ప్రజలారా, సముద్రాల్లో ప్రయాణం చేసే సర్వ ప్రజలారా, మహా సముద్రాల్లోని సర్వ ప్రాణులారా, దూర స్థలాల్లో ఉన్న సర్వ ప్రజలారా యెహోవాను స్తుతించండి!
ISA 42:11 అరణ్యాలు, పట్టణాలు కేదారు పొలాలు యెహోవా స్తుతించండి సెలా నివాసులారా ఆనందంగా పాడండి. మీ పర్వత శిఖరం మీదనుండి పాడండి.
ISA 42:12 యెహోవాకు మహిమ ఆపాదించండి. దూర దేశాల్లోని ప్రజలంతా ఆయనను స్తుతించాలి.
ISA 42:13 యెహోవా ఒక పరాక్రమ సైనికునిలా బయలుదేరుతున్నాడు. ఆయన యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న వానిలా ఉంటాడు. ఆయన చాలా ఉర్రూతలూగుతూంటాడు. ఆయన గట్టిగా కేకలు వేసి అరుస్తాడు. ఆయన తన శత్రువులను ఓడిస్తాడు.
ISA 42:14 “చాలా కాలంగా నేను మౌనంగా ఉన్నాను. నేను అలానే మౌనంగా ఉండి, నన్ను నేను నిగ్రహించుకొన్నాను. కానీ ఇప్పుడు శిశువును కంటున్న స్త్రీలా నేను గట్టిగా అరుస్తాను. నేను కఠినంగా, గట్టిగా ఊపిరి పీలుస్తాను.
ISA 42:15 కొండలను, పర్వతాలను నేను నాశనం చేస్తాను. అక్కడ మొలిచే మొక్కలన్నింటిని నేను ఎండిపోయేట్టు చేస్తాను. నదులను నేను పొడి నేలగా చేస్తాను. నీటి మడుగులను నేను ఎండిపోయేట్టు చేస్తాను.
ISA 42:16 గుడ్డివారికి ఇదివరకు తెలియని మార్గంలో నేను వారిని నడిపిస్తాను ఆ గుడ్డివారు ఇదివరకు ఎన్నడూ తిరుగని బాటలలో నేను వారిని నడిపిస్తాను. చీకటిని నేను వారికి వెలుగుగా చేస్తాను. కరకు నేలను నేను చదును చేస్తాను. నేను వాగ్దానం చేసే పనులను నేను చేస్తాను. నా ప్రజలను నేను విడువను.
ISA 42:17 కానీ కొంతమంది మనుష్యులు నన్ను వెంబడించటం మానివేశారు. బంగారపు పూత పూయబడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. ‘మీరే మా దేవుళ్లు’ అని వారు ఆ విగ్రహాలతో చెబతారు. ఆ ప్రజలు వారి అబద్ధపు దేవుళ్లను నమ్ముతారు. కానీ ఆ ప్రజలు నీరాశ చెందుతారు.”
ISA 42:18 “చెవిటి ప్రజలారా నా మాట వినాలి. గుడ్డి మనుష్యులారా మీరు కళ్లు తెరిచి, నన్ను చూడాలి.
ISA 42:19 ప్రపంచం అంతటిలోకెల్లా నా సేవకుడు ఎక్కువ గుడ్డివాడు. నేను ప్రపంచంలోకి పంపించిన నా సేవకుడు మహా చెవిటి. నేను ఒడంబడిక చేసు కొన్న ఆ వ్యక్తి యెహోవా సేవకుడు అందరికంటె మహా గుడ్డివాడు.
ISA 42:20 ఈ సేవకుడు తాను ఏమి చేయాలో అది చూడాలి. కానీ అతడు నాకు విధేయత చూపడం లేదు. అతడు తన చెవులతో వినగలడు. కానీ అతడు నా మాట వినుటకు నిరాకరిస్తున్నాడు.”
ISA 42:21 యెహోవా తన సేవకుని ఎడల న్యాయం చూపగోరుతున్నారు. కనుక అద్భుతమైన ఉపదేశాలను యెహోవా తన ప్రజలకు చేస్తాడు.
ISA 42:22 అయితే ప్రజలను చూడండి ఇతరులు వారిని ఓడించి, వారి దగ్గర దొంగిలించారు. యువకులంతా భయపడ్తున్నారు. వారు చెరలో బంధించబడ్డారు. మనుష్యులు వారి ధనం వారి దగ్గర్నుండి దోచుకొన్నారు. వారిని రక్షించేందుకు ఏ మనిషిలేడు. ఇతరులు వారి డబ్బు దోచుకొన్నారు. “దానిని తిరిగి ఇచ్చేయండి” అని చెప్పగల వాడు ఒక్కడూ లేడు.
ISA 42:23 మీలో ఎవరైనా దేవుని మాట విన్నారా? లేదు. కానీ మీరు ఆయన మాటలు జాగ్రత్తగా విని, జరిగిన దానిని గూర్చి ఆలోచించాలి.
ISA 42:24 యాకోబు, ఇశ్రాయేలునుండి ధనాన్ని దోచుకోనిచ్చింది ఎవరు? యెహోవాయే వారిని ఇలా చేయనిచ్చాడు. మనం యెహోవాకు విరోధంగా పాపం చేశాం. అందుచేత యెహోవా మన ధనాన్ని ఇతరులు దోచుకోనిచ్చాడు. యెహోవా కోరిన విధంగా జీవించటానికి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఉపదేశాలను వినిపించు కోలేదు.
ISA 42:25 అందుచేత యెహోవా వారిమీద కోపగించాడు. యెహోవా వారి మీదకు గొప్పయుద్ధాలు వచ్చేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు వారి చుట్టూరా అగ్ని ఉన్నట్టుగా ఉంది. కానీ జరుగుతోంది ఏమిటో వారికి తెలియలేదు. వారు కాలిపోతున్నట్టే ఉంది. కానీ జరుగుతోన్న సంగతులను గ్రహించేందుకు వారు ప్రయత్నించ లేదు.
ISA 43:1 యాకోబూ, యెహోవా నిన్ను సృష్టించాడు. ఇశ్రాయేలు, యెహోవా నిన్ను సృజించాడు. ఇప్పుడు యెహోవా చెబతున్నాడు: “భయపడవద్దు. నేను నిన్ను రక్షించాను. పేరుపెట్టి నిన్ను పిలిచాను. నీవు నా స్వంతం.
ISA 43:2 నీకు కష్టాలు వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు నదులు దాటి వెళ్లేటప్పుడు, అవి నీమీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యనడిచేటప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు.
ISA 43:3 ఎందుకంటే యెహోవానైన నేను నీకు దేవుడను గనుక, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేను మీకు రక్షకుణ్ణి గనుక. మీకు విలువగా చెల్లించేందుకు నేను ఈజిప్టును ఇచ్చాను. నిన్ను నా స్వంతం చేసుకొనేందుకు ఇథి యోపియాను, సెబాను నేను ఇచ్చాను.
ISA 43:4 నీవు నాకు ప్రియుడివి గనుక నేను నిన్ను ఘనపరుస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు బతుకునట్లు నీకు మనుష్యులనూ, నీకిష్టమైన జనాంగాలను నేను ఇచ్చివేస్తాను.”
ISA 43:5 “కనుక భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీ పిల్లలను సమకూర్చి వారిని నీ దగ్గరకు రప్పిస్తాను. తూర్పునుండి, పడమరనుండి నేను వారిని సమకూరుస్తాను.
ISA 43:6 నా మనుష్యుల్ని నాకు ఇచ్చివేయి అని నేను ఉత్తరానికి చెబతాను. నా మనుష్యుల్ని బందీలుగా చెరసాలలో ఉంచవద్దు అని నేను దక్షిణానికి చెబతాను. దూర దేశాలనుండి నా కుమారులను, కుమార్తెలను నా దగ్గరకు తీసుకొని రండి.
ISA 43:7 నా ప్రజలందరినీ, నీ నామం పెట్టబడిన మనుష్యులందరినీ నా దగ్గరకు తీసుకొని రండి. నేను వారిని నా కోసమే సృష్టించుకొన్నాను. వాళ్లను నేనే సృష్టించాను. వాళ్లు నావాళ్లు.”
ISA 43:8 “కళ్లుండి చూడలేని వాళ్లను బయటకు తీసుకొనిరండి. చెవులు ఉండి వినలేని వాళ్లను బయటకు తీసుకొని రండి.
ISA 43:9 ప్రజలందరూ, రాజ్యాలు అన్నీ సమావేశపర్చబడాలి. ఆదిలో జరిగిన దానిని గూర్చి వాళ్ల తప్పుడు దేవుళ్లలో ఎవరైనా వారితో చెప్పాలని కోరుతున్నారేమో, వారు వారి సాక్షులను తీసుకొని రావాలి. సాక్షులు సత్యం చెప్పాలి. వారిదే సరి అని ఇది తెలియజేస్తుంది.”
ISA 43:10 యెహోవా చెబతున్నాడు: “ప్రజలారా, మీరే నా సాక్షులు. నేను ఏర్పాటు చేసికొన్న ఆ సేవకులు మీరే. ప్రజలు నన్ను విశ్వసించుటకు వారికి మీరు సహాయం చేస్తారని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొన్నాను. ‘నేనే ఆయనను’ అని, నేనే సత్య దేవుడను అని మీరు గ్రహించాలని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నాకు ముందుగా ఏ దేవుడూ లేడు, నా తర్వాత ఏ దేవుడూ ఉండడు.
ISA 43:11 నా మట్టుకు నేనే యెహోవాను. నేను ఒక్కడనే రక్షకుడను, మరి ఎవరూలేరు.
ISA 43:12 మీతో మాట్లాడిన వాడను నేనే. నేనే మిమ్మల్ని రక్షించాను. ఆ సంగతులు నేనే మీకు చెప్పాను. మీతో ఉన్న ఎవరో కొత్తవాడు కాదు. మీరే నా సాక్షులు, నేనే దేవుడను.” సాక్షాత్తు యెహోవా చెప్పిన మాటలు ఇవి.
ISA 43:13 “నేను ఎల్లప్పుడూ దేవునిగానే ఉన్నాను. నేనేదైనా చేశాను అంటే నేను చేసిన దానిని ఎవరూ మార్చలేరు. నా శక్తి నుండి మనుష్యులను ఎవ్వరూ రక్షించలేరు.”
ISA 43:14 యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యెహోవా చెబతున్నాడు, “నేను మీ కోసం సైన్యాలను బబలోనుకు పంపిస్తాను. అనేక మంది ప్రజలు బంధించబడతారు. ఆ కల్దీయుల ప్రజలు వారి స్వంత పడవల్లోనే తీసుకొనిపోబడతారు. (కల్దీ ప్రజలకు ఆ పడవలను గూర్చి చాలా గర్వం)
ISA 43:15 నేను యెహోవాను, మీ పరిశుద్ధుడ్ని. ఇశ్రాయేలును నేను సృష్టించాను. నేను మీ రాజును.”
ISA 43:16 యెహోవా సముద్రంలో మార్గాలు వేస్తాడు. కల్లోలిత జలాలలో గూడ ఆయన తన ప్రజలకు ఒక బాట వేస్తాడు. మరియు యెహోవా చెబతున్నాడు,
ISA 43:17 “రథాలు, గుర్రాలు, సైన్యాలతో నాకు విరోధంగా యుద్ధం చేసేవారు ఓడించబడుతారు. వాళ్లు మళ్లీ ఎన్నటికీ లేవరు. వారు నాశనం చేయబడుతారు. క్రొవ్వువత్తిమంట ఆర్పినట్టుగా వారు ఆపుజేయబడతారు.
ISA 43:18 కనుక మొదట్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. చాలా కాలం కిందట జరిగిన ఆ సంగతులను గూర్చి ఆలోచించవద్దు.
ISA 43:19 ఎందుకంటే నేను నూతన కార్యాలు చేస్తాను. ఇప్పుడు మీరు కొత్త మొక్కలా ఎదుగుతారు. ఇది సత్యయమని మీకు గట్టిగా తెలుసు. నేను నిజంగానే అరణ్యంలో బాట వేస్తాను. నిజంగానే నేను ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను.
ISA 43:20 అడవి జంతువులు కూడ నాకు కృతజ్ఞత కలిగి ఉంటాయి. నిప్పుకోళ్లు, పెద్ద జంతువులు నన్ను ఘనపరుస్తాయి. అరణ్యంలో నేను నీళ్లను ప్రవహింప చేసినప్పుడు అవి నన్ను ఘనపరుస్తాయి. ఎడారిలో నేను నదులను ప్రవహింప జేసినప్పుడు అవి ఘన పరుస్తాయి. నేను ఏర్పరచుకొన్న నా ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి నేను దానిని చేస్తాను.
ISA 43:21 వీరే నేను చేసిన మనుష్యులు. ఈ ప్రజలు నన్ను స్తుతించుటకు పాటలు పాడతారు.
ISA 43:22 “యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. ఎందుకంటే ఇశ్రాయేలూ, నీవు నాతో విసిగిపోయావు.
ISA 43:23 ప్రజలారా, మీరు మీ బలి అర్పణ గొర్రెలను నా దగ్గరకు తీసుకొని రాలేదు. మీరు నన్ను ఘనపర్చలేదు. మీరు నాకు బలులు అర్పించలేదు, మీరు నాకు బలులు ఇవ్వాలని నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీకు విసుగు కలిగేంత వరకు మీరు నాకు ధూపం వేయమని మిమ్మల్ని నేను బలవంతపెట్టలేదు.
ISA 43:24 కనుక మీరు నన్ను ఘనపర్చేందుకు అవసరమైన వస్తువులు కొనుటకు మీరు మీ డబ్బును ఉపయోగించలేదు. కానీ నేను మీ సేవకునిలా ఉండాలని మీరే నన్ను బలవంతం చేశారు. మీ చెడు క్రియలన్నీ న న్ను చాలా విసిగించే వరకు పాపం చేశారు.
ISA 43:25 “నేను, నేనే మీ పాపాలు తుడిచివేసే వాడ్ని. నా ఆనందం కోసం నేను దీన్ని చేస్తాను. నేను మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను.
ISA 43:26 కానీ మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం సమావేశంగా కలుసుకొని ఏది సరైనదో నిర్ణయించాలి. మీరు చేసిన వాటిని గూర్చి చెప్పి, మీదే సరిగ్గా ఉంది అని చూపించాలి.
ISA 43:27 మీ మొదటి తండ్రి పాపం చేశాడు. మీ న్యాయవాదులు నాకు విరోధమైన వాటిని చేశారు.
ISA 43:28 మీ పవిత్ర పాలకులను పవిత్రులు గాకుండా నేను చేస్తాను. యాకోబు సంపూర్తిగా నావాడయ్యేటట్టు నేను చేస్తాను. ఇశ్రాయేలుకు చెడుగులు సంభవిస్తాయి.
ISA 44:1 “యాకోబూ నీవు నా సేవకుడవు. నా మాట విను. ఇశ్రాయేలూ నేను నిన్ను ఏర్పాటు చేసుకొన్నాను. నేను చెప్పే సంగతులు విను.
ISA 44:2 నేను యెహోవాను, నేనే నిన్ను సృజించాను. నీవు ఏమై యున్నావో అలా ఉండేందుకు నిన్ను సృజించిన వాడను నేనే. నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నేను నీకు సహాయం చేశాను. యాకోబూ, నా సేవకా, భయపడవద్దు. యెషూరూనూ నిన్ను నేను ఏర్పాటు చేసుకొన్నాను.
ISA 44:3 “దాహంగా ఉన్న మనుష్యులకు నేనే నీళ్లు పోస్తాను. ఎండిన భూమిమీద నేనే కాలువలను ప్రవహింపజేస్తాను. నీ పిల్లల మీద నేనే నా ఆత్మను కుమ్మరిస్తాను. అది మీ కుటుంబం మీద పొర్లుతున్న ఒక నీటి ప్రవాహంలా ఉంటుంది.
ISA 44:4 వారు ప్రపంచంలో ప్రజల మధ్య ఎదుగుతారు. నీటి కాలువల పక్కగా పెరిగే చెట్లలా ఉంటారు వారు.
ISA 44:5 “ఒక వ్యక్తి అంటాడు, ‘నేను యెహోవాకు చెందిన వాడను’ అని, మరోవ్యక్తి ‘యాకోబు’ పేరు చెప్పుకొంటాడు. ఇంకొక వ్యక్తి ‘నేను యెహోవావాడను,’ అని తన పేరు వ్రాసుకొంటాడు. ఇంకొకరు ‘ఇశ్రాయేలు’ పేరు ప్రయోగిస్తాడు.”
ISA 44:6 యెహోవా ఇశ్రాయేలీయుల రాజు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలును రక్షిస్తాడు. యెహోవా చెబతున్నాడు: “నేను ఒక్కడను మాత్రమే దేవుణ్ణి. ఇంక ఏ దేవుళ్లూ లేరు. నేనే ఆది, అంతము.
ISA 44:7 నావంటి దేవుడు ఇంకొకడు లేడు. అలా ఉంటే, ఆ దేవుడు ఇప్పుడు మాట్లాడాలి. ఆ దేవుడు వచ్చి, తాను నావలె ఉన్నట్టు రుజువు చూపించాలి. శాశ్వతంగా ఉండే ఈ ప్రజలను నేను సృజించినప్పుడు ఏమి జరిగిందో ఆ దేవుడు నాతో చెప్పాలి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అది అతనికి తెలిసినట్టు చూపించుటకు ఆ దేవుడు సూచనలు ఇవ్వాలి.
ISA 44:8 “భయపడవద్దు! దిగులుపడవద్దు! ఏమి జరుగుతుందో అది నేను నీతో ఎల్లప్పుడూ చెప్పలేదా? మీరే నాకు సాక్షులు. నాతోపాటు ఇంకొక దేవుడున్నాడా? ఏ దేవుడూ లేడు. నేను ఒక్కడను మాత్రమే. ఇంకొక దేవుడున్నట్టు నాకు తెలియదు.”
ISA 44:9 కొంత మంది మనుష్యులు విగ్రహాలు (అబద్ధపు దేవుళ్ళు) చేసుకొంటారు. కానీ అవి నిష్ప్రయోజనం. ప్రజలు ఆ విగ్రహాలను ప్రేమిస్తారు. కానీ ఆ విగ్రహాలు నిష్ప్రయోజనం. ఆ మనుష్యులే ఆ విగ్రహాలకు సాక్షులు, కానీ అవి మాట్లాడవు. వారికి ఏమీ తెలియదు. వారు చేసే పనుల విషయం వారు సిగ్గుపడేంత మాత్రం కూడా వారికి తెలియదు.
ISA 44:10 ఈ తప్పుడు దేవుళ్లను ఎవరు చేశారు? పనికిమాలిన ఈ విగ్రహాలను ఎవరు చేశారు?
ISA 44:11 చేతి పనివారు ఆ దేవుళ్లను చేశారు. ఆ పనివాళ్లంతా మనుష్యులే, దేవుళ్లు కారు. ఆ మనుష్యులంతా కలిసి వచ్చి, ఈ విషయాలను చర్చిస్తే, అప్పుడు వాళ్లంతా సిగ్గుపడతారు, భయపడతారు.
ISA 44:12 ఒక పనివాడు వేడి నిప్పుల మీద ఇనుము వేడిచేయటానికి తన పనిముట్లు వాడతాడు. లోహాన్ని కొట్టడానికి ఇతడు తన సుత్తెను ఉపయోగిస్తాడు, అప్పుడు ఆ లోహం ఒక విగ్రహం అవుతుంది. ఈ మనిషి బలమైన తన చేతులను ఉపయోగిస్తాడు. అయితే అతనికి ఆకలి వేసినప్పుడు అతని బలం పోతుంది. అతడు నీళ్లు తాగకపోతే, అతడు బలహీనం అవుతాడు.
ISA 44:13 మరో పనివాడు చెక్కమీద గీతలు గీసేందుకు నూలు వేసి చీర్ణంతో గీతలు గీస్తాడు. అతడు ఎక్కడ కోయాలో ఇది తెలియజేస్తుంది. అప్పుడు అతడు తన ఉలితో చెక్క నుండి విగ్రహాన్ని చెక్కుతాడు. ఆ విగ్రహాన్ని కొలిచేందుకు అతడు కర్కాటం ఉపయోగిస్తాడు. ఈ విధంగా ఆ పనివాడు ఆ చెక్క సరిగ్గా మనిషిలా కనబడేట్టు చేస్తాడు. మరియు ఈ మనిషిని పోలిన విగ్రహం ఇంట్లో కూర్చోవటం తప్ప చేసేది ఏమీ లేదు.
ISA 44:14 ఒకడు దేవదారు, సరళ లేక సింధూర వృక్షాన్ని సరికివేయవచ్చును. (ఆ చెట్లు పెరిగేటట్టు అతడేంచేయలేదు. ఆ చెట్లు అడవిలో వాటి స్వంత శక్తి మూలంగా పెరిగాయి. ఒకడు ఒక తమాల వృక్షాన్ని నాటితే వర్షం దాన్ని పెంచుతుంది.)
ISA 44:15 అప్పుడు అతడు మంట వేసుకొనేందుకు ఆ చెట్టును వాడుకొంటాడు. అతడు ఆ వృక్షాన్ని చిన్న కట్టె ముక్కలుగా నరుకుతాడు. వంట చేసుకొనేందుకు, చలి కాచుకొనేందుకు అతడు ఆ కట్టెలను వాడుకొంటాడు. కొన్ని కట్టెలతో అతడు మంట చేసి, రొట్టె కాల్చుకొంటాడు. అయితే అతడు ఆ కట్టెల్లో ఒక భాగాన్ని దేవునిగా చేయటానికి ఉపయోగిస్తాడు. మరియు ఆ మనిషి ఆ దేవుణ్ణి పూజిస్తాడు. ఆ దేవుడు ఆ మనిషి చేసిన విగ్రహమే కానీ ఆ మనిషి ఆ విగ్రహం ముందు సాష్టాంగపడతాడు.
ISA 44:16 ఆ మనిషి సగం కట్టెలు మంటలో కాలుస్తాడు. అతడు ఆ కట్టెలతో మాంసం వండుకొని, కడుపు నిండే అంతవరకు ఆ మాంసం తింటాడు. అతడు వెచ్చదనం కోసం ఆ కట్టెలను మంట పెడతాడు. “బాగుంది, ఇప్పుడు నాకు వెచ్చగా ఉంది. మంట ద్వారా వెలుగు వస్తుంది గనుక ఇప్పుడు నేను చూడగలను” అని అతడు అంటాడు.
ISA 44:17 అయితే కొంచెం కట్టె మిగిలింది. కనుక అతడు ఆ కట్టెతో ఒక విగ్రహం చేసి, దాన్ని తన దేవుడు అని పిలుస్తాడు. ఈ దేవుని ముందు అతడు సాష్టాంగపడి, దానిని పూజిస్తాడు. అతడు ఆ దేవుని ప్రార్థించి, “నీవే నా దేవుడివి, నన్ను రక్షించు” అంటాడు.
ISA 44:18 ఆ మనుష్యులు ఏమి చేస్తున్నారో వారికే తెలియదు. అది వారు గ్రహించరు. అది వారి కళ్లు మూసుకొనిపోయి, వారు చూడలేనట్టు ఉంటుంది. వారి హృదయాలు (మనసులు) అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించవు.
ISA 44:19 ఆ మనుష్యులు ఈ విషయాలను గూర్చి ఆలోచించలేదు. ఆ మనుష్యులు గ్రహించరు గనుక, “సగం కట్టెలు నేనే కాల్చేశాను, నా రొట్టె కాల్చుకొనేందుకు, నా మాంసం వండుకొనేందుకు ఆ నిప్పులు నేను వాడుకొన్నాను. ఆ మాంసం నేను తిన్నాను. మరి మిగిలిన కట్టెను ఉపయోగించి ఈ భయంకరమైన పని చేశాను. నేను ఒక చెక్క ముక్కనే పూజిస్తున్నాను” అని వారి మట్టుకు వారు ఎన్నడూ తలంచలేదు.
ISA 44:20 ఆ మనిషి ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు. అతడు గందరగోళం అయ్యాడు, కనుక అతని హృదయం అతన్ని తప్పు మార్గంలో నడిపించింది. అతడు తనను తాను రక్షించుకోలేడు. అతడు చేస్తున్నది తప్పు అని అతడు చూడలేడు. “నేను పట్టుకొన్న ఈ విగ్రహం అబద్ధపు దేవుడు” అని అతడు చెప్పడు.
ISA 44:21 “యాకోబూ, ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకో. ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవని జ్ఞాపకం ఉంచుకో. నిన్ను నేను సృజించాను. నీవు నా సేవకుడవు. కనుక ఇశ్రాయేలూ, నన్ను మరచిపోవద్దు.
ISA 44:22 నీ పాపాలు ఒక పెద్ద మేఘంలా ఉండేవి. కాని ఆ పాపాలను నేను తుడిచి వేశాను. గాలిలో అదృశ్యమైన ఒక మేఘంలా నీ పాపాలు పోయాయి. నేను నిన్ను తప్పించి కాపాడాను, కనుక తిరిగి నా దగ్గరకు వచ్చేయి.”
ISA 44:23 యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. గనుక ఆకాశాలు ఆనందిస్తున్నాయి. భూమి, దాని అగాధ స్థలాల్లో సహితం సంతోషిస్తుంది. పర్వతాలు దేవునికి వందనాలు చెల్లిస్తూ పాటలు పాడుతున్నాయి. అరణ్యంలో చెట్లన్నీ ఆనందంగా ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే యాకోబును యెహోవా రక్షించాడు గనుక ఇశ్రాయేలుకు యెహోవా గొప్ప కార్యాలు చేశాడు గనుక.
ISA 44:24 నీవు ఏమైయున్నావో అలా నిన్ను యెహోవా చేశాడు. నీవు ఇంకా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే యెహోవా దీనిని చేశాడు. “యెహోవాను, నేనే సమస్తం చేశాను. ఆకాశాలను నేనే అక్కడ ఉంచాను. నేనే భూమిని నా యెదుట పరచాను.” అని యెహోవా చెబతున్నాడు.
ISA 44:25 అబద్ధపు ప్రవక్తలు అబద్ధాలు చెబతారు. అయితే వారి అబద్ధాలు, అబద్ధాలుగా యెహోవా చూపిస్తాడు. మంత్రాలు చేసే మనుష్యులను యెహోవా వెర్రివారిగా చేస్తాడు. జ్ఞానులను గూడ యెహోవా కలవరపెడ్తాడు. వారికి చాలా తెలుసు. అని వారు అనుకొంటున్నారు. కాని వాళ్లు వెర్రివాళ్లలా కనిపించేట్టు యెహోవా చేస్తాడు.
ISA 44:26 ప్రజలకు సందేశాలు అందించేందుకు యెహోవా తన సేవకులను పంపిస్తాడు. ఆ సందేశాలను యెహోవా వాస్తవం చేస్తాడు. ప్రజలు చేయాల్సిన వాటిని గూర్చి వారికి చెప్పడానికి యెహోవా సందేశహరులను పంపిస్తాడు. వారి సలహా మంచిది అని యెహోవా సూచిస్తున్నాడు. “ప్రజలు మరల నీలో నివసిస్తారు” అని యెరూషలేముతో యెహోవా చెబతున్నాడు. “మీరు మరల నిర్మించబడతారు” అని యూదా పట్టణాలతో యెహోవా చెబతున్నాడు. “నేను మరల మిమ్మల్ని పట్టణాలుగా చేస్తాను” అని నాశనం చేయబడిన పట్టణాలతో యెహోవా చెబతున్నాడు.
ISA 44:27 “ఎండిపొండి! మీ కాలువలను నేను ఎండిపోయేట్టు చేస్తాను” అని లోత్తెన జలాలతో యెహోవా చెబతున్నాడు.
ISA 44:28 యెహోవా కోరేషుతో చెబతున్నాడు, “నీవు నా గొర్రెల కాపరివి. నేను కోరిన వాటిని నీవు చేస్తావు. ‘నీవు మరల కట్టబడతావు’ అని యెరూషలేముతో నీవు చెబతావు. ‘నీ పునాదులు మరల నిర్మించబడతాయి’” అని నీవు ఆలయంతో చెబతావు.
ISA 45:1 యెహోవా ఏర్పాటు చేసుకొన్న తన రాజు కోరెషుతో ఆయన చెప్పిన సంగతులు ఇవి: “కోరషు కుడిచేయి నేను పట్టుకొంటాను. రాజుల దగ్గర నుండి అధికారం తీసివేసుకొనేందుకు నేను అతనికి సహాయం చేస్తాను. పట్టణ ద్వారాలు కోరెషును ఆప్పుజేయలేవు. పట్టణ ద్వారాలు నేను తెరుస్తాను, కోరెషు లోనికి ప్రవేశిస్తాడు.
ISA 45:2 కోరెషూ, నీ సైన్యాలు ముందడుగు వేస్తాయి. నేను నీకు ముందుగా వెళ్తాను. పర్వతాలను నేను చదును చేస్తాను. పట్టణం ఇత్తడి తలుపులు నేను పగులగొడ్తాను. తలుపుల మీది ఇనుప గడియలను నేను విరుగగొడ్తాను.
ISA 45:3 చీకట్లో దాచిపెట్టబడిన ధనం నేను నీకు ఇస్తాను. దాచబడిన ఐశ్వర్యాలను నేను నీకు ఇస్తాను. నేను యెహోవాను అని నీవు తెలుసుకొనేందుకు నేను దీనిని చేస్తాను. ఇశ్రాయేలీయుల దేవుడను నేనే, నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
ISA 45:4 నా సేవకుడు యాకోబు కోసం నేను వీటిని చేస్తున్నాను. ఏర్పాటు చేయబడిన నా ప్రజలు ఇశ్రాయేలీయుల కోసం నేను వీటిని చేస్తున్నాను. కోరెషూ, నేను నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను. నీవు నన్ను ఎరుగవు, కానీ నేను నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
ISA 45:5 నేను యెహోవాను. నేను ఒక్కడినే దేవుడను. ఇంక ఏ దేవుడూ లేడు. నేనే నీకు బట్టలు ధరింపజేసినవాడను. అయినా నీవు ఇంకా నన్ను ఎరుగవు.
ISA 45:6 నేను ఒక్కడను మాత్రమే దేవుడనని ప్రజలంతా తెలుసుకోవాలని నేను ఈ సంగతులను చేస్తాను. నేనే యెహోవాను అని, నేను తప్ప ఇంకో దేవుడు లేడని తూర్పు నుండి పడమటి వరకు ప్రజలు తెలుసుకొంటారు.
ISA 45:7 నేనే వెలుగును కలిగించాను. మరి నేనే చీకటిని చేశాను. నేనే సమాధానం కలిగిస్తాను. నేనే కష్టాలు కల్గిస్తాను. నేను యెహోవాను నేనే ఈ సంగతులన్నింటిని చేస్తాను.
ISA 45:8 “పైన ఆకాశంలోని మేఘాలు మంచితనాన్ని భూమిమీద వర్షంగా కురిపించుగాక! భూమి నెరదలు విడిచి ర క్షణను ఫలింపజేయును గాక! దానితోబాటు మంచితనం పెరుగును గాక! యెహోవాను నేనే అతణ్ణి సృజించాను.”
ISA 45:9 “ఈ ప్రజలను చూడు! వాళ్లు వారిని సృజించిన వానితో వాదిస్తున్నారు. వాళ్లు నాతో వాదించటం చూడు. వాళ్లు పగిలిపోయిన కుండ పెంకులా ఉన్నారు. ఒకడు కుండ చేయటానికి జిగట మన్ను ఉపయోగిస్తాడు. మరి ఆ మట్టి, ‘ఓ మనిషీ, ఏం చేస్తున్నావు?’ అని అడగదు. తయారు చేయబడిన వస్తువులకు వాటిని తయారుచేసిన వానిని ప్రశ్నించే అధికారం లేదు. మనుష్యులు ఈ మట్టిలాగే ఉన్నారు.
ISA 45:10 ఒక తండ్రి తన పిల్లలకు ప్రాణం పోస్తాడు. మరి పిల్లలు, ‘నీవెందుకు నాకు ప్రాణం పోస్తున్నావు?’ అని అడిగేందుకు అధికారం లేదు. పిల్లలు తల్లిని పట్టుకొని, ‘నీవెందుకు నాకు జన్మనిస్తున్నావు?’ అని ప్రశ్నించేందుకు వీల్లేదు.”
ISA 45:11 యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు. ఆయనే ఇశ్రాయేలీయులను సృజించాడు. మరియు యెహోవా అంటున్నాడు: “నా కుమారులారా, మీకు ఒక సంకేతం చూపించమని నన్ను అడిగారు. నేను చేసిన వాటిని మీకు చూపించమని మీరు నాకు ఆదేశించారు.
ISA 45:12 కనుక చూడండి! భూమిని నేనే సృజించాను. దానిమీద జీవించే మనుష్యులందరినీ నేనే సృజించాను. నా స్వంత చేతులు ఉపయోగించి ఆకాశాలను సృజించాను. ఆకాశ సమూహాలన్నింటినీ నేనే ఆజ్ఞాపించాను.
ISA 45:13 కోరెషు మంచి పనులు చేసేందుకు అతని శక్తిని నేనే అతనికి ఇచ్చాను. అతని పని నేను సులభం చేస్తాను. కోరెషు నా పట్టణాన్ని మరల నిర్మిస్తాడు. అతడు నా ప్రజలను స్వతంత్రులను చేస్తాడు. కోరెషు నా ప్రజలను నాకు అమ్మడు. అతడు ఈ పనులు చేసేందుకు అతనికి నేనేమీ చెల్లించాల్సిన అవసరంలేదు. ప్రజలు విమోచించబడతారు. దానికి నాకేమీ ఖర్చుకాదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు చెప్పాడు.
ISA 45:14 యెహోవా చెబతున్నాడు, “ఈజిప్టులో, ఇథియోపియాలో ఎన్నో సంగతులు చేయబడ్డాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలారా మీరు వాటిని పొందుతారు. ఆజానుబాహులైన సెబా ప్రజలు మీ వాళ్లవుతారు. వారు మెడలలో సంకెళ్లతో మీ వెనుక నడుస్తారు. వాళ్లు మీ ఎదుట సాష్టంగపడతారు. వాళ్లు మీకు విన్నపం చేసుకొంటారు.” ఇశ్రాయేలూ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరి ఇంకే దేవుడూ లేడు.
ISA 45:15 దేవా, నీవు ప్రజలు చూడలేని దేవుడవు. నీవు ఇశ్రాయేలు రక్షకుడవు.
ISA 45:16 చాలామంది ప్రజలు తప్పుడు దేవుళ్లను చేసుకొంటారు. కానీ ఆ ప్రజలు నిరాశ చెందుతారు. ఆ ప్రజలంతా సిగ్గుతో తిరిగి వెళ్లిపోతారు.
ISA 45:17 కానీ ఇశ్రాయేలు యెహోవా చేత రక్షించబడును. ఆ రక్షణ శాశ్వతంగా కొనసాగుతుంది. మరల ఎన్నటెన్నటికి ఇశ్రాయేలు సిగ్గుపడడు.
ISA 45:18 యెహోవాయే దేవుడు. ఆయనే భూమిని, ఆకాశాలను సృజించాడు. భూమిని యెహోవా దాని స్థానంలో ఉంచాడు. యెహోవా భూమిని చేసినప్పుడు, అది ఖాళీగా ఉండాలని ఆయన కోరలేదు. భూమి మీద జీవం ఉండాలని యెహోవా కోరాడు. యెహోవా చెబతున్నాడు: “నేనే యెహోవాను. నేను తప్ప ఇంకో దేవుడు లేడు.
ISA 45:19 నేను రహస్యంగా మాట్లాడలేదు. నేను స్వేచ్చగా మాట్లాడాను. ప్రపంచపు చీకటి స్థలాల్లో నేను నా మాటలను దాచిపెట్టలేదు. ఖాళీ ప్రదేశాల్లో నన్ను వెదకమని యాకోబు ప్రజలకు నేను చెప్పలేదు. నేనే యెహోవాను, నేను సత్యం మాట్లాడుతాను. నేను మాట్లాడినప్పుడు సరైనవే నేను చెబతాను.
ISA 45:20 “ప్రజలారా మీరు ఇతర దేశాలనుండి తప్పించుకొని పోయారు. కనుక మీరు సమావేశమై నా ఎదుటికిరండి. (ఈ మనుష్యులు తప్పుడు దేవుళ్ల విగ్రహాలను మోసుకొని వెళ్తారు. ఈ ప్రజలు పనికిమాలిన ఆ దేవుళ్లకు ప్రార్థన చేస్తారు. కానీ వాళ్లు చేస్తోంది ఏమిటో ప్రజలకు తెలియదు.
ISA 45:21 ఈ ప్రజలను నా దగ్గరకు రమ్మని వారికి చెప్పండి. వారు వచ్చి ఈ సంగతులను నాతో మాట్లాడమని చెప్పండి.) “చాలా కాలం క్రిందట జరిగిన వాటిని గూర్చి మీకు ఎవరు చెప్పారు? చాలాకాలం నుండి ఈ సంగతులను విడువక మీకు ఎవరు చెప్పారు? యెహోవాను నేనే, ఈ సంగతులు మీకు చెప్పాను. నేను ఒక్కడను మాత్రమే దేవుడను. నావంటి దేవుడు ఇంకొకరు ఉన్నారా? ఇంకో మంచి దేవుడు ఉన్నాడా? తన ప్రజలను రక్షించే ఇంకో దేవుడూ ఉన్నాడా? లేడు మరి ఏ దేవుడు లేడు.
ISA 45:22 దూర దేశాల్లో ఉన్న ప్రజలారా, మీరంతా ఆ తప్పుడు దేవుళ్లను వెంబడించటం మానివేయాలి. మీరు నన్ను వెంబడించి, రక్షణ పొందాలి. నేను దేవుణ్ణి. వేరొక దేవుడు ఎవ్వడూ లేడు. నేను ఒక్కణ్ణి మాత్రమే దేవుడను.
ISA 45:23 “నేను నా స్వంత శక్తితో ఒక వాగ్దానం చేస్తాను. నేను ఏదైన ఒకటి చేస్తానని వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఒక ఆదేశం అవుతుంది. ఏదైనా జరగాలని నేను ఆదేశిస్తే, అది జరుగుతుంది. ప్రతి మనిషి నా (దేవుడు) ఎదుట సాగిలపడతాడని నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి మనిషి నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తాడు.
ISA 45:24 ‘మంచితనం, అధికారం యెహోవా నుండి మాత్రమే లభిస్తాయి’” అని ప్రజలు చెబతారు. కొంత మంది మనుష్యులు యెహోవా మీద కోపగిస్తారు. అయితే యెహోవా సాక్షులు వచ్చి, యెహోవా చేసిన వాటిని గూర్చి సాక్ష్యం చెబతారు. అందుచేత కోపగించిన ఆ మనుష్యులు సిగ్గుపడతారు.
ISA 45:25 ఇశ్రాయేలు ప్రజలు మంచిని జరిగించటానికి యెహోవా సహాయం చేస్తాడు, మరియు ప్రజలు వారి దేవుని గూర్చి ఎంతో గర్విస్తారు.
ISA 46:1 బేలు, నెబో నా ఎదుట సాగిలపడతారు. తప్పుడు దేవుళ్లు వట్టి విగ్రహాలే. మనుష్యులే ఆ విగ్రహాలను జంతువులమీద పెడతారు. మోయాల్సిన బరువులు మాత్రమే ఆ విగ్రహాలు. తప్పుడు దేవుళ్లు ప్రజలను విసిగించటం తప్ప ఇంకేం చేయవు.
ISA 46:2 ఆ తప్పుడు దేవుళ్లన్నీ సాగిలబడతాయి, అవన్నీ పడిపోతాయి. ఆ తప్పుడు దేవుళ్లు తప్పించుకోలేవు. అవన్నీ బందీలవలె తీసుకొనిపోబడుతాయి.
ISA 46:3 “యాకోబు వంశమా, నా మాట విను. ఇంకాబతికే ఉన్న ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా నా మాటవినండి. నేను మిమ్మల్ని మోశాను. మీరు మీ తల్లి ఒడిలో ఉన్నప్పటి నుండి నేను మిమ్మల్ని ఎత్తుకొన్నాను.
ISA 46:4 మీరు పుట్టినప్పుడు నేను మిమ్మల్ని ఎత్తుకొన్నాను, మీరు ముసలి వాళ్లయినప్పుడు నేను మిమ్మల్ని మోస్తాను. నేను మిమ్మల్ని సృజించాను. కనుక మీ తల వెండ్రుకలు నెరసిపోయినప్పుడు కూడా నేను మిమ్మల్ని మోస్తాను. నేను మిమ్మల్ని మోస్తూనే ఉంటాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను.
ISA 46:5 “మీరు నన్ను ఇంకెవరితోనైనా పోల్చగలరా? లేదు. ఎవ్వరూ నాకు సమానలు కారు. నన్ను గూర్చి మీరు పూర్తిగా గ్రహించలేరు. నావంటిది ఇంకేమీ లేదు.
ISA 46:6 కొంత మంది వెండి, బంగారం ఉండి ఐశ్వర్యవంతులు. వారి చేతి సంచుల్లోంచి బంగారం రాలుతుంది, వారు వారి వెండిని త్రాసులో తూకం వేస్తారు. వారు ఒక కళాకారునికి డబ్బిచ్చి, చెక్కతో ఒక తప్పుడు దేవుణ్ణి చేయించుకొంటారు. అప్పుడు ఆ ప్రజలు ఆ తప్పుడు దేవునికి సాగిలపడి, దానికి పూజ చేస్తారు.
ISA 46:7 ఆ మనుష్యులు ఆ తప్పుడు దేవుణ్ణి తమ భుజాల మీద పెట్టుకొని మోస్తారు. ఆ తప్పుడు దేవుడు నిష్ప్రయోజనం ప్రజలు వానిని మోయాల్సి ఉంటుంది. ప్రజలు ఆ విగ్రహాన్ని నేలమీద పెడ్తారు, ఆ తప్పుడు దేవుడు కదల్లేడు. ఆ తప్పుడు దేవుడు, వాని స్థానం నుండి ఎన్నడూ నడిచిపోడు. ప్రజలు వానిమీద కేకలు వేయవచ్చు, కాని అది జవాబు ఇవ్వదు. ఆ తప్పుడు దేవుడు వట్టి విగ్రహం మాత్రమే. అది ప్రజలను వారి కష్టాల్లోంచి రక్షించజాలదు.
ISA 46:8 “ప్రజలారా, మీరు పాపం చేశారు. ఈ సంగతులను గూర్చి మీరు మరల ఆలోచన చేయాలి. ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని బలవంతంగా ఉండండి.
ISA 46:9 చాలాకాలం కిందట జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుడను అని జ్ఞాపకం ఉంచుకోండి. నేనే అని జ్ఞాపకం ఉంచుకోండి. మరో దేవుడంటూ లేడు. ఆ తప్పుడు దేవుళ్లు నావంటివారు కారు.
ISA 46:10 “అంతంలో జరిగే సంగతులను గూర్చి మొదట్లోనే నేను మీకు చెప్పాను. ఇంకా సంభవించని సంగతులను గూర్చి చాలాకాలం కిందట నేను మీకు చెప్పాను. నేను ఒకటి తలపెట్టాను. అది జరిగి తీరుతుంది. నేను చేయాలనుకొన్నవి చేస్తాను.
ISA 46:11 తూర్పునుండి నేను ఒక మనిషిని పిలుస్తున్నాను. ఆ మనిషి గద్దలా ఉంటాడు. అతడు చాలా దూర దేశం నుండి వస్తాడు, నేను చేయాలని నిర్ణయించిన వాటిని అతడు చేస్తాడు. నేను ఇలా చేస్తానని నేను మీతో చెబతున్నాను, నేను తప్పక దీనిని చేస్తాను. నేనే అతన్ని చేశాను. నేనే అతడ్ని తీసుకొని వస్తాను.
ISA 46:12 “మీకు గొప్ప శక్తి ఉందని మీలో కొందరు తలుస్తారు. కానీ మీరు మంచి పనులు చేయరు. నా మాట వినండి!
ISA 46:13 నేను మంచి పనులు చేస్తాను. త్వరలో నేను నా ప్రజలను రక్షిస్తాను. సీయోనుకు, అద్భుతమైన నా ఇశ్రాయేలుకు నేను రక్షణ తీసుకొని వస్తాను.”
ISA 47:1 “కల్దీయుల కుమారీ, కన్యకా మట్టిలో పడి, అక్కడే కూర్చో. నేల మీద కూర్చో. ఇప్పుడు నీవు పరిపాలించటం లేదు. ప్రజలు ఇంక నిన్ను చక్కనిదానా అని అందగత్తె అని పిలువరు.
ISA 47:2 ఇప్పుడు నీవు కష్టపడి పనిచేయాలి. అందమైన నీపై వస్త్రాలు తీసివేయి. తిరుగటి రాళ్లు తీసుకొని పిండి విసురు. మనుష్యులకు నీ కాళ్లు కనబడేంతమట్టుకు నీ పైవస్త్రం లేపి నదులు దాటు. నీ దేశాన్ని విడిచిపెట్టు.
ISA 47:3 మనుష్యులు నీ శరీరాన్ని చూస్తారు. మనుష్యులు నిన్ను లైంగికంగా వాడుకొంటారు. నీవు చేసిన చెడ్డ పనులకు నీచేత నేను విలువ కట్టిస్తాను. మరియు ఎవ్వడూ వచ్చి నీకు సహాయం చేయడు
ISA 47:4 “‘దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పరిశుద్దుడు’” అని నా ప్రజలు అంటారు.
ISA 47:5 “అందుచేత బబలోనూ, నీవు మౌనంగా కూర్చోవాలి. కల్దీయుల కుమారీ చీకట్లోనికి వెళ్లు ఎందుకంటే నీవు ఇక మీదట ‘రాజ్యాలకు యజమానురాలివి’ కావు.
ISA 47:6 “నేను నా ప్రజల మీద కోపగించాను. ఈ ప్రజలు నావాళ్లే కానీ నేను కోపగించాను, అందుచేత నేను వాళ్లకు ప్రాముఖ్యం లేకుండా చేశాను. నేను వాళ్లను నీకు అప్పగించాను. నీవు వారిని శిక్షించావు. నీవు వారికి ఎలాంటి దయా చూపించలేదు. వాళ్లు ముసలి వాళ్ల కోసం చాలా కష్టపడి పనిచేసేట్టు నీవు చేశావు.
ISA 47:7 ‘నేను శాశ్వతంగా జీవిస్తాను. శాశ్వతంగా నేను రాణిగానే ఉంటాను’ అని నీవు చెప్పావు. నీవు ఆ ప్రజలకు చేసిన చెడు కార్యాలను నీవు గమనించలేదు. ఏమి జరుగుతుందో అని నీవు గమనించలేదు.
ISA 47:8 కనుక ‘అందమైన అమ్మాయీ’, ఇప్పుడు నా మాట విను. నీవు క్షేమంగానే ఉన్నాను అనుకొంటున్నావు. ‘నేను ఒక్కదాన్నే ప్రాముఖ్యమైన దాన్ని, ఇంకెవ్వరూ నా అంతటి ప్రముఖులు కారు. నేను ఎప్పటికీ విధవనుకాను. నాకు ఎల్లప్పుడూ పిల్లలు ఉంటారు’ అని నీలోనీవు అనుకొంటున్నావు.
ISA 47:9 నీకు ఈ రెండు సంగతులు జరుగుతాయి: మొట్టమొదట నీవు నీ పిల్లలను పోగొట్టుకొంటావు. (ప్రజలు) తర్వాత నీవు నీ భర్తను పోగొట్టుకొంటావు. (రాజ్యం) ఈ సంగతులు నీకు నిజంగా జరుగుతాయి. నీ మంత్రాలన్నీ, శక్తివంతమైన నీ ఉపాయాలన్నీ నిన్ను రక్షించవు.
ISA 47:10 నీవు చెడ్డ పనులు చేసి కూడ క్షేమంగా ఉన్నానని అనుకొంటున్నావు. ‘నేను చేసే తప్పు పనులు ఎవరూ చూడటం లేదు’ అని నీవు అనుకొంటావు. నీవు తప్పు చేస్తావు. కానీ నీ జ్ఞానం, నీ తెలివి నిన్ను రక్షిస్తాయి అనుకొంటావు. ‘నేను ఒక్క దాన్ని తప్ప నా అంతటి ప్రముఖులు ఇంకెవరూ లేరు’ అని నీవు అంటావు.
ISA 47:11 “అయితే నీకు కష్టాలు వస్తాయి. అది ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు. కాని నాశనం వచ్చేస్తుంది. ఆ కష్టాలను ఆపుజేసేందుకు నీవు ఏమీ చేయలేవు. నీవు త్వరగా నాశనం చేయబడతావు. నీకు ఏమి జరిగిపోయిందో కూడా నీకు తెలియదు.
ISA 47:12 నీ జీవితాంతం నీవు కష్టపడి పనిచేశావు. ఉపాయాలు, మంత్రాలు నేర్చుకొన్నావు. కనుక నీ ఉపాయాలు, మంత్రాలు ప్రయోగించటం ప్రారంభించు. ఒకవేళ ఆ ఉపాయాలు నీకు సహాయపడతాయేమో! ఒకవేళ నీవు ఎవరినైనా భయపెట్టగలుగుతావేమో.
ISA 47:13 నీకు ఎంతెంతో మంది సలహాదారులు వాళ్లు నీకిచ్చే సలహాలతో నీవు విసిగిపోయావా? నక్షత్ర శాస్త్రం తెలిసిన నీ మనుష్యులను వాళ్లు బయటకు పంపిస్తారు. నెల ప్రారంభం ఎప్పుడో వాళ్లు చెప్పగలుగుతారు. ఒకవేళ నీ కష్టాలు ఎప్పుడు మొదలవుతాయో వాళ్లు చెప్పగలుగుతారేమో.
ISA 47:14 అయితే ఆ మనుష్యులు కనీసం వాళ్లనే వాళ్లు రక్షించుకోలేరు. వాళ్లు గడ్డిలా కాలిపోతారు. వాళ్లు త్వరగా కాలిపోయినందుచేత రొట్టె కాల్చుకొనేందుకు గూడ నిప్పులు మిగులవు. వెచ్చగా కాచుకొనేందుకు మంటగూడా మిగలదు.
ISA 47:15 నీవు కష్టపడి సంపాదించిన దానంతటికీ అలా జరుగుతుంది. నీవు చిన్న పిల్లగా ఉన్నప్పట్నుంచీ నీతో వ్యాపారం చేసిన వారు నిన్ను వదిలివేస్తారు ప్రతివాడూ వాని వాని దారిన పోతాడు. నిన్ను రక్షించేందుకు ఒక్క మనిషి కూడా ఉండడు.”
ISA 48:1 యెహోవా చెబతున్నాడు: “యాకోబు వంశమా, నా మాట విను! మిమ్మల్ని మీరు ‘ఇశ్రాయేలు’ అని చెప్పుకొంటారు. మీరు యూదా వంశస్థులు. ప్రమాణాలు చేయటానికి మీరు యెహోవా నామం ప్రయోగిస్తారు. ఇశ్రాయేలు దేవుణ్ణి మీరు స్తుతిస్తారు. కానీ ఈ సంగతులను మీరు చేస్తున్నప్పుడు మీరు నమ్మకంగా ఉండరు.”
ISA 48:2 ప్రజలారా, పవిత్ర పట్టణంలో సభ్యులని మీరు పిలువబడుతున్నారు. ఇశ్రాయేలు దేవుని మీద మీరు ఆధారపడుతున్నారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆయన పేరు.
ISA 48:3 “జరుగబోయే సంగతులను గూర్చి చాలా కాలం కిందట నేను మీకు చెప్పాను. వాటిని గూర్చి నేను మీకు చెప్పాను. అకస్మాత్తుగా ఆ సంగతులు సంభవించేట్టు నేను చేశాను.
ISA 48:4 మీరు మొండివాళ్లని నాకు తెలుసు గనుక నేను అలా చేశాను. నేను చెప్పిన ప్రతిది మీరు నమ్మటానికి నిరాకరించారు. వంగని ఇనుములా మీరు చాలా మొండివాళ్లు. మీ తల ఇత్తడితో చేసినట్టుగా ఉంది.
ISA 48:5 కనుక జరుగబోయే సంగతులను గూర్చి నేను మీతో చెప్పాను. ఆ సంగతులు జరుగకముందే చాలాకాలం క్రిందటనే నేను మీకు చెప్పాను. ‘మా స్వంత శక్తితో మేమే వీటిని చేశాము’ అని మీరు చెప్పకుండా నేనిలా చేశాను. ‘మా ప్రతిమలు-విగ్రహాలే వీటిని జరిగించాయి’ అని మీరు చెప్పకుండా ఉండాలనే నేను ఇలా చేసాను.”
ISA 48:6 “జరిగిన సంగతులన్నింటినీ మీరు చూశారు, విన్నారు గనుక మీరు ఇతరులకు ఈ వార్త చెప్పాలి. మీకు ఇంకా తెలియని కొత్త సంగతులను ఇప్పుడు నేను మీకు చెబతాను.
ISA 48:7 ఇవి చాలాకాలం కిందట జరిగిపోయిన సంగతులు కావు. ఇవి ఇప్పుడు సంభవించటం మొదలైన సంగతులు. ఈ సంగతులను గూర్చి ఈ వేళకు ముందు మీరు ఎన్నడూ వినలేదు. అందుచేత ‘అది మాకు ముందే తెలుసు’ అని మీరు చెప్పజాలరు.
ISA 48:8 కానీ భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో అది నేను మీకు చెప్పినప్పటికీ మీరు ఇంకా నా మాట వినేందుకు నిరాకరిస్తారు. మీరు నేర్చు కొనేది శూన్యం. నేను మీకు చెప్పింది ఎన్నడూ ఏదీ మీరు వినలేదు. మీరు నాకు వ్యతిరేకంగా ఉంటారని మొదట్నుండి నాకు తెలుసు. మీరు పుట్టినప్పట్నుండి తప్పుడు పనులే చేశారు.
ISA 48:9 “కానీ నేను ఓపిగ్గా ఉంటాను. నా కోసమే నేను ఇలా చేస్తాను. నేను కోపగించి మిమ్మల్ని నాశనం చేయనందుకు ప్రజలు నన్ను స్తుతిస్తారు. సహించినందుకు మీరూ నన్ను స్తుతిస్తారు.
ISA 48:10 “చూడండి, నేను మిమ్మల్ని పవిత్రం చేస్తాను. వెండిని పవిత్రం చేసేందుకు ప్రజలు వేడినిప్పును ప్రయోగిస్తారు. కానీ నేను మీకు కష్టాలు కలిగించటం ద్వారా మిమ్మల్ని పవిత్రం చేస్తాను.
ISA 48:11 నా కోసం-నా కోసమే నేను ఇలా చేస్తాను. ప్రాముఖ్యం లేని వానిగా మీరు నన్ను చేయలేరు. నా మహిమ, స్తుతులను ఎవరో తప్పుడు దేవతలను నేను తీసుకోనివ్వను.
ISA 48:12 “యాకోబూ, నా మాట విను! ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా ప్రజలుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను. కనుక నా మాట వినండి. నేనే ఆది, నేనే అంతం.
ISA 48:13 నా స్వహస్తాలతో (శక్తితో) నేనే భూమిని చేశాను. ఆకాశాన్ని నా కుడి హస్తం చేసింది. మరియు నేను గనుక వాటిని పిలిస్తే అవి కలిసి నా ఎదుటికి వస్తాయి.
ISA 48:14 “కనుక మీరంతా సమావేశమై, నా మాట వినండి! ఈ సంగతులు జరుగుతాయని తప్పుడు దేవుళ్లలో ఏదైనా చెప్పిందా? లేదు. యెహోవా ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు. బబలోను, కల్దీయులకు యెహోవా ఏమి చేయాలనుకొంటే అది చేస్తాడు.
ISA 48:15 “యెహోవా చెబతున్నాడు, నేను అతన్ని పిలుస్తానని నేను మీతో చెప్పాను. మరియు నేను అతణ్ణి తీసుకొని వస్తాను. అతడు జయించేట్టు నేను చేస్తాను.
ISA 48:16 నా దగ్గరకు వచ్చి, నా మాట వినండి. ప్రజలు నా మాట వినగలుగునట్లు మొదటనుంచి నేను తేటగా మాట్లాడాను. బబలోను ఒక దేశంగా ప్రారంభమయినప్పుడు నేను అక్కడ ఉన్నాను.” అంతట యెషయా, “ఇప్పుడు ఈ సంగతులు, ఆయన ఆత్మను మీతో చెప్పేందుకు నా ప్రభవైన యెహోవా నన్ను పంపుతున్నాడు” అని అన్నాడు.
ISA 48:17 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, రక్షకుడు, యెహోవా చెబతున్నాడు, “నేనే మీ దేవుణ్ణి, యెహోవాను. మంచి పనులు చేయమని నేను మీకు ఉపదేశిస్తాను. మీరు నడవాల్సిన మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను.
ISA 48:18 మీరు నాకు విధేయులై ఉంటే అప్పుడు మీకు నిండుగా ప్రవహిస్తోన్న నదివలె శాంతి లభించి ఉండేది. సముద్ర తరంగాల్లా మంచివి మీ వద్దకు ప్రవహించి ఉండేవి.
ISA 48:19 మీరు నాకు విధేయులై ఉంటే అప్పుడు మీకు ఎంతోమంది పిల్లలు పుట్టి ఉండేవారు. వాళ్లు ఇసుక రేణువులంత మంది ఉండేవాళ్లు. మీరు నాకు విధేయులై ఉండే అప్పుడు మీరు నాశనం చేయబడి ఉండేవాళ్లు కాదు. మీరు నాతోనే కొనసాగి ఉండేవాళ్లు.”
ISA 48:20 నా ప్రజలారా, బబలోను విడిచిపెట్టండి. నా ప్రజలారా, కల్దీయుల దగ్గర్నుండి పారిపొండి. ఈ వార్త సంతోషంగా ప్రజలకు చెప్పండి. భూమిమీద దూర ప్రాంతాల వరకు ఈ వార్త వ్యాపింపచేయండి. ప్రజలతో ఇలా చెప్పండి: “యెహోవా తన సేవకుడు యాకోబును విమోచించాడు!
ISA 48:21 యెహోవా తన ప్రజలను అరణ్యంలో నడిపించాడు. ఆ ప్రజలు ఎన్నడూ దప్పిగొనలేదు. ఎందుకంటే, ఆయన తన ప్రజలకోసం బండనుండి నీళ్లు ప్రవహింపజేశాడు గనుక. ఆయన బండను చీల్చాడు. నీళ్లు ప్రవహించాయి.”
ISA 48:22 కానీ “చెడ్డ వారికి శాంతి లేదు” అని యెహోవా చెబతున్నాడు.
ISA 49:1 దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలారా, మీరంతా నామాట వినండి! భూమి మీద నివసిస్తున్న ప్రజలారా, మీరంతా వినండి! నేను పుట్టక మునుపే యెహోవా నన్ను తన సేవకోసం పిలిచాడు. నేను నా తల్లి గర్భంలో ఉండగానే యెహోవా నాకు పేరు పెట్టాడు.
ISA 49:2 తన పక్షంగా మాట్లాడేందుకు యెహోవా నన్ను వాడుకొంటాడు. పదునైన ఖడ్గాన్ని ఒక సైనికుడు వాడుకొన్నట్టు ఆయన నన్ను వాడుకొంటాడు. అయితే ఆయన నన్ను తన చేతిలో దాచిఉంచి కాపాడుతాడు కూడాను. వాడిగల బాణంలా యెహోవా నన్ను వాడుకొంటాడు. అయితే ఆయన నన్ను తన బాణాల పొదిలో దాచి ఉంచుతాడు కూడాను.
ISA 49:3 “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి. నీతో నేను అద్భుత కార్యాలు చేస్తాను” అని యెహోవా నాతో చెప్పాడు.
ISA 49:4 నేను చెప్పాను, “వట్టిగానే నేను కష్టపడి పనిచేశాను. నేను చాలా అలసిపోయాను. కాని ప్రయోజనకరమైనది ఏమీ నేను చేయలేదు. నా శక్తి అంతటిని ఉపయోగించాను. కానీ వాస్తవానికి నేను చేసింది ఏమీ లేదు. కనుక నా విషయం ఏమి చేయాలో యెహోవాయే నిర్ణయించాలి. దేవుడే నా బహుమానం నిర్ణయించాలి.
ISA 49:5 నా తల్లి గర్భంలో యెహోవా నన్ను చేసాడు. నేను ఆయన సేవకునిగా ఉండుటకు ఆయన అలా చేస్తాడు. యాకోబను, ఇశ్రాయేలును నేను తిరిగి ఆయన దగ్గరకు నడిపించునట్లు ఆయన నన్ను అలా చేసాడు. యెహోవా నన్ను సన్మానిస్తాడు. నా దేవుని నుండి నేను నా బలం పొందుతాను.”
ISA 49:6 యెహోవా నాతో చెప్పాడు, “నీవు నాకు చాలా ప్రాముఖ్యమైన సేవకుడివి. ఇశ్రాయేలు ప్రజలు ఖైదీలు. వారు తిరిగి నా వద్దకు తీసుకొని రాబడతారు. అప్పుడు యాకోబు కుటుంబ దళాలు తిరిగి నా వద్దకు వస్తారు. అయితే నీకు మరో పని ఉంది; అది దీనికంటె ఇంకా ముఖ్యమయింది. సమస్త రాజ్యాలకు నిన్ను నేను వెలుగుగా చేస్తాను, భూమిమీద మనుష్యులందరినీ రక్షించేందుకు నీవే నా మార్గంగా ఉంటావు.”
ISA 49:7 యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు. ఇశ్రాయేలును కాపాడుతాడు. మరియు యెహోవా చెబతున్నాడు, “నా సేవకుడు దీనుడు. అతడు పాలకులను సేవిస్తాడు. ప్రజలు అతన్ని ద్వేషిస్తారు. కానీ రాజులు అతన్ని చూచి, అతడ్ని సన్మానించేందుకు నిలబడతారు. మహానాయకులు అతని ఎదుట సాగిలపడతారు.” ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, యెహోవా కోరిసందుచేత ఇది జరుగుతుంది. మరియు యెహోవా నమ్మదగినవాడు. నిన్ను కోరుకొన్నవాడు ఆయనే.
ISA 49:8 యెహోవా చెబతున్నాడు: “సరైన సమయంలో నేను నీకు దయను చూపిస్తాను. ఆ సమయమందు నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాను. రక్షణ దినాన నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను కాపాడుతాను. ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది అనేందుకు మీరు ఒక నిదర్శనం. ఇప్పుడైతే దేశం నాశనం చేయబడింది, అయితే మీరు దేశాన్ని తిరిగి దాని స్వంత దారులకు ఇచ్చివేస్తారు.
ISA 49:9 ‘చెరలోనుండి బయటకు వచ్చేయండి’ అని ఖైదీలతో మీరు చెబతారు. ‘చీకటిలోనుండి బయటకు వచ్చేయండి’ అని చీకటిలో ఉన్న ప్రజలతో మీరు చెబతారు. ప్రజలు పయనిస్తూ భోజనం చేస్తారు. ఖాళీ కొండలమీద కూడా వారికి భోజనం ఉంటుంది.
ISA 49:10 ప్రజలు ఆకలితో ఉండరు. వారు దాహంతో ఉండరు. సూర్యుని వేడి గాల్పులు వారికి హానిచేయవు. ఎందుకంటే, వారిని ఆదరించే వాడు (దేవుడు) వారిని నడిపిస్తాడు గనుక. ప్రజలను నీటి ఊటలు దగ్గరకు ఆయన నడిపిస్తాడు.
ISA 49:11 నా ప్రజలకు నేను బాట వేస్తాను. పర్వతాలు సమతలం చేయబడతాయి. పల్లపు తోవలు ఎత్తు చేయబడతాయి.
ISA 49:12 “చూడండి! చాలా దూర ప్రదేశాల నుండి ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు. ఉత్తరం నుండి, పశ్చిమం నుండి ప్రజలు వస్తున్నారు. ఈజిప్టులోని అస్వాను నుండి ప్రజలు వస్తున్నారు.”
ISA 49:13 భూమి, ఆకాశములారా సంతోషించండి. పర్వతములారా, ఆనందంగా కేకలు వేయండి. ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఆదరిస్తాడు గనుక. తన దీన జనులకు యెహోవా దయచూపిస్తాడు.
ISA 49:14 కానీ ఇప్పుడు సీయోను అంటుంది, “యెహోవా నన్ను విడిచిపెట్టాడు. నా యజమాని నన్ను మరిచిపోయాడు” అని.
ISA 49:15 అయితే నేనంటాను, “ఓ స్త్రీ తన శిశువును మరచిపోగలదా? లేదు. తన గర్భంనుండి వచ్చిన శిశువును ఒక స్త్రీ మరువగలదా?లేదు. ఒక స్త్రీ తన పిల్లలను మరువజాలదు. మరి నేను (యెహోవాను) మిమ్ములను మరువజాలను.
ISA 49:16 చూడు, నేను నీ పేరు నా చేతి మీద వ్రాసుకొన్నాను. ఎల్లప్పుడు నేను నిన్నుగూర్చి తలుస్తాను.
ISA 49:17 నీ పిల్లలు నీ దగ్గరకు తిరిగివస్తారు. ప్రజలు నిన్ను ఓడించారు, కానీ ఆ ప్రజలు నిన్ను ఒంటరిగా విడుస్తారు.”
ISA 49:18 పైకి చూడు! నీ చుట్టూ చూడు! నీ పిల్లలు అందరూ సమావేశమై నీ దగ్గరకు వస్తున్నారు. యెహోవా చెబతున్నాడు: “నేను సజీవంగా ఉన్నాను, నేను మీకు ఈ వాగ్దానం చేస్తున్నాను: నీ పిల్లలు నీకు కంఠహారంగా ఉంటారు. పెండ్లి కుమార్తె ధరించే ఒడ్డాణంలా నీ పిల్లలు ఉంటారు.
ISA 49:19 “ఇప్పుడైతే నీవు ఓడించబడి, నాశనం చేయబడి ఉన్నావు. నీ భూమి నిష్ప్రయోజనం. అయితే కొంతకాలం తర్వాత నీ దేశంలో ఎందరెందరో మనుష్యులు ఉంటారు. నిన్ను నాశనం చేసిన ఆ మనుష్యులు చాలా చాలా దూరంగా ఉంటారు.
ISA 49:20 నీవు పోగొట్టుకున్న పిల్లలకోసం నీవు విచారంగా ఉన్నావు. అయితే ఆ పిల్లలు, ‘ఈ స్థలం మేము నివసించేందుకు చాలా చిన్నదిగా ఉంది. మేము నివసించేందుకు పెద్ద స్థలం ఇవ్వు’ అని నీతో చెబతారు.
ISA 49:21 అప్పుడు నీలో నీవు అనుకొంటావు, ‘ఈ పిల్లలందర్నీ నాకు ఎవరు ఇచ్చారు? ఇది చాలా బాగుంది. నేను విచారంగా, ఒంటరిగా ఉన్నాను. నేను ఓడించబడి, నా ప్రజలకు దూరమయ్యాను. అందుచేత ఈ పిల్లలను నాకిచ్చింది ఎవరు? చూడు, నేను ఒంటరిగా విడువబడ్డాను. ఈ పిల్లలంతా ఎక్కడనుండి వచ్చారు?’”
ISA 49:22 నా ప్రభువు యెహోవా చెబతున్నాడు, “చూడు, రాజ్యాలకు నేను నా చేయి ఊపుతాను. ప్రజలందరూ చూడగలిగేట్టు నేను నా పతాకాన్ని ఎగురవేస్తాను. అప్పుడు ఆ ప్రజలు నీ పిల్లలను నీ దగ్గరకు తీసుకొని వస్తారు. ఆ ప్రజలు నీ పిల్లలను వారి భుజాలమీద ఎత్తుకొంటారు, మరియు వారు తమ చేతుల్లో వారిని పట్టు కొంటారు.
ISA 49:23 నీ పిల్లలకు రాజులు ఉపాధ్యాయులుగా ఉంటారు. రాజకుమార్తెలు ఆ పిల్లల విషయమై శ్రద్ధ పుచ్చుకొంటారు. రాజులు, వారి కుమార్తెలు నీ ఎదుట సాష్టాంగపడ్తారు. నీ పాదాల కింద ధూళిని వారు ముద్దు పెట్టుకొంటారు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకొంటావు. నా యందు విశ్వాసం ఉంచే వాడెవడూ నిరాశచెందడని నీవు తెలుసుకొంటావు.”
ISA 49:24 బలమైన సైనికుడు ఒకడు యుద్ధంలో గనుక ఐశ్వర్యం గెలుచుకొంటే ఆ ఐశ్వర్యాన్ని అతని దగ్గర్నుండి నీవు తీసుకోలేవు. బలమైన సైనికుడు ఒక ఖైదీకి కాపలా ఉంటే ఆ ఖైదీ తప్పించుకోలేడు.
ISA 49:25 అయితే యెహోవా చెబతున్నాడు, “బలమైన సైనికుని దగ్గర్నుండి ఖైదీలు తప్పించబడతారు. ఆ ఖైదీలు తప్పించుకొంటారు. ఇది ఎలా జరుగుతుంది? నీ యుద్ధాలు నేను పోరాడుతాను నీ పిల్లల్ని నేను రక్షిస్తాను.
ISA 49:26 స్వంత శరీరాన్ని తినేట్టుగా, మిమ్నల్ని కష్టపెట్టే వారిని నేను బలవంతం చేస్తాను. వారి రక్తమే వారిని మత్తెక్కించే ద్రాక్షరసం అవుతుంది. అప్పుడు నేను మిమ్మల్ని రక్షించే యెహోవానని ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు. యాకోబు యొక్క మహా శక్తిమంతుడే మిమ్మల్ని రక్షించే వాడు అని మనుష్యులందరూ తెలుసుకొంటారు.”
ISA 50:1 యెహోవా చెబతున్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, మీ తల్లి యెరూషలేముకు నేను విడాకులిచ్చానని మీరంటున్నారు. అయితే ఆమెను నేను విడనానట్లు నిదర్శన కాయితాలు ఏయి? నా పిల్లలారా, ఎవరికైనా నేను డబ్బురుణం ఉన్నానా? అప్పు తీర్చటానికి నేను మిమ్నల్ని అమ్ముకొన్నానా? లేదు. చూడండి, మీరు చేసిన చెడ్డ పనుల మూలం గానే నేను మిమ్మల్ని విడిచి పెట్టేసాను. మీ తల్లి (యెరూషలేము) చేసిన చెడ్డ పనుల వల్లనే ఆమెను నేను పంపివేశాను.
ISA 50:2 నేను ఇంటికి వచ్చాను, ఎవరూ కనబడలేదు. నేను పిలిచి, పిలిచి, ఎంత పిలిచినా ఎవరూ పలుక లేదు. నేను మిమ్మల్ని రక్షించలేనని మీరు తలుస్తున్నారా? మీ కష్టాలనుండి మిమ్మును రక్షించే శక్తినాకు ఉంది. చూడండి, సముద్రాన్ని ఎండి పొమ్మని నేను ఆజ్ఞాపిస్తే అది ఎండిపోతుంది! అక్కడ నీళ్లు ఉండవు గనుక చేపలు చస్తాయి, అవి కుళ్లిపోతాయి.
ISA 50:3 ఆకాశాన్ని నేను చీకటి కమ్మివేసేలా చేయగలను. విచార వస్త్రాల్లా ఆకాశం నల్లగా అవుతుంది.”
ISA 50:4 ఉపదేశం చేయగల సామర్థ్యాన్ని నా ప్రభువైన యెహోవా నాకు ఇచ్చాడు. కనుక ఈ విచారగ్రస్థ ప్రజలకు ఇప్పుడు నేను ఉపదేశము చేస్తాను. ప్రతి ఉదయం ఆయన నన్ను మేల్కొలిపి, ఒక విద్యార్థిలా నాకు ఉపదేశిస్తాడు.
ISA 50:5 నేను నేర్చుకొనేందుకు నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. మరియు నేను ఆయన మీద తిరుగబడలేదు. నేను ఆయనను వెంబడించటం మానను.
ISA 50:6 నేను ఆ ప్రజల్ని నన్ను కొట్టనిస్తాను. వాళ్లను నా గడ్డం పీకనిస్తాను. వాళ్లు నన్ను చెడ్డ మాటలు తిట్టి, నా మీద ఉమ్మి వేసినప్పుడు నేను నా ముఖం దాచుకోను.
ISA 50:7 నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. కనుక వారు చెప్పే చెడ్డ మాటలు నాకు హాని కలిగించవు. నేను బలవంతుడనై ఉంటాను. నేను నిరాశ చెందనని నాకు తెలుసు.
ISA 50:8 యెహోవా నాతో ఉన్నాడు. నేను నిర్దోషినని ఆయనకు తెలుసును. కనుక నేను దోషినని ఎవరూ చూపించలేరు. నాదే తప్పు అని ఎవరైనా రుజువు చేయాలనుకొంటే, ఆ వ్యక్తి నా దగ్గరకు రావాలి. మేము ఒక తీర్పు జరిగిస్తాం.
ISA 50:9 అయితే చూడండి, నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. అందుచేత నేను చెడ్డవాడినని ఎవ్వరూ చూపించలేరు. అలాంటి వాళ్లంతా పనికిమాలిన గుడ్డల్లా అవుతారు. వాటిని చెదలు తినేస్తాయి.
ISA 50:10 యెహోవాను గౌరవించే ప్రజలు ఆయన సేవకుని మాటకూడా వింటారు. ఆ సేవకుడు ఏం జరుగుతుందో తెలియకుండానే సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తాడు. అతడు వాస్తవంగా యెహోవా నామాన్నే నమ్ముకొంటాడు, మరియు ఆ సేవకుడు తన దేవుని మీద ఆధారపడతాడు.
ISA 50:11 “ప్రజలారా, చూడండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించాలనుకొంటున్నారు. మీ మంటలను, జ్వాలలను మీరే అంటిస్తున్నారు. అలానే, మీ దారిన మీరు జీవిస్తున్నారు. కానీ మీరు శిక్షించబడతారు. మీరు మీ మంటల్లో, జ్వాలల్లో పడతారు, మీరు కాల్చివేయబడుతారు. అలా జరిగేట్టు నేను చేస్తాను.
ISA 51:1 “మీలో కొంతమంది ప్రజలు మంచి జీవితాలు జీవించాలని కష్టపడి ప్రయత్నిస్తారు. సహాయంకోసం మీరు యెహోవా దగ్గరకు వెళ్తారు. నా మాట వినండి. మీ తండ్రి అబ్రాహామును మీరు చూడాలి. మీరు ఏ బండనుండి చెక్కబడ్డారో, ఆ బండ ఆయనే.
ISA 51:2 అబ్రాహాము మీ తండ్రి, మీరు ఆయన్ని చూడాలి. మీకు జన్మనిచ్చిన మాతృమూర్తి శారాను మీరు చూడాలి. అబ్రాహామును నేను పిలిచినప్పుడు అతడు ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు నేను అతణ్ణి ఆశీర్వదించాను, అతడు ఒకగొప్ప వంశాన్ని ప్రారంభించాడు. అనేకానేక మంది అతనినుండి ఉద్భవించారు.”
ISA 51:3 అదే విధంగా సీయోనును యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆమెను గూర్చి, ఆమె ప్రజలను గూర్చి యెహోవా విచారించి, ఆమెకోసం ఒక గొప్ప కార్యం చేస్తాడు. అరణ్యాన్ని యెహోవా మార్చేస్తాడు. అరణ్యం ఏదెను వనంలా ఒక వనం అయిపోతుంది. ఆ దేశం ఖాళీగా ఉంది గాని అది యెహోవా తోటలా తయారవుతుంది. అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు. అక్కడ ప్రజలు వారి ఆనందాన్ని ప్రదర్శిస్తారు. కృతజ్ఞత, విజయాలను గూర్చి వారు పాటలు పాడుతారు.
ISA 51:4 “నా ప్రజలారా, నా మాట వినండి! ప్రజలు ఎలా జీవించాలో అది వారికి చూపించే దీపాల్లాంటివి నా నిర్ణయాలు.
ISA 51:5 నేను న్యాయవంతుడనని త్వరలోనే నేను చూపిస్తాను. త్వరలోనే నేను నిన్ను రక్షిస్తాను. నేను నా శక్తిన్ని ప్రయోగించి, రాజ్యాలన్నింటికి తీర్పు తీరుస్తాను. దూర ప్రదేశాలన్నీ నాకోసం కనిపెట్టుకొని ఉన్నాయి. నా శక్తి వారికి సహాయం చేయాలని అవి కనిపెట్టుకొని ఉన్నాయి.
ISA 51:6 ఆకాశాలవైపు చూడండి. మీ చుట్టూ కింద ఉన్న భూమిని చూడండి. ఆకాశాలు పొగ మేఘాల్లా మాయమైపోతాయి. భూమి పనికి మాలిన పాత గుడ్డల్లా అవుతుంది. భూమి మీద మనుష్యులు మరణిస్తారు. అయితే నా రక్షణ శాశ్వతంగా కొనసాగుతుంది. నా దయ ఎప్పటికీ అంతంకాదు.
ISA 51:7 దయను అవగాహన చేసికొనే ప్రజలారా, మీరు నా మాట వినాలి. నా ఉపదేశాలను పాటించే ప్రజలారా నేను చెప్పే మాటలు మీరు వినాలి. దుష్ట ప్రజలు విషయం భయపడకండి. వారు మీకు చెప్పే చెడ్డ విషయాలను గూర్చి భయపడకండి.
ISA 51:8 ఎందుకంటే వారు పాత గుడ్డల్లా ఉంటారు గనుక. చిమ్మెటలు వాటిని తినివేస్తాయి. వారు గొర్రెబొచ్చులా ఉంటారు. పురుగులు వాటిని తినివేస్తాయి. అయితే నా దయ శాశ్వతంగా కొనసాగుతుంది. నా రక్షణ శాశ్వతంగా సదా కొనసాగుతుంది.”
ISA 51:9 యెహోవా హస్తమా (శక్తి) మేలుకో! మేలుకో! నీ బలం సిద్ధం చేయి. చాలాకాలం కిందట నీవు చేసినట్టు పూర్వకాలాల్లో నీవు చేసినట్టు నీ బలాన్ని ప్రయోగించు. రాహాబును ఓడించిన శక్తి నీవే. మకరాన్ని నీవే ఓడించావు.
ISA 51:10 సముద్రం ఎండిపోయేట్టు నీవే చేశావు. మహా అగాధ జలాలను ఎండిపోయేట్టు నీవు చేశావు. సముద్రపు అతి లోతైన స్థలాలను నీవు త్రోవగా చేశావు. నీ ప్రజలు ఆ మార్గాన వెళ్లి రక్షించబడ్డారు.
ISA 51:11 యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు. వారు ఆనందంగా సీయోనుకు తిరిగి వస్తారు. వారు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారు. వారి ఆనందం వారి తలలమీద శాశ్వత కిరీటంలా ఉంటుంది. ఆనందంతో వారు పాటలు పాడు తూంటారు. దుఃఖం అంతా దూరమైపోతుంది.
ISA 51:12 యెహోవా చెబతున్నాడు, “నిన్ను ఆదరించే వాడను నేనే. కనుక ఇతరులను గూర్చి నీవెందుకు భయపడాలి? వాళ్లు కేవలం బతికి, చచ్చే మనుష్యులు మాత్రమే. వాళ్లు కేవలం మానవ మాత్రులువారు కూడా గడ్డిలాగే చస్తారు.”
ISA 51:13 యెహోవా మిమ్మల్ని చేశాడు. తన శక్తితో ఆయన భూమిని చేశాడు. తన శక్తితో ఆకాశాలను భూమికి పైగా ఆయన విస్తరింపజేసాడు. కానీ ఆయనను, ఆయన శక్తిని మీరు మరచి పోతారు. కనుక మీకు హాని చేసే కోపిష్ఠులైన మనుష్యులను గూర్చి ఎల్లప్పుడు మీరు భయపడుతుంటారు. ఆ మనుష్యులు మిమ్మును నాశనం చేయాలను పథకం వేసారు. కానీ ఇప్పుడు వాళ్లెక్కడ? వాళ్లంతా పోయారు.
ISA 51:14 చెరసాలలోని మనుష్యులు త్వరలోనే విడుదల చేయబడతారు. వాళ్లు చెరసాలలోనే మరణించి, కుళ్లిపోరు. ఆ మనుష్యులకు సరిపడినంత ఆహారం ఉంటుంది.
ISA 51:15 “నేను యెహోవాను, మీ దేవుడను. నేను సముద్రాన్ని కదలిస్తాను, కెరటాలు పుట్టిస్తాను.” (ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.)
ISA 51:16 “నా సేవకా, నీవు చెప్పాలని నేను కోరే మాటలను నేనే నీకు ఇస్తాను. నా చేతులతో నిన్ను నేను కప్పిఉంచి కాపాడుతాను. కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చేసేందుకు నిన్ను నేను ఉపయోగించుకొంటాను. ‘మీరు నా ప్రజలు అని ఇశ్రాయేలుతో చెప్పేందుకు నిన్ను నేను వాడుకొంటాను.’”
ISA 51:17 మేలుకో! మేలుకో! యెరూషలేమా, లెమ్ము! నీ మీద యెహోవా చాలా కోపగించాడు. అందువల్ల నీవు శిక్షించబడ్డావు. నీవు తాగాల్సిన ఒక విషపుపాత్రలా ఉంది ఆ శిక్ష. నీవు దానిని తాగావు.
ISA 51:18 యెరూషలేముకు చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ వారిలో ఎవ్వరూ ఆమెకు నాయకులు కాలేదు. ఆమె పెంచిన పిల్లలు ఎవ్వరు ఆమెను నడిపించే మార్గదర్శులు కాలేదు.
ISA 51:19 యెరూషలేముకు జంట జంటలుగా కష్టాలు వచ్చాయి, దొంగిలించటం, చొరబడటం, మహా ఆకలిపోరాటం. నీవు శ్రమ అనుభవిస్తున్నప్పుడు నీకు ఎవ్వరూ సహాయం చేయలేదు. ఎవరూ నీ మీద దయచూపించలేదు.
ISA 51:20 నీ ప్రజలు బలహీనులయ్యారు. వారు నేలమీద పడి, అలానే ఉండిపోయారు. ప్రతి వీధిమలుపులోను వారు పడివున్నారు. వారు వలలో పట్టబడిన జంతువుల్లా ఉన్నారు. వారు ఇంకెంత మాత్రం భరించలేనంతగా, యెహోవా కోపంచేత శిక్షించబడ్డారు. దేవుడు వారికి ఇంకా ఎక్కువ శిక్ష విధిస్తాను అన్నప్పుడు వారు మరీ బలహీనులై పోయారు.
ISA 51:21 అయ్యో, యెరూషలేమూ, నా మాట విను. ఒక తాగుబోతువానిలా నీవు బలహీనంగా ఉన్నావు, కానీ నీవు ద్రాక్షరసం తాగినందుచేత కాదు మత్తుగా ఉన్నది. నీవు ఆ “విషపు పాత్ర” మూలంగా బలహీనంగా ఉన్నావు.
ISA 51:22 నీ దేవుడు, యజమానియైన యెహోవా తన ప్రజలకోసం పోరాడుతాడు. ఆయన నీతో ఇలా అంటున్నాడు: “చూడు, ఈ ‘విషపు పాత్రను’ (శిక్షను) నీ వద్దనుండి నేను తొలగించి వేస్తున్నాను. నీ మీద నా కోపాన్ని తీసివేస్తున్నాను. ఇంకెంత మాత్రం నీవు నా కోపం మూలంగా శిక్షించబడవు.
ISA 51:23 నీకు హాని చేసిన వారిని శిక్షించటానికి ఇప్పుడు నేను నా కోపాన్ని వినియోగిస్తాను. ఆ ప్రజలు నిన్ను చంపటానికి ప్రయత్నించారు. ‘మా యెదుట, సాష్టాంగపడు, మేము నీ మీద నడుస్తాం’ అని వారు నీతో చెప్పారు. వాళ్ల ముందు సాష్టాంగ పడేట్టు వారు నిన్ను బలవంతం చేశారు. అప్పుడు ఆ మనుష్యులు నడుచుటకు నీ వీపును ధూళిగా చేశారు. వారు ప్రయాణం చేయుటకు నీవు ఒక తోవలా ఉన్నావు.”
ISA 52:1 మేలుకో! మేలుకో! సీయోనూ మేలుకో. నీవు వస్త్రాలు ధరించు. నీ బలంతొడుగుకో. పవిత్ర యెరూషలేమా, నిలుచో! దేవుణ్ణి వెంబడించేందుకు ఒప్పు కొని ప్రజలు, పవిత్రంగా లేని ప్రజలు నీలో మరల ప్రవేశింపరు.
ISA 52:2 ధూళి దులిపివేయి! అద్భుతమైన నీ వస్త్రాలు ధరించు! సీయోను కుమారీ, యెరూషలేమా, నీవు ఒక ఖైదీవి. కాని ఇప్పుడు నీ మెడ చుట్టూ ఉన్న గొలుసుల నుండి నిన్ను నీవు విడుదల చేసుకో!
ISA 52:3 యెహోవా చెబతున్నాడు, “నీవు డబ్బుకు అమ్మబడలేదు. అందుచేత డబ్బు లేకుండనే నీవు రక్షించబడతావు.”
ISA 52:4 నా ప్రభువు యెహోవా చెబతున్నాడు: “నా ప్రజలు నివాసం ఉండేందుకు మొదట ఈజిప్టుకు దిగిపోయారు, ఆ తర్వాత వారు బానిసలయ్యారు. ఆ తర్వాత వారిని అష్షూరు బానిసలను చేసింది.
ISA 52:5 ఇప్పుడు చూడండి ఏమయిందో! మరో రాజ్యాం నా ప్రజలను తీసుకొంది. నా ప్రజలను బానిసలుగా తీసుకొన్న ఆ రాజ్యం ఏది? నా ప్రజలను తీసుకొనేందుకు ఈ రాజ్యం ఏమీ చెల్లించలేదు. ఈ రాజ్యం నా ప్రజలను పాలిస్తూ, వారిని చూచి నవ్వుతుంది. ఆ మనుష్యులు ఎప్పుడూ నన్ను గూర్చి చెడ్డ మాటలే చెబుతుంటారు.”
ISA 52:6 “నా ప్రజలు నన్ను గూర్చి నేర్చుకొనేందుకు ఇది జరిగింది. నేను ఎవరినో నా ప్రజలు తెలుసుకొంటారు. నా ప్రజలు నా పేరు తెలుసుకొంటారు, ఉన్నవాడను అనే నేను వారితో మాట్లాడుతున్నానని వారు తెలుసుకొంటారు” అని యెహోవా చెబుతున్నాడు.
ISA 52:7 శుభవార్తతో కొండల మీదుగా ఒక వార్తాహరుడు రావటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. “శాంతి ఉంది! మేము రక్షించబడ్డాం! మీ దేవుడే రాజు!”అని ఒక వార్తాహరుడు ప్రకటించగా వినటం అద్భుతం.
ISA 52:8 పట్టణపు కావలి వాళ్లు కేకలు వేయటం మొదలు పెట్టారు. వాళ్లంతా కలిసి ఆనందిస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే, యెహోవా సీయోనుకు తిరిగి రావటం వారిలో ప్రతి ఒక్కరూ చూస్తారు.
ISA 52:9 యెరూషలేమా, నాశనం చేయబడిన నీ కట్టడాలు మరల సంతోషిస్తాయి. మీరంతా కలిసి ఆనందిస్తారు. ఎందుకంటే, యెరూషలేముమీద యెహోవా దయగలిగి ఉంటాడు. యెహోవా తన ప్రజలను విమోచిస్తాడు.
ISA 52:10 యెహోవా తన పవిత్ర శక్తిని సకల రాజ్యాలకు చూపిస్తాడు. మరియు దేవుడు తన ప్రజలను ఎలా రక్షిస్తాడో అది దూర దేశాలన్నీ చూస్తాయి.
ISA 52:11 ప్రజలారా మీరు బబులోను విడిచిపెట్టాలి. ఆ స్థలం విడిచిపెట్టండి! ఆరాధనలో ఉపయెగించే వస్తువలను మోసే మనుష్యులారా మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. అపవిత్రమైన దేన్ని ముట్టుకో వద్దు.
ISA 52:12 మీరు బబులోను విడిచిపెడ్తారు. కానీ మీరు ఆత్రంగా విడిచిపెట్టేందుకు బలవంతం చేయబడరు. పారిపోయేందుకు మీరు బలవంతం చేయబడరు. మీరు బయటకు నడుస్తారు మరియు యెహోవా మీతో నడుస్తాడు. యెహోవా మీకు ముందు ఉంటాడు. ఇశ్రాయేలీయుల దేవుడు మీ వెనుక ఉంటాడు.
ISA 52:13 “నా సేవకుని చూడు. అతనికి విజయం కలుగుతుంది. అతడు చాలా ప్రముఖుడవుతాడు. భవిష్యత్తులో ప్రజలు అతన్ని సన్మానించి, గౌరవిస్తారు.
ISA 52:14 కానీ చాలా మంది మనుష్యులు నా సేవకుని చూచి అదరిపోయారు. అతణ్ణి ఒక మనిషిగా వారు గుర్తించలేనంతగా అతడు బాధించబడ్డాడు.
ISA 52:15 కానీ అంతకంటె ఎక్కువమంది ప్రజలు ఆశ్చర్యపోతారు. రాజులు అతన్ని చూచి ఆశ్చర్యపోయి, నోట మాట రాకుండా ఉండిపోతారు. నా సేవకుని గూర్చిన కథ వారు వినలేదు- జరిగింది వారు చూశారు. ఈ ప్రజలు ఆ కథ వినలేదు గాని వారు గ్రహించారు.”
ISA 53:1 మేము ప్రకటించిన సంగతులను నిజంగా ఎవరు నమ్మారు? యెహోవా హస్తం ఎవరికి బయలు పరచబడింది?
ISA 53:2 యెహోవా ఎదుట ఆయన ఒక చిన్న మొక్కవలె ఉన్నాడు. ఎండిన భూమిలో ఎదుగుతున్న మొక్కవలె పెరిగాడు. మనము ఆయనలో చూడతగిన రూపముగాని తేజస్సుగాని, ఏమి లేదు. మనం ఆయనని చూడటానికి ఇష్టపడుటకు ఆయనలో ప్రత్యేకత ఏమీ మనకు కనబడదు.
ISA 53:3 ఆయన నీచంగా ఎంచబడ్డాడు, మనుష్యుల చేత విడిచి పెట్టబడ్డాడు, ఆయన ఎంతో బాధ పొందిన మనిషి. రోగం బాగా ఎరిగిన వాడు. కనీసం ఆయన్ని కన్నెత్తి చూసేందుకు మనుష్యులు ముఖాన్ని దాచుకొన్నారు. ఆయన నీచంగా ఎంచబడ్డాడు. కనుక మనం ఆయన్ని లెక్కచేయలేదు.
ISA 53:4 నిశ్చయంగా ఆయన మన వ్యాధులను భరించాడు. మన బాధలను మోశాడు. అయినా, ఆయన్ని కొట్టిన వానిగాను, హింసించిన వానిగాను, బాధించిన వానిగాను, మనం తలంచాం.
ISA 53:5 కాని మనం చేసిన చెడ్డ పనులకు ఆయన శ్రమపొందాల్సి వచ్చింది. మన దోషం మూలంగానే ఆయన నలుగగొట్టబడ్డాడు. మనకు సమాధాన మిచ్చిన శిక్ష ఆయన మీద పడింది. ఆయన గాయాల మూలంగా మనకు స్వస్థత కలిగింది.
ISA 53:6 కానీ ఆయన ఇలా చేసిన తర్వాత కూడా మనం అందరం గోర్రెలవలె త్రోవతప్పి పోయి తిరిగాం. మనం మనకు ఇష్టమైన దారిలో పోయాం. మన అందరి దోషాన్ని యెహోవా ఆయన మీద వేశాడు.
ISA 53:7 ఆయన భాధించబడ్డాడు, శిక్షించబడ్డాడు, కానీ ఎన్నడూ ఎదురు చెప్పలేదు. వధించబడుటకు తీసుకొని పొబడే గొర్రెవలె ఆయన మౌనంగా ఉన్నాడు. ఒక గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించేటప్పుడు ఎలా మౌనంగా ఉంటుందో అలా ఆయన మౌనంగా ఉన్నాడు. తనను తాను రక్షించుకోవటానికి ఆయన నోరు తెరవలేదు.
ISA 53:8 ఆయన అబద్ధపు తీర్పుపొంది, బంధించబడి తీసుకొని పోబడ్డాడు. ఆయన తరంలో ఈ విషయాలు ఎవరు మనస్సుకు తీసుకొన్నారు? ఆయన భూమిమీద నివసిస్తున్న వారిలో నుండి తొలగించబడ్డాడు. నా ప్రజల అపరాధాల కోసం ఆయన నలుగ కొట్టబడ్డాడు.
ISA 53:9 ఆయన చనిపోయి ధనికునితో పాతి పెట్టబడ్డాడు. దుష్టులతో పాటు ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన దౌర్జన్యం చేయలేదు. ఆయన ఎన్నడూ మోసం చేయలేదు.
ISA 53:10 అయినా ఆయన్ని నలుగ గొట్టాలని శ్రమకలిగించాలని, యెహోవాకు ఇష్టం. యెహోవా ఆయన ప్రాణాన్ని పాప పరిహర బలిగా అర్పించితే ఆయన బహూకాలం జీవించి తన సంతానాన్ని చూస్తాడు. ఆయనలో యెహోవా చిత్తం సఫలమవుతుంది.
ISA 53:11 ఆయన తన ఆత్మలో ఎన్నో శ్రమల పొందిన తర్వాత వెలుగును చూచి సంతృప్తి చెందుతాడు. నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానం వల్ల అనేకులను నీతిమంతులుగా చేస్తాడు.
ISA 53:12 ఈ కారణం చేత నేను గొప్ప ప్రజలతో ఆయన్ని గొప్పవాడినిగా చేస్తాను. బలముగల ప్రజలందరిలో ఆయనకు అన్నింటిలోనూ భాగం ఉంటుంది. ఎందుకంటే మనుష్యుల కోసం ఆయన తన ప్రాణం ఇచ్చిమరణించాడు. ఆయన నేరస్థులలో ఒకనిగా లెక్కించబడ్డాడు. అనేకుల పాపాల్ని ఆయన మోసి అపరాదుల కోసం విజ్ఞాపన చేసాడు.
ISA 54:1 ఓ స్త్రీ, సంతోషంగా ఉండు! నీకు పిల్లలు పుట్టలేదు, కానీ నీవు చాలా సంతోషంగా ఉండాలి. “భర్తగల స్త్రీకంటె ఒంటరి స్త్రీ ఎక్కువ మంది పిల్లలను కంటుంది.” అని యెహోవా చెబుతున్నాడు.
ISA 54:2 నీ గుడారం విశాలం చేయి. నీ ద్వారాలు పూర్తిగా తెరువు. నీ కుటుంబాన్ని వృద్ధి చేయటం ఆపుజేయకు. నీ గుడారాన్ని విశాలం చేయి, బలంగా చేయి.
ISA 54:3 ఎందుకంటే నీవు చాలా పెరిగిపోవటం మొదలు పెడతావు. నీ పిల్లలు అనేక రాజ్యాల నుండి ప్రజలను తీసుకొనివస్తారు. నాశనం చేయబడిన పట్టణాల్లో ఆ పిల్లలు తిరిగి నివసిస్తారు.
ISA 54:4 భయపడవద్దు! నీవు నిరాశ చెందవు. నీ మీద ప్రజలు చెడ్డ మాటలు చెప్పరు. నీవేమీ ఇబ్బందిపడవు. నీవు చిన్నదానివిగా ఉన్నప్పుడు నీవు సిగ్గుపడ్డావు. కానీ ఆ సిగ్గు నీవు ఇప్పుడ మరచిపోతావు. నీ భర్త పోయినప్పుడు నీకు కలిగిన అవమానాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవు.
ISA 54:5 ఎందుకంటే నిన్ను చేసిన వాడు నీ భర్త (దేవుడు) గనుక ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా. ఇశ్రాయేలును రక్షించేవాడు ఆయనే. ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధుడు. ఆయన సర్వభూమికి దేవుడు అని పిలువ బడతాడు.
ISA 54:6 నీవు భర్త విడిచిన భార్యవలె ఉన్నావు. ఆత్మలో నీవు చాలా దుఃఖించావు. కానీ యెహోవా నిన్ను తనదిగా ఉండేందుకు పిలిచాడు. యవ్వనంలో వివాహమై, భర్తచే విడిచి పెట్టబడిన స్త్రీలా నీవు ఉన్నావు. కానీ దేవుడు నిన్ను తనదానిగా ఉండుటకు పిలిచాడు.
ISA 54:7 దేవుడు చెబుతున్నాడు, “నేను నిన్ను విడిచిపెట్టాను. కానీ కొంతకాలం మట్టుకే. నేను నిన్ను మళ్లీ నా దగ్గరకు చేర్చుకొంటాను. నేను నీకు గొప్ప దయ చూపిస్తాను.
ISA 54:8 నేను చాలా కోపగించి కొద్ది కాలం పాటు నీ నుండి దాక్కున్నాను. కానీ శాశ్వతంగా నిన్ను నేను దయతో ఆదరిస్తాను.” నీ రక్షకుడైన యెహోవా ఇది చెప్పాడు.
ISA 54:9 దేవుడు చెబుతున్నాడు: “నోవహు కాలంలో ప్రళయంతో నేను ప్రపంచాన్ని శిక్షించినట్టుగా ఉంది ఇది. ప్రపంచాన్ని మళ్లీ ఎన్నడూ ప్రళయంతో ముంచివేయనని నొవహుకు నేను వాగ్దానం చేశాను. అదే విధంగా, నేను మరల ఎన్నడు నీ మీద కోపగించి, నిన్నుగూర్చి చెడుగా మాట్లాడనని ప్రమాణం చేస్తున్నాను.”
ISA 54:10 యెహోవా చెబుతున్నాడు: “పర్వతాలు కని పించకుండా పోవచ్చు, కొండలు ధూళి కావచ్చును. కానీ నా దయ నిన్ను ఎన్నటికీ విడువదు. నేను నీతో సమాధానపడతాను, అది ఎన్నటికీ అంతం కాదు.” యెహోవా నీ యెడల కరుణ చూపిస్తాడు. మరియు ఈ సంగతులు చెప్పిన వాడు ఆయనే.
ISA 54:11 “అయ్యో, దీన పట్టణమా! తుఫానులు నిన్ను బాధించాయి, మరియు నీవు ఓదార్చబడలేదు. నేను నిన్ను మరల నిర్మిస్తాను. ప్రశస్తమైన రాళ్లను ఉపయోగించి నేను నీ పునాదులు వేస్తాను. నీలాంజనాలు, నీలాలు నేను ఉపయోగిస్తాను.
ISA 54:12 మాణిక్య మణులతో నేను నీ గోడలు కడతాను. సూర్యకాంతాలతో నేను నీ ద్వారాలు కడతాను. ప్రశస్త రత్నాలతో నేను నీ గోడలన్నింటినీ కడతాను.
ISA 54:13 నీ పిల్లలు దేవుని వెంబడిస్తారు, ఆయన వారికి ఉపదేశం చేస్తాడు. నీ పిల్లలకు ఎంతో శాంతి ఉంటుంది.
ISA 54:14 న్యాయం ప్రయోగించి నేను నిర్మిస్తాను. కనుక నీవు అన్యాయానికి, కృ-రత్వానికి దూరంగా ఉండాలి. అప్పుడు నీవు భయపడాల్సింది. ఏమీ ఉండదు. ఏదీ నిన్ను బాధించుటకు రాదు.
ISA 54:15 నా సైన్యాలు ఏవీ నీకు వ్యతిరేకంగా పోరాడవు. మరియు ఏ సైన్యమైనా నీ మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తే నీవు ఆ సైన్యాన్ని ఓడిస్తావు.
ISA 54:16 “చూడు, కమ్మరిని నేను చేశాను. అగ్నిని రాజ బెట్టేందుకు అతడు నిప్పుమీద విసరుతాడు. అప్పుడు అతడు వేడి ఇనుమును తీసుకొని, తాను చేయదలచుకొన్న పనిముట్టును చేస్తాడు. అదేవిధంగా నాశనం చేసే ‘నాశన కర్తను’ నేను సృజించాను.
ISA 54:17 “నీ మీద పోరాడుటకు మనుష్యులు ఆయుధాలు చేస్తారు. కానీ ఆ ఆయుధాలు నిన్ను ఓడించవు. కొంత మంది నీకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. కానీ నీకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వ్యక్తిది తప్పు అని చూపించబడుతుంది.” “యెహోవా సేవకులకు ఏమి లభిస్తుంది? నా దగ్గర లభించే మంచి వాటన్నింటినీ వారు పొందుతారు” అని యెహోవా చెబుతున్నాతు.
ISA 55:1 “దాహంతో ఉన్న ప్రజలారా మీరంతా వచ్చి నీళ్లు తాగండి! మీ వద్ద డబ్బు లేకపోతే చింతపడకండి. రండి, మీకు తృప్తి కలిగేంతవరకు తినండి, తాగండి! మీకు డబ్బు అవసరం లేదు. మీకు తృప్తి కలిగేంతవరకు తినండి, తాగండి. ఆహారం, ద్రాక్షారసం ఉచితం!
ISA 55:2 నిజంగా ఆహారం కానిదానికోసం మీ ధనం వ్యర్థం చేయటం ఎందుకు? మిమ్మల్ని నిజంగా సంతృప్తి పరచని దానికోసం మీరు ప్రయాసపడటం ఎందుకు? నా మాట జాగ్రత్తగా వినండి, అప్పుడు మీరు మంచి ఆహారం భోజనం చేస్తారు. మీ ఆత్మను తృప్తిపరచే ఆహారం మీరు భోజనం చేస్తారు.
ISA 55:3 నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, మీ ఆత్మలు జీవించున ట్టుగా మీరు నా మాట వినండి. నా వద్దకు రండి! శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక నేను మీతో చేస్తాను. అది నేను దావీదుతో చేసిన ఒడంబడికలా ఉంటుంది. దావీదు ఎడల శాశ్వతంగా దయగలిగి ఉంటానని నేను అతనికి వాగ్దానం చేసాను. మరి మీరు ఆ వాగ్దానాన్ని నమ్ముకోవచ్చు.
ISA 55:4 రాజ్యాలన్నింటిలో నా శక్తికి దావీదును సాక్షిగా నేను చేశాను. దావీదు అనేక రాజ్యాలకు పరిపాలకు నిగాను, సర్వసేనానిగాను ఉంటాడని నేను అతనికి వాగ్దానం చేశాను.”
ISA 55:5 నీవు యెరుగని స్థలాల్లో రాజ్యాలు ఉన్నాయి, కానీ ఆ రాజ్యాలను నీవు పిలుస్తావు. ఆ రాజ్యాలకు నీవు తెలియదు. కానీ అవి నీ దగ్గరకు పరుగెడతాయి. నీ దేవుడు యెహోవా ఇలా కోరుతున్నాడు కనుక ఇది జరుగుతుంది. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు నిన్ను గౌరవిస్తున్నాడు. కనుక ఇది జరుగుతుంది.
ISA 55:6 కనుక సమయం మించిపోక ముందే నీవు యెహోవా కోసం వెదకాలి. ఆయన సమీపంగాఉన్నప్పుడు, ఇప్పుడే నీవు ఆయనను వేడుకోవాలి.
ISA 55:7 దుర్మార్గులు వారి దుర్మార్గ జీవితాలు విడిచిపెట్టాలి. వారు తమ దురాలోచనలు నిలిపివేయాలి. వారు తిరిగి యెహోవా దగ్గరకు రావాలి. అప్పుడు యెహోవా వారిని ఆదరిస్తాడు. మన దేవుడు క్షమిస్తాడు గనుక ఆ మనుష్యులు యెహోవా దగ్గరకు రావాలి.
ISA 55:8 యెహోవా చెబుతున్నాడు, “మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. మీ మార్గాలు నా మార్గాలవంటివి కావు.
ISA 55:9 ఆకాశాలు భూమికంటె ఉన్నతంగా ఉన్నాయి. అదే విధంగా మీ మార్గాలకంటె నా మార్గాలు ఉన్నతంగా ఉన్నాయి. మరియు మీ తలంపులకంటె నా తలంపులు ఉన్నతంగా ఉన్నాయి.” యెహోవా తానే ఈ సంగతులు చెప్పాడు.
ISA 55:10 “వర్షం, మంచు ఆకాశం నుండి కురుస్తాయి. అవినేలను తాకి, నేలను తడిచేయకుండా తిరిగి ఆకాశానికి వెళ్లవు. అప్పుడు నేల మొక్కలను మొలిపించి, ఎదిగింప చేస్తుంది. ఈ మొక్కలు రైతుకోసం విత్తనాలు సిద్ధం చేస్తాయి. ప్రజలు ఆహారంగా రొట్టెలకోసం ఈ విత్తనాలు వినియోగిస్తారు.
ISA 55:11 అదే విధంగా నా నోటినుండి నా మాటలు బయలు వెళ్తాయి. అవి సంగతులను సంభవింప చేసేంతవరకు తిరిగి రావు. నేను ఏ సంగతులు సంభవించాలని అనుకొంటానో వాటిని నా మాటలు సంభవింపచేస్తాయి. ఏమి చేయాలని నేను నా మాటలను పంపిస్తానో వాటిని నా మాటలు సాధిస్తాయి.
ISA 55:12 “నా మాటలు సంతోషంగా బయలు వెళ్తాయి. అవి శాంతి కలిగిస్తాయి. పర్వతాలు, కొండలు సంతోషంగా నాట్యంచేయటం మొదలు పెడతాయి పొలాల్లోని చెట్లన్నీ చప్పట్లుకొడ్తాయి.
ISA 55:13 పొదలు ఉన్నచోట పెద్ద దేవదారు వృక్షాలు పెరుగుతాయి. కలుపు మొక్కలు ఉన్నచోట గొంజి వృక్షాలు పెరుగుతాయి. ఈ సంగతులు యెహోవాను ప్రసిద్ధుని చేస్తాయి. యెహోవా శక్తిమంతుడు అనేందుకు ఈ సంగతులు రుజువు. ఈ రుజువు ఎన్నటికి నాశనం చేయబడదు.”
ISA 56:1 యెహోవా ఈ సంగతులు చెప్పాడు, “మనుష్యులందరికి న్యాయం చూపండి. సరైన వాటినే చేయండి. ఎందుకంటే త్యరలోనే నా రక్షణ మీకు లభిస్తుంది. నా మంచితనం త్వరలోనే సర్వలోకానికి చూపించబడుతుంది గనుక.”
ISA 56:2 సబ్బాతును గూర్చిన దేవుని చట్టానికి విధేయత చూపే వ్యక్తి ఆశీర్వదించబడును. ఏ కీడు చేయని వ్యక్తి సంతోషంగా ఉంటాడు.
ISA 56:3 యూదులు కాని మనుష్యులు కొందరు యెహోవా వైపు తిరుగుతారు. “యెహోవా తన ప్రజలతో పాటు నన్ను స్వీకరించడు” అని ఆ మనుష్యులు చెప్పకూడదు. “నేను ఎండిన కట్టె ముక్కను, నాకు పిల్లలు పుట్టరు” అని నపుంసకుడు చెప్పకూడదు.
ISA 56:4 “సబ్బాతుకు సంబంధించిన చట్టాలకు విధేయులయ్యే నపుంసకులకు నేను శక్తి, కీర్తి ప్రసాదిస్తాను. నేను కోరే వాటిని జరిగించే నపుంసకులకు నేను శక్తి, కీర్తి ప్రసాదిస్తాను. వారు నా ఆలయంలో, నా పట్టణంలో ఉంటారు. నా ఒడంబడికను పాటించే నా ప్రజలందరికీ నేను ఈ విషయాలు జరిగిస్తాను. కుమారులు, కుమార్తెలకంటె శ్రేష్ఠమైన దానిని నేను వారికి ఇస్తాను. శాశ్వతంగా కొనసాగే పేరు నేను వారికి ఇస్తాను” అని యెహోవా చెబుతున్నాడు గనుక వారు ఆ మాటలు చెప్పకూడదు.
ISA 56:6 యూదులు కాని మనుష్యులు కొందరు యెహోవావైపు చేరుతారు. యెహోవాను సేవించి, ఆయనను ప్రే మించగలిగేట్టు వారు ఇలా చేస్తారు. వారు యెహోవాకు సేవకులు అయ్యేందుకు యెహోవావైపు చేరుతారు. సబ్బాతును ప్రత్యేక ఆరాధన రోజుగా వారు పాటిస్తారు, నా ఒడంబడిక (ధర్మశాస్త్రాన్ని) సన్నిహితంగా పాటించటం కొనసాగిస్తారు.
ISA 56:7 “ఆ మనుష్యులను నా పరిశుద్ధ పర్వతానికి నేను తీసుకొని వస్తాను. నా ప్రార్థనా మందిరంలో నేను వారిని సంతోషింప చేస్తాను. వారు నాకు అర్పించే అర్పణలు, బలులు నాకు సంతోషం కలిగిస్తాయి. ఎందుకంటే, నా ఆలయం సకల రాజ్యాలకూ ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది గనుక” అని యెహోవా చెబుతున్నాడు.
ISA 56:8 నా ప్రభువు యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి దేశంనుండి బలవంతంగా వెళ్లగొట్టబడ్డారు. కానీ యెహోవా వారిని మరల ఒక్కచోట చేరుస్తాడు. “ఈ ప్రజలను నేను మరల ఒక్కచోట చేరుస్తాను” అని యెహోవా చెబుతున్నాడు.
ISA 56:9 అరణ్యంలోని అడవి మృగములారా తినుటకురండి!
ISA 56:10 కావలి వాళ్లు (ప్రవక్తలు) అందరు గుడ్డివాళ్లు. వారు చేస్తుంది ఏమిటో వారికే తెలియదు. వారు మొరగటం చేతకాని కుక్కల్లాంటి వాళ్లు. వారు నేలమీద పండుకొని, నిద్రపోతారు. ఆహా, నిద్రపోవటం వారికి ఇష్టం.
ISA 56:11 వారు ఆకలిగొన్న కుక్కల్లా ఉన్నారు. వారు ఎన్నటికి తృప్తిపొందరు. ఆ కాపరులు ఏమిచేస్తున్నది. వారికే తెలియదు. తప్పిపోయి తిరుగుతున్న వారి గొర్రెల్లానే ఉన్నారు వారూను. వారు దురాశపరులు. వారు చేయాలని ఆశించేది అంతా వారిని వారు తృప్తిపరచు కోవటమే.
ISA 56:12 “నేను కొంచెం ద్రాక్షరసం తాగుతాను. నేను కొంచెం మద్యం తాగుతాను. నేను రేపు కూడా ఇలానే చేస్తాను. ఆ తర్వాత నేను ఇంకా ఎక్కువ కూడా తాగుతాను” అని వారు వచ్చి చెబుతారు.
ISA 57:1 మంచి మనుష్యులు పోయారు. కానీ ఏ వ్యక్తి అది గమనించలేదు. ఏం జరుగుతుందో ప్రజలు గ్రహించరు. కానీ వారు మంచి మనుష్యులందరిని సమావేశపరచారు. కష్టాలు వస్తున్నాయని ప్రజలు గ్రహించరు. మంచి వాళ్లంతా భద్రతకోసం సమావేశం చేయబడ్డారని వారికి తెలియదు.
ISA 57:2 అయితే శాంతి కలుగుతుంది. మరియు ప్రజలు వారి స్వంత పడకలమీద విశ్రాంతి తీసుకొంటారు. వారు ఎలా జీవించాలని దేవుడు కోరుతాడో వారు అలా జీవిస్తారు.
ISA 57:3 “దయ్యాల పిల్లల్లారా, ఇక్కడకు రండి. మీ తండ్రి లైంగిక పాపాల మూలంగా దోషి. మరియు మీ తల్లి లైంగిక పరంగా తన శరీరాన్ని అమ్ముకొంటుంది. ఇక్కడకు రండి!
ISA 57:4 మీరు అబద్ధాలు చెప్పేవాళ్లు, చెడ్డవాళ్లు. మీరు నన్ను ఎగతాళి చేస్తారు. మీరు నన్ను వెక్కిరిస్తారు. మీరు నా మీద నాలుకలు చాపుతారు.
ISA 57:5 మీరు చేయగోరేదంతా ఏమిటంటే ప్రతి పచ్చని చెట్టు కింది తప్పుడు దేవుళ్లనూ పూజించటమే. మీరు ప్రతికాలువ ప్రక్క పిల్లల్నీ చంపుతారు, బండల స్థలాల్లో వారిని బలి ఇస్తారు.
ISA 57:6 నదులలో నున్నటి రాళ్లను పూజించటం మీకు ఇష్టం. వాటిని పూజించుటకు మీరు వాటిమీద ద్రాక్షర సం పోస్తారు. మీరు వాటికి బలులు ఇస్తారు. కానీ మీకు దొరికేది అంతా ఆ రాళ్లే. ఇది నాకు సంతోషం కలిగిస్తుందని మీరు తలుస్తున్నారా? లేదు! అది నాకు సంతోషం కలిగించదు.
ISA 57:7 మీరు ప్రతి కొండ మీద, ప్రతి పర్వతంమీద మీ పడక వేసుకొంటారు. మీరు ఆ స్థలాలకు వెళ్లి బలులు అర్పిస్తారు.
ISA 57:8 తర్వాత మీరు ఆ పడకల మీదికి వెళ్లి, ఆ దేవుళ్లను ప్రేమించటం ద్వారా నాకు వ్యతిరేకంగా పాపం చేస్తారు. మీరు ఆ దేవతలను ప్రేమిస్తారు. వాటి దిగంబర దేహాలను చూడటం మీకు ఇష్టం. మీరు నాతో ఉన్నారు కాని వాటితో ఉండేందుకు మీరు నన్ను విడిచి పెట్టారు. నన్ను జ్ఞాపకం చేసుకొనేందుకు సహాయపడే వాటిని మీరు దాచిపెట్టేస్తారు. గుమ్మాల వెనుక, ద్వారబంధాల వెనుక వాటిని మీరు దాచిపెట్టేస్తారు. మరియు మీరు వెళ్లి ఆ తప్పుడు దేవుళ్ళతో ఒడంబడికలు చేసుకుంటారు.
ISA 57:9 మొలెక్ దేవతకు అందంగా కనబడాలని మీరు తైలాలు, పరిమళాలు ఉపయోగిస్తారు. మీరు మీ సందేశకులను దూరదేశాలకు పంపించారు. ఇది మిమ్మల్ని పాతాళానికి, మరణ స్థానానికి తీసుకొని వస్తుంది.
ISA 57:10 ఈ పనులు చేయటానికి మీరు కష్టపడి పని చేశారు కానీ మీరు ఎన్నడూ అలసిపోలేదు. మీరు కొత్త బలం కనుగొన్నారు. ఎందుకంటే, వీటిలో మీరు ఆనందించారు గనుక.
ISA 57:11 మీరు నన్ను జ్ఞాపకం చేసికోలేదు మీరు నన్ను కనీసం గుర్తించలేదు. కనుక మీరు ఎవరిని గూర్చి చింతిస్తున్నారు? మీరు ఎవరిని గూర్చి భయపడుతున్నారు? మీరెందుకు అబద్ధం పలికారు? చూడండి, చాలాకాలంగా నేను మౌనంగా ఉన్నాను. మరి మీరు నన్ను గౌరవించలేదు.
ISA 57:12 మీ ‘మంచితనం’ గూర్చి, మీరు చేసే ‘మతపరమైన’ పనులు అన్నింటిని గూర్చి నేను చెప్పగలను. కానీ అవన్నీ పనికిమాలినవి.
ISA 57:13 మీకు సహాయం అవసరమైనప్పుడు మీరు మీ చుట్టూరా ప్రోగుచేసుకొన్న ఆ తప్పుడు దేవుళ్ళకు మొరపెట్టండి. అయితే, వాటిన్నింటనీ గాలి కొట్టిపారేస్తుందని నేను మీకు చెబుతున్నాను. ఒక్క గాలి విసురు వాటన్నింటినీ మీ వద్దనుండి తొలగించివేస్తుంది. అయితే నా మీద ఆధారపడే వ్యక్తి భూమిని సంపాదించుకొంటాడు. ఆ వ్యక్తికి నా పరిశుద్ధ పర్వతం దొరుకుతుంది.”
ISA 57:14 మార్గం సరళం చేయండి; మార్గం సరళం చేయండి. నా ప్రజలకోసం మార్గం చక్కజేయండి.
ISA 57:15 మహోన్నతుడైన దేవుడు, పైకిఎత్త బడినవాడు శాశ్వతంగా జీవించేవాడు, పవిత్రుడైన దేవుడు అనే నామం గలవాడు చెబుతున్నాడు: “నేను ఉన్నతమైన పవిత్ర స్థానంలో నివసిస్తాను. అయితే దుఃఖంలో ఉన్న దీన జనులతో కూడా ఉంటాను. ఆత్మలో దీనంగా ఉండేవారికి నేను నూతన జీవం ప్రసాదిస్తాను. హృదయమందు విచారంగా ఉన్నవారికి నేను నూతన జీవితం ప్రసాదిస్తాను.
ISA 57:16 నేను శాశ్వతంగా పోరాటం కొనసాగించను. నేను ఎప్పటికీ కోపంగానే ఉండను. నేను కోపంగా కొనసాగితే మనిషి ఆత్మ, వారికి నేను ఇచ్చిన జీవం నా ఎదుటనే మరణిస్తుంది.
ISA 57:17 ఈ ప్రజలు చెడు కార్యాలు చేశారు. అది నాకు కోపం కలిగించింది. కనుక నేను ఇశ్రాయేలును శిక్షించాను. నేను కోపంగా ఉన్నాను గనుక అతని నుండి నేను తిరిగిపోయాను. మరియు ఇశ్రాయేలు నన్ను విడిచిపెట్టాడు. ఇశ్రాయేలు తనకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్లాడు.
ISA 57:18 ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్లింది నాకు తెలుసు. కనుక నేను అతణ్ణి స్వస్థపరుస్తాను (క్షమిస్తాను). నేను అతణ్ణి ఆదరించి, అతడు బాగానే ఉంది అనుకొనేట్టు చేసే మాటలు నేను చెబుతాను. అప్పుడు అతడు, అతని ప్రజలు విచారంగా ఉండరు.
ISA 57:19 ఆ ప్రజలకోసం ‘శాంతి’ అనే కొత్త పదం నేను ఉపదేశిస్తాను. నాకు సమీపంగా ఉన్న ప్రజలకు, చాలా దూరంగా ఉన్న ప్రజలకు, నేను శాంతి ప్రసాదిస్తాను. ఆ ప్రజలను నేను స్యస్థపరుస్తాను (క్షమిస్తాను).” ఈ సంగతులు యెహోవా చెప్పాడు.
ISA 57:20 అయితే చెడ్డవాళ్లు భీకరంగా ఉన్న మహాసముద్రంలాంటి వాళ్లు. వారు నెమ్మదిగా, శాంతంగా ఉండలేరు. వారు కోపంగా ఉన్నారు, మహాసముద్రంలా మట్టిని కెలుకుతారు.
ISA 57:21 “దుష్టులకు శాంతి లేదు” అని నా దేవుడు చెబుతున్నాడు.
ISA 58:1 మీకు చేత్తనెనంత గట్టిగా కేకలు వేయండి. మీరు ఆపవద్దు. బూరలా కేకలు వేయండి. ప్రజలు చేసిన చెడు పనులను గూర్చి వారికి చెప్పండి. యాకోబు వంశానికి వారి పాపాలను గూర్చి చెప్పండి.
ISA 58:2 అప్పుడు వారు నన్ను ఆరాధించేందుకు రోజూ వస్తారు. మరియు ప్రజలు నా మార్గాలు తెలుసుకోవాలని కోరుతారు. అప్పుడు వారు సరైన పనులు చేసే ఒక రాజ్యం అవుతారు. ఆ ప్రజలు దేవుని మంచి ఆదేశాలను పాటించడం మానివేయరు. వారికి న్యాయంగా తీర్పు తీర్చమని ఆ ప్రజలు నన్ను అడుగుతారు. దేవుని న్యాయ నిర్ణయాలకోసం వారు దేవుని దగ్గరకు వెళ్లాలని కోరుకొంటారు.
ISA 58:3 ఇప్పుడు ఆ ప్రజలు చెబుతారు: “నీ గౌరవ సూచకంగా మేము భోజనం మానివేశాం. నీవెందుకు మమ్మల్ని చూడవు? నీ గౌరవ సూచకంగా మేము మా దేహాలను బాధించుకొంటాం. నీవెందుకు మమ్మల్ని గమనించవు?” అయితే యెహోవా అంటున్నాడు, “ఆ ప్రత్యేక దినాల్లో భోజనం చేయకుండా ఉండి మిమ్మల్ని మీరే సంతోషపెట్టుకొనేందుకు ఈ పనులు చేస్తారు. మరియు మీరు మీ శరీరాలను గాక, మీ సేవకుల్ని శిక్షిస్తారు.
ISA 58:4 మీరు ఆకలిగా ఉన్నారు కాని అన్నంకోసర కాదు. ఆహారంకోసం గాక వాదనకోసం, పోరాటం కొసం మీరు ఆకలిగా ఉన్నారు. మీ చెడ్డ చేతులతో ప్రజలను కొట్టాలని మీరు ఆకలిగా ఉన్నారు. మీరు భోజనం మానివేయటం నాకోసం కాదు. నన్ను స్తుతించుటకు మీరు మీ స్వరం వినియోగించటం మీకు ఇష్టం లేదు. నేను కోరేది అంతా
ISA 58:5 ఆ ప్రత్యేక దినాల్లో ప్రజలు భోజనం మానివేసి, వారి శరీరాలను శిక్షించు కోవటం చూడాలని మాత్రమేనని మీరు తలస్తున్నారా? ప్రజలు దుఃఖంగా కనబడాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? ప్రజలు చచ్చిన మొక్కల్లా తలలు వంచుకోవాలనీ, దుఃఖసూచక వస్త్రాలు ధరించాలని నేను కోరుతున్నానని మీరు తలస్తున్నారా? ప్రజలు వారి దుఃఖాన్ని తెలియచేసేందుకు బూడిదలో కూర్చోవాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? భోజనం మానివేసే ఆ ప్రత్యేక దినాల్లో మీరు చేసేది అదే. యెహోవా కోరేది కూడా అదే అని మీరు తలస్తున్నారా?
ISA 58:6 “నేను కోరే ప్రత్యేక రోజు, ప్రజలను స్వతంత్రలను చేసే రోజు ఎలాంటిదో నేను మీకు చెబుతాను. ప్రజల మీద నుండి భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి. కష్టాలుపడే ప్రజలను మీరు స్వతంత్రులుగా చేసే రోజు నాకు కావాలి. వారి భుజాలమీది భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి.
ISA 58:7 ఆకలిగొన్న ప్రజలతో మీరు మీ భోజనం పంచుకోవాలని నేను కోరుతున్నాను. ఇళ్లులేని పేద ప్రజలను మీరు వెదికి, వారిని మీరు మీ స్వంత ఇళ్లలోనికి తీసుకొని రావాలని నేను కోరుతున్నాను. బట్టలు లేనివాడ్ని మీరు చూచినప్పుడు, మీ బట్టలు వానికి ఇవ్వండి. ఆ మనుష్యులకు సహాయం చేయకుండా దాచుకోవద్దు; వాళ్లూ మీలాంటి వారే.”
ISA 58:8 వీటిని మీరు చేస్తే, మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది. అప్పుడు మీ గాయాలు బాగవుతాయి. మీ “మంచితనం” (దేవుడు) మీకు ముందు నడువగా, యెహోవా మహిమ మీ వెనుకగా మిమ్మల్ని వెంబడిస్తుంది.
ISA 58:9 అప్పుడు మీరు యెహోవాకు మొరపెడ్తారు, యెహోవా మీకు జవాబు ఇస్తాడు. మీరు యెహోవాకు గట్టిగా కేకెలు వేస్తారు. ఆయన “ఇదిగో నేనిక్కడే ఉన్నాను” అంటాడు. మీరు ప్రజలకు కష్టాలు, భారాలు కలిగించటం మానివేయాలి. విషయాలను బట్టి మీరు ప్రజలమీద కోపంగా మాట్లాడటం. వారిని నిందించటం మీరు మానివేయాలి.
ISA 58:10 ఆకలితో ఉన్న ప్రజలను గూర్చి మీరు విచారపడి, వారికి భోజనం పెట్టాలి. కలవరపడిన వారికి మీరు సహాయం చేయాలి వారి అవసరాలు తీర్చాలి. అప్పుడు మీ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. మరియు మీకు దుఃఖం ఉండదు. మధ్యాహ్నపు సూర్యకాంతిలా మీరు ప్రకాశిస్తారు.
ISA 58:11 అప్పుడు యెహోవా మిమ్మల్ని సదా నడిపిస్తాడు. ఎండిన భూములలో ఆయన మీ ఆత్మకు సంతృప్తినిస్తాడు. మీ ఎముకలకు యెహోవా బలం ఇస్తాడు. విస్తారమైన నీళ్లుగల తోటలా మీరు ఉంటారు. ఎల్లప్పుడు నీళ్లు ఉబుకుతూ ఉండే ఊటలా మీరుంటారు.
ISA 58:12 ఎన్నెన్నో సంవత్సరాలుగా మీ పట్టణాలు నాశనం చేయబడ్డాయి. కానీ కొత్త పట్టణాలు నిర్మించబడతాయి. మరియు ఈ పట్టణాల పునాదులు ఎన్నెన్నో సంవత్సరాల వరకు నిలిచి కొనసాగుతాయి. “కంచెలను బాగు చేసేవాడు” అని నీవు పిలువబడతావు, “త్రోవలు, ఇళ్లు నిర్మించువాడు” అని నీవు పిలువబడతావు.
ISA 58:13 సబ్బాతు విషయంలో దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నీవు పాపం చేయటం మానివేసినప్పుడు అది జరుగుతుంది. మరియు ఆ ప్రత్యేక రోజున నీ సంతోషం కోసం నీవు పనులు చేయటం మాని వేసినప్పుడు ఆది జరుగుతుంది. సబ్బాతు సంతోష దినంగా నీవు ఎంచుకోవాలి. యెహోవా ప్రత్యేక రోజును నీవు గౌరవించాలి. మిగిలిన ప్రతిరోజూ నీవు చెప్పేవి, చేసేవి మానివేయటం ద్వారా నీవు ఆ ప్రత్యేక రోజును గౌరవించాలి.
ISA 58:14 అప్పుడు నీవు యెహోవా, నాయందు దయచూపమని అడగవచ్చు. మరియు యెహోవా అంటాడు, భూమికి పైగా ఉన్నతమైన చోట్లకు నేను నిన్ను మోసికొనివెళ్తాను. నేను నీకు భోజనం పెడ్తాను. నీ తండ్రి యాకోబుకు కలిగిన వాటిని నేను నీకు ఇస్తాను. ఈ విషయాలు యెహోవా చెప్పాడు గనుక అవి జరుగుతాయి.
ISA 59:1 చూడు, నిన్ను రక్షించుటకు యెహోవా శక్తి చాలు. సహాయంకోసం నీవు ఆయనను అడిగినప్పుడు ఆయన వినగలడు.
ISA 59:2 కానీ నీ పాపాలు నిన్ను నీ దేవుని నుండి వేరుచేశాయి. యెహోవా నీ పాపాలు చూసి, నీ నుండి తిరిగిపోతాడు.
ISA 59:3 నీ చేతులు మైలగా ఉన్నాయి, అవి రక్తంతోనిండి ఉన్నాయి. నీ వేళ్లు దోషంతో నిండి ఉన్నాయి. నీవు నీ నోటితో అబద్ధాలు చెబుతున్నావు. నీ నాలుక చెడు విషయాలు పలుకుతుంది.
ISA 59:4 ఎవ్వరూ ఇతరులను గూర్చి సత్యం చెప్పరు. ప్రజలు ఒకరి మీద ఒకరు న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తారు, వారి వ్యవహారం గెలుచుకొనేందుకు వారు తప్పుడు వాదాలమీద ఆధారపడతారు. వారు ఒకరిని గూర్చి ఒకరు అబద్ధాలు చెబుతారు. వారు చిక్కులతో నిండిపొయి, కీడును పుట్టిస్తారు.
ISA 59:5 విషసర్పాల గ్రుడ్లవలె, వారు కీడును పొదుగుతారు. ఆ గ్రుడ్లు ఒకటి తింటే నీవు చస్తావు. ఆ గ్రుడ్లలో ఒకదాన్ని నీవు పగులగొడితే, ఒక విషసర్పం బయటకు వస్తుంది. ప్రజలు అబద్ధాలు చెబుతారు. ఈ అబద్ధాలు సాలెగూళ్లలా ఉంటాయి.
ISA 59:6 వారు అల్లే ఈ గూళ్లు బట్టలకు ఉపయోగపడవు. ఆ గూళ్లతో నిన్ను నీవు కప్పుకోలేవు. కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేస్తారు, ఇతరులను బాధించుటకు వారి చేతులు ప్రయోగిస్తారు.
ISA 59:7 కీడుకు పరుగులెత్తుటకు ఆ ప్రజలు వారి పాదాలను ఉపయోగిస్తారు. ఏ తప్పూ చేయని వారిని చంపటానికి వారు త్వరపడతారు. వారు చెడు తలంపులు తలుస్తారు. దౌర్జన్యం, దొంగతనం వారి జీవిత విధానం.
ISA 59:8 ఆ ప్రజలకు శాంతి మార్గం తెలియదు. వారి జీవితాల్లో మంచితనం ఏమీలేదు. వారి మార్గాలు నిజాయితీగా లేవు. వారు జీవించినట్టుగా జీవించేవారెవరి జీవితాల్లోనూ ఎన్నటికి శాంతి ఉండదు.
ISA 59:9 న్యాయం, మంచితనం అంతా పోయింది. చీకటి మాత్రమే మనవద్ద ఉంది. అందుచేత మనం వెలుగుకోసం కనిపెట్టాలి. ప్రకాశవంతమైన వెలుగుకోసం మనం నిరీక్షిస్తాం. కానీ మనకు ఉన్నదంతా చీకటి మాత్రమే.
ISA 59:10 మనం కళ్లులేని ప్రజల్లా ఉన్నాం. మనం గుడ్డివాళ్లలా గోడల మీదికి నడుస్తాం. అది రాత్రియైనట్టు మనం జారి పడ్తాం. పగటి వెలుగులో కూడా మనం చూడలేం. మధ్యాహ్న సమయంలో మనం చచ్చినవాళ్లలా పడిపోతాం.
ISA 59:11 మనం అందరం ఎంతో విచారంగా ఉన్నాం. పావురాల్లా, పావురాల్లా, ఎలుగుబంట్లలా విచారకరమైన శబ్దాలు మనం చేస్తాం. మనుష్యులు న్యాయంగా ఉండేకాలం కోసం మనం ఎదురుచూస్తున్నాం. కానీ ఇంకా న్యాయం ఏమీ లేదు. మనం రక్షించబడాలని ఎదురు చూస్తున్నాం, కానీ రక్షణ ఇంకా దూరంగానే ఉంది.
ISA 59:12 ఎందుకంటే మనం మన దేవునికి వ్యతిరేకంగా ఎన్నెన్నో తప్పు పనులు చేశాం గనుక. మనదే తప్పు అని మన పాలు చూపెడ్తున్నాయి. ఈ పనులు చేసి మనం దోషులంగా ఉన్నామని మనకు తెలుసు.
ISA 59:13 మనం పాపంచేసి, యెహోవాకు విరోధంగా తిరిగాం. మనం యెహోవా నుండి తిరిగిపోయి, ఆయన్ని విడిచిపెట్టేశాం. చెడు విషయాలను మనం ఆలోచించాం. దేవునికి వ్యతిరేకమైన వాటినే మనం ఆలోచించాం. వీటిని గూర్చి మనం ఆలోచించి, మన హృదయాల్లో వాటి పథకాలు వేసుకొన్నాం.
ISA 59:14 మన దగ్గర్నుండి న్యాయం తొలగిపోయింది. న్యాయం దూరంగా నిలుస్తుంది. సత్యం వీధుల్లో పడిపోయింది. మంచితనం పట్టణంలో ప్రవేశించటానికి అనుమతించ బడటంలేదు.
ISA 59:15 సత్యం పోయింది. మంచి జరిగించాలనుకొనే మనుష్యులు దోచుకోబడ్డారు. యెహోవా చూశాడు, కానీ మంచితనం ఏమీ ఆయనకు కనబడలేదు. ఇది యెహోవాకు ఇష్టం కాలేదు.
ISA 59:16 యెహోవా చూశాడు. నిలిచి, ప్రజలకు సహాయం చేసే వ్యక్తి ఒక్కడూ ఆయనకు కనిపించలేదు. కనుక యెహోవా తన స్వంత శక్తి, తన స్వంత మంచితనం ప్రయోగించాడు. మరియు యెహోవా ప్రజలను రక్షించాడు.
ISA 59:17 యెహోవా యుద్ధానికి సిద్ధమయ్యాడు. యెహోవా మంచితనాన్ని ఒక కవచంలా కప్పుకొన్నాడు. రక్షణ శిరస్త్రాణం ధరించాడు. శిక్షను వస్త్రాలుగా ధరించాడు. బలీయమైన ప్రేమ అంగీ ధరించాడు.
ISA 59:18 యెహోవా తన శత్రువుల మీద కోపంగా ఉన్నాడు కనుక వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు. యెహోవా తన శత్రువులమీద కోపంగా ఉన్నాడు. కనుక దూరస్థలాలు అన్నింటిలోను ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.
ISA 59:19 అప్పుడు పశ్చిమాన ప్రజలు యెహోవా నామాన్ని గౌరవిస్తారు. తూర్పున ప్రజలు యెహోవా మహిమను గూర్చి భయపడతారు. వేగంగా ప్రవహించే ఒక నదిలా యెహోవా వెంటనే వస్తాడు. యెహోవా ఈ నదిమీద విసరగా వచ్చిన శక్తివంతమైన గాలిలా అది ఉంటుంది.
ISA 59:20 అప్పుడు సీయోనుకు ఒక రక్షకుడు వస్తాడు. పాపం చేసినప్పటికి, తిరిగి దేవుని దగ్గరకు వచ్చిన యాకోబు ప్రజల దగ్గరకు ఆయన వస్తాడు.
ISA 59:21 “ఆ ప్రజలతో నేను ఒక ఒడంబడిక చేసుకుంటాను. నీ నోట నేను ఉంచే నా ఆత్మ, నా మాటలు నిన్ను ఎన్నడూ విడిచిపోవు అని నేను ప్రమాణం చేస్తున్నాను. నీ పిల్లలతోను, నీ పిల్లల పిల్లలతోను అవి ఉంటాయి. అవి ఇప్పుడు, ఎల్లప్పుడు నీతో ఉంటాయి” అని యెహోవా చెబుతున్నాడు.
ISA 60:1 “నా వెలుగైన యెరూషలేమా లెమ్ము! నీ వెలుగు (దేవుడు) వస్తున్నాడు. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది.
ISA 60:2 ఇప్పుడు భూమిని, దాని ప్రజలను చీకటి ఆవరించి ఉంది. కానీ యెహోవా నీ మీద ప్రకాశిస్తాడు. నీ చుట్టూరా ఆయన మహిమను ప్రజలు చూస్తారు.
ISA 60:3 ఆ సమయంలో రాజ్యాలు నీ వెలుగు (దేవుడు) దగ్గరకు వస్తాయి. ప్రకాశవంతమైన నీ వెలుగు దగ్గరకు రాజులు వస్తారు.
ISA 60:4 నీ చుట్టూ చూడు, చూడు ప్రజలు చూట్టూ చేరి, నీ దగ్గరకు వస్తున్నారు. ఆ ప్రజలు దూరం నుండి వస్తున్న నీ కుమారులు. మరియు వారితో నీ కుమార్తెలు వస్తున్నారు.
ISA 60:5 “భవిష్యత్తులో ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో నీ ప్రజలను నీవు చూస్తావు. ఆనందంతో మీ ముఖాలు ప్రకాశిస్తాయి. మొదట, మీరు భయపడతారు, కానీ తర్వాత మీరు సంబరపడతారు. సముద్రాల ఆవలి రాజ్యాల ఐశ్వర్యాలన్నీ నీ ముందు ఉంచబడతాయి. రాజ్యాల ఐశ్వర్యాలు నీకు సంక్రమిస్తాయి.
ISA 60:6 మిద్యాను, ఏయిఫాల నుండి ఒంటెల మందలు నీ దేశంలో నిండిపోతాయి. షేబనుండి ఒంటెలు బారులు తీరి వస్తాయి. బంగారం, బోళం అవి తెస్తాయి. ప్రజలు యెహోవాకు స్తుతులు పాడతారు.
ISA 60:7 కేదారు గొర్రెలు అన్నీ నీకు ఇవ్వబడుతాయి. నెబాయోతు పొట్టేళ్లు నీకోసం తీసుకొని రాబ డతాయి. అవి నా బలిపీఠం మీద స్వీక రించదగిన బలి అర్పణలవుతాయి. ఆశ్చర్యకరమైన నా ఆలయాన్ని నేను ఇంకా అందంగా తీర్చిదిద్దుతాను.
ISA 60:8 ప్రజలను చూడు! ఆకాశాన్ని వేగంగా దాటిపోయే మేఘాల్లా వారు త్వరపడుతున్నారు. వాటి గూళ్లకు ఎగిరిపోతున్న పావురాల్లా ఉన్నారు వారు
ISA 60:9 దూర దేశాలు నాకోసం కనిపెడ్తున్నాయి. తర్షీషు మహా ఓడలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. దూర దేశాలనుండి నీ పిల్లలను తీసుకొని వచ్చేందుకు ఆ ఓడలు సిద్ధంగా ఉన్నాయి. మరియు వారి వెండి బంగారాలను ఆ ఓడలు తీసుకొని వస్తాయి. నీ దేవుడు యెహోవాను గౌరవించుటకు ఇది జరుగుతుంది. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు అద్భుత కార్యాలు చేస్తాడు గనుక ఇది జరుగుతుంది.
ISA 60:10 ఇతర దేశాలనుండి వచ్చిన పిల్లలు నీ గోడలను తిరిగి నిర్మిస్తారు. వారి రాజులు నిన్ను సేవిస్తారు. “నేను కోపగించినప్పుడు, నేను నిన్ను బాధించాను. కానీ ఇప్పుడు, నేను నీకు దయచూపించ గోరుతున్నాను. కనుక నేను నిన్ను ఆదరిస్తాను.
ISA 60:11 నీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచి ఉంటాయి. రాత్రిగాని పగలుగాని అవి మూయబడవు. రాజులు, రాజ్యాలు వారి ఐశ్వర్యాలను నీకు తీసుకొని వస్తారు.
ISA 60:12 కొన్ని దేశాలు, రాజ్యాలు నిన్ను సేవించవు. కానీ ఆ దేశాలు, రాజ్యాలు పాడైపోయి, నాశనం అవుతాయి.
ISA 60:13 లెబానోనులోని గొప్పవన్నియు నీకు ఇవ్వబడుతాయి. దేవదారు, సరళ, గొంజి వృక్షాలను ప్రజలు నీ వద్దకు తీసుకొని వస్తారు. నా పరిశుద్ధ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు నీవు ఈ వృక్షాలను ఉపయోగిస్తావు. (ఈతావు నా సింహాసనం ఎదుట పాదపీఠంలా ఉంటుంది. నేను దానికి చాలా ఘనత ఇస్తాను.)
ISA 60:14 గతంలో ప్రజలు నిన్ను బాధించారు. ఆ ప్రజలు నీ ఎదుట సాష్టాంగపడతారు. గతంలో ప్రజలు నిన్ను ద్వేషించారు. ఆ ప్రజలు నీ పాదాల దగ్గర సాగిలపడతారు. ‘యెహోవా పట్టణం’ అని ‘ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోను’ అనీ ఆ ప్రజలు నిన్ను పిలుస్తారు.
ISA 60:15 “నీవు మళ్లీ ఎన్నటికీ ఒంటరిగా విడువబడవు. నీవు మరల ఎన్నడు ద్వేషించబడవు. నీవు మరల ఎన్నడూ ఖాళీగా ఉండవు. నిన్ను నేను శాశ్వతంగా గొప్ప చేస్తాను. నీవు ఎప్పటికి, శాశ్వతంగా సంతోషిస్తావు.
ISA 60:16 నీకు అవసరమైన వస్తువులను రాజ్యాలు నీకు ఇస్తాయి. అది ఒక బిడ్డ తన తల్లి దగ్గర పాలు తాగినట్టుగా ఉంటుంది. నీవైతే రాజులనుండి ఐశ్వర్యాలను తాగుతావు. అప్పుడు, నిన్ను రక్షించు యెహోవాను నేనే అని నీవు తెలుసు కొంటావు. యాకోబు యొక్క మహా గొప్పవాడు నిన్ను కాపాడును అని నీవు తెలుసుకొంటావు.
ISA 60:17 “ఇప్పుడు నీకు ఇత్తడి ఉంది. నేను నీకు బంగారం తెస్తాను. ఇప్పుడు నీకు ఇనుము ఉంది, నేను నీకు వెండి తెస్తాను. నీ చెక్కను నేను ఇత్తడిగా మార్చేస్తాను. నీ బండలను ఇనుముగా నేను మార్చేస్తాను. నీ శిక్షను నేను శాంతిగా మార్చేస్తాను. ఇప్పుతు ప్రజలు నిన్ను బాధిస్తున్నారు. కానీ ప్రజలు నీకు మంచి కార్యాలు చేస్తారు.
ISA 60:18 ప్రజలు మరల ఎన్నడూ నీ ఎడల నీచంగా ఉండరు. నీ దేశంలో నీ దగ్గర్నుండి ప్రజలు మరల ఎన్నడూ దొంగిలించరు. ‘రక్షణ’ అని నీ గోడలకు నీవు పేరుపెడతావు. ‘స్తుతి’ అని నీ ద్వారాలకు నీవు పేరుపెడతావు.
ISA 60:19 “ఇంకెంత మాత్రం పగలు సూర్యుడు నీకు వెలుగుగా ఉండడు. చంద్రకాంతి ఇంకెంత మాత్రం నీకు వెలుగుగా ఉండదు. ఎందుకు? ఎందుకంటే యెహోవాయే నీకు శాశ్వత వెలుగుగా ఉంటాడు. నీ దేవుడే నీ మహిమ.
ISA 60:20 నీ ‘సూర్యుడు’ ఇక ఎన్నటికీ అస్తమించడు. నీ ‘చంద్రుడు’ ఇక ఎన్నటికీ చీకటిగా ఉండడు. ఎందుకు? ఎందుకంటే యెహోవా నీకు శాశ్వత వెలుగుగా ఉంటాడు. మరియు నీ దుఃఖకాలం అంతం అవుతుంది.
ISA 60:21 “నీ ప్రజలు అందరూ మంచివారుగా ఉంటారు. ఆ ప్రజలు భూమిని శాశ్వతంగా పొందుతారు. నేనే ఆ ప్రజలను చేశాను. నా స్వహస్తాలతో నేనే చేసిన అద్భుతమైన మొక్క వారు.
ISA 60:22 అతి చిన్న కుటుంబం ఒక పెద్ద వంశం అవుతుంది. కడసారపు వ్యక్తి ఒక బలమైన రాజ్యం అవుతాడు. సమయం సరిగ్గా ఉన్నప్పుడు, యెహోవాను, నేను త్వరగా వస్తాను. నేను ఈ సంగతులను జరిగిస్తాను.”
ISA 61:1 యెహోవా సేవకుడు చెబుతున్నాడు, నా ప్రభువు యెహోవా తన ఆత్మను నాలో ఉంచాడు. కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటానికి యెహోవా నన్ను ఏర్పరచుకొన్నాడు. పేద ప్రజలకు శుభవార్త ప్రకటించుటకు, దుఃఖంలో ఉన్న మనుష్యులను ఓదార్చుటకు, స్వాతంత్య్రంలేని ప్రజలకు స్వాతంత్య్రం ప్రకటించుటకు, బలహీన ప్రజలకు నూతన బలం ఇచ్చేందుకు,
ISA 61:2 యెహోవా తన దయ చూపించే సమయాన్ని ప్రకటించేందుకు; దుష్టులను మన దేవుడు శిక్షించే సమయాన్ని ప్రకటించేందుకు; దుఃఖంలో ఉన్న వాళ్లను ఆదరించేందుకు;
ISA 61:3 దుఃఖంలో ఉన్న సీయోను వాసులకు గౌరవం చేకూర్చేందుకు (ఇప్పుడు వారికి బూడిద మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు ఆనందతైలం ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు దేవుని స్తుతిగీతాలు ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది;) “మంచి వృక్షాలు” అని ఆ ప్రజలకు పేరు పెట్టుటకు; “యెహోవా అద్భుత చెట్టు” అని వారికి పేరు పెట్టుటకు.
ISA 61:4 పాడు చేయబడిన పాత పట్టణాలు ఆ సమయంలో మరల నిర్మించబడతాయి. ఆ పట్టణాలు మొదట్లో ఉన్నట్టే మరల నూతనంగా చేయబడతాయి. ఎన్నెన్నో సంవత్సరాలుగా పాడు చేయబడిన ఆ పట్టణాలు కొత్తవాటిలా చేయబడతాయి.
ISA 61:5 అప్పుడు మీ శత్రువులు మీ దగ్గరకు వచ్చి, మీ గొర్రెలను గూర్చి జాగ్రత్త వహిస్తారు. మీ శత్రువుల పిల్లలు మీ పొలాల్లోనూ, మీ తోటల్లోనూ పనిచేస్తారు.
ISA 61:6 మీరు “యెహోవా యాజకులు” అని, “మన దేవుని సేవకులు” అని పిలువబడతారు. భూమి మీద ఉన్న రాజ్యాలన్నింటి నుండీ వచ్చిన ఐశ్వర్యాలు మీకు ఉంటాయి. అది మీకు ఉన్నందువల్ల మీరు గర్విస్తారు.
ISA 61:7 గతంలో ఇతరులు మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని చెడ్డ మాటలు అన్నారు. ఏ ఇతర ప్రజల కంటెకూడా మీరు ఎక్కువగా అవమానించబడ్డారు. కనుక ఇతర ప్రజలకంటె రెండంతలు ఎక్కువగా మీరు మీ దేశంలో పొందుతారు. శాశ్వతంగా కొనసాగే సంతోషం మీకు లభిస్తుంది.
ISA 61:8 ఎందుకు ఇలా జరగుతుంది? ఎందుకంటె, నేను యెహోవాను గనుక, న్యాయం అంతే నాకు ఇష్టం గనుక. దొంగతనం, సమస్త చెడుగు నాకు అసహ్యం. కనుక ప్రజలకు తగిన శిక్ష నేను ఇస్తాను. నా ప్రజలతో శాశ్వతంగా నేను ఒక ఒడంబడిక చేసుకొన్నాను.
ISA 61:9 అన్ని రాజ్యాలలో ప్రతి ఒక్కరూ నా ప్రజలను తెలుసుకొంటారు. నా దేశం పిల్లలను ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు. యెహోవా వారిని ఆశీర్వదించునని, వారిని చూచే ప్రతి వ్యక్తికి తెలుస్తుంది.
ISA 61:10 యెహోవా నన్ను ఎంతో ఎంతో సంతోషింపజేస్తాడు. నా దేవునియందు నేను సంపూర్ణంగా సంతోషిస్తున్నాను. రక్షణ వస్త్రాలతో యెహోవా నన్ను కప్పాడు. ఆ వస్త్రాలు ఒకడు తన పెండ్లికి ధరించే వస్త్రాల్లా ఉన్నాయి. దయ అనే పైబట్టతో యెహోవా నన్ను కప్పాడు. ఈ పైబట్ట ఒక స్త్రీ తన పెండ్లికి ధరించే అందమైన వస్త్రాల్లా ఉంది.
ISA 61:11 భూమి మొక్కలను మొలిపిస్తుంది. ప్రజలు తోటలో విత్తనాలు చల్లుతారు. ఆ తోట ఆ విత్తనాలను ఎదిగింపజేస్తుంది. అదే విధంగా యెహోవా దయను ఎదిగింప జేస్తాడు. సకల రాజ్యాలలో యెహోవా స్తుతిని ఎదిగింప జేస్తాడు.
ISA 62:1 సీయోను అంటే నాకు ప్రేమ. అందుచేత నేను ఆమె పక్షంగా ఇంకా మాట్లాడతాను. యెరూషలేము అంటే నాకు ప్రేమ. అందుచేత నేను మాట్లాడటం చాలించను. మంచితనం పెద్ద వెలుగుగా ప్రకాశించేంత వరకు నేను మాట్లాడతాను. ఒక జ్వాలలా రక్షణ నుండి ప్రకాశించేంత వరకు నేను మాట్లాడతాను.
ISA 62:2 అప్పుడు సకల రాజ్యాలు నీ మంచితనాన్ని చూస్తాయి. రాజులందరూ నీ గౌరవాన్ని చూస్తారు. అప్పుడు నీకు ఒక కొత్త పేరు ఇవ్వబడుతుంది. ప్రజలారా, యెహోవా తానే మీకు ఆ కొత్త పేరు ఇస్తాడు.
ISA 62:3 యెహోవా మీ విషయం ఎంతో అతిశయిస్తాడు. యెహోవా చేతిలో అందాల కిరీటంలా ఉంటారు మీరు.
ISA 62:4 ‘దేవుడు విడిచిపెట్టిన ప్రజలు’ అని ఇంకెన్నడూ మీరు పిలువబడరు. ‘దేవుడు నాశనం చేసిన దేశం’ అని మీ దేశం ఇంకెన్నటికి పిలువబడదు. ‘దేవుడు ప్రేమించే ప్రజలు’ అని మీరు పిలువబతుతారు. ‘దేవుని వధువు’ అని మీ దేశం పిలువబడుతుంది. ఎందుకంటె యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక. మరియు మీ దేశం ఆయనకు చెందుతుంది.
ISA 62:5 ఒక యువకుడు ఒక స్త్రీని ప్రేమించినప్పుడు అతడు ఆమెను పెండ్లి చేసుకొంటాడు. మరియు ఆమె అతనికి భార్య అవుతుంది. అదేవిధంగా మీ దేశం మీ పిల్లలకు చెందుతుంది. ఒకడు తన నూతన భార్యతో ఎంతో సంతోషిస్తాడు. అదే విధంగా, మీ దేవుడు మీతో ఎంతో సంతోషిస్తాడు.
ISA 62:6 కావలి ఉండుటకు యెరూషలేము గోడల మీద కావలివారిని (ప్రవక్తలను) నేను ఉంచుతాను. ఈ కావలివారు మౌనంగా ఉండరు. రాత్రింబవళ్లు వారు కనిపెట్టి ఉంటారు. యెహోవాను గూర్చి ఉపదేశించే మీరు ఎన్నటికీ మౌనంగా ఉండకూడదు. యెహోవాను ప్రార్థించటం మీరు చాలించకూడదు.
ISA 62:7 మీరు ఎల్లప్పుడూ యెహోవాను ప్రార్థించాలి. ఆయన యెరూషలేమును మరల ఒక పట్టణంగా చేసేంతవరకు యెహోవాకు ప్రార్థించండి. భూమిమీద ప్రజలంతా పొగడే పట్టణంగా ఆయన యెరూషలేమును చేసేంత వరకు యె హోవాకుప్రార్థించండి.
ISA 62:8 యెహోవా ఒక వాగ్దానం చేశాడు. యెహోవా తన స్వంత శక్తిని రుజువుగా వినియోగించి ఆ వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నిలుపుకొనేందుకు యెహోవా తన శక్తిని ప్రయోగిస్తాడు. యెహోవా చెప్పాడు, “మీ ఆహారాన్ని మరెన్నడూ మీ శత్రువులకు ఇవ్వనని నేను వాగ్దానం చెస్తున్నాను. మీరు తయారు చేసే మీ ద్రాక్షరసాన్ని మీ శత్రువులు ఎన్నటికీ తీసుకోరని నేను వాగ్దానం చేస్తున్నాను.
ISA 62:9 ఆహారం కూర్చుకొనేవాడు దానిని తింటాడు. మరియు ఆ వ్యక్తి యెహోవాను స్తుతిస్తాడు. ద్రాక్షపండ్లను కూర్చుకొనేవాడు ఆ ద్రాక్షపండ్లరసం తాగుతాడు. ఈ సంగతులన్నీ నా పవిత్రదేశంలో జరుగుతాయి.”
ISA 62:10 గుమ్మాలద్వారా రండి, ప్రజలకు దారి సరళం చేయండి. మార్గం సిద్ధం చేయండి! మార్గంలోని రాళ్లన్నీ తీసివేయండి. ప్రజలకు గుర్తుగా పతాకం ఎగురవేయండి!
ISA 62:11 వినండి, దూర దేశాల ప్రజలందరితో యెహోవా మాట్లాడుతున్నాడు: “సీయోను ప్రజలకు చెప్పండి. చూడండి, మీ రక్షకుడు వస్తున్నాడు. ఆయన మీ బహుమానం మీ కోసం తెస్తున్నాడు. ఆయన ఆ బహుమానాన్ని తనతో కూడ తెస్తున్నాడు.”
ISA 62:12 ఆయన ప్రజలు, “పరిశుద్ధ ప్రజలు” “విమోచించబడిన యెహోవా ప్రజలు” అని పిలువబడతారు. “దేవుడు కోరే పట్టణం” “దేవుడు తోడుగా ఉన్న పట్టం” అని యెరూషలేము పిలువబడుతుంది.
ISA 63:1 ఎదోమునుండి వస్తున్న ఇతడు ఎవరు? ఎర్రటి వస్త్రాలు ధరించి బొస్రానుండి అతడు వస్తున్నాడు. అతడు తన వస్త్రాల్లో శోభిల్లుతున్నాడు. అతడు మహా శక్తితో అతిశయంగా నడుస్తున్నాడు. “మిమ్మల్ని రక్షించే శక్తి నాకు ఉంది. నేను నిజాయితీగా మాట్లాడుచున్నాను” అని అతడు చెబుతున్నాడు.
ISA 63:2 “నీ వస్త్రాలు ఎందుకు అంత మరీ ఎర్రగా ఉన్నాయి? ద్రాక్షపండ్ల నుండి ద్రాక్షరసం చేసే వానిలా ఎర్రగా ఉన్నాయెందుకు నీ వస్త్రాలు?”
ISA 63:3 అతడు జవాబిస్తున్నాడు, “నా మట్టుకు నేను ద్రాక్షగానుగలో నడిచాను. నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు. నాకు కోపం వచ్చింది, ద్రాక్షపండ్ల మీద నడిచాను. ద్రాక్ష పండ్ల రసం నా బట్టలమీద చిమ్మింది. కనుక ఇప్పుడు నా బట్టలు మైలపడ్డాయి.
ISA 63:4 ప్రజలను శిక్షించుటకు నేను ఒక సమయం ఏర్పరచుకొన్నాను. నా ప్రజలను నేను రక్షించి, కాపాడవలసిన సమయం ఇప్పుడు వచ్చింది.
ISA 63:5 చుట్టూ కలియజూశాను, కానీ నాకు సహాయం చేసేవాడు ఒక్కడూ నాకు కనబడలేదు. నన్ను ఒక్కరూ బలపర్చకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది. కనుక నా ప్రజలను రక్షించుటకు నా స్వంత శక్తి నేను ప్రయోగించాను. నా కోపమే నాకు బలం ఇచ్చింది.
ISA 63:6 నేను కోపంగా ఉన్నప్పుడు, నేను ప్రజల మీద నడిచాను. నాకు వెర్రికోపం వచ్చినప్పుడు నేను వారిని శిక్షించాను. నేను వారి రక్తం నేలమీద ఒలకబోశాను.”
ISA 63:7 యెహోవా దయగలవాడు అని నేను జ్ఞాపకం చేసుకొంటాను. మరియు యెహోవాను స్తుతించటం నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఇశ్రాయేలు వంశానికి యెహోవా అనేకమైన మంచివాటిని ఇచ్చాడు. యెహోవా మా యెడల చాలా దయచూపించాడు. యెహోవా మా యెడల కరుణ చూపించాడు.
ISA 63:8 “వీరు నా పిల్లలు. ఈ పిల్లలు అబద్ధమాడరు” అని యెహోవా చెప్పాడు. కనుక యెహోవా ఈ ప్రజలను రక్షించాడు.
ISA 63:9 ప్రజలను చాలా కష్టాలు వచ్చాయి. కానీ యెహోవా వారికి విరోధంగా లేడు. యెహోవా ప్రజలను ప్రేమించాడు. వారిని గూర్చి ఆయన విచారించాడు. కనుక యెహోవా ప్రజలను రక్షించాడు. వారిని రక్షించేందుకు ఆయన తన ప్రత్యేక దేవదూతను పంపించాడు. మరియు యెహోవా ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం శాశ్వతంగా కొనసాగిస్తాడు. ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం ఎన్నడైనా చాలించాలని యెహోవా కోరలేదు.
ISA 63:10 అయితే ప్రజలు యెహోవాకు విరోధం అయ్యారు. ఆయన పరిశుద్ధాత్మను ప్రజలు చాలా దుఃఖపర్చారు. అందుచేత యెహోవా వారికి శత్రువు అయ్యాడు. యెహోవా ఆ ప్రజలకు విరోధంగా పోరాడాడు.
ISA 63:11 కానీ యెహోవా చాలా పూర్వకాలాన జరిగినదాన్ని ఇంకా జ్ఞాపకం ఉంచుకొంటాడు. మోషే, అతని ప్రజలూ యెహోవాకు జ్ఞాపకం. సముద్రంలోనుండి ప్రజలను బయటకు తీసుకొనివచ్చిన వాడు యెహోవాయే. యెహోవా తన మందను (ప్రజలును) నడిపించటానికి తన కాపరులను (ప్రవక్తలను) వాడుకొన్నాడు. అయితే మోషేలో తన ఆత్మను ఉంచిన ఆ యెహోవా ఇప్పుడు ఎక్కడ?
ISA 63:12 యెహోవా తన కుడిచేత మోషేను నడిపించాడు. మోషేను నడిపించుటకుగాను యెహోవా తన అద్భుత శక్తిని ఉపయోగించాడు. ప్రజలు సముద్రంలోనుండి నడువగలిగేట్టు యెహోవా నీళ్లను పాయలు చేశాడు. ఈ గొప్ప కార్యాలు చేయటం వల్ల యెహోవా తన నామాన్ని ప్రఖ్యాతి చేసుకొన్నాడు.
ISA 63:13 లోతైన సముద్రాల మధ్యనుండి తన ప్రజలను యెహోవా నడిపించాడు. ప్రజలు పడిపోకుండా నడిచారు. అరణ్యంలో గుర్రం నడచినట్టు వారు నడిచారు.
ISA 63:14 ఒక ఆవు ఊరికే పొలంలో నడుస్తూ పడిపోదు. అదేవిధంగా ప్రజలు సముద్రంలోనుండి వెళ్తూ పడిపోలేదు. ఒక విశ్రాంతి స్థలానికి ప్రజలను యెహోవా ఆత్మ నడిపించింది. అంతవరకు ప్రజలు క్షేమంగా ఉన్నారు. యెహోవా, నీవు నీ ప్రజలను నడిపించిన విధం అది. ప్రజలను నీవు నడిపించావు, నీ నామాన్ని నీవు ఆశ్చర్యకరమైనదిగా చేసుకొన్నావు.
ISA 63:15 యెహోవా, పరలోకము నుండి చూడుము. ఇప్పుడు జరుగుతున్న సంగతులు చూడుము. పరలోకంలో ఉన్న నీ మహాగొప్ప పవిత్ర నివాసంనుండి కిందనున్న మమ్మల్ని చూడుము. మా మీద నీ బలమైన ప్రేమ ఏది? నీ అంత రంగంలో నుండి బయలువెడలే నీ శక్తివంతమైన కార్యాలు ఏవి? నామీద నీ కరుణ ఏది? నామీద నీ దయగల ప్రేమను ఎందుకు దాచిపెడ్తున్నావు?
ISA 63:16 చూడు, నీవు మా తండ్రివి! మేము అబ్రాహాము పిల్లలమని అతనికి తెలియదు. ఇశ్రాయేలు (యాకోబు) మమ్మల్ని గుర్తించలేడు. యెహోవా, నీవు మా తండ్రివి. మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించినవాడవు నీవే.
ISA 63:17 యెహోవా, నీవు మమ్మల్ని నీ దగ్గర్నుండి ఎందుకు తోసివేస్తున్నావు? మేము నిన్ను అనుసరించటం మాకు కష్టతరంగా నీవెందుకు చేస్తున్నావు? యెహోవా, మా దగ్గరకు తిరిగి రమ్ము. మేము నీ సేవకులం. మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయి. మా కుటుంబాలు నీకు చెందినవి.
ISA 63:18 నీ పరిశుద్ధ ప్రజలకు ఇప్పుడు చాలా కష్టాలు వచ్చాయి. మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయం మీద నడుస్తున్నారు.
ISA 63:19 కొందరు మనుష్యులు నిన్ను వెంబడించరు. ఆ ప్రజలు నీ నామం ధరించరు. మరియు మేము ఆ ప్రజల్లాగే ఉన్నాము.
ISA 64:1 నీవు ఆకాశాలను చీల్చుకొని భూమి మీదికి దిగివస్తే అప్పుడు సమస్తం మారిపోతుంది. పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.
ISA 64:2 మండుతున్న పొదల్లా, పర్వతాలు అగ్ని జ్వాలల్లో కాలిపోతాయి. నిప్పుమీది నీళ్లలా పర్వతాలు కాగిపోతాయి. అప్పుడు నీ శత్రువులు నిన్ను గూర్చి తెలుసుకొంటారు. అప్పుడు రాజ్యాలన్ని నిన్ను చూడగా భయంతో వణుకుతాయి.
ISA 64:3 (కానీ నీ ఈ సంగతులు జరిగించాలని మేము నిజంగా కోరటంలేదు. పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.)
ISA 64:4 నీ ప్రజలు నిజంగా ఎన్నడూ నీ మాట వినలేదు. నీవు చెప్పిన విషయాలను నీ ప్రజలు నిజంగా ఎన్నడూ వినలేదు. నీవంటి దేవుణ్ణి ఏ మనిషీ ఎన్నడూ చూడలేదు. నీవు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు. ప్రజలు సహనంతో నీకొరకు కనిపెట్టివుంటే అప్పుడు నీవు వారికోసం గొప్ప కార్యాలు చేస్తావు.
ISA 64:5 మేలు చేయటంలో ఆనందించే మనుష్యులతో నీవు ఉన్నావు. నీ జీవన విధానాలను ఆ మనుష్యులు జ్ఞాపకం చేసుకొంటారు. కానీ చూడు, గతంలో మేము నీకు విరోధంగా పాపం చేశాము అందుచేత నీవు మా మీద కోపగించావు.
ISA 64:6 మేమందరం పాపంతో మైలపడ్డాం. మా “నీతి” అంతా పాత మైల గుడ్డల్లాంటిదే. మేమందరం ఎండిపోయిన ఆకుల్లా ఉన్నాము. మా పాపాలు మమ్మల్ని గాలిలా కొట్టుకుపోయాయి.
ISA 64:7 మేము నిన్ను ఆరాధించటం లేదు, నీ నామం మేము విశ్వసించలేదు. నిన్ను వెంబడించాలనే సంబరం మాలో ఎవ్వరికీ లేదు. అందుచేత నీవు మా వద్దనుండి తిరిగిపోయావు. మేము పాపంతో నిండిపోయాం గనుక నీ ఎదుట మేము నిస్సహాయులం.
ISA 64:8 కానీ, యెహోవా, నీవు మా తండ్రివి. మేము మట్టిలాంటి వాళ్లం. నీవు కుమ్మరివి. నీ చేతులే మమ్మల్ని అందర్ని చేశాయి.
ISA 64:9 యెహోవా, మా మీద ఇంకా కోపంతోనే ఉండకు. మా పాపాలను శాశ్వతంగా జ్ఞాపకం చేసుకోవద్దు. దయచేసి మమ్మల్ని చూడు, మేము నీ ప్రజలము.
ISA 64:10 నీ పవిత్ర పట్టణాలు శూన్యంగా ఉన్నాయి. ఆ పట్టణాలు ఇప్పుడు అరణ్యాలవలె ఉన్నాయి. సీయోను ఒక అరణ్యం. యెరూషలేము నాశనం చేయబడింది.
ISA 64:11 మా పవిత్ర ఆలయం అగ్నిచేత కాల్చి వేయబడింది. ఆ ఆలయం మాకు ఎంతో గొప్పది. మా తండ్రులు అక్కడ నిన్ను ఆరాధించారు. మాకు ఉండిన మంచి వస్తువులన్నీ ఇప్పుడు నాశనం చేయబడ్డాయి.
ISA 64:12 నీవు నీ ప్రేమను ఎన్నటికీ మాకు చూపకుండా ఉంచుతాయా ఈ వస్తువులు? నీవు ఏమీ పలుకకుండనే కొనసాగుతావా? శాశ్వతంగా నీవు మమ్మల్ని శిక్షిస్తావా?
ISA 65:1 యెహోవా చెబుతున్నాడు: “సలహాకోసం నా వద్దకు రాని ప్రజలకు నేను సహాయం చేశాను. నన్ను కనుగొన్నవారు నాకోసం వెదకిన వారు కారు. నా పేరు పెట్టబడని ఒక ప్రజతో నేను మాట్లాడాను. ‘నేనిక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను’ అని నేను చెప్పాను.
ISA 65:2 “నాకు విరోధంగా తిరిగిపోయిన వారిని చేర్చుకొనేందుకు నేను సిద్ధంగా నిలబడ్డాను. ఆ ప్రజలు నా దగ్గరకు వస్తారని నేను కనిపెట్టాను. కానీ వారు చెడుమార్గంలోనే జీవించటం కొనసాగించారు. వారి హృదయాలు కోరినవన్నీ వారు చేశారు.
ISA 65:3 ఆ మనుష్యులు నాకు ఎల్లప్పుడూ కోపం పుట్టిస్తూ, నా యెదుట ఉన్నారు. ఆ ప్రజలు వారి ఉద్యానవనాల్లో బలులు అర్పిస్తారు. ధూపం వేస్తారు.
ISA 65:4 ఆ మనుష్యులు సమాధుల్లో కూర్చొంటారు. చనిపోయిన వారి దగ్గర్నుండి సందేశాలకోసం వారు కనిపెడ్తారు. వారు శవాలమధ్య కూడా నివసిస్తారు. వారు పంది మాంసం తింటారు. వారి కత్తులు, గరిటెలు కుళ్లిపోయిన మాంసంతో మైలపడ్డాయి.
ISA 65:5 కానీ ఆ ప్రజలే, ‘దగ్గరకు రాకు, నేను నిన్ను శుద్ధి చేసేంతవరకు నన్ను ముట్టకు’ అని ఇతరులతో చెబుతారు. ఆ ప్రజలు నా కంటికి పొగలా ఉన్నారు. మరియు వారి అగ్ని ఎంతసేపూ మండుతూనే ఉంటుంది.”
ISA 65:6 “చూడు, నీవు చెల్లించాల్సిన లెక్క చీటి ఒకటి ఇక్కడ ఉంది. నీ పాపాల మూలంగా నీవు దోషివి అని ఈ లెక్క చీటి చూపిస్తుంది. ఈ లెక్క చీటి చెల్లించే వరకు నేను ఊరుకోను, నేను మిమ్మల్ని శిక్షించటం ద్వారా లెక్క చీటి చెల్లిస్తాను.
ISA 65:7 మీ పాపాలు, మీ తండ్రుల పాపాలు అన్నీ ఒకటే. యెహోవా ఇలా చెప్పాడు, ‘మీ తండ్రులు పర్వతాల్లో ధూపం వేసినప్పుడు ఈ పాపాలు చేశారు. ఆ కొండల మీద వారు నన్ను అవమానించారు. మరియు నేను మొదట వాళ్లను శిక్షించాను. వారు పొందాల్సిన శిక్ష నేను వారికి ఇచ్చాను.’”
ISA 65:8 యెహోవా చెబుతున్నాడు: “ద్రాక్షపండ్లలో కొత్తరసం ఉన్నప్పుడు, ప్రజలు ఆ ద్రాక్షరసాన్ని పిండుతారు. కాని ద్రాక్ష పండ్లను మాత్రం వారు పూర్తిగా నాశనం చేయరు. ఆ ద్రాక్షపండ్లు ఇంకా ఉపయోగపడ్తాయి. కనుక వారు యిలా చేస్తారు. నా సేవకులకు కూడ నేను అలాగే చేస్తాను. నేను వారిని పూర్తిగా నాశనం చేయను.
ISA 65:9 యాకోబు (ఇశ్రాయేలు) ప్రజలు కొందరిని నేను ఉంచుతాను. యూదా ప్రజలు కొందరికి నా పర్వతం లభిస్తుంది. నా సేవకులు అక్కడ నివసిస్తారు. అక్కడ నివసించాల్సిన మనుష్యులను నేను ఏర్పరచుకొంటాను.
ISA 65:10 అప్పుడు షారోను లోయ గొర్రెలకు పొలం అవుతుంది. ఆకోరు లోయ పశువులు విశ్రాంతి తీసుకొనే చోటు అవుతుంది. ఈ సంగతులన్నీ నా ప్రజలకోసం-కోసం వెదకే ప్రజలకోసమే.
ISA 65:11 “అయితే యెహోవాను విడిచిపెట్టిన ప్రజలారా, మీరు శిక్షించబడతారు. నా పవిత్ర పర్వతం గూర్చి మరచిపోయిన ప్రజలు మీరు. మీరు అదృష్టాన్ని ఆరాధించే ప్రజలు మీరు కర్మ అనే తప్పుడు దేవతమీద ఆధారపడే మనుష్యులు.
ISA 65:12 కానీ మీ భవిష్యత్తును నేను నిర్ణయిస్తాను. మరియు నా ఖడ్గం ప్రయోగించి నేను మిమ్మల్ని శిక్షిస్తాను. మిమ్మల్ని శిక్షించే ఆయన ఎదుట మీరంతా దీనులుగా ఉంటారు. నేను మిమ్మల్ని పిలిచాను, మీరు నాకు జవాబు ఇవ్వటానికి నిరాకరించారు. నేను మీతో మాట్లాడాను కానీ మీరు వినిపించుకోలేదు. కీడు అని నేను చెప్పిన వాటినే మీరు చేశారు. నాకు ఇష్టం లేని వాటినే చేయాలని మీరు తీర్మానించుకొన్నారు.”
ISA 65:13 కనుక యెహోవా నా ప్రభువు ఈ మాటలు చెప్పాడు: “నా సేవకులు భోజనం చేస్తారు కానీ దుర్మార్గులైన మీరు ఆకలితో ఉంటారు. నా సేవకులు పానం చేస్తారు. కానీ దుష్ఠులైన మీరు దాహంతో ఉంటారు. నా సేవకులు సంతోషంగా వుంటారు. కానీ దుష్టులైన మీరు సిగ్గునొందుతారు.
ISA 65:14 నా సేవకుల హృదయాల్లో మంచితనం ఉంటుంది. కనుక వారు సంతోషంగా ఉంటారు. కానీ దుష్ఠులైన మీ హృదయాల్లో బాధ ఉంటుంది గనుక మీరు ఏడుస్తారు. మీ ఆత్మలు భగ్నమైపోతాయి గనుక మీరు చాలా దుఃఖిస్తారు.
ISA 65:15 మీ పేర్లు నా సేవకులకు చెడ్డ మాటల్లా ఉంటాయి.” నా ప్రభువు, యెహోవా మిమ్మల్ని చంపేస్తాడు. మరియు ఆయన తన సేవకులను కొత్త పేర్లతో పిలుస్తాడు.
ISA 65:16 ఇప్పుడు ప్రజ లు ఆశీర్వదించమని భూమిని వేడుకొంటున్నారు. కానీ భవిష్యత్తులో వారు ఆశీర్వాదాలకోసం నమ్మకమైన దేవుణ్ణి అడుగుతారు. ఇప్పుడు ప్రజలు ప్రమాణాలు చేసినప్పుడు వారు భూశక్తిని నమ్ముకొంటున్నారు. కానీ భవిష్యత్తులో వారు నమ్మకమైన దేవుణ్ణి నమ్ముకొంటారు. ఎందుకంటే గతంలోని కష్టాలు మరువబడుతాయి గనుక. ఆ కష్టాలను నాప్రజలు ఇంక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోరు.
ISA 65:17 “చూడు, నేను ఒక కొత్త ఆకాశాన్ని ఒక కొత్త భూమిని చేస్తాను. గత విషయాలను ప్రజలు జ్ఞాపకం చేసుకోరు. ఆ విషయాలు ఏవీ నా ప్రజల జ్ఞాపకాల్లో ఉండవు.
ISA 65:18 నా ప్రజలు విచారంగా ఉండరు. లేదు, వారు సంతోషంగా ఉండి, శాశ్వతంగా దేవుని స్తుతిస్తారు. నేను చేసే సంగతుల మూలంగా వారు సంతోషంగా ఉంటారు. సంపూర్ణ ఆనందంతో నిండిన ఒక యెరూషలేమును నేను చేస్తాను. మరియు వారిని సంతోషించే ప్రజగా నేను చేస్తాను.
ISA 65:19 “అప్పుడు యెరూషలేము గూర్చి నేను సంతోషిస్తాను. నా ప్రజలను గూర్చి నేను సంతోషిస్తాను. ఆ పట్టణంలో మరల ఎన్నడూ ఏడుపు, దుఃఖం ఉండవు.
ISA 65:20 జన్మించి, కొన్నాళ్లు మాత్రమే జీవించే శిసవు అంటూ ఎవ్వరు ఆ పట్టణంలో ఉండరు. కొన్నాళ్లకే ఆయుష్షు తీరిపోయే వ్యక్తులు ఎవ్వరూ ఆ పట్టణంలో ఉండరు. జన్మించే ప్రతి శిశువు దీర్గకాలం జీవిస్తుంది. వృద్ధులు ప్రతి ఒక్కరూ చాలాకాలం జీవిస్తూనే ఉంటారు. వంద సంవత్సరాలు జీవించిన వ్యక్తి యువకుడు అని పిలువబడతాడు. (అయితే పాపం చేసినవాడు వంద సంవత్సరాలు బతికినా అన్నీ కష్టాలే.)
ISA 65:21 “ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఇల్లు కడితే ఆ వ్యక్తి అక్కడ నివసిస్తాడు. ఒక వ్యక్తి గనుక ద్రాక్షతోట నాటతే ఆ వ్యక్తి ఆ తోటలోని ద్రాక్ష పండ్లు తింటాతడు.
ISA 65:22 ఒకడు ఇల్లు కట్టగా మరొకడు ఆ ఇంటిలో నివసించటం అనేది జరుగదు. ఒకడు ఒక తోటను నాటగా మరొకడు ఆ తోట ఫలాలు తినటం అనేది జరుగదు. వృక్షాలు బతికినంత కాలం నా ప్రజలు బతుకుతారు. నేను ఏర్ప రచుకొనే ప్రజలు, వారు తయారుచేసే వాటిని అనుభవిస్తారు.
ISA 65:23 ప్రతిఫలం ఏమి లేకుండా ప్రజలు మరల ఎన్నడూ పనిచేయరు. చిన్నతనంలోనే మరణించే పిల్లల్ని ప్రజలు మరల ఎన్నడు కనరు. నా ప్రజలంతా యెహోవాచేత ఆశీర్వదించబడతారు. నా ప్రజలు, వారి పిల్లలు ఆశీర్వదించబడుతారు.
ISA 65:24 వారికి అవసరమైనవి, వారు అడగకముందే నేను తెలుసుకొంటాను. సహాయంకోసం వారు నన్ను అడుగుట ముగించక ముందే నేను వారికి సహాయం చేస్తాను.
ISA 65:25 తోడేళ్లు, గొర్రెపిల్లలు కలిసి మేతమేస్తాయి. సింహాలు పశువులతో కలిసి మేస్తాయి. నా పవిత్ర పర్వతం మీద నేలపై పాము ఎవరినీ భయపెట్టదు, బాధించదు.” ఇవన్నీ యెహోవా చెప్పాడు.
ISA 66:1 యెహోవా చెబుతోంది ఇదే, “ఆకాశాలు నా సింహాసనం. భూమి నా పాదపీఠం. అందుచేత నాకు ఒక గృహం నిర్మంచగలం అని మీరనుకొంటున్నారా? లేదు, నిర్మించ లేరు.
ISA 66:2 నా అంతట నేనే అన్నింటినీ చేశాను. అన్నింటిని నేను చేసాను కనుక అవి అన్నీ ఇక్కడ ఉన్నాయి.” యెహోవా ఈ సంగతులు చెప్పాడు. “నేను ఏ ప్రజల్ని లక్ష్యపెడతాను, నాతో చెప్పండి? పేదప్రజల్ని నేను లక్ష్యపెడతాను. వీరు చాల దుఃఖంలో ఉన్న ప్రజలు. నా మాటలకు విధేయులయ్యే వారిని నేను లక్ష్యపెడతాను
ISA 66:3 కొంతమంది నాకు బలులు ఇచ్చేందుకు ఎడ్లను వధిస్తారు. కానీ వారు ప్రజల్నికూడా కొడతారు. ఆ మనుష్యులు నాకు బలులు ఇచ్చేందుకని గొర్రెలను వధిస్తారు. అయితే వారు కుక్కల మెడలు కూడ విరుగగొడ్తారు. మరియు పందుల రక్తం వారు నాకు అర్పిస్తారు. ఆ మనుష్యులు ధూపం వేయటం జ్ఞాపకం ఉంచుకొంటారు. కాని పనికిమాలిన వారి విగ్రహాలను కూడా వారు ప్రేమిస్తారు. ఆ మనుష్యులు నా మార్గాలను గాక వారి స్వంత మార్గాలనే ఎంచుకొంటరు. భయం కరమైన వారి విగ్రహాలనే వారు పూర్తిగా ప్రేమిస్తారు.
ISA 66:4 కనుక వారి స్వంత రహస్యాలనే నేను ఉపయోగించాలని నేను నిర్ణయించుకొన్నాను. అంటే, దేనికైతే వారు ఎక్కువగా భయపడతారో వాటినే ప్రయోగించి వారిని శిక్షించాలని నా ఉద్దేశం. నేను ఆ ప్రజలను పిలిచాను కాని వారు వినిపించుకోలేదు. నేను వారితో మాట్లాడాను కానీ వారు నా మాట వినలేదు కనుక నేనుకూడా వారికి అదే విధంగా చేస్తాను. నేను కీడు అని చెప్పిన వాటినే ఆ ప్రజలు చేశారు. నాకు ఇష్టంలేని వాటినే వారు జరిగించేందుకు ఎంచుకొన్నారు.”
ISA 66:5 యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యే ప్రజలారా, మీరు యెహోవా చెప్పేవాటిని వినాలి. “మీ సోదరులు మిమ్మల్ని ద్వేషించారు. మీరు నన్ను వెంబడించినందువల్ల వారు మీకు విరోధంగా తిరిగారు. యెహోవా ఘనపరచబడినప్పుడు మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము. అప్పుడు మేము మీతోకూడ సంతోషిస్తాం, అని మీ సోదరులు చెప్పారు. ఆ మనుష్యులు శిక్షించబడతారు.”
ISA 66:6 వినండి! పట్టణం నుండి, దేవాలయం నుండి పెద్ద శబ్దం వస్తుంది. యెహోవా తన శత్రువులను శిక్షిస్తున్న శబ్దం అది. వారికి రావాల్సిన శిక్షనే యెహోవా వారికి ఇస్తున్నాడు.
ISA 66:7 “ఒక స్త్రీ నొప్పులు లేకుండా ప్రసవించదు. ఒక స్త్రీ నొప్పులు అనుభవించకుండనే తన శిశువును చూడటం అనేది ఎన్నడూ సంభవించలేదు. అదే విధంగా, ఒకే రోజున ఒక కొత్త ప్రపంచం ప్రారంభం అగుట ఎవ్వరూ ఎన్నడూ చూడలేదు. ఒకే రోజున ఒక కొత్త రాజ్యం ప్రారంభం అయినట్లు ఎవ్వరూ ఎన్నడూ వినలేదు. ప్రసవ వేదనలాంటి నొప్పులు దేశం మొదట అనుభవించాలి. ప్రసవ వేదనల తర్వాత దేశం తన పిల్లలకు- ఒక కొత్త దేశానికి – జన్మనిస్తుంది.
ISA 66:9 అదే విధంగా ఏదో కొత్తది జన్మించాల్సిన అవసరం లేకుండా నేను బాధ కలిగించను.” యెహోవా ఇది చెబుతున్నాడు: “నేను నీకు పురిటినొప్పులు రానిచ్చినట్లయితే, అప్పుడు నీ కొత్త దేశం నీకు రాకుండా నేను ఆపుజేయను.” మీ దేవుడే ఇది చెప్పాడు.
ISA 66:10 యెరూషలేమా, సంతోషించు! యెరూషలేమును ప్రేమించే మీరందరూ సంతోషించండి. విచారకరమైన విషయాలు యెరూషలేముకు సంభవించాయి. కనుక మీరు కొంతమంది మనుష్యులు విచారించారు. కానీ, అలాంటి మీరు ఇప్పుడు ఎంతో ఎంతో సంతోషించాలి.
ISA 66:11 ఎందుకంటే ఆమె స్థనాలనుండి పాలు వచ్చినట్లుగా మీకు కరుణ లభిస్తుంది. ఆ “పాలు” నిజంగా మిమ్మల్ని తృప్తిపరుస్తాయి. ప్రజలారా, మీరు పాలు తాగుతారు. మరియు మీరు యెరూషలేము మహిమను నిజంగా అనుభవిస్తారు.
ISA 66:12 యెహోవా చెబుతున్నాడు: “చూడండి, నేను మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది. భూమి మీద రాజ్యాలన్నింటిలోని ఐశ్వర్యాలు అన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు ప్రవహిస్తాయి. మీరు చిన్న పిల్లల్లా ఉంటారు. మీరు ‘పాలు’ తాగుతారు. మీరు ఎత్తబడి నా కౌగిటిలో ఉంటారు. మీరు నా మోకాళ్లమీద ఊపబడతారు.
ISA 66:13 యెరూషలేములో మీరు ఓదార్చబడతారు. ఒక తల్లి తన బిడ్డను ఓదార్చేలా నేను మిమ్మల్ని ఓదార్చుతాను.”
ISA 66:14 మీరు నిజంగా అనుభవించేవాటిని మీరు చూస్తారు. మీరు స్వతంత్రులై, గడ్డి పెరుగునట్లు పెరుగుతారు. యెహోవా సేవకులు ఆయన శక్తిని చూస్తారు. కానీ యెహోవా శత్రువులు ఆయన కోపాన్ని చూస్తారు.
ISA 66:15 చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నాడు. యెహోవా సైన్యాలు ధూళిమేఘాలతో వస్తున్నాయి. ఆ ప్రజలను యెహోవా తన కోపంతో శిక్షిస్తాడు. యెహోవా కోపంగా ఉన్నప్పుడు, ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన అగ్ని జ్వాలలను ప్రయోగిస్తాడు.
ISA 66:16 యెహోవా ప్రజలకు తీర్పు తీరుస్తాడు. తర్వాత యెహోవా తన ఖడ్గంతోను, అగ్నితోను ఆ ప్రజలను నాశనం చేస్తాడు. యెహోవా అనేకమంది ప్రజలను నాశనం చేస్తాడు.
ISA 66:17 ఆ ప్రజలు వారి ప్రత్యేక తోటలో ఆరాధించుకొనేందుకు, వారిని పవిత్రం చేసుకోవాలని చెప్పి, వారిని వారు కడుగుకొంటారు. ఈ ప్రజలు వారి తోటల్లోనికి ఒకరిని ఒకరు వెంబడిస్తారు. ఆ తర్వాత వారి విగ్రహాలను వారు పూజిస్తారు. కానీ, యెహోవా ఆ ప్రజలందరిని నాశనం చేస్తాడు. “పందులు, ఎలుకల మాంసం, ఇతర మైల వస్తువులు ఆ ప్రజలు తింటారు. అయితే ఆ ప్రజలంతా ఏకంగా నాశనం చేయబడతారు.” (సాక్షాత్తూ యెహోవా ఈ సంగతులు చెప్పాడు.)
ISA 66:18 “ఆ మనుష్యులకు దుష్టతలంపులు ఉన్నాయి, దుష్టకార్యాలు చేస్తారు. అందుచేత వారిని శిక్షించేందుకు నేను వస్తున్నాను. రాజ్యాలన్నింటిని, ప్రజలందరినీ నేను సమావేశం చేస్తాను. ప్రజలంతా కలిసి వచ్చి నా శక్తిని చూస్తారు.
ISA 66:19 కొంతమంది మనుష్యులకు నేను ఒక గుర్తువేస్తాను-వారిని నేను రక్షిస్తాను. రక్షించబడిన ఆ ప్రజల్లో కొందరిని తర్షీషు, లిబియా, లూద్, (విలుకాండ్ర దేశం), తూబాలు, గ్రీసు, దూరదేశాలు అన్నింటికీ నేను పంపిస్తాను. ఆ ప్రజలు నా ఉపదేశాలు ఎన్నడూ వినలేదు. ఆ ప్రజలు నా మహిమను ఎన్నడూ చూడలేదు. అందుచేత రక్షించబడిన ప్రజలు నా మహిమను గూర్చి దేశాలకు చెబుతారు.
ISA 66:20 మరియు వారు అన్ని దేశాలనుండి మీ సోదరులను, సోదరీలను తీసుకొని వస్తారు. నా పవిత్ర పర్వతం యెరూషలేముకు మీ సోదరీలను వారు తీసుకొని వస్తారు. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, రథాలు బండ్లమీద మీ సోదరులు, సోదరీలు వస్తారు. ఇశ్రాయేలీయులు పవిత్ర పళ్లెములలో యెహోవా మందిరానికి తీసుకొనివచ్చే కానుకలవలె మీ సోదరులు, సోదరీలు ఉంటారు.
ISA 66:21 ఈ మనుష్యుల్లో నుండి కూడ కొందరిని యాజకులుగా, లేవీలుగా ఉండేందుకు నేను ఏర్పరచు కొంటాను.” (యెహోవా ఈ సంగతులు చెప్పాడు.)
ISA 66:22 “నేను ఒక నూతన ప్రపంచాన్ని చేస్తాను మరియు నూతన ఆకాశం, నూతన భూమి శాశ్వతర గా నిలుస్తాయి. అదే విధంగా మీ పేర్లు, మీ పిల్లలు శాశ్వతంగా నాతో కూడ ఉంటారు.
ISA 66:23 ప్రతి ఆరాధన రోజు, ప్రజలంతా నన్ను ఆరాధించేందుకు వస్తారు. ప్రతి సబ్బాతు నాడూ, ప్రతి నెల మొదటిరోజున వారు వస్తారు.
ISA 66:24 “ఈ ప్రజలు నా పవిత్ర పట్టణంలో ఉంటారు. మరియు పట్టణం బయటకు వెళ్తే నాకు విరోధంగా పాపం చేసిన మనుష్యుల శవాలను వారు చూస్తారు. ఆ శవాలు పురుగులు పట్టి ఉంటాయి. ఆ పురుగులు ఎన్నటికి చావవు. అగ్ని జ్వాలలు ఆ శవాలను కాల్చివేస్తాయి మరియు ఆ జ్వాలలు ఎన్నటికీ ఆరిపోవు.”
JER 1:1 ఇవి యిర్మీయా వర్తమానాలు. యిర్మీయా తండ్రి పేరు హిల్కీయా. అనాతోతు నగరంలో నివసించే యాజకుల కుటుంబానికి చెందిన వాడు యిర్మీయా. ఆ నగరం బెన్యామీను వంశానికి చెందిన వారి ప్రాంతంలో వుంది.
JER 1:2 యూదా రాజ్యాన్ని యోషీయా పాలిస్తున్న రోజులలో యెహోవా యిర్మీయాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. యోషీయా తండ్రి పేరు ఆమోను. యోషీయా రాజ్యపాలన పదమూడవ సంవత్సరం జరుగుతూ ఉండగా యెహోవా యిర్మీయాతో మాట్లాడటం ప్రారంభించాడు.
JER 1:3 యెహోయాకీము యూదాకు రాజై యున్న కాలం వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం కొనసాగించాడు. యెహోయాకీము తండ్రి పేరు యోషీయా. సిద్కియా రాజ్యపాలన యూదాపై పదకొండు సంవత్సరాల ఐదు మాసాలు జరిగే వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం సాగించాడు. సిద్కియా కూడ యోషీయా కుమారుడే. సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాలు దాటి ఐదవ నెల జరుగుతూ ఉండగా యెరూషలేములో ఉన్న ప్రజలు బందీలుగా కొనపోబడ్డారు.
JER 1:4 యెహోవా వాక్కు నాకు చేరింది. ఈ వర్తమానం యెహోవా వద్ద నుండి వచ్చింది.
JER 1:5 “నీ తల్లి గర్భంలో నిన్ను నేను రూపించక ముందే నిన్ను నేనెరిగియున్నాను. నీవు పుట్టకముందే నిన్నొక ముఖ్యమైన పనికి ఎన్నుకున్నాను. దేశాలకు నిన్నొక ప్రవక్తగా నియమించాను.”
JER 1:6 అప్పుడు, యిర్మీయానగు నేను “సర్వశక్తిమంతుడనైన యెహోవా! నేనెలా మాట్లాడాలో నాకు తెలియదు. నేను బాలుడను” అని అన్నాను.
JER 1:7 కాని యెహోవా ఇలా అన్నాడు: “బాలుడనని అనవద్దు. నేను నిన్నెక్కడికి పంపుతానో నీవచ్చటికి తప్పక వెళ్లాలి. నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా నీవు చెప్పాలి.
JER 1:8 ఎవ్వరికీ భయపడకు. నేను నీతో ఉన్నాను. నేను నిన్ను కాపాడతాను”. ఈ వర్తమానం యెహోవానైన నా వద్దనుండి వచ్చినది.
JER 1:9 పిమ్మట యెహోవా తన చేయి చాచి నా నోటిని తాకాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, నేను నా వాక్కును నీ నోటిలో ఉంచుతున్నాను.
JER 1:10 దేశాలను, సామ్రాజ్యాలను ఈ రోజు నీ జవాబు దారిలో ఉంచుతున్నాను. నీవు వారిని కూకటి వేళ్లతో పెకలించి చీల్చివేస్తావు. నీవు వాటిని సర్వనాశనం చేసి పడత్రోస్తావు. నీవు వాటని కట్టి నాటుతావు.”
JER 1:11 యెహోవా యొక్క సందేశం నాకు చేరింది యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తూ ఉన్నావు?” అప్పుడు యెహోవాకు నేనిలా సమాధాన మిచ్చాను: “బాదపు చెట్టుకొమ్మతో చేయబడిన ఒక కర్రను నేను చూస్తున్నాను.”
JER 1:12 “నీవు చాలా బాగా కనిపెట్టావు. నేను నీకిచ్చిన సందేశం నిజం కావాలని ఎదురు చూస్తున్నాను” అని యెహోవా అన్నాడు.
JER 1:13 యెహోవా సందేశం నాకు మళ్లీ వినిపించింది. యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు?” “నేను ఒక మరుగుతున్న నీళ్ల కుండను చూస్తున్నాను. ఆ కుండ ఉత్తర దిశనుండి ఒరిగి ఉంది” అని నేను యెహోవాకు చెప్పాను.
JER 1:14 నాతో యెహోవా ఇలా అన్నాడు: “ఉత్తర దిశనుండి ఉపద్రవం రాబోతూవుంది. ఈ దేశంలో నివసిస్తూ ఉన్న వారందరికీ ఆ విపత్తువస్తుంది.
JER 1:15 అనతి కాలంలోనే ఉత్తర ప్రాంత సామ్రాజ్యాల ప్రజలందరికీ నేను పిలుపు యిస్తాను.” ఇది యెహోవా వాక్కు. “ఆయా రాజ్యాధినేతలు వస్తారు. యెరూషలేము ద్వారాల వద్ద వారు తమ సింహాసనాలను ప్రతిష్ఠించుతారు. యెరూషలేము నగర గోడలమీదికి దండెత్తి వస్తారు. యూదా రాజ్యంలోని అన్ని నగరాలపై వారు దండయాత్రలు చేస్తారు.
JER 1:16 అప్పుడు నా ప్రజలపై నా తీర్పును ప్రకటిస్తాను. వారు చెడు నడతగల వారగుటచేతను, వారు నాపట్ల విముఖులైనందువల్లను నేనిది చేస్తున్నాను. నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు. ఇతర దేవతలకు వారు బలులు అర్పించారు. వారి చేతితో వారు చేసిన బొమ్మలనే వారు ఆరాధించారు.
JER 1:17 “యిర్మీయా, నీవు మాత్రం సిద్ధంగా ఉండు. ధైర్యంగా నిలబడి ప్రజలతో మాట్లాడు. నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా వారికి తెలియజేయి. ప్రజలకు నీవు భయపడవద్దు. నీవు ప్రజలకు భయపడితే, వారిముందు నీవు భయపడటానికి తగిన కారణం కల్పిస్తాను.
JER 1:18 నేను మాత్రం ఈ రోజు నిన్నొక బలమైన నగరం మాదిరిగాను, ఒక ఇనుప స్థంభం వలెను, ఒక కంచుగోడ వలెను బలపరుస్తాను. దానివల్ల ఈ రాజ్యంలో ప్రతి వాని ఎదుట నీవు ధైర్యంగా నిలువగలవు. యూదా రాజుల ఎదుట, యూదా నాయకుల ఎదుట, యూదా యాజకుల ఎదుట, మరియు యూదా ప్రజల ఎదుట నీవు ధైర్యంగా నిలువగలవు.
JER 1:19 వారంతా నిన్నెదిరిస్తారు; కాని నిన్ను ఓడించలేరు. ఎందుకంటె నేను నీతో ఉన్నాను; నేను నిన్ను ఆదుకుంటాను.” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం.
JER 2:1 యెహోవా యొక్క వర్తమానం నాకు వినిపించింది. యెహోవా వాక్కు ఇలా వుంది:
JER 2:2 “యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ప్రజలతో మాట్లాడుము. నీవు ఇలా చెప్పాలి: “‘నీవొక చిన్న రాజ్యంగా ఉన్నప్పుడు నీవు నాకు విశ్వాసంగా ఉన్నావు. ఒక యౌవ్వన వధువులా నీవు నన్ననుసరించావు. ఎడారులలోను, సాగుచేయని బీడు భూములలోను నీవు నన్ను అనుసరించావు.
JER 2:3 ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఒక పవిత్రమైన బహుమానము: వారు యెహోవా ఏర్పచుకొన్న ప్రథమ ఫలం. ఇశ్రాయేలుకు హాని చేయబోయిన ప్రజలంతా దోషులుగా నిలిచారు. ఆ దుష్టులు అనేక కష్టనష్టాలకు గురవుతారు.’” ఇది యెహోవా వాక్కు.
JER 2:4 యాకోబు వంశీయులారా! యెహోవా వార్తవినండి. ఇశ్రాయేలు సంతతి కుటుంబాల గుంపుల వారందరూ! ఈ వర్తమానం వినండి.
JER 2:5 యెహోవా ఇలా చెప్పాడు: “మీ పూర్వీకులపట్ల నేను ఉదారంగా ప్రవర్తించి యుండలేదా? అందుకేనా వారు నాపట్ల విముఖులై నారు? మీ పూర్వీకులు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు. తద్వారా వారుకూడ పనికిమాలిన వారైనారు.
JER 2:6 ‘మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి తీసుకుని వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? మాకు ఎడారులలో మార్గదర్శి అయిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? మమ్మల్ని నిర్జల ప్రాంతాలలోను, కొండల్లో, కోనల్లో సురక్షితంగా నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? ఎవరూ నివసించని గాఢాంధకారములోనూ, ప్రమాదకరమైన భూమియందు యెహోవా మమ్మును నడిపించాడు. ప్రజలు ఆ ప్రదేశం గుండా ప్రయాణించరు. కానీ యెహోవా మమ్మును దాని గుండా నడిపించాడు.’ మీ పూర్వీకులు ఈ విషయాలు మీకు చెప్పలేదు.”
JER 2:7 ఒక మంచి, మరియు సారవంతమైన అనేక మంచి వస్తువులతో నిండివున్న రాజ్యానికి మిమ్మల్ని తీసుకొనివచ్చాను. మీరు ఆ ఫలాలను తినాలనీ, అక్కడ పండే ధాన్యాలను మీరు ఉత్పత్తి చేయాలనీ నేనలా చేశాను. కాని మీరు వచ్చినా దేశాన్ని అపవిత్ర పర్చారు. ఆ దేశాన్ని మీకు నేనిచ్చాను. అయితే మీరు దానిని చెడ్డ దేశంగా మార్చివేశారు.
JER 2:8 “యెహోవా ఎక్కడ అని యాజకులు అడగలేదు. నా ఉపదేశాలను అనుసరించేవారు నన్ను తెలుసు కోవటానికి నిరాకరించారు. ఇశ్రాయేలు ప్రజానాయకులు నాకు వ్యతిరేకులయ్యారు. బూటకపు దేవతైన బయలు పేరిట ప్రవక్తలు ప్రవచనాలు చేశారు. వారు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”
JER 2:9 కావున మిమ్మల్ని, మీ పుత్ర పౌత్రులను నేను నిందిస్తున్నాను.
JER 2:10 సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి వెళ్లి చూడండి. ఒకనిని కేదారు రాజ్యానికి పంపిశ్రద్ధగా పరిశీలించమనండి. అక్కడ ఎవరైనా ఈ రకంగా ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి.
JER 2:11 ఏ దేశవాసులైనా తమ పాత దేవుళ్లను కొత్త దేవుళ్లతో మార్చుకున్నారు? లేదు! నిజానికి వారి దేవుళ్లు వాస్తవ దేవుళ్లు కానేకారు అయినను నా ప్రజలు తమ మహిమాన్వితుడైన దేవుని ఆరాధించటం మానుకొని పనికిమాలిన విగ్రహాలను పూజించటం ప్రారంభించారు అని యెహోవా అన్నాడు.
JER 2:12 “ఆకాశములారా, జరిగిన విషయాలకు విస్మయము చెందండి. భయకంపితులుకండి!” యెహోవా ఇలా చెప్పాడు.
JER 2:13 “నా ప్రజలు రెండు చెడు కార్యాలు చేశారు: వారు జీవజల (ఊటనైన) నన్ను విడిచేసారు పైగా వారు వారివారి తొట్లను తవ్వుకున్నారు. (వారు ఇతర దేవుళ్ళవైపు మొగ్గారు.) కాని వారి తొట్లు పగిలి పోయాయి. అవి నీటిని పట్టజాలవు.
JER 2:14 “ఇశ్రాయేలు ప్రజలు బానిసలైపోయారు? వారు పుట్టుకతో బానిసలుగా తయారైనారా? ఇశ్రాయేలు ప్రజలను ఇతరులు ఎందుకు కొల్లగొడుతున్నారు?
JER 2:15 యువకిశోరాలు (శత్రువులు) ఇశ్రాయేలు రాజ్యంపై గర్జిస్తున్నాయి. సింహాలు కోపంతో గుర్రుమంటున్నాయి. ప్రజలు దేశాన్ని సింహాలు నాశనం చేశాయి. ఇశ్రాయేలు నగరాలు తగులబెట్టబడ్డాయి. అవి నిర్మానుష్యమైనాయి. వాటిలో ప్రజలెవ్వరూ లేరు.
JER 2:16 మెమ్‌ఫిస్, తహపనేసు వీటినుండి వచ్చిన యోధులు నీ తల చితుకగొట్టారు.
JER 2:17 ఈ కష్టానికంతటికి నీ తప్పులే కారణం! చక్కని మార్గంలో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్న మీ దేవుడైన యెహోవా నుండి మీరు తొలగిపోయారు
JER 2:18 యూదా ప్రజలారా, మీరిది ఆలోచించండి: ఈజిప్టుకు వెళ్లటం వలన ఏమైనా మేలు జరిగిందా? నైలునది (షీహోరు) జలాన్ని తాగినందువల్ల ఏమి మేలు జరిగింది? లేదు. ఏమీ లేదు! అష్షూరుకు వెళ్లుట వలన ఏమి జరిగింది? యూఫ్రటీసు నదీజలాన్ని తాగినందువల్ల ఏమి కలిసివచ్చింది. లేదు. ఏమీలేదు.
JER 2:19 మీరు చెడు పనులు చేశారు. మీ చెడ్డ పనులు మీకు శిక్షను తెస్తాయి. మీకు కష్టాలు సంభవిస్తాయి. ఆ ఆపద మీకు తగిన గుణపాఠం నేర్పుతుంది. దీనిని గురించి యోచన చేయండి! మీకై మీరు మీ దేవునికి దూరమగుట ఎంతటి ఘోరమైన విషయమో అప్పుడు మీకు అర్థమవుతుంది. నేనంటే భయ భక్తులు లేకపోవుట తగనిపని!” ఈ వర్తమానం నా ప్రభువును, సర్వశక్తి మంతుడయిన దేవుని వద్దనుండి వచ్చినది.
JER 2:20 “యూదా, చాలాకాలం క్రితమే నీవు నీకాడిని పారవేసినావు. నాకు దగ్గరగా ఉంచుకొనేందుకు నిన్నులాగి పట్టిన పగ్గాలను తెంచుకున్నావు. ‘నేను నిన్ను సేవించను’ అని నన్ను తిరస్కరించావు. నిజంగా నీవు ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టుకింద పండుకొని పచ్చి వేశ్యలా ప్రవర్తించావు.
JER 2:21 యూదా, నిన్నొక మేలు రకం ద్రాక్షపాదువలెనాటాను. మీరంతా మేలురకం విత్తనాల్లా ఉన్నారు. కాని నాసిరకం పండ్లనిచ్చే వేరొక రకం ద్రాక్షలతల్లా ఎలా తయారయ్యారు?
JER 2:22 క్షారజలంతో స్నానం చేసుకున్నా, నీవు విస్తరించి సబ్బు వినియోగించినా నేను నీ దోష కళంకాన్ని చూడగలను.” ఈ వర్తమానం దేవుడైన యెహోవాది.
JER 2:23 “యూదా, ‘నేను దోషినికానని, బయలు విగ్రహాలను ఆరాధించలేదని’ నీ వెలా నాకు చెప్పగలవు? లోయలో నీవు చేసిన పనులు గూర్చి ఒకసారి ఆలోచించుకో. నీవు ఏమిచేశావో గుర్తుకు తెచ్చుకో. నీవొక వడిగల ఆడ ఒంటివలె ఒక చోటినుండి మరో చోటికి పరుగెత్తావు.
JER 2:24 ఎడారిలో తిరిగే ఒక అడవి గాడిదలా నీవున్నావు. సంగమ సమయంలో అది గాలిని వాసనచూస్తూ తిరుగుతుంది. మిక్కిలి ఎదగొన్నప్పుడు దానిని ఎవ్వరూ వెనుకకు మరల్చలేరు. ఎదకాలంలో దానిని కోరే ప్రతీ మగజంతువూ దానిని పొందగలదు. అప్పుడు దానిని కనుగొనటం తేలిక.
JER 2:25 యూదా, ఇక నీవు విగ్రహాలను అనుసరించటం మానాలి. ఇతర దేవుళ్ల కొరకు దాహాన్ని వదిలి పెట్టు. కానీ, ‘లాభం లేదు! నేను వదల్లేను! నేను పరదేవుళ్లనే ప్రేమిస్తాను. నేను వాటినే ఆరాధిస్తాను’ అని నీవంటావు.
JER 2:26 “ప్రజలు పట్టుకున్నప్పుడు దొంగ సిగ్గుపడతాడు అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలు అవమానం పాలవుతారు. ఇశ్రాయేలు రాజులు, ప్రజానాయకులు, యాజకులు, ప్రవక్తలు అందరూ సిగ్గుతో తలవంచుకుంటారు.
JER 2:27 ఈ ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు! దానితో ‘నీవే నా తండ్రివి’ అంటారు. ఈ ప్రజలు ఒక రాతి బండతో మాట్లాడతారు. దానితో, ‘నీవేమాకు జన్మనిచ్చావు’ అంటారు. ఆ ప్రజలంతా అవమానం పొందుతారు. ఆ ప్రజలు నావైపుకు చూడరు. వారు విముఖులైనాకు వెన్ను చూపుతారు. కాని యూదా ప్రజలు కష్టాల పాలైనప్పుడు, ‘వచ్చి, మమ్మును ఆదుకోమని!’ నన్నడుగుతారు.
JER 2:28 ఆ విగ్రహాలనే వచ్చి మిమ్మును ఆదుకోనివ్వండి! మీకైమీరు చేసిన ఆ విగ్రహాలు ఎక్కడ వున్నాయి? మీకష్టకాలంలో ఆ విగ్రహాలు వచ్చి మిమ్మును ఆదుకుంటాయేమో చూద్దాము. యూదా ప్రజలారా, మీనగరాలెన్ని వున్నాయో మీ విగ్రహాలు కూడా అన్ని వున్నాయి!
JER 2:29 “మీరు నాతో ఎందుకు వాదిస్తారు? మీరంతా నాకు వ్యతిరేకులయ్యారు.” ఈ వర్తమానం యెహోవానుండి వచ్చినది.
JER 2:30 “యూదా ప్రజలారా, నేను మిమ్మును శిక్షించాను. కాని అది పనిచేయలేదు. మిమ్మల్ని శిక్షించినప్పుడు కూడా మీరు వెనక్కి మరలలేదు. మీ వద్దకు వచ్చిన ప్రవక్తలను మీరు మీకత్తులతో చంపారు. మీరొక భయంకర సింహంలా ప్రవర్తించి వారిని సంహరించారు.”
JER 2:31 ఈ తరం ప్రజలారా, యెహోవా వర్తమానం పట్ల శ్రద్ధవహించండి. “ఇశ్రాయేలు ప్రజలకు నేనొక ఎడారిలా ఉన్నానా? వారికి నేనొక అంధకారంతో నిండిన ప్రమాదకరమైన దేశంలా ఉన్నానా? ‘మేము మా యిష్టానుసారంగా నడవటానికి మాకు స్వేచ్ఛ ఉంది. యెహోవా, మేము తిరిగి నీ చెంతకు రాము,’ అని నా ప్రజలు అంటారు. కానీ, వారలా ఎందుకు మాట్లాడతారు?
JER 2:32 ఏ కన్యకగాని తన నగలను మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు! ఏ పెండ్లి కుమార్తెగాని తన దుస్తులకు ఒడ్డాణం మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు! కాని నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు.
JER 2:33 “యూదా, ప్రేమికులను (బూటకపు దేవుళ్లను) వెంబడించటం నీకు బాగా తెలుసు. కావున దుష్టకార్యాలు చేయుట నీకై నీవే నేర్చుకున్నావు.
JER 2:34 మీ చేతులు రక్తసిక్తమైనాయి! అది పేదవాళ్ల, అమాయకుల రక్తం. నిష్కారణముగా నీవు ప్రజలను చంపావు. కనీసం వారు నీవు పట్టుకున్న దొంగలైనా కారు. నీవటువంటి చెడ్డ పనులు చేస్తావు.
JER 2:35 కాని, ‘నేను అమాయకుడను, దేవుడు నా ఎడల కోపంగా లేడు’ అని నీవు చెప్పుకుంటూ ఉంటావు. అందువల్ల నీవు అబద్ధం చెప్పిన నేరానికి కూడా నిన్ను దోషిగా నేను న్యాయ నిర్ణయం చేస్తాను, ఎందుకంటే ‘నేనేమీ పాపం చేయలేదు’ అని నీవంటున్నావు.
JER 2:36 నీ మనస్సు మార్చుకోవటం నీకు చాలా సులభమైన పని! అష్షూరు నీకు ఆశాభంగం కలిగించింది. అందుచేత అష్షూరును వదిలి ఈజిప్టుకు వెళ్లి సహాయం అర్ధించినావు. ఈజిప్టు కూడా నీకు ఆశాభంగం కల్గిస్తుంది.
JER 2:37 చివరకు నీవు ఈజిప్టును కూడా వదిలివేస్తావు. అవమానంతో నీవు నెత్తిన చేతులు పెట్టుకుంటావు. నీవు ఆ రాజ్యాలను నమ్మినావు. కాని ఆ రాజ్యాల సహకారంతో నీవేమీ సాధించలేవు. ఎందువల్లనంటే యెహోవా ఆ రాజ్యాలను తిరస్కరించాడు.
JER 3:1 “ఒక వ్యక్తి తన భార్యకు విడాకులిస్తే, ఆమె అతన్ని వదిలి వెళ్లి మరో వివాహం చేసికొంటే, ఆ వ్యక్తి మళ్లీ ఆమెవద్దకు తిరిగి రాగలడా? లేదు. రాలేడు! ఆ వ్యక్తి ఆ స్త్రీ వద్దకు తిరిగి వెళితే ఆ రాజ్యం పూర్తిగా ‘మాలిన్య’ మైపోతుంది. యూదా, నీవు అనేకమంది విటులతో (అబద్ధపు దేవుళ్లు) వట్టి వేశ్యవలె ప్రవర్తించావు. మరల నీవిప్పుడు నా వద్దకు రావాలని కోరుతున్నావా?” అని యెహోవా పలికాడు.
JER 3:2 “యూదా, దిశగా ఉన్న కొండ శిఖరాలను చూడు. నీవక్కడ తిరుగని చోటు ఉందా? నీవు బాట పక్కన విటుల (అబద్ధపు దేవుళ్ల) కోసం వేచివున్నావు. ఎడారిలో కూర్చున్న అరబీయునివలె నీవక్కడ కూర్చున్నావు. నీవు దేశాన్ని ‘అపవిత్రం’ చేశావు! ఏమైనంటావా? నీవు చాలా దుష్కార్యాలు చేశావు. నీవు నాకు విశ్వాసపాత్రంగా లేవు.
JER 3:3 నీవు పాపం చేశావు. అందుచే వర్షాలు లేవు. వసంత కాలపు వానలూ లేవు. అయినా నీ ముఖ లక్షణాలు వేశ్యాలక్షణాల్లా ఉన్నాయి. నీ అకృత్యాలకు సిగ్గుపడటంకూడా మానివేశావు.
JER 3:4 కాని నీవు నన్నిప్పుడు పిలుస్తున్నావు. ‘నా తండ్రీ’ నా బాల్యంనుండి ‘నీవు నాకు ప్రియ మిత్రునిలా ఉన్నావు.’
JER 3:5 ‘దేవుడు నా పట్ల ఎల్లప్పుడూ కోపంగా ఉండడు. దేవుని కోపం అల్పమైనది. అది శాశ్వతంగా ఉండదు’ అని అంటున్నావు. “యూదా, నీవీ విషయాలు అంటూనే నీవు ఎంత చెడు చేయగలవో అంతా చేస్తున్నావు.”
JER 3:6 రాజైన యోషీయా యూదా రాజ్యాన్ని పాలించే కాలంలో యెహోవా నాతో మాట్లాడినాడు. ఆయన ఇలా అన్నాడు: “యిర్మీయా, ఇశ్రాయేలు చేసిన చెడ్డపనులు నీవు చూశావు. నా పట్ల ఆమె ఎలా విశ్వాసరహితంగా ఉన్నదో నీవు చూశావు! ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టు కింద విగ్రహాలతో వ్యభిచరించిన పాపానికి ఇశ్రాయేలు పాల్పడింది.
JER 3:7 ‘ఈ చెడు కార్యాలన్నీ చేయటం పూర్తయిన పిమ్మట ఇశ్రాయేలు తప్పక నావద్దకు తిరిగి వస్తుంది’ అని నేననుకున్నాను. కాని ఆమె నా వద్దకు రాలేదు. విశ్వాస ఘాతకురాలైన ఇశ్రాయేలు సోదరియగు యూదా ఆమె ఏమి చేసిందో చూసింది.
JER 3:8 ఇశ్రాయేలు విశ్వాసపాత్రంగా లేదు. ఆమెను నేనెందుకు పంపి వేశానో ఇశ్రాయేలుకు తెలుసు. ఆమె వ్యభిచార దోషానికి పాల్పడినందుకే నేనామెకు విడాకులిచ్చానని ఇశ్రాయేలుకు తెలుసు. కాని అది విశ్యాస ఘాతకురాలైన ఆమె సోదరిని భయపెట్టలేదు. యూదా భయపడలేదు. యూదాకూడా తెగించి వ్యభిచారిణిలా ప్రవర్తించింది.
JER 3:9 తానొక మరుగులేని వ్యభిచారిణిలా ప్రవర్తిస్తున్నాననే చింతన చేయలేదు. అలా ఆమె తన దేశాన్ని ‘మలిన’ (అపవిత్ర) పర్చింది. రాతితోను, చెక్కలతోను చేసిన విగ్రహాలను ఆరాధించి, వ్యభిచార పాపానికి ఒడిగట్టుకుంది.
JER 3:10 ఇశ్రాయేలు యొక్క విశ్వాస ఘాతకురాలైన సోదరి (యూదా) హృదయ పూర్వకంగా నావద్దకు తిరిగి రాలేదు. నావద్దకు తిరిగి వచ్చినట్లు ఆమె నటించింది.” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.
JER 3:11 యెహోవా నాతో ఇలా చెప్పినాడు “ఇశ్రాయేలు నాకు విశ్వాసపాత్రంగా లేదు. విశ్వాసం లేని యూదా కంటె ఇశ్రాయేలుకు చెప్పుకొనేందుకు ఒక మంచి సాకువుంది.
JER 3:12 యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఉత్తర దేశంలో చెప్పు: “‘విశ్వాసంలేని ఇశ్రాయేలీయులారా తిరిగి రండి.’ ఇది యెహోవా వాక్కు. ‘నిన్ను చూచి ముఖం తిప్పుకోను. నేను నిండు దయతో ఉన్నాను.’ ఈ వాక్కు యెహోవాది. ‘నీ పట్ల నేను శాశ్వతమైన కోపంతో ఉండను.
JER 3:13 నీవు నీ పాపాన్ని గుర్తించాలి. నీ యెహోవా దేవునికి నీవు వ్యతిరేకమయ్యావు నీ పాపం అదే. ఇతర దేశాలనుండి వచ్చిన వారి విగ్రహాలను నీవు ఆరాధించినావు నీవు ప్రతి పచ్చని చెట్టు కిందా విగ్రహారాధన చేశావు నీవు నా ఆజ్ఞను మన్నించలేదు.’” ఇదే యోహోవా వాక్కు.
JER 3:14 “విశ్వాసంలేని ప్రజలారా, నావద్దకు రండి” అని యెహోవా అంటున్నాడు “నేను మీ యజమానిని. ప్రతి నగరంనుంచీ ఒక్కొక్క వ్యక్తిని, ప్రతి కుటుంబంనుంచీ ఇద్దరు మనుష్యులను తీసుకొని మిమ్మల్ని సీయోనుకు తీసుకొని వస్తాను.
JER 3:15 అప్పుడు మీకు నూతన కాపరులను (పాలకులు) ఇస్తాను. ఆ పాలకులు నాకు విశ్వాస పాత్రులై ఉంటారు. వారు జ్ఞానంతోను, అవగాహనతోను మిమ్మల్ని నడిపిస్తారు.
JER 3:16 ఆ రోజుల్లో, రాజ్యంలో మీ సంతతి పెరిగి మీర నేకులై ఉంటారు.” ఈ వాక్కు యెహోవాది. “ఆ సమయంలో ప్రజలు తాము దేవుని నిబంధన మందసాన్ని కలిగివున్న రోజులు గుర్తున్నట్లు చెప్పరు. ఆ యెహోవా ఒడంబడికను గూర్చి వారెంత మాత్రం తలంచరు. వారు దానిని గుర్తుంచుకోరు. పోగొట్టు కోరు. వారు మరో పవిత్ర ఒడంబడికను చేయరు.
JER 3:17 ఆ సమయంలో యెరూషలేము నగరం ‘యెహోవా సింహాసనం’ అని పిలువబడుతుంది. దేశ దేశాల ప్రజలు యెరూషలేము నగరంలో కలిసి యెహోవాను స్మరించి ఆయన నామాన్ని గౌరవిస్తారు. ప్రజలు తమ మొండి హృదయాలను ఇక ఎంత మాత్రం అనుసరించరు.
JER 3:18 ఆ రోజుల్లో యూదా వంశం ఇశ్రాయేలు వంశంతో కలుస్తుంది వారు ఉత్తర ప్రాంతంలో ఒకే చోటునుండి కలిసి వస్తారు. వారి పితరులకు నేనిచ్చిన రాజ్యంలోకి వారు వస్తారు.”
JER 3:19 యెహోవానైన నేనిలా అనుకున్నాను, “మిమ్మల్ని నా స్వంత బిడ్డలవలె చూసుకోవటం నాకు సంతోషదాయకం. మీకో మంచి రాజ్యాన్నివ్వటం వాకు తృప్తినిస్తుంది. ఆ రాజ్యం ఇతర రాజ్యాలకంటె సుందరంగా ఉంటుంది. మీరు నన్ను ‘తండ్రీ’ అని పిలుస్తారనుకున్నాను. మీరు నన్ను ఎల్లప్పుడూ అనుసరిస్తారని అనుకున్నాను.
JER 3:20 కాని తన భర్త పట్ల వంచనగా నడిచే స్త్రీవలె మీరు తయారయ్యారు. ఇశ్రాయేలు వంశమా, నీవు నా పట్ల విశ్వాస పాత్రంగా మెలగ లేదు! ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
JER 3:21 నగ్నంగా ఉన్న కొండలమీద రోదన నీవు వినవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు దయాభిక్ష కోరుకుంటూ ఏడుస్తూ ప్రార్ధన చేస్తున్నారు. వారు బహు దుష్టులైనారు! వారు తమ యెహోవా దేవున్ని మర్చిపోయారు.
JER 3:22 “విశ్వాసఘాతకులగు ఇశ్రాయేలీయులారా నా వద్దకు తిరిగి రండి. నన్నాశ్రయించి రండి. నా పట్ల వంచనతో మెలిగినందుకు క్షమిస్తాను.” “అవును. మేము నీ వద్దకు వస్తాము. నీవు మా యెహోవా దేవుడవు
JER 3:23 కొండల మీద విగ్రహాలను పూజించుట అవివేకం. కొండలమీద ఆడంబరంగా జరిగే పూజా కార్యక్రమమంతా మోసం. నిజానికి, ఇశ్రాయేలుకు రక్షణ యెహోవా దేవుని వద్దనుండే వస్తుంది.
JER 3:24 ఆ భయంకరమైన బయలుదేవత మన తండ్రుల ఆస్తిని మ్రింగివేసింది. మనం పిల్లలం కావటంతో ఇదంతా జరిగింది. ఆ భయంకరమైన దేవత మన తండ్రుల గొర్రెలను, పశువులను, వారి కుమారులను, కుమార్తెలను చంపింది.
JER 3:25 మనం సిగ్గుతో తలవంచుకుందాం. మన అవమానం మనల్ని దుప్పటిలా కప్పివేయనీయండి. మన యెహోవా దేవునిపట్ల మనం తీవ్రమైన పాపం చేశాం. మనం, మన తండ్రులు కూడా పాపానికి ఒడిగట్టాము. మన చిన్నతనం నుండి ఇప్పటివరకు యెహోవా దేవుని ఆజ్ఞను మనం పాటించలేదు” అని చెప్పాలి.
JER 4:1 ఇదే యెహోవా వాక్కు. “ఇశ్రాయేలూ, నీవు రావాలనుకుంటే, తిరిగి నా వద్దకు రమ్ము నీ విగ్రహాలను విసరివేయి! నానుండి దూరంగా పోవద్దు!
JER 4:2 నీవు ఆ విధంగా చేస్తే, నీవు ప్రమాణం చేయటానికి ఈ మాటలు చెప్పగలవు ‘నిత్యుడైన యెహోవా తోడు’ అని నీవనగలవు నీవీ మాటలు సత్యమైన, న్యాయమైన, నీతిమార్గాన పలుకగలవు. నీవీ పనులు చేస్తే, యెహోవా రాజ్యాలను దీవిస్తాడు. యెహోవా చేసిన పనులను వారు పొగడుతారు.”
JER 4:3 యూదా ప్రజలకు, యెరూషలేము నగరవాసులకు యెహోవా ఇలా చెపుతున్నాడు: “మీ భూములు దున్నబడలేదు. వాటిని దున్నండి! ముండ్లపొదలలో విత్తనాలు చల్లవద్దు.
JER 4:4 యెహోవా యొక్క ప్రజలుగా మీరు తయారుకండి. మీ హృదయాలను మార్చుకోండి యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీలో పరివర్తన రాకపోతే నాకు చాలా కోపం వస్తుంది. నా కోపం అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది. నా కోపం మిమ్మల్ని దహించి వేస్తుంది. ఆ అగ్ని జ్వాలల్ని ఎవ్వరూ ఆర్పలేరు! అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? మీరు చేసిన పాపకార్యాలవల్లనే ఇదంతా జరుగుతుంది.”
JER 4:5 “ఈ వర్తమానాన్ని యూదా ప్రజలకు ప్రకటించుము: “యెరూషలేములో ప్రతి పౌరునికి తెలియజేయుము, ‘దేశమంతా బూర వూది’ బాహాటంగా ఇలా చెప్పుము, ‘మీరంతా కలిసి రండి! రక్షణకై మనమంతా బలమైన నగరాలకు తప్పించుకుపోదాం!’
JER 4:6 సీయోను వైపుకు సంకేత ధ్వజాన్ని ఎగురవేయుము. మీ ప్రాణరక్షణకై పారిపొండి! ఆలస్యం చేయవద్దు! ఇది మీరు త్వరగా చేయండి. ఎందువల్లననగా ఉత్తర దిశనుండి నేను విపత్తును తీసుకొని వస్తున్నాను. నేను అతి భయంకరమైన వినాశనాన్ని తీసుకొని వస్తున్నాను.”
JER 4:7 తన గుహనుండి ఒక “సింహం” బయటికి వచ్చింది. రాజ్యాలను నాశనం చేసేవాడు కదలి వస్తున్నాడు. నీ రాజ్యాన్ని సర్వ నాశనం చేయటానికి అతడు ఇల్లు వదిలి వస్తున్నాడు. నీ పట్టణాలు ధ్వంసమవుతాయి. వాటిలో నివసించటానికి ఒక్కడూ మిగలడు.
JER 4:8 కావున నారబట్టలు ధరించండి. మిక్కిలిగా విలపించండి! ఎందువల్లనంటే యెహోవా మీపట్ల చాలా కోపంగా ఉన్నాడు.
JER 4:9 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “ఇది జరిగే సమయంలో రాజు, ఇతర నాయకులు తమ ధైర్యాన్ని కోల్పోతారు. యాజకులు బెదరిపోతారు! ప్రవక్తలు భయపడి, విస్మయం పొందుతారు!”
JER 4:10 అప్పుడు యిర్మీయానైన నేను ఇలా చెప్పాను, “నా ప్రభువగు యెహోవా, నీవు నిజంగా యూదా, యెరూషలేము ప్రజలను మోసపుచ్చావు. ‘మీకు శాంతి కలుగుతుంది’ అని వారికి చెప్పియున్నావు. కాని ఇప్పుడు వారి గొంతులమీద కత్తిఉంది!”
JER 4:11 అ సమయంలో యూదా, యోరూషలేము ప్రజలకు ఒక వర్తమానం ఇవ్వబడుతుంది: “వట్టి కొండలపై నుండి వేడిగాలి వీస్తుంది. అది ఎడారి నుండి నీ ప్రజల మీదికి వీస్తుంది. అది రైతులు నూర్చిన ధాన్యం పోతపోయటానికి పనికి వచ్చే పైరుగాలిలాంటిది కాదు.
JER 4:12 ఇది దీనికంటె బలమైన గాలి; పైగా అది నావద్ద నుండి వీస్తుంది. ఇప్పుడు, యూదా ప్రజలపై నా న్యాయనిర్ణయం ప్రకటిస్తాను.”
JER 4:13 చూడు, శత్రువు మేఘంలా లేచి వస్తాడు! అతని రధాలు సుడిగాలిలా కన్పిస్తాయి! అతని గుర్రాలు గ్రద్దలకంటె వేగం కలవి! అది మనకు హానికరం! మనం సర్వ నాశనమయ్యాము!
JER 4:14 యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలనుంచి చెడును కడిగి వేయండి. మీరు పరిశుద్ధి హృదయాలు కలిగి ఉండండి; తద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. దుష్ట ఆలోచనలు చేయటం మానివేయండి.
JER 4:15 వినండి! దానునుండి వచ్చిన వార్తాహరుడు మాట్లాడుతున్నాడు. కొండల ప్రాంతమైన ఎఫ్రాయిము నుండి ఇతడు దుర్వార్త తెస్తున్నాడు.
JER 4:16 “దానిని ఈ దేశమంతా ప్రకటించండి. ఆ వార్తను యెరూషలేము నగరవాసులకు తెలియజేయండి. బహుదూరపు దేశంనుండి శత్రువు వస్తున్నాడు. యూదా నగరాలపై శత్రువులు యుద్ధ ధ్వని చేస్తున్నారు.
JER 4:17 చేను చుట్టూ పంటను కాపాడే మనుష్యులున్నట్లు యెరూషలేమును శత్రువులు చుట్టుముడతారు యూదా, నీవు నాకు ఎదురు తిరిగావు! అందువల్లనే శత్రవు నిన్నెదిరించి వస్తున్నాడు!” ఇది యెహోవా వాక్కు.
JER 4:18 “నీవు నివసించిన తీరు, నీవు చేసిన దుష్కార్యాలే ఈ విపత్తును తీసికొని వచ్చాయి. నీ దుష్టజీవితమే నీ గుండెల్ని చీల్చే బాధను తెచ్చింది.”
JER 4:19 అయ్యయ్యో, నా దుఃఖం, ఆవేదనతో నేను మూలుగుచున్నాను. నేను బాధతో క్రుంగి పోతున్నాను. అయ్యో, నేను భయ భ్రాంతుడనయ్యాను. నాలో నా గుండె దద్దరిల్లుతూ ఉంది. నేను ప్రశాంతంగా ఉండలేను. ఎందువల్లనంటే నేను బూర ధ్వని విన్నాను. అది యుద్ధ నాదం. సైన్యాన్ని అది పిలుస్తోంది!
JER 4:20 ఒకదాని తరువాత ఒకటి ఆపదల పరంపర! దేశం యావత్తూ సర్వనాశనమయ్యింది. అనుకోని విధంగా నా డేరాలన్నీ నాశనం చేయబడ్డాయి! నా పరదాలు (తెరలు) చించబడ్డాయి!
JER 4:21 యెహోవా, నేనెంత కాలం యుద్ధ ధ్వజాలను చూడాలి? ఎంతకాలం యుద్ధ నాదం నేను వినాలి?
JER 4:22 దేవుడు ఇలా అన్నాడు: “నా ప్రజలు మూర్ఖులు. వారు నన్నెరుగరు. వారు మంద బుద్ధిగల పిల్లలవలె ఉన్నారు. వారికి అవగాహనే లేదు. కాని వారు చెడు చేయటంలో నేర్పరులు. మంచిపని ఎలా చేయాలో వారికి తెలియనే తెలియదు.”
JER 4:23 నేను భూమివైపు చూశాను. భూమి ఖాళీగా ఉంది; దానిపై ఏమీ లేదు. నేను అకాశంవైపు చూశాను. వెలుగు పోయింది.
JER 4:24 నేను పర్వతాల వైపు చూశాను, అవి కదిలిపోతున్నాయి. కొండలన్నీ కంపించి పోతున్నాయి.
JER 4:25 నేను చూడగా, అక్కడ మనుష్యులు లేరు. ఆకాశంలో పక్షులు లేకుండా పోయాయి.
JER 4:26 నేను చూడగా సుక్షేత్రమైన రాజ్యం ఎడారిలా కన్పించింది. ఆ రాజ్యంలో నగరాలన్నీ సర్వనాశనమయ్యాయి. ప్రభువే ఇదంతా కలుగజేశాడు. అధికమైన యెహోవా కోపమే దీనిని కలుగచేసింది.
JER 4:27 యెహోవా ఇలా అన్నాడు: “దేశం యావత్తూ నాశనమవుతుంది. (కానీ దేశాన్ని పూర్తిగా నాశనం చేయను)
JER 4:28 అందువల్ల దేశంలో మిగిలినవారు చనిపోయిన వారి కొరకు విలపిస్తారు. ఆకాశం చీకటవుతుంది. నా మాటకు తిరుగులేదు. నేనొక నిర్ణయాని కొచ్చాను; మరల నేను మనస్సు మార్చుకోను.”
JER 4:29 గుర్రపు రౌతుల రవాళింపులు, విలుకాండ్ర శబ్దాలను యూదా ప్రజలు విని పారిపోతారు! కొందరు గుహలలో దాగుకొంటారు. కొంత మంది పొదలలో తలదాచుకుంటారు. మరి కొందరు కొండల మీదికి ఎక్కుతారు. యూదా నగరాలన్నీ నిర్మానుష్యమవుతాయి. అక్కడ ఎవ్వరూ నివసించరు.
JER 4:30 యూదా, నీవు నాశనం చేయబడ్డావు. నీవేమి చేస్తున్నావు? నీ అందమైన ఎర్రని దుస్తులు ఎందుకు ధరించావు? నిన్ను బంగారు ఆభరణాలతో ఎందుకు అలంకరించుకొన్నావు? నీ కంటికి అలంకరణ ఎందుకు చేసుకున్నావు? నీ అలంకరణ వ్యర్థం. నీ ప్రేమికులు నిన్నసహ్యించుకుంటారు. వారు నిన్ను చంపాలని చూస్తున్నారు.
JER 4:31 ప్రసవ వేదనలో స్త్రీ అరచినట్లుగా నేనొక రోదనవిన్నాను. అది ప్రథమ కన్పులో స్త్రీ పడిన వేదనవంటిది. అది సీయోను కుమార్తె రోదన. ఆమె చేతులెత్తి ప్రార్థిస్తూ, “అయ్యో, నేను మూర్ఛపోతున్నాను! హంతకులు నన్ను చుట్టుముట్టారు!” అని అంటున్నది.
JER 5:1 “యెరూషలేము నగర వీధులలో తిరుగుతూ చుట్టు పక్కల పరిశీలిస్తూ ఈ విషయాలపై ఆలోచించు. నగర కూడలి స్థలాలలో వెడకి ఏ ఒక్కడైనా మంచి వ్యక్తి కనిపిస్తాడేమో చూడు. నీతిగా వ్యవహరించే ఏ ఒక్కడు గాని, సత్యాన్వేషిగాని ఉన్నాడేమో చూడు. ఏ ఒక్క మంచి వ్యక్తిని చూడ గలిగినా, నేను యెరూషలేమును క్షమిస్తాను!
JER 5:2 ప్రజలు ప్రమాణాలు చేస్తూ ‘నిత్యుడైన యెహోవాతోడు’ అంటారు. కాని అది పేరుకు మాత్రం. వారు చెప్పింది చేయరు.”
JER 5:3 యెహోవా, నీవు ప్రజలలో నమ్మకస్థులకై చూస్తున్నావని నాకు తెలుసు. యూదా వారిని నీవు కొట్టావు. అయినా వారికి నొప్పి కలుగలేదు. వారిని నాశనం చేశావు, అయినా వారొక గుణపాఠం నేర్చుకోటానికి తిరస్కరించారు. వారు మొండి వైఖరి దాల్చారు. వారి దుష్కార్యాలకు వారు చింతించ నిరాకరించారు.
JER 5:4 కాని నేను (యిర్మీయా) ఇలా అనుకున్నాను: “కేవలం పేద మరియు సామాన్యా వర్గాల వారే అలా మూర్ఖులైవుండాలి. వారే యెహోవా మార్గాన్ని అనుసరించటం నేర్చుకోలేదు. పేదలు వారి దేవుని బోధనలు తెలుసుకోలేదు.
JER 5:5 కావున యూదా ప్రజల నాయకుల వద్దకు నేను వెళతాను. నేను వారితో మాట్లాడతాను. నాయకులు తప్పక యెహోవా మార్గాన్ని మరియు ఉపదేశాలను అర్థం చేసికుంటారు. వారి దేవుని న్యాయమార్గం వారికి తెలుస్తుందనే నమ్మిక నాకు ఉంది!” కాని నాయకులంతా యెహోవా సేవను నిరాకరించే నిమిత్తం ఏకమైనారు.
JER 5:6 వారు దేవునికి వ్యతిరేకులైనారు. అందువల్ల అరణ్యంలోనుండి ఒక సింహం వారిని ఎదిరిస్తుంది. ఎడారిలో నుండి ఒక తోడేలు వచ్చి వారిని చంపుతుంది. వారి నగరాల దాపున ఒక చిరుత పులిపొంచి ఉంది. నగరంలో నుంచి ఎవడు బయటికి వచ్చినా చిరుత పులి చీల్చి చెండాడుతుంది. యూదా ప్రజలు మరల మరల చేసిన పాపాల ఫలితంగా ఇదంతా జరుగుతుంది. అనేక పర్యాయములు వారు యెహోవాకు దూరమైనారు.
JER 5:7 దేవుడిలా అన్నాడు: “యూదా, నేను నిన్నెందుకు క్షమించాలో ఒక కారణం చూపించు. నీ పిల్లలు నన్ను త్యజించారు. దేవుళ్లే కానటువంటి వ్యర్థమైన విగ్రహాలకు వారు ప్రమాణాలు చేశారు. నీ సంతానానికి కావలసిన ప్రతీది నేను యిచ్చి వున్నాను. అయినా వారింకా నా పట్ల విశ్వాసఘాతకులై ఉన్నారు! వారెక్కువ కాలం వ్యభిచార గృహాలలోనే గడిపారు
JER 5:8 వారు తినటానికి సమృద్ధిగా ఉండి, సంభోగించటానికి సిద్ధంగా ఉన్న గుర్రాలవలె ఉన్నారు. పొరుగువాని భార్య కోసం మదించి సకిలిస్తున్న గుర్రంలా వున్నారు.
JER 5:9 ఈ పనులన్నీ చేసినందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?” ఇదే యెహోవా వాక్కు. “అవును! ఇటువంటి దేశాన్ని నేను శిక్షించాలిగదా. వారికి తగిన శిక్ష విధించాలి.
JER 5:10 “యూదా వారి ద్రాక్షతోటల వరుసలగుండా వెళ్లు. ద్రాక్షలతలన్నీ నరికివేయుము. (కాని వాటిని మొద్దులను నరికి నాశనం చేయ వద్దు). వాటి కొమ్మలన్నీ నరికివేయి. ఎందువల్లనంటే, ఈ తీగెలు యెహోవాకు చెందినవికావు.
JER 5:11 ఇశ్రాయేలు వంశీయులు, యూదా వంశీయులు ప్రతి విషయంలోనూ నాకు విశ్వాసఘాతుకంగా ఉన్నారు.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది.
JER 5:12 “యెహోవా విషయంలో ఆ ప్రజలు అబద్ధమాడారు. వారిలా అన్నారు: ‘యెహోవా మమ్మల్ని ఏమీ చేయడు. మాకు ఏ రకమైన కీడూ రాదు. మమ్మల్ని ఏ శత్రు సైన్యం ఎదిరించగా మేము చూడము. మేము ఆకలికి మాడిపోము.’
JER 5:13 తప్పుడు ప్రవక్తలు కేవలం వట్టి మాటలు పలుకువారు, దేవుని వాక్కు వారియందు లేదు. వారికి కీడు మూడుతుంది.”
JER 5:14 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు తెలియజేసాడు: “నేను వారిని శిక్షించనని ఆ ప్రజలు అన్నారు. కావున యిర్మీయా, నేను నీకు చెప్పిన మాటలు అగ్నిలా ఉంటాయి. ఆ ప్రజలు కొయ్యలాంటివారు. అగ్ని ఆ కట్టెనంతా దహించివేస్తుంది.”
JER 5:15 ఓ ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవా ఇలా చెప్పినాడు: “మీ మీదికి బహు దూరంలో ఉన్న ఒక దేశాన్ని తీసుకొని వస్తున్నాను. అది ఒక ప్రాచీన రాజ్యం అది ఒక శక్తివంతమైన రాజ్యం. మీకు అర్థంకాని భాషను వారు మాట్లాడతారు. వారు చెప్పేది మీకు అర్థం కాదు.
JER 5:16 వారి అమ్ముల పొదులు తెరచిన సమాధుల్లా వున్నాయి. వారంతా యోధనా యోధులు.
JER 5:17 మీరు పండించిన పంటనంతా ఆ సైనికులు తినివేస్తారు. మీ ఆహారాన్నంతా వారు తినివేస్తారు. మీ కుమారులను, కుమార్తెలను వారు నాశనంచేస్తారు. వారు మీ గొర్రెల మందలను, పశువుల మందలను తింటారు. మీ ద్రాక్షాపంటను, అంజూరపు చెట్లను వారు తింటారు. కత్తులతో వారు మీ బలమైన నగరాలను నాశనం చేస్తారు. మీరు నమ్మి తల దాచుకున్న బలమైన నగరాలను వారు నాశనం చేస్తారు!”
JER 5:18 యెహోవా ఇలా చెపుతున్నాడు: “కాని ఆ భయంకరమైన రోజులు వచ్చినప్పుడు, ఓ యూదా, నేను నిన్ను పూర్తిగా నాశనం కానివ్వను.
JER 5:19 యూదా ప్రజలు నిన్ను, ‘యిర్మీయా, మా దేవుడైన యెహోవా మాకెందుకీ ఆపద తెచ్చిపెట్టాడు?’ అని అడుగుతారు. అప్పుడు నీవు, ‘ఓ యూదా ప్రజలారా, మీరు యెహోవాను విస్మరించారు. మీ స్వంత దేశంలోనే పరదేశాల వారి విగ్రహాలను పూజించారు. మీరలా ప్రవర్తించారు గనుక ఇప్పుడు మీరు పరాయి రాజులను మీకు చెందని రాజ్యంలో సేవించవలసి ఉంది!’ అని సమాధానం చెప్పు.”
JER 5:20 యెహోవా ఇలా అన్నాడు: “యాకోబు వంశస్తులకు ఈ వర్తమానం అందజేయుము. యూదా రాజ్యానికి ఈ సమాచారం తెలియజేయుము.
JER 5:21 బుద్ధిహీనులైన మూర్ఖుపు జనులారా ఈ వర్తమానం వినండి: మీకు కళ్లు ఉండికూడా చూడరు! మీకు చెవులు ఉండి కూడా వినరు!
JER 5:22 నేనంటే మీరు నిజంగా భయపడటం లేదు.” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది “మీరు నాముందు భయంతో కంపించాలి. సముద్రానికి తీరాన్ని ఏర్పరచిన వాడను నేనే. తద్వారా సముద్రజలాలు తమ పరిధిలో శాశ్వతంగా ఉండేలా చేశాను. అలల తాకిడికి సముద్రతీరం దెబ్బతినదు. అలలు ఘోషిస్తూ తీరాన్ని చేర తాయి, కాని అవి దానిని దాటిపోవు.
JER 5:23 కాని యూదా ప్రజలు మొండి వైఖరి వహించారు. వారు నాకు వ్యతిరేకంగా తిరగటానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. నాకు విముఖులై, నానుండి వారు దూరంగా పోయారు.
JER 5:24 మనం మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండాలని, ‘ఆయన మనకు శరత్కాల, వసంతకాల వర్షాలు సకాలంలో ఇస్తున్నాడనీ, ఆయన సకాలంలో, సవ్వంగా మనం పంటనూర్పిడి చేసుకొనేలా చేస్తున్నాడనీ’ యూదా ప్రజలు ఎన్నడూ అనుకోలేదు.
JER 5:25 యూదా ప్రజలారా, మీరు చెడు చేశారు. అందువల్ల వర్షాలు లేవు; నూర్పిళ్లు లేవు. నీవు యెహోవా ఇచ్చే అనేక మంచి విషయాలను మీరు అనుభవించకుండా మీ పాపాలు అడ్డు పడుతున్నాయి.
JER 5:26 నా ప్రజల మధ్య దుష్ట వ్యక్తులున్నారు. ఆ దుష్టులు పక్షులను పట్టటానికి వలలు పన్నే కిరాతకుల్లా ఉన్నారు. వారు తమ బోనులు సిద్ధంచేసి పొంచి వుంటారు. కాని వాళ్లు పక్షులకు బదులు మనుష్యులను పట్టుకుంటారు.
JER 5:27 పంజరం నిండా పక్షులున్నట్లుగా, ఈ దుష్టుల ఇండ్ల నిండా అబద్దాలే! వారి అబద్ధాలు వారిని ధనికులుగా, శక్తివంతులుగా చేశాయి.
JER 5:28 వారు చేసిన దుష్కార్యాల ద్వారా వారు బాగా ఎదిగి, కొవ్వెక్కినారు. వారు చేసే అకృత్యాలకు అంతం లేదు. వారు అనాధ శిశువులు తరఫున వాదించరు. వారు అనాధలను అదుకోరు. వారు పేదవారికి న్యాయం జరిగేలా చూడరు.
JER 5:29 వారు ఈ కృత్యాలన్నీ చేస్తున్నందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది. “ఈ రకమైన దేశాన్ని నేను శిక్షించాలని నీకు తెలుసు. వారికి తగిన శిక్ష నేను విధించాలి.”
JER 5:30 యెహోవా ఇలా అన్నాడు, “యూదా రాజ్యంలో ఆశ్చర్య కలిగించే ఒక భయానక సంఘటన జరిగింది. అదేమంటే,
JER 5:31 ప్రవక్తలు అబద్ధం చెప్పటం; యాజకులు దేన్ని చేయుటకై ఎంచుకోబడ్డారో దానిని చేయరు నా ప్రజలు దానినే ఆదరించారు. కానీ, ఓ ప్రజలారా చివరలో మీరు శిక్షకు గురియైన నాడు మీరేమి చేస్తారు?”
JER 6:1 బెన్యామీనీయులారా, మీరు సురక్షిత ప్రాంతానికి పారిపోండి! యెరూషలేము నగరం నుండి పారిపోండి! తెకోవ నగరంలో యుద్ధ సంకేతంగా బూరవూదండి. బేత్‌హక్కెరెము నగరంలో హెచ్చరిక ధ్వజాన్ని ఎగురవేయండి! ఉత్తర దిశ నుండి ఆపద తొంగిచూస్తూ వున్నది కనుక మీరీ పనులు చేయండి. మహా భయంకరమైన విపత్తు మీకు రాబోతూ ఉంది!
JER 6:2 సీయోను కుమారీ, నీవెంతో అందమైన దానివి, సుకుమారివి.
JER 6:3 కాపరులు తమ గొర్రెల మందలను తోలుకొని యెరూషలేముకు వస్తారు. వారు నగరం చుట్టూతమ గుడారాలు నిర్మించుకుంటారు. ప్రతి గొర్రెల కాపరీ తన మంద విషయమై తగిన జాగ్రత్త తీసుకుంటాడు.
JER 6:4 వారిలా అంటారు: “యెరూషలేము నగరాన్ని ముట్టడించటానికి తగిన సన్నాహాలు చేయండి. లేవండి! మధ్యాహ్నం నగరంపై దండెత్తుదాం! ఇప్పటికే ఆలస్యమైంది. సాయంకాలపు నీడలు సాగుతున్నాయి.
JER 6:5 కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట ముట్టడిద్దాం. యెరూషలేము యొక్క రక్షణ దుర్గాలను కూల్చివేద్దాం!”
JER 6:6 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యెరూషలేము చుట్టూ ఉన్న వృక్షాలను పడగొట్టండి. ఆ కర్రలతో, మట్టితో నగర గోడకు దిబ్బలు నిర్మించి గోడ ఎక్కటానికి వీలు కల్పించండి. ఈ నగరం శిక్షించబడాలి. ఈ నగరంలో అక్రమం తప్ప మరేమీ లేదు.
JER 6:7 బావి తన నీటిని తాజాగా ఉంచుతుంది. అలాగే, యోరూషలేము తన దుర్మార్గాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. ఈ నగరంలో దౌర్జన్యం, విధ్వంసం గూర్చి ఎప్పుడూ వింటున్నాను. యెరూషలేములో అస్వస్థత, గాయాలు నిత్యం నేను చూస్తూనే ఉన్నాను.
JER 6:8 యెరూషలేమూ, ఈ హెచ్చరికను ఆలకించు. మీరు వినకపోతే, మీనుండి నేను వెనుదిరిగి పోతాను. మీ దేశాన్ని ఒక పనికిరాని ఎడారిగా మార్చివేస్తాను. అక్కడ ఎవ్వరూ నివసించలేరు!”
JER 6:9 సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెప్పినాడు: “ఈ రాజ్యంలో మిగిలిన వారినందరినీ ప్రోగు చేయుము నీవు ద్రాక్షతోటలో చివరికు ఏరుకొనే ద్రాక్షా కాయల్లా కూడదీయుము. ద్రాక్షకాయలను ఏరు వాని రీతిగా నీవు ప్రతి తీగను వెదకుము.”
JER 6:10 నేనెవరితో మాట్లాడగలను? ఎవరిని హెచ్చరించగలను? నా మాట ఎవరు వింటారు? ఇశ్రాయేలు ప్రజలు నా హెచ్చరికలు వినపడకుండా తమ చెవులు మూసుకున్నారు. యెహోవా ఉపదేశములు వారికిష్టము లేదు. కావున నా హెచ్చరికలు వారు వినలేరు. యెహోవా యొక్క బోధనలను ప్రజలు సహించరు. యెహోవా మాటలను వినుటకు వారు ఇష్టపడరు.
JER 6:11 కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) నిండి ఉండి! దానిని నేను లోపల ఇముడ్చుకో లేక పోతున్నాను! అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నా కోపాన్ని వీధులలో ఆడుకొనే పిల్లల మీదను, గుమిగూడియున్న యువకుల మీదను కుమ్మరించు. భార్యాభర్తలిరువురూ బందీలుగా పట్టుబడుదురు. వృద్ధులు, శతవృద్ధులు బందీలవుతారు.
JER 6:12 వారి ఇండ్లు ఇతరులకు ఇవ్వబడతాయి. వారి పొలాలు, వారి భార్యలు ఇతరులకివ్వబడతారు. నా చెయ్యెత్తి యూదా రాజ్య ప్రజలను శిక్షిస్తాను.” ఈ వాక్కు యెహోవా నుండివచ్చినది.
JER 6:13 “ఇశ్రాయేలు ప్రజలంతా ఇంకా, ఇంకా ధనం కావాలని కోరుతారు. కింది వర్గాలనుండి పై తరగతి వ్యక్తుల వరకు అందరూ ధనాపేక్ష కలిగి ఉంటారు! ప్రవక్తలు, యాజకులు అంతా కపటజీవనం సాగిస్తారు.
JER 6:14 ప్రవక్తలు, యాజకులు నా ప్రజల గాయాలను మాన్పజూస్తారు. అవేవో స్వల్ఫ గాయాలుగా. భావిస్తారు. ‘ఏమీ పరవాలేదు, ఏమీ పరవాలేదు’ అని అంటారు. కాని, నిజానికి ప్రమాదం చాలా ఉంది.
JER 6:15 ప్రవక్తలు, యాజకులు వారు చేయు చెడుకార్యాలకు సిగ్గుపడాలి! కాని వారికి సిగ్గనేది లేదు. వారి పాపానికి తగిన కలవరపాటు వారెరుగరు. అందువల్ల ఇతరులందరితో పాటు వారుకూడా శిక్షించబడతారు. నేను వారిని శిక్షించేటప్పుడు వారు నేల కరచేలా కిందికి తోయబడతారు.” ఇది యెహోవా వాక్కు.
JER 6:16 యెహోవా ఈ విషయాలు చెప్పినాడు: “నాలుగు మార్గాల కూడలి స్థలంలో నిలబడిచూడుము. పాతబాట ఏదో అడిగి తోలిసికో. ఏది మంచి మార్గమో అడిగి తెలుసుకో. అప్పుడు ఆ మార్గంపై పయనించుము. అప్పుడు మీరు మీకొరకు విశ్రాంతిని కనుగొంటారు. కాని మీరేమన్నారో తెలుసా? ‘మేము మంచి మార్గంపై పయనించ’ మన్నారు.
JER 6:17 నేను మీపై కాపలా కాయుటకు, కాపలాదారులను ఎన్నుకొన్నాను. నేను వారితో చెప్పాను. ‘యుద్ధ బూర ధ్వని వినండి’ అని. కాని వారన్నారు: ‘మేము వినము.’
JER 6:18 కావున, సర్వదేశవాసులారా వినండి! ఆయా దేశాల ప్రజలారా, ధ్యానముంచండి నేను యూదా ప్రజలకు చేయబోయే విషయాలను వినండి!
JER 6:19 భూలోకవాసులారా, ఇది వినండి: యూదా ప్రజలకు నేను ఘోర విపత్తు తెస్తున్నాను. ఎందుకంటే? ఆ ప్రజలు పన్నిన చెడు పనులన్నిటి కారణంగానే. వారు నా వర్తమానాలను లెక్కచేయనందుకు ఫలితంగా ఇది జరుగుతుంది. నా న్యాయ మార్గాన్ని అనుసరించటానికి వారు నిరాకరించారు.”
JER 6:20 యెహోవా ఇలా అన్నాడు: “మీరు షేబ దేశంనుండి నాకొరకు ధూపానికై సాంబ్రాణి ఎందుకు తెస్తున్నారు? దూరదేశాలనుండి సువాసనగల చెరుకును నాకు నైవేద్యంగా ఎందుకు తెస్తున్నారు? మీ దహనబలులు నన్ను సంతోషపర్చవు! మీ బలులు నన్ను సంతృప్తి పర్చజాలవు”
JER 6:21 అందువల్ల యెహోవా ఇలా చెప్పినాడు: “యూదా ప్రజలకు నేను సమస్యలు సృష్టిస్తాను. ప్రజల ఎదుట అడ్డబండలు నేను వేస్తాను. రాళ్లవలె అవి వుంటాయి. తండ్రులు, కొడుకులు వాటిపై తూలిపోతారు. స్నేహితులు, పొరుగువారు చనిపోతారు.”
JER 6:22 యెహోవా ఇలా అన్నాడు: “ఉత్తర ప్రాంతం నుండి ఒక సైన్యం వచ్చి పడుతూవుంది. భూమి పైగల ఒక పెద్ద దేశం దూరంనుండి వస్తూవున్నది.
JER 6:23 సైనికులు విల్లంబలు, ఈ టెలు పట్టుకొనివస్తారు. వారు బహు క్రూరులు. వారికి దయా, దాక్షిణ్యం ఉండవు. వారు మిక్కిలి శక్తిమంతులు! వారు గుర్రాలనెక్కి స్వారీ చేస్తూ వచ్చేటప్పుడు ఘోషించే మహా సముద్రంలా శబ్దం వస్తుంది. ఆ సైన్యం సర్వ సన్నద్ధమై యుద్ధానికి వస్తుంది. ఓ సీయోను కుమారీ, ఆ సైన్యం నిన్నెదిరించటానికి వస్తూ ఉంది.”
JER 6:24 ఆ సైన్యాన్ని గూర్చిన వర్తమానం మనం విన్నాము. భయకంపితులమై నిస్సహాయులంగా ఉన్నాము. కష్టాల ఉచ్చులో పడినట్లు ఉన్నాము. స్త్రీ ప్రసవవేదన అనుభవించినట్లు మేము బాధలో ఉన్నాము.
JER 6:25 మీరు పొలాల్లోకి వెళ్లవద్దు! మీరు బాట వెంబడి వెళ్లవద్దు. ఎందువల్లనంటే శత్రువువద్ద కత్తులున్నాయి. పైగా ఎటు చూచినా ప్రమాదమేవుంది.
JER 6:26 ఓ నా ప్రజలారా, మీరు గోనెపట్టలు ధరించండి. బూడిదలో పొర్లండి చనిపోయినవారి కొరకు బాగా దుఃఖించండి! మీకున్న ఒక్కగానొక్క కుమారుడు మరణించినట్లు విచారించండి. ఇవన్నీ మీరు చేయండి; కారణమేమంటే శత్రువు శరవేగంతో మనపైకి వస్తాడు!
JER 6:27 “యిర్మీయా, నేను (యెహోవా) నిన్నొక లోహపరీక్షకునిగా నియమించినాను. నీవు నా ప్రజల నడవడిని పరీక్షించు, వారిని గమనిస్తూ ఉండుము.
JER 6:28 నా ప్రజలే నాకు వ్యతిరేకులయ్యారు; వారు చాలా మొండివారు. వారు ఇతరుల గురించి చెడు విషయాలు చెప్తారు. వారు తుప్పుతో కప్పబడియున్న కంచు, ఇనుము లాంటివారు. వారంతా దుష్టులు.
JER 6:29 నీవొక వెండిని శుద్ధిచేసే పనివానిలా ఉన్నావు. కొలిమి తిత్తిలో బాగా గాలి వూదబడింది. అగ్ని ప్రజ్వరిల్లింది. కాని మంటలోనుండి కేవలం సీసం మాత్రమే వచ్చింది! శుద్ద వెండిని చేయాలను కోవటం వృధా ప్రయాస. వృధా కాలయాపన. అదే విధంగా నా ప్రజలలో దుర్నడత పోలేదు.
JER 6:30 ‘తిరస్కరించబడిన వెండి’ వంటివారని నా ప్రజలు పిలవబడతారు. యెహోవా వారిని ఆమోదించలేదు గనుక వారికాపేరు పెట్టబడింది.”
JER 7:1 యిర్మీయాకు యెహోవా నుండి ఇలా వర్తమానం వచ్చింది:
JER 7:2 “యిర్మీయా, నీవు దేవాలయ ద్వారం వద్ద నిలబడి, ఈ వర్తమానం ప్రజలకు బోధించుము: “‘ఓ యూదా ప్రజలారా యెహోవా వాక్కు ఆలకించండి! యెహోవా ఆరాధించటానికి ఈ ఆలయ ద్వారం ద్వారా వచ్చే ప్రజాలారా ఈ వర్తమానం వినండి!
JER 7:3 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడు, మీ జీవన విధానం మార్చుకోండి. సత్కార్యములు చేయండి! మీరలా చేస్తే, ఈ స్థలంలో మిమ్మల్ని నివసించేలాగు చేస్తాను
JER 7:4 కొందరు వ్యక్తులు చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి “ఇదే యెహోవా ఆలయం; ఇదే దేవాలయం ఇదే దేవాలయం!” అని వల్లిస్తారు.
JER 7:5 మీరు మీ జీవితాలను మార్చుకొని మంచి పనులు చేస్తే, మిమ్మల్ని ఈ ప్రదేశంలో నివసించేలా చేస్తాను. మీరు ఒకరికొకరు సత్యవర్తనులై మెలగాలి.
JER 7:6 కొత్తవారి పట్ల న్యాయం పాటించండి. అనాధ శిశువులకు, విధవ స్త్రీల సంక్షేమానికి మంచి పనులు చేయండి. అమాయకులను చంపవద్దు! ఇతర దేవుళ్లను అనుసరించ వద్దు! ఎందువల్లనంటే ఆ దేవతలు మీ జీవితాలను నాశనం చేస్తాయి.
JER 7:7 మీరు నా మాట మన్నిస్తే, నేను మిమ్మల్ని ఈ రాజ్యంలో నివసించేలా చేస్తాను. ఈ రాజ్యాన్ని నేను మీ పూర్వీకులకు శాశ్వతంగా ఇచ్చాను.
JER 7:8 “‘కాని మీరు అబద్ధాలనే నమ్ముతున్నారు. అబద్ధాలు ఆప్రయోజనకరమైనవి.
JER 7:9 మీరు దొంగతనాలు, హత్యలు చేస్తారా? వ్యభిచార పాపానికి ఒడిగడతారా? మీరు ఇతరులపై అకారణంగా నేరారోపణ చేస్తారా? బూటకపు బయలు దేవుణ్ణి ఆరాధిస్తారా? మీకు తెలియని ఇతర దేవుళ్లను అనుసరిస్తారా?
JER 7:10 మీరీ పాపాలు చేసి, నా పేరుతో పిలవబడే ఈ ఆలయంలో నా ముందు మీరు నిలవగలమని అనుకొంటున్నారా? ఈ చోటులో నాముందు నిలబడి “మేము సురక్షితం” అని ఎలా అనుకోగలరు? మీరీ చెడుకార్యాలు చేయటానికి మీకు రక్షణ వుందని అనుకొంటున్నారా?
JER 7:11 ఈ ఆలయం నా పేరుతో పిలవబడుతూ ఉంది! అయితే మీకు ఈ స్థలం ఒక దొంగల గుడారముకంటె భిన్నంగా కన్పించటం లేదా? నేను మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను!’” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది!
JER 7:12 “‘యూదా ప్రజలారా, ఇప్పుడు మీరు షిలోహు నగరానికి వెళ్లండి. అక్కడ నేను మొదటిసారిగా ఎక్కడైతే నా నామం కోసం ఒక ఇంటిని నిర్మించానో ఆ చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయులు కూడ దుష్టకార్యాలు చేశారు. వారు చేసిన పాపకార్యాలకు ప్రతిగా ఆ స్థలానికి నేను ఏమి చేసియున్నానో వెళ్లి చూడండి
JER 7:13 ఇశ్రాయేలీయులారా, మీరీ చెడుకార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది! నేను మీతో అనేక పర్యాయాలు మాట్లాడి యున్నాను. కాని మీరు వినటానికి నిరాకరించారు. నేను మిమ్మల్ని పిలిచాను. అయినా మీరు పలకలేదు.
JER 7:14 అందుచే యెరూషలేములో నాపేరు మీద పిలవబడే ఈ ఆలయాన్ని నాశనం చేస్తాను. షిలోహును నాశనం చేసినట్లు ఆ ఆలయాన్ని నాశనం చేస్తాను! ఆ ఆలయంలో మీరు విశ్వాసముంచారు. నేనా స్థలాన్ని మీకు, మీ పూర్వీకులకు ఇచ్చియున్నాను.
JER 7:15 మీ సోదరులనందరినీ నేను ఎఫ్రాయిమునుండి వెడల గొట్టినట్లు, నానుండి మిమ్మల్ని దూరంగా వెడలగొడతాను.’
JER 7:16 “యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు నీవు అడుగవద్దు; వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను ఆలకించను.
JER 7:17 యూదా పట్టణాలలో ఆ ప్రజలు ఏమి చేస్తున్నారో నీవు గమనిస్తున్నావని నాకు తెలుసు. యెరూషలేము నగర వీధుల్లో వారేమి చేస్తున్నారో నీవు చూడవచ్చు.
JER 7:18 యూదా ప్రజలు ఏమి చేస్తున్నారనగా: పిల్లలు కట్టెలను పోగుచేయటం; తండ్రులు వాటితో నిప్పు రాజేయటం; స్త్రీలు పిండి కలిపి, ఆకాశ రాణికి నివేదించటానికి రొట్టెలు చేయటం, యూదా ప్రజలు ఇతర దేవతా రాధనలో పానీయార్పణలను కుమ్మరిస్తున్నారు. నాకు కోపం తెప్పించటానికే ఇవన్నీ చేస్తున్నారు.
JER 7:19 కాని వాస్తవానికి యూదా ప్రజలు బాధపర్చేది నన్నుగాదు వారిని వారే బాధపర్చుకుంటున్నారు. వారిని వారే అవమాన పర్చుకుంటున్నారు” ఇది యెహోవా వాక్కు,
JER 7:20 కావున యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “నా కోపాన్ని ఈ ప్రదేశంపై చూపిస్తాను. నేను మనుష్యులను, జంతువులను శిక్షిస్తాను. పొలాల్లో చెట్లను, భూమి మీద పంటను నాశనం చేస్తాను. నా కోపం ప్రళయాగ్నిలా వుంటుంది. దానిని ఆర్పగల శక్తి ఎవ్వరికీ లేదు.”
JER 7:21 సర్వ శక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా అంటున్నాడు: “మీరు వెళ్లి మీరు కోరినన్ని దహన బలులు, సాధారణ బలులు అర్పించండి. తద్వారా వచ్చిన మాంసాన్ని మీరే తినండి.
JER 7:22 మీ పూర్వీకులను నేను ఈజిప్టునుండి తీసుకొని వచ్చాను. నేను వారితో మాట్లాడాను. కాని దహన బలుల గురించి, సాధరణ బలుల గురించి నేను వారికి ఏ రకమైన ఆజ్ఞలూ ఇవ్వలేదు.
JER 7:23 వారికి ఈ ఆజ్ఞ మాత్రమే ఇచ్చియున్నాను, ‘నాకు విధేయులై వుండండి. అప్పుడు నేను మీ దేవుడనై యుంటాను. మీరు నా ప్రజలైయుంటాను. నేను చెప్పినదంతా చేయండి. మీకు శుభం కలుగుతుంది.’
JER 7:24 “కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. నన్ను లెక్కచేయలేదు. మొండిగా, వారు చేయదలచుకున్నదంతా చేశారు. వారు సన్మార్గులు కాలేదు. వారు మరింత దుష్టులయ్యారు. ముందుకు సాగక వెనుకకు తిరిగారు.
JER 7:25 మీ పూర్వీకులు ఈజిప్టును వదలిన నాటినుండి ఈనాటి వరకు నా సేవకులను మీవద్దకు పంపియున్నాను. వారే ప్రవక్తలు. వారిని మీ వద్దకు అనేకసార్లు పంపాను.
JER 7:26 కాని మీ పూర్వికులు వారి మాట వినలేదు. వారు నన్ను లెక్కచేయలేదు. వారు మిక్కిలి మొండివారు. వారి తండ్రుల కంటె వారు ఎక్కువ చెడుకార్యాలు చేశారు.
JER 7:27 “యిర్మీయా, నీవు ఇవన్నీ యూదా ప్రజలకు చెపుతావు. అయినా వారు నీమాట వినరు! నీవు వారిని పిలుస్తావు. కాని వారు పలుకరు.
JER 7:28 అందువల్ల వారికి నీవీ మాటలు చెప్పాలి: తన యెహోవా దేవునికి విధేయతగా లేని దేశం ఇదే. దేవుని ఉపదేశములను ఈ ప్రజలు వినలేదు. సత్య ప్రవచనాలు ఈ ప్రజలు ఎరుగరు.
JER 7:29 “యిర్మీయా, నీ జుట్టు కత్తిరించి పారవేయి కొండమీదికి వెళ్లి దుఃఖించుము. ఎందుకంటావా? యెహోవా ఈ తరం ప్రజలను తిరస్కరించినాడు. ఈ ప్రజలకు యెహోవా విముఖుడైనాడు. కోపంతో ఆయన వారిని శిక్షిస్తాడు.
JER 7:30 డ్వండి, ఎందుకంటే యూదా ప్రజలు చెడుకార్యాలు చేయటం నేను చూసియున్నాను.” ఇది యెహోవా వాక్కు. “వారు విగ్రహాలను ప్రతిష్టించారు. నేనా విగ్రహాలను అసహ్యించుకుంటున్నాను! నా పేరుతో పిలువబడే ఆలయంలో వారు విగ్రహాలను పెట్టినారు. నా నివాసాన్ని వారు అపవిత్రపర్చారు.
JER 7:31 దా ప్రజలు బెన్ హిన్నోము లోయలో తోఫెతు అనబడే ఉన్నత స్థలాలు నిర్మించారు. వారక్కడ తమ కుమారులను, కమార్తెలను చంపి వారిని బలులుగా సమర్పించారు. ఇటువంటిది నేనెన్నడూ ఆజ్ఞాపించలేదు. ముందెన్నడూ ఈ రకమైన ఆలోచనే నా మనస్సుకు రాలేదు!
JER 7:32 కావున నిన్ను హెచ్చరిస్తున్నాను. ప్రజలు ఈ స్థలాన్ని తోఫెతు అనిగాని, బెన్ హిన్నోములోయ అనిగాని పిలవకుండా వుండే రోజులు వస్తున్నాయి” ఇది యెహోవా వాక్కు. పైగా వారు దీనిని కసాయి లోయ అని పిలుస్తారు. “వారు ఈ పేరు పెడతారు కారణమేమంటే తోఫెతులో ఏమాత్రం ఇంకెవ్వరినీ పాతిపెట్టేందుకు ఖాళీ లేకుండా చనిపోయిన వారిని పాతిపెడతారు.
JER 7:33 తరువాత శవాలను వట్టి నేలపై పడవేస్తారు. అవి పక్షులకు ఆహారమవుతాయి. ఆ శవాలను అడవి జంతువులు పీక్కొనితింటారు. శవాలను తినే పక్షులను, జంతువులను తోలి వేయటానికి అక్కడ బతికి వున్న మనుష్యుడొక్కడూ మిగలడు.
JER 7:34 యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను ఆనందోత్సాహాలు లేకుండా చేస్తాను. యూదాలోను, యెరూషలేములోను పెండ్లి సందడులు, వేడుకలు ఇక వుండవు. ఈ రాజ్యం పనికిరాని ఎడారిలా మారిపోతుంది.”
JER 8:1 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “ఆ సమయంలో యూదా రాజులయొక్క, ముఖ్యపాలకుల యొక్క ఎముకలను ప్రజలు సమాధులనుండి తీస్తారు. వారు యాజకుల యొక్క, ప్రవక్తల యొక్క ఎముకలను సమాధులనుండి తీస్తారు. యెరూషలేము ప్రజలు ఎముకలను కూడ వారి సమాధుల నుండి తీస్తారు.
JER 8:2 ఆ మనుష్యులు ఆ ఎముకలను ఆరుబయట సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలను కనపడేలా పడవేస్తారు. యోరూషలేము ప్రజలు సూర్య చంద్రులను, నక్షత్రాలను ఆరాధించటానికి యిష్టపడతారు. ఆ ఎముకలను తిరిగి ఎవ్వరూ ప్రోగుచేసి పాతిపెట్టరు. కావున ఆ యెముకలన్నీ పశువుల పేడవలె బయట పారవేయబడును.
JER 8:3 “యూదా ప్రజలు వారి ఇండ్లను, రాజ్యాన్ని వదిలి పోయేలా నేను ఒత్తిడి చేస్తాను. ఆ ప్రజలు వారి దేశాన్నుండి పరరాజ్యానికి తీసికొని పోబడతారు. యుద్ధంలో చావగా మిగిలిన యూదా ప్రజలు (ఈ దుష్ట ప్రజలు) తాము కూడ చనిపోతే బాగుండేదని భావిస్తారు,” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.
JER 8:4 “యిర్మీయా, ఈ విషయం యూదా ప్రజలకు తెలియజేయుము: ‘యెహోవా ఈ విషయాలు చెప్పినాడు: “‘ఒక వ్యక్తి కింద పడితే తిరిగి లేస్తాడని మీకు తెలుసు. ఒక వ్యక్తి తప్పుదారిలో వెళ్లితే అతడు మరల తిరిగి వెనుకకు వస్తాడు.
JER 8:5 యూదా ప్రజలు చెడు జీవితం గడిపారు. కాని యెరూషలేము ప్రజలు ఎప్పుడూ ఎందుకు పెడమార్గాన వెళ్లుచున్నారు. వారి అబద్ధాలను వారే నమ్ముతారు. వారు వెనుదిరిగి రావటానికి నిరాకరిస్తారు.
JER 8:6 వారు చెప్పేది నేను బహు శ్రద్ధగా ఆలకించాను. కాని వారు ఏది సరైనదో తెలియజెప్పరు. ప్రజలు వారి పాపాలకు విచారించుట లేదు. ప్రజలు వారు చేసిన నేరాల గురించి ఆలోచించుట లేదు. ప్రజలు ఆలోచనారహితంగా పనులు చేస్తారు.
JER 8:7 ఆకాశంలో ఎగిరే పక్షులకు సైతం తమ పనులకు ఒక నిర్ణీత కాలం తెలుసు. కొంగలు, గువ్వలు, వాన కోవిలలు, ఓదెకరువులు (ఒక జాతి కొంగ) వీటన్నిటికీ ఇతర ప్రాంతాలకు వలసపోయే కాలము క్రమము తప్పక తెలుసు. కాని నా ప్రజలకు మాత్రం వారి యెహోవా వారిని ఏమి చేయమని కోరుతున్నాడో తెలియదు.
JER 8:8 “‘యెహోవా ధర్మశాస్త్రం (ఉపదేశములు) మావద్ద ఉన్నది! అందువల్ల మేము తెలివిగలవారము! అని మీరు చెప్పుకుంటూ వుంటారు. కాని అది నిజం కాదు. ఎందువల్లనంటే లేఖకులు (వ్రాత గాండ్రు) వారి కలాలతో అబద్ధమాడారు.
JER 8:9 ఈ “తెలివిగలవారు” యెహోవా ఉపదేశములను వినటానికి నిరాకరించారు. కావున నిజంగా వారు జ్ఞానవంతులు కారు. ఆ “జ్ఞానవంతు” లనబడే వారు మోసంలో పడ్డారు. వారు విస్మయం పొంది, సిగ్గుపడ్డారు.
JER 8:10 కావున వారి భార్యలను నేనితరులకిచ్చి వేస్తాను. వారి పొలాలను కొత్త యజమానులకిచ్చివేస్తాను. ఇశ్రాయేలు ప్రజలంతా అధిక ధనసంపాదనపై ఆసక్తిగలవారు. ప్రాముఖ్యుల ఖ్యంలేని అతి సామాన్యుల నుండి ముఖ్యుల వరకు ప్రజలంతా అలాంటివారే. ప్రవక్తల నుండి యాజకుల వరకు ప్రజలంతా అబద్ధాలు చెప్పేవారే.
JER 8:11 నా ప్రజలు బాగా గాయపడ్డారు. కాని అదేదో బహు చిన్న గాయమైనట్లు ప్రవక్తలు, యాజకులు నా ప్రజలకు తగిలిన దెబ్బను మాన్పజూస్తారు. ‘అంతా మంచిగా వుంది; అంతా మంచిగా వుంది!’ అని వారంటారు. కాని పరిస్థితి ఏమీ బాగా లేదు!
JER 8:12 ఆ ప్రజలు తాము చేసే దుష్కార్యాలకు చాలా సిగ్గుపడాలి. కాని వారు సిగ్గుపడనే లేదు. వారి పాపాలకు వారు కలవరపాటు చెందాలనేది కూడా వాకిరి తెలియదు. అందరితో పాటు వారూ శిక్షించబడతారు. నేను వారిని శిక్షిస్తాను; వారిని కిందికి పడవేస్తాను.’” ఇది యెహోవా వాక్కు.
JER 8:13 “‘వారి ఫలాలను, పంటను నేను తీసుకుంటాను అందుచేత అక్కడ పంటకోత ఉండదు. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది ద్రాక్ష తీగలపై కాయలేమాత్రం ఉండవు. అంజూరపు చెట్లకు కూడ కాయలుండవు. వాటి ఆకులు సైతం ఎండిపోయి చనిపోతాయి. నేను వారి కిచ్చినవన్నీ తిరిగి తీసుకుంటాను.’”
JER 8:14 “మనమిక్కడ అనవసరంగా ఎందుకు కూర్చున్నాము? రండి, బలమైన నగరాలకు పారిపోదాం. మన దేవుడైన యెహోవా మనల్ని చంపబోతూవుంటే, మనం అక్కడే చనిపోదాం. మనం యెహోవా పట్ల తీరని పాపం చేశాం. అందుచేత దేవుడు విషం కలిపిన నీటిని మనకు తాగటానికి ఇచ్చాడు.
JER 8:15 మనం శాంతిని కోరుకున్నాం; కాని శాంతి కలుగలేదు. స్వస్థత సమయం కొరకు ఎదురు చూశాం, కాని విపత్తు మాత్రమే ముంచుకొచ్చింది.
JER 8:16 దాను వంశీయుల రాజ్యంనుండి శత్రు గుర్రాల వగర్పులు వినిపిస్తూ ఉన్నాయి. వాటి డెక్కల తాకిడికి భూమి కంపిస్తూ ఉంది. వారీ దేశాన్ని, దానిలో నివసిస్తున్న ప్రతి దాన్నీ నాశనం చేయాలని వచ్చియున్నారు. వారీ నగరాన్ని, నగరవాసులను సర్వనాశనం చేయటానికి వచ్చారు.
JER 8:17 “యూదా ప్రజలారా, మీ మీదికి విషసర్పాలను పంపుతున్నాను. ఆ సర్పాలను అదుపుచేయటం సాధ్యపడదు. ఆ విషనాగులు మిమ్మల్ని కాటు వేస్తాయి.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.!
JER 8:18 దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది; భయమేస్తూ ఉంది.
JER 8:19 నా ప్రజల మొరాలకించుము! దేశంలో ప్రతిచోటా వారు సహాయాన్ని అడుగుచున్నారు. “సీయోనులో యెహోవా ఇంకా వున్నాడా? సీయోను రాజు ఇంకా అక్కడ ఉన్నాడా?” అని వారంటున్నారు. కాని దేవుడిలా అంటున్నాడు: “యూదా ప్రజలు వారి విగ్రహాలను ఆరాధించి నాకెందుకు కోపం కల్గించారు? వారు అన్యదేశాల వారి పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”
JER 8:20 మళ్లీ ప్రజలు ఈ విధంగా అన్నారు: “పంటకోత కాలం అయిపోయింది. వేసవి వెళ్లిపోయింది. అయినా మేము రక్షించబడలేదు.”
JER 8:21 నా జనులు బాధపడియుండుటచేత బాధపడుతున్నాను. నేను మాటలాడలేనంత విచారముగా ఉన్నాను.
JER 8:22 వాస్తవానికి గిలియాదులో తగిన ఔషధం ఉంది! వాస్తవానికి గిలియాదులో వైద్యుడు కూడా ఉన్నాడు! అయితే నా ప్రజల గాయాలు ఎందుకు నయం చేయబడలేదు?
JER 9:1 నా తన నీటితో నిండియున్నట్లయితే, నా నేత్రాలు కన్నీటి ఊటలైతే హతులైన నా ప్రజల కొరకై నేను రాత్రింబవళ్లు దుఃఖిస్తాను!
JER 9:2 ప్రయాణీకులు రాత్రిలో తలదాచుకొనే ఇల్లు వంటి ప్రదేశం ఎడారిలో నాకొకటి ఉంటే అక్కడ నా ప్రజలను వదిలి వేయగలను. వారినుండి నేను దూరంగా పోగలను! ఎందువల్లనంటే వారంతా దేవునికి విధేయులై లేరు. వారంతా దేవునికి వ్యతిరేకులవుతున్నారు.
JER 9:3 “వారి నాలుకలను వారు విల్లంబుల్లా వినియోగిస్తున్నారు. వాటినుండి బాణాల్లా అబద్ధాలు దూసుకు వస్తున్నాయి. సత్యం కాదు కేవలం అసత్యం దేశంలో ప్రబలిపోయింది. వారు ఒక పాపం విడిచి మరో పాపానికి ఒడిగట్టుతున్నారు. వారు నన్నెరుగకున్నారు.” ఈ విషయాలు యెహోవా చెప్పియున్నాడు.
JER 9:4 “మీ పొరుగు వారిని కనిపెట్టి ఉండండి! మీ స్వంత సోదరులనే మీరు నమ్మవద్దు! ఎందువల్లనంటే ప్రతి సోదరుడూ మోసగాడే. ప్రతి పొరుగు వాడూ నీ వెనుక చాటున మాట్లాడేవాడే.
JER 9:5 ప్రతివాడూ తన పొరుగువానితో అబద్ధములు చెప్పును. ఎవ్వడూ సత్యం పలుకడు. యూదా ప్రజలు అబద్ధమాడుటలో తమ నాలుకలకు తగిన శిక్షణ ఇచ్చారు. వారి పాపం ఆకాశమంత ఎత్తుకు చేరింది!
JER 9:6 ఒక దుష్టకార్యాన్ని మరో దుష్టకార్యం అనుసరించింది. అబద్ధాలను అబద్ధాలు అనుసరించాయి! ప్రజలు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.” ఈ విషయాలను యెహోవా చెప్పినాడు!
JER 9:7 కావున, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెపుతున్నాడు, “లోహాలను అగ్నిలో కాల్చి పరీక్ష చేసినట్లు నేను యూదా ప్రజలను తప్పకుండా పరీక్షిస్తాను! నాకు వేరే మార్గం లేదు. నా ప్రజలు పాపం చేశారు.
JER 9:8 యూదా ప్రజలు వాడి బాణాల్లాంటి నాలుకలు కలిగి ఉన్నారు. వారి నార్లు అబద్ధాలనే మాట్లాడతాయి. ప్రతివాడూ తన పొరుగు వానితో పైకి ఇంపుగానే మాట్లాడతాడు. కాని అతడు తన పొరుగు వానిని ఎదిరించటానికి రహస్య పథకాలు వేస్తాడు.
JER 9:9 మరి యూదా ప్రజలు ఈ పనులన్నీ చేస్తున్నందుకు నేను వారిని శిక్షించవద్దా?” “ఆ రకమైన ప్రజలను నేను శిక్షించాలని నీకు తెలుసు. నేను వారిని అర్హమైన శిక్ష విధించాలి.” ఇది యెహోవా వాక్కు.
JER 9:10 నేను (యిర్మీయా) కొండల కొరకు మిక్కిలి దుఃఖిస్తాను. వట్టి పొలాల కొరకు నేను విషాద గీతాన్ని పాడతాను. ఎందువల్లనంటే జీవించివున్నవన్నీ పోయినాయి. ఎవ్వడూ అక్కడ పయనించడు. ఆ ప్రదేషశాలలో పశువుల అరుపులు వినరావు. పక్షులు ఎగిరి పోయాయి: పశువులు పారిపోయాయి.
JER 9:11 “నేను (యెహోవా నయిన) యెరూషలేము నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను. అది గుంట నక్కలకు స్థావరమవుతుంది. నేను యూదా రాజ్యపు నగరాలను నాశనం చేస్తాను. అందుచే అక్కడ ఎవ్వరూ నివసించరు.”
JER 9:12 ఈ విషయాలను అర్థం చేసుకోగల జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడా? యెహోవాచే బోధింపబడిన వాడెవడైనా ఉన్నాడా? యెహోవా వార్త ఎవ్వడైనా వివరించగలడా? రాజ్యం ఎందువలన నాశనం చేయబడింది? జన సంచారంలేని వట్టి ఎడారిలా అది ఎందుకు మార్చివేయబడింది.
JER 9:13 యెహోవాయే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఆయన ఇలా చెప్పినాడు: “ఆ విధంగా జరుగుటకు కారణమేమంటే యూదా ప్రజలు నా మాట వినలేదు. వారికి నా ఉపదేశములు ఇచ్చాను. కాని వారు వినటానికి నిరాకరించారు. వారు నా ఉపదేశములను అనుసరించుట విడిచారు.
JER 9:14 యూదా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా వారు జీవించారు. వారు మొండివారు. వారు బూటకపు దేవతైన బయలును అనుసరించారు. బూటకపు దేవుళ్లను అనుసరించుట వారికి వారి తండ్రులే నేర్పారు.”
JER 9:15 సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా చెపుతున్నాడు, “యూదా ప్రజలు త్వరలో చేదైన ఆహారం తినేలా చేస్తాను. విషం కలిపిన నీరు తాగేలా చేస్తాను.
JER 9:16 యూదా ప్రజలు ఇతర దేశాలలో చెల్లా చెదరైపోయేలా చేస్తాను. వారు పరాయి రాజ్యాలలో నివసించవలసి వస్తుంది. వారు గాని, వారి తండ్రులు గాని ఆ రాజ్యాలను ముందెన్నడూ ఎరిగియుండలేదు. కత్తులు చేతబట్టిన వారిని నేను పంపిస్తాను. యూదా ప్రజలను వారు చంపివేస్తారు. ప్రజలెవ్వరూ మిగలకుండా వారు చంపివేస్తారు.”
JER 9:17 సర్వాశక్తిమంతుడైన యెహోవా ఇలా అంటున్నాడు, “ఇప్పుడు నీవీ విషయాల గురించి అలోచించుము! శవాలకు అంత్యక్రియలు జరిపించేటప్పుడు విలపించేందుకు సొమ్ము తీసుకొనే స్త్రీలను విలపించుము. కార్యములు నిర్వహించుటలో అనుభవమున్న వారిని పిలువనంపుము.
JER 9:18 ‘ఆ స్త్రీలను వెంటనే వచ్చి మాకొరకు విలపించమనండి. అప్పుడు మా నేత్రాలు కన్నీటితో నిండిపోతాయి. కన్నీరు కాలువలై ప్రవహిస్తుంది’ అని ప్రజలంటారు.
JER 9:19 “సీయోను నుండి గట్టిగా విలపించే రోదన, ‘మేము నిజంగా నాశనమయ్యాము! మేము నిజంగా అవమానం పాలైనాము! మా ఇండ్లు నాశనం చేయబడినాయి కావున మేము మా రాజ్యాన్ని వదిలి పోవాలి’ అంటూ వినిపిస్తూ ఉంది.”
JER 9:20 యూదా స్త్రీలారా, యెహోవా వర్తమానం మీరిప్పుడు వినండి. యెహోవా వాక్కు వినటానికి మీ చెవులనొగ్గండి. యెహోవా ఇలా అంటున్నాడు, మీ కుమార్తెలకు గగ్గోలుగా విలపించటం ఎలానో నేర్పండి. ప్రతీ స్త్రీ ఈ విలాపగీతం పాడటం నేర్చుకోవాలి:
JER 9:21 “మృత్యువు మా కిటికీలగుండా ఎక్కి లోనికి వచ్చింది. మృత్యువు మా భవనాలలో ప్రవేశించింది. వీధుల్లో ఆడుకొంటున్న మా పిల్లల వద్దకు మృత్యువు వచ్చింది. బహిరంగ స్థలాలలో కలుసుకొనే యువకుల వద్దకు మృత్యువు వచ్చింది.”
JER 9:22 “యిర్మీయా, ‘ఇది యెహోవా వాక్కు అని చెప్పుము, పొలాలలో పశువుల పేడలా శవాలు పడివుంటాయి. పంటకోత కాలంలో చేల నిండా వేసిన పనల్లా శవాలు భూమి మీద పడివుంటాయి కాని వాటిని తీసి వేయటానికి ఒక్కడూ ఉండడు.’”
JER 9:23 యెహోవా ఇలా చెపుతున్నాడు: “తెలివిగల వారు తమ ప్రజ్ఞా విశేషాల గురించి గొప్పలు చెప్పుకోరాదు. బలవంతులు తమ బలాన్ని గురించి గొప్పలు చెప్పుకోరాదు. శ్రీమంతులు తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకోరాదు.
JER 9:24 ఎవడైనా గొప్పలు చెప్పుకోదలిస్తే వానిని ఈ విషయాలపై చెప్పుకోనిమ్ము. నన్నతను అర్థం చేసికున్నట్లు, నన్ను తెలుసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము. నేనే నిజమైన దేవుడనని తను అర్థం చేసికున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము. నేను దయామయుడనని, న్యాయవర్తనుడనని గొప్పలు చెప్పనియి. యెహోవానైన నేను భూమి మీద మంచి కార్యాలు నెరవేర్చు తానని గొప్పలు చెప్పనీయుము. నేను ఆ పనులన్నీ చేయటానికి యిష్టపడతాను.” ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది.
JER 9:25 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “శారీరకంగా మాత్రమే సున్నతి సంస్కారం పొందిన వారిని నేను శిక్షించే సమయమాసన్న మవుతూ ఉంది.
JER 9:26 తమ చెంపలను కత్తిరించే ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు ప్రజలు మరియు ఎడారిలో నివసించే జనులందరిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఈ దేశాలలోని పురుషులు శారీరకంగా సున్నతి సంస్కారం పొందియుండలేదు. కాని ఇశ్రాయేలు కుటుంబం నుండి వచ్చిన ప్రజలు హృదయ సంబంధమైన సున్నతి సంస్కారం కలిగియుండలేదు.”
JER 10:1 ఇశ్రాయేలు వంశీయులారా యెహోవా చెప్పే మాట వినుము!
JER 10:2 యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “అన్యదేశ ప్రజలవలె నీవు జీవించవద్దు! ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు నీవు భయపడవద్దు! అన్యదేశాలవారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు. కాని మీరు మాత్రం అలాంటి వాటికి భయపడరాదు.
JER 10:3 ఇతర దేశ ప్రజల ఆచారాలు లెక్క చేయవలసినవి కావు. వారి విగ్రహాలు అడవిలో దొరికే కర్రముక్కల కంటే వేరేమీ కాదు. వారి విగ్రహాలను ఒక పనివాడు తన ఉలితో కొట్టి మలుస్తాడు.
JER 10:4 వెండి బంగారాలతో వారి విగ్రహాలను అందంగా తీర్చిదిద్దుతారు. వాటిని పడిపోకుండా సుత్తులతో మేకులు కొట్టి నిలబెడతారు.
JER 10:5 బీర తోటలోని దిష్టి బొమ్మల్లా వారి విగ్రహాలుంటాయి. వారి విగ్రహాలు మాట్లాడవు. వారి విగ్రహాలు నడవలేవు. ఆ విగ్రహాలను మనుష్యులు మోయాలి! కావున ఆ విగ్రహాలకు భయపడకు. అవి నిన్ను ఏమీ చేయలేవు. పైగా అవి నీకసలు ఏ రకమైన సహాయమూ చేయలేవు!”
JER 10:6 యెహోవా, నీవంటి దైవం మరొకరు లేరు! నీవు గొప్పవాడవు! నీ నామము గొప్పది మరియు శక్తి గలది.
JER 10:7 ఓ దేవా, ప్రతివాడూ నిన్ను గౌరవించాలి. సర్వదేశాలకూ నీవు రాజువు. వారందరి గౌరవానికి నీవు అర్హుడవు. ప్రపంచ దేశలలో చాలామంది జ్ఞానులున్నారు. కాని వారిలో ఏ ఒక్కడు నీకు సాటిరాడు.
JER 10:8 అన్యదేశవాసులు మందబద్ధులు, మూర్ఖులు. వారి బోధనలన్నీ పనికిరాని చెక్క బొమ్మల పేరుతో వచ్చినవి.
JER 10:9 వారు తర్షీషు నగరంనుండి వెండిని, ఉపాజు నగరం నుండి బంగారాన్ని తెచ్చి విగ్రహాలను చేస్తారు. విగ్రహాలు వడ్రంగులచే, లోహపు పని వారిచే చేయబడతాయి. ఈ విగ్రహాలను నీలి రంగు, ఊదారంగు బట్టలతో అలంకరిస్తారు. “జ్ఞానులు” ఆ “దేవుళ్ల”ని చేస్తారు.
JER 10:10 కాని యెహోవా నిజమైన దేవుడు. ఆయన మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు! శాశ్వతంగా పాలించే రాజు ఆయనే. దేవునికి కోపం వచ్చి నప్పుడు భూమి కంపిస్తుంది. ప్రపంచ రాజ్యాల ప్రజల ఆయన కోపాన్ని భరించలేరు.
JER 10:11 “ఈ వర్తమానం ఆ ప్రజలకు తెలియజేయుము, ‘ఆ బూటకపు దేవతలు భూమిని, ఆకాశాన్ని సృష్టించలేదు. ఆ చిల్లర దేవుళ్లు నాశనం చేయబడతారు. వారు భూమి నుండి, ఆకాశము నుండి మాయమవుతారు.’” తన శక్తితో భూమిని సృష్టించినది నిత్యుడగు దేవుడే. దేవుడు తన జ్ఞాన సంపదచే ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు. తన అవగాహనతో దేవుడు ఆకాశాన్ని భూమిపైన వ్యాపింపజేశాడు.
JER 10:13 భయంకరమైన శబ్ధంగల పిడుగులను దేవుడే కలుగజేస్తాడు. ఆకాశంనుండి ధారాపాతంగా వర్షం పడేలా కూడా దేవుడే చేస్తాడు. భూమి నలుమూలల నుండీ ఆకాశంలోకి మేఘాలు లేచేలా ఆయన చేస్తాడు. ఆయన ఉరుములు మెరుపులతో వానపడేలా చేస్తాడు. ఆయన తన గిడ్డంగుల నుండి గాలి వీచేలా చేస్తాడు.
JER 10:14 ప్రజలు మందబుద్ధి గలవారయ్యారు! లోహపు పనివారు వారు చేసిన విగ్రహాల చేత మూర్ఖులయ్యారు. వారి బొమ్మలు అబద్ధాలకు ప్రతీకలు. అవి జడపదార్థములు
JER 10:15 ఆ విగ్రహాలు ఎందుకూ కొరగానివి. అవి హాస్యాస్పదమైనవి. తీర్పు తీర్చే కాలంలో ఆ విగ్రహాలు నాశనం చేయబడతాయి.
JER 10:16 కాని యాకోబు యొక్క దేవుడు ఆ విగ్రహాలవంటి వాడు కాదు. ఆయన సర్వసృష్టికి కారకుడు. ఇశ్రాయేలు తన ప్రజగా వర్థిల్లటానికి ఆయన దానిని ఎంపిక చేసినాడు. ఆయన పేరు “యెహోవా సర్వశక్తిమంతుడు.”
JER 10:17 మీకున్నదంతా సర్దుకొని వెళ్లటానికి సిద్దమవ్వండి. యూదా ప్రజలారా మీరు నగరంలో చిక్కుకున్నారు. శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు.
JER 10:18 యెహోవా ఇలా చెప్పాడు, “ఈ సారి యూదా ప్రజలను ఈ దేశంనుండి వెళ్ల గొడతాను. వారికి బాధను, శ్రమను కలుగజేస్తాను. వారికి ఒక గుణ పాఠం నేర్పటానికి నేనిదంతా చేస్తాను.”
JER 10:19 అయ్యో నేను (యిర్మీయా) బాగా గాయపడ్డాను నా గాయం మానరానిది. “ఇది నా రోగం, నేను దానిచే బాధ పడవలసినదే” అని నేను తలపోశాను.
JER 10:20 నా గుడారం పాడైపోయింది. దాని తాళ్లన్నీ తెగిపోయాయి. నా పిల్లలు నన్ను వదిలేశారు. వారు వెళ్లిపోయారు. నా గుడారం మరల నిర్మించటానికి సహాయం చేయుటకు ఒక్కడు కూడా మిగలలేదు. నాకు ఆశ్రయం కల్పించటానికి ఒక్కడూ మిగలలేదు.
JER 10:21 గొర్రెల కాపరులు (నాయకులు) మందమతులయ్యారు! వారు యెహోవాను కనుగొనే ప్రయత్నం చేయరు, వారు జ్ఞాన శూన్యులు. అందువల్లనే వారి మందలు (ప్రజలు) చెల్లాచెదరై తప్పిపోయాయి.
JER 10:22 ఒక పెద్ద శబ్దం వస్తోంది, వినుము! ఆ పెద్ద శబ్దం ఉత్తర దిశనుండి వస్తూవుంది. అది యూదా నగరాలను నాశనం చేస్తుంది. యూదా ఒక వట్టి ఎడారిలా మారుతుంది. అది గుంట నక్కలకు స్థావరమవుతుంది.
JER 10:23 యెహోవా, వారి స్వంత జీవితాలను వారి స్వాధీనంలో ఉంచుకోరని నాకు తెలుసు. ప్రజలు వారి భవిష్యత్తును గూర్చి పథకాలను వేసుకోలేరు. జీవించుటకు సరైన మార్గం వారికి తెలియదు. ఏది సన్మార్గమో ప్రజలకు నిజంగా తెలియదు.
JER 10:24 యెహోవా, మమ్మల్ని సరిదిద్దుము! నీవు మమ్ము నశింపజేయవచ్చు కాని మాపట్ల నిష్పక్షపాతంగా వుండుము! కోపంలో మమ్మల్ని శిక్షించవద్దు!
JER 10:25 నీకు కోపంవస్తే, అన్యదేశాలను శిక్షించుము. వారు నిన్నెరుగరు; గౌరవించరు. ఆ ప్రజలు నిన్ను పూజించరు. ఆ రాజ్యాలు యాకోబు వంశాన్ని నాశనం చేశాయి. వారు ఇశ్రాయేలును పూర్తిగా నాశనం చేశారు. వారు ఇశ్రాయేలు యొక్క స్వంత దేశాన్ని నాశనం చేశారు.
JER 11:1 ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినదిః
JER 11:2 “యిర్మీయా, ఈ ఒడంబడికలోని మాటలను వినుము. యూదా ప్రజలకు వీటి విషయం తెలియజేయుము. యెరూషలేము నగర వాసులకు కూడా ఈ విషయాలు తెలియజేయుము.
JER 11:3 ఇశ్రాయేలీయుల దేవుడైన చెప్పినది ఇది: ‘ఈ ఒడంబడికను అను సరించని ప్రతి వానికీ కీడు వాటిల్లుతుంది.’
JER 11:4 నేను నీ పూర్వీకులతో చేసుకొన్న ఒడంబడిక విషయం మాట్లాడుతున్నాను. వారిని ఈజిప్టునుండి నేను తీసుకొని వచ్చినప్పుడు నేనా ఒడంబడికను వారితో చేసుకొన్నాను. ఈజిప్టు అనేక కష్టాలున్న స్థలము అది ఇనుము కూడా కరిగి పోయేటంత వేడిగల పొయ్యిలాఉంది. నాకు విధేయులై, నేనాజ్ఞాపించినదంతా చేయండని ఆ ప్రజలకు చెప్పాను. మీరిది చేస్తే, మీరు నా ప్రజలవుతారు. పైగా నేను మీ దేవుడనవుతాను.
JER 11:5 “నేను మీ పూర్వీకులకు చేసిన వాగ్దానం నెరవేర్చటానికి నేనిది చేశాను. వారికి నేనొక సారవంతమైన భూమిని ప్రసాధిస్తానని వాగ్దానం చేశాను. పాలు, తేనెలు ప్రవహించే భూమి ఇస్తానని అన్నాను. ఈనాడు మీరు ఆ రాజ్యంలో నివసిస్తున్నారు.” నేను (యిర్మీయా) “ఆ ప్రకారమే జరగాలి ప్రభువా” అని అన్నాను.
JER 11:6 నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, ఈ సమాచారం యూదా పట్టణాలలోను, యెరూషలేము వీధులలోను ప్రకటించుము: ఈ ఒడంబడిక నియమాలు వినండి. ఆ ఒడంబడికలోని న్యాయసూత్రాలను పాటించండి.
JER 11:7 ఈజిప్టునుండి విడుదల చేసి మీ పితరులను నేను తీసుకొని వచ్చినప్పుడు వారికి ఒక హెచ్చరిక చేశాను. ఈ రోజువరకూ వారికి పదే పదే హెచ్చరికలు చేస్తూనే వచ్చాను. నాకు విధేయులై వుండమని వారికి చెప్పాను.
JER 11:8 కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. వారు మొండివైఖరి దాల్చారు. వారు దుష్ట హృదయాలు ఎలా చెపితే అలా ప్రవర్తించారు. ఒడంబడిక ప్రకారం వారు దానిని అనుసరించకపోతే వారికి కీడు వాటిల్లుతుంది. అందువల్లనే వారికి కష్టాలు సంభవించేలా నేను చేశాను! ఒడంబడికకు కట్టుబడి ఉండమని వారికి నేను ఆజ్ఞ ఇచ్చాను. కాని వారు పాటించలేదు.”
JER 11:9 నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా! యూదా ప్రజలు, యెరూషలేము వాసులు రహస్య పథకాలు వేశారని నాకు తెలుసు.
JER 11:10 ఆ ప్రజలు వారి పితరులు చేసిన పాపములన్నీ చేస్తున్నారు! వారి పూర్వీకులు నా వర్తమానం వినటానికి నిరాకరించారు. వారు అన్యదేవతలను అనుసరించి, ఆరాధించారు. ఇశ్రాయేలు వంశం వారు, యూదా వంశం వారు వారి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడికను ఉల్లంఘించినారు.”
JER 11:11 కావున యెహోవా ఇలా చెప్పినాడు, “త్వరలో యూదా వారికి భయంకర విపత్తు సంభవించేలా చేస్తాను. వారు దానినుండి తప్పించుకోలేరు! వారు దుఃఖపడతారు. వారు నా సహాయంకొరకు రోదిస్తారు. అయినా నేను వారి రోదన వినను.
JER 11:12 అప్పుడు యూదా వారు, యెరూషలేము వాసులు తమ విగ్రహాలవద్దకు వెళ్లి సహాయం అర్థిస్తారు. వారు విగ్రహాలకు సాంబ్రాణి పొగ వేస్తారు. కాని ఆ విపత్కాలం వచ్చినప్పుడు ఆ విగ్రహాలు యూదా ప్రజలను ఆదుకోలేవు.
JER 11:13 “యూదా ప్రజలారా, మీకు చాలా విగ్రహాలున్నాయి. యూదా రాజ్యంలో ఎన్ని పట్టణాలున్నాయో అన్ని విగ్రహాలు మీలో వున్నాయి. ఆ ఏహ్యమైన బయలు దేవతను ఆరాధించటానికి మీరు చాలా బలిపీఠములను నిర్మించారు. యోరూషలేములో ఎన్ని వీధులున్నాయో అన్ని బలిపీఠాలున్నాయి.
JER 11:14 “యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు అర్థించవద్దు. వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను వినను. ఆ ప్రజలకు బాధలు మొదలవుతాయి. అప్పుడు సహాయం కొరకు నన్ను పిలుస్తారు. కాని నేను వినను.
JER 11:15 “నా ప్రేయసి (యూదా) నా ఇంట్లో (ఆలయం) ఎందుకు ఉన్నది? అక్కడ ఉండే హక్కు ఆమెకు లేదు. ఆమే చాలా చెడుపనులు చేసింది. యూదా! నీవర్పించే ప్రత్యేక ప్రమాణాలు, బలులు నీవు నాశనంగాకుండా ఆపగలవని నీవనుకుంటున్నావా? నాకు బలులు అర్పించటం ద్వారా నీవు శిక్షనుండి తప్పించుకోగలవని తలుస్తున్నావా?”
JER 11:16 యెహోవా నీకొక పేరు ఇచ్చాడు. “కంటికింపైన పచ్చని బలివ చెట్టు” అని నిన్ను పిలిచాడు కాని ఆ చెట్టును బలమైన గాలిచే విసరబడే అగ్నితో యెహోవా కాల్చివేస్తాడు. దాని కొమ్మలన్నీ బూడిదై పోతాయి.
JER 11:17 సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్ములను నాటి స్థిరపర్చినా కాని ఆయనే మీకు విపత్తు వస్తుందని ప్రకటించాడు. ఎందువల్లనంటే, ఇశ్రాయేలు వంశం వారు, యూదా వంశం వారు చెడు కార్యాలు చేశారు. మీరు బూటకపు దేవత బయలుకు బయట బలులు సమర్పించి యెహహోవాకు కోపం తెప్పించారు.
JER 11:18 అనాతోతు ప్రజలు నాపై కుట్ర పన్నుతున్నారని యెహోవా నాకు తెలియపరిచాడు. వారు చేసే పనులు యెహోవా నాకు చూపాడు. అందుచే వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలిసింది.
JER 11:19 వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని యెహోవా తెలియపర్చక ముందు, నేనొక అమాయకపు గొర్రె పిల్లవలె నరకబడటానికి సిద్ధంగా వున్నాను. వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నేను అర్థం చేసికోలేదు. నన్ను గురించి వారిలా అంటున్నారు: “మనం చెట్టును, దాని పండును నాశనం చేద్దాం! మనం వానిని చంపివేద్దాం! అప్పుడు ప్రజలు అతన్ని మర్చిపోతారు.”
JER 11:20 యెహోవా, నీవు సత్య వర్తనుడవైన న్యాయాధి పతివి. ప్రజల మనస్సులను, హృదయాలను పరీక్షించే విధానం నీకు బాగా తెలుసు. నేను నా వాదనలను నీకు వినిపిస్తాను. వారికి అర్హమైన శిక్ష నీవే యిమ్ము.
JER 11:21 అనాతోతు మనుష్యులు యిర్మీయాను చంపుటకు పథకం పన్నుచుండిరి. వారు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీవు యెహోవా పేరుతో ప్రకటనలు చేయవద్దు. లేనిచో నిన్ను మేము చంపివేస్తాం.” అనాతోతు మనుష్యుల విషయంలో యెహోవా ఒక నిర్ణయానికి వచ్చాడు.
JER 11:22 సర్వశక్షిమంతుడైన యెహోవా ఇలా చెప్పాడు, “నేను త్వరలో అనాతోతు ప్రజలను శిక్షిస్తాను. వారి యువకులు యుద్ధంలో మరణిస్తారు. వారి కుమారులు, కమార్తెలు ఆకలితో మాడి చనిపోతారు.
JER 11:23 అనాతోతులో ఒక్కడు కూడా వదిలిపెట్టబడడు. ఎవ్వడూ బతకడు. వారిని నేను శిక్షిస్తాను. వారికి కీడు దాపురించేలా నేను చేస్తాను.”
JER 12:1 యెహోవా, నేను నీతో వాదించినట్లయితే, నీవే ఎల్లప్పుడూ సరైనవాడవుగా ఉంటావు! కానీ న్యాయంగా కనబడని కొన్ని విషయాల గురించి నేను నిన్ను అడగాలను కొంటాన్నాను. దుర్మార్గు లెందుకు విజయవంతులవుతున్నారు? నమ్మదగని ప్రజలు ఎలా సులభమైన జీవితం గడుపుతున్నారు?
JER 12:2 ఈ దుర్మార్గులను నీవిక్కడ ఉంచినావు. మొక్కలు బాగా వేరూనినట్లు వారు బాగా స్థిరపడి, అభివృద్ధిచెంది కాయలు కాసారు. నీవు వారికి చాలా ప్రియమైన వాడివని వారు నోటితో చెపుతారు. కాని వారి హృదయాలలో నీవు లేవు. వారు నీకు చాలా దూరంగా ఉన్నారు.
JER 12:3 ఓ ప్రభువా, నా హృదయం నీకు తెలుసు. నన్ను నీవు చూస్తూనే ఉన్నావు. నా మనస్సును పరీక్షిస్తూనే ఉన్నావు. గొర్రెలను నరకటానికి లాగినట్టు, ఆ దుర్మార్గపు మనుష్యులను లాగివేయి. సంహారపు రోజునకు వారిని ఎంపిక చేయి.
JER 12:4 ఎన్నాళ్లు ఈ భూమి వర్షపాతం లేక ఎండిపోయి ఉండాలి? ఎన్నాళ్లీ నేలపై గడ్డి ఎండి, చచ్చిపోయి ఉండాలి? దేశంలో పశువులు, పక్షులు అన్నీ చనిపోయాయి. ఈ దుష్ట జనుల చెడుపనులే ఈ పరిస్థితికి కారణం. పైగా, “మాకు ఏమి జరుగుతుందో చూడటానికి యిర్మీయా ఎక్కువ కాలం బతకడు” అని ఆ దుర్మార్గులే అంటున్నారు.
JER 12:5 “యిర్మీయా, మానవులతో పరుగు పందెమునకే నీవు అలసిపోతే, మరి గుర్రాలతో నీవు ఎలా పరుగు పెట్టగలవు? సురక్షిత దేశంలోనే నీవు అలసిపోతే, యొర్దాను నదీ తీరాన పెరిగే ముండ్ల పొదలలోకి వస్తే నీవు ఏమి చేస్తావు?
JER 12:6 ఈ మనుష్యులు నీ స్వంత సోదరులు. నీ కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారు. నీ ఇంటివారే నిన్ను జూచి అరుస్తున్నారు. వారు నీతో స్నేహితులవలె మాట్లాడినా నీవు వారిని నమ్మవద్దు.
JER 12:7 “నేను (యెహోవా) నా ఇంటిని వదిలివేశాను. నా స్వంత ఆస్తిని నేను వదిలివేశాను. నేను ప్రేమించే దానిని (యూదా) ఆమె శత్రువులకే అప్పగించాను.
JER 12:8 నా ఆస్తే నాకు ఒక భయంకర సింహంలా తయారయ్యింది. అది నన్ను చూచి గర్జిస్తూవుంది. అందుచే దాన్ని నేను అసహ్యించు కుంటున్నాను.
JER 12:9 నా ఆస్తి రాబందులచే ఆవరింపబడిన చనిపోయే జంతువులా వుంది. ఆ పక్షులు దాని చుట్టూ ఎగురుతాయి. వన్య (అడవి) మృగములారా, రండి. రండి, తినటానికి ఆహారం తీసుకోండి.
JER 12:10 చాలామంది గొర్రెల కాపరులు (నాయకులు) నా ద్రాక్షా తోటను నాశనం చేసారు. ఆ కాపరులు నా తోటలోని మొక్కలపై నడిచారు. వారు నా అందాల తోటను వట్టి ఎడారిగా మార్చి వేశారు.
JER 12:11 వారు నా భూమిని ఎడారిలా చేశారు. అది ఎండి చచ్చిపోయింది. అక్కడ ఎవ్వరూ నివసించరు. దేశం యావత్తూ వట్టి ఎడారి అయ్యింది. అక్కడ ఆ భూమిని గూర్చి శ్రద్ధ వహించే వారు ఎవ్వరూ లేరు.
JER 12:12 సైనికులు ఎడారిలోని నీళ్లగుంటలను దోచుకొనుటకు వచ్చారు. యెహోవా ఆ సైన్యాలను ఆ రాజ్యాన్ని శిక్షించటానికి వినియోగించుకున్నాడు. రాజ్యంలో ఒక మూలనుండి మరోమూల వరకు గల ప్రజలంతా శిక్షింపబడ్డారు. ఏ ఒక్కరికీ రక్షణ లేదు.
JER 12:13 ప్రజలు గోధుమ పైరు నాటుతారు. కాని వారు కోసేది ముండ్లను మాత్రమే. వారు బాగా అలసిపోయేటంతగా శ్రమిస్తారు. కాని వారి శ్రమకు ఫలం శూన్యం. వారి పంట విషయంలో వారు సిగ్గు చెందుతారు. యెహోవా కోపకారణంగా ఇదంతా జరిగింది.”
JER 12:14 యెహోవా ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలు చుట్టు పట్లవుండే ప్రజలకు నేనేమి చేస్తానో నీకు చెపుతాను. ఆ జనులు చాలా దుర్మార్గులు. నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన రాజ్యాన్ని వారు ధ్వంసం చేశారు. ఆ దుష్ట జనులను నేను పెల్లగించి, వారి రాజ్యంనుండి బయటికి త్రోసివేస్తాను. వారితో పాటు యూదా వారిని కూడా పెల్లగించుతాను.
JER 12:15 నేను వారిని తమ రాజ్యం నుండి భ్రష్టులను చేశాక, వారి విషయంలో నేను బాధపడతాను. తరువాత ప్రతి కుటుంబాన్నీ దాని స్వస్థలానికి, స్వంత ఆస్తికి తీసుకొని వస్తాను.
JER 12:16 కాకపోతే ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నాకోరిక. గతంలో వారు నా ప్రజలకు బయలు దేవత పేరు మీద వాగ్దానాలు చేయటం నేర్పినారు. ఇప్పుడు ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నా ప్రయత్నం. వారు నా పేరు ఉపయోగించుట నేర్చుకోవాలి. ‘నిత్యుడైన దేవుని సాక్షిగా…’ అని వారు చెప్పుట నేర్చుకోవాలి. అప్పుడు నేను వారిని నా ప్రజల మధ్య నిత్యము నివసించేలా చేస్తాను.
JER 12:17 కాని ఏ దేశమైనా మాట వినకపోతే, అప్పుడు నేను వారిని సర్వ నాశనం చేస్తాను. చచ్చిన మొక్కలవలె వారిని లాగి పారవేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
JER 13:1 యెహోవా నాతో ఇలా అన్నాడు, “యిర్మీయా, నీవు వెళ్లి నారతో చేసిన ఒక నడికట్టు బట్టకొని తీసుకురా. దానిని నీవు ధరించుము. కాని దానిని తడవనీయవద్దు.”
JER 13:2 కావున యెహోవా చెప్పిన విధంగా నేనొక నడికట్టు వస్త్రం కొని ధరించాను.
JER 13:3 అప్పుడు రెండవసారి యెహోవా వాక్కు నాకు వినిపించింది.
JER 13:4 ఆ వాక్కు ఇలా వుంది: “యిర్మీయా, నీవు కొని ధరించిన నడికట్టు వస్త్రం తీసుకొని ఫరాతుకు వెళ్లుము. అక్కడ ఒకబండ బీటలో ఆ నడికట్టు వస్త్రాన్ని దాచి పెట్టు.”
JER 13:5 అందుచేత నేను ఫరాతు (యూఫ్రటీసు) కు వెళ్లి ఒక బండ బీటలో నడికట్టు వస్త్రాన్ని (చల్లడము) అక్కడ యెహోవా చెప్పిన రీతిలో దాచాను.
JER 13:6 చాలా రోజుల తరువాత యెహోవా నాతో, “యిర్మీయా, ఇప్పుడు ఫరాతుకు వెళ్లుము. బండ బీటలో నిన్ను దాయమని చెప్పిన నడికట్టు వస్త్రాన్ని తీసుకొని రమ్ము” అని చెప్పాడు.
JER 13:7 అప్పుడు నేను ఫరాతుకు వెళ్లి నడికట్టు వస్త్రాన్ని తవ్వి తీశాను. నేను దాచిన బండ బొరియలోనుండి దానిని వెలికి తీశాను. కాని నేను దానిని ధరించ లేక పోయాను. కారణమేమంటే అది జీర్ణించిపోయింది. అది ఎందుకూ పనికిరానిదయ్యింది.
JER 13:8 అప్పుడు యెహోవా వర్తమానం నాకు చేరింది.
JER 13:9 యెహోవా ఇలా చెప్పినాడు: “నడికట్టు బట్ట జీర్ణించి, ఎందుకూ పనికిరానిదయి పోయింది. అదే విధంగా, యూదాలోను, యెరూషలేములోనుగల గర్విష్టులనందరినీ నాశనం చేస్తాను.
JER 13:10 యూదాలోని గర్విష్టులను, దుష్టులను నాశనం చేస్తాను. వారు నా వాక్కు వినటానికి నిరాకరిస్తున్నారు. మొండి వైఖరి దాల్చి, వారు చేయదలచుకున్న పనులే వారు చేస్తారు. వారు అన్యదేవుళ్లను అనుసరించి, ఆరాధిస్తారు. అటువంటి యూదా వారంతా ఈ నార నడికట్టు బట్టలా అయిపోతారు. వారు సర్వనాశనమవుతారు. వారెందుకూ పనికిరారు.
JER 13:11 నడికట్టు వస్త్రాన్ని మనుష్యులు తమ నడుము చుట్టూ గట్టిగా కట్టుకుంటారు. అదే మాదిరి ఇశ్రాయేలు సంతతి వారిని, యూదా వంశంవారిని నాచుట్టూ కప్పుకొన్నాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది “నేనలా ఎందుకు చేసినానంటే వారంతా నా ప్రజలు కావాలని. నా ప్రజలు నాకు ఖ్యాతిని, మహిమను, గౌరవాన్ని తెస్తారనుకున్నాను. కాని నా ప్రజలు నా మాటనే వినలేదు.”
JER 13:12 “యిర్మీయా, యూదా ప్రజలకు ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడని తెలియజేయుము: ‘ప్రతి ద్రాక్షరసపు తిత్తియు ద్రాక్షారసముతో నింపాలి.’ అది విన్న ఆ జనులు నవ్వి, ‘అవును. ప్రతి ద్రాక్షారసపు తిత్తీ ద్రాక్షారసంతోనే నింపాలని మాకు తెలుసు’ అని నీతో అంటారు.
JER 13:13 అప్పుడు నీవిలా చెప్పాలి, ‘యెహోవా ఇలా అంటున్నాడు: ఈ రాజ్యంలో నివసించే ప్రతివాని తాగిన వానిలా నిస్సహాయుని చేస్తాను. దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులను గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా నేను యాజకుల గురించి, ప్రవక్తల గురించి యెరూషలేము వారందరిని గురించి నేను మాట్లాడుతున్నాను.
JER 13:14 యూదా ప్రజలందరినీ తూలిపోయి ఒకరిమీద ఒకరు పడేలా చేస్తాను. తండ్రులు, కొడుకులు ఒకరిమీద ఒకరు పడిపోతారు.’ ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది ‘నేను వారిని గురించి విచారించటంగాని, జాలిపడటంగాని జరుగదు. యూదా ప్రజలను నాశనం చేయుటలో అనుతాపాన్ని (కనికరం) నన్ను అడ్డగించనివ్వను.’”
JER 13:15 శ్రద్ధగా ఆలకించండి. యెహోవా మీతో మాట్లాడియున్నాడు. మీరు గర్విష్టులు కావద్దు.
JER 13:16 మీ యెహోవా దేవుని గౌరవించండి. ఆయనను స్తుతించండి. లేనిచో ఆయన మీకు అంధకారాన్ని సృష్టిస్తాడు. మీరు చీకటి కొండల్లో పడిపోక ముందుగానే మీరాయనను స్తోత్రం చేయండి. యూదా ప్రజలారా మీరు వెలుగుకై ఎదురు చూస్తూన్నారు. కాని యెహోవా ఆ వెలుగును కటిక చీకటిగా మార్చుతాడు. యెహోవా వెలుగును మహా అంధకారంగా మార్చగలడు.
JER 13:17 యూదా ప్రజలారా, మీరు యెహోవా వాక్కు వినకపోతే నేను దాగుకొని విలపిస్తాను. మీ గర్వం నన్ను విలపించేలా చేస్తోంది. నేను బిగ్గరగా విలపిస్తాను. నా కన్నీరు వరదలై పారుతుంది. ఎందువల్లనంటే, యెహోవా మంద బందీయైపోయింది.
JER 13:18 ఈ విషయం రాజుకు, ఆయన భార్యకు తెలియ జెప్పండి: “మీ సింహాసనాల నుండి మీరు దిగిరండి. మీ అందాల కిరీటాల మీ తలలనుండి కిందికి పడిపోయాయి.”
JER 13:19 నెగెవు ఎడారిలో మీ నగరాలు మూసివేయ బడ్డాయి. వాటిని ఎవ్వరూ తెరువలేరు. యూదా ప్రజలంతా చెరపట్టబడ్డారు. వారంతా బందీలుగా కొనిపోబడ్డారు.
JER 13:20 యెరూషలేమా, పైకి చూడు! ఉత్తర దిశనుండి వచ్చే శత్రువును చూడు. నీ మంద ఎక్కడ? ఆ అందమైన మందను దేవుడు నీకిచ్చాడు. ఆ మంద రక్షణ బాధ్యత నీదై వుంది.
JER 13:21 ఆ మంద ఏమైనదని దేవుడు నిన్నడిగితే నీవేమి చెపుతావు? నీవు దేవుని గురించి ప్రజలకు బోధించవలసివుంది. నీ నాయకులు ప్రజలను నడిపించవలసి ఉంది. కాని వారి పని వారు చేయ లేదు! కావున నీవు మిక్కిలి బాధను, కష్టాలను అనుభవిస్తావు. నీ బాధ స్త్రీ యొక్క ప్రనవవేదనలాంటిది.
JER 13:22 “నాకెందుకీ చెడు దాపురించింది?” అని నీకు నీవే ప్రశ్నించుకో. నీవు చేసిన అనేక పాపాల ఫలమే నీకు వచ్చిన కష్టాలు. నీ పాపాల కారణంగా నీ అంగీ చిరిగిపోయింది. నీ పాదరక్షలు తీసుకొని పోబడ్డాయి. నిన్ను చిక్కులు పెట్టటానికే వారలా చేశారు.
JER 13:23 నల్లని వ్యక్తి తన శరీరపు రంగును మార్చలేడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు. అలాగే, ఓ యెరూషలేమా, నీవు మారి మంచి పనులు చేయలేవు. నీవు ఎల్లప్పుడూ చెడు చేయటానికే అలవాటడ్డానావు.
JER 13:24 “మీరు మీ ఇండ్లు వదిలిపోయేలా వత్తిడి తెస్తాను. మీరు పారిపోయేటప్పుడు చెల్లా చెదరై అన్ని వైపులకూ పారిపోతారు. ఎడారి గాలికి కొట్టుకు పోయే పొట్టులాంటి వారు మీరు.
JER 13:25 ఈ విషయాలన్నీ నీకు సంభవిస్తాయి. నా ప్రణాళికల్లో నీ పాత్ర ఇదే.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “ఇది ఎందుకు సంభవిస్తుంటే నీవు నన్ను మర్చిపోయావు. నీవు బూటకపు దేవుళ్ల నమ్మావు.
JER 13:26 యెరూషలేమా, నీ అంగీని అంచుబట్టి నీ ముఖంమీదికి లాగుతాను. ప్రతివాడూ నిన్ను చూస్తారు నీవు అవమానం పాలవుతావు.
JER 13:27 నీవు చేసిన భయంకరమైన పనులను నేను చూశాను. నీవు విజృంభించి ప్రియులతో వ్యభిచరించటం చూశాను. వేశ్యలా ప్రవర్తించాలనే నీ పథకం నాకు తెలుసు. నీవు కొండలమీద, మైదానాల మీద పాపాలు చేయుట నేను చూశాను. యెరూషలేమా, ఇది నీకు చాలా చెడ్డదిగా ఉంటుంది. అసహ్యమైన ఈ పాపాలు నీ వెన్నాళ్లు సాగిస్తావోనని నేను ఆశ్చర్యపోతున్నాను.”
JER 14:1 అనావృష్టి విషయమై ఇది యిర్మీయాకు యెహోవా పంపిన వర్తమానం:
JER 14:2 “యూదా రాజ్యం చనిపోయిన వారికొరకు రోధిస్తుంది. యూదా నగరాల ప్రజలు నానాటికీ బలహీనమౌతారు. వారు నేలమీద పడతారు. యెరూషలేము నుండి ఒక రోదన దేవుని వద్దకు వెళుతుంది.
JER 14:3 ప్రజా నాయకులు వారి సేవకుల నీటికొరకు పంపుతారు. సేవకులు జలాశయాల వద్దకు వెళతారు. కాని వారికి నీరు దొరకదు. సేవకులు ఖాళీ కూజాలతో తిరిగి వస్తారు. దానితో వారు సిగ్గుపడి, కలత చెందుతారు. అవమానంతో వారి తలలు బట్టతో కప్పుకుంటారు.
JER 14:4 ఒక్కడు కూడా భూమిని దున్ని సాగుచేయడు రాజ్యంలో వర్షం కురియదు. రైతులు నిరాశతో కుంగి పోతారు. వారు సిగ్గుతో తమ ముఖాలు కప్పుకుంటారు.
JER 14:5 పొలంలో ఈనిన దుప్పి సహితం తన పిల్లను వదిలిపోతుంది. పచ్చిక దొరకని కారణంగా అది అలా చేస్తుంది.
JER 14:6 అడవి గాడిదలు వట్టి కొండలపైన నిలబడతాయి. గుంటనక్కల్లా అవి గాలిని వాసన చూస్తాయి. వాటి కంటికి ఆహారమే కన్పించదు. ఎందువల్లనంటే వాటికి తినటానికి ఎక్కడా మొక్కలు లేవు.
JER 14:7 “నా ప్రజలిలా నాకు మొరపెట్టుకుంటారు: జరిగిన విషయాలన్నిటకీ మా తప్పులే కారణమని మాకు తెలుసు. మా పాపాల ఫలంగా మేమిప్పుడు కష్టాలనుభవిస్తున్నాము. యెహోవా, నీ నామ ఘనత కొరకు ఏదో ఒకటి చేసి మాకు సహాయపడుము. నిన్ను అనేక సార్లు మేము వదిలిపెట్టినట్లు మేము ఒప్పుకుంటున్నాము. నీ పట్ల మేము పాపం చేశాము.
JER 14:8 ఓ దేవా! ఇశ్రాయేలుకు నీవు ఆశాజ్యోతివి! కష్ట కాలంలో ఇశ్రాయేలును ఆదుకొనేవాడవు నీవే. అయినా ఇప్పుడి దేశంలో పరాయి వానిలా ప్రవర్తిస్తున్నావు. ఒక్కరాత్రి ఉండిపోయే బాటసారిలా ఉన్నావు.
JER 14:9 ఆకస్మికంగా దాడి చేయబడిన వ్యక్తిలా ఉన్నావు. ఎవ్వరినీ రక్షించలేని అశక్తుడైన సైనికునిలా ఉన్నావు. అయినా నీవు మాతో ఉన్నావు. యెహోవా, నీ పేరుతో మేము పిలువబడుతూ ఉన్నావు. మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి పెట్టవద్దు!”
JER 14:10 యూదా ప్రజల విషయంలో యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టటానికి ఇష్టపడ్తారు. వారు నన్ను వదిలి వెళ్లటంలో ఏమాత్రం వెనుకాడరు. కనుక ఇప్పుడు నేను వారిని అంగీకరించను. వారు చెసిన దుష్టకార్యాలను నేను గుర్తు పెట్టుకుంటాను. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను.”
JER 14:11 పిమ్మట యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, యూదా ప్రజలకు శుభం కలగాలని ప్రార్థన చేయవద్దు.
JER 14:12 యూదా ప్రజలు ఉపవాసాలు మొదలుపెట్టి నన్ను ప్రార్థించవచ్చు. కాని నేను వారి ప్రార్థనలు వినను. వారు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు సమర్పించినా ఆ ప్రజలను నేను అంగీకరించను. యుద్ధం ద్వారా యూదా వారిని నేను నాశనం చేస్తాను. వారి ఆహార ధాన్యాలను తీసుకుంటాను. వారు ఆకలితో అలమటిస్తారు. పైగా వారిని భయంకర వ్యాధులకు గురి చేసి నాశనం చేస్తాను.”
JER 14:13 కాని నేను యెహోవాతో ఇలా అన్నాను: “నా ప్రభువా, ప్రజలకు ప్రవక్తలు వేరొక రకంగా చెపు తున్నారు. ప్రజలు శత్రువు కత్తికి గురికావలసిన గతి పట్టదనీ, వారికి కరువు రాదనీ, యెహోవా ఈ రాజ్యంలోనే వారికి సుఖశాంతులు కలుగజేస్తాడనీ ప్రవక్తలు చెపుతున్నారు.”
JER 14:14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, ఆ ప్రవక్తలు నా పేరుతో అబద్దాలు బోధిస్తున్నారు. ఆ ప్రవక్తలను నేను పంపలేదు. నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. వారితో నేను మాట్లాడలేదు. ఆ ప్రవక్తలు బోధించేదంతా అబద్ధపు దర్శనాలు. వట్టి కనికట్టు. అది వారి స్వంత కల్పన.
JER 14:15 అందువలన నా పేరుతో భవిష్యత్తును చెప్పే ప్రవక్తల విషయంలో నేను చెప్పేదేమంటే వారిని నేను పంపలేదు. ఆ ప్రవక్తలు ‘కత్తిపట్టిన శత్రువెవ్వడూ ఈ రాజ్యంమీదికి రాడు. ఈ రాజ్యంలో కరువనేది ఉండదు,’ అని కదా చెప్పారు. చూడుము; ఆ ప్రవక్తలే ఆకలితో మాడి చనిపోతారు. శత్రువు కత్తికి బలియైపోతారు.
JER 14:16 ఆ ప్రవక్తలు ఏ ప్రజలతో మాట్లాడినారో, వారు వీధిలోనికి లాగబడతారు. ఆ ప్రజలు ఆకలితో చనిపోతారు. శత్రువుల కత్తి వారిని నరికివేస్తుంది. వారినిగాని, వారి భార్యలను గాని, వారి కుమారులను లేక కుమార్తెలను గాని పాతి పెట్టటానికి ఒక్కడుకూడా మిగలడు! నేను వారిని శిక్షిస్తాను.
JER 14:17 “యిర్మీయా, యూదా ప్రజలకు ఈ వర్తమానం అందజేయి. ‘నా కండ్లు కన్నీళ్ళతో నిండాయి. రాత్రింబవళ్లు నేను ఎల్లప్పుడూ విలపిస్తాను. కన్యయగు నా కుమార్తె కొరకు విలపిస్తాను. నా ప్రజలకొరకు నేను దుఃఖిస్తాను. ఎందువల్లనంటే అన్యుడొకడు వారిని గాయపర్చినాడు; వారిని అణగద్రొక్కినాడు. వారు తీవ్రంగా గాయపర్చబడినారు.
JER 14:18 నేను పల్లెపట్టులకు వెళితే, కత్తులతో సంహరింపబడినవారిని చూస్తారు. నేను నగరానికి వెళితే అక్కడ నేను తిండి లేక రోగగ్రస్థులైన వారిని చూస్తాను. యాజకులు, ప్రవక్తలు వారెరుగని అన్యదేశానికి కొనిపోబడ్డారు.’”
JER 14:19 యోహోవా, యూదా రాజ్యాన్ని నీవు పూర్తిగా విడనాడావా? యెహోవా, సీయోనును నీవు ప్రేమించడం లేదా? నీవు మమ్ములను గాయపర్చిన రీతి చూస్తే, మేము తిరిగి కోలుకొనలే మనిపిస్తున్నది. నీవు ఆ పని ఎందుకు చేశావు? మేము శాంతిని కోరుకుంటున్నాము. కాని దాని వల్ల ఏమీ మంచి జరుగలేదు. మేము స్వస్థపడే సమయం కొరకు ఎదురుచూశాము; కాని భయము పుట్టుచున్నది.
JER 14:20 యెహోవా, మేము చాలా దుర్మార్గులమని మాకు తెలుసు. మా పూర్వీకులు చెడుపనులు చేసినట్లు మాకు తెలుసు. అవును. మేము నీ పట్ల పాపం చేశాము.
JER 14:21 యెహోవా, ఉన్నతమైన నీ నామము కొరకై నా మమ్మల్ని తోసివేయవద్దు! దివ్యమైన నీ సింహాసనపు గౌరవాన్ని తగ్గించవద్దు. మాతో నీవు చేసిన ఒడంబడికను గుర్తుంచుకోవాలి. ఆ నిబంధనను మరువవద్దు.
JER 14:22 అన్య దేవతల విగ్రహాలకు వర్షం కురిపించే శక్తిలేదు. ఆకాశానికి వర్షాలను పంపే ప్రభావము లేదు. నీవే మాకు దిక్కు నీవే ఈ కార్యములన్నీ జరిపించేది.
JER 15:1 యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, చివరకు మోషే మరియు సమూయేలు ఇక్కడికి వచ్చి యూదా కొరకు ప్రార్థన చేసినా, ఈ ప్రజలకై నేను విచారపడను. నానుండి యూదా ప్రజలను దూరంగా పంపివేయి! పొమ్మని వారికి చెప్పు!
JER 15:2 ‘మేమెక్కడికి వెళతాము, అని వారడుగ వచ్చు. అప్పుడు వారితో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పు: “‘నేను వారిలో కొంతమంది అసహజంగా చనిపోవటానికి ఉద్దేశించాను. వారు మృత్యువు వాతబడతారు. కొంతమందిని కత్తికి బలిచేయటానికి ఉద్దేశించాను. వారు కత్తులతో యుద్దానికి పోయి చనిపోతారు. కొందరిని ఆకలి చావులకు ఉద్దేశించాను. వారు కరువుకు గురవుతారు. మరి కొందరిని అన్యదేశాలలో బందీలు కావటానికి ఉద్దేశించాను. వారు బందీలై పరదేశానికి తీసుకుపో బడతారు.
JER 15:3 నేను నాలుగు రకాల విధ్వంసకారులను వారిపైకి పంపుతాను.’ ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది ‘నేను ఖడ్గధారులైన శత్రువులను సంహారానికి పంపుతాను. చనిపోయినవారి శరీరాలను లాగివేయటానికి కుక్కలను పంపుతాను. వారి శవాలను తినివేయటానికి, నాశనం చేయటానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను.
JER 15:4 ప్రపంచ ప్రజలందరికీ భీతావహంగా ఉండేలా యూదా ప్రజలను భయంకరమైన దానికి ఒక ఉదాహరణగా చూపిస్తాను. మనష్షే రాజు యెరూషలేములో చేసిన దానిని బట్టి యూదా ప్రజలకు నేనీ విధంగా చేస్తాను. మనష్షే యూదా రాజైన హిజ్కియా కుమారుడు. మనష్షే యూదా రాజ్యానికి ఒక రాజు.’
JER 15:5 “యెరూషలేము నగరమా, నీకొరకు ఒక్కడు కూడా విచారించడు. ఎవ్వరూ నిన్ను గూర్చి విలపించరు. నీ యోగ క్షేమాలు తెలుసుకొనేందుకు కూడా ఎవ్వరూ దగ్గరకు రారు.
JER 15:6 యెరూషలేమా, నీవు నన్ను వదిలిపెట్టావు.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “అనేక పర్యాయములు నీవు నన్ను చేరలేదు! కావున నిన్ను నేను శిక్షించి నాశనం చేస్తాను. మీ శిక్షను మీ మీదకు రాకుండా పట్టుకొని నేను అలసి పోయాను.
JER 15:7 యూదా ప్రజలను నా కొంకె కర్రతో వేరు చేస్తాను. వారిని రాజ్యంలోగల నగర ద్వారాలవద్ద నిరుపయోగంగా పారవేస్తాను. నా ప్రజలలో మార్పు రాలేదు. అందుచే నేను వారిని నాశనం చేస్తాను. వారి పిల్లలను నేను తీసుకొని పోతాను.
JER 15:8 అనేకమంది స్త్రీలు తమ భర్తలను కోల్పోతారు. సముద్రతీరాన ఉన్న ఇసుకకంటె ఎక్కువగా విధవ స్త్రీలు వుంటారు. మధ్యాహ్న సమయంలో నేను నాశన కారులను తీసుకొని వస్తాను. యూదా యువకుల తల్లులపై వారు దాడి చేస్తారు. యూదా ప్రజలకు బాధను, భయాన్ని కలుగ జేస్తాను. ఇదంతా అతి త్వరలో సంభవించేలా చేస్తాను.
JER 15:9 శత్రువు కత్తులతో దాడిచేసి ప్రజలను చంపుతాడు. మిగిలిన యూదా వారిని వారు చంపుతారు. ఒక స్త్రీకి ఏడుగురు కుమారులుండవచ్చు, కాని వారంతా హత్య చేయబడతారు. ఆమె ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది. ఆమె కలవరపడి, తబ్బిబ్బై పోతుంది. దుఃఖంవల్ల పట్టపగలే ఆమెకు చీకటి కలుగుతుంది.”
JER 15:10 తల్లీ, నీవు నాకు జన్మ ఇవ్వనట్లయితే బాగుండేది. నేను దుఃఖపడుతున్నాను. నేను దురదృష్టవంతుడను. ఈ సమస్త రాజ్యాన్నీ నేను (యిర్మీయా) నిందిస్తూ, విమర్శిస్తూ ఉన్నాను. నేనెవరికీ ఏదీ అప్పు యివ్వలేదు; అరువు తీసుకోలేదు. కాని ప్రతివాడూ నన్ను శపిస్తున్నాడు!
JER 15:11 యెహోవా, నేను నిన్ను భక్తితో సేవించాను. ఆపదకాలం వచ్చినప్పుడు నా శత్రువుల గురించి నేను నిన్ను వేడుకున్నాను.
JER 15:12 “యిర్మీయా, ఇనుప ముక్కను నుగ్గుచేయటం ఎవరితరమూ కాదని నీకు తెలుసు. అంటే నా ఉద్దేశ్యం ఉత్తరాన్నుంచి వస్తున్న ఇనుమువలె ఉంటుంది అలాగే ఇనుప ముక్కను చిదుక గొట్టే వారెవరు?
JER 15:13 యూదా ప్రజలకు ధనము, ఐశ్వర్యం ఉన్నాయి. ఆసంపదను పరులకు ఇస్తాను. అన్యులు ఆ సంపదను ఖరీదు చేయనక్కరలేదు. నేనే వారికి స్వయంగా ఇచ్చివేస్తాను. ఎందువల్లనంటే యూదా చాలా పాపాలు చేసింది. యూదా దేశంలో ప్రతిచోటా పాపాలు జరిగాయి.
JER 15:14 యూదా ప్రజలారా, మీ శత్రువులకు మిమ్మల్ని బానిసలుగా చేస్తాను. ముందెన్నడూ ఎరుగని రాజ్యంలో మీరు బానిసలవుతారు. నేను మిక్కిలి కోపంతో ఉన్నాను. నా కోపం రగులుతున్న అగ్నిలా ఉంది. అందులో మీరు కాలిపోతారు.” యిర్మీయా ఈ విధంగా చెప్పాడు:
JER 15:15 యెహోవా, నీవు నన్ను అర్థంచేసుకో. నన్ను గుర్తుంచుకొని, నా గురించి శ్రద్ధ తీసుకో. ప్రజలు నన్ను గాయ పర్చుతున్నారు. వారికి తగిన శిక్ష విధించుము. ఆ ప్రజలపట్ల నీవు చాలా ఓపిక పట్టినావు. వారి పట్ల ఓపికపడుతూ, నన్ను నాశనం కానీయకు. నా గురించి ఆలోచించుము. యెహోవా, నీ గురించి నేననుభవిస్తున్న నొప్పిని గురించి నీవు జ్ఞాపకం చేసుకో.
JER 15:16 నీ వర్తమానం నాకు అందినప్పుడు, నీ మాటలు నేను పొందుకున్నాను. నీ వాక్కు నన్ను మిక్కిలి సంతోషపర్చింది. నా సంతోషానికి కారణమేమంటే నీ పేరు మీద నేను పిలువబడ్డాను. నీ పేరు సర్వశక్తిమంతుడు.
JER 15:17 నేను ప్రజలతో కలసి ఎన్నడూ కూర్చోలేదు. కారణమేమనగా వారు నన్ను చూచి నవ్వి, ఎగతాళి చేశారు. నామీద నీ ప్రభావం పడుటవలన నాకు నేను ఒంటరిగా కూర్చున్నాను. నాచుట్టూ ఉన్న చెడు వాతావరణంపట్ల నేను కోపగించుకొనేలా చేశావు.
JER 15:18 నేనింకా ఎందుకు బాధపడుతున్నానో నాకు అర్థం కావటంలేదు. నా గాయం ఎందుకు నయంకాలేదో, ఎందుకు తగ్గడంలేదో నాకు అర్థంకావటం లేదు. యెహోవా, నీవు మారి పోయావేమోనని అనుకుంటున్నాను. నీవు ఎండిపోయిన సెలయేటిలా ఉన్నావు. నీవు ఇంకిపోయిన నీటిబగ్గలా ఉన్నావు.
JER 15:19 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీలో మార్పు వచ్చి తిరిగి నావద్దకు వస్తే నిన్ను నేను శిక్షించను. నీవు మారి నావద్దకు వస్తే నీవు నన్ను వెంబడించగలవు. వ్యర్థ ప్రసంగాలు మాని, నీవు అనుకూలంగా మాట్లాడితే నాగురించి నీవు మాట్లాడగలవు. యూదా పజలు మార్పు చెంది నీవద్దకు తిరిగిరావాలి. అంతేగాని నీవు వూరి వారిలా వుండకూడదు.
JER 15:20 నిన్ను శక్తిమంతునిగా చేస్తాను. నిన్ను చూచి వారంతా కంచుగోడలాంటి వాడని అనుకుంటారు. యూదావారు నీతో పోట్లాడుతారు. కాని వారు నిన్ను ఓడించలేరు. ఎందువల్లంటే నేను నీతో వున్నాను. నేను నీకు సహాయ పడతాను; నిన్ను రక్షిస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
JER 15:21 “ఆ దుష్టులనుండి నేను నిన్ను రక్షిస్తాను. వారు నిన్ను బెదరగొడతారు. కాని వారి బారినుండి నిన్ను నేను రక్షిస్తాను.”
JER 16:1 యెహోవా వర్తమానం నాకు వచ్చింది:
JER 16:2 “యిర్మీయా, నీవు వివాహం చేసికోరాదు. ఈ స్థలములో నీవు కొడుకులను, కూతుళ్లను కలిగి యుండరాదు.”
JER 16:3 యూదా రాజ్యంలో పుట్టిన కొడుకులు, కూతుళ్లను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. మరియు ఆ పిల్లల తల్లిదండ్రులను గూర్చి యెహోవా ఇలా సెలవిచ్చాడు:
JER 16:4 “ఆ ప్రజలు ఒక భయంకరమైన చావు చస్తారు! వారిని గురించి ఒక్కడు కూడా ఏడ్వడు, విచారించడు. వారినెవ్వడూ సమాధిచేయడు. పశువుల పేడవలె వారి శవాలు నేలమీద పడివుంటాయి. వారు శత్రువు కత్తికి బలియైపోతారు. లేదా ఆకలితో మాడి చనిపోతారు. వారి శవాలు ఆకాశ పక్షులకు, అడవి జంతువులకు ఆహారమవుతాయి.”
JER 16:5 అందువల్ల యెహోవా ఇలా చెప్పాడు: “యిర్మీయా, ఏ ఇంటిలోనయితే చావు దినపు భోజనాలు జరుగుతూ వుంటాయో, నీవా ఇంటిలోనికి పోవద్దు. చనిపోయిన వారికొరకు విలపించటానికి గాని, నీ సంతాపాన్ని వెలిబచ్చటానికి గాని నీవక్కడికి వెళ్లవద్దు. ఆ పనులు నీవు చేయవద్దు. ఎందువల్లనంటే, నా ఆశీర్వాదాన్ని నేను తిరిగి తీసుకున్నాను. యూదా ప్రజలకు నేను కరుణ చూపను. వారి కొరకు నేను బాధపడను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
JER 16:6 “యూదా రాజ్యంలో ప్రముఖులు, సామాన్యులు అంతా చనిపోతారు. వారినెవరూ సమాధిచేయరు. లేక వారి కొరకు ఎవ్వరూ దుఃఖించరు. మృతుల కొరకు దుఃఖ సూచకంగా ఎవ్వడూ తన శరీరం చీరుకొనటంగాని, తల గొరిగించుకోవటం గాని చేయడు.
JER 16:7 చనిపోయిన వారికొరకై విలపించేవారికి ఎవ్వరూ ఆహారం తెచ్చియివ్వరు. తల్లిదండ్రులు చనిపోయి విలపించేవారిని ఎవ్వరూ ఓదార్చరు. మృతుల కొరకు రోదించేవారిని ఆదరించుటకు ఎవ్వరూ తాగటానికి నీరు ఇవ్వరు.
JER 16:8 “విందు జరుపుకుంటూన్న ఏ ఇంటిలోనికీ నీవు వెళ్లవద్దు. ఆ ఇంట్లోకి వెళ్లి తాగటానికి, తినటానికి కూర్చోవద్దు.
JER 16:9 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెప్పినాడు: ‘వేడుక చేసుకొనే వారు ఆనందమును నేను వెంటనే ఆపివేస్తాను. ఇది నీ జీవితకాలంలోనే జరుగుతుంది. ఇవన్నీ త్వరలోనే చేస్తాను.’
JER 16:10 “యిర్మీయా, యూదా ప్రజలకు నీవు ఈ విషయాలన్నీ చెపుతావు. తిరిగి వారు నిన్నిలా అడుగుతారు: ‘మా విషయంలో దేవుడు ఆ భయంకర విషయాలు జరుగుతాయని ఎందుకు చెప్పాడు? మేము చేసిన తప్పేమిటి? మా యెహోవా దేవునికి వ్యతిరేకంగా మేము చేసిన పాపం ఏమిటి?’
JER 16:11 అప్పుడు వారికి నీవు ఈ విషయాలు చెప్పాలి: ‘ఈ భయంకర పరిణామాలు జరగబోవడానికి కారణం మీ పితరులు నన్ను అనుసరించటం మానివేయటమే’ ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది: ‘వారు నన్ను వదిలి అనేక ఇతర దైవముల ననుసరించి ఆరాధించినారు. మీ పితరులు నన్ను వదిలి, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించుట మానివేశారు.
JER 16:12 కాని మీరు మీ పూర్వీకులకంటె నీచంగా పాపం చేశారు. మీరు కఠినాత్ములై చాలా మొండివైఖిరి దాల్చారు. మీరు చేయదలచుకున్నదే మీరు చేస్తున్నారు. మీరు నాకు విధేయులుగా లేరు. మీకు యిష్టమైనదే మీరు చేస్తున్నారు.
JER 16:13 కావున మిమ్మల్ని ఈ దేశంనుండి బహిష్కరిస్తాను. మిమ్మల్ని అన్యదేశానికి తరిమివేస్తాను. మీరు, మీ పూర్వీకులు ముందెన్నడూ చూడని దేశానికి మీరు వెళతారు. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు బూటకపు దేవతలను వెంబడించవచ్చు. నేను మీకు సహాయం చేయను. ఏ రకమైన ఉపకారమూ చేయను.’
JER 16:14 “ప్రజలు ప్రమాణాలు చేస్తూ, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చిన నిత్యుడైన దేవునితోడు’ అని వారు అంటారు. కాని ప్రజలు ఈ మాటలు అనకుండా ఉండే సమయం ఆసన్నమవుతూఉంది.” ఇది యెహోవా వాక్కు.
JER 16:15 ప్రజలు వాగ్దానాలు చేసి అంటారు: “నిత్యుడైన దేవుని సాక్షిగా అని, ‘ఇశ్రాయేలీయులను ఉత్తర దేశంనుండి తీసుకొని వచ్చినది నిత్యుడైన యెహోవాయే!’ అని, ‘ఇశ్రాయేలీయులను ఆయన పంపిన దేశాలనుండి మరల తీసుకొని వచ్చినది ఆయనే’ అని అంటారు. ప్రజలు ఇలా ఎందుకు అంటారు? ఎందువల్లనంటే ఇశ్రాయేలీయులను వారి పూర్వీకులకు నేనిచ్చిన రాజ్యానికి మరల తీకుకొనివస్తాను.
JER 16:16 “ఈ రాజ్యానికి చాలామంది జాలరులను త్వరలో పంపిస్తాను” ఇది యెహోవా వాక్కు “ఆ జాలరులు యూదా ప్రజలను పట్టుకుంటారు. అది జరిగిన పిమ్మట ఈ రాజ్యానికి చాలామంది వేట గాండ్రును పిలిపిస్తాను. ఈ వేటగాండ్రు యూదావారిని ప్రతి కొండమీద, పర్వతంమీద, కొండ బొరియల్లోను వేటాడతారు.
JER 16:17 వారు చేసేదంతా నేను చూస్తాను. యూదా వారు చేసేది దేనినీ నానుండి దాచలేరు. వారి పాపం నానుండి మరుగు పర్చబడలేదు.
JER 16:18 యూదా ప్రజలు చేసిన దుష్కార్యాలకు తగిన శిక్ష విధిస్తాను. వారి ప్రతి పాపానికీ రెండు సార్లు శిక్షిస్తాను. ఇది ఎందుకు చేస్తానంటే, వారు నా రాజ్యాన్ని ‘అపవిత్ర’ పర్చారు. వారు నా రాజ్యాన్ని భయంకరమైన విగ్రహాలతో ‘కలుషితం’ చేశారు. ఆ విగ్రహాలను నేను అసహ్యించుకుంటాను. కాని వారు నా దేశాన్నంతా ఘోరమైన చెడు విగ్రహాలతో నింపివేశారు.”
JER 16:19 యెహవా, నీవేనాకు బలం; నీవే నాకు రక్షణ. ఆపదలో తలదాచుకోటానికి నీవే సురక్షితమైన చోటు. ప్రపంచ దేశాలన్నీనీ శరణు వేడివస్తాయి. ఆ దేశాల వారంతా ఇలా అంటారు: “మా పితరులు చాలామంది బూటకపు దేవుళ్లను నమ్మారు. వారా పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు. కాని ఆ విగ్రహాలు వారికి ఏ రకంగానూ సహాయపడలేదు.
JER 16:20 ప్రజలు వారికై వారు నిజమైన దేవతలను చేయగలరా? చేయలేరు! వారు విగ్రహాలను మాత్రమే చేయగలరు. కాని ఆ బొమ్మలు నిజానికి దేవుళ్లే కారు!”
JER 16:21 “అందుచేత బొమ్మల దేవుళ్లను చేసేవారికి నేను గుణపాఠం నేర్పుతాను. ఇప్పుడే వారికి నా శక్తిని గురించీ, నా బలాన్ని గురించీ తెలియజెబతాను. అప్పుడు నేనే దేవుడననే జ్ఞానం వారికి కలుగుతుంది. నేనే యోహోవా అని వారు తెలుసుకుంటారు.”
JER 17:1 “యూదా ప్రజల పాపం తుడిచి వేయలేని చోట వ్రాయబడింది. వారి పాపాలు ఇనుపకలంతో రాతిలోకి చెక్కబడ్డాయి. వారి పాపాలు వజ్రపు మొనతో రాతిలోకి చెక్కడ్డాయి. వారి గుండెలే ఆ రాతి ఫలకాలు.
JER 17:2 బూటకపు దేవుళ్లకు అంకితం చేసిన బలిపీఠాలు వారి పిల్లలకు గుర్తున్నాయి. ఆ పాపాలన్నీ బలిపీఠం కొమ్ములమీద చెక్కబడినాయి. అషేరా దేవతకు అంకితం చేయబడిన దేవతా చెక్కస్తంభాలు కూడ వారికి గుర్తున్నాయి. కొండలమీద, పచ్చని చెట్లకింద జరిగిన తంత్రాలన్నీ వారికి గుర్తున్నాయి.
JER 17:3 మైదాన ప్రదేశాలలోగల పర్వాతాల మీద జరిగిన సంగతులు వారికి గుర్తున్నాయి. యూదా ప్రజలకు నిధి నిక్షేపాలున్నాయి. వాటిని నేను అన్య ప్రజలకు ఇచ్చివేస్తాను! మీ దేశంలోగల ఉన్నత స్థలాలన్నీ (పూజా ప్రదేశాలు) ప్రజలు నాశనం చేస్తారు. ఆ ప్రదేశాలలో ఆరాధనలు చేసి మీరు పాపం చేశారు.
JER 17:4 నేను మీకిచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. మీ విరోధులు మమ్మల్ని బానిసలుగా తీసుకొని పోయేలా చేస్తాను. ఎందువల్లనంటే, నేను చాలా కోపంగా ఉన్నాను. నా కోపం దహించే అగ్నిలా ఉంది. మీరందులో శాశ్వతంగ కాలిపోతారు.”
JER 17:5 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు: “ఇతర ప్రజలను నమ్మేవారికి కీడు జరుగుతుంది. బలం కొరకు ఇతర ప్రజలపై ఆధారపడేవారికి కష్ట నష్టాలు వస్తాయి. ఎందువల్లనంటే ప్రజలు యెహోవాను నమ్ముట మాని వేశారు.
JER 17:6 ఆ ప్రజలు ఎడారిలో పొదలావున్నారు. ఆ పొదవున్న ప్రాంతంలో ఎవ్వరూ నివసించరు. ఆ పొద బోటలు వారిన ఉష్ట ప్రదేశంలో ఉంది. ఆ పొద చవుడు భూమిలో ఉంది. ఆ పొదకు దేవుడు ఇవ్వగల అనేక శుభాలను గురించి తెలియదు.
JER 17:7 కాని యెహోవాలో నమ్మిక గల వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. ఎందువల్లనంటే తనను నమ్మవచ్చని యెహోవా నిరూపిస్తాడు.
JER 17:8 నీటి వనరులున్నచోట నాటిన చెట్టువలె ఆ వ్యక్తి ఏపుగా, బలంగా ఉంటాడు. నీటి వనరులున్న చెట్టుకు బలమైన వేర్లుంటాయి. ఆ చెట్టు వేసవి వేడికి తట్టుకుంటుంది. దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి. ఒక సంవత్సరం వర్షాలు కురియకపోయినా దానికీ భయముండదు. ఆ చెట్టు ఎల్లప్పుడు కాయలుకాస్తుంది.
JER 17:9 “మానవ మనస్సు మిక్కిలి కపటంతో కూడివుండి. మనస్సు చాలా వ్యాధిగ్రస్తమయ్యింది. మానవ మనస్సును ఎవ్వరూ సరిగా అర్థం చేసికోలేరు.
JER 17:10 కాని యెహోవానైన నేను ఒక వ్యక్తి హృదయంలోకి సూటిగా చూడగలను. వ్యక్తి మనస్సును నేను పరీక్షించగలను. అందువల్ల ఎవ్వరెవ్వరికి ఏమేమి కావాలో నేను నిర్ణయించగలను. ప్రతి వ్యక్తికీ వాని పనికి తగిన జీతభత్యం నేను ఇవ్వగలను.
JER 17:11 ఒకానొక పక్షి తను గ్రుడ్లు పెట్టకుండానే వేరే పక్షులు పెట్టిన గ్రుడ్లను పొదుగుతుంది. డబ్బుకోసం ఇతరులను మోసం చేసే వాడుకూడా అలాంటి పక్షిలాంటి వాడే. వాని జీవితం సగంగడిచే సరికి వాని ధనం పోతుంది. తన జీవిత ఆఖరి (చివరి) దశలో వాడు పరమ మూర్ఖుడై పోతాడనేది విదితమైన విషయం.”
JER 17:12 ఆదినుంచీ మన దేవాలయం ప్రఖ్యాతిగాంచిన దేవుని సింహాసనమై ఉన్నది. అది చాలా ముఖ్యమైన స్థలం.
JER 17:13 యెహోవా, నీవు ఇశ్రాయేలీయులకు ఆశాజ్యోతివి. దేవా, నీవు జీవజలధారలా ఉన్నావు! ఆయనను విడిచిపెట్టిన వారు అవమానానికి గురవుతారు. వారు అవమానించబడుతారు. జీవిత ప్రమాణం తగ్గిపోతుంది.
JER 17:14 యెహోవా, నీవు నన్ను బాగుచేస్తే నేను నిజంగా స్వస్థపడతాను! నన్ను రక్షిస్తే, నేను నిజంగా రక్షింపబడతాను. యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను.
JER 17:15 యూదా ప్రజలు నన్ను ప్రశ్నలడుగుతూవుంటారు. “యిర్మీయా, యెహోవా వర్తమానం ఎక్కడ? ఆ వర్తమానం నెరవేరేలా చేయి!” అని వారంటారు.
JER 17:16 యెహోవా, నేను నీనుండి దూరంగా పారి పోలేదు. నేను నిన్ను అనుసరించాను. నీవు కోరిన విధంగా నేను గొర్రెలకాపరినయ్యాను. ఆ భయంకరమైన రోజు రావాలని నేను కోరుకోలేదు. యెహోవా, నేను చెప్పిన విషయాలు నీకు తెలుసు. జరుగుతున్నదంతా నీవు చూస్తూనే ఉన్నావు.
JER 17:17 యెహోవా, నన్ను నాశనం చేయవద్దు. కష్టకాలంలో నేను నిన్నాశ్రయిస్తాను.
JER 17:18 ప్రజలు నన్ను హింసిస్తున్నారు. వారిని సిగ్గుపడేలాచేయి. కాని నాకు ఆశాభంగం కలుగ చేయకు. ఆ ప్రజలనే పారిపోయేలా చేయుము. కాని నన్ను మాత్రం పారి పోనీయవద్దు. ఆ భయంకరమైన దుర్దినాన్ని నా శత్రువు పైకి రప్పించుము. వారిని పూర్తిగా సర్వనాశనం చేయుము. వారిని పూర్తిగా భంగపర్చుము.
JER 17:19 యెహోవా ఈ విషయాలు నాకు చెప్పాడు: “యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ‘ముఖద్వారం’ వద్ద నిలబడు. అక్కడ యూదా రాజులు లోనికి, బయటకి వెళ్తూ ఉంటారు. అక్కడ ప్రజలకు నా వర్తమానం అందజేయి. తరువాత అన్ని ద్వారాల వద్దకూ వెళ్లి అలాగే చేయి.”
JER 17:20 ఆ ప్రజలకు ఇలా చెప్పుము: “యెహోవా వర్తమానం వినండి. యూదా రాజులారా, వినండి. యూదా ప్రజలారా, వినండి. ఈ ద్వారం ద్వారా యెరూషలేములోనికి వచ్చే ప్రజలారా, మీరంతా నేను చెప్పేది వినండి!
JER 17:21 యెహోవా ఈ విషయాలు చెప్పినాడు సబ్బాతు దినాన మీరేమీ బరువులు ెమోయా కుండా జాగ్రత్త తీసుకోండి. యెరూషలేము నగర ద్వారాల గుండా విశ్రాంతి దినాన ఏమీ బరువులు తేవద్దు.
JER 17:22 మీ ఇండ్లనుండి కూడా పవిత్ర విశ్రాంతి దినాన బరువులు తేవద్దు. ఆ రోజున మీరు ఏపనీ చేయవద్దు. మీరు విశ్రాంతి దినాన్ని పవిత్ర పర్చాలి. ఇదే రకపు ఆజ్ఞను మీ పూర్వీకులకు కూడ యిచ్చియున్నాను.
JER 17:23 కాని మీ పూర్వీకులు నా ఆజ్ఞను శిరసావహించలేదు. వారు నేను చెప్పిన దానిని లక్ష్య పెట్టలేదు. మీ పితరులు బహు మొండివారు. నేను వారిని శిక్షించాను. కాని దానివల్ల ఏమీ మంచి జరగలేదు. వారు నేను చెప్పినది వినలేదు.
JER 17:24 కాని మీరు నా ఆజ్ఞను అనుసరించేలా జాగ్రత్తపడాలి.” ఇది యెహోవా వాక్కు. “మీరు ఎట్టి పరిస్థితిలోనూ విశ్రాంతి దినాన యెరూషలేము నగర ద్వారాలనుండి బరువులు తేరాదు. మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రపర్చాలి. అనగా మీరు ఆ రోజు ఏ పనీ చేయకుండా దాని పవిత్రతను కాపాడవచ్చు.
JER 17:25 “‘మీరీ ఆజ్ఞను పాటిస్తే, దావీదు సింహాసనంపై కూర్చునే రాజులంతా యెరూషలేము నగర ద్వారం గుండా వస్తారు. ఆ రాజులు రధాలమీద, గుర్రాల మీద ఎక్కి వస్తారు. ఆ రాజుల వెంట యూదా, యెరూషలేము ప్రజానాయకులు కూడా వుంటారు. యెరూషలేము నగరంలో శాశ్వతంగా ప్రజలు నివసిస్తారు.
JER 17:26 యూదా పట్టణాలనుండి ప్రజలు యెరూషలేము నగరానికి వస్తారు. చుట్టుపట్లవున్న చిన్న చిన్న గ్రామాలనుండి కూడా ప్రజలు యెరూషలేము నగరానికి వస్తారు. బెన్యామీను వంశీయులున్న రాజ్యంనుండి కూడా ప్రజలు వస్తారు పడమట నున్న కొండవాలు ప్రాంతం నుండి, మన్యప్రాంతం నుండి కూడా ప్రజలు వస్తారు. మరియు యూదా దక్షిణ ప్రాంతంనుండి కూడా నెగెవు ప్రజలు వస్తారు. ఆ ప్రజలు కృతజ్ఞతార్పణలు, దహన బలులు, బలులు, ధాన్యార్పణలు, ధూపద్రవ్వాలు, తెస్తారు. వారా అర్పణలను, బలులను యెహోవా ఆలయానికి తెస్తారు.
JER 17:27 “‘అయితే, మీరు నామాట వినక నాకు విధేయులై యుండకపోతే మీకు కీడు సంభవిస్తుంది. సబ్బాతు దినాన యెరూషలేముకు మీరు బరువులు మోసుకువస్తే మీరు దానిని పవిత్ర దినంగా పరిగణించుట లేదని అర్థం. అప్పుడు నేను ఆర్పజాలని అగ్నిని ప్రజ్వరిల్ల జేస్తాను. ఆ అగ్ని యెరూషలేము ద్వార ములవద్దు మొదలవుతుంది. అది భవనాలన్నిటినీ దగ్ధం చేసేవరకు మంటలు చెలరేగుతూనే ఉంటాయి.’”
JER 18:1 ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవానుండి వచ్చినది:
JER 18:2 “యిర్మీయా, కుమ్మరి వాని ఇంటికి వెళ్లు. నా వర్తమానం నీకు అక్కడ యిస్తాను.”
JER 18:3 నేను కుమ్మరివాని ఇంటికి వెళ్లాను. ఆ కుమ్మరి తన సారె (చక్రం)పై కుండలు చేస్తున్నాడు.
JER 18:4 బంకమన్నుతో అతడొక కుండను చేస్తున్నాడు. కాని ఆ కుండరూపులో ఏదో లోపం వచ్చింది. చేసే కుండను తీసివేసి ఆ మట్టితో కుమ్మరి మరో కుండను చేశాడు. తన చేతి వ్రేళ్లను నైపుణ్యంగా ఉపయోగించి తనుకోరిన రీతిగా కుండను మలిచాడు.
JER 18:5 అప్పుడు యెహోవా వాక్కు వాకు వినిపించింది:
JER 18:6 “ఇశ్రాయేలు వంశమా, నేను (యెహోవా) నీ విషయంలో కూడా అదేరీతిగా చేయగలనని నీకు తెలుసు. నీవు కుమ్మరి చేతిలో మట్టిలా వున్నావు. నేను కుమ్మరి వానిలా వున్నాను!
JER 18:7 నేను ఒక దేశాన్ని గురించిగాని, ఒక సామ్రాజ్యాన్ని గురించి గాని మాట్లాడే సమయం రావచ్చు. నేనారాజ్యాన్ని పెరికి వేయగలనని చెప్పవచ్చు. లేదా, ఆ దేశాన్నిగాని, ఆ సామ్రాజ్యాన్నిగాని కిందికి లాగి నాశనం చేస్తానని నేను అంటాను.
JER 18:8 అయితే ఆ దేశపు ప్రజలు మనస్సు మార్చుకొని తమ నడవడికను సరిచేసికోవచ్చు. ఆ దేశ ప్రజలు దుష్టకార్యాలు చేయటం మానివేయవచ్చు. అప్పుడు నా మనస్సును కూడా నేను మార్చుకుంటాను. ఆ దేశానికి బాధలు తెచ్చి పెట్టినా పథకాన్ని నేను అమలుపర్చను.
JER 18:9 ఒక దేశాన్ని గురించి నేను ప్రస్తావించే మరో సమయంరావచ్చు. నేనా దేశాన్ని తీర్చిదిద్ది, దాన్ని సుస్థిర పరుస్తానని అనవచ్చు.
JER 18:10 కాని ఆ దేశ ప్రజలు నాకు విధేయులుకాకుండా దుష్టకార్యాలు చేస్తూ ఉండవచ్చు. అప్పుడు ఆ దేశానికి చేయదలచుకున్న మంచి పనుల విషయంలో నేను పునరాలోచించవలసి వుంటుంది.
JER 18:11 “కావున యిర్మీయా, యూదా ప్రజలకు, యెరూషలేము నగర వాసులకు యెహోవా ఇలా చెపుతున్నాడని చెప్పుము: ‘మీకు నేనిప్పుడే కష్టాలు సిద్ధం చేస్తున్నాను. మీకు వ్యతిరేకంగా పథకాలు తయారు చేస్తున్నాను. కావున మీరు చేస్తున్న దుష్టకార్యాలు చేయటం మానివేయాలి. ప్రతి ఒక్కడూ మార్పు చెందాలి. సత్కార్యాలు చేయటం మొదలు పెట్టాలి!’
JER 18:12 కాని యూదా ప్రజలు ఇలా సమాధాన మిస్తారు, ‘మార్చుటకు ప్రయత్నం చేయుటవల్ల ఏమీ ప్రయోజనముండదు. మేము చేయదలచుకున్నదేదో అదే చేస్తూపోతాము. మాలో ప్రతివాడూ తన కఠినమైన దుష్టమైన హృదయం ఎలా చెపితే అలా నడుచుకుంటాడు.’”
JER 18:13 యెహోవా చెప్పే విషయాలు వినండి: “అన్య దేశాల ప్రజలను ఈ ప్రశ్న అడగండి: ‘ఇశ్రాయేలు చేసినటువంటి దుష్కార్యాలు మరెవరైనా చేస్తున్నట్లు మీరెప్పుడైనా విన్నారా?’ పైగా ఇశ్రాయేలు దేవుని వధువులా ఉంది!
JER 18:14 పొలాల్లో నుండి బండలు తమంత తాము బయటికి పోవని నీకు తెలుసు. లెబానోను పర్వతాల నుండి మంచు ఎన్నడూ కరిగిపోదని కూడా నీకు తెలుసు. అక్కడ ప్రవహించే శీతల వాగులు ఎన్నడూ ఎండిపోవని కూడా నీకు తెలుసు.
JER 18:15 కాని నా ప్రజలు నన్ను గురించి మర్చిపోయారు. వారు పనికిరాని విగ్రహాలకు బలులు సమర్పించారు. నా ప్రజలు వారు చేసే పనులలో తొట్రు పాటు చెందుతారు. వారి పితరులు నడచిన పాత దారిలో నడిచి తడబడతారు. నా ప్రజలు వేరే మార్గాన నడుస్తారు. గతుకుల బాటలపై నడుస్తారు. కాని వారు మంచి మార్గంపై నన్నను సరించరు!
JER 18:16 యూదా రాజ్యం వట్టి ఎడారిగా మారిపోతుంది! ఆ దారిన పోయే వారందరు దాని గతిచూచి ఆశ్చర్యంతో తలలు ఆడిస్తారు. ఆ దేశం ఎలా నాశనమైపోయిందా అని వారు తికమక పడతారు!
JER 18:17 యూదా ప్రజలను వారి శత్రువులముందు పనికి రానివారిగా పడవేస్తాను. బలమైన తూర్పుగాలి వస్తువులను చెల్లాచెదరు చేసేలా నేను వారిని విసరివేస్తాను. నేనా ప్రజలను నాశనం చేస్తాను. ఆ సమయంలో నేను వారికి అండగా వస్తున్నట్టు నన్ను చూడలేరు. మరియు! నేను వారిని వదిలి పెడుతున్నట్లుగా చూస్తారు!”
JER 18:18 పిమ్మట యిర్మీయా శత్రువులు ఇలా అన్నారు: “రండి. మనం యిర్మీయా పై కుట్ర పన్నుదాము. నిశ్చయముగా యాజకుడు చెప్పిన ధర్మశాస్త్రము వృధాపోదు, జ్ఞానులు చెప్పిన సలహాలు ఇంకా మనతో ఉంటాయి. ప్రవక్తల మాటలు మనకు ఇంకా ఉంటాయి. అందువల్ల మనం అతనిపై అబద్ధప్రచారం చేద్దాం. అది అతనిని నాశనం చేస్తుంది. అతడి మాటలను మనం వినము.”
JER 18:19 యెహోవా, నా మనవి ఆలకించుము. నా శత్రువుల మాట విని వారిని మంచి మార్గంలో నడిచేలా నీవే నిర్ణయించుము.
JER 18:20 నేను యూదా ప్రజలకు మేలు చేశాను. వారు నాకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నన్ను చంపే ఉద్దేశ్యంతో వారు గోతిని తవ్వి సిద్ధం చేశారు.
JER 18:21 కావున నీవిప్పుడు వారి పిల్లలు క్షామంలో తిండి లేక మాడి పోయేలా జేయి. వారి శత్రువులు వారిని కత్తులతో ఓడించును గాక! వారి భార్యలు తమ పిల్లలను భర్తలను పోగొట్టు కొందురు గాక! యూదా రాజ్యంలో పురుషులంతా చనిపోవుదురు గాక! వారి భార్యలను వితంతువులుగా చేయి. వారి యువకులు యుద్ధంలో కత్తి వేటుకు చనిపోవును గాక.
JER 18:22 వారి ఇండ్లలో రోదనలు కలుగును గాక! నీవు వారిపైకి ఆకస్మికంగా శత్రువును రప్పించినపుడు వారు మిక్కిలి విలపించేలా చేయి. నా శత్రువులు నన్ను మోసం చేయదలచినందుకు ఇదంతా వారికి సంభవించును గాక! నా అడుగు పడ్డ వెంటనే పట్టడానికి బోనులు అమర్చారు.
JER 18:23 యెహోవా, నన్ను చంపటానికి వారి ఎత్తుగడలన్నీ నీకు తెలుసు. వారి నేరాలను క్షమించవద్దు. వారి పాపాలను తుడిచి వేయవద్దు. నా శత్రువులను మట్టు బెట్టు! నీకు కోపం వచ్చినపుడు వారిని శిక్షించు!
JER 19:1 యెహోవా నా తో ఇలా చెప్పినాడు: “యిర్మీయా, నీవు ఒక కుమ్మరి వాని వద్దకు వెళ్లి ఒక మట్టి జాడీ కొనుగోలు చేయి.
JER 19:2 యెరూషలేము నగర కుమ్మరి ద్వారానికి ఎదురుగా ఉన్న బెన్‌హిన్నోము లోయలోనికి వెళ్లు. నీతో పాటు కొందరు నాయకులను, యాజకులను తీసికొని వెళ్లు. ఆ స్థలంలో నేను నీకు ఏమి చెపుతానో దానిని వారికి తెలియజేయుము.
JER 19:3 నీతో ఉన్న వారితో ఇలా చెప్పు, ‘యూదా రాజా, యెరూషలేము నగర వాసులారా, యెహోవా వాక్కు వినండి! ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు: ఈ ప్రదేశానికి త్వరలో నేను ఘోర విపత్తు సంభవించేలా చేస్తాను! దానిని గురించి విన్న ప్రతి ఒక్కరు ఆశ్ఛర్యపడి భయంతో నిండిపోతాడు.
JER 19:4 నేను ఇదంతా ఎందుకు చేస్తాననగా యూదా ప్రజలు నన్నను సరించటం మానివేశారు. ఈ ప్రదేశాన్ని వారు పరదేశాల ఇతర దేవుళ్లకు స్థావరంగా మార్చి వేశారు. అన్య దేవతలకు యూదా ప్రజలు ఇక్కడ ధూపనైవేద్యాలు సమర్పించారు. పూర్వ కాలంలో ఆ దేవతలను ప్రజలు ఆరాధించలేదు. వారి పూర్వీకులు ఆ దేవతలను ఆరాధించలేదు. ఇవి ఇతర దేశాల నుండి దిగుమతి అయిన క్రొత్త దేవతలు. యూదా రాజులు ఈ ప్రదేశాన్ని అమాయక పిల్లల రక్తంతో నింపివేశారు.
JER 19:5 బయలు దేవతకు యూదా రాజులు ఉన్నత (పూజా) స్థలాలను నిర్మించినారు. ఆ స్థలాలను వారు తమ కుమారులను అగ్నిలో కాల్చి బయలు ముందు బలి అర్పించటానికి ఉపయోగించారు. బయలు దేవతకు వారి కుమారులను దహన బలులుగా అర్పించారు. అలా చేయమని నేనెన్నడూ వారికి చెప్పియుండలేదు. మీ కుమారులను బలియివ్వమని నేనెన్నడూ మిమ్మల్ని అడగలేదు. అటువంటి అకృత్యాన్ని నేను మనసులో కూడా ఎన్నడూ తలపోయలేదు.
JER 19:6 మరియు బెన్‌హిన్నోములో గల ఈ స్థలాన్ని వారిప్పుడు తోఫెతు అని పిలుస్తారు. కాని నేను మీకీ హెచ్చరిక ఇస్తున్నాను: ప్రజలీ స్థలాన్ని కసాయి లోయ అని పిలిచే రోజులు వస్తున్నాయి. ఇది యెహోవా వాక్కు.
JER 19:7 యూదా ప్రజల, యెరూషలేము వాసుల పథకాలన్నీ నేనీ ప్రదేశంలో వమ్ము జేస్తాను. శత్రువు ఈ ప్రజలను తరిమికొడతాడు. యూదా ప్రజలు ఈ ప్రదేశంలో శత్రువు కత్తికి ఆహుతై పోయేలా నేను చేస్తాను. వారి శవములను పక్షులకు, అడవి మృగాలకు ఆహారమయ్యేలా చేస్తాను.
JER 19:8 ఈ నగరాన్ని నేను సర్వనాశనం చేస్తాను. యెరూషలేము మీదుగా వెళ్లే ప్రయాణీకులు విభ్రాంతితో చలించి తమ తలలు పంకిస్తారు. నగరం నాశనం చేయబడిన తీరు చూచి వారు విస్మయంచెందుతారు.
JER 19:9 శత్రు సైన్యాలు నగరాన్ని చుట్టు ముడతాయి. ఆ సైన్యం నగర వాసులను తమ ఆహారం సంపాదించుకోవటానికి బయటికి పోనీయదు. అందువల్ల నగర వాసులు ఆకలితో అలమటిస్తారు. వారు ఆకలి భాధను తట్టుకొలేక తమ పిల్లల శరీరాలనే తినివేస్తారు. ఆ తరువాత వారు ఒకరి నొకరు చంపుకు తింటారు.’
JER 19:10 “యిర్మీయా, ఈ విషయాలన్నీ వారికి తెలియచెప్పు. వారు చూస్తూ ఉండగా నీ వద్ద నున్న జాడీని కింద పడవేసి పగుల గొట్టుము.
JER 19:11 అప్పుడీ మాటలు చెప్పు: ‘ఒకానొకడు మట్టి జాడీని పగులగొట్టినట్లు నేను యూదా రాజ్యాన్ని, యెరూషలేము నగరాన్నీ విచ్ఛిన్నం చేస్తానని సర్వశక్తిమంతుడగు యెహోవా చెపుతున్నాడు! ఈ ముక్కలను మరల కొత్త జాడీగా కూర్చలేము.
JER 19:12 యూదా రాజ్యం విషయంలో కూడ అలాగే జరుగుతుంది. చనిపోయిన వారంతా తోఫెతులో, సందు లేకుండా పాతిపెట్టిబడతారు.
JER 19:13 యెరూషలేము లోని ఇండ్లన్నీ తోఫెతువలె “అపవిత్ర” పర్చబడతాయి. తోఫెతువలె యూదా రాజుల రాజభవనాలన్నీ పాడవుతాయి. ఇది ఎందువల్ల జరుగుతుందంటే ప్రజలు వారి ఇండ్లలో కప్పుల మీద బూటకపు దేవతలను ఆరాధించినారు. నక్షత్రాలను వారు ఆరాధించి, వాటి గౌరవార్థం బలులు సమర్పించేవారు. బూటకపు దేవతలకు పానీయార్పణలు సమర్పించారు.’”
JER 19:14 తోఫెతును వదిలి, దేవుడు తనను బోధించమన్న చోటికి యిర్మీయా వెళ్లాడు. యిర్మీయా దేవాలయానికి వెళ్లి, గుడి ఆవరణలో నిలబడినాడు. అక్కడి ప్రజలనుద్దేశించి యిర్మీయా ఇలా అన్నాడు:
JER 19:15 “ఇశ్రాయేలు దేవుడు. సర్వశక్తిమంతుడగు యెహోవా యిలా సెలవిచ్చినాడు: ‘యెరూషలేముకు, దాని చుట్టు పట్ల గ్రామాలకు చాలా విపత్తులను కలుగజేస్తానని చెప్పియున్నాను. త్వరలోనే నేనీ విషయాలను జరిపిస్తాను. ఎందువల్లననగా ప్రజలు మొండి వారయ్యారు. నేను చెప్పేది వారు వినటం లేదు. నాకు విధేయులై వుండటానికి నిరాకరిస్తున్నారు.’”
JER 20:1 ఆ దేవాలయంలో పషూరు అనబడే ఒక యాజకుడున్నాడు. అతడు దేవాలయంలో ప్రధానాధికారి. పషూరు తండ్రి పేరు ఇమ్మేరు. యిర్మీయా ఈ భవిష్యత్ విషయాలు ఆలయ ప్రాంగణంలో చెప్పటం పషూరు విన్నాడు.
JER 20:2 అతడు ప్రవక్తయైన యిర్మీయాను కొట్టించినాడు. అతనికి దేవాలయం సమీపానగల బెన్యామీను పైద్వారం వద్ద బొండకొయ్య వేయించాడు.
JER 20:3 ఆ మరునాడు యిర్మీయాను పషూరు బొండ కొయ్య బంధం నుండి తొలగించాడు. అప్పుడు యిర్మీయా పషూరుతో ఇలా అన్నాడు, “దేవుడు నిన్ను పిలిచే పేరు పషూరు కాదు. ఆయన నీకు మాగోర్ మిస్సాబీబ్ అని పేరు పెడతాడు.
JER 20:4 ఎందువల్లనంటే దేవుడు ఇలా చెపుతున్నాడు: ‘నీ వంటే నీకె భీతి కలిగేలా త్వరలో చేస్తాను! అంతేగాదు. నీవంటే నీ స్నేహితులందరికీ భయాందోళనలు కలిగేలా చేస్తాను. నీ స్నేహితులంతా శత్రువుల కత్తికి గురియై చనిపోతూ వుంటే నీవు చూస్తూ వుంటావు. యూదా ప్రజలందరినీ బబలోను రాజుకు అప్పగిస్తాను. అతడు యూదా వారందరినీ బబలోను దేశానికి తీసికొని పోతాడు. తన సైనికులు యూదా ప్రజలను కత్తులతో నరికి వేస్తారు.
JER 20:5 యెరూషలేము నగర వాసులు ధనాన్ని కూడబెట్టటానికి, ఇతర నిర్మాణ కార్యక్రమాలకు చాలా కష్టపడినారు. కాని వాటన్నిటినీ వారి శత్రువులకు ఇచ్చివేస్తాను. యెరూషలేములోని రాజుకు ధనాగారాలు వున్నాయి. ఆ ధనాగారాలను నేను శత్రువుకు ఇచ్చివేస్తాను. శత్రువు ఆ ధనరాశులను తీసుకొని బబలోను దేశానికి పట్టుకు పోతాడు.
JER 20:6 ఓ పషూరు, నీవు, మరియు నీ ఇంటి వారందరునూ కూడా తీసుకొని పోబడతారు. బబలోనులో నివసించటానికి నీవు బలవంతంగా కొనిపోబడతావు! నీవు బబలోనులోనే చనిపోతావు. నీవా అన్య దేశంలోనే సమాధి చేయబడతావు. నీ స్నేహితులకు నీవు అబద్ధాలు బోధించావు. నేను చెప్పే విషయాలన్నీ జరగవని నీవు చెప్పినావు. నీ సహచరులంతా బబలోనులో చనిపోయి అక్కడే సమాధి చేయబడతారు.’”
JER 20:7 యెహోవా, నీవు నన్ను భ్రమలో పడవేశావు. నేను నిజంగా మోసగింపబడ్డాను. నీవు నాకంటె బలవంతుడవు, అందువల్ల నీవు గెలిచావు. నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా ప్రజలు నన్ను జూచి నవ్వటం ఎగతాళి చేయటం మొదలు పెట్టారు.
JER 20:8 నేను మాట్లాడిన ప్రతిసారీ అరుస్తున్నాను. దౌర్జన్యం గురించి, వినాశనాన్ని గురించి నేను ఎప్పుడూ అరుస్తున్నాను. యెహోవా నుంచి నాకు అందిన సమాచారాన్నే నేను బహిరంగంగా చెపుతున్నాను. కాని నా ప్రజలు నన్ను కేవలం అవమాన పర్చి, హేళన చేస్తున్నారు.
JER 20:9 “నేనిక దేవుని గురించి మర్చిపోతాను. ఇక ఏ మాత్రం దేవుని నామం పేరిట నేను మాట్లాడను!” అని నేను కొన్ని సార్లు అనుకున్నాను. కాని నేనలా అన్నప్పుడు దేవుని వర్తమానం నాలో అగ్నిలా రగులుతుంది! అది నన్ను లోపల దహించి వేస్తుంది. దేవుని వర్తమానం నాలో ఇముడ్చుకొన ప్రయత్నించి వేసారి పోయాను. ఇక ఎంత మాత్రం దానిని నాలో వుంచుకోలేను.
JER 20:10 అనేక మంది నాకు వ్యతిరేకంగా గుసగుసలాడు కోవటం నేను వింటున్నాను. ప్రతి చోటా నన్ను భయపెట్టే విషయాలు వింటున్నాను. నా స్నేహితులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేనేదైనా తప్పు చేయాలని జనం కనిపెట్టుకుని వున్నారు. “మనం అబద్ధమాడి అతడేదైనా తప్పు చేశాడని చెపుదాం! లేదా యిర్మీయాను మనం మోసపుచ్చవచ్చు! అప్పుడతనిని మనం ఎలాగో ఇరికించవచ్చు. తద్వారా అతనిని మనం వదిలించుకోవచ్చు. లేదా అప్పుడు మనం అతనిని పట్టుకొని మన కక్ష తీర్చుకోవచ్చు”నని వారంటున్నారు.
JER 20:11 కాని యెహోవా నాతో వున్నాడు. యెహోవా ఒక బలమైన సైనికునిలా వున్నాడు. కావున నన్ను తరిమే వారంతా పడిపోతారు. వారు నన్ను ఓడించలేరు. వారి ప్రయత్నం వ్యర్థం. వారు ఆశా భంగం చెందుతారు. వారు అవమానం పాలవుతారు. వారి అవమానాన్ని వారెన్నడు మరువలేరు.
JER 20:12 సర్వశక్తి మంతుడవైన ఓ యెహోవా, నీవు మంచి వారిని పరీక్షిస్తావు. మనిషి గుండెలోకి, మనస్సులోకి సూటిగా నీవు చూడగలవు. ఆ ప్రజలకు వ్యతిరేకంగా నావాదాన్ని నేను నీకు విన్నవించాను కావున నీవు వారికి తగిన శిక్ష విధించటం నన్ను చూడనిమ్ము.
JER 20:13 యెహోవాను ఆరాధించుము! యెహోవాను స్తుతించుము! యెహోవా పేద వారిని ఆదుకుంటాడు! ఆయన వారిని దుర్మార్గుల బారి నుండి రక్షిస్తాడు!
JER 20:14 నేను పుట్టిన రోజు శపింపబడును గాక! నా తల్లీ! నన్ను నీవు కన్న రోజును ఆశీర్వదించవద్దు.
JER 20:15 నేను పుట్టినట్లు నా తండ్రికి వర్తమానం యిచ్చిన మనుష్యుని శపించుము “నీకు పుత్ర సంతానం కలిగింది” అని చెప్పి అతడు నా తండ్రిని మిక్కిలి సంతోషపరిచాడు.
JER 20:16 యెహోవా సర్వనాశనం చేసిన ఆ నగరాల మాదిరిగానే ఆ మనుష్యుడు కూడా దౌర్భాగ్యుడగును గాక! యెహోవా ఆ నగరాలపై ఏమాత్రం కనికరం చూపలేదు వారు ఉదయాన్నే యుద్ధ నినాదాలను విందురుగాక! మధ్యహ్న సమయంలో అతడు యుద్ధశోకాలు వినును గాక!
JER 20:17 ఎందువల్లననగా అతడు నేను నా తల్లి గర్భంలో ఉండగానే నన్ను చంపలేదు. అతడే గనుక అప్పుడు నన్ను చంపి వుంటే నా తల్లి గర్భమే నాకు నా సమాధి అయివుండేది. నేను పుట్టివుండే వాడినే కాను.
JER 20:18 నా తల్లి గర్భం నుండి నేనెందుకు బయటికి వచ్చినట్లు? నేను వచ్చి చూచినదంతా కష్టము, దుఃఖమే! నా జీవితం అవమానంతో అంతమవుతుంది.
JER 21:1 యెహోవా వర్తమానం మళ్లీ యిర్మీయాకు వినిపించింది. అప్పుడు యూదా రాజు సిద్కియా అనేవాడు, రాజు పషూరు అనే వానిని, యాజకుడగు జెఫన్యాను పిలిపించి యిర్మీయా వద్దకు పంపినపుడు రాజుకు ఈ వార్తను వినిపించిరి. పషూరు అనేవాడు మల్కీయా కుమారుడు. జెఫన్యా అనేవాడు మయశేయా అనువాని కుమారుడు. పషూరు, జెఫన్యాలిరువురూ యిర్మీయాకు ఒక వర్తమానం తెచ్చారు.
JER 21:2 యిర్మీయాతో పషూరు, జెఫన్యాలు ఇలా అన్నారు. “మా కొరకు దేవుని ప్రార్థించుము. మాకు ఏమి జరుగుతుందో యెహవాను అడిగి తెలుసుకొనుము. బబలోను రాజైన నెబకద్నెజరు మా మీదికి దండెత్తి వస్తున్నాడు. కనుక ఇది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. గతంలో చేసినట్లు బహుశః యెహోవా మా కొరకు ఘనమైన కార్యాలు జరిపించవచ్చు. బహుశః నెబకద్నెజరు మామీదికి రాకుండా ఆపి అతనిని యెహోవా వెనుకకు పంపించవచ్చు.”
JER 21:3 అప్పుడు పషూరు, జెఫన్యాలకు యిర్మీయా ఇలా సమాధాన మిచ్చినాడు: “రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి:
JER 21:4 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘నీ చేతిలో మారణా యుధాలున్నాయి. నీవా ఆయుధాలను బబలోను రాజు నుండి, కల్దీయుల నుండి నిన్ను రక్షించుకోవటానికి ఉపయోగించనున్నావు. కాని ఆ ఆయుధాలన్నీ నిరుప యోగమయ్యేలా నేను చేస్తాను. “‘బబలోను సైన్యం నగరం చుట్టూ వున్న రక్షణగోడ వెలుపల మూగి ఉంది. ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. త్వరలోనే ఆ సైన్యాని యెరూషలేము లోనికి రప్పిస్తాను.
JER 21:5 యూదా ప్రజలైన మీతో నేనే యుద్ధం చేస్తాను. శక్తివంతమైన నా చేతితో నేనే మీతో పోరాడతాను. నేను మీ పట్ల మిక్కిలి కోపంగా ఉన్నాను. అందువల్ల నా శక్తివంతమైన చేతితో కఠినంగా నేను మీతో పోరాడతాను. నేను మీతో యుద్ధం చేసి, మీపట్ల నేనెంత కోపంగా వున్నానో తెలియజేస్తాను.
JER 21:6 యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను చంపుతాను. మనుష్యులతో పాటు పశువులను కూడా చంపుతాను. నగరమంతా వ్యాపించే భయంకరమైన వ్యాధుల ద్వారా వారంతా చనిపోతారు.
JER 21:7 అదే జరిగిన తరువాత యూదా రాజైన సిద్కియాను బబలోను రాజైన నెబకద్నెజరుకు అప్పగిస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “‘అంతేగాదు, సిద్కియా అధికారులను కూడా నెబకద్నెజరుకు అప్పగిస్తాను. యెరూషలేములో కొందరు ప్రబలిన వ్యాధులకు గురియై చనిపోతారు. మరికొంత మంది శత్రువు కత్తివాతకి గురియై చని పోతారు. మరికొంత మంది ఆకలితో మాడి చావరు. కాని నేనా ప్రజలను నెబకద్నెజరుకు అప్పగిస్తాను. యూదా యొక్క శత్రువు గెలిచేలా నేను చేస్తాను. నెబకద్నెజరు సైన్యం యూదా ప్రజలను హతమార్చాలని చూస్తూ వుంది. కావున యూదా ప్రజలు, యెరూషలేము నగరవాసులు కత్తివాతకి చనిపోతారు. నెబకద్నెజరు ఏ మాత్రం కనికరం చూపదు. ఆ ప్రజల గతికి అతడు విచారించడు.’
JER 21:8 “యెరూషలేము నగర వాసులకు ఈ విషయాలు కూడా చెప్పండి. యెహోవా ఇలా చెపుతున్నాడు: ‘బతకటమో, చనిపోవటమో అనే విషయాన్ని నేను మీకే వదిలి వేస్తున్నానని అర్థం చేసుకోమనండి!
JER 21:9 యెరూషలేములో ఉండే వాడెవడైనా చనిపోతాడు! వాడు కత్తివల్లగాని, ఆకలిచే గాని, లేక భయంకర వ్యాధివల్ల గాని చనిపోతాడు! ఎవరైతే యోరూషలేము నుండి బయటికి పోయి కల్దీయుల సైన్యానికి లొంగి పోతారో వారే బతుకుతారు! ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముటింది. అందువల్ల ఎవ్వడూ నగరంలోనికి ఆహారాన్ని చేరవేయలేడు. కాని ఎవడు నగరం వదిలి పోతాడో వాడు తన ప్రాణాన్ని రక్షించుకోగలడు.
JER 21:10 యెరూషలేము నగరానికి విపత్తు వచ్చేలా చేయటానికి నేను సంకల్పించాను.’” ఇదే యెహోవా వాక్కు “‘బబలోను రాజుకు ఈ యెరూషలేము నగరాన్ని ఇచ్చి వేస్తాను. దీనిని అతడు అగ్నితో తగులబెడతాడు.’”
JER 21:11 “యూదా రాజ కుటుంబానికి ఈ విషయాలు చెప్పండి: ‘యెహోవా వర్తమానాన్ని వినండి!
JER 21:12 దావీదు వంశమా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు: నీవు ప్రతి రోజా ప్రజల పట్ల సరియైన న్యాయ నిర్ణయం చేయాలి. నేరస్థుల దౌష్ట్యానికి గురి అయిన వారిని సంరక్షించుము. నీవది చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. నా కోపం ఎవ్వరూ ఆపలేని దహించు అగ్నిలా ఉంటుంది. మీరు దుష్ట కార్యాలు చేశారు గనుక ఇది జరుగుతుంది.’
JER 21:13 “యెరూషలేమా, నేను నీకు వ్యతిరేకినైనాను. నీవు పర్వత శిఖరంపై కూర్చుంటావు. నీవు ఈ లోయలో మహరాణిలా కూర్చుంటావు. యెరూషలేము వాసులారా ‘మమ్మల్ని ఎవ్వరూ ఎదుర్కొన లేరు, ఎవ్వడూ మా పటిష్ఠమైన నగరం లోకి ప్రవేశించలేడు’ అని మీరంటారు.” కాని యెహోవా నుండి వచ్చిన ఈ వర్తమానం వినండి.
JER 21:14 “మీకు తగిన శిక్ష మీరనుభవిస్తారు! మీ అడవుల్లో అగ్ని చెలరేగేలా చేస్తాను. ఆ అగ్ని మీ చుట్టూ ఉన్న ప్రతి దానిని కాల్చి వేస్తుంది.”
JER 22:1 యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు రాజభవనానికి వెళ్లు. అక్కడ యూదా రాజును కలిసి ఈ వర్తమానాన్ని అతనికి చెప్పు.
JER 22:2 ‘ఓ యూదా రాజా, యెహోవా యొక్క ఈ వర్తమానాన్ని ఆలకించు. నీవు దావీదు సింహాసనంపై కూర్చుని పరిపాలిస్తున్నావు గనుక, ఇది వినుము. ఓ రాజా! నీవును నీ అధికారులును శ్రద్ధగా వినండి. యెరూషలేము ద్వారాల నుండి వచ్చే నీ ప్రజలంతా ఈ యెహోవా వాక్కును తప్పక వినాలి.
JER 22:3 యెహోవా ఇలా చెపుతున్నాడు: న్యాయమైన, నీతిగల పనులనే చేయండి. దోపిడిగాండ్ర బారినుండి దోచుకోబడిన వారిని ఆదుకోండి. అనాధ పిల్లలను, వితంతువులను బాధించవద్దు. వారిపట్ల మీరు అపచారం చేయవద్దు. అమాయకులను చంపవద్దు.
JER 22:4 ఈ ఆదేశ సూత్రాలను మీరు పాటిస్తే, మీకు ఈ మంచి పనులు జరుగుతాయి: దావీదు సింహాసనంపై కూర్చున్న రాజులంతా నగర ద్వారాలగుండా యెరూషలేముకు నిరంతరం రాగలుగుతారు. ఆ రాజులు వారు అధికారులతో సహా నగర ద్వారాల నుండి వస్తారు. ఆ రాజులు, వారి అధికారులు, వారి ప్రజలు అందరూ రథాలలోను, గుర్రాల మీదను స్వారీ చేస్తూ వస్తారు.
JER 22:5 కాని మీరీ ఆదేశాలను పాటించకపోతే యెహోవా ఇలా చెప్పుచున్నాడు: యెహోవానైన నేను ప్రమాణ పూర్వకంగా చెప్పేదేమంటే, ఈ రాజగృహం నాశనం చేయబడుతుంది. ఇది కేవలం ఒక రాళ్ల గుట్టగా మారిపోతుంది.’”
JER 22:6 యూదా రాజు నివసించే భవనాన్ని గురించి యెహోవా చెప్పేదేమంటే: “గిలియాదు అడవుల్లా ఈ భవంతి చాలా ఎత్తుగా ఉంది లెబానోను పర్వతాలవలె ఈ భవంతి ఎత్తుగావుంది కాని నేను నిజంగా దీనిని ఎడారిలా మార్చివేస్తాను. నిర్మానుష్యంగా వున్న నగరంవలె ఈ భవంతి ఖాళీగా వుండి పోతుంది.
JER 22:7 ఈ భవనాన్ని నాశనం చేయటానికి నేను మనుష్యులను పంపుతాను. ఆ రాజగృహ నాశనానికి వచ్చిన ప్రతి వాని చేతిలోను ఒక ఆయుధం ఉంటుంది. అందమైన, బలమైన మీ దేవదారు దూలాలను నరికి వేస్తారు. నరికిన ఆ దూలాలను వారు తగలబెడతారు.
JER 22:8 “ఇతర దేశాల ప్రజలెందరో ఈ నగరం పక్కగా వెళతారు. వారంతా, ‘యెహోవా యెరూషలేమున కెందుకీ దుర్గతి పట్టించాడు? యెరూషలేము ఒక గొప్ప నగరం’ అని ఒకరి నొకరు అడుగుతారు.
JER 22:9 దానికి సమాధానమిది: ‘యూదా రాజ్య ప్రజలు వారి యెహోవా దేవుని నిబంధనను అనుసరించటం, మాని వేయటం మూలంగా దేవుడు యెరూషలేమును నాశనం చేశాడు. ఆ ప్రజలు అన్య దేవుళ్ళను కొలిచి ఆరాధించారు.’”
JER 22:10 చనిపోయిన రాజు కొరకు దుఃఖించవద్దు. అతని కొరకు విచారించవద్దు. కాని ఇక్కడ నుండి వెళ్లి పోయే రాజు కొరకు మిక్కిలిగా దుఃఖించండి. అతని కొరకు దుఃఖించండి; ఎందువల్లనంటే అతడు మరి తిరిగి రాడు. యెహోయాహాజు తన మాతృ భూమిని మరల చూడడు.
JER 22:11 యోషీయా కుమారుడైన షల్లూము (యెహోయాహాజు తన తండ్రి మరణానంతరం అతడు రాజయ్యాడు) ను గురించి యెహోవా యిలా అంటున్నాడు: “యెహోయాహాజు యెరూషలేము నుండి దూరంగా వెళ్లిపోయాడు. యెరూషలేముకు అతడు మరల తిరిగి రాడు.
JER 22:12 ఈజిప్టీయులు యెహోయాహాజును ఎక్కడికి తీసుకొని వెళ్లారో అతనక్కడే చనిపోతాడు. ఈ రాజ్యాన్ని అతడు మరల చూడడు.”
JER 22:13 “రాజైన యెహోయాకీముకు వ్యతిరేకంగా ఇది మిక్కిలి కీడు. తన భవన నిర్మాణానికి అతడు మిక్కిలి చెడ్డ పనులు చేస్తున్నాడు. పై అంతస్తులో గదులు కట్టడానికి అతడు ప్రజలను మోసగిస్తున్నాడు. నా ప్రజలచే అతడు వూరికే పని చేయిస్తూ ఉన్నాడు. వారి పనికి అతడు ప్రతి ఫలం ఇవ్వటం లేదు.
JER 22:14 “నా కొరకు నేనొక గొప్ప భవంతిని నిర్మిస్తాను. ‘పై అంతస్తులో ఎన్నో గదులు నిర్మిస్తాను,’ అని యెహోయాకీము అంటాడు. అలా అని అతడు తన భవంతిని పెద్ద పెద్ద కిటికీలతో నిర్మిస్తాడు. వాటి చట్రాలకు, తలుపులకు దేవదారు కలపను ఉపయోగించాడు. వాటికి అందంగా ఎరువు రంగు వేశాడు.
JER 22:15 “యెహోయాకీమా, నీ ఇంటిలో విశేషించి ఉన్న దేవదారు కలప నిన్ను గొప్ప రాజును చేయదు. నీ తండ్రియగు యోషీయా తనకు కావలసిన ఆహారపానీయాలతో తృప్తి పడ్డాడు. అతడు ఏది న్యాయమైనదో, ఏది సత్యమైనదో దానిని చేశాడు. యోషీయా సత్ప్రవర్తనుడై నందున అతనికి అంతా సవ్యంగా జరిగిపోయింది.
JER 22:16 యోషీయా పేదవారిని, అవస్థలో ఉన్న వారిని ఆదుకున్నాడు. యోషీయా అలా చేయుటవల్ల అతనికి అంతా సవ్వంగా జరిగి పోయింది. యెహోయాకీమా, “దేవుని తెలుసు కొనుట” అంటే ఏమిటి? దీనులకు దరిద్రులకు సహాయం చేయటం మరియు న్యాయంగా ప్రవర్తించటమే నన్ను తెలుసుకొనే మార్గాలు.” ఇదే యెహోవా వాక్కు.
JER 22:17 “యెహోయాకీమా నీకు ఏది లాభదాయకంగా ఉంటుందా, అని నీ కళ్లు వెదకుతూ ఉంటాయి. ఇంకా, ఇంకా ఎలా సంపాదించాలా అని సదా నీ మనస్సు దానిపై లగ్నమై ఉంటుంది. అందుకు అమాయకులను బలి చేయటానికి కూడా నీవు సిద్ధంగా ఉన్నావు ఇతరుల సొమ్మును దొంగిలించటానికి నీవు ఇష్ట పడుతున్నావు.”
JER 22:18 కావున యోషీయా కుమారుడైన యెహోయాకీము రాజునకు యెహోవా చెప్పుచున్న దేమనగా: “యూదా ప్రజలు యెహోయాకీమును గూర్చి ఏడ్వరు ‘అయ్యో, నా సోదరుడా, నేను యెహోయాకీమును గురించి దుఃఖిస్తున్నాను! అయ్యో, నా సహోదరీ, నేను యెహోయాకీమును గురించి విచారిస్తున్నాను!’ అని ప్రజలు ఒకరి కొకరు చెప్పుకోరు. యూదా ప్రజలు యెహోయాకీమును గిరించి విచారించరు. ‘ఓ యజమానీ, నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను. ఓ రాజా, నేను నీకై విచారిస్తున్నాను!’ అని వారతనిని గురించి చెప్పరు.
JER 22:19 చచ్చిన గాడిదను పూడ్చి పెట్టినట్లు యెరూషలేము ప్రజలు యెహోయాకీమును పాతిపెడతారు. అతని శవాన్ని వారు ఈడ్చి పార వేస్తారు. వారు అతని శవాన్ని యెరూషలేము తలుపుల బయటికి విసరి వేస్తారు.
JER 22:20 “యూదా! లెబానోను పర్వతం మీదికి వెళ్లి కేకలువేయి. నీ స్వరము బాషాను పర్వతాలలో వినిపించనియ్యి. అబారీము పర్వతాలలో మిక్కిలి రోదించు. ఎందువల్లనంటే నీవు మోహించిన వారంతా నాశనమవబోతున్నారు.
JER 22:21 “యూదా! నీవు చాలా సురక్షితంగా ఉన్నటు భావించావు. కాని నిన్ను నేను హెచ్చరించాను! నేను నిన్ను హెచ్చరించినా నీవు లక్ష్యపెట్టలేదు! నీవు చిన్న వయస్సులో ఈ విధంగా నివసించావు. యూదా, నీ చిన్న వయస్సు నుండే నీవు నాకు విధేయుడవు కాలేదు
JER 22:22 యూదా, నేను విధించే శిక్ష తుఫానులా వస్తుంది. అది నీ గొర్రెల కాపరుల నందరినీ (నాయకులను) ఊది వేస్తుంది. ఇతర దేశాలు కొన్ని నీకు సహాయపడతాయని అనుకున్నావు. కాని ఆ రాజ్యాలు కూడ ఓడింపబడతాయి. అప్పుడు నీకు తప్పక అవమానము కలుగుతుంది. నీవు చేసిన దుష్కార్యాలను తలచుకొని నీవు సిగ్గు చెందుతావు.
JER 22:23 “ఓ రాజా, కొండ మీద దేవదారు కలపతో నిర్మించిన భవనంలో నీవు నివసిస్తున్నావు. ఈ కలప తేబడిన లెబానోను దేశంలోనే నీ వున్నట్లుగా వుంది. కొండ మీది ఆ పెద్ద భవంతిలో నీకు నీవు సురక్షితం అనుకుంటున్నావు. కాని నీకు శిక్ష వచ్చినప్పుడు నీవు నిజంగా రోదిస్తావు. స్త్రీ ప్రసవ వేదన అనుభవించినట్లు నీవు బాధపడతావు.”
JER 22:24 “యెహోయాకీము కుమారుడవు, యూదా రాజువైన యెహోయాకీనూ, నేను నివసించునంత నిశ్చయముగ చెపుతున్నాను.” ఇది యెహోవా వాక్కు ఇది నీకు చేస్తాను. “నీవు నా చేతి ఉంగరమైనా నిన్ను నేను లాగి పడవేస్తాను!
JER 22:25 యెహోయాకీనూ, నిన్ను నేను బబలోను రాజైన నెబకద్నెజరుకు, కల్దీయులకు అప్పిగిస్తాను. వారిని గురించే నీవు భయపడుతున్నావు. వారు నిన్ను చంపచూస్తున్నారు.
JER 22:26 నిన్ను, నీ తల్లినీ మీరు పుట్టని దేశానికి త్రోసి వేస్తారు. నీవు, నీ తల్లి ఆ పరాయి దేశంలో చనిపోతారు.
JER 22:27 యెహోయాకీనూ, నీ మాతృ భూమికి రావాలని నీవు గాఢంగా కోరుకుంటావు. కాని నీ కోరిక తీరదు. నీవు వచ్చుటకు నేను అనుమతించను.”
JER 22:28 ఒక వ్యక్తిచే నేలకు విసరి కొట్టబడిన మట్టి కుండ మాదిరి, కొన్యా యొక్క (యోహోయాకీను) స్థితి వున్నది. ఎవ్వరికీ పనికిరాని ఓటి కుండ మాదిరిగా అతడున్నాడు. యెహోయాకీను, అతని పిల్లలు ఎందుకు విసర్జించబడతారు? వారెందుకు అన్య దేశానికి తోయబడతారు?
JER 22:29 యూదా రాజ్యమా, ఓ రాజ్యమా, ఓ రాజ్యమా! యెహోవా వర్తమానం వినిము!
JER 22:30 యెహోవా ఇలా అంటున్నాడు: “యెహోయాకీను గురించి ఈ విషయం వ్రాసి పెట్టండి: ‘అతడు పిల్లలు లేని వానితో లెక్క! తన జీవిత కాలంలో యెహోయాకీను ఏమీ సాధించలేడు. అతని పిల్లలలో ఎవ్వడూ దావీదు సింహాసనం మీద కూర్చోడు. అతని సంతానంలో ఎవడూ యూదా రాజ్యాన్ని ఏలడు.’”
JER 23:1 “యూదా కాపరులకు (నాయకులకు) చాలా చెడ్డదిగా ఉంటుంది. వారు నా గొర్రెలను (ఇశ్రాయేలీయులను) చెదరు గొట్టుతున్నారు. నా పచ్చిక బయలు నుండి గొర్రెలను పొమ్మని నలుదిశలా తోలి వేస్తున్నారు.” ఇది యెహోవా నుంచి వచ్చిన వాక్కు.
JER 23:2 ఆ కాపరులు (నాయకులు) నా ప్రజలకు బాధ్యులు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ కాపరులకు ఈ విషయాలు చెపుతున్నాడు: “ఓ కాపరులారా (నాయకులు), మీరు నా గొర్రెల మందను నలుదిశలా పారిపోయేలా చేశారు. వారు పోవటానికి మీరు ఒత్తిడి తెచ్చారు. మీరు వారిని గురించి శ్రద్ధ వహించలేదు. కాని నేను మీతో వ్యవహరిస్తాను. మీరు చేసిన చెడుకార్యాలకు నేను మిమ్మల్ని శిక్షిస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
JER 23:3 “నేను నా గొర్రెల మందను (ప్రజలను) ఇతర దేశాలకు పంపాను. పోయిన నా మందలను (ప్రజలను) నేను చేరదీస్తాను. వాటిని పచ్చిక బయలుకు (దేశానికి) మరల చేర్చుతాను. నా మందలు (ప్రజలు) వాటి పచ్చిక బీటికి (దేశానికి) తిరిగి చేరుకోగానే వాటికి సంతానోత్పత్తి జరిగి, అభివృద్ధి చెందుతాయి.
JER 23:4 నా గొర్రెల మందపై నేను కొత్త కాపరులను (నాయకులను) నియమిస్తాను. ఆ కాపరులు నా మంద విషయమై శ్రద్ధ వహిస్తారు. నా మంద బెదరిపోయేలా గాని, జడిసి పోయేలా గాని చేయబడదు. నా మందలో ఒక్క గొర్రె కూడా తప్పిపోదు.” ఇదే యెహోవా వాక్కు.
JER 23:5 “నేనొక నీతి యుక్తమైన అంకురాన్ని మొలిపింప జేసే సమయం వస్తూవుంది,” ఇదే యెహోవా వాక్కు. అతడు మంచి తెలివి తేటలతో పరిపాలించగల రాజు. దేశానికి ఏది యోగ్యమైనదో, ఏది మంచిదో అతడది చేస్తాడు.
JER 23:6 శుద్ధమైన మంచి బీజోత్పత్తి సమయమందు యూదా ప్రజలు రక్షింపబడతారు. ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తుంది. “యెహోవా మనకు న్యాయం” అని అతనికి పేరుగా ఉంటుంది.
JER 23:7 కావున సమయం ఆసన్నమవుతూ ఉంది ఇదే యెహోవా వాక్కు, “అప్పుడు ప్రజలు ఎంత మాత్రం యెహోవా పేరుమీద పాతవిధంగా ప్రమాణం చేయరు. ‘నిత్యుడగు యెహోవా తోడు’ అనేది ‘ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలును విడిపించి తీసికొని వచ్చిన యెహోవా తోడు’ అనేవి పాత ప్రమాణాలు.
JER 23:8 కాని ఇశ్రాయేలు ప్రజలు కొత్త విధంగా ప్రమాణం చేస్తారు. ‘నిత్యుడగు యెహోవా తోడు. యెహోవా తన ప్రజలను ఉత్తర రాజ్యం నుండి విముక్తి చేసి తీసుకొని వచ్చాడు. ఆయన వారిని పంపిన రాజ్యాలన్నిటి నుండి ప్రజలను తిరిగి తీసికొని వచ్చాడు’ అని ప్రజలు చెప్పుకుంటారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి స్వదేశంలో నివసిస్తారు.”
JER 23:9 ప్రవక్తలకు పవిత్రమైన మాటలు: నేను విచారంగా ఉన్నాను. నా హృదయం పగిలింది. నా ఎముకలు వణుకుతున్నాయి. నేను (యిర్మీయా) ఒక తాగుబోతు వ్యక్తిలా ఉన్నాను. యెహోవాను బట్టి, ఆయన పవిత్ర వాక్కును బట్టి నేనిలా వున్నాను.
JER 23:10 యూదా రాజ్యం వ్యభిచరించే వారితో నిండిపోయింది. వారనేక విధాలుగా అనిశ్వాసులై ఉన్నారు. యెహోవా రాజ్యాన్ని శపించాడు. అందుచే అది బీడై పోయింది. పచ్చిక బయళ్లలో మొక్కలు ఎండి చచ్చిపోతున్నాయి. పొలాలన్నీ ఎడారుల్లా మారినాయి. ప్రవక్తలంతా దుష్టులయ్యారు. ప్రవక్తలు వారి శక్తియుక్తుల్ని తప్పుడు విధంగా వినియోగిస్తున్నారు.
JER 23:11 “ప్రవక్తలు, యాజకులు కూడా దుష్టులయ్యారు. వారు నా ఆలయంలోనే దుష్టకార్యాలు చేయటం నేను చూశాను.” ఇదే యెహోవా వాక్కు.
JER 23:12 [“కావున నా సందేశం ఇక మీదట వారికివ్వను.] వారి జీవితం బలవంతంగా అంధకారంలో నడిచి నట్లుంటుంది. ప్రవక్తలకు, యాజకులకు మార్గం అతి నునుపై జారిపడేలా ఉంటుంది. గాఢాంధకారంలో ప్రవక్తలు, యాజకులు జారిపడతారు. వారి మీదికి విపత్తును తీసుకొని వస్తాను. ఆ సమయంలో ఆ ప్రవక్తలను, యాజకులను శిక్షిస్తాను.” ఇదే యెహోవా వాక్కు.
JER 23:13 “సమరయ ప్రవక్తలు చెడు చేయటం నేను చూశాను. బూటకపు దేవత బయలు పేరిట వారు భవిష్య విషయాలు చెప్పటం నేను చూశాను. ఆ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలను యెహోవాకు దూరం చేశారు.
JER 23:14 యూదా ప్రవక్తలు యెరూషలేములో ఘోరమైన పనులు చేయటం నేను చూశాను. ఈ ప్రవక్తలు వ్యభిచార దోషానికి పాల్పడ్డారు. వారు అబద్ధాలను వింటారు. వారు తప్పుడు బోధనలను అనుసరించారు. వారు దుర్మార్గులను, చెడు కార్యాలు చేయటానికి ప్రోత్సహించారు. అందువల్ల ప్రజలు పాపం చేయటం మానలేదు. వారు సొదొమ నగరంవలె ఉన్నారు. యెరూషలేము ప్రజలు నా దృష్టిలో గొమొర్రా నగరంవలె ఉన్నారు!”
JER 23:15 అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ ప్రవక్తల విషయంలో ఇలా చెపుతున్నాడు. “ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను. ఆ శిక్ష విషముతిన్నట్లు, చేదు నీరు తాగినట్లు ఉంటుంది. ఆ ప్రవక్తలు ఆధ్యాత్మిక పరమైన ఒక రుగ్మతను ప్రబలింప చేశారు. ఆ రోగం దేశ వ్యాప్తంగా చెలరేగింది, కావున ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను. ఆ రోగం యెరూషలేములోని ప్రవక్తల నుండే సంక్రమించింది.”
JER 23:16 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు: “ఆ ప్రవక్తలు మీకు చెప్పే విషయాలను మీరు లక్ష్యపెట్టవద్దు. వారు మిమ్మల్ని మోసపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రవక్తలు దర్శనాలను గురించి మాట్లాడతారు. కాని వారా దర్శనాలను నానుండి పొందలేదు. వారి దర్శనాలన్నీ వారి కల్పనాలే.
JER 23:17 కొంత మంది ప్రజలు యెహోవా యొక్క నిజమైన సందేశాలను సైతం అసహ్యించుకుంటారు. అందువల్ల ప్రవక్తలు ఆ ప్రజలకు రకరకాల విషయాలు చెపుతారు. ‘మీకు శాంతి సమకూరుతుంది’ అని వారంటారు. కొంత మంది ప్రజలు బహు మొండివారు. వారు చేయదలచుకున్నదేదో అదే చేస్తారు. కావున వారికి ఆ ప్రవక్తలు, ‘మీకు ఏ కీడూ రాదు!’ అని చెపుతారు.
JER 23:18 కాని ఈ ప్రవక్తలలో ఏ ఒక్కడూ పరలోక సభలో నిలవలేదు. వారిలో ఏ ఒక్కడూ యెహోవాను గాని, యెహోవా వాక్కును గాని దర్శించలేదు. వారిలో ఏ ఒక్కడూ యెహోవా సందేశం పట్ల శ్రద్ధ వహించలేదు.
JER 23:19 ఇప్పుడు యెహోవా నుండి శిక్ష తుఫానులావస్తుంది! యెహోవా కోపం ఉగ్రమైన గాలి వానలా ఉంటుంది! ఆ దుష్టుల తలలు చితికి పోయేలా అది వారి మీదికి విరుచుకు పడుతుంది.
JER 23:20 యెహోవా చేయదలచుకున్నదంతా చేసేవరకు ఆయన కోపం చల్లారదు. అంత్యదినాల్లో దీనిని మీరు సరిగా అర్థం చేసికుంటారు.
JER 23:21 ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు. కాని వారికి వారే తమ వర్తమానాలను చాటటానికి పరుగున పోయారు. నేను వారితో మాట్లాడలేదు. కాని వారు నా పేరుతో ప్రవచించారు.
JER 23:22 వారు నా సర్వ సభలో నిలిచి ఉండినట్లయితే వారు నా సందేశాలను యూదా ప్రజలకు చెప్పి ఉండేవారు. ప్రజలు చెడు మార్గాలు తొక్కకుండా ఆపేవారు. వారు దుష్ట కార్యాలు చేయకుండా ఆపేవారు.”
JER 23:23 “ఇక్కడ ఈ స్థలములో నేను దేవుడను. నేను దూర ప్రాంతంలో కూడా దేవుడను. ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం నేను దూరంలో లేను!
JER 23:24 ఒక వ్యక్తి నాకు నకపడకుండా రహస్య స్థావరంలో దాగటానికి ప్రయత్నించవచ్చు. కాని వానిని చూడటం నాకు తేలిక ఎందువల్లనంటే నేను స్వర్గంలోను, భూమి మీద సర్వత్రా వ్యాపించి వున్నాను!”
JER 23:25 “నా పేరు మీద అబద్ధాలు బోధించే ప్రవక్తలున్నారు. ‘నాకు స్వప్న దర్శనమయింది. నాకు స్వప్న దర్శనమయింది,’ అని వారంటారు. వారు అలా చెప్పటం నేను విన్నాను.
JER 23:26 ఎంత కాలం ఇది కొన సాగుతుంది? ఆ ప్రవక్తలు అబద్ధాలనే ఆలో చిస్తారు. వారు ఆలోచించిన అబద్ధాలనే ప్రజలకు భోదిస్తారు.
JER 23:27 యూదా ప్రజలు నా పేరు మర్చి పోయేలా చేయటానికి ఆ ప్రవక్తలు ప్రయత్నిస్తున్నారు. వారొకరి కొకరు ఈ దొంగ కలల గురించి చెప్పుకొనటం ద్వారా ఇది సాధించాలని చూస్తున్నారు. తమ పూర్వీకులు నన్ను మర్చిపోయిన రీతిగా, ఇప్పుడు నా ప్రజలు నన్ను మర్చిపోయేలా చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. వారి పూర్వీకులు నన్ను మర్చిపోయి, బూటకపు దేవత బయలును ఆరాధించారు.
JER 23:28 ఎండుగడ్డి, గోధుమలు ఒక్కటి గావు! అదే రీతిగా, ఆ ప్రవక్తల కలలు నా సందేశాలు కానేరవు. ఎవరైనా తన కలలను గూర్చి చెప్పుకోదలిస్తే చెప్పవివ్వండి. కాని నా వర్తమానం విన్నవాడు మాత్రం దానిని యదార్థంగా చెప్పాలి.
JER 23:29 నా సందేశం అగ్నిలావుంటుంది” ఇదే యెహవా వాక్కు “అది ఒక బండను పగులకొట్టే సమ్మెటలా ఉంటుంది.
JER 23:30 “కావున ఆ దొంగ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.”ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “ఈ ప్రవక్తలు ఒకరి నుండి ఒకరు నా మాటలు దొంగిలించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
JER 23:31 నేను ఈ దొంగ ప్రవక్తలకు వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారు కల్పించిన మాటలనే వారు ఉపయోగిస్తూ, అది నా సందేశమన్నట్లు నటిస్తారు.
JER 23:32 అసత్య దర్శనాలను బోధించే ఈ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారి అబద్ధాల ద్వారా అసత్య ప్రచారాల ద్వారా వారు నా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రజలకు బోధించే నిమిత్తం ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు! నా తరఫున ఏమి చేయటానికీ నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు! యూదా ప్రజలకు వారేరకంగా సహాయపడలేరు.” ఇదే యెహోవా వాక్కు.
JER 23:33 “యూదా ప్రజలు గాని, ఒక ప్రవక్త గాని, లేక ఒక యాజకుడు గాని నిన్ను పిలిచి, ‘యిర్మీయా, యెహోవా ఏమి ప్రకటిస్తున్నాడు?’ అని అడుగవచ్చు. అప్పుడు వారికి సమాధానంగా, ‘యెహోవాకు మీరే భారంగా ఉన్నారు! ఈ పెద్ద భారాన్ని కిందికి విసరి వేస్తాను.’ ఇదే యెహోవా వాక్కు, అని నీవు చెప్పు.
JER 23:34 “ఒక ప్రవక్తే గాని, యాజకుడే గాని, లేక ప్రజలలో ఎవ్వరే గాని, ‘ఇది యెహోవా నుండి వచ్చిన ప్రకటన ….’ అని చెప్పితే, అది అబద్ధం. అటువంటి వ్యక్తిని, వాని కుటుంబాన్నంతటినీ నేను శిక్షిస్తాను.
JER 23:35 మీరొకరికొకరు ఇలా చెప్పుకోండి, ‘యెహోవా ఏమి సమాధానమిచ్చాడు?’ లేక ‘యెహోవా ఏమి చెప్పాడు?’
JER 23:36 అంతేగాని మరెన్నడు, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం)’ అనే పదాన్ని తిరిగి మరలా వాడరు. ఎందువల్లనంటే యెహోవా సందేశం ఎన్నడూ, ఎవరికీ భారం కాకూడదు. కాని మీరు మన దేవుని మాటలు మార్చివేశారు! ఆయన నిత్యుడైన సర్వశక్తిమంతుడగు యెహోవా!
JER 23:37 “మీరు దేవుని సందేశం తెలుసుకొనదలిస్తే ఒక ప్రవక్తను, ‘యెహోవా నీకేమి సమాధానం చెప్పాడు’ అని గాని; ‘యెహోవా ఏమి చెప్పినాడు?’ అని గాని అడగండి.
JER 23:38 కాని, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం) ఏమిటి?’ అని అడగవద్దు. మీరామాటలు వాడితే, ‘అప్పుడు యెహోవా మీకు ఈ మాటలు చెప్పుతాడు: “మీరు నా సందేశాన్ని యెహోవా ప్రకటన” (పెద్ద భారం) అని చెప్పకుండా ఉండవలసింది. ఆ మాటలు వాడవద్దని నేను మీకు చెప్పియున్నాను.
JER 23:39 కాని నా సందేశాన్ని పెద్ద భారమని పిలిచారు. కావున మిమ్మల్ని పెద్ద భారంలా ఎత్తి నా నుండి విసరి పారవేస్తాను. యెరూషలేము నగరాన్ని మీ పూర్వీకులకు నేను ఇచ్చియున్నాను. కాని మిమ్మల్ని, మీ నగరాన్నీ నా నుండి దూరంగా పార వేస్తాను.
JER 23:40 పైగా మీకు శాశ్వతంగా తలవంపులు కలిగేలా చేస్తాను. మీ సిగ్గును మీరెన్నడూ మరువలేరు.’”
JER 24:1 యెహోవా నాకు ఈ వస్తువులను చూపించాడు: యెహోవా మందిరం ముందు ఉంచబడిన రెండు బుట్టల అంజూరపు పండ్లను చూశాను. (నాకు ఈ దర్శనం బబలోను రాజైన నెబకద్నెజరు యెకోన్యాను బందీగా తీసుకొని పోయిన తరువాత కలిగింది. యెకోన్యా రాజైన యెహోయాకీము కుమారుడు. యెకోన్యా, అతని ముఖ్యమైన అధికారులు యెరూషలేము నుండి తీసుకొని పోబడినారు. వారు బబలోనుకు బందీలుగా కొనిపోబడినారు. నెబకద్నెజరు యూదా రాజ్యంలోని చాలా మంది వడ్రంగులను, లోహపు పనివారలను కూడ తీసుకొనిపోయాడు.)
JER 24:2 ఒక బుట్ట నిండా మంచి అంజూరపు పండ్లున్నాయి. అవి వాటి కాలం కంటే ముందు పండిన పండ్లవలె ఉన్నాయి. కాని రెండవ బుట్టలో కుళ్లిపోయిన అంజూరపు పండ్లున్నాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లి పోయాయి.
JER 24:3 “యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు? అని యెహోవా నన్ను అడిగాడు. “నేను అంజూరపు పండ్లను చూస్తున్నాను. అని చాలా మంచి పండ్లు. చెడి పోయిన పండ్లు కుళ్లి పోయాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయాయి,” అని నేను సమాధానమిచ్చాను.
JER 24:4 పిమ్మట యెహోవా వర్తమానం నాకు చేరింది.
JER 24:5 ఇశ్రాయేలు దేవుడైవ యెహోవా ఇలా చెప్పాడు: “యూదా ప్రజలు తమ దేశాన్నుండి బయటకు కొనిపోబడ్డారు. వారు శత్రువు వారిని బబలోనుకు తీసుకొనిపోయాడు. ఆ ప్రజలు ఈ మంచి అంజూరపండ్లలా ఉన్నారు. ఆ ప్రజల పట్ల నేను కనికరం చూపుతాను.
JER 24:6 నేను వారిని రక్షిస్తాను. నేను వారిని తిరిగి యూదా రాజ్యానికి తీసుకొని వస్తాను. నేను వారిని చీల్చి పారవేయను. వారిని పైకి తీసుకొని వస్తాను! వారిని పెరికి వేయను. వారు అభివృద్ది చెందటానికి వారిని స్థిరంగా నాటుతాను.
JER 24:7 వారు నన్ను తెలుసుకొనగోరేలా చేస్తాను. నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. వారు నా ప్రజలు; నేను వారి దేవుడను. బబలోనులో వున్న ఆ బందీలంతా పూర్ణహృదయ పరివర్తనతో నా వైపు తిరుగుతారు గనుక నేనిదంతా చేస్తున్నాను.
JER 24:8 “కాని యూదా రాజైన సిద్కియా మాత్రం తినటానికి పనికిరాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె అవుతాడు. సిద్కియా, అతని ఉన్నతాధికారులు, యెరూషలేములో యింకా మిగిలి వున్న ప్రజలు, మరియు ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలు కుళ్లిన ఈ అంజూరపు పండ్లవలె ఉంటారు.
JER 24:9 నేను వారిని శిక్షిస్తాను. ఆ శిక్ష భూమిమీద ప్రజలందరికీ భయంతో కూడిన విస్మయాన్ని కల్గిస్తుంది! యూదా వారిని చూచి తక్కిన ప్రజలు హేళన చేస్తారు. వారిని గూర్చి హాస్యోక్తులు పలుకుతారు. నేను వారిని చిందర వందర చేసి పడవేసిన అన్ని ప్రదేశాలలో ప్రజలు వారిని శపిస్తారు.
JER 24:10 వారి మీదికి కత్తిని, కరువును, రోగాలను పంపుతాను. వారంతా చనిపోయే వరకు వారిని ఎదుర్కొంటూ వుంటాను. వారికి, వారి పితరులకు నేనిచ్చిన భూమిమీద వారిక ఎంత మాత్రము ఉండరు.”
JER 25:1 యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు చేరిన సందేశం ఇది. యెహోయాకీము యూదాకు రాజై పాలిస్తున్న నాల్గవ సంవత్సరంలో ఈ సందేశం వచ్చింది. యోషీయా కుమారుడు యెహోయాకీము. ఇతని పాలనలో నాల్గవ సంవత్సరం అయ్యే సరికి నెబకద్నెజరు బబలోనుకు రాజు కావటం, పరిపాలన ఒక సంవత్సరం కొనసాగించటం జరిగింది.
JER 25:2 ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజలందరికి, యెరూషలేము వాసులందరికి ఈ సందేశం ఇచ్చాడు:
JER 25:3 యెహోవా నుండి వచ్చిన సందేశాలను గత ఇరవై మూడు సంవత్సరాలలో నేను మీకు పదే పదే ఇచ్చియున్నాను. అమోను కుమారుడైన యోషీయా యూదా రాజ్యాన్ని పదమూడవ సంవత్సరంలో పాలిస్తూ ఉన్నప్పటినుండి నేను ప్రవక్తగా కొనసాగుతున్నాను. ఆనాటి నుండి ఈ నాటి వరకు నేను మీకు యెహోవా సందేశాలను అందజేస్తూ వస్తున్నాను. కాని మీరు వినిపించుకోలేదు.
JER 25:4 యెహోవా తన సేవకులై ప్రవక్తలను మరల, మరల మీ వద్దకు పంపాడు. కాని వారు చెప్పేది మీరు వినలేదు. మీరసలు వారిని లక్ష్య పెట్టలేదు.
JER 25:5 ఆ ప్రవక్తలు, “మీ జీవిత విధానం మార్చుకోండి. ఆ చెడు కార్యాలు చేయటం మానండి. మీలోమార్పు వస్తే, ఏనాడో దేవుడు మీరు నివసించుటకు మీ పితరులకు ఇచ్చిన రాజ్యానికి మీరు తిరిగి రాగలరు. మీరు శాశ్వాతంగా నివసించటానికి ఈ రాజ్యాన్ని ఆయన మీకిచ్చాడు.
JER 25:6 అన్య దేవతలను అనుసరించకండి. వాటిని సేవించవద్దు. ఆరాధించవద్దు. మానవ హస్తాలతో చేసిన విగ్రహాలను పూజించకండి. అదే మీపట్ల నాకు కోపం కల్గిస్తూ వుంది. ఇది చేయటం వల్ల మీకు మీరే హాని కలుగజేసుకుంటున్నారు!”
JER 25:7 “కాని మీరు నా మాట వినలేదు” ఇది యెహోవా వాక్కు “ఎవడో ఒక వ్యక్తి చేసిన విగ్రహాలను మీరు పూజించారు. అది నన్ను ఆగ్ర హపర్చింది. అదే మిమ్ము బాధ పెట్టింది.”
JER 25:8 కావున సర్వ శక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుతున్నాడు: “మీరు నా వర్తమానాలను వినలేదు.
JER 25:9 అందుచేత నేను శీఘ్రమే ఉత్తరదేశం నుండి ప్రజలందరి కొరకు ఒకనిని పంపుతాను.” ఇదే యెహోవా వాక్కు. “బబలోను రాజైన నెబకద్నెజరును వెంటనే పిలిపిస్తాను. అతడు నా సేవకుడు. ఆ జనాన్ని యూదా రాజ్యం మీదికి, దాని ప్రజలపైకి రప్పిస్తాను. అంతేగాదు. వారిని మీ చుట్టూ వున్న దేశాల మీదికి కూడ రప్పిస్తాను. ఆయా దేశాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. వాటిని శాశ్వతమైన ఎడారిగా మార్చి వేస్తాను. ప్రజలు ఆయా దేశాలను చూచి అవి ఎలా నాశనమయినాయో అని విస్మయం పొందుతారు.
JER 25:10 ఆ ప్రాంతంలో ఆనందోత్సాహాలను అంతం చేస్తాను. వివాహ వేడుకలు ఏ మాత్రం ఉండవు. తిరుగలి రాళ్ల శబ్దాలను, దీపాల వెలుగును మాయం చేస్తాను.
JER 25:11 ఆ ప్రాంతమంతా ఒక పనికిరాని ఎడారిలా మారి పోతుంది. ఆ ప్రజలంతా బబలోను రాజుకింద డెబ్బయి ఏండ్ల పాటు బానిసలవుతారు.
JER 25:12 “కాని డెబ్బయి సంవత్సరాల అనంతరం నేను బబలోను రాజును శిక్షిస్తాను. బబలోను రాజ్యాన్ని కూడా శిక్షకు గురి చేస్తాను.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “కల్దీయుల దేశాన్ని కూడా వారు పాపాల నిమిత్తంగా శిక్షిస్తాను. ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా ఎడారిలా మార్చివేస్తాను.
JER 25:13 బబలోనుకు చాలా కష్టనష్టాలు కలుగుతాయిని చెప్పియున్నాను. అవన్నీ జరిగి తీరుతాయి. యిర్మీయా ఆ పరాయి రాజ్యాల గురించి ప్రవచించియున్నాడు. ఆ హెచ్చరికలన్నీ ఈ గ్రంథంలో వ్రాయబడినాయి.
JER 25:14 అవును. బబలోను ప్రజలు చాలా దేశాలలో ఎక్కుమంది గొప్ప రాజులకు సేవలు చేయాల్సి ఉంటుంది. వారు చేసే పనులన్నిటికీ అర్హమైన శిక్ష వారికి నేను విధిస్తాను.”
JER 25:15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ విషయాలు నాకు చెప్పాడు: “యిర్మీయా, ఈ ద్రాక్షా రసపు గిన్నెను నా చేతి నుండి తీసుకో. ఇది నా కోపరసం. నిన్ను నేను వివిధ దేశాలకు పంపుతున్నాను. ఆయా దేశాల వారిని ఈ గిన్నె నుండి తాగేలా చేయుము.
JER 25:16 వారీ ద్రాక్షారసాన్ని తాగుతారు. పిదప వారు వాంతి చేసుకొని, పిచ్చివారిలా ప్రవర్తిస్తారు. నేను త్వరలో వారి పైకి పంపబోయే కత్తి దృష్ట్యా వారలా చేస్తారు.”
JER 25:17 కావున యెహోవా చేతి నుండి నేను ఆ గిన్నె అందుకొని యెహోవా పంపిన ప్రజలందరి యొద్దకు వెళ్లాను.
JER 25:18 యెరూషలేము వాసులకు, యూదా వారికి ఈ ద్రాక్షారసం పోశాను. యూదా రాజులను, నాయకులను ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. వారిని ఎడారిలా మార్చివేయాలని. నేనీ విధంగా ఎందుకు చేశానంటే ఆ ప్రదేశం సర్వనాశనం కావాలని, అది చూచి ప్రజలు కలవర పడిరి. దానిని శపించితిని. చివరికి అలానే జరిగింది. యూదా ఇప్పుడు అలానే తయారయింది.
JER 25:19 ఈజిప్టు రాజైన ఫరోను కూడా ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. అతని అధికారులను, అతని ముఖ్య నాయకులను, మరియు అతని ప్రజలందరినీ యెహోవా కోపపు గిన్నె నుండి తాగేలా చేశాను.
JER 25:20 అరబి దేశీయులు, మరియు ఊజు దేశపు రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా నేను చేశాను. ఫిలిష్తీయుల రాజులను కూడా ఈ గిన్నెతో తాగేలా చేశాను. వీరు అష్కెలోను, గాజ, ఎక్రోను నగరాల రాజులు, మరియు అష్డోదులో మిగిలిన రాజ్యానికి అధిపతులు.
JER 25:21 పిమ్మట ఎదోము, మోయాబు, మరియు అమ్మోను ప్రజలు ఈ గిన్నెతో తాగేలా చేశాను.
JER 25:22 తూరు రాజులు సీదోను రాజులు కూడ ఈ గిన్నెతో తాగేలా చేశాను. దూరదేశాపు రాజులందరి చేత ఆ గిన్నెతో తాగించాను.
JER 25:23 దదాను ప్రజలు, తేమానీయులు, బూజీయులందరూ ఈ గిన్నెతో తాగేలా చేశాను. కణతల వద్ద తమ వెంట్రుకలు గొరిగించుకొనే వారందరినీ ఈ గిన్నెతో తాగేలా చేశాను.
JER 25:24 అరబి రాజులంతా ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఈ రాజులు ఎడారిలో నివసిస్తారు.
JER 25:25 జిమ్రీ రాజులు, ఏలాము రాజులు, మరియు మాదీయుల రాజులు ఈ గిన్నె నుండి తాగేలా చేశాను.
JER 25:26 దగ్గరలో ఉన్న, దూరాన ఉన్న ఉత్తర దేశపు రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఒకరి తరువాత ఒకరు వారంతా తాగేలా చేశాను. యెహోవా కోపపు గిన్నె నుండి భూమిమీద గల రాజ్యాల వారంతా తాగేలా చేశాను. కాని బబలోను రాజు మాత్రం ఇతర రాజ్యాల వారంతా తాగిన పిమ్మట ఆ గిన్నె నుండి ఆఖరికి తాగుతాడు.
JER 25:27 “యిర్మీయా! ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడని ఆయా రాజ్యాల వారికి తెలియజేయుము: ‘నా కోపపు గిన్నె నుండి తాగండి. మైకం వచ్చేలా తాగి వాంతి చేసుకోండి! కింద పడి మరల లేవకుండా ఉండండి. ఎందువల్లనంటే మిమ్మల్ని చంపటానికి కత్తిని మీమీదికి పంపుతున్నాను!’
JER 25:28 “ఆ ప్రజలు నీ చేతి నుండి గిన్నెను తీసికోవటానికి నిరాకరిస్తారు. వారు దాని నుండి త్రాగటానికి ఒప్పుకోరు. అయినా నీవు వారిని పిలిచి ఇలా చెప్పాలి: ‘సర్వశక్తిమంతుడైన దేవుడీ సంగతులు తెలియజేస్తున్నాడు. మీరు నిజానికి ఈ గిన్నె నుండి తాగాలి!
JER 25:29 నా పేరుతో పిలవబడే యోరూషలేము నగరానికి ముప్పు తేవటం మొదలు పెట్టాను. బహుశః మీరు శిక్షింపబడక పోవచ్చునని మీరనుకుంటూ ఉండవచ్చు. అయితే మీరు పొరబడుతున్నారు. మీరు శిక్షింపబడతారు. భూమి మీదనున్న ప్రజలందరినీ ఎదుర్కోవటానికి నేను కత్తిని పంపుతున్నాను.’” ఇదే యెహోవా వాక్కు.
JER 25:30 “యిర్మీయా, ఈ వర్తమానం వారికి అందజేయి: ‘ఉన్నతమైన, పవిత్రమైన తన ఆలయం నుండి యెహోవా నిలుగెత్తి చాటుతున్నాడు. యెహోవా తన పచ్చిక బీడు (ప్రజలు)కు వ్యతిరేకంగా చాటుతున్నాడు. ఆయన ద్రాక్షారసం తీసే వారిలా బిగ్గరగా కేకలేస్తున్నాడు.
JER 25:31 ఆ శబ్దం మోత భూమిపై ప్రజలందరికి చేరుతుంది. అసలీ శబ్దం ఎందుకు? యెహోవా అన్ని దేశాల ప్రజలనూ శిక్షిస్తున్నాడు. యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా తన వాదన తెలియజెప్పాడు ఆయన ప్రజలపై తీర్పు ఇచ్చాడు. ఆయన కత్తితో దుష్ట సంహారం చేస్తున్నాడు.’” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం.
JER 25:32 సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే: “ఒక దేశాన్నుండి మరొక దేశానికి విపత్తులు త్వరలో వ్యాపిస్తున్నాయి. అవి పెనుతుఫానులా భూమిపై సుదూర తీరాల వరకు వ్యాపిస్తాయి!”
JER 25:33 ఆ ప్రజల శవాలు దేశం ఒక అంచు నుండి మరో అంచువరకు పడి ఉంటాయి. చనిపోయిన వారి కొరకు విలపించే వారొక్కరూ ఉండరు. ఆ శవాలను ఎవ్వరూ సేకరించి సమాధి చేయరు పశువుల పేడవలె అవి నేలపై పడి ఉంటాయి.
JER 25:34 కాపరులారా (నాయకులారా), మీరు మందను (ప్రజలను) కాయవలసి ఉంది. కాని ఓ గొప్ప నాయకులారా, రోదించటం మొదలు పెట్టండి. గొర్రెల కాపరులారా, నేలమీద పడి బాధతో పొర్లండి ఎందువల్లనంటే మీరు సంహరించబడే సమయం సమీపిస్తూ ఉంది. మిమ్ములను కొట్టి చెల్లా చెదరు చేస్తాను. పగిలిన కుండ పెంకుల్లా మీరు చిందర వందరై పోతారు!
JER 25:35 గొర్రెల కాపరులు (నాయకులు) దాగటానికి తావే దొరకదు! ఆ నాయకులు తప్పించుకోలేరు!
JER 25:36 కాపరులు (నాయకులు) అరవటం నేను వింటున్నాను. మంద (ప్రజలు) కాపరులు రోదించటం నేను వింటున్నాను! యెహోవా వారి పచ్చిక బయళ్లను (దేశం) నాశనం చేస్తున్నాడు!
JER 25:37 ఆ ప్రశాంతమైన పచ్చిక బయళ్లు (భవనాలు) నాశనం చేయబడి వట్టి ఎడారిలా అవుతాయి. యెహోవా మిక్కిలి కోపంగా వున్న కారణంగా ఇది జరిగింది.
JER 25:38 తన గుహనుండి బయటికి వస్తున్న ఒక భయంకరమైన సింహంలా యెహోవా ఉన్నాడు. యెహోవా కోపంగా ఉన్నాడు! యెహోవా కోపం ఆ ప్రజలకు హాని కల్గించింది! వారి రాజ్యం వట్టి ఎడారిలా అయిపోయింది.
JER 26:1 యూదా రాజ్యాన్ని యెహోయాకీము పాలిస్తున్న మొదటి సంవత్సరంలో ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు.
JER 26:2 యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు దేవాలయ ప్రాంగణంలో నిలబడు. దేవుని ఆరాధించుటకై వచ్చే యూదా ప్రజలందరికి ఈ సందేశాన్ని అందజేయుము. నేను నిన్ను మాట్లాడమని చెప్పినదంతా వారికి చెప్పుము. నా సందేశంలో ఏ భాగాన్ని వదిలి పెట్టవద్దు.
JER 26:3 బహుశః వారు నా సందేశాన్ని విని ఆచరించవచ్చు. బహుశః వారా దుర్మార్గపు జీవితాన్ని విడనాడవచ్చు. వారు గనుక మారితే, నేను వారిని శిక్షించాలనే నా పథకాన్ని కూడా మార్చు కుంటాను. వారు చేసిన అనేక దుష్టకార్యాల దృష్ట్యా నేను వారిని శిక్షించే పథకాన్ని తయారు చేస్తున్నాను.
JER 26:4 నీ విధి వారికి చెప్పుము, ‘యెహోవా ఇలా అంటున్నాడు: నా ఉపదేశాలను అందించాను. వీరు నాకు విధేయులైనా సూక్తులను పాటించాలి!
JER 26:5 నా సేవకులు (నా ప్రవక్తలు) మీకు చెప్పే విషయాలను మీరు ఆలకించాలి. నా ప్రవక్తలను మీ వద్దకు మరల, పంపియున్నాను. కాని మీరు వారు చెప్పేది ఆలకించలేదు.
JER 26:6 మీరు నన్ను అనుసరించక పోతే యెరూషలేములో ఉన్న నా ఆలయాన్ని షిలోహులో వున్న నా పవిత్ర గుడారం మాదిరిగా చేసివేస్తాను. ప్రపంచంలోని ప్రజలెవరైనా తమకు గిట్టని నగరాలకు కీడు జరగాలని తలిస్తే, యెరూషలేముకు జరిగినట్లు జరగాలని కోరుకుంటాను.’”
JER 26:7 దేవాలయంలో యిర్మీయా ఈ మాటలు చెప్పటం యాజకులు, ప్రవక్తలు, దేవుని ఆలయానికి వచ్చిన ప్రజలందరూ విన్నారు.
JER 26:8 ప్రజలకు చెప్పమని యెహోవా ఆజ్ఞ యిచ్చినదంతా యిర్మీయా చెప్పటం ముగించాడు. పిమ్మట యాజకులు, ప్రవక్తలు, ప్రజలు అంతా యిర్మీయాను పట్టు కున్నారు. “ఈ భయంకరమైన విషయాలు చెప్పి నందుకు నీవు చనిపోవలసినదే!
JER 26:9 యెహవా పేర అటువంటి విషయాలు చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! షిలోహులోని పవిత్ర గుడారంలా ఈ దేవాలయం నాశనమవుతుందని చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! యెరూషలేములో ఎవ్వరూ నివసించని రీతిలో అది ఎడారిలా మారిపోతుందని చెప్పటానికి నీకు ఎన్ని గుండెలు!” అని వారంతా యిర్మీయాను గద్దించారు. యెహోవా గుడిలో వారంతా యిర్మీయాను చుట్టు ముట్టారు.
JER 26:10 ఇప్పుడు యూదా పాలకులు జరుగుతున్న విషయాలన్నీ విన్నారు. కావున వారు రాజభవనం నుండి బయటికి వచ్చారు. వారు దేవాలయానికి వెళ్లారు. అక్కడ దేవాలయానికి తిన్నగా వెళ్లే నూతన ద్వారం వద్ద తమ తమ స్థానాలను అలంకరించారు.
JER 26:11 అప్పుడు యాజకులు, ప్రవక్తలు కలిసి పాలకులతోను, తదితర ప్రజలతోను మాట్లాడారు. “యిర్మీయా చంపబడాలి. యెరూషలేమును గురించి అతడు చాలా చెడ్డ విషయాలు చెప్పాడు. అతడా విషయాలు చెప్పటం మీరు కూడ విన్నారు” అని వారంతా చెప్పారు.
JER 26:12 పిమ్మట యిర్మీయా యూదా పాలకులందరితోను, ఇతర ప్రజలతోను మాట్లాడాడు. అతనిలా చెప్పాడు: “ఈ ఆలయాన్ని గురించి, ఈ నగరాన్ని గురించి ఈ విషయాలు చెప్పమని యెహోవా నన్ను పంపాడు. మీరు వినియున్నదంతా యెహోవా తెలియజేసినదే.
JER 26:13 ఓ ప్రజలారా, మీ జీవిత విధానం మార్చుకోండి! మీరు సత్కార్యాలు చేయుట మొదలుపెట్టండి! మీ దేవుడైన యెహోవాను మీరు అనుసరించాలి. మీరలా చేస్తే యెహోవా తన మనస్సు మార్చుకుంటాడు. యెహోవా మీకు వ్యతిరేకంగా తలపెట్టిన హానికరమైన పనులు చేయడు.
JER 26:14 ఇక నా విషయానికి వస్తే, నేను మీ ఆధీనంలో ఉన్నాను. మీరు ఏది ఉచితమని, న్యాయమని తోస్తే, నాకు అది చేయండి.
JER 26:15 కాని మీరు నన్ను చంపితే, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఖచ్చితంగా ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరానికి పాల్పడిన వారవుతారు. అంతే కారు మీరీ నగరాన్ని, అందులోని ప్రతి పౌరుణ్ణి కూడ నేరస్థులుగా చేసిన వారవుతారు. యెహోవా నిజంగా నన్ను మీ వద్దకు పంపియున్నాడు. మీరు విన్న సందేశం వాస్తవంగా యెహోవా నుండే వచ్చనది.”
JER 26:16 తరువాత పాలకులు, ప్రజలు అందరూ మాట్లాడారు. ఆ ప్రజలు యాజకులతోను “యిర్మీయా చంపబడకూడదు. యిర్మీయా మనకు చెప్పన విషయాలు మన యెహోవా దేవుని నుండి వచ్చినవే” అని అన్నారు.
JER 26:17 అప్పుడు నగర పెద్దలలో (నాయకులు) కొందరు లేచి ప్రజలతో ఇలా అన్నారు:
JER 26:18 “ప్రవక్తయైన మీకా మోరష్తీ నగర వాసి. యూదా రాజైన హిజ్కియా పాలనా కాలంలో మీకా ప్రవక్తగా వున్నాడు. యూదా ప్రజలందరికీ మీకా ఈ విషయాలు చెప్పియున్నాడు: “సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే: సీయోను దున్నబడిన పొలంలా అవుతుంది! యెరూషలేము ఒక రాళ్ల గుట్టలా తయారవుతుంది! గుడివున్న పర్వతం, ఒక ఖాళీ కొండ పొదలతో నిండినట్లవుతుంది.
JER 26:19 “హిజ్కియా యూదాకు రాజుగా వున్నప్పుడు హిజ్కియా మీకాను చంపలేదు. యూదా ప్రజలెవ్వరూ మీకాను చంపలేదు. హిజ్కియా యెహోవా పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడని మీకు తెలుసు. అతడు దేవుని సంతోష పరచాలని కోరుకున్నాడు. యూదా రాజ్యానికి కీడు చేస్తానని యెహోవా అన్నాడు. కాని హిజ్కియా యెహోవాను ప్రార్థించాడు. అందువల్ల యెహోవా తన మనస్సు మార్చుకున్నాడు. యెహోవా ముందుగా అన్నట్లు ఏ కీడూ చేయలేదు. ఇప్పుడు మనం యిర్మీయాను గాయపర్చితే, మనం మన మీదికే అనేక కష్టాలు తెచ్చి పెట్టుకుంటాము. ఆ కష్టాలన్నీ మన స్వంత తప్పులు.”
JER 26:20 గతంలో యెహోవా సందేశాన్ని ప్రవచించిన మరో వ్యక్తి వున్నాడు. అతని పేరు ఊరియా. అతడు షెమయా అనేవాని కుమారుడు. ఊరియా కిర్యత్యారీము నగరవాసి. యిర్మీయా చెప్పిన మాదిరిగానే ఈ నగరాన్ని గురించి, ఈ రాజ్యాన్ని గురించి ఊరియా కూడ చెప్పియున్నాడు.
JER 26:21 రాజైన యెహోయాకీము, అతని సైన్యాధికారులు, మరియు యూదాలోని ప్రజా నాయకులు ఊరియా బోధించినదంతా విన్నారు. వారికి చాలా కోపం వచ్చింది. రాజైన యెహోయాకీము ఊరియాను చంపగోరాడు. కాని యోహోయాకీము తనను చంపగోరుతున్నట్లు ఊరియా విన్నాడు. ఊరియా భయపడ్డాడు. అందుచే అతడు ఈజిప్టుకు తప్పించుకు పోయాడు.
JER 26:22 కాని ఎల్నాతాను అనే వ్యక్తిని, మరి కొందరు మనుష్యులను రాజైన యోహోయాకీము ఈజిప్టుకు పంపాడు. ఎల్నాతాను అనేవాడు. అక్బోరు అనేవాని కుమారుడు.
JER 26:23 ఆ మనుష్యులు ఊరియాను ఈజిప్టు నుండి తీసికొని వచ్చారు. వారు ఊరియాను రాజైన యెహోయాకీము వద్దకు తీసికొని వెళ్లారు. ఊరియాను కత్తితో నరికి చంపమని యెహోయాకీము ఆజ్ఞ యిచ్చాడు. పేద ప్రజల స్మశాన వాటికలో అతని శవం పారవేయబడింది.
JER 26:24 షాఫాను కుమారుడైన అహీకాము అనే ప్రముఖ వ్యక్తి ఒకడున్నాడు. అహీకాము యిర్మీయాకు అండగావున్నాడు. అందుచే అహీకాము యాజకుల బారి నుండి, ప్రవక్తల బారి నుండి చంపబడకుండా యిర్మీయాను రక్షించాడు.
JER 27:1 యెహోవా నుండి ఒక వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా యూదాకు రాజైన పిమ్మట తన పరిపాలనలో నాలుగవ సంవత్సరం జరుగుతూ ఉండగా ఈ వర్తమానం వచ్చింది. రాజైన సిద్కియా యోషీయా కుమారుడు.
JER 27:2 యోహోవా నాకు ఈ విధంగా చెప్పాడు. “యిర్మీయా! వారులతోను, నిలువు కట్టెతోను ఒక కాడి తయారు చేయి. ఆ కాడిని నీ మెడపై వేసుకో.
JER 27:3 తరువాత ఎదోము, మోయబు, అమ్మోను, తూరు, సీదోను రాజుల వద్దకు వర్తమానాలు పంపు. యూదా రాజైన సిద్కియాను చూడటానికి యెరూషలేముకు వచ్చే ఆయా రాజ దూతల ద్వారా వర్తమానాలను పంపు.
JER 27:4 ఈ వర్తమానాన్ని వారి యజమానులకిమ్మని ఆ దూతలతో ఇలా చెప్పుము. ‘ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పేదేమంటే: మీ యాజమానులతో
JER 27:5 నేనే భూమండలాన్ని, దానిపై ఉండే మనుష్యులందరినీ సృష్టించానని చెప్పండి. భూమి పైగల జంతుజలాన్ని కూడా నేనే సృష్టించాను. ఇదంతా నా గొప్ప మహిమ చేతను, నా దృఢమైన హస్తముతోను చేసియున్నాను. ఈ భూమిని నా ఇష్టమైన వాని కెవనికైనా ఇచ్చి వేయగలను.
JER 27:6 ఇప్పుడు మీ దేశాలన్నిటినీ బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఇచ్చి వేశాను. అతడు నా సేవకుడు. అడవి జంతువులు కూడ అతనికి లోబడి వుండేలా చేస్తాను.
JER 27:7 దేశాన్నీ నెబుకద్నెజరుకు, అతని కుమారునికి, అతని మనుమనికి దాసులై సేవచేస్తాయి. ఆ తరువాత బబులోను పతనానికి సమయం ఆసన్నమౌతాది. చాలా రాజ్యాలు, గొప్ప రాజులు బబులోనును వశపర్చుకొని దాస్యం చేయించుకుంటారు.
JER 27:8 “‘కాని ఇప్పుడు కొన్ని దేశాలు, రాజ్యాలు నెబుకద్నెజరుకు దాస్యం చేయటానికి నిరాకరించవచ్చు. వారు అతని కాడిని తమ మెడపై పెట్టుకోటానికి నిరాకరించవచ్చు. (తమపై అతని ఆధిపత్యాన్ని తిరస్కరించ వచ్చు.) అది గనుక జరిగితే, ఆయా దేశాలను, రాజ్యాలను కత్తితోను, ఆకలితోను, రోగాలతోను శిక్షిస్తాను. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. ఆ దేశాన్ని నాశనం చేసే వరకు నేనది చేస్తాను. నెబుకద్నెజరును వ్యతిరేకించే రాజ్యం పైకి అతనినే వినియోగించి దానిని నాశనం చేయిస్తాను.
JER 27:9 కావున మీరు మీ ప్రవక్తలు చెప్పే దానిని వినవద్దు. మంత్ర విద్యచే మోసం చేసి భవిష్యత్తును చెప్పజూచే వారి మాయలో పడవద్దు. కలల ఆంతర్యాలను చెపుతామనే వారి మాటలు నమ్మవద్దు. చనిపోయిన వారితో మాట్లాడుతామనేవారు, కనికట్టు విద్యలను ఆచరించే వారు చెప్పే మాటలు వినవద్దు. ఆ మనుష్యులు, “మీరు బబులోను రాజుకు బానిసలు కానేరరు” అని చెపుతారు.
JER 27:10 కాని వారు మీతో అబద్దమాడుతున్నారు. వారు కేవలం మీరు మీ మాతృదేశం నుండి దూర దేశాలకు తీసుకొని పోబడటానికి కారకులవుతారు. మీరు మీ ఇండ్లు వాకిళ్లు వదిలి పోయేలా నేను వత్తిడిచేస్తాను. పైగా మీరు వేరొక దేశంలో చనిపోతారు.
JER 27:11 “‘తమ మెడవంచి బబులోను రాజు కాడిని ధరించి అతనికి విధేయులై ఉన్న దేశాల వారు జీవిస్తారు. అటువంటి వారిని బబులోను రాజును సేవిస్తూ తమ దేశంలోనే ఉండేలా చేస్తాను.’ ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది ‘ఆయా దేశాల వారంతా తమ తమ స్వదేశాలలోనే ఉంటూ. తమ భూముల్లో సేద్యం చేసుకుంటూ ఉంటారు.’”
JER 27:12 యూదా రాజైన సిద్కియాకు కూడ ఇదే సందేశం ఇచ్చాను. నేనిలా చెప్పాను: “సిద్కియా, బబులోను రాజు యొక్క కాడి క్రింద నీ మెడ వుంచి అతనికి విధేయుడవై వుండాలి. నీవు బబులోను రాజుకు, అతని ప్రజలకు దాస్యం చేస్తే నీవు బతుకుతావు.
JER 27:13 నీవు బబులోను రాజుకు దాస్యం చేయటానికి ఒప్పుకొనకపోతే నీవు, నీ ప్రజలు శత్రువు యొక్క కత్తివాత బడి, ఆకలితోను, భయంకర రోగాలతోను చనిపోతారు. ఇవి జరిగి తీరుతాయని యెహోవా చెప్పాడు!
JER 27:14 కాని అబద్ధ ప్రవక్తలు మాత్రం, ‘నీవు బబులోను రాజుకు బానిసవు కానేరవు’ అని చెపుతున్నారు. “ఆ ప్రవక్తలు చెప్పేది వినవద్దు. ఎందువల్లనంటే వారు నీకు అబద్దాలు చెపుతున్నారు.
JER 27:15 ‘నేనా ప్రవక్తలను పంపలేదు.’ ఇదే యెహోవా వాక్కు ‘వారు అబద్దాలు బోధిస్తున్నారు. పైగా, ఆ సందేశం నా నుండి వచ్చినదే అని కూడ చెపుతున్నారు. కావున ఓ యూదా ప్రజలారా, మిమ్ముల్ని దూరంగా పంపివేస్తాను. మీరు చని పోతారు! మీకు బోధించే ఆ ప్రవక్తలు కూడా చనిపోతారు.’”
JER 27:16 అప్పుడు యిర్మీయానైన నేను యాజకులతోను, అ ప్రజలందరితోను ఇలా చెప్పాను: “యెహోవా చెప్పేదేమంటే ఆ అబద్ధ ప్రవక్తలు, ‘బబులోనీయులు యెహోవా నుండి ఎన్నో వస్తువులు తీసుకొని పోయారు. అవన్నీ శీఘ్రమే తిరిగి తీసుకొని రాబడుతాయి.’ అని చెపుతున్నారు. వారి మాటలు మీరు నమ్మవద్దు. ఎందువల్లనంటే వారు మీకు అబద్ధ ప్రవచాలను బోధిస్తున్నారు.
JER 27:17 ఆ ప్రవక్తలు చెప్పే వాటిని మీరు వినవద్దు. బబులోను రాజుకు దాస్యంచేయండి. మీ శిక్షను మీరు ఆమోదించండి. మీరు జీవిస్తారు. ఈ యెరూషలేము నగరం సర్వనాశనం అయ్యేలా మీరు చేయటానికి కారణమే కన్పించటం లేదు.
JER 27:18 ఈ మనుష్యులు నిజంగానే ప్రవక్తలయితే, వారికి యెహవా సందేశం అందితే వారిని ప్రార్థన చేయనివ్వండి. ఇంకా దేవునిలో వున్న వస్తువుల గురించి ప్రార్థన చేయనివ్వండి. రాజ భవనంలో యింకా మిగిలివున్న వస్తువుల గురించి వారిని ప్రార్థన చేయనివ్వండి. ఇంకా యెరూషలేములో వున్న వాటిని గురించి ప్రార్థన చేయ నివ్వండి. ఆయా వస్తుసముదాయాలు బబలోనుకు తీసుకొని పోబడకుండా వుండేలా ఆ ప్రవక్తలను ప్రార్థన చేయనివ్వండి.
JER 27:19 “సర్వశక్తిమంతుడైన యెహోవా యెరూషలేములో ఇంకా మిగిలివున్న వస్తువులను గూర్చి ఇది చెపుతున్నాడు. దేవాలయంలో స్తంభాలు, కంచుకోనేరు, కదిలించగల దిమ్మెలు ఇంకా ఇతరమైన వస్తు సామగ్రి ఉంది. బబులోను రాజైన నెబుకద్నెజరు వీటిని యెరూషలేములో వదిలి వేశాడు.
JER 27:20 యూదా రాజైన యెహోయాకీనును బందీగా కొనిపోయేటప్పుడు నెబుకద్నెజరు వాటన్నిటినీ తీసుకొని పోలేదు. రాజైన యెహోయాకీను యెహోయాకీము కుమారుడు. యూదా నుండి, యెరూషలేము నుండి ఇతర ప్రముఖ వ్యక్తులను కూడా నెబుకద్నెజరు బందీలుగా పట్టుకుపోయాడు.
JER 27:21 దేవాలయంలోను, రాజభవనంలోను, మరియు యెరూషలేములోను ఇంకా మిగిలివున్న వస్తువుల విషయంలో ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. ‘ఆ వస్తువులన్ని బబులోనుకు తీసుకొని పోబడతాయి.
JER 27:22 నేను వాటిని తిరిగి తీసుకొని వచ్చే రోజు వరకు అవి అక్కడే వుంచబడతాయి.’ ఇది యెహోవా వాక్కు. ‘పిమ్మట వాటిని నేను తీసుకొని వస్తాను. తిరిగి వాటిని యధాస్థానంలో వుంచుతాను.’”
JER 28:1 యూదా రాజుగా సిద్కియా పాలన నాలుగు సంవత్సరాలు దాటి ఐదవ నెల గడుస్తూ ఉండగా ప్రవక్త హనన్యా నాతో మాట్లాడాడు. హసన్యా తండ్రి పేరు అజ్జూరు. హనన్యా గిబియోను పట్టణవాసి. హనన్యా నాతో మాట్లాడినప్పుడు అతడు దేవాలయంలో వున్నాడు. యాజకులు, ఇతర ప్రజలు అందరు కూడ అక్కడ చేరి వున్నారు. హనన్యా ఇలా చెప్పాడు.
JER 28:2 “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు. ‘యూదా ప్రజల మెడపై బబులోను రాజు వుంచిన కాడిని నేను విరిచి వేస్తాను.
JER 28:3 రెండు సంవత్సరాలు గడిచేలోగా యెహోవా గుడి నుండి బబులోను రాజు నెబుకద్నెజరు తీసుకొనిపోయిన వస్తువులన్నిటినీ నేను తిరిగి తెస్తాను. నెబుకద్నెజరు ఆ వస్తువులన్నిటినీ బబులోనుకు తీసుకొని పోయాడు. కాని వాటన్నిటినీ నేను తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తాను.
JER 28:4 యూదా రాజైన యెహోయాకీమను కూడా ఈ స్థానానికి నేను తీసుకొని వస్తాను. యెకోన్యా యెహోయాకీము కుమారుడు. నెబుకద్నెజరు బలవంతం చేసి తమ ఇండ్ల నుండి బబులోనుకు తీసుకొని పోయిన యూదా ప్రజలందరినీ నేను తిరిగి తీసుకొని వస్తాను.’ ఇది యెహవా నుంచి వచ్చిన సమాచారం ‘కావున బబులోను రాజు యూదా ప్రజల మెడపై ఉంచిన కాడిని నేను విరుగగొడతాను!’”
JER 28:5 అప్పుడు ప్రవక్త యిర్మీయా ప్రవక్త హనన్యాకు ఇలా సమాధానం చెప్పాడు. వారు దేవాలయంలో నిలబడి వున్నారు. యాజకులు, మరియు అక్కడ చేరిన ప్రజలు యిర్మీయా సమాధానం వినగలిగారు.
JER 28:6 హనన్యాతో యిర్మీయా ఇలా అన్నాడు: “తధాస్తు! నిజంగా యెహోవా అలా చేయుగాక! నీవు ప్రవచించిన వర్తమానం యెహోవా నిజం చేయుగాక! బబులోను నుంచి దేవాలయ సంబంధిత వస్తువులన్నీటినీ యెహోవా ఇక్కడికి తీసుకొని వచ్చుగాక! బలవంతంగా తమ ఇండ్లు వదిలి పోయేలా చేయబడిన ప్రజలందరినీ యెహోవా మరల ఇక్కడికి తీసికొని వచ్చుగాక!
JER 28:7 “కాని హనన్యా! నేను చెప్పేది విను. ప్రజలారా, మీరందరు నేను చెప్పేది వినండి.
JER 28:8 హనన్యా! నీవు, నేను ప్రవక్తలం అవటానికి పూర్వం చాలా ముందు కాలంలో ప్రవక్తలుండినారు. చాలా దేశాలకు, మహా సామ్రాజ్యాలకు యుద్ధాలు, కరువులు, భయంకరమైన రోగాలు వస్తాయని వారు చెప్పియున్నారు.
JER 28:9 కాని మనకు సుఖ సంతోషాలు, శాంతి లభిస్తాయని చేప్పే ప్రవక్త నిజంగా యెహోవాచే పంపబడినవాడేనా అని మనం నిర్ధారణ చేయవలసి వుంది. ఆ ప్రవక్త చెప్పినది నిజమయ్యే పక్షంలో, అతడు నిజంగా యెహోవాచే పంపబడిన వాడని ప్రజలు తెలుసుకోవచ్చు.”
JER 28:10 యిర్మీయా ఒక కాడిని తన మెడకు తగిలించుకుని ఉన్నాడు. ప్రవక్త హనన్యా ఆ కాడిని యిర్మీయా మెడనుండి తీసి విరుగగొట్టాడు.
JER 28:11 పిమ్మట అక్కడ చేరిన ప్రజలంతా వినేలా హనన్యా ఇలా బిగ్గరగా చెప్పాడు: “యెహోవా సెలవిచ్చినదేమంటే, ఇదే రీతిని బబులోను రాజు నెబుకద్నెజరు వేసిన కాడిని నేను విరిచి వేస్తాను. అతడు ఆ కాడిని ప్రపంచ దేశాలన్నిటిపై వేశాడు. కాని రెండు సంవత్సరాల కాలంలోపల నేనా కాడిని విరిచివేస్తాను.” హనన్యా అలా చెప్పిన పిమ్మట యిర్మీయా దేవాలయం నుండి వెళ్లి పోయాడు.
JER 28:12 తరువాత యెహోవా సందేశం యిర్మీయాకు వచ్చింది. యిర్మీయా మెడ నున్న కాడిని తీసి హనన్యా విరచి వేసిన తరువాత ఇది జరిగింది.
JER 28:13 యెహోవా యిర్మీయాతో ఇలా చెప్పాడు, “నీవు వెళ్లి హనన్యాతో ఇలా చెప్పుము, ‘యెహోవా ఇలా అంటున్నాడు, నీవు చెక్కతో చేయబడిన కాడిని విరుగగొట్టావు. కాని దానికి బదులు నేనొక ఇనుప కాడిని వేస్తున్నాను.’
JER 28:14 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన అయిన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ దేశాలన్నిటిపైన నేనొక ఇనుప కాడిని వేస్తున్నాను. బబులోను రాజు నెబుకద్నెజరుకు వారంతా దాస్యం చేయాలనే ఉద్దేశంతో నేనలా చేస్తున్నాను. వారు అతనికి బానిసలవుతారు. కృరమృగాలను కూడ అదుపులో పెట్టగల శక్తిని నెబుకద్నెజరుకు ప్రసాదిస్తాను.’”
JER 28:15 అప్పుడు ప్రవక్త యిర్మీయా ప్రవక్త హనన్యా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు, “హనన్యా, వినుము! యెహోవా నిన్ను పంపలేదు. కాని యూదా ప్రజలు అబద్ధాలు నమ్మేలా చేశావు.
JER 28:16 అందువల్ల యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘హనన్యా, త్వరలో నిన్ను ఈ ప్రపంచం నుండి తీసుకొని వెళతాను. ఈ సంవత్సరమే నీవు చనిపోతావు. ఎందువల్లనంటే ప్రజలు యెహోవాకు వ్యతిరేకంగా తిరిగేలా నీవు బోధించావు గనుక.’”
JER 28:17 హనన్యా అదే సంవత్సరం ఏడవ నెలలో చనిపోయాడు. బబులోనులో బందీలుగా ఉన్న యూదులకు లేఖ
JER 29:1 బబులోనులో బందీలుగా వున్న యూదులకు యిర్మీయా ఒక లేఖ పంపాడు. బబులోనులో ఉంటున్న పెద్దలకు (నాయకులు), యాజకులకు, ప్రవక్తలకు, తదితర ప్రజలకు అతడు దానిని పంపాడు. వీరంతా నెబుకద్నెజరుచే యెరూషలేము నుండి బబులోనుకు తీసుకొని రాబడినవారే.
JER 29:2 (రాజైన యెకోన్యా, రాణియగు అతని తల్లి, యూదా, యెరూషలేముల అధికారులు, నాయకులు, వడ్రంగులు, లోహపు పనివారు మొదలైన వారంతా యెరూషలేము నుండి తీసుకొని పోబడీన పిమ్మట ఈ లేఖ పంపబడింది)
JER 29:3 బబులోనులోని రాజైన నెబుకద్నెజరు వద్దకు ఎల్యాశాను, గెమర్యా అనే వారిని యూదా రాజైన సిద్కియా పంపాడు. ఎల్యాశా అనువాడు షాఫాను కుమారుడు. యిర్మీయా తన లేఖను బబులోనుకు తీసుకొని వెళ్లటానికి వారిద్దరికీ ఇచ్చాడు. ఆ లేఖలో యిలా వ్రాయబడివుంది.
JER 29:4 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యోహోవా యెరూషలేము నుండి బబులోనుకు తాను బందీలుగా పంపిన ప్రజలందరి నుద్దేశించి ఈ విషయాలు చెపుతున్నాడు.
JER 29:5 “మీరు ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించండి. ఆ రాజ్యంలో స్థిరపడండీ. తోటలను పెంచి, మీరు పండించిన పండ్లను తినండి.
JER 29:6 వివాహాలు చేసుకొని సంతానవంతులై వర్ధిల్లండి. మీ కుమారులకు కూడ వధువులను వెదకండి. మీ కుమార్తెలకు వివాహాది శుభకార్యాలు చేయండి. వారు కూడ తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకొనే నిమిత్తం మీరలా చేయండి. మీ సంతానాన్ని విస్తరింపజేసి పెంచి బబులోనులో మీరు బాగా వ్యాపించండి. మీ సంఖ్యా బలం తగ్గిపోకూడదు.
JER 29:7 నేను మిమ్ములను పంపిన నగరానికి మీరంతా మంచి పనులు చేయండి. మీరు నివసిస్తున్న నగర శ్రేయస్సుకు మీరు ప్రార్థనలు చేయండి. ఎందువల్లనంటే, ఆ నగరంలో శాంతి నెలకొంటే మీకూ శాంతి లభిస్తుంది.”
JER 29:8 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్పేదేమనగా “మీ ప్రవక్తల, మంత్ర విద్యలు చేసే వారి యొక్క మోసంలో మీరు పడకండి. వారు కనిన కలలను మీరు వినవద్దు.
JER 29:9 వారు అబద్ధాలను బోధిస్తున్నారు. వారు చెప్పే వర్తమానం నానుండి వచ్చినదేనని అంటున్నారు! కాని నేను పంపలేదు!” ఇదే యెహోవా వాక్కు.
JER 29:10 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “బబులోను డెబ్బయి సంవత్సరాల పాటు బలమైన రాజ్యంగా ఉంటుంది. ఆ తరువాత బబులోనులో నివసిస్తున్న మీ వద్ధకు వస్తాను. మిమ్మల్ని తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తానని నేను మీకిచ్చిన నా మంచి వాగ్దానాన్ని నేను నెర వేర్చుతాను.
JER 29:11 ఇది నేనెందుకు చెపుతున్నానంటే మీ అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు.” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం “మీ సంక్షేమం కొరకు నాకు ఎన్నోమంచి ఆలోచనలున్నాయి. మీకు కీడు చేయాలని నేనెన్నడూ ఆలోచించను. మీకు ఆశను, మంచి భవిష్యత్తును కలుగజేయ టానికి వ్యూహరచన చేస్తాను.
JER 29:12 అప్పుడు మీరు నా పేరున నన్ను పిలుస్తారు. మీరు నాదరి చేరి, నన్ను ప్రార్థిస్తారు. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను.
JER 29:13 మీరు నా కొరకు అన్వేషిస్తారు. మీరు మీ హృదయ పూర్వకంగా నా కొరకు వెదకితే, మీరు నన్ను కనుగొంటారు.
JER 29:14 మీరు నన్ను కనుగొనేలా నేనే చేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “పైగా నేను మీకు బంధ విముక్తి కలుగజేసి తిరిగి తీసుకొని వస్తాను. నేనే మిమ్మల్ని ఈ స్థలం వదిలి పెట్టి పోయేలా వత్తిడి చేశాను. కాని మిమ్మల్ని ఏ దేశాలకు, ఏ ప్రాంతాలకు నేను పంపియున్నానో ఆయా ప్రాంతాలనుండి మిమ్మల్నందరినీ నేను తిరిగి కూడదీస్తాను.” ఇదే యెహోవా వాక్కు “మరియు మిమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొని వస్తాను.”
JER 29:15 “అయితే యెహోవా మాకు ఇక్కడ బబులోనులో ప్రవక్తలనిచ్చియున్నాడు” అని మీరు చెప్పవచ్చు.
JER 29:16 కాని బబులోనుకు తీసుకొని పోబడకుండా ఇక్కడే ఉన్న మీ బంధువుల గురించి యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. ఇప్పుడు దావీదు సింహాసనంపై కూర్చున్న రాజును గూరించి, యెరూషలేములో మిగిలి ఉన్న తదితర ప్రజల విషయమై నే మాట్లాడుతున్నాను.
JER 29:17 సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “యెరూషలేములో ఇంకా మిగిలి ఉన్న ప్రజలపైకి నేను త్వరలో కత్తిని, ఆకలిని, భయంకర రోగాలను పంపుతాను. తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె వారిని చేస్తాను.
JER 29:18 యెరూషలేములో ఇంకా వున్న వారిని నేను కత్తితోను, కరువుతోను, రోగాలతోను వెంటాడతాను. ఈ ప్రజలకు సంభవించే భయంకర విపత్తులను చూచి ప్రపంచ రాజ్యాలన్నీ భయభ్రాంతులయ్యేందుకే నేనిది చేయదలచాను. ఆ ప్రజలు నాశనం చేయబడతారు. వారికి సంభ వించిన విపత్తును గురించి విన్న ప్రజలంతా సంభ్ర మాశ్ఛర్యాలతో నిండిపోతారు. ప్రజలు తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికీ జరిగిన రీతిగా జరగాలని కోరుకుంటారు. నేను వారిని ఎక్కడికి బలవంతంగా పంపితే అక్కడ వార అవమానాల పాలవుతారు.
JER 29:19 యెరూషలేము ప్రజలు నా సందేశాన్ని పెడచెవిని పెట్టారు గనుక నేనివన్నీ చేయ సంకల్పించాను.” ఇదే యెహోవా వాక్కు. “నా సందేశాన్ని వారికి అనేక పర్యాయాలు పంపియున్నాను. నా సేవకులైన ప్రవక్తలను నా సందేశం ఆ ప్రజలకు అందజేయటానికి వినియోగించాను. కాని ఆ ప్రజలు వినలేదు.” ఇది యెహోవా వాక్కు.
JER 29:20 “మీరంతా బందీలు. నేనే మిమ్మల్ని యెరూషలేము వదిలి బబులోనుకు పోవల సిందిగా బలవంతం చేశాను. కావున, యెహోవా సందేశం వినండి.”
JER 29:21 సర్వశక్తిమంతుడైన యెహోవా కోలాయా కుమారుడైన అహాబును గురించి, మయశేయా కుమారుడైన సిద్కియాను గురించి ఇలా చెపుతున్నాడు: “ఈ ఇద్దరు మనుష్యులు మీకు అబద్దాలు బోధిస్తున్నారు. వారు చెప్పే సందేశం నానుండి వచ్చినదేనని అంటున్నారు. కాని వారు అబద్ధమాడుతున్నారు. ఆ ఇద్దరు ప్రవక్తలను బబులోను రాజైన నెబుకద్నెజరు అప్పగిస్తారు. అప్పుడు నెబుకద్నెజలుకు బబులోనులో బందీలుగా వున్న మీ అందరి ముందు ఆ ప్రవక్తలను చంపుతాడు.
JER 29:22 యూదా జాతి బందీలంతా తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికి జరిగిన శాస్తి వంటిది జరగాలని కోరుకుంటారు. అనగా శాపగ్రస్తులలో వీరొక ఉదాహరణగా మిగిలి పోతారు. బందీలంతా ఇలా అంటారు: ‘సిద్కియాకు, అహాబుకు పట్టిన గతినే మీకూ యెహోవా పట్టించు గాక! బబులోను రాజు వారిద్దరినీ అగ్నిలో కాల్చివేశాడు!’
JER 29:23 ఆ ప్రవక్తలిద్దరూ ఇశ్రాయేలు ప్రజలమధ్య బహునీచ కార్యాలు చేశారు. తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచారం చేశారు. వారు అబద్ధాలు కూడ చెప్పారు. పైగా వాటిని యెహోవానైన నానుండి వచ్చిన సందేశంగా చెప్పుకున్నారు. ఈ పనులన్నీ చేయమని వారికి నేనెప్పుడు చెప్పియుండలేదు. వారేమి చేశారో నాకు తెలుసు. వాటికి నేనే సాక్షిని.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
JER 29:24 షెమయాకు కూడ ఒక సందేశం ఇవ్వు. షెమయా నెహెలామీయుడు.
JER 29:25 ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు. “షెమయా, నీవు యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, యాజకులందరికీ లేఖలు పంపావు. మయశేయా కుమారుడు, యాజకుడునయిన జెఫన్యాకు నీవు లేఖలు పంపావు. లేఖలన్నీ నీవు నీ పేరుమీదనే పంపావు. అంతేగాని యెహోవా అధికారంతో పంపలేదు.
JER 29:26 షెమయా, నీ లేఖలో జెఫన్యాకు ఇలా చెప్పావు. ‘జెఫన్యా, యెహోవా నిన్ను యెహోయాదా స్థానంలో యాజకునిగా చేశాడు. దేవాలయ నిర్వాహణాధికారం నీవు కలిగి ఉంటావు. పిచ్చివానిలా ప్రవర్తించే ప్రతి వానినీ లేదా ప్రవక్తలా నటించే ప్రతి వానినీ, నీవు నిర్భందించవచ్చు. వానికి నీవు బొండ కొయ్య దండన విధించవచ్చు. వాని మెడకు ఇనుప చక్రం వేసి దానికి గొలుసులు తగిలించవచ్చు.
JER 29:27 ఇప్పుడు యిర్మీయా ప్రవక్తలా ప్రవర్తిసున్నాడు. కావున నీవతనిని ఎందువల్ల నిర్భందించలేదు?
JER 29:28 బబులోనులో వున్న మనకు యిర్మీయా యిలా వర్తమానం పంపాడు. ఇశ్రాయేలు నుండి తీసుకురాబడి బబులోనులో వున్న ప్రజలారా, మీరక్కడ బహుకాలం వుంటారు. కావున ఇండ్లు నిర్మించుకొని స్థిరపడండి. తోటలు పెంచి, మీరు పండించిన పండ్లను తినండి.’”
JER 29:29 ప్రవక్త యిర్మీయాకు ఈ లేఖను యాజకుడైన జెఫన్యా చదివి వినిపించాడు.
JER 29:30 పిమ్మట యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది.
JER 29:31 “యిర్మీయా, ఈ సందేశం బబులోనులో ఉన్న బందీలందరికి పంపించుము ‘నెహెలామీయుడైన షెమయాను గురించి యెహోవా ఇలా అంటున్నాడు. షెమయా మీకు ప్రవచించాడు. కాని నేనతనిని పంపలేదు. షెమయా ఒక అబద్ధాన్ని మీరు నమ్మేలాచేశాడు.
JER 29:32 షెమయా అలా చేసిన కారణంగా యెహోవా యిలా చెప్పుతున్నాడు. నేను త్వరలో నెహెలామీయుడైన షెమయాను శిక్షిస్తాను. పూర్తిగా అతని వంశం నాశనం గావిస్తాను. నా ప్రజలకు నేను చేసే మేలులో అతను పాలుపంచుకోలేడు.’” ఇదే యెహోవా వాక్కు “‘ప్రజలు యెహోవాకు వ్యతిరేకంగా తిరిగేలా షెమయా బోధించాడు గనుక నేను షెమయాను శిక్షిస్తాను.’”
JER 30:1 ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవా నుండి వచ్చింది.
JER 30:2 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్పాడు: “యిర్మీయా, నేను నీతో మాట్లాడిన విషయాలన్నీ ఒక పుస్తక రూపంలో వ్రాయుము. నీవే ఈ పుస్తకాన్ని (పత్రము) రాయాలి.
JER 30:3 ఎందువల్లనంటే, బందీలుగావున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలను నేను తిరిగి తీసుకొనివచ్చే రోజులు వస్తాయి.” ఇది యెహోవా సందేశం: “వారి పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో వారిని నేను మరల స్థిరపడేలా చేస్తాను. మళ్లీ నా ప్రజలు ఆ రాజ్యన్ని స్వంతం చేసుకుంటారు!” ఇదే యెహోవా వాక్కు.
JER 30:4 యెహోవా సందేశాన్ని ఇశ్రాయేలు, యూదా ప్రజలను గూర్చి చెప్పాడు.
JER 30:5 యెహోవా చెప్పినది ఇలా ఉంది: “భయంతో ప్రజలు చేసే ఆక్రందన మనం వింటున్నాం! ప్రజలు భీతావహులయ్యారు! వారికి శాంతి లేదు!
JER 30:6 “ఈ ప్రశ్న అడిగి, దాన్ని గురించి ఆలోచించుము: ఎవడైనా ఒక పురుషుడు బిడ్డను కనగలడా? అసంభవం! అయితే ప్రతి బలవంతుడు పురిటి నొప్పులతో బాధపడే స్త్రీ వలే తన కడుపు పట్టుకొనటం నేనెందుకు చూస్తున్నాను? ఎందువల్ల ప్రతివాని ముఖం శవంలా తెల్లనై వెలవెలబోతుంది? ఎందుకంటే పురుషులు మిక్కిలి భయపడి ఉన్నారు!
JER 30:7 “యూకోబుకు ఇది గొప్ప సంకట సమయం. ఇది బహు కష్ట కాలం. ఇటువంటి కాలం మరి ఉండబోదు. అయినా యాకోబు సంరక్షింపబడతాడు.
JER 30:8 “అప్పుడు నేను ఇశ్రాయేలు, యూదా ప్రజల మెడపై కాడిని విరచి వేస్తాను.” ఇది సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి వచ్చిన వర్తమానం: మిమ్మల్ని బంధించిన తాళ్లను తెంచివేస్తాను. విదేశీయులెవ్వరూ మరెన్నడు నా ప్రజలను బానిసలుగా చేసుకోవాలని బలవంతం చేయరు.
JER 30:9 ఇశ్రాయేలు, యూదా ప్రజలు విదేశాలలో దాస్యం చేయరు. ఎన్నడూ చేయరు! వారి దేవుడైన యెహోవానే వారు సేవిస్తారు. వారి రాజైన దావీదుకు వారు సేవచేస్తారు. ఆ రాజును నేను వారివద్దకు పంపుతాను.
JER 30:10 “కావున నా సేవకుడవైన యాకోబూ, నీవు భయపడవద్దు!” ఇదే యెహవా వాక్కు: “ఇశ్రాయేలూ, భయపడవద్దు! ఆ సుదూర దేశంనుండి నిన్ను నేను రక్షిస్తాను. ఆ దూర దేశంలో మీరు బందీలైవున్నారు. మీ సంతతివారిని ఆ భూమినుండి తిరిగి తీసుకొస్తాను. యాకోబుకు తిరిగి శాంతి సమకూరుతుంది. ప్రజలు యాకోబును బాధ పెట్టరు. నా ప్రజలను భయపెట్టుటకు ఇక శత్రువులుండరు.
JER 30:11 ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, నేను మీతో వున్నాను.!” ఇదే యెహోవా వాక్కు. “నేను మిమ్మల్ని రక్షిస్తాను. నేను మిమ్మల్ని ఆయా దేశాలకు చెదరగొట్టాను. కాని ఆ రాజ్యాలను నేను పూర్తిగా నాశనం చేస్తాను. ఇది నిజం. నేనా దేశాలను నాశనం చేస్తాను. కాని నేను మిమ్మల్ని మాత్రం నాశనం చేయను. అయితే మీరు చేసిన దుష్కార్యాలకు మీరు తప్పక శిక్షింపబడాలి. నేను మిమ్మల్ని బాగ క్రమశిక్షణలోకి తెస్తాను.”
JER 30:12 యెహోవా ఇలా అంటున్నాడు: “ఓ ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీకు బాగుకాని గాయం ఉంది. మీకు తగిలిన దెబ్బ నయం కానిది.
JER 30:13 మీ పుండ్లను గురించి శ్రద్ధ తీసికొనే వ్యక్తి లేడు. అందుచేత మీరు స్వస్థపర్చబడరు.
JER 30:14 మీరనేక దేశాలతో స్నేహం కుదుర్చుకున్నారు. అయినా ఆ రాజ్యాలు మిమ్మల్ని గురించి పట్టించుకోవు. మీ స్నేహితులనబడేవారు మిమ్మల్ని మర్చిపోయారు. ఒక శత్రువువలె మిమ్మల్ని గాయపర్చాను! మిమ్మల్ని చాలా కఠినంగా శిక్షించాను! మీరు చేసిన ఘోరమైన నేరం కారణంగా నేనలా చేశాను. మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేనలాచేశాను.
JER 30:15 ఇశ్రాయేలూ, యూదా! మీ గాయం గురించి ఎందుకు రోదిస్తున్నారు. మీ గాయం బాధాకరమైనది. పైగా దానికి చికిత్స లేదు. ఘోరమైన మీ అపరాధం కారణంగా, యెహోవానైన నేను మీకవన్నీ కలుగజేశాను. మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేను మీకు ఈ కష్టాలు కలుగజేశాను.
JER 30:16 ఆ రాజ్యాలవారు మిమ్మల్ని నాశనం చేశారు. కాని ఇప్పుడా రాజ్యాలే నాశనం చేయబడతాయి. ఇశ్రాయేలూ, యూదా! మీ శత్రువులే బందీలవుతారు! ఆ ప్రజలు మీ ఆస్తిపాస్తులు పొందియున్నాను. కాని ఇతర ప్రజలు వారి ఆస్తిపాస్తులు దోచుకుంటారు. ఆ ప్రజలు యుద్ధంలో మీ వస్తువులను తీసుకున్నారు. అలాగే యితరులు యుద్ధంలో వారి వాస్తువులు తీసుకుంటారు.
JER 30:17 అయినా నేను మీకు మరల ఆరోగ్యం చేకూర్చుతాను. మీ గాయాలన్నీ మాన్పుతాను.” ఇదే యెహవా వాక్కు, “ఎందవల్లననగా అన్యులు మిమ్మల్ని వెలివేసి భ్రష్టులన్నారు. ‘సీయోనును ఎవ్వరూ లెక్కచేయరు’ అని వారన్నారు!”
JER 30:18 యెహవా ఇలా చెప్పుచున్నాడు: “యూకోబు సంతానం ఇప్పుడు బందీలైయున్నారు. కాని వారు తిరిగివస్తారు. యాకోబు నివాసులపై నేను కనికరం కలిగివుంటాను. నగరమంతా కూలిపోయిన భవనాలతో కప్పబడిన కొండలా ఉంది. కాని నగరం మళ్లీ నిర్మింపబడుతుంది. రాజభవనం కూడా దాని యథాస్థానంలో తిరిగి నిర్మింపబడుతుంది.
JER 30:19 ఆ ప్రదేశాలలో ప్రజలు స్తుతిగీతాలు ఆలపిస్తారు. ఉల్లాసమైన నవ్వుల కిలకిలలు వినిపిస్తాయి. వారి సంతానం అభివృద్ధి అయ్యేలా చేస్తాను. ఇశ్రాయేలు, యూదా అల్ప రాజ్యాలుగా ఉండవు. వాటికి కీర్తి ప్రతిష్ఠలు కలుగజేస్తాను. ఎవ్వరూ వారిని చిన్నచూపు చూడరు.
JER 30:20 యాకోబు వంశం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇశ్రాయేలు. యూదా ప్రజలను నేను శక్తివంతులుగా చేస్తాను. అంతేగాదు; వారిని హింసించేవారిని నేను శిక్షిస్తాను.
JER 30:21 వారి స్వజనులలో ఒకడు వారిని నాయకత్వం వహిస్తాడు. ఆ పాలకుడు నా ప్రజలలోనుండే వస్తాడు. నేను పిలిస్తేనే ప్రజలు నావద్దకు రాగలరు. అందుచేత ఆ నాయకుని వావద్దకు పిలుస్తాను. అతడు నాకు సన్నిహితుడవుతాడు.
JER 30:22 మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీ దేవుడనై ఉంటాను.”
JER 30:23 యెహోవా మిక్కిలి కోపంగా ఉన్నాడు! ఆయన ప్రజలను శిక్షించినాడు. ఆ శిక్ష తుఫానులా వచ్చిపడింది. ఆ శిక్ష దుష్టులపైకి పెనుతుఫానులా వచ్చి పడింది.
JER 30:24 తన పథకం ప్రకారం అన్నీ జరిగేవరకు యెహోవా కోపోద్రిక్తుడై ఉంటాడు. ఆ రోజు సంభవించినప్పుడు (అంత్య దినాల్లో) మీరు అర్థం చేసుకుంటారు.
JER 31:1 “ఆ సమయంలో ఇశ్రాయేలు వంశస్థులందరికి నేను దేవుడనై యుందును. వారు నా ప్రజలైయుందురు” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
JER 31:2 యెహోవా ఇలా చెపుతున్నాడు: “శత్రువు యొక్క కత్తికి గురికాకుండా కొంతమంది మిగిలిపోతారు. వారికి ఎడారిలో ఆదరణ లభిస్తుంది. ఇశ్రాయేలు విశ్రాంతికొరకు అన్వేషిస్తూ అక్కడికి వెళ్తుంది.”
JER 31:3 యెహోవా తన ప్రజలకు దూరము నుండి దర్శనమిస్తాడు. ఆయన ఇలా అన్నాడు: “ప్రజలారా మిమ్మల్ని నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. అందుకే నా కృప శాశ్వతంగా మీ పట్ల చూపిస్తూవచ్చాను. నేను మీ పట్ల సదా సత్యంగా ఉంటాను.
JER 31:4 ఓ నా ఇశ్రాయేలు కన్యకా, నిన్ను నేను పునర్నిర్మిస్తాను. నీవు మరల ఒక దేశంలా అవుతావు. నీవు మరలా తంబుర మీటుతావు. వేడుక చేసికొనే ప్రజలందరితో కలిసి నీవు నాట్యం చేస్తావు.
JER 31:5 ఇశ్రాయేలు రైతులారా, మీరు మళ్లీ పంటలు పండిస్తూ, ద్రాక్షాతోటలు పెంచుతారు. సమరయనగర పరిసరాల్లో వున్న కొండలనిండా మీరు ద్రాక్ష తోటలు పెంచుతారు. ఆ ద్రాక్షా తోటల ఫల సాయాన్ని రైతులంతా అనుభవిస్తారు.
JER 31:6 కావలి వారు ఈ వర్తమానాన్ని చాటే సమయం వస్తుంది: ‘రండి మనమంతా సీయోనుకు వెళ్లి మన దేవుడైన యెహోవాను ఆరాధించుదాము!’ కొండల ప్రాంతమైన ఎఫ్రాయిములో కూడ కావలివారు ఆ వర్తమానాన్ని చాటి చెప్పుతారు!”
JER 31:7 యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “సంతోషంగా ఉండండి. యాకోబు కొరకు పాటలు పాడండి! రాజ్యాలలో కెల్ల మేటియైన ఇశ్రాయేలు విషయంలో ఎలుగెత్తి చాటండి. మీ స్తుతి గీతాలు పాడండి! ఇలా చాటి చెప్పండి: ‘యెహోవా తన ప్రజలను కాపాడినాడు! ఇశ్రాయేలు దేశంలో జీవంతో మిగిలిన వారిని యెహోవా రక్షించినాడు!’
JER 31:8 ఉత్తరాన గల దేశం నుండి ఇశ్రాయేలీయులను తీసికొని వస్తానని తెలిసికొనండి. భూమి మీద వివిధ దూర దేశాలలో చెదరియున్న ఇశ్రాయేలును నేను తిరిగి కూడదీస్తాను. వారిలో చాలా మంది గుడ్డి వారు, కుంటివారు అయ్యారు. కొందరు స్త్రీలు నిండు గర్భిణీలై కనటానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది ప్రజలు తిరిగి వస్తారు.
JER 31:9 వారు తిరిగి వచ్చే సమయంలో ఎంతగానో దుఃఖిస్తారు. కాని నేను వారికి మార్గదర్శినై, వారిని ఓదార్చుతాను. నేను వారిని ప్రవహించే సెలయేళ్ల పక్కగా నడిపించుతాను. వారు తూలిపోకుండా తిన్ననైన బాటపై వారిని నడిపిస్తాను. నేనా విధంగా వారికి దారి చుపుతాను. కారణమేమంటే నేను ఇశ్రాయేలుకు తండ్రిని మరియు ఎఫ్రాయిము నా ప్రథమ పుత్రుడు.
JER 31:10 “ఓ రాజ్యములారా (ప్రజలారా), యెహోవా యొక్క ఈ వర్తమానం వినండి! ఈ సందేశాన్ని దూరసముద్రతీర వాసులందరికి తెలియజెప్పండి. ‘ఇశ్రాయేలు ప్రజలను చెల్లా చెదరు చేసిన ఆ సర్వోన్నతుడే తిరిగి వారందరినీ ఒక్క చోటికి కూడదీస్తాడు. గొర్రెల కాపరిలా తన మందను (ప్రజలను) కాచి రక్షిస్తాడు.’
JER 31:11 యెహోవా యాకోబును తిరిగి తీసికొని వస్తాడు. యెహోవా తన ప్రజలను వారి కంటె బలవంతుల బారి నుండి రక్షిస్తాడు.
JER 31:12 ఇశ్రాయేలు ప్రజలు సీయోను కొండ పైకి వస్తారు. వారు ఆనందంతో కేకలు వేస్తారు. యెహోవా వారికి చేసిన అనేక సదుపాయాల కారణంగా వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. యెహోవా వారికి ఆహార ధాన్యాలను, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెను, గొర్రె పిల్లలను, ఆవులను ఇస్తాడు. నీరు పుష్కలంగా లభించే ఒక తోటలా వారు విల్లసిల్లుతారు. ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట ఎంత మాత్రము ఇబ్బంది పెట్టబడరు.
JER 31:13 ఇశ్రాయేలు యువతులంతా సంతోషంతో నాట్యం చేస్తారు. యువకులు, వృద్ధులు నాట్యంలో పాల్గొంటారు. వారి విచారాన్ని సంతోషంగా మార్చుతాను. ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చుతాను! వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చుతాను!
JER 31:14 యాజకులకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. నేనిచ్చే పారితోషికాలతో నా ప్రజలు నిండిపోయి తృప్తి చెందుతారు!” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది!
JER 31:15 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు: “రామాలో రోదన వినవచ్చింది. అది ఒక తీవ్రమైన రోదన; గొప్ప విషాదం. రాహేలు తన పిల్లలు హతులైన కారణంగా ఆమె ఓదార్పు పొందుటకు నిరాకరిస్తుంది.”
JER 31:16 కాని యెహోవా ఇలా అంటున్నాడు: “విలపించుట ఆపి వేయిము. నీవు కంటి తడి పెట్టవద్దు! నీ పనికి తగిన ప్రతిఫలం నీకు దక్కుతుంది!” ఇది యెహోవా సందేశం. “ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రు రాజ్యం నుండి తిరిగి వస్తారు.
JER 31:17 కావున, ఇశ్రాయేలూ, మంచి భవిష్యత్తుకు నీవు ఆశతో ఎదురు చూడుము.” ఇది యెహోవా వాక్కు. “నీ పిల్లలు వారి రాజ్యానికి తిరిగి వస్తారు.
JER 31:18 ఎఫ్రాయిము విలపిస్తున్నట్లు నేను విన్నాను. ఎఫ్రాయిము ఇలా అంటూవుండగా నేను విన్నాను: ‘యెహోవా, నీవు నిజంగా నన్ను శిక్షించావు! నేను మంచి గుణపాఠం నేర్చుకున్నాను. నేనిక ఎన్నడూ తర్భీతు పొందని కోడెదూడలా ఉన్నాను. దయచేసి నన్ను శిక్షించటం మానివేయుము. నేను తిరిగి నీ యొద్దకు వస్తాను. నీవే నిజమైన నా యెహోవా దేవుడవు.
JER 31:19 యెహోవా, నేను నీకు దూరమయ్యాను. కాని నేను చేసిన దుష్కార్యాలను నేను గుర్తించాను. కావున నేను నా జీవన విధానాన్ని మార్చుకొని, హృదయ పరివర్తన కలిగియున్నాను. నా చిన్న తనంలో నేను చేసిన మూర్ఖపు పనులకు సిగ్గుపడి కలవరపడియున్నాను.’”
JER 31:20 దేవుడు ఇలా చెప్పు చున్నాడు: “ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని మీకు తెలుసు. ఆ బిడ్డను నేను ప్రేమిస్తున్నాను. అవును, నేను ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా తరచు మాట్లాడియున్నాను. అయినా నేను అతనిని జ్ఞాపకం చేసికుంటూ ఉంటాను. నేనతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. నేను నిజంగా అతన్ని ఓదార్చ గోరుతున్నాను.” ఇది యెహోవా సందేశం.
JER 31:21 “ఇశ్రాయేలు ప్రజలారా, రహదారి గుర్తులను నెలకొల్పండి. ఇంటి మార్గాన్ని సూచించే గుర్తులను నిలబెట్టండి. మార్గాన్ని కనిపెట్టుకొని ఉండండి. మీరు పయనించే దారిని శ్రద్ధగా పరిశీలిస్తూ ఉండండి. ఇశ్రాయేలూ, నా కన్యకా, ఇంటికి రమ్ము! నీ నగరాలకు తిరిగిరా.
JER 31:22 నీవు విశ్వాసం లేని కుమార్తెవై ఉన్నావు. కాని ఇంకెంత కాలం అక్కడిక్కడ తిరుగుతావు. ఎప్పుడు ఇంటికి వస్తావు? “నీ దేశంలో ఒక నూతనమైన దానిని యెహవా సృష్టించినప్పుడు ఒక స్త్రీ తన పురుషుని ఆవరిస్తుంది.”
JER 31:23 ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “యూదా ప్రజలకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. వారిని తిరిగి నేను నిర్బందము నుండి తీసికొస్తాను. ఆ సమయంలో యూదా రాజ్యంలో దాని నగరాల్లోని ప్రజలు మళ్లీ ఇలా అంటారు: ‘ఓ నీతిగల నివాసమా, ఓ పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను దీవించు గాక!’
JER 31:24 “యూదా పట్టణాలలోని ప్రజలంతా శాంతి యుత సహాజీవనం చేస్తారు. రైతులు, స్థిరంగా లేకుండా తిరిగే పశువుల కాపరులు, అంతా యూదాలో ప్రశాంతంగా కలిసి జీవిస్తారు.
JER 31:25 బలహీనులకు, అలసిపోయిన ప్రజలకు నేను విశ్రాంతిని, బలాన్ని ఇస్తాను. దుఃఖిస్తున్న వారి కోరికను తీరుస్తాను.”
JER 31:26 అది విన్న తరువాత నేను (యిర్మీయా) మేల్కొని చుట్టూ చూశాను. అదెంతో హాయిని గూర్చిన నిద్ర.
JER 31:27 “ఇశ్రాయేలు వంశీయులు, యూదా వంశీయులు అభివృద్ధి చెందేలా నేను సహాయపడే రోజులు వస్తున్నాయి.” ఇది యెహోవా వాక్కు. “వారి సంతానం, వారి పశుసంపద వర్థిల్లేలా కూడా నేను సహాయపడతాను. నేను చేసే ఆ పని ఒక మొక్కను నాటి దానిని పెంచినట్లుగా ఉంటుంది.
JER 31:28 గతంలో ఇశ్రాయేలు, యూదావారు చేసే కార్యకలాపాలపై నేను నిఘా వేసి ఉన్నాను. వారిని మందలించే సమయం కోసం నేను వేచి ఉన్నాను. సమయం వచ్చింది; వారిని చీల్చి చెండాడాను. వారికి అనేక కష్ట నష్టాలు కలుగ జేశాను. కాని ఇప్పుడు వారిని పైకి తీసికొని రావటానికి, వారిని బలపర్చటానికి నేను వారిని గమనిస్తూ ఉన్నాను.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
JER 31:29 “ఆ సమయంలో ప్రజలు ఈ సామెత చెప్పరు: ‘తండ్రులు పుల్లని ద్రాక్ష తిన్నారు, కాని పిల్లల పళ్లు పులిశాయి.’
JER 31:30 కాని ప్రతివాడు తన పాపాల కారణంగా చని పోతాడు. పుల్లని ద్రాక్షా తిన్న వాని పండ్లే పులుస్తాయి.”
JER 31:31 “ఇశ్రాయేలు వంశంతోను, యూదా వంశంతోను నేనొక కొత్త ఒడంబడికను కుదుర్చుకునే సమయం ఆసన్న మవుతూ ఉంది.
JER 31:32 ఇది నేను వారు పూర్వీకులతో చేసికొన్న ఒడంబడిక వంటిది గాదు. వారిని నా చేతితో ఈజిప్టు నుండి నడిపించి తీసికొని వచ్చి నప్పుడు మేమా ఒడంబడిక చేసికొన్నాము. నేను వారి యెహోవాను, కాని వారే ఆ ఒడంబడికను ఉల్లంఘించారు.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
JER 31:33 “భవిష్యత్తులో నేను ఇశ్రాయేలుతో ఈ రకమైన ఒడంబడిక చేసికుంటాను.” ఇదే యెహోవా వాక్కు. “నా బోధనలన్నీ వారి మనస్సులో నాటింప చేస్తాను. పైగా వాటిని వారి హృదయాల మీద రాస్తాను. నేను వారి దేవుణ్ణి. వారు నా ప్రజలై ఉందురు.
JER 31:34 యెహోవాను గురించి తెలిసికొనేందుకు ప్రజలు వారి పొరుగువారికి, బంధువులకు బోధించనక్కరలేదు. ఎందువల్లనంటే అన్ని తరగతుల ప్రజలు తమతమ భేదం లేకుండా నన్ను తెలిసికుంటారు.” ఇదే యెహోవా వాక్కు. “వారు చేసిన చెడ్డ పనులన్నిటినీ నేను క్షమిస్తాను. వారి పాపాలను నేను గుర్తు పెట్టుకోనను.”
JER 31:35 యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “సూర్యుడు పగలు ప్రకాశించేలా యెహోవా చేశాడు. చంద్రుడు, నక్షత్రాలు రాత్రి పూట కాంతిని వెద జల్లేలా యెహోవా చేశాడు. సముద్రాలను ఘోషింపజేసి అలలు తీరాన్ని ముంచెత్తేలా చేసిందీ యెహవాయే. ఆయన పేరే సర్వశక్తి మంతుడగు యెహోవా.”
JER 31:36 యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు: “ఇశ్రాయేలు సంతతి ఒక రాజ్యంగా జాతిగా ఉండుట ఎప్పుడూ మానరు. సూర్య చంద్ర నక్షత్ర సముద్రాలపై నా అదుపు తప్పిన నాడు మాత్రమే వారు రాజ్యాంగా జాతిగా ఉండలేరు.”
JER 31:37 యెహోవా ఇలా చెప్పుతున్నాడు: “ఇశ్రాయేలు సంతతిని నేనెన్నడు తిరస్కరించను. ప్రజలు ఆకాశాన్ని కొలవగలిగిననాడు, వారు భూమి యొక్క సర్వ రహస్యాలను తెలిసికోగలిగిననాడు! నేను ఇశ్రాయేలీయుల సంతతి వారిని తిరస్కరిస్తాను. అప్పుడు మాత్రం వారు చేసిన అకృత్యాల కారణంగా నేను వారిని తిరస్కరిస్తాను” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
JER 31:38 “యెహోవా నిమిత్తం యెరూషలేము నగరం తిరిగి నర్మింపబడే రోజులు వస్తున్నాయి. ఇదే యెహోవా వాక్కు. హనన్యేలు బురుజు నుండి మూల ద్వారం వరకు మొత్తం నగరమంతా తిరిగి కట్టబడుతుంది.
JER 31:39 భూమి కొలత గీత గొలుసు మూల ద్వారం నుండి గారెబు కొండ వరకును, అక్కడ నుండి గోయా అను ప్రదేశం వరకు పరచబడుతుంది.
JER 31:40 శవాలను, బూడిదను పడవేసిన లోయ అంతా యెహోవాకు పవిత్రమైనదిగా ఉంటుంది. తూర్పున వున్న కిద్రోను లోయకు ఎగువనున్న భూములన్ని గుర్రాల ద్వారం వరకు అన్నీ కలపడుతాయి. యెరూషలేము నగరం మరెన్నడు విచ్చిన్నం చేయబడదు. నాశనం చేయబడదు.”
JER 32:1 యూదా రాజైన సిద్కియా పాలనలో పదవ సంవత్సరం గడుస్తు ఉండగా యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా పాలన పదవ సంవత్సరం జరుగుతూ ఉండగా నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరంలో ఇది జరిగింది.
JER 32:2 ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేమును ముట్టడిస్తూ వచ్చింది. (
JER 32:3 యూదా రాజైన సిద్కియా యిర్మీయాను ఆ ప్రదేశంలో ఖైదు చేశాడు. యిర్మీయా, చెప్పిన భవిష్యవాణి సిద్కియాకు నచ్చలేదు. యిర్మీయా ఇలా చెప్పాడు: “యెహోవా ఇలా అన్నాడు, ‘యెరూషలేమునగరాన్ని నేను త్వరలో బబులోను రాజుకు ఇవ్వబో తున్నాను. నెబుకద్నెజరు ఈ నగరాన్ని స్వధీనపర్చుకుంటాడు.
JER 32:4 కల్దీయుల సైనికుల నుండి యూదా రాజైన సిద్కియా తప్పించుకోలేడు. అతడు నిశ్చయంగా బబులోను రాజుకు అప్పగించబడతాడు. సిద్కియా బబులోను రాజుతో ఎదురుపడి ముఖాముఖిగా మాట్లాడుతాడు. సిద్కియా స్వయంగా అతనిని తన కన్నులతో చూస్తాడు.
JER 32:5 బబులోను రాజు సిద్కియాను బబులోనుకు తీసికొని పోతాడు. సిద్కియాను. నేను శిక్షించేవరకు అతనక్కడ ఉంటాడు.’ ఇదే యెహోవా వాక్కు. ‘నీవు కల్దీయుల సైన్యంతో పోరాడినా నీవు గెలవలేవు.’”)
JER 32:6 యిర్మీయా బందీగా వుండగా అతనిలా చెప్పాడు, “యెహోవా సందేశం నాకు అందినది. ఆ సందేశం ఇలా ఉంది:
JER 32:7 నీ పినతండ్రి కుమారుడైన హనమేలు త్వరలో నీ వద్దకు వస్తాడు. అతడు నీ తండ్రి సోదరుడైన షల్లూము కుమారుడు హనమేలు నీ వద్దకు వచ్చి. ‘అనాతోతు వద్ధ నున్న తన పొలం కొనమని నిన్ను అడుగుతాడు. నీవు అతని దగ్గరి బంధువు గనుక తన పొలం కొనమని అడుగుతాడు. ఆ పొలాన్ని కొనటానికి నీకు హక్కు ఉన్నది. అది నీ బాధ్యత అయి కూడ ఉంది’ అని అంటాడు.
JER 32:8 “తరువాత యెహోవా చెప్పినట్లే జరిగింది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు రక్షక భటుని ఆవరణలోనున్న నా యొద్దకు వచ్చాడు. హనమేలు నాతో ఇలా అన్నాడు, ‘యిర్మీయా, అనాతోతు పట్టణం వద్ద నున్న నా పొలాన్ని కొను. ఆ పొలం బెన్యామీను వంశం వారి రాజ్యంలో వుంది. నీవా పొలం కొనుగోలు చేయి. ఎందుకంటే అది నీవు కొని స్వంతం చేసికొనే హక్కు నీకుంది.’” అయితే ఇది యెహోవా నుండి వర్తమానం అని నాకు అర్థమయ్యింది.
JER 32:9 అనాతోతు వద్ద వున్న పొలాన్ని నా పినతండ్రి కుమారుడైన హ నమేలు నుండి కొన్నాను. దాని వెలగా పదునేడు తులాల వెండిని తూచి ఇచ్చినాను.
JER 32:10 క్రయ దస్తావేజు మీద సంతకం చేశాను దాని ప్రతినొక దానిని తీసికొని ముద్రవేయించాను. ఇందుకు సాక్షులను కూడా నియమించాను. వారి ఎదుట వెండిని తూచ్చాను.
JER 32:11 మడత పెట్టి ముద్ర వేసిన దస్తావేజును, ముద్ర వేయించి దాని ప్రతిని నేను తీసికున్నాను.
JER 32:12 తరువాత వాటిని నేను బారూకునకు ఇచ్చినాను. బారూకు అనేవాడు నేరీయా కుమారుడు. నేరీయా అనేవాడు మహసేయా అను వాని కుమారుడు. ముద్ర వేసి మూసిన క్రయ దస్తావేజులో నేను పొలం ఖరీదు చేసిన నియమ నిబంధనావళి ఉంది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు, మరియు ఇతర సాక్షుల యొదట నేనా దస్తావేజులను బారూనకు ఇచ్చాను. ఆ సాక్షులు కూడా దస్తావేజుల మీద సంతకాలు చేశారు. ఆ ఆవరణలో కూర్చుని వున్న అనేక మంది యూదా ప్రజలు కూడా నేను బారుకునకు దస్తావేజులను అప్పగించటం చూశారు.
JER 32:13 ఆ ప్రజలంతా చూస్తూ ఉండగా, నేను బారూకుతో ఇలా చెప్పాను:
JER 32:14 “సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పుచున్నాడు: ‘ముద్ర వేసిన, ముద్ర వేయని దస్తావేజుల రెంటిని నీవు తీసికొని ఒక మట్టి కుండలో భద్రం చేయుము. ఆ దస్తావేజులు ఎక్కువ కాలం సురక్షితంగా ఉండేలాగున నీవు ఆ విధంగానే చేయుము.’
JER 32:15 ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడునగు యెహోవా ఇలా అంటున్నాడు: ‘భవిష్యత్తులో నా ప్రజలు తిరిగి ఇండ్లను, పొలాలను, ద్రాక్షతోటలను ఇశ్రాయేలులో కొనుగోలు చేస్తారు.’”
JER 32:16 నేరీయా కుమారుడైన బారూకునకు దస్తావేజులను ఇచ్చిన పిమ్మట నేను దేవుని ప్రార్థించాను. నేనిలా అన్నాను:
JER 32:17 “యెహోవా నా దేవా, చాపబడిన నీ బల ప్రభావాలచే నీవీ భూమ్యాకాశాలను సృష్టించావు. తిరుగులేని నీ మహిమచే వాటిని నీవు సృష్టించినావు. నీవు చేసే పనులలో నీకు ఆశ్చర్యకరమైనది, అసాధ్యమైనది ఏదియు లేదు.
JER 32:18 యెహోవా, నీవు వేలాది ప్రజలకు దయా మయుడవు, నమ్మకస్తుడవు అయివున్నావు. కాని పెద్దల తప్పులకు వారి పిల్లలను కూడా శిక్షింపగలవాడవు. మహోన్నతుడవు, శక్తి సంపన్నుడవు, సర్వశక్తిమంతుడైన యెహోవా అని నీకు పేరు.
JER 32:19 దేవా, నీవు యోచించి ఘనమైన కార్యాలు సాధిస్తావు. ప్రజలు చేసే ప్రతీ పనినీ నీవు చూస్తావు. మంచి పనులు చేసేవారికి ప్రతిఫలాలిస్తావు. చెడుకార్యాలు చేసే వారికి తగిన శిక్ష విధిస్తావు.
JER 32:20 యెహోవా, ఈజిప్టు రాజ్యంలో నీవు అమోఘమైన అద్భుతాలు జరిపించినావు. ఈ నాటి వరకు నీవు నీ శక్తివంతమైన కార్యాలు జరిపిస్తూనే ఉన్నావు. ఆ పనులు నీవు ఇశ్రాయేలులో మాత్రమే గాక, నీ ప్రజలు ఎక్కడ వుంటే అక్కడ నీవా అధ్భత కార్యాలు చేశావు. వీటి కారణంగా నీవు మిక్కిలి ఘనత వహించినావు.
JER 32:21 యెహోవా, నీవు ఎన్నో మహాశక్తిగల అధ్భుతాలు జరిపించి, ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి బయటికి తీసికొని వచ్చావు. నీ శక్తవంతమైన హస్తాన్ని వినియోగించి నీవీ పనులు చేశావు! నీ శక్తి అశ్ఛర్యాన్ని కలుగ జేస్తూఉంది!
JER 32:22 “యెహోవా, నీవీ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకిచ్చావు. ఈ దేశాన్ని ఇస్తానని వారి పితరులకు నీవు ఏనాడో వాగ్దానం చేశావు. ఈ దేశం మిక్కిలి చాలా మంచిది. ఇది ఎన్నో మంచి వస్తువులతో నిండివున్నది.
JER 32:23 ఇశ్రాయేలీయులు ఈ దేశంలోనికి వచ్చి దీనిని వారు స్వంతం చేసికున్నారు. కాని ఆ ప్రజలే నీకు విధేయులు కాకుండా పోయారు. వారు నీ బోధనలను అనుసరించ లేదు. నీవు ఆజ్ఞాపించినట్లు వారు నడుచుకోలేదు. అందువల్లనే ఇశ్రాయేలు ప్రజలకు ఈ భయంకర మైనవన్నీ జరిగేటట్టు నీవు చేశావు.
JER 32:24 “మరియు ఇప్పుడు శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు. యెరూషలేము నగర ప్రాకారం చుట్టూ దిమ్మలు, మెట్లు నిర్మిస్తున్నారు. తద్వారా వారు నగరపు గోడలు సులభంగా ఎక్కి నగరాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు. శత్రువుల కత్తుల మూలంగా కరువులు, రోగాలు మొదలైన ఈతి బాధల కారణంగా, కల్దీయుల సైన్యం యోరూషలేము నగరాన్ని ఓడిస్తుంది. ఇప్పుడు బబులోను సైన్యం నగరాన్ని ఎదుర్కొంటూ వుంది! యెహోవా, ఇది జరుగుతుందని నీవు చెప్పావు. పైగా అది నీవు చూస్తూ వుండగానే జరుగుతూ ఉంది.
JER 32:25 “నా యెహోవా ప్రభువా, ఆపద ముంచుకు వస్తున్నది. కాని, నీవు నాతో, ‘యిర్మీయా, వెండినిచ్చి పొలం కొనమనీ, ఆ కొనుగోలుకు సాక్షులను నియమించ!’ మనీ చెపుతున్నాను. కల్దీయుల సైన్యం నగరాన్ని కైవసం చేసికోడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నీవు నాకీ విషయం చెపుతున్నావు. నా ధనం అలా ఎందుకు వృధా చేయాలి?”
JER 32:26 అప్పుడు యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది:
JER 32:27 “యిర్మీయా, నేనే యెహోవాను, ఈ భూమి మీద ప్రతి వానికి నేనే దైవాన్ని. యిర్మీయా, నాకు అసాధ్యమైనదేదీ లేదని నీకు తెలుసు.”
JER 32:28 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “యెరూషలేము నగరాన్ని నేను అతి త్వరలో కల్దీయుల సైన్యానికి, బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. ఆ సైన్యం నగరాన్ని పట్టుకుంటుంది.
JER 32:29 కల్దీయుల సైన్యం ఇప్పటికే యెరూషలేము నగరాన్ని! ఎదుర్కొంటూ వుంది. వారు త్వరలో నగరం ప్రవేశించి నిప్పు పెడతారు. వారీ నగరాన్ని తగులబెడతారు. బూటకపు దేవతైన బయలుకు ప్రజలు ఇండ్ల పైకప్పులపై బలులు అర్పించారు. అలా నాకు కోపం తెప్పించిన కొన్ని ఇండ్లు ఈ నగరంలో వున్నాయి. విగ్రహాలకు మద్యం సమర్పించి పూజించిన వారు కూడ ఉన్నారు. ఆ నివాసములన్నిటినీ కల్దీయుల సైన్యం తగుల బెడుతుంది.
JER 32:30 ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను నేను గమనిస్తూవున్నాను. వారు చేసే ప్రతీదీ దుష్టకరమైనది! వారి చిన్నతనం నుండి వారు చెడు కార్యాలకు పాల్పడ్డారు. ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం తెప్పించారు. చేతులతో చేసిన విగ్రహాలను పూజించి ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం కలుగజేశారు!” ఇది యెహోవా వాక్కు.
JER 32:31 “యెరూషలేము కట్టబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నగర ప్రజలు నాకు కోపం కల్గిస్తూనే ఉన్నారు. ఈ నగరం నాకెంతో కోపం తెప్పించింది. కావున నేను దానిని నా దృష్టి పథం నుండి తొలగిస్తాను.
JER 32:32 ఇశ్రాయేలు, యూదా ప్రజలు చేసిన చెడు కార్యాల కారణంగా నేను యెరూషలేము నగరాన్ని నాశనం చేస్తాను. ప్రజలు, రాజులు, నాయకులు, వారి యాజకులు, ప్రవక్తలు, యూదాప్రజలు, యెరూషలేము నగర వాసులు అందరూ నాకు కోపం కలుగజేశారు.
JER 32:33 “ఆ ప్రజలు సహాయం కొరకు నన్ను చేరవలసింది. కాని వారు నాకు విముఖులైనారు. వారికి నేను పదే పదే బుద్ధి చెప్ప చూశాను. కాని వారు నా మాట వినిపించుకోలేదు. నేను వారిని సరిజేయ చూశాను. అయినా వారు పట్టించుకోలేదు.
JER 32:34 వారు విగ్రహాలను చేస్తూనే వచ్చారు. నేనా విగ్రహాలను ఏవగించుకున్నాను. పైగా నా పేరు మీద పిలవబడే ఆలయంలో వారా విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ విధంగా వారు నా మందిరాన్ని ‘అపవిత్రం’ చేశారు.
JER 32:35 “బెన్‌హిన్నోము లోయలో వారు బూటకపు దేవత బయలుకు ఉన్నత పూజా స్థలాలు ఏర్పాటు చేశారు. వారా పూజా స్థలాలలో తమ కుమారులను, కుమార్తెలను శిశు బలులుగా మొలెకుకు సమర్పించటానికి ఏర్పాటు చేశారు. అటువంటి భయంకరమైన పని చేయమని నేనెప్పుడు ఆజ్ఞ ఇవ్వలేదు! అటువంటి ఘోరమైన పని యూదా ప్రజలు చేస్తారని కూడా నేనెప్పుడు అనుకోలేదు!
JER 32:36 “మీ ప్రజలిలా అంటున్నారు, ‘బబులోను రాజు యెరూషలేమును పట్టుకుంటాడు. అతడు కత్తని వినియోగిస్తాడు. కరువు, రోగాలు ఆవరిస్తాయి. ఈ నగరాన్ని ఓడించటానికి అతనికి అవి తోడ్పడుతాయి.’ కాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు:
JER 32:37 ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలను తమ దేశం వదిలి పోయేలా నేనే ఒత్తిడి చేశాను. నేను వారి పట్ల మిక్కిలి కోపగించియున్నాను. కాని వారందరిని నేను మరల ఈ ప్రదేశానికి తీసికొని వస్తాను! నేను బలవంతంగా పంపిన అన్ని దేశాల నుండి వారిని మరల కూడదీస్తాను. కూడదీసి ఈ దేశానికి మరల తీసికొనివస్తాను. వారు శాంతి కలిగి జీవించేలా చేస్తాను.
JER 32:38 ఇశ్రాయేలు, యూదా ప్రజలు నా ప్రజలుగా వర్ధిల్లుతారు. నేను వారి దేవుడనవుతాను.
JER 32:39 వాస్తవంగా వారంతా ఒకే ప్రజగా జీవించాలనే ఆకాంక్ష నేను వారిని కలిగిస్తాను. వారంతా తమ జీవితాంతం నిజంగా నన్నే ఆరాధించాలనే ధ్యేయ్యం కలిగివుంటారు. నన్ను ఆరాధించి, గౌరవించటం వారికిని, వారి పిల్లలకు మంచిని చేస్తుంది.
JER 32:40 “‘ఇశ్రాయేలు, యూదా ప్రజలతో నేనొక ఒడంబడిక కుదుర్చుకుంటాను. ఈ నిబంధన శాశ్వతంగా ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం నేనెప్పుడూ వారికి దూరం కాను. నేను వారికెప్పుడు సుముఖంగా ఉంటాను. వారు నన్ను గౌరవించాలనే కోరికతో ఉండేలా చేస్తాను. వారిక ఎన్నడూ నాకు విముఖులు కారు.
JER 32:41 వారు నన్ను సంతోష పర్చుతారు. వారికి మేలు చేయటానికి నేనెంతో ఉత్సాహం చూపిస్తాను. వారిని ఖచ్చితంగా ఈ దేశంలో నాటి వారు బాగా ఎదిగేలా తోడ్పడతాను. ఇది నా పూర్ణ హృదయంతోను, ఆత్మ సాక్షిగాను చేస్తాను.’”
JER 32:42 యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఈ మహా విపత్తును నేనే సంభవింపజేశాను. అదే మాదిరి నేను వారికి మేలు కూడా చేస్తాను. వారికి శుభం కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాను.
JER 32:43 ప్రజలు, ఈ దేశం వట్టి ఎడారి భూమి. ఇందులో మనుష్యులు, లేరు జంతువులు గాని లేవు. కల్దీయుల సైన్యం ఈ దేశాన్ని నాశనం చేసింది లేదు. అని అనుకుంటాను. కాని భవిష్యత్తులో ప్రజలు మళ్లీ ఇక్కడ పొలాలు కొంటారు.
JER 32:44 ప్రజలు తమ ధనాన్ని వెచ్చించి పంట భూములు కొంటారు. ప్రజలు తమ క్రయదస్తావేజులపై సంతకాలు చేసి వాటిపై ముద్రలు వేసి భద్ర పరుస్తారు. ప్రజలు తమ దస్తావేజులపై సంతకాలు చేయునట్లు సాక్షులను నియమిస్తారు. బెన్యామీను వంశస్తులు నివసించే ప్రాంతంలో కూడా ప్రజలు మళ్లీ భూములు కొంటారు వారు యెరూషలేము చుట్టుపట్ల పొలాలు కొంటారు. వారు యూదా పట్టణ ప్రాంతాలలోను, మన్య ప్రాంతాల లోను, పడమటి కొండవాలు ప్రాంతంలోను, మరియు దక్షిణ ఎడారి ప్రాంతంలోను భూములు కొంటారు. మీ ప్రజలందరిని నేను తిరిగి స్వదేశానికి తీసికొని వస్తాను. గనుక ఇదంతా జరుగుతుంది.” ఈ సందేశం యెహోవా నుండి వచ్చినది.
JER 33:1 యెహోవా నుండి సందేశం రెండవసారి యిర్మీయాకు వచ్చింది. యిర్మీయా ఇంకను రక్షక భటుని ఆవరణలో బందీయైయున్నాడు.
JER 33:2 యెహోవా భూమిని సృష్టించాడు. ఆయన దానిని సురక్షితంగా ఉంచుతాడు. ఆ సృష్టికర్త పేరే యెహోవా! యెహోవా ఇలా అంటున్నాడు:
JER 33:3 “ఓ యూదా, నన్ను ప్రార్థించు. నేను నీకు జవాబిస్తాను. నేను నీకు అతి ముఖ్యమైన రహస్యాలను తెలియజేస్తాను. అవి నీవు ముందెన్నడు విని ఎరుగవు.
JER 33:4 యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెరూషలేములోని ఇండ్ల విషయం, యూదా రాజుల భవనాల గురించి యెహోవా ఈ విషయాలు తెలియజేస్తున్నాడు శత్రువు ఆ ఇండ్లను నేల మట్టం చేస్తాడు. శత్రువు నగర గోడల చుట్టూ పై వరకు దిమ్ములు నిర్మిస్తాడు. శత్రువు కత్తి పట్టి ఈ నగరాల ప్రజలతో యుద్ధం చేస్తాడు.
JER 33:5 “యెరూషలేము నగరంలో ప్రజలు చాలా చెడు కార్యాలు చేశారు. వారి పట్ల నేను చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ పట్టణానికి విముఖుడనైనాను. కావున వారిలో చాలా మందిని చంపివేస్తాను. కల్దీయుల సైన్యం యెరూషలేముతో యుద్ధానికి వస్తుంది. యెరూషలేము నగరంలోని ఇండ్లలో అనేక మంది శవాలు పడి ఉంటాయి.
JER 33:6 “కాని ఆ నగరంలోని ప్రజలను నేను స్వస్థపరచి వారికి ఉపశమనం కలుగజేస్తాను. వారు శాంతి, రక్షణ కలిగి ఉండేలా చేస్తాను.
JER 33:7 యూదాను, ఇశ్రాయేలును గతంలో మాదిరిగా మిక్కిలి బలపడేలా చేస్తాను.
JER 33:8 వారు నాకు విరోధంగా పాపం చేశారు కాని నేను ఆ పాపాన్ని కడిగి వేస్తాను. నాకు విరోధంగా వారు పోరాడారు కాని వారిని క్షమిస్తాను.
JER 33:9 అప్పుడు యెరూషలేము ఒక అద్భుతమైన స్థలంగా మారి పోతుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇతర దేశాల ప్రజలు దిగ్భ్రాంతులవుతారు. మరియు నేను ఇశ్రాయేలీయులకు కలుగజేసే క్షేమాన్ని విశ్రాంతిని చూచి వణకుతారు. అనేక మంచి పనులు జరగడం గురించి వారు విన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇతర రాష్ట్రాల వారు నేను ఇశ్రాయేలుకు అనుగ్రహించిన మంచి వాటిని గురించి వింటారు.
JER 33:10 “ప్రజలారా మీరిలా అంటున్నారు, ‘మా దేశంవట్టి ఎడారి అయిపోయింది. మనుష్యులు గాని, జంతుజాలం గాని ఏదీ ఇక్కడ నివసించటం లేదు.’ యెరూషలేము వీధులలోను, యూదా పట్టణాలలోను ఇప్పుడు ప్రశాంతత నెలకొన్నది. కాని త్వరలో అక్కడ సందడి ఏర్పడుతుంది.
JER 33:11 అక్కడ తిరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వధూవరుల వేడుకలు నెలకొంటాయి. దేవాలయానికి కానుకలు తెచ్చే జన సందోహాల సందడి వినిపిస్తుంది. ‘సర్వశక్తిమంతుడయిన యెహోవాకు జయగీతం పాడండి! యెహోవా దయామయుడు. ఆయన కరుణ శాశ్వతంగా మనకు లభిస్తుంది!’ అని ప్రజలు అంటారు. యూదాకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. గనుక ప్రజలా మాటలు చెపుతారు. అప్పుడు యూదా తన పూర్వ వైభవం తిరిగి నెలకొంటుంది.” ఇదే యెహోవా వాక్కు.
JER 33:12 సర్వశక్తిమంతుడయిన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ప్రదేశం ఇప్పుడు ఖాళీగా వుంది. ఇది నిర్మానుష్యంగా, జంతు సంచారం కూడ లేకుండా ఉంది. కాని యూదా పట్టణాలన్నీ ప్రజలతో నిండిపోతాయి. గొర్రెల కాపరులుంటారు. పచ్చిక బయళ్లు మళ్లీ చిగురిస్తాయి. మందలు పచ్చిక మేసి హాయిగా వాటిలో విశ్రమిస్తాయి.
JER 33:13 గొర్రెలు తమ ముందు నడుస్తూ ఉండగా, కాపరులు వారి గొర్రెలను లెక్కిస్తారు. మన్యం ప్రాంతంలో, పచ్చిమ కొండవాలు ప్రాంతంలో, నెగేవు ఎడారి ప్రాంతంలో, ఇంకా యూదా పట్టణాలన్నిటిలో ప్రజలు తమ తమ గొర్రెలను లెక్కపెట్టుకుంటూ ఉంటారు.”
JER 33:14 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేసియున్నాను. నేనిచ్చిన మాట నెరవేర్చుకునే సమయం ఆసన్నమవుతూ వుంది.
JER 33:15 ఆ సమయంలో దావీదు వంశం నుండి ఒక మంచి ‘కొమ్మ’ చిగురించి పెరిగేలా చేస్తాను. ఆ మంచి ‘కొమ్మ’ (రాజు) దేశానికి ఏది మంచిదో, ఏది నీతి దాయకమో అది చేస్తుంది.
JER 33:16 ఈ ‘కొమ్మ’ చిగిర్చిన కాలంలో యూదా ప్రజలు రక్షింపబడతారు. యెరూషలేములో ప్రజలు సురక్షితంగా జీవిస్తారు. ఈ కొమ్మ పేరు ‘యెహోవాయే మా నీతి.’”
JER 33:17 యెహోవా ఇలా చెపుతున్నాడు, “దావీదు వంశంలోని ఒక వ్యక్తి సదా సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయులను పరిపాలిస్తాడు.
JER 33:18 లేవీయుల వంశంలోనివారే ఎల్లప్పుడూ యాజకులుగా ఉంటారు. ఆ యాజకులు సదా నా ఎదుట నిలచి నాకు దహన బలులు, ధాన్యార్పణలు, బలులు అర్పిస్తారు.”
JER 33:19 యిర్మీయాకు యెహోవా నుండి ఈ వర్తమానం వచ్చింది.
JER 33:20 యెహోవా ఇలా అన్నాడు: “నాకు రాత్రింబవళ్లతో ఒక ఒడంబడిక ఉంది. అవి అలా ఎల్లప్పుడూ సరైన సమయంలో వస్తాయి. ఆ ఒడంబడికను మీరు మార్చలేరు! దివారాత్రులు క్రమం తప్పక అలా వస్తూనే ఉంటాయి. మీరా నిబంధన మార్చగల్గిననాడు,
JER 33:21 నా సేవకుడైన దావీదు, నా సేవకులైన లేవీయులతో యాజకులతో నా ఒడంబడికను కూడా మార్చగల్గుతారు. అప్పుడు దావీదు వంశంలోని వారు రాజులు కాలేరు. లేవీ వంశం వారు యాజకులు కాలేరు.
JER 33:22 కాని నేను నా సేవకుడైన దావీదు వంశం, లేవీ వంశం అభివృద్ధి పొందేలా చేస్తాను. ఆకాశంలో నక్షత్రాల్లా వారి సంతతి వృద్ధి పొందుతుంది. ఆ నక్షత్రాలను ఎవ్వరూ లెక్కపెట్టలేరు. మరియు వారి సంతానం సముద్ర తీరాన గల ఇసుక రేణువుల్లా వృద్ధి పొందుతుంది. ఆ ఇసుక రేణువులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు.”
JER 33:23 యిర్మీయా ఈ వర్తమానాన్ని యెహోవా నుండి విన్నాడు:
JER 33:24 “యిర్మీయా, ప్రజలేమను కుంటున్నారో నీవు విన్నావా? ‘యెహోవా ఇశ్రాయేలు, యూదా రెండు వంశాల వారికి విముఖుడయాడు. యెహోవా వారిని ముందు ఎన్నుకున్నాడు. కాని ఇప్పుడాయన వారిని తిరస్కరించాడు.’ వారు మా ప్రజలను ఎంతగా ద్వేషస్తున్నారంటే, మా ప్రజలు ఒక రాజ్యంగా కూడా అంగీకరించటం లేదు.”
JER 33:25 అయితే యెహోవా ఇలా అంటున్నాడు: “దివారాత్రులతో నా ఒడంబడిక కొనసాగకపోతే, భూమ్యాకాశాలకు సంబంధించిన న్యాయసూత్రాలను నేను చేయకపోతే, బహుశః నేనా ప్రజలను వదిలి వేస్తాను.
JER 33:26 బహుశః అప్పుడు యాకోబు సంతతి నుండి నేను దూరంగా ఉంటాను. బహుశః అప్పుడే నేను దావీదు వంశం వారు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారిని ఏలకుండా చేస్తాను. కానీ నిర్బంధంలో నుండి వారిని మరలా వారి స్వదేశానికి తెస్తాను. ఆ ప్రజల పట్ల దయగలిగి ఉంటాను.”
JER 34:1 యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముతోను, దాని చుట్టు పట్ల నున్న పట్టణాలతోను యుద్ధం చేసే సమయంలో ఈ వర్తమానం వచ్చింది. నెబుకద్నెజరు పాలన కింద ఉన్న మహా సామ్రాజ్యంలోని దేశాల, సామంతుల సైన్యంతో పాటు తన సైన్యం యావత్తూ నెబుకద్నెజరుతో యెరూషలేమును ముట్టడించుటకు కదలి వచ్చింది.
JER 34:2 ఆ వర్తమానం ఇలా వుంది: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యిలా అంటున్నాడు: యిర్మీయా, యూదా రాజైనా ‘సిద్కియా వద్దకు వెళ్లి ఈ సందేశాన్ని అందజేయి: సిద్కియా, యెహోవా ఈ విధంగా తేలియ జెప్పుచున్నాడు: యెరూషలేము నగరాన్ని అతి త్వరలో నేను బబులోను రాజుకు ఇవ్వబోతున్నాను. అప్పుడతను దానిని తగలబెడతాడు!
JER 34:3 సిద్కియా, బబులోను రాజు నుండి నీవు తప్పించుకోలేవు. నీవు ఖచ్చితంగా పట్టుబడి అతనికి అప్పగింపబడతావు. బబులోను రాజును నీ కళ్లతో స్వయంగా చూస్తావు.! అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతాడు. నీవు బబులోనుకు వెళతావు.
JER 34:4 కాని, యూదా రాజువైన సిద్కియా! యెహోవా వాగ్దానం శ్రద్ధగా వినుము. నిన్ను గురించి యెహోవా యిలా చెప్పుచున్నాడు: నీవు కత్తిచేత చంపబడవు.
JER 34:5 నీవు ప్రశాంతంగా చనిపోతావు. నీ కంటె ముందు ఏలిన రాజులైన నీ పూర్వీకులు చనిపోయినప్పుడు వారి గౌరవార్థం ప్రజలు దహన సంస్కారాలు జరిపినారు. అదే రీతిగా ప్రజలు నీ గౌరవార్థం కూడా దహన క్రియలు జరుపుతారు. వారు నీ కొరకు విలపిస్తారు. “అయ్యో, మా నాయకుడా!” అని విచారిస్తారు. నాకై నేనే ఈ వాగ్దానం చేస్తున్నాను.’” ఇదే యెహోవా వాక్కు.
JER 34:6 యెహోవా యొక్క ఈ సమాచారాన్ని యెరూషలేములో వున్న సిద్కియాకు యిర్మీయా ఇచ్చాడు.
JER 34:7 అది బబులోను సైన్యం యెరూషలేముతో యుద్ధం చేస్తున్న సమయం. కైవసం చేసికొనని యూదా నగరాలతో కూడ బబులోను సైన్యం పోరాడుతూ ఉంది. అవి లాకీషు, అజేకా అనే నగరాలు. చుట్టూ ప్రాకారాలతో పటిష్టం చేయబడిన యూదా రాజ్య నగరాలలో అవి రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి.
JER 34:8 హెబ్రీ బానిసలకు స్వేచ్ఛ నివ్వాలని రాజైన సిద్కియా యెరూషలేము ప్రజలందరితో ఒక ఒడంబడిక చేశాడు. సిద్కియా ఆ ఒడంబడిక చేసిన పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినవచ్చింది.
JER 34:9 ప్రతి పౌరుడు తనవద్ద ఉన్న హెబ్రీ బానిసలను విడుదల చేయవలసి ఉంది. స్త్రీ పురుష భేదం లేకుండ హెబ్రీ బానిసలందరూ విడుదల చేయబడాలి. యూదా వంశీయులలో ఎవ్వరినీ ఏ ఒక్కరూ బానిసగా ఉంచుకోరాదు.
JER 34:10 అందువాల్ల యూదా నాయకులు, ప్రజలు ఈ ఒడంబడికకి అంగీకరించారు. ప్రతి పౌరుడు తన వద్దగల హెబ్రీ స్త్రీ, పురుష బానిసలను విడుదలచేయాలి. వారిని ఎంత మాత్రము బానిసలుగా పని చేయించరాదు. అందుకు ప్రతి పౌరుడు ఒప్పుకున్నాడు. దానితో బానిసలంతా స్వేచ్ఛగా వదిలివేయబడ్డారు.
JER 34:11 కాని ఆ తరువాత బానిసల యజమానులంతా తమ మనస్సు మార్చుకున్నారు. వారు స్వేచ్ఛగా వదిలిన బానిసలందరినీ మరల బానిసలుగా నియమించుకొన్నారు.
JER 34:12 పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు చేరింది:
JER 34:13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “‘యిర్మీయా, బానిసలుగా ఉన్న మీ పూర్వీకులకు ఈజిప్టు నుండి నేను తీసుకొని వచ్చాను. నేనా పని చేసినప్పుడు, వారితో నేనొక నిబంధన చేసినాను.
JER 34:14 మీ పితరులతో నేనిలా చెప్పాను: “ప్రతి ఏడు సంవత్సరాల అనంతరం ప్రతి పౌరుడు తన వద్ద ఉన్న హెబ్రీ బానిసలను వదిలి వేయాలి. మీకు అమ్ముడు పోయిన మీ సాటి హెబ్రీయుడు మీ వద్దనుంటే, అతడు ఆరు సంవత్సరాల పాటు సేవ చేసినాక అతనిని మీరు వదిలివేయాలి.” కాని మీ పూర్వీకులు నామాట వినలేదు. నన్ను లక్ష్యపెట్టలేదు.
JER 34:15 కొద్ది కాలంకిందట మీరు మీ హృదయాలను మార్చుకొని ఏది సక్రమమైనదో దానిని చేయటానికి సిద్ధమయ్యారు. బానిసలుగా ఉన్న సాటి హెబ్రీయులకు మీలో ప్రతి ఒక్కడూ స్వేచ్ఛ నిచ్చాడు. నా నామాన్ని పిలువబడే నా ఆలయంలో నా ముందు ఆ మేరకు మీరొక ఒడంబడిక కూడ చేశారు.
JER 34:16 కాని ఇప్పుడు మీరు మనస్సు మార్చుకున్నారు. మీరు నా పేరును గౌరవించరని నిరూపించుకున్నారు. ఇది మీరెలా చేశారు? వదిలి పెట్టిన ప్రతి స్త్రీ, పురుష బానిసను మీలో ప్రతివాడూ తిరిగి తీసుకున్నారు. వారు తిరిగి బానిసలయ్యేలా ఒత్తిడి చేశారు.’
JER 34:17 “అందుచేత యెహోవా ఇలా అంటున్నాడు: ‘ప్రజలారా, నాకు మీరు విధేయులుగా లేరు. మీరు మీ సాటి హెబ్రీయులకు స్వేచ్ఛ నివ్వలేదు. మీరు నా ఒడంబడికను ఉల్లంఘించిన కారణంగా నేను స్వేచ్ఛ నిస్తాను. కత్తికి, కరువుకు, భయంకర రోగాలకు నేను స్వేచ్ఛ నిస్తాను. అవి మిమ్మల్ని చంపివేస్తాయి.’” ఇదే యెహోవా వాక్కు. “‘మిమ్మల్ని గురించి చెప్పగానే ప్రపంచ రాజ్యాలన్నీ ఆశ్చరం చెందేలా మీకు మహా విపత్తు కలుగజేస్తాను.
JER 34:18 నా ఒడంబడికను ఉల్లంఘించిన వారిని, నా ముందు తాము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని వారిని నేను శత్రువుకు అప్పగిస్తాను. ఈ మనుష్యులంతా నా ముందు తాము కోడె దూడను రెండు ముక్కలుగా నరికి, అ ముక్కల మధ్య నుండి నడచిన వారే.
JER 34:19 యూదా, యెరూషలేము నాయకులు, న్యాయస్థాన అధికారులు, మరియు యాజకులూ, రాజ్యంలోను ప్రజలు నా ముందు ఒడంబడిక చేసి కోడెదూడ ముక్కల మధ్య నడచిన వారిలో ఉన్నారు.
JER 34:20 కావున ఆ ప్రజలను వారి శత్రువులకు అప్పగిస్తారు. వారిని చంప తలపెట్టిన ప్రతివానికి వారిని వదిలి వేస్తాను. వారి శవాలు పక్షులకు, క్రూర మృగాలకు ఆహారమవుతాయి.
JER 34:21 యూదా రాజైన సిద్కియాను, అతని ప్రజానాయకులను వారి శత్రువుకు, వారిని చంపదలిచే ప్రతి వానికి అప్పగిస్తాను. బబులోను సైన్యం యెరూషలేమును వదిలి నప్పటికి, సిద్కియాను, అతని ప్రజలను బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను.
JER 34:22 బబులోను సైన్యాన్ని యెరూషలేముకు పిలిపిస్తాను.’ ఇదే యెహోవా వాక్కు ‘ఆ సైన్యం యెరూషలేముతో పోరాడుతుంది. వారు నగరాన్ని పట్టుకొని, దానికి నిప్పుపెట్టి తగలబెడతారు. నేను యూదా రాజ్యంలోని నగరాలను నాశనం చేస్తాను. ఆ నగరాలు వట్టి ఎడారులవలె మారి పోతాయి. మనుష్యులెవ్వకూ అక్కడ నివసించరు.’”
JER 35:1 యెహోయాకీము యూదా రాజ్యాన్ని పరిపాలించే కాలంలో యిర్మీయాకు యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. యెహోవా సందేశం ఇలా ఉంది:
JER 35:2 “యిర్మీయా, రేకాబీయుల వద్దకు వెళ్లుము. యెహోవా దేవాలయపు ప్రక్కగదులలో ఒక దాని లోనికి వారిని ఆహ్వానించుము. వారు తాగటానికి ద్రాక్షారసాన్ని అందించుము.”
JER 35:3 కావున నేను (యిర్మీయా) యజన్యాను తీసికొని రావటానికి వెళ్లాను. యజన్యా యిర్మీయా అనువాని కూమారుడు. యిర్మీయా హబజ్జిన్యా కుమారుడు. యజన్యా సోదరులను; కుమారులను కూడ ఆహ్యానించాను, రేకాబీయుల కుటుంబం వారినందరినీ పిలువనంపాను.
JER 35:4 ఆ రేకాబీయుల నందరినీ మందిరంలోనికి తీసికొని వచ్చాను. అందరం హానాను కుమారుల గది అనబడే దానిలోనికి వెళ్లాము. హానాను అనువాడు యిగ్దల్యా కుమారుడు. హానాను ఒక దైవజనుడు. ఈ గది యూదా రాజు ముఖ్యఅధికారులు బసచేసే గది పక్కనే ఉంది, ఇది మయశేయా గదిపైనవుంది. మయశేయా అనేవాడు షల్లూము కుమారుడు. మయశేయా దేవాలయంలో ద్వార పాలకుడు.
JER 35:5 పిమ్మట నేను (యిర్మీయా) ద్రాక్షారసం పోసిన కొన్ని పాత్రలు, మరికొన్ని గిన్నెలు రేకాబీయుల ముందు ఉంచాను. “కొంచెం ద్రాక్షారసం తీసుకోండి” అని నేను వారికి చెప్పాను.
JER 35:6 కాని రేకాబీయులు ఇలా సమాధాన మిచ్చారు: “మేమెన్నడూ ద్రాక్షారసం తాగము. మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞ యిచ్చిన కారణంగా మేము దానిని తాగము. ఆయన ఆజ్ఞ ఏమనగా: ‘మీరు మీ సంతతివారు ఎన్నడూ ద్రాక్షారసం త్రాగవద్దు.
JER 35:7 పైగా మీరు ఎన్నడు ఇండ్లు కట్టవద్దు, విత్తనములు నాటవద్దు. దాక్షా తోటలు పెంచవద్దు. వీటిలో దేనినీ మీరు ఎన్నడూ చేయరాదు. మీరు కేవలం గుడారాలలోనే నివసించాలి. మీరిలా చేస్తే, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తిరుగుతూ మీరీ దేశంలో చిరకాలం జీవించగలుగుతారు.’
JER 35:8 కావున రేకాబీయులమైన మేము మా పితరుడైన యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞకు బద్ధలమైయున్నాము. మేమెన్నడూ ద్రాక్షారసం తాగము. మా భార్యాలు, కుమారులు, కుమార్తెలు కూడా ద్రాక్షారసం తాగరు.
JER 35:9 నివసించటానికి మేము ఇండ్లను నిర్మించము. ద్రాక్షాతోటలు గాని, పొలాలు గాని మేము కలిగివుండము. మేమెన్నడూ పంటలు పండించము.
JER 35:10 మేము గుడారాల్లో నివసిస్తూ. మా పూర్వీకుడైన యెహోనాదాబు యొక్క ఆజ్ఞలన్నీ పాలిస్తున్నాము.
JER 35:11 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజ్యాన్ని ముట్టడించినప్పుడు, మేము యెరూషలేములో ప్రవేశించాము. అప్పుడు మాలో మేము, ‘రండి, మనమంతా యెరూషలేము నగరానికి వెళద్దాం. అలా వెళ్లి బబులోను సైన్యం నుండి, అరాము దేశ (కల్దీయుల) సైన్యం నుండి మనల్ని మనం రక్షించుకుందాము’ అని అనుకున్నము. ఆ విధంగా మేము యెరూశలేములో ఉండి పోయాము”
JER 35:12 పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినవచ్చింది:
JER 35:13 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయిన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యిర్మీయా, ఈ వర్తమానం యూదా వారికి, యెరూషలేము ప్రజలకు తెలియ జేయుము. ఓ ప్రజలారా, మీరొక గుణపాఠం నేర్చుకొని, నా సందేశాన్ని పాటించాలి.” ఇదే యెహోవా వాక్కు.
JER 35:14 “రేకాబు కుమారుడైన యెహోనాదాబు ద్రాక్షారసం తాగవద్దని తన కుమారులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ శిరసావహించబడింది. ఈ రోజు వరకూ యెహోనాదాబు సంతతి వారు తమ పితరుని ఆజ్ఞను పాటిస్తూ వచ్చారు. వారు ద్రాక్షారసం తాగరు. కాని నేను యెహోవాను. యూదా ప్రజలైన మీకు అనేక పర్యాయాలు సందేశాలు పంపియున్నాను. కాని మీరు నాకు విధేయులుకాలేదు.
JER 35:15 ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీ వద్దకు నా సేవకులగు ప్రవక్తలను పంపాను. వారిని అనేక పర్యాయాలు మీ వద్దకు పంపినాను. ఆ ప్రవక్తలు మీతో, ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీలో ప్రతి ఒక్కడు చెడు కార్యాలు చేయటం మానివేయాలి. మంచి చెయ్యండి, ఇతర దేవతలను వెంబడించవద్దు, పూజించవద్దు, మీరు నాకు విధేయులై, మీ పూర్వీకులకు, మీకు నేను ఇచ్చిన భూమియందు మీరు నివసించవచ్చు’ అని అన్నాను. కాని మీరు నా మాటను వినుటకు తిరస్కరించారు.
JER 35:16 యెహోనాదాబు సంతతివారు వారి పూర్వీకుడు ఇచ్చిన ఆజ్ఞను తప్పక పాటించారు. కాని యూదా ప్రజలు మాత్రం నాకు విధేయులు కాలేదు.”
JER 35:17 కావున ఇశ్రాయేలీయులు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “యూదాకు, యెరూషలేముకు చాలా కష్టాలు సంభవిస్తాయని నేను చెప్పియున్నాను. త్వరలో ఆ విపత్తులన్నీ సంభవించేలా చేస్తాను. నేను ఆ ప్రజలతో మాట్లాడాను. కాని వారు వినటానికి నిరాకరించారు. నేను వారిని పిలిచాను. కాని వారు సమాధానం మియ్యలేదు.”
JER 35:18 రేకాబీయులతో యిర్మీయా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘మీరంతా మీ పితరుడైన యెహోనాదాబు ఆజ్ఞ పాటించినారు. యెహోనాదాబు బోధనలను మీరు అనుసరించారు. ఆయన చెప్పినదంతా మీరు ఆచరించారు.
JER 35:19 కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతిలో ఒకడు సదా నాసేవలో నిమగ్నమై ఉంటాడు.’”
JER 36:1 యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. ఇది యెషీయా కుమారుడైన యెహోయాకీము యూదా రాజ్యాన్ని పాలిస్తున్న నాల్గవ సంవత్సరం. యెహోవా వర్తమానం ఇలా వుంది:
JER 36:2 “యిర్మీయా, నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను యిచ్చే సందేశాలన్నిటినీ గ్రంథస్థం చేయుము. ఇశ్రాయేలు, యూదా రాజ్యాల గురించి, తదితర రాజ్యాల గురించి నేను నీతో మాట్లాడియున్నాను. యోషీయా రాజైనప్పటి నుండి ఈ నాటి వరకు నేను నీతో చెప్పిన మాటలన్నీ వ్రాయుము.
JER 36:3 యూదా వంశం వారికి నేను చేయాలని ప్రయత్నిస్తున్న కీడు అంతా బహుశః వారు వినవచ్చు. బహుశః వారు దుష్కార్యాలు చేయటం మాని వేయవచ్చు. వారలాచేస్తే గతంలో వారు చేసిన మహా పాపాలన్నిటినీ నేను క్షమిస్తాను.”
JER 36:4 కావున బారూకు అనే వానిని యిర్మీయా పిలిచాడు. బారూకు తండ్రి పేరు నేరీయా, యెహోవా తనతో చెప్పిన సందేశాలన్నిటిని యిర్మీయా బయటికి పలికాడు. యిర్మీయా మాట్లాడుతూ ఉండగా, బారూకు గ్రంథస్థం చేశాడు.
JER 36:5 పిమ్మట బారూకుతో యిర్మీయా ఇలా అన్నాడు: “నేను దేవాలయంలోనికి వెళ్లలేను. నేనక్కడికి వెళ్లటానికి అనుమతి లేదు.
JER 36:6 అందుచేత నీవే దేవాలయానికి వెళ్లాలని నా కోరిక, ఉపవాసాల రోజున నీవక్కడికి వెళ్లి, నీవు రాసిన విషయాలు ప్రజలకు చదివి వినిపించుము. నీవు రాసిన యెహోవా వర్తమానాలను నేను నీకు చెప్పిన విధంగా చదివి వినిపించు. యూదా పట్టణాల నుండి యెరూషలేముకు వచ్చే ప్రజలందరికీ ఆ వర్తమానాలను చదివి వినిపించు.
JER 36:7 బహుశః ఆ ప్రజలు తమకు సహాయపడమని యెహోవాను వేడు కొనవచ్చు. బహుశః ప్రతి ఒక్కడూ చెడుకార్యాలు చేయటం మానివేయవచ్చు. వారిపట్ల తాను చాలా కోపంగా వున్నట్లు యెహోవా ప్రకటించియున్నాడు.”
JER 36:8 కావున నేరీయా కుమారుడైన బారూకు ప్రవక్త అయిన యిర్మీయా చెప్పిన ప్రకారం చేశాడు. బారూకు తాను గ్రంథస్థం చేసిన యోహోవా వర్తమానాన్ని బిగ్గరగా చదివాడు. ఆయన దానిని యెహోవా ఆలయంలో చదివాడు.
JER 36:9 రాజైన యెహోయాకీము పాలన ఐదు సంవత్సరాలు దాటి తొమ్మిదవ నెల జరుగుతూ ఉండగా ఉపవాస దినం ప్రకటించబడింది. యెరూషలేము నగర వాసులు, యూదా పట్టణాల నుంచి యెరూషలేముకు వచ్చి నివసిస్తున్న వారందరం యెహోవా ముందు ఉపవాసము చేయవలసి ఉంది.
JER 36:10 ఆ సమయంలో యిర్మీయా మాటలన్నిటినీ తాను రాసి ఉంచిన పుస్తకంనుండి బారూకు చదివాడు. దానినతడు దేవాలయంలో చదివాడు. ెదేవాలయంలో చేరిన ప్రజలంతా వినేలా బారూకు తాను రాసిన పుస్తకాన్ని చదివాడు. తన పత్రం (పుస్తకం) చదివినప్పుడు బారూకు పై ఆవరణలో ఉన్న గెమర్యా గదిలో ఉన్నాడు. ఆలయ నూతన ద్వారం వద్ద ఆ గది నిర్మింపబడి ఉంది గెమర్యా తండ్రి పేరు షాఫాను. గెమర్యా అను వ్యక్తి దేవాలయంలో వ్రాయువాడు (లేఖికుడు)
JER 36:11 పుస్తకం నుండి బారూకు చదివిన యెహోవా వర్తమానాలన్నిటినీ మీకాయా అనువాడు విన్నాడు. మీకాయా తండ్రి పేరు గెమర్యా గెమర్యా తండ్రి పేరు షాఫాను.
JER 36:12 పుస్తకం నుండి చదవబడిన యెహోవా వర్తమానాలను విన్న మీకాయా రాజభవనంలో ఉన్న కార్యాదర్శి గదికి వెళ్లాడు. రాజభవనంలో ఉన్నతాధి కారులంతా కూర్చుని ఉన్నారు. అక్కడ ఉన్నవారిలో కార్యదర్శి ఎలీషామా, షెమాయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా మరియు తదితర రాజోద్యోగులు ఉన్నారు.
JER 36:13 పుస్తకంలో నుండి బారూకు ప్రజలందరి ముందు చదవగా తాను విన్నదంతా మీకాయా ఆ అధికారులకు తెలియజేశాడు.
JER 36:14 ఆ అధికారులంతా కలిసి యెహూదియను వానిని బారూకు వద్దకు పంపారు. యెహూది తండ్రి పేరు నెతన్యా. నెతన్యా తండ్రి పేరు షెలెమ్య. షెలెమ్య తండ్రి పేరు కూషి. యెహూది అనేతను బారూకు వద్దకు వెళ్లి, “నీవు చదివిన పుస్తకం తీసికొని నా వెంట రమ్మని” అన్నాడు. నేరీయా కుమారుడైన బారూకు పుస్తకాన్ని తీసికొని యెహూది వెంట అధికారుల వద్దకు వెళ్లాడు.
JER 36:15 ఆ అధికారులు బారూకును చూచి, “కూర్చో! మాకు ఆ ప్రతాన్ని చదివి వినిపించు” అని అన్నారు. అప్పుడు బారూకు ఆ పత్రాన్ని వారికి చదివి వినిపించాడు.
JER 36:16 గ్రంథస్థం చేయబడిన ఆ వర్తమానాలనన్నిటినీ అధికారులు విన్నారు. వాటిని విని వారంతా భయపడి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారు బారూకుతో ఇలా అన్నారు, “నీవు గ్రంథస్థం చేసిన వర్తమానాల విషయం మేము రాజైన యెహోయాకీముతో తప్పక చెప్పాలి.”
JER 36:17 తరువాత ఆ అధికారులు బారూకును ఒక ప్రశ్న అడిగారు. “బారూకూ, నీవు రాసిన ఈ వర్తమానములు నీకెలా లభ్యమైనాయి? యిర్మీయా నీతో మాట్లాడిన విషయాలను నీవు రాసియున్నావా?” అని అడిగారు.
JER 36:18 అవునని బారూకు చెప్పాడు. “యిర్మీయా మాట్లాడగా, ఆ వర్తమానానన్నిటినీ నేను సిరాతో ఈ పత్రంపై వ్రాసి ఉంచాను” అని అన్నాడు.
JER 36:19 అది విన్న రాజ్యాధికారులు బారూకుతో, “నీవు, యిర్మీయా పోయి తప్పక దాగుకోవాలి, మీరెక్కడ దాగియున్నారో ఎవ్వరికీ తెలియనీయవద్దు” అని అన్నారు.
JER 36:20 పిమ్మట రాజ్యాధికారులు ఆ పత్రాన్ని (పుస్తకం) లేఖికుడైన ఎలీషామా గదిలో ఉంచారు. వారు రాజైన యెహోయాకీము వద్దకు వెళ్లి ఆ పుస్తకం గురించి అంతా చెప్పారు.
JER 36:21 అప్పుడు రాజైన యెహోయాకీము ఆ పత్రాన్ని తేవటానికి యెహూదిని పంపించాడు. లేఖకుడైన ఎలీషామా గదినుండి యెహూది ఆ పుస్తకాన్ని తెచ్చాడు. రాజుకు, ఆయన వద్ద నిలబడి ఉన్న సిబ్బందికి యెహూది ఆ పుస్తకాన్ని చదివి వినిపించాడు.
JER 36:22 ఇది జరిగే నాటికి సంవత్సరంలో తొమ్మిదవ నెల కావటంతో, రాజైన యెహోయాకీము శితకాలపు గదిలో (వెచ్చని గది) కూర్చుని ఉన్నాడు. రాజు ముందు ఒక చిన్న నిప్పుగూటిలో మంట రగులుతూ వుంది.
JER 36:23 చుట్టబడిన పత్ర రూపంలో ఉన్న ఆ గ్రంథాన్ని యెహూది చదవటం మొదలు పెట్టాడు. అతడు రెండు మూడు పుటల విషయాలు చదవగానే రాజైన యెహోయాకీము ఆ పత్రాన్ని గుంజుకుని, ఒక చిన్న కత్తితో చదివిన భాగాన్ని కోసి మండే నిప్పులో వేయసాగాడు. ఆ విధంగా మొత్తం పుస్తకమంతా తగులబెట్టాడు.
JER 36:24 పైగా రాజైన యెహోయాకీము, అతని సిబ్బంది ఆ వర్తమానాన్ని విని భయపడలేదు. వారి పాపాలకు చింతిస్తున్న సూచనగా వారి తమ బట్టలను చించుకొనలేదు.
JER 36:25 ఎల్నాతాను, దెలాయ్యా మరియు గెమర్యా అనేవారు రాజుతో మాట్లాడి గ్రంథాన్ని తగులబెట్టకుండా చేయాలని ప్రయత్నించారు గాని రాజు వినలేదు.
JER 36:26 రాజైన యెహోయాకీము లేఖకుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను నిర్బంధించు మని కొందరు మనుష్యులను ఆదేశించాడు. అలా ఆదేశించబడిన మనుష్యులు రాజకుమారుడు యెరహ్మెయేలు, అజీ్రయేలు కుమారుడైన శెరాయా, మరియు అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యా అనువారు. అయితే యెహోవా బారూకును, యిర్మీయాను దాచివేసిన కారణంగా ఆ మనుష్యులు వారిని కనుక్కో లేక పోయారు.
JER 36:27 యెహోవా వాక్కు యిర్మీయాకు వినిపించింది. యెహోవా నుండి వచ్చిన సందేశాలన్నీ పొందుపర్చబడిన సుదీర్గ పుస్తకాన్ని. రాజైన యెహోయాకీము తగులబెట్టిన పిమ్మట ఇది జరిగింది. యిర్మీయా ఆ విషయాలు బారూకుతో చెప్పగా, బారూకు వాటన్నిటినీ పుస్తకంగా వ్రాశాడు. యిర్మీయాకు వచ్చిన యెహోవ సందేశం ఇలా ఉంది:
JER 36:28 “యిర్మీయా, మరో పత్రం తీసికో. దానిమీద మొదటి చుట్టలో వున్న వర్తమానములన్నిటినీ నీవు తిరిగి వ్రాయుము. ఆ మొదటి పుస్తకాన్నే యూదా రాజైన యెహోయాకీము తుగుల బెట్టాడు.
JER 36:29 యిర్మీయా, యూదా రాజైన యెహోయాకీముకు ఈ విషయం కూడా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నాడు: యెహోయాకీమా, నీవా పుస్తకాన్ని తగులబెట్టావు. “బబులోను రాజు వచ్చి నిశ్చయంగా ఈ రాజ్యాన్ని నాశనం చేస్తాడని యిర్మీయా ఎందుకు రాశాడు? ఈ దేశంలో గల మనుష్యులను, జంతువులను బబులోను రాజు నాశనం చేస్తాడని ఎందుకు చెప్పాడు?” అని నీవు అన్నావు.
JER 36:30 కావున, యూదా రాజైన యెహోయాకీము విషయంలో యెహోవా ఇలా అంటున్నాడు: యెహోయాకీము సంతతివారు దావీదు సింహాసనంపై కూర్చోనరు. యెహోయాకీము చనిపోయినప్పుడు రాజ లాంఛనాలతో అంత్యక్రియలు జరగవు. అతని కళేబరం నేలమీద పారవేయబడుతుంది. అతని శవం పగలు ఎండకు ఎండి, రాత్రి మంచుకు నానిపోతుంది.
JER 36:31 ప్రభువునైన నేను యెహోయాకీమును, అతని సంతానాన్ని శిక్షిస్తాను. అతని అధికారులను కూడ నేను శిక్షిస్తాను. వారు దుర్మార్గులు గనుక నేనలా చేస్తాను. ఆ అధికారులపైకి, యెరూషలేము ప్రజలపైకి, యూదా ప్రజలపైకి మహా విపత్తు తీసికొని వస్తానని నేను అనియున్నాను. నేను చెప్పిన విధంగా వారికి అష్ట కష్టాలను తెచ్చి పెడతాను. కారణమేమంటే, వారు నేను చెప్పినది వినలేదు.’”
JER 36:32 యిర్మీయా మరో పత్రాన్ని తీసికొని లేఖకుడు నేరీయా కుమారుడు బారూకుకు ఇచ్చాడు. రాజైన యెహోయాకీము నిప్పులో వేసి తగులబెట్టిన పుస్తకంలో వున్న వర్తమానములన్నిటినీ, యిర్మీయా చెప్పు చుండగా బారూకు ఆ పత్రం మీద మరల వ్రాశాడు. పాత వర్తమానాల వంటివే మరికొన్ని కొత్తగా ఈ రెండవ గ్రంథములో చేర్చబడ్డాయి.
JER 37:1 నెబుకద్నెజరు బబులోను రాజు. యూదా రాజుగా యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను స్థానంలో సిద్కియాను నెబుకద్నెజరు నియమించాడు. సిద్కియా రాజైన యోషీయా కుమారుడు.
JER 37:2 యెహోవా యిర్మీయాకు బోధననిమిత్తం ఇచ్చిన వర్తమానాలను సిద్కియా లక్ష్య పెట్టలేదు. సిద్కియా సేవకులు, యూదా ప్రజలు కూడ యెహోవా వర్తమానాల పట్ల శ్రద్ధ వహించలేదు.
JER 37:3 యెహుకలు అనువానిని, యాజకుడైన జెఫన్యాను రాజైన సిద్కియా ప్రవక్తయగు యిర్మీయా వద్ధకు ఒక సందేశమిచ్చి పంపాడు. యెహుకలు తండ్రి పేరు షెలెమ్యా. యాజకుడైన జెఫన్యా తండ్రి పేరు మయశేయా. వారు యిర్మీయాకు తెచ్చిన వర్తమానం యిలా ఉంది: “యిర్మీయా, మా కొరకు మన యెహోవా దేవుని ప్రార్థించు.”
JER 37:4 (ఆ సమయంలో ఇంకా యిర్మీయా చెరసాలలో నిర్బంధించబడలేదు. కావున అతనెక్కడికి వెళ్లాలన్నా స్వేచ్ఛ కలిగియున్నాడు.
JER 37:5 అదే సమయంలో ఈజిప్టు నుండి ఫరో సైన్యం కూడా యూదా వైపుకు కదలి వచ్చింది. కల్దీయుల సైన్యం యెరూషలేమును ఓడించటానికి దానిని చుట్టుముట్టింది. అయితే, ఈజిప్టు నుండి పచ్చిన సైన్యం తమ మీదికి వస్తున్నట్లు వారు విన్నారు. కావున బబులోను సైన్యం. యెరూషలేమును వదలి ఈజిప్టు సైన్యాన్ని ఎదిరించటానికి వెళ్లింది.)
JER 37:6 యెహోవా నుండి ఒక వర్తమానం ప్రవక్తయైన యిర్మీయాకు వచ్చింది:
JER 37:7 “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ వర్తమానం చెప్పుచున్నాడు: ‘యెహుకలు మరియు జెఫన్యా! యూదా రాజైన సిద్కియా నన్ను ప్రశ్నలడిగే నిమిత్తం మిమ్మల్ని నావద్దకు పంపినట్లు నాకు తెలుసు. రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: ఫరో సైన్యం బబులోను సైన్యాన్ని ఎదుర్కొనే విషయంలో నీకు సహాయం చేయాలని ఈజిప్టు నుండి ఇక్కడికి కదలి వస్తున్నది. కాని ఫరో సైన్యం ఈజిప్టుకు తిరిగి వెళ్లిపోతుంది.
JER 37:8 ఆ తరువాత బబులోను సైన్యం ఇక్కడికి తిరిగి వస్తుంది. వారు యెరూషలేము మీద దాడి చేస్తారు. బబులోను సైన్యం ఆ పిమ్మట యెరూషలేమును వశపర్చుకొని దానిని తగలబెడుతుంది.’
JER 37:9 యెహోవా ఇలా అంటున్నాడు: ‘యెరూషలేము ప్రజలారా మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. “బబులోను సైన్యం మమ్మల్ని వదలి తప్పక వెళ్లి పోతుంది” అని మీకు మీరు అనుకోవద్దు. వారు మిమ్మల్ని వదలరు.
JER 37:10 యెరూషలేము ప్రజలారా, మిమ్మల్ని ఎదుర్కొనే కల్దీయుల సైన్యాన్నంతా మీరు ఓడించగలిగినా వారి డేరాలలో కొద్దిమంది గాయపడిన సైనికులు మిగులుతారు. ఆ కొద్దిమంది గాయపడిన మనుష్యులే వారి డేరాల నుండి వచ్చి యెరూషలేమును తగలబెడతారు.’”
JER 37:11 కల్దీయుల సైన్యం ఈజిప్టు రాజైన ఫరో సైన్యాన్ని ఎదుర్కొనటానికి యెరూషలేమును వదిలిన సమయంలో
JER 37:12 యిర్మీయా యెరూషలేము నుండి బెన్యామీను దేశానికి వెళ్లగోరాడు. అక్కడ తన కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో యిర్మీయా వెళ్లాడు.
JER 37:13 కాని యెరూషలేములో బెన్యామీను ద్వారం వద్దకు వెళ్లే సరికి రక్షక భటాధికారి యిర్మీయాను నిర్బంధించాడు. ఈ అధికారి పేరు ఇరీయా. ఇరీయా తండ్రి పేరు షెలెమ్యా. షెలెమ్యో తండ్రి పేరు హనన్యా. రక్షక భటాధికారి అయిన ఇరీయా యిర్మీయాను నిర్బంధంలోకి తీసుకొని “యిర్మీయా, నీవు మమ్మల్ని వదిలి బబులోను పక్షం వహించటానికి వెళ్తున్నావు”అని అన్నాడు.
JER 37:14 “అది నిజం కాదు! నేను బబులోను పక్షం వహించటానికి వెళ్లటం లేదు” అని యిర్మీయా ఇరీయాతో అన్నాడు. కాని యిర్మీయా చెప్పేది ఇరీయా వినటానికి నిరాకరించాడు. యిర్మీయాను ఇరీయా నిర్బంధించి యెరూషలేములో రాజ్యాధి కారుల వద్దకు తీసికొని వెళ్లాడు.
JER 37:15 ఆ అధికారులు యిర్మీయా పట్ల చాలా కోపగించారు. యిర్మీయాను దండించాలని వారు ఆజ్ఞ ఇచ్చారు. వారు యిర్మీయాను కారాగారంలో నిర్బంధించారు. యెనాతాను అనేవాని ఇంటిలో ఈ చెరసాల ఉంది. యెనాతాను యూదా రాజుకు లేఖకుడు. యోనాతాను ఇంటిని చెరసాలగా మార్చారు.
JER 37:16 యోనాతాను ఇంటి కిందవున్న చెరసాల గదిలో వారు యిర్మీయాను నిర్బంధించారు. అది ఇంటి కింద భూమిలో కట్టిన ఒక చెరసాల గది. యిర్మీయా అందులో చాలాకాలం ఉన్నాడు.
JER 37:17 పిమ్మట రాజైన సిద్కియా మనుష్యులను పంపగా వారు యిర్మీయాను రాజభవనానికి తీసికొని వచ్చారు. యిర్మీయాతో సిద్కియా ఏకాంతంగా మాట్లాడ్డాడు. “యెహోవా నుండి ఏమైనా సందేశం వచ్చిందా?” అని యిర్మీయాను అడిగాడు. “అవును. యెహోవా సందేశం ఒకటి ఉంది సిద్కియా, నీవు బబులోను రాజుకు ఇవ్వబడతావు” అని యిర్మీయా సమాధాన మిచ్చాడు.
JER 37:18 తరువాత యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు. “నేను ఏమి తప్పు చేశాను? నీ పట్లగాని, నీ అధికారుల పట్లగాని యెరూషలేము ప్రజల పట్లగాని నేను చేసిన నేరం ఏమిటి? నన్నెందుకు కారాగృహంలో పడవేశావు?
JER 37:19 సిద్కియా రాజా, నీ ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ ప్రవక్తలు నీకు తప్పుడు వర్తమానం యిచ్చారు. ‘బబులోను రాజు నిన్నుగాని, ఈ యూదా రాజ్యాన్ని గాని ఎదుర్కోడు’ అని వారన్నారు.
JER 37:20 కాని మహారాజా, ఇప్పుడు నేను చెప్పేది దయచేసి వినండి. దయచేసి నా విన్నపం ఆలకించండి. నేనడిగేది ఏమంటే లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపవద్దు. మీరు నన్ను మరల పంపితే నేనక్కడ చనిపోతాను.”
JER 37:21 కావున యిర్మీయాను రాజభవనపు ఆవరణలోనే నిర్బందించి ఉంచాలని రాజైన సిద్కియా ఆజ్ఞాపించాడు. వీధిలోని రొట్టెల దుకాణము నుండి రొట్టె తెచ్చి యిర్మీయాకు ఇవ్వాలని కూడ రాజు ఆజ్ఞాపించాడు. నగరంలో అమ్మే రొట్టెలు అయిపోయే వరకు యిర్మీయాకు రొట్టెలు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా రాజ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నాడు.
JER 38:1 కొంతమంది రాజ్యాధికారులు యిర్మీయా బోధిస్తున్నది విన్నారు. వారు మత్తాను కుమారుడైన షెఫట్య, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకలును మరియు మల్కీయా కుమారుడైన పషూరు. యిర్మీయా ఈ వర్తమానాన్ని ప్రజలందరికి ఇలా చెప్పుచున్నాడు:
JER 38:2 “యెహోవా సెలవిస్తున్నదేమనగా, ‘యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కడు కత్తివల్లగాని, ఆకలివలనగాని, రోగంతోగాని చనిపోతాడు. కాని బబులోను సైన్యానికి లొంగిపోయిన ప్రతి ఒక్కడూ బతుకుతాడు. వారు వారి ప్రాణాలతో తప్పించుకో గలుగుతారు.’
JER 38:3 యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: ‘ఈ యెరూషలేము నగరం నిశ్చయంగా బబులోను రాజుకు ఇవ్వబడుతుంది. అతడి నగరాన్ని పట్టుకుంటాడు.’”
JER 38:4 ప్రజలకు ఈ విషయాలను యిర్మీయా తెలియపర్చుతూ ఉండగా విన్న రాజ్యాధికారులు రాజైన సిద్కియా వద్దకు వెళ్లారు. వారు వెళ్లి, “యిర్మీయాను చంపివేయాలి. నగరంలో ఇంకా ఉన్న సైనికులను అధైర్యపర్చుస్తున్నాడు. తాను చెప్పే విషయాలతో యిర్మీయా ప్రతి ఒక్కడినీ నిరుత్సాహ పరుస్తున్నాడు. యిర్మీయా మనకు శభం కలగాలని కోరుకోవటం లేదు. అతడు యెరూషలేము ప్రజలను నాశనం చేయాలని కోరుకుంటున్నాడు” ఇని చెప్పారు.
JER 38:5 “యిర్మీయా మీ స్వాధినంలోనే ఉన్నాడు. మిమ్మల్ని ఆపటానికి నేనేమీ చేయను” అని రాజైన సిద్కియా అన్నాడు.
JER 38:6 దానితో ఆ అధికారులు యిర్మీయాను మల్కీయా యొక్క నీళ్లగోతిలోనికి దించారు. (మల్కీయా రాజు యొక్క కుమారుడు) రాజభటుడు ఉండే ప్రాంగణంలోనే ఆ నీటి గొయ్యి ఉంది. ఆ అధికారులు తాళ్ల సహాయంలో యిర్మీయాను గోతిలోనికి దించారు. గోతిలో నీరు లేదు గాని, అడుగున బురద పేరుకొని ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.
JER 38:7 కాని ఎబెద్మెలెకు అనేవాడు అధికారులు యిర్మీయాను నీటిగోతిలోకి దించినట్లు విన్నాడు. ఎబెద్మెలెకు కూషీయుడు (ఇతియోపియ అనే దేశపువాడు) అతడు నపుంసకుడు (కొజ్జా) రాజ భవనంలో ఉద్యోగి. రాజైన సిద్కియా బెన్యామీను ద్వారం వద్ద కూర్చుని ఉండగా ఎబెద్మెలెకు రాజభవనం నుండి రాజును కలిసి మాట్లాడటానికి ద్వారం వద్దకు వెళ్లాడు.
JER 38:8 ఎబెద్మెలెకు ఇలా అన్నాడు: “నా ఏలినవాడవగు ఓ రాజా, ఆ అధికారులు చాలా క్రూరంగా ప్రవర్తించారు. ప్రవక్తయైన యిర్మీయా పట్ల వారు బహు క్రూరంగా వ్వవహరించారు. వారతనిని నీళ్లు నిలువజేసే గోతిలో పడవేశారు. అతనక్కడ చని పోయేలా వదిలి వేశారు.”
JER 38:10 అప్పుడు రాజైన సిద్కియా ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఇలా ఉంది: “ఎబెద్మెలెకూ, రాజభవనం నుంచి నీతో ముగ్గురు మనుష్యులను తీసికొని వెళ్లు. యిర్మీయా చనిపోకముందే వారి సహాయంతో అతనిని గోతిలో నుండి పైకి తియ్యి.”
JER 38:11 తరువాత ఎబెద్మెలెకు తనతో మనుష్యులను తీసుకొని వెళ్లాడు. ముందుగా అతడు రాజభవనంలో సామాను భద్రపరచే గిడ్డంగి కిందవున్న గదిలోనికి వెళ్లాడు. ఆ గదినుండి కొన్ని పాత బట్టలను, చింపిరి గుడ్డలను అతడు తీసికొన్నాడు. కొన్ని తాళ్ల సహాయంతో ఆ బట్టలను గోతిలో ఉన్న యిర్మీయాకు వదిలాడు.
JER 38:12 ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకు యిర్మీయాను పిలిచి ఇలా అన్నాడు: “ఈ గుడ్డ పేలికలను, పాత బట్టలను నీ చంకలలో పెట్టుకో మేము నిన్ను పైకిలాగినప్పుడు ఈ బట్టలు నీ చంకలలో మెత్తలవలె ఉండి తాళ్ల వలన నీకు బాధ కులుగదు.” ఎబెద్మెలెకు చెప్పినట్లుగా యిర్మీయా చేశాడు.
JER 38:13 ఆ మనుష్యులు యిర్మీయాను తాళ్ల సహాయంతో పైకిలాగి, నీళ్ల గొయ్యి నుండి బయటికి తీశారు. ఆలయ ఆవరణలోనే యిర్మీయా రక్షకభటుల ఆధీనంలోఉన్నాడు.
JER 38:14 పిమ్మట రాజైన సిద్కియా తన సేవకునితో ప్రవక్తయైన యిర్మీయాను పిలిపించాడు. దేవాలయంలో మూడవ ద్వారం వద్దకు అతడు యిర్మీయాను పిలువనంపాడు. అప్పుడు రాజు “యిర్మీయా, నేను నిన్నొక విషయం అడగదలిచాను. ఏమీ దాయకుండా చిత్త శుద్ధితో అంతా చెప్పు” అని అన్నాడు.
JER 38:15 “నేను నీకు సమాధానం ఇస్తే నీవు నన్ను చంపివేస్తావు. నేను నీకేదైనా సలహా ఇచ్చినా నీవు దానిని వినిపించుకోవు” అని యిర్మీయా సిద్కియాతో అన్నాడు.
JER 38:16 కాని రాజైన సిద్కియా యిర్మీయాకు ఒక ప్రమాణం చేశాడు. సిద్కియా ఇది రహస్యంగా చేశాడు. సిద్కియా ఇలా ప్రమాణం చేశాడు: “యిర్మీయా, మనందరికీ జీవం పోసిన ప్రాణదాత, నిత్యుడు అయిన యెహోవా సాక్షిగా నిన్ను నేను చంపను. అంతే గాదు. నిన్ను చంపజూచే అధికారులకు నిన్ను అప్పగించనని కూడా నేను నీకు ప్రమాణం చేస్తున్నాను.”
JER 38:17 అప్పుడు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విధంగా చెప్పాడు, ‘నీవు బబులోను అధికారులకు లొంగిపోతే నీ ప్రాణం కాపాడబడుతుంది. యెరూషలేము నగరం కూడ తగుల బెట్టబడదు. నీవు, నీ కుటుంబం సజీవంగా ఉంటారు.
JER 38:18 నీవు బబులోను రాజుయొక్క అధికారులకు లొంగి పోవటానికి నిరాకరిస్తే, యెరూషలేము కల్దీయుల సైన్యానికి ఇవ్వబడుతుంది. వారు యెరూషలేమును తగులబెడతారు. నీవు కూడ వారి బారి నుండి తప్పించుకోలేవు.’”
JER 38:19 “కాని ఇప్పటికే బబులోను సైన్యపు పక్షం వహించిన యూదా ప్రజల విషయంలో నేను భయపడుతున్నాను. పైగా సైనికులు నన్ను యూదా ప్రజలకు ఇస్తే వారు నన్ను అవమానపర్చి, గాయపర్చుతారని కూడా నేను భయపడతున్నాను.” అని యిర్మీయాకు రాజైన సిద్కియా బదులు చెప్పాడు.
JER 38:20 అందుకు యిర్మీయా ఇలా అన్నాడు: “సైనికులు నిన్ను ఆ యూదా ప్రజలకు అప్పజెప్పారు. నేను చెప్పినట్లు విని యెహోవాకు విధేయుడవై ఉండుము. అప్పుడు పరిస్థితులు నీకు అనుకూలిస్తాయి. నీ ప్రాణం రక్షింపబడుతుంది.
JER 38:21 కాని నీవు బబులోను సైన్యానికి లొంగిపోవటానికి నిరాకరిస్తే ఏమి జరుగుతుందో యెహోవా నాకు చూపించాడు. యెహోవా ఇలా అన్నాడు:
JER 38:22 యూదా రాజగృహంలో మిగిలివున్న స్త్రీలంతా బయటకు లాగబడతారు. వారు బబులోను రాజు ముఖ్య అధికారుల వద్దకు తేబడుతారు. నీ స్త్రీలే నిన్ను ఒక పాట పాడి ఎగతాళి చేస్తారు. ఆ స్త్రీలు ఇలా అంటారు. ‘నీ మంచి స్నేహితులే నిన్ను తప్పుదోవ పట్టించారు. నీవారు నీకంటె బలవంతులైనారు. అటువంటి స్నేహితులనే నీవు నమ్మావు. నీ కాళ్లు బురదలో కూరుకున్నాయి. నీ స్నేహితులు నిన్ను వదిలి పెట్టారు.’
JER 38:23 “నీ భార్యలు, పిల్లలు అందరూ బయటకు ఈడ్వబడతారు. వారు కల్దీయుల సైన్యానికి అప్పగించబడతారు. నీవు కూడ బబులోను సైన్యం నుండి తప్పించుకోలేవు. నీవు బబులోను రాజుచే పట్టు కొనబడతావు. యెరూషలేము తగులబెట్టబడుతుంది.”
JER 38:24 అప్పుడు సిద్కియా యిర్మీయాతో ఇలా అన్నాడు: “నేను నీతో మాట్లాడుతున్నానని ఎవ్వరికీ తెలియనీయవద్దు. చెప్పితే నీవు చనిపోతావు.
JER 38:25 ఆ అధికారులు నేను నీతో మాట్లాడినట్లు తెలిసికోవచ్చు. అప్పుడు వారు నీ వద్దకు వచ్చి, ‘యిర్మీయా, నీవు రాజైన సిద్కియాకు ఏమి చెప్పావో అది మాకు తెలియజేయుము. రాజైన సిద్కియా నీకు ఏమి చెప్పినాడో కూడ మాకు చెప్పు. మాకు నిజాయితీగా అంతాచెప్పు. లేకుంటే మేము నిన్ను చంపివేస్తాం’ అని అంటారు.
JER 38:26 వారు నీతో అలా అన్నప్పుడు, ‘నన్ను మరల యెనాతాను ఇంటి కిందగల చెరసాల గదిలోకి పంపవద్దని రాజును వేడుకుంటున్నాను. మళ్లీ నేనా చెరసాల గదికి పంపబడితే చనిపోతాను’ అని అన్నట్లు చెప్పు.”
JER 38:27 అనుకున్నదంతా జరిగింది. రాజ్యాధికారులు యిర్మీయాను ప్రశ్మించటానికి వచ్చారు. యిర్మీయా మాత్రం రాజు ఆజ్ఞానుసారం ఆయన చెప్పిన రీతిగా వారికి సమాధానమిచ్చాడు. అప్పుడా అధికారులు యిర్మీయాను ఒంటరిగా వదిలారు. యిర్మీయా మరియు రాజు ఏమి మాట్లాడారో ఏ ఒక్కరూ వినలేదు.
JER 38:28 యెరూషలేము ముట్టడింపబడేనాటి వరకు యిర్మీయా ఆలయ ప్రాంగణంలో బందీగా ఉన్నాడు.
JER 39:1 యెరూషలేము ఈ విధంగా లోబరచు కోబడింది: యూదా రాజ్యంలో సిద్కియా పాలన తొమ్మిది సంవత్సరాలు దాటి పదవ నెల గడుస్తూఉంది. అప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా కూడగట్టుకొని యెరూషలేము మీదికి తరలి వచ్చాడు. దానిని ఓడించటానికి అతడు నగరాన్ని ముట్టడించాడు.
JER 39:2 సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాల నాలుగు నెలలు దాటి తొమ్మిదవ రోజున యెరూషలేము నగర ప్రాకారం (గోడ) పగులగొట్టబడింది.
JER 39:3 దానితో బబులోను రాజు యొక్క ఉన్నతాధికారులంతా యెరూషలేము నగరం ప్రవేశించారు. వారు మధ్య ద్వారం వద్దకు వచ్చి కూర్చున్నారు. ఆ వచ్చిన వారిలో సిమ్గరు జిల్లాకు పాలకుడైన నేర్గల్‌షరేజరు; మరొక ప్రముఖమైన అధికారి శర్సెకీము; తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.
JER 39:4 యూదా రాజగు సిద్కియా బబులోను నుంచి వచ్చిన అధికారులను చూచి తన సైనికులతో కలసి పారిపోయాడు. రాత్రి సమయంలో వారు యెరూషలేమును వదిలి రాజుయొక్క ఉద్యానవనం ద్వారా బయటకు వెళ్లారు. రెండు గోడల మధ్య వున్న ద్వారం గుండా వారు వెళ్లారు. వారక్కడి నుండి ఎడారివైపు వెళ్లారు.
JER 39:5 కాని కల్దీయుల సైన్యం సిద్కియాను, అతనితో ఉన్న సైనికులను తరుముకుంటూ పోయారు. కల్దీయుల సైన్యం సిద్కియాను యెరికో మైదానాలలో పట్టుకున్నారు. వారు సిద్కియాను పట్టుకుని బబులోను రాజగు నెబుకద్నెజరు వద్దకు తీసికొని వెళ్లారు. నెబుకద్నెజరు ఆ సమయంలో హమాతు రాజ్యంలో ఉన్న రిబ్లా పట్టణంలో ఉన్నాడు. ఆ ప్రదేశంలో సిద్కియాకు వ్యతిరేకంగా నెబుకద్నెజరు తన తీర్పును ఇచ్చాడు.
JER 39:6 రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతను చూస్తూ ఉండగానే బబులోను రాజు చంపివేశాడు. మరియు సిద్కియా చూస్తూ ఉండగానే యూదా రాజ్యాధికారులందరినీ నెబుకద్నెజరు చంపివేశాడు.
JER 39:7 తరువాత సిద్కియా కండ్లను నెబకద్నెజరు పెరికివేశాడు. అతడు సిద్కియాకు కంచు సంకెళ్లను తగిలించి బబులోనుకు తీసికొని పోయాడు.
JER 39:8 బబులోను సైన్యం రాజగృహానికి, యెరూషలేము వాసుల ఇండ్లకు నిప్పు పెట్టారు. మరియు వారు యెరూషలేము గోడలను పడగొట్టారు.
JER 39:9 నెబూజరదాను అను వ్యక్తి బబులోను రాజు ప్రత్యేక అంగరక్షకుల దళానికి అధిపతి. అతడు యెరూషలేములో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నాడు. అతడు వారిని బబులోనుకు తీసికొని పోయాడు.
JER 39:10 కాని ప్రత్యేక అంగరక్షకుల దళాధికారి నెబూజరదాను యూదాలోని కొంతమంది పేద ప్రజలను నగరంలో వదిలివేశాడు. వారు ఆస్తి పాస్తులు ఏమీ లేనివారు. కావున ఆ రోజున నెబూజరదాను యూదాలోని పేద ప్రజలకు ద్రాక్షాతోటలను, పొలాలను ఇచ్చాడు.
JER 39:11 కాని యిర్మీయా విషయంలో నెబుకద్నెజరు ప్రత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదానుకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు.
JER 39:12 “యిర్మీయాను వెదకి తెలసికొని అతని విషయంలో జాగ్రత్త తీసికో. అతనిని గాయపర్చవద్దు. అతనేదడిగితే అది యివ్వు” అని ఆజ్ఞ ఇచ్చాడు.
JER 39:13 ప్రత్యేక అంగరక్షక దళధికారి నెబూజరదాను, బబులోను సైన్యంలో ముఖ్యాధికారియైన నెబూషజ్బాను, మరో ఉన్నతాధికారి నేర్గల్ షరేజరు మరియు ఇతర బబులోను సైన్యాధికారులు యిర్మీయాను పిలిపించారు.
JER 39:14 యూదా రాజు రక్షకుల ఆధీనంలో ఆలయ ప్రాంగణంలో వున్న యిర్మీయాను ఆ వచ్చిన వ్యక్తులు బయటకు తీసికొని వెళ్లారు. బబులోను సైన్యాధికారులు యిర్మీయాను గెదల్యాకు అప్పగించారు. గెదల్యా అనేవాడు అహీకాము కుమారుడు. అహీకాము అనేవాడు షాఫాను కుమారుడు. యిర్మీయాను తిరిగి ఇంటికి తీసికొని పోవటానికి గెదల్యాకు ఆజ్ఞ ఇవ్వబడింది. అందువల్ల యిర్మీయా తన ఇంటికి తీసికొనిపోబడగా అతడు తన ప్రజలతో కలిసి నివసించాడు.
JER 39:15 ఆలయ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నప్పుడు యెహోవా నుండి ఒక వర్తమానం అతనికి వచ్చింది. ఆ వర్తమానం ఇలా ఉంది:
JER 39:16 “యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఇతియోపియవాడగు ఎబెద్మెలెకునకు అందజేయుము: ‘ఇతశ్రాయేలీయుల దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, ఈ యెరూషలేము నగర విషయంలో నా వర్తమానాలన్నీ అతి త్వరలో నిజమయ్యేలా చేస్తాను. వినాశనం ద్వారా నా వర్తమానాలు నిజమవుతాయిగాని శుభ కార్యాల ద్వారా కాదు. నేను చెప్పినదంతా నిజమవటం నీ కళ్లతో నీవే చూస్తావు.
JER 39:17 కాని ఎబెద్మెలెకూ, ఆ రోజున నిన్ను నేను రక్షిస్తాను.’ ఇది యెహోవా సందేశం. ‘నీవు ఎవరిని చూచి భయబడుతున్నావో వారికి నిన్ను అప్పగించను.
JER 39:18 ఎబెద్మెలెకూ, నిన్ను నేను రక్షిస్తాను. నీవు కత్తివాతబడి చనిపోవు. నీవు తప్పించుకొని జీవిస్తావు. నీవు నన్ను నమ్మావు. గనుక అలా జరుగుతుంది.’” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది.
JER 40:1 యిర్మీయా రామా నగరంలో విడుదలైన పిమ్మట యోహోవా వాక్కు అతనికి వినిపించింది. బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను యిర్మీయాను రామా నగరంలో ఉన్నట్లు కనుగొన్నాడు. యిర్మీయా గొలుసులతో బంధింపబడ్డాడు. యెరూషలేము నుండి యూదా నుండి తేబడిన బందీలందరితో పాటు యిర్మీయా కూడా ఉన్నాడు. ఆ ప్రజలంతా బంధీలుగా బబులోనుకు తీసికొని పోబడుతున్నారు.
JER 40:2 దళాధిపతి నెబూజరదాను యిర్మీయాను చూచినప్పుడు అతనితో మాట్లాడి ఇలా అన్నాడు: “యిర్మీయా, నీ దేవుడైన యెహోవా ఈ విపత్తు ఈ ప్రదేశానికి వస్తుందని చెప్పియున్నాడు.
JER 40:3 యెహోవా ఏమి చేస్తానని చెప్పియున్నాడో అంతా జరిగేలా చేశాడు. మీ యూదా ప్రజలంతా యెహోవాపట్ల పాపం చేశారు. కావున మీకు ఈ ఆపద సంభవించింది. మీ ప్రజలు దేవునికి విధేయులుగా లేరు.
JER 40:4 కాని యిర్మీయా, నిన్ను నేనిప్పుడు విడుదల చేస్తాను. నీ మణికట్టుల నుండి సంకెళ్లను తీసివేస్తున్నాను. నీవు రాదలచుకొంటే నాతో బబలోనుకు రా. వస్తే నీ యోగక్షేమాల విషయంలో నేను తగిన శ్రద్ధ తీసికొంటాను. నీకు నాతో రావటానికి ఇష్టం లేకపోతే రావద్దు. చూడు; దేశమంతా నీకు బాహాటంగా తెరచబడి ఉంది. నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్లు.
JER 40:5 లేక షాఫాను పుత్రుడైన ఆహీకాము కుమారుడు గెదల్యావద్దకు తిరిగి వెళ్లు. యూదా పట్టణాల పరిపాలనా నిర్వహణకై బబులోను రాజు గెదల్యాను పాలకునిగా ఎంపిక చేశాడు. నీవు వెళ్లి గెదల్యాతో కలిసి ప్రజల మధ్య నివసించు. లేదా నీ ఇష్టమొచ్చిన మరెక్కడికైనా సరే వెళ్లు.” పిమ్మట నెబూజరదాను యిర్మీయాకు కొంత ఆహారాన్ని, ఒక కానుకను ఇచ్చి అతనిని పంపివేశాడు.
JER 40:6 కావున యిర్మీయా మిస్పా వద్ద వున్న అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వెళ్లాడు. యిర్మీయా గెదల్యాతో కలిసి యూదా రాజ్యంలో మిగిలి ఉన్న ప్రజల మధ్య నివసించాడు.
JER 40:7 యెరూషలేము నాశనం చేయబడినప్పుడు యూదా రాజ్య సైన్యంలోని కొంతమంది, సైనికులు అధికారులు, తదితర మనుష్యులు బయట ప్రాంతంలో వుండిపోయారు. రాజ్యంలో మిగిలిన ప్రజలను పాలించటానికి అహీకాము కుమారుడైన గెదల్యాను బబులోను రాజు నియమించినట్లు ఆ సైనికులు విన్నారు. యూదా రాజ్యంలో మిగిలిన ప్రజలలో మిక్కిలి పేదవారు, బబులోనుకు బందీలుగా తీసికొనిపోవటానికి అనువుగాని స్త్రీ పురుషులు, పిల్లలు వున్నారు.
JER 40:8 కావున ఆ సైనికులు మిస్పావద్ద గెదల్యాను కలవటానికి వచ్చారు. ఆ వచ్చిన సైనికులలో నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారులైన యోహోనాను మరియు యోనాతాను, తన్హుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీయుడైన ఏపయి యొక్క కుమారుడు, మాయకాతీయుని కుమారుడైన యెజన్యా, వారితో ఉన్న మనుష్యులు ఉన్నారు.
JER 40:9 షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యా ఆ సైనికులకు, వారితో ఉన్న మనుష్యులకు భద్రత కల్పించటానికి ఒక ప్రమాణం చేశాడు. గెదల్యా ఇలా అన్నాడు: “సైనికులారా, కల్దీయులకు సేవ చేయటానికి మీరు భయపడకండి. రాజ్యంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి. మీరిది చేస్తే, మీకు అంతా సవ్యంగా జరిగిపోతుంది.
JER 40:10 నేను కూడా మిస్పాలోనే నివసిస్తాను. కల్దీయులు ఇక్కడికి వచ్చినప్పుడు మీ తరపున నేను వారితో మాట్లాడతాను. మీరు ఆ పనిని నాకు వదలండి. వేసవి ద్రాక్షపంట నుండి రసం తీయాలి. నూనె కూడ తీయాలి. మీరు తయారు చేసినవన్నీ జాడీలలో నిలువ చేయండి. మీరు ఆక్రమించుకున్న పట్టణాలలో నివసించండి.”
JER 40:11 మోయాబు, అమ్మోను, ఎదోము, ఇంకను ఇతర దేశాలలో వున్న యూదా ప్రజలంతా బబులోను రాజు యూదా రాజ్యంలో కొంతమందిని వదిలి వెళ్లినట్లువిన్నారు. షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యాను బబులోను రాజు వారిపై పాలకునిగా నియమించినట్లు కూడ విన్నారు.
JER 40:12 ఆ యూదా ప్రజలు ఈ వార్త విన్న తరువాత యూదా రాజ్యానికి తిరిగి వచ్చారు. చిందరవందరగా వివిధ దేశాల్లో ఉన్న యూదా వారంతా మిస్పాకు తిరిగి వచ్చి గెదల్యాను ఆశ్రయించారు. తిరిగి వచ్చి, వారు చాల ద్రాక్షరసాన్ని తీసి, వేసవి పండ్లను సేకరించారు.
JER 40:13 బయట పల్లెల్లో ఉన్న కారేహ కుమారుడైన యోహానాను, ఇతర యూదా సైన్యాధికారులు గెదల్యా యొద్దకు వచ్చారు. గెదల్యా మిస్పా పట్టణంలో ఉన్నాడు.
JER 40:14 యోహానాను, మరియు అతనితో ఉన్న అధికారులు గెదల్యాతో, “అమ్మోనీయుల రాజైన బయలీను నిన్ను చంపజూస్తున్నాడు. అది నీకు తెలుసా? నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నిన్ను చంపటానికి పంపాడు” అని అన్నారు. కాని అహీకాము కుమారుడైన గెదల్యా వారు మాట నమ్మలేదు.
JER 40:15 పిమ్మట కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా మాట్లాడాడు. గెదల్యాతో యోహానాను ఇలా అన్నాడు: “నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నన్ను వెళ్లి చంపనిమ్ము. దానిని గురించి ఎవ్వరికీ తెలియకుండా నేను చేస్తాను. ఇష్మాయేలు నిన్ను చంపకుండా మేము చూస్తాము. అతడు నిన్ను చంపితే నిన్నాశ్రయించి వచ్చిన యూదా ప్రజలంతా మళ్లీ వివిధ దేశాలకు చెల్లాచెదరై పోతారు. అంటే మిగిలిన కొద్దిమంది యూదావారు కూడా నశించి పోతారన్నమాట.”
JER 40:16 కాని, అహీకాము కుమారుడైన గెదల్యా తన హితంగోరి చెప్పిన కారేహ కుమారుడైన యోహానానుతో, “ఇష్మాయేలును చంపవద్దు. నీవు ఇష్మాయేలును గురించి చెప్పుచున్న విషయాలు నిజం కావు” అని అన్నాడు.
JER 41:1 ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడు అగు ఇష్మాయేలు ఏడవ మాసంలో అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వచ్చాడు. అతనితో తమ మనుష్యులు పదిమంది ఉన్నారు. వారు మిస్పా పట్టణానికి వచ్చారు. ఇష్మాయేలు రాజ కుటుంబంలో ఒక సభ్యుడు. యూదా రాజు అధికారులలో ఒకడు. ఇష్మాయేలు, అతని మనుష్యులు గెదల్యాతో కలిసి భోజనం చేశారు.
JER 41:2 వారంతా కలిసి భోజనం చేస్తూవుండగా, ఇష్మాయేలు మరియు అతని పదిమంది మనుష్యులు లేచి అహీకాము కుమారుడైన గెదల్యాను కత్తితో పొడిచి చంపారు. గెదల్యా యూదా పాలకుడుగా బబులోను రాజుచే ఎంపిక చేయబడిన వ్యక్తి.
JER 41:3 మిస్పా పట్టణంలో గెదల్యాతో ఉన్న యూదా ప్రజలందరిని కూడ ఇష్మాయేలు చంపివేశాడు. అంతేగాదు. గెదల్యాతో వున్న కల్దీయుల సైనికులను కూడ ఇష్మాయేలు చంపివేశాడు.
JER 41:4 గెదల్యా హత్య గావింపబడిన మరుసటి రోజు ఎనభై మంది మనుష్యులు మిస్పాకు వచ్చారు. వారు ధాన్యపు నైవేద్యాలు, ధూపానికి సాంబ్రాణిని దేవాలయానికి తీసికొని వస్తున్నారు. ఆ ఎనభై మంది వ్యక్తులూ వారి గడ్డాలు గీయించుకొని తమ బట్టలు చింపుకొని, తమ శరీరాలను చీరుకొన్నారు వారు షెకెము, షిలోహు, షోమ్రోనుల నుండి వచ్చారు. వారిలో ఏ ఒక్కరికి గెదల్యా హత్య గావింపబడినట్లు తెలియదు.
JER 41:6 ఆ ఎనభై మందిని కలవటానికి ఇష్మాయేలు మిస్పా పట్టణం నుండి వారికి ఎదురేగాడు. అతడు వారిని కలవటానికి వెళుతూ రోదించాడు. ఇష్మాయేలు ఆ ఎనభై మంది మనుష్యులనూ కలిసి కొని, “నాతో రండి. మనం అహీకాము కుమారుడైన గెదల్యాను కలుద్దాము” అని చెప్పాడు.
JER 41:7 ఆ ఎనభై మంది మిస్పా పట్టణంలోకి వెళ్లారు. అప్పుడు ఇష్మాయేలు, అతని మనుష్యులు కలిసి ఆ వచ్చిన వారిలో డెబ్బయి మందిని చంపివేశారు. వారా శవాలను నీళ్లను నిల్వచేయటానికి నిర్మించిన నూయి వంటి గోతిలో పడవేశారు.
JER 41:8 కాని మిగిలిన పదిమంది ఇష్మాయేలుతో, “మమ్మల్ని చంపవద్దు! మావద్ద గోధుమ, యవధాన్యాలు ఉన్నాయి. మావద్ద తైలము, తేనె కూడ ఉన్నాయి. వాటిని మేమొక పొలంలో దాచాము (వాటిని మీకు ఇస్తాము)” అని చెప్పారు. అందువల్ల ఇష్మాయేలు ఆ పది మందినీ వదిలి పెట్టాడు. ఇతరులతో పాటు అతడు వారిని చంపలేదు.
JER 41:9 (ఈ నీటి గొయ్యి చాలా పెద్దది. ఆసా అనే యూదా రాజుచే అది నిర్మించబడింది. యుద్ధ కాలంలో నీటిని నిలువచేయటానికి రాజైన ఆసా దానిని నిర్మింప చేశాడు. ఇశ్రాయేలు రాజైన బయషా నుండి తన పట్టణాన్ని రక్షించుకోవటానికి ఆసా ఇలా చేశాడు. అయితే ఇష్మాయేలు మాత్రం ఆ గొయ్యి నిండేవరకు దానిలో శవాలను పడవేశాడు.)
JER 41:10 మిస్పా పట్టణంలో ఉన్న ఇతర ప్రజలందరినీ ఇష్మాయేలు పట్టుకున్నాడు. అలా పట్టుకున్న వారిలో రాజు కుమార్తెలు మరియు అక్కడ మిగిలియున్న ఇతర ప్రజలు వున్నారు. ఎవరినైతే నెబూజరదాను పాలించమని గెదల్యాను నియమించాడో, వారే ఆ ప్రజలు. నెబూజరదాను బబులోను రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి. ఇష్మాయేలు తాను పట్టుకున్న ప్రజలను తీసికొని అమ్మోను దేశానికి పోవటానికి బయలు దేరాడు.
JER 41:11 కారేహ కుమారుడైన యెహానాను మరియు అతనితో ఉన్న సైన్యాధికారులు ఇష్మాయేలు చేసిన క్రూరమైన పనులన్నిటి గురించి విన్నారు.
JER 41:12 కావున యోహానాను, అతనితో వున్న సైన్యాధికారులు తమ సైనికులను వెంట తీసికొని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎదుర్కోవటానికి వెళ్లారు. గిబియోను వద్ద గల పెద్ద చెరువు దగ్గర వారు ఇష్మాయేలును పట్టుకున్నారు.
JER 41:13 ఇష్మాయేలును బందీలుగా పట్టుకు పోతున్న యోహానానును, సైన్యాధికారులను చూచి జనులు చాలా సంతోషించారు.
JER 41:14 అప్పుడు మిస్పా పట్టణంలో ఇష్మాయేలు బందీలుగా తీసికొన్న వారంతా కారేహ కుమారుడైన యోహానాను వద్దకు పరుగెత్తారు.
JER 41:15 కాని ఇష్మాయేలు మరియు అతనితో ఉన్న వారిలో ఎనిమిది మంది యోహోనాను నుండి తప్పించుకున్నారు. వారు అమ్మోనీయుల వద్దకు పారిపోయారు.
JER 41:16 ఆ విధంగా కారేహ కుమారుడైన యోహానాను, సైనికాధికారులు బందీలను రక్షించారు. ఇష్మాయేలు గెదల్యాను హత్య చేసి ఆ ప్రజలను మిస్పా పట్టణంలో పట్టుకున్నాడు. బతికి బయటపడిన వారిలో సైనికులు, స్త్రీలు, పిల్లలు మరియు న్యాయాధికారులు వున్నారు, యెహానాను వారిని గిబియోను పట్టణం నుండి తిరిగి తీసికొని వచ్చాడు.
JER 41:17 యోహానాను, ఇతర సైనికాధికారులు కల్దీయుల విషయంలో భయపడ్డారు. బబులోను రాజు గెదల్యాను యూదా రాజ్యానికి పాలకునిగా ఎంపిక చేశాడు. కాని ఇష్మాయేలు గెదల్యాను హత్య చేశాడు. దానితో కల్దీయులకు కోపం వస్తుందేమోనని యోహానాను భయపడ్డాడు. కావున వారు ఈజిప్టుకు పారిపోవాలని నిశ్చయించుకొన్నారు. ఈజిప్టుకు పోతూ మార్గమధ్యంలో వారు గెరూతు కింహాము వద్ద ఆగారు. గెరూతు కింహాము బేత్లెహేము పట్టణం దగ్గర ఉన్నాది.
JER 42:1 వారు గెరూతు కింహాము వద్ద ఉండగానే యోహానాను, హోషేయా కుమారుడైన యెజన్యా అనే మరో వ్యక్తి కలిసి ప్రవక్తయైన యిర్మీయా వద్దకు వెళ్లారు. సైన్యాధికారులంతా యోహానాను, యెజన్యానులతో కలిసి వెళ్లారు. అల్పులు మొదలు ఉన్నతుల వరకు అంతా యిర్మీయా వద్దకు వెళ్లారు.
JER 42:2 వారంతా ఇలా అన్నారు: “యిర్మీయా, దయచేసి మా అభ్యర్థన ఆలకించు. యూదా సంతతిలో బతికి బయటపడిన ఈ ప్రజలందరిని గురించి నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. యిర్మీయా, మాలో ఎక్కువ మంది మిగలలేదు. ఒకప్పుడు మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాము.
JER 42:3 యిర్మీయా, మేము ఎక్కడికి వెళ్లవలెనో, ఏమి చేయవలెనో నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి తెలుసుకో.”
JER 42:4 అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా ఇలా అన్నాడు: “మీరు నన్ను చేయమని అడిగిన విషయాలను నేను అర్థం చేసికొన్నాను. మీ దేవుడైన యెహోవాకు మీరడిగిన విధంగా నేను ప్రార్థన చేస్తాను. యెహోవా చెప్పినదంతా నేను మీకు తెలియజేస్తాను. మీకు నేనేదీ దాచి పెట్టను.”
JER 42:5 తరువాత ప్రజలు యిర్మీయాతో ఇలా అన్నారు, “నీ దేవుడైన యెహోవా చెప్పినదంతా మేము చేయకపోతే దేవుడే మాకు వ్యతిరేకంగా నిజమైన సాక్షి అవుతాడు. నీ దేవుడైన యెహోవా మేము ఏది చేయాలో నీకు తెలియజేస్తాడని మాకు తెలుసు.
JER 42:6 యెహోవా వర్తమానం మాకు సమ్మతమవుతుందా, సమ్మతం కాదా అనేది సమస్య కాదు. మా యెహోవా దేవుని పట్ల మేము విధేయులపై ఉంటాము. మేము నిన్ను ఒక సందేశం తెచ్చుట కొరకు పంపుచున్నాము. దానికి మేము కట్టుబడి ఉంటాము. మా దేవుడైన యెహోవాకు మేము విధేయులమైనప్పుడు మాకు మంచి విషయాలు జరుగుతాయని మాకు ఖచ్చితముగా తెలుసు.”
JER 42:7 పది రోజులు జరిగిన పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినిపించింది.
JER 42:8 అప్పుడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్యాధికారులను యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. అతి సామాన్యుడి మొదలు అతి ముఖ్యమైన వ్యక్తి వరకు ప్రజలందరినీ కూడ యిర్మీయా ఒక చోటికి పిలిచాడు.
JER 42:9 అప్పుడు యిర్మీయా వారితో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వద్దకు మీరు నన్ను పంపారు. మీరు నన్ను అడగమన్నదంతా నేను యెహోవాను అడిగాను. యెహోవా ఇలా చెపుతున్నాడు:
JER 42:10 ‘ప్రజలారా మీరు యూదాలో ఉంటే నేను మిమ్మల్ని బలపర్చుతాను—మిమ్మల్ని నాశనం చేయను. మీరు స్థిరపడేలా చేస్తాను. నేను మిమ్మల్ని పెకలించి వేయను. నేనిది ఎందుకు చేయదలచుకున్నానంటే, నేను మీకు కలుగజేసిన భయంకర విషయాల పట్ల నేను విచారిస్తున్నాను.
JER 42:11 బబులోను రాజు విషయంలో ఇప్పుడు మీరు భయపడుతున్నారు. కాని అతనిని చూచి మీరు భయపడవద్దు. బబులోను రాజంటే మీరు భయపడవద్దు.’ ఇదే యెహోవా సందేశం. ‘ఎందువల్ల నంటే, నేను మీతో ఉన్నాను. నేను మిమ్మల్ని కాపాడతాను. నేను మిమ్మల్ని రక్షిస్తాను. అతడు మీ మీద చెయ్యి వేయలేడు.
JER 42:12 నేను మీ పట్ల దయగలిగి వుంటాను. బబులోను రాజు కూడ మీ పట్ల కనికరం చూపుతాడు. అతడు మిమ్మల్ని మీ దేశానికి తిరిగి తీసుకొని వస్తాడు.’
JER 42:13 ‘మేము యూదాలో వుండమని’ మీరు అనవచ్చు. అలా అంటే మీరు మీ యెహోవా దేవుని అనుసరించనట్లే.
JER 42:14 ‘అది కాదు. మేము వెళ్లి ఈజిప్టులో నివసిస్తాము. ఆ దేశంలో మాకు యుద్ధ భయం ఉండదు. మేమక్కడ యుద్ధ భేరీలు వినము. మేము అక్కడ ఆకలితో బాధపడము అని మీరు అనవచ్చు.’
JER 42:15 యూదాలో మిగిలిన ప్రజలారా, మీరలా అంటే యెహోవా వర్తమానం ఏమిటో వినండి. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘మీరు ఈజిప్టునందు నివసింప నిశ్చయిస్తే మీకు ఇలా జరుగుతుంది:
JER 42:16 మీరు యుద్ధమనే కత్తికి భయపడ్డారు. కాని అది మిమ్మల్ని అక్కడ ఓడిస్తుంది. మీరు ఆకలి విషయంలో భయపడ్డారు. కాని మీరు ఈజిప్టులో క్షామానికి గురియగుతారు. మీరక్కడ చనిపోతారు.
JER 42:17 ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించాలనుకునే ప్రతివాడు కత్తివాతబడి గాని, ఆకలిచేగాని, భయంకర వ్యాధులచేగాని చనిపోతాడు. ఈజిప్టుకు వెళ్లే ఏ ఒక్కడు బతకడు. నేను వారికి కలుగజేసే భయంకర పరిస్థితుల నుండి ఏ ఒక్కడూ తప్పించుకోలేడు.’
JER 42:18 “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘యెరూషలేము పట్ల నా కోపాన్ని చూపాను. యెరూషలేములో నివసించే ప్రజలను నేను శక్షించాను. అదేరీతిగా ఈజిప్టుకు వెళ్లే ప్రతివాని పట్లా నా కోపం చూపిస్తాను. ప్రజలు తమ శత్రువులకు కీడు జరగాలని కోరుకున్నప్పుడు మీకు జరిగినట్లు జరగాలని మిమ్మల్ని ఒక ఉదాహరణగా తీసుకుంటారు. మీరు శాపగ్రస్తులౌతారు. మిమ్మల్ని చూచి ప్రజలు సిగ్గు చెందుతారు. ప్రజలు మిమ్మల్ని అవమాన పర్చుతారు. మీరు మళ్లీ యూదా రాజ్యాన్ని చూడరు.’
JER 42:19 “యూదాలో మిగిలివున్న ప్రజలారా, ‘మీరు ఈజిప్టుకు పోవద్దు’ అని యెహోవా మీకు చెప్పియున్నాడు. ఇప్పుడే మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను.
JER 42:20 మీకు చావు తీసికొనివచ్చే తప్పు మీరు చేస్తున్నారు. ‘మీరే నన్ను మీ ప్రభువైన ెదేవుని వద్దకు పంపారు. మన ప్రభువైన దేవుణ్ణి మా కొరకు ప్రార్థించు. యెహోవా ఏమి చేయమని చెప్పుచున్నాడో అదంతా మాకు తెలియజేయుము. మేము యెహోవా చెప్పినట్లు నడచుకొంటాము’ అని మీరే నాతో అన్నారు.
JER 42:21 కావున ఈ రోజు యెహోవా సందేశాన్ని మీకు వినిపించాను. కాని మీరు ప్రభువైన మీ దేవునికి విధేయులు కాలేదు. ఆయన మిమ్మల్ని ఏమి చేయమని చెప్పటానికి నన్ను పంపియున్నాడో అదంతా మీరు చేయలేదు!
JER 42:22 కావున ఇప్పుడిది బాగా అర్థం చేసికొనండి: మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించాలని అనుకుంటున్నారు. కాని ఈజిప్టులో మీరు కత్తివేటుకు గురియైగాని, ఆకలిచేగాని, భయంకర రోగాలతో గాని చనిపోతారు.”
JER 43:1 వారి దేవుడైన యెహోవావద్ద నుండి వచ్చిన సందేశాన్ని యిర్మీయా అలా చెప్పి ముగించాడు. యెహోవా తనకు తెలియజేసిన రీతిగా యిర్మీయా ప్రజలందరికి పూర్తిగా చెప్పాడు.
JER 43:2 కాని హోషేయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను, ఇంకను మరికొంత మంది అహంభావంతో మొండివైఖరి దాల్చారు. వారు యిర్మీయా పట్ల చాలా కోపగించారు. “యిర్మీయా నీవు అబద్ధమాడుతున్నావు! ‘ఓ ప్రజలారా, మీరు నివసించటానికి ఈజిప్టుకు వెళ్లరాదు’ అని మాకు చెప్పుమని మా ప్రభువైన దేవుడు నిన్ను పంపలేదు.
JER 43:3 యిర్మీయా, నేరియా కుమారుడైన బారూకు నిన్ను మాకు వ్యతిరేకంగా పురికొల్పుచున్నాడని మేమనుకుంటున్నాము. నీవు మమ్మల్ని బబులోను వారికి అప్పగించాలని అతడు ఆశిస్తున్నాడు. నీవు ఇది చేస్తే, వారు మమ్మల్ని చంపాలని ఎదురు చూస్తున్నారు. లేదా, నీవిది చేస్తే వారు మమ్మల్ని బందీలుగా బబులోనుకు పట్టుకుపోవాలని అయినా కోరుకొని వుండవచ్చు” అని అన్నారు.
JER 43:4 కావున యోహానాను, సైనికాధికారులు, ఇతర ప్రజలు ప్రభువాజ్ఞ తిరస్కరించారు. యెహోవా వారిని యూదాలో వుండమని ఆజ్ఞ ఇచ్చాడు.
JER 43:5 కాని ప్రభువాజ్ఞ పాటించటానికి బదులు, యోహానాను మరియు సైనికాధికారులు యూదాలో మిగిలిన వారిని ఈజిప్టుకు తీసికొని వెళ్లారు. గతంలో ఆ మిగిలిన వారిని శత్రువు ఇతర దేశాలకు తీసికొని వెళ్లాడు. కాని వారు మరల యూదా దేశానికి తిరిగి వచ్చారు.
JER 43:6 ఇప్పుడు యోహానాను మరియు సైనికాధికారులు కలిసి పురుషులను, స్త్రీలను, పిల్లలను అందరినీ ఈజిప్టుకు తీసికొని వెళ్లారు. ఆ విధంగా తీసికొని వెళ్లబడిన వారిలో రాజు కుమార్తెలు కూడ వున్నారు. (నెబూజరదాను ఆ ప్రజలందరినీ గెదల్యా సంరక్షణలో వుంచాడు. నెబూజరదాను బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతి.) ప్రవక్తయైన యిర్మీయాను, నేరీయా కుమారుడగు బారూకును కూడ యోహానాను వెంట తీసికొని వెళ్లాడు.
JER 43:7 వారు యెహోవా మాట పెడచెవినిబెట్టి ఈజిప్టుకు వెళ్లారు. వారు తహపనేసు అనే పట్టణానికి వెళ్లారు.
JER 43:8 తహపనేసు పట్టణంలో యెహోవా యొక్క ఈ వర్తమానం యిర్మీయాకు చేరింది:
JER 43:9 “యిర్మీయా, కొన్ని పెద్ద రాళ్లను తీసికొనిరా, వాటిని తహపనేసులో ఫరో రాజు అధికార గృహానికి ఎదురుగా మట్టితోను, ఇటుకలతోను నిర్మించిన పక్కబాట కింద పాతిపెట్టు. యూదా వారు చూస్తుండగా నీవీపని చేయ్యి.
JER 43:10 అప్పుడు నిన్ను చూస్తూవున్న యూదా వారితో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు: బబులోను రాజైన నెబుకద్నెజరును ఇక్కడికి పిలుస్తాను. అతడు నా సేవకుడు. నేనిక్కడ పాతిపెట్టిన రాళ్లమీద నేనతని సింహాసనాన్ని నెలకొల్పుతాను. నెబుకద్నెజరు తన రత్నకంబళిని ఈ రాళ్లపై పరుస్తాడు.
JER 43:11 నెబుకద్నెజరు ఇక్కడికి వచ్చిన ఈజిప్టును ఎదిరిస్తాడు. మరణించవలసిన వారికి అతడు మరణాన్ని తీసికొనివస్తాడు. బందీలుగా కొనిపోబడే వారికి దాస్యాన్ని తెస్తాడు. కత్తిచే హతము గావింపబడే వారి మీదికి ఖడ్గాన్ని తెస్తాడు
JER 43:12 ఈజిప్టులోని బూటకపు దేవుళ్ల గుళ్లల్లో నెబుకద్నెజరు అగ్నిని రగుల్చుతాడు. అతడా గుళ్లను తగులబెట్టి, విగ్రహాలను తీసికొని పోతాడు. గొర్రెల కాపరి తమ బట్టలనుండి నల్లులను, ముండ్ల కాయలను ఏరివేయునట్లు నెబుకద్నెజరు ఈజిప్టును శుభ్రపర్చి వశం చేసికొంటాడు. ఆ తరువాత అతడు ఈజిప్టునుండి సురక్షితంగా వెళ్లిపోతాడు.
JER 43:13 ఈజిప్టులో అతి ముఖ్యమైన సూర్య దేవాలయంలోని పవిత్ర రాతి స్తంభాలను నెబుకద్నెజరు నాశనం చేస్తాడు. పైగా ఈజిప్టులోని బూటకపు దేవతల ఆలయాలన్నిటినీ అతడు తగులబెడతాడు!’”
JER 44:1 యిర్మీయాకు యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారందరి కొరకు ఉద్దేశించబడింది. ఈ వర్తమానం మిగ్దోలు, తహపనేసు, నొపు పట్టణాలలోను మరియు దక్షిణ ఈజిప్టులోను నివసిస్తున్న యూదా వారికై ఇవ్వబడింది. ఆ సందేశం ఇలా ఉంది:
JER 44:2 “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, ‘యెరూషలేము నగరం మీదికి, యూదా పట్టణాలన్నిటి మీదికి నేను రప్పించిన భయంకర విపత్తులను మీరంతా చూశారు. ఆ పట్టణాలన్నీ ఈనాడు వట్టి రాళ్ల గుట్టల్లా వున్నాయి.
JER 44:3 ప్రజలంతా పాపకార్యాలు చేయుటవల్లనే ఆ ప్రదేశాలన్నీ నాశనమయ్యాయి. ఆ ప్రజలు అన్యదేవతలకు బలులు అర్పించారు. అది నాకు కోపకారణమయ్యింది! గతంలో మీ ప్రజలు మీ పూర్వీకులు ఆ అన్యదేవతలను ఎరుగరు; ఆరాధించలేదు.
JER 44:4 ఆ ప్రజల వద్దకు నా ప్రవక్తలను అనేక పర్యాయాలు పంపి యున్నాను. ఆ ప్రవక్తలు నా సేవకులు. ఆ ప్రవక్తలు నా సందేశాన్ని ప్రజలకు చెప్పారు. “మీరీ భయంకరమైన పని చేయవద్దు. విగ్రహారాధన విషయమై మిమ్మల్ని నేను అసహ్యించు కుంటున్నట్లు” వారు ప్రజలకు చెప్పారు.
JER 44:5 కాని ఆ ప్రజలు నా ప్రవక్తల మాట వినలేదు. ప్రజలసలు ప్రవక్తలను లక్ష్యపెట్టనేలేదు. ఆ ప్రజలు దుష్ట కార్యాలు చేయటం మానలేదు. అన్యదేవతలకు బలులు అర్పించటం వారు మానలేదు.
JER 44:6 కావున వారి మీద నా కోపాన్నీ చూపించాను. యూదా పట్టణాలను, యోరూషలేము నగర వీధులను నేను శిక్షించాను. ఈనాడు అవి వున్నట్లుగా యోరూషలేము నగరాన్ని, యూదా పట్టణాలను పట్టి రాళ్ల గుట్టల్లా నా కోపం మార్చివేసింది.’
JER 44:7 “ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు, “విగ్రహారాధన చేస్తూ మిమ్మల్ని మీరు ఎందుకు బాధపెట్టుకుంటున్నారు? యూదా కుంటుంబం నుంచి పురుషులను, స్త్రీలను మరియు పిల్లలను, పసికందులను వేరు చేస్తున్నారు. ఆ విధంగా యూదా వంశంలో ఎవ్వరూ మిగలకుండా మీరు చేసుకుంటున్నారు.
JER 44:8 విగ్రహాలను తయారు చేస్తూ మీరెందుకు నాకు కోపం కల్గించ దల్చుకున్నారు? ఇప్పుడు మీరు ఈజిప్టులో ఉన్నారు. మళ్లీ మీరిప్పుడు ఈజిప్టుకు చెందిన బూటకపు దేవతలకు బలులు సమర్పిస్తూ నాకు కోపం కల్గిస్తూ ఉన్నారు. మీకై మీరే మిమ్మల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కేవలం అది మీ తప్పే. ఇతర దేశాలవారు మిమ్మల్ని గూర్చి చెడుగా మాట్లాడతారు. ఈ భూమి మీద వున్న రాజ్యాలన్నీ మిమ్మల్ని హేళన చేస్తాయి.
JER 44:9 మీ పూర్వీకులు చేసిన చెడుకార్యాలను మీరు మర్చిపోయారా? యూదా రాజులు, రాణులు చేసిన క్రూర కార్యాలు మీరు మర్చిపోయారా? మీరు, మీ భార్యలు కలసి యూదాలోను మరియు యెరూషలేము నగర వీధులలోను చేసిన చెడుకార్యాలు మర్చిపోయారా?
JER 44:10 ఈనాటికీ యూదా ప్రజలు తమ్ము తాము తగ్గించు కోలేదు. నాపట్ల గౌరవ భావమేమీ చూపలేదు. ఆ ప్రజలు నా బోధనలను అనుసరించలేదు. మీకు, మీ పితరులకు యిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు పాటించలేదు.”
JER 44:11 “కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘మీకు భయంకరమైన విపత్తులు కలుగజేయటానికి నేను నిశ్చయించాను. యూదా వంశాన్నంతా నాశనం చేస్తాను!
JER 44:12 యూదాలో బహు తక్కువమంది మిగిలారు. వారిక్కడ ఈజిప్టుకు వచ్చియున్నారు. కాని యూదా వంశంలో మిగిలిన ఆ కొద్దిమందినీ నేను నాశనం చేస్తాను. వారు కత్తివాతబడిగాని, ఆకలితోగాని చనిపోతారు. ఇతర దేశాలవారు వీరిని గురించి చెడుగా చెప్పుకునేలా వీరు తయారవుతారు. వీరికీ జరిగిన సంఘటనలను తలుచుకొని ఇతర దేశాలవారు భయభ్రాంతులవుతారు. ఆ ప్రజలు శాపానికి మారు పేరవుతారు. ఆ యూదా ప్రజలను ఇతర దేశీయులు అవమానపర్చుతారు.
JER 44:13 ఈజిప్టులో నివసించటానికి వచ్చిన వారిని నేను శిక్షిస్తాను. వారిని శిక్షించటానికి నేను కత్తిని, క్షామాన్ని, భయంకర రోగాలను వినియోగిస్తాను. యెరూషలేము నగరాన్ని శిక్షించిన విధంగానే ఆ ప్రజలను కూడ నేను శిక్షిస్తాను.
JER 44:14 యూదాలో బతికి బయటపడి ఈజిప్టులో నివసిస్తున్న కొద్ది మందిలో ఏ ఒక్కడూ నా శిక్షను తప్పించుకోలేడు. యూదాకు తిరిగి రావటానికి ఒక్కడు కూడా మిగలడు. వారు యూదాకు తిరిగివచ్చి మరల అక్కడ నివసించాలని కోరుకుంటారు. బహుశః తప్పించుకున్న బహు కొద్దిమంది తప్ప, వారిలో ఒక్కడు కూడ యెరూషలేముకు తిరిగి వెళ్లడు.’”
JER 44:15 ఈజిప్టులో నివసిస్తున్న చాలా మంది యూదా స్త్రీలు అన్యదేవతలను ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అది వారి భర్తలకు తెలుసు. అయినా వారు వారిని వారించలేదు. ఆ ప్రజలు పెద్ద గుంపుగా కలుసుకొన్నారు. వారిలో దక్షిణ ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలున్నారు. అన్యదేవతలకు నైవేద్యాలు అర్పిస్తున్న స్త్రీల భర్తలు యిర్మీయాతో ఇలా అన్నారు:
JER 44:16 “నీవు మాకు చెపుతున్న యెహోవా సందేశాన్ని మేము వినం.
JER 44:17 ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు సమర్పిస్తామని మేము మొక్కుకున్నాము. మేము మొక్కుకున్న విధంగా అంతా చేస్తాము. ఆమెకు పూజలో బలులు అర్పించి, పానార్పణ సమర్పిస్తాము. గతంలో మేమలా చేశాం. గతకాలంలో మా పూర్వీకులు, మా రాజులు, మా అధికారులు అలా చేశారు. యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను మేమంతా అలా చేశాం. ఆకాశ రాణిని మేము ఆరాధించినపుడు మాకు పుష్కలంగా ఆహారం దొరికింది. మాకు విజయం చేకూరింది. మాకు ఏ కీడూ సంభవించలేదు.
JER 44:18 కాని మేము ఆకాశ రాణికి పానీయాలు సమర్పించటం మానివేశాం. ఆమె పూజలో ఇవన్నీ మేము చేయటం మానినప్పటి నుండి మాకు అనేక సమస్యలు వచ్చాయి. మా ప్రజలు కత్తులచేత, ఆకలిచేత చంపబడ్డారు.”
JER 44:19 తరువాత స్త్రీలు మాట్లాడారు. వారు యిర్మీయాతో యిలా చెప్పారు, “మేము ఏమి చేస్తున్నామో మా భర్తలకు తెలుసు. ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు అర్పించుటకు మా భర్తల అనుమతి పొందాము. వారి అనుమతితోనే మేము ఆమెకు పానీయాలు వారబోశాము. ఆమె ప్రతిరూపంగా మేము కుడుములు చేయటం కూడ మా భర్తలకు తెలుసు.”
JER 44:20 పిమ్మట యిర్మీయా ఆ స్త్రీ పురుషులతో మాట్లాడాడు. ఈ విషయాలన్నీ చెప్పిన ఆ ప్రజలతో అతడు మాట్లాడినాడు.
JER 44:21 ఆ ప్రజలతో యిర్మీయా ఇలా అన్నాడు: “యూదా పట్టణాలలోను, యెరూషలేము నగరంలోను మీరు ఈ దేవతలకు చేసిన బలి అర్పణలు యెహోవా గుర్తుపెట్టుకున్నాడు. మీరు, మీ పితరులు, మీ రాజు, మీ అధికారులు మరియు దేశంలో ఇతర ప్రజలు ఆ పనులు చేశారు. మీరు చేసిన పనిని యెహోవా గుర్తుపెట్టుకొని దానిని గురించి ఆలోచన చేశాడు.
JER 44:22 తరువాత యెహోవా మీపట్ల ఎంతమాత్రం ఓర్పు వహించ లేకపోయాడు. మీరు చేసిన భయంకరమైన పనులను యెహోవా అసహ్యించుకున్నాడు. అందువల్ల యెహోవా మీ దేశాన్ని వట్టి ఎడారిగా మార్చి వేశాడు. అక్కడ ఇప్పుడు ఎవ్వడూ నివసించడు. అన్యులు ఆ రాజ్యాన్ని గురించి చెడ్డగా చెప్పుకుంటారు.
JER 44:23 అన్య దేవతలకు మీరు బలులు అర్పించిన కారణంగా మీకు కష్టాలన్నీ వచ్చాయి. మీరు యెహోవా పట్ల పాపం చేశారు. మీరు యెహోవాకు విధేయులై వుండలేదు. మీకు అందజేసిన ఆయన ఆదేశాలనుగాని, ఆయన నిర్దేశించిన న్యాయసూత్రాలను గాని మీరు అనుసరించలేదు. దేవుని ఒడంబడికలో మీ బాధ్యతను మీరు విస్మరించారు.”
JER 44:24 తరువాత ప్రజలందరినీ ఉద్దేశించి యిర్మీయా ఇలా చెప్పాడు: “ఇప్పుడు ఈజిప్టులో ఉన్న యూదా ప్రజలారా, యెహోవా వాక్కు వినండి:
JER 44:25 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్తున్నాడు, ‘మీరు మరియు మీ భార్యలు ఏమి చేస్తామని చెప్పినారో అది చేశారు. ఆకాశ రాణికి “మేము మొక్కుకున్న బలులు అర్పిస్తాము, పానీయాలు వారపోస్తాము” అని మీరన్నారు. అయితే అలాగే చేయండి. మీమాట ప్రకారం మీరు చేస్తామన్న పనులు చేయండి. మీ వాగ్దానాలను మీరు నిలబెట్టుకోండి.’
JER 44:26 కాని, ఈజిప్టులో నివసిస్తున్న ఓ యూదా ప్రజలారా యెహోవా సందేశాన్ని వినండి: ‘మహిమగల నా పేరు మీద ఈ ప్రమాణం చేస్తున్నాను: ఇప్పుడు ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారిలో ఒక్కడు కూడ మరెన్నడూ నా పేరు మీద వాగ్దానాలు చేయడు. “నిత్యుడైన యెహోవా సాక్షిగా” అని వారు చెప్పరు.
JER 44:27 ఆ యూదా ప్రజలను నేను గమనిస్తున్నాను. కాని వారి సంక్షేమం కొరకు నేను వారిని గమనించటం లేదు. వారిని దెబ్బ కొట్టటానికే నేను కనిపెట్టుకునివున్నాను. ఈజిప్టులో వున్న యూదా వారు ఆకలితో మాడి చనిపోతారు. కత్తులతో నరకబడి చనిపోతారు. వారలా క్రమేపీ ఒకరి తరువాత ఒకరు అందరూ ముగిసేవరకు చనిపోతారు.
JER 44:28 కొంతమంది యూదావారు కత్తివాతబడకుండా తప్పించుకుంటారు. వారు ఈజిప్టునుండి యూదాకు తిరిగి వస్తారు. అలా తప్పించుకోగలిగే యూదా వారు బహు తక్కువ మంది మాత్రమే. ఈజిప్టులో నివసించటానికి వచ్చి బ్రతికి బయటపడే ఆ బహు కొద్ది మంది యూదా వారు ఎవరి మాట నిజమవుతుందో తెలుసుకుంటారు. నా మాట నిజమయ్యినదో, వారి మాట నిజమయ్యినదో వారప్పుడు తెలుసుకుంటారు.
JER 44:29 ఇక్కడ ఈజిప్టులో మిమ్మల్ని నేను శిక్షిస్తానని తెలిసేటందుకు ఒక నిదర్శనం ఇస్తాను.’ ఇదే యెహోవా వాక్కు. ‘అప్పుడు మిమ్మల్ని శిక్షిస్తానని నేను చేసిన ప్రమాణం నిజమవుతుందని మీకు నిశ్చయంగా తెలుస్తుంది.
JER 44:30 నేను చెప్పినది చేస్తాననేందుకు ఇది ఒక నిదర్శనం.’ యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: ‘ఫరొహొఫ్ర ఈజిప్టుకు రాజు. శత్రువులు అతనిని చంపజూస్తున్నారు ఫరోహొఫ్రను అతని శత్రువులకు నేనప్పగిస్తాను. సిద్కియా యూదా రాజు. సిద్కియా శత్రువు నెబుకద్నెజరు. సిద్కియాను నేనతని శత్రువుకు అప్పగించాను. అదే రీతిగా ఫరోహొఫ్రను నేనతని శత్రువుకు అప్పగిస్తాను.’”
JER 45:1 యెహోయాకీము కుమారుడు యోషియా యూదాలో రాజైన యెహోయాకీము పాలన నాల్గవ సంవత్సరం జరుగుతూ ఉండగా ప్రవక్తయైన యిర్మీయా ఈ విషయాలను నేరీయా కుమారుడైన బారూకుతో చెప్పాడు. బారూకు ఈ విషయాలను పుస్తక రూపంలో రాశాడు. యిర్మీయా బారూకుకు చెప్పినది ఇది:
JER 45:2 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమనంటే,
JER 45:3 ‘బారూకూ, నీవిలా అన్నావు, “నాకు కష్టం వచ్చింది. నా బాధకు తోడు యెహోవా నాకు దుఃఖాన్ని యిచ్చాడు. నేను మిక్కిలి అలసిపోయాను. నా బాధలవల్ల నేను మిక్కిలి కృశించిపోయాను. నాకు విశ్రాంతి లేదు.”
JER 45:4 యిర్మీయా, నీవిది బారూకుకు చెప్పు: యెహోవా ఇలా అంటున్నాడు: నేను నిర్మించిన దానిని నేనే పడగొట్టుతున్నాను. నేను దేనినైతే నాటితినో దానిని నేనే పెరికివేస్తున్నాను. యూదాలో ప్రతిచోటా నేనలా చేస్తాను.
JER 45:5 బారూకూ, నీవు నీ కొరకై గొప్ప విషయాలకై ఎదురు చూస్తున్నావా? నీవు వాటి కొరకు చూడవద్దు. ఎందుకంటే, నేను భయంకర విపత్తును ప్రజలందరి మీదికి కలుగజేస్తున్నాను గనుక నీవు వారి కొరకు చూడవద్దు.’ ఇవి యెహవా చెప్పిన విషయాలు. ‘నీవు చాలా చోట్లకు వెళ్లవలసి వుంటుంది. నీవు ఎక్కడికి వెళ్లినా ప్రాణంతో తప్పించుకునేలా నేను చేస్తాను.’”
JER 46:1 ప్రవక్తయైన యిర్మీయాకు ఈ సందేశాలు వచ్చాయి. ఆ సందేశాలు వివిధ దేశాలకు సంబంధించి ఉన్నాయి.
JER 46:2 ఈ వర్తమానం ఈజిప్టు దేశాన్ని గురించి చెప్పిబడినది. అది ఫరోనెకో సైన్యానికి సంబంధించినది. నెకో ఈజిప్టు రాజు. అతని సైన్యం కర్కెమీషు అనే పట్టణం వద్ద ఓడింపబడింది. కర్కెమీషు యూఫ్రటీసు నది తీర పట్టణం. బబులోను రాజైన నెబుకద్నెజరు ఫరోనెకో సైన్యాన్ని కర్కెమీషు వద్ద ఓడించాడు. అప్పుడు యూదా రాజైన యెహోయాకీము పాలనలో నాల్గవ సంవత్సరం గడుస్తూ ఉంది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. ఈజిప్టుకు సంబంధించిన యెహోవా సందేశం ఇలా ఉంది:
JER 46:3 “మీ చిన్న, పెద్దడాళ్లను తీసుకోండి. యుద్ధానికి నడవండి.
JER 46:4 గుర్రాలను సిద్ధం చేయండి. సైనికులారా, మీరు గుర్రాలను ఎక్కండి. యుద్ధానికై మీమీ సంకేత స్థలాలకు వెళ్లండి. మీ శిరస్త్రాణాలను పెట్టుకోండి. మీ ఈటెలకు పదును పెట్టండి. మీ కవచాలను ధరించండి.
JER 46:5 నేనేమిటి చూస్తున్నాను? ఆ సైన్యం భయపడింది! సైనికులు పారిపోతున్నారు. ధైర్యవంతులైన వారి సైనికులు ఓడింపబడ్డారు. వారు తత్తరపడి పారిపోతున్నారు. వారు వెనుదిరిగి చూడకుండా పోతున్నారు. ఎటు చూచినా భయం.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
JER 46:6 “వేగంగా పరుగెత్తేవారు, బలవంతులు కూడా తప్పించుకోలేరు. వారు తూలి పడిపోతారు. ఉత్తరదేశంలో యూఫ్రటీసు నదీ తీరాన ఇది జరుగుతుంది.
JER 46:7 నైలు నదిలా ఆ వచ్చేది ఎవరు? పరవళ్లు తొక్కుతూ ప్రవహించే ఆ మహానదిలా వచ్చేది ఎవరు?
JER 46:8 పొంగి ప్రవహించే నైలు నదిలా వచ్చేది ఈజిప్టు దేశమే. మహా వేగంతో ప్రవహించే మహా నదిలా వచ్చేది. ఈజిప్టు దేశమే. ‘నేను వచ్చి భూమిని కప్పివేస్తాను. నేను నగరాలను, వాటి నివాసులను నాశనం చేస్తాను’ అని ఈజిప్టు అంటున్నది.
JER 46:9 గుర్రపు రౌతుల్లారా, యుద్ధానికి కదలండి. సారధుల్లారా, శరవేగంతో రథాలు తోలండి. యోధుల్లారా ముందుకు పదండి. కూషు, పూతు సైనికులారా మీ డాళ్లను చేబూనండి. లూదీయులారా, మీ విల్లంబులు వాడండి.
JER 46:10 “కాని ఆ రోజు సర్వశక్తిమంతుడైన మన యెహోవా గెలుస్తాడు! ఆ సమయంలో ఆయన శత్రువులకి తగిన శిక్ష ఆయన విధిస్తాడు. యెహోవా శత్రువులు వారికి అర్హమైన శిక్ష అనుభవిస్తారు తన పని పూర్తి అయ్యేవరకు కత్తి హతమారుస్తుంది. దాని రక్తదాహం తీరేవరకు కత్తి సంహరిస్తుంది. ఇది జరుగుతుంది. ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన మన మన యెహోవాకు ఒక బలి జరగవలసి వుంది. ఆ బలి ఈజిప్టు సైన్యమే! అది ఉత్తర దేశాన యూఫ్రటీసు నది ఒడ్డున జరుగుతుంది.
JER 46:11 “ఈజిప్టు, గిలియాదు వరకు వెళ్లి మందు తెచ్చుకో. నీవు మందులనేకం తయారుచేస్తావు, అయినా అవి నీకు ఉపయోగపడవు. నీ గాయాలు మానవు.
JER 46:12 నీ రోదనను దేశాలు వింటాయి. నీ ఏడ్పు ప్రపంచమంతా వినపడుతుంది. ఒక ధైర్యశాలి మరియొక ధైర్యశాలి అయిన యోధునిపై పడతాడు. ఆ యోధులిద్దరూ కలిసి కింద పడతారు.”
JER 46:13 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా ఈ వర్తమానం అందజేశాడు. ఈజిప్టును ఎదుర్కోవటానికి కదలివచ్చే నెబుకద్నెజరును గురించి ఈ వర్తమానం ఇవ్వబడింది.
JER 46:14 “ఈ సందేశాన్ని ఈజిప్టులో తెలియజెప్పండి. మిగ్దోలు నగరంలో బోధించండి. ఈ సందేశాన్ని నొపు (మెంఫిన్) లోను, తహపనేసులోను ప్రచారం చేయండి: ‘యుద్ధానికి సిద్ధపడండి. ఎందువల్లనంటే మీ చుట్టూవున్న ప్రజలు కత్తిచే చంపబడుతున్నారు.’
JER 46:15 ఈజిప్టూ నీ బలమైన యోధులెందుకు చంపబడతారు? వారు నిలువలేరు. ఎందువల్లనంటే యెహోవా వారిని నేలకు పడదోస్తాడు!
JER 46:16 ఆ సైనికులు పదేపదే తూలిపోతారు. వారొకరి మీద మరొకరు పడతారు. వారు, ‘లేవండి, మనం మన స్వంత ప్రజల వద్దకు వెళదాం. మనం మన మాతృభూమికి వెళ్లిపోదాము. మన శత్రువు మనల్ని ఓడిస్తున్నాడు. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అని అంటారు.
JER 46:17 వారి స్వస్థలాల ఆ సైనికులు, ‘ఈజిప్టు రాజైన ఫరో కేవలం ఆడంబరమైన వాడు; అతని ప్రభావం అయిపోయింది, అని అనుకుంటారు.’”
JER 46:18 ఈ వర్తమానం రాజునుండి వచ్చనది. సర్వశక్తిమంతుడైన యెహోవాయే ఆ రాజు. “నిత్యుడనగు నా తోడుగా ప్రమాణము చేపుతున్నాను. ఒక మహాశక్తివంతుడైన నాయకుడు వస్తాడు. తాబోరు కొండలా, సముద్రతీరానగల కర్మెలు పర్వతంలా అతడు గొప్పవాడై ఉంటాడు.
JER 46:19 ఈజిప్టు ప్రజలారా, మీ వస్తువులు సర్దుకోండి. బందీలై పోవటానికి సిద్ధమవండి. ఎందువల్లనంటే, నొపు (మెంఫిస్) నగరం శిథిలమై నిర్మానుష్యమవుతుంది. నగరాలు నాశనమవుతాయి. వాటిలో ఎవరూ నివసించరు!
JER 46:20 “ఈజిప్టు ఒక అందమైన ఆవులా ఉంది. కాని ఉత్తరాన్నుండి ఒక జోరీగ దాన్ని ముసరటానికి వస్తున్నది.
JER 46:21 ఈజిప్టు సైన్యంలో కిరాయి సైనికులు కొవ్విన కోడెదూడల్లా ఉన్నారు. అయినా వారంతా వెన్నుజూపి పారిపోతారు. శత్రు దాడికి వారు తట్టుకోలేరు. వారి వినాశన కాలం సమీపిస్తూ ఉన్నది. వారు అనతి కాలంలోనే శిక్షింపబడుతారు.
JER 46:22 బసకొట్టుతూ పారిపోవటానికి ప్రయత్నించే పాములా ఈజిప్టు వుంది. శత్రువు మిక్కిలి దరిజేరుతూ వున్నాడు. అందుచే ఈజిప్టు సైన్యం పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంది. గొడ్డళ్లు చేబట్టి శత్రవులు ఈజిప్టు మీదికి వస్తున్నారు. వారు చెట్లను నరికే మనుష్యుల్లా వున్నారు.”
JER 46:23 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు, “ఈజిప్టు అరణ్యాన్ని (సైన్యం) శత్రువు నరికివేస్తాడు. అరణ్యంలో (సైన్యం) చెట్లు (సైనికులు) చాలా వున్నాయి. కాని అది నరికివేయబడుతుంది. మిడుతలకంటె ఎక్కువగా శత్రు సైనికులున్నారు. లెక్కకు మించి శత్రు సైనికులున్నారు.
JER 46:24 ఈజిప్టుకు తలవంపులవుతుంది. ఉత్తరాన్నుండి వచ్చే శత్రు సైన్యం వారిని ఓడిస్తుంది.”
JER 46:25 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “అతి త్వరలో థేబెసు దేవతయైన ఆమోనును నేను శిక్షింపనున్నాను. నేను ఫరోను, ఈజిప్టును మరియు దాని దేవతలను శిక్షిస్తాను. ఈజిప్టు రాజులను నేను శిక్షిస్తాను. ఫరో మీద ఆధారపడి, అతన్ని నమ్మిన ప్రజలను కూడా నేను శిక్షిస్తాను.
JER 46:26 వారి శత్రువుల చేతుల్లో వారంతా ఓడిపోయేలా నేను చేస్తాను. ఆ శత్రువులు వారిని చంపగోరుతున్నారు. నేనా ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, అతని సేవకులకు అప్పగిస్తాను. “చాల కాలం ముందట ఈజిప్టు శాంతియుతంగా వుండేది. ఈ కష్ట కాలాలు అయిన తర్వాత ఈజిప్టు మరలా శాంతంగా వుంటుంది.” ఈ విషయాలను యెహోవా చెప్పాడు.
JER 46:27 “నా సేవకుడవైన యాకోబూ, భయపడవద్దు. ఇశ్రాయేలూ, బెదరవద్దు. ఆ దూర ప్రాంతాలనుండి నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను. వారు బందీలుగా వున్న దేశాలనుండి మీ పిల్లల్ని కాపాడతాను. యాకోబుకు మరల శాంతి, రక్షణ కల్పించబడతాయి. అతనిని ఎవ్వరూ భయపెట్టలేరు.”
JER 46:28 యెహోవా ఇలా అంటున్నాడు, “నా సేవకుడవైన యాకోబూ, భయపడకు. నేను నీతో వున్నాను. నిన్ను అనేక ఇతల దేశాలకు నేను పంపియున్నాను. ఆ రాజ్యాలన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను. కాని నిన్ను నేను పూర్తిగా నాశనం కానీయను. నీవు చేసిన నీచమైన కార్యాలకు నీవు తప్పక శిక్షింపబడాలి. కావున నీవు శిక్ష తప్పించుకొనేలా నిన్ను వదలను. నిన్ను క్రమశిక్షణలో పెడతాను. అయినా నీ పట్ల న్యాయపరమైన ఉదారంతో మాత్రమే ఉంటాను.”
JER 47:1 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది.
JER 47:2 యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు. శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు. దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు. వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు.
JER 47:3 పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు. రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు. తండ్రులు తమ పిల్లలను రక్షణ కల్పించలేరు. ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు.
JER 47:4 ఫిలిష్తీయులనందరినీ యెహోవా త్వరలో నాశనం చేస్తాడు! తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన వారందరినీ నాశనం చేస్తాడు. ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు. క్రేతు ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు.
JER 47:5 గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు. ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది. లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు?
JER 47:6 “ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు. నీ ఒరలోనికి నీవు వెళ్లుము! ఆగిపో! శాంతించు, అని మీరంటారు.
JER 47:7 కాని యెహోవా ఖడ్గం ఏ విధంగావిశ్రాంతి తీసికుంటుంది? యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.”
JER 48:1 మోయాబును గురించిన వర్తమానం ఈ వర్తమానం మోయాబు దేశాన్ని గురించినది. ఇశ్రాయేలు దేవుడు, సర్వ శక్తిమంతుడు అయిన యోహవా ఇలా చెపుతున్నాడు, “నెబో పర్వతానికి చేటు కులుగుతుంది. నెబో పర్వతం నాశనమవుతుంది. కిర్యతాయిము పట్టణం అణగ దొక్కబడుతుంది. అది పట్టుబడుతుంది. బలమైన దుర్గం అణగ దొక్కబడుతుంది. అది పడగొట్టబడి చిందర వందర చేయబడుతుంది.
JER 48:2 మోయాబు మరెన్నడూ ప్రశంసించబడడు. మోయాబును ఓడించటానికి హెష్బోను పట్టణవాసులు కుట్రపన్నుతారు. ‘రండి. మనమా దేశాన్ని రూపుమాపుదాము’ అని వారంటారు. మద్మేనా, నీవు కూడ మాట్లాడకుండా చేయబడతావు. కత్తి నిన్ను వెంటాడుతుంది.
JER 48:3 హొరొనయీము నుండి వచ్చే ఆక్రందనలువిను. అవి కలవరపాటుకు, వినాశనానికి సంబంధించిన కేకలు.
JER 48:4 మోయాబు ధ్వంసం చేయబడుతుంది. దాని చిన్న పిల్లలు సహాయం కొరకు విలపిస్తారు.
JER 48:5 మోయాబు ప్రజలు లూహీతు మార్గంలో వెళ్తున్నారు. వారు మార్గమధ్యంలో మిక్కిలిగా విలపిస్తున్నారు. హొరొనయీము పట్టణ మార్గంలో ప్రయాసతోను, బాధతోను కూడిన రోదన వినిపించగలదు.
JER 48:6 పారిపొండి! మీ ప్రాణరక్షణకై పారిపొండి! ఎడారిలో అరుహ వృక్షం వీచినట్లు మీరు పారిపొండి.
JER 48:7 “మీరు చేసిన వస్తువులలోను, మీ భాగ్యంలోనే మీరు విశ్వసిస్తారు. కావున మీరు పట్టుబడతారు. కెమోషు దైవం బందీగా కొనిపోబడతాడు. అతనితో పాటు అతని యాజకులు, అధికారులు కూడ తీసికొని పోబడతారు.
JER 48:8 వినాశనకారుడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు. ఒక్క పట్టణం కూడ తప్పించుకోలేదు. లోయశిథిలము చేయబడుతుంది. ఉన్నత మైదానం నాశనము చేయబడుతుంది. యెహోవా ఇది జరుగుతుందని చెప్పినాడుగాన ఇది జరిగి తీరుతుంది.
JER 48:9 మోయాబు పొలాలపైన ఉప్పు చల్లుము. దేశంవట్టి ఎడారి అయిపోతుంది. మోయాబు పట్టణాలు ఖాళీ అవుతాయి. వాటిలో ఎవ్వరూ నివసించరు.
JER 48:10 ఎవ్వరేగాని యెహోవా చెప్పినట్లు చేయకపోయినా, వారిని చంపటానికి తన కత్తిని వినియోగించకపోయినా, ఆ వ్యక్తికి కీడు మూడుతుంది.
JER 48:11 “మోయాబు ఇప్పటి వరకు ఆపద ఎరుగదు. కుదురుకోడానికి నిలకడగా పెట్టిన ద్రాక్షరసంవలె మోయాబు ఉంది. మోయాబు ఇంతవరకు ఒక జాడీనుండి మరొక దానిలోకి పోయబడలేదు అది. నిర్బంధించబడి ఇతర దేశానికి కొని పోబడలేదు. పూర్వంవలెనే అది ఇప్పుడూ రుచిగానే వున్నాడు. అతని సువాసన మారలేదు.”
JER 48:12 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. “కాని మిమ్మల్ని మీ జాడీలలో నుంచి బయట పోయుటకు అతి త్వరలోనే నేను మనుష్యులను పంపుతాను. ఆ మనుష్యులు మోయాబు యొక్క జాడీలను ఖాళీ చేస్తారు. తరువాత ఆ జాడీలను వారు పగులగొడతారు.”
JER 48:13 పిమ్మట మోయాబు ప్రజలు తమ బూటకపు దైవం కెమోషు పట్ల సిగ్గు చెందుతారు. ఇశ్రాయేలు ప్రజలు బేతేలు నందు ఆ బూటకపు దైవాన్ని నమ్మారు. కాని ఆ బూటకపు దైవం వారికి సహాయం చేయనప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కలతచెందారు. మోయాబు కూడా అలా అవుతాడు.
JER 48:14 “‘మేము మంచి సైనికులం. మేము యుద్ధవీరులం’ అని మీరు చెప్పుకోలేరు.
JER 48:15 శత్రువు మోయాబును ఎదుర్కొంటాడు. శత్రువు ఆ పట్టణాలలో చొరబడి నాశనం చేస్తాడు. మోయాబు యువ వీరులంతా నరకబడతారు.” ఈ వర్తమానం రాజునుండి వచ్చినది. ఆ రాజు పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
JER 48:16 “మోయాబు అంతం దగ్గర పడింది. మోయాబు త్వరలో నాశనమైపోతుంది.
JER 48:17 మోయాబు చుట్టుపట్ల నివసించు ప్రజలారా ఆ దేశంకొరకు విలపించండి. మోయాబు ఎంత ప్రసిద్ధి గాంచినవాడో మీకు తెలుసు. అందువల్ల వానికొరకు మీరు విచారించండి. ‘అధిపతుల అధికారం విరిగిపోయింది. మోయాబు కీర్తి ప్రతిష్ఠలు పోయాయి’ అని మీరు చెప్పండి.
JER 48:18 “దీబోను వాసులారా గొప్పవైన మీ స్థానాలనుండి దిగిరండి. నేలమీద మట్టిలో కూర్చోండి. ఎందువల్లనంటే, మోయాబును నాశనం చేసిన శత్రువు వస్తున్నాడు. అతడు మీ బలమైన నగరాలను నాశనం చేస్తాడు.
JER 48:19 “అరోయేరు నివాసులారా, దారి పక్కన నిలబడి కనిపెట్టుకొని ఉండండి. పారిపోయే మనిషిని చూడండి. పారిపోయే స్త్రీని చూడండి. ఏమి జరిగినందో వారిని అడగండి.
JER 48:20 “మోయాబు పాడుపడి, అవమానముతో నిండి పోతుంది. మోయాబు ఏకరీతిగా విలపిస్తుంది. మోయాబు పాడుపడిపోయిందని అర్నోను నది వద్ద ప్రకటించండి.
JER 48:21 ఉన్నత మైదానంలోని ప్రజలు శిక్షింపబడ్డారు. తీర్పు హోలోనుకు వచ్చింది. యాహసు, మేఫాతు,
JER 48:22 దీబోను, నెబో, బేత్‌ దిబ్లాతయీము,
JER 48:23 కిర్యతాయిము, బేత్గామూలు, బేత్మెయోను,
JER 48:24 కెరీయోతు మరియు బొస్రా పట్టణాలకు తీర్పు ఇవ్వబడింది. మోయాబుకు సమీపాన, దూరాన వున్న పట్టణాలన్నిటికి శిక్ష విధించబడింది.
JER 48:25 మోయాబు బలం తగ్గిపోయింది. మోయాబు చేయి విరిగిపోయింది.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
JER 48:26 “యెహోవా కంటె తానే ముఖ్యమైనట్లు మోయాబు భావించటం జరిగింది. కావున, తాగినవాని మాదిరి తూలిపోయే వరకు మోయాబును శిక్షించండి. మోయాబు తాను కక్కిన పదార్థంలోపడి దొర్లుతాడు. ప్రజలు మోయాబును చూచి హేళన చేస్తారు.
JER 48:27 “మోయాబూ, నీవు ఇశ్రాయేలును చూచి హేళన చేశావు. ఇశ్రాయేలు ఒక దొంగల గుంపు చేతికి చిక్కింది. నీవు ఇశ్రాయేలును గురించి మాట్లాడిన ప్రతిసారీ నీవు తలపంకించి, ఇశ్రాయేలు కంటె నీవే మెరుగైనట్లు ప్రవర్తించావు.
JER 48:28 మోయాబు ప్రజలారా, మీ పట్టణాలను వదిలిపెట్టండి. వెళ్లి గుట్టల్లో నివసించండి. గుహద్వారంలో గూడు చేసికొనే గువ్వల్లా ఉండండి.”
JER 48:29 “మోయాబు గర్వాన్ని గురించి విన్నాము. అతడు మిక్కిలి గర్విష్ఠి. తాను చాలా ముఖ్యమైన వానిలా అతడు తలంచినాడు. అతడు ఎల్లప్పుడూ గొప్పలు చెప్పుకొనేవాడు. అతడు మహా గర్విష్ఠి.”
JER 48:30 యోహోవా ఇలా చెపుతున్నాడు, “మోయాబు ఏ కారణమూ లేకుండానే కోపం తెచ్చుకొంటాడు, స్వంత గొప్పలు చెప్పుకుంటాడని నాకు తెలుసు. కాని అతని గొప్పలన్నీ అబద్ధాలు. అతను చెప్పేవి చేయలేడు.
JER 48:31 కావున, మోయాబు కొరకు నేను ఏడుస్తున్నాను. మోయాబులో ప్రతి పౌరుని కొరకు విచారిస్తున్నాను. కీర్హరెశు మనుష్యుల నిమిత్తం నేను బాధపడుతున్నాను.
JER 48:32 యాజెరు ప్రజలతో కలిసి నేను కూడ యాజెరు కొరకై దుఃఖిస్తున్నాను! సిబ్మా, గతంలో నీ ద్రాక్షలతలు సముద్ర తీరం వరకు వ్యాపించాయి. అవి యాజెరు పట్టణం వరకు వ్యాపించాయి. కాని వినాశనకారుడు నీ పంటను, ద్రాక్ష పండ్లను తీసికొన్నాడు.
JER 48:33 మోయాబులో గల విశాలమైన ద్రాక్ష తోటలనుండి సుఖసంతోషాలు మాయమైనాయి. గానుగల నుండి ద్రాక్షరసం కారకుండా ఆపాను. రసం తీయటానికి ద్రాక్షకాయలను తొక్కే వారిలో ఆ పాటలు ఆగిపోయాయి వారి అలరింతలు అంతమయ్యాయి.
JER 48:34 “హెష్బోను మరియు ఎలాలే పట్టణవాసులు కేకలు పెడుతున్నారు. వారి రోదన దూరానగల యాహసు పట్టణం వరకు వినిపిస్తూ ఉంది. వారి కేక సోయారు నుండి దూరానగల హొరొనయీము, ఎగ్లాత్షాలిషా వరకు వినవచ్చింది. నిమ్రీములో నీరు సహితం ఇంకిపోయింది.
JER 48:35 మోయాబు ఉన్నత స్థలాలలో దహన బలులు అర్పించటాన్ని నిలుపు చేస్తాను. వారు తమ దేవతలకు ధూపం వేయకుండా ఆపివేస్తాను.” ఇవి యెహోవా చెప్పిన విషయాలు.
JER 48:36 “మోయాబు కొరకు నేను మిక్కిలి భిన్నుడనైయున్నాను. వేణువుపై విషాద గీతం ఆలపించినట్లు నా హృదయం విలపిస్తున్నది. కీర్హరెశు ప్రజల విషయంలో కూడా నేను విచారిస్తున్నాను. వారి ధన ధాన్యాలన్నీ తీసికొని పోబడ్డాయి.
JER 48:37 ప్రతివాని తల గొరగబడింది. ప్రతివాని గడ్డం తీసివేయబడింది. గాయ పర్చబడటంతో ప్రతివాని చేతుల నుండి రక్తం కారుతున్నాయి. ప్రతివాడూ తన మొలచుట్టూ విషాద సూచక బట్ట కట్టుకున్నాడు.
JER 48:38 మోయాబులో ప్రతి చోట చనిపోయిన వారికోసం ప్రజలు దుఃఖిస్తున్నారు. వారు ప్రతి ఇంటిపైనా, జన సమ్మర్ద ప్రదేశాలలోనూ అలా విలపించారు. ఒక ఖాళీ జాడీని పగులగొట్టిన విధంగా నేను మోయాబును విచ్ఛిన్నం చేయటంతో విషాదం అలుముకున్నది.” యెహోవా ఈ మాటలు చెప్పాడు.
JER 48:39 “మోయాబు విచ్ఛిన్న మవటంలో ప్రజలు ఏడుస్తున్నారు. మోయాబు లొంగిపోయాడు. మోయాబుకు తలవంపులయ్యాయి. మోయాబును చూచి ప్రజలు ఎగతాళి చేస్తారు. కాని అక్కడ జరిగిన విషయాలవల్ల ప్రజలు భయంతో నిండిపోతారు.”
JER 48:40 యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడండి! ఆకాశం నుండి పక్షిరాజు (శత్రువు) దిగుతున్నాడు. అతను తన రెక్కలను మోయాబు మీదికి చాపుతున్నాడు.
JER 48:41 మోయాబు పట్టణాలు పట్టుబడతాయి. బలమైన దుర్గాలు ఓడింపబడతాయి. ఆ సమయంలో మోయాబు సైనికులు ప్రసవించే స్త్రీలా భయాందోళనలు చెందుతారు.
JER 48:42 మోయాబు రాజ్యం నాశనం చేయబడుతుంది. ఎందువల్లనంటే వారు యెహోవా కంటె తమను ముఖ్యమైన వారిగా తలంచారు.”
JER 48:43 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “మోయాబు ప్రజలారా, మీ కొరకై భయం లోతైన గోతులు, ఉరులు పొంచివున్నాయి.
JER 48:44 ప్రజలు భయపడి పారిపోతారు. పరుగెత్తి లోతు గోతులల్లో పడిపోతారు. ఎవడైనా ఆ లోతు గోతుల నుండి పైకివస్తే అతడు ఉరిలో చిక్కుకుంటాడు. మోయాబుకు శిక్షా సంవత్సరాన్ని తీసికొనివస్తాను.” ఈ విషయాలన్నీ యెహోవా చెప్పాడు.
JER 48:45 “బలవంతుడైన శత్రువునుండి జనం పారిపోయారు. వారు రక్షణకై హెష్బోను పట్టణానికి పారిపోయారు. అయినా అక్కడ రక్షణ దొరకలేదు. హెష్బోనులో అగ్ని ప్రజ్వరిల్లింది. సీహోను పట్టణంలో నిప్పు చెలరేగింది. అది మోయాబు నాయకులను దహించివేస్తున్నది. అది గర్విష్ఠులను కాల్చివేస్తున్నది.
JER 48:46 మోయాబూ, నీకు చెడు దాపురించింది. కెమోషు ప్రజలు నాశనం చేయబడుతున్నారు. నీ కుమారులు, కుమార్తెలు చెరపట్టబడి బందీలుగా కొనిపోబడుతున్నారు.
JER 48:47 “మోయాబు ప్రజలు బందీలుగా కొనిపోబడతారు. కాని రాబోయే కాలంలో మోయాబీయులను నేను వెనుకకు తీసికొని వస్తాను.” ఇది యెహోవా సందేశం. ఇంతటితో మోయాబీయులపై తీర్పు సమాప్తం.
JER 49:1 ఈ వర్తమానం అమ్మోనీయులను గురించినది. యెహోవా ఇలా చెపుతున్నాడు, “అమ్మోను ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలకు పిల్లలు లేరని మీరు అనుకొంటున్నారా? తల్లి తండ్రులు చనిపోతే భూమిని స్వతంత్రించుకొనుటకు అక్కడ పిల్లలు లేరని మీరనుకొంటున్నారా? బహుశః అందువల్లనే మల్కోము గాదు రాజ్యాన్ని తీసికొన్నాడా?”
JER 49:2 యెహోవా ఇలా చెపుతున్నాడు, “రబ్బోతు అమ్మోను ప్రజలు యుద్ధనాదాలు వినే సమయం వస్తుంది. రబ్బోతు-అమ్మోను నాశనమవుతుంది. అది కూలిపోయిన భవనాలతో నిండిన ఒక కొండలా ఉంటుంది. దాని చట్టూ ఉన్న పట్టణాలు తగులబడతాయి. ఆ జనం ఇశ్రాయేలీయులను తమ రాజ్యాన్ని వదిలి పొమ్మని వత్తిడి చేశారు. కాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వారిని దేశం వదిలి పొమ్మని బలవంతం చేస్తారు.” మరియు వారు భూమిని వారి స్వంతము చేసుకుంటారు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
JER 49:3 “హెష్బోను ప్రజలారా, విలపించండి! ఎందువల్లనంటే, హాయి పట్టణం పాడైపోయింది. రబ్బోతు-అమ్మోను మహిళల్లారా, విలపించండి! విషాద సూచకంగా మీరు నారబట్టలు ధరించి శోకించండి. రక్షణ కొరకు నగరానికి పరుగెత్తండి. ఎందువల్లనంటే, శత్రువు మీ మీదికి వస్తున్నాడు. వారు మల్కోము దైవాన్ని తీసికొనిపోతారు. వారు మల్కోము యాజకులను, అధికారులను చెరపట్టుతారు.
JER 49:4 నీవు నీ బలాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటావు. కాని నీవు నీ బలాన్ని కోల్పోతున్నావు. నీ డబ్బు నిన్ను రక్షిస్తుందని నీవు నమ్మావు. నిన్ను ఎదిరించటానికి ఏ ఒక్కడూ కనీసం ఆలోచన కూడా చేయడని నీవనుకున్నావు.”
JER 49:5 కాని సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “నలుమూలల నుండి నేను మీకు కష్టాలు తెచ్చిపెడతాను. మీరంతా పారిపోతారు. మిమ్మల్నందరినీ మరల ఎవ్వరూ కూడదీయలేరు.”
JER 49:6 “అమ్మోనీయులు బందీలుగా కొనిపోబడతారు. కాని అమ్మోనీయులను నేను వెనుకకు తీసికొనివచ్చే సమయం వస్తుంది.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
JER 49:7 ఈ వర్తమానం ఎదోమును గురించినది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “తేమాను పట్టణంలో జ్ఞానం ఏమాత్రం లేదా? ఎదోములోని జ్ఞానులు మంచి సలహా ఇవ్వలేక పోతున్నారా? వారి జ్ఞానాన్ని వారు కోల్పోయారా?
JER 49:8 దదానులో నివసించే ప్రజలారా, పారిపోండి! దాగుకోండి! ఎందుకంటే, నేను ఏశావును తాను చేసిన చెడ్డ పనులు కారణంగా శిక్షిస్తాను.
JER 49:9 “మీ ద్రాక్ష తీగల నుండి పనివారు వారికి కావలసినన్ని ద్రాక్షకాయలను కోస్తారు. అయినా వారు కొన్ని కాయలను చెట్లపై వదిలివేస్తారు. రాత్రిళ్లు దొంగలు వచ్చినా వారికి కావలసిన పరిమాణంలోనే తీసికొనిపోతారు.
JER 49:10 కాని ఏశావు నుండి నేను అంతా తీసికుంటాను. అతడు దాచుకొనే స్థలాలన్నింటినీ నేను కనుగొంటాను. అతడు నానుండి ఏమీయు దాచలేడు. అతని పిల్లలు, బంధువులు, పొరుగువారు అంత చనిపోతారు.
JER 49:11 అతని పిల్లల పట్ల శ్రద్ధ తీసికొనటానికి ఎవ్వరూ మిగలరు. అతని విధవరాండ్రు ఒంటరిగా విడువబడుతారు (యెహోవానైన) నేను మాత్రమే మీ అనాధుల ప్రాణాల్ని కాపాడుతాను. మరియు మీ విధవరాండ్రు నామీద నమ్మకముంచుతారు.”
JER 49:12 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “కొంతమంది మనుష్యులు శిక్షకు అర్హులు కారు. అయినా వారు బాధ అనుభవించారు. కాని ఎదోమూ, నీవు శిక్షకు పాత్రుడవు. కావున నీవు నిజంగా శిక్షింపబడతావు. అర్హమైన నీ శిక్షను నీవు తప్పించుకొనలేవు. నీవు దండించబడతావు.”
JER 49:13 యెహోవా చెపుతున్నాడు, “నా స్వయం శక్తితో నేనీ ప్రమాణం చేస్తున్నాను, బొస్రా నగరం నాశనమవుతుందని నిశ్చయంగా చెపుతున్నాను. ఆ నగరం పాడుబడి రాళ్లగుట్టలా మారిపోతుంది. ఇతర నగరాలకు ప్రజలు కీడు జరగాలని కోరుకున్నప్పుడు ఈ నగరానికి సంభవించినట్లు జరగాలని దీనిని ఉదహరిస్తారు. ప్రజలా నగరాన్ని అవమానపరుస్తారు. బొస్రా చుట్టుపట్లవున్న పట్టణాలన్నీ శాశ్వతంగా శిథిలాలైపోతాయి.”
JER 49:14 యెహోవా నుండి నేనొక సందేశం విన్నాను, దేశాలకు యెహోవా ఒక దూతను పంపాడు. ఆ సందేశం ఇలా వుంది, “మీ సైన్యాలను సమకూర్చుకోండి! యుద్ధానికి సిద్ధపడండీ. ఎదోము దేశం మీదికి కదలి వెళ్లండి!
JER 49:15 ఏదోమూ, నేను నీ ప్రాముఖ్యతను, ఘనతను తగ్గించివేస్తాను. ప్రతివాడూ నిన్ను అసహ్యించుకుంటాడు.
JER 49:16 ఎదోమా, నీవు ఇతర దేశాలను బెదరగొట్టావు. అందువల్ల నీవు గొప్పవాడివనుకున్నావు. కాని నీవు మోసపోయావు. నీ గర్వం నిన్ను మోసగించింది. ఎదోమూ, నీవు ఎత్తయిన కొండలపై నివసిస్తున్నావు. పెద్ద బండలు, కొండలు రక్షణ కల్గించే ప్రదేశాలలో నీవు నివసిస్తున్నావు. గద్ద గూటిలా నీ ఇంటిని ఎంత ఉన్నతమైన స్థలంలో కట్టుకున్నా నేను నిన్ను పట్టుకుంటాను. అక్కడినుండి నేను నిన్ను కిందికి దింపుతాను,” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
JER 49:17 “ఎదోము నాశనం చేయబడుతుంది. నాశనమయిన నగరాన్ని చూచి ప్రజలు విస్మయం చెంది ఆశ్చర్యంతో ఈల వేస్తారు. నాశనమయిన నగరాలను చూచి ప్రజలు ధిగ్భ్రాంతి చెంది సంభ్రమాశ్చర్య పడతారు.
JER 49:18 సొదొమ, గొమొర్రా నగరాలు, వాటి పరిసర పట్టణాల్లా ఎదోము కూడ నాశనం చేయబడుతుంది. అక్కడ ఎవ్వరూ నివసించరు.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
JER 49:19 “యొర్దాను నది దగ్గర దట్టమైన పొదలనుండి కొన్నాసార్లు సింహం వస్తూ ఉంటుంది. పొలాల్లో ప్రజలు మందవేసిన గొర్రెల మీదికి, పశువుల మీదికి వెళుతుంది. నేను ఆ సింహంలాంటివాణ్ణి! నేను ఎదోము మీదికి వెళతాను. నేనా ప్రజలను బెదరగొడతాను. వారిని పారిపోయేలా నేను చేస్తాను. వారి యువకులలో ఎవ్వడూ నన్ను ఆపలేడు. నాలా మరెవ్వడూ లేడు! నన్నెవ్వరూ ఎదిరించలేరు. వారి గొర్రెల కాపరులలో (నాయకులు) ఏ ఒక్కడూ నన్నెదిరించి నిలువలేడు.”
JER 49:20 కావున ఎదోముకు వ్యతిరేకంగా యెహోవా వేసిన పధకాన్ని వినండి. తేమాను వాసులకు యెహోవా ఏమి చేయ నిశ్చయించినది వినండి ఎదోము మంద (ప్రజలు)లో నుండి చిన్నవాటినన్నిటినీ శత్రువు ఈడ్చుకుపోతాడు. ఎదోము పచ్చిక బయళ్లు వారు చేసిన దాన్ని బట్టి ఆశ్చర్యపోతాయి.
JER 49:21 ఎదోము పతనంతో పుట్టిన శబ్దానికి భూమి కంపిస్తుంది. వారి ఆక్రందన ఎర్ర సముద్రంవరకు ప్రతిధ్వనిస్తుంది.
JER 49:22 దూసుకువచ్చి తనను తన్నుకుపోయే జంతువుపై తిరుగుతూ ఎగిరే గద్దలా యెహోవా ఉంటాడు. బొస్రా నగరంపై తన రెక్కలు విప్పుతున్న గద్దవలె యెహోవా ఉన్నాడు. ఆ సమయంలో ఎదోము సైనికులు మిక్కిలిగా బెదరిపోతారు. ప్రసవ వేదన పడుతున్న స్త్రీవలె వారు భయాందోళనలతో ఆక్రందిస్తారు.
JER 49:23 ఈ వర్తమానము దమస్కు నగరాన్ని గురించి నది: “హమాతు, అర్పాదు పట్టణాలు భయపడ్డాయి. దుర్వార్త వినటంవల్ల అవి భయపడ్డాయి. వారు అధైర్యపడ్డారు. వారు వ్యాకులపడి బెదిరారు.
JER 49:24 దమస్కు నగరం బలహీనమయ్యింది. ప్రజలు పారిపోవాలనుకుంటున్నారు. ప్రజలకు దిగులు పట్టుకున్నది. ప్రసవ స్త్రీ లా ప్రజలు బాధ, వేదన అనుభవిస్తున్నారు.
JER 49:25 “దమస్కు సుఖసంతోషాలున్న ఒక నగరం. ప్రజలింకా ఆ ‘వేడుక నగరాన్ని’ వదిలి పెట్టలేదు.
JER 49:26 అందువల్ల యువకులు ఆ నగరంలోని కూడలి స్థలాలలో చనిపోతారు. ఆ సమయంలో దాని సైనికులందరూ చంపబడతారు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయారు చెప్పినాడు.
JER 49:27 “దమస్కు గోడలన్నిటికీ నేను నిప్పు పెడతాను. బెన్హదదు బలమైన కోటలను అది పూర్తిగా కాల్చివేస్తుంది.”
JER 49:28 ఈ వర్తమానం కేదారు వంశస్తులను గూర్చియు, మరియు హాసోరు పాలకులను గురించినది. బబులోను రాజైన నెబుకద్నెజరు వారిని ఓడించారు. యెహోవా ఇలా చెపుతున్నాడు, “కేదారు వంశీయుల మీదికి మీరు దండెత్తి వెళ్లండి. తూర్పునవున్న ప్రజలను నాశనం చేయండి.
JER 49:29 వారి గుడారాలు, గొర్రెల మందలు తీసికొని పోబడతాయి. వారి గుడారంతో పాటు వారి వస్తువులన్నీ తీసికొనిపోబడతాయి. వారి శత్రువు ఒంటెలను పట్టుకుపోతాడు. ‘ఎటు చూచినా భయం, భయం’ అని మనుష్యులు కేకలు పెడతారు.
JER 49:30 త్వరగా పారిపొండి! హాసోరు ప్రజలారా, దాగటానికి మంచి స్థలం చూడండి.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది “నెబుకద్నెజరు నీవు వ్యతిరేకంగా పధకం పన్నాడు. నిన్ను ఓడించటానికి అతడు ఒక తెలివైన పథకాన్ని ఆలోచించాడు.
JER 49:31 “నిశ్చంతగావున్న దేశం ఒకటున్నది. దాన్ని ఎవ్వరూ ఓడించరని ఆ రాజ్యానికి ధీమా. ఆ దేశ రక్షణకు ద్వారాలుగాని, చుట్టూ కంచెగాని ఏమీ లేవు. వారు ఒంటరిగా నివసిస్తారు. ‘ఆ రాజ్యాన్ని ఎదుర్కోండి!’ అని యెహోవా అంటున్నాడు.
JER 49:32 వారి ఒంటెలను, విస్తారమైన పశుసంపదను శత్రువు దొంగిలిస్తాడు. శత్రువు వారి పెద్ద మందలను దొంగిలిస్తాడు. చెంపలు కత్తిరించుకునే వారిని భూమి నలుదిక్కులకు పంపివేస్తాను. అన్నివైపుల నుండి వారి మీదికి మహా విపత్తులను తీసికొని వస్తాను.” ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.
JER 49:33 “హాసోరు రాజ్యం గుంటనక్కలకు నివాసమవుతుంది. అది శాశ్వతంగా వట్టి ఎడారిగా మారిపోతుంది. అక్కడ మనుష్యులెవ్వరూ నివసించరు. ఆ స్థలంలో ఏ ఒక్కడూ నివాసంచేయడు.”
JER 49:34 యూదా రాజైన సిద్కియా పరిపాలనారంభంలో, ప్రవక్తయైన యిర్మీయా ఒక సందేశాన్ని యెహోవా నుండి అందుకున్నాడు. ఆ సందేశం ఏలాము దేశానికి సంబంధించినది.
JER 49:35 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఏలాము యొక్క ధనుస్సును నేను త్వరలో విరచివేస్తాను. విల్లే ఏలాము యొక్క బలమైన ఆయుధం.
JER 49:36 నాలుగు ప్రచండ వాయువులను ఏలాము మీదికి రప్పిస్తాను. ఆకాశపు నాలుగు మూలల నుండి వాటిని రప్పిసాను. భూమి మీదకు గాలి వీచే నలుమూలలకు ఏలాము ప్రజలను నేను చెదరగొడతాను. ఏలాము ప్రజలు ప్రతి దేశానికి బందీలుగా కొనిపోబడతారు.
JER 49:37 వారి శత్రువులు చూస్తూవుండగా ఏలామును తునాతునకలు చేస్తాను. వారిని చంపజూచేవారి సమక్షంలో ఏలామును భయపెడతాను. వారికి మహా విపత్తులను తెచ్చిపెడతాను. నేనెంత కోపంగా ఉన్నానో నేను వారికి చూపిస్తాను.” ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది. “ఏలామును వెంటాడటానికి నేను కత్తిని పంపుతాను. నేను వారందరినీ చంపేవరకు కత్తి వారిని తరుముతుంది.
JER 49:38 నా సింహాసనం ప్రతిష్ఠించి నేనే అదుపుదారుడనని నిరూపిస్తాను. దాని రాజును, రాజ్యాధికారులను నేను నాశనం చేస్తాను.” ఇదే యెహోవా సందేశం.
JER 49:39 “కాని ఏలామును వెనక్కు తీసుకొని వచ్చి వారికి మంచి సంభవించేటట్లుగా చేస్తాను.” ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.
JER 50:1 బబులోను దేశానికి, కల్దీయులను ఉద్దేశించి యెహోవా ఈ సందేశాన్ని ఇచ్చాడు. యెహోవా ఈ వర్తమానాన్ని యిర్మీయా ద్వారా చెప్పాడు.
JER 50:2 “అన్ని దేశాల వారికి ఈ వర్తమానం ప్రకటించండి! జెండా ఎగురవేసి ఈ సందేశం ప్రకటించండి! పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తూ ఇలా చెప్పండి, ‘బబులోను రాజ్యం వశపర్చుకోబడుతుంది. బేలు దైవం అవమానపర్చబడుతుంది. మర్దూక్ మిక్కిలి భీతిల్లుతుంది. బబులోను విగ్రహాలు అవమానపర్చబడతాయి. దాని విగ్రహ దేవతలు భయంతో నిండిపోతాయి.’
JER 50:3 ఉత్తర దేశమొకటి బబులోనును ఎదుర్కొంటుంది. ఆ దేశం బబులోనును వట్టి ఎడారివలె మార్చివేస్తుంది. ప్రజలెవ్వరూ అక్కడ నివసించరు. మనుష్యులు, జంతువులు అంతా అక్కడ నుండి పారిపోతారు”
JER 50:4 యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కలిసి ఒక్కరీతిగా రోదిస్తారు. వారంతా కలిసి వారి దేవుడైన యెహోవాను వెతుక్కుంటూ వెళతారు.
JER 50:5 ఆ ప్రజలు సియోనుకు ఎలా వెళ్లాలి అని దారి అడుగుతారు. వారు ఆ దిశగా వెళ్లటానికి బయలు దేరుతారు. ప్రజలు యిలా అంటారు. ‘రండి, మనల్ని మనము యెహోవాకు కలుపుకొందాం. శాశ్వతమైన ఒక నిబంధన చేసికొందాము. మన మెన్నటికీ మరువలేని ఒక నిబంధన చేసికొందాం.’
JER 50:6 “నా ప్రజలు తప్పిపోయిన గొర్రెలవలె ఉన్నారు. వారి కాపరులు (నాయకులు) వారిని తప్పుదారి పట్టించారు. వారి నాయకులు వారిని కొండల్లో, కోనల్లో తిరిగేలా చేశారు. వారి విశ్రాంతి స్థలమెక్కడో వారు మర్చిపోయారు.
JER 50:7 నా ప్రజలను చూచిన వారంతా వారిని గాయపర్చారు. పైగా వారి శత్రువులు, ‘మేము ఏ నేరమూ చేయలేదన్నారు.’ ఆ ప్రజలు యెహోవా పట్ల పాపం చేశారు. యెహోవాయే వారి అసలైన విశ్రాంతి స్థలం. వారి తండ్రులు నమ్మిన యెహోవాయే వారి దేవుడు.
JER 50:8 “బబులోను నుండి పారిపొండి. కల్దీయుల రాజ్యాన్ని వదిలిపొండి. మందముందు నడిచే మేకలు మాదిరి వుండండి.
JER 50:9 ఉత్తరాన్నుండి చాలా దేశాలను నేను కూడగట్టుకు వస్తాను. ఈ దేశాల కూటమి బబులోను మీదికి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఉత్తర దేశాల వారిచేత బబులోను చెరబట్టబడుతుంది. ఆ రాజ్యాలు బబులోను మీదికి చాలా బాణాలు వేస్తాయి. యుద్ధం నుండి వట్టి చేతులతో తిరిగిరాని సైనికుల్లా ఈ బాణాలు వుంటాయి.
JER 50:10 కల్దీయుల భాగ్యాన్నంతా శత్రువు కొల్లగొడతాడు. శత్రు సైనికులు తాము కోరుకున్నవన్నీ పొందగలుగుతారు.” ఇవి యెహోవా చెప్పిన విషయాలు.
JER 50:11 “బబులోనూ, నీవు ఉద్రేకంతోను, సంతోషంతోను వున్నావు. నీవు నా భూమిని తీసికొన్నావు. ధాన్యంలో చిందులేసే పడుచు ఆవులా నీవు నాట్యం చేస్తున్నావు. గుర్రాలు సంతోషంలో చేసే సకిలింపుల్లా వుంది నీ నవ్వు.
JER 50:12 ఇప్పుడు నీ తల్లికి తలవంపులవుతుంది. నినుగన్న తల్లి కలత చెందుతుంది. దేశాలన్నిటిలో బబులోను అతి సామాన్యమైపోతుంది. ఆమె బెట్టయైన వట్టి ఎడారిలా అవుతుంది.
JER 50:13 యెహోవా తన కోపం చూపటంతో అక్కడ ఎవ్వరూ నివసించరు. బబులోను నగరం పూర్తిగా ఖాళీ అవుతుంది. బబులోను పక్కగా పోయే ప్రతివాడు భయపడతాడు. అది నాశనం చేయబడిన తీరుచూచి విస్మయంతో వారు తలలు ఆడిస్తారు.
JER 50:14 “బబులోనుతో యుద్ధానికి సిద్ధమవ్వండి. వింటిని బట్టిన వీరుల్లారా, బబులోనుపై బాణాలు వేయండి. మీ బాణాల్లో వేటినీ మిగల్చవద్దు. బబులోను యెహోవా పట్ల పాపం చేసింది.
JER 50:15 బబులోను చుట్టూ సైనికులు జయ నినాదాలు చేస్తారు. ఇప్పుడు బబులోను లొంగిపోయింది! దాని ప్రాకారాలు, బురుజులు కూలదోయబడ్డాయి! వారికి అర్హమైన శిక్షను యెహోవా ఆ ప్రజలకు ఇస్తున్నాడు. ప్రజలారా, బబులోనుకు తగిన శిక్షను ఇవ్వండి. అది ఇతర దేశాలకు ఏమి చేసిందో, దానిని ఆ రాజ్యానికి తిరిగి చేయండి.
JER 50:16 బబులోను ప్రజలను మొక్కలు నాటనివ్వకండి. వారి పంటను సేకరించనీయవద్దు. బబులోను సైనికులు చాలా మందిని తమ నగరానికి బందీలుగా తీసికొనివచ్చారు. ఇప్పుడు శత్రు సైన్యాలువచ్చాయి. కావున ఆ బంధీలంతా ఇండ్లకు తిరిగి వెళ్లుచున్నారు. ఆ బందీలు తిరిగి తమ తమ దేశాలకు పరుగున పోతున్నారు.
JER 50:17 “పొలాల్లో చెల్లాచెదరైన గొర్రెల్లా ఇశ్రాయేలు వున్నది. సింహాలు తరిమిన గొర్రెల్లా ఇశ్రాయేలు వున్నది. వానిని తిన్న మొదటి సింహం అష్షూరు రాజు. వాని ఎముకలు నలుగగొట్టిన చివరి సింహం బబులోను రాజైన నెబుకద్నెజరు.
JER 50:18 కావున సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘బబులోను రాజును, అతని దేశాన్ని నేను త్వరలో శిక్షిస్తాను. నేను అష్షూరు రాజును శిక్షించినట్లు అతనిని నేను శిక్షిస్తాను.
JER 50:19 “‘కాని ఇశ్రాయేలును మళ్లీ వాని స్వంత పొలాలకు తీసుకొని వస్తాను. అతడు కర్మేలు పర్వతం మీదను బాషాను భూముల్లోను పండిన పంటను తింటాడు. అతడు తిని, తృప్తి పొందుతాడు. ఎఫ్రాయిము మరియు గిలాదు ప్రాంతాలలో గల కొండల మీద అతడు తింటాడు.’”
JER 50:20 యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఆ సమయంలో ప్రజలు ఇశ్రాయేలు యొక్క తప్పులెదకటానికి గట్టిగా ప్రయత్నిస్తారు. కాని వారికి కన్పించదు. ప్రజలు యూదా పాపాలు వెదక యత్నిస్తారు. కాని ఏ పాపాలూ కనుగొనబడవు. ఎందువల్లనంటే ఇశ్రాయేలు, యూదా రాజ్యాలలో మిగిలిన కొద్దమందిని నేను రక్షిస్తున్నాను. పైగా వారి పాపాలన్నిటినీ నేను క్షమిస్తున్నాను.”
JER 50:21 యెహోవా యిలా చెపుతున్నాడు, “మెరాతయీయు దేశంపై దండెత్తండి! పెకోదీలో వుంటున్న ప్రజలను ఎదుర్కొనండి! వారిని ఎదుర్కొనండి! వారిని చంపండి. వారిని సర్వ నాశనం చేయండి! నా ఆజ్ఞ ప్రకారం అంతా చేయండి!
JER 50:22 “యుద్ధ ధ్వని దేశమంతా వినిపిస్తుంది. అది తీవ్రవినాశనానికి సంబంధించిన ధ్వని.
JER 50:23 బబులోను ఒకనాడు సర్వప్రపంచానికి సుత్తివలె వుంది. కాని ఇప్పుడా “సుత్తి” విరిగి ముక్కలై పోయింది. బబులోను సాటి రాజ్యాలన్నిటిలో నిజంగా మిక్కిలి నాశనమైనది.
JER 50:24 బబులోనూ, నీ కొరకు నేను వల పన్నాను. అది నీవు తెలిసికొనే లోపుగానే నీవు పట్టుబడ్డావు. నీవు యెహోవాకు వ్యతిరేకంగా పోరాడావు. అందువల్ల నీవు చూడబడి, పట్టుబడ్డావు.
JER 50:25 యెహోవా తన గిడ్డంగిని తెరిచాడు. ఆ గిడ్డంగి నుండి యెహోవా తన కోపమనే ఆయుధాన్ని వెలికి తీశాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు తాను చేయవలసిన పని ఒకటి వుండుటచే ఆ ఆయుధాన్ని వెలికి తీశాడు. ఆయన చేయవలసిన కార్యం కల్దీయుల రాజ్యంలో ఉంది.
JER 50:26 దూర తీరాల నుండి బబులోను మీదికి రండి. ఆమె ధాన్యాగారాలను పగులగొట్టండి. బబులోనును సర్వనాశనం చేయండి. సజీవంగా ఎవ్వరినీ వదల వద్దు. పెద్ద ధాన్యరాసులవలె వారి శవాలను గుట్టవేయండి.
JER 50:27 బబులోనులో ఉన్న గిత్తలన్నిటినీ (యువకులు) చంపండి. వారు నరకబడనివ్వండి. వారిని ఓడింపబడే సమయం వచ్చింది. వారికి మిక్కిలి కష్టం వచ్చిపడింది. వారు శిక్షింపబడే సమయంవచ్చింది.
JER 50:28 బబులోను దేశం నుండి ప్రజలు పారిపోతున్నారు. వారా దేశంనుండి తప్పించుకొనిపోతున్నారు. ఆ ప్రజలు సీయోనుకు వస్తున్నారు. యెహోవా చేస్తున్న పనులను ఆ ప్రజలు ఇతరులకు చెపుతున్నారు, బబులోనుకు అర్హమైన శిక్షను యెహోవా ఇస్తున్నారని వారు చెబుతున్నారు. యెహోవా ఆలయాన్ని బబులోను ధ్వంసం చేసింది. కావున యెహోవా ఇప్పుడు బబులోనును ధ్వంసం చేస్తున్నాడు.
JER 50:29 “బబులోను మీదికి విలుకాండ్రను పిలవండి. ఆ నగరాన్ని చుట్టుముట్టమని వారికి చెప్పండి. ఎవ్వరినీ తప్పించుకోనివ్వద్దు. అది చేసిన దుష్టకార్యాలకు తగిన ప్రతీకారం చేయండి. అది ఇతర రాజ్యాలకు ఏమి చేసిందో, దానిని ఆ దేశానికి కూడా చేయండి. బబులోను యెహోవాను గౌరవించలేదు. పరిశుద్దుడైన ఇశ్రాయేలు దేవునిపట్ల అది మూర్ఖంగా ప్రవర్తించింది. కావున బబులోనును శిక్షించండి.
JER 50:30 బబులోను యువకులు వీధుల్లో చంపబడతారు. ఆ రోజున దాని సైనికులంతా చనిపోతారు.” యెహోవా ఈ విషయాలు చెపుతున్నారు.
JER 50:31 “బబులోనూ, నీవు మిక్కిలి గర్విష్ఠివి. అందుచే నేను నీకు వ్యతిరేకినైనాను.” సర్వశక్తమంతుడైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. “నేను నీకు వ్యతిరేకిని. నీవు శిక్షింపబడే సమయం వచ్చింది.
JER 50:32 గర్విష్ఠియైన బబులోను తూలిపడి పోయింది. అది లేచుటకు ఎవ్వరూ సహాయపడరు. దాని పట్టణాలలో నేను అగ్ని రగుల్చుతాను. దాని చుట్టూ వున్న వారందరినీ ఆ అగ్ని పూర్తిగా దహించివేస్తుంది.”
JER 50:33 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నారు. “ఇశ్రాయేలు, యూదా ప్రజలు బానిసలై యున్నారు. శత్రువు వారిని చెరబట్టాడు. శత్రువు ఇశ్రాయేలును వదిలిపెట్టడు.
JER 50:34 కాని, దేవుడు ఆ ప్రజలను తిరిగి తీసికొని వస్తాడు. ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా. ఆ ప్రజలను ఆయన బాగా రక్షిస్తాడు. వారి రాజ్యానికి విశ్రాంతి కల్గించే విధంగా ఆయన వారిని రక్షిస్తాడు. అంతేగాని బబులోనులో నివసించే వారికి ఆయన విశ్రాంతినివ్వడు.”
JER 50:35 యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోనులో నివసించే ప్రజలను ఒక కత్తి చంపుగాక. బబులోను రాజును, అతని అధికారులను, జ్ఞానులను ఒక కత్తి హతము చేయుగాక.
JER 50:36 బబులోను యాజకులను, దొంగ ప్రవక్తలను కత్తి సంహరించుగాక, ఆ యాజకులు పట్టి మూర్ఖులవుతారు. బబులోను సైనికులను ఒక కత్తి చంపుగాక. ఆ సైనికులు భీతావహులవుతారు.
JER 50:37 బబులోను గుర్రాలను, రథాలను ఒక కత్తి నరికి వేయుగాక. విదేశ కిరాయి సైనికులను ఒక కత్తి సంహరించుగాక, ఆ సైనికులందరూ భయపడిన స్త్రీ లవలె ఉంటారు. బబులోను ధనాగారాల మీదికి ఒక కత్తి వెళ్లుగాక. ఆ ధనాగారాలు దోచుకోబడతాయి.
JER 50:38 బబులోను నీటి వనరులపైకి ఒక కత్తి వెళ్లుగాక. ఆ నీటి వనరులన్నీ ఎండిపోతాయి. బబులోను దేశంలో విగ్రహాలు కోకొల్లలు. బబులోను ప్రజలు మూర్ఖులని ఆ విగ్రహాలు చాటి చెపుతున్నాయి. అందుచే ఆ ప్రజలకు కష్టనష్టాలు సంభవిస్తాయి.
JER 50:39 బబులోను మరెన్నడూ ప్రజలతో నిండిఉండదు. పిచ్చి కుక్కలు, ఉష్ట్ర పక్షులు, తదితర ఎడారి జంతువులు అక్కడ నివసిస్తాయి. అంతేగాని, మళ్లీ జనం అక్కడ ఎన్నడూ నివసించరు.
JER 50:40 సొదొము, గొమొర్రా నగరాలను, వాటి చుట్టుపట్ల పట్టణాలను దేవుడు పూర్తిగా నాశనం చేశాడు. ఇప్పుడా పట్టణాలలో ఎవ్వరూ నివసించరు. అదేరీతి, బబులోనులో ఎవ్వరూ నివసించరు. అక్కడ నివసించటానికి ప్రజలు అసలు వెళ్లరు.”
JER 50:41 “చూడండి! ఉత్తరాన్నుండి జనులు వస్తున్నారు. వారొక బలమైన రాజ్యం నుండి వస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుండి చాలామంది రాజులు కలిసి వస్తున్నారు.
JER 50:42 వారి సైన్యాలకు ధనుస్సులు, ఈటెలు ఉన్నాయి. ఆ సైనికులు బహు క్రూరులు వారికి దయలేదు. గుర్రాలపై స్వారి చేస్తూ సైనికులు వస్తారు. అప్పుడు సముద్ర ఘోషలా శబ్దంపుడుతుంది. వారివారి స్థానాలలో యుద్ధానికి సిద్ధంగా నిలబడతారు! బబులోను నగరమా, నీపై దాడికి వారు సిద్ధంగా వున్నారు.
JER 50:43 ఆ సైన్యాల గురించి బబులోను రాజు విన్నాడు. అతడు బాగా బెదరిపోయాడు! అతని చేతులు బిగుసుకుపోయేటంతగా అతడు భయపడ్డాడు. ప్రసవ స్త్రీ వేదనవలె, అతని భయం అతని కడుపును ఆరాటపెడుతుంది.”
JER 50:44 యెహోవా చెపుతున్నాడు, “అప్పుడప్పుడు యొర్దాను నదీ తీరాన దట్టమైన పొదల నుండి ఒక సింహం వస్తుంది. ప్రజలు పొలాల్లో మందవేసిన పశువులపైకి ఆ సింహం వచ్చిపడుతుంది. అప్పుడా పశువులు చెల్లాచెదరైపోతాయి. నేనా సింహంలా వుంటాను. బబులోనును దాని రాజ్యం నుంచి తరిమిగొడతాను! ఇది చేయటానికి నేనెవరిని ఎన్నుకుంటాను? నాలాగా మరే వ్యక్తి లేడు. నన్నెదిరించగలవాడు మరొక్కడూ లేడు. కావున నేనే ఆ పని చేస్తాను. నన్ను బయటకు తోలటానికి ఏ గొర్రెల కాపరీ రాడు. నేను బబులోను ప్రజలను తరిమిగొడతాను.”
JER 50:45 బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా పన్నిన పధకాన్ని వినండి. కల్దీయులకు వ్యతిరేకంగా యెహోవా ఏమి చేయ నిర్ణయించాడో వినండి. “శత్రువు బబులోనులోని గొర్రె పిల్లలను (ప్రజలను) తిరిగి తీసికొంటాడు. ఆ గొర్రె పిల్లలను ఆయన ఇంటికి తీసికొని వెళతాడు. ఆ పిమ్మట బబులోను పచ్చిక బయళ్లను యెహోవా పూర్తిగా నాశనం చేస్తాడు. జరిగిన దానికి బబులోను విస్మయం చెందుతుంది.
JER 50:46 బబులోను పడిపోతుంది. ఆ పతనానికి భూమి కంపిస్తుంది. బబులోను పతనాన్ని గురించి ప్రపంచ ప్రజలంతా వింటారు.”
JER 51:1 యెహోవా ఇలా చెపుతున్నాడు, “నేనొకపెనుగాలి వీచేలా చేస్తాను. అది బబులోను, కల్దీయ ప్రజల మీదికి వీచేలా చేస్తాను.
JER 51:2 బబులోనును తూర్పార బట్టటానికి నేను కొత్త వారిని పంపుతాను. వారు బబులోనును తూర్పార బడతారు. వారు బబులోనునుండి ప్రతీది తీసుకొంటారు. సైన్యాలు నగరాన్ని చుట్టుముట్టుతాయి. భయంకరమైన విధ్వంసకాండ జరుగుతుంది.
JER 51:3 బబులోను సైనికులు తమ ధనుర్బాణాలను వినియోగించలేరు. ఆ సైనికులు తమ కవచాలను కూడ ధరించలేరు. బబులోను యువకులను గురించి విచారించవద్దు. దాని సైన్యాన్ని సర్వ నాశనం చేయుము.
JER 51:4 బబులోను సైనికులు కల్దీయుల రాజ్యంలో చంపబడతారు. బబులోను వీధుల్లో వారు తీవ్రంగా గాయపర్చబడతారు.”
JER 51:5 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలును, యూదాను ఒక విధవరాలివలె ఒంటరిగా వదిలి వేయలేదు. దేవుడు ఆ ప్రజలను వదిలిపెట్టలేదు. లేదు! ఆ ప్రజలే ఇశ్రాయేలు పవిత్ర దైవాన్ని వదిలివేసిన పాపానికి ఒడిగట్టారు. వారే ఆయనను వదిలారు గాని ఆయన వారిని విడిచివేయలేదు.
JER 51:6 బబులోను నుంచి పారిపొండి. మీ ప్రాణ రక్షణకై పారిపొండి! మీరు ఆగకండి. బబులోను పాపాల కారణంగా మీరు చంపబడవద్దు! వారు చేసిన దుష్కార్యాలకు బబులోను ప్రజలను యెహోవా శిక్షించవలసిన సమయం వచ్చింది. బబులోనుకు తగిన శాస్తి జరుగుతుంది.
JER 51:7 యెహోవా చేతిలో బంగారు గిన్నెలా బబులోను ఉండేది. బబులోను ప్రపంచాన్నంతటినీ తాగించింది. బబులోను ఇచ్చిన మధ్యాన్ని దేశాలు సేవించాయి. కావున వారికి వెర్రి పట్టింది.
JER 51:8 బబులోను అకస్మాత్తుగా పడి ముక్కలై పోతుంది. దాని కొరకు విలపించండి! దాని బాధ నివారణకు మందుతెండి! బహుశః ఆమెకు నయం కావచ్చు!
JER 51:9 బబులోనుకు స్వస్థత చేకూర్చాలని యత్నించాము. కాని ఆమె స్వస్థతనొందలేదు. కావున ఆమెను వదిలివేసి మనందరం మన మన దేశాలకు వెళ్లిపోదాం. వరలోకంలో దేవుడు బబులోనుకు శిక్ష నిర్ణయిస్తాడు. బబూలోనుకు ఏమి సంభవించాలో ఆయన నిర్ణయిస్తాడు.
JER 51:10 యెహోవా మనకోసం శత్రువుల మీద పగతీర్చుకొన్నాడు. రండి! ఈ విషయం మనం సీయోనులో చెప్పుదాం. మన దేవుడైన యెహోవా చేసిన పనులను గూర్చి చెప్పుదాం.
JER 51:11 మీ బాణాలకు పదును పెట్టండి. మీ డాళ్లను చేపట్టండి! యెహోవా మాదీయుల రాజును ప్రేరేపిస్తున్నాడు. ఆయన బబులోనును నాశనంచేయ సంకల్పించాడు. కావున ఆయన వారిని ప్రేరేపిస్తున్నాడు. బబులోను ప్రజలకు అర్హమైన శిక్షను యెహోవా విధిస్తాడు. బబులోను సైన్యం యెరూషలేములో యెహోవా ఆలయాన్ని నాశనం చేసింది. కావున వారికి తగిన దండన యెహోవా విధిస్తాడు.
JER 51:12 బబులోను ప్రాకారాలకు ఎదురుగా జెండా ఎగురవేయండి. ఎక్కువమంది కావలివారిని నియమించండి. రక్షణ భటులను వారి వారి స్థానాలలో నిలపండి. రహస్య దాడికి సిద్ధంగా ఉండండి! యెహోవా తను యోచించిన ప్రకారం చేస్తాడు. యెహోవా బబులోనుకు వ్యతిరేకంగా ఏమి చేస్తానని చెప్పియున్నాడో అది చేసి తీరుతాడు.
JER 51:13 బబులోనూ, నీవు పుష్కలంగా నీరున్నచోట నివసిస్తున్నావు. నీవు ధనధాన్యాలతో తులతూగుతున్నావు. కాని ఒక రాజ్యంగా నీవు మనగలిగే కాలం అంతమవుతూవుంది. నీకు వినాశనకాలం దాపురించింది.
JER 51:14 సర్వశక్తిమంతుడైన యెహోవా తన పేరుమీద ప్రమాణం చేసి ఈ విషయాలు చెప్పాడు, “బబులోనూ, నిశ్చయముగా నిన్ను అనేక శత్రు సైనికులతో నింపుతాను. వారు మిడుతల దండులా వచ్చి పడుతారు. ఆ సైనికులు యుద్ధంలో నీ మీద గెలుస్తారు. వారు నీపై నిలబడి విజయధ్వనులు చేస్తారు.”
JER 51:15 యెహోవా తన అనంత శక్తి నుపయోగించి భూమిని సృష్టించాడు. ఆయన తన జ్ఞానాన్ని వినియోగించి ప్రపంచాన్ని నిర్మించాడు. తన ప్రజ్ఞతో ఆయన ఆకాశాన్ని విస్తరించాడు.
JER 51:16 ఆయన గర్జస్తే ఆకాశంలో సముద్రాలు ఘోషిస్తాయి. భూమిపైకి మేఘాలను ఆయన పంపిస్తాడు. ఉరుములు మెరుపులతో వర్షం పడేలా చేస్తాడు. తన గిడ్డంగుల నుండి ఆయన పెనుగాలులు రప్పిస్తాడు.
JER 51:17 కాని ప్రజలు బహుమూర్ఖులు. దేవుడు ఏమి చేశాడో తెలిసికోలేరు. నేర్పరులైన పనివారు బూటకపు దేవతల విగ్రహాలను చేస్తారు. ఆ విగ్రహాలన్నీ బూటకపు దేవతలే. కావున ఆ పని వాడు ఎంత మూర్ఖుడో అవి చాటి చెపుతాయి. ఆ విగ్రహాలు నిర్జీవ ప్రతిమలు.
JER 51:18 ఆ విగ్రహాలు నిరుపయోగం! ప్రజలు చేసిన ఆ విగ్రహాలు నవ్వులాట బొమ్మలు! వారికి తీర్పు తీర్చే కాలం వస్తుంది. అప్పుడా విగ్రహాలు నాశనం చేయబడతాయి.
JER 51:19 కాని యెకోబు స్వాస్థ్యము (దేవుడు) ఆ పనికి మాలిన విగ్రహాల్లాటివాడు కాదు. ప్రజలు దేవుని చేయలేదు. దేవుడే తన ప్రజలను చేశాడు! దేవుడు సమస్తాన్నీ సృష్టించినాడు! ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
JER 51:20 యెహోవా ఈ విధంగా అంటున్నాడు: “బబులోనూ, నీవు నా చేతి దుడ్డుకర్రవి రాజ్యాలను మోదటానికి నిన్ను వినియోగించాను. సామ్రాజ్యాలను నాశనం చేయటానికి నిన్ను వాడాను.
JER 51:21 గుర్రాన్ని, రౌతును బాదటానికి నిన్ను వాడాను. రథాన్ని, సారథిని చిదుకగొట్టటానికి నిన్నుపయోగించాను.
JER 51:22 స్త్రీ పురుషులను చితుకగొట్టుటకు నిన్ను వాడాను. వృద్ధులను, యువకులను చితకగొట్టుటకు నిన్ను వాడాను. యువకులను, యువతులను చితకగొట్టుటకు నిన్ను వాడాను.
JER 51:23 గొర్రెల కాపరులను, మందలను నాశనం చేయటానికి నిన్ను ఉపయోగించాను. రైతులను, ఆవులను నాశనం చేయుటకు నిన్ను ఉపయోగించాను. పాలకులను, ముఖ్య అధికారులను దండించటానికి నిన్ను వాడాను.
JER 51:24 కాని బబులోనుకు తగిన శాస్తి నేను చేస్తాను. కల్దీయులందరికీ తగిన శాస్తి చేస్తాను. సీయోనుకు వారు చేసిన కీడంతటికి తగిన శాస్తి చేస్తాను. యూదా, నీ కన్నుల ఎదుటనే నేను వారికి తగిన శాస్తి చేస్తాను.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
JER 51:25 యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోనూ, నీవొక విధ్వంసకర పర్వతానివి. నేను నీకు వ్యతిరేకిని. బబులోనూ, భూమినంతటినీ నీవు నాశనంచేశావు. నేను నీకు విరోధిని. నీ మీదికి నా చేయి చాస్తున్నాను. కొండ శిఖరాల నుంచి నిన్ను దొర్లిస్తాను. నిన్నొక కాలిపోయిన కొండలా చేస్తాను.
JER 51:26 పునాది రాళ్లకు పనికివచ్చే పెద్ద బండలను ప్రజలు చూడరు. వారి భవనాల పునాదులకు ప్రజలు పెద్ద రాళ్లను బబులోను నుంచి తీసికొనిపోరు. ఎందువల్లనంటే శ్వతంగా ఈ నగరం ఒక నలిగిన రాళ్లపోగులా మారుతుంది.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
JER 51:27 “రాజ్యంలో యుద్ధ పతాకాన్నెగుర వేయండి! దేశాలన్నిటిలో బూర వూదండి! బబులోనుతో యుద్ధానికి దేశాలను సిద్ధం చేయండి! బబులోనుతో యుద్ధానికి అరారాతు, మిన్నీ, అష్కనజు అనే రాజ్యాలను పిలవండి. దాని మీదికి సైన్యాన్ని నడపటానికి ఒక అధికారిని ఎంపిక చేయండి. మిడతల దండులా దానిమీదికి ఎక్కువ గుర్రాలను పంపండి.
JER 51:28 దానిమీదకి యుద్ధానికి దేశాలను సిద్ధం చేయండి. మాదీయుల రాజులను సమాయత్తపర్చండి. మాదీయుల పాలకులను, ముఖ్యాధికారులను సిద్ధంచేయండి. వారు పాలించే దేశాలన్నిటినీ బబులోను మీద యుద్ధానికి సిద్ధంచేయండి.
JER 51:29 బాధలో వున్నట్లు ఆ రాజ్యం వణకిపోతుంది. యెహోవా తన పధకాన్ని అమలుపర్చటం మొదలు పెట్టినప్పుడు అది కంపించిపోతుంది. బబులోనును వట్టి ఎడారిగా మార్చటమే యెహోవా సంకల్పం. అక్కడ ఎవ్వరూ నివసించరు.
JER 51:30 బబులోను సైనికులు పోరాడటం మానివేశారు. వారు తమ కోటల్లోనే ఉండిపోయారు. వారి శక్తి తరిగిపోయింది. వారు బెదరిపోయిన స్త్రీలవలె అయినారు. బబులోనులో ఇండ్లు తగులబడుతున్నాయి. దాని ద్వారాల కడ్డీలు విరిగిపోయాయి.
JER 51:31 ఒక దూత మరో దూతను అనుసరిస్తాడు. దూత తరువాత దూత వస్తాడు. అతని నగరమంతా పట్టుబడిందని వారు బబులోను రాజుకు తెలియజేస్తారు.
JER 51:32 మనుష్యులు నదులను దాటే స్థలాలన్నీ పట్టుబడ్డాయి. చిత్తడి నేలలు సహితం మండుతున్నాయి. బబులోను సైనికులంతా భయపడ్డారు.”
JER 51:33 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడూ అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను నగరం పంటకళ్లంలా ఉన్నది. పంటకోయు కాలంలో రైతులు కోసిన పైరును కొట్టి పొట్టునుండి ధాన్యాన్ని వేరుచేస్తారు. బబులోనును కొట్టే కాలం దగ్గర పడుతోంది.”
JER 51:34 “గతంలో బబులోను రాజు నెబుకద్నెజరు మమ్మల్ని నాశనం చేశాడు. గతంలో నెబుకద్నెజరు మమ్మల్ని గాయపర్చాడు. ఇదివరలో అతడు మా ప్రజలను చెరగొన్నాడు. మేము వట్టి జాడీల్లా అయ్యాము. అతడు మాకున్న మంచి వస్తువులన్నిటినీ తీసికొన్నాడు. కడుపు పగిలేలా అన్నీ తిన్న బ్రహ్మరాక్షసిలా అతడున్నాడు. అతడు మా మంచి వస్తువులన్నీ తీసికొని మమ్మల్ని నెట్టివేశాడు.
JER 51:35 మమ్మల్ని బాధించటానికి బబులోను భయర కరమైన పనులు చేసింది. ఇప్పుడు అవన్నీ బబులోనుకు జరగాలని నేను కోరుకుంటున్నాను.” సీయోనులో నివసిస్తున్న ప్రజలు ఈ విషయాలు చెప్పారు: “బబులోను వారు మా ప్రజలను చంపిన నేరస్థులు. వారు చేసిన దుష్ట కార్యాలకు వారిప్పుడు శిక్షింపబడతారు.” యెరూషలేము నగరం ఆ విషయాలు చెప్పింది.
JER 51:36 కావున యెహోవా ఇలా చెపుతున్నాడు, “యూదా, నిన్ను రక్షిస్తాను. బబులోను తప్పక శిక్షింపబడేలా చేస్తాను. బబులోను సముద్రం ఎండిపోయేలా చేస్తాను. ఆమె ఊటలు ఎండిపోయేలా నేను చేస్తాను.
JER 51:37 బబులోను కూలిపోయిన భవంతుల గుట్టలా తయారవుతుంది. బబులోను పిచ్చికుక్కలు తిరుగాడే స్థలంగా మారుతుంది. ఆ రాళ్లగుట్టను చూచిన ప్రజలు ఆశ్చర్యపోతారు. బబులోనును చూచి జనులు బాధతో తల లాడిస్తారు. బబులోను నిర్మానుష్యమై పోతుంది.
JER 51:38 బబులోను ప్రజలు గర్జించు యువ సింహాల్లా ఉన్నారు. వారు పులి పిల్లల్లా గుర్రుమంటున్నారు.
JER 51:39 ఆ ప్రజలు కొదమ సింహాలలా ప్రవర్తిస్తున్నారు. వారికి నేనొక విందు. ఇస్తాను. వారు బాగా మద్యం సేవించేలా చేస్తాను. వారు నవ్వుతూ విలాసంగా కాలక్షేపం చేస్తారు. తరువాత వారు శాశ్వతంగా నిద్రపోతారు. వారిక మేల్కొనరు.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
JER 51:40 “బబులోను ప్రజలను చంపటానికి నేను తీసికొని వెళతాను. నరకబడటానికి వేచివుండే గొర్రెల్లా, పొట్టేళ్లలా, మేకల్లా బబులోను ప్రజలుంటారు.
JER 51:41 “షేషకు ఓడింపబడుతుంది. అత్యుత్తమమైన, గర్వించదగిన దేశం చెరబట్టబడుతుంది. ఇతర రాజ్యాల ప్రజలు బబులోనువైపు చూస్తారు. వారు చూసే విషయాలు వారిని భయపెడతాయి.
JER 51:42 బబులోను మీదికి సముద్రం పొంగివస్తుంది. ఘోషించే అలలు దానిని ముంచివేస్తాయి.
JER 51:43 బబులోను పట్టణాలు పాడుపడి, ఖాళీ అవుతాయి. బబులోను భూమి ఎండి ఎడారిలా మారుతుంది. అది నిర్మానుష్యమైన భూమి అవుతుంది. కనీసం ప్రజలు బబులోను గుండానైనా పయనించరు.
JER 51:44 బబులోనులో బేలు దేవతను నేను శిక్షిస్తాను. తను మింగిన మనుష్యులను అతడు కక్కేలా చేస్తాను. ఇతర రాజ్యాల వారు బబులోనుకు రారు. బబులోను నగరపు చుట్టున్న ప్రాకారం కూలిపోతుంది.
JER 51:45 నా ప్రజలారా, బబులోను నగరం నుండి బయటకు రండి. మీ ప్రాణరక్షణకు పారిపొండి. యెహోవా యొక్క భయానక కోపంనుండి దూరంగా పారిపొండి.
JER 51:46 “నా ప్రజలారా, విచారించకండి. వదంతులు వ్యాపిస్తాయి; కాని భయపడవద్దు. ఒక వదంతి ఈ సంవత్సరం వ్యాపిస్తుంది. మరొక వదంతి మరు సంవత్సరం వస్తుంది. దేశంలో భీకరపోరాటం గురించిన వదంతులు లేస్తాయి. పాలకులు ఇతర పాలకులతో పోట్లాడుతున్నట్లు వదంతులు వస్తాయి.
JER 51:47 బబులోనువారి బూటకపు దేవతలను నేను శిక్షించే సమయం ఖచ్చితంగా వస్తుంది. బబులోను రాజ్యం యావత్తు అవమాన పర్చబడుతుంది. అనేకమంది ప్రజలు చనిపోయి నగర వీధుల్లో పడివుంటారు.
JER 51:48 అప్పుడు పరలోకంలోను, భూమి మీద ఉన్న వారంత బబులోనుకు జరిగిన దాని విషయమై సంతోషంతో కేకలు పెడతారు. శత్రు సైన్యాలు ఉత్తరాన్నుండి వచ్చి బబులోనుతో యుద్ధం చేస్తాయి గనుక వారునూ కేకలు పెడతారు.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
JER 51:49 “బబులోను ఇశ్రాయేలు ప్రజలను చంపింది. భూమి మీద ప్రతి ప్రాంతంనూ ప్రజలలోని బబులోను చంపింది. కావున బబులోను తప్పక పతనమవ్వాలి!
JER 51:50 కత్తివాతబడకుండా తప్పించుకున్న ప్రజలారా త్వరపడండి; బబులోనును వదిలిపొండి. ఆగకండి! మీరు ఎంతో దూరానగల దేశంలో వున్నారు. కాని మీరున్న చోటనే యెహోవాను తలుచుకోండి. యెరూషలేమును గుర్తుచేసికొనండి.
JER 51:51 “యూదా ప్రజలమైన మేము సిగ్గుపడుతున్నాము. మేము అవమానింపబడినందున మేము సిగ్గుపడుతున్నాము. అది ఎందువల్లనంటే పరాయివాళ్లు మా దేవుని దేవాలయంలోని పవిత్ర స్థలాల్లో ప్రవేశించారు.”
JER 51:52 యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను విగ్రహాలను నేను శిక్షించే సమయం వస్తోంది. ఆ సమయంలో, ఆ రాజ్యంలోని ప్రతిచోటా గాయపడిన ప్రజలు బాధతో మూలుగుతారు.
JER 51:53 ఆకాశాన్నంటే వరకు బబులోను పెరగవచ్చు. బబులోను తన కోటలను పటిష్ఠం చేసికోవచ్చు కాని ఆ నగరంతో పోరాడటానికి నేను జనాన్ని పంపుతాను. ఆ ప్రజలు దానిని నాశనం చేస్తారు.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
JER 51:54 “బబులోనులో ప్రజల ఆక్రందనలు మనంవినగలం. కల్దీయుల రాజ్యంలో ప్రజలు చేస్తున్న విధ్వంసకాండ శబ్దాలను మనం వింటాం.
JER 51:55 అతి త్వరలో యెహోవా బబులోనును ధ్వంసం చేస్తాడు. నగరంలో వినవచ్చే గొప్ప సందడిని ఆయన అణచి వేస్తాడు. మహాసముద్రపు అలలు ఘోషించినట్లు శత్రువులు వచ్చిపడతారు. చుట్టు పట్లవున్న ప్రజలు ఆ గర్జన వింటారు.
JER 51:56 సైన్యం వచ్చి బబులోనును ధ్వంసం చేస్తుంది. బబులోను సైనికులు పట్టుబడతారు. వారి ధనుస్సులు విరిగిపోతాయి. ఎందువల్లనంటే, వారు చేసిన పాపాలకు యెహోవా ఆ ప్రజలను శిక్షిస్తాడు. వారికి తగిన పూర్తి దండన యెహోవా విధిస్తాడు.
JER 51:57 బబులోను యొక్క ముఖ్యమైన అధిపతులను, జ్ఞానులను మత్తిల్లజేస్తాను. దాని పాలకులను, అధికారులను, సైనికులను కూడ మత్తిల్లజేస్తాను. దానితో వారు శాశ్వతంగా నిద్రిస్తారు. వారు ఎప్పిటికీ మేల్కొనరు.” ఈ విషయాలు రాజు చెప్పియున్నాడు. ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
JER 51:58 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను యొక్క మందమైన, బలమైన గోడ కూలగొట్టబడుతుంది. దాని ఉన్నత ద్వారాలు తగులబెట్టబడతాయి. బబులోను ప్రజలు కష్టపడి పనిచేస్తారు. కాని అది వారికి సహాయపడదు! నగరాన్ని రక్షించటంలో వారు మిక్కిలి అలసిపోతారు. కాని వారు ఎగసేమంటల్లో కేవలం సమిధలవుతారు!”
JER 51:59 యిర్మీయా ఈ సందేశాన్ని అధికారియైన శెరాయాకు పంపాడు. శెరాయా నేరీయా కుమారుడు. నేరీయా మహసేయా కుమారుడు. యూదా రాజైన సిద్కియాతో పాటు శెరాయా బబులోనుకు వెళ్లాడు. సిద్కియా యూదాకు రాజైన పిమ్మట నాల్గవ సంవత్సరంలో ఇది జరిగింది. ఆ సమయంలో అధికారి శెరాయాకు యిర్మీయా ఈ వర్తమానాన్ని పంపించాడు.
JER 51:60 బబులోనుకు సంభవించే భయంకర విషయాలన్నీ యిర్మీయా ఒక పుస్తకపు చుట్టలో వ్రాశాడు:
JER 51:61 శెరాయాకు యిర్మీయా ఇలా చెప్పాడు, “శెరాయా, బబులోనుకు వెళ్లు. ప్రజలంతా వినేటట్లు ఈ సమాచారం తప్పకుండా చదువు.
JER 51:62 తరువాత, ‘ఓ దేవా, ఈ ప్రదేశమగు బబులోనును నీవు నాశనం చేస్తానని అన్నావు. నరులుగాని, జంతువులు గాని నివసించని విధంగా దానిని నాశనం చేస్తానని అన్నావు. ఈ చోటు శాశ్వతంగా పట్టి శిథిలాలు పోగు అవుతుంది’ అని చెప్పు.
JER 51:63 నీవీ పుస్తకం చదవటం పూర్తి చేయగానే దానికి ఒక రాయి కట్టు. తరువాత దానిని యూఫ్రటీసు నదిలోకి విసురు.
JER 51:64 అప్పుడు, ‘ఇదే రీతిగా బబులోను మునిగిపోతుంది. బబులోను మరి పైకి లేవద్దు! నేను ఇక్కడ కలుగజేసే భయంకరమైన పరిణామాల కారణంగా బబులోను మునిగిపోతుంది’” అని చెప్పు. యిర్మీయా మాటలు సమాప్త.
JER 52:1 యూదాకు రాజయ్యే నాటికి సిద్కియాకు ఇరవై యొక్క సంవత్సరా వయస్సు. యెరూషలేములో సిద్కియా పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఈమె తండ్రి పేరు యిర్మీయా. హమూటలు వంశం వారు లిబ్నా పట్టణవాసులు.
JER 52:2 రాజైన యెహోయాకీము మాదిరిగానే సిద్కియా కూడా దుష్ట కార్యాలు చేశాడు. సిద్కియా ఆ చెడు కార్యాలు చేయటం యెహోవాకు ఇష్టం లేదు.
JER 52:3 వారి పట్ల యెహోవా కోపగించటంతో యెరూషలేములోను, యూదాలోను భయంకరమైన సంఘటనలు జరిగాయి. చివరికి యెరూషలేము, యూదా ప్రజలను తన ముందు నుంచి దూరంగా తోసివేశాడు. బబులోను రాజుమీద సిద్కియా తిరుగుబాటు చేశాడు.
JER 52:4 కావున సిద్కియా పాలనలో తొమ్మిది సంవత్సరాల పది నెలలు దాటి పదవ రోజు గడుస్తూ వుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తన యెరూషలేము మీదికి దండెత్తాడు. నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా వెంటబెట్టుకు వచ్చాడు. బబులోను సైన్యం యెరూషలేము బయట దిగింది. తరువాత వారు నగరపు గోడల మీదికి ఎగబాకటానికి అనువుగా చుట్టూ దిమ్మలు కట్టారు.
JER 52:5 రాజైన సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం జరిగే వరకు యెరూషలేము నగరం బబులోను సైన్యం ముట్టడిలో వుంది.
JER 52:6 ఆ సంవత్సరం నాల్గవ నెలలో తొమ్మిదవ రోజున నగరంలో కరువు తీవ్రమయ్యింది. నగరంలో ఆహార పదార్ధాలు అయిపోవటం కారణంగా ప్రజలకు తినటానికి తిండి కరువయ్యింది.
JER 52:7 ఆ రోజున బబులోను సైన్యం యెరూషలేములోనికి ప్రవేశించింది. యెరూషలేము సైన్యం పారిపోయింది. రాత్రి సమయంలో సైనికులు నగరం వదిలి పారిపోయారు. రెండు గోడల మధ్య ద్వారం గుండా వారు బయటకి పోయారు. ఆ ద్వారం రాజు యొక్క ఉద్యానవనం వద్ద వుంది. బబులోను సైన్యం నగరాన్ని చుట్టుముట్టి ఉన్నప్పటికీ, యెరూషలేము సైనికులు పారిపోగలిగారు. వారు ఎడారివైపు పారిపోయారు.
JER 52:8 కాని, కల్దీయుల సైన్యం రాజైన సిద్కియాను వెంటాడింది. వారు యెరికో మైదానంలో అతన్ని పట్టుకున్నారు. కాని సిద్కియా సైనికులంతా పారిపోయారు.
JER 52:9 బబులోను సైన్యం రాజైన సిద్కియాను చెరబట్టింది రిబ్లా నగరంలోవున్న బబలోను రాజు వద్దకు అతన్ని తీసికొని వెళ్లారు. రిబ్లా నగరం హమాతు రాజ్యంలో వుంది. బబులోను రాజు రిబ్లా నగరంలో రాజైన సిద్కియాపై తీర్పు ప్రకటించాడు.
JER 52:10 రిబ్లా నగరంలోనే బబులోను రాజు సిద్కియా కుమారులను చంపివేశాడు. తన కుమారులు క్రూరంగా చంపబడటం సిద్కియా బలవంతాన చూశాడు. (ఆ హింస చూడటానికి అతనిపై వత్తిడి వచ్చింది.) యూదా అధికారులందరినీ కూడ బబులోను రాజు చంపివేశాడు.
JER 52:11 పిమ్మట బబులోను రాజు సిద్కియా కండ్లు పెరికివేశాడు. అతనికి కంచు గొలుసులు వేశాడు. తరువాత సిద్కియాను అతడు బబులోనుకు తీసికొనిపోయాడు. బబులోనులో సిద్కియాను అతడు చెరసాలలో ఉంచాడు. సిద్కియా చనిపోయే వరకు చెరసాలలోనే ఉన్నాడు.
JER 52:12 బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధి పతియైన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు. రాజైన నెబుకద్నెజరు పాలనలో పందొమ్మిదవ సంవత్సర ఐదవనెలలో పదవ రోజున అతను వచ్చాడు. బబులోనులో నెబూజరదాను ఒక ముఖ్యమైన నాయకుడు.
JER 52:13 నెబూజరదాను దేవాలయాన్ని తగులబెట్టాడు. రాజభవనాన్ని, యెరూషలేములో ఇతర గృహాలను కూడ అతడు తగులబెట్టాడు. యెరూషలేములో ప్రతి ముఖ్య భవనాన్నీ అతడు తగులబెట్టాడు.
JER 52:14 కల్దీయుల సైన్యమంతా కలిసి యెరూషలేము చుట్టూవున్న గోడలను కూలగొట్టింది. రాజుయొక్క ఒక ప్రత్యేక అంగరక్షకుని కింద ఆ సైన్యం ఉంది.
JER 52:15 సైనికాధికారి నెబూజరదాను ఇంకా యెరూషలేములో మిగిలిన జవాన్ని బందీలుగా పట్టుకున్నాడు. బబులోను రాజుకు ఇంతకుముందే లొంగిపోయిన వారిని కూడా చెరబట్టి తీసికొనిపోయాడు. యెరూషలేములో మిగిలిన నిపుణులైన చేతి పనివారిని కూడా అతడు తీసికొని వెళ్లాడు.
JER 52:16 కాని నెబూజరదాను మిక్కిలి పేదవారిని కొందరిని రాజ్యంలో వదిలివేశాడు. వారిని ద్రాక్ష తోటలలోను, పొలాలలోను పవిచేయటానికి అతడు వదలి వెళ్లాడు.
JER 52:17 ల్దీయుల సైన్యం ఆలయంలోని కంచు స్తంభాలను విరుగగొట్టింది. యెహోవాయొక్క ఆలయంలో గల స్తంభాలను, కంచు సముద్రమును (కోనేరు) కూడ ముక్కలు చేశారు. ఆ కంచునంతా వారు బబులోనుకు తీసికొని పోయారు.
JER 52:18 బబులోను సైన్యం ఆలయం నుండి ఆ వస్తు సామగ్రిని కూడ తీసికొని పోయింది: కుండలు, పారవంటి గరిటెలు, వత్తులను ఎగదోసే పనిముట్లు, పెద్ద గిన్నెలు, పెనాలు, దేవాలయ అర్చనలో ఉపయెగించే కంచు సామగ్రి వంటి వాటిని కూడ బబులోను సైన్యం తీసికొనిపోయింది.
JER 52:19 రాజు యొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి ఈ వస్తువులు తీసుకొని వెళ్లాడు: పళ్లెములు, ధూపకలశాలు, పెద్ద పాత్రలు, కుండలు, దీపస్తంభాలు, పెనములు, పానీయాలు అర్పించే పాత్రలు వెండి, బంగారాలతో చేసిన వస్తువులన్నీ అతడు తీసికొని పోయాడు.
JER 52:20 రెండు స్తంభాలు, సముద్రం (కోనేరు), దాని కింద పన్నెండు కంచు గిత్తదూడల విగ్రహాలు, తోపుడు స్థంభాలు చాలా బరువైనవి. రాజైన సొలొమోను వాటిని యెహోవా ఆలయానికి చేయించాడు. వాటి చేతకు పట్టిన కంచు ఎంత బరువైనదంటే దాన్ని తూచటం కష్టం.
JER 52:21 ప్రతి కంచుస్తంభం ఇరువది ఏడు అడుగుల (పదునెనిమిది మూరలు) ఎత్తు వుంది. ప్రతి స్తంభం పద్దెనిమిది అడుగుల (పన్నెండు మూరలు) చుట్టు కొలత కలిగివుంది. ప్రతి స్తంభం బోలుగా ఉంది. స్తంభపు అంచు మందం నాలుగు అంగుళాలు.
JER 52:22 మొదటి స్తంభం మీది కంచుపీట ఏడున్నర అడుగుల (ఏడు మూరలు) ఎత్తు కలిగి ఉంది. దాని చుట్టూ వలలాంటి నగిషీ పని, కంచు దానిమ్మకాయల అలంకరణ చేయబడింది. మరొక స్తంభం మీద కూడ దానిమ్మకాయల పనితనం వుంది. అదికూడ మొదటి స్తంభం మాదిరిగానే వుంది.
JER 52:23 స్తంభాల పక్కల మీద తొంబది ఆరు దానిమ్మకాయలున్నాయి. స్తంభాల పైన వలవంటి నగిషీపని మీద మొత్తం వంద దానిమ్మ కాయలు వున్నాయి.
JER 52:24 రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి శెరాయాను, సిద్కియాను బందీలుగా తీసికొని పోయాడు. ముగ్గురు ద్వారపాలకులను కూడా బందీలుగా తీసికొనిపోయాడు. శెరాయా ప్రధాన యాజకుడు, అతని తరువాతి వాడు జెఫన్యా.
JER 52:25 రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి పోరాటయోధుల దళాధిపతిని కూడా పట్టుకున్నాడు. రాజుయొక్క సలహాదారులలో ఏడుగురిని కూడా అతడు పట్టుకున్నాడు. ఆ మనుష్యులు ఇంకా యెరూషలేములో ఉన్నారు. సైన్యంలో మనుష్యులను చేర్చుకొనే అధికారిని (లేఖరి) కూడ అతడు పట్టుకున్నాడు. నగరంలో ఉన్న అరువది మంది సామాన్య ప్రజలను కూడా అతడు పట్టుకున్నాడు.
JER 52:26 అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను ఆ అధికారులందరినీ పట్టుకున్నాడు. వారిని బబులోను రాజు వద్దకు తీసికొనివచ్చాడు. బబులోను రాజు రిబ్లా నగరంలో ఉన్నాడు. రిబ్లా నగరం హమాతు రాజ్యంలో వుంది. రిబ్లా నగరంలో ఆ అధికారులందరికీ రాజు మరణశిక్ష విధించాడు. ఆ విధంగా యూదా ప్రజలు తమ దేశంనుండి తీసికొనిపోబడ్డారు.
JER 52:28 నెబుకద్నెజరు చెరబట్టిన వారు వివరాలు ఇలా ఉన్నాయి: నెబుకద్నెజరు పాలన ఏడవ సంవత్సరం గడుస్తూ వుండగా మూడు వేల ఇరవై ముగ్గురు యూదా ప్రజలు.
JER 52:29 నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరం జరుగుతూ ఉండగా ఎనిమిది వందల ముప్పది రెండు మంది యెరూషలేము నుండి బందీలుగా తీసికొని పోబడ్డారు.
JER 52:30 నెబుకద్నెజరు పాలన ఇరువై మూడవ సంవత్సరంలో నెబూజరదాను ఏడువందల నలభై ఐదు మంది యూదా వారిని బందీ చేశాడు. నెబూజరదాను రాజు యొక్క ప్రత్యేక అంగరక్షక ధళాధిపతి. మొత్తం మీద నాలుగువేల ఆరువందల మందిని బందీలుగా పట్టుకుపోయారు.
JER 52:31 యూదా రాజైన యెహోయాకీను బబులోనులో ముప్పది ఏడు సంవత్సరాల పాటు చెరసాలలో ఉన్నాడు. యెహోయాకీను కారాగారవాసంలో ముప్పది ఏడవ సంవత్సరం జరుగుతూ ఉండగా బబులోను రాజైన ఎవీల్మెరోదకు అతని పట్ల మిక్కిలి కనికరం చూపాడు. ఆ సంవత్సరంలో యెహోయాకీనును అతడు చెరసాల నుండి విడుదల చేశాడు. అనగా అది ఎవీల్మెరోదకు బబులోనుకు రాజు అయిన మొదటి సంవత్సరం. ఎవీల్మెరోదకు ఆ సంవత్సరం పన్నెండవ నెలలో ఇరువై ఐదవ రోజున యెహోయాకీనును చెరసాల నుండి విడుదల చేశాడు.
JER 52:32 ఎవీల్మెరోదకు మిక్కిలి దయగా యెహోయాకీనుతో మాట్లాడాడు. అప్పుడు తనతో బబులోనులో ఉన్న రాజులం దరికంటె యెహోయాకీనుకు అతడు గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చాడు.
JER 52:33 దానితో యెహోయాకీను తన చెరసాల బట్టలు తీసివేశాడు. మిగిలిన తన జీవిత కాలమంతా అతడు ప్రతిరోజూ రాజుయొక్క బల్లవద్దనే భోజనం చేశాడు.
JER 52:34 బబులోను రాజు ప్రతిరోజూ యెహోయాకీనుకు దినభత్యం ఇచ్చేవాడు. ఇది యెహోయాకీను చనిపోయేవరకు కొనసాగింది.
LAM 1:1 యెరూషలేము ఒకనాడు జనసందోహంతో కిటకిటలాడిన నగరం. కాని ఘోరంగా నిర్జనమయ్యంది! ఒకప్పుడు ప్రపంచ మహానగరాల్లో యెరూషలేము ఒక మహానగరం. కాని అది విధవరాలుగా అయింది. ఒకనాడామె నగరాలలో యువరాణిలా ఉన్నది. కాని ఆమె ఒక బానిసలా చేయబడింది.
LAM 1:2 ఆమె రాత్రివేళ తీవ్రంగా దుఃఖిస్తుంది. ఆమె కన్నీరు ఆమె చెక్కిళ్లపై ఉన్నాయి. ఆమెను ఓదార్చటానికి ఎవ్వరూ లేరు. ఆమెతో సఖ్యంగా ఉన్న ఏ ఒక్క దేశమూ ఆమెను ఓదార్ఛలేదు. ఆమె స్నేహితులంతా ఆమెపట్ల విముఖులయ్యారు. ఆమె స్నేహితులు ఆమెకు శత్రువులయ్యారు.
LAM 1:3 అనేక బాధలను అనుభవించి యూదా బందీ అయ్యింది. మిక్కిలి శ్రమకు గురియై యూదా బందీ అయ్యింది. యూదా పరదేశీయుల మధ్య నివసిస్తూ ఉంది. ఆమెకు విశ్రాంతిలేదు. ఆమెను వెంటాడిన ప్రజలు ఆమెను పట్టుకున్నారు. ఆ ప్రజలు ఆమెను ఇరుకు లోయల్లో పట్టుకున్నారు.
LAM 1:4 సియోనుకు పోయే మార్గాలన్నీ దుఃఖమయ మయ్యాయి. అందుకు కారణం సీయోనుకు నియామక కూటాలకు ఎవ్వరూ రాకపోవటమే. సీయోను ద్వారాలు పాడుబడినాయి. సీయోను యాజకులు మూల్గుచున్నారు. సీయోను యువతులు పట్టుబడ్డారు. ఇదంతా సీయోనుకు భరింపరాని విషాదం.
LAM 1:5 యెరూషలేము శత్రువులు గెలిచారు. ఆమె శత్రువులు విజయవంతులయ్యారు. యెహోవా ఆమెను శిక్షించిన కారణంగా ఇదంతా జరిగింది. యెరూషలేము చేసిన అనేక పాపాలకు ఆయన ఆమెను శిక్షించినాడు. ఆమె పిల్లలు వెళ్ళిపోయారు. వారి శత్రువులకు బందీలై వారు వెళ్ళిపోయారు.
LAM 1:6 సీయోను కుమార్తె అందం మాయమయ్యింది. ఆమె రాకుమారులు లేళ్లవలె అయ్యారు. గడ్డి మేయటానికి పచ్చిక బయలు కానరాని లేళ్లవలె వారున్నారు. శక్తి లేకపోయినా వారెలాగో పారిపోయారు. తమను వెంటాడుతున్న వారి నుండి వారు పారిపోయారు.
LAM 1:7 యెరూషలేము గతాన్ని తలుస్తూవుంది యెరూషలేము బాధపడిన దినాలను, నివాసం లేక తిరిగిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది. ఆమె తన గత వైభవాన్ని జ్ఞాపకం చేసికొంటూవుంది. పాత రోజుల తన అనుభవాలను ఆమె తలపోసుకొంటుంది. శత్రువు తన ప్రజలను చెరబట్టిన దినాలను ఆమె జ్ఞాపకం చేసికొంటూ ఉంది. ఆమెకు క లిగిన నిస్సహాయ పరిస్థితిని ఆమె జ్ఞాపకం చేసికొంటుంది. ఆమె శత్రువులు ఆమెను చూచి నవ్వారు. ఆమె నాశనం చేయబడినందున వారు నవ్వారు.
LAM 1:8 యెరూషలేము ఘోరంగా పాపం చేసింది. యెరూషలేము పాపాల కారణంగా ఆమెను చూసిన వారంతా తలలూపే పరిస్థితి వచ్చింది. ఆమెను గౌరవించిన వారంతా ఇప్పుడామెను అసహ్యించుకుంటున్నారు. ఆమెను వారు నగ్నంగా చూశారు, గనుక వారామెను అసహ్యించు కుంటున్నారు. యెరూషలేము మూల్గుతూ ఉంది. ఆమె వెనుదిరిగి పోతూవుంది.
LAM 1:9 యెరూషలేము చీర చెంగులు మురికి అయ్యాయి. తనకు జరిగబోయే విషయాలను గూర్చి ఆమె ఆలోచించలేదు. ఆమె పతనం విస్మయం కలుగజేస్తుంది. ఆమెను ఓదార్చటానికి ఆమెకు ఎవ్వరూలేరు. “ఓ ప్రభూ, నేనెలా బాధపడ్డానో చూడు! తనెంత గొప్పవాడినని నాశత్రువు అనుకొంటున్నాడో చూడు!” అని ఆమె అంటూ ఉంది.
LAM 1:10 శత్రువు తన చేతిని చాచాడు. అతడామె విలువైన వస్తువులన్నీ తీసికొన్నాడు. వాస్తవంగా, పరదేశీయులు తన పవిత్ర దేవాలయములో ప్రవేశించటం ఆమెచూసింది. ఓ యెహోవా, ఆ ప్రజలు నీ పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించకూడదు! అని నీవు ఆజ్ఞాపించావు.
LAM 1:11 యెరూషలేము ప్రజలంతా ఉస్సురుమంటూ ఉన్నారు. ఆమె ప్రజలంతా ఆహారం కొరకు వెదుకుతున్నారు. ఆహారం కొరకు వారికున్న విలువైన వస్తువులన్నీ ఇచ్చివేస్తున్నారు. ఇది వారు తమ ప్రాణాలు నిలుపుకోవటానికి చేస్తున్నారు. యెరూషలేము ఇలా అంటున్నది: “యెహోవా, ఇటు చూడు; నావైపు చూడు! ప్రజలు నన్నెలా అసహ్యించుకొంటున్నారో చూడు.
LAM 1:12 త్రోవన పోయే ప్రజలారా, మీరు నన్ను లక్ష పెట్టినట్లు లేదు. కాని నావైపు దృష్టి ప్రసరించి చూడండి. నా బాధవంటి బాధ మరొక్కటేదైనా ఉందా? నాకు సంభవించిన బాధలాంటిది మరేదైనా ఉందా? యెహోవా నన్ను శిక్షంచిన బాధకు మించిన బాధ మరేదైనా ఉందా? ఆయనకు తీవ్రమైన కోపం వచ్చిన రోజున ఆయన నన్ను శిక్షించాడు.
LAM 1:13 యెహోవా పైనుండి అగ్ని కురిపించాడు ఆ అగ్ని నా ఎముకలకంటింది. ఆయన నా కాళ్లకు వలపన్నాడు. ఆయన నన్ను అన్ని వైపులకు తిప్పాడు. ఆయమన నన్ను ఒక బీడు భూమిలా మార్చాడు. నేను రోజంతా అస్వస్థతగా ఉన్నాను.
LAM 1:14 “కాడివలె నా పాపాలు కట్టబడ్డాయి. యెహోవా చేతుల్లో నా పాపాలు మూటగట్టబడ్డాయి. యెహోవా కడి నా మెడ మీద ఉంది. యెహోవా నన్ను బలహీన పర్చాడు. నేను ఎదిరించలేని ప్రజలకు యెహోవా నన్ను అప్పజెప్పాడు.
LAM 1:15 “బలమైన నా సైనికులందరినీ యెహోవా తిరస్కరించాడు. ఆ సైనికులంతా నగరంలోనివారే పిమ్మట యెహోవా ఒక జనసమూహాన్ని నా మీదికి తెచ్చాడు. నా యువ సైనికులను చంపటానికే ఆయన ఆ జనాన్ని తీసుకొని వచ్చాడు. ద్రాక్షా గానుగలలో వున్న కాయలపై (ప్రజలు) యెహోవా అడుగువేసి త్రొక్కాడు. ఆ ద్రాక్షా గానుగ కన్యక అయిన యెరూషలేము కుమారి.
LAM 1:16 “ఈ విషయాలన్నిటిపట్ల నేను వ్యధ చెందుతున్నాను. నా కళ్ళు; కన్నీళ్లతో తడిసిపోయాయి. నన్ను ఓదార్చు వారెవ్వరూ నావద్ద లేరు. నన్ను ఓదార్చి స్వస్థపర్చు వారెవ్వరూ లేరు. నా పిల్లలు బంజ రు భూమిలా ఉన్నారు. శత్రువు గెలవటంతో వారలా తాయారయ్యారు.”
LAM 1:17 సీయోను తన చేతులు చాపింది. ఆమెను ఆదరించేవారెవ్వరూ లేరు. యాకోబు శత్రువులకు యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. యాకోబు శత్రువులకు అతనిని చుట్టుముట్టుమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. యెరూషలేము అపవిత్రమయ్యింది. ఆ శత్రువుల మధ్య ఆమె అపవిత్రురాలైంది.
LAM 1:18 “నేను యెహోవాను అనుసరించటానికి తిరస్కరించాను. అందువల్ల ఆయన చేసిన పని న్యాయమైనదే అని ఆమె అంటూంవుంది. కావున ప్రజలారా, వినండి! నా బాధను గమనించండి! నా యువతీ యువకులు బందీలైపోయారు.
LAM 1:19 నా ప్రేమికులను నేను పిలిచాను. కాని వారు నన్ను మోసగించారు. నా యాజకులు, నా పెద్దలు నగరంలో చనిపోయారు. ఆహారం కొరకు వారు అన్వేషించారు. వారు తమ ప్రాణాలను నిలుపుకోదల్చారు.
LAM 1:20 “యెహోవా, నా వైపు చూడు. నేను బాధలో ఉన్నాను! నాలో కలవరం చెలరేగింది! నా గుండె తల్లిక్రిందులైనట్లు నాకు భావన కలుగుతూ వుంది! నా కలవరపాటుకు కారణం నేను మొండిగా తిరిగుపబాటు చేయటమే! నా పిల్లలు నడివీదుల్లో కత్తికి గురి అయ్యారు. ఇంటిలోపల మృత్యువు పొంచివుంది.
LAM 1:21 “నా గోడు విను, నేను దుఃఖభారంతో నిట్టూర్చుతున్నాను. ఓదార్చటానికి నాకు ఎవ్వరూ లేరు. నా శత్రువులంతా నా కష్టాల గురించి విన్నారు. విని సంతోషపడ్డారు. నీవు నాకు ఈ శిక్ష విధించినందుకు వారు సంతోషించారు. నీవు ప్రకటించిన ఆ రోజును ఇప్పుడు రప్పించుము. ఆ రోజున నా శత్రువులు ఇప్పుడు నేనున్న స్థితికి వచ్చేలా చేయుము.
LAM 1:22 “నా శత్రువుల దుష్టత్వం నీ ముందు ప్రకటితమవ్వనిమ్ము. నా పాపాలకు నీవు నన్ను శిక్షించినట్లు, అప్పుడు వారి దుష్టత్వానికి వారిని శిక్షించుము. పొంగిన ధుఃఖంతో ఎడతెరిపి లేకుండా నేను మూల్గుతున్నాను. అందువల్ల నీవు ఇది చెయ్యి. నా హృదయం కృంగి కృశించినందున నీవు ఈ పని చెయ్యి.”
LAM 2:1 సీయోను కుమార్తెను (యెరూషలేము) యెహోవా మేఘముతో కప్పి ఎలా మరుగు పర్చినాడో చూడుము. ఇశ్రాయేలు వైభవాన్ని ఆయన ఆకాశాన్నుండి భూమికి త్రోసివేశాడు. యెహోవాకు కోపం వచ్చిన రోజున ఇశ్రాయేలు ఆయన కాలిపీట అని కూడా ఆయన గుర్తు పెట్టు కోలేదు.
LAM 2:2 యాకోబు (ఇశ్రాయేలు) ఇండ్లను యెహోవా మింగివేశాడు. కనికరం లేకుండా ఆయన వాటిని మింగివేశాడు. ఆయన తన కోపంలో యూదా కుమార్తె (యూదా రాజ్యం) కోటలను నాశనం చేశాడు. యూదా రాజ్యాన్ని, దాని పాలకులను యెహోవా నేలకు పడదోసినాడు. ఆయన రాజ్యాన్ని నాశనం చేశాడు.
LAM 2:3 యెహోవా తన కోపంతో ఇశ్రాయేలు బలాన్ని క్షయం చేశాడు. ఆయన తన కుడిచేతిని ఇశ్రాయేలు మీదినుండి తీసివేశాడు. శత్రువు వచ్చినప్పుడు ఆయన అలా చేశాడు. యాకోబు (ఇశ్రాయేలు) లో ఆయన అగ్నిశిలలా మండినాడు. ప్రళయాగ్నిలా ఆయన ఉన్నాడు.
LAM 2:4 ఒక శత్రువులా యెహోవా తన విల్లు వంచాడు. అయన కుడిచేయి తన ఖడ్గం ఒరమీద వుంది. బాగా కన్పించే యూదా మనుష్యులందరినీ ఆయన చంపివేశాడు. యెహోవా ఒక శత్రువులా వారిని హతమార్చినాడు. యెహోవా తన కోపాన్ని కుమ్మరించాడు. ఆయన దానిని సీయోను గుడారాలపై కుమ్మరించాడు.
LAM 2:5 యెహోవా ఒక శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగేశాడు. ఆయన దాని స్థలాలన్నిటినీ మింగేశాడు. ఆయన దాని కోటలన్నిటినీ మింగేశాడు. మృతుల కొరకు యూదా కుమార్తెలో మిక్కిలి దుఃఖాన్ని, బాధను కలుగ జేశాడు.
LAM 2:6 యెహోవా తన స్వంత గుడారాన్నే ఒక తోట మాదిరి నాశనం చేసినాడు. ప్రజలు ఎక్కడ సమావేశమై తనను ఆరాధిస్తారో ఆ ప్రదేశాన్నే ఆయన పాడుజేశాడు. సీయోనులో ప్రత్యక సమావేశాలు, ప్రత్యేక విశ్రాంతి దినాలను ప్రజలు మర్చిపోయేలా యెహోవా చేశాడు. యెహోవా రాజును, యాజకుని తిరస్కరించాడు. తనకోపంలో ఆయన వారిని తిరస్కరించాడు.
LAM 2:7 యెహోవా తన బలిపీఠాన్ని తిరస్కరించాడు. ఆయన తన పవిత్ర ఆరాధనా స్థలాన్ని తిరస్కరించాడు. యెరూషలేము కోట గోడలను ఆయన శత్రువులకు అప్పజెప్పాడు. యెహోవా ఆలయంలో శత్రువు అల్లరి చేశాడు. అది ఒక సెలవు రోజు అన్నట్లు వారు అల్లరి చేశారు.
LAM 2:8 సీయోను కుమార్తె (ఇశ్రాయేలు) కోట గోడలను కూల దోయటానికి యెహోవా పథకం నిర్ణయించాడు. ఒక కొలబద్దతో అతడు గోడకు గుర్తులు పెట్టాడు. దానిని నాశనం చేయటంలో తనను తాను నిగ్రహించుకోలేదు. కావున బయటి ప్రాకారం, ఇతర గోడలు ధుఃఖ భారంతో కూలి పోయేలా చేశాడు. అవి ఒక్కుమ్మడిగా శిథి లమై పోయాయి.
LAM 2:9 యోరూషలేము ద్వారాలు భూమిలోకి క్రుంగి పోయాయి. ద్వారాల కడ్డీలను ఆయన నుగ్గు నుగ్గు చేశాడు. ఆమె యొక్క రాజు, యువరాజులు పరదేశాలకు పోయి ఉన్నారు. వారికి ఇక ఎంత మాత్రం ఉపదేశం లేదు. యెరూషలేము ప్రవక్తలకు కూడా యెహోవా నుండి దర్శనాలు ఏమీలేవు.
LAM 2:10 సీయోను పెద్దలు నేలపై కూర్చున్నారు. వారు కింద కూర్చుండి మౌనం వహించారు. వారు తమ తలలపై దుమ్ము జల్లుకున్నారు. వారు గోనెపట్ట కట్టుకున్నారు. యెరూషలేము యువతులు దుఃఖంతో తమ తలలు కిందికి వంచుకున్నారు.
LAM 2:11 కన్నీళ్లతో నా కళ్లు నీరసించాయి! నా అంత రంగంలో గందరగోళం చెలరేగుతూవుంది! నా గుండె జారి కిందపడినట్లు భావన కలుగుతూ ఉంది! నా ప్రజల నాశనం చూసిన నాకు ఆ భావన కలుగుతూ ఉంది. పిల్లలు, పసికందులు నగర రహదారి స్థలాలలో మూర్ఛపోతున్నారు.
LAM 2:12 “రొట్టె, ద్రాక్షారసం ఏవి?” అని ఆ పిల్లలు తమ తల్లులను ఆగుడుతున్నారు. వారు చనిపోతూ ఈ ప్రశ్న అడుగుతున్నారు. వారు తమ తల్లుల ఒడిలో పడుకొని ఉండగా చనిపోతున్నారు.
LAM 2:13 సీయోను కుమారీ, నిన్ను దేనితో సరిపోల్చను? నిన్ను దేనితో పోల్చాలి? సీయోను కన్యాకుమారీ, నిన్ను దేనితో పోల్చను? నిన్నెలా ఓదార్చగలను? నీ వినాశనం సముద్రమంత పెద్దది! ఎవ్వరేగాని నిన్ను స్వస్థపర్చగలరని నేను అనుకోవటంలేదు.
LAM 2:14 నీ ప్రవక్తలు నీ కొరకు దర్శనాలు చూశారు. కాని వారి దర్శనాలన్నీ విలువలేని అబద్ధాలు. పాపం చేయవద్దని వారు నిన్ను హెచ్చరించలేదు. పరిస్థితి మెరుగుపర్చటానికి వారు ఎట్టి ప్రయత్నిమూ చేయలేదు. వారు నీకొరకు ఉపదేశాలు అందించారు. కాని, అవి కేవలం నిన్ను మోసగించటానికి ఉద్దేశించబడిన అబద్ధపు వర్తమానాలు.
LAM 2:15 మార్గమున పోవు వారు నిన్ను చూసి విస్మయంతో చేతులు చరుస్తారు. యెరూషలేము కుమార్తెను చూచి వారు ఈలవేసి తలలు ఆడిస్తారు. “‘అపురూప అందాల నగరం’ అనీ, ‘భూనివాసులకు ఆనంద దాయిని’ అని ‘ప్రజలు పిలిచే నగరం ఇదేనా’?” అని వారడుగుతారు.
LAM 2:16 నీ శత్రువులంతా నిన్ను చూసి నోళ్లు తెరుస్తారు. వారు ఈలవేసి, నిన్నుజూచి పండ్లు కొరుకుతారు. “మేము వారిని మింగేశాము! నిజంగా మేము ఈ రోజుకొరకే ఎదురుచూశాము. చివరకు ఇది జరగటం మేము చూశాము” అని వారంటారు.
LAM 2:17 యెహోవా తాను అనుకున్న ప్రకారమే చేశాడు. ఆయన ఏది చేస్తానని అన్నాడో అది చె సివేశాడు. పూర్వకాలం నుండి ఆయన ఎలా హెచ్చరిస్తూవచ్చాడో ఆయన ఇప్పుడు అలాగే చేశాడు. దయాదాక్షిణ్యం లేకుండా ఆయన నాశనం చేశాడు. నీ మూలంగానే నీ శత్రువులు సంతోషపడేలా ఆయన చేశాడు. ఆయన నీ శత్రువుల శక్తియుక్తులను పెంచాడు.
LAM 2:18 ఓ సీయోను కుమార్తె ప్రాకారమా, నీ గుండెలు పగిలేలా యెహోవాకు మొరపెట్టుకో! నీ కన్నీరు వాగులా పారనీ! నీ కన్నీరు మున్నీరై పారనీ! నీ కన్నీరు రాత్రింబవళ్లు కారనీ! వాటిని ఆపకు! నీ కండ్లకు విశ్రాంతి ని వ్వకు!
LAM 2:19 లెమ్ము! రాత్రిళ్లు రోదించు! రాత్రిళ్లు ప్రతి ఝామున దుఃఖించు! ఒక జలరాశిలా నీ గుండె కుమ్మరించు! యెహోవా ముందు నీ గుండె కుమ్మరించు! నీ చేతులెత్తి యెహోవాకు ప్రార్థన చేయుము. నీ పిల్లలు బతికేలా చేయుమని ఆయనను ప్రాధేయపడుము. ఆకలితో అలమటించి సొమ్మసిల్లే నీ పిల్లలను బతికించుమని ఆయనను అర్థించుము. ఆకలితో మాడి నగర వీధుల్లో వారు సొమ్మసిల్లి పడిపోతున్నారు.
LAM 2:20 యెహోవా, నావైపు చూడుము! నీవు ఈ రకంగా శిక్షించినది ఎవ్వరినో చూడు! నన్ను ఈ ప్రశ్న అడుగనిమ్ము: తాము కన్న బిడ్డలనే స్త్రీలు తిన వలెనా? తాము పెంచి పోషిర చిన బిడ్డలనే స్త్రీలు తినవలెనా? యాజకుడు, ప్రవక్త యెహోవా ఆలయంలో చంపబడాలా?
LAM 2:21 యువకులు, ముసలివారు నగర వీధుల్లో దుమ్ములో పడివున్నారు. నా యువతీ యువకులు కత్తి వేటుకు గురియైనారు. యెహోవా, నీవు కోపగించిన రోజున నీవు వారిని చంపేశావు! దయ లేకుండా నీవు వారిని చంపివేశావు!
LAM 2:22 నలుమూలల నుండి నా మీదికి భయాన్ని ఆహ్వానించావు. ఏదో విందుకు ఆహ్వానించినట్లు నీవు భయాన్ని ఆహ్వానించావు. యెహోవాకు కోపం వచ్చిన రోజున తప్పించుకున్నావాడుగాని, దానిని తట్టుకున్నవాడుగాని ఒక్కడూ లేడు. నేను పెంచిపోషించిన వారందరినీ నా శత్రువు చంపివేశాడు.
LAM 3:1 నేను కష్టాలు అనుభవించిన వ్యక్తిని. యెహోవా కోపపు కర్ర క్రింద నేను సంకట పరిస్థితులు చూశాను.
LAM 3:2 యెహోవా నన్ను చీకటిలోకి నడపించాడేగాని వెలుగులోకి గాదు.
LAM 3:3 యెహోవా తన చేతిని నా మీదకి ఎత్తాడు. రోజంతా పదే పదే ఆయన అలా చేశాడు.
LAM 3:4 ఆయన నా మాంసం, నా చర్మం కృశింపజేశాడు. ఆయన నా ఎముకలు విరుగగొట్టాడు.
LAM 3:5 యెహోవా నా పైకి కష్టాలను, వేదనను రప్పించాడు. ఆయన నాచుట్టూ విషాన్ని, సంకట పరిస్థితిని కలుగచేశాడు.
LAM 3:6 ఆయన నన్ను చీకటిలో కూర్చనేలా చేశాడు. ఏనాడో చనిపోయిన వ్యక్తిలా నన్ను ఆయన చేశాడు.
LAM 3:7 యెహోవా నన్ను బయటకు రాకుండా బంధించాడు. ఆయన నాకు బరువైన గొలుసులు తగిలించాడు.
LAM 3:8 సహాయం కొరకు నేను మొర్ర పెట్టుకుని అర్థంచినా, యెహోవా నా ప్రార్థన ఆలకించలేదు.
LAM 3:9 ఆయన నా మార్గాన్ని రాళ్లతో అడ్డగించాడు. ఆయన నా మార్గాన్ని వక్రంగా, గ తుకులమయం చేశాడు.
LAM 3:10 నా మీదకు పడనున్న ఎలుగుబంటిలా యెహోవా ఉన్నాడు. ఆయన పొంచి వున్న ఒక సింహంలా ఉన్నాడు.
LAM 3:11 యెహోవా నన్ను నా మార్గం నుండి తొలగించాడు. ఆయన నన్ను ముక్కలుగా చీల్చాడు. నన్ను నాశనం చేశాడు.
LAM 3:12 ఆయన విల్లంబులు చేపట్టాడు. ఆయన బాణాలకు నన్ను గురి చేశాడు.
LAM 3:13 ఆయన నా పొట్టలో బాణం వేశాడు. ఆయన బాణాలతో నన్ను తూట్లు పొడిచాడు.
LAM 3:14 నా ప్రజలందరిలో నేను నవ్వులపాలయ్యాను. రోజంతా పాటలు పాడి వారు నన్ను ఎగతాళి చేస్తారు.
LAM 3:15 యెహోవా నాచేత చేదు పానీయం (శిక్ష) తాగించాడు. ఆయన చేదు పానీయాలతో నన్ను నింపివేశాడు.
LAM 3:16 నా పండ్లు రాత్రి నేలలో గుచ్చుకుపోయేలా యెహోవా నన్ను తోశాడు. ఆయన నన్ను మట్టిలోకి తోసివేశాడు.
LAM 3:17 ఇక నాకు శాంతి ఉండదని అనుకున్నాను. మంచి విషయాలు ఎట్టివో నేను మర్చిపోయాను.
LAM 3:18 “యెహోవా తిరగి నాకు సహాయం చేస్తాడనే ఆశ లేదనుకొన్నాను.”
LAM 3:19 ఓ యెహోవా, నా దుఃఖాన్ని, నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము. నీవు నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (శిక్ష) కలిపిన పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము.
LAM 3:20 నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నేను మిక్కిలి విచారిస్తున్నాను.
LAM 3:21 కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పొడచూపింది. నేను ఇలా అనుకున్నాను.
LAM 3:22 యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి. యెహోవా కృపా కటాక్షాలు తరగనివి.
LAM 3:23 అవి నిత్య నూతనాలు. ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.
LAM 3:24 “యెహోవా నా దేవుడు. అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను ఆనుకున్నాను.
LAM 3:25 ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు. ఆయన కోసం వెదికేవారికి యెహోవా ఉదారుడు.
LAM 3:26 యెహోవా రక్షణకై నెమ్మదిగా వేచియుండటం క్షేమకరం
LAM 3:27 యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది. ఆయన కాడిని చిన్నతనం నుండే మోయటం ఆ వ్యక్తికి మరీ మంచిది.
LAM 3:28 యెహోవా తన కాడిని వానిమీద వేయునప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉండాలి.
LAM 3:29 ఆ వ్యక్తి బూడిదలో కూర్చొని యెహోవాకు సాష్టాంగపడి నమస్కరించాలి. దానివల్ల తన ఆశ నెరవేరునేమో.
LAM 3:30 తనను కొట్టేవానివైపు తన దవడను ఆ వ్యక్తి తిప్పాలి. ఆ వ్యక్తి అవమానాలను భరించటానికి సంసిద్ధుడు కావాలి.
LAM 3:31 యెహోవా తన ప్రజలను శాశ్వతంగా తిరస్కరించడని ఆ వ్యక్తి గుర్తుంచుకోవాలి.
LAM 3:32 యెహోవా శిక్షించేటప్పుడు, ఆయనకు కరుణకూడ ఉంటుంది. ఆయనకుగల అపారమైన ప్రేమ, కరుణ కారణంగా ఆయన జాలి పడతాడు.
LAM 3:33 యెహోవా తన ప్రజలను శి క్షింపకోరడు. తన ప్రజలను బాధపెట్టటానికి ఆయన ఇష్టపడడు.
LAM 3:34 యెహోవా ఈ విషయాలంటే ఇష్టపడడు: ఎవ్వరో ఒక్కరికోసం భూమిపైగల ఖైదీలందరినీ ఆయన పాదాలకింద తొక్కటానికి ఇష్టపడడు.
LAM 3:35 ఒకని మేలుకోసం మరియొకనికి అన్యాయం చేయటం ఆయనకు ఇష్టముండదు. కాని కొంత మంది ఈ అన్యాయాన్ని మహోన్నతుడైన దేవుని సన్నిధిలోనే చేస్తారు.
LAM 3:36 ఒకని మంచి పనిని మరియొకని కోసం పాడు చేయటానికి ఆయన ఇష్టపడడు. యెహోవా ఈ పనులేవీ చేయటానికి ఇష్టపడడు.
LAM 3:37 యెహోవా ఆజ్ఞలేకుండా ఎవ్వరూ దేనినీ చెప్పలేరు; చెప్పి జరిపించలేరు.
LAM 3:38 మహోన్నతుడైన దేవుని నోటినుండి వరాలు, శాపాలు రెండూ వెలువడతాయి.
LAM 3:39 ఒక వ్యక్తియొక్క పాపాలననుసరించి యెహోవా అతన్ని శిక్షిస్తాడు. కనుక, బతికున్న వాడెవడూ ఆయనపై ఫిర్యాదు చేయలేడు?
LAM 3:40 మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము.
LAM 3:41 పరలోకాధిపతియైన దేవునివైపు మన హృదయాలను, చేతులను చాపుదాము.
LAM 3:42 ఆయనకు మనం ఇలా విన్నవించుకుందాము: “మేము పాపం చేశాము, మొండివైఖరి దాల్చాము. అందువల్ల నీవు మమ్మల్ని క్షమించలేదు.
LAM 3:43 నిన్ను కోపం ఆవరించినప్పుడు నీవు మమ్మల్ని వెంటాడినావు. కనికరం లేకుండా నీవు మమ్మల్ని చంపావు.
LAM 3:44 నిన్ను నీవు ఒక మేఘంతో కప్పుకున్నావు. ఏ ఒక్క ప్రార్థనా నీలో ప్రవేశించకుండ నీవలా చేశావు.
LAM 3:45 అన్య దేశాలవారి దృష్టిలో మమ్మల్ని పనికిరాని చెత్తలా, కల్మశంలా చేశావు.
LAM 3:46 మా శత్రువులందరూ మాతో కోపంగా మాట్లాడుతున్నారు.
LAM 3:47 మేము భయానికి గురి అయ్యాము. మేము గోతిలో పడ్డాము. మేము బాధపెట్టబడి, చితుక గొట్టబడ్డాము!”
LAM 3:48 నా కన్నీళ్లు ప్రవాహంలా కారుచున్నాయి! నా ప్రజానాశనం పట్ల నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను.
LAM 3:49 ఎడతెరిపిలేకుండా నా కన్నీరు కారుతూవుంది! నా దుఃఖం ఆగదు.
LAM 3:50 ఓ యెహోవా, నీ దృష్టి మా పై ప్రసాదించి, మమ్మల్ని చూసే వరకు నా దుఃఖం ఆగదు. పరలోకం నుండి నీవు మమ్మల్ని చూసేవరకు నేను దుఃఖిస్తూనే ఉంటాను.
LAM 3:51 నా నగర కుమార్తెలకు ఏమి జరిగిందో నేను చూసినప్పుడు నా కండ్లు నాకు వేదన కలిగించాయి.
LAM 3:52 తగిన కారణం లేకుండానే నాకు శత్రువులైన వారంతా నన్నొక పక్షిలా తరిమారు.
LAM 3:53 నేను బతికి వుండగానే నన్ను గోతిలోకి తోశారు. నాపై వాళ్లు రాళ్లు విసిరారు.
LAM 3:54 నీళ్లు నా తలపైకి వచ్చాయి. “ఇది నా అంతం” అని నేననుకున్నాను.
LAM 3:55 ఓ యెహోవా, నీ పేరు స్మరించాను. గోతిలో అట్టడుగునుండి నిన్ను పేరుపెట్టి పిలిచాను.
LAM 3:56 నీవు నా మొరాలకించావు. నీవు నీ చెవులు మూసి కొనలేదు. నన్ను కాచి రక్షించటానికి నీవు వెనుకాడలేదు.
LAM 3:57 నేను నిన్ను పిలిచిన రోజున నీవు నాకు దగ్గరగా వచ్చావు “భయపడవద్దు,” అని నాకు అభయమిచ్చావు.
LAM 3:58 ఓ యెహోవా, నీవు నా సంగతి పట్టించుకొని నా పక్షం వహించావు. నాకు మళ్లీ జీవం పోశావు.
LAM 3:59 ఓ యెహోవా, నీవు నా కష్టాలను తిలకించావు. నా వ్యవహారంలో ఇప్పుడు నీ తీర్పు ఇవ్వు.
LAM 3:60 నా శత్రువులు నన్నెలా హింసించారో నీవు చూశావు. వారు నాపై జరిపిన కుట్రలన్నీ నీవు చూశావు.
LAM 3:61 ఓ యెహోవా, వారెలా నన్నవమానించారో నీవు విన్నావు. వారు నాపై జరిపిన కుట్రలన్నిటిని గురించి నీవు విన్నావు.
LAM 3:62 నా శత్రువుల మాటలు, ఆలోచనలు ఎప్పుడూ నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి.
LAM 3:63 ఓ యెహోవా, వారు కూర్చున్నా, నిలబడినా వారు నన్నెలా ఎగతాళి చేస్తున్నారో చూడు!
LAM 3:64 ఓ యెహోవా, వారికి తగిన గుణపాఠం నేర్పు! వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధించు!
LAM 3:65 వారి గుండె బండ బారేలా చేయుము! పిమ్మట వారిని శపించుము!
LAM 3:66 కోపంతో వారిని వెంటాడుము! వారిని నాశనం చేయుము. యెహోవా, వారిని ఈ ఆకాశం కింద లేకుండా చేయుము!
LAM 4:1 బంగారం ఎలా నల్లబడిందో చూడు. మంచి బంగారం ఎలా మారి పోయిందో చూడు. ఆభరణాలన్నీ నలుపక్కలా విసరివేయబడ్డాయి. ప్రతి వీధి మూలలో ఆ నగలు వెదజల్లబడ్డాయి.
LAM 4:2 సీయోను ప్రజలకు ఒకనాడు చాలా విలువ వుండేది. వారికి బంగారంతో సరితూగే విలువ వుండేది. కాని ఈనాడు శత్రువు వారిని మట్టి కుండల్లా చుస్తున్నాడు. కుమ్మరి చేసిన మట్టి కుండల్లా ఈనాడు శత్రువు వారిని చూస్తున్నాడు.
LAM 4:3 నక్క సహితం తన పిల్లలకు పొదుగు అందిస్తుంది. నక్క సహితం తన పిల్లలను పాలు తాగనిస్తుంది. కాని నా ప్రజల కుమార్తె (ఇశ్రాయేలు స్త్రీలు) మాత్రం కఠినాత్మురాలు. ఆమె ఎడారిలో నివసించే ఉష్ట్రపక్షిలా వుంది.
LAM 4:4 దహంతో పసిబిడ్డ నాలుక అంగిట్లో అతుక్కు పోతుంది. చిన్న పిల్లలు అన్నానికి అలమటిస్తారు. కాని వారికి ఎవ్వరూ ఆహారం ఇవ్వరు.
LAM 4:5 ఒకనాడు విలువైన భోజనం చేసినవారు, ఈనాడు వీధులో చనిపోతాన్నారు. అందమైన ఎర్రని దుస్తుల్లో పెరిగిన ప్రజలు ఇప్పుడు చెత్త కుండీలలో ఏరుకుంటున్నారు.
LAM 4:6 నా ప్రజల కుమార్తె (యెరూషలేము స్త్రీలు) చేసిన పాపం మిక్కిలి ఘోరమైనది. వారి పాపం సొదొమ, గొమొర్రాల పాపాలకు మించివుంది. సొదొమ, గొమొర్రా పట్టణాలు అకస్మాత్తుగా నాశనం చేయబడ్డాయి. ఏ మానవ హస్తమో చేసిన వినాశనం కాదది.
LAM 4:7 దేవుని సేవకు ప్రత్యేకంగా అంకితమైన యూదా మనుష్యులు మంచుకంటె తెల్లనివారు. వారు పాలకంటె తెల్లనివారు. వారి శరీరాలు పగడంలా ఎర్రనివి. వారి దేహకాంతి నీలమువంటిది.
LAM 4:8 కాని వారి ముఖాలు ఇప్పుడు మసికంటె నల్లగా తయారైనాయి. వీధీలో వారిని ఎవ్వరూ గుర్తు పట్టలేరు. వారి ఎముకలపై వారి చర్మం ముడుతలు పడింది. వారి చర్మం కట్టెలా అయిపోయింది.
LAM 4:9 కరువుతో మాడి చనిపోయిన వారి స్థితికంటె కత్తి వేటుకు గురియైన వారు అదృష్టవంతులు. ఆకలిచే మాడేవారు దుఃఖభాగ్యులు. వారు గాయపర్చబడ్డారు. పొలాల నుండి పంటలురాక వారు ఆకలితో చనిపోయారు.
LAM 4:10 ఆ సమయంలో ఉత్తమ స్త్రీలు కూడా తమ స్వంత పిల్లలను వండుకొని తిన్నారు. ఆ పిల్లలు తమ తల్లులకు ఆహార మయ్యారు. నా ప్రజలు నాశనం చేయబడినప్పుడు ఇది జరిగింది.
LAM 4:11 యెహోవా తన కోపాన్నంతా ప్రయోగించాడు. తన కోపాన్నంతా ఆయన కుమ్మరించాడు. సీయోనులో ఆయన అగ్నిని ప్రజ్వరిల్ల జేశాడు. ఆ అగ్ని సీయోను పునాదులను తగులబెట్టింది.
LAM 4:12 జరిగిన దానిని ప్రపంచ రాజులెవ్వరూ నమ్మలేకపోయారు. ప్రపంచ ప్రజానీకం ఏది సంభవించిందో దానిని నమ్మలేకపోయింది. శత్రువులు యెరూషలేము నగర ద్వారాల గుండా లోనికి ప్రవేశింపగలరని వారు అనుకోలేదు.
LAM 4:13 యెరూషలేము ప్రవక్తలు పాపం చేసిన నేరానికి ఇది జరిగింది. యెరూషలేము యాజకులు దుష్ట కార్యాలు చేయటం వలన ఇది సంభవించింది. యెరూషలేము నగరంలో ఆ మనుష్యులు రక్తం చిందించుతున్నారు. వారు మంచివారి రక్తన్ని పారిస్తున్నారు.
LAM 4:14 ప్రవక్తలు, యాజకులు అంధుల్లా వీధుల్లో తిరిగాడారు. వారు రక్తసిక్తమై మలినపడ్డారు. వారు మలినపడిన కారణంగా ఎవ్వరూ వారి బట్టలనుకూడ ముట్టరు.
LAM 4:15 “పొండి! దూరంగా పొండి! మమ్మల్ని తాకవద్దు.” ఆ ప్రజలు చుట్టుపక్కల తిరుగాడినారు. వారికి నివాసం లేదు. “వారు మాతో కలిసి నివసించటం మాకు ఇష్టం లేదు.” అని అన్యదేశీయులు అన్నారు.
LAM 4:16 యెహోవాయే ఆ ప్రజలను నాశనం చేశాడు. ఆయన వారి బాగోగులు ఎంతమాత్రం తెలుసు కోలేదు. ఆయన యాజకులను గౌరవించలేదు. ఆయన యూదా పెద్దలతో స్నేహ భావంతో లేడు.
LAM 4:17 మా కండ్లు పనిచేయటం మానివేశాయి. మేము సహాయం కొరకు నిరీక్షించాము. కాని అది రాలేదు. ఆ నిరీక్షణలో కండ్లు అలసిపోయాయి. ఏదో ఒక రాజ్యం వచ్చి మమ్మల్ని రక్షిస్తుందని అదే పనిగా ఎదురుచూశాము. మా కావలి బురుజులపై నుండి మేము చూశాము. కాని ఏ దేశమూ మమ్మల్ని కాపాడటానికి రాలేదు.
LAM 4:18 అన్ని వేళలా మా శత్రువులు మమ్మల్ని వేటాడారు. మేము కనీసం వీధులలోకి కూడ పోలేకపోయాము. మా అంతం సమీపించింది. మాకు సమయం దగ్గర పడింది. మాకు అంతిమకాలం వచ్చేసింది!
LAM 4:19 మమ్మల్ని వేటాడిన మనుష్యులు ఆకాశంలో గద్దల కంటె వేగవంతులు. ఆ మనుష్యులు మమ్మల్ని పర్వతాలలోకి తరిమివేశారు. మమ్మల్ని పట్టుకోవటానికి వారు ఎడారిలో మాటువేశారు.
LAM 4:20 మా ముక్కు రంధ్రాలలో ఊపిరిలా మెలగిన మా రాజును వారు తమ గోతిలో పట్టుకున్నారు. రాజు యెహోవాచే అభిషిక్తము చేయబడిన వ్యక్తి. “మేము ఆయన నీడలో నివసిస్తాము; ప్రపంచ రాజ్యాల మధ్య మేము ఆయన నీడలో నివసిస్తాము,” అని మేము మా రాజును గురించి చెప్పుకున్నాము.
LAM 4:21 ఎదోము ప్రజలారా, సంతోషంగా ఉండండి, అనందించండి. ఊజు రాజ్యంలో నివసించే ప్రజలారా, సంతోషంగా వుండండి. కాని ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. యెహోవా కోపపు గిన్నె మీవద్దకు కూడా వస్తుంది. మీరు దానిని తాగినప్పుడు, మీకు మత్తెక్కుతుంది. ఆ మత్తులో మిమ్మల్ని మీరు దిగంబరులుగా చేసుకుంటారు.
LAM 4:22 సీయోనూ, నీ శిక్ష పూర్తి అయ్యింది. మరెన్నడూ నీవు చెరపట్టబడవు. కాని ఎదోము ప్రజలారా, యెహోవా మీర పాపాలకు తగిన శిక్ష విధిస్తాడు. ఆయన మీ పాపాలను బహిర్గతం చేస్తాడు.
LAM 5:1 యెహోవా! మాకు జరిగిన దానిని జ్ఞపకము చేసికొనుము. మాకు జరిగిన అవమానాన్ని తిలకించుము.
LAM 5:2 మా రాజ్యం పరాయివాళ్ల వశమయ్యింది. మా ఇండ్లు అన్యదేశీయులకు ఇవ్వబడ్డాయి.
LAM 5:3 మేము అనాధలమయ్యాము. మాకు తండ్రిలేడు. మా తల్లులు విధవరాండ్రవలె అయ్యారు.
LAM 5:4 మా తాగే నీరు మేము కొనవలసి వచ్చింది. మేము వాడే కట్టెలకు మేము డబ్బు చెల్లించవలసి వచ్చింది.
LAM 5:5 మా మెడమీద బలవంతంగా కాడి మోయవలసి వచ్చింది. మేము అలసిపోయాము. మాకు విశ్రాంతి లేదు.
LAM 5:6 మేము ఈజిప్టుతో ఒక ఒడంబడిక చేసికొన్నాము. తగిన ఆహార పదార్థాల సరఫరాకు మేము అష్షూరుతో కూడ ఒక ఒడంబడిక చేసికొన్నాము.
LAM 5:7 నీపట్ల మా పూర్వీకులు అపచారం చేశారు. వారిప్పుడు చచ్చిపోయారు. వారి పాపాలకు ఇప్పుడు మేము కష్టాలనుభవిస్తున్నాము.
LAM 5:8 బానిసలు మాకు పాలకులయ్యారు. వారినుండి మమ్మల్ని రక్షించటానికి ఎవ్వరూ లేరు.
LAM 5:9 మేము ఆహారం సంపాదించటానికి మా ప్రాణాలు తెగించవలసి వచ్చింది. ఎడారిలో కత్తులు ధరించివున్న మనుష్యుల మూలంగా మేము మా ప్రాణాలను తెగించవలసి వచ్చింది.
LAM 5:10 నిప్పు కొలిమిలా మా చర్మం వేడెక్కింది. నకనకలాడే ఆకలి కారణంగా మా చర్మం వేడెక్కింది.
LAM 5:11 సీయోను స్త్రీలపై శత్రువులు అత్యాచారాలు జరిపారు. వారు యూదా నగరాలలో స్త్రీలను చెరిపారు.
LAM 5:12 మా రాజకుమారులను శత్రువు ఉరితీశాడు. వారు మా పెద్దలను గౌరవించలేదు.
LAM 5:13 శత్రువు మా యువకులచే తిరుగలి తిప్పించి పిండిపట్టించాడు. మా యువకులు కట్టెల మోపులు మోయలేక తొట్రిల్లారు.
LAM 5:14 నగర ద్వారాల వద్ద పెద్దలు ఏమాత్రం కూర్చోడంలేదు. యువకులు సంగీతం పాడటం మానివేశారు.
LAM 5:15 మా హృదయాల్లో సంతోషం ఏ మాత్రం లేదు. మా నాట్యం చనిపోయిన వారి కొరకు విలాపంగా మారింది.
LAM 5:16 మా తలనుండి కిరీటం కింద పడిపోయింది. మేము పాపం చేయటం మూలంగా మాకు చెడు పరిణామాలు వచ్చాయి.
LAM 5:17 ఇందు మూలంగా మా గుండెలు అలిసిపోయాయి. ఫలితంగా మా కండ్లు మసకబారాయి.
LAM 5:18 సీయోను పర్వతం బీడు భూమి అయ్యింది. సీయోను పర్వతం మీద నక్కలు సంచరిస్తున్నాయి.
LAM 5:19 కాని యెహోవా, నీవు శాశ్వతంగా పరిపాలిస్తావు. నీ రాచరిక సింహాసనం కలకాలం అలా నిలిచివుంటుంది.
LAM 5:20 యెహోవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా మర్చి పోయినట్లున్నావు. నీవు మమ్మల్ని ఇంత దీర్ఘకాలం వదిలి వెళ్లావు.
LAM 5:21 యెహోవా, మమ్మల్ని నీవద్దకు చేర్చుకో. మేము సంతోషంగా నీదరి చేరుతాము. మా రోజులను మునుపటిలా మార్చివేయుము.
LAM 5:22 నీవు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించావు. నీవు మాపట్ల మిక్కిలి కోపం వహించావు.
EZE 1:1 నేనొక యాజకుణ్ణి. నా పేరు యెహెజ్కేలు. బూజీ కుమారుణ్ణి. దేశభ్రష్టుడనై చెరలో ఉన్నాను. బబులోనులో నేను కెబారు కాలువ పక్కన ఉండగా ఆకాశం తెరువబడింది. అప్పుడు నాకు దైవసంబంధమైన దర్శనాలు కలిగాయి. అది ముఫ్పైవ సంవత్సరంలో నాల్గవ నెల (జూన్) ఐదవ రోజున జరిగింది. బబులోను రాజైన యెహోయాకీను ప్రవాసంలో చెరపట్టబడ్డాక ఐదవ సంవత్సరం, ఆ నెలలో ఐదవ రోజున యెహోవా వాక్కు యెహెజ్కేలుకు విన వచ్చింది. ఆ స్థలంలో యెహోవా ప్రభావం అతని మీదికి వచ్చింది.
EZE 1:4 ఉత్తరాన్నుండి గాలి దుమారం లేచి వస్తున్నట్లు నేను (యెహెజ్కేలు) చూశాను. అది ఒక పెను మేఘం. దాని నుండి అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంది. దానిచుట్టూ వెలుగు దేదీప్యమానంగా ఉంది. అగ్నిలో కణకణలాడే లోహంలా అది మెరుస్తూ ఉంది.
EZE 1:5 దాని లోపల నాలుగు జంతువులు ఉన్నాయి. వాటి రూపం మానవ రూపంలా ఉంది.
EZE 1:6 కాని ప్రతీ జంతువుకు నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి.
EZE 1:7 వాటి కాళ్లు నిట్ట నిలువుగా ఉన్నాయి. వాటి పాదాలు ఆవు పాదాల్లా ఉన్నాయి. అవి మెరుగుదిద్దిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి.
EZE 1:8 వాటి రెక్కల కింద మనుష్యుల చేతులు వంటివి ఉన్నాయి. అక్కడ మొత్తం నాలుగు జంతువులున్నాయి. వాటిలో ప్రతి ఒక్క జంతువుకూ నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి.
EZE 1:9 ఇప్పుడు వాటి ముఖాల గురించి వివరిస్తాను. వాటి రెక్కలు ఒకదానితో ఒకటి తాకుతున్నాయి. అవి కదిలినప్పుడు ఆ జంతువులు పక్కకి తిరుగలేదు. అవి చూస్తూవున్న దిశలోనే అవి కదిలి వెళ్ళాయి.
EZE 1:10 ప్రతి జంతువుకు నాలుగు ముఖాలున్నాయి. ప్రతి ఒక్కటి ముందువైపు మనుష్య ముఖం కలిగిఉంది. కుడివైపు సింహపు ముఖం ఉంది. ఎడమ పక్క ఎద్దు ముఖం ఉంది. వెనుకవైపు గరుడ ముఖం ఉంది.
EZE 1:11 తమ రెక్కలతో ఆ జంతువులు తమ శరీరాలను కప్పుకున్నాయి. రెండు రెక్కలు విప్పుకొని పక్కదాని రెక్కలను తాకుతున్నాయి. మరి, రెండు రెక్కలు శరీరాన్ని కప్పుకొవటానికి వినియోగించు కుంటున్నాయి.
EZE 1:12 ప్రతి జంతువు చూస్తూవున్న దిశలోనే అవి కదిలి వెళ్లాయి. గాలి ఎటువీస్తే అవి అటు కదిలివెళ్లాయి. కానీ, అవి కదలినప్పుడు వాటి ముఖాలు పక్కకి తిరగలేదు.
EZE 1:13 ఆ జంతువులు ఆ విధంగా కనిపించాయి. జంతువుల మధ్యలోవున్న లోపలి ప్రాంతంలో కాలుతున్న బొగ్గు నిప్పుల్లా కనబడిన ఏదో ఒకటి ఉంది. ఈ అగ్ని ఆ జంతువుల చుట్టూ కదలుతున్న చిన్న కాగడాల్లా ఉంది. ఆ అగ్ని ప్రకాశవంతగా వెలిగి దానినుండి మెరుపు మెరిసింది.
EZE 1:14 మెరుపు వంటి వేగంతో ఆ జీవులు వెనుకకు, ముందుకు కదులుతున్నాయి!
EZE 1:15 నేనా జంతువుల వైపు చూడగా నాలుగు చక్రాలు కన్పించాయి. ఆ చక్రాలన్నీ ఒకే విధంగా కనిపించాయి. ఒక్కొక్క ముఖానికి ఒక చక్రం చొప్పున ఉన్నాయి. ఆ చక్రాలు భూమిని తాకాయి. చక్రాలు స్వచ్ఛమైన పసుపువన్నె గోమేధికంతో చేయబడినట్లు కానవచ్చాయి. ఒక చక్రంలో మరో చక్రం ఉన్నట్లు కన్పించింది.
EZE 1:17 ఆ చక్రాలు ఏ దిశలోనైనా కదలగలవు. కాని అవి కదలినప్పుడు జంతువులు మాత్రం తిరుగలేదు.
EZE 1:18 ఆ చక్రాల అంచులు ఎత్తుగా, భయంకరంగా ఉన్నాయి. ఆ నాలుగు చక్రాల అన్ని అంచుల చట్టూ కళ్లు ఉన్నాయి.
EZE 1:19 ఆ జంతువులతోపాటు చక్రాలు ఎప్పుడూ కదు లుతూనే ఉండేవి. జంతువులు ఆకాశంలోకి లేచినప్పుడు వాటితోపాటు చక్రాలు కూడా లేచేవి.
EZE 1:20 గాలి (ఆత్మ) వాటిని ఎటు పోవాలని కోరితే అవి అటు వెళ్లాయి. అప్పుడు చక్రాలు కూడా వాటితో వెళ్లాయి. ఎందువల్లనంటే ఆ జంతువుల యొక్క గాలి శక్తి చక్రాలలోనే ఉంది.
EZE 1:21 అందువల్ల జీవులు కదిలితే చక్రాలు కూడా కదిలేవి. జీవులు ఆగితే చక్రాలు కూడా ఆగేవి. చక్రాలు గాలిలోకి వెళితే, జీవులు కూడా వాచితో పాటు వెళ్లాయి. ఎందువల్లనంటే గాలి (ఆత్మ శక్తి) చక్రాలలోనే ఉంది.
EZE 1:22 ఆ జీవులపై ఒక ఆశ్చర్యకరమైన వస్తువు కన్పించింది. అది ఒక పెద్ద పాత్ర బోర్లించినట్లుగా ఉంది. అది మంచులా స్వచ్చంగా ఉంది. అది జీవుల తలలచుట్టూ గాలిలో తేలియాడుతూ ఉంది.
EZE 1:23 ఈ పాత్రకింద ప్రతి జంతువుయొక్క రెక్కలు పక్కనున్న జంతువును తాకేటట్లు ఉన్నాయి. రెండు రెక్కలు ఒక వైపున మరో రెండు రెక్కలు మరో వైపున శరీరాన్ని కప్పుతూ వ్యాపించాయి.
EZE 1:24 పిమ్మట నేను ఆ రెక్కల చప్పుడు విన్నాను. జంతువులు కదలినప్పుడల్లా, ఆ రెక్కలు గొప్ప శబ్దం చేసేవి. మహా నీటి ప్రవాహం ఘోషించినట్లు వాటి రెక్కల చప్పుడు వినిపించింది. సర్వశక్తిమంతుడైన దేవుని గంభీర శబ్దంలాగ ఆ శబ్దం వినిపించింది. ఒక సైన్యంగాని, ఒక ప్రజా సమూహంగాని చేసే రణగొణధ్వనుల్లా అవి వినవచ్చాయి. ఆ జంతువులు కదలటం మానినప్పుడు అవి వాటి రెక్కలను తమ పక్కలకు దించివేసేవి.
EZE 1:25 జంతువులు కదలటం మానివేసి, రెక్కలను దించివేశాయి. పిమ్మట మరొక పెద్ద శబ్దం వచ్చింది. అది వాటి తలలపైవున్న ఆకాశమండలం లాంటి పాత్ర మీదుగా వచ్చింది.
EZE 1:26 ఆ పాత్రలాంటి వస్తువుపై మరొకటి కన్పించింది. అది ఒక సింహాసనంలా ఉంది. అది నీలమణిలా మెరుస్తూ ఉంది. ఆ సింహాసనంపై మనిషివంటి ఒక స్వరూపం కూర్చున్నట్లు కన్పించింది!
EZE 1:27 నడుము నుండి పైవరకు అతనిని పరికించి చూశాను. కాలుతున్న లోహంలా అతడు కన్పించాడు. అతని చుట్టూ అగ్ని ప్రజ్వరిల్లుతున్నట్లు కానవచ్చింది! అతని నడుము నుండి కిందికి చూడగా, అంతా అగ్నిలా కన్పించింది. అది అతని చుట్టూ ప్రకాశిస్తూ ఉంది.
EZE 1:28 ఆయన చుట్టూ ప్రకాశించే వెలుగు ఇంద్రధనుస్సులా ఉంది. అది యెహోవా మహిమలా ఉంది. అది చూచి నేను సాష్టాంగపడ్డాను. నా శిరస్సు నేలకు ఆనించాను. అప్పుడు నాతో మాట్లాడే ఒక కంఠస్వరం విన్నాను.
EZE 2:1 ఆ స్వరం, “నరపుత్రుడా, లెమ్ము; నేను నీతో మాట్లాడదలిచాను” అని అన్నది.
EZE 2:2 ఇంతలో ఒకగాలి వచ్చి నన్ను నా పాదాలమీద నిలబెట్టింది. ఆ వ్యక్తి (దేవుడు) చెప్పేది నేను విన్నాను.
EZE 2:3 ఆయన ఇలా చెప్పాడు, “ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశం వారితో మాట్లాడటానికి నిన్ను నేను పంపుతున్నాను. ఆ ప్రజలు అనేక సార్లు నాకు వ్యతిరేకులయ్యారు. వారి పూర్వీకులు కూడా నాపై తిరుగుబాటు చేశారు. వారు నా పట్ల అనేకసార్లు పాపం చేశారు. ఈనాటికీ వారు నాపట్ల పాపం చేస్తూనే వున్నారు.
EZE 2:4 ఆ ప్రజలతో మాట్లాడటానికి నేను నిన్ను పంపుతున్నాను. కాని వారు చాలా మొండివారయ్యారు. వారు తలబిరుసు కలిగినవారు. అయినా, నీవు వారితో తప్పక మాట్లాడాలి. ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెవుతున్నాడు’ అని నీవు అనాలి.
EZE 2:5 కాని ఆ ప్రజలు నీ మాట వినరు. వారు నా పట్ల పాపం చేయటం మానరు. ఎందువల్లనంటే వారు మిక్కిలిగా తిరుగబడే స్వభావం గలవారు. వారు ఎల్లప్పుడూ నాపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు! కాని నీవావిషయాలు చేప్పాలి. దానితో వారిమధ్య ఒక ప్రవక్త నివసిస్తున్నాడని వారు తెలుసుకుంటారు.
EZE 2:6 “ఓ నరపుత్రుడా, ఆ ప్రజలకు నీవు భయపడవద్దు, వారు చెప్పేవాటికి నీవు భయపడకు, వారు నీకు వ్యతిరేకులై, నీకు హాని చేయటం ఖాయం. వారు ముండ్లవంటి వారు. తేళ్లమధ్య నివసిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది. కాని వారు చెప్పేవాటికి నీవు భయపడవద్దు. వారు తిరుగుబాటుదారులు. అయినా వారికి నీవు భయపడవద్దు.
EZE 2:7 నేను చేప్పే విషయాలు నీవు వారికి తప్పక తెలియజేయాలి. వారు నీ మాట వినరని నాకు తెలుసు. పైగా నా పట్లు పాపం చేయటం వారు మానరు. ఎందువల్లనంటే వారు తిరుగబడే స్వభావం గలవారు.
EZE 2:8 “ఓ నరపుత్రుడా, నేను నీకు చెప్పే విషయాలు శ్రద్ధగా విను. ఆ తిరుగుబాటుదారుల్లా నీవు నాకు వ్యతిరేకం కావద్దు. నీ నోరు తెరచి, నా మాటలు స్వీకరించు. తిరిగి వాటిని ప్రజలకు తెలియజెప్పు. ఈ మాటలను నీవు జీర్ణించుకో.”
EZE 2:9 తరువాత నేను (యెహెజ్కేలు) ఒక చేయి నా మీదికి రావటం చూశాను. ఆ చేతిలో వ్రాయబడిన గ్రంథపు చుట్ట ఉంది.
EZE 2:10 చుట్టబడిన ఆ కాగితాన్ని విడదీసి చూడగా దానిమీద రెండు పైపులా వ్రాసివుంది. అందులో రకరకాల విషాద గీతికలు, విషాద గాథలు, హెచ్చరికలు ఉన్నాయి.
EZE 3:1 దేవుడు నాతో ఇలా చెప్పాడు: “ఓ నరపుత్రుడా, నీవు చూస్తున్న దానిని తిను. ఈ గ్రంథపు చుట్టను తిని, ఇశ్రాయేలు వంశం వారికి దీనిలోనున్న విషయాలన్నిటినీ తెలియజెప్పు.”
EZE 3:2 ఆ తరువాత నేను నా నోరు తెరువగా, అతడు గ్రంథపు చుట్టను నాతో తినిపించెను.
EZE 3:3 పిమ్మట దేవుడు ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ కాగితం చుట్టను నీకిస్తున్నాను. దానిని మ్రింగివేయి! ఆ గ్రంథపు చుట్ట నీ శరీరాన్ని నింపివేయనీ.” నేను దానిని తినేశాను. అది తేనెలా మధురంగా ఉంది.
EZE 3:4 అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు, “నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశంవారి వద్దకు వెళ్లు. వారికి నా మాటలన్నీ తెలియజేయుము.
EZE 3:5 భాష తెలియని పరదేశీయుల వద్దకు నిన్ను నేను పంపటంలేదు. ఏ ఇతర భాషను నీవు నేర్చుకునే పనిలేదు. నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వారివద్దకు పంపుతున్నాను!
EZE 3:6 నీవు అర్థం చేసుకోలేని పలుభాషలు మాట్లాడే అనేక ఇతర దేశాల ప్రజల వద్దకు నేను నిన్ను పంపటం లేదు. నీవు గనుక వారి వద్దకు వెళ్లి మాట్లాడితే వారు వింటారు. కాని నీవాకఠిన భాషలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
EZE 3:7 లేదు! నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వద్దకు పంపుతున్నారు. వారున్నారే వారు తల బిరుసు కలిగి ఉన్నారు. వారు చాలా మొండివారు! ఇశ్రాయేలీయులు నీవు చెప్పేది వినటానికి నిరాకరిస్తారు. వారు నా మాట వినదల్చుకోలేదు!
EZE 3:8 కాని వారు ఎంత మొండివారో, నిన్ను కూడా అంత మొండివానిగా నేను చేస్తాను. నీ తల కూడా వారి తలలా కఠినంగా ఉంటుంది!
EZE 3:9 చెకుముకిరాయి కంటె వజ్రం కఠినమైనది. అదే రకంగా, నీ తల వారి తలకంటె గట్టిగా తయారవుతుంది. నీవు మిక్కిలి మొండిగా ఉంటావు. అందువల్ల వారంటే నీవు భయపడవు. ఎల్లప్పుడూ నా మీద తిరుగుబాటు చేసే ఆ ప్రజలంటే నీవు భయపడవు.”
EZE 3:10 ఇంకా దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్రుడా, నేను నీకు చెప్పే ప్రతీ మాటను వినాలి. విని, వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి.
EZE 3:11 పిమ్మట దేశాన్నుండి వెళ్ల గొట్ట బడిన నీ ప్రజలందరి వద్దకు వెళ్లు. వారి వద్దకు వెళ్లి, ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు’ అని పలుకు. వారు వినరు. వారు పాపం చేయటం మానరు. అయినా నీవు ఈ విషయాలు చెప్పాలి.”
EZE 3:12 పిమ్మట గాలి (ఆత్మ) నన్ను పైకి లేపింది. అప్పుడు వెనుక నుండి నేనొక స్వరం విన్నాను. అది ఉరుములా చాలా బిగ్గరగా ఉంది. ఆ స్వరం, “యెహోవా మహిమ ధన్యమైనది!” అని పలికింది.
EZE 3:13 ఆ తరువాత జంతువుల రెక్కలు కదలసాగాయి. రెక్కలు ఒక దానితో ఒకటి తాకగా అవి చాలా గట్టిగా శబ్దం చేశాయి. వాటి ముందునున్న చక్రాలు కూడ పెద్ద శబ్దం చేశాయి. ఆ శబ్దం ఉరుము ఉరిమినట్లుగా ఉంది.
EZE 3:14 గాలి (ఆత్మ) నన్ను పైకెత్తి దూరంగా తీసుకొని వెళ్లింది. నేను ఆ స్థలాన్ని వదిలిపెట్టాను. నేను నా ఆత్మలో దుఃఖించి తల క్రిందులయ్యాను! యెహోవా ప్రభావం నాలో శక్తివంతంగా పనిచేస్తూ ఉంది!
EZE 3:15 టెల్ అవీవ్‌కు బలవంతంగా తీసుకొనిపోబడి, అక్కడ ప్రవాసంలోవున్న ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్లాను. ఆ ప్రజలు కెబారు కాలువ వద్ద నివసించారు. ఆ ప్రజలను నేను పరామర్శించాను. అక్కడ నేను వాళ్ల మధ్యలో ఏడు రోజులు భయంతోనూ, మౌనంతోనూ కూర్చుంటిని.
EZE 3:16 ఏడు రోజుల తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు:
EZE 3:17 “ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలుకు నిన్ను కావలివానిగా చేస్తున్నాను. వారికి జరుగబోయే కీడును గూర్చి నేను నీకు తెలియజేస్తాను. కనుక ఆ పరిణామాలను గూర్చి నీవు వారికి హెచ్చరిక చేయాలి.
EZE 3:18 ‘ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు.’ అని నేను చెప్పితే, నీవతనిని హెచ్చరించాలి.! అతని జీవన విధానం మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పాలి. నీవతనిని హెచ్చరించకపోతే, ఆ వ్యక్తి చనిపోతాడు. అతడు పాపం చేశాడు గనుక అతడు చనిపోతాడు. కాని అతని చావుకు నిన్ను కూడా బాధ్యుణ్ణి చేస్తాను! ఎందుకంటే, నీవతని వద్దకు వెళ్లి అతనిని హెచ్చరిస్తే అతని ప్రాణం రక్షింపబడేది.
EZE 3:19 “ఒకవేళ నీవా వ్యక్తి వద్దకు వెళ్లి అతని జీవిత విధానాన్ని మార్చుకోమనీ, చెడు కార్యాలు చేయటం మావమనీ చెప్పావనుకో. ఆ వ్యక్తి నీమాట వినక పోవచ్చు. అప్పుడతడు చనిపోతాడు. అతడు పాపి గనుక చనిపోతాడు. అయినా నీవతనిని హెచ్చరించావు. అందువల్ల నిన్ను నీవు రక్షించుకున్నవాడివవుతావు.
EZE 3:20 “లేదా, ఒక మంచి వ్యక్తి మధ్యలో మంచి పనులు చేయడం మానివేసి చెడుపనులు చేస్తాడు. అప్పుడు నేను అతని ముందు ఏదైనా తగిలి పడటానికి (పాపంలో పడటానికి) ఉంచవచ్చు. అతడు చెడుకార్యాలు చేయటం మొదలు పెడతాడు. దానితో అతడు చని పోతాడు. తన పాపాల కారణంగా అతడు చనిపోతాడు. దానికి తోడు నీవతనిని హెచ్చరించలేదు. అందువల్ల అతని చావుకు నిన్ను బాధ్యుణ్ణి చేస్తాను. చివరికి అతడు చేసిన మంచి పనులేవీ ప్రజలు గుర్తు పెట్టుకోరు.
EZE 3:21 “నీవొక మంచి మనిషిని పాపం చేయవద్దని హెచ్చరిస్తావనుకో; అతడు పాపం చేయటం మానితే అతడు రక్షించబడతాడు. ఎందువల్లనంటే నీవతనికి హెచ్చరిక చేయటం, అతడు నీ మాటను వినటం జరిగాయి గనుక. ఈ విధంగా నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.”
EZE 3:22 పిమ్మట యెహోవా హస్తం ఆ స్థలంలో నా మీదికి వచ్చింది. “లెమ్ము; లోయలోకి వెళ్లు. అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని దేవుడు నాకు చెప్పాడు.
EZE 3:23 నేను లేచి లోయలోకి వెళ్లాను. యెహోవా మహిమ అక్కడ ఉంది. గతంలో నేను కెబారు కాలువవద్ద చూసినట్లే అది ఉంది. నేను శిరస్సు నేలకు ఆన్చి సాష్టాంగ నమస్కారం చేశాను.
EZE 3:24 కాని, ఇంతలో ఒక గాలి (ఆత్మ) వచ్చి నన్ను నా పాదాలపైకి లేపింది. ఆయన నాతో ఇలా అన్నాడు, “నీవు ఇంటికి వెళ్లి లోపల కూర్చుని గడియపెట్టుకో.
EZE 3:25 ఓ నరపుత్రుడా, ప్రజలు నీ వద్దకు వచ్చి, నిన్ను తాళ్లతో బంధిస్తారు. వారు నిన్ను ప్రజల మధ్యకు వెళ్లనీయరు.
EZE 3:26 నేను నీ నాలికను నీ అంగిలి గుంటలో అతుక్కుపోయేలా చేస్తాను. దానితో నీవు మాట్లాడలేవు. అందువల్ల వారు తప్పు చేస్తున్నట్లు వారికి చెప్పే మనుష్యుడెవ్వడూ ఉండడు. ఎందువల్లనంటే ఆ జనులు నా మీద ఎల్లప్పుడూ తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.
EZE 3:27 కాని నేను నీతో మాట్లాడతాను. పిమ్మట నీవు మళ్లీ మాట్లాడటానికి అనుమతిస్తాను. అయితే నీవు మాత్రం ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు’ అని వారికి చెప్పాలి. ఏ వ్యక్తి అయినా వినగోరితే మంచిదే. ఎవ్వరూ వినటానికి ఇష్టపడకపోయినా మంచిదే. ఆ ప్రజలు ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకులవుతూ ఉన్నారు.
EZE 4:1 “నరపుత్రుడా, ఒక ఇటుక తీసుకొని దానిమీద ఒక బొమ్మ గియ్య. యెరూషలేము నగరపు బొమ్మ వేయుము.
EZE 4:2 నీవా నగరాన్ని ముట్టుడించే సైన్యంలాగా చిత్రీకరించు. నగరాన్ని తేలికగా పట్టుకొనేటందుకు అనువుగా దానిచుట్టూ ఒక మట్టిగోడ నిర్మించు. నగరపు గోడవరకు ఒక మట్టి రహదారి వేయుము. సమ్మెటల్ని (ముఖ్య నాయకుల్ని) తెప్పించి, నగరం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేయండి.
EZE 4:3 పిమ్మట ఒక ఇనుప పెనము తీసుకొని దానిని నీకు, నగరానికి మధ్య ఉంచు. అది నిన్ను, నగరాన్ని వేరుచేసే ఇనుప గోడలా ఉంటుంది. ఈ రకంగా నీవా నగరానికి వ్యతిరేకంగా వున్నట్లు నీవు చూపిస్తావు. నీవా నగరాన్ని చుట్టుముట్టి దానిపై దాడి చేస్తున్నట్లు వుంటుంది. ఎందువల్లనంటే ఇశ్రాయేలు వంశానికి ఇది ఒక ఉదాహరణగా వుంటుంది. (దేవుడనైన) నేను యెరూషలేమును నాశనం చేస్తానని అది నిరూపిస్తుంది.
EZE 4:4 “తరువాత నీవు ఎడమ పక్కకి పడుకో, ఇశ్రాయేలీయుల పాపాలన్నీ నీవు భరిస్తున్నట్లు నిరూపించే విధంగా నీవాపని చేయాలి. నీవు ఎడమ పక్కన ఎన్నాళ్లు పడుకొని ఉంటే అన్నాళ్లు నీవా పాపాలను మోస్తావు.
EZE 4:5 నీవు వారి పాపాన్ని మూడు వందల తొంభై రోజులు భరించాలి. ఈ ప్రకారం ఇశ్రాయేలు ఎంతకాలం శిక్షింపబడుతుందో నేను తెలియజేస్తున్నాను. ఒక్కరోజు ఒక్క సంవత్సరానికి సమానం.
EZE 4:6 “ఆ తరువాత నీవు కుడి పక్కకి తిరిగి నలభై రోజులు పడుకోవాలి. ఈసారి నీవు యూదావారి పాపాలను నలభై రోజులపాటు భరిస్తావు. ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం. యూదా ఎంతకాలం శిక్షింపబడాలో నేను నీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను.”
EZE 4:7 దేవుడు మళ్లీ మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు, “ఇప్పుడు నీవు నీ చొక్కా చేతిని పైకి మడిచి, ఆ ఇటుక మీదికి నా చేతినెత్తు. యెరూషలేము నగరంపై దాడి చేస్తున్నట్లు నీవు ప్రవర్తించు. నీవు నా తరఫు దూతగా మాట్లాడుతున్నట్లు చూపటానికి ఈ విధంగా చేయుము.
EZE 4:8 ఇప్పుడు చూడు, నిన్నిప్పుడు తాళ్లతో కట్టుతున్నాను. నగరంపై నీ దాడి పూర్తయ్యేవరకు నీవు అటు, ఇటు కదలలేవు.”
EZE 4:9 దేవుడు ఇంకా చెప్పాడు: “రొట్టె చేయటానికి నీవు కొంత ధాన్యాన్ని తీసుకొనిరా. కొన్ని గోధుమలు, బార్లీ బియ్యము (యవలు), చిక్కుడు గింజలు, పప్పులు, జొన్నలు, సజ్జలు తీసుకో. వీటన్నిటినీ కలిపి రోటిలోవేసి దంచి పిండి చేయుము. ఈ పిండిని ఉపయోగించి రొట్టె చేయుము. నీవు పక్కకు తిరిగి పడుకొనే మూడువందల తొంభై రోజులూ ఈ రొట్టెనే తినాలి.
EZE 4:10 రొట్టె ను చేయటానికి ఈ పిండిని రోజుకు ఒక గిన్నెడు (సుమారు ఇరవై తులాలు) మాత్రమే ఉపయోగించటానికి నీకు అనుమతి ఇవ్వబడింది. అవసరమైనప్పుడల్లా రోజంతా ఆ రొట్టెనే నీవు తినాలి.
EZE 4:11 ప్రతి రోజూ మూడు గిన్నెల నీరే నీవు తాగాలి. రోజంతా తగిన సమయానికి దానిని తాగాలి.
EZE 4:12 ప్రతిరోజూ నీ రొట్టెను నీవే చేసుకోవాలి. నీవు మనుష్యుల మలం తెచ్చి, ఎండబెట్టి, దానిని కాల్చాలి. మండే ఆ మనుష్యుల మలం మీద నీవు ఆ రొట్టెను కాల్చాలి. ప్రజల ఎదుట ఈ రొట్టెనే నీవు కాల్చితినాలి.”
EZE 4:13 మళ్లీ యెహోవా ఇలా చెప్పాడు: “ఈ పని చేయటం ద్వారా ఇశ్రాయేలు వంశీయులు పరాయి దేశాలలో అపరిశుభ్రమైన రొట్టెలు తింటారని నీవు సూచిస్తావు. వారు ఇశ్రాయేలు వదిలి అన్యదేశాలకు పోయేలా నేను వారిని ఒత్తిడి చేశాను!”
EZE 4:14 అప్పుడు నేనిలా (యెహెజ్కేలు) అన్నాను, “అయ్యో, నా ప్రభువైన యెహోవా, నేనెన్నడూ అపరిశుద్ధ ఆహారాన్ని తినలేదు. వ్యాధిచే చచ్చిన జంతు మాంసంగాని, అడవి జంతువుచే చంపబడిన పశువుల మాంసాన్ని గాని నేను ఎన్నడూ తినియుండలేదు. నా చిన్ననాటి నుండి ఈ నాటి వరకు నేను ఎన్నడూ అపరిశుద్ధ ఆహారం ముట్టి ఎరుగను. ఆ దుష్ట మాంసమేదీ నానోట బడలేదు.”
EZE 4:15 అందుకు దేవుడీలా అన్నాడు: “సరే! నీ రొట్టెను కాల్చటానికి ఎండిన ఆవుపేడ ఉపయోగించేటందుకు నీకు అనుమతి ఇస్తున్నాను. ఎండిన మనిషి మలం నీవు వినియోగించనవసరం లేదు.”
EZE 4:16 దేవుడు ఇంకా ఇలా అన్నాడు, “నరపుత్రుడా, యెరూషలేముకు ఆహార పదార్థాల సరఫరాను నిలిపి వేస్తున్నాను. అందువల్ల ప్రజలు తగుమాత్రం రొట్టె తినవలసి వస్తుంది. వారి ఆహార పదార్థాల సరఫరా విషయమై వారు మిక్కిలి చింతిస్తారు. వారికి తాగే నీరు కూడా పరిమితమవుతుంది. ఆ నీటిని తాగినప్పుడు వారు మిక్కిలి భీతిల్లుతారు.
EZE 4:17 ఎందువల్లనంటే ప్రజలకు తినటానికి తిండి, తాగటానికి నీరు తగినంత ఉండదు. ప్రజలు ఒకరిని చూచి ఒకరు భయ కంపితులవుతారు. వారివారి పాపాల కారణంగా వారు చిక్కి శల్యాలైపోతారు.
EZE 5:1 “నరపుత్రుడా, నీ ఆకలి సమయం అనంతరం నీవు ఈ పనులు చేయాలి: ఒక పదునైన కత్తి తీసుకో. దానిని మంగలి కత్తిలా వినియోగించి, నీ జుట్టును, గడ్డాన్ని గొరిగివేయుము. అలా తీసిన నీ జుట్టును ఒక తాసులో తూకం వేయుము. ఆ జుట్టును మూడు సమభాగాలుగా తూచాలి. నీ జుట్టులో ఒక భాగాన్ని నగరం బొమ్మ ఉన్న ఇటుక మీద పెట్టి, ఆ జుట్టును నగరంలో కాల్చివేయుము. కొంతమంది ప్రజలు నగరంలో చనిపోతారనే దానికి ఇది ఒక సూచన. ఒక కత్తితో రెండవ భాగం జుట్టును చిన్న చిన్న ముక్కలుగా చేయుము. ఆ జుట్టును నగరం (ఇటుక) చుట్టూ జల్లు. కొంతమంది ప్రజలు నగరం వెలుపల చనిపోతారని ఇది తెలియజేస్తుంది. నీ జుట్టులో మూడవ భాగాన్ని గాలిలోకి విసిరివేయుము. దానిని గాలిలో బహుదూరం కొట్టుకొనిపోనిమ్ము. కొంత మంది ప్రజలను నేను నా కత్తిని బయటికిలాగి బహుదూర దేశాలకు తరిమివేస్తానని ఇది సూచిస్తుంది.
EZE 5:3 కాని తరువాత నీవు వెళ్లి కొట్టుకుపోయిన వెంట్రుకలలో కొన్నింటిని ఏరి తేవాలి. వాటిని నీ దుస్తులతో చుట్టు. ఇది నా ప్రజలలో కొంతమందిని తిరిగి నా వద్దకు తెచ్చుకుంటాననే దానికి సూచన.
EZE 5:4 ఎగిరిపోయిన వెంట్రుకలలో మరికొన్నింటిని ఏరితే. తెచ్చి, వాటిని నిప్పులో వేయుము. ఇది ఇశ్రాయేలు ఇల్లంతా అగ్నికి గురియై నాశనమవుతుందనడానికి ఒక సూచన.”
EZE 5:5 నా ప్రభువైన యెహోవా ఇంకా ఇలా చెప్పియున్నాడు. “ఆ ఇటుకరాయి యెరూషలేముకు గురుతు. యెరూషలేమును ఇతర రాజ్యాలకు మధ్య ఉంచుతాను. దాని చుట్టూ దేశాలుంటాయి.
EZE 5:6 ఆ ప్రజలు నా ఆజ్ఞలను ధిక్కరించారు. ఇతర దేశాల వారికంటె వీరు మిక్కిలి హీనులయ్యారు. వారిచుట్టూ వున్న దేశాల ప్రజలకంటె ఈ ప్రజలే నా ధర్మాన్ని ఎక్కువగా ఉల్లంఘించారు. నా ఆజ్ఞలను వినటానికి వారు నిరాకరించారు! నా నియమాలను వారు మన్నించ లేదు!”
EZE 5:7 కావున నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “మీకు నేను భయంకర పరిస్థితులు కల్పిస్తారు. ఎందు కనగా మీరు నా ధర్మాన్ని అంగీకరించి, అనుసరించలేదు. మీరు నా ఆజ్ఞలను పాటించలేదు. మీ చుట్టూవున్న ప్రజలకంటే నా న్యాయసూత్రాలను మీరే ఎక్కువగా ఉల్లంఘించారు! ఆ ప్రజలు తప్పుగా భావించే పనులను కూడా మీరు చేశారు!”
EZE 5:8 అందువల్ల నా ప్రభువైన యెహోవా చెప్పినదేమంటే, “కాబట్టి ఇప్పుడు, నేను కూడా మీకు వ్యతిరేకిని. ఇతర ప్రజలంతా చూసేలా నేను మిమ్ముల్ని శిక్షిస్తాను.
EZE 5:9 గతంలో నేనెన్నడూ చేయని పనులు మీకు నేను చేస్తాను. ఆ భయంకరమైన శిక్షను ఇకముందెన్నడూ విధించను! ఎందువల్లనంటే మీరు అనేక భయంకరమైన పనులు చెశారు.
EZE 5:10 యెరూషలేము ప్రజలు చాలా ఆకలితో ఉండి, తండ్రులు వారి బిడ్డలనే తినివేస్తారు. పిల్లలు వారి తండ్రులను తినివేస్తారు. అనేక విధాలుగా మిమ్ముల్ని నేను శిక్షిస్తాను. చావగా మిగిలిన ప్రజలను నేను అన్ని దిక్కులలో చిందర వందరగా వదిలి వేస్తాను.”
EZE 5:11 నా ప్రభువైన యెహోనా ఇలా చెప్పాడు, “యెరూషలేమా, నా జీవము తోడుగా నిన్ను నేను శిక్షిస్తానని చెపుతున్నాను! నిన్ను శిక్షిస్తానని నేను ప్రమాణ పూర్వకంగా చెపుతున్నాను! ఎందుకంటే, నా పవిత్ర స్థలానికి నీవు భయంకరమైన పనులు చేశావు. దానిని అపవిత్ర పర్చుతూ ఘోరమైన పనులు చేశావు! నేను నిన్ను శిక్షిస్తాను. నీ పట్ల కరుణ ఏ మాత్రం చూపించను. నిన్ను చూచి నేను విచారపడను!
EZE 5:12 నగరంలో నీ ప్రజలలో మూడవ వంతు వ్యాధిపీడితులై ఆకలితో చనిపోతారు. నీ ప్రజలలో మూడవ వంతు నగరం వెలుపల యుద్ధంలో చనిపోతారు. అప్పుడు నా కత్తిని బయటికిలాగి మీలో మరొక మూడో వంతు మందిని దూర దేశాలకు తరిమి వేస్తాను. నీ చుట్టూ ఉన్న ప్రజలు యుద్ధంలో వారిని చంపివేస్తారు! అప్పుడు మాత్రమే నేను నీ పట్ల నా కోపాన్ని ఉప సంహరించుకుంటాను.
EZE 5:13 అప్పుడు మాత్రమే నీ ప్రజల పట్ల నా కోపాన్ని తగ్గించుకుంటాను. వారు నా పట్ల చేసిన పాపకార్యాలకే వారు శిక్షింపబడ్డారని నాకు తెలుసు. నేను వారి యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు. వారి పట్ల నాకుగల గాఢమైన ప్రేమ వల్ల నేను వారితో మాట్లాడానని కూడా వారు తెలుసు కుంటారు!”
EZE 5:14 దేవుడు ఇలా చెప్పాడు: “యెరూషలేమా, నిన్ను నేను నాశనం చేస్తాను. నీవు కేవలం ఒక రాళ్ల కుప్పలా మిగిలిపోతావు. నీ చుట్టూ వున్న ప్రజలు నిన్ను ఎగతాళి చేస్తారు. నీ పక్కగా వెళ్లే ప్రతివాడూ నిన్ను చూచి పరిహసిస్తాడు.
EZE 5:15 నీ చుట్టూ వున్న ప్రజలు నిన్ను పరిహసిస్తారు. కాని వారికి నీవొక గుణపాఠంలా కూడ మిగులుతావు. నేను నీ పట్ల కోపగించి, నిన్ను శిక్షించినట్లు వారు చూస్తారు, నేను మిక్కిలి కోపంగా ఉన్నాను. నేను నిన్ను హెచ్చరించాను. యెహోవానైన నేను ఏమి చేస్తానో నీకు చెప్పాను!
EZE 5:16 నీకు లభించే ఆహరాన్ని తీసేసి మరల మరల ఆకలిగొలిపే ఆ సమయాన్ని కలుగజేస్తానని చెప్పియున్నాను. నిన్ను నాశనం చేసే భయంకర పరిణామాలు కలుగజేస్తానని నీకు చెప్పియున్నాను. ఆ కరువు పరిస్థితులు అనేకసార్లు వచ్చాయి. మీకు ఆహార పదార్థాలు సరఫరా కాకుండా చేశాను.
EZE 5:17 నేను ఆకలిని, క్రూరమృగాలను నీ మీదను పంపుతాను. ఆవి నీ పిల్లలను చంపుతాయి. నగరమంతా వ్యాధులు, మరణాలు సంభవిస్తాయని నేను చెప్పియున్నాను. మీ మీదికి శత్రు సైన్యాలను తెప్పించి యుద్ధం చేయిస్తాను. యహోవానగు నేను ఈ విషయాలన్నీ సంభవిస్తాయని నీకు చెప్పియున్నాను. అవన్నీ జరిగి తీరాయి!”
EZE 6:1 మళ్లీ యెహోవా వాక్కు నాకు వినిపించింది.
EZE 6:2 ఆయన ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు పర్వతాలవైపు తిరిగి, నా తరపున వాటికి వ్యతిరేకంగా మాట్లాడు.
EZE 6:3 ఆ పర్వతాలకు ఈ విషయాలు తెలియజెప్పు: ‘ఇశ్రాయేలు పర్వతములారా, నా ప్రభువైన యెహోవా సందేశాన్ని వినండి! నా ప్రభువైన యెహోవా కొండలకు, పర్వతాలకు, కనుమలకు, లోయలకు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. చూడండి! (దేవుడనగు) నేను మీపై యుద్ధానికి శత్రువును రప్పిస్తున్నాను. మీ ఉన్నత స్థలాలు. నేనే నాశనం చేస్తాను
EZE 6:4 మీ బలిపీఠాలు ముక్కలు చేయబడతాయి! మీ ధూప వేదికలు నాశనం చేయబడతాయి. మీ హేయమైన విగ్రహాలముందే మీ శవాలను పడవేస్తాను.
EZE 6:5 ఇశ్రాయేలు ప్రజల శవాలను అసహ్యమైన విగ్రహాల ముందు పడవేస్తాను. మీ ఎముకలను మీ పీఠాల చుట్టూ వెదజల్లుతాను.
EZE 6:6 మీ ప్రజలెక్కడ వుంటే అక్కడ వాళ్ళు నాశనం చేయబడతారు. వారి నగరాలు రాళ్లగుట్టల్లా మారిపోతాయి. వారి ఉన్నత స్థలాలు నాశనం చేయబడతాయి. ఎందుకంటే, ఆ పూజా స్థలాలు మరెన్నడూ వినియోగింపబడకుండా వుండేటందుకు. ఆ బలి పీఠాలు నాశనం చేయబడతాయి. ప్రజలు మరెన్నడూ ఆ రోత విగ్రహాలను ఆరాధించరు. ఆ ధూప పీఠాలు ధ్వంసం చేయబడతాయి. మీరు చేసిన వస్తువులన్ని సర్వనాశనం చేయబడతాయి!
EZE 6:7 మీ ప్రజలు చంపబడతారు. అప్పుడు నేనే ప్రభువు (యెహోవా) నని మీరు తెలుసుకుంటారు!’”
EZE 6:8 దేవుడు ఇలా చెప్పాడు: “కాని మీలో చాలా కొద్ది మంది తప్పించుకునేలా నేను చేస్తాను. వారు అన్య దేశాలలో స్వల్పకాలం పాటు నివసిస్తారు. వారిని నేను చెల్లా చెదురుచేసి, ఇతర దేశాలలో నివసించేలా ఒత్తిడి చేస్తాను.
EZE 6:9 అలా మిగిలిన వారు బందీ చేయబడతారు. వారు అన్యదేశాలలో నివసించేలా తరిమివేయబడతారు. కాని, అలా మిగిలిన వారు నన్ను తలచుకొంటారు. నేను వారి గుండెలు బద్దలయ్యేలా చేశాను. వారు చేసిన చెడు కార్యాలకు వారిని వారే అసహ్యించుకుంటారు. గతంలో వారు నాకు విముఖులై, నన్ను వదిలిపెట్టారు. హేయమైన వారి విగ్రహాల వెంట వారు వెళ్ళారు. తన భర్తను వదిలి, పరాయి పురుషుని వెంటబడిన స్త్రీవలె వారున్నారు. వారెన్నో భయంకరమైన పనులు చేశారు.
EZE 6:10 చివరికి, నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు. నేనేదైనా చేస్తానంటే, అది చేసి తీరుతానని కూడా తెలుసుకొంటారు! వారికి జరిగిన కీడంతా నేనే జరిపించినట్లు వారు తెలుసుకొంటారు.”
EZE 6:11 మళ్లీ నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: “నీ చేతులు చరిచి, నీ పాదాలను దట్టించుము. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఘోరమైన చెడ్డ పనులన్నిటినీ విమర్శిస్తూ మాట్లాడు. వారు వ్యాధుల వల్ల, ఆకలిచేత చనిపోతారని వారిని హెచ్చరించు. వారు యుద్ధంలో చనిపోతారని తెలియజేయుము.
EZE 6:12 దూరాన వున్నవారు రోగపీడితులై చనిపోతారు. ఈ ప్రదేశానికి దగ్గరగా వున్న ప్రజలు కత్తిచేత చంపబడతారు. ఇంకను నగరంలో మిగిలిన ప్రజలు ఆకలితో మాడి చనిపోతారు. అప్పుడు మాత్రమే నా కోపం తగ్గుతుంది.
EZE 6:13 అప్పుడు మాత్రమే నేను యెహోవానని మీరు తెలుసుకొంటారు. మీ అపవిత్రమైన మీ విగ్రహాలముందు, వాటి బలిపీఠాల చుట్టూ పడిన మీ శవాలను చూచినప్పుడు మీరిదితెలుసుకుంటారు. ఆ శవాలు మీ ఆరాధనా స్థలాలున్న ప్రతిచోట, ప్రతి కొండ, పర్వతంమీద, ప్రతి పచ్చని చెట్టు, ఆకులున్న ప్రతి సింధూర వృక్షం క్రింద పడి వుంటాయి. ఆ స్థలాలన్నిటిలో మీరు మీ బలులు సమర్పించారు. అవి మీ హేయమైన విగ్రహాలకు సుగంధ పరిమళాలు.
EZE 6:14 కాని మీ మీదికి నా చెయ్యెత్తి, మిమ్ముల్ని నేను శిక్షించాను! నేను మీ దేశాన్ని నాశనం చేశాను. అది దిబ్లాతు ఎడారి కంటె ఎక్కువగా శూన్య ప్రదేశమయ్యింది. ఇప్పుడు మీ ప్రజలు నివసించే ప్రతి చోటా నేనే యెహోవానని తెలుసుకొంటారు!”
EZE 7:1 పిమ్మట యెహోవా వాక్కు నాకు చేరింది.
EZE 7:2 ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నా ప్రభువైన యెహోవా నుండి ఒక సందేశం ఉంది. అది ఇశ్రాయేలు దేశానికి సంబంధించినది: “అంతం వచ్చింది. దేశం యావత్తూ నాశనమవుతుంది.
EZE 7:3 ఇప్పుడు నీ అంతం సమీపించింది. నేను నీ పట్ల ఎంత కోపంగా ఉన్నానో చూపిస్తాను. నీ చెడు కార్యాలకు నిన్ను నేను శిక్షిస్తాను. నీవు చేసిన భయంకరమైన పనులకు ఫలమనుభవిస్తావు.
EZE 7:4 నీ పట్ల నేను కనికరం చూపను. నిన్ను చూచి విచారించను. నీవు చేసిన చెడ్డకార్యాలకు నిన్ను నేను శిక్షిస్తున్నాను. నీవు ఘోరమైన పనులు చేశావు. నేను యెహోవానని నీవిప్పుడు తెలుసు కొంటావు.”
EZE 7:5 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “ఒక విపత్తు తరువాత మరొకటి వస్తుంది:
EZE 7:6 అంతం సమీపిస్తున్నది! అవసానదశ వస్తున్నది. అది అతి త్వరలో సంభవిస్తుంది!
EZE 7:7 ఇశ్రాయేలులో నివసిస్తున్న ప్రజలారా, హెచ్చరించే ఈల శబ్దం వింటున్నారా? శత్రువు వచ్చిపడుతున్నాడు. శిక్షాకాలం అతి దగ్గరలో ఉంది! శత్రుసైన్యపు రణగొణ ధ్వనులు పర్వతాలపై మరీ మరీ ఎక్కువగా వినవస్తున్నాయి.
EZE 7:8 నేనెంత కోపంగా వున్నానో అతి త్వరలో మీకు నేను చూపిస్తాను. మీమీద నాకున్న కోపాన్నంతా చూపిస్తాను. మీరు చేసిన చెడు కార్యాలకు మిమ్ముల్ని నేను శిక్షిస్తాను. మీరు చేసిన భయంకరమైన పనులన్నిటికీ మీరు ప్రతి ఫలం చెల్లించేలా చేస్తాను.
EZE 7:9 మీ పట్ల ఏ మాత్రం కనికరం చూపను. మిమ్ముల్ని చూచి విచారపడను. మీరటువంటి భయంకరమైన పాపాలు చేశారు. నేను ప్రభువైన యెహోవానని, నేనే మిమ్ముల్ని కొడతానని మీరు తెలుసుకుంటారు.
EZE 7:10 “ఆ శిక్షాకాలం సమీపించింది. హెచ్చరిక ఈల విన్నావా? దేవుడు సూచన చేశాడు. శిక్ష మొదలవుతూ ఉంది. చేతికర్ర చిగురు తొడగటం మొదలు పెట్టింది. అహంకారియైన రాజు (నెబుకద్నెజరు) ఇప్పటికే చాలా బలవంతుడైనాడు.
EZE 7:11 హింసావాదియైన అతడు ఆ దుష్ట ప్రజలను శిక్షించటానికి సిద్ధంగా వున్నాడు. ఇశ్రాయేలులో చాలా మంది మనుష్యులున్నారు. కాని అతడు వారిలో ఒకడు కాదు. ఆ గుంపులో అతడొకడు కాదు. ఆ ప్రజలలో అతడొక ప్రముఖ నాయకుడు కాదు.
EZE 7:12 “ఆ శిక్షాకాలం దరిచేరింది. ఆ రోజు ఇక్కడే వున్నది. సరుకులు కొనుగోలు చేసే జనులు సంతోషపడరు. అమ్మకపుదారులు వారి అమ్మకాల పట్ల విచారపడరు. ఎందువల్లనంటే ఆ భయంకరమైన శిక్ష ప్రతివానికి వస్తుంది గనుక.
EZE 7:13 తమ ఆస్తిని అమ్ముకున్న ప్రజలు, మరి దాని వద్దకు వెళ్లరు. ఏ వ్యక్తి అయినా తప్పించుకుని బతికితే కూడా అతడు తన ఆస్తి వద్దకు ఎన్నడూ మళ్లీ వెళ్లలేడు. ఎందు వల్లనంటే, దేవుని ఈ సందేశం అందరికీ సంబంధించినది గనుక. అందువల్ల ఏ ఒక్కడైనా బతికి బయటపడినా, అది ప్రజలను సంతోష పెట్టలేదు.
EZE 7:14 “ప్రజలను హెచ్చరించటానికి వారు బూరలు ఊదుతారు. ప్రజలు యుద్ధ సన్నద్ధులౌతారు. కాని వారు యుద్ధం చేయటానికి మాత్రం బయటికి వెళ్లరు. ఎండువల్లనంటే నేనెంత కోపంగా వున్నానో ఆ సమూహమంతటికీ చూపిస్తాను గనుక.
EZE 7:15 శత్రువు కత్తిపట్టి నగరం వెలుపల కాచివున్నాడు. వ్యాధులు, క్షామము నగరం లోపల ఉన్నాయి. ఏ మనిషేగాని బయట తన పొలానికి వెళ్లితే వేచి వున్న శత్రు సైనికుడు అతన్ని చంపివేస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి నగరంలోనే వుంటే ఆకలి, వ్యాధులు అతన్ని చంపివేస్తాయి.
EZE 7:16 “కాని కొంతమంది ప్రజలు తప్పించుకుంటారు. అలా బతికినవారు పర్వతాలలోకి పారిపోతారు. అయినా వారు సంతోషంగా ఉండలేరు. వారు తమ పాపాలను తలచుకొని కుమిలిపోతారు. వారు ఏడ్చి, పావురాలవలె మూలుగుతారు.
EZE 7:17 ప్రజలు మిక్కిలి అలసిపోయి, దఃఖించి తమ చేతులను కూడా ఎత్తలేరు. వారి కాళ్లు నీళ్లలా ఉంటాయి.
EZE 7:18 వారు విషాదాన్ని సూచించే దుస్తులు ధరిస్తారు. వారిని భయం ఆవరిస్తుంది. ప్రతి ముఖంలోనూ సిగ్గు ముంచుకు రావటం చూస్తావు. విచారాన్ని వ్యక్తంచేస్తూ వారు తమ తలలను గొరిగించుకుంటారు.
EZE 7:19 వారి వెండి విగ్రహాలను వీధుల్లో పారవేస్తారు. బంగారము (విగ్రహాల)ను మురికి గుడ్డల్లా చూస్తారు. యెహోవా తన కోపాన్ని వారిపట్ల చూపించినప్పుడు వారి విగ్రహాలు వారిని రక్షించలేవు గనుక వారలా చేస్తారు. ప్రజలను పాపమార్గంలో పడవేయటానికి విగ్రహాలు ఒక మాయోపాయంలాంటివి. ఆ విగ్రహాలు ప్రజలకు ఆహారాన్ని ఇవ్వలేవు. వారి విగ్రహాలు వారి కడుపు నింపలేవు.
EZE 7:20 “ఆ ప్రజలు వారి విలువైన ఆభరణాలు వినియోగించి ఒక విగ్రహాన్ని తయారుచేశారు. ఆ విగ్రహాన్ని చూచి వారు గర్వపడ్డారు. వారింకా భయానక విగ్రహాలు చేశారు. వారా హేయమైన వస్తువులను చేశారు. కావున దేవుడనైన నేను వారిని మసిబట్టలా విసిరి పారవేస్తాను.
EZE 7:21 పరాయివారు వారిని పట్టుకునేలా చేస్తాను. పరాయి ప్రజలు వారిని ఎగతాళి చేస్తారు. పరాయి జనులు వారిలో కొంతమందిని చంపివేస్తారు. మరి కొంతమందిని చెరపట్టి తీసుకొనిపోతారు.
EZE 7:22 నేను వారిని చూచి ముఖం తిప్పుకుంటాను. నేను వారివంక చూడను. పరాయి మనుష్యులు నా ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. ఆ పవిత్ర భవనంలో రహస్య స్థానాలకు వెళ్లి అపవిత్ర పరుస్తారు.
EZE 7:23 “బందీల కొరకు సంకెళ్లు తయారుచేయి! ఎందుకంటే ఇతరులను చంపిన నేరానికి చాలామంది ప్రజలుంటే శిక్షింపబడతారు గనుక ఈ గొలుసులు తయారు చేయాలి. నగరంలో ప్రతిచోటా దౌర్జన్యం చెలరేగుతుంది.
EZE 7:24 రాజ్యాల నుండి చెడ్డ వ్యక్తులను తీసుకువస్తాను. ఆ చెడ్డ మనుష్యులు ఇశ్రాయేలీయుల ఇండ్లన్నిటినీ ఆక్రమిస్తారు. శక్తివంతులైన మీ ప్రజలందరినీ గర్వించకుండా చేస్తాను. అన్యదేశీయులు మీ ఆరాధన స్థలాలన్నిటినీ వశపర్చుకుంటారు.
EZE 7:25 “మీ ప్రజలందరూ భయంతో పణికిపోతారు. మీరు శాంతికోసం ఎదురుచూస్తారు. కాని అది మీకు లభ్యం కాదు.
EZE 7:26 ఒక విషాద గాధ తరువాత మరియొకటి మీరు వింటారు. చెడ్డవార్తలు మినహా మరేమీ మీరు వినరు. మరొక ప్రవక్త కొరకు వెదికి, దర్శన విషయం అడుగుతారు. ఒక్కటికూడ మీకు వుండదు. యాజకులు మీకు బోధించేదేమీ లేదు. పెద్దలు మీకిచ్చే మంచి సలహా ఏమీ వుండదు.
EZE 7:27 చనిపోయిన ప్రజల కొరకు మీ రాజు దుఃఖిస్తాడు. నాయకులు విషాద సూచక దుస్తులు ధరిస్తారు. సామాన్య జనులు మిక్కిలి భయపడతారు. ఎందువల్లనంటే వారు చేసిన పనులను నేను తిప్పికొడతాను. నేను వారికి శిక్షను నిర్ణయిస్తాను. వారిని నేను శిక్షిస్తాను. అప్పుడా ప్రజలు నేను యెహావానని తెలుసుకుంటారు.”
EZE 8:1 ఒకరోజు నేను (యెహెజ్కేలు) నా ఇంటిలో కూర్చొని ఉన్నాను. యూదా పెద్దలు నా ముందు కూర్చున్నారు. ఇది చెరబట్టబడిన కాలంలో ఆరవ సంవత్సరం, ఆరవ నెల (సెప్టెంబరు) ఐదవ రోజున జరిగింది. నా ప్రభువైన యెహోవా శక్తి అకస్మాత్తుగా నామీదికి వచ్చింది.
EZE 8:2 అగ్నివంటి రూపాన్నొకటి నేను చూశాను. అది మానవ శరీరంలా ఉంది. నడుము నుండి కిందికి అది అగ్నిలా కన్పించింది. నడుము నుండి పైకి ఆ ఆకారం దేదీప్యమానంగా వెలు గొందుతూ, అగ్నిలో కరుగాలిన లోహంలా ఉంది.
EZE 8:3 పిమ్మట చెయ్యి వంటిదొకటి నేను చూశాను. ఆ చెయ్యి నా మీదికి వచ్చి నా తలపై జుట్టుపట్టుకుంది. పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపింది. ఆ దేవదర్శనంలో ఆయన నన్ను యెరూషలేముకు తీసుకొని వెళ్లాడు. ఆయన నన్ను లోపలి ద్వారం వద్దకు తీసుకొని వెళ్లాడు. అది నగరానికి ఉత్తర దిశన ఉంది. ఆ ద్వారం దగ్గరే దేవుడు అసూయపడేలా చేసిన విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది.
EZE 8:4 కాని ఇశ్రాయేలు దేవుని మహిమ అక్కడ ఉంది. ఆ మహిమ నేను [కెబారు కాలువ వద్ద] లోయలో చూసిన దర్శనంలా ఉంది.
EZE 8:5 దేవుడు నాతో మాట్లాడుతూ, “నరపుత్రుడా, ఉత్తర దిశవైపు చూడు!” అన్నాడు. నేను ఉత్తరానికి చూశాను. అక్కడ బలిపీఠం వద్దగల ద్వారానికి ఉత్తరంగా దేవుడు అసూయ పడునట్లు చేసిన విగ్రహం ఉంది.
EZE 8:6 మళ్లీ దేవుడు నాకు ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి భయంకరమైన పనులు చేస్తున్నారో నీవు చూస్తున్నావా? వారు దానిని ఖచ్చితంగా నా ఆలయం పక్కనే నెలకొల్పారు! నీవు నాతో వస్తే, ఇంకా భయంకరమైన విషయాలు చూస్తావు!”
EZE 8:7 అందువల్ల నేను ఆవరణద్వారం వద్దకు వెళ్లాను. గోడలో ఒక రంధ్రాన్ని చూశాను.
EZE 8:8 దేవుడు నాతో, “నరపుత్రుడా, గోడలో ఒక రంధ్రం చెయ్యి” అని చెప్పాడు. కాబట్టి నేను ఆ తలుపులో ఒక రంధ్రాన్ని చేశాను. లోపల ఒక తలుపు కన్పించింది.
EZE 8:9 అప్పుడు దేవుడు నాతో, “లోనికి వెళ్లి ఇక్కడ ప్రజలు చేస్తున్న భయంకరమైన, దుష్టమైన పనులను చూడు” అని అన్నాడు.
EZE 8:10 నేను లోనికి వెళ్లి చూశాను. అక్కడ మీరు ఊహించటానికే అసహ్యకరమైన పాముల, బల్లుల, క్రిమీకీటకాదుల, ఇతర జంతువుల ప్రతిమలు, శిల్పాలు ఉన్నాయి. అవన్నీ ఇశ్రాయేలీయులు ఆరాధించే హేయమైన విగ్రహాలు. ఆ జంతువుల బొమ్మలు అన్ని గోడల మీదా చుట్టూ చెక్కబడి ఉన్నాయి!
EZE 8:11 అక్కడ షాఫాము కుమారుడైన యజన్యాయును, మరి డెబ్బయి మంది ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) ప్రజలతో కలసి ఆ స్థలంలో ఆరాధిస్తున్నారు. వారు ఖచ్చితంగా ప్రజల ముందు నిలబడి ఉన్నారు! ప్రతీ పెద్ద మనిషి చేతిలో ఒక ధూప కలశం ఉంది. సాంబ్రాణి ధూపం గాలిలోకి లేస్తూ ఉంది.
EZE 8:12 అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో ఏమి చేస్తున్నారో నీవు చూశావా? ప్రతి ఒక్కడూ తన బూటకపు దేవునికి ఒక గది కలిగి ఉన్నాడు! ‘మనల్ని యెహోవా చూడలేడు. యెహోనా ఈ దేశాన్ని వదిలేశాడు’ అని వారిలో వారనుకుంటున్నారు.”
EZE 8:13 దేవుడు మళ్లీ, “నీవు నాతో వస్తే, ఆ మనుష్యులు మరీ భయంకరమైన పనులు చేయటం చూస్తావు!” అని అన్నాడు.
EZE 8:14 దేవుడు నన్ను ఆలయ ద్వారం వద్దకు తీసుకొని వెళ్లాడు. ఈ ద్వారం ఉత్తరపు దిక్కున ఉంది. అక్కడ స్త్రీలు కూర్చుని, ఏడ్వటం చూశాను. వారంతా బూటకపు దేవము తమ్మూజును గురించి దుఃఖిస్తున్నారు!
EZE 8:15 దేవుడు ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ భయంకరమైన విషయాలు గమనించావా? నా వెంట రమ్ము. నీవింతకంటే ఘోరమైన విషయాలు చూస్తావు!”
EZE 8:16 ఆయన నన్ను యెహోవా ఆలయం లోపలి ఆవరణలోనికి తీసుకొని వెళ్లాడు. ఆక్కడ ఇరవైఐదు మంది కిందికి వంగి ఆరాధించటం చూశాను. వారు ముందు మండపానికి, బలి పీఠానికి మధ్యలో ఉన్నారు. కాని వారు తప్పు దిశకు తిరిగి కూర్చున్నారు! వారి వీపులు పవిత్ర స్థలానికి వెనుతిరిగి ఉన్నాయి. వారు సూర్యుణ్ణి ఆరాధించటానికి వంగు తున్నారు!
EZE 8:17 అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్రుడా, ఇది చూశావు గదా! యూదా ప్రజలు ఈ నా ఆలయాన్ని అతి సామాన్యమైనదిగా భావిస్తూ, ఆలయంలోనే వారు చెడు పనులు కొనసాగిస్తున్నారు.! ఈ దేశమంతా దౌర్జన్యంతో నిండిపోయింది. వారు నిరంతరం చెడుకార్యాలు చేస్తూ నాకు పిచ్చి పట్టిస్తున్నారు. చూడు, ఒక బూటకపు దేవతలా చంద్రుని ఆరాధించటానికి వారు ముక్కులకు ఉంగరాలు పెట్టుకుంటున్నారు.
EZE 8:18 వారికి నా కోపం చూపిస్తాను! వారిపట్ల ఏమాత్రం కనికరం చూపించను! వారిని గురించి నేను విచారించను! వారు ప్రాధేయపడి నన్ను పిలుస్తారు. కాని వారి అభ్యర్థనను నేను వినను!”
EZE 9:1 పిమ్మట దేవుడు నగరాన్ని శిక్షించటానికి నియమితులైన నాయకులను పిలిచాడు. ప్రతి నాయకుడూ తన చేతిలో ఒక విధ్వంసకర ఆయధం కలిగి ఉన్నాడు.
EZE 9:2 పై ద్వారం నుంచి ఆరుగురు మనుష్యులు బాటవెంట నడచి రావటం చూశాను. ఈ ద్వారం ఉత్తర దిశన ఉంది. ప్రతి ఒక్కడూ తన చేతిలో ఒక మారణాయుధాన్ని కలిగియున్నాడు. వారిలో ఒకడు నార బట్టలు ధరించాడు. అతని నడుముకు తేఖకుని కలం, సిరాబుడ్డి వేలాడకట్టుకున్నాడు. ఈ మనుష్యులు ఆలయంలో కంచు పీఠం వద్దకు వెళ్లి, అక్కడ నిలబడ్డారు.
EZE 9:3 అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమ కెరూబు దూతల మీదుగా లేచి అతను ఎక్కడకు వెళ్లాడో అక్కడకి వచ్చింది. ఆ తేజస్సు ఆలయ ద్వారం వద్దకు వచ్చింది. గడప మీదకు వచ్చి తేజస్సు ఆగింది. తరువాత నారబట్టలు వేసుకొని, లేఖకుని సామగ్రి ధరించి ఉన్నవానిని ఆ తేజస్సు పిలిచింది.
EZE 9:4 పిమ్మట యెహోవా (మహిమ) అతనితో, “యెరూషలేము నగరం గుండా వెళ్లు. ఈ నగరంలో ప్రజలు చేస్తున్న భయంకరమైన పనులన్నిటికీ కలత చెంది, విచారిస్తున్న వారి ఒక్కొక్కరి నుదుటి మీద ఒక గుర్తు పెట్టు” అని చెప్పాడు.
EZE 9:5 మళ్లీ దేవుడు ఇతర ఐదుగురు మనుష్యులతో, “మీరు ఆ మొదటి వ్యక్తిని అనుసరించి వెళ్లవలసిందిగా మిమ్ముల్ని కోరుతున్నాను. నుదుటి మీద గుర్తులేని ప్రతివానిని మీరు చంపివేయండి. వారు పెద్దలేగాని, పిన్నలేగాని, యువతులేగాని, పిల్లలేగాని, తల్లులేగాని ఎవరైనా లెక్కచేయవద్దు. మీ ఆయుధాన్ని వినియోగించి నుదుటిపై గుర్తులేని ప్రతివానిని చంపివేయండి. ఏ మాత్రం దయాదాక్షిణ్యం చూపవద్దు. ఎవ్వరిపట్లా జాలిపడవద్దు! ఈ నా ఆలయం వద్దనే మొదలు పెట్టండి” అని చెప్పాడు. ఆలయం ముందు ఉన్న పెద్దలతోనే వారు మొదలు పెట్టారు.
EZE 9:7 ఆ మనుష్యులతో దేవుడు ఇలా చెప్పాడ, “ఈ స్థలాన్ని అపవిత్రం చేయండి. శవాలతో ఈ ఆవరణాన్ని నింపివేయండి! ఇప్పుడు వెళ్లండి!” కావున వారు వెళ్లి నగర ప్రజలను చంపివేశారు.
EZE 9:8 ఆ మనుష్యులు ప్రజలను చంపటానికి వెళ్లగా, నేను అక్కడే ఉండిపోయాను. నా శిరస్సును భూమికి ఆనించి నమస్కరించి, “నా ప్రభువైన ఓ యెహోవా, యెరూషలేముపై నీ కోపాన్ని ప్రకటించటంతో నీవు ఇశ్రాయేలులో మిగిలి ఉన్న వారిని చంపివేయటం లేదు కదా!” అని అన్నాను.
EZE 9:9 అది విన్న దేవుడు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు, యూదా వంశాల వారు అనేక ఘోరపాపాలు చేశారు. ఈ దేశంలో ప్రజలు ఎక్కడ బడితే అక్కడ హత్య చేయబడుతున్నారు. ఈ నగరం నేరాలతో నిండిపోయింది. ఎందువల్లనంటే ప్రజలు, ‘యెహోవా ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోయాడు కనుక మనం చేసే పనులను ఆయన చూడలేడు’ అని అనుకొంటున్నారు.
EZE 9:10 కాని నేను ఏ మాత్రం కనికరం చూపను. ఈ ప్రజలు పట్ల విచారించను. వారు దాన్ని వారి మీదకే తెచ్చుకొన్నారు. నేను కేవలం వారికి అర్హమైన శిక్ష విధిస్తున్నాను!”
EZE 9:11 పిమ్మట నారబట్టలు ధరించి కలం, సిరాబుడ్డి పట్టుకున్న వ్యక్తి వచ్చి, “మీ ఆజ్ఞ ప్రకారం నేను అంతా చేశాను” అని అన్నాడు.
EZE 10:1 తరువాత నేను కెరూబు దూతల తలలపైవున్న పాత్రవైవు చూశాను. అది స్వచ్చమైన నీలపు మణిగా కనబడింది. ఆ పాత్రమీద సింహాసనం వంటిది ఒకటుంది. అక్కడ నుండి దేవుణ్ణి చూడవచ్చు.
EZE 10:2 నారబట్టలు వేసుకున్న వ్యక్తితో దేవుడు ఇలా అన్నాడు: “నీవు కెరూబు చక్రాల మధ్య ప్రాంతంలోకి రమ్ము. కెరూబు దూతల మధ్య నుండి కొన్ని మండే నిప్పు కణికెలను తీసుకో. ఆ నిప్పును నీ చేతిలో పట్టుకొని వెళ్లి, దానిని యెరూషలేము నగరంపై విసిరివెయి.” ఆ వ్యక్తి నా పక్క నుండి వెళ్లాడు.
EZE 10:3 ఆ వ్యక్తి మేఘంలోకి ప్రవేశించినప్పుడు ఆలయానికి దక్షిణానవున్న ప్రదేశంలో కెరూబు దూతలు నిలబడ్డారు. మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మిఉంది.
EZE 10:4 పిమ్మట దేవుని మహిమా ప్రకాశం కెరూబు దూతల మీదినుండి పైకి లేచింది. ఆ దూతలు ఆలయం గడపమీద నిలబడి ఉన్నారు. పిమ్మట ఆలయాన్ని మేఘం నింపి వేసింది. యెహోవా తేజస్సు ఆలయ ఆవరణాన్నంతా ఆవరించింది.
EZE 10:5 ఆ తరువాత కెరూబుల రెక్కల ధ్వని వెలుపలి ఆవరణమంతా వినబడ్డది. సర్వశక్తి మంతుడైన దేవుడు మాట్లాడినప్పుడు వచ్చే ఆ శబ్దం ఉరుములాంటి స్వరంలా గంభీరంగా ఉంది. రెక్కల చప్పుడు చాలా దూరంలో గల బయటి ఆవరణ వరకు వినవచ్చింది.
EZE 10:6 నారబట్టలు ధరించిన వ్యక్తికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీవు కెరూబుల మద్య చక్రాల నడిమి ప్రాంతంలోకి వెళ్లి, మండే నిప్పును తీసుకొని రమ్ము. కావున ఆ వ్యక్తి ఒక చక్రం పక్కగా నిలబడ్డాడు.
EZE 10:7 కెరూబులలో ఒకరు తన చేయిచాపి వాటి మధ్యనున్న మండే నిప్పును తీశాడు. ఆ నిప్పును ఆ వ్యక్తి చేతిలో వేశాడు. దానిని తీసుకొని ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.
EZE 10:8 (కెరూబుల రెక్కల కింద మానవుల చేతుల వంటివి ఉన్నాయి.)
EZE 10:9 అక్కడ నాలుగు చక్రాలున్నట్లు నేనప్పుడు చూశాను. ప్రతి కెరూబుల పక్క ఒక చక్రం చొప్పున ఉన్నాయి. చక్రాలు స్వచ్చమైన విలువైన రాయిగా కనిపించాయి.
EZE 10:10 మొత్తం నాలుగు చక్రాలున్నాయి. అవన్నీ ఒకే రీతిగా కన్పించాయి. ఒక చక్రంలో మరి యొకటి ఉన్నట్లు అవి కన్పించాయి.
EZE 10:11 కదిలినప్పుడు ఆ నాలుగూ ఒకేసారి ఏ దిశలోనైనా వెళ్ళగలిగినవి. కాని [కెరూబులు] కదలినప్పుడు అటు ఇటు తిరిగేవారు కాదు. తమ తలలు చూస్తున్న దిశలోనే వారు కదలి వెళ్లేవారు. వారు కదలినప్పుడు అటు ఇటు తిరుగలేదు.
EZE 10:12 వారి శరీరాల నిండా కన్నులున్నాయి. వారి వీపుల మీద. చేతుల మీద, వారి రెక్కల మీద. వారి చక్రాల మీద కన్నులున్నాయి. అవును, నాలుగు చక్రాల మీద కన్నులున్నాయి!
EZE 10:13 నేను విన్నది ఈ చక్రాలనే. వీటినే “చక్రాల మధ్యనున్న స్థలం” అంటారు.
EZE 10:14 ప్రతి కెరూబుకూ నాలుగు ముఖాలున్నాయి. మొదటి ముఖం కెరూబు ముఖం. రెండవ ముఖం మనుష్య ముఖం. మూడవది సింహపు ముఖం. నాల్గవది గద్దముఖం. ఈ కెరూబు దూతలు నేను కెబారు కాలువ వద్ద దర్శనంలో చూచిన జీవులే. పిమ్మట కెరూబు గాలిలోకి పైకి లేచారు.
EZE 10:16 వాటితో పాటు చక్రాలు లేచాయి. కెరూబులు రెక్కలు లేపి గాలిలోకి ఎగిరినప్పుడు చక్రాలు తమ దిశను మార్చలేదు.
EZE 10:17 కెరూబులు గాలిలోకి ఎగిరినప్పుడు చక్రాలు వారితో వెళ్లాయి. కెరూబు దూతలు నిలకడగా ఉన్నప్పుడు చక్రాలు కూడా అలానే ఉండేవి. ఎందువల్లనంటే ఆ జీవియొక్క ఆత్మ (శక్తి) అంతా చక్రాలలోనే ఉంది.
EZE 10:18 తరువాత యోహోవా మహిమ ఆలయ గుమ్మం మీది నుండి పైకిలేచి, కెరూబుల మీదికి వచ్చి అగింది.
EZE 10:19 అప్పుడు కెరూబులు తమ రెక్కలు విప్పి గాలిలోకి ఎగిరిపోయారు. వారు దేవాలయాన్ని వదిలి వెళ్లటం నేను చూశాను! చక్రాలు వారితో వెళ్లాయి. తరువాత వారు ఆలయపు తూర్పు ద్వారం వద్ద ఆగారు. ఇశ్రాయేలు దేవుని మహిమ గాలిలో వారిపైని లిచింది.
EZE 10:20 అప్పుడు నేను కెబారు కాలువవద్ద దర్శించిన ఇశ్రాయేలు దేవుని మహిమ కింద ఉన్న జీవులను గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ జీవులే కెరూబు దూతలని నేను తెలుసుకొన్నాను.
EZE 10:21 ప్రతి జీవికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు మరియు మానవుల చేతులను పోలినటువంటివి వాటి రెక్కల కింద ఉన్నాయి.
EZE 10:22 కెరూబుల ముఖాలు నేను కెబారు కాలువ వద్ద దర్శించిన జీవుల ముఖాల మాదిరిగానే ఉన్నాయి. అవన్నీ అవి పోయే దిక్కు వైపే తిన్నగా చూస్తూ ఉన్నాయి.
EZE 11:1 తరువాత ఆత్మ (గాలి) నన్ను యెహోవా ఆలయపు తూర్పుద్వారం వద్దకు తీసుకొని వెళ్లింది. [సూర్యుడు ఉదయించే వైపుకు] ఈ ద్వారం తిరిగి ఉంది. ఈ ద్వారం ముందు ఇరవై ఐదు మంది మనుష్యులున్నట్లు నేను చూశాను. అజ్జూరు కుమారుడైన యజన్యా వారితోవున్నాడు. బెనాయా కుమారుడు పెలట్యా కూడా అక్కడ వున్నాడు. పెలట్యా ఆ ప్రజలకు నాయకుడుగా ఉండెను.
EZE 11:2 పిమ్మట దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ నగరానికి కీడు మూడే పథకాలు వేసేవారు వీరే. ప్రజలు చెడు కార్యాలు చేయటానికి వీరు నిత్యం ప్రోత్సహిస్తారు.
EZE 11:3 ఈ మనుష్యులు, ‘మా ఇండ్లు మేము త్వరలో తిరిగి నిర్మించుకుంటాము. కుండలో మాంసంలా మేమీ నగరంలో సురక్షితంగా ఉన్నాము!’ అని అంటున్నారు.
EZE 11:4 వారీ అబద్ధాలు చెపుతున్నారు. కావున నీవు నా తరపున ప్రజలతో మాట్లాడాలి. ఓ నరపుత్రుడా, నీవు వెళ్లి ప్రజలకు భవిష్యత్తు యొక్క నిజాలను ప్రకటించు.”
EZE 11:5 ఆ తరువాత యెహోవా ఆత్మ నా మీదికి వచ్చింది. దేవుడు ఇలా చెప్పాడు: “యెహోవా ఈ మాట చెప్పాడని వారికి తెలియజేయి: ఇశ్రాయేలు వంశీయులారా, మీరు పెద్ద పెద్ద విషయాలు చేయపూనుకొంటున్నారు. కాని మీరు ఏమి ఆలో చిస్తున్నారో నాకు తెలుసు!
EZE 11:6 మీరీ నగరంలో అనేక మందిని చంపివేశారు. వీధులన్నిటినీ మీరు శవాలతో నింపివేశారు.
EZE 11:7 ఇప్పుడు మన ప్రభువైన యెహోవా చెపుతున్నదేమంటే, ‘ఈ శవాలే ఆ మాంసం. నగరమే ఆ కుండ. కాని అతడు (నెబకద్నెజరు) వచ్చి ఈ సురక్షితమైన కుండలో నుండి మిమ్మల్ని తీసుకొనిపోతాడు!
EZE 11:8 మీరు కత్తికి భయపడుతున్నారు. కాని మీ మీదికి నేను కత్తిని తీసుకువస్తున్నాను!’” మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. కావున అవి నెరవేరితీరుతాయి!
EZE 11:9 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “మిమ్మల్ని ఈ నగరం నుండి నేను బయటికి తీసుకొని వెళతాను. మిమ్మల్ని అన్యులకు అప్పగిస్తాను. నేను మిమ్మల్ని శిక్షిస్తాను!
EZE 11:10 మీరు కత్తికి గురియై చనిపోతారు. నేను మిమ్మల్ని అక్కడే ఇశ్రాయేలులో శిక్షిస్తాను. తద్వారా మిమ్మల్ని శిక్షించేది నేనే అని మీరు తెలుసుకొంటారు. నేనే యెహోవాను.
EZE 11:11 అవును. ఈ నగరం వంటపాత్ర అవుతుంది. మీరు అందులో ఉడికే మాంసం! మిమ్మల్ని ఇక్కడే ఇశ్రాయేలులో శిక్షిస్తాను.
EZE 11:12 అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు భగ్నపర్చింది నా ధర్మాన్నే! మీరు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. మీ చుట్టూ వున్న దేశాల ప్రజల మాదిరిగానే మీరూ జీవించటానికి నిర్ణయించు కున్నారు.”
EZE 11:13 నేను దేవుని తరపున మాట్లాడటం పూర్తిచేసిన వెంటనే బెనాయా కుమారుడైన పెలట్యా చని పోయాడు! నేను వెంటనే సాష్టాంగపడి, నా శిరస్సు భూమికి ఆనించి ఇలా పెద్ద గొంతుకతో అరిచాను: “నా ప్రభువైన ఓ యెహోవా, నీవు ఇశ్రాయేలులో మిగిలిన వారందరినీ పూర్తిగా నాశనం చేయబోతున్నావు!”
EZE 11:14 కాని యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు:
EZE 11:15 “నరపుత్రుడా, ఈ దేశాన్నుండి వెడలగొట్టబడిన ఇశ్రాయేలు సంతతివారగు నీ సోదరులను నీవు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇక్కడికి చాలా దూరంలో వున్న దేశంలో వారు నివసిస్తున్నారు. అయినా నేను వాళ్ళను తిరిగి రప్పిస్తాను. ‘కాని యెరూషలేములో ఉంటున్న జనులు యెహోవాకు దూరంగా ఉండండి. ఈ దేశం మాకు ఇవ్వబడింది.’ ఇది మాది అని అంటున్నారు.
EZE 11:16 “కావున ఈ విషయాలు ఆ ప్రజలకు తెలియ జేయుము, మన ప్రభువైన యెహోవా చెప్పున దేమంటే, ‘నా ప్రజలు దూరదేశాలకు తరలిపోయేలా నేను ఒత్తిడి చేసిన మాట నిజమే. అనేక దేశాలలో నిపసించేలా వారిని చెల్లా చెదురు చేశాను. అయినా వాళ్ళు ఆ దేశాలలో ఉన్నప్పుడు కొద్దికాలం నేనే వారి ఆలయమై ఉంటాను.
EZE 11:17 కావున వారి ప్రభువైన యెహోవా వారిని తిరిగి తీసుకువస్తాడని నీవు ఆ ప్రజలకు చెప్పాలి. నేను మిమ్మల్ని అనేకదేశాలకు చెదరగొట్టాను. కాని మిమ్మల్ని మళ్లీ చేరదీసి, ఆయా దేశాలనుండి తిరిగి తీసుకొని వస్తారు. ఇశ్రాయేలు దేశాన్ని మళ్లీ మీకు ఇస్తాను!
EZE 11:18 నా ప్రజలు తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న అపవిత్రమైన విగ్రహాలన్నింటినీ నాశనం చేస్తారు.
EZE 11:19 నేను వారందరినీ చేరదీసి, ఒక్క మనిషిలా వారిలో ఐకమత్యం కలుగజేస్తాను. వారికి నూతన ఆత్మ కలుగజేస్తాను. రాతి గుండెను వెలికితీసి, దాని స్థానంలో స్పందించే గుండెను అమర్చుతాను.
EZE 11:20 అప్పుడు వారు నా ధర్మాలను పాటిస్తారు. వారు నా ఆజ్ఞలను పాటిస్తారు. నేను వారికి చెప్పిన పనులు చేస్తారు. అప్పుడు వారు నిజంగా నా ప్రజలవుతారు. నేను వారి దేవుడి నవుతాను.’”
EZE 11:21 దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “కాని ఇప్పుడు వారి హృదయాలు ఆ భయంకరమైన, హేయమైన విగ్రహాలకు చెందివున్నాయి. కనుక ఆ ప్రజలు చేసిన దుష్కార్యాలకు నేను వారిని శిక్షించాలి.” నా ప్రభువైన యెహోవా ఆ మాటలు చెప్పాడు.
EZE 11:22 పిమ్మట కెరూబులు తమ రెక్కలు విప్పి గాలిలో ఎగిరిపోయారు. చక్రాలు వారితో వెళ్లాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ వారిపైన ఉంది.
EZE 11:23 యెహోవా మహిమ గాలిలోకి లేచి యెరూషలేమును వదిలి వెళ్లింది. యెరూషలేముకు తూర్పున వున్న కొండ మీద దేవుడు ఒక్క క్షణం ఆగాడు.
EZE 11:24 పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపి మళ్ళీ బబలోను (బాబిలోనియా)కు తీసుకొని వచ్చింది. అది నన్ను ఇశ్రాయేలు నుండి బలవంతంగా వెళ్ల గొట్టబడిన ప్రజల వద్దకు తీసుకొనివచ్చింది. ఆ దర్శనంలోనే యెహోవా ఆత్మ గాలిలోకి లేచి, నన్ను వదిలి వెళ్లింది. అవన్నీ నేను దర్శనంలో చూశాను.
EZE 11:25 పిమ్మట బందీలుగా వున్న (చెరపట్టబడిన) ప్రజలతో నేను మాట్లాడాను. యెహోవా నాకు చూపిన అన్ని విషయాల గురించీ వారికి చెప్పాను.
EZE 12:1 తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 12:2 “నరపుత్రుడా, నీవు తిరుగుబాటుదారుల మధ్య వున్నావు. వారు ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా వుంటున్నారు. నేను వారి కొరకు చేసిన పనులను చూడటానికి వారికి కళ్ళున్నాయి. అయినా వాటినివారు చూడలేరు. వారిని నేను చేయమని చెప్పిన విషయాలను వినటానికి వారికి చెవులున్నాయి. అయినా వారు నా ఆజ్ఞలను వినరు. ఎందువలనంటే వారు తిరుగుబాటుదారులు.
EZE 12:3 కావున, నరపుత్రుడా, నీ సామాన్లు సర్దుకో. నీవొక సుదూర దేశానికి పోతున్నట్లు నటించు. ప్రజలిదంతా చూసేలా నీవు చేయాలి. బహుశః వారు నిన్ను చూడవచ్చు. కాని వారు మిక్కిలి తిరుగుబాటుదారులు.
EZE 12:4 “ప్రజలు నిన్ను చూసే విధంగా నీ సామాన్లు పగటిపూట బయటకు తీసుకొని వెళ్ళు. మళ్లీ సాయంత్రం నీవొక బందీవలె దూరదేశానికి వెళ్తున్నట్లు ప్రవర్తించు.
EZE 12:5 మళ్లీ ఆ జనులు గమనిస్తూ వుండగా గోడకు కన్నం పెట్టి, దాని గుండా నీవు బయటికి వెళ్లు.
EZE 12:6 రాత్రిపూట నీ సామాను సంచి భుజం మీద వేసుకొని బయలుదేరు. నీవు ఎక్కడికి వెళ్ళు తున్నావో నీకే తెలియని విధంగా నీ ముఖాన్ని కప్పుకోవాలి. జనులు నిన్ను గమనించేటందుకు నీవీ పనులు చేయాలి. ఎందువల నంటే ఇశ్రాయేలు వంశానికి ఒక ఆదర్శంగా నేను నిన్ను వినియోగించు కుంటున్నాను!”
EZE 12:7 కావున నేను (యెహెజ్కేలు) యెహోవా ఆజ్ఞ ప్రకారం చేశాను. పగటివేళ నా సంచులు తీసుకొని నేనొక దూరదేశానికి వెళ్లి పోతున్నట్లు నటించాను. ఆ సాయంత్రం నా చేతులతో గోడకు కన్నం వేశాను. రాత్రివెళ నా సంచి చంకకు తగిలించుకొని బయలు దేరాను. ఈ పనులన్నీ ప్రజలు గమనించే విధంగా చేశాను.
EZE 12:8 మరునాటి ఉదయం యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 12:9 “నరపుత్రుడా, ఇశ్రాయేలీయులైన ఆ తిరుగుబాటుదారులు నీవు ఏమి చేస్తున్నావని నిన్ను అడిగారా?
EZE 12:10 వారి ప్రభువగు యెహోవా ఈ విషయాలు చెప్పాడని తెలియజేయి. ఈ విషాద సమాచారం యెరూషలేము నాయకునకు (పాలకుడు), అక్కడ నివసిస్తున్న ఇశ్రాయేలీయులందరికీ సంబంధించినది.
EZE 12:11 ‘మీ అందరికీ నేను (యెహెజ్కేలు) ఒక ఆదర్శం అనీ, నేను చేసి చూపించి నవి మీకు తప్పక జరుగుతాయని’ చెప్పుము. మీరు తప్పక దూరదేశాలకు బలవంతాన బందీలుగా తీసుకొని పోబడతారు.
EZE 12:12 మీ నాయకుడు (పాలకుడు) రాత్రి పూట గోడకు కన్నం వేసి దొంగచాటుగా బయటకు పారిపోతాడు. ప్రజలతనిని గుర్తు పట్టకుండా, అతడు తన ముఖాన్ని కప్పుకుంటాడు. అతడెక్కడికి వెళ్ళుచున్నాడో అతని కన్నులు చూడలేవు.
EZE 12:13 అతడు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాడు. కాని నేను (దేవుడు) అతనిని పట్టుకుంటాను! అతడు నా వలలో చిక్కుకుంటాడు. నేనతనిని కల్దీయుల రాజ్యమైన బబలోను (బాబిలోనియా)కు తీసుకొని వస్తాను. కాని అతడు మాత్రం తనెక్కడికి పోతున్నాడో చూడలేడు. శత్రువు అతని కన్నులను పీకి గుడ్డివాణ్ణి చేస్తాడు అప్పుడు అక్కడ అతడు చనిపొతాడు.
EZE 12:14 రాజ వంశీయులను ఇశ్రాయేలు చుట్టూ ఉన్న అన్యదేశాలలో నివసించేలా వారిని ఒత్తిడి చేస్తాను. అతని సైన్యాన్ని చెల్లా చెదురు చేస్తాను. శత్రు సైన్యాలు వారిని తరిమి కొడతాయి.
EZE 12:15 అప్పుడా ప్రజలు నేను యెహోవాను అని తెలుసుకొంటారు. నేనే వారిని అన్యదేశాలలో విసిరి వేశానని తెలుసుకొంటారు. ఇతర దేశాలకు పోయేలా వారిని నేనే ఒత్తిడి చేశానని తెలుసుకొంటారు.
EZE 12:16 “కాని కొద్దిమంది ప్రజలను మాత్రం బతక నిస్తాను. రోగాలవల్ల గాని, ఆకలిచేత గాని లేక యుద్ధం వల్ల గాని వారు చనిపోరు. వారు నాపట్ల చేసిన భయంకర నేరాలను గురించి ఇతర ప్రజలకు తెలియజెప్పటానికి గాను వారిని నేను బతకనిస్తాను. పిమ్మట వారు నేను యెహోవానని తెలుసుకొంటారు.”
EZE 12:17 ఆ పిమ్మట మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 12:18 “నరపుత్రుడా, నీవు చాలా భయపడినవానిలా వ్యవహరించాలి. నీవు ఆహారం తీసుకొనే సమయంలో వణకాలి. నీవు నీరుతాగేటప్పుడు వ్యాకుల పడుతున్నట్లు, భయపడు తున్నట్ లు ప్రవర్తించాలి.
EZE 12:19 ఈ విషయాలు నీవు సామాన్య ప్రజలకు తెలియజెప్పాలి. నీవు ఇలా అనాలి: ‘యెరూషలేము ప్రజలకు, ఇశ్రాయేలులో ఇతర ప్రాంతాల ప్రజలకు మన ప్రభువైన యెహోవా చేపుతున్నాడు, మీరు మీ ఆహారం తీసుకొనేటప్పుడు మిక్కిలి కలత చెందుతారు. వీరు నీరు తాగేటప్పుడు. భయకంపితులవుతారు. ఎందువల్లనంటే, మీ దేశంలో అన్ని వస్తువులూ సర్వనాశనం చేయబడతాయి! అక్కడ నివసిస్తున్న ప్రజలందరి పట్ల శత్రువు చాలా కృరంగా ప్రవర్తిస్తాడు.
EZE 12:20 మీ నగరాలలో చాలా మంది ప్రజలు నివసిస్తున్నారు. కాని ఆ నగరాలన్నీ నాశనం చేయబడతాయి. మీ దేశం యావత్తూ నాశనం చేయబడుతుంది! అప్పుడు నేనే యెహోవానని మీరు గుర్తిస్తారు.’”
EZE 12:21 యెహోవా వాక్కు నాకు మరల వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు:
EZE 12:22 “నరపుత్రుడా, ఇశ్రాయేలును గురించి ఎందుకు ఈ పాట పాడుకుంటారు? ‘ఆపద త్వరలో రాదు, దర్శనాలు నిజం కావు.’
EZE 12:23 “వారి ప్రభువైన యెహోవా ఆ పాటను ఆపుచేయిస్తాడని ప్రజలకు చెప్పు. ఇశ్రాయేలును గురించి ఆ మాటలు వారిక ఎన్నడూ పలుకరు. ఇప్పుడు వారీ పాటపాడతారు. ‘ఆపద ముంచుకు వస్తూ ఉంది, స్వప్న దర్శనాలన్నీ నిజమై తీరుతాయి.’
EZE 12:24 “నిజానికి ఇకమీదట ఇశ్రాయేలులో అసత్య దర్శనాలు ఉండవు. నీజం కాని భవిష్యత్తును చెప్పే తాంత్రికులు మరి ఉండబోరు.
EZE 12:25 ఎందువల్ల నంటే, నేనే యెహోవాను. నేను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పి తీరుతాను. అది తప్పక జరిగి తీరుతుంది! నేను కాలయాపన చేయను. ఆ కష్టాలు త్వరలో మీ కాలంలోనే రాబోతున్నాయి. ఓ తిరుగుబటు ప్రజలారా, నేను ఏదైనా చెప్పితే అది జరిగేలా చేస్తాను.” ఇవీ నా ప్రభువైన యెహోవా చెప్పిన మాటలు.
EZE 12:26 మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 12:27 “నరపుత్రుడా, నేను నీకిచ్చిన దర్శనాలు భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతాయని ఇశ్రాయేలు ప్రజలు అనుకొంటున్నారు. ఇప్పటి నుంచి చాలా సంపత్సరాల తరువాత జరుగబోయే విషయాలను గురించి నీవు మాట్లాడుతున్నావని వారనుకుంటున్నారు.
EZE 12:28 కావున నీవు వారికి ఈ విషయాలు చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: నేనిక ఎంతమాత్రం ఆలస్యం చేయను. నేనేదైనా జరుగుతుందని చెప్పితే అది తప్పక జరిగి తీరుతుంది!’” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
EZE 13:1 మరొకసారి యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఈ విధంగా చెప్పాడు:
EZE 13:2 “నరపుత్రుడా, నీవు నా తరపున ఇశ్రాయేలు ప్రవక్తలతో మాట్లాడాలి. ఆ ప్రవక్తలు వాస్తవానికి నా తరపున మాట్లాడటం లేదు. ఆ ప్రవక్తలు తాము చెప్పదలచుకొన్న విషయాలే చెప్పుచున్నారు. కావున నీవు వారితో మాట్లాడవలేను. వారికి ఈ విషయాలు చెప్పు: ‘యెహోవా నుండి వచ్చిన వర్తమానం వినండి!
EZE 13:3 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబతున్నాడు. దుష్ట ప్రవక్తలగునుకు కీడు మూడుతుంది. మీరు మీ ఆత్మలే అనుసరిస్తున్నారు. మీరు స్వప్న దర్శనాలలో చూసిన వాస్తవాలను ప్రజలకు చెప్పుటలేదు.
EZE 13:4 “‘ఓ ఇశ్రాయేలూ! నీ ప్రవక్తలు, పాడుబడిన ఇండ్లల్లో పరుగెత్తే గుంట నక్కలా వుంటారు.
EZE 13:5 బీటలు వారిన నగర గోడల వద్ద నీవు సైనికులను కాపలా వుంచలేదు. ఇశ్రాయేలు వంశాన్ని కాపాడటానికి నీవు గోడలను నిర్మించలేదు. కావున యెహోవాకు మిమ్మల్ని శిక్షించే రోజు వచ్చినప్పుడు, నీవు యుద్ధంలో పరాజయం పొందుతావు!
EZE 13:6 “‘దొంగ ప్రవక్తలు తమకు దర్శనాలు కలిగాయని అన్నారు. కొన్ని తంత్రాలు చేసి వారు చెప్పిన విషయాలు జరుగుతాయని అన్నారు. కాని వారు అబద్ధమాడారు. వారిని యెహోవాయే పంపినట్లు వారు చెప్పారు. అదికూడా అబద్ధమే. వారి అబద్ధాలు నిజమవ్వాలని వారింకా ఎదురు చూస్తూనే వున్నారు.
EZE 13:7 “‘దొంగ ప్రవక్తలారా, మీరు చూసిన దర్శనాలు నిజం కావు. మీరు తంత్రాలు జరిపి, అనేక విషయాలు జరుగుతాయని చెప్పారు. కాని మీరు చెప్పింది అబద్ధం! యెహోవా ఆ విషయాలు చెప్పాడని మీరు ప్రకటించారు. కాని నేను మీతో మాట్లాడలేదు.’”
EZE 13:8 కాపున ఇప్పుడు నా ప్రభువైన యెహోవా నిజంగా మాట్లాడతాడు! ఆయన చెప్పినదేమంటే, “మీరు అబద్ధమాడారు. సత్యదూరమైన దర్శనాలను మీరు చూశారు. కావున ఇప్పుడు నేను (దేవుడు) మీకు వ్యతిరేకినయ్యాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 13:9 యెహోవా ఇంకా ఇలా చెప్పాడు, “అబద్ధపు దర్శనాలను చూచి, అబద్ధాలు చెప్పిన ప్రవక్తలను నేను శిక్షిస్తాను. వారిని నా ప్రజల మధ్యనుండి తొలగిస్తాను. వారి వేర్లు ఇశ్రాయేలు వంశావళిలో ఉండవు. వారు మరెన్నటికీ ఇశ్రాయేలు రాజ్యానికి తిరిగిరారు. అప్పుడు మీ ప్రభువగు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు!
EZE 13:10 “ఆ బూటకపు ప్రవక్తలు పదే పదే నా ప్రజలకు అబద్ధాలు చెప్పారు. శాంతి విలసిల్లుతుందని ఆ ప్రవక్తలు చెప్పారు. కాని శాంతి లేదు. గోడలు కట్టుదిట్టం చేసి, ప్రజలు యుద్ధానికి సిద్ధపడవలసి ఉంది. అయితేం వారు పగిలిన గోడలమీద పలుచని పూత మాత్రం పూస్తున్నారు. పగుళ్లకు బంకమట్టి వ్రాస్తున్నారు.
EZE 13:11 నేను వారి మీదికి తీవ్రమైన వడగండల్ల వాన (శత్రు సైన్యం) పంపుతానని నీవు వారికి చెప్పు. పెనుగాలి వీస్తుంది. తుఫాను వస్తుంది. అప్పుడు ఆగోడ కూలిపోతుంది.
EZE 13:12 గోడ కూలినప్పుడు ప్రజలు ప్రవక్తలను, ‘మీరు గోడలకు పూసిన బంకమట్టి ఏమయ్యింది?’” అని అడుగుతారు.
EZE 13:13 నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పుతున్నాడు, “నేను కోపంగా వున్నాను. మీ మీదికి నేనొక తుఫాను పంపుతాను. నేను కోపగించివున్నాను. మీ మీదికి జడివాన పంపుతాను. నేను కోపంగావున్నాను. ఆకాశాన్నుండి పడగండ్లు పడేలా చేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను!
EZE 13:14 గోడమీద మీరు పలుచనైన బంకమట్టి పులిమారు. కాని నేను మొత్తం గోడనే నాశనం చేస్తాను. దానిని కూలగొడతాను. ఆ గోడ మీ మీద పడుతుంది. అప్పుడు నేనే యెహోవానని మీరు గుర్తిస్తారు.
EZE 13:15 గోడమీద, ఆ గోడకు పూత పూసిన వారిమీద నా కోపం చూపటం పూర్తిచేస్తాను. అప్పుడు, ‘గోడా లేదు, గోడకు పూతపూసే పని వాళ్ళూ లేరు’ అని నేనంటాను.
EZE 13:16 “ఈ విషయాలన్నీ ఇశ్రాయేలులో వున్న దొంగ ప్రవక్తలకు సంభవిస్తాయి. ఆ ప్రవక్తలు యెరూషలేము ప్రజలతో మాట్లాడుతూ, శాంతి నెలకొంటుందని అంటారు. కాని శాంతి లేదు.”ఈ విషయాలన్నీ నా ప్రభువైన యెహోవా చెప్పాడు.
EZE 13:17 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలులో స్త్రీ ప్రవక్తల విషయం చూడు. ఈ ఆడ ప్రవక్తలు నా తరపున మాట్లాడరు. వారు చెప్పదలచుకొన్నవే వారు చెప్పుతారు. కాపున నీవు నా పక్షాన వారికి వ్యతిరేకంగా మాట్లాడాలి. వారికి నీవు ఈ విషయాలు చెప్పాలి.
EZE 13:18 నా ప్రభువైన యెహోవా ఈ రకంగా చెపుతున్నాడు, ఓ స్త్రీలారా, మీకు కీడు జరుగుతుంది. ప్రజలు వారి చేతులమీద ధరించటానికి మీరు గుడ్డలతో కంకణాలు కుడతారు. ప్రజలకు కావలసిన రకరకాల తలముసుగులు ప్రత్యేకంగా తయారు చేస్తారు. [అవన్నీ ప్రజల జీవితాలను కట్టుబాటలో వుంచే మహిమగల వస్తువులని] మీరు చెబతున్నారు. మీ బ్రతుకుదెరువు కోసం ప్రజలను మీ వలలలో వేసుకొంటున్నారు!
EZE 13:19 నేను ముఖ్యుడను కానని ప్రజలు నమ్మేలా వారిని మీరు మభ్యపెడుతున్నారు. గుప్పెడు గింజలు కోసం, పట్టెడు అన్నం కోసం మీరీ పనులన్నీ చేస్తూ ప్రజలను నాకు వ్యతిరేకులుగా చేస్తున్నారు. నా ప్రజలకు మీరు అబద్ధాలు చెబతున్నారు. ప్రజలు కూడా అబద్ధాలు వినటానికే ఇష్టపడుతున్నారు. బతక వలసిన ప్రజలను మీరు చంపుతున్నారు. చావవలసిన మనష్యులను మీరు జీవించేలా చేస్తున్నారు.
EZE 13:20 కావున ప్రభువైన యెహోవా ఈలాగు చెపుతున్నాడు, మీరు బట్టతో కంకణాలు కట్టి ప్రజలను చిక్కించుకుంటున్నారు. కాని నేనా ప్రజలను విడుదల చేస్తాను. ఆ కంకణాలు మీ చేతుల నుండి లాగి పారవేస్తాను. అప్పుడు ప్రజలు మీ నుండి విముక్తి పోందుతారు. పంజరంలో నుండి ఎగిరిపోయే పక్షుల్లా వారు వుంటారు!
EZE 13:21 నేను వారి ముసుగులను చించివేస్తాను. మీ దుష్టశక్తి నుండి నా ప్రజలను కాపాడతాను. మీ బోను నుండి ఆ ప్రజలు తప్పించుకుంటారు. నేనే యెహోవానని అప్పుడు మీరు తెలుసుకుంటారు.
EZE 13:22 “‘ప్రవక్తలైన మీరు అసత్యాలు చెబతున్నారు. మీ అబద్ధాలు మంచి వ్యక్తులకు బాధ కలుగజేస్తాయి. మంచి ప్రజలను బాధించటం నాకు ఇష్టంలేని పని! దుష్ట జనాన్ని మీరు బలపర్చి, వారిని ప్రోత్సహిస్తారు. వారి నడవడికను మార్చుకోమని మీరు వారికి చెప్పరు. మీరు వారి ప్రాణాలను రక్షించటానికి ప్రయత్నించరు!
EZE 13:23 కావున ఇక మీదట మీరు పనికిరాని దర్శనాలను చూడరు. మీరిక ఎంతమాత్రం గారడీలు చేయరు. మీ శక్తుల నుండి నా ప్రజలను నేను రక్షిస్తాను. అప్పుడు మీరు నన్ను యెహోవా అని తెలుసుకొంటారు.’”
EZE 14:1 ఇశ్రాయేలు పెద్దలలో కొంతమంది నా వద్దకు వచ్చారు. వారు నాతో మాట్లాడాలని నావద్ద కూర్చున్నారు.
EZE 14:2 ఆ సమయంలో యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు.
EZE 14:3 “నరపుత్రుడా, ఈ మనుష్యులు నీతో మాట్లాడాలని వచ్చారు. వారు నా సలహా కోరమని నిన్ను అడగటానికి వచ్చారు. కాని ఈ మనుష్యులు ఇంకా హేయమైన విగ్రహాలను కలిగివున్నారు. వారు పాపం చేయటానికి కారణమైన వస్తువులను వారింకా విడనాడలేదు. ఆ విగ్రహాలను వారింకా పూజిస్తూనే వున్నారు. అందువల్ల వారు నా సలహా కొరకు రావలసిన అవసరం ఏముంది? వారి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలా? అవసరం లేదు!
EZE 14:4 అయినా నేను వారికి ఒక సమాధానం ఇస్తాను. ఆది నేను వారిని శిక్షించటం! ఈ విషయాలు నీవు వారికి చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ఇశ్రాయేలుకు చెందిన వాడెవడైనా ఒక ప్రవక్త వద్దకు వచ్చి నా సలహా కోరితే, ఆ ప్రవక్త వానికి సమాధానం చెప్పడు. వాకై నేనే ఆ వ్యక్తి ప్రశ్నకు సమాధానమిస్తాను. ఆ వ్యక్తి తన హేయమైన విగ్రహాలను కలిగివున్నా, తన పాపాలకు కారణమైన వస్తువులను దాచివుంచినా, అతడా విగ్రహారాధన చేసినా, నేనతనికి సమాధానమిస్తాను. వానివద్ద అపవిత్ర విగ్రహాలున్నా నేనతనితో మాట్లాడతాను.
EZE 14:5 ఎందుకనగా నేను వారి హృదయాలను తాకకోరుచున్నాను. వారి నీచమైన విగ్రహాల కొరకు వారు నన్ను విడిచిపెట్టినా, నేను వారిని ప్రేమిస్తున్నట్లు చూపదలిచాను.’
EZE 14:6 “కావున ఇశ్రాయేలు వంశం వారికి ఈ విషయాలు చెప్పు. వారితో ఇలా అనాలి, ‘నా ప్రభువైన యెహోవా ఏమి చెబతున్నాడనగా: నా వద్దకు తిరిగి రండి. మీ అపవిత్ర విగ్రహాలను వదిలివేయండి. ఆ బూటకపు దేవుళ నుండి దూరంకండి.
EZE 14:7 ఏ ఇశ్రాయేలీయుడు గాని, ఇశ్రాయేలులో నివసించే పరదేశియుడుగాని నా వద్దకు సలహా కోరివస్తే, వానికి నేను సమాధానమిస్తాను. అతను అపవిత్ర విగ్రహాలను కలిగియున్నా, తనుపాపాలు చేయటానికి కారుకమైన వస్తువులను దాచుకున్నా, అతను విగ్రహాలను ఆరాధించినా, అతనికి నేను సమాధాన మీస్తాను. నేను వారికిచ్చే సమాధాన మిది:
EZE 14:8 నేనా వ్యక్తికి వ్యతిరేకినవుతాను. నేను వానిని నాశనం చేస్తాను. ఇతర ప్రజలకు అతడొక ఉదాహరణగా మిగులుతాడు. ప్రజలతనిని చూసి నవ్వుతారు. నా ప్రజల మధ్యనుండి అతనిని తొలగిస్తాను. అప్పుడు నేను యెహొవానని మీరు తెలుసుకొంటారు!
EZE 14:9 ఏ ప్రవక్తయేగాని మూర్ఖంగా తన స్వంత సమాధానమిస్తే, అతడెంత మూర్ఖుడో నేనతనికి నిరూపిస్తాను! అతనికి వ్యతిరేకంగా నా శక్తిని వినియోగిస్తాను. అతనని నాశనం చేసి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల నుండి అతనిని తొలగిస్తాను.
EZE 14:10 కావున, సలహా కొరకు వచ్చిన వ్యక్తి, సమాధాన మిచ్చిన ప్రవక్త, ఇద్దరూ ఒకే శిక్షకు గురియవుతారు.
EZE 14:11 ఎందుకంటే, దానివల్ల ఆ ప్రవక్తలు నా ప్రజలను నాకు దూరం చేయకుండా ఆగిపోతారు. తద్వారా, నా ప్రజలు వారి పాపాలలో అపవిత్రము కాకుండా ఆగిపోతారు. అప్పుడు వారు నా ప్రత్యేక ప్రజలవుతారు. నేను వారి దేవుడనవుతాను.’” ఈ విషయాలన్నీ ప్రభువైన యెహోవా చెప్పాడు.
EZE 14:12 పిమ్మట యెహోవా వాక్కు నాకు తిరిగి వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు,
EZE 14:13 “నరపుత్రుడా, నన్ను వదిలిపెట్టిన, నా పట్ల పాపంచేసిన ఏ దేశాన్నయినా నేను శిక్షిస్తాను. వారికి ఆహార సరఫరాలను నిలిపి వేస్తాను. వారికి కరుపు కాలం రప్పించి, ఆ దేశ జనాభాని పశుసంపదను తొలగిస్తాను.
EZE 14:14 ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు నివసిస్తున్నప్పటికీ దానిని నేను శిక్షిస్తాను. ఆ మనష్యులు వారి మంచితనం చేత వారి ప్రాణాలను కాపాడుకొనగలరు. [కాని మొత్తం దేశాన్ని వారు రక్షించలేరు.” ] నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 14:15 దేవుడు ఇంకా ఇలా తెలియజెప్పాడు: “లేదా, నేను ఆ రాజ్యానికి కృర మృగాలను పంపవచ్చు. ఆ జంతువులు ప్రజలందరినీ చంపివేయవచ్చు. ఈ కృర మృగాల కారణంగా ఆ దేశం గుండా ఎవ్వరూ ప్రయాణం చేయరు.
EZE 14:16 ఒకవేళ ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు నివసిస్తూవుంటే ఆ ముగ్గురు మంచి వ్యక్తులనూ నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మనుష్యులూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. నా జీవ ప్రమాణంగా వారు ఇతరుల ప్రాణాలను గాని, కనీసం వారి కుమారులను, కుమార్తెలను గాని రక్షించలేరని నిశ్చయంగా చెబతున్నాను! ఆ చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 14:17 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “లేదా, నేను శత్రుసైన్యాన్ని ఆ దేశం మీదికి పంపవచ్చు. ఆ సైనికులు ఆ రాజ్యాన్ని నాశనం చేస్తారు. దేశంలో వున్న మనుష్యులను, జంతువులను తొలగించి వేస్తాను.
EZE 14:18 నోవహు, దానియేలు, యోబు అక్కడ వుంటే, ఆ ముగ్గురు మంచి వ్యక్తులను నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మునుష్యులూ వారి ప్రాణాలను కాపాడుకోగలుగుతారు. కాని, నా జీవ ప్రమాణంగా ఇతర ప్రజల ప్రాణాలను గాని, తమ స్వంత కుమారుల, కుమార్తెల ప్రాణాలను గాని కాపాడలేరని చెబతున్నాను. ఆ చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 14:19 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “లేదా, ఆ దేశం మీద ఒక వ్యాధి ప్రబలేలా నేను చేయవచ్చు. ఆ ప్రజల మీద నా కోపం కుమ్మరిస్తాను. ఆ రాజ్యంనుండి ప్రజలందరినీ, పశువులన్నిటినీ నేను తొలగించి వేస్తాను.
EZE 14:20 ఒకవేళ నొవహు, దానియేలు, యోబు అక్కడ నివసిస్తే, ఆ ముగ్గురు మనుష్యులను నేను రక్షిస్తాను. ఎందువల్ల నంటే వారు మంచి వ్యక్తులు. ఆ ముగ్గురూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. కాని, నా ఆత్మ సాక్షిగా వారు ఇతర ప్రజలను గాని, వారి స్వంత కొడుకులను, కుమారైలను గాని రక్షించలేరు!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 14:21 మళ్లీ నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెప్పాడు: “కావున యెరూషలేము పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో ఆలోచించు. ఆ నాలుగు రకాల శిక్షలనూ ఆ నగరం మీదికి పంపుతాను! ఆ నగరం మీదికి శత్రుసైన్యాలను. క్షామాన్ని, రోగాలను, క్రూర మృగాలను పంపుతాను. ఆ రాజ్యం నుండి ప్రజలను, పశువులను అందరినీ తొలగిస్తాను!
EZE 14:22 కొంతమంది ప్రజలు ఆ దేశంనుండి తప్పించు కుంటారు. వారు తమ కుమారులను, కుమారైలను తీసుకొని నీ సహాయం కొరకు వస్తారు. నిజంగా వారెంత చెడ్డవారో నీవప్పుడు తెలుసుకొంటావు. నేను యెరూషలేము మీదకి రప్పించే కష్టాలను గూర్చి నీవప్పుడు యోచించి అవి వారికి తగినవేనని నీవనుకుంటావు.
EZE 14:23 నీవు వారి జీవన విధానాన్ని, వారు చేసే చెడుకార్యాలను చూస్తావు. నేనా ప్రజలను శిక్షించటానికి తగిన కారణమున్నట్లు నీవు అప్పుడు తెలుసుకుంటావు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 15:1 మరల దేవుని వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 15:2 “ఓ నరపుత్రుడా, అడవిలో నరికి తెచ్చిన చిన్న కొమ్మల కన్నా ద్రాక్షాతీగ పుల్లలు ఏమైనా మిన్నవయినవా? కాదు!
EZE 15:3 ద్రాక్షా తోటల నుంచి తెచ్చిన పుల్లలను ఏ పనికైనా నీవు వినియోగించగలవా? లేదు! ఆ కట్టెను పాత్రలు తగిలించేరాటలకైనా నీవు వినియోగించగలవా? లేదు!
EZE 15:4 ప్రజలా పుల్లలను కేవలం నిప్పులో వేస్తారు. కొన్ని పుల్లలు రెండు చివరలా మండుతూ మధ్య భాగం పొగకమ్మి నల్లబడతాయి. అంతేగాని పుల్లలు పూర్తిగా తగులబడవు. ఆ సగం కాలిన పుల్లతో నీవేమైనా చేయగలవా?
EZE 15:5 ఆ పుల్ల కాలక ముందు దానితో నీవు ఏమీ చేయలేకపోతే, నిజానికి అది కాలిన తరువాత దానితో నీవు ఏమి చేయగలవు!
EZE 15:6 కావున ద్రాక్షా తోటలో తేచ్చిన పుల్లలూ కేవలం అడవిలో తెచ్చిన పుల్లల మాదిరే వుంటాయి. ప్రజలా పుల్లలను నిప్పులో వేస్తారు. నిప్పు వాటిని కాల్పివేస్తుంది. అదేరకంగా, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను నేను అగ్నిలో పడవేస్తాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 15:7 “ఆ ప్రజలను నేను శిక్షిస్తాను. కాని వారిలో కొంతమంది పూర్తిగా కాలని పుల్లల వంటివారు. వారు శిక్షింపబడతారు. అంతేగాని వారు సర్వనాశనం చేయబడరు. నేను ఈ ప్రజలను శిక్షించటం నీవు చూస్తావు. ఆ శిక్షించింది యెహోవాయే అని కూడా నీవు తెలుసుకుంటావు!
EZE 15:8 ప్రజలు [బూటకపు దేవుళ్ల] ను ఆరాధించే నిమిత్తం నన్ను వదిలిపెట్టిన కారణంగా, నేను ఆ రాజ్యాన్ని నాశనం చేస్తాను.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
EZE 16:1 మరో పర్యాయం యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు:
EZE 16:2 “నరపుత్రుడా, యెరూషలేము ప్రజలకు వారు చేసిన భయంకర నేరాల విషయం తెలియజెప్పు.
EZE 16:3 నీవు ఇలా చెప్పాలి, ‘యెరూషలేముకు నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు: నీ చరిత్రవైపు ఒకసారి చూడు. నీవు కనానులో జన్మించావు. నీ తండ్రి అమోరీయుడు. నీ తల్లి హిత్తీయురాలు.
EZE 16:4 యెరూషలేమా, నీవు పుట్టిన రోజన నీ బొడ్డు కోయటానికి ఒక్కరు కూడా లేరు. నిన్ను శుభ్రపర్చటానికి నీ మీద ఎవ్వరూ ఉప్పు పెట్టి స్నానం చేయించలేదు. నీకు ఎప్పురూ పొత్తిగుడ్డలు చుట్టలేదు.
EZE 16:5 యెరూషలేమా, నీవు అప్పుడు ఒంటరిదానవు. నీ కొరకు ఎవ్వరూ బాధపడలేదు. నిన్ను గూర్చి ఎవ్వరూ శ్రద్ధ తీసుకోలేదు. యెరూషలేమా, నీవు పుట్టిన రోజునే నీ తలిదండ్రులు నిన్నుపొలాల్లో పారవేశారు. నీవు అప్పటికి ఇంకా రక్తంతోను, మావితోను కప్పబడి ఉన్నావు.
EZE 16:6 “‘అప్పుడు నేను (దేవుడు) అటుగా వేళ్లు చున్నాను. నీవు రక్తంలో తన్నుకుంటూ అక్కడ పడివుండటం నేను చూశాను. నీవు రక్తంతో కప్పబడివున్నావు. కాని నేను, “నీవు బతుకుగాక!” అని అన్నాను. అవును. నీవు రక్తంతో కప్పబడినావు. కాని, “నీవు బతుకుగాక!” అని నేనన్నాను.
EZE 16:7 పొలంలో మొక్కలా నీవు పెరిగేటందుకు నేను సహాయం చేశాను. నీవు అలా, అలా పెరిగవు. నీవు కన్యకవయ్యావు. నీవు ఋతుమతివయ్యావు. నీ చన్నులు పెరిగాయి నీ తల వెంట్రుకలు పెరిగాయి. అయినా, నీవు ఇంకా నగ్నంగా దిసమొలతో ఉన్నావు.
EZE 16:8 నేను నిన్ను తేరిపార చూశాను. ప్రేమకు తగిన వయస్సు నీకు వచ్చినట్లు గమనించాను. కావున నా వస్త్రములు నీమీద వేసి, నీ నగ్నత్వాన్ని కప్పివేశాను. నిన్ను వివాహమాడటాకి అభయమిచ్చాను. నాతో ఒక అంగీకారానికి వచ్చాను. అంతే; నీవు నాదానివయ్యావు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 16:9 “‘నేను నిన్ను నీటితో కడిగాను. నీ రక్తాన్ని కడిగాను. నీ వంటికి చమురు రాశాను.
EZE 16:10 నీకు అందమైన బట్టలు, మెత్తని చర్మపు పాదరక్షలు ఇచ్చాను. నేను నీకు నారతో ఒక తలకట్టు, భుజాలమీద వేసుకొనే పట్టు బట్టను ఇచ్చాను.
EZE 16:11 పిమ్మట నీకు కొన్ని ఆభరణాలు ఇచ్చాను. నీ ముంజేతులకు కడియాలు తొడిగాను. నీ మెడలో బంగారు హారం వేశాను.
EZE 16:12 నీకు ముక్కుపుడక చెవికి దుద్దులు, నీ తలకు కిరీటము అమర్చాను.
EZE 16:13 నీవు ధరించిన వెండి బంగారు ఆభరణాలలోను; నార, పట్టు, కుట్టుపని వస్త్రాలలోను నీవు ఎంతో అందంగా కన్పించావు. నీవు మిక్కిలి విలువైన ఆహారం తిన్నావు. నీవు మహా సౌందర్యవతివయ్యావు. నీవు రాణి వయ్యావు!
EZE 16:14 నీవు అందానికి ప్రసిద్ధి చెందావు. ఎందువల్లనంటే నిన్ను అంత లావణ్యవతిగా తీర్చిదిద్దాను!’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 16:15 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “కానీ నీవు నీ అందాన్ని నమ్ముకోవటం ప్రారంభించావు. నీకున్న మంచి పేరును నీవు వినియోగించుకుంటూ, నీవు నా పట్ల విశ్వాస ఘాతకురాలుగా వున్నావు. నీ పక్కగా వెళ్లే ప్రతివాని పటల నీవొక వేశ్యవలె ప్రవర్తించావు. నీకై నీవు వారందరికీ సమర్పించుకున్నావు!
EZE 16:16 నీ అందమైన వస్త్రాలను తీసుకొని, నీ ఆరాధనా స్థలాలను అలంకరించటానికి నీవు వాటిని వినియోగించావు. ఆ స్థలాలలో నీవొక వేశ్యవలె ప్రవర్తించావు. నీ పక్కగా వచ్చిన ప్రతివానికీ నిన్ను నీవు సమర్పించుకున్నావు.
EZE 16:17 పిమ్మట నేను నీకిచ్చిన వినువైన ఆభరణాలను తీశావు. ఆ వెండి బంగారాలను కరిగించి పురుషుల విగ్రహాలు చేయటానికి వినియోగించావు. పైగా వాటితో నీవు వ్యభిచరించావు కూడ!
EZE 16:18 తరువాత అందమైన వస్త్రాలు తీసుకొని ఆ విగ్రహాలకు దుస్తులు తయారు చేశావు. నేను నీకిచ్చిన అత్తరులు, సాంబ్రాణి తీసుకొని, వాటిని విగ్రహాల ముందు వుంచావు.
EZE 16:19 నేను నీకు రొట్టె, తేనె, నూనె ఇచ్చాను. కాని నేనిచ్చిన ఆహారాన్నంతా నీవు నీ విగ్రహాలకు సమర్పించావు. నీ బూటకపు దేవతల తృప్తికొరకు నీవు వాటిని మనోహరమైన పరిమళంగా సమర్పించావు. ఆ బూటకపు దేవతలతో నీవొక వేశ్యవలె వ్యవహరించావు!” నా ప్రభువైన యెహోవా ఈ విషయోలు చెప్పాడు.
EZE 16:20 దేవుడు చెప్పటం కొనసాగించాడు, “నీకూ, నాకూ పిల్లలు పుట్టారు. కాని మన పిల్లల్ని నీవు తీసుకొన్నావు. వారిని నీవు చంపి, ఆ బూటకపు దేవుళ్ళకు అర్పించావు! నీవు నన్ను మోసం చేసి, నన్ను వదిలి ఆ బూటకపు దేవుళ్ళ వద్దకు వెళ్లినప్పుడు చేసిన నీచమైన పనులలో ఇది ఒకటి.
EZE 16:21 నీవు నా కుమారులను నరికి, అగ్నిద్వారా వాళను నీ బూటకపు దేవుళ్ళకు అందించావు.
EZE 16:22 నీవు నన్ను వదిలి, ఈ భయంకరమైన పనులన్నిటికీ పాల్పడ్డావు. నీ చిన్నతనాన్ని నీవు ఒక్క సారి కూడా గుర్తుకు తెచ్చుకోలేదు. నేను నిన్ను కనుగొన్నప్పుడు నీవు దిసమొలతో వున్నట్లు, రక్తంలో కొట్టుకుంట్లున్నటలు నీకు జ్ఞాపకం లేదు.
EZE 16:23 “ఈ చెడు కార్యాలన్నిటి తరువాత, … ఓ యెరూషలేమా, అది నీకు చాలా కీడుగా ఉంటుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు తెలియజేశాడు.
EZE 16:24 “ఈ విషయాలన్నీ చేసిన పిమ్మట, ఆ బూటకపు దేవతను ఆరాధించటానికి నీవొక గుట్టను నిర్మించావు. ప్రతి వీధి చివరా బూటకపు దేవతలను ఆరాధించటానికి నీవు స్థలాలు ఏర్పాటు చేశావు.
EZE 16:25 ప్రతి బాట మొదలయ్యిన చోటా నీవు పూజకై గుట్టలు నిర్మించావు. తరువాత నీవు నీ అందాన్ని భ్రష్టపర్చుకున్నావు. అటుపోయే ప్రతి మనుష్యునీ నీ వలలో వేసుకొనేటందుకు దానిని వినియోగించుకున్నావు. వారికి నీ కాళ్ళు కన్పించేలాగు నీ చీర పైకెత్తావు. తరువాత ఆ మనుష్యులతో నీవొక వేశ్యలా ప్రవర్తించావు.
EZE 16:26 పిమ్మట నీవు కామాతురుడైన నీ పొరుగు వాడైన ఈజిప్టు వద్దకు వెళ్లావు. నన్ను ఆగ్రహపర్చేలా నీవు వానితో అనేకసార్లు వ్యభిచరించావు.
EZE 16:27 కావున నేను నిన్ను శిక్షించాను! నీ బత్తెం (భూమి)లో కొంత భాగాన్ని నేను తీసుకొన్నాను. నీ శత్రువులగు ఫిలిష్తీయుల కుమారైలను (నగరాలు) నీకు వ్యతిరేకంగా వారికి ఇష్టంవచ్చినట్లు చేయనిచ్చాను. నీవు చేసే చెడ్డ పనులపట్ల చివరికి వారు కూడ విభ్రాంతి చెందారు.
EZE 16:28 పిమ్మట నీ కామవాంఛ తీర్చుకోవచానికి నీవు అష్షూరు వెళ్లావు. అక్కడ నీ వార ఛ తీరలేదు. నీకు అసలు తృప్తి అనేది లేదు.
EZE 16:29 అందువల్ల నీవు కనానువైపు తిరిగావు; అటు తరువాత బబలోను (బాబిలోనియా) కు వెళ్లావు. ఆయినా నీకు కామం తీరలేదు.
EZE 16:30 నీ మనస్సు మిక్కిలి బలహీనమయ్యింది. ఆ మనుష్యులందరు (దేశాలు) నిన్ను పాపం చేయటానికి ప్రోత్సహించేలా నీవు అలుసు ఇచ్చావు. నీవు కేవలం అహంకారపు వేశ్యలా ప్రవర్తించావు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 16:31 దేవుడు ఇలా చెప్పసాగాడు: “కాని, నీవు అసలైన వేశ్యలా లేవు. ప్రతి బాట మొదట నీవు నీ గుట్టలను ఏర్పాటు చేశావు; ప్రతి వీధి చివర నీ ఆరాధనా స్థలాలు నెలకొల్పావు. ఆ మనుష్యులందరితో నీవు వ్యభిచరించావు. అయినా, నిజంగా ఒక వేశ్య అడిగినట్లు నీవు వారిని డబ్బు అడగలేదు.
EZE 16:32 నీవు వ్యభిచారివి. నీవు నీ భర్తతో గాకుండా, కొత్త వారితో సంభోగానికి ఇష్ట పడ్డావు.
EZE 16:33 వేశ్యలలో అధిక సంఖ్యాకులు తమ కోర్కె తీర్చుకొనే పురుషులను డబ్బు ఇమ్మని పీడిస్తారు. కాని నీవు మాత్రం అనేకంగా వున్న నీ విటులకు నీ బహుమానాలను, డబ్బును ఇచ్చావు. నీతో వ్యభిచరించడానికి చుట్టూవున్న పురుషులకు డబ్బిచ్చావు.
EZE 16:34 చాలా మంది వేశ్యలకన్నా నీవు భీన్నంగా వున్నావు. చాలా మంది వేశ్యలు పురుషులను డబ్బు ఇమ్మని బాధిస్తారు. కాని నీవు మాత్రం నిన్ను పొందమని నీ విటులకు డబ్బు ఎదురిస్తున్నావు.”
EZE 16:35 ఓ వేశ్యా, యెహోవా నుండి వచ్చిన సందేశం విను.
EZE 16:36 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “నీ స్వంత డబ్బు ఖర్చు పెట్టి నీ విటులకు, హేయమైన దేవతలకు నీ నగ్నత్వాన్ని చూపించి, వారితో వ్యభిచరించావు. నీ పిల్లల్ని నీవు చంపావు. నీవు వారి రక్తాన్ని వారపోశావు. ఆ బూటకపు దేవుళ్ళకు అది నీ కానుక.
EZE 16:37 అందువల్ల నీ విటుల నందరినీ కూడదీస్తున్నాను. నీవు ప్రేమించిన మనుష్యులందరినీ, నీవు అసహ్యించుకున్న మనుష్యులందరినీ తీసుకువస్తాను. వాళ్లందరినీ ఒక్కసారిగా తీసుకొని వచ్చి వారు నీ నగ్న స్వరూపాన్ని చూసేలా చేస్తాను. నీ పూర్తి దిగంబరత్వాన్ని వారు చూస్తారు.
EZE 16:38 అప్పుడు నేను నిన్ను శిక్షిస్తాను. ఒక హంతకురాలిగా, వ్యభిచారిణిగా నీ పాప నిరూపణ చేసి నిన్ను శిక్షిస్తాను. కోప గించిన, అసూయ చందిన ఒక భర్త చేతవలె నీవు శిక్షింపబడతావు.
EZE 16:39 నిన్ను నీ ప్రేమికుల చేతుల్లో పడవేస్తాను. వారు నీ గుట్టలన్నీ ధ్వంసం చేస్తారు. వారు నీ ఆరాధనా స్థలాలన్నీ తగలబెడతారు. వారు నీ బట్టలు చించివేస్తారు. వారు నీ అందమైన ఆభరణాలన్నీ తీసుకొంటారు. వారు నిన్ను నిలువు దోపిడీ చేసి, [నేను నిన్ను కనుగొన్నప్పుడు] వున్నట్లు నగ్నంగా వదులుతారు.
EZE 16:40 వారు ఒక పెద్ద గుంపును తీసుకొని వచ్చి నిన్ను చంపటానికి బండరాళ్ళు విసురుతారు. వారి కత్తులతో నిన్ను ముక్కలుగా నరుకుతారు.
EZE 16:41 వారు నీ ఇంటిని (ఆలయం) తగలబెడతారు. ఇతర స్త్రీలందరూ చూచే విధంగా వారు నిన్ను శిక్షిస్తారు. నీవు వేశ్యా జీవితం గడపకుండా నిన్ను కట్టుదిట్టం చేస్తాను. నీ విటులకు నీవు డబ్బు ఇవ్వకుండా నిన్ను ఆపుతాను.
EZE 16:42 అప్పుడు నేను కోపాన్ని ఆపి, అసూయ చెందకుండా వుంటాను. నేను శాంతిస్తాను. ఆ పిమ్మట నేను మరెన్నడూ కోపగించను.
EZE 16:43 ఈ విషయాలన్నీ ఎందుకు సంభవిస్తాయి? ఎందుకనగా నీవు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఏమి జరిగినదో నీకు జ్ఞాపకం లేదు గనుక. ఆ చెడ్డ పనులన్నీ నీవు చేసి నాకు కోపం కలిగించావు. ఆ చెడు కార్యాలు చేసినందుకు నిన్ను నేను శిక్షించవలసి ఉంది. అయినా నీవు మరిన్ని భయంకరమైన పనులు చేయటానికి వ్యూహం సిద్ధం చేశావు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 16:44 “నిన్ను గురించి చెప్పుకునే ప్రజలందరికీ ఇప్పుడు ఇంకొక విషయం తోడవుతుంది. వారంతా, ‘తల్లిలాగనే కూతురు కూడ’ అని అంటారు.
EZE 16:45 అచ్చం నీవు నీ తల్లి కూతురువే. నీవు నీ భర్తను గురించి గాని, నీ పిల్లలను గురించి గాని శ్రద్ధ చేయవు. నీవు ఖచ్చితంగా నీ సోదరిలా వున్నావు. మీ ఇద్దరూ మీ భర్తలను, మీ పిల్లలను అసహ్యించుకున్నారు. [మీరు మీ తల్లిదండ్రుల వలెనే ప్రవర్తిస్తున్నారు.] నీ తల్లి హిత్తీయురాలు. నీ తండ్రి అమోరీయుడు.
EZE 16:46 నీ పెద్ద సోదరి సమరయ (షోమ్రోను). ఆమె నీకు ఉత్తరంగా తన కుమారైలతో (పట్టణాలు) నివసిస్తోంది. నీ చిన్న సోదరి సొదొమ ఆమె నీకు దక్షిణంగా తన కుమారైలతో (పట్టణాలు) నివసిస్తూ ఉంది.
EZE 16:47 వారు చేసిన మహా పాపాలన్నీ నీవూ చేశావు. కాని నీవింకా ఘోరమైన తప్పు పనులు చేశావు!
EZE 16:48 నేనే ప్రభువును; యెహోవాను. నేను సజీవుడను. నా జీవ ప్రమాణంగా చెపుతున్నాను. నీవు, నీ కుమారైలు చేసినన్ని చెడు కార్యాలు నీ సోదరి సొదొమ, ఆమె కుమారైలు ఎన్నడూ చేయలేదు.”
EZE 16:49 దేవుడు ఇలా చెప్పసాగాడు: “నీ సోదరి సొదొమ, ఆమె కుమారైలు గర్వష్ఠులు. వారికి తినటానికి పుష్కలంగా ఉంది. వారికి కావలసినంత తీరుబడి సమయం ఉంది. వారు పేదలను గాని, నిస్సహాయులను గాని ఆదుకోలేదు.
EZE 16:50 సొదొమ, ఆమె కుమారైలు అతి గర్విష్టులయి నా ఎదుటనే భయంకరమైన పాపాలు చేయటం మొదలు పెట్టారు. వారు చెడుకార్యాలు చేయటం నేను చూసి, వారిని శిక్షించాను.”
EZE 16:51 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు, “నీవు చేసిన చెడుకార్యాలలో సమరయ సగం మాత్రమే చేసింది. సమరయ చేసిన వాటికంటే ఎన్నో ఘోరమైన పనులు నీవు చేశావు! నీ తోబుట్టువుల కంటె నీవు అనేకనేక చెడుకార్యాలు చేశావు. నీతో పోల్చి చూస్తే సొదమ, సమరయ ఎంతో మెరుగు.
EZE 16:52 కావున నీ సిగ్గు నీవు భరించాలి. నీతో పోల్చినప్పుడు నీ తోబట్టువులు మంచివాళ్లుగా కన్పించేలా నీవు ప్రవర్తించావు. నీవు ఘోరమైన చెడుకార్యాలు చేశావు. అందుకు నీవు సిగ్గుపడాలి.”
EZE 16:53 దేవుడు ఇలా చెప్పసాగాడు: “నేను సొదొమను, దాని చుట్టూ వున్న పట్టణాలను నాశనం చేశాను. నేనింకా సమరయను, దాని చుట్టూ వున్న పట్టణాలను. నాశనం చేశాను. మరియు, ఓ యెరూషలేమా, నిన్ను నాశనం చేస్తాను. కాని ఆ నగరాలను నేను మళ్లీ నిర్మిస్తాను. ఓ యెరూషలేమా, నిన్ను కూడా నేను తిరిగి నిర్మిస్తాను.
EZE 16:54 నిన్ను ఓదార్చుతాను. అప్పుడు నీవు చేసిన భయంకరమైన పనులు నీకు జ్ఞాపకం వస్తాయి. నీవు సిగ్గుపడతావు.
EZE 16:55 కావున నీవు, నీ తోబుట్టువులు తిరిగి నిర్మింపబడతారు. సొదొమ, దాని చుట్టూ వున్న పట్టణాలు; సమరయ, దాని చుట్టూ వున్న పట్టణాలు మరియు నీవు, నీ చుట్టూ వున్న పట్టణాలు, అన్నీ తిరిగి నిర్మింపబడతాయి.”
EZE 16:56 దేవుడు ఇలా అన్నాడు: “గతంలో నీవు గర్వంగా వున్నావు. నీ సోదరి సొదొమను నీవు ఎగతాళి చేశావు. కాని మళ్లీ నీవు అలా చేయలేవు.
EZE 16:57 నీవు శిక్షింపబడక ముందు, నీ పొరుగువారు నిన్ను చూచి నవ్వక ముందు నీవది చేశావు. ఎదోము (అరాము) కుమార్తెలు (పట్టణాలు), మరియు ఫిలిష్తీయులు ఇప్పుడు నిన్ను చూచి నవ్వుతున్నారు.
EZE 16:58 వు చేసిన ఘోర పాపాలకు ఫలితం ఇప్పుడు నీవు తప్పక అనుభవించాలి.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 16:59 నీ ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నీవు నీ వివాహ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేదు. మన ఒడంబడికను నీవు గౌరవించలేదు.
EZE 16:60 నీవు యౌవ్వన వయస్సులో వున్నప్పుడు మనం చేసుకొన్న నిబంధన నాకు జ్ఞాపకం ఉంది. నేను నీతో సదా కొనసాగే ఒక నిబంధన చేసుకొన్నాను!
EZE 16:61 నీ తోబుట్టువులను నీ వద్దకు చేర్చుతాను. వారిని నీ కుమార్తెలుగా తయారు చేస్తాను. అది మన నిబంధనలో లేకపోయి నప్పటికీ, నీకొరకు నేనది చేస్తాను. అప్పుడు నీవు చేసిన భయంకరమైన పనులు జ్ఞాపకం చేసుకొని సిగ్గుతో క్రుంగిపోతావు.
EZE 16:62 నీతో నేను చేసుకొన్న ఒడం బడికను కాపాడుతాను. అప్పుడు నేను యెహోవానని నీవు తెలుసుకొంటావు.
EZE 16:63 నేను నీపట్ల ఉదారంగా ఉంటాను. దానివల్ల నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని, నీవు చేసిన పాపకార్యాలను తలచుకొని సిగ్గుతో కుమిలిపోతావు. నేను నిన్ను పరిశుద్దం చేస్తాను. మళ్లీ నీవు ఎన్నడూ సిగ్గు పడనవసరం లేదు!” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
EZE 17:1 తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు,
EZE 17:2 “నరపుత్రుడా! ఇశ్రాయేలు వంశానికి ఈ కథ వినిపించు. దాని అర్థమేమిటో వారినడుగు.
EZE 17:3 వారికి ఇలా చెప్పు: “‘పెను రెక్కల గరుడ పక్షి ఒకటి లెబానోనుకు వచ్చింది. మచ్చలుగల ఈకలు గరుడుడికి మెండుగా ఉన్నాయి.
EZE 17:4 గరుడపక్షి రాజు ఆ పెద్ద దేవదారు వృక్షపు (లెబానోను) తలతుంచి వేసింది. తెంచిన కొమ్మను కనానులోని వ్యాపారస్తుల దేశంలో నాటింది.
EZE 17:5 కనాను నుండి పిదప కొన్ని విత్తనాల (ప్రజల)ను గరుడ పక్షి తీసుకుంది. సారవంతమైన భూమిలో వాటని నాటింది. అది వాటిని మంచి నదీతీరాన నాటింది.
EZE 17:6 ఆ విత్తనం మొలకెత్తి ద్రాక్షా చెట్టయ్యింది. అది మంచి ద్రాక్షాలత. ఆ మొక్క ఎత్తుగా లేదు. అయినా అది ఎక్కువ విస్తీర్ణంలో పాకింది. అది కొమ్మ తొడిగింది. చిన్న కొమ్మలు చాలా పొడుగ్గా పెరిగాయి.
EZE 17:7 మరో పెద్ద రెక్కల గరుడ పక్షి ద్రాక్షా మొక్కను చూసింది. ఆ పక్షికి చాలా ఈకలు ఉన్నాయి. ఆ ద్రాక్షాలత తనను ఈ కొత్త పక్షి సంరక్షించాలని కోరింది. అందువల్ల తన వేళ్లు పక్షివైపు పెరిగేలా చేసింది ఆ మొక్క. దాని కొమ్మలు ఆ పక్షి వైపుకే విస్తరించాయి. అది నాటబడిన పొలాన్ని అధిగమించింది. దాని కొమ్మలు ప్రాకాయి. తనకు నీళ్లు పోయమని కొత్త గరుడపక్షిని కోరింది. ద్రాక్షాచెట్టు.
EZE 17:8 సారవంతమైన భూమిలో నాటబడింది ద్రాక్షామొక్క. మంచి నీటివనరు వున్నచోట నాట బడింది. దాని కొమ్మలు బాగా పెరిగి, కాపు కాయ వలసి ఉంది. అది ఎంతో మేలురకం ద్రాక్షాలత అయివుండేది.’”
EZE 17:9 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “మరి ఆ మొక్క విజయం సాధిస్తుందని మీరనుకుంటున్నారా? లేదు! ఆ కొత్త గరుడపక్షి మొక్కను భూమినుండి పెరికివేస్తుంది. మొక్క వేళ్లను పక్షి నరికివేస్తుంది. వున్న కాయలన్నీ అదే తినేస్తుంది. కొత్త ఆకులన్నీ ఎండి రాలిపోతాయి. మొక్క చాలా బలహీనమవుతుంది. మొక్కను వేళ్లతో లాగివేయటానికి అది గట్టి ఆయుధాలు పట్టటం గాని, బలమైన సైన్య సహాయాన్ని గాని తీసుకోదు.
EZE 17:10 అది నాటబడిన చోట మొక్క పెరుగుతుందా? లేదు! వేడి తూర్పు గాలులు వీస్తాయి. దానితో మొక్క వాడి, చనిపోతుంది. అది నాటిన దగ్గరే చనిపోతుంది.”
EZE 17:11 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 17:12 “ఇశ్రాయేలు ప్రజలకు ఈ కథ వివరించు. ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ నాపై తిరుగు బాటు చేస్తూవున్నారు. వారికి ఈ విషయాలు వివరించు. మొదటి గరుడపక్షి రాజు నెబుకద్నెజరు. అతడు బబులోను (బాబిలోనియా) రాజు. అతడు యెరూషలేముకు వచ్చి రాజును, ఇతర పెద్దలను తీసుకొని పోయాడు. వారిని బబులోనుకు తీసుకొని వెళ్లాడు.
EZE 17:13 పిమ్మట రాజ కుటుంబంలోని ఒకనితో నెబుకద్నెజరు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. ఒక వాగ్దానం చేయమని అతనిని నెబుకద్నెజరు ఒత్తిడి చేశాడు. అందువల్ల అతడు నెబుకద్నెజరు పట్ల రాజ భక్తి కలిగి వుండటానికి మాట ఇచ్చాడు. నెబకద్నెజరు ఇతనిని యూదాకు రాజుగా నియమించాడు. తరువాత అతడు శక్తియుక్తులున్న మనుష్యులందరినీ యూదా నుండి తీసుకొనిపోయాడు.
EZE 17:14 దానితో యూదా ఒక బలహీన రాజ్యంగా మారిపోయింది. అందువల్ల అది రాజైన నెబుకద్నెజరును ఎదిరించలేక పోయింది. యూదా యొక్క నూతన రాజుతో చేసుకొన్న ఒడంబడికను ఆచరించేలా నెబుకద్నెజరు ప్రజలపై ఒత్తిడి తెచ్చాడు.
EZE 17:15 ఆయినప్పటికీ ఈ కొత్త రాజు నెబుకద్నెజరుపై తిరుగుబాటు ప్రయత్నం చేశాడు! అతడు తన దూతలను ఈజిప్టుకు పంపి సహాయం అర్థించాడు. కొత్తరాజు అనేక గుర్రాలను, సైనికులను అడిగాడు. మరి ఈ నూతన యూదా రాజు విజయం సాధిస్తాడని ఇప్పుడు మీరనుకుంటున్నారా? ఒడంబడికను ఉల్లంఘించి, శిక్షనుండి తప్పించుకునేటంత శక్తి ఈ కొత్త రాజుకు ఉన్నదని మీరనుకుంటున్నారా?”
EZE 17:16 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నా జీవ ప్రమాణంగా ఈ కొత్త రాజు బబులోనులో చనిపోతాడని నిశ్చయంగా చెప్పుతున్నాను! ఈ వ్యక్తిని యూదా రాజుగా నెబుకద్నెజరు నియమించాడు. కాని ఇతడు నెబుకద్నెజరుకు ఇచ్చినమాట నిలబెట్టుకోలేదు. ఈ కొత్తరాజు ఒడంబడికను నిరాదరించి విడిచి పెట్టాడు.
EZE 17:17 పైగా ఈజిప్టు రాజు యూదా రాజును రక్షించలేడు. అతడు అనేకమంది సైనికులను పంపవచ్చు. కాని ఈజిప్టుకు వున్న మహా బలసంపత్తి యూదాను రక్షించలేదు. నెబుకద్నెజరు సైన్యం నగరాన్ని పట్టుకొనటానికి మట్టిదారులు, మట్టి గోడలు నిర్మిస్తుంది. అనేకమంది చనిపోతారు.
EZE 17:18 అయినా యూదా రాజు తప్పించుకోలేడు. ఎందుకంటే, తన ఒడంబడిక అతడు అలక్ష్యం చేశాడు. అతడు నెబుకద్నెజరుకు ఇచ్చిన మాట తప్పాడు.”
EZE 17:19 నా ప్రభువైన యెహోవా ఈ ప్రమాణం చేస్తున్నాడు: “నా జీవ ప్రమాణంగా యూదా రాజును శిక్షిస్తానని నిశ్చయంగా చెప్పుతున్నాను. ఎందువల్లనంటే, అతడు నా హెచ్చరి కలను లెక్కచేయలేదు. అతడు మా ఒడంబడికను ఉల్లంఘించాడు.
EZE 17:20 నేను నావల పన్నుతాను. అతడందులో చిక్కుకొంటాడు. అతనిని నేను బబులోనుకు తీసుకొనివచ్చి అక్కడ శిక్షిస్తాను. అతడు నా పై తిరుగుబాటు చేశాడు గనుక నేనతనిని శిక్షిస్తాను.
EZE 17:21 నేనతని సైన్యాన్ని నాశనం చేస్తాను. గొప్ప యోధులగు అతని సైనికులను చంపివేస్తాను. చావగా మిగిలిన వారిని చెల్లాచెదురు చేస్తాను. నేనే యెహావాననీ, నీకు ఈ మాటలు చెప్పినది నేనే అనీ, నీవప్పుడు తెలుసుకొంటావు.”
EZE 17:22 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “పిమ్మట ఎతైన దేవదారు వృక్షపు కొమ్మనొకటి నేను తీసుకొంటాను. వృక్షపు పైభాగాన్నుండి ఒక చిన్న రెమ్మను తీసుకొంటాను. నేనే దానిని చాలా ఎత్తైన పర్వతం మీద నాటుతాను.
EZE 17:23 నేనే దానిని ఇశ్రాయేలులోని ఒక ఎత్తైన పర్వతంపై నాటుతాను. ఆ కొమ్మ ఒక వృక్షంలా పెరుగుతుంది. ఆది బాగా కొమ్మలు వేసి, పండ్లు కాస్తుంది. అది ఒక అందమైన దేవదారు వృక్షమవుతుంది. దాని కొమ్మలపై అనేకమైన పక్షులు కూర్చుంటాయి. అనేకమైన పక్షులు దాని కొమ్మల నీడల్లో నివసిస్తాయి.
EZE 17:24 “నేను పొడవైన వృక్షాలన్నిటినీ నేలకు పడేస్తానని ఇతర చెట్లన్నీ అప్పుడు తెలుసుకొంటాయి. చిన్న చెట్లను పెరగనిచ్చి మహావృక్షాలను చేస్తానని కూడా అవి తెలుసుకొంటాయి. వచ్చని చెట్లు ఎండిపోయేలా, ఎండిన మోడులు చిగురించేలా చేస్తాను. నేనే యెహోవాను నేనేదైనా చేస్తానని చెప్పితే నేనది తప్పక చేస్తాను!”
EZE 18:1 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు:
EZE 18:2 “మీరీ సామెతవల్లిస్తూ ఉంటారు: ‘తల్లిదండ్రులు వుల్లని ద్రాక్ష తింటే పిల్లలపండ్లు పులిశాయి!’ ఇలా మీరెందుకు అంటూ వుంటారు? మీరు పాపంచేస్తే, మీ బదులు భవిష్యత్తులో మరెవ్వడో శిక్షింపబడతాడని మీరనుకుంటున్నారు.”
EZE 18:3 కాని నా ప్రభువైన యెహోవా చెబుతున్నదేమంటే, “నా జీవ ప్రమాణంగా ఇశ్రాయేలు ప్రజలు ఈ సామెత ఇక మీదట నిజమని నమ్మరని నేను మీకు ఖచ్చితంగా చెబుతున్నాను!
EZE 18:4 నేను ప్రతి వ్యక్తినీ ఒకే రకంగా చూస్తాను. ఆ వ్యక్తి తండ్రిగాని, బిడ్డగాని గావచ్చు. పర్వాలేదు. ఎవరైతే పాపం చేశారో ఆ వ్యక్తులే చని పోతారు!
EZE 18:5 “మంచి మనిషి ఎవరైనా వుంటే, ఆ వ్యక్తి జీవిస్తాడు! ఆ మంచి వ్యక్తి ప్రజలయెడల నీతిగా న్యాయంగా వుంటాడు.
EZE 18:6 ఆ సజ్జనుడు పర్వతాలమీదికి వెళ్లి, అక్కడ బూటకపు దేవతలకు అర్పించిన నైవేద్యాలను తినడు. అతడు. ఇశ్రాయేలులో నెలకొల్పిన రోత విగ్రహాలను ప్రార్థించడు. అతడు తన పొరుగువాని భార్యతో వ్యభిచరించే పాపానికి ఒడిగట్టడు. తన భార్య ముట్టయినప్పుడు ఆమెతో సంభోగించడు.
EZE 18:7 ఆ సజ్జనుడు ప్రజల మంచితనాన్ని ఆసరాగా తీసుకోడు, ఎవ్వరేగాని అతని వద్దకు అప్పుకు వచ్చినప్పుడు, మంచి వ్యక్తి వస్తువులను తాకట్టు పెట్టుకొని డబ్బు ఇస్తాడు. అప్పు తీసుకొన్నవాడు తిరిగి చెల్లించినప్పుడు, సజ్జనుడు తన డబ్బ తీసుకొని తాకట్టు వస్తువులను ఇచ్చివేస్తాడు. ఆకలిగొన్న వారికి సజ్జనుడు అన్నం పెడతాడు. కట్టు బట్టలు లేక బాధపడేవారికి అతడు వస్త్రదానం చేస్తాడు.
EZE 18:8 అప్పు కోరి అతనిని ఆశ్రయిస్తే మంచి వ్యక్తి ఆ వచ్చిన వానికి డబ్బు ఇస్తాడు. కాని అతడా ఋణానికి వడ్డీ తీసుకో. మంచివాడు కపటంగా ప్రవర్తించటానికి నిరాకరిస్తాడు. అతడు ప్రతి మనిషి పట్లా ఎల్లప్పుడూ ఉదారంగా ప్రవర్తిస్తాడు. ప్రజలతనిని నమ్మవచ్చు.
EZE 18:9 అతడు నా కట్టడులను అనుసరిస్తాడు. అతడు నా నిర్ణయాలను గురించి ఆలోచించి, ధర్మవర్తనుడై నమ్మ దగినవాడుగా వుండటం నేర్చుకుంటాడు. అతడు సజ్జనుడు. అందుచేత అతడు జీవిస్తాడు.
EZE 18:10 “కాని ఆ మంచి వ్యక్తికీ ఆటువంటి మంచి పనులేవీ చేయని ఒక కుమారుడు వుండవచ్చు. ఆ కుమారుడు వస్తువులను దొంగిలించి, నరహత్య చేయవచ్చు.
EZE 18:11 అతడు ఈ చెడ్డ పనులలో దేనినైనా చేయవచ్చు. పర్వతాల మీదకి వెళ్లి బూటకపు దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలను తినవచ్చు. ఆ చెడ్డ కుమారుడు తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించి పాపం చేయవచ్చు.
EZE 18:12 అతడు పేదలను, నిస్సహాయులను అలక్ష్యము చేయవచ్చు. అతడు ప్రజల మంచితనాన్ని వినియోగ పర్చుకోవచ్చు. అప్పు తీసుకున్నవాడు సొమ్ము చెల్లించినప్పుడు, అతడు తాకట్టు వస్తువును తిరిగి ఇచ్చివేయక పోవచ్చు. ఆ చెడ్డ కుమారుడు రోత పుట్టించే విగ్రహాలను ఆరాధించి, ఇతర భయంకరమైన పనులు చేయవచ్చు.
EZE 18:13 ఆ దుష్టుడైన కుమారుని వద్ద డబ్బు అప్పు తీసుకొనే అవసరర ఎవరికైన కలుగవచ్చు. అతడు నానికి అప్పు అవ్వవచ్చు. కాని, అతడిచ్చిన అప్పుమీద వడ్డీ చెల్లించమని అప్పుదారుని అతడు పీడిస్తాడ. అందువల్ల ఆ చెడ్డ కుమారుడు జీవించడు. అతడు చేసిన ఘోరమైన పనులకు అతడు చంపబడతాడు. పైగా అతని చావుకు అతడే బాధ్యుడు.
EZE 18:14 “ఇప్పుడా దుష్టుడైన కుమారునికి ఒక కుమారుడు కలుగవచ్చు. ఈ కుమారుడు తన తండ్రి చేసే దుష్కార్యాలను చూసి, వాటిని నిరసించి తన తండ్రిలాగా ఉండకపోవచ్చు. వాడు ప్రజలందరినీ సమాదాన పరుస్తాడు.
EZE 18:15 ఆ మంచి కుమారుడు కొండల మీదికి వెళ్లి చిల్లర దేవుళ్లను ఆరాధించడు, ఆ దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలను తినడు. ఇశ్రాయేలులో నెలకొల్పిన రోత విగ్రహాలకు అతడు ప్రార్థన చేయడు. అతడు తన పొరుగువాని భార్యతో వ్యభిచార పాపానికి ఒడిగట్టడు.
EZE 18:16 ఆ మంచి కుమారుడు ప్రజల మంచితనాన్ని ఉపయోగించు కోకుండా ఉండవచ్చు. ఏ వ్యక్తి అయినా తన వద్దకు అప్పుకోరివస్తే, అతడు వస్తువులు తాకట్టు పెట్టుకొని డబ్బు ఇస్తాడు. మళ్లీ అప్పు తీసుకొన్నవాడు డబ్బు చెల్లిస్తే, ఆ మంచి కుమారుడు తాకట్టు వస్తువులు తిరిగి ఇచ్చివేస్తాడు. మంచి కుమారుడు ఆకలిగొన్న వారికి అన్నం పెడతాడు. అవసరమైన వారికి అతడు వస్త్రదానం చేస్తాడు.
EZE 18:17 అతడు పేదలకు సహాయం చేస్తాడు. ఎవరైనా తనవద్ద అప్పు తీసుకో తలంచితే, మంచి కుమారుడు అతనికి డబ్బు ఇస్తాడు. కాని అతడు ఆ అప్పుమీద వడ్డీ తీసుకొనడు! మంచి కుమారుడు నా న్యాయాన్ని శిరసావహిస్తాడు. నా కట్టడలను పాటిస్తాడు. తన తండ్రి చేసిన పాపాలకు ఆ మంచి కుమారుడు చంపబడడు! ఆ మంచి కుమారుడు జీవిస్తాడు.
EZE 18:18 తండ్రి ప్రజలను బాధించవచ్చు. వస్తువులను దొంగిలించవచ్చు. అతడు అతని ప్రజలకు ఏ మంచిని ఎన్నడూ చేసియుండడు! ఆ తండ్రి తన పాపాల కారణంగానే చనిపోతాడు. ఆయితే, కుమారుడు మాత్రం అతని తండ్రి పాపాలకు శిక్షింపబడడు.
EZE 18:19 “తన తండ్రి పాపాలకు కుమారుడు ‘ఎందుకు చంపబడడు? అని నీవు అడుగవచ్చు. అందుకు కారణం కుమారుడు న్యాయవర్తనుడై మంచి పనులు చేయటమే! అతడు నా కట్టడలను మిక్కిలి శ్రద్ధగా అనుసరించి నడచుకొన్నాడు! అందువల్ల అతడు జీవిస్తాడు.
EZE 18:20 చంపబడేది పాపాలకు ఒడిగట్టిన వ్యక్తి మాత్రమే! ఒక కుమారుడు అతని తండ్రి పాపాలకు శిక్షింపబడడు. ఒక తండ్రి తన కుమారుడు చేసిన తప్పులకు గాను శిక్షింపబడడు. ఒక మంచి వ్యక్తి మంచి తనం అతనికి మాత్రమే చెంది ఉంటుంది. ఒక చెడ్డ వ్యక్తి చెడుతనం అతనికి మాత్రమే పరిమితమై ఉంటుంది.
EZE 18:21 “ఒకవేళ చెడ్డ వ్యక్తి తన జీవిత విధానాన్ని మార్చుకుంటే అతడు జీవిస్తాడు. అతడు చనిపోడు. అతడు గతంలో చేసిన చెడ్డపనులన్నీ కొనసాగించటం మానివేస్తాడు. నా కట్టడలన్నీ అతడు శ్రద్ధతో పాటిస్తాడు. అతడు న్యాయవర్తనుడై, మంచివాడు అవుతాడు.
EZE 18:22 అతడు చేసిన చెడ్డకార్యాలను దేవుడు గుర్తుపెట్టుకోడు. అప్పుడు దేవుని దృష్టిలో అతని మంచి తనమే వుంటుంది! అందవల్ల ఆ వ్యక్తి జీవిస్తాడు!”
EZE 18:23 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “చెడ్డవాళ్లంతా చనిపోవాలని నేను కోరుకోవటం లేదు. వారు జీవించేటందుకు వారు తమ జీవన విధానం మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను!
EZE 18:24 “ఇప్పుడు ఒక మంచి వ్యక్తి తన మంచితనాన్ని విడనాడవచ్చు. తన జీవన విధానాన్ని మార్చుకొని గతంలో చెడ్డమనిషి చెసిన ఘోరమైన పాపాలన్నీ చెయవచ్చు. అలాంటి వ్యక్తి జీవిస్తాడా? కావున ఆ మంచి మనిషి మారిపోయి చెడ్డవాడయితే, అతడు పూర్వం చేసిన మంచి పనులేవీ దేవుడు గుర్తు పెట్టుకోడు. ఆ వ్యక్తి తనకు వ్యతిరేకి అయ్యాడనీ, పాపం చేయటం మొదలు పెట్టాడనీ మాత్రం దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. అందువల్ల అతని పాపాల కారణంగా అతడు చనిపోతాడు.”
EZE 18:25 దేవుడు ఇలా చెప్పాడు: “ప్రజలారా మీరు, ‘మా ప్రభువైన దేవుడు న్యాయంగా ప్రవర్తించడు’ అని అంటారు. కాని ఇశ్రాయేలు వంశములారా, వినండి. నేను న్యాయంగానే ఉన్నాను. మీరే న్యాయంగా లేరు.
EZE 18:26 ఒక మంచి మనిషి మారిపోయి, చెడ్డవాడైతే అతని చెడ్డకార్యాలకు ఫలితంగా అతడు చనిపోతాడు.
EZE 18:27 ఒక చెడ్డ వ్యక్తి మారి, మంచివాడై, మంచికార్యాలు చేస్తే, అతడు తన జీవితాన్ని రక్షించుకుంటాడు. అతడు బతుకుతాడు!
EZE 18:28 తాను పూర్వం ఎంత చెడ్డవాడో తెలుసుకొని, నావద్దకు తిరిగి వచ్చిన వాడవుతాడు. తాను గతంలో చేసిన చెడ్డకార్యాలు మళ్లీ చేయటం మానటంతో అతడు జీవిస్తాడు! అతడు మరణించడు!”
EZE 18:29 ఇశ్రాయేలు ప్రజలు, “అది న్యాయం కాదు! మా ప్రభువైన యెహోవా న్యాయంగా వుండనేరడు!” అని అన్నారు. అందుకు దేవుడు ఇలా అన్నాడు: “నేను న్యాయంగానే ఉన్నాను. మీరే న్యాయంగా లేరు.
EZE 18:30 ఓ ఇశ్రాయేలు వంశమా, ఎందువల్లనంటే, నేను ప్రతి వ్యక్తికీ అతను చేసిన కార్యాలను అనుసరించి న్యాయనిర్ణయం చేస్తాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “కావున, మీరు నా వద్దకు తిరిగిరండి. చెడుకార్యాలు చేయటం మానండి! ఆ ఘోరమైన వస్తువులు మీరు పాపం చేయటానికి కారణం కానీయకండి!
EZE 18:31 మీరు చేసిన భయంకర వస్తువులన్నీ పారవేయండి. అవన్నీ కేవలం మీరు పాపం చేయటానికే దోహదం చేస్తాయి! మీ హృదయాలను, ఆత్మలను మార్చుకోండి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని మీరెందుకు చనిపోయేలాగు చేసుకొంటున్నారు?
EZE 18:32 నేను మిమ్మల్ని చంపకోరటం లేదు! దయచేసి నా వద్దకు తిరిగి రండి. జీవించండి!”ఆ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పాడు.
EZE 19:1 దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు: “ఇశ్రాయేలు నాయకులను గురించి నీవు ఈ విషాద గీతం ఆలపించాలి:
EZE 19:2 “‘నీ తల్లి ఆడసింహంలా, మగసింహాల మధ్య పడుకొని ఉంది. ఆమె యౌవ్వనంలో ఉన్న మగ సింహాలతో పడుకొని ఉంది. దానికి చాలా మంది పిల్లలున్నారు.
EZE 19:3 ఆ సింహపు పిల్లల్లో ఒకటి లేచింది. అది బలమైన యువ సింహంలా తయారయ్యింది. అది తన ఆహారాన్ని వేటాడం నేర్చుకుంది. అది ఒక మనుష్యుని తినేసింది.
EZE 19:4 “‘అది గర్జించటం ప్రజలు విన్నారు. తాము పన్నిన బోనులో దానిని పట్టుకున్నారు! దాని నోటికి గాలం తగిలించారు. వారా కొదమ సింహాన్ని ఈజిప్టుకు తీసుకొని వెళ్లారు.
EZE 19:5 “‘తల్లి తన యువసింహం నాయకత్వం వహిస్తుందనుకుంది. కాని ఆమె ఆశలు అడియాశలయ్యాయి. అందువల్ల ఆమె తన పిల్లల్లో మరో దానిని తీసుకుంది. దానిని యువ సింహంలా తీర్చిదిద్దింది.
EZE 19:6 అది పెద్ద సింహాలతో కలిసి వేటకెళ్లింది. అది భయంకర సింహంలా తయారయ్యింది. అది తన ఆహారం వేటాడ నేర్చుకుంది. అది ఒక మనుష్యుని చంపి తినివేసింది.
EZE 19:7 ఆది రాజభవనాల మీద దాడి చేసింది. అది నగరాలను నాశనం చేసింది. దాని గర్జన విన్న ప్రతివాడూ నోట మాట లేక నివ్వెరపోయాడు.
EZE 19:8 అప్పుడు తనచుట్టూ నివసిస్తున్నవారు దానికైవలపన్నారు. అది వారి వలలో చిక్కిపోయింది.
EZE 19:9 వారు దానికి కొక్కీలు వేసి బంధించారు. వారు దానిని తమ బోనులో ఇరికించారు. వారు దానిని బబులోను రాజు వద్దకు తీసుకొని పోయారు. అందువల్ల ఇశ్రాయేలు పర్వతాలలో ఇప్పుడు మీరు గర్జన వినలేరు.
EZE 19:10 “‘మీ తల్లి నీటి పక్క నాటిన ద్రాక్షాలతలాంటిది. దానికి నీరు పుష్కలంగా ఉంది. అది చాలా ఫలభరితమైన దళమైన ద్రాక్షా తీగలతో పెరిగింది.
EZE 19:11 ఆ పిమ్మట దానికి కొన్ని పెద్ద కొమ్మలు పెరిగాయి. అవి కొన్ని చేతికర్రల్లా ఉన్నాయి. ఆ కొమ్మ ఒక రాజదండాల్లా ఉన్నాయి. ఆ ద్రాక్షాలత అలా, అలా పొడుగ్గా, చాలా కొమ్మలతో మేఘాలను అంటేలా పెరిగింది.
EZE 19:12 కాని ఆ ద్రాక్షా చెట్టు వేర్లతో పెరికివేయబడి, నేలమీద కూల్చి వేయబడింది. తూర్పుదిక్కు వేడిగాడ్పులు వీయగా దాని పండ్లు ఎండి పోయాయి. దాని పెద్ద కొమ్మలు విరిగి పోయాయి. అవి అగ్నిలో వేయబడ్డాయి.
EZE 19:13 “‘ఇప్పుడా ద్రాక్ష మొక్క ఎడారిలో నాటబడింది. అది నీరులేక, దాహం పుట్టంచే ప్రాంతం.
EZE 19:14 దాని పెద్ద కొమ్మ నుండి నిప్పు చెలరేగింది. నిప్పు దాని రెమ్మలను, పండ్లను నాశనం చేసింది. అందుచే బలమైన చేతికర్రాలేదు; రాజదండమూ లేదు’ ఇది ఒక విషాద గీతం. అది వినాశనాన్ని గూర్చిపాడబడింది.”
EZE 20:1 ఒక రోజు ఇశ్రాయేలు పెద్దలు యెహోవా సలహా తీసుకొనగోరి నా వద్దకు వచ్చారు. ఇది ప్రవాసంలో ఏడవ సంవత్సరం ఐదవ నెల (జులై), పదవ రోజున జరిగింది. పెద్దలు (నాయకులు) నా ముందు కూర్చున్నారు.
EZE 20:2 అప్పుడు యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు:
EZE 20:3 “నరపుత్రుడా, ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడు. వారితో ఇలా చెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు, మీరంతా నా సలహా తీసుకోదలచి వచ్చారా? అలా వచ్చివుంటే, దానిని మీకు నేను యివ్వను. ఈ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పియున్నాడు.’
EZE 20:4 నీవు వారికి తీర్పు తీర్చుతావా? నరపుత్రుడా, నీవు వారికి న్యాయ నిర్ణయం చేస్తావా? వారి తండ్రులు చేసిన భయంకర నేరాలను గూర్చి నీవు వారికి తెలియజెప్పాలి.
EZE 20:5 వారికి నీవిలా చెప్పాలి, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలును ఎంపిక చేసుకొన్నప్పుడు, యాకోబు వంశం కొరకు నా చేయెత్తి ఈజిప్టు వారికి ఒక వాగ్దానం చేశాను. అక్కడ నన్ను నేను ప్రత్యక్షపరచుకొన్నాను. నా చేయెత్తి ఇలా చేప్పాను: “నేను మీ దేవుడనైన యెహోవాను.”
EZE 20:6 ఆ రోజున మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి, నేను మీకు ఇవ్వబోతున్న దేశంలోకి సడిపిస్తానని వాగ్దానం చేశాను. ఆది చాలా మంచి వస్తువులున్న దేశం. దేశాలన్నిటిలోకి అది సుందరమైనది!
EZE 20:7 “‘రోత పుట్టించే విగ్రహాలన్నిటినీ సారవేయమని నేను ఇశ్రాయేలు వంశం వారికి చెప్పాను. ఈజిప్టు నుండి తేబడిన హేయమైన విగ్రహాలతో వారు కూడ హేయమైనవారుగా తయారు కావద్దని నేను చెప్పియున్నాను. నేను మీ దేవుడనైన యెహోవాను”
EZE 20:8 కాని వారు నాపై తిరుగుబాటు చేసి, నేను చెప్పేది వినలేదు. ఈజిప్టువారి అపవిత్రమైన విగ్రహాలను పారవేయలేదు. వారి అపవిత్ర విగ్రహాలను ఈజిప్టులో వదిలివేయలేదు. కావున నేను (దేవుడు) ఉగ్రమైన నా కోపాన్ని చూపించటానికి ఈజిప్టులోనే వారిని నాశనం చేయదల్చాను.
EZE 20:9 అయినా నేను వారిని సంహరించలేదు. ఈజిప్టు నుండి నా ప్రజలను బయటకు తీసుకొని వస్తానని గతంలోనే వారు నివసిస్తున్న చోటి ప్రజలకు తెలియజేశాను. నా మంచి పేరును నేను పాడుచేయదల్చుకోలేదు. అందువల్ల ఆ అన్యప్రజల ముందు ఇశ్రాయేలును నాశనం చేయలేదు.
EZE 20:10 ఇశ్రాయేలు వంశాన్ని నేను ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చాను. వారిని ఎడారిలోకి నడిపించాను.
EZE 20:11 అక్కడ నేను వారికి నా కట్టడలను తెలియజేశాను. నా నియమ నిబంధనలన్నీ వారికి తెలియజెప్పాను. నా కట్టడలను పాటించిన వ్యక్తి జీవిస్తాడు.
EZE 20:12 ప్రత్యేక విశ్రాంతి రోజులన్నిటి గురించి కూడా నేను వారికి చెప్పాను. నాకు, వారికి మధ్య ఆ సెలవు రోజలు ఒక ప్రత్యేక సంకేతం. అవి నేను యెహోవానని, వారిని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకున్నానని తెలియజేస్తాయి.
EZE 20:13 “‘అయినా ఇశ్రాయేలు వంశం ఎడారిలో నా మీద తిరుగుబాటు చేసింది. వారు నా న్యాయాన్ని పాటించలేదు. వారు నా కట్టడలను అనుసరించటానికి నిరాకరించారు. పైగా అవి ఎంతో మంచి నియమాలు. ఏ వ్యక్తి అయినా ఆ నియమాలను పాటిస్తే, అతడు జీవిస్తాడు. నేను నియమించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను వారు సామాన్య రోజులుగా పరిగణించారు. అనేకసార్లు వారా విశ్రాంతి రోజులలో పనిచేశారు. నా ఉగ్రమైన కోపాన్ని వారు చవిచూడటానికి నేను వారిని ఎడారిలో నాశనం చేయ సంకల్పించాను.
EZE 20:14 అయినా నేను వారిని సంహరించలేదు. నేను ఇశ్రాయేలును, ఈజిప్టు నుండి వెలికి తీసుకొని రావటం ఇతర దేశాలు చూశాయి. నాకున్న మంచి పేరును నేను పాడుచేసుకోదల్చలేదు. అందువల్ల అన్యప్రజల ముందు నేను ఇశ్రాయేలును సంహరించలేదు.
EZE 20:15 ఎడారిలోని ఆ ప్రజలకు నేను మరొక వాగ్దానం చేశాను. వారికి నేనివ్వబోయే దేశంలోకి వారిని నేను తీసుకొని వెళ్లనని గట్టిగా చెప్పాను. ఆది పాలు, తేనె ప్రవహించే సుభిక్షమైన దేశం. అది దేశాలన్నిటిలోకీ సుందరమైన దేశం!
EZE 20:16 “‘ఇశ్రాయేలు ప్రజలు నా కట్టడలను పాటించ నిరాకరించారు. వారు నా విధులను అనుసరించలేదు. నేను నిర్ణయించిన విశ్రాంతి రోజులను అతి సామాన్యమైనవిగా వారు పరిగణించారు. వారి హృదయాలు ఆ అపవిత్ర విగ్రహాలమీద లగ్నమై వుండుటచేత వారీ పనులన్నీ చేశారు.
EZE 20:17 కాని వారి స్థితిపట్ల నేను విచారం వ్యక్తం చేశాను. వారిని నేను సంహరించలేదు. ఎడారిలో వారిని నేను సర్వనాశనం చేయలేదు.
EZE 20:18 నేను వారి పిల్లలతో ఎడారిలో మాట్లాడాను. నేను వారితో, “మీరు మీ తల్లిదండ్రులవలె ప్రవర్తించవద్దు. అపవిత్ర విగ్రహాల జోలికిపోయి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. వాటి ధర్మాన్ని మీరు అనుసరించవద్దు. వాటి ఆజ్ఞలను మీరు పాటించవద్దు.
EZE 20:19 నేను యెహోవాను. నేను మీ దేవుణ్ణి. నా ధర్మాన్ని అనుసరించండి. ఆజ్ఞాపాలన గావించండి. నేను చెప్పే పనులు చేయండి.
EZE 20:20 నేను నిర్దేశించిన విశ్రాంతి రోజులు మీకు అతి ముఖ్యమైనవని చూపించండి. అవి నాకును, మీకును మధ్య ఒక ప్రత్యేక సంకేతమని గుర్తు పెట్టుకోండి. నేనే యెహోవాను. నేను మీ దేవుడనని ఆ సెలవు రోజులు మీకు సూచిస్తాయి.”
EZE 20:21 “‘కాని ఆ పిల్లలు నాకు వ్యతిరేకులయ్యారు. వారు నా కట్టడలను పాటించలేదు. వారు నా ఆజ్ఞలను లెక్క చేయలేదు. నేను వారికి చెప్పిన పనులు చేయలేదు. అవన్నీ మంచి న్యాయ సూత్రాలు. ఎవ్వరు వాటిని అనుసరించినా, ఆ వ్యక్తి జీవిస్తాడు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను ప్రాముఖ్యంలేని వాటినిగా వారు పరిగణించారు. అందువల్ల నేను ఎడారిలో నా ఉగ్రమైన కోపం చూపటానికి వారిని సర్వనాశనం చేద్దామనుకున్నాను.
EZE 20:22 కాని నాకు నేనే ఆగిపోయాను. నేను ఇశ్రాయేలును ఈజిప్టు నుండి బయటకు తీసుకొని రావటం ఇతర రాజ్యాలు చూశాయి. నాకున్న మంచి పేరును నేను పాడు చేసుకోదల్చలేదు. అందువల్ల నేను ఇశ్రాయేలును అన్య జనుల ముందు సంహరించలేదు.
EZE 20:23 అందువల్ల ఎడారిలో వారికి నేను ఇంకొక మాట చెప్పాను. వారిని ఇతర రాజ్యాలలోకి చెదరగొడతాననీ, వారిని అనేక దేశాలకు పంపించి వేస్తాననీ చెప్పాను.
EZE 20:24 “‘ఇశ్రాయేలు ప్రజలు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. వారు నా కట్టడలను అనుసరించటానికి నిరాకరించవారు. వారు నేనిచ్చిన ప్రత్యేక విశ్రాంతి రోజులను ముఖ్యమైనవిగా పరిగణించలేదు. వారి తండ్రుల అపవిత్ర విగ్రహాలను వారు పూజించారు.
EZE 20:25 అందువల్ల వారికి నేను చెడ్డ నీతిని ప్రసాదించాను. వారు బతకటానికి ఆధారం కాని ఆజ్ఞలను నేను వారికి ఇచ్చాను.
EZE 20:26 వారి కానుకలతో వారిని వారే మలిన పర్చుకొనేలా వారిని వదిలివేశాను. వారు తమ మొదటి సంతానాన్ని సహితం బలి ఇవ్వటం మొదల పెట్టారు. ఈ రకంగా ఆ ప్రజలను నేను నాశనం చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు.’
EZE 20:27 కావున, ఓ నరపుత్రుడా, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వంశంతో మాట్లాడు. వారికిలా చేప్పు, ‘నా ప్రభవైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నాకు వ్యతిరేకంగా చెడుమాటలు పలికారు. నాపై కుట్రపన్నారు.
EZE 20:28 అయినా నేను వారికి ఇస్తానని వాగ్దానం చేసిన రాజ్యానికి వారిని తీసుకొని వచ్చాను. వారు కొండలను, పచ్చని చెట్లను అన్నిటినీ చూసి పూజలు చేయటానికి ఆ ప్రదేశాలకు వెళ్లేవారు. వారు బలులను, కోప కానుకలను ఆ ప్రదేశాలన్నిటికీ తీసుకొని వెళ్లారు. సువాసన వేసే వారి బలులన్నీ వారు అర్పించారు. ఆ స్థలాలలో పానార్పణాలు కూడా వారు అర్పించారు.
EZE 20:29 వారా ఉన్నత స్థలాలకు ఎందుకు వెళ్తున్నారని నేను వారిని అడిగాను. ఆ ఆరాధనా స్థలాలన్నీ ఈనాటికీ ఉన్నత స్థలాలు అనే పిలవబడుతున్నాయి.’”
EZE 20:30 దేవుడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలు ఆ చెడు కార్యాలన్నీ చేశారు. అందువల్ల ఇశ్రాయేలు వంశంవారితో మాట్లాడు. వారికి ఈ రకంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు. మీ పూర్వీకులు చేసిన పనులనే చేస్తూ మిమ్ము మీరు మలిన పర్చుకుంటున్నారు. మీరు వేశ్య వలె ప్రవర్తిస్తున్నారు. మీ పూర్వీకులు ఆరాధించిన భయంకర దేవుళ్ళను ఆరాధించటానికి మీరు నన్ను వదిలివేశారు.
EZE 20:31 మీరు కూడా అవే రకమైన కానుకలు సమర్పిస్తున్నారు. మీ బూటకపు దేవతలకు కానుకగా మీ పిల్లలను అగ్నిలో పడవేస్తున్నారు. ఈనాడు ఆ రోత విగ్రహాలను ఆశ్రయించి మిమ్మల్ని మీరు మరింత మలిన పర్చుకుంటున్నారు! నేను మిమ్మల్ని నా వద్దకు రానిచ్చి, నా సలహా తీసుకోనివ్వాలని మీరు నిజంగా అనుకుంటున్నారా? నేను ప్రభువును; యెహోవాను. నా జీవ ప్రమాణంగా మీ ప్రశ్నలకు సమాధానమివ్వను. మీకు సలహా ఇవ్వను!
EZE 20:32 ఇతర రాజ్యాల మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు మీరు అంటూ ఉంటారు. కానీ మీ అభిప్రాయాలు, ఆశలూ ఎప్పటికీ నెరవేరవు. ఇతర జనాంగముల ప్రజల మాదిరిగా మీరు నివసిస్తున్నారు. కొయ్యముక్కలను, రాతి ముక్కలను (విగ్రహాలు) మీరు కొలుస్తారు!’”
EZE 20:33 నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పుతున్నాడు, “నా జీవ ప్రమాణంగా, రాజునై మిమ్మల్ని పరిపాలిస్తానని వాగ్దానం చేస్తున్నాను. కాని నా శక్తివంతమైన హస్తాన్ని ఎత్తి మిమ్మల్ని శిక్షిస్తాను. మీపట్ల నా కోపాన్ని చూపిస్తాను!
EZE 20:34 మిమ్మల్నందరినీ ఈ అన్యదేశాల నుండి వెలికి తెస్తాను. ఈ రాజ్యాలకు నేను మిమ్మల్ని చెదర గొట్టాను. కాని మిమ్మల్నందరినీ కూడదీసి, ఈ రాజ్యాల నుండి తిరిగి తీసుకొని వస్తాను. అయినా నా బలమైన హస్తాన్ని ఎత్తి మిమ్మల్ని శిక్షిస్తాను. మీమీద నాకు గల కోపాన్ని వెల్లడిస్తాను!
EZE 20:35 నేను గతంలో చేసినట్లు మిమ్మల్ని ఒక ఎడారికి నడిపిస్తాను. కాని ఇది అన్యదేశీయులు నివసించే ఒక స్థలం. అక్కడ నేను ముఖాముఖిగా మీతో వ్యాజ్యెమాడుతాను.
EZE 20:36 గతంలో ఈజిప్టు వద్దగల ఎడారిలో నేను మీ పూర్వికులకు తీర్పు తీర్చినట్లు, ఇప్పుడిక్కడ మీకు న్యాయ నిర్ణయం చేస్తాను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 20:37 “మీరు నేరస్థులని తీర్పు ఇచ్చి, ఒడంబడిక ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాను.
EZE 20:38 నాపై తిరుగుబాటు చేసి, నాపట్ల పాపం చేసిన ప్రజలందరినీ నేను తొలగిస్తాను. మీ స్వదేశాన్నుండి వారందరినీ తొలగిస్తాను. వారు మరెన్నడూ ఇశ్రాయేలు రాజ్యానికి తిరిగిరారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.”
EZE 20:39 ఓ ఇశ్రాయేలు వంశములారా, నా ప్రభువైన యెహోవా ఇప్పుడు ఈ విషయాలు చెప్పుతున్నాడు, “ఏ వ్యక్తి అయినా తన రోత విగ్రహాలను పూజింపగోరితే, అతనిని వెళ్లి వాటిని పూజించనీయండి. కాని, తరువాత నానుండి ఏదైనా సలహా మీకు వస్తుందని మాత్రం మీరు అనుకోవద్దు! మీరు నా పేరు ఇక ఏ మాత్రం పాడుచేయలేరు! ముఖ్యంగా మీరు మీ నీచ విగ్రహాలకు కానుకలను సమర్పించినా అది జరగదు.”
EZE 20:40 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “ప్రజలు నన్ను సేవించటానికి ఇశ్రాయేలులో ఎత్తైన పర్వతంగా పేరొందిన నా పవిత్ర పర్వతం వద్దకు రావాలి! ఇశ్రాయేలు వంశంవారంతా తమ స్వంత భూమి మీదికి వస్తారు. వారు తమ దేశంలో ఉంటారు. మీరు నా సలహా కోరి రావలసిన స్థలం అదే. మీరు ఆ స్థలానికి నాకు అర్పణలు ఇవ్వటానికి రావాలి. ఆ స్థలంలో మీ పంటలో తొలి భాగాన్ని నా కొరకు తేవాలి. ఆ స్థలంలో మీ పవిత్ర కానుకలు నాకు సమర్పించాలి.
EZE 20:41 అప్పుడు మీరు సమర్పించే బలుల సువాసనలతో నేను సంతృప్తి చెందుతాను. ఇదంతా నేను మిమ్మల్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు జరుగుతుంది. నేను మిమ్మల్ని అనేక దేశాలకు చెదరగొట్టాను. అయినా నేను మిమ్మల్నందరినీ కూడగట్టి, మళ్లీ నా ప్రత్యేక ప్రజగా స్వీకరిస్తాను. పైగా ఆయా దేశాలన్నీ ఇదంతా చూస్తాయి.
EZE 20:42 అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. నేను మిమ్మల్ని ఇశ్రాయేలు రాజ్యానికి తీసుకొని వచ్చినప్పుడు ఇది మీరు తెలుసు కొంటారు. అది నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన రాజ్యం.
EZE 20:43 ఆ రాజ్యంలో మిమ్మల్ని మలినపర్చిన వస్తువులను, మీరు చేసిన చెడుకార్యాలను మీరు గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడతారు.
EZE 20:44 ఇశ్రాయేలు వంశములారా, మీరు ఎన్నో అకృత్యాలు చేశారు. ఆ చెడుకార్యాలకు ఫలితంగా మీరు నాశనం చేయబడాలి. కాని నాకున్న మంచి పేరు కాపాడుకోవటానికి, మీకు నిజంగా అర్హమైన శిక్ష విధించవలసి వుండి కూడా నేను విధించను. నేనే యెహోవానని పిమ్మట మీరు తెలుసుకొంటారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 20:45 మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు:
EZE 20:46 “నరపుత్రుడా, యూదా రాజ్యం దక్షిణాన వున్న నెగెవు వైపు చూడు. నెగెవు అరణ్యానికి వ్యతిరేకంగా మాట్లాడు.
EZE 20:47 నెగెవు అరణ్యానికి ఇలా చెప్పు, ‘యెహోవా వాక్కు విను. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. చూడు, నీ అరణ్యంలో అగ్ని రగల్చటానికి నేను సిద్దంగా ఉన్నాను. ప్రతి పచ్చని చెట్టునూ, ప్రతి ఎండిన చెట్టునూ అగ్ని దహించి వేస్తుంది. అలా కాల్చివేసే ఆ నిప్పు ఆర్పబడదు. దక్షణం నుండి ఉత్తరం వరకు గల ప్రదేశమంతా కాల్చివేయ బడుతుంది.
EZE 20:48 అప్పుడు ప్రజలంతా యెహోవానైన నేనే ఈ అగ్నిని ప్రజ్వలింపచేసినట్లు తెలుసుకుంటారు. ఆ నిప్పు ఆర్పివేయబడదు.’”
EZE 20:49 పిమ్మట నేను (యెహెజ్కేలు) ఇలా అన్నాను: “ఓ నా ప్రభువైన యెహోవా! నేనా విషయాలు ప్రజలకు చెప్తే నేనేవో కాకమ్మ కథలు వారికి చెబుతున్నానని అనుకుంటారు. అది నిజంగా సంభవిస్తుందని వారను కోరు!”
EZE 21:1 అందువల్ల యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఈ విధంగా చెప్పాడు:
EZE 21:2 “నరపుత్రుడా, యెరూషలేము వైపు చూసి, వారి పవిత్ర స్థలాలకు వ్యతిరేకంగా మాట్లాడు. నా తరపున ఇశ్రాయేలు రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడు.
EZE 21:3 ఇశ్రాయేలు రాజ్యానికిలా తెలియజేయి, ‘యెహోవా ఈ విషయాలు చెప్పాడు, నేను నీకు వ్యతిరేకంగా వున్నాను! ఒరలోనుండి నా కత్తిని దూస్తాను. నీనుండి ప్రజలందరినీ తొలగిస్తాను. వారిలో మంచివారు, చెడవారు అంతా ఉంటారు!
EZE 21:4 నీ మంచి మనుష్యులనూ, చెడ్డవారినీ నేను నాశనం చేస్తాను. ఒరనుండి నా కత్తిని దూస్తాను. దక్షిణాన్నుండి ఉత్తరం వరకు గల ప్రజలందరిపై దానిని ప్రయోగిస్తాను.
EZE 21:5 అప్పుడు ప్రజలంతా నేనే యెహోవానని తెలుసుకొంటారు. పైగా నా కత్తిని ఒరనుండి దూశానని కూడా వారు తెలుసుకొంటారు. తన పని పూర్తి చేసే వరకు నా కత్తి మళ్లీ ఒరలోకి తిరిగి వెళ్లదు.’”
EZE 21:6 దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, గుండె పగిలే దుఃఖంలో వున్న వ్యక్తిలా నీవు నిట్టూర్పులు విడువు. ప్రజల ముందే నిట్టూర్పు.
EZE 21:7 వారప్పుడు నిన్ను, ‘నీ వెందుకు నిట్టూరుస్తున్నావు?’ అని అడుగుతారు. దానికి నీవు ఇలా సమాదానం చెప్పాలి, ‘రాబోయే విషాద వార్తను తలచుకొని భయంతో ప్రతి హృదయం వికలమైపోతుంది. చేతులు బలహీనమవు తాయి. ప్రతి ప్రాణం నీరసించి పోతుంది. మోకాళ్ళు నీళ్లవలె మారిపోతాయి.’ చూడండి; ఆ చెడ్డవార్త రాబోతూ ఉంది. ఈ విషయాలన్నీ జరుగుతాయి!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 21:8 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడ:
EZE 21:9 “నరపుత్రుడా, నా తరపున ప్రజలతో మాట్లాడు. ఈ విషయాలు తెలియజెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు: “‘చూడండి, ఒక కత్తి, పదును గల కత్తి మెరుగుదిద్దిన కత్తి.
EZE 21:10 చంపటానికి పదును పెట్టబడింది కత్తి. మెరుపులా మెరవటానికి అది మెరుగుదిద్దబడింది. నా కుమారా, నిన్ను శిక్షించటానికి నేను వాడే కర్రకు నీవు దూరంగా పారిపోయావు. ఆ కట్టెపుల్లతో శిక్షింపబడటానికి నీవు నిరాకరించావు.
EZE 21:11 అందువల్ల కత్తి మెరుగు పెట్టబడింది. ఇప్పుడది వాడబడుతుంది. కత్తి పదును పెట్టబడి, మెరుగుదిద్దబడింది. అదిప్పుడు చంపేవాని చేతికి ఇవ్వ బడుతుంది.
EZE 21:12 “‘నరపుత్రుడా, కేకలు పెట్టి రోదించు! ఎందుకంటే ఆ కత్తి నా ప్రజల మీదికి, ఇశ్రాయేలు పాలకుల మీదికి తేబడింది! ఆ పాలకులు యుద్ధాన్ని కోరారు. అందవల్ల కత్తి ఎదురైనప్పుడు వారు నా ప్రజలతో పాటు వుంటారు! కావుల నీ తొడ చరుచుకొని, నీ దుఃఖాన్ని వెలిబుచ్చే పెద్ద శబ్దాలు చేయుము!
EZE 21:13 ఎందు వల్లనంటే, ఇది కేవలం పరీక్ష గాదు! నీవు కట్టెతో శిక్షింపబడటానికి నిరాకరించావు. కనుక నిన్ను శిక్షించటానికి మరి నేనేమి ఉపయోగించాలి? అవును. [కత్తినే!]’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 21:14 దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నీవు చప్పట్లు చరిచి, నా తరపున ప్రజలతో మాట్లాడు. “కత్తిని రెండుసార్లు కిందికి రానీ, అవును, మూడుసార్లు! ఈ కత్తి ప్రజలను హతమార్చటానికే. మహా మారణానికి వినియోగించబడేది ఈ ఖడ్గమే! ఈ కత్తి వాళ్లను ఖండిస్తుంది.
EZE 21:15 భయంతో వారి హృదయాలు కరుగుతాయి. చాలామంది పడిపోతారు. వారి నగర ద్వారం వద్దనే చంపబడతారు. అవును. ప్రజలను చంపటానికి ఆ ఖడ్గాన్ని నేనే ఎంపిక చేశాను! ఆ ఖడ్గం మెరుపుతీగలా ప్రకాశిస్తుంది.
EZE 21:16 ఓ ఖడ్గమా, పదునుగా నుండుము, కుడి పక్క నరుకు. ఎడమ పక్క నరుకు. నీ అంచు ఎటు వెళ్లగోరితే అటు వెళ్లు!
EZE 21:17 “అప్పుడు నేను కూడా చప్పట్లు చరుస్తాను. పిమ్మట నా కోపాన్ని చూపడం ఆపుతాను. యెహోవానైన నేను మాట్లాడాను!”
EZE 21:18 యెహోవా మాట నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 21:19 “నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గం ఇశ్రాయేలుపై రావటానికి వినియోగపడే రెండు మార్గాలను గీయుము. రెండు మార్గాలూ ఒకే ప్రదేశం బబులోను నుండి మొదలవ్వాలి. నగరానికి వచ్చే ఒక మార్గం మొదట్లో ఒక గుర్తు పెట్టి.
EZE 21:20 ఖడ్గం ఏ దారిని వినియోగిస్తుందో తెలుపటానికి ఆగుర్తు పెట్టాలి. ఒక మార్గం అమ్మెనీయుల నగరమైన రబ్బాకు వెళ్తుంది. మరొక మార్గం యూదాలోని రక్షిత నగరమైన యెరూషలేముకు వెళ్తుంది!
EZE 21:21 ఇది బబులోను రాజు ఆ ప్రాంతాన్ని తాను ఎలా ఎదుర్కోవాలన్నదానిని తెలుపుతుంది. బబులోను రాజు ఆ మార్గం రెండుగా విడిపోయే చోటికి వచ్చాడు. బబులోను రాజు తన భవిష్యత్తు కార్యక్రమం తెలుసుకొనటానికి మంత్ర, తంత్ర సంకేతాలను ఉపయోగించాడు. అతడు కొన్ని బాణాలు తీసుకొన్నాడు. తన కులదేవతలను కొన్ని ప్రశ్నలడిగాడు. పిమ్మట అతడు చంపిన ఒక జంతువు కార్జంవెపు చూశాడు.
EZE 21:22 “అక్కడ అతను కొన్ని సంకేతాలు చూశాడు. అవి అతనిని తన కుడిపక్కనున్న యెరూషలేముకు పోయే మార్గంలో వెళ్లమని సూచించాయి! అతడు నగర ద్వారాలు పగులగొట్టే దూలాల యంత్రాలను తేవటానికి సిద్ధం కమ్మనే సంకేతం ఇవ్వాలను కున్నాడు. అతడు ఆజ్ఞ ఇవ్వగానే అతని సైనికులు మారణకాండకు పూనుకుంటారు. యుద్ధ నినాదాలు చేయమని, నగరపు గోడకు మురికి వీధిని నిర్మించమని, మరియు కొయ్య బురుజులు నగరాన్ని ఎదుర్కోవడానికి నిర్మించమని సంకేతాలు యిస్తాడు.
EZE 21:23 ఆ తంత్ర సంకేతాలు ఇశ్రాయేలు ప్రజలకు అర్థంకావు. వారు చేసిన వాగ్దానాలు వారికున్నాయి. అవి వారికి ముఖ్యం. కాని యెహోవా వారి పాపాలను జ్ఞాపకం పెట్టు కుంటాడు. దానితో ఇశ్రాయేలీయులు పట్టుబడతారు.”
EZE 21:24 నా ప్రభువైన యెహోవా ఈ విషయం చెప్పాడు: “మీరు అనేక చెడు కార్యాలు చేశారు. మీ పాపాలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయి. మీరు నేరస్థులని గుర్తుపెట్టుకొనేలా మీరు నన్ను ఒత్తిడి చేశారు. కావున శత్రువు మిమ్మల్ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు.
EZE 21:25 ఓ ఇశ్రాయేలు దుష్ట నాయకుడా, నీవు చంపబడతావు. నీకు శిక్ష కాలం సమీపించింది! నీ అంతం ఇక్కడే!”
EZE 21:26 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “నీ తలపాగా తీసివేయి! నీ కిరీటం తీసివేయి! మార్పుకు సమయం ఆసన్నమయ్యింది. ముఖ్య నాయకులు తగ్గింపబడతారు. సామాన్య మానవులు ప్రముఖ వ్యక్తులౌతారు.
EZE 21:27 ఆ నగరాన్ని నేను సర్వనాశనం చేస్తాను! కాని యోగ్యుడైన వ్యక్తి కొత్త రాజు అయ్యేవరకు ఇది సంభవించదు. అప్పుడు ఈ నగరాన్ని అతడు (బబులోను రాజు) కైవసం చేసుకొనేలా చేస్తాను.”
EZE 21:28 దేవుడు ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, నా తరపున ప్రజలతో మాట్లాడు. ఈ విషయాలు చెప్పు: ‘అమ్మోను ప్రజలకు, వారి సిగ్గుచేటు దేవతకు నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “‘చూడండి, ఒక ఖడ్గం! ఆ ఖడ్గం దాని ఒరనుండి బయటకు వచ్చింది. కత్తి మెరుగు దిద్దబడింది! కత్తి సంహారానికి సిద్ధంగా ఉంది. అది మెరుపు తీగలా ప్రకాశించటానికి మెరుగు దిద్దబడింది!
EZE 21:29 “‘మీ దర్శనాలు పనికిరావు. మీ మంత్ర తంత్రాలు సహాయపడవు. అదంతా ఒక అబద్ధాల మూట. దుష్టుల మెడల మీద ఇప్పుడు కత్తి ఉంది. వారు త్వరలో శవాలై పోతారు. వారికి సమయం దాపురించింది. వారి చెడుతనం ముగిసే సమయం వచ్చింది.
EZE 21:30 “‘ఇప్పుడు కత్తిని దాని ఒరలో పెట్టవచ్చు. నీవు సృష్టింపబడిన ప్రదేశంలో, నీవు జన్మమెత్తిన రాజ్యంలో నీకు నేను న్యాయనిర్ణయం చేస్తాను.
EZE 21:31 నీ మీగ నా కోపాన్ని కుమ్మరిస్తాను. వేడి గాడ్పువలె నా కోపం నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను దుష్టులయిన మగవారికి అప్పగిస్తాను. వారు ప్రజల్ని హత మార్చటంలో ఆరితేరిన వారు.
EZE 21:32 నీవు అగ్నికి ఆజ్యంలా తయారవుతావు. నీ రక్తం భూమిలోకి లోతుగా ప్రవహిస్తుంది. ప్రజలు నిన్ను మరెన్నడూ జ్ఞాపకం పెట్టుకోరు. యెహోవానైన నేనే ఇది చెప్పాను.’”
EZE 22:1 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు:
EZE 22:2 “నరపుత్రుడా, నీవు న్యాయనిర్ణయం చేస్తావా? హంతకుల నగరంపై (యెరూషలేము) నీవు తీర్పు తీర్చుతావా? ఆమె చేసిన భయంకరమైన కార్యాలను గూర్చి ఆమెకు తెలియ జేస్తావా?
EZE 22:3 నీవు ఈలా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు, నగరం హంతకులతో నిండి ఉంది. కావున ఆమెకు శిక్షపడే కాలం వస్తుంది! తనకై తాను రోతవిగ్రహాలను చేసింది. ఆ విగ్రహాలే ఆమెను మలినపర్చాయి!
EZE 22:4 “‘యెరూషలేము వాసులారా, మీరనేక మందివి హతమార్చారు. మీరు అసహ్యకరమైన విగ్రహాలను చేశారు. మీరు నేరస్తులు. మిమ్మల్ని శిక్షించే కాలం వచ్చింది. మీకు అంతం సమీపించింది. అన్యదేశాలవారు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఆ రాజ్యాల వారు మిమ్మల్ని చూసి నవ్వుతారు.
EZE 22:5 మీకు దగ్గరలోను, దూరంలోను వున్న ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. మీ పేరును మీరే పాడుచేసుకున్నారు. వారి పెద్ద నవ్వును మీరు వినవచ్చు.
EZE 22:6 “‘చూడండి! ఇశ్రాయేలు పాలకులలో ప్రతివాడూ ఇతరులను చంపటానికి యెరూషలేములో తనను తాను బాగా బలపర్చుకున్నాడు.
EZE 22:7 యెరూషలేములో ప్రజలు తమ తల్లిదండ్రులను గౌరవించరు. ఆ నగరంలో వారు అన్యదేశీయులను బాధిస్తారు. ఆ నగరంలో వారు అనాధ పిల్లలను, విధవలను మోసగిస్తున్నారు.
EZE 22:8 మీరంతా నా పవిత్ర వస్తువులను అసహ్యించు కుంటారు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి దినాలను మీరు సామాన్యమైనవిగా భావిస్తారు.
EZE 22:9 యెరూషలేము ప్రజలు ఇతరులను గురించి అబద్ధాలు పలుకుతారు. ఆ అమాయక ప్రజలను చంపటానికే వారు ఆ విధంగా ప్రవర్తిస్తారు. ప్రజలు బూటకపు దేవుళ్లను కొలవటానికి కొండల మీదికి వెళతారు. పిమ్మట యెరూషలేముకు వచ్చి స్నేహ పంక్తి భోజనాలు చేస్తారు. “‘యెరూషలేములో ప్రజలు కామవాంఛలతో కూడిన పాపాలు చేస్తారు.
EZE 22:10 యెరూషలేములో మనుష్యులు తమ తండ్రి భార్యతోనే వ్యభిచరించి పాపం చేస్తారు. యెరూషలేములో మనుష్యులు స్త్రీలను మానభంగం చేస్తారు. స్త్రీలు బహిష్టు అయినప్పుడు కూడా వారిని చెరబట్టి మానభంగం చేస్తారు.
EZE 22:11 ఒకడు ఆ భయంకర పాపాన్ని తన పొరుగువాని భార్యతోనే చేస్తాడు. మరొకడు తన కోడలితోనే వ్యభిచరించి ఆమెను అపవిత్ర పరుస్తాడు. ఇంకొకడు తన తండ్రి కుమార్తెయగు తన సోదరిని మానభంగం చేస్తాడు.
EZE 22:12 ఓ యెరూషలేము ప్రజలారా, నరహత్య చేయటానికి మీరు డబ్బు తీసుకొంటారు. మీరు డబ్బు అప్పు ఇచ్చి, దానిమీద వడ్డీ తీసుకుంటారు. స్వల్ప లాభం కోసం మీరు మీ పొరుగువారిని మోసగిస్తారు. మీరు నన్ను మర్చిపోయారు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 22:13 దేవుడు ఇలా చెప్పసాగాడు: “‘ఇప్పుడు చూడు! నా చేతిని కింద కొట్టి నిన్ను ఆపుతాను! ప్రజలను మోసగించినందుకు, చంపినందుకు నిన్ను నేను శిక్షిస్తాను.
EZE 22:14 అప్పుడు నీవు ధైర్యంగా ఉంటావా? నేను నిన్ను శిక్షించటానికి వచ్చినప్పుడు నీవు శక్తిగలిగివుంటావా? లేదు! ఉండలేవు. నేనే యెహోవాను. మాట్లాడింది నేనే. నేనన్నది చేసి తీరుతాను!
EZE 22:15 మిమ్మల్ని చాలా దేశాలలోనికి చెదరగొడతాను. మీరు అన్యదేశాలకు పారిపోయేలా మీపై ఒత్తిడి తెస్తాను. ఈ నగరంలో ఉన్న ఏహ్యమైన వస్తువులన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను.
EZE 22:16 కాని యెరూషలేమా, నీవు అపవిత్రమవుతావు. పైగా ఇతర దేశాలన్నీ ఈ విషయాలు జరగటం చూస్తాయి. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకొంటావు.’”
EZE 22:17 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు,
EZE 22:18 “నరపుత్రుడా, వెండితో పోల్చినప్పుడు కంచు, ఇనుము, సీసము, తగరము మొదలైనవి చాలా విలువతక్కువ లోహాలు. పనివారు వెండిని శుద్ధి చేయటానికి అగ్నిలో వేస్తారు. కరిగిన వెండి నుంచి పనివారు అలా మైలను వేరు చేస్తారు. ఇశ్రాయేలు దేశం అలా వేరు చేయబడిన మలిన పదార్థంలా తయారయ్యింది.
EZE 22:19 కావున ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ‘మీ ప్రజలంతా పనికిరాని చెత్తలా తయారయ్యారు. అందవల్ల మిమ్మల్నందరినీ యెరూషలేముకు చేర్చుతాను.
EZE 22:20 పనివారు వెండిని, కంచును, ఇనుమును, సీసాన్ని, తగరాన్ని నిప్పులో వేసి, నిప్పురగిలేలా కొలిమి వూదుతారు. లోహాలు కరగటం మొదలు పెడతాయి. అదేమాదిరి, మిమ్మల్ని నా అగ్నిలో వేసి కరగబెడతాను. నా రగిలే కోపమే ఆ నిప్పు.
EZE 22:21 ఆ నిప్పులో మిమ్మల్ని వేస్తాను. నా కోపాగ్నిని బాగా రగిలేలా చేస్తాను. అప్పుడు మీరు కరగటం మొదలు పెడతారు.
EZE 22:22 వెండి నిప్పులో కరుగుతుంది. పనివారు శుద్ధ వెండిని వేరుచేసి దానిని భద్రపరుస్తారు. అదేమాదిరి మీరు నగరంలో కరుగుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. నా కోపాన్ని మీమీద కుమ్మరించానని మీరు తెలుసుకొంటారు.’”
EZE 22:23 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు,
EZE 22:24 “నరపుత్రుడా, ఇశ్రాయేలుతో మాట్లాడుము. ఆమె పవిత్రురాలు కాదని నీవామెలో చెప్పుము. నేను ఆ రాజ్యాల మీర కోపంగావున్నాను. అందువల్ల ఆ రాజ్యంలో వానలు పడవు.
EZE 22:25 యెరూషలేములోని ప్రవక్తలు కుట్రలు పన్నుతున్నారు. తను తినదల్చిన జంతువును పట్టుకున్నప్పుడు గర్జించు సింహంలా వారున్నారు. ఆ ప్రవక్తలు ఎన్నో జీవితాలను నాశనం చేశారు. వారెన్నో విలువైన వస్తువులను తీసుకున్నారు. యెరూషలేములో ఎందరో స్త్రీలు విధవలు కావటానికి వారు కారకులయ్యారు.
EZE 22:26 “యాజకులు నా ధర్మ బోధనలను నిజంగా గాయపర్చారు. వారు నా పవిత్ర వస్తువులను మైల చేశారు. వారు వాటిని ముఖ్యమైనవిగా పరిగణించరు. పవిత్ర వస్తువులను అతి సామాన్యమైనవిగా చూస్తారు. శుభ్రమైన వస్తువులను వారు మురికైనవిగా చూస్తారు. ఈ విషయాలను గూర్చి వారు ప్రజలకు బోధించరు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను వారు గౌరవించి పాటించరు. నేను వారివల్ల తృణీకరించ బడ్డాను.
EZE 22:27 “తాను పట్టిన జంతువును తీంటున్న తోడేలులా ఇశ్రాయేలు నాయకులు వున్నారు. వారు ధనవంతులు కావాలనే కోర్కెతో ఆ నాయకులు ప్రజలను చంపివేస్తారు.
EZE 22:28 “ప్రవక్తలు ప్రజలను హెచ్చరించరు. వారు నిజాన్ని దాచివేస్తారు. వారు గోడ నిర్మాణం చేయకుండా, పగుళ్లపై బంకమట్టి పూసే పనివారిలావుంటారు. వారి కండ్లకు కేవలం అబద్ధాలే కన్పిస్తాయి. భవిష్యత్తును తెలుసుకొనటానికి వారు మంత్ర తంత్రాలను వినియోగిస్తారు. అయినా వారు అబద్ధాలు మాత్రమే చెపుతారు. వారు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు’ అని అంటారు. కాని వారు అబద్ధ మాడుచున్నారు. యెహోవా వారితో మాట్లాడలేదు!
EZE 22:29 “సామాన్య ప్రజలు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటారు. ఒకరి నొకరు మోసపుచ్చుకుని, ఒకరి సొమ్ము నొకరు దొంగిలించుకుంటారు. వారు పేదలను, ఆసరాగా పెట్టుకొని ధనవంతులవుతారు. వారితో నివసిస్తున్న పరదేశీయులను మోసగిస్తారు. వాళ్లకు ఎప్పుడూ న్యాయంగా ఉండరు.
EZE 22:30 “[తమ జీవిత విధానాన్ని] మార్చుకొని, తమ దేశాన్ని రక్షించుకోమని నేను ప్రజలకు హితవు చెప్పాను. గోడలను పటిష్ట పర్చమని నేను ప్రజలకు చెప్పాను. బీటలు వారిన గోడలవద్ద నిలబడి, తమ నగర పరిరక్షణకు పోరాడమని చెప్పాను. కాని ఏ ఒక్కడు సహాయపడటానికి ముందుకు రాలేదు!
EZE 22:31 కావున వారికి నా కోపాన్ని చూపిస్తాను. వారిని సర్వనాశనం చేస్తాను! వారు చేసిన చెడుకార్యాలకు వారిని నేను శిక్షిస్తాను. ఇదంతా వారి స్వయంకృత అపరాధమే!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 23:1 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు:
EZE 23:2 “నరపుత్రుడా, సమరయ, యెరూషలేములను గురించిన ఈ కథ ఆలకించుము. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వారిద్దరూ ఒక్క తల్లి కడుపునే పుట్టారు.
EZE 23:3 చిన్న వయస్తులో ఉండగనే వారిద్దరూ ఈజిప్టులో వేశ్యలయ్యారు. ఈజిప్టులో వారు మగవాళ్లతో పడుకొన్నారు. మనుష్యులను వారు తమ చనుమొనలు నలిపి, తమ యౌవ్వనపు చన్నులను పట్టుకోనిచ్చారు.
EZE 23:4 పెద్ద కుమారై పేరు ఒహొలా. ఆమె చెల్లిలి పేరు ఒహొలీబా. ఆ అక్కా చెల్లెళ్లిద్దరూ నాకు భార్యలయ్యారు. మాకు పిల్లలు కలిగారు. (నిజానికి ఒహొలాయే సమరయ. ఒహొలీబాయే యెరూషలేము.)
EZE 23:5 “అప్పుడు ఒహొలా నా పట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించింది. ఆమె ఒక వేశ్యలా జీవించసాగింది. తన విటులను కోరుకోనారంభించింది. ఊదారంగు బట్టలు వేసుకున్న అష్షూరు సైనికులను ఆమె చూసింది.
EZE 23:6 గుర్రాలపై వెళ్లే ఆ సైనికులంతా కోరుకో తగ్గ యువకులు. వారు నాయకులు, అధికారులు అయివున్నారు.
EZE 23:7 ఆ మనుష్యులందరికి ఒహొలా తనను తాను సమర్పించుకుంది. అష్టూరు సైన్యంలో వారంతా ప్రత్యేకంగా ఎంపిక చేయబడినవారు. వాళ్లందరినీ ఆమె కోరుకొంది! వారి రోత విగ్రహాలతో ఆమె కూడ మలినపర్చబడింది.
EZE 23:8 దానికి తోడు, ఈజిప్టుతో తన ప్రేమ కలాపాలు ఆపలేదు. ఆమె చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఈజిప్టు ఆమెతో సంగమించాడు. ఆమె యౌవ్వనపు చన్నులు పట్టుకున్న మొదటి ప్రేమికుడే ఈజిప్టు. ఈజిప్టు తన దొంగ ప్రేమనంతా ఆమెపై ఒలకపోశాడు.
EZE 23:9 అందువల్ల ఆమె విటులను ఆమెను పొందడానికి రానిచ్చాను. ఆమె అష్టూరును కోరుకుంది. ఆందుచే నేనామెను వారికిచ్చాను!
EZE 23:10 వారామెకు మానభంగం కావించారు. వారు ఆమె పిల్లలను ఎత్తుకుపోయారు. తరువాత వారు కత్తితో ఆమెను చంపివేశారు. వారామెను అలా శిక్షించారు. స్త్రీలు ఆమెను గురించి ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు.
EZE 23:11 “తన చిన్న సోదరి ఒహొలీబా ఇవన్నీ జరగటం చూసింది. అయినా తన అక్కకంటె ఒహొలీబా ఎక్కువ పాపాలు చేసింది! ఒహొలాకంటె ఈమె మరీ విశ్వాసంలేని స్త్రీ అయింది.
EZE 23:12 ఈమె అష్షూరు నాయకులను, అధికారులను కోరుకొంది. ఊదా బట్టల్లో గుర్రాలమీద స్వారీచేసే ఆ సైనికులను ఆమె కోరుకొంది. వారంతా ఆశించదగ్గ యువకులు.
EZE 23:13 ఒకే రకమైన తప్పులతో ఆ ఇద్దరు స్త్రీలు తమ జీవితాలను నాశనం చేసుకోబోతున్నట్ల నేను చూశాను.
EZE 23:14 “ఒహొలీబా నాపట్ల విశ్వాసం లేకుండ కొన సాగింది. బబులోను (బాబిలోనియా)లో గోడలమీద చెక్కిన మనుష్యుల బొమ్మలను చూసింది. ఇవి ఎర్రని బట్టలు ధరించిన కల్దీయ మనుష్యుల బొమ్మలు.
EZE 23:15 వారి నడుమున చూట్టు పటకాలు, తలలపైన పొడుగాటి తలపాగాలు ధరించి వున్నారు. ఆ మనుష్యులందరు రథాధిపతుల వలె వున్నారు. వారంతా బబులోనులో జన్మించిన వారుగనే కన్పించారు.
EZE 23:16 మరి ఒహొలీబా వారందరినీ కావాలనుకొంది.
EZE 23:17 కావున ఆ బబులోను మనుష్యులందరూ ఆమెతో సంభోగించటానికి ఆమె ప్రేమ పాన్పు మీదికి వచ్చారు. ఆమెను విచ్చల విడిగావాడుకొని, చివరకు ఆమె వారిని చీదరించుకునేలా ఆమెను అపవిత్రపరచారు.
EZE 23:18 “ఒహొలీబా తన అవిశ్వాసాన్ని అందరూ గమనించేలా ప్రవర్తించింది. ఆమె తన నగ్నత్వాన్ని అనేక మంది అనుభవించనిచ్చింది. దానితో నాకు ఆమెపట్ల విసుగు పుట్టి, నేనామె అక్కను చీదరించుకున్నట్లు ఈమెను కూడ అసహ్యించుకున్నాను.
EZE 23:19 పదే పదే ఒహొలీబా నాపట్ల అవిశ్వాసంతో ప్రవర్తించింది. పిమ్మట ఈజిప్టు తను చిన్న పిల్లగా వుండి జరిపిన ప్రేమ కలాపాలు జ్ఞాపకం తెచ్చుకుంది.
EZE 23:20 గాడిద మేఢ్రంవంటి శిశ్నముతో గుర్రంవలె వరదలా రేతస్సును కార్చే తన విటుని ఆమె జ్ఞాపకం చేసుకున్నది.
EZE 23:21 “ఒహొలీబా, నీ ప్రేమికుడు నీ చనుమొనలు ముట్టి, నీ యౌవ్వనపు చన్నులను పట్టిన ఆ రోజులను గురించి నీవిప్పుడు కలలు కంటున్నావు.
EZE 23:22 కావున బహోలీచా, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ‘నీ ప్రేమికులతో నీవిప్పుడు విసుగుచెందియున్నావు. కాని నీ విటులను నేనిక్కడికి రప్పిస్తాను. వారు నీ చుట్టూ మూగుతారు.
EZE 23:23 వారందరినీ నేను బబులోను (బాబిలోనియా)నుండి రప్పిస్తాను. ముఖ్యంగా కల్దీయులను రప్పిస్తాను. పెకోదు, శోయ, కోయ ప్రాంతాలనుండి నేను పురుషులను రప్పిస్తాను. అష్టూరు నుండి కూడ నేను మనుష్యులను రప్పిస్తాను. తమ నాయకులను, అధికారులను రప్పిస్తాను. వారంతా కోరుకోతగ్గ యువకులు. రథాధిపతులు, ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన గుర్రపు రౌతులు వారిలో వున్నారు.
EZE 23:24 ఆ గుంపంతా నీ వద్దకు వస్తుంది. తమ గుర్రాలమీద, రథాలమీద వారు వస్తారు. అనేకానేకమంది వస్తారు. వారు తమ ఈటెలను, డాళ్లను, శిరస్త్రాణములను ధరించి వస్తారు. వారంతా నీ చూట్టూ గుమిగూడతారు. నీవు నాకు చేసినదంతా వారికి నేను వివరిస్తాను. వారికి ఇష్టమైన రీతిలో వారు నిన్ను శిక్షిస్తారు.
EZE 23:25 నేనెంత రోషంగా వున్నానో నీకు చూపిస్తాను. వారు చాలా కోపగించి నిన్ను బాధిస్తారు. వారు నీ ముక్కూ చెవులు కోసివేస్తారు. వారు కత్తితో నిన్ను చంపుతారు. పిమ్మట వారు నీ పిల్లలను తీసుకుపోతారు. నీవద్ద మిగిలిన ప్రతి దానిని వారు తగులబెడతారు.
EZE 23:26 నీ అందమైన బట్టలను, ఆభరణాలను వారు తీసుకుంటారు.
EZE 23:27 ఈజిప్టులో నీ ప్రేమ కలాపాలను గురించిన నీ కలలను నిలిపివేస్తాను. మళ్లీ నీవెన్నడు వారికొరకు ఎదురు చూడవు. నీవు ఇకముందెన్నడు ఈజిప్టును జ్ఞాపకం చేసుకొనవు!’”
EZE 23:28 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “నీవు అసహ్యించుకునే మనుష్యులకు నిన్ను అప్పజెప్పుచున్నాను. నీవు విసుగుచెందిన మనుష్యులకే నిన్ను అప్పజెప్పుచున్నాను.
EZE 23:29 వారు నిన్నెంత అసహ్యించుకుంటున్నారో వారు నీకు చూపిస్తారు. నీవు పనిచేసిందానినంతా వారు నిన్ను నిలువు దోపిడీ చేసి, నగ్నంగా వదులుతారు! ప్రజలు నీ పాపాలను విశదంగా చూస్తారు. నీవు వేశ్యలా ప్రవర్తించావని, నీవు నీచమైన కలలుగన్నావని వారు తలుసుకుంటారు.
EZE 23:30 అన్యదేశీయులను వెంబడించి పోవటానికి నన్ను వదిలిపెట్టినప్పటి నుండి నీవీ పాపకార్యాలకు ఒడిగట్టావు. వారి రోత విగ్రహాలను ఆరాధించటం మొదలు పెట్టినప్పటి నుండి నీవీ చెడ్డ కార్యాలకు తలపడ్డావు.
EZE 23:31 నీవు నీ అక్కను అనుసరించి, ఆమె గడిపిన జీవితాన్నే నీవూ గడిపావు. నీకు నీవే విషపు పాత్రను అందుకుని, నీ చేతిలో పట్టుకున్నావు. నీకు శిక్ష నీవే విధించుకున్నావు.”
EZE 23:32 ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నీవు నీ అక్క విషపు పాత్రను తీసుకొని తాగుతావు. అది ఒక పొడుగాటి, వెడల్పయిన గిన్నె. ఆ గిన్నెలో విషం (శిక్ష) చాలా పడుతుంది. ప్రజలు నిన్ను చూచి నవ్వి, ఎగతాళి చేస్తారు.
EZE 23:33 తాగినవానిలా నీవు తూలిపోతావు. నీవు గొప్ప దుఃఖముతో నింపబడతావు. షోమ్రోను పాత్ర వినాశ ఉపద్రవములతో నిండియున్నది. అది నీ అక్క తాగిన విషవు (శిక్ష) పాత్ర లాంటిదే.
EZE 23:34 ఆ పాత్రలోనే నీవు విషం తాగుతావు. దానిని నీవు పూర్తిగా తాగుతావు. పిమ్మట పాత్ర క్రిందకు విసిరివేసి ముక్కలు చేస్తావు. బాధతో నీ రొమ్ములు చీరుకుంటావు. నేను ప్రభువైన యెహోవాను గనుక ఇది సంభవిస్తుంది. ఈ విషయాలు నేనే చెప్పాను.
EZE 23:35 “కావున నా ప్రభవైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ‘యెరూషలేమా నీవు నన్ను మర్చి పోయావు. నన్ను దూరంగా విసరివేసి, నన్ను వెనుక వదిలావు. నీవు నన్ను వదిలి వేశ్యలా జీవించిన కారణంగా ఇప్పుడు నీవు బాధ అనుభవిస్తావు. నీ అపవిత్రమైన కలలకూ నీ వ్యభీచారానికి నీవు శ్రమననుభవించాలి.’”
EZE 23:36 నా ప్రభవైన యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నరుడా, నీవు ఒహొలా, ఒహొలీబాలకు తీర్పు ఇస్తావా? అయితే వారు చేసిన భయంకర నేరాలను వారికి చెప్పు.
EZE 23:37 వారు వివాహబంధం తెంచుకొని వ్యభిచరించారు. వారిపై హత్యానేరం ఉంది. వారు వేశ్యల్లా ప్రవర్తించారు. వారి అపవిత్ర విగ్రహాలతో వుండటానికి వారు నన్ను వదిలివేశారు. నా పిల్లలు వారితో వున్నారు. కాని వారిని నిప్పులో బలవంతంగా నడిపించింది. తమ అపవిత్ర విగ్రహాలకు నైవేద్యం పెట్టటానికి వారీ పని చేశారు.
EZE 23:38 నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి దినాలను, నా పవిత్ర స్థలాన్ని వారు సామాన్యమైనవిగా పరిగణించారు.
EZE 23:39 వారి విగ్రహాల కొరకు వారు తమ పిల్లల్ని బలిపెట్టారు. తరువాత వారు నా పవిత్ర స్థలంలోకీ వెళ్లి దానిని కూడ అపవిత్ర పర్చారు! ఇది వారు నా ఆలయం లోపలే చేశారు!
EZE 23:40 “దూర ప్రాంతాల మనుష్యుల కొరకు వారు కబురు పంపారు. ఆ మనుష్యుల కొరకు నీవు (ఒహొలీబా) దూతను పంపావు. వారు నిన్ను చూడటానికి వచ్చారు. వారికొరకు నీవు స్నానం చేసి, కండ్లు అలంకరించు కొని, ఆభరణాలు ధరించావు.
EZE 23:41 ఒక అందమైన పాన్పు మీద నీవు కూర్చుని, దాని ముందు ఒక బల్లవేశావు. ఆ బల్ల మీద నా సుగంధ ధూప ద్రవ్యాన్ని, నూనెను ఉంచావు.
EZE 23:42 “యెరూషలేములో వినబడే శబ్దం విందులో ప్రజలు చేసే రణగొణ ధ్వనిలా ఉంది. విందుకు అనేక మంది వచ్చారు. ఎడారినుండి వచ్చిన వారు కావటంతో వారు తాగుతూ ఉన్నారు. వారు స్త్రీలకు కడాయాలు, అందమైన కిరీటాలు యిచ్చారు.
EZE 23:43 కామ క్రీడలతో నీరసించిపోయిన ఆ స్త్రీతో నేను మాట్లాడినాను. వారంతా ఆమెతోను, ఆమె వారితోను వ్యభిచార పాపం చేస్తారా? అని అన్నాను.
EZE 23:44 కాని వారంతా ఒక వేశ్యవద్దకు ఆమెవద్ద వెళ్ళుచున్నట్లుగనే ఆమె వద్దకు వెళ్ళుతున్నారు. కామంతో పాపకార్యం చేసే ఒహొలా, ఒహొలీబాల వద్దకు వారు మళ్లీ, మళ్లీ వెళ్లారు.
EZE 23:45 “కాని మంచి మనుష్యులు వారిని నేరస్థులుగా తీర్పు ఇస్తారు. వారా స్త్రీలను వ్యభిచార, హత్యానేరాల కింద దోషులుగా నిర్ణయిస్తారు. ఒహొలా మరియు ఒహొలీబాలు వ్యభచార పాపం చేసినందుకు, వారు చంపిన ప్రజల రక్తం ఇంకా వారి చేతులపై వున్నందున ఇది ఇలా జరుగుతుంది!”
EZE 23:46 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “ప్రజలను ఒక చోట సమీకరించండి. ఆ ప్రజలందరు ఒహొలా, ఒహొలీబాలను శిక్షింపనీయండి. ఈ ప్రజా సమూహం ఈ ఇద్దరు స్త్రీలను శిక్షించి, వారిని ఎగతాళి చేస్తారు.
EZE 23:47 తరువాత ఈ గుంపు వారిద్దరిపై రాళ్ళు విసరి చంపివేస్తారు. వారా ఇద్దరినీ తమ కత్తులతో నరికి ముక్కలు చేస్తారు. వారు ఈ స్త్రీల పిల్లలను చంపి, వారి ఇండ్లను తగలబెడతారు.
EZE 23:48 ఈ రకంగా ఈ దేశాన్నుండి అవమానాన్ని తొలగిస్తాను. మిగిలిన స్త్రీలంతా మీరు చేసినటుంటి సిగ్గు మాలిన పనులు చేయకుండ వుండేలా హెచ్చరింపబడతారు.
EZE 23:49 మీరు చేసిన చెడు కార్యాలకు వారు మిమ్మల్ని శిక్షిస్తారు. హేయమైన మీ విగ్రహాలను ఆరాధించిన నేరానికి మీరు శిక్షింపబడతారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకొంటారు.”
EZE 24:1 నా ప్రభువైన యెహోవా మాట నాకు చేరింది. అది చెరలో తొమ్మిదవ సంవత్సరం, పదవనెల పదవ తేదీన జరిగింది. ఆయన ఇలా అన్నాడు,
EZE 24:2 “నరపుత్రుడా, ఈ రోజు తారీఖు వేసి, ఈ చీటీ రాయి, ‘ఈ రోజు బబులోను రాజు సైన్యం యెరూషలేమును చుట్టుముట్టింది.’
EZE 24:3 విధేయులు కావటానికి తిరస్కరించే ఇశ్రాయేలు తెగవారికి ఈ కథ చెప్పు. వారికి ఈ విషయాలు చెప్పుము, ‘నా ప్రభవైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. “‘పొయ్యిమీద కుండ పెట్టుము. కుండ పెట్టి, అందులో నీరు పొయుము.
EZE 24:4 దానిలో మాంసం ముక్కలు వేయాలి. మంచి ముక్కలు వేయాలి. తొడ మాంసం, జబ్బ మాంసం వేయాలి. మంచి ఎముకలతో కుండ నింపాలి.
EZE 24:5 వీటి కొరకు మందలో వున్న మంచి జంతువులను (పశువులను) వాడాలి. కుండ కింద బాగా కట్టెలు వేర్చు. మాంసం ముక్కలను పుడకబెట్టు. ఎముకలు కూడా వుడికేలా రసాన్ని కాగబెట్టు!
EZE 24:6 “‘నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెప్పుతున్నాడు, హంతకులున్న ఈ నగరమునకు కీడు మూడింది. తుప్పుమరకలున్న కుండలా యెరూషలేము ఉంది. ఆ మచ్చలు తొలగింప బడవు! కుండలో నుండి ప్రతి మాంసం ముక్కను బయటకు తీయుము. ఆ మాంసాన్ని తినవద్దు! పాడైపోయిన ఆ మాంసం నుండి యాజకులను ఏమీ తీసుకోనివ్వద్దు.
EZE 24:7 యెరూషలేము ఆ తుప్పుపట్టిన కుండలా ఉంది. ఎందువల్లననగా హత్యల రక్తం ఇంకా అక్కడ ఉంది! రక్తాన్ని ఆమె రాళ్లమీద చిందించింది. రక్తాన్ని ఆమె నేలపై పోసి దుమ్ముతో కప్పలేదు.
EZE 24:8 నేనామె రక్తాన్ని రాతిబండమీద వుంచాను. అందువల్ల అది కప్పబడదు. చూచిన ప్రజలకు కోపం రావాలని, అమాయక ప్రజలను చంపినందుకు వారామెను శిక్షించాలని నేనది చేశాను.
EZE 24:9 “‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, నరహంతకులతో నిండిన ఈ నగరానికి కీడు మూడింది! నిప్పు రాజెయ్యటానికి నేను కట్టెలు బాగా పేర్చుతాను.
EZE 24:10 కుండ కింద కట్టెలు బాగా పేర్చు. నిప్పు రాజెయ్యి. మాంసాన్ని బాగా ఉడకనియ్యి! మసాల దినుసులు కలుపుము. ఎముకలు కాలిపోనిమ్ము.
EZE 24:11 పిమ్మట బొగ్గుల మీద ఖాళీ కుండను వుండ నిమ్ము. దాని మచ్చలు కాలి మెరిసేలా దానిని వేడెక్కనిమ్ము. దాని మచ్చలు కరిగిపోతాయి. తుప్పు (కిలుము) రాలిపోతుంది.
EZE 24:12 “‘యెరూషలేము తన మచ్చలు మాపుకోటానికి బాగా శ్రమించవచ్చు. ఆయినా దాని ‘తుప్పు’ పోదు! కేవలం అగ్ని (శిక్ష) మాత్రమే ఆ తుప్పును పోగొడుతుంది.
EZE 24:13 “‘నీవు నాపట్ల పాపం చేశావు. దానితో నీ చర్మం మాలిన్యమయ్యింది. నిన్ను కడిగి శుభ్రపర్చాలను కున్నాను. కాని నీ వంటిమీది మచ్చలు పోకుండెను నీపట్ల నా తీవ్రమైన కోపం తీరేవరకు నిన్ను కడిగే ప్రయత్నం మళ్లీ చేయను!
EZE 24:14 “‘నేనే యెహోవాను. నీకు శిక్ష విధింపబడుతుందని చెప్పాను. ఆది వచ్చేలా నేను చేస్తాను. నేను శిక్షను ఆపను. నిన్ను గురించి నేను విచారించను. నీవు చేసిన చెడు కార్యాలకు నేను నిన్ను శిక్షిస్తాను.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 24:15 పిమ్మట యెహోవా సందేశం నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 24:16 “నరపుత్రుడా, నీవు నీ భార్యను మిక్కిలి ప్రేమిస్తున్నావు. కాని ఆమెను నీనుండి నేను తీసుకొనబోతున్నాను. నీ భార్య ఆకస్మాత్తుగా చనిపోతుంది. ఆయినా నీవు మాత్రం నీ విచారాన్ని వ్యక్తం చేయకూడదు. నీవు బిగ్గరగా ఏడ్వకూడదు. నీవు కన్నీళ్లు కార్చకూడదు.
EZE 24:17 కాని నీ వెక్కి ఏడ్పు శబ్దాలను బయటకు వినరానీయవద్దు. చని పోయిన నీ భార్య కొరకు నీవు ఏడ్వవద్దు. నీవు మామూలుగా వేసుకొనే బట్టలనే ధరించాలి. నీ తలపాగా, నీ చెప్పులు ధరించుము. నీ విచారాన్ని వ్యక్తం చేయటానికి నీవు నీ మీసాలను కప్పివుంచవద్దు. సామాన్యంగా వ్యక్తులు మరణించినప్పుడు ప్రజలు తినే ఆహారాన్ని నీవు తినవద్దు.”
EZE 24:18 మరునాటి ఉదయం దేవుడు చెప్పిన విషయాలను నేను ప్రజలకు తెలియజేశాను. ఆ సాయంత్రం నా భార్య చనిపోయింది. ఆ మరునాటి ఉదయం దేవుడు ఆజ్ఞాపించిన విధంగా నేను అన్నీ చేశాను.
EZE 24:19 అప్పుడు ప్రజలు నాతో, “నీవిలా ఎందుకు చేస్తున్నావు? దీని అర్థం ఏమిటి?” అని ప్రశ్నించారు.
EZE 24:20 అందుకు వారతో నేనిలా అన్నాను: “యెహోవా మాట నాకు విన్పించింది.
EZE 24:21 ఇశ్రాయేలు వంశంవారితో మాట్లడమని ఆయన నాకు చెప్పాడు. నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: ‘చూడండి, నేను నా పవిత్ర స్థలాన్ని నాశనం చేస్తాను. మీరా స్థలాన్ని చూచి గర్వపడుతున్నారు. దానిని శ్లాఘిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ స్థలాన్ని చూడాలని మీరు ఉబలాట పడుతూ వుంటారు. మీరు నిజంగా ఆ స్థలమంటే ఇష్టపడుతూ వున్నారు. కాని నేనాస్థలాన్ని నాశనం చేస్తాను. మీరు మీ వెనుక వదిలిపెట్టిన మీ పిల్లలంతా యుద్ధంలో చంపబడతారు.
EZE 24:22 నేను చనిపోయిన నా భార్య విషయంలో ఏమి చేశానో, మీరు కూడా ఆలానే చేస్తారు. మీ దుఃఖాన్ని సూచించటానికి మీరు మీసాలను కప్పుకొనరు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సామాన్యంగా ప్రజలు తినే ఆహారాన్ని మీరు తినరు.
EZE 24:23 మీరు మీ తలపాగాలు, చెప్పులు ధరిస్తారు. మీరు మీ విచారాన్ని వ్యక్తం చేయరు. మీరు ఏడ్వరు. మీ పాపాల కారణంగా మీరు నశించిపోతారు. మీ దుఃఖాన్ని మీరు ఒకరికొకరు నిశ్శబ్దంగా తెలియజేసుకుంటారు.
EZE 24:24 కావున యెహెజ్కేలు మీకు ఒక ఉదాహరణ. అతడు చేసినవన్నీ అలానే మీరూ చేస్తారు. ఆ శిక్షా కాలం సమీపిస్తున్నది. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసు కుంటారు.’”
EZE 24:25 “నరపుత్రుడా, ప్రజల నుండి ఆ సురక్షిత ప్రాంతాన్ని (యెరూషలేమును) నేను తీసుకుంటాను. ఆ అందమైన స్థలం వారిని సంతోషపెడుతూ ఉంది. వారు దానిని చూడాలని కుతూహల పడుతూ వుంటారు. వారు నిజంగా ఆ స్థలమంటే బాగా ఇష్టపడుతున్నారు. ఆ నగరాన్ని, వారి పిల్లలను నేను వారినుండి తీసుకొంటాను. ఆ సమయంలో చావగా మిగిలిన వారలో ఒకడు యెరూషలేమును గూర్చిన ఒక చెడువార్తను తీసుకొని వస్తాడు.
EZE 24:27 అప్పుడు నీవతనితో మాట్లాడ గలుగుతావు. ఇక నీవెంత మాత్రమూ మౌనంగా వుండవు. ఈ రకంగా నీవు వారికి ఒక ఉదాహరణగా ఉంటావు. నేను యెహోవానని అప్పుడు వారు తెలుసుకుంటారు.”
EZE 25:1 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 25:2 “నరపుత్రుడా, నీవు అమ్మెనీయులనుద్ధేశించి వారికి వ్యతిరేకంగా నా తరపున మాట్లాడు.
EZE 25:3 అమ్మెను ప్రజలకు ఇలా చెప్పు: ‘నా ప్రభువైన యెహోవా మాటను ఆలకించండి! నా ప్రభువైన యెహోవా ఈ విషయం చెపుతున్నాడు, నా పవిత్ర స్థలం నాశనం చేయబడినప్పుడు మీరు సంతోషించారు. ఇశ్రాయేలు కాలుష్యం చెందినప్పుడు మీరు దానికి వ్యతిరేకులయ్యారు. యూదా ప్రజలు బందీలుగా పట్టుకు పోబడినప్పుడు మీరు యూదా వంశానికి వ్యతిరేకులయ్యారు.
EZE 25:4 కావున తూర్పు నుండి వచ్చే ప్రజలకు మిమ్మల్ని అప్పగిస్తాను. వారు మీ రాజ్యాన్ని ఆక్రమిస్తారు. మీ దేశంలో వారి సైన్యాలు స్థావరాలు ఏర్పాటు చేస్తాయి. వారు మీ మధ్య నివసిస్తారు. వారు మీ పంటను తింటూ, మీ పాలు తాగుతారు.
EZE 25:5 “‘రబ్బా నగరాన్ని ఒంటెలు మేసే పచ్చిక బయలుగా చేస్తాను. అమ్మెను దేశాన్ని గొర్రెల దొడ్డిగా జేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.
EZE 25:6 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: యెరూషలేము నాశనమైనప్పుడు మీరు సంతోషపడ్డారు. మీరు మీ చేతులు చరిచి, కాళ్లు దట్టించారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని అవమానపరుస్తూ మీరు వేడుక చేసుకున్నారు.
EZE 25:7 కావున నేను మిమ్మల్ని శిక్షిస్తాను. సైనికులు యుద్ధంలో తీసుకొనే విలువైన వస్తువుల్లా మీరు ఉంటారు. ఇతర దేశాలతో మీరు వేరుగా అయిపోతారు. దూర దేశాల్లో మీరు చనిపోతారు. నేను మీ దేశాన్ని నాశనం చేస్తాను! అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’”
EZE 25:8 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “మోయాబు, శేయీరు (ఎదోము) ప్రజలు, ‘యూదా వంశం కేవలం ఇతర రాజ్యాల జనుల మాదిరే ఉంది’ అని అంటారు.
EZE 25:9 నేను మోయాబు భుజంలోకి నరుకుతాను. సరిహద్దుల్లో వున్న దాని నగరాన్నిటినీ, ఆ భూమి గొప్పదనాన్ని తీసుకుంటాను. రాజ్యానికి తలమానికమైన బేత్యేషీమోతు, బయల్మెయోను, కిర్య తాయిములను తీసుకుంటాను.
EZE 25:10 తరువాత ఈ నగరాలను తూర్పు నుండి వచ్చిన ప్రజలకు ఇస్తాను. వారు నీ రాజ్యాన్ని చేజిక్కించు కుంటారు. తూర్పు రాజ్యాల ప్రజలు అమ్మెను ప్రజలను నాశనం చేయనిస్తాను. దానితో అసలు అమ్మోను ప్రజలు ఒక దేశంగా వుండేవారనే సత్యాన్ని ప్రజలు మర్చిపోతారు.
EZE 25:11 అలాగే మోయాబును నేను శిక్షిస్తాను. అప్పుడు వారంతా నేను యెహోవానని తెలుసు కుంటారు.”
EZE 25:12 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “ఎదోము ప్రజలు యూదా వంశంపై తిరుగుబాటు చేసి, చివరికి దానిని చేజిక్కించుకోవాలని కూడ ప్రయత్నించారు. ఎదోము ప్రజలు నేరస్థులు.”
EZE 25:13 కావున నా ప్రభువైన యెహోవా చెబుతున్నదేమనగా, “నేనే ఎదోమును శిక్షిస్తాను. ఎదోములో వున్న ప్రజలను, జంతువులను నాశనం చేస్తాను. తేమాను నుండి దదాను వరకు గల మొత్తం ఎదోము, దేశాన్ని నేను నాశనం చేస్తాను. ఎదోమీయులు యుద్ధంలో చనిపోతారు.
EZE 25:14 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను వినియోగించి ఎదోముకు వ్యతిరేకమవుతాను. ఈ రకంగా ఇశ్రాయేలు కూడా ప్రజలు ఎదోముపై నాకు గలకోపాన్ని చూపిస్తారు. అప్పుడు నేనే వారిని శిక్షించినట్లు ఎదోము ప్రజలు తెలుసుకుంటారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 25:15 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఫిలిష్తీయులున ప్రయత్నించారు పగతీర్చుకొనుచున్నారు. వారు అతిక్రూరులు. తమ కోపం తమలోనే ఎక్కువ కాలం వుంచుకొని తమని తాము దహింపజేసుకొన్నారు!”
EZE 25:16 కావున నా ప్రభువైన యెహోవా చెప్పినదేమంటే, “నేను ఫిలిష్తీయులను శిక్షిస్తాను. కెరేతీయులను నేను నాశనం చేస్తాను. సముద్ర తీరాన నివసిస్తున్న ప్రజలను నేను సర్వనాశనం చేస్తాను.
EZE 25:17 నేనా ప్రజలను శిక్షిస్తాను. వారిపై పగ సాధిస్తాను. నా కోపంతో వారికి ఒక గుణపాఠం నేర్పిస్తాను. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు!”
EZE 26:1 దేశ భ్రష్టత్వంలో (చెర) పదకొండవ సంవత్సరపు మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడ:
EZE 26:2 “నరపుత్రుడా, యెరూషలేమును గురించి తూరు చెడ్డ విషయాలు చెప్పింది, ‘ఆహా! ప్రజలను రక్షిస్తున్న నగర ద్వారం నాశనం చేయబడింది! నా కొరకు నగర ద్వారం తెరవబడింది. యెరూషలేము నగరం నాశనం చేయబడింది. అందులో నాకు విలువైన వస్తువులు ఎన్నో లభిస్తాయి!’”
EZE 26:3 కావున నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “తూరూ, నీకు నేను వ్యతిరేకిని! నీపై యుద్ధం చేయటానికి అనేక దేశాల వారిని తీసుకొని వస్తాను. తీరం మీదికి వచ్చిపడే సముద్రపు అలల్లా, వారు నీ మీదికి మాటి మాటికీ వస్తారు.”
EZE 26:4 దేవుడు ఇలా అంటున్నాడు: “శత్రు సైనికులు తూరూ గోడలను నాశనం చేస్తారు. దాని బురుజులను కూలగొడతారు. ఆమె రాజ్యంలో గల భూమి యొక్కపైభాగవు నేలను చెరిపివేస్తాను. తూరును ఒక బండరాయిగా మార్చివేస్తాను.
EZE 26:5 సముద్ర తీరాన కేవలం చేపలు పట్టే వలలు ఆరబెట్టటానికి పనికి వచ్చే స్థలంవలె తూరు అయిపోతుంది. ఇదే నా మాట!” నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యుద్ధంలో సైనికులు తీసుకొనే విలువైన వస్తువుల వలె తూరు అయిపోతుంది.
EZE 26:6 దాని ముఖ్య భూమిలో గల ఆమె కుమారైలు ( చిన్న పట్టణాలు ) యుద్ధంలో చంపబడతారు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.”
EZE 26:7 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరు మీదికి ఉత్తర దిశనుండి ఒక శత్రువును రప్పిస్తాను. బబులోను మహారాజైన నెబుకద్నెజరే ఆ శత్రువు! అతడు చాలా పెద్ద సైన్యంతో వస్తాడు. ఆ సైన్యంలో గుర్రాలు, రథాలు, రౌతులు ఇంకా అనేకమంది ఇతర సైనికులు ఉంటారు! ఆ సైనికులలో చాలా దేశాల వారుంటారు.
EZE 26:8 ముఖ్య భూమిలో నీ కుమారైలను (చిన్న పట్టణాలు) నెబుకద్నెజరు చంపివేస్తాడు. నీ నగరాన్ని ఎదుర్కోవటానికి అతడు బులుజులను నిర్మిస్తాడు. నీ నగరం చుట్టూ అతడు మట్టిబాట నిర్మిస్తాడు. గోడల వరకు ఒక మట్టిదారి వేస్తాడు.
EZE 26:9 నీ గోడలు పగులగొట్టటానికి అతడు దూలాలు తెస్తాడు. నీ బురుజులు కూలగొట్టటానికి అతడు వాడిగల పనిముట్లను ఉపయోగిస్తాడు.
EZE 26:10 లెక్కకుమించి వున్న అతని గుర్రాలు రేపే దుమ్ముతో నీవు కప్పబడతావు. బబులోను రాజు నగర ద్వారాల గుండా నగర ప్రవేశం చేసినప్పుడు గుర్రాల చప్పుడుకు, బండ్లు, రథాలు చేసే ధ్వనికి నీ గోడలు కిందికి తోయబడుతాయి. అవును, నీ గోడలు పెరికివేయటానికి వారు నీ నగరంలోకి వస్తారు.
EZE 26:11 బబులోను రాజు గుర్రం మీద నీ నగరం గుండా వస్తాడు. అతని గుర్రాల డెక్కలు నీ వీధులన్నిటినీ పిండిగొట్టినట్లు దట్టస్తాయి. నీ ప్రజలను అతడు కత్తులతో చంపివేస్తాడు. నీ నగరంలోని బలమైన స్తంభాలు నేలకూలుతాయి.
EZE 26:12 నెబుకద్నెజరు మనుష్యులు నీ ధనాన్ని దోచుకుంటారు. నీవు అమ్మ దలచిన వస్తువులను వారు ఎత్తుకుపోతారు. వారు నీ ప్రాకారాలను పడగొడతారు. నీ సుందర భవంతులను వారు నాశనం చేస్తారు. నీ రాళ్లను, కలప ఇండ్లను చెత్త వలె, సముద్రంలో పారవేస్తారు.
EZE 26:13 అలా మీ ఆనంద గీతికల శబ్దాన్ని ఆపివేస్తాను. ప్రజలు మీ వీణావాదనలు మరి వినరు.
EZE 26:14 నిన్నొక బండరాయిలా మార్చివేస్తాను. సముద్రపు ఒడ్డున చేపలు పట్టే వలలు ఆరబెట్టటానికి పనికివచ్చే స్థలంగా మారిపోతావు! నీవు తిరిగి నిర్మింపబడవు. ఎందవల్లననగా యెహోవానైన నేను ఈ విషయం చెపుతున్నాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 26:15 నా ప్రభువైన యెహోనా ఈ విషయం తూరుకు చెపుతున్నాడు: “మధ్యధరా సముద్ర తీరానగల దేశాలు నీ పతనంవల్ల కలిగిన శబ్దానికి తుళ్లిపడతాయి. నీ ప్రజలు హింసించబడి, చంపబడినప్పుడు అది జరుగుతుంది.
EZE 26:16 సముద్రతీర దేశరాజులంతా తమ సింహాసనాలు దిగి తమ సంతాపాన్ని వెలిబుచ్చుతారు. వారు తమ ప్రత్యేక రాజదుస్తులు తీసివేస్తారు. వారు తమ అందమైన బట్టలు విసర్జిస్తారు. పిమ్మట వారు ‘భయసూచక దుస్తులు’ ధరిస్తారు. వారు నేలమీద కూర్చుని, భయంతో వణుకు తారు. ఎంత త్వరగా నీవు నాశనం చేయబడ్డావో చూచి వారు విస్మయం చెందుతారు.
EZE 26:17 నిన్ను గురించి వారు ఈ విషాద గీతిక పాడుతారు: “‘ఒహో తూరూ, నీవొక ప్రసిద్ధ నగరానివి. నీలో నివసించాలని ప్రజలు సముద్రాలు దాటి వచ్చారు. నీవు చాలా ప్రఖ్యాతి చెందిన దానివి. కాని నీవు లేకుండా పోయావు! సముద్రంలో నీవు బలమైనదానవు. నీలాగే నీలో నివసించిన ప్రజలు కూడా బలిష్ఠులు. నీ ముఖ్య భూమిలో నివసించే ప్రజలు నీవంటే భయపడేలా చేశావు.
EZE 26:18 మరి నీవు పతనమయ్యే రోజున తీర దేశాలు భయంతో కంపించిపోతాయి. తీరం వెంబడి నీవెన్నో వాడలు ఏర్పాటు చేశావు. నీవు పోగానే ఆ ప్రజలు భయభ్రాంతులవుతారు!’”
EZE 26:19 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరూ, నిన్ను నాశనం చేస్తాను. నీవొక పురాతన పాడుబడ్డ నగరంలా మారతావు. అక్కడ ఎవ్వరూ నివసించరు. సముద్రం పొంగి నీ మీదికి వచ్చేలా చేస్తాను. ఆ గొప్ప సముద్రం నిన్ను ఆవరిస్తుంది.
EZE 26:20 చనిపోయిన వాళ్లు పోయే పాతాళం లోకి నిన్ను పంపుతాను. ఎన్నడో చనిపోయిన వారిని నీవు కలిసికొంటావు. పాడుబడిన ఇతర పురాతన నగరాలవలె నిన్ను కూడా కింది లోకానికి పంపివేస్తాను. సమాధికి పోయిన ఇతరులతో నీవు కూడా ఉండిపోతావు. అప్పుడు నీలో మరెవ్వరూ నివసించరు. మరెన్నటికీ నీవు నివసించటానికి అనువుకాకుండా పోతావు!
EZE 26:21 నీకు జరిగిన దానిని చూసి ప్రజలు భయపడిపోతారు. నీవు నాశనమవుతావు! ప్రజలు నీకొరకు చూస్తారు; కాని వారు నిన్ను ఇక కనుగొనలేరు!” నా ప్రభువైన యెహోవా చెప్పిన విషయం ఇది.
EZE 27:1 మరొకసారి యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 27:2 “నరపుత్రుడా, తూరును గురించి ఈ విషాద గీతం పాడుము.
EZE 27:3 తూరును గురించిన ఈ విషయాలు తెలియజేయుము: “‘తూరూ, నీవు సముద్రాలకు ద్వారం వంటిదానవు. అనేక దేశాలకు నీవు వ్యాపారివి. తీరం వెంబడి నీవనేక దేశాలకు ప్రయాణం చేస్తావు. నిన్ను గూర్చి నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: తూరూ, నీవు చాలా అందమైన దానివని నీవనుకుంటున్నావు. నీవు చక్కని సుందరాంగివని తలపోస్తున్నావు!
EZE 27:4 మధ్యధరా సముద్రం నీ నగరం చుట్టూ సరిహద్దు. నిన్ను నిర్మించిన వారు నిన్ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు! నీ నుండి ప్రయాణమై వెళ్లే ఓడలవలె నీవు ఉన్నావు.
EZE 27:5 నీ నిర్మాణపు పనివారు శెనీరు (హెర్మోను కొండ) నుండి తెచ్చిన తమాల వృక్షపు కర్రతో (ఓడ) బల్లలు తయారుచేశారు. లెబానోను సరళవృక్షపు కర్రతో నీ ఓడ స్తంభాలను చేశారు.
EZE 27:6 బాషాను నుండి తెచ్చిన సింధూర వృక్షపు కర్రతో పడవ తెడ్లు చేశారు. కిత్తీయుల ద్వీపం (సైప్రస్) నుండి తెచ్చిన దేవదారు వృక్షపు కర్రను వినియోగించి అడుగు అంతస్థులో గదిని నిర్మించారు. ఈ గదిని దంతపు పనితో అలంకరించారు.
EZE 27:7 ఈజిప్టు నుండి తెచ్చిన రంగు రంగుల నారబట్టలు నీ తెరచాపలుగా ఉపయోగించారు. ఆ తెరచాపయే నీ పతాకం. నీ గది తెరలు నీలం, ఊదా రంగులను కలిగి ఉన్నాయి. అవి ఎలిషా (సైప్రస్) ద్వీపంనుండి వచ్చినవి.
EZE 27:8 దోనూ, అర్వదూ నివాసులు నీ కొరకు నీ పడవలు నడిపారు. తూరూ, నీ వారిలో తెలివి గలవారు నీ ఓడలకు చుక్కాని పట్టారు.
EZE 27:9 బిబ్లోసు (గెబలు) పెద్దలు, నేర్పరులైన పనివారు ఓడమీద ఉండి చెక్కల మధ్య కీలువేసి ఓడను బాగుచేశారు. సముద్రం మీదనున్న అన్ని ఓడలు, వాటి నావికులు నీతో వర్తక వ్యాపారాలు చేయటానికి నీ వద్దకు వచ్చారు.’
EZE 27:10 “పారసీకులు (పర్షియావారు), లూదు వారు, పూతువారు నీ సైన్యంలో ఉన్నారు. వారు నీ యుద్ధ వీరులు. వారు తమ డాళ్లను, శిరస్త్రాణాలను నీ గోడలకు వేలాడదీశారు. వారు నీ నగరానికి ప్రతిష్ఠను తెచ్చి పెట్టారు.
EZE 27:11 నీ నగరం చుట్టూ అర్వదు మనుష్యులు కాపలాదారులుగా నిలబడియున్నారు. బురుజులలో గామదు మనుష్యులు ఉన్నారు. నీ నగరం చుట్టూ వాళ్లు తమ డాళ్లను వ్రేలాడదీసియున్నారు. వాళ్లు నీ సౌందర్యాన్ని సంపూర్ణముగా చేశారు.
EZE 27:12 “తర్షీషు నీకున్న మంచి ఖాతాదారులలో ఒకటి. నీవు అమ్మే అద్భుతమైన వస్తువులకు వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చేవారు.
EZE 27:13 గ్రీకేయులు, టర్కీ (తుబాలువారు) మరియు నల్ల సముద్రపు (మెషెకు) ప్రాంత ప్రజలు నీతో వ్యాపారం చేశారు. నీవు అమ్మే సరుకులకు వారు బానిసలను, కంచును ఇచ్చేవారు.
EZE 27:14 తోగర్మా ప్రజలు నీవు అమ్మిన వస్తువులకు గుర్రాలను, యుద్ధాశ్వాలను, కంచర గాడిదలను ఇచ్చేవారు.
EZE 27:15 దదాను ప్రజలు నీతో వ్యాపారం చేశారు. నీవు నీ సరుకులను అనేకచోట్ల అమ్మావు. నీ సరుకులకు మూల్యంగా వారు ఏనుగు దంతాలు, విలువగల కోవిదారు కలపను ఇచ్చేవారు.
EZE 27:16 నీవద్ద అనేక మంచి వస్తువులు ఉన్న కారణంగా ఆరాము నీతో వ్యాపారం చేసింది. నీవు అమ్మే సరుకులకు ఎదోము ప్రజలు పచ్చమణులు, ఊదారంగు బట్టలు, సున్నితమైన అల్లిక పనిచేసిన వస్త్రాలు, నాజూకైన నారబట్టలు, పగడాలు, కెంపులు ఇచ్చేవారు.
EZE 27:17 “యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నీతో వర్తకం చేశారు. వారు నీవద్ద కొనే సరుకులకు గోధుమ, ఆలివులు ముందు వచ్చే అత్తిపళ్లు, తేనె, నూనె, గుగ్గిలం యిచ్చేవారు.
EZE 27:18 దమస్కు నీకు మరో మంచి ఖాతా దారు. నీవద్ద ఉన్న అనేక అద్భుత వస్తువులను వారు కొనుగోలు చేశారు. ప్రతిగా వారు హెల్బోను నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని, తెల్ల ఉన్నిని నీకిచ్చేవారు.
EZE 27:19 నీవమ్మే సరుకులకు దమస్కువారు ఉజాల్ నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని నీకిచ్చేవారు. వాటిని ఇనుము, కసింద మూలిక, చెరకును వారు కొన్న వస్తువులకు మారుగా ఇచ్చేవారు.
EZE 27:20 వ్యాపారం ముమ్మరంగా సాగటానికి దదాను దోహద పడింది. వారు గుర్రపు గంతపై వేసే బట్టను, స్వారీ గుర్రాలను నీకిచ్చి సరుకులు కొనేవారు.
EZE 27:21 అరబీయులు (అరేబియావారు) కేదారు నాయకులు నీకు గొర్రె పిల్లలను, పొట్లేళ్లను, మేకలను ఇచ్చి నీవద్ద ఉన్న సరుకులు కొనేవారు.
EZE 27:22 షేబ దేశపు వర్తకులు, రామా ప్రాంత వర్తకులు నీతో వ్యాపారం చేశారు. నీ వస్తువులకు వారు మిక్కిలి శ్రేష్ఠమైన సుగంధ ద్రవ్యాలు, నానారకాల విలువైన రాళ్లు, బంగారం ఇచ్చేవారు.
EZE 27:23 హారాను, కన్నే, ఏదెను, షేబ, అష్షూరు మరియు కిల్మదు దేశాల ప్రజలు, వర్తకులు నీతో వ్యాపారం చేశారు.
EZE 27:24 నీవద్ద కొన్న సరుకులకు వారు నాణ్యమైన వస్త్రాలు, నీలవర్ణపు, అల్లిక పనిచేసిన దుస్తులు, రంగు రంగుల తివాచీలు, బాగా పురిపెట్టి వేనిన తాళ్ళు, దేవదారు కలపతో చేయబడిన అనేక వస్తువులు ఇచ్చేవారు. ఈ వస్తు సామగ్రులతో వారు నీతో వ్యాపారం చేశారు.
EZE 27:25 [నీవు అమ్మిన సరుకులు తర్షీషు ఓడలు మోసుకుపోయేవి.] “తూరూ! నీవు సరుకులతో నిండిన ఓడలాంటి దానివి. నీవు సముద్రం మీద అనేకమైన విలువగల సరుకులతో ఉన్నదానివి.
EZE 27:26 నీ పడవలను నడిపిన నావికులు నిన్ను మహా సముద్రాల మధ్యగా తీసుకొని వెళ్తారు. కాని బలమైన తూర్పు గలులు నీ ఓడను నడిసముద్రంలో నాశనం చేస్తాయి.
EZE 27:27 నీ ధనమంతా సముద్రం పాలవుతుంది. నీ ఐశ్వర్యం, నీ వర్తకం, నీ సరుకు, నీ నావికులు, చుక్కాని పట్టేవారు, కీలుపెట్టి పడవలు బాగుచేసే పనివారు, నీ అమ్మకపు దారులు, నీ నగరంలో గల సైనికులు, నీ ఓడ సిబ్బంది అంతా సముద్రంలో మునిగిపోతారు! నీవు నాశనమయ్యే రోజున ఇదంతా జరుగుతుంది.
EZE 27:28 “నీ వ్యాపారులను నీవు బహుదూర ప్రాంతాలకు పంపిస్తావు. అయితే నీ ఓడ చుక్కాని పట్టేవాని రోదన విన్నప్పుడు ఆ ప్రాంతాలు భయంతో పణకిపోతాయి!
EZE 27:29 నీ ఓడ సిబ్బంది అంతా ఓడ నుండి దుముకుతారు. నీ నావికులు, చుక్కాని పట్టేవారు. వారు ఓడ నుండి దుమికి ఒడ్డుకు ఈదుతారు.
EZE 27:30 వారు నిన్ను గురించి చాలా బాధపడతారు. వారు రోదిస్తారు. వారు తమ తలలపై దుమ్ము పోసు కుంటారు. వారు బూడిదలో పొర్లాడుతారు.
EZE 27:31 నీ కొరకు వారు తమ తలలు గొరిగించు కుంటారు. వారు విషాద సూచక దుస్తులు ధరిస్తారు. వారు నీకొరకు దుఃఖిస్తారు. మృతుడైన వ్యక్తి కొరకు ఏడ్చేవానిలా వారు శోకిస్తారు.
EZE 27:32 “వారి భయంకర రోదనలో, ఈ విషాద గీతం వారు ఆలపిస్తూ నీకొరకు విలపిస్తారు, “‘తూరు వంటిది మరొక్కటి లేదు! నడి సముద్రంలో తూరు నాశనమయ్యింది!
EZE 27:33 నీ వ్యాపారులు సముద్రాల మీద పయనించారు. నీ మహా సంపదతోను, నీవు అమ్మిన సరుకులంతోను నీవనేక మందిని తృప్తిపర్చావు. ఈ భూమిపై గల రాజులను నీవు ఐశ్వర్యవంతులుగా చేశావు!
EZE 27:34 కాని నీవు నడిసముద్రంలో, అగాధంలో ముక్కలై పోయావు. నీవు అమ్మే వస్తువులతో పాటు నీ మనుష్యులందరూ కూలిపోయారు!
EZE 27:35 రవాసులంతా నీ విషయంలో అదిరి పోయ్యారు. వారి రాజులు తీవ్రంగా భయపడ్డారు. వారి రాజులు తీవ్రంగా భయపడ్డారు. వారి ముఖాలు చిన్న బోయాయి.
EZE 27:36 ఇతర రాజ్యాల వర్తకులు నిన్ను చూసి చులకనగా మాట్లాడారు. నీకు జరిగిన సంఘటనలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. ఎందువల్ల నంటే నీవు సర్వనాశనమయ్యావు. నీవికలేవు.’”
EZE 28:1 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు:
EZE 28:2 “నరపుత్రుడా, తూరు పాలకునికి ఇలా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా నీకు చెప్పునదేమనగా: “‘నీవు గర్విష్ఠివి! “నేనే దేవుడను! సముద్ర మధ్యంలో దైవ స్థానంలో కూర్చున్నాను” అని నీవంటున్నావు. “‘కాని నీవు మానవ మాత్రుడవు. దేవుడవు, మాత్రం కాదు. నీవు దేవుడవని నీకై నీవే అనుకుంటున్నావు.
EZE 28:3 నీవు దానియేలు కంటె తెలివిగలవాడవని తల పోస్తున్నావు! రహస్యాలన్నిటినీ తెలుసుకొనగలవని నీవనుకుంటున్నావు.!
EZE 28:4 నీ తెలివితేటల ద్వారా, నీ వ్యాపారం ద్వారా నీవు ధనధాన్యాలు విస్తారంగా సేకరించావు. నీ ధనాగారాలలో వెండి బంగారాలు నిలువజేశావు.
EZE 28:5 గొప్పదైన నీ జ్ఞానంచేత, వ్యాపారం ద్యారా నీ సంపదను పెంచావు. ఇప్పుడా ఐశ్వర్యాన్ని చూచు కొని నీవు గర్వపడుతున్నావు.
EZE 28:6 “‘అందువల్ల నా ప్రభువైన యెహోవా చెపుతున్న దేమంటే, నీవొక దేవుడిలా ఉన్నావని తలంచావు.
EZE 28:7 అన్య జనులను నేను నీ మీదికి రప్పిస్తాను. వారు దేశాలన్నిటిలో అతి భయంకరులు! వారు తమ కత్తులను దూస్తారు. నీ తెలివితేటలు సముపార్జించి పెట్టిన అందమైన వస్తువుల మీద వాటిని ఉపయోగిస్తారు. వారు నీ కీర్తిని నాశనం చేస్తారు.
EZE 28:8 వారు నిన్ను సమాధిలోకి దించుతారు. నడి సముద్రంలో చనిపోయిన నావికునిలా నీవుంటావు.
EZE 28:9 నిన్నొక వ్యక్తి చంపివేస్తాడు. అప్పుడు “నేను దేవుణ్ణి” అని నీవు చెప్పుకోగలవా? ఆ సమయంలో అతడు నిన్ను తన అధీనంలో ఉంచుతాడు. దానితో నీవొక మానవ మాత్రుడవనీ, దేవుడవు కావనీ నీవు తెలుసుకుంటావు!
EZE 28:10 కోత్తవాళ్లు నిన్ను విదేశీయునిగా చూసి చంపివేస్తారు. నేను ఇచ్చిన ఆజ్ఞ కారణంగా ఆ పనులు జరుగుతాయి!’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 28:11 యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 28:12 “నరపుత్రుడా, తూరు రాజను గురించి ఈ విషాద గీతం ఆలపించు. అతనికి ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “‘నీవు ఆదర్శ పురుషుడవు. నీకు జ్ఞానసంపద మెండు. నీ అందం పరిపూర్ణమైనది.
EZE 28:13 దేవుని ఉద్యానవనమైన ఏదెనులో నీవున్నావు. నీవద్ద ప్రతి విలువైన రత్నం ఉంది. కెంపులు, గోమేధికము, ఇతర రత్నాలు; గరుడ వచ్చలు, సులిమానురాయి, పచ్చరాయి; నీల మణులు, వైడూర్యము, మరకత పచ్చలు. వీటిలో ప్రతిరాయీ బంగారంలో పొదగబడింది. నీవు సృష్టింపబడిన రోజుననే దేవుడు నిన్ను బలవంతుడిగా చేశాడు.
EZE 28:14 నీవు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన కెరూబులలొ ఒకడవై యున్నావు. నీ రెక్కలు నా సింహాసనం మీదికి చాపబడ్డాయి. దేవుని పవిత్ర పర్వతం మీద నిన్ను ఉంచాను. అగ్నిలా మెరిసే ఆభరణాల గుండా నీవు నడిచావు.
EZE 28:15 నేను నిన్ను సృష్టించినప్పుడు నీవు మంచివాడివి, యోగ్యుడిగా ఉన్నావు. కాని ఆ తరువాత నీవు దుష్టుడవయ్యావు.
EZE 28:16 నీ వ్యాపారం నీకు చాలా ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది. ధనంతో పాటు నీలో మదం (గర్వం) పెరిగింది. దానితో నీవు పాపం చేశావు. అందువల్ల నిన్నొక అపరిశుభ్రమైన వస్తువుగా నేను పరిగణించాను. దేవుని పవిత్ర పర్వతం నుండి నిన్ను తోసివేశాను. నీవు ప్రత్యేక కెరూబులలో ఒకడవు. నీ రెక్కలు నా సింహాసనం పైకి చాప బడ్డాయి. కాని అగ్నిలా మెరిసే ఆభరణాలను వదిలిపెట్టి పోయేలా నిన్ను ఒత్తిడి చేశాను.
EZE 28:17 నీ అందాన్ని చూచుకొని నీవు గర్వపడ్డావు. నీ గొప్పతనం యెక్క గర్వం నీ జ్ఞానాన్ని పాడు చేసింది. అందువల్ల నిన్ను కిందికి పడదోశాను. ఇప్పుడు ఇతర రాజులు నీవంక తేరిపార జూస్తున్నారు.
EZE 28:18 నీవు చాలా పాపాలు చేశావు. నీవు చాలా కుటిలమైన వర్తకుడవు. ఈ రకంగా పవిత్ర స్థలాలను నీవు అపవిత్ర పర్చావు. కావున నీలో నేను అగ్ని పుట్టించాను. అది నిన్ను దహించి వేసింది! నీవు నేలమీద బూడిదవయ్యావు. ఇప్పుడు ప్రతి ఒక్కడు నీ అవమానాన్ని చూడ గలడు.
EZE 28:19 ఇతర దేశాల ప్రజలు నీకు సంభవించిన దాన్ని చూచి ఆశ్చర్యపోయారు. నీకు వచ్చిన ఆపద ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. నీవు సర్వనాశనమయ్యావు.’”
EZE 28:20 యెహోవా మాట నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 28:21 “నరపుత్రుడా, సీదోను పట్టణం వైపు చూడు. నా తరపున ఆ ప్రదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుము.
EZE 28:22 ఈ రకంగా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “‘సీదోనూ, నేను నీకు వ్యతిరేకిని! నీ ప్రజలు నన్ను గౌరవించటం నేర్పుకుంటారు! నేను సీదోనును శిక్షిస్తాను. ప్రజలు నేనే యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు. నేను పవిత్రుడనని వారు నేర్చుకుని నన్ను ఆ విధంగా చూసుకుంటారు.
EZE 28:23 రోగాలను, మరణాన్ని నేను సీదోనుకు పంపిస్తాను. ఖడ్గం (శత్రు సైన్యం) నగరం వెలుపల చాలా మందిని చంపుతుంది. వారప్పుడు నేనే యెహోవానని తెలుసుకుంటారు!’”
EZE 28:24 “‘గతంలో ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలు దానిని అసహ్యించుకున్నాయి. కాని ఆయా దేశాలకు కీడు జరుగుతుంది. ఇశ్రాయేలు వంశాన్ని బాధించే ముండ్లు గాని, వదలక అంటుకునే ముండ్ల పొదలు గాని ఇక ఎంత మాత్రం ఉండవు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’”
EZE 28:25 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నేను ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదరగొట్టాను. కాని, ఇశ్రాయేలు వంశాన్ని నేను మళ్లీ ఒక్క చోటికి చేర్చుతాను. అప్పుడా రాజ్యాలన్నీ నేను పవిత్రుడనని తెలుసుకుంటాయి. అవి నన్ను ఆ విధంగా గౌరవిస్తాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తమ రాజ్యంలో నివసిస్తారు. ఆ రాజ్యాన్ని నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చాను.
EZE 28:26 వారు ఆ రాజ్యంలో క్షేమంగా ఉంటారు. వారు ఇండ్లు కట్టుకొని, ద్రాక్షాతోటలు పెంచుకుంటారు. నేను వారి చుట్టూ ఉండి, వారిని అసహ్యించుకున్న దేశాల వారిని శిక్షిస్తాను. తరువాత ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా జీవిస్తారు. అప్పుడు నేనే వారి దేవుడనైన యెహోవానని వారు తెలుసుకొంటారు.”
EZE 29:1 దేశం నుండి వెళ్లగొట్టబడిన పదవ సంవత్సరం, పదవనెల (జనవరి) పన్నెండవరోజున నా ప్రభువైన యెహోవా మాట నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 29:2 “నరపుత్రుడా, ఈజిప్తు రాజైన ఫరోవైపు చూడు. నా తరపున నీవు అతనికి, ఈజిప్టుకు వ్యతిరేకంగా మాట్లాడుము.
EZE 29:3 నీవు ఈ విధముగా మాట్లాడుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “‘ఈజిప్టు రాజవైన ఫరో, నేను నీకు విరోధిని. నీవు నైలునదీ తీరాన పడివున్న ఒక పెద్ద క్రూర జంతువవు. “ఈ నది నాది! ఈ నదిని నేను ఏర్పాటు చేశాను!” అని నీవు చెప్పుకొనుచున్నావు.
EZE 29:4 “‘కాని నేను నీ దవడలకు గాలం వేస్తాను. నైలునదిలోని చేపలు నీ చర్మపు పొలుసులను అంటుకుంటాయి. పిమ్మట నిన్ను, నీ చేపలను నదిలోనుంచి లాగి నేలమీదికి ఈడ్చుతాను. నీవు నేలమీద పడతావు. నిన్నెవ్వరూ లేవనెత్తటం గాని, పాతిపెట్టడం గాని, చేయరు. నేను నిన్ను అడవి జంతువులకు, పక్షులకు వదిలివేస్తాను. నీవు వాటికి ఆహారమవుతావు.
EZE 29:6 ఈజిప్టు నివసిస్తున్న ప్రజలంతా నేనే యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు! “‘నేనీ పనులు ఎందుకు చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద ఆధారపడ్డారు. కాని ఈజిప్టు రెల్లు గడ్డిలా బలహీసమైనది.
EZE 29:7 ఇశ్రాయేలు ప్రజలు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద ఆధారపడ్డారు. కాని ఈజిప్టువారి చేతులకు, భుజాలకు తూట్లు పొడిచింది. వారు సహాయం కొరకు నీ మీద ఆధారపడ్డారు. కాని నీవు వారి నడుము విరుగగొట్టి, మెలిపెట్టావు.’”
EZE 29:8 కావున నా ప్రభువైన యెహోవా, ఈ విషయాలు చెపుతున్నాడు: “నేను నీ మీదికి కత్తిని రప్పిస్తున్నాను. నేను నీ ప్రజలందరినీ, పశువులనూ నాశనం చేస్తాను.
EZE 29:9 ఈజిప్టు నిర్మానుష్యమై నాశనమవుతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.” దేవుడు ఇలా చెప్పాడు: “నేనెందుకీ పనులు చేయాలి? ‘ఈ నది నాది. ఈ నదిని నేను ఏర్పాటు చేశాను’ అని నీవు చెప్పుకున్నందువల్ల! నేను ఆ పనులు చేయదలిచాను.
EZE 29:10 కావున నేను (దేవుడు) నీకు వ్యతిరేకిని. అనేకంగా ఉన్న నైలు నదీ శాఖలకు నేను విరోధిని. నేను ఈజిప్టును పూర్తిగా నాశనం చేస్తాను. మిగ్దోలునుండి ఆశ్వన్ (సెవేనే) వరకు, మరియు ఇథియోపియ (కూషు) సరిహద్దు వరకు గల నగరాలన్నీ నిర్మానుష్యమై పోతాయి.
EZE 29:11 మనుష్యుడే గాని, జంతువే గాని ఈజిప్టు దేశం గుండా వెళ్లరు.
EZE 29:12 పాడుబడ్డ దేశాల మధ్యలో ఈజిప్టు దేశాన్ని పాడుబడ్డ నగరాల మధ్యలో దాని నగరాన్ని పాడుగా చేస్తాను. అది నలభై సంవత్సరాలు పాడుగా ఉంటుంది. ఈజిప్టు వారిని జనాల మధ్యలోనికి తోలివేసి చెదరగొడతాను. చెదరగొట్టిన దేశాల్లో నేను వారిని పరాయి వారినిగా చేస్తాను.”
EZE 29:13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఈజిప్టు ప్రజలను నేను అనేక దేశాలకు చెదరి పోయేలా చేస్తాను. కాని నలభై సంవత్సరాల అనంతరం ఆ ప్రజలను నేను మళ్లీ సమీకరిస్తాను.
EZE 29:14 ఈజిప్టు బందీలను నేను వెనుకకు తీసుకొని వస్తాను. ఈజిప్టువారిని వారి జన్మస్థలమైన పత్రోసుకు తిరిగి తీసుకొని వస్తాను. అయితే వారి రాజ్యానికి మాత్రం ప్రాముఖ్యం ఉండదు.
EZE 29:15 అది పాముఖ్యం లేని రాజ్యంగా తయారవుతుంది. అది మరెన్నడూ సాటి రాజ్యాల కంటె మిన్నగా పెరగజాలదు. అది ఇతర రాజ్యాల మీద ఆధిపత్యం చేయలేనంత చిన్నగా దానిని నేను తగ్గించి వేస్తాను.
EZE 29:16 ఇశ్రాయేలు వంశం వారు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద మరెన్నడు ఆధార పడరు. ఇశ్రాయేలీయులు తమ పాపాన్ని గుర్తు తెచ్చుకుంటారు. తమ సహాయం కొరకు దేవుని అర్థించకుండా ఈజిప్టును ఆశ్రయించిన తమ పాపాన్ని వారు గుర్తు తెచ్చుకుంటారు. నేనే ప్రభువైన యెహోవానని వారు గుర్తిస్తారు.”
EZE 29:17 దేశంనుండి వెళ్ల గొట్టబడిన ఇరవై ఏడవ సంవత్సరం, మొదటి నెల (ఏప్రిల్) మొదటి రోజున దేవుని వాక్కు నాకు వినబడింది. ఆయన ఇలా చెప్పాడు,
EZE 29:18 “నరపుత్రుడా, బబులోను రాజైన నెబుకద్నెజరు తూరుపై యుద్ధంలో తన సైన్యాలు తీవ్రంగా పోరాడేలాగు చేశాడు. వాళ్లు ప్రతి సైనికుని తల గొరిగారు. బరువైన పనులు ప్రతి సైనికుని తలమీద రుద్దబడినవి. ప్రతి సైనికుని భుజం కొట్టుకుపోయి పుండయ్యింది. తూరును ఓడించటానికి నెబుకద్నెజరు, అతని సైన్యంచాలా శ్రమ పడవలసి వచ్చింది. కాని ఆ శ్రమకు తగిన ప్రతిఫలం వారికి దక్కలేదు.”
EZE 29:19 అందువల్ల నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెపుతున్నాడు: “నేను ఈజిప్టు రాజ్యాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. నెబుకద్నెజరు ఈజిప్టు ప్రజలను పట్టుకు పోతాడు. ఈజిప్టు నుంచి విలువైన వస్తువుల నెన్నింటినో నెబుకద్నెజరు తీసుకొనిపోతాడు. అదే నెబుకద్నెజరు సైన్యానికి పారితోషికం.
EZE 29:20 నెబుకద్నెజరు చేసిన కష్టానికి అతనికి నేను ఈజిప్టు రాజ్యాన్ని ప్రతిఫలంగా ఇస్తున్నాను. వారు నా కొరకు పనిచేశారు గనుక నేనిది వారికి చేస్తున్నాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
EZE 29:21 “ఆ రోజను ఇశ్రాయేలు వంశాన్ని నేను బల పర్చుతాను. పైగా నీ ప్రజలు ఈజిప్టువారిని చూచి నవ్వుతారు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.”
EZE 30:1 మరొకసారి యెహోవా మాట నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 30:2 “నరపుత్రుడా, నా తరపున మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “‘నీవు దుఃఖపడి, “భయంకరమైన రోజు దరిచేరుతున్నది” అని ప్రకటించుము.
EZE 30:3 ఆ రోజు దగ్గరలో ఉంది! అవును. యెహోవా తీర్పు తీర్చే రోజు దగ్గర పడుతున్నది. అది మేఘాల రోజు. అది రాజ్యాలపై తీర్పు ఇచ్చే సమయం!
EZE 30:4 ఈజిప్టు మీదకి ఒక కత్తి వస్తుంది! ఈజిప్టు పతనమయ్యే సమయాన ఇథియోపియ (కూషు) ప్రజలు భయంతో చెదరిపొతారు. ఈజిప్టు ప్రజలను బబులోను సైన్యం బందీలుగా పట్టుకుపోతుంది. ఈజిప్టు పునాదులు కదిలిపోతాయి!
EZE 30:5 “‘ఆ అనేక మంది ప్రజలు ఈజిప్టుతో శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. కాని ఇథియోపియ (కూషు), పూతు, లూదు, అరేబియా (మిశ్రమ ప్రజలు), లిబ్యా (కూబు), ఇశ్రాయేలు (నా నిబంధన దేశము) ప్రజలు-అందరూ నాశనం చేయబడతారు!
EZE 30:6 “‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “అవును. ఈజిప్టును బలపర్చిన వారంతా పడిపోతారు! దాని బలగర్వం తగ్గి పోతుంది. మిగ్దోలు నుండి ఆశ్వన్ (సెవేనే) వరకు గల ఈజిప్టు ప్రజలంతా చంపబడతారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
EZE 30:7 నాశనం చేయబడిన దేశాలలో ఈజిప్టు కూడా కలిసిపోతుంది. శూన్యంగా మిగిలిన రాజ్యాలలో ఈజిప్టులో ఒకటి అవుతుంది.
EZE 30:8 ఈజిప్టులో అగ్ని రగిలిస్తాను. దానితో దాని సహాయకులు నాశనమై పోతారు. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
EZE 30:9 “‘ఆ సమయాన నేను దూతలను పంపుతాను. వారు ఓడలలో పయనించి ఇథియోపియ (కూషు)కు దుర్వార్త తీసుకొని వెళతారు. ఇథియోపియ ఇప్టుడు క్షేమంగా ఉన్నాననుకుంటూ ఉంది. కాని ఈజిప్టు శిక్షించ బడినప్పుడు ఇథియోపియ ప్రజలు భయంతో కంపించిపోతారు. ఆ సమయం వస్తూ ఉంది!’”
EZE 30:10 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “బబులోను రాజైన నెబుకద్నెజరును నేను వినియోగించి ఈజిప్టు ప్రజలను నాశనం చేస్తాను.
EZE 30:11 నెబుకద్నెజరు, అతని మనుష్యులు జాతులన్నిటిలోనూ అతి భయంకరులు. ఈజిప్టును నాశనం చేయటానికి వారిని తీసుకొనివస్తాను. ఈజిప్టు మీద వారు తమ కత్తులు దూస్తారు. వారు దేశాన్ని శవాలతో నింపివేస్తారు.
EZE 30:12 నైలునది ఎండిపోయేలా నేను చేస్తాను. అలా ఎండిన భూభూగాన్ని దుష్ట జనులకు అమ్మి వేస్తాను. ఆ భూమిని నిర్మానుష్యం చేయటానికి నేను అన్యజనులను వినియోగిస్తాను. యెహోవానైన నేను ఈ విషయాలు చెపుతున్నాను!”
EZE 30:13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఈజిప్టులో ఉన్న విగ్రహాలను కూడా నేను నాశనం చేస్తాను. మెంఫిస్ (నొపు)లో ఉన్న విగ్రహాలన్నిటినీ తొలగిస్తాను. ఈజిప్టులో ఇక ఎంత మాత్రం నాయకుడెవడు ఉండడు. ఈజిప్టు రాజ్యంలో భయాన్ని పుట్టిస్తాను.
EZE 30:14 పత్రోసును శూన్య రాజ్యంగా మార్చివేస్తాను. సోయనులో అగ్ని రగుల్చుతాను. ‘నో’ నగరాన్ని శిక్షిస్తాను.
EZE 30:15 ఈజిప్టుకు కోటవలె అండగా నిల్చిన సీను మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను! ‘నో’ నగర వాసులను నేను నాశనం చేస్తాను.
EZE 30:16 ఈజిప్టులో నేను అగ్ని ముట్టిస్తాను. సీను అనబడే ప్రాంతం భయానికి గురియవుతుంది. ‘నో’ నగరంలోకి సైనికులు విరుచుకుపడ్తారు. శత్రువులు దాన్ని పగటిపూట ఎదుర్కొంటారు.
EZE 30:17 ఓను, పిబేసెతు పట్టణాల యువకులు యుద్ధంలో చనిపోతారు. స్త్రీలు బందీలుగా పట్టుకుపోబడతారు.
EZE 30:18 ఈజిప్టు ఆధిపత్యాన్ని (కాడిని) తహపనేసులో నేను విరిచినప్పుడు అక్కడ అంధకారం ఏర్పడుతుంది. ఈజిప్టు యొక్క బలగర్వం అంతమవుతుంది! ఈజిప్టును ఒక మేఘం ఆవరిస్తుంది. ఆమె కుమార్తెలు చెరపట్టబడి తీసుకుపో బడతారు.
EZE 30:19 ఆ విధంగా నేను ఈజిప్టును శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు!”
EZE 30:20 చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం మొదటి నెల (ఏప్రిల్) ఏడవ రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 30:21 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరో చేతిని (శక్తిని) నేను విరచివేశాను. ఆ చేతికి ఎవ్వరూ కట్టు కట్టలేరు. ఆది నయం కాదు. ఆ చేయి మళ్లీ కత్తి పట్టే బలాన్ని పుంజుకోలేదు.”
EZE 30:22 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని. అతని మంచి చేతిని, గతంలో విరిగిన అవిటి చేతిని, రెండింటినీ నేను విరుగగొడతాను. అతని చేతి నుండి కత్తి జారి కిందపడేలా చేస్తాను.
EZE 30:23 ఈజిప్టువారిని వివిధ దేశాలకు చెదరగొడతాను.
EZE 30:24 బబులోను రాజు చేతులను నేను బలపర్చుతాను. నా కత్తిని అతని చేతిలో ఉంచుతాను. కాని ఫరో చేతులను నేను విరుగ గొడతాను. అప్పుడు ఫరో మరణించుతాడు. వేదన పడేలా బాధపడతాడు.
EZE 30:25 ఆ విధంగా బబులోను రాజు చేతులను బలపర్చి, ఫరో రాజు చేతులను నేను బలహీన పర్చుతాను. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు. “నేను నా కత్తిని బబులోను రాజు చేతిలో ఉంచుతాను. అతడా కత్తిని ఈజిప్టు రాజ్యం మీదికి విసురుతాడు.
EZE 30:26 నేను ఈజిప్టువారిని వివిధ దేశాలకు తరిమివేస్తాను. అప్పడు నేను యెహోవానని వారు తెలుసుకొంటారు.”
EZE 31:1 చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం మూడవ నెల మొదటి రోజున యెహోవా మాట నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 31:2 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోకు మరియు అతని ప్రజలకు ఈ విషయాలు తెలియజేయుము, “‘గొప్పతనంలో నీవు ఎవరిలా ఉన్నావు?
EZE 31:3 మిక్కిలి ఉన్నతంగా పెరిగి తన అందమైన కొమ్మలతో దట్టమైన నీడనిస్తూ లెబానోనులో పెరిగిన కేదారు వృక్షం అష్షూరు రాజ్యమే. దాని తల మేఘాల్లో ఉంది!
EZE 31:4 మంచి నీటివనరు చెట్టును బాగా పెరిగేలా చేసింది. లోతైన నది అది ఎత్తుగా పెరగటానికి దోహదమిచ్చింది. చెట్టు నాటబడిన ప్రాంతంలో నదులు ప్రవహించాయి. దాని కాలువలే అక్కడి పొలాల్లో ఉన్న చెట్లకు నీటిని అందజేశాయి
EZE 31:5 ఆ వృక్షం అలా మిగిలిన చెట్లన్నిటిలో పొడవుగా పెరిగింది. దానికి ఎన్నో కొమ్మలు పెరిగాయి. నీరు పుష్కలంగా ఉంది. అందువల్ల దాని కొమ్మలు విస్తరించాయి.
EZE 31:6 కావున పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి. ఆ ప్రాంతంలో జంతువులన్నీ దాని చల్లని నీడలో తమ పిల్లల్ని పెట్టాయి. గొప్ప రాజ్యాలన్నీ ఆ చెట్టు నీడలో నివసించాయి!
EZE 31:7 ఆ విధంగా ఆ చెట్టు తన గొప్పతనంలోను, తన పొడవైన కొమ్మలతోను, ఎంతో ఆందంగా కన్పించింది. ఎందువల్ల ననగా దానివేళ్ళు నీరు బాగా అందేవరకు నాటుకున్నాయి!
EZE 31:8 దేవుని ఉద్యానవనంలో ఉన్న కేదారు వృక్షాలు కూడా ఈ చెట్టంత పెద్దగా లేవు. దీనికి ఉన్నన్ని కొమ్మలు సరళ వృక్షాలకు కూడా లేవు. అక్షోట (మేడి) చెట్లకు అసలిటువంటి కొమ్మలే లేవు. దేవుని ఉద్యానవనంలో ఇంత అందమైన చెట్టేలేదు.
EZE 31:9 అనేకమైన కొమ్మలతో ఈ చెట్టును నేను అందమైనదిగా చేశాను. ఏదెనులో దేవుని ఉద్యానవనంలో ఉన్న చెట్లన్నీ దీనిపట్ల అసూయ చెందాయి!’”
EZE 31:10 కావున నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఈ చెట్టు విస్తరించి పొడవుగా పెరిగింది. దాని తలని మబ్బుల్లో పెట్టుకుంది. దాని ఎత్తు చూసుకొని అది గర్వపడింది.
EZE 31:11 అందువల్ల ఒక పరాక్రమశాలియగు రాజు ఆ చెట్టును ఉంచుకొనేలా చేస్తాను. అది చేసిన చెడ్డ పనులకు ఆ పాలకుడు దానిని శిక్షిస్తాడు. అతని చెడు తనంవల్ల నేను ఆ చెట్టును నాతోటనుండి తీసుకొంటిని.
EZE 31:12 దేశాలన్నిటిలో కొత్తవాళ్లు, చాలా క్రూరులయిన వాళ్లు దానిని నరికి పడవేశారు. ఆ చెట్టు కొమ్మలు కొండల మీదను, లోయలలోను చెల్లా చెదరుగా పడవేశారు. ఆ దేశం గుండా ప్రవహించే నదులలో విరిగిన కొమ్మలు కొట్టుకు పోయాయి. ఆ చెట్టు కింద నీడ ఇక ఏ మాత్రం లేకపోవటంతో వివిధ దేశాల ప్రజలంతా దానిని వదిలిపెట్టారు.
EZE 31:13 ఇప్పుడు పక్షులు పడిపోయిన ఆ చెట్టు మీదే నివసిస్తాయి. దాని పడిపోయిన కొమ్మలమీద ఆడవి జంతువులన్నీ నడుస్తాయి.
EZE 31:14 “ఆ నీటి పక్కనున్న ఏ చెట్టూ ఇక మీదట గర్వపడదు. అవి ఆకాశాన్నంటుకోవాలని తాపత్రయ పడవు. ఆ నీరును పీల్చే బలమైన చెట్లలో ఏ ఒక్కటీ పొడవుగా ఉన్నానని గొప్పలు చెప్పుకోదు. ఎందువల్ల నంటే అవన్నీ చనిపోవటం ఖాయం. అవన్నీ పాతాళ లోకంలోకి పోతాయి. అవి (వారు) మృతి చెందిన వారితో పాతాళంలో కలవటం తధ్యం.”
EZE 31:15 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఆ చెట్టు పాతాళానికి వెళ్లిన రోజున ప్రజలంతా సంతాపం పొందేలా చేశాను. అగాధమైన సముద్రంలో దాన్ని కప్పివేశాను. దాని నదులన్నిటినీ నిలుపు జేశాను. నీరంతా ప్రవహించటం ఆగిపోయింది. లెబానోను దాని కొరకు దుఃఖించేలా చేశాను. ఆ మహావృక్షం కొరకు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ విచారంతో క్రుంగిపోయాయి.
EZE 31:16 ఆ చెట్టు పడిపోయేలా నేను చేశాను. అది పతనమయినప్పుడు వచ్చిన శబ్దంతో దేశాలు భయంతో వణికిపోయాయి. ఆ వృక్షం మృతుల స్థానానికి వెళ్లేలా చేశాను. అది మృతులతో కలిసి ఉండటానికి పాతాళానికి చేరింది. గతంలో ఏదెనులో ఉన్న అన్ని చెట్లు, లెబానోనులో ఉన్న శ్రేష్ఠమైన చెట్లు ఆ నీటిని పిల్చాయి. ఆ చెట్లు పాతాళ లోకంలో ఓదార్చబడ్డాయి.
EZE 31:17 అవును. మృతుల స్థానానికి మహా వృక్షంతో పాటు మిగిలిన చెట్లు కూడ పోయాయి. యుద్ధంలో హతులైన ప్రజలను అవి కలిశాయి. ఆ మహా వృక్షం మిగిలిన చెట్లను బలపర్చింది. దేశాల మధ్య ఆ మహా వృక్షం యొక్క నీడలో ఆ చెట్లు నివసించాయి.
EZE 31:18 “కావున ఈజిప్టూ, ఏదెనులో నిన్ను ఏ చెట్టుతో పోల్చను? ఆ చెట్లన్నీ పెద్దవీ, బలిష్ఠమయినవీ. ఏదెనులోని చెట్లతో పాటు నీవు అధోలోకానికి పోతావు. విదేశీయులతోను యుద్ధంలో మరణించిన వారితోను కలిసి నీవు మృత్యుస్థానంలో పడివుంటావు. “ఫరోకు మరియు అతని ప్రజలందరికీ ఇది సంభవిస్తుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 32:1 చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్సరం, పన్నెండవ నెల (మార్చి) మొదటి రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 32:2 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి ఈ విషాద గీతిక ఆలపించు. అతనితో ఇలా చెప్పు: “‘దేశాల మధ్య గర్వంగా తిరుగాడే బలమైన యువకిశోరం అని నీకు నీవే తలుస్తున్నావు. కాని, నిజానికి నీవు సముద్రాల్లో తిరుగాడే మహాసర్పానివా. నీటి కాలువల గుండా నీ దారిని తీసుకొంటున్నావు. నీ కాళ్లతో కెలికి నీళ్లను మురికి చేస్తున్నావు. నీవు ఈజిప్టు నదులను కెలుకుతున్నావు.’”
EZE 32:3 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “అనేక మంది ప్రజలను నేను ఒక దగ్గరికి చేర్చాను. నేనిప్పుడు నా వలను నీ మీదికి విసురుతాను. ఆ ప్రజలంతా అప్పుడు నిన్ను లోపలకి లాగుతారు.
EZE 32:4 పిమ్మట నిన్ను ఎండిన నేలపై నేను పడేస్తాను. నిన్ను పొలాల్లో విసరివేస్తాను. నిన్ను తినటానికి పక్షులన్నిటినీ రప్పిస్తాను. కడుపునిండా నిన్ను తినటానికి అన్నిచోట్ల నుండి అడవి జంతువులను రప్పిస్తాను.
EZE 32:5 నీ కళేబరాన్ని పర్వతాల మీద చిందర వందరగా వేస్తాను. నీ కళేబరంతో లోయలు నింపుతాను.
EZE 32:6 నీ రక్తాన్ని పర్వతాలపై నేను ఒలక బోస్తాను. అది భూమిలో ఇంకిపోతుంది. నదులన్నీ నీతో నిండి ఉంటాయి.
EZE 32:7 నిన్ను మాయం చేస్తాను. నేను ఆకాశాన్ని కప్పివేసి నక్షత్రాలు కన్పించకుండా చేస్తాను. ఒక మేఘంతో నేను సూర్యుణ్ణి కప్పివేయగా చంద్రుడు ప్రకాశించడు.
EZE 32:8 ఆకాశంలో మెరిసే జ్యోతులన్నీ నీపై వెలుగును ప్రసరించకుండా చేస్తాను. నీ దేశమంతటా నేను చీకటిమయం చేస్తాను.
EZE 32:9 “నిన్ను నాశనం చేయటానికి నీ మీదికి నేను శత్రువును తీసుకొని వచ్చినట్లు తెలుసుకొని అనేక మంది ప్రజలు దుఃఖిముఖులై, తలక్రిందులౌతారు. నీ వెరుగని దేశాలు కూడా కలవరపాటు చెందుతాయి.
EZE 32:10 నీ విషయంలో చాలా మంది ఆశ్చర్యపోయేలా చేస్తాను. నేను నా కత్తిని వారి ముందు ఝళిపించడానికి మునుపే వారి రాజులు నీ విషయంలో విపరీతంగా భయపడతారు. నీవు పతనమైన రోజున ప్రతిక్షణం రాజులు భయంతో కంపించి పోతారు. ప్రతీ రాజూ తనభద్రత కొరకు భయపడతాడు.”
EZE 32:11 దానికి తగిన కారణం నా ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: “బబులోను రాజు యొక్క కత్తి నీపై యుద్ధానికి వస్తుంది.
EZE 32:12 యుద్ధంలో నీ ప్రజలను చంపటానికి నేను ఆ సైనికులను వినియోగిస్తాను. అన్ని దేశాలలో అతి భయంకరమైన దేశం నుండి ఆ సైనికులు వస్తారు. ఈజిప్టు అతిశయబడే వస్తువులన్నిటినీ వారు ధ్వంసం చేస్తారు. ఈజిప్టు ప్రజలు నాశనం చేయబడతారు.
EZE 32:13 ఈజిప్టు నదీ తీరాలలో అనేకమైన జంతువులున్నాయి. ఆ జంతువులన్నిటినీ కూడ నేను నాశనం చేస్తాను! ప్రజలిక ఎంతమాత్రం తమ కాళ్లతో నీటిని మురికిచేయరు. ఆవుల గిట్టలు ఇక ఎంతమాత్రం నీటిని మురికి చేయవు.
EZE 32:14 ఆ విధంగా ఈజిప్టు నీటిని నేను శాంతపర్చుతాను. వారి నదులు ప్రశాంతంగా ప్రవహించేలా చేస్తాను. అవి నూనెవలె మృదువుగా జాలు వారుతాయి.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
EZE 32:15 “నేను ఈజిప్టు దేశాన్ని ఏమీ లేకుండా చేస్తాను. ఆ రాజ్యం సమస్తాన్ని కోల్పోతుంది. ఈజిప్టులో నివసిస్తున్న ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని, ప్రభువునని వారు గుర్తిస్తారు!
EZE 32:16 “ఈజిప్టు కొరకు ప్రజలు పాడే ఒక విషాద గీతిక ఇది. ఇతర దేశాల కుమారైలు (నగరాలు) ఈజిప్టును గూర్చి ఈ విలాప గీతం పాడతారు. ఈజిప్టును గురించి, దాని ప్రజల గురించి వారు దీనిని విలాప గీతంగా ఆలపిస్తారు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
EZE 32:17 దేశం నుండి వెళ్లగొట్టబడిన పన్నెండవ సంవత్సరంలో, అదే నెలలో పదిహేనవ రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 32:18 “నరపుత్రుడా, ఈజిప్టు ప్రజల కొరకు విలపించు. ఈజిప్టును, ఇతర బలమైన దేశాల కుమారైలను సమాధికి నడిపించు. పాతాళానికి చేరిన ఇతర జనులతో ఉండటానికి వారిని అధోలోకానికి నడిపించు.
EZE 32:19 “ఈజిప్టూ నీవు ఇతరులెవరికంటెను గొప్ప దానివి కాదు! మృత్యు స్థానానికి వెళ్లు! వెళ్లి, అక్కడ అన్య జనులతో పడివుండు.
EZE 32:20 “యుద్ధంలో హతులైన వారందరితో కలిసి ఉండటానికి ఈజిప్టు వెళుతుంది. శత్రువు ఆమెను, ఆమె జనులను దూరంగా లాగి పడవేసినాడు.
EZE 32:21 “బలవంతులు, పరాక్రమశాలులు యుద్ధంలో చంపబడ్డారు. ఆ పరాయి వరాంతా మృత్యు స్థలానికి దిగి వెళ్లారు. ఆ ప్రదేశం నుండి చనిపొయిన మనుష్యులు ఈజిప్టుతోను, దాని సహాయకులతోను మాట్లాడతారు వారు కూడ యుద్ధంలో చంపబడతారు.
EZE 32:22 “అష్షూరు, దాని సర్వ సైన్యము మృత్యులోకంలో ఉన్నాయి. వారి సమాధులు అడుగున ఆ రంధ్రంలో ఉన్నాయి. అష్షూరు సానికులంతా యుద్ధంలో హతులయ్యారు. అష్షూరు సైన్యం దాని సమాధి చుట్టూ మూగింది. బతికి ఉన్నప్పుడు వారు ప్రజలను భయపెట్టారు. కాని వారంతా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. వారంతా యుద్ధంలో చంపబడ్డారు.
EZE 32:24 “ఏలాము అక్కడ ఉన్నది. దాని సైన్యమంతా దాని సమాధి చుట్టూ ఉంది. వారంతా యుద్ధంలో చనిపోయారు. ఆ విదేశీయులు భూమిలోకి లోతుగాపోయారు. బతికి ఉన్నప్పుడు వారు ప్రజలను భయ పెట్టారు. వారి అవమానాన్ని వారు పాతాళానికి తమ తోనే తీసుకొని పోయారు.
EZE 32:25 ఏలాముకు, యుద్ధంలో చనిపోయిన సైనికులందరికీ వారు పడక ఏర్పాటు చేశారు. ఏలాము సైన్యమంతా దాని సమాధి చుట్టూ చేరింది. ఆ విదేశీయులందరూ యుద్ధంలో హతులయ్యారు. వారు జీవించి ఉన్నప్పుడు వారు ప్రజలను భయపెట్టారు. కాని వారి అవమానాన్ని వారు తమతో పాతాళానికి తీసుకొని పోయారు. చనిపోయిన వారందరితోపాటు వారు ఉంచబడ్డారు.
EZE 32:26 “మెషెకు, తుబాలు మరియు వాటి సైన్యాలు అక్కడ ఉన్నాయి. వాటి సమాధులు వాటిచుట్టూ ఉన్నాయి. విదేశీయులు యుద్ధంలో చంపబడ్డారు. వారు జీవించి ఉన్న సమయంలో వారు ప్రజలను భయపెట్టారు.
EZE 32:27 కాని ఏనాడో చనిపోయిన పరాక్రమశాలుల పక్కన వారిప్పుడు పడుకొని ఉన్నారు! వారు తమ యుద్ధాయుధాలతో సమాధి చేయబడ్డారు. వారి కత్తులు వారి తలల కింద ఉంచబడతాయి. కాని వారి పాపాలు మాత్రం వారి ఎముకల మీద ఉన్నాయి. ఎందువల్లనంటే వారు జీవించి వున్న కాలంలో వారు ప్రజలను భయపెట్టారు.
EZE 32:28 “ఈజిప్టూ, నీవు కూడా నాశనం చేయబడతావు. సున్నతి సంస్కారం లేని విదేశీయులు నిన్ను పడుకోబెడతారు. యుద్ధంలో చనిపోయిన ఇతర సైనికులతే పాటు నీవు కూడా ఉంటావు.
EZE 32:29 “ఎదోము కూడా అక్కడ ఉన్నాడ. అతని రాజులు, ఇతర నాయకులు అతనితో అక్కడ ఉన్నారు. వారు శూరులైన సైనికులు కూడా. అయినా వారు యుద్ధంలో చనిపోయిన విదేశీయులతో పడివున్నారు. వారంతా అక్కడ పరాయి వారితో పడివున్నారు. బాగా లోతైన రంధ్రంలో ప్రజలతో వారు అక్కడ ఉన్నారు.
EZE 32:30 “ఉత్తరదేశ రాజులంతా అక్కడ ఉన్నారు! సీదోనుకు చెందిన సైనికులంతా అక్కడ ఉన్నారు. వారి బలం ప్రజలను భయపెట్టింది. కాని వారు ఇబ్బంది పడ్డారు. ఆ విదేశీయులు కూడా యుద్ధంలో చనిపోయిన ఇతరులతో పండుకొని ఉన్నారు. వారితో పాటు తమ అవమానాన్ని కూడా పాతాళానికి తీసుకొని పోయారు.
EZE 32:31 “మృత్యు లోకంలోకి పోయిన ప్రజలను ఫరో చూస్తాడు. అతడు, అతనితో ఉన్న అతని మనుష్యులందరూ అప్పుడు ఊరట చెందుతారు. అవును, ఫరో మరియు అతని సర్వ సైన్యం యుద్ధంలో చెంపబడతారు.” ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 32:32 “ఫరో జీవించి ఉన్న కాలంలో అతనంటే ప్రజలు భయపడేలా నేను చేశాను. కాని ఇప్పుడతడు విదేశీయులతో పడి ఉంటాడు. ఫరో, అతని సైన్యం యుద్ధంలో చనిపోయిన ఇతర సైనికులతో పాటు పడివుంటారు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
EZE 33:1 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 33:2 “నరపుత్రుడా, నీ ప్రజలతో మాట్లాడు. వారికి ఈ రకంగా చెప్పు, ‘ఈ దేశం మీదికి నేను శత్రు సైన్యాలను రప్పించవచ్చు. అది జరిగినప్పుడు ప్రజలు ఒకనిని కావలివానిగా ఎంపిక చేస్తారు.
EZE 33:3 ఈ కావలివాడు శత్రుసైన్యాలు రావటం చూచి బూర ఊది ప్రజలను హెచ్చరిస్తాడు.
EZE 33:4 ప్రజలు ఆ హెచ్చరికను విని కూడా జాగ్రత్త పడకపోతే శత్రువు వచ్చి వారిని బందీలుగా పట్టుకుపోతాడు. అటువంటి వ్యక్తి తన మరణానికి తనే బాధ్యుడవుతాడు.
EZE 33:5 అతడు బాకా విన్నాడు. ఆయినా అతడు హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల అతని చావుకు అతనినే నిందించాలి. ఆ హెచ్చరికను గనుక అతడు లక్ష్య పెట్టి ఉంటే అతడు తన ప్రాణాన్ని కాపాడు కొనగలిగేవాడు.
EZE 33:6 “‘ఒకవేళ కావలివాడు శత్రుసైనికులు రావటం గమనించి కూడా బూర ఊదకపోవచ్చు. అనగా కావలివాడు ప్రజలను హెచ్చరించలేదన్నమాట. అప్పుడు శత్రువు వారిని పట్టుకొని బందీలుగా తీసుకుపోతాడు. తన పాపం కారణంగా ఒక వ్యక్తి పట్టుబడతాడు. అయినా కావలివాడు ఆ మనిషి చావుకు బాధ్యుడైవున్నాడు.’
EZE 33:7 “నరపుత్రుడా, ఇప్పుడు నేను ఇశ్రాయేలు వంశానికి నిన్ను కావలివానిగా నియమిస్తున్నాను. నీవు నా నోటి నుండి ఒక వర్తమానం వింటే, నా తరఫున ప్రజలను హెచ్చరించాలి.
EZE 33:8 ‘ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు’ అని నేను నీకు చెప్పవచ్చు. అప్పుడు నా తరపున నీవు వెళ్లి అతనిని హెచ్చరించాలి. నీవు వెళ్లి ఆ దుష్ట వ్యక్తిని హెచ్చరించక, తన జీవిత విధానాన్ని మార్చుకోమని చెప్పకపోతే తన పాప ఫలంగా అతడు చనిపోతాడు. కాని అతని చావుకు నేను నిన్ను బాధ్యుణ్ణి చేస్తాను.
EZE 33:9 ఒక వేళ నీవా దుష్టవ్యక్తిని తన దుర్మార్గపు జీవితాన్ని మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పి నావనుకో, అయినా ఆ వ్యక్తి పాపం చేయటం మానక పోతే తన పాపాలకు ఫలితంగా అతడు చనిపోతాడు. కానీ నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.
EZE 33:10 “కావున నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు వంశం వారితో మాట్లాడు. అప్పుడు వారు, ‘మేము పాపం చేశాము. ధర్మాన్ని అతిక్రమించాము. మా పాపాలు భరింపరానివి. ఆ పాపాల కారణంగా మేము కుళ్లిపోతున్నాము. మేము జీవించాలంటే ఏమి చేయాలి?’ అని అడుగవచ్చు.
EZE 33:11 “నీవు వారితో ఇలా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నా జీవం తోడుగా ప్రజలు చనిపోతూ ఉంటే చూడటం నాకు ఇష్టముండదని మీకు మాట ఇస్తున్నాను. దుష్టులు చనిపోవటం కూడా నాకు ఇష్టంలేనిపని. వారు చనిపోవాలని నేను కోరను. ఆ దుష్ట జనులంతా నా వద్దకు తిరిగి రావాలనే నేను కోరుకుంటాను. వారు తమ జీవితాలను మార్చుకొని నిజంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను! అందువల్ల నా వద్దకు తిరిగి రండి! చెడు కార్యాలు చేయటం మానండి! ఓ ఇశ్రాయేలు వంశీయులారా, మీరెందుకు మరణించాలి?’
EZE 33:12 “నరపుత్రుడా, నీ ప్రజలకు ఇలా చెప్పు, ‘ఒక మంచి వ్యక్తి దుష్టుడై పాపం చేయటం మొదలు పెడితే, అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు. ఆ చెడ్డ వ్యక్తి చెడునుండి పరివర్తన చెంది మంచివాడై సత్కార్యాలు చేస్తే, గతంలో అతడు చేసిన పాపపు పనులు అతనిని నాశనం చేయలేవు. కావున ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఒక మంచి వ్యక్తి దుర్మార్గుడై పాపం చేయడం మొదలుపెడితే అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు.’
EZE 33:13 “ఒక మంచి మనిషికి అతడు జీవిస్తాడని నేను చెప్పవచ్చు. తద్వారా ఆ మంచి మనిషి తను పూర్వం చేసిన సత్కార్యాలు అతనిని రక్షించగలవని అనుకోవటం మొదలు పెట్టవచ్చు. ఆ రకమైన భావనతో అతడు చెడు కార్యాలు చేయటానికి పాల్పడవచ్చు. కాని గతంలో అతడు చేసిన మంచి పనులను నేను గుర్తు పెట్టుకోను! తాను చేయ మొదలు పెట్టిన పాప కార్యాల కారణంగా అతడు చనిపోతాడు.
EZE 33:14 “లేదా, ఒక దుర్మార్గునితో అతడు చచ్చిపోతాడని నేను చెప్పవచ్చు. అయితే అతడు తన జీవితాన్ని మార్చుకోవచ్చు. అతడు పాపం చేయటం మాని, సన్మార్గాన్ని అవలంబించవచ్చు. అతడు మంచివాడై న్యాయశీలి కావచ్చు.
EZE 33:15 అతడు అప్పులిచ్చినప్పుడు తాను కుదువపెట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చి వేయవచ్చు. అతడు దొంగిలించిన వస్తువులకు తగిన పరిహారం చెల్లించవచ్చు. జీవాన్ని ఇచ్చే కట్టడలను అతడు అనుసరించటం మొదలు పెట్టవచ్చు. అతడు చెడు పనులు చేయటం మానవచ్చు. అప్పుడా వ్యక్తి ఖచ్చితంగా జీనిస్తాడు. అతడు మరణించడు.
EZE 33:16 అతడు గతంలో చేసిన చెడ్డ పనులను నేను గుర్తు పెట్టకోను. ఎందుకంటే అతడిప్పుడు న్యాయవర్తనుడై మంచి మనిషి అయ్యాడు గనుక. అందుచే అతడు జీవిస్తాడు!
EZE 33:17 “కాని నీ ప్రజలు, ‘అది న్యాయం కాదు! మా ప్రభువైన యెహోవా అలా వుండజాలడు!’ అని అంటారు. “కాని వారే నిజానికి న్యాయవర్తనులు కాకపోతే! మారవలసిన మనుష్యులు వారే!
EZE 33:18 ఒక మంచి వ్యక్తి సత్కార్యాలు చేయటం మానివేసి పాపం చేస్తే, అతని పాప ఫలితంగా అతడు చనిపోతాడు.
EZE 33:19 ఒక దుర్మార్గుడు చెడు పనులు చేయటం మాని, న్యాయవర్తనుడై మంచి జీవితాన్ని ప్రారంభిస్తే అతడు జీనిస్తాడు!
EZE 33:20 అయినా నేను న్యాయంగా లేనని మీరంటారు. కాని నేను మీకు నిజం చెప్పుచున్నాను. ఇశ్రాయేలు వంశమా, ప్రతి ఒక్కడూ తాను చేసిన పనులను బట్టి తీర్పు పొందుతాడు!”
EZE 33:21 అది చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్సరంలో పదవ నెల (జనవరి) ఐదవరోజు. ఆ రోజున ఒక వ్యక్తి యెరూషలేము నుండి నా వద్దకు వచ్చాడు. అతడక్కడ యుద్ధం నుండి తప్పించుకుని వచ్చాడు. అతడు, “ఆ నగరం (యెరూషలేము) వశపర్చుకో బడింది!” అని అన్నాడు.
EZE 33:22 ఆ మనిషి రావడానికి ముందు నా ప్రభువైన నా యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. నాకు మాట్లాడే శక్తి లేకుండా దేవుడు చేశాడు. ఆ వ్యక్తి నా వద్దకు వచ్చే సమయానికి యెహోవా నా నోరు తెరపించి, నేను మాట్లాడేలాగు చేశాడు.
EZE 33:23 అప్పుడు యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 33:24 “నరపుత్రుడా, పాడుపడిన ఇశ్రాయేలు నగరాలలో కొందరు ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నారు. వారు ఇలా అంటున్నారు, ‘అబ్రాహాము ఒక్కడే ఒక్కడు. ఆయినా దేవుడు అతనికి ఈ దేశాన్నంతటినీ ఇచ్చినాడు. ఇప్పుడు మేము చాలా మంది ప్రజల మయ్యాము. కావున ఈ దేశం ఖచ్చితంగా మాకు చెందుతుంది. ఇది మా దేశం!’
EZE 33:25 “ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని నీవు వారికి తప్పక తెలియజేయాలి, ఇంకా ‘రక్తం ఉన్న మాంసాన్ని మీరు తింటున్నారు. సహాయం కొరకు మీరు మీ విగ్రహాలవైపు చూస్తున్నారు. మీరు ప్రజలను హత్య చేస్తారు. కావున ఈ దేశాన్ని మీకు నేనెందుకు ఇవ్వాలి?
EZE 33:26 మీరు మీ కత్తిమీద ఆధార పడతారు. మీలో ప్రతి ఒక్కడూ భయంకరమైన పనులు చేస్తాడు. మీలో ప్రతి ఒక్కడూ మీ పొరుగు వాని భార్యతో వ్యభిచరించి పాపం చేస్తాడు. అందువల్ల మీరు ఈ రాజ్యాన్ని పొందలేరు!’
EZE 33:27 “‘ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని నీవు వారికి తెలియజేయుము, “శిథిలమైన ఆ నగరాలలో నివసిస్తున్న ప్రజలు నా కత్తిచేత చనిపోతారని నా ప్రాణము మీద ప్రమాణం చేసి నేను చెపుతున్నాను. ఆ సమయంలో ఎవరైనా బయట పొలాలలోనికి వెళితే జంతువులు వారిని చంపి తిని వేసేలా చేస్తాను. కోటలలోను, గుహలలోను ప్రజలు దాగివుంటే వారు రోగాలతో చనిపోతారు.
EZE 33:28 దేశాన్ని నిర్మానుష్యంగా, ఎడారిగా మార్చేస్తాను. వేటిని చూసుకొని ఆ దేశం గర్వపడుతూ వుందో ఆ వస్తువులనన్నిటినీ అది కోల్పోతుంది. ఇశ్రాయేలు పర్వతాలు శూన్యంగా తయారవుతాయి. ఆ ప్రదేశం గుండా ఎవ్వరూ పయనించరు.
EZE 33:29 ఆ ప్రజలు ఎన్నో భయంకరమైన పనులు చేశారు. అందువల్ల ఆ దేశాన్ని శూన్యమైన ఎడారిలా నేను మార్చివేస్తాను. అప్పుడు నేను యెహోవానని ఈ ప్రజలు తెలుసుకుంటారు.”
EZE 33:30 “‘నరపుత్రుడా, ఇప్పుడు నీ విషయంలో నీవు ఒక మాట చెప్పాలి. నీ ప్రజలు గోడలకు ఆనుకొని, వాకిళ్లలో నిలబడి నిన్ను గురించి మాట్లాడుకుంటారు. వారు ఒకరితో ఒకరు, “రండి, యెహోవా ఏమి చెపుతున్నాడో విందాం” అని చెప్పుకుంటారు.
EZE 33:31 కావున వారు నా ప్రజలవలె నీవద్దకు వస్తారు. నా ప్రజలవలె వారు నీ ముందు కూర్చుంటారు. వారు నీ మాటలు వింటారు. కాని నీవు చెప్పినది మాత్రం వారు ఆచరించరు. వారు ఏది మంచిదనుకుంటే దానినే చేస్తారు. వారు ప్రజలను మోసగించి అధిక ధనవంతులు కావాలని కోరుకుంటారు.
EZE 33:32 “‘వారికి నీవు కేవలం ప్రేమ గీతాలు పాడే ఒక గాయకుడివి మాత్రమే. నీకు మధురమైన కంఠం ఉంది. నీవు సొంపుగా వాద్యం వాయిస్తావు. నీ మాటలు వారు వింటారు గాని, వాటిని ఆచరించరు.
EZE 33:33 అయినా నీవు పాడే విషయాలు తప్పక జరిగి తీరుతాయి. అప్పుడు ప్రజలు తమలో నిజంగా ఒక ప్రవక్త నివసించాడని తెలుసుకుంటారు!’”
EZE 34:1 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 34:2 “నరపుత్రుడా, నీవు నా తరఫున ఇశ్రాయేలు గొర్రెల కాపరులకు (పాలకులకు) వ్యతిరేకంగా మాట్లాడు. నా తరఫున వాళ్లతో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి తెలుపు: ‘ఇశ్రాయేలు కాపరులారా మీకు మీరే బాగా తింటున్నారు. అది మీకు చాలా హానికరం! ఓ కాపరులారా, మీరు మందను ఎందుకు మేపరు?
EZE 34:3 బాగా బలిసిన గొర్రెలను మీరు తింటారు. మీ దుస్తులకై వాటి ఉన్నిని వినియోగించు కుంటారు. బలిసిన గొర్రెలను మీరు చంపుతారు; కాని మందను మాత్రం మీరు మేపరు.
EZE 34:4 బలహీనంగా ఉన్న వాటిని మీరు బలంగా తయారు చేయలేదు. జబ్బు చేసిన గొర్రెల విషయమై మీరు శ్రద్ధ తీసుకోలేదు. గాయ పడిన గొర్రెలకు మీరు కట్టు కట్టలేదు. కొన్ని గొర్రెలు అటు ఇటు చెదరి వెళ్లిపోయాయి. అయినా మీరు వెళ్లి వాటిని తీసుకురాలేదు. తప్పిపోయిన గొర్రెలను వెదకటానికి మీరు వెళ్లలేదు. లేదు; మీరు చాలా కృరులు, కఠినాత్ములు—ఆ రకంగా మీరు మందను నడిపించ ప్రయత్నించారు!
EZE 34:5 “‘కాపరిలేని కారణంగా ఇప్పుడు మంద చెల్లాచెదరై పోయింది. ప్రతి అడవి జంతువుకు అని ఆహారమైనాయి. అలా అవి చిందర వందరై పోయాయి.
EZE 34:6 నా మంద ప్రతి పర్వతం మీద, ప్రతి కొందమీద తిరుగాడింది. నా మంద భూమిమీద అంతటా చెల్లాచెదరై పోయింది. వాటిని వెదకటానికి గాని, చూడటానికి గాని ఎవ్వరూ లేరు.’”
EZE 34:7 కావున ఓ గొర్రెల కాపరులారా! యెహోవా మాట వినండి. నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు:
EZE 34:8 “నా జీవముతోడుగా మీకు నేనిలా మాట ఇస్తున్నాను. అడవి జంతువులు నా మందను పట్టుకున్నాయి. అవును, నా మంద అన్ని కృర జంతువులకూ ఆహారమయ్యింది. ఎందువల్లనంటే వాటికి నిజమైన కాపరిలేడు. నా గొర్రెల కాపరులు నా మంద విషయమై తగిన జాగ్రత్త తీసుకోలేదు. మరియు ఆ కాపరులు కేవలం నా మందను చంపుకు తిన్నారే గాని, దానిని మేపలేదు.”
EZE 34:9 అందువల్ల, ఓ కాపరులారా, యెహోవా మాట వినండి!
EZE 34:10 యెహోవా ఇలా చెపుతున్నాడు: “నేను ఆ కాపరులకు విరోధిని! నా గొర్రెల కొరకు నేను వారిని అడుగుతాను. నేను వారిని తీసివేస్తాను ఇక ఎంతమాత్రం వారు నా మందకు కాపరులుగా కొన సాగరు! దానితో వారు మందను చంపి తమ పొట్టను నింపుకోలేరు. వారి బారినుండి నా మందను నేను రక్షించుకోగలుగుతాను. అప్పుడు నా గొర్రెలు వారికి ఆహారం కాజాలవు.”
EZE 34:11 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నాకు నేనే వారికి కాపరిగా వ్యవహరిస్తాను. చెదరి పోయిన నా గొర్రెలను నేనే వెదకుతాను. నేను వాటి విషయమై జాగ్రత్త తీసుకుంటాను.
EZE 34:12 తన గొర్రెలు తప్పిపోయినప్పుడు ఒక కాపరి వాటి వెంట ఉంటే, అతడు వెళ్లి వాటికొరకు వెదకగలడు. అదే విధంగా, నేను నా గొర్రెల కొరకు వెదకుతాను. నేను నా గొర్రెలను రక్షించుకుంటాను. ఒకానొక ముసురు పట్టిన చీకటి రోజూ చెదరిపోయిన నా గొర్రెలను ఆయా ప్రాంతాల నుండి వెదకి తీసుకు వస్తాను.
EZE 34:13 ఆయా దేశాలనుండి వాటిని తిరిగి తీసుకొని వస్తాను. ఆ ప్రాంతాల నుండి వాటిని కుడదీస్తాను. వాటి స్వదేశానికి వాటిని తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు పర్వతాల పైన, సెలయేటి గట్ల మీద, ప్రజలు నివసించే అన్ని ప్రాంతాలలోను నేను వాటిని మేపుతాను.
EZE 34:14 నేను వాటిని పచ్చిక బీళ్లకు నడిపిస్తాను. ఇశ్రాయేలు కొండలశిఖరాల పైకి అవి వెళతాయి. అవి అక్కడ పచ్చిక మేసి, మంచి ప్రదేశంలో హాయిగా పండుకొంటాయి. ఇశ్రాయేలు పర్వతాల మీద మంచి పచ్చిక భూములలో అవి మేత మేస్తాయి.
EZE 34:15 అవును, నా మందను నేనే మేపుతాను. వాటిని ఒక విశ్రాంతి స్థలానికి నడిపిస్తాను.” నా ప్రభువైన యెహోనా ఈ విషయాలు చెప్పాడు.
EZE 34:16 “పోయిన గొర్రెలను నేను వెదకుతాను. చెదరి పోయిన గొర్రెలను నేను తిరిగి తోలుకు వస్తాను. గాయపడిన గొర్రెలకు కట్లు కడతాను. నీరసపడిన గొర్రెలు బలపడేలా చేస్తాను. కాని ఆ బలిసిన, శక్తివంత మైన గొర్రెల కాపరులను మాత్రం నేను నాశనం చేస్తాను. వారికి అర్హమైన శిక్ష వారికి నేను విధిస్తాను.”
EZE 34:17 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మీరు, నా గొర్రెల మంద. నేను మీలో ఒక్కొక్కదానికి తీర్పు ఇస్తాను. పొట్టేళ్లను, మేక పోతులకు మధ్య తీర్పు తీర్చుతాను.
EZE 34:18 సారవంతమైన భూముల్లో పెరిగే గడ్డిని మీరు తినవచ్చు. అటువంటప్పుడు ఇతర గొర్రెలు మేసే గడ్డిని మీలో కొందరు మీ కాళ్లతో ఎందుకు తొక్కి పాడుచేస్తారు? మీరు స్వచ్ఛమైన నీటిని కావలసినంత తాగవచ్చు! అలా కాకుండా ఇతర గొర్రెలు తాగదల్చుకున్న నీటిని కూడా మీరెందుకు కెలికి మురికి చేస్తున్నారు?
EZE 34:19 మీ కాళ్లతో తొక్కి పాడుచేసిన గడ్డిని నా మంద తింటున్నది. మీ కాళ్లతో కెలికి మురికి చేసిన నీటిని అవి తాగవలసి ఉందా!”
EZE 34:20 కావున నా ప్రభువైన యెహోవా వాటికి ఇలా చెపుతున్నాడు: “నాకై నేనే బలిసిన గొర్రెలకు, బక్క చిక్కిన గొర్రెలకు మధ్య తీర్పు ఇస్తాను!
EZE 34:21 బక్క జీవాలు అవతలికి పారిపోయే వరకు వాటిని మీరు మీ భుజాలతోను, పార్శ్వాలతోను తోసి, మీ కొమ్ములతో కుమ్ముతారు.
EZE 34:22 కావున నా మందను నేనే రక్షించు కుంటాను. అవి ఇక ఎంత మాత్రం క్రూర జంతువుల బారిన పడవు. గొర్రెకు మరొక గొర్రెకు మధ్య నేనే తీర్పు ఇస్తాను.
EZE 34:23 తరువాత నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని మేపుతాడు. అతడు వాటిని స్వయంగా మేపి, వాటిని కాపరి అవుతాడు.
EZE 34:24 ప్రభువును యెహోవాను అయిన నేను అప్పుడు వాటికి దేవుడనవుతాను. నా సేవకుడగు దావీదు వాటి మధ్య నివసిస్తూ పాలకుడవుతాడు. యెహోవానైన నేనే చెపుతున్నాను.”
EZE 34:25 “మరియు నా గొర్రెలతో నేను శాంతి ఒడంబడిక చేసుకుంటాను. దేశంలో కృర జంతువులు లేకుండా చేస్తాను. అప్పుడే గొర్రెలు ఎడారిలో నిర్భయంగా తిరిగి, అడవులలో హాయిగా నిద్రిస్తాయి.
EZE 34:26 నేను నా గొర్రెలను, నా కొండ (యెరూషలేము) చుట్టూ ఉన్న ప్రదేశాలను దీవిస్తాను. సకాలంలో వర్షాలు కురిసేలా చేస్తాను. దీవెనకరమైన జల్లులు పడతాయి.
EZE 34:27 పొలాల్లో పెరిగే చెట్లు ఫలాల నిస్తాయి. భూమి తన పంటనిస్తుంది. కావున గొర్రెలు తమ భూమిమీద సురక్షితంగా ఉంటాయి. బాని సత్వానికి చిహ్నమైన వాటి మెడమీది కాడిని నేను విరుగ గొడతాను. వాటిని బానిసలుగా చేసిన మనుష్యుల అధికారం నుండి వాటికి విముక్తి కలుగజేస్తాను. అప్పుడు నేనే యెహోవానని అవి గుర్తిస్తాయి.
EZE 34:28 అవి ఇక ఎంతమాత్రం మామూలు జంతువులవలె అన్య దేశీయులచే పట్టుబడవు. ఆ కృర మృగాలు వాటిని ఇక ఎంతమాత్రం తినవు. అవి సురక్షితంగా జీవిస్తాయి. ఎవ్వరూ వాటిని భయ పెట్టలేరు.
EZE 34:29 మంచి ఉద్యానవనంగా తయారయ్యే కొంత భూమిని వాటికి ఇస్తాను. ఆ భూమిలో అవి ఇక ఎంతమాత్రం ఆకలితో బాధపడవు. ఇక ఏ మాత్రం అవి అన్యదేశాల నుండి అవమానాన్ని పొందవు.
EZE 34:30 అప్పుడవి నేనే వాటి దేవుడనగు యెహోవానని తెలుసుకుంటాయి. నేను వాటితో ఉన్నానని అవి తెలుసుకుంటాయి. మరియు ఇశ్రాయేలు వంశం వారు తాము నా ప్రజలేనని తెలుసుకుంటారు!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 34:31 “నా గొర్రెల్లారా, నా పచ్చిక బయలులో ఉండే నా గొర్రెల్లారా మీరు కేవలం మానవ మాత్రులు. నేను మీ దేవుడను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 35:1 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 35:2 “నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు చూచి నా తరపున దానికి వ్యతిరేకంగా మాట్లాడు.
EZE 35:3 దానితో ఈ విధంగా చెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “‘శేయీరు పర్వతమా, నేను నీకు విరోధిని! నేను నిన్ను శిక్షిస్తాను. నిన్నొక పనికిమాలిన బీడు భూమిలా చేస్తాను.
EZE 35:4 నీ నగరాలను నేను నాశనం చేస్తాను. నీవు నిర్మానుష్యమవుతావు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.
EZE 35:5 “‘ఎందువల్లనంటే నీవు నా ప్రజలకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడూ, వారి శిక్షాకాల అంతిమదశలోనూ నీవు నీ కత్తిని వారిమీద ఉపయోగించావు.’”
EZE 35:6 కావున నా ప్రభువైన యెహోవా చెపుతున్నదేమంటే, “నా జీవ ప్రమాణంగా నేను నిశ్చయంగా చెప్పేదేమంటే, నిన్ను మృత్యువు కబళించివేసేలా చేస్తాను. మృత్యువు నిన్ను వెంటాడుతుంది. రక్తమును నీవు అసహ్యించుకోలేదు. కావున మృత్యువు నిన్ను తరుముకు వెళుతుంది.
EZE 35:7 శేయీరు పర్వతాన్ని పాడైపోయిన శూన్య ప్రదేశంగా చేస్తాను. ఆ నగరం నుండి వచ్చే ప్రతి వానినీ నేను చంపివేస్తాను. ఇంకా ఆ నగరంలోకి వెళ్ల ప్రయత్నించే ప్రతివానిని నేను చంపివేస్తాను.
EZE 35:8 దాని పర్వతాలన్నిటినీ శవాలతో కప్పివేస్తాను. ఆ శవాలు నీ కొండలన్నిటి మీద, నీ లోయలు, కనుమలన్నిటిలోను పడివుంటాయి.
EZE 35:9 నిన్ను శాశ్వతంగా ఏమీలేనివానిగా మార్చివేస్తాను. నీ నగరాలలో ఏ ఒక్కడూ నివసించడు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.”
EZE 35:10 “ఈ రెండు జనాభాలు, వారి దేశాలు (ఇశ్రాయేలు, యూదా) నావే. మేము వాటిని శాశ్వతంగా మా స్వంతం చేసుకుంటాము” అని నీవు అన్నావు. కాని యెహోవా ఇలా అన్నాడు!
EZE 35:11 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “నీవు నా ప్రజల పట్ల అసూయచెంది ఉన్నావు. నీవు వారిపట్ల కోపంతో ఉన్నావు. నీవు వారిని అసహ్యించుకున్నావు. నీవు వారిని బాధించిన విధంగా నేను నిన్ను శిక్షిస్తానని నామీద ప్రమాణం చేసి చెపుతున్నాను! నేను నిన్ను శిక్షించి, నేను నా ప్రజలతోనే ఉన్నానని వారు తెలుసుకొనేలా చేస్తాను.
EZE 35:12 నీ అవమానాలన్నిటి గురించి నేను విన్నానని నీవు కూడ తెలుసుకుంటావు. ఇశ్రాయేలు పర్వతానికి వ్యతిరేకంగా నీవు అనేక చెడ్డ విషయాలు ప్రచారం చేశావు. “‘ఇశ్రాయేలు నాశనం చేయబడింది! వాళ్లను మేము ఆహారం నమిలినట్లు నమిలి వేస్తాము!’ అని అంటూ నీవు ప్రచారం మొదలు పెట్టావు.
EZE 35:13 నీవు గర్వించి, నాకు వ్యతిరేకంగా అనేక విషయాలు చెప్పావు. నీవు చాలాసార్లు అలా మాట్లాడినావు. కాని నీవు మాట్లాడిన ప్రతి మాటా నేను విన్నాను! అవును. నీవన్నది నేను విన్నాను.”
EZE 35:14 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నేను నిన్ను నాశనం చేసినప్పుడు ఈ భూమి యావత్తూ సంతోషిస్తుంది.
EZE 35:15 ఇశ్రాయేలు దేశం నాశనమయినప్పుడు నీవు సంతోషించావు. అదే రీతిని నిన్ను నేను చూస్తాను. శేయీరు పర్వతం, ఎదోము దేశం మొత్తం నాశనం చేయబడతాయి. నేనే యెహోవానని మీరప్పుడు తెలుసుకుంటారు.”
EZE 36:1 “నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు పర్వతాలతో మాట్లాడు. యెహోవా మాట ఆలకించమని ఇశ్రాయేలు పర్వతాలకు చెప్పు!
EZE 36:2 ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి తెలియజేయుము. శత్రువు నిన్ను గురించి చెడ్డ విషయాలు ప్రచారం చేశాడు. ‘ఆహా! ఆ పురాతన పర్వతాలు ఇక మనవే!’” అని వారు అనుకొన్నారు.
EZE 36:3 “కావున ఇశ్రాయేలు పర్వతాలతో నా తరపున మాట్లాడుము. ప్రభువైన యెహోవా ఈ విషయాలు తెలుపుతున్నాడని వాటితో చెప్పుము. శత్రువు నిన్న నిర్మానుష్యం చేశాడు. అన్ని వైపుల నుండి నారు నిన్ను చితుకదొక్కారు. నిన్ను అన్యదేశాల పాలు చేయటం కొరకే వారా విధంగా చేశారు. పిమ్మట ప్రజలు నీగురించి గుసుగుసలు మొదలు పెట్టారు.”
EZE 36:4 కావున ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా సందేశాన్ని వినండి! ప్రభువైన యెహోవా దీనిని పర్వతాలకు, కొండలకు, నదులకు, లోయలకు, శిథిలాలకు మరియు పాడుబడిన నగరాలకు చెపుతున్నాడు, నీ చుట్టూ ఉన్న దేశాల వారిచే నీవు దోచుకోబడి, ఎగతాళి చేయబడ్డావు.
EZE 36:5 “నా తీవ్రమైన భావాలను ఇప్పుడు నిజంగా వ్యక్తం చేస్తున్నాను! ఎదోము, తదితర దేశాలు నా కోపాన్ని చవి చూసేలా చేస్తాను. ఎదోమీయులు నా భూమిని తమ స్వంతం చేసుకున్నారు. వాళ్ళు బాగా సంతోషంగా అనుభవించారు. వారా విధంగా సంతోషంతో ఉన్నప్పుడు ఈ భూమిని ఎలా అసహ్యించు కొనేవారో తెలిపారు. వారు ఈ భూమిని నాశనం చేసి దాన్ని స్వాధీన పరచుకోదలిచారు.”
EZE 36:6 కావున నా ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ విషయాలు చెపుతున్నాడు: “నా తరపున ఇశ్రాయేలు దేశ భూభాగంతో మాట్లాడు. పర్వతాలు, కొండలతోను, నదులతోను మరియు లోయలతోను మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ‘వారికి తెలియజేయుము. నా తీవ్రమైన భావాలను, కోపాన్ని వ్యక్తం చేస్తాను. నీవు ఆ ప్రజల నుండి అవమానాలను భరించావు గనుక నేను నా కోపాన్ని వ్యక్తం చేస్తాను.’”
EZE 36:7 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నీ చుట్టూ ఉన్న దేశాలు అవమానాలు భరించ వలసి ఉంటుందని నేను ప్రమాణం చేసి చెపుతున్నాను.
EZE 36:8 “ఇశ్రాయేలు పర్వతములారా, నా ఇశ్రాయేలు ప్రజల కొరకు మీరు కొత్త చెట్లు పెంచి, పండ్లను పండిస్తారు. నా ప్రజలు వెంటనే తిరిగివస్తారు.
EZE 36:9 నేను మీతో ఉన్నాను. నేను మీకు సహాయపడతాను. ప్రజలు నేలను దున్నుతారు. ప్రజలు మీలో విత్తనాలు నాటుతారు.
EZE 36:10 మీమీద అనేకానేక మంది ప్రజలు నివసిస్తారు. ఇశ్రాయేలు వంశమంతా అక్కడ నివసిస్తుంది. నగరాలు మళ్లీ ప్రజలతో కళకళలాడుతాయి. నాశనం చేయబడిన స్థలాలన్నీ నూతనంగా నిర్మింపబడతాయి.
EZE 36:11 అనేక మంది ప్రజలను, జంతువులను నేను మీకిస్తాను. వారికి చాలా మంది పిల్లలు పుడతారు. పూర్వం మాదిరి ఇతరులు మీపై ఆదారపడి నివసించేలా మీకు సదుపాయం కలుగజేస్తాను. ముందుకంటె ఇప్పుడు మీరు ఇంకా బాగుండేటట్లు చేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.
EZE 36:12 అవును, నా ప్రజలైన, ఇశ్రాయేలీయులను ఈ భూమి వద్దకు నడిపిస్తాను. వారు మిమ్మల్ని వశపర్చుకుంటారు. మీరు వారి సొత్తు అవుతారు. మరెన్నడూ వారికి పిల్లలు లేకుండా మీరు చేయలేరు.”
EZE 36:13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇశ్రాయేలు దేశమా! ప్రజలు నీవు చెడ్డపనులు చేశావని అంటారు. నీ ప్రజలను నీవే నాశనం చేశావని వారంటారు. నీవు పిల్లలను ఎత్తుకు పోయావని వారు చెపుతారు.
EZE 36:14 కాని నీవు ప్రజలను ఇక ఎంతమాత్రం నాశనం చేయవు. వారి పిల్లలను ఎంతమాత్రం నీవు తీసుకొనవు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
EZE 36:15 “అన్యదేశాలు ఇక ఎంతమాత్రం నిన్ను అవమానపర్చనివ్వను. వారిచే ఇక నీవు బాధించ బడవు. నీవు నీ పిల్లలను ఇకమీదట పోగొట్టుకోవు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 36:16 పిమ్మట యెహోవా వాక్కు నావద్దకు వచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 36:17 “నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశం వారు తమ స్వంత భూమిలో నివసించారు. కాని వారు చేసిన చెడు పనులతో ఆ దేశాన్ని వారు మలినపర్చారు. వారు నా దృష్టిలో నెలసరి వచ్చే మైల రక్తర తో అపరిశుభ్రంగా ఉన్న స్త్రీలవలె ఉన్నారు.
EZE 36:18 ఆ రాజ్యంలో వారు ప్రజలను హత్యచేసి భూమిమీద రక్తం చిందించారు. వారి విగ్రహాలతో దేశాన్ని వారు మలినపర్చారు. అందుచే నేనెంత కోపంగా ఉన్నానో నేను వారికి చూపించాను.
EZE 36:19 నేను వారిని వివిధ ప్రజల మధ్యకు చెదరగొట్టి అన్ని భూభాగాలలోకి పంపిన కారణంగా వారు ఆయా దేశాలలో ఉండి పోయారు. వారి వారి చెడు కార్యాలను అనసరించి నేను వారిని శిక్షించాను.
EZE 36:20 వారు అన్యదేశాలకు వెళ్లారు. ఆయా దేశాలలో కూడ వారు నా మంచి పేరును పాడుచేశారు. ఎలాగనగా, ఆ దేశస్థులు కూడ వీరిని గురించి మాట్లాడారు. ‘యెహోవా ఎటువంటి దేవుడు? వీరు యెహోవా ప్రజలు. అయినా వీరు తమ దేశాన్ని వదిలి వచ్చారు’ అని వారన్నారు.
EZE 36:21 “ఇశ్రాయేలు ప్రజలు నా పవిత్ర నామాన్ని పాడు చేశారు. నా పేరు విషయంలో నేను బాధపడ్డాను.
EZE 36:22 కావున ప్రభువైన యెహావా ఈ విషయాలు చెపుతున్నాడని ఇశ్రాయేలు వంశానికి చెప్పు, ‘ఇశ్రాయేలు వంశీయులారా, మీరు వెళ్లిన ప్రతిచోటా నా పవిత్ర నామాన్ని పాడుచేశారు. దీనిని ఆపటానికి నేనేదైనా చేయదలిచాను. ఇశ్రాయేలూ, అది నేను నీ కొరకు మాత్రం చేయను. నా పవిత్ర నామం కొరకు నేను ఆ పని చేస్తాను.
EZE 36:23 గొప్పదైన నా పేరు నిజంగా పవిత్రమైనదని నేను ఆ ప్రజలకు నిరూపిస్తాను. మీరు నా పేరును గౌరవించేటట్లు చేస్తాను. నా మంచి పేరును ఆ దేశాలలో మీరు పాడుచేశారు! కాని నేను పవిత్రుడనని మీకు నిరూపిస్తాను. అప్పుడు ఆ ప్రజలంతా నేనే యెహోవానని తెలుసుకుంటారు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 36:24 దేవుడు ఇలా అన్నాడు, “ఆయా రాజ్యాలనుండి మిమ్మల్ని బయటకు తీసి, ఒక్క చోటికి సమీకరించి మీ స్వంత దేశానికి తీసుకొనివస్తాను.
EZE 36:25 పిమ్మట మీ మీద పరిశుద్ధ జలాన్ని చల్లి మిమ్మల్ని పవిత్రులనుగా చేస్తాను. మీ మురికినంతటిని కడిగివేస్తాను. ఆ విగ్రహాలనుండి వచ్చిన మురికని నేను కడిగివేస్తాను.”
EZE 36:26 దేవుడు ఇలా అన్నాడు: “మీలో సరికొత్త ఆత్మను పెడతాను. మీ ఆలోచనా సరళి మార్చుతాను. మీ శరీరం నుండి రాతి గుండెను తొలగించి సున్నితమైన మానవ హృదయాన్ని ఇస్తాను.
EZE 36:27 మీలో నా ఆత్మను ప్రవేశపెడతాను. మీరు నా కట్టడులను పాటించేలా మిమ్మల్ని నేను మార్చుతాను. మీరు నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తారు.
EZE 36:28 పిమ్మట మీ పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజలవుతారు.నేను మీ దేవుడనవుతాను.”
EZE 36:29 దేవుడు ఇలా చెప్పాడు: “నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు మలినపడకుండా ఉంచుతాను. ధాన్యం (సమృద్ధిగా) పండేలా నేను ఆజ్ఞ ఇస్తాను. మీ మీదికి కరువును రప్పించను.
EZE 36:30 మీ చెట్ల నుండి ఫలసంపద పుష్కలంగా వచ్చేలా చేస్తాను. మీ పొలాలను బహుగా పండిస్తాను. అన్య దేశాలలో మరెన్నడూ మీరు ఆకలి బాధల అవమానాన్ని అనుభవించరు.
EZE 36:31 మీరు చేసిన చెడు కార్యాలను మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. మీరు చేసినవి మంచి పనులు కావని తెలుసుకునే జ్ఞానం మీకు కలుగుతుంది. మీరు చేసిన పాపాలకు, మీరు పాల్పడిన భయంకర కృత్యాలకు మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.”
EZE 36:32 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను, మీ మంచి కొరకు నేనీ పనులేవీ చేయటం లేదు! [నా మంచి పేరు నిలుపుకోటానికే వాటిని నేను చేస్తున్నాను!] కావున ఇశ్రాయేలు వంశమా, మీరు జీవించిన తీరుకు మీరు సిగ్గుపడి, కలత చెందాలి!”
EZE 36:33 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “నేను మీ పాపాలను కడిగివేసే రోజున ప్రజలను మీ నగరాలకు తీసుకొని వస్తాను. పాడుబడ్డ నగరాలు తిరిగి నిర్మించబడతాయి.
EZE 36:34 బీడు భూములు సాగుచేయబడతాయి. అది దారిన పోయే వారికి కేవలం శిథిలాల గుట్టలా కన్పించదు.
EZE 36:35 ‘గతంలో ఈ దేశం నాశనమయింది. అది ఇప్పుడు ఏదెను ఉద్యానవనంలా రూపు దిద్దుకున్నది. నగరాలు నాశనం చేయబడ్డాయి. అవి పాడుబడి నిర్మానుష్యమై నాయి. కాని ఇప్పుడవి రక్షిత నగరాలైనవి. వాటిలో ప్రజలు ఇప్పుడు నివసిస్తున్నారు అని వారు చెప్పుకుంటారు.’”
EZE 36:36 దేవుడు ఇలీ చెప్పాడు: “నీ చుట్టూ ఉన్న దేశాలు నేను యెహోవాననీ, ఆ పాడైపోయిన ప్రాంతాలను పునరుద్ధరించాననీ తెలుసుకుంటాయి. ఖాళీగా ఉన్న ఈ నేలలో నేను మొక్కలు నాటాను. నేనే యెహోవాను. నేనే ఈ విషయాలను చెప్పాను.అవి జరిగేలా చేస్తాను.”
EZE 36:37 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఇశ్రాయేలు వంశం వారు ఇలా జరిగేలా చేయమని నన్ను అడిగేలా కూడ చేస్తాను. వారి సంతానాన్ని బహుగా అభివృద్ధి చేస్తాను. వారు గొర్రెల మందల్లా విస్తరిస్తారు.
EZE 36:38 యెరూషలేములో ప్రత్యేక పండుగల సందర్భంగా తేబడే గొర్రెల, మేకల మందల్లా ఆ ప్రజలు విస్తారంగా ఉంటారు. నగరాలు, పాడుబడిన ప్రాంతాలు తిరిగి జనసందోహాలతో కిటకిటలాడుతాయి. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”
EZE 37:1 యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. దేవుని ఆత్మ (సుడిగాలి రూపంలో) నన్ను నగరంనుండి ఎత్తుకుపోయి ఒక లోయ మధ్యలో దించింది. ఆ లోయ అంతా మానవ అస్థిపంజరాలతో నిండిఉంది.
EZE 37:2 లోయలో భూమిమీద ఎముకలు లెక్కకు మించి పడివున్నాయి. ఆ ఎముకల మధ్యగా యెహోవా నన్ను నడిపించాడు. ఎముకలు బాగా ఎండిపోయి ఉన్నట్లు నేను చూశాను.
EZE 37:3 నా ప్రభువైన యెహోవా నన్ను, “నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోగలవా?” అని అడిగాడు. “నాప్రభువైన యెహోవా, ఈ ప్రశ్నకు సమాధానం నీకే తెలుసు” అని నేనన్నాను.
EZE 37:4 అందుకు నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి!
EZE 37:5 నా ప్రభువైన యెహోవా మీకు ఈ విషయాలు చెపుతున్నాడు: మీలోకి ఊపిరి వచ్చేలా చెస్తాను. మీరు ప్రాణం పోసుకుంటారు!
EZE 37:6 మీమీద మళ్లీ స్నాయువులు, కండరాలు కలుగజేస్తాను. మిమ్మల్ని చర్మంతో కప్పుతాను. పిమ్మట మీలో ఊపిరి పోస్తాను. మీరు బతుకుతారు! అప్పుడు ప్రభువును, యెహావాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’”
EZE 37:7 ఆయన చెప్పిన రీతిలో నేను యెహోవా తరపున ఎముకలతో మాట్లాడాను. నేను ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఒక పెద్ద శబ్దం విన్నాను. ఎముకలలో గలగల శబ్దం వినవచ్చింది. ఒక ఎముకతో మరొక ఎముక కలవటం మొదలు పెట్టింది!
EZE 37:8 తరువాత నా కళ్ల ముందే వాటిమీద స్నాయువులు, కండరాలు ఏర్పడటం జరిగింది. వాటిమీద చర్మం కప్పివేయటం మొదలయింది. కాని శరీరాలు మాత్రం కదలలేదు. వాటిలో ఊపిరి లేదు.
EZE 37:9 పిమ్మట నా ప్రభువైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “వాయువుతో మాట్లాడు. ఓ నరపుత్రుడా, ఊపిరితో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ఊపిరితో చెప్పు: ‘ఊపిరి, అన్ని దిశలనుండి నీవు వీచి ఈ శవాలలో జీవంపోయుము! వాటికి ఊపిరి పోయుము; అవి తిరిగిబతుకుతాయి!’”
EZE 37:10 ఆయన చెప్పిన విధంగా నేను యెహోవా తరపున ఆత్మతో మాట్లాడాను. వెంటనే శవాలలోకి ఊపిరి వచ్చింది. వాటికి ప్రాణం వచ్చి లేచి నుంచున్నాయి. అక్కడ ఎంతో మంది మనుష్యులున్నారు. వారంతా ఒక పెద్ద సైన్యం!
EZE 37:11 తరువాత నా ప్రభువైన యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఈ ఎముకలు మొత్తం ఇశ్రాయేలు వంశంలా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు, ‘మా ఎముకలు ఎండిపోయాయి. మా ఆశలు అడుగంటాయి. మేము సర్వనాశనమయ్యాము!’ అని అంటున్నారు.
EZE 37:12 కావున నీవు నా తరపున వారితో మాట్లాడి ప్రభువైన యెహోవా ఈ రకంగా చెపుతున్నాడని తెలుపు, ‘నా ప్రజలారా నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని బయటికి తెస్తాను! పిమ్మట మిమ్మల్ని ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వస్తాను.
EZE 37:13 నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని వాటినుండి బయటకు తెస్తాను! అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
EZE 37:14 నా ఆత్మను మీలో పెడతావును. దానితో మీరు మళ్లీ జీవిస్తారు. అప్పుడు మిమ్మల్ని మీ స్వదేశానికి తిరిగి నడపిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఈ విషయాలు నేనే చెప్పాను, వాటిని జరిగేలా చేశానని మీరు తెలుసుకుంటారు!’” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
EZE 37:15 యెహోవా వాక్కు నాకు మళ్నీ వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 37:16 “నరపుత్రుడా, ఒక కట్టెపుల్లను తెచ్చి ఈ వర్తమానం దానిమీద వ్రాయి, ‘ఈ పుల్ల యూదాకు, దాని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది.’ తరువాత మరో పుల్లను తీసుకొని దాని మీద; ‘ఈ ఎఫ్రాయిము పుల్ల యోసేపుకు, అతని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది,’ అని వ్రాయుము.
EZE 37:17 పిమ్మట ఆ రెండు పుల్లలను కలుపుము. నీ చేతిలో ఆ రెండూ ఒక్క పుల్లలా ఉంటాయి.
EZE 37:18 “దీని భావమేమిటని నీ ప్రజలు నిన్నడుగుతారు.
EZE 37:19 ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి చెప్పు. ‘ఎఫ్రాయిము చేతిలో ఉన్న యోసేపు పుల్లను మరియు అతని స్నేహితులగు ఇశ్రాయేలీయులను నేను తీసుకుంటాను. దానిని యూదా యొక్క పుల్లతో కలిపి ఒక్క పుల్లగా చేస్తాను. నా చేతిలో అవి ఒక్క కట్టె పుల్ల అవుతాయి!’
EZE 37:20 “నీకు ముందుగ వారి కండ్ల ఎదుట ఆ కర్రలను నీ చేతిలో ఎత్తి పట్టుకొనుము. ఆ పేర్లను ఆ కట్టెపుల్లల మీద నీవు వ్రాశావు.
EZE 37:21 నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెపుతున్నాడని అనుము, ‘వారు చెదరిపోయిన దేశాల నుండి ఇశ్రాయేలు ప్రజలను నేను తీసుకొంటాను. అన్ని చోట్ల నుండి వారిని సమావేశపర్చి, వారి స్వంత దేశానికి తిరిగి తిసుకొని వస్తాను.
EZE 37:22 ఇశ్రాయేలు పర్వతం మీద వారిని ఒక్క దేశంగా చేస్తాను. వారందరికి ఒక్కడే రాజు ఉంటాడు. వారు రెండు రాజ్యాలుగా కొనసాగరు. వారిక ఎంతమాత్రం రెండు రాజ్యాలుగా విడిపోరు.
EZE 37:23 వారి విగ్రహాలతోను, భయంకర శిల్పాలతోను, తదితర ఘోరమైన నేరాలతోను వారు తమను తాము మలినపర్చు కోవటం కొనసాగించరు. వారెక్కడున్నా వారి భయంకర పాపాలన్నిటి నుండి వారిని నేను కాపాడుతాను. నేను వారిని కడిగి పవిత్ర పర్చుతాను. వారు నా ప్రజలవుతారు. నేను వారికి దేవుడనై యుంటాను.
EZE 37:24 “‘నా సేవకుడైన దావీదు వారికి రాజుగా ఉంటాడు. వారంతా ఒకే ఒక్క కాపరిని కలిగి ఉంటారు. వారు నా నీతికి, న్యాయానికి బద్ధులై జీవిస్తారు. నేను చెప్పినవన్నీ వారు చేస్తారు.
EZE 37:25 నేను సేవకుడైన యాకోబుకు ఇచ్చిన భూమి మీద వారు నివసిస్తారు. నీ పూర్వీకులు ఆ ప్రదేశంలో నివసించారు. నా ప్రజలూ అక్కుడే నివసిస్తారు.వారు, వారి పిల్లలు మరియు వారి మనుమలు అక్కడే శాశ్వతంగా నివసిస్తారు. మరియు నా సేవకుడైన దావీదు సదా వారికి రాజై ఉంటాడు.
EZE 37:26 నేను వారితో శాంతి ఒడంబడిక ఒకటి చేసుకుంటాను. ఈ ఒడంబడిక ఎల్లకాలం కొన సాగుతుంది. వారి దేశాన్ని వారికి ఇవ్వటానికి నేను అంగీకరించాను. వారి సంతానం విస్తారమవడానికి నేను అంగీకరించాను. పైగా నా పవిత్ర స్థలాన్ని అక్కడ శాశ్వతంగా వారితో ఉంచటానికి నేను అంగీకరించాను.
EZE 37:27 నా పవిత్ర గుడారం వారి మధ్య అక్కడ ఉంటుంది. అవును,నేను వారి దైవంగా, వారు నా ప్రజలుగా ఉంటాము.
EZE 37:28 మరియు ఇతర దేశాలు కూడ నేను యెహోవానని తెలుసుకుంటాయి. నా పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంచటం ద్వారా నేను ఇశ్రాయేలీయులను నా ప్రత్యేక జనులుగా చేశానని కూడ వారు తెలుసుకుంటారు.’”
EZE 38:1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది. ఆయన ఇలా అన్నాడు:
EZE 38:2 “నరపుత్రుడా, మాగోగు దేశపువాడైన గోగువైపు చూడు. అతడు మెషెకు మరియు తుబాలు దేశాలకు అతి ముఖ్యమైన నాయకుడు. నీవు నా తరపున గోగుక వ్యతిరేకంగా మాట్లాడుము.
EZE 38:3 ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని నీవతనికి తెలుపు, ‘గోగూ, నీవు మెషెకు మరియు తుబాలు దేశాలకు అతి ముఖ్యమైన నాయకుడవు! కాని నీకు నేను విరోధిని.
EZE 38:4 నిన్ను నేను పట్టుకుని వెనుకకు తీసుకొని వస్తాను. నీ సైన్యంలోని వారందరినీ నేను పట్టుకు వస్తాను. గుర్రాలను, గుర్రపు సైన్యం వారందరిని పట్టుకు వస్తాను. మీ నోళ్లకు గాలం తగిలించి, మీ అందరినీ తిరిగి తీసుకు వస్తాను. మీ సైనికులంతా వారి దుస్తులు, డాళ్లు, కత్తులు ధరిస్తారు.
EZE 38:5 పెర్షియా (పారసీకము), ఇథియోపియ (కూషు) మరియు పూతు సైనికులందరు కూడ మీతో ఉంటారు. వారంతా తమ డాళ్లు, శిరస్త్రాణాలు ధరిస్తారు.
EZE 38:6 అక్కడ గోమరు కూడ తన సైన్యమంతటితో ఉంటుంది. తన సైనిక పటాలాలన్నిటితో దూరాన గల ఉత్తర దేశమైన తోగర్మా కూడ ఉంటుంది. ఆ బందీల ప్రదర్శనలో ఇంకా అనేకానేక మంది ప్రజలు ఉంటారు.
EZE 38:7 “‘సిద్ధంకండి. అవును. నీవు నీతో కలిసిన సైన్యాలు సిద్ధం కండి. మీరు సిద్ధమై మెలకువతో ఉండండి.
EZE 38:8 ఎంతో కాలం తరువాత మీరు విధులకు పిలవబడుతారు. తరువాతి సంవత్సరాలలో యూద్ధ బాధలనుండి విముక్తి చెదిన దేశంలోకి మీరు వస్తారు. ఆ దేశపు ప్రజలు తాము ఇతర దేశాలనుండి సమ కూర్చబడి ఇశ్రాయేలు పర్వతం మీదికి తిసుకొని రాబడతారు. గతంలో ఇశ్రాయేలు పర్వతాలు పదే పదే నాశనం చేయబడ్డాయి. అయితే ఈ ప్రజలు మాత్రం ఇతర దేశాల నుండి తిరిగి వచ్చినవారు. వారంతా క్షేమంగా నివసిస్తారు.
EZE 38:9 కాని నీవు వారిని ఎదిరించటానికి వస్తావు. నీవొక తుఫానులా వస్తావు.దేశాన్ని ఆవరించి గర్జించే మేఘంలా నీవు వస్తావు. నీవు, నీతో వున్న అన్య దేశాల సైనిక దళాలు ఈ ప్రజల మీదికి వచ్చి పడతారు.’”
EZE 38:10 నా ప్రభవైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఆ సమయంలో నీ మనస్సుకు ఒక ఆలోచన వస్తుంది. నీవు కుయుక్తి పన్నటం మొదలు పెడతావు.
EZE 38:11 నీవు ఈ విధంగా అంటావు, ‘నగరాలకు రక్షణ గోడలు లేకుండా ఉన్న దేశంపై (ఇశ్రాయేలు) నేను దాడిచేస్తాను. వారు ప్రశాంతంగా జీవిస్తున్నారు. సురక్షితంగా ఉన్నామని వారనుకుంటున్నారు. నగరాలను రక్షించటానికి వాటిచుట్టూ గోడలే లేవు. వారి ద్వారాలకు తాళాలు లేవు. అసలు ద్వారాలే లేవు!
EZE 38:12 ఆ ప్రజలను నేను ఓడించి, వారి విలువైన సొమ్ములను నేను కొల్లగొడతాను. ఒకప్పుడు నాశనం చేయబడి, ఇప్పుడు జనంతో క్రిక్కిరిసిన ప్రాంతాలపై నేను యూద్ధం చేస్తాను. అన్యదేశాల నుండి వెనుకకు తీసుకొని రాబడిన ఆ ప్రజలతో (ఇశ్రాయేలు) నేను యుద్ధం చేస్తాను. ఇప్పుడా ప్రజలకు పశువులు, ఆస్తిపాస్తులు సమకూడాయి. వారు ప్రపంచానికి నాలుగుబాటల కూడలి స్థలంలో నివసిస్తున్నారు. కొన్ని అగ్ర రాజ్యాలు ఇతర బలమైన రాజ్యాలకు ఆ ప్రాంతం గుండానే వెళ్లాలి’
EZE 38:13 “సెబా, దదానువారు; తర్షీషు వ్యాపారులు, ఇతర వ్యాపార కేంద్రాలైన నగరాల వారు నిన్ను చూచి ఇలా అంటారు, ‘విలువైన వస్తువులు పట్టుకు పోవడానికి వచ్చావా? మంచి మంచి వస్తువులు, వెండి బంగారాలు, పశువులు, ఇతర సంపద కొల్లగొట్టి పట్టుకుపోవటానికి నీవు నీ సైనిక దళాలను తీసుకొని వచ్చావా? ఆ విలువైన వస్తువులు పట్టుకు పోవటానికి వచ్చావా?’”
EZE 38:14 దేవుడు ఇలా అన్నాడు, “నరపుత్రుడా, నా తరఫున గోగుతో మాట్లాడు. ప్రభవైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని అతనికి తెలియజేయి, ‘నా ప్రజలు ప్రశాంతంగా, నిర్భయంగా జీవిస్తున్న సమయంలో నీవు వారిమీద దండయాత్రకు వస్తావు.
EZE 38:15 సుదూర ఉత్తర ప్రాంతంలో గల నీ దేశంనుండి నీవు వస్తావు. నీతో అనేక మందిని తీసుకొని వస్తావు. వారంతా గుర్రాల మీద వస్తారు. మీరంతా ఒక శక్తివంతమైన మహా సైన్యంగా ఉంటారు.
EZE 38:16 నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయటానికి మీరు వస్తారు. దేశాన్ని ఆవరించే గర్జించే ఒక మేఘంలా నీవుంటావు. ఆ సమయం వచ్చినప్పుడు నా దేశం మీద యూద్ధానికి నిన్ను తీసుకొనివస్తాను. గోగూ, అప్పుడు నేనెంత శక్తిమంతుడనో దేశాలన్నీ తెలుసుకొంటాయి! వారు నన్ను గౌరవించటం నేర్చుకుంటారు. నేను మహనీయుడనని వారు తెలుసుకుంటారు. నీకు నేనేమి చేస్తానో వారు చూస్తారు!’”
EZE 38:17 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “గతంలో నేను నిన్ను గురించి మాట్లాడినట్లు ఆ సమయంలో ప్రజలు గుర్తు తెచ్చుకుంటారు. నా సేవకులైన ఇశ్రాయేలు ప్రవక్తల సేవలను నేను వినియోగించుకున్నట్లు వారు గుర్తు తెచ్చుకుంటారు. ఇశ్రాయేలు ప్రవక్తలు గతంలో నా తరపున మాట్లాడుతూ, వారిపై యుద్ధానికి నేను నిన్ను తీసుకొని వస్తానని చెప్పినట్లు వారు గుర్తు తెచ్చుకుంటారు”
EZE 38:18 నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: “ఆ సమయంలో ఇశ్రాయేలు దేశంపై యుద్ధానికి గోగు వస్తాడు. నేను నా కోపాన్ని చూపిస్తాను.
EZE 38:19 నా కోపంలో, ఉద్రేకంలో నేనిలా ప్రమాణం చేస్తున్నాను, ఇశ్రాయేలు దేశంలో ఒక తీవ్రమైన భూకంపం వస్తుందని నేను ఖచ్చితంగా చెపుతున్నాను.
EZE 38:20 ఆ సమయంలో జీవరాశులన్నీ భయంతో కంపించిపోతాయి. సముద్రంలో చేపలు, గాలిలో పక్షులు, అడవుల్లో క్రూరమృగాలు తదితర పాకే జీవులు, మానవులందరూ భయంతో వణికిపోతారు. పర్వతాలు కూలిపోతాయి. కొండ శిఖరాలు విరిగి పడతాయి. ప్రతి గోడా నేలకూలు తుంది!”
EZE 38:21 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “అంతేగాదు. ఇశ్రాయేలు పర్వతాల మీద అన్ని రకాల భయోత్పాతాలను గోగు మీదికి రప్పిస్తాను. అతని సైనికులు తమ కంగారులో ఒకరిపై ఒకరు పడి, తమ కత్తులతో ఒకరి నొకరు పొడుచుకొని చెంపుకుంటారు.
EZE 38:22 రోగాలతోను, మరణంతోను గోగును శిక్షిస్తాను. గోగు మీదను, అనేక దేశాల నుండి వచ్చిన అతని సైన్యం మీదను వడగళ్లు, అగ్ని, గంధకం వర్షించేలా చేస్తాను.
EZE 38:23 నేనెంత గొప్పవాడినో నేనప్పుడు చూపిస్తాను. నేను మహనీయుడనని రుజువు చేస్తాను. నేను ఈ పనులు చేయటం అనేక దేశాల వారు చూస్తారు. నేనెవరినో అప్పుడు వారు కనుగొంటారు. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు.”
EZE 39:1 “నరపుత్రుడా, నా తరపున గోగుకు వ్యతిరేకంగా మాట్లాడు. యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని అతనికి తెలియజేయుము, ‘గోగూ, నీవు మెషెకు, తుబాలు దేశాలకు అతి ముఖ్యమైన నాయకుడవు! కాని నేను నీకు వ్యతిరేకిని.
EZE 39:2 నిన్ను నేను పట్టుకొని వెనుకకు తీసుకొని వస్తాను. దూరపు ఉత్తర ప్రాంతం నుండి నిన్ను తీసుకు వస్తాను. ఇశ్రాయేలు పర్వతాలపై యుద్ధానికి నిన్ను నేను తీసుకు వస్తాను.
EZE 39:3 కాని నీ ఎడమచేతి నుండి నీ ధనుస్తును నేల రాల్చుతాను. నీకుడి చేతి నుండి నీ బాణాలు పడిపోయేలా చేస్తాను.
EZE 39:4 ఇశ్రాయేలు పర్వతాల మీద నీవు చంపబడతావు. నీవు, నీ సైనిక దళాలు, నీతో ఉన్న అన్య దేశాల జనులు యుద్ధంలో చంపబడతారు. మాంసం తినే ప్రతి పక్షి, క్రూర మృగాలకి నిన్ను ఆహారంగా పడవేస్తాను.
EZE 39:5 నీవు నగర ప్రవేశం చేయవు. నీవు ఆరు బయటనే పొలాల్లో చంపబడతావు. ఇది చెప్పినది నేనే!’” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
EZE 39:6 దేవుడు ఇలా చెప్పాడు, “మాగోగు మీదికి, తీరం వెంబడి నిర్భయంగా నివసిస్తున్న ప్రజల మీదికి అగ్నిని పంపిస్తాను. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకొంటారు.
EZE 39:7 నేనొక్కడినే ఇశ్రాయేలులో మహనీయుణ్ణి. ప్రజలు నా పవిత్ర నామాన్ని ఇక ఎంతమాత్రం పాడు చేయకుండా చూస్తాను. దేశాలన్నీ నేనే యెహోవానని తెలుసుకుంటాయి. నేను ఇశ్రాయేలులో నెలకొన్న పవిత్రుడినైన యెహోవానని వారు తెలుసుకుంటారు.
EZE 39:8 ఆ సమయం ఆసన్నమవుతూ ఉంది! అది జరిగి తీరుతుంది!” యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “ఆ రోజును గురించే నేను మాట్లాడుతున్నాను.
EZE 39:9 “ఆ సమయంలో ఇశ్రాయేలు నగరాలలో నివసిస్తున్న ప్రజలు ఆ పొలాలలోకి వెళతారు. వారు శత్రువుల ఆయుధాలన్నీ ఏరి తగలబెడతారు. డాళ్లు, ధనుస్సులు, బాణాలు, దుడ్డు కర్రలు, ఈటెలు అన్నీ వారు తగులబెడతారు. ఆ ఆయుధాలన్నిటినీ వారు ఏడేండ్ల పాటు వంట చెరకుగా ఉపయోగిస్తారు.
EZE 39:10 ఈ ఆయుధాలనే వారు వంట చెరకుగా ఉపయోగించటంతో వారు పొలాల్లో పుల్లలు ఏరటం గాని, అడవిలో కట్టెలు కొట్టటం గాని చేయవలసిన అవసరం లేదు. వారిని దోచుకోవాలని వచ్చిన సైనికుల నుండి విలువైన వస్తునులను వారే తీసుకుంటారు. తమవద్ద విలువైన వస్తువులను దోచుకున్న సైనికుల నుండి వారే మంచి వస్తువులను తీసుకుంటారు.” ఈ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పాడు.
EZE 39:11 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “ఆ సమయంలో గోగును సమాధి చేయటానికి ఇశ్రాయేలులో నేనొక స్థలాన్ని ఎంపిక చేస్తాను. మృత సముద్రానికి తూర్పున ఉన్న ప్రయాణీకుల లోయలో అతడు సమాధి చేయబడతారు. అది ప్రయాణికల బాటను మూసివేస్తుంది. గోగు మరియు అతని సైన్యమంతా అక్కడే సమాధి చేయబడతారు గనుక అలా జరుగుతుంది. ప్రజలు ఆ ప్రదేశాన్ని ‘గోగు సైన్యావు లోయ’ అని పిలుస్తారు.
EZE 39:12 దేశాన్ని శుద్ధి చేయటానికి ఇశ్రాయేలు వంశం వారు వారిని ఏడు నెలల పాటు పాతిపెడతారు.
EZE 39:13 దేశంలోని సామాన్య ప్రజలంతా ఆ శత్రు సైనికులను పాతిపెడతారు. నేను ఖ్యాతి తెచ్చుకున్న ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు కీర్తి వహిస్తారు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయం చెప్పాడు.
EZE 39:14 దేవుడు ఇలా చెప్పాడు: “ఆ చనిపోయిన సైనికులను పాతి పెట్టటానికి పనివారిని పూర్తి సమయ ప్రాతిపదికపై ప్రజలు నియమించవలసి ఉంటుంది. ఈ రకంగా వారు దేశాన్ని పవిత్రం చేస్తారు. పనివారు ఏడునెలల పాటు పని చేస్తారు. వారు శవాలను వెదుకుతూ నలుదిశలా తిరుగుతారు.
EZE 39:15 పనివారు అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఒక్కడైనా ఒక ఎముకను చూస్తే దాని పక్కన ఒక గుర్తు పెడతాడు. సమాధులు త్రవ్వేవారు వచ్చి ఆ ఎముకును గోగు సైన్యపులోయలో పాతిపెట్టే వరకు ఆ గుర్తు అక్కడ ఉంటుంది.
EZE 39:16 ఆ మృతుల నగరానికి హమోనా అని పేరు పెడతారు. ఈ విధంగా వారు దేశాన్ని శుద్ధి చేస్తారు.”
EZE 39:17 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నరపుత్రుడా, అన్ని పక్షుల, అడవి జంతువులతో నా తరఫున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఇక్కడికి రండి! ఇక్కడికి రండి! చుట్టూ మూగండి. నేను మీ కొరకు సిద్ధం చేస్తున్న బలినిమీరు తినండి. ఇశ్రాయేలు పర్వతాల మీద చాలా పెద్ద బలి ఇవ్వబడుతుంది. రండి. మాంసం తినండి. రక్తం తాగండి.
EZE 39:18 బలాఢ్యులైన సైనికుల శరీరాల మాంసం మీరు తింటారు. మహా రాజుల రక్తాన్న మీరు తాగుతారు. బాషానుకు చెందిన పొట్టేళ్లు, గొర్రె పిల్లలు, మేకలు, బలిసిన గిత్తల్లా వారుంటారు.
EZE 39:19 మీకు కావలసిన కొవ్వునంతా మీరు తినవచ్చు. మీ పొట్టలు నిండేలా మీరు రక్తం తాగవచ్చు. మీ కొరకు నేను ఇచ్చే బలి మాంసం మీరు తిని, తాగుతారు.
EZE 39:20 నా బల్లవద్ద తినటానికి మీకు మాంసం పుష్కలంగా లభిస్తుంది. వారిలో గుర్రాలు, రథసారధులు బలిష్ఠులైన సైనికులు, ఇతర పోరాట యోధులు ఉన్నారు.’”నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
EZE 39:21 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు, “నేనేమి చేశానో ఇతర దేశాల వారు చూసేలా చేస్తాను. ఆ అన్యదేశాల వారు నన్ను గౌరవించటం మొదలు పెడతారు! ఆ శత్రువు మీద నేను ఉపయోగించిన నా శక్తిని వారు చూస్తారు.
EZE 39:22 ఆ రోజునుంచి ఇశ్రాయేలు వంశం వారు నేను తమ దేవుడగు యెహోవానని తెలుసుకుంటారు.
EZE 39:23 అన్యదేశాలు ఇశ్రాయేలు వంశం వారు ఎందుకు బందీలుగా కొనిపోబడ్డారో తెలుసుకుంటాయి. నా ప్రజలు నామీద తిరుగుబాటు చేసినట్లు వారు తెలుసుకుంటారు. కావున నేను వారికి విముఖు డనయ్యాను. వారి శత్రువులు వారిని ఓడించేలా చేశాను. అందుచే నా ప్రజలు యుద్ధంలో చెంపబడ్డారు.
EZE 39:24 వారు పాపం చేసి, వారిని వారు మలినపర్చుకున్నారు. కావున వారు చేసిన పనులకు నేను వారిని శిక్షించాను. నేను వారికి విముఖుడనై, వారికి సహాయం చేయ నిరాకరించాను.”
EZE 39:25 కావున నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇప్పుడు యాకోబు వంశాన్ని దేశ బహిష్కరణ నుండి విముక్తిచేసి తీసుకు వస్తాను. ఇశ్రాయేలు వంశమంతటి మీద దయ చూపుతాను. నా పవిత్ర నామ పరిరక్షణ విషయంలో నేను నా రోషాన్ని తెలియజేస్తాను.
EZE 39:26 ప్రజలు వారి అవమానాలను, వారు నాపై తిరుగుబాటు చేసిన రోజులను వారు మర్చిపోతారు. వారు తమ స్వంత దేశంలో సురక్షితంగా నివసిస్తారు. వారి నెవరూ భయపెట్టరు.
EZE 39:27 అన్య దేశాలనుంచి నా ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాను. వారి శత్రు రాజ్యాల నుండి వారిని కూడదీస్తాను. నేనెంత పవిత్రుడనో అనేక దేశాలు అప్పుడు చూస్తాయి.
EZE 39:28 వారు తమ ఇండ్లను వదిలి ఇతర దేశాలకు బందీలుగా పోయేటట్లు ఇంతకు ముందు నేను చేశాను. తరువాత మళ్లీ వారిని కూడదీసి తమ స్వంత దేశానికి తీసుకొని వచ్చాను. అందువల్ల నేను వారి దేవుడనైన యెహోవానని వారు తెలుసుకుంటారు.
EZE 39:29 ఇశ్రాయేలు వంశం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దాని తరువాత మరెన్నడూ నేను నా ప్రజలకు విముఖుడనై ఉండను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 40:1 మేము బందీలుగా ఉన్న తరువాత ఇరవై ఐదవ సంవత్సరం ఆదిలో ఆ నెల (అక్టోబరు), పదవ రోజున యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. అంటే ఇది ఆ రోజుకు బబులోను (బాబిలోనియా) వారు యెరూషలేమును వశపర్చుకున్న తరువాత పద్నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఒక స్వప్న దర్శనంలో యోహోవా నన్నక్కడికి తీసికొని వెళ్లాడు.
EZE 40:2 ఒక దర్శనంలో దేవుడు నన్ను ఇశ్రాయేలు రాజ్యానికి తీసుకొని వెళ్లాడు. చాలా ఎత్తయిస ఒక పర్వతం దగ్గర ఆయన నన్నుదించాడు. ఆ పర్వతం మీద ఒక నగరంలా కన్పించే ఒక దివ్య భవంతి ఉంది. ఆ నగరం దక్షిణ దిశగా ఉంది.
EZE 40:3 యెహోవా నన్నక్కడికి తీసుకొని వచ్చాడు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. మెరుగుదిద్దిన కంచులా అతడు మెరుస్తున్నాడు. ఆ మనిషి చేతిలో గుడ్డతో చేసిన కొలతతాడు మరియు కొలతబద్ద ఉన్నాయి. అతడు ద్వారం వద్ద నిలబడ్డాడు.
EZE 40:4 ఆ మనిషి నాతో అన్నాడు, “నరపుత్రుడా నీ కళ్లను, చెవులను శ్రద్ధగా ఉపయోగించు. ఈ వస్తువులను చూడు. నేను చెప్పేది విను. నేను చూపించే ప్రతిదాని పట్ల నీవు శ్రద్ధ వహించు. ఎందుకనగా నేను ఇవన్నీ నీకు చూపించే నిమిత్తమే నీవిక్కడకు తేబడ్డావు. నీవు చూసినదంతా ఇశ్రాయేలు వంశం వారికి చెప్పాలి.”
EZE 40:5 ఆలయ ఆవరణ చుట్టూ నేనొక గోడ చూశాను. ఆ మనిషి చేతిలో కొలత బద్ద ఉంది. దాని పొడవు ఆరు మూరలు. ఆ మనిషి గోడ యొక్క మందాన్ని కొలిచాడు. దాని మందం పది అడుగుల ఆరంగుళాలు. తరువాత అతడు గోడ ఎత్తు కొలవగా అది పది అడుగుల ఆరంగుళాలు ఉంది.
EZE 40:6 పిమ్మట ఆ మనిషి తూర్పు ద్వారం వద్దకు వెళ్లాడు. అక్కడ దాని మెట్లెక్కి ద్వారపు గడప వెడల్పు కొలవగా అది పది అడుగుల ఆరంగుళాలు ఉంది. మరియొక గడప వెడల్పు కూడ పది అడుగుల ఆరంగుళాలే ఉంది.
EZE 40:7 అక్కడ ఒక గది ఉంది. దాని పొడవు, వెడల్పులు ఒక్కొక్కటి పది అడుగుల ఆరంగుళాలు. గదుల మధ్య ఖాళీస్థలం ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళాలు ఉంది. లోపలి వైపుకు తిరిగి ఉన్న ముఖ మండపం దిశలో ఉన్న ద్వారం యొక్క గడప వెడల్పు పది అడుగుల ఆరంగుళాలు.
EZE 40:8 ఆలయానికి పక్కనున్న ద్వార ముఖ మంటపాన్ని ఆ మనిషి కొలిచాడు. దాని వెడల్పు పది అడుగుల ఆరంగుళాలు.
EZE 40:9 పిమ్మట అతడు ద్వార మండపాన్ని కొలవగా అది ఎనిమిది మూరలున్నది. ద్వారపు రెండు పక్కలనున్న గోడను కొలిచాడు. ఒక్కొక్క పక్క రెండు మూరల మందం ఉంది. ముఖ మంటపం ద్వారానికి చివరి కోవెలదిశగా ఉంది. మండప ద్వారం లోపలి వైపున ఉంది.
EZE 40:10 ద్వారానికి ఇరు వైపుల మూడేసి చిన్న గదులున్నాయి. ఈ మూడు చిన్న గదుల నాలుగు పక్కల గోడలూ ఒకే కొలతలో ఉన్నాయి. ద్వారపు కమ్మెలు రెండు పక్కలా ఒకే కొలతలో ఉన్నాయి.
EZE 40:11 ద్వారపు ప్రవేశ మార్గం పది మూరల వెడల్పు, పదమూడు మూరల నిడివి కలిగి ఉంది.
EZE 40:12 ప్రతి గది ముందు ఒక లోతైన గోడ ఉంది. ఆ గోడ ఎత్తు ఆరు మూరలు. దాని మందం ఆరు మూరలు. గదులు చతురస్రాకారంలో ఉన్నాయి. ప్రతి గోడ ఆరు మూరలపొడుగు కలది.
EZE 40:13 ఆ మనిషి ద్వారపు కొలతలను ఒక గది పైకప్పునుండి ఎదురుగానున్న మరి యొక గది పైకప్పు వరకు కొలిచాడు. అది ఇరవై ఐదు మూరలుంది.
EZE 40:14 అతడు పక్కనున్న గోడల ముందు భాగంతో బాటు, మంటపం ముందున్న పక్క గోడలతో సహా కొలిచాడు. దాని పొడవు మొత్తం అరవై మూరలు. దాని వెడల్పు ముప్పయి అడుగులు. మండపం చుట్టూ ఆవరణ ఉంది.
EZE 40:15 మండపం బయటి ద్వారం నుండి లోపలి ద్వారం వరకు ఏభై మూరలు ఉన్నాయి.
EZE 40:16 కాపలాగ దులకు పైన, పక్క గోడల పైన, మంటపం మీద చిన్న కిటికిలు ఉన్నాయి. ఆ కిటికిల పెద్ద భాగాలు ద్వారాన్ని చూస్తున్నాయి. ద్వారానికి ఇరువైపుల ఉన్న గోడల మీద తాటిచెట్లు చెక్కబడి ఉన్నాయి.
EZE 40:17 పిమ్మట ఆ మనుష్యుడు నన్ను బయటి ఆవరణలోకి తీసుకొని వచ్చాడు. అక్కడ గదులు, బాటలు రాళ్ళతో చేయబడ్డ వాటిని చూశాను. గోడల నానుకొని ఉన్న ఆ గదులు బాటకు ఎదురుగా ఉన్నాయి. అవి ఆవరణ చుట్టూ ఉన్నాయి. ముందు భాగంలో చదును చేసిన బాట మీద ముప్పయి గదులున్నాయి.
EZE 40:18 ద్వారం ఎంత పొడవుగా ఉందో చదును బాట కూడ అంత పొడవుంది. ఆ దారి ద్వారపు లోపలికొస వరకు చేరివుంది. ఇది దిగువ చదునుబాట.
EZE 40:19 పిమ్మట ఆ మనుష్యుడు కింది ద్వారం నుండి లోపలి ఆవరణ వరకు గల దూరాన్ని కొలిచాడు. అది తూర్పున, ఉత్తరాన నూరు మూరలు ఉంది.
EZE 40:20 ఉత్తర దిశకు ఉన్న వెలుపలి ఆవరణ ద్వారం యొక్క పొడవు వెడల్పులను ఆ మనిషి కొలిచాడు.
EZE 40:21 ఈ ద్వారం దాని రెండు పక్కల ఉండే మూడేసి గదులు దాని ఆవరణ, మొదటి ద్వారం ప్రక్కనే ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు ఉంది.
EZE 40:22 దాని కిటికీలు, దాని మండపం, ఖర్జూరపు చెట్ల చెక్కడాలు, తూర్పు ద్వారపు కొలతల పనితనం పలెనే ఉన్నాయి. ద్వారం వరకు ఏడు మెట్లున్నాయి. ద్వార మండపం లోపలికి ఉంది.
EZE 40:23 లోపలి ఆవరణలో అడ్డంగా ఉత్తర ద్వారానికి ఎదురుగా ఒక ద్వారం ఉంది. అది తూర్పు ద్వారం వలెనే ఉంది. ఆ మనిషి ఈ [లోపలి ద్వారం] నుంచి ఆ [వెలుపలి ద్వారం] వరకు కొలవగా అది ద్వార ద్వారానికి నూరు మూరల వెడల్పు ఉంది.
EZE 40:24 పిమ్మట ఆ మనిషి నన్ను దక్షిణానికి తీసుకొని వెళ్లాడు. అక్కడ నేను దక్షిణ ద్వారం చూశాను. అతడు ద్వారపు కమ్మీలను, మండపాన్ని కొలిచాడు. ఈ కొలతలు ఇతర ద్వారాల కొలతల మాదిరిగానే ఉన్నాయి.
EZE 40:25 ద్వారానికి, మండపానికి చుట్టూ మిగతా వాటి మాదిరే కిటికీలున్నాయి. ద్వారం ఏభై మూరల పొడవు, ఇరవై ఐదు మూరల వెడల్పు ఉంది.
EZE 40:26 ద్వారం వరకు ఏడు మెట్లున్నాయి. దాని మండప ద్వారం లోపల చివర వరకూ ఉంది. ద్వారానికి అటూ ఇటూ ఖర్జూరపు చెట్ల చెక్కడపు పనితనం ఉంది.
EZE 40:27 లోపలి ఆవరణ యొక్క దక్షిణ దిశన ఒక గుమ్మం ఉంది. ఒక ద్వారానికి, మరొక ద్వారానికి మధ్య దూరాన్ని ఆ మనిషి కొలిచాడు. దాని వెడల్పు నూట డెభై ఐదు అడుగులు.
EZE 40:28 తరువాత నన్నతడు దక్షిణ ద్వారం గుండా లోపలి ఆవరణలోకి తీసుకొని వచ్చాడు. ఇతర గుమ్మాల మాదిరిగానే దక్షిణ ద్వారం కొలతలు కూడ ఉన్నాయి.
EZE 40:29 దక్షిణ ద్వారపు గదులు, దాని ద్వారపు కమ్మీలు, దాని మండపం కొలతలు కూడ ఇతర గుమ్మాల కొలతలవలెనే ఉన్నయి. ద్వారానికి, మండపానికి చుట్టూ కిటికీలున్నాయి. ద్వారం పొడవు ఏభై మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు ఉన్నాయి. లోపలి ఆవరణ చుట్టూ మండపాలున్నాయి.
EZE 40:30 మండపం పొడవు ఇరవై ఐదు మూరలు, వెడల్పు ఐదు మూరలు కలిగి ఉంది.
EZE 40:31 మరియు దాని మంపప ద్వారం వెలుపలి ఆవరణ తరువాత ఉంది. దాని [ద్వారానికి ఇరు పక్కలనున్న] గోడల మీద ఖర్జూరపు చెట్ల చెక్కడపు పనితనం ఉంది. దనిని ఎక్కటానికి ఎనిమిది మెట్లున్నాయి.
EZE 40:32 ఆ మనిషి నన్ను తూర్పు దిశన ఉన్న లోపలి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. అతడు గుమ్మాన్ని కొలిచాడు. అది ఇతర గుమ్మాల మాదిరే కొలతలు కలిగిఉంది.
EZE 40:33 తూర్పు ద్వారపు గదులు, పక్కగోడలు, మండపం ఇతర ద్వారాల మాదిరే కొలతలు కలిగి ఉన్నాయి. ద్వారానికి, మండపానికి చుట్టూ కిటికీలున్నాయి. ద్వారం పొడవు ఏభై మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు కలిగి ఉంది.
EZE 40:34 దాని మండపం ద్వారానికి చివర వెలుపలి ఆవరణ వైపుకు ఉంది. దాని ఇరు పక్కల ఉన్న గోడల మీద ఖర్జూరపు చెట్లు చెక్కబడి ఉన్నాయి. దానికి ఎనిమిది మెట్లున్నాయి.
EZE 40:35 పిమ్మట ఆ మనిషి నన్ను ఉత్తర ద్వారం వద్దకు తీసుకొని వచ్చాడు. అతడు దానిని కొలిచాడు. దీని కొలతలు కూడా ఇతర ద్వారాలవలె ఉన్నాయి.
EZE 40:36 ఇతర ద్వారాలు, గదుల, మండపాల కొలతల మేరకే అది కూడా ఉంది. ద్వారం మరియు మండపం చుట్టూ కిటికీలున్నాయి. అది యాభై మూరల పొడవు, ఇరవై ఐదు మూరలు వెడల్పు కలిగి ఉంది.
EZE 40:37 దాని మండపం ద్వారానికి చివర వెలుపలి ఆవరణ వైపున ఉంది. ఆ రెండు గొడల మీద ఖర్జూరవు చెట్లు చెక్కబడ్డాయి. దానికి ఎనిమిది మెట్లున్నాయి.
EZE 40:38 ద్వారం వద్ద తలుపువున్న ఒక గది మండపానికి చెరువగా ఉంది. యాజకులు దహన బలులు ఇవ్వటానికి బలి పశువులను కడి గే చోటు ఇదే.
EZE 40:39 ద్వార మండపంలో ప్రతి పక్క రెండు బల్లలున్నాయి. అపరాధ పరిహారార్థ బలులు ఇవ్వటానికి తగిన జంతువులను ఈ బల్లల మీదనే వధిస్తారు.
EZE 40:40 మరియు ద్వార మండ పానికి అవతలి పక్కన కూడా రెండు బల్లలున్నాయి.
EZE 40:41 గోడల లోపల నాలుగు బల్లలున్నాయి. గోడల బయట నాలుగు బల్లలున్నాయి. మొత్తం అక్కడ ఎనిమిది బల్లలున్నాయి. ఈ బల్లల మీదనే యాజకులు బలి పశువులను వధిస్తారు.
EZE 40:42 దహన బలుల నిమిత్తం నాలుగు చెక్కిన రాతి బల్లలు ఉన్నాయి. ఈ బల్లలు ఒక్కొక్కటి రెండడుగుల ఏడున్నర అంగుళాల పొడవు; రెండడుగుల ఏడున్నర అంగుళాల వెడల్పు; ఒక అడుగు తొమ్మిది అంగుళాల ఎత్తు కలిగి ఉన్నాయి. దహన బలులకు, ఇతర బలులకు వినియోగించే జంతు వులను చెంపటానికి తగిన పని ముట్లను యాజకులు ఈ బల్లల మీదనే ఉంచుతారు.
EZE 40:43 మూడంగుళాల మాంసపు కొక్కెములు ఆలయ మంతటా ఉంచ బడ్డాయి. అర్పణకు ప్రత్యేకించిన మాంసాన్ని బల్లల మీద ఉంచుతారు.
EZE 40:44 లోపలి ఆవరణలోకి వెళ్లే ద్వారం బయట రెండు గదులున్నాయి. ఒకటి ఉత్తర ద్వారం వద్ద ఉంది. అది దక్షిణానికి చూస్తూ ఉంది. రెండవ గది దక్షిణ ద్వారం వద్ద ఉంది. అది ఉత్తరానికి చూస్తూంది.
EZE 40:45 ఆ మనిషి నాతో ఇలా అన్నాడు: “దక్షిణానికి చూసే ఈ గది దేవాలయ సేవలో ఉంటూ పనిమీద ఉన్న యాజకులు ఉండటానికి ప్రత్యేకించబడింది.
EZE 40:46 కాని ఉత్తరానికి చూస్తూవున్న గదిని విధులకు వచ్చి బలిపీఠం వద్ద పనిచేసే యాజకులు ఉండటానికి ఇవ్వబడింది. ఈ యాజకులంతా సాదోకు సంతతివారు. లేవీయులలో సాదోకు సంతతివారు మాత్రమే యెహోవాకు బలులు తెచ్చి సేవచేయటానికి అర్హులు.”
EZE 40:47 ఆ మనుష్యుడు లోపలి ఆవరణను కొలవగా అది ఖచ్చితమైన సమ చదరంగా ఉంది. దాని పొడవు, వెడల్పులు ప్రతి ఒక్కటి నూట డెభై ఐదు అడుగులు ఉంది. బలిపీఠం ఆలయానికి ముందున్నది.
EZE 40:48 ఆ మనుష్యుడు నన్ను ఆలయ మండపానికి తీసుకొనివచ్చాడు. అతడు మండపం యొక్క రెండు పక్కలనున్న గోడలను కొలిచాడు. ప్రతి పక్క గోడలు ఐదు మూరల దళం, మూడు మూరల వెడల్పు కలిగి ఉన్నాయి. వాటి మధ్య పద్నాలుగు మూరల స్ధలం ఉంది.
EZE 40:49 మండపం పొడవు పన్నెండు మూరలు, వెడల్పు ఇరవై మూరలు, మండపంచేరటానికి పది మెట్లు ఉన్నాయి. గోడలకు పక్కగా అటు ఒకటి, ఇటు ఒకటి రెండు స్తంభాలున్నాయి.
EZE 41:1 ఆ మనిషి నన్ను మధ్య గదికి (పవిత్ర స్థలం) తీసుకొని వచ్చాడు. అతడు దానికి రెండు పక్కలనున్న గోడలను కొలిచాడు. అవి ప్రతి పక్క పది అడుగుల ఆరంగుళాల మందాన ఉన్నాయి.
EZE 41:2 తలుపు పది మూరల వెడల్పు ఉంది. ద్వారపు పక్క భాగాలు ప్రతి పక్కా ఐదు మూరలు ఉన్నాయి. ఆ మనిషి గదిని కొలిచాడు. అది నలభై మూరల పొడవు, ఇరవై మూరల వెడల్పు ఉంది.
EZE 41:3 పిమ్మట ఆ మనిషి లోపలి చివరి గదికి వెళ్లి ద్వారం పక్క గోడలను కొలిచాడు. ప్రతిగోడా రెండు మూరల మందం, ఏడు మూరల వెడల్పు ఉంది. తలుపు మధ్య ఆరు మూరల ప్రవేశ స్థలం ఉంది.
EZE 41:4 తరువాత ఆ మనిషి గది యొక్క పొడవు కొనిచాడు. అది మధ్య గదిలో ప్రవేశించే ఇరవై మూరల పొడవు, ఇరవై మూరల వెడల్పు కలిగి ఉంది. అతను నాతో, “ఇది అతి పవిత్ర స్థలం” అని చెప్పాడు.
EZE 41:5 పిమ్మట అతడు ఆలయపు గోడను కొలిచాడు. అది ఆరు మూరల మందం కలిగి ఉంది. పక్క గదులు ఆలయం చుట్టూ ఉన్నాయి. అవి నాలుగు మూరల వెడల్పు.
EZE 41:6 పక్క గదులు మూడు వివిధ అంతస్థులపై ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి అవి ఉన్నాయి. ప్రతి అంతస్థులోను ముప్పయి గదులున్నాయి. ఆలయపు గోడలు రాళ్ళ తిప్పలతో కట్టబడ్డాయి. పక్క గదులకు చుట్టూ గోడ ఆధారం ఉంది. కానీ కేవలం ఆలయం యొక్క గోడే గదులకు ఆధారం కాలేదు.
EZE 41:7 ఆలయం చుట్టూ ఉన్న గదుల ప్రతి అంతస్ధూ దానికింది భాగం కంటె వెడల్పుగా ఉంది. ఆలయం చుట్టూ ఉన్న గదుల గోడలు పైకి పోను పోనూ ఇరుకు కావడం వల్ల పై అంతస్థుల గదులు విశాలంగా ఉన్నాయి. కింది అంతస్థు నుండి పై అంతస్థు వరకు మధ్య అంతస్తుగుండా మెట్లదారి ఉంది.
EZE 41:8 ఆలయానికి చుట్టూ చదును చేసి బండలు పరచిన ఎత్తయిన పునాది ఉన్నట్లు నేను చూశాను. పక్క గదుల పునాదులు పది అడుగుల ఆరంగుళాల ఎత్తున ఉన్నాయి.
EZE 41:9 పక్క గదుల బయటి గోడ ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళాల మందం ఉంది. ఆలయం పక్క గదుల కు, యాజకుల గదులకు మధ్య మరియు
EZE 41:10 ఆలయం చుట్టూ ఖాళీ స్థలం ముప్పయి ఐదు అడుగులు.
EZE 41:11 పక్క గదుల వాకిళ్ళు ఎత్తయిన పునాది స్థలం వరకూ ఉన్నాయి. ఒక వాకిలి ఉత్తర దిశగా ఉంటే, మరొకటి దక్షిణ దిశగా ఉంది.
EZE 41:12 ఆలయానికి పడమట నియమిత స్థలంలో ఒక భవరం ఉంది. అది డెభ్బై మూరల వెడల్పు, తొంభై మూరల పొడవు కలిగి ఉంది. ఆ భవనపుగోడ ఆన్ని వైపులా ఐదు మూరల మందం ఉంది.
EZE 41:13 పిమ్మట ఆ మనుష్యుడు ఆలయాన్ని కొలిచాడు. ఆలయం నూరు మూరల పొడఉంది. భవనం, నియమిత స్థలం, దాని గోడలతో కలిసి పొడవు నూరు మూరలున్నాయి.
EZE 41:14 ఆలయం ముందు తూర్పు భాగపు నియమిత స్థలం నూరు మూరల పొడఉంది.
EZE 41:15 ఆలయపు చివరి నియమిత స్థలంలో ఉన్న భవనం పొడవును ఆ మనిషి కొలిచాడు. ఒక గోడకు మరొక గోడకు నూరు మూరలున్నవి. అతి పవిత్ర స్థలానికి, పవిత్ర స్థలానికి, మండపానికి ఎదురుగా ఉన్న ఆవరణ చుట్టూ మూడింటి గోడలకు నగిషీ పనులు చేసిన కొయ్యపలకలు అన్ని కిటికీలకు, తలుపులకు కొయ్యతో నగిషీలు చెయబడ్డాయి.
EZE 41:16 ఆలయపు గుమ్మం వద్ద కింది నుండి కిటికీల వరకు చుట్టూ బల్ల కూర్పువేయబడింది.
EZE 41:17 ఆలయపు లోపలి, బయటి గదుల గోడలలో నగిషీలు చేయబడ్డాయి. ఆలయం యొక్క లోపలి గది గోడల మీద, బయట గది గోడల మీద
EZE 41:18 కెరూబుల, ఖర్జూరపు చెట్లు చిత్రాలు చెక్కబడ్డాయి. కెరూబుల మధ్య ఒక ఖర్జూరపు చెట్లు చొప్పున ఉన్నాయి. ప్రతీ కెరూబులకు రెండు ముఖాలు ఉన్నాయి.
EZE 41:19 ఒకటి మానవ ముఖం ఆకారంలో ఉండి ఒక పక్క నున్న ఖర్జూరపు చెట్టు వైపు చూస్తూ ఉంటుంది. రెండవది సింహపు ముఖం. అది రెండవ పక్కనున్న ఖర్జూరపు చెట్టును చూస్తూ ఉంటుంది. అవి ఆలయం మీద అన్ని చోట్లా చెక్కబడ్డాయి.
EZE 41:20 నేలనుండి తలుపు మీది వరకూ గల పవిత్ర స్థలగోడల మీద కెరూబుల, ఖర్జూరపు చెట్ల చిత్రాలు చెక్కబడ్డాయి.
EZE 41:21 ఆలయపు పవిత్ర స్థలం పక్కనున్న గోడలు చదరంగా ఉన్నాయి. అతి పవిత్ర స్థలం ముందు
EZE 41:22 కొయ్యతో చేయబడిన బలిపీఠం వంటిది ఒకటుంది. అది మూడు మూరల ఎత్తు, రెండు మూరల పొడవు కలిగి ఉంది. దాని మూలలు, దాని అడుగు, దాని పక్కలు అన్నీ కొయ్యతోనే చేయ బడ్డాయి. “ఇది యోహోవా ఎదుట ఉండే బల్ల” అని ఆ మనుష్యుడు నాతో ఇలా చెప్పాడు.
EZE 41:23 పవిత్ర స్థలం మరియు అతి పవిత్ర స్థలం రెండింటికీ రెండు తలుపులున్నాయి.
EZE 41:24 తలుపులలో ప్రతి ఒక్కటి రెండు చిన్న తలుపులతో చేయబడింది. ప్రతి తలుపుకి నిజానికి రెండు మడత తలుపులున్నాయి.
EZE 41:25 పవిత్రమైన గది తలుపుల మీద కూడ కెరూబుల, ఖర్జూరపు చెట్ల చిత్రాలు చెక్కబడ్డాయి. అవి గోడల మీద చెక్కిన చిత్రాల మాదిరిగానే ఉన్నాయి. మండపానికి ముందు భాగం చెక్కలతో కప్పబడి ఉంది.
EZE 41:26 మండపం చుట్టూ దాని మేడ మీద గదులలో కొయ్యతో చేయబడ్డ చట్రపు కిటికీలు, మండపానికి ఇరు పక్కల ఖర్జూరపు చెట్లు ఉన్నాయి.
EZE 42:1 పిమ్మట ఆ మనిషి ఉత్తరపు గుమ్మంనుండి బయటి ఆవరణకు తీసుకొని వెళ్లాడు. ఉత్తర నియమిత స్థలంలో అనేక గదులతో కూడుకున్న భవనానికి నన్ను నడిపించాడు.
EZE 42:2 ఉత్తర దిశన ఉన్న భవనం పొడవు నూరు మూరలు; వెడల్పు ఏభైమూరలు ఉంది.
EZE 42:3 ఈ కట్టడాల గోడల మీద మూడంతస్థుల్లో వసారాలు ఉన్నాయి. భవనానికి, ఆలయానికి మధ్య లోపలి ఆవరణ ఇరవై మూరలుంది. దాని పక్కన గదులు బయట ఆవరణ యొక్క చుదునుబాటను చూస్తూ ఉంది.
EZE 42:4 ఆ గదుల ముందు ఒక చావడి ఉంది. దాని వెడల్పు పది మూరలు, పొడవు నూరు మూరలు (ఇది భవనానికి తూర్పుదిశగా ఉంది). వాటి తలుపులు ఉత్తరానికి ఉన్నాయి.
EZE 42:5 భవనం మూడంతస్థుల ఎత్తు ఉండడం వల్లనూ, వాటి బయటి ఆవరణకు స్థంభాలు లేకపొవడంవల్ల పై అంతస్థుల్లో ఉన్న గదులు, మధ్యన మరియు కింది గదులకన్నా చాలా వెనుకనున్నాయి.
EZE 42:6 పై అంతస్థులో వసారాలు ఎక్కువ స్థలం తీసుకోవటంతో పై అంతస్థులు మధ్య అంతస్థుకన్నా ఇరుకుగా ఉంది. మధ్య అంతస్థు కింది అంతస్థుకన్నా ఇరుకుగా ఉంది.
EZE 42:7 బయట ఒక గోడ ఉంది. అది గదులకు సమాంతరంగా ఉంది. అది గదులకు ముందు ఏభై మూరల వరకు వెళ్తుంది.
EZE 42:8 ఆ భవనం మొత్త ఆలయం పైపుగా నూరు మూరల పొడవు వున్నా, బయట ఆవరణలో అది ఏభై మూరల పొడవు ఉంది.
EZE 42:9 ఈ గదుల ద్వారం భవనపు తూర్పు దిక్కుకు దిగువన ఉంది. కానీ ప్రజలు బయటి ఆవరణ నుండి ప్రవేశించవచ్చు.
EZE 42:10 ఆవరణ పక్కనున్న గోడ మొదట్లో ఉంది. ఈ గదుల ముందు దక్షిణ దిక్కున నియమిత స్థలంలో గదులు ఉన్నాయి.
EZE 42:11 ఒక చావడి కూడా ఉంది. అవి ఉత్తర దిశన వున్న గదులమాదిరే ఉన్నాయి. దక్షిణవైపు తలుపుల పొడవు వెడల్పులు ఉత్తర దిక్కున వున్నవాటి లెక్కనే ఉన్నాయి. ఉత్తర దిశ తలుపులకు వున్న కొలతలు, గుమ్మాల మాదిరే దక్షిణ తలుపులకు కూడ ఉన్నాయి.
EZE 42:12 కింది గదులకు ప్రవేశం భవనం తూర్పు దిక్కు చివరన ఉంది కాబట్టి ప్రజలు గోడ బయటి మార్గం గుండా ప్రవేశించవచ్చు.
EZE 42:13 ఆ మనిషి నాతో ఇలా అన్నాడు: “నియమిత స్థలానికి అడ్డంగా ఉన్న ఉత్తర గదులు, దక్షిణ గదులు పవిత్రమైనవి. యెహోవాకు బలులు సమర్పించే యాజకులకు ఈ గదులు కేటాయించబడ్డాయి. ఆ యాజకులు అతి పవిత్ర అర్పణలను ఈ గదులలోనే తింటారు. అతి పవిత్ర అర్పణలను వారక్కడ ఉంచుతారు. ఎందుకంటే, ఈ స్థలం పవిత్రమైనది. అతి పవిత్ర అర్పణలు ఏమంటే: ధాన్యపు నైవేద్యాలు, తప్పులను పరిహరించు బలులు మరియు అపరాధ పరిహారార్థ బలులు.
EZE 42:14 యాజకులు పవిత్ర ప్రదేశంలో ప్రవేశిస్తారు. కాని వారు బయటి ఆవరణలోకి వెళ్లే ముందు, వారు సేవ చేసేటప్పుడు ధరించే బట్టలను పవిత్ర స్థలంలో వదిలి వేస్తారు. అవి అతి పవిత్రమైన బట్టలు గనుక వారలా చేస్తారు. ఒక యాజకుడు ఆలయంలో సామాన్య ప్రజలు వుండే చోటికి వెళ్లదలచినప్పుడు అతడు వేరే బట్టలు ధరించి వెళ్లవలసి ఉంటుంది.”
EZE 42:15 ఆలయపు లోపలి భాగాన్ని ఆ మనిషి కొలవటం పూర్తి చేసిన పిమ్మట, తూర్పు ద్వారం గుండా అతడు నన్ను బయటకు తీసుకొని వచ్చాడు. గుడి బయటి భాగాన్నంతా అతడు కొలిచాడు.
EZE 42:16 ఆ మనుష్యుడు కొలకర్రతో తూర్పు భాగాన్నంతా కొలిచాడు. అది ఐదువందల మూరల పొడఉంది.
EZE 42:17 అతడు ఉత్తర భాగాన్ని కొలవగా అది ఐదువందల మూరల పొడఉంది.
EZE 42:18 అతడు దక్షిణ భాగాన్ని కొలవగా అది ఐదువందల మూరల పొడఉంది.
EZE 42:19 అతడు తిరిగి వెళ్లి పశ్చిమ దిశను కొలవగా అది ఐదువందల మూరల పొడఉంది.
EZE 42:20 ఆ విధంగా అతడు ఆలయం చుట్టూ యొక్క నాలుగు పక్కల కొలిచాడు. ఆలయం చుట్టూ గోడ కట్టబడింది. ఆ గోడ పొడవు అది ఐదువందల మూరల, వెడల్పు అది ఐదువందల మూరలు ఉంది. అది మామూలు ప్రదేశాన్ని, పవిత్ర స్థలం నుండి వేరుచేసింది.
EZE 43:1 ఆ మనుష్యుడు నన్న తూర్పు ద్వారం వద్దకు నడిపించాడు.
EZE 43:2 అక్కడ ఇశ్రాయేలు దేవుని కీర్తి తూర్పు నుండి వచ్చింది. దేవుని కంఠస్వరం సముద్ర ఘోషలా గంభీరంగా ఉంది. దేవుని మహిమవల్ల భూమి ప్రకాశమానమయ్యింది.
EZE 43:3 నేను చూచిన ఆ దర్శనం గతంలో నేను కెబారు కాలువవద్ద చూచిన దర్శనంవలెనే ఉంది. నేను సాష్టాంగ నమస్కారం చేశాను.
EZE 43:4 తూర్పు ద్వారం గుండా దేవుని మహిమ ఆలయంలోకి వచ్చింది.
EZE 43:5 అప్పుడు ఆత్మ నన్ను పట్టుకొని లోపలి ఆవరణలోనికి తీసుకొని వచ్చింది. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది.
EZE 43:6 ఆలయం లోపలి నుండి ఎవరో నాతో మాట్లాడుతున్నట్లు నేను విన్నాను. నా పక్కన ఒక మనుష్యుడు నిలబడివున్నాడు.
EZE 43:7 ఆలయంలో నుండి వచ్చిన కంఠస్వరం నాతో ఇలా అన్నది: “నరపుత్రుడా, ఇది నా సింహాసనం, పాదపీఠం నెలకొని వున్న చోటు. ఇశ్రాయేలు ప్రజలు మధ్య ఈ ప్రదేశంలో నేను శాశ్వతంగా నివసిస్తాను. ఇశ్రాయేలు వంశం మరెన్నడూ నా పవిత్ర నామాన్ని పాడు చేయదు. వ్యభిచార పాపాల చేత, ఈ ప్రదేశంలో రాజుల శవాలను పాతిపెట్టిన దోషాలచేత రాజులు, వారి ప్రజలు నా పేరును అవమాన పర్చరు.
EZE 43:8 వారి గడప నా గడప పక్కన; వారి ద్వారం నా ద్వారం పక్కన నెలకొల్పి వారు నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేయరు. గతంలో కేవలం ఒక్క గోడ మాత్రమే నాకు, వారికి అడ్డంగా ఉండేది. అందుచే వారు పాపం చేసిన ప్రతిసారి, భయంకర కార్యాలు చేసినప్పుడల్లా వారు నా పేరును అవమానపర్చారు అందుచేత నాకు కోపం వచ్చి నేను వారిని నాశనం చేశాను.
EZE 43:9 ఇప్పుడు వారు వ్యభిచార పాపాలకు దూరం కావాలి. వారి రాజుల కళే బరాలను నాకు దూరంగా తీసుకొనిపోవాలి. అప్పుడు నేను వారి మధ్య శాశ్వతంగా నివసిస్తాను.
EZE 43:10 “నరపుత్రుడా, ఇప్పుడు ఇశ్రాయేలు వంశానికి ఈ ఆలయాన్ని గురించి చెప్పు. అప్పుడు వారు తమ పాపాల పట్ల సిగ్గుపడతారు. వారు ఆలయానికి సంబంధించిన నమూనాలు నేర్చుకొంటారు.
EZE 43:11 పైగా వారు తాము చేసిన చెడ్డ పనులన్నిటినీ తలపోసి సిగ్గుపడతారు. ఆలయ నమూనాను వారు తెలుసుకోవాలి. అది ఎలా నిర్మింపబడిందో, ఎక్కడెక్కడ లోపలికి వచ్చే, బయటకు వెళ్లే ద్వారాలున్నాయో, ఇంకా దాని మీద వున్న చెక్కడపు పనులను గురించే వారిని తెలిసి కోనిమ్ము. దానికి సంబంధించిన నియమ నిబంధనలన్నింటినీ వారికి నేర్పు. వారు చూడగలిగే విధంగా నీవు ఈ విషయాలన్నీ వ్రాసి పెట్టు. అప్పుడు ఆలయానికి సంబంధించిన నియమ నిబంధనలు వారు తప్పక పాటిస్తారు. అప్పుడు వారు వీటన్నిటినీ చేయగులు గుతారు.
EZE 43:12 ఆలయ ధర్మం ఇది, పర్వతం మీది శిఖరాగ్ర ప్రదేశమంతా అతి పవిత్ర స్థలం. ఇది ఆలయ ధర్మం.
EZE 43:13 “పెద్ద కొలకర్రతో కొలవగా బలిపీఠం యొక్క కొలతలు ఇలా ఉన్నాయి, బలిపీఠం కింది అరుగు చుట్టూ మురికి నీరు పోయే దారి ఉంది. దాని లోతు ఒక మూర ఉంది. దాని ప్రతి పక్కా ఒక మూర వెడల్పు ఉంది. దానిమీద అంచు చుట్టూ ఉన్న కట్టు జానెడు ఉంది. బలిపీఠం ఎత్తు
EZE 43:14 భూమి నుండి కింది అంచు వరకు అస్థిభారం రెండు మూరలు. అది ఒక మూర వెడల్పు. చిన్న అంచునుండి పై అంచు వరకు నాలుగు మూరలుంది. అది రెండు మూరల వెడల్పు ఉంది. అది చిన్న చూరు నుండి పెద్ద చూరు వరకు ఏడడుగులు ఉంది. అది మూడడుగుల ఆరంగుళాల వెడల్పు ఉంది.
EZE 43:15 బలిపీఠం మీద అగ్నిస్థానం (హోమగుండం) నాలుగు మూరల ఎత్తు ఉంది. నాలుగు మూరలు నాలుగు కొమ్ముల్లా మలచబడి ఉన్నాయి.
EZE 43:16 బలిపీఠం మీది అగ్ని గుండం పొడవు పన్నెండు మూరలు, వెడల్పు పన్నెండు మూరలు అది ఖచ్చితమైన నలుమూలల చదరంగా ఉంది.
EZE 43:17 అంచు కూడ పొడవు వెడల్పులు పన్నెండు మూరలు చొప్పున చదరంగా ఉంది. దాని చుట్టూ వున్న అంచు అరమూర ఉంది. అడుగు దిమ్మ చుట్టూ నీరు పోయే మార్గపు వెడల్పు రెండు మూరలు ఉంది. బలిపీఠం మీదికి మెట్లు తూర్పు దిక్కున ఉన్నాయి.”
EZE 43:18 అప్పుడు ఆ వ్యక్తి నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: ‘ఈ బలిపీఠం కట్టబడిన రోజున ఈ బలులు, దాని మీద రక్తం చల్లడం అనే నియమాలు పాటించు.
EZE 43:19 సాదోకు వంశపు యాజకులకు పాప పరిహారార్థ బలి నిమిత్తం ఒక కోడె దూడను ఇవ్వాలి. వీరు లేవీ తెగకు చెందిన యాజకులు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు,
EZE 43:20 “వారు నాకు బలులు తెచ్చి, నాకు సేవ చేస్తారు. మీరు కోడెదూడ రక్తాన్ని కొంత తీసుకొని బలిపీఠపు నాలుగు కొమ్ముల మీద, దాని చూరు నాలుగు మూలల మీద, మరియు దాని అంచు చుట్టూ వుంచాలి. తద్వారా మీరు బలిపీఠాన్ని పవిత్ర పర్చుతారు.
EZE 43:21 పాప పరిహారార్థ బలికొరకు మీరు కోడెదూడను తేవాలి. ఆలయంలోని భవనం బయట ఒక ప్రత్యేక స్థలంలో కోడెదూడ దహనపర్చ బడుతుంది.
EZE 43:22 “రెండవ రోజున దోషరహితమైన ఒక మేక పోతును బలి ఇవ్వాలి. ఇది పాపపరిహారార్థమైన బలి. కోడెదూడను బలి ఇచ్చిన సందర్భంగా బలిపీఠాన్ని పరిశుద్ధపర్చినట్లే యాజకులు ఇప్పుడు కూడా చేస్తారు.
EZE 43:23 మీరు బలిపీఠాన్ని శుద్ధి పర్చిన పిమ్మట దోష రహితమైన ఒక కోడెదూడను, మందలో ఏ దోషం లేని ఒక పొట్టేలును బలికి తెస్తారు.
EZE 43:24 మీరు వాటిని యెహోవా ముందు బలి ఇస్తారు. యాజకులు వాటి మీద ఉప్పు జల్లుతారు. పిమ్మట యాజకులు గిత్తను, పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పిస్తారు.
EZE 43:25 ఏడు రోజులపాటు ప్రతిరోజూ మీరు ఒక మేకను పాపపరిహారార్థ బలికి సిద్ధం చేస్తారు. అలాగే మీరు ఒక కోడెదూడను, మందలో నుండి ఒక పొట్టేలును సిద్ధం చేస్తారు. కోడెదూడ, పొట్టేలు ఏ దోషమూ లేనివై యుండాలి.
EZE 43:26 ఏడు రోజుల పాటు యాజకులు బలిపీఠాన్ని శుద్ధిపర్చుతారు. తరువాత వారు దానిని యెహోవాకు అంకితం చేస్తారు.
EZE 43:27 ఏడు రోజులు అయిన తరువాత ఎనిమిదవ రోజు నుండి యాజకులు మీ దహనబలులను, సహవాస బలులను బలిపీఠం మీద ఇవ్వాలి. అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను.” నా ప్రభువైన యెహోవా ఇది చెప్పాడు.
EZE 44:1 పిమ్మట ఆ మనుష్యుడు నన్ను ఆలయానికి తూర్పున ఉన్న వెలుపలి ద్వారం వద్దకి తిరిగి తీసుకొని వచ్చాడు. వెలుపలి ద్వారం మూసి ఉంది.
EZE 44:2 యెహోవా నాతో ఇలా చెప్పాడు: “ఈ ద్వారం మూయబడి ఉంటుంది. ఇది తెరవబడదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దీనిద్వారా ప్రవేశించాడు గనుక మరెవ్వరూ ఈ ద్వారంగుండా ప్రవేశం చేయరు. అందువల్ల ఇది మూయబడి ఉండాలి.
EZE 44:3 యెహోవాతో సమాధాన బలి అర్పణ తినేటప్పుడు ప్రజాపాలకుడు ఈ ద్వారం వద్ద కూర్చుంటాడు. ద్వారం వద్ద గల మండప మార్గం ద్వారా అతడు వచ్చి వెళతాడు.”
EZE 44:4 తరువాత ఆ మనుష్యుడు ఉత్తర ద్వారం ద్వారా నన్ను ఆలయం ముందుకు తీసుకొని వచ్చాడు. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేస్తున్నట్లు నేను చూశాను. నేను సాష్టాంగపడి నమస్కరించాను.
EZE 44:5 యెహోవా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, జాగ్రత్తగా చూడు! నీ కండ్లను, చెవులను ఉపయోగించు. ఈ వస్తువులను చూడు. నేను యెహోవా ఆలయం యొక్క నియమ నిబంధనలను గురించి చెప్పే ప్రతి విషయాన్ని నీవు శ్రద్ధగా విను. ఆలయ ప్రవేశద్వారాల వైపు, ఆలయం నుండి బయటికి పోయే ద్వారములన్నిటి వైపూ పరిశీలనగా చూడు.
EZE 44:6 తరువాత నాపట్ల తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ వర్తమానాన్ని అందించు. వారికిలా చెప్పు: ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ఇశ్రాయేలు వంశీయులారా, మీరు నాపట్ల చేసిన భయంకరమైన పనులు కోకొల్లలు! ఇక చాలు.
EZE 44:7 నా ఆలయం లోకి మీరు అన్యదేశీయులను తీసుకొని వచ్చారు. వారు నిజంగా సున్నతి సంస్కారం లేనివారు. వారు తమను తాము పూర్తిగా నాకు సమర్పించుకోలేదు. ఈ రకంగా మీరు నా ఆలయాన్ని అపవిత్రం చేశారు. మన ఒడంబడికను మీరు భంగపర్చారు. మీరు చెడుకార్యాలు చేశారు. తరువాత మీరు నాకు రొట్టె, కొవ్వు, రక్తం సమర్పించారు. కాని ఇదంతా కేవలం నా ఆలయాన్ని అపవిత్రపర్చింది.
EZE 44:8 మీరు నా వవిత్ర వస్తువుల విషయంలో జాగ్రత్త తీసుకోలేదు. పైగా అన్యదేశీయులు నా పవిత్ర స్థలాన్ని గురించి బాధ్యత వహించేలా చేశారు!’”
EZE 44:9 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నిజంగా సున్నతి సంస్కారం పొందని నిదేశీయుడెవ్వడూ నా ఆలయంలోకి రాకూడదు. అట్టివాడు శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్న వాడైనా నా ఆలయ ప్రవేశానికి అర్హుడు కాడు. అతడు నా ఆలయ ప్రవేశం చేసే దానికి ముందు సున్నతి సంస్కారం పొంది తనను తాను నాకు పూర్తిగా సమర్పించుకోవాలి.
EZE 44:10 గతంలో ఇశ్రాయేలీయులు నాపై తిరుగుబాటు చేసినప్పుడు లేవీయులు నన్ను వదిలివేశారు. తమ విగ్రహాలను ఆరాధించటానికి ఇశ్రాయేలీయులు నన్ను వదిలిపెట్టారు. లేవీయులు చేసిన పాపానికి వారు శిక్షింప బడతారు.
EZE 44:11 నా పవిత్ర స్థలంలో సేవ చేయటానికి లేవీయులు ఎంపిక చేయబడ్డారు. ఆలయ ద్వారాలకు వారు కాపలా ఉన్నారు. వారు ఆలయంలో సేవ చేశారు. ప్రజల తరఫున బలులు దహన బలులు ఇవ్వటానికి వారు జంతువులను వధించారు. ప్రజలకు సహాయం చేయటానికి, వాళ్ళకు సేవ చేయటానికి వారు ఎంపిక చేయబడ్డారు.
EZE 44:12 కాని ప్రజలు నాపట్ల పాపం చేయటానికే లేవీయులు వారికి సహాయపడ్డారు! ప్రజల విగ్రహారాధనలో లేవీయులు వారికి సహాయపడ్డారు! కనుక నేను వారికి వ్యతిరేకంగా ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నాను, ‘వారు తమ పాపానికి శిక్షింపబడతారు.’” నా ప్రభువైన యెహోవా ఇది చెప్పాడు.
EZE 44:13 “కావున యాజకులవలె లేవీయులు నాకు అర్పణలు తీసుకొనిరారు. నా పవిత్ర వస్తువుల వద్దకు గాని, అతి పవిత్రమైనవిగా తలచబడేవాటి దరిదాపులకు గాని వారు రారు. వారు చేసిన నీచమైన పనులకు అవమానాన్ని వారు భరించాలి.
EZE 44:14 అయితే వారిని నా ఆలయం గురించి శ్రద్ధ తీసుకోనిస్తాను. వారు ఆలయంలో పనిచేస్తూ, అక్కడ తప్పక జరగవలసిన కార్యాలన్నీ నెరవేర్చుతారు.
EZE 44:15 “యాజకులందరూ లేవీ వంశపువారే. కాని ఇశ్రాయేలు ప్రజలు నాపై తిరుగుబాటు చేసినప్పుడు సాదోకు సంతతి యాజకులు మాత్రమే నా పవిత్ర స్థలాన్ని గురించి జాగ్రత్త తీసుకున్నారు. కావున సాదోకు సంతతి వరే నాకు అర్పణలు తెస్తారు. వారు బలి యిచ్చే జంతువుల కొవ్వును, రక్తాన్ని నాకు అర్పించేందుకు వారు నా ముందు నిలబడతారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
EZE 44:16 “వారు నా పవిత్ర స్థలంలో ప్రవేశిస్తారు. నేను వారి కిచ్చిన వస్తువుల పట్ల జాగ్రత్త తీసుకుంటారు.
EZE 44:17 వారు లోపలి ఆవరణ ద్వారాలలో ప్రవేశించినప్పుడు వారు నారబట్టలు ధరిస్తారు. లోపలి ఆవరణ గుమ్మాల వద్ద, ఆలయంలోను సేవ చేసేటప్పుడు వారు ఉన్ని బట్టలు ధరించరు.
EZE 44:18 వారు నార పాగాలను తమ తలలపై ధరిస్తారు. నడుముకు చుట్టుకొనేటందుకు కూడ వారు నారబట్టలే వుపయోగిస్తారు. వారికి చెమట పుట్టించే బట్టలేవీ వారు ధరించరు.
EZE 44:19 బయటి ఆవరణలో ప్రజల వద్దకు వారు వెళ్లేముందు, నాకు సేవ చేసేటప్పుడు ధరించే వస్త్రాలను వారు విడుస్తారు. వారు వేరే బట్టలు వేసుకొంటారు. ఈ విధంగా వారు పవిత్ర వస్త్రాలను ప్రజలు ముట్టకుండ చూస్తారు.
EZE 44:20 “ఈ యాజకులు తమ తలలు గొరిగించరు. కాని జుట్టు బారుగా పెరగకుండా మాత్రం జాగ్రత్త పడతారు. (తలలు గొరిగించడం విచారానికి దుఃఖానికి సూచన. యాజకులు కేవలం యెహోవా సేవలోనే ఆనందిస్తారు.) యాజకులు తమ తల వెంట్రుకలను తగు మాత్రమే కత్తిరిస్తారు.
EZE 44:21 లోపలి ఆవరణలోనికి వెళ్లేటప్పుడు యాజకులెవ్వరూ ద్రాక్షారసం తాగరాదు.
EZE 44:22 యాజకులు విధవరాండ్రను, విడాకులిచ్చిన స్త్రీలను వివాహమాడరాదు. వారు కేవలం ఇశ్రాయేలు వంశంలో నుండి కన్యలను మాత్రమే వివాహమాడాలి. లేదా చనిపోయిన భర్త యాజకుడైతే, ఆ విధవస్త్రీని వారు పెండ్లి చేసుకోవచ్చు.
EZE 44:23 “పవిత్ర వస్తువులకు, పవిత్ర వస్తువులు కాని వాటికి మధ్య వ్యత్యాసాన్ని గురించి కూడా నా ప్రజలకు యాజకులు తెలియజేస్తారు. శుభ్రమైన పదార్థాలు ఏవో, అపరిశుభ్రమైనవి ఏవో నా ప్రజలు తెలుసుకొనేటందుకు వారు సహాయపడతారు.
EZE 44:24 న్యాయస్థానంలో యాజకులు న్యాయాధీశులుగా వ్యవహరిస్తారు. ప్రజలకు తీర్పు తీర్చేటప్పుడు వారు నా కట్టడలను అనుసరిస్తారు. నా ప్రత్యేక విందుల (సమావేశాల) సమయంలో వారు నా నియమ నిబంధనలను పాటిస్తారు. వారు నేను ఏర్పాటు చేసిన ప్రత్యేక విశ్రాంతి రోజులను గౌరవించి, వాటిని పవిత్రంగా ఉంచుతారు.
EZE 44:25 వారు శవాలను తాకి వారిని వారు అపవిత్ర పర్చుకోరు. కాని ఆ చనిపోయిన వ్యక్తి గనుక తండ్రి గాని, తల్లి గాని, కుమారుడు, కుమార్తె, సోదరుడు గాని లేక వివాహితకాని సోదరిగాని అయితే వారు శవాలను ముట్టి తమను తాము అపవిత్రం చేసుకొంటారు.
EZE 44:26 ఇది యాజకుని అపరిశుద్ధుణ్ణి చేస్తుంది. యాజకుడు పరిశుద్ధుడయిన తరువాత అతడు ఏడు రోజులు ఆగాలి.
EZE 44:27 అప్పుడతడు తిరిగి పవిత్ర స్థలానికి వెళ్లవచ్చు. పవిత్ర స్థలంలో సేవ నిమిత్తం అతడు లోపలి ఆవరణలోకి వెళ్లే రోజున తన నిమిత్తం ఒక పాప పరిహారపు బలిని ఇచ్చుకోవాలి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 44:28 “లేవీయులకు సంబంధించిన భూమిని విషయమేదంటే, వారి ఆస్తిని నేనే. ఇశ్రాయేలులో లేవీయులకు మీరేమీ ఆస్తిని (భూమిని) ఇవ్వవద్దు. ఇశ్రాయేలులో నేనే వారి భాగం.
EZE 44:29 ధాన్యార్పణలు, పాప పరిహారార్థ బలిమాంసం, అపరాధ పరిహారార్థ బలి సమర్పణ వారికి ఆహారంగా ఇవ్వబడతాయి. ఇశ్రాయేలులో ప్రజలు యెహోవాకు సమర్పించేదంతా వారికి చెందుతుంది.
EZE 44:30 కోత కాలంలో ప్రతి పంటలోను మొదటి భాగం యెజకులకు కేటాయించాలి. కలిపిన రొట్టెల పిండి ముద్దలో మొదటి భాగం యాజకులకు ఇవ్వాలి. ఇది మీ కుటుంబాలకు మంచి ఆశీస్సులనిస్తుంది.
EZE 44:31 సహజంగా చనిపోయిన పక్షినిగాని, జంతువునుగాని, లేదా ఏదైనా అడవి జంతువుచే చీల్చబడిన దానినిగాని యాజకులు తినరాదు.
EZE 45:1 “మీరు చీట్లువేసి భూమిని ఇశ్రాయేలు వంశపు వారి మధ్య విభజించాలి. ఆ సమయంలో ఒక భూమి భాగాన్ని మీరు విడిగా ఉంచాలి. అది యెహోవా యొక్క పవిత్ర భాగం. ఆ భూమి పొడవు ఇరవైఐదువేల మూరలు వెడల్పు ఇరవై వేల మూరలు. ఈ భూమి అంతా పవిత్రమైనది.
EZE 45:2 రెండువేల ఐదు వందల మూరల చదరపు అడుగుల పొడవున్న చతుర స్రాకార స్థలాన్ని గుడికి కేటాయించ బడాలి. గుడి చుట్టూ ఐదువందల మూరలు గల ఖాళీస్థలం ఉండాలి.
EZE 45:3 పవిత్ర స్థలంలో ఇరవై ఐదువేల మూరలు పొడవు; పదివేల మూరల వెడల్పు గల స్థలాన్ని కొలవాలి. ఈ ప్రదేశంలోనే గుడి ఉండాలి. గుడి ప్రదేశం అతి పవిత్ర స్థలంగో ఉండాలి.
EZE 45:4 “ఆ భూమిలో పవిత్ర భాగం యాజకుల వినియోగార్థమై, ఆలయ సేవకుల నిమిత్తం వాళ్ళు ఎక్కడ యెహోవా దగ్గరకు సేవ చేయటానికి వస్తారో వాళ్ళ కోసం ఉంటుంది. యాజకుల ఇండ్ల నిమిత్తం, ఆలయానికి స్థానంగా అది వినియోగ పడుతుంది.
EZE 45:5 ఐదు లక్షల ఇరవై ఐదువేల మూరల పొడవు, పదివేల మూరల వెడల్పుతో మరొక భూభాగం ఆలయంలో సేవ చేసే లేవీయులకు ప్రత్యేకించబడుతుంది. ఈ భూభాగం లేవీయుల నివాస ప్రాంతంగా కూడా ఉపయోగపడుతుంది.
EZE 45:6 “మీరు నగరానికి ఐదువేల మూరల వెడల్పు, రెండులక్షల ఏభైవేల మూరల పొడవుగల భూ భాగాన్నిస్తారు. ఇది పవిత్ర స్థలం పొడవునా ఉంటుంది. ఇది ఇశ్రాయేలు వంశానికంతటికీ చెంది ఉంటుంది.
EZE 45:7 పాలనాధికారికి పవిత్ర స్థలానికి రెండు పక్కల ఉన్న భూమి, నగరానికి చెందిన భూమిగా ఉంటుంది. ఒక తెగకు (గోత్రం) చెందిన స్థలం ఎంత వెడల్పు ఉంటుందో దీని వెడల్పు కూడ అంతే ఉంటుంది. ఇది పడమటి సరిహద్దు నుండి తూర్పు సరిహద్దు వరకు వ్యాపించి ఉంటుంది.
EZE 45:8 స్ధలం ఇశ్రాయేలులో పాలనాధికారి యొక్క ఆస్తి. అందువల్ల ఈ అధిపతి నా ప్రజల జీవితాలను ఏ మాత్రం కష్టాలపాలు చేయనవసరం లేదు. కానివారు ఈ స్థలాన్ని ఇశ్రాయేలీయులకు వంశాలవారీగా ఇస్తారు.”
EZE 45:9 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “ఇశ్రాయేలు పాలకులారా, ఇక చాలు! ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తించటం, వారి సొమ్ము కొల్ల గొట్టటం మానండి! న్యాయవర్తనులై మంచి పనులు చేయండి! నా ప్రజలను వారి ఇండ్ల నుండి వెడల గొట్టటం మానండి!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 45:10 “మీరు ప్రజలను మోసగించటం మానండి. మీరు ఖచ్చితమైన తూనికలు, కొలతలు వినియోగించండి!
EZE 45:11 ‘ఏఫా’ (పందుములో పదవ పాలు) మరియు ‘బత్‌’(తూము) ఒకే పరిమాణంలో ఉండాలి. రెండూ ‘ఓమెరు’ లో పదవ వంతుకు సరిసమానంగా ఉండాలి. ఆ కొలతలు ‘ఓమెరు’ (పందుము) ను పరిమాణంగా చేసుకొని ఉండాలి.
EZE 45:12 ‘షెకెలు’ (తులం) ఇరవై ‘గెరా’లకు (చిన్నములు) సరి సమానంగా ఉండాలి. ఒక ‘మీనా’ అరవై షెకెలు (తులా)లకు సమానంగా ఉండాలి. అనగా అది ఇరవై తులాలు, ఇరవై ఐదు తులాలు, పదిహేను తులాల కలయికకు సమానం.
EZE 45:13 “మీరు ఇచ్చే ప్రత్యేక (ప్రతిష్టిత) అర్పణ ఈలాగన ఉండాలి. గోధుమలలో తూములో ఆరో భాగం, యవలగింజలలో తూముతో ఆరో భాగం వంతున అర్పించాలి.
EZE 45:14 తైన పదార్థాలు చెల్లించేటప్పుడు ప్రతి నూట ఎనభై పడుల ఒలీవ నూనెలో ముప్పాతిక పడుల వంతు నూనెను చెల్లించాలి. ఇది ఒక నిబంధన.
EZE 45:15 ఇశ్రాయేలులో నీటి వనరుగల ప్రాంతాలలో ఉన్న మందలలో ప్రతి రెండు వందల గొర్రెలకు ఒక మంచి గొర్రె చొప్పున అర్పించాలి. “ఆ ప్రత్యేక అర్పణలు ధాన్యార్పణల కొరకు, దహన బలులకు, సమాధాన (శాంతి) బలులకు ఇవ్వ బడతాయి. ఈ అర్పణలన్నీ ప్రజలను పరిశుద్ధులను చేయటానికి ఉద్దేశించబడ్డాయి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
EZE 45:16 “ఈ అర్పణ ప్రతి పౌరుడు ఇశ్రాయేలు పాలకునికి చెల్లిస్తాడు.
EZE 45:17 కావున పాలకుడు ప్రత్యేక పవిత్ర దినాలకు కావలసిన వస్తువులను తప్పక ఇవ్వాలి. విందు రోజులకు, అమావాస్యలకు, సబ్బాతు రోజులకు ఇశ్రాయేలు వంశం జంపే ప్రత్యేక విందుల సమయాలకు దహన బలులు. ధాన్యార్పణలు, సానార్పణలు పాలకుడైన వాడు సమకూర్చాలి. ఇశ్రాయేలు వంశాన్ని పవిత్రపర్చే కార్యక్రమంలో ఇచ్చే పాపపరిహార బలులు, ధాన్యపు నైవేద్యాలు, దహన బలులు, సమాధాన బలులు పాలకుడు ఇవ్వాలి.”
EZE 45:18 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మొదటి నెల మొదటి రోజున ఏ దోషమూ లేని ఒక కోడెదూడను తీసుకోవాలి. ఆలయాన్ని పరిశుద్ధం చేయటానికి మీరు ఆ కోడెదూడను ఉపయోగించాలి.
EZE 45:19 పాప పరిహారార్థమైన బలిరక్తాన్ని కొంత యాజకుడు తీసుకొని ఆలయ గుమ్మాల మీద, బలిపీఠం అంచు నాలుగు మూలల మీద మరియు లోపలి ఆవరణ గుమ్మం కమ్మెలమీద చల్లుతాడు.
EZE 45:20 ఇదే పని ఆ నెలలో ఏడవ రోజున ఎవరైనా పొర పాటునగాని, తెలియక గాని చేసిన పాప పరిహారం నిమిత్తం మీరు చేస్తారు. అలా మీరు ఆలయాన్ని పరిశుద్ధ పర్చాలి.
EZE 45:21 “మొదటి నెల పద్నాలుగవ రోజున మీరు పస్కా పండుగ జరుపుతోవాలి. పులియని రొట్టెల పండుగ ఇదే సమయంలో మొదలవుతుంది. ఆ పండుగ ఏడు రోజులపాటు జరుగుతుంది.
EZE 45:22 ఆ సమయంలో పాలకుడు తన కొరకునూ, ఇశ్రాయేలు ప్రజల కొరకునూ ఒక కోడెదూడను బలి ఇస్తాడు. అది పాపపరిహారార్థ బలి.
EZE 45:23 పండుగ జరిగే ఏడు రోజులు పాలకుడు ఏ దోషములేని ఏడు కోడెదూడలను, ఏడు పొట్టేళ్లను బలి ఇస్తాడు. అవి యెహోవాకు దహన బలులుగా సమర్పింపబడతాయి. పండుగ ఏడు రోజులూ రోజుకు ఒక కోడెదూడ చొప్పున పాలకుడు బలి ఇస్తాడు. ప్రతి రోజూ పాప పరిహారార్థమై అతడు ఒక మేకపోతును అర్పిస్తాడు.
EZE 45:24 ప్రతి కోడెదూడతో పాటు ఒక ఏఫా (సుమారు తొమ్మిది మానికెలు) యవలను ధాన్యపు నైవేద్యంగాను, ఒక ఏఫా యవలను ప్రతి పొట్టేలుతోను అధిపతి చెల్లిస్తాడు. ఇంకా పాలకుడు ప్రతి తొమ్మిది మానికెల ధాన్యంతో పాటు మూడు పడుల (ఒక గాలను) నూనెను సమర్పించాలి.
EZE 45:25 పాలకుడు [పర్ణశాలల] పండుగ జరిపే ఏడు రోజులలోనూ ఇదే విధంగా తప్పక చేయాలి. ఈ పండుగ ఏడవ నెలలో పదిహేనవ రోజున మొద లవుతుంది. ఇవన్నీ పాపపరిహారార్థ అర్పణలు, దహన బలులు, ధాన్యార్పణలు, నూనె అర్పణలుగా పరిగణింపబడుతాయి.”
EZE 46:1 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “లోపలి ఆవరణ తూర్పు ద్వారం ఆరు పని రోజులలోను మూసి ఉంచబడుతుంది. కాని అది సబ్బాతు రోజున, అమావాస్య రోజున తెరువబడుతుంది.
EZE 46:2 పాలకుడు ద్వారం మండపం గుండా లోనికి ప్రవేశించి, ద్వారం పక్కన నిలబడతాడు. తరువాత యాజకులు పాలకుని తరుపున దహనబలి, సమాధాన బలులు సమర్పిస్తారు. ద్వారం గడపవద్దనే పాలకుడు ఆరాధించాలి, మరియు నమస్కరించాలి. అతడు బయటికి వెళతాడు. కాని సాయంత్రం వరకు ద్వారం మూయబడదు.
EZE 46:3 సబ్బాతు రోజులలోను, అమావాస్యలందు సాధారణ ప్రజలు కూడ యెహోవా ముందు ద్వారం తెరవబడిన దగ్గర పూజలు చేస్తారు.
EZE 46:4 “సబ్బాతు దినాన పాలకుడు యెహోవాకు దహన బలులు అర్పిస్తాడు. ఏ దోషమూలేని ఆరు గొర్రెపిల్లలను, ఏ దొషమూలేని ఒక పొట్టేలును అతడు సమకూర్చాలి.
EZE 46:5 పొట్టేలుతో పాటు ఒక ఏఫా (తొమ్మిది మానికెలు) ధాన్యాన్ని కూడ అతడు తప్పక ఇవ్వలి. పాలకుడు ధాన్యార్పణకు గొర్రె పిల్లలతో పాటు తను ఇవ్వగలిగినంత ఇస్తాడు. ప్రతి తొమ్మిది మానికెల (ఏఫా) ధాన్యానికి మూడు పడుల (ఒక గాలను) ఒలీవ నూనెను అతడు తప్పక ఇవ్వాలి.
EZE 46:6 “అమావాస్యనాడు ఏ దోషమూలేని ఒక కోడెదూడను అతడు తప్పక అర్పించాలి. ఏ దోషమూలేని ఆరు గొర్రె పిల్లలను, ఒక పొట్టేలును అతడు అర్పిస్తాడు.
EZE 46:7 కోడెదూడతో పాటు ఒక తూమెడు ధాన్యార్పణను, పొట్టేలుతో పాటు పాలకుడు తప్పక అందించాలి. గొర్రె పిల్లతోపాటు పాలకుడు తన శక్తికొలది సమర్పణలు ఇవ్వవచ్చు. ప్రతి తూమెడు ధాన్యానికి మూడు పడుల (ఒక గాలను) నూనె చొప్పున సమర్పించాలి.
EZE 46:8 “పాలకుడు వచ్చి తూర్పు ద్వారంలో గల మండపం ద్వారా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాలి. బయటకు కూడా వెళ్లిపోవాలి.
EZE 46:9 “ప్రత్యేక పండుగల సందర్భంలో దేశ ప్రజలు యెహోవా దర్శనార్థం వచ్చినప్పుడు, వారు ఉత్తర ద్వారం గుండా ఆరాధనకు వచ్చి దక్షిణ ద్వారం గుండా నేరుగా బయటకు వెళ్లాలి. దక్షిణ ద్వారం గుండా ప్రవేశించిన వ్యక్తి ఉత్తర ద్వారం గుండా బయటకు వెళ్లాలి. ఏ వ్యక్తీ ప్రవేశించిన ద్వారం గుండా బయటకు వెళ్లరాదు. ప్రతి ఒక్కడూ తిన్నగా బయటకు సాగి పోవాలి.
EZE 46:10 ప్రజలు లోపల ప్రవేశించినప్పుడు, వారి తోపాటు పాలకుడు లోనికి వెళతాడు. వారితో బాటు పాలకుడు బయటకు వెళ్లాలి.
EZE 46:11 “విందులప్పుడు, ప్రత్యేక సమావేశాల సమయాలలోను ప్రతి కోడెదూడతోను తొమ్మిది మానికెల (ఒక ఏఫా) ధాన్యార్పణ తప్పక చేయాలి. ప్రతి పొట్టేలుతోను, తోమ్మిది మానికెల ధాన్యార్పణ చేయాలి. ప్రతి గొర్రె పిల్లతోను అతడు తన శక్తి కొలదీ ధాన్యాన్ని అర్పించాలి. ప్రతి తొమ్మిది మానికెల ధాన్యంతో పాటు మూడు పడుల (ఒక గాలను) నూనెను సమర్పించాలి.
EZE 46:12 “పాలకుడు తను స్వంతంగా దహనబలులు గాని, సమాధాన బలులుగాని తన ఇష్టపూర్వక అర్పణ (స్వేచ్చార్పణ) గాని యెహోవాకు ఇవ్వదలచినప్పుడు అతనికోసం తూర్పు ద్వారం తెరువబడుతుంది. అప్పుడు తను విశ్రాంతి రోజున అర్పించినట్లు తన దహనబలిని, సమాధానబలిని అర్పిస్తాడు. అతడు వెళ్లినాక తిరిగి ద్వారం మూయబడుతుంది.
EZE 46:13 “మరియు మీరు ఏ దోషమూలేని ఒక ఏడాది వయస్సుగల గొర్రె పిల్లను ఇవ్వాలి. అది యెహోవాకు ప్రతి రోజూ దహనబలిగా ఇవ్వ బడుతుంది. దానిని అనుదినం ఉదయం సమర్పించాలి.
EZE 46:14 ప్రతిరోజూ ఉదయం గొర్రె పిల్లతో పాటు ధాన్యార్పణ కూడ ఇవ్వాలి. ఇందు నిమిత్తం తూమెడు గోధుమ పిండిలో (ఏఫా) ఆరవ వంతు, ఆ సన్నపు పిండిని కలపటానికి ఒక పడి (గాలనులో మూడివ వంతు) నూనెను ఇవ్వాలి. ఇది యెహోవాకు అనుదిన ధాన్యార్పణ. ఇది శాశ్వతంగా పాటింపబడుతుంది.
EZE 46:15 ఆ విధంగా వారు గొర్రె పిల్లను, ధాన్యార్పణను, నూనెను ప్రతి ఉదయం ఎప్పటికీ దహన బలిగా ఇవ్వాలి.”
EZE 46:16 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “రాజ్యాధిపతి తన కుమారులలో ఎవరికైనా తన భూమిలో కొంత భాగం కానుకగా ఇస్తే అది అతని కుమారులకు చెందుతుంది. అది వారి ఆస్తి.
EZE 46:17 ఒకవేళ పాలకుడు తన భూమిలో కొంత భాగాన్ని ఒక బానిసకు బహుమారం ఇస్తే, అది వాడు స్వేచ్చపొందే సంవత్సరం వరకే వానికి చెందుతుంది. పిమ్మట ఆ బహుమానం రాజుకు తిరిగి వస్తుంది. కేవలం రాజు కుమారులు మాత్రమే అతను బహుమానం చేసిన భూమిని ఉంచుకుంటారు.
EZE 46:18 మరియు పాలకుడు ప్రజల భూమిని తన వశం చేసుకోడు. వారు భూమిని వదిలిపొమ్మని ఒత్తడి కూడ చేయడు. అతడు తన స్వంత భూమిలో కొంత భాగాన్ని మాత్రమే తన కుమారులకు ఇవ్వాలి. ఆ విధంగా నా ప్రజలు తమ భూమిని పోగొట్టుకునేలాగ రాజు బలవంత పెట్టబడరు.”
EZE 46:19 ఆ మనుష్యుడు నన్ను ద్వారం పక్కనున్న మార్గం గుండా నడిపించాడు. ఉత్తర దిశన ఉన్న యాజకుల పవిత్ర గదుల వద్దకు నన్ను నడిపించాడు. అక్కడ బాగా పడమటికి ఉన్న ఒక స్థలాన్ని చూశాను.
EZE 46:20 ఆ మనుష్యుడు నాతో ఇలా అన్నాడు: “ఇక్కడే యాజకులు దోష బలి సమర్పణను, పాపపరిహారార్థ బలి సమర్పణను పెడతారు. ఇక్కడే యాజకులు ధాన్యార్పణలను (రొట్టె) కాల్చుతారు. ఈ విధంగా చేయటం వలన వారీ అర్పణ పదార్థాలను బయటి ఆవరణలోనికి తెచ్చే అవసరముండదు. కావున వారీ పవిత్ర పదార్థాలను సామాన్య ప్రజలు ఉండే చోటుకి తీసుకొనిరారు.”
EZE 46:21 తరువాత ఆ మనుష్యుడు నన్ను బయటి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. అతడు నన్ను ఆవరణ నాలుగు మూలలకు నడిపించాడు. ఆవరణలో ప్రతి మూలా మరో చిన్న ఆవరణ ఉంది.
EZE 46:22 ఆవరణ యొక్క నాలుగు మూలలలోనూ చిన్న ఆవరణలు ఉన్నాయి. ప్రతి చిన్న ఆవరణ నలభై మూరలు పొడుగు ముప్పై మూరలు వెడల్పు కలిగివుండెను. నాలుగు మూలలూ ఒకే కొలతలో ఉన్నాయి.
EZE 46:23 లోపల నాలుగు చిన్న ఆవరణాల్లోనూ ప్రతి ఒక్కదాని చుట్టూ ఒక ఇటుక గోడ ఉంది. నాలుగు చిన్న ఆవరణల్లోను గోడలకు అటకలు నిర్మింపబడ్డాయి. ఇటుక గోడల్లో వంటకు పొయ్యిలు కట్టబడ్డాయి.
EZE 46:24 “ఆలయంలో సేవ చేసే వారు ఈ పాకశాలల్లోనే ప్రజల కొరకు బలి మాంసాన్ని ఉడక బెడతారు” అని ఆ మనుష్యుడు నాకు చెప్పాడు.
EZE 47:1 ఆ మనుష్యుడు నన్ను మళ్లీ ఆలయ ద్వారంవద్దకు నడిపించాడు. ఆలయ తూర్పు గుమ్మం కిందనుంచి నీరు బయటకు రావటం చూశాను. (ఆలయ ముఖద్వారం తూర్పునకే ఉంది) బలిపీఠానికి దక్షిణంగా ఉన్న ఆలయ దక్షిణపు భాగం చివరి నుండి నీరు ప్రవహిస్తూ ఉంది.
EZE 47:2 ఆ మనుష్యుడు నన్ను ఉత్తర ద్వారం గుండా బయటికి తీసుకొని వచ్చి ఆ తరువాత తూర్పున ఉన్న వెలుపలి ద్వారం బయట చుట్టూ తిప్పాడు. ఆలయ దక్షిణ భాగాంలో నీరు బయటికి వస్తూఉంది.
EZE 47:3 ఆ మనుష్యుడు ఒక కొలత బద్ద పట్టుకొని నూరు మూరలు కొలిచాడు. అక్కడ నీళ్లను దాటమని అతడు నాకు చెప్పాడు. నీళ్లు చీలమండలవరకు వచ్చాయి.
EZE 47:4 అతడు మరో ఐదు వందల ఎనభై ఆరు గజాల రెండడుగుల దూరం కొలిచాడు. మళ్లీ ఆ ప్రదేశంలో నీళ్లలో నడవమని అతడు నాకు చెప్పాడు. అక్కడ నీరు నా మోకాళ్ల వరకు వచ్చింది. మరో వెయ్యి మూరలు కొలిచాడు. అక్కడ నీళ్లలోనుండి నడవమని అతడు నాకు చెప్పాడు. అక్కడ నీరు నా మొలలోతు వచ్చింది.
EZE 47:5 ఆ మనిషి మరో వెయ్యి మూరలు కొలిచాడు. కాని అక్కడ నీరు దాటలేనంత లోతుగా ఉంది. అది ఒక నది అయింది. నీరు ఈదటానికి అనువైన లోతున ఉంది. అది దాట శక్యముగానంత లోతైన నది అయ్యింది.
EZE 47:6 “నరపుత్రుడా, నీవు చూచిన విషయాలను శ్రద్ధగా పరిశీలించావా?” అని ఆ మనుష్యుడు నన్నడిగాడు. పిమ్మట నది పక్కగా ఆ మనుష్యుడు నన్ను తిరిగి వెనుకకు తీసుకొని వచ్చాడు.
EZE 47:7 నేను నది పక్కగా తిరిగి వస్తూ వుండగా నీటికి రెండు పక్కలా రకరకాల చెట్లు చూశాను.
EZE 47:8 ఆ మనుష్యుడు నాతో ఇలా అన్నాడు: “ఈ నీరు తూర్పుగా అరబా లోయలోకి ప్రవహిస్తూ ఉంది. ఈ నీరు మృత సముద్రంలోకి ప్రవహించటంతో, దానిలోని నీరు మంచినీరై శుభ్ర పడుతూ ఉంది.
EZE 47:9 ఈ నీటిలో చేపలు విస్తారంగా వుంటాయి. ఈ నది ప్రవహించే ప్రాంతంలో అన్ని రకాల జంతువులు నివసిస్తాయి.
EZE 47:10 ఏన్గెదీ పట్టణం నుండి ఏనెగ్లాయీము పట్టణం వరకు బెస్తవాళ్లు నది ఒడ్డున నిలబడి ఉండటం నీవు చూడగలవు. వారు తమ వలలు విసరి రకరకాల చేపలు పట్టటం నీవు చూడవచ్చు. మధ్యధరా సముద్రంలో ఎన్ని రకాల చేపలు వుంటాయో మృత సముద్రంలో అన్ని రకాల చేపలు ఉంటాయి.
EZE 47:11 కాని అక్కడి పర్రలు, మరియు కొద్దిగానున్న తడి ప్రదేశాలు మంచి భూమిగా మారవు. అవి ఉప్పు తయారు చేయటానికి వదిలివేయబడతాయి.
EZE 47:12 అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు నదికి ఇరు పక్కల పెరుగుతాయి. వాటి ఆకులు ఎన్నడూ ఎండవు. ఆ చెట్లులో పండ్లు ఇవ్వకుండా ఎప్పుడూ ఉండవు. ప్రతినెలా అవి పండ్లు ఇస్తూనే ఉంటాయి. చెట్లకు కావలసిన నీరు ఆలయం నుండి వస్తూ ఉంటుంది గనుక ఇలా జరుగుతుంది. చెట్ల నుండి లభించే పండ్లు ఆహార నిమిత్తమూ, ఆకులు ఔషదాలకూ వినియోగపడతాయి.”
EZE 47:13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇశ్రాయేలులోని పన్నెండు వంశ తెగలకు దేశాన్ని పంచే సరిహద్దులు ఇవి: యోసేపుకు రెండు భాగాలు.
EZE 47:14 మీరు దేశాన్ని సమానంగా పంచుకోవాలి. ఈ దేశాన్ని ఇస్తానని మీ పూర్వీకులకు నేను ప్రమాణం చేశాను. కావున ఇది మీకు నేను ఇస్తున్నాను.
EZE 47:15 “దేశ సరిహద్దులు ఇవి: ఉత్తరాన మధ్యధరా సముద్రం నుండి మొదలై హెత్లోను మార్గం ద్వారాహమాతు మార్గం వద్ద మలుపు తిరిగి తరువాత జెదాదుకు
EZE 47:16 బేరోతాయునకు, హాజేరు హమాతుకు పొలి మేరన గల సిబ్రయీము మరియు హవ్రానుకు పొలి మేరనగల దమస్కస్ హత్తికోను వరకు.
EZE 47:17 అలా సముద్రం నుండి హసరేనాను వెళ్లి ఉత్తర పొలిమేరలోని దమస్కు మరియు హమాతు వరకూ వ్యాపించింది. ఇది ఉత్తర సరిహద్దు.
EZE 47:18 “తూర్పు సరిహద్దు హసరేనాను నుండి మొదలై హవ్రాను, దమస్కుల మధ్యగా యొర్దాను నది పక్కగా గిలాదు, ఇశ్రాయేలు భూభాగాల మధ్యగా తూర్పు సముద్ర తీరం వెంబడి తామారు వరకు వ్యాపించింది. ఇది తూర్పు సరిహద్దు.
EZE 47:19 “దక్షిణ సరిహద్దు తామారు నుండి మెరీబా కాదేషు ఊటల వరకు ఉంది. అది అక్కడ నుండి ఈజిప్టు వాగు పక్కగా మధ్యధరా సముద్రం వరకు వ్యాపించింది. ఇది దక్షిణ సరిహద్దు.
EZE 47:20 “పశ్చిమాన లేబో-హమాతు వరకు మధ్యధరా సముద్ర తీరమంతా సరిహద్దుగా ఉంటుంది. ఇది మీ పడమటి సరిహద్దు.
EZE 47:21 “మీరీ దేశాన్ని ఇశ్రాయేలు తెగలకు విభజించాలి.
EZE 47:22 దీనిని నీరు ఆస్తిలా మీ మధ్య, మీ మధ్య నివసించే పరదేశీయులకు, మీలో ఉంటూ పిల్లలు కన్న వారికి మధ్య పంచియివ్వాలి. ఈ పరదేశీయులు దేశపౌరులే. వారు సహజంగా ఇక్కడ పుట్టి పెరిగిన ఇశ్రాయేలీయుల మాదిరే ఉంటారు. ఇశ్రాయేలు తెగలకు చెందిన భూమినుండి మీరు వారకి కొంత భూమిని విభజిస్తారు.
EZE 47:23 ఆ పౌరుడు ఏ తెగలో నివసిస్తూవుంటాడో అది అతనికి కొంత భూమిని ఇవ్వాలి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
EZE 48:1 “ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం నుండి తూర్పుకు సాగి హెత్లోనుకు, హమాతు కనుమ వరకు వెళ్లి, అక్కడ నుండి హసరేనాను వరకు ఉంది. ఇది దమస్కు (డెమాస్కస్)కు, హమాతుకు సరిహద్దు మీద ఉంది. ఆయా వంశాలకు లభించే భూమి తూర్పునుండి పడమటివరకు వెళుతుంది. ఉత్తరాన్నుండి దక్షిణానికి ఈ ప్రదేశంలో గల తెగలు (గోత్రాలు) ఏవనగా: దాను, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, ఏఫ్రాయిము, రూబేను మరియు యూదా.
EZE 48:8 “మిగిలిన భూభాగం ప్రత్యేక వినియోగాలకు కేటాయించ బడింది. మిగిలిన భాగం యూదా యొక్క భాగానికి దక్షిణాన ఉంది. ఈ ప్రదేశం ఉత్తరాన ఇరవై ఐదువేల మూరల పొడఉంది. మరియు పడమట పది వేల మూరల వెడల్పు, తూర్పున పదివెల మూరల వెడల్పు, దక్షిణాన ఇరవై ఐదువేల మూరల వెడల్పు ఉంటుంది. ఆలయం ఈ విభాగం మధ్యలోవుంటుంది.
EZE 48:9 ఈ భూమిని మీరు దేవునికి అంకితం చేస్తారు. దాని పొడవు ఎనిమిది మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాలు; దాని వెడల్పు ఆరు మైళ్ల పదివందల ఏబది ఆరు గజాలు.
EZE 48:10 ఈ ప్రత్యేక భూ విభాగం యాజకులు, లేవీయుల మధ్య పంచబడుతుంది. “ఈ ప్రదేశంలో యాజకులకు ఒక వంతు వస్తుంది. ఈ భూమి ఉత్తర దిశన ఎనిమిది మైళ్ల ఐదు వందల ఇరవై ఎనిమిది గజాల పొడవు ఉంది. పశ్చిమ దిశన మూడు మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాల వెడల్పు ఉంది; తూర్పున మూడు మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాలు; దక్షిణ దిశన ఎనిమిది మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాల పొడఉంది. యెహోవా ఆలయం ఈ ప్రదేశపు మధ్య భాగంలో ఉంటుంది.
EZE 48:11 ఈ భూమి సాదోకు సంతతివారికి ఇవ్వ బడుతుంది. ఈ మనుష్యులు నా పవిత్ర యాజకులుగా ఉండటానికి ఎంపిక చేయబడ్డారు. ఎందువల్లననంటే ఇతర ఇశ్రాయేలీయులు నన్ను వదిలిపెట్టినప్పుడు కూడా వీరు నన్ను భక్తి శ్రద్ధలతో కొలిచారు. లేవీయులు చేసినట్లు సాదోకు సంతతి నన్ను విడిచిపెట్టలేదు.
EZE 48:12 అందుచే ఈ పవిత్ర భూమిలో ఈ ప్రత్యేక విభాగం ఈ యాజకుల కొరకు ప్రత్యేకించబడింది. ఇది లేవీయుల భూమికి ప్రక్కనే ఉంటుంది.
EZE 48:13 “యాజకుల భూమి ప్రక్కన లేవీయులకు భూమిలో భాగం వుంటుంది. దాని పొడవు ఇరవై ఐదువేల మూరలు వెడల్పు పదివేల మూరలు గలది. వాళ్లు ఈ భూమి యొక్క పూర్తి పొడవు వెడల్పుల వరకూ తీసుకొంటారు-అనగా పొడవు ఇరవై ఐదువేల మూరలు, వెడల్పు ఇరవైవేల మూరలు.
EZE 48:14 లేవీయులు ఈ భూమిలో ఏ భాగంతోనూ వ్యాపారం చేయకూడదు. వారీ భూమిలో ఏ భాగాన్నీ అమ్మలేరు. దేశంలో ఈ భాగాన్ని వారు విడగొట్టగూడదు. ఎందువల్లనంటే ఈ భామి యెహోవాకు చెందినది. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది దేశంలో మిక్కిలి మంచి భాగం.
EZE 48:15 “యాజకులకు, లేవీయులకు ఇచ్చిన భూమిని ఆనుకొని ఐదువేల మూరల వెడల్పు, ఇరవై ఐదువేల మూరల పొడవు గల ఒక స్థలం ఉంటుంది. ఈ స్థలం నగరానికి, పశువులు తిరిగి మేయటానికి, ఇండ్లు కట్టటానికి ఉపయోగపడుతుంది. సామాన్య ప్రజలు ఈ స్థలాన్ని వినియోగించుకుంటారు. నగరం దీని మధ్యలో వుంటుంది.
EZE 48:16 నగర కొలతలు ఇలా ఉన్నాయి, ఉత్తరాన నాలుగువేల ఐదువందల మూరలు, దక్షిణాన నాలుగువేల ఐదవందల మూరలు, తూర్పున నాలుగువేల ఐదువందల మూరలు, పడమట నాలుగువేన ఐదువందల మూరలు.
EZE 48:17 నగరానికి పచ్చిక బీడులు వుంటాయి. ఈ పచ్చిక బీడులు ఉత్తరాన రెండువందల ఏభై మూరలు, దక్షిణాన రెండువందల ఏభై మూరలు. తూర్పున రెండువందల ఏభై మూరలు, పడమట రెండువందల ఏభై మూరలు కలిగి వుంటాయి.
EZE 48:18 పవిత్ర ప్రదేశం పొడవు పక్కగా వదిలిన స్థలం తూర్పున పదివేల మూరలు, పడమట పదివేల మూరలు. ఈ స్థలం పవిత్ర ప్రదేశం పక్కన పొడవునా ఉంటుంది. నగర కార్మికులకు ఈ స్థలంలో ఆహార ధాన్యాలు పండుతాయి.
EZE 48:19 నగరంలో పనిచేసే కార్మికులు ఈ భూమిని సాగుచేస్తారు. ఇశ్రాయేలు తెగలన్నిటిలో నుండి ఈ పనివారు వస్తారు.
EZE 48:20 “ఈ ప్రత్యేక భూభాగం నలుదిశలా చదరంగా వుంటుంది. దాని పొడవు వెడల్పులు ఒక్కొక్కటి ఇరవై ఐదువేల మూరలు చొప్పున ఉన్నాయి. దాని ప్రత్యేక అవసరాల కొరకే ఈ భూమిని ఉంచాలి. ఒక భాగం యాజకులకు. ఒక భాగం లేవీయులకు. ఒక భాగం నగరానికి చెంది ఉండవలెను.
EZE 48:21 “ఆ ప్రత్యేక భూమిలో ఒక భాగం దేశపాలకునికి చెందుతుంది. ఆ ప్రత్యేక భూమి నలుదిశలా చదరంగా ఉంది. దాని పొడవు, వెడల్పులు ఒక్కొక్కటి ఇరవై ఐదువేల మూరల చొప్పున ఉన్నాయి. ఈ ప్రత్యేక భూమిలో ఒక భాగం యాజకులకు, ఒక భాగం లేవీయులకు, మరొక భాగం ఆలయానికి చెందుతాయి. ఆలయం ఈ స్థలంలో మధ్యగా వుంటుంది. మిగిలిన భాగం దేశపాలకునికి చెందుతుంది. బెన్యామీనీయుల సరిహద్దుకు, యూదా వారి సరిహద్దుకు మధ్యగావున్న ప్రాంతం రాజ్యాధిపతికి చెంది ఉంటుంది.
EZE 48:23 “ఈ ప్రత్యేక భూమికి దక్షిణంగా వున్న భూమి యొర్దాను నదికి తూర్పున నివసించే తెగల (గోత్రాలు) వారికి చెందుతుంది. తూర్పు సరిహద్దు నుండి మధ్యధరా సముద్రం వరకు ఉన్న భూమిలో ప్రతీ గోత్రం వారికి ఒక భాగం వస్తుంది. ఉత్తరాన్నుండి దక్షిణం వరకు ఈ గోత్రాల వారెవరనగా: బెన్యామీను, షిమ్యోను,ఇశ్శాఖారు, జెబూలూను మరియు గాదు.
EZE 48:28 “గాదు వారి భూమి దక్షిణ సరిహద్దు తామారు నుండి కాదేషులోగల మెరీబా నీటి వనరు వరకూ అక్కడ నుండి ఈజిప్టు వాగు వెంబడి మధ్యధరా సముద్రం వరకు వ్యాపించి ఉంది.
EZE 48:29 ఈ భూమినే మీరు ఇశ్రాయేలు వంశాల మధ్య విభజించుకోవాలి. ప్రతి తెగ వారికి వచ్చేది అదే.” నా ప్రభువైన యెహోవాయే ఈ విషయాలు చెప్పాడు!
EZE 48:30 “ఇవి నగర ద్వారాలు. ఈ ద్వారాలు ఇశ్రాయేలు గోత్రాల పేర్ల మీద పిలవబడతాయి. “నగర ఉత్తర భాగం ఒక మైలు ఎనిమిది వందల ఎనభై గజాల పొడవుంది.
EZE 48:31 అక్కడ మూడు ద్వారాలు వుంటాయి: అవి రూబేను ద్వారం, యూదా ద్వారం, మరియు లేవీ ద్వారం.
EZE 48:32 “నగర తూర్పు భాగం నాలుగువేల ఐదువందల మూరల పొడవు. అక్కడ మూడు ద్వారాలు ఉన్నాయి: ఆవి యోసేపు ద్వారం, బెన్యామీను ద్వారం మరియు దాను ద్వారం.
EZE 48:33 “నగర దక్షిణ భాగం నాలుగువేల ఐదు వందల మూరల పొడవుంది. అక్కడ మూడు ద్వారాలు ఉన్నాయి: అవి షిమ్యోను ద్వారం, ఇశ్శాఖారు ద్వారం మరియు జెబూలూను ద్వారం.
EZE 48:34 “నగర పశ్చిమ భాగం నాలుగు వేల ఐదువేల మూరల పొడఉంది. అక్కడ మూడు ద్వారాలున్నాయి: అవి గాదు ద్వారం, ఆషేరు ద్వారం మరియు నఫ్తాలి ద్వారం.
EZE 48:35 “నగరం చుట్టుకొలత ఆరుమైళ్లు. ఇప్పటి నుండి ఈ నగరం యెహోవా ఇక్కడ ఉన్నాడు అని పిలువబడుతుంది.”
DAN 1:1 బబులోను రాజైన, నెబుకద్నెజరు తన సైన్యంతో యెరూషలేముకు వచ్చి దానిని చుట్టుముట్టాడు. ఇది యెహోయాకీము యూదాకు రాజుగానున్న మూడవ సంవత్సరంలో జరిగింది.
DAN 1:2 ప్రభువు యూదా రాజైన యెహోయాకీమును ఓడించడానికి, దేవుని ఆలయం నుంచి అన్ని వస్తువులను తీసుకొని వెళ్ళడానికి నెబుకద్నెజరును అనుమతించాడు. అతడు ఆ వస్తువులను తన విగ్రహ దేవతలున్న ఆలయములో ఉంటాడు.
DAN 1:3 తర్వాత నెబుకద్నెజరు అష్పెనజుకు (అష్పెనజు రాజుకొలువులోని నపుంసకులలో ప్రముఖుడు), “కొందరు యూదులను తన ఇంటికి తీసుకు రమ్మని” చెప్పాడు. కొన్ని ప్రసిద్ధ కుటుంబాల నుంచి, ఇశ్రాయేలీయుల రాజకుటుంబం నుంచి ఆరోగ్యవంతులైన యౌవ్వన యూదులను తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు.
DAN 1:4 ఎలాంటి లోపము తమ దేహాలమీద లేనివారు, అందమైన, చురుకైన వారు, తేలికగా విషయాలు నేర్చుకునే వారు, రాజగృహములో సేవ చేయ సామర్థ్యముగల యువకులను ఎన్నుకోమన్నాడు. ఆ ఇశ్రాయేలు యువకులకు కల్దీయుల భాషను, వ్రాతలను నేర్పుమని రాజు అష్పెనజుకు ఆజ్ఞాపించాడు.
DAN 1:5 నెబుకద్నెజరు ఆ యువకులకు ప్రతీరోజు రాజుతిని, త్రాగే ఆహారము, ద్రాక్షామద్యం ఇప్పించాడు. ఇశ్రాయేలుకు చెందిన ఆ యువకులు మూడేళ్లపాటు తర్ఫీదు పొందాలని రాజు ఆదేశించాడు. మూడేళ్ల తర్వాత, వారు బబులోను రాజ నగరులో ప్రవీణులుగా ఉంటారు.
DAN 1:6 ఆ యువకులలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు, యూదా దేశానికి చెందిన వారు.
DAN 1:7 తర్వాత అష్పెనజు యూదా నుంచి వచ్చిన ఆ యువకులకు బబులోను పేర్లు పెట్టాడు. దానియేలుకు బెల్తెషాజరు, మిషాయేలుకు మేషాకు, అజర్యాకు అబేద్నెగో, హనన్యాకు షద్రకు, అని పేర్లు పెట్టాడు.
DAN 1:8 రాజు భుజించే విలువైన ఆహారం, ద్రాక్షామద్యం తీసుకోడానికి వారు ఇష్టపడలేదు. ఆ ఆహారం, మత్తు ద్రాక్షామద్యం తమను తాము అపవిత్రం చేసుకోవటం దానియేలుకు ఇష్టము లేక దానిని తప్పించుమని అష్పెనజు అనుమతి కోరాడు.
DAN 1:9 దానియేలు పట్ల అష్పెనజు మంచిగాను, దయతోను ఉండేటట్లు దేవుడు చేసాడు.
DAN 1:10 కాని అష్పెనజు దానియేలుతో, “రాజైన నా యజమానికి భయపడుతున్నాను. ఈ ఆహారము, ద్రాక్షామద్యం మీ కిమ్మని రాజు నాకాజ్ఞాపించాడు. మీరు ఈ ఆహారం భుజించక పోతే, జబ్బుగాను బలహీనంగాను కనబడతారు. మీ వయసు వారైన ఇతర యువకులతో పోల్చితే మీరు తక్కువగా కనిపిస్తారు. రాజు ఇది చూచి నా మీద కోపగిస్తాడు. ఒకవేళ నా తలను కూడా తీసివేస్తాడు” అని అన్నాడు.
DAN 1:11 దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలపై అష్పెనజుచే నియమించబడిన సంరక్షకునితో దానియేలు ఇలా అన్నాడు:
DAN 1:12 “పది రోజులపాటు మాకు ఈ పరీక్ష విధించు. తినడానికి కాయగూరలు, త్రాగడానికి మంచినీళ్లు తప్ప మరేమీ ఇవ్వవద్దు.
DAN 1:13 పది రోజుల తర్వాత, రాజు నియమించిన ఆహారంతిన్న ఇతర యువకులతో మమ్మల్ని పోల్చి చూడు. ఎవరు ఆరోగ్యంగా ఉన్నారో నీవే ఆలోచించి నీ సేవకులమైన మాకు ఏమి చేయాలని నీ నిరయమో అలాగే చెయ్యి” అని అన్నాడు.
DAN 1:14 అందువల్ల దానియేలును, హనన్యాను, మిషాయేలును, అజర్యాను పదిరోజులు పరీక్షించడానికి ఆ సంరక్షకుడు సమ్మతించాడు.
DAN 1:15 పదిరోజుల తర్వాత, దానియేలు మరియు అతని మిత్రులు రాజు ఆహారంతిన్న ఇతర యువకులకంటె ఆరోగ్యంగా కనిపించారు.
DAN 1:16 అందువల్ల రాజు నియమించిన ప్రత్యేక ఆహారానికి బదులుగా, కాయగూరలు, మంచినీళ్లు దానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు, ఆ సంరక్షకుడు ఇస్తూ వచ్చాడు.
DAN 1:17 దానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు వివేకం, పలు విధాలైన వ్రాతలు, శాస్తాలు నేర్చుకునే జ్ఞానము, సామర్థ్యము దేవుడు ప్రసాదించాడు. అన్ని విధాలైన దర్శనాలు, స్వప్నాలు దానియేలు గ్రహించుకోగలిగాడు.
DAN 1:18 ఆ యువకులందరూ మూడేళ్లపాటు మంచి శిక్షణ పొందాలని రాజు ఆదేశించాడు. ఆ గడువు తీరిన తర్వాత, అష్పెనజు ఆ యువకుల్ని రాజైన నెబుకద్నెజరు వద్దకు తీసుకు వెళ్లాడు.
DAN 1:19 రాజు వారితో మాట్లాడాడు. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలకంటె ఇతర యువకులెవ్వరూ గొప్పగా లేకపోవడాన్ని రాజు కనుగొన్నాడు. అందువల్ల ఈ నలుగురు యువకులు రాజు ఆస్థానంలో నిలువగలిగారు.
DAN 1:20 ప్రతీసారి రాజు వారిని యేదో ఒక ముఖ్య విషయం అడుగగానే, వారు మంచి గ్రహింపు, వివేకం ప్రదర్షించేవారు. తన రాజ్యంలో ఉన్న జ్ఞాన వంతులంగరికంటెను, ఇంద్ర జాలికులందరికంటెను, వారు నలుగురు పదిరెట్లు ఎక్కువగా ఉన్నారని రాజు గ్రహించాడు.
DAN 1:21 అందువల్ల దానియేలు, కోరెషు రాజయిన మొదటి సంవత్సరంవరకు రాజు ఆస్థానంలో కొనసాగాడు.
DAN 2:1 నెబుకద్నెజరు రాజుగావున్న రెండవ సంవత్సరంలో, అతనికి కొన్ని కలలు వచ్చాయి. ఆ కలలు అతన్ని కలతపెట్టాయి, కనుక అతనికి నిద్ర పట్టలేదు.
DAN 2:2 అప్పుడు రాజు తన కలను చెప్పటానికి మాంత్రికులను, గారడీవాళ్లను, శకునం చెప్పేవాళ్లను, కల్దీయులను పిలుపించుమని ఆజ్ఞాపించాడు. వారందరు వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు. తాను ఏమి కలగన్నాడో చెప్పామని రాజు వారిని అడిగాడు.
DAN 2:3 అప్పుడు వారితో రాజు ఇలా అన్నాడు, “ఆ కల నన్ను కలతబెట్టింది. కాబట్టి కల, దాని అర్థం నాకు మీరు చెప్పాలి”
DAN 2:4 తర్వాత కల్దీయులు రాడుతో సిరియా భాషలో, “రాజా, వర్థిల్లుము. మేము నీ సేవకులం. దయచేసి నీ కల ఏమిటో చెప్పుము. ఆ తర్వాత దాని అర్థం మేము చెబుతాము” అని అన్నారు.
DAN 2:5 అప్పుడు నెబుకద్నెజరు వారితో, “ఆ కలను నేను మర్చిపోయాను. కలను, దాని అర్థాన్ని కూడా మీరు చెప్పాలి. మీరు ఇవి చెప్పకపోతే, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. మీ ఇళ్లను పాడు దిబ్బలుగా చేయిస్తాను.
DAN 2:6 కానీ మీరు నా కలను, దాని అర్థాన్ని వివరించినట్లయితే, అప్పుడు మీకు నేను కానుకలు, బహుమానాలు ఇస్తాను. గొప్పగా గౌరవిస్తాను. అందువల్ల ఆ కలను, దాని భావాన్ని, మీరు నాతో చెప్పండి” అని అన్నాడు.
DAN 2:7 మళ్లీ ఆ జ్ఞానవంతులు, “రాజా, దయచేసి నీ కలను చెప్పుము, మేము దాని అర్థం చెబుతాము” అని అడిగారు.
DAN 2:8 అప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “మీరింకా వ్యవధి కోరుతున్నారని నాకు తెలుసు. కాని నేనేమి చెప్పానో, అది నా నిర్థారణ అని మీకు తెలుసు.
DAN 2:9 మీరు నా కలను గురించి చెప్పకపోతే, నేను మిమ్మల్ని శిక్షిస్తానని కూడా మీకు తెలుసు. కాబట్టి మీరంతానాతో వ్యర్థమైన మాటలు అబద్ధాలు చెప్పటానికి కాలయాపన చేస్తున్నారు. నేను చెప్పిన మాటలు మరచిపోతానని మీరు భావించవద్దు. ఇప్పుడు నా కలను గురించి చెప్పండి. మీరు చెప్పితే, అప్పుడు ఆ కల యొక్క అర్థము కూడా మీరు చెప్పగలరని నాకు తెలుస్తుంది.”
DAN 2:10 అప్పుడు రాజుతో కల్దీయులు ఇలా చెప్పారు: “రాజు ఏమి అడుగుచున్నాడో, అది చెప్పగల ప్యక్తి ఈ భూమిమీదనే లేడు. ఈ విధంగా వివేకవంతుల్నిగాని, ఇంద్రజాలికుల్నిగాని, కల్దీయుల్నిగాని అడిగిన రాజు ఎవ్వరూ లేరు. ఈ విధంగా ఏ గొప్ప రాజుగాని, ఏ మహా శక్తివంతుడైన రాజుగాని అడుగలేదు.
DAN 2:11 చేయటానికి బహు కఠినమైన దానిని రాజు అడుగుచున్నాడు. దేవుళ్లు మాత్రమే రాజైన తమకు వచ్చిన కలనుగాని, ఆ కల అర్థముగాని చెప్పగలుగుతారు. కాని దేవుళ్లు మనుష్యులతో ఉండరు.”
DAN 2:12 ఇది వినగానే, రాజు చాలా ఉగ్రుడై బబులోనులోని జ్ఞానవంతులందరిని చంపుమని ఆజ్ఞాపించాడు.
DAN 2:13 నెబుకద్నెజరు వివేకవంతులందరు చంపబడాలని ఆజ్ఞ ప్రకటించగా రాజు మనుష్యులు దానియేలు మరియు అతని మిత్రుల్ని చంపడానికి వెళ్లారు.
DAN 2:14 అర్యోకు రాజరక్షకభటుల అధిపతి. బబులోనులోని వివేకవంతుల్ని చంపడానికి అతడు బయలు దేరాడు. కాని దానియేలు అతనితో తెలివిగా మాట్లాడాడు.
DAN 2:15 దానియేలు రాజరక్షకభటుల అధిపతియైన అర్యోకుని ఇలా అడిగాడు: “రాజు ఎందుకు ఇంత కఠినమైన శిక్షను విధించాడు?” అప్పుడు అర్యోకు రాజు కలయొక్క వృత్తాంతము నంతటిని దానియేలుకు వివరించాడు. దానియేలు అదివిని సంగతి తెలుసుకొన్నాడు.
DAN 2:16 అతను నెబుకద్నెజరు రాజు వద్దకు వెళ్లి, తనకు మరికొంత సమయం ఇమ్మని అప్పుడతను కలను, కలయొక్క అర్థాన్ని చెప్పగలనని అడిగాడు.
DAN 2:17 దానియేలు తన ఇంటికి వెళ్లి మిత్రులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు పూర్తి సంగతిని వివరించాడు.
DAN 2:18 తమ పాలిట దేవుడు దయకలిగి ఆ రహస్యమును తెలుపుటకు పరలోకమందున్న దేవుని ప్రార్థించుమని దానియేలు తన మిత్రుల్ని కోరాడు. ఎందుకనగా దానియేలు మరియు అతని మిత్రులు బబులోనులోనియితర వివేకవంతులతో కలిసి నాశనమవ్వకూడదు.
DAN 2:19 ఆ రాత్రి, దేవుడు ఆ రహస్యమును దానియేలుకి దర్శనములో వివరించెను. అప్పుడు పరలోక మందున్న దేవున్ని దానియేలు స్తుతించాడు.
DAN 2:20 “నిరంతరం దేవుని పేరు కీర్తించబడాలి; శక్తియు వివేకము ఆయనకే చెందాలని దానియేలు దేవున్ని స్తుతించాడు.
DAN 2:21 దేవుడే కాలాల్ని సమయాల్ని మార్చుతాడు. ఆయనే రాజుల్ని వారి అధికారాల్ని మార్చుతాడు. ఆయనే మనుష్యలకు వివేకమిస్తాడు. కనుక, వారు వివేకవంతు లౌతారు. జ్ఞానమిస్తాడు, కనుక జ్ఞానవంతుల వుతారు.
DAN 2:22 గ్రహించటానికి కష్టమైన రహస్యాలు ఆయనకు తెలుసు. చీకటిలో మరుగైన సంగతులు ఆయనకు తెలుసు. వెలుగు ఆయనలో నివసిస్తుంది.
DAN 2:23 మా పూర్వీకుల దేవా! నీకు కృతజ్ఞుణ్ణి, నిన్ను కీర్తిస్తున్నాను. నీవు నాకు వివేకము, బలము ప్రసాదించావు. నీవు రాజు కన్న కలను దాని అర్థాన్ని తెలియజేశావు. మేమడిగిన విషయాల్ని నీవు మాకు చెప్పావు” అని దానియేలు అన్నాడు.
DAN 2:24 తర్వాత దానియేలు అర్యోకు వద్దకు వెళ్లాడు. బబులోను వివేకవంతుల్ని చంపటానికి రాజు అర్యోకును ఎంపిక చేశాడు. “బబులోను వివేకవంతుల్ని చంపవద్దు. నన్ను రాజు వద్దకు తీసుకుని వెళ్లు. కలను గురించి దాని అర్థాన్ని గురించి నేను చెప్తాను” అని దానియేలు అన్నాడు.
DAN 2:25 దానియేలును అర్యోకు తక్షణం రాజువద్దకు తీసుకొని వెళ్లాడు. అర్యోకు రాజుతో, “యూదానుంచి బందీలుగా వచ్చిన మనుష్యులలో నేనొక వ్యక్తిని చూశాను. కలయొక్క అర్థాన్ని రాజైన తమకు అతను వివరించగలడు” అని చెప్పాడు.
DAN 2:26 రాజు దానియేలుకు (బెల్తెషాజరు) ఒక ప్రశ్న వేశాడు. “నీవు నా కలను గూర్చి, దాని అర్థాన్ని గూర్చి చెప్పగలవా?”
DAN 2:27 దానియేలు, “నెబుకద్నెజరు రాజా! వివేక వంతుడుగాని, ఇంద్రజాలికుడుగాని, కల్దీయుడుగాని రాజు అడిగిన రహాస్య విషయాల గురించి చెప్పలేడు.
DAN 2:28 కాని పరలోకమందున్న దేవుడు మరుగైన విషయాలగురించి చెప్పగలడు. భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూపించడానికి దేవుడు రాజుకు ఒక కలను ఇచ్చాడు. నీవు నీ పడకమీద పడుకుని ఉండగా చూచిన విషయాలు ఇవి.
DAN 2:29 రాజా! నీ పడకమీద పడుకొని భవిష్యత్తులో ఏమి జరుగునో అని తలంచుచూ నీవు నిద్రించావు. గప్త విషయాలు గురించి దేవుడే చెప్పగలడు. భవిష్యత్తులో ఏమి జరుగునో దేవుడే నీకు చూపాడు.
DAN 2:30 దేవుడు ఈ రహస్యం నాకు కూడా తెలిపాడు. ఎందుకంటే ఇతర వివేకవంతులకంటే నాకు ఎక్కువ వివేకం కలదనే కారణం కాదు. రాజువైన నీవు దాని అర్థమేమిటో గ్రహించాలని తలంచి దేవుడు ఈ రహాస్య విషయం నాకు తెలిపాడు. ఆ విధంగా నీ మనుస్సులోని ఆలోచన ల్ని నీవు గ్రహించగలవు” అని అన్నాడు.
DAN 2:31 “రాజా, నీవు నీ కలలో ఒక పెద్ద విగ్రహం నీ ముందునిలిచి యుండటం చూశావు. అది తళతళ మెరుస్తూ భయంకరంగా ఉండినది.
DAN 2:32 విగ్రహం యొక్కతల స్వచ్చమైన బంగారంతోను, రొమ్ము చేతులు వెండితోను, పొట్ట, తొడలు కంచుతోను
DAN 2:33 మోకాళ్ల క్రింది భాగం ఇనుముతోను, పాదాలు, మట్టి, ఇనుముతోను కలిసి చేయబడినని.
DAN 2:34 నీవు ఆ విగ్రహంవైపు చూస్తూ ఉండగా, ఒక రాయి మానవుని చేతిలో తీయ బడకుండా గాలిలో ఎగిరి, దానంతట అదే వెళ్లి ఇనుముతోను, బంకమట్టితోను చేయబడిన విగ్రహంపాదాల మీదపడి దానిని పొడిపొడి చేసింది.
DAN 2:35 తర్వాత ఇనుము, బంకమట్టి, కంచు, వెండి, బంగారం పొడిపొడి అయ్యాయి. ఆ పొడి గాలికి కొట్టుకొనిపొయి కనబడకుండా పోయింది. తర్వాత విగ్రహాన్ని పొడి చేసిన ఆ రాయి పెద్ద కొండగా మారిపోయి భూమి అంతటా వ్యాపించింది.
DAN 2:36 “అదే నీ కల. ఇప్పుడు ఆ కలయొక్క అర్థమేమిటో మేము రాజుకు వివరిస్తాము.
DAN 2:37 రాజా, నీవు చాలా ముఖ్యుడైన రాజువి. పరలోకమందున్న దేవుడు నీకు అధికారం, బలం, రాజ్యం, ప్రఖ్యాతిని, ప్రసాదించాడు.
DAN 2:38 నీవు ప్రజల్ని, భూజంతువుల్ని, ఆకాశ పక్షుల్ని లోబరచుకొని, పరిపాలించే శక్తిని ఆయన నీకు ఇచ్చాడు. వాళ్లందరూ, అవన్నీ ఎక్కడున్నా, దేవుడు నీవు పరిపాలించేటట్లు చేశాడు. ఓ నెబుకద్నెజరు రాజా! ఆ విగ్రహపు బంగారు తల నీవే.
DAN 2:39 “మరో రాజ్యం నీ తర్వాత వస్తుంది. అది వెండి లాంటిది. కాని ఆ రాజ్యం నీ రాజ్యంలా అంత గొప్పగా ఉండదు. ఆ తర్వాత మూడవ రాజ్యం భూమిని పరిపాలిస్తుంది. అది కంచు లాంటిది.
DAN 2:40 తర్వాత నాలుగవ రాజ్యం వస్తుంది. అది ఇనుములా శక్తివంతంగా ఉంటుంది. ఇనుము బ్రద్ధలుచేసి ముక్కలు మక్కలుగా విరుగకొడుతుంది. ఆ విధంగానే, ఆ నాలుగవ రాజ్యం ఇతర రాజ్యాల్ని ముక్కలుగా పగులగొడుతుంది.
DAN 2:41 “ఆ విగ్రహం పాదాలు, వ్రేళ్లు కొంత ఇనుముతోను, కొంత బంకమట్టితోను చేయబడినవిగా నీవు చూశావు. అనగా, ఆ రాజ్యం భాగాలైన రాజ్యంగా ఉంటుంది. నీవు ఇనుమూ బంకమట్టి కలిసినట్టుగా చూసితివి గనుక ఆ రాజ్యం కొంతవరకు ఇనుమునకున్నంత బలంగానూ, బంకమట్టిలా బలహీనంగానూ ఉంటుందని అర్థం.
DAN 2:42 ఆ విగ్రహంయొక్క పాదాలు, బొటనవ్రేళ్లు ఇనుము బంకమట్టితో కలిసి ఉన్నట్లుగా చూశావు. అలాగే ఆ రాజ్యం కొంత ఇనుమువలె బలంగాను, కొంత బంకమట్టివలై బలహీనంగానూ ఉర టుంది.
DAN 2:43 (నీవు ఇనుమును బంకమన్ను కలిసింది చూశావు.) ఆ విధంగానే, ఆ మనుష్యులు ఒకరితోనొకరు కలసి మెలసివుండలేరు.
DAN 2:44 “ఆ రాజ్యపు పరిపాలకుల కాలంలో పరలోక మందున్న దేవుడు మరొక రాజ్యం స్థాపిస్తాడు. ఈ రాజ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. అది యెన్నటికీ నాశనం కాదు! అది దాన్నపొందేవాళ్లకి తప్ప వేరే వాళ్లకు చెందదు. ఈ రాజ్యం ఇతర రాజ్యాలన్నిటినీ నాశనం చేసి అంతం చేస్తుంది. కాని ఆ రాజ్యం మాత్రమే సదాకాలం కొనసాగుతూ ఉంటుంది.
DAN 2:45 “నెబుకద్నెజరు రాజా, ఒక పర్వతంనుంటి విరిగిన ఒక రాయిని నీవు చూశావు. అది మనిషి చేతులతో తీయబడింది కాదు. ఆ రాయి ఇనుమును, కంచును, బంకమట్టిని, వెండిని, బంగారాన్ని ముక్కలుగా విరుగ గొట్టింది. ఈ విధంగా, దేవుడు భవిష్యత్తులో జరగనున్నదాన్ని నీకు చూపాడు. కల నిజం, దాని అర్థం నమ్మదగినది” అని దానియేలు రాజుతో చెప్పాడు.
DAN 2:46 అప్పుడు రాజైన నెబుకద్నెజరు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజు దానియేలును గౌరవించాలనకొన్నాడు. కాబట్టి అతనికి అర్పణాన్ని ధూపాన్ని సమర్పించాలని ఆజ్ఞాపించాడు.
DAN 2:47 అప్పుడు దానియేలుతో రాజు, “నీవు దేవుడు గొప్పవాడని, శక్తి మంతుడనీ నేను నిస్సందేహంగా తెలుసుకున్నాను. ఆయన రాజులకు రాజు, దేవుళ్ళకు దేవుడు. ప్రజలకు తెలియని విషయాలు ఆయన చెపుతాడు. ఈ రహస్య విషయాలన్నిటినీ నీవు నాకు చెప్పితివి కాబట్టి, ఇది సత్యమని నేను భావిస్తున్నాను”అని అన్నాడు.
DAN 2:48 అప్పుడు రాజు దానియేలుకు తన రాజ్యంలో అతి ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. మరియు రాజు ఖరీదైన కానుకలు ఎన్నో అతనికిచ్చాడు. నెబుకద్నెజరు దానియేలును బబులోను రాజ్య మంతటికీ పరిపాలకునిగా చేశాడు. బబులోనులోని వివేకవంతులందరిమీద దానియేలును అధికారిగా నియమించాడు.
DAN 2:49 షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను రాజ్యంలో ముఖ్యులైన అధికారులుగా నియమింపుమని దానియేలు రాజుని కోరాడు. దానియేలు చెప్పినట్లుగానే, రాజు చేశాడు. మరియు దానియేలు రాజు దగ్గరే ఉండేవాడు.
DAN 3:1 నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ విగ్రహం అరవై మూరల ఎత్తు, ఆరు మూరల వెడల్పు గలది. తర్వాత, బబులోను రాజ్యంలో దూరాయను మైదాన ప్రదేశంలో ఆ విగ్రహాన్ని అతను ప్రతిష్ఠించాడు.
DAN 3:2 ఆ తర్వాత అధిపతులను, సేనాధిపతులను, ముఖ్యోద్యోగులను, ఉన్నతాధి కారులను, సలహాదారులను, న్యాయాధిపతులను, పాలకులను రాజ్యంలోని ఇతర ముఖ్య అధికారులను రాజు వారందరిని పిలించాడు.
DAN 3:3 రాజైన నెబుకద్నెజరు ప్రతిష్ఠించిన ఆ విగ్రహ సమక్షంలో వారందరు నిలిచారు.
DAN 3:4 రాజు తరఫున ప్రకటనలు చేసే వ్యక్తి గొప్ప స్వరంతో, “వివిధ దేశాలనుండి, వివిధ భాషావర్గాలనుండి, వచ్చిన మీరందరూ నా మాడలు ఆలకించండి. ఇది మీరు చేయాలని రాజాజ్ఞ.
DAN 3:5 కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తంతివాద్యాలు, తిత్తి బూరల, ధ్వసులు వినగానే మీరు బంగారు విగ్రహానికి సాష్టాంగ పడి పూజించాలి.
DAN 3:6 ఎవరైనా ఆ బంగారు విగ్రహానికి సాగిలపడి పూజించకపోతే, అప్పుడతనిని వెంటనే మండుచున్న అగ్నిగుండంలోకి తోసివేస్తారు.”
DAN 3:7 అందువల్ల, కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ విపంచిక, తంతివాద్యాలు, తిత్తిబూరలు మొదలైన సంగీత వాద్యాల ధ్యనులు వినగానే రాజు ప్రతిష్టించిన ఆ బంగారు విగ్రహానికి అందరు, అన్ని దేశాలవాళ్లు, అన్ని భాషలవాళ్లు సాష్టాంగపడి పూజించారు.
DAN 3:8 తర్వాత కల్దీయులలో కొందరు రాజు వద్దకు వచ్చి యూదులకు విరుద్ధంగా మాటలాడసాగిరి.
DAN 3:9 వాళ్లు నెబుకద్నెజరుతో ఇలా అన్నారు: “రాజు, ఎల్లప్పుడూ వర్ధిల్లు గాక!
DAN 3:10 రాజా! నీవొక ఆజ్ఞ విధించావు. కొమ్ము బూరలు, పిల్లనగ్రోవులు, సుంఫొనీయ, విపంచిక, తిత్తి బూరలు, మొదలైన వివిధ సంగీక వాద్యాల ధ్వనులు వినగానే అందరూ సాగిలపడి బంగారు విగ్రహాన్ని పూజించాలని నీవు చెప్పావు.
DAN 3:11 ఎవరైనా బంగారు విగ్రహానికి బోర్లగాపడి నమస్కరించకపోతే, అతడు మండుచున్న కొలిమిలోకి త్రోయబడతాడని నీవు చెప్పావు.
DAN 3:12 రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నడవని యూదులు కొందరున్నారు. బబులోను రాజ్యంలో ఆ యూదులను నీవు ముఖ్యోద్యోగులుగా నియమించావు. వారు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. వారు నీ దేవుళ్లను పూజించరు. నీవు ప్రతిషించిన ఆ బంగారు విగ్రాహాన్ని తలవంచి వారు పూజించలేదు.”
DAN 3:13 నెబుకద్నెజరు చాలా ఉగ్రుడైనాడు. అతడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు.
DAN 3:14 అందువల్ల వారిని అతని సమక్షమునకు తీసుకు వచ్చారు. నెబుకద్నెగో, “మీరు నా దేవుళ్లని పూజించని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని పూజించని మాటకూడా నిజమేనా?
DAN 3:15 కొమ్ముబూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు మొదలైన వాద్య ధ్వనులు వినగానే మీరు బోర్లగాపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే, అది మంచిది. మీరు పూజించ కపోతే, మిమ్మును వెంటనే మండుచున్న కొలిమిలోకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారంనుంచి మిమ్మును కాపాడలేడు!”
DAN 3:16 షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకి ఇలా ప్రత్యుత్తరమిచ్చారు: “నెబుకద్నెజరూ, ఈ విషయాలు మీకు మేము వివరించనవసరం లేదు.
DAN 3:17 మీరు మమ్మును మండుచున్న కొలిమిలోకి తోసివేస్తే, మేము నమ్ముకొన్న మా దేవుడే మమ్ములను రక్షిస్తాడు. మరియు ఆయనకి ఇష్టం కలిగితే మీ అధికారంనుంచి మమ్ములను కాపాడుతాడు.
DAN 3:18 దేవుడు కూడా మమ్ములను రక్షించని పక్షంలో, రాజా, మేము నీ దేవుళ్లను కొలవమనే సంగతి నీవు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించము.”
DAN 3:19 అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతను చాలా కొపంగా చూశాడు. మామూలుకంటె ఏడు రెట్లు కొలిమి వేడిగా ఉండాలని అతను ఆజ్ఞాపించాడు.
DAN 3:20 తర్వాత నెబుకద్నెజరు తన సైన్యంలోని మహా బలాఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నె గోలనిబంధించి. వేడి కొలిమిలోకి తోసి వేయుమని ఆజ్ఞా పించాడు.
DAN 3:21 అందువల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వారిని వేడి కొలిమిలోకి త్రోసివేశారు. వాళ్లను మంటలో విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు, పైవస్త్రాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు.
DAN 3:22 రాజు చాలా ఉగ్రుడై ఉండెను. అందువల్లవారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే ఆ మహా బలవంతులయిన సైనికుల్ని కూడా కాల్చివేశాయి. ఆ ముగ్గురిని మంటలో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్లిన సైనికులు ఆ మంటలచేత వెంటనే కాలిచచ్చారు.
DAN 3:23 షద్రకు, మేషాకు, అబేద్నెగోలను గట్టిగా బంధించి మంటల్లోకి త్రోసేశారు.
DAN 3:24 తర్వాత నెబుకద్నెజరు జరిగింది చూసి ఆశ్చర్యపడ్డాడు. తన సలహాదారుల్ని పిలిచి, “మనం ముగ్గురినే బంధించి మంటల్లోకి త్రోసివేశాము గదా!” అని అడిగాడు. “చిత్తం ప్రభూ” అని సలహాదారులు బదులు చెప్పారు.
DAN 3:25 “చూడండి! మంటల్లో నలుగురు నడుస్తున్నట్టు నేను చూస్తున్నాను. వారు బంధించబడినట్లుగా గాని కాలి పోయినట్టుగా గాని లేదు. నాలుగవ వ్యక్తి దైవ కుమారునిగా కనిపిస్తున్నాడు” అని రాజు అన్నాడు.
DAN 3:26 తర్వాత నెబుకద్నెజరు వేడి కొలిమి వద్దకు వెళ్ళి, “అత్యున్నతుడైన దేవుని సేవకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా బయటికి రండి” అని పిలిచాడు. అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మంటలనుండి వెలుపలికి వచ్చారు.
DAN 3:27 వారు వెలుపలికి రాగానే, పాలనాధికారులు ఉన్నతాధికారులు, రాజుగారి సలహా దారులు వారిని చుట్టుముట్టారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలని మంటలు కాల్చలేదని, వారి దేహాలు ఏమీ కాలిపోలేదని, వారి వెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదని, వాళ్ళ మీద మంటల వాసనై నా లేదని వారు తెలుసుకొన్నారు.
DAN 3:28 తర్వాత నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “నేను షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుణ్ణి కీర్తిస్తున్నాను. వాళ్ల దేవుడు తన దూతను పంపించి తన సేవకుల్ని మంటలనుండి రక్షించినాడు. ఈ వ్యక్తులు ముగ్గురు తమ దేవుని విశ్వసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవటానికిష్టసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవటానికిష్టపడ్డారు కాని, మరొక దేవుని కొలవడానికి గాని, పూజించుటకు గాని ఇష్టపడలేదు.
DAN 3:29 అందువల్ల నేనిప్పుడు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను: ఏ దేశానికి చెందిన మనుష్యులుగాని, ఏ భాషకు చెందినవారు గాని, షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి విరుద్ధంగా ఏమైనా చెప్పితే వారు ముక్కలుగా నరకబడతారు. ఆ వ్యక్తుల ఇళ్ళు పాడుదిబ్బగా నాశానం చేయబడుతాయి. ఈ విధంగా ఏ ఇతర దేవుడు గాని తన మనుష్యులను రక్షించలేడు.”
DAN 3:30 ఆ తర్వాత షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు రాజు బబులోను దేశంలో ఇంకా ముఖ్యమైన అధికారాలిచ్చాడు.
DAN 4:1 రాజైన నెబుకద్నెజరు తన లేఖను ప్రపంచంలో అన్ని జనాంగాలకు, ఇతర భాషలు మాటలాడే దేశాలకు, ప్రజలకు వ్రాయిస్తూ మీ అందరికీ సమాధాన మగుగాక!
DAN 4:2 అత్యున్నతుడైన దేవుడు, నా కోసం చేసిన అద్భుత విషయాలు, అద్భుత సంఘటనల గురించి చెప్పడానికి సంతోసిస్తున్నాను.
DAN 4:3 దేవుని సూచనలు, అద్భుతాలు మహాగొప్పవి, శక్తివంతమైనవి. దేవుని రాజ్యం శాశ్వతమైనది. దేవుని ప్రభుత్వం అన్ని తరాలు కొనసాగుతుంది.
DAN 4:4 నెబుకద్నెజరు అను నేను నా అంతఃపురాన ఉన్నాను. నేను సుఖంగా సంతోషంగా ఉన్నాను.
DAN 4:5 నన్ను భయంగొలిపే కల ఒకటి వచ్చింది. నేను నా పడకమీద ఉన్నాను. నా మనస్సులోని ఆలోచనలు నన్ను భయపెట్టాయి.
DAN 4:6 అందువల్ల బబులోనులోని వివేకవంతులందరినీ నావద్దకు తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకంటే వారు నా కలయొక్క అర్థం చెప్పగలరని.
DAN 4:7 ఇంద్ర జాలికులు, కల్దీయులు వచ్చారు. రాగానే వారితో కల వృత్తాంతం చెప్పాను. కాని దాని అర్థమేమిటో వారు చెప్పలేకపోయారు.
DAN 4:8 చివరికి దానియేలు వచ్చాడు. (నా దేవుని గౌరవించే నిమిత్తం నేను దానియేలుకు బెల్తెషాబరు అని పేరుపెడితిని. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ అతనిలో వుంది.) నా కల గురించి దానియేలుతో చెప్పాను.
DAN 4:9 నేను ఈ విధంగా చెప్పాను: “బెలైషాజరూ! ఇంద్ర జాలికులందరిలో నీవు చాలా ముఖ్యుడివి. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ నీలో ఉన్నట్లు నాకు తెలుసు. ఏ రహస్యమూ నీకు తెలుసుకోవడం కష్టంకాదు. ఇది నేను (కన్నకల) దాని అర్థమేమిటో చెప్పుము.
DAN 4:10 నేను నా పడక మీద ఉండగా ఈ దర్శనం నేను చూశాను. నా యెదుట భూమి మధ్యలో ఒక వృక్షం ఉంది. అది చాలా ఎత్తైనది.
DAN 4:11 ఆ చెట్టు ఏపుగా దృఢంగా పెరిగింది. ఆ చెట్టు పైభాగం ఆకాశాన్ని అంటిందా అన్నట్లున్నది. భూమిమీద ఎక్కడినుంచ యినా ఆ చెట్టుని చూడవచ్చు.
DAN 4:12 ఆ చెట్టు ఆకులు చాలా అందమైనవి. దాని మీద చాలా పళ్లు ఉన్నాయి. అవి అందరికీ ఆహారంగా ఉన్నాయి. భూజంతువులకు చెట్టుక్రింద నీడ లభించింది. దాని కొమ్మలలో పక్షులు ఉన్నవి. ప్రతీ జీవి ఆ చెట్టునుండి పోషింటబడింది.
DAN 4:13 “నేను నా పడక మీదనే పడుకొని నా దర్శనంలో కావలివానివలె పరలోకంనుంచి ఒక పవిత్రుడు క్రిందికి రావడం చూశాను.
DAN 4:14 అతను చాలా బిగ్గరగా మాట్లాడాడు, ‘చెట్టును నరికి వేయండి. చెట్టుకొమ్మల్ని నరికి వేయండి. దాని ఆకులను, దాని పండ్లని త్రుంచి పారవేయండి. చెట్టుకిందవున్న జంతువుల్ని తోలివేయండి. దాని కొమ్మల మీదవున్న పక్షుల్ని ఎగిరి పోనివ్వండి.
DAN 4:15 కాని దాని మొద్దును వేళ్లతో సహాభూమిలోనే ఉండనివ్వండి. దాని చుట్టూ ఇనుమూ కంచు కలిసిన ఒక బద్దీ వేయండి. చెట్టుమొద్దు, వ్రేళ్లు పొలంలో పెరిగే గడ్డి మధ్యలో భూమిలోనే ఉండినివ్వండి. మంచు చేత దాన్ని తడవ నివ్వండి. అని అతను చెప్పాడు.
DAN 4:16 ఇక మీదట అతను మనిషిలా ఆలోచించడు. అతనికి జంతువుల బుద్ధి వస్తుంది. ఏడు కాలాలు (సంవత్సరాలు) అతని మీదగా గడుస్తాయి.’
DAN 4:17 “కావలి దూత ద్వారా ఈ ఆజ్ఞ జారీ అయింది. పరిశుద్ధుల ద్వారా నిర్ణయం జరిగింది. ఇది అంతం వరకు ఉంటుంది. మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడని భూమి మీద నివసించే మనుష్యులందరు తెలుసుకొనేందుకు వీలవుతుంది. ఆయనకు నచ్చిన ఎవరికైనా దేవుడు ఆ రాజ్యాలను ఇచ్చి వేస్తాడు. ఆ రాజ్యాలను పాలించేందుకు వినయ విధేయతగల వారిని దేవుడు ఎన్నుకుంటాడు!
DAN 4:18 “ఇదే నెబుకద్నెజరు రాజునైన నేను కన్నకల. ఇప్పుడు బెలైషాజరూ (దానియేలూ) ఈ కల అర్థం చెప్పుము. నా రాజ్యాంలోని వివేకవంతు లెవ్వరూ నాకు ఆ కల అర్థం చెప్పలేకపోయారు. కాని బెలైషాజరూ, నీవు ఆ కల గురించి చెప్పగలవు. ఎందుకంటే నీలో పరిశుద్ధ దేవతల ఆత్మవుంది.”
DAN 4:19 తర్వాత దానియేలు (బెలైషాజరు) కొంచెంసేపు చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆలోచిస్తున్న విషయాలు అతన్ని కలత పరచినవి. అందువల్ల రాజు, “బెల్తెషాజరూ! (దానియేలు) ఆ కలగాని, ఆ కలయొక్క అర్థంగాని, నిన్ను కలత చెందనీయకుండును గాక” అని చెప్పాడు. తర్వాత బెల్తెషాజరు (దానియేలు) రాజుతో ఇలా అన్నాడు: “నా రాజా! ఆ కల నీ విరోధులకు జరుగునుగాక! నీ శత్రువులకు ఆ కలయొక్క అర్థము నెరవేరును గాక!
DAN 4:20 కలలో నీవొక వృక్షాన్ని చూశావు. అది ఏపుగా దృఢంగా పెరిగింది. దాని పైభాగం ఆకాశాన్ని అంటినట్లుగా ఉంది. భూమిమీద ఎక్కడినుంచియైనా దానిని చూడవచ్చు. దాని ఆకులు అందంగా ఉన్నాయి. ఫలసమృద్ధి కూడా ఉంది. ఆ పళ్లు ప్రతివారికీ సమృద్థిగా ఆహారం సమకూర్చాయి. అది అడవి మృగాలకు ఆశ్రయం. దాని కొమ్మలేమో పక్షుల నివాసస్థానం. అలాంటి వృక్షామే నీవు చూసింది.
DAN 4:22 రాజా. నీవే ఆ వృక్షానివి. నీవు మహా శక్తిమంతుడవయ్యావు. ఆకాశాన్ని అంటిన ఉన్నత వృక్షంవంటి వాడవు నీవు. నీ అధికారం భూమిమీద దూర భాగాలకు కూడా వ్యాపించింది.”
DAN 4:23 “రాజా, పరలోకంనుంచి ఒక పవిత్ర కావలి దేవదూత క్రిందికి రావడం నీవు చూశావు. అతడు ఇలా అన్నాడు: ‘చెట్టుని నరికివేయుము; నాశనం చేయుము. ఇనుము కంచు బద్దీతో కట్టబడి, పొలంలోని గడ్డి మధ్య నాటబడిన ఆ మొద్దును ప్రేళ్ళతో సహా భూమిలోనే విడిచిపెట్టు. ఏడు కాలాలు (సంవత్సరాలు) అతను మంచుకు తడుస్తూ మృగంవలె జీవస్తాడు.’
DAN 4:24 “రాజా, కలయొక్క అర్థం ఇదే. మహోన్నతుడైన దేవుడు ఇవి జరుగుతాయని నా రాజువైన నీకు ఆజ్ఞాపించాడు.
DAN 4:25 నెబుకద్నెజరు రాజా, నీ ప్రజలనుంచి దూరంగా నీవు తరుమబడుతావు. భూజంతువుల మధ్య నీవు నివసిస్తావు. ఎద్దువలె నీవు పచ్చిక తింటావు. నీవు మంచుచేత తడుస్తావు. అలా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు నీవీపాఠం నేర్చుకుంటావు-మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడనియు, తనకు నచ్చిన ఎవనికైనా రాజ్యాలను ఇచ్చివేస్తాడనియు నీవు తెలుసుకుంటావు.
DAN 4:26 “చెట్టు మొద్దు, వ్రేళ్లనీ నేలలోనే ఉంచుము అని ఇవ్వబడిన ఆజ్ఞకు అర్థమిది: మహోన్నతుడైన ఆ దేవుడే మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడన్న విషయం నీవు తెలుసుకున్నప్పుడు, నీ రాజ్యం నీకు ఇవ్వ బడుతుంది.
DAN 4:27 అందువల్ల, రాజా, నా సమహాని స్వీకరించుము. పాపం చేయడం ఆపివేయుము. సరి యైనదేదో అదే జరిగించుము. చెడు విషయాలు చేయడం ఆపివేయుము. బీదవారిపట్ల దయగలిగి ఉండుము. అప్పుడు నీవు క్రమంగా విజయాన్ని పొందగలవు.”
DAN 4:28 నెబుకద్నెజరు రాజుకి ఆ ఘటనలన్నీ జరిగినవి.
DAN 4:29 కల వచ్చిన పన్నెండు నెలల తర్వాత, బబులోనులోని తన అంతఃపురం పైభాగాన నెబుకద్నెజరు నడుచుచుండగా రాజు బబులోనువైపు చూసి, “ఈ గొప్ప నగరాన్ని, ఈ గొప్ప అంతఃపురాన్ని నా శక్తివల్ల నిర్మించాను. నేనెంత గొప్పవాడనో తెలపటానికి ఈ అంతః పురాన్ని నిర్మించాను” అని తన మనస్సులో చెప్పుకొన్నాడు.
DAN 4:31 అతని మాటలు ఇంకా అతని నోటిలోనే ఉండగా, ఆకాశమునుంచి ఒక స్వరం వినిపించింది. “నెబుకద్నెజరు రాజా, ఈ మాటలు నీకోసమే: నీ వద్దనుంచి నీ అధికారం తీసివేయబడింది.
DAN 4:32 ప్రజలనుండి నీవు తరిమి వేయబడతావు. భూజంతువులతో మేస్తావు. నీవు గుణపాఠం నేర్చుకునేలోగా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు మనుష్యుల రాజ్యాలను సర్వోన్నతుడైన దేవుడు పరిపాలిస్తాడనియు, తనకు నచ్చిన వానికి రాజ్యాలు ఇస్తాడనియు నీవు తెలుసుకుంటావు.”
DAN 4:33 ఆ విషయాలు వెంటనే జరిగాయి. నెబుకద్నెరును ప్రజలు తమ మధ్యనుండి తరిమివేశారు. అతడు ఎద్దువలె పచ్చిక వేయ సాగాడు. ఆకాశ మంచుచేత అతని దేహం తడిసింది. గ్రద్ద ఈకలవలె అతని గోళ్లు పొడుగ్గా పెరిగాయి.
DAN 4:34 ఆ యేడేళ్ల కాలం పూర్తి కాగానే, నెబుకద్నెజరు అను నేను ఆకాశంవైపు కన్నెత్తి చూశాను. మళ్లీ నాకు మానవబుద్ది లభించింది. అప్పుడు మహోన్నతుడైన దేవున్ని నేను కీర్తించాను. ఎల్లాకాలము నివసించే ఆయనను గౌరవించి, ఇలా ప్రశంసించాను: ఆయన పరిపాలన శాశ్వతమైనది, తరతరాలకు ఆయన రాజ్యం కొనసాగుతుంది.
DAN 4:35 భూమిమీద మనుష్యులు ఆయన ఎదుట లెక్క లేనివారికి సమానము. దేవుడు పరలోకలమందలి సైన్యాలకు, భూమిమీది మనుష్యులకు తనకు ఇష్టము వచ్చినట్లు చేస్తాడు. ఎవ్వరూ ఆయన శక్తివంతమైన హస్తాన్ని ఆపలేరు. ఎవ్వరూ ఆయన చేసే పనుల్ని ప్రశ్నించలేరు.
DAN 4:36 అందువల్ల, ఆ సమయాన, దేవుడు నాకు సరి అయిన బుద్ధిని ప్రసాదించాడు. రాజుగా అధిక గౌరవం, శక్తిని నాకు తిరిగి ఇచ్చాడు. మరల నా సలహాదారులు రాజపురుషులు నా సలహా అడగ సాగారు. నేను మళ్లీ రాజుని అయ్యాను. పూర్వం కంటె ఎక్కువ శక్తి ఎక్కువ గొప్పతనం నాకు వచ్చాయి.
DAN 4:37 ఇప్పుడు, నెబుకద్నెజరు అను నేను పరలోక మందున్న రాజుని కీర్తిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఆయన చేసే ప్రతిది సరి అయినదే. ఆయన ఎప్పుడూ న్యాయంగానే ఉంటాడు. గర్విష్ఠులను ఆయన అణగ ద్రొక్కుతాడు.
DAN 5:1 రాజైన బెల్షెస్సరు తన వెయ్యిమంది అధికారులకు ఒక గొప్ప విందు ఇచ్చాడు. వారితో కలిసి రాజు ద్రాక్షామద్యం సేవిస్తూ ఉన్నాడు.
DAN 5:2 బెల్షెస్సరు ద్రాక్షామద్యం తాగుతుండగా బంగారు, వెండి పాత్రలు తీసుకురమ్మని అతతడు సేవకుల్ని ఆజ్ఞాపించాడు. తన తండ్రి అయిన నెబుకద్నెజరు ఆ పాత్రల్ని యెరూషలేము ఆలయం నుంచి తీసుకువచ్చాడు. బెల్షెస్సరు తన సామంతులు, తన భార్యలు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్షామద్యం పానం చేయాలని కోరాడు.
DAN 5:3 కనుక యెరూషలేము ఆలయం నుంచి తెచ్చిన ఆ ప్రాత్రల్ని వారు తీసుకు వచ్చారు. రాజు మరియు అతని సామంతులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు ఆ పాత్రల్లో పానం చేశారు.
DAN 5:4 త్రాగుచూవారు బంగారం వెండి, కంచు, ఇనుము, కర్ర రాయి మొదలైన వాటితో తయారు చేయబడిన తమ దేవుళ్లను కీర్తించారు.
DAN 5:5 అప్పుడు ఉన్నట్టుండి, ఒక వ్యక్తి చేతి వ్రేళ్లు కనబడిగోడమీద వ్రాయసాగాయి. రాజగృహములో దీపం ప్రక్కగా గోడమీద ఆ చెయ్యి వ్రాసింది. ఆ చెయ్యి వ్రాస్తుండగా, రాజు చూశాడు.
DAN 5:6 రాజైన బెల్షెస్సరు భయభ్రాంతుడయ్యాడు, భయంవల్ల అతని ముఖం ఒకటి కొట్టుకొనసాగాయి. అతని కాళ్లు చాలా బలహీనంగా ఉండటంవల్ల, అతడు నిలబడలేక పోయాడు.
DAN 5:7 అప్పుడు ఇంద్రజాలకుల్ని, కల్దీయుల్ని, తన సమక్షమునకు తీసుకురావలసిందిగా కోరాడు. ఆ వివేకవంతులతో, “గోడమీద ఈ వ్రాతను చదివే ఏ వ్యక్తికైనా నేను బహుమతి ఇస్తాను, అతను దాని అర్థం కూడా తెలపాలి. ఊదారంగు వస్త్రాలు అతనికి బహుకరిస్తాను. అతని మెడలో ఒక బంగారు గొలుసు వేస్తాను. అతనిని రాజ్యంలో మూడవ ఉన్నత పరిపాలకునిగా చేస్తాను” అని చెప్పాడు.
DAN 5:8 అందువల్ల వివేకవంతులందరు లోనికి వచ్చారు. కాని వారు ఆ వ్రాతను చదవలేకపోయారు. దాని అర్థాన్నికూడా చెప్పలేకపోయారు.
DAN 5:9 బెల్షెస్సరు, అతని అధికారులు కలవరపడ్డారు. అతనికి చింత, భయం కూడా ఎక్కువయ్యాయి. ఆ భయంతో అతని ముఖం తెల్ల బోయింది.
DAN 5:10 విందు జరుగుతున్న ఆ ప్రదేశానికి రాజు యొక్క తల్లి వచ్చింది. ఆమె రాజు, అతని అధికారుల మాటలు విన్నది. “రాజా, నీవు చిరకాలం వర్ఖిల్లాలి. ఏమీ భయపడకు. భయంతో నీ ముఖం కలత చెంద నివ్వకు.
DAN 5:11 నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు. పవిత్ర దేవుళ్ల ఆత్మ అతనిలో ఉంది. నీ తండ్రి పరిపాలించే రోజుల్లో అతను రహస్య విషయాలు తెలుసుకోగలనని నిరూపించాడు. చాలా చురుగ్గా, వివేక వంతంగా ఉన్నట్లుగా కూడా అతను కనిపించాడు. ఇటువంటి విషయాల్లో అతను దేవతలవంటివాడు. నీ తండ్రి నెబుకద్నెజరు ఈ వ్యక్తిని వివేకవంతులందరికీ అధికారిగా నియమించాడు. అతను ఇంద్ర జాలకులందరికి, కల్దీయులందరికి ఆధిపత్యం వహించాడు.
DAN 5:12 నేను మాటలాడుతున్న వ్యక్తి వేరు దానియేలు. రాజు అతనికి బెల్తెషాజరు అని నామకరణం చేశాడు. బెల్తెషాజరు చాలా బుద్ధిమంతుడు. అతనికి చాలా విషయాలు తెలుసు. అతను కలయొక్క అర్ధాలు చెప్పగలడు. రహస్య విషయాలు వివరించగలడు. కఠినమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరం చెప్పగలడు. దానియేలును పిలిపించు. గోడమీది వ్రాతకుగల అర్థమేమిటో అతను చెప్పగలడు” అని ఆమె చెప్పింది.
DAN 5:13 అందువల్ల దానియేలును రాజు వద్దకు తీసుకు వచ్చారు. దానియేలుతో రాజు, “నీ పేరేనా దానియేలు, రాజైన మా తండ్రి యూదానుండి బందీగా తీసుకొని వచ్చినవాడవు నీవేనా?
DAN 5:14 నీలో దేవతల ఆత్మ ఉన్నదని నేను విన్నాను. నీవు చురుకైనవాడవనీ, చాలా వివేక వంతుడవనీ, రహస్యాలను నీవు అర్థం చేసుకో గలవనీ విన్నాను.
DAN 5:15 వివేకవంతుల్నీ ఇంద్రజాలకుల్నీ గోడమీది వ్రాత చదవటానికి నా వద్దకు తీసుకువచ్చారు. కాని వారు నాకు గోడమీది వ్రాతకుగల అర్థాన్ని తెలుప లేకపోయారు.
DAN 5:16 నేను నిన్ను గురించి విన్నాను. మర్మముల అర్థం ఏమిటో నీవు చెప్పగలవని విన్నాను. కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవని కూడా విన్నాను. గోడమీది వ్రాతను చదివి, దాని అర్థాన్ని నీవు వివరించగలిగితే, నీకు ఊదారంగుగల బట్టలు ధరింపజేస్తాను. నీ మెడకు బంగారు గొలుసు వేస్తాను. తర్వాత రాజ్యంలో నీవు మూడవ ఉన్నత పరిపాలకుడవు కాగలవు” అని అన్నాడు.
DAN 5:17 తర్వాత దానియేలు రాజుతో, “బెల్షెస్సరు రాజా, నీ కానుకలు నీవద్దనే ఉంచుకొనుము. లేకపోతో ఆ బహుమతుల్ని మరెవరికైనా ఇవ్వవచ్చు. కాని నీ కోసం నేను గోడమీది వ్రాతను చదువగలను. మరియు దాని అర్థమేమిటో నీకు వివరించగలను” అని చెప్పాడు.
DAN 5:18 “రాజా, సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరును మహా శక్తిమంతమైన రాజుగా చేశాడు. దేవుడు అతన్ని అతి ముఖ్యుడుగా చేశాడు.
DAN 5:19 పెక్కు దేశాలకు చెందిన ప్రజలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు నెబుకద్నెజరును చూచి భయపడుచుండిరి. ఎందు కంటే సర్వోన్నతుడైన దేవుడు అతన్ని అతి ముఖ్యుడైన రాజుగా చేసిన కారణంవల్ల. నెబుకద్నెజరు ఒక వ్యక్తిని చంపదలచినట్లయితే, అతనిని చంపేవాడు. ఒక వ్యక్తిని జీవింప తలచుకుంటే, అతణ్ణి జీవించేలా చేసేవాడు. మనుష్యుల్ని ముఖ్యులుగా చేయదలుచు కుంటే, ఆ మనుష్యుల్ని ముఖ్యులుగా చేసేవాడు. హీనులుగా చేయదలచుకుంటే, హీనులుగా చేసేవాడు.
DAN 5:20 “కాని నెబుకద్నెజరు గర్విష్ఠి అయినాడు, మొండి వాడయ్యాడు. అందువల్ల అతని నుండి అధికారం తీసుకొనబడింది. అతని రాజ సింహాసనం తొలగించబడింది. అతని ప్రభావం తొలగించబడింది.
DAN 5:21 అతని బుద్ధి జంతువుల బుద్ధివలె మారింది. అతను అడవిగాడిదలతో నివసించసాగాడు. ఎద్దువలె పచ్చిక మేసాడు. మంచువల్ల తడిసాడు. అతను పాఠం నేర్చు కొనే వరకు ఈ సంగతులు జరిగాయి. తర్వాత సర్వోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాల్ని పాలించు వాడని, తనకు నచ్చిన వానికి రాజ్యాలు అప్పగించ గలడని తెలుసుకొన్నాడు.
DAN 5:22 “నెబుకద్నెజరు కుమారుడవైన బెల్షెస్సరూ! ఈ విషయాలు నీకు ఇంతకు మునుపే తెలుసు,
DAN 5:23 అయినా నిన్ను నీవు తగ్గించుకొనలేదు. అందుకు బదులుగా నీవు పరలోకమందున్న ప్రభువుకు విరొధంగా హెచ్చించుకున్నావు. యెహోవా ఆలయం నుండి నీవు త్రాగే పాత్రలు నీ కోసం ఆజ్ఞాపించి తెప్పించావు. తర్వాత నీవు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, రాజో ద్యోగులు ఆ పాత్రలనుండి ద్రాక్షామద్యం పానం చేశారు. నీవు వెండి, బంగారు, కంచు, ఇనుము, రాయి, కర్రలతో చేయబడిన దేవుళ్లను కీర్తించావు. అవి నిజమైన దేవుళ్లు కావు. అవి చూడలేవు, వినలేవు, లేక ఏమీ అర్థం చేసుకోలేవు. కాని నీ జీవితం మీదను, నీవు చేసేవాటి మీదను, అధికారంగల దేవుణ్ణి నీవు గౌరవించలేదు.
DAN 5:24 ఆ కారణం వల్ల, దేవుడు గోడమీద వ్రాసే హస్తాన్ని పంపించాడు.
DAN 5:25 ఈ క్రింది మాటలే గోడమీద వ్రాయబడినవి: మెనే మెనే టెకేల్ ఊఫర్సీన్.
DAN 5:26 “ఈ మాటలకు అర్థం ఇది: మెనే: అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూసి దాన్ని ముగించాడు.
DAN 5:27 టేకల్: అనగా దేవుడు నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు.
DAN 5:28 ఊఫర్సిన్: అనగా నీ రాజ్యం నీ వద్దనుండి తీసి వేయబడి మాదీయులకూ పారసీకులకూ విభజింపబడింది.”
DAN 5:29 తర్వాత బెల్షెస్సరు ఊదారంగు బట్టలు దానియేలు ధరించేలా ఆజ్ఞ ఇచ్చాడు. అతని మెడకు బంగారు గొలుసు ధరింపజేశాడు. అతను రాజ్యంలో మూడవ గొప్ప పాలకుడని ప్రకటింపజేశాడు.
DAN 5:30 ఆ రాత్రే బబులోను రాజైన బెల్షెస్సరు హతుడయ్యాడు.
DAN 5:31 దర్యావేషు అనే పేరుగల మాదీయుడు క్రొత్తగా రాజు అయ్యాడు. దర్యావేషు సుమారు అరవై రెండు యేండ్లవాడు.
DAN 6:1 తన రాజ్యం అంతటినీ పరిపాలించేందుకు నూట ఇరవైమంది రాజ్యాధికారులను ఎంపిక చేయాలని దర్యావేషు తలంచాడు. అది మంచి ఆలోచన అను కొన్నాడు.
DAN 6:2 మరియు ఆ నూట ఇరవైమంది రాజ్యాధికారుల మీద ఆధిపత్యం గలవారుగా ముగ్గురిని ఎంపిక చేసాడు. ఆ ముగ్గురు ప్రధానులలో దానియేలు ఒకడు. ఎవ్వరూ తనను మోసగించ కూడదని ఆ ముగ్గురిపైన, మరి ఆ నూట ఇరవైమంది పైన దానియేల్ని అధికారిగా ఎంపిక చేశాడు. అందువల్ల తన రాజ్యంలో ఏమీ తాను నష్టపడేది ఉండదు.
DAN 6:3 రాజు దానియేలును మెచ్చు కొన్నాడు. తన మంచి ప్రవర్తన వల్లను, తన సామర్థ్యం వల్లను దానియేలుకు రాజు అలా చేయగలిగాడు. రాజు దానియేలు వశుడయ్యాడు. రాజ్యమంతతికీ దానియేలును పరిపాలకునిగా చెయ్యాలని తలంచాడు.
DAN 6:4 కాని ఈ విషయాన్ని వినగానే ఇతర ప్రధానులు, రాజ్యధి కారులు అసూయ చెందారు. దానియేలులో తప్పుపట్టేందుకు వారు కారణాలు వెదకసాగారు. కనుక రాజ్యంగురించి దానియేలు చేసే పనుల్ని వారు గమనించ సాగారు. కాని దానియేలులో ఏ తప్పూ వారు కనుగొన లేకపోయారు. ప్రజలు విశ్వసించదగిన వ్యక్తి దానియేలు. అతను రాజుని మోసగించలేదు. కష్టించి పని చేసాడు.
DAN 6:5 చివరికి వారు, “దానియేలుపై తప్పు పట్టేందుకు తగిన కారణం మనమెన్నటికీ కనుగొనలేము. అందువల్ల అతని దేవునికి సంబంధించిన ధర్మం గురించి మనం ఫిర్యాదు చేసేందుకు ఏదో ఒకటి కనుగొనాలి” అని అనుకొన్నారు.
DAN 6:6 అందువల్ల ఆ ఇద్దరు ప్రధానులు, రాజ్యాధికారులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లి, “దర్యావేషు రాజు వర్ధిల్లాలి.
DAN 6:7 ప్రధానులు, రాజ్యాధికారులు, ముఖ్యోద్యోగులు, సలహాదారులు, రాజ్యపాలకులు అందరూ ఒక విషయం సమ్మతించారు. రాజు ఈ చట్టం చెయ్యాలని, ఈ చట్టాన్ని ప్రతి వ్యక్తి పాటించాలని భావిస్తున్నాము. ఆ చట్టం ఇది: ఎవరైనా, రాజువైన నిన్ను తప్ప, వచ్చే ముఫ్పై రోజులదాకా, ఏ దేవున్నిగాని, వ్యక్తినిగాని ప్రార్థించినట్లయితే, ఆ వ్యక్తి సింహాల గుహలోకి త్రోసి వేయబడతాడు.
DAN 6:8 రాజా! ఆ చట్టం వ్రాసిన కాగితం మీద సంతకం పెట్టి ఈ విధంగా చట్టం మార్చరానిది, రద్దు చేయరానిది అని ప్రకటించాలి. ఎందుకంటే మాదీయుల మరియు పారసీకుల చట్టాలు మార్చరానివి లేక రద్దు చేయరానివి” అని చెప్పారు.
DAN 6:9 అందువల్ల దర్యావేషు చట్టాన్ని చేసి కాగితంపై సంతకం పెట్టాడు.
DAN 6:10 దానియేలు ప్రతిరోజూ మూడు సార్లు మోకరిల్లి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ఈ క్రొత్త చట్టం గురించి దానియేలు విని, తన ఇంటికి వెళ్లి, తన ఇంటిమీద ఉన్న గదిలో యెరూషలేము వైపుగా తెరచివున్న కిటికీ వద్ద ఎప్పుడూ చేసే విధంగా, మోకరిల్లి దేవుణ్ణి ప్రార్థించాడు.
DAN 6:11 అప్పుడు ఆ మనుష్యులు ఒక బృందంగా వెళ్లి దానియేలు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన సహాయం కోరుతున్నట్లు వారు కనుగొన్నారు. అందువల్ల వారు బృందంగా రాజు వదకు వెళ్లి, రాజు చేసిన చట్టం గురించి వారతనితో మాట్లాడారు.
DAN 6:12 వారు, “దర్యావేషు రాజా, మీరొక చట్టం జారీ చేశారు. దాని ప్రకారం వచ్చే ముఫ్పై రోజుల్లో ఎవరైనా మిమ్మల్ని కాక ఇతర దేవుణ్ణి గాని వ్యక్తిని గాని ప్రార్థించినట్లయితే, అతను సింహాల గుహలోకి త్రోసి వేయబడతాడు. ఆ చట్టం మీద నీవు సంతకం చేశావు. అవును గదా” అని జ్ఞాపకం చేశారు. “అవును, నేను ఆ చట్టం మీద సంతకం చేసి మాదీయుల, పారసీకుల చట్టాలు రద్దు చేయరానివి లేక మార్చరానివి” అని ప్రకటించానని రాజు బదులు చెప్పాడు.
DAN 6:13 అప్పుడు ఆ మనుష్యులు రాజుతో, “యూదా నుంచి తీసుకొని రాబడిన బందీలలో దానియేలు అనబడే ఆ వ్యక్తి మీ మాటలపట్ల శ్రద్ధ వహించ లేదు. మీరు చేసిన చట్టాన్ని పాటించ లేదు. ప్రతిరోజూ అతనింకా మూడుసార్లు తన దేవుని స్తుతిస్తున్నాడు” అని చెప్పారు.
DAN 6:14 ఇది వినగానే రాజు చాలా విచారించి, దానియేలును రక్షించడానికి నిశ్చయించాడు. దానియేలును కాపాడేందుకు సూర్యాస్తమయం వరకు ఒక ఉపాయం కోసం రాజు ప్రయత్నించాడు, కాని ప్రయోజనం లేకపోయింది.
DAN 6:15 తర్వాత ఆ మనుష్యులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లారు. “రాజా, గుర్తుంచుకో. మాదీయుల, పారసీకుల చట్టం చెబుతున్నదేమనగా, రాజు చేసిన చట్టాన్ని మార్చుటకు రద్దు చేయుటకు వీలులేదు” అని వారు చెప్పారు.
DAN 6:16 అందువల్ల రాజైన దర్యావేషు ఆజ్ఞ ప్రకారం దానియేలును తీసుకొని వచ్చి సింహాల గుహలోకి త్రోసివేశారు. రాజు దానియేలుతో ఇట్లన్నాడు: “నీవు నిరంతరం ఆరాధించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని భావిస్తున్నాను.”
DAN 6:17 ఒక పెద్ద బండను తీసుకువచ్చి, దానిని సింహాల గుహ యొక్క ద్వారం మీద ఉంచారు. తర్వాత రాజు తన ఉంగరంతోను, మరియు తన ఉద్యోగుల ఉంగరాలతోను ఆ బండమీద ముద్రలు వేశారు. ఎవ్వరూ బండను తొలగించి, దానియేలును సింహాల గుహనుంచి వెలుపలికి తీసుకు రాకూడదని ఇలా చేశారు.
DAN 6:18 తర్వాత దర్యావేషు రాజు తన ఇంటికి మరలి పోయాడు. ఆ రాత్రి రాజు భోజనం చేయలేదు. ఎవ్వరూ ఆ రాత్రి తనకు వినోదాన్ని కలిగించకూడదని అదేశించాడు. ఆ రాత్రంతా రాజు నిద్ర పోలేదు.
DAN 6:19 ఆ మరునాటి ఉదయం రాజైన దర్యావేషు వెలుతురు వస్తూండగా సింహాల గుహవద్దకు పరుగెత్తుకు వెళ్లాడు.
DAN 6:20 రాజు చింతాక్రాంతుడుగా సింహాల గుహవద్దకు వెళ్లి దానియేలును ఇలా పిలిచాడు: “సజీవుడగు దేవుని సేవకుడవైన దానియేలూ, నీవెప్పుడూ ఆరాధించే నీ దేవుడు నిన్ను సింహాల బారినుండి కాపాడగలిగెనా?”
DAN 6:21 “రాజా, నీవు చిరకాలము వర్ధిల్లాలి!
DAN 6:22 నా దేవుడు నన్ను రక్షించడానికి తన దూకను పంపి సింహాల నోళ్లను మూసివేశాడు. నా దేవునికి నేను కళంకరహితుణ్ణి అని తెలుసు, కనుకనే సింహాల నన్ను గాయపరచలేదు. రాజా, నీకెప్పుడూ నేను అన్యాయం చెయ్యలేదు”అని దానియేలు బదులు చెప్పాడు.
DAN 6:23 దర్యావేషు రాజు చాలా సంతోషించాడు. సింహాల గుహనుండి దానియేలును పైకి తీయవలసిందిగా రాజు తన సేవకుల్ని ఆజ్ఞాపించాడు. వారు గుహనుండి దానియేలుని పైకి తీయగా, వారతని దేహంమీద ఎలాంటి గాయాన్ని చూడలేదు. దానియేలు తన దేవున్ని విశ్వసించిన కారణంగా, అతనికి సింహాలవల్ల ఎలాంటి హాని జరగలేదు.
DAN 6:24 తర్వాత దానియేలుని సింహాల గుహకు పంపడానికి కారణమైన ఆ మనుష్యుల్ని తీసురురమ్మని రాజు ఆజ్ఞాపించాడు. సింహాల గుహలోకి ఆ మనుష్యులను, వారి భార్యలను, వారి సంతానాన్ని త్రోసివేయగా వారు సింహాల గుహ అడుగుభాగం తాకక ముందే సింహాలు వారి శరీరాలను కబళించి వారి ఎముకల్ని విరుగగొట్టాయి.
DAN 6:25 తర్వాత ప్రపంచమంతటా విభిన్న భాషలు మాట్లాడే ఆ మనుష్యులకందరికీ రాజైన దర్వావేషు ఈ క్రింది లేఖను వ్రాశాడు: అందురికి శుభమగు గాక!
DAN 6:26 నేనిప్పుడు క్రొత్త చట్టం చేస్తున్నాను. నా రాజ్యంలో ఏ భాగంలో నివసించే వారికైనా ఇది వర్తిస్తుంది. మీరందరూ దానియేలు యొక్క దేవునికి భయపడి వణకాలి. దానియేలు దేవుడే సజీవుడు. ఆయన ఎప్పుడూ జీవిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ నశించదు, ఆయన పరిపాలన అంతం కాదు.
DAN 6:27 దేవుడు ప్రజలకు సహాయం చేస్తాడు, రక్షిస్తాడు. ఆయన ఆశ్చర్యాలను, అద్భుతాలను పరలోక మందునూ, భూమి మీదనూ చేస్తాడు. దేవుడు దానియేలును సింహాలనుండి రక్షించాడు.
DAN 6:28 అందువల్ల దర్యావేషు రాజుగా ఉన్న కాలంలోనూ, పారశీకుడైన కోరెషు రాజుగావున్న కాలంలోనూ దానియేలు అభివృద్ధి చెందాడు.
DAN 7:1 బెల్షెస్సరు బబులోనుకు రాజుగా ఉన్న మొదటి సంవత్సరంలో, దానియేలు ఒక కలగన్నాడు. దానియేలు ఈ దర్శనాలు చూశాడు. అప్పుడతను తన పడకమీద పడుకునివున్నాడు. తాను కలగన్న విషయాల్ని దానియేలు వ్రాసాడు.
DAN 7:2 దానియేలు ఇలా చెప్పాడు: “నేను రాత్రివేళ ఒక దర్శనం చూశాను. అందులో నాలుగు వైపుల నుండి గాలి వీచింది. ఆ గాలులక సముద్రం అల్లకల్లోలంగా ఉండింది.
DAN 7:3 నేను నాలుగు పెద్ద మృగాల్ని చూశాను. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగా వున్నాయి. ఆ నాలుగు మృగాలు సముద్రం నుండి పైకి వచ్చాయి.
DAN 7:4 “మొదటి మృగము సింహంవలె ఉండింది. దానికి గ్రద్ద రెక్కలున్నాయి. ఆ మృగాన్ని గమనిస్తూండగా దాని రెక్కలు విరిచివేయబడ్డాయి. అది నేలనుండి పైకి ఎత్తబడి మనిషిలాగ రెండు కాళ్లమీద నిలబడింది. దానికి మానవుని మనస్సువంటి మనస్సు ఇవ్వబడింది.
DAN 7:5 “ఆ తర్వాత నా ఎదుట రెండవ మృగాన్ని చూశాను. ఇది ఎలుగుబంటివలె కనిపించింది. ఒక వైపుకి అది లేవనెత్తబడింది. దాని నోట్లో పళ్ల సందున మూడు ప్రక్క ఎముకలున్నాయి. పైకి లేచి, నీకు కావలసినంత మాంసం తిను” అని దానికి చెప్పబడింది.
DAN 7:6 “తర్వాత నేను చూడగా నా ఎదుట మూడవ మృగము ఉంది. ఇది చిరుతపులిలాగ ఉంది. దానివీపుమీద నాలుగు పక్షి రెక్కలున్నాయి. దీనికి నాలుగు తలలున్నాయి. పరిపాలించే అధికారం దానికి ఇవ్వబడింది.
DAN 7:7 “ఆ తర్వాత, నా దర్శనాలలో రాత్రివేళ చూస్తూండగా నా ఎదుట నాలుగవ మృగము ఉంది. ఇది చాలా ఘోరంగాను, భయంకరంగాను కని పించింది. అది మహా బలంగా ఉంది. దానికి ఇనుప పళ్లు ఉన్నాయి. ఈ మృగం ముక్కలుగా చీల్చి మ్రింగుచూ మిగిలిన దాన్ని తన కాళ్ల క్రింద త్రొక్కుచుండినది. అంతకు మునుపు నేను చూసిన ఇతర మృగాలకంటె ఈ నాలుగవ మృగం భిన్నంగా ఉంది. దీనికి పది కొమ్ములున్నాయి.
DAN 7:8 “ఈ కొమ్ముల విషయం నేను తలస్తూండగా వాటిమధ్యలో ఒక చిన్న కొమ్ము పైకి వచ్చింది. దాని స్థానంలో మొదట ఉన్న మూడు కొమ్ములు కుదురుతో సహా పెరికి వేయబడ్డాయి. ఈ చిన్న కొమ్ముమీద మానవ కళ్లలాంటి కళ్లు, డంబాలు పలికేనోరు దానికి ఉన్నాయి.
DAN 7:9 “నేను చూస్తూండగా సింహాసనాలు వేయబడ్డాయి. మరియు ప్రాచీన రాజు తన సింహాసనమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన వస్త్రాలు మంచులా తెల్లగాను, ఆయన తల వెంట్రుకలు స్వచ్చమైన ఉన్నివలె తెల్లగా ఉండినవి. ఆయన సింహాసనం అగ్ని జ్వాలలతోను, ఆ సింహాసనపు చక్రాలు మంటల తోను మండుచున్నవి.
DAN 7:10 ఆయన ఎదుట నుండి అగ్ని ప్రవాహము బయలు వెళ్లింది. కోట్లకొలది ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు. కోట్లకొలది ఆయన ఎదుట నిలబడ్డారు. తీర్పుకై ఆయన న్యాయసభకు కూర్చుండగా గ్రంథాలు తెరువబడ్డాయి.
DAN 7:11 “చిన్న కొమ్ము గర్వపు మాటలు మాట్లాడుచున్న శబ్ధం విని అటు చూశాను. నేను చూస్తుండగా ఆ నాలుగవ మృగం చంపబడింది. దాని శరీరం నాశలం చేయబడింది.
DAN 7:12 మిగిలిన మృగాల అధికారం వాటినుండి తీసివేయబడింది. కాని కొంతకాలంపాటు అవి నివసించి ఉండడానికి అనుమతి ఇవ్వబడింది.
DAN 7:13 “రాత్రి దర్శనాలలో, మానవ కుమారుని పోలిన ఒక వ్యక్తి రావటం నేను చూశాను. ఆయన ఆకాశంలోని మబ్బులమీద ప్రాచీన రాజు వద్దకు వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు.
DAN 7:14 “మానవ కుమారునివలె కనిపించిన ఆ వ్యక్తికి అధికారం, ప్రభావం, సంపూర్ణ పరిపాలనాధికారం ఇవ్వబడ్డాయి. అందును బట్టి ప్రజలందరు, దేశాలు, ప్రతి భాషకు చెందినవారు ఆయన్ని సేవిస్తారు. ఆయన పరిపాలన ఎప్పటికీ ఉంటుంది. ఆయన రాజ్యం ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. అది ఎన్నటికీ అంతం కానిది.
DAN 7:15 “దానియేలు అను నేను నా ఆత్మలో చింతించాను. నేను చూసిన దర్శనాలు నన్ను కలవరబెట్టాయి.
DAN 7:16 అక్కడ నిలబడిన ఒకనిని నేను సమీపించి ఇదంతా ఏమిటని నేను అతన్ని అడిగాను.
DAN 7:17 అందువల్ల, అతను వాటి అర్థాలేమిటో వివరించి చెప్పాడు, ‘నాలుగు మృగాలు నాలుగు రాజ్యాలు. ఆ నాలుగు రాజ్యాలు భూమిమీద ఉద్భవిస్తాయి.
DAN 7:18 కాని మహోన్నతుడైన దేవుని ప్రత్యేక జనులే ఆ రాజ్యాన్ని పొందుతారు. వారా రాజ్యాన్ని ఎల్లప్పుడూ కలిగియుంటారు.’
DAN 7:19 “తర్వాత ఆ నాలుగవ మృగం దాని అర్థం తెలుసుకోదలచాను. మిగిలిన మృగం భిన్నమైంది, మహా భయంకరంగా ఉండిది. దానికి ఇనుప పళ్లు, కంచు గోళ్లు ఉన్నాయి. అది తన బలి పశువుల్ని అన్నింటిని చీల్చి తిని, మిగిలినదాన్ని కాళ్ల క్రింద త్రొక్కి వేసింది.
DAN 7:20 నాలుగవ మృగం తలమీదవున్న పది కొమ్ములు గురించి తెలుసు కోవాలను కున్నాను. అక్కడ పెరిగిన చిన్న కొమ్ము గురించి తెలుసుకోదలిచాను. వాటిలో మూడు కొమ్ముల్ని చిన్న కొమ్ము పెరికివేసింది. ఇతర కొమ్ముల కంటె చిన్న కొమ్ము గొప్పదిగా, నీచంగా కనిపించింది. అది మానవ కన్నుల లాంటి కన్నులు కలిగియుండినది. అది డంబములు పలుకుతూనే ఉండినది.
DAN 7:21 నేనది గమనిస్తూండగా, ఈ చిన్న కిమ్ము దేవుని ప్రత్యేక జనుల్ని ఎదిరించి వారితో యుద్ధం చేయసాగింది.
DAN 7:22 మరియు ఆ కొమ్ము వారిని చంపుతూ ఉండెను. ప్రాచీన రాజు వచ్చి, న్యాయవిచారణ చేసేంతవరకు అది దేవుని ప్రత్యేక జనుల్ని చంపుచుండెను. ప్రాచీన రాజు చిన్న కొమ్ముని గురించి తీర్పు ప్రకటించాడు. ఆ తీర్పు దేవుని ప్రత్యేక జనులకు సహాయము చేసింది. మరియు వారు రాజ్యమును స్వీకరించే సమయము వచ్చింది.
DAN 7:23 “అతను నాకిది వివరించాడు: ‘భూమిమీద అవ తరించి నాలుగవ రాజ్యమే ఆ నాలుగవ మృగం. అది యితర రాజ్యాలకు భిన్నంగా వుంటుంది. ఆ నాలుగవ రాజ్యం ప్రపంచమంతట వుండే ప్రజల్ని తన వశం చేసుకొంటుంది. ప్రపంచంలో వుండే రాజ్యాలను అణిచివేస్తుంది.
DAN 7:24 ఈ నాలుగవ రాజ్యం నుండి వచ్చే పదిమంది రాజులే పది కొమ్ములు. ఆ పదిమంది రాజులు పొయిన తర్వాత, మరొక రాజు వస్తాడు. తనకు పూర్వం పరిపాలించిన రాజులకంటె ఈ రాజు భిన్నంగా ఉంటాడు. ఇతర ముగ్గరు రాజుల్ని అతను జయిస్తాడు.
DAN 7:25 ఈ ప్రత్యేక రాజు సర్వోన్నతుడైన ఆ దేవునికి విరుద్ధంగా మాట్లాడు తాడు. ఆ రాజు దేవుని ప్రత్యేక జనుల్ని గాయపరచి చంపివేస్తాడు. అంతకు పూర్వమే వున్న సమయాలను చట్టాలను మార్చివేయడానికి అతను ప్రయత్నిస్తాడు. దేవుని ప్రత్యేక జనులు ఆ రాజు ఆధిపత్యంలో మూడున్నర సంవత్సరాలుంటారు.
DAN 7:26 “‘కాని ఏమి జరగవలెనో, (దేవుని) న్యాయ స్థానమే నిర్ణయిస్తుంది. మరియు ఆ రాజుయొక్క అధికారము తీసివేయ బడుతుంది. వాని రాజ్యం సమూలంగా నాశనమవుతుంది.
DAN 7:27 తర్వాత దేవుని ప్రత్యేక జనులు రాజ్యాన్ని పరిపాలిస్తారు. వారు భూమిమీద సర్వరాజ్యాలను పాలిస్తారు. ఈ రాజ్యం ఎన్నటికీ ఉంటుంది. ఇతర రాజ్యాలకు చెందిన ప్రజలు వారిని గౌరవిస్తారు, సేవిస్తారు.’
DAN 7:28 “ఇదే కలయొక్క ముగింపు. దానియేలు అను నేను చాలా భయపడితిని. ఆ భయంవల్ల నా ముఖం పాలిపోయింది. మరియు నేను చూసిన, విన్న విషయాలను నా మనస్సులో ఉంచుకొంటిని.”
DAN 8:1 బెల్షస్సరు రాజుగా ఉన్న మూడవ సంవత్సరంలో, నాకు ఈ దర్శనము కనిపించింది. ఇది మొదటి దర్శనానికి తర్వాత వచ్చింది.
DAN 8:2 ఆ దర్శనంలో నేను షూషనులో ఉన్నట్లు చూశాను. ఏలాం రాష్ట్రంలో షూషను ఒక రాజధాని నగరం. నేను ఊలయి నది ప్రక్క నిలబడి ఉన్నాను.
DAN 8:3 నా కన్నులెత్తి ఊలయి నదికి ప్రక్కగా ఒక పొట్టేలు నిలబడి ఉండడం చూశాను. ఆ పొట్టేలుకి రెండు పొడుగాటి కొమ్ములుండెను. కాని ఒకటి మరొకదాని కంటె పొడుగైనది. పొడుగాటి కొమ్ము తర్వాత పుట్టింది.
DAN 8:4 ఆ కొమ్ములతో పొట్టేలు పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి పరుగెత్తడం చూశాను. ఏ మృగమూ పొట్టేలుని ఎదురించలేక పోయింది. మరియు ఎవ్వరూ దీనినుండి ఇతర జంతువుల్ని కాపాడలేక పోయారు. ఆ పొట్టేలు చేయదలచిందంతా చేస్తూంది. అందువల్ల పొట్టేలు చాలా శక్తివంత మయింది.
DAN 8:5 నేను ఆ పొట్టేలు గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఒక మేకపోతు పడమర నుండి రావడం చూశాను. అది భూమి అంతటా చుట్టి వచ్చింది. దాని కాళ్లు భూమిని కూడా తాకలేదు. ఈ వేకపోతుకు ఒక పెద్ద కొమ్ము దాని కళ్ల మధ్యన ఉంది.
DAN 8:6 ఆ మేకపోతు ఊలయి నదికి ప్రక్కగా నిలబడివున్న రెండు కొమ్ములు గల పొట్టేలు వద్దకు వచ్చింది. మేకపోతు చాలా కోపంగా ఉంది.
DAN 8:7 మేకపోతు పొట్టేలువైపు పరుగెత్తి చాలా కోపంతో కలబడి పొట్టేలు రెండు కొమ్ముల్ని విరుగ కొట్టింది. మేకపోతును పొట్టేలు ఎదిరించలేకపోయింది. మేకపోతు పొట్టేలుని నేలకు పడవేసి దాన్ని త్రొక్కివేసింది. ఆ మేకపోతు నుండి పొట్టేలుని కాపాడగలిగిన వారెవ్వరూ లేకపోయిరి.
DAN 8:8 అందువల్ల మేకపోతు చాలా బలంగా పెరిగింది. కాని అది శక్తివంతంగా వున్నప్పుడు, దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది. తర్వాత ఆ పెద్ద కొమ్ము స్థానంలో నాలుగు వేరే కొమ్ములు మొలిచాయి. ఆ నాలుగు కొమ్ములు ఆకాశపు నాలుగు దిక్కులలో పెరిగాయి.
DAN 8:9 తర్వాత ఆ నాలుగు కొమ్ములలో ఒకదాని నుండి ఒక చిన్న కొమ్ము పెరిగి బాగా పెద్దదయింది. అది దక్షిణ దిక్కుగా, తూర్పు దిక్కుగా, సుందర దేశం దిక్కుగా పెరిగింది.
DAN 8:10 ఆ చిన్నకొమ్ము బాగా పెద్దదయి ఆకాశాన్ని అంటేంత వరకు పెరిగింది. అది నక్షత్రాల్ని కూడా క్రిందికి త్రోసి కాళ్ల క్రింద త్రొక్కి వేసింది.
DAN 8:11 ఆ చిన్న కొమ్ము బాగా గర్వించి ఆ నక్షత్రాల సైన్యాధి పతికి ఎదురు తిరిగింది. అది పరిపాలకుని అనుదిన బల్యర్పణాన్ని ఆపివేసి. ఆయన ఆలయాన్ని పడగొట్టింది.
DAN 8:12 తిరుగుబాటు జరిగినందున (పరిశుద్ధుల) సైన్యం మరియు అనుదిన బలి దాని వశం చేయ బడ్డాయి. సత్యం నేలకు అణచి వేయబడింది. చేసిన ప్రతి దానిలో అది బాగా అభివృద్ధి చెందింది.
DAN 8:13 అంతట ఒక పరిశుద్ధుడు మాట్లాడటం విన్నాను. ఇంకొక పరిశుద్ధుడు మొదటి వానిని ఇలా అడిగాడు: “ఈ దర్శనం నెరవేరటానికి ఎంత కాలం పడుతుంది? అనుదిన బలిని గూర్చిన దర్శనం, నాశనం కలిగించు తిరుగుబాటు, పరిశుద్ధ స్థలం మరియు పరిశుద్ధుల సైన్యం కాళ్ల క్రింద త్రొక్కబడటం ఇవన్నియు నెరవేరటానికి ఎంతకాలము పడుతుంది?”
DAN 8:14 అతడు నాతో ఇలా అన్నాడు: “దానికి రెండువేల మూడువందల రోజులు పడుతాయి. అప్పుడు పవిత్ర స్థలం తిరిగి పరిశుద్ధం చేయబడుతుంది.”
DAN 8:15 దానియేలు అను నేను ఈ దర్శనం చూశాను. అది యేమిటో తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తూండగా మానవుని వంటి ఒకతను నా ఎదుట నిలిచాడు.
DAN 8:16 తర్వాత ఒక మనిషి స్వరం ఊలయి నదిమీది నుంచి వినవచ్చింది, “గాబ్రియేలూ, ఈ దర్శనమును ఈ వ్యక్తికి వివరింపుము.”
DAN 8:17 నేను నిలుచుండిన స్థలానికి గాబ్రియేలు రాగా నేను భయభ్రాంతుడనై నేలమీద సాష్టాంగపడ్డాను. గాబ్రియేలు దూత నాతో, “మానవపుత్రుడా!, ఈ దర్శనం అంత్యకాలానికి సంబంధించిందని తెలుసు కొనుము” అని చెప్పాడు.
DAN 8:18 గాబ్రియేలు దూత నాతో మాటలాడుతూ ఉండగా, నేను నేలమీద సాష్టాంగపడి, గాఢనిద్ర పోయాను. అప్పుడు అతను నన్ను తాకి పైకి లేవనెత్తాడు.
DAN 8:19 గాబ్రియేలు దూత ఇలా చెప్పాడు: “శ్రమకాలపు చివరిలో ఏమి జరుగుతుందో నీకు ఇప్పుడు చెపుతాను. ఈ దర్శనం నియమించబడిన అంత్యకాలానికి సంబంధించింది అని అన్నాడు.
DAN 8:20 “రెండు కొమ్ములు గల పొట్టేలును నీవు చూశావు. ఆ కొమ్ములు మాదీయ, పారసీన దేశాలు.
DAN 8:21 బొచ్చుగల మేకపోతు గ్రీకు రాజు, దాని కళ్ల మధ్యవున్న పెద్ద కొమ్ము మొదటి రాజు.
DAN 8:22 ఆ కొమ్ము విరిగి పోయింది. ఆ స్థానంలో నాలుగు కొమ్ములు మొలిచాయి. ఆ కొమ్ములు మొదటి రాజు సామ్రాజ్యంనుంచి చీలిన నాలుగు రాజ్యాలు. కాని ఆ నాలుగు రాజ్యాలు మొదటి రాజువలె బలిష్ఠంగా ఉండవు.
DAN 8:23 “ఆ రాజ్యాలకు అంతం సమిపించే సమయాన, వారి దుష్టత్వం నిండినప్పుడు, మొండితనపు ముఖముగలిగి జిత్తులమారి అయిన ఒక రాజు లేస్తాడు. ఈ రాజు తన శక్తి వల్ల కాకుండానే మహా శక్తిమంతుడవుతాడు.
DAN 8:24 ఇతడు భయంకరమైన నాశనాన్ని తెస్తాడు. ఇతడు చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. అతను శక్తిమంతులైన మనుష్యుల్ని చివరికి దేవుని ప్రత్యేక జనుల్ని కూడా నాశనం చేస్తాడు.
DAN 8:25 “ఈ రాజు చాలా మోసగాడు, జిత్తులమారి అయివుండి, తన యుక్తి ఉపయోగించి, వంచనతో గెలుపొందుతారు. తాను అతి ముఖ్యుడనని భావిస్తాడు. ప్రజలు క్షేమంగా ఉన్నా మని తలస్తూన్నప్పుడు ఇతడు చాలా మందిని, రాజధి రాజును సహితం ఎదిరిస్తాడు. అయినా ఇతడు నాశనం చేయబడతాడు, కాని మానవ శక్తివల్ల కాదు.
DAN 8:26 “ఆ కాలాన్ని గురించి నీకివ్వబడిన దర్శనం నిజమైంది. కాని ఆ దర్శనానికి ముద్ర వేయి. ఎందుకనగా అది అంత్యకాల సంబంధమైనది.”
DAN 8:27 దానియేలు అను నేను అలసిపోయి చాలా రోజలు జబ్బు పడ్డాను. రాజుకు పనిచేసే నిమిత్తం నేను మరల లేచి వెళ్ళాను. కాని నేను ఆ దర్శనాన్ని తలంచుకుని కలతచెందాను. కాని దాని అర్థమేమిటో నాకు తెలియలేదు.
DAN 9:1 మాదీయుడైన అహష్వేరోషు కుమారుడగు దర్వావేషు బబులోను రాజ్యానికి రాజైన మొదటి సంవత్సరంలో జరిగిన సంగతి ఇది.
DAN 9:2 దర్వావేషు రాజుగా ఉండిన మొదటి సంవత్సరంలో, దానియేలు అను నేను, దేవుని ప్రవక్త అయిన యిర్మియా ద్వారా వ్రాయించిన సంగతిని గ్రహించాను. ఏమనగా యెరూషలేము డెబ్బై సంవత్సరాలు పాడుబడినదిగా ఉండవలసిన సమయము పూర్తి అవుతూందని గ్రహించాను.
DAN 9:3 తర్వాత నేను గోనెపట్ట ధరించి, బూడిదలో కూర్చుని ఉపవాస ముండి నా ప్రభువైన దేవునికి నా మనవిని ప్రార్థన విజ్ఞాపన ద్వారా తెలియ పర్చుకొన్నాను.
DAN 9:4 నా దేవుడైన యెహోవాకు ప్రార్థించి నా పాపములన్నిటినీ ఒప్పు కొన్నాను. “ప్రభువా! నీవు భయంకరుడవైన మహా దేవుడవు. నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞలకు లోబడే ప్రజల పట్ల నీ ఒడంబడికను నెరవేరుస్తావు.
DAN 9:5 “ప్రభువా! మేము పాపాలు చేశాము. మేము చెడ్డ పనులు చేసి నీకు విరుద్ధంగా ప్రవర్తించాము. మేము నీ ఆజ్ఞలకు, నీ విధులకు అవిధేయులమయ్యాం.
DAN 9:6 ప్రవక్తలు నీ తరపున మా రాజులతోను, నాయకులతోను, మా తండ్రులతోను, దేశంలోని ప్రజలందరితో మాట్లాడారు. మేము నీ సేవకులైన ప్రవక్తల మాటలు వినలేదు.
DAN 9:7 “ప్రభువా, నీపు నీతిమంతుడవు. మేము అనగా యూదా, యెరూషలేము ప్రజలు, మా పితరులు నీకు ద్రోహము చేసిన కారణాన దూర, సమీప దేశాలకు చెదర గొట్టబడిన ఇశ్రాయేలు వారమైన మేము ఈ దినాన సిగ్గు పడవలసిన వారమైయున్నాము.
DAN 9:8 “ప్రభువా! మా రాజులు, నాయకులు, మా పూర్వీకులు నీకు విరోధంగా పాపం చేసినందువల్ల మేము సిగ్గుపడ వలసిన వారమైతిమి.
DAN 9:9 “ప్రభవు దయామయుడు, క్షమాపణా స్వభావం గలవాడు. అయినను మేము నిజంగానే నీకు విరుద్ధంగా పాపం చేశాము.
DAN 9:10 మేము మా దేవుడైన యెహోవా మాటలు పాటించలేదు. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా మాకు ప్రసాదించిన ఆ చట్టాలను అతిక్రమించాము.
DAN 9:11 ఇశ్రాయేలు ప్రజలు నీ బోధనలకు విధేయులు కాకుండా వారందరూ నీకు విముఖులయ్యారు. దేవుని సేవకుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన శాపాలు, ప్రమాణాలు మా మీద క్రుమ్మరించ బడ్డాయి. ఎందుకంటే మేము నీ ఎడల పాపం చేశాము
DAN 9:12 దేవుడు మాకును, రాజులకును విరోధంగా పలికిన మాటలు మా ఎడల జరిగేటట్లు చేశాడు. ఎలాగనగా ఆకాశం క్రింద ముందెన్నడూ జరుగని మహావిపత్తును యెరూషలేము ఎడల జరిగించుట ద్వారా మాపై ఈ శిక్షను విధించాడు.
DAN 9:13 ఆ భయంకర విషయములన్నీ మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగానే మా మీద జరిగాయి. మేము మా పాపాలు మాని, అయన సత్యాన్ననుసరించి నడుచుకొని, ప్రభువు దయను పొందేటట్లు ప్రయత్నించలేదు.
DAN 9:14 ప్రభువు మా మీద నాశనాన్ని రప్పించటానికి వెను కాడలేదు. ఎందుకంటే మా దేవుడైన ప్రభువు ఈ కార్యాలన్నిటిలో నీతిమంతుడు. కాని మేము ఆయనకు విధేయులం కాలేదు.
DAN 9:15 “మా దేవుడవైన యెహోవా, నీవు నీ మహాశక్తివల్ల నీ ప్రజల్ని ఈజిప్టునుండి వెలుపలికి తెచ్చావు. అందు వలననే నీవీ నాటికినీ నీ నామాన్ని గొప్పదిగా చేశావు. కాని మేము చెడుగా ప్రవర్తించి పాపం చేశాము.
DAN 9:16 దేవా, నీ నీతి క్రియలను దృష్టిలో సుంచుకొని, పరిశుద్ధ పట్టణం పట్ల, యెరూషలేం పట్ల నీ కోపాన్ని మానుము. మా పాపాల వల్ల, మా పూర్వీకుల అపరాధాల వల్ల యెరూషలేము, నీ ప్రజలు మా పొరుగువారి మధ్యలో అవమానం పాలైరి.
DAN 9:17 “కాబట్టి మా దేవా! ఇప్పుడు, నీ సేవకుడనైన నా ప్రార్థన, మనవి ఆలకించుము. నీ నామం కొరకు, ప్రభువా! నీ ముఖకాంతి పాడుబడిన పరిశుద్ధ స్థలం మీద ప్రకాశించుగాక!
DAN 9:18 నా దేవా, నీ చెవి వంచి నా ప్రార్థన వినుము! నీ కన్నులు తెరిచి, పాడుబడిన మా పైన, నీ పేరు పెట్టబడిన నగరము పైన నీ దృష్టినుంచుము. మేము నీతి మంతులమని కాదుగాని, నీవు కృపామయుడవని నీకు మొర పెట్టుచున్నాము.
DAN 9:19 ప్రభువా! నా మొర ఆలకింపుము. ప్రభువా మమ్ము మన్నించుము. ప్రభువా, మా ప్రార్థన విని, సహాయం చేయుము. నా దేవా! ఆలస్యం చేయవద్దు. నా దేవా, నీ నామ మహిమ కొరకు నీ పట్టణం, నీ ప్రజలు నీ పేరును ధరించియున్నారు.”
DAN 9:20 నేనింకా మాట్లాడుచూ, ప్రార్థిస్తూ, నా పాపాన్ని గురించి, ఇశ్రాయేలు పాపాలను గురించి ఒప్పుకుంటూ ఉంటిని. నా దేవుని పరిశుద్ధ పర్వతాన్ని గురించి ప్రభువైన నా దేవునికి ప్రార్థిస్తూ ఉంటిని.
DAN 9:21 నేను ప్రార్థన చేస్తూ ఉండగా నా దర్శనంలో ఇంతకు ముందు నేను చూసిన గాబ్రియేలు దూత త్వరగా సాయంకాలపు బలియర్పణ సమయాన వచ్చాడు.
DAN 9:22 అతడు వచ్చినాతో ఇలా చెప్పాడు: “దానియేలూ, నేను నీకు వివేకము, గ్రహింపు ఇవ్వడానికి వచ్చాను.
DAN 9:23 నీవు ప్రార్థన చేయడానికి మొదలు పెట్టినప్పుడు దాని సమాధానం నాకు యివ్వబడింది. దాన్ని నేను నీకు చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నీవు దేవునికి ప్రియమైన వాడవు. కాబట్టి నా మాట విని దర్శనాన్ని అర్థము చేసికొనుము.
DAN 9:24 “నీ ప్రరజలకు నీ పవిత్ర నగరానికి డెబ్బై వారాల గడువు ఇవ్వబడింది: అనగా అతిక్రమాన్ని ముగించటానికి, పాపాన్ని అంతం చేయటానికి, అపరాధాన్ని ప్రాయశ్చిత్తం చేయటానికి, నీతిని శాశ్వతంగా తేవటానికి, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించటానికి మరియు పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించటానికి డెబ్బై వారాలు పడుతుంది.
DAN 9:25 “కాబట్టి ఈ విషయం తెలుసుకొని గ్రహించు కొనుము- యెరూషలేమును తిరిగి కట్టమని సందేశం బయలు వెళ్లిన సమయంనుండి, అభిషేకింప బడిన రాజు వచ్చేవరకు ఏడు వారాలు అవుతుంది. అరవైరెండు వారాలలో యెరూషలేము రాజవీధులతోను, కందకములతోను మరల కట్టబడుతుంది, కాని కష్ట సమయాల్లో అది కట్టబడుతుంది.
DAN 9:26 అరవై రెండు వారాల తర్వాత అభిషేకింపబడిన రాజు చంప బడుతాడు. అప్పుడు రాబోయే రాజుయొక్క ప్రజలు నగరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని నాశనం చేస్తారు. దాని అంతం ఒక ప్రళయంతో వస్తుంది. అంతం వరకు యుద్ధం కొనసాగుతుంది. నాశనాలు జరగటానికి ఆజ్ఞాపించబడ్డాయి.””
DAN 9:27 “ఒక వారంపాటు రాబోయే రాజు చాలామందితో ఒక స్థిరమైన ఒప్పందం చేస్తాడు. అర్దవారం బలి అర్పణలు నిలుపు చేస్తాడు. అసహ్య కార్యాలు జరిగించే (దేవాలయములో) నాశనకారుడు ఒకడు వస్తాడు. ఆజ్ఞా పించబడిన అంతము ఈ నాశనకారుని మీద క్రుమ్మరించ బడేవరకు ఈ విధముగా జరుగుతుంది”
DAN 10:1 పారసీక రాజగు కోరషు పాలన మూడవ సంవత్సరంలో, బెల్తెషాజరు అను ఒక విషయం దానియేలుకు తెలియపర్చబడింది. అది యుద్ధమును గూర్చిన నిజ సంగతి. ఇది దర్శనం ద్వారా దానియేలుకు బయలుపడింది గనుక అతడు గ్రహించాడు.
DAN 10:2 ఆ దినాల్లో దానియేలు అను నేను మూడు వారాలు దుఃఖాక్రాంతుడనయ్యాను.
DAN 10:3 ఆ మూడు వారాల్లో, నేను ఎలాంటి పుష్ఠికరమైన ఆహారాన్ని భుజించలేదు, మాంసాన్ని, ద్రాక్షారసాన్ని తీసుకోలేదు, తలకు నూనె రాసుకోలేదు.
DAN 10:4 మొదటి నెల ఇరవై నాల్గవ రోజున, గొప్ప నది అయిన టెగ్రిసు (హిద్దెకెలు) నది గట్టుమీద నేను నిలబడి ఉన్నాను.
DAN 10:5 నేనక్కడ నిలబడి కన్నులెత్తి చూస్తూండగా ఒక వ్యక్తి నార బట్టలు ధరించుకొని, నడుము చుట్టూ మేలిమి బంగారపు దట్టి ధరించుకొని యున్నాడు.
DAN 10:6 ఆయన శరీరం గోమేధికం వలె పసుపు గాను, ముఖం మెరుపులవె ప్రకాశవంతంగాను, కళ్లు ప్రకాశిస్తున్న దీపాల వలె కనిపించాని. చేతులూ, కాళ్లూ మెరుస్తున్న కంచువలెను, మాటల శబ్ధం నర సమూహపు కంఠధ్వని వలెను ఉన్నాయి.
DAN 10:7 దానియేలు అను నేనొక్కడనే ఆ దర్శనం చూశాను. నా వెంట నున్న మనుష్యులు ఆ దర్శనం చూడలేదు. కాని వారు భయంతో వణుకుచూ పారిపోయి దాగుకొన్నారు.
DAN 10:8 అందువల్ల నేను ఒంటరి వాడనై, ఆ గొప్ప దర్శనాన్ని చూచి, నాలో బలము లేనివాడనయ్యాను. మృతుడైన వాని ముఖంవలె నా ముఖం పాలిపోయి బలం లేని వాడనయ్యాను.
DAN 10:9 దర్శనంలో కనిపించిన వ్యక్తి మాటలాడడం విన్నాను. ఆయన మాటలాడడం వినగా, నేను గాఢనిద్ర పొందిన వాడనె నేలమీద సాష్టాంగ పడ్డాను.
DAN 10:10 అప్పుడు ఒక చెయ్యి నన్ను తాకి, వణుకుచున్న నా చేతులను, మోకాళ్లను బలపరచి నన్ను నిలువ బెట్టింది.
DAN 10:11 అతడు నాతో, “బహు ప్రియుడవైన దానియేలూ! నేను నీతో చెప్పు మాటల్ని జాగ్రత్తగా వినుము. సరిగా నిలువ బడు. నేను నీ కోసమే నీ యొద్దకు పంపబడ్డాను” అని అన్నాడు. అతడు నాతో ఈ మాట చెప్పుచుండగా వణకుతూ నేను నిలబడ్డాను.
DAN 10:12 అప్పుడు అతడు నాతో, “దానియేలూ, భయపడకు. నీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని గ్రహించటానికి నీ మనస్సు నిలుపుకొన్న ఆ మొదటి రోజునుండి నీ మాటలు వినబడ్డాయి. నీవు ప్రార్థింస్తూన్నందువల్లనే నేను నీ వద్దకు వచ్చాను.
DAN 10:13 పారసీక రాజ్యాధిపతి ఇరవై యొక్క రోజులు నన్ను అడ్డగించాడు. కాని ప్రధాన దూతలలో ఒకడైన మిఖాయేలు నా సహాయం కోసం వచ్చాడు. అతన్ని నేను పారసీక రాజ్యాధి పతియొద్ద విడిచి వచ్చాను.
DAN 10:14 అంత్య దినాల్లో నీ జనులకు జరుగబోయే సంగతుల్ని నీకు తెలియ జేయటానికి నేను వచ్చాను. ఈ దర్శనం రాబోయే దినాలకు సంబధించింది” అని చెప్పాడు.
DAN 10:15 అతడు అలా మాటలాడుతూ ఉండగా, నా ముఖము నేలకు వంచి నేను మౌనంగా ఉంటిని.
DAN 10:16 మానవ పుత్రులను పోలిన ఒకతను నా పెదవులు తాకాడు. నేను నా నోరు తెరిచి, మాటలాడటానికి ప్రారంభించాను. నేను నా ఎదుట నిలబడిన ఆ వ్యక్తితో, “అయ్యా, దర్శనంలో కనిపించిన వాటివల్ల బాధనొంది బలము లేని వాడనయ్యాను.
DAN 10:17 అయ్యా! నీ సేవకుడనైన నేను నీతో ఎలా మాట్లాడగలను? నా బలంపోయింది. నాకు ఊపిరి ఆడనట్లయింది” అని అన్నాను.
DAN 10:18 మానవునిలా కనిపించిన ఆ వ్యక్తి మళ్లీ నన్ను ముట్టి, బలపరిచాడు.
DAN 10:19 అతడు నాతో, “బహు ప్రాయుడవయిన మనుష్యుడా! భయపడవద్దు. నీకు శాంతి కలుగునుగాక! శక్తివంతుడవై ధైర్యంగా ఉండు” అని అన్నాడు. అతడు మాటలాడగానే నేను బలం పొంది ఇలాగన్నాను: “అయ్యా, నాకు నీవు శక్తినిచ్చావు. ఇప్పుడు నీవు మాట్లాడవచ్చును.”
DAN 10:20 అప్పుడు అతను, “దానియేలూ, నేను ఎందుకు నీవద్దకు వచ్చానో నీకు తెలుసా? నేను త్వరగా మరలి పోయి పారసీక రాజ్యాధిపతితో యుద్ధం చేయాలి. నేను వెళ్లినప్పుడు, గ్రీకు యువరాజు వస్తాడు.
DAN 10:21 సత్య గ్రంథంలో ఏమి వ్రాయబడిందో అది నేను నీకు చెపుతాను. ఈ సంగతుల్లో మీ అధిపతి మిఖాయేలు తప్ప మరి యెవ్వరూ నా పక్షంగా నిలబడరు.
DAN 11:1 “మాదీయుడైన దర్యావేషు రాజుగా ఉన్న మొదటి సంవత్సరంలో, నేను మిఖాయేలుకు తోడుగా నిలుబడ్డాను.
DAN 11:2 “దానియేలూ! ఇప్పుడు నేను నీకు నిజం వివరిస్తాను, మరి ముగ్గురు రాజులు పారసీకలో రాజ్యం చేస్తారు. తర్వాత నాలుగవ రాజు వస్తాడు. తనకంటె ముందున్న ఇతర పారసీక రాజులకంటె, ఆ నాలుగవ రాజు ఐశ్వర్యవంతుడై, గొప్పవాడై వుంటాడు. అతడు గ్రీకు రాజ్యానికి విరోధంగా అందర్ని పురికొల్పుతాడు.
DAN 11:3 తర్వాత శక్తిమంతుడైన గొప్పరాజు ఒకడు వస్తాడు. అతను ఎక్కువ అధికారం కలిగి తన ఇష్టానుసారంగా చేస్తాడు.
DAN 11:4 అతడు అభివృద్ధి పొందుచూ ఉండగా అతని రాజ్యము ముక్కలుగా విరిగి ఆకాశపు నాలుగు దిక్కులకు విభాగమవుతుంది. అతని రాజ్యం అతని పిల్లలకు గాని మనుమలకి గాని విభాగితం కాదు. అతని రాజ్యానికి అతను పాలించిన నాటి శక్తి వుండదు. ఎందుకనగా అతని రాజ్యం లాగివేయబడి ఇతరులకు ఇవ్వబడుతుంది.
DAN 11:5 “దక్షిణ రాజు బలవంతుడవుతాడు. కాని అతని రాజుల్లో ఒకడు అతనికంటె బలవంతుడౌతాడు, మరియు ఇతని రాజ్యం గొప్పదవుతుంది.
DAN 11:6 “కొన్ని సంవత్సరాల తర్వాత, ఈ ఇద్దరు రాజులు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. దక్షిణ రాజు యొక్క కుమారై ఉత్తర రాజు యొద్ద ఒప్పందం చేసు కోటానికి వస్తుంది. కాని ఆమె తన బలాన్ని నిలుపుకోదు. అతడు త న మాటను, బలాన్ని నిలుపుకోడు. కాని, ఆమెను, ఆమెను తెచ్చిన వారిని, ఆమెను కన్న వారిని, ఆమెను బలపరచిన వారిని, ఆ సమయాల్లో విడిచిపెడతారు.
DAN 11:7 “కాని ఆమె కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి దక్షిణ రాజు యొక్క స్థానం ఆక్రమించడానికి వస్తాడు. అతడు ఉత్తర రాజు సైన్యాలను ఎదిరించి ఆ రాజు యొక్క బలమైన దుర్గంలోకి ప్రవేశిస్తాడు. అతను యుద్ధం చేసి జయిస్తాడు.
DAN 11:8 అతను దేవతా ప్రతిమల్ని, లోహ విగ్రహాల్ని, వెండి బంగారాలతో చేయబడిన విలువగల వస్తువుల్ని ఉజిప్టుకి తీసుకు వెళతాడు. ఆ తర్వాత అతను కొన్ని సంవత్సరాల పాటు ఉత్తర రాజును ఎదిరించడు.
DAN 11:9 ఉత్తర రాజు రాజ్యాన్ని ఎదుర్కొని తర్వాత తన దేశానికి మరలిపోతాడు.
DAN 11:10 “ఉత్తర రాజు కుమారులు యుద్ధ సన్నద్ధులై ఒక పెద్ద పైన్యాన్ని సమకూర్చుతారు. ఆ సైన్యం ఆ ప్రదేశంగుండా గొప్ప ప్రవాహంవలె దక్షిణ రాజు యొక్క బలమైన దుర్గం వరకు యుద్ధం సాగిస్తుంది.
DAN 11:11 అప్పుడు దక్షిణ రాజు మహోగ్రడై ఉత్తర రాజుతో యుద్ధం చేస్తాడు. ఉత్తర రాజు పెద్ద సైన్యంతో ఎదిరిస్తాడు కాని ఆ సైన్యం దక్షిణ రాజు వశమవుతుంది.
DAN 11:12 ఉత్తర సైన్యం ఓడిపోయి తీసుకొని పోబడుతుంది. దక్షిణ రాజు గర్విష్ఠి అవుతాడు. ఉత్తర సైన్యంలో వేలాది సైనికుల్ని హతమార్చుతాడు. కాని అతని విజయం కొనసాగదు.
DAN 11:13 ఉత్తర రాజు మరో సైన్యం సమకూర్చు కుంటాడు. ఆ సైన్యం మొదటి సైన్యం కంటె చాలా పెద్దది. చాలా సంవత్సరాల తర్వాత, అతను ఈ పెద్ద సైన్యాన్ని చాలా ఆయుధాల్ని సిద్ధం చేసికొని యుద్ధానికి వెళతాడు.
DAN 11:14 “ఆ రోజుల్లో దక్షిణ రాజుకి చాలామంది వ్యతిరేకులై ఉంటారు. దర్శన నెరవేర్పుగా నీ ప్రజల్లో తిరుగుబాటుదారులు ఎదురు తిరుగుతారు గాని ఓడి పోతారు.
DAN 11:15 తర్వాత ఉత్తర రాజు వచ్చి గోడలకు ముట్టడి దిబ్బలు కట్టి ఒక దృఢమయిన నగరాన్ని ఆక్రమిస్తాడు. దక్షిణ సైన్యానికి మరల యుద్ధం చేయడానికి శక్తి ఉండదు. దక్షిణ సైన్యానికి చెందిన ఉత్తమ సైనికులు కూడా ఉత్తర సైన్యాన్ని ఆపలేక పోతారు.
DAN 11:16 “తన ఇష్టము వచ్చినట్లు ఉత్తర రాజు చేస్తాడు. ఎవ్వరూ అతనిని విరోధించలేరు. అతను అధికారం పొంది, సుందర దేశాన్ని అదుపులో ఉంచుకొంటాడు. మరిము అతనికి దాన్ని నాశనం చేసే శక్తికూడా ఉంటుంది.
DAN 11:17 ఉత్తర రాజు తన సర్వ సైనిక బలంతో వచ్చి దక్షిణ రాజులో ఒప్పందం చేసుకోటానికి నిర్ణయిస్తాడు. ఉత్తర రాజు దక్షిణ రాజుకు పెళ్లి చేసుకునేందుకు తన కుమార్తెలలో ఒకదానిని అనుమతిస్తాడు, ఎందుకంటే దక్షిణ రాజుని ఓడించాలని. కాని ఆ పథకాలు నెరవేరవు, అతనికి తోడ్పడవు.
DAN 11:18 “అప్పుడు ఉత్తర రాజు తన దృష్టిని సముద్ర తీరాననున్న దేశాల మీదికి మరల్చుతాడు, పెక్కు నగరాల్ని జయిస్తాడు. కాని తర్వాత ఒక సైన్యాధిపతి ఉత్తర రాజు యొక్క తిరుగుబాటుని, అతని గర్వాన్ని అణచి అతడు సిగ్గుచెందేలా చేస్తాడు.
DAN 11:19 “అది జరిగిన తర్వాత, ఉత్తర రాజు తన స్వదేశంలోని బలమైన దుర్గాలకు తిరిగి వెళతాడు. కాని అతను బలహీనుడై పతనం చెంది మరణము పాలవుతాడు.
DAN 11:20 “ఆ ఉత్తర రాజు తర్వాత మరో క్రొత్త పరిపాలకుడు వస్తాడు. ఆ పరిపాలకుడు పన్నులు వసూలు చేసే అధికారిని రాజ వైభవం కోసం డబ్బు సంపాదించటానికి పంపుతాడు. కాని కొన్ని సంవత్సరాలలోనే, ఆ పరిపాలకుడు కోపము వల్లగాని, యుద్ధమువల్లగాని కాకుండ నాశనం చేయబడతాడు.
DAN 11:21 “ఆ పరిపాలకుని తర్వాత అతి క్రూరుడు, ద్వేషింపబడినవాడు అయిన ఒక వ్యక్తి వస్తాడు. రాజ వంశానికి చెందినవాడనే గౌరవం వానికి ఉండదు. మాయోపాయముచేత అతతడు పరిపాలకుడవుతాడు. ప్రజలు నెమ్మదిగా ఉన్న సమయాన, అతడు రాజ్యముమీద దాడి చేస్తాడు.
DAN 11:22 ప్రవాహంలాంటి ఆ సైన్యాలు వాని ఎదుటనుండి తుడిచి వేయబడును. ఒప్పందం కుదుర్చుకున్న రాజు కూడా నశిస్తాడు.
DAN 11:23 ఆ రాజుతో ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత మోసంగా ప్రవర్తించి, కొద్ది మందితోనే అతడు అధికారాన్ని పొందుతాడు.
DAN 11:24 “సంవన్న దేశాలు నెమ్మదిగా ఉన్నప్పుడు, అతడు (క్రూరుడూ ద్వేషింపబడినవాడూ అయిన ఆ పరిపాలుకుడు) వాటిమీద దాడి చేస్తాడు. అతని తండ్రులుగాని, అతని పూర్వీకులుగాని చేయలేనిదాన్ని అతడు సాధిస్తాడు. దోపిడి, లూటి చేసి పొందిన సంపత్తును వాని అనుచరుల మధ్య పంచుతాడు. బలమైన కోటల్ని పడగొట్టడానికి కుట్ర చేస్తాడు, గాని అది ఒక కాలము వరకు మాత్రమే.
DAN 11:25 “దక్షిణ రాజుకు విరోధంగా గొప్ప సైన్యంతో తన బలాన్ని, ధైర్యాన్ని ఎక్కువ చేసుకొంటాడు. గొప్ప బలమైన సేనతో దక్షిణ రాజు యుద్ధానికి దిగుతాడు గాని, అతనికి వ్యతిరేకంగా శత్రువు పన్నిన పన్నాగాల వల్ల దక్షిణ రాజు ఓడిపోతాడు.
DAN 11:26 దక్షిణ రాజు భోజన పదార్థాలనుండి తినేవారే అతన్ని నాశనము చేయాలని ప్రయత్నిస్తారు. అతని సైన్యం ఓడించ బడుతుంది. యుద్ధంలో చాలామంది సైనికులు చంపబడుతారు.
DAN 11:27 ఆ రాజులిద్దరూ దురుద్దేశముతో ఒకే భోజన బల్లవద్ద కూర్చొని ఒకరికొకరు అబద్ధాలు చెప్పు కొంటారు. అందువల్ల వారిలో ఎవరికీ మంచి కలుగదు. ఎందుకంటే దేవుడు వారి అంతానికి ఒక కాలం నిర్ణయించాడు.
DAN 11:28 “ఉత్తర రాజు అధిక సంపదతో తన దేశానికి తిరిగి వెళతాడు. కాని, పవిత్ర ఒడంబడికకు విరుద్ధంగా అతను తన హృదయాన్ని మార్చుకొంటాడు. తన ఇష్టానుసారంగా జరిగిస్తూ అతడు స్వదేశానికి మరలి పోతాడు.
DAN 11:29 “నియమిత సమయాన, ఉత్తర రాజు దక్షిణ రాజు మీద మరల దాడి చేస్తాడు, కాని ఈ సారి, పూర్వంవలె అతడు గెలుపొందలేడు.
DAN 11:30 కిత్తీము నుండి ఓడలువచ్చి ఉత్తర రాజును ఎదిరిస్తాయి. ఆ ఓడలు రావటం చూసి. అతడు భయభ్రాంతుడవుతాడు. అప్పుడతను వెనుదిరిగి, పవిత్ర ఒడంబడిక పట్ల తన కోపాన్ని తీర్చుకొంటాడు. అతడు వెనక్కి తిరిగి పవిత్ర ఒడంబడికను విసర్జించే వాళ్ల మాట వింటాడు.
DAN 11:31 వానినుండి వచ్చిన సైన్యాలు కోటను, దేవాలయాన్ని అపవిత్ర పరచి, అనుదిన బలి అర్పణలను నిలుపు చేస్తాయి. వాళ్లు నాశనకరమైన ఆ అసహ్యమైన దాన్ని దేవాలయంలో నిలుపుతారు.
DAN 11:32 “ఉత్తర రాజు పవిత్ర ఒడంబడికను అతిక్రమించిన వాళ్లను (యూదులు) తన ఇచ్ఛకపు మాటలచేత దుష్టత్యానికి మళ్లించుతాడు. కాని తమ దేవుణ్ణి ఎరిగిన ప్రజలు స్థిరముగా నిలబడి అతనిని ఎదిరిస్తారు.
DAN 11:33 “కొన్ని దినాలపాటు వారు ఖడ్గంతోను, అగ్నితోను, చెరసాల బంధనతోను, దోపుడుతోను హింసించబడ్డ, వారిలో జ్ఞానవంతులైన వారు అనేకులను సంగతులు అర్థము చేసికొనేటట్లు చేస్తారు.
DAN 11:34 జ్ఞాన వంతులైన ఆ యూదులు హింసించబడ్డ తర్వాత, వారికి కొద్దిపాటి సహాయం లభిస్తుంది. అనేకులు వారికి వారే జ్ఞానులైన యూదులతో ముఖస్తుతి చేస్తూ కలిసి పోతారు.
DAN 11:35 నియమితమైన అంత్య కాలం ఇంకను రాలేదు. ఆ అంత్యకాలం వరకు జ్ఞానుల్లో కొందరు కూలుట ద్వారా మిగిలిన వారు శుద్ధిగాను, నిర్మలులుగాను, పరిశుద్ధులుగాను చేయ బడటానికి ఇలాగున జరుగుతుంది.
DAN 11:36 “ఉత్తర రాజు తన ఇష్టానుసారముగా చేస్తాడు. ప్రతి దేవతకు పైగా తనకు తానే హెచ్చించుకొంటూ, ఘన పరచుకొంటాడు. అంతేకాక, దేవాది దేవునికి విరోధంగా విచిత్రమైన విషయాలు మాట్లాడుతాడు. ఉగ్రత తీరే వరకు వాడు వర్ధిల్లుతాడు. ఏది నిర్ణయమైందో అది వానికి జరుగుతుంది.
DAN 11:37 “తన పూర్వీకుల పట్ల ఆ ఉత్తర రాజు శ్రద్ధ వహింపడు. స్త్రీల ఇష్ట దేవతల పట్ల కూడ లక్ష్యపెట్టడు. ఏ దేవుని గురించి అతడు లక్ష్యపెట్టడు. అన్ని దేవుళ్ల దేవతల కంటే తనను తాను హెచ్చించుకొంటాడు.
DAN 11:38 వీటన్నీటికి బదులుగా కోటల దేవతను గౌరవిస్తాడు. తన పూర్వీకులు ఎరుగని దేవతను బంగారు, వెండి, వెలగల రాళ్లు మరియు వెలగల బహుమానాలతో గౌరవిస్తాడు.
DAN 11:39 “ఆ ఉత్తర రాజు బలమైన కోటల మీదికి అన్యదేవుని సహాయంతో దాడి చేస్తాడు, తనను గుర్తించే వాళ్లను హెచ్చించి గౌరవిస్తాడు. వాళ్లను చాలా మంది ప్రజల మీద పరిపాలకులుగా ఉంచి, దేశాన్ని వెలకు విభాగిస్తాడు.
DAN 11:40 “అంత్యకాలంలో, దక్షిణ రాజు ఉత్తర రాజుతో యుద్ధం చేస్తాడు. ఉత్తర రాజు ఉగ్రుడై సుడిగాలి వలె దక్షిణ రాజు మీద రథాలు, గుర్రపు రౌతులు, అనేక ఓడలతో విరుచుకు పడుతాడు. అదే విధంగా దేశాల మీదికి ప్రవాహం వలె వెళతాడు.
DAN 11:41 అతడు మహిమాదేశం మీద కూడా దాడి చేస్తాడు. అనేక దేశాల్లో వేలాది మందిని పడగొడతాడు, కాని ఎదోము, మోయాబు, అమ్మోనీయల నాయకులు అతని చేతినుండి రక్షింపబడుతారు.
DAN 11:42 చాలా దేశాల్లో ఉత్తర రాజు తన అధికారాన్ని వ్యాపింప జేస్తాడు కాని ఈజిప్టు తప్పించుకోలేదు.
DAN 11:43 ఈజిప్టుకు చెందిన వెండి బంగారం సర్వ సంపదలకు అతడు అధిపతి అవుతాడు. లిబియావాళ్లు, కూషీయులు (ఇతియోపియా వాళ్లు) అతని ఎడల విధేయులై ఉంటారు.
DAN 11:44 కాని ఉత్తర రాజు తూర్పు, ఉత్తర దిశలనుంచి వచ్చిన సమాచారము తెలిసికొని. భయభ్రాంతుడై, మహోగ్రుడై చాలా మందిని సర్వ నాశనం చేయడానికి ముందుకు సాగుతాడు.
DAN 11:45 సుందరమైన పరిశుద్ధ పర్వతానికి సముద్రానికి మధ్య అతను రాజవైభవంగల గుడారాలు నెలకొల్పుతాడు. చివరికి అతడు నిస్సహాయుడై మరణిస్తాడు.
DAN 12:1 “ఆ సమయాన నీ ప్రజలైన యూదుల పక్షం వహించిన గొప్ప రాజు మిఖాయేలు (ప్రధాన దూత) జోక్యం కలిగించుకొంటాడు. నీ ప్రజలు ఒకే దేశంగా కూడిన కాలంనుండి అప్పటి వరకు ముందెన్నడూ సంభవించనంత మహా విపత్తు వారి మీద కలుగుతుంది. కాని, నీ ప్రజల్లో ఎవరి పేరు గ్రంథమందు వ్రాయబడిందో వారు తప్పించుకొంటారు.
DAN 12:2 సమాధి చేయబడిన పెక్కుమంది మృతులు, మేల్కొంటారు. కొందరు నిత్యజీవానికి, కొందరు సిగ్గుపొందటానికి, శాశ్వతంగా తిరస్కారం పొందటానికి మేల్కొంటారు.
DAN 12:3 జ్ఞానవంతులు ఆకాశమందలి జ్యోతుల్లాగ ప్రకాశిస్తారు, అనేకులను నీతి మార్గానికి నడిపించేవారు నక్షత్రాల్లాగ శాశ్వతంగా వెలుగుతారు
DAN 12:4 “కాని, దానియేలూ, నీవు, ఈ సందేశాన్ని రహస్యంగా ఉంచు. ఈ పుస్తకాన్ని నీవు అంత్యకాలం వరకు మూసి ఉంచు. చాలా మంది అటు ఇటు భూసంచారం చేయటంవల్ల తెలివి పెరుగుతుంది” అని గాబ్రియేలు నాతో చెప్పాడు.
DAN 12:5 అప్పుడు దానియేలు అను నేను చూస్తూండగా ఇద్దరు మనుష్యులు కనబడ్డారు. నది ఈ ఒడ్డున ఒకడు నది ఆ ఒడ్డున మరియొకడు నిలబడి ఉన్నారు.
DAN 12:6 నార బట్టలు ధరించిన వ్యక్తి నదీ జలాల మీద ఉన్నాడు. ఆ ఇరువురిలో ఒకడు, “ఈ ఆశ్చర్య సంగతులు నెరవేరటా నికి ఎంతకాలము పడుతుంది?” అని నార బట్టలు ధరించిన వాన్ని అడిగాడు.
DAN 12:7 నార బట్టలు ధరించి నదీ జలాల మీదనున్న వ్యక్తి ఆకాశం వైపుగా తన కుడి, ఎడమ చేతులు ఎత్తి. సజీవుడైన దేవుని నామం మీద ప్రమాణం చేయుట నేను విన్నాను. ఏమనగా “ఒక కాలము, కాలములు, అర్ధకాలము (మూడున్నర సంవత్సరాలు) పడతాయి. పరిశుద్ధ ప్రజల బలం నాశనం చేయబడటం అంతం కాగానే ఈ సంగతులన్నీ నెరవేరుతాయి.”
DAN 12:8 నేను విన్నాను,స కాని అర్థము చేసుకోలేక పోయాను. అందువల్ల, “అయ్యా, ఈ సంగతులు జరిగిన తర్వాత ఏమవుతుంది?” అని అడిగాను.
DAN 12:9 అందుకతడు, “దానియేలూ! నీవు దాటిపొమ్ము. ఈ మాటలు అంత్యకాలం వరకు ముద్ర వేయబడి రహస్యంగా ఉంటాయి.
DAN 12:10 చాలామంది తమ్మును తాము పరిశుద్ధులుగా చేసికొంటారు. తమ్మును తాము తెలుపుగాను, శుద్ధులుగాను చేసికొంటారు. కాని చెడ్డవాళ్లు చెడ్డవాళ్లగానే ఉంటారు. ఆ దుర్జనులు ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. కాని జ్ఞానవంతులు అర్థం చేసి కొంటారు.
DAN 12:11 “అనుదిన బలులు నిలిపివేసిన కాలం మొదలు కొని నాశనకరమైన అసహ్య వస్తువు నిలబెట్టబడిన కాలం వరకు ఒక వెయ్యి మూడువందల ముప్పయైదు రోడులు వేచియుండి ఆ దినముల అంతము వరకు ఉండువాడు ధన్యుడు.
DAN 12:13 “నీవు నీ జీవిత అంతం వరకు బ్రతికి, నీ విశ్రాంతిలో ప్రవేశించు. దినాల అంతమందు నీవు లేవబడి నీ స్థానములో నీవు నిలుస్తావు.”
HOS 1:1 బెయేరి కుమారుడైన హోషేయకు వచ్చిన యెహోవా సందేశం ఇది. ఉజ్జీయా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనువారు యూదా దేశపు రాజులుగా ఉన్న కాలంలో ఈ సందేశం వచ్చింది. యెహోవాయాషు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలు రాజుగా ఉన్న కాలం అది.
HOS 1:2 ఇది హోషేయకు యెహోవా ఇచ్చిన మొదటి సందేశం. “వెళ్లి ఒక వేశ్యను పెండ్లి చేసుకొని, ఆ వేశ్య ద్వారా పిల్లల్ని కనుము. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు వేశ్యల్లా ప్రవర్తించారు-వారు యెహోవాకు అపనమ్మకంగా జీవించారు” అని యెహోవా చెప్పాడు.
HOS 1:3 కనుక దిబ్లయీము కుమార్తెయైన గోమెరును హోషేయ పెండ్లి చేసుకొన్నాడు. గోమెరు గర్భవతియై, హోషేయకు ఒక కుమారుని కన్నది.
HOS 1:4 యెహోవా హోషేయతో, “అతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. ఎందుచేతనంటే యెహూ యెజ్రెయేలు లోయలో రక్తం చిందించిన కారణంగా నేను యెహూ కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యాన్ని నేను నాశనం చేస్తాను.
HOS 1:5 ఆ సమయంలో యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు విల్లును నేను విరుగగొడ్తాను” అని చెప్పాడు.
HOS 1:6 మరల గోమెరు గర్భవతియై ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. యెహోవా హోషేయతో ఇలా చెప్పాడు: “ఆమెకు లో-రూహామా అని పేరు పెట్టు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యనికి నేను ఇక ఎంతమాత్రం కరుణ చూపించను. నేను వారిని క్షమించను.
HOS 1:7 కాని యూదా రాజ్యానికి నేను కరుణ చూపిస్తాను. యూదా రాజ్యాన్ని నేను రక్షిస్తాను. వారిని రక్షించేందుకు విల్లుగాని, ఖడ్గంగాని నేను ఉపయోగించను. వారిని రక్షించేందుకు యుద్ధ గుర్రాలను గాని, సైనికులను గాని నేను ఉపయోగించను. నేను నా స్వంత శక్తి చేతనే వారిని రక్షిస్తాను.”
HOS 1:8 గోమెరు లో-రూహామాకు చనుబాలు ఇవ్వటం చాలించగానే ఆమె మరల గర్భవతి అయ్యింది. ఆమె మరొక కుమారుని కన్నది.
HOS 1:9 అప్పుడు, “అతనికి లో-అమ్మీ అని పేరు పెట్టు. ఎందుచేతనంటే మీరు నా ప్రజలు కారు, నేను మీ దేవుణ్ణి కాను” అని యెహోవా చెప్పాడు.
HOS 1:10 “రాబోయే కాలంలో ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల్లా ఉంటుంది. ఇసుకను నీవు కొలవలేవు. లెక్కించ లేవు. ఏ స్థలంలోనైతే ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పబడిందో అక్కడే ‘మీరు జీవంగల దేవుని పిల్లలు’ అని వారితో చెప్పడం జరుగుతుంది.
HOS 1:11 “అప్పుడు యూదా ప్రజలు మరియు ఇశ్రాయేలు ప్రజలు సమావేశపరచబడతారు. వారు ఒక పాలకుని తమకోసం ఏర్పాటు చేసుకొంటారు. మరియు వారి రాజ్యం ఆ దేశం పట్టజాలనంత పెద్దదిగా ఉంటుంది! యెజ్రెయేలు దినం నిజంగా గొప్పగా ఉంటుంది.”
HOS 2:1 “అప్పుడు మీరు మీ సోదరులతో ‘మీరు నా ప్రజలు’ అనియు, మీ స్వంతవారితో ‘ఆయన మీ యెడల కరుణ చూపించాడు’” అని చెబుతారు.
HOS 2:2 “మీ తల్లితో గట్టిగా వాదించండి, ఎందుకంటే ఆమె నా భార్య కాదు! నేను ఆమె భర్తను కాను! వేశ్యలాగ ఉండటం మానుకోమని ఆమెతో చెప్పండి. ఆమె స్తనాల మధ్య నుండి ఆమె విటులను తొలగించి వేయుమని ఆమెతో చెప్పండి.
HOS 2:3 ఆమె తన వ్యభిచారం మాను కోవటానికి నిరాకరిస్తే నేను ఆమె వస్త్రాలు తీసివేసి దిగంబరిగా చేస్తాను. ఆమెను, ఆమె పుట్టిన రోజున ఉన్నట్టుగానే చేస్తాను. నేను ఆమె ప్రజలను తొలగించివేస్తాను. ఆమె ఎండిపోయిన ఖాళీ ఎడారిలాగ ఉంటుంది. దాహంతో నేను ఆమెను చంపివేస్తాను.
HOS 2:4 ఆమె పిల్లల మీద నేను జాలిపడను. ఎందుకంటే వారు వ్యభిచార సంతానం కనుక.
HOS 2:5 వారి తల్లి ఒక వేశ్యలాగ ప్రవర్తించింది. వారి తల్లి, ఆమె చేసిన పనుల విషయంలో సిగ్గుపడాలి. ఆమె, ‘నేను నా విటుల దగ్గరకు వెళ్తాను, నా విటులు నాకు భోజనపానాలు ఇస్తారు. వారు ఉన్ని మరియు మేలు రకపు సన్నని వస్త్రాలు ఇస్తారు. ద్రాక్షామద్యం, ఒలీవనూనె వారు నాకు ఇస్తారు’ అని చెప్పింది.
HOS 2:6 “అందుచేత, యెహోవానైన నేను మీ (ఇశ్రాయేలు) మార్గాన్ని ముళ్లతో అడ్డువేస్తాను. నేను ఒక గోడ కట్టిస్తాను. అప్పుడు తన దారులను ఆమె తెలుసు కోలేక పోతుంది.
HOS 2:7 ఆమె తన విటుల వెనుక పరుగులెత్తుతుంది కానీ ఆమె వారిని కలుసుకోలేక పోతుంది. ఆమె తన విటుల కోసం వెదుకుతుంది. కాని ఆమె వారిని కనుగొనలేక పోతుంది. అప్పుడు ఆమె, ‘నేను నా మొదటి భర్త (దేవుడు) దగ్గరకు వెళ్తాను. నేను ఆయనతో ఉన్నప్పుడు నా జీవితం బాగా ఉండింది. ఇప్పటికంటే నా జీవితం అప్పుడే మేలు’ అని ఆమె అంటుంది.
HOS 2:8 “ధాన్యం, ద్రాక్షారసం, నూనె ఇచ్చేవాడును నేనే అని ఆమెకు (ఇశ్రాయేలు) తెలియదు. నేను ఆమెకు వెండి బంగారాలు ఇంకా ఇంకా ఎక్కువగా ఇస్తూ పోయాను. కాని బయలు విగ్రహాలు చేయుటకు ఇశ్రాయేలీయులు ఈ వెండి బంగారాలు ఉపయోగించారు.
HOS 2:9 కనుక నేను (యెహోవాను) తిరిగి వస్తాను. నా ధాన్యం కోతకు సిద్దంగా ఉన్నప్పుడు నేను దానిని తీసివేసుకొంటాను. ద్రాక్షలు సిద్దంగా ఉన్న సమయంలో నా ద్రాక్షారసం నేను తీసివేసికొంటాను. నా ఉన్ని, మేలురకపు వస్త్రాలు నేను తీసివేసికొంటాను. ఆమె తన నగ్న శరీరాన్ని కప్పుకునేందుకు వీటిని నేను ఆమెకు ఇచ్చాను.
HOS 2:10 కాని ఇప్పుడు నేను ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమె ప్రేమికులు ఆమె నగ్నత్వాన్ని చూస్తారు. నా శక్తి నుండి ఆమెను ఎవ్వరూ తప్పించలేరు.
HOS 2:11 నేను (దేవుడు) ఆమె సరదానంతా తీసివేస్తాను. ఆమె పండుగ రోజులు, ఆమె అమావాస్య విందులు, ఆమె విశ్రాంతి దినాలు, ప్రత్యేక విందులను నేను నిలిపి వేస్తాను.
HOS 2:12 ఆమె ద్రాక్షావల్లులను, అంజూరపు చెట్లను నేను నాశనం చేస్తాను. ‘నా విటులు వీటిని నాకు ఇచ్చారు’ అని ఆమె చెప్పింది. కాని ఆమె తోటలను నేను మార్చివేస్తాను. అవి భయంకరమైన అడవులుగా మారిపోతాయి. అడవి మృగాలు వచ్చి ఆ మొక్కలను తింటాయి.
HOS 2:13 “ఆమె బయలు దేవతలను సేవించింది. కనుక ఆమెను నేను శిక్షిస్తాను. బయలు దేవతలకు ఆమె ధూపం వేసింది ఆమె వస్త్రాలు ధరించి, నగలు, ముక్కుకమ్మి పెట్టుకొంది. అప్పుడు ఆమె తన విటుల దగ్గరకు వెళ్లి నన్ను మరిచిపోయింది.” యెహోవా ఈ విషయం చెప్పాడు.
HOS 2:14 “కనుక నేను (యెహోవా) ఆమెతో ప్రేమగా మాట్లాడుతాను. ఆమెను ఎడారిలోకి నడిపించి ఆమెతో నేను మృదువుగా మాట్లాడుతాను.
HOS 2:15 అక్కడ ద్రాక్షాతోటలను ఆమెకు ఇస్తాను. ఆకోరు లోయను (శ్రమగల) ఒక నిరీక్షణ ద్వారంగా ఇస్తాను. అప్పుడు తన యౌవన దశలో ఈజిప్టు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఆమె జవాబు చెపుతుంది.”
HOS 2:16 యెహోవా ఇలాగున చెపుతున్నాడు. “ఆ సమయంలో ‘నా భర్తవు’ అని నీవు నన్ను పిలుస్తావు. ‘నా బయలు’ అని నీవు నన్ను పిలవవు.
HOS 2:17 ఆమె నోటినుండి బయలు దేవత పేర్లను నేను తొలగించివేస్తాను. అప్పుడు ఆ బయలు దేవతల పేర్లను ప్రజలు మరల ఉపయోగించరు.
HOS 2:18 “ఆ సమయంలో పోలంలోని పశువులకు, ఆకాశంలోని పక్షులకు, నేలమీద ప్రాకే ప్రాణులకు ఇశ్రాయేలీయులకోసం నేను ఒక ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధ ఆయుధాలు నేను విరుగగొడతాను. ఆ దేశంలో ఆయుధాలు ఏవీ మిగలవు. ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా పడుకోగల్గు నట్లు నేను దేశాన్ని క్షేమంగా ఉంచుతాను.
HOS 2:19 మరియు నేను (యెహోవా) నిన్ను శాశ్వతంగా నా వధువుగా చేసుకొంటాను. మంచితనం, న్యాయం, ప్రేమ, కరుణలతో నిన్ను నేను నా వధువుగా చేసుకొంటాను.
HOS 2:20 నిన్ను నాకు నమ్మకమైన వధువుగా చేసుకొంటాను. అప్పుడు నీవు నిజంగా యెహోవాను తెలిసికొంటావు.
HOS 2:21 ఆ సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను.” యెహోవా ఇలాగున చెపుతున్నాడు. “నేను ఆకాశాలతో మాట్లాడుతాను. అవి భూమికి వర్షాన్ని ఇస్తాయి.
HOS 2:22 ధాన్యం, ద్రాక్షా మద్యం, నూనెలను భూమి ఇస్తుంది. అవి యెజ్రెయేలు అవసరాలను తీరుస్తాయి.
HOS 2:23 భూమిమీద ఆమెను నేను నాటుతాను. లో-రూహామాకు నేను దయచూపిస్తాను. లో-అమ్మీకీ ‘నీవు నా ప్రజ’ అని నేను చెపుతాను. ‘నీవు మా దేవుడవు’” అని వారు నాతో చెపుతారు.
HOS 3:1 అప్పుడు యెహోవా నాతో, “గోమెరుకు చాలా మంది విటులు ఉన్నారు. కాని నీవు ఆమెను ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుచేతనంటే అది యెహోవా చేసినట్టుగా ఉంటుంది. యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాని వారు ఇతర దేవతలను పూజిస్తూనే ఉన్నారు. మరియు ఎండుద్రాక్షల అడలు తినటం వారికి ఇష్టం” అని మరల నాతో చెప్పాడు.
HOS 3:2 కనుక, గోమెరును పదునయిదు తులాల వెండి, తొమ్మిది తూముల యవలు ఇచ్చి నేను కొన్నాను.
HOS 3:3 కాబట్టి నేను ఆమెతో, “చాలా రోజులు నీవు నాతో కలసి ఇంటి వద్దనే ఉండాలి. నీవు వేశ్యలా ఉండకూడదు. నీవు మరో పురుషునితో పడుకో కూడదు. నేను నీకు భర్తగా ఉంటాను” అని చెప్పాను.
HOS 3:4 అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజుగాని, ఒక నాయకుడు గాని లేకుండా అనేక రోజులు కొనసాగుతారు. ఒక బలి అర్పణగాని లేక ఒక స్మారకశిలగాని లేకుండా ఉంటారు. వారికి ఏఫోదుగాని లేక గృహ దవతలు గాని ఉండవు.
HOS 3:5 దీని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వెనుకకు వస్తారు. వారు వారి దేవుడైన యెహోవా కోసం, వారి రాజైన దావీదు కోసం వెతుకుతారు. చివరి దినాల్లో వారు యెహోవానూ, ఆయన మంచితనాన్నీ గౌరవిస్తారు.
HOS 4:1 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా సందేశం వినండి! ఈ దేశంలో నివసించే ప్రజల మీద ఆయనకు గల వ్యాజ్యెం ఏమిటో యెహోవా చెపుతాడు వినండి. “ఈ దేశంలోని ప్రజలు నిజంగా దేవుణ్ణి ఎరుగరు. ప్రజలు దేవునికి సత్యవంతులుగాను, నమ్మకస్తులుగాను లేరు.
HOS 4:2 ప్రజలు (అబద్ధపు) ఒట్టు పెట్టుకుంటారు, అబద్ధాలు చెపుతారు, చంపుతారు, దొంగిలిస్తారు. వారు వ్యభిచార పాపం చేసి పిల్లల్ని కంటారు. ప్రజలు మరల మరల హత్య చేస్తారు.
HOS 4:3 అందుచేత దేశం చచ్చినవాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలాగ ఉంది. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి పొలాల్లోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రంలోని చేపలు కూడ చనిపోతున్నాయి.
HOS 4:4 ఏ వ్యక్తీ మరో వ్యక్తితో వివాదం పెట్టుకోకూడదు, నిందించకూడదు. యాజకునితో! వాదం పెట్టుకోవద్ద.
HOS 4:5 మీరు (యాజకులు) పగటివేళ పడిపోతారు. మరియు రాత్రివేళ ప్రవక్త కూడ మీతోబాటు పడిపోతాడు. మరియు మీ తల్లిని నేను నాశనం చేస్తాను.
HOS 4:6 “నా ప్రజలకు తెలివి లేదు గనుక నాశనం చేయబడ్డారు. నేర్చుకొనేందుకు మీరు నిరాకరించారు. కనుక నా కోసం మిమ్మల్ని యాజకులుగా ఉండనిచ్చుటకు నేను నిరాకరిస్తాను. మీరు మీ దేవుని న్యాయచట్టం మరచిపోయారు గనుక నేను మీ పిల్లల్ని మరచిపోతాను.
HOS 4:7 వారు గర్విష్టులయ్యారు! వారు నాకు విరోధంగా ఇంకా ఇంకా ఎక్కువ పాపం చేశారు. కనుక వారు ఘనతను అవమానంగా నేను మార్చివేస్తాను.
HOS 4:8 “యాజకులు ప్రజల పాపాలలో చేరిపోయారు. వారు ఆ పాపాలను ఇంకా ఇంకా ఎక్కువాగా కోరుకొన్నారు.
HOS 4:9 కనుక ప్రజలకంటే యాజకులు వేరుగా ఏమీలేరు. వారు చేసిన వాటి విషయమై నేను వారిని శిక్షిస్తాను. వారు చేసిన వాటికోసం నేను వారికి తగిన శిక్ష విధిస్తాను.
HOS 4:10 వారు భోజనం చేస్తారు కాని వారికి తృప్తి ఉండదు. వారు లైంగిక పాపాలు చేస్తారు. కాని వారికి పిల్లలు ఉండరు. ఎందుచేతనంటే వారు యెహోవాను విడిచిపెట్టి వేశ్యలవలె తయ్యారయ్యారు.
HOS 4:11 “లైంగిక పాపాలు, ద్రాక్షామద్యం కొత్త ద్రాక్షారసం, మనిషిలో సరిగ్గా ఆలోచించగలిగే శక్తిని నాశనం చేస్తాయి.
HOS 4:12 సలహా కోసం నా ప్రజలు కట్టెముక్కలను అడుగుతున్నారు. ఆ కట్టెలు వారికి జవాబిస్తాయని వారు తలుస్తున్నారు. ఎందుచేతనంటే వారు వేశ్యలాగ ఆ బూటకపు దేవతలను వెంటాడారు.
HOS 4:13 వారు కొండ శిఖరాల మీద బలులు అర్పిస్తారు. కొండలమీద, సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద ధూపం వేస్తారు. ఆ చెట్ల కింద నీడ బాగున్నట్టు కనిపిస్తుంది. కనుక మీ కుమార్తెలు ఆ చెట్ల కింద వ్యభిచరిస్తారు. మరియు మీ కోడళ్లు కూడాపాపాలు చేస్తారు.
HOS 4:14 “వేశ్యలుగా ఉన్నందుకు మీ కుమార్తెలను గానీ, లైంగిక పాపాలు చేసినందుకు మీ కోడళ్లనుగాని నేను నిందించలేను. పురుషులు వెళ్లి వేశ్యలతో పడుకొంటారు. వారు వెళ్లి ఆలయ వేశ్యలతో కలిసి బలులు అర్పిస్తారు. కనుక ఆ తెలివి తక్కువ ప్రజలు వారిని వారే పాడు చేసుకుంటున్నారు.
HOS 4:15 “ఇశ్రాయేలూ, నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తిస్తున్నావు. కానీ యూదాను అపరాధిగా ఉండ నియ్యకుము. గిల్గాలుకు గాని లేక బేతావెనుకు గాని వెళ్లకుము. ప్రమాణాలు చేయటానికి యెహోవా నామం ఉపయోగించకుము. మరియు ‘యెహోవా జీవంతోడు …!’ అని అనవద్దు.
HOS 4:16 ఇశ్రాయేలుకు యెహోవా ఎన్నో ఇచ్చాడు. గడ్డి విస్తారంగా ఉన్న విశాలమైన పొలంలోకి తన గొర్రెలను తీసికొనివెళ్లే కాపరిగా ఆయన ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు మొండిది. ఇశ్రాయేలు మరల మరల పారిపోయే పెయ్యలాగ ఉంది.
HOS 4:17 “ఎఫ్రాయిము అతని విగ్రహాలతో కలిశాడు కనుక అతన్ని ఒంటరిగా విడిచివేయండి.
HOS 4:18 వారి త్రాగుడు వారిని ప్రక్కకు త్రిప్పివేసింది. వారు విడువక ఇష్టానుసారంగా జారత్వము చేయుచు ఆమెను సిగ్గుతో కప్పుతున్నారు.
HOS 4:19 కాని ఆమెను, ఆమె రెక్కలతో బంధించును. వారి బలి అర్పణల వలన వారు సిగ్గునొందుదురు.”
HOS 5:1 “యాజకులారా, ఇశ్రాయేలు రాజ్యమా, రాజవంశ ప్రజలారా తీర్పు మీకోసమే ఉంది. నా మాట వినండి. “మిస్పాలో మీరు ఒక ఉచ్చువలే ఉన్నారు. తాబోరులో నేలమీద పరచిన ఒక వలవలె మీరు ఉన్నారు.
HOS 5:2 మీరు ఎన్నెన్నో చెడ్డ పనులు చేశారు. కనుక మిమ్మల్నందర్నీ నేను శిక్షిస్తాను!
HOS 5:3 ఎఫ్రాయిము నాకు తెలుసు. ఇశ్రాయేలు చేసినవి నాకు తెలుసు ఎఫ్రాయిమూ, ఇప్పటికిప్పుడు ఒక వేశ్యలాగ నీవు ప్రవర్తిస్తావు. ఇశ్రాయేలు తన పాపాలతో అశుద్ధమయింది.
HOS 5:4 ఇశ్రాయేలు ప్రజలు చెడ్డపనులు అనేకం చేశారు. వారు తిరిగి వారి దేవుని దగ్గరకు రాకుండా ఆ చెడ్డ పనులే వారిని అడ్డగిస్తాయి. ఇతర దేవతలనువెంటాడే మార్గాలను గూర్చి వారు ఎల్లప్పుడూ తలుస్తున్నారు. వారు యెహోవాను ఎరుగరు.
HOS 5:5 ఇశ్రాయేలీయుల గర్వమే వారికి విరోధంగా ఒక సాక్ష్యం అవుతుంది. కనుక ఇశ్రాయేలు, ఎఫ్రాయిము వారి పాపంలో కాలు జారిపడతారు. కాని యూదా కూడ వారితోపాటేకాలు తప్పిపడిపోతుంది.
HOS 5:6 “ప్రజా నాయకులు యెహోవా కోసం వెదకుటకు వెళ్లారు. వారు, వారి ‘గొర్రెలను’ మరియు ‘ఆవులను’ వారితో కూడ తీసుకొని వెళ్లారు. కాని యెహోవాను వారు కనుగొనలేదు. ఎందుచేతనంటే ఆయన వారిని విడచిపెట్టాడు.
HOS 5:7 వారు యెహోవాకు విశ్వాస పాత్రులుగా ఉండలేదు. వారి పిల్లలు పరాయి వాని పిల్లలుగా పుట్టిరి. కాని ఇప్పుడు వారు, వారి పొలాలతో బాటు అమావాస్యనాటికి నాశన మవుతారు.”
HOS 5:8 “గిబియాలో కొమ్ము ఊదండి. రామాలో బాకా ఊదండి. బేతావెను వద్ద హెచ్చరిక చేయండి. బెన్యామీనూ, శత్రువు నీ వెనుక ఉన్నాడు.
HOS 5:9 శిక్షా సమయంలో ఎఫ్రాయిము పాడై పోతాడు. ఆ విషయాలు తప్పక జరుగుతాయి అని నేను (దేవుడు) ఇశ్రాయేలు గోత్రాల వారిని హెచ్చరిస్తున్నాను.
HOS 5:10 యూదా నాయుకులు మరొక మనిషి ఆస్తిని దొంగిలించుటకు ప్రయత్నించే దొంగల్లాగ తయారయ్యారు. కనుక నేను (దేవుడు) వారి మీద నా కోపాన్ని నీళ్లలాగ పోస్తాను.
HOS 5:11 ఎఫ్రాయిము శిక్షించబడతాడు. అతడు ద్రాక్షా పళ్లలాగ చితుకగొట్టబడి అణగదొక్కబడతాడు. ఎందుచేతనంటే, అతడు దుష్టత్వాన్ని చెయ్యాలని కోరుకున్నాడు.
HOS 5:12 చిమ్మెట బట్టను పాడుచేసినట్టు ఎఫ్రాయిమును నేను నాశనం చేస్తాను. చెక్కముక్కను చెదలపురుగు పాడుచేసినట్టు నేను యూదాను పాడుచేస్తాను.
HOS 5:13 ఎఫ్రాయిము తన రోగాన్ని చూశాడు, యూదా తన గాయాన్ని చూశాడు. కనుక వారు సహాయంకోసం ఆష్షూరు వెళ్లారు. తమ సమస్యలను గూర్చి తాము ఆ మహారాజుతో చెప్పారు. కాని ఆ రాజు మిమ్మల్ని స్వస్థపరచలేడు. అతడు మీ గాయాన్ని బాగుచేయలేడు.
HOS 5:14 ఎఫ్రాయిముకు నేను ఒక సింహంవలె ఉంటాను. యూదా రాజ్యానికి నేను ఒక కొదమ సింహంలాగ ఉంటాను. గనుక నేను, అవును యెహోవానైన నేనే వారిని ముక్కలుగా చీల్చివేస్తాను. నేను వారిని తీసుకొని వెళ్ళిపోతాను. నానుండి వారిని ఎవ్వరూ రక్షించలేరు.
HOS 5:15 ప్రజలు తాము దోషులమని ఒప్పుకొనేంత వరకు నాకోసం వారు వెదకుతూ వచ్చేంత వరకు నేను నా స్థలానికి వెళ్లిపోతాను. అవును తమ కష్టంలో నన్ను కనుక్కొనేందుకు వారు కష్టపడి ప్రయత్నిస్తారు.”
HOS 6:1 “రండి, మనం తరిగి యెహోవా దగ్గరకు వెళ్దాం. ఆయన మనల్ని గాయపరిచాడు. కాని ఆయనే మనలను బాగుచేస్తాడు. ఆయన మనలను గయపర్చాడు. కాని ఆయనే మనకు కట్టుకడతాడు.
HOS 6:2 తర్వాత ఆయన మనలను మరల బతికిస్తాడు. మూడోనాడు ఆయన మనలను తిరిగి లేపుతాడు. అప్పుడు మూడవ రోజున మనం ఆయన ఎదుట జీవించగలం.
HOS 6:3 మనం యెహోవాను గూర్చి నేర్చుకొందాము. ప్రభువును తెలుసుకొనేందుకు మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం. సూర్యోదయం వస్తుందని మనకు తెలిసినట్లే ఆయన వస్తున్నాడని మనకు తెలుసు. యెహోవా వర్షంలాగ మన దగ్గరకు వస్తాడు. నేలను తడిపే వసంతకాలపు వర్షంలాగ ఆయన వస్తాడు.”
HOS 6:4 “ఎఫ్రాయిమూ, నిన్ను నేను (యెహోవా) ఏమి చేయాలి? యూదా, నిన్ను నేను ఏమి చేయాలి? నీ నమ్మకత్వం ఉదయపు మంచులాగ ఉంది. వేకువనే ఉండకుండా పోయే హిమంలాగ నీ నమ్మకత్వం ఉంది.
HOS 6:5 నేను ప్రవక్తలను ఉపయోగించి ప్రజల కోసం న్యాయచట్టం చేశాను. నా ఆజ్ఞచేతనే ప్రజలు చంపబడ్డారు. కానీ ఆ నిర్ణయాల మూలంగానే మంచి విషయాలు వస్తాయి.
HOS 6:6 ఎందుచేతనంటే నాకు కావల్సింది నమ్మకమైన ప్రేమయే. అంతేగాని బలిఅర్పణకాదు. ప్రజలు నన్ను తెలుసుకోవాలని నా కోరిక దహనబలులు తీసుకొని వచ్చేందుకు కాదు.
HOS 6:7 అయితే ఆదాము చేసినట్టు ప్రజలు నా ఒడంబడికను ఉల్లంఘించారు. వారి దేశంలో వారు నాకు అపనమ్మకంగా ఉన్నారు.
HOS 6:8 గిలాదు పాపాలు చేసే ప్రజల పట్టణం. ఆ ప్రజలు ఇతరులను ఉపాయం చేసి చంపేశారు.
HOS 6:9 బందిపోటు దొంగలు దాగుకొని, ఎవరిమీదనైనా పడేందుకు వేచిఉంటారు. అదే విధంగా యాజకులు షెకెము వెళ్లే మార్గంలో పొంచి ఉండి, ఆ మార్గంలో వేళ్లేవారిని వారు చంపుతారు. వారు దుర్మార్గపు పనులు చేశారు.
HOS 6:10 ఇశ్రాయేలు రాజ్యంలో ఒక దారుణ విషయం నేను చూశాను. ఎఫ్రాయిము దేవునకి అపనమ్మకస్తుడు. ఇశ్రాయేలు తన పాపంతో అశుద్ధమయింది.
HOS 6:11 యూదా, నీకు కూడా ఒక కోతకాలం ఉంది. బానిసత్వం నుండి నా ప్రజలను నేను వెనుకకు తీసుకొని వచ్చునప్పుడు అది సంభవిస్తుంది.”
HOS 7:1 “ఇశ్రాయేలును నేను స్వస్థపరుస్తాను! ఎఫ్రాయిము యొక్క పాపం గూర్చి ప్రజలు తెలుసుకొంటారు. సమరయ అబద్ధాలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు. ఆ పట్టణంలో వచ్చి పోయే దొంగలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు.
HOS 7:2 ఆ ప్రజల నేరాలను నేను జ్ఞాపకం ఉంచుకొంటానని వారు నమ్మరు. వారు చేసిన చెడ్డపనులు చుట్టూరా ఉన్నాయి. వారి పాపాలను నేను తేటగా చూడగలను.
HOS 7:3 ఇశ్రాయేలు చేసే చెడ్డపనులు వాళ్ల రాజులను సంతోషపెడ్తాయి. వాళ్లు చెప్పే అబద్ధాలు వాళ్ల నాయకులను సంతోషపెడ్తాయి.
HOS 7:4 రొట్టెలు చేయువాడు రొట్టె చేయుటకు పిండి పిసుకుతాడు. అతడు రొట్టెను పెనంమీద వేస్తాడు. రొట్టె పొంగుతున్నప్పుడు అతడు మంట ఎక్కువ చేయడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ రొట్టెలు చేసేవానిలాగ లేరు. ఇశ్రాయేలు ప్రజలు వారి మంటను ఎల్లప్పుడూ ఎక్కువ చేస్తున్నారు.
HOS 7:5 మా రాజు దినాన, వారు మంటను పెంచుతారు. వారు తాగుడు విందులు చేస్తారు. ద్రాక్షామద్యపు వేడి మూలంగా పెద్దలు రోగులవుతారు. కనుక దేవుణ్ణి ఎగతాళి చేసే ప్రజలతో రాజులు చేతులు కలుపుతారు.
HOS 7:6 ప్రజలు రహస్య పథకాలు వేస్తారు. వారి హృదయాలు పొయ్యివలె ఉద్రేకముతో మండుతాయి. వారి కోపం రాత్రి అంతా మండుతుంది. మర్నాడు ఉదయం అది బహు వేడిగల నిప్పువలె ఉంటుంది.
HOS 7:7 వాళ్లంతా మండుచున్న పొయ్యిలాంటి వాళ్లు. వారు వారి పాలకులను నాశనం చేశారు. వారి రాజులంతా పతనం అయ్యారు. వారిలో ఒక్కడు కూడా సహాయం కోసం నన్ను అడుగలేదు.”
HOS 7:8 “ఎఫ్రాయిము రాజ్యాలతో కలిసిమెలిసి ఉంటుంది. ఎఫ్రాయిము రెండు వైపులా కాలని రొట్టెలా ఉంది.
HOS 7:9 పరాయివాళ్లు ఎఫ్రాయిము బలాన్ని నాశనం చేస్తారు. కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు. ఎఫ్రాయిము తలమీద తెల్లవెంట్రుకలు ఉన్నాయి, కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు.
HOS 7:10 ఎఫ్రాయిము గర్వం అతనికి విరోధంగా మాట్లాడుతుంది. ప్రజలకు ఎన్నెన్నో కష్టాలు కలిగాయి. అయినప్పటికీ వారు తమ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లలేదు. ప్రజలు సహాయంకోసం ఆయనవైపు చూడలేదు.
HOS 7:11 కనుక ఎఫ్రాయిము తెలివిలేని పావురంలా తయారయ్యాడు. ప్రజలు సహాయంకోసం ఈజీప్టును పిలిచారు. సహాయంకోసం ప్రజలు అష్షూరు వెళ్లారు.
HOS 7:12 సహాయంకోసం వారు ఆయా దేశాలకు వెళ్తారు. కానీ నేను వారిని వలలో పడవేస్తాను. వారి మీద నేను నా వల విసిరి ఆకాశ పక్షుల్లాగ నేను వారిని కిందికి దించుతాను. వారి ఒడంబడిక విషయంలో నేను వారిని శిక్షిస్తాను.
HOS 7:13 అది వారికి చెడుగా ఉంటుంది. వారు నన్ను విడిచిపెట్టేశారు. నాకు విధేయులగుటకు వారు నిరాకరించారు. కనుక వారు నాశనం చేయబడతారు. ఆ ప్రజలను నేను రక్షించాను. కానీ వారు నాకు విరోధంగా అబద్ధాలు చెబుతారు.
HOS 7:14 అవును, వారు హృదయపూర్వకంగా ఎన్నడూ నాకు మొరపెట్టరు. వారు ఇతరుల భూములలో ధాన్యం, కొత్త ద్రాక్షారసం కోసం తరిగేటప్పుడు వారి పడకల మీద పడి ఏడుస్తారు. వారి ఆరాధనలో భాగంగా వారిని వారు కోసుకొంటారు. కానీ వారి హృదయాల్లో వారు నా నుండి తిరిగి పోయారు.
HOS 7:15 నేను వారికి బుద్ధి వచ్చేటట్లు చేసి, వారు చేతులను బలపర్చాను. కానీ వారు నాకు విరోధంగా దుష్ట పన్నాగాలు పన్నారు.
HOS 7:16 దేవుళ్లుకాని వారివైపు (బయలు దేవత) వారు తిరిగారు. వారు అక్కరకు రాని (వంగని) విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ బలాన్ని గూర్చి అతిశయించారు. కానీ వారు కత్తులతో చంపబడతారు. అప్పుడు ఈజిప్టు ప్రజలు వారిని చూచి నవ్వుతారు. విగ్రహారాధన నాశనానికి దారి తీస్తుంది.
HOS 8:1 “బూర నీ నోట పెట్టుకొని, హెచ్చరిక చేయుము. యెహోవా ఆలయం మీద పక్షి రాజువలె ఉండు. ఇశ్రాయేలీయులు నా ఒడంబడికను ఉల్లఘించారు. వారు నా న్యాయ చట్టానికి విధేయులు కాలేదు.
HOS 8:2 ‘నా దేవా, ఇశ్రాయేలులో ఉన్న మాకు నీవు తెలుసు’ అని వారు అరచి నాకు చెపుతారు.
HOS 8:3 కానీ ఇశ్రాయేలు మంచివాటిని తిరస్కరించింది. అందుచేత శత్రువు అతన్ని తరుముతున్నాడు.
HOS 8:4 ఇశ్రాయేలీయులు తమ రాజులను ఏర్పరచుకొన్నారు. కానీ సలహా కోసం వారు నా దగ్గరకు రాలేదు. ఇశ్రాయేలీయులు నాయకులను ఏర్పరచుకున్నారు. కానీ నేను ఎరిగిన మనుష్యులను వారు ఎన్నుకోలేదు. ఇశ్రాయేలీయులు తమ వెండి, బంగారం ఉపయోగించి వారికోసం విగ్రహాలు చేసుకొన్నారు. కనుక వారు నాశనం చేయబడతారు.
HOS 8:5 (షోమ్రోనూ) నీ దూడను (విగ్రహాన్ని) యెహోవా నిరాకరించాడు. దేవుడు అంటున్నాడు, ‘ఇశ్రాయేలీయుల మీద నేను చాలా కోపంగా ఉన్నాను’ ఇశ్రాయేలు ప్రజలు వారి పాపం విషయంలో శిక్షించబడతారు.
HOS 8:6 ఆ విగ్రహాలను ఒక పనివాడు చేశాడు. అవి దేవుళ్లు కావు. సమరయ దూడ ముక్కలుగా విరుగగొట్ట బడుతుంది.
HOS 8:7 ఇశ్రాయేలీయులు ఒక మూర్ఖమైన పని చేశారు అది గాలిని నాటుటకు ప్రయత్నించినట్టు ఉంది. కానీ వారికి కష్టాలు మాత్రమే కలుగుతాయి. వారు సుడిగాలిని పంటగా కోస్తారు. పొలంలో ధాన్యం పండుతుంది. కానీ అది ఆహారాన్ని ఇవ్వదు. ఒకవేళ దానిలో ఏమైనా పండినా పరాయివాళ్లు దాన్ని తినేస్తారు.
HOS 8:8 “ఇశ్రాయేలు మింగివేయబడింది (నాశనం చేయబడింది). ఇశ్రాయేలు ఎవరికీ పనికిరాని ఒక పనిముట్టులాగ తయారయ్యింది. ఇశ్రాయేలు విసిరి వేయబడింది వారు యితర రాజ్యాలలో చెదరగొట్టబడ్డారు.
HOS 8:9 ఎఫ్రాయిము తన విటుల దగ్గరకు వెళ్లాడు. అడవి గాడిదలా అతడు తిరుగుతూ అష్షూరు వెళ్లాడు.
HOS 8:10 ఆయా రాజ్యాలలో తన విటుల దగ్గరకు ఇశ్రాయేలు వెళ్లింది. కానీ ఇప్పుడు నేను ఇశ్రాయేలీయులను సమకూరుస్తాను. ఆ మహాశక్తిగల రాజు వారి మీద భారాన్ని వేస్తాడు. మరియు వాళ్లు ఆ భారంవల్ల కొద్దిగా బాధపడాలి.
HOS 8:11 ”“ఎఫ్రాయిము ఎన్నెన్నో బలిపీఠాలు కట్టింది. అవి అతను పాపాలు చేయడానికి అధారమయ్యాయి
HOS 8:12 ఎఫ్రాయిము కోసం నేను నా న్యాయచట్టాలు సంపూర్ణముగా వ్రాసినా అవి ఎవరో పరాయి వాడికోసం అన్నట్టు అతడు వాటిని గూర్చి అనుకొంటాడు.
HOS 8:13 బలులు అంటే ఇశ్రాయేలీయులకు ఇష్టం. వారు మాంసం అర్పించి, దాన్ని తినేస్తారు. యెహోవా వారి బలులు స్వీకరించడు. ఆయనకు వారి పాపాలు జ్ఞాపకమే. ఆయన వారిని శిక్షిస్తాడు. వారు ఈజిప్టుకు బందీలుగా కొనిపోబడుతారు.
HOS 8:14 ఇశ్రాయేలీయులు నివాసాలు నిర్మించారు. కానీ వారు తమను చేసిన సృష్టికర్తను మరచిపోయారు. ఇప్పుడు యూదా కోటలు కట్టింది. కానీ యూదా పట్టణాల మీదకి నేను అగ్నిని పంపిస్తాను. ఆ అగ్ని దాని రాజభవనాలను నాశనం చేస్తుంది.”
HOS 9:1 ఇశ్రాయేలూ, రాజ్యాలు సంబరం చేసుకున్నట్టు నీవు చేసుకోవద్దు. సంతోషంగా ఉండకు! నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తించి, నీ దేవుణ్ణి విడిచిపెట్టేశావు. ప్రతి కళ్లం మీద నీవు నీ లైంగిక పాపం చేశావు.
HOS 9:2 కానీ ఆ కళ్లములనుండి వచ్చే ధాన్యం, ఇశ్రాయేలీయులకు సరిపడినంత ఆహారం ఇవ్వదు. ఇశ్రాయేలుకు సరిపడినంత ద్రాక్షారసం ఉండదు.
HOS 9:3 ఇశ్రాయేలీయులు యెహోవా దేశంలో నివసించరు. ఎఫ్రాయిము తిరిగి ఈజిప్టుకు వెళ్తుంది. వారు తినకూడని ఆహారం వారు అష్షూరులో తింటారు.
HOS 9:4 ఇశ్రాయేలీయులు ద్రాక్షారసపు అర్పణలు యెహోవాకు అర్పించరు. వారు ఆయనకు జంతువుల బలులు అర్పించరు. వారి బలులు శవసంస్కారము వద్ద తినే భోజనము లాంటిది. ఎవరైతే దాన్ని తింటారో వారు అపరిశుద్ధులవుతారు. వారి రొట్టెలు యెహోవా ఆలయంలోనికి వెళ్లవు-అవి సరిగ్గా వారు బతికి ఉండేందుకు మాత్రమే సరిపోతాయి.
HOS 9:5 వారు (ఇశ్రాయేలీయులు) యెహోవాకు పండుగలు, పవిత్ర దినాలు ఆచరించలేరు.
HOS 9:6 ఇశ్రాయేలీయులకు కలిగినదంతా శత్రువు తీసుకొన్నందువల్ల ఇశ్రాయేలు వదిలిపెట్టబడింది. కాని ఈజిప్టు ఆ ప్రజలను తీసుకొంటుంది. వారిని మెంఫెసు పట్టణం పాతిపెడ్తుంది. వారి వెండి ఐశ్వర్యాల మీద పిచ్చిమొక్కలు మొలుస్తాయి. ఇశ్రాయేలీయులు నివసించినచోట ముళ్లకంపలు పెరుగుతాయి.
HOS 9:7 “ఇశ్రాయేలూ, ఈ విషయాలు తెలుసుకో; శిక్షా సమయం వచ్చింది. నీవు చేసిన చెడుకార్యాలకు ప్రతిఫలం నీవు చెల్లించాల్సిన సమయం వచ్చింది” అని ప్రవక్త చెపుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, “ప్రవక్త బుద్ధిలేనివాడు. దేవుని ఆత్మగల ఈ మనిషి వెర్రివాడు” అని అంటున్నారు. “మీ చెడు పాపాల విషయంలో మీరు శిక్షించబడతారు మీద్వేషం మూలంగా మీరు శిక్షించబడుతారు” అని ప్రవక్త చేపుతున్నాడు.
HOS 9:8 దేవుడు మరియు ప్రవక్త ఎఫ్రాయిముకు కాపలా కాస్తున్న కావలివంటివారు. కానీ మార్గం పొడవునా ఎన్నో ఉచ్చులు ఉన్నాయి. మరియు ప్రజలు ప్రవక్తను అతని దేవుని మందిరంలో కూడ అసహ్యించు కొంటున్నారు.
HOS 9:9 గిబియా కాలంలో వలె, ఇశ్రాయేలీయులు నాశనం లోనికి లోతుగా దిగిపోయారు. ఇశ్రాయేలీయుల పాపాలను యెహోవా జ్ఞాపకం ఉంచుకొంటాడు. వారి పాపాలను ఆయన శిక్షిస్తాడు.
HOS 9:10 ”“నా మట్టు కైతే ఇశ్రాయేలు ఎడారిలో ద్రాక్షాపళ్లు చూచినట్టు ఉంది. కాలం మొదట్లో అంజూరపు చెట్లమీద మొదటి పండ్లవంటివారు మీ పూర్వీకులు. అయితే వారు బయల్పెయోరుకు వచ్చారు. వారు మారిపోయారు-వారు ఏదో కుళ్ళిపోయినదానిలా ఉండిరి. వారు తాము ప్రేమించిన దారుణ విషయాల్లాగే (అబద్ధపు దేవుళ్లు) వారూ తయారయ్యారు.
HOS 9:11 “ఒక పిట్టలాగ ఎఫ్రాయిము మహిమ ఎగిరి పోతుంది. ఇక గర్భములు దాల్చుట ఉండదు. పుట్టుకలు ఇక ఉండవు. పిల్లలు ఇక ఉండరు.
HOS 9:12 కానీ ఒకవేళ ఇశ్రాయేలీయులు పిల్లలను పెంచినా, అది సహాయ పడదు. పిల్లలను వారి దగ్గర్నుండి నేను తీసివేస్తాను. నేను వారిని విడిచిపెట్టేస్తాను. వారికి కష్టాలు తప్ప మరేవి ఉండవు.”
HOS 9:13 ఎఫ్రాయిము తన పిల్లలను బోను లోనికి నడిపిస్తూ ఉండటం నేను చూడగలను. ఎఫ్రాయిము తన పిల్లలను హంతకుని దగ్గరకు తీసికొని వస్తాడు.
HOS 9:14 యెహోవా, నీ ఇష్టం వచ్చిన దాన్ని వారికి చేయుము. గర్భస్రావాలు అయ్యే గర్భం వారికి ఇమ్ము, పాలు ఇవ్వలేని స్తనాలు వారికి ఇమ్ము.
HOS 9:15 వారి దుర్మార్గం అంతా గిల్గాలులో ఉంది. అక్కడే నేను వారిని అసహ్యించుకోవటం మొదలు బెట్టాను. వారు చేసే దుర్మార్గపు పనుల మూలంగా వారిని నా ఇంటినుండి నేను వెళ్ల గొట్టేస్తాను. ఇంకెంతమాత్రం నేను వారిని ప్రేమించను. వారి నాయకులు తిరుగుబాటు దారులు. వారు నాకు విరోధంగా తిరిగారు.
HOS 9:16 ఎఫ్రాయిము శిక్షించబడుతుంది. వారి వేరుచస్తుంది. వారికి ఇక పిల్లలు ఉండరు. వారు పిల్లల్ని కనవచ్చును. కానీ వారి శరీరాలనుండి పుట్టే ఆ ప్రశస్త శిశువులను నేను చంపేస్తాను.
HOS 9:17 ఆ ప్రజలు నా దేవుని మాట వినలేదు. కనుక ఆయన వారిని నిరాకరించాడు. వారు ఇల్లులేని వారుగా, రాజ్యాలలో సంచారం చేస్తారు.
HOS 10:1 విస్తారమైన పండ్లు ఫలించే ద్రాక్షావల్లిలాంటిది ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకు దేవుని దగ్గరనుండి ఎన్నెన్నో లభించాయి. కానీ అతడు ఇంకా ఇంకా ఎక్కువ బలిపీఠాలను బూటకపు దేవుళ్లకు కట్టాడు. అతని భూమి క్రమంగా ఎక్కువగా ఫలించింది. కనుక అతడు బూటకపు దేవుళ్లను గౌరవించుటకు స్థంభాలను నిలిపాడు.
HOS 10:2 ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మోసం చేయాలని చూశారు కానీ ఇప్పుడు వారు తమ దోషాన్ని అంగీకరించాలి. వారి బలిపీఠాలను యెహోవా విరుగగొడ్తాడు. వారి స్మారక శిలలను ఆయన నాశనం చేస్తాడు.
HOS 10:3 ఇప్పుడు, “మాకు రాజు లేడు. మేము యెహోవాను గౌరవించము! ఆయన రాజు మాకు ఏమి చేయలేడు!” అని ఇశ్రాయేలీయులు చెపుతారు.
HOS 10:4 వారు వాగ్దానాలు చేస్తారు కానీ వారు వట్టి అబద్ధాలు మాత్రమే చేపుతున్నారు. వారి వాగ్దానాలను వారు నిల బెట్టుకోరు. [ఇతర దేశాలతో వారు ఒప్పందాలు చేస్తారు. ఆ ఒప్పందాలు దేవునికి ఇష్టం లేదు.] ఆ న్యాయ మూర్తులు, దున్నబడిన పొలంలో విషపుకలుపు మొక్కల్లాంటివారు.
HOS 10:5 సమరయ ప్రజలు బేతావెను దగ్గర దూడలను పూజిస్తారు. ఆ ప్రజలు, యాజకులు నిజంగా ఏడుస్తారు. ఎందుకంటే అందమైన వారి విగ్రహం ఎత్తుకునిపోబడింది.
HOS 10:6 అష్షూరు రాజుకు కానుకగా అది ఎత్తుకొనిపోబడింది. ఎఫ్రాయిము యొక్క అవమానకరమైన విగ్రహాన్ని అతడు ఉంచుకొంటాడు. ఇశ్రాయేలు తన విగ్రహం విషయమై సిగ్గుపడుతుంది.
HOS 10:7 సమరయ బూటకపు దేవుడు నాశనం చేయబడతాడు. అది నీటిమీద తేలిపోతున్న చెక్క ముక్కలాగ ఉంటుంది.
HOS 10:8 ఇశ్రాయేలు పాపంచేసి, ఎత్తయిన స్థలాలు అనేకం నిర్మించింది. ఆవెనులోనున్న ఎత్తయిన స్థలాలు అన్నీ నాశనం చేయబడతాయి. వాటి బలిపీఠాలమీద ముళ్ల కంపులు, పిచ్చిమొక్కలు మొలుస్తాయి. అప్పుడు వారు “మమ్మల్ని కప్పండి!” అని పర్వతాలతోను, “మా మీద పడండి!” అని కొండలతోను చెపుతారు.
HOS 10:9 “ఇశ్రాయేలూ, గిబియా కాలం నుండి నీవు పాపం చేశావు. (మరియు ఆ ప్రజలు అక్కడ పాపం చేస్తూనే ఉన్నారు). ఆ దుర్మార్గులను గిబియాలో యుద్దం నిజంగా పట్టుకొంటుంది.
HOS 10:10 వారిని శిక్షించటానికి నేను వస్తాను. వారికి విరోధంగా సైన్యాలు కలిసి ఉమ్మడిగా వస్తాయి. ఇశ్రాయేలీయులను వారి రెండు పాపాల నిమిత్తం ఆ సైన్యాలు శిక్షిస్తాయి.
HOS 10:11 “ఎఫ్రాయిము నూర్పిడి కళ్లంలో ధన్యం మీద నడవడానికి ఇష్టపడే శిక్షణగల పెయ్యలాగ ఉన్నాడు. దాని మెడమీద నేను ఒక కాడిని పెడతాను. తాళ్లను నేను ఎఫ్రాయిము మీద ఉంచుతాను. అప్పుడు యూదా దున్నటం మొదలు పెడతాడు. యాకోబు తానే భూమిని చదును చేస్తాడు.”
HOS 10:12 నీవు మంచితనాన్ని నాటితే సత్య ప్రేమను కోస్తావు. నీవు నేలను దున్ని యెహోవాతో కలిసి పంటకోస్తావు. ఆయన వచ్చి, మంచితనాన్ని వర్షంలాగ నీమీద కురిపిస్తాడు!
HOS 10:13 కానీ మీరు దుర్మార్గం నాటారు. కష్టాన్ని పంటగా కోశారు. మీ అబద్ధాల ఫలం మీరు తిన్నారు. ఎందుచేతనంటే మీరు మీ శక్తిని, మీ సైనికులను నమ్ముకొన్నారు.
HOS 10:14 కనుక మీ సైన్యాలు యుద్ధ ధ్వనులు వింటాయి. మరియు మీ కోటలన్నీ నాశనం చేయబడతాయి. అది షల్మాను బేతర్బేలును నాశనం చేసిన సమయంలాగా ఉంటుంది. ఆ యుద్ధ సమయంలో తల్లులు వారి పిల్లలతో పాటు చంపబడ్డారు.
HOS 10:15 మీకు కూడ బేతేలు వద్ద అలాగే జరుగుతుంది. ఎందుచేత నంటే, మీరు చాలా దుర్మార్గపు పనులు చేశారు గనుక. ఆ రోజు ప్రారంభమైనప్పుడు ఇశ్రాయేలు రాజు సర్వ నాశనం చేయబడతాడు.
HOS 11:1 “ఇశ్రాయేలు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేను (యెహోవా) వానిని ప్రేమించాను. మరియు ఈజిప్టు నుండి నా కుమారుని బయటకు పిలిచాను.
HOS 11:2 కాని ఇశ్రాయేలీయులను ఎంత ఎక్కువగా నేను పిలిస్తే అంత ఎక్కువగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టారు. బయలు దేవతలకు ఇశ్రాయేలీయులు బలులు అర్పించారు. విగ్రహాలకు వారు ధూపం వేశారు.
HOS 11:3 “అయితే ఎఫ్రాయిముకు నడవటం నేర్పింది నేనే! ఇశ్రాయేలీయులను నేను నా చేతులతో ఎత్తు కొన్నాను! నేను వారిని స్వస్థపరిచాను. కాని అది వారికి తెలియదు.
HOS 11:4 తాళ్లతో నేను వారిని నడిపించాను. కాని అవి ప్రేమ బంధాలు. నేను వారిని విడుదల చేసిన వ్యక్తిలాగవున్నాను. నేను వంగి వారికి భోజనం పెట్టాను.
HOS 11:5 “ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు మళ్లుకొనుటకు నిరాకరించారు. కనుక వారు ఈజిప్టు వెళ్తారు! అష్షూరు రాజు వారికి రాజు అవుతాడు.
HOS 11:6 వారి పట్టణాలకు విరోధంగా ఖడ్గం విసరబడుతుంది. బలమైన వారి మనుష్యులను అది చంపుతుంది. వారి నాయకులను అది నాశనం చేస్తుంది.
HOS 11:7 “నేను తిరిగిరావాలని నా ప్రజలు కోరుకుంటున్నారు. పైనున్న దేవున్ని వాళ్లు వేడుకుంటారు. కాని, దేవుడు వాళ్లకు సహాయం చేయడు.”
HOS 11:8 “ఎఫ్రాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె నాకులేదు. ఇశ్రాయేలూ, నిన్ను కాపాడాలన్నదే నా కోర్కె. నిన్ను అద్మావలె చెయ్యాలన్న కోర్కె నాకు లేదు! నిన్ను జెబొయీములాగ చెయ్యాలనీ లేదు! నేను నా మనసు మార్చు కుంటున్నాను, నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.
HOS 11:9 నేను నా కోపాగ్నిని అణచుకొంటాను. నేను మరోమారు ఎఫ్రాయిమును నాశనం చేయను. నేను మనిషిని కాను, నేను పవిత్రమైన దేవుణ్ణి. నేను నీతోవున్నాను కాబట్టి నేను నీపై నా కోపం చూపను.
HOS 11:10 నేను సింహంలాగ గర్జిస్తాను. నేను గర్జించగానే, నా బిడ్డలు వచ్చి నన్ను అనుసరిస్తారు. భయంతో కంపిస్తూ నా బిడ్డలు పశ్చిమ దిశ నుంచి వస్తారు.
HOS 11:11 వాళ్లు ఈజిప్టు నుంచి పక్షుల్లా వణుకుతూ వస్తారు. వాళ్లు అష్షూరు దేశంనుంచి పావురాలవలె కదులుతూ వస్తారు నేను వాళ్లని తిరిగి ఇంట చేరుస్తాను” అని యెహోవా చెప్పాడు.
HOS 11:12 “బూటకపు దేవుళ్లతో ఎఫ్రాయిము నన్ను చుట్టు ముట్టాడు. ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా తిరిగారు. మరియు వాళ్లు నశింపజేయబడ్డారు! కాని, యూదా యింకా ఎల్‌-తోనే నడుస్తున్నాడు. యూదా అపవిత్రలకు నమ్మ కస్తుడుగా ఉన్నాడు.”
HOS 12:1 ఎఫ్రాయిము వాళ్లు తమ కాలాన్ని వృథా చేస్తున్నారు, ఇశ్రాయేలీయులు రోజంతా “గాలిని తరుముతున్నారు.” వాళ్లు అంతకంతకు ఎక్కువగా అబద్ధాలాడుతున్నారు, వారు అంతకంతకు ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్లు అష్షూరుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్లు తమ ఒలీవ నూనెను ఈజిప్టుకి తరలిస్తున్నారు.
HOS 12:2 యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వాదించాను. అతను చేసిన పనులకు గాను యాకోబును శిక్షించి తీరాలి. అతను చేసిన వాటినిబట్టి అతన్ని శిక్షించాలి.
HOS 12:3 యాకోబు ఇంకా తన తల్లి కడుపులో ఉండగానే తన సోదరుణ్ణి మోసగించ నారంభించాడు. యాకోబు బలిష్టడైన యువకుడు. అప్పట్లో అతను దేవునితో పోరాడాడు.
HOS 12:4 యాకోబు దేవుని దూతతో పోరాడి గెలిచాడు. అతను విలపించి దేవుణ్ణి ఒక సహాయం చేయుమని అడిగాడు. ఇది బేతేలులో జరిగిన సంఘటన. అక్కడే ఆయన మనతో మాట్లాడాడు.
HOS 12:5 ఔను, యెహోవాయే సర్వసేనాధిపతియైన దేవుడు. అయన పేరు యెహోవా (ప్రభువు).
HOS 12:6 అందుకని, మీరు మీ దేవుని వద్దకు తిరిగి రండి. ఆయనకు విధేయులుగా ఉండండి. దయగలవారిగా నీతిమంతులుగా ఉండండి. సదా మీ దేవుని నమ్మండి.
HOS 12:7 “యాకోబు ఒక వ్యాపారస్థుడు. అతను తన మిత్రుణ్ణి కూడా మోసగిస్తాడు. అతని తక్కెడలు కూడా సరైననవి కావు.
HOS 12:8 ఎఫ్రాయిము ఇలా అనుకున్నాడు: ‘నేను ఐశ్వర్యవంతుణ్ణి! నాకు ధనరాశులు దొరికాయి. నా నేరాల సంగతి ఎవడూ తెలుసుకోడు. నా పాపాలు గురించి ఎవడూ తెలుకోడు.’
HOS 12:9 “మీరు ఈజిప్టు దేశంలో ఉన్ననాటినుంచి యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి. గుడార సమావేశ కాలంలో మాదిరిగా నేను మిమ్మల్ని గుడారాల్లో నివసింపజేస్తాను.
HOS 12:10 నేను ప్రవక్తలతో మాట్లాడాను. నేను వాళ్లకి అనేక దర్శనాలు ఇచ్చాను. నేను పద్ధతులను సూచించాను.
HOS 12:11 కాని, గిల్గాదు ప్రజలు పాపులు. అక్కడ అనేక క్షుద్ర దేవతా విగ్రహాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు గిల్గాలువద్ద ఎడ్లను బలులుగా ఇస్తారు. వాళ్లకి బలిపీఠాలు అనేకం ఉన్నాయి. దున్నిన పొలంలో బురద చాళ్లు ఉన్నట్లే వాళ్లకి బారులు బారులుగా బలిపీఠాలు ఉన్నాయి.
HOS 12:12 “యాకోబు అరాము దేశంలోకి పారిపోయాడు. అక్కడ, ఇశ్రాయేలు ఒక భార్యకోసం శ్రమచేశాడు. మరో భార్యకోసం గొర్రెల్ని మేపాడు.
HOS 12:13 కాని, యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును ఈజిప్టునుంచి వెనక్కి రప్పించాడు. యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును భద్రంగా కాపాడాడు.
HOS 12:14 కాని, ఎఫ్రాయిము యెహోవాకి మిక్కిలి కోపం కలిగించాడు. ఎఫ్రాయిము చాలామందిని హతమార్చాడు. అందుకని, అతను తన నేరాలకిగాను శిక్షింపబడతాడు. అతని ప్రభువు అతన్ని తన సిగ్గును సహించేటట్లుగా చేశాడు.”
HOS 13:1 ఇశ్రాయేలులో ఎఫ్రాయిము చాలా ప్రాముఖ్యం సంపాదించుకున్నాడు. ఎఫ్రాయిము మాట్లడితే చాలు ప్రజలు భయంతో కంపించి పోయేవారు. కాని ఎఫ్రాయిము పాపకార్యాలు చేశాడు. అతను బయలు దేవతని ఆరాధించాడు.
HOS 13:2 ఇప్పుడిక ఇశ్రాయేలీయులు నానాటికీ ఎక్కువగా పాపంచేస్తారు. వాళ్లు తమకోసం తాము విగ్రహాలను చేసుకుంటారు. పనివాళ్లు వెండితో ఆ విగ్రహాలను చేస్తారు. అప్పుడిక ఇశ్రాయేలీయులు తామ ఆ విగ్రహాలతో మాట్లాడతారు. వాళ్లు ఆ విగ్రహాలకు బలులు సమర్పిస్తారు. వాళ్లు ఆ బంగారు దూడలను ముద్దు పెట్టుకొంటారు.
HOS 13:3 అందుకే వాళ్లు త్వరలోనే ప్రాతః కాలపు పొగమంచులా అదృశ్యమవుతారు. ఆ పొగ మంచు నేలపై పడుతుంది. కాని అది త్వరలోనే ఆవిరై పోతుంది. ఇశ్రాయేలీయులు కళ్లంలో ధాన్యపు పోత పోసేటప్పుడు గాలికి ఎగిరిపోయే పొట్టులాంటి వాళ్లు. ఇశ్రాయేలీయులు పొగగొట్టంలోనుంచి వెలువడి, గాలిలో కలిసిపోయే పొగలాంటివాళ్లు.
HOS 13:4 “మీరు ఈజిప్టులో ఉన్ననాటినుంచీ యెహోవానైన నేనే మీ దేవుణ్ణి. నన్ను తప్ప మీరు మరో దేవుడెవరినీ ఎరుగరు. మిమ్మల్ని రక్షించినది నేనే.
HOS 13:5 మీరు ఎడారిలో ఉన్నప్పుడూ, మెట్ట ప్రాంతంలో ఉన్నప్పుడూ కూడా మీరు నాకు తెలుసు.
HOS 13:6 ఇశ్రాయేలీయులకు నేను ఆహారమిచ్చాను. వాళ్లా ఆహారం తిన్నారు. వాళ్లు కడుపులు నింపుకుని తృప్తిచెందారు. వాళ్లు గర్విష్ఠులై నన్ను మరచారు!
HOS 13:7 “అందుకే నేను వాళ్ల పాలిటికి సింహంలాగ ఉంటాను. దారిప్రక్కన పొంచివున్న చిరుత పులిలాగా ఉంటాను.
HOS 13:8 తన కూనల్ని కోల్పోయిన ఎలుగు బంటి లాగ నేను వాళ్లపైన దాడిచేస్తాను. నేను వాళ్ల రొమ్ములు చీలుస్తాను. తన కెదురైన జంతువును చీల్చి తినేసే ఒక కృర మృగంలాగ ఉంటాను”
HOS 13:9 “ఇశ్రాయేలూ, నేను నీకు సహాయం చేశాను. కానీ, నాకు నీవు ఎదురు తిరిగావు. అందుకు, నిన్ను నేనిప్పుడు నాశనం చేస్తాను.
HOS 13:10 నీ రాజు ఎక్కడున్నాడు? నీ నగరాలన్నింటిలోనూ అతను నిన్ను రక్షించలేడు! నీ న్యాయాధిపతులు ఎక్కడ? నీవొకప్పుడు ‘నాకొక రాజునీ, కొందరు నాయకుల్నీ ఇవ్వండి’ అని అడిగావు.
HOS 13:11 నాకు కోపం వచ్చి, నేను నీకొక రాజును ఇచ్చాను. నా కోపం మితిమీరినప్పుడు నేనా రాజుని వెనక్కి తీసేసుకున్నాను.
HOS 13:12 “ఎఫ్రాయిము తన దోషాన్ని కప్పుకొన ప్రయత్నించాడు. తన పాపాలు గుప్తంగా ఉన్నాయనుకున్నాడు. (కాని, అతను శిక్షంపబడతాడు.)
HOS 13:13 అతని శిక్ష ఎలా ఉంటుందంటే, స్త్రీ ప్రసవ బాధలా ఉంటుంది. అతను వివేకి అయిన పుత్రుడుగా ఉండడు. అతని పుట్టుకకి సమయం ఆసన్నమవుతుంది, కాని అతను బతికి బయటపడడు.
HOS 13:14 “నేను వాళ్లనా సమాధినుంచి కాపాడుతాను! నేను వాళ్లని మృత్యుముఖంనుంచి కాపాడుతాను! మరణమా, నీ వ్యాధులు ఎక్కడున్నాయి? సమాధీ నీ శక్తి ఎక్కడ? నేను పగ సాధించాలని చూడటం లేదు!
HOS 13:15 ఇశ్రాయేలు తన సోదరుల మద్య పెరుగుతాడు. కాని, శక్తివంతమైన తూర్పుగాలి వీస్తుంది. యెహోవా గాలి ఎడారినుంచి వస్తుంది. అప్పుడు (ఇశ్రాయేలు) బావి ఎండిపోతుంది. అతని నీటి బుగ్గ ఇంకిపోతుంది. (ఇశ్రాయేలు) సంపదలో విలువైన వాటన్నింటినీ గాలి ఎగరే సుకుపోతుంది.
HOS 13:16 షోమ్రోను శిక్షింపబడాలి. ఎందుకంటే, అది తన దేవునికి వ్యతిరేకమైంది. ఇశ్రాయేలీయులు కత్తులతో చంపబడతారు. వాళ్ల పిల్లలు తునాతునకలు చేయబడతారు. వాళ్ల గర్భిణీస్త్రీల కడుపులు చీల్చబడతాయి.”
HOS 14:1 ఇశ్రాయేలూ, నీవు పడిపోయి దేవునికి విరోధముగా పాపము చేశావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా వద్దకు తిరిగిరమ్ము.
HOS 14:2 నీవు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించుము. యెహోవా వద్దకు తిరిగిరిమ్ము. ఆయనతో ఇలాగున చెప్పుము, “మా పాపాన్ని తీసివేయుము. మా మంచి పనులను అంగీకరించుము. మా పెదవులనుండి స్తుతిని సమర్పిస్తాము.
HOS 14:3 అష్షూరు మమ్మల్ని కాపాడదు. మేమిక యుద్ధ గుర్రాల పైన స్వారీ చేయుము. మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము. ఎందుకంటే, అనాధుల పట్ల జాలి చూపేది నువ్వొక్కడివే.”
HOS 14:4 అందుకు యెహోవా ఇలా అంటాడు: “నా కోపం చల్లారింది, కనుక, నన్ను వీడి పోయినందుకు నేను వాళ్లని క్షమిస్తాను. నేను వాళ్లని ధారాళంగా ప్రేమిస్తాను.
HOS 14:5 నేను ఇశ్రాయేలీయులకు మంచువలెవుంటాను. ఇశ్రాయేలు తామర పుష్పంలాగ వికసిస్తాడు. అతడు లెబానోను, దేవదారు వృక్షంలాగా వేరుతన్ని దృఢంగా నిలుస్తాడు.
HOS 14:6 అతని శాఖలు విస్తరిస్తాయి, అతను అందమైన దేవదారు వృక్షంలాగ ఉంటాడు. అతను లెబానోనులోని దేవదారు చెట్లు వెలువరించే సువాసనలాగ ఉంటాడు.
HOS 14:7 ఇశ్రాయేలీయులు మరల నా పరిరక్షణలో జీవిస్తారు. గోధుమ కంకుల్లాగ పెరుగుతారు. ద్రాక్షా తీగల్లాగ పుష్పించి ఫలిస్తారు. వారు లెబానోను ద్రాక్షారసం వలె ఉంటారు.”
HOS 14:8 “ఎఫ్రాయిమూ, విగ్రహాలతో ఇక నీకెంత మాత్రమూ పనిలేదు. నీ ప్రార్థనలు ఆలకించేది నేనే నిన్ను కాపాడేది నేనే. నేను నిరంతరం పచ్చగానుండే మీ ఫలము నానుండి వస్తుంది.”
HOS 14:9 వివేకవంతుడు ఈ విషయాలు గ్రహిస్తాడు. చురుకైనవాడు ఈ విషయాలు నేర్చుకోవాలి. యెహోవా మార్గాలు సరైనవి. మంచివాళ్లు వాటిద్వారా జీవిస్తారు. పాపులు వాళ్లకు వాళ్లే చనిపోతారు.
JOE 1:1 పెతూయేలు కుమారుడైన యోవేలు ఈ సందేశాన్ని యెహోవా దగ్గరనుండి అందుకొన్నాడు:
JOE 1:2 నాయకులారా, ఈ సందేశం వినండి! దేశంలోనివసించే మనుష్యులారా, మీరందరూ నామాట వినండి. మీ జీవితకాలలంలో ఇలాంటిదిఏదైనా ఇదివరకు జరిగిందా? లేదు! మీతండ్రుల కాలంలో ఇలాంటిది ఎదైనా జరిగిందా? లేదు!
JOE 1:3 ఈ సంగతులను గూర్చి మీరు మీ పిల్లలతో చెపుతారు. మీపిల్లలు వారి పిల్లలతో చెపుతారు. మీ మనుమలు, మనుమరాండ్రు తమ తరువాత తరమువారితో చెపుతారు.
JOE 1:4 కోతమిడుతలు విడిచిపెట్టిన దానిని దండు మిడుతలు తినేస్తాయి దండు మిడుతలు విడిచిపెట్టిన దానిని దూకుడు మిడుతలు తినేస్తాయి. దూకుడు మిడుతలు విడిచి పెట్టిన దానిని వినాశ మిడుతలు తినేశాయి!
JOE 1:5 మద్యపానమత్తులారా మేల్కొని, ఏడ్వండి! ద్రాక్షామద్యం తాగే మీరందరూ ఏడ్వండి. ఎందుకంటే మీ క్రొత్త ద్రాక్షామద్యం అయిపొయింది. ఆ ద్రాక్షామద్యం మరోగుక్కెడు మీకు దొరకదు.
JOE 1:6 నా రాజ్యం మీద యుద్ధం చేయటానికి, ఒకపెద్ద శక్తిగల రాజ్యం వస్తోంది. వారు లెక్కించ శక్యంకానంత మంది సైనికులు ఉన్నారు. ఆమిడుతలు (శత్రుసైనికులు) మిమ్మల్ని నిలువునా చీల్చివేయగలవు! అది వారికి సింహపుకోరలు ఉన్నట్టుగా ఉంట్టుంది.
JOE 1:7 నా ద్రాక్షావల్లుల నుండి ద్రాక్షాపళ్ళు అన్నింటినీ ఆ “మిడుతలు”తినేస్తాయి! అవి నా అంజూరపు చెట్లను నాశనం చేస్తాయి. మిడుతలు నా చె ట్లబెరడును తినేస్తాయి. కొమ్మలు తెల్లబారి పోతాయి. చెట్లు నాశనం చేయబడతాయి.
JOE 1:8 పెళ్లికి సిద్ధంగా ఉండి తనకు కాబోయే భర్త అప్పుడే చంపి వేయబడిన ఒక యువతిలా ఏడ్వండి.
JOE 1:9 యాజకులారా! యెహోవా సేవకులారా! ఏడ్వండి. ఎందుకంటే యెహోవా ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇక ఉండవు.
JOE 1:10 పొలాలు పాడు చేయబడ్డాయి. చివరికి నేలకూడా విలపిస్తుంది. ఎందుకనగా ధాన్యం పాడైపొయింది. కొత్త ద్రాక్షారసం ఎండిపోయింది. ఒలీవ నూనె ఇకలేదు.
JOE 1:11 రైతులారా విచారించండి! ద్రాక్షాతోట రైతులారా గట్టిగా ఏడ్వండి. గోధుమ, బార్లీ కోసం ఏడ్వండి! ఎందుకంటే పొలంలోని పంట నష్టమైంది.
JOE 1:12 ద్రాక్షా వల్లులు ఎండియాయి. అంజూరపుచెట్టు చస్తోంది. దానిమ్మ చెట్టు, ఖర్జూరపుచెట్టు, ఆపిల్ చెట్టు, పొలములోని చెట్లు అన్నీ ఎండి పోయాయి. ప్రజల్లో సంతోషం చచ్చింది.
JOE 1:13 యాజకులారా, మీ విచార సూచక వస్త్రాలు ధరించి గట్టిగా ఏడ్వండి. బలిపీఠపు సేవకులారా, నా దేవుని సేవకులారా, మీరు మీ విచారసూచక వస్త్రాలతోనే నిద్రపోతారు. ఎందుకంటే దేవుని ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇకమీదట ఉండవు. మా వేశ పరచు నీ దేవుడైన సమయం ఉ యెహోవా ఆలయానికి వారిని తీసుకొని వచ్చి యెహోవాకు ప్రార్థించండి.
JOE 1:14 ఉపవాసం ఉండాల్సిన ఒక ప్రత్యేక సమయం ఉంటుందని ప్రజలతో చెప్పు. ప్రత్యేకమైన ఒక సమావేశం కోసర ప్రజల్నిపిలువుము. దేశంలో నివసిస్తున్న నాయకులను, ప్రజలందరిని సమావేశ పరచు. నీదేవుడైన యెహోవా ఆలయాని కివారిని తీసుకొనివచ్చి యెహోవాకు ప్రార్థించండి.
JOE 1:15 దుఃఖపడండి! ఎందుకంటే యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది. ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర నుండి శిక్ష ఒక దాడిలా వస్తుంది.
JOE 1:16 మన ఆహారం పోయింది. మన దేవుని ఆలయం నుండి ఆనందం, సంతోషం పోయాయి.
JOE 1:17 మనం విత్తనాలు విత్తాం, కాని ఆ విత్తనాలు ఎండిపోయి చచ్చి మట్టిలో పడివున్నాయి. మన మొక్కలు ఎండపోయి చచ్చిపోయాయి. మన కొట్టాలు ఖాళీ అయిపోయి పడిపోతున్నాయి.
JOE 1:18 జంతువులు ఆకలితో మూలుగుతున్నాయి. పశువుల మందలు గందరగోళంగా తిరుగుతున్నాయి. అవి మేసేందుకు గడ్డి లేదు. గొర్రెలు చస్తున్నాయి.
JOE 1:19 యెహోవా, సహయంకోసం నీకు నేను మొరపెడుతున్నాను. అగ్ని మా పచ్చటి పొలాలను ఎడారిగా మార్చేసింది. పొలంలొని చెట్లన్నింటినీ జ్వాలలు కాల్చి వేశాయి.
JOE 1:20 అడవి జంతువులకు కూడ నీ సహాయం కావాలి. కాలువలు ఎండిపోయాయి, నీళ్ళు లేవు! మా పచ్చటి పొలాలను అగ్ని ఎడారిగా మార్చివేసింది.
JOE 2:1 సీయోనులో బూర ఊదండి. నా పవిత్ర పర్వతం మీద హెచ్చరికగా కేకవేయండి. దేశంలో నివసించే ప్రజలందరూ భయంతో వణుకుదురు గాక. యెహోవా ప్రత్యేకదినం వస్తుంది. యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది.
JOE 2:2 అది ఒక చీకటిదుర్దినంగా ఉంటుంది. అది అంధకారపు మేఘాలు కమ్మిన దినంగా ఉంటుంది. సూర్యోదయాన సైన్యం పర్వతాలలో నిండి ఉండటం నీవు చూస్తావు. అది మహశక్తిగల సైన్యంగా ఉంటుంది. ఇంతకుముందు ఇలాంటిది ఏదీ, ఎన్నడూ ఉండలేదు. మరియు ఇలాంటిది ఏది, ఎన్నటికీ మరో సారి ఉండదు.
JOE 2:3 మండుచున్న అగ్నిలా సైన్యం దేశాన్ని నాశనం చేస్తుంది. వారి ఎదుట దేశం ఏదెను వనంలా ఉంది. వారి వెనుక దేశం ఖాళీ ఎడారిలా ఉంది. ఏదీ వారినుండి తప్పించుకోలేదు.
JOE 2:4 వారు గుర్రాల్లా కనబడరతారు. యుద్ధ గుర్రాల్లావారు పరుగెత్తుతారు.
JOE 2:5 వారి మాట వినండి. అది పర్వతాలమీద రథాలు పరుగులెత్తిన ధ్వనిలా ఉంది. అది పొట్టును కాల్చి వేస్తోన్న అగ్నిజ్వాలల శబ్ధంలా ఉంది. వారు శక్తిగల ఒక జనం. వారు యుద్ధానికి సిద్దంగా ఉన్నారు.
JOE 2:6 ఈ సైన్యం ఎదుట ప్రజలు భయంతో వణకు తారు. వారి ముఖాలు భయంతో తెల్లబడి పోతాయి.
JOE 2:7 ఆసైనికులు వేగంగా పరుగెత్తుతారు. ఆ సైనికులు గోడలు ఎక్కుతారు. ప్రతి సైనికుడూ తిన్నగా ముందుకు దూసుకొనిపోతాడు. వారు వారి మార్గంనుండి తప్పుకోరు.
JOE 2:8 వారు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాడరు. ప్రతి సైనికుడూ తన సొంత దారిలో నడుస్తాడు. ఒక సైనికుడు దెబ్బ తగిలి పడిపోతే మిగిలిన వారు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు.
JOE 2:9 వారు పట్టణానికి పరుగెత్తుతారు. వారు త్వరగాగోడ ఎక్కుతారు. వారు ఇండ్లలోనికి ఎక్కిపోతారు. వారు ఒక దొంగలా కిటికీల్లో నుండి ప్రవేశిస్తారు.
JOE 2:10 వారి ఎదుట భూమి, ఆకాశం వణుకుతాయి. సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతాయి. మరియు నక్షత్రాలు ప్రకాశించటం మాని వేస్తాయి.
JOE 2:11 యెహోవా తన సైన్యాన్ని గట్టిగా పిలుస్తాడు. ఆయన విడిది చాలా విశాలమైంది. ఆ సైన్యం ఆయన ఆదేశాలకు లోబడుతుంది. ఆ సైన్యం చాలా శక్తిగలది. యెహోవా ప్రత్యేక దినం ఒక గొప్ప భయంకర దినం. ఏ మనిషీ దానిని ఆపు చేయలేవు.
JOE 2:12 ఇది యెహోవా సందేశం: “ఇప్పుడు మీ పూర్ణహృదయంతో నా దగ్గరకు తిరిగిరండి. మీరు చెడ్డ పనులు చేసారు. ఏడువండి, ఏడువండి. భోజనం ఏమీ తినకండి.
JOE 2:13 మీ వస్త్రాలు కాదు మీ హృదయాలు చింపుకోండి.” మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి. ఆయన దయ, జాలిగలవాడు. ఆయన త్వరగా కోపపడడు. ఆయనకు ఎంతో ప్రేమఉంది. ఒక వేళ ఆయన తలపెట్టిన చెడ్డ శిక్ష విషయంలో ఆయన తన మనస్సు మార్చుకొంటాడేమో.
JOE 2:14 ఒకవేళ యెహోవా తన మనస్సు మార్చుకొంటాడేమో ఎవరికి తెలుసు. మరియు ఒకవేళ ఆయన తన వెనుక నీ కోసం ఒక ఆశీర్వాదం విడిచి పెడతాడేమో. అప్పుడు నీవు నీ యెహోవా దేవునికి ధాన్యార్పణం పానీయా ర్పణలు అర్పించవచ్చు.
JOE 2:15 సీయోనులో బూర ఊదండి. ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి. ఒక ప్రత్యేక ఉపవాస సమయం ఏర్పాటు చేయండి.
JOE 2:16 ప్రజలను సమావేశం చేయండి. ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి. పెద్దవాళ్లును సమావేశపరచండి. చిన్న పిల్లలను, తల్లుల స్తనములను ఇంకా కుడిచే చిన్న శిశువులను సహితం సమావేశపరచండి. పెండ్లి కుమార్తెను, ఆమె పెండ్లి కుమారున్ని వారి పడక గది నుండి బయటకు రప్పించండి.
JOE 2:17 యాజకులను, యెహోవా సేవకులను మండపానికి బలిపీఠానికి మధ్య విలపించ నివ్వండి ఆప్రజలందరూ ఈ విషయాలు చెప్పాలి: “యెహోవా, నీ ప్రజలను కరుణించు. నీ ప్రజలను సిగ్గుపడనియ్యకు. నీ ప్రజలను గూర్చి ఇతరలను హేళన చేయనియ్యకు. ఇతర దేశాల్లోని ప్రజలు నవ్వుతూ ‘వారిదేవుడు ఎక్కడ?’” అని చెప్పనియ్యకు.
JOE 2:18 అప్పుడు యెహోవా ఈ దేశాన్ని గూర్చి ఉద్వేగపడ్డాడు. తన ప్రజల విషయం అయన విచార పడ్డాడు.
JOE 2:19 యెహోవా తన ప్రజలతో మాట్లాడాడు. ఆయన చెప్పాడు, “నేను మీకు ధాన్యం, ద్రాక్షారసం, నూనె పంపిస్తాను. అవి మీకు సమృద్ధిగా ఉంటాయి. రాజ్యాల మధ్య నేను మిమ్మిల్ని ఇంకెంత మాత్రం అవమానించను.
JOE 2:20 లేదు. ఆ ఉత్తరపు ప్రజలను మీ దేశంనుండి వెళ్ళగొడతాను. ఎండిపోయిన ఖాళీ దేశానికి వారు వెెళ్ళేటట్టు నేను చేస్తాను. వారిలో కొందరు తూర్పు సముద్రానికి వెళ్తారు. మరి కొందరు పడమటి సముద్రానికి వెళ్తారు. ఆ ప్రజలు అంత భయంకరమైన పనులు చేశారు. కాని వారు చచ్చి కుళ్ళిపోతున్న దానిలా ఉంటారు. అక్కడ భయంకరమైన కంపు కొడుతుంది!”
JOE 2:21 దేశమా, భయపడకు. సంతోషించి ఆనందంతోనిండి ఉండు. ఎందుకంటే యెహోవా గొప్పకార్యాలు చేస్తాడు.
JOE 2:22 పొలంలోని పశువులారా, భయపడవద్దు. అరణ్యపు బీళ్ళు మరలా గడ్డి మొలిపిస్తాయి. చెట్లఫలాలు ఫలిస్తాయి. అంజూరపు చెట్లు, మరియు ద్రాక్షావల్లులు మరిన్ని ఫలాలు ఫలిస్తాయి.
JOE 2:23 కనుక, సీయోను ప్రజలారా, సంతోషించండి. మీ యెహోవా దేవునియందు ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఆయన తన మంచితనాన్ని చూపి వర్షం కురిపిస్తాడు. ఇదివరకటివలె ఆయన మీకు ముందటి వర్షాలు కడపటి వర్షాలుకురిపిస్తాడు.
JOE 2:24 మరియు కళ్లాలు గోధుమలతో నిండిపోయి ఉంటాయి. క్రొత్త ద్రాక్షారసం మరియు ఒలీవ నూనె సీసాలలో పొర్లిపోతూంటాయి.
JOE 2:25 “నేనే యెహోవాను, నా సైన్యాన్ని మీకు విరోధంగా పంపించాను. ఆ దండు మిడుతలు, ఆ దూకుడు మిడుతలు, ఆ వినాశ మిడుతలు మరియు ఆ కోత మిడుతలు మీ వాటిని తినివేశాయి. కాని నేనే యెహోవాను, ఆ కష్టకాల సంవత్సరాలన్నింటికీ తిరిగి మీకు నేను చెల్లిస్తాను.
JOE 2:26 అప్పుడు మీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. మీరు తృప్తిగా ఉంటారు. మీ యెహోవా దేవుని నామం మీరు స్తుతిస్తారు. మీకోసం అయన అశ్చర్యకార్యాలు చేస్తాడు. నా ప్రజలు తిరిగి ఎన్నటికి సిగ్గుపరచబడరు.
JOE 2:27 ఇశ్రాయేలు ప్రజలకు నేను తోడుగా ఉన్నానని మీరు తెలుసుకొంటారు. మీ దేవుడనైన యెహోవాను నేనే అనిమీరు తెలుసుకొంటారు. మరో దేవుడు ఎవ్వరూ లేరు. నా ప్రజలు తిరిగి ఎన్నడూ సిగ్గుపడరు.”
JOE 2:28 “దీని తరువాత ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను (ఇస్తాను). మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు. మీ ముసలివాళ్ళు కలలు కంటారు. మీ యువకులు దర్శనాలు చూస్తా రు.
JOE 2:29 ఆ సమయంలో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడ నా ఆత్మను కుమ్మరిస్తాను (ఇస్తాను).
JOE 2:30 ఆకాశంలోను, భూమిమీదను ఆశ్చర్యకార్యాలు నేను చూపిస్తాను. రక్తం, అగ్ని, దట్టమైన పొగ ఉంటాయి.
JOE 2:31 సూర్యుడు చీకటిగా మార్చబడతాడు. చంద్రుడు రక్తంగా మార్చబడతాడు. అ ప్పుడు యెహోవాయొక్క మహా భయంకర దినం వస్తుంది!
JOE 2:32 అప్పుడు యెహోవా నామాన్ని స్మరించే ఏ వ్యక్తి అయినా సరే రక్షింపడతాడు. సీయోను కొండమీద యెరూషలేములో రక్షింపబడిన మనుష్యులు ఉంటారు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరుగుతుంది. మిగిలిన వారిలో యెహోవా పిలిచిన వారు ఉంటారు.
JOE 3:1 “ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదాను, యెరూషలేమును నేను తిరిగి తీసికొని వస్తాను.
JOE 3:2 రాజ్యలన్నింటిని కూడా నేను సమావేశ పరుస్తాను. ఈ రాజ్యలన్నిటిని క్రిందికి యెహోషా పాతు లోయలోకి నేను తిసుకొని వస్తాను. అక్కడ వారికి నేను తీర్పు చెప్తాను. ఆ రాజ్యా లు నా ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టాయి. వారు ఇతర రాజ్యాలలో జీవించేలా వారు వారిని బలవంత పెట్టారు. కనుక ఆ రాజ్యాలను శిక్షిస్తాను. ఆ రాజ్యాలు నా దేశాన్ని విభజించేశాయి.
JOE 3:3 నా ప్రజల కొసం వారు చీట్లు వేసి కొన్నారు. ఒక వేశ్యను కొనేందుకు వారు ఒక బాలుని అమ్ముకొన్నారు. మరియు తాగడానికి ద్రాక్షా మద్యం కొనేందుకు వారు ఒక బాలికను అమ్ముకొన్నారు.
JOE 3:4 “తూరూ! సీ దోనూ! ఫిలిష్తీలోని అన్నిప్రాంతాలూ! మీరు నాకు ముఖ్యం కాదు. నేను ఏదైనా చేసినందుకు మీరు నన్ను శిక్షిస్తున్నారా? మీరు నన్ను శిక్షిస్తున్నారని తలస్తుండవచ్చు. కానీ త్వరలో నేను మిమ్మల్ని శిక్షిస్తాను.
JOE 3:5 నా వెండి, బంగారం మీరు తీసుకొన్నారు. నా ప్రశస్త ఐశ్వర్యాలు మీరు తీసుకొని మీమీ ఆలయాలో పెట్టుకొన్నారు.
JOE 3:6 “యూదా, యెరూషలేము ప్రజలను మీరు గ్రీకువాళకు అమ్మేశారు. ఆ విధంగా మీరు వారిని దేశానికి దూరంగా తీసికొని వె ళ్ళగలిగారు.
JOE 3:7 మీరు నా ప్రజలను అంత దూరస్థలానికి పంపించి వేశారు. కానీ నేను వారిని వెనుకకు తీసికొని వస్తాను. మరియు మీరు చేసిన దానికి నేను మీమ్మల్ని శిక్షిస్తాను.
JOE 3:8 మీ కుమారులను, కుమార్తెలను యూదా ప్రజలకు నేను అమ్మివేస్తాను. అప్పుడు వారు ఇంకా దూరంలో ఉన్న షెబాయీము ప్రజలకు అమ్మివేస్తారు.” ఆ విషయాలు యెహోవా చెప్పాడు.
JOE 3:9 రాజ్యాలలో దీనిని ప్రకటించండి: యుద్ధానికి సిద్ధపడండి! బలాఢ్యులను మేల్కొలపండి! యుద్ధ వీరులందరనీ దగ్గరగా రానివ్వండి, వారిని రానివ్వండి!
JOE 3:10 మీ నాగటి రేకులను చెడగొట్టి కత్తులు చేయండి. మీ పోటు కత్తులు చెడగొట్టి ఈటెలు చేయండి. బలహీనుడ్ని కూడ “నేను బలాఢ్యుడను” అని చెప్పనీయండి.
JOE 3:11 సకల రాజ్యాల్లారా, త్వరపడండి! ఆ స్థలానికికూడి రండి! యెహోవా, బలమైన నీ సైనికు లను తీసికొని రమ్ము.
JOE 3:12 రాజ్యాల్లారా మేల్కొనండి. యెహోషాపాతు లోయలోనికి రండి. చుట్టు పక్కల రాజ్యాలన్నింటికీ తీర్పు చెప్పేందుకు అక్కడ నేను కూర్చుంటాను.
JOE 3:13 పంట సిద్ధంగా ఉంది గనుక కొడవలి పట్టుకొనిరండి. రండి, ద్రాక్షా గానుగ నిండిపోయింది గనుక ద్రాక్షాపండ్ల మీద నడవండి. వారి దుర్మార్గం చాలాఉంది గనుక పీపాలు నిండిపోయి పొర్లిపోతాయి.
JOE 3:14 తీర్మాన లోయలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. యెహోవా ప్రత్యేక దినం తీర్మాన లోయకు సమీపంగా ఉంది.
JOE 3:15 సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతాయి. నక్షత్రాలు ప్రకాశించడం మానివేస్తాయి.
JOE 3:16 యెహోవా దేవుడు సీయోనులో నుండి కేకవేస్తాడు. యెరూషలేము నుండి ఆయన కేక వేస్తాడు. మరియు ఆకాశం, భూమి కంపిస్తాయి. కాని యెహోవా దేవుడే ఆయన ప్రజలకు క్షేమస్తానం. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన క్షేమస్థానంగా ఉంటాడు.
JOE 3:17 “మీ యెహోవా దేవుడను నేనే అని అప్పుడు మీరు తెలుసుకొంటారు. నా పవిత్ర పర్వతమైన సీయోనులో నేను నివసిస్తాను. యెరుషలేము పవిత్రం అవుతుంది. పరాయి వారు ఆ పట్టణంలో నుండి మరల ఎన్నడూ దాటి వెళ్లరు.”
JOE 3:18 “ఆ రోజున పర్వతాల నుండి తియ్యటి ద్రాక్షారసం కారుతుంది. కొండల్లో పాలు, తేనెలు ప్రవహిస్తాయి. మరియు యూదాలోని ఖాళీ నదులన్నిటిలో నీళ్ళు ప్రవహిస్తాయి. యెహోవా ఆలయంలోనుండి ఒక నీటీ ఊట చిమ్ముతుంది. అది షిత్తీము లోయకు నీళు ఇస్తుంది.
JOE 3:19 ఈజిఫ్టు ఖాళీ అవుతుంది. ఎదోము ఖాళీ అరణ్యం అవుతుంది. ఎందుకంటే యూదా ప్రజలపట్ల వారు కృరంగా ఉన్నారు. వారి దేశంలోని నిర్దోష ప్రజలను వారు చంపివేశారు.
JOE 3:20 కాని యూదాలో మనుష్యులు ఎలప్పుడూ నివసిస్తారు. అనేక తరాల వరకు యెరూషలేములో మనుష్యులు నివసిస్తారు.
JOE 3:21 ఆ మనుష్యులు చాలా మంది ప్రజలను చంపేశారు. కనుక ఆ ప్రజలను నేను నిజంగా శిక్షిస్తాను!” యెహోవా దేవుడు సీయోనులో నివసిస్తాడు.
AMO 1:1 ఇది ఆమోసు వర్తమానం. ఆమోసు తెకోవ నగరానికి చెందిన ఒక గొర్రెల కాపరి. ఉజ్జీయా యూదాకు రాజుగాను, యెహోయాషు కుమారుడు యరొబము ఇశ్రాయేలుకు రాజుగాను ఉన్న కాలంలో ఆమోసు ఇశ్రాయేలును గూర్చి దర్శనాలు చూశాడు. ఇది భూకంపం రావటానికి రెండు సంవత్సరాల ముందటి విషయం.
AMO 1:2 ఆమోసు ఇలా అన్నాడు: “యెహోవా సీయోనులో సింహంలా గర్జిస్తాడు. ఆయన గంబీరస్వరం యెరూషలేము నుండి గర్జిస్తుంది. గొర్రెల కాపరుల పచ్చిక బయళ్లు ఎండి పోతాయి. కర్మెలు పర్వతం సహితం ఎండి పోతుంది.”
AMO 1:3 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “దమస్కు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేనువారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే వారు గిలాదును ధాన్యం రాలగొట్టే ఇనుప కడ్డీలతో నలుగగొట్టారు.
AMO 1:4 కావున హజాయేలు ఇంటిలో (సిరియా) నేను అగ్నిని పుట్టిస్తాను. ఆ అగ్ని బెన్హదదు ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది.
AMO 1:5 “దమస్కు ద్వారాల మీద ఉన్న బలమైన కడ్డీలను విరుగగొడతాను ఆవెను లోయలో సీంహాసనంపై కూర్చున్నవానిని నేను నాశనం చేస్తాను. బెతేదేనులో రాజదండం పట్టిన రాజును నేను నాశనం చేస్తాను. సిరియా ప్రజలు ఓడింపబడతారు ప్రజలు వారిని కీరు దేశానికి తీసుకుపోతారు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
AMO 1:6 యెహోవా ఇది చెపుతున్నాడు: “గాజా ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలందరినీ చెరబట్టి, వారినిఎదోముకు బానిసులుగా పంపారు.
AMO 1:7 కావున గాజా ప్రాకారం మీదికి నేను అగ్నిని పంపుతాను. గాజాలోని ఉన్నత బురుజులను అగ్ని దహించివేస్తుంది.
AMO 1:8 మరియు నేను అష్టోదు లో సింహాసనంపై కూర్చున్న వానిని నాశనం చేస్తాను. అష్కెలోనులో రాజదండం ధరించిన రాజును నేను నాశనం చేస్తాను. నేను ఎక్రోను ప్రజలను నాశనం చేస్తాను. ఇంకా బతికివున్న ఫిలిష్తీయులు అప్పుడు మరణిస్తారు.” దేవుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
AMO 1:9 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలనందరినీ చెరబట్టి, వారిని బానిసలుగా ఎదోముకు పంపారు. తమ సోదరులతో (ఇశ్రాయేలు) చేసుకొన్న ఒడంబడికను వారు గుర్తు పెట్టుకోలేదు.
AMO 1:10 అందువల్ల తూరు గోడల మీద నేను అగ్నిని రగుల్చుతాను. తూరులో ఎత్తయిన బురుజులను ఆ అగ్ని నాశనం చేస్తుంది.”
AMO 1:11 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఎదోము ప్రజలు చేసిన అనేక నేరాలకు వారిని నేను నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే ఎదోము కత్తి పట్టి తన సోదరుని (ఇశ్రాయేలు) వెంటాడాడు. ఎదోము దయ చూపలేదు. ఎదోము కోపం శాశ్వతంగా కొనసాగింది. అతడు ఒక క్రూర జంతువులా ఇశ్రాయేలును చీల్చి చెండాడాడు.
AMO 1:12 కావున తేమానులో నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని బొస్రా లో ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది.”
AMO 1:13 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “అమ్మోను ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు గిలాదులో గర్భిణి స్త్రీలను చంపారు. ఆ ప్రాంతాన్ని కలుపుకొని తమ రాజ్యాన్ని విస్తరింపజేయటానికి అమ్మోను ప్రజలు ఈ పని చేశారు.
AMO 1:14 కావున రబ్బా గోడమీద నేను అగ్ని రగుల్చుతాను. అది రబ్బాలోని ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది. వారి దేశంలోకి సుడిగాలి వచ్చినట్లు వారికి కష్టాలు వస్తాయి.
AMO 1:15 అప్పుడు వారి రాజులు, నాయకులు పట్టుబడతారు. వారంతా కలిసి చెరపట్టబడతారు.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
AMO 2:1 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మోయాబు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, ఎదోము రాజు యొక్క ఎముకలు సున్నమయ్యేలా మోయాబు వారు కాల్చివేశారు.
AMO 2:2 కావున మోయాబులో నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని కెరీయోతు ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది. భయంకరమైన అరుపులు, బూర నాదాలు వవినబడతాయి. మోయాబు చనిపోతాడు.
AMO 2:3 అలా నేను మోయాబు రాజులను నిర్మూలిస్తాను. మరియు మోయాబు నాయకులందరినీ నేను చంపివేస్తాను.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
AMO 2:4 యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదా వారుచేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, వారు యెహోవా ఆజ్ఞలను పాటించ నిరాకరించారు. వారాయన ఆజ్ఞలను స్వీకరించలేదు. వారి పూర్వీకులు అబద్ధాలను నమ్మారు. ఆ అబద్ధాలే యూదా ప్రజలను దేవుని అనుసరించకండా చేశాయి.
AMO 2:5 కావున యూదాలో అగ్నిని పుట్టిస్తాను. ఆ అగ్ని యెరూషలేములోగల ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది.”
AMO 2:6 యెహోవా ఇది చెపుతున్నాడు: “ఇశ్రాయేలువారు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే స్వల్పమైన వెండికొరకు వారు మంచివారిని, అమాయకులైన ప్రజలను అమ్మివేశారు. వారు ఒక జత చెప్పుల విలువకు పేదవారిని అమ్మివేశారు.
AMO 2:7 పేద ప్రజలను మట్టికరిచేలా కిందికి తోసి, వారిపై తాము నడిచారు. బాధపడేవారి గోడును వారు ఆలకించరు. తండ్రులు, కొడుకులు ఒకే స్త్రీతో సంభోగిస్తారు. వారు నా పవిత్ర నామాన్ని పాడుచేసారు.
AMO 2:8 పేద ప్రజలవద్ద వారు బట్టలు తీసుకొని, బలిపీఠాల ముందు ఆరాధన జరిపేటప్పుడు వాటిమీద కూర్చుంటారు. వారు పేదవారికి డబ్బు అప్పుగా ఇచ్చి, వారి దుస్తులను తాకట్టు పెట్టుకున్నారు. ప్రజలు అపరాధ రుసుము చెల్లించేలా వారు చేస్తారు. ఆ డబ్బును వారు తమ దేవుని అలయంలో తాగటానికి ద్రాక్షా మద్యం కొనడానికి వినియోగిస్తారు.
AMO 2:9 “కాని అమోరీయులను వారి ముందర నాశనం చేసింది నేనే. అమోరీయులు దేవదారు వృక్షమంత ఎత్తయిన వారు. వారు సింధూర వృక్షమంత బలంగల వారు. కాని, పైన వాటి పండ్లును, కింద వాటి వేళ్లను నేను నాశనం చేశాను.
AMO 2:10 “ఈజిప్టు దేశం నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చినది నేనే. అమోరీయుల దేశాన్ని మీరు ఆక్రమించటంలో నేను మీకు సహాయం చేశాను. దీనికై నలబె సంవత్సరాలు మిమ్మల్ని ఎడారిలో నడిపించాను.
AMO 2:11 మీ కుమారులలో కొంత మందిని నేను ప్రవక్తలుగా చేశాను. యువకులలో కొంత మందిని నాజీరులుగా నియమించాను. ఇశ్రాయేలు ప్రజలారా ఇది నిజం.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
AMO 2:12 “కాని నాజీరులు ద్రాక్షామద్యం తాగేలా మీరు చేశారు. దేవుని మాటలు ప్రకటించవద్దని మీరు ప్రవక్తలకు చెప్పారు.
AMO 2:13 మీరు నాకు పెద్ద భారమైనారు. అధికమైన గడ్డివేసిన బండిలా నేను చాలా కిందికి వంగిపోయాను.
AMO 2:14 ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎంత వేగంగా పరుగెత్తగలవాడైనా తప్పించుకోలేడు. బలవంతులు బలంగా లేరు. సైనికులు తమను తాము రక్షించుకోలేరు.
AMO 2:15 విలంబులు, బాణాలు చేతబట్టిన వారు బ్రతకురు. వేగంగా పరుగిడ గలవారు తప్పించుకోలేరు. గుర్రాలు ఎక్కినవారు ప్రాణలతో తప్పించుకోలేరు.
AMO 2:16 ఆ సమయంలో మిక్కిలి బలవంతులైన సైనికులు సహితం పారిపోతారు. వారు బట్టలు వేసుకొనటానికి కూడా సమయం తీసుకోరు.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
AMO 3:1 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ వర్తమానం వినండి! ఇశ్రాయేలూ, నిన్ను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఈజిప్టునుండి ఆయన తీసుకొని వచ్చిన ఇశ్రాయేలు వంశాల వారందరిని గూర్చినదే ఈ వర్తమానం.
AMO 3:2 “భూమి మీద అనేక వంశాలున్నాయి. కాని మిమ్మల్ని మాత్రమే నేను ఎంపికచేసి ప్రత్యేకంగా ఎరిగియున్నాను. అయితే, మీరు నాపై తిరుగుబాటు చేశారు. కావున మీ పాపాలన్నిటికీ నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”
AMO 3:3 అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసినడవలేరు.
AMO 3:4 అడ విలో వున్న సింహం ఒక జంతువును పట్టుకున్న తరువాతనే గర్జిస్తుంది. తన గుహలో వున్న ఒక యువ కిశోరం గర్జిస్తూ ఉందంటే, అది ఏదో ఒక దానిని పట్టుకున్నదని అర్థం.
AMO 3:5 బోనులో ఆహారం లేకపోతే ఒక పక్షి ఆ బోనులోకి ఎగిరిరాదు. బోనుమూసూకుపోతే, అది అందులో చిక్కుతుంది.
AMO 3:6 హెచ్చరిక చేసే బూరనాదం వినబడితే ప్రజలు భయంతో వణుకుతారు. ఒక నగరానికి ఏదైనా ముప్పు వాటిల్లిందంటే, దానిని యెహోవాయే కలుగ జేసినట్లు.
AMO 3:7 నా ప్రభువైన యెహోవా ఏదైనా చేయటానికి నిర్ణయించవచ్చు. కాని ఆయన ఏదైనా చేసేముందు ఆయన తన పథకాలను తన, సేవకులైన ప్రవక్తలకు తెలియజేస్తాడు.
AMO 3:8 ఒక సింహం గర్జిస్తే ప్రజలు భయపడతారు. యెహోవా మాట్లాడితే, ప్రవక్తలు దానిని ప్రవచిస్తారు.
AMO 3:9 అష్టోదు, ఈజిప్టులలో ఉన్న ఎత్తయిన బురుజులు ఎక్కి ఈ వర్తమానం ప్రకటించండి: “మీరు సమరయ (షోమ్రోను) పర్వతాల మీదికి రండి. అక్కడ మీరు ఒక పెద్ద గందరగోళ పరిస్తితిని చూస్తారు. ఎందుకంటే, సవ్యమైన జీవితం ఎలా గడపాలో ఆ ప్రజలకు తెలియదు. సాటి ప్రజలపట్ల వారు క్రూరంగా వ్యవహరించారు. అన్యజనులనుండి వారు వస్తువులను తీసుకొని వాటిని ఎత్తయిన బురుజులలో దాచివేశారు. యుద్ధంలో తీసుకున్న వస్తువులతో వారి ఖజానాలు నిండివున్నాయి.”
AMO 3:11 కావున యెహోవా చెపుతున్నదేమంటే: “దేశంమీదికి ఒక శత్రువు వస్తాడు. ఆ శత్రువు మీ బలాన్ని హరిస్తాడు. మీ ఎత్తయిన బురుజులలో దాచిన వస్తువులన్నీ అతడు తీసుకుంటాడు.”
AMO 3:12 యెహోవా ఇది చెపుతున్నాడు: “ఒక సింహం ఒక గొర్రెపిల్ల మీద పడవచ్చు. ఆ గొర్రెపిల్లలో కొంత భాగాన్నే కాపరి రక్షించగలడు. సింహం నోటినుండి అతడు రెండు కాళ్లను గాని, చెవిలో కొంత భాగాన్నిగాని బయటకు లాగవచ్చు. అదే మాదరి, ఇశ్రాయేలు ప్రజలలో ఎక్కువ మంది రక్షింపబడరు. సమరయ (షోమ్రోను)లో నివసిస్తున్న ప్రజలు మంచంలో కేవలం ఒక మూలను గాని, లేక తమ పాన్పులో ఒక గుడ్డముక్కను గాని రక్షించుకుంటారు.”
AMO 3:13 నా ప్రభువును, దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “యాకోబు వంశాన్ని (ఇశ్రాయేలు) ఈ విషయాలను గూర్చి హెచ్చరించు.
AMO 3:14 ఇశ్రాయేలు పాపం చేసింది. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను. బేతేలులో వున్న బలిపీఠాలను కూడా నేను నాశనం చేస్తాను. బలిపీఠపు కొమ్ములు నరికివేయబడతాయి. అవి కింద బడతాయి.
AMO 3:15 శీతాకాలపు విడిదిని, వేసవి విడిదిని కలపి నేను నాశనం చేస్తాను. దంతపు ఇండ్లు నాశనం చేయబడతాయి. అనేక ఇండు నాశనం చేయబడతాయి.” యెహోవా ఆ విషయాలు చేప్పాడు.
AMO 4:1 సమరయ (షోమ్రోను) కొండ మీద గల బాషాను ఆవుల్లారా నేను చెప్పేది వినండి. మీరు పేద ప్రజలను గాయపరుస్తారు. ఆ పేద ప్రజానీకాన్ని మీరు అణగదొక్కుతారు. “మేము తాగటానికి ఏదైనా తీసికొని రండి!”అని మీరు మీ భర్తలకు చెపుతారు.
AMO 4:2 నా ప్రభువైన యెహోవా ఒక వాగ్దానం చేసాడు. మీకు కష్టాలు వస్తాయని ఆయన తన పవిత్రత సాక్షిగా చెప్పాడు. శత్రు ప్రజలు మీకు కొంకెలు తగిలించి లాగుతారు. మీ పిలలను లాక్కుపోవటానికి చేపలు పట్టే గాలాలను ఉపయోగిస్తారు.
AMO 4:3 మీ నగరం నాశనం చేయబడుతుంది. మీ స్త్రీలలో ప్రతి ఒక్కరూ గోడ కంతలగుండా నగరం నుండి బయటకు పోతారు. చనిపోయిన మీ పిల్లలను గుట్టమీదకు విసరివేస్తారు. యెహోవా ఇది చేపుతున్నాడు:
AMO 4:4 “బేతేలుకు వెళ్లి పాపం చేయండి! గిల్గాలుకు వెళ్లి మరింత పాపం చేయండి. మీ బలులను ఉదయ వేళల్లో ఇవ్వండి. మీ పంటలో పదవవంతు మూడు రోజులకొకసారి తీసికొని రండి.
AMO 4:5 పులియబెట్టిన పదార్థాన్ని స్తోత్రార్పణగా ఇవ్వండి. స్వేచ్ఛార్పణల విషయం అందరికీ చెప్పండి. ఇశ్రాయేలూ, నీవు ఈ పనులు చేయటానికి ఇష్టపడతావు. కావున నీవు వెళ్ళి వాటిని చేయి.” యెహోవా ఇది చెప్పాడు.
AMO 4:6 “నిన్ను నా వద్దకు వచ్చేలా చేయటానికి నేను చాలా పనులు చేశాను. నేను, మీరు తినటానికి ఏమీ ఆహారం ఇవ్వలేదు. మీ నగరాలలో దేనిలోనూ ఆహారం ఇవ్వలేదు. అయినా నీవు నా వద్దకు తిరిగి రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
AMO 4:7 “నేను వర్షాన్ని కూడా నిలుపు చేశాను. పైగా అది పంట కోతకు మూడు నెలల ముందు సమయం. అందువల్ల పంటలు పండలేదు. పిమ్మట ఒక నగరంలో వర్షం కురిపించి, మరో నగరంలో వర్షం లేకుండా చేశాను. దేశంలో ఒక భాగంలో వర్షం పడింది. కాని దేశంలో మరొక ప్రాంతం వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయింది.
AMO 4:8 కావున రెండు మూడు నగరాల ప్రజలు తడబడుతూ నీళ్లకోసం మరొక నగరానికి వెళ్లారు. కాని అక్కడ ప్రతి ఒక్కరికీ సరిపోయేటంత నీరు లేదు. అయినా మీరు సహాయం కొరకు నా వద్దకు రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
AMO 4:9 “ఎండ వేడిమివల్ల. తెగుళ్లవల్ల మీ పంటలు పాడైపోయేలా చేశాను. మీ ఉద్యానవనాలను, ద్రాక్షా తోటలను నేను నాశనం చేశాను. మీ అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను మిడుతలు తినివేశాయి. కాని మీరు మాత్రం సహాయం కొరకు నా వద్దకు రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
AMO 4:10 “ఈజిప్టు విషయంలో చేసినట్లు నేను మీ మీదికి రోగాలను పంపించాను. మీ యువకులను నేను కత్తులతో సంహరించాను. మీ గుర్రాలను నేను తీసుకున్నాను. మీ స్థావరం కుళ్లిన శవాలతో దుర్గంధ పూరితయ్యేలా చేశాను. కాని మీరు సహాయం కొరకు నావద్దకు తిరిగి రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
AMO 4:11 “సొదొమ, గొమొర్రా నగరాలను నేను నాశనం చేసినట్లు నేను నిన్ను నాశనం చేశాను. ఆ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పొయ్యిలో నుండి లాగబడి కాలిన కట్టెలా మీరున్నారు. కాని మీరు సహాయంకొరకు నా వద్దకు రాలేదు.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
AMO 4:12 “కావున ఇశ్రాయేలూ, మీకు నేనీ విషయాలు కలుగజేస్తాను. ఇది మీకు నేను చేస్తాను. ఇశ్రాయేలూ, మీ దేవుని కలుసుకోటానికి సిద్ధమవ్వు.”
AMO 4:13 నేనెవరిని? పర్వతాలను ఏర్పాటు చేసింది నేనే. మీ మనస్సులను సృష్టించింది నేనే. ఎలా మాట్లాడాలో ప్రజలకు నేర్పింది నేనే. సంద్యవేళను చీకటీగా మార్చేదీ నేనే. భూమిపైగల పర్వతాలపై నేను నడుస్తాను. ఇట్టి నేను ఎవరిని? సర్వశక్తిమంతుడగు దేవుడను. నా పేరు యెహోవా.
AMO 5:1 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ పాట వినండి. ఈ విలాపగీతం మిమ్మల్ని గురించినదే.
AMO 5:2 ఇశ్రాయేలు కన్యక పతనమయింది. ఆమె ఇక లేవలేదు. మట్టిలోపడి ఆమె ఒంటరిగా వదిలి వేయబడింది. ఆమెను లేవనెత్తే వ్యక్తే లేడు.
AMO 5:3 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “వెయ్యిమంది సైనికులతో నగరం వదిలివెళ్ళే అధికారులు కేవలం వందమంది మనుష్యులతో తిరిగి వస్తారు వందమంది సైనికులతో నగరం వదలి వెళ్లే అధికారులు కేవలం పదిమంది మనుష్యులతో తిరిగి వస్తారు.”
AMO 5:4 ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెపుతున్నాడు: “నన్ను వెదుక్కుంటూ వచ్చి జీవించండి.
AMO 5:5 కాని బేతేలులో వెదకవద్దు. గిల్గాలుకు వెళ్లవద్దు. సరిహద్దును దాటి బెయేర్షెబాకు వెళ్లకండి. గిల్గాలు ప్రజలు బందీలుగా తీసుకు పోబడతారు. బేతేలు నాశనం చేయబడుతుంది.
AMO 5:6 యెహోవా దరిచేరి జీవించండి. మీరు యెహోవా వద్దకు వెళ్లకపోతే యోసేపు (పదివంశాలవారు) ఇంటిమీద నీప్పు పడుతుంది. ఆ అగ్ని యోసేపు ఇంటిని దగ్ధం చేస్తుంది. బేతేలులో చెలరేగిన ఆ అగ్నిని ఎవ్వరు ఆపలేరు.
AMO 5:7 మీరు యెహోవా కొరకు చూడండి. సప్త ఋషీ నక్షత్రములను మృగశిర నక్షత్రాన్ని సృష్టించినది ఆయనే. చీకటిని ఉదయ కాంతిగా ఆయన మార్చుతాడు. పగటిని చీకటిగా ఆయన మార్చుతాడు. ఆయన సముద్ర జలాలను బయట నేలమీద కుమ్మరిస్తాడు. ఆయన పేరు యహోవా! ఒక బలమైన నగరాన్ని ఆయన సురక్షితంగా ఉంచుతాడు. మరో బలమైన నగరం నాశనమయ్యేలా ఆయన చేస్తాడు.” ప్రజలారా ఇది మీకు తగని పని. మీరు మంచిని విషంగా మార్చుతారు. న్యాయాన్ని హత్యచేసి నేలకు కూలేలా చేస్తారు.
AMO 5:10 ప్రవక్తలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి ప్రజలు చేసే చెడ్డ పనులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుచే ప్రజలా ప్రవక్తలను అసహ్యించుకుంటారు. ప్రవక్తలు మంచివైన సామాన్య సత్యాలను బోధిస్తారు. అందుచే ప్రజలు ఆ ప్రవక్తలను అసహ్యించుకుంటారు.
AMO 5:11 మీరు ప్రజలనుండి అన్యాయంగా పన్నులు వసూలు చేస్తారు. మీరు పేదవారి నుండి గోధుమ మోపులను తీసుకుంటారు. ఈ ధనంతో మీరు చెక్కిన రాళ్లతో అందమైన ఇండ్లు కట్టుకుంటారు. కాని మీరు ఆ ఇండ్లలో నివసించరు. మీరు అందమైన ద్రాక్షాతోటలను నాటతారు. కాని మీరు వాటి నుండి ద్రాక్షారసం తాగరు.
AMO 5:12 ఎందుకంటే మీరు చేసిన అనేక పాపాల గురించి నాకు తెలుసు. మీరు నిజంగా కొన్ని ఘోరమైన పాపాలు చేశారు. మంచి పనులు చేసే ప్రజలను మీరు బాధించారు. చెడు చేయటానికి మీరు డబ్బు తీసుకుంటారు. బహిరంగ ప్రదేశాలలో పేదవారిని మీరు నెట్టివేస్తారు.
AMO 5:13 ఆ సమయంలో తెలివిగల బోధకులు ఊరుకుంటారు. ఎందుకంటే అది చెడు కాలం గనుక.
AMO 5:14 దేవుడు మీతోనే ఉన్నట్లు మీరు చెపుతారు. అందుచే మీరు మంచిపనులు చేయాలేగాని చెడు చేయరాదు. అప్పుడు మీరు బతుకుతారు. సర్వశక్తుడగు యెహోవా నిజంగా మీతోవుంటాడు.
AMO 5:15 చెడును ద్వేషించు. మంచిని ప్రేమించు. న్యాయస్థానాలలో న్యాయాన్ని పునరుద్ధ రించండి. అప్పుడు యోసేపు వంశంలో మిగిలిన వారిమీద దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా కనికరం కలిగి ఉండవచ్చు.
AMO 5:16 అందువలన నా ప్రభువును, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు ఈ విషయం చెపుతున్నాడు: “బహిరంగ ప్రదేశాలన్నిటిలోనూ ప్రజలు విలిపిస్తారు. ప్రజలు వీధులలో రోదిస్తారు. ఏడ్చేటందుకు ప్రజలు కిరాయి మనుష్యులను నియమిస్తారు.
AMO 5:17 ద్రాక్షా తోటలన్నిటిలో ప్రజలు విలపిస్తారు. ఎందుకనగా నేను అటుగా వెళ్లి మిమ్మల్ని శిక్షిస్తాను.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
AMO 5:18 మీలో కొంతమంది యెహోవా యొక్క ప్రత్యేక తీర్పు రోజును చూడగోరతారు. అ రోజున మీరెందుకు చూడగోరుతున్నారు. యెహోవా యొక్క ఆ ప్రత్యేక దినము మీకు చీకటిని తెస్తుందేగాని, వెలుగును కాదు!
AMO 5:19 ఒక సింహపు బారినుండి తప్పించుకుపోయే వ్యక్తిపై ఎలుగుబంటి మీదపడినట్లు మీరుంటారు! ఇంటిలోకి వెళ్లి గోడమీద చేయి వేయగా పాము కరచిన వాని మాదిరి మీరుంటారు!
AMO 5:20 కావున యెహోవా యొక్క ప్రత్యేక దినము చీకటిని తెస్తుంది గాని, వెలుగును కాదు. అది దుఃఖ సమయంగాని, సంతోష సమయంగాదు! ఆ రోజు మీకు వెలుగు ఏమాత్రమూ లేని కారు చీకటిగా ఉంటుంది.
AMO 5:21 “మీ పవిత్ర దినాలను నేను ద్వేషిస్తాను! నేను వాటిని అంగీకరించను! మీ ప్రార్థనా సమావేశాలపట్ల నేను సంతోషంగా ఉండను!
AMO 5:22 మీరు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు పెట్టినా, నేను వాటిని స్వీకరించను! మీరు సమాధాన బలులుగా అర్పించే బలిసిన జంతువులవైపు నేను కనీసం చూడనైనా చూడను.
AMO 5:23 మీరు బిగ్గరగా పాడే పాటలను ఇక్కడ నుండి తొలగించండి. మీ స్వరమండలము నుండి వచ్చే సంగీతాన్ని నేను వినను.
AMO 5:24 మీ దేశమంతటా న్యాయం నీళ్లలా ప్రవహించేలా మీరు చేయాలి. మంచితనాన్ని ఎన్నడూ ఎండని నీటి వాగువలె ప్రవహించేలా చేయండి.
AMO 5:25 ఇశ్రాయేలూ, నలుబది సంవత్సరాల పాటు నీవు ఎడారిలో నాకు బలులు, అర్పణలు సమర్పించావు.
AMO 5:26 కాని మీరు మీ రాజు యొక్క సక్కూతు విగ్రహాలను, కైవాను విగ్రహాలను కూడ తీసికొని వెళ్లారు. పైగా మీకై మీరు ఆ నక్షత్రాన్ని మీ దేవునిగా చేసుకున్నారు.
AMO 5:27 కావున దమస్కు (డెమాస్కస్) పట్టణం అవతలకి మిమ్మల్ని బందీలుగా పట్టుకుపోయేలా చేస్తాను.” దేవుడును, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఆ విషయాలు చెపుతున్నాడు.
AMO 6:1 సీయోను వాసులారా, మీలో కొంతమంది చాలాసుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సమరయ పర్వతంమీద ఉన్న ప్రజలలో కొంతమంది సురక్షితంగా ఉన్నట్లు తలంచున్నారు. కాని మీకు చాలా దుఃఖకరము మీరు ప్రాముఖ్యమైన జనాంగపు “ముఖ్య” నాయకులు. “ఇశ్రాయేలు ప్రజలు” సలహా కొరకు మీ వద్దకు వస్తారు.
AMO 6:2 మీరు వెళ్లి కల్నేలో చూడండి. అక్కడ నుండి పెద్ద నగరమైన హమాతుకి వెళ్లండి. ఫిలిష్తీయుల నగరమైన గాతుకు వెళ్లండి. ఆ రాజ్యాలకంటే మీరేమైనా గొప్పవారా? లేదు మీ దానికంటే వారి రాజ్యాలు విశాలమైనవి.
AMO 6:3 శిక్షా దినము బహు దూరాన ఉన్నదనుకొని, దౌర్జన్య పరిపాలనకు దగ్గరవుతున్నారు.
AMO 6:4 కాని మీరు అన్ని సుఖాలు అనుభవిస్తారు. మీరు దంతపు మంచాలపై పడుకుంటారు. మీ పాన్పులపై మీరు చాచుకొని పడుకుంటారు. మందలోని మంచి లేత గొర్రె పిల్లలను, పశువులశాలలోని మంచి చిన్న గిత్త దూడలను మీరు తింటారు.
AMO 6:5 మీరు స్వరమండలాలను వాయిస్తారు. దావీదువలె మీరు కనిపెట్టిన వాద్య విశేషాలపై సాధన చేస్తారు.
AMO 6:6 చిత్రమైన గిన్నెల్లో మీరు ద్రాక్షారసం తాగుతారు. మీరు శ్రేష్ఠమైన పరిమళ తైలాలు వాడతారు. యోసేపు వంశం నాశనమవుతూ ఉందని కూడా మీరు కలవరం చెందరు.
AMO 6:7 ఆ ప్రజలు వారి పాన్పులపైన చాచుకొని పడుకున్నారు. కాని వారి మంచి రోజులు అంతమవుతాయి. వారు బందీలవలే అన్యదేశాలకు తీసుకొనిపోబడతారు. ముందుగా అలా పట్టుకుపోబడే వారిలో ఈ ప్రజలు వుంటారు.
AMO 6:8 నా ప్రభువైన యెహోవా ఈ ప్రమాణం చేశాడు. దేవుడును, సర్వ శక్తిమంతుడును అయిన యెహోవా తన పేరుమీద ఈ ప్రమాణం చేశాడు: “యాకోబుకు గర్వ కారణమైన వస్తువులను నేను అసహ్యించుకుంటాను. అతని బలమైన బురుజులను నేను అసహ్యించుకుంటాను. అందుచేత ‘శత్రువు’ నగరాన్ని, దానిలోని ప్రతి వస్తువును తీసుకునేలా చేస్తాను.”
AMO 6:9 ఆ సమయంలో ఒక్కానొక ఇంట్లో పదిమంది జీవించియుండవచ్చు. ఆ ఇంటిలో మరి కొంతమంది మరిణించవచ్చు.
AMO 6:10 ఒక బంధవు ఆ శవాన్ని బయటకు తీసికొనిపోయి దహనం చేయవచ్చు. ఆ బంధువు ఇంటినుంచి ఎముకులు తేవటానికి వెళ్తాడు. ఇంటిలో దాగిన ఏ వ్యక్తినైనా ప్రజలు పిలిచి, “నీ వద్ద ఇంకా ఏమైనా శ వాలు మిగిలియా?” అని అడుగుతారు. ఆ వ్యక్తి, “లేవు …” అని సమాధానమిస్తాడు. అప్పుడా వ్యక్తి యొక్క బంధువు ఇలా అంటాడు: “నిశ్శబ్దం! మనం యెహోవా మాట ఎత్తుకూడదు.”
AMO 6:11 చూడు, దేవుడై న యెహోవా ఆజ్ఞ ఇవ్వగా, పెద్ద ఇండ్లు ముక్కలుగా పగిలిపోతాయి. చిన్న ఇండ్లు చిన్న ముక్కలైపోతాయి.
AMO 6:12 గుర్రాలు బండలపై పరుగిడతాయా? లేదు! ప్రజలు ఆవులను నేల దున్నటానికి వినియోగిస్తారా? అవును! కాని మీరు అన్నిటినీ తారుమారు చేస్తారు. మీరు మంచిని, న్యాయాన్ని విషంగా మార్చారు.
AMO 6:13 మీరు లో-దెబారులో సుఖంగా ఉన్నారు. “మేము కర్నయీమును మా స్వశక్తిచే తెచ్చుకున్నాం” అని మీరంటారు.
AMO 6:14 “కాని ఇశ్రాయేలూ, నేను మీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను. ఆ రాజ్యం మీకు కష్టాలు తెచ్చిపెడుతుంది. లేబో-హమాతు నుండి అరాబా వాగువరకూ మీ అందరికీ కష్టాలు వస్తాయి.” దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
AMO 7:1 యెహోవా నాకిది చూపించాడు: రెండవ పంట పెరగటం ప్రారంభమైనప్పుడు ఆయన మిడుతలను పుట్టిస్తున్నాడు. రాజు మొదటి పంట కోసాక పెరిగే రెండవ పంట ఇది.
AMO 7:2 మిడుతలు దేశంలో వున్న గడ్డినంతా తినివేశాయి. దాని తరువాత నేనిలా అన్నాను: “నా ప్రభువైన యెహోవా, మమ్మల్ని క్షమించుమని నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు చాలా చిన్నవాడు!”
AMO 7:3 అప్పుడు యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది జరగదు” అని అన్నాడు.
AMO 7:4 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు నాకు చూపించాడు: దేవుడైన యెహోవా అగ్నిచేత తీర్పు తీర్చటానికి పిలవటం నేను చూశాను. ఆ అగ్ని గొప్పఅగాధ జలాన్ని నశింపజేసింది. ఆ ఆగ్ని భూమిని తినివేయటం ప్రారంభించింది.
AMO 7:5 కాని నేనిలా అన్నాను, “దేవుడవైన ఓ యెహోవా, ఇది ఆపివేయుము. నిన్ను నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు మిక్కిలి చిన్నవాడు!”
AMO 7:6 పిమ్మట యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది కూడా జరగదు” అని అన్నాడు!
AMO 7:7 యోహోవా దీనిని నాకు చూపించాడు: మట్టపు గుండు (మట్టపు గోడ నిటారుగా వచ్చేలా సరి చూడబడుతుంది)ను చేతబట్టుకొని యెహోవా ఒక గోడవద్ద నిలబడ్డాడు.
AMO 7:8 “ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని యెహోవా నన్ను అడిగాడు. “ఒక మట్టపు గుండు” ను అని నేనన్నాను. అప్పుడు నా ప్రభువు ఇలా అన్నాడు: “చూడు, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య ఒక మట్టపుగుండు పెడతాను. వారి ‘దుష్టత్వాన్ని’ ఇక ఎంత మాత్రం నేను చూసి చూడనట్లు వదలను. (ఆ దుష్ట భాగాలను నేను తోలగిస్తాను).
AMO 7:9 ఇస్సాకు వంశస్థులు ఏర్పాటు చేసిన ఉన్నత ప్రదేశాలు నాశనం చేయబడతాయి. ఇశ్రాయేలు పవిత్ర స్థలాలన్నీ రాళ్ల గుట్టల్లా మార్చబడతాయి. నేను యరొబాము వంశం మీద పడి వారిని కత్తులతో చంపుతాను.”
AMO 7:10 బేతేలులో ఒక యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఈ వర్తమానం పంపాడు: “ఆమోసు నీమీద కుట్ర పన్నుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నీ మీదకు తిరగబడేలా చేయటానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. అతడు ఎంతగా మాట్లాడుతున్నాడంటే, ఈ దేశంలో అతని మాటలు పట్టవు.
AMO 7:11 యరొబాము కత్తిచే చంపబడతాడనీ, ఇశ్రాయేలీయులు తమ దేశం నుండి బందీలుగా కొనిపోబడతారనీ అమోసు ప్రచారం చేస్తున్నాడు.”
AMO 7:12 అమోసుతో కూడ అమజ్యా ఇలా చెప్పాడు: “ఓ దీర్గదర్శీ (ప్రవక్త), నీవు యూదాకు పారిపోయి అక్కడనే తిను. నీ బోధన అక్కడనే చేయి.
AMO 7:13 అంతేగాని, ఇక్కడ బేతేలులో ఎంతమాత్రమూ నీవు ప్రకటనలు చేయవద్దు. ఇది యరొబాము పవిత్ర స్థలం (రాజధాని). ఇది ఇశ్రాయేలు ఆలయం!”
AMO 7:14 అప్పుడు అమజ్యాకు ఆమోసు ఇలా సమాధానాం చెప్పాడు: “నేను వృత్తిరీత్యా ప్రవక్తను గాను. పైగా నేను ప్రవక్త వంశం నుండి వచ్చినవాడినీ కాను. నేను పశువులను కాస్తూ ఉంటాను. మేడి పండ్ల వృక్షాలను పరిక్షిస్తూ వుంటాను.
AMO 7:15 నేనొక గొర్రెల కాపరిని. అయితే యెహోవా నన్ను గొర్రెలను అనుసరించనీయకుండా పిలిచాడు. ‘నీవు వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ప్రకటనలు చేయి’ అని యెహోవా నాతోచెప్పాడు.
AMO 7:16 కావున యెహోవా వర్త మానాన్ని విను. నీవు, ‘ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ప్రకటించవద్దు. ఇస్సాకు వంశానికి వ్యతిరేకంగా బోధనలు చేయవద్దు’ అని నాకు చెపుతున్నావు.
AMO 7:17 కాని యెహోవా చెప్పేదేమంటే: ‘నీ భార్య నగరంలో వేశ్య అవుతుంది. నీ కుమారులు, కుమార్తెలు కత్తులతో చంపబడతారు. అన్యజనులు నీ రాజ్యాన్ని వ శపర్చుకొని, తమలో తాము దానిని పంచుకుంటారు. నీవు పరదేశంలో చనిపోతావు. ఇశ్రాయేలు ప్రజలు నిశ్చయంగా ఈ దేశంనుండి బందీలుగా తీసికొనిపోబడతారు.’”
AMO 8:1 యెహోవా ఇది నాకు చూపించాడు. వేసవి కాలపు పండ్లగంప నొకదానిని నేను చూశాను.
AMO 8:2 “ఆమోసూ, నీ వేమి చూస్తున్నావు?” అని యెహోవా నన్నడిగాడు. “ఒక గంపెడు వేసవి కాలపు పండ్లు” అని నేను చెప్పాను. అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చింది. నేనిక ఎంత మాత్రం వారి పాపాలను చూసి చూడనట్లు ఉండను.
AMO 8:3 ఆలయంలో పాడే పాటలు శోక గీతాలుగా మారతాయి. నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. ప్రతి చోటా శవాలు పడి ఉంటాయి. ప్రజలు నిశ్శబ్దంగా శవాలను మోసుకుపోయి పీనుగుల గుట్టమీద వేస్తారు.”
AMO 8:4 నేను చెప్పేది వినండి! నిస్సహాయులైన ప్రజలపై మీరు నడిచి వెళ్తారు. ఈ దేశ పేదప్రజలను నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.
AMO 8:5 వర్తకులారా, మీరిలా అంటారు, “మేము ధాన్యాన్ని అమ్ముకొనేటందుకు అమావాస్య ఎప్పుడు వెళ్లిపోతుంది? అమ్మకానికి మా గోధుమలు తేవటానికి విశ్రాంతి దినం ఎప్పుడైపోతుంది? కొలతలు తగ్గించి, ధరలు పెంచుతాము. దొంగ త్రాసువేసి ప్రజలను మోసగిస్తాము.
AMO 8:6 పేదవారు ఎలాగో వారి అప్పులు తీర్చ లేరు గనుక, మేము వారిని బానిసలనుగా కొంటాము. జత చెప్పుల విలువకు ఆ నిస్సహాయులను మేము కొంటాము. ఆహా, నేలపై ఒలికిన ధాన్యాన్ని కూడా మేము అమ్ముకోవచ్చు.”
AMO 8:7 యెహోవా ఒక మాట ఇచ్చాడు. యాకోబుకు గర్వ కారణమైన తన పేరు మీద ఈ ప్రమాణం చేశాడు: “ఆ ప్రజలు చేసిన పనులను నేనెన్నడూ మరువను.
AMO 8:8 ఆ పనుల కారణంగా భూమి అంతా కంపిస్తుంది. దేశంలో నివసించే ప్రతివాడు చనిపోయినవారి కొరకు విలపిస్తాడు. ఈజిప్టులోని నైలు నదిలా భూమి అంతా ఉవ్వెత్తుగా లేచి పతనమవుతుంది. భూమి అటూ ఇటూ ఊగిసలాడుతుంది.”
AMO 8:9 యెహోవా ఈ విషయాలు కూడా చెప్పాడు: “ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో సూర్యుడు అస్తమించేలా నేను చేస్తాను. మబ్బులేని పగటి సమయంలో భూమిపై చీకటి కమ్మేలా చేస్తాను.
AMO 8:10 మీ పండుగ దినాలను చనిపోయిన వారి కొరకు దుఃఖించే దినాలుగామార్చుతాను. మీ పాటలన్నీ మృతులకొరకు విలాప గీతాలవుతాయి. ప్రతివాని పైన విషాద సూచిక దుస్తులు వేస్తాను. ప్రతివాని తలను బోడితల చేస్తాను. ఏకైక పుత్రుడు చనిపోయినప్పుడు కలిగే గొప్ప దుఃఖంలాంటి దుఃఖాన్ని నేను కలిగిస్తాను. అది ఒక భయంకరమైన అంతం.”
AMO 8:11 యెహోవా చెపుతున్నాడు: “చూడు, దేశంలో కరువు పరిస్థితిని నేను కల్పించే సమయం వస్తూవుంది. ప్రజలు ఆహారం కొరకు ఆకలిగొనరు. ప్రజలు నీటి కొరకు దప్పిగొనరు. కాని యెహోవా వాక్యాలు కొరకు ప్రజలు ఆకలిగొంటారు.
AMO 8:12 ప్రజలు ఒక సముద్రం నుండి మరొక సముద్రం వరకు తిరుగుతారు. వారు ఉత్తరాన్నుండి తూర్పుకు పయనిస్తారు. యెహోవా వాక్యం కొరకు ప్రజలు ముందుకు, వెనుకకు పోతారు. కాని వారు దానిని కనుగొనలేరు.
AMO 8:13 ఆ సమయంలో అందమైన యువతీ యువకులు దప్పికతో సోమ్మసిల్లుతారు.
AMO 8:14 షోమ్రోను యొక్క పాపము సాక్షిగా వారు ప్రమాణం చేసేవారు ఇలా అంటారు: ‘దానూ, నీ దేవుని జీవముతోడు.’ బెయేర్షెబా మార్గంతోడు ఆ ప్రజలు పతనమవుతారు, వారు మరెన్నడూ లేవరు.”
AMO 9:1 నా ప్రభువు బలిపీఠం పక్కన నిలబడినట్లు నేను చూశాను. ఆయన ఇలా అన్నాడు: “స్తంభాల తలలపై కొట్టు. దానితో అది గుమ్మాల వరకు కదులుతుంది. స్తంభాలు ప్రజల తలలపై పడేలా కొట్టు. ఇంకా ఎవరైనా మిగిలితే వారిని నేను కత్తితో చంపుతాను. ఏ వ్యక్తి అయినా పారిపోవచ్చు; కాని అతడు తప్పించుకోలేడు. ప్రజలలో ఒక్కడు కూడా తప్పించుకోలేడు.
AMO 9:2 వారు పాతళం లోపలికి పోయినా నేను వారిని అక్కడనుండి బయటకు లాగుతాను. వారు ఆకాశంలోకి దూసుకుపోతే, నేను వారిని అక్కడనుండి కిందికి తెస్తాను.
AMO 9:3 వారు కర్మెలు పర్వతం శిఖరంలో దాగినా వారిని నేనక్కడ కనుగొంటాను. వారిని అక్కడ పట్టుకొని తీసుకొస్తాను. వారు నా నుండి సముద్రం గర్భంలో దాగటానికి ప్రయత్నించితే నేను పాముకు ఆజ్ఞ ఇస్తాను. అది వారిని కాటేస్తుంది.
AMO 9:4 వారు శత్రువు చేతజిక్కి బందీలుగా కొనిపోబడితే, నేను కత్తికి ఆజ్ఞ ఇస్తాను. అది వారిని అక్కడ చంపివేస్తుంది. అవును. నేను వారిపై నిఘా వేసి ఉంటాను. వారికి కష్టాలు తెచ్చి పెట్టే ఉపాయాలను నేను అన్వేషిస్తాను. అంతేగాని, వారికి మంచి చేసే విధానాలను నేను చూడను.”
AMO 9:5 నా ప్రభువును సర్వశక్తిమంతుడును అయిన యెహోవా భూమిని తాకితే, అది కరిగిపోతుంది. అప్పుడు భూమిపై నివసించే వారంతా చనిపోయిన వారి కొరకు విలపిస్తారు. ఈజిప్టులో నైలు నదిలా భుమి పెల్లుబికి పడుతుంది.
AMO 9:6 యెహోవా తన పై అంతస్తు గదులు ఆకాశంపై నిర్మించాడు. ఆయన తన స్వర్గాన్ని భూమికి మీదుగా ఏర్పాటు చేశాడు. సముద్ర జలాలను ఆయన పిలుస్తాడు. పిలిచి, వాటిని వర్షంలా బయట భూమి మీద పారబోస్తాడు. ఆయన పేరు యెహోవా.
AMO 9:7 యెహోవా ఇది చెపుతున్నాడు: “ఇశ్రాయేలూ, మీరు నాకు ఇథియోపియనుల (కూషీయులు) వంటివారు. ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు దేశం నుండి బయటకు తీసికొని వచ్చాను. ఫిలిష్తీయులను కూడ నేను కఫ్తోరునుండి బయటకు రప్పించాను. మరియు అరామీయులను (సిరియనులు) కీరునుండి బయటకు తీసుకొని వచ్చాను.”
AMO 9:8 నా ప్రభువైన యెహోవా ఈ పాపపు రాజ్యాన్ని (ఇశ్రాయేలు) గమనిస్తున్నాడు. యెహోవా ఇది చెప్పాడు: “ఈ భూమి ఉపరితలం నుండి ఇశ్రాయేలును తొలగిస్తాను. కాని యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను.
AMO 9:9 ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేయటానికి ఆజ్ఞ ఇస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదర గొడతాను. కాని అది పిండిని జల్లించువాని రీతిగా ఉంటుంది. ఒక వ్యక్తి జల్లెడలో పిండిని జల్లిస్తాడు. అప్పుడు మెత్తని పిండి క్రిందికి దిగుతుంది. కాని బరక పిండి జల్లెట్లో మిగిలి పోతుంది. యాకోబు వంశం విషయంలో కూడ ఇదేరీతి జరుగుతుంది.
AMO 9:10 “నా ప్రజలలో పాపులైనవారు, ‘మాకేమీ కీడు జరుగదు!’ అని అంటారు. కాని ఆ జనులందరూ కత్తులచే చంపబడతారు!”
AMO 9:11 “దావీదు గుడారం పడిపోయింది. కాని నేను దానిని తిరిగి నిలబెడతాను. గోడల కంతలు పూడ్చుతాను. శిథిలమైన భవనాలను తిరిగి నిర్మిస్తాను. దానిని పూర్వమున్నట్లు నిర్మిస్తాను.
AMO 9:12 అప్పుడు ఎదోములో బతికివున్న ప్రజలు, మరియు నా పేరు మీద నిలబడే జనులందరూ సహాయం కొరకు యెహోవా వైపు చూస్తారు.” యెహోవా ఈ మాటలు చెప్పాడు. అవి జరిగేలా ఆయన చేస్తాడు.
AMO 9:13 యెహోవా చెపుతున్నాడు: “పంటకోయు వాని వెనుక భూమిని దున్నే రోజులు వస్తున్నాయి. ద్రాక్షాపండ్లు తెంచేవాని వెనుకనే, పండ్లను తొక్కేవాడు వచ్చే సమయం రాబోతూవుంది. కొండల నుంచి, పర్వతాల నుంచి మధురమైన ద్రాక్షారసం పారుతుంది.
AMO 9:14 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను చెరనుండి తిరిగి తీసుకు వస్తాను. వారు శిథిలమైన నగరాలను తిరిగి కడతారు. ఆ నగరాలలో వారు మళ్లీ నివసిస్తారు. వారు ద్రాక్షాతోటలు వేస్తారు. ఆ తోటలనుంచి వచ్చిన ద్రాక్షారసాన్ని వారు తాగుతారు. వారు తోటలను ఏర్పాటు చేస్తారు. వారు ఆ తోటల నుండి వచ్చే ఫలాలను తింటారు.
AMO 9:15 నా ప్రజలను తమ దేశంలో మళ్లీ స్థిరపర్చుతాను. నేను వారికిచ్చిన దేశాన్నుండి వారు మళ్లీ లాగి వేయబడరు.” మీ దేవుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
OBA 1:1 ఇది ఓబద్యాకు వచ్చిన దర్శనం. నా ప్రభువైన యెహోవా ఎదోమును గురించి ఈ విషయం చెప్పాడు: దేవుడైన యెహోవా నుండి ఒక సమాచారం మేము విన్నాము. వివిధ దేశాలకు ఒక దూత పంపబడ్డాడు. “మనం వెళ్లి ఎదోము మీద యుద్ధం చేద్దాం” అని అతడన్నాడు.
OBA 1:2 “చూడు, సాటి దేశాలలో నిన్ను అల్పునిగా చేస్తాను. ప్రజలు నిన్ను మిక్కిలి అసహ్యించుకుంటారు.
OBA 1:3 నీ గర్వం నిన్ను మోసపుచ్చింది. కొండశిఖరం మీద గుహలలో నీవు నివసిస్తున్నావు. నీ ఇల్లు కొండల్లో ఎత్తున ఉంది. అందువల్ల, ‘నన్నెవరూ కిందికి తేలేరు’ అని, నీకు నీవు మనస్సులో అనుకుంటున్నావు.”
OBA 1:4 దేవుడైన యెహోవా ఇది చెప్పాడు: “నీవు గరుడ పక్షిలా ఎత్తుగా ఎగిరినా, నీ గూటిని నీవు నక్షత్రాల్లో కట్టుకున్నా, అక్కడ నుండి నిన్ను కిందికి దించుతాను
OBA 1:5 నీవు నిశ్చయంగా నాశనమవుతావు! దొంగలు నీవద్దకు వస్తారు! రాత్రి పూట దోపిడిగాండ్రు వస్తారు! ఆ దొంగలు వారికి కావలసినవన్నీ ఎత్తుకు పోతారు? ద్రాక్షాకాయలు ఏరటానికి పనివారు నీ పొలాలకు వచ్చినప్పుడు, వారు కొన్ని పండ్లు వదిలిపెడతారు.
OBA 1:6 ఏశావు రహస్య ధనసంపద కొరకు శత్రువులు వెదకుతారు. వాటిని వారు కనుగొంటారు!
OBA 1:7 నీ స్నేహితులైన ప్రజలంతా నిన్ను దేశం నుండి పంపివేస్తారు. నీతో సంధి చేసుకొన్నవారు నిన్ను మోసగించి, ఓడిస్తారు. నీ వద్దనే రొట్టెలు తిన్న మనుష్యులు, నిన్ను పట్టటానికి వల పన్నుతున్నారు. వారు ఇలా అంటున్నారు: ‘ఇలా అవుతుందని అతడు అనుమానించడు’”
OBA 1:8 యెహోవా ఇలా చెపుతున్నాడు: “ఆ రోజున ఎదోము జ్ఞానులను ఎదోము పర్వతాలలోనున్న వివేకులను నేను నాశనం చేయగోరుదును.
OBA 1:9 తేమానూ, నీ యోధులు భయపడతారు. ఏశావు పర్వతం మీద ప్రతి ఒక్కడూ చంపబడతాడు. అనేకనేక మంది చంపబడతారు.
OBA 1:10 అవమానం నిన్ను ఆవరిస్తుంది. నీవు శాశ్వతంగా నాశనమవుతావు. ఎందుకంటే, నీవు నీ సోదరుడైన యాకోబు పట్ల చాలా క్రూరంగా ఉన్నావు.
OBA 1:11 పరదేశీయులు ఇశ్రాయేలు ధనరాశులను ఎత్తుకు పోయినప్పుడు ఇశ్రాయేలు శత్రువులతో నీవు చేతులు కలిపావు. పరదేశీయులు ఇశ్రాయేలు నగర ద్వారంలోకి వచ్చి, యెరూషలేములో ఎవరు ఏ భాగాన్ని ఆక్రమించు కోవాలనే దాని విషయంలో చీట్లు వేశారు. ఆ సమయంలో, ఆ వచ్చిన వారిలో నీవొకనిమాదిరిగా ఉన్నావు.
OBA 1:12 నీ సోదరుని కష్టకాలం చూసి నీవు నవ్వావు. నీవాపని చేసియుండకూడదు. ఆ జనులు యూదాను నాశనం చేసినప్పుడు నీవు సంతోషించావు. నీవలా చేసియుండకూడదు. యూదా ప్రజల కష్టకాలంలో నీవు గొప్పలు చెప్పుకున్నావు. నీవది చేసియుండ కూడదు.
OBA 1:13 నా ప్రజల నగరద్వారాన ప్రవేశం చేసి, నీవు వారి సమస్యలను చూసి నవ్వావు. నీవది చేసియుండకూడదు. వారికి కష్టకాలం వచ్చినప్పుడు. నీవు వారి ఆస్తిని దోచుకున్నావు. నీవాపని చేసియుండకూడదు.
OBA 1:14 నీవు నాలుగు బాటలు కలిసిన స్థానంలో నిలబడి తప్పించుకొని పారిపోయే ప్రజలను చంపివేశావు. నీవాపని చేయకుండా ఉండవలసింది. తప్పించుకునే వారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నావు. నీవాపని చేయకుండా ఉండవలసింది.
OBA 1:15 అన్ని దేశాలపై యెహోవా తీర్పురోజు త్వరలో వస్తూ ఉంది. నీవు ఇతరి ప్రజలకు కీడు చేశావు. అదే కీడు నీకూ జరుగుతుంది. అవే చెడ్డ పనులు నీ తలమీదికి వచ్చి పడతాయి.
OBA 1:16 ఎందుకంటే, నా పవిత్ర పర్వతంమీద నీవు రక్తాన్ని చిందించావు. అలాగే ఇతర జనులు నీ రక్తాన్ని చిందిస్తారు. నువ్వు అంతరిస్తావు నుప్పుడూ లేనట్లుగా ఉంటుంది.
OBA 1:17 కాని సియోను కొండ మీద మాత్రం మిగిలిన వారు ఉంటారు. వారు నా ప్రత్యేక ప్రజలుగా ఉంటారు. యాకోబు వంశం తనకు చెందిన వస్తువులను తిరిగి తీసుకొంటుంది.
OBA 1:18 యాకోబు వంశం అగ్నిలా తయారవుతుంది. యోసేప సంతతివారు మంటలా తయారవుతారు. కాని ఏశావు వంశంబూడిదలా ఉంటుంది. యూదా ప్రజలు ఎదోమీయులను కాల్చివేస్తారు. యూదా ప్రజలు ఎదోమీయులను నాశనం చేస్తారు. అప్పుడు ఏశావు సంతతివారిలో బ్రతికిన వాడంటూ ఏ ఒక్కడూ ఉండడు.” దేవుడైన యెహోవా దాన్ని చెప్పాడు గనుక అది జరుగుతుంది.
OBA 1:19 యూదాకు దక్షిణాన గల ఎడారి ప్రాంత ప్రజలు ఏశావు కొండను ఆక్రమించుకుని నివసిస్తారు. కొండకింది (మైదాన) ప్రాంతం వారు ఫిలిష్తీయుల దేశాన్ని ఆక్రమిస్తారు. ఆ ప్రజలు ఎఫ్రాయిము, సమరయ (షోమ్రోను) భూములను ఆక్రమించి నివసిస్తారు. గిలాదు దేశం బెన్యామీనుకు చెంది ఉంటుంది.
OBA 1:20 ఇశ్రాయేలు ప్రజలు వారి ఇండ్లు వదిలి పోయేలా ఒత్తిడి చేయబడ్డారు. కాని ఆ ప్రజలే కనానీయుల దేశాన్ని సారెపతువరకు ఆక్రమిస్తారు. యెరూషలేమునుండి సెఫారాదుకు చెరపట్టబడ్డవారు దక్షిణ ప్రాంత పట్టణాలను ఆక్రమించు కొంటారు.
OBA 1:21 జయించినవారు సీయోను కొండమీద ఉంటారు ఆ మనుష్యులు ఏశావు కొండ మీద నివసిస్తున్న వారిని పరిపాలిస్తారు. అప్పుడు రాజ్యం యెహోవాకు చెంది ఉంటుంది.
JON 1:1 అమిత్తయి కుమారుడైన యోనాతో యోహోవా మాట్లాడాడు. యెహోవా ఇలా అన్నాడు:
JON 1:2 “నీనెవె ఒక మహానగరం. అక్కడి ప్రజలు చేస్తున్న అనేక నీచ కార్యాలను గురించి నేను విన్నాను. కావున నీవు ఆ నగరానికి వెళ్లి వారు చేసే చెడు పనులు మానుకొనుమని చెప్పు.”
JON 1:3 దేవుని సలహా యోనా పాటించదలచలేదు. కావున యెహోవాకు దూరంగా యెనా పారిపోవటానికి ప్రయత్నించాడు. యోనా యొప్పే పట్టణానికి వెళ్లాడు. బహుదూరానగల తర్షీషు నగరానికి వెళ్లే ఒక ఓడను యోనా చూశాడు. యోనా తన ప్రయాణానికయ్యే ఖర్చు చెల్లించి ఓడలోనికి వెళ్లాడు. తర్షీషుకు వెళ్లే ఈ ఓడపైగల జనంతో కలిసి యోనా ప్రయాణం చేసి, యెహోవాకు దూరంగా పారిపోదలిచాడు.
JON 1:4 కాని యెహోవా సముద్రంలో పెనుతుఫాను లేవ దీశాడు. గాలివల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుఫాను తీవ్రంగా ఉంది. ఓడ పగిలిపోవటానికి సిద్దంగా ఉంది.
JON 1:5 ఓడ మునగకుండా అందులో ఉన్నావారు దానిని తేలిక చేయదల్చారు. కావున వారు సరుకును సముద్రంలో పారవేయడం మొదలుపెట్టారు. నావికులు చాలా భయపడ్డారు. ఓడలోనున్న ప్రతీవాడు తన దేవుని ప్రార్థించసాగాడు. యోనా మాత్రం పడుకోటానికి పడవ కి ంది భాగంలోకి వెళ్లాడు. యోనా నిద్రపోతూ ఉన్నాడు.
JON 1:6 ఓడ అధికారి యోనాను చూసి ఇలా అన్నాడు: “నిద్రలే! నీవు ఎందుకు నిద్రపోతున్నావు? నీ దేవుణ్ణి ప్రార్థించు! బహుశః నీ దైవం నీ ప్రార్థన ఆలకించి మనల్ని రక్షించవచ్చు.”
JON 1:7 పిమ్మట ఓడలోని మనుష్యులు ఒకరితో ఒకరు, “మనకీ కష్టాలు ఎందుకు వచ్చాయో తెలుసు కోవటానికి మనం చీట్లు వేయాలి” అని అనుకున్నారు. అందువల్ల వారు చీట్లు వేశారు. ఈ కష్టమంతా యోనా వల్ల వచ్చినదేనని చీట్లవల్ల తెలిసింది.
JON 1:8 అప్పుడు ఆ మనుష్యులు యోనాతో ఇలా అన్నారు: “మాకు ఈ కష్టమంతా నీ తప్పువల్లనే సంభవిస్తూ ఉంది! కావున నీవు ఏమి చేశావో మాకు చెప్పు. నీవు ఏమిపని చేస్తావు? నీవు ఎక్కడనుండి వస్తున్నావు? నీది ఏ దేశం? నీ ప్రజలు ఏవరు?”
JON 1:9 అప్పుడు యోనా ఇలా అన్నాడు: “నేనొక హెబ్రీయుడను (యూదా జాతివాడను). పరలోక దేవుడైన యెహోవాను నేను ఆరాధిస్తాను. సముద్రాన్ని, భూమిని సృష్టించిన దేవుడు ఆయనే.”
JON 1:10 తాను యెహోవా నుండి పారిపోతున్నట్లు యోనా వారికి చెప్పాడు. ఇది తెలుసుకున్న ఆ మనుష్యులు చాలా భయపడిపోయారు. ఆ మనుష్యులు యోనాను, “నీ దేవునికి వ్యతిరేకంగా ఎటువంటి భయంకరమైన అపరాధం చేశావు?” అని అడిగారు.
JON 1:11 గాలి, అలలు సముద్రంలో రాను రాను మరింత తీవ్రమవుతున్నాయి. అందువల్ల ఆ మనుష్యులు యోనాతో, “మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే ఏమిచేయాలి? సముద్రాన్ని శాంతింపచేయటానికి నీకు మేము ఏమిచేయాలి?” అని అడిగారు.
JON 1:12 యోనా ఆ మనుష్యులతో ఇలా అన్నాడు: “నేను తప్పు చేశానని నాకు తెలుసు. అందువల్లనే ఈ తుఫాను సముద్రంలో చెలరేగింది. కావున నన్ను సముద్రంలోకి తోసివెయ్యండి. సముద్రం శాంతిస్తుంది”
JON 1:13 కాని ఆ మనుష్యులు యోనాను సముద్రంలోకి తోసివేయటానికి ఇష్టపడలేదు. వారు ఓడను తిరిగి ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కాని వారలా చేయలేకపోయారు. గాలి, సముద్రపు అలలు రాను రాను మరింత తీవ్రమయ్యాయి.
JON 1:14 కావున ఆ మనుష్యులు యెహోవాకు ఇలా విన్న వించుకున్నారు: “ప్రభూ ఇతడు చేసిన చెడు కార్యాల దృష్ట్యా మేము ఈ మనుష్యుని సముద్రంలోకి తోసి వేస్తున్నాము. ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరారోపణ దయచేసి మామీద వేయకు. మేము అతన్ని చంపినందుకు దయచేసి నీవు మమ్ముల్ని చనిపోయేలాగు చేయవద్దు. నీవు యెహోవా అని మాకు తెలుసు. నీవు ఏది తలిస్తే అది చేస్తావు. కాని దయచేసి మాపట్ల కరుణ చూపు.”
JON 1:15 పిమ్మట వారు యోనాను సముద్రంలోకి విసరివేశారు. తుఫాను ఆగిపోయింది. సముద్రం శాంతించింది!
JON 1:16 ఆ మనుష్యులు ఇదంతా చూసి భయపడ సాగారు. యెహోవా పట్ల వారికి భక్తి ఏర్పడింది. వారు యెహోవాకు ఒక బలి సమర్పించి, ప్రత్యేక మొక్కులు మొక్కుకొన్నారు.
JON 1:17 యోనా సముద్రంలో పడగానే యోనాను మింగటానికి ఒక పెద్ద చేపను యెహోవా పంపాడు. ఆ చేప కడుపులో యోనా మూడు పగళ్లు, మూడు రాత్రులు ఉన్నాడు.
JON 2:1 చేప కడుపులో ఉన్నంతకాలం యోనా తన దేవుడైన యెహోవాను ప్రార్థించాడు. యోనా ఇలా అన్నాడు:
JON 2:2 “నేను తీవ్రమైన కష్టంలో ఉన్నాను. నేను యెహోవా సహాయం అర్థించాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు! నేను పాతాళపు లోతుల్లో ఉన్నాను. యెహోవా, నేను నీకు మొరపెట్టుకొనగా నీవు నా మొరాలకించావు!
JON 2:3 “నీవు నన్ను సముద్రంలోకి విసరివేశావు. తీవ్రమైన నీ అలలు నన్ను ముంచెత్తాయి. నేనీ అగాధ సముద్రం లోతులదాకా పోయాను. నా చుట్టూ జల ప్రళయం.
JON 2:4 ‘ఇక నేను చుడలేని స్థలానికి తోయబడ్డాను’ అని అనుకున్నాను. కాని సహాయం కొరకు నేను నీ పవిత్ర ఆలయం వైపు చూస్తూనే ఉన్నాను.
JON 2:5 “సముద్రజలం నన్ను ముంచి వేసింది. నీరు నా నోటిని మూసివేసింది, నేను శ్వాస పీల్చు కోలేకుండా ఉన్నాను. ఈ సముద్రపు లోతులలోకి నేను వెళ్లాను. సముద్రపు మొక్కలు నా తలకు చుట్టుకున్నాయి.
JON 2:6 పర్వతాల పునాదులున్న చోట, సముద్రపు అట్టడుగున నేను ఉన్నాను. ఈ చెరలో నేను శాశ్వతంగా మూయబడి ఉన్నాననుకున్నాను. కానీ నా దేవుడైన యెహోవా నన్ను నా సమాధి నుండి బయటకు లేపాడు! ఓ నా దేవా, నీవు నాకు మళ్లీ ప్రాణం పోశావు!
JON 2:7 “నా ఆత్మ నిరాశ చెందింది, అప్పుడు నేను యెహోవాను తలచుకొన్నాను. యెహోవా, నిన్ను నేను ప్రార్థించాను. నీ పవిత్రాలయంలో నీవు నా ప్రార్థనలు విన్నావు.
JON 2:8 “కొంతమంది ప్రజలు పనికిరాని విగ్రహాలను పూజిస్తారు. కానీ ఆ విగ్రహాలు వారికి ఎన్నడూ సహాయం చేయలేవు.
JON 2:9 యెహోవా నుండి మాత్రమే రక్షణ లభిస్తుంది! యెహోవా, నీకు నేను బలులు అర్పిస్తాను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీకు నేను ప్రత్యేక మొక్కులు మొక్కుతాను. నా మొక్కుబడులు నేను చెల్లిస్తాను.”
JON 2:10 అప్పుడు యెహోవా చేపతో మాట్లాడాడు. తరువాత ఆ చేప తన కడుపులో ఉన్న యోనాను పొడిగా ఉన్న నేలమీదకు కక్కివేసింది.
JON 3:1 పిదప యోనాతో యెహోవా మళ్ళీ మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు:
JON 3:2 “నీవు ఆ నీనెవె మహానగరానికి వెళ్లు. నేను నీకు చెప్పే విషయాలు వారికి బోధించు.”
JON 3:3 యెహోవా ఆజ్ఞను శిరాసావహించి యెనా నీనెవె నగరానికి వెళ్లాడు. నీనెవె ఒక మహా నగరం. ఎవరైనా నగరంగుండా వెళ్లాలంటే మూడు రోజులు నడవాలి.
JON 3:4 యోనా నగరం మధ్యకు వెళ్లి ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు. “నలబై రోజుల తరువాత నీనెవె నాశనమవుతుంది” అని యోనా ప్రకటించాడు.
JON 3:5 నీనెవె నగరవాసులు దేవుని వర్తమానాన్ని విశ్వసించారు. ప్రజలు తమ పాపాలను గురించి ఆలోచించటానికి కొంతకాలంపాటు ఉపవాసం చేయటానికి నిర్ణయించుకొన్నారు. తమ విచారాన్ని వ్యక్తం చేయుటకు ప్రజలు ప్రత్యేకమైన దుస్తులు ధరించారు. అతి ముఖ్యలు, అతి సామాన్యులతో సహా నగరవాసులంతా ఇది ఆచరించారు.
JON 3:6 ఈ విషయాలను గురించి నీనెవె రాజు విన్నాడు. రాజుకూడా తాను చేసిన చెడుపనులకు విచారించాడు. అందుచే రాజు తన సింహాసనాన్ని వదిలివేశాడు. రాజు తన రాజదుస్తులు విసర్జించి, తన విచారాన్ని వ్యక్తం చేసే ప్రత్యేక దుస్తులు ధరించాడు. పిమ్మట రాజు బూడిదలో కూర్చున్నాడు.
JON 3:7 రాజు ఒక ప్రత్యేక వర్తమానాన్ని వ్రాసి, నగరమంతా ప్రకటింపదేజేశాడు. రాజు నుండి, అతని కింద పాలకుల నుండి వచ్చిన ఆజ్ఞ ఏమనగా: కొద్దికాలం పాటు ఏ మనిషీగాని, జంతువుగాని ఏమీ తినగూడదు. పశువుల మందలనుగాని, గొర్రెల మందలనుగాని పొలాల్లోకి వదలకూడదు. నీనెవెలో ఉన్న ఏ జీవీ ఏమీ తనకూడదు. నీరు తాగుకూడదు.
JON 3:8 ప్రతి వ్యక్తీ, ప్రతి జంతువూ విచార సూచకంగా ఒక ప్రత్యేకమైన బట్టతో తప్పక కప్పబడాలి. ప్రజలు బిగ్గరగా తమ గోడును దేవునికి చెప్పుకోవాలి. ప్రతి వ్యక్తీ తన జీవన విధానం మార్చుకొని, చెడు పనులు చేయడం మా నాలి.
JON 3:9 బహుశః అప్పుడు దేవుడు తన మనస్సు మార్చుకొని, తాను చేయ సంకల్పించిన పనులు చేయక పోవచ్చు. బహుశః దేవుని మనస్సు మారవచ్చు. కోపంగా ఉండకపోవచ్చు. అప్పుడు మనం శిక్షింపబడకపోవచ్చు.
JON 3:10 ప్రజలు చేసిన పనులన్నీ దేవుడు చూశాడు. ప్రజలు చెడుపనులు చేయటం మానినట్లు దేవుడు గమనించాడు. కావున దేవుడు మనసు మార్చుకొని, తాను చేయ సంకల్పించినది విరమించుకున్నాడు. దేవుడు ప్రజలను శిక్షించలేదు.
JON 4:1 దేవుడు నగరాన్ని రక్షించటం పట్ల యోనా సంతోషంగా లేడు. యోనాకు కోపం వచ్చింది.
JON 4:2 యోనా యెహోవాపట్ల చిరాకుతో ఇలా అన్నాడు: “ఇది జరుగుతుందని నాకు తెలుసు! నేను నా దేశంలో ఉన్నప్పుడు నన్ను ఇక్కడికి రమ్మన్నావు. ఈ దుర్మార్గపు నగరవాసులను నీవు క్షమిస్తావని నాకు అప్పుడే తెలుసు. అందువల్లనే నేను తర్షీషుకు పారి పోవటానికి నిర్ణయించుకున్నాను. నీవు దయగల దేవుడవని నాకు తెలుసు! నీవు కరుణ చూపిస్తావని, నీవు ప్రజలను శిక్షింపగోరవనీ నాకు తెలుసు! నీ అంతరంగం కరణతో నిండివుందనీ నాకు తెలుసు! వీరు పాపం చేయటం మానితే, వీరిని నాశనం చేయాలనే నీ తలంపు మార్చుకుంటావనీ నాకు తెలుసు.
JON 4:3 కావున యెహోవా, నన్ను చంపివేయుమని నే ను నిన్ను వేడుకుంటున్నాను. నేను బ్రతకటం కంటే చనిపోవటం మంచిది!”
JON 4:4 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నేను ఆ ప్రజలను నాశ నం చెయ్యనంత మాత్రాన నీవు కోపగించుకోవటం నీకు సమంజసమని అనుకుంటున్నావా?”
JON 4:5 అయినా యోనా జరిగినదానికంతకు ఇంకా కోపంగానే ఉన్నాడు. కావున అతడు నగరం వెలుపలికి వెళ్లాడు. తూర్పు దిక్కున నగరానికి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతానికి యోనా వెళ్లాడు. యోనా తన కొరకు ఒక పందిరి నిర్మించుకున్నాడు. నగరానికి ఏమ వుతుందో చూద్దామని ఎదురుచూస్తూ అతడు ఆ నీడలో కూర్చున్నాడు.
JON 4:6 యోనా కూర్చునివున్న పందిరి మీదీకి ఒక సొర పాదును త్వరత్వరగా పాకేలా యెహోవా చేశాడు. అది యోనా కూర్చోవటానికి చల్లని వాతావరణం కల్పించింది. ఇది యోనాకు హాయిని సమకూర్చటంలో సహాయ పడింది. ఈ సొరపాదు మూలంగా యోనా చాలా సంతోషంగా ఉన్నాడు.
JON 4:7 మరునాటి ఉదయం, మొక్కలో ఒక భాగాన్ని తినివేయటానికి ఒక పురుగును దేవుడు పంపాడు. ఆ పురుగు మొక్కను తినివేయటం మొదలుపెట్టగా, ఆ మొక్క చనిపోయింది.
JON 4:8 మిట్టమధ్యాహ్నమయ్యే సరికి, దేవుడు తూర్పు నుండి వేడిగాడ్పులు వీచేలా చేశాడు. యోనా తలమీద సూర్యుని వేడిమి ఎక్కువయ్యింది. యోనా బాగా నీరసించిపోయాడు. యోనా దేవునితో తనను చనిపోనిమ్మన్నాడు. “నేను బ్రతకటంకంటే చనిపోవటం మేలు” అని యోనా అన్నాడు.
JON 4:9 కాని దేవుడు యోనాతో, “ఈ మొక్క చని పోయినంత మాత్రాన నీవు కోపగించుకోవటం సమంజసమేనా?” అని అన్నాడు. “అవును, నేను కోపగించుకోవటం సమంజసమే! నేను చచ్చిపోవాలనేటంత కోపంతో ఉన్నాను” అని యోనా అన్నాడు.
JON 4:10 పిమ్మట యెహోవా ఇలా అన్నాడు: “ఆ మొక్కకు నీవు ఏమీ చేయలేదు! నీవు దానిని పెంచలేదు. అది రాత్రికి రాత్రి పెరిగి, మరునాడు చనిపోయింది. ఇప్పుడు నీవు ఆ మొక్కను గురించి విచారి స్తున్నావు.
JON 4:11 నీవు ఒక మొక్కను గురించే కలత చెందినప్పుడు, నేను నీనెవె లాంటి ఒక మహా నగరం గురించి ఖచ్చితంగా విచారిస్తాను. ఆ నగరంలో ప్రజలు ఉన్నారు. జంతువులు అనేకంగా ఉన్నాయి. తాము తప్పు చేస్తున్నామని తెలియని ఒక లక్షా ఇరవైవేల మందికంటే ఎక్కువ మంది ప్రజలు ఆ నగరంలో ఉన్నారు.”
MIC 1:1 యెహోవా వాక్కు మీకాకు అందింది. ఇది యోతాము, ఆహాజు, మరియు హిజ్కియా అనే రాజుల కాలంలో జరిగింది. వీరు ముగ్గురూ యూదా రాజులు. మీకా, మోరషతు నగరం వాడు. సమరయ, యెరుషలేములను గురించిన ఈ దర్శనాలను మీకా చూశాడు.
MIC 1:2 ప్రజాలారా, మీరంతా వినండి! భూమీ, దాని మీదగల ప్రతి ఒక్కడూ, అంతా వినండి! నా ప్రభువైన యెహోవా తన పవిత్ర ఆలయం నుండి వస్తాడు. నా ప్రభువు మీకు వ్యతిరేకంగా ఒక సాక్షిగా వస్తాడు.
MIC 1:3 చూడండి, దేవుడైన యెహోవా తన స్థానంనుండి బయటకు వస్తున్నాడు. ఆయన భూమీయొక్క ఉన్నత స్థలాలపై నడవటానికి కిందికి వస్తున్నాడు.
MIC 1:4 దేవుడైన యెహోవా అగ్ని ముందు మైనంలా పర్వతాలు కరిగిపోతాయి. గొప్ప జలాపాతంలా, లోయలు వికలమై కరిగిపోతాయి.
MIC 1:5 యాకోబు పాపం కారణంగా, ఇశ్రాయేలు ఇంటి వారు చేసిన పాపాల కారణంగా ఇది జరుగుతుంది. యాకోబు పాపానికి కారణం ఏమిటి? దానికి కారణం సమరయ! యూదాలో ఉన్నత స్థలమేది? అది యెరూషలేము!
MIC 1:6 మైదానంలో రాళ్ల గుట్టలా నేను సమరయను మార్చుతాను. అది ద్రాక్షాతోట వేయటానికి అనువైన భూమివలె మారిపోతుంది. సమరయ యొక్క నిర్మాణపు రాళ్లను పెరిగి లోయలో పారవేస్తాను. నేను దాని పునాదులను నాశనం చేస్తాను.
MIC 1:7 దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరుగ గొట్టబడతాయి. అది సంపాదించిన ధనం అగ్నికి ఆహుతి అవుతుంది. దానియొక్క బూటకపు దేవుళ్ల విగ్రహాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. ఎందుకంటే, సమరయ నా పట్ల అవిశ్వాసంగా ఉండి అవన్నీ కూడబెట్టింది. కావున ఈ వస్తువులన్నీ నాపట్ల అవిశ్వసంగా ఉన్న ఇతర ప్రజలకు వెళ్లిపోతాయి.
MIC 1:8 ఈ చెడు విషయంలో నేను కలవరపాటుచెంది, విచారిస్తున్నాను. నేను పాద రక్షలు కూడ లేకుండా, నగ్నంగా బయటకు వెళతాను. నక్కలు ఊళ పెట్టినట్లు నేను అరుస్తాను. నిప్పు కోళ్లలా మూల్గుతాను.
MIC 1:9 ఎందుకనగా సమరయ గాయం మాన్పరానిది. ఆమె గాయం (పాపం) యూదాకు వ్యాపించింది. అది నా ప్రజల నగర ద్వార వద్దకు చేరింది. అది చివరకు యెరూషలేము వరకు వచ్చింది.
MIC 1:10 ఇది గాతులో చెప్పవద్దు. అక్కడ ఏడ్వవద్దు. బేత్‌యఫ్రలో విలపించి, దుమ్ములో పొర్లాడు.
MIC 1:11 షాఫీరులో నివసించేవాడు, దిగంబరివై, సిగ్గుతో నీ దారిన నీవు పోమ్ము. జయనానులో నివసించేవాడు బయటకు వెళ్లడు. బేతేజెలులో ఉన్నావారు విలపిస్తారు. దానికి కావలసిన ఆసరా మీ నుండి తీసుకొంటుంది.
MIC 1:12 మారోతులో నివసించేవాడు మంచివార్త కోసం ఎదురు చూస్తూ నీరసించిపోయాడు. ఎందుకంటే యెహోవానుండి ఆపద యెరూషలేము నగర ద్వారంవరకు వచ్చింది.
MIC 1:13 లాకీషులో నివసిస్తున్న ఓ స్త్రీ, రథాన్ని వేగముగల గుర్రానికి తగిలించు. సీయోను పాపాలు లాకీషులో మొదలైనాయి. ఎందుకంటే నీవు ఇశ్రాయేలు పాపాలనే అనుసరించావు.
MIC 1:14 కావున గాతులోని మోరెషెతుకు మీరువీడ్కోలు బహుమతులు ఇవ్వాలి. అక్జీబులోని ఇండ్లు ఇశ్రాయేలు రాజులను మోసపుచ్చుతాయి.
MIC 1:15 మారేషా నివాసులారా, మీ మీదికి నేనోక వ్యక్తిని తీసుకొని వస్తాను, మీకున్న వస్తువులన్నీ ఆ వ్యక్తి తీసుకుంటాడు. ఇశ్రాయేలు మహిమ (దేవుడు) అదుల్లాములో ప్రవేశిస్తుంది.
MIC 1:16 కావున మీ తలలు గొరిగించి, బోడిగా చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రేమించే పిల్లలకొరకుమీరు దుఃఖిస్తారు. రాబందులారా మీ తలలు బోడి చేసుకోండి. ఎందుకంటే మీ పిల్లలు మీకు దూరమవుతారు. వారు బలవంతంగా ఇండ్లు వదిలి పోయేలా చేయబడతారు.
MIC 2:1 పాపం చేయటానికి ఉపాయం పన్నేవారికి ఆపదలు వస్తాయి. ఆ ప్రజలు తమ పాన్పులపై పడుకొని పాపం చేయటానికి పథకాలు వేస్తారు. తెల్లవారగానే, ఈ ప్రజలు తమ పథకం ప్రకారం చెడు పనులు చేస్తారు. ఎందుకంటే వాటిని చేయటానికి వారికి శక్తిఉంది.
MIC 2:2 వారు భూములను ఆశించి, వాటిని తీసుకుంటారు. వారు ఇండ్లును కోరి వాటిని ఆక్రమిస్తారు. వారొక వ్యక్తిని మోసపుచ్చి వాని ఇంటిని తీసుకుంటారు. వారొక వ్యక్తిని మోసగించి అతని వస్తువులను కాజేస్తారు.
MIC 2:3 అందువల్ల యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “చూడండి, ఈ వంశం మీదికి ఆపద తీసుకురావటానికి నేను పథకం వేస్తున్నాను. మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. మీరు గర్వంగా నడవలేరు. ఎందకంటే అది కీడుమూడే సమయం.
MIC 2:4 ఆ సమయంలో ప్రజలు మిమ్మల్ని గురించి పాటలు పాడుకుంటారు. ప్రజలు మిమ్మల్ని గురించి దుఃఖ సూచకపాటలు ఆలపిస్తారు. మీరు ఇలా అంటారు: ‘మేము నాశనమయ్యాము! యెహోవా నా ప్రజల భూమిని తీసుకున్నాడు. ఆయన దానిని అన్యజనులకు ఇచ్చాడు. అవును, నా భూమిని ఆయన నానుండి తీసుకున్నాడు. యెహోవా మా పొలాలను మా శత్రువులమధ్య విభజించాడు.
MIC 2:5 ప్రజలు మీ భూమిని కొలవలేరు. భూమిని యెహోవా ప్రజల మధ్య విభజించటానికి ప్రజలు చీట్లు వేయలేరు. ఎందుకంటే, ఆ భూమి మీకు చెందియుండదు!’”
MIC 2:6 ప్రజలు ఇలా అంటారు: “మాకు బోధించవద్దు. మా గురించి ఆ చెడు విషయాలు చెప్పవద్దు. మాకు ఏ కీడూ జరుగబోదు.”
MIC 2:7 కాని, యాకోబు వంశీయులారా నేనీ విషయాలు చెప్పాలి. మీరు చేసిన పనుల పట్ల యెహోవా కోపగిస్తున్నాడు. మీరు ధర్మంగా ప్రవర్తిస్తే నేను మిమ్మల్ని గురించి మంచి మాటలు చెప్పేవాడిని.
MIC 2:8 కాని, ఇటీవల నా ప్రజలే నా శత్రువులయ్యారు దారిన పోయే వారివద్ద నుండి మీరు బట్టలు దొంగిలిస్తారు. ఆ జనులు మాత్రం సురక్షితంగా ఉన్నామనుకున్నారు. కాని వారు యుద్ధ ఖైదీలు అన్నట్లు, వారి వస్తువులు మీరు తీసుకుంటారు.
MIC 2:9 నా ప్రజల స్త్రీలను వారి అందమైన, సౌకర్యాలు గల ఇండ్లనుండి మీరు వెళ్లగొట్టారు. వారి చిన్న పిల్లల మధ్యనుండి నా మహిమను మీరు తీసివేశారు.
MIC 2:10 లేచి వెళ్లిపొండి! ఎందుకంటే, ఇది విశ్రాంతి తీసుకొనే స్థలం కాదు. ఎందుకంటే మీరు ఈ స్థలాన్ని పాడు చేశారు! మీరు దీన్ని అపవిత్రం చేశారు. కనుక అది నాశనం చేయబడుతుంది!
MIC 2:11 ఒక బూటకపు ప్రవక్త వచ్చి, అబద్ధాలు చెప్పవచ్చు. అతడు, “నాకు ద్రాక్షారసం, మద్యం ఇవ్వండి. నేను మీకు మంచి విషయాలు చెపుతాను” అని అనవచ్చు. అతడు వారికి ఆ విధంగా బోధకుడవుతాడు!
MIC 2:12 అవును, యాకోబు వంశీయులారా, నేను మీ అందరినీ ఒక్కచోటికి తీసుకువస్తాను. ఇశ్రాయేలు ప్రజలలో మిగిలిన వారందరినీ సమకూర్చుతాను. దొడ్డిలోని గొర్రెల్లా, పచ్చిక బీడులోనిమందల్లా, వారిని నేను సమకూర్చుతాను. అప్పుడు ఆ స్థలమంతా అనేకమందిచేసే ధ్వనులతో నిండిపోతుంది.
MIC 2:13 “ఒక వ్యక్తి” ముందుకు తోసుకు వచ్చి తన ప్రజల ముందుకు వస్తాడు. ఆయన ద్వారాలను పడదోసుకుపోతాడు. ప్రజలు ఆ నగరాన్ని వదలివేస్తారు. వారి రాజు వారిముందు నడుస్తాడు. యెహోవా తన ప్రజల ముందు ఉంటాడు.
MIC 3:1 అప్పుడు నేనిలా అన్నాను: “యాకోబు పెద్దలారా, ఇశ్రాయేలు దేశాధిపతులారా, ఇప్పుడు వినండి. న్యాయమంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి!
MIC 3:2 కాని మీరు మంచిని ద్వేషించి, చెడును ప్రేమిస్తారు! మీరు వారి ప్రజల చర్మాన్ని ఒలుస్తారు. మీరు వారి ఎముకలపై గల మాంసాన్ని లాగివేస్తారు!
MIC 3:3 మీరు నా ప్రజలను నాశనం చేస్తున్నారు! మీరు వారి చర్మాన్ని ఒలుచుకుంటున్నారు; వారి ఎముకలను విరుగ గొడుతున్నారు. మాంసంలా వారి ఎముకలను కుండలో పెట్టటానికి మీరు నరుకుతారు!
MIC 3:4 అప్పుడు మీరు దేవుడైన యెహోవాను ప్రార్థిస్తారు. కాని ఆయన మీ ప్రార్థన వినడు; దేవుడైన యెహోవా మిమ్మల్ని చూచి ముఖం తిప్పుకుంటాడు. ఎందుకంటే మీరు చెడుపనులు చేశారు!”
MIC 3:5 అబద్ధ ప్రవక్తలు యెహోవా ప్రజలకు తప్పుడు జీవిత విధానాన్ని బోధిస్తారు. యెహోవా ఆ ప్రవక్తల విషయంలో ఈ విధంగా చెపుతున్నాడు: “ప్రజలు గనుక ఈ ప్రవక్తలకు తినటానికి ఆహారం ఇస్తే వారు శాంతి అని అరుస్తారు! ఒకవేళ ప్రజలు వారికి ఆహారం ఇవ్వకపోతే, అప్పుడు ప్రవక్తలు ‘యుద్ధానికి సిద్ధంకండి’ అని అరుస్తారు.
MIC 3:6 “అందువల్ల మీకు చీకటి కమ్మినట్లుఉంటుంది. మీకు దర్శనాలు కలుగవు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మీరు చెప్పలేరు గనుక. మీకు అంధకారం వ్యాపించినట్లు ఉంటుంది. ఈ ప్రవక్తలకు సూర్యుడు అస్తమిస్తాడు. వారికి పట్టపగలే అంధకారం ఆవరిస్తుంది.
MIC 3:7 దీర్గదర్శులు (ప్రవక్తలు) సిగ్గుపడతారు. భవిష్యత్తును చూసేవారు కలవరపాటు చెందుతారు. అవును; వారంతా వారి నోళ్లు మూసుకుంటారు. ఎందుకంటే దేవునివద్ద నుండి సమాధానం రాదు!
MIC 3:8 కానీ యెహోవా ఆత్మ నన్ను శక్తితోను, మంచితనంతోను, బలంతోను నింపివేసింది. కావున నేను యాకోబుకు అతని పాపాలనుగూర్చి చెప్పగలను. అవును ఇశ్రాయేలుకు అతను చేసిన పాపాలను గురించి నేను చెపుతాను!”
MIC 3:9 యాకోబు ప్రజల నాయకులారా, ఇశ్రాయేలు అధిపతులారా, నేను చెప్పేది వినండి! మీరు న్యాయాన్ని ద్వేషిస్తారు. మీరు తిన్నగా ఉన్నదానిని వంకర చేస్తారు!
MIC 3:10 మీరు ప్రజలను హత్యచేసి సీయోనును నిర్మించారు! మీరు యెరూషలేమును పాపంతో నిర్మించారు!
MIC 3:11 యెరూషలేములో న్యాయాధిపతులు రహస్యంగా లంచాలు తీసుకుంటారు. వారలా చేసి న్యాయస్థానంలో తమ తీర్పు ఇస్తారు. ప్రజలకు బోధించే ముందు యెరూషలేము యాజకులకు వేతనం చెల్లించాలి. ప్రవక్తలు భవిష్యత్తులోకి చూసే ముందు ప్రజలు వారికి డబ్బు చెల్లించాలి. అప్పుడా నాయకులు, “మనకు ఏరకమైన కీడూరాదు! యెహోవా మనపట్ల ఉన్నాడు!” అని అంటారు.
MIC 3:12 మీ మూలంగానే సీయోను నాశనమవుతుంది. అది దున్నిన పొలంలా తయారవుతుంది. యెరూషలేము రాళ్ల గుట్టలా మారుతుంది. ఆలయపు పర్వతం పొదలతో నిండినవట్టి కొండలా తయారవుతుంది.
MIC 4:1 చివరి రోజులలో ఇలా జరుగుతుంది. పర్వతాలన్నిటిలో దేవుడైన యెహోవా ఆలయమున్న పర్వతం మిక్కిలి ప్రాముఖ్యంగలది అవుతుంది. అది కొండలన్నిటిలో ఉన్నతంగా చేయబడుతుంది. అన్యదేశాల ప్రజలు దానివద్దకు ప్రవాహంలా వస్తారు.
MIC 4:2 అనేక దేశాలవారు వచ్చి ఇలా అంటారు: “రండి మనం యెహోవా పర్వతంమీదికి వెళదాం! యాకోబు దేవుని ఆలయానికి వెళదాం! యెహోవా తన ధర్మాన్ని మనకు నేర్పుతాడు. ఆయన మార్గంలో మనం నడుద్దాం.” ఎందువల్లనంటే దేవుని బోధలు సీయోనునుండి వస్తాయి. యెహోవా వాక్కు యెరూషలేమునుండి వస్తుంది!
MIC 4:3 యెహోవా అనేకా జనుల మధ్య తీర్పు తీర్చుతాడు. బహు దూరానగల బలమైన దేశాల ప్రజలకు ఆయన తీర్పు ఇస్తాడు. అప్పుడు వారు తమ కత్తులను సాగగొట్టి వాటిని నాగలికర్రలుగా చేస్తారు. ఆ జనులు తమ ఈటెలను సాగ గొట్టిచెట్లను నరికే పనిముల్లుగా చేస్తారు. జనులు ఒకరితో ఒకరు కత్తులతో యుద్ధం చేయటం మాని వేస్తారు. వారిక ఎన్నడూ యుద్ధ వ్యూహాలను అధ్యయనం చేయరు!
MIC 4:4 లేదు, ప్రతి ఒక్కడూ తన ద్రాక్షాలతల క్రింద, అంజూరపు చెట్టుక్రింద కూర్చుంటాడు. వారిని ఎవ్వరూ భయపడేలా చేయరు! ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన యెహావా ఇది చెప్పాడు!
MIC 4:5 అన్యదేశాల ప్రజలు తమతమ దేవుళ్లను అనుసరిస్తారు. కానీ మనం మాత్రం మన దేవుడైన యెహోవా నామాన్ని సదా స్మరించుకుంటాం!
MIC 4:6 యెహోవా చెపుతున్నాడు, “యెరూషలేము గాయపర్చబడగా కుంటిది అయ్యింది. యెరూషలేము అవతలకు విసిరివేయబడింది. యెరూషలేము గాయపర్చబడింది; శిక్షింపబడింది. అయినా నేను ఆమెను నా వద్దకు తీసుకొనివస్తాను.
MIC 4:7 “ఆ ‘కుంటి’ నగరవాసులే బతుకుతారు. ఆ నగర ప్రజలు నగరం వదిలివెళ్లేలా బలవంత పెట్టబడ్డారు. కాని నేను వారిని ఒక బలమైన రాజ్యంగా రూపొందిస్తారు.” యెహోవా వారికి రాజుగా ఉంటాడు. ఆయన శాశ్వతంగా సీయోను పర్వతం మీదనుండి పరిపాలిస్తాడు.
MIC 4:8 ఓ మందల కావలిదుర్గమా, ఓ సీయోను కుమార్తె పర్వతమైన ఓఫెలూ, గతంలోమాదిరి నీవొక రాజ్యంగా రూపొందుతావు. అవును, సీయోను కుమారీ, ఆ రాజ్యం నీకు వస్తుంది.
MIC 4:9 నీవిప్పుడు అంత బిగ్గరగా ఎందుకు ఏడుస్తున్నావు? నీ రాజు వెళ్లిపోయాడా? నీ నాయకుని నీవు కోల్పోయావా? ప్రసవవేదనపడే స్త్రీలా నీవు బాధ పడుతున్నావు.
MIC 4:10 సీయోను కుమారీ, నీవు బాధపడు. ప్రసవించే స్త్రీలా నీవు ప్రసవించి “బిడ్డను” కను. ఎందుకంటే నీవు (యెరూషలేము) నగరాన్ని ఇప్పుడు వదిలివేస్తావు. నీవు వెళ్లి పొలంలో నివసిస్తావు. నీవు బబులోనుకు (బాబిలోనియా) వెళతావు. కానీ నీవక్కడనుండి రక్షింపబడతావు. యెహోవా అక్కడికి వెళ్లి నిన్ను నీ శత్రువులనుండి తిరిగి తీసుకొని వస్తాడు.
MIC 4:11 అనేక దేశాలు నీ మీద యుద్ధానికి వచ్చాయి. “సీయోను వైపు చూడు! దానిపై దాడి చేయండి!” అని ఆ జనులు అంటారు.
MIC 4:12 ఆ జనులు వారి వ్యూహాలు పన్నారు. కాని యెహోవా చేసే యోచన మాత్రం వారు ఎరుగరు. యెహోవా ఆ ప్రజలను ఇక్కడికి ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో తీసుకొని వచ్చాడు. కళ్లంలో ధాన్యం నూర్చబడినట్లు ఆ జనులు నలగదొక్క బడతారు.
MIC 4:13 “సీయోను కుమారీ లెమ్ము; ఆ జనాలను అణగదొక్కు. నేను నిన్ను బాగా బలపర్చుతాను. నీకు ఇనుప కొమ్ములు, కంచుగిట్టలు ఉన్నట్లువుతుంది. అనేకమంది జనులను నీవు ముక్కలుగాచి తకగొడతావు. వారి సంపదను నేను యెహోవాకు ఇస్తాను. వారి భాగ్యాన్ని సర్వజగత్తుకూ అధిపతియయైన యెహోవాకు సమర్పిస్తాను.”
MIC 5:1 కావున, బలమైన నగరమా నీ సై న్యాలను సమీకరించు. నీ శత్రువులు ముట్టడించటానికి కూడుకుంటున్నారు. వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని చెంపమీద కొడతారు.
MIC 5:2 కాని, బేత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదాలో అతి చిన్న గ్రామానివి. నీ వంశం లెక్కపెట్టానికి కూడా అతి చిన్నది. అయినప్పటికీ, నీ నుండే నా “ఇశ్రాయేలు పాలకుడు” వస్తాడు. ఆయన ఆరంభం (ఉనికి) పురాతన కాలంనుండి, ఆద్యంతములు లేని రోజులనుండి ఉంటూవుంది.
MIC 5:3 యెహోవా తన ప్రజలను బబులోను (బాబిలోనియా)లో ఉండనిస్తాడు. స్త్రీ ప్రసవించే దాకా వారక్కడ ఉంటారు. అప్పుడు ఇంకా బతికివున్న అతని సోదరులు తిరిగివస్తారు. వారు ఇశ్రాయేలు ప్రజలవద్దకు తిరిగివస్తారు.
MIC 5:4 అప్పుడు ఇశ్రాయేలును పాలించేవాడు నిలబడి తన మందను మేపుతాడు. యెహోవా తన శక్తితోను; దేవుడైన యెహోవా తన అద్భత నామ మహత్తుతోను ఆయన వారిని నడిపించుతాడు. వారు నిర్భయంగా జీవిస్తారు. ఎందువల్లనంటే, ఆ సమయంలో ఆయన గొప్పతనం భూమి అంచుల దాకా వ్యాపిస్తుంది.
MIC 5:5 శాంతి నెలకొంటుంది. అష్షూరు సైన్యం మన దేశంలోకి వస్తుంది. ఆ సైన్యం మన పెద్ద ఇండ్లను నాశనంచేస్తుంది. కాని ఇశ్రాయేలు పాలకుడు ఏడుగురు గొర్రెల కాపరులను ఎంపికచేస్తాడు. కాదు ఆయన ఎనమండగురు నాయకులనుఎంపిక చేస్తాడు.
MIC 5:6 వారు తమ కత్తులను ఉపయోగించి, అష్షూరువారిని పాలిస్తారు. వారు తమ స్వంత నగరాలనుండి నిమ్రోదుదేశాన్ని పాలిస్తారు. ఆ ప్రజలను పాలించటానికి వారు తమ కత్తులను ఉపయోగిస్తారు. అప్పుడు ఇశ్రాయేలు పాలకుడు మనలను అష్షూరీయులు నుండి రక్షిస్తాడు. (ఆ ప్రజలు మన రాజ్యంలోకి వస్తారు. వారు మన ప్రాంతాన్ని తమ కాళ్ళకింద త్రొక్కుతారు.)
MIC 5:7 యాకోబు సంతతిలో మిగిలిన వారుచాలామంది ప్రజలకు యెహోవా కురిపించే మంచులా ఉంటారు. వారు పచ్చగడ్డిపై పడే వర్షంలా ఉంటారు. వారు ఏ మనిషి కోసమూ వేచి ఉండరు. వారు ఎవరికీ భయపడరు.
MIC 5:8 అడవి జంతువుల మధ్య సింహం ఎలా ఉంటుందో, యాకోబు సంతతిలో మిగిలినవారు చాలామంది ప్రజలకు అలా ఉంటారు. గొర్రెలమందల్లో చొరబడిన కొదమ సింహంలా వారుంటారు. సింహం నడుచుకుంటూ వెళ్లినప్పుడు అది ఎటు వెళ్లదలిస్తే అటు వెళుతుంది. అది ఒక జంతువును ఎదుర్కొన్నప్పుడు ఎవ్వడూ దానిని అదుపు చేయలేడు. మిగిలి ఉన్న జనులు అటువంటి సింహంలా ఉంటారు.
MIC 5:9 మీరు మీచోతిని మీ శత్రువులపైకి ఎత్తి, వారిని నాశనం చేస్తారు.
MIC 5:10 దేవుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో మీ గుర్రాలను మీవద్దనుండి తీసుకుంటాను. మీ రథాలను నాశనంచేస్తాను.
MIC 5:11 మీ దేశంలోగల నగరాలను నేను నాశనం చేస్తాను. మీ కోటలన్నిటినీ కూలగొడతాను.
MIC 5:12 మీరిక ఎంతమాత్రం మంత్రతంత్రాలు చేయ ప్రయత్నించరు. భవిష్యత్తును చెప్ప యత్నించే జనులుమీకిక వుండబోరు.
MIC 5:13 మీ బూటకపు దేవుళ్లు విగ్రహాలను నేనునాశనం చేస్తాను. ఆ బూటకపు దేవుళ్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రాళ్లను నేను పడగొట్టతాను. నీ చేతులు చేసిన వస్తువులను నీవు ఆరాధించవు.
MIC 5:14 అషేరా దేవతను ఆరాధించటానికి ఏర్పాటు చేయబడిన స్తంబాలను లాగివేస్తాను. మీ బూటకపు దేవుళ్లను నేను నాశనం చేస్తాను.
MIC 5:15 కొంతమంది మనుష్యులు నా మాట వినరు. నేను నా కోపాన్ని చూపిస్తాను. ఆ జనులకు నేను ప్రతీకారంచేస్తాను.”
MIC 6:1 యెహోవా ఏమి చేపుతున్నాడో ఇప్పుడు విను నీవు లేచి పర్వతాలముందు నిలబడు. వాటికి నీ కథ విన్నవించుకో. కొండలను నీ కథ విననియ్యి.
MIC 6:2 తన ప్రజలకు వ్యతిరేకంగా యెహోవాకు ఒక ఫిర్యాదు వుంది. పర్వతాల్లారా, యెహోవా చేసే ఫిర్యాదు వినండి. భూమి పునాదుల్లారా, యెహోవా చేప్పేది వినండి. ఇశ్రాయేలుది తప్పు అని ఆయన నిరూపిస్తాడు!
MIC 6:3 యెహోవా చెపుతున్నాడు, “నా ప్రజలారా, మీ పట్ల నేనేమి తప్పు చేశాను? మీరు నాపట్ల విరక్తి చెందేలా నేను ఏమి చేశాను? మీకు నేను చేసిన పనులు నాకు చెప్పండి!
MIC 6:4 నేను చేసిన పనులు మీకు నేను చెపుతాను! ఐగుప్తు (ఈజిప్టు) దేశం నుండి మిమ్ముల్ని నేను తీసుకువచ్చాను. మీకు నేను దాస్యంనుండి విముక్తి కలిగించాను. నేను మీవద్దకు మోషే, అహరోను, మిర్యాములను పంపాను.
MIC 6:5 నా ప్రజలారా, మోయాబు రాజైన బాలాకు చేసిన దుష్టవ్యూహాలను మీరు గుర్తుపెట్టుకోండి. బెయోరు కుమారుడైన బిలాము అనేవాడు బాలాకుకు చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకోండి అకాసియ (షిత్తీయు) నుండి గిల్గాలువరుకు జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు యెహోవా న్యాయ వరున్తుడని మీరు తెలుసుకుంటారు!”
MIC 6:6 దేవుడైన యెహోవా సన్నధికి నేను వచ్చినప్పుడు, నేను దేవుని ముందు సాష్టాంగ పడినప్పుడు నాతో నేనేమి తీసుకొనిరావాలి? ఒక సంవత్సరం వయస్సుగల కోడెదూడను దహనబలి నిమిత్తం తీసుకొని నేను యెహోవా వద్దకు రావాలా?
MIC 6:7 యెహోవా వెయ్యి పొట్టేళ్లతో లేక పదివేల నదులకు సమానమైన నూనెతో సంతృప్తి చెందుతాడా, నా పాప పరిహారానికి నా ప్రథమ సంతానాన్నిబలి ఇవ్వనా? నా పాపాలకు పరిహారంగా నా శరీరంలో భాగంగా పుట్టిన శిశువును అర్పించనా?
MIC 6:8 మానవుడా, మంచి విషయాలను గురించి యెహోవా నీకు చెప్పియున్నాడు. యెహోవా నీ నుండి కోరేవి ఇవి: ఇతరుల పట్ల నీవు న్యాయంగా ప్రవర్తించు. ప్రజలపట్ల ప్రేమ, దయకలిగి ఉండటానికి ఇష్టపడు. అణకువ కలిగి నీ దేవునితో జీవించు.
MIC 6:9 దేవుడైన యెహోవా కంఠం నగరాన్ని (యెరూషలేము) పిలుస్తూవుంది. తెలివిగల మనష్యుడు యెహోవా నామాన్ని గౌరవిస్తాడు. కావున శిక్షించే దండంపట్ల, ఆ దండాన్నిచేత ధరించేవాని పట్ల ధ్యానముంచు!
MIC 6:10 దుష్టులు తాము దొంగిలించిన ధనరాశులను ఇంకా దాస్తున్నారా? దుష్టులు ఇంకా మరీ చిన్నబట్టలతో జనాన్నిమోసగిస్తున్నారా? అలా ప్రజలను మోసగించే విధానాలను యెహోవా అసహ్యించు కుంటాడు!
MIC 6:11 దుష్టులు ఇంకా తప్పుడు కొలతలు, తప్పుడు తూనికలతో ప్రజలను మోసగిస్తున్నారా? తప్పుడు కొలతలు కొలవటానికి వారింకా దొంగతూకపురాళ్లు, దొంగ కొలతలుగల సంచులు కలిగియున్నారా? అవును! అవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి!
MIC 6:12 ఆ నగరంలో ధనవంతులు ఇంకా క్రూరమైన పనులు చేస్తున్నారు! ఆ నగరవాసులు ఇంకా అబద్ధాలు చెపుతున్నారు! అవును, ఆ ప్రజలు అబద్ధాలు చెపుతూనే ఉన్నారు!
MIC 6:13 కావున నేను నిన్ను శిక్షించటం మొదలుపెట్టాను. నీ పాపాల కారణంగా నేను నిన్ను నాశనంచేస్తాను.
MIC 6:14 నీవు తింటావు; కానీ నీ కడుపు నిండదు. నీ కడుపు ఖాళీగా ఉండి నీవు ఇంకా ఆకలితో ఉంటావు. నీవు ప్రజలను సురక్షితంగా ఉంచటానికి ప్రయత్నిస్తావు. కాని కత్తులు పట్టిన జనులు నీవు కాపాడిన జనులను చంపుతారు, నిన్ను పట్టుకుంటారు.
MIC 6:15 నీవు విత్తనాలు చల్లుతావు; కానీ నీవు పంట కోయలేవు. ఒలీవ గింజలను గానుగపడతావు; కానీ నీకు నూనెరాదు. నీ తియ్యటి ద్రాక్షారసం తాగటానికి నీవు అనుమతింపబడవు.
MIC 6:16 ఎందకుంటే నీవు ఒమ్రీ నిర్దేశించిన కట్టుబాట్లను అనుసరిస్తూ, అహాబు వంశంవారు చేసిన చెడు పనులన్నీ చేస్తున్నావు. నీవు వారి బోధలను పాటిస్తున్నావు. అందువల్ల నీవు నాశనమయ్యేలా చేస్తాను. నీ నగరవాసులు నవ్వుల పాలవుతారు. చీదర పుట్టించే నా జనులు బందీలుగా కొనిపోబడతారు.
MIC 7:1 నేను కలత చెందాను! ఎందుకంటే, నేను సేకరించబడిన వేసవి కాలపు పండులా ఉన్నాను. పండిపోయినా ద్రాక్షాపండ్లవలె ఉన్నాను. తినటానికి ద్రాక్షాపండ్లు మిగలలేదు. నేను కాంక్షించే తొలి అంజూరపు పండ్లులేనేలేవు.
MIC 7:2 అనగా విశ్వసంగల జనులంతా పోయారు. ఈ దేశంలో మంచివాళ్లంటూ ఎవ్వరూ మిగలలేదు. ప్రతి ఒక్కడూ మరొకడిని చంపటానికి వేచివున్నాడు. ప్రతి ఒక్కడూ తన సోదరుని కపటో పాయంతో పట్టటానికి యత్నిస్తున్నాడు.
MIC 7:3 ప్రజలు తమ రెండు చేతులతో చెడ్డపనులు చేయటానికి సమర్థులైవున్నారు. అధిపతులు లంచం అడుగుతారు. ఒక న్యాయాధిపతి న్యాయస్థానంలో తన తీర్పును తారుమారు చేయటానికి డబ్బు తీసుకుంటాడు. “ముఖ్యులగు పెద్దలు” మంచివైన, న్యాయమైన నిర్ణయాలు చేయరు. వారేది చేయదలచారో అదే చేస్తారు.
MIC 7:4 వారిలో అతి మంచివాడు సహితం ముండ్లపొదవలె ఉంటాడు. వారిలో మిక్కిలి మంచివాడు సహితం ముండ్లుపొదకంటే చాలా కంటకుడై ఉంటాడు. నీ ప్రవక్తలు ఈ రోజు వస్తుందని చెప్పారు. నీ కావలివాండ్ర దినం రానేవచ్చింది. ఇప్పుడు నీవు శిక్షింపబడతావు! ఇప్పుడు నీవు కలవరపడతావు!
MIC 7:5 నీ పొరుగువానిని నమ్మవద్దు! స్నేహితుని నమ్మువద్దు! నీ భార్యతో సహితం నీవు స్వేచ్చగా మాట్లాడవద్దు!
MIC 7:6 తన ఇంటివారే తనకు శత్రువులవుతారు. ఒక కుమారుడు తన తండ్రిని గౌరవించడు. ఒక కుమార్తె తన తల్లికి ఎదురు తిరుగుతుంది. ఒక కోడలు తన అత్తపై తిరుగుబడుతుంది.
MIC 7:7 కావున సహాయంకొరుకు నేను యెహోవా తట్టు చూస్తాను. నాకు సహాయం చేయటానికి నేను యెహోవా కొరకు నిరీక్షిస్తాను. నా దేవుడు నా మొర ఆలకిస్తాడు.
MIC 7:8 నేను పతనమయ్యాను. కానీ, ఓ శత్రువూ, నన్ను చూచి నవ్వకు! నేను తిరిగి లేస్తాను. నేనిప్పుడు అంధకారంలో కూర్చున్నాను. కానీ యెహోవాయే నాకు వెలుగు.
MIC 7:9 నేను యెహోవా పట్ల పాపం చేశాను. అందువల్ల ఆయన నేనంటే కోపంగా ఉన్నాడు. కానీ న్యాయ స్థానంలో ఆయన నా తరపున వాదిస్తాడు. నాకు మంచి జరిగే పనులు ఆయన చేస్తాడు. పిమ్మట ఆయన నన్ను వెలుగులోకి తీసుకువస్తాడు. ఆయన చేసింది న్యాయమైనదని నేను గ్రహిస్తాను.
MIC 7:10 నా శత్రువు ఇది చూసి సిగ్గుపడుతుంది. “నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు?” అని నా శత్రువు నన్నుడిగింది. ఆ సమయంలో ఆమెను చూసి నేను నవ్వుతాను. వీధిలో మట్టమీద నడిచి నట్లు జనులు ఆమెమీద నడుస్తారు.
MIC 7:11 నీ గోడలు తిరిగి కట్టబడే సమయం వస్తుంది. ఆ సమయంలో వారి దేశం విస్తరిస్తుంది.
MIC 7:12 నీ ప్రజలు నీ దేశానికి తిరిగివస్తారు. అష్షూరునుండి, ఈజిప్టు దేశపు నగరాలనుండి వారు వస్తారు. నీ దేశం ఈజిప్టు నది మొదలుకొని యూఫ్రటీసు నదివరకు, పడమట సముద్రంనుండి తూర్పున పర్వతాలవరకు వ్యాపించి ఉంటుంది.
MIC 7:13 దేశం పాడై పోయింది. దానిలో నివసించే జనులవల్ల, వారు చేసిన పనులవల్ల అది పాడై పోయింది.
MIC 7:14 కావున దండం చేపట్టి నీ ప్రజలను పాలించు. నీకు చెందిన ప్రజా సమూహాన్ని పాలించు. ఆ మంద (జనులు) అడవుల్లోనూ, కర్మెలు, పర్వతం మీదనూ ఒంటరిగానూ ఉంటుంది. గతంలో మాదిరి ఆ మంద బాషానులోనూ, గిలాదులోనూ నివసిస్తుంది.
MIC 7:15 నేను నిన్ను ఈజిప్టు నుండిబయటకు తీసుకొని వచ్చినప్పుడు ఎన్నో అద్భుతకార్యాలు జరిపించాను. ఆ రకంగా మీరింకా ఎన్నో అద్భుత కార్యాలు చూసేలా చేస్తాను.
MIC 7:16 అన్య జనులు ఆ అద్భుతకార్యాలు చూసి సిగ్గుపడతారు. వారి “శక్తి” నాదానితో పోల్చినప్పుడు వ్యర్థమైనదని వారు గ్రహిస్తారు. వారు విస్మయం చెంది, వారి నోళ్లపై చేతులు వేసుకుంటారు! వారు చెవులు మూసుకొని, వినటానికి నిరాకరిస్తారు.
MIC 7:17 వారు పాములా మట్టిలో పాకుతారు. వారు భయంతో వణుకుతారు. తమ బొరియల్లోనుంచి బయటకు వచ్చే కీటకాలవలె, వారు నేలమీద పాకుతారు. వారు భయపడి దేవుడైన యెహోవా వద్దకు వస్తారు. నీ ముందు వారు భయపడతారు!
MIC 7:18 నీవంటి దేవుడు మరొకడు లేడు. పాపం చేసిన దోషులను నీవు క్షమిస్తావు. నీ ప్రజలలో మిగిలిన వారి పాపాల వైపు నీవు చూడవు. దేవుడైన యెహోవా కోపం శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే ఆయన కనికరం చూపటానికి ఇష్టపడతాడు.
MIC 7:19 యెహోవా, మమ్మల్ని ఓదార్చు. మా పాపాలను పరిహరించు. మా పాపాలన్నిటినీ లోతైన సముద్రంలోకి విసిరివేయుము.
MIC 7:20 దేవా, నీవు యాకోబు యెడల నమ్మకస్తుడవుగా ఉంటావు. అబ్రాహాము యెడల దయకలిగి యుంటావు. ఎందుకంటే మా పూర్వీకులకు పురాతన కాలమందు నీవు వాగ్దానం చేశావు.
NAH 1:1 ఎల్కోషువాడైన నహూముకు కలిగిన దర్శనాన్ని వివరించే గ్రంథం. ఇది నీనెవె నగరాన్ని గూర్చిన దుఃఖకరమైన సమాచారం.
NAH 1:2 యెహోవా రోషంగల దేవుడు! యెహోవా నేరస్తులను శిక్షంపబోతున్నాడు. యెహోవా తన శత్రువులను శిక్షిస్తాడు. ఆయన తన శత్రువులపై తన కోపాన్ని నిలుపుతాడు.
NAH 1:3 యెహోవా ఓర్పు గలవాడు కాని ఆయన మిక్కిలి శక్తిమంతుడు. యెహోవా నేరం చేసిన జనులను శిక్షిస్తాడు. ఆయన వారిని ఊరికే వదిలి పెట్టడు. దుష్టజనులను శిక్షంచటానికి యెహోవా వస్తున్నాడు. ఆయన తన శక్తిని చూపటానికి సుడిగాలులను, తుఫానులను ఉపయోగిస్తాడు. మానవుడు నేల మీద మట్టిలో నడుస్తాడు. కాని యెహోవా మేఘాలపై నడుస్తాడు!
NAH 1:4 యెహోవా సముద్రంతో కోపంగా మాట్లాడితే, అది ఎండిపోతుంది. ఆయన నదులన్నీ ఇంకి పోయేలా చేస్తాడు! బాషానులోని, కర్మెలులోని సారవంతమైన భూములన్నీ ఎండి నశించి పోతాయి. లెబానోనులోని పుష్పాలన్నీ వాడి పోతాయి.
NAH 1:5 యెహోవా వస్తాడు. పర్వతాలన్నీ భయంతో కంపిస్తాయి. కొండలు కరిగిపోతాయి. యెహోవా వస్తాడు. భయంతో భూమి కంపిస్తుంది. ఈ ప్రపంచం, అందులో నివసించే ప్రతివాడూ భయంతో వణుకుతారు.
NAH 1:6 యెహోవా మహాకోపం ముందు ఎవ్వరూ నిలువలేరు. ఆయన భయంకర కోపాన్ని ఎవ్వరూ భరించలేరు. ఆయన కోపం అగ్నిలా దహించి వేస్తుంది. ఆయన రాకతో బండలు బద్దలై చెదిరి పోతాయి.
NAH 1:7 యెహోవా మంచివాడు, ఆపద సమయంలో తలదాచుకోటానికి ఆయన సురక్షిత స్థలం. ఆయనను నమ్మిన వారి పట్ల ఆయన శ్రద్ధ తీసుకుంటాడు.
NAH 1:8 ఆయన తన శత్రువులను సర్వనాశనం చేస్తాడు. ఆయన వరదలా వారిని తుడిచి పెడతాడు. ఆయన తన శత్రువులను అంధకారంలోకి తరిమి వేస్తాడు.
NAH 1:9 యూదా, యెహోవాపై కుట్రలు ఎందుకు పన్నుతున్నావు? కాని ఆయన వారి పన్నాగాలన్నిటినీ వమ్ము చేస్తాడు. కష్టం రెండువ సారి రాదు.
NAH 1:10 చిక్కు పడిన ముండ్ల పొదలా నీ శత్రువు నాశనం చేయబడతాడు. ఎండిన కలుపు మొక్కల్లా వారు వేగంగా కాలిపోతారు.
NAH 1:11 అష్షూరూ, నీలో నుండి ఒక మనిషి వచ్చాడు. అతడు యెహోవాకు వ్యతిరంగా దుష్ట పథకాలు వేశాడు. అతడు చెడు సలహా ఇచ్చాడు.
NAH 1:12 యెహోవా ఈ విషయాలు యూదాకు చెప్పాడు: “అష్షూరు ప్రజలు పూర్తి బలం కలిగి ఉన్నారు. వారికి చాలామంది సైనికులున్నారు. కాని వారంతా నరికి వేయబడతారు. వారంతా అంతం చేయబడతారు. నా ప్రజలారా, మీరు బాధ పడేలా చేశాను. కాని ఇక మిమ్మల్ని బాధపడనీయను.
NAH 1:13 అష్షూరు అధికారాన్నుండి ఇప్పుడు మిమ్మల్ని విడిపిస్తాను. మీ మెడ మీద నుండి ఆ కాడిని తీసివేస్తాను. మిమ్మల్నిబంధించిన గొలుసులను తెంచి వేస్తాను.”
NAH 1:14 అష్షూరు రాజా, నీ విషయంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. “నీ పేరు పెట్టుకోటానికి నీ సంతతివారు ఉండరు. నీ దేవుళ్ల ఆలయాలలో నెలకొల్పిన, చెక్కిన విగ్రహాలను, లోహపు బొమ్మలను నేను నీ కొరకు నీ సమాధిని నేను తయారు చేస్తున్నాను. నీవు ముఖ్యుడవు కావు!”
NAH 1:15 యూదా, చూడు! పర్వతాల మీద నుండి వస్తున్నది, అక్కడ చూడు. శుభవార్త తీసుకొని ఒక దూత ఇక్కడికి వస్తున్నాడు! శాంతి ఉన్నదని అతడు చెపున్నాడు! యూదా, నీ ప్రత్యేక పండుగలను జరుపుకో! యూదా, నీవు మాట ఇచ్చిన వాటిని నెరవేర్చు. దుష్ట జనులు మళ్లీ నీ మీద దాడి చేసి నిన్ను ఓడించలేరు! ఆ దుష్ట జనులందరూ నాశనం చేయబడ్డారు.
NAH 2:1 నీనెవె, నీతో యుద్ధం చేయటానికి వినాశకారుడు వస్తున్నాడు. కావున నీ నగరపు బలమైన ప్రదేశాలను కాపాడుకో, మార్గంపై నిఘా పెట్టు. యుద్ధానికి సిద్ధం కమ్ము. పోరాటానికి సన్నాహాలు చెయ్యి!
NAH 2:2 ఎందుకంటే ఇశ్రాయేలు ప్రభావం వలె యాకోబుకు తన ప్రభావాన్ని యెహోవా తిరిగి ఇస్తున్నాడు. అష్షూరీయులు ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేశారు. వారి ద్రాక్షాలతలను నాశనం చేశారు.
NAH 2:3 ఆ సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి. వారి దుస్తులు మిరుమిట్లు గొలిపేటంత ఎర్రగా ఉన్నాయి. వారి రథాలు యుద్ధానికి బారులు తీర్చబడి, అగ్ని శిఖల్లా మెరుస్తున్నాయి. వారి గుర్రాలు స్వారీకి సిద్ధంగా ఉన్నాయి!
NAH 2:4 రథాలు వీధులలో దూసుకు పోతున్నాయి. బహిరంగ ప్రదేశాలలో అవి ముందుకు, వెనుకకు పోతున్నాయి. అవి మండే దివిటీల్లా, ఒక చోట నుండి మరొక చోటికి ప్రసరించే మెరుపుల్లా కనిపించాయి!
NAH 2:5 అష్షూరు రాజు తన మంచి సైనికులందరినీ పిలుస్తాడు. కాని వారు తొట్రిల్లి దారిలో పడిపోతారు. గోడను రక్షించటానికి వారు దాని వద్దకు పరుగెడతారు. రక్షక కవచాన్ని వారు కిందికి దించుతారు.
NAH 2:6 కాని నది వైపు ద్వారాలు తెరచి ఉన్నాయి. శత్రువు లోనికి వచ్చి, రాజ గృహాన్ని నాశనం చేస్తాడు.
NAH 2:7 శత్రువు రాణిని ఎత్తుకు పోతాడు. ఆమె దాసీలు పావురాల్లా విచారంగా మూల్గుతారు. వారు విచారాన్ని వ్యక్త పరుస్తూ తమ రొమ్ములు బాదుకుంటారు.
NAH 2:8 నీరు బయటకు కారిపోతే ఒక మడుగులా నీనెవె నగరం ఉంది. ప్రజలు, “ఆగండి! పారిపోవటం మానండి!” అని అరుస్తారు. కాని ఎవ్వడూ ఆగడు. వారు చెప్పేదాన్ని ఎవ్వరూ. లక్ష్యపెట్టరు!
NAH 2:9 నీనెవెను నాశనం చేస్తున్న సైనికులారా, వెండిని తీసుకోండి! బంగారాన్ని దోచుకోండి! తీసుకోటానికి అనేక వస్తువులున్నాయి. ఎన్నో ధనాగా రాలున్నాయి!
NAH 2:10 ఇప్పుడు నీనెవె ఖాళీ అయ్యింది. ప్రతీదీ దోచుకోబడింది. నగరం నాశనం చేయబడింది! ప్రజలు వారి ధైర్యాన్ని కోల్పోయారు. వారి హృదయాలు భయంతో వికలమవుతున్నాయి. వారి మోకాళ్ళు ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి. వారి శరీరాలు వణుకుతున్నాయి వారి ముఖాలు భయంతో వెలవెల పోతున్నాయి.
NAH 2:11 సింహపు గుహ (నీనెవె) ఇప్పుడు ఎక్కడుంది? ఆడ, మగ సింహాలు అక్కడ నివసించాయి. వాటి పిల్లలు భయపడలేదు.
NAH 2:12 ఆ సింహం (నీనెవె రాజు) తన పిల్లలను సంతృప్తి పర్చటానికి అనేక మంది మనుష్యులను చంపింది. అతడు తన గుహను (నీనెవె) మానవకళేబరాలతో నింపివేశాడు. అతడు తాను చంపిన స్త్రీలతో తన గుహను నింపాడు.
NAH 2:13 సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “నీనెవే, నేను నీకు వ్యతిరేకిని! నీ రథాలను నేను తగులబెడతాను. యుద్ధంలో నీ ‘యువ సింహాలను’ నేను చంపుతాను. భూమి మీద మరెన్నడూ నీవు ఎవరినీ వెంటాడవు. నీ దూతలు చెప్పే వాటిని ప్రజలు మరెన్నడూ వినరు.”
NAH 3:1 ఆ హంతకుల నగరానికి చాలా కీడు మూడుతుంది. నీనెవె నగరం అబద్ధాల పుట్ట. ఇతర దేశాలనుండి దోచుకున్న వస్తువులతో అది నిండివుంది. అది వెంటాడి చంపిన అనేకమందితో అది నిండివుంది!
NAH 3:2 కొరడా ఝళిపింపుల ధ్వని, చక్రాల సవ్వడి, స్వారీ గుర్రాల గిట్టల ధ్వనులు, ఎగిరిపడే రథాల చప్పుడు నీవు వినవచ్చు!
NAH 3:3 అశ్వదళం వారు దాడి చేస్తున్నారు. వారి కత్తులు మెరుస్తున్నాయి. వారి ఈటెలు తళుక్కుమంటున్నాయి! అక్కడ ఎంతోమంది చనిపోయారు. శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. శవాలు లెక్కకుమించివున్నాయి. శవాలకు అడ్డంపడి ప్రజలు తొట్రిల్లుతున్నారు.
NAH 3:4 నీనెవె మూలంగా ఇవన్నీ జరిగాయి. తృప్తి చందని వేశ్యలా నీనెవె ఉంది. ఆమె మరింత మందిని కోరుకుంది. తనను తాను అనేక జనులకు అమ్ముకుంది. వారిని తన బానిసలుగా చేసుకోటానికి ఆమె తన మంత్ర విద్యలను ఉపయోగించింది.
NAH 3:5 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నీనెవె, నీకు నేను విరోధిని. నీ బట్టలను నీ ముఖం మీదకి లాగుతాను. నీ నగ్నత్వాన్ని రాజ్యాలన్నిటికీ చూపిస్తాను. ఆ రాజ్యాలన్నీ నీవు సిగ్గుపడటం చూస్తాయి.
NAH 3:6 నీ మీదకు మురికి వస్తువులు విసురుతాను. నిన్ను ఏహ్యభావంతో చూస్తాను. ప్రజలు నీవంక చూసి నవ్వుతారు.
NAH 3:7 నిన్ను చూసిన ప్రతి ఒక్కడూ పారిపోతాడు. ‘నీనెవె నాశనమయ్యింది. ఆమెను గురించి ఏడ్చేవారెవరు?’ అనివారు అంటారు. నీనెవె నిన్ను ఓదార్చే వారెవ్వరినీ నేను చూడలేనని నాకు తెలుసు.”
NAH 3:8 నీనెవె, నైలు నది మీద వున్న తేబేస్ (నో-అమోను) నగరం కంటే నీవు మెరుగైన దానవా? కాదు! తేబేస్ చుట్టూ కూడ నీరువుంది. తేబేస్ ఆ నీటిని శత్రువుల నుండి తనను తాను కాపాడుకోటానికి వినియోగించుకొనేది. ఆమె ఆ నీటిని ఒక గోడలా కూడా వినియోగించుకొనేది!
NAH 3:9 కూషీయులును, ఈజిప్టు వారును తేబేస్‌కు మంచి బలాన్నిచ్చారు. పూతు వారు, లూబీయులు ఆమెకు మద్దతు ఇచ్చారు.
NAH 3:10 అయినా తేబేస్ ఓడింపబడింది. ఆమె ప్రజలు పర దేశానికి బందీలుగా పట్టుకుపోబడ్డారు. ప్రతీ వీధిమూలా సైనికులు ఆమె పిల్లలను చావగొట్టారు. ముఖ్యలైన ప్రజలను ఎవరు బానిసలుగా ఉంచుకోవాలి అనే విషయంలో వారు చీట్లు వేశారు. తేబేస్‌లో ప్రముఖులైన వారందరికీ వారు సంకెళ్లు వేశారు.
NAH 3:11 కావున నీనెవే, నీవు కూడా తాగినవానిలా పడిపోతావు! నీవు దాగటానికి ప్రయత్నిస్తావు. శత్రువుకు దూరంగా ఒక సురక్షిత ప్రదేశం కొరకు నీవు చూస్తావు.
NAH 3:12 కాని నీనెవే, నీ దుర్గాలన్నీ అంజూరపు చెట్లలా ఉంటాయి. కొత్త అంజూరపు కాయలు పండుతాయి. ఒకడు వచ్చి చెట్టును కుదుపుతాడు. అంజూరపు పండ్లు వాని నోట పడతాయి. అతడు వాటిని తింటాడు. అవి అయిపోతాయి!
NAH 3:13 నీనెవే, నీ ప్రజలంతా స్త్రీలవలె ఉన్నారు. శత్రుసైనికులు వారిని పట్టుకు పోవటానికి సిద్ధంగా ఉన్నారు. నీ శత్రువులు లోనికి రావటానికి అనువుగా నీ దేశపు ద్వారాలు పూర్తిగా తెరవబడి ఉన్నాయి. ద్వారాలకు అడ్డంగా వున్న కర్రపట్టీలను అగ్ని కాల్చివేసింది.
NAH 3:14 నీరు తెచ్చి దానిని నీ నగరంలోపల నిలువ చెయ్యి. ఎందుకంటే, శత్రుసైనికులు నీ నగరాన్ని చుట్టు ముట్టుతారు. వారు ఎవ్వరినీ నగరంలోకి ఆహారాన్ని, నీటిని తీసుకు రానివ్వరు. నీ కోటలను పటిష్ట పర్చుకో! ఇటుకలు విస్తారంగా చేయటానికి బంక మట్టిని తీసుకొనిరా! సున్నము గచ్చు కలుపు! ఇటుకలు చేయటానికి అచ్చులు తీసుకొనిరా!
NAH 3:15 నీవు ఆ పనులన్నీ చేయవచ్చు. కాని, అగ్ని నిన్ను పూర్తిగా నాశనం చేసి వేస్తుంది! మరియు కత్తి నిన్ను హతమార్చుతుంది. మిడుతల దండు వచ్చి సమస్తాన్ని తినివేసినట్లు నీ దేశం కన్పిస్తుంది. నీనెవే, నీవు మిక్కిలిగా పెరిగావు. నీవు మిడుతల దండులా వున్నావు.
NAH 3:16 వివిధ ప్రాంతాలకు వెళ్లి సరుకులు కొని వ్యాపారం చేసే వర్తకులు నీకు అనేక మంది ఉన్నారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో వారు అంతమంది ఉన్నారు! దండులా వచ్చి సర్వాన్ని తినివేసే మిడుతల్లా వారున్నారు.
NAH 3:17 మరియు నీ ప్రభు త్వాధికారులు కూడ మిడుతల్లా వున్నారు. చలిగా ఉన్న రోజున రాతిగోడపై కుదురుకున్న మిడుతల్లా వారున్నారు. కాని సూర్యుడు పైకి వచ్చినప్పుడు రాళ్లువేడెక్కగా మిడుతలు ఎగిరిపోతాయి. పైగా అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలియదు! నీ అధికారులు కూడా అలానేవుంటారు.
NAH 3:18 అష్షూరు రాజా, నీ గొర్రెల కాపరులు (నాయకులు) నిద్రకుపడ్డారు. శక్తివంతులగు ఆ మనుష్యులు నిద్రిస్తున్నారు. ఇప్పుడు నీ గొర్రెలు (ప్రజలు) పర్వతాలపై చెదిరిపోయాయి. వాటిని మరల్చుకొని వచ్చేవాడు ఎవ్వడూ లేడు.
NAH 3:19 నీనెవే, నీవు తీవ్రంగా దెబ్బతిన్నావు. నీ గాయాన్ని ఏదీ మాన్పలేదు. నీ వినాశాన్ని గురించి విన్నప్రతివాడూ చప్పట్లు చరుస్తాడు. వారంతా సంతోషంగా ఉంటారు! ఎందుకంటే, నీవు ఎల్లప్పుడూ కలుగజేసిన బాధను వారంతా అనుభవించారు!
HAB 1:1 ప్రవక్తయైన హబక్కూకునకు ఇవ్వబడిన వర్తమానం ఇది.
HAB 1:2 యెహోవా, నేను సహాయం కొరకు అర్తిస్తూనే వున్నాను. నీవు నా మొర ఎన్నడు ఆలకిస్తావు? దౌర్జన్యం విషయంలో నేను నీకు మొరపెట్టాను. కాని నీవేమి చేయలేదు!
HAB 1:3 ప్రజలు వస్తువులను దొంగలిస్తున్నారు. ఇతరులను బాధపెట్టుతున్నారు. ప్రజలు వాదులాడుతూ, కలస్తున్నారు. నీవెందుకు నన్నీ భయంకర విషయాలు చూసేలా చేస్తున్నావు?
HAB 1:4 న్యాయవ్యవస్థ బలహీనపడింది. ప్రజలకు న్యాయం జరుగుట లేదు. మంచి వారిపై దుష్టులు తమ తగాదాలలో గెలుస్తున్నారు. అందువల్ల న్యాయం ఎంతమాత్రం పక్షపాత రహితంగా లేదు.
HAB 1:5 యెహోవా సమాధానమిచ్చాడు: “ఇతర జనులవైపు చూడు! వారిని గమనించు. నీకు విస్మయం కలుగుతుంది. నీ జీవిత కాలంలో నీకు విస్మయం కలిగించే ఒక పని చేస్తాను. నీవు అది నమ్మాలంటే చూసి తీరాలి. దాని విషయం నీకు చెపితే అది నీవు నమ్మవు.
HAB 1:6 బబులోను ప్రజలను నేను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దుతాను. ఆ ప్రజలు నీచులు; శక్తిగల యుద్ధవీరులు. వారు భూమికి అడ్డంగా నడుస్తారు. వారికి చందని ఇండ్లను, నగరాలను వారు వశపర్చుకుంటారు.
HAB 1:7 బబులోనువారు ఇతర ప్రజలను భయపెడతారు. బబులోనువారు వారు చేయదల్చుకున్నది చేస్తారు; వెళ్ళదల్చుకున్న చోటుకి వెళతారు.
HAB 1:8 వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగం కలవి. సూర్యుడు అస్తమించాక అవి తోడేళ్ళ కంటె నీచంగా ఉంటాయి. వారి గుర్రపు దళంవారు దూర ప్రాంతలనుండి వస్తారు. ఆకలిగొన్న గరుడ పక్షి ఆకాశం నుండి కిందికి దూసుకు వచ్చినట్లు, వారు తమ శత్రువులను వేగంగా ఎదుర్కొంటారు.
HAB 1:9 వారంతా చేయకోరుకునే ఒకే ఒక్క విషయం యుద్ధం. వారి సైన్యాలు ఎడారిలో గాలిలా వేగంగా నడుస్తాయి. మరియు బబులోను సైనికులు అనేకానేక మందిని చెరబడతారు. ఇసుక రెణువుల్లా లెక్కలేనంత మందిని పట్టుకుంటారు.
HAB 1:10 “బబులోను సైనికులు ఇతర దేశాల రాజులను చూసి నవ్వుతారు. పరదేశ పాలకులు వారికి హాస్యగాండ్రవలె ఉంటారు. పొడవైన, బలమైన గోడలు గల నగరాలను చూచి బబులోను సైనికులు నవ్వుతారు. ఆ సైనికులు గోడ మీదికంటె మట్టి బాట సునాయాసంగా నిర్మించి, నగరాలను తేలికగా జయిస్తారు.
HAB 1:11 పిమ్మట వారు గాలిలా వెళ్లి మరో ప్రాంతంలో యుద్ధం చేస్తారు. బబులోనువారు ఆరాధించే ఒకే ఒక్క వస్తువు వారి స్వయంశక్తి.”
HAB 1:12 పిమ్మట హబక్కూకు చెప్పాడు: “యెహోవా, నీవు ఎల్లకాలములయందు ఉండే దేవుడవు! నీవు చావులేని పవిత్ర దేవుడవు! యెహోవా, జరుగవలసిన కార్యం జరిపించటా నికే నీవు బబులోను ప్రజలను సృష్టించావు. మా ఆశ్రయ దుర్గమా, యూదా ప్రజలను శిక్షించటానికి నీవు వారిని సృష్టించావు.
HAB 1:13 నీ కండ్లు దుష్టత్వాన్ని చూడలేవు. ప్రజలు తప్పు చేయటాన్ని నీవు చూడలేవు. మరి అటువంటి నీవు ఆ దుష్టులు జయించటం ఎలా చూడగలు గుతున్నావు? దుష్టులు మంచివారిని ఓడించటం నీవెలా చూడగలుగుతున్నావు?
HAB 1:14 “నీవు ప్రజలను సముద్రంలో చేపల్లా తయూరు చేశావు. నాయకుడులేని చిన్న సముద్ర జంతువుల్లా వారున్నారు.
HAB 1:15 వారందరినీ గాలాలు, వలలు వేసి శత్రువు పట్టు కుంటాడు. శత్రువు వారిని తన వలలో పట్టి లాగుతాడు, తను పట్టుకున్న దానిని చూసి శత్రువు చాలా సంతోషిస్తాడు.
HAB 1:16 శత్రవు తను భాగ్యవంతుడుగా నివసించటానికి, మంచి ఆహారం తినటానికి అతని వల అతనికి సహాయపడుతుంది. కావున శత్రవు తన వలనే ఆరాధిస్తాడు. తన వల యొక్క గౌరవార్థం అతడు దానికి బలులు అర్పించి, ధూపంవేస్తాడు.
HAB 1:17 తన వలతో ధనాన్ని తీసుకుపోవటం అతడు కొనసాగిస్తాడా? దయా దాక్షిణ్యం లేకుండా అతడు (బబులోను సైన్యం) ప్రజలను నాశనం చయటం కొనసాగిస్తాడా?”
HAB 2:1 నేనొక కాపలాదారునిగా నిలబడి గమనిస్తాను. యెహోవా నాకు ఏమి చెపుతాడో వినటానికి నేను వేచి ఉంటాను. ఆయన నా ప్రశ్నలకు ఎలా సనాధానమిస్తాడో నేను వేచివుండి తెలుసుకుంటాను.
HAB 2:2 యెహోవా నాకు సమాధానమిచ్చాడు: “నేను నీకు చూపించేవాటిని వ్రాయి. ప్రజలు సులభంగా చదవగలిగే రీతిలో దానిని ఒక పలకమీద స్పష్టంగా వ్రాయి.
HAB 2:3 ఈ వర్తమానం భవిష్యత్తులో ఒక ప్రత్యేక సమయం గురించినది. ఈ వర్తమానం పరిసమాప్తిని గురించినది. అది నిజమవుతుంది! ఆ సమయం ఎన్నడూ రానట్టుగా కన్పించవచ్చు. కాని ఓపికతో దానికొరకు వేచివుండు. ఆ సమయం వస్తుంది. అది ఆలస్యం కాదు.
HAB 2:4 దీనిని విన నిరాకరించే వారికి ఈ వర్తమానం సహాయపడదు. కాని మంచివాడు ఈ వర్తమానాన్ని నమ్ముతాడు. తన విశ్వాసం కారణంగా, ఆ మంచి వ్యక్తి దీనిని నమ్ముతాడు.”
HAB 2:5 దేవుడు చెప్పాడు: “ద్రాక్షమద్యం మనిషిని మోసం చేయగలదు. అదే మాదిరి ఒక బలవంతుని గర్వం అతనిని అవివేకునిగా చేస్తుంది. అతనికి శాంతి ఉండదు. అతడు మృత్యువువలె ఉంటాడు. అతడు ఇంకా, ఇంకా కోరుతూనే ఉంటాడు. మృత్యువువలె అతనికి తృప్తి అంటూ ఉండదు.అతడు ఇతర దేశాలను ఓడించటం కొనసాగిస్తూనే ఉంటాడు. ఆ ప్రజలను చెరపట్టటం కొనసాగిస్తూ ఉంటాడు.
HAB 2:6 కాని అతి త్వరలోనే ఆ ప్రజలంతా అతనిని చూచి నవ్వుతారు. వారు నవ్వి, ‘అది మిక్కిలి హెయమైనది! ఆ వ్వక్తి అనేక వస్తువులు దొంగిలించాడు. తనవి కానివాటిని తన వశం చేసుకున్నాడు. అతడు ధనాన్ని విస్తారంగా తీసు కున్నాడు. ఆ వ్యక్తికి అది అతి శ్రమకారకమైన పని’ అని అంటారు.
HAB 2:7 “నీవు (బలవంతుడు) ప్రజలవద్ద ఉబ్బు తీసు కున్నావు. ఒక రోజు ఆ ప్రజలు మేల్కొని జరుగుతారు. అప్పుడు వారే నీనుండి వస్తువులు తీసుకొంటారు. నీవు చాలా భయపడతావు.
HAB 2:8 నీవు అనేక దేశాలనుండి వస్తువులు దొంగిలించావు. కావున ఆ ప్రజలు నీ నుండి చాలా తీసుకుంటారు. నీవు అనేక మందిని చంపివేశావు.నీవు దేశాలను, నగరాలను నాశనం చేసావు. నీవక్కడ ప్రజలందరినీ చంపివేశావు.
HAB 2:9 “అవును, అన్యాయం చేసి ధనవంతుడైన వానికి మిక్కిలి శ్రమ. సురక్షిత ప్రదేశంలో నివసించటానికి అతడు ఆ పనులు చేశాడు. ఇతరులు తనను దోచుకోవచాన్ని తను ఆవగలనని అతడు అనుకొంటున్నాడు. కాని అతనికి కీడు వాటిల్లుతుంది.
HAB 2:10 నీవు (బలవంతుడు) అనేక మందిని నాశనం చేయటానికి వ్యూహాలు పన్నావు. ఇది నీ స్వంతప్రజలనే అవమానానికి గురిచేసింది. నీవు ప్రాణాన్ని కోల్పోతావు.
HAB 2:11 గోడరాళ్ళు నీకు వ్యతిరేకంగా అరుస్తాయి. నీ స్వంత ఇంటి వాసాలు సహితం నీవు తప్పు చేశావని ఒప్పుకుంటాయి.
HAB 2:12 “అన్యాయం చేసి, నరహత్య చేసి నగరం నిర్మించిన నాయకునకు మిక్కిలి కీడు.
HAB 2:13 అటువంటి జనులు నిర్మంప తలపెట్టిన వాటన్నిటినీ అగ్నిచే కాల్చివేయటానికి సర్వ శక్తిమంతుడైన యెహోవా నిర్ణయించాడు. వారు చేసిన పనంతా వృధా.
HAB 2:14 అప్పుడు ప్రతిచోట ప్రజలు యెహోవా యొక్క మహిమను గూర్చి తెలుసుకుంటారు. సముద్రంలోకి నీరు వ్యాపించునట్లు ఈ వార్త వ్యాపిస్తుంది.
HAB 2:15 తను కోపం చెంది, ఇతరులను బాధించే వ్యక్తికి మిక్కిలి శ్రమ. ఆ వ్యక్తి కోపంలో ఇతరులను నేలకు పడగొడతాడు. అతడు వారిని వస్త్రవిహినులుగాను, తాగినవారిగాను చూస్తాడు.
HAB 2:16 “కాని అతడు యెహోవా కోపాన్ని రుచిచూచితాగిన వానిలా నేలమీద పడతాడు. “దుష్టపాలకుడా, నీవు ఆ గిన్నెనుండి తాగుతావు. నీవు పొందేది అవమానం; గౌరవం కాదు.
HAB 2:17 నీవు లెబానోనులో ఎంతో మందిని బాధించావు. అక్కడ నీవు ఎన్నో పశువులను దొంగిలించావు. కావున, చనిపోయిన ప్రజల కారణంగాను, నీవా దేశానికి చేసిన చెడుపనుల వల్లను నీవు భయపడతావు. నీవా నగరాలకు, వాటిలో నివసించే ప్రజలకు చేసిన పనుల బట్టి నీవు భయపడతావు”
HAB 2:18 అతని బూటకవు దేవుడు అతనికి సహాయం చేయడు. ఎందుకనగా అది ఒకానొకడు లోహవు తొడుగు వేసి చేసిన బొమ్మ. అది కేవలం విగ్రహం. కావున దానిని చేసినవాడు అది సహాయం చేస్తుందని ఆశించలేడు. ఆ విగ్రహం కనీసం మాట్టాడలేదు.
HAB 2:19 ఒక కొయ్య విగ్రహముతో “నిలబడు” అని చెప్పే వానికి మిక్కిలి వేదన! మాట్టాడలేని ఒక రాతితో, “మేలుకో” అని చెప్పేవానికి బాధ తప్పదు. ఆ వస్తువులు అతనికి సహాయపడలేవు. ఒక విగ్రహం బంగారంతో గాని, వెండితో గాని తొడుగు వేయబడవచ్చు. కాని ఆ విగ్రహంలో ప్రాణం లేదు.
HAB 2:20 కాని యెహోవా విషయం వేరు! యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. కావున ఈ భూమి అంతా నిశ్శబ్దంగా వుండి, యెహోవా ముందు గౌరవ భావంతో మెలగాలి.
HAB 3:1 ప్రవక్తయైన హబక్కూకు చేసిన షిగ్గయోను పార్థన.
HAB 3:2 యెహోవా, నిన్ను గూర్చిన వార్త విన్నాను. యెహోవా, పూర్వం నీవు చేసిన శక్తివంతమైన పనుల విషయంలో నేను విస్మయం చెందాను. అట్టి గొప్ప పనులు మా కాలంలో జరిపించమని నేను నిన్ను వేడుకుంటున్నాను. ఆ పనులు మాకాలంలోనే జరిపించమని నేను ప్రార్థిస్తున్నాను. కాని నీ ఆవేశంలో (ఉద్రేకం) మా పట్ల కరుణ చూపటం గుర్తుపెట్టుకొనుము.
HAB 3:3 దేవుడు తేమానులో నుండి వస్తున్నాడు. పరిశుద్ధుడు పారాను పర్వతం మీది నుండి వస్తున్నాడు. యెహోవా మహిమ ఆకాశాన్ని కప్పి వేసింది! ఆయన ప్రభావంతో భూమి నిండి పోయింది!
HAB 3:4 అది ప్రకాశమానమై మెరుస్తున్న వెలుగు. ఆయన చేతినుర డి కాంతి కిరణాలు ప్రసరిస్తున్నియి. అట్టి మహత్తర శక్తి ఆయన చేతిలో దాగివుంది.
HAB 3:5 వ్యాధి ఆయనకు ముందుగా వెళ్లింది. అయన వెనుక వినాశనకారి అనుసరించి వెళ్లింది.
HAB 3:6 యెహోవా నిలుచుండి భూమికి తీర్పు తీర్చాడు. ఆయన అన్ని దేశాల ప్రజలవైవు చూశాడు. వారు భయంతో వణికి పోయారు. అనీదిగా పర్వతాలు బలంగా నిలిచి ఉన్నాయి. కాని ఆ పర్వతాలు బద్దలై పోయాయి. పాత పాత కొండలు పడిపోయాయి. దేవుడు ఎల్లప్పుడూ అలానే ఉంటాడు!
HAB 3:7 కుషాను (కూషియుల) నగరాలలో ఆపద సంభవించటం నేను చూశాను. మిద్యాను దేశీయుల ఇండ్లు భయంతో కంపించాయి.
HAB 3:8 యెహోవా, నీవు నదుల పట్ల కోపంగా ఉన్నీవా? వాగుల పట్ల నీవు కోపంగా ఉన్నావా? నీవు నీ గుర్రాలను, రథాలను విజయానికి నడిపించి నప్పుడు నీవు కోపంగా ఉన్నావా?
HAB 3:9 అప్పుడు కూడ నీ రంగుల కాంతి వుంజాన్ని (ఇంద్ర ధనుస్సు) నీవు చేసుకున్న ఒడంబడికకు అది నిదర్శనం ఎండు భూమి నదులను విభజించింది.
HAB 3:10 పర్వతాలు నిన్ను చూచి వణికాయి. నీరు నేల విడిచి పట్టు దప్పినందున అది పెద్దగా ధ్వని చేసింది.
HAB 3:11 సూర్యుడు, చంద్రుడు వాటి కాంతిని కోల్పోయాయి. నీ దేదీప్యమానమైన మెరువు కాంతులు చూడగానే అవి వ్రకాశించటం మానివేశాయి. ఆ మెరుపులు గాలిలో దూసుకు పోయే ఈటెలు, బాణాలవలె ఉన్నాయి.
HAB 3:12 నీవు కోపంతో భూమిపై నడిచి దేశాలను శిక్షించావు.
HAB 3:13 నీ ప్రజలను రక్షించటానికి నీవు వచ్చావు. అభిషేకం చేయబడిన నీ వ్యక్తిని రక్షించటానికి నీవు వచ్చావు. ప్రతి చెడ్డ కుటుంబంలోనూ మొదట పుట్టిన వానిని నీవు చంపివేశావు. ఆ కుటుంబం దేశంలో అతి తక్కువదా? లేక అతి గొప్పదా? అనే విచక్షణ నీవు చూపలేదు.
HAB 3:14 శత్రు సైనికులను ఆపటానికి నీవు మోషే చేతి కర్రను ఉపయోగించావు. ఆ సైనికులు మామీద యుద్ధానికి పెనుతుఫానులా వచ్చారు. రహస్యంగా ఒక పేదవాణ్ణి దోచుకున్నట్టు, వారు మమ్మల్ని తేలికగా ఓడించవచ్చనుకున్నారు.
HAB 3:15 కాని నీవు నీ గుర్రాలతో సముద్రం గుండా నడిచావు. ఆ మహ జలరాశిని దూరంగా దొర్లిపోయేలా చేశావు.
HAB 3:16 నేనీ విషయాలు విన్నప్పుడు, నా శరీరం వణికింది. పెద్ద శబ్దాలు నేను విన్నప్పుడు నా పెదవులు అదిరాయి. నా ఎముకలు బలహినమయ్యాయి. నా కాళ్లు వణికాయి. కావున ఆ వినాశన దినం వచేవరకు ఓపికగా వేచి ఉంటాను. మామీదదాడి చేసేవారికి ఆ విపత్కర దినం వస్తోంది.
HAB 3:17 అంజూరపు చెట్టు కాయలు కాయకుండా ఉండవచ్చు. ద్రాక్షలతలపై కాయలు ఉండక పోవచ్చు. చట్చకు ఆలిపు పండ్లు కాయక పోవచ్చు. పోలాల్లో ఆహర ధాన్యాలు పండక పోవచ్చు. దొడ్లలో గొర్రెలు ఉండక పోవచ్చు. కొట్టాలలో పాడి పశువులు లేకపోవచ్చు.
HAB 3:18 అయినా, నేను యెహోవాయందు ఆనందిస్తాను. నా రక్షకుడైన దేవునియందు నేను ఉల్లసిస్తాను.
HAB 3:19 నా ప్రభువైన యెహోవా నాకు బలాన్ని ఇస్తాడు. లేడిలా పరుగెత్తగలిగేలా ఆయన నాకు సహాయపడతాడు. పర్వతాలపై ఆయన నన్ను సురక్షితంగా నడిపిస్తాడు. సంగీత దర్శకునికి. ఇది నా తంతి వాద్యాలతో పాడదగినది.
ZEP 1:1 ఇది జెఫన్యాకు యెహోవా ఇచ్చిన సందేశం. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజుగా ఉన్న కాలంలో జెఫన్కా ఈ సందేశం అందు కొన్నాడు. జెఫన్యా కూషు కుమారుడు. కూషు గెదల్యా కుమారుడు. గెదల్యా అమర్యా కుమారుడు. అమర్యా హిజ్కియా కుమారుడు.
ZEP 1:2 “భూమి మీదనున్న సమస్తాన్ని ెనేను నాశనం చేస్తాను!
ZEP 1:3 మనుష్యులందరినీ, జంతుపులన్నింటినీ నేను నాశనం చేస్తాను. ఆకాశంలో పక్షుల్ని, సముద్రంలో చేపల్ని నేను నాశనం చేస్తాను. దుర్మార్గులను, వారిచేత పాపం చేయించే వాటన్నింటినీ నేను నాశనం చేస్తాను. భూమి మీద నుండి మనుష్యులందరినీ నేను తొలగించి వేస్తాను” అని యెహోవా చెపుతున్నాడు.
ZEP 1:4 ఈ సంగతులను యెహోవా చెప్పాడు: “యూదాను మరియు యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను నేను శిక్షిస్తాను. ఆ స్థలం నుండి నేను వీటిని తీసివేస్తాను: బయలు దేవత పూజ చివరి గుర్తులను నేను తొలగించి వేస్తాను. నేను పూజారులను తొలగించి వేస్తాను.
ZEP 1:5 నక్షత్రాలను పూజించుటకు వారి యింటి కప్పుల మీదికి వెళ్ళే వారందరినీ నేను తొలగించి వేస్తాను. ఆ బూటకవు యాజకులను ప్రజలు మరచి పోతారు. కొంతమంది నన్ను పూజిస్తున్నామని అంటారు.ఆ ప్రజలు నన్ను ఆరాధిస్తామని వాగ్దానం చేసారు. కాని ఇప్పుడు వారు బూటకపు దేవత మిల్కోమును పూజిస్తున్నారు. కనుక ఆ ప్రజలను ఆ స్థలం నుండి నేను తొలగించి వేస్తాను.
ZEP 1:6 కొందరు మనుష్యులు యెహోవా నుండి తిరిగిపోయారు. వారు నన్ను వెంబడించుట విడిచిపెట్టారు. ఆ ప్రజలు సహాయంకోసం యెహోవాను అడగటం మాని వేసారు. కనుక నేను ఆ ప్రజలను ఆ స్థలంనుండి తొలగించివేస్త్తాను.”
ZEP 1:7 నా ప్రభువైన యెహోవా ముందు నిశ్శబ్దంగా ఉండు! ఎందుచేతనంటే ప్రజలకు యెహోవా తీర్పు చెప్పే దినం త్వరలో వస్తుంది గనుక! యెహోవా తన బలిని సిద్ధం చేశాడు. తాను ఆహ్వానించిన అతిధులతో సిద్ధంగా ఉండుమని చెప్పాడు.
ZEP 1:8 “బలి అర్పించే యెహోవా దినాన రాజకుమారులను, ఇతర నాయకులను నేను శిక్షిస్తాను. విదేశీ వస్త్రాలు ధరించిన ప్రజలందరినీ నేను శిక్షిస్తాను.
ZEP 1:9 ఆ సమయంలో గుమ్మం దాటిన ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. అబద్ధాలతో, హింసతో యజమాని ఇంటిని నింపిన వారిని నేను శిక్షిస్తాను” అని యెహోవా చెప్పాడు.
ZEP 1:10 యెహోవా ఇంకా ఇలా చెప్పాడు, “ఆ సమయంలో యెరుషలేములోని చేప ద్వారం దగ్గర ప్రజలు సహాయంకోసం కేకలు వేస్తారు. పట్టణంలోని ఇతర చోట్ల ప్రజలు ఏడుస్తుంటారు. పట్టణం చుట్టూరా కొండల్లో నాశనం చేయబడుతున్న వాటి పెద్ద శబ్ధాలను ప్రజలు వింటారు.
ZEP 1:11 పట్టణం దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలారా, మీరు ఏడుస్తారు. ఎందుకు? ఎందుకంటే వ్యాపారస్తులు, ధనిక వర్తకులు అందరూ నాశనం చేయబడతారు గనుక.
ZEP 1:12 “ఆ సమయంలో నేను దీపం పట్టుకొని యెరూషలేము అంతటా వెదకుతాను. వారి ఇష్టాను సారంగా జీవిస్తూ తృప్తిపడుతోన్న మనుష్యులందరినీ నేను కను గొంటాను. ఆ ప్రజలు ‘యెహోవా, ఏమీ చేయడు. ఆయన సహాయం చేయడు,ఆయన బాధించడు’ అని అంటారు. అలాంటి వారిని నేను కనుగొని, వారిని శిక్షిస్తాను!
ZEP 1:13 అప్పుడు మిగిలిన వారు, వారి ఐశ్వర్యాలను తీసికొని వారి ఇండ్లను నాశనం చేస్తారు. ఆ సమయంలో ఇండ్లు కట్టుకొన్నవారు వాటిలో నివసించరు. మరియు ద్రాక్షా తోటలు నాటుకొన్న వారు ఆ ద్రాక్షా పండ్లరసం తాగరు-ఇతరులకు అవి లభిస్తాయి.”
ZEP 1:14 యెహోవా తీర్పు తీర్చే ప్రత్యేక దినం త్వరగా వచ్చేస్తుంది! ఆ రోజు దగ్గర్లో ఉంది; మరియు వేగంగా వచ్చేస్తుంది. యెహోవా ప్రత్యేక తీర్పు దినాన ప్రజలు విచారకరమైన శబ్దాలు వింటారు. బలమైన స్తెనికులు కూడ ఏడుస్తారు!
ZEP 1:15 ఆ సమయంలో దేవుడు తన కోపం చూపిస్తాడు. అది భయంకరమైన కష్టకాలంగా ఉంటుంది. అది విధ్వంస సమయంగా ఉంటుంది. అది చీకటి మబ్బు తుఫాను రోజుగా, చీకటి సమయంగా ఉంటుంది.
ZEP 1:16 అది భద్రతా గోపురాలలో, సంరక్షిత పట్టణాలలో ప్రజలు బూరలూ, బాకాలూ వినే యుద్ధ సమయంలా ఉంటుంది.
ZEP 1:17 యెహోవా ఇలా చెప్పాడు: “నేను ప్రజలకు జీవితం చాలా దుర్భరం చేస్తాను.ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా నడిచే గుడ్డివారిలా ప్రజలు అటు ఇటు నడుస్తారు. ఎందుకంటే, ఆ ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేసారు గనుక. అనేకమంది ప్రజలు చంపబడతారు. వారి రక్తం నేల మీద చిందుతుంది. వారి మృతదేహాలు నేలమీద పెంట కుప్పలా ఉంటాయి.
ZEP 1:18 వారి బంగారం, వెండి వారికి యెహోవా ఉగ్రత దినంలో సహాయం చేయవు! ఆ సమయంలో యెహోవా చాలా చికాకుపడి కోపంగా ఉంటాడు. యెహోవా మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. భూమి మీద ప్రతి ఒక్కరినీ యెహోవా సర్వనాశనం చేస్తాడు!”
ZEP 2:1 సిగ్గులేని ప్రజలారా మీ జీవితాలు మార్చుకోండి.
ZEP 2:2 అదీ, మీరు వాడిపోయి చనిపోతున్న పుష్పంలా కాకముందే. పగటి ఎండకు ఒక పుష్పం వాడిపోతుంది, చనిపోతుంది. యెహోవా తన భయంకర కోపం చూపించినప్పుడు మీరు అలానే ఉంటారు. కనుక మీ మీద యెహోవా కోపపు రోజు వస్తుంది మీ బతుకులు మార్చుకోండి!
ZEP 2:3 దీనులైన సర్వజనులారా, యెహోవా దగ్గరకు రండి! ఆయన చట్టాలకు విధేయులుగా ఉండండి. మంచి పనులు చేయటం నేర్చుకోండి. వినయంగా ఉండటం నేర్చుకోండి. ఒకవేళ అప్పుడు యెహోవా తన కోపం చూపించేవేళ మీరు క్షేమంగా ఉంటారేమో.
ZEP 2:4 గాజాలో ఏ ఒక్కరూ విడువబడరు. అష్యెలోను నాశనం చేయబడుతుంది. మధ్యాహ్నానికల్లా అష్డోదునుండి ప్రజలు బలవంతంగా వెళ్లగొట్టబడతారు. ఎక్రోను శూన్యం అవుతుంది!
ZEP 2:5 ఫిలిష్తీ ప్రజలారా, సముద్ర తీరంలో నివసించే ప్రజలారా, యెహోవా దగ్గరనుండి వచ్చిన ఈ సందేశం మిమ్మల్న గూర్చిందే. కనాను దేశమా, పాలస్తీనా దేశమా, నీవు నాశనం చేయ బడతావు-అక్కడ ఎవ్వరూ నివసించరు!
ZEP 2:6 సముద్రం పక్కన ఉన్న మీ దేశం గొర్రెల కాపరులకు, వారి గొర్రెలకు బంజరు పొలాలుగా అవుతుంది.
ZEP 2:7 అప్పుడు యూదా వారిలో శేషించిన వారికి ఆ దేశం చెందుతుంది. ఆ యూదా ప్రజలను యెహోవా జ్ఞాపకం చేసు కొంటాడు. ఆ ప్రజలు ఒక విదేశంలో బందీలుగా ఉన్నారు. కాని యెహోవా వారిని వెనుకకు తీసుకొని వస్తాడు. అప్పుడు యూదా ప్రజలు ఆ పొలాల్లో తమ గొర్రెలను గడ్డి మేయనిస్తారు. రాత్రిళ్ళు అవి అష్యెలోను ఖాళీ ఇండ్లలో పండుకొంటాయి.
ZEP 2:8 యెహోవా ఇలా అంటున్నాడు: “మోయాబు మరియు అమ్మోను ప్రజలు ఏమి చేసారో నాకు తెలుసు! ఆ ప్రజలు నా ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఆ ప్రజలు వారి స్వంత దేశాలను విశాల పరచు కొనేందుకు వారి భూమిని తీసుకొన్నారు.
ZEP 2:9 కనుక నేను బ్రతికి ఉన్నంత నిశ్చయంగా, మోయాబు మరియు అమ్మోను ప్రజలు సొదొమ, గొమొర్రాల్లా నాశనం చేయబడుతారు. నేను ఇశ్రాయేలీయుల దేవుడను, సర్వశక్తిగల యెహోవాను. ఆ దేశాలు శాశ్వతంగా సర్వనాశనం చేయబడతాయని ెనేను వాగ్దానం చేస్తున్నాను. వారి దేశంనిండా కలుపు మొక్కలు పెరిగి పొతాయి. వారి దేశం మృత సముద్రపు ఉప్పుచేత కప్పబడిన దేశంలా ఉంటుంది. నా ప్రజలలో శేషించినవారు ఆ దేశాన్ని, అందులో మిగిలిన వాటన్నింటినీ తీసుకొంటారు.”
ZEP 2:10 మోయాబు మరియు అమ్నోను ప్రజలు గర్వపడి, దేవుని ప్రజలను గేళిచేసి, సర్వశక్తిగల యెహోవా ప్రజల పట్ల క్రూరంగా పవర్తించారు. వారిని అవమాన పర్చారు. కనుక వాళ్లకు అవి జరిగే తీరుతాయి.
ZEP 2:11 ఆ ప్రజలు యెహోవాకు భయపడుతారు. ఎందుకంటే యెహోవా వారి దేవతలను నాశనం చేస్తాడు గనుక. అప్పుడు దూర దేశాలన్నింటిలోని మనుష్యులందరూ యెహోవాను ఆరాధిస్తారు.
ZEP 2:12 కూషీయులారా, దీని అర్థం మీరు కూడాను! యెహోవా ఖడ్గం మీ ప్రజలను కూడా చంపుతుంది.
ZEP 2:13 మరియు యెహోవా ఉత్తరంగా తిరిగి అష్షూరును శిక్షిస్త్తాడు. నీనెవెను ఆయన నాశనం చేస్తాడు-ఆ పట్టణం ఎండిన ఎడారిలా శూన్యంగా ఉంటుంది.
ZEP 2:14 అప్పుడు గొర్రెలు, అడవి జంతువులు మాత్రమే శిథిలమైన ఆ పట్టణంలో నివసిస్త్తాయి. అక్కడ మిగిలిపోయిన స్తంభాలమీద గుడ్లగూబలు, కాకులు కూర్చుంటాయి. వాటి అరువులు కిటికీల గుండా వినిపిస్తాయి. గుమ్మాల మీద కాకులు కూర్చుంటాయి. ఆ ఖాళీ ఇండ్లలో నల్ల పక్షులు కూర్చుంటాయి.
ZEP 2:15 నీనెవె ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది. అది చాలా సంతోషంలో నిండిన పట్టణంగా ఉంది. ఆ ప్రజలు క్షేమంగా ఉన్నామని తలుస్తున్నారు. ప్రపంచ మంతటిలో నీనెవె పట్టణమే మహా గొప్ప పట్టణమని వారు తలుస్తున్నారు. కాని ఆ పట్టణం నాశనం చేయబడుతుంది! అది అడవి జంతువులు పండు కొనేందుకు వెళ్లే శూన్య ప్రదేశం అవుతుంది. ఆ స్థలం ప్రక్కగా వెళ్ళే మనుష్యులు ఆ పట్టణం అంత విపరితంగా నాశనం చేయబడటం చూసినప్పుడు వారు తలలు ఊవుతూ ఈలలు వేస్తారు.
ZEP 3:1 యెరూషలేమూ, నీ ప్రజలు దేవునికి విరోధంగా యుద్ధం చేశారు! నీ ప్రజలు ఇతరులను బాధించారు, నీవు పాపంతో అపవిత్రమయ్యావు.
ZEP 3:2 నీ ప్రజలు నా మాట వినలేదు! వారు నా ప్రబోధాలు అంగీకరించలేదు. యెరూషలేము యెహోవాను నమ్మలేదు. యెరూషలేము తన దేవుని దగ్గరకు వెళ్ళలేదు.
ZEP 3:3 యెరూషలేము నాయకులు గర్జించే సింహాల్లా ఉన్నారు. దాని న్యాయమూర్తులు గొర్రెలమీద దాడి చేసేందుకు రాత్రివేళ వచ్చి ఉదయానికి ఏమీ మిగల్చని ఆకలిగొన్న తోడేళ్లలా ఉన్నారు.
ZEP 3:4 దాని ప్రవక్తలు ఇంకా, ఇంకా ఎక్కువ సంపాదించటం కోసం ఎల్లప్పుడూ వారి రహస్య పథకాలు వేస్తూనే ఉన్నారు. దాని యాజకులు పవిత్రమైన విషయాలను పవిత్రం కానట్టె చూశారు. దేవుని ప్రబోధాలను వారు అతిక్రమించారు.
ZEP 3:5 కాని దేవుడు ఇంకా ఆ పట్టణంలో ఉన్నాడు. మరియు ఆయన మంచివాడుగానే కొనసాగుతున్నాడు. దేవుడు తప్పు ఏమీ చేయడు. ఆయన తన ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రజలు మంచి నిర్ణయాలు చేసేందుకు ఆయన వారికి ప్రతి ఉదయం సహాయం చేస్తాడు. కాని ఆ దుర్మార్గులు తాము చేసే చెడ్డ పనుల విషయంలో సిగ్గుపడరు.
ZEP 3:6 దేవుడు చెవుతున్నాడు: “నేను మొత్తం జన సమూహాలను నాశనం చేశాను. నేను వారి సంరక్షణ దుర్గాలను నాశనం చేశాను. నేను వారి వీధులను నాశనం చేశాను, అక్కడ ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళరు. వారి పట్టణాలు ఖాళీ, అక్కడ ఇంకెంత మాత్రమూ ఎవ్వరూ నివసించరు.
ZEP 3:7 నీవు ఒక పాఠం నేర్చుకోవాలని ఈ సంగతులు నీతో నేను చెబుతున్నాను. నీవు నాకు భయపడి నన్ను గౌరవించాలని నేను కోరుతున్నాను. ఒకవేళ నీవు ఇలా చేస్తే, నీ ఇల్లు నాశనం చేయబడదు. నీవు ఇలా చేస్తే నా పథకం ప్రకారం నిన్ను నేను శిక్షించాల్సి ఉండదు.” కాని ఆ చెడ్డ ప్రజలు ఇదివరకే చేసిన ఆ చెడుకార్యాలనే ఇంకా ఎక్కువ చేయాలను కొన్నారు!
ZEP 3:8 యెహోవా చెప్పాడు: “కనుక కొంచెం వేచి ఉండండి! నేను నిలిచి మీకు తీర్పు చెప్పేంతవరకు వేచి ఉండండి. అనేక దేశాల నుండి మనుష్యులను రప్పించి, మిమ్మల్ని శిక్షించేందుకు వారిని వాడుకొనే హక్కు నాకు ఉంది. మీ మీద నా కోపం చూపించేందుకు నేను ఆ ప్రజలను వాడుకొంటాను. నాకు ఎంత చికాకు కలిగిందో చూపించేందుకు నేను వారిని వాడు కొంటాను. మరియు మొత్తం దేశం నాశనం చేయబడుతుంది!
ZEP 3:9 అప్పుడు నేను ఇతర జనాంగ ములనుండి ప్రజలను మార్పు చేస్తాను. కాబట్టి వారు స్పష్టంగా మాట్టాడుతూ ప్రభువు నామాన్ని పేరుపెట్టి పిలువగలరు. వారందరూ ఒకే ప్రజగా కూడి నన్ను ఆరాధిస్తారు.
ZEP 3:10 కూషు దేశంలోని నది ఆవలివైపున, అంత దూరం నుండి ప్రజలు వస్తారు. చెదరిపోయిన నా ప్రజలు నా దగ్గరకు వస్తారు. నా భక్తులు వస్తారు మరియు నాకు వారు కానుకలు తెస్తారు.
ZEP 3:11 “యెరూషలేమూ, అప్పుడు నీవు, నీ ప్రజలు నాకు విరోధంగా చేసే చెడు విషయాలను గూర్చి ఇంకెంత మాత్రం సిగ్గుపడవు. ఎందుకంటే, ఆ దుర్మార్గులందరినీ యెరూషలేము నుండి నేను తొలగించి వేస్తాను. ఆ గర్విష్ఠులందరినీ నేను తొలగించివేస్తాను. నా పరిశుద్ధ పర్వతంమీద ఆ గర్విష్ఠులు ఎవ్వరూ ఉండరు.
ZEP 3:12 దీనులను, సాత్వికులను మాత్రమే నేను నా పట్టణంలో (యెరూషలేము) ఉండనిస్తాను. మరియు వారు యెహోవా నామాన్ని నమ్ముకొంటారు.
ZEP 3:13 ఇశ్రాయేలులో మిగిలిన వారు చెడు పనులు చేయరు. వారు అబద్ధాలు చెప్పరు. వారు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించరు. వారు తిని ప్రశాంతంగా పడుకొనే గొర్రెల్లా ఉంటారు-వారిని ఎవరూ ఇబ్బంది పెట్టరు.”
ZEP 3:14 యెరూషలేమా! పాడుతూ సంతోషంగా ఉండు! ఇశ్రాయేలూ, ఆనందంగా కేకలు వేయి! యెరూషలేమా, సంతోషించి సరదాగా ఉండు!
ZEP 3:15 ఎందుకంటే, నీ శిక్షను యెహోవా నిలిపివేశాడు గనుక! నీ శత్రువుల బలమైన దుర్గాలను ఆయన నాశనం చేశాడు! ఇశ్రాయేలు రాజా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఏ చెడు విషయం జరుగుతున్నా దాన్ని గూర్చి నీవు దిగులు వడాల్సిన అవసరం లేదు.
ZEP 3:16 ఆ సమయంలో యెరూషలేముతో ఇలా చెప్ప బడుతుంది: “బలంగా ఉండు, భయపడవద్దు!
ZEP 3:17 నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన శక్తిమంతుడైన సైనికునిలా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఆయన నీకు చూపిస్తాడు. ఆయన నీ గురించి సంతోషపడతాడు, నీవంటే ఆనందిస్తాడు. విందులో పాల్గొన్న వారివలె అయన నీ విషయంలో నవ్వుతూ సంతోషిస్తాడు.
ZEP 3:18 అది విందులో పాల్గొన్న ప్రజల్లా ఉంటుంది.” యెహోవా చెప్పాడు: “నీ అవమానాన్ని నేను తొలగించివేస్తాను. ఆ ప్రజలు నిన్ను బాధించ కుండునట్టు నేను చేస్తాను.
ZEP 3:19 ఆ సమయంలో, నిన్ను బాధించే వారిని నేను శిక్షిస్తాను. బాధించబడిన నా ప్రజలను నేను రక్షిస్తాను. పారిపోయేలా బలవంతం చేయబడిన ప్రజలను నేను తిరిగి వెనుకకు తీసుకొనివస్తాను. మరియు నేను వారిని ప్రసిద్ధి చేస్తాను. అన్ని చోట్లా ప్రజలు వారిని పొగడుతారు.
ZEP 3:20 ఆ సమయంలో, నిన్ను నేను వెనుకకు తీసుకొని వస్తాను. నేను నిన్ను కలిపి తీసుకొని వస్తాను. నిన్నునేను ప్రసిద్ధి చేస్తాను. అన్ని చోట్లా ప్రజలు నిన్ను పొగడుతారు. నీ సొంత కళ్ళయెదుట బందీలను తిరిగి నేను వెనుకకు తీసుకొని వచ్చి నప్పుడు అది జరుగుతుంది!” ఆ సంగతులు యెహోవా చెప్పాడు.
HAG 1:1 దేవుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా యూదా పాలనాధికారియైన జెరుబ్బాబెలుకు, మరియు ప్రధాన యాజకుడైన యెహోషువకు వినవచ్చింది. (జెరుబ్బాబెలు తండ్రి పేరు షయల్తీయేలు. యెహోషువ తండ్రి పేరు యెహోజాదాకు) ఈ వాక్కు రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి రోజున వచ్చింది. ఈ సందేశమేమంటే,
HAG 1:2 సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “దేవుడైన యెహోవా ఆలయ నిర్మాణానికి తగిన సమయం రాలేదని ఈ ప్రజలు అంటున్నారు.”
HAG 1:3 పిమ్మట దేపుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా వచ్చి ఇలా చెప్పింది:
HAG 1:4 “మీరు నగిషీ పనులు చేయబడ్డ చెక్క వలకలు గోడలకు అమర్చబడి అందంగా ఉన్న ఇండ్లలో నివసిస్తున్నారు. కాని యెహోవా ఇల్లు ఇంకా శిథిలావస్థలోనే ఉంది.
HAG 1:5 అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: ‘మీ ప్రవర్తన విషయం మీరు ఆలోచించండి!
HAG 1:6 నీవు నాటింది ఎక్కువ. కాని నీవు కోసేది తక్కువ. నీవు భోజనం తింటావు. అయినా నీ కడుపు నిండదు. నీవు నీరు తాగుతావు. ఆయినా నీ దాహం తీరదు. నీవు బట్టలు ధరిస్తావు. కాని నీకు వెచ్చగా ఉండదు. ధన సంపాదకుడు చిల్లులు ఉన్న సంచిలో డబ్బును వేయటానికే సంపాదిస్తాడు!’”
HAG 1:7 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు: “మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించండి!
HAG 1:8 మీరు పర్వతాలకు వెళ్లండి. కలప తెచ్చి ఆలయ నిర్మాణం చేయండి. అప్పుడు ఆలయం విషయంలో నేను సంతోషపడతాను. అది నాకు గౌరవప్రదం.” దేవుడైన యెహోవా ఇది చెప్పాడు.
HAG 1:9 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “మీరు ఎంతో పెద్ద పంటకొరకు ఎదురుచూస్తారు. కానీ మీకు లభించే ధాన్యం కొంతమాత్రమే దానిని మీరు ఇంటికి తెచ్చి నప్పుడు, నేను గాలినిపంపించి ఎగురగొడతాను. ఎందు కని ఈ సంగతులు జరుగుతున్నాయి? ఎందుకనగా నా ఇల్లు ఇంకా శిథిలావస్థలో ఉంది. కాని మీలో ప్రతి ఒక్కడూ తన ఇంటిని భద్రపరచుకోవడానికి పరుగు పెడతాడు.
HAG 1:10 ఈ కారణంవల్ల ఆకాశం మంచును పడనీయదు. మరియు భూమి పంటలను పండనీయదు.”
HAG 1:11 ప్రభువిలా చెపుతున్నాడు, “నేను భూమిని, పర్వతాలను ఎండి పోవాలని ఆజ్ఞ ఇచ్చాను. భూమి పండించే ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, ఒలీవ నూనె అన్నీ పాడై పోతాయి. మరియు మనుష్యులందరూ నీరసించి పోతారు. జంతువులన్నీ ఎండిపోతాయి.”
HAG 1:12 పిమ్మట షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, మరియు యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకుడు అయిన యెహోషువ తమ దేవుడైన యెహోవా వాక్కును ప్రవక్తయైన హగ్గయి మాటలను విన్నారు. వారి దేవుడైన యెహోవా తన మాటలను హగ్గయికి పంపాడు. మిగిలిపున్న ప్రజలుకూడా అజ్ఞ పాలించారు. ప్రజలు దేవుడైన యెహోవా పట్ల భయ భక్తులను, చూపారు.
HAG 1:13 దేవుడైన యెహోవా తన వార్తాహరుడైన హగ్గయికి ఒక వర్తమానం పంపాడు. ఈ వర్తమానం ప్రజలకొరకు ఉద్దేశించబడింది. ఆ వర్తమానం ఇలా ఉంది: దేవుడైన యెహోవా “నేను మీతో ఉన్నాను!” అని ప్రకటిస్తున్నాడు.
HAG 1:14 పిమ్మట యూదా దేశపు పాలనాధికారియు, షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలును దేవుడగు యెహోవా ప్రేరేపించాడు. దేవుడైన యెహోవా యెహోజాదా కుమారుడు, ప్రధాన యాజకుడు అయిన యెహోషువాను కూడా ప్రేరేపించాడు. మరియు దేవుడైన యెహోవా మిగిలివున్న జనులం దరినీ ప్రేరేపించాడు. అప్పుడు వారంతావచ్చి తమ దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు.
HAG 1:15 వారు ఈ పనిని, రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఆరవ నెల ఇరవై నాల్గవ రోజున ప్రారంభించారు.
HAG 2:1 దేవుడైన యెహోవా వాక్కు ఏడవనెల ఇరవై ఒకటో రోజున హగ్గయికి వినవచ్చింది. ఆ వాక్కు ఇలా చెప్పింది:
HAG 2:2 ఇప్పుడు షయల్తీయేలు కుమారుడు, యూదారాజ్య పాలనాధికారి అయిన జెరుబ్బాబెలుతోను, యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకుడు అయిన యెహోషవాతోను, మరియు జనులం దరితోను మాట్లాడి ఇలా చెప్పు:
HAG 2:3 “ఈ ఆలయం యొక్క గత వైభవాన్ని చూసినవారు మీలో ఎవ్వరు మిగిలారు? ఇప్పుడు మీరు దీనిని ఎలా చూస్తున్నారు? చాలా సంవత్సరాలక్రితం ఉన్న ఆలయంతో పోల్చిచూస్తే, మీ కండ్లకు ఇప్పటిది ఎందుకూ పనికిరానిదిగా ఉన్నట్లు అనిపిస్తూవుందా?”
HAG 2:4 కాని ఇవ్పుడు యెహోవా చెపుతున్నాడు, “జెరుబ్బాబెలూ! అధైర్యపడవద్దు. యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకడునైన యెహోషవా! అధైర్యపడవద్దు. ఈ దేశనివాసులైన మీరందరు అధైర్యపడవద్దు అని యెహోవా చెపుతున్నాడు. ఈ పనిని కొనసాగించండి, ఎందు కంటే, నేను మీతో ఉన్నాను.” సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ విషయాలు చెప్పాడు!
HAG 2:5 “‘మీరు ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు నేను మీతో చేసిన ఒడంబడిక ప్రకారం, నా ఆత్మ మీ మధ్య ఉంది. భయపడవద్దు!’
HAG 2:6 ఎందువల్లనంటే సర్యశక్తి మంతుడైన యెహోవా ఇది చెవుతున్నాడు! ‘కొద్ది వ్యవధిలో మరొక్కసారి పరలోకాలను, భూమిని, సముద్రాన్ని, ఎండిన నేలను కంపించేలా చేస్తాను.
HAG 2:7 దేశాలన్నింటినీ కుదిపివేస్తాను. వారంతా, వివిధ దేశాలలోవున్న ధనసంపదతో వస్తారు. అప్పుడు ఈ ఆలయాన్ని మహిమతో నింపుతాను.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు.
HAG 2:8 ‘వెండి నాది. బంగారంనాది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెవుచున్నాడు. ఈ ఆలయంయొక్క తరువాత మహిమ మొదటి ఆలయ మహత్తుకంటె ఇనుమడించి ఉంటుంది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెవుతున్నాడు. ‘మరియు ఈ ప్రదేశంలో శాంతి నెల కొల్పుతాను.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు!”
HAG 2:10 దర్యావేషు కాలంలో రెండవ సంవత్సరం తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ రోజున దేవుడైన యెహోవా వాక్కు ప్రవక్త హగ్గయికి ఇలా వినవచ్చింది:
HAG 2:11 సర్వశక్తి మంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు: “ధర్మశాస్త్రం వీటిని గురించి ఏమి చెవుతున్నదో ఇప్పుడు యాజకులను అడుగు.
HAG 2:12 ‘ఒకడు తన వస్త్రముల మడతలో పవిత్ర బలి మాంసాన్ని పెట్టుకుని వెళ్లినాడనుకో. పవిత్ర మాంసాన్ని ఉంచిన తన వస్త్రం రొట్టెనుగాని, వండిన ఆహారాన్నిగాని, ద్రాక్షారసం, నూనె లేక ఇతర తినుబండారాలను తాకినదనుకో. అలా ముట్టబడిన పదార్థం పవిత్రమౌతుందా?’” యాజకులు “కాదు” అని సమాధానమిచ్చారు.
HAG 2:13 పిమ్మట హగ్గయి అన్నాడు: “ఒకడు శవాన్ని ముట్టినాడనుకో. అతడు అపవిత్రుడవుతాడు. అతడు గనుక దేన్నయినా ముట్టుకుంటే ఆ వస్తువు అపవిత్ర మౌతుందా?” “అది అపవిత్రమౌతుంది” అని యాజకులు సమాధానమిచ్చారు.
HAG 2:14 పిమ్మట హగ్గయి చెప్పాడు: “దేవుడైన యెహోవా ఇలా చెవుతున్నాడు: ‘ఈ జనులకు సంబంధించినంత వరకూ ఆ విషయం కూడా నిజమే. వాళ్లు నా ముందు అపరిశుద్ధులు, అపవిత్రులు. వాళ్ల చేతులతో తాకినవన్నీ అపరి శుద్ధమైనవి.
HAG 2:15 “‘యెహోవా ఆలయవు పని ప్రారంభించేందుకు ముందు జరిగిన సంగతుల విషయమై ఆలోచించు.
HAG 2:16 ప్రజలు ఇరవై బస్తాల ధాన్యం అవుతుందను కొన్నారు. కాని పది బస్తాల ధాన్యం అవుతుందను కొన్నారు. కాని పది బస్తాల ధాన్యం మాత్రమే కుప్పలో ఉంది. ద్రాక్షారసం ఏభై కొలలు తీసికోటానికి ఒక తొట్టివద్దకు రాగా, వారికి ఇరవై కొలలు మాత్రమే దొరికేవి.
HAG 2:17 ఎందుకంటే నేను మిమ్మల్ని, మీ చేతులు చేసిన వస్తువులను శిక్షించాను. మొక్కలను చీడలతోను, బూజుతోనూ, మిమ్మల్ని వడగండ్లతోను శిక్షించాను. కాని మీరింకా నా వద్దకు రారు.’ దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు.”
HAG 2:18 “‘ఈ రోజు తొమ్మిదవ నెలలో ఇరవైనాల్గవ దినం. మీరు యెహోవీ ఆలయానికి పునాది వేయటం ముగించారు. కావున ఈ రోజునుండి ఏమి జరుగుతుందో చూడండి.
HAG 2:19 గోదాముల్లో ధాన్యం నిలవవుందా? ద్రాక్షాలతలు, అంజూరపుచెట్టు, దానిమ్మ చెట్టు ఇంకను పండ్లనీయటం లేదా? (లేదు).అయితే మిమ్మల్ని ఈ రోజునుండి ఆశీర్వదిస్తాను!’”
HAG 2:20 మళ్లీ తొమ్మిదవనెల, ఇరవై నాలుగవరోజు రెండవ సారి దేవుడైన యెహోవా వాక్కు హగ్గయికి వినవచ్చింది. ఆ వాక్కు ఇలా చెప్పింది:
HAG 2:21 “జెరుబ్బాబెలుకు చెప్పు: పరలోకాన్ని, భూమిని కదుపుతాను.
HAG 2:22 రాజ్యాల సింహాసనాలను తల్లక్రిందులు చేస్తాను. ఆ ఇతర రాజ్యాలవారిని నాశనం చేస్తాను. రథాలను వాటిమీద ఉన్నవారిని పడదోస్తాను. గుర్రాలు, రౌతులు కూలిపోతారు. ఆ సైన్యాలు ప్రస్తుతం మిత్రులు. కానివాళ్లు ఒకరినొకరు ప్రతికూలులై, కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని చంవుకొంటారు.”
HAG 2:23 సర్వశక్తి మంతుడైన యెహోవా ఇది చెవుతున్నాడు: “షయల్తీయేలు కుమారుడవు, నా సేవకుడైన జెరుబ్బాబెలూ, నిన్ను నేను ఎన్నుకొన్నాను. దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. ఆ సమయాన నేను నిన్నొక ముద్ర వేసే ఉంగరంగా చేస్తాను. (ఈ పనులు నేను చేశానని మీరే ఋజువు.)” సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెవుతున్నాడు.
ZEC 1:1 బెరక్యా కుమారుడు జెకర్యా. యెహోవా నుండి జెకర్యాకు ఒక వర్తమానం వచ్చింది. అది పర్షయా ( పారశీకం ) రజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఎనిమిదవ నెలలో వచ్చింది. ( జెకర్యా తండ్రి వేరు బెరక్యా. బెరక్య ఇద్దో కుమారుడు. ఇద్దో ఒక ప్రవక్త.) ఆ వర్తమానం ఇలా ఉంది.
ZEC 1:2 యెహోవా మీ పూర్వీకుల పట్ల చాలా కోపంగా ఉన్నాడు.
ZEC 1:3 కావున ప్రజలకు మీరీ విషయాలు తప్పక చెప్పాలి. యెహోవా ఇలా చెపుతున్నాడు, “మీరు నా వద్దకు తిరిగి రండి; నేను మీ వద్దకు వస్తాను.” సర్వశక్తి మంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
ZEC 1:4 యెహోవా చెప్పాడు: “మీ పూర్వీకులవలె మీరు ఉండవద్దు. గతంలో ప్రవక్తలు వారితో ఇలా మాట్లాడారు. ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ చెడు జీవిత విధానాలను మార్చుకోమని మిమ్మల్ని కోరుతున్నాడు. చెడు కార్యాలు చేయటం మానండి!’ అని చెప్పారు. కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
ZEC 1:5 దేవుడు చెప్పాడు: “మీ పూర్వీకులు పోయారు. ఆ ప్రవక్తలూ శాశ్వతంగా జీవించలేదు.
ZEC 1:6 ప్రవక్తలు నా సేవకులు. మీ పూర్వీకులకు నా ధర్మాన్ని, బోధనలను తెలియజెప్పటానికి నేను వారిని వినియోగించు కొన్నాను. చివరకు మీ పూర్వీకులు గుణపాఠం నేర్చు కున్నారు. ‘సర్వశక్తిమంతుడైన యెహోవా చేస్తానని చెప్పిన విషయాలు చేశాడు. మేము జీవించిన పద్ధతికి, మేము చెసిన చెడు పనులకు ఆయన మమ్మల్ని శిక్షించాడు’ అని వారు చెప్పారు. కాపున వారు దేవుని వద్దకు తిరిగి పచ్చారు.”
ZEC 1:7 పర్షియా రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం పదకొండవ నెల (శెబాటు) ఇరవై నాల్గవ రోజున జెకర్యా మరో వర్తమానాన్ని యెహోవానుండి అందుకున్నాడు. ( జెకర్యా తండ్రి బెరక్యా, బెరక్యా తండ్రి ప్రవక్త అయిన ఇద్దో. ) ఆ వర్తమానం ఇది.
ZEC 1:8 రాత్రి వేళ ఒకడు ఎర్రగుర్రమునెక్కి స్వారీచేయుట నేను చూశాను. అతడు లోయలో కొన్ని కదంబ చెట్ల మధ్య నిలుచున్నాడు. అతని వెనుక ఎరుపు, గోధుమరంగు మరియు తెలుపురంగు గుర్రాలు ఉన్నాయి.
ZEC 1:9 “అయ్యా, ఈ గుర్రాలు ఎందుకు?” అని నేను అడిగాను. అప్పుడు దేవదూత నాతో మాట్టాడుతూ, “ఈ గుర్రాలు ఎందుకో నేను నీకు చూపిస్తాను” అని చెప్పాడు.
ZEC 1:10 పిమ్మట కదంబ చెట్ల మధ్య నిలుచున్న మనిషి చెప్పాడు, “యెహోవా ఈ గుర్రాలను భూమిపై ఇక్కడా, అక్కడా తిరగటానికి పంపించాడు.”
ZEC 1:11 తరువాత కదంబ చెట్ల మధ్య నిలుచున్న యెహోవా దూతతో ఆ గుర్రాలు మాట్లాడాయి. “మేము భూమిపై ఇక్కడా, అక్కడా సంచరించాము. అంతా సవ్యంగా, శాంతంగా ఉంది” అని అవి చెప్పాయి.
ZEC 1:12 పిమ్మట యెహోవా దూత చెప్పాడు: “ప్రభువా! యెరూషలేమును, యూదా నగరాలను ఓదార్చటానికి నీకు ఇంకా ఎంతకాలం పడుతుంది? ఇప్పటికి డెబ్బైయేండ్లగా ఈ నగరాలపై నీ కోపాన్ని చూపిస్తూ వచ్చావు.”
ZEC 1:13 అప్పుడు నాతో మాట్లాడుతూ వున్న దేవదూతకు యెహోవా సమాధానం చెప్పాడు. యెహోవా మంచివైన, ఓదార్పు మాటలు చెప్పాడు.
ZEC 1:14 తరువాత దేవదూత ఈ విషయాలను ప్రజలకు చెప్పుమని నాతో చెప్పాడు: సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “యెరూషలేము పట్ల, సీయోను పట్ల నాకు గాఢమైన ప్రేమ ఉంది.
ZEC 1:15 మిక్కిలి రక్షణ కలిగి యున్నామని భావించే దేశాల పట్ల నేను చాలా కోపంగా వున్నాను. నాకు కొంచెం కోపం వచ్చింది. అప్పుడు నా జనులను శిక్షించటానికి నేను ఆ రాజ్యాలను వినియోగించాను. కాని ఆ రాజ్యాలు చాలు హాని చేశాయి.”
ZEC 1:16 కావున యెహోవా చెపుతున్నాడు: “నేను యెరూషలేముకు తిరిగి వచ్చి ఆమెను ఓదార్చుతాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “యెరూషలేము మళ్లీ నిర్మింపబడుతుంది. మరియు నా ఆలయం అక్కడ కట్టబడుతుంది.”
ZEC 1:17 దేవదూత చెప్పాడు, “ప్రజలకు ఈ విషయాలు కూడా చెప్పు, ‘సర్వశక్తిమంతుడైన యెహోవీ చెపుతున్నాడు: నా పట్టణాలు మళ్లీ భాగ్యవంత మవుతాయి. నేను సీయోనును ఓదార్చుతాను. నేను యెరూషలేమును నా ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకుంటాను.’”
ZEC 1:18 అప్పుడు నేను పైకిచూడగా అక్కడ నాలుగు కొమ్ములు చూశాను.
ZEC 1:19 నాతో మాట్లాడుతున్న దేవదూతను, “ఈ కొమ్ముల అర్థమేమిటి?” అని అడిగాను. అతడు ఇలా చెప్పాడు: “ఇవి ఇశ్రాయేలు, యూదా, యెరూషలేము ప్రజలను ఇతర దేశాలకు పోయేలా ఒత్తిడి చేసిన కొమ్ములు.”
ZEC 1:20 తరువాత యెహోవా నలుగురు పనివారిని నాకు చూపించాడు.
ZEC 1:21 “ఈ నలుగురు పనివారు ఏమి చేయటానికి వస్తున్నారు?” అని నేనతనిని అడిగాను. అతడు ఇలా చెప్పాడు, “ఈ మనుష్యులు ఆ కొమ్ములను నాశనం చేయటానికి వచ్చారు. ఆ కొమ్ములు యూదాప్రజలను అన్యదేశాలకు పోయేలా ఒత్తిడి చేశాయి. ఆ కొమ్ములు ఎవ్వరికి కనికరం చూపలేదు. యూదా ప్రజలపై దాడిచేసి వారిని అన్యదేశాలకు వెడలగొట్టిన రాజ్యాలకు చిహ్నలుగా ఈ కొమ్ములు ఉన్నాయి.”
ZEC 2:1 నేను పైకిచూశాను. వస్తువులను కొలవటానికి ఒకడు తాడు పట్టుకుని ఉన్నట్లు చూశాను.
ZEC 2:2 “నీవెక్కడికి వెళ్తున్నావు?” అని అతన్ని అడిగాను. “నేను యెరూషలేమును కొలవటానికి వెళ్తున్నాను. అది ఎంత వెడల్పు, ఎంత పోడవు వున్నదో చూడాలి”అని అతడు నాకు చెప్పాడు.
ZEC 2:3 అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత వెళ్లి పోయాడు. మరొక దేవదూత అతనితో మాట్లాడటానికి వెళ్లాడు.
ZEC 2:4 అతనితో ఇలా చెప్పాడు: “పరుగున పొమ్ము. వెళ్లి ఆ యువకునితో యెరూషలేము కొలవ లేనంత పెద్దగా పుంటుందని చెప్పు. అతనికి ఈ విషయూలు చెప్పు: ‘యెరూషలేము ప్రాకారం లేని నగరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంతోమంది మనుష్యులు, ఎన్నో జంతుపులు నివసిస్తాయి.’
ZEC 2:5 యెహోవా చెపుతున్నాడు, ‘యెరూషలేమును రక్షిస్తూ దానిచుట్టూ నేనొక అగ్ని గోడలా ఉంటాను. ఆ నగరానికి మహిమను కలుగజేస్తూ, నేనక్కడ నివసిస్తాను.’”
ZEC 2:6 యెహోవా ెచెపుతున్నాడు, “త్వరపడు! ఉత్తర దేశం నుండి పారిపొమ్ము! అవును. నీ ప్రజలను ప్రతి చోటికి నేను చెదర గొట్టిన మాట నిజమే.
ZEC 2:7 సీయోను ప్రజలారా మీరు బబులోనులో బందీలయ్యారు. కాని ఇప్పుడు తప్పించుకోండి! ఆ నగరం నుండి పారిపొండి!” సర్వశక్తిమంతుడైన యెహోవా నా గురించి ఈ విషయాలు చెప్పాడు: ఆ రాజ్యాలు యుద్ధంలో నీనుండి వస్తువులు తీసుకున్నారు.
ZEC 2:8 ఆ రాజ్యాలు ఘనత సంపాదించాయి. కాని ఆ తరువాత యెహోవా నన్ను వారి మీదికి పంపుతాడు. ఎందుకంటే, మీకు హాని కలిగించడమంటే, దేవుని కంటిపాపలకు హాని కలిగించడమే అవుతుంది. అప్పుడు ఆ రాజ్యాలు వాటి గౌరవాన్ని పొందుతాయి.
ZEC 2:9 మరియు నేనా ప్రజలను బాధిస్తాను. వారి బానిసలు వారి ధనాన్ని తీసుకుంటారు. బబులోను ప్రజలు నా ప్రజలను బంధించి వారిని బానిసలుగా చేశారు. కాని నేను వాళ్లను దెబ్బ తీస్తాను వారు నా ప్రజలకు బానిసలపుతారు. అప్పుడు సర్వశక్తి మంతుడైన యెహోవాయే నన్ను పంపినట్టు మీరు తెలుసుకుంటారు.
ZEC 2:10 యెహోవా చెపుతున్నాడు: “సీయోనూ, సంతోషంగా పుండు! ఎందుకంటే, నేను వస్తున్నాను. మరియు నేను నీ నగరంలో నివసిస్తాను.
ZEC 2:11 ఆ సమయంలో అనేక దేశాల ప్రజలు నా వద్దకు వస్తారు. పైగా వారు నా ప్రజలవుతారు. నేను నీ నగరంలో నివసిస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా నీ వద్దకు నన్ను పంపాడని నీవు తెలుసుకుంటావు.
ZEC 2:12 యెహోవా మళ్లీ యెరూషలేమును తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేస్తాడు. మరియు యూదా పవిత్ర భూమిలో తన భాగంగా ఉంటుంది.
ZEC 2:13 ప్రతి ఒక్కడూ ప్రశాంతంగా ఉండాలి! యెహోవా తన పవిత్ర నివాసం నుండి వస్తున్నాడు.
ZEC 3:1 పిమ్మట దేవదూత ప్రధాన యాజకుడైన యెహోషువను నాకు చూపించాడు. యెహోవా దూత ముందు యెహోషువ నిలబడి ఉన్నాడు. యెహోషువాకి కుడి పక్కగా సాతాను నిలబడి ఉన్నాడు. యెహోషువ మీద చెడు పనులు చేసినట్లునింద మోపటానికి సాతాను అక్కడ ఉన్నాడు.
ZEC 3:2 అప్పుడు యెహోవా దూత ఇలా చెప్పాడు: “సాతానూ, యెహోవా నిన్ను విమర్శించు గాక నీవు అపరాధివని యెహోవా తీర్పు ఇచ్చుగాక! యెరూషలేమును యెహోవా తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఆ నగరాన్ని రక్షించాడు. అది నిప్పులోనుండి లాగిన మండే కట్టెలా ఉంది.”
ZEC 3:3 యెహోషువ దేవదూత ముందు నిలుచున్నాడు. యెహోషువ ఒక మురికి వస్త్రం ధరించివున్నాడు.
ZEC 3:4 అప్పుడు దేవదూత తనవద్ద నిలబడిన ఇతర దేవ దూతలతో, “యెహోషువ వేనుకున్న మురికి వస్త్రాలను తీసివేయండి” అని చెప్పాడు. పిమ్మట దేవదూత యెహోషువతో మాట్లాడినాడు. అతడు ఇలా అన్నాడు: “ఇప్పుడు నీ నేరాన్ని నేను తీసివేశాను. నీకు నూతన వస్త్రాలను ఇస్తున్నాను.”
ZEC 3:5 అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచు” అని అన్నాను. కావున ఒక శుభ్రమైన తల పాగాను వారతని తలపై పెట్టారు. యెహోవా దూత అక్కడ నిలబడి వుండగా వారు అతనికి నూతన వస్త్రాలు తొడిగారు.
ZEC 3:6 పిమ్మట యెహోషువాకు యెహోవా దేవదూత ఈ విషయాలు చెప్పాడు:
ZEC 3:7 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నేను చెప్పిన విధంగా జీవించు. నేను చెప్పినవన్నీ చెయ్యి. నీవు నా ఆలయానికి అధి కారినిగా ఉంటావు. నీవు దాని ఆవరణ విషయం శ్రద్ధ తీసుకుంటావు. ఇక్కడ నిలబడిన దేవదూతలవలె నీవు నా ఆలయంలో ఎక్కడికైనా వెళ్లటా నికి నీకు స్వేచ్ఛ ఉంది.
ZEC 3:8 కావున యెహోషువ, నీవూ, నీతో వున్న ప్రజలూ నేను చెప్పేది తప్పక వినాలి. నీవు ప్రధాన యాజకుడవు. నీతో ఉన్న జనులు నిజంగా అద్భుతాలు నెరవేర్చగలరు. నేను నిజంగా నా వ్రత్యేక సేవకుని తీసుకువస్తాను. అతడు ‘కొమ్మ’ ( చిగురు ) అని పిలువబడతాడు.
ZEC 3:9 చూడండి, యెహోషువ ముందు నేనొక రాతిని పెట్టాను. ఆ రాతికి ఏడు పక్కలు ( కండ్లు ) ఉన్నాయి. ఆ రాతి మీద నేనొక ప్రత్యేక వర్తమానం చెక్కుతాను. నేను ఒక్క రోజులో ఈ దేశంలోని పాపాలన్నీ తీసివేస్తానని ఇది తెలియ జేస్తుంది.”
ZEC 3:10 సర్వశక్తిమంతుడైన యెహోవా చెవుతున్నాడు: “ఆ సమయంలో ప్రజలు తమ స్నేహితులతోను, పొరుగువారితోను కూర్చొని మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కడూ తన అంజూరపు చెట్టు కింద, తన ద్రాక్షాలత క్రింద ప్రశాంతంగా కూర్చుంటాడు.”
ZEC 4:1 పిమ్మట నాతో మాట్లాడుతూవున్న దేవదూత నా పద్దకు వచ్చి నన్ను లేపాడు. నేను నిద్ర నుండి మేల్కొంటున్న వ్యక్తివలె ఉన్నాను.
ZEC 4:2 “నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు. నేను ఇలా చెప్పాను: “ఒక గట్టి బంగారు దీప స్తంభాన్ని చూస్తున్నాను. ఆ స్తంభం మీద ఏడు దీపాలు ( ప్రమిదెలు ) ఉన్నాయి. దీపస్తంభం మీద ఒక గిన్నెఉంది. గిన్నె నుండి ఏడు గొట్టాలు వచ్చాయి. ప్రతి దీపానికీ ఒక గొట్టం చొప్పున వెళ్లాయి. ఆ గొట్టాలు దీపాలకు కావలసిన నూనెను గిన్నెనుండి చేరవేస్తున్నాయి.
ZEC 4:3 గిన్నె పక్కగా కుడి వైవున ఒకటి, ఎడమ వైపున ఒకటి ఒలీవ చెట్లు ఉన్నాయి.”
ZEC 4:4 తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూతను, “అయ్యా, ఈ వస్తువులు ఏమి తెలియజేస్తున్నాయి?” అని అడిగాను.
ZEC 4:5 “ఈ వస్తువులు ఏమిటో నీకు తెలియదా?” అని నాతో మాట్టాడుతూ ఉన్న దేవదూత అన్నాడు. “లేదయ్యా” అని నేను చెప్పాను.
ZEC 4:6 అతడు నాతో ఇలా అన్నాడు: “యెహోవా నుంచి జెరుబ్బాబెలుకు వచ్చిన వర్తమానం ఇది: ‘నీ శక్తి సామర్థ్యాలవల్ల నీకు సహాయం రాదు. నీ సహాయం నా ఆత్మ నుండి వస్తుంది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు!
ZEC 4:7 ఆ ఎత్తైన పర్వతం జెరుబ్బాబెలుకు సమమైన ప్రదేశంగా ఉంటుంది. అతడు ఆలయ నిర్మాణం చేస్తాడు. దానికి చివరి రాయి పెట్ట బడినప్పుడు, ‘అందంగా ఉంది! అందంగా ఉంది!’ అని ప్రజలు కేకలు పెడతారు.”
ZEC 4:8 నాకు వచ్చిన యెహోవా వర్తమానం ఇంకా ఇలా చెప్పింది:
ZEC 4:9 “నా ఆలయానికి జెరుబ్బాబెలు వునాదులు నిర్మిస్తాడు. మరియు జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణం పూర్తిచేస్తాడు. అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలైన మీ వద్దకు నన్ను పంపినట్టు మీరు తెలుసుకుంటారు.
ZEC 4:10 సామాన్యంగా ప్రారంభించ బడే పనులపట్ల ప్రజలు సిగ్గుచెందరు. జెరుబ్బాబెలు గుండు దారం తీసికొని తయారైన భవనాన్ని తనిఖీచేసి కొలవటం చూసినప్పుడు, ప్రజలు నిజంగా సంతోషిస్తారు. ఆ రాతికి మీరు ఇప్పుడు చూసిన ఏడు పక్కలు యెహోవా యొక్క ఏడు కండ్లకు చిహ్నాలుగా ఉండి అన్ని దిశలకూ చూస్తూ ఉంటాయి. అవి భూమి మీద ప్రతిదాన్నీ చూస్తాయి.”
ZEC 4:11 పిమ్మట నేను ( జెకర్యా ) అతనికి చెప్పాను: “దీపస్తంభానికి కుడి పక్కన ఒక ఒలీవ చెట్టును, ఎడమ పక్కన మరొక చెట్టును నేను చూశాను. ఆ రెండు ఒలీవ చెట్ల అర్థం ఏమిటి?”
ZEC 4:12 నేనింకా ఇలా అన్నాను: “బంగారు రంగుగల నూనె ప్రవహించే బంగారు గొట్టాల వద్ద నేను రెండు ఒలీవ కొమ్మలు చూశాను. వీటి అర్థం ఏమిటి?”
ZEC 4:13 తరువాత దేవదూత నాతో, “వీటి అర్థం ఏమిటో నీకు తెలియదా?”అని అన్నాడు. “లేదయ్యా” అని నేను చెప్పాను.
ZEC 4:14 “ఈ సర్వజగత్తుకు ప్రభువైన యెహోవాను సేవించటానికి ఎంపిక చేయబడిన ఇద్దరు మనుష్యులను అవి సూచిస్తాయి,” అని అతడు చెప్పాడు.
ZEC 5:1 నేను మళ్లీ పైకి చూడగా, చుట్టబడిన ఒక ఎగిరే పత్రాన్ని చూశాను.
ZEC 5:2 “నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగినాడు. “నేనొక చుట్టగా వున్న ఎగిరే పత్రాన్ని చూస్తున్నాను. ఆ చుట్ట ముప్పై అడుగుల పొడవు, పదిహేను అడుగుల వెడల్పు ఉంది” అని నేను చెప్పాను.
ZEC 5:3 అప్పుడు దేవదూత నాతో చప్పాడు, “ఆ చుట్ట బడిన పత్రంమీద ఒక శాపం వ్రాయబడి ఉంది. ఆ పత్రంలో ఒక ప్రక్కన దొంగలకు ఒక శాపం ఉంది. ఆ పత్రానికి మరొక పక్కన అబద్ధపు వాగ్దానాలు చేసే వారికి ఒక శాపం ఉంది.
ZEC 5:4 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: ‘దొంగల ఇండ్లకు, నా పేరు మీద దొంగ వాగ్దానాలు చేసేవారి ఇండ్లకు ఆ చుట్టబడిన పత్రాన్ని నేను పంపిస్తాను. ఆ పత్రం అక్కడ వుండి, ఆ ఇండ్లను నాశనం చేస్తుంది. రాళ్లు, కొయ్యస్తంభాలు సహితం నాశనం చేయబడతాయి.’”
ZEC 5:5 తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూత బయటికి వెళ్లాడు. అతడు నాతో, “చూడు!నీవు ఏమి జరుగుతున్నట్లు చూస్తున్నావు?” అని అన్నాడు.
ZEC 5:6 “అదేమిటో నాకు తెలియదు” అని నేను అన్నాను. అతడు ఇలా చెప్పాడు: “అది ఒక కొలతొట్టె. ఈ దేశంలో ప్రజలు చేసే పాపాలను కొలవటానికి ఆ బుట్ట ఉద్దేశించబడింది.”
ZEC 5:7 ఆ తొట్టె మీదనుంచి సీసపు మూత తొలగించ బడింది. ఆ బుట్టలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. దానితో బరువైన (డెబ్బై ఐదు పౌనులు) సీసపు తూనికరాయి ఉంది.
ZEC 5:8 “ఈ స్త్రీ చెడును ెతెలియజేస్తుంది” అని దేవ దూత చెప్పాడు. పిమ్మట దేవదూత ఆ స్త్రీని తొట్టెలో పడదోసి, దానిమీద సీసపు మూతను పెట్టాడు. పాపాలు ఘోరమైనవని (బరువై నవని) ఇది తెలుపుతుంది.
ZEC 5:9 తరువాత నేను పైకి చూశాను. అక్కడ సంకుబుడ్డ కొంగవలె రెక్కలు గల ఇద్దరు స్త్రీలను చూశాను. వారు ఎగిరి వచ్చారు. వారి రెక్కల్లో గాలి ఉంది. వారు బుట్టను పట్టి లేవనెత్తాకు. బుట్టను పట్టుకొని వారు గాలిలోకి పోయారు.
ZEC 5:10 “వారు ఆ బుట్టను ఎక్కడికి మోసుకు పోతున్నారు?” అని నాతో మాట్లాడుతూ వున్న దేవ దూతను నేనడిగాను.
ZEC 5:11 దేవదూత నాతో ఇలా చెప్పాడు: “షీనారులో దానికొక ఆలయం నిర్మించటానికి వారు వెళ్తున్నారు. వారా ఆలయాన్ని నిర్మించాక ఆ బుట్టను అక్కడ ఉంచుతారు.”
ZEC 6:1 నేను పిమ్మట నలు పక్కలా తిరిగి,పైకి చూశాను. అక్కడ నాలుగు రథాలు నాలుగు కంచుపర్వతాల మధ్యగా వెళ్లుచున్నట్లు నేను చూశాను.
ZEC 6:2 ఎర్రగుర్రాలు మొదటి రథాన్ని లాగుతున్నాయి. నల్లగుర్రాలు రెండవ రథాన్ని లాగుతున్నాయి.
ZEC 6:3 తెల్లగుర్రాలు మూడవ రథాన్ని లాగుతున్నాయి. మరియు ఎర్రమచ్చలున్న గుర్రాలు నాలుగో రథాన్ని లాగుతున్నాయి.
ZEC 6:4 నాతో మాట్టాడుచున్న దేవదూతను, “అయ్యా వీటి అర్థమేమిటి?” అని అడిగాను.
ZEC 6:5 దేవదూత ఇలా సమాధానమిచ్చాడు: “ఇవి నాలుగు గాలులు. ఇవి కేవలం ఈ సర్వలోకానికి ప్రభువైన ఆయన ముందునుండి వచ్చాయి.
ZEC 6:6 నల్లగుర్రాలు ఉత్తరానికి వెళతాయి. ఎర్రగుర్రాలు తూర్పుకు వెళతాయి. తెల్ల గుర్రాలు పడమతకి వెళతాయి. ఎర్ర మచ్చల గుర్రాలు దక్షిణానికి వెళతాయి.”
ZEC 6:7 ఎర్రమచ్చల గుర్రాలు తమకు చెందిన భూభాగాన్ని చూడాలని ఆత్రంగా ఉన్నాయి. కావున దేవదూత వాటితో, “వెళ్లి భూమి మీద నడవండి” అని అన్నాడు. అందుచే అవి వాటికి చెందిన ప్రాంతంలో నడుస్తూ వెళ్లాయి.
ZEC 6:8 తరువాత యెహోవా నన్ను బిగ్గరగా పిలిచి ఇలా అన్నాడు: “చూడు, ఉత్తరానికి వెళ్తున్న గుర్రాలు బబులోనులో తమ పనిపూర్తి చేశాయి. అవి నా ఆత్మను శాంతింపజేశాయి. నేనిప్పుడు కోవంగా లేను!”
ZEC 6:9 పిమ్మట యెహోవా నుండి నేను మరొక వర్త మానం అందుకున్నాను.
ZEC 6:10 ఆయన ఇలా చెప్పాడు: “బబులోనులో బందీలుగాఉన్న వారిలో నుండి హెల్దయి, టోబీయా, యెదాయా అనేవారు వచ్చారు. వారి వద్దనుండి వెండి బంగారాలు తీసికొని, జెఫన్యా కుమారుడైన యెషీయా ఇంటికి వెళ్లు.
ZEC 6:11 ఆ వెండి బంగారాలను ఒక కిరీటం చెయటానికి వినియోగించు. ఆ కిరీటాన్ని యెహోషువ తలమీద పెట్టు. ( యెహోషువ ప్రధాన యాజకుడు. యెహోజాదాకు కుమారుడే యెహోషువ ) తరువాత యెహోషువకు ఈ విషయాలు చెప్పు.
ZEC 6:12 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “కొమ్మ అని పిలువ బడే ఒక మనిషి ఉన్నాడు. అతడు బలంగా పెరుగుతాడు. అతడు యెహోవా ఆలయాన్ని నిర్మిస్తాడు.
ZEC 6:13 అతడు యెహోవా ఆలయాన్ని నిర్మించి గౌరవాన్ని పొందుతాడు. అతడు తన సింహాసనంపై కూర్చుని, పాలకుడవుతాడు. ఒక యాజకుడు అతని సింహాసనం వద్ద నిలబడతాడు. ఈ ఇద్దరు మనుష్యులూ శాంతియుత వాతావరణంలో కలిసి పనిచేస్తారు.
ZEC 6:14 వారు కిరీటాన్ని ప్రజల జ్ఞాపకార్థం ఆలయంలో ఉంచుతారు. ఆ కిరీటం హెల్దయి, టోబీయా, యెదాయా మరియు జెఫన్నా కుమారుడైన యోషీయాలకు గౌరవాన్ని తెచ్చివెడుతుంది.”
ZEC 6:15 మిక్కిలి దూరంలో నివసిస్తున్నవారు వచ్చి ఆలయాన్ని నిర్మిస్తారు. అప్పుడు ప్రజలైన మీవద్దకు యెహోవా నన్ను పంపినట్లు మీరు నిశ్చయంగా తెలుసుకుంటారు. యెహోవా ఏమి చెపుతున్నాడో అది మీరు చేస్తే ఈ విషయాలన్నీ జరుగుతాయి.
ZEC 7:1 దర్యావేషు పర్షియా రాజుగావున్న కాలంలో నాలుగవ సంవత్సరంలో యెహోవా నుండి జెకర్యా ఒక వర్తమానం అందుకున్నాడు. ఇది తొమ్మిదవ నెలలో (కిస్లేవు) నాల్గవ రోజున జరిగింది.
ZEC 7:2 బేతేలు ప్రజలు షెరెజెరును, రెగెమ్మెలెకును, వారి మనుష్యులను యెహోవా వద్దకు ఒక ప్రశ్న అడగటానికి పంపారు.
ZEC 7:3 వారు సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయంలో ఉన్న ప్రవక్తలు, యాజకుల వద్దకు వెళ్లరు. ఆ మనుష్యులు వారిని ఈ ప్రశ్న అడిగారు: “ఆలయ వినాశనానికి కొన్ని సంవత్సరాలుగా మా విషాదాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాము. ప్రతి సంవత్సరం ఐదవ నెలలో ఒక వ్రత్యేక సంతాపదినాన్ని, నిరాహార దీక్షను పాటి స్తున్నాము. మేము ఇలా చేస్తూ ఉండవలసిందేనా?”
ZEC 7:4 సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి నేను ఈ వర్తమానం అందుకున్నాను:
ZEC 7:5 “ఈ దేశంలోని యాజకులకు, తదితర ప్రజలకు ఈ విషయం చెప్పు, ‘మీరు ఉపవాసాలు చేసి మీ సంతాపాన్ని ఐదవ నెలలోను, ఏడవ నెలలోను ప్రకటించారు. నిజానికి ఆ ఉపవాసం నా కొకకేనా? కాదు!
ZEC 7:6 మరియు మీరు తినటం, తాగటం కూడ నా కొరకేనా? కాదు! అది మీ మంచి కొరకు మాత్రమే.
ZEC 7:7 దేవుడు ఏనాడో ఈ విషయాలు చెప్పటానికి ఆనాటి ప్రవక్తలను వినియోగించాడు. యెరూషలేము జనంతో నిండి ఐశ్వర్యంతో తులతూగేనాడే ఆయన ఈ విషయాలు చెప్పాడు. యెరూషలేము చుట్టూవున్న పట్టణాలలో, దక్షిణపల్లపు ప్రాంతంలో, పడమటి కొండవాలులలో ప్రజలు నివసిస్తున్న రోజులలోనే దేవుడు ఈ విషయాలు చెప్పాడు.’”
ZEC 7:8 యెహోవా నుండి జెకర్యాకు వచ్చిన వర్తమానం ఇది:
ZEC 7:9 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “ఏది ధర్మమో, ఏది న్యాయమో మీరది చేయాలి. మీ అందరూ ఒకరికొకరు దయ, కరుణ కలిగి ఉండాలి.
ZEC 7:10 విధవ స్త్రీలను, అనాథ పిల్లలను, కొత్తవారిని, పేదవారిని బాధించవద్దు. కనీసం ఒకరికొకరు కీడు చేసుకోవాలనే ఆలోచన కూడూ మీరు రానీయకండి!”
ZEC 7:11 కాని ఆ ప్రజలు ఇది వినటానికి నిరాకరించారు. ఆయన కోరింది చేయటానికి వారు నిరాకరించారు. దేవుడు చెప్పింది వినకుండా వుండేటందుకు వారు తమ చెవులు మూసుకున్నారు.
ZEC 7:12 వారు చాలా మొండి వైఖరి దాల్చారు. వారు న్యాయాన్ని పాటించరు. ఆత్మ ప్రేరణతో సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలకు ప్రవక్తల ద్వారా వర్తమానాలు పంపాడు. కాని ప్రజలు వాటిని వినరాయెను. అందువల్ల సర్వశక్తి మంతుడైన యెహోవా మిక్కిలి కోపగించాడు.
ZEC 7:13 కావున సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు, “నేను వారిని పిలిచాను, కాని వారు పలకలేదు. అందువల్ల ఇప్పుడు వారు పిలిస్తే నేను పలకను.
ZEC 7:14 ఇతర దేశాలను వారి మీదిరి ఒక తుఫానులా తీసుకువస్తాను. వారెవరో వీరికి ెతెలియదు; కాని వారు దేశంలో తిరిగాక అది నాశనమై పోతుంది. రమ్యమైన ఈ దేశం నాశనమై పోతుంది.”
ZEC 8:1 సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి వచ్చిన ఒక వర్తమానం ఇది.
ZEC 8:2 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “నేను సీయోనును నిజంగా ప్రేమిస్తున్నాను. నేనామెను ఎంతగా ప్రేమిస్తున్నానంటే, ఆమె నాపట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించినప్పుడు నాకు కోపం పచ్చింది.”
ZEC 8:3 యెహోవా చెవుతున్నాడు, “నేను సీయోనుకు తిరిగి వచ్చాను. నేను యెరూషలేములో నివసిస్తున్నాను. యెరూషలేము విశ్వాసంగల నగరం అని పిలవబ డుతుంది. నా పర్వతం పవిత్ర పర్వతం అని పిలవబడుతుంది.”
ZEC 8:4 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “వృద్ధులైన స్త్రీ వురుషులు మళ్లీ యెరూషలేము బహిరంగ ప్రదేశాలలో కనబడతారు. ప్రజలు నడవటానికి చేతి కర్రలు కావలసివచ్చే వయసువరకు నివసిస్తారు.
ZEC 8:5 వీధుల్లో ఆడుకునే పిల్లలతో నగరం నిండిపోతుంది.
ZEC 8:6 చావగా మిగిలిన వారు ఇదంతా అద్భుతం అనుకుంటారు నేనూ ఇది అద్భుతం అనుకుంటాను!”
ZEC 8:7 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “చూడు, తూర్పు, పడమటి దేశాలలో ఉన్న నా ప్రజలను నేను రక్షిస్తున్నాను.
ZEC 8:8 వారిని ఇక్కడికి తిరిగి తీసుకు వస్తాను. వారు యెరూషలేములో నివసిస్తారు. వారు నా ప్రజగా పుంటారు. నేను వారికి మెచ్చదగిన, విశ్వసనీయమైన దేవునిగా వుంటాను.”
ZEC 8:9 సర్వశక్తీమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ధైర్యంగా ఉండండి! సర్వశక్తిమంతుడైన యెహోవా ముందుగా తన ఆలయాన్ని నిర్మించటానికి పునాదులు వేసినప్పుడు ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్నే ప్రజలైన మీరు ఈనాడు వింటున్నారు.
ZEC 8:10 అంతకు ముందు, పనివారిని వెట్టటానికి, జంతువులను బాడుగకు తీసు కోటానికి మనుష్యుల వద్ద డబ్బు లేదు. పైగా మనుష్యులు రావటానికి పోవటానికి కూడ క్షేమకరం కాని సమయం. బాధలన్నిటి నుండి ఉపశమనం లేదు. నేను ప్రతివాడిని తన పొరుగు వానిపై తిరుగబడేలా చేశాను.
ZEC 8:11 కాని ఇప్పుడు పూర్వం మాదిరిగా లేదు. బతికివున్న వారికి ఇక అలా జరుగదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
ZEC 8:12 “ఈ ప్రజలు శాంతియుత వాతావరణంలో మొక్కలు. నాటుతారు. వారి ద్రాక్షాతోటలు కాయలు కాస్తాయి. భూమి విస్తారంగా పంటనిస్తుంది. ఆకాశం వర్షిస్తుంది. వీటన్నిటినీ నా ప్రజలైన వీరికి ఇస్తాను.
ZEC 8:13 ప్రజలు తమ శాపాలతో ఇశ్రాయేలును, యూదాను వాడటం మొదలు పెట్టారు. కాని ఇశ్రాయేలును, యూదాను నేను రక్షిస్తాను. ఆ పేర్లు ఒక దీవెనగా మారుతాయి. కావున భయపడవద్దు. ధైర్యంగా ఉండండి!”
ZEC 8:14 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “మీ పూర్వీకులు నాకు కోపం కలిగించారు. అందువల్ల వారిని నేను నాశనం చేయ సంకల్పించాను. నా మనస్సు మార్చుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
ZEC 8:15 “కాని ఇప్పుడు నా మనస్సు మార్చు కున్నాను. అదేమాదిరి నేను యెరూషలేము పట్ల, యూదాప్రజల పట్ల మంచిగా వుండటానికి నిర్ణయించు కున్నాను. కావున భయపడవద్దు!
ZEC 8:16 అయితే మీరు మాత్రం ఇవి తప్పక చేయండి: మీ పొరుగు వారికి నిజం చెప్పండి. మీరు మీ నగరాలలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు సరిగా ప్రవర్త్తించండి. ధర్మమైన శాంతికి దోహదపడే పనులు చేయండి.
ZEC 8:17 మీ పొరుగు వారిని బాధించడానికి మీరు రహస్య పథకాలు వేయ కండి! బూటకపు వాగ్దానాలు చేయకండి! అటువంటి పనులు చేయటం పట్ల ఆసక్తి కన్పరచకండి. ఎందు కంటే, వాటిని నేను అసహ్యించుకుంటాను!” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
ZEC 8:18 నేనీ వర్త మానం సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి అందు కున్నాను.
ZEC 8:19 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “మీరు ప్రత్యేక సంతాప దినాలు,ఉపవాస దినాలు నాల్గవ నెలలోను, ఐదవ నెలలోను, ఏడవ నెలలోను, పదవ నెలలోను కలిగి ఉన్నారు. ఆ సంతాప దినాలు సంతోష దినాలుగా తప్పక మార్చబడాలి. అవి యోగ్యమైన, సంతోష దాయకమైన విశ్రాంతి దినాలవుతాయి. కావున మీరు సత్యాన్ని, శాంతిని ప్రేమించండి!”
ZEC 8:20 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుకున్నాడు, “భవిష్యత్తులో అనేక నగరాల నుండి ప్రజలు యెరూషలేముకు వస్తారు.
ZEC 8:21 ఒక నగరం నుండి వచ్చిన ప్రజలు, వారు కలిసిన మరొక నగరవాసులతో ఇలా అంటారు, [వేరేవాళ్లు మేము మీతో వస్తాము అని అంటారు. ] ‘సర్యశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి మేము వెళ్తున్నాము. మాతో రండి!’”
ZEC 8:22 అనేక బలమైన రాజ్యాల నుండి అనేక మంది ప్రజలు సర్యశక్తిమంతుడైన యెహోవాను వెదుక్కుంటూ యెరూషలేముకు వస్తారు. ఆయనను ఆరాధించటానికి వారు అక్కడికి వస్తారు.
ZEC 8:23 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో వివిధ భాషలు మాట్లాడేవారు ఒక యూదా మనిషి వద్దకు వచ్చి, ‘దేవుడు నీతో ఉన్నాడని మేము విన్నాము. ఆయనను ఆరాధించటానికి మేము నీతో రావచ్చువా?’ అని అడుగుతారు.”
ZEC 9:1 ఒక విషాద వర్తమానం. ఇది హద్రాకు యొక్క దేశాన్ని గురించి, అతని రాజధాని నగరమైన దమస్కును గురించిన యెహోవా వర్తమానం. “ెదేవుడిని తెలుసుకున్న వారు కేవలం ఇశ్రాయేలు వంశాల వారు మాత్రమే కాదు. ప్రతి ఒక్కడూ సహాయంకొరకు ఆయనను ఆశ్రయించవచ్చు.
ZEC 9:2 హద్రాకు యొక్క దేశ సరిహద్దుల్లో హమాతు ఉంది. అలాగే తూరు, సీదోనులు కూడా ఉన్నాయి. ( ఆ ప్రజలు చాలా తెలివిగల వారు )
ZEC 9:3 తూరు ఒక కోటలా కట్టబడింది. ఆ ప్రజలు వెండిని దుమ్ము వలె విస్తారంగా సేకరించారు. బంగారం వారికి బంకమట్టివలె సామాన్యమై పోయింది.
ZEC 9:4 కాని మా ప్రభువైన యెహోవా దానినంతా తీసుకుంటాడు. ఆ నగరపు శక్తివంతమైన నౌకాబలాన్ని ఆయన నాశనం చేస్తాడు. ఆ నగరు అగ్నివల్ల నాశనం కాబడుతుంది!
ZEC 9:5 “అష్కెలోను ప్రజలు వాటిని చూసి భయపడతారు. గాజా ప్రజలు భయంతో వణకుతారు. ఇవన్నీ జరగటం చూచినప్పుడు ఎక్రోను ప్రజలకు ఆశలుడుగుతాయి. గాజాలో రాజంటూ ఎవ్వడూ మిగలడు. అష్కెలోనులో ఇక ఎంత మాత్రం ఎవ్వరూ నివ సించరు.
ZEC 9:6 అష్డోదులో ప్రజలు వారి నిజమైన తండ్రులు ఎవరో కూడ తెలుసుకోలేరు. గర్విష్టలైన ఫిలిష్తీయులను సర్వనాశను చేస్తాను.
ZEC 9:7 రక్తం కలిసివున్న మాంసాన్నిగాని, నిషెధించబడిన ఏ ఇతర ఆహార పదార్థాన్ని గాని వారిక తినరు. జీవించివున్న ఫిలిష్తీయుడెవడై-నా వుంటె అతడు నా ప్రజల్లో భాగంగా ఉంటాడు. యూదాలో వారు మరొక వంశంగా ఉంటారు. యెబూ సీయులవలె ఎక్రోను ప్రజలు నా ప్రజల్లో ఒక భాగమపుతారు. నేను నా దేశాన్ని రక్షిస్తాను.
ZEC 9:8 శత్తుసైన్యాలను దానిగుండా వెళ్లనీయను. ఇక ఎంత మాత్రం వారిని నా ప్రజలను బాధించనీయను. గతంలో నా ప్రజలు ఎంత బాధపడ్డారో నేను స్వయంగా చూశాను.”
ZEC 9:9 సీయోనూ, నీవు సంతోషంగా వుండు! యెరూషలేము ప్రజలారా, ఆనందంతో కేకలు పెట్టండి! చూడండి, మీరాజు మీ వద్దకు వస్తున్నాడు! ఆయన విజయం సాధించిన మంచి రాజు. కాని ఆయన వినయం గలవాడు. ఆయన ఒక గాడిదపై స్వారీ చేస్తున్నాడు. ఒక గాడిద పిల్లపై వస్తున్నాడు.
ZEC 9:10 రాజు చెపుతున్నాడు, “నేను ఎప్రాయిములో రథాలూ, యెరూషలేములో గుర్రవు రౌతులను నాశనం చేశాను. యుద్ధంలో వాడిన విల్లంబులను నాశనం చేశాను.” శాంతిని గూర్చిన వార్తను అన్య దేశాలు విన్నాయి. ఆ రాజు సముద్రంనుండి సముద్రంవరకు పరిపాలిస్తాడు. ఆయన నది నుండి భూమిపై సుదూర ప్రాంతాలవరకు పాలిస్తాడు.
ZEC 9:11 యెరూషలేమూ, మన ఒడంబడిక రక్తంతో స్థిరపర్చబడింది. కావున నీ బందీలను నేను విడుదల చేశాను. నీ ప్రజలు ఇక ఎంతమాత్రం ఆ ఖాళీ చెరసాలలో ఉండరు.
ZEC 9:12 చెరపట్టబడిన ప్రజలారా, ఇంటికి వెళ్ళండి. మీకు ఇంకా ఆశపడదగింది ఉంది. నేను మీవద్దకు తిరిగి వస్తున్నానని నేను మీకు చెపుతున్నాను!
ZEC 9:13 యూదా, నిన్ను నేను ఒక విల్లులా విని యోగిస్తాను. ఎఫ్రాయిమూ నిన్ను నేను బాణాల్లా వినియెగిస్తాను. ఇశ్రాయేలూ, గ్రిసుతో యుద్ధం చేయటానికి నిన్ను ఒక బలమైన కత్తిలా ఉపయోగిస్తాను.
ZEC 9:14 యెహోవా వారికి కన్పిస్తాడు. ఆయన తన బాణాలను మెరుపుల్లా వదులుతాడు. నా ప్రభువైన యెహోవా బాకా ఊదుతాడు. అప్పుడు సైన్యం ఎడారిలో ఇసుక తుఫానులా ముందుకు చొచ్చుకు పోతుంది.
ZEC 9:15 సర్వశక్తిమంతుడైన యెహోవా వారిని రక్షిస్తాడు. శత్రువును ఓడించటానికి సైనికులు బండ రాళ్లను, వడిసెలలను ఉపయోగిస్తారు. వారి శత్రువుల రక్తాన్ని వారు చిందిస్తారు. అది ద్రాక్షా మద్యంలా పారుతుంది. అది బలిపీఠం మూలలపై పోసిన రక్తంలా వుంటుంది!
ZEC 9:16 ఒక కాపరి తన గొర్రెలను కాపాడినట్టు, దేవుడైన యెహోవా తన ప్రజలను ఆ సమయంలో కాపాడతాడు. వారాయనకు చాలా విలువైన వారు. తన భూమిపై వారు మెరిసే రత్నాల వంటివారు.
ZEC 9:17 ప్రతీదీ మెచ్చదగినదై, అందంగా పుంటుంది! విచిత్రమైన పంట పండుతుంది. కాని అది కేవలం ధాన్యం, ద్రాక్షారసం కాదు. ఆ పంట యువతీ యువకులే!
ZEC 10:1 వసంత ఋతువులో వర్షం కొరకు యెహోవాను ప్రార్థించండి. యెహోవా మెరుపులను కలుగజేస్తాడు. వర్షం కురుస్తుంది. ప్రతి వాని పొలంలోనూ దేవుడు పైరులు పెరిగేలా చేస్తాడు.
ZEC 10:2 భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసు కోవటానికి ప్రజలు తమ చిన్న విగ్రహాలను, మంత్రతంత్రాలను ఉపయోగిస్తారు. కాని అది నిరుపయోగం. ఆ జనులు దర్శనాలు చూసి, తమ కలలను వివరిస్తారు. కాని అవన్నీ పనికిరాని అబద్ధాలు. అందువల్ల ప్రజలు సహాయంకొరకు గొర్రెల్లా అరుస్తూ ఇక్కడా, అక్కడా తిరుగుతారు. కాని వారిని నడిపించటానికి కాపరిలేడు.
ZEC 10:3 యెహోవా చెపుతున్నాడు: “కాపరుల ( నాయకుల ) పట్ల నేను చాలా కోపంగా వున్నాను. నా గొర్రెలకు ( ప్రజలకు ) జరిగిన దానికి నేను ఆ నాయకులను బాధ్యులుగా చేశాను.” ( యూదా ప్రజలు దేవుని యొక్క గొర్రెల మంద. సర్వశక్తిమంతుడైన యెహోవా తన మంద విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. ఒక సైనికుడు తన అందమైన యుద్ధగుర్రం విషయంలో శ్రద్ధ చూపినట్టు, ఆయన వారి పట్ల జాగ్రత్త తీసుకుంటాడు. )
ZEC 10:4 “పునాదిరాయి, గుడారవు గుంజ, యుద్ధ విల్లు, ముందుకు చొచ్చుకువచ్చే సైన్యం అన్నీ [యూదానుండి] కలిసి వస్తాయి.
ZEC 10:5 [వారు తమ శత్రుపును ఓడిస్తారు.] అది సైనికులు బురద వీధుల గుండా నడిచినట్లు ఉంటుంది. వారు పోరాడతారు. యెహోవా వారితోవున్న కారణంగా వారు శత్రువుకు చెందిన గుర్రపు దళాలను కూడ ఓడిస్తారు.
ZEC 10:6 యూదా వంశాన్ని నేను బలపర్చుతాను. యోసేపు వంశాన్ని యుద్ధంలో గెలిచేలా చేస్తాను. వారిని సురక్షితంగా, ఆరోగ్యంగా తిరిగి తీసుకు వస్తాను. వారిని ఓదార్చుతాను. అది నేను వారిని ఎప్పుడూ విడిచి పెట్టనట్లుగా ఉంటుంది. నేను వారి దేవుడైన యెహోవాను. నేను వారికి సహాయం చేస్తాను.
ZEC 10:7 ఎప్రాయిము ప్రజలు తాగటానికి పుష్కలంగా దొరికిన సైనికులవలె సంతోషంగా ఉంటారు. వారి పిల్లలు ఉల్లాసంగా ఉంటారు. వారు కూడ హాయిగావుంటారు. వారంతా యెహోవాతో కలిసి ఉండే ఆనందమయ సమయూన్ని కలిగి ఉంటారు.
ZEC 10:8 “నేను వారికొరకు ఈల వేసి, వారందరినీ ఒక్కచోటికి పిలుస్తాను. నేను వారిని నిజంగా రక్షిస్తాను. వారి సంఖ్య విస్తారంగా ఉంటుంది.
ZEC 10:9 అవును, నా ప్రజలను అనేక దేశాలకు చెదరగొడుతూ వచ్చాను. కాని ఆ దూర దేశాలలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. వారు, వారిపిల్లలు బతుకుతారు. పైగా వారు తిరిగి వస్తారు.
ZEC 10:10 నేను వారిని ఈజిప్టు ( ఐగుప్తు ) నుంచి, అష్షూరు నుంచి వెనుకకు తీసుకు వస్తాను. వారినిగిలాదు ప్రాంతానికి తిరిగి తీసుకువస్తాను. అక్కడ వారికి సరిపోయే స్థలం వుండదు గనుక, వారిని దగ్గరలోనేవున్న లెబానోనులో నివసించనిస్తాను.”
ZEC 10:11 దేవుడు వారిని ఈజిప్టు (ఐగుప్తు) నుండి బయటకు తీసికొని వచ్చినప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి ఉంటుంది. ఆయన సముద్రపు అలలను కొట్టగా, సముద్రం రెండు పాయలు అయ్యింది. ప్రజలు ఆ కష్టాల సముద్రం మధ్య నుండి నడిచి వచ్చారు. యెహోవా నదీ ప్రవాహాలను ఇంకిపోయేలా చేస్తాడు. అష్షూరు గర్వాన్ని, ఈజిప్టు ( ఐగుప్తు ) అధి కారాన్ని ఆయన నాశనం చేస్తాడు.
ZEC 10:12 యెహోవా తన ప్రజలు బలపడేలా చేస్తాడు. వారు ఆయన ధ్యానంలో, ఆయన నామస్మరణ చేస్తూ జీవిస్తారు. యెహోవా ఈ విషయూలు చెప్పడు.
ZEC 11:1 లెబానోనూ, అగ్ని ప్రవేశించి నీ దేవదారు వృక్షాలను కాల్చివేసేలాగు నీ ద్వరాలను తెరువు.
ZEC 11:2 దేవదారు వృక్షాలు పడిపోయినందుకు సరళ వృక్షాలు విచారిస్తాయి. బలమైన ఆ చెట్లు దూరంగా తీసుకుపోబడ్డాయి. బాషానులోని సింధూర వృక్షాలు నరికి వేయబడిన అడవికొరకు దుఃఖిస్తాయి.
ZEC 11:3 విలపించే కాపరులను వినండి. శక్తివంతులైన వారి నాయకులు పట్టుబడ్డారు. యువకిశోరాల గర్జన వినండి. యొర్దాను నది వద్ద గల వాటి చిక్కటి పొదలన్నీ తీసుకుపోబడ్డాయి.
ZEC 11:4 దేవుడైన యెహోవా చెపుతున్నాడు, “చంపటానికి పెంచబడ్డ గొర్రెల విషయం జాగ్రత్త తీసుకో.
ZEC 11:5 వాటి నాయకులు యజమానులవలెను, వ్యాపారులవలెను ఉన్నారు. యజమానులు వారి గొర్రెలను చంపుతారు. అయినా వారు శిక్షింపబడరు. వ్యాపారులు గొర్రెలను అమ్మి ‘దేవునికి జయం, నేను భాగ్యవంతుడ నయ్యాను’ అని అంటారు. కాపరులు తమ గొర్రెల కొరకు విచారించరు.
ZEC 11:6 ఈ దేశంలో నివసించే ప్రజల కొరకు నేను విచారించను.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “చూడండి, నేను ప్రతివాడినీ తన పొరుగువానిచేత, రాజుచేత దూషింపబడేటట్లు చేస్తాను. వారి దేశాన్ని నాశనం చేసేలాగు నేను వారిని వదులుతాను. నేను వారిని ఆపను!”
ZEC 11:7 కావున చంపబడటానికి పెంచబడిన ఆ అభాగ్యపు గొర్రెల పట్ల నేను శ్రద్ధ తీసుకున్నాను. నాకు రెండు కర్రలు దొరికాయి. ఒక కర్రను “అభిమానం” అని, మరొక కర్రను “సమైక్యత” అని పిలిచాను. తరువాత నేను గొర్రెల పట్ల శ్రద్ద తీసుకోవటం మొదలు పెట్టాను.
ZEC 11:8 ముగ్గురు కాపరులను ఒక్క నెలలో సంహరించాను. నేను గొర్రెలపట్ల కోపించగా, వారు నన్ను ద్వేషించటం మొదలు పెట్టారు.
ZEC 11:9 అప్పుడు నేను ఇలా అన్నాను: “నేను వదిలి వేస్తాను! నేను మిమ్మల్ని గురించి శ్రద్ధ తీసుకోను! చావు కోరేవారిని నేను చనిపోనిస్తాను. నాశనమై పోవాలని కోరుకొనేవారిని నేను నాశనం కానిస్తాను. ఇంకా మిగిలినవారు ఒకరినొకరు నాశనం చేసుకుంటారు.”
ZEC 11:10 తరువాత “అభిమానం” అనే కర్రను నేను తీసుకొని విరుగగొట్టాను. తన ప్రజలతో గల దేవుని ఒడంబడిక రద్దయినట్లు చూపటానికే నేనిది చేశాను.
ZEC 11:11 కావున ఆ రోజున నిబంధన రద్దయింది. నన్ను గమనిస్తున్న ఆ నిర్భాగ్యపు గొర్రెలకు ఈ వర్త మానం యెహోవా నుండి వచ్చినదని తెలుసు.
ZEC 11:12 అప్పుడు నేనిలా అన్నాను: “మీరు నాకు వేతనం ఇవ్వదలిస్తే ఇవ్వండి. వద్దనుకుంటే మానండి!” వారప్పుడు ముప్పై వెండి నాణెములిచ్చారు.
ZEC 11:13 తరువాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “అంటే నా విలువ అంత మాత్రమేనని వారనుకుంటున్నారన్న మాట. ఆ మహాధనాన్ని ఆలయ ఖజానాలో పడవేయి.” కాపున ఆ ముప్పై వెండి నాణాలను తీసుకొని యెహోవా ఆలయంలోని ఖజానాలో పడవేశాను.
ZEC 11:14 పిమ్మట “సమైక్యత” అనే కర్రను తీసుకొని రెండుగా నరికాను. యూదా, ఇశ్రాయేలులు మధ్యగల ఐక్యతకు భంగం వాటిల్లిందని చూపటానికి నేనిది చేశాను.
ZEC 11:15 పిమ్మట యెహోవా నాతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు గొర్రెలను కాయటానికి అసలు పనికిరాని ఒక కర్రను చూడు.
ZEC 11:16 ఈ దేశానికి ఒక కొత్త కాపరిని నేను తెస్తానని ఇది చూపుతుంది. కాని ఈ యువకుడు నాశనం కాబడుతున్న గొర్రెలపట్ల జాగ్రత్త తీసుకోలేడు. గాయపడిన గొర్రెలను అతడు బాగు చేయలేడు. బతి కివున్న వాటికి అతడు గ్రాసం ఇవ్వలేడు. ఆరోగ్యంగావున్నవి వూర్తిగా తినబడతాయి. కేవలం వాటి గిట్టలు మాత్రం వదిలి వేయబడతాయి.”
ZEC 11:17 పనికిమాలిన ఓ నా కాపరీ, నీవు నా గొర్రెలను వదిలివేశావు. అతనిని శిక్షించు! అతని కుడి చేతిని, కుడి కంటిని కత్తితో కొట్టు. అతని కుడిచేయి నిరుపయోగమవుతుంది. అతనికుడి కన్ను గ్రుడ్డిదవుతుంది.
ZEC 12:1 ఇశ్రాయేలును గురించి యెహోవా నుండి పచ్చిన విషాద వార్త. యెహోవా ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన మానపుని ఆత్మను అతనిలో పొందుపర్చాడు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు:
ZEC 12:2 “చూడండి, నేను యెరూషలేమును దానిచుట్టూ ఉన్న దేశాలకు ఒక విషవు గిన్నెలా చేస్తాను. దేశాలు వచ్చి ఆ నగరంపై దాడి చేస్తాయి. యూదా అంతా బోనులో చిక్కుతుంది.
ZEC 12:3 కాని నేను యెరూష లేమును ఒక బరుైవెన బండలా చేస్తాను. దానిని తీసు కోడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అది అతనినే గాయపర్చుతుంది. ఆ ప్రజలు నిజంగా నరక బడతారు, గీకబడతారు. కాని భూమిపై గల దేశాలన్నీ కలిసి యెరూషలేము మీద యుద్ధానికి వస్తాయి.
ZEC 12:4 కాని ఆ సమయంలో నేను గుర్రాన్ని బెదర గొడతాను. దాని మీద స్వారీ చేసే సైనికునికి భయం పుట్టిస్తాను. శత్రు గుర్రాలన్నీ గుడ్డివై పోయేలా చేస్తాను. కాని నాకండ్లు తెరవబడి ఉంటాయి. నేను యూదా వంశాన్ని కనిపెడుతూ ఉంటాను.
ZEC 12:5 యూదా వంశ నాయకులు ప్రజలను ప్రోత్సహిస్తారు. వారు, ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ దేవుడు, ఆయన మనల్ని బల వంతులుగా చేస్తాడు’ అని అంటారు.
ZEC 12:6 ఆ సమయంలో యూదా నాయకులను అరణ్యంలో చెలరేగిన అగ్నిలా నేను చేస్తాను. అగ్ని ఎండు గడ్డిని దగ్ధం చేసినట్లు, వారు తమ శత్రువులను నాశనం చేస్తారు. చుట్టూవున్న వారి శత్రువులను వారు నాశనం చేస్తారు. యెరూషలేము ప్రజలు మళ్లీ తీరిక కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు.”
ZEC 12:7 యెరూషలేము ప్రజలు మిక్కిలి గొప్పలు చెప్పు కోకుండా చేయటానికి, యెహోవా యూదా ప్రజలను ముందుగా రక్షిస్తాడు. యూదాలో పున్న ప్రజలకంటె తాము గొప్పవారమని దావీదు వంశం వారు, యెరూషలేములో పుంటున్న ఇతర ప్రజలు గొప్పలు చెప్పు కోలేరు.
ZEC 12:8 కాని యెరూషలేము ప్రజలను యెహోవా రక్షిస్తాడు. ఏమీ చేతగానివాడు సహితం దావీదులా గొప్ప సైనికుడవుతాడు. దావీదు వంశంలోని మనుష్యులు దేవుళ్లవలె పుంటారు. ప్రజలను నడిపించే యెహోవా దూతలా వుంటారు.
ZEC 12:9 యెహోవా చెపుతున్నాడు: “ఆ సమయంలో యెరూషలేముపై యుద్ధానికి వచ్చిన దేశాలను నేను నాశనం చేస్తాను.
ZEC 12:10 దావీదు వంశాన్ని, యెరూషలే ములో నివసిస్తున్న ప్రజలను దయాదాక్షిణ్య స్వభావంతో నింపివేస్తాను. వారు నన్ను పొడిచారు. అలాంటి నా సహాయం కొరకే వారు ఎదురు చూస్తారు. వారు చాలా విచారిస్తారు. తన ఏకైక కుమారుడు చనిపోయిన వాడు విలపించేలా, తన మొదటి కుమారుడు చని పోయినవాడు విలపించేలా వారు దుఃఖిస్తారు.
ZEC 12:11 యెరూషలేములో గొప్ప దుఃఖ సమయం ఉంటుంది. అది మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను మరణంపట్ల ప్రజల దుఃఖంలా పుంటుంది.
ZEC 12:12 ప్రతి ఒక్క కుటుంబం విడిగా దుఃఖిస్తుంది. దావీదు కుటుంబంలోని వురుషులు విడిగా దుఃఖిస్తారు. వారి భార్యలు విడిగా వారికి వారే దుఃఖిస్తారు. నాతాను కుటుంబంలోని పురుషులు ప్రత్యేకంగా విలపిస్తారు. వారి భార్యలు విడిగా దుఃఖిస్తారు.
ZEC 12:13 లేవి కుటుంబంలోని పురుషులు విడిగా విచారిస్తారు వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. షిమ్యోను (షిమీ) కుటుంబంలోని పురుషులు విడిగా విలపిస్తారు. వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు.
ZEC 12:14 ఇదే మాదిరి అన్ని వంశాలలోనూ జరుగుతుంది. పురుషులు, స్త్రీలు విడి విడిగా దుఃఖిస్తారు.”
ZEC 13:1 కాని ఆ సమయంలో దావీదు కుటుంబానికి, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకొరకు ఒక నీటి జల తీయబడుతుంది. ఆ జలం వారి పాపాలను కడిగి, వారిని పవిత్రులుగా చేయటానికి ఉద్దేశించబడుతుంది.
ZEC 13:2 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో విగ్రహాలన్నిటినీ భూమిపై నుండి తొలగిస్తాను. ప్రజలు కనీసం వాటి పేర్లయినా గుర్తు పెట్టుకోలేరు. ఈ భూమిపై నుండి బూటకవు ప్రవక్తలను, మురికి దయ్యాలను నేను తొలగిస్తాను.
ZEC 13:3 ఎవ్వరైనా భవిష్య ప్రకటనలు చేస్తే అట్టి ప్యక్తి శిక్షింపబడతాడు. అతని తల్లిదండ్రులు సహితం అతనితో, ‘యెహోవా పేరుమీద నీవు అబద్ధాలు చెప్పావు. కావున నీవు తప్పక చనిపోవాలి!’ అని అంటారు. అతని స్వంత తల్లిదండ్రులు అతడు భవిష్య ప్రకటనలు చేసినందుకు కత్తితో పొడుస్తారు.
ZEC 13:4 అప్పుడు ప్రపక్తలు తమ దర్శనాలపట్ల, తమ ప్రకటనలపట్ల సిగ్గు చెందుతారు. తాము ప్రవక్తలమని తెలియజేసే ముతక బట్టను వారు ధరించరు. భవిష్య ప్రకటనల పేరుతో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించటానికి వారు ఆ బట్టలు ధరించరు.
ZEC 13:5 ఆ జనులు ఇలా అంటారు: ‘నేను ప్రపక్తను కాను. నేనొక వ్యవసాయదారుడను. నా చిన్నతనం నుండి నేను వ్యవసాయదారునిగానే పని చేశాను.’
ZEC 13:6 ‘అయితే నీ చేతులమీద ఈ గాయాలు ఏమిటి?’ అని ఇతరులు అడుగుతారు. అందుకతడు, ‘నా స్నేహితుని ఇంటిలో నాకు దెబ్బలు తగిలాయి’ అని అంటాడు.”
ZEC 13:7 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “ఖడ్గమా, గొర్రెల కాపరిని నరుకు! నా స్నేహితుని నరుకు! కాపరిని నరకు! గొర్రెలన్నీ పారిపోతాయి. నేను ఆ చిన్న వాటిని శిక్షిస్తాను.
ZEC 13:8 దేశ జనాభాలో మూడింట రెండు వంతులు బాధింపబడగా చని పోతారు. మూడింట ఒకవంతు బతుకుతారు.
ZEC 13:9 చని పోగా మిగిలిన వారిని నేను పరీక్షిస్తాను. వారికి నేను ఎన్నో కష్టాలు కలుగ జేస్తాను. వెండిని శుద్ధి చేయటానికి కాల్చబడే అగ్నిలా ఆ కష్టాలు పుంటాయి. ఒకడు బంగారాన్ని పరీక్ష చేసినట్లు నేను వారిని పరీక్ష చేస్తాను. అప్పుడు సహాయం కొరకు వారు నన్ను పిలుస్తారు. నేను వారికి సమాధానమిస్తాను. ‘మీరు నా ప్రజలు’ అని నేను అంటాను. అప్పుడు వారు ఇలా అంటారు: ‘యెహోవా మా దేవుడు.’”
ZEC 14:1 చూడండి. తీర్పుతీర్చటానికి యెహోవాకు ఒక రోజు ఉంది. మీరు తీసుకున్న ధనం మీ నగరంలో విభజించబడుతుండి.
ZEC 14:2 యెరూషలేము మీదికి దేశాలన్నిటినీ నేను రప్పిస్తాను. వారు నగరాన్ని పట్టు కొని ఇండ్లన్నీ నాశనం చేస్తారు. స్త్రీలు మానభంగం చేయబడతారు. జనాభాలో సగం మంది బందీలుగా పట్టుకుపోబడతారు. కాని మిగిలిన ప్రజలు నగరం నుండి తీసుకుపోబడరు.
ZEC 14:3 అప్పుడు యెహోవా ఆయా దేశాలపైకి యుద్ధానికి వెళతాడు. అది నిజమైన యుద్ధం అవుతుంది.
ZEC 14:4 ఆ సమయంలో ఆయన యెరూషలేముకు తూర్పున పున్న ఒలీవల కొండమీద నిలబడతాడు. ఒలీవల కొండ రెండుగా చీ లి పోతుంది. ఆ కొండలో ఒక భాగం ఉత్తరానికి, మరొక భాగం దక్షిణానికి తిరుగుతాయి. తూర్పు నుండి పడమటికి ఒక లోతైన లోయ ఏర్పడుతుంది.
ZEC 14:5 ఆ పర్వతలోయ మీకు మరి సన్నిహితంగా రావటంతో మీరు పారిపోవటానికి ప్రయత్నిస్తారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం పచ్చినప్పుడు మీరు పారిపోయిన రీతిగా మీరిప్పుడు పారిపోతారు. కాని నా దేవుడైన యెహోవా వస్తాడు. ఆయన యొక్క పవిత్ర జనులందరూ ఆయనతో ఉంటారు.
ZEC 14:6 అది ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజున వెలుతురుగాని, చలిగాని, మంచుగాని వుండదు. అప్పుడు పగలూ వుండదు, రాత్రీ వుండదు. అది ఎట్లాగో యెహోవా ఒక్కనికే తెలుసు. అప్పుడు మామూలుగా చీకటి పడేటప్పడు ఇంకా కొంత వెలుతురు ఉంటుంది.
ZEC 14:8 ఆ సమయంలో యెరూషలేము నుండి నీరు ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం రెండు పాయలై ఒకటి తూర్పుగా పారుతుంది. రెండవది పడమటిగా మధ్యధరా సముద్రం వైపు ప్రవహిస్తుంది. అది సంవత్సరం పొడపునా వేసవిలోను, శీతాకాలంలోను ప్రవహిస్తుంది.
ZEC 14:9 ఆ సమయంలో యెహోవా ప్రపంచానికంతటికి రాజుగా వుంటాడు. యెహోవా ఒక్కడే. ఆయనకు పేరు ఒక్కటే.
ZEC 14:10 అప్పుడు యెరూషలేము చుట్టూ వున్న ప్రాంత మంతా అరాబా ఎడారిలా నిర్మానుష్య మవుతుంది. గెబ నుండి దక్షిణాన రిమ్మోను వరకు దేశం ఎడారిలా మారిపోతుంది. కాని యెరూషలేము నగరమంతా బెన్యామీను ద్వారం నుండి మొదటి ద్వారం (మూల ద్వారం) వరకు, మరియు హనన్యేలు బురుజు నుండి రాజు యొక్క ద్రాక్ష గానుగలు వరకు మళ్లీ నిర్మింప బడుతుంది.
ZEC 14:11 నిషేధం తొలగింప బడుతుంది. ప్రజలు మళ్లీ అక్కడ ఇండ్లు కట్టుకుంటారు. యెరూషలేము సురక్షితంగా ఉంటుంది.
ZEC 14:12 కాని యెరూషలేముతో యుద్ధం చేసిన దేశాలన్నిటినీ యెహోవా శిక్షిస్తాడు. ఆ మనుష్యులకు ఒక భయంకర వ్యాధి సోకేలా ఆయన చేస్తాడు. ఆ జనులు జీవించి వుండగానే వారి శరీరాలు కుళ్లిపోవటం ప్రారంభిస్తాయి. వారి కండ్లు కనుగుంటలలోనే కుళ్లిపోతాయి. నాలుక నోటిలోనే కుళ్లనారంభిస్తుంది.
ZEC 14:13 ఆ భయంకర వ్యాధి శత్రు స్థావరంలో ప్రబలుతుంది. పైగా వారి గుర్రాలు, కంచర గాడిదలు, ఒండెలు మరియు గాడిదలు కూడ ఆ భయంకర వ్యాధికి గురియగుతాయి. ఆ సమయంలో ఆ ప్రజలు యెహోవా అంటే నిజంగా భయపడతారు. వారు ఒకరి కొకరు విరోధులై, ఒకరినొకరు పట్టుకుందురు. యూదా ప్రజలు కూడా యెరూషలేముకు విరుద్ధంగా యుద్ధం చేస్తారు. నగరం చుట్టూవున్న దేశాలనుండి వారికి ధనం లభిస్తుంది. వారికి బంగారం, వెండి, బట్టలు విస్తారంగా లభిస్తాయి.
ZEC 14:16 యెరూషలేముపై యుద్ధానికి వచ్చిన వారిలో కొంత మంది బ్రతుకుతారు. వారు ప్రతి సంవత్సరం రాజును, సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి వస్తారు. పర్ణశాలల పండుగను చేసుకోటానికి వారు వస్తారు.
ZEC 14:17 ఈ భూమి మీద ఏ వంశంవారైనా సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి యెరూషలేముకు వెళ్ళక పోయి నట్లయితే, యెహోవా వారికి వర్షాలు లేకుండా చేస్తాడు.
ZEC 14:18 ఈజిప్టు (ఐగుప్తు) నుండి ఏ వంశంవారైనా పర్ణశాలల వండుగ జరువు కొనుటకురాక పోయినట్లయితే, యెహోవా శత్రు దేశాలకు సంభవింపజేసిన ఆ భయంకర వ్యాధి వారికి సోకేలా చేస్తాడు.
ZEC 14:19 వర్ణశాలల పండుగ జరుపుకొనుటకు రానటువంటి ఈజిప్టుకు, మరి ఏ ఇతర దేశానికైనా అదే శిక్ష.
ZEC 14:20 ఆ సమయంలో ప్రతిదీ దేవునికి చెందివుంటుంది. గుర్రాల మీది జీనులకు కూడ “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాసిన చీటీలు కట్టబడతాయి. బలిపీఠం వద్ద పుంచబడిన గిన్నెలవలె యెహోవా ఆలయంలో వాడబడే పాత్రలన్నీ ప్రాము ఖ్యంగల వస్తువులే.
ZEC 14:21 వాస్తవానికి యెరూషలేము, యూదాలలో గల ప్రతి ప్రాత్రమీద “సర్వశక్రిమంతుడైన యెహోవాకు పవిత్రమైనది” అని ప్రానిన చీటి అంట బెట్టబడుతుంది. యెహోవాను ఆరాధించే ప్రతి వ్యక్తి ఆ పాత్రలలో వండి, తినగలిగినవారై ఉంటారు. ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయంలో క్రయ విక్రయాలు జరిపే వ్యాపారస్తులెప్వరూ వుండరు.
MAL 1:1 దేవుని దగ్గర్నుండి ఇది ఒక సందేశం. ఈ సందేశం యెహోవా దగ్గరనుండి వచ్చింది. ఇశ్రాయేలీయులకు ఈ సందేశాన్ని మలాకీ ఇచ్చాడు.
MAL 1:2 “ప్రజలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అన్నాడు యెహోవా. కానీ “నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావని తెలియ జేసేది ఏమిటి?” అని మీరు అన్నారు. యెహోవా చెప్పాడు: “ఏశావు యాకోబుకు సోదరుడు. కానీ నేను యాకోబును ఎన్నుకొన్నాను.
MAL 1:3 మరియు ఏశావును నేను అంగీకరించలేదు. ఏశావా యొక్క కొండ దేశాన్ని నేను నాశనం చేశాను. ఏశావు దేశం నాశనం చేయబడింది. ఇప్పుడు అక్కడ అడవి కుక్కలు మాత్రమే నివసిస్తాయి.”
MAL 1:4 ఒకవేళ ఎదోము ప్రజలు, “మేము నాశనం చేయబడ్డాం. కానీ మేము తిరిగి వెళ్లి, మా పట్టణాలు మరల కట్టుకొంటాం” అని అనవచ్చును. అయితే సర్వశక్తిమంతుడైన యెహోవా, “వారు ఆ పట్టణాలను మరల నిర్మిస్తే, నేను వాటిని మరల నాశనం చేస్తాను” అని చెపుతున్నాడు. కనుక ఎదోముదుష్ట పట్టణం అని ప్రజలు చెబుతారు. ఆ దేశాన్ని యెహోవా శాశ్వతంగా అసహ్యించుకొంటున్నాడు అని ప్రజలు చెబుతారు.
MAL 1:5 ప్రజలారా, మీరు ఈ సంగతులు చూశారు, మరియు “ఇశ్రాయేలుకు వెలుపల కూడ యెహోవా గొప్పవాడు” అని మీరు చెప్పారు.
MAL 1:6 “పిల్లలు తమ తండ్రిని గౌరవిస్తారు. సేవకులు తమ యజమానులను గౌరవిస్తారు. నేను మీ తండ్రిని. కనుక మీరెందుకు నన్ను గౌరవించరు? నేను మీ యజమానిని. అయినను నేనంటే భయభక్తులు ఎందుకు లేవు మీకు? యాజకులారా, మీరు నా పేరును అగౌరవపరుస్తున్నారు” అని సర్వశక్తిమంతుడైన యెహోవా అన్నాడు. కాని మీరు, “మేము నీ పేరును అగౌరవపరచామని చూపించడానికి మేము ఏమి చేశాం?” అని అంటారు.
MAL 1:7 “పాడై పోయిన రొట్టెను మీరు నా బలిపీఠం దగ్గరకు తీసికొని వస్తారు” (అని యెహోవా చెప్పాడు.) కానీ మీరు “ఆ రొట్టెను ఏది పాడు చేస్తుంది?” అని అంటారు. (యెహోవా చెప్పాడు,) “నా బల్లను మీరు గౌర వించరు.
MAL 1:8 గుడ్డి జంతువులను బలిగా మీరు తీసికొని వస్తారు. అది తప్పు! బలి అర్పణల కోసం కుంటి మరియు జబ్బు జంతువులను మీరు తీసికొని వస్తారు. మరి అదీ తప్పు. ఆ జబ్బు జంతువులను మీ దేశాధికారికి ఇచ్చి చూడండి. ఆ జబ్బు జంతువులను అతడు కానుకలుగా స్వీకరిస్తాడా? లేదు! ఆ కానుకలు అతడు అంగీకరించడు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
MAL 1:9 “యాజకులారా! యెహోవా మా యెడల దయగలిగి ఉండాలని మీరు ఆయనను అడగాలి. కాని ఆయన మీ మాట వినడు. మరి ఆ తప్పు అంతా మీదే”. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
MAL 1:10 “కనీసం, మీ యాజకుల్లో కొందరు దేవాలయం తలుపులు మూయపచ్చు, హోమాలు సరిగ్గా వెలిగించవచ్చు. మీ విషయం నాకు సంతోషంగా లేదు. నేను మీ కానుకలు అంగీకరించను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు చెప్పాడు.
MAL 1:11 “ప్రపంచం అంతటా మనుష్యులు నన్ను గౌరవిస్తారు. ప్రపంచం అంతటా మనుష్యులు నాకు మంచి కానుకలు అర్పిస్తారు. నాకు కానుకగా వారు మంచి సాంబ్రాణి ధూపం వేస్తారు. ఎందుకంటే, ఆ మనుష్యులందరికీ నా పేరు ముఖ్యం గనుక.” సర్వశక్తి మంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
MAL 1:12 “కానీ మీరు మాత్రం నా పేరు అంటే మీకు గౌరవం లేదని చూపించారు. యెహోవా బల్ల మలినంగా ఉందని మీరు అంటారు.
MAL 1:13 ఆ బల్లమీది భోజనం మీకు ఇష్టంలేదు. ఆ భోజనాన్ని మీరు వాసన చూచి, తినుటకు నిరాకరిస్తారు. అది చెడిపోయిందని మీరు చెబుతారు. కానీ అది సత్యం కాదు. ఆ తర్వాత జబ్బువి, కుంటివి, గాయపర్చబడిన జంతువులను మీరు నాకోసం తెస్తారు. జబ్బు జంతువులను నాకు బలి అర్పణలుగా ఇచ్చేందుకు మీరు ప్రయత్నిస్తారు. కానీ మీ వద్దనుండి ఆ జబ్బు జంతువులను నేను అంగీకరించను.
MAL 1:14 కొంతమంది దగ్గర వారు బలి అర్పణలుగా ఇవ్వగలిగిన మంచి మగ జంతువులు ఉన్నాయి. కానీ ఆ మంచి జంతువులను వారు నాకు ఇవ్వరు. కొంత మంది మంచి జంతువులను నాకోసం తీసికొని వస్తారు. ఆరోగ్యంగా ఉన్న ఆ జంతువులను నాకు ఇస్తాం అనివారు వాగ్దానం చేస్తారు. కానీ వారు ఆ మంచి జంతువులను రహస్యంగా మార్చివేసి, జబ్బు జంతువులను నాకు ఇస్తారు. ఆ మనుష్యులకు చెడు సంగతులు సంభవిస్తాయి. నేను మహారాజును. మీరు నాయెడల భయభక్తులు కలిగి ఉండాలి. ప్రపంచం అంతటా ప్రజలు నాయందు భయభక్తులు కలిగి ఉంటారు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
MAL 2:1 “యాజకులారా, ఈ నియమం మీ కోసమే! నా మాట వినండి! నేను చెప్పే మాటలు గమనించండి! నా పేరును మీరు గౌరవించాలి.
MAL 2:2 మీరు నా పేరును గౌరవించకపోతే, అప్పుడు మీకు చెడు విషయాలు సంభవిస్తాయి. మీరు ఆశీర్వాదాలు చెప్పగా అవి శాపనార్థాలు అవుతాయి. మీరు నా పేరు అంటే గౌరవం చూపడం లేదు గనుక కీడులు సంభవించేటట్టు నేను చేస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
MAL 2:3 “చూడండి, మీ సంతతివారిని నేను శిక్షిస్తాను. పవిత్ర దినాల్లో, యాజకులారా, మీరు నాకు బలులు అర్పిస్తారు. చచ్చిన జంతువుల్లో నుండి పేడ, పేగులు మీరు తీసి, వాటిని పారవేస్తారు. కానీ నేను ఆ పేడను మీ ముఖాలకు పులిమివేస్తాను, మరియు దానితోపాటుమీరు విసరివేయబడుతారు!
MAL 2:4 అప్పుడు ఈ ఆజ్ఞను నేను ఎందుకోసం మీకు ఇచ్చానో అది మీరు నేర్చు కొంటారు. లేవీతో నా ఒడంబడిక కొన సాగాలని నేను ఈ విషయాలు మీతో చెపుతున్నాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
MAL 2:5 [యెహోవా చెప్పాడు,] “లేవీతో ఆ ఒడంబడిక నేను చేశాను. అతనికి జీవం-శాంతి ఇస్తానని నేను వాగ్దానం చేశాను-మరియు నేను వాటిని అతనికి ఇచ్చాను! లేవీ నేనంటే భయభక్తులు చూపాడు! అతడు నా పేరుకు గౌరవం చూపించాడు!
MAL 2:6 లేవీ సత్య ప్రబోధాలు నేర్పించాడు. లేవీ అబద్ధాలు నేర్పించలేదు. లేవీ నిజాయితీపరుడు, అతడు శాంతిని ప్రేమించాడు. లేవీ నన్ను అనుసరించి, అనేకమంది తాము చేసిన చెడ్డ పనుల కోసం శిక్షింపబడకుండా వారిని అతడు రక్షించాడు.
MAL 2:7 ప్రతి యాజకుడూ దేవుని ప్రబోధాలు ఎరిగి ఉండాలి. ప్రజలు ఒక యాజకుని దగ్గరకు వెళ్లి, దేవుని ప్రబోధాలను అతని వద్ద నేర్చుకోగలిగి ఉండాలి. యాజకుడు ప్రజలకు దేవుని సందేశకునిగా ఉండాలి.”
MAL 2:8 (యెహోవా చెప్పాడు,) “యాజకులారా, మీరు నన్ను అనుసరించటం మానివేశారు! మనుష్యులచేత చెడు చేయించటానికి ఆ ప్రబోధాలు మీరు వినియోగించుకొన్నారు. లేవీతోటి ఒడంబడికను మీరు భగ్నం చేశారు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
MAL 2:9 “నేను మీతో చెప్పిన విధంగా మీరు జీవించరు! మీరు నా ప్రబోధాలు అంగీకరించలేదు! కనుక నేను మిమ్మల్ని ప్రాముఖ్యం లేనివారినిగా చేస్తాను. ప్రజలు మిమ్మల్ని బహిష్కరిస్తారు!”
MAL 2:10 మన అందరికీ ఒకే తండ్రి ఉన్నాడు (దేవుడు). ఆ దేవుడే మనలో ప్రతి ఒక్కరినీ చేశాడు! కనుక ప్రజలు ఎందుకు వారి సోదరులను మోసం చేస్తున్నారు? ఆ ప్రజలు ఒడంబడికను సన్మానించటం ెలేదని వ్యక్తం చేస్తున్నారు. మన పూర్వీకులు దేవునితో చేసుకున్న ఒడంబడికను వారు గౌరవించరు.
MAL 2:11 యూదా మనుష్యులు ఇతరులను మోసం చేశారు. యెరూషలేములో, ఇశ్రాయేలులో ప్రజలు భయంకర విషయాలు జరిపించారు. యూదాలో ప్రజలు యెహోవా పవిత్ర ఆలయాన్ని గౌరవించలేదు. ఆ స్థలం దేవునికి ఇష్టమైనది! యూదా ప్రజలు ఆ విదేశీ దేవతను పూజించటం మొదలు పెట్టారు.
MAL 2:12 యెహోవా ఆ మనుష్యులను యూదా వంశంలోనుండి తొలగించివేస్తాడు. ఆ ప్రజలు యెహోవాకు కానుకలు తీసికొని రావచ్చుగాక, కానీ అది సహాయ పడదు.
MAL 2:13 నీవు ఏడ్చి, యెహోవా బలిపీఠాన్ని కన్నీళ్ళతో నింపవచ్చు, కానీ యెహోవా నీ కానుకలు అంగీకరించడు. నీవు ఆయనకోసం తెచ్చే వస్తువులతో యెహోవా సంతోషించడు.
MAL 2:14 “మా కానుకలను యెహోవా ఎందుచేత అంగీ కరించలేదు?” అని మీరు అడుగుతారు. ఎందుకంటే మీరు చేసిన చెడుకార్యాలు యెహోవా చూశాడు, మీకు విరుద్ధంగా ఆయనే సాక్షి. నీవు నీ భార్యను మోసం చేయటం ఆయన చూశాడు. నీవు యువకునిగా ఉన్నప్పుడే నీవు ఆ స్త్రీకి వివాహం చేయబడ్డావు. ఆమె నీ స్నేహితురాలు. తర్వాత మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసికొన్నారు-ఆమె మీకు భార్య అయింది. కానీ నీవు ఆమెను మోసం చేసావు.
MAL 2:15 భర్తలు, భార్యలు ఒకే శరీరం, ఒకే ఆత్మ కావాలని దేవుడు కోరుచున్నాడు. ఎందుకంటే, వారికి పవిత్రమైన పిల్లలు ఉండాలని. అందుచేత ఆత్మ పరమైన ఆ ఐక్యతను కాపాడుకోండి. మీ భార్యను మోసం చేయవద్దు. నీవు యువకునిగా ఉన్నప్పటి నుండి ఆమె నీకు భార్యగా ఉంది.
MAL 2:16 “విడాకులు అంటే నాకు అసహ్యం. మరియు పురుషులు తమ భార్యలయెడల చేసే కృరమైన పనులు నాకు అసహ్యం. అందుచేత మీ ఆత్మపరమైన ఐక్యాన్ని కాపాడుకోండి. నీ భార్యను మోసం చేయవద్దు” అని ఇశ్రయేలీయుల దేవుడైన యెహోవా చెపుతున్నాడు.
MAL 2:17 మీరు తప్పుడు విషయాలు నేర్పించారు. ఆ తప్పుడు ప్రబోధాలు యెహోవాకు చాలా విచారం కలిగించాయి. చెడుకార్యాలు చేసే వారంటే దేవునికి ఇష్టం అని మీరు ప్రబోధించారు. అలాంటివారే మంచివాళ్లని దేవుడు తలుస్తాడు అని మీరు ప్రబోధించారు. చెడుకార్యాలు చేసినందుకు దేవుడు శిక్షించడు అని మీరు ప్రబోధం చేశారు.
MAL 3:1 “చూడండి, నేను నా సందేశకుని పంపిస్తున్నాను. అతడు నా కోసం మార్గం సిద్ధం చేస్తాడు. అకస్మాత్తుగా మీరు ఎదురుచూచే యజమాని తన ఆలయంలోనికి వచ్చేస్తాడు. అవును, మీరు కోరుతున్న కొత్త ఒడంబడిక దూత నిజంగా వస్తున్నాడు! సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
MAL 3:2 “ఆ సమయాన్ని ఏ వ్యక్తి ఆపలేడు. ఆయన వచ్చినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎవ్వరూ నిల బడలేరు. ఆయన మండుతున్న అగ్నిలా ఉంటాడు. ప్రజలు వస్తువులను శుభ్రం చేయుటకు ఉపయోగించే శక్తివంతమైన సబ్బులా ఆయన ఉంటాడు.
MAL 3:3 ఆయన లేవీ ప్రజలను శుభ్ర పరుస్తాడు. అగ్నిచేత వెండి శుద్ధి చేయబడినట్టు ఆయన వారిని శుద్ధి చేస్తాడు. స్వచ్ఛమైన బంగారంలా, వెండిలా ఆయన వారిని చేస్తాడు. అప్పుడు వారు యెహోవాకు కానుకలు తీసికొని వస్తారు-వాటిని సరైన పద్ధతిలో వారు చేస్తారు.
MAL 3:4 అప్పడు యూదా నుండి, యెరూషలేము నుండి కానుకలను యెహోవా స్వీకరిస్తాడు. అది గతంలో ఉన్నట్టుగా ఉంటుంది. అది చాలకాలం కిందట ఉన్నట్టుగా ఉంటుంది.
MAL 3:5 అప్పడు నేను మీ దగ్గరకు వస్తాను. మరియు సరైనది నేను చేస్తాను. ప్రజలు చేసిన చెడుకార్యాలను గూర్చి న్యాయమూర్తితో చెప్పటానికి సిద్ధంగా ఉన్న మనిషిలా నేను ఉంటాను. కొంత మంది మాయమంత్రాలు చేస్తారు. కొంతమంది వ్యభిచార పాపం చేస్తారు. కొంతమంది బూటకపు వాగ్దానాలు చెస్తారు కొంతమంది తమ పనివారిని మోసం చేస్తరు. వారు వాగ్దానం చేసిన డబ్బును వారు చెల్లించరు. విధవలకు, అనాథ బాలబాలికలకు ప్రజలు సహాయం చేయరు. విదేశీయులకు ప్రజలు సహాయం చేయరు. ప్రజలు నన్ను గౌరవించరు!”సర్వశక్తిమంతుడైన యెహోవా ఈవిషయాలు చెప్పాడు.
MAL 3:6 “నేను యెహోవాను, నేను మారను. మీరు యాకోబు పిల్లలు, మరియు మీరు పూర్తిగా నాశనం చేయబడలేదు.
MAL 3:7 కానీ మీరు ఎన్నడూ నా ఆజ్ఞలకు విధేయులు కాలేదు. చివరికి మీ వూర్వీకులు కూడా నన్ను అనుసరించటం మానివేశారు. తిరిగి నా దగ్గరకు రండి, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను.” సర్వశక్తి మంతుడైన యెహోవా ఈవిషయాలు చెప్పాడు. “మేము ఎలా తిరిగి వెనుకకు రాగలం?”అని మీరు అంటారు.
MAL 3:8 దేవుని దగ్గర వస్తువులు దొంగిలించటం మానివేయండి! మనుష్యులు దేవుని దగ్గ ర వస్తువులు దొంగిలించకూడదు. కానీ మీరు నా దగ్గర వస్తువులు దొంగిలించారు! “నీ దగ్గర మేము ఏమి దొంగిలించాం?” అని మీరు అంటారు. “మీ వస్తువుల్లో పదోవంతు మీరు నాకు ఇచ్చి ఉండాల్సింది. మీరు నాకు ప్రత్యేక కానుకలు ఇచ్చి ఉండాల్సింది. కానీ మీరు నాకు వాటిని ఇవ్వలేదు.
MAL 3:9 ఈ విధంగా మీ రాజ్యం మొత్తం అందరూ నా దగ్గర దొంగిలించారు. కనుక మీకు చె డు విషయాలు సంభవిస్తున్నాయి.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
MAL 3:10 సర్వశక్తిమంతుడైన యెహోవా అంటున్నాడు, “ఈ పరీక్షలో ప్రయత్నించండి. మీకు ఉన్నవాటిలో పదో భాగం నా దగ్గరకు తీసికొని రండి. వాటిని ధనా గారంలో ఉంచండి. నా మందిరానికి ఆహారం తీసికొనిరండి. నన్ను పరీక్షించండి! మీరు ఆ పనులు చేస్తే, అప్పుడు నేను నిజంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆకాశం నుండి వర్షం కురిసినట్టు, మంచి మంచి విషయాలు మీకు లభిస్తాయి. మీకు సమస్తం, కావలసిన దానికంటె ఎక్కువగా ఉంటాయి.
MAL 3:11 నేను చీడ పురుగులు మీ పంటలను తినివేయనియ్యను. మీ ద్రాక్షాపల్లులు అన్నీ ద్రాక్షాపండ్లు ఫలిస్తాయి.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
MAL 3:12 “ఇతర రాజ్యాల ప్రజలు మీ యెజల దయగలిగి ఉంటారు. నిజంగా మీకు ఒక అద్భుత దేశం ఉంటుంది.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
MAL 3:13 “మీరు నన్ను గూర్చి నీచ విషయాలు చెప్పారు” అని యెహోవా అంటున్నాడు. కానీ “నిన్ను గూర్చి మేము ఏమి చెప్పాం?”అని మీరు అంటారు.
MAL 3:14 “యెహోవాను ఆరాధించటం వ్యర్థం. యెహోవా మాకు చెప్పిన వాటిని మేము చేసాంగాని మాకు లాభం ఏమీ కలుగలేదు. సమాధి దగ్గర మనుష్యులు ఏడ్చినట్టు, మేము మా పాపాల విషయంలో బాధపడ్డాం. కానీ దానివల్ల లాభం లేదు.
MAL 3:15 గర్విష్ఠులు సంతోషంగా ఉన్నారని మేము అను కొంటున్నాం. దుర్మార్గులే అభివృద్ధి చెందుతున్నారు. వారు దేవుని సహనం పరీక్షించుటకు చెడు వనులు చేస్తారు-దేవుడు వారిని శిక్షించడు అని మీరు చెప్పారు”.
MAL 3:16 దేవుని అనుచరులు ఒకరితో ఒకరు మాట్టాడారు-అది యెహోవా విన్నాడు. ఆయన ఎదుట ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో దేవుని అనుచరుల పేర్లు ఉన్నాయి. వారు యెహోవా పేరును గౌరవించేవారు.
MAL 3:17 ఆ ప్రజలు నాకు చెందినవాళ్లు. నేను వారికి దయ చూవుతాను. ఒక మనిషి అతనికి విధేయులయ్యే పిల్లల యెడల చాలా దయగలిగి ఉంటాడు. అదే విధంగా,నేను నా అనుచరులయెడల దయగలిగి ఉంటాను.
MAL 3:18 ప్రజలారా, మీరు తిరిగి నా దగ్గరకు వస్తారు. మరియు మంచికి చెడుకు గల భేదం మీరు నేర్చు కొంటారు. దేవుని అనుసరించే మనిషికి, దేవుని అనుసరించని మనిషికి వ్యత్యాసం మీరు నేర్చుకొంటారు అని యెహోవా చెప్పాడు.
MAL 4:1 “తీర్పు సమయం వస్తుంది. అది కాలుతున్న అగ్ని గుండంలా ఉంటుంది. ఆ గర్విష్ఠులు అందరూ శిక్షించబడతారు. ఆ దుర్మార్గులు అందరూ గడ్డిలా కాలిపోతారు. ఆ సమయంలో వారు అగ్నిలో మండుతున్న ఒక పొదలా ఉంటారు-దాని కొమ్మగాని వేరుగాని మిగలదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
MAL 4:2 “అయితే నా అనుచరులారా, ఉదయిస్తున్న సూర్యునిలా, మంచితనం మీమీద ప్రకాశిస్తుంది. మరియు సూర్యకిరణాలవలె అది స్వస్థతా శక్తిని తెచ్చి పెడ్తుంది. పాక నుండి విడిచిపెట్టబడిన దూడల్లా, మీరు స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటారు.
MAL 4:3 అప్పుడు మీరు ఆ దుర్మార్గుల మీద సడుస్తారు-వారు మీ పాదాలకింద బూడిదలా ఉంటారు. తీర్పు సమయంలో ఆ సంగతులను నేను సంభవింపజేస్తాను.” సర్వశక్తి మంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
MAL 4:4 “మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం ఉంచుకొని, విధేయత చూపండి. మోషే నా సేవకుడు. హోరేబు (సీనాయి) కొండమీద ఇశ్రాయేలీయులందరి కోసం ఆ చట్టాలు, నియమాలు నేను అతనికి ఇచ్చాను.”
MAL 4:5 “చూడండి, ఏలీయా ప్రవక్తను నేను మీ దగ్గరకు వంపిస్తాను. యెహోవా నుంచి వచ్చే ఆ మహాభయంకర తీర్పు సమయానికి ముందు ఆయన వస్తాడు.
MAL 4:6 తల్లిదండ్రులు వారి పిల్లలకు సన్నిహితులగుటకు ఏలీయా సహాయం చేస్తాడు. మరియు అతడు (ఏలీయా) పిల్లలు వారి తల్లిదండ్రులకు సన్నిహితులగుటకు సహాయం చేస్తాడు. ఇది జరిగి తీరాలి. లేదా నేను వచ్చి, మీ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తాను,” అని యెహోవా చెప్పాడు!
MAT 1:1 యేసు క్రీస్తు వంశక్రమము: ఈయన దావీదు మరియు అబ్రాహాము వంశానికి చెందినవాడు.
MAT 1:2 అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారులు యూదా మరియు అతని సహోదరులు.
MAT 1:3 యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. (పెరెసు, జెరహుల తల్లి తామారు.) పెరెసు కుమారుడు ఎస్రోము ఎస్రోము కుమారుడు అరాము
MAT 1:4 అరాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మా
MAT 1:5 శల్మా కుమారుడు బోయజు. (బోయజు తల్లి రాహాబు.) బోయజు కుమారుడు ఓబేదు. (ఓబేదు తల్లి రూతు.) ఓబేదు కుమారుడు యెష్షయి.
MAT 1:6 యెష్షయి కుమారుడు రాజు దావీదు. దావీదు కుమారుడు సొలొమోను. (సొలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య.)
MAT 1:7 సొలొమోను కుమారుడు రెహబాము. రెహబాము కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా.
MAT 1:8 ఆసా కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు ఉజ్జియా.
MAT 1:9 ఉజ్జియా కుమారుడు యోతాము. యోతాము కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా.
MAT 1:10 హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు ఆమోసు. ఆమోసు కుమారుడు యోషీయా.
MAT 1:11 యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు.
MAT 1:12 బబులోను నగరానికి కొనిపోబడిన తరువాతి వంశ క్రమము: యెకొన్యా కుమారుడు షయల్తీయేలు. షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.
MAT 1:13 జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు. అబీహూదు కుమారుడు ఎల్యాకీము. ఎల్యాకీము కుమారుడు అజోరు.
MAT 1:14 అజోరు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు ఆకీము. ఆకీము కుమారుడు ఎలీహూదు.
MAT 1:15 ఎలీహూదు కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు మత్తాను. మత్తాను కుమారుడు యాకోబు.
MAT 1:16 యాకోబు కుమారుడు యోసేపు. యోసేపు భార్య మరియ. మరియ కుమారుడు యేసు. ఈయన్ని క్రీస్తు అంటారు.
MAT 1:17 అంటే అబ్రాహాము కాలం నుండి దావీదు కాలం వరకు మొత్తం పదునాలుగు తరాలు. దావీదు కాలం నుండి బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడిన కాలం వరకు పదునాలుగు తరాలు. అలా కొనిపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు పదునాలుగు తరాలు.
MAT 1:18 యేసు క్రీస్తు జననం ఇలా సంభవించింది: యేసు క్రీస్తు తల్లి మరియకు, యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది. వివాహంకాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది.
MAT 1:19 కాని ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు అమెను నలుగురిలో అవమాన పరచదలచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనస్సులో అనుకొన్నాడు.
MAT 1:20 అతడీవిధంగా అనుకొన్న తర్వాత, దేవదూత అతనికి కలలో కనిపించి, “యోసేపూ, దావీదు కుమారుడా, మరియ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది. కనుక ఆమెను భార్యగా స్వీకరించటానికి భయపడకు.
MAT 1:21 ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాలనుండి రక్షిస్తాడు. కనుక ఆయనకు ‘యేసు’ అని పేరు పెట్టు” అని అన్నాడు.
MAT 1:22 ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు: “కన్యక గర్భవతియై మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళాయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు” ఇది నిజం కావటానికే ఇలా జరిగింది.
MAT 1:24 యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేసాడు. మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు.
MAT 1:25 కాని, ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు ఆ బాలునికి “యేసు” అని నామకరణం చేసాడు.
MAT 2:1 హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బేత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశనుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి
MAT 2:2 “యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము” అని అన్నారు.
MAT 2:3 ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడ కలవరపడ్డారు.
MAT 2:4 అతడు ప్రధానయాజకుల్ని, పండితుల్ని సమావేశపరచి, “క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు?” అని అడిగాడు.
MAT 2:5 వాళ్ళు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని సమాధానం చెప్పారు. దీన్ని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాసాడు:
MAT 2:6 “‘యూదయ దేశంలోని బేత్లెహేమా! నీవు యూదయ పాలకులకన్నా తక్కువేమీ కాదు! ఎందుకంటే, నీ నుండి ఒక పాలకుడు వస్తాడు. ఆయన నా ప్రజల, అంటే ఇశ్రాయేలు ప్రజల, కాపరిగా ఉంటాడు.’”
MAT 2:7 ఆ తర్వాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరియైన సమయం వాళ్ళనడిగి తెలుసుకొన్నాడు.
MAT 2:8 వాళ్ళను బేత్లెహేముకు పంపుతూ, “వెళ్ళి, ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి. ఆ శిశువును కనుక్కొన్నాక నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను” అని అన్నాడు.
MAT 2:9 వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపొయ్యారు. వాళ్ళు తూర్పు దిశన చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళ్ళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది.
MAT 2:10 వాళ్ళా నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు.
MAT 2:11 ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూసారు. వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తర్వాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోళం బహూకరించారు.
MAT 2:12 హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు.
MAT 2:13 వాళ్ళు వెళ్ళిపొయ్యాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, “లెమ్ము! తప్పించుకొని తల్లీబిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు! హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకనున్నాడు. కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు” అని అన్నాడు.
MAT 2:14 యోసేపు లేచి తల్లీ బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు.
MAT 2:15 యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండి పొయ్యాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా, “నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తాను” అని అన్న మాట నిజమైంది.
MAT 2:16 జ్ఞానులు తనను మోసం చేసారని గ్రహించి హేరోదు కోపంతో మండిపొయ్యాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ననుసరించి బేత్లేహేములో, దాని పరిసర ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, లేక అంతకన్నా తక్కువ వయస్సుగల బాలురనందర్ని చంపివేయమని ఆజ్ఞాపించాడు.
MAT 2:17 తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది:
MAT 2:18 “రామా గ్రామంలో అతి దుఃఖంతో ఏడుస్తున్న స్వరం వినిపించింది. రాహేలు తన సంతానం కొఱకు ఏడ్చింది. ఎవరు ఓదార్చిన వినలేదు. ఆమె సంతానంలో ఎవ్వరూ మిగల్లేదు.”
MAT 2:19 హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి,
MAT 2:20 “లెమ్ము! శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు. కనుక తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు” అని అన్నాడు.
MAT 2:21 అందువల్ల యోసేపు లేచి తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు.
MAT 2:22 కాని, యూదయ దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కెలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళటానికి భయపడిపొయ్యాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభువు హెచ్చరించటంవల్ల అతడు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపొయ్యాడు.
MAT 2:23 అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించాడు. తద్వారా, ఆయన నజరేతు నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి.
MAT 3:1 బాప్తిస్మము యిచ్చే యోహాను, ఆ కాలంలో యూదయ దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండేవాడు.
MAT 3:2 అతడు, “దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించాడు.
MAT 3:3 ఇతణ్ణి గురించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పాడు: “‘ప్రభువు మార్గాన్ని సిద్ధం చెయ్యమని, తిన్నని మార్గాన్ని వెయ్యమని’ ఎడారిలో ఒక గొంతు ఎలుగెత్తి పలికింది.”
MAT 3:4 యోహాను ఒంటె వెంట్రుకలతో చెయ్యబడిన వస్త్రాల్ని ధరించి, నడుముకు తోలు దట్టి కట్టుకొని, మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు.
MAT 3:5 యెరూషలేము నుండి, యూదయ దేశము నుండి యోర్దాను నదీ ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు అతని దగ్గరకు వెళ్ళి,
MAT 3:6 తాము చేసిన పాపాల్ని ఒప్పుకొనే వాళ్ళు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మమునిచ్చేవాడు.
MAT 3:7 పరిసయ్యులు సద్దూకయ్యులు యోహాను బాప్తిస్మమునిస్తున్న ప్రాంతానికి వచ్చారు. అతడు వాళ్ళను చూసి, “మీరు సర్పసంతానం. దేవుని కోపం నుండి తప్పించుకొనుటకు మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
MAT 3:8 మీరు మారుమనస్సు పొందినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి.
MAT 3:9 ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు గర్వించకండి. ఈ రాళ్ళ నుండి దేవుడు అబ్రాహాముకు సంతానాన్ని సృష్టించ గలడని నేను చెబుతున్నాను.
MAT 3:10 చెట్ల వేర్ల మీద గొడ్డలి సిద్ధంగా ఉంది. దేవుడు మంచి ఫలమివ్వని చెట్లను నరికి మంటల్లోకి వేస్తాడు.
MAT 3:11 “మీరు మారుమనస్సు పొందారు కనుక నేను మీకు బాప్తిస్మము నిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నా కన్నా శక్తి కలవాడు! ఆయన చెప్పుల్ని మోయటానికి కూడా నేను తగను. ఆయన మీకు పవిత్రాత్మతో, అగ్నితో, బాప్తిస్మము నిస్తాడు.
MAT 3:12 తూర్పార బట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును శుభ్రం చేసి తన గోధుమల్ని ధాన్యపు కొట్టులో వేసుకొంటాడు. పొట్టును ఆరని మంటల్లో వేసి కాలుస్తాడు” అని అన్నాడు.
MAT 3:13 గలిలయ నుండి యేసు యోహాను ద్వారా బాప్తిస్మము పొందటానికి యొర్దాను నదీ ప్రాంతానికి వచ్చాడు.
MAT 3:14 కాని యోహాను ఆయనతో, “నీ ద్వారా నేను బాప్తిస్మము పొందాలి కాని, నీవు నా ద్వారా బాప్తిస్మము పొందటానికి రావటమా?” అని అంటూ యేసును ఆపటానికి ప్రయత్నించాడు.
MAT 3:15 యేసు సమాధానంగా, “ప్రస్తుతానికి ఇది జరుగనివ్వుము. నీతిని నిలబెట్టటానికి మనమిలా చెయ్యటం సమంజసమే!” అని అన్నాడు. దీనికి యోహాను అంగీకరించాడు.
MAT 3:16 యేసు బాప్తిస్మము పొంది, నీళ్ళ నుండి వెలుపలికి రాగానే అదే క్షణంలో ఆకాశం తెరుచుకొంది. దేవుని ఆత్మ ఒక పాపురంలాగ తన మీదికి రావటం యేసు చూసాడు.
MAT 3:17 పరలోకంనుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు. ఇతని పట్ల నాకెంతో ఆనందం” అని అన్నది.
MAT 4:1 ఆ తర్వాత సైతాను కలిగించే పరీక్షల్ని ఎదుర్కోవాలని పవిత్రాత్మ యేసును ఎడారి ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు.
MAT 4:2 అక్కడ యేసు నలభై రోజులు ఉపవాసం చేసాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.
MAT 4:3 సైతాను ఆయన దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు” అని అన్నాడు.
MAT 4:4 యేసు సమాధానంగా, “‘మనుష్యులను బ్రతికించేది కేవలం ఆహారం మాత్రమే కాదు. కాని దేవుడు పలికిన ప్రతి మాటవలన బ్రతకగలడు’ అని వ్రాసారు” అని అన్నాడు.
MAT 4:5 ఆ తర్వాత సైతాను ఆయన్ని పవిత్ర నగరానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ దేవాలయం మీది ఒక ఎత్తైన స్థలంపై నిలుచో బెట్టి,
MAT 4:6 “నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఎందుకంటే, ‘నీకు సహాయం చెయ్యమని, దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు వచ్చి నీ పాదం ఏ రాయికీ తగలకుండా నిన్ను తమ హస్తాలతో ఎత్తి పట్టుకొంటారు,’ అని వ్రాసివుంది కదా!” అని అన్నాడు.
MAT 4:7 యేసు వానితో, “‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు!’ అని కూడా వ్రాసి వుంది” అని అన్నాడు.
MAT 4:8 సైతాను ఆయన్ని ఎత్తైన ఒక పర్వతం మీదికి తీసుకు వెళ్ళి ఆయనకు ప్రపంచంలోని రాజ్యాలను, వాటి వైభవాన్ని చూపి,
MAT 4:9 “నీవు నా ముందు మోకరిల్లి నన్ను పూజిస్తే వీటన్నిటిని నీకిస్తాను” అని అన్నాడు.
MAT 4:10 యేసు: “సైతానా! నా ముందునుండి వెళ్ళిపో! ఎందుకంటే ‘నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన సేవ మాత్రమే చెయ్యాలి!’ అని కూడా వ్రాసి ఉంది” అని అన్నాడు.
MAT 4:11 అప్పుడు సైతాను ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యాడు. తర్వాత దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసారు.
MAT 4:12 యోహాను కారాగారంలో ఉన్నాడని విని యేసు గలిలయకు తిరిగి వచ్చాడు.
MAT 4:13 ఆయన నజరేతును వదిలి, అక్కడి నుండి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళి అక్కడ నివసించాడు. కపెర్నహూము, జెబూలూను మరియు నఫ్తాలి ప్రాంతంలోని సరస్సు ఒడ్డున ఉంది.
MAT 4:14 ఈయన ఇలా చెయ్యటం వల్ల దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన విషయాలు నిజమయ్యాయి. యెషయా ప్రవక్త ఈ విధంగా అన్నాడు:
MAT 4:15 “జెబూలూను ప్రాంతమా! నఫ్తాలి ప్రాంతమా! సముద్రం ప్రక్కన ఉన్న ఓ జనమా! యొర్దాను నదికి అవతలి వైపుననున్న ప్రదేశమా! యూదులుకాని వాళ్ళు నివసించే ఓ గలిలయా!
MAT 4:16 చీకట్లో నివసిస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూసారు! మృత్యుఛాయలు పడే ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై వెలుగు ప్రకాశించింది.”
MAT 4:17 ఆ నాటి నుండి యేసు, “దేవుని రాజ్యం దగ్గర లోనే వుంది. కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించటం మొదలు పెట్టాడు.
MAT 4:18 యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ పేతురు అని పిలువబడే సీమోనును, అతని సోదరుడు అంద్రెయను చూశాడు. ఈ సోదరులు చేపలు పట్టేవారు. వాళ్ళు అప్పుడు నీళ్ళల్లో వల వేస్తూ ఉన్నారు.
MAT 4:19 యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి! మీరు మనుష్యుల్ని పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు.
MAT 4:20 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు.
MAT 4:21 యేసు అక్కడ నుండి వెళ్తూ మరో యిద్దర్ని చూశాడు. వాళ్ళు కూడా సోదరులు. ఒకని పేరు యాకోబు, మరొకని పేరు యోహాను. తండ్రి పేరు జెబెదయి. ఆ సోదరులు తమ తండ్రితో కలసి పడవలో కూర్చొని వలను సరిచేసుకొంటూ ఉన్నారు. యేసు వాళ్ళను పిలిచాడు.
MAT 4:22 వాళ్ళు వెంటనే పడవను, తమ తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు.
MAT 4:23 యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ గలిలయ ప్రాంతమంతా పర్యటించాడు. ఆయన ప్రతి రోగిని, బాధపడ్తున్న ప్రతి వ్యక్తిని బాగు చేసాడు.
MAT 4:24 ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపిస్తూవుండింది. ప్రజలు రకరకాల రోగాలు ఉన్నవాళ్ళను, బాధ పడ్తున్న వాళ్ళను, దయ్యాలు పట్టిన వాళ్ళను, మూర్చరోగుల్ని, పక్షవాత రోగుల్ని, ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. ఆయన వాళ్ళను నయం చేశాడు.
MAT 4:25 గలిలయ నుండి, దెకపొలి నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దాను నది అవతలి వైపుననున్న ప్రాంతాల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు.
MAT 5:1 యేసు ప్రజా సమూహాల్ని చూసి ఒక కొండ మీదికి వెళ్ళి కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వెళ్ళారు.
MAT 5:2 యేసు ఈ విధంగా ఉపదేశించటం మొదలు పెట్టాడు:
MAT 5:3 “ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్ళదే దేవుని రాజ్యం. కనుక వాళ్ళు ధన్యులు.
MAT 5:4 దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు. కనుక వాళ్ళు ధన్యులు.
MAT 5:5 నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులౌతారు. కనుక వాళ్ళు ధన్యులు.
MAT 5:6 అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడే వాళ్ళకు ప్రతిఫలం దొరకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు.
MAT 5:7 దయగల వాళ్ళకు దేవుని దయ దొరుకుతుంది. కనుక వాళ్ళు ధన్యులు.
MAT 5:8 శుద్ధ హృదయం కలవాళ్ళు దేవుణ్ణి చూస్తారు. కనుక వాళ్ళు ధన్యులు.
MAT 5:9 శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు. కనుక శాంతి స్థాపకులు ధన్యులు.
MAT 5:10 నీతి కోసం హింసల్ని అనుభవించిన వాళ్ళదే దేవుని రాజ్యం. కనుక వాళ్ళు ధన్యులు.
MAT 5:11 “నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే లేక హింసిస్తే లేక అన్యాయంగా చెడు మాటలు పలికితే, మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడ హింసించారు.
MAT 5:13 “మీరు ఈ ప్రపంచానికి ఉప్పులాంటి వాళ్ళు, కాని ఉప్పులోవున్న ఉప్పు గుణం పోతే మళ్ళీ దాన్ని ఉప్పుగా ఎలా చెయ్యగలం? అది దేనికీ పనికి రాకుండా పోతుంది. అంతేకాక, దాన్ని పార వేయవలసి వస్తుంది. ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు.
MAT 5:14 “మీరు ఈ ప్రపంచానికి వెలుగులాంటి వాళ్ళు. కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగు పరచటం అసంభవం.
MAT 5:15 దీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కాలి పీటపై ఉంచుతారు. అప్పుడది యింట్లోని వాళ్ళందరికి వెలుగునిస్తుంది.
MAT 5:16 అదే విధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు యితర్లు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు.
MAT 5:17 “నేను ధర్మశాస్త్రాన్ని కాని, ప్రవక్తల వచనాలను కాని రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని రద్దుచేయటానికి రాలేదు. వాటిని పూర్తి చేయటానికి వచ్చాను.
MAT 5:18 ఇది సత్యం. భూమి, ఆకాశం గడచి పోయేలోపుల అన్ని సంగతులు, ధర్మశాస్త్రంలోని చిన్న అక్షరం, పొల్లుతో సహా నెరవేరుతాయి.
MAT 5:19 “ఒక చిన్న ఆజ్ఞనైనా సరే రద్దుచేసిన వాడును, తనలాగే చెయ్యమని బోధించిన వాడును దేవుని రాజ్యంలో తక్కువ వాడుగా ఎంచబడుతాడు. కాని ఈ ఆజ్ఞల్ని అనుసరిస్తూ వాటిని బోధించినవాడు దేవుని రాజ్యంలో గొప్పవానిగా ఎంచబడతాడు.
MAT 5:20 ఎందుకంటే, మీరు శాస్త్రులకన్నా, పరిసయ్యుల కన్నా గొప్ప నీతిమంతులని గుర్తింపబడక పోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని నేను చెబుతున్నాను.
MAT 5:21 “పూర్వంలో ‘హత్య చేయరాదు, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది’ అని ప్రజలకు చెప్పటం మీరు విన్నారు.
MAT 5:22 కాని నేను చెప్పేదేమిటంటే తన సోదరునిపై కోపగించిన ప్రతి వ్యక్తి శిక్షింపబడతాడు. తన సోదరుణ్ణి ‘పనికిమాలినవాడా’ అన్న ప్రతి వ్యక్తి మహాసభకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. తన సోదరుణ్ణి ‘మూర్ఖుడా!’ అన్న ప్రతి వ్యక్తి నరకంలో అగ్నిపాలు కావలసి వస్తుంది.
MAT 5:23 “మీరు, మీ కానుకను బలిపీఠం దగ్గరవుంచటానికి ముందు, మీ సోదరునికి మీపై ఏ కారణం చేతనైనా కోపం ఉందని జ్ఞాపకం వస్తే మీ కానుకను అక్కడే వదిలి వెళ్ళండి. వెళ్ళి, మీ సోదరునితో ముందు రాజీ పడండి. ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించండి.
MAT 5:25 “మీరు, మీ ప్రతివాదితో దారిలో ఉన్నప్పుడే అతనితో మీకున్న సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోండి. అలా చేయకపోతే అతడు మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటునికి అప్పగించవచ్చు. ఆ భటుడు మిమ్మల్ని కారాగారంలో పడవేయవచ్చు.
MAT 5:26 ఇది సత్యం. మీరు చెల్లించవలసిన చివరికాసు చెల్లించే వరకు మీరా కారగారం నుండి బయటపడరు.
MAT 5:27 “‘వ్యభిచారం చేయరాదు’ అని చెప్పటం మీరు విన్నారు.
MAT 5:28 కాని నేను చెప్పేదేమిటంటే, పరస్త్రీ వైపు కామంతో చూసినవాడు, హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వానిగా పరిగణింపబడతాడు.
MAT 5:29 మీరు పాపం చెయ్యటానికి మీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది.
MAT 5:30 మీరు పాపం చెయ్యటానికి మీ కుడి చెయ్యి కారణమైతే దానిని నరికి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది.
MAT 5:31 “‘తన భార్యకు విడాకులివ్వదలచిన వ్యక్తి ఆమెకు ఒక విడాకుల పత్రం ఇవ్వాలి’ అని చెప్పే వాళ్ళు.
MAT 5:32 కాని నేను చెప్పేదేమంటే భార్య మీద వ్యభిచార కారణంలేకుండా భర్త ఆమెకు విడాకులిస్తే ఆమె వ్యభిచారిణిగా పరిగణింప బడటానికి అతడు కారకుడౌతాడు. అలా విడాకులు పొందిన స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. వ్యభిచార కారణాన మాత్రానే తన భార్యకు విడాకులివ్వాలి గాని వేరే కారణాన కాదు.
MAT 5:33 “అంతేకాక మాట తప్పకండి. ప్రభువుతో చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకోండి, అని పూర్వం ప్రజలకు చెప్పటం మీరు విన్నారు.
MAT 5:34 కాని నేను చెప్పేదేమిటంటె, దేని మీదా ప్రమాణం చెయ్యకండి, ఆకాశం దేవుని సింహాసనం కనుక ఆకాశం మీద ప్రమాణం చెయ్యకండి.
MAT 5:35 భూమి దేవుని పాదపీఠం కనుక భూమ్మీద ప్రమాణం చెయ్యకండి. యెరూషలేము మహారాజు నగరం కనుక దానిపై ప్రమాణం చెయ్యకండి.
MAT 5:36 మీ తలపై ఉన్న ఒక్క వెంట్రుకను కూడా తెలుపుగా కాని, నలుపుగా కాని మార్చలేరు. కనుక, మీ తలపై ప్రమాణం చెయ్యకండి.
MAT 5:37 మీరు ‘ఔను’ అని అనాలనుకొంటే ఔననండి. ‘కాదు’ అని అనాలనుకొంటే కాదనండి. మరేవిధమైన ప్రమాణం మీ నుండి వచ్చినా దానికి కారణం ఆ సైతానే.
MAT 5:38 “‘కంటికి కన్ను, పంటికి పన్ను ఊడ దీయాలి’ అని అనటం మీరు విన్నారు.
MAT 5:39 కాని నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి.
MAT 5:40 ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే, మీ కండువా కూడా తీసుకు వెళ్ళనివ్వండి.
MAT 5:41 ఎవరైనా మిమ్మల్ని తమతో మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే, అతనితో రెండు మైళ్ళు వెళ్ళండి.
MAT 5:42 అడిగిన వాళ్ళకు ఇవ్వండి. మీ దగ్గర అప్పుపుచ్చుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళతో లేదనకండి.
MAT 5:43 “‘పొరుగింటి వాణ్ణి ప్రేమించండి. శత్రువును ద్వేషించండి’ అని చెప్పటం మీరు విన్నారు.
MAT 5:44 కాని నేను చెప్పేదేమిటంటే ‘మీ శత్రువుల్ని ప్రేమించండి మిమ్మల్ని హింసించిన వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థించండి.’
MAT 5:45 అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలౌతారు. ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం సూర్యోదయం కలిగిస్తాడు. నీతిమంతుల కోసం, అనీతిమంతుల కోసం వర్షాలు కురిపిస్తాడు.
MAT 5:46 మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలాచెయ్యటం లేదా?
MAT 5:47 మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే యితర్ల కన్నా మీరు ఏం గొప్ప? యూదులుకాని వాళ్ళు కూడా అలా చేస్తారే!
MAT 5:48 పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. మీరును ఆయనలా ఉండాలి.
MAT 6:1 “జాగ్రత్త! మీరు చేసే నీతికార్యాలు ఇతర్లు చూసేలా చెయ్యకండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలమివ్వడు.
MAT 6:2 “అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో, ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం, వాళ్ళకు లభించవలసిన ప్రతి ఫలం అప్పుడే పూర్తిగా లభించింది.
MAT 6:3 కాని, మీరు దానం చేసేటప్పుడు మీ కుడిచేయి ఏమి యిస్తుందో మీ ఎడమచేతికి తెలియనివ్వకండి.
MAT 6:4 అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది. అప్పుడు, మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
MAT 6:5 “మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి. వాళ్ళు సమాజమందిరాల్లో, వీధుల ప్రక్కన నిలుచొని నలుగురూ చూడాలని ప్రార్థిస్తారు. అది వాళ్ళకు ఆనందాన్నిస్తుంది. కాని ఇది సత్యం – వాళ్ళకు లభించవలసిన ఫలితం వాళ్ళకప్పుడే పూర్తిగా లభించింది.
MAT 6:6 మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసికొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
MAT 6:7 “అంతేకాక, మీరు ప్రార్థించేటప్పుడు యూదులు కాని వాళ్ళవలె మాట్లాడవద్దు. ఆలా చేయడంవల్ల దేవుడు వింటాడని వాళ్ళు అనుకొంటారు.
MAT 6:8 వాళ్ళవలె చేయకండి. మీకేం కావాలో మీరడగక ముందే మీ తండ్రికి తెలుసు.
MAT 6:9 కాబట్టి మీరి విధంగా ప్రార్థించాలి: ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు సదా పవిత్ర పర్చబడాలని మేము ప్రార్థిస్తున్నాము.
MAT 6:10 నీ రాజ్యం రావాలనీ, పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే ఈ లోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము.
MAT 6:11 ప్రతి రోజు మాకు కావలసిన ఆహారం మాకు దయ చేయుము.
MAT 6:12 ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించినరీతి, మేము చేసిన పాపాలను కూడా క్షమించుము.
MAT 6:13 మేము శోధనకు గురిఅయ్యేలా చేయవద్దు. పైగా మమ్ములను దుష్టుని నుండి కాపాడుము.’
MAT 6:14 ఇతర్ల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు.
MAT 6:15 కాని యితర్లను మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించడు.
MAT 6:16 “కపటులు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్లు చేసుకొంటారు. మీరు ఉపవాసం చేసినప్పుడు అలా చేయకండి. ఇది సత్యం, వాళ్ళు పొందవలసిన ఫలాన్ని పొందారు. యింకేమీ లభించదు.
MAT 6:17 మీరు ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని కడుక్కొండి.
MAT 6:18 అలా చేస్తే, మీరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రజలకు కనిపించదు. కాని కనిపించని మీ తండ్రికి మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువలన రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
MAT 6:19 “మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ఆ ధనానికి చెదలు పడుతుంది. తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది. దొంగలు పడి దోచుకొంటారు.
MAT 6:20 మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకొండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు. దొంగలు పడి దోచుకోరు.
MAT 6:21 మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది.
MAT 6:22 “కన్ను శరీరానికి ఒక దీపంలాంటిది. మీ కళ్ళు బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది.
MAT 6:23 మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకటైపోతుంది. మీలో ఉన్న వెలుగే చీకటై పోతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా.
MAT 6:24 “ఒకే వ్యక్తి యిద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకణ్ణి ప్రేమించి, యింకొకణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. లేదా ఒకనికి అతిశ్రద్ధతో సేవ చేసి, యింకొకణ్ణి అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి, డబ్బుకు సేవకునిగా ఉండటమనేది అసంభవం.
MAT 6:25 “అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీ జీవితాలకు కావలసిన ఆహారాన్ని గురించి కాని, మీ దేహాలకు కావలసిన దుస్తుల్ని గురించి కాని చింతించకండి. జీవితం ఆహారం కన్నా, దేహం దుస్తులకన్నా, ముఖ్యమైనవి కావా?
MAT 6:26 ఆకాశంలో ఎగిరే పక్షుల్ని గమనించండి. అవి విత్తనం విత్తి పంటను పండించవు. ధాన్యాన్ని ధాన్యపు కొట్టులో దాచివుంచవు. అయినా పరలోకంలోవున్న మీ తండ్రి వాటికి ఆహారాన్ని యిస్తాడు. మీరు వాటికన్నా విలువైన వాళ్ళు కారా!
MAT 6:27 చింతించి తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు మీలో ఎవరైనా ఉన్నారా?
MAT 6:28 “మీరు దుస్తుల్ని గురించి ఎందుకు చింతిస్తున్నారు? గడ్డిమీద పెరిగే పువ్వుల్ని గమనించండి. అవి పని చేసి దారాన్ని వడకవు.
MAT 6:29 అయినా, నేను చెప్పేదేమిటంటే గొప్ప వైభవమున్న సొలొమోను రాజుకూడా అలంకరణలో ఈ పువ్వుల్లోని ఒక్క పువ్వుతో కూడా సరితూగలేడు.
MAT 6:30 ఈనాడు ఉండి రేపు మంటల్లో పారవేయబడే ఈ గడ్డిని దేవుడంత అందంగా అలంకరిస్తే మిమ్మల్ని యింకెంత అందంగా అలంకరిస్తాడో కదా! మీలో దృఢ విశ్వాసం లేదు.
MAT 6:31 “‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏ దుస్తుల్ని వేసుకోవాలి?’ అని చింతించకండి.
MAT 6:32 యూదులు కానివాళ్ళు వాటివైపు పరుగెత్తుతూ ఉంటారు. పరలోకంలో ఉన్న మీ తండ్రికి యివన్నీ మీకవసరమని తెలుసు.
MAT 6:33 కాని మొదట ఆయన రాజ్యం కొఱకు, నీతి కొఱకు ప్రయాస పడండి; అప్పుడు అవన్నీ దేవుడు మీకిస్తాడు.
MAT 6:34 రేపటిని గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. ఏరోజుకు తగ్గ కష్టాలు ఆరోజుకు ఉన్నాయి.
MAT 7:1 “ఇతర్లపై తీర్పు చెప్పకండి. అలా చేస్తే ఇతర్లు కూడ మీపై తీర్పు చెబుతారు.
MAT 7:2 మీరు ఇతర్లపై తీర్పు చెప్పినట్లే ఇతర్లు మీపై కూడా తీర్పు చెబుతారు. మీరు కొలిచిన కొలతతో ఇతర్లు మీకు కొలిచి ఇస్తారు.
MAT 7:3 “మీరు మీ సోదరుని కంట్లో ఉన్న నలుసును గమనిస్తారు. కాని మీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించరెందుకు?
MAT 7:4 మీ కంట్లో దూలం పెట్టుకొని ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనివ్వు!’ అని మీ సోదరునితో ఎట్లా అనగలుగుతున్నారు?
MAT 7:5 కపటీ! మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని నన్ను తీసివేయనీ! అప్పుడు నీవు స్పష్టంగా చూడకలిగి, నీ సోదరుని కంట్లో ఉన్న నలుసును తీయకలుగుతావు.
MAT 7:6 “పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి. అలా చేస్తే అవి తిరగబడి మిమ్మల్ని చీల్చి వేస్తాయి. ముత్యాలను పందుల ముందు వేయకండి. వేస్తే అవి వాటిని కాళ్ళ క్రింద త్రొక్కి పాడుచేస్తాయి.
MAT 7:7 “అడిగితే లభిస్తుంది. వెతికితే దొరుకుతుంది. తట్టితే తలుపు తెరుచుకుంటుంది.
MAT 7:8 ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన ప్రతి ఒక్కనికి దొరుకుతుంది. తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది.
MAT 7:9 “రొట్టె నడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా?
MAT 7:10 లేక చేపనడిగితే పామునెవరైనా యిస్తారా?
MAT 7:11 దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలివ్వాలని తెలుసు కదా! మరి అలాంటప్పుడు పరలోకంలోవున్న మీ తండ్రి తన్నడిగిన వాళ్ళకు మంచి కానుకలివ్వడా? తప్పకుండా యిస్తాడు.
MAT 7:12 “ప్రతి విషయంలో యితర్లు మీకోసం ఏం చెయ్యాలని మీరు ఆశిస్తారో మీరు యితర్ల కోసం అదే చెయ్యాలి. ఇదే మోషే ధర్మశాస్త్రం యొక్క, ప్రవక్తలు ప్రవచించిన వాటి యొక్క అర్థం.
MAT 7:13 “నరకానికి వెళ్ళే మార్గము సులభంగా ఉంటుంది. దాని ద్వారం విశాలంగా ఉంటుంది. చాలా మంది ఆ ద్వారాన్ని ప్రవేశిస్తారు. పరలోకానికి వెళ్ళే మార్గము కష్టంగా ఉంటుంది. దాని ద్వారం ఇరుకుగా ఉంటుంది. కొద్దిమంది మాత్రమే దాన్ని కనుగొంటారు. ఇది గమనించి, ఇరుకైన ద్వారాన్నే ప్రవేశించండి.
MAT 7:15 “కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొఱ్ఱె తోళ్ళు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు. కాని లోపల క్రూరమైన తోడేళ్ళలా ఉంటారు.
MAT 7:16 వాళ్ళ వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్ళను మీరు గుర్తించ కలుగుతారు. ముళ్ళపొదల నుండి ద్రాక్షాపండ్లను, పల్లేరు మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా?
MAT 7:17 మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి. పులుపు పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి.
MAT 7:18 మంచి చెట్టుకు పులుపు పండ్లు కాయవు. పులువు పండ్లు కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవు.
MAT 7:19 దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు.
MAT 7:20 అందువల్ల, వాళ్ళవల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించ కలుగుతారు.
MAT 7:21 “నన్ను ప్రభూ! ప్రభూ! అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అనుకోకండి. నా తండ్రి ఇష్టానుసారం నడచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరు.
MAT 7:22 ఆ రోజు చాలా మంది నాతో, ‘ప్రభూ! ప్రభూ! నీపేరిట మేము దైవ సందేశాన్ని ప్రకటించలేదా? దయ్యాల్ని పారద్రోలలేదా? ఎన్నో అద్భుతాలు చెయ్యలేదా?’ అని అంటారు.
MAT 7:23 అప్పుడు నేను వాళ్ళతో, ‘మీరెవరో నాకు తెలియదు. పాపాత్ములారా! నా ముందు నుండి వెళ్లిపొండి’ అని స్పష్టంగా చెబుతాను.
MAT 7:24 “అందువల్ల నా మాటలు విని వాటిని ఆచరించే ప్రతి ఒక్కడూ బండపై తన యింటిని కట్టుకొన్న వానితో సమానము.
MAT 7:25 ఆ ఇల్లు రాతి బండపై నిర్మించబడింది. కనుక వర్షాలుపడి, వరదలు వచ్చి తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టినా ఆయిల్లు పడిపోలేదు.
MAT 7:26 “కాని నా మాటలు విని వాటిని ఆచరించని ప్రతి ఒక్కడూ యిసుకపై తన యింటిని నిర్మించుకొన్న మూర్ఖునితో సమానము.
MAT 7:27 వర్షాలు వచ్చి, వరదలు వచ్చి, తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టాయి. ఆ యిల్లు కూలి నేలమట్టమైపోయింది” దాని పతనం భయంకరమైనది.
MAT 7:28 యేసు చెప్పటం ముగించాడు. ఆయన వాళ్ళ శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలాగ బోధించాడు. కనుక ప్రజలు ఆయన ఉపదేశాలు విని ఆశ్చర్యపడ్డారు.
MAT 8:1 యేసు కొండదిగి రాగా, ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు.
MAT 8:2 కుష్టురోగంతో ఉన్న వాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మీరు తలచుకొంటే నన్ను బాగుచెయ్యగలరు” అని అన్నాడు.
MAT 8:3 యేసు తన చేయి చాపి అతణ్ణి తాకుతూ, “నీకు బాగు కావాలని కోరుతున్నాను, స్వస్థుడవుకమ్ము!” అని అన్నాడు. వెంటనే అతనికి నయమైపోయింది.
MAT 8:4 అప్పుడు యేసు అతనితో, “ఈ సంఘటనను గురించి ఎవ్వరికీ చెప్పకు. కాని యాజకుని దగ్గరకు వెళ్ళి నీ దేహాన్ని చూపి, మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. తద్వారా నీకు నయమైనట్లు వాళ్ళకు రుజువౌతుంది” అని అన్నాడు.
MAT 8:5 యేసు కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన సహాయం కావాలని కోరుతూ,
MAT 8:6 “ప్రభూ! నా సేవకుడు పక్షవాతం వచ్చి యింట్లో పడుకొని ఉన్నాడు. వానికి చాలా బాధ కలుగుతోంది” అని అన్నాడు.
MAT 8:7 యేసు, “నేను వచ్చి నయం చేస్తాను” అని అన్నాడు.
MAT 8:8 కాని శతాధిపతి సమాధానంగా, “ప్రభూ! మీరు మా యింటి గడపలో కాలు పెట్టటానికి కూడా నేను అర్హుడను కాను. కాని మీరు మాటంటే చాలు, నా సేవకునికి నయమైపోతుంది.
MAT 8:9 ఎందుకంటే, నేను కూడా అధికారుల క్రింద ఉన్నవాణ్ణి. నా క్రింద కూడా సైనికులున్నారు. నేను ఈ సైనికునితో ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు; ఆ సైనికునితో ‘రా’ అంటే వస్తాడు. నా సేవకునితో ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు.
MAT 8:10 యేసు ఇది విని ఆశ్చర్యపొయ్యాడు. ఆయన తన వెంట వస్తున్న వాళ్ళతో, “ఇది సత్యం. ఇంత గొప్ప విశ్వాసమున్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయులలో ఎవ్వరూ కనిపించలేదు.
MAT 8:11 నేను చెప్పెదేమిటంటే, తూర్పునుండి, పడమరనుండి, చాలామంది ప్రజలు వస్తారు. వచ్చి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు.
MAT 8:12 కాని దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుకవల్ల వారసులైన వాళ్ళను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు.”
MAT 8:13 ఇలా అని, యేసు శతాధిపతితో, “వెళ్ళు! నీవు విశ్వసించినట్లే జరుగుతుంది” అని అన్నాడు. అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది.
MAT 8:14 యేసు పేతురు యింటికి వచ్చి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండటం చూసాడు.
MAT 8:15 ఆయన ఆమె చేతిని తాకగానే, జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఆమె లేచి ఆయనకు సపర్యలు చెయ్యటం మొదలుపెట్టింది.
MAT 8:16 ప్రజలు సాయంత్రం కాగానే, దయ్యాలు పట్టిన వాళ్ళను చాలా మందిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. ఆయన ఒక మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగాలున్న వాళ్ళందరికి నయం చేసాడు.
MAT 8:17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ మాటలు నిజం కావటానికి ఇలా జరిగింది: “మన రోగాల్ని ఆయన తనపై వేసుకొన్నాడు. మన బాధల్ని ఆయన అనుభవించాడు.”
MAT 8:18 యేసు తన చుట్టూ ఉన్న ప్రజల గుంపును చూసి, తన శిష్యులతో సరస్సు అవతలి వైపుకు వెళ్ళండని అన్నాడు.
MAT 8:19 అప్పుడు శాస్త్రుడొకడు ఆయన దగ్గరకు వచ్చి, “బోధకుడా! మీరెక్కడికి వేళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు.
MAT 8:20 యేసు, “నక్కలు దాక్కోవటానికి బిలములున్నాయి. గాలిలో ఎగిరే పక్షులు ఉండటానికి గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడ స్థలం లేదు” అని అతనితో అన్నాడు.
MAT 8:21 మరొక శిష్యుడు, “ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి” అని అన్నాడు.
MAT 8:22 యేసు అతనితో, “చనిపోయిన తమ వాళ్ళను చనిపోయే వాళ్ళు సమాధి చేసుకోనిమ్ము! నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు.
MAT 8:23 యేసు పడవనెక్కాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు.
MAT 8:24 అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ సరస్సు మీదికి రావటం వల్ల ఆ పడవ అలల్లో చిక్కుకు పోయింది. ఆసమయంలో యేసు నిద్రపోతూ ఉన్నాడు.
MAT 8:25 శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నిద్రలేపుతూ, “ప్రభూ! రక్షించండి. మునిగిపోతున్నాము!” అని అన్నారు.
MAT 8:26 యేసు, “మీ విశ్వాసం ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు?” అని అంటూ లేచి గాలిని, అలల్ని శాంతించమని ఆజ్ఞాపించాడు. అవి శాంతించాయి.
MAT 8:27 వాళ్ళు ఆశ్చర్యపడి, “ఈయనేలాంటి వాడు? గాలి, అలలు కూడా ఈయన మాట వింటున్నాయే!” అని అన్నారు.
MAT 8:28 యేసు, సరస్సు ఆవలి పైపుననున్న గదరేనీయుల ప్రాంతాన్ని చేరుకున్నాడు. దయ్యాలు పట్టిన మనుష్యులిద్దరు స్మశానం నుండి వచ్చి ఆయన్ని కలుసుకొన్నారు. వీళ్ళ క్రూర ప్రవర్తన వల్ల ఆ దారిమీద ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కారు.
MAT 8:29 అవి, “దేవుని కుమారుడా! మాకేం చెయ్యాలని వచ్చావు తగిన సమయం రాకముందే మమ్మల్ని శిక్షించాలని యిక్కడికి వచ్చారా?” అని బిగ్గరగా అన్నాయి.
MAT 8:30 వాళ్ళకు కొంత దూరంలో ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది.
MAT 8:31 ఆ దయ్యాలు యేసుతో, “మీరు మమ్మల్ని వెళ్ళగొట్టాలని అనుకొంటే ఆ పందుల గుంపులోకి పంపండి” అని ప్రాధేయపడ్డాయి.
MAT 8:32 ఆయన వాటితో, “వెళ్ళండి!” అని అన్నాడు. అందువల్ల అవి వెలుపలికి వచ్చి ఆ పందుల్లోకి ప్రవేశించాయి. ఆ పందుల గుంపంతా నిటారుగా ఉన్న కొండ మీదనుండి జారి సరస్సులో పడి చనిపొయ్యాయి.
MAT 8:33 ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు అక్కడి నుండి పరుగెత్తి గ్రామంలోకి వెళ్ళి జరిగిందంతా, అంటే ఆ దయ్యం పట్టిన వాళ్ళకేమైందో అంతా చెప్పారు.
MAT 8:34 ఇది విని ఆ గ్రామమంతా యేసును కలవటానికి వచ్చింది. వాళ్ళాయన్ని చూసాక తమ పరిసరాల్ని వదిలి వెళ్ళమని ఆయనను ప్రాధేయపడ్డారు.
MAT 9:1 యేసు పడవనెక్కి సముద్రం దాటి తన స్వగ్రామానికి వచ్చాడు.
MAT 9:2 కొందరు వ్యక్తులు మంచం పట్టిన ఒక పక్షవాత రోగిని చాప మీద పడుకోబెట్టి ఆయన దగ్గరకు తీసికొని వచ్చారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాత రోగితో, “ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు.
MAT 9:3 ఇది విని కొందరు శాస్త్రులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని అనుకొన్నారు.
MAT 9:4 వాళ్ళు ఏమనుకొంటున్నారో యేసుకు తెలిసిపోయింది. ఆయన వాళ్ళతో, “మీ హృదయాల్లోకి దురాలోచనల్ని ఎందుకు రానిస్తారు?
MAT 9:5 ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని అనటం సులభమా లేక ‘లేచి నిలుచో’ అని అనటం సులభమా?
MAT 9:6 పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారముందని మీకు తెలియాలి!” అని వాళ్ళతో అన్నాక, పక్షవాత రోగితో, “లే! నీ చాపను తీసికొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.
MAT 9:7 పక్షవాతంతో ఉన్నవాడు లేచి యింటికి వెళ్ళాడు.
MAT 9:8 ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు.
MAT 9:9 యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా, మత్తయి అనేవాడు కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉండటం చూసాడు. యేసు అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు. మత్తయి లేచి ఆయన్ని అనుసరించాడు.
MAT 9:10 యేసు మత్తయి యింట్లో భోజనానికి కూర్చుని ఉండగా, చాలామంది పన్నులు సేకరించే వాళ్ళు, పాపులు వచ్చారు, వాళ్ళంతా యేసుతో, ఆయన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు.
MAT 9:11 పరిసయ్యులు ఇది గమనించి యేసు శిష్యులతో, “మీ ప్రభువు పన్నులు సేకరించే వారితోను, పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేస్తాడు?” అని అడిగారు.
MAT 9:12 యేసు ఇదివిని, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది.
MAT 9:13 ‘నేను కోరేది దయ, జంతువుల బలినికాదు’ అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.
MAT 9:14 ఆ తర్వాత యోహాను శిష్యులు వచ్చి, యేసును, “మేము, పరిసయ్యులు ఉపవాసం చేస్తాం కదా; మరి మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.
MAT 9:15 యేసు, “పెళ్ళికుమారుని అతిథులు పెళ్ళి కుమారుడు వాళ్ళతో ఉండగా ఎందుకు ఉపవాసం చేస్తారు? పెళ్ళి కుమారుడు వెళ్ళి పోయే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని సమాధానం చెప్పాడు.
MAT 9:16 “పాత వస్త్రం యొక్క చిరుగును క్రొత్త వస్త్రంతో కుట్టరు. అలా చేస్తే ఆ అతుకు చినిగిపోతుంది. అంతే కాక ఆ చిల్లు యింకా పెద్దదౌతుంది.
MAT 9:17 అదే విధంగా క్రొత్త ద్రాక్షారసమును పాతతోలు సంచిలో దాచరు. అలా చేస్తే ఆ తోలుసంచి చినిగిపోయి ఆ ద్రాక్షారసము నాశనమైపోతుంది. అంతేకాక ఆ తోలు సంచి నాశనమైపోతుంది. అందువల్ల క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తోలు సంచిలోనే దాచి ఉంచాలి. అలా చేస్తే రెండూ భద్రంగా ఉంటాయి” అని యేసు అన్నాడు.
MAT 9:18 యేసు ఈ విధంగా మాట్లాడుతుండగా యూదుల సమాజమందిరానికి అధికారిగా ఉన్నవాడు ఒకడు వచ్చి, ఆయన ముందు మోకరిల్లి, “నా కూతురు చనిపోయింది. కాని మీరు వచ్చి మీ చేయి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది” అని అన్నాడు.
MAT 9:19 యేసు, ఆయన శిష్యులు లేచి అతని వెంట వెళ్ళారు.
MAT 9:20 వాళ్ళు వెళ్తుండగా పండ్రెండేండ్ల నుండి రక్త స్రావంతో బాధ పడ్తున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది.
MAT 9:21 ఆమె, “నేను ఆయన వస్త్రాన్ని తాకగలిగితే చాలు నాకు నయమైపోతుంది” అని తనలో తాను అనుకొన్నది.
MAT 9:22 యేసు వెనక్కు తిరిగి ఆమెను చూసి, “ధైర్యంగా వుండమ్మా! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది” అని అన్నాడు.
MAT 9:23 యేసు ఆ అధికారి యింట్లోకి ప్రవేశిస్తూ, అక్కడ పిల్లన గ్రోవి వాయించే వాళ్ళు, గోల చేస్తున్న వాళ్ళు ఉండటం చూసాడు.
MAT 9:24 వాళ్ళతో, “వెళ్ళిపొండి, ఆమె చనిపోలేదు. నిద్రపోతూ ఉంది, అంతే!” అని అన్నాడు. వాళ్ళాయన్ని హేళన చేసారు.
MAT 9:25 ఆయన వాళ్ళను పంపేసాక లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి చేయి తాకాడు. ఆమె వెంటనే లేచి నిలుచుంది.
MAT 9:26 ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
MAT 9:27 యేసు అక్కడినుండి బయలుదేరి వెళ్తుండగా యిద్దరు గ్రుడ్డివాళ్ళు, “దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని పిలుస్తూ ఆయన్ని అనుసరించారు.
MAT 9:28 యేసు యింట్లోకి వెళ్ళాక ఆ గుడ్డివాళ్ళాయన దగ్గరకు వెళ్ళారు. ఆయన వాళ్ళను, “ఇది నేను చేయగలననే విశ్వాసం మీకుందా?” అని అడిగాడు. “ఉంది ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
MAT 9:29 అప్పుడాయన వాళ్ళ కళ్ళను తాకుతూ, “మీకెంత విశ్వాసముంటే అంత ఫలం కలుగనీ!” అని అన్నాడు.
MAT 9:30 వాళ్ళకు చూపు వచ్చింది. యేసు, “ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడండి!” అని వాళ్ళను హెచ్చరించాడు.
MAT 9:31 కాని వాళ్ళు వెళ్ళి ఆయన్ని గురించి ఆ ప్రాంతమంతా ప్రచారం చేసారు.
MAT 9:32 వాళ్ళు వెలుపలికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దయ్యం పట్టిన మూగవాడి నొకణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు.
MAT 9:33 యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మూగవాడు మాట్లాడటం మొదలు పెట్టాడు. అక్కడున్న ప్రజలు నిర్ఘాంతపోయి, “ఇలాంటిదేదీ ఇదివరకెన్నడూ ఇశ్రాయేలులో జరగలేదే?” అని అన్నారు.
MAT 9:34 కాని పరిసయ్యులు, “అతడు దయ్యాల రాజు సహాయంతో దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు.
MAT 9:35 యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ అన్ని పట్టణాలు, పల్లెలు పర్యటన చేసాడు. దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటించాడు. అన్నిరకాల రోగాల్ని, బాధల్ని నయం చేసాడు.
MAT 9:36 ప్రజలు కాపరిలేని గొఱ్ఱెల్లా అలసిపోయి, చెదరిపోయి ఉండటం చూసి యేసు వాళ్ళపై జాలి పడ్డాడు.
MAT 9:37 ఆ తర్వాత తన శిష్యులతో, “పంట బాగా పండింది కాని పని వాళ్ళే తక్కువగా ఉన్నారు.
MAT 9:38 పంట ప్రభువును, పంట కోయటానికి పనివాళ్ళను పంపమని ప్రార్థించండి” అని అన్నాడు.
MAT 10:1 యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి దయ్యాల్ని వదిలించటానికి, అన్ని రకాల వ్యాధుల్ని, బాధల్ని నయం చేయటానికి వాళ్ళకధికారం ఇచ్చాడు.
MAT 10:2 ఆ పన్నెండుగురి అపోస్తలుల పేర్లు ఇవి: సీమోను; ఇతన్నే పేతురు అని పిలిచేవాళ్ళు. అతని సోదరుడు అంద్రెయ. జెబెదయి కుమారుడు యాకోబు, యాకోబు సోదరుడు యోహాను.
MAT 10:3 ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, పన్నులు సేకరించే మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి అని పిలువబడే లెబ్బయి,
MAT 10:4 కనానీయుడైన సీమోను, యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు.
MAT 10:5 ఆ పన్నెండుగురిని ప్రజల వద్దకు పంపుతూ వారికి యేసు ఈ విధంగా ఉపదేశించాడు: “యూదులు కాని వాళ్ళ దగ్గరకు గాని, సమరయ దేశంలోని పట్టణాలలోకి గాని వెళ్ళకండి.
MAT 10:6 దానికి మారుగా ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళండి. వారు తప్పిపోయిన గొఱ్ఱెలవలె ఉన్నారు.
MAT 10:7 వెళ్ళి, దేవుని రాజ్యం దగ్గరలోనే ఉందని ప్రకటించండి.
MAT 10:8 జబ్బుతో ఉన్న వాళ్ళకు నయం చెయ్యండి. దయ్యాలను వదిలించండి. మీకు ఉచితంగా లభించింది ఉచితంగా యివ్వండి.
MAT 10:9 బంగారం కాని, వెండికాని, రాగి కాని మీ సంచిలో పెట్టుకొని వెళ్ళకండి,
MAT 10:10 మీరు ప్రయాణం చేసేటప్పుడు సంచిని కాని, దుస్తుల్ని కాని, చెప్పుల్ని కాని, చేతి కర్రను కాని మీ వెంట తీనుకెళ్ళకండి. పని చేసిన వాళ్ళకు కూలి దొరకాలి కదా!
MAT 10:11 “మీరు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెకు వెళ్ళినా మంచి వాడెవరో విచారించి, ఆ గ్రామం వదిలే దాకా అతని ఇంట్లోనే ఉండండి.
MAT 10:12 మీరా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ‘శాంతి కలుగునుగాక’ అనండి.
MAT 10:13 ఆ ఇంటివారు యోగ్యులైతే మీరు చెప్పిన శాంతి ఆ ఇంటివారికి కలుగుతుంది. లేక పోయినట్లైతే ఆ శాంతి మీకే తిరిగి వస్తుంది.
MAT 10:14 ఒక వేళ, మీకు ఎవ్వరూ స్వాగతం చెప్పక పోయినట్లైతే, ఆ ఇంటిని కాని లేక ఆ గ్రామాన్ని కాని వదిలి వెళ్ళేముందు మీ కాలి ధూళి దులిపి వెయ్యండి.
MAT 10:15 ఇది సత్యం, తీర్పు చెప్పే రోజు సొదొమ మరియు గొమొఱ్ఱా పట్టణాలకన్నా మీరు వదిలిన గ్రామం భరించలేని స్థితిలో ఉంటుంది.
MAT 10:16 “తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. అందువల్ల పాముల్లాగా తెలివిగా, పాపురాల్లా నిష్కపటంగా మీరు మెలగండి.
MAT 10:17 కాని, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని స్థానిక సభలకు అప్పగిస్తారు. తమ సమాజ మందిరాల్లో కొరడా దెబ్బలుకొడతారు.
MAT 10:18 వాళ్ళు నా కారణంగా మిమ్మల్ని పాలకుల ముందుకు, రాజుల ముందుకు తీసుకు వెళ్తారు. మీరు వాళ్ళ ముందు, యూదులుకాని ప్రజలముందు నా గురించి చెప్పాలి.
MAT 10:19 వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగించినప్పుడు, ఏ విధంగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని చింతించకండి. మీరు ఏం మాట్లాడాలో దేవుడు ఆ సమయంలో మీకు తెలియచేస్తాడు.
MAT 10:20 ఎందుకంటే, మాట్లాడేది మీరు కాదు. మీ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతాడు.
MAT 10:21 “సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తమ తల్లి తండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళను చంపుతారు.
MAT 10:22 ప్రజలందరూ నా పేరు కారణంగా మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని చివరి దాకా సహనంతో ఉన్న వాళ్ళను దేవుడు రక్షిస్తాడు.
MAT 10:23 మిమ్మల్ని ఒక పట్టణంలో హింసిస్తే తప్పించుకొని యింకొక పట్టణానికి వెళ్ళండి. ఇది నిజం. మీరు ఇశ్రాయేలు దేశంలోని పట్టణాలన్ని తిరగక ముందే మనుష్యకుమారుడు వస్తాడు.
MAT 10:24 “విద్యార్థి గురువుకన్నా గొప్పవాడు కాడు. అలాగే సేవకుడు యజమానికన్నా గొప్పవాడు కాడు.
MAT 10:25 విద్యార్థి గురువులా ఉంటే చాలు. అలాగే సేవకుడు యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు అని అన్న వాళ్ళు ఆ యింటివాళ్ళను యింకెంత అంటారో కదా!
MAT 10:26 “అందువల్ల వాళ్ళకు భయపడకండి. రహస్యమైనవి బయటపడతాయి. దాచబడినవి నలుగురికి తెలుస్తాయి.
MAT 10:27 నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా యితర్లకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన విషయాలను యింటి కప్పులపై ఎక్కి ప్రకటించండి.
MAT 10:28 “వాళ్ళు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు. వాళ్ళను గురించి భయపడకండి. శరీరాన్ని, ఆత్మను నరకంలో వేసి నాశనం చెయ్యగల వానికి భయపడండి.
MAT 10:29 ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల మీదికి పడదు.
MAT 10:30 మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు.
MAT 10:31 అందువలన భయపడకండి. ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు.
MAT 10:32 “నన్ను ప్రజల సమక్షంలో అంగీకరించిన ప్రతి వ్యక్తిని పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో అంగీకరిస్తాను.
MAT 10:33 కాని ప్రజల సమక్షంలో నన్ను తిరస్కరించిన వాణ్ణి నేను పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో తిరస్కరిస్తాను.
MAT 10:34 “నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను.
MAT 10:35 ఎందుకంటే నేను, ‘తండ్రి కుమార్ల మధ్య, తల్లీ కూతుర్ల మధ్య, అత్తా కోడళ్ళ మధ్య, విరోధం కలిగించాలని వచ్చాను. ఒకే యింటికి చెందిన వాళ్ళు ఆ యింటి యజమాని శత్రువులౌతారు.’
MAT 10:37 “తన తల్లి తండ్రుల్ని నా కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన కొడుకును కాని, లేక కూతుర్నికాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడుకాడు.
MAT 10:38 నన్ను వెంబడించేవాడు తనకియ్యబడిన సిలువను అంగీకరించకపోతే, నాకు యోగ్యుడు కాడు.
MAT 10:39 జీవితాన్ని కాపాడుకొనువాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం జీవితాన్ని పోగొట్టుకొన్నవాడు జీవితాన్ని సంపాదించుకొంటాడు.
MAT 10:40 “మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే.
MAT 10:41 ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం పొందుతాడు.
MAT 10:42 మీరు నా అనుచరులైనందుకు, ఈ అమాయకులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్ళనిస్తారో వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజం.”
MAT 11:1 యేసు తన పన్నెండుగురి శిష్యులకు వాళ్ళు చెయ్యవలసిన వాటిని గురించి చెప్పటం ముగించాడు. ఆ తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గ్రామాల్లో బోధించటానికి, ప్రకటించటానికి వెళ్ళాడు.
MAT 11:2 కారాగారంలోవున్న యోహాను క్రీస్తు చేస్తున్న వాటిని గురించి విన్నాడు. అతడు తన శిష్యుల్ని యేసు దగ్గరకు పంపి,
MAT 11:3 వాళ్ళ ద్వారా, “రావలసిన వాడవు నువ్వేనా? లేక మరెవరికోసమైనా మేము ఎదురు చూడాలా?” అని అడిగించాడు.
MAT 11:4 యేసు, “మీరు విన్నవాటిని గురించి, చూసిన వాటిని గురించి వెళ్ళి యోహానుకు చెప్పండి.
MAT 11:5 గ్రుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారని, కుంటివాళ్ళు నడువ గలుగుతున్నారని, కుష్టురోగులకు నయమైపోతోందని, చెవిటి వాళ్ళు వినగలుగుతున్నారని, చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తున్నారని, సువార్త పేదవాళ్ళకు ప్రకటింపబడుతోందని చెప్పండి.
MAT 11:6 నా విషయంలో అనుమానం చెందనివాడు ధన్యుడు” అని సమాధానం చెప్పాడు.
MAT 11:7 యోహాను శిష్యులు వెళ్తూ ఉంటే, యేసు యోహానును గురించి అక్కడున్న ప్రజలతో ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు: “ఎడారి ప్రాంతాల్లోకి ఏం చూడాలని వెళ్ళారు? గాలికి కొట్టుకొనే రెల్లును చూడాలని వెళ్ళారా?
MAT 11:8 మరి ఏం చూడాలని వెళ్ళారు? మంచి దుస్తులు వేసుకొన్న మనిషిని చూడాలని వెళ్ళారా? మంచి దుస్తులు వేసుకొన్న వాళ్ళు రాజభవనంలో నివసిస్తారు.
MAT 11:9 మరి, ఏం చూడాలని వెళ్ళారు? ప్రవక్తనా? అవును, యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని నేను చెబుతున్నాను.
MAT 11:10 అతణ్ణి గురించి ఈ విధంగా వ్రాసారు: ‘నీ కన్నా ముందు నా దూతను పంపుతాను, అతడు నీ కన్నా ముందు వెళ్ళి నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడు.’
MAT 11:11 “ఇది సత్యం. ఇదివరకు జన్మించిన వాళ్ళలో బాప్తిస్మము ఇచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడు. అయినా దేవుని రాజ్యంలో అత్యల్పుడు యోహాను కన్నా గొప్పవానిగా పరిగణింపబడతాడు.
MAT 11:12 బాప్తీస్మము ఇచ్చే యోహాను కాలం నుండి, నేటివరకు దేవుని రాజ్యం ముందడుగు వేస్తూవుంది. శక్తిగల వాళ్ళు దాన్ని సంపాదించటానికి ప్రయత్నిస్తున్నారు.
MAT 11:13 యోహాను కాలం వరకు ప్రవక్తలు, ధర్మశాస్త్రము వీటిని గురించి వచించటం జరిగింది.
MAT 11:14 ఆ యోహానే రానున్న ఏలీయా. ఇష్టముంటే అంగీకరించండి.
MAT 11:15 ఇష్టమున్నవాడు వింటాడు.
MAT 11:16 “ఈ తరం వాళ్ళను నేను ఎవరితో పోల్చాలి? వాళ్ళు సంతలో కూర్చొని బిగ్గరగా మాట్లాడుకొంటున్న పిల్లలతో సమానము. వాళ్ళు ఇలా అన్నారు:
MAT 11:17 ‘మేము పిల్లనగ్రోవి వూదాము; కాని మీరు నాట్యం చెయ్యలేదు, మేము విషాదగీతం పాడాము, కాని మీరు దుఃఖించలేదు.’
MAT 11:18 ఎందుకంటే యోహాను తింటూ, త్రాగుతూ రాలేదు. కాని అతనిలో దయ్యం ఉందన్నారు.
MAT 11:19 మనుష్య కుమారుడు తింటూ త్రాగుతూ వచ్చాడు. కాని వాళ్ళు, ‘ఇదిగో తిండిపోతు, త్రాగుపోతు. ఇతను పన్నులు సేకరించే వాళ్ళకు, పాపులకు మిత్రుడు’ అని అన్నారు. జ్ఞానము దాని పనులను బట్టి తీర్పు పొందుతుంది.”
MAT 11:20 ఆయన అనేక మహత్కార్యాలు చేసిన కొన్ని పట్టణాలు మారుమనస్సు పొందలేదు. కనుక యేసు వాటిని విమర్శించాడు.
MAT 11:21 “అయ్యో! కొరాజీనా పట్టణమా! అయ్యో! బేత్సయిదా నగరమా! నేను మీలో చేసిన అద్భుతాలను తూరు, సీదోను పట్టణాలలో చేసివుంటే వాళ్ళు ఏనాడో గోనెపట్టలు కట్టుకొని, బూడిదరాసుకొని మారుమనస్సు పొంది ఉండే వాళ్ళు.
MAT 11:22 కానీ, నేను చెప్పేదేమిటంటే తీర్పు చెప్పేరోజున తూరు, సీదోను నగరాలకన్నా మీరు భరించలేని స్థితిలో ఉంటారు.
MAT 11:23 “ఇక, ఓ కపెర్నహూము నగరమా! నీవు ఆకాశానికి ఎక్కుతాననుకొన్నావా? అలా జరుగదు! నీవు మృత్యులోకానికి పడిపోతావు. నీలో చేసిన మహాత్యాలు సోదొమ నగరంలో చేసివుంటే అది ఈనాటికీ నిలిచి ఉండేది.
MAT 11:24 కాని నేను మీకు చెప్పేదేమంటే తీర్పుచెప్పే రోజున సొదొమ నగరానికన్నా మీరు భరించలేని స్థితిలో ఉంటారు.”
MAT 11:25 ఆ సమయంలో యేసు యింకా ఈ విధంగా అన్నాడు, “తండ్రీ! ఆకాశానికి భూలోకానికి ప్రభువైన నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే, నీవు వీటిని తెలివిగల వాళ్ళ నుండి, జ్ఞానుల నుండి దాచి చిన్న పిల్లలకు తెలియ జేసావు.
MAT 11:26 ఔను తండ్రీ! నీవీలాగు చేయటం నీకిష్టమయింది.
MAT 11:27 “నా తండ్రి నాకు అన్నీ అప్పగించాడు. తండ్రికి తప్ప నాగురించి ఎవ్వరికి తెలియదు. నాకును, నా తండ్రిని గురించి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఎన్నుకొన్న వాళ్ళకును తప్ప, తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు.
MAT 11:28 “బరువు మోస్తూ అలసిపోయిన వాళ్ళంతా నా దగ్గరకు రండి. నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను.
MAT 11:29 నేనిచ్చిన కాడిని మోసి, నా నుండి నేర్చుకోండి. నేను సాత్వికుడను. నేను దీనుడను.
MAT 11:30 నేనిచ్చిన కాడిని మోయటం సులభం. నేనిచ్చే భారం తేలికగా ఉంటుంది. కనుక మీ ఆత్మలకు విశ్రాంతి కలుగుతుంది.”
MAT 12:1 ఒకప్పుడు ఒక విశ్రాంతి రోజున యేసు, తన శిష్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆకలితో ఉండటం వల్ల కంకులు నలిపి తినటం మొదలు పెట్టారు.
MAT 12:2 పరిసయ్యులు ఇది చూసి యేసుతో, “విశ్రాంతి రోజు మీ శిష్యులు చెయ్యరాని పని చేస్తున్నారు” అని అన్నారు.
MAT 12:3 యేసు, “దావీదుకు, అతని అనుచరులకు ఆకలివేసినప్పుడు అతడు దేవాలయంలోకి ప్రవేశించారు. తర్వాత అతడు, అతని అనుచరులు దేవుని సన్నిధిలో పెట్టిన రొట్టెలు తిన్నారు. ఈ విషయాన్ని మీరు చదువలేదా? యాజకులకు తప్ప దావీదుకు కాని, అతని అనుచరులకు కాని, మరెవ్వరికి ఆ రొట్టెను తినే అధికారం లేదు.
MAT 12:5 అంతేకాక, యాజకులు విశ్రాంతి రోజు పని చేస్తారన్న విషయం ధర్మశాస్త్రంలో ఉంది. ఇది మీరు చదువలేదా? వాళ్ళు అలా చెయ్యటం తప్పుకాదు.
MAT 12:6 నేను చెప్పేదేమిటంటే మందిరం కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు.
MAT 12:7 ‘నాకు దయకావాలి, బలికాదు’ అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసివుంటే మీరు అమాయకుల్ని అవమానించే వాళ్ళు కాదు.
MAT 12:8 “విశ్రాంతి రోజుకు మనుష్యకుమారుడు ప్రభువు” అని అన్నాడు.
MAT 12:9 ఆయన అక్కడి నుండి బయలుదేరి సమాజ మందిరానికి వెళ్ళాడు.
MAT 12:10 అక్కడ ఎండి పోయిన చేయిగలవాడొకడున్నాడు. యేసుపై నేరారోపణ చెయ్యాలని ఎదురుచూస్తున్న పరిసయ్యులు, ఆయన్ని, “విశ్రాంతి రోజు నయం చెయ్యటం ధర్మమా?” అని అడిగారు.
MAT 12:11 ఆయన వాళ్ళతో, “మీలో ఎవరి దగ్గరైనా ఒక గొఱ్ఱె ఉందనుకొండి. విశ్రాంతి రోజు అది గోతిలో పడితే దాన్ని పట్టి మీరు బయటికి లాగరా?
MAT 12:12 మరి మానవుడు గొఱ్ఱెలకన్నా ఎన్నోరెట్లు విలువైన వాడు కదా! అందువల్ల విశ్రాంతిరోజు మంచి చెయ్యటం ధర్మమే!” అని అన్నాడు.
MAT 12:13 అలా అన్నాక ఆ ఎండిపోయిన చెయ్యిగల వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. అతడు చేయి చాపాడు. చేయి పూర్తిగా నయమై రెండవ చెయ్యిలా అయింది.
MAT 12:14 కాని పరిసయ్యులు బయటికి వెళ్ళి, యేసును చంపటానికి పన్నాగం పన్నారు.
MAT 12:15 యేసు ఇది తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేసాడు.
MAT 12:16 తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు.
MAT 12:17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగింది:
MAT 12:18 “ఆయన నేనెన్నుకున్న నా సేవకుడు! ఆయన పట్ల నాకు ప్రేమవుంది. ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు. నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును. ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు.
MAT 12:19 ఆయన పోట్లాడడు: కేకలు పెట్టడు, ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవ్వరికి వినిపించదు.
MAT 12:20 న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు. ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు.
MAT 12:21 ఈయన పేరుమీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుంది.”
MAT 12:22 ఆ తర్వాత కొందరు, దయ్యంపట్టి గ్రుడ్డివానిగా, మూగవానిగా అయిపోయిన ఒకతణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. యేసు అతనికి నయం చేసాడు. దానితో ఆ మూగ వానికి మాట, దృష్టి రెండూ వచ్చాయి.
MAT 12:23 ప్రజలందరికి ఆశ్చర్యమేసి, “ఈయన బహుశా దావీదు కుమారుడేమో!” అని అన్నారు.
MAT 12:24 పరిసయ్యులు ఇది విని, “దయ్యాల రాజైన బయెల్జెబూలు సహాయంతో యితడు దయ్యాలను వదిలిస్తున్నాడు. అంతే!” అని అన్నారు.
MAT 12:25 వాళ్ళ ఆలోచనలను యేసు తెలుసుకొన్నాడు. వాళ్ళతో, “విభాగాలైన ప్రతి రాజ్యం నశించి పోతుంది. విభాగాలైన ప్రతి పట్టణమూ, ప్రతి యిల్లు కూలిపోతుంది.
MAT 12:26 సైతాను సైతాన్ని పారద్రోలితే వాడు విడిపోతాడు. అప్పుడు వాని రాజ్యం ఏవిధంగా నిలుస్తుంది?
MAT 12:27 నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాన్ని పారద్రోలుతున్నట్లైతే మీ కుమారులు ఎవరి ద్వారా పారద్రోలుతున్నారు? మీరంటున్నది తప్పని మీ వాళ్ళే ఋజువు చేస్తున్నారు.
MAT 12:28 ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాల్ని పారద్రోలుతున్నట్లైతే దేవుని రాజ్యం మీకు వచ్చినట్లేగదా!
MAT 12:29 అంతేకాక మొదట బలవంతుణ్ణి కట్టి వేయకుండా అతని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఆ బలవంతుణ్ణి కట్టివేసాక అతని యింటిని దోచుకోగలరు.
MAT 12:30 నాతో ఉండని వాడు నాకు శత్రువుగా ఉంటాడు. నాతో కలసిమెలసి ఉండనివాడు చెదరిపోతాడు.
MAT 12:31 “అందువలన నేను చెప్పేదేమిటంటే మానవుడు చేసిన పాపాలన్నిటిని దేవదూషణను దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషించిన వాళ్ళను క్షమించడు.
MAT 12:32 మనుష్యకుమారుణ్ణి దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి ఈయుగంలో కాని, లేక రానున్న యుగంలో కాని క్షమించడు.
MAT 12:33 “మీరు మంచిఫలాలు కావాలనుకుంటే, చెట్టును మంచిగా చేయాలి. నీ చెట్టు మంచిది కాకపోతే దానికి చెడ్డ ఫలాలు కాస్తాయి. పండును బట్టి చెట్టు ఎట్టిదో చెప్పబడుతుంది.
MAT 12:34 మీరు పాముల్లాంటి వాళ్ళు. దుష్టులు మంచి మాటలేవిధంగా ఆడగలుగుతారు. హృదయంలో ఉన్నదాన్ని నోరు మాట్లాడుతుంది.
MAT 12:35 మంచివానిలో మంచి ఉంటుంది. కనుక అతని నుండి మంచి బయటికి వస్తుంది. దుష్టునిలో చెడు ఉంటుంది కనుక అతని నుండి చెడు బయటికి వస్తుంది.
MAT 12:36 కాని నేను చెప్పేదేమిటంటే మానవులు తాము నిర్లక్ష్యంగా ఆడిన ప్రతి మాటకు తీర్పు చెప్పే రోజున లెక్క చెప్పవలసి ఉంటుంది.
MAT 12:37 ఎందుకంటే మీరాడిన మాటల్ని బట్టి మీరు నిరపరాధులో, అపరాధులో నిర్ణయింపబడుతుంది” అని అన్నాడు.
MAT 12:38 ఆ తర్వాత కొందరు శాస్త్రులు, పరిసయ్యులు ఆయనతో, “బోధకుడా! మీరొక రుజువు చూపాలని మా కోరిక!” అని అన్నారు.
MAT 12:39 కాని ఆయన చెప్పాడు: “దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి ఈ తరంవాళ్ళు రుజువు చూపమని కోరుతారు. యోనా ప్రవక్త ద్వారా చూపిన రుజువు తప్ప మరే రుజువు చూపబడదు.
MAT 12:40 ఎందుకంటే, యోనా పెద్ద చేప కడుపులో మూడు పగళ్ళు, మూడు రాత్రులు గడిపాడు. అదే విధంగా మనుష్యకుమారుడు మూడు రాత్రులు, మూడు పగళ్ళు భూగర్భంలో గడుపుతాడు.
MAT 12:41 నీనెవె ప్రజలు యోనా ప్రకటించిన సందేశాన్ని విని మారు మనస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజు వాళ్ళు ఈ తరం వాళ్ళతో సహా నిలబడి ఈతరం వాళ్ళు నేరస్థులని నిర్ణయిస్తారు. కాని యిప్పుడు యోనా కంటె గొప్పవాడు యిక్కడున్నాడు.
MAT 12:42 “దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినాలని చాలా దూరం నుండి వచ్చింది. కనుక తీర్పు చెప్పే రోజు ఆమె ఈ తరం వాళ్ళతో కలసి నిలబడి ఈ తరం వాళ్ళు నేరస్థులని నిర్ణయిస్తుంది. కాని యిప్పుడు సొలొమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు.
MAT 12:43 “దయ్యం పట్టిన వాని నుండి బయటికి వచ్చిన దయ్యం విశ్రాంతి కోసం వెతుకుతూ నీరులేని చోట తిరుగుతుంది. కాని దానికి విశ్రాంతి దొరకదు.
MAT 12:44 అప్పుడది, ‘నేను వదిలి వచ్చిన నాయింటికి మళ్ళీ వెళ్తాను’ అని అనుకొంటుంది. అది తిరిగి వచ్చి, ఆయింటిని ఎవ్వరూ ఆక్రమించనట్లు, పైగా శుభ్రంగా వూడ్చి అన్నీ సరిదిద్దినట్లు గమనిస్తుంది.
MAT 12:45 అప్పుడది వెళ్ళి తనతో సహా, తనకన్నా దుష్టమైన ఏడు దయ్యాల్ని పిలుచుకు వస్తుంది. అన్నీ కలసి ఆ యింటిలోకి వెళ్ళి నివశిస్తాయి. అప్పుడా వ్యక్తి గతి మొదటికన్నా అధ్వాన్నం ఔతుంది. దుర్బుద్ధిగల ఈ తరం వాళ్ళకు ఇలాంటి గతి పడ్తుంది” అని చెప్పాడు.
MAT 12:46 యేసు ప్రజలతో యింకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతలో ఆయన తల్లి, సోదరులు ఆయనతో మాట్లాడాలనుకొని వచ్చి, బయట నిలబడ్డారు.
MAT 12:47 ఒకడు యేసుతో, “మీ తల్లి, సోదరులు మీతో మాట్లాడాలని బయట నిలుచొన్నారు!” అని అన్నాడు.
MAT 12:48 యేసు సమాధానం చెబుతూ, “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అన్నాడు.
MAT 12:49 తన శిష్యుల వైపు చూపుతూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు.
MAT 12:50 ఎవరైతే పరలోకంలోని నా తండ్రి యిచ్చానుసారం నడుచుకొంటారో వాళ్ళే నా సోదరులు, నా చెల్లెండ్రు, నా తల్లి” అని అన్నాడు.
MAT 13:1 అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్ళి సరస్సు ప్రక్కన కూర్చున్నాడు.
MAT 13:2 ఆయన చుట్టు పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. అందువల్ల ఆయన పడవనెక్కి కూర్చున్నాడు. ప్రజలు సరస్సు ఒడ్డున నిలుచున్నారు.
MAT 13:3 ఆయన వాళ్ళకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు, “ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు.
MAT 13:4 అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేసాయి.
MAT 13:5 మరి కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి.
MAT 13:6 కాని సూర్యోదయమయ్యాక ఆ మొక్కలు వాడి పొయ్యాయి. వాటివేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి.
MAT 13:7 మరి కొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ఈ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కల్ని అణిచి వేసాయి.
MAT 13:8 మరి కొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై బడ్డాయి. వాటిలో కొన్ని నూరు రెట్ల పంటను, కొన్ని అరవై రెట్ల పంటను, కొన్ని ముప్పైరెట్ల పంటనిచ్చాయి.
MAT 13:9 వినేవాళ్లు వినండి!”
MAT 13:10 శిష్యులు వచ్చి యేసును, “మీరు ప్రజలతో ఉపమానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడుతారు?” అని అడిగారు.
MAT 13:11 ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుని రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకొనే జ్ఞానాన్ని మీరు పొందారు. వాళ్ళుకాదు.
MAT 13:12 దేవుడు గ్రహింపు ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వాళ్ళ దగ్గరనుండి ఉన్నది కూడా తీసివేస్తాడు.
MAT 13:13 నేను వాళ్ళతో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే, చూసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. విన్నా అర్దంచేసుకోరు, గ్రహించరు.
MAT 13:14 తద్వారా యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ళ విషయంలో నిజమైంది: ‘మీరు తప్పక వింటారు, కాని అర్థంచేసుకోలేరు. మీరు తప్పక చూస్తారు కాని గ్రహించలేరు.
MAT 13:15 వాళ్ళు కళ్ళతో చూసి, చెవుల్తో విని, హృదయాలతో అర్థం చేసుకొని నావైపు మళ్ళితే నేను వాళ్ళను నయం చేస్తాను. కాని అలా జరుగరాదని ఈ ప్రజల హృదయాలు మొద్దుబారాయి. వాళ్ళకు బాగా వినిపించదు. వాళ్ళు తమ కళ్ళు మూసికొన్నారు.’
MAT 13:16 కాని మీ కళ్ళు చూడకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. మీ చెవులు వినకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి.
MAT 13:17 ఎందుకంటే ఎందరో ప్రవక్తలు, నీతిమంతులు మీరుచూస్తున్నవి చూడాలని ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని ఆశించారు. కాని వినలేక పోయారు. ఇది సత్యం.
MAT 13:18 “మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి.
MAT 13:19 “కొందరు దేవుని రాజ్యాన్ని గురించి వింటారు. కాని అర్థం చేసుకోరు. అలాంటి హృదయాల్లో నాటబడిన దైవ సందేశాన్ని సైతాను తీసుకు వెళ్తాడు. వీళ్ళను రహదారి ప్రక్కనపడిన విత్తనాలతో పోల్చవచ్చు.
MAT 13:20 “దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్ళను రాతి నేలపైబడ్డ విత్తనాలతో పోల్చవచ్చు.
MAT 13:21 అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు. కనుక అవి చాలాకాలం బ్రతుకవు. సందేశం వలన కష్టాలుకాని హింసలు కాని సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదలి వేస్తారు.
MAT 13:22 “దైవ సందేశాన్ని విని జీవితంలోని కష్టాలకు, ధనంవలన కలిగే మోసానికి ఉక్కిరి బిక్కిరై, నిష్పలులై పోయే వాళ్ళను ముళ్ళ మొక్కల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు.
MAT 13:23 “దైవ సందేశాన్ని విని దాన్ని అర్ధం చేసుకొనే వాళ్ళను సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. వాటిలో కొన్ని నూరురెట్లు పంటను, కొన్ని అరవై రెట్లు పంటను, కొన్ని ముప్పైరెట్లు పంటను యిస్తాయి.”
MAT 13:24 యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు.
MAT 13:25 అందరూ నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు.
MAT 13:26 గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు కూడ కనిపించాయి.
MAT 13:27 పని వాళ్ళు, తమ యజమాని దగ్గరకు వచ్చి ‘అయ్యా! మీరు మీ పొలంలో మంచి విత్తనాలను నాటలేదా? మరి కలపు మొక్కలు ఎట్లా మొలిచాయి?’ అని అడిగారు.
MAT 13:28 “‘ఇది శత్రువు చేసిన పని’ అని ఆ యజమాని సమాధానం చెప్పాడు. “పని వాళ్ళు, ‘మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా?’ అని అడిగారు.
MAT 13:29 “అతడు, ‘వద్దు! మీరిప్పుడు కలుపు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికి వేసే అవకాశం ఉంది.
MAT 13:30 కోతకొచ్చేవరకు రెండింటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసే వాళ్ళతో, మొదట కలుపు మొక్కలు కోసి, కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగు చేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకు వెళ్ళమంటాను’ అని అంటాడు.”
MAT 13:31 ఆయన వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆవగింజను తన తోటలో నాటాడు.
MAT 13:32 అది విత్తనాలన్నిటికన్నా చిన్నదైనా, పెరిగినప్పుడది మొక్కలన్నిటి కన్నా పెద్దగా పెరిగి ఒక చెట్టవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలపై గూళ్ళు కట్టుకొంటాయి.”
MAT 13:33 యేసు వాళ్లకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యం పులుపు పిండి లాంటిది. ఒక స్త్రీ పులిసినపిండిని తీసికొని మూడు సేర్ల పిండిలో కలిపింది. అలా చెయ్యటం వల్ల ఆ పిండంతా పులుపుగా మారింది.”
MAT 13:34 యేసు ప్రజలకు ఇవన్నీ ఉపమానాల ద్వారా చెప్పాడు. ఉపమానం ఉపయోగించకుండా వాళ్ళకేదీ చెప్పలేదు.
MAT 13:35 దాంతో ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన వాక్యాలు నిజమయ్యాయి: “నేను ఉపమానాల ద్వారా మాట్లాడి, ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి దాచబడిన వాటిని చెబుతాను.”
MAT 13:36 ఆ తర్వాత ఆయన ప్రజల్ని వదలి యింట్లోకి వెళ్ళాడు. ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని, “పొలంలోని కలుపు మొక్కల ఉపమానాన్ని గురించి మాకు వివరంగా చెప్పండి” అని అడిగారు.
MAT 13:37 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మంచి విత్తనాన్ని నాటుతున్న వాడు మనుష్య కుమారుడు.
MAT 13:38 ఈ ప్రపంచం పొలంతో పోల్చబడింది. మంచి విత్తనాలు దేవుని రాజ్యంలోవున్న ప్రజలతో పోల్చబడ్డాయి. పొలంలోని కలుపు మొక్కలు సైతాను కుమారులతో పోల్చబడ్డాయి.
MAT 13:39 వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు. కోతకాలం యుగాంతంతో పోల్చబడింది. కోతకోసేవాళ్ళు దేవదూతలతో పోల్చబడ్డారు.
MAT 13:40 “కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చి వేసినట్లే యుగాంతంలో కూడా మనుష్య కుమారుడు తన దూతల్ని పంపుతాడు.
MAT 13:41 వాళ్ళు వచ్చి ఆయన రాజ్యంలో ఉన్న పాపుల్ని, పాపాలను కలుగజేసే వాళ్ళను ప్రోగు చేస్తారు. అలా ప్రోగు చేసి వాళ్ళను అగ్ని గుండంలో పారవేస్తారు.
MAT 13:42 వాళ్ళు ఏడుస్తారు. బాధననుభవిస్తారు.
MAT 13:43 ఆ తర్వాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. విన్నవాళ్ళు అర్థం చేసుకోండి!
MAT 13:44 “దేవుని రాజ్యం పొలంలో దాచబడిన నిధి లాంటిది. ఒక వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడు. కాని వెంటనే దాన్ని దాచేసాడు. ఆ తర్వాత ఆనందంగా వెళ్ళి తన దగ్గరున్నవన్నీ అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు.
MAT 13:45 “దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది.
MAT 13:46 ఒక వర్తకుడు మంచి విలువైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు.
MAT 13:47 “దేవుని రాజ్యం సరస్సులోకి వేసి అన్ని రకాల చేపల్ని పట్టుకొనే ఒక వలలాంటిది.
MAT 13:48 వల చేపల్తో నిండిపొయ్యాక బెస్తవాళ్ళు దాన్ని ఒడ్డుకు లాగి మంచి చేపల్ని బుట్టలో వేసికొని పనికిరాని చేపల్ని పారవేస్తారు.
MAT 13:49 అదేవిధంగా యుగాంతంలో కూడా దేవ దూతలు వచ్చి నీతిమంతులనుండి దుర్మార్గుల్ని వేరు చేసి, భయానకమైన మంటల్లో పారవేస్తారు.
MAT 13:50 వాళ్ళు దుఃఖిస్తారు, బాధననుభవిస్తారు, పళ్ళు కొరుకుతారు.”
MAT 13:51 “మీకివన్నీ అర్థమయ్యాయా?” అని యేసు అడిగాడు. అవునని వాళ్ళు సమాధానం చెప్పారు.
MAT 13:52 యేసు వాళ్ళతో, “దేవుని రాజ్యాన్ని గురించి బోధన పొందిన శాస్త్రుల్ని తన ధనాగారం నుండి క్రొత్త నిధుల్ని, పాతనిధుల్ని తీసుకొని వచ్చే ఆసామితో పోల్చవచ్చు” అని అన్నాడు.
MAT 13:53 యేసు ఈ ఉపమానాలన్నిటిని చెప్పటం ముగించాక అక్కడి నుండి ప్రయాణమై తన స్వగ్రామం వెళ్ళాడు. అక్కడ సమాజ మందిరంలో ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు.
MAT 13:54 వాళ్ళు ఆ బోధనలు విని చాలా ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ శక్తి ఈయనకు ఎక్కడ నుండి లభించాయి?
MAT 13:55 ఈయన వడ్రంగి కుమారుడే కదూ! ఈయన తల్లి పేరు మరియ కదూ! ఇతని సోదరులు యాకోబు, యోసేవు, సీమోను, యూదా కదూ!
MAT 13:56 ఇతని అక్క చెల్లెండ్రందరూ మన గ్రామంలోనే నివసిస్తున్నారు కదూ! మరి ఈయనకు యివన్నీ ఎక్కడనుండి లభించాయి?” అని అన్నారు.
MAT 13:57 ఆయనపై వాళ్ళకు కోపం వచ్చింది. యేసు వాళ్ళతో, “స్వగ్రామం వాళ్ళు, యింటి వాళ్ళు తప్ప ప్రవక్తను అందరూ గౌరవిస్తారు” అని అన్నాడు.
MAT 13:58 వాళ్ళు విశ్వసించలేదు. కనుక ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.
MAT 14:1 ఆ కాలంలో గలిలయకు అధిపతియైన హేరోదు యేసును గురించి విన్నాడు.
MAT 14:2 అతడు తన పరిచారకులతో, “ఇతడు బాప్తిస్మమునిచ్చే యోహాను అని నా నమ్మకం. అతడు బ్రతికి వచ్చాడు. కనుకనే అద్భుతాలు చేసే శక్తి ఆయనలోవుంది” అని అన్నాడు.
MAT 14:3 అలా ఎందుకన్నాడంటే కొంతకాలానికి ముందు హేరోదు యోహానును బంధించి కారాగారంలో వేసాడు. ఇలా జరగటానికి కారణం హేరోదియ. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పుకు భార్య.
MAT 14:4 పైగా యోహాను హేరోదుతో, “నీవామెతో కలసి జీవించటం న్యాయం కాదు!” అని అనేవాడు.
MAT 14:5 ఈ కారణంగా హేరోదు యోహానును చంపాలనుకున్నాడు. కాని ప్రజలు యోహానును ఒక ప్రవక్తగా పరిగణించేవారు కనుక హేరోదు వాళ్ళను చూసి భయపడి పోయాడు.
MAT 14:6 హేరోదు పుట్టిన రోజు పండుగ జరిగింది. ఆరోజు హేరోదియ కుమార్తె సభలో నాట్యం చేసి హేరోదును మెప్పించింది.
MAT 14:7 అందువల్ల అతడు ఆమె అడిగింది యిస్తానని వాగ్దానం చేసాడు.
MAT 14:8 ఆమె తన తల్లి ప్రోద్బలంతో, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి నాకివ్వండి” అని అడిగింది.
MAT 14:9 ఇది విన్న రాజుకు దుఃఖం కలిగింది. కాని వాగ్దానం చేయటం వల్ల, అతిథులు అక్కడే ఉండటంవల్ల ఆమె కోరిక తీర్చమని ఆజ్ఞాపించాడు.
MAT 14:10 వెంటనే భటుణ్ణి పంపి కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు.
MAT 14:11 ఒక భటుడు యోహాను తలను ఒక పళ్ళెంలో తీసుకు వచ్చి ఆమెకిచ్చాడు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరకు తీసుకు వెళ్ళింది.
MAT 14:12 యోహాను శిష్యులు వచ్చి అతని దేహాన్ని తీసుకు వెళ్ళి సమాధి చేసారు. ఆ తర్వాత వెళ్ళి యేసుతో చెప్పారు.
MAT 14:13 జరిగింది విని యేసు పడవనెక్కి ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన సమాచారం విని ప్రజలు గుంపులు గుంపులుగా పట్టణాలనుండి వచ్చి కాలినడకన ఆయన్ని అనుసరించారు.
MAT 14:14 యేసు పడవనుండి దిగి ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడ ఉండటం చూసాడు. ఆయనకు జాలి వేసింది. వాళ్ళలో రోగాలున్న వాళ్ళను ఆయన బాగు చేసాడు.
MAT 14:15 సాయంకాలం కాగానే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఈ ప్రదేశం ఏమూలో ఉంది, పైగా ఇప్పటికే చాలా ప్రొద్దుపోయింది. వీళ్ళను పంపి వేయండి. గ్రామాల్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు.
MAT 14:16 యేసు, “వాళ్ళు వెళ్ళనక్కరలేదు. తినటానికి మీరే ఏదైనా యివ్వండి.” అని వాళ్ళతో అన్నాడు.
MAT 14:17 “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
MAT 14:18 “వాటిని ఇక్కడకు తీసుకు రండి” అని యేసు అన్నాడు.
MAT 14:19 ఆ తర్వాత ప్రజల్ని అక్కడున్న పచ్చిక బయళ్ళలో కూర్చోమని అన్నాడు. ఆ అయిదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసికొని ఆకాశం వైపు చూసి దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఆ రొట్టెను విరచి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు పంచారు.
MAT 14:20 అందరూ కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు.
MAT 14:21 స్త్రీలు, పిల్లలే కాకుండా అయిదువేల మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు.
MAT 14:22 ఆ తర్వాత యేసు తన శిష్యులతో పడవనెక్కి తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. తానక్కడే ఉండి ప్రజల్ని ఇళ్ళకు పంపాలని ఆయన ఉద్దేశం.
MAT 14:23 ప్రజల్ని పంపేశాక యేసు ఏకాంతంగా ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. సాయంకాలం అయింది. అయినా ఆయనొక్కడే అక్కడ ఉండిపోయాడు.
MAT 14:24 పడవ ఒడ్డుకు చాలా దూరంలో ఉంది. ఎదురు గాలి వీయటం వల్ల అలలు ఆ పడవను కొడ్తూ ఉన్నాయి.
MAT 14:25 రాత్రి నాలుగోఝామున యేసు నీళ్ళ మీద నడుస్తూ శిష్యుల దగ్గరకు వెళ్ళాడు.
MAT 14:26 ఆయన నీళ్ళపై నడవటం చూసి శిష్యులు, “దయ్యం” అంటూ భయంతో పెద్దకేక పెట్టారు.
MAT 14:27 యేసు వెంటనే, “నేనే! ధైర్యంగా ఉండండి! భయపడకండి!” అని అన్నాడు.
MAT 14:28 పేతురు, “ప్రభూ మీరైతే, నీళ్ళ మీద నడుస్తూ నన్ను మీదగ్గరకు రానివ్వండి!” అని అన్నాడు.
MAT 14:29 “రా” అని యేసు అన్నాడు. అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ళ మీద నడుస్తూ యేసు దగ్గరకు వెళ్ళాడు.
MAT 14:30 కాని గాలి వీయటం గమనించి భయపడి నీళ్ళలో మునుగుతూ, “ప్రభూ, నన్ను రక్షించండి!” అని కేక వేశాడు.
MAT 14:31 యేసు వెంటనే తన చేయి జాపి అతణ్ణి పట్టుకొని, “నీలో దృఢవిశ్వాసం లేదు! ఎందుకు సందేహించావు?” అని ప్రశ్నించాడు.
MAT 14:32 వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది.
MAT 14:33 పడవలోవున్న వాళ్ళు యేసుకు మ్రొక్కుతూ, “మీరు నిజంగా దేవుని కుమారుడు!” అని అన్నారు.
MAT 14:34 వాళ్ళు సరస్సు దాటి గెన్నేసరెతు ఒడ్డును చేరుకున్నారు.
MAT 14:35 ఆ గ్రామం వాళ్ళు యేసును గుర్తించి చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళందరికి కబురు పెట్టారు. ప్రజలు రోగాలతో ఉన్న వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చి.
MAT 14:36 “వాళ్ళను మీ అంగీ అంచునైనా తాకనివ్వండి” అని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన వాళ్ళకందరికి నయమైపోయింది.
MAT 15:1 కొందరు పరిసయ్యులు, శాస్త్రులు యెరూషలేము నుండి వచ్చి,
MAT 15:2 “మీ శిష్యులు భోజనానికి ముందు చేతులెందుకు కడుక్కోరు? పెద్దలు నియమించిన ఆచారాల్ని వాళ్ళెందుకు ఉల్లంఘిస్తున్నారు?” అని అడిగారు.
MAT 15:3 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ఆచారాల కోసం దేవుని ఆజ్ఞల్ని ఎందుకుల్లంఘిస్తున్నారు?
MAT 15:4 దేవుడు ‘తల్లి తండ్రుల్ని గౌరవించు’ అని అన్నాడు. అంతేకాక ‘తల్లి తండ్రుల్ని దూషించిన వానికి మరణ దండన వేయవలెను!’ అని కూడా చెప్పాడు.
MAT 15:5 కాని మీరు ఒక వ్యక్తి తన తల్లి తండ్రులతో ‘మీ అవసరాలకివ్వాలనుకొన్న ధనం దేవునికి ముడుపు కట్టాను’ అని అన్నవాడు, తల్లి తండ్రుల్ని గౌరవించనవసరం లేదని అంటున్నారు. అంటే మీరు మీ ఆచారం కోసం దేవుని మాటను కాదంటున్నారన్న మాట.
MAT 15:7 మీరు మోసగాళ్ళు. యెషయా మిమ్మల్ని గురించి సరిగ్గా ముందే చెప్పాడు. అతడు,
MAT 15:8 ‘ఈ ప్రజలు నన్ను పెదాలతో గౌరవిస్తారు. కాని వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉంటాయి.
MAT 15:9 వాళ్ళ ఆరాధనలు వ్యర్థం! వాళ్ళ బోధనలు మానవులు సృష్టించిన ఆజ్ఞలతో సమానం,’” అని అన్నాడు.
MAT 15:10 యేసు ప్రజల్ని తన దగ్గరకు రమ్మని పిలిచి వాళ్ళతో, “విని అర్థం చేసుకోండి.
MAT 15:11 మానవుని నోటిలోనికి వెళ్ళేదేదీ అతణ్ణి అపవిత్రం చెయ్యదు. అతని నోటినుండి వచ్చే మాటలు అతణ్ణి అపవిత్రం చేస్తాయి” అని అన్నాడు.
MAT 15:12 ఆ తర్వాత ఆయన శిష్యులు వచ్చి, “మీరన్నది విని పరిసయ్యులు కోపగించుకొన్నారని మీకు తెలుసా?” అని అడిగారు.
MAT 15:13 యేసు సమాధానంగా, “పరలోకంలో ఉన్న నా తండ్రి నాటని ప్రతి మొక్క వేర్లతో పెరికి వేయబడుతుంది.
MAT 15:14 వాళ్ళ విషయాన్ని వదిలెయ్యండి. వాళ్ళు గ్రుడ్డివాళ్ళు. కాని వారు ఇతరులకు దారి చూపుతూ ఉంటారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపితే యిద్దరూ గోతిలో పడ్తారు” అని అన్నాడు.
MAT 15:15 పేతురు, “ఆ ఉపమానాన్ని మాకు విడమరచి చెప్పండి” అని అడిగాడు.
MAT 15:16 యేసు, “మీక్కూడా అర్థంకాలేదా?
MAT 15:17 నోట్లోకి వెళ్ళినవి కడుపులోకి వెళ్ళి తదుపరి శరీరం నుండి బయటకు వెళ్తున్నాయని మీకు తెలియదా?
MAT 15:18 కాని నోటినుండి బయటకు వచ్చే మాటలు హృదయం నుండి వస్తాయి. మనిషిని అపవిత్రం చేసేవి ఇవే.
MAT 15:19 ఎందుకంటే, దురాలోచన, హత్య, లైంగిక అవినీతి, వ్యభిచారం, దొంగతనము, తప్పుడు సాక్ష్యము, అపనింద, మానవుని హృదయం నుండి వస్తాయి.
MAT 15:20 వీటి కారణంగా మానవుడు అపవిత్రమౌతున్నాడు. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన అపవిత్రం కాడు” అని అన్నాడు.
MAT 15:21 యేసు ఆ ప్రదేశాన్ని వదిలి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు.
MAT 15:22 కనాను ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ యేసు దగ్గరకు ఏడుస్తూ వచ్చి, “ప్రభూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు. నా కూతురు దయ్యం పట్టి చాలా బాధ పడుతుంది” అని ఆయనతో అన్నది.
MAT 15:23 యేసు ఏ సమాధానం చెప్పలేదు. అందువల్ల శిష్యులు వచ్చి, “ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ మనవెంట వస్తోంది. ఆమెను వెళ్ళమనండి” అని విజ్ఞప్తి చేసారు.
MAT 15:24 యేసు, “తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల కోసం మాత్రమే దేవుడు నన్ను పంపాడు” అని అన్నాడు.
MAT 15:25 ఆ స్త్రీ వచ్చి యేసు ముందు మోకరిల్లి, “ప్రభూ! నాకు సహాయం చెయ్యండి!” అని అడిగింది.
MAT 15:26 యేసు, “దేవుని సంతానానికి చెందిన ఆహారం తీసుకొని కుక్కలకు వెయ్యటం న్యాయం కాదు” అని సమాధానం చెప్పాడు.
MAT 15:27 “ఔను ప్రభూ! కాని, కుక్కలు కూడా తమ యజమాని విస్తరు నుండి పడిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె అన్నది.
MAT 15:28 అప్పుడు యేసు, “అమ్మా! నీలో ఉన్న విశ్వాసం గొప్పది. నీవు కోరినట్లే జరుగుతుంది” అని సమాధానం చెప్పాడు. ఆ క్షణంలోనే ఆమె కూతురుకు నయమై పోయింది.
MAT 15:29 యేసు అక్కడి నుండి బయలుదేరి, గలిలయ సరస్సు తీరము మీదుగా నడిచి కొండ మీదికి వెళ్ళి కూర్చున్నాడు.
MAT 15:30 ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు. వాళ్ళు తమ వెంట కుంటి వాళ్ళను, గ్రుడ్డి వాళ్ళను, కాళ్ళు చేతులు పడి పోయిన వాళ్ళను, మూగ వాళ్ళను యింకా అనేక రకాల రోగాలున్న వాళ్ళను తీసికొని వచ్చి ఆయన కాళ్ళ ముందు పడ వేసారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు.
MAT 15:31 మూగ వాళ్ళకు మాట వచ్చింది. కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకు నయమైపోయింది. కుంటి వాళ్ళు నడిచారు. గ్రుడ్డి వాళ్ళకు చూపు వచ్చింది. ఇవన్నీ జరగటం చూసి ప్రజలు ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించారు.
MAT 15:32 యేసు తన శిష్యుల్ని పిలిచి వాళ్ళతో, “వీళ్ళపట్ల నాకు చాలా జాలి వేస్తోంది. వాళ్ళు మూడు రోజులనుండి నా దగ్గరే ఉన్నారు. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వాళ్ళు దారిలో మూర్ఛ పడిపోతారు” అని అన్నాడు.
MAT 15:33 ఆయన శిష్యులు సమాధానంగా, “ఈ మారు మూల ప్రాంతంలో అందరికి సరిపోయె రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి?” అని అన్నారు.
MAT 15:34 “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” యేసు అడిగాడు. “ఏడు రొట్టెలు, కొన్ని చేపలు ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
MAT 15:35 యేసు ప్రజల్ని కూర్చోమన్నాడు.
MAT 15:36 ఆ తర్వాత ఆ ఏడు రొట్టెల్ని, చేపల్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచి శిష్యులకు యిచ్చాడు. శిష్యులు వాటిని ప్రజలకు పంచి పెట్టారు.
MAT 15:37 అందరూ సంతృప్తిగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని ఏడు గంపల నిండా నింపారు.
MAT 15:38 స్త్రీలు, చిన్న పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు.
MAT 15:39 యేసు ప్రజల్ని పంపేసాక పడవనెక్కి మగదాను ప్రాంతానికి వెళ్ళాడు.
MAT 16:1 పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసును పరీక్షించాలని వచ్చి, “ఆకాశం నుండి ఒక అద్భుతాన్ని మాక్కూడా చూపండి” అని అడిగారు.
MAT 16:2 ఆయన, “సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా ఉంటే ఆ రోజు వాతావరణం బాగుంటుందని మీరంటారు.
MAT 16:3 ఉదయం ఆకాశం ఎఱ్ఱగావుండి, ఆకాశంలో మబ్బులు ఉంటే ఆ రోజు తుఫాను వస్తుందని అంటారు. ఆకాశం వైపు చూసి మీరు వాతావరణాన్ని సూచించగలరు కాని ఈ కాలంలో కనబడుతున్న అద్భుతాన్ని అర్థం చేసుకోలేరేం?
MAT 16:4 దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి ఈ తరం వాళ్ళు అద్భుతకార్యాల్ని చూపమని కోరతారు. దేవుడు యోనా ద్వారా చూపిన అద్భుతం తప్ప మరే అద్భుతం చూపబడదు” అని చెప్పి వాళ్ళను వదిలి వెళ్ళిపోయాడు.
MAT 16:5 శిష్యులు సరస్సు దాటి వెళ్ళే ముందు, తమ వెంటరొట్టెల్ని తీసుకు వెళ్ళటం మరచిపొయ్యారు.
MAT 16:6 యేసు వాళ్ళతో, “జాగ్రత్త! పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే పులిసిన పిండి విషయంలో దూరంగా ఉండండి” అని అన్నాడు.
MAT 16:7 ఈ విషయాన్ని గురించి వారు తమలో తాము చర్చించుకొని, “మనం రొట్టెలు తేలేదని అలా అంటున్నాడు” అని అన్నారు.
MAT 16:8 వాళ్ళ చర్చ యేసుకు తెలిసింది. వాళ్ళతో, “మీలో దృఢవిశ్వాసం లేదు. రొట్టెలు లేవని మీలో మీరెందుకు చర్చించుకొంటున్నారు.
MAT 16:9 మీకింకా అర్థం కాలేదా? అయిదు వేల మందికి అయిదు రొట్టెల్ని పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో మీకు జ్ఞాపకం లేదా?
MAT 16:10 మరి ఏడు రొట్టెల్ని నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో జ్ఞాపకం లేదా?
MAT 16:11 నేను రొట్టెల్ని గురించి మాట్లాడలేదని మీకెందుకు అర్ధం కావటం లేదు? పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే దుష్ప్రభావానికి దూరంగా ఉండండి” అని అన్నాడు.
MAT 16:12 ఆయన రొట్టెలకు ఉపయోగించే పులుపు విషయంలో జాగ్రత్త పడమనటం లేదని, పరిసయ్యుల బోధన విషయంలో, సద్దూకయ్యుల బోధన విషయంలో జాగ్రత్త పడమంటున్నాడని అప్పుడు వాళ్ళకు అర్థమయింది.
MAT 16:13 యేసు ఫిలిప్పు స్థాపించిన కైసరయ పట్టణ ప్రాంతానికి వచ్చాక తన శిష్యులతో, “మనుష్య కుమారుణ్ణి గురించి ప్రజలేమనుకుంటున్నారు?” అని అడిగాడు.
MAT 16:14 వాళ్ళు, “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నారు. కొందరు ఏలీయా అంటున్నారు. కొందరు యిర్మీయా అంటున్నారు. మరి కొందరు ప్రవక్తల్లో ఒకడై ఉండవచ్చని అంటున్నారు” అని అన్నారు.
MAT 16:15 యేసు, “కాని మీ విషయమేమిటి? నేనెవరని మీరనుకొంటున్నారు?” అని వాళ్ళనడిగాడు.
MAT 16:16 సీమోను పేతురు, “నీవు క్రీస్తువు! సజీవుడైన దేవుని కుమారుడవు!” అని అన్నాడు.
MAT 16:17 యేసు సమాధానం చెబుతూ, “యోనా కుమారుడా! ఓ! సీమోనూ, నీవు ధన్యుడవు! ఈ విషయాన్ని నీకు మానవుడు చెప్పలేదు. పరలోకంలో వున్న నా తండ్రి చెప్పాడు.
MAT 16:18 నీవు పేతురువని నేను చెబుతున్నా. ఈ బండ మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తాను. మృత్యులోకపు శక్తులు సంఘాన్ని ఓడించలేవు.
MAT 16:19 దేవుని రాజ్యం యొక్క తాళం చెవులు నేను నీకిస్తాను. ఈ ప్రపంచంలో నీవు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో కూడా నిరాకరిస్తాను. ఈ ప్రవంచంలో నీవు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో కూడా అంగీకరిస్తాను” అని అన్నాడు.
MAT 16:20 ఆ తర్వాత, తాను క్రీస్తు అన్న విషయం ఎవ్వరికీ చెప్పవద్దని శిష్యులతో చెప్పాడు.
MAT 16:21 అప్పటి నుండి యేసు తన శిష్యులతో తాను యెరూషలేముకు వెళ్ళవలసిన విషయాన్ని గురించి, అక్కడున్న పెద్దలు, మహాయాజకులు, శాస్త్రులు తనను హింసించే విషయాన్ని గురించి, తాను పొందవలసిన మరణాన్ని గురించి, మూడవ రోజు బ్రతికి రావటాన్ని గురించి చెప్పటం మొదలు పెట్టాడు.
MAT 16:22 పేతురు ఆయనను ప్రక్కకు పిలిచి అలా మాట్లాడవద్దంటూ, “దేవుడు మీపై దయ చూపాలి ప్రభూ! అలా ఎన్నటికి జరగ కూడదు!” అని అన్నాడు.
MAT 16:23 యేసు పేతురు వైపు తిరిగి, “నా ముందు నుండి వెళ్ళిపో సాతాను! నీవు నాకు ఆటంకం కలిగిస్తున్నావు! నీవు మనుష్యుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు కాని, దేవుని సంగతులు గురించి కాదు” అని అన్నాడు.
MAT 16:24 యేసు తన శిష్యులతో, “నా వెంట రాదలచిన వాడు అన్నీ విడచి పెట్టి, తన సిలువను మోసుకొంటూ నన్ను అనుసరించాలి.
MAT 16:25 తన ప్రాణాన్ని కాపాడాలనుకొన్నవాడు దాన్ని పొగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని ఒదులు కొన్నవాడు దాన్ని కాపాడుకుంటాడు.
MAT 16:26 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని పొగొట్టుకొన్న వ్యక్తికి ఏం లాభం కలుగుతుంది? ఆ ప్రాణాన్ని తిరిగి పొందటానికి అతడేమివ్వగలుగుతాడు?
MAT 16:27 మనుష్య కుమారుడు తన దేవదూతలతో కలిసి, తండ్రి మహిమతో రానున్నాడు. అప్పుడాయన ప్రతి ఒక్కనికి, చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు.
MAT 16:28 ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు మనుష్యకుమారుడు రావటం చూసేవరకు జీవించే వుంటారు” అని గట్టిగా చెప్పాడు.
MAT 17:1 యేసు ఆరు రోజుల తర్వాత పేతురును, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును, ఒక ఎతైన కొండ మీదికి తన వెంట ప్రత్యేకంగా పిలుచుకు వెళ్ళాడు.
MAT 17:2 ఆయన అక్కడ వాళ్ళ సమక్షంలో దివ్యరూపం పొందాడు. ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది. ఆయన దుస్తులు వెలుతురువలే తెల్లగా మరాయి.
MAT 17:3 అదే క్షణంలో వాళ్ళ ముందు మోషే మరియు ఏలీయా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు.
MAT 17:4 పేతురు యేసుతో, “ప్రభూ! మనమిక్కడ ఉండటం మంచిది. మీరు కావాలంటే మూడు పర్ణశాలలు నిర్మిస్తాము – మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి” అని అన్నాడు.
MAT 17:5 అతడు ఇంకా మాట్లాడుతుండగా ఒక కాంతివంతమైన మేఘం ఆ ముగ్గుర్ని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన పట్ల నాకు ప్రేమ ఉంది. ఈయన నాకు చాలా నచ్చాడు. ఈయన మాట వినండి” అని వినిపించింది.
MAT 17:6 ఇది విని శిష్యులు భయంతో సాష్టాంగ పడ్డారు.
MAT 17:7 యేసు వచ్చి వాళ్ళను తాకుతూ, “లేవండి! భయపడకండి!” అని అన్నాడు.
MAT 17:8 వాళ్ళు తలెత్తి చూసారు. వాళ్ళకు యేసు తప్ప యింకెవరూ కనపడలేదు.
MAT 17:9 వాళ్ళు కొండ దిగి క్రిందికి వస్తుండగా యేసు, “మనుష్యకుమారుడు బ్రతికి వచ్చేవరకు మీరు చూసిన ఈ దృశ్యాన్ని గురించి ఎవ్వరికి చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.
MAT 17:10 “మరి మొదట ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు” అని శిష్యులు అడిగారు.
MAT 17:11 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఏలియా తప్పకుండా వస్తాడు. వచ్చి అన్నీ ముందున్నట్లు స్థాపిస్తాడు.
MAT 17:12 నేను చెప్పేదేమిటంటే, ఏలియా ఇదివరకే వచ్చాడు. కాని వాళ్ళతన్ని గుర్తించలేదు. పైగా అతని పట్ల తమ యిష్టానుసారంగా ప్రవర్తించారు. అదే విధంగా వాళ్ళు మనుష్య కుమారునికి కూడా బాధలు కలిగిస్తారు.”
MAT 17:13 యేసు బాప్తిస్మమునిచ్చే యోహానును గురించి మాట్లాడుతున్నట్లు శిష్యులకు అప్పుడు అర్థమయింది.
MAT 17:14 వాళ్ళు ప్రజల దగ్గరకు రాగానే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి మోకరిల్లి,
MAT 17:15 “ప్రభూ! నా కుమారునిపై దయ చూపండి. అతడు మూర్ఛ రోగంతో చాలా బాధపడ్తున్నాడు. మాటి మాటికి నిప్పుల్లో పడ్తూ ఉంటాడు.
MAT 17:16 అతణ్ణి నేను మీ శిష్యుల దగ్గరకు తీసుకు వచ్చాను. కాని వాళ్ళతనికి నయం చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.
MAT 17:17 అప్పుడు యేసు, “మూర్ఖులైన ఈ తరానికి చెందిన మీలో విశ్వాసం లేదు. మీకు సక్రమమైన ఆలోచనలు రావు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మీ పట్ల సహనం వహించాలి. ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకు రండి” అని అన్నాడు.
MAT 17:18 యేసు ఆ దయ్యానికి వెళ్ళిపొమ్మని గట్టిగా చెప్పాడు. అది ఆ బాలుని నుండి వెలుపలికి వచ్చింది. అదే క్షణంలో ఆ బాలునికి నయమైపోయింది.
MAT 17:19 శిష్యులు ఆ తర్వాత యేసు దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేక పోయాము?” అని అడిగారు.
MAT 17:20 యేసు, “మీలో దృఢవిశ్వాసం లేదు కనుక మీరు దాన్ని వెళ్ళగొట్టలేక పొయ్యారు. కాని ఇది సత్యం.
MAT 17:21 మీలో ఆవగింజంత విశ్వాసమున్నా చాలు. మీరీ కొండతో ‘అక్కడికి వెళ్ళు’ అని అంటే వెళ్తుంది. మీకు అసాధ్యమనేది ఉండదు” అని అన్నాడు.
MAT 17:22 వాళ్ళంతా గలిలయలో మళ్ళీ కలుసుకొన్నప్పుడు యేసు వాళ్ళతో, “మనుష్య కుమారుడు దుర్మార్గులకు అప్పగించబడుతాడు.
MAT 17:23 వాళ్ళాయన్ని చంపుతారు. కాని మూడవ రోజు ఆయన తిరిగి బ్రతికి వస్తాడు” అని అన్నాడు. ఇది విని శిష్యులు చాలా దుఃఖించారు.
MAT 17:24 యేసు, ఆయన శిష్యులు కపెర్నహూము చేరుకొన్నారు. అక్కడ అరషెకెలు పన్నులు సేకరించే అధికారులు పేతురు దగ్గరకు వచ్చి, “మీ బోధకుడు గుడి పన్ను చెల్లించడా?” అని ప్రశ్నించారు.
MAT 17:25 “చెల్లిస్తాడు” అని పేతురు సమాధానం చెప్పి యింట్లోకి వెళ్ళాడు. అతడేం మాట్లాడక ముందే యేసు, “సీమోనూ! నీవేమంటావు? రాజులు సుంకాలు, పన్నులు ఎవర్నుండి సేకరిస్తారు? తమ స్వంత కుమారుల నుండా? లేక యితర్లనుండా?” అని అడిగాడు.
MAT 17:26 “ఇతర్లనుండి” అని పేతురు సమాధానం చెప్పాడు. యేసు, “అలాగయితే కుమారులు చెల్లించవలసిన అవసరం లేదన్న మాటేగా!
MAT 17:27 కాని వాళ్ళకాటంకం కలిగించటం నాకిష్టం లేదు. సరస్సు దగ్గరకు వెళ్ళి గాలం వెయ్యి! మొదట పట్టుకొన్న చేప నోటిని తెరిచి చూస్తే నీకు నాలుగు ద్రాక్మాల నాణెం కనబడుతుంది. దాన్ని తీసుకువెళ్ళి నా పక్షాన, నీ పక్షాన వాళ్ళకు చెల్లించు!” అని అన్నాడు.
MAT 18:1 ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “మరి దేవుని రాజ్యంలో అందరి కన్నా గొప్ప వాడెవరు?” అని అడిగారు.
MAT 18:2 యేసు ఒక చిన్న పిల్లవాణ్ణి దగ్గరకు రమ్మని పిలిచి అతణ్ణి వాళ్ళ మధ్య నిలుచోబెట్టి ఈ విధంగా అన్నాడు:
MAT 18:3 “ఇది సత్యం. మీరు మారి, మీ హృదయాల్లో చిన్న పిల్లల్లా ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు.
MAT 18:4 అందువల్ల ఈ చిన్నపిల్లవానిలో ఉన్న వినయాన్ని అలవర్చుకున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్ప వానిగా పరిగణింపబడతాడు.
MAT 18:5 “అంతేకాక ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకనికి నా పేరిట స్వాగతమిచ్చిన వాణ్ణి నాకు స్వాగతమిచ్చిన వానిగా నేను పరిగణిస్తాను.
MAT 18:6 “కాని నన్ను విశ్వసించే ఈ చిన్న పిల్లల్లో ఎవరైనా పాపం చేయటానికి కారకుడవటం కన్నా, మెడకు తిరుగటి రాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడటం మేలు.
MAT 18:7 ప్రపంచంలోని మానవుల్ని చూచినప్పుడు విచారం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చేత పాపం చేయించే సంగతులు అలాంటివి. అవి జరుగక తప్పదు. కాని ఎవడు అలాంటివి జరిగిస్తాడో వాని స్థితి భయంకరమైనది.
MAT 18:8 “మీ కాలుగాని లేక మీ చేయిగాని మీ పాపానికి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. కాళ్ళు చేతులు ఉండి నరకంలో శాశ్వతమైన మంటల్లో పడటం కన్నా, కుంటి వానిగా లేక వికలాంగునిగా జీవం పొందటం మేలు.
MAT 18:9 ఇక మీ కన్ను మీ పాపానికి కారణమైతే దాన్ని పీకిపారవేయండి. రెండు కళ్ళుండి నరకంలోని మంటల్లో పడటం కన్నా ఒక కన్నుతో జీవంలో ప్రవేశించి జీవించటం మేలు.
MAT 18:10 “ఈ చిన్న పిల్లల్లో ఎవర్నీ చిన్న చూపు చూడకండి. నేను చెప్పేదేమిటంటే పరలోకంలో ఉన్న వీళ్ళ దూతలు పరలోకంలో ఉన్న నా తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు.
MAT 18:11 
MAT 18:12 “ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు వున్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే, అతడు ఆ తొంబైతొమ్మిది గొఱ్ఱెల్ని కొండమీద వదిలి, ఆ తప్పిపోయిన గొఱ్ఱె కోసం వెతుక్కొంటూ వెళ్ళడా? మీరేమంటారు?
MAT 18:13 ఇది సత్యం, ఒక వేళ ఆ గొఱ్ఱె దొరికితే ఆ తప్పిపోని తొంబైతొమ్మిది గొఱ్ఱెలు తన దగ్గరున్న దానికన్నా ఎక్కువ ఆనందిస్తాడు.
MAT 18:14 అతనిలాగే పరలోకంలోవున్న నా తండ్రి ఈ చిన్న పిల్లల్లో ఎవ్వరూ తప్పిపోరాదని ఆశిస్తుంటాడు.
MAT 18:15 “మీ సోదరుడు మీపట్ల అపరాధం చేస్తే అతని దగ్గరకు వెళ్ళి అతడు చేసిన అపరాధాల్ని అతనికి రహస్యంగా చూపండి. అతడు మీ మాట వింటే అతణ్ణి మీరు జయించినట్లే!
MAT 18:16 ఒక వేళ అతడు మీ మాట వినకపోతే, ఒకరిద్దర్ని మీ వెంట తీసుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రతి విషయాన్ని నిర్ణయించటానికి యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యం చెప్పాలి.
MAT 18:17 వాళ్ళ మాట వినటానికి అతడు అంగీకరించకపోతే వెళ్ళి వాళ్ళ సంఘానికి చెప్పండి. అతడు సంఘం చెప్పిన మాటకూడ వినకపోతే అతణ్ణి మీ వానిగా పరిగణించకండి.
MAT 18:18 “ఇది సత్యం. ఈ ప్రపంచములో మీరు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో నేను కూడా నిరాకరిస్తాను. ఈ ప్రపంచంలో మీరు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో నేను కూడా అంగీకరిస్తాను.
MAT 18:19 అంతేకాక, నేను చెప్పేదేమిటంటే మీలో యిద్దరు కలసి దేవుణ్ణి ఏమి అడగాలో ఒక నిర్ణయానికి వచ్చి ప్రార్థించాలి. అప్పుడు పరలోకంలోవున్న నా తండ్రి మీ కోరిక తీరుస్తాడు.
MAT 18:20 ఎందుకంటే, నా పేరిట యిద్దరు లేక ముగ్గురు ఎక్కడ సమావేశమైతే నేను అక్కడ వాళ్ళతో ఉంటాను.”
MAT 18:21 అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరుడు నా పట్ల పాపం చేస్తే నేనెన్ని సార్లు అతణ్ణి క్షమించాలి? ఏడుసార్లా?” అని అడిగాడు.
MAT 18:22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, “ఏడుసార్లు కాదు, డెబ్బది ఏడు సార్లు క్షమించాలని చెబుతున్నాను.
MAT 18:23 “అందువల్లే దేవుని రాజ్యాన్ని తన సేవకులతో లెక్కలు పరిష్కరించుకోవాలన్న రాజుతో పోల్చవచ్చు.
MAT 18:24 ఆ రాజు లెక్కలు పరిష్కరించటం మొదలు పెట్టగానే వేలకొలది తలాంతులు అప్పు ఉన్న ఒక వ్యక్తిని భటులు రాజుగారి దగ్గరకు పిలుచుకు వచ్చారు.
MAT 18:25 కాని అప్పు ఉన్న వాని దగ్గర చెల్లించటానికి డబ్బు లేదు. అందువల్ల ఆ రాజు అతణ్ణి, అతని భార్యను, అతని సంతానాన్ని, అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటిని అమ్మేసి అప్పు చెల్లించమని ఆజ్ఞాపించాడు.
MAT 18:26 “ఆ సేవకుడు రాజు ముందు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వండి, మీకివ్వ వలసిన డబ్బంతా యిచ్చేస్తాను’ అని వేడుకొన్నాడు.
MAT 18:27 రాజు ఆ సేవకునిపై దయచూపి అతణ్ణి విడుదల చేసాడు. పైగా అతని అప్పుకూడా రద్దు చేసాడు.
MAT 18:28 “ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి, తనతో కలసి పనిచేసే సేవకుణ్ణి చూసాడు. తనకు వంద దేనారాలు అప్పువున్న అతని గొంతుక పట్టుకొని, ‘నా అప్పు తీర్చు!’ అని వేధించాడు.
MAT 18:29 “అప్పువున్నవాడు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వు! నీ అప్పు తీరుస్తాను!’ అని బ్రతిమిలాడాడు.
MAT 18:30 “కాని అప్పిచ్చిన వాడు దానికి అంగీకరించలేదు. పైగా వెళ్ళి తన అప్పు తీర్చే దాకా ఆ అప్పున్నవాణ్ణి కారాగారంలో వేయించాడు.
MAT 18:31 తోటి సేవకులు జరిగింది చూసారు. వాళ్ళకు చాలా దుఃఖం కలిగింది. వాళ్ళు వెళ్ళి జరిగిందంతా తమ రాజుతో చెప్పారు.
MAT 18:32 “అప్పుడు ఆ ప్రభువు ఆ సేవకుణ్ణి పిలిచి, కోపంతో ‘దుర్మార్గుడా! నీవు బ్రతిమిలాడినందుకు నీ అప్పంతా రద్దు చేసాను.
MAT 18:33 మరి, నేను నీమీద దయ చూపినట్లే నీవు నీ తోటి సేవకునిపై దయ చూపనవనరంలేదా?’ అని అన్నాడు. ఆ తదుపరి తన అప్పంతా తీర్చేదాకా చిత్రహింస పెట్టమని ఆ సేవకుణ్ణి భటులకు అప్పగించాడు.
MAT 18:35 “మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుణ్ణి మనసారా క్షమించక పోతే పరలోకంలో వున్న నా తండ్రి మీ పట్ల ఆ రాజులాగే ప్రవర్తిస్తాడు.”
MAT 19:1 యేసు మాట్లాడటం ముగించాక గలిలయ వదలి యొర్దాను నది అవతలి వైపున ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్ళాడు.
MAT 19:2 ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు.
MAT 19:3 కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని వచ్చి, “పురుషుడు తన భార్యకు ఏదో ఒక కారణం చూపి విడాకులివ్వవచ్చా?” అని అడిగారు.
MAT 19:4 యేసు, “మొదట్లో సృష్టికర్త పురుషుణ్ణి, స్త్రీని సృష్టించి ఇలా అన్నాడు: ‘పురుషుడు తన తల్లి తండ్రులను వదలి తన భార్యతో ఏకమౌతాడు. వాళ్ళిద్దరూ కలసి ఒకే శరీరంగా జీవిస్తారు!’ ఇది మీరు చదువలేదా?
MAT 19:6 ఆ కారణంగా వాళ్ళనికమీదట యిరువురిగా కాకుండా ఒకరిగా పరిగణించాలి! దేవుడు ఏకం చేసిన వాళ్ళను మానవుడు వేరు చేయరాదు!” అని సమాధానం చెప్పాడు.
MAT 19:7 “మరి పురుషుడు విడాకుల పత్రం తన భార్యకిచ్చి ఆమెను పంపివేయవచ్చని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని వాళ్ళు అడిగారు.
MAT 19:8 యేసు, “మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు కాదు కాబట్టి మీ భార్యలకు విడాకులివ్వటానికి మోషే మీకు అనుమతి యిచ్చాడు. అంతేకాని మొదటి నుండి ఈ విధంగా లేదు.
MAT 19:9 కాని నేను చెప్పేదేమిటంటే అవినీతిపరురాలు కాని తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడువబడ్డ దానిని పెండ్లి చేసికొంటే వాడును వ్యభిచారిగా అవుతాడు” అని అన్నాడు.
MAT 19:10 శిష్యులు ఆయనతో, “విడాకులివ్వటానికి ఇలాంటి కారణం కావలసి వస్తే వివాహం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం” అని అన్నారు.
MAT 19:11 యేసు, “మీరన్నట్లు చెయ్యటం అందరికి సాధ్యంకాదు. కొందరు నపుంసకులుగా పుడ్తారు. కనుక వివాహం చేసుకోరు. మరి కొందర్ని యితర్లు నపుంసకులుగా చేస్తారు. కనుక వివాహం చేసుకోరు. కాని కొందరు దేవుని రాజ్యం కొరకు వివాహం చేసుకోరు. ఈ బోధను అనుసరించ గలవాడే అనుసరించనీ” అని సమాధానం చెప్పాడు.
MAT 19:13 యేసు తన చేతుల్ని చిన్న పిల్లల తలలపై ఉంచి వాళ్ళకోసం ప్రార్థించాలని కొందరు వ్యక్తులు వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. కాని ఆ పిలుచుకు వచ్చిన వాళ్ళను శిష్యులు చివాట్లు పెట్టారు.
MAT 19:14 కాని యేసు, “దేవుని రాజ్యం అలాంటి వాళ్ళదే కనుక వాళ్ళను నా దగ్గరకు రానివ్వండి! వాళ్ళనాపకండి!” అని అన్నాడు.
MAT 19:15 వాళ్ళ తలలపై చేతులుంచాక యేసు అక్కడనుండి ముందుకు సాగిపొయ్యాడు.
MAT 19:16 ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి, “భోధకుడా! నిత్యజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చెయ్యాలి?” అని అడిగాడు.
MAT 19:17 యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? ఒకే ఒక మంచి వాడున్నాడు. నీవు నిత్యజీవం పొందాలంటే ఆజ్ఞల్ని పాటించు!” అని అన్నాడు.
MAT 19:18 “ఏ ఆజ్ఞలు?” ఆ వ్యక్తి అడిగాడు. యేసు, “హత్యచేయరాదు, వ్యభిచరించ రాదు. దొంగతనం చెయ్యరాదు. దొంగసాక్ష్యం చెప్పరాదు.
MAT 19:19 తల్లితండ్రుల్ని గౌరవించాలి. మీ పొరుగువాళ్ళను మిమ్మల్మి మీరు ప్రేమించుకొన్నంతగా ప్రేమించాలి” అని సమాధానం చెప్పాడు.
MAT 19:20 ఆ యువకుడు, “నేనవన్నీ చేస్తూనే ఉన్నాను. యింకా ఏం చెయ్యాలి?” అని అడిగాడు.
MAT 19:21 యేసు, “నీవు పరిపూర్ణత పొందాలని అనుకుంటే వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు! అలా చేస్తే నీకు పరలోకంలో ధనం లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని సమాధానం చెప్పాడు.
MAT 19:22 ఆ యువకుని దగ్గర చాలా ధనముంది కనుక యేసు చెప్పింది విని విచారంతో వెళ్ళిపోయాడు.
MAT 19:23 ఆ తర్వాత యేసు తన శిష్యులతో, “నేను నిజం చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం.
MAT 19:24 నేను మళ్ళీ చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూదిరంధ్రం ద్వారా వెళ్ళటం సులభం!” అన్నాడు.
MAT 19:25 శిష్యులు ఇది విని చాలా ఆశ్చర్యపడి, “మరి రక్షణ ఎవరికి లభిస్తుంది?” అని అడిగారు.
MAT 19:26 యేసు వాళ్ళ వైపు చూసి, “మానవులు దీన్ని స్వతహాగా సాధించలేరు. కాని దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు.
MAT 19:27 అప్పుడు పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మేము అన్నీ వదులుకున్నాము. మరి, మాకేం లభిస్తుంది?” అని అన్నాడు.
MAT 19:28 యేసు, “ఇది సత్యం. క్రొత్త ప్రపంచంలో మనుష్యకుమారుడు తేజోవంతమైన సింహాసనంపై కూర్చుంటాడు. నన్ను అనుసరిస్తున్న మీరు కూడా పన్నెండు సింహాసనాలపై కూర్చొని ఇశ్రాయేలు జనాంగంలోని పన్నెండు గోత్రాల్ని పాలిస్తారు.
MAT 19:29 నాకోసం ఇండ్లను కాని, సోదరుల్ని కాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లిని కాని, తండ్రిని కాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని విడిచినవాడు దానికి నూరువంతుల ఫలం పొందుతాడు. అంతేకాక నిత్యజీవం కూడా పొందుతాడు.
MAT 19:30 కాని ముందున్న వాళ్ళలో చాలామంది వెనక్కి వెళ్తారు. వెనుకనున్న వాళ్ళలో చాలా మంది ముందుకు వస్తారు!” అని అన్నాడు.
MAT 20:1 యేసు, “దేవుని రాజ్యాన్ని ద్రాక్షతోట యజమానితో పోల్చవచ్చు. అతడు తన తోటలో పని చెయ్యటానికి పనివాళ్ళను నియమించాలని ఉదయమే లేచి వెళ్ళాడు.
MAT 20:2 ఆ రోజు పనివాళ్ళకు ఒక దెనారా యివ్వటానికి అంగీకరించి వాళ్ళను తన ద్రాక్షతోటకు పంపాడు.
MAT 20:3 “అతడు ఉదయం తొమ్మిదిగంటలకు మళ్ళీ సంతకు వెళ్ళాడు. అక్కడ మరికొంత మంది ఏ పనీ చేయకుండా వూరికే నిల్చొని ఉండటం చూసాడు.
MAT 20:4 అతడు వాళ్ళతో ‘మీరు కూడా వెళ్ళి నా ద్రాక్షతోటలో పని చెయ్యండి. మీక్కూడా సమంజసమైన కూలి యిస్తాను’ అని అన్నాడు.
MAT 20:5 వాళ్ళు దానికి అంగీకరించి వెళ్ళారు. “అతడు పన్నెండు గంటలప్పుడు, మూడు గంటలప్పుడు కూడా వెళ్ళి మళ్ళీ అలాగే చేసాడు.
MAT 20:6 అతడు అయిదు గంటలప్పుడు మళ్ళీ వెళ్ళి మరి కొంతమంది అక్కడ నిలుచొని ఉండటం గమనించాడు. అతడు వాళ్ళతో ‘మీరు ఏమీ చెయ్యకుండా దినమంతా యిక్కడ ఎందుకు నిలుచున్నారు?’ అని అడిగాడు.
MAT 20:7 “‘మాకెవ్వరూ పనివ్వలేదు’ అని వాళ్ళు సమాధానం చెప్పారు. “అతడు వాళ్ళతో ‘మీరు కూడా నా ద్రాక్షతోటలో పని చెయ్యండి!’ అని అన్నాడు.
MAT 20:8 “సాయంత్రం కాగానే ఆ ద్రాక్షతోట యజమాని పెద్ద దాసునితో ‘పనివాళ్ళందరిని పిలిచి చివరకు వచ్చిన వాళ్ళతో మొదలుపెట్టి కూలి యిచ్చేయి!’ అని అన్నాడు.
MAT 20:9 “అయిదు గంటలప్పుడు పని మొదలు పెట్టిన కూలీలు వచ్చారు. వాళ్ళకు ఒక దెనారా లభించింది.
MAT 20:10 మొదట పని మొదలుపెట్టిన వాళ్ళువచ్చి తమకు ఎక్కువ కూలి లభిస్తుందని ఆశించారు. కాని వాళ్ళకు కూడా ఒక దెనారా లభించింది.
MAT 20:11 వాళ్ళు కూలి తీసికొని యజమానునితో ‘చివరకు వచ్చిన వాళ్ళు ఒకే గంట పని చేసారు. ఎండను సహించి దినమంతా పనిచేసిన మమ్మల్ని, వాళ్ళనూ మీరు సమానంగా చూస్తున్నారు’ అని సణగటం మొదలు పెట్టారు.
MAT 20:13 “కాని అతడు ఒక కూలి వానితో, ‘మిత్రమా నేను నీకు అన్యాయం చేయటం లేదు. ఒక దెనారాకు పని చేస్తానని నీవు ఒప్పుకోలేదా?
MAT 20:14 నీ కూలి తీసికొని వెళ్ళిపో! నీకిచ్చిన కూలినే చివరను వచ్చిన వానికి కూడా యివ్వాలనుకొన్నాను.
MAT 20:15 నా డబ్బుతో నా యిష్టంవచ్చినట్లు చేసుకొనే అధికారం నాకులేదా? నేను ఔదార్యం చూపుతున్నందుకు నీవు ఓర్వలేకుండా ఉన్నావా?’ అని అన్నాడు.
MAT 20:16 “ఈ విధంగా చివరనున్న వాళ్ళు ముందుకు వస్తారు; ముందున్న వారు చివరకు వెళ్తారు” అని అన్నాడు.
MAT 20:17 యేసు యెరూషలేముకు వెళ్తూ పండ్రెండు మంది శిష్యులను ప్రక్కకు పిలిచి ఈ విధంగా అన్నాడు:
MAT 20:18 “మనమంతా యెరూషలేమునకు వెళ్తున్నాము. అక్కడ మనుష్యకుమారుడు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగింప బడతాడు. వాళ్ళు ఆయనకు మరణ దండన విధించి,
MAT 20:19 యూదులుకాని వాళ్ళకప్పగిస్తారు. ఆ యూదులుకాని వాళ్ళు ఆయన్ని హేళన చేసి కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వేస్తారు. మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు.”
MAT 20:20 ఆ తర్వాత జెబెదయి భార్య తన కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి ఒక ఉపకారం చెయ్యమని కోరింది.
MAT 20:21 యేసు, “నీకేం కావాలి?” అని అడిగాడు. ఆమె, “మీ రాజ్యంలో, నా ఇరువురు కుమారుల్లో ఒకడు మీ కుడిచేతివైపున, మరొకడు మీ ఎడమచేతి వైపున కూర్చునేటట్లు అనుగ్రహించండి” అని అడిగింది.
MAT 20:22 యేసు, “మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నా పాత్రలో దేవుడు కష్టాల్ని నింపాడు. నేను త్రాగటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు త్రాగగలరా?” అని అడిగాడు. “త్రాగగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
MAT 20:23 యేసు వాళ్ళతో, “మీరు నిజంగానే త్రాగవలసి వస్తుంది. కాని నా కుడిచేతివైపున కూర్చోవటానికి, లేక ఎడమచేతివైపు కూర్చోవటానికి అనుమతి యిచ్చే అధికారం నాకు లేదు. ఈ స్థానాల్ని నా తండ్రి ఎవరికోసం నియమించాడో వాళ్ళకే అవి దక్కుతాయి” అని అన్నాడు.
MAT 20:24 మిగతా పదిమంది ఇది విని ఆ ఇరువురు సోదరుల పట్ల కోపగించుకొన్నారు.
MAT 20:25 యేసు వాళ్ళను పిలిచి, “యూదులుకాని రాజులు తమ ప్రజలపై అధికారం చూపుతూ ఉంటారు. వాళ్ళ పెద్దలు వాళ్ళను అణచిపెడ్తూ ఉంటారు. ఈ విషయం మీకు తెలుసు.
MAT 20:26 మీరు అలాకాదు. మీలో గొప్పవాడు కాదలచినవాడు మీ సేవకునిగా ఉండాలి.
MAT 20:27 మీలో ముఖ్యుడుగా ఉండ దలచిన వాడు బానిసగా ఉండాలి.
MAT 20:28 మనుష్యకుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు. సేవచెయ్యటానికివచ్చాడు. అనేకుల విమోచన కోసం తన ప్రాణాన్ని ఒక వెలగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నాడు.
MAT 20:29 యేసు, ఆయన శిష్యులు యెరికో పట్టణం నుండి బయలు దేరి వెళ్తూండగా చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు.
MAT 20:30 దారి ప్రక్కన కూర్చొన్న ఇద్దరు గ్రుడ్డివాళ్ళు యేసు ఆ దారిన వస్తున్నాడని విని, “మమ్మల్ని కరుణించు దావీదు కుమారుడా!” అని బిగ్గరగా అన్నారు.
MAT 20:31 ప్రజలు వాళ్ళను నిశ్శబ్దంగా వుండమని గద్దించారు. కాని ఆ గ్రుడ్డివాళ్ళు యింకా బిగ్గరగా, “ప్రభూ! దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని అన్నారు.
MAT 20:32 యేసు ఆగి ఆ గ్రుడ్డివాళ్ళను పిలిచి, “ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు.
MAT 20:33 “ప్రభూ! మాకు చూపుకావాలి!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
MAT 20:34 యేసుకు వాళ్ళపై దయ కలిగి వాళ్ళ కళ్ళను తాకాడు. వెంటనే వాళ్ళకు చూపు వచ్చింది. వాళ్ళు ఆయన్ని అనుసరించారు.
MAT 21:1 యేసు, ఆయన శిష్యులు యెరూషలేమునకు వెళ్తూ బేత్పగే అనే గ్రామాన్ని చేరుకున్నారు. యేసు తన శిష్యుల్లో యిద్దర్ని ఆ గ్రామానికి పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు:
MAT 21:2 “గ్రామంలోకి వెళ్ళండి అక్కడ వాకిలిలో కట్టబడిన ఒక గాడిద, దాని పిల్ల కనబడుతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి.
MAT 21:3 ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు అవి కావాలి; వాటి అవసరం తీరిన వెంటనే తిరిగి పంపుతాడు’ అని చెప్పండి.”
MAT 21:4 దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఇలా జరిగింది:
MAT 21:5 “‘గాడిదనెక్కి వినయంగా నీ రాజు వస్తున్నాడు చూడు! బరువు మోసే గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు చూడు!’ అని సీయోను కుమారితో చెప్పండి.”
MAT 21:6 శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించినట్లు చేసారు.
MAT 21:7 గాడిదను, గాడిద పిల్లను తీసుకు వచ్చి వాటిపై తమ వస్త్రాలను పరిచారు. యేసు వస్త్రాలపై నెక్కి కూర్చున్నాడు.
MAT 21:8 అక్కడున్న వాళ్ళలో చాలామంది తమ వస్త్రాల్ని దారిపై పరిచారు. మరికొందరు చెట్ల కొమ్మల్ని విరిచి దారిపై పరిచారు.
MAT 21:9 ఆయనకు ముందు, వెనుక నడుస్తున్న ప్రజలు ఇలా కేకలు వేసారు. “దావీదు కుమారునికి హోసన్నా! ‘ప్రభువు పేరిట వస్తున్నవాడు ధన్యుడు!’ మహోన్నతమైన స్థలములో హోసన్నా!”
MAT 21:10 యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ పట్టణమంతా ఆందోళన చెలరేగింది, “ఈయనెవరు?” అని ప్రజలు ప్రశ్నించారు.
MAT 21:11 “ఈయన యేసు, గలిలయలోని నజరేతు గ్రామానికి చెందిన ప్రవక్త!” అని ఆయన వెంటనున్న వాళ్ళే సమాధానం చెప్పారు.
MAT 21:12 యేసు ఆలయంలోకి వెళ్ళి, అక్కడ అమ్ముతున్న వాళ్ళను, కొంటున్న వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను, పావురాలు అమ్ముతున్న వర్తకుల పీఠల్ని క్రింద పడవేసాడు.
MAT 21:13 ఆయన వాళ్ళతో, “‘నా ఆలయం ప్రార్థనాలయం అనిపించుకుంటుంది’ అని వ్రాసారు. కాని దాన్ని మీరు దోపిడి దొంగల గుహగా మార్చారు” అని అన్నాడు.
MAT 21:14 గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు ఆలయంలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్ళకును నయం చేసాడు.
MAT 21:15 ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన అద్భుతాలను చూసారు. మందిరావరణంలో ఉన్న పిల్లలు, “దావీదు కుమారునికి హోసన్నా!”* అని కేకలు వేయటం విన్నారు. వాళ్ళకు కోపం వచ్చింది.
MAT 21:16 “చిన్న పిల్లలేమంటున్నారో నీవు విన్నావా?” అని వాళ్ళు యేసును ప్రశ్నించారు. యేసు, “విన్నాను. ‘చిన్న పిల్లలు, పసిపాపలు కూడా నిన్ను స్తుతించేటట్లు చేసావు!’ అని వ్రాసారు. ఇది మీరు ఎన్నడూ చదువలేదా?” అని అన్నాడు.
MAT 21:17 ఆయన వాళ్ళను వదిలి, పట్టణం బయట ఉన్న బేతనియ గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపాడు.
MAT 21:18 ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది.
MAT 21:19 యేసు దారిప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమియూ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక మీదట నీకు ఫలం కలుగకుండా వుండుగాక!” అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది.
MAT 21:20 శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి, “అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోయింది?” అని అడిగారు.
MAT 21:21 యేసు, “ఇది సత్యం. మీరు అనుమానం చెందకుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వతంతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే అది అలాగే చేస్తుంది.
MAT 21:22 దేవుడు మీరడిగినవి యిస్తాడని విశ్వసించి ప్రార్థించండి. అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి” అని అన్నాడు.
MAT 21:23 యేసు మందిరానికి వెళ్ళి బోధిస్తుండగా ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు? నీకి అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.
MAT 21:24 యేసు సమాధానం చెబుతూ, “నేను కూడా మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సమాధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను.
MAT 21:25 బాప్తిస్మమివ్వమని యోహానును ఎవరు పంపారు? దేవుడా? మానవులా?” అని అడిగాడు. వాళ్ళు, “‘దేవుడు’ అని సమాధానం చెబితే మరి అలాగైతే అతణ్ణి ఎందుకు నమ్మలేదు? అని అంటాడు ‘మానవులు’ అని సమాధానం ఇస్తే ప్రజలందరూ యోహాను ఒక ప్రవక్త అని నమ్మేవాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తారో” అనే భయంతో పరస్పరం మాట్లాడుకొన్నారు.
MAT 21:27 అందువల్ల వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు. ఆయన, “నేను కూడా ఎవరిచ్చిన అధికారంతో యివి చేస్తున్నానో మీకు చెప్పను” అని అన్నాడు.
MAT 21:28 “ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకనికి యిద్దరు కుమారులుండేవాళ్ళు. అతడు మొదటి కుమారుని దగ్గరకు వెళ్ళి, ‘నాయనా! వెళ్ళి ఈ రోజు ద్రాక్షతోటలో పనిచెయ్యి!’ అని అన్నాడు.
MAT 21:29 “కుమారుడు, ‘నాకిష్టంలేదు’ అని సమాధానం చెప్పాడు. కాని తదుపరి తన మనస్సు మార్చుకొని పని చెయ్యటానికి వెళ్ళాడు.
MAT 21:30 “తండ్రి రెండవ కుమారునికి అదే విషయం చెప్పాడు. రెండవ కుమారుడు ‘వెళ్తానండి’ అని అన్నాడు. కాని వెళ్ళలేదు.
MAT 21:31 “ఆ యిద్దరిలో తండ్రి మాటను ఎవరు పాటించారు? అని యేసు అడిగాడు.” “మొదటి వాడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “నేను మీకు సత్యం చెబుతున్నాను. సుంకరులు, వేశ్యలు మీకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు.
MAT 21:32 మీకు నీతిమార్గాన్ని చూపటానికి యోహాను వచ్చాడు. మీరతణ్ణి నమ్మలేదు. కాని సుంకరులు, వేశ్యలు ఆయన్ని విశ్వసించారు. ఇది చూసాక కూడా మీరు మారుమనస్సు పొందలేదు, విశ్వసించలేదు.
MAT 21:33 “ఇంకొక ఉపమానాన్ని వినండి. ఒక ఆసామి ఉండేవాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. చుట్టూ ఒక గోడ కట్టించి ద్రాక్షరసాన్ని తీయటానికి ఒక గానుగను, తొట్టిని కట్టించాడు. కావలి కాయటానికి ఒక కంచె వేయించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు.
MAT 21:34 కోతకాలం కాగానే తన సేవకుల్ని ఆ రైతుల దగ్గరకు పంపి తన భాగం తీసుకు రమ్మన్నాడు.
MAT 21:35 “ఆ రైతులు, ఆ సేవకుల్ని పట్టుకొని వాళ్ళలో ఒకణ్ణి కొట్టారు. మరొకణ్ణి చంపారు. మూడవవాణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు.
MAT 21:36 ఆ ఆసామి ఈ సారి మొదటి కన్నా యింకా ఎక్కువ మంది సేవకుల్ని పంపాడు. కాని ఆ రైతులు వాళ్ళ పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించారు.
MAT 21:37 ఆ ఆసామి ‘నా కుమారుణ్ణి వాళ్ళు గౌరవించవచ్చు!’ అని అనుకొని చివరకు తన కుమారుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు.
MAT 21:38 “కాని ఆ రైతులు అతని కుమారుణ్ణి చూసి, ‘ఇతడు వంశోద్ధారకుడు. రండి! ఇతణ్ణి చంపేసి అతని ఆస్థిని తీసుకొందాం’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు.
MAT 21:39 ఆ తర్వాత కుమారుణ్ణి పట్టుకొని చంపి ద్రాక్షతోటకవతల పారవేసారు.
MAT 21:40 “మరి ఆ ద్రాక్షతోట యజమాని తిరిగి వచ్చాక ఆ రైతుల్ని ఏమి చేస్తాడంటారు?”
MAT 21:41 వాళ్ళు, “ఆ దుష్టుల్ని ఘోరంగా చంపేస్తాడు. ఆ తదుపరి పంట కాలంలో తన భాగాన్ని తనకిచ్చే రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని సమాధానం చెప్పారు.
MAT 21:42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “లేఖనాల్లో మీరీ విషయం ఎన్నడూ చదువలేదా? ‘ఇల్లు కట్టువాళ్ళు తృణీకరించిన రాయి ముఖ్యమైన రాయి అయింది. ఇది ప్రభువు చేసాడు. ఆ రాయి మన కండ్లకు ఆశ్చర్యంగా కనబడుతుంది!’
MAT 21:43 “అందువల్ల నేను చెప్పేదేమిటంటే దేవుడు తన రాజ్యాన్ని మీ నుండి తీసికొని, ఆ రాజ్యానికి తగిన విధంగా ప్రవర్తించే వాళ్ళకు యిస్తాడు.
MAT 21:44 ఈ బండ మీద పడ్డవాడు ముక్కలై పోతాడు. ఎవని మీద ఈ బండ పడ్తుందో అతడు నలిగి పోతాడు.”
MAT 21:45 ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసు చెప్పిన ఉపమానం విని ఆయన తమను గురించి మాట్లాడుతున్నట్టుగా గ్రహించారు.
MAT 21:46 వాళ్ళు ఆయన్ని బంధించటానికి మార్గాన్ని వెతికారు. కాని ప్రజలు ఆయన్ని ఒక ప్రవక్త అని అనుకొనే వాళ్ళు కనుక వాళ్ళు ప్రజల్ని చూసి భయపడి పోయారు.
MAT 22:1 యేసు ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా చెప్పాడు:
MAT 22:2 “దేవుని రాజ్యాన్ని తన కుమారుని వివాహ సందర్భంగా విందునేర్పాటు చేసిన ఒక రాజుతో పోల్చవచ్చు.
MAT 22:3 ఆ రాజు విందుకు ఆహ్వానింపబడిన వాళ్ళను రమ్మని పిలవటానికి తన సేవకుల్ని పంపాడు. కాని ఆహ్వానితులు రావటానికి నిరాకరించారు.
MAT 22:4 “ఆ రాజు మరికొంతమంది సేవకుల్ని పంపుతూ ఆహ్వానింపబడిన వాళ్ళతో ‘భోజనం సిద్దంగా ఉందని చెప్పండి. ఎద్దుల్ని, బాగా బలిసిన పశువుల్ని కోసి అన్నీ సిద్ధంగా ఉంచామని చెప్పి వాళ్ళని పెళ్ళికి రమ్మనండి’ అని అన్నాడు.
MAT 22:5 “కాని ఆహ్వానితులు లెక్క చెయ్యలేదు. ఒకడు తన పొలానికి, ఇంకొకడు తన వ్యాపారం మీద వెళ్ళిపొయ్యారు.
MAT 22:6 మిగతా వాళ్ళు ఆ సేవకుల్ని పట్టుకొని అవమానించి చంపేశారు.
MAT 22:7 ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. తన సైన్యాన్ని పంపి ఆ హంతకుల్ని నాశనం చేసి, వాళ్ళ పట్టణాన్ని కాల్చి వేసాడు.
MAT 22:8 “ఆ తర్వాత తన సేవకులతో, ‘పెళ్ళి విందు సిద్దంగా ఉంది. కాని నేనాహ్వానించిన వాళ్ళు విందుకు రావటానికి అర్హులుకారు.
MAT 22:9 వీధుల్లోకి వెళ్ళి మీకు కనిపించిన వాళ్ళందర్ని విందుకాహ్వానించండి’ అని అన్నాడు.
MAT 22:10 ఆ సేవకులు వీధుల్లోకి వెళ్ళి తమకు కనిపించిన వాళ్ళందర్ని అంటే మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, అందర్ని పిలుచుకు వచ్చారు. అతిథులతో పెళ్ళి యిల్లంతా నిండిపోయింది.
MAT 22:11 “రాజు అతిధుల్ని చూడాలని వచ్చాడు. అక్కడున్న వాళ్ళల్లో ఒకడు పెళ్ళి దుస్తులు వెసుకోలేదని గమనించాడు.
MAT 22:12 ‘మిత్రమా! పెళ్ళి దుస్తులు వేసుకోకుండా లోపలికి ఎట్లా వచ్చావు?’ అని రాజు అత న్ని అడిగాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేక పొయ్యాడు.
MAT 22:13 వెంటనే ఆ రాజు తన సేవకులతో, ‘అతని కాళ్ళు, చేతులు కట్టేసి అవతల చీకట్లో పారవేయండి. అక్కడున్న వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు’ అని అన్నాడు.
MAT 22:14 “దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు. కాని కొందర్ని మాత్రమే ఎన్నుకొంటాడు” అని అంటూ యేసు చెప్పటం ముగించాడు.
MAT 22:15 ఆ తర్వాత పరిసయ్యులు వెళ్ళి ఆయన్ని ఆయన మాటల్తోనే పట్టి వేయాలని కుట్ర పన్ని తమ శిష్యుల్ని, హేరోదు పక్షమున్న వాళ్ళను యేసు దగ్గరకు పంపారు.
MAT 22:16 వాళ్ళు, “బోధకుడా! మీరు సత్యవంతులని, దైవ మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారని మాకు తెలుసు. ఇతర్ల అంతస్తులను లెక్క చెయ్యరు. కనుక పక్షపాతం చూపరని కూడా మాకు తెలుసు.
MAT 22:17 మరి చక్రవర్తికి పన్నులు కట్టడం ధర్మమా? కాదా? మీరేమంటారు?” అని ఆయన్ని అడిగారు.
MAT 22:18 యేసుకు వాళ్ళ దురుద్దేశం తెలిసిపోయింది. వాళ్ళతో, “వేషధారులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు?
MAT 22:19 ఏ నాణెంతో పన్నులు కడుతున్నారో దాన్ని నాకు చూపండి” అని అన్నాడు. వాళ్ళు ఒక దెనారా తెచ్చి ఆయనకు ఇచ్చారు.
MAT 22:20 ఆయన, “ఈ బొమ్మ ఎవరిది? ఆ నాణెంపై ఎవరి శాసనం ఉంది?” అని వాళ్ళనడిగాడు.
MAT 22:21 “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడాయన వాళ్ళతో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందిది దేవునికి యివ్వండి” అని అన్నాడు.
MAT 22:22 ఇది విని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ తదుపరి ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు.
MAT 22:23 అదే రోజు పునరుత్ధానంలేదని వాదించే సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు:
MAT 22:24 “బోధకుడా! ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే, అతని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి చనిపోయిన సోదరునికి సంతానం కలిగించాలని మోషే అన్నాడు.
MAT 22:25 మాలో ఏడుగురు సోదరులున్న ఒక కుటుంబం ఉండింది. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. కనుక ఆ వితంతువును చనిపోయిన వాని సోదరుడు వివాహం చేసుకొన్నాడు.
MAT 22:26 రెండవవాడు, మూడవవాడు, ఏడవవాని దాకా అదేవిధంగా ఆమెను పెళ్ళి చేసుకొని మరణించారు.
MAT 22:27 చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది.
MAT 22:28 ఆ ఏడుగురు ఆ స్త్రీని వివాహం చేసుకొన్నారు కదా, మరి పునరుత్ధానం తర్వాత ఆమె ఆ ఏడుగురిలో ఎవరి భార్యగా ఉంటుంది?”
MAT 22:29 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు తెలియవు. దేవుని శక్తి గురించి మీకు తెలియదు. అందువల్ల మీరు పొరబడుతున్నారు.
MAT 22:30 పునరుత్థానమందు పెళ్ళి చేసుకోవటం కాని, చెయ్యటం కాని ఉండదు. వాళ్ళు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు.
MAT 22:31 ఇక చనిపోయిన వారు బ్రతకడాన్ని గురించి దేవుడు మీకేం చెప్పాడో మీరు చదువలేదా?
MAT 22:32 ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అన్నాడు. ఆయన చనిపోయిన వాళ్ళ దేవుడు కాదు. జీవిస్తున్న వాళ్ళ దేవుడు.”
MAT 22:33 ప్రజలు ఈ బోధన విని ఆశ్చర్యపొయ్యారు.
MAT 22:34 యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు.
MAT 22:35 వాళ్ళలో ఉన్న ధర్మశాస్త్ర పండితుడొకడు యేసును పరీక్షించాలని, “బోధకుడా! ధర్మశాస్త్రాల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ గొప్పది?” అని ప్రశ్నించాడు.
MAT 22:37 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ప్రభువైన దేవుణ్ణి సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితో ప్రేమించండి.
MAT 22:38 ఇది అన్ని ఆజ్ఞలకన్నా మొదటిది, గొప్పది.
MAT 22:39 రెండవ ఆజ్ఞ కూడా అట్టిదే. ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు’
MAT 22:40 ధర్మశాస్త్రాలలో ఉన్న వాటన్నిటికి, ప్రవక్తలు వ్రాసిన వాటన్నిటికి ఈ రెండు ఆజ్ఞలే ఆధారం.”
MAT 22:41 పరిసయ్యులు సమావేశమయ్యారు. యేసు వాళ్ళను
MAT 22:42 “మీరు క్రీస్తును గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు?” అని అడిగాడు. “దావీదు కుమారుడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
MAT 22:43 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “మరి దావీదు దేవుని ఆత్మద్వారా మాట్లాడుతూ క్రీస్తును ‘ప్రభూ!’ అని ఎందుకు పిలిచాడు? దావీదు,
MAT 22:44 ‘ప్రభువు, నా ప్రభువుతో నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసే దాకా, నా కుడి వైపు కూర్చో’ అని అనలేదా?
MAT 22:45 దావీదు క్రీస్తును ‘ప్రభూ’ అని అన్నాడు కదా. అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లవుతాడు?”
MAT 22:46 ఎవ్వరూ ఏ సమాధానం చెప్పలేక పొయ్యారు. ఆ రోజు నుండి ఆయన్ని మరే ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.
MAT 23:1 ఆ తర్వాత యేసు ప్రజలతో, తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు:
MAT 23:2 “శాస్త్రులు, పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చునివున్నారు.
MAT 23:3 అందువల్ల వాళ్ళు చెప్పినది విధేయతతో చెయ్యండి. కాని వాళ్ళు బోధించినవి వాళ్ళే ఆచరించరు కనుక వాళ్ళు చేసేవి చెయ్యకండి.
MAT 23:4 వాళ్ళు బరువైన మూటలు కట్టి ప్రజల భుజాలపై పెడతారు. కాని వాళ్ళు మాత్రం ఆ బరువు మొయ్యటానికి తమ వేలు కూడా కదలించరు.
MAT 23:5 “పెద్ద దేవుని వాక్యములు వ్రాసి పెట్టుకొన్న సంచులను కట్టుకొని, వెడల్పాటి అంచులుగల వస్త్రాలు ధరించి చేసే ప్రతిపని ప్రజలు చూడాలని చేస్తారు.
MAT 23:6 విందుల్లో, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్ని ఆక్రమించటానికి చూస్తారు.
MAT 23:7 సంతల్లో, ప్రజలు తమకు నమస్కరించాలని, తమను రబ్బీ అని పిలవాలని ఆశిస్తారు.
MAT 23:8 “మీకందరికి బోధకుడు ఒకడే! మీరంతా సోదరులు. కనుక మిమ్మల్ని రబ్బీ అని పిలువనీయకండి.
MAT 23:9 ప్రపంచంలో ఎవ్వర్నీ ‘తండ్రి!’ అని సంబోధించకండి. మీ అందరికి తండ్రి ఒక్కడే. ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు.
MAT 23:10 అదే కాకుండా మిమ్మల్ని ‘గురువు!’ అని పిలువ నియ్యకండి. మీకు ఒకే గురువు ఉన్నాడు. ఆయనే ‘క్రీస్తు.’
MAT 23:11 మీలో గొప్ప వాడు మీ సేవకునిగా ఉండాలి.
MAT 23:12 ఎందుకంటే గొప్పలు చెప్పుకొనేవాణ్ణి దేవుడు అణచి వేస్తాడు. అణకువతో ఉన్న వాణ్ణి దేవుడు గొప్పవానిగా చేస్తాడు.
MAT 23:13 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్షతప్పదు. దేవుని రాజ్యంలోకి ప్రజల్ని ప్రవేశింపనీయకుండా మీరు దాని మార్గాన్ని మూసివేస్తారు. మీరు ప్రవేశించక పోవటమేకాకుండా, ప్రవేశించటానికి ప్రయత్నించే వాళ్ళను కూడా ఆపుతున్నారు.
MAT 23:14 
MAT 23:15 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు, మీకు శ్రమ తప్పదు. మీరు మోసాలు చేస్తారు. వితంతువుల ఇళ్లు దోస్తారు. ఇతర్లు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు. కనుక మీరు కఠినమైన శిక్ష పొందుతారు.
MAT 23:16 “గ్రుడ్డి మార్గదర్శకులారా! మీకు శిక్ష తప్పదు. దేవాలంయపై ఒట్టు పెట్టుకొంటే నష్టం లేదుకాని, ‘దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు.
MAT 23:17 మీరు అంధులే కాక మూర్ఖులు కూడా! ఏది గొప్పది? బంగారమా? లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా?
MAT 23:18 “అంతేకాక, ‘బలిపీఠంపై ఒట్టుపెట్టుకొంటే నష్టంలేదు కాని, దాని మీదనున్న కానుకపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు.
MAT 23:19 అంధులారా, ఏది గొప్పది? కానుకా? లేక ఆ కానుకను పవిత్రంచేసే బలిపీఠమా?
MAT 23:20 అందువల్ల బలిపీఠంపై ఒట్టు పెట్టుకొంటే, దానిపై ఉన్న వాటి మీద కూడా ఒట్టు పెట్టుకొన్నట్లే కదా!
MAT 23:21 అదే విధంగా దేవాలయంపై ఒట్టు పెట్టుకొంటే, దాని మీద, అందులో నివసించే వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్లే కదా!
MAT 23:22 అదే విధంగా పరలోకంపై ఒట్టు పెట్టుకొంటే అక్కడున్న సింహాసనం మీదా, ఆ సింహాసనంపై కూర్చొన్న వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్టే గదా!
MAT 23:23 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వాటిలో పదోవంతు దేవునికి అర్పిస్తారు. కాని ధర్మశాస్త్రంలో వున్న ముఖ్యమైన వాటిని అంటే న్యాయము, దయ, విశ్వాసము, మొదలగు వాటిని వదిలి వేస్తారు. మొదటి వాటిని విడువకుండా మీరు వీటిని ఆచరించి వుండవలసింది.
MAT 23:24 గ్రుడ్డి మార్గదర్శకులారా! దోమను వడకట్టి ఒంటెను మ్రింగువారివలే ఉన్నారు మీరు.
MAT 23:25 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు! మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ, స్వార్థము పేరుకొని ఉన్నాయి.
MAT 23:26 పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది.
MAT 23:27 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోస గాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి వాళ్ళు. అవి బయటకు అందంగా కనబడుతాయి. కాని వాటి నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటాయి.
MAT 23:28 అదే విధంగా మీరు బాహ్యంగా నీతిమంతులవలె కన్పిస్తారు. కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి.
MAT 23:29 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు.
MAT 23:30 అంతేకాక ‘మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే, వాళ్ళతో కలసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు’ అని మీరంటారు.
MAT 23:31 అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారన్నమాట.
MAT 23:32 మీ తాత ముత్తాతలు ప్రారంభించారు. మీరు ముగించండి!
MAT 23:33 “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు?
MAT 23:34 నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. వాళ్ళలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు. మరి కొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు కొడ్తారు. వాళ్ళను వెంటాడుతూ గ్రామ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు.
MAT 23:35 “నీతిమంతుడైన హేబెలు రక్తం నుండి దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు హత్యచేసిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తం దాకా ఈ భూమ్మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికి మీరు బాధ్యులు.
MAT 23:36 ఇది సత్యం. ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్ళపై ఆరోపింపబడతాయి.
MAT 23:37 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీకరించలేదు.
MAT 23:38 అదిగో చూడు! పాడుబడిన మీ యింటిని మీకొదిలేస్తున్నాను.
MAT 23:39 ‘ప్రభువు పేరిట రానున్న వాడు ధన్యుడు!’ అని నీవనే దాకా నన్ను మళ్ళీ చూడవని చెబుతున్నాను.”
MAT 24:1 యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు దగ్గరకు వచ్చి ఆ దేవాలయపు కట్టడాన్ని ఆయన దృష్టికి తెచ్చారు.
MAT 24:2 యేసు, “ఇవన్నీ చూస్తున్నారుగా! ఇది సత్యం. రాయి మీద రాయి నిలువకుండా వాళ్ళు అన్నీ పడగొడ్తారు” అని అన్నాడు.
MAT 24:3 యేసు ఒలీవ చెట్ల కొండ మీద కూర్చొన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “చెప్పండి; ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మీరు రావటానికి ముందు, ఈ యుగం అంతమవటానికి ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని అడిగారు.
MAT 24:4 యేసు సమాధానంగా, “మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి.
MAT 24:5 ఎందుకంటే చాలా మంది నా పేరిట వచ్చి ‘నేను క్రీస్తును’ అని చెప్పుకొంటూ అనేకుల్ని మోసం చేస్తారు.
MAT 24:6 యుద్ధాలను గురించి, యుద్ధముల వదంతుల్ని గురించి విన్నప్పుడు మీరు దిగులు పడకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని ‘అంతం’ అప్పుడే రాదు.
MAT 24:7 దేశం మీదికి దేశం యుద్ధానికి వస్తుంది. రాజ్యం మీదికి రాజ్యం యుద్ధానికి వస్తుంది. పలుప్రాంతాల్లో క్షామాలు, భూకంపాలు సంభవిస్తాయి.
MAT 24:8 అంటే, ప్రసవవేదనలు ఆరంభం అయ్యాయన్నమాట.
MAT 24:9 “ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగిస్తారు. ఆ అధికారులు మిమ్మల్ని హింసించి చంపుతారు. నా కారణంగా దేశాలన్నీ మిమ్మల్ని ద్వేషిస్తాయి.
MAT 24:10 ఆ సమయంలో అనేకులు ఈ విశ్వాసాన్ని వదిలి వేస్తారు. పరస్పరం ద్వేషించు కొంటారు.
MAT 24:11 దొంగ ప్రవక్తలు అనేకులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు.
MAT 24:12 పాపం పెరగటంవల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది.
MAT 24:13 కాని చివరి దాకా పట్టుదలతో నిలుచున్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు.
MAT 24:14 ఈ రాజ్యాన్ని గురించి చేప్పే సువార్త ప్రపంచమంతా ప్రకటింప బడుతుంది. ఆ సువార్త దేశాలన్నిటికిని ఒక ఋజువుగా ఉంటుంది. అప్పుడు అంతం వస్తుంది.
MAT 24:15 “అసహ్యం కలిగించేది, సర్వ నాశనం కలిగించేది పవిత్ర స్థానంలో నిలుచొని ఉండటం మీరు చూస్తారు. దీన్ని గురించి దానియేలు ప్రవక్త మాట్లాడాడు. పాఠకుడు దీని అర్థం గ్రహించాలి.
MAT 24:16 అప్పుడు యూదయ ప్రాంతలోవున్న ప్రజలు కొండల మీదికి పారిపోవటం మంచిది.
MAT 24:17 మిద్దె మీద ఉన్నవాడు తన యింట్లోకి వెళ్ళి ఏదీ తీసుకోరాదు.
MAT 24:18 పొలంలో వున్నవాడు తన వస్త్రాన్ని తీసుకు రావటానికి వెనక్కు మళ్ళరాదు.
MAT 24:19 “ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత దుఃఖం కలుగుతుందో కదా!
MAT 24:20 ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది. కనుక చలికాలంలో కాని, లేక విశ్రాంతి రోజు కాని పారిపోవలసిన పరిస్థితి ఏర్పడ కూడదని ప్రార్థించండి.
MAT 24:21 ప్రపంచం సృష్టింపబడిన నాటి నుండి నేటి దాకా అలాంటి కష్టం ఎన్నడూ సంభవించలేదు. యిక ముందు సంభవించదు.
MAT 24:22 “దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసి ఉండక పోయినట్లయితే, ఎవ్వరూ బ్రతికి ఉండే వాళ్ళు కాదు. కాని దేవుడు తానెన్నుకొన్న వాళ్ళకోసం ఆ రోజుల సంఖ్య తగ్గించాడు.
MAT 24:23 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా, ‘ఇదిగో చూడండి క్రీస్తు యిక్కడ ఉన్నాడు’ అని కాని, లేక, ‘అక్కడున్నాడు’ అని కాని అంటే నమ్మకండి.
MAT 24:24 ఎందుకంటే క్రీస్తులమని, ప్రవక్తలమని చెప్పుకొంటూ ప్రజల్ని మోసం చెయ్యటానికి గొప్ప మహత్యాలు, ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేసే మోసగాళ్ళు బయలు దేరుతారు. వీళ్ళు వీలైతే దేవుడు ఎన్నుకొన్నవాళ్ళను కూడా మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తారు.
MAT 24:25 చూడండి! ముందే మీకు చెబుతున్నాను.
MAT 24:26 “కనుక మీతో ఎవరైనా, ‘అదిగో! ఆయన నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నాడు’ అంటే, అక్కడికి వెళ్ళకండి. లేక, ‘యిక్కడ గదుల్లో ఉన్నాడు’ అంటే, నమ్మకండి.
MAT 24:27 తూర్పునుండి పడమర దాకా మెరిసే మెరుపు వలే మనుష్యకుమారుడు వస్తాడు.
MAT 24:28 శవమున్న చోటే రాబందులు ప్రోగౌతాయి.
MAT 24:29 “ఆ కష్టకాలం గడిచిన వెంటనే ‘దేవుడు సూర్యుణ్ణి చీకటిగా చేస్తాడు. చంద్రుడు వెలుగునివ్వడు నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి ఆకాశంలోని శక్తులు కదలిపోతాయి.’
MAT 24:30 “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీద ఉన్న దేశాలన్నీ దుఃఖిస్తాయి. మనుష్యకుమారుడు శక్తితో, గొప్ప తేజస్సుతో ఆకాశంలోని మేఘాలపై రావటం వాళ్ళు చూస్తారు.
MAT 24:31 అప్పుడు దేవుడు తన దూతల్ని గొప్ప బూరధ్వనితో పంపుతాడు. ఆ దూతలు నలువైపుల నుండి అంటే, ఆ చివరి నుండి ఈ చివరిదాకా గాలించి దేవుడెన్నుకొన్న వాళ్ళను ప్రోగు చేస్తారు.
MAT 24:32 “ఇక ఇప్పుడు అంజూరపు చెట్టు ఉపమానాన్ని గురించి నేర్చుకొండి. వాటి రెమ్మలు మృదువై ఆకులు చిగురించగానే, ఎండకాలం దగ్గరకు వచ్చిందని మీకు తెలిసి పోతుంది.
MAT 24:33 అదే విధంగా నేను చెప్పినవన్నీ చూసిన వెంటనే ఆయన దగ్గరలోనే ఉన్నాడని అంటే మీ తలుపు ముందే ఉన్నాడని తెలుసుకొంటారు.
MAT 24:34 ఇది సత్యం. ఇవన్నీ జరిగేదాకా ఈ తరం వాళ్ళు జీవించే ఉంటారు.
MAT 24:35 భూమి, ఆకాశము నశించి పోతాయి కాని నా మాటలు శాశ్వతంగా నిలిచి పోతాయి!
MAT 24:36 “ఆ రోజును గురించి లేక ఆ ఘడియను గురించి పరలోకంలోని దేవ దూతలకు గాని, కుమారునికి గాని ఎవ్వరికి తెలియదు. తండ్రికి మాత్రం తెలుసు.
MAT 24:37 “నోవహు కాలంలో ఏ విధంగా ఉందో మనుష్యకుమారుడు వచ్చినప్పుడు కూడా అదే విధంగా వుంటుంది.
MAT 24:38 నోవహు తన నావలో ప్రవేశించేదాకా, ప్రళయానికి ముందు రోజుల్లో ప్రజలు తింటూ, త్రాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకొంటూ, పెళ్ళిళ్ళు చేస్తూ జీవించారు.
MAT 24:39 ప్రళయం వచ్చి వాళ్ళందరూ కొట్టుకొని పోయేదాకా ఆ విధంగా జరుగుతుందని వాళ్ళకు తెలియదు. “మనుష్యకుమారుడు కూడా అదే విధంగా అకస్మాత్తుగా వస్తాడు.
MAT 24:40 ఆ రోజు ఇద్దరు వ్యక్తులు పొలంలో పని చేస్తూవుంటే ఒకడు ఆయన వెంట తీసుకు పోబడతాడు. రెండవ వాడు వదిలి వేయబడతాడు.
MAT 24:41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒక స్త్రీని తన వెంట తీసుకువెళ్తాడు. రెండవ స్త్రీని వదిలి వేస్తాడు.
MAT 24:42 “మీ ప్రభువు ఏ రోజు రానున్నాడో మీకు తెలియదు కనుక సిద్ధముగా ఉండండి.
MAT 24:43 కాని ఈ విషయం తెలుసుకొండి. ఇంటి యజమానికి దొంగ ఎప్పుడు వస్తాడో తెలిసి ఉంటే, తన యింట్లోకి దొంగను రానీయకుండా కాపలాకాస్తాడు.
MAT 24:44 మనుష్య కుమారుడు కూడా మీరు అనుకోని ఘడియలో వస్తాడు. కనుక మీరు కూడా అదే విధంగా సిద్ధంగా ఉండాలి.
MAT 24:45 “విశ్వాసము, తెలివిగల ఒక సేవకుణ్ణి ఉదాహరణగా తీసుకోండి. అతని యజమాని అతణ్ణి తన యింట్లో పనిచేసే వాళ్ళకు సరియైన సమయంలో భోజనం పెట్టడానికి నియమించాడు.
MAT 24:46 యజమాని వచ్చినప్పుడు ఆ సేవకుడు తన యజమాని చెప్పినట్లు చేస్తూవుంటే ధన్యుడు.
MAT 24:47 నేను మీకు నిజం చెబుతున్నాను: యజమాని ఆ నౌకరును తనకున్న ఆస్తి అంతటిపై అధికారిగా నియమిస్తాడు.
MAT 24:48 “ఒక వేళ ఆ సేవకుడు దుర్మార్గుడైతే తనలో తాను ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని
MAT 24:49 తన తోటి పని వాళ్ళను కొట్టడం మొదలు పెడ్తాడు. అంతేకాక త్రాగుబోతులతో కలసి తిని, త్రాగుతాడు.
MAT 24:50 యజమాని తన సేవకుడు ఎదురు చూడని రోజు, అతనికి తెలియని ఘడియలో వచ్చి,
MAT 24:51 అతణ్ణి చంపించి పాపులతో సహా నరకంలో పడవేస్తాడు. ఆ నరకంలో వాళ్ళంతా ఏడుస్తూ పండ్లు కొరుకుతూ బాధననుభవిస్తారు.
MAT 25:1 “దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: పది మంది కన్యకలు తమ తమ దీపాలు తీసుకొని పెళ్ళి కుమారుణ్ణి కలవటానికి వెళ్ళారు.
MAT 25:2 వాళ్ళలో ఐదుగురు తెలివిలేని వాళ్ళు; ఐదుగురు తెలివిగల వాళ్ళు.
MAT 25:3 తెలివి లేని కన్యలు దీపాలు తీసుకెళ్ళారు కాని తమ వెంట నూనె తీసుకు వెళ్ళలేదు.
MAT 25:4 తెలివిగల కన్యలు తమ దీపాలతో పాటు పాత్రలో నూనె కూడా తీసుకు వెళ్ళారు.
MAT 25:5 పెళ్ళి కుమారుడు రావటం ఆలస్యం అయింది. అందరికి కునుకు వచ్చి నిద్దుర పొయ్యారు.
MAT 25:6 “అర్థరాత్రి వేళ, ‘అదిగో పెళ్ళి కుమారుడు! వచ్చి చూడండీ!’ అని ఎవరో బిగ్గరగా కేక వేసారు.
MAT 25:7 “వెంటనే ఆ కన్యకలందరూ లేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు.
MAT 25:8 తెలివి లేని కన్యలు ‘మీ నూనె కొద్దిగా మాకివ్వండి; మా దీపాలలో నూనంతా అయిపోయింది!’ అని తెలివిగల కన్యల్ని అడిగారు.
MAT 25:9 “తెలివి గల కన్యలు, ‘ఈ నూనె మనకందరికి సరిపోదేమో! దుకాణానికి వెళ్ళి మీకోసం కొద్ది నూనె కొనుక్కురండి’ అని సమాధానం చెప్పారు.
MAT 25:10 “కాని వాళ్ళు నూనె కొనుక్కురావటానికి వెళ్ళినప్పుడు పెళ్ళి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న కన్యలు పెళ్ళి విందుకు అతనితో కలసి లోపలికి వెళ్ళారు. ఆ తదుపరి తలుపు వేయబడింది.
MAT 25:11 “మిగతా కన్యలు వచ్చి, ‘అయ్యా! అయ్యా! తలుపు తెరవండి’ అని అడిగారు.
MAT 25:12 “కాని అతడు, ‘నేను నిజం చెబుతున్నాను; మీరెవరో నాకు తెలియదు’ అని సమాధానం చెప్పాడు.
MAT 25:13 “మీకు ఆ రోజు, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మెలకువతో ఉండండి.
MAT 25:14 “దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తూ తన సేవకుల్ని పిలిచి తన ఆస్తిని వాళ్ళకు అప్పగించాడు.
MAT 25:15 ఒకనికి ఐదు తలాంతుల ధనం ఇచ్చాడు. రెండవ వానికి రెండు తలాంతులు, మూడవ వానికి ఒక తలాంతు వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి ఇచ్చాడు. ఆ తర్వాత ప్రయాణమై వెళ్ళాడు.
MAT 25:16 ఐదు తలాంతులు పొందిన వాడు వెంటనే వెళ్ళి ఆ ధనాన్ని ఉపయోగించి మరో ఐదు తలాంతులు సంపాదించాడు.
MAT 25:17 అదేవిధంగా రెండు తలాంతులు పొందినవాడు వెళ్ళి మరో రెండు తలాంతులు సంపాదించాడు.
MAT 25:18 కాని ఒక తలాంతు పొందిన వాడు వెళ్ళి ఒక గొయ్యి త్రవ్వి యజమాని యిచ్చిన ధనాన్ని అందులో దాచాడు.
MAT 25:19 “చాలాకాలం తర్వాత ఆ యజమాని తిరిగి వచ్చి లెక్కలు చూసాడు.
MAT 25:20 ఐదు తలాంతులు పొందినవాడు మరో ఐదు తలాంతులు తెచ్చి, ‘అయ్యా! మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు. నేను మరో ఐదు సంపాదించాను చూడండి!’ అని అన్నాడు.
MAT 25:21 “ఆ యజమాని ‘మంచి పని చేసావు! నీలో మంచితనం, విశ్వాసం ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పని చేసావు! కనుక నిన్ను ఇంకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను. నీ యజమానితో కలసి ఆనందించు!’ అని సమాధానం చెప్పాడు.
MAT 25:22 “రెండు తలాంతులు పొందిన వాడు కూడా వచ్చి, ‘అయ్యా! నాకు రెండు తలాంతులు యిచ్చారు. నేను మరో రెండు సంపాదించాను చూడండి!’ అని అన్నాడు.
MAT 25:23 “ఆ యజమాని, ‘మంచి పని చేసావు! నీలో మంచితనము, విశ్వాసము ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పని చేసావు కనుక నిన్ను యింకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను, నీ యజమానితో కలసి ఆనందించు!’ అని అన్నాడు.
MAT 25:24 “తదుపరి ఒక తలాంతు పొందినవాడు వచ్చి ‘అయ్యా! మీరు కృరమైన వారని నాకు తెలుసు. విత్తనం నాటని చోట మీరు పంటను కోస్తారు. విత్తనం వేయని పొలాలనుండి ధాన్యం ప్రోగు చేస్తారు.
MAT 25:25 అందువల్ల నేను భయపడి మీ తలాంతు తీసుకు వెళ్ళి భూమిలో దాచి ఉంచాను. ఇదిగో! మీది మీరు తీసుకోండి!’ అని అన్నాడు.
MAT 25:26 “ఆ యజమాని ఈ విధంగా సమాధానం ఇచ్చాడు: ‘నీవు దుర్మార్గుడివి! సోమరివి! నేను విత్తనం నాటని పొలం నుండి పంటను కోస్తానని, విత్తనం వెయ్యని చోట ధాన్యం ప్రోగు చేస్తానని నీకు తెలుసునన్న మాట. అలా అనుకొన్నవాడివి నా డబ్బు వడ్డీ వ్యాపారుల దగ్గర దాచి ఉంచ వలసింది.
MAT 25:27 అలా చేసుంటే నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది.’
MAT 25:28 “అతని దగ్గరున్న తలాంతు తీసుకొని పది తలాంతులున్న వానికివ్వండి.
MAT 25:29 ఎందుకంటే ఉన్న వాళ్ళకు దేవుడు యింకా ఎక్కువ యిస్తాడు. అప్పుడు వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంటుంది. లేని వాళ్ళనుండి వాళ్ళ దగ్గరున్నది కూడా తీసి వేయబడుతుంది.
MAT 25:30 ఆ పనికిరాని వాణ్ణి బయట చీకట్లో పడవేయండి. అక్కడతడు ఏడుస్తూ బాధననుభవిస్తాడు.
MAT 25:31 “తేజోవంతుడైన మనుష్యకుమారుడు తన దేవదూతలతో కలసి వస్తాడు. వచ్చి తేజోవంతమైన తన సింహాసనంపై కూర్చుంటాడు.
MAT 25:32 ప్రజలందర్ని సమావేశ పరచి గొఱ్ఱెల కాపరి మేకల్లో నుండి గొఱ్ఱెల్ని వేరు చేసినట్లు వాళ్ళను వేరుచేస్తాడు.
MAT 25:33 తదుపరి కొందరిని తన కుడి వైపున, కొందరిని తన ఎడమ వైపున ఉంచుతాడు.
MAT 25:34 “అప్పుడా రాజు తన కుడి వైపునున్న వాళ్ళతో, ‘రండి! నా తండ్రి ఆశీర్వాదాలను మీరు పొందారు. మీ రాజ్యాన్ని తీసుకొండి. ప్రపంచం సృష్టింపబడినప్పుడే ఈ రాజ్యాన్ని దేవుడు మీకోసం ఉంచాడు.
MAT 25:35 ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళిచ్చారు. పరదేశీయునిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఆతిథ్యమిచ్చారు.
MAT 25:36 దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు నాకు దుస్తులిచ్చారు. జబ్బుతో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేసారు. నేను కారాగారంలో ఉన్నప్పుడు వచ్చి పలకరించారు’ అని అంటాడు.
MAT 25:37 “అప్పుడు నీతిమంతులు, ‘ప్రభూ! మీరు ఆకలితో ఉండగా మేము ఎప్పుడు మీకు భోజనం పెట్టాము? మీరు దాహంతో ఉండగా మీకు నీళ్ళెప్పుడిచ్చాము?
MAT 25:38 మీరు పరదేశీయునిగా ఎప్పుడు వచ్చారు? మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించాము? మీకు దుస్తులు ఎప్పుడు కావలసివచ్చింది? దుస్తులు మీకు ఎప్పుడిచ్చాము?
MAT 25:39 మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు చూసాము? మీరు కారాగారంలో ఎప్పుడువున్నారు? మిమ్మల్ని చూడటానికి ఎప్పుడు వచ్చాము?’ అని అడుగుతారు.
MAT 25:40 “ఆ రాజు, ‘ఇది సత్యం. హీన స్థితిలో ఉన్న నా సోదరులకు మీరు చేసిన ప్రతి సహాయాన్ని నాకు చేసినట్టుగా పరిగణిస్తాను’ అని సమాధానం చెబుతాడు.
MAT 25:41 “ఆ తర్వాత ఆ రాజు తన ఎడమ వైపునున్న వాళ్ళతో, ‘శాపగ్రస్తులారా! వెళ్ళి పొండి! సైతాను కొరకు, వాని దూతలకొరకు సిద్ధం చేయబడిన శాశ్వతమైన మంటల్లో పడండి.
MAT 25:42 ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళివ్వలేదు.
MAT 25:43 నేను పరదేశీయునిగా వచ్చినప్పుడు మీరు నన్ను ఆహ్వానించలేదు. నాకు దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు దుస్తుల్ని యివ్వలేదు. నేను జబ్బుతో కారాగారంలో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేయలేదు’ అని అంటాడు.
MAT 25:44 “అప్పుడు వాళ్ళు కూడా, ‘ప్రభూ! మీరు ఆకలిగావున్నప్పుడు గాని, లేక దాహంతో ఉన్నప్పుడు కాని, లేక పరదేశీయునిగా కాని, లేక జబ్బుతో ఉన్న వానిగా కాని లేక చెరసాలలో ఉన్నట్టుకాని ఎప్పుడు చూసాము? అలా చూసి కూడా మీకు ఎప్పుడు సహాయం చెయ్యలేదు?’ అని అంటారు.
MAT 25:45 “ఆయన, ‘ఇది సత్యం. హీనస్థితిలో ఉన్నవానికి మీరు సహాయం చెయ్యలేదు. కనుక నాకు సహాయం చెయ్యనట్లే’ అని చెబుతాడు.
MAT 25:46 “వాళ్ళు వెళ్ళి శాశ్వతంగా శిక్షను అనుభవిస్తారు. కాని నీతిమంతులు అనంత జీవితం పొందుతారు.”
MAT 26:1 యేసు చెప్పటం ముగించాడు. ఆ తదుపరి శిష్యులతో
MAT 26:2 “రెండు రోజుల తర్వాత పస్కాపండుగ వస్తొందని మీకు తెలుసు. ఆ తర్వాత మనుష్య కుమారునికి శ్రమ సంభవిస్తుంది. తత్ఫలితంగా ఆయన శత్రువులు ఆయన్ని సిలువకు వేస్తారు” అని అన్నాడు.
MAT 26:3 ప్రధానయాజకులు, పెద్దలు, కయప అని పిలువబడే ప్రధానయాజకుని యింటి ఆవరణంలో సమావేశమై
MAT 26:4 యేసును ఏదో ఒక కుట్రతో బంధించి చంపాలని పన్నాగం పన్నారు.
MAT 26:5 “కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజల్లో అల్లర్లు చెలరేగవచ్చు” అని అనుకొన్నారు.
MAT 26:6 బేతనియ గ్రామంలో కుష్టురోగియగు సీమోను అని పిలువబడే ఒక వ్యక్తి యింట్లో యేసు ఉన్నాడు.
MAT 26:7 యేసు భోజనానికి కూర్చొని ఉండగా ఒక స్త్రీ చలువరాతి బుడ్డిలో అతి విలువైన అత్తరుతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన తలపై పోసింది.
MAT 26:8 ఇది చూసి శిష్యులకు కోపం వచ్చింది. “ఎందుకిలా వ్యర్థంచేయటం?
MAT 26:9 ఈ అత్తరు పెద్ద మొత్తానికి అమ్మి ఆ డబ్బు పేదవాళ్ళ కివ్వవలసింది!” అని వాళ్ళన్నారు.
MAT 26:10 యేసుకు ఈ విషయం తెలిసి, “ఆమెనెందుకంటున్నారు? ఆమె సరియైన పని చేసింది,
MAT 26:11 పేద వాళ్ళు మీతో ఎప్పుడూ ఉంటారు. కాని నేను మీతో ఎల్లకాలం ఉండబోను.
MAT 26:12 ఆమె ఆ అత్తరు నా శరీరం మీద పోసి నన్ను సమాధి చెయ్యటానికి సిద్ధం చేసింది.
MAT 26:13 ఇది సత్యం – ఈ సువార్తను ప్రపంచంలో ఏ చోట ప్రకటించినా ఆమె జ్ఞాపకార్థం ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.
MAT 26:14 ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు.
MAT 26:15 “ఆయన్ని మీ కప్పగిస్తే మీరు నాకేమివ్వాలనుకొన్నారు?” అని వాళ్ళనడిగాడు. వాళ్ళు ముప్పై వెండి నాణెములు లెక్క పెట్టి యిచ్చారు.
MAT 26:16 అప్పటినుండి యూదా ఆయన్ని పట్టివ్వాలని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు.
MAT 26:17 పులియని రొట్టెలు తినే పండుగ రోజులు వచ్చాయి. మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “పస్కా పండుగ భోజనం ఎక్కడ సిద్ధం చేయమంటారు?” అని అడిగారు.
MAT 26:18 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పట్టణంలోకి నేను చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్ళండి. అతనితో ‘నా సమయం దగ్గరకొచ్చింది. నేను నా శిష్యులతో కలసి పస్కా పండుగ భోజనం మీ యింట్లో చెయ్యాలనుకొంటున్నానని మా ప్రభువు చెప్పమన్నారు’ అని చెప్పండి.”
MAT 26:19 శిష్యులు యేసు సూచించిన విధంగా పస్కాపండుగ విందు సిద్దం చేసారు.
MAT 26:20 సాయంత్రం కాగానే యేసు పన్నెండు మందితో కలసి భోజనానికి కూర్చున్నాడు.
MAT 26:21 అంతా భోజనం చేస్తుండగా ఆయన, “ఇది సత్యం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.
MAT 26:22 వాళ్ళకు దుఃఖం కలిగింది. ప్రతి ఒక్కడు ఆయనతో, “ప్రభూ! నేను కాదు కదా!” అని అన్నాడు.
MAT 26:23 యేసు సమాధానం చెబుతూ, “నాతో కలసి గిన్నెలో చెయ్యి ఉంచిన వాడు నాకు ద్రోహం చేస్తాడు.
MAT 26:24 మనుష్యకుమారుడు లేఖనాల్లో వ్రాసినట్లు చనిపోతాడు. కాని ఆయనకు ద్రోహంచేసిన వానికి బహుశ్రమ కలుగుతుంది. వాడు జన్మించి ఉండక పోయినట్లయితే బాగుండేది” అని అన్నాడు.
MAT 26:25 అప్పుడు ఆయనకు ద్రోహం చేయనున్న యూదా, “నేను కాదు కదా రబ్బీ” అని అన్నాడు. యేసు, “ఔను! నువ్వే!” అని సమాధానం చెప్పాడు.
MAT 26:26 వాళ్ళు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది తీసుకొని తినండి! ఇది నా దేహం!” అని అన్నాడు.
MAT 26:27 ఆ తర్వాత పాత్రను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి వాళ్ళకిస్తూ, “అందరూ ఈ పాత్రలోవున్న దాన్ని త్రాగండి.
MAT 26:28 ఇది నా ఒడంబడిక రక్తం. అనేకులకు పాప క్షమాపణ కలగాలని నేనీ రక్తాన్ని చిందించాను.
MAT 26:29 ఈ రోజు నుండి నా తండ్రి రాజ్యంలో మీతో కలసి ద్రాక్షారసాన్ని మళ్ళీ త్రాగే దాకా దీన్ని యిక మీదట త్రాగనని మీతో చెబుతున్నాను” అని అన్నాడు.
MAT 26:30 వాళ్ళు కీర్తనను పాడాక ఒలీవ చెట్ల కొండ మీదికి వెళ్ళారు.
MAT 26:31 ఆ తదుపరి యేసు వాళ్ళతో, “ఈ రాత్రి మీరు నా కారణంగా చెదరిపోతారు. ఎందుకంటే: ‘నేను గొఱ్ఱెల కాపరిని చంపుతాను అప్పుడా గొఱ్ఱెల మంద చెదరిపోతుంది’ అని వ్రాయబడివుంది.
MAT 26:32 కాని దేవుడు నన్ను బ్రతికించాక నేను మీకన్నా ముందే గలిలయకు వెళ్తాను” అని అన్నాడు.
MAT 26:33 పేతురు, “అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళినా నేను మాత్రం మిమ్మల్ని వదలి వెళ్ళను” అని సమాధానం చెప్పాడు.
MAT 26:34 యేసు, “ఇది సత్యం. ఈ రాత్రి కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లు అంటావు” అని సమాధానం చెప్పాడు.
MAT 26:35 కాని పేతురు, “నేను మీతో కలసి మరణిస్తాను, కాని మీరెవరో నాకు తెలియదని అనను” అని అన్నాడు. శిష్యులందరూ అదే విధంగా అన్నారు.
MAT 26:36 ఆ తర్వాత యేసు శిష్యులతో కలసి గెత్సేమనే అనే ప్రదేశానికి వెళ్ళాడు. వాళ్ళతో, “ఇక్కడే కూర్చోండి. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తాను” అని అన్నాడు.
MAT 26:37 యేసు పేతుర్ని, జెబెదయి యొక్క యిద్దరు కుమారుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు దుఃఖం వచ్చింది. మనస్సు వ్యాకులం చెందింది.
MAT 26:38 అప్పుడాయన వాళ్ళతో, “నా ఆత్మ మరణ వేదన పొందుతోంది. ఇక్కడే ఉండి నాతో సహా మేలుకొని ఉండండి” అని అన్నాడు.
MAT 26:39 యేసు యింకా కొంత దూరం వెళ్ళి సాష్టాంగపడి, “నా తండ్రి! వీలైతే దుఃఖంతో నిండిన ఈ పాత్రను నా నుండి తీసివేయి! అయినా నెరవేరవలసింది నా యిచ్ఛకాదు, నీది” అని అంటూ ప్రార్థించాడు.
MAT 26:40 ఆ తర్వాత తిరిగి వచ్చి శిష్యులు నిద్రిస్తూ ఉండటం గమనించాడు. ఆయన, “నాతో సహా ఒక గంట సేవు మేలుకోలేక పొయ్యారా?” అని అన్నాడు.
MAT 26:41 “మెలకువగా ఉండి ప్రార్థించండి! అప్పుడే మీరు దుష్ప్రేరేపణకు లోనైపోకుండా ఉంటారు. ఆత్మ సిద్ధంగా ఉంది కాని శరీరం బలహీనంగా ఉంది!” అని పేతురుతో అన్నాడు.
MAT 26:42 ఆయన రెండవసారి వెళ్ళి, “నా తండ్రీ! ఈ పాత్రలోవున్నది త్రాగితేగాని వీల్లేదంటే నేను దాన్ని త్రాగుతాను. నీ యిష్టమే నెరవేరు గాక!” అని ప్రార్ధించాడు.
MAT 26:43 ఆయన తిరిగి వచ్చి తన శిష్యులు మళ్ళీ నిద్రిస్తుండటం గమనించాడు. కళ్ళు బరువెక్కటంవల్ల వాళ్ళు నిద్రనాపుకోలేక పోయారు.
MAT 26:44 ఆయన మూడవ సారి వాళ్ళను వదిలి వెళ్ళి ముందు ప్రార్థించినట్లే మళ్ళీ ప్రార్ధించాడు.
MAT 26:45 ఆ తదుపరి తన శిష్యుల దగ్గరకు వచ్చి, “మీరింకా నిద్రిస్తూ, విశ్రాంతి తీసుకొంటున్నారా. చూడండి! మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడే ఘడియ దగ్గరకు వచ్చింది.
MAT 26:46 వెళ్దాం, లేవండి. అదిగో! నాకు ద్రోహం చేయనున్నవాడు వస్తున్నాడు!” అని అన్నాడు.
MAT 26:47 ఆయనింకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, ప్రజాప్రముఖులు పంపించిన పెద్ద ప్రజల గుంపు ఒకటి వాని వెంట ఉంది. వాళ్ళ చేతుల్లో కత్తులు, కర్రలు ఉన్నాయి.
MAT 26:48 ఆ ద్రోహి, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకుంటానో, ఆయన్ని బంధించండి!” అని ముందే ఒక ఏర్పాటు చేసుకొన్నాడు.
MAT 26:49 యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్ళి, “వందనాలు రబ్బీ!” అని ఆయన్ని ముద్దుపెట్టుకున్నాడు.
MAT 26:50 యేసు, “మిత్రమా! నీవు చేయవచ్చిన పని చెయ్యి” అని అన్నాడు. వెంటనే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆయన్ని బంధించారు.
MAT 26:51 యేసుతో ఉన్న వాళ్ళలో ఒకడు వెంటనే తన కత్తిని వరనుండి తీసి, ప్రధాన యాజకుని సేవకుని యొక్క చెవిని నరికి వేసాడు.
MAT 26:52 యేసు, “కత్తిని వరలో పెట్టెయి! కత్తినెత్తిన వాడు ఆ కత్తితోనే మరణిస్తాడు.
MAT 26:53 నేను నా తండ్రిని సహాయం కావాలని అడగలేననుకొన్నావా? నేను అడిగిన వెంటనే పన్నెండు దళాలకంటే ఎక్కువ మంది దేవదూతల్ని పంపుతాడు.
MAT 26:54 నేను అలాచేస్తే ఈ విధంగా జరగాలని లేఖనాల్లో వ్రాసినవి ఎట్లా నెరవేరుతాయి?” అని అన్నాడు.
MAT 26:55 ఆ తదుపరి యేసు వచ్చిన ప్రజలతో, “దోపిడి దొంగను పట్టుకోవటానికి వచ్చినట్లు కత్తులతో, కర్రలతో వచ్చారేం? మందిరావరణంలో కూర్చొని ప్రతిరోజు బోధించాను. కాని అప్పుడు మీరు నన్ను బంధించలేదు.
MAT 26:56 కాని, ప్రవక్తలు వ్రాసినవి నెరవేరాలని యివన్నీ జరిగాయి” అని అన్నాడు. వెంటనే ఆయన శిష్యులందరూ ఆయన్ని వదిలి వెళ్ళి పొయ్యారు.
MAT 26:57 వాళ్ళు యేసును బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకు వెళ్ళారు. అక్కడ శాస్త్రులు, పెద్దలు ఇదివరకే సమావేశమై వున్నారు.
MAT 26:58 కాని పేతురు కొంత దూరంలోవుండి యేసును ప్రధానయాజకుని యింటి దాకా అనుసరించాడు. ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని భటుల్తో కలసి యింటి ముగింట్లో కూర్చున్నాడు.
MAT 26:59 మరణ శిక్ష విధించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన యాజకులు, మహాసభ సభ్యులు యేసుకు ప్రతికూలంగా, దొంగ సాక్ష్యం కొరకు చూసారు.
MAT 26:60 చాలా మంది దొంగ సాక్ష్యం చెప్పటానికి ముందుకు వచ్చారు. కాని చంపడానికి సరైన కారణం లభించలేదు. చివరకు యిద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి
MAT 26:61 ఈ విధంగా చెప్పారు, “ఈ వ్యక్తి ‘నేను దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ నిర్మించగలను’ అని అన్నాడు.”
MAT 26:62 అప్పుడు ప్రధాన యాజకుడు లేచి నిలబడి యేసుతో, “నీవు సమాధానం చెప్పవా? వీళ్ళు చేస్తున్న నేరారోపణలేమిటి?” అని అడిగాడు.
MAT 26:63 కాని యేసు సమాధానం చెప్పలేదు. ప్రధాన యాజకుడు, “సజీవుడైన దేవునిపై ప్రమాణం చేసి చెప్పు, నీవు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువా?” అని అడిగాడు.
MAT 26:64 యేసు సమాధానం చెబుతూ, “ఔను! మీరన్నది నిజం. అంతే. నేను మీతో చెప్పేదేమిటంటే యిక మీదటి నుండి మనుష్యకుమారుడు సర్వశక్తిసంపన్నుని కుడివైపు కూర్చొని ఉండటం మీరు చూస్తారు. ఆయన మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు.
MAT 26:65 ఇది విని ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని కోపాన్ని వ్యక్తపరుస్తూ, “ఇతను దైవదూషణ చేస్తున్నాడు. మనకింక ఇతర సాక్ష్యాలు ఎందుకు? చూడండి అతడు చేసిన దైవదూషణ విన్నారు కదా!
MAT 26:66 మరి మీరేమంటారు?” అని అడిగాడు. “అతనికి మరణదండన విధించవలసిందే” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
MAT 26:67 వాళ్ళలో కొందరు ఆయన ముఖంమ్మీద ఉమ్మేసి కొట్టారు. మరి కొందరు ఆయన చెంప మీద కొట్టి
MAT 26:68 “ఓ క్రీస్తూ! నిన్నెవరు కొట్టారో చెప్పుకో!” అని అన్నారు.
MAT 26:69 ఇక్కడ పేతురు బయట ముంగిట్లో కూర్చొని ఉండగా ఒక దాసీ పిల్ల అతని దగ్గరకు వచ్చి, “నీవు కూడా గలిలయ వాడైన యేసుతో ఉన్న వాడవే కదూ!” అని అడిగింది.
MAT 26:70 కాని అతడు వాళ్ళందరి ముందు, “నీవేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు!” అని అంటూ ఆమె మాటను కాదన్నాడు.
MAT 26:71 ఆ తదుపరి, అతడు అక్కడి నుండి ద్వారం దగ్గరకు వెళ్ళాడు. అక్కడతణ్ణి మరోదాసీ పిల్ల చూసి, అక్కడున్న ప్రజలతో, “ఈ వ్యక్తి, నజరేతు యేసుతో ఉన్నవాడే!” అని అన్నది.
MAT 26:72 పేతురు ఒట్టు పెట్టుకొని మళ్ళీ ఆమె మాటల్ని కాదంటూ, “నాకు ఆ మనిషి ఎవరో తెలియదు!” అని అన్నాడు.
MAT 26:73 కొద్ది సేపయ్యాక అక్కడ నిలుచున్న వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి, “నీవు తప్పకుండా వాళ్ళలో ఒకడివి. నీ మాట తీరు చూస్తేనే తెలిసిపోతుంది!” అని అన్నారు.
MAT 26:74 అప్పుడు పేతురు శపించుకోవటం మొదలు పెట్టాడు. అతడు ప్రమాణం చేస్తూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు!” అని అన్నాడు. వెంటనే కోడి కూసింది.
MAT 26:75 అప్పుడు యేసు చెప్పిన ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లంటావు” పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు.
MAT 27:1 తెల్లవారాక ప్రధాన యాజకులు, పెద్దలు అంతా సమావేశమై యేసును చంపటానికి నిశ్చయించారు.
MAT 27:2 వాళ్ళాయన్ని బంధించి తీసుకెళ్ళి రాష్ట్ర పాలకుడైన పిలాతుకు అప్పగించారు.
MAT 27:3 యేసుకు ద్రోహం చేసిన యూదా యేసుని చంపటానికి నిశ్చయించారని విని చాలా బాధ పడ్డాడు. తాను తీసుకొన్న ముప్పై వెండి నాణాల్ని ప్రధాన యాజకులకు, పెద్దలకు తిరిగి యిచ్చేస్తూ,
MAT 27:4 “నేను పాపం చేసాను. ఆ అమాయకుణ్ణి చావుకు అప్పగించాను” అని అన్నాడు. వాళ్ళు, “అది నీ గొడవ. మాకు సంబంధం లేదు” అని సమాధానం చెప్పారు.
MAT 27:5 యూదా ఆ డబ్బును దేవాలయంలో పారవేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు.
MAT 27:6 ప్రధానయాజకులు నాణాల్ని తీసికొని, “ఇది రక్తాని కోసం చెల్లించిన డబ్బు కనుక ఈ డబ్బును ధనాగారంలో ఉంచటం మంచిది కాదు” అని అన్నారు.
MAT 27:7 వాళ్ళు ఆలోచించి ఆ ధనంతో విదేశీయుల్ని సమాధి చెయ్యటానికి ఉపయోగపడేటట్లు ఒక కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు.
MAT 27:8 అందువల్లే ఈ నాటికీ ఆ పొలాన్ని “రక్తపు భూమి” అని అంటారు.
MAT 27:9 తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ వాక్యాలు నెరవేరాయి, “వాళ్ళు ముప్పై వెండి నాణెములను తెచ్చారు. ఇది అతని విలువ. ఇది ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించిన విలువ. ప్రభువు ఆజ్ఞాపించినట్లు వాళ్ళు ఆ ధనంతో కుమ్మరి పొలాన్ని కొన్నారు.”
MAT 27:11 యేసు రాష్ట్రపాలకుని ముందు నిల్చున్నాడు. ఆ రాష్ట్రపాలకుడు, “నీవు యూదులకు రాజువా?” అని యేసును అడిగాడు. “ఔను! నీవన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు.
MAT 27:12 ప్రధాన యాజకులు, పెద్దలు ఆయనపై నేరారోపణలు చేస్తూ పోయారు. కాని ఆయన సమాధానం చెప్పలేదు.
MAT 27:13 అప్పుడు పిలాతు, “వాళ్ళు నీైపె యిన్ని నేరాలు మోపుతున్నారు కదా! నీవు వినటం లేదా?” అని అడిగాడు.
MAT 27:14 యేసు ఒక్క నేరారోపణకు కూడా సమాధానం చెప్పలేదు. రాష్ట్రపాలకునికి చాలా ఆశ్చర్యం వేసింది.
MAT 27:15 పండుగ రోజుల్లో ప్రజలు కోరిన ఒక నేరస్తుణ్ణి విడుదల చేసే ఆచారాన్ని ఆ రాష్ట్రపాలకుడు ఆచరిస్తూ ఉండేవాడు.
MAT 27:16 ఆ రోజుల్లో బరబ్బ అనే ప్రసిద్ధిగాంచిన ఒక నేరస్తుడు కారాగారంలో ఉన్నాడు.
MAT 27:17 అందువల్ల ప్రజలు సమావేశమయ్యాక పిలాతు, “ఎవర్ని విడుదల చెయ్యమంటారు? బరబ్బనా లేక క్రీస్తు అని పిలువబడే యేసునా?” అని వాళ్ళనడిగాడు.
MAT 27:18 అసూయవల్ల వాళ్ళు యేసుని తనకప్పగించారని పిలాతుకు తెలుసు.
MAT 27:19 పిలాతు న్యాయపీఠంపై కూర్చోబోతుండగా అతని భార్య, “ఆ నీతిమంతుని విషయంలో జోక్యం కలిగించుకోకండి. నిన్న రాత్రి ఆయన గురించి కలగన్నాను. ఆ కలలో ఎన్నో కష్టాలను అనుభవించాను” అన్న సందేశాన్ని పంపింది.
MAT 27:20 బరబ్బను విడుదల చేసి యేసుకు మరణ దండన విధించేటట్లు కోరుకోమని ప్రధాన యాజకులు, పెద్దలు ప్రజల్ని ప్రోద్బలం చేసారు.
MAT 27:21 “ఇద్దర్లో నన్ను ఎవర్ని విడుదల చెయ్యమంటారు?” అని రాష్ట్రపాలకుడు అడిగాడు. “బరబ్బను” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
MAT 27:22 “మరి ‘క్రీస్తు’ అని పిలువబడే ఈ యేసును నన్నేమి చెయ్యమంటారు?” అని పిలాతు అడిగాడు. అంతా, “సిలువకు వెయ్యండి!” అని సమాధానం చెప్పారు.
MAT 27:23 “ఆయనేం తప్పు చేసాడు?” అని పిలాతు అడిగాడు. కాని వాళ్ళు, “అతన్ని సిలువకు వెయ్యండి” అని యింకా బిగ్గరగా కేకలు వేసారు.
MAT 27:24 లాభం కలగటానికి మారుగా అల్లర్లు మొదలవటం పిలాతు గమనించాడు. తరువాత అతడు నీళ్ళు తీసుకొని ప్రజలముందు ఆ నీళ్ళను చేతులు మీదుగా వదుల్తూ, “ఈయన రక్తానికి నేను బాధ్యుణ్ణికాను. ఇది మీ బాధ్యత!” అని అన్నాడు.
MAT 27:25 ప్రజలు, “అతని రక్తానికి మేము, మా సంతానము బాధ్యత వహిస్తాము!” అని సమాధానం చెప్పారు.
MAT 27:26 ఆ తర్వాత పిలాతు బరబ్బను విడుదల చేసాడు. కాని యేసును కొరడా దెబ్బలు కొట్టించి సిలువకు వేయటానికి అప్పగించాడు.
MAT 27:27 ఆ తర్వాత రాష్ట్రపాలకుని సైనికులు యేసును కోటకు తీసుకు వెళ్ళారు. దళానికి చెందిన సైనికులందరూ ఆయన చుట్టూ చేరారు.
MAT 27:28 ఆయన దుస్తుల్ని విప్పి, ఎఱ్ఱ రంగుగల ఒక పొడుగాటి వస్త్రాన్ని ఆయనకు తొడిగించారు.
MAT 27:29 ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు. ఆయన కుడి చేతికి ఒక బెత్తాన్నిచ్చారు. ఆయన ముందు మోకరిల్లి నమస్కరిస్తూ, “యూదుల రాజా! జయము” అని హేళన చేసారు.
MAT 27:30 ఆయన మీద ఉమ్మివేసారు. బెత్తాన్ని తీసుకొని దాంతో ఆయన తలపై కొట్టారు.
MAT 27:31 ఆయన్ని హేళన చేసాక ఆ పొడుగాటి వస్త్రాన్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తదుపరి ఆయన్ని సిలువకు వెయ్యటానికి తీసుకెళ్ళారు.
MAT 27:32 వాళ్ళు బయటికి వెళ్తూండగా కురేనే పట్టణానికి చెందిన సీమోను అనేవాడు కనిపించాడు. అతణ్ణి బలవంతం చేసి యేసు సిలువను మొయ్యమన్నారు.
MAT 27:33 వాళ్ళు గొల్గొతా అనే స్థలాన్ని చేరుకున్నారు. (గొల్గొతా అంటే “పుర్రెలాంటి స్థలం” అని అర్థం.)
MAT 27:34 అక్కడ చేదుకలిపిన ద్రాక్షరసాన్ని యేసుకు త్రాగటానికి యిచ్చారు. కాని రుచి చూసాక దాన్ని త్రాగటానికి ఆయన నిరాకరించాడు.
MAT 27:35 ఆయన్ని సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని చీట్లువేసి పంచుకున్నారు.
MAT 27:36 సైనికులు కూర్చొని ఆయనకు కాపలా కాశారు.
MAT 27:37 ఆయనపై ఆరోపించిన, “ఇతడు యూదుల రాజు” అన్న నేరాన్ని వ్రాసి ఆయన తలపై భాగాన ఉంచారు.
MAT 27:38 ఆ తదుపరి ఆయనతో పాటు దోపిడి దొంగలిద్దర్ని ఒకణ్ణి కుడివైపు, మరొకణ్ణి ఎడమ వైపు సిలువకు వేసారు.
MAT 27:39 ఆ దారిన వెళ్ళిన వాళ్ళు తమ తలలాడిస్తూ ఆయన్ని దూషిస్తూ
MAT 27:40 “దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో పునర్నిర్మాణం చేయగల వాడివి! నిన్ను నీవు రక్షించుకో. నీవు దేవుని కుమారుడవైతే ఆ సిలువ నుండి దిగిరా!” అని అన్నారు.
MAT 27:41 ప్రధానయాజకులు శాస్త్రులతో, పెద్దలతో కలసి ఆయన్ని అదే విధంగా హేళన చేస్తూ,
MAT 27:42 “అతడు యితరులను రక్షిస్తాడు. కాని తనను తాను రక్షించుకోలేడు. అతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజైనట్లయితే ఆ సిలువ నుండి క్రిందికి దిగిరానీ. అప్పుడతణ్ణి విశ్వసిస్తాము.
MAT 27:43 అతడు దేవుణ్ణి విశ్వసిస్తాడు, ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అన్నాడు. దేవునికి కావలసివస్తే అతణ్ణి రక్షించుకోమనండి” అని అన్నారు.
MAT 27:44 ఆయనతో సహా సిలువకు వేయబడిన దోపిడి దొంగలు కూడా ఆయన్ని అదేవిధంగా అవమానించారు.
MAT 27:45 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది.
MAT 27:46 సుమారు మూడు గంటలప్పుడు యేసు బిగ్గరగా, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ?” అని కేక వేసాడు. అంటే, “నా దైవమా! నా దైవమా! నన్నెందుకు ఒంటరిగా ఒదిలివేసావు?” అని అర్థం.
MAT 27:47 అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు ఇది విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు.
MAT 27:48 ఒకడు వెంటనే పరుగెత్తుకొంటూ వెళ్ళి ఒక స్పాంజి తెచ్చాడు. దాన్ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక బెత్తానికి పెట్టి యేసుకు త్రాగటానికి యిచ్చాడు.
MAT 27:49 కాని యితర్లు, “ఆగండి! అతణ్ణి రక్షించటానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం!” అని అన్నారు.
MAT 27:50 యేసు మళ్ళీ ఒక మారు పెద్ద కేక వేసి తన ప్రాణం వదిలి వేసాడు.
MAT 27:51 అదే క్షణంలో దేవాలయంలోని తెర పైనుండి క్రింది దాకా చినిగి పోయింది. భూకంపం వచ్చి బండలు పగిలి పొయ్యాయి.
MAT 27:52 సమాధులు తెరుచుకొన్నాయి. దేవుడు చనిపోయిన పరిశుద్ధులను అనేకుల్ని బ్రతికించాడు.
MAT 27:53 వాళ్ళు సమాధులనుండి వెలుపలికి వచ్చారు. యేసు బ్రతికి వచ్చాక వాళ్ళు పవిత్ర నగరాన్ని ప్రవేశించి చాలా మందికి కనిపించారు.
MAT 27:54 యేసును కాపలా కాస్తున్న శతాధిపతి, సైనికులు భూకంపాన్ని, జరిగిన మిగతా సంఘటల్ని చూసి చాలా భయపడిపోయి, “ఈయన నిజంగా దేవుని కుమారుడే!” అని అన్నారు.
MAT 27:55 చాలా మంది స్త్రీలు కొంత దూరం నుండి చూస్తూ ఉన్నారు. వీళ్ళు యేసుకు ఉపచారాలు చెయ్యటానికి గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చినవాళ్ళు.
MAT 27:56 వాళ్ళలో మగ్దలేనే గ్రామస్తురాలైన మరియ, యాకోబు, యోసేపు అనువారి తల్లి మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.
MAT 27:57 సాయంత్రం అయ్యింది. యోసేపు అనే ధనవంతుడు అరిమతయియ గ్రామం నుండి వచ్చాడు. యోసేపు కూడా యేసు శిష్యుల్లో ఒకడు.
MAT 27:58 అతడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని యివ్వమని కోరాడు. పిలాతు యివ్వమని ఆజ్ఞాపించాడు.
MAT 27:59 యోసేపు ఆ దేహాన్ని తీసుకొని ఒక క్రొత్త గుడ్డలో చుట్టాడు.
MAT 27:60 ఒక పెద్ద రాయిని తొలిచి తన కోసం నిర్మించుకొన్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. ఒక రాయిని ఆ సమాధి ద్వారానికి అడ్డంగా దొర్లించి వెళ్ళిపొయాడు.
MAT 27:61 మగ్దలేనే మరియ, యింకొక మరియ ఆ సమాధికి ఎదురుగా అక్కడే కూర్చొని ఉన్నారు.
MAT 27:62 అది విశ్రాంతికి సిద్ధమయ్యే రోజు. మరుసటి రోజు పరిసయ్యులు పిలాతు సమక్షంలో సమావేశమయ్యారు,
MAT 27:63 “అయ్యా! ఆ మోసగాడు బ్రతికి ఉండగా ‘మూడు రోజుల్లో నేను తిరిగి బ్రతికి వస్తాను’ అని అనటం మాకు జ్ఞాపకం ఉంది.
MAT 27:64 అందువల్ల మూడవ రోజు వరకు ఆ సమాధిని జాగ్రత్తగా కాపలా కాయమని ఆజ్ఞాపించండి. అలా చెయ్యకపోతే అతని శిష్యులు వచ్చి అతని దేహాన్ని దొంగిలించి, ‘అతడు బ్రతికాడు’ అని ప్రజలతో చెప్పవచ్చు. ఈ చివరి మోసం మొదటి మోసం కన్నా ఘోరంగా ఉంటుంది” అని అన్నారు.
MAT 27:65 పిలాతు, “భటుల్ని తీసుకు వెళ్ళండి. వాళ్ళు సమాధిని జాగ్రత్తగా కాపలా కాయటం మీ బాధ్యత” అని చెప్పాడు.
MAT 27:66 వాళ్ళు వెళ్ళి రాతికి ముద్రవేసి భటుల్ని ఆ సమాధికి కాపలా ఉంచి దాన్ని భద్రం చేసారు.
MAT 28:1 విశ్రాంతి రోజు గడిచింది. ఆదివారం సూర్యోదయమవుతుండగా మగ్దలేనే మరియ, యింకొక మరియ సమాధిని చూడటానికి వెళ్ళారు.
MAT 28:2 అప్పుడు ఒక భూకంపం వచ్చింది. పరలోకం నుండి ప్రభువు దూత వచ్చి ఆ సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ రాతిని దొర్లించి దాని మీద కూర్చొన్నాడు.
MAT 28:3 ఆ రూపం మెరుపులా ఉంది. అతని దుస్తులు మంచువలె తెల్లగా ఉన్నాయి.
MAT 28:4 సమాధిని కాపలా కాస్తున్న భటులు అతన్ని చూసి భయపడి వణికిపోయి, చనిపోయిన వాళ్ళలా అయ్యారు.
MAT 28:5 ఆ దేవదూత, స్త్రీలతో ఈ విధంగా అన్నాడు: “భయపడకండి, సిలువకు వేయబడిన యేసు కోసం మీరు చూస్తున్నారని నాకు తెలుసు.
MAT 28:6 ఆయనిక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్లు బ్రతికి వచ్చాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి.
MAT 28:7 ఆ తదుపరి వెంటేనే వెళ్ళి ఆయన శిష్యులతో, ‘ఆయన బ్రతికి వచ్చాడు. మీకన్నా ముందే గలిలయకు వెళ్ళబోతున్నాడు. మీరు ఆయన్ని అక్కడ కలుసుకొంటారు’ అని చెప్పండి. నేను చెప్పవలసింది చెప్పాను.”
MAT 28:8 ఆ స్త్రీలు ఆయన శిష్యులకు చెప్పాలని సమాధి దగ్గరనుండి భయంతో, ఆనందంతో పరుగెత్తికొంటూ వెళ్ళారు.
MAT 28:9 యేసు వాళ్ళను కలుసుకొని, “శుభం!” అని అన్నాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళపైబడి ఆయనకు మ్రొక్కారు.
MAT 28:10 అప్పుడు యేసు వాళ్ళతో, “భయపడకండి. వెళ్ళి నా సోదరులతో గలిలయకు వెళ్ళమని చెప్పండి. వాళ్ళు అక్కడ నన్ను కలుసుకొంటారు” అని అన్నాడు.
MAT 28:11 ఆ స్త్రీలు వెళ్ళిపొయ్యారు. అదే సమయంలో కొంతమంది భటులు పట్టణంలోకి వెళ్ళి జరిగినదంతా ప్రధాన యాజకులతో చెప్పారు.
MAT 28:12 ప్రధాన యాజకులు పెద్దల్ని కలుసుకొని ఒక కుట్ర పన్నారు. వాళ్ళు భటులకు పెద్ద మొత్తాలిస్తూ వాళ్ళతో,
MAT 28:13 “అతని శిష్యులు, ‘మేము రాత్రి వేళ నిద్రిస్తుండగా వచ్చి అతని దేహాన్ని దొంగిలించుకు పొయ్యారు’ అని చెప్పండి.
MAT 28:14 ఈ వార్త రాష్ట్రపాలుకునిదాకా వెళ్తే అతణ్ణి శాంత పరచి మీకు కష్టం కలుగకుండా మేము చూస్తాము” అని అన్నారు.
MAT 28:15 భటులు డబ్బు తీసుకొని వాళ్ళు చెప్పినట్లు చేసారు. ఈ కథ బాగా వ్యాపించి ఈ నాటికి వాడుకలో ఉంది.
MAT 28:16 ఆ తర్వాత ఆ పదకొండుగురు శిష్యులు గలిలయకు వెళ్ళి, యేసు చెప్పిన కొండ మీదికి వెళ్ళారు.
MAT 28:17 అక్కడ యేసును చూసి ఆయన ముందు సాష్టాంగ పడ్డారు. కాని వాళ్ళలో కొందరు సందేహించారు
MAT 28:18 అప్పుడు యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, “పరలోకంలో, భూమ్మీదా ఉన్న అధికారమంతా దేవుడు నాకిచ్చాడు.
MAT 28:19 అందువల్ల అన్ని దేశాలకు వెళ్ళి, వాళ్ళను శిష్యులుగా చెయ్యండి. తండ్రి పేరిట, కుమారుని పేరిట, పవిత్రాత్మ పేరిట వాళ్ళకు బాప్తిస్మము యివ్వండి.
MAT 28:20 నేను మీకాజ్ఞాపించిన వన్నీ వాళ్ళను ఆచరించమని బోధించండి. నేను అన్ని వేళలా ఈ యుగాంతం దాకా మీ వెంట ఉంటాను” అని అన్నాడు.
MAR 1:1 దేవుని కుమారుడైన యేసు క్రీస్తును గురించి సువార్త ప్రారంభం.
MAR 1:2 యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఇతడు నా దూత. ఇతణ్ణి నీకన్నా ముందు పంపుతాను, ఇతడు నీ కోసం దారి సిద్ధం చేస్తాడు.”
MAR 1:3 “‘ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయుము, అతని కోసం చక్కటిదారుల్ని, వేయుము’ అని అరణ్య ప్రాంతంలో ఒక వ్యక్తి కేక వేయుచున్నాడు.”
MAR 1:4 కనుక యోహాను ప్రజలకు ఎడారి ప్రాంతంలో బాప్తిస్మమిచ్చాడు. పాపపరిహారార్థం మారుమనస్సు పొందటం, బాప్తిస్మము పొందటం అవసరమని వాళ్ళకు ప్రకటించాడు.
MAR 1:5 యూదయ దేశంలోని ప్రజలు, యెరూషలేములోని ప్రజలు అతని దగ్గరకు వెళ్ళారు. తాము చేసిన పాపాలను చెప్పుకొన్నారు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు.
MAR 1:6 యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన దుస్తుల్ని వేసుకొనేవాడు. నడుముకు తోలుదట్టి కట్టుకొనేవాడు. మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు.
MAR 1:7 అతడు ప్రకటించిన సందేశం ఇది, “నా తర్వాత నాకన్నా శక్తివంతుడైన వాడు వస్తాడు. నేను వంగి అతని చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు.
MAR 1:8 నేను మీకు నీళ్ళతో బాప్తిస్మము యిస్తున్నాను. కాని ఆయన మీకు పవిత్రాత్మతో బాప్తిస్మమిస్తాడు.”
MAR 1:9 ఆ రోజుల్లో, గలిలయలోని నజరేతు పట్టణానికి చెందిన యేసు వచ్చాడు. యోహాను ఆయనకు యొర్దాను నదిలో బాప్తిస్మము యిచ్చాడు.
MAR 1:10 యేసు నీటి నుండి బయటికి వస్తుండగా ఆకాశం తెరుచుకొని అందులో నుండి పవిత్రాత్మ ఒక పావురంలా తన మీదికి దిగిరావడం ఆయన గమనించాడు.
MAR 1:11 పరలోకం నుండి ఒక స్వరము, “నీవు నా ప్రియ కుమారుడవు. నీవంటే నాకెంతో ఆనందం!” అని అన్నది.
MAR 1:12 వెంటనే దేవుని ఆత్మ యేసును ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు.
MAR 1:13 ఆయన అక్కడ నలభై రోజులున్నాడు. సైతాను ఆయన్ని పరీక్షించాడు. ఆయన మృగాల మధ్య జీవించాడు. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేసారు.
MAR 1:14 యోహాను చెరసాలలో వేయబడ్డాడు. యేసు గలిలయకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు.
MAR 1:15 ఆయన, “దేవుని రాజ్యం వస్తుంది. ఆ సమయం దగ్గరకు వచ్చింది. మారుమనస్సు పొంది సువార్తను విశ్వసించండి” అని ప్రకటించాడు.
MAR 1:16 యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. ఆయన చేపలు పట్టేవాళ్ళైన సీమోను మరియు అతని సోదరుడు అంద్రెయ వల వేయటం చూసాడు.
MAR 1:17 యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి. మీరు మనుష్యులను పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు.
MAR 1:18 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు.
MAR 1:19 ఆయన కొంతదూరం వెళ్ళాక జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సోదరుడు యోహాను పడవలో ఉండటం చూసాడు. వాళ్ళు వల సిద్ధం చేసుకొంటూ ఉన్నారు.
MAR 1:20 యేసు వాళ్ళను పిలిచాడు. వాళ్ళు తమ తండ్రి జెబెదయిని పనివాళ్ళతో అక్కడే పడవలో వదిలివేసి యేసును అనుసరించారు.
MAR 1:21 అంతా కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళారు. విశ్రాంతి రోజు వచ్చింది. యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధించటం మొదలు పెట్టాడు.
MAR 1:22 శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలా బోధించాడు. కనుక ప్రజలు ఆయన బోధన విని ఆశ్చర్యపడ్డారు.
MAR 1:23 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజమందిరానికి వచ్చాడు.
MAR 1:24 వాడు, “నజరేయుడవైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరవో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నాడు.
MAR 1:25 యేసు, “నోరుమూసుకో వాని నుండి బయటకు రా!” అని గద్దిస్తూ అన్నాడు.
MAR 1:26 ఆ దయ్యం వాణ్ణి వణికించి పెద్దకేక పెడుతూ వానినుండి బయటికి వచ్చింది.
MAR 1:27 ప్రజలందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు, “ఇదేమిటి? కొత్తబోధనా? పైగా అధికారంతో బోధిస్తున్నాడే! దయ్యాలను ఆజ్ఞాపిస్తే అవికూడా విధేయతతో ఆయనకు లోబడుతున్నవి!” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
MAR 1:28 గలిలయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకందరికి ఆయన గురించి తెలిసిపోయింది.
MAR 1:29 వాళ్ళు సమాజమందిరం వదిలి నేరుగా యాకోబు మరియు యోహానులతో కలిసి సీమోను మరియు అంద్రెయల ఇంటికి వెళ్ళారు.
MAR 1:30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టివుంది. ఆమెను గురించి వాళ్ళు యేసుతో చెప్పారు.
MAR 1:31 ఆయన ఆమెను సమీపించి చేయి పట్టుకొని లేపి కూర్చోబెట్టాడు. జ్వరం ఆమెను వదిలిపోయింది. ఆమె వెంటనే వాళ్ళకు పరిచర్యలు చెయ్యటం మొదలు పెట్టింది.
MAR 1:32 ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ప్రజలు వ్యాధిగ్రస్తుల్ని, దయ్యంపట్టిన వాళ్ళను, యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు.
MAR 1:33 ఆ ఊరంతా ఆయనవున్న యింటిముందు చేరుకుంది.
MAR 1:34 రకరకాల వ్యాధులున్న వాళ్ళకు యేసు నయం చేసాడు. ఎన్నో దయ్యాలను విడిపించాడు. ఆ దయ్యాలకు తానెవరో తెలుసు కనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
MAR 1:35 యేసు తెల్లవారుఝామున ఇంకా చీకటియుండగానే లేచి యిల్లు వదిలి ఎడారి ప్రదేశానికి వెళ్ళి, అక్కడ ప్రార్థించాడు.
MAR 1:36 సీమోను మరియు అతని సహచరులు యేసును వెతకటానికి వెళ్ళారు.
MAR 1:37 ఆయన్ని చూసి వాళ్ళు, “అంతా మీకోసం వెతుకుతున్నారు” అని అన్నారు.
MAR 1:38 యేసు సమాధానం చెబుతూ, “ఇతర గ్రామాలకు వెళ్దాం రండి. అక్కడ కూడా ప్రకటించాలని నా అభిలాష, నేను వచ్చింది కూడా అందుకే కదా!” అని అన్నాడు.
MAR 1:39 ఆయన గలిలయ ప్రాంతమంతా పర్యటన చేసి అక్కడి సమాజమందిరాల్లో ప్రకటించాడు. దయ్యాలను వదిలించాడు.
MAR 1:40 ఒక కుష్టురోగి ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లి, “మీరు దయతలిస్తే నయం చెయ్యగలరు” అని వేడుకున్నాడు.
MAR 1:41 యేసుకు జాలివేసింది. తన చేయి జాపి, “సరే దయ చూపుతాను!” అని అంటూ అతణ్ణి తాకాడు.
MAR 1:42 వెంటనే కుష్టురోగం అతన్ని వదిలిపోయింది. అతనికి నయమైంది.
MAR 1:43 అతణ్ణి పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరికి చెప్పకుండా జాగ్రత్తపడు.
MAR 1:44 కాని వెళ్ళి మీ యాజకునికి చూపు. మోషే ఆజ్ఞాపించిన బలి యిచ్చి నీవు శుద్ధి అయినట్లు రుజువు చేసుకొ” అని గట్టిగా చెప్పాడు.
MAR 1:45 కాని అతడు వెళ్ళి అందరికి చెప్పాడు. ఆ కారణంగా యేసు ఆ గ్రామాన్ని బహిరంగంగా ప్రవేశించ లేక పొయ్యాడు. గ్రామాల వెలుపల అరణ్య ప్రదేశాల్లో బస చేసాడు. అయినా ప్రజలు అన్ని ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు.
MAR 2:1 కొద్ది రోజుల తర్వాత యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వచ్చాడన్న వార్త ప్రజలకు తెలిసింది.
MAR 2:2 చాలా మంది ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. తలుపు అవతల కూడా స్థలం లేకపోయింది. యేసు వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నాడు.
MAR 2:3 ఇంతలో నలుగురు మనుష్యులు ఒక పక్షవాత రోగిని మోసికొని అక్కడికి తీసుకు వచ్చారు.
MAR 2:4 చాలామంది ప్రజలుండటం వల్ల రోగిని యేసు ముందుకు తీసుకు రాలేకపోయారు. అందువల్ల వాళ్ళు యేసు వున్న గది పైకప్పు తెరచి, ఆ పక్షవాత రోగిని, అతడు పడుకొని ఉన్న చాపతో సహా ఆ సందు ద్వారా యేసు ముందుకు దించారు.
MAR 2:5 యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి పక్షవాత రోగితో, “కుమారుడా! నీ పాపాలు క్షమించబడ్డాయి!” అని అన్నాడు.
MAR 2:6 అక్కడే కూర్చొని ఉన్న కొందరు శాస్త్రులు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు.
MAR 2:7 “ఇతడెందుకు ఈ విధంగా అంటున్నాడు? ఇది దైవ దూషణ కాదా? దేవుడు తప్ప వేరెవ్వరు పాపాల్ని క్షమించగలరు?” అని అనుకొన్నారు.
MAR 2:8 వాళ్ళు తమ మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తున్నారని యేసు మనస్సు తక్షణమే గ్రహించింది. ఆయన వాళ్ళతో, “మీరు దీన్ని గురించి ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు?
MAR 2:9 ఏది సులభం? పక్షవాత రోగితో, ‘నీ పాపాలు క్షమించబడ్డాయి!’ అని అనటం సులభమా లేక, ‘నీ చాప తీసుకొని నడిచి వెళ్ళు!’ అని అనటం సులభమా?
MAR 2:10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి!” అని అంటూ, పక్షవాత రోగితో,
MAR 2:11 “నేను చెబుతున్నాను, లేచి నీ చాప తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.
MAR 2:12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి నిలబడి తన చాప తీసుకొని అందరూ చూస్తుండగా నడుస్తూ వెళ్ళి పోయాడు. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. “మేము ఇలాంటిది ఎన్నడూ చూడలేదు!” అని అంటూ దేవుణ్ణి స్తుతించారు.
MAR 2:13 యేసు మళ్ళీ సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. చాలామంది ప్రజలు ఆయన చుట్టూ చేరారు. ఆయన వాళ్ళకు బోధించటం మొదలుపెట్టాడు.
MAR 2:14 అక్కడి నుండి బయలుదేరి ముందుకు నడుస్తూండగా అల్ఫయి కుమారుడైన లేవి పన్నులు వసూలు చేసే పాకలో కూర్చుని వుండటం చూసాడు. యేసు అతనితో, “నా వెంటరా” అని అన్నాడు. లేవి లేచి ఆయన్ని అనుసరించాడు.
MAR 2:15 యేసు, ఆయన శిష్యులు లేవి యింట్లో భోజనం చేస్తూ ఉన్నారు. ఆయనతో సహా చాలామంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, పాపం చేసిన వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. వీళ్ళలో చాలామంది యేసు అనుచరులు.
MAR 2:16 పరిసయ్యులలోని శాస్త్రులు యేసు పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో భోజనం చెయ్యటం చూసారు. వాళ్ళు ఆయన శిష్యులతో, “ఆయన పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో ఎందుకు కలసి తింటాడు?” అని అడిగారు.
MAR 2:17 ఇది విని యేసు వాళ్ళతో, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.
MAR 2:18 యోహాను శిష్యులు, పరిసయ్యులు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కొందరు యేసు దగ్గరకు వచ్చి, “యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసాలు చేస్తారు కదా! మీ శిష్యులు ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.
MAR 2:19 యేసు, “పెళ్ళికుమారుడు వాళ్ళతో ఉన్నంత కాలం వాళ్ళు ఉపవాసం చెయ్యరు,
MAR 2:20 కాని, వాళ్ళనుండి పెళ్ళికుమారుణ్ణి తీసుకు వెళ్ళేరోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.
MAR 2:21 “పాత వస్త్రంపై ఉన్న చిరుగుకు క్రొత్త వస్త్రంతో ఎవరు కుడ్తారు? అలా చేస్తే క్రొత్త వస్త్రం గుంజుకుపోయి మొదటి చిరుగు ఇంకా పెద్దదౌతుంది.
MAR 2:22 పాత తోలు సంచుల్లో క్రొత్త ద్రాక్షారసం ఎవరూ దాచారు. అలా దాస్తే క్రొత్త ద్రాక్షరసం ఆ తోలు సంచిని చినిగేటట్లు చేస్తుంది. తోలుసంచీ, ద్రాక్షారసం రెండూ నాశనమౌతాయి. అందువల్ల క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తోలు సంచుల్లోనే దాచాలి” అని కూడా యేసు అన్నాడు.
MAR 2:23 ఒక విశ్రాంతి రోజు యేసు పొలాల ద్వారా వెళ్తూవున్నాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంటే ఉన్నారు. వాళ్ళు తినటానికి కొన్ని దాన్యపు కంకుల్ని త్రుంచారు.
MAR 2:24 పరిసయ్యులు ఆయనతో, “అదిగో చూడండి! వాళ్ళు విశ్రాంతి రోజు చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.
MAR 2:25 యేసు, “దావీదు, అతని అనుచరులు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకు ఆహారం కావలసివచ్చింది. అప్పుడు దావీదు ఏం చేసాడో మీరు ఎన్నడూ చదవలేదా?
MAR 2:26 అబ్యాతారు ప్రధానయాజకుడుగా ఉన్న కాలంలో దావీదు దేవాలయంలోకి ప్రవేశించి దేవుని సముఖమున పెట్టిన రొట్టె తీసుకొని, తానుతిని, తన సహచరులకు కూడా కొంత యిచ్చాడు. ఈ రొట్టెను యాజకులు తప్ప యితరులు తినకూడదు” అని అన్నాడు.
MAR 2:27 యేసు వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “విశ్రాంతి రోజు మానవుని కోసం సృష్టింపబడింది. కాని మానవుడు విశ్రాంతి రోజు కోసం సృష్టింపబడలేదు.
MAR 2:28 అందువల్ల మనుష్యకుమారునికి విశ్రాంతి రోజుపై కూడా అధికారం ఉంది.”
MAR 3:1 ఒక రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ చెయ్యి ఎండిపోయిన వాడొకడు ఉన్నాడు.
MAR 3:2 అక్కడున్న వాళ్ళలో కొందరు, యేసు ఆ చేయి ఎండిపోయిన వానికి విశ్రాంతి రోజు నయం చేస్తాడేమో చూడాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. అలా చేస్తే ఆయనపై నేరం మోపాలని వాళ్ళ ఉద్దేశ్యం.
MAR 3:3 యేసు ఆ చేయిపడిపోయిన వానితో, “అందరి ముందుకి వచ్చి నిలుచో” అని అన్నాడు.
MAR 3:4 అప్పుడు యేసు అక్కడున్న వాళ్ళతో, “విశ్రాంతి రోజున మంచి చెయ్యటం ధర్మమా? లేక చెడు చేయటం ధర్మమా? ప్రాణాన్ని రక్షించటం ధర్మమా లేక చంపటం ధర్మమా?” అని అన్నాడు. కాని దానికి వాళ్ళు ఏ సమాధానమూ చెప్పలేదు.
MAR 3:5 ఆయన కోపంతో చుట్టూ చూసాడు. వాళ్ళవి కఠిన హృదయాలైనందుకు ఎంతో దుఃఖిస్తూ, ఆ చేయి ఎండిపోయిన వానితో, ‘నీ చేయి చాపు’ అని అన్నాడు. వాడు చేయి చాపాడు. వెంటనే అతని చేయి పూర్తిగా నయమైపోయింది.
MAR 3:6 ఆ తర్వాత పరిసయ్యులు బయటికి వెళ్ళి, హేరోదీయులతో కలిసి యేసును చంపాలని కుట్రపన్నటం మొదలు పెట్టారు.
MAR 3:7 యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. గలిలయ నుండి చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు.
MAR 3:8 యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమియ నుండి, యోర్దాను నది అవతలి వైపునున్న ప్రాంతాలనుండి, తూరు, సీదోను పట్టణాల చుట్టూవున్న ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు.
MAR 3:9 చాలామంది ప్రజలు ఉండటం వల్ల వాళ్ళు తనను త్రోయకుండా ఉండాలని యేసు తన శిష్యులతో ఒక చిన్న పడవను తన కోసం సిద్ధం చేయమని చెప్పాడు.
MAR 3:10 ఆయన చాలామందికి నయం చేసాడు. అందువల్ల రోగాలున్నవాళ్ళు ఆయన్ని తాకాలని ముందుకు త్రోసుకుంటూ వస్తూ ఉన్నారు.
MAR 3:11 చెడు ఆత్మలు ఆయన్ని చూసినప్పుడల్లా ఆయన ముందుపడి బిగ్గరగా, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేసేవి.
MAR 3:12 యేసు తానెవరో ఎవ్వరికి చెప్పవద్దని ఆ ప్రజల్ని గట్టిగా ఆజ్ఞాపించాడు.
MAR 3:13 యేసు కొండపైకి వెళ్ళి తనకు కావలసిన వాళ్ళను పిలిపించాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళారు.
MAR 3:14 ఆయన పన్నెండుగురిని తన అపొస్తలులుగా నియమించాడు. వాళ్ళు తనతో ఉండాలని, ప్రకటించటానికి వాళ్ళను ప్రపంచంలోకి పంపాలని ఆయన ఉద్దేశ్యం.
MAR 3:15 దయ్యాలను వదిలించే అధికారం వాళ్ళకిచ్చాడు.
MAR 3:16 ఆయన నియమించిన పన్నెండుగురు అపొస్తలుల పేర్లు యివి: సీమోను, ఇతనికి పేతురు అనే పేరునిచ్చాడు.
MAR 3:17 జెబెదయి కుమారులైన యాకోబు అతని సోదరుడు యోహాను, వీళ్ళకు బోయనేర్గెసు అనే పేరునిచ్చాడు. బోయనేర్గెసు అంటే “ఉరుముకు పుత్రులు” అని అర్థం.
MAR 3:18 అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, జెలటు అని పిలవబడే సీమోను,
MAR 3:19 యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు.
MAR 3:20 ఆ తర్వాత యేసు యింటికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు సమావేశమయ్యారు. దీనితో ఆయనకు, ఆయన శిష్యులకు తినటానికి కూడా సమయం దొరకలేదు.
MAR 3:21 ప్రజలు “ఆయనకు మతిపోయింది” అని అంటూ ఉండటంవల్ల ఆయన బంధువులు ఆయన భారం వహించటానికి వచ్చారు.
MAR 3:22 యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, “అతనికి బయల్జెబూలు దయ్యం పట్టింది. దయ్యాల రాజు సహాయంతో అతడు దయ్యాలను వదిలిస్తున్నాడు” అని అన్నారు.
MAR 3:23 అందువల్ల యేసు వాళ్ళను గురించి, ఉపమానాలు ఉపయోగించి వారితో ఈ విధంగా అన్నాడు: “సైతాను తనను తాను ఏవిధంగా పారద్రోలుతాడు?
MAR 3:24 ఏ రాజ్యంలో చీలికలు వస్తాయో ఆ రాజ్యం నిలువదు.
MAR 3:25 కుటుంబంలో చీలికలు వస్తే ఆ కుటుంబం నిలువదు.
MAR 3:26 సైతాను తనకు తాను విరోధి అయి తన అధికారంతో చీలికలు తెచ్చుకొంటే ఆ సైతాను నిలవడు. వాని అధికారం అంతమౌతుంది.
MAR 3:27 “నిజానికి బలవంతుని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని దోచుకోవాలనుకొంటే మొదట ఆ బలవంతుణ్ణి కట్టివేయవలసి వస్తుంది. అప్పుడే ఆ యింటిని దోచుకోగల్గుతాడు.
MAR 3:28 “నేను నిజం చెబుతున్నాను. మానవులు చేసిన అన్ని పాపాలను, వాళ్ళ దూషణలను, దేవుడు క్షమిస్తాడు.
MAR 3:29 కాని పవిత్రాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎప్పటికి క్షమించడు. అతణ్ణి శాశ్వతమైన పాపం చేసిన వానిగా పరిగణిస్తాడు.”
MAR 3:30 ధర్మశాస్త్ర పండితులు తనలో దురాత్మ ఉందని అనటం వలన ఆయన పై విధంగా అన్నాడు.
MAR 3:31 యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చారు. బయటే నిలుచుని యేసును పిలవమని ఒకణ్ణి లోపలికి పంపారు.
MAR 3:32 యేసు చుట్టూ జనసమూహం ఉంది. వాళ్ళు ఆయనతో, “మీ తల్లి, సోదరులు మీకోసం అడుగుతూ బయట నిలుచున్నారు” అని అన్నారు.
MAR 3:33 “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అంటూ
MAR 3:34 చుట్టూ కూర్చున్న వాళ్ళవైపు చూసి, “వీరే నా తల్లి, నా సోదరులు.
MAR 3:35 దైవేచ్చానుసారం నడుచుకొనే వాళ్ళు నా సోదరులు, నా అక్కచెల్లెండ్లు, నా తల్లి” అని అన్నాడు.
MAR 4:1 ఒక రోజు యేసు సముద్రం దగ్గర బోధించటం మొదలు పెట్టాడు. ఆయన చుట్టూ చాలమంది ప్రజలు చేరటం వల్ల ఆయన పడవనెక్కి కూర్చొని నీళ్ళలోకి వెళ్ళాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు.
MAR 4:2 ఆయన ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళకు చాలా విషయాలు బోధించాడు. ఆ విధంగా బోధిస్తూ,
MAR 4:3 “వినండి! ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు.
MAR 4:4 అతడు విత్తనములు చల్లుతుండగా కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. వాటిని పక్షులు తినివేసాయి.
MAR 4:5 మరికొన్ని మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందువల్ల అవి త్వరగా మొలకెత్తాయి.
MAR 4:6 కాని సూర్యుడు రాగానే అవి ఆ వేడికి వాడిపోయాయి. వాటికి వేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి.
MAR 4:7 మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల మధ్య పడ్డాయి. ఆ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కలను అణచి వేయటంవల్ల వాటికి ధాన్యం పండలేదు.
MAR 4:8 మరికొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి పెరిగి, ముప్పై వంతుల, అరవైవంతుల, నూరువంతుల పంటను కూడా యిచ్చాయి.”
MAR 4:9 ఈ విధంగా చెప్పి యేసు, “చెవులున్న వాడు విననీ!” అని అన్నాడు.
MAR 4:10 ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన పన్నెండుగురు శిష్యులు ఆయన చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు.
MAR 4:11 ఆయన వాళ్ళతో, “దేవుని రాజ్యంయొక్క రహస్య జ్ఞానాన్ని మీకు చెప్పాను. కాని యితరులకు ఈ జ్ఞానం ఉపమానాల ద్వారా చెబుతాను.
MAR 4:12 ఎందుకంటే, ‘వాళ్ళు ఎప్పుడూ చూస్తారు కాని ఏదీ గ్రహించరు. అన్నీ వింటారు కాని ఒక్కటీ అర్థం చేసుకోరు. వాళ్ళు అలా చేస్తే దేవుని వైపు మళ్ళవచ్చు దేవుడు వాళ్ళను క్షమిస్తాడు.’”
MAR 4:13 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “మీకీ ఉపమానం అర్థం కాలేదా? మరి మిగతా ఉపమానాల్ని ఎలా అర్థం చేసుకొంటారు?
MAR 4:14 రైతు, దైవ సందేశాన్ని విత్తుతున్నవాడు.
MAR 4:15 కొందరు వ్యక్తులు దారి మీది మట్టిలాంటి వాళ్ళు. వీళ్ళలో విత్తనం నాటిన వెంటనే, అంటేవాళ్ళు విన్న వెంటనే, సైతాను వచ్చి వాళ్ళలో నాటబడిన దైవసందేశాన్ని తీసుకువెళ్తాడు.
MAR 4:16 “మరి కొందరు రాతినేలలాంటి వాళ్ళు. వీళ్ళు సందేశాన్ని విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు.
MAR 4:17 కాని వాళ్ళు సందేశాన్ని లోతైన జీవితంలోనికి నాటనివ్వరు. కొంత కాలం మాత్రమే నిలుస్తుంది. ఆ సందేశం కారణంగా కష్టంకాని, హింసకాని కలిగితే వాళ్ళు వెంటనే దాన్ని వదిలేస్తారు.
MAR 4:18 “మరి కొందరు ముళ్ళమొక్కలు మొలిచే నేలలాంటి వాళ్ళు. వాళ్ళు దైవసందేశం వింటారు కాని
MAR 4:19 ఈ జీవితం వల్ల కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, యితర వస్తువుల పట్ల వ్యామోహం, ఆ దైవ సందేశాన్ని అణిచివేసి ఫలించకుండా చేస్తాయి.
MAR 4:20 “ఇతరులు సారవంతమైన భూమిలాంటివాళ్ళు. కనుక వీళ్ళు దైవసందేశాన్ని విని అంగీకరించి ఫలంపొందే వాళ్ళు. కనుక వీళ్ళు ముప్పై, అరవై, నూరువంతుల ఫలం ఫలిస్తారు.”
MAR 4:21 ఆయన మళ్ళీ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “మీరు దీపాన్ని తెచ్చి స్తంభం మీద పెట్టకుండా మంచం క్రింద లేక పాత్ర క్రింద పెడతారా? లేదు, దీపస్తంభం మీద పెడతారు.
MAR 4:22 దాచబడినవన్నీ బహిరంగమౌతాయి. అన్ని రహస్యాలు బయటపడతాయి.
MAR 4:23 వింటున్న మీరు జాగ్రత్తగా వినండి.”
MAR 4:24 యేసు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మీరు విన్నదాన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతతో కొలిచి యిస్తారో అదే కొలతతో యింకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు.
MAR 4:25 వున్నవానికి దేవుడు యింకా ఎక్కువగా యిస్తాడు. లేనివాని దగ్గరనుండి అతని దగ్గర ఉన్నది కూడా తీసివేస్తాడు.”
MAR 4:26 యేసు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి విత్తనాల్ని భూమ్మీద చల్లుతాడు.
MAR 4:27 అవి రాత్రి, పగలు, అతడు పడుకొని ఉన్నా, లేచివున్నా మొలకెత్తి పెరుగుతూ ఉంటాయి. అవి ఏ విధంగా పెరుగుతున్నాయో అతనికి తెలియదు.
MAR 4:28 భూమి తనంతకు తానె ధాన్యాన్ని పండిస్తుంది. మొదట మొలక వేసి ఆ తర్వాత కంకువేసి, ఆ కంకి నిండా ధాన్యం పండుతుంది.
MAR 4:29 పంటకాలం వరకు ఆ ధాన్యం పూర్తిగా పండిపోతుంది. వెంటనే, రైతు కొడవలిపెట్టి కోస్తాడు.”
MAR 4:30 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని రాజ్యం ఏ విధంగా ఉందని చెప్పాలి? ఏ ఉపమానాన్ని ఉపయోగించి దాన్ని వర్ణించాలి?
MAR 4:31 అది ఆవగింజలాంటిది. మనం భూమిలో నాటే విత్తనాలన్నిటి కన్నా అది చాలా చిన్నది.
MAR 4:32 కాని ఆ ఆవగింజను నాటాక తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఉంటాయి. గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూడుకట్టుకొంటాయి.”
MAR 4:33 యేసు ఇలాంటి ఉపమానాల్ని ఎన్నో ఉపయోగించి, దైవసందేశాన్ని వాళ్ళు అర్థం చేసుకొన్నంత బోధించాడు.
MAR 4:34 ఉపమానాల్ని ఉపయోగించకుండా వాళ్ళకు ఏదీ బోధించ లేదు. కాని ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకు అన్నీ వివరించి చెప్పాడు.
MAR 4:35 ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సముద్రం అవతలివైపుకు వెళ్దాం!” అని అన్నాడు.
MAR 4:36 శిష్యులు, అక్కడ ఉన్న ప్రజా సమూహాన్ని వదిలి పడవలో ఉన్న యేసును తమవెంట తీసుకు వెళ్ళారు. మరికొన్ని పడవలు కూడా వాళ్ళను అనుసరించాయి.
MAR 4:37 ఇంతలో తీవ్రమైన ఒక పెనుగాలి వీచింది. అలలు రేగి ఆ పడవలోకి నీళ్ళు వచ్చాయి. పడవ నిండి పోసాగింది.
MAR 4:38 పడవ వెనుక వైపు యేసు తలక్రింద ఒక దిండు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన్ని లేపి ఆయనతో, “బోధకుడా! మేము మునిగి పోయినా మీకు చింతలేదా?” అని అన్నారు.
MAR 4:39 ఆయన లేచి గాలిని, అలల్ని గద్దిస్తూ, “ఆగిపో, నెమ్మదించు!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి తీవ్రత తగ్గిపోయింది. అంతటా శాంతం ఏర్పడింది.
MAR 4:40 ఆయన తన శిష్యులతో, “మీరెందుకింత భయపడుతున్నారు? మీలో యింకా విశ్వాసం కలుగలేదా?” అని అన్నాడు.
MAR 4:41 వాళ్ళకు చాలా భయంవేసింది. తమలో తాము, “ఎవరీయన? గాలి, అలలు కూడా ఆయన మాటకు లోబడుతున్నాయే!” అని ఆశ్చర్యపడ్డారు.
MAR 5:1 వాళ్ళు సముద్రం దాటి గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు.
MAR 5:2 యేసు పడవ నుండి క్రిందికి దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరకు వచ్చాడు.
MAR 5:3 వాడు స్మశానంలో నివసిస్తుండే వాడు. ఇనుప గొలుసులతో కట్టినా వాణ్ణి ఎవ్వరూ పట్టి ఉంచలేక పోయారు.
MAR 5:4 వాని చేతుల్ని, కాళ్ళను ఎన్నోసార్లు యినుప గొలుసులతో కట్టివేసే వాళ్ళు. కానివాడు ఆ గొలుసుల్ని తెంపి, కాళ్ళకు వేసిన యినుప కడ్డీలను విరిచి వేసేవాడు. వాణ్ణి అణచగలశక్తి ఎవ్వరికి లేదు.
MAR 5:5 వాడు స్మశానంలో సమాధుల దగ్గర, కొండల మీదా, రాత్రింబగళ్ళు బిగ్గరగా ఏడుస్తూ తిరుగుతూ ఉండేవాడు. రాళ్ళతో తన శరీరాన్ని గాయపరుచుకొనేవాడు.
MAR 5:6 వాడు యేసును దూరంనుండి చూసి పరుగెత్తి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లాడు.
MAR 5:7 “యేసూ! మహోన్నతుడైన దేవుని కుమారుడా! మాజోలికి రావద్దయ్యా! మమ్మల్ని హింసించనని దేవుని మీద ప్రమాణంతో చెప్పండి” అని వాడు బిగ్గరగా అరుస్తూ ప్రాధేయ పడ్డాడు.
MAR 5:8 ఎందుకంటే ఒక్క క్షణం క్రితం యేసు వానితో, “ఓ! దయ్యమా! ఆ మనిషి నుండి బయటకు రా!” అని అన్నాడు.
MAR 5:9 యేసు వాణ్ణి, “నీ పేరేమి?” అని అడిగాడు. “నా పేరు ‘పటాలం’. మా గుంపు చాలా పెద్దది” అని ఆ మనిషి సమాధానం చెప్పాడు.
MAR 5:10 వానిలోని దయ్యాలు యేసుతో, తమను ఆ ప్రాంతం నుండి పంపివేయవద్దని దీనంగా ఎన్నోసార్లు వేడుకొన్నాయి.
MAR 5:11 ఆ కొండ ప్రక్కన ఒక పెద్ద పందుల గుంపు మేస్తూవుంది.
MAR 5:12 ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల్లోకి పంపండి. వాటిలో ప్రవేశించటానికి అనుమతివ్వండి” అని అన్నాయి.
MAR 5:13 యేసు వాటికి అనుమతి యిచ్చాడు. దయ్యాలు వాని నుండి వెలుపలికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి. రెండువేల దాకా ఉన్న ఆ పందుల గుంపు వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తుకొనిపోయి సరస్సున పడి మునిగిపొయ్యాయి.
MAR 5:14 ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో, ఈ సంఘటనను గురించి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు.
MAR 5:15 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి అక్కడి దయ్యాల పటాలం పట్టినవాడు దుస్తులు వెసుకొని సక్రమమైన బుద్ధితో, కూర్చొని ఉండటం గమనించారు. వాళ్ళకు భయం వేసింది.
MAR 5:16 జరిగిన దాన్ని పూర్తిగా చూసిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వానికి జరిగిన దాన్ని గురించి, పందుల్ని గురించి వాళ్ళకందరికి చెప్పారు.
MAR 5:17 వాళ్ళు యేసును తమ ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని వేడుకొన్నారు.
MAR 5:18 యేసు పడవనెక్కుతుండగా దయ్యం పట్టిన వాడు వెంటవస్తానని బ్రతిమలాడాడు.
MAR 5:19 యేసు దానికి అంగీకరించలేదు. అతనితో, “ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు ఎంత సహాయం చేశాడో, నీపై ఎంత కరుణ చూపాడో నీ కుటుంబం లోని వాళ్ళతో చెప్పు” అని అన్నాడు.
MAR 5:20 అతడు వెళ్ళి దెకపొలిలో యేసు తనకోసం చేసినదంతా చెప్పాడు. అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు.
MAR 5:21 యేసు మళ్ళీ పడవనెక్కి సముద్రం దాటి అవతలి గట్టు చేరుకొన్నాడు. ఒక పెద్ద ప్రజల గుంపు ఆయన చుట్టూ చేరింది. ఆయన యింకా సముద్రం దగ్గరే ఉన్నాడు.
MAR 5:22 ఇంతలో సమాజ మందిరానికి అధికారులలో ఒకడు అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. అతడు యేసును చూసి ఆయన కాళ్ళ మీద పడి,
MAR 5:23 “నా చిన్నకూతురు చావు బ్రతుకుల్లో ఉంది. మీరు దయచేసి వచ్చి మీ చేతుల్ని ఆమె మీద ఉంచితే ఆమెకు నయమై జీవిస్తుంది” అని దీనంగా వేడుకొన్నాడు.
MAR 5:24 యేసు అతని వెంట వెళ్ళాడు. ఒక పెద్ద ప్రజాసమూహం ఆయన్ని త్రోసుకుంటూ ఆయన్ని అనుసరించింది.
MAR 5:25 పన్నెండు సంవత్సరాల నుండి రక్త స్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది.
MAR 5:26 ఆమె చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. కాని ఆమె బాధ ఏమాత్రం తగ్గలేదు. తన దగ్గరున్న డబ్బంతా వ్యయం చేసింది. కాని నయమవటానికి మారుగా ఆమెస్థితి యింకా క్షీణించింది.
MAR 5:27 ఆమె యేసును గురించి వినటంవల్ల గుంపులోనుండి యేసు వెనుకగా వచ్చింది.
MAR 5:28 తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు నయమైపోతుంది” అని అనుకొని, ఆయన వస్త్రాన్ని తాకింది.
MAR 5:29 వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన శరీరంలోని బాధలనుండి విముక్తి పొందినట్లు ఆమెకు అర్థమయింది.
MAR 5:30 వెంటనే, యేసుకు తన నుండి శక్తి పోయినట్లు తెలిసింది. చుట్టూ ఉన్న ప్రజల వైపు తిరిగి చూసి, “నా దుస్తుల్ని ఎవరు తాకారు?” అని అన్నాడు.
MAR 5:31 ఆయన శిష్యులు, “ప్రజలు మిమ్మల్ని త్రోసుకొంటూ మీ మీద పడుతున్నారు గదా! అయినా ఎవరు తాకారని అడుగుతున్నారెందుకు?” అని అన్నారు.
MAR 5:32 కాని యేసు, “ఎవరు తాకారు?” అని చుట్టూ చూస్తూ ఉండిపోయాడు.
MAR 5:33 అప్పుడా స్త్రీ తనకు నయమైపోయిందని తెలుసుకొని, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి జరిగినదంతా చెప్పింది.
MAR 5:34 ఆయనామెతో, “అమ్మా! నీ విశ్వాసమే నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు, నీ బాధలు నివారణ అయ్యాయి” అని అన్నాడు.
MAR 5:35 యేసు ఇంకా మాట్లాడుతుండగా సమాజ మందిరానికి అధికారియైన యాయీరు ఇంటి నుండి కొందరు మనుష్యులు వచ్చి యాయీరుతో, “మీ కూతురు మరణించింది. బోధకునికి శ్రమ కలిగించటం దేనికి?” అని అన్నారు.
MAR 5:36 యేసు వాళ్ళన్న దాన్ని విని లెక్క చేయకుండా సమాజమందిరపు అధికారితో, “భయపడకు. నమ్మకంతో ఉండు” అని అన్నాడు.
MAR 5:37 యేసు పేతుర్ని, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును తప్ప మరెవ్వరిని తనవెంట రానివ్వలేదు.
MAR 5:38 యాయీరు యింటికి వచ్చాక అక్కడున్న వాళ్ళు బిగ్గరగా ఏడుస్తూ పెడ బొబ్బలు పెడుతూ ఉండటం యేసు చూసాడు. ఏమీ తోచక అందరూ దిగులుతో ఉండినారు.
MAR 5:39 ఆయన యింట్లోకి వెళ్ళి వాళ్ళతో, “ఎందుకు దిగులు? ఎందుకీ ఏడుపు? ఆమె చనిపోలేదు. నిద్రలోవుంది! అంతే!” అని అన్నాడు.
MAR 5:40 కాని వాళ్ళాయన్ని హేళన చేసారు. యేసు వాళ్ళనందరినీ వెలుపలికి పంపాడు. ఆమె తండ్రిని, తల్లిని తనతోవున్న శిష్యుల్ని వెంటబెట్టుకొని, ఆమె ఉన్న గదికి వెళ్ళాడు.
MAR 5:41 ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని “తలీతాకుమీ!” అని అన్నాడు. (తలీతాకుమీ అంటే “చిన్నమ్మాయి! నేను చెబుతున్నాను లెమ్ము!” అని అర్థం.)
MAR 5:42 ఆమె వెంటనే లేచి నడవటం మొదలు పెట్టింది. (ఆమె వయస్సు పన్నెండు సంవత్సరాలు.) ఇది చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది.
MAR 5:43 దీన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆమెకు తినటానికి ఏదైనా యివ్వమని వాళ్ళకు చెప్పాడు.
MAR 6:1 యేసు అక్కడినుండి తన శిష్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్ళాడు.
MAR 6:2 విశ్రాంతి రోజు రాగానే సమాజమందిరంలో బోధించటం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు పరస్పరం ఈ విధంగా మాట్లాడుకొన్నారు. “ఈయన కింత జ్ఞానం ఏవిధంగా లభించింది? ఈ జ్ఞానం ఎలాంటిది? ఈయన మహత్యాలు ఎట్లా చేస్తున్నాడు.
MAR 6:3 ఈయన వడ్రంగి కదా! మరియ కుమారుడు కదూ! యాకోబు, యోసేపు, యూదా, సీమోనుల సోదరుడే యితడు. ఇతని చెల్లెండ్లు యిక్కడ మనతోనే ఉన్నారు కదూ!” అని అంటూ వాళ్ళు ఆయన్ని తృణీకరించారు.
MAR 6:4 యేసు వాళ్ళతో, “ప్రవక్తకు స్వగ్రామంలో, తన బంధువుల్లో, తన యింట్లో తప్ప అన్నిచోట్లా గౌరవం లభిస్తుంది” అని అన్నాడు.
MAR 6:5 యేసు కొందరు వ్యాధిగ్రస్తుల మీద తన చేతులుంచి, వాళ్ళకు నయం చేయటం తప్ప మరే మహత్యాలు అక్కడ చేయలేక పోయాడు.
MAR 6:6 వాళ్ళలో విశ్వాసం లేక పోవటం చూసి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత యేసు, గ్రామ గ్రామానికి వెళ్ళి బోధించాడు.
MAR 6:7 ఆయన పన్నెండుగురిని పిలిచి వాళ్ళకు దయ్యాలపై అధికారమిచ్చాడు. ఇద్దరిద్దరి చొప్పున పంపుతూ,
MAR 6:8 వాళ్ళకు ఈ విధంగా ఉపదేశించాడు: “ప్రయాణం చేసేటప్పుడు చేతి కర్రను తప్ప మరేది తీసుకు వెళ్ళకండి. ఆహారము, సంచీ, దట్టీలో డబ్బు, తీసుకువెళ్ళకండి.
MAR 6:9 చెప్పులు వేసుకోండి. కాని మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి.
MAR 6:10 ఒకరి యింటికి వెళ్ళాక ఆ గ్రామం వదిలి వెళ్ళేదాకా ఆ యింట్లోనే ఉండండి.
MAR 6:11 ఒక గ్రామం వాళ్ళు మీకు స్వాగతమివ్వక పోతే, లేక మీ బోధనల్ని వినకపోతే మీరా గ్రామం వదిలేముందు వాళ్ళ వ్యతిరేకతకు గుర్తుగా మీ కాలికంటిన వాళ్ళ ధూళిని దులపండి.”
MAR 6:12 వాళ్ళు వెళ్ళి ప్రజలకు మారుమనస్సు పొందమని బోధించారు.
MAR 6:13 ఎన్నో దయ్యాలను వదిలించారు. చాలామంది వ్యాధిగ్రస్తులకు నూనెరాచి నయం చేసారు.
MAR 6:14 యేసుకు పేరు ప్రఖ్యాతులు రావడంతో హేరోదు రాజుకు వీటిని గురించి తెలిసింది. బాప్తిస్మము నిచ్చే యోహాను బ్రతికివచ్చాడని, కనుకనే మహత్వపూర్వకమైన కార్యాలు చేసేశక్తి అతనిలో ఉన్నదని అన్నాడు.
MAR 6:15 “ఆయన ఏలియా” అని కొందరన్నారు. “ఆయన ప్రవక్త, పూర్వకాలపు ప్రవక్తల్లాంటివాడు” అని మరికొందరన్నారు.
MAR 6:16 కాని హేరోదు వీటిని గురించి విని, “నేను తల నరికించిన యోహాను బ్రతికి వచ్చాడు” అని అన్నాడు.
MAR 6:17 క్రితంలో హేరోదు, స్వయంగా యోహానును బంధించి కారాగారంలో వేయమని ఆజ్ఞాపించాడు. తాను వివాహం చేసుకొన్న హేరోదియ కారణంగా ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య.
MAR 6:18 పైగా యోహాను హేరోదుతో, “నీ సహోదరుని భార్యను చేసుకోవటం అన్యాయం” అంటూ ఉండేవాడు.
MAR 6:19 అందువల్ల హేరోదియకు యోహాను అంటే యిష్టం వుండేదికాదు. అంతేకాక, ఆమె అతణ్ణి చంపి వేయాలని ఆశించింది. కాని యోహాను అంటే హేరోదు భయపడేవాడు. కనుక అలాచెయ్య లేక పొయ్యాడు.
MAR 6:20 పైగా యోహాను నీతిమంతుడని, పవిత్రమైనవాడని హేరోదుకు తెలుసు. కనుక అతణ్ణి కాపాడుతూ వుండేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవరం చెందేవాడు, అయినా అతని మాటలు వినటానికి యిష్టపడేవాడు.
MAR 6:21 చివరకు హేరోదియకు అవకాశం లభించింది. హేరోదు తన రాజ్యంలోని ప్రముఖ అధికారులను, సైన్యాధిపతులను గలిలయలోని ప్రముఖులను పిలిచి తన పుట్టినరోజు పండుగ చేసాడు.
MAR 6:22 హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసింది. ఆమె హేరోదును, అతని అతిథుల్ని మెప్పించింది. హేరోదు ఆమెతో, “నీకు కావలసింది ఏదైనా కోరుకో! యిస్తాను!” అని అన్నాడు.
MAR 6:23 “నీవేదడిగినా యిస్తాను, అర్ధ రాజ్యాన్నైనా సరే!” అని ప్రమాణం చేసాడు.
MAR 6:24 ఆమె వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది. “బాప్తిస్మము నిచ్చే యోహాను తల కోరుకో!” అని ఆమె సమాధానం చెప్పింది.
MAR 6:25 వెంటనే ఆమె రాజు దగ్గరకు పరుగెత్తి, “బాప్తిస్మము నిచ్చే యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి తక్షణమే యిప్పించమని మిమ్మల్ని వేడుకొంటున్నాను” అని అన్నది.
MAR 6:26 రాజుకు చాలా దుఃఖం కలిగింది. కాని తాను ప్రమాణం చేసాడు. పైగా అతిథులక్కడే ఉన్నారు. కనుక ఆమె కోరికను నిరాకరించ దలచుకోలేదు.
MAR 6:27 అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఒక భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి యోహాను తలను కారాగారంలోనే నరికి వేసి,
MAR 6:28 దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి తీసుకు వచ్చి ఆమెకు బహూకరించాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది.
MAR 6:29 యోహాను శిష్యులు ఇది విని అక్కడికి వెళ్ళి అతని దేహాన్ని తీసుకువెళ్ళి సమాధిచేసారు.
MAR 6:30 అపొస్తలులు యేసు చుట్టూ చేరి తాము చేసిన వాటిని గురించి, బోధించిన వాటిని గురించి వివరంగా ఆయనకు చెప్పారు.
MAR 6:31 వాళ్ళ దగ్గరకు చాలామంది వస్తూ పోతూ ఉండటంవల్ల వాళ్ళకు తినటానికి కూడా సమయం లేకపోయింది. అందుకు యేసు వాళ్ళతో, “నాతో మీరు మాత్రమే ఏకాంత ప్రదేశానికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.
MAR 6:32 అందువల్ల వాళ్ళు మాత్రమే ఒక పడవనెక్కి నిర్జన ప్రదేశానికి వెళ్ళారు.
MAR 6:33 కాని, వాళ్ళు వెళ్ళటం చాలా మంది చూసారు. వాళ్ళెవరో గుర్తించి అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళకన్నా ముందే ఆ ఎడారి ప్రాంతాన్ని చేరుకొన్నారు.
MAR 6:34 యేసు పడవ దిగి ఆ ప్రజాసమూహాన్ని చూసాడు. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజల్ని చూసి ఆయనకు జాలివేసింది. అందువల్ల వాళ్ళకు ఎన్నో విషయాలు బోధించటం మొదలు పెట్టాడు.
MAR 6:35 అప్పటికే మధ్యాహ్నం దాటి సాయంకాలమవుతూ వుంది. ఆయన శిష్యులు వచ్చి, “ఇది నిర్మానుష్య ప్రాంతం. ఇప్పటికే సాయంకాలమవుతూ వుంది.
MAR 6:36 మీరి ప్రజల్ని పంపివేస్తే వాళ్ళు చుట్టూవున్న పల్లెలకో లేక గ్రామలకో వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు.
MAR 6:37 కాని యేసు, “వాళ్ళు తినటానికి మీరే ఏదైనా ఇవ్వండి!” అని సమాధానం చెప్పాడు. “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని వాళ్లకు పంచి పెట్టమంటావా?” అని ఆయన్ని అడిగారు.
MAR 6:38 “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో వెళ్ళి చూడండి” అని యేసు అన్నాడు. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి, “ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అని అన్నారు.
MAR 6:39 పచ్చిగడ్డి మీద అందరిని గుంపులు గుంపులుగా కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు.
MAR 6:40 ప్రజలు గుంపుకు యాబై, నూరుగురి చొప్పున కూర్చున్నారు.
MAR 6:41 యేసు ఆ ఐదు రొట్టెల్ని రెండు చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞత చెప్పి రొట్టెల్ని తుంచాడు. అవి తన శిష్యులకిచ్చి ప్రజల ముందుంచమన్నాడు. అదే విధంగా ఆ రెండు చేపల్ని కూడా భాగాలు చేసి అందరికి పంచాడు.
MAR 6:42 అందరూ సంతృప్తిగా తిన్నారు.
MAR 6:43 శిష్యులు మిగిలిన రొట్టెముక్కల్ని, చేప ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు.
MAR 6:44 ఆ రోజు అక్కడ ఐదు వేలమంది పురుషులు భోజనం చేసారు.
MAR 6:45 ఆ తదుపరి యేసు తన శిష్యులతో, పడవనెక్కి, తనకన్నాముందు బేత్సయిదాకు వెళ్ళమని గట్టిగా చెప్పాడు. బేత్సాయిదా సముద్రంకు ఆవలివైపున ఉంది. యేసు ప్రజల్ని తమ తమ యిండ్లకు వెళ్ళమని చెప్పాడు.
MAR 6:46 వాళ్ళను వదిలి ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు.
MAR 6:47 అర్ధరాత్రికి శిష్యులున్న పడవ సముద్రం మధ్యవుంది. యేసు మాత్రం యింకా గట్టునే ఉన్నాడు.
MAR 6:48 ఎదురు గాలి వీయటంవల్ల శిష్యులు కష్టంగా తెడ్లు వేయటం ఆయన చూసాడు. తెల్లవారు ఝామున యేసు నీళ్ళ మీదుగా నడిచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళను దాటి ముందుకు వెళ్తుంటే
MAR 6:49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళమీద నడవటం చూసి, దయ్యం అనుకొని భయపడి బిగ్గరగా కేకలు వేసారు.
MAR 6:50 వెంటనే ఆయన వాళ్ళతో మాట్లాడుతూ, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు.
MAR 6:51 ఆయన పడవనెక్కగానే గాలి తీవ్రత పూర్తిగా తగ్గి పోయింది. వాళ్ళు ఇది చూసి దిగ్భ్రాంతి చెందారు. రొట్టెలు పంచిన అద్భుతాన్ని వాళ్ళు చూశారు.
MAR 6:52 కాని దానిని అర్థం చేసుకోలేక పోయారు.
MAR 6:53 సముద్రం దాటి గెన్నేసరెతు తీరాన్ని చేరుకొని అక్కడ పడవను నిలిపారు.
MAR 6:54 వాళ్ళు పడవ దిగగానే ప్రజలు యేసును గుర్తించారు.
MAR 6:55 ప్రజలు చుట్టూ ఉన్న ప్రాంతాలకు పరుగెత్తి వెళ్ళి రోగుల్ని చాపలపై పడుకోబెట్టి ఆయనున్న చోటికి తీసుకు వచ్చారు.
MAR 6:56 పల్లెల్లో, పట్టణాల్లో, పొలాల్లో, చుట్టూ, ఆయన వెళ్ళిన ప్రతిచోట రోగుల్ని వీథుల్లో పడుకోబెట్టారు. ఆయన వస్త్రానైనా తాకనీయమని ఆయన్ని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన ప్రతి ఒక్కరికి నయమై పోయింది.
MAR 7:1 యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, శాస్త్రులు యేసు చుట్టూ చేరారు.
MAR 7:2 వాళ్ళు, యేసు శిష్యుల్లో కొందరు అపరిశుభ్రమైన చేతులతో, అంటే ఆచారం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం గమనించారు.
MAR 7:3 పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారం తమ చేతుల్ని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోకుండా భోజనం చెయ్యరు.
MAR 7:4 వాళ్ళు వీథిలోకి వెళ్ళివస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యరు. ఇదేకాక వాళ్ళింకా అనేకమైన ఆచారాలు పాటిస్తారు. లోటాలను, చెంబులను, గిన్నెలను శుద్ధి చేయటం వాళ్ళ ఆచారం.
MAR 7:5 అందువల్ల పరిసయ్యులు, శాస్త్రులు యేసుతో, “మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తారు? పెద్దలు చెప్పిన ఆచారం ఎందుకు పాటించరు?” అని అడిగారు.
MAR 7:6 యేసు సమాధానంగా, “యెషయా వేషధారులైన మిమ్మల్ని గురించి సరిగ్గా ప్రవచించాడు. అతడు తన గ్రంథంలో ఇలా ప్రవచించాడు: ‘వీళ్ళు మాటలతో నన్ను గౌరవిస్తారు. కాని వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి.
MAR 7:7 వాళ్ళు మానవ కల్పితమైన నియమాలను బోధిస్తారు. కనుక వాళ్ళ ఆరాధన నిరర్థకం.’
MAR 7:8 దేవుని ఆజ్ఞల్ని పాటించటం మానేసి, మానవుడు కల్పించిన ఆచారాల్ని పట్టుకొని మీరు పాటిస్తున్నారు.
MAR 7:9 “మీరు దేవుని ఆజ్ఞల్ని కాదని, మీ ఆచారాలను స్థాపించటంలో ఘనులు.
MAR 7:10 ఉదాహరణకు, మోషే మీ తల్లితండ్రుల్ని గౌరవించమని మరియు తల్లిని కాని, తండ్రిని కాని దూషించినవారికి మరణ దండన విధించమని ఆజ్ఞాపించాడు.
MAR 7:11 కాని ఒక మనిషి దగ్గర తన తల్లితండ్రులకు సహాయం చెయ్యటానికి కొంత ధనం ఉన్నా అతడు వాళ్ళతో, అది అంటే దేవునికి అర్పితం అని అంటే,
MAR 7:12 ఆ మనిషి తన తల్లి తండ్రులకు సహాయం చేయనవసరంలేదని మీరు అతణ్ణి సమర్థిస్తున్నారు.
MAR 7:13 మీ పెద్దల ఆచారం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తోంది. ఇలాంటివి మీరు ఎన్నో చేస్తున్నారు” అని అన్నాడు.
MAR 7:14 యేసు మళ్ళీ, ప్రజల్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి. అర్థం చేసుకోండి.
MAR 7:15 బయట ఉన్నవేవీ మనిషి కడుపులోకి వెళ్ళి అతణ్ణి అపవిత్రం చేయవు.
MAR 7:16 మనిషినుండి బయటకు వచ్చేది. అతణ్ణి అపవిత్రం చేస్తొంది” అని అన్నాడు.
MAR 7:17 యేసు ప్రజల్ని వదిలి యింట్లోకి వెళ్ళాక ఆయన శిష్యులు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు.
MAR 7:18 యేసు, “మీరింత అజ్ఞానులా! బయట ఉన్నది లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రం చెయ్యటం లేదని మీరు గమనించటం లేదా!
MAR 7:19 అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది” అని అన్నాడు. (యేసు ఈ విధంగా చెప్పి అన్ని ఆహార పదార్థాలు తినడానికి పవిత్రమైనవి అని సూచించాడు.)
MAR 7:20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మనిషి నుండి బయటకు వచ్చేవి అతణ్ణి అపవిత్రం చేస్తాయి.
MAR 7:21 ఎందుకంటే, మానవుల హృదయాల నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం,
MAR 7:22 లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయటకు వస్తాయి.
MAR 7:23 ఇవే లోపలనుండి బయటకు వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి.”
MAR 7:24 యేసు ఆ ప్రాంతం వదిలి తూరు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒకరి యింటికి వెళ్ళాడు. తనక్కడ ఉన్నట్లు ఎవ్వరికి తెలియరాదని ఆయన ఉద్దేశ్యం. కాని దాన్ని రహస్యంగా ఉంచలేకపోయాడు.
MAR 7:25 ఒక స్త్రీ వెంటనే యేసును గురించి విన్నది. ఆమె కూతురుకు దయ్యం పట్టివుంది. ఆమె అక్కడికి వచ్చి యేసు కాళ్ళపై పడింది.
MAR 7:26 ఆమె గ్రీసు దేశస్తురాలు. జన్మస్థానం సిరియ దేశంలోని ఫొనీషియా. తన కూతురు నుండి ఆ దయ్యాన్ని వదిలించమని ఆమె యేసును వేడుకొంది.
MAR 7:27 ఆయన ఆమెతో, “మొదట చిన్నపిల్లల్ని వాళ్ళకు కావలసినవి తిననివ్వాలి. ఎందుకంటే చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకొని కుక్కలకు వేయటం సమంజసం కాదు” అని అన్నాడు.
MAR 7:28 “ఔను! ప్రభూ! కాని, బల్లక్రిందవున్న కుక్కలు కూడా చిన్నపిల్లలు వదిలివేసిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె సమాధానం చెప్పింది.
MAR 7:29 అప్పుడు యేసు ఆమెతో, “అలాంటి సమాధానం చెప్పావు కనుక వెళ్ళు. దయ్యం నీ కూతుర్ని వదిలి వెళ్ళింది” అని అన్నాడు.
MAR 7:30 ఆమె యింటికి వెళ్ళి తన కూతురు పడకపై పడుకొని ఉండటం చూసింది. దయ్యం నిజంగా ఆమె నుండి వెళ్ళిపోయింది.
MAR 7:31 ఆ తర్వాత యేసు తూరు ప్రాంతం వదిలి, సీదోను వెళ్ళి అక్కడినుండి దెకపొలి ద్వారా గలిలయ సముద్రం చేరుకొన్నాడు.
MAR 7:32 అక్కడ కొందరు చెముడు, నత్తి ఉన్న ఒక మనిషిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. అతనిపై తన చేయి పెట్టమని వాళ్ళు యేసును వేడుకొన్నారు.
MAR 7:33 యేసు అతణ్ణి ప్రజలనుండి ప్రక్కకు పిలుచుకు వెళ్ళి తన చేతి వ్రేళ్ళను అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి ఆ వ్యక్తి యొక్క నాలుక తాకాడు.
MAR 7:34 ఆకాశం వైపుచూసి నిట్టూర్చి, “ఎఫ్ఫతా” అని అన్నాడు. (ఎఫ్ఫతా అంటే “తెరుచుకో” అని అర్థం.)
MAR 7:35 వెంటనే అతని చెవులు తెరుచుకొన్నాయి. అతని నాలుక వదులైంది. అతడు స్పష్టంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.
MAR 7:36 యేసు దీన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. కాని ఆయన చెప్పినకొద్దీ వాళ్ళు దాన్ని గురించి యింకా ఎక్కువగా చెప్పారు.
MAR 7:37 ప్రజల ఆశ్చర్యానికి అంతులేక పోయింది. వాళ్ళు, “ఈయన అన్నీ బాగా చేస్తాడు. పైగా చెవిటివాడు వినేటట్లు, నత్తివాడు మాట్లాడేటట్లు కూడా చేస్తున్నాడు” అని అన్నారు.
MAR 8:1 ఆ రోజుల్లో మళ్ళీ ఒకసారి పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ ఉండనందువల్ల యేసు శిష్యుల్ని పిలిచి,
MAR 8:2 “నాకు జాలివేస్తోంది. వాళ్ళిప్పటికే మూడు రోజులనుండి నా దగ్గరున్నారు. తినటానికి వాళ్ళ దగ్గర ఏమీలేదు.
MAR 8:3 నేను వాళ్ళను ఆకలితో యింటికి పంపివేస్తే వాళ్ళలో కొందరు చాలా దూరం నుండి వచ్చారు. కనుక వాళ్ళు దారిలో మూర్ఛపోవచ్చు” అని అన్నాడు.
MAR 8:4 ఆయన శిష్యులు, “ఈ ఎడారి ప్రాంతంలో వాళ్ళు తినటానికి చాలినంత ఆహారం ఎక్కడనుండి తెమ్మంటారు?” అని అన్నారు.
MAR 8:5 “ఎన్ని రొట్టెలున్నాయి” అని యేసు అడిగాడు. “ఏడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
MAR 8:6 యేసు ప్రజల్ని కూర్చోమని చెప్పాడు. ఆ ఏడు రొట్టెలు తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచాడు. ఆ రొట్టెముక్కల్ని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు. వాళ్ళు అలాగే చేసారు.
MAR 8:7 వాళ్ళ దగ్గర కొన్ని చేపలుకూడా ఉన్నాయి. వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని కూడా పంచమని తన శిష్యులకు యిచ్చాడు.
MAR 8:8 ప్రజలు వాటిని తిని సంతృప్తి చెందారు. ఆ తర్వాత ప్రజలు తినగా మిగిలిన ముక్కల్ని ఏడు గంపలనిండా నింపారు.
MAR 8:9 నాలుగు వేలమంది ప్రజలు అక్కడవున్నారు. వాళ్ళను పంపివేసి వెంటనే
MAR 8:10 యేసు తన శిష్యులతో కలిసి పడవనెక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.
MAR 8:11 పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఆయన్ని పరీక్షించే ఉద్దేశ్యంతోనే ఆకాశంనుండి ఒక రుజువు చూపమన్నారు.
MAR 8:12 ఆయన పెద్దగా నిట్టూర్చి, “ఈ కాలపు వాళ్ళు అద్భుతాల్ని రుజువులుగా చూపమని ఎందుకు అడుగుతారు? ఇది నిజం. మీకు ఏ రుజువూ చూపబడదు” అని అన్నాడు.
MAR 8:13 ఆ తర్వాత ఆయన వాళ్ళను వదిలి పడవనెక్కి అవతలి ఒడ్డు చేరుకొన్నాడు.
MAR 8:14 శిష్యులు రొట్టెలు తేవటం మరిచిపోయారు. వాళ్ళ దగ్గర ఒక రొట్టె మాత్రమే ఉంది.
MAR 8:15 యేసు, “జాగ్రత్తగా ఉండండి. పరిసయ్యుల పులుపును హేరోదు పులుపును గమనిస్తూ ఉండండి” అని వాళ్ళను హెచ్చరించాడు.
MAR 8:16 ఇది వాళ్ళు పరస్పరం చర్చించుకొంటూ, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా!” అని అనుకొన్నారు.
MAR 8:17 వాళ్ళు ఏమి చర్చించుకొంటున్నారో యేసు కనిపెట్టి, “రొట్టెలులేవని ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు యింకా అర్థంకాలేదా? మీరు చూడలేదా? మీ బుద్ధి మందగించిందా?
MAR 8:18 మీకు కళ్ళున్నాయి కాని చూడలేరు. చెవులున్నాయి కాని వినలేరు. మీకు జ్ఞాకపం లేదా?
MAR 8:19 నేను ఐదు రొట్టెల్ని విరిచి ఐదువేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపలనిండా నింపారు?” అని అడిగాడు. “పన్నెండు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
MAR 8:20 “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని గంపలనిండా నింపారు?” అని యేసు అన్నాడు. “ఏడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
MAR 8:21 “యింకా మీకు అర్థం కాలేదా?” అని ఆయన వాళ్ళతో అన్నాడు.
MAR 8:22 యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. అక్కడి ప్రజలు గ్రుడ్డివాణ్ణి యేసు దగ్గరకు తీసుకు వచ్చారు. అతణ్ణి తాకమని వాళ్ళు ఆయనను వేడుకొన్నారు.
MAR 8:23 యేసు ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకొని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. యేసు ఆ గ్రుడ్డివాని కళ్ళ మీద ఉమ్మివేసి తన చేతుల్ని వాటిపైవుంచి, “నీకేమైనా కనబడుతోందా” అని అడిగాడు.
MAR 8:24 ఆ గ్రుడ్డివాడు తలెత్తి, “మనుష్యులు నడుస్తున్నట్లు కనబడుతున్నారు. కాని వాళ్ళు చెట్లలా కనబడుతున్నారు” అని అన్నాడు.
MAR 8:25 యేసు మళ్ళీ ఒకసారి అతని కళ్ళపై తన చేతుల్ని ఉంచాడు. వెంటనే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అతనికి దృష్టి వచ్చింది. అన్నీ స్పష్టంగా చూడగలిగినాడు.
MAR 8:26 యేసు అతణ్ణి యింటికి పంపుతూ, “గ్రామంలోకి వెళ్ళవద్దు” అని అన్నాడు.
MAR 8:27 యేసు తన శిష్యులతో కలిసి, కైసరయ ఫిలిప్పి పట్టణానికి చుట్టూవున్న పల్లెలకు వెళ్ళాడు. దారిలో యేసు వాళ్ళతో, “ప్రజలు నేనెవరని అనుకొంటున్నారు?” అని అడిగాడు.
MAR 8:28 వాళ్ళు, “బాప్తిస్మము నిచ్చే యోహాను అని కొందరు, ఏలీయా అని కొందరు, ప్రవక్తలలో ఒకడై ఉండవచ్చని మరికొందరు అంటున్నారు” అని సమాధానం చెప్పారు.
MAR 8:29 “మరి మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని అడిగాడు. పేతురు, “మీరే క్రీస్తు” అని సమాధానం చెప్పాడు.
MAR 8:30 తనను గురించి ఎవ్వరికి చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు.
MAR 8:31 ఆ తదుపరి యేసు వాళ్ళకు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు: “మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానయాజకులు, శాస్త్రులు, ఆయన్ని తృణీకరిస్తారు. ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికివస్తాడు.”
MAR 8:32 యేసు ఈ విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడాడు. పేతురు ఆయన చేయిపట్టుకొని వారించటం మొదలు పెట్టాడు.
MAR 8:33 కాని యేసు వెనక్కు తిరిగి తన శిష్యుల వైపు ఒకసారి చూసి, పేతురుతో “సైతానా! నాముందు నుండి వెళ్ళిపో! నీవు మానవరీతిగా ఆలోచిస్తున్నావు కాని, దేవుని రీతిగా కాదు” అని అన్నాడు.
MAR 8:34 ఆ తర్వాత తన శిష్యుల్ని, ప్రజల్ని దగ్గరకు పిలిచి, “మీరు నన్ను అనుసరింపదలిస్తే, తనను తాను విసర్జించుకొని తన సిలువను మోస్తూ అనుసరించాలి.
MAR 8:35 ఎందుకంటే, తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నాకోసం, సువార్త కోసం ప్రాణాన్ని పోగొట్టుకొన్నవాడు దాన్ని కాపాడుకొంటాడు.
MAR 8:36 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని వదులుకొన్న మనిషికి ఏంలాభం కలుగుతుంది?
MAR 8:37 తన ప్రాణాన్ని తిరిగి పొందటానికి మనిషి ఏంయివ్వగలడు?
MAR 8:38 ఈ తరం వ్యభిచారంతో, పాపంతో నిండివుంది. నా విషయంలో కాని, నా బోధనల విషయంలో కాని ఎవ్వడు సిగ్గుపడతాడో, మనుష్య కుమారుడు తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతలతో కలసి వచ్చినప్పుడు వాని విషయంలో సిగ్గుపడతాడు.”
MAR 9:1 ఆయన వాళ్ళతో, “ఇది నిజం. ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు దేవుని రాజ్యం శక్తితో రావటం చూస్తారు. దానికి ముందు వాళ్ళు మరణించరు” అని అన్నాడు.
MAR 9:2 ఆరురోజుల తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును ఒక ఎత్తైన కొండ మీదికి తనవెంట పిలుచుకు వెళ్ళాడు. వాళ్ళు అక్కడ ఏకాంతంగా ఉన్నారు. అక్కడ యేసు వాళ్ళ సమక్షంలో దివ్యరూపం పొందాడు.
MAR 9:3 ఆయన దుస్తులు మెరువ సాగాయి. ప్రపంచంలో ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా మారిపొయ్యాయి.
MAR 9:4 ఏలీయా, మోషేలు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు.
MAR 9:5 పేతురు యేసుతో, “రబ్బీ! మనిమిక్కడే ఉండటం మంచిది. మేము మూడు పర్ణశాలలు వేస్తాము. మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి” అన్నాడు.
MAR 9:6 శిష్యులు భయపడుతూ ఉండటం వల్ల పేతురుకు ఏమనాలో తోచలేదు.
MAR 9:7 అప్పుడు ఒక మేఘం కనిపించి వాళ్ళను కప్పి వేసింది. ఆ మేఘం నుండి, “ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయన మాట వినండి” అని అనటం వినిపించింది.
MAR 9:8 వెంటనే వాళ్ళు తమ చుట్టూ చూశారు. మిగతా యిద్దరూ వాళ్ళకు కనిపించలేదు. యేసు మాత్రమే కనిపించాడు.
MAR 9:9 వాళ్ళు కొండదిగి క్రిందికి వస్తుండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి బ్రతికి వచ్చేవరకు మీరు చూసిన దృశ్యాన్ని ఎవ్వరికి చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.
MAR 9:10 అందువల్ల వాళ్ళావిషయాన్ని తమలోనే దాచుకొని, చనిపోయి బ్రతికి రావటాన్ని గురించి చర్చించుకొన్నారు.
MAR 9:11 వాళ్ళాయనతో, “ఏలీయా మొదట రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు?” అని అడిగారు.
MAR 9:12 యేసు సమాధానం చెబుతూ, “ఏలీయా మొదట వచ్చినప్పుడు సరి చేస్తాడన్నమాట నిజం. కాని, మనుష్యకుమారుడు కష్టాలను అనుభవించాలని, తృణీకరింపబడాలని ధర్మశాస్త్రంలో ఎందుకు వ్రాసారు?
MAR 9:13 ఏలీయా వచ్చాడు. లేఖనాల్లో వ్రాసిన విధంగా ప్రజలు చేయలానుకొన్నవన్నీ ఇతనికి చేసారు” అని అన్నాడు.
MAR 9:14 యేసు, పేతురు, యోహాను మరియు యాకోబు మిగతా శిష్యుల దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక పెద్ద ప్రజల గుంపు శిష్యుల చుట్టూ ఉండటం, వాళ్ళతో ఏమో వాదిస్తూ ఉండటం చూసారు.
MAR 9:15 యేసును చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి స్వాగతం చెప్పటానికి ఆయన దగ్గరకు పరుగెత్తారు.
MAR 9:16 యేసు శిష్యులను, “వాళ్ళతో మీరేమి వాదిస్తున్నారు” అని అడిగాడు.
MAR 9:17 ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! నేను నా కుమారుణ్ణి మీదగ్గరకు పిలుచుకు వచ్చాను. దయ్యం పట్టి అతనికి మాట పడిపోయింది.
MAR 9:18 ఆ దయ్యం అతని మీదికి వచ్చినప్పుడల్లా అది అతణ్ణి నేలపై పడవేస్తుంది. అప్పుడు నా కుమారుని నోటినుండి నురుగు వస్తుంది. పండ్లు కొరుకుతాడు. అతని శరీరం కట్టెబారిపోతుంది. ఆ దయ్యాల్ని వదిలించమని మీ శిష్యుల్ని అడిగాను. కాని వాళ్ళు ఆ పని చేయలేక పోయారు” అని అన్నాడు.
MAR 9:19 యేసు, “ఈనాటి వాళ్ళలో విశ్వాసం లేదు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మిమ్మల్ని భరించాలి? ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకురండి” అని అన్నాడు.
MAR 9:20 వాళ్ళు ఆ బాలుణ్ణి పిలుచుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే, ఆ బాలుణ్ణి వణికేటట్లు చేసింది. ఆ బాలుడు క్రింద పడ్డాడు. నురుగు కక్కుతూ పొర్లాడటం మొదలు పెట్టాడు.
MAR 9:21 యేసు ఆ బాలుని తండ్రితో, “ఎంత కాలం నుండి యితడీవిధంగా ఉన్నాడు?” అని అడిగాడు. “చిన్ననాటి నుండి” అని అతడు సమాధానం చెప్పాడు.
MAR 9:22 “ఆ దయ్యం అతణ్ణి చంపాలని ఎన్నో సార్లు అతణ్ణి నిప్పుల్లో, నీళ్ళలో పడవేసింది. మీరేదైనా చేయగల్గితే మా మీద దయవుంచి మాకు సహాయం చెయ్యండి” అని ఆ బాలుని తండ్రి అన్నాడు.
MAR 9:23 యేసు, “నీవు విశ్వసించగలిగితే, విశ్వాసమున్న వానికి ఏదైనా సాధ్యమౌతుంది” అని అన్నాడు.
MAR 9:24 వెంటనే ఆ బాలుని తండ్రి, “నేను విశ్వసిస్తున్నాను. నాలో ఉన్న అపనమ్మకం తొలిగిపోవటానికి సహాయయం చెయ్యండి” అన్నాడు.
MAR 9:25 యేసు ప్రజల గుంపు తన దగ్గరకు పరుగెత్తుకుంటూ రావటం చూసి ఆ దయ్యంతో, “ఓ చెవిటి, మూగ దయ్యమా! అతని నుండి బయటకు రమ్మని, మళ్ళీ అతనిలో ప్రవేశించవద్దని నేను ఆజ్ఞాపిస్తున్నాను” అని అన్నాడు.
MAR 9:26 ఆ దయ్యం కేకపెట్టి అతణ్ణి తీవ్రంగా వణికించి బయటకు వచ్చింది. ఆ బాలుడు శవంలా పడివుండుట వల్ల చాలా మంది అతడు చనిపొయ్యాడనుకొన్నారు.
MAR 9:27 కాని, యేసు అతని చేతులు పట్టుకొని లేపి నిలుచోబెట్టాడు.
MAR 9:28 ఇంట్లోకి వెళ్ళాక శిష్యులు రహస్యంగా, “మేమెందుకు వెళ్ళగొట్టలేక పొయ్యాము?” అని అడిగారు.
MAR 9:29 యేసు, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థనతో మాత్రమే వెళ్ళగొట్టగలము” అని సమాధానం చెప్పాడు.
MAR 9:30 వాళ్ళా ప్రాంతాన్ని వదిలి గలిలయ ద్వారా ప్రయాణం సాగించారు. యేసు తన శిష్యులకు బోధిస్తూ ఉండటం వల్ల తామెక్కడ ఉన్నది కూడా ఎవ్వరికి తెలియకూడదని ఆశించాడు. ఆయన వాళ్ళతో, “ఒకడు మనుష్యకుమారునికి ద్రోహం చేసి శత్రువులకు అప్పగిస్తాడు. వాళ్ళాయన్ని చంపుతారు. మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి బ్రతికివస్తాడు” అని అన్నాడు.
MAR 9:32 కాని యేసు చెప్పింది శిష్యులకు అర్థంకాలేదు. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు భయం వేసింది.
MAR 9:33 వాళ్ళు కపెర్నహూము అనే పట్టణాన్ని చేరుకొన్నారు. అందరూ యింట్లోకి వెళ్ళాక యేసు వాళ్ళతో, “దార్లో దేన్ని గురించి చర్చించుకొన్నారు?” అని అడిగాడు.
MAR 9:34 వాళ్ళు వచ్చేటప్పుడు అందరికన్నా గొప్ప వాడెవరన్న విషయాన్ని గురించి చర్చించారు. కాబట్టి అందరూ మౌనంగా ఉండిపొయ్యారు.
MAR 9:35 యేసు కూర్చుంటూ, పన్నెండుగురిని పిలిచి, “ముఖ్యస్థానాన్ని వహించాలనుకొన్నవాడు అందరికన్నా చివరన ఉండి సేవచెయ్యాలి” అని అన్నాడు.
MAR 9:36 ఒక బాలుణ్ణి పిలుచుకు వచ్చి వాళ్ళ మధ్య నిలుచోబెట్టాడు. ఆ బాలుణ్ణి ఎత్తుకొని,
MAR 9:37 “నా పేరిట ఇలాంటి పసివానిని అంగీకరించేవాడు నన్ను అంగీకరించినవానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీకరించేవాడు నన్నే కాదు, నన్ను పంపినవానిని కూడా అంగీకరిస్తాడు” అని అన్నాడు.
MAR 9:38 “బోధకుడా! ఒకడు, మీ పేరిట దయ్యాల్ని వదిలించటం మేము చూశాము. అతడు మనవాడు కానందువల్ల అలా చెయ్యటం మానెయ్యమని అతనికి చెప్పాము” అని యోహాను అన్నాడు.
MAR 9:39 యేసు ఈ విధంగా అన్నాడు: “అతణ్ణి ఆపకండి, నా పేరిట అద్భుతం చేసినవాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడలేడు.
MAR 9:40 ఎందుకంటే, మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్న వానితో సమానము.
MAR 9:41 ఇది నిజం, మీరు క్రీస్తుకు చెందిన వాళ్ళని గమనించి నా పేరిట ఒక గిన్నెడు నీళ్ళు మీకు త్రాగటానికి యిచ్చినవాడు తప్పక ప్రతిఫలం పొందుతాడు.
MAR 9:42 “నన్ను విశ్వసించే ఈ పసివాళ్ళు పాపం చేయటానికి కారకులు అవటంకన్నా మెడకు ఒక పెద్ద తిరుగటిరాయి కట్టుకొని సముద్రంలో పడటం మేలు.
MAR 9:43 మీరు పాపం చెయ్యటానికి మీ చేయి కారణమైతే దాన్ని నరికి వేయండి. ఆరని మంటలు మండే నరకానికి రెండు చేతులతో వెళ్ళటం కన్నా, అవిటివానిగా నిత్య జీవంపొందటం ఉత్తమం.
MAR 9:44 
MAR 9:45 పాపం చెయ్యటానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళుండి నరకంలో పడటంకన్నా కుంటివానిగా నిత్య జీవం పొందటం ఉత్తమం.
MAR 9:46 పాపం చెయ్యటానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకివేయండి. రెండు కళ్ళతో నరకంలో పడటంకన్నా ఒక కన్నుతో దేవుని రాజ్యాన్ని ప్రవేశించటం ఉత్తమం.
MAR 9:48 అక్కడ నరకంలో పడ్డవాళ్ళు చావరు. వాళ్ళను కరుస్తున్న పురుగులు చావవు! ఆ మంటలు ఆరిపోవు
MAR 9:49 “ప్రతి వాడు ఈ అగ్నిలో శిక్షననుభవిస్తాడు.
MAR 9:50 “ఉప్పు మంచిదే. కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే ఆ గుణం మళ్ళీ ఏవిధంగా తేగలరు? కాబట్టి మీరు మంచివారై ఉండండి. ఒకరితో ఒకరు శాంతంగా ఉండండి.”
MAR 10:1 యేసు ఆ ప్రాంతాన్ని వదిలి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుండి యొర్దాను నది అవతల వైపునున్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజల గుంపులు ఆయన దగ్గరకు వచ్చాయి. యేసు ఎప్పటిలాగే వాళ్ళకు బోధించాడు.
MAR 10:2 కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని అనుకొని వచ్చి, “ఒక మనిషి తన భార్యకు విడాకులివ్వటం న్యాయ సమ్మతమేనా?” అని అడిగారు.
MAR 10:3 యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు.
MAR 10:4 వాళ్ళు, “విడాకుల పత్రం వ్రాసి భార్యను పంపివేయటానికి మోషే అనుమతి ఇచ్చాడు” అని అన్నారు.
MAR 10:5 యేసు, “మీరు దేవునికి లోబడనివారు కనుక మోషే అలా వ్రాశాడు.
MAR 10:6 కాని, దేవుడు తన సృష్టి ప్రారంభించినప్పుడు ‘ఆడ మగ అనే జాతుల్ని సృష్టించాడు’
MAR 10:7 అందువల్లే, పురుషుడు తన తల్లి తండ్రుల్ని వదిలి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు.
MAR 10:8 వాళ్ళిద్దరూ ఐక్యమై ఒకే దేహంగా మారిపోతారు. అందువల్ల వాళ్ళు యిద్దరివలే కాకుండా ఒకరిలా జీవిస్తారు.
MAR 10:9 కనుక దేవుడు ఐక్యం చేసిన వాళ్ళను ఏ మానవుడూ వేరు చేయకూడదు” అని అన్నాడు.
MAR 10:10 అంతా యింట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ విషయాన్ని గురించి విశదంగా చెప్పమని కోరారు.
MAR 10:11 యేసు ఇలాగన్నాడు: “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకొన్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచరించినవాడౌతాడు.
MAR 10:12 అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుని వివాహం చేసుకొన్న స్త్రీ వ్యభిచారిణిగా పరిగణింపబడుతుంది.”
MAR 10:13 యేసు తాకాలని, ప్రజలు చిన్నపిల్లల్ని పిలుచుకొని వస్తూవుంటే శిష్యులు వాళ్ళని గద్దించారు.
MAR 10:14 ఇది చూసి యేసుకు మనస్సులో బాధ కలిగింది. ఆయన వాళ్ళతో, “చిన్నపిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం చిన్న పిల్లల్లాంటి వారిది.
MAR 10:15 ఇది నిజం. చిన్న పిల్లవాని వలే దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాడు ఆ రాజ్యంలోకి ప్రవేశించలేడు” అని అన్నాడు.
MAR 10:16 ఆయన ఆ చిన్న పిల్లల్ని దగ్గరకు పిలిచి వాళ్ళపై తన చేతులుంచి ఆశీర్వదించాడు.
MAR 10:17 యేసు బయలుదేరుతుండగా ఒక మనిషి పరుగెత్తుకొంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా! నేను నిత్యజీవం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
MAR 10:18 యేసు, “నేను మంచివాణ్ణి అని ఎందుకు అంటున్నావు. దేవుడు తప్ప ఎవరూ మంచివారు కారు. మోషే ఆజ్ఞలు నీకు తెలుసు కదా!
MAR 10:19 హత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యం చెప్పరాదు. మోసం చెయ్యరాదు. నీ తల్లి తండ్రుల్ని గౌరవించు” అని అన్నాడు.
MAR 10:20 అతడు, “అయ్యా! నా చిన్నతనంనుండి నేను వీటిని పాటిస్తున్నాను!” అని అన్నాడు.
MAR 10:21 యేసు అతని వైపు చూసాడు. అతనిపై యేసుకు అభిమానం కలిగింది. అతనితో, “నీవు యింకొకటి చెయ్యాలి. వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు. అప్పుడు నీకు పరలోకంలో సంపద లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు.
MAR 10:22 ఇది విన్నాక ఆ వచ్చిన వ్యక్తి ముఖం చిన్నబోయింది. అతని దగ్గర చాలా ధనముండటం వల్ల దుఃఖంతో అక్కడినుండి వెళ్ళిపొయ్యాడు.
MAR 10:23 యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనమున్నవాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం” అని అన్నాడు.
MAR 10:24 శిష్యులు ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. యేసు మళ్ళీ, “శిష్యులారా! దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో కష్టం!
MAR 10:25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.
MAR 10:26 ఇది విని శిష్యులు యింకా ఎక్కువ ఆశ్చర్యపడ్డారు. అలాగైతే, “ఎవరికి రక్షణ లభిస్తుంది?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు.
MAR 10:27 యేసు వాళ్ళవైపు చూసి, “మానవునికి ఇది అసాధ్యమైన పని కాని, దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు.
MAR 10:28 పేతురు ఆయనతో, “మిమ్మల్ని అనుసరించాలని మేము అన్నీ వదిలివేసాము” అని అన్నాడు.
MAR 10:29 యేసు, “ఇది నిజం. నా కోసం, సువార్తకోసం, తన యింటినికాని, సోదరులనుకాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లినికాని, తండ్రినికాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని, విడిచినవాడు ఈ తరంలోనే నూరు రెట్లు యిళ్ళను, సోదరులను, అక్క చెల్లెండ్లను, తల్లుల్ని, సంతానాన్ని, పొలాల్ని పొందుతాడు. వీటితో పాటు హింసల్ని కూడా పొందుతాడు. రానున్న లోకంలో నిత్యజీవం పొందుతాడు.
MAR 10:31 కాని ముందున్న వాళ్ళు చివరివాళ్ళై, చివర వున్న వాళ్ళు ముందుకు వెళ్తారు” అని అన్నాడు.
MAR 10:32 యేసు, ఆయనతో ఉన్న వాళ్ళు అంతా యెరూషలేము వెళ్ళటానికి బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు దిగులుతో నడుస్తూ ఉన్నారు. యేసును అనుసరిస్తున్న యితరులు భయపడుతూ నడుస్తూ ఉన్నారు. యేసు మళ్ళీ తన శిష్యులను ప్రక్కకు పిలిచి తనకు జరుగనున్న వాటిని గురించి వాళ్ళకు చెప్పాడు.
MAR 10:33 ఆయన, “వినండి, మనం యెరూషలేము దాకా వెళ్తున్నాము. అక్కడ మనుష్యకుమారునికి ద్రోహం జరుగుతుంది. ఆయన ప్రధానయాజకులకు, శాస్త్రులకు అప్పగింపబడతాడు. వాళ్ళాయనకు మరణ శిక్ష విధించి యూదులుకాని వాళ్ళకు అప్పగిస్తారు.
MAR 10:34 యూదులుకాని వాళ్ళు ఆయన్ని హేళన చేసి ఆయన మీద ఉమ్మివేస్తారు. ఆయన్ని కొరడా దెబ్బలుకొడతారు. ఆ తర్వాత చంపివేస్తారు. మూడు రోజుల తర్వాత ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు.
MAR 10:35 జెబెదయి కుమారులు యాకోబు మరియు యోహానులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము అడిగింది చెయ్యమని కోరుతున్నాము” అని అన్నారు.
MAR 10:36 “ఏమి చెయ్యమంటారు?” అని యేసు అడిగాడు.
MAR 10:37 వాళ్ళు, “మీరు మహిమను పొందినప్పుడు మాలో ఒకరిని మీ కుడిచేతి వైపు, మరొకరిని మీ ఎడమచేతివైపు కూర్చోనివ్వండి” అని అడిగారు.
MAR 10:38 యేసు, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగినదాన్ని మీరు త్రాగగలారా? నేను పొందిన బాప్తిస్మము మీరు పొందగలరా?” అని అడిగాడు.
MAR 10:39 “పొందగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో, “నేను త్రాగిన దాన్ని మీరు త్రాగుదురు, నేను పొందిన బాప్తిస్మము మీరు పొందుదురు.
MAR 10:40 కాని నా కుడివైపు, లేక నా ఎడమ వైపు కూర్చోమనటానికి అనుమతి యిచ్చేది నేను కాదు. ఈ స్థానాలు ఎవరి కోసం నియమించబడ్డాయో వాళ్ళు మాత్రమే కూర్చోగలరు” అని అన్నాడు.
MAR 10:41 ఇది విని మిగతా పది మందికి యాకోబు మరియు యోహానులపై కోపం వచ్చింది.
MAR 10:42 యేసు వాళ్ళను దగ్గరకు పిలిచి, “యూదులుకాని వాళ్ళను పాలించ వలసిన ప్రభువులు, వాళ్ళపై తమ అధికారం చూపుతూ ఉంటారు. ఇతర అధికారులు కూడా వాళ్ళపై అధికారం చూపుతూ ఉంటారు. ఇది మీకు తెలుసు.
MAR 10:43 మీ విషయంలో అలా కాదు. మీలో అందరి కన్నా గొప్ప కావాలనుకున్నవాడు మిగతా వాళ్ళందరికి సేవ చేయాలి.
MAR 10:44 మీలో ప్రాముఖ్యత పొందాలనుకొన్నవాడు మీ అందరికి బానిసగా ఉండాలి.
MAR 10:45 ఎందుకంటే మనుష్యకుమారుడు కూడా సేవ చేయించుకోవటానికి రాలేదు. కాని సేవ చేయటానికి, అందరి పక్షాన తన ప్రాణాన్ని క్రయధనంగా ధారపోయటానికి వచ్చాడు” అని అన్నాడు.
MAR 10:46 ఆ తర్వాత వాళ్ళు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వాళ్ళతో ఉన్న ప్రజల గుంపు ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండినాడు. అతడు బిక్షగాడు.
MAR 10:47 ఆ గ్రుడ్డివాడు, వస్తున్నది నజరేతు నివాసి యేసు అని తెలుసుకొని, “యేసూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు!” అని బిగ్గరగా అనటం మొదలు పెట్టాడు.
MAR 10:48 చాలామంది అతణ్ణి తిట్టి ఊరుకోమన్నారు. కాని ఆ గ్రుడ్డివాడు. “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని యింకా బిగ్గరగా అరిచాడు.
MAR 10:49 యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అని అన్నాడు. వాళ్ళా గ్రుడ్డివానితో, “ధైర్యంగా లేచి నిలుచో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని అన్నారు.
MAR 10:50 ఆ గ్రుడ్డివాడు కప్పుకొన్న వస్త్రాన్ని ప్రక్కకు త్రోసి, గభాలున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు.
MAR 10:51 యేసు, “ఏమి కావాలి?” అని అడిగాడు. ఆ గ్రుడ్డివాడు, “రబ్బీ! నాకు చూపు కావాలి” అని అన్నాడు.
MAR 10:52 యేసు, “నీ విశ్వాసం నీకు నయం చేసింది. యిక వెళ్ళు” అని అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయన వెంట వెళ్ళాడు.
MAR 11:1 వాళ్ళు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవలకొండ దగ్గరున్న బేత్పగే మరియు బేతనియ గ్రామాలకు రాగానే యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ,
MAR 11:2 వాళ్ళతో, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరాగ్రామంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ వయస్సులో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. అది ఒక వాకిలి ముందు కట్టబడి ఉంటుంది. దాని మీద ఇది వరకెవ్వరూ స్వారి చెయ్యలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి.
MAR 11:3 అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు కావాలి, త్వరలోనే తిరిగి పంపుతాము’ అని సమాధానం చెప్పండి” అని అన్నాడు.
MAR 11:4 శిష్యులు వెళ్ళి, ఇంటి ముందు వీధిలో ఒక గాడిద ఉండటం చూసారు. వాళ్ళు దాన్ని విప్పుతుండగా
MAR 11:5 అక్కడ నిలుచున్న కొందరు మనుష్యులు, “గాడిదను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు.
MAR 11:6 వాళ్ళు యేసు చెప్పమన్న సమాధానం చెప్పారు. ఆ మనుష్యులు వాళ్ళను పోనిచ్చారు.
MAR 11:7 వాళ్ళా గాడిదను యేసు దగ్గరకు తీసుకొని వచ్చి, తమ వస్త్రాల్ని దాని మీద పరిచారు. యేసు దానిపై కూర్చున్నాడు.
MAR 11:8 చాలా మంది ప్రజలు తమ వస్త్రాలను దారిమీద పరిచారు. మరికొందరు తోటలనుండి తెచ్చిన చెట్ల రెమ్మల్ని దారి మీద పరిచారు.
MAR 11:9 ముందు నడుస్తున్న వాళ్ళు, వెనుక నడుస్తున్న వాళ్ళు, “‘హోసన్నా, ప్రభువు పేరిట వచ్చుచున్న వాడు ధన్యుడు.’
MAR 11:10 “రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యమైనది. మహోన్నతుడైన వానికి హోసన్నా!” అని బిగ్గరగా కేకలు వేసారు.
MAR 11:11 యేసు యెరూషలేం పట్టణం ప్రవేశించి అక్కడున్న ఆలయానికి వెళ్ళాడు. చుట్టూ ఉన్న వాటిని చూసాడు. అప్పటికే ప్రొద్దు పోయి ఉండటం వల్ల పన్నెండుగురితో కలిసి బేతనియకు వెళ్ళాడు.
MAR 11:12 మరుసటిరోజు వాళ్ళు బేతనియనుండి బయలుదేరి వస్తుండగా యేసుకు ఆకలి వేసింది.
MAR 11:13 కొంత దూరంలో ఆకులున్న అంజూరపు చెట్టు ఉండటం యేసు చూసాడు. దాని మీద పండ్లున్నాయేమో చూడాలని దగ్గరకు వెళ్ళాడు. కాని దగ్గరకు వెళ్ళాక, అది పండ్లు కాచేకాలం కానందువల్ల ఆయనకు ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు.
MAR 11:14 అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఎన్నడూ ఎవ్వరూ నీ ఫలాల్ని తినకూడదు!” అని అన్నాడు. ఆయన అలా అనటం శిష్యులు విన్నారు.
MAR 11:15 యెరూషలేము చేరుకొన్నాక యేసు దేవాలయంలోకి ప్రవేశించి వ్యాపారం చేస్తున్న వాళ్ళను తరిమి వేయటం మొదలుపెట్టాడు. డబ్బు మార్చే వ్యాపారస్తుల బల్లల్ని, పావురాలు అమ్ముతున్న వ్యాపారస్తుల బల్లల్ని క్రింద పడవేసాడు.
MAR 11:16 దేవాలయం ద్వారా ఎవరూ సరుకులు మోసుకు పోనీయకుండా చేసాడు.
MAR 11:17 ఆయన బోధిస్తూ, “‘నా ఆలయం అన్ని జనాంగాలకు ప్రార్థనా ఆలయం అనిపించుకొంటుంది’ అని గ్రంథాల్లో వ్రాసారు. కాని మీరు దాన్ని దోపిడి దొంగలు దాచుకొనే గుహగా మార్చారు” అని అన్నాడు.
MAR 11:18 అక్కడున్న ప్రజలు యేసు బోధను విని ఆశ్చర్యపొయ్యారు. ప్రధానయాజకులు, శాస్త్రులు భయపడి యేసును చంపటానికి మార్గం వెతకటం మొదలు పెట్టారు.
MAR 11:19 సాయంత్రం కాగానే ఆయన, శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపొయ్యారు.
MAR 11:20 ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు.
MAR 11:21 పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! అదిగో చూడండి; మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” అని అన్నాడు.
MAR 11:22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి.
MAR 11:23 ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే, అలాగే సంభవిస్తుంది.
MAR 11:24 అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది.
MAR 11:25 అంతేకాక, మీరు ప్రార్థించటానికి నిలుచున్నప్పుడు మీకు ఎవరితోనన్న విరోధం ఉంటే అతణ్ణి క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”
MAR 11:26 
MAR 11:27 యేసు, ఆయన శిష్యులు యెరూషలేం చేరుకొన్నారు. ఆయన మందిరావరణంలో నడుస్తుండగా ప్రధానయాజకులు, శాస్త్రులు పెద్దలు ఆయన దగ్గరకు వచ్చారు.
MAR 11:28 వాళ్ళాయన్ని, “ఎవరిచ్చిన అధికారంతో నీవు వీటిని చేస్తున్నావు? ఇవి చేయటానికి అధికారమెవరిచ్చారు?” అని అడిగారు.
MAR 11:29 యేసు సమాధానంగా, “నన్ను ఒక్క ప్రశ్న అడుగనివ్వండి. దానికి మీరు సమాధానం చెప్పండి. అప్పుడు నేనివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను.
MAR 11:30 యోహాను బాప్తిస్మము పరలోకంలో నుండి వచ్చినదా? లేక మానవులనుండి వచ్చినదా? సమాధానం చెప్పండి” అన్నాడు.
MAR 11:31 వాళ్ళు, ఆ విషయాన్ని గురించి పరస్పరం చర్చించుకొని, “మనం ‘పరలోకం నుండి’ అని అంటే, ‘మరి అలాగైతే మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అడుగుతాడు.
MAR 11:32 మనం ‘మానవుల నుండి’ అని అంటే ప్రజలకు మనమంటే కోపం వస్తుంది” అని అనుకున్నారు. యోహాను ఒక ప్రవక్త అని ప్రతి ఒక్కడు నమ్మటంవల్ల వాళ్ళు ప్రజలంటే భయపడ్డారు.
MAR 11:33 కనుక వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు. యేసు, “అలాగైతే నేను కూడా యివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు.
MAR 12:1 ఆ తర్వాత ఆయన వాళ్ళతో దృష్టాంతాలు చెబుతూ ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు: “ఒకడు ద్రాక్షాతోట వేసి, చుట్టూ ఒక గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు త్రొక్కటానికి ఒక తొట్టి కట్టించాడు. అక్కడే ఒక గోపురం కట్టించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు.
MAR 12:2 “పంటకాలం రాగానే పంటలో తనకు రావలసిన భాగం తీసుకు రమ్మని ఒక సేవకుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు.
MAR 12:3 కాని ఆ రైతులతణ్ణి పట్టుకొని కొట్టి వట్టిచేతులతో పంపివేసారు.
MAR 12:4 ఆ తర్వాత అతడు యింకొక సేవకుణ్ణి పంపాడు. వాళ్ళతణ్ణి తలపై బాది అవమానపరిచారు.
MAR 12:5 అతడు యింకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వాళ్ళతణ్ణి చంపివేసారు. అతడింకా చాలామందిని పంపాడు. కాని ఆ రైతులు వారిలో కొందరిని చంపారు. మరి కొందరిని కొట్టారు.
MAR 12:6 “తన ప్రియమైన కుమారుడు తప్ప పంపటానికి యింకెవ్వరూ మిగల్లేదు. వాళ్ళు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకొని చివరకు తన కుమారుణ్ణి పంపాడు.
MAR 12:7 “కాని ఆ రైతులు, ‘ఇతడు వారసుడు! యితణ్ణి చంపుదాం; అప్పుడు ఆ వారసత్వం మనకు దక్కుతుంది’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు.
MAR 12:8 ఆ కారణంగా వాళ్ళతణ్ణి పట్టుకొని చంపి ఆ ద్రాక్షతోటకు అవతల పడవేసారు.
MAR 12:9 “అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షతోటను యితరులకు కౌలుకిస్తాడు.
MAR 12:10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: ఇది మీరు చదువలేదా? ‘ఇల్లు కట్టువాళ్ళు పనికిరాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది.
MAR 12:11 ఇది ప్రభువు చేసాడు. ఆ అద్భుతాన్ని మనం కండ్లారా చూసాము.’”
MAR 12:12 ఈ దృష్టాంతం తమనుగూర్చి చెప్పాడని యూదులు గ్రహించారు. కనుక ఆయన్ని బంధించటానికి మార్గం ఆలోచించారు. కాని ప్రజల గుంపును చూసి భయపడిపొయ్యారు. అందువల్ల ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు.
MAR 12:13 ఆ తర్వాత యేసును ఆయన మాటల్లో పట్టేయాలని కొంతమంది పరిసయ్యుల్ని హేరోదు రాజు పక్షముననున్న వాళ్ళను ఆయన దగ్గరకు పంపారు.
MAR 12:14 వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, “అయ్యా! మీరు సత్యవంతులని మాకు తెలుసు. మీరు మానవుల మాటలకు లొంగిపోరు. వాళ్ళెవరనే విషయం మీకు అవసరం లేదు. సత్యమార్గాన్ని మీరు ఉన్నది ఉన్నట్లు బోధిస్తారు. మరి చక్రవర్తికి పన్నులు కట్టటం న్యాయమా? కాదా? మేము పన్నులు కట్టాలా మానాలా?” అని అడిగారు.
MAR 12:15 యేసుకు వాళ్ళ కుట్ర తెలిసి పోయింది. “నన్నెందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు? ఒక దేనారా యివ్వండి. నన్ను దాన్ని చూడనివ్వండి” అని అన్నాడు.
MAR 12:16 వాళ్ళు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. యేసు, “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని అడిగాడు. “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
MAR 12:17 అప్పుడు యేసు వారితో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందింది దేవునికి యివ్వండి” అని అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపొయ్యారు.
MAR 12:18 చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకరని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేసారు.
MAR 12:19 “అయ్యా, ఒకని సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరునికి సంతానం లేకపోయినట్టయితే, ఆ చనిపోయిన సోదరుని భార్యను బ్రతికివున్న సోదరుడు వివాహమాడి, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేటట్లు చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో వ్రాసాడు.
MAR 12:20 ఒకప్పుడు ఏడుగురు సోదరులుండే వాళ్ళు. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా చనిపొయ్యాడు.
MAR 12:21 రెండవ వాడు అతని వితంతువును వివాహమాడాడు. కాని అతడు కూడా సంతానం లేకుండా చనిపొయ్యాడు. మూడవ వానికి కూడా అదే సంభవించింది.
MAR 12:22 ఆ ఏడుగురిలో ఎవ్వరికి సంతానం కలగలేదు. చివరకు ఆ స్త్రీకూడా చనిపోయింది.
MAR 12:23 చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు ఆమె ఎవరి భార్యగా పరిగణింపబడుతుంది? ఆమెను ఆ ఏడగురు పెండ్లి చేసుకొన్నారు కదా?” అని అడిగారు.
MAR 12:24 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు. కనుక పొరబడుతున్నారు.
MAR 12:25 చనిపోయిన వాళ్ళు బ్రతికివచ్చాక వివాహం చేసుకోరు. వాళ్ళు ఆడ, మగ అని ఉండరు. వాళ్ళు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు.
MAR 12:26 ఇక చనిపోయిన వాళ్ళు బ్రతకటం విషయంలో మోషే తాను వ్రాసిన గ్రంథంలో ‘పొదను’ గురించి వ్రాసినప్పుడు, దేవుడు అతనితో ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అతనితో చెప్పాడు.
MAR 12:27 ‘నేను వాళ్ళ దేవుణ్ణి’ అని ఆయన అన్నప్పుడు, వాళ్ళు నిజంగా చనిపోలేదన్న మాట. అంటే ఆయన బ్రతికివున్న వాళ్ళకు మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు.”
MAR 12:28 శాస్త్రుల్లో ఒకడు వచ్చి వాదన విన్నాడు. యేసు చక్కటి సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ ముఖ్య మైనది?” అని యేసును అడిగాడు.
MAR 12:29 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఓ ఇశ్రాయేలు జనాంగమా విను. మొదటిది ఇది: మన ప్రభువైన దేవుడు మాత్రమే ప్రభువు.
MAR 12:30 నీ శక్తి, బుద్ధి, సంపూర్ణంగా ఉపయోగిస్తూ నీ ప్రభువైన దేవుణ్ణి నీ సంపూర్ణమైన ఆత్మతో మనస్ఫూర్తిగా ప్రేమించు,
MAR 12:31 రెండవది ఇది: నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. వీటిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు.”
MAR 12:32 ఆ శాస్త్రి, “అయ్యా! చక్కగా చెప్పారు. దేవుడు ఒక్కడేనని, ఆయన తప్ప మరెవ్వరూ లేరని సరిగ్గా చెప్పారు.
MAR 12:33 ఆ దేవుణ్ణి సంపూర్ణమైన బుద్ధితో, సంపూర్ణమైన మనస్సుతో శక్తినంతా ఉపయోగిస్తూ ప్రేమించాలని, మరియు తనను ప్రేమించుకొన్నంతగా, తన పొరుగువాణ్ణి ప్రేమించాలని చక్కగా చెప్పారు. ఈ రెండు ఆజ్ఞలు, బలులకన్నా, దహన బలులకన్నా ముఖ్యమైనవి” అని అన్నాడు.
MAR 12:34 అతడు తెలివిగా చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు!” అని అన్నాడు. ఆ తర్వాత ఆయన్ని ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.
MAR 12:35 యేసు మందిరంలో బోధిస్తూ ఈ విధంగా అన్నాడు: “క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు ఎందుకంటున్నారు?
MAR 12:36 దావీదే స్వయంగా పవిత్రాత్మ ద్వారా మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువు, నా ప్రభువుతో ఈ విధంగా అన్నాడు: నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసేవరకు నా కుడిచేతి వైపు కూర్చొనుము.’
MAR 12:37 దావీదు స్వయంగా ఆయన్ని, ‘ప్రభూ!’ అని పిలిచాడు కదా! మరి అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లా ఔతాడు?” అక్కడున్న ప్రజలగుంపు అత్యానందంగా ఆయన మాటలు విన్నారు.
MAR 12:38 యేసు యింకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు: “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పొడుగాటి దుస్తులు ధరించి నడవాలని, సంతల్లో ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ ఉంటారు.
MAR 12:39 వాళ్ళు సమాజాల్లో ముఖ్య స్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను ఆక్రమించాలని ఆశిస్తూ ఉంటారు.
MAR 12:40 వాళ్ళు వితంతువుల యిండ్లను దోచుకుంటూ, పైకి మాత్రం గంటల తరబడి ప్రార్థిస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు అతితీవ్రంగా శిక్షిస్తాడు.”
MAR 12:41 ఒక రోజు యేసు, మందిరంలో కానుకలు వేసే పెట్టెకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ప్రజలు ఆ పెట్టెలో డబ్బును వేయటం ఆయన గమనించాడు. ధనవంతులు చాలామంది పెద్ద పెద్ద మొత్తాల్ని ఆ పెట్టెలో వేసారు.
MAR 12:42 కాని ఒక పేద వితంతువు వచ్చి రెండు రాగి నాణెములను ఆ పెట్టెలో వేసింది.
MAR 12:43 యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “ఇది నిజం. ఈ పేద వితంతువు ఆ పెట్టెలో అందరికన్నా ఎక్కువ డబ్బు వేసింది.
MAR 12:44 మిగతా వాళ్ళు తాము దాచుకొన్న ధనంలో కొంత భాగం మాత్రమే వేసారు. కాని ఆమె పేదదైనా తన దగ్గరున్నదంతా వేసింది” అని అన్నాడు.
MAR 13:1 యేసు మందిరం నుండి వెళ్తుండగా శిష్యుల్లో ఒకడు, “బోధకుడా! చూడండి, ఎంత అద్భుతమైన పెద్ద రాళ్ళో! ఎంత పెద్ద కట్టడాలో చూడండి!” అని అన్నాడు.
MAR 13:2 యేసు సమాధానంగా, “నీవు పెద్ద కట్టడాన్ని చూస్తున్నావా? రాయి మీద రాయి నిలువకుండా రాళ్ళన్ని పడిపోతాయి” అని అన్నాడు.
MAR 13:3 యేసు మందిరానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండపై కూర్చొన్నాడు. ఆయన వెంట ఆయన శిష్యులు పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రెయ ఉన్నారు. వాళ్ళు ఆయనతో
MAR 13:4 “ఇది ఎప్పుడు జరుగుతుందో మాకు చెప్పండి. ఇవి జరుగబోయే సమయం వచ్చిందని సూచించటానికి ఏం జరుగుతుంది?” అని అడిగారు.
MAR 13:5 యేసు వాళ్ళతో, “మిమ్మల్నెవరూ మోసం చేయకుండా జాగ్రత్తపడండి.
MAR 13:6 అనేకులు నా పేరు పెట్టుకొని వచ్చి, నేనే ఆయన్ని అని చెప్పి అనేకుల్ని మోసం చేస్తారు.
MAR 13:7 మీరు యుద్ధాల్ని గురించి కాని, యుద్ధాల వదంతుల్ని గురించి కాని వింటే వెంటనే ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు.
MAR 13:8 దేశాలకు, రాజ్యాలకు మధ్య యుద్ధాలు సంభవిస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి. కరువులు వస్తాయి. అంటే ప్రసవించే ముందు కలిగే నొప్పులు ప్రారంభమయ్యాయన్నమాట.
MAR 13:9 “మీరు జాగ్రత్తగా ఉండండి. కొందరు మనుష్యులు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు కొరడా దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు రాజ్యాధికారుల ముందు, రాజుల ముందు నిలుచొని సాక్ష్యం చెప్పవలసి వస్తుంది.
MAR 13:10 మొదట మీరు అన్ని దేశాలకు సువార్త తప్పక ప్రకటించాలి.
MAR 13:11 మిమ్మల్ని బంధించి విచారణ జరపటానికి తీసుకు వెళ్తారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో అని చింతించకండి. ఆ సమయంలో మీకు తోచింది మాట్లాడండి. ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు. పవిత్రాత్మ మీ ద్వారా మాట్లాడుతాడు.
MAR 13:12 “సోదరులు ఒకరికొకరు ద్రోహం చేసుకొని, ఒకరి మరణానికి ఒకరు కారకులౌతారు. అదే విధంగా తండ్రి తన కుమారుని యొక్క మరణానికి కారకుడౌతాడు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళ మరణానికి కారకులౌతారు.
MAR 13:13 నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు. కాని చివరిదాకా పట్టుదలతో ఉన్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు.
MAR 13:14 “నాశనం కలిగించేది, అసహ్యమైనది, తనది కాని స్థానంలో నిలుచొని ఉండటం మీకు కనిపిస్తే యూదయలో ఉన్నవాళ్ళు కొండల మీదికి పారిపొండి.
MAR 13:15 ఇంటి మిద్దె మీద ఉన్న వాళ్ళు క్రిందికి దిగి తమ వస్తువులు తెచ్చుకోవటానికి తమ యిళ్ళలోకి వెళ్ళరాదు.
MAR 13:16 పొలాల్లో పని చేస్తున్న వాళ్ళు తమ దుస్తులు తెచ్చుకోవటానికి యిళ్ళకు వెళ్ళరాదు.
MAR 13:17 “గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆ రోజులు ఎంత దుర్భరంగా ఉంటాయో కదా!
MAR 13:18 ఈ సంఘటన చలికాలంలో సంభవించకూడదని ప్రార్థించండి.
MAR 13:19 ప్రపంచంలో ఇదివరకు ఎన్నడూ, అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన నాటినుండి ఈనాటి వరకూ సంభవించని దుర్భరమైన కష్టాలు ఆ రోజుల్లో సంభవిస్తాయి. అలాంటి కష్టాలు యిక ముందు కూడా ఎన్నడూ కలగవు.
MAR 13:20 కాని దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసాడు. లేకపోయినట్లయితే ఎవ్వరూ బ్రతికేవాళ్ళు కాదు. తానెన్నుకున్న తన ప్రజల కోసం ఆ రోజుల సంఖ్యను తగ్గించాడు.
MAR 13:21 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా ‘ఇదిగో! క్రీస్తు యిక్కడ ఉన్నాడని’ కాని, ‘అదిగో అక్కడున్నాడని’ కాని అంటే నమ్మకండి.
MAR 13:22 దొంగ క్రీస్తులు, దొంగ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు, మహత్యాలు చేసి ఐనంతవరకు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళను మోసం చెయ్యాలని చూస్తారు.
MAR 13:23 అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలని, అన్ని విషయాలు మీకు ముందే చెబుతున్నాను.
MAR 13:24 “కాని ఆ కష్టాలు గడిచిన తర్వాత వచ్చే రోజుల్లో ‘సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు తన వెలుగును వెదజల్లడు.
MAR 13:25 ఆకాశంలోని నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో వున్నవన్నీ మార్పుచెందుతాయి.’
MAR 13:26 “అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో, తేజస్సుతో, మేఘాలమీద రావటం మానవులు చూస్తారు.
MAR 13:27 ఆయన నలువైపుల నుండి, అంటే ఈ మూలనుండి ఆ మూల దాకా, తన దేవదూతలను పంపి తానెన్నుకున్న ప్రజలను ప్రోగు చేయిస్తాడు.
MAR 13:28 “అంజూరపు చెట్టును చూసి పాఠం నేర్చుకొండి. దాని రెమ్మలు ఆకులు చిగురించుట చూసి ఎండాకాలం రానున్నదని మీరు గ్రహిస్తారు.
MAR 13:29 అదే విధంగా యివి జరగటం మీరు చూసినప్పుడు ఆయన త్వరగా రానైయున్నాడని గ్రహిస్తారు.
MAR 13:30 ఇది నిజం. ఈ కాలపువాళ్ళు జీవిస్తూండగానే ఇవన్ని జరుగును.
MAR 13:31 ఆకాశం, భూమి గతించి పోతాయి కాని, నా మాటలు ఎన్నటికి గతించిపోవు.
MAR 13:32 “ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో, పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారునికి గాని మరెవ్వరికి గాని తెలియదు. అది తండ్రికి మాత్రమే తెలుసు.
MAR 13:33 జాగ్రత్తగా, సిద్ధంగా ఉండండి. ఆ సమయం ఎప్పుడు రాబోతోందో మీకు తెలియదు.
MAR 13:34 “ఇది తన యిల్లు విడిచి దూరదేశం వెళ్ళే ఒక మనిషిని పోలి ఉంటుంది. అతడు తన యింటిని సేవకులకు అప్పగిస్తాడు. ప్రతి సేవకునికి ఒక పని అప్పగిస్తాడు. ద్వారం దగ్గరవున్నవానికి కాపలా కాయమని చెబుతాడు.
MAR 13:35 ఎల్లప్పుడు సిద్ధంగా ఉండమని చెబుతాడు. ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడికూసే వేళకు వస్తాడో, సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు.
MAR 13:36 అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రిస్తూ ఉండటం చూస్తాడేమో.
MAR 13:37 హెచ్చరికగా ఉండండి అని మీకు చెబుతున్నాను. అదే ప్రతి ఒక్కనికి చెబుతున్నాను.”
MAR 14:1 పస్కా పండుగకు, పులియబెట్టని రొట్టెల పండుగకు రెండురోజుల ముందు ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును బంధించి చంపటానికి పన్నాగం పన్నటం మొదలు పెట్టారు.
MAR 14:2 “కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజలు అల్లర్లు మొదలు పెట్టవచ్చు” అని మాట్లాడుకొన్నారు.
MAR 14:3 ఆ సమయంలో యేసు బేతనియలో ఉన్నాడు. ఆయన కుష్టురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చొని ఉండగా, ఒక స్త్రీ ఇంట్లోకి వచ్చింది. ఆమె స్వచ్ఛమైన అగరు చెట్లనుండి చేసిన మిక్కిలి విలువైన అత్తరును ఒక చలువరాతి బుడ్డిలో తన వెంట తెచ్చింది. ఆ బుడ్డి మూత పగులగొట్టి ఆ అత్తరును యేసు తలపై పోసింది.
MAR 14:4 ఇది చూసి అక్కడున్న వాళ్ళలో కొందరికి కోపం వచ్చింది. వాళ్ళు పరస్పరం, “అత్తరును ఇలా వృధా చేయటం ఎందుకు?
MAR 14:5 దాన్ని అమ్మితే మూడు వందల దేనారాలు వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్ళకు యిచ్చి ఉండవలసింది” అని ఆ స్త్రీని గూర్చి గొణుక్కున్నారు.
MAR 14:6 యేసు, “ఆపండి. ఆమెనెందుకు కంగారు పెడుతున్నారు. ఆమె మంచి పని చేసింది.
MAR 14:7 పేదవాళ్ళు మీలో ఎప్పుడూ ఉంటారు. మీ కిష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళకు సహాయం చెయ్యవచ్చు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను.
MAR 14:8 ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నన్ను సమాధికి సిద్ధం చేయాలని ఆమె నా దేహంపై అత్తరు పోసింది.
MAR 14:9 ఇది నిజం. ప్రపంచంలో సువార్త ప్రకటించిన ప్రతిచోటా ఆమె జ్ఞాపకార్థంగా ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.
MAR 14:10 ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు, యేసును ప్రధాన యాజకులకు పట్టివ్వటానికి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు.
MAR 14:11 వాళ్ళు ఇది వినిచాలా ఆనందపడి, అతనికి డబ్బిస్తామని వాగ్దానం చేసారు. అందువల్ల యూదా యేసును పట్టివ్వటానికి తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు.
MAR 14:12 పులియబెట్టని రొట్టెలపండుగ వచ్చింది. మొదటి రోజు పస్కా గొఱ్ఱెపిల్లను బలి యివ్వటం ఆచారం. ఆ రోజు యేసు శిష్యులు ఆయనతో, “ఎక్కడికి వెళ్ళి పస్కా పండుగ భోజనం సిద్ధం చెయ్యమంటారు?” అని అడిగారు.
MAR 14:13 యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నగరంలోకి వెళ్ళండి. నీళ్ల కడవనెత్తుకొని వస్తున్న ఒక మనిషి మీకు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించండి.
MAR 14:14 అతడు ప్రవేశించిన యింటి యజమానితో, అతిథులు ఉండే గది ఎక్కడుందో బోధకుడు అడగమన్నాడని, ఆయన తన శిష్యులతో కలిసి ఆ గదిలో పస్కా పండుగ భోజనం చెయ్యాలని అనుకుంటున్నాడని, నేను అన్నట్లు చెప్పండి.
MAR 14:15 అన్ని వస్తువులతో సిద్దంగా ఉన్న మేడమీది విశాలమైన గదిని అతడు మీకు చూపుతాడు. మనకోసం అక్కడ భోజనం ఏర్పాటు చేయండి.”
MAR 14:16 శిష్యులు పట్టణంలోకి వెళ్ళారు. యేసు చెప్పి నట్లే అన్నీ జరిగాయి. వాళ్ళు పస్కా పండుగ భోజనం సిద్ధం చేసారు.
MAR 14:17 సాయంత్రం కాగానే యేసు పన్నెండుగురితో కలిసి వచ్చాడు.
MAR 14:18 వాళ్ళంతా బల్లముందు కూర్చొని భోజనం చేస్తూవున్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, “ఇది నిజం. మీలో ఒకడు అంటే ప్రస్తుతం నాతో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్ళలో ఒకడు, నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.
MAR 14:19 వాళ్ళకు దుఃఖం వచ్చింది. “ఖచ్చితంగా నేను కాదుగదా ప్రభూ” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనతో అన్నారు.
MAR 14:20 యేసు, “మీ పన్నెండుగురిలో ఒకడు, నాతో కలిసి రొట్టె గిన్నెలో ముంచేవాడు, నాకు ద్రోహం చేస్తాడు.
MAR 14:21 లేఖనాల్లో వ్రాసిన విధంగా మనుష్యకుమారుడు వెళ్లిపోవుచున్నాడు. కాని మనుష్యకుమారునికి ద్రోహం చేసినవాడు శాపగ్రస్తుడౌతాడు. వాడు జన్మించివుండకపోతే బాగుండేది” అని అన్నాడు.
MAR 14:22 అంతా భోజనం చేస్తుండగా, యేసు రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది నా దేహం, దీన్ని తీసుకొండి” అని అన్నాడు.
MAR 14:23 ఆ తర్వాత గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకిచ్చాడు. వాళ్ళందరూ ఆ గిన్నె నుండి త్రాగారు.
MAR 14:24 “ఇది నా నిబంధన రక్తం. ఆ రక్తాన్ని అందరికోసం కార్చాను.
MAR 14:25 ఇది నిజం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి క్రొత్త ద్రాక్షారసం త్రాగేదాకా, యిప్పుడు తప్ప మరెప్పుడూ ద్రాక్షారసం త్రాగను” అని యేసు అన్నాడు.
MAR 14:26 వాళ్ళు ఒక భక్తిగీతం పాడాక ఒలీవల కొండ మీదికి వెళ్ళారు.
MAR 14:27 యేసు వాళ్ళతో, “మీ మనస్సులు చెదరి పోతాయి. ఎందుకంటే లేఖనాల్లో, ‘నేను గొఱ్ఱెల కాపరిని కొడతాను! గొఱ్ఱెలన్నీచెదరిపోతాయి!’ అని వ్రాయబడింది.
MAR 14:28 కాని, నేను బ్రతికివచ్చాక మీకన్నా ముందుగా గలిలయకు వెళ్తాను” అని అన్నాడు.
MAR 14:29 అప్పుడు పేతురు, “అందరి విశ్వాసం పోయినా నా విశ్వాసం సన్నగిల్లదు” అని అన్నాడు.
MAR 14:30 యేసు సమాధానంగా, “ఇది నిజం. ఈ రోజు, అంటే ఈ రాత్రి కోడి రెండు సార్లు కూయక ముందే నీవు మూడుసార్లు నేనెవరో తెలియదంటావు” అని అన్నాడు.
MAR 14:31 కాని పేతురు ఎన్నటికి అలా అననని అంటూ, “నేను మీతో మరణించవలసి వచ్చినా సరే నేనెప్పటికీ మీరెవరో తెలియదనను” అని అన్నాడు. మిగతా శిష్యులు కూడా అదేవిధంగా అన్నారు.
MAR 14:32 అంతా గెత్సేమనె అనే స్థలానికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థించి వచ్చేదాకా మీరిక్కడే ఉండండి” అని అన్నాడు.
MAR 14:33 కాని యేసు పేతురును, యాకోబును, యోహానును, తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు చాలా దుఃఖం, ఆవేదన కలగటం మొదలుపెట్టింది.
MAR 14:34 ఆయన వాళ్ళతో, “నా ఆత్మ ప్రాణం పోయేటంత దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఇక్కడే కూర్చొని మెలకువతో ఉండండి” అని అన్నాడు.
MAR 14:35 ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై మోకరిల్లి వీలైతే “ఆ ఘడియ” రాకూడదని ప్రార్థిస్తూ,
MAR 14:36 ఆయన, “అబ్బా తండ్రి! నీకన్నీ సాధ్యం ఈ దుఃఖాన్ని నాకు దూరంగా తీసివేయి. కాని, నెరవేరవలసింది నా కోరిక కాదు, నీది” అని అన్నాడు.
MAR 14:37 ఆయన వచ్చి తన శిష్యులు నిద్రిస్తుండడం చూసాడు. ఆయన పేతురుతో, “సీమోనూ! నిద్రిస్తున్నావా, ఒక గంట మేలుకో లేక పోయావా?
MAR 14:38 మెలకువతో ఉండండి. ప్రార్థించండి. అప్పుడే మీరు సైతాను ప్రేరణకు లోంగకుండా ఉంటారు. ఆత్మ సిద్ధమే కాని శరీరంలో బలం లేదు” అని అన్నాడు.
MAR 14:39 యేసు, మళ్ళీ వెళ్ళి మొదటివలే ప్రార్థించాడు.
MAR 14:40 ఆయన తిరిగివచ్చి శిష్యుల కళ్ళు భారంగా ఉండటంవల్ల వాళ్ళు నిద్రిస్తూ వుండటం గమనించాడు. ఆయనకు ఏం సమాధానం చెప్పాలో శిష్యులకు తోచలేదు.
MAR 14:41 యేసు మూడవసారి తిరిగివచ్చి వాళ్ళతో, “ఇంకా హాయిగా నిద్రిస్తున్నారా? చాలించండి. సమయం ఆసన్నమైంది. అదిగో చూడండి. మనుష్య కుమారుడు పాపులకు అప్పగింపబడుతున్నాడు.
MAR 14:42 లేవండి! వెళ్దాం రండి. అదిగో! ద్రోహి వస్తున్నాడు!” అని అన్నాడు.
MAR 14:43 ఆయన ఇంకా మాట్లాడుతుండగా పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు పంపిన ప్రజలు కత్తులు, కర్రలు పట్టుకొని యూదా వెంట ఉన్నారు.
MAR 14:44 ఆ ద్రోహి వాళ్ళతో, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకొంటానో ఆయనే యేసు. ఆయన్ని బంధించి భటుల మధ్య ఉంచి తీసుకు వెళ్ళండి” అని వాళ్ళతో చెప్పాడు. ఆయన్ని ముద్దు పెట్టుకొని వాళ్ళకు సంజ్ఞ చేస్తానని ముందే వాళ్ళతో మాట్లాడుకొన్నాడు.
MAR 14:45 వెంటనే యూదా, యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ!” అని అంటూ ఆయన్ని ముద్దు పెట్టుకొన్నాడు.
MAR 14:46 వచ్చిన ప్రజలు యేసును బంధించారు.
MAR 14:47 యేసు ప్రక్కన నిలుచున్న వాడొకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికి వేసాడు.
MAR 14:48 యేసు, “మీరు కత్తులతో, కర్రలతో వచ్చి బంధించటానికి నేనేమైనా దొంగనా?
MAR 14:49 నేను ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ మీతో ఉన్నవాణ్ణే. అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? కాని, లేఖనాల్లో వ్రాసింది జరిగి తీరాలి” అని అన్నాడు.
MAR 14:50 అప్పుడు యేసు అనుచరులందరూ ఆయన్ని ఒంటరిగా వదిలి పారిపోయారు.
MAR 14:51 ఒక యువకుడు యేసును అనుసరిస్తూ ఉన్నాడు. అతని వంటిమీద నడుముకు కట్టుకొన్న గుడ్డ తప్ప మరేది లేదు. ప్రజలు వానిని కూడా గభాలున పట్టుకున్నారు. కాని,
MAR 14:52 అతడు తన అంగీపై వేసుకొన్న గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు.
MAR 14:53 వాళ్ళు యేసును ప్రధానయాజకుని దగ్గరకు తీసుకు వెళ్ళారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశం అయ్యారు.
MAR 14:54 పేతురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుసరిస్తూ ప్రధాన యాజకుని యింటి పెరట్లోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా చలిమంటలు వేసుకొంటూ వాళ్ళతో కూర్చున్నాడు.
MAR 14:55 ప్రధానయాజకులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు, యేసుకు మరణదండన విధించటానికి తగిన సాక్ష్యం కోసం వెతక సాగారు. కాని వాళ్ళకు సాక్ష్యం లభించలేదు.
MAR 14:56 చాలా మంది ప్రతికూలంగా దొంగసాక్ష్యం చెప్పారు. కాని వాళ్ళ సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొసగలేదు.
MAR 14:57 అప్పుడు కొందరు లేచి ఈ దొంగ సాక్ష్యం చెప్పారు:
MAR 14:58 “‘మానవులు కట్టిన ఈ మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మానవులు కట్టని మరొక మందిరాన్ని నిర్మిస్తాను’ అని అతడు అనటం మేము విన్నాము.”
MAR 14:59 కాని ఆ సాక్ష్యం కూడా ఒకరు ఒక విధంగా, యింకొకరు యింకో విధంగా చెప్పారు.
MAR 14:60 ఆ తర్వాత ప్రధాన యాజకుడు లేచి సభ్యుల ముందు నిలుచొని యేసుతో, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా! నీవేమంటావు?” అని అడిగాడు.
MAR 14:61 కాని యేసు ఏ సమాధానం చెప్పక మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మానవులు స్తుతించే దేవుని కుమారుడవా?” అని మళ్ళీ ప్రశ్నించాడు.
MAR 14:62 యేసు, “ఔను, సర్వశక్తిసంపన్నుడైన దేవుని కుడిచేతి వైపు మనుష్యకుమారుడు కూర్చొని ఉండటం, ఆయన పరలోకంలో నుండి మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు.
MAR 14:63 ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని “మనకు యితర సాక్ష్యాలు ఎందుకు?
MAR 14:64 అతడు దైవదూషణ చేయటం మీరు విన్నారుగదా; మీ అభిప్రాయమేమిటి?” అని సభ్యుల్ని అడిగాడు. అందరూ మరణదండన విధించాలని అన్నారు.
MAR 14:65 ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయటం మొదలుపెట్టారు. కొందరు ఆయన కళ్ళకు గంతలు కట్టి తమ పిడికిలితో గుద్ది, “ఎవరో చెప్పుకో” అని హేళన చేసారు. కాపలాకాచే భటులు ఆయన్ని తీసుకువెళ్ళి కొట్టారు.
MAR 14:66 పేతురు, క్రింద యింటి ముందు పెరట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని దాసీలలో ఒకతె అక్కడకు వచ్చింది.
MAR 14:67 పేతురు చలిమంటలు వేసుకొంటూ అక్కడ ఉండటం చూసి అతని దగ్గరకు వెళ్ళి అతణ్ణి పరీక్షగా చూసింది. “నజరేతు యేసుతో నీవు కూడా ఉన్నావు కదూ!” అని ఆమె పేతురుతో అన్నది.
MAR 14:68 అతడు నాకు తెలియదంటూ, “నీవేం అంటున్నానో నాకు అర్థం కావటంలేదు” అని అన్నాడు. పేతురు ద్వారం వైపు వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది.
MAR 14:69 ఆ దాసీపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వాళ్ళతో, “ఇతడు వాళ్ళలో ఒకడు” అని మళ్ళీ అన్నది.
MAR 14:70 మళ్ళీ పేతురు, “అది నిజం కాదు; నాకు తెలియదు” అని అన్నాడు. కొద్ది సేపయ్యాక పేతురుతో నిలుచున్న వాళ్ళు అతనితో, “నీవు కూడ గలిలయ వాడవు కనుక తప్పకుండా వాళ్ళలో ఒకడివి” అని అన్నారు.
MAR 14:71 పేతురు తన మీద ఒట్టు పెట్టుకొంటూ, “ప్రమాణంగా చెబుతున్నాను. మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు.
MAR 14:72 వెంటనే రెండవసారి కోడి కూసింది. అప్పుడు యేసు తనతో అన్న ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి రెండు సార్లు కూయకముందే నేనెవరో తెలియదని మూడుసార్లు అంటావు.” పేతురు దుఃఖం ఆపుకోలేక శోకించటం మొదలు పెట్టాడు.
MAR 15:1 తెల్లవారుఝామున ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు యేసును బంధించి తీసుకెళ్ళి పిలాతుకు అప్పగించారు.
MAR 15:2 పిలాతు, “నీవు యూదులకు రాజువా?” అని అడిగాడు. “మీరే అంటున్నారుగా!” అని యేసు సమాధానం చెప్పాడు.
MAR 15:3 ప్రధానయాజకులు యేసు మీద ఎన్నో నేరాలు మోపారు.
MAR 15:4 అందువల్ల పిలాతు యేసుతో మళ్ళీ, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వాళ్ళు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు!” అని అన్నాడు.
MAR 15:5 అయినా యేసు సమాధానం చెప్పలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది.
MAR 15:6 పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్తుణ్ణి విడుదల చేయటం ఒక ఆచారం.
MAR 15:7 తిరుగుబాటులో పాల్గొని హత్యలు చేసిన వాళ్ళు కారాగారంలో ఉన్నారు. వాళ్ళలో బరబ్బ ఒకడు.
MAR 15:8 ప్రజలు పిలాతు దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరం విడుదల చేసినట్లే ఆ సంవత్సరం కూడా ఒకణ్ణి విడుదల చెయ్యమని కోరారు.
MAR 15:9 ప్రధానయాజకులు అసూయవల్ల యేసును తనకప్పగించారని పిలాతుకు తెలుసు. కనుక, “యూదుల రాజును విడుదల చెయ్యమంటారా?” అని అడిగాడు.
MAR 15:11 కాని ప్రధానయాజకులు యేసుకు మారుగా బరబ్బాను విడుదల చేసేటట్లు పిలాతును కోరమని ప్రజలను పురికొల్పారు.
MAR 15:12 పిలాతు, “మరి మీరు ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ మనిషిని ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు.
MAR 15:13 వాళ్ళు, “సిలువకు వేయుము!” అని కేకలు వేసారు.
MAR 15:14 “ఎందుకు? అతడు చేసిన నేరమేమిటి?” అని పిలాతు అడిగాడు. ప్రజలు యింకా బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వేయండి” అని కేకలు వేసారు.
MAR 15:15 ఆ ప్రజల గుంపును ఆనందపరచాలని వాళ్ళు అడిగినట్లు బరబ్బను విడుదల చేసాడు. కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వెయ్యమని యేసును భటులకు అప్పగించాడు.
MAR 15:16 భటులు యేసును రాజభవనంలో, అంటే ప్రేతోర్యమునకు తీసుకెళ్ళి, భటులందరిని సమావేశ పరచారు.
MAR 15:17 వాళ్ళాయనకు ఊదారంగు రాజ దుస్తులను తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు.
MAR 15:18 ఆ తర్వాత, “యూదుల రాజా! జయము!” అని ఆయన్ని పిలుస్తూ కేకలు వేసారు.
MAR 15:19 ఆయన తలపై కర్రతో మాటి మాటికి కొడుతూ ఆయన మీద ఉమ్మివేసారు. ఆయన ముందు వంగి తమ మోకాళ్ళపై కూర్చొని ఆయన్ని వ్యంగ్యంగా పూజించారు.
MAR 15:20 ఆయన్ని హేళన చేసిన తర్వాత, ఊదారంగు దుస్తుల్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తర్వాత ఆయన్ని సిలువకు వేయటానికి తీసుకు వెళ్ళారు.
MAR 15:21 కురేనే పట్టణానికి చెందిన సీమోను అనే వాడొకడు పొలాలనుండి ఆ దారిన వెళ్తూ ఉన్నాడు. ఇతడు అలెక్సంద్రుకు మరియు రూపునకు తండ్రి. భటులు యితనితో బలవంతంగా సిలువ మోయించారు.
MAR 15:22 వాళ్ళు యేసును గొల్గొతాకు తీసుకువచ్చారు. గొల్గొతా అంటే “పుర్రెలాంటి స్థలం” అని అర్థం.
MAR 15:23 అక్కడ వాళ్ళు ఆయనకు ద్రాక్షారసంలో మత్తు కలిపి త్రాగమని యిచ్చారు. కాని ఆయన త్రాగలేదు.
MAR 15:24 ఆ తర్వాత వాళ్ళాయన్ని సిలువకు వేసారు. ఆయన దుస్తులు పంచుకోవటానికి చీట్లు వేసి ఎవరికి వచ్చినవి వాళ్ళు తీసుకొన్నారు.
MAR 15:25 ఆయన్ని సిలువ వేసినప్పుడు ఉదయం తొమ్మిది గంటలు.
MAR 15:26 ఆయనపై మోపబడిన నేరాన్ని, “యూదులరాజగు యేసు” అని ఒక పలకపై వ్రాసి తగిలించారు.
MAR 15:27 ఆయనతో సహా యిద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువకు వేసారు.
MAR 15:28 
MAR 15:29 ఆ దారి మీద నడిచివెళ్ళే వాళ్ళు ఆయన్ని అవమానపరచారు. వాళ్ళు తమ తలలాడిస్తూ, “మరి మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్న వాడవు గదా.
MAR 15:30 సిలువ నుండి క్రిందికి దిగి నిన్ను నీవు కాపాడుకోలేవా?” అని అన్నారు.
MAR 15:31 ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా ఆయన్ని హేళన చేస్తూ “ఇతరులను రక్షించాడు కాని తనను తాను రక్షించుకోలేడు.
MAR 15:32 ఈ క్రీస్తు, ఈ ఇశ్రాయేలు రాజు సిలువనుండి క్రిందికి దిగివస్తే చూసి అప్పుడు విశ్వసిస్తాము” అని పరస్పరం మాట్లాడుకొన్నారు. ఆయనతో సహా సిలువకు వేయబడ్డ వాళ్ళు కూడా యేసును అవమానించారు.
MAR 15:33 మధ్యాహ్నం పన్నెండు గంటలనుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది.
MAR 15:34 మూడు గంటలకు యేసు బిగ్గరగా, “ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ” అంటే, “నాదేవా! నాదేవా! నన్నెందుకు ఒంటరిగా వదిలివేసావు” అని కేకవేసాడు.
MAR 15:35 దగ్గర నిలుచున్న కొందరు ఇది విని, “వినండి! అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు.
MAR 15:36 ఒకడు పరుగెత్తి వెళ్ళి ఒక స్పాంజిని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక కట్టెకు తగిలించి యేసుకు త్రాగటానికి అందించాడు. మరొకడు, “అతణ్ణి వదలండి! అతణ్ణి క్రిందికి దింపటానికి ఏలియా వస్తాడేమో చూద్దాం!” అని అన్నాడు.
MAR 15:37 పెద్ద కేక పెట్టి యేసు ప్రాణం వదిలాడు.
MAR 15:38 అప్పుడు మందిరంలోని తెర మీది నుండి క్రింది వరకు రెండు భాగాలుగా చినిగిపోయింది.
MAR 15:39 యేసు ముందు నిలుచొని ఉన్న శతాధిపతి ఆయన కేక విని, ఆయన చనిపోయిన విధం చూసి, “ఈయన తప్పక దేవుని కుమారుడు” అని అన్నాడు.
MAR 15:40 కొందరు స్త్రీలు దూరం నుండి అన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబుకు, యోసేపుకు తల్లి అయిన మరియ మరియు సలోమే ఉన్నారు.
MAR 15:41 గలిలయలో ఉన్నప్పుడు వీళ్ళు యేసును అనుసరిస్తూ, ఆయనకు సేవచేస్తూ ఉండేవాళ్ళు, వీళ్ళేగాక ఆయన వెంట యెరూషలేమునకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు.
MAR 15:42 అది సబ్బాతుకు సిద్దమయ్యే రోజు, అనగా విశ్రాంతి రోజుకు ముందు రోజు సాయంత్రమయింది.
MAR 15:43 అరిమతయియ గ్రామస్తుడు యోసేపు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని అడిగాడు. యోసేపు మహాసభలో పేరుగల సభ్యుడు. ఇతడు స్వయంగా దేవుని రాజ్యంకొరకు కాచుకొని ఉండేవాడు.
MAR 15:44 యేసు అప్పుడే చనిపోయాడని విని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు.
MAR 15:45 ఆ సైన్యాధిపతి ఔనని అన్నాక యేసు దేహాన్ని తీసుకు వెళ్ళటానికి యోసేపుకు అనుమతి యిచ్చాడు.
MAR 15:46 యోసేపు, నారతో చేసిన వస్త్రాన్ని కొనుక్కొని వచ్చి, యేసు దేహాన్ని క్రిందికి దింపి ఆ వస్త్రంలో చుట్టాడు. ఆ తర్వాత ఆ దేహాన్ని తీసుకువెళ్ళి రాతితో మలచిన సమాధిలో ఉంచాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధి మూసివేసాడు.
MAR 15:47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లి మరియ ఆ దేహం ఉంచిన స్థలాన్ని చూసారు.
MAR 16:1 విశ్రాంతి రోజు ముగియగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ మరియు సలోమే యేసు దేహానికి పూయటానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు.
MAR 16:2 ఆదివారం ఉదయం సూర్యోదయం అవుతుండగా వాళ్ళు సమాధి దగ్గరకు వెళ్ళాలని బయలుదేరారు.
MAR 16:3 “ఇంతకూ సమాధికి అడ్డంగా ఉన్న రాయిని ఎవరు తీస్తారు?” అని పరస్పరం దారిలో మాట్లాడుకొన్నారు.
MAR 16:4 వాళ్ళు కళ్ళెత్తి సమాధి వైపు చూసారు. ఆ పెద్దరాయి దొర్లిపోయి ఉంది.
MAR 16:5 వాళ్ళు సమాధిలోకి ప్రవేశించారు. అక్కడ దానికి కుడి వైపు ఒక యువకుడు తెల్లటి దుస్తులు ధరించి ఉండటం చూసారు. వాళ్ళకు భయం వేసింది.
MAR 16:6 ఆ యువకుడు, “భయపడకండి, సిలువకు వేయబడిన నజరేతు యేసు కోసం చూస్తున్నారా? ఆయన యిక్కడ లేడు. ఆయన బ్రతికి వచ్చి వెళ్ళిపొయ్యాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలం చూడండి.
MAR 16:7 కాని మీరు వెళ్ళి శిష్యులతో, ముఖ్యంగా పేతురుతో ఈ విధంగా చెప్పండి: ‘యేసు మీకు ముందే గలిలయకు వెళ్తున్నాడు. ఆయన ముందే చెప్పినట్లు, మీరు ఆయన్ని అక్కడ చూస్తారు.’”
MAR 16:8 ఆ స్త్రీలు దిగ్భ్రాంతి చెంది వణుకుతూ ఆ సమాధినుండి పరుగెత్తి పోయారు. భయంవల్ల వాళ్ళు ఎవరికీ ఏమీ చెప్పలేదు. (ముఖ్యమైన ప్రాచీన వ్రాతప్రతులు మార్కు 16:8 తోసమాప్తమయ్యాయి.)
MAR 16:9 యేసు ఆదివారం తెల్లవారుఝామున బ్రతికి వచ్చి మొదట మగ్దలేనే మరియకు కనిపించాడు. గతంలో యేసు ఈమె నుండి ఏడు దయ్యాలను వదిలించి ఉన్నాడు.
MAR 16:10 ఆమె ఇదివరలో యేసుతో ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ ఉన్నారు. ఆమె వాళ్లకు జరిగిన సంగతి చెప్పింది.
MAR 16:11 యేసు బ్రతికి ఉన్నాడని, తాను ఆయన్ని చూసానని చెప్పింది. ఇది వాళ్ళు విన్నారు. కాని వాళ్ళు ఆమె మాటలు నమ్మలేదు.
MAR 16:12 ఆ తర్వాత యేసు తన యిద్దరు శిష్యులు వారి గ్రామానికి నడుస్తుండగా మరో రూపంలో కనిపించాడు.
MAR 16:13 వీళ్ళు తిరిగి వచ్చి జరిగిన విషయం మిగిలిన శిష్యులకు చెప్పారు. కాని వాళ్ళు వీళ్ళను కూడా నమ్మలేదు.
MAR 16:14 ఆ తర్వాత పదకొండుగురు భోజనం చేస్తుండగా యేసు వాళ్ళకు కనిపించాడు. తాను బ్రతికి వచ్చిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు. కనుక యేసు వాళ్ళు తనను నమ్మనందుకు వాళ్ళను గద్దించాడు.
MAR 16:15 యేసు వాళ్ళతో, “ప్రపంచమంతా పర్యటన చేసి ప్రజలందరికి సువార్త ప్రకటించండి.
MAR 16:16 విశ్వసించి బాప్తిస్మము పొందిన వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. కాని, విశ్వసించని వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు.
MAR 16:17 విశ్వసించిన వాళ్లకు ఈ ఋజువులు కనిపిస్తాయి. నాపేరిట వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టకలుగుతారు. తమకు రాని భాషల్లో మాట్లాడకలుగుతారు.
MAR 16:18 తమ చేతుల్తో పాముల్ని పట్టుకోగలుగుతారు. విషం త్రాగినా వాళ్ళకే హానీ కలుగదు. వాళ్ళు తమ చేతుల్ని రోగులపై ఉంచితే వాళ్ళకు నయమైపోతుంది” అని అన్నాడు.
MAR 16:19 యేసు ప్రభువు వాళ్ళతో మాట్లాడిన తరువాత దేవుడాయన్ని పరలోకానికి పిలుచుకొన్నాడు. ఆయన అక్కడ దేవుని కుడిచేతి వైపున కూర్చున్నాడు.
MAR 16:20 ఆ తర్వాత వాళ్ళు అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించారు. ప్రభువు వాళ్ళతో సహా పని చేసి వాళ్ళు ప్రకటించిన సందేశం నిజమని నిరూపించటానికి ఎన్నో అద్భుతాలు చేసి చూపాడు. ఆమేన్.
LUK 1:1 గౌరవనీయులైన థెయొఫిలాకు: మనలో జరిగిన సంఘటల్ని మొదటి నుండి కండ్లారా చూసి, దైవ సందేశాన్ని బోధించిన వాళ్ళు మనకు వాటిని అందించారు.
LUK 1:2 వీటన్నిటినీ నేను మొదట నుండి క్షుణ్ణంగా పరిశోధించాను కనుక నాకు కూడా వీటన్నిటిని క్రమపద్ధతిలో వ్రాసి మీకు అందించటం ఉత్తమమనిపిం చింది.
LUK 1:4 మీరు నేర్చు కొన్నవి నిజమని మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ గ్రంథం మీకోసం వ్రాస్తున్నాను.
LUK 1:5 హేరోదు రాజు యూదయను పాలించే కాలంలో జెకర్యా అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఇతడు అబీయా అనబడే యాజక శాఖకు చెందినవాడు. ఇతని భార్య అహారోను శాఖకు చెందినది. ఆమె పేరు ఎలీసబెతు.
LUK 1:6 ఈ దంపతులు యధార్థంగా, దేవునికి ప్రీతికరంగా నుడుచుకుంటూ ప్రభువు ఆజ్ఞల్ని పాటిస్తూ ఏ అపకీర్తి లేకుండా నిష్టాపరులై జీవించే వాళ్ళు,
LUK 1:7 ఎలీసబెతు గొడ్రాలు. పైగా వాళ్ళిద్దరూ వయస్సు మళ్ళిన వాళ్ళు. వాళ్ళకు సంతానం కలుగలేదు.
LUK 1:8 తన శాఖకు చెందిన వాళ్ళు చేయవలసిన వంతు రావటంవల్ల జెకర్యా యాజక పనులు చేస్తూ ఉన్నాడు.
LUK 1:9 దేవాలయంలో దేవునికి ధూపం వేయటానికి వాడుక ప్రకారం చీట్లు వేసి జెకర్యాను ఎన్నుకున్నారు.
LUK 1:10 అతడు ధూపం వేస్తుండగా బయట సమావేశమైన భక్తులు ప్రార్థిస్తున్నారు.
LUK 1:11 ధూపవేదికకు కుడివైపున జెకర్యాకు ఒక దేవదూత ప్రత్యక్షం అయ్యాడు.
LUK 1:12 జెకర్యా అతణ్ణి చూడగానే ఉలిక్కి పడ్డాడు. అతనికి భయం వేసింది.
LUK 1:13 దేవదూత అతనితో, “జెకర్యా భయపడకు. దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. నీ భార్య ఎలీసబెతు ఒక మగశిశువును కంటుంది. ఆ పిల్లవానికి యోహాను అని నామకరణం చెయ్యి.
LUK 1:14 ఇతని పుట్టుక వల్ల నీవు చాలా ఆనందిస్తావు. నీవేకాక ప్రజలందరూ ఆనందిస్తారు.
LUK 1:15 అతడు ఆధ్యాత్మికతతో గొప్పవాడౌతాడు. దేవుడతని గొప్పతనం చూసి ఆనందిస్తాడు. అతడు ద్రాక్షారసం కాని, లేక యితర రకములైన మద్యపానాల్ని కాని ముట్టడు. పుట్టినప్పటి నుండే అతనిలో పవిత్రాత్మ ఉంటాడు.
LUK 1:16 “ఇశ్రాయేలు ప్రజల ప్రభువైన దేవుని దగ్గరకు యితడు చాలా మంది ప్రజల్ని తీసుకు వస్తాడు.
LUK 1:17 తండ్రుల హృదయాలను పిల్లల వైపు మళ్ళించటానికి, దేవుణ్ణి నమ్మని వాళ్ళను నీతిమంతుల జ్ఞానం సంపాదించేటట్లు చెయ్యటానికి, ప్రభువు రాకకు ప్రజల్ని సిద్ధపరచటానికి ఇతడు ఏలియాలో ఉన్న ఆత్మ బలంతో ప్రభువు కన్నా ముందుగా వెళ్తాడు” అని అన్నాడు.
LUK 1:18 జెకర్యా దేవదూతతో, “మీరన్న విధంగా జరుగుతుందన్నదానికి నిదర్శన మేమిటి? నేను ముసలి వాణ్ణి. నా భార్యకు కూడా వయస్సు మళ్ళింది” అని అన్నాడు.
LUK 1:19 దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నా పేరు గాబ్రియేలు. నేను దేవుని దూతను. నీతో మాట్లాడి నీకి సువార్త చెప్పుమని దేవుడు నన్ను పంపాడు.
LUK 1:20 జాగ్రత్త! నీవు నా మాటలు నమ్మటం లేదు కనుక మూగవాడవై పోతావు. తగిన సమయం వచ్చాక నా మాటలు నిజమౌతాయి. అంతవరకు నీకు మాటలు రావు.”
LUK 1:21 బయట ప్రజా సమూహం జెకర్యా దేవాలయంలో యింతవరకు ఎందుకున్నాడో అని ఆశ్చర్యంతో అతని కోసం కాచుకొని ఉన్నారు.
LUK 1:22 జెకర్యా వెలుపలికి వచ్చాడు. కాని వాళ్ళతో మాట్లాడలేక పోయాడు. ఏమీ మాట్లాడలేక సంజ్ఞలు చెయ్యటం వల్ల దేవాలయంలో అతనికి దివ్య దర్శనం కలిగినదని అక్కడున్న వాళ్ళు గ్రహించారు.
LUK 1:23 సేవా దినములు ముగిసాక అతడు తన యింటికి వెళ్ళిపోయాడు.
LUK 1:24 కొన్ని రోజుల తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఐదు నెలల దాకా ఆమె గడపదాటలేదు.
LUK 1:25 “ప్రభువు ఈ దశలో నాకీ గర్భం యిచ్చి నన్ను అనుగ్రహించాడు; నలుగురిలో నాకున్న అవమానం తొలగించాడు” అని ఆమె అన్నది.
LUK 1:26 ఎలీసబెతు ఆరు నెలల గర్భంతో ఉంది. అప్పుడు దేవుడు గాబ్రియేలు అనే దేవదూతను గలిలయలోని నజరేతు అనే పట్టణంలో ఉన్న ఒక కన్య దగ్గరకు పంపాడు.
LUK 1:27 దావీదు వంశస్థుడైన యోసేపు అనే వ్యక్తితో ఈ కన్యకు పెళ్ళి నిశ్చయమైంది. ఈ కన్య పేరు మరియ.
LUK 1:28 ఈ దేవదూత ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో, “నీకు శుభం కలుగుగాక! ప్రభువు నిన్ను అనుగ్రహించాడు. ఆయన నీతో ఉన్నాడు” అని అన్నాడు.
LUK 1:29 దేవదూత మాటలు విని మరియ కంగారు పడి ఇతని దీవెనకు అర్థమేమిటా అని ఆశ్చర్యపడింది.
LUK 1:30 ఇది చూసి దేవదూత ఆమెతో యిలా అన్నాడు: “భయపడకు మరియా! దేవుడు నిన్ను అనుగ్రహించాడు.
LUK 1:31 నీవు గర్భం దాల్చి మగ శిశువును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెట్టు.
LUK 1:32 ఆయన చాలా గొప్ప వాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకు యిస్తాడు.
LUK 1:33 యాకోబు వంశానికి చెందిన వాళ్ళందర్ని ఈయన చిరకాలం పాలిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ అంతరించదు.”
LUK 1:34 “నా కింకా పెండ్లి కాలేదే! ఇది ఎట్లా సాధ్యమవుతుంది?” అని మరియ దేవదూతను అడిగింది.
LUK 1:35 ఆ దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పవిత్రాత్మ నీ మీదికి వచ్చునప్పుడు సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అందువలన నీకు పుట్టబోయే శిశువు పవిత్రంగా ఉంటాడు. ఆ శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.
LUK 1:36 నీ బంధువు ఎలీసబెతు తన వృద్ధాప్యంలో తల్లి కాబోతోంది. గొడ్రాలని పిలవబడే ఆమె యిప్పుడు ఆరు నెలల గర్భంతో ఉంది.
LUK 1:37 దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు.”
LUK 1:38 మరియ, “నేను దేవుని సేవకురాలను. మీరన్న విధంగానే జరుగనీ!” అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు.
LUK 1:39 మరియ వెంటనే యూదా పర్వత ప్రాంతం లోని ఒక గ్రామానికి వెళ్ళటానికి ప్రయాణమైంది.
LUK 1:40 ఆ గ్రామంలోనున్న జెకర్యా యింటికి వెళ్ళి ఎలీసబెతును కలుసుకొని ఆమె క్షేమ సమాచారాలు అడిగింది.
LUK 1:41 ఎలీసబెతు ఆమె మాటలు విన్న తక్షణమే, ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసాడు. ఎలీసబెతు పవిత్రాత్మతో నిండిపోయింది.
LUK 1:42 ఆమె బిగ్గరగా, “దేవుడు ఏ స్త్రీని దీవించనంతగా నిన్ను దీవించాడు. అదే విధంగా నీ గర్భంలో నున్న శిశువు కూడా ధన్యుడు.
LUK 1:43 కాని దేవుడు నా మీద యింత దయ ఎందుకు చూపుతున్నాడు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటమా?
LUK 1:44 నీ మాటలు నా చెవిలో పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు.
LUK 1:45 ప్రభువు చెప్పినట్లు జరుగుతుందని విశ్వసించావు. ధన్యురాలవు” అని అన్నది.
LUK 1:46 మరియ ఈ విధంగా అన్నది:
LUK 1:47 “నా ఆత్మ ప్రభువును కొలిచింది. దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు.
LUK 1:48 దీనురాల్ని నేను! ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు! ఇకనుండి అందరూ నన్ను ధన్యురాలంటారు!
LUK 1:49 దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం!
LUK 1:50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.
LUK 1:51 తన బలమైన హస్తాన్ని జాపి గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు.
LUK 1:52 రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు. దీనులకు గొప్ప స్థానాలిస్తాడు.
LUK 1:53 పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు. ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు.
LUK 1:54 తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో, అతని సంతతితో చెప్పినట్లు
LUK 1:55 దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”
LUK 1:56 మరియ ఎలీసబెతు యింట్లో మూడు నెలలుండి, ఆ తర్వాత యింటికి తిరిగి వెళ్ళిపోయింది.
LUK 1:57 ఎలీసబేతుకు నెలలు నిండి మగశిశువును ప్రసవించింది.
LUK 1:58 బంధువులు మరియు ఇరుగు పొరుగు వాళ్ళు ప్రభువు ఆమెను కనికరించినందుకు ఆనందించారు.
LUK 1:59 ఎనిమిదవ రోజు వాళ్ళు పిల్లవానికి సున్నతి చేయటానికి వచ్చి అతనికి జెకర్యా అని అతని తండ్రి పేరే పెట్టబోయారు.
LUK 1:60 కాని తల్లి వారిస్తూ, “ఆ పేరు వద్దు! యోహాను అని పేరు పెట్టండి” అని అన్నది.
LUK 1:61 వాళ్ళు, “మీ బంధువుల్లో ఆ పేరున్న వాళ్ళు ఎవ్వరూ లేరే?” అని అన్నారు.
LUK 1:62 ఆ పిల్లవాని తండ్రికి సంజ్ఞలు చేసి అతడే పేరు పెట్టదలచాడో అని అడిగారు.
LUK 1:63 అతడు వ్రాయటానికి ఒక పలక నివ్వమని అడిగి దానిపై, “అతనికి యోహాను అని పేరు పెట్టండి” అని వ్రాసాడు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు.
LUK 1:64 వెంటనే అతని నోరు, నాలుక కదిలి బాగైపోయింది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు.
LUK 1:65 ఇరుగు పొరుగు వాళ్ళలో భక్తి, భయమూ నిండుకుపొయ్యాయి. యూదయ పర్వత ప్రాంతమంతా ఈ వార్త వ్యాపించింది.
LUK 1:66 ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడి, “ఈ పసివాడు ఎంతగొప్పవాడౌతాడో కదా!” అని అన్నారు. ఆ బాలునికి ప్రభువు హస్తం తోడుగా ఉంది.
LUK 1:67 ఆ బాలుని తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నింపబడి దేవుని సందేశాన్ని ఈ విధంగా చెప్పాడు:
LUK 1:68 “తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి! ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి!
LUK 1:69 మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి మనకోసం పంపాడు.
LUK 1:70 గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా ఈ విషయం చెప్పాడు.
LUK 1:71 దేవుడు శత్రువుల బారినుండి, మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు.
LUK 1:72 మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు. పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు!
LUK 1:73 శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు.
LUK 1:74 మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి.
LUK 1:75 జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం!
LUK 1:76 “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు! ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు!
LUK 1:77 పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు!
LUK 1:78 “మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి ఒక నీతిసూర్యుణ్ణి పంపించి,
LUK 1:79 మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!”
LUK 1:80 ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం వచ్చే దాకా యోహాను ఎడారుల్లో జీవించాడు.
LUK 2:1 ఇది యిలా వుండగా రోమా సామ్రాజ్యమంతటా జనాభా లెక్కలు సేకరించటానికి కైసరు ఔగుస్తు చక్రవర్తి ఒక ప్రకటన జారీ చేశాడు.
LUK 2:2 కురేనియ సిరియ దేశాన్ని పాలిస్తున్న కాలంలో మొదటి సారిగా ఇలాంటి జనాభా లెక్కలు సేకరింపబడ్డాయి.
LUK 2:3 అందువల్ల ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లు వ్రాయబడటానికి తమ స్వగ్రామాలకు వెళ్ళారు.
LUK 2:4 యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి అతడు గలిలయలోని నజరేతు అనే పట్టణం నుండి యూదయ దేశంలోని దావీదు పట్టణానికి వెళ్ళాడు. దీన్ని బేత్లెహేము అని అనే వాళ్ళు.
LUK 2:5 మరియతో ఇతనికి పెళ్ళి నిశ్చయమై ఉంది. మరియ గర్భంతో ఉంది. అతడు ఆమెను తన వెంట తీసుకొని తమ పేర్లు జాబితాలో వ్రాయించుకోటానికి వెళ్ళాడు.
LUK 2:6 వాళ్ళక్కడ ఉండగా ఆమెకు ప్రసవవేదన వచ్చింది.
LUK 2:7 ఆమె మగ శిశువును ప్రసవించింది. ఈయన ఆమె మొదటి కుమారుడు. వాళ్ళకు సత్రంలో గది దొరకనందువల్ల ఆమె ఆ పసివాణ్ణి పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో ఉంచింది.
LUK 2:8 ఊరు ప్రక్క పొలాల్లో ఉన్న గొఱ్ఱెల కాపరులు రాత్రివేళ తమ గొఱ్ఱెల్ని కాపలాకాస్తూ ఉన్నారు.
LUK 2:9 ఒక దేవదూత వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ చుట్టూ దివ్యమైన వెలుగు ప్రకాశించింది. వాళ్ళు చాలా భయపడ్డారు.
LUK 2:10 ఆ దేవదూత వాళ్ళతో, “భయపడకండి! మీకే కాక ప్రజలందరికి ఆనందం కలిగించే సువార్త తెచ్చాను.
LUK 2:11 దావీదు పట్టణంలో ఈ రోజు మీకోసం రక్షకుడు జన్మించాడు. ఆయనే మన ప్రభువు.
LUK 2:12 మీకొక గుర్తు చెబుతాను. పశువుల తొట్టిలో, పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక పసివాడు మీకు కనిపిస్తాడు” అని అన్నాడు.
LUK 2:13 తక్షణం పరలోకంలోనుండి చాలామంది దేవదూతలు వచ్చి అక్కడున్న దేవదూతతో నిలుచొని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విధంగా అన్నారు:
LUK 2:14 “మహోన్నత లోకంలోవున్న దేవునికి మహా తేజస్సు కలుగుగాక! భూమ్మీద ఆయన ప్రేమించే ప్రజలకు శాంతి కలుగుగాక!”
LUK 2:15 దేవదూతలు వాళ్ళను వదిలి పరలోకానికి వెళ్ళి పొయ్యాక గొఱ్ఱెల కాపరులు, “జరిగిన దాన్ని గురించి ప్రభువు మనకు చెప్పాడు. బేత్లెహేము వెళ్ళి ఇది చూసి వద్దాం” అని మాట్లాడుకొన్నారు.
LUK 2:16 వాళ్ళు తక్షణం అక్కడికి వెళ్ళారు. మరియను, యోసేపును, తొట్టిలో పడుకొనివున్న పసివాణ్ణి, చూసారు.
LUK 2:17 ఆ బాలుణ్ణి చూసాక ఆయన్ని గురించి దేవదూత తమతో చెప్పిన విషయం అందరితో చెప్పారు.
LUK 2:18 వాళ్ళు చెప్పింది విని అంతా ఆశ్చర్యపోయారు.
LUK 2:19 కాని, మరియ యివన్నీ మనస్సులో భద్రంగా దాచుకొని వాటిని గురించి ఆలోచించేది.
LUK 2:20 గొఱ్ఱెల కాపరులు తాము విన్నవి, చూసినవి దేవదూత చెప్పినట్లు జరిగినందుకు వాటిని గురించి మాట్లాడుకొంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన తేజస్సును పొగుడుతూ తిరిగి వెళ్ళిపొయ్యారు.
LUK 2:21 ఎనిమిదవ రోజున సున్నతి చేయించి ఆ బాలునికి యేసు అని నామకరణం చేసారు. మరియ గర్భవతి కాకముందే దేవదూత ఈ పేరు మరియకు చెప్పాడు.
LUK 2:22 మోషే ధర్మశాస్త్రానుసారం మరియ, యోసేపులు పరిశుభ్రం కావలసిన సమయం వచ్చింది. వాళ్ళు ఆ బాలుణ్ణి ప్రభువుకు అర్పించటానికి యెరూషలేముకు వెళ్ళారు.
LUK 2:23 ప్రభువు యొక్క ధర్మశాస్త్రంలో, “మొదటి మగసంతానాన్ని దేవునికి సమర్పించాలి” అని వ్రాయబడి ఉంది.
LUK 2:24 అంతేకాక, ప్రభువు యొక్క ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్ళు వెళ్ళి రెండు పావురాలనైనా లేక రెండు గువ్వలనైనా బలి యివ్వాలనుకొన్నారు.
LUK 2:25 ఇక్కడ యెరూషలేములో సుమెయోను అని పిలువబడే ఒక వ్యక్తివున్నాడు. ఇతడు భక్తితో నీతిగా జీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కాచుకొని ఉండేవాడు. అతడు పవిత్రాత్మ పూర్ణుడు.
LUK 2:26 ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూసే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి బయలుపర్చాడు.
LUK 2:27 పవిత్రాత్మ తన మీదికి రాగా అతడు దేవాలయంలోకి వెళ్ళాడు. అదే సమయానికి ధర్మశాస్త్రం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియ, యోసేపు బాలునితో సహా మందిరంలోకి వచ్చారు.
LUK 2:28 సుమెయోను ఆ బాలుణ్ణి తన చేతుల్తో ఎత్తి దేవుణ్ణి ఈ విధంగా స్తుతించడం మొదలు పెట్టాడు:
LUK 2:29 “మహా ప్రభూ! నీ మాట ప్రకారం నీ సేవకుణ్ణి శాంతంగా వెళ్ళనివ్వు.
LUK 2:30 నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూసాను.
LUK 2:31 నీవు ఆయన్ని ప్రపంచములోని ప్రజలందరి ముందు ఎన్నుకొన్నావు!
LUK 2:32 యూదులుకాని వాళ్ళకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఆయనే. నీ ఇశ్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే!”
LUK 2:33 యేసు తల్లితండ్రులు అతడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు.
LUK 2:34 ఆ తర్వాత సుమెయోను వాళ్ళను ఆశీర్వదించి యేసు తల్లియైన మరియతో ఈ విధంగా అన్నాడు: “ఈ బాలుని కారణంగా ఎందరో ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతారు! మరెందరో పడిపోతారు! ఈ బాలుడు దేవుని చిహ్నం. ఈ చిహ్నాన్ని చాలా మంది ఎదిరిస్తారు.
LUK 2:35 తద్వారా మనుష్యుల మనస్సుల్లో ఉన్న రహస్యాలు బయట పడ్తాయి. ఒక కత్తి నీ గుండెను దూసుకుపోతుంది.”
LUK 2:36 ఆ మందిరంలో, “అన్న” అనే ఒక ప్రవక్త్రి కూడా ఉండేది. ఈమె పనూయేలు కుమార్తె. ఆషేరు తెగకు చెందింది. ఆమె వయస్సులో చాలా పెద్దది. పెండ్లి అయిన ఏడు సంవత్సరాలకే ఆమె వితంతువు అయింది.
LUK 2:37 అప్పటికి ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు. మందిరం విడిచి వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళు ప్రార్థించేది. ఉపవాసాలు చేసేది.
LUK 2:38 మరియ, యోసేపులు అక్కడ ఉండగా ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు చెప్పి యెరూషలేములో విముక్తి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికి ఆ బాలుణ్ణి గురించి చెప్పింది.
LUK 2:39 ప్రభువు ధర్మశాస్త్రానుసారం చేయవలసినవన్నీ చేశాక మరియ, యోసేపులు తమ స్వగ్రామమైన గలిలయలోని నజరేతుకు తిరిగి వెళ్ళిపోయారు.
LUK 2:40 యేసు పెరిగి పెద్ద వాడయ్యాడు. బలంతోపాటు తెలివి కూడా ఆయనలో అభివృద్ధి కొనసాగింది. దేవుని అనుగ్రహం ఆయన మీద ఉంది.
LUK 2:41 ప్రతి సంవత్సరం ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగకు యెరూషలేము వెళ్ళేవాళ్ళు.
LUK 2:42 కనుక ఎప్పటిలాగే అలవాటు ప్రకారం యేసుకు పన్నెండు సంవత్సరాలున్నప్పుడు వాళ్ళు పండుగ కోసం యెరూషలేముకు వెళ్ళారు.
LUK 2:43 పండుగ తర్వాత ఆయన తల్లిదండ్రులు తిరిగి తమ ఊరికి వెళ్ళటానికి ప్రమాణమయ్యారు. కాని యేసు యెరూషలేములోనే ఉండిపొయ్యాడు. తల్లిదండ్రులకు ఇది తెలియదు.
LUK 2:44 తమ గుంపులో ఉన్నాడనుకొని వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేసారు. తమతో లేడని గ్రహించాక వాళ్ళు తమ స్నేహితులతో, బంధువులతో ఉన్నాడనుకొని వాళ్ళలో వెతకసాగారు.
LUK 2:45 ఆయన కనిపించక పోయే సరికి వాళ్ళు ఆయన్ని వెతకటానికి యెరూషలేము తిరిగి వెళ్ళారు.
LUK 2:46 మూడు రోజులు వెతికాక ఆయన వాళ్ళకు మందిరంలో కూర్చొని వాళ్ళు చెప్పినవి వింటూ, వాళ్ళను ప్రశ్నిస్తూ ఉండగా కన్పించాడు.
LUK 2:47 ఆయనలో ఉన్న గ్రహింపు శక్తికి, ఆయన సమాధానాలకు అక్కడవున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు.
LUK 2:48 ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన్ని చూసి చాలా ఆశ్చర్య పోయారు. యేసు తల్లి ఆయనతో, “ఇలా ఎందుకు చేసావు బాబు? నేను, మీ నాన్న దిగులుపడి అన్ని చోట్లా వెతికాము!” అని అన్నది.
LUK 2:49 యేసు, “నా కోసం ఎందుకు వెతికా రమ్మా! నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా?” అని అన్నాడు.
LUK 2:50 వాళ్ళకు ఆయన అన్న మాటలు అర్థం కాలేదు.
LUK 2:51 ఆ తర్వాత ఆయన వాళ్ళ వెంట నజరేతుకు వెళ్ళాడు. వినయ విధేయతలతో నడుచుకునే వాడు. కాని ఆయన తల్లి జరిగిన ఈ సంఘటనల్ని తన మనస్సులో ఆలోచిస్తూ ఉండేది.
LUK 2:52 యేసు జ్ఞానంలో, బలంలో, అభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. దేవుని మెప్పు, ప్రజల మెప్పు సంపాదించాడు.
LUK 3:1 కైసరు తిబెరి రాజ్యపాలన చేస్తున్న పదు నైదవ సంవత్సరములో: యూదయ దేశాన్ని పొంతి పిలాతు పాలిస్తూ ఉన్నాడు. హేరోదు గలిలయ దేశానికి సామంతరాజుగా ఉన్నాడు. హేరోదు తమ్ముడు ఫిలిప్పు ఇతూరయ, త్రకోనీత ప్రాంతాలకు పాలకుడుగా ఉన్నాడు. లుసానియా అబిలేనే రాష్ట్రానికి సామంతరాజుగా ఉన్నాడు.
LUK 3:2 ఇతని కాలంలోనే అన్న మరియు కయప ప్రధాన యాజకులుగా ఉన్నారు. వీళ్ళ కాలంలోనే జెకర్యా కుమారుడైన యోహాను అరణ్య ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నాడు. అక్కడ అతనికి దేవుని సందేశం లభించింది.
LUK 3:3 ఆతర్వాత అతడు యొర్దాను నది చుట్టూ ఉన్న ప్రాంతాలన్ని తిరిగి, “పాప క్షమాపణ పొందాలంటే మారుమనస్సు కలిగి బాప్తిస్మము పొందాలి” అని బోధించాడు.
LUK 3:4 దీన్ని గురించి యెషయా ప్రవక్త గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది: “‘ప్రభువు కోసం మార్గం వేయుమని ఆయన బాటలు చక్కగా చేయుమని ఎడారి ప్రాంతములో ఒక గొంతు ఎలుగెత్తి పలికింది.
LUK 3:5 లోయలు పూడ్చివేయ బడుతాయి. కొండలు గుట్టలు నేలమట్టమౌతాయి. వంకర బాటలు చక్కగా ఔతాయి. కరుకు బాటలు నునుపుగా ఔతాయి.
LUK 3:6 మానవులు దేవుడు ప్రసాదించే రక్షణను చూస్తారు!’”
LUK 3:7 ప్రజలు బాప్తిస్మము పొందటానికి గుంపులు గుంపులుగా యోహాను దగ్గరకు వచ్చారు. యోహాను, “మీరు సర్పసంతానం. దేవునికి కోపం రానున్నది. ఆ కోపం నుండి పారిపోవాలనుకుంటున్నారు. అలా చేయుమని ఎవరు చెప్పారు?
LUK 3:8 మారుమనస్సు పొందినట్లు ఋజువు చేసే పనులు చెయ్యండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని గొప్పలు చెప్పుకొన్నంత మాత్రాన లాభం లేదు. ఈ రాళ్ళనుండి దేవుడు అబ్రాహాము సంతానాన్ని సృష్టించగలడని నేను చెబుతున్నాను.
LUK 3:9 చెట్లవేళ్ళమీద గొడ్డలి సిద్ధంగా ఉంది. మంచి ఫలమివ్వని చెట్టును కొట్టెసి ఆయన మంటల్లో పార వేస్తాడు” అని అన్నాడు.
LUK 3:10 “మరి మేము ఏం చెయ్యాలి?” అని ప్రజలు అడిగారు.
LUK 3:11 యోహాను, “రెండు చొక్కాలున్న వాడు ఒక చొక్కాకూడా లేని వానితో వాటిని పంచుకోవాలి. అలాగే మీ ఆహారం కూడా పంచుకోవాలి” అని అన్నాడు.
LUK 3:12 పన్నులు సేకరించేవాళ్ళు కూడా బాప్తిస్మము పొందటానికి వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.
LUK 3:13 “సేకరించ వలసిన పన్నుల కన్నా ఎక్కువ పన్నులు సేకరించవద్దు” అని అతడు వాళ్ళతో అన్నాడు.
LUK 3:14 కొందరు సైనికులు కూడా వచ్చి, “మేము ఏం చెయ్యాలి?” అని అతణ్ణి అడిగారు. అతడు సమాధానం చెబుతూ, “ప్రజల నుండి డబ్బుగుంజవద్దు! వాళ్ళపై తప్పుడు నిందలు మోపకండి. మీ జీతంతో తృప్తి చెందండి” అని అన్నాడు.
LUK 3:15 ప్రజలు రానున్న వాని కోసం ఆశతో కాచుకొని ఉన్నరోజులవి. వాళ్ళు యోహానే క్రీస్తు అయి ఉండవచ్చనుకున్నారు.
LUK 3:16 యోహాను వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను మీకు నీటిలో బాప్తిస్మము నిచ్చాను. కాని నాకన్నా శక్తిగలవాడు వస్తాడు. ఆయన కాలిచెప్పులు విప్పే అర్హతకూడా నాకు లేదు. ఆయన మీకు పవిత్రాత్మలో, అగ్నిలో బాప్తిస్మమునిస్తాడు.
LUK 3:17 చేట ఆయన చేతిలో ఉంది. ఆయన ఆ చేటతో ధాన్యాన్ని శుభ్రపరచి తన ధాన్యాన్ని కొట్టులో దాచుకొని, పొట్టును ఆరని మంటల్లో కాల్చివేస్తాడు.”
LUK 3:18 యోహాను వాళ్ళకు హెచ్చరిక కలిగేటట్లు యింకా ఎన్నో విషయాలు చెప్పాడు. సువార్త కూడా ప్రకటించాడు.
LUK 3:19 రాజ్యాధికారి హేరోదుకు అతని సోదరుని భార్య అయిన హేరోదియతో సంబంధంవుంది. దీని కారణంగా, హేరోదు చేసిన యితర దుష్కార్యాల కారణంగా యోహాను అతణ్ణి తీవ్రంగా విమర్శించాడు.
LUK 3:20 తద్వారా హేరోదు, యోహానును కారాగారంలో ఉంచాడు. ఇలా చేసి తాను చేసిన దుష్కార్యాలకు మరొక దుష్కార్యం చేర్చుకొన్నాడు.
LUK 3:21 యోహాను ప్రజలకు బాప్తిస్మమునిస్తూ వుండినాడు. అప్పుడు వాళ్ళతో సహా యేసుకు కూడా బాప్తిస్మమునిచ్చాడు. యేసు ప్రార్థిస్తుండగా పరలోకం తెరువబడింది.
LUK 3:22 పవిత్రాత్మ ఒక పావురం రూపంలో దిగివచ్చి ఆయనపై వ్రాలాడు. వెంటనే పరలోకం నుండి ఒక స్వరం, “నీవు నా ప్రియ కుమారుడివి, నిన్ను నేను ప్రేమించుచున్నాను. నీయందు ఎక్కువగా నేను ఆనందించుచున్నాను” అని వినబడింది.
LUK 3:23 యేసు బోధించటం మొదలు పెట్టినప్పుడు ఆయనకు సుమారు ముప్పై సంవత్సరాలు. యేసు యోసేపు కుమారుడు అని ప్రజలు అనుకునేవాళ్ళు. యోసేపు హేలీ కుమారుడు,
LUK 3:24 హేలీ మత్తతు కుమారుడు, మత్తతు లేవి కుమారుడు. లేవి మెల్కీ కుమారుడు. మెల్కీ యన్న కుమారుడు. యన్న యోసేపు కుమారుడు.
LUK 3:25 యోసేపు మత్తతీయ కుమారుడు, మత్తతీయ ఆమోసు కుమారుడు. ఆమోసు నాహోము కుమారుడు, నాహోము ఎస్లి కుమారుడు. ఎస్లి నగ్గయి కుమారుడు.
LUK 3:26 నగ్గయి మయతు కుమారుడు. మయతు మత్తతీయ కుమారుడు. మత్తతీయ సిమియ కుమారుడు. సిమియ యోశేఖు కుమారుడు. యోశేఖు యోదా కుమారుడు.
LUK 3:27 యోదా యోహన్న కుమారుడు. యోహన్న రేసా కుమారుడు, రేసా జెరుబ్బాబేలు కుమారుడు. జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు. షయల్తీయేలు నేరి కుమారుడు,
LUK 3:28 నేరి మెల్కీ కుమారుడు, మెల్కీ అద్ది కుమారుడు. అద్ది కోసాము కుమారుడు, కోసాము ఎల్మదాము కుమారుడు, ఎల్మదాము ఏరు కుమారుడు,
LUK 3:29 ఏరు యెహోషువ కుమారుడు. యెహోషువ ఎలీయెజెరు కుమారుడు. ఎలీయెజెరు యోరీము కుమారుడు. యోరీము మత్తతు కుమారుడు, మత్తతు లేవి కుమారుడు.
LUK 3:30 లేవి షిమ్యోను కుమారుడు, షిమ్యోను యూదా కుమారుడు, యూదా యోసేపు కుమారుడు. యోసేపు యోనాము కుమారుడు. యోనాము ఎల్యాకీము కుమారుడు,
LUK 3:31 ఎల్యాకీము మెలెయా కుమారుడు. మెలెయా మెన్నా కుమారుడు. మెన్నా మత్తతా కుమారుడు. మత్తతా నాతాను కుమారుడు. నాతాను దావీదు కుమారుడు,
LUK 3:32 దావీదు యెష్షయి కుమారుడు, యెష్షయి ఓబేదు కుమారుడు, ఓబేదు బోయజు కుమారుడు, బోయజు శల్మాను కుమారుడు, శల్మాను నయస్సోను కుమారుడు,
LUK 3:33 నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు. అమ్మీనాదాబు అరాము కుమారుడు. అరాము ఎస్రోము కుమారుడు, ఎస్రోము పెరెసు కుమారుడు, పెరెసు యూదా కుమారుడు.
LUK 3:34 యూదా యాకోబు కుమారుడు, యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రాహాము కుమారుడు, అబ్రాహాము తెరహు కుమారుడు, తెరహు నాహోరు కుమారుడు,
LUK 3:35 నాహోరు సెరూగు కుమారుడు, సెరూగు రయూ కుమారుడు, రయూ పెలెగు కుమారుడు, పెలెగు హెబెరు కుమారుడు, హెబెరు షేలహు కుమారుడు,
LUK 3:36 షేలహు కేయినాను కుమారుడు, కేయినాను అర్పక్షదు కుమారుడు, అర్పక్షదు షేము కుమారుడు, షేము నోవహు కుమారుడు, నోవహు లెమెకు కుమారుడు,
LUK 3:37 లెమెకు మెతూషెల కుమారుడు, మెతూషెల హనోకు కుమారుడు, హనోకు యెరెదు కుమారుడు, యెరెదు మహలలేలు కుమారుడు, మహలలేలు కేయినాను కుమారుడు,
LUK 3:38 కేయినాను ఎనోషు కుమారుడు, ఎనోషు షేతు కుమారుడు, షేతు ఆదాము కుమారుడు, ఆదాము దేవుని కుమారుడు.
LUK 4:1 యేసు యొర్దాను నది ప్రాంతం నుండి తిరిగి వచ్చాడు. ఆయన పవిత్రాత్మపూర్ణుడై యుండి ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు.
LUK 4:2 అక్కడ సైతాను ఆయన్ని నలభై దినాలు శోధించాడు. ఆ నలభై రోజులు యేసు ఉపవాసం చేశాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.
LUK 4:3 సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మారుమని ఆజ్ఞాపించు!” అని అన్నాడు.
LUK 4:4 యేసు, “‘మనిషి జీవించటానికి ఆహారం మాత్రమే చాలదు’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.
LUK 4:5 ఆ సైతాను ఆయన్ని ఎత్తైన స్థలానికి తీసుకు వెళ్ళాడు. ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్ని ఆయనకు చూపించాడు.
LUK 4:6 ఆయనతో, “వీటిపై అధికారము, వాటివల్ల లభించే గౌరవము నీకిస్తాను. అవి నావి. నా కిష్టం వచ్చిన వానికివ్వగలను.
LUK 4:7 నా కాళ్ళ మీద పడితే వీటిని నీకిస్తాను.” అని అన్నాడు.
LUK 4:8 యేసు, “‘నీ ప్రభువైన దేవుని ముందు మాత్రమే మోకరిల్లి, ఆయన సేవ మాత్రమే చెయ్యి’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.
LUK 4:9 సైతాను ఆయన్ని యెరూషలేములో ఉన్న ఆలయానికి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నిలుచోబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే యిక్కడి నుండి క్రిందికి దూకు.
LUK 4:10 ‘దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుమని ఆజ్ఞాపిస్తాడు’
LUK 4:11 అంతేకాక: ‘ఆ దూతులు నీ కాళ్ళు రాతికి తగలకుండా నిన్నుతమ చేతుల్తో ఎత్తి పట్టుకుంటారు’ అని వ్రాయబడింది” అని అన్నాడు.
LUK 4:12 యేసు, “‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు’ అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.
LUK 4:13 ఆ సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి ఆయన్ని వదిలి పొయ్యాడు.
LUK 4:14 యేసు పవిత్రాత్మ శక్తితో గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన్ని గురించి ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసింది.
LUK 4:15 ఆయన ఆ ప్రాంతాల్లో ఉన్న సమాజ మందిరాల్లో బోధించాడు. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్తుతించారు.
LUK 4:16 ఆ తర్వాత తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్ళాడు. ఒక విశ్రాంతి రోజున అలవాటు ప్రకారం సమాజమందిరానికి వెళ్ళి, చదవటానికి నిలుచున్నాడు.
LUK 4:17 అక్కడున్న వాళ్ళు, ప్రవక్త యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ గ్రంథములో ఈ వాక్యాలున్న పుటను తెరిచి చదవటం మొదలు పెట్టాడు:
LUK 4:18 “ప్రభువు నన్నభిషేకించి పేదవాళ్ళకు నన్ను సువార్త ప్రకటించుమన్నాడు. అందుకే ప్రభువు ఆత్మ నాలో ఉన్నాడు. బంధితులకు స్వేచ్ఛ ప్రకటించుమని, గుడ్డివారికి చూపు కలిగించాలని, హింసింపబడే వారికి విడుదల కలిగించాలని, నన్ను పంపాడు.
LUK 4:19 ప్రభువు ‘తాను దయ చూపే సంవత్సరం’ ప్రకటించుమని నన్ను పంపాడు.”
LUK 4:20 ఆ తదుపరి యేసు గ్రంథం మూసేసి దాన్ని తెచ్చిన వానికి యిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవాళ్ళందరి కళ్ళు ఆయనపై ఉన్నాయి.
LUK 4:21 ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు.
LUK 4:22 అంతా ఆయన్ని మెచ్చుకున్నారు. అంతే కాక ఆయన నోటినుండి వచ్చిన ఆ చక్కటి మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు, “ఈయన యోసేపు కుమారుడు కదా!” అని అన్నారు.
LUK 4:23 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “‘వైద్యుడా! నిన్ను నీవు నయం చేసుకో!’ అన్న సామెత మీరు నాకు చెబుతారని తెలుసు. పైగా మీరు, ‘కపెర్నహూములో చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!’ అని అంటారని నాకు తెలుసు.
LUK 4:24 ఇది నిజం. ఏ ప్రవక్తనూ అతని స్వగ్రామపు ప్రజలు అంగీకరించలేదు.
LUK 4:25 “ఏలీయా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులుండినారని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షాలు కురియలేదు. దేశమంతటా తీవ్రమైన కరువు వ్యాపించి ఉంది.
LUK 4:26 సీదోను రాష్ట్రంలోని సారెపతు అనే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. దేవుడు ఏలీయాను ఆమె దగ్గరకు తప్పమరెవ్వరి దగ్గరకు పంపలేదు.
LUK 4:27 “ప్రవక్త ఎలీషా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలా మంది కుష్టురోగులుండే వాళ్ళు. కాని సిరియ దేశానికి చెందిన నయమాను అనేవాణ్ణి తప్ప దేవుడు వీళ్ళలో ఒక్కరిని కూడా నయం చేయలేదు.”
LUK 4:28 సమాజ మందిరములో వున్న వాళ్ళందరికి యిది విని ఆయనపై చాలా కోపం వచ్చింది.
LUK 4:29 వాళ్ళు లేచి ఆయన్ని గ్రామం నుండి వెళ్ళగొట్టారు. ఆ గ్రామం కొండ మీద ఉంది. వాళ్ళు ఆయన్ని క్రిందికి త్రోయాలని కొండ చివరకు తీసుకు వెళ్ళారు.
LUK 4:30 కాని ఆయన వాళ్ళ మధ్యనుండి నడిచి తన దారిన తాను వెళ్ళి పోయాడు.
LUK 4:31 అక్కడి నుండి ఆయన గలిలయలోని కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి రోజున బోధించటం మొదలు పెట్టాడు.
LUK 4:32 ఆయన అధికారమున్న వానిలా బోధించటం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు.
LUK 4:33 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడు. ఆ దయ్యం బిగ్గరగా,
LUK 4:34 “ఓ నజరేయుడైన యేసూ! మాతో నీకేంపని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నది.
LUK 4:35 యేసు, “నోరు మూసుకొని అతని నుండి బయటకు రా!” అని గద్దించాడు. ఆ దయ్యం తాను పట్టిన వాణ్ణి క్రింద పడవేసి ఏ హానీ చెయ్యకుండా ఆ దయ్యం వెలుపలికి వచ్చింది.
LUK 4:36 అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పరస్పరం, “ఏమిటిది? దయ్యాలను కూడా ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడే? అవి బయటికి రావటానికి ఈయన మాటల్లో ఎంత శక్తి ఉందో కదా?” అని మాట్లాడుకున్నారు.
LUK 4:37 ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో ఈయన్ని గురించి అందరికి తెలిసింది.
LUK 4:38 యేసు సమాజమందిరాన్ని వదిలి సీమోను యింటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పారు.
LUK 4:39 యేసు, ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలి పొమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరిని ఆదరించటం మొదలు పెట్టింది.
LUK 4:40 సూర్యాస్తమయమౌతుండగా ప్రజలు రక రకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతుల్ని ఉంచి అందరిని నయం చేశాడు.
LUK 4:41 “నీవు దేవుని కుమారుడవు” అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను క్రీస్తు అని తెలియటం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దని గద్దించాడు.
LUK 4:42 తెల్లవారుతుండగా యేసు గ్రామం వదిలి ఎడారిలో ఒంటరిగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళాడు. ప్రజలాయన కోసం వెతుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. ఆయన తమను మళ్ళీ వదిలి వెళ్ళకుండా చెయ్యాలని ప్రయత్నించారు.
LUK 4:43 కాని యేసు, “దేవుని రాజ్యం యొక్క సువార్త నేను యితర పట్టణాల్లో కూడా ప్రకటించాలి. దేవుడు నన్ను అందుకే పంపాడు” అని అన్నాడు.
LUK 4:44 ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ మందిరాల్లో బోధించాడు.
LUK 5:1 ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు ప్రక్కన నిలబడి దైవసందేశం ఉపదేశిస్తున్నాడు. ప్రజలు ఆయన ఉపదేశం వినటానికి త్రోసుకుంటూ ఆయన చుట్టూ చేరారు.
LUK 5:2 యేసు సరస్సు ప్రక్కన రెండు పడవలుండటం చూశాడు. బెస్తవాళ్ళు పడవలు దిగి ఆ ప్రక్కనే తమ వలలు కడుక్కుంటున్నారు.
LUK 5:3 యేసు సీమోను అనే వ్యక్తికి చెందిన పడవనెక్కి పడవను ఒడ్డునుండి కొంతదూరం తీసుకొని వెళ్ళమన్నాడు. ఆ తర్వాత ఆయన ఆ పడవలో కూర్చొని ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు.
LUK 5:4 ఆయన మాట్లాడటం ముగించాక సీమోనుతో, “పడవను నీళ్ళు లోతుగా ఉన్న చోటికి పోనిచ్చి వలవేయండి. మీకు చేపలు దొరకుతాయి” అని అన్నాడు.
LUK 5:5 సీమోను, “అయ్యా! మేము రాత్రంతా చాలా కష్టపడి పనిచేసినా చేపలు పట్టలేక పోయాము. అయినా మీరు చెబుతున్నారు కాబట్టి మేము వేస్తాము” అని అన్నాడు.
LUK 5:6 వాళ్ళు, ఆయన చెప్పినట్లు చేసి ఎన్నో చేపలు పట్టారు. ఆ బరువుకు వలలు చినగటం మొదలు పెట్టాయి.
LUK 5:7 కాబట్టి ప్రక్క పడవలో ఉన్న తమతోటి పని వాళ్ళను వచ్చి తమకు సహాయం చెయ్యమని అడిగారు. వాళ్ళు వచ్చి ఆ రెండు పడవల్ని పూర్తిగా చేపల్తో నింపారు. ఆ బరువుకు వాళ్ళ పడవలు మునగసాగాయి.
LUK 5:8 సీమోను పేతురు యిది చూసి యేసు కాళ్ళపైపడి, “నేనొక పాపిని. వెళ్ళిపొండి ప్రభూ!” అని అన్నాడు.
LUK 5:9 అతడు, అతనితో ఉన్న వాళ్ళు తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు.
LUK 5:10 వీళ్ళే కాక జెబెదయ కుమారులు యాకోబు, యోహానులు కూడా ఆశ్చర్యపోయారు. వీళ్లు సీమోను భాగస్థులు. యేసు సీమోనుతో, “చింతించకు. ఇప్పటి నుండి నువ్వు మనుష్యుల్ని పడ్తావు!” అని అన్నాడు.
LUK 5:11 వాళ్ళు పడవలు ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయన్ని అనుసరించారు.
LUK 5:12 యేసు ఒక గ్రామంలో ఉండగా ఒళ్ళంతా కుష్టురోగం ఉన్న వాడు ఆయన్ని చూడాలని వచ్చాడు. యేసును చూడగానే ఆయన కాళ్ల ముందు సాష్టాంగ పడి, “ప్రభూ! మీరు దయ తలిస్తే నాకు నయం చెయ్యగలరు!” అని వేడుకొన్నాడు.
LUK 5:13 యేసు, “నీకు నయం చేస్తాను!” అని అంటూ తన చేయి జాపి అతణ్ణి తాకాడు. వెంటనే కుష్టురోగం అతణ్ణి వదిలి పోయింది.
LUK 5:14 ఆ తర్వాత యేసు, “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. కాని వెళ్ళి యాజకునికి చూపు! మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. నీకు నయమైపోయిందని నిరూపించుకో!” అని ఆజ్ఞాపించాడు.
LUK 5:15 కాని యేసును గురించి యింకా చాలా మందికి తెలిసిపోయింది. ఆయన బోధనలు వినటానికి, తమరోగాలు నయం చేసుకోవటానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు.
LUK 5:16 కాని యేసు ప్రార్థించటానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు.
LUK 5:17 ఒక రోజు ఆయన బోధిస్తుండగా పరిసయ్యులు, శాస్త్రులు అక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళు గలిలయలోని పల్లెల నుండి, యూదయ, యెరూషలేము పట్టణాల నుండి వచ్చిన వాళ్ళు. రోగులకు నయం చేసే శక్తి యేసులో ఉంది.
LUK 5:18 కొంతమంది ఒక పక్షవాత రోగిని ఒక మంచం మీద మోసుకొని వచ్చారు. అతణ్ణి యేసు ముందు ఉంచాలని, యేసు ఉన్న యింట్లోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు.
LUK 5:19 కాని ప్రజాసమూహం అధికముగా ఉండటం వల్ల అలా చెయ్యటం వీలుకాలేదు. వాళ్ళు ఇంటి మీదికి వెళ్ళి పైకప్పు ద్వారా ఆ రోగిని మంచంతో సహా యేసు ముందు దించారు. యేసు ప్రజల మధ్య ఉన్నాడు.
LUK 5:20 ఆయన వాళ్ళ విశ్వాసం చూసి, “మిత్రమా, నీ పాపాలు క్షమించాను!” అని అన్నాడు.
LUK 5:21 పరిసయ్యులు, శాస్త్రులు మనస్సులో, “భక్తి హీనునిగా మాట్లాడుతున్నాడే? వీడెవడు? దేవుడు తప్ప యితరులెవరు పాపాలు క్షమించగలరు?” అని అనుకున్నారు.
LUK 5:22 వాళ్ళేమనుకుంటున్నారో యేసుకు తెలిసి పోయింది. ఆయన, “మీరు మీ మనస్సులో అలా ఎందుకాలోచిస్తున్నారు?
LUK 5:23 ‘నీ పాపాలు క్షమించాను’ అని అనటం తేలికా? లేదా ‘లేచి నడు’ అని అనటం తేలికా?
LUK 5:24 కాని మనుష్యకుమారునికి ఈ భూమ్మీద పాపాలు క్షమించటానికి అధికారముందని మీరు గ్రహించాలి” అని అంటూ ఆ పక్షవాత రోగితో, “నేను చెబుతున్నాను; లేచి నీ మంచం తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.
LUK 5:25 ఆ పక్షవాత రోగి వెంటనే అందరి ముందు లేచి తానిదివరకు పడుకున్న మంచమును తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ యింటికి వెళ్ళిపోయాడు.
LUK 5:26 అక్కడున్న వాళ్ళంతా దిగ్భ్రాంతి చెంది దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. వాళ్ళు భయంతో, “ఈ రోజు మనం అనుకోని గొప్ప సంఘటన చూసాము” అని అన్నారు.
LUK 5:27 తర్వాత యేసు అక్కడి నుండి వెళ్ళి పోయాడు. లేవి అనే ఒక పన్నులు సేకరించే గుమాస్తా, పన్నులు సేకరిస్తూ ఒక గదిలో కూర్చొని ఉన్నాడు. యేసు అతణ్ణి చూసి, “నా వెంటరా!” అని అతనితో అన్నాడు.
LUK 5:28 లేవి లేచి అన్నీవదిలి యేసును అనుసరించాడు.
LUK 5:29 ఆ తర్వాత లేవి తన యింట్లో యేసు కోసం ఒక పెద్ద విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఇతర్లు ఆయనతో కలసి భోజనం చేస్తూఉన్నారు.
LUK 5:30 పరిసయ్యులు, వాళ్ళ గుంపుకు చెందిన శాస్త్రులు యేసు అనుచరులతో, “మీరు పన్నులు సేకరించే వాళ్ళతో, పాపులతో కలిసి ఎందుకు తింటారు?” అని విమర్శిస్తూ అడిగారు.
LUK 5:31 యేసు, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉంటుంది.
LUK 5:32 నేను నీతిమంతుల్ని పిలిచి, వాళ్ళకు మారుమనస్సు పొందుమని చెప్పటానికి రాలేదు. పాపుల కోసం వచ్చాను” అని సమాధానం చెప్పాడు.
LUK 5:33 వాళ్ళు, “యోహాను శిష్యులు ఎప్పుడూ ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పరిసయ్యులు కూడా అదేవిధంగా చేస్తూ ఉంటారు. కాని మీ వాళ్ళు తింటూ త్రాగుతూ ఉంటారు” అని యేసుతో అన్నారు.
LUK 5:34 యేసు, “పెళ్ళి కుమారుని అతిథులు పెళ్ళి కుమారునితో ఉన్నప్పుడు ఉపవాసం చేస్తారా?
LUK 5:35 కాని పెళ్ళి కుమారుణ్ణి వాళ్ళనుండి తీసుకు వెళ్ళే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.
LUK 5:36 యేసు వాళ్ళకు ఈ ఉపమానం కూడా చెప్పాడు: “క్రొత్త బట్టను చింపి పాత బట్టకు ఎవ్వరూ అతుకులు వెయ్యరు. అలా వేస్తే క్రొత్త బట్ట పాత బట్టను చింపివేస్తుంది. పైగా క్రొత్తబట్ట నుండి చింపిన గుడ్డ పాతబట్టకు సరిగ్గా అతకదు.
LUK 5:37 అదేవిధంగా క్రొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తిలో ఎవ్వరూ నింపరు. అలా చేస్తే క్రొత్త రసం తిత్తిని చింపుతుంది. ద్రాక్షారసం కారి పోతుంది. తిత్తి కూడా నాశనమౌతుంది.
LUK 5:38 అలా చెయ్యరాదు. క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తిలోనే పొయ్యాలి.
LUK 5:39 పాత ద్రాక్షారసం త్రాగిన వాడు క్రొత్త ద్రాక్షారసాన్ని కోరడు. అతడు, ‘పాతది బాగుంది’ అని అంటాడు.”
LUK 6:1 ఒక విశ్రాంతి రోజు యేసు ధాన్యపు పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కంకులు త్రుంచి వాటిని నలిపి తినటం మొదలుపెట్టారు.
LUK 6:2 కొందరు పరిసయ్యులు, “విశ్రాంతి రోజున చెయ్యరాని పనులు ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.
LUK 6:3 యేసు, “దావీదు తనకు, తనతో ఉన్న వాళ్ళకు ఆకలి వేసినప్పుడు ఏమిచేసాడో మీరు చదవలేదా?
LUK 6:4 అతడు దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. అక్కడ దేవుని సన్నిధిని పెట్టిన రొట్టెలు ఉండినవి. వాటిని యాజకులు తప్ప యితర్లు తిన కూడదు. అతడు వాటిని తీసుకొని తాను తిని, తనతో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాడు” అని సమాధానం చెప్పాడు.
LUK 6:5 యేసు మళ్ళీ, “మనుష్యకుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువు!” అని అన్నాడు.
LUK 6:6 మరొక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడ కుడి చేయి పడిపోయిన వాడొకడున్నాడు.
LUK 6:7 పరిసయ్యులు, శాస్త్రులు యేసును ఏదో ఒక కారణంతో నిందించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు విశ్రాంతి రోజు ఆయన ఆ చేయి పడిపోయిన వానిని నయం చేస్తాడేమోనని ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు.
LUK 6:8 యేసుకు వాళ్ళేమాలోచిస్తున్నారో తెలుసు. ఆయన ఆ చేయి పడిపోయిన వానితో, “లేచి అందరి ముందు నిలుచో!” అని అన్నాడు. ఆ చేయి పడిపోయిన వాడు లేచి నిలుచున్నాడు.
LUK 6:9 ఆ తదుపరి యేసు వాళ్ళతో, “విశ్రాంతి రోజు ఏది చెయ్యటం న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నాను? ఒకరికి మేలు చేయటమా? లేక కీడు చేయటమా? ప్రాణాన్ని రక్షించటమా? లేక నాశనం చేయటమా?” అని అన్నాడు.
LUK 6:10 యేసు వాళ్ళ వైపు ఒకసారి చూసి, చేయి పడిపోయిన వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. ఆచేయి పడిపోయినవాడు యేసు చెప్పినట్లు చేశాడు. అతని చేయి పూర్తిగా నయమై పోయింది.
LUK 6:11 ఇది చూసి అక్కడున్నవాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు యేసును ఏమి చెయ్యాలో తమలో తాము ఆలోచించుకొన్నారు.
LUK 6:12 ఆ తర్వాత యేసు ఒక రోజు ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు.
LUK 6:13 ఉదయం కాగానే తన శిష్యులందర్ని దగ్గరకు పిలిచి వాళ్ళలో పన్నెండు మందిని ఎన్నుకొని వాళ్ళను తన అపొస్తలులుగా నియమించాడు. వారెవరనగా,
LUK 6:14 సీమోను, యేసు ఇతనికి “పేతురు” అని పేరు పెట్టాడు, అతని తమ్ముడు అంద్రెయ. యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి,
LUK 6:15 మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతె అని పిలువబడే సీమోను
LUK 6:16 యాకోబు కుమారుడు యూదా, యూదా ఇస్కరియోతు. (ఈ యూదా ఇస్కరియోతు మున్ముందు ద్రోహిఔతాడు).
LUK 6:17 యేసు వాళ్ళతో సహా కొండ దిగి సమంగా ఉన్న స్థలంలో నిలుచున్నాడు. చాలా మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన శిష్యులే కాక యూదయ నుండి, యెరూషలేం నుండి చాలా మంది ప్రజలు వచ్చారు. సముద్ర తీరంలో ఉన్న తూరు, సీదోను పట్టణాల నుండి కూడా చాలా మంది ప్రజలు వచ్చారు.
LUK 6:18 ఆయన బోధనలు వినాలని ఆయన ద్వారా తమ రోగాలు బాగు చేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. దయ్యాలు పట్టి బాధపడ్తున్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా నయమైపోయింది.
LUK 6:19 ఆయన నుండి శక్తి ప్రవహించి అందరికి నయం చేస్తూవుండటం వల్ల అందరూ ఆయన్ని తాకటానికి ప్రయత్నించారు.
LUK 6:20 యేసు తన శిష్యుల వైపు చూసి ఈ విధంగా అన్నాడు: “దీనులైన మీరు ధన్యులు. దేవుని రాజ్యం మీది.
LUK 6:21 ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు. మీ ఆకలి తీరుతుంది. ఇప్పుడు దుఃఖిస్తున్న మీరు ధన్యులు. భవిష్యత్తులో మీరు నవ్వుతారు.
LUK 6:22 “మనుష్యకుమారుని కారణంగా ప్రజలు మిమ్ముల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని దూరం చేసి అవమానించినప్పుడు, మీ పేరే హానికరమైనదని వారు భావించినప్పుడు మీరు ధన్యులౌతారు!
LUK 6:23 మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక యిది జరిగిన రోజు ఆనందంతో గంతులు వెయ్యండి! వీళ్ళ పూర్వీకులు కూడా ఆనాడు ప్రవక్తల పట్ల యిదే విధంగా ప్రవర్తించారు.
LUK 6:24 “ఓ ధనికులారా! మీకు శ్రమ తప్పదు! మీరు అనుభవించవలసిన సుఖాన్ని యిదివరకే అనుభవించారు!
LUK 6:25 కడుపులు నిండిన ప్రజలారా మీకు శ్రమ తప్పదు. మీకు ఆహారం దొరకదు! నవ్వుతున్న ప్రజలారా! మీకు శ్రమ తప్పదు! మీరు దుఃఖిస్తారు, శోకిస్తారు!
LUK 6:26 “పొగడ్తులుపొందే ప్రజలారా! మీకు శిక్ష తప్పదు! వాళ్ళ పూర్వులు యిదే విధంగా అబద్ధ ప్రవక్తల్ని పొగిడారు.
LUK 6:27 “కాని, నా మాటలు వినే వాళ్ళకు యిది నేను చెబుతున్నాను: మీ శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకు మంచి చెయ్యండి.
LUK 6:28 మిమ్మల్ని దూషించే వాళ్ళను దీవించండి. మీకు కీడు చేసిన వాళ్ళకు మంచి కలగాలని ప్రార్థించండి.
LUK 6:29 ఒక చెంప మీద కొట్టిన వానికి రెండవ చెంప కూడా చూపండి. నీ పైకండువాను తీసికొనే వానిని నీ చొక్కాను కూడ తీసికోనివ్వు.
LUK 6:30 అడిగిన వాళ్ళకు యివ్వండి. మీ వస్తువుల్ని ఎవరైనా తీసుకుంటే వాటిని తిరిగి అడక్కండి.
LUK 6:31 ఇతర్లు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారో అదేవిధంగా మీరు యితర్ల పట్ల ప్రవర్తించండి.
LUK 6:32 “మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపులు కూడా తమను ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తారు.
LUK 6:33 మీకు మంచి చేసిన వాళ్ళకు మీరు మంచి చేస్తే అందులో గొప్పేముంది? పాపులుకూడా అదే విధంగా చేస్తారు.
LUK 6:34 అప్పు తిరిగి చెల్లిస్తారని ఆశించి అప్పిస్తే అందులో గొప్పేముంది? తమ అప్పు పూర్తిగా చెల్లిస్తారని పాపులు కూడా తమలో తాము యిచ్చి పుచ్చుకుంటారు.
LUK 6:35 “మీ శత్రువుల్ని ప్రేమించండి. వాళ్ళకు మంచి చెయ్యండి. తిరిగి చెల్లిస్తారని ఆశించకుండా అప్పివ్వండి. విశ్వాస ఘాతుకుల మీద, దుర్మార్గుల మీద కూడా దేవుడు దయ చూపుతాడు. మీరు నేను చెప్పినట్లు చేస్తే సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా పరిగణిస్తాడు. మీకు గొప్ప బహుమతి లభిస్తుంది.
LUK 6:36 మీ తండ్రివలె మీరు కూడా దయ, ప్రేమ చూపుతూ జీవించండి.
LUK 6:37 “ఇతర్లపై తీర్పు చెప్పకండి. అప్పుడు ఇతర్లు మీపై తీర్పు చెప్పరు. ఇతర్లను నిందించకండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని నిందించరు. ఇతరులను క్షమించండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని క్షమిస్తారు.
LUK 6:38 ఇతర్లకు యివ్వండి, మీకివ్వబడుతుంది. అప్పుడు మీకు కొలతలు నింపి, అదిమి, కుదిల్చి ఒలికిపోతుండగా మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో యిస్తే ఆ కొలతతో మీకు లభిస్తుంది.”
LUK 6:39 ఆయన ఈ ఉపమానం కూడా చెప్పాడు: “ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి దారి చూపగలడా? అలా చేస్తే యిద్దరూ గోతిలో పడ్తారు కదా!
LUK 6:40 శిష్యుడు తన గురువుకన్నా గొప్ప కాదు. కాని శిక్ష సంపూర్ణంగా పొందిన తర్వాత అతని గురువుతో సమానమౌతాడు.
LUK 6:41 “నీ కంట్లోవున్న పెద్ద దూలంను నీవు చూడక నీ సోదరుని కంట్లోవున్న చిన్న నలుసును ఎందుకు చూస్తావు?
LUK 6:42 నీ కంట్లో దూలం పెట్టుకొని, ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తియ్యనివ్వు’ అని అతనితో ఏలాగు అనగలుగుతున్నావు? ఓ కపటీ! నీ కంట్లో దూలాన్ని ముందు తీసేయి. అప్పుడు నీవు బాగా చూడ కలిగి సోదరుని కంట్లో ఉన్న నలుసును ఏ విధంగా తియ్యాలో తెలుసుకుంటావు.
LUK 6:43 “మంచి చెట్టుకు చెడు పండ్లు కాయవు. అదే విధంగా చెడ్డ చెట్టుకు మంచి పండ్లు కాయవు.
LUK 6:44 పండ్లను బట్టి చెట్టు జాతి తెలుస్తుంది. ముండ్ల పొదల నుండి అంజూరపు పండ్లు, గోరింట పొదల నుండి ద్రాక్షాపండ్లు లభించవు.
LUK 6:45 మంచి వాని హృదయం మంచి గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతని నుండి మంచి తనమే బయటకు వస్తుంది. చెడ్డవాని హృదయం చెడు గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతనినుండి చెడే బయటకు వస్తుంది. మనిషి తన హృదయములో ఉన్న గుణాలను బట్టి మాట్లాడుతాడు.
LUK 6:46 “నేను చెప్పింది చెయ్యకుండా నన్ను ‘ప్రభూ! ప్రభూ!’ అని పిలవటం ఎందుకు?
LUK 6:47 నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటిని అనుసరించే వాడు ఎలాంటి వాడో చెబుతాను వినండి.
LUK 6:48 అలాంటి వాణ్ణి భూమి లోతుగా త్రవ్వి రాళ్ళ పునాది వేసి యిల్లు కట్టుకున్న వానితో పోల్చవచ్చు. ఇతడు తన యింటిని సక్రమమైన పద్దతిలో కట్టాడు కనుక వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ యింటిని కొట్టినా ఆ యిల్లు కూలి పోలేదు.
LUK 6:49 “నా మాటలు విని వాటిని అనుసరించని వాడు పునాది వేయకుండా, నేలపై ఇల్లు కట్టుకొన్న వానితో సమానము. వరదలు వచ్చాయి. ఆ నీటి ప్రవాహానికి ఆ యిల్లు కూలి నేల మట్టమైపోయింది.”
LUK 7:1 యేసు తాను చెప్పవలసినవన్నీ చెప్పాడు. ప్రజలు ఆయన చెప్పినవన్నీ విన్నారు. ఆ తర్వాత యేసు కపెర్నహూముకు వెళ్ళాడు.
LUK 7:2 అక్కడ కపెర్నహూములో ఒక శతాధిపతి ఉండేవాడు. అతని సేవకుడు జబ్బుతో చాలా బాధపడ్తూ చివరి దశలో ఉన్నాడు. శతాధిపతి అతణ్ణి చాలా ప్రేమతో చూసుకొనేవాడు.
LUK 7:3 ఆ శతాధిపతి యేసును గురించి విన్నాడు. అతడు యూదుల పెద్దల్ని కొందర్ని పంపించి తన సేవకునికి వచ్చి నయం చేయమని అడగమన్నాడు.
LUK 7:4 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి, “ఈ మనిషి మీ సహాయం పొందటానికి అర్హుడు.
LUK 7:5 మన సమాజ మందిరాన్ని కట్టించిన వాడు అతడే” అని దీనంగా అన్నారు.
LUK 7:6 యేసు వాళ్ళ వెంట వెళ్ళాడు. ఆయన శతాధిపతి యింటికి వస్తుండగా ఆ శతాధిపతి తన స్నేహితుల్ని పంపి ఆయనతో యిలా చెప్పమన్నాడు: “ప్రభూ! మీరు నా గడప దాటి నా యింట్లో కాలు పెట్టే అర్హత నాకు లేదు. మీకా శ్రమ వద్దు.
LUK 7:7 నేను మీ దగ్గరకు వచ్చే అర్హత నాకు ఉందనుకోను. కనుక అక్కడినుండి ఆజ్ఞాపిస్తే నా సేవకునికి నయమైపోతుంది.
LUK 7:8 ఆజ్ఞాపించటం అంటే ఏమిటో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒకరి అధికారంలో ఉన్నవాణ్ణి. నా క్రింద ఉన్న సైనికులపై నాకు అధికారం ఉంది. ఇతణ్ణి ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు. అతణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా సేవకునితో ‘యిది చెయ్యి’ అంటే చేస్తాడు.”
LUK 7:9 యేసు శతాధిపతి చెప్పి పంపింది విని ఆశ్చర్యపొయ్యాడు. తనను అనుసరిస్తున్న ప్రజల వైపు తిరిగి, “ఇంత భక్తి నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదని చెప్పగలను” అని అన్నాడు.
LUK 7:10 యేసు దగ్గరకు పంపబడిన పెద్దలు తిరిగి శతాధిపతి దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఆ సేవకునికి నయమై ఉండటం గమనించారు.
LUK 7:11 ఆ తర్వాత యేసు నాయీను అనే పట్టణానికి వెళ్ళాడు. ఆయన శిష్యులు, చాలా మంది ప్రజలు ఆయన వెంట వెళ్ళారు.
LUK 7:12 ఆయన ఆ పట్టణం యొక్క ముఖ్య ద్వారం చేరుకుంటుండగా కొందరు శవాన్ని మోసుకొని వెళ్తుండటం చూశాడు. అతని తల్లికి ఈ చనిపోయిన వాడు మాత్రమే కుమారుడు. తల్లి వితంతువు. ఆ వూరి వాళ్ళు అనేకులు ఆమె వెంటవున్నారు.
LUK 7:13 ఆమెను చూసి ప్రభువు హృదయం కరిగి పోయింది. ఆయన ఆమెతో, “దుఃఖించకమ్మా” అని అన్నాడు.
LUK 7:14 ఆ తదుపరి వెళ్ళి పాడెను తాకాడు. పాడె మోసుకు వెళ్తున్న వాళ్ళు కదలకుండా ఆగిపోయారు. యేసు, “బాబూ! లెమ్మని నీతో చెబుతున్నాను!” అని అన్నాడు.
LUK 7:15 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాడు. యేసు అతణ్ణి అతని తల్లికి అప్పగించాడు.
LUK 7:16 వాళ్ళందరిలో భక్తి, భయము నిండుకు పోయాయి. వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళు, “ఒక గొప్ప ప్రవక్త మనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తన ప్రజల్ని కాపాడటానికి వచ్చాడు” అని అన్నారు.
LUK 7:17 యేసును గురించి యూదయ ప్రాంతంలోను, దాని చుట్టూవున్న ప్రాంతాల్లోను తెలిసిపోయింది.
LUK 7:18 యోహాను శిష్యులు యోహానుకు వీటన్నిటిని గురించి చెప్పారు.
LUK 7:19 అతడు తన శిష్యుల్లో యిద్దర్ని పిలిచి, “రానున్నది మీరేనా? లేక మరొకరి కోసం మేము ఎదురు చూడాలా?” అని ప్రభువును అడిగిరమ్మని పంపాడు.
LUK 7:20 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి, “బాప్తిస్మము నిచ్చి, ఉపదేశం చేసే యోహాను ఈ విధంగా అడిగి రమ్మని మమ్మల్ని పంపాడు: ‘రానున్నది మీరేనా? మరొకరి కోసం మేము ఎదురుచూడాలా?’” అని అన్నారు.
LUK 7:21 వాళ్ళు అక్కడ ఉండగా యేసు రోగగ్రస్తులకు, బాధితులకు, దయ్యాలు పట్టిన వాళ్లకు నయం చేశాడు. చాలా మంది గ్రుడ్డి వాళ్ళకు దృష్టినిచ్చాడు.
LUK 7:22 యేసు, ఆ వర్తమానం తెచ్చిన వాళ్ళతో, “వెళ్ళి యోహానుతో గ్రుడ్డివాళ్ళకు దృష్టి లభిస్తొందని, కుంటివాళ్ళు నడుస్తున్నారని, కుష్టురోగులకు నయమౌతుందని, చెవిటి వాళ్ళు వింటున్నారని, పేదవాళ్ళకు దైవ సందేశము బోధింపబడ్తోందని చెప్పండి. మీరు చూసిన వాటిని, విన్నవాటిని అతనికి చెప్పండి.
LUK 7:23 నన్ను విశ్వసించటానికి వెనుకంజ వెయ్యని వాడు ధన్యుడు” అని అన్నాడు.
LUK 7:24 ఆ వార్త తెచ్చిన వాళ్ళు వెళ్ళి పొయ్యాక యేసు అక్కడ సమావేశమైన ప్రజలకు యోహానును గురించి ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఎడారి ప్రాంతాలకు ఏం చూడాలని వెళ్ళారు? రెల్లు గాలికి కదలటం చూడాలని వెళ్ళారా?
LUK 7:25 ఏమి చూడాలని వెళ్ళారు? విలువైన వస్త్రాల్ని ధరించిన వాళ్ళనా? విలువైన వస్త్రాలను ధరించేవారు రాజగృహాల్లో ఉంటారు.
LUK 7:26 మరి ఏమి చూడాలని వెళ్ళారు? ప్రవక్తనా? ఔను, యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని మీతో చెప్పుచున్నాను.
LUK 7:27 యోహానును గురించి లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ‘ఇతడు నా దూత, ఇతణ్ణి నీ కన్నా ముందుగా పంపుతాను. ఇతడు నీ కోసం దారి సిద్ధం చేస్తాడు.’
LUK 7:28 యోహాను ప్రపంచములో పుట్టిన మానవులందరి కన్నా గొప్పవాడు. కాని దేవుని రాజ్యంలో అందరికన్నా అల్పుడు యోహాను కన్నా గొప్పవాడని నేను చెబుతున్నాను.”
LUK 7:29 (యోహాను బోధనలు విని ప్రజలు, చివరకు పన్నులు వసూలు చేసేవాళ్ళు కూడా, యోహాను ద్వారా బాప్తిస్మము పొందారు. తద్వారా వాళ్ళు దేవుడు సంకల్పించినట్లు చేసారు.
LUK 7:30 కాని పరిసయ్యులు, శాస్త్రులు యోహాను చేత బాప్తిస్మము పొందటానికి నిరాకరించారు. తద్వారా వాళ్ళు దేవుడు తమకోసం సంకల్పించిన దాన్ని నిరాకరించారు.)
LUK 7:31 “మరి ఈ కాలపు ప్రజల్ని నేను దేనితో పోల్చాలి? వాళ్ళు ఏ విధంగా ఉంటారు?
LUK 7:32 వాళ్ళు సంతలో కూర్చొని, ‘మేము మీకోసం పిల్లన గ్రోవి ఊదాము. కాని మీరు నాట్యం చేయలేదు. మేము చనిపోయిన వానికోసం పాట పాడాము. కాని మీరు దుఃఖించలేదు’ అని మాట్లాడుకొంటున్న చిన్న పిల్లల్లాంటి వాళ్ళు.
LUK 7:33 బాప్తిస్మమునిచ్చే యోహాను ఆహారం తినలేదు. ద్రాక్షారసం త్రాగలేదు. మీరు అతనికి దయ్యం పట్టిందన్నారు.
LUK 7:34 మనుష్యకుమారుడు తింటూ, త్రాగుతూ వచ్చాడు. ఆయన్ని మీరు తిండిపోతు, త్రాగుపోతు అని అన్నారు. పన్నులు వసూలు చేసే వాళ్ళతో, పాపులతో స్నేహం చేస్తాడని ఆయన్ని విమర్శించారు.
LUK 7:35 జ్ఞానము దానిని పొందినవాని ద్వారా సరైనదని ఋజువు చేయబడుతుంది.”
LUK 7:36 ఒకసారి ఒక పరిసయ్యుడు యేసును తన యింటికి భోజనానికి పిలిచాడు. యేసు అతని యింటికి వెళ్ళాడు. ఆయన భోజనానికి కూర్చొని ఉండగా,
LUK 7:37 ఆ పట్టణంలో పాపాలు చేస్తూ జీవిస్తున్న ఒక స్త్రీ యేసు పరిసయ్యుని యింట్లో భోజనం చేస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. వెళ్ళేముందు చలువరాతి బుడ్డిలో ఖరీదైన అత్తరు తన వెంట తీసుకువెళ్ళింది.
LUK 7:38 వెనుకనుండి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర నిలుచొంది. ఆయన పాదాలను తన కన్నీటితో తడిపి, తన వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంది. వాటిపై అత్తరు పోసింది.
LUK 7:39 ఆయన్ని ఆహ్వానించిన పరిసయ్యుడు ఇది చూసి, “ఆయన ప్రవక్త అయినట్లైతే తనను ఎవరు తాకారో, ఆమె ఎలాంటి స్త్రీయో, అంటే ఆమె పాపం చేస్తూ జీవించే స్త్రీయని తెలుసుకుంటాడు” అని తన మనస్సులో అనుకున్నాడు.
LUK 7:40 యేసు అతనితో, “సీమోనూ, నీకో విషయం చెప్పాలి!” అని అన్నాడు. “చెప్పండి, బోధకుడా!” అని సీమోను అన్నాడు.
LUK 7:41 యేసు, “ఇద్దరు వ్యక్తులు ఒక షావుకారికి అప్పుండినారు. వాళ్ళలో ఒకడు అయిదు వందల దేనారాలు, యింకొకడు యాభై దేనారాలు అప్పు తీసుకొని ఉన్నారు.
LUK 7:42 ఇద్దరిలో ఎవ్వరి దగ్గర కూడా అప్పుతీర్చటానికి డబ్బులేదు. అందువల్ల ఆ షావుకారు వాళ్ళిద్దరి అప్పు రద్దు చేశాడు. ఆ యిద్దరిలో ఎవరు ఆ షావుకారి పట్ల ఎక్కువ ప్రేమ కనుబరుస్తారు?” అని అడిగాడు.
LUK 7:43 “ఎక్కువ ధనం అప్పున్నవాడని నేననుకొంటాను” అని సీమోను సమాధానం చెప్పాడు. యేసు, “నీ తీర్పు సరియైనది” అని అన్నాడు.
LUK 7:44 ఆ తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ యింటికి వచ్చాను. కాళ్ళు కడుక్కోవటానికి నీవు నీళ్ళు కూడా ఇవ్వలేదు. కాని ఈమె నా కాళ్ళు తన కన్నీటితో కడిగి తన వెంట్రుకలతో తుడిచింది.
LUK 7:45 నీవు నన్ను ప్రేమతో హృదయానికి హత్తుకోలేదు. కాని ఈమె యింట్లోకి వచ్చినప్పటినుండి నా కాళ్ళను భక్తితో ముద్దాడటం మానలేదు.
LUK 7:46 నీవు నా తలకు నూనె అంటలేదు. కాని ఈమె నా కాళ్ళకు అత్తరు రాసింది.
LUK 7:47 అందువల్ల నేను చెప్పేదేమిటంటే ఆమె చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి. దీనికి ఆమె చూపిన అమితమైన ప్రేమే నిదర్శనం. కొన్ని పాపాలు మాత్రమే క్షమించబడిన వానికి కొంత ప్రేమ మాత్రమే ఉంటుంది” అని అన్నాడు.
LUK 7:48 ఆ తర్వాత యేసు ఆమెతో, “నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు.
LUK 7:49 అక్కడున్న మిగతా అతిథులు, “పాపాలు కూడా క్షమించటానికి యితడెవరు?” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
LUK 7:50 యేసు ఆ స్త్రీతో, “నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. శాంతంగా వెళ్ళు!” అని అన్నాడు.
LUK 8:1 ఆ తర్వాత యేసు పట్టణాలు, పల్లెలు పర్యటించి దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రజలకు ప్రకటించాడు. పన్నెండుమంది అపొస్తలులు ఆయన వెంటే ఉన్నారు.
LUK 8:2 దయ్యాలు విడిపించబడిన కొందరు స్త్రీలు, రోగాలు నయం చేయబడిన కొందరు స్త్రీలు కూడా ఆయన వెంట ఉన్నారు. వీళ్ళలో మగ్దలేనే అని పిలవబడే మరియ ఒకతె. ఈమె నుండి ఏడు దయ్యాలు విడిపించబడ్డాయి.
LUK 8:3 హేరోదు రాజుకు కుడిభుజంగా ఉన్న కూజా భార్య యోహన్న, సూసన్న, మొదలగు చాలా మంది స్త్రీలు ఆయన వెంట ఉన్నారు. వీళ్ళు తమ స్వంత డబ్బుతో యేసుకు, ఆయన అపొస్తలులకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు.
LUK 8:4 అనేక గ్రామాల నుండి ప్రజలు యేసు దగ్గరకు వచ్చారు. ఒక పెద్ద గుంపు సమావేశమైంది. యేసు వాళ్ళకీ ఉపమానం చెప్పడం మొదలు పెట్టాడు:
LUK 8:5 “ఒక రైతు విత్తనాలు చల్లడానికి పొలానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారిపై పడ్డాయి. వాటిని ప్రజలు త్రొక్కి వేసారు. పక్షులు వచ్చి వాటిని తిని వేసాయి.
LUK 8:6 మరికొన్ని విత్తనాలు మట్టి కొద్దిగా ఉన్న రాతి నేలపై పడ్డాయి. అవి మొలకెత్తాయి, కాని వాటికి తేమ దొరకనందువలన అవి వాడిపొయ్యాయి.
LUK 8:7 మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల స్థలంలో పడ్డాయి. ఈ విత్తనాలతో పాటు ముళ్ళ మొక్కలు కూడా పెరిగి వాటిని పెరగనివ్వలేదు.
LUK 8:8 మరి కొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి పెద్దవై నూరు రెట్లు ఫలాన్నిచ్చాయి.” ఈ విధంగా చెప్పి, “వినే వాళ్ళు జాగ్రత్తగా వినాలి” అని బిగ్గరగా అన్నాడు.
LUK 8:9 శిష్యులు, “ఈ ఉపమానానికి అర్థమేమిటని” ఆయన్ని అడిగారు.
LUK 8:10 యేసు, “దేవుని రాజ్యం యొక్క రహస్య జ్ఞానం తెలుసుకొనే అవకాశం మీకివ్వబడింది. కాని యితర్లకు, ఆ రహస్యం ఉపమానాలు ఉపయోగించి చెబుతాను. ఎందుకంటే, ‘వాళ్ళు చూస్తున్నట్లే వుండి చూడలేరు, వాళ్ళు వింటున్నదానిని అర్థం చేసుకోలేరు.’
LUK 8:11 “ఇందులోని అర్థం యిది: విత్తనం దైవ సందేశం.
LUK 8:12 దారిపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది: కొందరు ప్రజలు వింటారు. కాని సైతాను వచ్చి వాళ్ళ హృదయాల్లో ఉన్న దైవ సందేశాన్ని తీసుకువెళ్తాడు. వీళ్ళు విశ్వసించరాదని, రక్షింపబడరాదని వాని ఉద్దేశ్యం.
LUK 8:13 రాతి నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది; కొందరు దైవ సందేశం విని దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. కాని వీళ్ళ విశ్వాసానికి వేర్లు ఉండవు. కనుక వాళ్ళు కొద్ది కాలం మాత్రమే విశ్వసిస్తారు. పరీక్షా సమయం రాగానే వెనుకంజ వేస్తారు.
LUK 8:14 “ముళ్ళు పెరిగే నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది: కొందరు వింటారు కాని సుఖదుఃఖాలు, ధనము వాళ్ళను అణచి వేయటం వల్ల వాళ్ళు సంపూర్ణంగా ఫలించరు.
LUK 8:15 సారవంతమైన నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది: కొందరు ఉత్తమమైన మంచి మనస్సుతో విని, విన్న వాటిని హృదయాల్లో దాచుకొని పట్టుదలతో మంచి ఫలాన్నిస్తారు.
LUK 8:16 “దీపాన్ని వెలిగించి ఏ కుండ క్రిందో లేక మంచం క్రిందో ఎవ్వరూ దాచరు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళకు వెలుగు కనిపించాలని ఆ దీపాన్ని ఎత్తైన దీప స్థంభంపై పెడ్తాము.
LUK 8:17 తెలియబడని, బయలు పర్చబడని రహస్య మేదియు ఉండదు. అందువల్ల మీరు ఎట్లా వింటున్నారో జాగ్రత్తగా ఆలోచించండి.
LUK 8:18 కలిగియున్న వానికి ఇంకా ఎక్కువ యివ్వబడుతుంది. లేని వాని నుండి వాని దగ్గరున్నదని అనుకొంటున్నది కూడా తీసి వేయబడుతుంది” అని అన్నాడు.
LUK 8:19 ఒకసారి యేసు తల్లి, ఆయన సోదరులు ఆయన్ని చూడాలని వచ్చారు. ప్రజల గుంపు ఆయన చుట్టూ ఉండటంవల్ల వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళలేక పొయ్యారు.
LUK 8:20 ఒకడు యేసుతో, “మీ తల్లి, సోదరులు మిమ్మల్ని చూడాలని వచ్చి బయట నిలుచున్నారు” అని అన్నాడు.
LUK 8:21 యేసు, “దైవ సందేశం విని దాన్ని అనుసరించే వాళ్ళే నా తల్లి, నా సోదరులు” అని సమాధానం చెప్పాడు.
LUK 8:22 ఒక రోజు యేసు, ఆయన శిష్యులు పడవలో ఉండగా, “సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్దాం” అని అన్నాడు. అందువల్ల వాళ్ళు ప్రయాణమయ్యారు.
LUK 8:23 ప్రయాణం సాగిస్తుండగా యేసు నిద్రపొయ్యాడు. అకస్మాత్తుగా పెనుగాలి ఆ సముద్రం మీదుగా వీచింది. నీళ్ళు పడవలోకి రావటం మొదలు పెట్టాయి. వాళ్ళందరూ పెద్ద ప్రమాదంలో చిక్కుకొని పొయ్యారు.
LUK 8:24 శిష్యులు యేసును నిద్ర లేపుతూ, “ప్రభూ! ప్రభూ! మనము మునిగి పోతున్నాం!” అని అన్నారు. ఆయన లేచి గాలిని, నీళ్ళను ఆగమని గద్దించాడు. పెనుగాలి ఆగిపోయింది.
LUK 8:25 “యేసు, మీ విశ్వాసం ఏమైంది?” అని తన శిష్యుల్ని అడిగాడు. వాళ్ళు భయంతో ఆశ్చర్యంగా, “ఆయన ఎంత గొప్పవాడు! నీళ్ళను, గాలిని కూడా ఆజ్ఞాపిస్తున్నాడే! అవి విధేయతతో ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాయే!” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
LUK 8:26 యేసు మరియు ఆయన శిష్యులు గెరాసేనులు అనే ప్రజలు నివసించే ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ ప్రాంతం గలిలయ సముద్రానికి అవతలి వైపున ఉంటుంది.
LUK 8:27 యేసు ఒడ్డు చేరగానే దయ్యం పట్టిన ఆ ఊరి వాడొకడు యేసు దగ్గరకు వచ్చాడు. చాలాకాలం నుండి అతడు బట్టలు వేసుకొనేవాడు కాదు. ఇంట్లో నివసించే వాడు కాదు. స్మశానాల్లో నివసించేవాడు.
LUK 8:28 ఆ దయ్యం పట్టినవాడు యేసును చూడగానే పెద్ద గొంతుతో, “యేసూ! దేవుని కుమారుడా! నాతో నీకేం పని? నన్ను హింసించవద్దని వేడుకొంటున్నాను” అని బిగ్గరగా అంటూ ఆయన కాళ్ళ మీద పడ్డాడు.
LUK 8:29 యేసు ఆ దయ్యాన్ని అతని నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఈ దయ్యం అతణ్ణి చాలాసార్లు ఆవరించింది. అతని కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేసి కాపలాలోవుంచేవాళ్ళు. అయినా అతడు ఆ గొలసులను తెంపుకొనేవాడు. ఆ దయ్యం అతణ్ణి నిర్మానుష్య స్థలాలకు లాక్కొని వెళ్ళేది.
LUK 8:30 యేసు, “నీ పేరేమిటి?” అని అడిగాడు. అతడు, “సేన” అని సమాధానం చెప్పాడు. ఎన్నో దయ్యాలు వానిలో ఉండటం వల్ల ఈ విధంగా సమాధానం చెప్పాడు.
LUK 8:31 ఆ దయ్యాలు తమను పాతాళం లోకి పడవేయ వద్దని ఎంతో ప్రాధేయ పడ్డాయి.
LUK 8:32 అక్కడ కొండ మీద ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు, తాము ఆ పందుల్లోకి వెళ్ళేటట్లు అనుమతి యివ్వుమని యేసును వేడుకున్నాయి. ఆయన అనుమతినిచ్చాడు.
LUK 8:33 ఆ దయ్యాలు ఆ మనిషి నుండి బయటకు వచ్చి పందుల్లోకి జొరబడ్డాయి. ఆ తర్వాత అవి ఆ కొండనుండి క్రిందికి పరుగెత్తి సముద్రంలో పడి మునిగి పొయ్యాయి.
LUK 8:34 పందులు కాస్తున్న వాళ్ళు జరిగింది చూసి పరుగెత్తి వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళకు, పొలాల్లో ఉన్న వాళ్ళకు చెప్పారు.
LUK 8:35 ప్రజలు ఏమి జరిగిందో చూడాలని అక్కడికి వెళ్ళారు. అంతా యేసు దగ్గరకు వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలింపబడ్డవాడు యేసు కాళ్ళ దగ్గరవుండటం వాళ్ళు చూశారు. అతని ఒంటిపై దుస్తులువున్నాయి. అతని ప్రవర్తన సహజంగా ఉంది. ఇది గమనించి వాళ్ళకు భయం వేసింది.
LUK 8:36 జరిగింది చూసిన వాళ్ళు ఆ దయ్యం పట్టినవానికి ఏ విధంగా నయమైపోయిందో వచ్చిన వాళ్ళకు చెప్పారు.
LUK 8:37 గెరాసేను ప్రజలందరికి చాలా భయం వేయటంవల్ల తమ ప్రాంతం వదిలి వెళ్ళమని వాళ్ళు యేసుతో అన్నారు. అందువల్ల ఆయన పడవనెక్కి వెళ్ళిపోయాడు.
LUK 8:38 దయ్యాలు వదిలింపబడ్డ వాడు వెంటవస్తానని యేసును బ్రతిమిలాడాడు.
LUK 8:39 యేసు అతనితో, “నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు చేసిన మేలు అందరికి చెప్పు” అని అతణ్ణి పంపివేసాడు. అందువల్ల అతడు వెళ్ళి యేసు తనకు చేసిన మేలు తన గ్రామంలో ఉన్న వాళ్ళందరికి చెప్పాడు.
LUK 8:40 ప్రజలందరూ యేసు కోసం వేచి ఉన్నారు. ఆయన రాగానే వాళ్ళు ఆయనకు స్వాగతమిచ్చారు.
LUK 8:41 అదే సమయానికి సమాజ మందిరానికి అధికారిగా ఉన్న యాయీరు అన్న వ్యక్తి ఒకడు వచ్చి యేసు కాళ్ళ మీద పడ్డాడు.
LUK 8:42 తన పన్నెండేండ్ల కుమార్తె కూతురు చనిపోతుందని, తనకు ఒకే కూతురని, తన యింటికి వచ్చి ఆమెకు నయం చేయమని వేడుకున్నాడు. యేసు అతని ఇంటికి వెళ్తుండగా, ప్రజలు త్రోసుకొంటూ ఆయన చుట్టూ ఉన్నారు.
LUK 8:43 ఆ గుంపులో పన్నెండేండ్లనుండి రక్తస్రావంతో బాధపడ్తున్న ఒక స్త్రీ ఉంది. ఆమె తన దగ్గరున్న ధనమంతా ఖర్చు పెట్టినా ఏ వైద్యుడూ ఆమె రోగాన్ని నయం చేయలేక పోయాడు
LUK 8:44 ఆమె యేసు వెనుకనుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
LUK 8:45 ఆయన, “నన్నెవరు తాకారు?” అని అడిగాడు. అంతా తాము కాదన్నారు. అప్పుడు పేతురు, “ప్రభూ! ప్రజలు త్రోసుకొంటూ మీ మీద పడ్తున్నారు కదా! ఎవరని చెప్పగలము?” అని అన్నాడు.
LUK 8:46 యేసు, “కాని ఎవరోనన్ను తాకారు. నా నుండి శక్తి వెళ్ళటం గమనించాను” అని అన్నాడు.
LUK 8:47 అప్పుడా స్త్రీ తనను గమనించకుండా ఉండరని గ్రహించి, వణకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడింది. తాను ఆయన్ని ఎందుకు తాకిందో, తనకు ఎలా వెంటనే నయమైందో అందరి సమక్షంలో చెప్పింది.
LUK 8:48 అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా! నీ విశ్వాసం నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు” అని అన్నాడు.
LUK 8:49 యేసు యింకా మాట్లాడుతుండగా ఆ సమాజ మందిరపు అధికారి ఇంటినుండి ఒకడు వచ్చి అతనితో, “మీ కూతురు చనిపోయింది. ప్రభువును కష్టపెట్టనవసరం లేదు” అని అన్నాడు.
LUK 8:50 ఇది విని యేసు యాయీరుతో, “భయపడకు, విశ్వాసం ఉంచుకో, ఆమెకు నయమైపోతుంది” అని అన్నాడు.
LUK 8:51 యేసు యాయీరు యింటికి వచ్చాడు. పేతురు, యోహాను, యాకోబు ఆ అమ్మాయి తల్లి తండ్రుల్ని తప్ప మరెవ్వరిని తన వెంట రానివ్వలేదు.
LUK 8:52 వాళ్ళంతా ఆమె కోసం శోకిస్తూ ఉన్నారు. యేసు, “మీ శోకాలు ఆపండి. ఆమె చనిపోలేదు, నిద్రపోతూ ఉంది అంతే” అని అన్నాడు.
LUK 8:53 ఆమె చనిపోయిందని వాళ్ళకు తెలుసు కనుక వాళ్ళు ఆయన్ని హేళన చేసారు.
LUK 8:54 యేసు ఆమె చేతులు పట్టుకొని, “లే అమ్మాయి!” అని అన్నాడు.
LUK 8:55 ఆమె ఆత్మ తిరిగి ఆమెలో చేరింది. ఆమె వెంటనే లేచి కూర్చొంది. యేసు వాళ్ళతో, “ఆమెకు ఏదైనా తినటానికి యివ్వండి” అని అన్నాడు.
LUK 8:56 ఆమె తల్లి తండ్రులు దిగ్భ్రాంతి చెందారు. కాని యేసు జరిగిన దాన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఆజ్ఞాపించాడు.
LUK 9:1 యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని సమావేశ పరిచి దయ్యాల్ని పారద్రోలటానికి, రోగాలను నయం చేయటానికి వాళ్ళకు శక్తి, అధికారము ఇచ్చాడు.
LUK 9:2 వాళ్ళను ప్రపంచంలోకి పంపుతూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుమని, రోగాలున్న వాళ్ళకు నయం చెయ్యమని వాళ్ళతో చెప్పాడు.
LUK 9:3 వాళ్ళతో, “ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వెంట చేతి కర్రకాని, సంచికాని, ఆహారంకాని, ధనంకాని, మారు దుస్తులు కాని, యితర వస్తువులు కాని తీసుకు వెళ్ళకండి.
LUK 9:4 ఒక యింటికి వెళ్తే ఆ గ్రామం వదిలే దాకా ఆ యిల్లు విడిచి వెళ్ళకండి.
LUK 9:5 ప్రజలు మీకు స్వాగతం ఇవ్వకుంటే ఆ ఊరు వదిలి వెళ్ళే ముందు వాళ్ళు చేసిన పొరపాటు చూపటానికి మీ కాలి ధూళి దులపండి” అని అన్నాడు.
LUK 9:6 ఆ తర్వాత వాళ్ళు బయలు దేరి ప్రతి గ్రామానికి వెళ్ళారు. ప్రతిచోటా దైవ సందేశాన్ని ప్రకటించారు. రోగాలున్న వాళ్ళకు నయం చేసారు.
LUK 9:7 సామంతరాజైన హేరోదు జరుగుతున్న వాటిని గురించి విని చాలా కంగారు పడ్డాడు. యోహాను బ్రతికి వచ్చాడని కొందరన్నారు.
LUK 9:8 ఏలీయా కనిపించాడని కొందరన్నారు. మరికొందరు పూర్వకాలం నాటి ప్రవక్తల్లో ఒకడు బ్రతికి వచ్చాడని అన్నారు.
LUK 9:9 కాని హేరోదు, “నేను యోహాను తల నరికించాను కదా. మరి ఎవర్ని గురించి వింటున్నాను?” అని మనస్సులో అనుకొన్నాడు. హేరోదు యేసును చూడాలని ఆతృత పడ్డాడు.
LUK 9:10 అపొస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ యేసుతో చెప్పారు. ఆ తర్వాత యేసు అపొస్తలులను ప్రజలకు దూరంగా బేత్సయిదా అనే పట్టణానికి తన వెంట తీసుకు వెళ్ళాడు.
LUK 9:11 ప్రజలకు ఈ విషయం తెలిసింది. వాళ్ళు యేసును చూడటానికి అక్కడికి కూడా వెళ్ళారు. ఆయన వాళ్ళను ఆహ్వానించి దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి రోగాలున్న వాళ్ళకు నయం చేశాడు.
LUK 9:12 సూర్యాస్తమయమౌతుండగా ఆయన వద్దకు పన్నెండు మంది అపొస్తలులు వచ్చి, “మనం ఏ మూలో ఉన్నాం. ప్రజల్ని వెళ్ళమనండి. చుట్టూ ఉన్న పల్లెలకు, గ్రామాలకు వెళ్ళి ఆహారము, విశ్రమించటానికి స్థలం చూసుకొంటారు” అని అన్నారు.
LUK 9:13 యేసు వాళ్ళతో, “వాళ్ళు తినటానికి మీరేదైనా ఆహారం ఇవ్వండి” అని అన్నాడు. వాళ్ళు, “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి. మేము వెళ్ళి వీళ్ళందరికోసం ఆహారం కోనుక్కు రావాలని మీ ఉద్దేశ్యమా?” అని అన్నారు.
LUK 9:14 సుమారు ఐదువేలమంది పురుషులు అక్కడ ఉన్నారు. కాని యేసు తన శిష్యులతో, “పంక్తికి యాభైమంది చొప్పున వాళ్ళను కూర్చో బెట్టండి” అని అన్నాడు.
LUK 9:15 శిష్యులు ఆయన చెప్పినట్లు చేసారు. వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు.
LUK 9:16 యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసుకొని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని భాగాలు చేశాడు. వాటిని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు.
LUK 9:17 అందరూ కడుపు నిండుగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ఆహారాన్ని పండ్రెండు గంపల నిండా నింపారు.
LUK 9:18 ఒకరోజు యేసు ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ప్రార్థించటం ముగించాక వాళ్ళతో, “ప్రజలు నేను ఎవర్నని అంటున్నారు?” అని అడిగాడు.
LUK 9:19 వాళ్ళు, “కొందరు బాప్తిస్మము నిచ్చే యోహాను అని అంటున్నారు. మరికొందరు పూర్వకాలం నాటి ప్రవక్త బ్రతికి వచ్చాడు అని అంటున్నారు” అని సమాధానం చెప్పారు.
LUK 9:20 “మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని ఆయన అడిగాడు. పేతురు, “మీరు దేవుడు పంపిన క్రీస్తు” అని సమాధానం చెప్పాడు.
LUK 9:21 “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు” అని యేసు ఖండితంగా చెప్పాడు.
LUK 9:22 ఆయన వాళ్ళతో, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన్ని తిరస్కరిస్తారు. ఆయన చంపబడి మూడవ రోజున బ్రతికింపబడతాడు” అని అన్నాడు.
LUK 9:23 ఆ తర్వాత వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా వెంట రావాలనుకొన్నవాడు తన కోరికల్ని చంపుకొని, తన సిలువను ప్రతిరోజు మోసుకొంటూ నన్ను అనుసరించాలి.
LUK 9:24 తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొంటాడు.
LUK 9:25 ప్రపంచాన్నంతా జయించి తనను పోగొట్టుకొని, తన జీవితాన్ని నాశనం చేసుకొంటే దానివల్ల కలిగే లాభమేమిటి?
LUK 9:26 నన్ను, నా సందేశాన్ని అంగీకరించటానికి సిగ్గుపడిన వాళ్ళ విషయంలో, మనుష్యకుమారుడు తన తేజస్సుతో, తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతల తేజస్సుతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడు.
LUK 9:27 ఇది నిజం. ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడకుండా మరణించరు.”
LUK 9:28 ఈ విధంగా చెప్పిన ఎనిమిది రోజులకు పేతురు, యోహాను, యాకోబును తన వెంట తీసుకొని ఒక కొండ మీదికి యేసు ప్రార్థించటానికి వెళ్ళాడు.
LUK 9:29 ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖతేజస్సు మారింది. ఆయన దుస్తులు తెల్లగా ప్రకాశించటం మొదలు పెట్టాయి.
LUK 9:30 అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు తేజస్సుతో యేసు ముందు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళు మోషే, ఏలీయాలు.
LUK 9:31 యెరూషలేములో నెరవేర్చబడనున్న దైవేచ్ఛను గురించి, అంటే ఆయన మరణాన్ని గురించి, మాట్లాడారు.
LUK 9:32 పేతురు, అతని వెంటనున్న వాళ్ళు మంచి నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళకు మెలకువ వచ్చింది. వాళ్ళు లేచి యేసు తేజస్సును, ఆయనతో నిలుచొని ఉన్న ఆ యిద్దరి పురుషుల తేజస్సును చూసారు.
LUK 9:33 మోషే, ఏలీయాలు వెళ్తుండగా పేతురు యేసుతో, “ప్రభూ! మనము యిక్కడ ఉండటం మంచిది. మీకొకటి, మోషేకొకటి, ఏలీయా కొకటి మూడు పర్ణశాలలు వేయమంటారా?” అని అడిగాడు. పరిస్థితి అర్థం చేసుకోకుండా అతడు ఈ మాటలు అన్నాడు.
LUK 9:34 పేతురు ఈ మాట అంటుడగానే ఒక మేఘం వచ్చి వాళ్ళను కప్పివేసింది. వాళ్ళను ఆ మేఘం కప్పివేస్తుండగా పేతురుకు, అతనితో ఉన్న వాళ్ళకు భయం వేసింది.
LUK 9:35 ఆ మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఎన్నుకొన్నవాడు. ఆయన చెప్పినట్లు చెయ్యండి” అని వినబడింది.
LUK 9:36 ఆ స్వరం మాట్లాడటం ముగించాక వాళ్ళకు అక్కడ యేసు మాత్రమే కనిపించాడు. చాలా కాలందాకా శిష్యులు తాము చూసిన దాన్ని ఎవ్వరికి చెప్పలేదు.
LUK 9:37 మరుసటి రోజు వాళ్ళు కొండ దిగగానే పెద్ద ప్రజల గుంపు ఒకటి యేసును చూడటానికి అక్కడ సమావేశమైంది.
LUK 9:38 ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! వచ్చి నా కుమారుణ్ణి కటాక్షించుమని వేడు కుంటున్నాను. నాకు ఒక్కడే కుమారుడు.
LUK 9:39 ఒక దయ్యం అతణ్ణి ఆవరిస్తుంది. అది మీదికి రాగానే అతడు బిగ్గరగా కేకలు వేస్తాడు. అది ఆతణ్ణి క్రింద పడవేస్తుంది. అతడు వణుకుతూ నోటినుండి నురుగులు కక్కుతాడు. అది అతణ్ణి వదలటం లేదు. అతణ్ణి పూర్తిగా నాశనం చేస్తొంది.
LUK 9:40 ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని మీ శిష్యుల్ని వేడుకున్నాను. కాని వాళ్ళు ఆ పని చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.
LUK 9:41 యేసు, “మూర్ఖతరం వారలారా! విశ్వాస హీనులారా! మీతో ఉండి ఎన్ని రోజులు సహించాలి? నీ కుమారుణ్ణి పిలుచుకురా!” అని అన్నాడు.
LUK 9:42 ఆ దయ్యం పట్టినవాడు వస్తూవుంటే అది అతణ్ణి నేల మీద పడవేసింది. యేసు ఆ దయ్యాన్ని వెళ్ళిపొమ్మని గద్దించి ఆ బాలునికి నయం చేశాడు. తదుపరి అతణ్ణి అతని తండ్రికి అప్పగించాడు.
LUK 9:43 దేవుని మహిమ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. యేసు చేసింది చూసి వాళ్ళు తమ ఆశ్చర్యం నుండి కోలుకోక ముందే యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నాడు:
LUK 9:44 “నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మనుష్యకుమారుణ్ణి ఒక ద్రోహి యితర్లకు అప్పగిస్తాడు.”
LUK 9:45 వాళ్ళకు దీని అర్థం తెలియలేదు. వాళ్ళకు అర్థం కాకుండునట్లు రహస్యంగా ఉంచబడింది. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు ధైర్యం చాలలేదు.
LUK 9:46 తమలో అందరికన్నా ఎవరు గొప్ప అన్న అంశంపై శిష్యుల మధ్య ఒక వాదం మొదలైంది.
LUK 9:47 యేసుకు వాళ్ళ ఆలోచనలు తెలిసిపోయాయి. ఆయన ఒక చిన్న పిల్లవాణ్ణి తీసుకొని తన ప్రక్కన నిలబెట్టుకొని
LUK 9:48 వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా పేరిట ఈ పసివానిని అంగీకరిస్తే నన్ను అంగీకరించిన దానితో సమానము. నన్ను అంగీకరిస్తే నన్ను పంపిన వానిని అంగీకరించిన దానితో సమానము. మీలో అందరికన్నా తక్కువవాడు అందరికన్నా గొప్పవానితో సమానము.”
LUK 9:49 యోహాను, “అయ్యా! మీ పేరుతో ఒకడు దయ్యాల్ని వదిలిస్తున్నాడు. అతడు మన వాడు కాదు. కనుక అలా చెయ్యవద్దని అడ్డగించాము” అని అన్నాడు.
LUK 9:50 యేసు, “అతణ్ణి ఆపకండి. నాకు వ్యతిరేకంగా ఉండని వాడు నాకు అనుకూలంగా ఉన్న వానితో సమానము” అని అన్నాడు.
LUK 9:51 ఆయన పరలోకానికి వెళ్ళే సమయం దగ్గర పడసాగింది. యేసు యెరూషలేము వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు.
LUK 9:52 తన దూతల్ని తనకన్నా ముందు పంపాడు. వాళ్ళు ఆయన కోసం అన్నీ సిద్దం చెయ్యాలని ఒక సమరయ పల్లెకు వెళ్ళారు.
LUK 9:53 ఆ వూరి వాళ్ళు ఆయన యెరూషలేము వెళ్తుండటం వలన ఆయనకు స్వాగతమివ్వలేదు.
LUK 9:54 ఆయన శిష్యులలో యాకోబు, యోహాను యిది చూసి యేసుతో, “ప్రభూ! వాళ్ళను నాశనం చేయటానికి ఆకాశం నుండి అగ్ని రప్పించమంటారా?” అని అడిగారు.
LUK 9:55 యేసు వాళ్ళవైపు చూసి వాళ్ళను గద్దించాడు.
LUK 9:56 అక్కడి నుండి వాళ్ళంతా మరొక గ్రామానికి వెళ్ళారు.
LUK 9:57 వాళ్ళు దారిమీద నడుస్తుండగా ఒకడు యేసుతో, “మీరు ఎక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు.
LUK 9:58 యేసు, “నక్కలు నివసించటానికి బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడా స్థలం లేదు” అని అన్నాడు.
LUK 9:59 యేసు యింకొకనితో, “నా వెంట రా!” అని అన్నాడు. కాని అతడు, “ప్రభూ! నేను వెళ్ళి ముందు నా తండ్రిని సమాధి చేసి రానివ్వండి!” అని అన్నాడు.
LUK 9:60 యేసు అతనితో, “చనిపోయిన వాళ్ళ సంగతి చనిపోయినవాళ్ళు చూసుకోనీ. నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించు” అని అన్నాడు.
LUK 9:61 ఇంకొకడు, “ప్రభూ! నేను మిమ్మల్ని అనుసరిస్తాను. కాని ముందు వెళ్ళి నాయింటి వాళ్ళకు చెప్పి రానివ్వండి” అని అన్నాడు.
LUK 9:62 అందుకు యేసు, “దున్నుటకు నాగల్ని పట్టుకొని వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు” అని అతనితో చెప్పాడు.
LUK 10:1 ఆ తర్వాత యేసు మరొక డెబ్బది రెండు మంది శిష్యులను నియమించాడు. వాళ్ళను జతలు జతలుగా తాను వెళ్ళబోయే ప్రతి గ్రామానికి, పల్లెకు తన కంటే ముందు పంపుతూ,
LUK 10:2 “పంటబాగా పండింది. కాని పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. అందువల్ల పంటనిచ్చిన ఆ ప్రభువును పని వాళ్ళను తన పొలాలకు పంపమని ప్రార్థించండి.
LUK 10:3 “వెళ్ళండి! తోడేళ్ళ మందలోకి గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను.
LUK 10:4 మీ వెంటడబ్బు దాచుకొనే సంచి కాని, జోలి కాని, చెప్పులు కాని, తీసుకు వెళ్ళకండి. దారి మీద ఎవ్వరితో మాట్లాడకండి.
LUK 10:5 ఒకరి యింట్లోకి వెళ్ళేముందు, మొదట సమాధానం కలుగుగాక అని చెప్పండి.
LUK 10:6 ఆ యింటిలో శాంతి పొందనర్హుడైన వ్యక్తి ఉంటే మీ ఆశీస్సు అతనికి తోడౌతుంది. లేని పక్షంలో మీ ఆశీస్సు మీకు తిరిగివస్తుంది.
LUK 10:7 ఉన్న యింట్లోనే ఉండండి. ఇచ్చిన దాన్ని భుజించండి. పని చేసినవానికి కూలి దొరకాలి కదా! ఇల్లిల్లు తిరగకండి.
LUK 10:8 “ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగతమిచ్చి ఏది మీ ముందు పెడితే అది భుజించండి.
LUK 10:9 గ్రామంలో ఉన్న రోగులకు నయం చెయ్యండి. వాళ్ళతో, ‘దేవుని రాజ్యం మీ దగ్గరకు వస్తోంది’ అని చెప్పండి.
LUK 10:10 “మీరొక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగత మివ్వకుంటే
LUK 10:11 వీధిలోకి వెళ్ళి మీరు చేస్తున్నది తప్పని సూచించటానికి, ‘మా కాలికంటిన మీ ఊరి ధూళి కూడా దులిపి వేస్తున్నాము. కాని యిది మాత్రం నిజం. దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది. తెలిసికోండి’ అని అనండి.
LUK 10:12 తీర్పు చెప్పబోయేరోజున, ఆ ఊరి ప్రజల్ని దేవుడు సొదొమ ప్రజలకన్నా ఎక్కువగా శిక్షిస్తాడని నేను చెబుతున్నాను.
LUK 10:13 “అయ్యో కొరాజీనా! అయ్యో బేత్సయిదా! మీకోసం చేసిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాలలో చేసివుంటే వాళ్ళు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకొని బూడిద తలపై వేసుకొని పశ్చాత్తాపం చెంది, మారుమనస్సు పొందివుండే వాళ్ళు.
LUK 10:14 కాని తీర్పు చెప్పబడే రోజున తూరు, సీదోను ప్రజలకన్నా మిమ్మల్ని ఎక్కువగా శిక్షిస్తాడు.
LUK 10:15 ఇక, ఓ కపెర్నహూమా! ఆకాశ మంత ఎత్తుగా హెచ్చించుకొందువా? పాతాళానికి త్రోసి వేయబడతావు.
LUK 10:16 “మీ బోధనలు వింటే నా బోధనలు విన్నట్టే. మిమ్మల్ని నిరాకరిస్తే నన్నును నిరాకరించినట్టే. నన్ను నిరాకరిస్తే నన్ను పంపినవానిని నిరాకరించినట్లే” అని వాళ్ళతో అన్నాడు.
LUK 10:17 ఆ డెబ్బది రెండు మంది శిష్యులు ఆనందంతో తిరిగి వచ్చి, “ప్రభూ! మీ పేరు చెప్పగానే దయ్యాలు కూడా మా మాటలకు లోబడ్డాయి” అని అన్నారు.
LUK 10:18 యేసు, “సైతాను ఆకాశం నుండి మెరుపువలే పడిపోవటం నేను చూశాను.
LUK 10:19 పాముల మీద నడవటానికి మీకు అధికారము యిచ్చాను. శత్రువును జయించే అధికారం యిచ్చాను. ఏది మీకు హాని చెయ్యలేదు.
LUK 10:20 దయ్యాలు మీ మాట వింటున్నంత మాత్రాన ఆనందించకండి. మీ పేరు పరలోకంలో వ్రాయబడినందుకు ఆనందించండి” అని అన్నాడు.
LUK 10:21 ఆయన పవిత్రాత్మలో సంతోషిస్తూ, “ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి ఓ తండ్రి! నీకు స్తుతులు! నీవీ విషయాలు చదువుకున్న వాళ్ళనుండి, విజ్ఞానుల నుండి దాచి, అమాయకులకు తెలియ చేసావు. ఔను, తండ్రీ! ఇదే నీచిత్తము.
LUK 10:22 “నా తండ్రి నాకు అన్నీ యిచ్చాడు. తండ్రికి తప్ప కుమారుడెవరో ఇతర్లకు తెలియదు. కుమారుడు చెప్పదలచిన వాళ్లకు తప్ప తండ్రి ఎవరో యితర్లకు తెలియదు” అని అన్నాడు.
LUK 10:23 ఆ తర్వాత తన శిష్యుల వైపు తిరిగి, “మీరు చూస్తున్నవి చూసే కన్నులు ధన్యమైనవి.
LUK 10:24 నేను చెప్పేదేమిటంటే మీరు చూస్తున్నవి చూడాలని చాలా మంది ప్రవక్తలు, రాజులు ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని వాళ్ళాశించారు. కాని వినలేక పోయారు” అని రహస్యంగా వారితో అన్నాడు.
LUK 10:25 ఒక ధర్మశాస్త్ర పండితుడు యేసును పరీక్షించాలనుకొని లేచి, “బోధకుడా! నేను నిత్యజీవం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
LUK 10:26 దానికి యేసు, “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసారు? నీవు ఏమిచదివావు?” అని అడిగాడు.
LUK 10:27 అతడు, “‘నీ ప్రభువైనటువంటి దేవుణ్ణి సంపూర్ణమైన మనస్సుతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితోనూ, శక్తితోనూ ప్రేమించు.’ అంతేకాక, ‘నిన్ను ప్రేమించుకొన్నంతగా నీ పొరుగు వాళ్ళను ప్రేమించు’ అని వ్రాయబడివుంది” అని చెప్పాడు.
LUK 10:28 యేసు ఈ విధంగా అన్నాడు: “నీవు సరియైన సమాధానం చెప్పావు. ఆ విధంగా నడుచుకో, అనంత జీవితం పొందుతావు.”
LUK 10:29 ఆ పండితుడు తాను నీతిమంతుడనని రుజువు చేయటానికి యేసుతో, “మరి నా పొరుగువాడు ఎవరు?” అని అడిగాడు.
LUK 10:30 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ దార్లో దొంగల చేతిలో చిక్కాడు. వాళ్ళతణ్ణి నిలువు దోపిడి చేసి బాగాకొట్టి వదిలి వేసారు. అతడు కొన ప్రాణంతో ఉన్నాడు.
LUK 10:31 “అనుకోకుండా ఒక యాజకుడు ఆ దారిన రావటం తటస్థించింది. అతణ్ణి చూసి కూడా ఆ యాజకుడు ప్రక్కకు తొలిగి వెళ్ళిపొయ్యాడు.
LUK 10:32 అదే విధంగా ఒక లేవీయుడు కూడా వచ్చి అతణ్ణి చూసి ప్రక్కకు తొలిగి వెళ్ళి పొయ్యాడు.
LUK 10:33 “ఒక సమరయ ప్రాంతపువాడు ప్రయాణం చేస్తూ అతని దగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూసి ఆ సమరయ వానికి చాలా జాలి కలిగింది.
LUK 10:34 అతని దగ్గరకు వెళ్ళి అతని గాయాలమీద ద్రాక్షారసం పోసి, నూనె రాచి, కట్లుకట్టాడు. ఆ తర్వాత తన దగ్గరున్న గాడిద మీద అతణ్ణి ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకు వెళ్ళాడు. ఈ విధంగా అతనికి చాలా ఉపకారం చేశాడు.
LUK 10:35 మరుసటి రోజు ఆ సత్రపు యజమానికి రెండు దేనారాలిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతని కోసం నేనిచ్చిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బు నీకిస్తాను’ అని చెప్పి వెళ్ళి పొయ్యాడు.”
LUK 10:36 ఈ విషయం చెప్పి యేసు, “దొంగల చేతుల్లో చిక్కిన వానికి ఈ ముగ్గరిలో ఎవరు పొరుగువాడని నీ అభిప్రాయం?” అని అడిగాడు.
LUK 10:37 ఆ పండితుడు, “అతనిపై జాలి చూపిన వాడే!” అని సమాధానం చెప్పాడు. దానికి యేసు, “నీవు కూడా అతనిలాగే నడుచుకో” అని చెప్పాడు.
LUK 10:38 యేసు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో మార్త అనే స్త్రీ ఆయన్ని తన యింటికి ఆహ్వానించింది.
LUK 10:39 ఆమెకు మరియ అనే ఒక సోదరి ఉంది. మరియ యేసు ప్రభువు కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చెప్పిన విషయాలు వింటూ ఉంది.
LUK 10:40 కాని మార్తకు పని ఎక్కువగా ఉండటం వల్ల చిరాకు కలిగింది. ఆమె యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరి యింటి పనులంతా నామీద వదిలి వేయటం మీకు న్యాయమనిపిస్తుందా? వచ్చి నాకు సహాయం చెయ్యమని ఆమెతో చెప్పండి” అని అన్నది.
LUK 10:41 ప్రభువు, “మార్తా! మార్తా! పనులు ఎక్కువగా ఉండటంవల్ల నీకు చింత, చిరాకు కలుగుతున్నాయి.
LUK 10:42 నిజంగా చెయ్యవలసింది ఒక్కటే పని. మరియ ఏది ఉత్తమమో దాన్ని ఎన్నుకొంది. దాన్ని ఆమెనుండి ఎవ్వరూ తీసుకోలేరు” అని అన్నాడు.
LUK 11:1 ఒక రోజు యేసు ఒక చోట ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థించటం ముగించాక ఆయన శిష్యుల్లో ఒకడు, “ప్రభూ! యోహాను తన శిష్యులకు ప్రార్థించటం నేర్పించినట్లు మాక్కూడా ప్రార్థించటం నేర్పండి” అని అడిగాడు.
LUK 11:2 ఆయన వాళ్ళతో, “మీరు ఈ విధంగా ప్రార్థించాలి: ‘తండ్రీ! నీ పేరు పవిత్రంగానే ఉండాలి! నీ రాజ్యం రావాలి!
LUK 11:3 మాకు ప్రతి రోజు ఆహారం యివ్వు!
LUK 11:4 మా పట్ల పాపం చేసిన వాళ్ళను మేము క్షమించినట్లు మా పాపాలు క్షమించు. మమ్మల్ని శోధనలో పడనివ్వవద్దు!’”
LUK 11:5 ఆ తర్వాత ఆయన వాళ్ళతో, “ఒక వేళ మీలో ఒకడు అర్ధరాత్రివేళ తన స్నేహితుని యింటికి వెళ్ళి, ‘నా స్నేహితుడు ఒకడు అకస్మాత్తుగా మా యింటికొచ్చాడు. మా యింట్లో తినటానికి ఏమి లేదు. మూడు రొట్టెలుంటే యిస్తావా?’ అని అడిగాడనుకొండి.
LUK 11:7 ఆ స్నేహితుడు యింటి నుండి బయటకు రాకుండా, ‘నేను, నా పిల్లలు పడుకున్నాం. తలుపులు కూడా తాళం వేసాం. అనవసరంగా బాధ పెట్టొద్దు. అయినా యిప్పుడు లేచి నేను రొట్టెలివ్వలేను’ అని అన్నాడనుకోండి. నేను చెప్పేదేమిటంటే,
LUK 11:8 అతడు తన స్నేహితుడైనందుకు రొట్టెలు యివ్వకపోయినా మొండిగా అడగటం వల్ల తప్పక లేచి అతడడిగిన రొట్టెలు యిస్తాడు.
LUK 11:9 కనుక, నేను మీకు చెప్పేదేమంటే; అడగండి, మీకు లభిస్తుంది. వెతకండి దొరుకుతుంది. తలుపు తట్టండి, అది మీకోసం తెరుచుకుంటుంది.
LUK 11:10 ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన వానికి దొరుకుతుంది. తలుపు తడితే అది అతని కోసం తెరుచుకుంటుంది.
LUK 11:11 మీలో ఏ తండ్రి తన కుమారుడు చేప నడిగితే, చేపకు బదులుగా పామునిస్తాడు?
LUK 11:12 లేక గ్రుడ్డునడిగితే తేలునిస్తాడు?
LUK 11:13 మీరు చెడ్డవాళ్లైనా మీ కుమారులకు మంచి బహుమతులు ఎట్లా యివ్వాలో మీకు తెలుసు. కనుక పరలోకంలో ఉన్న మీ తండ్రి తన్నడిగినవాళ్ళకు పవిత్రాత్మను తప్పక యిస్తాడని గ్రహించండి” అని చెప్పాడు.
LUK 11:14 ఒక రోజు యేసు ఒక మూగ దయ్యాన్ని పారద్రోలుతూ ఉన్నాడు. ఆ దయ్యం వెళ్ళిపోగానే అది పట్టిన మనిషి మాట్లాడటం మొదలు పెట్టాడు. అది చూసి ప్రజలు దిగ్భ్రాంతి చెందారు.
LUK 11:15 కొందరు, “బయెల్జెబూలు అనే దయ్యాలరాజు ద్వారా అతడు దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు.
LUK 11:16 మరి కొందరు యేసును పరీక్షించుచూ ఒక అద్భుతం పరలోకం నుండి చూపుమని అడిగారు.
LUK 11:17 యేసుకు వాళ్ళ అభిప్రాయం తెలిసిపోయింది. అందువల్ల వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “చీలికలు కలిగిన యిల్లు పడిపోతుంది.
LUK 11:18 సైతానురాజ్యంలో చీలికలు కలిగితే వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? ఇలా ఎందుకు అంటున్నానంటే బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాల్ని వదిలిస్తున్నానని మీరు అంటున్నారు.
LUK 11:19 నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాల్ని వదిలిస్తున్నట్లైతే, మీ వాళ్ళు దేని సహయంతో దయ్యాల్ని వదిలిస్తున్నారు? అందువల్ల మీ వాదన తప్పని మీ వాళ్ళే రుజువు చేస్తున్నారు.
LUK 11:20 కాని నేను దైవశక్తితో దయ్యాల్ని వదిలిస్తున్నాను కనుక, దేవుని రాజ్యం వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తొంది.
LUK 11:21 “ఒక బలవంతుడు ఆయుధాల్ని ధరించి తన యింటిని కాపలా కాస్తే అతని యింట్లోని వస్తువులు భధ్రంగా ఉంటాయి.
LUK 11:22 కాని అతని కన్నా బలవంతుడు వచ్చి మీదపడి అతన్ని ఓడిస్తే అతడిన్నాళ్ళు నమ్ముకున్న ఆయుధాలన్నీ ఇంటివానియొద్ద నుండి తీసుకొని, ఆదోచుకొన్న వస్తువుల్ని అందరికి పంచి పెడ్తాడు.
LUK 11:23 “నాతో ఉండని వాడు నాకు వ్యతిరేకంగా ఉన్న వానితో సమానము. నాతో కలిసి గొఱ్ఱెల్ని ప్రోగుచేయటానికి సహాయం చెయ్యనివాడు వాటిని చెదరగొట్టిన వానితో సమానము.
LUK 11:24 “దయ్యము ఒక మనిషి నుండి వెలుపలికి వచ్చాక విశ్రాంతి కోసం నీరులేని స్థలాల్లో వెతుకుతుంది. కాని దానికి విశ్రాంతి లభించదు. అప్పుడది, ‘నేను వదిలి వచ్చిన యింటికి వెళ్తాను’ అని అనుకుంటుంది.
LUK 11:25 అక్కడికి వెళ్ళాక ఆ యిల్లు ఊడ్చబడి వుండటం ఎక్కడి వస్తువులక్కడ సక్రమంగా వుండటం చూస్తుంది.
LUK 11:26 అది మళ్ళీ బయటికి వెళ్ళి తనకన్నా దుర్మార్గులైన ఏడు దయ్యాలను తనవెంట తీసుకువస్తుంది. ఆ దయ్యాలన్నీ కలిసి ఆ యింట్లో నివసించటానికి వెళ్తాయి. అప్పుడు ఆ మనిషి స్థితి మొదటిస్థితికన్నా అధ్వాన్నంగా ఉంటుంది.”
LUK 11:27 యేసు ఈ విషయాలు చెబుతుండగా ప్రజల్లో ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను కని, పెంచిన ఆ తల్లి ధన్యురాలు” అని అన్నది.
LUK 11:28 ఆయన, “అవునుగాని, దైవసందేశం విని దాన్ని పాటించే వాళ్ళు ఇంకా ధన్యులు” అని సమాధానం చెప్పాడు.
LUK 11:29 ప్రజల గుంపు పెరుగుతూ పోయింది. యేసు ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఈ కాలం వాళ్ళు చెడ్డవాళ్ళు, గనుక అద్భుతాలు అడుగుతారు. దేవుడు యోనాను పంపి యిచ్చిన రుజువు తప్ప, మరే రుజువు మీకు యివ్వబడదు.
LUK 11:30 ఎందుకంటే, నీనెవె ప్రజలకు యోనా ఏ విధంగా ఒక రుజువో అదే విధంగా మనుష్యకుమారుడు ఈ తరం వాళ్ళకు ఒక రుజువు.
LUK 11:31 “దక్షిణ దేశపు రాణి సొలొమోను రాజు బోధిస్తున్న జ్ఞానాన్ని వినటానికి చాలా దురం నుండి వచ్చింది. కాని యిప్పుడు సొలోమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. ఈనాటి ప్రజలు ఆయన మాటలు వినటం లేదు. కనుక తీర్పు చెప్పబడే రోజు ఆ రాణి వీళ్ళతో సహా నిలబడి వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తుంది.
LUK 11:32 “నీనెవె ప్రజలు యోనా బోధనలు విని మారుమానస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజున వాళ్ళు ఈనాటి ప్రజలతో సహా నిలుచొని వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తారు. కాని యిప్పుడు యోనా కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు.
LUK 11:33 “దీపాన్ని వెలిగించి, యింటికి వచ్చే పోయే వాళ్ళకు కనిపించేలా ఒక ఎత్తైన బల్ల మీద పెడ్తాము కాని, గంప క్రింద దాచి ఉంచము.
LUK 11:34 మీ కళ్ళు దేహానికి దీపం లాంటివి. మీ కళ్ళు బాగుంటే మీ దేహమంతా కాంతితో వెలుగుతుంది. కాని, అవి చెడిపోతే, మీ దేహమంతా చీకటైపోతుంది.
LUK 11:35 అందువలన మీలో ఉన్న వెలుగు చీకటైపోకుండా చూసుకొండి.
LUK 11:36 మీ దేహమంతా కొంచెం కూడా చీకటిలో లేకుండా వెలుగుతూ ఉంటే అది సంపూర్ణంగా వెలుగుతూ ఉంటుంది. ఆ దేహం దీపపు వెలుగు ప్రకాశించినట్లు ప్రకాశిస్తుంది.”
LUK 11:37 యేసు మాట్లాడటం ముగించాడు. ఒక పరిసయ్యుడు యేసును తన యింటికి ఆహ్వానించాడు. యేసు అతని యింటికి వెళ్ళి భోజనానికి కూర్చుని ఉన్నాడు.
LUK 11:38 యేసు భోజనానికి ముందు చేతులు కడుక్కోకుండా కూర్చోవటం గమనించి పరిసయ్యునికి ఆశ్చర్యం వేసింది.
LUK 11:39 అప్పుడు ప్రభువు అతనితో, “మీ పరిసయ్యులు గిన్నెల్ని, పళ్ళేల్ని వెలుపలి భాగం శుభ్రం చేస్తారు. కాని లోపల దురాశ, దుష్టత్వము నిండివుంటాయి.
LUK 11:40 మూర్ఖులారా! వెలుపలి భాగం సృష్టించిన వాడే లోపలి భాగం సృష్టించలేదా?
LUK 11:41 మీరు దాచుకున్న వాటిని పేదవాళ్ళకు దానం చెయ్యండి. అప్పుడు మీరు పూర్తిగా శుభ్రమౌతారు.
LUK 11:42 “మీరు మీ తోటలో పండిన పుదీనా, సదాప మొదలగు కూరగాయల యొక్క పదవవంతు దేవునికి యిస్తారు. కాని న్యాయాన్ని, దేవుని ప్రేమని నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక మీకు శ్రమ. పదవవంతు ఇవ్వటం మానుకోకుండా న్యాయాన్ని, దేవుని ప్రేమను కూడా అలవరచుకోవలసింది.
LUK 11:43 “మీరు సమాజ మందిరాల్లో ఉన్నత స్థలాల్లో కూర్చోవటానికోసం ప్రాకులాడుతారు. దారి మీద వెళ్తూవుంటే ప్రజలు గౌరవమివ్వాలని ఆశిస్తారు. కనుక మీకు శ్రమ తప్పదు.
LUK 11:44 ప్రజలు తమకు తెలియకుండా త్రొక్కుతూ నడిచే సమాధుల్లాంటి వాళ్ళు మీరు. మీకు శ్రమ తప్పదు” అని అన్నాడు.
LUK 11:45 ధర్మశాస్త్రంలో పాండిత్యం ఉన్న ఒకడు లేచి, “బోధకుడా! మీరీ విధంగా మాట్లాడి మమ్మల్ని కూడా అవమానిస్తున్నారు” అని అన్నాడు.
LUK 11:46 యేసు, “ధర్మశాస్త్ర పండితులారా! మీరు ప్రజలపై వాళ్ళు మోయలేని భారం వేస్తున్నారు. కాని వాటిని లేపటానికి మీరు ఒక్క వ్రేలు కూడా కదల్చరు. కనుక మీకు శ్రమ తప్పదు.
LUK 11:47 మీరు ప్రవక్తల కోసం సమాధులు కట్టిస్తారు. కాని మీ పూర్వికులు వాళ్ళను చంపారు. కనుక మీకు శిక్ష తప్పదు.
LUK 11:48 అంటే పూర్వికులు చేసిన దాన్ని అంగీకరిస్తున్నట్లు నిరూపించుకొంటున్నారన్న మాట. వాళ్ళు ప్రవక్తల్ని చంపారు. మీరు సమాధులు కట్టించారు.
LUK 11:49 అందువల్లే దేవుడు దివ్యజ్ఞానంతో ఈ విధంగా చెప్పాడు: ‘నేను వాళ్ళకోసం ప్రవక్తల్ని, అపొస్తలులను పంపుతాను. కొందర్ని వాళ్ళు చంపుతారు. మిగతా వాళ్ళను హింసిస్తారు.’
LUK 11:50 “అందువలన ప్రపంచం పుట్టిన నాటినుండి ప్రవక్తలు కార్చిన రక్తానికి ఈ తరం వాళ్ళు బాధ్యులు.
LUK 11:51 హేబెలు హత్య మొదలుకొని ధూప వేదికకు, మందిరానికి మధ్య చంపబడిన జెకర్యా హత్యదాకా వీళ్ళు బాధ్యులు. ఔను. ఈ కాలం వాళ్ళు వీటికి బాధ్యులని నేను చెబుతున్నాను.
LUK 11:52 “ధర్మశాస్త్ర పండితులారా! జ్ఞానం యొక్క తాళం చెవి మీరు తీసుకున్నారు. దాని తలుపులు తెరిచి మీరు లోనికి వెళ్ళలేరు. పైగా వెళ్తున్న వాళ్ళను అడ్డగిస్తారు. మీకు శిక్ష తప్పదు” అని చెప్పాడు.
LUK 11:53 యేసు అక్కడినుండి వెళ్ళిన తర్వాత పరిసయ్యులును, శాస్త్రులును ఆయనను ఇంకా ఎక్కువగా వ్యతిరేకించారు. ప్రశ్నలతో ఆయన్ని వేధించారు.
LUK 11:54 ఆయనను మాటలలో చిక్కించాలని ప్రయత్నించారు.
LUK 12:1 అంతలో వేలమంది ప్రజలు సమావేశమవటం వలన ఒకళ్ళనొకళ్ళు త్రోసు కోవటం మొదలు పెట్టారు. యేసు మొదట తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు: “పరిసయ్యుల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తపడండి.
LUK 12:2 బయట పడకుండా ఏదీ దాగివుండదు. దాచబడింది ఏదీ బహిరంగం కాకుండా పోదు.
LUK 12:3 చీకట్లో మాట్లాడుకున్న మాటలు అందరికీ వినిపిస్తాయి. గది తలుపులు వేసుకొని రహస్యంగా మాట్లాడుకున్న విషయాలు ఇంటి కప్పుల మీదినుండి ప్రకటింపబడతాయి.
LUK 12:4 “మిత్రులారా! నేను చెబుతున్నది వినండి: ఈ శరీరాన్ని చంపేవాళ్ళను చూసి భయపడకండి. దాన్ని చంపాక వాళ్ళేమీ చెయ్యలేరు.
LUK 12:5 ఎవరికి భయపడాలో నేను చెబుతున్నాను. శరీరం చనిపోయాక మిమ్మల్ని నరకంలో పారవేయటానికి అధికారమున్న వానికి భయపడండి! ఔను, ఆయనకు భయపడుమని చెబుతున్నాను.
LUK 12:6 “రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్ముడు పోతాయి కదా! అయినా, ఒక్క పిచ్చుకనైనా దేవుడు మరచిపోలేదు.
LUK 12:7 మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు. పిచ్చుకలకన్నా మీ విలువ ఎక్కువే! కనుక భయపడకండి.
LUK 12:8 “బహిరంగంగా నన్ను అంగీకరించిన వాణ్ణి మనుష్యకుమారుడు దేవదూతల సమక్షంలో అంగీకరిస్తాడని నేను చెబుతున్నాను.
LUK 12:9 కాని ప్రజల సమక్షంలో నన్ను కాదన్న వాణ్ణి మనుష్యకుమారుడు దేవుని సమక్షంలో కాదంటాడు.
LUK 12:10 “మనుష్యకుమారుణ్ణి దూషించిన వాణ్ణి దేవుడు క్షమించవచ్చునేమో కాని పవిత్రాత్మను దూషించినవాణ్ణి దేవుడు క్షమించడు.
LUK 12:11 “సమాజమందిరాల ముందు, లేక పాలకుల ముందు, లేక అధికారుల ముందు మిమ్మల్ని నిలబెడితే ఏ విధంగా మాట్లాడాలో, నిర్దోషులని ఏ విధంగా ఋజువు చేసుకోవాలో చింతించకండి.
LUK 12:12 మీరు ఏమి మాట్లాడాలో అప్పుడు పవిత్రాత్మ మీకు చెబుతాడు.”
LUK 12:13 ప్రజల నుండి ఒకడు, “అయ్యా! నా సోదరుణ్ణి ఆస్తి పంచిపెట్టమని చెప్పండి” అని అన్నాడు.
LUK 12:14 యేసు, “నన్ను మీ న్యాయాధిపతిగా లేక మీ మధ్యవర్తిగా ఎవరు నియమించారు?” అన్నాడు.
LUK 12:15 ఆ తర్వాత వాళ్ళతో, “జాగ్రత్త! అత్యాసలకు పోకండి. మానవుని జీవితం అతడు ఎంత ఎక్కువ కూడబెట్టాడన్న దానిపై ఆధారపడి ఉండదు” అని యేసు అన్నాడు.
LUK 12:16 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక ధనికుడు ఉండేవాడు. అతని పొలంలో బాగాపంట పండింది.
LUK 12:17 అతడు ‘నేనేం చేయాలి? నా దగ్గర ఈ ధాన్యం దాచటానికి స్థలం లేదే’ అని తన మనస్సులో ఆలోచించసాగాడు.
LUK 12:18 “‘ఆ! ఇలా చేస్తాను. నా ధాన్యపు కొట్టుల్ని పడగొట్టి యింకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యాన్ని, వస్తువుల్ని దాస్తాను’ అని అనుకొన్నాడు. ఆ తర్వాత అతడు, తనతో
LUK 12:19 ‘అదృష్టవంతుడివి, సంవత్సరాలదాకా సరిపోయే వస్తువుల్ని కూడబెట్టుకున్నావు. ఇక జీవితాన్ని సుఖంగా గడుపు. తిను, త్రాగు, ఆనందించు’ అని చెప్పుకుంటానని అనుకొన్నాడు.
LUK 12:20 “కాని దేవుడు అతనితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది. అప్పుడు నీవు నీకోసం దాచుకొన్నవి ఎవరు అనుభవిస్తారు?’ అని అడిగాడు.
LUK 12:21 “ఐహిక సంపదల్ని కూడబెట్టుకొని, ఆధ్యాత్మిక సంపదల్ని నిర్లక్ష్యం చేసినవాని గతి అదే విధంగా ఉంటుంది.”
LUK 12:22 ఈ విధంగా చెప్పి యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “అందువల్ల నేను చెప్పేదేమిటంటే జీవించటానికి ఏమి తినాలి? మీ దేహాలకు ఏ దుస్తులు ధరించాలి? అని చింతించకండి.
LUK 12:23 మీ జీవితం ఆహారాని కన్నా ముఖ్యమైనది. దేహం దుస్తులకన్నా విలువైనది.
LUK 12:24 పక్షుల్ని చూడండి. అవి విత్తనాలు నాటవు. పంటకోయవు. వాటిదగ్గర ఎలాంటి ధాన్యపు కొట్లు లేవు. దేవుడు వాటికి ఆహారం చూపిస్తున్నాడు. మీరాపక్షుల కన్నా విలువైన వాళ్ళు.
LUK 12:25 చింతించి తన జీవితాన్ని ఒక గంట పొడిగించగల వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా?
LUK 12:26 మీరింత చిన్న విషయం సాధించ లేనప్పుడు మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తున్నారు?
LUK 12:27 “పువ్వులు ఏ విధంగా పెరుగుతున్నాయో గమనించండి. అవి పని చేయవు. దారం వడకవు. నేను చెప్పేదేమిటంటే ఖరీదైన దుస్తులు వేసుకొనే సొలొమోను రాజుకూడా ఏ ఒక్క పువ్వుతో సరితూగలేడు.
LUK 12:28 మీలో కొంతకూడా విశ్వాసం లేదు. ఎందుకు? ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో కాలిపోయే గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరించాడు కదా! మరి మిమ్మల్నెంత అందంగా అలంకరిస్తాడో ఆలోచించండి.
LUK 12:29 “అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ప్రాకులాడకండి. వాటిని గురించి చింతించకండి.
LUK 12:30 ప్రపంచం లోవున్న ప్రతి ఒక్కడూ వాటికోసం ప్రాకులాడుతాడు. మీ తండ్రికి మీకేవి అవసరమో తెలుసు.
LUK 12:31 ఆయన రాజ్యాన్ని, నీతిని సంపాదించుకోండి. అప్పుడు దేవుడు మీకు యివి కూడా యిస్తాడు.
LUK 12:32 “మీరు అమాయకమైన చిన్న మందలాంటి వాళ్ళు. కాని భయపడకండి. మీ తండ్రి తన రాజ్యాన్ని మీకు ఆనందంగా ఇస్తాడు.
LUK 12:33 మీ ఆస్థి అమ్మి పేదవాళ్ళకు దానం చెయ్యండి. పాతబడని డబ్బుల సంచి సిద్దం చేసుకోండి. మీ ధనాన్ని పరలోకంలో దాచండి. అక్కడ అది తరగదు. దొంగలు దాన్ని ముట్టలేరు. ఆ సంపదకు చెదలు పట్టవు.
LUK 12:34 మీ ధనమున్న చోటే మీ మనస్సు కూడా ఉంటుంది.
LUK 12:35 “మీ నడికట్టుతో నడుముకు చుట్టి, దీపాలు వెలిగించి సిద్దంగా ఉండండి.
LUK 12:36 పెళ్ళి విందుకు వెళ్ళి యింటికి వస్తున్న యజమాని కోసం కాచుకొని ఉండే సేవకుల్లా ఉండండి. అలా చేస్తే యజమాని వచ్చి తలుపు తట్టిన వెంటనే అతనికోసం మీరు తలుపు తీయకలుగుతారు.
LUK 12:37 యజమాని వచ్చినప్పుడు మెలుకువతో ఉన్న సేవకులు ధన్యులు. ఇది నిజం. యజమాని వచ్చి తానే నడుము బిగించుకొని స్వయంగా సేవ చేస్తాడు. సేవకుల్ని కూర్చోబెట్టి వాళ్ళకు వడ్డించటానికి సిద్ధమౌతాడు.
LUK 12:38 అతడు ఏ అర్థరాత్రికో లేక తెల్లవారుఝామునో వచ్చినప్పుడు అతని కోసం సిద్దంగావున్న సేవకులు ధన్యులు. వాళ్ళకు శుభం కలుగుతుంది.
LUK 12:39 “కాని యిది అర్థంచేసుకోండి. దొంగ ఏ ఘడియలో వస్తాడో యింటి యజమానికి తెలిస్తే అతడు తన యింట్లోకి దొంగల్ని రానివ్వడు.
LUK 12:40 మీరు కూడా సిద్ధంగా వుండండి. ఎందుకంటే మనుష్య కుమారుడు మీరు అనుకోని సమయంలో వస్తాడు.”
LUK 12:41 పేతురు, “ప్రభూ! మీరీ ఉపమానం మాకోసం చెబుతున్నారా లేక అందరి కోసమా?” అని అడిగాడు.
LUK 12:42 ప్రభువు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “తెలివిగల ఉత్తమ సేవకుడు ఎవడు? ఆ యజమాని తిరిగి వచ్చినప్పుడు తాను విశ్వసించగల వాణ్ణి, తెలివి గలవాణ్ణి తన యితర సేవకులకు సరియైన ఆహారం ఇవ్వటానికి వాళ్ళపై అధికారిగా నియమిస్తాడు.
LUK 12:43 ఆ యజమాని వచ్చినప్పుడు, అతడు చెప్పిన విధంగా నడుచుకొన్న సేవకుడు ధన్యుడు.
LUK 12:44 ఇది నిజం. ఆ యజమాని అతణ్ణి తన ఆస్థికంతటికి అధికారిగా నియమిస్తాడు.
LUK 12:45 “కాని ఒకవేళ ఆ సేవకుడు తనలో తాను, ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని తన క్రింద పనిచేసేవాళ్ళను ఆడా మగా అనే భేదం లేకుండా కొట్టి, తిని త్రాగటం మొదలు పెడతాడనుకోండి.
LUK 12:46 యజమాని ఆ సేవకుడు ఎదురుచూడని రోజున అనుకోని సమయంలో వచ్చి ఆ సేవకుణ్ణి నరికించి భక్తిహీనుల గుంపులో చేరుస్తాడు.
LUK 12:47 “తన యజమాని మనస్సు తెలిసి కూడా, అతని యిష్టానుసారం పని చెయ్యని సేవకుడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి.
LUK 12:48 కాని తెలియక శిక్షార్హమైన పనులు చేసిన వాడికి తక్కువ దెబ్బలు తగులుతాయి. దేవుడు తాను ఎక్కువగా యిచ్చిన వాళ్ళనుండి ఎక్కువ కోరుతాడు. ఎక్కువ అప్పగించినవాళ్ళ నుండి యిచ్చిన దానికన్నా ఎక్కువ ఆశిస్తాడు.
LUK 12:49 “నేను ఈ భూమ్మీద అగ్ని వేయడానికి వచ్చాను. ఆ అగ్ని యిదివరకే రగిలి ఉండాలని ఆశించాను.
LUK 12:50 కాని నేను పొందవలసిన బాప్తిస్మము ఉంది. అది జరిగే వరకు నాకీ వేదన తప్పదు.
LUK 12:51 శాంతిని కలుగ జేయుటకు నేనీ భూమ్మీదికి వచ్చాననుకొంటున్నారా? కాదు. దీన్ని విభజించటానికి వచ్చాను.
LUK 12:52 ఇప్పటి నుండి ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటే, వాళ్ళు విడిపోయి, ముగ్గురు ఒకవైపుంటే ఇద్దరొకవైపు: యిద్దరొక వైపుంటే ముగ్గురొక వైపు చేరి పోట్లాడుతారు.
LUK 12:53 తండ్రి కుమారునితో, కుమారుడు తండ్రితో, తల్లి కూతురుతో, కూతురు తల్లితో, అత్త కోడలితో, కోడలు అత్తతో పోట్లాడుతారు.”
LUK 12:54 యేసు అక్కడున్న ప్రజలతో, “మీరు పడమరన మేఘాలు కమ్ముకోవటం చూసిన వెంటనే, ‘వర్షం కురుస్తుంది’ అని అంటారు.
LUK 12:55 దక్షిణం నుండి గాలివీయగానే, ‘వేడి ఎక్కువౌతుంది’ అని అంటారు. మీరన్నట్లే జరుగుతుంది.
LUK 12:56 కాని మీరు వంచకులు. భూమివైపు, ఆకాశం వైపు చూసి ఏమి జరుగబోతుందో చెప్పగలరు. కాని ప్రస్తుతం జరుగుతున్న దాన్ని చూసి ఏమి జరుగబోతుందో ఎందుకు చెప్పలేరు?
LUK 12:57 “ఏది న్యాయమో స్వయంగా మీరే నిర్ణయించండి.
LUK 12:58 మీ ప్రతి వాదితో కలిసి న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళటానికి ముందు దారి మీద ఉన్నప్పుడే అతనితో రాజీ పడటానికి గట్టిగా ప్రయత్నించండి. అలా చెయ్యకపోతే అతడు మిమ్మల్ని న్యాయధిపతి ముందుకు లాగవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటులకు అప్పగించవచ్చు. ఆ భటులు మిమ్మల్ని కారాగారంలో వేయవచ్చు.
LUK 12:59 నేను చెప్పేది వినండి. మీ దగ్గర ఉన్న చివరి పైసా చెల్లించే దాకా మీరు బయటపడరు.”
LUK 13:1 ఆ సమయంలో అక్కడున్న వాళ్ళలో కొందరు యేసుతో, “పిలాతు గలిలయ ప్రజల రక్తాన్ని బలి యిచ్చిన జంతువుల రక్తంతో కలిపాడని” చెప్పారు.
LUK 13:2 యేసు వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ విధంగా చనిపోయినందుకు వీళ్ళు యితర గలిలయ ప్రజలకంటే ఎక్కువ పాపం చేసారని మీ అభిప్రాయమా?
LUK 13:3 నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి.
LUK 13:4 గోపురం మీదపడి సిలోయములో చనిపోయిన ఆ పద్దెనిమిది మంది సంగతేమిటి? యెరూషలేములో నివసించే ఇతర ప్రజలకు కాకుండా వీళ్ళకు ఈ గతి పట్టటం సమంజసమని మీ అభిప్రాయమా?
LUK 13:5 నేను కాదంటాను. మీరు వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పొందండి.”
LUK 13:6 ఆ తర్వాత యేసు ఈ ఉపమానం చెప్పాడు: “ఒకడు తన ద్రాక్షాతోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడు. పండ్లు కోసం ఆ అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళి అతడు తరచు చూస్తూవుండేవాడు. కాని అతనికి పండ్లు కనిపించలేదు.
LUK 13:7 అతడు తోటమాలితో, ‘ఈ చెట్టుకు పండ్లు కాస్తాయేమోనని మూడేళ్ళు చూసాను. కాని దానికి పండ్లు కాయలేదు. దాన్ని కొట్టేయి. అది అనవసరంగా భూమి సారాన్ని గుంజి వేస్తోంది’ అని అన్నాడు.
LUK 13:8 ఆ తోట మాలి, ‘అయ్యా! దీన్ని యింకొక సంవత్సరం వదిలెయ్యండి. నేను చుట్టూ పాదు త్రవ్వి ఎరువు వేస్తాను.
LUK 13:9 వచ్చే సంవత్సరం పంట కాస్తే, మంచిదే. కాయకపోతే అప్పుడు కొట్టి వేయవచ్చు’ అని అన్నాడు.”
LUK 13:10 ఒక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు.
LUK 13:11 దయ్యం పట్టటంవల్ల పద్దెనిమిది ఏళ్ళనుండి రోగంతో బాధపడ్తున్న స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడుము వంగి ఉంది. ఆమె చక్కగా నిలువలేకపోయేది.
LUK 13:12 యేసు ఆమెను చూసి దగ్గరకు రమ్మని పిలిచి ఆమెతో, “అమ్మా! నీ రోగం నుండి నీకు విముక్తి కలిగించాను.”
LUK 13:13 అని అంటూ ఆమె మీద తన చేతుల్ని ఉంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టింది.
LUK 13:14 విశ్రాంతి తీసుకోవలసిన రోజున ఆమెకు నయం చేసినందుకు ఆ సమాజమందిరపు అధికారికి కోపం వచ్చింది. అతడు ప్రజలతో, “ఆరు రోజులు పని చెయ్యటానికి ఉన్నాయి. ఆ రోజుల్లో వచ్చి నయం చేయించుకోండి. విశ్రాంతి తీసుకోవలసిన రోజున కాదు” అని అన్నాడు.
LUK 13:15 యేసు, “మీరు కపటులు. విశ్రాంతి రోజు మీ ఎద్దును, గాడిదను కొట్టం నుండి విప్పుకొని వెళ్ళి నీళ్ళు త్రాగించరా?
LUK 13:16 ఈమె అభ్రాహాము కుమార్తె. పద్దెనిమిది సంవత్సరాలు సైతాను ఈమెను తన ఆధీనంలో ఉంచుకొన్నాడు. మరి ఈమెకు విశ్రాంతి రోజు ఆ బంధంనుండి విముక్తి కలిగించనవసరం లేదంటారా?” అని అడిగాడు.
LUK 13:17 ఈ మాటలు, ఆయన విరోధులు సిగ్గుపడేటట్లు చేశాయి. కాని ఆయన చేసిన మహత్కార్యాల్ని చూసి ప్రజలు చాలా ఆనందించారు.
LUK 13:18 ఆ తర్వాత యేసు, “దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చాలి?
LUK 13:19 అది ఒక ఆవగింజ లాంటిది. దాన్ని ఒకడు తన తోటలో నాటాడు. అది పెరిగి చెట్టయింది. ఆకాశంలో ఎగిరే పక్షులు దాని కొమ్మల మీద వ్రాలాయి” అని అన్నాడు.
LUK 13:20 యేసు మళ్ళీ, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చాలి?” అని అడిగి,
LUK 13:21 “అది పిండిలో కలిపే పులుపు లాంటిది. ఒక స్త్రీ ఆ పులుపును మూడు కుంచాల పిండిలో ఆ పిండంతా పులిసేదాకా కలిపింది” అని సమాధానం చెప్పాడు.
LUK 13:22 యేసు పట్టణాల్లో, పల్లెల్లో బోధిస్తూ యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు.
LUK 13:23 ఒకడు, “ప్రభూ! కొద్దిమంది మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు. ఆయన వాళ్ళతో,
LUK 13:24 “దేవుని రాజ్యానికి ఉన్న ద్వారం యిరుకైనది. ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి గట్టి ప్రయత్నం చేయండి అనేకులు ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తారు. కాని ప్రవేశించలేరు.
LUK 13:25 ఇంటి యజమాని లేచి తలుపులకు తాళం వేస్తాడు. మీరు బయట నిలబడి తలుపు తడుతూ ‘అయ్యా! మాకోసం తలుపు తెరవండి!’ అని వేడుకొంటారు. కాని ఆయన ‘మీరెవరో, ఏ ఊరినుండి వచ్చారో నాకు తెలియదు’ అని సమాధానం చెబుతాడు.
LUK 13:26 అప్పుడు మీరు, ‘మీతో కలిసి తిన్నాము. మీరు మా వీధుల్లో బోధించారు’ అని అంటారు.
LUK 13:27 కాని ఆయన, ‘మీరెవరో నాకు తెలియదు. ఎక్కడినుండి వచ్చారో తెలియదు. ఇక్కడినుండి వెళ్ళండి, మీరంతా దుర్మార్గులు’ అని అంటాడు.
LUK 13:28 “మీరు అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును ఇతర ప్రవక్తలను దేవుని రాజ్యంలో చూస్తారు. మిమ్మల్ని బయట పారవేసినందుకు మీరు దుఃఖిస్తారు. బాధననుభవిస్తారు.
LUK 13:29 ప్రజలు ఉత్తర దక్షిణాల నుండి, తూర్పు పడమరల నుండి దేవుని రాజ్యంలో జరుగుతున్న విందుకు వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చుంటారు.
LUK 13:30 ఇప్పుడు చివరి స్థానాల్లో కూర్చున్నవాళ్ళు అక్కడ ముందు స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు మొదటి స్థానాల్లో ఉన్న వాళ్ళు అక్కడ చివరి స్థానాల్లో కూర్చుంటారు” అని అన్నాడు.
LUK 13:31 అప్పుడు కొందరు పరిసయ్యులు యేసు దగ్గరకు వచ్చి, “ఈ ప్రాంతం వదిలి యింకెక్కడికైనా వెళ్ళు. హేరోదు రాజు నిన్ను చంపాలనుకుంటున్నాడు” అని అన్నారు.
LUK 13:32 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ రోజు, రేపు ప్రజలకు నయం చేస్తాను. దయ్యాల్ని వదిలిస్తాను. మూడవరోజు నేను చేయవలసిన కార్యం ముగిస్తుంది. వెళ్ళి ఈ విషయం ఆ గుంట నక్కతో చెప్పండి.
LUK 13:33 ప్రవక్త అయినవాడు యెరూషలేమునకు బయట మరణించకూడదు కదా. కనుక ఏది ఏమైనా ఈ రోజు, రేపు, ఎల్లుండి నా ప్రయాణం సాగిస్తూ ఉండవలసిందే.
LUK 13:34 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తలను చంపుతున్నావు. దేవుడు పంపిన ప్రచారకుల్ని రాళ్ళతో కొడుతున్నావు. కోడి తన పిల్లల్ని రక్షించటానికి రెక్కల క్రిందికి చేర్చుకొన్నట్లే నీ ప్రజలను నాదగ్గరకు చేర్చుకోవాలని ఎన్నో సార్లు అనిపించింది! కాని నీవు దానికి అంగీకరించలేదు!
LUK 13:35 నీ ఇల్లు పాడుబడుతుంది. ‘ప్రభువు పేరిట వచ్చినవాడు ధన్యుడు’ అని నీవనేవరకు నీవు నన్ను చూడవు.”
LUK 14:1 ఒక విశ్రాంతి రోజు యేసు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వాళ్ళు ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు.
LUK 14:2 దేహమంతా నీరొచ్చిన ఒక వ్యక్తి యేసు ముందు కొచ్చాడు.
LUK 14:3 యేసు శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, “విశ్రాంతి రోజు నయం చెయ్యటం శాస్త్ర సమ్మతమా? కాదా?” అని అడిగాడు.
LUK 14:4 వాళ్ళు దానికి సమాధానం చెప్పలేదు. యేసు ఆ రోగి మీద తన చేతులుంచి నయం చేసి పంపాడు.
LUK 14:5 ఆ తర్వాత, “మీ కుమారుడో లేక మీ ఎద్దు విశ్రాంతి రోజు బావిలో పడితే మీరు వెంటనే పైకి లాగి రక్షించరా?” అని అడిగాడు.
LUK 14:6 దానికి వాళ్ళు సమాధానం చెప్పలేక పోయారు.
LUK 14:7 విందులకు వచ్చిన అతిథులు గౌరవ స్థానం ఆక్రమించుట గమనించి యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు:
LUK 14:8 “మీరు పెళ్ళి విందుకు ఆహ్వానింపబడినప్పుడు, మీకన్నా ముఖ్యమైన అతిథులు ఆహ్వానించబడి ఉండవచ్చు. కనుక ముందు స్థానాల్లో కూర్చోకండి.
LUK 14:9 అలాచేస్తే ఆ యింకొక వ్యక్తిని ఆహ్వానించిన వాడు వచ్చి నీతో ‘ఈ స్థలం యితనికి యివ్వు’ అని అంటాడు. నీవు అవమానం పొంది చివరన ఉన్న స్థలంలో కూర్చోవలసి వస్తుంది.
LUK 14:10 “అందువల్ల నిన్ను ఆహ్వానించినప్పుడు చివరన ఉన్న స్థలంలో కూర్చో. అలా చేస్తే నిన్ను ఆహ్వానించిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ‘మిత్రమా! ముందుకు వచ్చి మంచి స్థలంలో కూర్చో’ అని అంటాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళలో నీ గౌరవం పెరుగుతుంది.
LUK 14:11 ఎందుకంటే ఉన్నత స్థానాన్ని ఆక్రమించినవాడు అల్ప స్థానానికి దించబడతాడు. తనంతట తాను అల్ప స్థానాన్ని ఆక్రమించినవాడు ఉన్నత స్థానానికి ఎత్తబడతాడు.”
LUK 14:12 అప్పుడు యేసు తన అతిథితో, “భోజనానికి లేక విందుకు ఆహ్వానించదలచినప్పుడు మీ స్నేహితుల్ని కాని, మీ సోదరుల్ని కాని, మీ బంధువుల్ని కాని ధనికులైన మీ ఇరుగు పొరుగు వాళ్ళను కాని ఆహ్వానించకండి. అలా చేస్తే మిమ్మల్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. అప్పుడు వాళ్ళ రుణం తీరిపోతుంది.
LUK 14:13 కనుక మీరు విందు చేసినప్పుడు పేదవాళ్ళను, వికలాంగులను, కుంటివాళ్ళను, గ్రుడ్డివాళ్ళను ఆహ్వానించండి.
LUK 14:14 వాళ్ళు మీ రుణం తీర్చలేరు. కనుక మీరు ధన్యులౌతారు. ఎందుకంటే మంచి వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు దేవుడు మీరు చేసిన మంచి పనికి మంచి బహుమతి నిస్తాడు” అని అన్నాడు.
LUK 14:15 భోజనానికి కూర్చున్న వాళ్ళలో ఒకడు యిది విని యేసుతో, “దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొన్నవాడు ధన్యుడు” అని అన్నాడు.
LUK 14:16 యేసు యిలా చెప్పాడు: “ఒకడు పెద్ద విందు చేయదలచి చాలా మందిని ఆహ్వానించాడు.
LUK 14:17 వంటలు సిద్ధమయ్యాక తాను ఆహ్వానించిన వాళ్ళ దగ్గరకు తన సేవకుణ్ణి పంపి ‘రండి! అంతా సిద్ధం’ అని చెప్పమన్నాడు.
LUK 14:18 కాని అందరూ ఒకే రీతిగా సాకులు చెప్పారు. మొదటివాడు ‘నేను పొలం కొన్నాను, వెళ్ళి తప్పకుండా దాన్ని చూడాలి; నన్ను క్షమించు’ అని అన్నాడు.
LUK 14:19 ఇంకొకడు ‘నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను. వెళ్ళి అవి ఏ విధంగా పనిచేస్తాయో చూడాలి, నన్ను క్షమించుము’ అని అన్నాడు.
LUK 14:20 మరొకడు ‘నేను ఈ రోజే పెళ్ళి చేసుకున్నాను కనుక రాలేను’ అని అన్నాడు.
LUK 14:21 “ఆ సేవకుడు తిరిగి వచ్చి జరిగినదంతా తన యజమానితో చెప్పాడు. అతనికి కోపం వచ్చి తన సేవకునితో, ‘వెంటనే పట్టణంలో ఉన్న అన్ని వీధుల్లోకి వెళ్ళి పేదవాళ్ళను, వికలాంగులను, గ్రుడ్డివాళ్ళను, కుంటివాళ్ళను పిలిచుకురా!’ అని అన్నాడు.
LUK 14:22 “ఆ సేవకుడు మళ్ళీవచ్చి, ‘అయ్యా! మీరు చెప్పినట్లు చేసాను. కాని భోజనశాలలు ఇంకా నిండలేదు’ అని అన్నాడు.
LUK 14:23 అప్పుడు ఆ యజమాని తన సేవకునితో ‘ఊరి బయటనున్న రహదారులకు, పొలాలకు వెళ్ళి అక్కడి వాళ్ళను తప్పక రమ్మనమని చెప్పు. వాళ్ళతో నా యిల్లంతా నిండి పోవాలి.
LUK 14:24 నేను చెప్పేదేమిటంటే నేనిదివరకు పిలిచిన వాళ్ళలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు’ అని అన్నాడు.”
LUK 14:25 ప్రజలు గుంపులు గుంపులుగా యేసుతో ప్రయాణం చేస్తూవున్నారు. యేసు వాళ్ళ వైపు తిరిగి,
LUK 14:26 “నాతో వచ్చి, తన తల్లి తండ్రులకన్నా, తన భార్యకన్నా, తన సంతానానికన్నా, తన తోబుట్టువులకన్నా, చివరకు తన ప్రాణానికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించలేనివాడు నా శిష్యుడు కాలేడు.
LUK 14:27 అంతేకాక తన సిలువను మోసికొని నన్ను అనుసరించనివాడు నా శిష్యుడు కాలేడు.
LUK 14:28 “గోపురం కట్టాలనుకొన్నవాడు కూర్చొని దానికి ఎంత వ్యయమౌతుందో అంచనా వేయడా? తన దగ్గర కావలసినంత డబ్బు ఉందో లేదో చూసుకోడా?
LUK 14:29 పునాదులు వేసాక దాన్ని పూర్తి చెయ్యలేక పోతే చూసిన వాళ్ళంతా ‘ఇతడు కట్టటం మొదలెట్టాడు కాని పూర్తి చెయ్యలేక పోయాడు’ అని అతణ్ణి హేళన చేస్తారు.
LUK 14:31 “అంతేకాక ఒక రాజు మరొక రాజుతో యుద్ధం చెయ్యటానికి వెళ్తాడనుకోండి. అతడు శాంతంగా కూర్చొని తన పదివేల సైన్యంతో యుద్దం చేయబోతున్న ఇరవై వేల సైన్యాన్ని ఎదిరించగలనా లేదా అని ఆలోచించడా?
LUK 14:32 యుద్ధం చేయలేనని అనుకుంటే సైన్యాలు దూరంగా ఉన్నప్పుడే తన రాయబారుల్ని పంపి సంధి చేసుకొంటాడు.
LUK 14:33 “అదే విధంగా మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీకున్న వాటిని వదిలివేయకుంటే నా శిష్యులు కాలేరు.
LUK 14:34 “ఉప్పు మంచిదే, కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే దాన్ని మళ్ళీ ఉప్పుగా ఎట్లా చెయ్యగలము?
LUK 14:35 అది పెంట కుప్పుకు పనికి రాదు. పొలానికి పనికి రాదు. దాన్ని పారవేయవలసి వస్తుంది. “చెప్పిన వాటిని జాగ్రత్తగా గమనించండి” అని అన్నాడు.
LUK 15:1 ఒక రోజు పన్నులు వసూలు చేసే వాళ్ళు, పాపులు ఆయన చెప్పినవి వినటానికాయన చుట్టూ సమావేశమయ్యారు.
LUK 15:2 కాని పరిసయ్యులు, శాస్త్రులు, “ఇతడు పాపుల్ని పిలిచి వాళ్ళతో కలిసి తింటాడు” అని గొణిగారు.
LUK 15:3 అప్పుడు యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు:
LUK 15:4 “మీలో ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు ఉన్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే అతడు తన తొంబది తొమ్మిది గొఱ్ఱెల్ని అక్కడ బయల్లో వదిలేసి ఆ తప్పిపోయిన గొఱ్ఱె దొరికేదాకా వెతకడా?
LUK 15:5 అది దొరికిన వెంటనే దాన్ని భుజాలపై మోసికొని ఆనందంతో
LUK 15:6 యింటికి వెళ్ళి తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, ‘తప్పిపోయిన నా గొఱ్ఱె దొరికింది. మనమంతా ఆనందించుదాం’ అని అంటాడు.
LUK 15:7 నేను చెప్పేదేమిటంటే అదేవిధంగా మారుమనస్సు పొందనవసరం లేని తొంభైతొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగె ఆనందంకన్నా పాపం చేసిన ఒక్కడు మారుమనస్సు పొందితే పరలోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆనందిస్తారు.
LUK 15:8 “ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణాలు ఉన్నాయనుకోండి. అందులో ఒక నాణెం పోగొట్టుకొంటే ఆమె దీపం వెలిగించి యిల్లంతా వూడ్చి అది దొరికే దాకా జాగ్రత్తగా వెతకదా?
LUK 15:9 దొరికిన వెంటనే తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి పోగొట్టుకున్న నా నాణెం దొరికింది. మనమంతా ఆనందించుదాం! అని అంటుంది.
LUK 15:10 నేను చెప్పేదేమిటంటే అదే విధంగా ఒక పాపాత్ముడు మారుమనస్సు పొందితే దేవదూతలు ఆనందిస్తారు” అని అన్నాడు.
LUK 15:11 యేసు ఇంకా ఇలా చెబుతూ పోయాడు: “ఒకనికి యిద్దరు కుమారులు ఉన్నారు.
LUK 15:12 చిన్నవాడు తండ్రితో, ‘నాన్నా! నా భాగం ఆస్తి నాకు ఇచ్చేయి’ అని అడిగాడు. తండ్రి సరేనని తన ఆస్తిని ఇరువురి మధ్య పంచిపెట్టాడు.
LUK 15:13 “కొద్ది రోజుల్లో చిన్నవాడు తనపాలు భాగం తీసుకొని దూర దేశాలకు వెళ్ళి పొయ్యాడు. ఉన్న డబ్బంతా విలాసాలకు ఖర్చు పెట్టాడు.
LUK 15:14 అంతా ఖర్చయి పోయింది. ఇంతలో అతడున్న దేశంలో తీవ్రమైన క్షామం వచ్చింది. అతని దగ్గర ఏమీ మిగల్లేదు. కనుక ఆ దేశంలో ఉన్న ఒక ఆసామి దగ్గర ఉద్యోగంలో చేరాడు.
LUK 15:15 ఆ ఆసామి అతణ్ణి పందులు కాయటానికి నియమించాడు.
LUK 15:16 ఆ పందులు తీనే ఆహారంతో తన కడుపు నింపుకోవాలని అనుకున్నాడు. ఆయినా ఎవ్వరూ అతనికి ఏదీ ఇవ్వలేదు.
LUK 15:17 “అతనికి బుద్ధి వచ్చింది. అతడు ‘నా తండ్రి పనివాళ్ళ దగ్గర కూడా కావలసినంత తిండి ఉంది. నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను.
LUK 15:18 నేను ఈ గ్రామం వదిలి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తాను. వెళ్లి అతనితో నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల కూడా పాపం చేశాను.
LUK 15:19 నేను నీ కుమారుడనని చెప్పుకొంటానికి కూడా తగను. నన్ను కూడా నీ దగ్గర పని చేసేవాళ్ళతో ఉండనీ!’ అని చెప్పాలని మనస్సులో అనుకున్నాడు.
LUK 15:20 వెంటనే అతడు తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. “ఇంటికి కొంత దూరంలో ఉండగానే అతని తండ్రికి తనకుమారుణ్ణి చూసి చాలా కనికరం కలిగింది. అతడు పరుగెత్తుకొంటూ తన కుమారుని దగ్గరకు వెళ్ళి అతణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు.
LUK 15:21 అతడు తండ్రితో, ‘నాన్నా! నేను దేవుని పట్ల, నీ పట్ల పాపం చేసాను. నేను నీ కుమారుణ్ణని చెప్పుకోవటానికి కూడా తగను’ అని అన్నాడు.
LUK 15:22 “అతని తండ్రి పని వాళ్ళతో, ‘వెంటనే వెళ్ళి మంచి దుస్తులు, వేలికి ఉంగరము, కాళ్లకు జోళ్ళు తెచ్చి యితనికి తొడిగించండి.
LUK 15:23 బాగా బలిసిన దూడను తీసుకు వచ్చి కొయ్యండి. పండుగ చేసుకొందాం.
LUK 15:24 చనిపోయిన నా కుమారుడు బ్రతికి వచ్చాడు. తప్పి పోయినవాడు తిరిగి దొరికాడు’ అని అన్నాడు. వాళ్ళు వెంటనే పండుగ చేసుకోవడం మొదలు పెట్టారు.
LUK 15:25 “ఇంతలో పెద్దవాడు పొలంనుండి ఇంటికి వస్తూవున్నాడు. ఆతనికి ఇంటినుండి సంగీతము, నాట్యము జరుగుతున్న ధ్వనులు వినిపించాయి.
LUK 15:26 అతడు పని వాళ్ళలో ఒకణ్ణి పిలిచి, ‘ఏమి జరుగుతోంది?’ అని అడిగాడు.
LUK 15:27 ఆ పనివాడు ‘మీ తమ్ముడు వచ్చాడు. మీ నాన్న అతడు క్షేమంగా తిరిగి వచ్చాడని బాగా బలిసిన దూడను కోసి విందు చేస్తున్నాడు’ అని చెప్పాడు.
LUK 15:28 “ఇది విని అతనికి కోపం వచ్చింది. కనుక ఇంట్లొకి అడుగు పెట్టనని అన్నాడు. అందువల్ల అతని తండ్రి వెలుపలికి వచ్చి బ్రతిమిలాడాడు.
LUK 15:29 అతడు తండ్రితో, ‘యిదిగో నాన్నా! ఎన్నో ఏండ్లనుండి నేను బానిసలాగా పనిచేసాను. నీ ఆజ్ఞ జవదాట లేదు. ఆయినా నేను నా స్నేహితులతో విందు చేసుకోవటానికి నీవు ఒక్క చిన్న గొఱ్ఱెను కూడా ఇవ్వలేదు.
LUK 15:30 కాని, నీ ఈ కుమారుడు ఆస్థినంతా వేశ్యలకు తగలెట్టి ఇల్లు చేరుకొంటే వానికోసం బలిసిన దూడను కోస్తున్నావు!’ అని అన్నాడు.
LUK 15:31 “కాని తండ్రి అతనితో, ‘నా బాబూ! నీవెప్పుడూ నా దగ్గరే ఉంటున్నావు. కనుక నా దగ్గర ఉన్నవన్నీ నీవి.
LUK 15:32 కాని నీ ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. తప్పిపోయిన వాడు దొరికాడు. కనుక మనం ఆనందంగా పండుగ చేసుకోవాలి’ అని అన్నాడు.”
LUK 16:1 యేసు తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఒక ధనవంతుని దగ్గర ఒక గుమాస్తా పని చేస్తూ ఉండేవాడు. కొందరు, గుమాస్తా ఆ ధనవంతుని ధనం వ్యర్థం చేస్తున్నాడని అతనిపై ఆ ధనవంతునితో ఫిర్యాదు చేశారు.
LUK 16:2 ఆ కారణంగా ఆ ధనవంతుడు తన గుమాస్తాను పిలిచి, ‘నేను నిన్ను గురించి వింటున్నదేమిటి? జమాఖర్చుల లెక్కలు నాకు చూపు. నీవిక నా గుమాస్తాగా ఉండటానికి వీల్లేదు’ అని అన్నాడు.
LUK 16:3 “ఆ గుమాస్తా, ‘నేనేం చెయ్యాలి? నా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసివేస్తున్నాడు. పొలం దున్ని జీవించాలంటే శక్తి లేదు. భిక్ష మెత్తుకోవాలంటే సిగ్గేస్తుంది.
LUK 16:4 ఆ! నా ఉద్యోగం పోయినప్పుడు ప్రజలు నన్ను తమ ఇండ్లలోనికి ఆహ్వానించేటట్లు ఏమి చెయ్యాలో తెలిసింది’ అని అనుకున్నాడు.
LUK 16:5 “వెంటనే అతడు తన యజమానికి అప్పున్న వాళ్ళను ఒక్కొక్కరిని పిలిచాడు. మొదటివానితో, ‘నా యజమానికి ఎంత అప్పున్నావు?’ అని అడిగాడు.
LUK 16:6 ‘వందలీటరులు ఒలీవ నూనె’ అని అతడు సమాధానం చెప్పాడు. ఆ గుమాస్తా, ‘ఈ రసీదు తీసుకొని అక్కడ కూర్చొని దాన్ని వెంటనే యాభై లీటర్లు చెయ్యి’ అని అతనితో అన్నాడు.
LUK 16:7 “ఆ తర్వాత రెండవ వానితో, ‘నీవెంత అప్పున్నావు?’ అని అడిగాడు. ‘వంద గోధుమ సంచులు’ అని అతడు సమాధానం చెప్పాడు. ఆ గుమాస్తా, ‘ఈ రసీదు తీసుకొని దాన్ని ఎనభై సంచులు చెయ్యి’ అని అతనితో అన్నాడు.
LUK 16:8 “ఆ యజమాని, ఆ అవినీతి గుమాస్తాను తెలివిగా ప్రవర్తించినందుకు అభినందించాడు. దైవ చింతన కలవాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో చూపుతున్న తెలివి కన్నా, ప్రాపంచిక విషయాల్లో ఉన్నవాళ్ళు తమ పరిస్థితుల్ని ఎక్కువ తెలివిగా ఎదుర్కొంటారు.
LUK 16:9 “నేను చెప్పేదేమిటంటే, మీ ఐహిక సంపదను ఉపయోగించి ఈ లోకపు స్నేహితులను సంపాదించండి. మీ ధనం తరిగిపోయిన తర్వాత వారు మీకు సహాయం అవుతారు.
LUK 16:10 చిన్న విషయాల్లో నమ్మగలిగిన వాణ్ణి పెద్ద విషయాల్లో కూడా నమ్మవచ్చు. చిన్న విషయాల్లో అవినీతిగా ఉన్నవాడు పెద్ద విషయాల్లో కూడా అవినీతిగా ఉంటాడు.
LUK 16:11 ఐహిక సంపద విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు నిజమైన సంపద విషయంలో మిమ్మల్నెవరు నమ్ముతారు?
LUK 16:12 ఇతరుల ఆస్థి విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు మీకు మీ స్వంత ఆస్థిని ఎవరిస్తారు?
LUK 16:13 “ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలాచేస్తే అతడు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తాడు. ఒకని పట్ల విశ్వాసం చూపి యింకొకని పట్ల నీచంగా ప్రవర్తిస్తాడు. దేవుణ్ణి, ధనాన్ని సమంగా కొలువలేము.”
LUK 16:14 పరిసయ్యులు ధనాన్ని ప్రేమించేవాళ్ళు కనుక వాళ్ళు ఇది విని యేసును హేళన చేశారు.
LUK 16:15 యేసు వాళ్ళతో, “మీరు ప్రజల ముందు నీతిమంతులుగా ప్రవర్తిస్తారు. కాని మీ హృదయాల్లో ఏముందో దేవునికి తెలుసు. మానవులు వేటికి అత్యధికమైన విలువనిస్తారో వాటిని దేవుడు తిరస్కరిస్తాడు.
LUK 16:16 “యోహాను కాలాందాకా ధర్మశాస్త్రము, ప్రవక్తలు వ్రాసిన విషయాలు ఆచరణలో ఉన్నాయి. యోహాను కాలం నుండి దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటింపబడుతోంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలోకి వెళ్ళాలని తమ శక్త్యానుసారం కష్టపడుతున్నారు.
LUK 16:17 భూమి, ఆకాశము నశించిపోవచ్చు, కాని ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు.
LUK 16:18 “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకొన్న ప్రతివాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడాకులివ్వబడిన స్త్రీని వివాహం చేసుకొన్నవాడు కూడా వ్యభిచారిగా పరిగణింపబడతాడు” అని అన్నాడు.
LUK 16:19 “ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు మంచి విలువైన దుస్తులు వేసుకొని ప్రతిరోజు భోగాలనుభవిస్తూ జీవించేవాడు.
LUK 16:20 అతని గడప ముందు లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటినిండా కురుపులు ఉండేవి. కుక్కులు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి.
LUK 16:21 అతడాధనికుని బల్లమీద నుండి పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశతో అక్కడ పడి ఉండేవాడు.
LUK 16:22 “ఆ భిక్షగాడు చనిపొయ్యాడు. అతణ్ణి దేవదూతలు తీసుకువెళ్ళి అబ్రాహాము ప్రక్కన కూర్చుండబెట్టారు. ఆ తర్వాత ఆ ధనికుడు కూడా చనిపొయ్యాడు. అతడు సమాధి చెయ్యబడ్డాడు.
LUK 16:23 నరకంలో ఆ ధనికుడు హింసలు అనుభవిస్తూవుండేవాడు. తలెత్తి చూడగా లాజరును తన ప్రక్కన కూర్చోబెట్టుకున్న అబ్రాహాము కనిపించాడు. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు.
LUK 16:24 అందువల్ల అబ్రాహామును పిలిచి, ‘తండ్రి అబ్రాహామా! నామీద దయ చూపు. నేను ఈ మంటల్లో తీవ్రంగా బాధపడ్తున్నాను. లాజరుతో ఇక్కడకు వచ్చి తన వేలుముంచి నా నాలుక తడపమని చెప్పండి’ అని అన్నాడు.
LUK 16:25 “కాని అబ్రాహాము, ‘కుమారుడా! జ్ఞాపకం తెచ్చుకో! నీవు బ్రతికిన రోజుల్లో సుఖాలనుభవించావు. లాజరు కష్టాలనుభవించాడు. కాని అతడిక్కడ ఆనందంగా ఉన్నాడు. నీవు బాధలను అనుభవిస్తున్నావు.
LUK 16:26 ఇక్కడి వాళ్ళు అక్కడకు రాకూడదని, అక్కడివాళ్ళు యిక్కడికి రాకూడదని మన మధ్య పెద్ద అఘాతం ఉంది’ అని అన్నాడు.
LUK 16:27 “ఆ ధనికుడు అలాగైతే ‘తండ్రి! లాజరును మా తండ్రి ఇంటికి పంపు.
LUK 16:28 అక్కడ నా ఐదుగురు సోదరులున్నారు. వాళ్ళు యిక్కడకు వచ్చి హింసలు అనుభవించకుండా ఉండేటట్లు వాళ్ళకు బోధించుమని చెప్పు’ అని అన్నాడు.
LUK 16:29 “అబ్రాహాము ఈ విధంగా సమాధానం చెప్పాడు: ‘మోషే, ప్రవక్తలు ఉన్నారు కదా! వాళ్ళు చెప్పినట్లు చెయ్యనీ!’
LUK 16:30 “‘తండ్రీ అబ్రాహామా! చనిపోయిన వాళ్ళనుండి ఎవరైనా వెళ్తే వాళ్ళు విని మారుమనస్సు పొందుతారు’ అని ఆ ధనికుడు అన్నాడు.
LUK 16:31 “అబ్రాహాము, ‘వాళ్ళు మోషే, ప్రవక్తలు చెప్పినట్లు విననట్లైతే చనిపోయినవాడు బ్రతికి వచ్చినా వాళ్ళు వినరు’ అని అన్నాడు.”
LUK 17:1 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ప్రజలు పాపం చేసే పరిస్థితులు కలుగచేసే వాళ్ళకు శిక్ష తప్పదు.
LUK 17:2 ఈ అమాయకుల్లో ఏ ఒక్కడు పాపం చేసేటట్లు చేసినా శిక్ష తప్పదు. అది జరుగక ముందే అలాంటి వాని మెడకు తిరగటి రాయి కట్టి సముద్రంలో పడవేస్తే అది అతనికి మేలు చేసినట్లవుతుంది.
LUK 17:3 అందువల్ల జాగ్రత్త! “మీ సోదరుడు పాపం చేస్తే గద్దించండి. పశ్చాత్తాపం చెందితే క్షమించండి.
LUK 17:4 అతడు రోజుకు ఏడుసార్లు మీ పట్ల పాపం చేసి ఏడుసార్లు మీ దగ్గరకు వచ్చి, ‘నేను పశ్చాత్తాపం చెందాను’ అని అంటే అతణ్ణి క్షమించండి.”
LUK 17:5 అపొస్తలులు ప్రభువుతో, “మా విశ్వాసాన్ని గట్టి పరచండి” అని అన్నారు.
LUK 17:6 ప్రభువు అన్నాడు: “మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నాచాలు; మీరు కంబళి చెట్టుతో, ‘నీవు నీ వేర్లతో బాటు పెళ్లగింపబడి వెళ్ళి సముద్రంలో పడి అక్కడ నాటుకుపో!’ అని అంటే అది మీ మాట వింటుంది.
LUK 17:7 “మీ పొలం దున్నే సేవకుడో లేక మీ గొఱ్ఱెలు కాచే సేవకుడో ఒకడున్నాడనుకోండి. అతడు పొలం నుండి యింటికి రాగానే, ‘రా! వచ్చి కూర్చొని భోజనం చెయ్యి’ అని అతనితో అంటారా? అనరు.
LUK 17:8 దీనికి మారుగా, ‘వంటవండి, దుస్తులు మార్చుకొని, నేను తిని త్రాగేదాకా పనిచేస్తూవుండు. ఆ తర్వాత నువ్వు కూడా తిని త్రాగు’ అని అంటారు.
LUK 17:9 మీరు చెప్పినట్లు విన్నందుకు మీ సేవకునికి కృతజ్ఞత తెలుపుకుంటారా?
LUK 17:10 మీరు కూడా చెప్పిన విధంగా చేసాక ‘మేము మామూలు సేవకులము, చెప్పినట్లు చేసాము. అది మా కర్తవ్యం’ అని అనాలి.”
LUK 17:11 యేసు యెరూషలేముకు ప్రయాణం సాగిస్తూ గలిలయ నుండి సమరయ పొలిమేరలకు వచ్చాడు.
LUK 17:12 ఒక గ్రామంలోకి వెళ్తూండగా పదిమంది కుష్టురోగులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆయనకు కొద్ది దూరంలో నిలుచొని,
LUK 17:13 “యేసు ప్రభూ! మాపై దయచూపు” అని బిగ్గరగా అన్నారు.
LUK 17:14 ఆయన వాళ్ళను చూసి, “వెళ్ళి యాజకులకు చూపండి” అని అన్నాడు. వాళ్ళు వెళ్తూంటే వాళ్ళకు నయమైపోయింది.
LUK 17:15 వాళ్ళలో ఒకడు తనకు నయమవటం గమనించి, గొంతెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ వెనక్కు వెళ్ళాడు.
LUK 17:16 యేసు ముందు మోకరిల్లి కృతజ్ఞత చెప్పుకున్నాడు. అతడు సమరయ వాడు.
LUK 17:17 యేసు, “పది మందికి నయమైంది కదా! మిగతా తొమ్మిది మంది ఏరి?
LUK 17:18 ఈ సమరయుడు తప్ప మరెవ్వరూ దేవుణ్ణి స్తుతించటానికి తిరిగి రాలేదా?” అని అన్నాడు.
LUK 17:19 ఆ తర్వాత అతనితో, “లేచి వెళ్ళు, నీ విశ్వాసమే నీకు నయం చేసింది” అని అన్నాడు.
LUK 17:20 కొందరు పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని అడిగారు. యేసు, “దేవుని రాజ్యం అందరికి కనిపించేలా రాదు.
LUK 17:21 ‘ఇదిగో, దేవుని రాజ్యం ఇక్కడ ఉంది; అదిగో అక్కడ ఉంది’ అని ఎవరూ అనరు. ఎందుకంటే దేవుని రాజ్యం మీలో ఉంది!” అని సమాధానం చెప్పాడు.
LUK 17:22 ఆ తర్వాత, తన శిష్యులతో, “మనుష్యకుమారుడు మీతో ఒక్క రోజన్నా ఉండాలని మీరు తహతహలాడే సమయం వస్తుంది. కాని అలా జరగదు.
LUK 17:23 ప్రజలు, ‘అదిగో అక్కడ ఉన్నాడని’ కాని, లేక ‘ఇదిగో ఇక్కడున్నాడని’ కాని అంటే వాళ్ళ వెంట పరుగెత్తి వెళ్ళకండి.
LUK 17:24 “ఎందుకంటే మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆకాశంలో ఈ చివరినుండి ఆ చివరి దాకా మెరిసే మెరుపులా ఉంటాడు.
LUK 17:25 కాని దానికి ముందు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఈ తరం వాళ్ళతో తృణీకరింపబడాలి.
LUK 17:26 “నోవహు కాలంలో జరిగిన విధంగా మనుష్యకుమారుని కాలంలో కూడా జరుగుతుంది.
LUK 17:27 నోవహు నావలో ప్రవేశించేదాకా ప్రజలు తింటూ, త్రాగుతూ, వివాహాలు చేస్తూ, వివాహాలు చేసుకొంటూ గడిపారు. అతడు నావలో ప్రవేశించాక వరదలు రాగా మిగిలిన వాళ్ళందరూ నాశనమయ్యారు.
LUK 17:28 “లోతు కాలంలో కూడా అదేవిధంగా జరిగింది. ప్రజలు తింటూ, త్రాగుతూ, అమ్ముతూ, కొంటూ, పొలాలు సాగుచేస్తూ, ఇళ్ళు కడుతూ జీవించారు.
LUK 17:29 కాని లోతు సొదొమ పట్టణం వదిలి వెళ్ళిన వెంటనే ఆకాశం నుండి మంటలు, గంధకము వర్షంలా కురిసి అందర్ని నాశనం చేసింది.
LUK 17:30 మనుష్యకుమారుణ్ణి దేవుడు వ్యక్తం చేసిన రోజు కూడా ఇదే విధంగా జరుగుతుంది.
LUK 17:31 “ఆ రోజు ఇంటి కప్పు మీదనున్న వాళ్ళు తమ వస్తువులు తెచ్చుకోవటానికి ఇళ్ళలోకి వెళ్ళరాదు. అదే విధంగా పొలాల్లో ఉన్నవాళ్ళు ఏ వస్తువు కోసం ఇంటికి తిరిగి వెళ్ళరాదు.
LUK 17:32 లోతు భార్యను జ్ఞాపకం తెచ్చుకొండి.
LUK 17:33 “తన ప్రాణాన్ని కాపాడు కోవాలనుకొన్నవాడు పోగొట్టుకొంటాడు. ప్రాణం పోగొట్టుకోవటానికి సిద్దంగా ఉన్నవాడు తన ప్రాణం కాపాడుకొంటాడు.
LUK 17:34 ఆ రాత్రి ఒక పడక మీద ఇద్దరు నిద్రిస్తూ ఉంటే ఒకడు వదిలి వేయబడి మరొకడు తీసుకొని వెళ్ళబడతాడు.
LUK 17:35 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒకామె తీసుకు వెళ్ళబడుతుంది, మరొకామె వదిలి వేయబడుతుంది” అని అన్నాడు.
LUK 17:36 
LUK 17:37 “ఇవి ఎక్కడ సంభవిస్తాయి ప్రభూ!” అని వాళ్ళు అడిగారు. ఆయన, “ఎక్కడ శవముంటే అక్కడ రాబందులుంటాయి” అని సమాధానం చెప్పాడు.
LUK 18:1 నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలని, నిరుత్సాహం చెందరాదని, బోధించటానికి యేసు తన శిష్యులకు ఈ ఉపమానం చెప్పాడు:
LUK 18:2 “ఒక గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి దేవుడంటే భయంకాని, ప్రజలు తనని గురించి ఏమనుకొంటారనే భీతికాని లేకుండెను.
LUK 18:3 అదే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు ప్రతిరోజు వచ్చి ‘నాకు ఒకడు అన్యాయం చేశాడు. నాకు న్యాయం చేకూర్చండి’ అని అడుగుతూ ఉండేది.
LUK 18:4 చాలా కాలం అతడు ఆమె మాటలు పట్టించుకోలేదు. కాని చివరకు ‘నాకు దేవుడంటే భయంకాని, ప్రజలంటే భీతికాని లేదు.
LUK 18:5 కాని ఈ వితంతువు వచ్చి నన్ను విసిగిస్తోంది. కాబట్టి ఈమె మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రాకుండ ఈమెకు న్యాయం జరిగేలా చూస్తాను’ అని తన మనస్సులో అనుకున్నాడు.”
LUK 18:6 ఇలా చెప్పి ప్రభువు, “ఆ నీతి నియమం లేని న్యాయాధిపతి అనుకొన్న మాటలు విన్నారు కదా!
LUK 18:7 మరి దేవుడు తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన వాళ్ళకు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? వాళ్ళకు న్యాయం చెయ్యటంలో ఆలస్యం చేస్తాడా!
LUK 18:8 ఆయన వాళ్ళకు వెంటనే న్యాయం చేకూరుస్తాడని నేను చెబుతున్నాను. కాని మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రజలలో విశ్వాసాన్ని కనుగొంటాడా?” అని అన్నాడు.
LUK 18:9 తాము మాత్రమే నీతిమంతులమని అనుకొని యితర్లను చిన్నచూపు చూసేవాళ్ళకు యేసు ఈ ఉపమానం చెప్పాడు:
LUK 18:10 “ఇద్దరు మనుష్యులు మందిరానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు పన్నులు వసూలు చేసేవాడు.
LUK 18:11 పరిసయ్యుడు ఒక ప్రక్కనిలుచొని ఈ విధంగా ప్రార్థించటం మొదలు పెట్టాడు: ‘ప్రభూ! నేను యితరుల్లా, అంటే మోసగాళ్ళల్లా, దుర్మార్గుల్లా, వ్యభిచారుల్లా ఉండనందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ పన్నులు సేకరించేవానిలా నేను ఉండనందుకు కూడా కృతజ్ఞుణ్ణి.
LUK 18:12 నేను వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేస్తాను. నా సంపదలో పదవవంతు దేవుని పేరిట యిస్తాను.’
LUK 18:13 “ఆ పన్నులు సేకరించేవాడు మరొక ప్రక్క నిలుచొని ఆకాశం వైపు కూడా చూడటానికి ధైర్యము లేక గుండెలు బాదుకుంటూ, ‘దేవుడా! నేనొక పాపిని, నాపై దయచూపు’ అని అన్నాడు.
LUK 18:14 దేవుని దృష్టిలో పరిసయ్యునికి మారుగా ఇతడు నీతిమంతుడనిపించుకొని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే గొప్పలు చెప్పుకొన్నవాడు అణచబడతాడు. అణుకువతో ఉన్నవాడు గొప్ప స్థానానికి ఎత్తబడతాడు.”
LUK 18:15 యేసు వారిని తాకాలని ప్రజలు చిన్న పిల్లల్ని ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చారు. శిష్యులు యిది చూసి ప్రజల్ని వారించారు.
LUK 18:16 కాని, యేసు ఆ చిన్న పిల్లల్ని తన దగ్గరకు పిలుస్తూ, “చిన్న పిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం వాళ్ళలాంటి వారిదే.
LUK 18:17 యిది నిజం. దేవుని రాజ్యాన్ని చిన్న పిల్లల్లా అంగీరించనివాడు ఆందులోకి ప్రవేశించలేడు” అని అన్నాడు.
LUK 18:18 ఒక యూదుల నాయకుడు యేసును, “బోధకుడా! మీరు మంచివాళ్ళు. నేను అనంత జీవితం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
LUK 18:19 “నేను మంచివాణ్ణని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప మరెవ్వరూ మంచివాళ్ళు కాదు.
LUK 18:20 నీకు దేవుని ఆజ్ఞలు తెలుసు కదా: ‘వ్యభిచారం చెయ్యరాదు, హత్య చెయ్యరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యాలు చెప్పరాదు. తల్లి తండ్రుల్ని గౌరవించవలెను’” అని యేసు సమాధానం చెప్పాడు.
LUK 18:21 “నేను చిన్ననాటినుండి ఈ నియమాలు పాటిస్తూనేవున్నాను” అని ఆ యూదుల పెద్ద అన్నాడు.
LUK 18:22 ఇది విని యేసు అతనితో, “నీలో యింకొక లోపం ఉంది. నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకు దానం చెయ్యి. అది నీకు పరలోకంలో సంపద అవుతుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు.
LUK 18:23 ఆ యూదుల పెద్ద చాలా ధనవంతుడు. అందువల్ల యిది విని అతనికి చాలా దుఃఖం కలిగింది.
LUK 18:24 యేసు అతడు దుఃఖపడటం చూసి, “ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం.
LUK 18:25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటంకన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.
LUK 18:26 ఇది విని వాళ్ళు, “మరి ఎవరు రక్షింపబడుతారు?” అని అడిగారు.
LUK 18:27 “మానవునికి సాధ్యంకానిది దేవునికి సాధ్యమౌతుంది” అని యేసు అన్నాడు.
LUK 18:28 పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మాకున్నవన్నీ వదిలివేసాము” అని అన్నాడు.
LUK 18:29 యేసు, “ఇది నిజం. దేవుని రాజ్యం కొరకు తన యింటిని, భార్యను, సోదరుల్ని, తల్లితండ్రుల్ని, సంతానాన్ని వదిలినవాడు ఏ మాత్రం నష్టపోడు.
LUK 18:30 ఇప్పుడు ఎన్నోరెట్లు ఫలం పొందటమే కాకుండా మున్ముందు అనంత జీవితం పొందుతాడు.” అని అన్నాడు.
LUK 18:31 యేసు పన్నెండుమందిని ప్రక్కకు పిలుచుకు వెళ్ళి, “మనం యెరూషలేము వెళ్ళాలి. మనుష్యకుమారుణ్ణి గురించి ప్రవక్తలు వ్రాసినవన్నీ నిజం కాబోతున్నాయి.
LUK 18:32 ఆయన యూదులుకాని వాళ్ళకు అప్పగింపబడతాడు. వాళ్ళాయన్ని హేళన చేస్తారు. అవమానిస్తారు, ఆయనపై ఉమ్మి వేస్తారు,
LUK 18:33 కొరడా దెబ్బలు కొడతారు. చివరకు చంపివేస్తారు. మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు.
LUK 18:34 శిష్యులకు ఆయన చెప్పింది ఏ మాత్రం అర్థం కాలేదు. ఆయన చెప్పిన దానిలో గూఢార్థం ఉంది. కాని వాళ్ళకది బోధపడలేదు.
LUK 18:35 యేసు యెరికో పట్టణాన్ని సమీపిస్తున్నాడు. అదే సమయానికి ఒక గ్రుడ్డివాడు దారిప్రక్కన భిక్షమెత్తుకుంటూ కూర్చొని ఉన్నాడు.
LUK 18:36 అతడు ప్రజల గుంపు వెళ్తుండటం గమనించి ఏమి జరుగుతోందని అడిగాడు.
LUK 18:37 వాళ్ళు, “నజరేతు నివాసి యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని చెప్పారు.
LUK 18:38 ఆ గ్రుడ్డివాడు బిగ్గరగా, “యేసూ! దావీదు కుమారుడా! నామీద దయ చూపు!” అని అన్నాడు.
LUK 18:39 ముందున్న వాళ్ళు అతణ్ణి గద్దిస్తూ నోరు మూసుకోమని చెప్పారు. కాని, అతడు యింకా బిగ్గరగా, “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని అన్నాడు.
LUK 18:40 యేసు ఆగి ఆ గ్రుడ్డివాణ్ణి తన దగ్గరకు పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతడు దగ్గరకు రాగానే యేసు అతణ్ణి
LUK 18:41 “ఏమి కావాలి?” అని అడిగాడు. “ప్రభూ! నాకు దృష్టి కావాలి!” అని గ్రుడ్డివాడు సమాధానం చెప్పాడు.
LUK 18:42 యేసు, “నీకు దృష్టి కలగాలి! నీవు విశ్వసించావు కనుక నీకు దృష్టి కలిగింది” అని అన్నాడు.
LUK 18:43 వెంటనే అతడు చూడగలిగాడు. ఆ గ్రుడ్డివాడు దేవుణ్ణి స్తుతిస్తూ యేసును అనుసరించాడు. ప్రజలందరూ యిది చూసి వారుకూడా దేవుణ్ణి స్తుతించారు.
LUK 19:1 యేసు యెరికోను చేరి ఆ పట్టణం ద్వారా వెళ్తూవున్నాడు.
LUK 19:2 ఆ గ్రామంలో జక్కయ్య అనేవాడు ఉండేవాడు. అతడు పన్నులు సేకరించేవాళ్ళలో పెద్ద అధికారి. గొప్ప ధనికుడు కూడా.
LUK 19:3 జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకొన్నాడు. కాని ప్రజలు గుంపులు గుంపులుగా వుండిరి అతడు పొట్టివాడు అవటంవలన యేసును చూడలేకపోయాడు.
LUK 19:4 యేసు ఆ దారిలో వస్తున్నాడని తెలిసి ఆయన్ని చూడటానికి అందిరకన్నా ముందు పరుగెత్తి ఒక మెడి చెట్టెక్కి కూర్చున్నాడు.
LUK 19:5 యేసు ఆ చెట్టుదగ్గరకు వచ్చాక పైకి చూసి, “జక్కయ్యా! జక్కయ్యా! వెంటనే క్రిందికి దిగిరా! ఈ రోజు నేను నీ యింట్లో బసచెయ్యాలి!” అని అన్నాడు.
LUK 19:6 అతడు వెంటనే క్రిందికి దిగి ఆనందంతో యేసుకు స్వాగతం చెప్పాడు.
LUK 19:7 ప్రజలు జరిగినదంతా చూసి, “యేసు ఒక పాపి యింట్లో బస చెయ్యటానికి వెళ్తున్నాడే!” అని గొణిగారు.
LUK 19:8 కాని జక్కయ్య ప్రభువుతో, “ప్రభూ! నేనుయిక్కడే నా ఆస్తిలో సగం పేదవాళ్ళకు యిస్తాను. నేను ఎవరినుండైనా ఏదైనా మోసం చేసి తీసుకొని ఉంటే దానికి నాలుగు రెట్లు వాళ్ళకు చెల్లిస్తాను” అని అన్నాడు.
LUK 19:9 అప్పుడు యేసు, “ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు. కనుక ఈ యింటికి ఈ రోజు రక్షణ వచ్చింది.
LUK 19:10 మనుష్యకుమారుడు తప్పిపోయిన వాళ్ళను వెతికి రక్షించటానికి వచ్చాడు” అని అన్నాడు.
LUK 19:11 ప్రజలు ఆయన చెబుతున్న విషయాలు వింటూ ఉన్నారు. ఆయన యెరూషలేము దగ్గరగా ఉండటం వల్ల ప్రజలు దేవుని రాజ్యం రాబోతొందని అనుకున్నారు. కనుక ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు:
LUK 19:12 “గొప్ప కుంటుంబంలో పుట్టినవాడొకడు దూర దేశానికి వెళ్ళి తన దేశానికి రాజుగా నియమింపబడ్డాక తిరిగి రావాలనుకొన్నాడు.
LUK 19:13 వెళ్ళేముందు తన సేవకుల్ని పది మందిని పిలిచి ఒక్కొక్కనికి ఒక మీనాయిచ్చి, ‘నేను తిరిగి వచ్చేదాకా ఈ డబ్బుతో వ్యాపారం చెయ్యండి’ అని అన్నాడు.
LUK 19:14 అతని ప్రజలకు అతడంటే యిష్టం ఉండేది కాదు. కనుక వాళ్ళు తమ ప్రతినిధుల్ని పంపి, ‘ఇతడు మా రాజుగా ఉండటం మాకిష్టం లేదు’ అని చెప్పనంపారు.
LUK 19:15 “అయినా అతడు రాజుగా నియమింపబడ్డాడు. ఆ తర్వాత అతడు తన దేశానికి తిరిగి వచ్చాడు. తాను డబ్బిచ్చిన సేవకులు ఎంత సంపాదించారో కనుక్కోవటానికి వాళ్ళను పిలిపించాడు.
LUK 19:16 మొదటి వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో మరొక పది మీనాలు సంపాదించాను’ అని అన్నాడు.
LUK 19:17 ‘మంచిది! నీవు మంచి సేవకుడివి. నీవు చిన్న వాటిలో కూడా ఇంత నమ్మకంగా ఉన్నందుకు పది గ్రామాలపై నీకు అదికారం ఇస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు.
LUK 19:18 “రెండవ వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో ఐదు మీనాలు సంపాదించాను’ అని అన్నాడు.
LUK 19:19 ‘నిన్ను ఐదు గ్రామాలపై అధికారిగా నియమిస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు.
LUK 19:20 “మూడవవాడు వచ్చి, ‘ప్రభూ! ఇదిగో మీరిచ్చిన మీనా. దాన్ని నేను ఒక గుడ్డలో చుట్టి దాచి ఉంచాను.
LUK 19:21 మీరు చాలా కఠినాత్ములు కనుక మీరంటే నాకు భయం. మీరు మీవి కానివాటిని లాక్కుంటారు; విత్తకుండానే కోయాలంటారు’ అని అన్నాడు.
LUK 19:22 “ఆ రాజు, ‘ఓరి, దుర్మార్గుడా! నిన్ను శిక్షించటానికి నీ మాటలే ఉపయోగిస్తాను. నేను కఠినాత్ముడనని నీకు తెలుసునన్నమాట. నేను ఇవ్వని వాటిని లాక్కుంటానన్నమాట. విత్తనం వేయకుండా ఫలం పొందుతానన్నమాట.
LUK 19:23 అలాంటప్పుడు నా డబ్బు వడ్డీకి ఎందుకు యివ్వలేదు? అలా చేసివుంటే నేను తిరిగి వచ్చినప్పుడు నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది కదా!’ అని అన్నాడు.
LUK 19:24 ఆ తర్వాత అక్కడ నిలుచున్న వాళ్ళతో ‘వాని నుండి ఆ మీనా తీసుకొని పదిమీనాలున్న వానికి ఇవ్వండి!’ అని అన్నాడు.
LUK 19:25 “‘అయ్యా! అతని దగ్గర పదిమీనాలున్నాయి కదా!’ అని వాళ్ళు అన్నారు.
LUK 19:26 “అతడు, ‘వున్నవానికి యింకా ఎక్కువ ఇవ్వబడుతుంది. ఏమిలేని వాని నుండి అతని దగ్గర ఉన్నవి కూడా తేసివేయబడతాయి.
LUK 19:27 ఇక నేను తమ రాజుగా ఉండటానికి నిరాకరించిన శత్రువుల్ని పిలుచుకు వచ్చి నా ముందు చంపండి’” అని అన్నాడు.
LUK 19:28 యేసు ఈ ఉపమానం చెప్పి యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు.
LUK 19:29 వాళ్ళు ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ గ్రామాలను చేరుకొన్నాక యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరా గ్రామాన్ని ప్రవేశించగానే స్థంభానికి కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడుతుంది. దాని మీద యిదివరకు ఎవ్వరూ ఎక్కలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి.
LUK 19:31 ఎవరైనా ‘ఎందుకు విప్పుతున్నారు?’ అని అడిగితే, ఇది ప్రభువుకు కావాలని చెప్పండి” అని అన్నాడు.
LUK 19:32 వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పిన విధంగా గాడిద స్థంభానికి కట్టబడి ఉండటం చూసారు.
LUK 19:33 వాళ్ళు దాన్ని విప్పుతుండగా దాని యజమానులు వచ్చి, “గాడిదను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు.
LUK 19:34 ఇది “ప్రభువుకు కావాలి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
LUK 19:35 వాళ్ళు దాన్ని యేసు దగ్గరకు తీసుకు వచ్చి తమ వస్త్రాల్ని దానిపై పరిచి, దాని మీద యేసును ఎక్కించారు.
LUK 19:36 ఆయన వెళ్తుండగా, ప్రజలు తమ వస్త్రాల్ని దారి మీద పరిచారు.
LUK 19:37 ఆయన ఒలీవల కొండమీద నుండి క్రిందికి దిగే స్థలాన్ని చేరుకున్నాడు. శిష్యుల గుంపంతా తాము మహత్యాలు చూసినందుకు ఆనందంతో బిగ్గరగా యిలా దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు:
LUK 19:38 “‘ప్రభువు పేరిట రానున్న రాజు ధన్యుడు!’ పరలోకంలో శాంతి! మహోన్నత స్థలాల్లో దేవునికి మహిమ!”
LUK 19:39 గుంపులో ఉన్న కొందరు పరిసయ్యులు యేసుతో, “బోధకుడా! మీ శిష్యుల్ని అదుపులో పెట్టుకో!” అని అన్నారు.
LUK 19:40 యేసు, “వాళ్ళు గొంతెత్తి మాట్లాడటం ఆపితే, రాళ్ళు గొంతెత్తి మాట్లాడటం మొదలు పెడతాయి” అని సమాధానం చెప్పాడు.
LUK 19:41 ఆయన యెరూషలేము సమీపిస్తూ ఆ పట్టణాన్ని చూసి ఈ విధంగా విలపించ సాగాడు: “శాంతిని స్థాపించటానికి ఏమి కావాలో నీకు ఈ రోజైనా తెలిసుంటే బాగుండేది. కాని అది నీకిప్పుడు అర్థం కాదు.
LUK 19:43 నీ శత్రువులు నీ చుట్టూ గోడకట్టి నాలుగు వైపులనుండి ముట్టడి చేసే రోజులు రానున్నాయి.
LUK 19:44 వాళ్ళు నిన్ను, నీ ప్రజల్ని నేల మట్టం చేస్తారు. దేవుని రాకను నీవు గమనించలేదు. కనుక వాళ్ళు ఒక రాయి మీద యింకొక రాయి ఉండకుండా చేస్తారు.”
LUK 19:45 ఆ తర్వాత ఆయన మందిరంలోకి ప్రవేశించి అక్కడ అమ్ముతున్న వ్యాపారస్తుల్ని తరిమి వేయటం మొదలు పెట్టాడు.
LUK 19:46 వాళ్ళతో, “నా ఆలయం ప్రార్థనా ఆలయం. కాని మీరు దాన్ని దొంగలు దాగుకొనే స్థలంగా మార్చారు!” అని చెప్పబడిందని అన్నాడు.
LUK 19:47 ఆయన ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ ఉండే వాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజా నాయకులు ఆయన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు.
LUK 19:48 కాని ప్రజలు యేసు మాటలు శ్రద్ధతో వింటూ ఉండటంవల్ల ఆయన్ని ఏ విధంగా చంపాలో వాళ్ళకు బోధపడలేదు.
LUK 20:1 ఒక రోజు మందిరంలో యేసు ప్రజలకు బోధిస్తూ, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రధానయాజకులు, శాస్త్రులు, పెద్దలు అంతా కలిసి ఆయన దగ్గరకు వచ్చారు.
LUK 20:2 “ఎవరిచ్చిన అధికారంతో నీవు ఇవన్నీ చేస్తున్నావు? నీకీ అధికారం ఎవరిచ్చారు? చెప్పు” అని వాళ్ళు అడిగారు.
LUK 20:3 ఆయన, “నన్నొక ప్రశ్న అడుగనివ్వండి.
LUK 20:4 యోహానుకు బాప్తిస్మము నిచ్చే అధికారం ఎవరిచ్చారు? దేవుడా? లేక ప్రజలా” అని అన్నాడు.
LUK 20:5 వాళ్ళు పరస్పరం ఈ విధంగా చర్చించుకున్నారు: “దేవుడంటే, అతడు ‘మరి మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అంటాడు
LUK 20:6 ప్రజలంటే, ‘ప్రజలు యోహానును ఒక ప్రవక్త అని విశ్వాసిస్తూ ఉండేవాళ్ళు కనుక వాళ్ళు మనల్ని రాళ్ళతో కొడతారు.’
LUK 20:7 అందువల్ల ఆ అధికారం ఎక్కడినుండి వచ్చిందో మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.
LUK 20:8 యేసు, “మరి అలాగైతే నేను కూడా ఎవరి అధికారంతో యివన్నీ చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు.
LUK 20:9 ఆ తర్వాత ప్రజలకు ఈ ఉపమానం చెప్పటం మొదలు పెట్టాడు: “ఒకడు ఒక ద్రాక్షాతోట వేసి రైతులకు కౌలుకిచ్చి చాలాకాలం దేశాంతరం వెళ్ళి పోయ్యాడు.
LUK 20:10 పండ్లు కోసే సమయానికి తన పాలు వసూలు చేసుకురమ్మని సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కొట్టి వట్టి చేతుల్తో పంపారు.
LUK 20:11 ఆ ఆసామి మరొక సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కూడా బాగా కొట్టి అవమానించి వట్టిచేతుల్తో పంపారు.
LUK 20:12 అతడు మూడవవాణ్ణి పంపాడు. వాళ్ళతణ్ణి తీవ్రంగా గాయపరచి తరిమి వేసారు.
LUK 20:13 “ఆ ద్రాక్షాతోట యజమాని, ‘నేనేం చెయ్యాలి? ఆ! నా ముద్దుల కొడుకుని పంపుతాను. బహుశా వాళ్ళతణ్ణి గౌరవించవచ్చు’ అని అనుకున్నాడు.
LUK 20:14 కాని రైతులు అతని కుమారుణ్ణి చూసి, తమలో ‘ఇతడు వారసుడు కనుక యితణ్ణి చంపేద్దాం. అప్పుడు ఈ తోట మనకే ఉంటుంది’ అని నిశ్చయించుకొన్నారు.
LUK 20:15 అతణ్ణి ద్రాక్షాతోట నుండి బైటకు తరిమి చంపివేసారు. “ఆ ద్రాక్షాతోట ఆసామి వాళ్ళనేమి చేస్తాడు?
LUK 20:16 వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షాతోట యింకొకరికి కౌలుకు యిస్తాడు” అని అన్నాడు. ప్రజలు యిది విని, “అలా ఎన్నటికి జరుగకూడదు” అని అన్నారు.
LUK 20:17 యేసు వాళ్ళవైపు సూటిగా చూసి, “మరి అలాగైతే లేఖనాల్లో వ్రాయబడిన ఈ వాక్యానికి అర్థమేమిటి: ‘పనికి రానిదని ఇళ్ళుకట్టేవాళ్ళు పారవేసిన రాయి ముఖ్యమైన రాయి అయింది’?
LUK 20:18 ఆ రాయిమీద ఎవరు పడతారో వాళ్ళు ముక్కలై పోతారు. ఆ రాయి ఎవరి మీద పడుతుందో వాళ్ళు నలిగిపోతారు” అని అన్నాడు.
LUK 20:19 శాస్త్రులు, ప్రధాన యాజకులు ఈ ఉపమానం తమను ఉద్దేశించి చెప్పిందని గ్రహించి ఆయన్ని బధించటానికి వెంటనే ప్రయత్నించారు. కాని ప్రజల్ని చూసి భయపడి పోయారు.
LUK 20:20 వాళ్ళు సరియైన అవకాశం కోసం ఎదురు చూడసాగారు. కనుక వాళ్ళు తమ వాళ్ళను కొందర్ని రహస్యంగా ఆయన దగ్గరకు పంపారు. వాళ్ళు మంచి వాళ్ళుగా నటిస్తూ యేసు చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పు పట్టి ఆయన్ని ఆ ప్రాంతం యొక్క రాజ్యాధికారికి అప్పగించటానికి ప్రయత్నించసాగారు. ఆ రాజ్యాధికారికి శిక్షించటానికి అధికారం ఉంది.
LUK 20:21 ఒక రోజు వాళ్ళు యేసుతో, “బోధకుడా! మీరు సత్యం మాట్లాడుతారు. సత్యం బోధిస్తారు. పక్షపాతం చూపరు. దేవుని మార్గాన్ని ఉన్నది ఉన్నట్లు బోధిస్తారని మాకు తెలుసు.
LUK 20:22 మరి మేము చక్రవర్తికి పన్నులు కట్టాలా వద్దా?” అని అడిగారు.
LUK 20:23 వాళ్ళ పన్నాగం గమనించి
LUK 20:24 యేసు, “ఒక దేనారా చూపండి. దాని మీద ఎవరి బొమ్మవుంది? ఎవరి పేరు ఉంది?” అని అడిగాడు. “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చేప్పారు.
LUK 20:25 ఆయన, “అలాగైతే చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి. దేవునికి చెందింది దేవునికి యివ్వండి” అని అన్నాడు.
LUK 20:26 ఆయన అక్కడ ప్రజల సమక్షంలో చెప్పిన ఈ సమాధానంలో వాళ్ళు ఏ తప్పూ పట్టలేక పోయారు. పైగా వాళ్ళాయన సమాధానానికి ఆశ్చర్యపడి మౌనం వహించారు.
LUK 20:27 చనిపొయ్యాక మళ్ళీ బ్రతికిరారని వాదించే సద్దూకయ్యుల తెగకు చెందిన కొందరు యేసు దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రశ్నించారు:
LUK 20:28 “బోధకుడా! మోషే ‘ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే అతని సోదరుడు ఆ చనిపోయిన వానికి సంతానం కలుగ చేయటానికి అతని భార్యను వివాహం చేసుకోవాలి’ అని వ్రాశాడు.
LUK 20:29 ఒక్కప్పుడు ఏడుగురు సోదరులుండే వారు. మొదటి వాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండా మరణించాడు.
LUK 20:30 రెండవవాడు ఆమెను పెళ్ళి చేసుకొని మరణించాడు.
LUK 20:31 మూడవవాడును ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. అదేవిధంగా ఆ ఏడుగురు సోదరులు సంతానం లేకుండా మరణించారు.
LUK 20:32 చివరకు ఆమెకూడా మరణించింది.
LUK 20:33 మరణించిన వాళ్ళందరూ బ్రతికి వచ్చినప్పుడు ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకొంటారు గనుక ఆమె ఎవరి భార్య అవుతుంది?” అని అడిగారు.
LUK 20:34 యేసు, “ఈ భూమ్మీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. చేసుకొంటారు.
LUK 20:35 పరలోకమునకు పునరుత్థానమగుటకు అర్హత ఉన్నవాళ్ళు అనంత జీవితం పొంది రానున్న కాలంలో జీవిస్తారు. అప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, చెయ్యరు.
LUK 20:36 వాళ్ళు దేవదూతల వలె, దేవుని కుమారులవలె ఉంటారు. కనుక వారిక చావరు. వాళ్ళు మరణాన్ని జయించి బ్రతికి వచ్చిన వాళ్ళు కనుక దేవుని సంతానంగా పరిగణింపబడతారు.
LUK 20:37 మండుచున్న పొదను గురించి వ్రాస్తూ, ‘ప్రజలు చావునుండి బ్రతికింపబడతారు’ అని మోషే సూచించాడు. ఎందుకంటే, అతడు ప్రభువును గురించి ప్రస్తావిస్తూ ‘ప్రభువు అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు’ అని వ్రాసాడు.
LUK 20:38 ప్రభువు చనిపోయిన వాళ్ళకు దేవుడు కాదు. ఆయన సజీవంగా ఉన్నవాళ్ళకే దేవుడు. ఆయన అందర్ని జీవిస్తున్న వాళ్ళుగా పరిగణిస్తాడు” అని అన్నాడు.
LUK 20:39 కొందరు శాస్త్రులు, “బోధకుడా! చక్కగా చెప్పారు” అని అన్నారు.
LUK 20:40 ఆ తదుపరి ఆయన్ని ప్రశ్నించటానికి ఎవరికి ధైర్యం చాలలేదు.
LUK 20:41 ఆ తర్వాత యేసు వాళ్ళతో, “క్రీస్తు దావీదు కుమారుడని వాళ్ళు ఎందుకు అంటున్నారు?
LUK 20:42 దావీదు, తన కీర్తనలో ఈ విధంగా వ్రాశాడు కదా! ‘ప్రభువు నా ప్రభువుతో: నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకూ నా కుడి వైపు కూర్చో’
LUK 20:44 దావీదు ఆయన్ని ‘ప్రభూ!’ అని అన్నాడు కదా! అలాంటప్పుడు ఆయన దావీదు కుమారుడెట్లా ఔతాడు?” అని అన్నాడు.
LUK 20:45 ప్రజలు యేసు చెబుతున్న విషయాలు వింటూ అక్కడే ఉన్నారు. ఆయన తన శిష్యులకు ఈ విధంగా చెప్పాడు:
LUK 20:46 “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిండుగా అంగీలువేసుకొని తిరగాలి అంటే వారికి చాలా యిష్టం. సంతలో నడుస్తున్నప్పుడు ప్రజలు దండాలు పెడితే సంతసిస్తారు. విందుకు వెళ్ళినప్పుడు, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన స్థానాల్లో కూర్చోవటానికి ప్రాకులాడుతారు.
LUK 20:47 వితంతువుల్ని మోసం చేసి వాళ్ళ ఇళ్ళు దోచుకుంటారు. కాని పైకి మాత్రం చాలాసేపు ప్రార్థనలు చేస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”
LUK 21:1 యేసు చుట్టూ చూసాడు. ధనవంతులు హుండీలో కానుకలు వేయటం ఆయన గమనించాడు.
LUK 21:2 అతి పేదరాలైన ఒక వితంతువు రెండు పైసాలు హుండీలో వెయ్యటం కూడా ఆయన గమనించాడు.
LUK 21:3 ఆయన, “నేను చెప్పేదేమిటంటే ఈ బీదవితంతువు అందరికన్నా ఎక్కువ ఆ హుండిలో వేసింది.
LUK 21:4 యితర్లు తమ దగ్గరున్న సంపద నుండి కొంత మాత్రమే కానుకగా వేసారు. కాని ఆమె తాను జీవించటానికి దాచుకొన్నదంతా ఆ హుండీలో వేసింది” అని అన్నాడు.
LUK 21:5 ఆయన శిష్యుల్లో కొందరు ఆ మందిరానికి చెక్కబడిన రాళ్ళ అందాన్ని గురించి, ప్రజలు యిచ్చిన కానుకలతో చేసిన అలంకరణను గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు.
LUK 21:6 కాని యేసు, “మీరిక్కడ చూస్తూన్నవన్నీ రాయి మీద రాయి నిలువకుండా నేలమట్టమై పోయ్యే సమయం వస్తుంది” అని అన్నాడు.
LUK 21:7 వాళ్ళు, “అయ్యా! యివి ఎప్పుడు సంభవిస్తాయి! ఇవి జరుగబోయేముందు ఎలాంటి సూచనలు కనిపిస్తాయి” అని అడిగారు.
LUK 21:8 ఆయన, “జాగ్రత్త! మోసపోకండి. నా పేరిట అనేకులు వచ్చి, ‘నేనే ఆయన్ని అని, కాలం సమీపించింది’ అని అంటారు. వాళ్ళను అనుసరించకండి.
LUK 21:9 యుద్ధాల్ని గురించి, తిరుగుబాట్లను గురించి వింటే భయపడకండి. ఇవన్నీ ముందు జరిగి తీరవలసిందే. కాని అంతం అప్పుడే రాదు” అన్నాడు.
LUK 21:10 ఆ తర్వాత ఆయన వాళ్ళతో, “దేశం దేశంతో, రాజ్యం రాజ్యంతో యుద్ధం చేస్తుంది.
LUK 21:11 అన్నిచోట్లా తీవ్రమైన భూకంపాలు, కరువులు, రోగాలు సంభవిస్తాయి. ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆకాశంలో భయంకర గుర్తులు కనిపిస్తాయి.
LUK 21:12 “కాని యివన్నీ జరుగక ముందే యూదులు మిమ్మల్ని బంధించి, హింసించి సమాజ మందిరాలకు అప్పగిస్తారు. ఆ సమాజ మందిరాల అధికారులు మిమ్మల్ని కారాగారంలో పడవేస్తారు. రాజుల ముందు, రాజ్యాధికారుల ముందు నిలబెడతారు. ఇవన్నీ నాపేరు కారణంగా జరుగుతాయి.
LUK 21:13 తద్వారా వాళ్ళకు సువార్తను గురించి చేప్పే అవకాశం మీకు కలుగుతుంది.
LUK 21:14 వాళ్ళ సమక్షంలో మిమ్మల్ని మీరు సమర్థించుకోవటానికి సిద్ధం కారాదని మీ మనస్సులో నిర్ణయించుకోండి.
LUK 21:15 ఎందుకంటే సరియైన సమయానికి మాట్లాడటానికి అవసరమైన పదాన్ని నేను మీకు అందిస్తాను. కావలసిన జ్ఞానం యిస్తాను. మీ ప్రతివాదులు మీ మాటల్ని ఖండించకుండా ఉండేటట్లు చేస్తాను. వాళ్ళలో తిరిగి వాదించే శక్తి లేకుండా చేస్తాను.
LUK 21:16 మీ తల్లి తండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు మీకు ద్రోహం చేస్తారు. మీలో కొందర్ని చంపి వేస్తారు.
LUK 21:17 నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు.
LUK 21:18 కాని మీ తల మీదనున్న ఒక్కవెంట్రుక కూడా రాలిపోదు.
LUK 21:19 సహనంతో ఉండండి. అప్పుడే మిమ్మల్ని మీరు వీటన్నిటియందు విశ్వాసం ద్వారా రక్షించుకోగలుగుతారు.
LUK 21:20 “యెరూషలేము చుట్టూ సైన్యాలు చూసినప్పుడు అది నాశనమయ్యే రోజులు వచ్చాయని గ్రహించండి.
LUK 21:21 అప్పుడు యూదయలో ఉన్న మీరు పరుగెత్తి కొండల మీదికి వెళ్ళండి. పట్టణంలో ఉన్న వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపొండి. గ్రామాల్లో ఉన్న వాళ్ళు పట్టణాల్లోకి వెళ్ళకండి.
LUK 21:22 ఇది శిక్షా సమయం. ఇదివరకు లేఖనాల్లో వ్రాసినవన్నీ నిజంకానున్న సమయం.
LUK 21:23 ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత కష్టం కలుగుతుందో కదా! ఈ దేశానికి పెద్ద దుఃఖంకలుగనున్నది. దేవుడు తన కోపాన్ని ఈ దేశంపై చూపనున్నాడు.
LUK 21:24 కొందరు కత్తికి బలి అవుతారు. మరి కొందరు ఖైదీలుగా యితర దేశాలకు తీసుకు వెళ్ళబడతారు. యూదులుకాని వాళ్ళ కాలం ముగిసేదాకా వాళ్ళు యెరూషలేమును అణగత్రొక్కి ఉంచుతారు.
LUK 21:25 “సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాల్లో సూచనలు కన్పిస్తాయి. సముద్రాల రోదనకు, తీవ్రమైన అలలకు దేశాలు భయపడి కలవరం చెందుతాయి.
LUK 21:26 రానున్న ఘోరాన్ని తలంచుకొని ప్రజలు భయంతో మూర్చపోతారు. ఆకాశపు జ్యోతులు గతి తప్పుతాయి.
LUK 21:27 అప్పుడు శక్తితో, గొప్ప తేజస్సుతో మేఘం మీద మనుష్యకుమారుడు రావటం వాళ్ళు చూస్తారు.
LUK 21:28 ఇవి జరగటం మొదలైనప్పుడు లేచి మీ తలలెత్తి చూడండి. అంటే మీకు రక్షణ దగ్గరకు వచ్చిందని అర్థం” అని అన్నాడు.
LUK 21:29 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఆ అంజూరపు చెట్టును చూడండి. అంతెందుకు; చెట్లన్నిటిని చూడండి.
LUK 21:30 చెట్టు చిగురు వేయగానే ఎండాకాలం దగ్గరకు వచ్చిందని గ్రహిస్తారు.
LUK 21:31 అదే విధంగా ఈ సంఘటనలు జరగటం చూసినప్పుడు దేవుని రాజ్యం దగ్గరకు వచ్చిందని గ్రహించండి.
LUK 21:32 “ఇది నిజం. ఇవన్నీ సంభవించేవరకు ఈ తరంవాళ్ళు గతించరు.
LUK 21:33 ఆకాశం, భూమి గతించి పోవచ్చుకాని నామాటలు చిరకాలం నిలిచి పోతాయి.
LUK 21:34 “జాగ్రత్త! విందులు, వినోదాలు చేసుకొంటూ త్రాగుబోతులై జీవించకండి. ప్రాపంచిక విషయాల్లో మునిగిపోకండి. అలా చేస్తే మీ బుద్ధి పని చెయ్యటం మానేస్తుంది. అప్పుడు ఆ దినం మీరు సిద్ధంగా లేనప్పుడు వచ్చి మీ మీద పడుతుంది.
LUK 21:35 అది ప్రపంచం మీదికంతా వస్తుంది.
LUK 21:36 అన్ని వేళలా జాగ్రత్తగా ఉండండి. ఈ దుర్ఘటనలనుండి తప్పించుకొనే శక్తి, మనుష్యకుమారుని సమక్షంలో నిలబడగలిగే శక్తి కలగాలని ప్రార్థించండి.”
LUK 21:37 యేసు ప్రతి రోజు మందిరంలో బోధిస్తూ ఉండేవాడు. ప్రతిరాత్రి ఒలీవలకొండ మీదికి వెళ్ళి గడిపేవాడు.
LUK 21:38 ప్రజలందరు ఆయన బోధనలు వినాలని తెల్లవారుఝామునే మందిరానికి వెళ్ళేవాళ్ళు.
LUK 22:1 పులవకుండా రొట్టెలు చేసే పండుగ దగ్గరకు వచ్చింది. దాన్ని “పస్కా” అనే వాళ్ళు.
LUK 22:2 ప్రజల్లో ఉన్న విశ్వాసం చూసి ప్రధాన యాజకులు, శాస్త్రులు భయపడి పోయారు. వాళ్ళు ఏదో ఒక విధంగా యేసును చంపాలని ప్రయత్నం చేయసాగారు.
LUK 22:3 పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు అనబడే యూదాలో సాతాను ప్రవేశించాడు.
LUK 22:4 యూదా ప్రధాన యాజకులను, ముఖ్య ద్వార పాలకుల్ని కలుసుకొని తాను ఏవిధంగా యేసును వాళ్ళకప్పగించగలడో చర్చించాడు.
LUK 22:5 యూదా చెప్పింది విని ప్రధాన యాజకులు ఆనందించారు. యేసును అప్పగిస్తే అతనికి కొంత డబ్బు యిస్తామని వాళ్ళు చెప్పారు.
LUK 22:6 అతడు దానికి అంగీకరించి ప్రజలు లేనప్పుడు యేసును వాళ్ళకప్పగించాలనుకొని మంచి సమయం కోసం ఎదురు చూడసాగాడు.
LUK 22:7 పులవకుండా రొట్టెలు చేసే పండుగ వచ్చింది. ఆ రోజు పస్కా గొఱ్ఱె పిల్లను బలి ఇచ్చేవాళ్ళు.
LUK 22:8 యేసు పేతురు, యోహానులతో, “వెళ్ళి పస్కా పండుగ భోజనం సిద్ధం చెయ్యండి” అని చెప్పాడు.
LUK 22:9 వాళ్ళు, “ఎక్కడ సిద్ధం చెయ్యమంటారు?” అని అడిగారు.
LUK 22:10 ఆయన, “మీరు పట్టణంలోకి ప్రవేశిస్తుంటే నీళ్ళ కడవ ఎత్తుకొని వెళ్తున్న వాడొకడు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించి అతడు ఏ యింట్లోకి వెళ్తాడో ఆ యింట్లోకి వెళ్ళండి.
LUK 22:11 ఆ యింటి యజమానితో, ‘మా బోధకుడు తన శిష్యులతో కలిసి పస్కా భోజనం చెయ్యాలి. కనుక అతిథులుండే గది ఎక్కడుందో మాకు చూపండి’ అని అతనితో అనండి.
LUK 22:12 అతడు మీకు మేడ మీద ఉన్న ఒక విశాలమైన గది చూపిస్తాడు. ఆ గదిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. పస్కా భోజనం అక్కడ తయారు చెయ్యండి” అని అన్నాడు.
LUK 22:13 వాళ్ళు వెళ్ళి, అన్నీ యేసు చెప్పిన విధంగా ఉండటం గమనించారు. అక్కడ వాళ్ళు పస్కా పండుగ భోజనం తయారు చేసారు.
LUK 22:14 భోజనం చేసే సమయం దగ్గరకు వచ్చింది. యేసు, ఆయన అపొస్తలులు భోజనానికి కూర్చున్నారు.
LUK 22:15 ఆయన వాళ్ళతో, “నేను చనిపోకముందే మీతో కలిసి ఈ పస్కా భోజనము చెయ్యాలని ఎంతో ఆశ పడ్డాను.
LUK 22:16 ఎందుకంటే దేవుని రాజ్యంలో ఈ పస్కా భోజనమునకు ఉన్న నిజమైన అర్థం నెరవేరుతుంది. అంతవరకు ఈ భోజనం మళ్ళీ చెయ్యను” అని అన్నాడు.
LUK 22:17 ఆయన గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి, “ఇది తీసుకొని మీ మధ్య పంచుకొండి.
LUK 22:18 ఎందుకంటే దేవుని రాజ్యం వచ్చేవరకు నేను ద్రాక్షతో చేసిన ఈ పానీయం మళ్ళీ త్రాగనని మీతో చెబుతున్నాను” అని అన్నాడు.
LUK 22:19 ఆ తర్వాత ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని త్రుంచి వాళ్ళకిస్తూ, “ఇది నా శరీరం. మీకోసం యివ్వబడింది. నా జ్ఞాపకార్థం యిది చెయ్యండి” అని అన్నాడు.
LUK 22:20 అదే విధంగా భోజనం అయ్యాక ఆయన పాత్రను తీసుకొని, “ఇది నా రక్తంతో చేసిన క్రొత్త నిబంధన. నేను ఈ రక్తాన్ని మీకోసం చిందిస్తున్నాను.
LUK 22:21 “నాకు ద్రోహం చేయబోతున్నవాడు నాతో యిక్కడ భోజనానికి కూర్చొని ఉన్నాడు.
LUK 22:22 దేవుడు నిర్ణయించినట్లు మనుష్యకుమారుడు మరణించబోతున్నాడు. ఆయనకు ద్రోహం చేసిన వానికి శిక్ష తప్పదు” అని అన్నాడు.
LUK 22:23 వాళ్ళు తమలో, “ఎవరీపని చేస్తారా?” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు.
LUK 22:24 ఆ తర్వాత వాళ్ళలో, “ఎవరు గొప్ప” అన్న విషయంపై వాదన మొదలైంది.
LUK 22:25 యేసు వాళ్ళతో, “యూదులుకాని వాళ్ళను, వాళ్ళ రాజులు క్రూరంగా పాలిస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళు తమను పొగడమని ప్రజల్ని ఒత్తిడి చేస్తారు.
LUK 22:26 కాని మీరు అలా ఉండకూడదు. మీలో అందరికన్నా గొప్పవాడు అందరికన్నా చిన్నవానిలా మెలగాలి. నాయకుడు సేవకునిలా ఉండాలి.
LUK 22:27 ఎవరు గొప్ప? భోజనానికి కూర్చొన్నవాడా లేక భోజనం వడ్డించేవాడా? భోజనానికి కూర్చొన్న వాడేకదా! కాని నేను మీ సేవకునిలా ఉంటున్నాను.
LUK 22:28 “మీరు నా కష్టసమయాల్లో నా వెంట ఉన్నవాళ్ళు.
LUK 22:29 కనుక నా తండ్రి నాకు రాజ్యాన్ని అప్పగించి నట్లు నేను మీకు రాజ్యాన్ని అప్పగిస్తాను.
LUK 22:30 అప్పుడు మీరు నా రాజ్యంలో నాతో కలిసి కూర్చొని తింటారు. సింహాసనాలపై కూర్చుని పండ్రెండు వంశాల వారిపై తీర్పు చేస్తారు.
LUK 22:31 “సీమోనూ! సీమోనూ! మిమ్మల్ని గోధుమలు చెరిగినట్లు చెరిగి పరీక్షించటానికి సైతాను అనుమతి పొందాడు.
LUK 22:32 కాని సీమోనూ! నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లరాదని నేను ప్రార్థించాను. నీ విశ్వాసం మళ్ళీ బలపడినప్పుడు నీ సోదరుల విశ్వాసాన్ని గట్టిపరుచు” అని అన్నాడు.
LUK 22:33 కాని సీమోను, “ప్రభూ! మీ వెంట కారాగారానికి రమ్మన్నా, చనిపొమ్మన్నా సిద్ధమే!” అని సమాధానం చెప్పాడు.
LUK 22:34 యేసు, “పేతురూ! నేను చెప్పేది విను. ఈ రోజు కోడి కూయక ముందే నేనెవరినో నీకు తెలియదని మూడు సార్లంటావు” అని అన్నాడు.
LUK 22:35 ఆ తర్వాత యేసు, “నేను మిమ్మల్ని డబ్బు దాచుకొనే సంచీ, చేతి సంచీ, చెప్పుల జోళ్ళూ లేకుండా పంపినప్పుడు మీ అవసరాలు తీరలేదా?” అని అడిగాడు. “తీరాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
LUK 22:36 యేసు వాళ్ళతో, “ఇప్పుడు మీ దగ్గర డబ్బులు దాచుకొనే సంచి ఉంటే దాన్ని మీ వెంట తీసుకెళ్ళండి. మీ దగ్గర కత్తి లేకుంటే మీ వస్త్రాన్ని అమ్మి కత్తి కొనండి.
LUK 22:37 లేఖనాల్లో, ‘అతడు నేరస్థునిగా పరిగణింపబడ్డాడు’ అని వ్రాయబడి ఉంది. అది నా విషయంలో నిజమౌతుంది. ఔను! అది యిప్పుడు నా విషయంలో నిజమౌతుంది!” అని అన్నాడు.
LUK 22:38 శిష్యులు ఆయనతో, “ఇదిగో ప్రభూ! యిక్కడ రెండు కత్తులున్నాయి” అని అన్నారు. “ఆ విషయం ఇక చాలించండి” అని ఆయన అన్నాడు.
LUK 22:39 “అలవాటు ప్రకారం యేసు ఒలీవల కొండ మీదికి వెళ్ళటానికి బయలుదేరాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు.
LUK 22:40 అక్కడికి చేరుకొన్నాక వాళ్ళతో, మీరు శోధనలో పడకుండ ఉండటానికి ప్రార్థించాలి” అని అన్నాడు.
LUK 22:41 ఆయన వాళ్ళనుండి రాయి విసిరినంత దూరం వెళ్ళి, మోకరిల్లి ఈ విధంగా ప్రార్థించాడు:
LUK 22:42 “తండ్రీ! నీకిష్టమైతే ఈ గిన్నె నా నుండి తీసివెయ్యి. కాని నెరవేరవలసింది నా యిచ్ఛ కాదు: నీది.”
LUK 22:43 అప్పుడు ఒక దేవదూత పరలోకంలో నుండి వచ్చి ఆయనకు శక్తినివ్వటానికి ప్రత్యక్షమైనాడు.
LUK 22:44 ఆయన ఆవేదనతో యింకా తీవ్రంగా దేవుణ్ణి ప్రార్థించాడు. నేలమీద పడ్తున్న ఆయన చెమట చుక్కలు రక్తపు చుక్కల్లా ఉన్నాయి.
LUK 22:45 ప్రార్థించటం ముగించాక ఆయన తన శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. దుఃఖంవల్ల అలసిపోయి వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు.
LUK 22:46 వాళ్ళతో, “ఎందుకు పడుకున్నారు? లేచి మీరు శోధింపబడకూడదని ప్రార్థించండి” అని అన్నాడు.
LUK 22:47 ఆయనింకా మాట్లాడుతుండగా ప్రజల గుంపు ఒకటి అక్కడికి వచ్చింది. పన్నెండుమందిలో ఒకడైన యూదా అన్నవాడు అందరి కన్నా ముందు ఉన్నాడు. వాడు యేసును ముద్దు పెట్టుకోవటానికి ఆయన దగ్గరకు వెళ్ళాడు.
LUK 22:48 కాని యేసు వానితో, “యూదా! ముద్దు పెట్టుకొని దేవుని కుమారునికి ద్రోహం చెయ్యాలని నీ ఉద్దేశ్యమా?” అని అడిగాడు.
LUK 22:49 యేసు శిష్యులు జరుగబోయే సంఘటనను గ్రహించారు. వాళ్ళు, “ప్రభూ! మా కత్తులతో వాళ్ళను నరకమంటారా?” అని అడిగారు.
LUK 22:50 ఇంతలో ఆయన శిష్యుల్లో ఒకడు తన కత్తి దూసి ప్రధానయాజకుని సేవకుని యొక్క కుడిచెవి నరికి వేశాడు.
LUK 22:51 యేసు, “ఆపండి” అని అంటూ ఆ సేవకుని చెవి తాకి అతనికి నయం చేశాడు.
LUK 22:52 ఆ తర్వాత యేసు తనను బంధించటానికి వచ్చిన ప్రధానయాజకులతో, మందిరం యొక్క ముఖ్య ద్వారపాలకులతో, పెద్దలతో ఈ విధంగా అన్నాడు: “నేనొక దొంగనైనట్లు మీరు కత్తులతో, కర్రలతో రావలసిన అవసరమేమొచ్చింది?
LUK 22:53 నేను మీతోపాటు ప్రతిరోజు ఆలయంలో ఉన్నాను. కాని మీరు అప్పుడు నన్ను బంధించలేదు. ఇది మీ ఘడియ. సైతాను శక్తులు రాజ్యం చేస్తున్న ఘడియ.”
LUK 22:54 యేసును బంధించి ప్రధాన యాజకుని యింటికి తీసుకొని వెళ్ళారు. పేతురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుసరించాడు.
LUK 22:55 వాళ్ళు పెరటి మధ్య చలిమంటలు వేసి చుట్టూరా కూర్చొన్నారు. పేతురు వచ్చి వాళ్ళతో సహా కూర్చున్నాడు.
LUK 22:56 ఒక పనిపిల్ల ఆ మంటల వెలుతురులో పేతురు అక్కడ కూర్చుని ఉండటం గమనించింది. దగ్గరకు వచ్చి అతణ్ణి చూస్తూ, “ఇతడు కూడా యేసుతో ఉన్నాడు” అని అనింది.
LUK 22:57 కాని పేతురు అది నిజంకాదంటూ, “ఆయనెవరో నాకు తెలియదు అమ్మాయి!” అని అన్నాడు.
LUK 22:58 కొంత సేపయ్యాక మరొకడు అతణ్ణి చూసి, “నీవు కూడా వాళ్ళలో ఒకడివి” అని అన్నాడు. “నేను వాళ్ళలో ఒకణ్ణి కాదు” అని సమాధానం చెప్పాడు.
LUK 22:59 ఒక గంట తర్వాత యింకొకడు, “ఇతడు గలిలయ దేశస్థుడు. కనుక తప్పక అతనితో ఉన్నవాడే!” అని అన్నాడు.
LUK 22:60 “అయ్యా! మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు” అని పేతురు సమాధానం చెప్పాడు. అతడీ మాటలంటుండగానే కోడి కూసింది.
LUK 22:61 ప్రభువు అటువైపు మళ్ళీ సూటిగా పేతురు వైపు చూశాడు. అప్పుడు ప్రభువు, “ఈ రోజు కోడి కూయక ముందే నేనెవరినో తెలియదని మూడుసార్లంటావు” అని అన్న మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి.
LUK 22:62 పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు.
LUK 22:63 యేసును కాపలా కాస్తున్న వాళ్ళు ఆయన్ని హేళన చేస్తూ కొట్టటం మొదలు పెట్టారు. ఆయన కళ్ళకు బట్టకట్టి, “నిన్నెవరు కొట్టారో దివ్యదృష్టితో చూసి చెప్పు!” అని ఆయన్ని కవ్వించి అడిగారు.
LUK 22:65 అవమానిస్తూ ఎన్నెన్నో మాటలు అన్నారు.
LUK 22:66 సూర్యోదయం కాగానే యూదుల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు సమావేశమయ్యారు. వాళ్ళు యేసును మహాసభ ముందుకు పిలుచుకు వచ్చారు.
LUK 22:67 మహాసభ సభ్యులు, “నీవు క్రీస్తువైనట్లైతే మాతో చెప్పు” అని అన్నారు. యేసు, “నేను చెబితే మీరు నమ్మరు.
LUK 22:68 నేను అడిగితే మీరు చెప్పరు.
LUK 22:69 కాని యిప్పటినుండి మనుష్య కుమారుడు సర్వశక్తిసంపన్నుడైన దేవుని యొక్క కుడివైపున కూర్చుంటాడు” అని సమాధానం చెప్పాడు.
LUK 22:70 వాళ్ళు, “నీవు దేవుని కుమారునివా?” అని అడిగారు. ఆయన, “మీరన్నది నిజం” అని అన్నాడు.
LUK 22:71 ఆ తదుపరి వాళ్ళు, “మనకిక ఇతర సాక్ష్యాలు ఎందుకు? స్వయంగా అతని నోటినుండే విన్నాము” అని అన్నారు.
LUK 23:1 మహాసభ సభ్యులందరూ లేచి యేసును పిలాతు ముందుకు పిలుచుకు వచ్చి,
LUK 23:2 “ఇతడు మన దేశాన్ని తప్పుదారి పట్టించటం మేము గమనించాము. చక్రవర్తికి పన్నులు కట్టరాదని, తాను క్రీస్తునని, రాజునని చెప్పుకుంటున్నాడు” అని ఫిర్యాదు చేసారు.
LUK 23:3 ఇది విని పిలాతు యేసుతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు. “ఔను, మీరన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు.
LUK 23:4 ఆ తర్వాత పిలాతు ప్రధాన యాజకులతో, ప్రజలతో, “ఇతనికి శిక్ష విధించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు” అని అన్నాడు.
LUK 23:5 కాని వాళ్ళు, “ఇతడు తన బోధనలతో యూదయ ప్రాంతంలో ఉన్న ప్రజలనందరిని పురికొలుపుచున్నాడు. ఇది యితడు గలిలయలో ప్రారంభించి యిక్కడి దాకా వచ్చాడు” అని మళ్ళీ మళ్ళీ అన్నారు.
LUK 23:6 ఇది విని పిలాతు వాళ్ళను, “అతడు గలిలయ దేశస్థుడా?” అని అడిగాడు.
LUK 23:7 యేసు, హేరోదు పాలిస్తున్న ప్రాంతానికి చెందినవాడని తెలుసుకొన్న వెంటనే, పిలాతు ఆయన్ని హేరోదు దగ్గరకు పంపాడు. అప్పుడు హేరోదు యెరూషలేములో ఉన్నాడు.
LUK 23:8 హేరోదుకు చాలాకాలం నుండి యేసును చూడాలని ఉంది. కనుక ఆయన్ని చూడగానే హేరోదుకు చాలా ఆనందం కలిగింది. యేసును గురించి విన్నవాటిని బట్టి ఆయన ఏదైనా మహాత్యం చేస్తాడేమోనని ఆశించాడు.
LUK 23:9 అతడు యేసును ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కాని యేసు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు.
LUK 23:10 ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసుపై తీవ్రంగా నేరారోపణ చేస్తూ అక్కడే నిలుచొని ఉన్నారు.
LUK 23:11 హేరోదు, అతని భటులు యేసును తిరస్కరించి, హేళన చేస్తూ నవ్వారు. ఆయనకు రాజ దుస్తులు తొడిగించి తిరిగి పిలాతు దగ్గరకు పంపారు.
LUK 23:12 ఆ రోజు హేరోదు, పిలాతు ఇద్దరూ మిత్రులయ్యారు. ఆనాటివరకు వాళ్ళు శత్రువులుగా ఉన్నారు.
LUK 23:13 పిలాతు ప్రధానయాజకుల్ని, పాలకుల్ని, ప్రజల్ని, సమావేశపరిచాడు.
LUK 23:14 వాళ్ళతో, “తిరుగుబాటు చెయ్యటానికి ప్రజల్ని పురికొలుపుతున్నాడని అతణ్ణి మీరిక్కడికి పిలుచుకు వచ్చారు. మీ సమక్షంలోనే అతణ్ణి విచారించాము. మీ నేరారోపణలకు నాకు ఏమాత్రం కారణం కనపడటంలేదు.
LUK 23:15 హేరోదుకు కూడా ఏ తప్పూ కనిపించలేదు. కనుకనే అతణ్ణి తిరిగి మా దగ్గరకు పంపాడు. మరణ దండన పొందవలసిన నేరం అతడు చెయ్యలేదని మీరు గమనించారు.
LUK 23:16 అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను” అని అన్నాడు.
LUK 23:17 
LUK 23:18 వాళ్ళంతా ఒకే గొంతుతో, “అతణ్ణి చంపండి, బరబ్బను విడుదల చెయ్యండి” అని కేకలు వేశారు.
LUK 23:19 బరబ్బ తాను పట్టణంలో చేసిన ఒక తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్నాడు.
LUK 23:20 యేసును విడుదల చెయ్యాలనే ఉద్దేశ్యంతో పిలాతు మళ్ళీ విజ్ఞప్తి చేశాడు.
LUK 23:21 కాని వాళ్ళు బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వెయ్యండి!” అని కేకలు వేశారు.
LUK 23:22 మూడవసారి, పిలాతు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఎందుకు? అతడేమి నేరం చేశాడు? అతనికి మరణ దండన విధించటానికి నాకు ఏ కారణం కన్పించలేదు. అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను.” అని అన్నాడు.
LUK 23:23 కాని, అతణ్ణి సిలువకు వెయ్యమని కేకలు వేయటం వాళ్ళు మానలేదు. చివరకు వాళ్ళు గెలిచారు.
LUK 23:24 పిలాతు వాళ్ళడిగినట్లు చెయ్యటానికి ఒప్పుకున్నాడు.
LUK 23:25 తిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్న వాళ్ళడిగిన బరబ్బను విడుదల చేసి యేసును వాళ్ళ కప్పగించాడు.
LUK 23:26 వాళ్ళు యేసును తీసుకొని వెళ్తూ, గ్రామం నుండి పట్టణంలోకి వస్తున్న సీమోను అనే వాణ్ణి పట్టుకొని అతనిపై సిలువను పెట్టి యేసు వెనుక నడిపించారు. సీమోను కురేనే గ్రామస్థుడు.
LUK 23:27 చాలామంది ప్రజలు యేసు వెనుక నడుస్తూ ఉన్నారు. వాళ్ళలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ యేసు వెనుక నడిచారు.
LUK 23:28 యేసు వాళ్ళవైపు తిరిగి, “యెరూషలేము బిడ్డలారా! నా కోసం దుఃఖించకండి. మీ కోసం, మీ సంతానం కోసం దుఃఖించండి.
LUK 23:29 ‘గొడ్రాళ్ళుగా ఉన్న స్త్రీలు ధన్యులని, పిల్లలు కనని కడుపులు, పాలివ్వని స్తనములు ధన్యములైనవి’ అనే రోజులు వస్తాయి.
LUK 23:30 అప్పుడు వాళ్లు పర్వతాలతో తమ మీద పడమని అంటారు. కొండలతో కూలి తమను కప్పి వేయమని అడుగుతారు.
LUK 23:31 చెట్టు పచ్చగా ఉన్నప్పుడే ప్రజలు ఈ విధంగా చేస్తే అది ఎండిపొయ్యాక ఏం చేస్తారు?” అని అన్నాడు.
LUK 23:32 మరణ దండన విధించటానికి, ఇద్దరు నేరస్థుల్ని కూడా యేసు వెంట తీసుకొని వెళ్తూ ఉన్నారు.
LUK 23:33 కల్వరి అనబడే స్థలాన్ని చేరుకొన్నాక ఆ నేరస్థులు యిద్దర్నీ ఒకణ్ణి యేసుకు కుడివైపు, మరొకణ్ణి ఎడమవైపు ఉంచి ముగ్గుర్నీ సిలువకు వేసారు.
LUK 23:34 యేసు, “తండ్రి, వాళ్ళను క్షమించు, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు” అని అన్నాడు. వాళ్ళు చీట్లు వేసి ఆయన దుస్తుల్ని పంచుకొన్నారు.
LUK 23:35 ప్రజలు జరుగుతున్న వాటిని చూస్తూ నిలబడి ఉన్నారు. పాలకులు ఎగతాళి చేసారు. వాళ్ళు, “ఇతర్లను రక్షించాడే! తాను దేవుడెన్నుకొన్న వాడైనట్లైతే, తాను ‘క్రీస్తు’ అయినట్లైతే తనను తాను రక్షించుకోనీ!” అని అన్నారు.
LUK 23:36 భటులు కూడా దగ్గరకు వచ్చి ఆయన్ని హేళన చేసారు. వాళ్ళు ఆయనకు పులిసిన ద్రాక్షారసం యిస్తూ
LUK 23:37 “నీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో!” అని ఎగతాళి చేసారు.
LUK 23:38 “ఇతడు యూదుల రాజు” అని వ్రాసి సిలువకు తగిలించారు.
LUK 23:39 ఆయనతో సహా సిలువకు వేయబడిన ఒక నేరస్థుడు, “నీవు క్రీస్తువు కదా! నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు!” అని అవమానపరిచాడు.
LUK 23:40 కాని మరొక నేరస్థుడు మొదటి వాణ్ణి గద్దిస్తూ, “నీవు దేవునికి భయపడవా! నీవు కూడా అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా! మనల్ని శిక్షించటం న్యాయమే.
LUK 23:41 మనము చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాము. కాని ఆయన ఏ అపరాధమూ చెయ్యలేదు” అని అన్నాడు.
LUK 23:42 ఆ తదుపరి ఆయనతో, “యేసూ! నీవు నీ రాజ్యం చెయ్యటం మొదలు పెట్టినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకో” అని అన్నాడు.
LUK 23:43 యేసు, “ఇది నిజం, ఈ రోజు నువ్వు నాతో సహా పరదైసులో ఉంటావు” అని సమాధానం చెప్పాడు.
LUK 23:44 అప్పుడు మధ్యాహ్నం పండ్రెండు గంటల సమయం. సూర్యుడు ప్రకాశించటం మానేయటం వల్ల అప్పటినుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటితో నిండిపోయింది. మందిరంలో ఉన్న తెర రెండు భాగాలుగా చినిగి పోయింది.
LUK 23:46 యేసు బిగ్గరగా, “తండ్రి! నా ఆత్మను నీ చేతుల్లో పెడ్తున్నాను” అని అన్నాడు. వెంటనే తన ప్రాణం వదిలాడు.
LUK 23:47 శతాధిపతి జరిగిందిచూసి దేవుణ్ణి స్తుతిస్తూ, “ఈయన నిజంగా నీతిమంతుడై ఉన్నాడు!” అని అన్నాడు.
LUK 23:48 ఈ దృశ్యం చూడాలని గుమికూడిన ప్రజలు జరిగినదాన్ని చూసి తమ గుండెలు బాదుకుంటూ వెళ్ళిపోయారు.
LUK 23:49 కాని ఆయనకు తెలిసిన వాళ్ళు, గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చిన స్త్రీలు, యివన్నీ చూస్తూ కొంతదూరంలో నిలుచొని ఉన్నారు.
LUK 23:50 అరిమతయియ యూదుల గ్రామం. ఆ గ్రామానికి చెందిన యోసేపు అనేవాడు అక్కడ ఉన్నాడు. అతడు మహాసభ సభ్యుడు.
LUK 23:51 నీతిమంతుడు, మంచివాడు. యోసేపు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మహాసభ సభ్యులు యేసుకు మరణ శిక్ష విధించటానికి నిర్ణయించినప్పుడు అతడు ఒప్పుకోలేదు.
LUK 23:52 యోసేపు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తీసుకెళ్ళటానికి అనుమతి పొందాడు.
LUK 23:53 అతడు ఆ దేహాన్ని సిలువ నుండి క్రిందికి దింపి ఒక విలువైన బట్టలో చుట్టాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి యిదివరకు ఎవర్నీ పెట్టని ఒక సమాధిలో ఉంచాడు. ఆ సమాధి పెద్దరాయి మలచి సిద్ధం చేయబడి ఉంది.
LUK 23:54 అది విశ్రాంతిరోజు కొరకు సిద్ధమౌతున్న రోజు. అది ప్రారంభం అవ్వబోతుంది.
LUK 23:55 యేసు వెంట గలిలయనుండి వచ్చిన స్త్రీలు యోసేపు వెంట వెళ్లి సమాధిని, అతడు ఆ సమాధిలో యేసు దేహాన్ని ఉంచిన దృశ్యాన్ని చూసారు.
LUK 23:56 ఆ తర్వాత వాళ్ళు యింటికి వెళ్ళి, అత్తరు, సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసారు. కాని విశ్రాంతి రోజు ప్రారంభం అయినందువల్ల వాళ్ళు మోషే శాస్త్రం ప్రకారం ఏ పనీ చేయలేదు.
LUK 24:1 ఆదివారం తెల్లవారుఝామున ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి దగ్గరకు వెళ్ళారు.
LUK 24:2 సమాధికి ఉన్న రాయి త్రోసి వేయబడి ఉండటం గమనించి లోపలికి వెళ్ళి చూసారు.
LUK 24:3 అక్కడ వాళ్ళకు యేసు ప్రభువు దేహం కనిపించ లేదు.
LUK 24:4 దీన్ని గురించి వాళ్ళింకా ఆశ్చర్యపడుతుండగా అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు ప్రత్యక్షమై వాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. వాళ్ళ దుస్తులు మెరుపువలె మెరుస్తూ ఉన్నాయి.
LUK 24:5 భయంతో ఆ స్త్రీలు ముఖాల్ని వంచుకొన్నారు. ఆ దేవదూతలు, “మీరు బ్రతికి ఉన్నవాని కోసం చనిపోయిన వాళ్ళ మధ్య ఎందుకు వెతుకుతున్నారు?
LUK 24:6 ఆయన బ్రతికి, యిక్కడినుండి వెళ్లిపోయాడు. ఆయన మీతో కలిసి గలిలయలో ఉన్నప్పుడు, ‘మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడాలి; సిలువ మీద చంపబడాలి. మూడవ రోజు బ్రతికి రావాలి!’ అని అన్న విషయం మీకు జ్ఞాపకం లేదా!” అని అన్నారు.
LUK 24:8 అప్పుడు వాళ్ళకు ఆయన మాటలు జ్ఞాపకం వచ్చాయి.
LUK 24:9 మగ్దలేనే మరియ, యోహాన్న, యాకోబుల తల్లి మరియ, మరియు మిగతా స్త్రీలు సమాధినుండి వెళ్ళి ఈ విషయాలు ఆ పదకొండుగురికి, మిగతా వాళ్ళకు చెప్పారు.
LUK 24:11 ఆ స్త్రీల మాటలకు అర్థం లేదనుకొని శిష్యులు వాళ్ళ మాటలు నమ్మలేదు.
LUK 24:12 అయినా పేతురు లేచి ఆ సమాధి దగ్గరకు పరుగెత్తాడు. లోనికి తొంగి చూసి, కట్టబడిన వస్త్రాలు అక్కడ పడివుండటం గమనించాడు. ఏమి జరిగి ఉంటుందా? అని ఆశ్చర్యపడ్తూ వెళ్ళిపోయాడు.
LUK 24:13 అదే రోజు వాళ్ళలో ఇద్దరు ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తూవున్నారు. అది యెరూషలేముకు ఏడుమైళ్ళ దూరంలో ఉంది.
LUK 24:14 వాళ్ళు జరిగిన సంఘటనలను గురించి మాట్లాడుకొంటున్నారు.
LUK 24:15 వాళ్ళు ఈ విషయాన్ని గురించి చర్చిస్తూండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో కలిసి నడవటం మొదలు పెట్టాడు.
LUK 24:16 కాని తానెవ్వరో వాళ్ళను గుర్తుపట్టనివ్వలేదు.
LUK 24:17 యేసు వాళ్ళతో, “మీరు ఏం మాట్లాడుకొంటున్నారు?” అని అడిగాడు. వాళ్ళు ఆగిపొయ్యారు. వాళ్ళ ముఖంల్లో దుఃఖం ఉంది.
LUK 24:18 వాళ్ళలో క్లెయొపా అనేవాడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మధ్య జరిగిన సంఘటనలు తెలుసుకోకుండా యెరూషలేములో నివసిస్తూన్న వాడివి నీవొక్కడివేనా!”
LUK 24:19 “ఏ సంఘటనలు?” అని యేసు అడిగాడు. వాళ్ళు, “నజరేతు నివాసియైన యేసును గురించి. ఆయన ఒక ప్రవక్త. గొప్ప విషయాలు చెప్పాడు. గొప్ప పనులు చేశాడు. ప్రజల మెప్పు, దేవుని మెప్పు పొందాడు.
LUK 24:20 మా ప్రధాన యాజకులు, పాలకులు, మరణ దండన విధించుమని ఆయన్ని అధికారులకు అప్పగించారు. వాళ్ళు ఆయన్ని సిలువకు వేసారు.
LUK 24:21 ఆయన ఇశ్రాయేలును రక్షిస్తాడని ఆశించాము. “పైగా యివన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి.
LUK 24:22 అంతేకాక మాతో ఉన్న కొందరు స్త్రీలు ఆశ్చర్యం కలిగించే విషయం మాకు చెప్పారు. వాళ్ళు ఈ రోజు తెల్లవారు ఝామున సమాధిదగ్గరకు వెళ్ళారు.
LUK 24:23 కాని, అక్కడ వాళ్ళకు యేసు దేహం కనిపించలేదు. తాము దేవ దూతల్ని చూసినట్లు, ఆ దేవదూతలు యేసు బ్రతికి వచ్చాడని చెప్పినట్లు మాకు చెప్పారు.
LUK 24:24 మాతో ఉన్న వాళ్ళు కొందరు సమాధి దగ్గరకు వెళ్ళి అది ఆ స్త్రీలు వర్ణించిన విధంగా ఉండటం గమనించారు. కాని అక్కడ యేసు కనిపించలేదు” అని అన్నారు.
LUK 24:25 యేసు వాళ్ళతో, “అజ్ఞానులారా! ప్రవక్తలు చెప్పిన విషయాలు నమ్మటానికి యింత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు?
LUK 24:26 క్రీస్తు చనిపోయి తర్వాత కదా తేజస్సు పొందాలి!” అని అన్నాడు.
LUK 24:27 ఆ తదుపరి మోషే గ్రంథాలతో, ప్రవక్తల వ్రాతలతో మొదలు పెట్టి తనను గురించి లేఖనాల్లో వ్రాసినవన్నీ వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు.
LUK 24:28 వాళ్ళు వెళ్ళనున్న గ్రామం దగ్గరకు వచ్చింది. యేసు తాను యింకా ముందుకు వెళ్ళనున్న వానిలా కనిపించాడు.
LUK 24:29 కాని వాళ్ళు, “సాయంకాలమైంది. చీకటి కాబోతోంది. మాతో ఉండిపొండి!” అని అన్నారు. యేసు సరేనని వాళ్ళతో వాళ్ళ యింటికి వెళ్ళాడు.
LUK 24:30 వాళ్ళతో భోజనానికి కూర్చున్నాక ఆయన రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞత చెప్పి దాన్ని విరిచి వాళ్ళకిచ్చాడు.
LUK 24:31 అప్పుడు వాళ్ళ కండ్లు తెరిపించాడు. వెంటనే వాళ్ళు ఆయన్ని గుర్తించారు. కాని ఆయన అదృశ్యమయ్యాడు.
LUK 24:32 ఆ తర్వాత ఆ యిద్దరూ, “దారిపై నడుస్తుండగా ఆయన మాట్లాడి, లేఖనాల్లో నిజమైన అర్థాన్ని మనకు చెప్పినప్పుడు గుండెల్లో మండుతున్నట్లు అనిపించలేదా?” అని మాట్లాడుకున్నారు.
LUK 24:33 వాళ్ళు లేచి వెంటనే యెరూషలేము వెళ్ళారు. అక్కడ ఆ పదకొండుగురు శిష్యులు, మిగతా వాళ్ళు సమావేశమై ఉన్నారు.
LUK 24:34 వాళ్ళలో ఒకడు, “ఔను! ఇది నిజం. ప్రభువు బ్రతికి వచ్చి సీమోనుకు కనిపించాడు” అని అన్నాడు.
LUK 24:35 ఆ తదుపరి ఆ వచ్చిన వాళ్ళు దారిపై జరిగిన సంఘటనను, యేసు రొట్టెను విరిచినప్పుడు తాము ఆయన్ని గుర్తించిన విషయము చెప్పారు.
LUK 24:36 వాళ్ళు ఈ విషయాన్ని గురించి యింకా మాట్లాడుతుండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో నిలుచుని, “శాంతి కలుగుగాక” అని అన్నాడు.
LUK 24:37 వాళ్ళు భూతాన్ని చూసామనుకొని వణికి భయపడిపోయారు.
LUK 24:38 యేసు వాళ్ళతో, “మీరెందుకు భయపడ్తున్నారు. మీకు సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి?
LUK 24:39 నా చేతులు, కాళ్ళు చూడండి. నేనే ఆయనను. తాకి చూడండి. నాకు మాంసము, ఎముకలు ఉన్నాయి. భూతానికి అవి ఉండవు” అని అన్నాడు.
LUK 24:40 ఆయన ఈ మాటలు అంటూ తన చేతులు, కాళ్ళు వాళ్ళకు చూపాడు.
LUK 24:41 వాళ్ళకు ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. వాళ్ళు నమ్మలేకపొయ్యారు. అప్పుడు యేసు, “మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా?” అని అడిగాడు.
LUK 24:42 వాళ్ళు ఒక కాల్చిన చేపను తెచ్చి యిచ్చారు.
LUK 24:43 ఆయన దాన్ని తీసుకొని వాళ్ళ సమక్షంలో తిన్నాడు.
LUK 24:44 ఆయన, “నేను మీతో కలిసి ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనలలో నన్ను గురించి వ్రాసినవన్నీ జరుగుతాయి అని చెప్పాను” అని అన్నాడు.
LUK 24:45 అప్పుడు వాళ్ళు లేఖనాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ కండ్లు తెరిపించాడు.
LUK 24:46 ఆయన వాళ్ళతో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు చనిపోయి మూడవరోజున బ్రతికి వస్తాడు!
LUK 24:47 పశ్చాత్తాపాన్ని గురించి, పాప క్షమాపణ గురించి ఆయన పేరిట ప్రకటించటం మొదట యెరూషలేములో మొదలౌతుంది. ఆ పిదప అది అన్ని దేశాల్లో ప్రకటింపబడుతుంది.
LUK 24:48 మీరు వీటికి సాక్షులు.
LUK 24:49 నా తండ్రి వాగ్దానం చేసిన ఆయన్ని నేను పంపుతాను. కాని పరలోకం నుండి మీకు పరిశుద్ధాత్మ శక్తి లభించే దాకా ఈ పట్టణంలోనే ఉండండి” అని చెప్పాడు.
LUK 24:50 ఆ తర్వాత వాళ్ళను అక్కడి నుండి బేతనియ దాకా తీసుకు వెళ్ళి తన చేతులెత్తి వాళ్ళను ఆశీర్వదించాడు.
LUK 24:51 వాళ్ళను ఆశీర్వదిస్తుండగా ఆయన వాళ్ళ నుండి దూరం చేయబడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు.
LUK 24:52 ఆ తర్వాత వాళ్ళాయనకు నమస్కరించి చాలా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు.
LUK 24:53 వాళ్ళు మందిరంలో ఉండి విరామం లేకుండా దేవుని స్తుతించారు.
JOH 1:1 సృష్టికి ముందు నుండి జీవంగల వాక్యము ఉండెను. ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యమే దేవుడు.
JOH 1:2 ఆయన సృష్టికి ముందు దేవునితో ఉండేవాడు.
JOH 1:3 ఆయన ద్వారా అన్నీ సృష్టింపబడ్డాయి. సృష్టింపబడినదేదీ ఆయన లేకుండా సృష్టింపబడలేదు.
JOH 1:4 ఆయన జీవానికి మూలం. ఆ జీవం మానవ జాతికి వెలుగునిచ్చెను.
JOH 1:5 వెలుగు చీకట్లో వెలుగుతోంది, కాని చీకటి దాన్ని అర్థం చేసుకోలేదు.
JOH 1:6 దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను.
JOH 1:7 తన ద్వారా మానవులు వెలుగును గురించి విని, విశ్వసించాలని అతడు ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చాడు.
JOH 1:8 అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు.
JOH 1:9 ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే ఆ నిజమైన వెలుగు ప్రపంచంలోకి వస్తూ వుండెను.
JOH 1:10 ఆయన ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచం సృష్టింపబడినా, ప్రపంచం ఆయన్ని గుర్తించలేదు.
JOH 1:11 ఆయన తన స్వంత వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కాని వాళ్ళాయనను ఒప్పుకోలేదు.
JOH 1:12 అయినా, తనను ఒప్పుకొన్న వాళ్ళందరికి, అంటే తనను నమ్మిన వాళ్ళకందరికి, దేవుని సంతానమయ్యే హక్కును ఇచ్చాడు.
JOH 1:13 కాని వీళ్ళు మానవుల రక్తం వలనకాని, శారీరక వాంఛలవల్ల కాని, మనుష్యుని నిర్ణయంవల్ల కాని, జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం.
JOH 1:14 ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము.
JOH 1:15 యోహాను ఆయన్ని గురించి ఈ విధంగా నొక్కి చెప్పాడు: “ఈయన గురించి నేను యిదివరకే ఈ విధంగా చెప్పాను, ‘నా తర్వాత రానున్నవాడు నాకన్నా ముందునుండి ఉన్నావాడు. కనుక ఆయన నాకన్నా గొప్పవాడు.’”
JOH 1:16 ఆయన పరిపూర్ణతవల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము.
JOH 1:17 దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు ద్వారా కృపను, సత్యాన్ని ఇచ్చాడు.
JOH 1:18 ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. దేవుని ప్రక్కనవున్న ఆయన ఏకైక పుత్రుడు దేవునితో సమానము. ఆయన మనకు దేవుణ్ణి గురించి తెలియచేసాడు.
JOH 1:19 యోహానును అడిగి, అతడెవరన్న విషయం కనుక్కురావటానికి, యెరూషలేములోని యూదులు యాజకులను లేవీయులను అతని దగ్గరకు పంపారు.
JOH 1:20 యోహాను సమాధానం చెప్పటానికి నిరాకరించలేదు. పైగా ఏదీ దాచకుండా స్పష్టంగా సమాధానం చెప్పాడు. యోహాను, “నేను క్రీస్తును కాదు!” అని చెప్పాడు.
JOH 1:21 వాళ్ళు అతణ్ణి, “మరి నీవెవరు? ఏలీయావా?” అని అడిగారు. అతడు, “కాదు” అని అన్నాడు. వాళ్ళు, “ప్రవక్తవా?” అని అడిగారు. అతడు, “కాదు” అని అన్నాడు.
JOH 1:22 చివరకు వాళ్ళు, “మరి నీవెవరవు? మమ్మల్ని పంపిన వాళ్ళకు చెప్పటానికి మాకో సమాధానం చెప్పండి. మమ్మల్ని పంపిన వాళ్ళకు చెప్పటానికి నీ గురించి నీవేమని చెప్పుచున్నావు?” అని అడిగారు.
JOH 1:23 యోహాను యిలా సమాధానం చెప్పాడు: “ప్రభువు కోసం చక్కటి మార్గం వేయుమని ఎడారి ప్రాంతాల్లో ఒక స్వరం ఎలుగెత్తి పలికింది.” ఇవి యెషయా ప్రవక్త అన్న మాటలు.
JOH 1:24 వీళ్ళను పంపింది పరిసయ్యులు.
JOH 1:25 వాళ్ళు మరొక ప్రశ్న వేస్తూ, “నీవు క్రీస్తువు కానంటున్నావు, ఏలీయావుకానంటున్నావు, ప్రవక్తవుకానంటున్నావు. అటువంటప్పుడు నీవు ప్రజలకు బాప్తిస్మము ఎందుకిస్తున్నావు?” అని అడిగారు.
JOH 1:26 యోహాను సమాధానం చెబుతూ, “నేను నీళ్ళ ద్వారా బాప్తిస్మము యిస్తున్నాను. కాని మీరెరుగని వాడొకాయన మీ మధ్య ఉన్నాడు.
JOH 1:27 నా తర్వాత రానున్నవాడు ఆయనే. ఆయన చెప్పులు విప్పటానికి కూడా నేను తగను” అని అన్నాడు.
JOH 1:28 ఈ సంఘటనలన్నీ బేతనియ గ్రామంలో జరిగాయి. అది యోహాను బాప్తిస్మము ఇచ్చిన యొర్దాను నదికి అవతల వైపున ఉంది.
JOH 1:29 మరుసటి రోజు యోహాను యేసు తన వైపురావటం చూసి, “అదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల! ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకొంటాడు.
JOH 1:30 నేను యిదివరలో, ‘నా తర్వాత రానున్న వాడొకడున్నాడు. ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు. అందువలన ఆయన నాకన్నా గొప్పవాడు’ అని నేను చెప్పింది ఈయన్ని గురించే!
JOH 1:31 అప్పుడాయన ఎవరో నాక్కూడా తెలియదు. కాని, ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియ చేయటానికి బాప్తిస్మము నిస్తూ వచ్చాను” అని అన్నాడు.
JOH 1:32 ఆ తర్వాత యోహాను మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: “ఆకాశం నుండి పవిత్రాత్మ ఒక పావురంలా వచ్చి ఆయనపై వాలటం చూసాను.
JOH 1:33 బాప్తిస్మము నివ్వటానికి దేవుడు నన్ను పంపాడు. ‘పవిత్రాత్మ క్రిందికి వచ్చి ఎవరి మీద వ్రాలుతాడో ఆ వ్యక్తి పవిత్రాత్మ ద్వారా బాప్తిస్మము యిస్తాడు’ అని దేవుడు నాకు ముందే చెప్పక పోయివుంటే ఆయనెవరో నాకు తెలిసేది కాదు.
JOH 1:34 నేను ఈ సంఘటనను చూసాను. ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం చెబుతున్నాను.”
JOH 1:35 మరుసటి రోజు యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని శిష్య బృందానికి చెందిన యిద్దరు అతనితో ఉండినారు.
JOH 1:36 అదే సమయాన యేసు అలా వెళ్ళటం చూసి, “అదిగో దేవుని గొఱ్ఱెపిల్లను చూడండి!” అని అన్నాడు.
JOH 1:37 ఆ యిద్దరు శిష్యులు అతడీమాట అనటం విని, యేసును అనుసరించారు.
JOH 1:38 యేసు వాళ్ళ వైపు తిరిగి, వాళ్ళు రావటం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు. వాళ్ళు, “రబ్బీ! మీరెక్కడ ఉంటున్నారు?” అని అడిగారు. (రబ్బీ అంటే గురువు అని అర్థం.)
JOH 1:39 యేసు, “వచ్చి చూడండి” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఆయనెక్కడ ఉంటున్నాడో చూసారు. ఆ రోజు ఆయనతో గడిపారు. అప్పుడు సుమారు సాయంకాలం నాలుగు గంటలు అయింది.
JOH 1:40 యోహాను చెప్పింది విని, యేసును అనుసరించిన యిద్దరిలో
JOH 1:41 అంద్రెయ ఒకడు. అంద్రెయ సీమోను పేతురు సోదరుడు. అంద్రెయ వెంటనే తన సోదరుడైన సీమోనును కనుగొని అతనితో, “మెస్సీయను కనుగొన్నాము” అని అన్నాడు.
JOH 1:42 తర్వాత సీమోనును యేసు దగ్గరకు పిలుచుకువచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నీ పేరు సీమోను! నీవు యోహాను కుమారుడవు. ఇప్పటి నుండి నీవు కేఫా అని పిలువబడుతావు” అని అన్నాడు. కేఫా అంటే పేతురు అని అర్థం.
JOH 1:43 మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు.
JOH 1:44 అంద్రెయ, పేతురులాగే, ఫిలిప్పు కూడా బేత్సయిదా గ్రామస్థుడు.
JOH 1:45 ఫిలిప్పు నతనయేలు కోసం వెతికి అతనితో, “మేము మోషే ధర్మశాస్త్రంలో ఎవర్ని గురించి వ్రాయబడివుందో ఆయన్ని కనుగొన్నాము. ప్రవక్తలు వ్రాసింది ఈయన్ని గురించే. ఈయన పేరు యేసు. ఈయన యోసేపు కుమారుడు. నజరేతు గ్రామస్థుడు” అని చెప్పాడు.
JOH 1:46 నతనయేలు, “నజరేతు గ్రామం నుండి మంచి జరగటం సంభవమా!” అని అడిగాడు. “వచ్చి చూడు!” అని ఫిలిప్పు అన్నాడు.
JOH 1:47 నతనయేలు తన వైపు రావటం యేసు చూసాడు. అతణ్ణి గురించి, “అదిగో! నిజమైన ఇశ్రాయేలీయుడు! అతనిలో ఏ కపటమూ లేదు” అని అన్నాడు.
JOH 1:48 “మీకు నేనెలా తెలుసు?” అని నతనయేలు అడిగాడు. యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసాను” అని అన్నాడు.
JOH 1:49 నతనయేలు, “రబ్బీ! మీరు నిజముగా దేవుని కుమారుడు. ఇశ్రాయేలు జనాంగానికి ప్రభువు” అని అన్నాడు.
JOH 1:50 యేసు, “నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటం చూసానని చెప్పినందుకు విశ్వసిస్తున్నావా? వీటికన్నా గొప్ప వాటిని చూస్తావు!” అని అన్నాడు.
JOH 1:51 ఆయన మళ్ళీ, “ఇది నిజం. ఆకాశం తెరచుకోవటం, దేవదూతలు మనుష్యకుమారుని యొద్దకు దిగటం, మరల ఎక్కిపోవటం చూస్తావు” అని అన్నాడు.
JOH 2:1 మూడవరోజు గలిలయ దేశంలోని “కానా”పట్టణంలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది.
JOH 2:2 యేసు, ఆయన అనుచరులు కూడా ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు.
JOH 2:3 ద్రాక్షారసం అయిపోయాక యేసు తల్లి ఆయనతో, “వాళ్ళ దగ్గర ద్రాక్షారసం అయిపోయింది!” అని చెప్పింది.
JOH 2:4 యేసు, “నాకెందుకు చెబుతున్నావమ్మా! నా సమయమింకా రాలేదు!” అని సమాధానం చెప్పాడు.
JOH 2:5 ఆయన తల్లి పనివాళ్ళతో, “ఆయన చెప్పినట్లు చెయ్యండి!” అని అనింది.
JOH 2:6 ప్రక్కనే రాతితో చేయబడిన ఆరు బానలు ఉన్నాయి. అలాంటి బానల్ని యూదులు ఆచారపు స్నానం చేసి పరిశుద్ధం కావటానికి ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్క బానలో ఎనభై నుండి నూరు లీటర్ల దాకా నీళ్ళు పట్టేవి.
JOH 2:7 యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో నింపండి!” అని అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు నింపారు.
JOH 2:8 ఆ తర్వాత యేసు వాళ్ళతో, “ఇప్పుడు ఒక బానలో నుంచి కొద్దిగా తీసి పెళ్ళి పెద్ద దగ్గరకు తీసుకెళ్ళండి” అని అన్నాడు. వాళ్ళు అలాగే చేసారు. ఆ పెళ్ళి పెద్ద, ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్ళు రుచి చూసాడు.
JOH 2:9 ఆ పనివాళ్ళకు అది ఎక్కడనుండి వచ్చిందో తెలుసు. కానీ ఆ పెళ్ళి పెద్దకు అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కనుక అతుడు పెళ్ళి కుమారుణ్ణి ప్రక్కకు పిలిచి అతనితో,
JOH 2:10 “అందరూ మంచి ద్రాక్షారసమును మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాక మాములు ద్రాక్షారసమును పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసమును యింతవరకు ఎందుకు దాచావు?” అని అన్నాడు.
JOH 2:11 యేసు చేసిన అద్భుతాలలో యిది మొదటిది. ఇది గలిలయలోని కానాలో జరిగింది. ఈ విధంగా ఆయన తన మహిమను చాటాక ఆయన శిష్యులకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది.
JOH 2:12 ఇది జరిగాక యేసు తన తల్లితో, సోదరులతో, శిష్యులతో కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొద్దిరోజులు బస చేసారు.
JOH 2:13 యూదుల పస్కా పండుగ దగ్గర పడగానే యేసు యెరూషలేము వెళ్ళాడు.
JOH 2:14 ప్రజలు మందిర ఆవరణంలో ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని, పావురాల్ని, అమ్మటం చూసాడు. కొందరు బల్లల ముందు కూర్చొని డబ్బు మార్చటం చూసాడు.
JOH 2:15 త్రాళ్ళతో ఒక కొరడా చేసి అందర్ని ఆ మందిరావరణం నుండి తరిమి వేసాడు. ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని తరిమేసి, డబ్బులు మారుస్తున్న వాళ్ళ డబ్బును క్రింద చల్లి వాళ్ళ బల్లల్ని తల క్రిందులుగా చేసివేసాడు.
JOH 2:16 పావురాలు అమ్ముతున్న వాళ్ళతో, “అవన్నీ అక్కడనుండి తీసివేయండి! నా తండ్రి ఆలయాన్ని సంత దుకాణంగా మార్చటానికి మీకెన్ని గుండెలు?” అని అన్నాడు.
JOH 2:17 ఆయన శిష్యులు లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయ జ్ఞాపకం చేసుకొన్నారు: “నీ యింటిపై నాకున్న ఆశ నన్ను దహించి వేస్తుంది.”
JOH 2:18 యూదులు యేసుతో, “ఒక అద్భుతాన్ని చేసి చూపించు. దానితో నీకు యివి చేయటానికి అధికారమున్నదని నమ్ముతాము” అని అన్నారు.
JOH 2:19 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మందిరాన్ని పడగొట్టండి. నేను దాన్ని మూడు రోజుల్లో మళ్ళీ కడతాను.”
JOH 2:20 యూదులు,“ఈ మందిరం కట్టటానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు దాన్ని మూడు రోజుల్లో నిర్మిస్తావా?” అని అన్నారు.
JOH 2:21 కాని యేసు మాట్లాడింది ఆలయమనే తన దేహాన్ని గురించి.
JOH 2:22 ఆయన బ్రతికింపబడ్డాక, ఆయన శిష్యులకు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వాళ్ళు గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని, యేసు చెప్పిన వాటిని విశ్వసించారు.
JOH 2:23 పస్కా పండుగ రోజుల్లో ఆయన యెరూషలేములో ఉండి చేసిన అద్భుతాల్ని ప్రజలు చూసారు. వాళ్ళకు ఆయన పట్ల విశ్వాసము కలిగింది.
JOH 2:24 కాని ఆయనకు మానవ స్వభావము తెలుసు. కనుక తనను తాను వాళ్ళకు అప్పగించుకోలేదు.
JOH 2:25 మానవ స్వభావం ఆయనకు తెలుసు కనుక మానవుల్ని గురించి ఆయనకు ఎవడును సాక్ష్యం చెప్పనవసరం లేదు.
JOH 3:1 నీకోదేము అనే పరిసయ్యుడు యూదుల నాయకునిగా ఉండేవాడు.
JOH 3:2 అతడు ఒకనాటి రాత్రి యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ! నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని మాకు తెలుసు. నీవు చేస్తున్న అద్భుతాలు దేవుని అండ లేకుండా ఎవ్వరూ చెయ్యలేరు” అని అన్నాడు.
JOH 3:3 యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. క్రొత్తగా జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని స్పష్టంగా చెప్పాడు.
JOH 3:4 నికోదేము, “కాని ఒక వ్యక్తి వృద్ధుడయ్యాక తిరిగి ఏవిధంగా జన్మిస్తాడు? మళ్ళీ జన్మించటానికి తల్లిగర్భంలోకి రెండవ సారి ప్రవేశించలేము కదా!” అని అడిగాడు.
JOH 3:5 యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. నీళ్ళద్వారా, పవిత్రాత్మద్వారా, జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు.
JOH 3:6 మానవుడు భౌతికంగా జన్మిస్తాడు. కాని, ఆధ్యాత్మికత పవిత్రాత్మ వల్ల జన్మిస్తుంది.
JOH 3:7 అందువల్ల నేను, ‘నీవు మళ్ళీ జన్మించాలి’ అనటం విని అశ్చర్యపోవద్దు.
JOH 3:8 గాలి తన యిష్టం వచ్చినట్లు వీస్తుంది. మీరు దాని ధ్వని వినగలరు కాని అది ఏ వైపు నుండి వీచిందో, ఏ వైపుకు వీస్తుందో చెప్పలేరు. పవిత్రాత్మవల్ల జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు” అని అన్నాడు.
JOH 3:9 “అది ఏ విధంగా సంభవమౌతుంది?” అని నికోదేము అడిగాడు.
JOH 3:10 యేసు, “నీవు ఇశ్రాయేలు వారిలో పండితుడవు కదా! నీకీ విషయాలు అర్థం కాలేదా?
JOH 3:11 ఇది నిజం. మేము మాకు తెలసిన విషయాలు చెబుతున్నాము. చూసిన వాటికి సాక్ష్యం చెబుతున్నాము. అయినా మీరు మేము చెబుతున్న వాటిని అంగీకరించరు.
JOH 3:12 నేను మాట్లాడిన ప్రాపంచిక విషయాలను గురించి మీరు నమ్మలేదు. అటువంటప్పుడు పరలోక విషయాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు?
JOH 3:13 పరలోకం నుండి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప పరలోకమునకు ఎవ్వరూ ఎప్పుడూ వెళ్ళలేదు.
JOH 3:14 “ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కడూ నశించకుండా అనంత జీవితం పోందాలంటే, మోషే ఎడారిలో పామును ఎత్తినట్లు మనుష్యకుమారుడు కూడా ఎత్త బడాలి” అని అన్నాడు.
JOH 3:16 దేవుడు ఈ ప్రపంచ ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ నాశనం కాకూడదని, వాళ్ళు అనంత జీవితం పొందాలనీ ఆయన ఉద్దేశ్యం.
JOH 3:17 దేవుడు తన కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి రక్షణనివ్వటానికే గాని తీర్పు చెప్పటానికి పంపలేదు.
JOH 3:18 తన కుమారుణ్ణి నమ్మినవానికి ఆయన శిక్ష విధించడు. నమ్మనివానిపై, అనగా తన ఏకైక కూమారుణ్ణి నమ్మలేదు కనుక, యిదివరకే శిక్ష విధించాడు.
JOH 3:19 దేవుడు చెప్పిన తీర్పు యిది: ప్రపంచంలోకి వెలుగు వచ్చింది. ప్రజలు దుర్మార్గపు పనులు చేసారు. కనుక వాళ్ళు వెలుగుకు మారుగా చీకటిని ప్రేమించారు.
JOH 3:20 చెడుపనులు చేసేవాడు వెలుగును ద్వేషిస్తాడు. తన చెడు బయట పడుతుందేమోనని అతడు వెలుగులోకి రాడు.
JOH 3:21 మంచి పనులు చేసేవాడు తాను చేసిన పనులు దేవునివల్ల చేసిన విషయమై ప్రజలు గ్రహించాలని వెలుగులోకి వస్తాడు.
JOH 3:22 ఇది జరిగిన తర్వాత యేసు తన శిష్యులతో యూదయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్దిరోజులు గడిపాడు, బాప్తిస్మము నిచ్చాడు.
JOH 3:23 అదేవిధంగా యోహాను కూడా సలీము పట్టణం దగ్గరున్న ఐనోను గ్రామంలో నీళ్ళు పుష్కలంగావుండటం వల్ల, అక్కడి ప్రజలకు బాప్తిస్మమునిస్తూ ఉన్నాడు. ప్రజలు బాప్తిస్మము పొందటానికి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు.
JOH 3:24 ఇది యోహానును కారాగారంలో వెయకముందు జరిగిన సంఘటన.
JOH 3:25 పవిత్రం కావటానికి శుద్ధి చేసే ఆచారం విషయంలో ఒక యూదునికి, యోహాను శిష్యులకు వాదన జరిగింది.
JOH 3:26 వాళ్ళు యోహాను దగ్గరకు వచ్చి, “రబ్బీ! యొర్దాను నదికి అవతలి వైపున మీతో ఉన్నవాడు, మీరు ఎవర్ని గురించి సాక్ష్యము చెప్పారో ఆయన బాప్తిస్మము నిస్తున్నాడు. అందరూ అయన దగ్గరకు వెళ్తున్నారు” అని చెప్పారు.
JOH 3:27 యోహాను సమాధానం చెబుతూ, “దేవుడిస్తే తప్ప ఎవ్వరూ దేన్నీ పొందలేరు.
JOH 3:28 నేను క్రీస్తును కానని, ఆయన కన్నా ముందు పంపబడిన వాణ్ణి మాత్రమేనని నేను ముందే చెప్పాను. దీనికి మీరు సాక్ష్యం.
JOH 3:29 పెళ్ళి కూతురు పెళ్ళి కుమారుని సొత్తు. కాని పెళ్ళి కుమారుని స్నేహితుడు పెళ్ళికుమారుని మాట వినాలని కాచుకొని ఉంటాడు. అతని స్వరం వినిపించగానే ఆనందిస్తాడు. నాదీ అలాంటి ఆనందమే. ఆ ఆనందం నాకిప్పుడు సంపూర్ణంగా కలిగింది.
JOH 3:30 ఆయన ప్రాముఖ్యత పెరగాలి. నా ప్రాముఖ్యత తరగాలి.
JOH 3:31 “పై నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఈ ప్రపంచానికి చెందుతాడు. అలాంటి వాడు ప్రాపంచిక విషయాల్ని గురించి మాట్లాడుతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు.
JOH 3:32 ఆయన తాను చూసిన వాటిని గురించి, విన్నవాటిని గురించి సాక్ష్యం చెబుతాడు. కాని ఆయన సాక్ష్యాన్ని ఎవ్వరూ అంగీకరించరు.
JOH 3:33 దాన్ని అంగీకరించిన మనిషి దేవుడు సత్యవంతుడని అంగీకరిస్తాడు.
JOH 3:34 ఎందుకంటే దేవుడు పంపిన వాడు దేవుడు చెప్పిన మాటలు చెబుతాడు. ఆయనకు దేవుడు పవిత్రాత్మను అపరిమితంగా ఇస్తాడు.
JOH 3:35 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందువలన అంతా ఆయన చేతుల్లో ఉంచాడు.
JOH 3:36 ఆ కుమారుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడూ అనంత జీవితం పొందుతాడు. కాని ఆ కుమారుణ్ణి తృణీకరించినవాడు అనంత జీవీతం పొందలేడు. దేవుని కోపం నుండి ఎవడూ తప్పించుకోలేడు” అని అన్నాడు.
JOH 4:1 యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, అతని కన్నా ఎక్కువ మందికి బాప్తిస్మము నిస్తున్నాడని పరిసయ్యులు విన్నారు.
JOH 4:2 నిజానికి, బాప్తిస్మము నిచ్చింది యేసు కాదు. ఆయన శిష్యులు.
JOH 4:3 యేసు యిది గమనించి, యూదయ వదిలి మళ్ళీ గలిలయకు వెళ్ళిపోయాడు.
JOH 4:4 ఆయన సమరయ ద్వారా ప్రయాణం చేయవలసివచ్చింది.
JOH 4:5 ప్రయాణం చేసి సమరయలోని సుఖారు అనే గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూమిని, యాకోబు తన కుమారుడైన యోసేపుకు యిచ్చాడు.
JOH 4:6 అక్కడ యాకోబు బావి ఉండేది. యేసు ప్రయాణంవల్ల అలసి ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు.
JOH 4:7 ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకొని వెళ్ళటానికి వచ్చింది. యేసు ఆమెతో, “అమ్మా! నాకు త్రాగటానికి నీళ్ళిస్తావా?” అని అడిగాడు.
JOH 4:8 ఆయన శిష్యులు ఆహారం కొనుక్కొని రావటానికి పట్టణంలోకి వెళ్ళారు.
JOH 4:9 ఆ సమరయ స్త్రీ ఆయనతో, “మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, నన్ను నీళ్ళివ్వమని అడుగుతున్నారే?” అని అన్నది. యూదులు సమరయులతో స్నేహంగా ఉండరు.
JOH 4:10 యేసు సమాధానం చెబుతూ, “దేవుడు ఏమివ్వగలడో నీకు తెలియదు. నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతున్నారో నీకు తెలియదు. అది నీకు తెలిసివుంటే నేను అడగటానికి బదులు నీవు నన్ను నీళ్ళు అడిగేదానివి. నేను నీకు జీవజలాన్నీ యిచ్చేవాణ్ణి” అని అన్నాడు.
JOH 4:11 ఆ స్త్రీ, “అయ్యా! బావి లోతుగా ఉంది. పైగా మీ దగ్గర చేదటానికి ఏమిలేదు. ఈ జీవజలం మీకెట్లాలభిస్తుంది?
JOH 4:12 మీరు మా తండ్రి యాకోబు కన్నా గొప్పవారా? అతడు ఈ బావి మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళు అతడు, అతని కుమారులు, అతని గొఱ్ఱెలు త్రాగాయి” అని అన్నది.
JOH 4:13 యేసు, “ఈ నీళ్ళు త్రాగినా మళ్ళీ దాహం వేస్తుంది!
JOH 4:14 కాని నేనిచ్చే నీళ్ళు త్రాగినవానికి మళ్ళీ దాహం కాదు. నేనిచ్చిన నీళ్ళు అతనిలో ఒక సజీవమైన ఊటగా మారి అతనికి అనంత జీవితాన్నిస్తుంది” అని సమాధానం చెప్పాడు.
JOH 4:15 ఆ స్త్రీ, “అయ్యా! నాకు మళ్ళీ దాహం కలుగకుండా, నేను నీళ్ళు చేదటానికి ఇక్కడికి ప్రతిరోజూ రాకుండా ఉండేటట్లు నాకా జలాన్ని ప్రసాదించండి” అని అడిగింది.
JOH 4:16 ఆయన, “వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా!” అని ఆమెతో అన్నాడు.
JOH 4:17 “నాకు భర్తలేడు” అని ఆమె తెలియచెప్పింది. యేసు, “నీకు భర్త లేడని సరిగ్గా సమాధానం చెప్పావు.
JOH 4:18 నిజానికి నీకు ఐదుగురు భర్తలుండిరి. ప్రస్తుతం నీవు ఎవరితో నివసిస్తున్నావో అతడు నీ భర్తకాడు. నీవు నిజం చెప్పావు” అని అన్నాడు.
JOH 4:19 ఆమె, “అయ్యా! మీరు ప్రవక్తలా కనిపిస్తున్నారు.
JOH 4:20 మా పూర్వులు ఈ కొండ మీద పూజించారు. కాని మీ యూదులు, ‘మేము పూజించవలసింది యిక్కడ కాదు, యెరూషలేములో పూజించాలి’ అని అంటున్నారు” అని అన్నది.
JOH 4:21 యేసు, “నన్ను నమ్మమ్మా! తండ్రిని ఆరాధించటానికి ఈ కొండ మీదికి గాని లేక యెరూషలేముకు గాని వెళ్ళవలసిన అవసరం తీరిపోయే సమయం వస్తుంది.
JOH 4:22 మీ సమరయ దేశస్థులు తెలియనిదాన్ని ఆరాదిస్తారు. రక్షణ యూదుల నుండి రానున్నది కనుక మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము.
JOH 4:23 నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే సమయం రానున్నది. ఆ సమయం ఇప్పుడే వచ్చింది కూడా. ఎందుకంటే తండ్రి అటువంటి ఆరాధికుల కోసమే ఎదురు చుస్తున్నాడు.
JOH 4:24 దేవుడు ఆత్మ అయివున్నాడు. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి” అని అన్నాడు.
JOH 4:25 ఆ స్త్రీ, “క్రీస్తు అనబడే మెస్సీయ రానున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకన్నీ విశదంగా చెబుతాడు” అని అన్నది.
JOH 4:26 యేసు, “నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే!” అని అన్నాడు.
JOH 4:27 అదే క్షణంలో ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆయనొక స్త్రీతో మాట్లాడటం చూసి ఆశ్చర్యపడ్డారు. కాని, “మీకేమి కావాలి?” అని కాని, లేక, “ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు” అని కాని వాళ్ళు అడగలేదు.
JOH 4:28 ఆ స్త్రీ తన కడవనక్కడ వదిలి గ్రామంలోకి తిరిగి వెళ్ళిపోయింది.
JOH 4:29 ప్రజలతో, “రండి! నేను చేసిన వాటన్నిటీని చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయనే క్రీస్తు అవును గదా” అని అన్నది.
JOH 4:30 వాళ్ళందరూ గ్రామంనుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.
JOH 4:31 ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ! భోజనం చెయ్యండి” అని వేడుకున్నారు.
JOH 4:32 కాని ఆయన వాళ్ళతో, “నా దగ్గర తినటానికి ఆహారం ఉంది. కాని ఆ ఆహారాన్ని గురించి మీకేమీ తెలియదు” అని అన్నాడు.
JOH 4:33 ఆయన శిష్యులు, “ఆయన కోసం ఎవరో భోజనం తెచ్చివుంటారు!” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
JOH 4:34 యేసు, “నన్ను పంపిన వాని కోరిక తీర్చటం, ఆయన కార్యాన్ని పూర్తి చేయటమే, నా భోజనం.
JOH 4:35 ‘విత్తిన తర్వాత నాలుగు నెలల్లో పంట వస్తుంది!’ అని మీరంటున్నారు. కాని నేను చెప్పేదేమిటంటే కళ్ళు తెరచి పొలాల వైపు చూడండి. పంట కోయటానికి సిద్ధంగా ఉంది.
JOH 4:36 దాన్ని విత్తినవాడు, కోసేవాడు ఫలం పొందుతున్నారు. అనంత జీవితం కోసం, అతడు ఆ పంటను కోస్తున్నాడు. తద్వారా విత్తనం నాటినవాడు, పంట కోసే వాడు, యిద్దరూ ఆనందిస్తారు.
JOH 4:37 ‘విత్తనం ఒకడు నాటితె ఫలం ఇంకొకడు పొందుతాడు’ అన్న సామెత ఈ సందర్భంలో వర్తిస్తుంది.
JOH 4:38 మీరు కష్టపడి పని చెయ్యని పంట కోయటానికి మిమ్మల్ని పంపాను, దాని కోసం యితర్లు చాలా కష్టించి పని చేసారు. వాళ్ళ కష్టానికి మీరు ఫలం పొందుతున్నారు” అని చెప్పాడు.
JOH 4:39 ఆ పట్టణంలో ఉన్న సమరయ ప్రజలతో ఆ స్త్రీ, “నేను చేసినదంతా ఆయన చెప్పాడు” అని చెప్పింది. ఆ కారణంగా అనేకులు యేసును నమ్మారు.
JOH 4:40 అందువల్ల ఆ సమరయ ప్రజలాయన దగ్గరకు వెళ్ళి తమతో ఉండుమని వేడుకున్నారు. ఆయన వాళ్ళతో రెండు రోజులున్నాడు.
JOH 4:41 ఆయన చెప్పిన విషయాల వలన యింకా అనేకులు విశ్వాసులైయ్యారు.
JOH 4:42 ఆ సమరయ ప్రజలు ఆమెతో, “మొదట నీవు చెప్పిన విషయాలు విని ఆయన్ని విశ్వసించాము. కాని యిప్పుడు మేము ఆయన మాటలు స్వయంగా విన్నాము. కనుక ఆయన్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము. ఆయన ప్రపంచాన్ని రక్షించటానికి వచ్చిన వాడని మాకు బాగ తెలిసిపోయింది” అని అన్నారు.
JOH 4:43 రెండు రోజుల తర్వాత ఆయన గలిలయకు వెళ్ళాడు.
JOH 4:44 అక్కడ యేసు, “ప్రవక్తకు తన స్వగ్రామంలో గౌరవం లేదు” అని అన్నాడు.
JOH 4:45 ఆయన గలిలయ వచ్చాక అక్కడి ప్రజలు ఆయనకు స్వాగతమిచ్చారు. గలిలయ ప్రజలు కూడా పస్కా పండుగ కోసం యోరూషలేము వెళ్ళారు. కనుక, వాళ్ళు ఆయన అక్కడ పండుగ రోజుల్లో చేసిన వాటన్నిటిని చూశారు.
JOH 4:46 యేసు, తాను నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన గలిలయలోని “కానా”ను మళ్ళీ దర్శించాడు. కపెర్నహూము పట్టణంలో ఒక రాజ్యాధికారి ఉండేవాడు. అతని కుమారుడు జబ్బుతో ఉన్నాడు.
JOH 4:47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని విని ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్ళాడు.వెళ్ళి చావుకు దగ్గరగా ఉన్న తన కుమారునికి నయం చేయుమని వేడుకున్నాడు.
JOH 4:48 “మహాత్కార్యాలు, అద్భుతాలు చూస్తే కాని మీరు నమ్మరు” అని యేసు అతనితో అన్నాడు.
JOH 4:49 ఆ రాజ్యాధికారి, “అయ్యా! నా కుమారుడు మరణించకముందే దయచేసి రండి!” అని అన్నాడు.
JOH 4:50 యేసు, “నీవు వెళ్ళు! నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్నాడు. అతడు యేసు మాట విశ్వసించి వెళ్ళి పోయాడు.
JOH 4:51 అతడు యింకా దారిలో ఉండగానే అతని సేవకులు ఎదురుగా వచ్చి బాబుకు నయమై పోయిందని చెప్పారు.
JOH 4:52 అతడు వాళ్ళను తన కుమారునికి ఏ సమయంలో నయమైందని అడిగాడు. వాళ్ళు, “నిన్న ఒంటిగంటకు జ్వరం విడిచింది” అని సమాధానం చెప్పారు.
JOH 4:53 సరిగ్గా అదే సమయానికి యేసు తనతో, “నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. అందువల్ల అతడు, అతని యింట్లోని వాళ్ళంతా ప్రభువుని నమ్మారు.
JOH 4:54 యూదయ దేశం నుండి గలిలయకు వచ్చాక యిది యేసు చేసిన రెండవ మహాత్కార్యము.
JOH 5:1 కొద్ది రోజుల తర్వాత యూదుల పండుగ వచ్చింది. యేసు యెరూషలేముకు వెళ్ళాడు.
JOH 5:2 అక్కడ యెరూషలేములో గొఱ్ఱెల ద్వారం దగ్గర ఒక కొలను ఉండేది. దీన్ని హీబ్రూ భాషలో బేతెస్థ అని అంటారు. దీని చుట్టూ ఐదు మండపాలు ఉండేవి.
JOH 5:3 చాలామంది వికలాంగులు, గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పక్షవాత రోగులు అక్కడ వేచి ఉండేవాళ్ళు.
JOH 5:4 
JOH 5:5 అక్కడున్న వాళ్ళలో ఒకడు ముప్పైఎనిమిది సంవత్సరాల నుండి రోగంతో బాధ పడ్తూ ఉన్నాడు.
JOH 5:6 యేసు అతడక్కడ ఉండటం చూసాడు. చాలాకాలం నుండి అతడాస్థితిలో ఉన్నాడని గ్రహించి అతనితో, “నీకు నయం కావాలని ఉందా?” అని అడిగాడు.
JOH 5:7 ఆ వికలాంగుడు, “అయ్యా! నీళ్ళు కదిలినప్పుడు ఆ కోనేరులోకి దించటానికి ఎవరూ లేరు: అయినా వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగానే, ఇంకొకడు నాకన్నా ముందు ఆ నీళ్ళలోకి దిగుతాడు” అని అన్నాడు.
JOH 5:8 అప్పుడు యేసు అతనితో, “లే! నీ చాప తీసుకొని నడువు!” అని అన్నాడు.
JOH 5:9 అతనికి వెంటనే నయమైపోయింది. అతడు తన చాపతీసుకొని వెళ్ళిపోయాడు. ఈ సంఘటన విశ్రాంతి రోజున జరిగింది.
JOH 5:10 తత్కారణంగా యూదులు కోలుకున్న వానితో, “ఇది విశ్రాంతి రోజు, ధర్మశాస్త్రం ప్రకారం నీవు చాపమోసుక వెళ్ళటానికి వీల్లేదు” అని అన్నారు.
JOH 5:11 కాని అతడు, “నాకు నయం చేసిన వ్యక్తి, ‘నీ చాప పట్టుకొని వెళ్ళు’ అని అన్నాడు” అని సమాధానం చెప్పాడు.
JOH 5:12 వాళ్ళు, “నీ చాప తీసుకొని నడవమన్న వాడెవడు?” అని అడిగారు.
JOH 5:13 ప్రజల గుంపు ఉండటంవల్ల యేసు అక్కడినుండి వెళ్ళిపోయాడు. కనుక తనకు నయం చేసిన వాడెవరో అతడు చూపలేక పోయాడు.
JOH 5:14 ఆ తర్వాత యేసు అతణ్ణి మందిరంలో కలుసుకొని, “చూడు! నీవు తిరిగి ఆరోగ్యవంతుడవు అయ్యావు. పాపాలు చెయ్యటం మానేయి. లేకపోతే ఇంతకన్నా ఎక్కువ కీడు సంభవించవచ్చు!” అని అన్నాడు.
JOH 5:15 ఆ తర్వాత వాడు వెళ్ళి, తనకు నయం చేసిన వ్యక్తి యేసు అని చెప్పాడు.
JOH 5:16 యేసు విశ్రాంతి రోజున యివన్నీ చెశాడని తెలియటం వల్ల యూదులు ఆయన్ని పీడించటం మొదలు పెట్టారు.
JOH 5:17 యేసు వాళ్ళతో, “నా తండ్రి అన్ని వేళలా పని చేస్తాడు. అందువల్ల నేనుకూడా పని చేస్తున్నాను” అని సమాధానం చెప్పాడు.
JOH 5:18 ఈ కారణంగా యూదులాయన్ని చంపటానికి యింకా గట్టిగా ప్రయత్నించారు. వాళ్ళు, “అతడు విశ్రాంతి రోజును పాటించక పోవటమే కాకుండా, దేవుడు తన తండ్రి అని కూడా అంటున్నాడు. అలా చేసి తనను దేవునితో సమానం చేసుకొంటున్నాడు” అని అన్నారు.
JOH 5:19 యేసు, “ఇది నిజం. కుమారుడు ఏదీ స్వయంగా చెయ్యలేడు. తన తండ్రి చేస్తున్న దాన్ని చూసి, దాన్ని మాత్రమే కుమారుడు చెయ్యగలడు. తండ్రి ఏది చేస్తాడో, కుమారుడూ అదే చేస్తాడు.
JOH 5:20 తండ్రికి కుమారుని పట్ల ప్రేమ ఉంది కనుక తాను చేస్తున్నవన్నీ ఆయనకు చూపిస్తాడు. భవిష్యత్తులో ఆయనకు యింకా గొప్ప వాటిని చూపిస్తాడు. అప్పుడు మీరంతా అశ్చర్యపోతారు.
JOH 5:21 తండ్రి చనిపోయిన వాళ్ళను బ్రతికించినట్లే కుమారుడు కూడా తనకు యిష్టం వచ్చిన వాళ్ళకు ప్రాణం పోస్తాడు.
JOH 5:22 “అంతేకాదు, తండ్రి ఎవరి మీద తీర్పు చెప్పడు. తీర్పు చెప్పటానికి కుమారునికి సర్వాధికారాలు ఇచ్చాడు.
JOH 5:23 తండ్రిని గౌరవించినట్లు, కుమారుణ్ణి గౌరవించాలని యిలా చేసాడు. కుమారుణ్ణి గౌరవించని వాడు, ఆ కుమారుణ్ణి పంపిన తండ్రిని కూడా గౌరవించనట్లే పరిగణింపబడతాడు” అని అన్నాడు.
JOH 5:24 యేసు, “ఇది సత్యం. నామాటలు విని నన్ను పంపిన వానిని నమ్మువాడు అనంత జీవితం పొందుతాడు. అలాంటి వాడు శిక్షింపబడడు. అంటే అతడు చావు తప్పించుకొని జీవాన్ని పొందాడన్న మాట.
JOH 5:25 ఇది సత్యం. దేవుని కుమారుని స్వరం చనిపోయిన వాళ్ళు వినే కాలం రాబోతూవుంది. ఇప్పటికే వచ్చింది. ఆ స్వరం విన్నవాళ్ళు క్రొత్త జీవితాన్ని పొందుతారు.
JOH 5:26 ఎందుకంటే, జీవానికి తండ్రి ఏ విధంగా మూలపురుషుడో అదేవిధంగా కుమారుడు కూడా జీవానికి మూలపురుషుడు. కుమారుణ్ణి మూలపురుషుడుగా చేసింది తండ్రి!
JOH 5:27 కుమారుడు మానవావతారం పొందాడు కనుక తండ్రి ఆయనకు తీర్పు చెప్పే అధికారంయిచ్చాడు. ఆయన స్వరం వినే కాలం రానున్నది.
JOH 5:28 “ఆశ్చర్యపడకండి! సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన స్వరం వినే కాలం రానున్నది.
JOH 5:29 వెలుపలికి రండి! మంచి చేసిన వాళ్ళు నిరంతరం జీవించటానికి బ్రతికి వస్తారు. కీడు చేసిన వాళ్ళు నిరంతరం శిక్షింపబడటానికి బ్రతికివస్తారు.
JOH 5:30 “నేను స్వయంగా ఏదీ చెయ్యలేను. నేను దేవుడు చెప్పమన్న తీర్పు చెబుతాను. అందువలన నా తీర్పు న్యాయమైనది. నెరవేర వలసింది నాయిచ్ఛ కాదు. నేను నన్ను పంపిన వాని యిచ్ఛ నెర వేర్చటానికి వచ్చాను.
JOH 5:31 “నా పక్షాన నేను సాక్ష్యం చెబితే దానికి విలువ ఉండదు.
JOH 5:32 కాని నా పక్షాన సాక్ష్యం చెప్పేవాడు మరొకాయన ఉన్నాడు. నా విషయంలో ఆయన చెప్పే సాక్ష్యానికి విలువ ఉందని నాకు తెలుసు.
JOH 5:33 “మీరు మీ వాళ్ళను యెహాను దగ్గరకు పంపారు. అతడు న్యాయం పక్షాన మాట్లాడాడు.
JOH 5:34 మానవుని సాక్ష్యం నాకు కావాలని కాదు. మీరు రక్షింపబడాలని ఈ విషయం చెబుతున్నాను.
JOH 5:35 యోహాను ఒక దీపంలా మండుచూ. వెలుగు నిచ్చాడు. కొంతకాలం మీరా వెలుగు ద్వారా లాభంపొంది ఆనందించారు.
JOH 5:36 “నా దగ్గర యోహాను సాక్ష్యాని కన్నా గొప్ప సాక్ష్యం ఉంది. పూర్తి చెయ్యమని తండ్రి నాకు అప్పగించిన కార్యాల్ని నేను పూర్తి చేస్తున్నాను. ఈ కార్యాలు తండ్రి నన్ను పంపాడని నిరూపిస్తాయి.
JOH 5:37 నన్ను పంపిన తండ్రి స్వయంగా నన్ను గురించి చెప్పాడు. మీరాయన స్వరం ఎన్నడూ వినలేదు. ఆయన రూపాన్ని ఎప్పుడూ చూడలేదు.
JOH 5:38 అంతే కాక ఆయన పంపిన వాణ్ణీ మీరు నమ్మటంలేదు. కనుక, ఆయన బోధనలు మీ మనస్సులో నివసించటంలేదు.
JOH 5:39 లేఖనాల ద్వారా అనంత జీవితం లభిస్తుందని మీరు వాటిని పరిశోధిస్తారు. కాని ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం చెపుతున్నాయి.
JOH 5:40 అయినా మీరు నా దగ్గరకు వచ్చి నానుండి క్రొత్త జీవితాన్ని పొందటానికి నిరాకరిస్తున్నారు.
JOH 5:41 “నాకు మానవుల పొగడ్తలు అవసరం లేదు.
JOH 5:42 కాని మీ గురించి నాకు తెలుసు. మీకు దేవునిపట్ల ప్రేమ లేదని నాకు తెలుసు.
JOH 5:43 నేను నా తండ్రి పేరిటవచ్చాను. నన్ను మీరు అంగీకరించలేదు. కాని ఒక వ్యక్తి స్వయంగా తన పేరిట వస్తే అతణ్ణి మీరు అంగీకరిస్తారు.
JOH 5:44 మీరు పరస్పరం పొగడుకుంటారు. కాని దేవుని మెప్పు పొందాలని ప్రయత్నించరు. అలాంటప్పుడు నన్ను ఎట్లా విశ్వసించగలరు?
JOH 5:45 నేను మిమ్మల్ని నా తండ్రి సమక్షంలో నిందిస్తానని అనుకోకండి. మీరు ఆధారంగా చేసుకొన్న మోషే మిమ్మల్ని నిందిస్తున్నాడు.
JOH 5:46 మీరు మోషేను నమ్మినట్లైతే, అతడు నన్ను గురించి వ్రాసాడు కనుక మీరు నన్ను కూడా నమ్మేవాళ్ళు.
JOH 5:47 అతడు వ్రాసింది మీరు నమ్మనప్పుడు నేను చెప్పింది ఎట్లా నమ్మగలరు?” అని అన్నాడు.
JOH 6:1 ఇది జరిగిన కొద్ది రోజులకు, యేసు గలిలయ సముద్రం (తిబెరియ సముద్రం) దాటి వెళ్ళాడు.
JOH 6:2 ఆయన అద్భుతమైన మహిమలతో రోగులకు బాగుచెయ్యటం చూసి, పెద్ద ప్రజల గుంపు ఒకటి ఆయన్ని అనుసరిస్తూవచ్చింది.
JOH 6:3 యేసు తన శిష్యులతో కలిసి కొండ మీదికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు.
JOH 6:4 అవి పస్కా పండుగకు ముందు రోజులు. పస్కా యూదల పండుగ.
JOH 6:5 యేసు తలెత్తి పెద్ద ప్రజలగుంపు తన వైపు రావటం చూసి, ఫిలిప్పుతో, “వీళ్ళు తినటానికి ఆహారం ఎక్కడ కొందాం?” అని అడిగాడు.
JOH 6:6 అతణ్ణి పరీక్షించటానికి మాత్రమే ఈ ప్రశ్న అడిగాడు. యేసు తాను ఏమి చెయ్యాలో ముందే ఆలోచించుకొన్నాడు.
JOH 6:7 ప్రతి ఒక్కనికి ఒక్కొక్క ముక్క దొరకాలన్నా, రెండువందల దేనారాలు ఖర్చు చేయవలసి వస్తుంది. అయినా అది చాలదు.
JOH 6:8 యేసు శిష్యుల్లో ఒకడైన అంద్రెయ అక్కడున్నాడు. యితడు సీమోను పేతురు సోదరుడు.
JOH 6:9 “ఇక్కడ ఒక బాలుని దగ్గర యవలతో చేసిన ఐదు రొట్టెలు, రెండు కాల్చిన చేపలు ఉన్నాయి. కాని యింతమందికి అవి ఎట్లా సరిపోతాయి?” అని అన్నాడు.
JOH 6:10 యేసు, “ప్రజల్ని కూర్చోపెట్టండి!” అని అన్నాడు. అక్కడ చక్కటి పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ప్రజలందరూ కూర్చున్నారు. అక్కడున్న పురుషుల సంఖ్య ఐదువేలు.
JOH 6:11 యేసు ఆ రొట్టెల్ని తీసుకొని, దేవునికి కృతజ్ఞత చెప్పి, అక్కడ కూర్చున్నవాళ్ళకు పంచిపెట్టాడు. అదే విధంగా చేపల్ని కూడా పంచి పెట్టాడు. అందరూ కావలసినంత తిన్నారు.
JOH 6:12 వాళ్ళు తృప్తిగాతిన్నాక, తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా వాళ్ళు తినగా మిగిలిన ముక్కల్ని ఎత్తి పెట్టండి!” అని అన్నాడు.
JOH 6:13 ఐదు బార్లీ రొట్టెల్ని పంచగా మిగిలిన ముక్కల్ని శిష్యులు పండ్రెండు గంపలనిండా నింపారు.
JOH 6:14 ప్రజలు యేసు చేసిన ఆ మహాకార్యాన్ని చూసి, “లోకానికి రానున్న ప్రవక్త ఈయనే!” అని అనటం మొదలు పెట్టారు.
JOH 6:15 యేసు వాళ్ళు తనను బలవంతంగా రాజును చెయ్యాలనుకుంటున్నారని గ్రహించాడు. కనుక ఆయన ఏకాంతంగా కొండకు వెళ్ళిపోయ్యాడు.
JOH 6:16 సాయంకాలమైంది. ఆయన శిష్యులు సముద్రం దగ్గరకు వెళ్ళారు.
JOH 6:17 వాళ్ళు ఒక పడవనెక్కి సముద్రంకు అవతలి వైపుననున్న కపెర్నహూము అనే పట్టణం వైపు వెళ్ళసాగారు. అప్పటికే చీకటి పడింది. యేసు వాళ్ళనింకా కలుసుకోలేదు.
JOH 6:18 గాలి తీవ్రంగా వీయటంవల్ల అలలు అధికమయ్యాయి.
JOH 6:19 మూడు నాలుగుమైళ్ళ దూరందాకా తెడ్లు వేసాక, యేసు నీళ్ళ పై నడుస్తూ పడవ దగ్గరకు రావటం వాళ్ళు చూసారు. వాళ్ళకు బాగా భయం వేసింది.
JOH 6:20 కాని, యేసు వాళ్ళతో, “నేనే! భయపడకండి!” అని అన్నాడు.
JOH 6:21 ఈ మాట అన్న తర్వాత ఆయన పడవలోకి రావటానికి వాళ్ళు అంగీకరించారు. ఆ తదుపరి వాళ్ళు, తాము వెళ్ళదలచిన తీరాన్ని త్వరలోనే చేరుకున్నారు.
JOH 6:22 తెల్లవారింది. అవతలి ఒడ్డున ఉండి పోయిన ప్రజలకు అక్కడ ఒకే పడవ ఉందని, యేసు శిష్యులతో కలిసి వెళ్ళలేదని, శిష్యులు మాత్రమే వెళ్ళారని, తెలుసు కొన్నారు.
JOH 6:23 వాళ్ళు యేసు, ఆయన శిష్యులు అక్కడ లేరని గ్రహించిన వెంటనే, వెతకటానికి నిశ్చయించుకున్నారు. తిబెరియ నుండి కొన్ని పడవలు వచ్చి ఒడ్డు చేరాయి. ప్రభువు దేవునికి కృతజ్ఞత చెప్పి, రొట్టెల్ని ప్రజలకు పంచిన స్థలం దీని సమీపంలో ఉంది. వాళ్ళు ఆ పడవలెక్కి ఆయన్ని వెదుకుతూ కపెర్నహూము వెళ్ళారు.
JOH 6:25 యేసు అవతలి ఒడ్డున కనిపించగానే, వాళ్ళు ఆయనతో, “రబ్బీ! మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?” అని అడిగారు.
JOH 6:26 యేసు, “ఇది నిజం. అద్భుతాల్ని చూసినందువలన నన్ను మీరు వెతకటం లేదు. రొట్టెలు తిని మీ కడుపులు నింపుకొన్నందుకు నా కోసం వెతుకుతున్నారు.
JOH 6:27 చెడిపోయే ఆహారం కోసం పాటు పడకండి. చిరకాలం ఉండే ఆహారం కోసం పాటు పడండి. దాన్ని మనుష్యకుమారుడు మీకిస్తాడు. ఆయన పై తండ్రి ఆయన దేవుడు తన అంగీకార ముద్రవేశాడు” అని చెప్పాడు.
JOH 6:28 వాళ్ళు ఆయన్ని, “దైవకార్యం చెయ్యాలంటే మేము ఏమి చెయ్యాలి?” అని అడిగారు.
JOH 6:29 యేసు, “ఆయన్నిపంపిన వాణ్ణి నమ్మటమే దైవకార్యం” అని సమాధానం చెప్పాడు.
JOH 6:30 కనుక వాళ్ళు ఆయనతో చెప్పారు, “అలాగైతే, మేము నమ్మేటట్లు ఏ అద్భుత కార్యాన్ని చేసి చూపిస్తారు?
JOH 6:31 మా ముత్తాతలు ఎడారుల్లో మన్నాను తిన్నారు. దీన్ని గురించి గ్రంథాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయన, వాళ్ళు తినటానికి పరలోకం నుండి ఆహారం యిచ్చాడు.”
JOH 6:32 యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పరలోకం నుండి నిజమైన ఆహారం ఇచ్చింది మోషే కాదు. దాన్ని యిచ్చేవాడు నా తండ్రి.
JOH 6:33 ఆ జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తే. ఆయన లోకానికి జీవాన్నిస్తాడు” అని అన్నాడు.
JOH 6:34 వాళ్ళు, “అయ్యా! యికనుండి ఈ ఆహారం మాకివ్వండి!” అని అన్నారు.
JOH 6:35 యేసు ఈ విధంగా చెప్పాడు: “నేను జీవాన్నిచ్చే ఆహారాన్ని, నా దగ్గరకు వచ్చినవాడు ఆకలితో పోడు. నన్ను నమ్మినవానికి ఎన్నడూ దాహం కలుగదు.
JOH 6:36 కాని నేను ఇంతకు క్రితం చెప్పినట్లు, నన్ను చూసారు! అయినా మీరు నమ్మలేదు!
JOH 6:37 తండ్రి నాకప్పగించిన వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణెవణ్ణి నేను ఎన్నటికి నెట్టి వేయను.
JOH 6:38 ఎందుకంటే, నేను పరలోకం నుండి నా యిష్టం నెరవెర్చుకోవటానికి దిగిరాలేదు. నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చటానికి వచ్చాను.
JOH 6:39 నన్ను పంపిన వాని కోరిక యిది: నా కప్పగింపబడిన వాళ్ళను నేను పోగొట్టు కోరాదు. వాళ్ళను చివరి రోజు బ్రతికించాలి.
JOH 6:40 కుమారుని వైపు చూసి ఆయన్ని నమ్మినవాడు అనంత జీవితం పొందాలి. ఇది నా తండ్రి కోరిక. అలా నమ్మిన వాణ్ణి నేను చివరి రోజు బ్రతికిస్తాను.”
JOH 6:41 ఆయన, “నేను పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని” అని అనటం విని యూదులు గొణిగారు.
JOH 6:42 “ఇతడు యోసేపు కుమారుడైన యేసు కదా! ఇతని తల్లిదండ్రుల్ని మనం ఎరుగుదుమే! మరి యిప్పుడితడు, ‘నేను పరలోకం నుండి దిగి వచ్చానని’ ఎందుకు అంటున్నాడు?” అని వాళ్ళన్నారు.
JOH 6:43 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీలో మీరు గొణుక్కోవడం చాలించండి.
JOH 6:44 నన్ను పంపిన తండ్రి పంపితే తప్ప, నా దగ్గరకు ఎవ్వడూ రాలేడు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణి చివరి రోజు నేను బ్రతికిస్తాను.
JOH 6:45 ప్రవక్తల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది: ‘దేవుడు వాళ్ళందరికీ బోధిస్తాడు.’ తండ్రి మాట విని ఆయన చెప్పింది నేర్చుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు.
JOH 6:46 దేవుని నుండి వచ్చినవాడు తప్ప తండ్రినెవ్వరూ చూడలేదు. ఆయన మాత్రమే తండ్రిని చూసాడు.
JOH 6:47 “ఇది నిజం. నమ్మినవానికి అనంత జీవితం లభిస్తుంది.
JOH 6:48 నేను మీ జీవితానికి ఆహారాన్ని.
JOH 6:49 మీ పూర్వీకులు ఎడారిలో ఉన్నప్పుడు మన్నా తిన్నారు. అయినా చనిపోయారు.
JOH 6:50 కాని ఈయన పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం. దీన్ని అందరూ తినవచ్చు. దీన్ని తిన్నవాడు మరణించడు.
JOH 6:51 పరలోకం నుండి వచ్చిన సజీవమైన ఆ ఆహారాన్ని నేనే. దీన్ని తిన్నవాడు చిరకాలం జీవిస్తాడు. ఆ ఆహారం నా శరీరం. నా శరీరాన్ని లోకం యొక్క జీవం కోసం యిస్తాను.”
JOH 6:52 ఆ తర్వాత, “మనకు తన శరీరాన్ని తినటానికి ఈయన ఏవిధంగా యిస్తాడు?” అని యూదులు పరస్పరం తీవ్రంగా వాదించుకున్నారు.
JOH 6:53 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఇది సత్యం. మనుష్యకుమారుని శరీరం తిని, ఆయన రక్తం తాగ్రితే తప్ప మీలో జీవం ఉండదు.
JOH 6:54 నా శరీరము తిని, నా రక్తం త్రాగిన వానికి అనంతజీవితం లభిస్తుంది. అతణ్ణి నేను చివరి రోజు బ్రతికిస్తాను.
JOH 6:55 ఎందుకంటే నా శరీరం నిజమైన ఆహారం. నా రక్తం నిజమైన పానీయము.
JOH 6:56 నా శరీరం తిని, నా రక్తం త్రాగినవాడు నాలో ఉంటాడు.
JOH 6:57 “సజీవుడైన నా తండ్రి నన్ను పంపాడు. ఆయన కారణంగానే నేను జీవిస్తున్నాను. అదే విధంగా నన్ను ఆహారంగా తిన్నవాడు నాకారణంగా జీవిస్తాడు.
JOH 6:58 పరలోకం నుండి దిగివచ్చిన నిజమైన ఆహారం యిదే! ఇది మన పూర్వీకులు తిన్న ఆహారంలాంటిది కాదు. వాళ్ళు అది తిన్నా చనిపొయ్యారు. కాని ఈ ఆహారాన్ని తిన్నవాళ్ళు అనంతజీవితం పొందుతారు.”
JOH 6:59 యేసు, కపెర్నహూములోని యూదుల సమాజ మందిరంలో బోధిస్తూ ఈ విషయాలు చెప్పాడు.
JOH 6:60 ఆయన చెప్పినవి విని చాలా మంది శిష్యులు, “ఈ బోధన చాల కష్టమైనది. దీన్ని ఎవరు అంగీకరించగలరు?” అని అన్నారు.
JOH 6:61 తన శిష్యులు ఈ విషయాన్ని గురించి గొణుక్కుంటున్నారని యేసు గ్రహించాడు. ఆయన వాళ్ళతో, “ఇది మీకు కష్టంగా ఉందా?
JOH 6:62 మనుష్యకుమారుడు, తాను ముందున్న చోటికి వెళ్ళటం చూస్తే మీరెమంటారు?
JOH 6:63 ఆత్మ జీవాన్నిస్తాడు. శరీరానికి విలువ లేదు. నామాటలు ఆత్మకు సంబంధించినవి. అవి జీవం.
JOH 6:64 కాని, మీలో కొందరు నమ్మటం లేదు” అని అన్నాడు. తనను నమ్మని వాడెవడో, తనకు ద్రోహం చేసేవాడెవడో యేసుకు ముందునుండి తెలుసు.
JOH 6:65 యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “తండ్రి అనుమతిస్తే తప్ప నా దగ్గరకు ఎవ్వరూ రాలేరని అందుకే అన్నాను.”
JOH 6:66 ఆ రోజు నుండి చాలా మంది శిష్యులు ఆయన్ని అనుసరించటం మానుకొని వెనక్కు మళ్ళి పోయారు.
JOH 6:67 యేసు, “మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా?” అని పన్నెండు మందిని అడిగాడు.
JOH 6:68 సీమోను పేతురు, “ప్రభూ మేము ఎవరి దగ్గరకు వెళ్ళాలి? అనంత జీవితాన్ని గురించి చెప్పే మాటలు మీ దగ్గర ఉన్నాయి.
JOH 6:69 మీరు దేవునికి సంబంధించిన వారని, పవిత్రులని మాకు తెలుసు. అది మేము నమ్ముతున్నాము” అని సమాధానం చెప్పాడు.
JOH 6:70 అప్పుడు యేసు, “మీ పన్నెండు మందిని ఎన్నుకొన్న వాణ్ణి నేనే కదా! అయినా మీలో ఒకడు సైతాను!” అని అన్నాడు.
JOH 6:71 ఆయన ఉద్దేశ్యం సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా అని. యూదా పన్నెండు మందిలో ఒకడైయుండి యేసుకు ద్రోహం చేస్తాడు.
JOH 7:1 ఇది జరిగిన తర్వాత, యేసు గలిలయలో మాత్రమే పర్యటన చేసాడు. యూదులు ఆయన ప్రాణం తీయాలనుకోవటం వలన ఆయన కావాలనే యూదయలో పర్యటన చెయ్యలేదు.
JOH 7:2 యూదుల పర్ణశాలల పండుగ దగ్గరకు వచ్చింది.
JOH 7:3 యేసు సోదరులు యేసుతో, “నీవీ ప్రాంతం వదిలి యూదయకు వెళ్ళు. అలా చేస్తే నీ శిష్యులు నీవు చేసే కార్యాల్ని చూడగలుగుతారు.
JOH 7:4 నీవు ఈ కార్యాల్ని చేస్తున్నావు. కనుక నీవు ప్రజలముందుకు రావాలి. ఎందుకంటే, ప్రజానాయకుడు కాదలచినవాడు రహస్యంగా కార్యంచేయడు” అని అన్నారు.
JOH 7:5 అంటే ఆయన సోదరులు కూడా ఆయన్ని నమ్మలేదన్నమాట!
JOH 7:6 యేసు వాళ్ళతో, “నాకింకా సమయం రాలేదు. మీకు ఏ సమయమైనా మంచిదే.
JOH 7:7 ప్రపంచం మిమ్మల్ని ద్వేషించదు. కాని నేను దాని పనులు దుర్మార్గములని అంటాను. కనుక అది నన్ను ద్వేషిస్తున్నది.
JOH 7:8 మీరు పండుగకు వెళ్ళండి. నాకు తగిన సమయం యింకా రాలేదు కనుక నేను యిప్పుడు రాను” అని అన్నాడు.
JOH 7:9 ఇలాగు అన్న తర్వాత యేసు గలిలయులోనే ఉండి పోయాడు.
JOH 7:10 ఆయన సోదరులు వెళ్ళాక ఆయన కూడా పండుగకు వెళ్ళాడు. కాని బహిరంగంగా కాదు. రహస్యంగా.
JOH 7:11 అక్కడ పండుగ జరుగే స్థలంలో యూదులు, “అతడెక్కడున్నాడు?” అని అంటూ ఆయన కోసం వెదకసాగారు.
JOH 7:12 ప్రజలు ఆయన్ని గురించి రహస్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు. కొందరు ఆయన మంచివాడన్నారు. మరి కొందరు, “కాదు, అతడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు!” అని అన్నారు.
JOH 7:13 యూదులకు భయపడి ఆయన్ని గురించి బహిరంగంగా ఎవ్వడూ ఏమీ అనలేదు.
JOH 7:14 పండుగ సగం కాకముందే యేసు మందిరంలోకి వెళ్ళి బోధించటం మొదలుపెట్టాడు.
JOH 7:15 యూదులు ఆశ్చర్యపడి, “చదవకుండా యితడు యింత జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించాడు” అని అన్నారు.
JOH 7:16 యేసు, “నేను బోధించేవి నావి కావు. అవి నన్ను పంపిన దేవునివి.
JOH 7:17 దైవేచ్చానుసారం జీవించ దలచిన వానికి నా బోధనలు దేవునివా లేక నేను స్వయంగా నా అధికారంతో మాట్లాడుతున్నానా అన్న విషయం తెలుస్తుంది.
JOH 7:18 స్వతహాగా మాట్లాడేవాడు గౌరవం సంపాదించాలని చూస్తాడు. కాని తనను పంపిన వాని గౌరవం కోసం మాట్లాడేవాడే నిజమైనవాడు. అలాంటి వాడు అసత్యమాడడు.
JOH 7:19 మోషే మీకు ధర్మశాస్త్రాన్ని అందించాడు కదా! అయినా మీలో ఒక్కడు కూడా దాన్ని పాటించలేదు. నన్ను చంపటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు” అని అన్నాడు.
JOH 7:20 “నీకేమన్నా దయ్యం పట్టిందా? నిన్ను చంపటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు?” అని ప్రజలు అన్నారు.
JOH 7:21 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నేను ఒక మహత్కార్యాన్ని చేసాను. దానికే మీరింత ఆశ్చర్యపడిపోయారు.
JOH 7:22 మోషే మీకు సున్నతి చేయించుకోమని చెప్పాడు. నిజానికి యిది మోషే నుండి కాదు కాని పితరులనుండి ప్రారంభమైనది.
JOH 7:23 కనుక అవసరమైతే మీరు విశ్రాంతి రోజున సున్నతి చేస్తే తప్పుకాదు కాని, నేను ఒక మనిషి దేహాన్ని సంపూర్ణంగా నయంచేసినందుకు మీకు కోపం వస్తోంది?
JOH 7:24 పైన చూసి తీర్పు చెప్పటం మానుకోండి. న్యాయంగా తీర్పు చెప్పండి.”
JOH 7:25 అదే క్షణాన కొందరు యెరూషలేము ప్రజలు ఈ విధంగా అనటం మొదలుపెట్టారు: “వాళ్ళు చంపాలని ప్రయత్నిస్తున్నది ఈయనే కదా!
JOH 7:26 ఆయనిక్కడ బహిరంగంగా మాట్లాడుతున్నా వాళ్ళు ఆయన్ని ఒక్క మాట కూడా అనటం లేదే! అధికారులు కూడా ఈయన నిజంగా క్రీస్తు అని తలంచారా ఏమి?
JOH 7:27 కాని క్రీస్తు వచ్చేటప్పుడు ఎక్కడనుండి వస్తాడో ఎవ్వరికీ తెలియదు. మరి ఈయనెక్కడి నుండి వచ్చాడో మనకందరికి తెలుసు!”
JOH 7:28 అప్పుడు యేసు మందిరంలో ఇంకను మాట్లాడుతూ ఉండినాడు. ఆయన బిగ్గరగా, “ఔను! నేనెవరినో మీకు తెలుసు. నేను స్వతహాగా యిక్కడికి రాలేదు నన్ను పంపించినవాడు సత్యవంతుడు. ఆయనెవరో మీకు తెలియదు.
JOH 7:29 కాని ఆయన నన్ను పంపాడు కాబట్టి ఆయన దగ్గర నుండి నేను యిక్కడికీ వచ్చాను. కాబట్టి ఆయనెవరో నాకు తెలుసు” అని అన్నాడు.
JOH 7:30 ఇది విని వాళ్ళు ఆయన్ని బంధించాలని ప్రయత్నించారు. కాని ఆయన సమయం యింకా రాలేదు కనుక ఆయన మీద ఎవ్వరూ చేయి వేయలేదు.
JOH 7:31 అక్కడున్న వాళ్ళలో చాలా మంది ఆయన్ని విశ్వసించారు. వాళ్ళు, “క్రీస్తు వచ్చినప్పుడు ఈయన కన్నా గొప్ప అద్భుతాలు చేస్తాడా?” అని అన్నారు.
JOH 7:32 ప్రజలు ఆయన్ని గురించి యిలా మాట్లాడు కోవటం పరిసయ్యులు విన్నారు. వాళ్ళు, ప్రధాన యాజకులు కలిసి ఆయన్ని బంధించటానికి భటుల్ని పంపారు.
JOH 7:33 కనుక యేసు ప్రజలతో, “నేను మీతో కొద్దికాలమే ఉంటాను. ఆ తర్వాత నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తాను.
JOH 7:34 నా కోసం మీరు వెతుకుతారు. కాని నన్ను కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు” అని అన్నాడు.
JOH 7:35 యూదులు తమలో తాము, “మనం కనుక్కోకుండా ఉండేటట్లు ఇతడు ఎక్కడికి వెళ్ళదలిచాడు? గ్రీకుల మధ్య నివసిస్తున్న మనవాళ్ళ దగ్గరకు వెళ్ళి గ్రీకులకు బోధిస్తాడా?
JOH 7:36 ‘నా కోసం వెతుకుతారు, కాని కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు’ అని అతడు అనటంలో అర్థమేమిటి?” అని మాట్లాడుకున్నారు.
JOH 7:37 పండుగ చివరి రోజు చాలా ముఖ్యమైనది. ఆ రోజు యేసు నిలుచుని పెద్ద గొంతుతో, “దాహం వేసినవాడు నా దగ్గరకు రావచ్చు. వచ్చి తన దాహం తీర్చుకోవచ్చు.
JOH 7:38 లేఖనాలు చెప్పినట్లు, నన్ను నమ్మిన వాని లోపలి నుండి జీవపు ఊటలు ప్రవహిస్తాయి” అని అన్నాడు.
JOH 7:39 అంటే, తనను నమ్మిన వాళ్ళకు ముందుగా లభించబోయే ఆత్మను గురించి ఈ మాటలు చెప్పాడు. ఆయన మహిమ పర్చబడలేదు. కనుక దేవుడు యింత వరకు ఆత్మను ఎవ్వరికీ యివ్వలేదు.
JOH 7:40 ఆయన మాటలు విన్నాక కొందరు, “ఈయన తప్పక ప్రవక్త అయివుండాలి” అని అన్నారు.
JOH 7:41 మరికొందరు, “ఈయన క్రీస్తు అయ్యి ఉండాలి” అని అన్నారు. కాని యితర్లు, “క్రీస్తు గలిలయనుండి ఎట్లావస్తాడు?
JOH 7:42 ఆయన దావీడు వంశంనుండి, దావీదు నివసించిన బేత్లెహేమునుండి వస్తాడని లెఖానాల్లో వ్రాసారు కదా!” అని అన్నారు.
JOH 7:43 యేసును బట్టి అక్కడున్న ప్రజలలో భేధాభిప్రాయం కలిగింది.
JOH 7:44 కనుక ఆయన్ని బంధించాలనుకున్నారు. కాని ఎవ్వరూ ఆయన పై చెయ్యి వెయ్యలేదు.
JOH 7:45 చివరకు భటులు ప్రధానయాజకుల దగ్గరకు, పరిసయ్యుల దగ్గరకు తిరిగి వెళ్ళిపొయ్యారు. వాళ్ళు ఆ భటుల్ని, “అతణ్ణెందుకు పిలుచుకొని రాలేదు?” అని అడిగారు.
JOH 7:46 వాళ్ళు, “అతడు మాట్లాడినట్లు ఇంత వరకు ఎవ్వరూ మాట్లాడలేదు!” అని అన్నారు.
JOH 7:47 పరిసయ్యులు, “అంటే! మిమ్మల్ని కూడా అతడు మోసం చేసాడా?
JOH 7:48 పాలకుల్లో కాని, పరిసయ్యుల్లో కాని అతణ్ణి నమ్మిన వాళ్ళెవ్వరూ లేరు.
JOH 7:49 ధర్మశాస్త్రాన్ని గురించి ఏమీ తెలియని ఆ ప్రజల మీద దేవుని శాపం ఉందన్నట్లే!” అని అన్నారు.
JOH 7:50 నీకొదేము వాళ్ళలో ఒకడు. ఇతడు ఇదివరలో యేసు దగ్గరకు వెళ్ళి వచ్చాడు.
JOH 7:51 అతడు, “మన ధర్మశాస్త్రం విచారణ చేయకుండా, అతని వాదన వినకుండా, అతడు చేసింది తేలుసుకోకుండా శిక్షవిధిస్తుందా?” అని అడిగాడు.
JOH 7:52 వాళ్ళు, “నీవు కూడా గలిలయవాడవా? ధర్మశాస్త్రాన్ని చదువు. ప్రవక్త గలిలయనుండి రాడని నీకే తెలుస్తుంది” అని సమాధానం చెప్పారు.
JOH 7:53 ఆ తర్వాత అందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళి పొయ్యారు.
JOH 8:1 యేసు మళ్ళీ ఒలీవల చెట్ల కొండ మీదికి వెళ్ళాడు.
JOH 8:2 సూర్యోదయం అవుతుండగా ఆయన మళ్ళీ మందిరంలో కనిపించాడు. అక్కడ ప్రజలు ఆయన చుట్టూ సమావేశమయ్యారు. వాళ్ళకు బోధించటానికి ఆయన కూర్చున్నాడు.
JOH 8:3 వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు కలిసి అక్కడికి తీసుకొని వచ్చారు. ఆమెను అందరి ముందు నిలుచో బెట్టి
JOH 8:4 యేసుతో, “బోధకుడా! ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది.
JOH 8:5 మోషే, ధర్మశాస్త్రంలో యిలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపుమని ఆజ్ఞాపించాడు. మీరేమంటారు?” అని అడిగారు.
JOH 8:6 ఆయన్ని పరీక్షించటానికి ఈ ప్రశ్న వేసారు. ఆయన్ని శిక్షించటానికి కారణం దొరుకుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. కాని యేసు వంగి, నేలపై తన వ్రేలితో వ్రాయటం మొదలు పెట్టాడు.
JOH 8:7 వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. యేసు తలెత్తి చూస్తూ, “మీలో పాపం చెయ్యనివాడు ఎవరైనా ఉంటే, అతడు ఆమెపై మొదటిరాయి విసర వచ్చు!” అని అన్నాడు.
JOH 8:8 ఇలా అన్నాక, మళ్ళీ క్రిందికి వంగి నేలపై వ్రాస్తూ ఉన్నాడు.
JOH 8:9 ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు.
JOH 8:10 యేసు తలెత్తి చూస్తూ, “వాళ్ళెక్కడమ్మా! నిన్నెవ్వరూ శిక్షించ లేదా?” అని అడిగాడు.
JOH 8:11 “లేదు ప్రభూ!” అని ఆమె అన్నది. “నేను కూడా శిక్ష విధించను. వెళ్ళు! ఇకనుండి పాపం చెయ్యకు!” అని అన్నాడు.
JOH 8:12 యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించినప్పుడు, “నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అనుసరించినవాళ్ళు అంధకారంలో నడవరు. వాళ్ళకు జీవితం యొక్క వెలుగు లభిస్తుంది” అని అన్నాడు.
JOH 8:13 పరిసయ్యులు సవాలు చేస్తూ, “నీ పక్షాన నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం పనికి రాదు” అని అన్నారు.
JOH 8:14 యేసు సమాధానం చెబుతూ, “నేను నా పక్షాన సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నమ్మవచ్చు. ఎందుకంటే, నేనెక్కడినుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కాని నేను ఎక్కడినుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు.
JOH 8:15 మీరు అందరి మానవులవలె తీర్పుచెబుతారు. నేను ఎవరిపైనా తీర్పు చెప్పను.
JOH 8:16 కాని నేను ఒక వేళ తీర్పు చెబితే నా తీర్పు సత్యసమ్మతమైనది. ఎందుకంటే, నేను ఒంటరిగా తీర్పు చెప్పటం లేదు. నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు.
JOH 8:17 ఇద్దరు కలసి సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని నమ్మవచ్చని మీ ధర్మశాస్త్రంలో వ్రాసారు.
JOH 8:18 నేను నా పక్షాన సాక్ష్యం చెబుతున్నాను. నా యింకొక సాక్షి నన్ను పంపిన ఆ తండ్రి” అని అన్నాడు.
JOH 8:19 అప్పుడు వాళ్ళు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. యేసు, “మీకు నేను ఎవరినో, నా తండ్రి ఎవరో తెలియదు. నేనెవరినో తెలిస్తే, నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు.
JOH 8:20 ఆయనీ విషయాలన్నీ మందిరంలో కానుకలు వేసే చోట నిలుచొని బోధిస్తూ మాట్లాడాడు. అయినా ఆయన్నెవరూ బంధించలేదు; కారణం? ఆయన ఘడియ యింకా రాలేదు!
JOH 8:21 యేసు మరొకసారి వాళ్ళతో, “నేను వెళ్తున్నాను. మీరు నా కోసం వెతుకుతారు. కాని నేను వెళ్ళేచోటికి మీరు రాలేరు. ఎందుకంటే మీరు మీ పాపాల్లో మరణిస్తారు” అని అన్నాడు.
JOH 8:22 యూదులు, “ఆత్మహత్య చేసుకొంటాడా? అందుకేనా, ‘నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు’ అని అంటున్నాడు” అని అన్నారు.
JOH 8:23 యేసు, “మీరు యిక్కడి వాళ్ళు. నేను పైనుండి వచ్చిన వాణ్ణి. మీరు ఈలోకపు వాళ్ళు. నేను ఈ లోకపు వాణ్ణి కాదు.
JOH 8:24 మీరు మీ పాపాలతో మరణిస్తారు” అని అన్నాడు.
JOH 8:25 వాళ్ళు, “అది సరే కాని, నీవెవరు?” అని అడిగారు. యేసు, “నేను యింతవరకు ఎవర్నని చెబుతున్నానో ఆయన్నే” అని అన్నాడు.
JOH 8:26 “నేను మీ తీర్పు విషయంలో ఎన్నో సంగతులు చెప్పగలను. కాని దానికి మారుగా నన్ను పంపిన వాని నుండి విన్న వాటిని మాత్రమే ప్రపంచానికి చెబుతున్నాను. ఆయన నమ్మదగినవాడు” అని అన్నాడు.
JOH 8:27 ఆయన తన తండ్రిని గురించి చెబుతున్నాడు. వాళ్ళు అర్థం చేసుకోలేదు.
JOH 8:28 అందువలన యేసు వాళ్ళతో, “మనుష్యకుమారుణ్ణి పైకి లేపినప్పుడు ఆయన నేనేనని మీరు తెలుసుకుంటారు. అంతేకాక స్వతహాగా నేను ఏమీ చెయ్యనని, నా తండ్రి బోధించిన వాటిని మాత్రమే చెబుతానని తెలుసుకుంటారు.
JOH 8:29 నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. నేను అన్ని వేళలా ఆయనకు యిష్టమైనవే చేస్తాను. కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలి వేయడు” అని అన్నాడు.
JOH 8:30 ఆయన చెప్పిన విషయాలు విని అనేకులు ఆయన విశ్వాసులైయ్యారు.
JOH 8:31 తనను నమ్మిన యూదులతో యేసు, “మీరు నా బోధనలు పాటిస్తే, మీరు నా నిజమైన శిష్యులు.
JOH 8:32 అప్పుడు మీరు సత్యాన్ని గురించి తెలుసు కుంటారు. ఆ సత్యమే మీకు స్వేచ్ఛ కలిగిస్తుంది” అని అన్నాడు.
JOH 8:33 వాళ్ళు, “మేము అబ్రాహాము వంశీయులం. మేమింతవరకు ఎవ్వరికి బానిసలుగా ఉండలేదు. మరి మాకు స్వేచ్ఛ కలుగుతుందని ఎందుకంటున్నావు?” అని అన్నారు.
JOH 8:34 యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పాపం చేసిన ప్రతి ఒక్కడూ పాపానికి బానిస ఔతాడు.
JOH 8:35 బానిసకు కుటుంబంలో శాశ్వతమైన స్థానం ఉండదు. కాని కుమారుడు శాశ్వతంగా ఆ యింటికి చెందినవాడు.
JOH 8:36 కుమారుడు స్వేచ్ఛ కలిగిస్తే మీకు నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది.
JOH 8:37 మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు. అయినా మీకు నా సందేశం నచ్చలేదు. కనుక నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు.
JOH 8:38 నేను నా తండ్రి సమక్షంలో చూసిన దాన్ని చెబుతున్నాను. మీరు మీ తండ్రి నుండి విన్నదాన్ని చేస్తున్నారు” అని అన్నాడు.
JOH 8:39 “అబ్రాహాము మా తండ్రి” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు, “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము చేసినట్లు చేసేవాళ్ళు!
JOH 8:40 నేను చేసిందల్లా దేవుని నుండి విన్న సత్యాన్ని చెప్పటమే! దానికి మీరు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము మీలా ప్రవర్తించలేదు.
JOH 8:41 మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు” అని అన్నాడు. వాళ్ళు, “మేము అక్రమంగా పుట్టలేదు. మాకు దేవుడొక్కడే తండ్రి” అని అన్నారు.
JOH 8:42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “దేవుడు మీ తండ్రి అయినట్లయితే నేను దేవునినుండి వచ్చానని నమ్మేవాళ్ళు. కనుక మీరు నన్ను ప్రేమించే వాళ్ళు. స్వతహాగా నేను యిక్కడికి రాలేదు. దేవుడే నన్ను పంపాడు.
JOH 8:43 మీరు నా సందేశం అంగీకరించటం లేదు కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు.
JOH 8:44 మీరు సైతానుకు చెందిన వాళ్ళు. వాడే మీ తండ్రి. మీ తండ్రి కోరికల్ని తీర్చడమే మీ అభిలాష. వాడు మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుసరించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ధమాడటం వాడి స్వభావము. కనుక వాడు అన్ని వేళలా అబద్ధమాడుతాడు. వాడు అబద్ధానికి తండ్రి.
JOH 8:45 “నేను నిజం చెప్పటంవల్ల మీరు నమ్మటంలేదు.
JOH 8:46 నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం చెబుతున్నాను కదా! నన్నెందుకు విశ్వసించరు.
JOH 8:47 దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.”
JOH 8:48 “నీవు సమరయ దేశస్థుడవని, నీకు దయ్యం పట్టిందని మేమనటంలో నిజం లేదా?” అని వాళ్ళు ప్రశ్నించారు.
JOH 8:49 యేసు, “నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తాను. మీరు నన్ను అగౌరవ పరుస్తున్నారు.
JOH 8:50 నేను నా కీర్తిని కోరటం లేదు. కాని నా కీర్తి కోరేవాడొకాయన ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతి.
JOH 8:51 ఇది నిజం. నా బోధ అనుసరించిన వాడు ఎన్నటికీ చావుచూడడు” అని అన్నాడు.
JOH 8:52 ఇది విని యూదులు బిగ్గరగా, “నీకు దయ్యం పట్టిందని మాకిప్పుడు తెలిసింది! అబ్రాహాము చనిపోయాడు. అలాగే ప్రవక్తలు చనిపోయారు. అయినా నీ బోధన అనుసరించిన వాడు చనిపోడని అంటున్నావు.
JOH 8:53 నీవు మా తండ్రి అబ్రాహాము కన్నాగొప్ప వాడవా? అతడు చనిపొయ్యాడు. ప్రవక్తలు కూడా చనిపొయ్యారు. నీ మనస్సులో నీవెవరవనుకుంటున్నావు?” అని అన్నారు.
JOH 8:54 యేసు, “నన్ను నేను పొగుడుకుంటే ఆ పొగడ్తకు అర్థం లేదు. నన్ను పొగిడేవాడు నా తండ్రి. ఆయన మీ దేవుడని మీరే అంటున్నారు.
JOH 8:55 ఆయన మీకు తెలియదు. కాని నాకాయన తెలుసు. ఆయన నాకు తెలియదని అంటే, నేను మీలాగే అబద్ధాలాడినట్లవుతుంది. కాని ఆయన నాకు తెలుసు. ఆయన మాట నేను పాటిస్తాను.
JOH 8:56 మీ తండ్రి అబ్రాహాము నా కాలాన్ని చూడగలనని గ్రహించిన వెంటనే ఆనందపడ్డాడు. అతడు చూశాడు: ఆనంద పడ్డాడు” అని అన్నాడు.
JOH 8:57 ఆ కారణంగా యూదులు, “నీకింకా యాభై ఏళ్ళైనా నిండలేదు. నీవు అబ్రాహామును చూసావా?” అని అన్నారు.
JOH 8:58 యేసు, “ఇది నిజం. అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను” అని అన్నాడు.
JOH 8:59 ఇది విని వాళ్ళు ఆయన్ని కొట్టాలని రాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. కాని యేసు వాళ్ళకు కనిపించకుండా దాక్కొని ఆ గుంపు నుండి వెళ్ళి పోయాడు.
JOH 9:1 ఆయన వెళ్తూ ఒక పుట్టు గ్రుడ్డి వాణ్ణి చూశాడు.
JOH 9:2 ఆయన శిష్యులు ఆయనతో, “రబ్బీ! యితడు గ్రుడ్డివానిగా పుట్టాడే! ఎవరు పాపం చేసారంటారు? ఇతడా లేక యితని తల్లిదండ్రులా?” అని అడిగారు.
JOH 9:3 యేసు, “ఇతడు కాని, యితని తల్లిదండ్రులు కాని పాపం చెయ్యలేదు! దేవుని శక్తి యితని జీవితం ద్వారా ప్రదర్శింపబడాలని గ్రుడ్డివానిగా పుట్టాడు.
JOH 9:4 సూర్యాస్తమయం అయ్యేలోగా మనం నన్ను పంపిన వాని కార్యం చేయాలి. రాత్రి రాబోతోంది. అప్పుడు ఎవ్వరూ పని చెయ్యలేరు.
JOH 9:5 ఈ ప్రపంచంలో నేను ఉన్నంత కాలం నేను దానికి వెలుగును” అని అన్నాడు.
JOH 9:6 ఈ విధంగా మాట్లాడి నేల మీద ఉమ్మి వేసాడు. ఆ ఉమ్మితో బురద చేసి, ఆ గ్రుడ్డివాని కళ్ళమీద పూసాడు.
JOH 9:7 అతనితో, “వెళ్ళి, సిలోయం కోనేట్లో కడుక్కో!” అని అన్నాడు. సిలోయం అన్న పదానికి అర్థం “పంపబడిన వాడు.” ఆ గ్రుడ్డివాడు వెళ్ళి తన కళ్ళు కడుక్కున్నాడు. అతనికి దృష్టి వచ్చాక తిరిగి వచ్చాడు.
JOH 9:8 అతని ఇరుగు, పొరుగు వాళ్ళు, అతడు భిక్షమెత్తు కుంటుండగా చూసిన వాళ్ళు, “ఈ మనిషి కూర్చొని భిక్షమెత్తు కుంటూవుండే వాడు కదా!” అని అన్నారు.
JOH 9:9 కొందరు, “ఔనన్నారు. మరికొందరు, కాదు ఇతడు అతనిలా కనిపిస్తున్నాడు, అంతే!” అని అన్నారు. కాని అతడు స్వయంగా, “నేనే అతణ్ణి” అని అన్నాడు.
JOH 9:10 “మరి అలాగైతే నీకు దృష్టి ఎట్లా వచ్చింది!” అని వాళ్ళు అడిగారు.
JOH 9:11 అతడు, “యేసు అని పిలుస్తారే ఆయన బురద చేసి నా కళ్ళ మీద పూసాడు. తర్వాత నన్ను వెళ్ళి సిలోయం కొనేరులో కడుక్కోమన్నాడు. నేను అలాగే వెళ్ళి కడుక్కున్నాను. ఆ తర్వాత నాకు దృష్టి వచ్చింది” అని సమాధానం చెప్పాడు.
JOH 9:12 వాళ్ళు, “అతడెక్కడ ఉన్నాడు?” అని అడిగారు. ఆయన, “నాకు తెలియదు” అని అన్నాడు.
JOH 9:13 వాళ్ళు యింతకు పూర్వం గ్రుడ్డివానిగా ఉన్న వాణ్ణి పరిసయ్యుల దగ్గరకు పిలుచుకు వచ్చారు.
JOH 9:14 బురద చేసి ఆ గ్రుడ్డివానికి నయం చేసింది విశ్రాంతి రోజు.
JOH 9:15 పరిసయ్యులు దృష్టి ఎట్లా వచ్చిందని అతణ్ణి ప్రశ్నించారు. అతడు, “ఆయన నా కళ్ళమీద బురద పూసాడు. నేను వెళ్ళి కడుక్కొన్నాను. నాకు దృష్టి వచ్చింది” అని అన్నాడు.
JOH 9:16 కొందరు పరిసయ్యులు, “అతడు విశ్రాంతి రోజును పాటించడు. కనుక అతడు దేవుని నుండి రాలేదు!” అని అన్నారు. మరికొందరు, “ఇతడు పాపాత్ముడైతే ఇలాంటి అద్భుతాలు చేయగలడా?” అని అన్నారు. అలా వారిలో వారికి వివాదం కలిగింది.
JOH 9:17 వాళ్ళు మళ్ళీ గ్రుడ్డివానితో, “నీవు అతని గురించి ఏమనుకొంటున్నావు” అని అడిగారు. “ఆయన ఒక ప్రవక్త!” అని ఆ నయమైన వాడు సమాధానం చెప్పాడు.
JOH 9:18 ఇదివరలో గ్రుడ్డివానిగా ఉన్నవాడు యితడేనని; యిప్పుడతనికి దృష్టి వచ్చిందని, అతని తల్లిదండ్రుల్ని పిలువనంపే దాకా యూదులు నమ్మలేదు.
JOH 9:19 అతని తల్లిదండ్రులతో, “ఇతడు మీ కుమారుడా! గ్రుడ్డి వానిగా జన్మించింది ఇతడేనా? ఇతడు ఇప్పుడెట్లా చూడగలుగుతున్నాడు?” అని అడిగారు.
JOH 9:20 అతని తల్లిదండ్రులు, “అతుడు మా కుమారుడని, గ్రుడ్డివానిగా జన్నించాడని మాకు తెలుసు.
JOH 9:21 కాని అతడు ఇప్పుడేవిధంగా చూడగలుగు తున్నాడో. అతనికి దృష్టి ఎవరిచ్చారో మాకు తెలియదు. అతణ్ణే అడగండి! తనను గురించి సమాధానం చెప్పుకోగల వయస్సు అతనికి ఉంది” అని అన్నారు.
JOH 9:22 యేసే, “క్రీస్తు” అన్న ప్రతి ఒక్కణ్ణి సమాజ మందిరం నుండి బహిష్కరించాలని యూదులు యిది వరకే నిశ్చయించారు. కనుక వాళ్ళకు భయపడి అతని తల్లిదండ్రులు ఈ విధంగా సమాధానం చెప్పారు.
JOH 9:23 అందుకే వాళ్ళు, “అతనికి వయస్సు వచ్చింది. అతణ్ణే అడగండి!” అని అన్నారు.
JOH 9:24 యూదులు గ్రుడ్డివానిగా ఉన్నవాణ్ణి రెండవసారి పిలువనంపారు. అతనితో, “దేవుణ్ణి స్తుతించు, అతణ్ణి కాదు. అతడు పాపాత్ముడని తెలుసు!” అని అన్నారు.
JOH 9:25 “ఆయన పాపాత్ముడో, కాదో నాకు తెలియదు. నాకు ఒకటి తెలుసు. నేనిదివరలో గ్రుడ్డి వాణ్ణి. ఇప్పుడు చూడగలుగుతున్నాను” అని అతడు సమాధానం చెప్పాడు.
JOH 9:26 “అతడు ఏమి చేసాడు? ఏ విధంగా నీకు దృష్టి కలిగించాడు?” అని వాళ్ళు అడిగారు.
JOH 9:27 అతుడు, “నేను యిది వరకే చెప్పాను. కాని మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలని అనుకుంటున్నారా?” అని అన్నాడు.
JOH 9:28 వాళ్ళు అతణ్ణి అవమానపరచారు. అతనితో, “నువ్వు అతని శిష్యుడివి. మేము మోషే శిష్యులము.
JOH 9:29 దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. ఇక ఇతని గురించా? ఇతడెక్కడినుండి వచ్చాడో కూడా మాకు తెలియదు” అని అన్నారు.
JOH 9:30 అతడు, “ఇది చాలా విచిత్రం. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియదు. అయినా ఆయన నాకు దృష్టి కలిగించాడు.
JOH 9:31 దేవుడు పాపాత్ముల మాటలు వినడని, తన ఆజ్ఞలను పాటిస్తున్న విశ్వాసుల మాటలు వింటాడని మాకు తెలుసు.
JOH 9:32 పుట్టు గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించటం ఇది వరకు ఎవ్వరూ వినలేదు.
JOH 9:33 ఇతడు దేవుని నుండి రానట్లైతే ఏమి చెయ్యలేకపొయ్యేవాడు” అని అన్నాడు.
JOH 9:34 ఇది విని వాళ్ళు, “నీవు పాపంలో పుట్టావు. పాపంలో పెరిగావు. మాకు ఉపదేశించటానికి నీకెంత ధైర్యం?” అని అంటూ అతణ్ణి వెలివేశారు.
JOH 9:35 అతణ్ణి వెలివేశారని యేసు విన్నాడు. యేసు అతణ్ణి కనుగొని, “నీవు మనుష్యకుమారుణ్ణి నమ్ముచున్నావా?” అని అడిగాడు.
JOH 9:36 ఆ వ్యక్తి, “ఆయనెవరో చెప్పండి ప్రభూ! విశ్వసిస్తాను!” అని అన్నాడు.
JOH 9:37 యేసు, “నీవు ఆయన్ని చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్నవాడాయనే!” అని అన్నాడు.
JOH 9:38 అతడు, “ప్రభూ! నేను నమ్ముతున్నాను!” అని అంటూ ఆయన ముందు మోకరిల్లాడు.
JOH 9:39 యేసు, “నేను తీర్పు చెప్పటానికి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఆ తీర్పేదనగా-గ్రుడ్దివాళ్ళు చూడగలగాలనీ, చూడగలమని అంటున్న వాళ్ళు గ్రుడ్డివాళ్ళు కావాలని నేను వచ్చాను” అని అన్నాడు.
JOH 9:40 ఆయనతో ఉండి ఆయనన్న మాటలు విన్న కొందరు పరిసయ్యులు, “మేము కూడా గ్రుడ్డివాళ్ళ మంటున్నావా?” అని అన్నారు.
JOH 9:41 యేసు, “మీరు గ్రుడ్డి వాళ్ళైనట్లైతే మిమ్ములను దోషులుగా పరిగణించవలసిన అవసరం ఉండదు. కాని మీరు చూడగలము అంటున్నారు. కనుక మిమ్మల్ని దోషులనవలిసిందే!” అని అన్నాడు.
JOH 10:1 యేసు, “ఇది నిజం. గొఱ్ఱెల దొడ్డిలోకి తలుపు ద్వారా వెళ్ళకుండా గోడనెక్కి వెళ్ళేవాడు దొంగ, దోపిడిగాడు.
JOH 10:2 తలుపు ద్వారా ప్రవేశించేవాడు ఆ గొఱ్ఱెలకు కాపరి.
JOH 10:3 ద్వారపాలకుడు అతని కోసం తలుపు తెరుస్తాడు. గొఱ్ఱెలు అతని స్వరము గుర్తిస్తాయి. ఆ గొఱ్ఱెలు అతనివి. అతడు ఆ గొఱ్ఱెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి తీసుకొని వెళ్తాడు.
JOH 10:4 తన గఱ్ఱెల్ని వెలుపలికి పిలుచుకొని వచ్చాక అతడు ముందు నడుస్తాడు. వాటికి అతని స్వరం తెలుసు కనుక అవి అతణ్ణి అనుసరిస్తాయి.
JOH 10:5 అవి క్రొత్త వాని వెంట వెళ్ళవు. క్రొత్త వాని స్వరం గుర్తుపట్టలేవు. కనుక పారిపోతాయి.” అని అన్నాడు.
JOH 10:6 యేసు ఈ ఉపమానం ఉపయోగించి బోధించాడు. కాని వాళ్ళకు ఆయనేమి చెబుతున్నాడో అర్థం కాలేదు.
JOH 10:7 అందువల్ల యేసు మళ్ళీ ఈవిధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “నిజంగా నేను గొఱ్ఱెలకు ద్వారాన్ని.
JOH 10:8 నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు దొంగలు, దోపిడిగాళ్ళు. కనుక గొఱ్ఱెలు వాళ్ళ మాటలు వినలేదు.
JOH 10:9 నేను ద్వారాన్ని. నా ద్వారా ప్రవేశించిన వాళ్ళు రక్షింపబడతారు. వాళ్ళు స్వేచ్ఛతో లోపలికి వస్తూ పోతూ ఉంటారు. ఆ గొఱ్ఱెలకు పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి.
JOH 10:10 దొంగ దొంగతనం చేయటానికి, చంపటానికి, నాశనం చేయటానికి వస్తాడు. నేను వాళ్ళకు క్రొత్త జీవితం ఇవ్వాలని వచ్చాను. ఆ క్రొత్త జీవితం సంపూర్ణమైనది.
JOH 10:11 “మంచి కాపరి గొఱ్ఱెల కోసం చావటానికి కూడా సిద్ధమౌతాడు. నేను ఆ మంచి కాపరిని.
JOH 10:12 కూలి కోసం పనిచేసే వాడు కాపరికాడు. గొఱ్ఱెలు అతనివి కావు. కనుక అతడు తోడేళ్ళు రావటం చూస్తే గొఱ్ఱెల్ని వదిలి పారిపోతాడు. అప్పుడు తోడేళ్ళు వచ్చి మంద మీద పడి వాటిని చెదరగొడతాయి.
JOH 10:13 అతడు కూలి కొరకు పని చేసేవాడు కాబట్టి గొఱ్ఱెల క్షేమం చూడడు.
JOH 10:14 “నేను మంచి కాపరిని. నా తండ్రికి నన్ను గురించి, నాకు నా తండ్రిని గురించి తెలుసు. అదే విధంగా నాకు నా గొఱ్ఱెల్ని గురించి, నా గొఱ్ఱెలకు నా గురించి తెలుసు. నా గొఱ్ఱెల కోసం నేను ప్రాణం ఇస్తాను.
JOH 10:16 ఈ మందకు చెందని గొఱ్ఱెలు కొన్ని ఉన్నాయి. అవికూడా నావే. వాటిని కూడా నేను తీసుకొని రావాలి. అవి నా మాట వింటాయి. అప్పుడు అన్నీ ఒకే మందగా ఉంటాయి. ఒకే ఒక కాపరి ఉంటాడు.
JOH 10:17 నేను నా ప్రాణం యివ్వటానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని తిరిగి పొందడానికి శక్తిమంతుడను. కనుకనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు.
JOH 10:18 నా ప్రాణాన్ని నానుండి ఎవ్వరూ తీసుకోలేరు. నేను స్వయంగా నా ప్రాణం యిస్తాను. నా ప్రాణం యివ్వటానికి, తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. అది నా తండ్రి ఆజ్ఞ.”
JOH 10:19 ఈ మాటల వల్ల యూదుల్లో తిరిగి చీలికలు వచ్చాయి.
JOH 10:20 చాలా మంది, “దయ్యం పట్టి అతనికి బాగా పిచ్చెక్కింది. అతని మాటలెందుకు వినటం?” అని అన్నారు.
JOH 10:21 కాని మరికొందరు, “అవి దయ్యం పట్టినవాని మాటలు కావు. దయ్యం గ్రుడ్డి వాళ్ళకు ఎట్లా దృష్టిని కలిగించగలదు?” అని అన్నారు.
JOH 10:22 ఆలయ ప్రతిష్టిత అనే పండుగ యెరూషలేములో జరుగుతూంది.
JOH 10:23 అది చలికాలం. యేసు మందిరావరణంలో సొలొమోను మంటపం దగ్గర నడుస్తూవున్నాడు. యూదులు ఆయన చుట్టూ గుమికూడారు.
JOH 10:24 వాళ్ళు, “నీవు మమ్మల్ని ఎంతకాలం సందేహంలో ఉంచుతావు? నీవు క్రీస్తువయినట్లైతే దాచకుండా చెప్పు” అని అన్నారు.
JOH 10:25 యేసు, “ఆ విషయం నేను ఇది వరకే చెప్పాను. కాని మీరు నమ్మటం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న అద్భుతాలే నేను ఎవరన్న దానికి రుజువు.
JOH 10:26 కాని మీరు నా మందకు చెందిన వాళ్ళు కాదు. కాబట్టి నన్ను విశ్వసించటం లేదు.
JOH 10:27 నా గొఱ్ఱెలు నా మాట గుర్తిస్తాయి. నాకు వాటిని గురించి తెలుసు. అవి నన్ను అనుసరిస్తాయి.
JOH 10:28 వాటికి నేను అనంత జీవితం యిస్తాను. అవి ఎన్నటికీ మరణించవు. వాటిని నా అండ నుండి ఎవ్వరూ తీసుకొని పోలేరు.
JOH 10:29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరి కన్నా గొప్పవాడు. నా తండ్రి అండనుండి వాటిని ఎవ్వరూ తీసుకొని పోలేరు.
JOH 10:30 నేను, నా తండ్రి ఒకటే!” అని అన్నాడు.
JOH 10:31 యూదులు ఆయన్ని కొట్టాలని మళ్ళీ రాళ్ళెత్తారు.
JOH 10:32 కాని యేసు వాళ్ళతో, “నేను నా తండ్రి చేయుమన్న ఎన్నో మంచి పనులు చేసాను. వీటిలో దేన్ని చేసినందుకు మీరు నన్ను కొట్టాలనుకుంటున్నారు?” అని అన్నాడు.
JOH 10:33 యూదులు, “నీవు మంచి పనులు చేసినందుకు రాళ్ళు రువ్వటం లేదు కాని, నీవు దైవదూషణ చేస్తున్నందుకు. మనిషివై దేవుణ్ణి అని అంటున్నందుకు నిన్ను చంపదలచాము” అని అన్నారు.
JOH 10:34 యేసు సమాధానంగా, “మీ ధర్మశాస్త్రంలో, ‘మీరు దేవుళ్ళని’ దేవుడు అన్నట్లు వ్రాయబడి ఉంది.
JOH 10:35 మీ ధర్మశాస్త్రం అసత్యం చెప్పదు. దేవుడు తన సందేశం విన్న ప్రజల్ని దేవుళ్ళుగా అన్నాడు.
JOH 10:36 తండ్రి నన్ను ఎన్నుకొని తన కార్యం చెయ్యటానికి ఆ ప్రపంచంలోకి పంపాడు. మరి నేను దేవుని కుమారుణ్ణి అని అనటం ఆయన్ని దూషించటం ఎట్లా ఔతుంది?
JOH 10:37 నేను, నా తండ్రి కార్యం చేస్తే తప్ప నన్ను విశ్వసించకండి.
JOH 10:38 నేను నా తండ్రి కార్యాన్ని చేసాను. కనుక మరి నన్ను విశ్వసించకపోయినా కనీసం నా కార్యన్ని విశ్వసించండి. అలా చేస్తే నా తండ్రి నాలో ఉన్నాడని, నేను నా తండ్రిలో ఉన్నానని మీకు స్పష్టంగా తెలిసిపోతుంది” అని అన్నాడు.
JOH 10:39 ఆయన్ని బంధించాలని వాళ్ళు మరొక సారి ప్రయత్నించారు. కాని ఆయన అక్కడ నుండి వెళ్ళి పోయాడు.
JOH 10:40 యేసు మళ్ళీ యొర్దాను నది యొక్క అవతలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉండిపొయ్యాడు. ఇదివరలో యోహాను బాప్తిస్మము నిచ్చింది ఇక్కడే.
JOH 10:41 అనేకులు ఆయన దగ్గరకు వచ్చారు. “వాళ్ళు యోహాను ఏ మహాత్యం చెయ్యలేదు. కాని ఈయన్ని గురించి అతను చెప్పిన ప్రతీ విషయం నిజం” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
JOH 10:42 అక్కడ అనేకులు యేసును విశ్వసించారు.
JOH 11:1 బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, ఆమె సోదరి మార్త కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళు.
JOH 11:2 ఒకప్పుడు ప్రభువు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది ఈ మరియయే! జబ్బుతో ఉండిన లాజరు మరియ సోదరుడు.
JOH 11:3 ఈ స్త్రీలు, “ప్రభూ! మీరు ప్రేమిస్తున్న లాజరు జబ్బుతో ఉన్నాడు” అన్న వార్త యేసుకు పంపారు.
JOH 11:4 యేసు, విని, “ఈ జబ్బు చంపటానికి రాలేదు. దేవుని కుమారునికి మహిమ కులుగచేసి తద్వారా దేవుని మహిమను ప్రకటించటానికి వచ్చింది” అని అన్నాడు.
JOH 11:5 యేసుకు మార్త పట్ల, ఆమె సోదరి పట్ల, లాజరు పట్ల ప్రేమ ఉంది.
JOH 11:6 లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు విన్నాడు. అక్కడ రెండురోజులు ఉండి,
JOH 11:7 ఆ తర్వాత తన శిష్యులతో, “మనమంతా యూదయకు తిరిగి వెళ్దాం” అని అన్నాడు.
JOH 11:8 వాళ్ళు, “కాని రబ్బీ! యింతకు ముందే యూదులు మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలని ప్రయత్నించారు. అయినా మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారా?” అని అడిగారు.
JOH 11:9 యేసు, “దినానికి పన్నెండు గంటలు వెలుతురుంటుంది. పగటి వేళ నడిచేవాడు ప్రపంచం యొక్క వెలుగు చూస్తుంటాడు. కనుక క్రిందపడడు.
JOH 11:10 రాత్రి వేళ నడిచే వానిలో వెలుగు ఉండదు. కనుక క్రిందపడతాడు” అని అన్నాడు.
JOH 11:11 ఈ విషయాలు చెప్పాక యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి నిద్రనుండి లేపటానికి నేను అక్కడికి వెళ్తున్నాను.”
JOH 11:12 ఆయన శిష్యులు, “ప్రభూ! నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటాడు” అని అన్నారు.
JOH 11:13 యేసు మాట్లాడింది అతని చావును గురించి. కాని ఆయన శిష్యులు ఆయన సహజమైన నిద్రను గురించి మాట్లాడుతున్నాడనుకున్నారు.
JOH 11:14 అప్పుడు యేసు స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.
JOH 11:15 నేనక్కడ లేనిది మంచిదైంది. మీ కోసమే అలా జరిగింది. మీరు నమ్మాలని నా ఉద్దేశ్యం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం” అని అన్నాడు.
JOH 11:16 దిదుమ అని పిలువబడే తోమా, మిగతా శిష్యులతో, “యేసుతో కలిసి చనిపోవటానికి మనం కూడా ఆయన వెంట వెళ్దాం” అని అన్నాడు.
JOH 11:17 యేసు అక్కడికి చేరుకున్నాడు. నాలుగు రోజుల ముందే లాజరు సమాధి చేయబడ్డాడని ఆయనకు తెలిసింది.
JOH 11:18 బేతనియ, యెరూషలేమునకు సుమారు రెండు మైళ్ళ దూరంలో ఉంటుంది.
JOH 11:19 చాలా మంది యూదులు మార్తను, మరియను వాళ్ళ సోదరుడు చనిపోయినందుకు ఓదార్చటానికి వచ్చారు.
JOH 11:20 యేసు వస్తున్నాడని విని మార్త ఆయన్ని కలుసుకోవటానికి వెళ్ళింది. కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.
JOH 11:21 మార్త యేసుతో, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయే వాడు కాదు.
JOH 11:22 కాని, యిప్పటికైనా మీరడిగితే దేవుడు మీరడిగింది యిస్తాడని నాకు తెలుసు” అని అన్నది.
JOH 11:23 యేసు ఆమెతో, “మీ సోదరుడు మళ్ళీ బ్రతికివస్తాడు” అని అన్నాడు.
JOH 11:24 మార్త, “చివరి రోజున అనగా అందరూ బ్రతికి వచ్చే రోజున అతడూ బ్రతికి వస్తాడని నాకు తెలుసు” అని సమాధానం చెప్పింది.
JOH 11:25 యేసు, “బ్రతికించే వాణ్ణి, బ్రతుకును నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా జీవిస్తాడు.
JOH 11:26 జీవిస్తున్నవాడు నన్ను విశ్వసిస్తే ఎన్నటికి మరణించడు. ఇది నీవు నమ్ముతున్నావా?” అని అడిగాడు.
JOH 11:27 ఆమె, “నమ్ముతున్నాను ప్రభూ! మీరు క్రీస్తు అని, ఈ ప్రపంచంలోకి వచ్చిన దేవుని కుమారుడవని నమ్ముతున్నాను” అని అన్నది.
JOH 11:28 ఈ విధంగా అన్న తర్వాత యింటికి వెళ్ళి తన సోదరి మరియను ప్రక్కకు పిలిచి, ఆమెతో, “బోధకుడు వచ్చాడు. నీ కొరకు అడుగుతున్నాడు” అని అన్నది.
JOH 11:29 మరియ యిది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళింది.
JOH 11:30 యేసు గ్రామంలోకి రాలేదు. ఆయనింకా మార్త కులుసుకొన్న చోటే ఉన్నాడు.
JOH 11:31 మరియ యింట్లో ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె హడావుడిగా లేచి బయటకు వెళ్ళటం చూసారు. ఆమె దుఃఖించటానికి సమాధి దగ్గరకు వెళ్తోందని ఆమె వెంట వెళ్ళారు.
JOH 11:32 మరియ యేసు ఉన్న చోటికి వెళ్ళి ఆయన్ని చూసి, కాళ్ళ ముందుపడి, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు!” అని అన్నది.
JOH 11:33 ఆమె, ఆమెతో వచ్చిన యూదులు దుఃఖించటం చూసి యేసు తన ఆత్మలో కలవర పడ్డాడు. ఆయన హృదయం కరిగి పోయింది.
JOH 11:34 “అతన్నెక్కడ సమాధిచేసారు?” అని యేసు అడిగాడు. “వచ్చి చూడండి ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
JOH 11:35 యేసు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
JOH 11:36 అప్పుడు యూదులు, “యేసు అతన్నెంతగా ప్రేమించాడో చూడండి!” అని అన్నారు.
JOH 11:37 కాని కొందరు, “గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించిన యితడు, చనిపోకుండా చెయ్యలేక పోయాడా?” అని అన్నారు.
JOH 11:38 యేసు హృదయం మళ్ళీ కదిలింది. ఆయన సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమాధి ఒక గుహలా ఉంది. ఒక రాయి దానికి అడ్డంగా పెట్టబడి ఉంది.
JOH 11:39 “ఆ రాయి తీసి వెయ్యండి!” అని అన్నాడు. చనిపోయిన వాని సోదరి మార్త, “కాని, ప్రభూ! అతని దేహం నాలుగు రోజులనుండి అక్కడవుంది. యిప్పటికది కంపు కొడ్తూ ఉంటుంది” అని అన్నది.
JOH 11:40 అప్పుడు యేసు, “నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా?” అని అన్నాడు.
JOH 11:41 వాళ్ళు ఆ రాయి తీసి వేసారు. యేసు పైకి చూసి, “తండ్రి నీవు నా మాటలు విన్నందుకు కృతజ్ఞుణ్ణి.
JOH 11:42 నా మాటలు అన్ని వేళలా వింటావని నాకు తెలుసు. నీవు నన్ను పంపించినట్లు వీళ్ళు నమ్మాలని, వీళ్ళకు అర్థం కావాలాని అక్కడ నిలుచున్న వాళ్ళ మంచి కోసం యిలా అంటున్నాను” అని అన్నాడు.
JOH 11:43 ఈ విధంగా అన్నాక యేసు పెద్ద స్వరంతో, “లాజరూ! వెలుపలికి రా!” అని పిలిచాడు.
JOH 11:44 చినిపోయిన వాడు వెలుపలికి వచ్చాడు. అతని కాళ్ళు చేతులు వస్త్రాలతో చుట్టబడి ఉన్నాయి. అతని ముఖం మీద కూడా ఒక గుడ్డ కట్టబడి ఉంది. యేసు వాళ్ళతో, “సమాధి దుస్తుల్ని తీసి వేయండి, అతణ్ణి వెళ్ళనివ్వండి!” అని అన్నాడు.
JOH 11:45 మరియ దగ్గరకు వచ్చిన యూదుల్లో చాల మంది యేసు చేసింది చూసి ఆయన యందు నమ్మకం ఉంచారు.
JOH 11:46 కొందరు మాత్రం పరిసయ్యుల దగ్గరకు వెళ్ళి యేసు చేసింది చెప్పారు.
JOH 11:47 అప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను ఏర్పాటు చేసారు. “మనం ఏం చేద్దాం? ఈ మనుష్యుడు చాలా మహాత్కార్యాలు చేస్తున్నాడు.
JOH 11:48 అతణ్ణి ఈ విధంగా వదిలి వేస్తే ప్రతి ఒక్కడు అతని శిష్యుడవుతాడు. ఆ తర్వాత రోమనులు వచ్చి మన మందిరాన్ని, మన దేశాన్ని నాశనం చేస్తారు” అని అన్నారు.
JOH 11:49 వాళ్ళలో ఒకడైన కయప అనబడే వాడు, “మీకేమీ తెలియదు!” అని అన్నాడు. కయప ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడు.
JOH 11:50 అతడు యింకా, “దేశమంతా నాశనం కావటానికన్నా ప్రజల కోసం ఒక మనిషి చావటం మంచిది. ఇది మీకు అర్థం కాదా?” అని అన్నాడు.
JOH 11:51 యూదుల దేశం కోసమేకాక, ప్రపంచంలో చెదిరియున్న దేవుని ఇతర జనాంగములను ఒకటిగా చేయటానికి కూడా యేసు ప్రాణమిస్తాడని కయప ప్రవచనం చెప్పాడు. అవి అతడు స్వయంగా ఆడిన మాటలు కావు. అవి అతడు ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా పలికిన మాటలు.
JOH 11:53 ప్రధాన యాజకుని మాటలు విని ప్రజలు ఆనాటి నుండి యేసును చంపటానికి పన్నాగాలు పన్నటం మొదలు పెట్టారు.
JOH 11:54 అందువల్ల యేసు యూదుల మధ్య బహిరంగంగా తిరగటం మానేసి వాళ్ళకు దూరంగా ఎడారి దగ్గర ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామానికి వెళ్ళి పోయాడు. అక్కడ ఆయన తన శిష్యులతో కొంత కాలం గడిపాడు.
JOH 11:55 యూదుల పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. పండుగకు ముందు శుద్ధి చేసుకోవటానికి గ్రామ గ్రామాలనుండి చాలా మంది ప్రజలు యెరూషలేముకు వెళ్ళారు.
JOH 11:56 అక్కడ వీళ్ళంతా యేసు కోసం వెతికారు. మందిరంలో సమావేశం అయ్యాక వాళ్ళు, “మీరేమనుకుంటున్నారు? పండుగకు వస్తాడా? రాడా?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు.
JOH 11:57 ప్రధానయాజకులు, పరిసయ్యులు, “యేసు ఎక్కడున్న విషయం తెలిసినవాడు వెంటనే తమకు తెలియచెయవలెనని” ఒక ఆజ్ఞ ప్రకటించారు. యేసును బంధించాలని వాళ్ళ ఉద్దేశ్యం.
JOH 12:1 పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు బేతనియ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు యింతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు.
JOH 12:2 అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు.
JOH 12:3 మరియ జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి, తన తల వెంట్రుకలతో పాదాలను తుడుచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది.
JOH 12:4 యూదా ఇస్కరియోతు యేసు శిష్యుల్లో ఒక్కడు. యేసుకు ద్రోహం చెయ్యబోయేవాడు వీడే. యూదా, “ఈ అత్తరు అమ్మి, ఆ డబ్బు పేద వాళ్ళ కెందుకివ్వలేదు. ఆ అత్తరు వెల మూడువందల దేనారా లన్నా ఉంటుంది కదా!” అని అన్నాడు.
JOH 12:6 యూదాకు పేద వాళ్ళపై కనికరం ఉండుటవలన యిలా అనలేదు. వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటంవల్ల దానిలోవున్న డబ్బు దొంగలించే వాడు.
JOH 12:7 యేసు, “ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి సిద్ధం చెయ్యటానికి ఈనాటి దాకా దాన్ని దాచి ఉంచింది.
JOH 12:8 మీతో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను” అని అన్నాడు.
JOH 12:9 ఇంతలో పెద్ద యూదుల గుంపు ఒకటి యేసు అక్కడవున్నాడని విని అక్కడికి వచ్చింది. ఆయన కోసమే కాకుండా ఆయన బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వచ్చారు.
JOH 12:10 తద్వారా ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని పన్నాగం పన్నారు. ఎందుకంటే యితని కారణంగానే చాలామంది యూదులు యేసు దగ్గరకు వెళ్ళి ఆయన యందు నమ్మకం ఉంచారు.
JOH 12:12 మరుసటి రోజు పండుగ కోసం వచ్చిన గుంపు ఒకటి యేసు యెరూషలేంలోకి వస్తున్నాడని విన్నది.
JOH 12:13 వాళ్ళు ఖర్జూరపు మట్టల్ని పట్టుకొని, “హోసన్నా! ప్రభూవు పేరిట వచ్చిన ఇశ్రాయేలు రాజు ధన్యుడు!” అని కేకలు వేస్తూ ఆయన్ని కలవటానికి వచ్చారు.
JOH 12:14 యేసు ఒక గాడిద పిల్లను కనుగొని దానిపై కూర్చున్నాడు. ఈ సందర్భాన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
JOH 12:15 “సీయోను కుమారీ, భయపడకు! గాడిద పిల్లపై కూర్చొని నీ రాజు వస్తున్నాడు చూడు!”
JOH 12:16 ఇవి ఆయన శిష్యులకు అప్పుడు అర్థంకాలేదు. కాని యేసు మహిమ పొందిన తర్వాత ప్రవక్తలు ఆయన్ని గురించి వ్రాశారని గుర్తించారు. అంతేగాక తాము చేసిన వాటిని గురించి అర్థం చేసుకొన్నారు.
JOH 12:17 యేసు లాజరును సమాధినుండి లేచి రమ్మని పిలవటము, అతణ్ణి బ్రతికించటము చూసిన ప్రజలు ఆవార్త ప్రచారం చేసారు.
JOH 12:18 చాలా మంది ఆయన ఈ అద్భుతాన్ని చేసాడని విన్నందువలన ఆయన్ని కలుసు కోవటానికి వెళ్ళారు.
JOH 12:19 అందువలన పరిసయ్యులు పరస్పరం, “చూడండి! మనం గెలవటం లేదు. ప్రపంచమంతా అతని వెంట ఎట్లా వెళ్తున్నారో చూడండి!” అని మాట్లాడుకున్నారు.
JOH 12:20 పండుగ రోజు ఆరాధన చెయ్యటానికి వెళ్ళిన వాళ్ళల్లో గ్రీకులు కూడా ఉన్నారు.
JOH 12:21 వాళ్ళు ఫిలిప్పును కలుసుకొని, “అయ్యా! మేము యేసును చూడటానికి వచ్చాము” అని అన్నారు. ఫిలిప్పు, గలిలయలోని బేత్సయిదా అనే గ్రామానికి చెందిన వాడు.
JOH 12:22 ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. వీళ్ళిద్దరూ వెళ్ళి యేసుతో చెప్పారు.
JOH 12:23 యేసు ఇలా అన్నాడు: “మనుష్యకుమారుడు మహిమపొందు గడియ దగ్గరకు వచ్చింది.
JOH 12:24 ఇది నిజం. గోధుమ విత్తనం భూమ్మీద పడి చనిపోకపోతే అది ఒకటిగానే ఉంటుంది. అది చనిపోతే ఎన్నో విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది.
JOH 12:25 తన ప్రాణాన్ని ప్రేమించే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని ఈ ప్రాపంచిక జీవితాన్ని ఏవగించుకొన్నవాడు తన ప్రాణాన్ని కాపాడు కొంటాడు. పైగా అనంతజీవితం పొందుతాడు.
JOH 12:26 నా సేవ చేయదలచిన వాడు నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా సేవ చేసేవాణ్ణి నా తండ్రి గౌరవిస్తాడు.
JOH 12:27 “ఇక నా ఆత్మ కలవరం చెందుతున్నది. తండ్రీ నేనేమనాలి? ఈ గడియనుండి నన్ను రక్షించుమని అడగాలా? కాదు! నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా!
JOH 12:28 తండ్రీ నీ పేరుకు మహిమ కలిగించుకో.” అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను యిదివరలో నా పేరుకు మహిమ కలిగించాను. మళ్ళీ దానికి మహిమ కలిగిస్తాను!” అని అన్నది.
JOH 12:29 అక్కడ నిలుచున్న ప్రజలు యిది విన్నారు. కొందరు ఉరిమిందన్నారు. మరి కొందరు, “దేవదూత ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు.
JOH 12:30 యేసు, “ఆ గొంతు మీ కోసం పలికింది. నా కోసం కాదు.
JOH 12:31 ఈ ప్రపంచంపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. ఈ లోకాధికారిని బయటకు తరిమి వేసే సమయం వచ్చింది.
JOH 12:32 కాని దేవుడు నన్ను ఈ భూమ్మీదినుండి పైకెత్తినప్పుడు నేను ప్రజలందర్ని నా యొద్దకు ఆకర్షిస్తాను. వాళ్ళను నా దగ్గరకు పిలి పించుకుంటాను” అని అన్నాడు.
JOH 12:33 ఇది చెప్పి తాను ఏ విధంగా మరణించనున్నాడో సూచించాడు.
JOH 12:34 ప్రజలు, “మేము ధర్మశాస్త్రం ద్వారా ‘క్రీస్తు’ చిరకాలం ఉంటాడని విన్నాము. అలాంటప్పుడు మనుష్యకుమారుణ్ణి దేవుడు పైకెత్తుతాడని ఎట్లా అనగలుగుతున్నావు? ఈ మనుష్యకుమారుడెవరు?” అని అన్నారు.
JOH 12:35 అప్పుడు యేసు వాళ్ళతో, “వెలుగు మీకోసం యింకా కొంత కాలం మాత్రమే ఉంటుంది. చీకటి రాకముందే, అంటే వెలుగు ఉండగానే ప్రయాణం సాగించండి. చీకట్లో నడిచే వ్యక్తికి తానెక్కడికి వెళుతున్నాడో తెలియదు.
JOH 12:36 వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వసించండి. అప్పుడు మీరు వెలుగు యొక్క సంతానంగా లెక్కింపబడతారు” అని అన్నాడు. యేసు మాట్లాడటం ముగించాక వాళ్ళకు కనిపించకుండా ఉండాలని దూరంగా వెళ్ళిపోయాడు.
JOH 12:37 యేసు ఇన్ని మహాత్కార్యాలు వాళ్ళ సమక్షంలో చేసినా వాళ్ళలో ఆయన పట్ల విశ్వసం కలుగలేదు.
JOH 12:38 ప్రవక్త యెషయా చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి యిలా జరిగింది: “ప్రభూ! మా సందేశం ఎవరు విశ్వసించారు? ప్రభువు తన శక్తిని ఎవరికి చూపాడు?”
JOH 12:39 అందుచేత వాళ్ళు విశ్వసించలేక పోయారు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త మరొక చోట చెప్పినది నెరవేరునట్లు యిలా జరిగింది:
JOH 12:40 “ప్రభువు వాళ్ళ కళ్ళు కప్పి, వాళ్ళ హృదయాలు మూసి వేశాడు. వాళ్ళు చూడరాదని, వాళ్ళు అర్థం చేసుకోరాదని ఆయన ఉద్దేశ్యం. అలా చేయకపోతే వాళ్ళు నా వైపు మళ్లుతారు వాళ్ళకు నేను నయం చేయవలసివస్తుంది.”
JOH 12:41 యెషయా యేసు మహిమను చూసాడు. కనుకనే ఆయన్ని గురించి ఆ విధంగా మాట్లాడాడు.
JOH 12:42 ఈ పరిస్థితుల్లో కూడా యూదుల నాయకుల్లో కొందరు యేసును విశ్వసించారు. కాని పరిసయ్యులు తమను సమాజం నుండి బహిష్కరిస్తారనే భయం వల్ల ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు.
JOH 12:43 ఎందుకంటే, వీళ్ళకు దేవుని మెప్పుకన్నా ప్రజల పొగడ్తలంటే ఎక్కవ యిష్టం.
JOH 12:44 యేసు, “నన్ను విశ్వసించేవాడు, నన్నే కాక నన్ను పంపిన వానియందు కూడా విశ్వసిస్తాడు.
JOH 12:45 అతడు నన్ను చూసేటప్పుడు నన్ను పంపిన వానిని చూస్తున్నట్లే!
JOH 12:46 నేను ఈ ప్రపంచంలోకి వెలుగ్గా వచ్చాను! ఎందుకంటే నన్ను విశ్వసించేవాడు చీకటిలో ఉండ కూడదని. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రీ నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే.
JOH 12:47 “ఎవడైనను నా మాటలు విని వాటిని అనుసరించని వానికి నేను తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ ప్రపంచానికి తీర్పు తీర్చటానికి రాలేదు, కాని నేను రక్షించటానికి వచ్చాను.
JOH 12:48 నన్ను, నా మాటల్ని ఇష్టపడక వ్యతిరేకించేవానిపై ఒక న్యాయాధిపతి ఉన్నాడు. నేను పలికిన మాటయే చివరి దినమున వానికి తీర్పుతీరుస్తుంది.
JOH 12:49 నేను నా యిష్ట ప్రకారం మాట్లాడలేదు, గాని నా తండ్రి ఏమి చెప్పుమని నాకు ఆజ్ఞాపించాడో అలాగే చెప్పాను.
JOH 12:50 ఆయన ఆజ్ఞ నిత్య జీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రి నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే” అని అన్నాడు.
JOH 13:1 పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని వదిలి తన తండ్రి దగ్గరకు వెళ్ళే సమయం వచ్చిందని యేసుకు తెలుసు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న తన వాళ్ళను ప్రేమించాడు. తాను వాళ్ళనెంత సంపూర్ణంగా ప్రేమించాడంటే ఆ ప్రేమను వాళ్ళకు చూపించాడు.
JOH 13:2 యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయుటకు కూర్చొని ఉన్నారు. సైతాను అప్పటికే సీమోను కుమారుడైన యూదా ఇస్యరియోతులో ప్రవేశించి యేసుకు ద్రోహం చెయ్యమని ప్రేరేపించాడు.
JOH 13:3 తండ్రి తనకు సంపూర్ణమైన అధికారమిచ్చినట్లు యేసుకు తెలుసు. తాను దేవుని నుండి వచ్చిన విషయము, తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళ బోతున్న విషయము ఆయనకు తెలుసు.
JOH 13:4 అందువల్ల ఆయన భోజన పంక్తి నుండి లేచాడు. తన పైవస్త్రాన్ని తీసివేసి, ఒక కండువాను నడుముకు చుట్టుకున్నాడు.
JOH 13:5 ఆ తర్వాత ఒక వెడల్పయిన పళ్ళెంలో నీళ్ళు పోసి తన శిష్యుల పాదాలు కడగటం మొదలుపెట్టాడు. నడుముకు చుట్టుకున్న కండువాతో వాళ్ళ పాదాలు తుడిచాడు.
JOH 13:6 యేసు సీమోను పేతురు దగ్గరకు రాగానే, పేతురు ఆయనతో, “ప్రభూ! మీరు నా పాదాలు కడుగుతారా?” అని అన్నాడు.
JOH 13:7 యేసు, “నేను చేస్తున్నది నీకు యిప్పుడు అర్థం కాదు. తదుపరి అర్థమౌతుంది” అని సమాధానం చెప్పాడు.
JOH 13:8 పేతురు, “మీరు నా పాదాలు ఎన్నటికీ కడుగకూడదు. నేను ఒప్పుకోను” అని అన్నాడు. యేసు, “నీ పాదాలు కడిగితే తప్ప నీకు, నాకు సంబంధం ఉండదు!” అని సమాధానం చెప్పాడు.
JOH 13:9 సీమోను పేతురు, “ప్రభూ! అలాగైతే నా పాదాలేకాదు. నా చేతుల్ని, నా తలను కూడా కడగండి!” అని అన్నాడు.
JOH 13:10 యేసు సమాధానం చెబుతూ, “స్నానం చేసినవాని శరీరమంతా శుభ్రంగా ఉంటుంది. కనుక అతడు పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు ఒక్కడు తప్ప మీరందరూ పవిత్రులై ఉన్నారు” అని అన్నాడు.
JOH 13:11 తనకు ద్రోహం చేయనున్న వాడెవడో యేసుకు తెలుసు. కనుకనే ఒక్కడు తప్ప అందరూ పవిత్రంగా ఉన్నారని ఆయనన్నాడు.
JOH 13:12 ఆయన వాళ్ళ పాదాలు కడగటం ముగించి, పై వస్త్రాన్ని వేసుకొని తాను యింతకు ముందు కూర్చున్న స్థలానికి వెళ్ళాడు. యేసు, “నేను చేసింది మీకు అర్థమైందా?
JOH 13:13 మీరు నన్ను ‘బోధకుడా!’ అని ‘ప్రభూ!’అని పిలుస్తారు. నేను బోధకుడను కనుక మీరు నన్ను ఆ విధంగా పిలవటం సమంజసమే!
JOH 13:14 మీ బోధకుడను, ప్రభువును అయిన నేను మీ పాదాలు కడిగాను. కనుక మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి.
JOH 13:15 నేను చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను చేసినట్లు మీరు కూడా చేయాలని నా ఉద్దేశ్యం.
JOH 13:16 ఇది నిజం. యజమాని కంటే సేవకుడు గొప్ప కాదు. అలాగే వార్త తెచ్చేవాడు వార్త పంపినవాని కన్నా గొప్ప కాదు.
JOH 13:17 ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. వీటిని ఆచరిస్తే ధన్యులౌతారు.
JOH 13:18 “నేనిది మీ అందర్ని గురించి చెప్పటం లేదు. నేను ఎన్నుకొన్న వాళ్ళు నాకు తెలుసు. కాని ఈ విషయం జరిగి తీరాలి: ‘నాతో రొట్టె పంచుకొన్న వాడు నాకు ద్రోహం చేస్తాడు.’ ఇవి జరుగక ముందే మీకు అన్నీ చెబుతున్నాను.
JOH 13:19 అవి జరిగినప్పుడు నేనే ఆయన్ని అని మీరు విశ్వసించాలని నా ఉద్దేశ్యం.
JOH 13:20 ఇది నిజం. నేను పంపిన వాణ్ణి అంగీకరించిన వాడు నన్ను అంగీకరించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీకరించిన వాడు నన్ను పంపిన వాణ్ణి అంగీకరించినట్లు పరిగణింపబడతాడు” అని అన్నాడు.
JOH 13:21 యేసు మాట్లాడటం ముగించాడు. ఆయన మనస్సుకు చాలా వేదన కలిగింది. ఆయన, “ఇది నిజం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.
JOH 13:22 ఆయన శిష్యులు, ఆయన ఎవర్ని గురించి అంటున్నాడో తెలుసుకోలేక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
JOH 13:23 యేసు ప్రేమించిన శిష్యుల్లో ఒకడు యేసు ప్రక్కనే కూర్చొని ఉన్నాడు.
JOH 13:24 సీమోను పేతురు ఆ శిష్యునితో, “ఎవర్ని గురించి అంటున్నాడో అడుగు” అని సంజ్ఞ చేసాడు.
JOH 13:25 అతడు యేసుకు దగ్గరగా ఒరిగి, “ప్రభూ! ఎవరు!” అని అడిగాడు.
JOH 13:26 యేసు, “నేనీ రొట్టె ముక్కను పాత్రలో ముంచి ఎవరికిస్తానో వాడే!” అని సమాధానం చెప్పాడు. తదుపరి రొట్టెముక్కను పాత్రలో ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు యిచ్చాడు.
JOH 13:27 రొట్టె తీసుకొన్న వెంటనే సైతాను వానిలోకి ప్రవేశించాడు. యేసు వానితో, “నీవు చేయబోయేదేదో త్వరగా చెయ్యి” అని అన్నాడు.
JOH 13:28 కాని, భోజనానికి కూర్చున్న వాళ్ళకెవ్వరికీ యేసు ఆ విధంగా ఎందు కంటున్నాడో అర్థం కాలేదు.
JOH 13:29 డబ్బు యూదా ఆధీనంలో ఉండేది. కాబట్టి పండుగకు కావలసినవి కొని తెమ్మంటున్నాడని కొందరనుకున్నారు. పేదలకు కొంత పంచి పెట్టమంటున్నాడని మరికొందరనుకున్నారు.
JOH 13:30 యూదా రొట్టె తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అది రాత్రి సమయం.
JOH 13:31 యూదా వెళ్ళిపోయాక యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుని మహిమ వ్యక్తమయింది. అలాగే ఆయనలో దేవుని మహిమ వ్యక్తమయింది.
JOH 13:32 దేవుడు అయన ద్వారా మహిమ పొందాక తన కుమారుణ్ణి తనలో ఐక్యం చేసికొని మహిమపరుస్తాడు. ఆలస్యం చేయడు” అని అన్నాడు.
JOH 13:33 యేసు, “బిడ్డలారా! నేను మీతో మరి కొంత కాలం మాత్రమే ఉంటాను. మీరు నా కోసం చూస్తారు. యూదులకు చెప్పిన విషయాన్నే మీకూ చెబుతున్నాను. నేను వెళ్ళే చోటికి మీరు యిప్పుడురారు.
JOH 13:34 “నేను మీకొక క్రొత్త ఆజ్ఞనిస్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా మీరు కూడా ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి వుండండి
JOH 13:35 మీరు ఒకరినొకరు ప్రేమతో చూసుకున్నప్పుడే మీరు నాకు శిష్యులని లోకమంతా తెలుసుకుంటారు” అని అన్నాడు.
JOH 13:36 సీమోను పేతురు, “ప్రభూ! మీరెక్కడికి వెళ్తున్నారు?” అని అడిగాడు. యేసు, “నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి నీవు యిప్పుడు నా వెంట రాలేవు. కాని తర్వాత నన్ను అలుసరించగలుగుతావు” అని అన్నాడు.
JOH 13:37 పేతురు, “ప్రభూ! యిప్పుడే ఎందుకు నేను నీ వెంట రాలేను? నేను మీకోసం నా ప్రాణాల్ని అర్పించటానికి సిద్ధంగా ఉన్నాను” అని అన్నాడు.
JOH 13:38 యేసు, “నీవు నిజంగా నా కోసం నీ ప్రాణంయిస్తావా? ఇది నిజం. కోడి కూసేలోగా నేనెవరినో తెలియదని మూడుసార్లు అంటావు!” అని సమాధనం చెప్పాడు.
JOH 14:1 “మీరు ఆందోళన చెందకండి. దేవుణ్ణి నమ్మండి. నన్ను కూడా నమ్మండి.
JOH 14:2 నా తండ్రి యింట్లో ఎన్నో గదులున్నాయి. అలా లేక పోయినట్లైతే మీకు చెప్పేవాణ్ణి. మీకోసం ఒక స్థలము నేర్పాటు చేయటానికి అక్కడికి వెళ్తున్నాను.
JOH 14:3 నేను వెళ్ళి మీకోసం స్థలం ఏర్పాటు చేశాక తిరిగి వచ్చి మిమ్మల్ని నాతో పిలుచుకొని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండటం నా ఉద్దేశ్యం.
JOH 14:4 నేను వెళ్ళే చోటికి వచ్చే దారి మీకు యిదివరకే తెలుసు” అని యేసు అన్నాడు.
JOH 14:5 తోమా ఆయనతో, “ప్రభూ! మీరు వెళ్ళే చోటు ఎక్కడుందో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకా దారి ఏ విధంగా తెలుస్తుంది?” అని అన్నాడు.
JOH 14:6 యేసు, “మార్గము, సత్యము, జీవము, నేనే! నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవ్వరూ రాలేరు.
JOH 14:7 నేను ఎవరో మీకు నిజంగా తెలిసివుంటే నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది. యిప్పుడు ఆయన్ని చూసారు. ఆయనెవరో మీకు తెలుసు” అని సమాధానం చెప్పాడు.
JOH 14:8 ఫిలిప్పు, “ప్రభూ! మాకు తండ్రిని చూపండి. అది చాలు” అని అన్నాడు.
JOH 14:9 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను యింత కాలం మీతో కలిసి ఉన్నాను కదా! అయినా నేనెవరినో నీకు తెలియదా ఫిలిప్పు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. అలాగైతే తండ్రిని చూపుమని ఎందుకు అడుగుతున్నావు?
JOH 14:10 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నాడని, నీవు నమ్మటం లేదా? నేను చెప్పే మాటలు నా స్వంతవి కావు. నాలో నివసిస్తున్న తండ్రి తన పనిని చేస్తున్నాడు.
JOH 14:11 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నామని నమ్మండి. లేక మహాత్కార్యాలు చూసైనా నమ్మండి.
JOH 14:12 “ఇది నిజం. నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. నన్ను నమ్మిన ప్రతి ఒక్కడూ నేను చేసిన కార్యాలు చేస్తాడు. వీటికన్నా యింకా గొప్ప కార్యాలే చేస్తాడు.
JOH 14:13 కుమారుని ద్వారా తండ్రి మహిమ పొందటానికి మీరు నా పేరిట ఏమి అడిగినా చేస్తాను.
JOH 14:14 నా పేరిట నన్ను ఏమడిగినా నేను చేస్తాను.
JOH 14:15 “మీకు నా మీద ప్రేమ ఉంటే నేను ఆజ్ఞాపించినట్లు చేస్తారు.
JOH 14:16 మీతో చిరకాలం ఉండి, మీకు సహాయం చెయ్యటానికి మరొక ఉత్తరవాదిని పంపుమని నేను తండ్రిని అడుగుతాను. ఆయన ఆత్మను పంపుతాడు. ఆ పవిత్రాత్మ సత్యాన్ని ప్రకటించటం తన కర్తవ్యం. ప్రపంచం ఆయన్ని చూడలేదు. ఆయన గురించి ప్రపంచానికి తెలియదు. కనుక ఆయన్ని అంగీకరించలేదు. ఆయన మీతో ఉన్నాడు కనుక మీకు ఆయన గురించి తెలుసు. ఆయన భవిష్యత్తులో మీతో ఉంటాడు. లోకం ఆయన్ని అంగీకరించలేదు, ఎందుకంటే అది ఆయన్ని చూడలేదు, తెలుసుకోలేదు.
JOH 14:18 “నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వేయను. మీ దగ్గరకు తిరిగి వస్తాను.
JOH 14:19 కొద్ది రోజుల తర్వాత ఈ ప్రపంచం నన్ను చూడదు. కాని మీరు నన్ను చూస్తారు. ఎందుకంటే నేను ఏ విధంగా జీవిస్తున్నానో అదే విధంగా మీరు కూడా జీవిస్తారు.
JOH 14:20 ఆ రోజు నేను తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామన్న విషయం మీరు గ్రహిస్తారు.
JOH 14:21 నా ఆజ్ఞలు విని వాటిని అనుసరించినవాడే నన్ను ప్రేమించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను ప్రేమించిన వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమించి అతనికి ప్రత్యక్షమౌతాను.”
JOH 14:22 అప్పుడు యూదా (యూదా ఇస్కరియోతు కాదు), “కాని ప్రభూ! మీరు మాకు మాత్రమే ప్రత్యక్షమై, ప్రపంచానికి ప్రత్యక్షంకానని ఎందుకంటున్నారు?” అని అన్నాడు.
JOH 14:23 యేసు, ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రమించేవాడు నేను చెప్పినట్లు చేస్తాడు. అలాంటివాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. మేము వచ్చి అతనితో నివసిస్తాము.
JOH 14:24 నన్ను ప్రేమించనివాడు నా మాట వినడు. మీరు వింటున్న నా ఈ మాటలు నావి కావు. అవి నన్ను పంపిన తండ్రివి.
JOH 14:25 “నేను వెళ్ళిపోక ముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాను.
JOH 14:26 తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు.
JOH 14:27 “‘శాంతిని’ మీకు యిస్తున్నాను. అది నాలో ఉన్న శాంతి. ప్రపంచం దాన్ని మీకివ్వ జాలదు. కనుక చింతించకండి. భయపడకండి.
JOH 14:28 నేను వెళ్తున్నానని, మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తానని చెప్పటం మీరు విన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నందుకు మీరు ఆనందిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు.
JOH 14:29 ఇది జరిగినప్పుడు మీరు విశ్వసించాలని మీకీ విషయం ముందే చెబుతున్నాను.
JOH 14:30 “ఈ లోకాధికారి రాబోతున్నాడు. అందువలన మీతో ఎక్కువ కాలం మాట్లాడను. వాడు నన్నేమీ చెయ్యలేడు.
JOH 14:31 కాని నాకు తండ్రిపై ప్రేమ ఉందన్న విషయము, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను చేస్తున్న విషయము ప్రపంచానికి తెలియాలి. అందుకే యిలా చేస్తున్నాను. “రండి, యిక్కడి నుండి వెళ్దాం!”
JOH 15:1 “నా తండ్రి తోట యజమాని. నేను నిజమైన ద్రాక్షా తీగను.
JOH 15:2 నాలో ఫలం కాయని కొమ్మలన్నిటిని నా తండ్రి పూర్తిగా కొట్టి వేస్తాడు. ఫలమిచ్చే కొమ్మల్ని, అవి యింకా ఎక్కువ ఫల మిచ్చేటట్లు చెయ్యటానికి వాటికొనల్ని కత్తిరిస్తాడు.
JOH 15:3 నేను మీకు బోధించిన విషయాలవల్ల ఎక్కువ ఫల మిచ్చేటట్లు మీరిదివరకే కత్తిరింపబడ్డారు.
JOH 15:4 నాలో ఐక్యమై ఉండండి. నేను మీలో ఐక్యమై ఉంటాను. కొమ్మ స్వతహాగా ఫలమివ్వ లేదు. అది తీగకు అంటుకొని ఉండాలి. అదేవిధంగా మీరు నాలో ఉంటేనే ఫలమివ్వగలరు.
JOH 15:5 “నేను తీగను. మీరు నా కొమ్మలు. ఒక వ్యక్తి నాలో ఉండి నేను అతనిలో ఉంటే అతడెక్కువ ఫల మివ్వగలడు. నాకు దూరంగా ఉండి మీరేమీ చెయ్యలేరు.
JOH 15:6 నాలో ఉండని వాళ్ళు కొమ్మవలే పారవేయబడతారు. అప్పుడు కొమ్మలు ఎండి పోతాయి. వాటిని ప్రోగుచేసి ప్రజలు మంటల్లో వేస్తారు. అవి కాలిపోతాయి.
JOH 15:7 మీరు నాలో, నా ఉపదేశాలు మీలో ఉంటే మీరు మీకిష్టమైన దేదైనా అడగండి. అది మీకిస్తాను. కోరింది జరుగుతుంది.
JOH 15:8 మీరు ఎక్కువ ఫలం ఫలించి నా శిష్యులుగా ఉంటే నా తండ్రి మహిమ వ్యక్తం చేసిన వాళ్ళౌతారు.
JOH 15:9 “నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమకు పాత్రులైఉండండి.
JOH 15:10 నేను నా తండ్రి ఆజ్ఞలకు లోబడి ఆయన ప్రేమలో నిలిచియున్నట్లుగా మీరు నా ఆజ్ఞలకు లోబడినట్లైతే నా ప్రేమలో నిలిచియుంటారు.
JOH 15:11 నా ఆనందం మీరు కూడా పంచుకోవాలని, మీరు సంపూర్ణంగా ఆనందించాలని మీకీ విషయాలన్నీ చెప్పాను.
JOH 15:12 నా ఆజ్ఞ యిది: నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో, అదే విధంగా మీరు కూడా పరస్పరం ప్రేమతో ఉండండి.
JOH 15:13 స్నేహితుల కోసం ప్రాణాలివ్వటం కన్నా గొప్ప ప్రేమ లేదు.
JOH 15:14 నేను ఆజ్ఞాపించినట్లు చేస్తే మీరు నా స్నేహితులు.
JOH 15:15 నేను యిక మీదటి నుండి మిమ్మల్ని సేవకులుగా భావించను. ఎందుకంటే, సేవకునికి తన యజమాని చేస్తున్నదేమిటో తెలియదు. కాని నేను నా తండ్రి నుండి విన్న వాటినన్నిటిని మీకు చెప్పాను. అందుకే మీరు నా స్నేహితులని అన్నాను.
JOH 15:16 “మీరు నన్ను ఎన్నుకో లేదు. నేను మిమ్మల్ని ఎన్నుకొన్నాను. మీరు వెళ్ళి చిరకాలం ఉండే ఫలమివ్వాలని మిమ్మల్ని ఎన్నుకొని నియమించాను. మీరు నా పేరిట ఏది అడిగినా నా తండ్రి మీకిస్తాడు.
JOH 15:17 ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఇది నా ఆజ్ఞ.
JOH 15:18 “ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆ ప్రపంచం మీకన్నా ముందు నన్ను ద్వేషించిందన్న విషయం జ్ఞాపకం ఉంచుకోండి.
JOH 15:19 మీరు ప్రపంచానికి చెందిన వాళ్ళైతే ఆ ప్రపంచంలోని ప్రజలు మిమ్మల్ని తమ వాళ్ళుగా ప్రేమిస్తారు. నేను మిమ్మల్ని ఈ ప్రపంచంనుండి ఎన్నుకొన్నాను. కనుక యిప్పుడు మీరు ఈ ప్రపంచానికి చెందరు. అందుకే ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తుంది.
JOH 15:20 “‘యజమాని కంటే సేవకుడు గొప్పకాదు’ అని నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళు నన్నే హింసించారు. కనుక మిమ్మల్ని కూడా హింసిస్తారు. వాళ్ళు నా సందేశం పాటించి ఉంటే మీ సందేశం కూడా పాటిస్తారు.
JOH 15:21 నన్ను పంపింది ఎవరో వాళ్ళకు తెలియదు. కనుక నా పేరిట వెళ్ళిన మీ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తారు.
JOH 15:22 నేను రాకుండా, వాళ్ళకు బోధించకుండా ఉండివుంటే పాపదోషము వాళ్ళ మీద ఉండేది కాదు. కాని ఇప్పుడు వాళ్ళు తమ పాపాల నుండి తప్పించుకోలేరు.
JOH 15:23 “నన్ను ద్వేషించిన వాడు నా తండ్రిని కూడా ద్వేషించిన వానిగా పరిగణింపబడతాడు.
JOH 15:24 నేను వాళ్ళ కోసం ఎవరూ చేయని ఈ మహాత్కార్యాలు చేసివుండక పోయినట్లైతే వాళ్ళకు ఈ పాపం అంటి ఉండేది కాదు. కాని యిప్పుడు వాళ్ళు నా అద్భుతాన్ని చూసారు. అయినా నన్ను, నా తండ్రిని ద్వేషిస్తున్నారు.
JOH 15:25 కాని ధర్మశాస్త్రంలో, ‘వాళ్ళు నిష్కారణంగా నన్ను ద్వేషించారు’ అని వ్రాయబడింది. నెరవేరటానికి యిలా జరిగింది.
JOH 15:26 “నేను నా తండ్రి నుండి సత్య స్వరూపియైన ఆత్మను మీకు ఆదరణకర్తగా పంపుతాను. తండ్రిలో నుండి వచ్చిన ఈ ఆత్మ నన్ను గురించి సాక్ష్యమిస్తాడు.
JOH 15:27 మీరు నాతో మొదటి నుండి ఉన్న వాళ్ళు కనుక మీరు కూడా సాక్ష్యం చెప్పాలి.
JOH 16:1 “మీ విశ్వాసం చెదిరిపోకూడదని ఈ విషయాలన్నీ మీకు చెప్పాను.
JOH 16:2 వాళ్ళు మిమ్మల్ని సమాజ మందిరాల నుండి వెలి వేస్తారు. నిజం చెప్పాలంటే, మిమ్మల్ని చంపితే దేవుని సేవ చేసిన దానితో సమానంగా భావించే కాలం వస్తుంది.
JOH 16:3 వాళ్ళకు నా గురించి కాని, తండ్రిని గురించి కాని, తెలియదు కనుక అలా చేస్తారు.
JOH 16:4 ఆ సమయం వచ్చినప్పుడు నేను హెచ్చరించినట్లు మీకు జ్ఞాపకం ఉండాలని ఈ విషయం చెపుతున్నాను. ఇన్నాళ్ళు మీతో ఉన్నాను. కనుక మీకీ విషయం మొదట చెప్పలేదు.
JOH 16:5 “కాని యిప్పుడు నేను నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తున్నాను. కాని మీలో ఒక్కరైనా నేను ఎక్కడికి వెళ్తున్నానని అడగలేదు.
JOH 16:6 నేను ఈ విషయం చెప్పటంవల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి.
JOH 16:7 కాని నేను వెళ్ళటం మీ మంచి కోసమే. ఇది నిజం. నేను వెళ్ళకపోతే మీకు సహాయం చెయ్యటానికి ఆదరణకర్త రాడు. నేను వెళ్తే ఆయన్ని పంపగలను.
JOH 16:8 “ఆయన వచ్చాక పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ప్రపంచాన్ని ఒప్పింప చేస్తాడు.
JOH 16:9 ప్రజలు నన్ను విశ్వసించలేదు కనుక వాళ్ళలో ‘పాపం’వుందని రుజువు చేస్తాడు.
JOH 16:10 మీరు చూడలేని చోటికి, అంటే తండ్రి దగ్గరకు, వెళ్తున్నాను. కనుక తండ్రితో నాకున్న సంబంధాన్ని ఆయన రుజువు చేస్తాడు.
JOH 16:11 కనుక నీతి విషయంలో ఈ లోకాధికారియైన సైతానుకు ఇదివరకే శిక్ష విధింపబడింది. కనుక ‘తీర్పు’ విషయంలో ఒప్పింప చేస్తాడు.
JOH 16:12 “నేను మీకు చెప్పవలసిన విషయాలు ఎన్నోఉన్నాయి. కాని వాటికి మీరు ప్రస్తుతం తట్టుకొనలేరు.
JOH 16:13 కాని సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన స్వతహాగ మాట్లాడడు. తాను విన్న వాటిని మాత్రమే మాట్లాడుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు.
JOH 16:14 నా సందేశం మీకు తెలియజేయుటవల్ల ఆయన నన్ను మహిమ పరుస్తాడు.
JOH 16:15 తండ్రికి చెందినవన్నీ నావి. అందువల్లే ఆత్మ నా సందేశం తీసుకొని మీకు తెలియచేస్తాడని చెప్పాను.
JOH 16:16 “కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు. ఆ తదుపరి మరి కొంత కాలం గడిచాక మీరు నన్ను చూస్తారు.”
JOH 16:17 ఆయన శిష్యుల్లో కొందరు, “‘కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు’ అని అనటంలోను మరియు, ‘మరి కొంత కాలం గడిచాక మీరు మళ్ళీ నన్ను చూస్తారు’ అని అనటంలో అర్థమేమిటి? పైగా ‘నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ అని అంటున్నాడే! అంటే ఏమిటి?” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
JOH 16:18 “‘కొంత కాలం’ తర్వాత అని అనటంలో ఆయన ఉద్దేశ్యమేమిటి? ఆయనేమంటున్నాడో అర్థం కావటం లేదు!” అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనుకొన్నారు.
JOH 16:19 ఈ విషయాన్ని గురించి వాళ్ళడగాలని అనుకుంటున్నారని యేసు గ్రహించాడు. అందువలన ఆయన వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “‘కొంత కాలం గడిచాక నన్ను చూడరు, మరి కొంత కాలం గడిచాక నన్ను చూస్తారు’ అని నేనటంలో అర్థమేమిటని పరస్పరం మాట్లాడుకుంటున్నారా?
JOH 16:20 మీరు దుఃఖిస్తున్నప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది. మీ మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. ఇది నిజం.
JOH 16:21 “ప్రసవించే సమయం వచ్చినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీ నొప్పులు అనుభవిస్తుంది. శిశువు పుట్టాక ఒక జీవిని ఈ ప్రపంచంలోకి తెచ్చిన ఆనందంలో తన వేదన మరచి పోతుంది.
JOH 16:22 అదే విధంగా యిది మీరు దఃఖించే సమయం. కాని నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అప్పుడు మీ హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. ఆ ఆనందాన్ని ఎవ్వరూ దోచుకోలేరు.
JOH 16:23 ఆ రోజు మీరు నన్ను ఏమీ అడగరు. ఇది నిజం. నా పేరిట మీరేది అడిగినా తండ్రి మీకిస్తాడు.
JOH 16:24 ఇంత కాలం మీరు నా పేరిట ఏమీ అడగలేదు. ‘అడగండి; మీకు లభిస్తుంది’ అప్పుడు మీకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది.
JOH 16:25 “నేను యింతవరకూ ఉపమానాలతో మాట్లాడుతూ వచ్చాను. కాని యిలాంటి భాష ఉపయోగించకుండా నేను స్పష్టంగా మాట్లాడే సమయం వస్తోంది. అప్పుడు నేను మీకు తండ్రిని గురించి స్పష్టంగా చెబుతాను.
JOH 16:26 ఆ రోజు మీరు నా పేరిట తండ్రిని అడుగుతారు. మీ పక్షాన నేను తండ్రిని అడుగుతున్నానని అనటం లేదు.
JOH 16:27 నేను తండ్రి నుండి వచ్చానని మీరు నమ్మారు. మీకు నా పట్ల ప్రేమ ఉంది. కనుక తండ్రికి స్వయంగా మీ పట్ల ప్రేమ ఉంది.
JOH 16:28 నేను తండ్రి నుండి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఇప్పుడు నేనీ ప్రపంచాన్ని వదిలి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను.”
JOH 16:29 శిష్యులు, “ఇప్పుడు మీరు ఉపమానాల ద్వారా కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నారు.
JOH 16:30 మీకు అన్నీ తెలుసునని మేము ఇప్పుడు గ్రహించాము. ఎవరునూ మీకు ప్రశ్న వేయవలసిన అవసరం లేదు. అందువల్ల మీరు దేవుని నుండి వచ్చారని విశ్వసిస్తున్నాము” అని అన్నారు.
JOH 16:31 యేసు, “చివరకు నమ్ముతున్నారన్న మాట!
JOH 16:32 మీరు నన్ను ఒంటరిగా ఒదిలి మీమీ యిండ్లకు వెళ్ళే సమయం రానున్నది. ఇప్పుడే వచ్చింది. నా తండ్రి నాతో ఉన్నాడు. కనుక నేను ఒంటరిగా ఉండను.
JOH 16:33 “నా ద్వారా మీకు శాంతి కలగాలని యివన్నీ మీకు చెప్పాను. ఈ ప్రపంచంలో మీకు కష్టాలు కలుగుతాయి. కాని ధైర్యంగా ఉండండి. నేను ప్రపంచాన్ని జయించాను” అని అన్నాడు.
JOH 17:1 ఆ తర్వాత యేసు ఆకాశం వైపు చూసి ఈ విధంగా ప్రార్థించాడు: “తండ్రి! సమయం వచ్చింది. నీ కుమారునికి మహిమ కలిగించు. అప్పుడు కుమారుడు నీకు మహిమ కలిగిస్తాడు.
JOH 17:2 ప్రజలందరిపై కుమారునికి అధికారమిచ్చావు. నీవు అప్పగించిన వాళ్ళకు, ఆయన అనంత జీవితం యివ్వాలని నీ ఉద్దేశ్యం.
JOH 17:3 నీవు మాత్రమే నిజమైన దేవుడవు. నిన్నూ, నీవు పంపిన ‘యేసుక్రీస్తు’ను తెలుసుకోవటమే అనంత జీవితం.
JOH 17:4 పూర్తి చేయుమని నీవు నాకు అప్పగించిన కార్యాన్ని పూర్తిచేసి ఈ ప్రపంచంలో నీకు మహిమ కలిగించాను.
JOH 17:5 తండ్రీ! ఈ ప్రపంచం ఆరంభం కాక ముందు నీతో పాటు నాకు కూడా మహిమ ఉండేది. ఇప్పుడు ఆ మహిమ నీ సమక్షంలో నాకు కలిగేటట్లు చేయుము.
JOH 17:6 “ఈ ప్రపంచంలో నీవు నాకు అప్పగించిన వాళ్ళకు నిన్ను గురించి తెలియ చేసాను. వాళ్ళు నీ వాళ్ళు. కాని వాళ్ళను నీవు నాకు అప్పగించావు. వాళ్ళు నీ సందేశాన్ని పాటించారు.
JOH 17:7 నీవు నాకు ఎన్నోయిచ్చావు. అవన్నీ నాకిచ్చినావని వాళ్ళకిప్పుడు తెలిసింది.
JOH 17:8 ఎందుకంటే, నీవు నాకు చెప్పిన సందేశాన్ని వాళ్ళకు చెప్పాను. వాళ్ళు దాన్ని అంగీకరించారు. నేను నిజంగా నీ నుండి వచ్చానని వాళ్ళకు తెలుసు. నీవు నన్ను పంపావన్న విశ్వాసం యిప్పుడు వాళ్ళలో కలిగింది.
JOH 17:9 నేను వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. ప్రపంచాని కోసం ప్రార్థించటం లేదు. నీవు నాకు అప్పగించిన వాళ్ళు నీ వాళ్ళు కావాలని ప్రార్థిస్తున్నాను.
JOH 17:10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. నా వాళ్ళ ద్వారా నాకు మహిమ కలుగుతోంది.
JOH 17:11 “నేనీ ప్రపంచంలో యిక ఉండను. కాని వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. నేను నీ దగ్గరకు రాబోతున్నాను. ఓ తండ్రీ! నీలో పవిత్రత ఉంది. నీవు నాకిచ్చిన, నీ నామంలో ఉన్న మహిమతో వాళ్ళను రక్షించు. అలా చేస్తే మనం ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉంటారు.
JOH 17:12 నేను వాళ్ళతో ఉన్నప్పుడు, నీవు నా కిచ్చిన నామంతో వాళ్ళను రక్షించి కాపాడాను. లేఖనాల్లో వ్రాసినవి నిజం కావటానికి నాశనం కావలసిన వాడు తప్ప మరెవ్వరూ నాశనం కాలేదు.
JOH 17:13 “నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా ఆనందం వాళ్ళ హృదయాల్లో పూర్తిగా నిండి పోవాలని నేనీ ప్రపంచంలో ఉన్నప్పుడే ఈ విషయాలు చెబుతున్నాను.
JOH 17:14 నీ సందేశం నా శిష్యులకు చెప్పాను. నేను ఈ ప్రపంచానికి చెందిన వాణ్ణి కాదు. అదే విధంగా నా శిష్యులు కూడా ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాదు. కనుక ప్రపంచం వాళ్ళను ద్వేషిస్తుంది.
JOH 17:15 “వాళ్ళనీ ప్రపంచం నుండి తీసుకు వెళ్ళమని నేను ప్రార్థించటం లేదుగాని దుర్మార్గుని నుండి వాళ్ళను రక్షించుమని ప్రార్థిస్తున్నాను.
JOH 17:16 నేను ఏ విధంగా ఈ ప్రపంచానికి చెందనో అదే విధంగా వాళ్ళు కూడా ఈ ప్రపంచానికి చెందరు.
JOH 17:17 సత్యంలో వారిని పవిత్రపరచు, నీ వాక్యమే సత్యం.
JOH 17:18 నీవు నన్ను ఏ విధంగా పంపావో, అదే విధంగా వాళ్ళను నేను ఈ ప్రపంచంలోనికి పంపాను.
JOH 17:19 వాళ్ళ కోసం నన్ను నేను ప్రత్యేకపరచు కొన్నాను. వాళ్ళు కూడా నిజంగా ప్రత్యేకించబడాలని నా ఉద్దేశ్యం.
JOH 17:20 “నా ప్రార్థన వాళ్ళ కోనం మాత్రమే కాదు. వాళ్ళ సందేశం ద్వారా నన్ను విశ్యసించే వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను.
JOH 17:21 తండ్రీ! నేను నీలో, నీవు నాలో ఉన్నట్లే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవు నన్ను పంపినట్లు ఈ ప్రపంచం నమ్మాలంటే వాళ్ళను కూడా మనలో ఐక్యం చేయుము.
JOH 17:22 మనము ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉండాలని, నీవు నాకిచ్చిన మహిమను నేను వాళ్ళకిచ్చాను.
JOH 17:23 నేను వాళ్ళలో ఉన్నాను. నీవు నాలో ఉన్నావు. వాళ్ళలో సంపూర్ణమైన ఐక్యత కలిగేటట్లు చేయుము. అలా చేస్తే నీవు నన్ను పంపావని, నన్ను ప్రేమించినంతగా వాళ్ళను కూడా ప్రేమించావని ప్రపంచానికి తెలుస్తుంది.
JOH 17:24 “తండ్రీ! నీవు నాకు అప్పగించిన వాళ్ళు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం పుట్టక ముందు నుండి నన్ను ప్రేమించావు. నాకు మహిమను ఇచ్చావు. ఆ మహిమను వాళ్ళు చూడాలని నా అభిలాష.
JOH 17:25 నీతి స్వరూపుడవగు తండ్రీ! ప్రపంచానికి నీవెవరవో తెలియక పోయినా నీవు నాకు తెలుసు. నీవు నన్ను పంపావని వీళ్ళకు తెలుసు.
JOH 17:26 నీవెవరవో వాళ్ళకు తెలియచేసాను. తెలియచేస్తూ ఉంటాను. నాయందు నీకున్న ప్రేమ వాళ్ళయందు కూడా ఉండాలని, వాళ్ళలో నేను స్వయంగా ఉండాలని నా ఉద్దేశ్యం.”
JOH 18:1 యేసు ప్రార్థించటం ముగించాక తన శిష్యులతో కలిసి ప్రయాణమయ్యాడు. అంతా కలిసి కెద్రోను లోయ దాటి వెళ్ళారు. అక్కడ ఒక ఒలీవల తోట ఉంది. వాళ్ళు ఆ తోటలోకి వెళ్ళారు.
JOH 18:2 యేసు తన శిష్యులతో తరుచు యిక్కడ కలుసుకొంటూ ఉండేవాడు కనుక ఆయనకు ద్రోహం చేసిన యూదాకు ఈ స్థలం తెలుసు.
JOH 18:3 అందువల్ల యూదా ఒక సైనిక దళాన్ని, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన కొంతమంది రక్షక భటుల్ని వెంట బెట్టుకొని వచ్చాడు. వాని వెంట ఉన్న వాళ్ళు ఆయుధాలను, దివిటీలను, దీపాలను, పట్టుకొని వాణ్ణి అనుసరించారు.
JOH 18:4 యేసుకు జరుగనున్నదంతా తెలుసు. ఆయన ముందుకు వచ్చి, “వాళ్ళతో మీకెవరు కావాలి?” అని అడిగాడు.
JOH 18:5 “నజరేతుకు చెందిన యేసు!” అని వాళ్ళు సమాధానం చెప్పారు. “ఆయన్ని నేనే!” అని యేసు అన్నాడు. ద్రోహం చేసిన యూదా వాళ్ళతో నిలుచుని ఉన్నాడు.
JOH 18:6 యేసు, “నేనే ఆయన్ని” అని అనటం విని వాళ్ళు ఒక అడుగు వెనక్కు వేసి క్రింద పడిపోయారు.
JOH 18:7 యేసు, “మీకెవరు కావాలి?” అని మళ్ళీ అడిగాడు. వాళ్ళు, “నజరేతుకు చెందిన యేసు” అని సమాధానం చెప్పారు.
JOH 18:8 యేసు, “ఆయన్ని నేనే అని చెప్పానుగా? మీరు నా కోసం చూస్తుంటే వీళ్ళను మాత్రం వెళ్ళ నివ్వండి” అని అన్నాడు.
JOH 18:9 “నీవు నాకప్పగించిన వాళ్ళలో ఒక్కణ్ణి కూడా నేను పోగొట్టుకోలేదు” అని ఆయన అన్న మాటలు నిజం కావటానికి యిలా జరిగింది.
JOH 18:10 సీమోను పేతురు దగ్గర ఒక కత్తి ఉండింది. అతడు ఆ కత్తి దూసి ప్రధాన యాజకుని సేవకుణ్ణి నరకటానికి పోయి, అతని కుడి చెవి నరికి వేసాడు. ఆ సేవకుని పేరు “మల్కు.”
JOH 18:11 యేసు పేతురుతో, “నీ కత్తి ఒరలో పెట్టు! నా తండ్రి యిచ్చిన పాత్ర నేను త్రాగకుండా ఉంటానా?” అని అన్నాడు.
JOH 18:12 ఆ తర్వాత సైనిక దళము, దళాధిపతి, రక్షక భటులు యేసును బంధించి, మొదట అన్న దగ్గరకు తీసుకు వెళ్ళారు. “అన్న” “కయపకు” కూమార్తె నిచ్చిన మామ.
JOH 18:13 “కయప” ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు.
JOH 18:14 ప్రజల కొరకు ఒకే ఒక వ్యక్తి చనిపోవటం మంచిదని యూదులకు సలహా ఇచ్చిన వాడు ఇతడే!
JOH 18:15 సీమోను పేతురు, అతనితో పాటు యింకొక శిష్యుడు యేసు వెంట వెళ్ళారు. ఈ యింకొక శిష్యుడు ప్రధాన యాజకునికి తెలిసినవాడు. అందువల్ల అతడు యేసు వెంట ప్రధాన యాజకుని యింటి ఆవరణంలోకి వెళ్ళాడు.
JOH 18:16 కాని పేతురు బయట ద్వారం దగ్గర ఉండవలసి వచ్చింది. ప్రధాన యాజకునికి పరిచయమున్న ఆ యింకొక శిష్యుడు, బయటికి వచ్చి అక్కడవున్న కాపలా ఆమెతో మాట్లాడి పేతుర్ని లోపలికి పిలుచుకు వెళ్ళాడు.
JOH 18:17 “నీవు అతని శిష్యుల గుంపుకు చెందిన వాడవు కావా?” అని ద్వారం దగ్గరున్న కాపలాది పేతుర్ని అడిగింది. “లేదు!” అని అతడు జవాబు చెప్పాడు.
JOH 18:18 చలిగా ఉంది కనుక రక్షక భటులు, సేవకులు, చలిమంట వేసి దాని చుట్టూ నిల్చున్నారు. పేతురు వెళ్ళి వారితో సహా చలికాచుకొనుచున్నాడు.
JOH 18:19 ప్రధానయాజకుడు యేసును ఆయన శిష్యుల్ని గురించి, ఆయన బోధిస్తున్న విషయాల్ని గురించి ప్రశ్నించాడు.
JOH 18:20 యేసు, “నేను సమాజమందిరాలలోను, యూదులు సమావేశమయ్యే దేవాలయంలోను బహిరంగంగా ఈ ప్రపంచానికి బోధించేవాణ్ణి. నేను రహస్యంగా ఏదీ బోధించలేదు.
JOH 18:21 అలాంటప్పుడు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు. నేను చెప్పిన వాటిని గురించి, నా బోధనలను విన్న వాళ్ళను అడగండి. నేను చెప్పినవి వాళ్ళకు తెలుసు” అని అన్నాడు.
JOH 18:22 యేసు ఈ విధంగా మాట్లాడటం వలన ఆయన ప్రక్కన నిలుచున్న ఒక రక్షక భటుడు ఆయన చెంప మీద కొడుతూ, “ప్రధానయాజకునితో అలాగేనా మాట్లాడటం?” అని అన్నాడు.
JOH 18:23 యేసు, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే చెప్పు. కాని నేను నిజం మాట్లాడాను. మరినన్నెందుకు కొట్టావు?” అని అడిగాడు.
JOH 18:24 ఆ తర్వాత అన్న ఆయనకు కట్టిన త్రాళ్ళు విప్పకుండా ప్రధాన యాజకుడు కయప దగ్గరకు పంపాడు.
JOH 18:25 సీమోను పేతురు నిలుచొని యింకా చలికాగుతూ ఉన్నాడు. వాళ్ళు “నీవు అతని శిష్యుల్లో ఒకడివి కాదా?” అని అడిగారు. “కాదు” అని పేతురు అన్నాడు.
JOH 18:26 ప్రధాన యాజకుని దగ్గర ఒకడు పని చేస్తూ ఉండేవాడు. వీని బంధువు చెవును పేతురు నరికివేసాడు. వాడు పేతురుతో, “నీవు అతనితో కలిసి తోటలో ఉండగా చూడలేదని అనుకొంటున్నావా?” అని అన్నాడు.
JOH 18:27 పేతురు మళ్ళీ, “లేదు” అన్నాడు. వెంటనే కోడి కూసింది.
JOH 18:28 ఆ తర్వాత యూదులు యేసును కయప నుండి రోము రాజ్యాధికారి భవానానికి తీసుకు వెళ్ళారు. తెల్లవారింది. పస్కా పండుగ భోజనం చెయ్యటానికి ముందు మైలపడ కూడదని వాళ్ళు రాజభవనంలోకి వెళ్ళలేదు.
JOH 18:29 పిలాతు వాళ్ళను కలవటానికి వెలుపలికి వచ్చి, “ఇతడేమి తప్పు చేసాడు?” అని అడిగాడు.
JOH 18:30 “అతడు నేరస్థుడు కానట్లైతే మీకు అప్పగించే వాళ్ళంకాదు!” అని అన్నారు.
JOH 18:31 పిలాతు, “అతణ్ణి మీరే తీసుకు వెళ్ళి మీ ధర్మ శాస్త్రాన్ననుసరించి విచారణ చేసుకోండి” అని అన్నాడు.
JOH 18:32 యూదులు, “మాకు మరణశిక్ష విధించే అధికారం లేదే!” అని సమాధానం చెప్పారు. యేసు, తాను ఎలాంటి మరణం పొందనున్నాడో యిది వరకే చెప్పాడు. అది నిజం కావాలని యిలా జరిగింది.
JOH 18:33 పిలాతు భవనంలోకి వెళ్ళి యేసును పిలిపించాడు. ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
JOH 18:34 యేసు, “అది నీవు స్వయంగా వేసిన ప్రశ్నాలేక యితర్లు నా గురించి అలా చెప్పారా?” అని అడిగాడు.
JOH 18:35 పిలాతు, “నేను యూదుణ్ణి అని అనుకుంటున్నావా? నీ వాళ్ళు, మీ ప్రధాన యాజకుడు నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏం చేసావు?” అని అడిగాడు.
JOH 18:36 యేసు, “నా రాజ్యం ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు. అలాగైనట్లైతే నా అనుచరులు యూదుల చేత నేను బంధింపకుండా ఉండాలని వాళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు. కాని నా రాజ్యం పరలోక సంబంధమైంది” అని అన్నాడు.
JOH 18:37 “అలాగైతే నీవు రాజువన్నమాట!” అని పిలాతు అన్నాడు. యేసు జవాబు చెబుతూ, “నన్ను రాజని నీవనటం నిజమే. నేను సత్యాన్ని గురించి చెప్పటానికి జన్మించాను. ఆ కారణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే వాళ్ళు నా మాట వింటారు.”
JOH 18:38 “సత్యం అంటే ఏమిటి?” అని పిలాతు అడిగాడు. ఇలా అన్నాక అతడు మళ్ళీ యూదుల దగ్గరకు వెళ్ళి, “అతణ్ణి శిక్షించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు!
JOH 18:39 కాని మీ ఆచారం ప్రకారం ప్రతి పస్కాపండుగకు ఒక ఖైదీని విడుదల చెయ్యటం నా ధర్మం, ‘యూదుల రాజును’ విడుదల చేయమంటారా?” అని అడిగాడు.
JOH 18:40 వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, “వద్దు, అతణ్ణి కాదు. బరబ్బను విడుదల చెయ్యండి!” అని అన్నారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.
JOH 19:1 ఆ తర్వాత పిలాతు యేసును తీసుకు వెళ్ళి కొరడాలతో కొట్టించాడు.
JOH 19:2 భటులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి యేసు తలపై పెట్టారు. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు.
JOH 19:3 ఆయన దగ్గరకు మాటి మాటికి వెళ్ళి, “యూదుల రాజా! జయము!” అని అంటూ ఆయన ముఖం మీద కొట్టారు.
JOH 19:4 పిలాతు మరొకసారి వెలుపలికి వచ్చి యూదులతో, “యిదిగో చూడండి! అతణ్ణి మీ ముందుకు తెస్తున్నాను. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటంలేదు. ఇది మీరు గ్రహించాలి” అని అన్నాడు.
JOH 19:5 యేసుకు ముళ్ళ కిరీటాన్ని, ఊదారంగు దుస్తుల్ని ధరింపజేసి వెలుపలికి తీసుకొచ్చారు. పిలాతు వాళ్ళతో, “ఆ మనిషిని చూడండి!” అని అన్నాడు.
JOH 19:6 ప్రధానయాజకులు, అధికారులు యేసును చూడగానే, “సిలువకు వెయ్యండి! సిలువకు వెయ్యండి!” అని కేకలు వేసారు. కాని పిలాతు, “మీరే తీసుకు వెళ్ళి సిలువకు వెయ్యండి. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటం లేదు” అని అన్నాడు.
JOH 19:7 కాని యూదులు, “మాకో న్యాయశాస్త్రం ఉంది. తాను, ‘దేవుని కుమారుడను’ అని అన్నాడు కనుక, మా న్యాయశాస్త్రం ప్రకారం అతడు మరణ దండన పొందాలి!” అని అన్నారు.
JOH 19:8 పిలాతు ఇది విని యింకా భయపడి పొయ్యాడు.
JOH 19:9 అతడు తిరిగి భవనంలోకి వెళ్ళి యేసుతో, “నీ స్వగ్రామం ఏది?” అని అడిగాడు. కాని యేసు దానికి సమాధానం చెప్పలేదు.
JOH 19:10 పిలాతు, “నాతో మాట్లాడటానికి నిరాకరిస్తున్నావా? నిన్ను విడుదల చేయటానికి, సిలువకు వేయటానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అని అన్నాడు.
JOH 19:11 యేసు సమాధానంగా, “పైన ఉన్నవాడు యిస్తే తప్ప నీకు నాపై ఏ అధికారం లేదు. కనుక నన్ను నీకు అప్పగించిన వాడు ఎక్కువ పాపం చేసాడు” అని అన్నాడు.
JOH 19:12 ఆ క్షణం నుండి, పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నించాడు. కాని యూదులు, “ఇతణ్ణి విడుదల చేస్తే నీవు చక్రవర్తికి మిత్రుడవు కాదు. తాను రాజునన్న ప్రతి ఒక్కడూ చక్రవర్తిని వ్యతిరేకించిన వాడౌతాడు!” అని కేకలు వేసారు.
JOH 19:13 ఇది విని పిలాతు యేసును వెలుపలికి పిలుచుకొని వచ్చాడు. “రాళ్ళు పరచిన స్థలంలో” ఉన్న న్యాయపీఠంపై కూర్చున్నాడు. దీన్ని హీబ్రూ భాషలో “గబ్బతా” అని అంటారు.
JOH 19:14 అది పస్కా పండుగకు సిద్ధపడబొయ్యేరోజు. అప్పుడు ఉదయం సుమారు ఆరు గంటల సమయం. పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు” అని అన్నాడు.
JOH 19:15 కాని వాళ్ళు, “తీసుకు వెళ్ళండి, తీసుకు వెళ్ళండి. సిలువకు వేయండి!” అని కేకలు వేసారు. పిలాతు, “మీ రాజును సిలువకు వేయ మంటారా?” అని అన్నాడు. ప్రధానయాజకులు, “చక్రవర్తి తప్ప మాకు వేరే రాజు లేడు” అని సమాధానం చెప్పారు.
JOH 19:16 తదుపరి, పిలాతు ఆయన్ని సిలువకు వెయ్యమని భటులకు అప్పగించాడు.
JOH 19:17 భటులు యేసును తీసుకు వెళ్ళారు. తన సిలువను మోసుకొని యేసు “పుర్రె స్థలాన్ని” చేరుకున్నాడు. హీబ్రూ భాషలో దీన్ని “గొల్గొతా” అంటారు.
JOH 19:18 ఇక్కడ ఆయన్ని సిలువకు వేసారు. ఆయనకు ఇరువైపు మరొక యిద్దర్ని సిలువకు వేసారు.
JOH 19:19 పిలాతు, ఒక ప్రకటన వ్రాయించి ఆయన సిలువకు తగిలించాడు. ఆ ప్రకటనలో, “నజరేతు నివాసి యేసు యూదుల రాజు” అని వ్రాయబడి ఉంది.
JOH 19:20 యేసును సిలువకు వేసిన స్థలము పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటన హీబ్రూ, రోమా, గ్రీకు భాషల్లో వ్రాయబడి ఉంది. కనుక చాలా మంది యూదులు ఈ ప్రకటన చదివారు.
JOH 19:21 యూదుల ప్రధాన యాజకులు దీన్ని గురించి పిలాతు ముందు ఫిర్యాదు చేస్తూ, “‘యూదుల రాజు’ అని వ్రాసారెందుకు? ‘ఇతడు, తాను యూదుల రాజని అన్నాడు’ అని వ్రాయండి” అని అన్నారు.
JOH 19:22 పిలాతు, “వ్రాసిందేదో వ్రాసాను” అని సమాధానం చెప్పాడు.
JOH 19:23 భటులు యేసును సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని నాలుగు భాగాలుగా చేసి తలొకటి పంచుకున్నారు. వాళ్ళు ఆయన పొడుగాటి అంగీని కూడా లాక్కున్నారు. అది పైనుండి క్రింది దాకా కుట్టు లేకుండా నేయబడి ఉంది.
JOH 19:24 ఆ భటులు, “దీన్ని చింపకుండా చీట్లు వేసి ఎవరికి దొరుకుతుందో చూద్దాం!” అని మాట్లాడుకున్నారు. ఈ విధంగా అనుకున్నట్లు చేసారు: “వాళ్ళు నా దుస్తుల్ని పంచుకొన్నారు! నా దుస్తుల కోసం చీట్లు వేసారు!” లేఖనాల్లో వ్రాయబడిన విషయం నిజం కావటానికి యిలా జరిగింది.
JOH 19:25 యేసు సిలువదగ్గర ఆయన తల్లి, తల్లి యెక్క సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, నిలుచొని ఉన్నారు.
JOH 19:26 యేసు తన తల్లి, తన ప్రియ శిష్యుడు అక్కడ నిలుచొని ఉండటం చూసాడు. తన తల్లితో, “అమ్మా! ఇదిగో నీ కుమారుడు” అని అన్నాడు.
JOH 19:27 ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి!” అని అన్నాడు. ఆనాటి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.
JOH 19:28 ఆ తర్వాత యేసు అంతా ముగిసిందని గ్రహించాడు. ఆయన, “నాకు దాహం వేస్తోంది” అని అన్నాడు. లేఖనాల్లో వ్రాసింది నిజంకావటానికి ఇలా జరిగింది.
JOH 19:29 పులిసిన ద్రాక్షారసం ఉన్న ఒక కుండ అక్కడ ఉంది. వాళ్ళు ఒక స్పాంజి ఆ కడవలో ముంచి, హిస్సోపు చెట్టుకొమ్మపై ఆ స్పాంజి పెట్టి, దాన్ని యేసు పెదాలకు అందించారు.
JOH 19:30 ఆయన దాన్ని రుచిచూచి, “అంతా ముగిసింది” అని అన్నాడు. ఆ మాట అన్నాక, తలవాల్చి ఆత్మను అప్పగించాడు.
JOH 19:31 అది పండుగకు సిద్దమయ్యే రోజు. మరుసటి రోజు విశేషమైన విశ్రాంతి రోజు కనుక ఆ రోజు వాళ్ళను సిలువపై వదిలి వేయటం యూదులకు యిష్టం లేదు. అందువల్ల వాళ్ళు వారి కాళ్ళు విరగ్గొట్టి వారిని క్రిందికి దింపి వెయించుమని పిలాతును అడిగారు.
JOH 19:32 భటులు వచ్చి యేసుతో సిలువకు వేయబడిన మొదటి వాని కాళ్ళు, రెండవ వాని కాళ్ళు విరగ్గొట్టారు.
JOH 19:33 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి ఆయన అప్పటికే చనిపోయినట్లు గమనించారు. అందువల్ల వాళ్ళు ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు.
JOH 19:34 దానికి మారుగా భటుల్లో ఒకడు యేసు డొక్కను బల్లెంతో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు కారాయి.
JOH 19:35 మీరు కూడా విశ్వసించాలని ఈ సంఘటన చూసిన వాడు దీన్ని గురించి చెప్పాడు. అతడు చెప్పింది నిజం. తాను సత్యం పలుకుతున్నట్లు అతనికి తెలుసు.
JOH 19:36 లేఖనాల్లో వ్రాయబడిన విషయాలు నిజం కావటానికి యిలా జరిగింది. ఒకచోట ఇలా వ్రాయబడి ఉంది: “ఆయనలో ఒక్క ఎముక కూడ విరువబడదు.” మరొక చోట, ఇలా వ్రాయబడివుంది: “తాము పొడిచిన వాని వైపు వాళ్ళు చూస్తారు”
JOH 19:38 ఆ తర్వాత “అరిమతయియ” గ్రామానికి చెందిన యోసేపు, యేసు దేహాన్నివ్వమని పిలాతును అడిగాడు. యోసేపు యూదులంటే భయపడేవాడు. కనుక రహస్యంగా యేసు శిష్యుడైనాడు. పిలాతు అంగీకారం పొంది అతడు యేసు దేహాన్ని తీసుకు వెళ్ళాడు.
JOH 19:39 అతని వెంట “నీకొదేము” కూడా ఉన్నాడు. క్రితంలో ఒక నాటి రాత్రి యేసును కులుసుకున్న వాడు యితడే. ఇతడు ముప్పై అయిదు కిలోలబోళం, అగరుల మిశ్రమాన్ని తన వెంట తీసుకు వచ్చాడు.
JOH 19:40 వాళ్ళిద్దరూ కలిసి యేసు దేహాన్ని సుగంధ ద్రవ్యాల్లో ఉంచి, దాన్ని నారగుడ్డలో చుట్టారు. ఇలా చెయ్యటం యూదుల సాంప్రదాయం.
JOH 19:41 యేసును సిలువకు వేసిన చోట ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక కొత్త సమాధిఉంది. ఆ సమాధిలో అంతవరకు ఎవర్నీ ఉంచలేదు.
JOH 19:42 అది యూదులు పండుగకు సిద్ధం అవ్వ బోయే రోజు. పైగా ఆ సమాధి సిలువకు సమీపంలో ఉంది. కనుక వాళ్ళు ఆయన దేహాన్ని ఆ సమాధిలో ఉంచారు.
JOH 20:1 ఆ రోజు ఆదివారం. “మగ్దలేనే”కు చెందిన మరియ చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసి వేయబడి ఉండటం గమనించింది.
JOH 20:2 అందువల్ల ఆమె సీమోను పేతురు దగ్గరకు, యేసు ప్రేమించిన యింకొక శిష్యుని దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళతో, “ఎవరో ప్రభువును సమాధి నుండి తీసుకు వెళ్ళారు. ఎక్కడ ఉంచారో తెలియదు” అని అన్నది.
JOH 20:3 పేతురు, ఆ యింకొక శిష్యుడు సమాధి చూడటానికి బయలుదేరి వెళ్ళారు.
JOH 20:4 వాళ్ళు కలిసి పరుగెత్తుకుంటూ వెళ్లారు కాని, ఆ యింకొక శిష్యుడు పేతురు కన్నా ముందు పరుగెత్తి సమాధిని మొదట చేరుకున్నాడు.
JOH 20:5 అతడు తొంగి లోపల చూసాడు. అక్కడ పడివున్న నారబట్టలు అతనికి కనిపించాయి. కాని అతడు లోపలికి వెళ్ళలేదు.
JOH 20:6 అతని వెనుక వస్తున్న పేతురు వచ్చి సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ పడి ఉన్న బట్టల్ని చూసాడు.
JOH 20:7 వాటినే కాక యేసు తల చుట్టూ చుట్టబడిన వస్త్రాన్ని కూడా చూసాడు. మడత పెట్టబడిన తల వస్త్రం నారబట్టలతో కాక వేరుగా ఉంచబడి ఉంది.
JOH 20:8 సమాధి దగ్గరకు ముందు వెళ్ళిన శిష్యుడు కూడా తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆ దృశ్యం చూసి విశ్వసించాడు.
JOH 20:9 (యేసు బ్రతికి వస్తాడని లేఖనాల్లో వ్రాయబడిన విషయం వాళ్ళకు యింకా అర్థంకాలేదు.)
JOH 20:10 ఆ తర్వాత శిష్యులు తమ తమ యిండ్లకు వెళ్ళిపొయ్యారు.
JOH 20:11 కాని, మరియ సమాధి బయట దుఃఖిస్తూ నిలుచొని ఉంది. ఆమె దుఃఖం ఆగలేదు. సమాధిలోకి తొంగి చూసింది.
JOH 20:12 తెల్లటి దుస్తుల్లో ఉన్న యిద్దరు దేవదూతలు అక్కడ కూర్చొని ఉండటం ఆమె గమనించింది. యేసు దేహాన్ని ఉంచిన చోట ఒక దేవదూత తల వైపు, మరొక దేవదూత కాళ్ళ వైపు కూర్చొని ఉన్నారు.
JOH 20:13 వాళ్ళామెను, “ఎందుకు దఃఖిస్తున్నావమ్మా?” అని అడిగారు. ఆమె, “వాళ్ళు నా ప్రభువును తీసుకు వెళ్ళారు. ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలియదు” అని అన్నది.
JOH 20:14 అలా అన్నాక వెనక్కు తిరిగింది. అక్కడ యేసు నిలుచొని ఉండటం చూసింది. కాని ఆయనే “యేసు” అని ఆమె గుర్తించలేదు.
JOH 20:15 ఆయన, “ఎందుకు విలపిస్తున్నావమ్మా! ఎవరి కోసం చూస్తున్నావు?” అని అడిగాడు. అతడొక తోటమాలి అనుకొని, “అయ్యా మీరాయన్ని ఎత్తుకుపోయి ఉంటే ఎక్కడ ఉంచారో చెప్పండి. నేను వెళ్ళి తెచ్చుకుంటాను” అని అన్నది.
JOH 20:16 యేసు ఆమెను “మరియా” అని పిలిచాడు. ఆమె ఆయన వైపు చూసి హీబ్రూ భాషలో “రబ్బూనీ!” అని అన్నది. రబ్బూనీ అంటే బోధకుడు అని అర్థం.
JOH 20:17 యేసు, “నేనింకా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు కనుక నన్ను తాకవద్దు. నా సోదరుల దగ్గరకు వెళ్ళి నాకు, మీకు తండ్రి, దేవుడు అయినటువంటివాని దగ్గరకు వెళ్తున్నానని చెప్పు” అని అన్నాడు.
JOH 20:18 మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్ళింది. తాను ప్రభువును చూసిన వార్త, ప్రభువు తనకు చెప్పిన సందేశము, వాళ్ళతో చెప్పింది.
JOH 20:19 ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరు ఒకే చోట సమావేశమయి ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు.
JOH 20:20 ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని, ప్రక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూసాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది.
JOH 20:21 యేసు మళ్ళీ, “మీకు శాంతి కులుగు గాక! తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని అన్నాడు.
JOH 20:22 ఇలా అన్నాక, “పవిత్రాత్మను పొందండి!” అని వాళ్ళపై ఊదాడు.
JOH 20:23 ఆ తర్వాత, “మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు.
JOH 20:24 యేసు వచ్చినప్పుడు పండ్రెండుగురిలో ఒకడైన తోమా శిష్యుల్తోలేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు.
JOH 20:25 మిగత శిష్యులు తోమాతో, “మేము ప్రభువును చుసాము” అని అన్నారు. కాని తోమా, “నేను స్వయంగా ఆయన చేతులకున్న మేకుల గాయాల్ని చూసి, వాటిని చేతుల్తో తాకి, ఆయన ప్రక్క డొక్కపై నా చేతుల్ని ఉంచాక ఆయన్ని నమ్ముతాను” అని అన్నాడు.
JOH 20:26 ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు ఒక యింట్లో ఉన్నారు. తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి వేసి ఉన్నా యేసు లోపలికి వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు.
JOH 20:27 యేసు తోమాతో, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. నా ప్రక్క భాగంపై నీ చేతుల్ని ఉంచు! ఇక అనుమానించకు” అని అన్నాడు.
JOH 20:28 తోమా ఆయనతో, “దేవా! నా ప్రభూ!” అని అన్నాడు.
JOH 20:29 అప్పుడు యేసు అతనితో, “నన్ను చూసావు కనుక నమ్మావు. నన్ను చూడకున్నా విశ్వసించే వాళ్ళు ధన్యులు” అని అన్నాడు.
JOH 20:30 నేను ఈ గ్రంథంలో వ్రాసినవే కాక, యేసు ఇంకా అనేకమైన మహాత్కార్యాలు చేసాడు. వాటన్నిటినీ శిష్యులు చూసారు.
JOH 20:31 యేసు “క్రీస్తు” అని, “దేవుని కుమారుడు” అని, ఆయన్ని విశ్వసించిన వాళ్ళకు ఆయన పేరిట అనంత జీవితం లభిస్తుందని మీరు నమ్మాలనే ఉద్దేశ్యంతో యివి వ్రాయబడ్డాయి.
JOH 21:1 ఆ తర్వాత తిబెరియ సముద్రం దగ్గర యేసు మళ్ళీ కనిపించాడు. అది ఈ విధంగా జరిగింది:
JOH 21:2 సీమోను పేతురు, దిదుమ అని పిలువబడే తోమా, గలిలయలోని కానా పట్టణానికి చెందిన “నతనయేలు”, జెబెదయి కుమారులు, మరొక యిద్దరు శిష్యులు, అంతా కలిసి ఒక చోట ఉన్నారు.
JOH 21:3 సీమోను పేతురు, “నేను చేపలు పట్టటానికి వెళ్తున్నాను” అని అన్నాడు. మిగతా వాళ్ళు, “మేము కూడా వస్తున్నాము” అని అన్నాక అంతా కలిసి వెళ్ళి పడవనెక్కారు. కాని ఆ రాత్రి వాళ్ళకు చేపలు దొరక లేదు.
JOH 21:4 తెల్లవారే సమయానికి యేసు ఒడ్డున నిలుచొని ఉన్నాడు. కాని శిష్యులు ఆయనే “యేసు” అని గ్రహించలేదు.
JOH 21:5 యేసు, “మిత్రులారా! చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు. “లేదు” అని వాళ్ళన్నారు.
JOH 21:6 ఆయన, “పడవ కుడి వైపు మీ వల వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అని అన్నాడు. వాళ్ళు ఆయన చెప్పిన విధంగా వల వేసారు. చేపలు ఎక్కువగా వలలో పడటంవల్ల వాళ్లు ఆ వల లాగలేక పొయ్యారు.
JOH 21:7 యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, “అదిగో చూడు ప్రభువు” అని అన్నాడు. సీమోను పేతురు, “అదిగో ప్రభువు!” అని అతడు అనటం విన్న వెంటనే, యిది వరకు తీసివేసిన తన పై వస్త్రాన్ని నడుముకు చుట్టుకొని నీళ్ళలోకి దూకాడు.
JOH 21:8 మిగతా శష్యులు ఒడ్డుకు వంద గజాల దూరంలో ఉన్నారు. అందువల్ల వాళ్ళు చేపలతో నిండిన వలను లాగుతూ పడవను నడుపుకుంటూ అతణ్ణి అనుసరిస్తూ ఒడ్డును చేరుకున్నారు.
JOH 21:9 వాళ్ళు పడవ దిగాక కాలుతున్న బొగ్గల మీద చేపలు ఉండటం చూసారు. కొన్ని రొట్టెలు కూడా అక్కడ ఉన్నాయి.
JOH 21:10 యేసు వాళ్ళతో “మీరు పట్టిన కొన్ని చేపలు తీసుకురండీ” అని అన్నాడు.
JOH 21:11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలనిండా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మొత్తం నూట ఏబది మూడు చేపలు ఉన్నాయి. అన్ని చేపలున్నా ఆ వల చినుగలేదు!
JOH 21:12 యేసు వాళ్ళతో, “రండి! వచ్చి భోజనం చెయ్యండి” అని అన్నాడు. “మీరెవరు” అని అడగటానికి శిష్యుల కెవ్వరికీ ధైర్యం చాలలేదు.
JOH 21:13 యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, రొట్టెను తీసుకొని వాళ్ళకిచ్చాడు. అదే విధంగా చేపల్ని కూడా యచ్చాడు.
JOH 21:14 ఆయన బ్రతికింపబడ్డాక తన శిష్యులకు కనిపించడం యిది మూడవసారి.
JOH 21:15 వాళ్ళు భోజనం చెయ్యటం ముగించాక యేసు, సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోనూ! వీళ్ళకన్నా నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. “ఔను ప్రభూ! ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు. యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు!” అని అన్నాడు
JOH 21:16 యేసు, “యోహాను కుమారుడవైన సీమోనూ! నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?” అని మళ్ళీ అడిగాడు. అతడు, “ఔను ప్రభూ! నేను ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు. యేసు, “నా గొఱ్ఱెల్ని జాగ్రత్తగా చూసుకో!” అని అన్నాడు.
JOH 21:17 మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోనూ! నన్ను ప్రేమిస్తున్నావా?” అని అన్నాడు. మూడవసారి, “నన్ను ప్రేమిస్తున్నావా” అని అడిగినందుకు పేతురు మనస్సు చివుక్కుమన్నది. అతడు, “ప్రభూ! మీకన్నీ తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కూడా తెలుసు” అని అన్నాడు. యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు!
JOH 21:18 ఇది నిజం. వయస్సులో ఉన్నప్పుడు నీ దుస్తులు నీవు వేసుకొని నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్ళే వాడవు. కాని వయస్సు మళ్ళిన తర్వాత నీవు చేతులు చాపితే మరొకళ్ళు నీకు దుస్తులు తొడిగించి నీకు యిష్టం లేదన్న చోటికి తీసుకు వెళ్తారు” అని అన్నాడు.
JOH 21:19 పేతురు ఎలాంటి మరణం పొంది దేవునికి మహిమ తెస్తాడో సూచించటానికి యేసు ఇలా అన్నాడు. ఆ తర్వాత అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు.
JOH 21:20 పేతురు వెనక్కు తిరిగి చూసాడు. యేసు ప్రేమించిన శిష్యుడు వెంట రావటం గమనించాడు. రాత్రి భోజనాలప్పుడు యేసుకు ఆనుకొని, “ప్రభూ! మీకు ఎవరు ద్రోహం చేస్తారు!” అని ప్రశ్నించిన వాడు యితడే.
JOH 21:21 పేతురు అతణ్ణి చూసి యేసుతో, “ప్రభూ! అతని సంగతి ఏమిటి?” అని అడిగాడు.
JOH 21:22 యేసు సమాధానంగా, “నేను తిరిగి వచ్చే వరకు అతడు బ్రతికి ఉండాలని నాకిష్టమైతే! ఆ సంగతి నీ కెందుకు. నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు.
JOH 21:23 యేసు ఈ విధంగా అనటంవల్ల ఈ శిష్యుడు చనిపోడనే వదంతి సోదరుల్లో వ్యాపించింది. కాని యేసు అతడు చనిపోడని అనలేదు. అతడు, “నేను తిరిగి వచ్చేవరకు అతడు బ్రతికి ఉండాలని నా ఉద్దేశ్యమైతే ఆ సంగతి నీకెందుకు?” అని అన్నాడు, అంతే.
JOH 21:24 వీటిని గురించి సాక్ష్యం చెప్పిన వాడు, వ్రాసిన వాడు ఈ శిష్యుడే. అతని సాక్ష్యం నిజమైనదని మనకు తెలుసు.
JOH 21:25 యేసు యింకా ఎన్నో కార్యాలు చేసాడు. వాటన్నిటిని గురించి వ్రాస్తే ఈ గ్రంథాలకు ఈ ప్రపంచంలో ఉన్న స్థలమంతా కూడా సరిపోదని నేననుకుంటాను.
ACT 1:1 ప్రియమైన థెయొఫిలాకు, నేను నా మొదటి గ్రంథంలో యేసు చేసింది, బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడిన రోజు వరకు జరిగినదంతా వ్రాసాను.
ACT 1:2 ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడే ముందు పవిత్రాత్మ మహిమతో తానెన్నుకొన్న అపొస్తలులకు వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలను చెప్పాడు.
ACT 1:3 ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళకు కనిపించి తాను బ్రతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్ళకు నలభై రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు.
ACT 1:4 ఆయన వారిని ఒకసారి కలిసికొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు: “యెరూషలేము పట్టణాన్ని వదిలి వెళ్ళకండి. నా తండ్రి వాగ్దానం చేసిన వరం కోసం కాచుకొని ఉండండి. దాన్ని గురించి నేను మీకిదివరకే చెప్పాను.
ACT 1:5 యోహాను నీళ్ళతో బాప్తిస్మమునిచ్చాడు. కాని కొద్ది రోజుల్లో మీరు పవిత్రాత్మలో బాప్తిస్మము పొందుతారు.”
ACT 1:6 వాళ్ళంతా కలుసుకొన్నప్పుడు, “ప్రభూ! మీరు ఈ సమయాన ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని తిరిగి ఇస్తారా?” అని యేసును అడిగారు.
ACT 1:7 ఆయన వాళ్ళతో, “తండ్రి తన అధికారంతో గడియలను, రోజులను నియమించాడు. కాని వాటిని తెలుసుకొనే అవసరం మీకు లేదు.
ACT 1:8 కాని పవిత్రాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీలో శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోనూ, యూదయ, సమరయ ప్రాంతాలన్నిటిలోనూ ప్రపంచపు అన్ని స్థలాల్లోనూ నన్ను గురించి సాక్ష్యమిస్తారు” అని అన్నాడు.
ACT 1:9 ఈ విధంగా చెప్పాక వాళ్ళ కళ్ళ ముందే ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. వాళ్ళకు కనపడకుండా ఒక మేఘం ఆయన్ని కప్పివేసింది.
ACT 1:10 ఆయన వెళ్తూ ఉంటే వాళ్ళు దీక్షతో ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నారు. అకస్మాత్తుగా తెల్లని దుస్తులు వేసుకొన్న యిద్దరు వ్యక్తులు వాళ్ళ ప్రక్కన నిలుచొని వాళ్ళతో,
ACT 1:11 “గలిలయ ప్రజలారా! ఆకాశంలోకి చూస్తూ ఎందుకు నిలుచున్నారు? మీ నుండి పరలోకానికి తీసుకు వెళ్ళబడిన ఈ యేసు మీరు చూస్తున్నప్పుడు పరలోకానికి వెళ్ళినట్లే మళ్ళీ తిరిగి వస్తాడు” అని అన్నారు.
ACT 1:12 ఆ తర్వాత వాళ్ళు ఒలీవల కొండనుండి యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఈ కొండ పట్టణానికి విశ్రాంతి రోజున నడిచినంత దూరంలో ఉంటుంది.
ACT 1:13 వాళ్ళు వచ్చి మేడ మీద తాము నివసిస్తున్న గదిలోకి వెళ్ళారు. అక్కడున్న అపొస్తలులు ఎవరనగా: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్పయి కుమారుడు యాకోబు, “జెలోతే” అని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడు యూదా.
ACT 1:14 వీళ్ళంతా సమావేశమై ఒకే మనస్సుతో ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియ, యేసు సోదరులు కూడా వీళ్ళతో ఉండే వాళ్ళు.
ACT 1:15 ఒక రోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. వాళ్ళ సంఖ్య నూటఇరవై. పేతురు మాట్లాడటానికి లేచి నిలుచున్నాడు.
ACT 1:16 అతడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా సోదరులారా! చాలా కాలం క్రిందటే పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయాలు తప్పక జరుగవలసినవి. ఈ యూదా యేసును బంధించిన వాళ్ళకు దారి చూపాడు.
ACT 1:17 యూదా మాలో ఒకడు. మాతో కలిసి సేవ చెయ్యటానికి ఎన్నుకోబడ్డవాడు.”
ACT 1:18 యూదా చేసిన ఈ కుట్రకు అతనికి డబ్బు దొరికింది. ఆ డబ్బుతో ఒక భూమి కొనబడింది. ఆ తర్వాత యూదా తలక్రిందుగా పడిపోయాడు. అతని దేహం చీలిపోయి ప్రేగులు బయటపడ్డాయి.
ACT 1:19 యెరూషలేములోని వాళ్ళంతా దీన్ని గురించి విన్నారు. అందువలన తమ భాషలో ఆ భూమిని అకెల్దమ అని పిలిచేవాళ్ళు. దీని అర్థం “రక్తపు భూమి.”
ACT 1:20 పేతురు యింకా ఈ విధంగా అన్నాడు: “దీన్ని గురించి కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది: ‘అతని భూమిని పాడు పడనిమ్ము అక్కడెవ్వరూ నివసించకుండా పోనిమ్ము.’ ‘అతని స్థానాన్ని యింకొకడు ఆక్రమించనిమ్ము!’
ACT 1:21 “ఇప్పుడు యింకొకడు మనలో చేరాలి. అతడు వాళ్ళలో, అంటే యేసు మనతో కలిసి జీవించినంత కాలం మనతో కలిసి ఉన్న వాళ్ళలో ఒకడై ఉండాలి.
ACT 1:22 అతడు యేసు ప్రభువు చావునుండి బ్రతికి వచ్చాడన్న దానికి మనతో కలిసి సాక్ష్యం చెప్పాలి. యోహాను బాప్తిస్మము నివ్వటం మొదలు పెట్టినప్పటినుండి యేసును మన నుండి పరలోకానికి తీసుకు వెళ్ళిన దినం దాకా మనతో కలిసి జీవించినవాడై ఉండాలి.”
ACT 1:23 వాళ్ళు ఇద్దరి పేర్లను సూచించారు. బర్సబ్బా అని పిలువబడే యోసేపు పేరు ఇతన్నే యూస్తు అని కూడా అంటారు, మత్తీయ పేరు.
ACT 1:24 అంతా కలిసి ఈ విధంగా ప్రార్థించారు: “ప్రభూ! నీకు ప్రతి ఒక్కరి మనస్సు తెలుసు. యూదా తన స్థానాన్ని వదిలి తాను వెళ్ళతగిన స్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో అపొస్తలత్వాన్ని, ఈ సేవా స్థానాన్ని ఆక్రమించటానికి నీవెన్నుకొన్న వాణ్ణి మాకు చూపించు.”
ACT 1:26 ఆ తర్వాత వాళ్ళు చీటీలు వేసారు. వాళ్ళు తీసిన చీటీలో మత్తీయ పేరు వ్రాయబడి ఉంది. అందువల్ల అతడు ఆ పదకొండుగురిలాగే అపొస్తలుడయ్యాడు.
ACT 2:1 పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. ఆ రోజు వాళ్ళంతా ఒక చోట సమావేశం అయ్యారు.
ACT 2:2 తీవ్రమైన గాలి వీచినప్పుడు కలిగే ధ్వనిలాంటిది పరలోకంనుండి అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు కూర్చొన్న యింటినంతా నింపివేసింది.
ACT 2:3 అప్పుడు వాళ్ళకు నాలుకల్లా అగ్నిజ్వాలలు కనిపించాయి. అవి విడిపోయి ప్రతి ఒక్కరి మీదా దిగినవి.
ACT 2:4 అందరూ పవిత్రాత్మతో నిండిపోయి తమ భాషల్లో కాక యితర భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళిలా మాట్లాడటానికి పవిత్రాత్మ శక్తినిచ్చాడు.
ACT 2:5 అప్పుడు ఈ యెరూషలేము పట్టణంలో అన్ని దేశాలకు చెందిన దైవభక్తిగల యూదులు ఉండినారు.
ACT 2:6 ఆ మాటల శబ్దం విని ఒక పెద్ద ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. గుంపులోని ప్రతి ఒక్కడూ తన స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం విని దిగ్భ్రాంతి చెందాడు.
ACT 2:7 వాళ్ళు దిగ్భ్రాంతి చెంది, “మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్ళే కదా?
ACT 2:8 అలాంటప్పుడు, మాలోని ప్రతి ఒక్కడూ, అతని స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం ఎట్లా వింటున్నాడు.
ACT 2:9 మేము, అంటే ‘పార్తి’ దేశం వాళ్ళు, ‘మాదీ’ దేశం వాళ్ళు, ‘ఏలామీ’ దేశం వాళ్ళు, ‘మెసొపొతమియ’ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ నివాసులు,
ACT 2:10 ప్రుగియ, పంపులియ, ఈజిప్టు ప్రాంతాల వాళ్ళు, ‘లిబియ’ లోని ‘కురేనే’ దగ్గరున్న ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు, రోము నగరం నుండి వచ్చిన వాళ్ళు,
ACT 2:11 యూదులు, యూద మతంలో చేరిన వాళ్ళు, క్రేతీయులు, అరబీయులు, వాళ్ళు దేవుని మహిమల్ని గురించి మా స్వంత భాషలో చెప్పటం వింటున్నామే!” అని అన్నారు.
ACT 2:12 దిగ్భ్రాంతి చెందటం వల్ల, జరిగిన విషయాలు అర్థం కాకపోవటం వల్ల, “దీని అర్థమేమిటి” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు.
ACT 2:13 “బాగా మద్యం త్రాగి మత్తులో ఉన్నారు” అని కొందరు వాళ్ళనెగతాళి చేసారు.
ACT 2:14 ఇది విని పేతురు పదకొండుగురితో లేచి, పెద్ద గొంతుతో ప్రజల్ని సంబోధిస్తూ, “తోటి యూదా సోదరులారా! యెరూషలేంలో నివసిస్తున్న సమస్త ప్రజలారా! నన్ను దీన్ని గురించి మీకు చెప్పనివ్వండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.
ACT 2:15 మీరనుకొన్నట్లు వీళ్ళు త్రాగలేదు. ఇప్పుడు ఇంకా ఉదయం తొమ్మిది గంటలే కదా!
ACT 2:16 దీన్ని గురించి ప్రవక్త యోవేలు ఈ విధంగా వ్రాసాడు కనుక యివి జరుగుతున్నాయి:
ACT 2:17 ‘దేవుడు ఈ విధంగా అంటున్నాడు: ఈ చివరి దినాల్లో నా ఆత్మను అందరిపై కురిపిస్తాను! మీ కుమారులు, కుమార్తెలు, నా ప్రవచనాలు పలుకుతారు! మీ యువతరం దివ్యదర్శనాలు చూస్తుంది. వయస్సు మళ్ళిన మీ వాళ్ళు కలలుగంటారు.
ACT 2:18 ఆడా, మగా అనే భేదం లేకుండా నా సేవకులందరిపై ఆ దినాల్లో నా ఆత్మను కురిపిస్తాను. అప్పుడు వాళ్ళు నా ప్రవచనాలు చెబుతారు.
ACT 2:19 పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపిస్తాను. క్రింద భూమ్మీద రుజువులు చూపిస్తాను. రక్తం, మంటలు, చిక్కటి పొగలు చెలరేగుతాయి.
ACT 2:20 సూర్యుణ్ణి చీకటిగా మారుస్తాను. చంద్రుణ్ణి ఎర్రటి రక్తంలా మారుస్తాను. ఉత్కృష్టమైనటువంటి, తేజోవంతమైనటువంటి ప్రభువు యొక్క దినం రాక ముందే యిది జరుగుతుంది.
ACT 2:21 అప్పుడు ఆయన నామంలో ప్రార్థించు ప్రతి ఒక్కణ్ణి ప్రభువు రక్షిస్తాడు.’
ACT 2:22 “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది వినండి. దేవుడు నజరేతు నివాసియైన యేసును, తాను ప్రత్యేకంగా నియమించాడన్న విషయం మీకు నిరూపించాలని ఆయన ద్వారా మహాత్యాలు, అద్భుతాలు మీకోసం చేసాడు. సూచనలు చూపాడు. ఈ మహాత్యాలు, అద్భుతాలు చేసినట్లు, సూచనలు చూపినట్లు మీకు ఇదివరకే తెలుసు.
ACT 2:23 దైవ సంకల్పానుసారం ఆయన దివ్య జ్ఞానానుసారం యేసు మీకు అప్పగింపబడ్డాడు. ఆ తర్వాత మీరు దుర్మార్గుల సహాయంతో ఆయనను సిలువకు వేసి, మేకులు కొట్టి ఆయన్ని చంపారు.
ACT 2:24 కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఆయనకు మరణవేదన నుండి విముక్తి కలిగించాడు. మరణానికి ఆయన్ని బంధించి ఉంచటం చేతకాలేదు.
ACT 2:25 దావీదు యేసును గురించి ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువును, నేను నా ముందు అన్ని వేళలా చూసాను. నన్ను రక్షించటానికి ప్రభువు నా వెంట ఉన్నాడు!
ACT 2:26 అందుకే నా మాటల్లో ఆనందం నిండియున్నది. అందుకే నా దేహం ఆశతో జీవిస్తోంది.
ACT 2:27 ఎందుకంటే, నా ఆత్మను నీవు చనిపోయిన వాళ్ళతో వదిలివేయవు నీవు నీ భక్తుని దేహాన్ని కుళ్ళనీయవు.
ACT 2:28 నాకు జీవపు దారుల్ని చూపావు! నా వెంటే ఉండి నాకు ఆనందం కలిగించావు!’
ACT 2:29 “సోదరులారా! మన వంశీయుడైన దావీదును గురించి నేనిది ఖచ్చితంగా చెప్పగలను. అతడు చనిపొయ్యాడు. అతణ్ణి సమాధి చేసారు. ఆ సమాధి ఈ నాటికీ ఉంది.
ACT 2:30 దావీదు ఒక ప్రవక్త. దావీదు వంశంలో పుట్టిన వాణ్ణొకణ్ణి సింహాసనంపై కూర్చో బెడ్తానని దేవుడు అతనికి ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసాడు. ఇది దావీదుకు తెలుసు.
ACT 2:31 ఈ జరుగనున్న దాన్ని గురించి దావీదుకు ముందే తెలుసు. అందువల్లే అతడు క్రీస్తు బ్రతికి రావటాన్ని గురించి ఈ విధంగా అన్నాడు: ‘దేవుడు ఆయన్ని సమాధిలో వదిలివేయ లేదు. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు.’ క్రీస్తు సమాధినుండి లేచే విషయమై దావీదు మాటలాడుచూ ఉన్నాడు.
ACT 2:32 కావున దేవుడు ఈ యేసునే మృత్యువు నుండి బ్రతికించినాడు. దీనికి మేమంతా సాక్ష్యము.
ACT 2:33 యేసు పరలోకానికి ఎత్తబడినాడు. ఇప్పుడు యేసు దేవునితో ఆయన కుడిప్రక్కన ఉన్నాడు. తండ్రి పరిశుద్ధాత్మను యేసుకు ఇచ్చాడు. దేవుడు ఇస్తానని వాగ్దానము చేసినది పరిశుద్ధాత్మయే. యేసు ఇప్పుడాయాత్మను ఇస్తున్నాడు. ఇదే మీరు వింటున్నది, చూస్తున్నదీ.
ACT 2:34 యేసులా దావీదు పరలోకానికి వెళ్ళలేదు. అయినా, అతడీ విధంగా అన్నాడు: ‘ప్రభువు నా ప్రభువుతో, నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసే వరకు నీవు నా కుడివైపు కూర్చో!’
ACT 2:36 “అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ యిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు, మీరు సిలువకు వేసి చంపిన ఈ యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు.”
ACT 2:37 ఇది విని ప్రజల హృదయాలు కదిలిపొయ్యాయి. వాళ్ళు పేతురు మరియు యితర అపొస్తలులను, “సోదరులారా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.
ACT 2:38 పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు: “మీలో ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ నిమిత్తం మారుమనస్సు కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడ్తాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది.
ACT 2:39 దేవుడు ఈ వాగ్దానాన్ని మీకోసం, మీ సంతానాని కోసం, ప్రభువు ఆహ్వానించబోయే దూర ప్రాంతాల వాళ్ళకందరి కోసం చేసాడు.”
ACT 2:40 వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక, వాళ్ళతో ఈ విధంగా బ్రతిమిలాడాడు: “వక్రబుద్ధులున్న ఈ తరం వాళ్ళనుండి విడిపోయి రక్షణ పొందండి.”
ACT 2:41 అతని సందేశాన్ని అంగీకరించిన వాళ్ళు బాప్తిస్మము పొందారు. ఆ రోజు సుమారు మూడువేల మంది విశ్వాసులుగా చేరారు.
ACT 2:42 వాళ్ళు అపొస్తలుల బోధను వింటూ సహవాసములోను, రొట్టె విరుచుటలోను పాలి భాగస్థులై; ప్రార్థన చేయుటలో నిమగ్నులై యుండేవాళ్ళు.
ACT 2:43 దేవుడు అపొస్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసాడు. చిహ్నాలు చూపాడు. ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది.
ACT 2:44 భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకొనే వాళ్ళు.
ACT 2:45 తమ ఆస్తిని, వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్ళకు యిచ్చేవాళ్ళు.
ACT 2:46 ప్రతి రోజు మందిరావరణంలో ఒకే ఉద్దేశ్యంతో సమావేశమయ్యేవాళ్ళు. ఇండ్లలో సమావేశమై ఆహారాన్ని పంచుకొని తినేవాళ్ళు. మంచి మనస్సుతో అమితానందంగా భుజించే వాళ్ళు,
ACT 2:47 దేవుణ్ణి స్తుతించే వాళ్ళు. ప్రజలందరూ వాళ్ళను యిష్టపడేవాళ్ళు. ప్రభువు తాను రక్షించిన వాళ్ళను విశ్వాసులతో చేరుస్తూ వచ్చాడు.
ACT 3:1 ఒక రోజు పేతురు, యోహాను పగలు మూడు గంటలప్పుడు మందిరానికి వెళ్తున్నారు. అది ప్రార్థనా సమయం.
ACT 3:2 కొందరు ఒక పుట్టు కుంటివాణ్ణి ప్రతిరోజూ మోసుకొని వెళ్ళి ఒక ద్వారం ముందు దించేవాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారం అనేవాళ్ళు. మందిరంలోకి ప్రవేశించే వాళ్ళనుండి ఆ కుంటివాడు భిక్షమెత్తుకొంటూ ఉండేవాడు.
ACT 3:3 ఈ కుంటివాడు, పేతురు యోహానులు ఆలయంలోకి ప్రవేశించబోతుండగా చూసి వాళ్ళను భిక్షమడిగాడు.
ACT 3:4 పేతురు అతనివైపు ఏక దృష్టితో చూసాడు. యోహాను కూడా అలాగే చూసాడు. పేతురు ఆ కుంటివానితో, “మా వైపు చూడు!” అని అన్నాడు.
ACT 3:5 ఆ కుంటివాడు వాళ్ళేదైనా యిస్తారని వాళ్ళ వైపు చూసాడు.
ACT 3:6 అప్పుడు పేతురు, “నా దగ్గర వెండి, బంగారాలు లేవు కాని నా దగ్గరున్న దాన్ని నీకిస్తాను. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట నడువు!” అని అంటూ,
ACT 3:7 అతని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలకు, పాదాలకు బలం వచ్చింది.
ACT 3:8 అతడు గంతేసి నిలబడి నడవటం మొదలు పెట్టాడు. తదుపరి అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళతో సహా మందిరంలోకి ప్రవేశించాడు.
ACT 3:9 మందిరంలో ఉన్న వాళ్ళంతా అతడు నడవటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు.
ACT 3:10 భిక్షమెత్తుకోవటానికి మందిరంలోని సౌందర్య ద్వారం ముందు కూర్చునేవాడు అతడేనని గుర్తించారు. జరింగింది చూసి వాళ్ళు భయపడి దిగ్భ్రాంతి చెందారు.
ACT 3:11 ఆ భిక్షమెత్తుకొనేవాడు పేతురు, యోహానులను అంటి పెట్టుకొని ఉన్నాడు. ప్రజల్లో కలిగిన ఆశ్చర్యం తగ్గలేదు. వాళ్ళు సొలొమోను మంటపంలో ఉన్న పేతురు, యోహానుల దగ్గరకు పరుగెత్తు కొంటూ వెళ్ళారు.
ACT 3:12 పేతురు వాళ్ళను చూసి ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది మీకెందుకు ఆశ్చర్యం కలిగిస్తోంది? మేము మా స్వశక్తితో లేక మా మంచితనంతో యితణ్ణి నడిపించినట్లు మావైపు అంత దీక్షతో ఎందుకు చూస్తున్నారు?
ACT 3:13 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన వంశీయుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పర్చాడు. మీరాయన్ని అధికారులకు అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చెయ్యాలని నిర్ణయించినప్పుడు మీరు పిలాతు ముందు యేసును నిరాకరించారు.
ACT 3:14 పవిత్రుడు, నీతిమంతుడు, అయిన ఆయన్ని నిరాకరించి, ఆయనకు మారుగా ఒక హంతకుణ్ణి విడుదల చెయ్యాలని మీరు కోరారు.
ACT 3:15 మీరు, మీకు నిత్యజీవితాన్నిచ్చే దాతను చంపారు. కాని దేవుడాయన్ని చావు నుండి బ్రతికించాడు. మేము దీనికి సాక్షులం.
ACT 3:16 “మాకు ‘యేసు’ అనే పేరులో నమ్మకం ఉండబట్టే మీకు తెలిసిన యితనికి, మీరు చూస్తున్న యితనికి నయమైపోయింది. యేసు పేరు, ఆయన కలిగించిన విశ్వాసము యితనికి పూర్తిగా స్వస్థత కలిగించాయి. ఇది మీరు చూసారు.
ACT 3:17 “సోదరులారా! మీ నాయకులవలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు.
ACT 3:18 కాని, ‘క్రీస్తు తప్పక చనిపోవాలి’ అని ప్రవక్తలందరి ద్వారా దేవుడు ముందే పలికిన వాక్కుల్ని ఈ విధంగా నిజం చేసాడు.
ACT 3:19 మారుమనస్సు పొంది దేవుని వైపు మళ్ళండి. అలా చేస్తే దేవుడు మీ పాపాలు కడిగి వేస్తాడు. మీకు విమోచనం కలిగే రోజులు వస్తాయి.
ACT 3:20 మీ కోసం దేవుడు క్రీస్తుగా నియమించిన యేసును పంపుతాడు.
ACT 3:21 “చాలా కాలం క్రితమే తమను తాము దేవునికి అంకితం చేసుకొన్న ప్రవక్తల నోటి ద్వారా యిలా అభయమిచ్చాడు. సర్వం పునః స్థాపితం చేసేకాలం వచ్చేవరకు యేసు పరలోకంలోనే ఉండాలి.
ACT 3:22 మోషే ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువైన దేవుడు మీ కొరకు నాలాంటి ప్రవక్తను పంపుతాడు. ఆయన మీ సోదరులనుండి వస్తాడు. ఆయన చెప్పినట్లు మీరు వినాలి.
ACT 3:23 దేవుడు ఆయన మాటల్ని వినని ప్రతి ఒక్కణ్ణి తమ వాళ్ళ నుండి దూరం చేసి నాశనం చేస్తాడు.’
ACT 3:24 “సమూయేలు కాలం నుండి ప్రవక్తలందరూ ఈ రోజులు రానున్నాయని చెప్పారు.
ACT 3:25 మీ పూర్వీకులతో దేవుడు చేసిన ఒప్పందానికి, మీ ప్రవక్తలకు, మీరు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ వంశీయుని ద్వారా భూమ్మీద ఉన్న ప్రజలందర్ని దీవిస్తాను’ అని అన్నాడు.
ACT 3:26 దేవుడు తన సేవకుణ్ణి మొదట మీ దగ్గరకు పంపాడు. మీ అందర్ని మీ మీ దుర్మార్గాలనుండి మళ్ళించటానికి ఆయన్ని పంపాడు. అలా చేసి మిమ్మల్ని దీవించాలని అనుకొన్నాడు.”
ACT 4:1 యాజకులు, మందిరం యొక్క ద్వార పాలకుల అధిపతి, సద్దూకయ్యులు కలిసి పేతురు, యోహానులు ఉన్న చోటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ప్రజలకు ఉపదేశిస్తూ ఉన్నారు.
ACT 4:2 ఆ అపొస్తలులు ప్రజలకు ఉపదేశించటం, యేసును ఉదాహరణగా తీసుకొని చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తారని ప్రకటించటం విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది.
ACT 4:3 వాళ్ళు పేతురును, యోహానును బంధించారు. అప్పటికే సాయంకాలమై ఉండటం వల్ల మరుసటి రోజు దాకా వాళ్ళను బంధించి ఉంచారు.
ACT 4:4 వాళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసులయ్యారు. ఆ విశ్వాసుల సంఖ్య సుమారు అయిదు వేలదాకా పెరిగిపోయింది.
ACT 4:5 మరుసటి రోజు నాయకులు, పెద్దలు పండితులు యెరూషలేములో సమావేశం అయ్యారు.
ACT 4:6 “అన్న”, అనే ప్రధాన యాజకుడు, కయప, యోహాను, అలెక్సంద్రు, ప్రధాన యాజకుని కుటుంబానికి చెందిన వాళ్ళు అంతా ఆ సమావేశంలో ఉన్నారు.
ACT 4:7 పేతురును, యోహానును వీళ్ళ ముందుకు పిలుచుకు వచ్చారు. “ఏ అధికారంతో, ఎవరి పేరిట మీరాపని చేసారు?” అని వాళ్ళు ప్రశ్నించటం మొదలు పెట్టారు.
ACT 4:8 అదే సమయంలో, పేతురు పవిత్రాత్మతో నిండినవాడై వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ప్రజా నాయకులారా! పెద్దరాలా!
ACT 4:9 ఒక కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి మమ్మల్ని ప్రశ్నించాలనుకొంటున్నారా? అతనికి ఎవరు నయం చేసారని తెలుసుకోవాలనుకొంటున్నారా?
ACT 4:10 అలాగైతే మీరు, ఇశ్రాయేలు ప్రజలు ఇది తెలుసుకోవాలి. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట ఈ కుంటివాడు పూర్తిగా నయమై మీ ముందు నిలుచున్నాడు. మీరు యేసును సిలువకు వేసి చంపినా దేవుడాయన్ని బ్రతికించాడు.
ACT 4:11 ‘ఇల్లు కట్టు వాళ్ళైన మీరు పారవేసిన రాయి ఈ యేసే! ఇప్పుడది మూలకు తలరాయి అయింది, ఆ రాయి యేసే.’
ACT 4:12 రక్షణ యింకెవరి ద్వారా లభించదు. ఎందుకంటే, రక్షణ పొందటానికి ఈ పేరు (యేసు క్రీస్తు) తప్ప మరే పేరును దేవుడు మానవులకు తెలుపలేదు. ఈ పేరుకు తప్ప ఆ శక్తి ప్రపంచంలో మనుష్యులకివ్వబడిన మరే పేరుకు లేదు.”
ACT 4:13 పేతురు, యోహానులు చదువురాని మామూలు మనుష్యులని వాళ్ళకు తెలిసిపోయింది. కాని వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడా సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్న వాళ్ళని గ్రహించారు.
ACT 4:14 కాని నయమైన మనిషి వాళ్ళతో నిలిచి ఉండటం చూసి యింకే ఆక్షేపణలు చెయ్యలేక పోయారు.
ACT 4:15 వాళ్ళను మహా సభనుండి వెళ్ళమని ఆజ్ఞాపించి పరస్పరం యిలా చర్చించుకొన్నారు:
ACT 4:16 “వీళ్ళనేం చెయ్యాలి? యెరూషలేము నివాసులందరికి వీళ్ళు అద్భుతమైన మహిమ చేసారని బాగా తెలుసు. మనం దాన్ని కాదనలేం.
ACT 4:17 కాని యిది ప్రజల్లో యింకా ఎక్కువగా వ్యాపించక ముందే యిక మీదట అతని పేరిట ఎవరితో ఏమీ మాట్లాడవద్దని వాళ్ళను వారించాలి.”
ACT 4:18 వాళ్ళను మళ్ళీ పిలిచి యేసు పేరిట బోధించకూడదని, ఆయన గురించి మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు.
ACT 4:19 కాని పేతురు, యోహానులు వాళ్ళకు సమాధానం చెబుతూ, “మీరు చెప్పింది చెయ్యాలో, దేవుడు చెప్పింది చెయ్యాలో, దేవుని దృష్టిలో ఏది న్యాయమో మీలో మీరు నిర్ణయించుకోండి.
ACT 4:20 ఎందుకంటే మేము చూసిన దాన్ని, విన్న దాన్ని గురించి ప్రజలకు చెప్పకుండా వుండలేము” అని అన్నారు.
ACT 4:21 వాళ్ళు పేతురును, యోహానును, యింకా కొంచెం భయపెట్టి వదిలేసారు.
ACT 4:22 దేవుని మహిమవల్ల నయమైన వ్యక్తి నలభై ఏండ్లు దాటినవాడు. ఈ జరిగిన సంఘటనవల్ల ప్రజలంతా కలిసి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. అందువలన వీళ్ళను ఏ విధంగా శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు.
ACT 4:23 విడుదలయ్యాక పేతురు, యోహానులు తమ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రధాన యాజకులు, పెద్దలు చెప్పినదంతా చెప్పారు.
ACT 4:24 ఇది విన్నాక వాళ్ళంతా కలిసి ఒకే ధ్యేయంతో దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు: “మహా ప్రభూ! నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు.
ACT 4:25 నీవు పవిత్రాత్మ ద్వారా నీ సేవకుడు, మా తండ్రి అయిన దావీదు నోటినుండి యిలా పలికించావు: ‘జనాంగములు ఎందుకు రెచ్చుతున్నాయి? ప్రజలెందుకు వృధాగా పన్నాగాలు పన్నుతున్నారు?
ACT 4:26 ‘రాజులు, పాలకులు కలిసి ప్రభువును, ఆయన క్రీస్తును ఎందుకు ఎదిరిస్తున్నారు?’
ACT 4:27 హేరోదు మరియు పొంతి పిలాతు, ఇశ్రాయేలు ప్రజలతో మరియు యితర దేశ ప్రజలతో కలిసారు. అంతా కలిసి పవిత్రతగల నీ సేవుకుణ్ణి, నీవు క్రీస్తుగా నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు.
ACT 4:28 ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్ళు నీవు నిర్ణయించినట్లే చేసారు.
ACT 4:29 ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు!
ACT 4:30 యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. ఆయన పేరిట రోగుల్ని నయం చెయ్యటానికి, అద్భుతాలు, మహాత్యాలు చెయ్యటానికి నీ అభయ హస్తాన్ని చాపి మాకు శక్తినివ్వు!”
ACT 4:31 వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవసందేశాన్ని ధైర్యంగా చెప్పటం మొదలు పెట్టారు.
ACT 4:32 విశ్వాసుల మనస్సు, ఆత్మ ఒకే విధంగా ఉండేవి. ఎవ్వరూ “ఇది నాది” అని అనకుండా తమకున్న వాటిని ఇతర్లతో పంచుకొనే వాళ్ళు.
ACT 4:33 దైవికమైన శక్తితో అపొస్తలులు ప్రభువు బ్రతికి వచ్చాడని ఋజువు చేసారు. దేవుని అనుగ్రహం వాళ్ళందరిపై సంపూర్ణంగా ఉంది.
ACT 4:34 వాళ్ళలో ఎవ్వరికీ ఏ కొరతలు ఉండేవి కావు. ఇండ్లు, పొలాలు ఉన్న వాళ్ళు వాటిని అమ్మి,
ACT 4:35 ఆ డబ్బును అపొస్తలుల పాదాల ముందుంచే వాళ్ళు. ఆ అపొస్తలులు అవసరమున్న ప్రతి ఒక్కనికి ఆ డబ్బును పంచేవాళ్ళు.
ACT 4:36 యోసేపు అనే అతడు లేవి వంశీయుడు. ఇతడు సైప్రసు (కుప్ర) ద్వీపానికి చెందినవాడు. ఇతణ్ణి అపొస్తలులు బర్నబా (ప్రోత్సాహపు కుమారుడని ఈ పదానికి అర్థం) అని పిలిచే వాళ్ళు.
ACT 4:37 ఇతడు తన పొలాన్ని అమ్మి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల ముందుంచాడు.
ACT 5:1 “అననీయ” అనబడే ఒక వ్యక్తి, అతని భార్య “సప్పీరా” కలిసి తమ భూమి అమ్మేసారు.
ACT 5:2 “అననీయ” తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. “అననీయ” మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు.
ACT 5:3 అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా నీ మనస్సులో సైతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేసావు?
ACT 5:4 అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది. నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.”
ACT 5:5 ఈ మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన విన్న వాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది.
ACT 5:6 కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి మోసుకెళ్ళి సమాధి చేసారు.
ACT 5:7 మూడు గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేదీ ఆమెకు తెలియదు.
ACT 5:8 పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు యింతేనా? చెప్పు!” అని ఆమెను అడిగాడు. “ఔనండి! అంతే డబ్బు లభించింది” అని ఆమె సమాధానం చెప్పింది.
ACT 5:9 పేతురు ఆమెతో, “నీవు, నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గరనుండి వస్తున్న అడుగుల చప్పుడు విను! అవి నీ భర్తను సమాధి చేసిన వాళ్ళవి. వాళ్ళు నిన్ను కూడా మోసుకు వెళ్తారు” అని అన్నాడు.
ACT 5:10 తక్షణమే ఆమె అతని పాదాలముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు.
ACT 5:11 సంఘానికి, ఈ సంఘటనలు విన్న వాళ్ళకు పెద్ద భయం పట్టుకుంది.
ACT 5:12 అపొస్తలులు, విశ్వాసులు, ఉమ్మడిగా సొలొమోను మండపంలో సమావేశమౌతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు, మహత్యాలు చేసారు.
ACT 5:13 ప్రజలు అపొస్తలుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు వాళ్ళతో చేరడానికి తెగించలేదు.
ACT 5:14 చాలా మంది స్త్రీలు, పురుషులు ప్రభువును విశ్వసించారు. ప్రభువు వాళ్ళను సంఘంలో చేర్చాడు.
ACT 5:15 ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్న వాళ్ళను దారి మీదికి తెచ్చి పరుపుల మీద చాపల మీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారి మీదుగా నడిచినప్పుడు అతని నీడ కొందరి మీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశ్యం.
ACT 5:16 ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి గుంపులు గుంపులుగా వచ్చారు. తమలో జబ్బుతో ఉన్న వాళ్ళను, దయ్యాలు పట్టి బాధపడ్తున్న వాళ్ళను తీసుకు వచ్చారు. వాళ్ళందరికీ నయమైపోయింది.
ACT 5:17 సద్దూకయ్యుల తెగకు చెందిన ప్రధాన యాజకుడు, అతనితో ఉన్న వాళ్ళు అసూయతో నిండిపోయారు.
ACT 5:18 వాళ్ళు అపొస్తలులను బంధించి కారాగారంలో వేసారు.
ACT 5:19 కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు.
ACT 5:20 వాళ్ళతో, “వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచొని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి” అని చెప్పాడు.
ACT 5:21 దేవదూత చెప్పినట్లు విని వాళ్ళు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవరణంలో ప్రవేశించి ప్రజలకు బోదించటం మొదలు పెట్టారు. ప్రధాన యాజకుడు, అతనితో ఉన్న వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల పెద్దలందర్ని సమావేశపరిచి మహాసభను ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అపొస్తలులను పిలుచుకు రమ్మని కొందర్ని కారాగారానికి పంపారు.
ACT 5:22 భటులు కారాగారానికి వచ్చారు. కాని వాళ్ళకు అపొస్తలులు కనపడలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళి, “మేము కారాగారపు ద్వారాలు భద్రంగా తాళం వేయబడి ఉండటం చూసాము. ద్వారపాలకులు ద్వారాల దగ్గర ఉండటం చూసాము. కాని ద్వారాలు తెరిచి చూస్తే అపొస్తలులు లేరు” అని జరిగిన విషయం చెప్పారు.
ACT 5:24 ఈ సంగతి విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన యాజకులు, వాళ్ళు ఏమై ఉంటారా? అని ఆశ్చర్యపడ్డారు.
ACT 5:25 ఇంతలో ఒకడు వచ్చి, “మీరు కారాగారంలో ఉంచిన వాళ్ళు మందిరం యొక్క ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు.
ACT 5:26 ఇది విని ద్వారపాలకుల అధిపతి భటులను వెంట తీసుకొని వాళ్ళను పట్టుకు రావటానికి వెళ్ళాడు. ప్రజలు తమను రాళ్ళతో కొడతారనే భయం వాళ్ళలో ఉంది. కనుక అపొస్తలులపై వాళ్ళు ఏ దౌర్జన్యం చేయలేదు.
ACT 5:27 అపొస్తలుల్ని పిలుచుకు వచ్చి మహాసభ ముందు నిలుచోబెట్టారు. ప్రధాన యాజకుడు విచారణ చేస్తూ,
ACT 5:28 “మీ యేసు పేరిట బోధించవద్దని మేము యిది వరకే ఖచ్చితంగా ఆజ్ఞాపించాము. అయినా యెరూషలేమంతా మీ బోధనలతో నింపివేసారు. అంతేకాక అతని మరణాన్ని మాపై మోపాలని చూస్తున్నారు” అని అన్నాడు.
ACT 5:29 పేతురు, మిగతా అపొస్తలులు యిలా అన్నారు: “మేము దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాము, మానవుల ఆజ్ఞల్ని కాదు.
ACT 5:30 మీరు సిలువకు వ్రేలాడదీసి చంపిన యేసును మా పూర్వీకుల దేవుడు బ్రతికించాడు.
ACT 5:31 దేవుడు ఆయనకు తన కుడి వైపుననున్న స్థానాన్నిచ్చాడు. ఆయన్ని ఒక అధిపతిగా, రక్షకుడిలా నియమించాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపం పొందే అవకాశము, తమ పాపాలకు క్షమాపణ పొందే అవకాశము కలగాలని ఆయన ఉద్దేశ్యం.
ACT 5:32 వీటికి మేము సాక్షులము. దేవుడు తన ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళకిచ్చిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షి.”
ACT 5:33 ఇది విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు అపొస్తలులను చంపాలనుకున్నారు.
ACT 5:34 కాని “గమలీయేలు” అనే పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలుచొని అపొస్తలుల్ని కొంతసేపు అవతలకు తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గమలీయేలు ధర్మశాస్త్ర పండితుడు. ప్రజల గౌరవం పొందినవాడు.
ACT 5:35 అతడు వాళ్ళని సంబోధిస్తూ, “ఇశ్రాయేలు ప్రజలారా! వీళ్ళను ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించండి!
ACT 5:36 ఇదివరలో థూదా కనిపించి తానొక గొప్ప వాణ్ణని చెప్పుకున్నాడు. సుమారు నాలుగువందల యాభై మంది అతణ్ణి అనుసరించారు. అతడు చంపబడ్డాడు. ఆ తర్వాత అతని అనుచరులు చెదిరి పోయారు. చివరకు ఏమీ మిగల్లేదు.
ACT 5:37 అతని తర్వాత జనాభా లెక్కల కాలంలో యూదా అనే వాడు వచ్చి ప్రజల్ని చేరదీసి తిరుగుబాటు చేసాడు. ఇతడు గలిలయవాడు. ఇతడు కూడా చంపబడ్డాడు. అతని అనుచరులందరూ చెదిరిపోయారు,
ACT 5:38 అందువల్ల వాళ్ళ విషయంలో నా సలహా ఇది: వాళ్ళ విషయం పట్టించుకోకండి! వాళ్ళను వదిలివేయండి! వాళ్ళ కార్యము, వాళ్ళ ఉద్దేశ్యము మానవుడు సృష్టించినదైతే అది నశిస్తుంది.
ACT 5:39 అలా కాకుండా అది దైవేచ్ఛ వలన అయితే మీరు వాళ్ళను ఆపలేరు. అలా చేస్తే మీరు దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళౌతారు” అని అన్నాడు.
ACT 5:40 సభ్యులు అతడు చెప్పినట్లు విన్నారు. అపొస్తలుల్ని పిలిపించి కొరడా దెబ్బలు కొట్టించారు. ఆ తర్వాత, యేసు పేరిట మాట్లాడవద్దని వారించి వదిలి వేసారు.
ACT 5:41 అపొస్తలులు యేసు కోసం అవమానింపబడటానికి తాము అర్హులైనందుకు సంతోషిస్తూ మహా సభనుండి వెళ్ళిపోయారు.
ACT 5:42 ప్రతి రోజూ మందిరంలో, ఇంటింటా, “యేసే క్రీస్తు” అని ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించటం మానుకోలేదు.
ACT 6:1 యేసు అనుచరుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ రోజుల్లో గ్రీకు భాషలో మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదులతో, “మా వితంతువుల్ని ప్రతి రోజు చేసే దానాల విషయంలో సరిగ్గా చూడటం లేదు” అని తగువు పెట్టుకొన్నారు.
ACT 6:2 అందువల్ల ఆ పన్నెండు మంది అపొస్తలులు అనుచరులందర్ని సమావేశ పరిచి ఈ విధంగా అన్నారు: “అన్నదానాల విషయం చూడటానికోసం మేము దేవుని సందేశం యొక్క బోధన విషయంలో అశ్రద్ధ వహించటం మంచిది కాదు.
ACT 6:3 సోదరులారా! పవిత్రాత్మ సంపూర్ణంగాగల వాళ్ళను, పూర్ణ జ్ఞానం కలవాళ్ళను ఏడుగురిని మీలోనుండి ఎన్నుకోండి. ఈ బాధ్యత వాళ్ళకప్పగిస్తాం.
ACT 6:4 మేము మా కాలాన్ని ప్రార్థనలకు, దేవుని సందేశాన్ని ఉపదేశించటానికి వినియోగిస్తాము.”
ACT 6:5 అపొస్తలులు చెప్పింది వాళ్ళకందరికీ బాగా నచ్చింది. వాళ్ళు స్తెఫనును ఎన్నుకొన్నారు. స్తెఫను దేవుని పట్ల గొప్ప విశ్వాసం గలవాడు. అతనిలో పవిత్రాత్మ సంపూర్ణంగా ఉంది. అతణ్ణే కాక ఫిలిప్పును, ప్రొకొరును, నీకానోరును, తీమోనును, పర్మెనాసును, నీకొలాసును కూడా ఎన్నుకొన్నారు. ఈ నీకొలాసు అంతియొకయకు చెందినవాడు. పూర్వం యూదుల మతంలో చేరినవాడు.
ACT 6:6 ప్రజలు వీళ్ళను అపొస్తలుల ముందుకు పిలుచుకొని వచ్చారు. అపొస్తలులు ప్రార్థించి తమ చేతుల్ని వాళ్ళపై ఉంచారు.
ACT 6:7 దేవుని సందేశం ప్రచారమైంది. యెరూషలేములో శిష్యుల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది యాజకులు విశ్వసించారు.
ACT 6:8 దేవుని నుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని పొందిన స్తెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్భుతాలు చేసాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు.
ACT 6:9 కాని స్వతంత్రుల సమాజమని పిలువబడే సమాజానికి చెందిన కొందరు యూదులు స్తెఫనుతో వాదన పెట్టుకొన్నారు. వీళ్ళలో కురేనీ, అలెక్సంద్రియ పట్టణాలకు చెందిన యూదులు, కిలికియ, ఆసియ ప్రాంతాలకు చెందిన యూదులు కూడా ఉన్నారు.
ACT 6:10 కాని మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి తెలివినిచ్చాడు. కనుక అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు.
ACT 6:11 ఆ తర్వాత యూదులు కొందరిని పురికొలిపి, “ఈ స్తెఫను, మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడటం మేము విన్నాము” అని చెప్పమన్నారు.
ACT 6:12 అదే విధంగా ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్ని, కూడా పురికొలిపి పంపారు. ఆ తదుపరి స్తెఫన్ను బంధించి మహాసభ ముందుకు తెచ్చారు.
ACT 6:13 తప్పుడు సాక్ష్యాలు తెచ్చి, “యితడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎదిరిస్తూ మాట్లాడటం మానుకోడు. ఎందుకంటే, నజరేతు నివాసి యేసు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తాడని, మోషే మనకందించిన ఆచారాన్ని మారుస్తాడని చెప్పటం మేము విన్నాము” అని వాళ్ళతో చెప్పించారు.
ACT 6:15 సభలో కూర్చొన్న వాళ్ళంతా స్తెఫను వైపు శ్రద్ధగా చూసారు. వాళ్ళకు అతని ముఖం ఒక దేవదూత ముఖంలా కనిపించింది.
ACT 7:1 ఆ తర్వాత ప్రధాన యాజకుడు, “ఈ నేరారోపణలు నిజమా?” అని అతణ్ణి అడిగాడు.
ACT 7:2 అతడు సమాధానంగా, “అయ్యలారా! సోదరులారా నేను చెప్పేది వినండి, అది, మన తండ్రి అబ్రాహాము ‘మెసొపొతమియలో’ నివసిస్తున్న కాలం. అంటే, అతడు అప్పటికి యింకా తన నివాసాన్ని ‘హారాను’ పట్టణానికి మార్చలేదన్న మాట.
ACT 7:3 అక్కడ అతనికి తేజస్వి అయిన దేవుడు కనిపించి, ‘నీ దేశాన్ని, ప్రజల్ని వదిలి నేను చూపబోయే దేశానికి వెళ్ళు’ అని అన్నాడు.
ACT 7:4 “అందువల్ల అతడు కల్దీయుల దేశాన్ని వదిలి హారానులో స్థిరపడ్డాడు. అతని తండ్రి చనిపోయాక ఆ దేశాన్ని కూడా వదలమని, మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో దేవుడతణ్ణి స్థిరపర్చాడు.
ACT 7:5 దేవుడతనికి ఈ దేశంలో ఒక్క అడుగు భూమి కూడా ఆస్థిగా యివ్వలేదు. అతనికి అప్పుడు సంతానం లేకపోయినా, అతనికి, అతని తర్వాత రానున్న వాళ్ళకు ఆ దేశం ఆస్తిగా ఉంటుందని వాగ్దానం చేసాడు.
ACT 7:6 “దేవుడతనితో, ‘నీ వారసులు పరదేశంలో నివసిస్తారు. ఆ పరదేశీయులు, నీ వాళ్ళను నాలుగు వందల సంవత్సరాలు తమ బానిసలుగా ఉంచుకొని వాళ్ళను కష్టపెడతారు.
ACT 7:7 వాళ్ళను బానిసలుగా చేసిన దేశాన్ని, నేను శిక్షిస్తాను. ఆ తర్వాత నీ ప్రజలు ఆ దేశం వదిలి నన్ను యిక్కడ ఆరాధిస్తారు’ అని అన్నాడు.
ACT 7:8 “సున్నతి నియమాన్ని పాటిస్తే తన వాగ్దానాన్ని నిలుపుకొంటానని దేవుడు అబ్రాహాముతో ఒక ఒప్పందం చేసాడు. ఇస్సాకు పుట్టిన ఎనిమిదవ రోజున అబ్రాహాము అతనికి సున్నతి చేయించాడు. అదే విధంగా ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు సున్నతి చేయించాడు. యాకోబు తన పన్నెండుమంది కుమారులకు సున్నతి చేయించాడు. ఈ పన్నెండు మంది పండ్రెండు వంశాలకు మూల పురుషులయ్యారు.
ACT 7:9 “వీళ్ళకు, తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది. అందువల్ల వాళ్ళతణ్ణి ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేసారు. కాని దేవుడతనికి అండగా ఉండి,
ACT 7:10 అతణ్ణి కష్టాలనుండి రక్షించాడు. అతనికి జ్ఞానాన్ని యిచ్చాడు. ఆ జ్ఞానంతో అతడు ఈజిప్టు రాజైన ‘ఫరో’ అభిమానాన్ని సంపాదించాడు. ఫరో అతణ్ణి ఈజిప్టు దేశానికి పాలకునిగా, తన రాజభవనాలకు అధికారిగా నియమించాడు.
ACT 7:11 ఇంతలో ఈజిప్టు, కనాను దేశాల్లో కరువు రాగా ప్రజలు చాలా కష్టాలనుభవించారు. మన పూర్వీకులకు తినటానికి తిండి కూడా లేకుండింది.
ACT 7:12 “ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వీకుల్ని మొదటి సారిగా అక్కడకు పంపాడు.
ACT 7:13 రెండవసారి వచ్చినప్పుడు, యోసేపు తానెవ్వరన్న విషయం తన సోదరులకు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది.
ACT 7:14 ఆ తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును, డెభ్బై ఐదు మందిగల తన కుటుంబాన్ని పిలవనంపాడు.
ACT 7:15 యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక, అతడు, మన పూర్వీకులు అందరూ చనిపోయారు.
ACT 7:16 వాళ్ళ దేహాలు షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రాహాము యిదివరలో హమోరు వంశం వాళ్ళకు డబ్బిచ్చి వాళ్ళనుండి ఒక స్మశాన భూమిని కొని ఉన్నాడు. వాళ్ళు అక్కడ సమాధి చేయబడ్డారు.
ACT 7:17 “దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం ఫలించే సమయం దగ్గరకు వచ్చింది. ఈజిప్టులో మన వాళ్ళ సంఖ్య బహుగా పెరిగింది.
ACT 7:18 కొంత కాలం తర్వాత యోసేపును గురించి ఏమీ తెలియనివాడు ఈజిప్టు దేశానికి పాలకుడయ్యాడు.
ACT 7:19 అతడు మన వాళ్ళను మోసం చేసాడు. మన వాళ్ళ సంతానం చనిపోవాలని, వాళ్ళకు పుట్టిన పసికందుల్ని బయట వేయించి వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.
ACT 7:20 “ఆ కాలంలోనే మోషే జన్మించాడు. ఇతడు సామాన్యుడు కాడు. మోషే మూడు నెలల దాకా తన తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు.
ACT 7:21 ఇతణ్ణి యింటి బయట ఉంచగానే ఫరో కుమార్తె తీసుకెళ్ళి తన స్వంత కుమారునిగా పెంచుకుంది.
ACT 7:22 ఈజిప్టు దేశస్థుల జ్ఞానాన్నంతా అతనికి నేర్పించింది. మోషే గొప్ప విషయాలు చెప్పటంలో గొప్ప పనులు చేయటంలో ఆరితేరిన వాడయ్యాడు.
ACT 7:23 “మోషేకు నలభై సంవత్సరాలు రాగానే అతడు తన తోటి ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకొన్నాడు.
ACT 7:24 ఒకసారి, మోషే ఈజిప్టు దేశస్థుడు ఇశ్రాయేలు వానితో అన్యాయంగా ప్రవర్తించటం చూసి ఇశ్రాయేలీవానికి సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో, అతణ్ణి రక్షించటానికి వెళ్ళాడు. ఈజిప్టు దేశస్థుణ్ణి చంపి ఇశ్రాయేలు వాని పక్షాన పగ తీర్చుకున్నాడు.
ACT 7:25 ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటానికి దేవుడు తనను ఉపయోగిస్తున్న విషయం వాళ్ళు తెలుసుకొంటారని మోషే ఆశించాడు. కాని వాళ్ళకది అర్థం కాలేదు.
ACT 7:26 “మరుసటి రోజు మోషే యిద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడటం చూసి, వాళ్ళను శాంత పరచాలనే ఉద్దేశ్యంతో, ‘అయ్యా! మీరు సోదరులు! పరస్పరం ఎందుకు పోట్లాడుతున్నారు?’ అని అడిగాడు.
ACT 7:27 ఏ ఇశ్రాయేలు వాడు తోటివాడికి అన్యాయం చేశాడో వాడు, మోషేను ప్రక్కకు త్రోసి, ‘మా మీద తీర్పు చెప్పటానికి, మమ్మల్ని పాలించటానికి నిన్నెవరు నియమించారు?
ACT 7:28 ఈజిప్టు దేశస్థుణ్ణి నిన్న చంపినట్లు నన్ను కూడా చంపాలని చూస్తున్నావా?’ అని అన్నాడు.
ACT 7:29 ఈ విమర్శ విని మోషే ఈజిప్టు దేశాన్ని వదిలి, మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ పరదేశీయునిగా స్థిరపడ్డాడు. అక్కడ అతనికి యిద్దరు కుమారులు కలిగారు.
ACT 7:30 “నలభై సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు సీనాయి పర్వతంపై మండుతున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనిపించాడు.
ACT 7:31 ఆ దృశ్యాన్ని చూసి మోషే దిగ్భ్రాంతి చెందాడు. దగ్గరనుండి చూడాలనుకొని ముందుకు వెళ్తుండగా అతనికి ప్రభువు స్వరం వినిపించింది.
ACT 7:32 ఆ స్వరం అతనితో ‘నేను మీ పూర్వుల దేవుణ్ణి! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి!’ అని అన్నాడు. మోషే వణికిపోయాడు. తలెత్తి చూడటానికి అతనికి ధైర్యం చాలలేదు.
ACT 7:33 “ప్రభువు, ‘చెప్పులు తీసెయ్యి! నీవు నిలుచున్న స్థలం పవిత్రమైనది.
ACT 7:34 నా ప్రజల్ని ఈజిప్టులో అణచి ఉంచటం చూసాను. వాళ్ళ ఏడుపులు విన్నాను. వాళ్ళకు విముక్తి కలిగించటానికి వచ్చాను. రా! నిన్ను తిరిగి ఈజిప్టు పంపుతాను!’ అని అన్నాడు.
ACT 7:35 స్తెఫను ఇంకా ఇలా చెప్పాడు: “‘నిన్ను పాలకునిగా, న్యాయాధిపతిగా చేసిందెవరు?’ అని వాళ్ళచే తిరస్కరించబడినవాడే ఈ మోషే. ఈ మోషేను దేవుడు వాళ్ళ పాలకునిగా, రక్షకునిగా పంపినట్లు పొదలో కనిపించిన దేవదూత ద్వారా తెలియచేసాడు.
ACT 7:36 మోషే అద్భుతాలు, మహత్యాలు చేసి వాళ్ళను ఈజిప్టు నుండి వెలుపలికి పిలుచుకు వచ్చాడు. ఎఱ్ఱ సముద్రం దగ్గర, ఆ తర్వాత నలభై సంవత్సరాలు ఎడారుల్లో కూడా అద్భుతాలు, మహాత్యాలు చేసాడు.
ACT 7:37 “‘నాలాంటి ప్రవక్తను దేవుడు మీనుండి ఎన్నుకొని మీకందిస్తాడు’ అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మోషే ఇతడే!
ACT 7:38 ఇశ్రాయేలు ప్రజలందరూ ఎడారిలో సమావేశమైనప్పుడు, అక్కడున్న మన పూర్వీకులతో కలిసి ఉన్నవాడు మోషేనే. సీనాయి పర్వతంపై దేవదూతతో మాట్లాడింది మోషేనే. మనకు అందివ్వటానికి సజీవమైన దైవసందేశాన్ని పొందింది మోషేనే.
ACT 7:39 “కాని మన పూర్వీకులు అతని మాటలు వినలేదు. పైగా అతణ్ణి తిరస్కరించి ఈజిప్టు దేశానికి తిరిగి వెళ్ళాలనుకొన్నారు.
ACT 7:40 అందువల్ల అహరోనుతో, ‘మాకు దారి చూపించగల దేవుళ్ళ విగ్రహాలను సిద్ధం చేయించు. మమ్మల్ని ఈజిప్టు నుండి పిలుచుకు వచ్చిన ఆ మోషేకు ఏమైందో ఏమో!’ అని అన్నారు.
ACT 7:41 వెంటనే అందరూ కలిసి దూడ రూపంలో ఒక విగ్రహాన్ని సిద్ధం చేసారు. ఆ విగ్రహానికి బలి అర్పించారు. తమ చేతుల్తో తయారు చేసిన ఆ విగ్రహం పేరిట పండుగ చేసుకొన్నారు.
ACT 7:42 కాని దేవుడు విరక్తి చెంది, ‘ఆకాశంలోని మీ దేవుళ్ళను మీరు పూజించుకొండి’ అని అన్నాడు. దీన్ని గురించి ప్రవక్తల గ్రంథంలో యిలా వ్రాయబడి వుంది: ‘ఓ ఇశ్రాయేలు ప్రజలారా! ఎడారుల్లో నలభై సంవత్సరాలు పశువుల్ని బలి యిచ్చింది నా కోసం కాదు!
ACT 7:43 మీరు మీ వెంట మోసుకు వెళ్ళింది, మొలొకు యొక్క డేరా! మీరు మోసుకు వెళ్ళింది మీరు దేవుడనుకొంటున్న రొంఫా నక్షత్రం యొక్క విగ్రహాన్ని! దాన్ని మీరు పూజించుకోవటానికి సృష్టించుకున్నారు. కనుక మిమ్మల్ని బబులోను నగరానికి దూరంగా పంపుతాను!’
ACT 7:44 “మన పూర్వులు ఎడారుల్లో ఉన్నప్పుడు వాళ్ళ వద్ద దేవుని గుడారం ఉంది. ఇది మోషేచే నిర్మింపబడినది. ఇది నిర్మింపబడక ముందు దేవుడు ఒక నమూనాను మోషేకు చూపి దాని ప్రకారం నిర్మించుమని ఆజ్ఞాపించాడు.
ACT 7:45 ఆ తర్వాత ఇది మన పూర్వీకులకు లభించింది. వాళ్ళు యెహోషువ నాయకత్వాన, దేవుడు పారద్రోలిన ప్రజలు వదిలి వెళ్తున్న భూమిపై స్థిరపడుతున్న సమయాన ఈ గుడారం వాళ్ళ దగ్గరే ఉంది. దావీదు కాలందాకా అది ఆ దేశంలో ఉంది.
ACT 7:46 దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు వంశీయుల కోసం మందిరాన్ని నిర్మించే అవకాశం యివ్వుమని దేవున్ని కోరాడు.
ACT 7:47 అయితే ఈ మందిరాన్ని నిర్మించింది సొలొమోను రాజు.
ACT 7:48 “కాని సర్వోన్నతుడైన దేవుడు మానవులు నిర్మించిన మందిరాల్లో నివసించడు. దీన్ని గురించి ప్రవక్త యిలా అన్నాడు:
ACT 7:49 ‘ఆకాశం నా సింహాసనం! భూమి నా పాద పీఠం! నాకెలాంటి మందిరం నిర్మిస్తారు మీరు? విశ్రాంతికి నాకు స్థలం ఏది?
ACT 7:50 ఇవన్నీ నిర్మించింది నేనే కాదా?’ అని ప్రభువన్నాడు.”
ACT 7:51 స్తెఫను ఉపన్యాసం సాగిస్తూ, “మూర్ఖులారా! మీ హృదయాలు యూదులు కాని వాళ్ళ హృదయాల వలే ఉన్నాయి. మీ చెవులు దైవసందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళవలె మీరు కూడా అన్ని వేళలా పవిత్రాత్మను తృణీకరించారు.
ACT 7:52 మీ పూర్వులు హింసించని ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా! నీతిమంతుడు రానున్నాడని ప్రవచనం చెప్పిన వాళ్ళను వాళ్ళు చంపివేసారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తుని కూడా చంపేసారు.
ACT 7:53 దేవదూతల ద్వారా అందివ్వబడిన దేవుని ధర్మశాస్త్రం లభించింది మీకు. కాని దాన్ని మీరు పాటించను కూడా లేదు” అని అన్నాడు.
ACT 7:54 ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండిపోయి, అతణ్ణి చూసి పళ్ళు కొరికారు.
ACT 7:55 కాని స్తెఫను పవిత్రాత్మతో నిండిపోయి పరలోకం వైపే చూసి దేవుని తేజస్సును, యేసు దేవుని కుడి వైపు ఉండటం చూసాడు.
ACT 7:56 “అదిగో చూడండి! పరలోకం తెరుచుకోవటం. దేవుని కుమారుడు ఆయన కుడి వైపు నిలుచొని వుండటం చూస్తున్నాను!” అని అన్నాడు.
ACT 7:57 ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్ళారు.
ACT 7:58 అతణ్ణి ఊరి బయటికి లాగి రాళ్ళతో కొట్టటం మొదలు పెట్టారు. ఈ సంఘటన చూస్తున్న వాళ్ళు తమ వస్త్రాల్ని “సౌలు” అనబడే ఒక యువకుని కాళ్ళ ముందు వుంచారు.
ACT 7:59 వాళ్ళు రాళ్ళు విసరుతుండగా స్తెఫను, “యేసు ప్రభూ! నా ఆత్మను నీలో చేర్చుకో!” అని ప్రార్థించాడు.
ACT 7:60 ఆ తదుపరి మోకరిల్లి, “ప్రభూ! వాళ్ళపై ఈ పాపం మోపవద్దు!” అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూసాడు.
ACT 8:1 అతణ్ణి చంపటానికి తన అంగీకారం చూపుతున్నట్లు సౌలు అక్కడే ఉన్నాడు.
ACT 8:2 కొందరు విశ్వాసులు స్తెఫన్ను సమాధి చేసి, అతని కోసం దుఃఖించారు. ఆ రోజు యెరూషలేములోని సంఘంపై పెద్ద హింసాకాండ మొదలైంది. సౌలు సంఘాన్ని నాశనం చెయ్యటం మొదలు పెట్టాడు. ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళను, మగవాళ్ళను బయటకు లాగి కారాగారంలో వేసాడు. అపొస్తలులు తప్ప మిగతా వాళ్ళంతా చెదిరిపోయి, యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
ACT 8:4 ఇలా చెదిరిపోయిన వాళ్ళు తాము వెళ్ళిన ప్రతిచోటా సువార్త ప్రకటించారు.
ACT 8:5 ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్ళి క్రీస్తును గురించి ప్రకటించాడు.
ACT 8:6 ప్రజలు ఫిలిప్పు చెప్పిన ఉపన్యాసాలు విన్నారు. చేసిన అద్భుతాలు చూసారు. దయ్యాలు పట్టిన వాళ్ళు, పక్షవాత రోగులు, కుంటివాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. దయ్యాలు పట్టిన వాళ్ళనుండి దయ్యాలు పెద్దకేకలు వేస్తూ వెలుపలికి వచ్చాయి. పక్షవాత రోగులకు, కుంటివాళ్ళకు నయమైంది. ఈ కారణంగా వాళ్ళు అతడు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా గమనించారు.
ACT 8:8 ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఆనందించారు.
ACT 8:9 సీమోను సమరయకు చెందినవాడు. అతడు చాలా కాలం నుండి ఇంద్రజాలం చేస్తూ, సమరయ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తుండేవాడు. తానొక గొప్ప వాణ్ణని చెప్పుకొనేవాడు.
ACT 8:10 చిన్నా, పెద్దా అంతా అతడు చెప్పినవి జాగ్రత్తగా వినేవాళ్ళు. “మనం గొప్ప శక్తి అంటామే ఆ దైవికమైన శక్తి అతనిలో మూర్తీభవించి ఉంది” అని ప్రజలు అనేవాళ్ళు.
ACT 8:11 అతడు వాళ్ళను తన ఇంద్రజాలంతో చాలాకాలం నుండి ఆశ్చర్య పరుస్తూ ఉండటంవల్ల వాళ్ళు అతడు చెప్పినట్లు చేసేవాళ్ళు.
ACT 8:12 కాని దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్తను, యేసు క్రీస్తు పేరును ఫిలిప్పు ప్రకటించిన తరువాత ఆడ, మగా అందరూ విని, విశ్వసించి, బాప్తిస్మము పొందారు.
ACT 8:13 సీమోను కూడా విశ్వసించి బాప్తిస్మము పొందాడు. అతడు ఫిలిప్పుకు సన్నిహితంగా ఉండి అతడు చేసిన మహాత్యాల్ని అద్భుతాల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు.
ACT 8:14 యెరూషలేములోని అపొస్తలులు సమరయ దేశం దేవుని సందేశాన్ని అంగీకరించిందని విని, పేతురును, యోహాన్ను అక్కడికి పంపారు.
ACT 8:15 పేతురు, యోహానులు వచ్చి అక్కడి వాళ్ళకు పవిత్రాత్మ లభించాలని ప్రార్థించారు.
ACT 8:16 ఎందుకంటే అక్కడి వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. కాని వాళ్ళ మీదికి పవిత్రాత్మ యింకా రాలేదు.
ACT 8:17 వాళ్ళు తమ చేతుల్ని అక్కడి ప్రజలపై ఉంచిన వెంటనే ఆ ప్రజలు పవిత్రాత్మను పొందారు.
ACT 8:18 అపొస్తలులు తమ చేతుల్ని వాళ్ళపై ఉంచిన వెంటనే వాళ్ళలోకి పవిత్రాత్మ రావటం సీమోను గమనించి వాళ్ళతో,
ACT 8:19 “నేను మీకు డబ్బులిస్తాను; నా చేతులుంచిన ప్రతి ఒక్కనికి పవిత్రాత్మ లభించేటట్లు చేసే ఈ శక్తి నాక్కూడా యివ్వండి” అని అడిగాడు.
ACT 8:20 పేతురు, “దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకొన్నావు కనుక నీ డబ్బు నీతో నాశనమైపోనీ!
ACT 8:21 దేవుని దృష్టిలో నీ హృదయం మంచిది కాదు. కనుక ఈ సేవలో నీకు స్థానం లేదు.
ACT 8:22 నీ దుర్భుద్ధికి పశ్చాత్తాపం చెంది ప్రభువును ప్రార్థించు. అలాంటి ఆలోచన నీలో కలిగినందుకు ప్రభువు నిన్ను క్షమించవచ్చు.
ACT 8:23 నీలో విషం నిండి ఉండటం నేను చూస్తున్నాను. నీవు అధర్మానికి లోబడిపోయావు” అని సమాధానం చెప్పాడు.
ACT 8:24 ఆ తదుపరి సీమోను వాళ్ళతో, “మీరన్నదేదీ నాకు కలగకూడదని నా పక్షాన ప్రభువును ప్రార్థించండి” అని అడిగాడు.
ACT 8:25 పేతురు, యోహానులు తాము ప్రభువును గురించి విన్నది, చూసినది అక్కడి ప్రజలకు చెప్పారు. ప్రభువు చెప్పిన సందేశాన్ని ప్రకటించారు. ఆ తర్వాత వాళ్ళు శుభవార్తను ఎన్నో సమరయ పల్లెల్లో ప్రకటిస్తూ యెరూషలేమునకు తిరిగి వచ్చారు.
ACT 8:26 ఒక దేవదూత ఫిలిప్పుతో, “లే! దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజా వెళ్ళే ఎడారి దారిని చేరుకో!” అని అన్నాడు.
ACT 8:27 అతడు లేచి వెళ్ళాడు. అక్కడ ఇథియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కనిపించాడు. అతడు నపుంసకుడు. ఇథియోపియన్ల రాణి కందాకే రాజ్యంలో ప్రధాన కోశాధికారిగా పని చేస్తుండేవాడు. యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి,
ACT 8:28 తిరిగి వస్తూ తన రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుచుండగా.
ACT 8:29 దేవుని ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథం దగ్గరకు వెళ్ళి అక్కడే ఉండు” అని అన్నాడు.
ACT 8:30 ఫిలిప్పు రథం దగ్గరకు పరుగెత్తుతూ యెషయా ప్రవక్త గ్రంథాన్ని ఆ కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ కోశాధికారిని, “నీవు చదువుతున్నది అర్థమౌతోందా?” అని అడిగాడు.
ACT 8:31 “ఎవరైనా నాకు విడమర్చి చెబితే తప్ప ఎట్లా అర్థమౌతుంది” అని కోశాధికారి అన్నాడు. అతడు ఫిలిప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు.
ACT 8:32 ఆ కోశాధికారి ధర్మశాస్త్రంలోని ఈ వాక్యాన్ని చదువుతువున్నాడు: “చంపటానికి తీసుకు వెళ్ళుతున్న గొఱ్ఱెలా ఆయన నడిపించబడ్డాడు తన బొచ్చును కత్తిరిస్తున్న గొఱ్ఱెపిల్ల మౌనం వహించినట్లుగా ఆయన మాట్లాడ లేదు!
ACT 8:33 ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం జరిగించారు. ఆయన జీవితాన్ని భూమ్మీదనుండి తొలగించారు. ఆయన సంతతిని గురించి యిక మాట్లాడేదెవరు?”
ACT 8:34 ఆకోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకర్ని గురించా? దయచేసి చెప్పండి!” అని అడిగాడు.
ACT 8:35 ఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు.
ACT 8:36 ఆ దారిన ప్రయాణం చేస్తూ వాళ్ళు నీళ్ళున్న ఒక ప్రదేశాన్ని చేరుకొన్నారు. ఆ కోశాధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్ళున్నాయి, మీరు నాకు బాప్తిస్మమునెందుకు ఇవ్వకూడదు?” అని అడిగాడు.
ACT 8:37 దాన్ని ఆపమని ఆజ్ఞాపించి, ఫిలిప్పు ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళలోకి వెళ్ళారు.
ACT 8:38 ఫిలిప్పు అతనికి బాప్తిస్మమునిచ్చాడు.
ACT 8:39 వాళ్ళు నీళ్ళ నుండి వెలుపలికొచ్చాక ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడినుండి తీసుకొని వెళ్ళాడు. ఆ కోశాధికారి ఫిలిప్పును మళ్ళీ చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన తాను వెళ్ళిపొయ్యాడు.
ACT 8:40 ఫిలిప్పు అజోతు అనే పట్టణంలో కనిపించాడు. అక్కడి నుండి బయలుదేరి అన్ని పట్టణాలకు వెళ్ళి శుభవార్తను ప్రకటించాడు. చివరకు కైసరియ చేరుకొన్నాడు.
ACT 9:1 సౌలు, ప్రభువు అనుచరుల్ని చంపిస్తానని ఇంకా బసలు కొడ్తూనే ఉన్నాడు.
ACT 9:2 ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్ళి డెమాస్కసు పట్టణంలోని సమాజ మందిరాలకు ఉత్తరాలు వ్రాసి యివ్వమని అడిగాడు. ప్రభువు మార్గాన్ని అనుసరించే వాళ్ళు కనిపిస్తే స్త్రీ, పురుష భేదం లేకుండా వాళ్ళను బంధించి యెరూషలేముకు తీసుకు రావాలని అతని ఉద్దేశ్యం.
ACT 9:3 అతడు డెమాస్కసు పొలిమేరలు చేరుకున్నాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.
ACT 9:4 అతడు నేల కూలిపొయ్యాడు. ఒక స్వరం, “సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు?” అని వినబడింది.
ACT 9:5 “ప్రభూ! మీరెవరు?” అని సౌలు అడిగాడు. “నేను నీవు హింసిస్తున్న యేసును.
ACT 9:6 లేచి పట్టణంలోకి వెళ్ళు. నీవేం చెయ్యాలో అక్కడ నీకు చెప్పబడుతుంది” అని ఆయన సమాధానం చెప్పాడు.
ACT 9:7 సౌలుతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు మూగవాళ్ళలా నిల్చున్నారు. వాళ్ళు ఆ స్వరం విన్నారే కాని వాళ్ళకెవ్వరూ కనపడలేదు.
ACT 9:8 క్రింద పడ్డ సౌలు లేచి నిలుచొని కళ్ళు తెరిచాడు. కాని అతనికి ఏమీ కనిపించలేదు. వాళ్ళతని చేయి పట్టుకొని డెమాస్కసులోనికి నడిపించారు.
ACT 9:9 మూడు రోజుల దాకా అతడు గ్రుడ్డివానిగానే ఉండిపోయాడు. ఆహారం కాని నీళ్ళు కాని ముట్టలేదు.
ACT 9:10 డెమాస్కసులో యేసు భక్తుడొకడుండేవాడు. అతని పేరు అననీయ. ప్రభువతనికి దివ్యదర్శనంలో కనపడి, “అననీయా!” అని పిలిచాడు. “ఇదిగో, ఇక్కడున్నాను ప్రభూ!” అని అతడు జవాబు చెప్పాడు.
ACT 9:11 ప్రభువతనితో, “‘తిన్నని వీధి’ అని పిలువబడే వీధిలో ఉన్న ‘యూదా’ యింటికి వెళ్ళు, ‘తార్సు’ అనే పట్టణం నుండి వచ్చిన సౌలు అనే వ్యక్తి కోసం అడుగు. అతడు ప్రార్థిస్తూ ఉంటాడు.
ACT 9:12 అతడొక దివ్యదర్శనంలో ‘అననీయ’ అనే పేరుగలవాడు అతని దగ్గరకు వచ్చినట్లు, అతనికి దృష్టి రావటానికి అతనిపై చేతులుంచబడినట్లు చూసాడు” అని చెప్పాడు.
ACT 9:13 అననీయ, “ప్రభూ, అతడు యెరూషలేంలోని పరిశుద్ధులకు చాలా హాని చేసినట్లు చాలా మంది విన్నారు.
ACT 9:14 మిమ్మల్ని శరణుజొచ్చిన ప్రతి ఒక్కణ్ణి బంధించే అధికారం అతడు ప్రధాన యాజకుల దగ్గరనుండి పొందాడు”, అని సమాధానం చెప్పాడు.
ACT 9:15 అప్పుడు ప్రభువు అననీయతో, “వెళ్ళు! నా పేరు యూదులు కాని వాళ్ళకు, వాళ్ళ పాలకులకు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రచారం చేయటానికి యితణ్ణి నేను ఒక సాధనంగా ఎన్నుకొన్నాను.
ACT 9:16 నా పేరిట అతడెన్ని కష్టాలు పడవలసి వస్తుందో నేనతనికి తెలియచేస్తాను” అని అన్నాడు.
ACT 9:17 ఆ తర్వాత అననీయ అక్కడి నుండి బయలుదేరి సౌలు ఉన్న యింటికి వెళ్ళాడు. తన చేతుల్ని సౌలు మీద ఉంచి, “సోదరుడా! సౌలా! యేసు ప్రభువు నివిక్కడికి వస్తున్నప్పుడు నీకు దారిలో కనిపించాడే, ఆయనే, నీవు మళ్ళీ చూడగలగాలని, పవిత్రాత్మ నీలో నిండాలని నన్ను పంపాడు” అని అన్నాడు.
ACT 9:18 వెంటనే పొరల్లాంటివి సౌలు కళ్ళనుండి రాలి క్రిందపడ్డాయి. అతడు మళ్ళీ చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మము పొందాడు.
ACT 9:19 ఆ తర్వాత కొంత ఆహారాన్ని పుచ్చుకొన్నాక అతనికి బలం వచ్చింది. సౌలు డెమాస్కసులో ఉన్న విశ్వాసులతో కొద్ది రోజులు గడిపాడు.
ACT 9:20 ఆ తర్వాత, యూదుల సమాజ మందిరాల్లో, “యేసు దేవుని కుమారుడు” అని బోధించటం మొదలు పెట్టాడు.
ACT 9:21 అతని మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసును నమ్మిన వాళ్ళను చంపిన వాడు ఇతడే కదా! ఇక్కడికి వచ్చింది యేసు శిష్యులను బంధించటానికే కదా! అలా బంధించి వాళ్ళను ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొని వెళ్ళాలనే కదా అతని ఉద్దేశ్యం!” అని అనుకొన్నారు.
ACT 9:22 కాని సౌలు ఇంకా ఎక్కువ ఆత్మబలంతో డెమాస్కసులో నివసించే యూదులకు, “యేసు ప్రభువే క్రీస్తు” అని రుజువు చేసి వాళ్ళను ఆశ్చర్యపరిచాడు.
ACT 9:23 చాలా రోజులు గడిచిపోయాయి. యూదులు అతణ్ణి చంపాలని కుట్రపన్నారు.
ACT 9:24 కాని సౌలుకు వాళ్ళ కుట్ర తెలిసిపోయింది. యూదులు అతణ్ణి చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాలను జాగ్రత్తగా కాపలా కాచారు.
ACT 9:25 కాని అతని శిష్యులు రాత్రివేళ అతణ్ణి ఒక బుట్టలో దాచి కోట గోడనుండి క్రిందికి దింపారు.
ACT 9:26 సౌలు యెరూషలేముకు వచ్చాక శిష్యులతో కలిసిపోవటానికి ప్రయత్నించాడు. కాని వాళ్ళు అతడంటేనే భయపడిపోయారు.
ACT 9:27 కాని బర్నబా అతణ్ణి పిలుచుకొని అపొస్తలుల దగ్గరకు వచ్చి వాళ్ళతో సౌలు ప్రయాణంలో ప్రభువును చూసిన విషయము, ప్రభువు అతనితో మాట్లాడిన విషయము, అతడు డెమాస్కసులో యేసు పేరును ధైర్యంగా ప్రకటించిన విషయము చెప్పాడు.
ACT 9:28 స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరును ధైర్యంగా ప్రకటిస్తూ సౌలు వాళ్ళతో కలిసి యెరూషలేములో ఉండిపోయాడు.
ACT 9:29 గ్రీకు మాట్లాడే యూదులతో మాట్లాడి వాదించాడు. వాళ్ళు అతణ్ణి చంపాలని నిశ్చయించారు.
ACT 9:30 సోదరులకు యిది తెలియగానే అతణ్ణి కైసరియకు తీసుకెళ్ళి అక్కడి నుండి తార్సుకు పంపారు.
ACT 9:31 ఆ తర్వాత యూదయ, గలిలయ, సమరయలోని సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపాయి. ఆయా ప్రాంతాలలోని సంఘాలకు చెందిన సభ్యులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువంటే భయభక్తులు కలిగి, పవిత్రాత్మ ద్వారా ప్రోత్సాహాంపొందుతూ జీవించారు. సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ACT 9:32 పేతురు దేశమంతా తిరుగుతూ “లుద్ద” అనే పట్టణంలో నివసిస్తున్న విశ్వాసుల్ని కలుసుకోవటానికి వెళ్ళాడు.
ACT 9:33 అక్కడ ఎనిమిదేళ్ళ నుండి పక్షవాతంతో మంచంపట్టిన “ఐనెయ” అనే వాణ్ణి చూసాడు.
ACT 9:34 “ఐనెయా! అని పిలిచి యేసు క్రీస్తు నీకు నయం చేస్తాడు. లేచి నీ పరుపును సర్దుకో!” అని అన్నాడు. ఐనెయ వెంటనే లేచి నిలుచున్నాడు.
ACT 9:35 లుద్ద, షారోను పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళంతా ఐనెయను చూసి ప్రభువునందు విశ్వాసముంచారు.
ACT 9:36 “యొప్పే” అనే పట్టణంలో, తబితా అనే శిష్యురాలు ఉండేది. ఈమెను గ్రీకు భాషలో దొర్కా అని పిలిచే వాళ్ళు. ఈమె పేదలకు సహాయం చేస్తూ ఉండేది. ఎప్పుడూ మంచి పనులు చేసేది.
ACT 9:37 పేతురు అదే ప్రాంతాల్లో ఉండగా ఆమె జబ్బు పడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ మీది గదిలో ఉంచారు.
ACT 9:38 లుద్ద యొప్పే పట్టణానికి దగ్గరగా ఉండింది. పేతురు లుద్దలో ఉన్నాడని, శిష్యులు యిద్దరు మనుష్యుల్ని అతని దగ్గరకు పంపి వెంటనే రమ్మని వేడుకున్నారు.
ACT 9:39 పేతురు వాళ్ళ వెంట వెళ్ళాడు. అతడు రాగానే మేడ మీది గదికి తీసుకు వెళ్ళారు. అతని చుట్టూ చేరిన వితంతువులు, దొర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన రకరకాల దుస్తుల్ని చూపి విలపించారు.
ACT 9:40 పేతురు వాళ్ళందర్ని గదినుండి వెలుపలికి పంపి తన మోకాళ్ళపై ప్రార్థించాడు. శవం వైపు తిరిగి, “లే, తబితా!” అని అన్నాడు. ఆమె కళ్ళు తెరిచింది. పేతురును చూసి లేచి కూర్చుంది.
ACT 9:41 అతడు చేతులందించి ఆమె నిలబడటానికి సహాయం చేసాడు. ఆ తదుపరి పేతురు భక్తుల్ని, వితంతువుల్ని పిలిచి వాళ్ళకు ప్రాణంతో ఉన్న తబితాను చూపాడు.
ACT 9:42 యొప్పే ప్రాంతమంతా యిది తెలిసిపోయింది. అనేకులు ప్రభువు భక్తులయ్యారు.
ACT 9:43 పేతురు యొప్పేలో సీమోను అనే ఒక చెప్పులు కుట్టే వాని యింట్లో చాలా రోజులు గడిపాడు.
ACT 10:1 కైసరియ అనే పట్టణంలో కొర్నేలీ అనే పేరుగల ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు, “ఇటలి” దళంలో శతాధిపతిగా పని చేస్తూ ఉండేవాడు.
ACT 10:2 అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికి దేవుడంటే భయభక్తులుండేవి. అతడు తన డబ్బును ధారాళంగా దానం చేసేవాడు. దేవుణ్ణి ఎల్లప్పుడు ప్రార్థించే వాడు.
ACT 10:3 ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు అతనికి ఒక దివ్య దర్శనంలో ఒక దేవదూత తన ముందు ప్రత్యక్షం కావటం స్పష్టంగా చూసాడు. ఆ దేవదూత అతణ్ణి సమీపించి, “కొర్నేలీ” అని పిలిచాడు.
ACT 10:4 కొర్నేలీ అతని వైపు చూసి భయంతో, “ఏమిటి ప్రభూ” అని అడిగాడు. ఆ దేవదూత కొర్నేలీతో, “నీ ప్రార్థనలు, పేదవాళ్ళకు నీవు చేస్తున్న దానాలు దేవుడు గుర్తించాడు.
ACT 10:5 ఇప్పుడు నీవు కొందర్ని సీమోను అని పిలువబడే పేతురును పిలుచుకొని రావటానికి యొప్పేకు పంపు.
ACT 10:6 అతడు ప్రస్తుతం సీమోను అనే చెప్పులు కుట్టే వాని యింట్లో అతిథిగా ఉంటున్నాడు. అతని యిల్లు సముద్రము తీరాన ఉంది” అని అన్నాడు.
ACT 10:7 ఇలా చెప్పి దేవదూత వెళ్ళిపోయాడు. ఆ తదుపరి కొర్నేలీ తన సేవకుల్లో యిద్దర్ని పిలిచాడు. ఇంటి పనులు చేసే భటుల్లో ఒకణ్ణి పిలిచాడు. ఈ భటుడు దైవ భక్తి కలవాడు.
ACT 10:8 జరిగినదంతా వాళ్ళకు చెప్పి వాళ్ళను యొప్పేకు పంపాడు.
ACT 10:9 మరుసటి రోజు వాళ్ళు యొప్పేను సమీపించారు. అప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు. అదే నమయంలో పేతురు ప్రార్థించటానికి మిద్దె మీదికి వెళ్ళినాడు.
ACT 10:10 పేతురుకు ఆకలి వేసింది. ఏదైనా తినాలనుకొన్నాడు. అతని కోసం వంట సిద్ధం చేస్తుండగా అతనికి దర్శనం కలిగింది.
ACT 10:11 ఆ దర్శనంలో ఆకాశం తెరుచుకొని ఏదో క్రిందికి దిగి రావటం చూశాడు. అది ఒక పెద్ద దుప్పటిలా ఉంది. ఎవరో దాని నాలుగు మూలలు పట్టుకొని క్రిందికి దింపుతున్నట్లు అది భూమ్మీదికి దిగింది.
ACT 10:12 అందులో నాలుగు కాళ్ళున్న అన్ని రకాల జంతువులు, ప్రాకే ప్రాణులు, గాలిలో ఎగిరే పక్షులు ఉన్నాయి.
ACT 10:13 ఒక స్వరం, “పేతురూ, లే! వాటిని చంపి తిను” అని అన్నది.
ACT 10:14 పేతురు, “ప్రభూ! నేనలా చెయ్యలేను. అధమమైన దాన్ని, పరిశుభ్రంగా లేనిదాన్ని నేను ఎన్నడూ తినలేదు” అని సమాధానం చెప్పాడు.
ACT 10:15 ఆ స్వరం రెండవసారి, “దేవుడు పవిత్రం చేసిన వాటిని అపవిత్రం అనకు” అని అన్నది.
ACT 10:16 ఇలా మూడు సార్లు జరిగిన వెంటనే అది ఆకాశానికి తీసుకు వెళ్ళబడింది.
ACT 10:17 పేతురు ఈ దివ్య దర్శనానికి అర్థం తెలియక దాన్ని గురించి ఆశ్చర్యంతో ఆలోచిస్తున్నాడు. ఇంతలో కొర్నేలీ పంపిన మనుష్యులు సీమోను యిల్లు ఎక్కడుందో కనుక్కొని అతని యింటి ముందు ఆగారు.
ACT 10:18 “పేతురు అని పిలుస్తారే ఆ సీమోను యిక్కడ అతిథిగా ఉంటున్నాడా?” అని యింటి వాళ్ళను అడిగారు.
ACT 10:19 దివ్య దర్శనాన్ని గురించి పేతురు యింకా ఆలోచిస్తుండగా దేవుని ఆత్మ అతనితో, “ఇదిగో! ముగ్గురు వ్యక్తులు నీ కోసం వెతుకుతున్నారు.
ACT 10:20 లేచి క్రిందికి వెళ్ళు. వాళ్ళను పంపింది నేనే. కనుక వాళ్ళ వెంట వెళ్ళటానికి కొంచెం కూడా సంకోచపడకు” అని చెప్పాడు.
ACT 10:21 పేతురు క్రిందికి వెళ్ళి వాళ్ళతో, “ఇదిగో! మీరు చూస్తున్నది నా కొరకే! ఎందుకొచ్చారు!” అని అడిగాడు.
ACT 10:22 వాళ్ళు, “మేము కొర్నేలీ అనే శతాధిపతి దగ్గర్నుండి వచ్చాము. అతడు మంచివాడు. దేవుని పట్ల భయభక్తులు కలవాడు. యూదులందరు అతణ్ణి గౌరవిస్తారు. మిమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మీరు చెప్పింది వినవలెనని పవి త్రమైన దేవదూత అతనితో చెప్పాడు” అని సమాధానం చెప్పారు. పేతురు వాళ్ళను యింట్లోకి రమ్మని పిలిచి ఆ రాత్రికి అక్కడే ఉండమన్నాడు.
ACT 10:23 మరుసటి రోజు పేతురు వాళ్ళతో ప్రయాణమయ్యాడు. యొప్పేలోని కొందరు సోదరులు కూడా అతని వెంట వెళ్ళారు.
ACT 10:24 ఆ మరుసటి రోజు వాళ్ళు కైసరియ చేరుకొన్నారు. వీళ్ళు రానున్నారని తెలిసి కొర్నేలీ సన్నిహితులైన బంధువుల్ని తన యింటికి ఆహ్వానించాడు.
ACT 10:25 పేతురు యింట్లోకి అడుగు పెడ్తుండగానే కొర్నేలీ అతనికి ఎదురు వెళ్ళి అతని కాళ్ళ ముందు సాష్టాంగపడి నమస్కరించాడు.
ACT 10:26 పేతురు అతనిని లేపుతూ, “లెమ్ము! నేను కూడా ఒక మనిషినే”అని అన్నాడు.
ACT 10:27 పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది ప్రజలు సమావేశమై ఉండటం చూసాడు.
ACT 10:28 పేతురు వాళ్ళతో, “యూదుడు, యూదుడు కాని వానితో కలిసి ఉండరాదనీ, అతని యింటికి వెళ్ళరాదనీ యూదుల న్యాయశాస్త్రం అంటుంది. ఇది తప్పని మీకందరికి తెలుసు. కావున ఏ వ్యక్తినీ అధమంగా భావించరాదు. పరిశుభ్రత లేని వాడని అనకూడదు. ఇది నాకు దేవుడు తెలియజేసాడు.
ACT 10:29 కాబట్టి నా కోసం పిలవనంపగానే వచ్చాను. నన్నెందుకు పిలిచారో నేను యిప్పుడు కారణం అడగవచ్చా?” అని అన్నాడు.
ACT 10:30 కొర్నేలీ యిలా చెప్పాడు: “నాలుగు రోజుల క్రితం యిదే సమయంలో యింట్లో కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అప్పుడు పగలు మూడు గంటలు. అకస్మాత్తుగా తెల్లటి మెరిసే దుస్తులు వేసుకొని ఒక వ్యక్తి నా ముందు ప్రత్యక్షమయ్యాడు.
ACT 10:31 అతడు నాతో, ‘కొర్నేలీ! దేవుడు నీ ప్రార్థనల్ని విన్నాడు. నీవు పేదలకు చేస్తున్న దానాలను గుర్తించాడు.
ACT 10:32 పేతురు అని పిలువబడే సీమోన్ను పిలుచుకు రావటానికి కొందర్ని యొప్పేకు పంపు. అతడిప్పుడు సీమోను అనే చెప్పులు కుట్టే వాని యింట్లో అతిథిగా ఉన్నాడు. ఈ చెప్పులు కుట్టేవాని యిల్లు సముద్ర తీరాన ఉంది’ అని చెప్పాడు.
ACT 10:33 మిమ్మల్ని పిలుచుకు రావటానికి తక్షణం మనుష్యుల్ని పంపాను. మీరొచ్చి మంచి పని చేసారు. ఇప్పుడు మనమంతా దేవుని ముందున్నాము. మాకు చెప్పుమని ప్రభువు మీకాజ్ఞాపించిన వన్నీ వినటానికి సిద్ధంగా ఉన్నాము.”
ACT 10:34 పేతురు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు: “దేవుడు పక్షపాతం చూపడని, తానంటే భయభక్తులున్న వాళ్ళను, నిజాయితీ పరుల్ని వాళ్ళు ఏ దేశస్థులైనా అంగీకరిస్తాడని యిప్పుడు నాకు బాగా తెలిసింది.
ACT 10:36 ఈ సందేశాన్ని దేవుడు ఇశ్రాయేలు వంశీయులకు అందించాడు. దేవుడు మనకందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శాంతి లభిస్తుందనే శుభవార్తను ప్రకటించాడు.
ACT 10:37 “యోహాను బోధించిన బాప్తిస్మమును ప్రజలు పొందాక గలిలయలో ఒక సంగతి ప్రారంభమైంది. ఆ సంగతిని గురించిన ప్రకటనలు యూదయ ప్రాంతం అంతా వ్యాపించాయి. ఇది మీకంతా తెలుసు.
ACT 10:38 నజరేతు నివాసి యేసును దేవుడు పవిత్రాత్మతో అభిషేకించాడు. అద్భుతమైన శక్తి యిచ్చాడు. దేవుడు ఆయనతో ఉండటం వల్ల యేసు ప్రజలకు మేలు చేస్తూ అన్ని ప్రాంతాలు పర్యటించాడు. సైతాను పీడవలన బాధపడ్తున్న వాళ్ళకు నయం చేసాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు.
ACT 10:39 “యెరూషలేము, యూదయ దేశంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రతి పనిని మేము కళ్ళారా చూసాము. వాళ్ళు ఆయన్ని మ్రానుతో చేసిన సిలువకు మేకులు కొట్టి చంపారు.
ACT 10:40 కాని మూడవ రోజున దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ప్రజలకు కనిపించాలని దేవుని ఉద్దేశ్యం.
ACT 10:41 అందరూ ఆయన్ని చూడలేదు. ఇది వరకే దేవుడు ఎన్నుకొన్న కొందరు మాత్రం చూసారు. మేమే ఆ సాక్షులం. ఆయన బ్రతికి వచ్చాక మేమంతా ఆయనతో కలిసి భోజనం చేసాం.
ACT 10:42 “ఆయన అందరికి న్యాయాధిపతి. అంటే బ్రతికి ఉన్నవాళ్ళకు, పునర్జీవం పొందనున్న వాళ్ళకు. ఈ పదవిని దేవుడు ఆయనకిచ్చాడు. దీన్ని గురించి ప్రజల ముందు సాక్ష్యం చెప్పుమని, సువార్తను ప్రకటించుమని ఆయన మాకు ఆజ్ఞాపించాడు.
ACT 10:43 యేసును నమ్మిన వాళ్ళు తమ పాపాలకు ఆయన ద్వారా క్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు చెప్పారు.”
ACT 10:44 పేతురు యింకా మాట్లాడుతుండగానే అతని సందేశాన్ని వింటున్న అక్కడి వాళ్ళందరి మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడు.
ACT 10:45 పేతురుతో వచ్చిన వాళ్ళందరు యూదులు.
ACT 10:46 యేసునందు విశ్వసించినవారు. వీళ్ళు యూదులు కాని వాళ్ళు యితర భాషల్లో మాట్లాడటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. దేవుడు తన పరిశుద్ధాత్మను వరంగా యూదులు కాని వాళ్ళకు కూడా యిచ్చాడని గ్రహించి వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. తదుపరి పేతురు యిలా అన్నాడు:
ACT 10:47 “వీళ్ళకు బాప్తిస్మము నివ్వటానికి అడ్డు చేప్పే ధైర్యం ఎవరికుంది? మనలాగే వీళ్ళు కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందారు.”
ACT 10:48 యేసు పేరిట వాళ్ళు బాప్తిస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు. ఇదంతా ముగిసాక వాళ్ళు పేతురును తమతో కొద్దిరోజులు ఉండుమని అడిగారు.
ACT 11:1 అపొస్తలులు, యూదయ దేశంలో ఉన్న సోదరులు, యూదులు కాని వాళ్ళకు కూడా దైవసందేశం లభించిందని విన్నారు.
ACT 11:2 పేతురు యెరూషలేము వచ్చాడు. సున్నతి చేసుకోవాలి అని వాదించే వాళ్ళ గుంపు అతణ్ణి విమర్శిస్తూ,
ACT 11:3 “నీవు సున్నతి చేసుకోని వాళ్ళ యిళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి తిన్నావు!” అని అన్నారు.
ACT 11:4 పేతురు వాళ్ళకు జరిగింది జరిగినట్లు ఈ విధంగా విడమర్చి చెప్పటం మొదలు పెట్టాడు:
ACT 11:5 “నేను యొప్పే పట్టణంలో ప్రార్థిస్తుండగా నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక దివ్య సంగతి చూసాను. ఆ దివ్య దర్శనంలో ఒక పెద్ద దుప్పటి లాంటిది ఆకాశంనుండి ఎవరో దాని నాలుగు మూలలు పట్టుకొని క్రిందికి దింపుతున్నట్లు చూసాను. అది నేనున్న స్థలంలో దిగింది.
ACT 11:6 నేను అందులో ఏముందోనని జాగ్రత్తగా చూసాను. భూమ్మీద నివసించే నాలుగు కాళ్ళ జంతువులు, క్రూర మృగాలు, ప్రాకే ప్రాణులు, గాల్లో ఎగిరే పక్షులు కనిపించాయి.
ACT 11:7 అంతలో నాకొక స్వరం వినిపించి నాతో, ‘పేతురూ! లే! వీటిలో ఏ జంతువునైనా చంపి దానిని తిను!’ అని అంది.
ACT 11:8 “‘నేనాపని చేయలేను ప్రభూ! తినకూడదన్న దాన్ని నా నాలుక ఎన్నడూ రుచి చూడలేదు’ అని నేను సమాధానం చెప్పాను.
ACT 11:9 “ఆకాశం నుండి ఆ స్వరం రెండవసారి యిలా అంది: ‘దేవుడు తినవచ్చని అన్న వాటిని తినకూడదని అనకు.’
ACT 11:10 “ఇలా మూడుసార్లు జరిగాక అది ఆకాశానికి తిసుకు వెళ్ళబడింది.
ACT 11:11 అదే క్షణంలో నన్ను పిలుచుకు వెళ్ళడానికి కైసరియనుండి వచ్చిన ముగ్గురు వ్యక్తులు నేనున్న యింటి ముందు ఆగారు.
ACT 11:12 వాళ్ళతో వెళ్ళటానికి నేను ఏ మాత్రం వెనకాడరాదని దేవుని ఆత్మ నాతో చెప్పాడు. అక్కడున్న ఆరుగురు సోదరులు కూడా నాతో వచ్చారు. మేమంతా కలిసి కొర్నేలీ యింటికి వెళ్ళాం.
ACT 11:13 అతడు తన యింట్లో ఒక దేవదూత ప్రత్యక్షమైన విషయము, అతణ్ణి తాను చూసిన విషయము, దేవదూత, ‘పేతురు అని పిలువబడే సీమోన్ను పిలుచుకు రావటానికి కొందర్ని యొప్పేకు పంపు,
ACT 11:14 అతడు మాట్లాడే విషయాలు నిన్ను, నీ యింట్లోని వాళ్ళనందరిని రక్షిస్తాయి’ అని తనతో చెప్పిన విషయము మాకు చెప్పాడు.
ACT 11:15 “నేను మాట్లాడటం మొదలెడుతుండగా, మొట్టమొదట మన మీదికి వచ్చినట్లే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు కూడా వచ్చాడు.
ACT 11:16 ‘యోహాను నీళ్ళతో బాప్తిస్మము యిచ్చాడు కాని నీవు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతావు!’ అని అన్న యేసు ప్రభువు మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి.
ACT 11:17 మనం యేసు క్రీస్తు ప్రభువును నమ్మినందుకు మనకిచ్చిన వరమునే దేవుడు వాళ్ళకు కూడా యిచ్చాడు. అలాంటప్పుడు దేవుణ్ణి ఎదిరించటానికి నేనెవర్ని?”
ACT 11:18 వాళ్ళీ మాటలు విన్నాక వేరే ఆక్షేపణలు చేయలేదు. దేవుడు యూదులు కాని వాళ్ళకు కూడా మారు మనస్సు కలిగి రక్షణ పొందే అవకాశ మిచ్చాడంటూ వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు.
ACT 11:19 స్తెఫను చనిపోయిన తర్వాత జరిగిన హింసలకు భక్తులు చెదిరిపోయారు. వీళ్ళలో కొందరు ఫొనీషియ, సైప్రసు, అంతియొకయ పట్టణాలకు వెళ్ళి దైవసందేశాన్ని యూదులకు మాత్రమే చెప్పారు.
ACT 11:20 సైప్రసు, కురేనీ పట్టణాలకు చెందిన వీళ్ళలో కొందరు అంతియొకయకు వెళ్ళి, గ్రీకువారితో కూడా మాట్లాడటం మొదలు పెట్టారు.
ACT 11:21 ప్రభువు అభయ హస్తం వాళ్ళ వెంట ఉంది. కనుక అనేకులు వాళ్ళు చెప్పిన దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి ప్రభువునందు విశ్వాసులైయ్యారు.
ACT 11:22 యెరూషలేములో వున్న సంఘం ఈ వార్త విని బర్నబాను అంతియొకయకు పంపింది.
ACT 11:23 అతడు అంతియొకయకు వెళ్ళి అక్కడి ప్రజలపై దైవానుగ్రహం అమితంగా ఉండటం గమనించి చాలా ఆనందించాడు. ప్రభువు పట్ల మనసారా భక్తి చూపుతూ ఉండుమని, అక్కడి వాళ్ళందర్ని వేడుకున్నాడు.
ACT 11:24 బర్నబా ఉత్తముడు. పరిశుద్ధాత్మ ప్రభావం అతనిపై సంపూర్ణంగా ఉంది. అంతేకాక దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అనేకులు ప్రభువునందు విశ్వాసులైయ్యారు.
ACT 11:25 ఆ తర్వాత బర్నబా, తార్సు అనే పట్టణానికి వెళ్ళి సౌలు కోసం చూసాడు. అతణ్ణి కలుసుకొని అంతియొకయకు పిలుచుకు వచ్చాడు.
ACT 11:26 సౌలు, బర్నబా ఒక సంవత్సరం అంతియొకయలో ఉన్నారు. అక్కడి సంఘాన్ని కలుసుకొంటూ అనేకులకు బోధించే వాళ్ళు. అంతియొకయలోని శిష్యులు మొదటిసారిగా “క్రైస్తవులు” అని పిలువబడ్డారు.
ACT 11:27 ఆ రోజుల్లో కొంత మంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చారు.
ACT 11:28 వాళ్ళలో ఒకతని పేరు అగబు. అతడు లేచి నిలబడి పరిశుద్ధాత్మ శక్తితో, “తీవ్రమైన కరువు త్వరలో ప్రపంచమంతా రాబోతోంది” అని సూచించాడు. ఈ కరువు క్లౌదియ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో సంభవించింది.
ACT 11:29 ఇది విని అంతియొకయలో ఉన్న శిష్యులు యూదయలో నివసిస్తున్న తమ సోదరుల కోసం తమకు చేతనయిన సహాయం వాళ్ళు చెయ్యాలని నిర్ణయించుకొన్నారు.
ACT 11:30 అనుకొన్న విధంగా బర్నబా, సౌలు ద్వారా తాము పంపదలచిన వాటిని యూదయలోని పెద్దలకు పంపారు.
ACT 12:1 ఆ రోజుల్లోనే హేరోదు రాజు సంఘానికి చెందిన కొందర్ని హింసించటం మొదలు పెట్టాడు.
ACT 12:2 అతడు యోహాను సోదరుడైన యాకోబును కత్తితో నరికి వేయించాడు.
ACT 12:3 ఈ సంఘటనకు యూదులు ఆనందించారు. ఇది గమనించి అతడు పేతురును కూడా బంధించాలని వెళ్ళాడు. ఈ సంఘటన యూదులు పులియని రొట్టెలు తినే పండుగ రోజుల్లో సంభవించింది.
ACT 12:4 అతణ్ణి బంధించి కారాగారంలో వేసాడు. పూటకు నలుగురి చొప్పున కాపలా కాయుమని చెప్పి పదహారుగురు భటులకు అతణ్ణి అప్పగించాడు. పస్కా పండుగ జరిగాక అతణ్ణి ప్రజల ముందుకు తెచ్చి విచారణ జరిపించాలని అతని ఉద్దేశ్యం.
ACT 12:5 పేతురును అంతదాకా కారాగారంలో ఉంచాడు. పేతురు కోసం సంఘానికి చెందిన వాళ్ళు దీక్షతో దేవుణ్ణి ప్రార్థించారు.
ACT 12:6 హేరోదు రేపు విచారణ చేస్తాడనగా ఆ నాటి రాత్రి పేతురు యిరువురి సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు. సైనికులు అతణ్ణి రెండు యినుప గొలుసులతో కట్టివేసి ఉంచారు. మరి కొందరు సైనికులు కారాగారం ముందు కాపలా కాస్తూ ఉన్నారు.
ACT 12:7 అకస్మాత్తుగా ప్రభువు దూత ప్రత్యక్షం అయ్యాడు. ఆ గదియంతా వెలుగుతో నిండిపోయింది. ప్రభువు దూత పేతురు భుజం తట్టి, “త్వరగా లెమ్ము!” అని అంటూ అతణ్ణి నిద్రలేపాడు. మణికట్లకు కట్టిన సంకెళ్ళు వూడిపోయాయి.
ACT 12:8 ఆ దూత, “లేచి, నీ దుస్తులు సరిచేసుకొని, చెప్పులు తొడుక్కో!” అని అన్నాడు. పేతురు అలాగే చేసాడు. “నీ దుప్పటి శరీరం మీద కప్పుకొని నా వెంటరా!” అని ఆ దూత అన్నాడు.
ACT 12:9 పేతురు అతణ్ణి అనుసరిస్తూ కారాగారంనుండి వెలుపలికి వచ్చాడు. కాని దేవదూత చేస్తున్నదంతా నిజంగా జరుగుతుందని అతడు అనుకోలేదు. తానొక కలకంటున్నాననుకొన్నాడు.
ACT 12:10 వాళ్ళు మొదటి కాపలా వాణ్ణి, రెండవ కాపలా వాణ్ణి దాటి పట్టణంలోకి వెళ్ళే యినుప ద్వారం దగ్గరకు వచ్చారు. అది వాళ్ళ కోసం దానంతట అదే తెరుచుకుంది. వాళ్ళు దాన్ని దాటి వెళ్ళారు. కొంత దూరం నడిచాక అకస్మాత్తుగా ఆ ప్రభువు దూత అతణ్ణి వదిలి వెళ్ళిపోయాడు.
ACT 12:11 అప్పటికి పేతురుకు తెలివి వచ్చింది. అతడు, “ప్రభువు తన దూతను పంపి హేరోదు బంధం నుండి మరియు కీడు కలగాలని ఎదురు చూస్తున్న యూదుల నుండి, నన్ను రక్షించాడు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు” అని తనలో తాను అనుకొన్నాడు.
ACT 12:12 జరిగిన వాటిని గ్రహించాక యోహాను తల్లియైన మరియ యింటికి వెళ్ళాడు. యోహాన్ని మార్కు అని కూడా పిలిచే వాళ్ళు. అక్కడ చాలా మంది సమావేశమై ప్రార్థిస్తూ ఉన్నారు.
ACT 12:13 పేతురు తలుపు తట్టాడు. “రొదే” అనే పనిపిల్ల తలుపు తీయటానికి వచ్చింది.
ACT 12:14 ఆమె పేతురు స్వరం గుర్తించి చాలా ఆనందించింది. ఆ ఆనందంలో తలుపు కూడా తెరవకుండా లోపలికి పరుగెత్తి, “పేతురు తలుపు ముందున్నాడు” అని కేక వేసింది.
ACT 12:15 వాళ్ళంతా “నీకు మతిపోయింది” అని అన్నారు. కాని ఆమె తాను చెప్పింది నిజమని నొక్కి చెప్పింది. దానికి వాళ్ళు, “అది అతని దూత అయివుంటుంది” అని అన్నారు.
ACT 12:16 పేతురు ఇంకా తలుపు తడుతూనే ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి తలుపు తెరిచి చూసి చాలా ఆశ్చర్యపడ్డారు.
ACT 12:17 పేతురు వాళ్ళందర్ని నిశ్శబ్దంగా ఉండుమని సంజ్ఞ చేసాడు. ఆ తదుపరి దేవుడు తనను కారాగారం నుండి ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చాడో అందరికీ విశదంగా చెప్పాడు. “యాకోబకు, మిగతా సోదరులకు దీన్ని గురించి చెప్పండి” అని చెప్పి, వాళ్ళను వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళిపొయ్యాడు.
ACT 12:18 ఉదయం సైనికుల్లో అలజడి చెలరేగింది. “పేతురు ఏమై ఉంటాడు?” అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు.
ACT 12:19 హేరోదు పేతుర్ని వెతకటానికి అంతా గాలించమన్నాడు. కాని పేతురు కనిపించలేదు. హేరోదు కాపలా వాళ్ళను అడ్డు ప్రశ్నలు వేసి విచారించాడు. ఆ తదుపరి ఆ కాపలా వాళ్ళను చంపుమని ఆజ్ఞాపించాడు. ఇది జరిగిన తదుపరి హేరోదు యూదయ నుండి కైసరియకు వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపాడు.
ACT 12:20 హేరోదు తూరు, సీదోను ప్రజల పట్ల చాలా కోపంతో ఉన్నాడు. వాళ్ళంతా యిప్పుడు ఒకటై హేరోదుతో మాట్లాడటానికి వెళ్ళారు. రాజుగారి ఆంతరంగిక స్నేహితుడైన “బాస్తు”ను తమ వైపు త్రిప్పుకొని శాంతి కావాలని అడిగారు. వీళ్ళ రాజ్యం తమ ఆహారధాన్యాల కోసం హేరోదు రాజ్యంపై ఆధారపడి ఉండటమే దీనికి కారణం.
ACT 12:21 ఒక నియమితమైన రోజు హేరోదు రాజ దుస్తులు ధరించాడు. సింహాసనంపై కూర్చొని ప్రజల్ని సంబోధిస్తూ ఒక ఉపన్యాసం యిచ్చాడు.
ACT 12:22 “ఇది దేవుని కంఠం. మనిషిది కాదు” అని ప్రజలు ఆపకుండా కేకలు వేసారు.
ACT 12:23 దేవునికి చెందవలసిన ఘనత అతడు అంగీకరించినందుకు ప్రభువు దూత అతణ్ణి తక్షణమే రోగంతో పడవేసాడు. పురుగులు పట్టి అతడు చనిపోయాడు.
ACT 12:24 దైవసందేశం విని విశ్వసిస్తున్న ప్రజల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ACT 12:25 బర్నబా, సౌలు తమ పని ముగించుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. తమ వెంట మార్కు అని పిలువబడే యోహాన్ను కూడా పిలుచుకు వచ్చారు.
ACT 13:1 అంతియొకయలోని సంఘంలో ఉన్న ప్రవక్తలు, పండితులు ఎవరనగా: బర్నబా, “నీగెరు” అని పిలువబడే ‘సుమెయోను’ కురేనీ గ్రామానికి చెందిన లూకియ, మనయేను, (ఇతడు, సామంత రాజైన హేరోదు, యిద్దరూ కలిసి పెరిగారు), మరియు సౌలు.
ACT 13:2 వీళ్ళు ఉపవాసాలు చేసి ప్రభువును ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ, “బర్నబాను, సౌలును నా కోసం వేరుచేయండి. వాళ్ళను ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచాను” అని అన్నాడు.
ACT 13:3 అక్కడున్న వాళ్ళు వీళ్ళిద్దర్ని పంపే ముందు ప్రార్థనలు, ఉపవాసాలు చేసి, వాళ్ళపై తమ చేతులుంచి పంపారు.
ACT 13:4 పవిత్రాత్మ వాళ్ళను పంపాడు. వాళ్ళు “సెలూకయ” అనే పట్టణానికి వెళ్ళి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసి సైప్రసు (కుప్ర) అనే ద్వీపాన్ని చేరుకున్నారు.
ACT 13:5 అక్కడి నుండి సలామి అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడున్న యూదుల సమాజ మందిరాల్లో దైవసందేశాన్ని ప్రకటించారు. వాళ్ళకు సహాయంగా యోహాను వాళ్ళ వెంటే ఉన్నాడు.
ACT 13:6 వాళ్ళు ఆ ద్వీపాన్నంతా పర్యటించి “పాపు” అనే పట్టణం చేరుకున్నారు. ఇంద్రజాలం చేస్తూ తానొక ప్రవక్తనని చెప్పుకుంటున్న వ్యక్తిని అక్కడ కలుసుకున్నారు. అతడు యూదుడు. పేరు “బర్‌యేసు,”
ACT 13:7 అతడు “సెర్గిపౌలు” అనే రాష్ట్రపాలకునికి సన్నిహితంగా ఉండేవాడు. సెర్గిపౌలు తెలివిగలవాడు. దైవసందేశాన్ని వినాలని బర్నబాను, సౌలును ఆహ్వానించాడు.
ACT 13:8 ఇంద్రజాలికుడైన “ఎలుమ” గ్రీకు భాషలో ఇది ఇతని పేరు. రాష్ట్రపాలకుణ్ణి ఈ విశ్వాసానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించాడు.
ACT 13:9 అప్పుడు సౌలు (ఇతణ్ణి పౌలు అని కూడా పిలిచే వారు) పరిశుద్ధాత్మతో నిండిపోయి ఎలుమను సూటిగా చూస్తూ,
ACT 13:10 “నీవు సైతానుకు పుట్టావు! మంచిదన్న ప్రతిదీ నీకు శత్రువు! నీలో అన్ని రకాల మోసాలు, కుట్రలు ఉన్నాయి! ప్రభువు యొక్క సక్రమ మార్గాల్ని వక్రంగా మార్చటం ఎప్పుడు మానుకొంటావు?
ACT 13:11 ఇదిగో చూడు, ప్రభువు ఇప్పుడు నిన్ను శిక్షిస్తాడు. కొంతకాలం దాకా నీవు సూర్యుని వెలుగు చూడలేవు! గుడ్డివాడివై పోతావు!” అని అన్నాడు. తక్షణమే పొగమంచు, చీకట్లు అతణ్ణి చుట్టివేసాయి. తన చేయి పట్టుకొని నడిపేందుకు ఎవరైనా దొరుకుతారేమోనని తారాడుతూ చూసాడు.
ACT 13:12 ఆ రాష్ట్రపాలకుడు ప్రభువును గురించి చెప్పిన బోధనలు విని ఆశ్చర్యపడి ప్రభువును నమ్మాడు.
ACT 13:13 “పాపు” నుండి పౌలు, అతని స్నేహితులు, పంపూలియాలోని “పెర్గే” అనే పట్టణానికి ఓడలో ప్రయాణం చేసి వెళ్ళారు. యోహాను వాళ్ళను అక్కడ వదిలి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు.
ACT 13:14 వాళ్ళు పెర్గే నుండి పిసిదియ ప్రక్కన ఉన్న అంతియొకయ అనే పట్టణాన్ని చేరుకున్నారు. ఒక విశ్రాంతి రోజు యూదుల సమాజ మందిరములోకి వెళ్ళి కూర్చున్నారు.
ACT 13:15 ధర్మశాస్త్రంలోని విషయాలు, ప్రవక్తల గ్రంథాలు చదివారు. ఆ తదుపరి సమాజమందిరం యొక్క అధికారులు, “సోదరులారా! ప్రజలను ఉత్సాహపరిచే ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా ఉంటే దయచేసి మాట్లాడండి” అని అడగనంపారు.
ACT 13:16 పౌలు లేచి నిలుచొని చేతులెత్తి, “ఇశ్రాయేలు ప్రజలారా! యూదులవలె దైవభీతిగల ప్రజలారా! నా మాటలు వినండి.
ACT 13:17 ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వులను ఎన్నుకొని వాళ్ళు ఈజిప్టులో పరదేశీయులుగా ఉన్నప్పుడు వాళ్ళను గొప్ప వాళ్ళుగా చేసాడు. తన అద్భుతమైన శక్తితో ఆ దేశం నుండి వాళ్ళను పిలుచుకెళ్ళి,
ACT 13:18 ఎడారుల్లో వాళ్ళ ప్రవర్తనను నలభై సంవత్సరాలు సహిస్తూ వాళ్ళను కాపాడాడు.
ACT 13:19 కనాను దేశంలో ఏడు జాతుల్ని పడగొట్టి తన ప్రజల్ని ఆ ప్రాంతానికి వారసులుగా చేసాడు.
ACT 13:20 ఇవి చేయటానికి నాలుగు వందల ఏబది సంవత్సరాలు పట్టింది. “ఆ తర్వాత దేవుడు సమూయేలు ప్రవక్త కాలందాకా, నాయకత్వం వహించగల న్యాయాధిపతుల్ని పంపాడు.
ACT 13:21 తమకు ‘రాజు’ కావాలని కోరగా కీషు కుమారుడైన ‘సౌలును’ వాళ్ళకు రాజుగా పంపాడు. ఇతడు బెన్యామీను వంశానికి చెందినవాడు. సౌలు నలభై సంవత్సరాలు పాలించాడు.
ACT 13:22 సౌలును తీసివేసాక దావీదును వాళ్ళ రాజుగా చేసాడు. దావీదు విషయంలో తన అంగీకారం చూపుతూ దేవుడు యిలా అన్నాడు: ‘యెష్షయి కుమారుడైన దావీదు నా మనస్సుకు నచ్చాడు. అతడు నేను చెప్పినట్లు చేస్తాడు.’
ACT 13:23 “దేవుడు తన వాగ్దానానుసారం ఇశ్రాయేలు ప్రజల కోసం రక్షకుడైనటువంటి యేసును ఇతని వంశంలో జన్మింపచేసాడు.
ACT 13:24 యేసు రాకముందు, యోహాను మారుమనస్సును గురించి బాప్తిస్మమును గురించి ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు.
ACT 13:25 తన కర్తవ్యం ముగిసే చివరి దశలో అతడు ఇలా అన్నాడు: ‘నేనెవర్ననుకొన్నారు. నేను మీరనుకొంటున్న వాణ్ణి కాదు! కాని నా తర్వాత ఆయన రాబోతున్నాడు. ఆయన చెప్పులు తాకే అర్హత కూడా నాకు లేదు.’
ACT 13:26 “సోదరులారా! అబ్రాహాము వంశీయులారా! దైవభీతిగల ఇతర ప్రజలారా! రక్షణ గురించి తెలియ చేసే సందేశాన్ని దేవుడు మనకు తెలియచేసాడు.
ACT 13:27 కాని యెరూషలేము ప్రజలు, వాళ్ళ పాలకులు ఈ యేసును గుర్తించలేదు. యేసుకు మరణదండన వేయించి ప్రతి విశ్రాంతి రోజున చదివే ప్రవక్తల మాటలు నిజం చేసారు.
ACT 13:28 ఆయనకు మరణదండన విధించటానికి వాళ్ళకు ఏ కారణం దొరక్కపోయినా ఆయనను చంపివేయించుమని పిలాతును కోరారు.
ACT 13:29 “లేఖనాల్లో ఆయన్ని గురించి వ్రాసిన విధంగా వాళ్ళాయనను చంపారు. ఆ తర్వాత సిలువనుండి క్రిందికి దింపి సమాధి చేసారు.
ACT 13:30 కాని దేవుడాయన్ని బ్రతికించాడు.
ACT 13:31 ఇదివరలో ఆయనతో కలిసి గలిలయనుండి యోరూషలేమునకు ప్రయాణం చేసిన ప్రజలకు చాలా రోజుల దాకా కనిపించాడు.
ACT 13:32 “వాళ్ళు ఆయన కోసం ఇశ్రాయేలు ప్రజల ముందు సాక్ష్యం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు.
ACT 13:33 దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానాన్ని యిప్పుడు వాళ్ళ సంతతియైన మన కోసం పూర్తి చేసాడు. యేసును బ్రతికించటంతో ఈ వాగ్దానం పూర్తి అయింది. ఇదే మేము చెప్పే సువార్త. దీన్ని గురించి కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడివుంది: ‘నీవు నా కుమారుడవు! నేడు నేను నీకు తండ్రినయ్యాను.’
ACT 13:34 దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ఎన్నటికీ మట్టిలో కలిసిపోడు. అందువల్ల దేవుడు మరొక చోట, ‘నేను దావీదుకు తప్పక యిస్తానన్న పవిత్రమైన ఆశీస్సులను నీకిస్తాను’ అని అన్నాడు.
ACT 13:35 మరొక చోట యిలా చెప్పబడింది: ‘నీ పవిత్రుడి దేహాన్ని సమాధిలో నీవు క్రుళ్ళిపోనియ్యవు!’
ACT 13:36 “దావీదు తన కాలంలో దేవుని ఆజ్ఞానుసారం నడుచుకొన్నాడు. అతడు చనిపోగానే అతణ్ణి అతని పూర్వీకులతో సమాధి చేసారు. అతని దేహం మట్టిలో కలిసిపోయింది.
ACT 13:37 కాని దేవుడు బ్రతికించినవాడు మట్టిలో కలిసిపోలేదు.
ACT 13:38 మీరీ విషయం తెలుసుకోవాలి. యేసు ద్వారా మీ పాపాలు క్షమించబడుతాయని మేము ప్రకటిస్తున్నాము. మోషే ధర్మశాస్త్రం క్షమించలేని పాపాలనుండి,
ACT 13:39 యేసు తనను నమ్ముకొన్న ప్రతి ఒక్కణ్ణీ క్షమిస్తాడు.
ACT 13:40 ప్రవక్తలు చెప్పిన ఈ విషయాలు మీకు సంభవించకుండా జాగ్రత్త పడండి:
ACT 13:41 ‘పరిహాసం చేసే ప్రజలారా! ఆశ్చర్యం పొందండి! నశించకండి! ఎందుకనగా మీ కాలంలో మీరు నమ్మలేనిది నేనొకటి చేయబోతున్నాను! మరొకరు చెప్పినా మీరు నమ్మరు.’”
ACT 13:42 పౌలు, బర్నబా యూదుల సమాజ మందిరాన్ని వదిలి వెళ్తుండగా వచ్చే విశ్రాంతి రోజు ఈ విషయాల్ని గురించి యింకా ఎక్కువగా మాట్లాడుమని ప్రజలు అడిగారు.
ACT 13:43 ప్రజలు వెళ్ళిపోయాక చాలామంది యూదులు, యూదుల మతంలో భక్తిగలవాళ్ళు పౌలు, బర్నబా వెంట వెళ్ళారు. పౌలు, బర్నబాలు ప్రజలతో, “దేవుని అనుగ్రహాన్ని విశ్వసిస్తూ యిలాగే జీవిస్తూ ఉండండి!” అని చెప్పారు.
ACT 13:44 మరుసటి విశ్రాంతి రోజున పట్టణమంతా ప్రభువు సందేశాన్ని వినాలని సమావేశం అయ్యింది.
ACT 13:45 సమావేశమయిన ప్రజల్ని చూసి యూదుల్లో ఈర్ష్య నిండిపోయింది. వాళ్ళు పౌలుకు ఎదురు తిరిగి మాట్లాడి అతణ్ణి దూషించారు.
ACT 13:46 పౌలు, బర్నబాలు ధైర్యంగా సమాధానం చెబుతూ, “అందరికన్నా ముందు దైవసందేశాన్ని మీకు చెప్పటం మా కర్తవ్యం. కాని మీరు నిరాకరించటంవల్ల, నిత్యజీవానికి అనర్హులమని మీలో మీరు అనుకోవటం వల్ల మేము మిమ్మల్ని వదిలి యితరుల దగ్గరకు వెళ్తున్నాము.
ACT 13:47 ప్రభువు యిలా ఆజ్ఞాపించాడు అని అన్నాడు: ‘ప్రపంచానికి రక్షణ కలిగించాలని యితర దేశాలకు నిన్నొక వెలుగుగా చేసాను!’”
ACT 13:48 యూదులు కాని వాళ్ళు ఇది విని ఆనందించారు. ప్రభువు సందేశాన్ని అంగీకరించారు. అనేకులు విశ్వాసులయ్యారు. శాశ్వతమైన క్రొత్త జీవితాన్నివ్వటానికి దేవుడు వీళ్ళను ఎన్నుకొన్నాడు.
ACT 13:49 దైవసందేశం ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
ACT 13:50 కాని యూదులు పట్టణంలోని పెద్దలతో, దైవభక్తి గల గొప్పింటి స్త్రీలతో మాట్లాడి వాళ్ళకు పౌలు, బర్నబాల పట్ల కోపం కలిగేటట్లు చేసారు. అంతా కలిసి వాళ్ళను హింసించి ఆ తదుపరి వాళ్ళను తమ పట్టణం నుండి తరిమివేసారు.
ACT 13:51 పౌలు, బర్నబా తమ నిరసనకు చిహ్నంగా కాలి ధూళిని దులిపి “ఈకొనియ” అనే పట్టణానికి వెళ్ళిపోయారు.
ACT 13:52 కాని విశ్వాసులపై పవిత్రాత్మ ప్రభావం ఉండటంవల్ల వాళ్ళలో ఉన్న ఉత్సాహం తగ్గలేదు.
ACT 14:1 ఈకొనియలో పౌలు, బర్నబా ఎప్పటిలాగే యూదుల సమాజమందిరానికి వెళ్ళి, బాగా మాట్లాడారు. తద్వారా చాలా మంది యూదులు, యూదులు కానివాళ్ళు విశ్వాసులయ్యారు.
ACT 14:2 వాళ్ళ సందేశాన్ని నమ్మని యూదులు, యూదులు కానివాళ్ళను రేకెత్తించి మన సోదరులకు విరుద్ధంగా వాళ్ళ మనసుల్ని పాడుచేసారు.
ACT 14:3 కాబట్టి, వాళ్ళు ప్రభువు పట్ల తమ విశ్వాసము విడువక ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలాకాలం ఉన్నారు. ప్రభువు వాళ్ళకు అద్భుతాలను, మహిమలను చేసే శక్తినిచ్చాడు. ఈ విధంగా తన అనుగ్రహాన్ని గురించి ఋజువు చేసాడు.
ACT 14:4 ఆ పట్టణంలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు యూదుల పక్షం, మరికొందరు అపొస్తలుల పక్షం చేరిపోయారు.
ACT 14:5 యూదులు కాని వాళ్ళు, యూదులు తమ తమ నాయకులతో కలిసి అపొస్తలుల్ని అవమానించి, రాళ్ళతో కొట్టి చంపివేయాలనుకొన్నారు.
ACT 14:6 కాని అపొస్తలులు ఇది కనిపెట్టి లుకయొనియలోని లుస్త్ర, దెర్బే అనే పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
ACT 14:7 ఆయా ప్రాంతాల్లో వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించటం కొనసాగించారు.
ACT 14:8 లుస్త్రలో ఒక కుంటివాడుండే వాడు. ఇతడు కుంటివానిగా పుట్టాడు. ఎన్నడూ నడవలేదు.
ACT 14:9 పౌలు మాట్లాడుతుండగా అతడు విన్నాడు. పౌలు అతని వైపు సూటిగా చూసి నయం కాగల విశ్వాసం అతనిలో ఉందని గ్రహించి,
ACT 14:10 “లేచి నీ కాళ్ళపై నిలబడు!” అని అతనితో బిగ్గరగా అన్నాడు. తక్షణం అతడు గంతేసి నడవటం మొదలు పెట్టాడు.
ACT 14:11 పౌలు చేసింది చూసి ప్రజలు తమ లుకయొనియ భాషలో, “మానవ బృహస్పతి రూపంలో దేవుళ్ళు దిగివచ్చారు” అని బిగ్గరగా అన్నారు.
ACT 14:12 బర్నబాను ద్యుపతి అని, ప్రధాన ఉపన్యాసకుడు కాబట్టి పౌలును హెర్మే అని పిలిచారు.
ACT 14:13 వీళ్ళు దేవుళ్ళని అనుకోవటం వల్ల వీళ్ళకు బలి యివ్వాలనే ఉద్దేశ్యంతో ఊరి బయట ఉన్న ద్యుపతి మందిరం యొక్క పూజారి, ప్రజలు కలిసి ఎద్దుల్ని, పూలహారాలను పట్టణ ద్వారాల దగ్గరకు తెచ్చారు.
ACT 14:14 కాని అపొస్తలులైన బర్నబా, పౌలు ఇది విని తమ దుస్తుల్ని చింపుకొంటూ ఆ ప్రజల గుంపులోకి పరుగెత్తి యిలా బిగ్గరగా అన్నారు:
ACT 14:15 “అయ్యలారా! మీరిలా ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మనుష్యులమే! మీలాంటి మనుష్యులమే! ఈ పనికి రానివాటినుండి మిమ్మల్ని దూరం చేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని వాటిలో ఉన్న వాటన్నిటిని సృష్టించిన దేవుని వైపు మళ్ళించే సువార్తను తెచ్చాము. ఆ దేవుడు సజీవమైనవాడు.
ACT 14:16 “ఇదివరలో దేవుడు ప్రజల్ని తమ యిష్టం వచ్చినట్లు చెయ్యనిచ్చాడు.
ACT 14:17 కాని ఆకాశం నుండి వానలు కురిపించి, పంట కాలంలో పంటలు పండించి తినటానికి కావలసినంత ఆహారాన్నిచ్చి మన మనసుల్ని ఆనందంతో నింపి మనపై దయచూపి దేవుడు తానున్నట్లు తెలియచేసాడు.”
ACT 14:18 ఇన్ని చెప్పాక కూడా ప్రజలు తాము యివ్వాలనుకొన్న బలినివ్వటం మానుకోలేదు.
ACT 14:19 కాని కొందరు యూదులు అంతియొకయ, ఈకొనియ పట్టణాలనుండి వచ్చి ప్రజల్ని తమవైపు మళ్ళించుకొన్నారు. అంతా కలిసి పౌలు మీద రాళ్ళు విసిరారు. అతడు చనిపోయాడనుకొని అతణ్ణి ఊరి బయట పారవేసారు.
ACT 14:20 శిష్యులు అతని చుట్టూ చేరారు. ఆ తదుపరి అతడు లేచి మళ్ళీ పట్టణంలోకి వెళ్ళాడు. మరుసటి రోజు అతడు బర్నబాను కలుసుకొన్నాడు. ఇద్దరూ కలిసి దెర్బే అనే పట్టణానికి ప్రయాణమయ్యారు.
ACT 14:21 ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేసుకొన్నారు. లుస్త్ర, ఈకొనియ, అంతియొకయ పట్టణాలకు తిరిగి వచ్చారు.
ACT 14:22 శిష్యుల్ని ఆత్మీయంగా బలపరుస్తూ భక్తి వదలకుండా ఉండుమని ఉత్సాహం కలిగే మాటలు చెప్పారు. “దేవుని రాజ్యంలోకి ప్రవేశించటానికి మనం ఎన్నో కష్టాలనుభవించాలి” అని వాళ్ళు అన్నారు.
ACT 14:23 పౌలు, బర్నబా కలిసి ప్రతి సంఘానికి కొందరు పెద్దల్ని నియమించారు. ఈ పెద్దలు ఇంతకు క్రితమే ప్రభువును విశ్వసించిన వాళ్ళు కనుక పౌలు, బర్నబా ప్రార్థనలు, ఉపవాసాలు చేసి వాళ్ళను ప్రభువుకు అప్పగించారు.
ACT 14:24 ఆ తదుపరి పిసిదియ ప్రాంతాలకు వెళ్ళి అక్కడనుండి పంపూలియ చేరుకొన్నారు.
ACT 14:25 పెర్గేలో సందేశాన్ని ప్రకటించి అక్కడినుండి అత్తాలియకు వెళ్ళారు.
ACT 14:26 అత్తాలియ నుండి అంతియొకయకు తిరిగి ప్రయాణమయ్యారు. ప్రస్తుతం ముగించిన దైవ కార్యాన్ని చేయటానికి దైవానుగ్రహం కలగాలని దీవించి వీళ్ళను దేవునికి అప్పగించింది యిక్కడే.
ACT 14:27 అంతియొకయకు వచ్చాక సంఘాన్ని పిలిచి దేవుడు తమ ద్వారా చేసినవన్నీ చెప్పారు. యూదులు కానివాళ్ళు కూడా తనను నమ్మేటట్లు దేవుడు ద్వారాలను ఏ విధంగా తెరిచాడో చెప్పారు.
ACT 14:28 వాళ్ళు అక్కడున్న శిష్యులతో చాలా కాలం గడిపారు.
ACT 15:1 కొందరు యూదయ నుండి అంతియొకయకు వచ్చి అక్కడున్న సోదరులకు, “సున్నతి అనే మోషే ఆచారాన్ని పాటిస్తే తప్ప మీకు రక్షణ లభించదు” అని బోధించారు.
ACT 15:2 ఈ కారణంగా పౌలు, బర్నబా వాళ్ళతో తీవ్రమైన వాదనలు, చర్చలు చేసారు. అపొస్తలుల్ని ఈ విషయాన్ని గురించి సంప్రదించాలనే ఉద్దేశ్యంతో పౌలును, బర్నబాను, మరి కొంతమందిని యెరూషలేమునకు పంపాలనే నిర్ణయం జరిగింది.
ACT 15:3 అక్కడున్న సంఘం వీళ్ళకు వీడ్కోలు యిచ్చింది. వీళ్ళు ఫోనీషియ, సమరయ పట్టణాల ద్వారా ప్రయాణం చేస్తూ యూదులు కాని వాళ్లలో వచ్చిన మార్పును గురించి అక్కడి వాళ్ళకు చెప్పారు. ఇది సోదరులందరికీ చాలా ఆనందం కలిగించింది.
ACT 15:4 వీళ్ళు యెరూషలేము చేరగానే సంఘము, అపొస్తలులు, పెద్దలు అంతా కలిసి వీళ్ళకు స్వాగతం యిచ్చారు. పౌలు, బర్నబా దేవుడు తమ ద్వారా చేసిన వాటిని వాళ్ళకు చెప్పారు.
ACT 15:5 పరిసయ్యుల తెగకు చెందిన కొందరు భక్తులు లేచి, “యూదులు కానివాళ్ళు తప్పక సున్నతి చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి” అని అన్నారు.
ACT 15:6 అపొస్తలులు, పెద్దలు కలిసి ఈ విషయాన్ని పరిశీలించారు.
ACT 15:7 ఎన్నో చర్చలు జరిగాక పేతురు లేచి యిలా అన్నాడు: “సోదరులారా! యూదులు కానివాళ్ళు నా నోటి నుండి సువార్త విని విశ్వాసులు కావాలని చాలా కాలం క్రిందటే దేవుడు మనందరి నుండి నన్నెన్నుకొన్నట్లు మీకు తెలుసు.
ACT 15:8 మానవుల మనస్సు తెలిసిన దేవుడు, మనకిచ్చినట్లే పవిత్రాత్మను వాళ్ళకు కూడా యిచ్చి వాళ్ళను అంగీకరించినట్లు మనకు తెలియ చేసాడు.
ACT 15:9 మనకు, వాళ్ళకూ వ్యత్యాసం చూపలేదు. వాళ్ళు విశ్వసించారు. కనుక వాళ్ళ హృదయాలను పవిత్రం చేసాడు.
ACT 15:10 మరి అలాంటప్పుడు బరువైన ఈ కాడిని శిష్యుల మెడపై ఎందుకు పెడ్తున్నారు? ఈ బరువును మనము, మన పెద్దలు కూడా మోయలేక పోయాము కదా! దేవుడు కోప్పడుతాడో లేదో చూడాలని ఉందా?
ACT 15:11 యేసు ప్రభువు దయతో మనము, వీళ్ళు కూడా రక్షింపబడుతామని నమ్ముతున్నాము.”
ACT 15:12 సభలో ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దం వహించారు. బర్నబా, పౌలు యూదులు కాని వాళ్ళలో దేవుడు తమ ద్వారా చేసిన మహిమల్ని గురించి, అద్భుతాల్ని గురించి చెప్పగా వాళ్ళు విన్నారు.
ACT 15:13 పౌలు, బర్నబా మాట్లాడటం ముగించాక యాకోబు ఈ విధంగా అన్నాడు: “సోదరులారా! నా మాటలు వినండి!
ACT 15:14 దేవుడు మొదట్లో యూదులు కాని వాళ్ళ పట్ల తన అభిమానాన్ని చూపి వాళ్ళనుండి కొందర్ని ఎన్నుకొని తన ప్రజలుగా ఎలా చేసుకొన్నాడో సీమోను మనకు వివరించి చెప్పాడు.
ACT 15:15 ఈ సంఘటనను ప్రవక్తలు ఈ వాక్యాల్లో సరిగ్గా వర్ణించారు:
ACT 15:16 ‘కూలిపోయిన దావీదు యింటిని పునః నిర్మిస్తాను! ఆ శిథిలాలతో క్రొత్త యింటిని నిర్మిస్తాను!
ACT 15:17 మిగతా వాళ్ళంతా ప్రభువును వెతుకుతారు! నేనెన్నుకొన్న యూదులు కాని ప్రజలు కూడా వెతుకుతారు.’
ACT 15:18 ‘అని ప్రభువు చాలా కాలం క్రిందటే తెలియచేసాడు.’
ACT 15:19 “దేవుడు యూదులు కాని వాళ్ళను కూడా అంగీకరించాడు కాబట్టి, దేవుని వైపు మళ్ళుతున్న వాళ్ళ మనస్సుకు కష్టం కలిగించ కూడదని నా అభిప్రాయం.
ACT 15:20 కాని తరతరాలనుండి మోషే ధర్మశాస్త్రాన్ని ప్రతి పట్టణంలో ప్రకటిస్తూ, వాటిని ప్రతి విశ్రాంతి రోజు సమాజ మందిరాల్లో చదివారు కాబట్టి, విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం ముట్టరాదని, పరస్త్రీని కామించకూడదని, గొంతు నులిమి చంపిన జంతువుల మాంసం ముట్టరాదని, జంతువుల రక్తాన్ని తినరాదని వాళ్ళకు మనం వ్రాయాలి.”
ACT 15:22 అపొస్తలులు, పెద్దలు, సంఘసభ్యులు, అంతా కలిసి సంఘం నుండి కొందర్ని ఎన్నుకొని పౌలు, బర్నబాతో సహా వాళ్ళను అంతియొకయకు పంపారు. సోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బా అని పిలువబడే యూదాను, సీలను ఎన్నుకొని
ACT 15:23 వాళ్ళ వెంట ఈ లేఖను పంపారు: మీ సోదరులైన అపొస్తలులనుండి, పెద్దల నుండి, అంతియొకయ, సిరియ, కిలికియ పట్టణాల్లోని యూదులు కాని సోదరులకు, శుభం! ప్రియ సహోదరులారా!
ACT 15:24 మా అనుమతి లేకుండా మాలో కొందరు అక్కడికి వచ్చి తమ మాటల్తో మీలో అశాంతి కలిగించి మీ మనస్సుల్ని పాడుచేసారని విన్నాము.
ACT 15:25 మా ప్రియమిత్రులైన బర్నబాతో, పౌలుతో కొందర్ని మీ వద్దకు పంపాలని మేమంతా కలిసి నిర్ణయించాము.
ACT 15:26 వీళ్ళు మన యేసు క్రీస్తు ప్రభువు కోసం తమ ప్రాణాల్ని తెగించిన వాళ్ళు.
ACT 15:27 అందువల్ల, మేము వ్రాస్తున్నవి తమ నోటి ద్వారా మీకు తెలపాలని యూదాను, సీలను పంపుతున్నాము.
ACT 15:28 ఈ నియమాల్ని తప్ప మిగతా నియమాల్ని మీపై మోపటం భావ్యంకాదని పవిత్రాత్మకు, మాకు అనిపించింది:
ACT 15:29 విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారాన్ని, గొంతు నులిమి చంపిన జంతువుల మాంసాన్ని, జంతువుల రక్తాన్ని ముట్టకండి. పరస్త్రీని కామించకూడదని. ఇలా వీటికి దూరంగా ఉండటంవల్ల మీలో సత్‌ప్రవర్తన కలుగుతుంది. వీడ్కోలు.
ACT 15:30 వాళ్ళు సెలవు తీసుకొని అంతియొకయకు వెళ్ళారు. యేసు భక్తులందర్ని పిలిచి వాళ్ళకీ లేఖనిచ్చారు.
ACT 15:31 ప్రోత్సాహపరిచే ఈ లేఖను చదివి ప్రజలు చాలా ఆనందించారు.
ACT 15:32 యూదా, సీల కూడా ప్రవక్తలు కాబట్టి ఆ ఊరి సోదరులతో చాలా సేపు మాట్లాడి వాళ్ళను ప్రోత్సాహపరిచి ఆధ్యాత్మికంగా బలపరిచారు.
ACT 15:33 వాళ్ళక్కడ కొద్ది రోజులు గడిపారు. ఆ తదుపరి అక్కడి సోదరులు, “శాంతి కలుగుగాక” అని కోరుతూ వాళ్ళకు వీడ్కోలు చెప్పారు. వీళ్ళు తమను పంపిన వాళ్ళ దగ్గరకు తిరిగి వెళ్ళిపోయారు.
ACT 15:34 “కాని సీల అక్కడే ఉండిపోవాలనుకొన్నాడు.”
ACT 15:35 పౌలు, బర్నబా అంతియొకయలో కొద్ది రోజులు గడిపారు. వీళ్ళు, యింకా అనేకులు కలిసి ప్రభువు సందేశాన్ని ఉపదేశించి బోధించారు.
ACT 15:36 కొంతకాలం తర్వాత పౌలు, బర్నబాతో, “ప్రభువు సందేశాన్ని ఉపదేశించిన ప్రతి పట్టణానికి, మనం మళ్ళీ వెళ్దాం. అక్కడి సోదరుల్ని కలుసుకొని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో చూసి వద్దాం” అని అన్నాడు.
ACT 15:37 బర్నబా, మార్కు అని పిలివబడే యోహానును కూడా తమ వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు.
ACT 15:38 కాని తమతో పని చెయ్యకుండా తమను పంపూలియలో వదిలి వేసాడు కాబట్టి పౌలు అతణ్ణి పిలుచుకు వెళ్ళటం మంచిది కాదనుకొన్నాడు.
ACT 15:39 బర్నబా, పౌలు మధ్య తీవ్రమైన స్పర్థ కలగటం వల్ల వాళ్ళు విడిపోయారు. బర్నబా మార్కును తన వెంట పిలుచుకొని ఓడలో సైప్రసుకు వెళ్ళాడు.
ACT 15:40 పౌలు, సీలను తన వెంట పిలుచుకొని వెళ్ళాడు. అక్కడున్న సోదరులు అతనికి ప్రభువు అనుగ్రహం కలగాలని దీవించి ప్రభువుకు అప్పగించారు.
ACT 15:41 అతడు సిరియ, కిలికియ పట్టణాల ద్వారా ప్రయాణం చేసి అక్కడి సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరిచాడు.
ACT 16:1 ఆ తర్వాత పౌలు దెర్బే వెళ్ళి అక్కడి నుండి లుస్త్రకు వెళ్ళాడు. లుస్త్రలో తిమోతి అనే పేరుగల ఒక విశ్వాసి ఉండేవాడు. అతని తల్లి భక్తిగల యూదురాలు; తండ్రి గ్రీసు దేశస్థుడు.
ACT 16:2 లుస్త్ర, ఈకొనియ పట్టణాల్లో నివసించే సోదరుల్లో తిమోతి మంచి పేరు తెచ్చుకున్నాడు. పౌలు అతణ్ణి తన వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు.
ACT 16:3 తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతంలో నివసించే యూదులందరికి తెలుసు. కాబట్టి అతనికి సున్నతి చేయించాడు.
ACT 16:4 అపొస్తలులు, పెద్దలు యెరూషలేములో నిర్ణయించిన నియమాల్ని, వాళ్ళు ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రజలకు తెలియచేసి, వాటిని పాటించుమని చెప్పారు.
ACT 16:5 తద్వారా సంఘాల్లో భక్తి అభివృద్ధి చెందింది. రోజు రోజుకూ ఆ సంఘాల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ACT 16:6 వాళ్ళు ఆసియ ప్రాంతాలకు వెళ్ళి ఈ సందేశాన్ని బోధించాలనుకొన్నారు. కాని పరిశుద్ధాత్మ వాళ్ళను ఆపాడు. కనుక, వాళ్ళు ప్రుగియ, గలతీయలలోని ప్రతి గ్రామానికి వెళ్ళారు.
ACT 16:7 ముసియ పొలిమేరలకు వచ్చాక బితూనియకు వెళ్ళటానికి ప్రయత్నించారు. కాని యేసు ఆత్మ అందుకు అంగీకరించలేదు.
ACT 16:8 ఆ కారణంగా వాళ్ళు ముసియ దాటి త్రోయకు వెళ్ళారు.
ACT 16:9 మాసిదోనియ ప్రాంతం వాడొకడు, “మాసిదోనియకు వచ్చి మమ్మల్ని రక్షించండి” అని వేడుకొన్నట్లు ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం కలిగింది.
ACT 16:10 పౌలుకు దర్శనం కలిగాక మాసిదోనియ నివాసులకు సువార్త ప్రకటించటానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకొన్నాడని గ్రహించి తక్షణమే మేము అక్కడికి వెళ్ళటానికి సిద్ధం అయ్యాము.
ACT 16:11 “త్రోయ” నుండి సముద్ర ప్రయాణం చేసి నేరుగా సమొత్రాకేకు వెళ్ళి మరుసటి రోజు నెయపొలి చేరుకొన్నాము.
ACT 16:12 అక్కడి నుండి ప్రయాణమై రోము సామ్రాజ్యంలోని ఫిలిప్పీకి వెళ్ళాం. ఫిలిప్పీ మాసిదోనియలోని ప్రాంతంలో చాలా ముఖ్యమైన పట్టణం. మేము ఆ పట్టణంలో చాలా రోజులు గడిపాము.
ACT 16:13 ఒక విశ్రాంతి రోజున ప్రార్థనలు చేయటానికి స్థలం దొరుకుతుందని ఆశిస్తూ ఊరి బయట ఉన్న నది దగ్గరకు వెళ్ళాము. అక్కడికి వచ్చిన ఆడవాళ్ళతో కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాము.
ACT 16:14 మా మాటలు వింటున్న ఒకావిడ పేరు “లూదియ.” ఈవిడ తుయతైర గ్రామానికి చెందింది. ఊదారంగు పొడిని వ్యాపారం చేసే ఈ లూదియ భక్తురాలు. దేవుడు ఆవిడ మనస్సును మార్చి పౌలు సందేశం వినేటట్లు చేసాడు.
ACT 16:15 ఆమె, ఆమె యింట్లో ఉన్న వాళ్ళంతా బాప్తిస్మము పొందాక మమ్మల్ని యింటికి ఆహ్వానించింది. “నేను నిజంగా ప్రభువు భక్తురాలననే నమ్మకం మీలో ఉన్నట్లయితే వచ్చి మా యింట్లో ఉండండి” అని మమ్మల్ని వేడుకొని చాలా బలవంతం చేసింది.
ACT 16:16 ఒకసారి మేము ప్రార్థనా స్థలానికి వెళ్తుండగా ఒక బానిస పిల్ల కనిపించింది. ఆమెకు సోదె చెప్పే శక్తిగల “పుతోను” అనే దయ్యము పట్టివుంది. ఆమె సోదె చెప్పటం వల్ల ఆమె యజమానులు చాలా డబ్బు గడించారు.
ACT 16:17 ఆమె పౌలును, మమ్మును అనుసరిస్తూ, “వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. రక్షణకు దారి చూపుతున్నారు” అని బిగ్గరగా కేక పెట్టేది.
ACT 16:18 ఇలా చాలా రోజులు చేసింది. చివరకు పౌలు విసుగు చెంది వెనక్కి తిరిగి ఆమెలో ఉన్న దయ్యంతో, “యేసు క్రీస్తు పేరిట ఆమెను వదిలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే దయ్యం ఆమెను వదిలివేసింది.
ACT 16:19 ఆ బానిస పిల్ల యజమానులు తాము డబ్బు చేసుకొనే ఆశ నశించిందని గ్రహించి పౌలును, సీలను బంధించారు.
ACT 16:20 వాళ్ళను బహిరంగంగా రోము సైనికాధికారుల ముందుకు పిలుచుకు వచ్చి, “వీళ్ళు యూదులు. మన పట్టణంలో అలజడి లేపుతున్నారు.
ACT 16:21 రోము పౌరులుగా మనము ఆచరించలేని ఆచారాలను వాళ్ళు మనకు చెబుతున్నారు. వాటిని అంగీకరించటం కూడా న్యాయం కాదు” అని అన్నారు.
ACT 16:22 ప్రజల గుంపు పౌలు, సీలల మీద పడింది. అధికారులు వాళ్ళ దుస్తుల్ని చింపి కొట్టమని ఆజ్ఞాపించారు.
ACT 16:23 చావకొట్టి, వాళ్ళను చెరసాలలో పడవేస్తూ, “వీళ్ళను జాగ్రత్తగా కాపలా కాయండి” అని ఆ చెరసాల అధికారితో చెప్పారు.
ACT 16:24 కనుక ఆ చెరసాల అధికారి వాళ్ళ కాళ్ళను బొండ కొయ్యకు గల రంధ్రాల్లో బిగించి లోపలి గదిలో పడవేసాడు.
ACT 16:25 అర్థరాత్రి వేళ పౌలు, సీల ప్రార్థనలు చేస్తూ, దైవకీర్తనలు పాడుతుండగా ఇతర బందీలు వింటున్నారు.
ACT 16:26 అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం వచ్చింది. దానితో చెరసాల పునాదులు కదిలిపోయాయి. వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. వీళ్ళకు కట్టిన కట్లు తెగిపొయ్యాయి.
ACT 16:27 చెరసాల అధికారి మేలుకొని చెరసాల తలుపులు తెరచి ఉండటం చూసి నేరస్థులు అందరు తప్పించుకు పోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు.
ACT 16:28 కాని పౌలు, “హాని చేసుకోవద్దు! మేమంతా యిక్కడే ఉన్నాము” అని బిగ్గరగా అన్నాడు.
ACT 16:29 ఆ అధికారి దీపాలు తెప్పించి లోపలికి పరుగెత్తికొంటూ వెళ్ళి వణకుతూ పౌలు, సీలల కాళ్ళ మీద పడ్డాడు.
ACT 16:30 ఆ తర్వాత వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చి, “అయ్యా! నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి?” అని అడిగాడు.
ACT 16:31 వాళ్ళు, “యేసు ప్రభువును నమ్ము! నీకు, నీ యింట్లోని వాళ్ళకందరికీ రక్షణ లభిస్తుంది” అని సమాధానం చెప్పారు.
ACT 16:32 ఆ తరువాత వాళ్ళు ప్రభువు సందేశాన్ని అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికీ చెప్పారు.
ACT 16:33 ఆ అధికారి, ఆ రాత్రివేళ వాళ్ళను పిలుచుకు వెళ్ళి గాయాలను కడిగాడు. వెంటనే అతడు, అతని యింట్లోని వాళ్ళు బాప్తిస్మము పొందారు.
ACT 16:34 ఆ తరువాత అతడు వాళ్ళను తన యింటికి పిలుచుకు వెళ్ళి వాళ్ళకు భోజనం పెట్టాడు. అతడు, అతని యింట్లోని వాళ్ళు తాము దేవుణ్ణి విశ్వసించటం మొదలు పెట్టినందుకు చాలా ఆనందించారు.
ACT 16:35 తెల్లవారగానే న్యాయాధికారులు తమ భటుల్ని చెరసాల అధికారి దగ్గరకి పంపి వాళ్ళను విడుదల చేయుమని ఆజ్ఞాపించారు.
ACT 16:36 “నిన్ను, సీలను విడుదల చేయుమని న్యాయాధికారులు సెలవిచ్చారు. మీరిక వెళ్ళొచ్చు, క్షేమంగా వెళ్ళండి!” అని చెరసాల అధికారి అన్నాడు.
ACT 16:37 కాని పౌలు వాళ్ళతో, “మేము రోము పౌరులమైనా విచారణ జరుపకుండా ప్రజల ముందు మమ్మల్ని కొరడా దెబ్బలు కొట్టారు. కారాగారంలో పడవేసారు. కాని యిప్పుడు రహస్యంగా పంపివేయాలని చూస్తున్నారు. వీల్లేదు, స్వయంగా వచ్చి మమ్మల్ని విడుదల చేయుమని అధికారులతో చెప్పండి” అని అన్నాడు.
ACT 16:38 భటులు ఈ వార్త అధికారలకు తెలియజేసారు. వాళ్ళు పౌలు, సీలలు రోము పౌరులని విని భయపడిపోయారు.
ACT 16:39 అందువల్ల అధికారులు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తమ తప్పు క్షమించుమని వేడుకొన్నారు. వాళ్ళను ఊరి బయటకు పిలుచుకు వెళ్ళి, దయ ఉంచి తమ ఊరు విడిచి వెళ్ళమని వాళ్ళను కోరారు.
ACT 16:40 పౌలు, సీలలు కారాగారంనుండి లూదియ యింటికి వెళ్ళారు. అక్కడున్న సోదరులను కలుసుకొని వాళ్ళలో విశ్వాసం పెరిగే విధంగా మాట్లాడి వెళ్ళిపోయారు.
ACT 17:1 వాళ్ళు “అంఫిపొలి”, “అపోల్లోనియ”, పట్టణాల ద్వారా ప్రయాణం చేసి థెస్సలొనీక అనే పట్టణం చేరుకొన్నారు. అక్కడ ఒక యూదుల సమాజ మందిరం ఉంది.
ACT 17:2 అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విషయాలు తర్కించాడు.
ACT 17:3 క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి ఋజువు చేసాడు. “నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” అని వాళ్ళకు నచ్చచెప్పాడు.
ACT 17:4 తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీలల పక్షము చేరిపోయారు. దైవ భీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు.
ACT 17:5 ఇది గమనించి యూదులు అసూయ పడ్డారు. సంతలో ఉన్న పనిలేని వాళ్ళను కొందర్ని నమావేశపరచి పట్టణంలో అల్లర్లు మొదలు పెట్టారు. పౌలు, సీలలను ప్రజల ముందుకు లాగాలనుకొని అంతా కలిసి యాసోను యింటి మీద పడ్డారు.
ACT 17:6 వాళ్ళు అక్కడ కనిపించక పోయేసరికి యాసోన్ను, మరి కొందరు సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకొని వచ్చి, “ప్రపంచాన్నే కలవరపరచిన ఈ మనుష్యులు ఇప్పుడిక్కడికి వచ్చారు.
ACT 17:7 వీళ్ళకు యాసోను తన యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు” అని కేకలు వేసారు.
ACT 17:8 ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు రేకెత్తిపోయారు.
ACT 17:9 ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలి వేసారు.
ACT 17:10 అర్థరాత్రి కాగానే సోదరులు పౌలు, సీలలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చిన వాళ్ళు యూదుల సమాజ మందిరానికి వెళ్ళారు.
ACT 17:11 థెస్సలోనీక వాళ్ళకన్నా బెరయ వాళ్ళు మర్యాద కలవాళ్ళు. వాళ్ళు దైవసందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్ళు. ప్రతీరోజు పవిత్ర గ్రంథాలు చదివి, ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించే వాళ్ళు.
ACT 17:12 చాలా మంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు, పురుషులు కూడా విశ్వాసులయ్యారు.
ACT 17:13 పౌలు దైవసందేశాన్ని బెరయలో కూడా ఉపదేశిస్తున్నాడని థెస్సలోనీకలోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలను పురికొలిపి, వాళ్ళలో అల్లర్లు రేకెత్తించారు.
ACT 17:14 వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు.
ACT 17:15 పౌలుతో వెళ్ళిన వాళ్ళు అతనితో కలిసి ఏథెన్సుదాకా వెళ్ళారు. సీలను, తిమోతిని అయినంత త్వరలో రమ్మనమని పౌలు వాళ్ళ ద్వారా కబురు పంపాడు. ఈ వార్తతో వాళ్ళు తిరిగి బెరయకు వెళ్ళిపోయారు.
ACT 17:16 పౌలు ఏథెన్సులో వాళ్ళకోసం ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆగిపొయ్యాడు. ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం గమనించి అతని ఆత్మ క్షోభించింది.
ACT 17:17 అందువల్ల నమాజ మందిరంలో సమావేశమయ్యే యూదులతో, దైవ భీతిగల యూదులు కాని ప్రజలతో, సంతకు వచ్చి పోయే ప్రజలతో ప్రతి రోజు మాట్లాడే వాడు.
ACT 17:18 ఎపికూరీయులు అని అనబడే కొందరు తత్వజ్ఞులు, స్తోయికులు అనబడే కొందరు తత్వజ్ఞులు అతనితో తర్కించారు. “ఆ వదరుబోతు ఏమంటున్నాడు?” అని కొందరు అన్నారు. “ఇతర దేవుళ్ళను గురించి ప్రబోధిస్తున్నట్లుంది” అని మరి కొందరు అన్నారు. పౌలు యేసును గురించి, ఆయన బ్రతికి రావటాన్ని గురించి ప్రకటించటం వల్ల అతణ్ణి వాళ్ళిలా విమర్శించారు.
ACT 17:19 వాళ్ళు అతనిని పట్టుకొని అరేయొపగు సభకు పిలుచుకు వచ్చారు. “నీవు చెబుతున్న ఈ క్రొత్త బోధన ఏమిటో మేము తెలుసుకోవచ్చా?” అని కొందరు అడిగారు.
ACT 17:20 “మీరు చిత్రమైన విషయాలు మా చెవుల్లో వేసారు. వాటి అర్థం మాకు చెప్పండి” అని మరి కొందరడిగారు.
ACT 17:21 ఏథెన్సు ప్రజలు, ఆ పట్టణంలో నివసించే పరదేశీయులు, తమ కాలాన్నంతా కొన్ని సిద్ధాంతాలను చెప్పటంలోనో లేక వినటంలోనో గడిపే వాళ్ళు. మరే పని చేసే వాళ్ళు కాదు.
ACT 17:22 పౌలు అరేయొపగు సభలో నిల్చొని, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లో చాలా నిష్టగా ఉన్నారు. ఇది నేను గమనించాను.
ACT 17:23 నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూసాను. అంతేకాదు సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద, ‘తెలియని దేవునికి’ అని వ్రాయబడి ఉండటం చూసాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను.
ACT 17:24 “ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు; ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి దేవుడు, మానవులు కట్టిన మందిరాల్లో నివసించడు.
ACT 17:25 మానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ లేదు. జీవి పీల్చుకొనే గాలిని, కావలసిన ప్రతీ వస్తువును యిచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా?
ACT 17:26 ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేసాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు.
ACT 17:27 “మానవులు తనను వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు:
ACT 17:28 ‘మనం ఆయనలో జీవిస్తున్నాం ఆయనలో కదులుతున్నాం. ఆయన కారణంగా మనం ఉన్నాం’ మీలోని కొందరు కవులు చెప్పినట్లు: ‘మనం ఆయన సంతానం.’
ACT 17:29 “మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, దేవుడు బంగారంతో కాని లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటి వాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడుకాడు.
ACT 17:30 గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు ప్రవర్తించాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కణ్ణీ మారు మనస్సు పొందుమని ఆజ్ఞాపిస్తున్నాడు.
ACT 17:31 ప్రపంచంలో ఉన్న ప్రతీ వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించి తాను చేయనున్న దాన్ని ప్రజలందరికీ ఋజువు చేసాడు.”
ACT 17:32 చనిపోయిన వారు యేసువలె బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతణ్ణి హేళన చేసారు. మరి కొందరు, “ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది” అని అన్నారు.
ACT 17:33 పరిస్థితులు యిలా అవటం వల్ల పౌలు ఆ సభనుండి వెళ్ళిపొయ్యాడు.
ACT 17:34 కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళలో అరేయొపగు అను సభకు సభ్యత్వం ఉన్న దియొనూసియు అనేవాడు, దమరి అనే స్త్రీ మొదలగు వాళ్ళున్నారు.
ACT 18:1 ఆ తరువాత పౌలు ఏథెన్సు వదిలి కొరింథుకు వెళ్ళాడు.
ACT 18:2 అక్కడ అకుల అనే యూదుణ్ణి కలుసుకొన్నాడు. ఇతని స్వగ్రామం పొంతు. క్లౌదియ యూదులందర్ని రోము నగరం వదిలి వెళ్ళుమని ఆజ్ఞాపించటంవలన అకుల ఇటలీ నుండి తన భార్య ప్రిస్కిల్లతో కలసి ఈ మధ్య యిక్కడికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్ళాడు.
ACT 18:3 తనలాగే వాళ్ళు కూడా గుడారాలు చేసి జీవించే వాళ్ళు కనుక వాళ్ళతో కలిసి ఉండి పని చేసాడు.
ACT 18:4 ప్రతి విశ్రాంతి రోజూ సమాజ మందిరాల్లో తర్కించి యూదుల్ని, గ్రీకుల్ని ఒప్పించటానికి ప్రయత్నించేవాడు.
ACT 18:5 మాసిదోనియ నుండి సీల, తిమోతిలు వచ్చాక పౌలు తన కాలాన్నంతా బోధించటానికి వినియోగించాడు. యూదుల సమక్షంలో మాట్లాడి, యేసు ప్రభువే క్రీస్తు అని నిరూపించే వాడు.
ACT 18:6 కాని యూదులు ఎదురు తిరిగి అతణ్ణి దూషించారు. పౌలు తన నిరసనను వ్యక్తపరుస్తూ తన దుస్తుల్ని దులిపి, “మీరు పొందనున్న శిక్షకు మీరే బాధ్యులు, నేను బాధ్యుణ్ణి కాదు. ఇక మీదట నేను యూదులు కాని వాళ్ళ దగ్గరకు వెళ్తాను” అని అన్నాడు.
ACT 18:7 పౌలు సమాజ మందిరాన్ని వదిలి ప్రక్కనున్న తీతియు యూస్తు అనే విశ్వాసి యింటికి వెళ్ళాడు.
ACT 18:8 యూదుల సమాజ మందిరంపై అధికారిగా పని చేస్తున్న క్రిస్పు అనే వ్యక్తీ అతని యింట్లోని వాళ్ళు ప్రభువును విశ్వసించారు. చాలా మంది కొరింథు ప్రజలు పౌలు చెప్పిన వాటిని విని ప్రభువును విశ్వసించి బాప్తిస్మము పొందారు.
ACT 18:9 ఒక నాటి రాత్రి ప్రభువు పౌలుకు కలలో కనిపించి, “ఈ పట్టణంలో నా ప్రజలు చాలా మంది ఉన్నారు. కనుక మౌనం వహించక ధైర్యంగా బోధించు. నేను నీ వెంటే ఉన్నాను. ఎవ్వరూ నీకు ఎదురు తిరగలేరు. ఏ హానీ చెయ్యలేరు” అని అన్నాడు.
ACT 18:11 పౌలు ఒకటిన్నర సంవత్సరాలు అక్కడుండి దైవసందేశాన్ని వాళ్ళకు బోధించాడు.
ACT 18:12 గల్లియో అనే పేరుగల ఒక వ్యక్తి అకయ ప్రాంతానికి సామంత రాజుగా ఉండేవాడు. అతని కాలంలో యూదులందరూ కలిసి పౌలుకు ఎదురు తిరిగారు. అతణ్ణి న్యాయస్థానం ముందుకు తెచ్చి,
ACT 18:13 “ఇతడు మన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతిలో దేవుణ్ణి పూజించుమని ప్రజల్ని ఒత్తిడి చేస్తున్నాడు” అని అతణ్ణి నిందించారు.
ACT 18:14 పౌలు సమాధానం చెప్పటానికి సిద్ధం అయ్యాడు. ఇంతలో గల్లియో యూదులతో, “మీరు ఘోరమైన నేరాన్ని గురించి కాని, లేక చెడు నడతను గురించి కాని చెప్పదలిస్తే నేను మీ విన్నపం వినటం సమంజసంగా ఉంటుంది.
ACT 18:15 కాని మీ ఆరోపణ పదాలను గురించి, పేర్లను గురించి, మీ శాస్త్రాల్ని గురించి కాబట్టి మీలో మీరు తీర్మానం చేసుకోండి.
ACT 18:16 అలాంటి వాటిపై నేను తీర్పు చెప్పను” అని అంటూ వాళ్ళను న్యాయస్థానం నుండి తరిమి వేసాడు.
ACT 18:17 వాళ్ళు యూదుల సమాజమందిరానికి పెద్ద అయినటువంటి సోస్తెనేసును పట్టుకొని అతణ్ణి న్యాయస్థానం ముందు కొట్టారు. అయినా గల్లియో తనకు సంబంధం లేనట్టు వూరుకొన్నాడు.
ACT 18:18 పౌలు కొరింథులో కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత అక్కడున్న సోదరుల్ని వదిలి, ప్రిస్కిల్లను, అకులను తన వెంట పిలుచుకొని ఓడలో సిరియ దేశానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణానికి ముందు తాను మ్రొక్కుబడి తీర్చుకోవటానికి కెంక్రేయలో తన వెంట్రుకలు కత్తిరించుకున్నాడు.
ACT 18:19 వాళ్ళు ఎఫెసు చేరుకున్నారు. అక్కడ పౌలు ప్రిస్కిల్లను వదిలి తానొక్కడే సమాజ మందిరానికి వెళ్ళి యూదులతో తర్కించాడు.
ACT 18:20 వాళ్ళు అతణ్ణి తమతో మరికొన్ని రోజులుండమని అడిగారు. అతడు వీల్లేదన్నాడు.
ACT 18:21 కాని వెళ్ళే ముందు, “దేవుని చిత్తమైతే మళ్ళీ వస్తాను” అని వాళ్ళతో చెప్పి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసాడు.
ACT 18:22 అతడు కైసరియ తీరాన్ని చేరుకొని అక్కడి నుండి యెరూషలేము వెళ్ళాడు. అక్కడున్న సంఘానికి శుభాకాంక్షలు తెలిపి అక్కడి నుండి అంతియొకయకు వెళ్ళాడు.
ACT 18:23 అంతియొకయలో కొద్ది రోజులు గడిపి అక్కడినుండి ప్రయాణమై గలతియ, ఫ్రుగియ ప్రాంతాల్లో పర్యటన చేసి, ఆయా ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల్లో విశ్వాసం అభివృద్ధి చెందేటట్లు చేసాడు.
ACT 18:24 ఇది యిలా ఉండగా అపొల్లో అనే యూదుడు ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. అపొల్లో స్వగ్రామం అలెక్సంద్రియ. ఇతడు గొప్ప పండితుడు. యూదుల శాస్త్రాల్లో ఆరితేరినవాడు.
ACT 18:25 ప్రభువు మార్గాన్ని గురించి ఉపదేశం పొందినవాడు. యేసును గురించి సక్రమంగా గొప్ప ఉత్సాహంతో బోధించాడు. కాని బాప్తిస్మము విషయంలో అతనికి యోహాను బోధించిన విషయాలు మాత్రమే తెలుసు.
ACT 18:26 అతడు యూదుల సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రిస్కిల్ల, అకుల యితని బోధన విని అతణ్ణి తమ యింటికి పిలిచి దైవ మార్గాన్ని గురించి అతనికి యింకా విశదంగా చెప్పారు.
ACT 18:27 అపొల్లో అకయ ప్రాంతానికి వెళ్ళాలనుకొన్నాడు. సోదరులు అతని ఉద్దేశాన్ని బలపరిచారు. అకయ ప్రాంతాల్లో ఉన్న శిష్యులకు ఉత్తరం వ్రాసి యితనికి స్వాగతం చెప్పుమని అడిగారు. అతడు వెళ్ళి, దైవానుగ్రహంవల్ల యేసును విశ్వసించిన వాళ్ళకు చాలా సహాయం చేసాడు.
ACT 18:28 ప్రజలందరి ముందు యూదులతో తీవ్రమైన వాద వివాదాలు చేసి, వాళ్ళను ఓడించి శాస్త్రాల ద్వారా యేసు ప్రభువే క్రీస్తు అని రుజువు చేసాడు.
ACT 19:1 అపొల్లో యింకా కొరింథులోనే ఉన్నాడు. పౌలు భూమార్గం ద్వారా ప్రయాణం చేసి ఎఫెసు చేరుకున్నాడు. అక్కడ కొంత మంది శిష్యుల్ని కలుసుకొని
ACT 19:2 వాళ్ళతో, “మీరు విశ్వసించిన పిదప పవిత్రాత్మను పొందారా?” అని అడిగాడు. వాళ్ళు, “లేదండి! పవిత్రాత్మ ఉన్నాడనేది కూడా మేము వినలేదు” అని సమాధానం చెప్పారు.
ACT 19:3 పౌలు, “మీరు ఎలాంటి బాప్తిస్మం పొందారు?” అని అడిగాడు. “యోహాను బాప్తిస్మం” అని వాళ్ళు చెప్పారు.
ACT 19:4 పౌలు, “యోహాను మారుమనస్సుకు సంబంధించిన బాప్తిస్మము నిచ్చాడు. అతడు, తన తర్వాత రానున్న వాణ్ణి, అంటే యేసును నమ్ముమని ప్రజలకు బోధించాడు కదా!” అని అన్నాడు.
ACT 19:5 ఇది విన్నాక వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు.
ACT 19:6 పౌలు తన చేతుల్ని వాళ్ళ తలలపై ఉంచగానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చాడు. వాళ్ళంతా తమకు రాని భాషల్లో మాట్లాడారు. దేవుడు ప్రేరేపించిన సత్యాలు ప్రకటించారు.
ACT 19:7 అక్కడ మొత్తం పన్నెండు మంది ఉన్నారు.
ACT 19:8 పౌలు యూదుల సమాజ మందిరానికి మూడు నెలలు వెళ్ళాడు. దేవుని రాజ్యాన్ని గురించి ధైర్యంగా వాదించి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు.
ACT 19:9 కాని కొందరు నమ్మలేదు. తమ పట్టు వదులుకోలేదు. పైగా ప్రభువు చూపిన మార్గాన్ని బహిరంగంగా దూషించారు. అందువల్ల పౌలు వాళ్ళను వదిలి, శిష్యుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. అతడు, తురన్ను ఉపన్యాస శాలలో ప్రతి రోజూ తర్కించేవాడు.
ACT 19:10 ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి. ఫలితంగా ఆసియ ప్రాంతాల్లో నివసిస్తున్న యూదులు, గ్రీకులు అందరూ ప్రభువు సందేశాన్ని విన్నారు.
ACT 19:11 దేవుడు పౌలు ద్వారా ఎన్నో మహాత్కార్యాలు చేసాడు.
ACT 19:12 ప్రజలు అతడు తాకిన జేబు రుమాళ్ళను, తుండు గుడ్డల్ని తీసుకొని జబ్బుతో ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళు. వాటితో వాళ్ళ జబ్బులు నయమయ్యేవి. పట్టిన దయ్యాలు వదిలిపొయ్యేవి.
ACT 19:13 చుట్టూ ఉన్న ప్రాంతాలలో తిరిగి దయ్యాల్ని వదిలిస్తున్న కొందరు యూదులు యేసు ప్రభువు పేరునుపయోగించి దయ్యాలు పట్టిన వాళ్ళకు నయం చెయ్యటానికి ప్రయత్నించారు. వాళ్ళు, “పౌలు ప్రకటిస్తున్న యేసు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము. బయటకు రా!” అని అనే వాళ్ళు.
ACT 19:14 స్కెవ అనే యూదుల ప్రధాన యాజకుడు, అతని ఏడుగురు కుమారులు యిలా చేసే వాళ్ళు.
ACT 19:15 ఒకసారి ఆ దయ్యం, “యేసు ఎవరో నాకు తెలుసు. పౌలు ఎవరో నాకు తెలుసు. కాని మీరెవరు?” అని అడిగింది.
ACT 19:16 ఆ దయ్యం పట్టిన వాడు వాళ్ళ మీద పడి వాళ్ళను బాగా కొట్టాడు. వాళ్ళు రక్తం కార్చుకొంటూ ఆ యిల్లు వదిలి దిగంబరంగా పారిపోయారు.
ACT 19:17 ఎఫెసులో నివసిస్తున్న యూదులకు, గ్రీకులకు ఈ విషయం తెలిసింది. వాళ్ళందరూ భయపడి యేసు ప్రభువు నామాన్ని చాలా గౌరవించటం మొదలు పెట్టారు.
ACT 19:18 ఇది జరిగాక చాలా మంది తాము చేసిన వాటిని బహిరంగంగా ఒప్పుకోవటం మొదలు పెట్టారు.
ACT 19:19 మంత్ర విద్య నేర్చిన కొందరు తమ గ్రంథాల్ని తెచ్చి అందరి సమక్షంలో వాటిని కాల్చి వేసారు. ఆ తదుపరి వాళ్ళు తాము కాల్చిన గ్రంథాల వెలగట్టి వాటి వెల సుమారు యాభై వేల ద్రాక్మాలని నిర్ణయించారు.
ACT 19:20 ఈ విధంగా ప్రభువు సందేశం బాగా వ్యాపించింది. దాని ప్రభావం అభివృద్ధి చెందుతూ వచ్చింది.
ACT 19:21 ఆ సంఘటనలు జరిగాక పౌలు మాసిదోనియ, అకయ ప్రాంతాల ద్వారా యెరూషలేము వెళ్ళాలని పరిశుద్ధాత్మ సహాయంతో నిశ్చయించుకున్నాడు. అక్కడికి వెళ్ళాక రోము నగరాన్ని తప్పక దర్శించాలనుకున్నాడు.
ACT 19:22 తనకు సహాయం చేసే వాళ్ళలో యిద్దర్ని మాసిదోనియకు పంపాడు. వాళ్ళ పేర్లు తిమోతి, ఎరస్తు. అతడు ఆసియ ప్రాంతంలో మరి కొంత కాలం గడిపాడు.
ACT 19:23 ఆ రోజుల్లోనే ప్రభువు చూపిన మార్గాన్ని గురించి పెద్ద గొడవ జరిగింది.
ACT 19:24 “దేమేత్రి” అనే ఒక కంసాలి ఉండేవాడు. ఇతడు అర్తెమి దేవత ఉండే మందిరం యొక్క ప్రతిరూపాలను వెండితో తయారు చేసి అమ్మేవాడు. తద్వారా తన క్రింద పని చేసే వాళ్ళకు చాలినంత పని కల్పించేవాడు.
ACT 19:25 తన పనివాళ్ళను, తనలాంటి వృత్తి చేసే వాళ్ళను సమావేశ పరిచి ఈ విధంగా అన్నాడు: “అయ్యలారా! మనమీ వ్యాపారంలో చాలా ధనం గడిస్తున్న విషయం మీకందరికీ తెలుసు.
ACT 19:26 ఈ పౌలు అనేవాడు ఏం చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. ఇతడిక్కడ ఎఫెసులో, సుమారు ఆసియ ప్రాంతాలన్నిటిలో మానవుడు సృష్టించిన విగ్రహాలు దేవుళ్ళు కాదంటూ చాలా మంది ప్రజల్ని నమ్మించి తప్పుదారి పట్టిస్తున్నాడన్న విషయం మీరు విన్నారు.
ACT 19:27 ఈ కారణంగా మన వ్యాపారానికున్న మంచి పేరు పోయే ప్రమాదం ఉంది. పైగా అర్తెమి మహాదేవి మందిరానికున్న విలువ పోతుంది. ఆసియ ప్రాంతాల్లోనే కాక ప్రపంచమంతా పూజింపబడుతున్న ఆ దేవత యొక్క గొప్పతనము కూడా నశించి పోతుంది.”
ACT 19:28 ఈ మాటలు విన్న వాళ్ళకు చాలా ఉద్రేకం కలిగింది. వాళ్ళు బిగ్గరగా, “ఎఫెసు ప్రజల అర్తెమి దేవత గొప్పది!” అని నినాదం చెయ్యటం మొదలు పెట్టారు.
ACT 19:29 ఈ అలజడి ఆ పట్టణమంతా వ్యాపించి పోయింది. మాసిదోనియకు చెందిన “గాయియు, అరిస్తర్కు” అనే యిద్దరు వ్యక్తులు పౌలు వెంట ఉన్నారు. ప్రజలు వీళ్ళను బంధించి త్రోసుకొంటూ ఒక్క గుంపుగా పెద్ద నాటక శాలలోకి ప్రవేశించారు.
ACT 19:30 పౌలు ప్రజల ముందుకు రావాలనుకొన్నాడు. కాని అనుచరులతన్ని వెళ్ళనివ్వలేదు.
ACT 19:31 పౌలు స్నేహితులు కొందరు ఆ ప్రాంతాలకు పాలకులుగా ఉండే వాళ్ళు. నాటక శాలలోకి వెళ్ళ వద్దని వేడుకుంటూ వీళ్ళు పౌలుకు ఒక ఉత్తరం పంపారు.
ACT 19:32 ఆ సభ అంతా గందరగోళంగా ఉంది. కొందరు యిదని, కొందరు అదని బిగ్గరగా కేకలు వేసారు. కొందరికి తప్ప మిగతా వాళ్ళకెవ్వరికీ తామక్కడికి ఎందుకు వచ్చింది తెలియదు.
ACT 19:33 యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోసారు. కొందరు కేకలు వేస్తూ అతనికి ఏదో సలహా యిచ్చారు. అతడందర్నీ శాంతంగా ఉండుమని సంజ్ఞ చేసి సమాధానంగా ఏదో చెప్పబోయాడు.
ACT 19:34 అతడు కూడా ఒక యూదుడని తెలుసుకొన్నాక వాళ్ళంతా రెండు గంటల సేపు ఒకే గొంతుతో, “ఎఫెసు ప్రజల అర్తెమి దేవత చాలా గొప్పది” అని నినాదం చేసారు.
ACT 19:35 ఆ గ్రామాధికారి ప్రజల్ని శాంత పరుస్తూ యిలా అన్నాడు: “ఎఫెసు ప్రజలారా! మహా దేవత అర్తెమి యొక్క మందిరాన్ని, స్వర్గంనుండి పడిన శిలా విగ్రహాన్ని చూసుకొనే బాధ్యత ఎఫెసు పట్టణంపై ఉంది. ఇది ప్రపంచానికంతా తెలుసు.
ACT 19:36 దీన్ని ఎవరూ కాదనలేరు. కనుక మీరు ఆలోచించకుండా తొందర పడి ఏదీ చెయ్యకండి. శాంతంగా ఉండండి!
ACT 19:37 “వీళ్ళు మన మందిరాన్ని దోచుకోలేదు. మన దేవతను దూషించ లేదు. అయినా మీరు వీళ్ళనిక్కడికి పట్టుకొని వచ్చారు.
ACT 19:38 దేమేత్రికి లేక అతనితో కలిసి పని చేసే వాళ్ళకు వాళ్ళపై నేరం మోపాలని ఉంటే న్యాయస్థానాలు తెరిచి ఉన్నాయి. వాళ్ళ వాద వివాదాలు వినటానికి న్యాయాధిపతులున్నారు.
ACT 19:39 “మీరింకేదైనా చెప్పుకోవాలనుకొంటే చట్ట ప్రకారం జరిగే ప్రజా సమావేశాల్లో చెప్పుకోండి.
ACT 19:40 ఈనాడు జరిగిన సంఘటనవల్ల మనం తిరుగుబాటు చేసామని అధికారులు మనపై నేరం మోపే ప్రమాదం వుంది. అది జరిగితే ఈ అలజడికి ఏ కారణం లేదు కనుక మనం ఏ సమాధానమూ చెప్పలేము.”
ACT 19:41 ఇలా చెప్పి అందర్నీ అక్కడినుండి వెళ్ళమన్నాడు.
ACT 20:1 అల్లర్లు తగ్గిపొయ్యాక, పౌలు యేసు శిష్యుల్ని పిలిచాడు. వాళ్ళను ఆత్మీయంగా ప్రోత్సాహపరిచి, వాళ్ళనుండి సెలవు తీసుకొన్నాడు. ఆ తర్వాత మాసిదోనియకు వెళ్ళాడు.
ACT 20:2 ఆ ప్రాంతాన పర్యటన చేసి ఆత్మీయంగా ఉత్సాహపరిచే ఎన్నో విషయాలు ప్రజలకు చెప్పి చివరకు గ్రీసు దేశం చేరుకున్నాడు.
ACT 20:3 అక్కడ మూడు నెలలున్నాడు. అక్కడినుండి సిరియ దేశానికి ఓడలో ప్రయాణం చెయ్యాలనుకొని సిద్ధమయ్యాడు. ఇంతలో యూదులు తనను చంపాలని అనుకొంటున్నారని అతనికి తెలిసింది. అందువలన అతడు తిరిగి మాసిదోనియకు వెళ్ళి అక్కడినుండి ప్రయాణం చేసాడు.
ACT 20:4 అతని వెంట ఉన్నవాళ్ళు ఎవరనగా: బెరయ పట్టణంనుండి పుర్రు కుమారుడైన సోపత్రు, థెస్సలొనీక పట్టణం నుండి అరిస్తర్కు, సెకుందు, దెర్బే పట్టణం నుండి గాయియు, తిమోతి, ఆసియ నుండి తుకికును, త్రోఫిము.
ACT 20:5 వీళ్ళు ముందే వెళ్ళి మా కోసం త్రోయలో కాచుకొని ఉన్నారు.
ACT 20:6 కాని మేము ఫిలిప్పీనుండి ప్రత్యేకమైన పులియని రొట్టెల పండుగ తర్వాత ఓడలో ప్రయాణమయ్యాము. అయిదు రోజులు ప్రయాణం చేసాక త్రోయలో వాళ్ళను కలుసుకున్నాము. అక్కడ ఏడు రోజులు ఉన్నాము.
ACT 20:7 ఆదివారం రోజున అంతా కలిసి రొట్టె విరుచుటకు సమావేశమయ్యాము. పౌలు మరుసటి రోజు ప్రయాణం చేయాలని అనుకోవటం వలన అర్థరాత్రి దాకా ప్రజలతో మాట్లాడాడు.
ACT 20:8 మేము మేడపైనున్న గదిలో సమావేశమయ్యాము. మా గదిలో చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి.
ACT 20:9 ఆ గది కిటికీలో ఐతుకు అనే యువకుడు కూర్చొని ఉన్నాడు. పౌలు ఏకధాటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఐతుకుకు నిద్ర వచ్చి గాఢంగా నిద్రపొయ్యాడు. ఆ నిద్రలో మూడవ అంతస్తు నుండి క్రింద పడ్డాడు. కొంత మంది వచ్చి చనిపోయిన అతణ్ణి చూసారు.
ACT 20:10 పౌలు క్రిందికి వెళ్ళి ఆ యువకుని ప్రక్కన ఒరిగి అతణ్ణి తన చేతుల్తో ఎత్తి, “దిగులు పడకండి, ప్రాణం ఉంది” అని అన్నాడు.
ACT 20:11 అతడు మళ్ళీ మేడ మీదికి వెళ్ళి రొట్టె విరిచి సోదరులకు పంచి తాను తిన్నాడు. తెల్లవారే దాకా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపొయ్యాడు.
ACT 20:12 ప్రజలు బ్రతికింపబడిన ఆ యువకుణ్ణి అతని యింటికి పిలుచుకు వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ మనస్సులు ఎంతో నెమ్మది పడ్డాయి.
ACT 20:13 మేము పౌలును వదిలి ఓడనెక్కి “అస్సు”కు వెళ్ళాము. తాను కాలి నడకన అస్సుకు చేరుకొని మమ్మల్ని అక్కడ కలుసుకొంటానని చెప్పాడు. అక్కడి నుండి మాతో కలిసి ఓడలో ప్రయాణం చెయ్యాలని అతని ఉద్దేశ్యం.
ACT 20:14 మేము అతణ్ణి అస్సులో కలుసుకొన్నాక అతడు మా ఓడనెక్కాడు. అంతా కలిసి “మితులేనే” వెళ్ళాము.
ACT 20:15 మితులేనే నుండి మరుసటి రోజు ఓడలో మళ్ళీ ప్రయాణం సాగించి, “కీయొసు” ద్వీపం కొంత దూరం ఉందనగానే లంగరు వేసాము. ఆ మరుసటి రోజు ప్రయాణం చేసి “సమొసు” ద్వీపానికి దగ్గరగా వచ్చాము. మరొక రోజు ప్రయాణం చేసాక “మిలేతు” చేరుకున్నాము.
ACT 20:16 పౌలు యెరూషలేము త్వరగా వెళ్ళాలని అనుకొన్నాడు. ఆసియ ప్రాంతంలో కాలాన్ని వ్యర్థం చెయ్యటం యిష్టం లేక ఎఫెసులో ఆగకుండా వెళ్ళాడు. వీలైతే పెంతెకొస్తు పండుగనాటికి యెరూషలేంలో ఉండాలని అనుకొన్నాడు.
ACT 20:17 పౌలు కొందర్ని మిలేతునుండి ఎఫెసుకు పంపి అక్కడున్న సంఘ పెద్దల్ని పిలిపించాడు.
ACT 20:18 వాళ్ళు వచ్చాక వాళ్ళతో యిలా చెప్పాడు: “నేను ఆసియలో అడుగు పెట్టిన నాటినుండి మీతో ఉన్నన్ని రోజులు ఏ విధంగా జీవించానో మీకు తెలుసు.
ACT 20:19 యూదుల పన్నాగాలవల్ల నాకు ఎన్నో కష్టాలు, దుఃఖాలు సంభవించాయి. అయినా ప్రభువు సేవ సంపూర్ణమైన విశ్వాసంతో చేసాను.
ACT 20:20 ఆత్మీయ విషయాల్లో మీకు దోహదమయ్యే ప్రతీ విషయాన్ని దాచకుండా, బహిరంగంగా ప్రకటించటమే కాకుండా యింటింటికీ వెళ్ళి బోధించానని మీకు తెలుసు.
ACT 20:21 మారు మనస్సు పొంది, దేవుని కోసం జీవించుమని, మన యేసు ప్రభువును నమ్ముమని యూదులకు, గ్రీకులకు చెప్పాను.
ACT 20:22 “పరిశుద్ధాత్మ చెప్పినట్లు చెయ్యాలనే ఉద్దేశ్యంతో నేను యెరూషలేము వెళ్తున్నాను. అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు.
ACT 20:23 నేను కష్టాలు, కారాగారాలు ఎదుర్కొంటానని పరిశుద్ధాత్మ నన్ను ప్రతి పట్టణంలో ముందే వారించాడు. ఇది మాత్రం నాకు తెలుసు.
ACT 20:24 నా జీవితాన్ని నేను లెక్కచెయ్యను. కాని ఈ పరుగు పందెం ముగించి యేసు ప్రభువు చెప్పిన ఈ కార్యాన్ని పూర్తి చేస్తే చాలు. దేవుని అనుగ్రహాన్ని గురించి చెప్పే సువార్తను ప్రకటించటమే నా కర్తవ్యం.
ACT 20:25 “మళ్ళీమిమ్మల్ని చూడటం వీలు పడదని నాకు తెలుసు. నేను మీతో ఉండి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాను.
ACT 20:26 అందువల్ల ఈ రోజు నేనిది ఖచ్చితంగా చెప్పగలను. మీలో ఎవరైనా ఆత్మీయంగా మరణిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను.
ACT 20:27 ఎందుకంటే, నేను దేవుడు చెయ్యదలచిన దాన్ని సంపూర్ణంగా కొంచెం కూడా సంకోచించకుండా ప్రకటించాను.
ACT 20:28 పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంఘానికి కాపరులుగా నియమించాడు. ఆ దేవుని సంఘానికి మీరు గొఱ్ఱెల కాపరుల్లా ఉండాలి. ఆయన తన సంఘమును తన స్వంత రక్తంతో సంపాదించాడు. మీ విషయంలో, ఈ సంఘ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ACT 20:29 నేను వెళ్ళిపొయ్యాక భయంకరమైన తోడేళ్ళు మీ మందలోకి వచ్చి హాని కలిగిస్తాయని నాకు తెలుసు.
ACT 20:30 మీలో నుండి కూడా కొందరు ముందుకు వచ్చి మీతో ఉన్న అనుచరుల్ని దొంగిలించాలని అబద్ధాలాడుతారు.
ACT 20:31 అందుకే జాగ్రత్తగా ఉండండి. నేను మూడు సంవత్సరాలు మీతో ఉన్నాను. కంట తడి పెట్టుకొని రాత్రింబగళ్ళు మీలో ఉన్న ప్రతి ఒక్కర్నీ వారించాను. ఈ విషయం మరిచిపోకండి.
ACT 20:32 “ఇప్పుడు మిమ్మల్ని దేవునికి, ఆయన అనుగ్రహాన్ని గురించి బోధించే సందేశానికి అప్పగిస్తున్నాను. ఆ సందేశంలో మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచగల శక్తి ఉంది. అంతే కాక అది పరిశుద్ధమైన దేవుని విశ్వాసులకు లభించిన వారసత్వం మీక్కూడా లభించేటట్లు చేస్తుంది.
ACT 20:33 మీ నుండి నేను వెండి బంగారాలు కాని, మంచి దుస్తులు కాని ఆశించ లేదు.
ACT 20:34 నేను నా చేతుల్తో పని చేసి, నా అవసరాలు, నాతో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చుకొన్నానని మీకు తెలుసు.
ACT 20:35 కష్టించి పని చేసి దిక్కులేని వాళ్ళకు సహాయం చెయ్యటం ఉత్తమమని మీకు అన్ని విధాలా తెలియ చేసాను. యేసు ప్రభువు, ‘తీసుకోవటంలో కన్నా యివ్వటంలో చాలా దీవెన ఉంది!’ అని అన్నాడు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవటం అవసరమని మీకు రుజువు చేసాను.”
ACT 20:36 ఈ విధంగా చెప్పి, అతడు తన మోకాళ్ళూని అందరితో కలిసి ప్రార్థించాడు.
ACT 20:37 ఆ తర్వాత అందరూ కంట తడిపెట్టుకొని అతనికి ప్రేమతో వీడ్కోలు యిచ్చారు.
ACT 20:38 “మిమ్మల్ని మళ్ళీ చూడటం వీలుపడదు” అని అతడన్న మాటలు వాళ్ళకు చాలా దుఃఖం కలిగించాయి. ఆ తదుపరి వాళ్ళతనితో ఓడవరకు వెళ్ళారు.
ACT 21:1 మేము సెలవు పుచ్చుకొని నేరుగా “కోసు”కు ఓడలో ప్రయాణం చేసాము. మరుసటి రోజు “రొదు” చేరుకున్నాము. అక్కడినుండి బయలుదేరి “పతర” చేరుకున్నాము.
ACT 21:2 ఒక ఓడ ఫొనీషియ వెళ్ళటం గమనించి అందులో ప్రయాణం చేసాము.
ACT 21:3 సైప్రసు ద్వీపం కనపడ్డాక ఆ ద్వీపానికి దక్షిణంగా వెళ్ళి సిరియ దేశం చేరుకున్నాం. మా ఓడ సరుకు దింపవలసి ఉంది కనుక తూరు ద్వీపంలో ఆగాము.
ACT 21:4 అక్కడ భక్తులుండటం గమనించి వాళ్ళతో ఏడు రోజులున్నాము. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యెరూషలేము వెళ్ళవద్దని పౌలుతో చెప్పారు. కాని వెళ్ళవలసిన సమయం రాగానే ప్రయాణమై మా దారిన మేము వెళ్ళాము.
ACT 21:5 విశ్వాసులు, తమ భార్యా బిడ్డలతో కలిసి మా వెంట ఊరి అవతలి వరకు వచ్చారు. సముద్ర తీరం చేరుకున్నాక, అందరమూ మోకరిల్లి ప్రార్థించాము.
ACT 21:6 పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నాక మేము ఓడనెక్కాము. వాళ్ళు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్ళిపోయారు.
ACT 21:7 మేము తూరు నుండి మా ప్రయాణం సాగించి తొలేమాయి తీరం చేరుకున్నాము. అక్కడున్న సోదరుల్ని కలుసుకొని వాళ్ళతో ఒక రోజు గడిపాము.
ACT 21:8 మరుసటి రోజు ప్రయాణమై కైసరియ చేరుకున్నాము. అక్కడ సువార్త ప్రచారం చేస్తున్న ఫిలిప్పు అనే వ్యక్తి యింట్లో బసచేసాము. అతడు యెరూషలేములో ఎన్నుకోబడ్డ ఏడుగురిలో ఒకడు.
ACT 21:9 అతనికి నలుగురు పెళ్ళికాని కూతుర్లు ఉన్నారు. వాళ్ళు దైవేచ్ఛను చెప్పటంలో ప్రతిభావంతులు.
ACT 21:10 అక్కడ మేము చాలా రోజులున్నాక, అగబు అనే ప్రవక్త యూదయ నుండి వచ్చాడు.
ACT 21:11 అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు నడికట్టు తీసుకొని దాంతో తన కాళ్ళు చేతులు కట్టివేసుకొని ఈ విధంగా అన్నాడు: “ఈ నడికట్టు ఎవరిదో, అతణ్ణి యెరూషలేములో యూదులు ఈ విధంగా కట్టేసి యూదులు కాని వాళ్ళకు అప్పగిస్తారు అని పరిశుద్ధాత్మ చెపుతున్నాడు.”
ACT 21:12 ఇది విని అక్కడి ప్రజలు, మేము కలిసి పౌలును యెరూషలేము వెళ్ళవద్దని బ్రతిమిలాడాము.
ACT 21:13 పౌలు, “మీరు దుఃఖించి నా గుండెలెందుకు పగులగొడ్తున్నారు? యేసు ప్రభువు పేరిట బంధింపబడటానికే కాదు, మరణించటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను!” అని సమాధానం చెప్పాడు.
ACT 21:14 మేము అతని మనస్సు మార్చలేమని తెలుసుకొన్నాక, “ప్రభువు ఇచ్ఛ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది,” అనుకొని మేమేమీ మాట్లాడలేదు.
ACT 21:15 ఆ తర్వాత అంతా సిద్ధమై యెరూషలేము వెళ్ళాము.
ACT 21:16 కైసరియ నుండి కొందరు శిష్యులు మా వెంట వచ్చి మమ్మల్ని “మ్నాసోను” అనే అతని యింటికి పిలుచుకు వెళ్ళారు. అక్కడ మా బస, మ్నాసోను, సైప్రసు ద్వీపానికి చెందినవాడు. మొదట్లో విశ్వాసులైన వాళ్ళలో ఇతడు ఒకడు.
ACT 21:17 మేము యెరూషలేము వచ్చాము. అక్కడి సోదరులు మాకు మనసారా స్వాగతమిచ్చారు.
ACT 21:18 మరుసటి రోజు మేము పౌలుతో కలిసి యాకోబును చూడాలని వెళ్ళాము. అక్కడ సంఘ పెద్దలందరూ ఉన్నారు.
ACT 21:19 పౌలు వాళ్ళను కుశల ప్రశ్నలు అడిగి తాను చేసిన కార్యాల వల్ల దేవుడు యూదులు కాని వాళ్ళతో చేసిన వాటినన్నిటిని ఒక్కొక్కటి విడమరిచి చెప్పాడు.
ACT 21:20 వాళ్ళా మాటలు విని దేవుణ్ణి స్తుతించారు. ఆ తర్వాత పౌలుతో, “సోదరుడా! వేలకొలది యూదులు విశ్వాసులవటం నీవు చూస్తున్నావు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించటం ముఖ్యమని వాళ్ళ అభిప్రాయం.
ACT 21:21 కాని నీవు మోషే ధర్మశాస్త్రాన్ని వదులమని, కుమారులకు సున్నతి చేయించటం తప్పని యూదుల ఆచారాలను పాటించవద్దని యూదులు కాని వాళ్ళ మధ్య నివసిస్తున్న యూదులకు బోధించినట్లు వీళ్ళకు ఎవరో చెప్పారు.
ACT 21:22 “ఏం చెయ్యాలి? నీవు వచ్చిన విషయం వాళ్ళకు తప్పక తెలుస్తుంది.
ACT 21:23 అందువల్ల మేము చెప్పినట్లు చెయ్యి. మా దగ్గర మ్రొక్కుబడి ఉన్న వాళ్ళు నలుగురున్నారు.
ACT 21:24 వీళ్ళను నీ వెంట పిలుచుకెళ్ళు. వాళ్ళతో కలిసి శుద్ధీకరణ చేయి. వాళ్ళు తల వెంట్రుకలు తీయించుకోవటానికి అయ్యే డబ్బు చెల్లించు. అలా చేస్తే నీ గురించి విన్నవి నిజం కాదని అందరికీ రుజువౌతుంది. మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవిస్తున్నావని వాళ్ళకు తెలుస్తుంది.
ACT 21:25 “ఇక యూదులు కాని భక్తుల విషయంలో మేమిదివరకే మా అభిప్రాయం తెలియచేసాము. వాళ్ళు ఈ నియమాన్ని మాత్రం పాటిస్తే చాలని ఇదివరకే వాళ్ళకు వ్రాసి పంపాము: ‘విగ్రహాలకు పెట్టిన నైవేద్యం ముట్టరాదు. రక్తాన్ని, గొంతునులిపి చంపిన జంతువుల మాంసాన్ని తినరాదు. పరస్త్రీని కోరరాదు’” అని అన్నారు.
ACT 21:26 మరుసటి రోజు పౌలు వాళ్ళను పిలుచుకెళ్ళి వాళ్ళతో సహా శుద్ధి చేసుకొన్నాడు. ఆ తదుపరి యెరూషలేము మందిరానికి వెళ్ళి పూర్తిగా శుద్ధి కావటానికి ఎన్ని రోజులు వేచివుండాలో ప్రకటించాడు. చివరి రోజున తనతో వచ్చిన ప్రతి ఒక్కరి పక్షాన బలి ఇవ్వవచ్చని చెప్పాడు.
ACT 21:27 ఏడు రోజులు పూర్తిగా గడవక ముందే ఆసియ ప్రాంతం నుండి వచ్చిన కొందరు యూదులు పౌలును మందిరంలో చూసారు. వాళ్ళు ప్రజల్ని పురికొలిపి పౌలును బంధించారు. ప్రజలతో, “ఇశ్రాయేలు ప్రజలారా! మాతో సహకరించండి. ఇతడు అన్ని ప్రాంతాలు తిరిగి ఇశ్రాయేలు ప్రజల్ని గురించి, మోషే ధర్మశాస్త్రాన్ని గురించి యెరూషలేములోని మందిరాన్ని గురించి విరుద్ధంగా అందరికీ బోధించాడు. ఇప్పుడు గ్రీకుల్ని కొందర్ని మందిరంలోకి పిలుచుకొని వెళ్ళి, ఈ పవిత్ర స్థానాన్ని అపవిత్రం చేసాడు” అని బిగ్గరగా అన్నారు.
ACT 21:29 ప్రజలు ఎఫెసుకు చెందిన త్రోఫిమును పౌలుతో కలిసి పట్టణంలో తిరగటం చూసారు. కనుక పౌలు అతణ్ణి మందిరంలోకి పిలుచుకెళ్ళాడనుకున్నారు.
ACT 21:30 పట్టణమంతా అల్లర్లు వ్యాపించాయి. ప్రజలు అన్ని వైపులనుండి పరుగెత్తికొంటూ వచ్చారు. పౌలును పట్టుకొని మందిరం అవతలికి లాగి వెంటనే మందిరం యొక్క తలుపులు మూసి వేసారు.
ACT 21:31 వాళ్ళు, అతణ్ణి చంపే ప్రయత్నంలో ఉన్నారు. యెరూషలేమంతా అల్లర్లతో నిండిపోయిందనే వార్త సైన్యాధిపతికి పంపబడింది.
ACT 21:32 ఆ సైన్యాధిపతి వెంటనే, కొందరు సైనికుల్ని, సైన్యాధిపతుల్ని తన వెంట బెట్టుకొని ప్రజలు గుమి కూడిన చోటికి వెళ్ళాడు. వాళ్ళు సైన్యాధిపతిని, సైనికుల్ని చూసి, పౌలును కొట్టడం మానివేసారు.
ACT 21:33 సైన్యాధిపతి అతని దగ్గరకు వెళ్ళి, అతణ్ణి పట్టుకొని యినుప గొలుసులతో కట్టి వేయుమని ఆజ్ఞాపిస్తూ సైనికులకు అప్పగించాడు. “అతడెవరు? ఏం చేసాడు?” అని తదుపరి ప్రజల్ని విచారించాడు.
ACT 21:34 ప్రజలు బిగ్గరగా కేకలు వేస్తూ, ఒకరొకటి, మరొకరు మరొకటి చెప్పారు. అల్లరిగా ఉండటం వల్ల సైన్యాధిపతికి జరిగిందేమిటో తెలియలేదు. పౌలును కోటలోకి తీసుకు వెళ్ళుమని ఆజ్ఞాపించాడు.
ACT 21:35 పౌలు మెట్లు ఎక్కుతుండగా ప్రజలు అల్లరి చేసారు. అందువల్ల సైనికులు పౌలును మోసికొని కోటలోకి తీసుకు వెళ్ళారు.
ACT 21:36 ప్రజలు అతణ్ణి వెంటాడుతూ, “అతణ్ణి చంపాలి!” అని బిగ్గరగా నినాదం చేసారు.
ACT 21:37 సైనికులు పౌలును కోటలోకి తీసుకు వెళ్ళే ముందు, అతడు సైన్యాధిపతితో, “నేను మీతో కొద్దిగా మాట్లాడవచ్చా?” అని అడిగాడు. సైన్యాధిపతి, “నీవు గ్రీకు భాష మాట్లాడుతున్నావే!
ACT 21:38 క్రితంలో ప్రభుత్వాన్ని ధిక్కరించి నాలుగు వేల మంది హంతకుల్ని ఎడారుల్లోకి పిలుచుకు వెళ్ళిన ఈజిప్టు దేశపువాడవు నీవే కదూ?” అని అడిగాడు.
ACT 21:39 పౌలు, “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని తార్సు అనే ముఖ్య పట్టణానికి చెందిన పౌరుణ్ణి. నన్ను ప్రజలతో మాట్లాడనివ్వండి!” అని అడిగాడు.
ACT 21:40 సైన్యాధిపతి సరేనన్నాడు. పౌలు మెట్ల మీద నిలబడి చేతులెత్తి శాంతించమని ప్రజల్ని కోరాడు. అందరూ శాంతించాక “హెబ్రీ” భాషలో ఈ విధంగా మాట్లాడాడు:
ACT 22:1 “పెద్దలారా! సోదరులారా! నా సమాధానం వినండి,”
ACT 22:2 అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం విని వాళ్ళు మరింత నిశ్శబ్దం వహించారు.
ACT 22:3 పౌలు ఈ విధంగా చెప్పుకొంటూ పొయ్యాడు: “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని తార్సు అనే పట్టణంలో జన్మించాను. ఈ పట్టణంలో పెరిగాను. మన పూర్వులు అప్పగించిన ధర్మశాస్త్రంలో గమలీయేలు వద్ద సంపూర్ణంగా శిక్షణ పొందాను. మీరు ఈనాడు దేవుని పట్ల ఏ పద్ధతిననుసరించి మీ భక్తిని ప్రదర్శిస్తున్నారో అదే పద్ధతిలో నేనూ ప్రదర్శిస్తూ ఉండేవాణ్ణి.
ACT 22:4 నేను యేసు మార్గాన్ని అనుసరించిన వాళ్ళను ఎన్నో హింసలు పెట్టాను. తద్వారా కొందరికి మరణం కూడా సంభవించింది. ఆడా, మగా అనే భేదం లేకండా అందర్ని బంధించి కారాగారంలో వేసేవాణ్ణి.
ACT 22:5 “ప్రధాన యాజకుడు, మహా సభకు చెందిన పెద్దలు దీనికి సాక్ష్యం. వాళ్ళను, డెమాస్కసులోని వాళ్ళ సోదరులకు ఉత్తరాలు వ్రాసి ఇవ్వమని అడిగి తీసుకొన్నాను. అక్కడికి వెళ్ళి యేసు మార్గాన్ని అనుసరిస్తున్న వాళ్ళను బంధించి యెరూషలేమునకు పట్టుకు వచ్చి వాళ్ళకు శిక్ష ఇవ్వాలనేదే నా ఉద్దేశ్యం.
ACT 22:6 “నేను డెమాస్కసుకు వెళ్ళినప్పుడు, ఆ పట్టణపు పొలిమేరలకు చేరగానే అకస్మాత్తుగా ఆకాశం నుండి తేజోవంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు.
ACT 22:7 నేను నేల కూలిపొయ్యాను. నాతో ఒక స్వరం, ‘సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు!’ అని అడిగింది.
ACT 22:8 “‘మీరెవరు ప్రభూ!’ అని నేనడిగాను. ‘నేను నజరేతుకు చెందిన యేసును. నీవు హింసిస్తున్నది నన్నే!’ అని ఆ స్వరం జవాబు చెప్పింది.
ACT 22:9 నాతో ఉన్నవాళ్ళు ఆ వెలుగును చూసారు. కాని ఆ స్వరం ఏం మాట్లాడుతోందో వాళ్ళకు అర్థం కాలేదు.
ACT 22:10 “‘నన్నేం చేయమంటారు ప్రభూ!’ అని నేనడిగాను. ‘లే! లేచి డెమాస్కసు వెళ్ళు. అక్కడికి వెళ్ళాక నీవు చేయవలసిన పనులు చెప్పబడుతాయి’ అని ప్రభువు అన్నాడు.
ACT 22:11 ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చెయ్యటం వల్ల నాతో ఉన్న వాళ్ళు నన్ను నా చేయి పట్టుకొని డెమాస్కసుకు నడిపించుకు వెళ్ళారు.
ACT 22:12 “అననీయ అనే పేరుగల వ్యక్తి నన్ను చూడటానికి వచ్చాడు. అతడు మోషే ధర్మశాస్త్రాన్ని శ్రద్ధతో పాటించే విశ్వాసి. అక్కడ నివసిస్తున్న యూదులందరు అతణ్ణి గౌరవించేవాళ్ళు. అననీయ నా ప్రక్కన నిల్చొని
ACT 22:13 ‘సౌలా! నా సోదరా! నీకు దృష్టి కలుగుగాక!’ అని అన్నాడు. తక్షణం నేను చూడగలిగాను.
ACT 22:14 “ఆ తదుపరి అతడు, ‘మన పూర్వీకులు పూజించిన దేవుడు, తాను చేయదలచిన విషయం తెలుపటానికి, నీతిమంతుడైనటువంటి తన సేవకుణ్ణి చూడటానికి, ఆయన నోటిమాటలు వినటానికి, నిన్ను ఎన్నుకొన్నాడు.
ACT 22:15 నీవు చూసిన వాటిని గురించి, విన్న వాటిని గురించి ఆయన పక్షాన అందరి ముందు సాక్ష్యం చెబుతావు.
ACT 22:16 ఇంకా ఎందుకు చూస్తున్నావు? లే! బాప్తిస్మము పొందు. ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడుక్కో!’ అని అన్నాడు.
ACT 22:17 “నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి మందిరంలో ప్రార్థనలు చేస్తుండగా నాకు దర్శనం కలిగింది.
ACT 22:18 ఆ దర్శనంలో ప్రభువు, ‘త్వరగా లే! వెంటనే యెరూషలేము వదిలి వెళ్ళిపో! నా గురించి నీవు చెప్పే సత్యాన్ని వాళ్ళు అంగీకరించరు’ అని అనటం విన్నాను.
ACT 22:19 “నేను, ‘ప్రభూ! నేను ప్రతి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి భక్తుల్ని బంధించి శిక్షించిన విషయం అందరికీ తెలుసు.
ACT 22:20 నీ సాక్షి స్తెఫను తన రక్తాన్ని చిందించినప్పుడు నేను నా అంగీకారం చూపుతూ, అతణ్ణి చంపుతున్న వాళ్ళ దుస్తుల్ని కాపలా కాస్తూ అక్కడే నిలుచొని ఉన్నాను’ అని అన్నాను.
ACT 22:21 “అప్పుడు ప్రభువు నాతో, ‘వెళ్ళు! నిన్ను దూరంగా యూదులు కాని వాళ్ళ దగ్గరకు పంపుతాను’ అని అన్నాడు.”
ACT 22:22 ప్రజలు, పౌలు చెప్పింది అంతదాకా విన్నారు. కాని అతడు ఈ మాట అనగానే, బిగ్గరగా, “అతడు బ్రతకటానికి వీల్లేదు, చంపి పారవేయండి!” అని కేకలు వేసారు.
ACT 22:23 వాళ్ళు తమ దుస్తుల్ని చింపి పారవేస్తూ, దుమ్ము రేపుతూ కేకలు వేసారు.
ACT 22:24 సేనాధిపతి పౌలును కోట లోపలికి తీసుకు వెళ్ళుమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అతణ్ణి చూసి ఎందుకిలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవటానికి పౌలును కొరడాలతో కొట్టుమని ఆజ్ఞాపించాడు.
ACT 22:25 అతణ్ణి కొట్టటానికి కట్టి వేస్తుండగా పౌలు అక్కడున్న శతాధిపతి, “నేరస్తుడని నిర్ణయం కాకముందే రోము పౌరుణ్ణి కొరడా దెబ్బలు కొట్టటం న్యాయమేనా?” అని అడిగాడు.
ACT 22:26 ఇది విన్నాక ఆ సేనాధిపతి, సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి పౌలు అన్నది చెబుతూ, “మీరేమి చేస్తున్నారో మీకు తెలుసా? అతడు రోము పౌరుడట!” అని అన్నాడు.
ACT 22:27 ఆ సహస్రాధిపతి పౌలు దగ్గరకు వెళ్ళి, “ఇప్పుడు చెప్పు! నీవు రోము పౌరుడివా?” అని అడిగాడు. “ఔను!” పౌలు సమాధానం చెప్పాడు.
ACT 22:28 సహస్రాధిపతి, “నేను రోము పౌరుడవటానికి చాలా డబ్బు యివ్వవలసి వచ్చింది” అని అన్నాడు. పౌలు, “నేను పుట్టినప్పటి నుండి రోము పౌరుణ్ణి!” అని అన్నాడు.
ACT 22:29 అతణ్ణి ప్రశ్నలడగాలనుకొన్న వాళ్ళు తక్షణమే వెనుకంజ వేసారు. ఆ సహస్రాధిపతి కూడా తాను రోము పౌరుణ్ణి బంధించిన విషయం గమనించి భయపడిపోయాడు.
ACT 22:30 అతడు పౌలుపై యూదులు మోపిన నిందకు సరియైన కారణం తెలుసుకోవాలనుకొన్నాడు. కనుక మరుసటి రోజు ప్రధాన యాజకుల్ని, మిగతా సభ్యుల్ని సమావేశం కమ్మని ఆజ్ఞాపించాడు. పౌలును విడుదల చేసి వాళ్ళ ఎదుటకు పిలుచుకు వెళ్ళాడు.
ACT 23:1 పౌలు మహాసభ వైపు సూటిగా చూసి, “సోదరులారా! నేను ఈనాటి వరకు నిష్కల్మషంగా జీవించాను. దీనికి దేవుడే సాక్షి” అని అన్నాడు.
ACT 23:2 ఈ మాటలు అనగానే ప్రధాన యాజకుడైన అననీయ, పౌలు ప్రక్కన నిలుచున్న వాళ్ళతో, “అతని మూతి మీద కొట్టి నోరు మూయించండి” అని ఆజ్ఞాపించాడు.
ACT 23:3 అప్పుడు పౌలు అతనితో, “దేవుడు నీ నోరు మూయిస్తాడు. నీవు సున్నం కొట్టిన గోడవి. ధర్మశాస్త్రం ప్రకారం నా మీద తీర్పు చెప్పటానికి నీవక్కడ కూర్చున్నావు. కాని నన్ను కొట్టుమని ఆజ్ఞాపించి నీవా ధర్మశాస్త్రాన్నే ఉల్లంఘిస్తున్నావు” అని అన్నాడు.
ACT 23:4 పౌలు ప్రక్కన నిలుచున్న వాళ్ళు, “దేవుని ప్రధాన యాజకుని అవమానించటానికి నీకెంత ధైర్యం?” అని అన్నారు.
ACT 23:5 అందుకు పౌలు, “సోదరులారా! ప్రధాన యాజకుడని నాకు తెలియదు. మన లేఖనాల్లో యిలా వ్రాయబడివుంది, ‘ప్రజానాయకుల్ని గురించి చెడుగా మాట్లాడరాదు.’”
ACT 23:6 పౌలుకు వాళ్ళలో కొందరు సద్దూకయ్యులని, మరి కొందరు పరిసయ్యులని తెలుసు. అందువల్ల అతడు ఆ మహాసభలో బిగ్గరగా, “సోదరులారా! నేను పరిసయ్యుణ్ణి. నా తండ్రి పరిసయ్యుడు. నేను యిక్కడ నిందితునిగా నిలుచోవటానికి కారణం చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తారన్నదే నాలోని ఆశ” అని అన్నాడు.
ACT 23:7 అతడీ మాట అనగానే, సద్దూకయ్యులకు, పరిసయ్యులకు సంఘర్షణ జరిగి వాళ్ళు రెండు భాగాలుగా చీలిపోయారు.
ACT 23:8 సద్దుకయ్యులు మనుష్యులు బ్రతికి రారని, దేవదూతలు, ఆత్మలు అనేవి లేవని వాదిస్తారు. కాని పరిసయ్యులు యివి ఉన్నాయి అంటారు.
ACT 23:9 సభలో పెద్ద అలజడి మొదలైంది. పరిసయ్యులకు సంబంధించిన కొందరు పండితులు లేచి బిగ్గరగా వాదిస్తూ, “యితనిలో మాకే తప్పు కనిపించలేదు. దేవదూతో లేక ఆత్మో అతనితో మాట్లాడి ఉండవచ్చు!” అని అన్నారు.
ACT 23:10 సంఘర్షణ చాలా తీవ్రంగా మారిపోయింది. ఆ రెండు గుంపులు కలిసి, పౌలును చీల్చివేస్తారేమోనని సహస్రాధిపతి భయపడిపొయ్యాడు. అతడు తన సైనికులతో, “వెళ్ళండి! అతణ్ణి వాళ్ళనుండి విడిపించుకొచ్చి కోట లోపలికి తీసుకెళ్ళండి” అని ఆజ్ఞాపించాడు.
ACT 23:11 ఆ రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలుచొని, “ధైర్యంగా ఉండి, నా గురించి నీవు యెరూషలేములో బోధించిన విధంగా రోములో కూడా బోధించాలి” అని అన్నాడు.
ACT 23:12 మరుసటి రోజు యూదులు ఒక కుట్ర పన్నారు. పైగా, పౌలును చంపేవరకు అన్నపానాలు ముట్టరాదని వాళ్ళందరూ ఒక ప్రమాణం తీసుకున్నారు.
ACT 23:13 నలభై మంది కంటే ఎక్కువే ఈ కుట్రలో పాల్గొన్నారు.
ACT 23:14 వాళ్ళు ప్రధాన యాజకుల దగ్గరకు, పెద్దల దగ్గరకు వెళ్ళి, “మేము పౌలును చంపే వరకు అన్నపానాలు ముట్టరాదని ప్రమాణం తీసుకున్నాం.
ACT 23:15 కనుక మీరు మహాసభ పక్షాన అతణ్ణి గురించి, ‘మేము యింకా విశదంగా తెలుసుకోవాలనుకొంటున్నాము’ అని అబద్ధాలు చెప్పి, ఆ సాకుతో పౌలును పంపుమని సహస్రాధిపతిని అడగండి. అతడు ఇక్కడికి చేరకముందే అతణ్ణి చంపటానికి మేము సిద్ధంగా ఉంటాము” అని అన్నారు.
ACT 23:16 పౌలు మేనల్లుడు ఈ కుట్రను గూర్చి విని కోటలోకి వెళ్ళి పౌలుతో చెప్పాడు.
ACT 23:17 పౌలు శతాధిపతిని పిలిచి, “ఈ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళు. అతనికి యితడు చెప్పవలసిన విషయం ఒకటుంది” అని అన్నాడు.
ACT 23:18 శతాధిపతి ఆ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళి, “చెరసాలలో ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి మీ దగ్గరకు పిలుచుకెళ్ళమన్నాడు. ఇతడు మీకొక విషయం చెప్పదలిచాడు!” అని అన్నాడు.
ACT 23:19 సహస్రాధిపతి ఆ యువకుని చేయి పట్టుకొని ప్రక్కకు తీసుకెళ్ళి, “నాకేం చెప్పాలనుకొన్నావు?” అని అడిగాడు.
ACT 23:20 ఆ యువకుడు, “పౌలును గురించి యింకా విశదంగా తెలుసుకోవాలనే సాకుతో యూదులందరూ కలిసి, పౌలును రేపు మహాసభకు పిలుచుకు రమ్మని మీకు విజ్ఞాపన చెయ్యాలనుకొంటున్నారు.
ACT 23:21 వాళ్ళ విజ్ఞాపనను అంగీకరించకండి. నలభై కంటే ఎక్కువ మంది పౌలును పట్టుకోవటానికి కాచుకొని ఉన్నారు. అతణ్ణి చంపే దాకా అన్నపానీయాలు ముట్టమని ప్రమాణం తీసుకున్నారు” అని అన్నాడు.
ACT 23:22 సహస్రాధిపతి యువకుణ్ణి వెళ్ళుమని చెబుతూ, తనకీవిషయం చెప్పినట్టు ఎవ్వరికీ చెప్పవద్దని జాగ్రత్త పరిచాడు.
ACT 23:23 తదుపరి తన శతాధిపతుల్ని యిద్దర్ని పిలిచి, “రెండు వందల సైనికుల్ని, డెబ్బైమంది గుఱ్ఱపు రౌతుల్ని, బళ్ళేలు ఉపయోగించే రెండు వందల సైనికుల్ని మీ వెంట తీసుకొని ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరియకు వెళ్ళండి.
ACT 23:24 పౌలుకు గుర్రాన్నిచ్చి రాష్ట్రాధిపతియైన ఫేలిక్సు దగ్గరకు క్షేమంగా పంపండి” అని ఆజ్ఞాపించాడు.
ACT 23:25 సహస్రాధిపతి యిలా ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చాడు:
ACT 23:26 గౌరవనీయులైన ఫేలిక్సు రాష్ట్రాధిపతికి, క్లౌదియ లూసియ అభివందనాలు చెప్పి వ్రాయునది,
ACT 23:27 ఇతణ్ణి యూదులు పట్టుకొని చంపబొయ్యారు. కాని, నేను యితడు రోము పౌరుడు అని తెలుసుకొని నా దళాలతో వెళ్ళి అతణ్ణి రక్షించాను.
ACT 23:28 వాళ్ళెందుకు అతణ్ణి అపరాధి అంటున్నారో తెలుసుకోవాలని అతణ్ణి వాళ్ళ మహాసభకు పిలుచుకు వెళ్ళాను.
ACT 23:29 వాళ్ళు, తమ ధర్మశాస్త్రం విషయంలో యితణ్ణి అపరాధి అంటున్నారని నాకు తెలిసింది. కారాగారంలో ఉంచవలసిన నేరం కాని, మరణదండన వేయవలసిన నేరం కాని ఇతడు చేయలేదు.
ACT 23:30 వాళ్ళు ఇతణ్ణి చంపటానికి కుట్ర పన్నుతున్నారని తెలిసింది. అందువలన వెంటనే మీ దగ్గరకు పంపుతున్నాను. ఇతనిపై నేరారోపణ చేసిన వాళ్ళతో ఆ నేరారోపణ మీ సమక్షంలో చెయ్యవచ్చని చెప్పాను.
ACT 23:31 సహస్రాధిపతి ఆజ్ఞాపించినట్లు సైనికులు పౌలును రాత్రి వేళ తమతో పిలుచుకు వెళ్ళి అంతిపత్రికి చేరుకున్నారు.
ACT 23:32 మరుసటి రోజు రౌతుల్ని పౌలు వెంట పంపి, సైనికులు కోటకు తిరిగి వచ్చారు.
ACT 23:33 పౌలుతో వెళ్ళిన వాళ్ళు కైసరియ చేరుకొని ఆ ఉత్తరాన్ని, పౌలును, రాష్ట్రాధిపతికి అప్పగించారు.
ACT 23:34 రాష్ట్రాధిపతి ఆ ఉత్తరాన్ని చదివి, “నీవు ఏ ప్రాంతం వాడవు?” అని పౌలును అడిగాడు. అతడు కిలికియ వాడని తెలుసుకొని,
ACT 23:35 “నీపై నేరారోపణ చేసిన వాళ్ళు యిక్కడికి వచ్చాక నీ విషయం విచారిస్తాను” అని అన్నాడు. ఆ తర్వాత పౌలును హేరోదు భవనంలో ఉంచి కాపలా కాయుమని భటులతో చెప్పాడు.
ACT 24:1 అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయ, కొంతమంది పెద్దలతో, తెర్తుల్లు అనబడే న్యాయవాదితో కలిసి కైసరియ చేరుకున్నాడు. పౌలు పట్ల తాము చేయదలచిన నేరారోపణల్ని రాష్ట్రాధిపతి ముందు ఉంచాడు.
ACT 24:2 తెర్తుల్లు తన వాదనను ప్రారంభిస్తూ, “మీ పాలనలో చాలాకాలం శాంతంగా జీవించాము. ఇది మా అదృష్టం. మీ ముందు చూపువల్ల ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి.
ACT 24:3 “మహా ఘనత పొందిన ఫేలిక్సు ప్రభూ! మీరు చేసిన వాటిని అన్ని ప్రాంతాల్లో ఉన్న మా ప్రజలు, ఎంతో కృతజ్ఞతతో, సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు.
ACT 24:4 మిమ్మల్ని ఎక్కువగా విసిగించటం మాకు ఇష్టం లేదు. కనుక క్లుప్తంగా చెపుతాము. మేము చెప్పేది మాపై దయవుంచి వినుమని విజ్ఞప్తి చేస్తున్నాము.
ACT 24:5 ఇతడు సమస్యలు, కష్టాలు కలిగిస్తాడని మాకు తెలిసింది. ప్రపంచంలో ఉన్న యూదులందరిలో ఇతడు అల్లర్లు లేపాడు. ఇతడు కుట్రలు పన్నే నజరేతు జాతికి నాయకుడు.
ACT 24:6 ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చెయ్యటానికి ప్రయత్నించాడు.
ACT 24:7 
ACT 24:8 మీరితణ్ణి విచారిస్తే మేము చేసిన ఆరోపణల యొక్క నిజానిజాలు మీకే తెలుస్తాయి” అని అన్నాడు.
ACT 24:9 న్యాయస్థానంలో యూదులందరూ ఈ ఆరోపణలు నిజమని చెబుతూ, తెర్తుల్లు వాదనను బలపరిచారు.
ACT 24:10 రాష్ట్రాధిపతి పౌలును మాట్లాడుమని సంజ్ఞ చేసాడు. పౌలు ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు: “మీరు ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నారు. అందువల్ల నేను ఆనందంగా నా నిర్దోషత్వం నిరూపిస్తాను.
ACT 24:11 నేను ఆరాధించటానికి యెరూషలేము వెళ్ళి యింకా పన్నెండు రోజులు కాలేదు. నేను చెబుతున్న దానిలోని నిజానిజాలు మీరు సులభంగా విచారించవచ్చు.
ACT 24:12 నాపై నేరారోపణ చేసిన వీళ్ళు నేను మందిరంలో వాదిస్తుండగా చూసారా? లేదు. సమాజమందిరంలో కాని పట్టణంలో మరెక్కడైనా కాని, నేను ప్రజల్ని పురికొల్పటం వీళ్ళు చూసారా? లేదు.
ACT 24:13 వీళ్ళు ప్రస్తుతం నాపై మోపుతున్న నేరాల్ని నిరూపించలేరు.
ACT 24:14 “వాళ్ళు, దేన్ని వేరొక జాతిగా పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పుకుంటాను. ఈ మార్గాన్ననుసరించి నేను మా పూర్వీకుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పైగా, ధర్మశాస్త్రంలో వ్రాయబడినవాటిని, మన ప్రవక్తలు వ్రాసిన వాటిని, నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను.
ACT 24:15 వాళ్ళలాగే నాకూ దేవుడంటే నమ్మకం ఉంది. వాళ్ళలాగే, సన్మార్గుడు, దుర్మార్గుడు బ్రతికి వస్తారని నేను ఎదురు చూస్తున్నాను.
ACT 24:16 అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి ఎప్పుడూ మనసారా ప్రయత్నిస్తున్నాను.
ACT 24:17 “పేద వాళ్ళకు డబ్బు దానం చెయ్యాలని, దేవునికి కానుకలివ్వాలని ఎన్నో ఏండ్ల తర్వాత నేను యెరూషలేముకు వచ్చాను.
ACT 24:18 నేనీ కార్యాలు మందిరావరణంలో చేస్తుండగా వాళ్ళు చూసారు. నేను శాస్త్రయుక్తంగా శుభ్రమయ్యాను. నా వెంట ప్రజా సమూహం లేదు. నేను ఏ అల్లర్లు మొదలు పెట్టలేదు.
ACT 24:19 కానీ అక్కడికి ఆసియనుండి వచ్చిన కొందరు యూదులకు నేను నేరం చేసానని అనిపిస్తే, యిక్కడికి వచ్చి నేరారోపణ చేయవలసి ఉంది.
ACT 24:20 నేను మహాసభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏ అపరాధం కనిపెట్టారో ఇక్కడ నిలుచున్న వాళ్ళను చెప్పమనండి.
ACT 24:21 ఔను! నేను ఒకటి చేసాను. వాళ్ళ సమక్షంలో నిలుచొని బిగ్గరగా ‘చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తారని నమ్మినందుకు మీ ముందు ఈ రోజు నేరస్థునిగా నిలుచున్నాను’ అని అన్నాను. ఇది తప్ప నేనేమీ చెయ్యలేదు.”
ACT 24:22 యేసు ప్రభువు మార్గం బాగా తెలిసిన ఫేలిక్సు సభను ముగిస్తూ, “సహస్రాధిపతి లూసియ వచ్చాక నీ విషయం నిర్ణయిస్తాను” అని అన్నాడు.
ACT 24:23 శతాధిపతితో, “పౌలును కాపలాలో ఉంచు! కాని కొంత స్వేచ్ఛనివ్వు. అతని స్నేహితులు అతనికి ఏదైనా ఇవ్వటానికి వస్తే వాళ్ళనాపవద్దు” అని అన్నాడు.
ACT 24:24 కొద్ది రోజుల తర్వాత ఫేలిక్సు తన భార్య ద్రుసిల్లతో వచ్చాడు. ద్రసిల్ల యూదురాలు. ఫేలిక్సు పౌలును పిలిపించాడు. “యేసు క్రీస్తులో విశ్వాసం” అనే విషయాన్ని గురించి, పౌలు మాట్లాడాడు. ఫేలిక్సు విన్నాడు.
ACT 24:25 పౌలు సన్మార్గాన్ని గురించి, మనో నిగ్రహాన్ని గురించి, రానున్న తీర్పును గురించి చెప్పటం విని ఫేలిక్సు భయపడి, “ఇప్పటికి చాలించి, వెళ్ళు! నాకు వీలున్నప్పుడు నిన్ను మళ్ళీ పిలిపిస్తాను” అని అన్నాడు.
ACT 24:26 కాని తనకు లంచమిస్తాడని ఆశించి అతణ్ణి మాటిమాటికి పిలిపించి అతనితో మాట్లాడే వాడు.
ACT 24:27 రెండు సంవత్సరాలు గడిచాక పోర్కియు ఫేస్తు ఫేలిక్సు స్థానంలో వచ్చాడు. ఫేలిక్సు యూదులకు ఒక ఉపకారం చెయ్యాలనే ఉద్దేశంతో పౌలును కారాగారంలోనే ఉంచాడు.
ACT 25:1 ఫేస్తు ఆ ప్రాంతానికి వచ్చిన మూడు రోజుల తర్వాత కైసరియ నుండి యెరూషలేమునకు వెళ్ళాడు.
ACT 25:2 అక్కడ ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతణ్ణి కలుసుకొని, పౌలును గురించి చెప్పారు.
ACT 25:3 పౌలును వెంటనే యెరూషలేముకు పంపి తమకు ఉపకారం చెయ్యుమని వేడుకున్నారు. ఎవ్వరికీ తెలియకుండా పౌలును దారిలో చంపేయాలని వాళ్ళ కుట్ర.
ACT 25:4 ఫేస్తు, “పౌలు కైసరియలో బందీగా ఉన్నాడు. నేను కూడా అక్కడికి త్వరలోనే వెళ్తున్నాను.
ACT 25:5 మీలో ముఖ్యమైన వాళ్ళు నావెంట వస్తే, అతడు ఒకవేళ ఏదైనా నేరం చేసి ఉంటే అతనిపై మీ నేరారోపణలు అక్కడే చేయవచ్చు” అని అన్నాడు.
ACT 25:6 అక్కడ వాళ్ళతో ఎనిమిది, పది రోజులు గడిపాక కైసరియకు వెళ్ళాడు. వెళ్ళిన మరుసటి రోజు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు పిలుచుకు రమ్మని ఆజ్ఞాపించాడు.
ACT 25:7 పౌలు కనపడగానే యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ చేరి అతనిపై తీవ్రమైన నేరాలు ఆరోపించారు. ఎన్ని నేరాల్ని ఆరోపించినా, ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేక పోయారు.
ACT 25:8 తదుపరి పౌలు, తాను నేరస్థుడు కాదని నిరూపించుకోవటానికి ఈ విధంగా వాదించాడు, “నేను యూదుల ధర్మశాస్త్రాన్ని కాని, మందిర నియమాల్ని కాని అతిక్రమించ లేదు. చక్రవర్తికి ఎదురు తిరిగి ప్రవర్తించనూ లేదు.”
ACT 25:9 ఫేస్తు, యూదులకు ఉపకారం చేయాలని, పౌలుతో, “నీవు యెరూషలేము వచ్చి అక్కడ నా ఎదుట న్యాయస్థానంలో నిలుచోగలవా?” అని అడిగాడు.
ACT 25:10 పౌలు ఈ విధంగా సమాధానం చెప్పాడు. “నేను ప్రస్తుతం చక్రవర్తి యొక్క న్యాయస్థానంలో నిలుచున్నాను. ఇక్కడే తీర్పు జరగాలి. నేను యూదులకు ఏ అన్యాయం చెయ్యలేదు. ఇది మీకు బాగా తెలుసు.
ACT 25:11 మరణదండన పొందవలసిన నేరం నేను ఒక వేళ ఏదైనా చేసివుంటే, మరణించటానికి నేను వెనుకంజ వేయను. కాని వీళ్ళు ఆరోపించిన నేరాలు అసత్యమైతే నన్ను వీళ్ళకప్పగించే అధికారం ఎవ్వరికీ లేదు. చక్రవర్తినే ఈ విషయంపై తీర్పు చెప్పుమని నేను విన్నవించుకొంటాను.”
ACT 25:12 ఫేస్తు తన సలహాదార్లతో సంప్రదించి యిలా ప్రకటించాడు: “నీవు చక్రవర్తి సమక్షంలో విన్నవించుకోవాలని కోరావు. కనుక నిన్ను చక్రవర్తి దగ్గరకు పంపుతాను.”
ACT 25:13 కొద్ది రోజుల తర్వాత అగ్రిప్పరాజు, బెర్నీకే, ఫేస్తును కలుసుకొందామని కైసరియకు వచ్చారు.
ACT 25:14 వాళ్ళక్కడ చాలా రోజులున్నారు. ఫేస్తు పౌలు విషయాన్ని రాజుగారితో చర్చిస్తూ, “ఇక్కడ, ఫేలిక్సు కారాగారంలో ఉంచిన వాడొకడున్నాడు.
ACT 25:15 నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతనిపై నేరారోపణ చేసి అతనికి మరణదండన విధించుమని నన్ను కోరారు.
ACT 25:16 నేను, ‘నేరమారోపింపబడిన వానికి తనపై నేరారోపణ చేసిన వాళ్ళను ప్రత్యక్షంగా కలుసుకొని, వాళ్ళారోపించిన నేరాలకు ప్రతిగా తన రక్షణార్థం మాట్లాడే అవకాశం కలగాలి. దానికి ముందు అతణ్ణి అప్పగించటం రోమనుల పద్ధతి కాదు’ అని జవాబు చెప్పాను.
ACT 25:17 “నాతో కలిసి వాళ్ళిక్కడికి వచ్చారు. నేను ఆలస్యం చెయ్యకుండా మరుసటి రోజే సభనేర్పాటు చేసి పౌలును సభలోకి పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాను.
ACT 25:18 అతనిపై నేరారోపణ చేసిన వాళ్ళు లేచి మాట్లాడారు. కాని నేననుకున్న ఏ నేరాన్నీ అతనిపై ఆరోపించలేదు.
ACT 25:19 దానికి మారుగా తామనుసరించే మతాన్ని గురించి అతనితో వాదించారు. చనిపోయిన యేసును గురించి తర్కించారు. కాని పౌలు యేసు బ్రతికే ఉన్నాడని వాదించాడు.
ACT 25:20 అలాంటి విషయాలు ఏ విధంగా విచారణ చెయ్యాలో నాకు తెలియదు. అందువల్ల నేను అతణ్ణి, ‘విచారణ కోసం నీవు యెరూషలేము వెళ్తావా?’ అని అడిగాను.
ACT 25:21 చక్రవర్తే తీర్పు చెప్పాలని, అంతదాకా తనను కారాగారంలో ఉంచుమని పౌలు కోరాడు. ఆ కారణంగా అతణ్ణి కైసరు దగ్గరకు పంపేదాకా కారాగారంలో ఉంచుమని ఆజ్ఞాపించాను” అని చెప్పాడు.
ACT 25:22 అగ్రిప్ప ఫేస్తుతో, “అతడు మాట్లాడే విషయాలు వినాలని నాక్కూడా ఉంది” అని అన్నాడు. “రేపు మీరతని మాటలు వింటారు” అని ఫేస్తు జవాబు చెప్పాడు.
ACT 25:23 మరుసటి రోజు అగ్రిప్ప, బెర్నీకే మిక్కిలి ఆడంబరంగా సభలోకి వచ్చి సహస్రాధిపతులతో, పట్టణ ప్రముఖులతో కలిసి కూర్చున్నారు. ఫేస్తు ఆజ్ఞాపించగానే పౌలు సభలోకి తేబడ్డాడు.
ACT 25:24 ఫేస్తు యిలా అన్నాడు: “అగ్రిప్ప రాజా! సభికులారా! మీరు చూస్తున్న ఈ వ్యక్తిని గురించి యూదులు యెరూషలేములో, ఇక్కడ, ‘ఇతడిక ఎక్కువ రోజులు బ్రతకటానికి వీల్లేదు’ అని బిగ్గరగా కేకలు వేసి నాకు ఫిర్యాదు చేసారు.
ACT 25:25 మరణదండన విధించవలసిన నేరమేదీ అతడు చేయలేదని నాకర్థమైనది. కాని అతడు చక్రవర్తికి విన్నవించుకొంటానని అన్నాడు. కనుక అతణ్ణి చక్రవర్తి దగ్గరకు పంపాలని నిశ్చయించుకున్నాను.
ACT 25:26 ఇతణ్ణి గురించి చక్రవర్తికి వ్రాయటానికి నాకేదీ కనిపించలేదు. అందువల్ల యితణ్ణి మీ ముందుకు పిలుచుకు వచ్చాను. అగ్రిప్ప రాజా! ముఖ్యంగా మీకోసం యితణ్ణి పిలిపించాను. మీ విచారణ వల్ల వ్రాయటానికి నాకేదైనా కనిపించవచ్చు.
ACT 25:27 ఒక బందీని, అతడు చేసిన నేరం స్పష్టంగా చూపకుండా పంపటం న్యాయం కాదని నా అభిప్రాయం.”
ACT 26:1 అప్పుడు అగ్రిప్ప రాజు పౌలుతో, “నీవు చెప్పుకోదలచింది ఇక చెప్పకోవచ్చు!” అని అన్నాడు. పౌలు తన చేతులెత్తి, తాను నిర్దోషినని నిరూపించుకోవటానికి ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు:
ACT 26:2 “అగ్రిప్ప రాజా! ఈ రోజు మీ ముందు నిలుచొని యూదులు నాపై ఆరోపించిన నేరాలు అసత్యమని ఋజువు చేసుకోవటానికి అవకాశం కలగటం నా అదృష్టం.
ACT 26:3 మీకు యూదులతో, వాళ్ళ ఆచారాలతో, వాళ్ళు తర్కించే విషయాలతో బాగా పరిచయముంది. కనుక యిది నిజంగా నా అదృష్టం. నేను చెప్పేది మీరు శాంతంగా వినాలని మనవి చేసుకొంటున్నాను.
ACT 26:4 “నేను చిన్ననాటినుండి ఏ విధంగా జీవించానో యూదులందరికీ తెలుసు. నా దేశంలో గడచిన నా బాల్యం మొదలుకొని యెరూషలేములో జరిగిన సంఘటనల దాకా జరిగినదంతా వాళ్ళకు తెలుసు.
ACT 26:5 వాళ్ళు నన్ను ఎన్నో సంవత్సరాలనుండి ఎరుగుదురు. నేను, మన మతంలోని నిష్టగల పరిసయ్యుల తెగను అనుసరిస్తూ జీవించానని వాళ్ళకు తెలుసు. కావాలనుకొంటే వాళ్ళే యిది నిజమని సాక్ష్యం చెబుతారు.
ACT 26:6 దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దానంలో నాకు నమ్మకం ఉంది. అందువల్లే నేను ఈ రోజు ఈ పరీక్షకు నిలబడవలసి వచ్చింది.
ACT 26:7 ఈ వాగ్దానం పూర్తి కావాలని మన పండ్రెండు గోత్రాల వాళ్ళు రాత్రింబగళ్ళు విశ్వాసంతో దేవుణ్ణి సేవిస్తూ ఎదురు చూస్తున్నారు. ఓ రాజా! ఈ ఆశ నాలో ఉండటం వల్లే యూదులు నన్ను నేరస్థునిగా పరిగణిస్తున్నారు.
ACT 26:8 దేవుడు చనిపోయిన వాళ్ళను బ్రతికిస్తాడు. ఈ సత్యాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు?
ACT 26:9 “ఒకప్పుడు నేను కూడా నజరేతు నివాసి యేసు నామము లేకుండా చెయ్యటం నా కర్తవ్యంగా భావించాను.
ACT 26:10 నేను యెరూషలేములో చేసింది అదే. ప్రధాన యాజకులు యిచ్చిన అధికారంతో నేను చాలామంది పరిశుద్ధుల్ని కారాగారంలో వేసాను. వాళ్ళను చంపటానికి నేను అంగీకారం కూడా తెలిపాను.
ACT 26:11 ఎన్నోసార్లు నేను ఒక సమాజ మందిరమునుండి మరొక నమాజ మందిరానికి వెళ్ళి వాళ్ళను శిక్షించాను. వాళ్ళతో బలవంతంగా యేసును దూషింపచేసాను. పిచ్చి కోపంతో యితర పట్టణాలకు కూడా వెళ్ళి ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళను హింసించాను.
ACT 26:12 “ఒక రోజు నేను, ప్రధాన యాజకుల అధికారంతో, అనుమతితో డెమాస్కసుకు వెళ్తున్నాను.
ACT 26:13 సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు, ఓ రాజా! నేను దారిలో ఉండగా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు రావటం చూసాను. ఆ వెలుగు సూర్యునికన్నా యింకా ఎక్కువ వెలుగుతో వచ్చి నా మీద నాతో ఉన్న వాళ్ళ మీద ప్రకాశించింది.
ACT 26:14 మేమంతా నేలపై పడిపొయ్యాము. ఒక స్వరం హెబ్రీ భాషలో నాతో ఈ విధంగా అనటం విన్నాను: ‘సౌలా! సౌలా! నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇలా చేయటంవల్ల నీకే నష్టం కలుగుతుంది.’
ACT 26:15 “నేను, ‘మీరెవరు ప్రభూ!’ అని అడిగాను. “‘నేను నీవు హింసిస్తున్న యేసును’ అని ప్రభువు జవాబు చెప్పాడు.
ACT 26:16 ‘ఇక లేచి నిలబడు, నిన్ను నా సేవకునిగా నియమించుకోవాలని అనుకున్నాను. నన్ను చూసిన ఈ సంఘటనను గురించి, నేను చూపబోయే వాటిని గురించి యితర్లకు చెప్పటానికి నిన్ను నియమించాలని నీకు ప్రత్యక్షమయ్యాను.
ACT 26:17 నిన్ను నీ వాళ్ళనుండి, యూదులుకాని వాళ్ళనుండి రక్షిస్తాను.
ACT 26:18 వాళ్ళ కళ్ళు తెరిపించి వాళ్ళను చీకటినుండి వెలుగులోకి పిలుచుకు రావటానికి నిన్ను పంపుతున్నాను. వాళ్ళను సైతాను ఆధీనం నుండి కాపాడి, దేవుని వైపు మళ్ళించటానికి నిన్ను పంపుతున్నాను. వాళ్ళు నన్ను విశ్వసించి తమ పాపాలకు క్షమాపణ పొందాలని, దేవుడు ఎన్నుకొన్న వాళ్ళతో కలిసి తమ స్థానం పొందాలని యిలా చేస్తున్నాను.’”
ACT 26:19 “అందువల్ల అగ్రిప్ప రాజా! ఆకాశం నుండి వచ్చిన దివ్య దర్శనము నేను అతిక్రమించలేను.
ACT 26:20 మారు మనస్సు పొంది దేవుని వైపు మళ్ళుమని, తమ నిజమైన పశ్చాత్తాపం మారు మనస్సు అన్న విషయం పనుల ద్వారా ఋజువు చేయుమని ఉపదేశించాను. ఈ ఉపదేశం డెమాస్కసు ప్రజలతో మొదలు పెట్టి యెరూషలేములోని ప్రజలకు, యూదయలోని యితర ప్రజలకు, యూదులు కాని వాళ్ళకు చెప్పాను.
ACT 26:21 “ఆ కారణంగా యూదులు నన్ను మందిరంలో పట్టుకొని చంపాలని ప్రయత్నించారు.
ACT 26:22 కాని దేవుని దయ ఈనాటికీ నా మీద ఉంది. కనుక చిన్నా, పెద్దా, అనే భేధం లేకుండా అందరికీ దీన్ని గురించి చెబుతున్నాను. మోషే, మరియు ప్రవక్తలు జరుగనున్న వాటిని గురించి ముందే ఈ విధంగా చెప్పారు:
ACT 26:23 ‘క్రీస్తు మరణించవలసి వస్తుంది. కాని బ్రతికి వచ్చిన వాళ్ళలో ఆయన మొదటివాడౌతాడు. తన ప్రజలకు, యూదులుకాని వాళ్ళకు వెలుగునివ్వటానికి వచ్చాడని చెపుతున్నాను.’ నేను వీళ్ళు చెప్పినవి తప్ప వేరే విషయాలు చెప్పటం లేదు.”
ACT 26:24 పౌలు, తన రక్షణార్థం ఈ విధంగా మాట్లాడుతుండగా, ఫేస్తు, పౌలుతో వాదన ఆపమంటూ, “నీకు మతిపోయింది పౌలూ! నీ పాండిత్యం నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది” అని బిగ్గరగా అన్నాడు.
ACT 26:25 పౌలు, “మహా ఘనత పొందిన ఓ ఫేస్తూ! నేను పిచ్చివాణ్ణి కాదు. సక్రమంగానే మాట్లాడాను. సత్యం చెప్పాను.
ACT 26:26 రాజుగారికి యివన్నీ తెలుసు. నేను రాజుగారితో స్వేచ్ఛగా మాట్లాడగలను. ఇవి అతని దృష్టి నుండి తప్పించుకోలేవన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే యివి రహస్యంగా సంభవించలేదు.
ACT 26:27 అగ్రిప్ప రాజా! మీరు ప్రవక్తలు వ్రాసిన వాటిని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నారని నాకు తెలుసు” అని పౌలు అన్నాడు.
ACT 26:28 అగ్రిప్ప, “అంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చెయ్యాలనుకుంటున్నావా?” అని అన్నాడు.
ACT 26:29 పౌలు, “సులభమో, కష్టమో! మీరే కాదు, ఈ రోజు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కడూ ఈ సంకెళ్ళు తప్ప మిగిలిన వాటిలో నావలె కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నాడు.
ACT 26:30 రాజు లేవగానే రాష్ట్రాధిపతి, బెర్నీకే, మరియు వాళ్ళతో కూర్చున్న వాళ్ళు లేచి నిలుచున్నారు.
ACT 26:31 వాళ్ళా గది వదిలివెళ్తూ తమలో తాము, “ఇతడు మరణదండన పొందటానికి కాని, కారాగారంలో ఉండ వలసిన నేరం కాని ఏదీ చేయలేదు” అని అనుకున్నారు.
ACT 26:32 అగ్రిప్ప ఫేస్తుతో, “ఇతడు చక్రవర్తికి విన్నపం చేయకుండా ఉండినట్లైతే విడుదల చేసి ఉండేవాణ్ణి!” అని అన్నాడు.
ACT 27:1 మేము ఇటలీకి ఓడలో ప్రయాణం చేయాలని అధికారులు నిర్ణయించి పౌలును, ఇతర ఖైదీలను “యూలి” అనబడే శతాధిపతికి అప్పగించారు. ఇతడు చక్రవర్తి దళానికి చెందినవాడు.
ACT 27:2 మేము ఆసియ తీరాలకు వెళ్ళటానికి సిద్ధమవుతున్న అద్రముత్తియ అనే ఓడనెక్కి ప్రయాణం అయ్యాము. మాసిదోనియ ప్రాంతంలోని థెస్సలోనీకకు చెందిన అరిస్తార్కు అనేవాడు మా వెంట ఉన్నాడు.
ACT 27:3 మరునటి రోజు మేము సీదోను చేరుకున్నాము. యూలి, పౌలు తన స్నేహితుల్ని కలుసుకొని సహాయం పొందేటట్లు అతనికి అనుమతిచ్చి అతనిపై దయచూపాడు.
ACT 27:4 అక్కడి నుండి మళ్ళీ ఓడలో ప్రయాణం సాగించాము. ఎదురుగాలి వీస్తూ ఉంది. అందువల్ల కుప్రకు దక్షిణంగా గాలి వీచని నీళ్లలో ప్రయాణం సాగించాము.
ACT 27:5 కిలికియ, పంపూలియల దగ్గర ఉన్న సముద్రం మీద ప్రయాణం చేస్తూ “లుకియ” ప్రాంతంలో ఉన్న “మూర” అనే పట్టణాన్ని చేరుకున్నాము.
ACT 27:6 మా వెంట ఉన్న శతాధిపతి ఇటలీకి వెళ్తున్న “అలెక్సంద్రియ” ఓడను చూసి, మమ్మల్ని ఆ ఓడలో ఎక్కించాడు.
ACT 27:7 ఎదురు గాలి వీస్తూవుండటం వల్ల మా ప్రయాణం చాలా రోజుల వరకు మెల్లగా సాగింది. చాలా కష్టంగా “క్నిదు” తీరాన్ని చేరుకున్నాము. ఎదురు గాలి వల్ల ముందుకు వెళ్ళలేక పోయ్యాము. అందువల్ల దక్షిణంగా వెళ్ళి “క్రేతు” ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని “సల్మోనే” తీరంగుండా ప్రయాణం సాగించాము.
ACT 27:8 ఆ నీళ్లలో మా ప్రయాణం కష్టంగా సాగింది. ఏదో విధంగా “మంచి రేవులు” అనే స్థలాన్ని చేరుకున్నాము. ఈ తీరం లసైయ అనే పట్టణానికి దగ్గరగా ఉంది.
ACT 27:9 అప్పటికే చాలా కాలం వృధా అయిపోయింది. కాని ప్రయాణం చెయ్యటం ప్రమాదకరమై పోయింది. ఉపవాస దినం చేసే దినం కూడా దాటి పోయింది. అందుకు పౌలు వాళ్ళను జాగ్రత్తపడుమని చెబతూ,
ACT 27:10 “ప్రజలారా! ఈ ప్రయాణంలో మనకు కష్టాలు సంభవిస్తాయని నాకనిపిస్తూవుంది. ఓడను, సరుకును నష్టపోవటమే కాకుండా మన ప్రాణాలకు కూడా ప్రమాదం కలుగవచ్చు!” అని అన్నాడు.
ACT 27:11 కాని ఆ శతాధిపతి పౌలు మాటలు వినక ఆ ఓడ యొక్క యజమాని మాటలు, నావికుని మాటలు విన్నాడు.
ACT 27:12 వాళ్ళున్న రేవు చలి కాలంలో ఉండటానికి పనికిరాదు. కనుక అనేకులు ప్రయాణం సాగించుమని సలహాయిచ్చారు. చలికాలం గడపటానికి “ఫినిక్సు” అనే రేవు చేరగలమని అంతా ఆశించారు. ఈ ఫీనిక్సు రేపు క్రేతు ద్వీపంలో ఉంది. నైరుతి, వాయవ్వ దిశలనుండి మాత్రమే ఆ రేవును ప్రవేశించటానికి వీలుంటుంది.
ACT 27:13 దక్షిణ గాలి వీచగానే తదుకు కావలసింది దొరికిందని వాళ్ళనుకున్నారు. లంగరు తీసి, ఓడను క్రేతు తీరం ప్రక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు.
ACT 27:14 అంతలోనే, ఉరకులోను అనబడే తీవ్రమైన తుఫాను గాలి క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది.
ACT 27:15 ఓడ ఆ తుఫానుగాలికి కొట్టుకొని పోయింది. ఎదురు గాలివల్ల మా ఓడ ముందుకు పోలేక పోయింది. మేమేమీ చెయ్యలేక పోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకొని పోయింది.
ACT 27:16 “కౌద” అనబడే చిన్న ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని దాని ప్రక్కగా ప్రయాణం సాగించాము. ఓడకు కట్టబడిన వడవను చాలా కష్టంగా కాపాడగలిగాము.
ACT 27:17 దానిని ఓడమీదకి ఎక్కించిన తర్వాత త్రాళ్ళు బిగించి ఓడను గట్టిగా కట్టారు. ఓడ “సూర్తిస” ప్రాంతంలోని యిసుక తిప్పల మీదికి వెడ్తుందని భయపడ్డారు. కనుక తెరచాపలు దించి ఓడను గాలి వీచే వైపు పోనిచ్చారు.
ACT 27:18 మరుసటి రోజు, తుఫానుగాలి తీవ్రంగా వీచటంవల్ల ఓడలోవున్న సరుకులు సముద్రంలో పడవేసారు.
ACT 27:19 మూడవ రోజు ఓడలో ఉపయోగించే పనిముట్లను కూడా సముద్రంలో పడవేసారు.
ACT 27:20 సూర్యుడు కాని, నక్షత్రాలు కాని చాలా రోజుల దాకా కనపడ లేదు. తుఫానుగాలి తీవ్రత తగ్గలేదు. మేము బ్రతుకుమీద ఆశ యిక పూర్తిగా వదులుకున్నాము.
ACT 27:21 చాలా రోజులనుండి వాళ్ళు ఆహారం తినలేదు. పౌలు వాళ్ళ మధ్య నిలబడి, “నా సలహా పాటించి మీరు క్రేతు నుండి ప్రయాణం చేయకుండా ఉండ వలసింది. అలా చేసి ఉంటే మీకు కష్టంగాని, నష్టంగాని కలిగేది కాదు.
ACT 27:22 కాని, యిప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. ధైర్యంగా ఉండండి. మీలో ఒక్కరు కూడా ప్రాణాల్ని కోల్పోరు. కాని ఓడ మాత్రం నష్టమౌతుంది.
ACT 27:23 నేను ఎవరికి చెందానో, ఎవరి సేవ నేను చేస్తున్నానో ఆయన దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి ఇలా చెప్పాడు:
ACT 27:24 ‘పౌలూ! భయపడకు. విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు దేవుడు దయదలిచి, నీ కోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళ ప్రాణాలను రక్షించాడు.’
ACT 27:25 అందువల్ల ప్రజలారా! దైర్యంగా ఉండండి. నాకు దేవుని పట్ల నమ్మకం ఉంది. ఆయన చెప్పినట్లే జరుగుతుంది.
ACT 27:26 మనం త్వరలోనే ఒక ద్వీపానికి కొట్టకుపోతాము” అని అన్నాడు.
ACT 27:27 పదునాల్గవ రోజు రాత్రి కూడా మేమింకా అద్రియ సముద్రంలో గాలికి కొట్టుకొని పోతున్నాము. సుమారు అర్థరాత్రి వేళ నావికులు భూమి దగ్గరకొచ్చిందని గ్రహించారు.
ACT 27:28 బడుదు నీళ్ళలోకి వేసి ఇరవై బారల లోతుందని తెలుసుకున్నారు. కొంతసేపైన తర్వాత మళ్ళీ బుడుదు నీళ్ళలోకి వేసి పదునైదు బారల లోతుందని తెలుసుకున్నారు.
ACT 27:29 ఓడ, రాళ్ళకు కొట్టుకుంటుందని భయపడి ఓడ వెనుక భాగంనుండి నాలుగు లంగర్లు వేసారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థించారు.
ACT 27:30 నావికులు ఓడ ముందుభాగంనుండి లంగర్లు నీళ్ళలోకి దింపుతున్నట్లు నటిస్తూ ఓడకు కట్టబడిన చిన్న పడవను సముద్రంలోకి దింపారు. తప్పించుకు వెళ్ళాలని వాళ్ళ ఉద్ధేశ్యం.
ACT 27:31 అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ నావికలు ఓడలో ఉంటే తప్ప మీరు రక్షింపబడరు” అని అన్నాడు.
ACT 27:32 ఇది విని సైనికులు పడవకు కట్టిన త్రాళ్ళను కోసి ఆ పడవను నీళ్ళలోకి పోనిచ్చారు.
ACT 27:33 సూర్యోదయానికి ముందు పౌలు వాళ్ళనందర్ని తినుమని చెబతూ, “గడిచిన పదునాలుగు రోజుల నుండి మీరు ఆహారం ముట్టకుండా జీవించారు. ఏం జరుగనున్నదో మీకు తెలియదు. అయినా కాచుకున్నారు.
ACT 27:34 ఇక మిమ్మల్ని కొంచం తినమని వేడుకొంటున్నాను. మిమ్మల్ని రక్షించుకోవాలంటే తినటం అవసరం. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు” అని అన్నాడు.
ACT 27:35 ఇలా చెప్పాక అతడు రొట్టెను తీసుకొని దేవునికి అందరి ముందు కృతజ్ఞతలు చెప్పి దాన్నుండి ఒక ముక్కను విరిచి తినటం మొదలు పెట్టాడు.
ACT 27:36 అప్పుడందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు.
ACT 27:37 మా సంఖ్య మొత్తం రెండువందల డెబ్బది ఆరు.
ACT 27:38 వాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత ఓడలో ఉన్న మిగతా ధాన్యాన్ని సముద్రంలోకి పారవేసి ఓడను తేలిక చేసారు.
ACT 27:39 సూర్యోదయమయింది. వాళ్ళకు భూమి కనిపించింది. కాని వాళ్ళు అది గుర్తించలేదు. ఇసుక ఉన్న తీరం యొక్క పాయ కనపడగానే ఓడను వీలైతే అక్కడ ఆపాలనుకున్నారు.
ACT 27:40 త్రాళ్ళు కోసేసి లంగర్లను సముద్రంలోకి పడనిచ్చారు. చుక్కానుల త్రాళ్ళు విప్పారు. ఓడ యొక్క ముందుభాగంలో ఉన్న తెరచాపను లేపి ఓడను తీరం వైపు పోనిచ్చారు.
ACT 27:41 కాని ఆ ఓడ నీళ్ళలో ఉన్న యిసుకకు తగిలి భూమిలో చిక్కుకొని పోయింది. ఓడ యొక్క ముందుభాగం యిసుకలో చిక్కుకుపోవటం వల్ల ఓడ కదల్లేదు. అలలు తీవ్రంగా కొట్టటం వల్ల ఓడ యొక్క వెనుక భాగం ముక్కలై పోయింది.
ACT 27:42 నేరస్థులు ఈది పారిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సైనికులు వాళ్ళను చంపాలని నిశ్చయించు కున్నారు,
ACT 27:43 కాని పౌలు ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో ఆ శతాధిపతి సైనికులు చెయదలచిన దానిని చెయనివ్వలేదు. ఈద గలిగిన వాళ్ళను, నీళ్ళలోకి దూకి ఒడ్డును చేరుకోమని ఆజ్ఞాపించాడు.
ACT 27:44 మిగతా వాళ్ళను చెక్కల సహాయంతో, ఓడ యొక్క విరిగిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నాడు. ఈ విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు.
ACT 28:1 తీరం చేరుకున్నాక ఆ ద్వీపాన్ని “మెలితే” అంటారని తెలుసుకున్నాము.
ACT 28:2 ఆ ద్వీపంలో నివసించే వాళ్ళు మాపై చాలా దయచూపారు. అప్పుడు వర్షం కురుస్తూవుంది. చలి తీవ్రంగా ఉంది. వాళ్ళు చలిమంటలు వేసి మమ్మల్ని కూడా రమ్మన్నారు.
ACT 28:3 పౌలు కట్టెలు ప్రోగుచేసి ఆ మోపును మంటపై వేసాడు. ఆ కట్టెల మోపునుండి ఒక పాము ఆ వేడికి తట్టుకోలేక వెలుపలికి వచ్చి, పౌలు చేతిని కరిచి దాని పళ్ళతో పట్టుకుంది.
ACT 28:4 ఆ ద్వీపవాసులు పౌలు చేతికి పాము వ్రేలాడి ఉండటం చూసి తమలో తాము, “ఇతడు తప్పక ఒక హంతకుడై ఉండాలి! సముద్రంనుండి తప్పించుకున్నాడు కాని, దేవుడతన్ని బ్రతుకనివ్వలేదు” అని అనుకున్నారు.
ACT 28:5 కాని పౌలు, ఆ పామును మంటలోకి దులిపి వేసాడు. అతనికి ఏ హాని కలుగలేదు.
ACT 28:6 వాళ్ళు అతని శరీరం వాచి పోతుందనో, లేక అతడు అకస్మాత్తుగా చనిపోతాడనో అనుకొని చాలా సేపు కాచుకున్నారు. అతనికి ఏ హాని కలగక పోవటం గమనించి, వాళ్ళు తను మనస్సును మార్చుకొని, “అతడు ఒక దేవత” అని అన్నారు.
ACT 28:7 ఆ ప్రక్కనున్న పొలాలు “పొప్లి” అనే అతనికి చెందినవి. పొప్లి ఆ ద్వీపానికి అధికారి. అతడు మమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మూడు రోజుల దాకా అతిథిసత్కార్యాలు చేసాడు.
ACT 28:8 పొప్లి తండ్రి జ్వరంతో, చీమునెత్తురు విరేచనాలతో మంచం పట్టి ఉన్నాడు. పౌలు అతణ్ణి చూడటానికి వెళ్ళాడు. దేవుణ్ణి ప్రార్థించి పౌలు తన చేతుల్ని అతని తలపై ఉంచాడు. వెంటనే అతనికి నయమైపోయింది.
ACT 28:9 ఈ విధంగా జరిగిన తర్వాత ఆ ద్వీపంలో ఉన్న మిగతా రోగులు కూడా వచ్చారు. వాళ్ళక్కూడా నయమైపోయింది.
ACT 28:10 ఆ ద్వీప వాసులు మమ్మల్ని ఎన్నో విధాలుగా గౌరవించి మేము ప్రయాణ మయ్యెముందు మాకు కావలసిన సామగ్రి నిచ్చారు.
ACT 28:11 చలికాలమంతా ఆ ద్వీపంలో ఉండి పోయిన ఒక ఓడలో మూడు నెలల తర్వాత ప్రయాణం చేసాము. అది అలెక్సంద్రియ నగరానికి చెందిన ఓడ. దాని పేరు “కవల దేవతలు.”
ACT 28:12 మేము “సురకూసై” అనే పట్టణానికి చేరుకున్నాము. సురకూసైలో మేము మూడు రోజులుండి, మరల బయలు దేరాము.
ACT 28:13 మేము రేగియ నగరానికి వచ్చాము. మరునటి రోజు నైరుతి గాలి వీచటంతో మేము బయలు దేరగలిగాము. ఒక రోజు తరువాత మేము పొతియొలీ నగరం చేరాము.
ACT 28:14 అక్కడున్న సోదరుల్లో కొందర్ని కలుసుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి తమతో ఒక వారం ఉండుమన్నారు. ఈ విధంగా రోము చేరుకున్నాము.
ACT 28:15 రోములో ఉన్న సోదరులు మేము వస్తున్నామని విన్నారు. మమ్మల్ని కలుసుకోవటానికి వాళ్ళు అప్పీయా ఫోరన్ ట్రెయిన్ టాబెర్న్ అనే గ్రామాల వరకు వచ్చారు. వీళ్ళను చూడగానే పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతనిలో ధైర్యం కలిగింది.
ACT 28:16 మేము రోము పట్టణం చేరుకున్నాక పౌలును ఏకాంతంగా ఉండనిచ్చారు. కాని ఒక సైనికుణ్ణి అతనికి కాపలాగా ఉంచారు.
ACT 28:17 మూడు రోజుల తర్వాత పౌలు యాదుల నాయకుల్ని పిలిపించాడు. అంతా సమావేశమయ్యాక పౌలు వాళ్ళతో, “సోదరులారా! మన ప్రజలకు విరుద్ధంగా లేక మన పూర్వీకుల ఆచారాలకు విరుద్ధంగా నేను ఏది చెయ్యలేదు. అయినా నన్ను యెరూషలేములో బంధించి రోము అధికారులకు అప్పగించారు.
ACT 28:18 వాళ్ళు విచారణ చేసారు. కాని యూదులు ఆరోపించినట్లు మరణదండన పొందవలసిన అపరాధమేదీ నేను చెయ్యలేదు. కనుక నన్ను విడుదల చెయ్యాలనుకున్నారు.
ACT 28:19 కాని, దానికి యూదులు ఒప్పుకోలేదు. నేను చక్రవర్తికి విజ్ఞాపన చెయ్యటం అవసరమైంది. యూదులపై నేరారోపణ చెయ్యటానికి నేనిక్కడికి రాలేదు.
ACT 28:20 ఈ కారణంగానే నేను మిమ్మల్ని చూసి మాట్లాడాలని పిలువనంపాను. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఆశ కోసం నేనీ సంకెళ్ళలో ఉన్నాను” అని అన్నాడు.
ACT 28:21 వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పారు: “యూదయ నుండి మిమ్మల్ని గురించి మాకెలాంటి ఉత్తరంరాలేదు. అక్కడినుండి వచ్చిన సోదరులు కూడా మిమ్మల్ని గురించి ఏ సమాచారం చెప్పలేదు. చెడుగా మాట్లాడలేదు.
ACT 28:22 కాని అన్ని ప్రాంతల వాళ్ళు ఈ మతాన్ని గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు. అందువలన దీన్ని గురించి మీ అభిప్రాయం వినాలని ఉంది.”
ACT 28:23 పౌలును కలుసుకోవటానికి వాళ్ళు ఒక దినాన్ని నిర్ణయించారు. ఆ రోజు మొదటి రోజుకన్నా ఎక్కువ మంది పౌలు నివసిస్తున్న స్థలానికి వచ్చారు. పౌలు ఉదయంనుండి సాయంకాలం దాకా వాళ్ళతో మాట్లాడి, దేవుని రాజ్యాన్ని గురించి విడమరచి చెప్పాడు. మోషే ధర్మశాస్త్రంనుండి, ప్రవక్తల వ్రాతల నుండి ఉదాహరణలు తీసుకొని, యేసును గురించి చెప్పి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు.
ACT 28:24 అతడు చెప్పింది కొందరు నమ్మారు. కొందరు నమ్మలేదు.
ACT 28:25 వాళ్ళలో వాళ్ళకు భేదాభిప్రాయం రావటం వలన వాళ్ళు వెళ్ళి పోవటం మొదలుపెట్టారు. పౌలు ఈ చివరి మాట చెప్పటం మొదలు పెట్టాడు: “పరిశుద్ధాత్మ మీ పూర్వీకులతో ప్రవక్త యెషయా ద్వారా ఈ విధంగా చెప్పి నిజంపలికాడు:
ACT 28:26 ‘ప్రజలతో ఈ విధంగా చెప్పు: మీరెప్పుడూ వింటుంటారు. కాని ఎన్నటికి అర్థం చెసుకోరు! మీరు అన్ని వేళలా చూస్తుంటారు. కాని ఎన్నటికి గ్రహించరు.
ACT 28:27 వాళ్ళు కళ్ళతో చూసి, చెవుల్తో విని హృదయాలతో అర్థం చేసుకొని నా వైపు మళ్ళితే నేను వాళ్ళకు నయం చేస్తాను. కాని అలా జరుగకూడదని ఈ ప్రజల హృదయాలు ముందే మొద్దు బారాయి. వాళ్ళకు బాగా వినిపించదు. వాళ్ళు తమ కళ్ళు మూసుకున్నారు.’
ACT 28:28 “అందువల్ల మీరీ విషయాన్ని గ్రహించాలి. రక్షణను గురించి ఈ సందేశం యూదులు కాని వాళ్ళ వద్దకు పంపబడింది. వాళ్ళు వింటారు!”
ACT 28:29 
ACT 28:30 పౌలు రెండు సంవత్సరాలు తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో నివసించాడు. తనను చూడాలని వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్పాడు.
ACT 28:31 ధైర్యంగా, స్వేచ్ఛతో దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి, యేసు క్రీస్తు ప్రభువును గురించి బోధించాడు.
ROM 1:1 యేసు క్రీస్తు సేవకుడైన పౌలు నుండి: దేవుడు తన అపొస్తలునిగా పని చేయటానికి రమ్మని నన్ను పిలిచినాడు. దేవుని సువార్తను ప్రకటించటానికి నన్ను ప్రత్యేకించినాడు.
ROM 1:2 దేవుడు ఈ సువార్తను తన ప్రవక్తలతో వ్రాయించి పవిత్ర లేఖనముల ద్వారా ఇంతకు క్రితమే తెలియచేసాడు.
ROM 1:3 ఈ సువార్త దేవుని కుమారుడును మన ప్రభువు అయిన యేసు క్రీస్తును గురించి. ఆయన దావీదు వంశంలో మానవునిగా జన్మించాడు.
ROM 1:4 పవిత్రమైన దేవుని ఆత్మ ఆయన్ని తన శక్తితో బ్రతికించి, ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారుడని నిరూపించినాడు.
ROM 1:5 ఆయన ద్వారా నేను దేవుని దయను పొంది ఆయన కోసం అపొస్తలుడనయ్యాను. ప్రజలందరు సువార్తను విశ్వసించి దాన్ని అనుసరించాలని దేవుని ఉద్ధేశ్యం.
ROM 1:6 యేసు క్రీస్తుకు చెందిన వారవుటకు పిలువబడిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు.
ROM 1:7 అందువల్ల రోము పట్టణంలో ఉన్న మీ అందరికీ వ్రాయుటమేమనగా మీరు దేవునికి ప్రియమైన వాళ్ళు. ఆయిన మిమ్మల్ని తన ప్రజగా ఉండటానికి పిలిచాడు. మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహాన్ని ప్రసాదించి మీలో శాంతి కలుగుజేయునుగాక!
ROM 1:8 మీ విశ్వాసాన్ని గురించి ప్రపంచానికంతా తెలిసింది. కనుక నన్ను ముందు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు అర్పించనివ్వండి.
ROM 1:9 నేను దేవుని కుమారుని సువార్తను ప్రకటించి మనస్పూర్తిగా ఆయన సేవ చేస్తున్నాను.
ROM 1:10 నేను ప్రార్థనలు చేసినప్పుడెల్లా విడువకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొంటాను. దానికి ఆ దేవుడే సాక్షి. చివరకు ఇప్పుడైనా నేను మీ దగ్గరకు రావటానికి దైవేచ్చవల్ల మార్గం ఏర్పడాలని ప్రార్థిస్తున్నాను.
ROM 1:11 మీకు ఆధ్యాత్మిక శక్తి కలిగేటట్లు ఆత్మీయవరాన్ని అందించాలని మీ దగ్గరకు రావాలనుకొంటున్నాను.
ROM 1:12 అంటే మీరూ, నేనూ మనలోవున్న విశ్వాసం ద్వారా పరస్పరం ప్రోత్సాహపరచు కోవాలని ఆశిస్తున్నాను.
ROM 1:13 సోదరులారా! నేను, మిగతా యూదులుకాని వాళ్ళనుండి ఫలం పొందినట్లే మీ నుండి కూడా ఫలం పొందాలని, మీ దగ్గరకు రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కాని ఇప్పటి వరకు ఆటంకాలు కలిగాయి. ఈ విషయం మీరు గ్రహించాలని నా కోరిక.
ROM 1:14 గ్రీకులకు, గ్రీకులు కాని వాళ్ళకు, జ్ఞానులకు, అజ్ఞానులకు బోధించవలసిన కర్తవ్యం నాది.
ROM 1:15 అందుకే రోము నగరంలో ఉన్న మీకు కూడా సువార్త ప్రకటించాలని అనుకొంటున్నాను.
ROM 1:16 సువార్త విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకంటే, విశ్వాసమున్న ప్రతి ఒక్కరికీ, అంటే యూదులకే కాక ఇతరులకు కూడా రక్షణను కలిగించే దేవుని శక్తి అది.
ROM 1:17 ఈ సువార్తలో దేవుడు మానవుల్ని నీతిమంతులుగా పరిగణించే విధానాన్ని గురించి చెప్పబడివుంది. అది విశ్వాసంతో మొదలై విశ్వాసంతో అంతమౌతుంది. దీన్ని గురించి లేఖనాల్లో, “విశ్వాసంవల్ల నీతిమంతుడైన వాడు అనంతజీవితం పొందుతాడు” అని వ్రాయబడి ఉంది.
ROM 1:18 భక్తిహీనులై దుర్బుద్ధితో సత్యాన్ని అణిచిపెట్టే ప్రజలపై, దేవుడు స్వర్గంనుండి తన ఆగ్రహాన్ని చూపుతాడు.
ROM 1:19 తనను గురించి తెలియవలసిన విషయాలు దేవుడు వాళ్ళకు తెలియచేసాడు కనుక అవి వాళ్ళకు స్పష్టంగా తెలుసు.
ROM 1:20 కంటికి కనిపించని దేవుని గుణాలు, అంటే, శాశ్వతమైన ఆయన శక్తి, దైవికమైన ఆయన ప్రకృతి ప్రపంచం స్పష్టింపబడిన నాటినుండి సృష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సృష్టి ద్వారా, ఆయన గుణాన్ని మానవులు చూడగలిగారు. కనుక వాళ్ళు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
ROM 1:21 ఎందుకంటే, వాళ్ళకు దేవుడెవరో తెలిసినా, వాళ్ళాయనను దేవునిగా స్తుతింపలేదు. ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దానికి మారుగా వాళ్ళలో పనికిమాలిన ఆలోచనలు కలిగాయి. తెలివిలేని వాళ్ళ మనసులు అందకారమైపోయాయి.
ROM 1:22 వాళ్ళు తాము తెలివిగల వాళ్ళమని చెప్పుకొన్నారు కాని మూర్ఖులవలె ప్రవర్తించారు.
ROM 1:23 ఏలాగనగా చిరకాలం ఉండే దేవుని తేజస్సును నశించిపోయే మనిషిని పోలిన విగ్రహాలకు, పక్షి విగ్రహాలకు, జంతువుల విగ్రహాలకు ప్రాకే ప్రాణుల విగ్రహాలకు మార్చి వాటిని పూజించారు.
ROM 1:24 అందువల్ల దేవుడు వాళ్ళను, వాళ్ళ హృదయాలలోని మలినమైన లైంగిక కోరికలు తీర్చు కోవటానికి వదిలివేసాడు. తద్వారా వాళ్ళు పరస్పరం తమ దేహాలను మలినం చేసుకొన్నారు.
ROM 1:25 దేవుడు చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చారు. సృష్టికర్తను పూజించి ఆయన సేవ చెయ్యటానికి మారుగా ఆ సృష్టికర్త సృష్టించిన వాటిని పూజించి వాటి సేవ చేసారు. సృష్టికర్త సర్వదా స్తుతింపదగినవాడు. ఆమేన్!
ROM 1:26 పురుషులు కూడా ఈ విధంగా చెయ్యటం వల్ల, దేవుడు వాళ్ళను సిగ్గుమాలిన తమ కోరికలకు వదిలివేసాడు. వాళ్ళ స్త్రీలు కూడా సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు.
ROM 1:27 అదే విధంగా, పురుషులు కూడా స్త్రీలతో సహజ సంపర్కాలు వదిలివేసి పురుషులతో సంపర్కం పొందాలనే కోరికలతో చెలరేగి పోయారు. పురుషులు పురుషులతో అసహజమైన సహవాసాలు చేసి తమ అసహజతకు తగిన శిక్షను స్వయంగా అనుభవిస్తున్నారు.
ROM 1:28 పైగా వాళ్ళు దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని లెక్కచెయ్యలేదు. కనుక దేవుడు వాళ్ళను వాళ్ళ నీఛ బుద్దికి వదిలి వేసాడు. తద్వారా వాళ్ళు చెయ్యరాని పనులు చేసారు.
ROM 1:29 అన్యాయం, దుష్టత్వం, దురాశ, దుర్నీతి, ద్వేషం, హత్య, పోరాటం, మోసం, అసూయ అనే గుణాలు వాళ్ళలో సంపూర్ణంగా నిండి పోయాయి. వాళ్ళు వృధాగా మాట్లాడుతూ,
ROM 1:30 ఇతర్లను నిందిస్తూ, దేవుణ్ణి ద్వేషిస్తూ, ఇతర్లపై దౌర్జన్యం చూపుతూ, గర్విస్తూ, బడాయిలు చెప్పుకొంటూ జీవిస్తూ ఉంటారు. దుర్మార్గపు పనులు చెయ్యటానికి రకరకలా మార్గాలు కనిపెడ్తూ ఉంటారు. అంతేకాక తమ తల్లిదండ్రుల పట్ల అవిధేయతగా ప్రవర్తిస్తూ ఉంటారు.
ROM 1:31 వాళ్ళలో తెలివిలేదు. విశ్వాసము లేదు, హృదయము లేదు, కనికరం లేదు.
ROM 1:32 దేవుని నీతి నియమములకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేసే వాళ్ళకు మరణ శిక్ష తప్పదని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండటమే కాకుండా ఆ పనులు చేసే వాళ్ళను మెచ్చుకొంటూ ఉంటారు.
ROM 2:1 ఇతర్లపై తీర్పు చెప్పే నీవు, ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఏవిషయాల్లో నీవు ఇతర్లపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవుకూడా చేస్తున్నావు. అందువల్ల నీకు నీవే శిక్ష విధించుకుంటున్నావు.
ROM 2:2 దేవుడు అలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్న వాళ్ళకు సత్యం ఆధారం మీద న్యాయమైన శిక్ష విధిస్తాడని మనకు తెలుసు.
ROM 2:3 మిత్రమా! ఏ కారణాలవల్ల నీవు వాళ్ళపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు?
ROM 2:4 లేక, నీవు దేవుని అనంతమైన దయను, క్షమను, సహనాన్ని ద్వేషిస్తున్నావా? నీవు మారుమనస్సు పొందాలని దేవుడు నీపై దయచూపాడు. ఈ విషయం నీకు తెలియదా?
ROM 2:5 కాని, నీది కఠిన హృదయం. అది పశ్చాత్తాపం పొందదు. కనుక దేవుడు ఆగ్రహం చూపే రోజున నీకు లభింపనున్న శిక్షను, స్వయంగా ఎక్కువ చేసుకొంటున్నావు. ఆరోజు న్యాయమైన తీర్పు నీకు వ్యక్తమౌతుంది.
ROM 2:6 ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు.
ROM 2:7 కొందరు ఎప్పుడూ మంచిపనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తేజస్సును, గౌరవాన్ని, నశించని దేహాన్ని పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకే దేవుడు అనంత జీవాన్నిస్తాడు.
ROM 2:8 మరికొందరు సత్యాన్ని తృణీకరించి, చెడును అనుసరిస్తూ స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు అలాంటి వాళ్ళపై తన ఆగ్రహాన్ని తీవ్రంగా చూపుతాడు.
ROM 2:9 చెడును చేసిన ప్రతి మనిషికి కష్టాలు, దుఃఖాలు సంభవిస్తాయి. అవి యూదులకు, తర్వాత ఇతరులకు కూడా సంభవిస్తాయి.
ROM 2:10 మంచి చేసిన ప్రతి ఒక్కనికి తేజస్సు, గౌరవము, శాంతి లభిస్తాయి. అవి మొదట యూదులకు తర్వాత ఇతరులకు కూడా లభిస్తాయి.
ROM 2:11 దేవుడు పక్షపాతం చూపడు.
ROM 2:12 ధర్మశాస్త్రము లేని పాపులు ధర్మశాస్త్రము లేకుండానే నశించిపోతారు. అలాగే ధర్మశాస్త్రం ఉండి కూడా పాపం చేసిన వాళ్ళపై దేవుడు ధర్మ శాస్త్రానుసారం తీర్పు చెపుతాడు.
ROM 2:13 ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతి మంతులు కాలేరు. కాని ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని విధేయతతో ఆచరించే వాళ్ళను దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తాడు.
ROM 2:14 యూదులుకాని వాళ్ళకు ధర్మశాస్త్రాం లేదు. కాని వాళ్ళు సహజంగా ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకొంటే వాళ్ళకు ధర్మశాస్త్రం లేకపోయినా, వాళ్ళు నడుచుకునే పద్దతే ఒక ధర్మశాస్త్రం అవుతుంది.
ROM 2:15 వాళ్ళ ప్రవర్తన, ధర్మశాస్త్ర నియమాలు వాళ్ళ హృదయాలపై వ్రాయబడినట్లు చూపిస్తుంది. ఇది నిజమని వాళ్ళ అంతరాత్మలు కూడా చెపుతున్నాయి. వాళ్ళు కొన్ని సార్లు సమర్థించుకొంటూ, మరి కొన్నిసార్లు నిందించుకొంటూ, తమలోతాము వాదించుకుంటూ ఉంటారు.
ROM 2:16 ఆ రోజు దేవుడు మానవుల రహస్య ఆలోచనలపై యేసు క్రీస్తు ద్వారా తీర్పు చెపుతాడు. నేను ప్రజలకు అందించే సువార్త ఈ విషయాన్ని తెలియజేస్తుంది.
ROM 2:17 నీవు యూదుడవని చెప్పుకొంటావు. ధర్మశాస్త్రాన్ని నమ్ముకొన్నావు. దేవునితో నీకు ఉన్న సంబంధాన్ని గురించి గర్వంగా చెప్పుకుంటావు.
ROM 2:18 నీవు ధర్మశాస్త్రం ప్రకారము శిక్షణ పొందావు. దేవుని ఉద్దేశ్యం తెలుసుకొన్నావు. మంచిని గర్తించ గలుగుతున్నావు.
ROM 2:19 అంధులకు మార్గదర్శివని, చీకట్లో ఉన్నవాళ్ళకు వెలుగువంటివాడవని నీవను కొంటున్నావు.
ROM 2:20 మీ ధర్మశాస్త్రంలో జ్ఞానం, సత్యం ఉన్నాయి కనుక నీవు మూర్ఖులను సరిదిద్దగలననుకొంటున్నావు. అజ్ఞానులకు బోధించగలననుకొంటున్నావు.
ROM 2:21 ఇతర్లకు బోధించే నీవు స్వయంగా నీకు నీవే ఎందుకు బోధించుకోవటం లేదు? దొంగతనము చేయరాదని బోధించే నీవు దొంగతనము చేయవచ్చా?
ROM 2:22 వ్యభిచారం చేయరాదని బోధించే నీవు వ్యభిచారం చేయవచ్చా? విగ్రహారాధనను అసహ్యించుకునే నీవు మందిరాలు దోచుకోవచ్చా?
ROM 2:23 ధర్మశాస్త్రాన్ని గురించి గర్వంగా చెప్పుకొనే నీవు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేవుణ్ణి అగౌరవపరచవచ్చా?
ROM 2:24 ఈ విషయంపై, “నీ కారణంగా దేవుని పేరు యూదులుకాని వాళ్ళ మధ్య దూషింపబడింది” అని వ్రాయబడివుంది.
ROM 2:25 ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే సున్నతికి విలువ ఉంది. కాని నీవు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, నీ సున్నతికి విలువలేదు.
ROM 2:26 కనుక సున్నతి చేయించుకోని వాళ్ళు ధర్మశాస్త్ర నియమాల్ని పాటిస్తే వాళ్ళు సున్నతి చేయించుకొన్న వాళ్ళతో సమానము కదా?
ROM 2:27 యూదులైన మీ దగ్గర ధర్మశాస్త్రం వ్రాత మూలంగా ఉంది. మీరు సున్నతి చేయించుకుంటారు. అయినా, మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లఘించారు కనుక, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వ్యక్తి, అతడు సున్నతి పొందని వాడైనా మీరు తప్పు చేస్తున్నారని రుజువు చేస్తున్నాడు.
ROM 2:28 నిజమైన సున్నతి బాహ్యమైనది, శారీరకమైనది కాదు. అదేవిధంగా యూదునివలే బాహ్యంగా కనబడినంత మాత్రాన యూదుడుకాలేడు.
ROM 2:29 అంతరంగంలో యూదునిగా ఉన్నవాడే నిజమైన యూదుడు. హృదయపు సున్నతి అంటే పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందటం అన్నమాట. ధర్మశాస్త్ర నియమంతో కాదు. ఇలాంటివాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. మానవులు కాదు.
ROM 3:1 సున్నతి పొందిన వాళ్ళలో ఏదైనా ప్రత్యేకత ఉందా? లేదు. మరి అలాంటప్పుడు యూదులుగా ఉండటంవల్ల వచ్చిన లాభమేమిటి?
ROM 3:2 ఎంతో లాభం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమేమిటంటే దేవుడు వాళ్ళకు తన సందేశాన్ని అప్పగించాడు.
ROM 3:3 మరి వాళ్ళల్లో కొందరు నమ్మతగని వాళ్ళున్నంత మాత్రాన దేవుడు నమ్మతగని వాడని అనగలమా?
ROM 3:4 అలా అనలేము. ప్రతి ఒక్కడూ అసత్యం చెప్పినాసరే, దేవుడు మాత్రం సత్యవంతుడుగా ఉంటాడు! ఈ విషయమై ఇలా వ్రాయబడివుంది: “నీవు మాట్లడినప్పుడు నిజం చెప్పావని ఋజువౌతుంది. నీపై విచారణ జరిగినప్పుడు నీవు గెలుస్తావు!”
ROM 3:5 మనం అధర్మంగా ఉన్నాము కనుకనే దేవునిలో ఉన్న ధర్మం స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమనగలము? దేవుడు మనల్ని శిక్షించి తప్పు చేస్తున్నాడనగలమా? నేను మానవ నైజం ప్రకారం తర్కిస్తున్నాను.
ROM 3:6 ఎన్నటికీ కాదు. అలాగైనట్లైతే దేవుడు ప్రపంచంపై ఎలా తీర్పు చెప్పగలడు?
ROM 3:7 “నేను అసత్యవంతునిగా ఉండటం వల్ల దేవుడు సత్యవంతుడనే కీర్తి పెరుగుతున్నట్లైతే, నేను పాపినని ఇంకా ఎందుకంటున్నారు?
ROM 3:8 మంచి కలగటానికి మనం పాపంచేద్దాం” అని అనకూడదు. మేమీవిధంగా బోధించినట్లు కొందరు మమ్మల్ని నిందించి అవమానిస్తున్నారు. వాళ్ళకు తగిన శిక్ష లభిస్తుంది.
ROM 3:9 మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్ళకంటే ఉత్తమమైన వాళ్ళమనా? ఎన్నటికి కాదు. యూదులు, యూదులుకాని వాళ్ళు, అందరూ సమానంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే ఋజువు చేసాను.
ROM 3:10 ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది: “నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు!
ROM 3:11 అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు. దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు.
ROM 3:12 అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. అందరూ కలిసి పనికిరాని వాళ్ళైపోయారు. మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడు!”
ROM 3:13 “వాళ్ళనోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి. వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి;” “వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!”
ROM 3:14 “వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!”
ROM 3:15 “వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి.
ROM 3:16 వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశ నాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు.
ROM 3:17 వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!”
ROM 3:18 “వాళ్ళ కళ్ళలో దైవభీతి కనిపించదు.”
ROM 3:19 ధర్మశాస్త్ర నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసిన వారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, అంటే యూదులు కాని వాళ్ళేకాక, యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు.
ROM 3:20 ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని, ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము.
ROM 3:21 కాని దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉపయోగించకుండా నీతిమంతులయ్యే విధానం మనకు తెలియచేసాడు. ఈ విధానాన్ని ప్రవక్తలు ముందే చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలోనూ ఉంది.
ROM 3:22 దీని ప్రకారం యేసు క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది.
ROM 3:23 అందరూ పాపం చేసారు, కనుక దేవుని తేజస్సు పంచుకోవటానికి ఎవ్వరికీ అర్హత లేదు. అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది. వ్యత్యాసం లేదు.
ROM 3:24 కాని, దేవుడు వాళ్ళను తన ఉచితమైన కృపవల్ల నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది యేసు క్రీస్తు వల్ల కలిగే విముక్తి ద్వారా సంభవిస్తుంది.
ROM 3:25 దేవుడు ఇది వరలో ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చెయ్యకుండా సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించాలని యేసు క్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజలకోసం ఆయనను కరుణాపీఠంగా చేసాడు.
ROM 3:26 అలా చేసి ఇప్పుడు తన నీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రజలు తనను నీతిమంతునిగా పరిగణించాలని, యేసును విశ్వసించే ప్రజలను నీతిమంతులుగా చెయ్యాలని ఆయన ఉద్దేశ్యం.
ROM 3:27 మరి, మనం గర్వించటానికి కారణం ఉందా? ఖచ్చితంగా లేదు. ఏ న్యాయం ప్రకారం కారణం లేదని చెప్పగలుగుతున్నాము? విశ్వాసానికి సంభందించిన న్యాయంవల్ల కారణం లేదని చెపుతున్నాము. కాని క్రియా న్యాయం వల్లకాదు.
ROM 3:28 మనిషిలో ఉన్న విశ్వాసం అతణ్ణి నీతిమంతునిగా చేస్తుంది. ధర్మశాస్త్రం ఆదేశించిన క్రియలు చేసినందుకు కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను.
ROM 3:29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడొక్కడే కనుక ఆయన యూదులు కాని వాళ్ళకు కూడా దేవుడే.
ROM 3:30 దేవుడు సున్నతి పొందిన వాళ్లను వాళ్ళలో విశ్వాసం ఉంది కనుక నీతిమంతులుగా పరిగణిస్తాడు. సున్నతి పొందని వాళ్ళను కూడా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా పరిగణిస్తాడు.
ROM 3:31 మరి అలాగైతే, ఈ విశ్వాసాన్ని స్థాపించి మనం ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? కాదు. దాని విలువను ఎత్తి చూపిస్తున్నాము.
ROM 4:1 అబ్రాహాము మన మూలపురుషుడు. అతడు ఈ విషయంలో ఏమి నేర్చుకొన్నాడు!
ROM 4:2 అబ్రాహాము చేసిన కార్యాలవలన అతడు నీతిమంతునిగా పరిగణింపబడి ఉంటే అతడు గర్వించటానికి కారణం ఉండేది. కాని దేవుని యెదుట కాదు
ROM 4:3 ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “అబ్రాహాము దేవుణ్ణి విశ్వసించాడు కనుక దేవుడు అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.”
ROM 4:4 పనిచేసేవానికి కూలి దొరుకుతుంది. అది అతని హక్కు. ఆ వచ్చిన జీతం బహుమానం కాదు.
ROM 4:5 దుర్మార్గుల్ని నీతిమంతులుగా చెయ్యగల దేవుడు, వాళ్ళు కార్యాలు చెయ్యకపోయినా వాళ్ళు తనను విశ్వసిస్తే, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళను నీతిమంతులుగా పరిగణిస్తాడు.
ROM 4:6 క్రియలు చేయకున్నా దేవునిచే నీతిమంతునిగా పరిగణింపబడిన మానవుడు ధన్యుడు. ఈ విషయాన్ని గురించి దావీదు ఈ విధంగా అన్నాడు:
ROM 4:7 “దేవుడు ఎవరి తప్పుల్ని, పాపాల్ని, క్షమిస్తాడో వాళ్ళు ధన్యులు.
ROM 4:8 ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ళ లెక్కలో వెయ్యడో వాళ్ళు ధన్యులు.”
ROM 4:9 మరి, సున్నతి చేయించుకొన్న వాళ్ళు మాత్రమే ధన్యులా లేక సున్నతి చేయించుకోని వాళ్ళు కూడా ధన్యులా? అబ్రాహాములో విశ్వాసం ఉండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడని మనమంటూ వచ్చాము.
ROM 4:10 దేవుడు, అతణ్ణి నీతిమంతునిగా ఎప్పుడు అన్నాడు? సున్నతి చేయించుకొన్న పిదపనా లేక ముందా? సున్నతి చేయించుకున్న పిదప కాదు, ముందే.
ROM 4:11 అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు అతనిలో విశ్వాస ముండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. దీనికి చిహ్నంగా అబ్రాహాము సున్నతిని ఒక ముద్రగా పొందాడు. తద్వారా సున్నతి పొందకున్నా, విశ్వాసం ఉన్న వాళ్ళకు అతడు తండ్రి అయ్యాడు. వీళ్ళను నీతిమంతులుగా పరిగణించాలని దేవుని ఉద్దేశం.
ROM 4:12 అబ్రాహాము సున్నతి చేయించు కొన్న వాళ్ళకు కూడా తండ్రి. అంటే అందరికి కాదు. మన తండ్రి అబ్రాహాము సున్నతి చేయించు కోకముందు నుండి అతనిలో ఉన్న విశ్వాసాన్ని తమలో చూపిన వాళ్ళకు మాత్రమే అతడు తండ్రి.
ROM 4:13 అబ్రాహాము మరియు అతని సంతానం ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని దేవుడు వాగ్దానం చేసాడు. ఈ వాగ్దానం ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు చెయ్యలేదు. అతనిలో విశ్వాస ముండటంవలన దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానం చేసాడు.
ROM 4:14 ఒకవేళ వారసులు కావటానికి ధర్మశాస్త్రాం కారణమైతే, విశ్వాసానికి విలున ఉండదు. పైగా వాగ్దానానికి అర్థం ఉండదు.
ROM 4:15 ధర్మశాస్త్రం ఉంటే దేవుని ఆగ్రహం ఉంటుంది. కాని ధర్మశాస్త్రం లేకపోతే దాన్ని అతిక్రమించే ప్రశ్నేరాదు.
ROM 4:16 ఆ వాగ్దానము విశ్వాసము ఉండటంవల్ల సంభవిస్తోంది. అది ఉచితంగా లభించాలని దేవుని ఉద్దేశ్యం. అది అబ్రాహాము సంతానానికంతా వర్తిస్తుందని దేవుడు అభయమిచ్చాడు. అంటే ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకే కాకుండా అబ్రాహాములో ఉన్న విశ్వాసాన్ని తమలో వ్యక్తం చేసే వాళ్ళకు కూడా అది వర్తిస్తుందన్న మాట. అబ్రాహాము మనందరికీ తండ్రి.
ROM 4:17 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను నిన్ను ఎన్నో జనాంగములకు తండ్రినిగా చేస్తాను.” దేవుని దృష్టిలో అబ్రాహాము మనకు తండ్రిలాంటి వాడు. దేవుడు చనిపోయిన వాళ్ళకు ప్రాణం పొయ్యగలడు. తన ఆజ్ఞలతో లేనివాటిని సృషించగలడు. అలాంటి దేవుణ్ణి అబ్రాహాము విశ్వసించాడు.
ROM 4:18 నిరాశా సమయంలో అబ్రాహాము ఆశతో నమ్ముకొన్నాడు. అందుకే అతడు ఎన్నో జనములకు తండ్రి అయ్యాడు. “నీ సంతతి వాళ్ళు చాలా మంది ఉంటారు” అని దేవుడు చెప్పిన ప్రకారమే జరిగింది.
ROM 4:19 అప్పటికి అబ్రాహాముకు సుమారు నూరు సంవత్సరాల వయస్సు. అతని శరీరం బలహీనంగా ఉండింది. పైగా శారాకు గర్భం దాల్చే వయస్సు దాటిపోయి ఉంది. ఈ సంగతులు అబ్రాహాముకు తెలుసు. అయినా అతని విశ్వాసం సన్నగిల్లలేదు.
ROM 4:20 దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు.
ROM 4:21 దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపు కోగలడని, ఆ శక్తి ఆయనలో ఉందని అబ్రాహాముకు సంపూర్ణమైన విశ్వాసం ఉండినది.
ROM 4:22 ఈ కారణంగానే, “దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు”
ROM 4:23 ‘నీతిమంతునిగా పరిగణించాడు’ అన్న పదాలు అతనికొరకు మాత్రమే వ్రాయబడలేదు.
ROM 4:24 అవి మనకోసం కూడా వ్రాయబడ్డాయి. మనము మన యేసు ప్రభువును బ్రతికించిన దేవునియందు విశ్వసిస్తున్నాము. కనుక దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా పరిగణిస్తాడు.
ROM 4:25 దేవుడు మన పాపాల కోసం ఆయన్ని మరణానికి అప్పగించాడు. మనం నీతిమంతులం కావాలని ఆయన్ని బ్రతికించాడు.
ROM 5:1 మనలో విశ్వాసము ఉండటం వలన దేవుడు మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. ఆ కారణంగా, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు దేవునితో స్నేహం కలిగింది.
ROM 5:2 మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితం దేవుని అనుగ్రహం వల్ల సంభవించింది. ఇది విశ్వాసంగల మనకు యేసు క్రీస్తు ద్వారా లభించింది. దేవుని తేజస్సులో భాగం పంచుకొంటామనే ఆశ మనలో ఉండటం వల్ల మనకు ఎంతో ఆనందం కలుగుతోంది.
ROM 5:3 అంతేకాదు, కష్టాలు సహనాన్ని పెంపొందింపచేస్తాయని మనకు తెలుసు. కనుక మనము కష్టాలు అనుభవించటంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాము.
ROM 5:4 సహనం వల్ల దేవుని మెప్పు, మెప్పువల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకొంటామనే నిరీక్షణ కలుగతోంది.
ROM 5:5 దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మనపై కురిపించాడు. కనుక ఆ ఆశ విషయంలో మనకు నిరాశ కలుగదు.
ROM 5:6 నిజానికి మనలో శక్తి లేని సమయాన భక్తిహీనులమైన మన కోసం క్రీస్తు మరణించాడు.
ROM 5:7 నీతిమంతుల కోసం మరణించటం చాలా అరుదు. మంచి స్నేహితుని కోసం ఒకడు ధైర్యం చేసి, మరణిస్తే మరణించవచ్చు.
ROM 5:8 కాని మనమింకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మన కోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మనకోసం వ్యక్తం చేసాడు.
ROM 5:9 దేవుడు యేసు క్రీస్తు రక్తంద్వారా మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. కనుక మనము దేవుని ఆగ్రహం నుండి తప్పకుండా రక్షింపబడుతాము. ఇది యేసు క్రీస్తు ద్వారా సంభవిస్తుంది.
ROM 5:10 ఒకప్పుడు మనం దేవుని శత్రువులం. అయినా తన కుమారుని మరణంవల్ల మనకు ఆయనతో సమాధానం కలిగింది. కనుక క్రీస్తు జీవితం ద్వారా ఆయన మనల్ని తప్పకుండా రక్షిస్తాడు.
ROM 5:11 పైగా మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో స్నేహం కలిగినందుకు మనం ఇప్పుడు ఆనందిస్తున్నాము.
ROM 5:12 పాపం ఈ ప్రపంచంలోకి ఆదాము ద్వారా ప్రవేశించింది. పాపం ద్వారా మరణం సంభవించింది. అంతేకాక అందరూ పాపంచేసారు కనుక అందరికీ మరణం ప్రాప్తించింది.
ROM 5:13 ధర్మశాస్త్రాని కి ముందే పాపం ఈ ప్రపంచంలో ఉండేది. కాని ధర్మశాస్త్రం లేక పోయినట్లైతే పాపం లెక్కలోకి వచ్చేది కాదు.
ROM 5:14 అయినా, ఆదాము కాలంనుండి మోషే కాలం వరకు మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాని అతనివలే పాపం చెయ్యని వాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది. ఆదాముకు, రానున్న వానికి కొంత పోలిక ఉంది.
ROM 5:15 కాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి పోలికలేదు. ఒకడు చేసిన పాపం వల్ల చాలా మంది మరణించారు. మరొకని అనుగ్రహం వల్ల, అంటే యేసు క్రీస్తు అనుగ్రహంవల్ల, దేవునిలో వరము, ఆయన అనుగ్రహము ఉచితంగా లభించాయి.
ROM 5:16 పైగా ఆదాము ఒక్కసారి చేసిన పాపానికి నేరస్థుడుగా తీర్పు ఇవ్వబడింది. కాని ఎన్నో పాపాలు చేసిన మనకు దేవుని నుండి నీతిమంతులముగా అయ్యే వరం లభించింది. అందువల్ల ఆదాము పాపాన్ని దేవుని వరంతో పోల్చలేము.
ROM 5:17 ఆదాము పాపం చేసాడు. ఆ ఒక్కని పాపంవల్ల మరణం రాజ్యం చేసింది. కాని ఆ “ఇంకొకని” ద్వారా అంటే యేసు క్రీస్తు ద్వారా ఆధ్యాత్మిక జీవితం పొంది రాజ్యం చెయ్యటం తథ్యం. ఇది దేవుని నుండి నీతియను వరాన్ని, సంపూర్ణమైన ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్ళకు సంభవిస్తుంది.
ROM 5:18 అందువల్ల ఒకడు చేసిన పాపంవల్ల ప్రజలందరికీ శిక్ష విధించబడింది. అదే విధంగా ఒకడు ఒక నీతికార్యాన్ని చేయటంవల్ల, అందరూ శిక్షను తప్పించు కొని అనంతజీవితం పొందుటకు మార్గమేర్పడింది.
ROM 5:19 ఒకని అవిధేయతవల్ల అనేకులు పాపులుగా చేయబడిరి. అలాగే ఒకని విధేయతవల్ల అనేకులు నీతిమంతులగుదురు.
ROM 5:20 పాపం అధికం కావాలని దేవుడు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. కాని పాపం అధికమైన చోటే అనుగ్రహం ఇంకా అధికమయ్యింది.
ROM 5:21 పాపం మరణం ద్వారా రాజ్యం చేసినట్లు దైవానుగ్రహం నీతిద్వారా రాజ్యం చేసింది. మన యేసు క్రీస్తు ప్రభువుద్వారా అది మనకు అనంత జీవం కలిగిస్తుంది.
ROM 6:1 దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా?
ROM 6:2 ఎన్నటికి కాదు. పాపపు జీవితం విషయంలో మనం మరణించినవారము. అలాంటప్పుడు మనం పాపంలో జీవించుకొంటూ ఎట్లా ఉండగలము?
ROM 6:3 బాప్తిస్మము పొందిన మన మందరము క్రీస్తు యేసులో ఐక్యత పొందాము. ఈ బాప్తిస్మము ద్వారా ఆయన మరణంలో కూడా భాగం పంచుకొన్నామని మీకు తెలియదా?
ROM 6:4 ఈ బాప్తిస్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా సమాధి పొందాము. తండ్రి తేజస్సు ద్వారా క్రీస్తు బ్రతికింపబడినట్లుగానే మనం కూడా నూతన జీవితాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం.
ROM 6:5 మనం ఆయన మరణంలో ఐక్యమైనట్లుగా ఆయన పునరుత్ధానములో కూడా మనం ఐక్యం కాగలం.
ROM 6:6 మన పాపజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమై, మన మిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు.
ROM 6:7 ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపంనుండి విముక్తి పొందుతాడు.
ROM 6:8 మనం క్రీస్తుతో కలిసి మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము.
ROM 6:9 దేవుడు క్రీస్తును బ్రతికించాడని, ఆయనకు మళ్ళీ మరణం ప్రాప్తించదని మనకు తెలుసు. మరణానికి ఆయనపై అధికారం ఉండదు.
ROM 6:10 పాపం విషయమై ఆయన ఒకే ఒకసారి మరణించాడు. కాని ఆయన జీవిస్తున్న జీవితం దేవుని కోసం జీవిస్తున్నాడు.
ROM 6:11 అదే విధంగా, మీరు పాపం విషయంలో మరణించినట్లు దేవునికోసం యేసుక్రీస్తులో జీవిస్తున్నట్లు భావించండి.
ROM 6:12 నశించిపోయే మన శరీరాన్ని పాపం పాలించకుండా జాగ్రత్త పడండి. దాని కోరికలకు లోబడకండి.
ROM 6:13 మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి. దానికి మారుగా మీరు చనిపోయి బ్రతికివచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి.
ROM 6:14 మీరు ధర్మశాస్త్రం యొక్క ఆదీనంలోలేరు. కాని దైవానుగ్రహంలో ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు.
ROM 6:15 అంటే? మనం ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేమని దానికి మారుగా దైవానుగ్రహంలోనున్నామని పాపం చెయ్యవచ్చా? అలా చెయ్యలేము.
ROM 6:16 సేవ చెయ్యటానికి మిమ్నల్ని మీరు బానిసలుగా అర్పించుకొంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు పాపానికి బానిసలైతే అది మరణానికి దారితీస్తుంది. కాని, దేవుని పట్ల విధేయతగా ఉంటే మీరు నీతిమంతులౌతారు.
ROM 6:17 ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు. కాని మీకందివ్వబడిన బోధనా విధానాన్ని మనసారా స్వీకరించి దాన్ని అనుసరించారు. దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పకొందాం.
ROM 6:18 మీరు పాపం నుండి విముక్తులై నీతికి బానిసలయ్యారు.
ROM 6:19 మీకు వీటిని అర్థం చేసుకొనే శక్తి లేదు కనుక నేను మాములు ఉదాహరణలు ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాను. ఇదివరలో మీరు మీ అవయవాల్ని అపవిత్రతకు, దుర్మార్గపు పనులు చెయ్యటానికి బానిసలుగా అర్పించుకొన్నారు. అదే విధంగా ఇప్పుడు మీ అవయవాల్ని నీతికి, పవిత్రతకు నడిపించే బానిసలుగా అర్పించుకోండి.
ROM 6:20 మీరు పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు నీతి మీపై రాజ్యం చెయ్యలేదు.
ROM 6:21 ఆ పనుల వల్ల మీరు ఏమి ఫలం పొందారు? వాటివల్ల మరణమే కలుగుతుంది.
ROM 6:22 ఇక ఇప్పుడు మీరు పాపంనుండి విముక్తులై దేవునికి బానిసలయ్యారు. కనుక మీరు పొందుతున్న ఫలం పవిత్రతకు దారి తీస్తుంది. చివరకు అనంత జీవితం లభిస్తుంది.
ROM 6:23 పాపం మరణాన్ని ప్రతి ఫలంగా ఇస్తుంది. కాని దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అనంతాన్ని బహుమానంగా ఇస్తాడు.
ROM 7:1 సోదరులారా! నేను ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రానికి ఒక వ్యక్తిపై అతడు బ్రతికి ఉన్నంతవరకే అధికారం కలిగి ఉంటుందని మీకు తెలియదా?
ROM 7:2 ఉదాహరణకు, ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ ఆమె భర్త జీవించి ఉన్నంతవరకే అతనికి బద్ధురాలై ఉంటుంది. ఒకవేళ అతడు మరణిస్తే ధర్మశాస్త్ర బంధం నుండి ఆమెకు విముక్తి కలుగుతుంది.
ROM 7:3 ఆమె భర్త జీవించి ఉండగా ఇంకొకణ్ణి వివాహమాడితే ఆమె వ్యభిచారి అనబడుతుంది. కాని ఆమె భర్త మరణిస్తే ఆమెకు ఆ చట్టం నుండి విముక్తి కలుగుతుంది. అప్పుడు ఆమె ఇంకొకణ్ణి వివాహం చేసుకొన్నా ఆమె వ్యభిచరించిన దానిగా పరిగణింపబడదు.
ROM 7:4 అదేవిధంగా నా సోదరులారా! మీరు కూడా క్రీస్తు శరీరంతో పాటు చనిపోయి ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి పొందారు. మీరు బ్రతికింపబడ్డ క్రీస్తుకు చెందిన వారై దేవుని కొరకు ఫలిస్తారు.
ROM 7:5 ధర్మశాస్త్రం మూలంగా కలిగిన దురాశలు మన శరీరాల్లో పని చేయటంవల్ల మనం మరణాన్ని పొందాము.
ROM 7:6 మనల్ని బంధించి ఉంచిన ధర్మశాస్త్రం విషయంలో మనం మరణించాము కనుక ఇప్పుడు మనము ఆ బంధం నుండి స్వేచ్చనుపొందాము. అందువల్ల వ్రాత పూర్వకంగా ఉన్న ధర్మశాస్త్రానికి మనమిక బానిసలము కాము. దేవుని ఆత్మ చూపించిన క్రొత్త మార్గాన్ని అనుసరించి మనము ఆయన సేవ చేస్తున్నాము.
ROM 7:7 అంటే, ధర్మశాస్త్రం పాపంతో కూడూకున్నదని అర్థమా? కాదు. ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే పాపమంటే నాకు తెలిసేది కాదు. “ఇతర్లకు చెందిన వాటిని ఆశించవద్దని” ధర్మశాస్త్రం చెప్పి ఉండకపోతే, ఆశించటమంటే ఏమో నాకు తెలిసేది కాదు.
ROM 7:8 ధర్మశాస్త్రం చెప్పిన ఆజ్ఞను ఉపయోగించి పాపం నాలో అన్ని రకాల దురాశల్ని కలిగించింది. ధర్మశాస్త్రం లేక పోయినట్లైతే పాపంలో ప్రాణముండేది కాదు.
ROM 7:9 ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించాను. కాని ఆజ్ఞ రాగానే పాపం మొలకెత్తింది. దానితో నేను మరణించాను.
ROM 7:10 జీవాన్నివ్వటానికి ఉద్దేశింపబడిన ఆ ఆజ్ఞ నాకు మరణాన్ని కలుగ చెయ్యటం గమనించాను.
ROM 7:11 “ఆజ్ఞ” కలుగ చేసిన అవకాశాన్ని ఉపయోగించుకొని, పాపం నన్ను మోసంచేసి ఆ ఆజ్ఞద్వారా నన్ను చంపివేసింది.
ROM 7:12 సరే! మరి, ధర్మశాస్త్రం పవిత్రమైంది. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతీ ఆజ్ఞ పవిత్రమైంది. దానిలో నీతి, మంచితనము ఉన్నాయి.
ROM 7:13 అలాగైతే, మరి ఆ మంచి ధర్మశాస్త్రం నాకు మరణాన్ని కలిగించిందా? ఎన్నటికి కాదు. ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి పాపం నాకు మరణాన్ని కలిగించి తన నిజ స్వరూపాన్ని వ్యక్త పరిచింది. అందువల్ల ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ ద్వారా పాపం ఇంకా గొప్ప పాపంగా కనిపించింది.
ROM 7:14 ధర్మశాస్త్రం ఆధ్యాత్మికమైనదని మనకు తెలుసు. కాని నేను బలహీనమైన మనిషిని, పాపానికి బానిసగా అమ్ముడుపోయిన వాణ్ణి.
ROM 7:15 నేనేం చేస్తున్నానో నాకు తెలియదు. నేను చెయ్యలనుకొన్నదాన్ని చెయ్యటంలేదు. దేన్ని ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నాను.
ROM 7:16 నేను వద్దను కున్న దాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని అంగీకరిస్తున్నాను.
ROM 7:17 నిజానికి చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది.
ROM 7:18 నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా చెయ్యలేకపోతున్నాను.
ROM 7:19 చెయ్యాలను కొన్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకొన్న చెడుపు నేను చేస్తూ పోతున్నాను.
ROM 7:20 చెయ్యకూడదనుకొన్న దాన్ని నేను చేస్తున్నానంటే, దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపమే అలా చేయిస్తోంది.
ROM 7:21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాతో అక్కడే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను.
ROM 7:22 నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో ఆనందం పొందుతోంది.
ROM 7:23 కాని, నా అవయవాల్లో వేరొక నియమం పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. నన్ను పాపాత్మునిగా చేస్తున్న ఈ నియమం నా మెదడులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి నన్ను ఖైదీగా చేస్తోంది.
ROM 7:24 నేనంత దౌర్భాగ్యుణ్ణి! మరణం యొక్క ఆధీనంలో ఉన్న ఈ నా శరీరంనుండి నన్ను ఎవరు రక్షిస్తారు?
ROM 7:25 అందువల్ల మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొందాం. స్వయంగా, బుద్ధి పూర్వకంగా నేను దేవుని ధర్మశాస్త్రానికి బానిసను. కాని నా శరీరం పాపాన్ని కలుగచేసే నియమానికి బానిస.
ROM 8:1 అందువల్ల, ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు.
ROM 8:2 దేవుని ఆత్మ మనం యేసు క్రీస్తుతో ఐక్యత పొందటంవల్ల మనలో జీవాన్ని కలుగచేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి, మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది.
ROM 8:3 ధర్మశాస్త్రం అన్నీ చెయ్యలేక పోయింది. పాప స్వభావం దాన్ని బలహీనంచేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు చేసే మానవుని రూపంలో పాపాలకు బలిగా పంపాడు. ఆయన వచ్చి మానవునిలో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు.
ROM 8:4 ధర్మశాస్త్రం ఆదేశించిన నీతికార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశ్యం. మనము పాప స్వభావంతో జీవించటంలేదు. పరిశుద్ధాత్మ చెప్పినట్లు జీవిస్తున్నాము.
ROM 8:5 ప్రాపంచికంగా జీవించే వాళ్ళ మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనై వుంటుంది. కాని దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించే వాళ్ళ మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకులోనై ఉంటుంది.
ROM 8:6 ప్రాపంచిక విషయాలకు లోనవటం వల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటం వల్ల జీవం. శాంతం లభిస్తాయి.
ROM 8:7 ఎందుకంటే, ప్రాపంచిక విషయాలకు లోనైనవాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండదు. ఉండజాలదు.
ROM 8:8 ప్రాపంచికంగా జీవించే వాళ్ళు దేవుని మెప్పుపొందలేరు.
ROM 8:9 దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నట్లైతే, మీరు ఈ లోక సంబంధంగా జీవించటంలేదన్నమాట. అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట క్రీస్తు యొక్క ఆత్మ తనలో లేనివాడు క్రీస్తుకు చెందడు.
ROM 8:10 ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లైతే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో వున్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసాడు కనుక, ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు.
ROM 8:11 మరణించిన యేసును దేవుడు లేపినాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, నశించిపోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి నుండి యేసును లేపినవాడు దేవుడే కావున మీలో నివసిస్తున్న ఆయన ఆత్మ ద్వారా దేవుడు మీ శరీరాలను జీవింపచేస్తాడు.
ROM 8:12 అందువల్ల సోదరులారా! మనము మన ఐహిక వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు.
ROM 8:13 ఎందుకంటే, ఐహికవాంఛలతో జీవిస్తే మీరు మరణిస్తారు. కాని శరీరం చేస్తున్న చెడ్డ పనుల్ని ఆత్మ ద్వారా రూపు మాపితే మీరు జీవిస్తారు.
ROM 8:14 దేవుని ఆత్మను అనుసరించిన వాళ్ళు దేవుని కుమారులు.
ROM 8:15 మీరు బానిసలయ్యే ఆత్మను పొందలేదు. మీరు దేవుని కుమారులుగా అయ్యే ఆత్మను పొందారు. ఇది మీలో భయం కలిగించదు. దానికి మారుగా మనము దేవుణ్ణి, “అబ్బా! తండ్రీ!” అని పిలుస్తున్నాము
ROM 8:16 మనం దేవుని పుత్రులమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెపుతున్నాడు.
ROM 8:17 మనము దేవుని సంతానము కనుక మనము ఆయన వారసులము. క్రీస్తుతో సహావారసులము. మనము ఆయనలో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకొంటే, ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి.
ROM 8:18 మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం.
ROM 8:19 దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది.
ROM 8:20 సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా, దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది.
ROM 8:21 బానిసత్వంతో క్షిణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్చను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది.
ROM 8:22 సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు.
ROM 8:23 అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము.
ROM 8:24 మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు?
ROM 8:25 కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము.
ROM 8:26 అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు.
ROM 8:27 ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్చానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు.
ROM 8:28 దేవుడు తనను ప్రేమించే ప్రజల కేసం, తన ఉద్దేశానుసారం పిలువబడిన వాళ్ళకోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు.
ROM 8:29 దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్ళను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్ళలో యేసు మొట్ట మొదటి వానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం.
ROM 8:30 దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహిమను పంచుకొన్నాడు.
ROM 8:31 మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు?
ROM 8:32 మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా?
ROM 8:33 దేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే.
ROM 8:34 ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు.
ROM 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా?
ROM 8:36 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము, మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.”
ROM 8:37 ఈ విషయాలన్నిటిలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము.
ROM 8:38 చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలు గాని, దయ్యాలుగాని, ప్రస్తుతం గాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని
ROM 8:39 ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను.
ROM 9:1 క్రీస్తు పేరిట నేను నిజం చెపుతున్నాను. నేను అసత్యమాడటం లేదు. నా అంతరాత్మ, పవిత్రాత్మ ద్వారా ఇది నిజమని సాక్ష్యం చెబుతోంది.
ROM 9:2 నాలో చాలా దుఃఖం ఉంది. అంతంగాని ఆవేదన నా హృదయంలో ఉంది.
ROM 9:3 నా వంశానికి చెందిన నా సోదరుల కోసం దేవుడు నన్ను శపించినా, క్రీస్తు నుండి నన్ను వేరు చేసినా నాకు సంతోషమే.
ROM 9:4 ఈ నా సోదరులు ఇశ్రాయేలు వంశానికి చెందిన వాళ్ళు. దేవుడు వాళ్ళను తన పుత్రులుగా చేసుకొని మహిమను, ఒడంబడికలను, ధర్మశాస్త్రాన్ని, ఆరాధనా విధానాన్ని ఇచ్చి వాగ్దానాలు చేసాడు.
ROM 9:5 మూల పురుషులు వీళ్ళ వంశానికి చెందిన వాళ్ళు. క్రీస్తు వీళ్ళ వంశంలో జన్మించాడు. క్రీస్తు అందరికీ దేవుడు. ఆయన్ని చిరకాలం అందరూ స్తుతించుగాక! ఆమేన్!
ROM 9:6 ఇశ్రాయేలు వంశానికి చెందిన వాళ్ళందర్ని దేవుడు తన ప్రజలుగా ఎన్నుకోలేదు. కాబట్టి దేవుని మాట పరాజయం పొందిందని మనమనకూడదు.
ROM 9:7 లేక అబ్రాహాము సంతానమందరూ నిజంగా అబ్రాహాము సంతానమని మనమనలేము. కాని ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఇస్సాకు వల్ల మాత్రమే నీ సంతానం గుర్తింపబడుతుంది.”
ROM 9:8 ఇంకొక రీతిగా చెప్పాలంటే అబ్రాహాముకు ప్రకృతి సహజంగా జన్మించినంత మాత్రాన దేవుని సంతానంగా పరిగణింపబడరు. కాని దేవుని వాగ్దానం మూలంగా అతనికి కలిగిన సంతానం అబ్రాహాము సంతానంగా పరిగణింపబడుతుంది.
ROM 9:9 ఈ వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నియమిత సమయానికి నేను తిరిగి వస్తాను, శారాకు పుత్రుడు జన్మిస్తాడు.”
ROM 9:10 అంతేకాదు. రిబ్కాకు, మన మూల పురుషుడైన ఇస్సాకు ద్వారా ఇద్దరు పుత్రులు కలిగారు.
ROM 9:11 కాని దేవుడు ఒక్కణ్ణే ఎన్నుకోవాలని, తద్వారా తన ఉద్దేశ్యం సంపూర్ణంగా నెరవేరాలని, రిబ్కాతో, “పెద్దవాడు, చిన్నవాని సేవ చేస్తాడు” అని అన్నాడు. అప్పటికింకా ఈ కవలలు జన్మించలేదు కనుక వాళ్ళు మంచి, చెడు, చేసే ప్రశ్నే రాదు. అంటే దేవుడు తన ఇష్ట ప్రకారం పిలిచాడు. కాని, ఈ పిలుపు వాళ్ళు చేసిన పనులపై ఆధారపడలేదన్న మాట.
ROM 9:13 ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను యాకోబును ప్రేమించాను, కాని ఏశావును ద్వేషించాను.”
ROM 9:14 మరి, మనమేమనాలి? దేవుడు అన్యాయం చేసాడా? లేదు.
ROM 9:15 ఎందుకంటే ఆయన మోషేతో ఈ విధంగా అన్నాడు: “నాకిష్టం వచ్చిన వాళ్ళను కరుణిస్తాను, నాకిష్టం వచ్చిన వాళ్ళపై దయ చూపిస్తాను.”
ROM 9:16 అందువల్ల ఇది, మానవుని అభీష్టంపై కాని, లేక అతని శ్రమపై కాని ఆధారపడింది కాదు. ఇది దేవుని కనికరంపై ఆధారపడింది.
ROM 9:17 లేఖనము ఫరోతో ఈ విధంగా అంటుంది: “నీ ద్వారా నా శక్తి వ్యక్తం చెయ్యాలనీ, ప్రపంచమంతా నా పేరు ప్రకటింపబడాలనీ, నేను నిన్ను రాజుగా చేసాను.”
ROM 9:18 అంటే, దేవుడు తనకిష్టమున్న వాళ్ళపై కనికరం చూపిస్తాడు, తనకిష్టమున్న వాళ్ళపై కఠినత్వం చూపిస్తాడు.
ROM 9:19 మీరు నాతో, “మరి దేవుడు మమ్ముల్ని ఎందుకు ఇంకా నిందిస్తున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు కాదనగలరు?” అని అనవచ్చు.
ROM 9:20 కాని, ఓ మనిషీ! దేవునితో ఎదురు తిరిగి మాట్లాడటానికి నీవెవరవు? సృష్టింపబడింది సృష్టికర్తతో, “నన్నీవిధంగా ఎందుకు సృష్టించావు?” అని అడగవచ్చా?
ROM 9:21 కుమ్మరి ఒకే మట్టి ముద్దతో కొన్ని కుండల్ని మంచి పనులకోసం, మరి కొన్నిటిని మామూలుగా ఉపయోగించుకోవటానికి చేస్తాడు. అలా చెయ్యటానికి అతనికి అధికారం లేదా?
ROM 9:22 భవిష్యత్తులో దేవుడు తన కోపాన్ని చూపాలని, తన శక్తిని తెలియచెయ్యాలని, నాశనం చెయ్యతగిన దుర్మార్గుల పట్ల సహనం వహించాడంటే మనమేమనగలము?
ROM 9:23 దేవుడు తన తేజస్సులోని గొప్పతనాన్ని తెలియచెయ్యాలని తన మహిమను పంచుకోవటానికి దయతో ఇతర్లను సృష్టించాడంటే మనం ఏమనగలం?
ROM 9:24 యూదుల నుండే కాక, యూదులు కాని వాళ్ళ నుండి కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది మనల్నే.
ROM 9:25 హోషేయ గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు: “నా ప్రజలు కాని వాళ్ళను నా ప్రజలని పిలుస్తాను. నా ప్రియురాలు కాని జనాన్ని నా ప్రియురాలా అని పిలుస్తాను.”
ROM 9:26 “మీరు నా ప్రజలు కారు అని అన్న చోటనే మీరు సజీవంగా ఉండే దేవుని పుత్రులు అని అనటం సంభవిస్తుంది.”
ROM 9:27 యెషయా ప్రవక్త ఇశ్రాయేలు వంశాన్ని గురించి ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు పుత్రుల సంఖ్య సముద్ర తీరంపై ఉన్న ఇసుక రేణువుల్లా ఉన్నా, కొందరు మాత్రమే రక్షింపబడతారు.
ROM 9:28 ఎందుకంటే, ప్రపంచానికి విధించిన శిక్షను ప్రభువు త్వరలోనే నెరవేరుస్తాడు.”
ROM 9:29 యెషయా జరుగుతుందని చెప్పినట్లు: “సర్వ శక్తిసంపన్నుడైన ప్రభువు కొంత మందిని మనకు వదిలి ఉండక పోయినట్లైతే మనం సొదొమ ప్రజలవలే, గొమొఱ్ఱా ప్రజలవలె ఉండే వాళ్ళం.”
ROM 9:30 మరి మనమేమనాలి? నీతిమంతులు కావటానికి ప్రయత్నించని యూదులుకాని ప్రజలు నీతిమంతులయ్యారు. అది వాళ్ళల్లో విశ్వాసం ఉండటం వల్ల సంభవించింది.
ROM 9:31 కాని ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కావాలని ప్రయత్నించిన ఇశ్రాయేలు వంశీయులు నీతిమంతులు కాలేదు.
ROM 9:32 ఎందుకు? వాళ్ళు విశ్వాసంతో కాకుండా కార్యాలు చేసి ప్రయత్నించారు. కనుక అడ్డురాయి తగిలి తొట్రుపడ్డారు.
ROM 9:33 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను సీయోనులో ఒక రాయిని స్థాపించాను. దాని వల్ల కొందరు తొట్రుపడతారు. నేనొక శిలను స్థాపిస్తాను. దాని వల్ల వాళ్ళు క్రింద పడతారు. ఆయన్ని నమ్మిన వానికెన్నడూ ఆశాభంగం కలుగదు.”
ROM 10:1 సోదరులారా! దేవుడు ఇశ్రాయేలు వరశీయుల్ని రక్షించాలని హృదయ పూర్వకంగా ప్రార్థిస్తున్నాను.
ROM 10:2 వాళ్ళు శ్రద్ధతో దేవుని సేవ చేస్తున్నారని నేను సాక్ష్యం చెప్పగలను. కాని వాళ్ళ శ్రద్ధ జ్ఞానం మీద ఆధారపడలేదు.
ROM 10:3 దేవుడు నీతిమంతులుగా చేసే విధానాన్ని గురించి తెలియక వాళ్ళు తమ విధానాన్ని స్థాపించాలనుకొన్నరు. కనుక వాళ్ళు దేవుడు చెప్పిన విధానాన్ని అంగీకరించలేదు.
ROM 10:4 నమ్మిన ప్రతి ఒక్కడూ నీతిమంతుడు కావాలని క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రం అంతమైపోయింది.
ROM 10:5 ధర్మశాస్త్రం ద్వారా లభించే నీతిని గురించి మోషే ఈ విధంగా వ్రాస్తున్నాడు: “ధర్మశాస్త్ర క్రియలు చేసే మానవుడు వీటి ద్వారా జీవిస్తాడు”
ROM 10:6 కాని విశ్వాసం వల్ల కలిగే నీతిని గురించి ఈ విధంగా వ్రాశారు: “పరలోకానికి ఎవరు ఎక్కుతారు?” అని అనకండి. అంటే ఎవరు పరలోకానికి ఎక్కి క్రీస్తును క్రిందికి పిలుచుకు రాగలరు?
ROM 10:7 “అగాధంలోకి ఎవరు దిగుతారు?” అని అనకండి. అంటే ఎవరు అగాధంలోకి దిగి క్రీస్తును చావునుండి పిలుచుకు రాగలరు?
ROM 10:8 మరి వాక్యమేమంటున్నది! “దైవసందేశం మీకు దగ్గరగా ఉంది. అది మీ నోటిలో ఉంది, మీ హృదయాల్లో ఉంది.” ఇది విశ్వాసానికి సంబంధించిన సందేశము. దీన్ని మేము ప్రకటిస్తున్నాము.
ROM 10:9 యేసు, ప్రభువని మీ నోటితో బహిరంగంగా ఒప్పుకొని చనిపోయిన వారిలో నుండి దేవుడాయన్ని బ్రతికించాడని మీ హృదయాల్లో విశ్వసిస్తే మీరు రక్షింపబడుతారు.
ROM 10:10 ఎందుకంటే మనము, మన హృదయాలతో విశ్వసిస్తాము కనుక నీతిమంతులుగా పరిగణింపబడుతాము. నోటితో ఒప్పుకొంటాము కనుక రక్షణను పొందుతాము.
ROM 10:11 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఆయన్ని నమ్మిన వానికి ఆశాభంగం కలుగదు.”
ROM 10:12 యూదులకు, యూదులు కానివాళ్ళకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే అందరికి ప్రభువు. ఆయన, తనను ప్రార్థించిన వాళ్ళందరికీ అడిగినంత ఇస్తాడు.
ROM 10:13 దీన్ని గురించి, “ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు” అని వ్రాయబడి ఉంది.
ROM 10:14 మరి, విశ్వసించకుండా ఎలా ప్రార్థించగలరు? ఆయన్ని గురించి వినకుండా వాళ్ళు ఆయన్ని ఏ విధంగా విశ్వసించగలరు? వాళ్ళకు ఎవరో ఒకరు చెప్పకుంటే వాళ్ళు ఏ విధంగా వినగలరు?
ROM 10:15 ఎవరైనా పంపందే వాళ్ళు వచ్చి ఎలా చెపుతారు? దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “సువార్తను తచ్చేవాళ్ళ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!”
ROM 10:16 కాని సువార్తను అందరూ అంగీకరించలేదు. యెషయా ఈ విధంగా అన్నాడు: “ప్రభూ! మేము చెప్పినదాన్ని ఎవరు నమ్మారు?”
ROM 10:17 తద్వారా, సువార్తను వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు సందేశం ద్వారా సువార్త వినటం సంభవిస్తుంది.
ROM 10:18 “వాళ్ళు వినలేదా?” అని నేనడుగుతున్నాను. వాళ్ళు విన్నారు. ఆ విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “వాళ్ళ స్వరం ప్రపంచమంతా వినిపించింది. వాళ్ళు పలికిన మాటలు ప్రపంచం నలుమూలలా వినిపించాయి.”
ROM 10:19 “ఇశ్రాయేలుకు ఈ విషయం తెలియదా?” అని నేను మళ్ళీ అడుగుచున్నాను. అవును వారికి తెలిసింది. మోషే మొదట ఈ విధంగా అన్నాడు: “జనాంగము కాని వారి ద్వారా మీరు అసూయ పడేటట్లు చేస్తాను అర్థం చేసుకోలేని జనము ద్వారా మీరు కోపం చెందేటట్లు చేస్తాను.”
ROM 10:20 యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు: “నా కోసం వెదకని వాళ్ళు నన్ను కనుగొంటారు. నా కోసం అడగని వాళ్ళకు నేను స్వయంగా ప్రత్యక్షమయ్యాను.”
ROM 10:21 కాని ఇశ్రాయేలు ప్రజల్ని గురించి అతడు ఈ విధంగా అన్నాడు: “అవిధేయతతో ఎదురుతిరిగి మాట్లాడుతున్న ప్రజల కోసం దినమంతా వేచియున్నాను.”
ROM 11:1 “మరి దేవుడు తన ప్రజల్ని నిరాకరించాడా?” అని నేను అడుగుతున్నాను. లేదు, నేను స్వయంగా ఇశ్రాయేలు వంశీయుణ్ణి. బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. అబ్రాహాము మా మూలపురుషుడు.
ROM 11:2 తనకు ముందే తెలిసిన ప్రజల్ని దేవుడు నిరాకరించలేదు. లేఖనాల్లో ఏలీయాను గురించి ఏమని వ్రాసారో మీకు తెలియదా? అతడు ఇశ్రాయేలు వంశీయులపై నేరారోపణ చేస్తూ దేవునితో ఈ విధంగా విన్నవించుకొన్నాడు:
ROM 11:3 “ప్రభూ! వాళ్ళు నీ ప్రవక్తల్ని చంపి వేసారు. నీ బలిపీఠాన్ని నేలమట్టం చేసారు. మిగిలిన వాణ్ణి నేనొక్కణ్ణే. నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నారు.”
ROM 11:4 అప్పుడు దేవుని స్వరం ఈ విధంగా అన్నది: “బయలు ముందు మోకరించని ఏడువేల మందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచుకొన్నాను.”
ROM 11:5 అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు కరుణించిన కొద్దిమంది మిగిలిపొయ్యారు.
ROM 11:6 ఇది దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. అంటే, అది మానవులు చేసిన కార్యాలపై ఆధారపడింది కాదన్నమాట. అలా కాకపోయినట్లైతే అనుగ్రహానికి అర్థం ఉండేది కాదు.
ROM 11:7 అంటే ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు మనసారా కోరుకొన్నది లభించలేదు. కాని దేవుడు ఎన్నుకొన్న వాళ్ళకు అది లభించింది. ఇశ్రాయేలు దేశంలోని మిగతా ప్రజలు సువార్తను నిరాకరించారన్న విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “దేవుడు వాళ్ళకు మత్తుగల ఆత్మను.” “చూడలేని కళ్ళను, వినలేని చెవుల్ని ఇచ్చాడు. ఈనాడు కూడా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు.”
ROM 11:9 ఈ సందర్భాన్ని గురించి దావీదు ఈ విధంగా అంటున్నాడు: “వాళ్ళు విందులు చేస్తున్నప్పుడు వేసుకొన్న బల్లలు బోనులవలె, వలలవలె మారుగాక! వాళ్ళు క్రిందపడి శిక్షను అనుభవించుదురు గాక!
ROM 11:10 వాళ్ళ కన్నులు చీకటితో నిండిపోయి, వాళ్ళ దృష్టి నశించుగాక! వాళ్ళ నడుములు కష్టాలతో వంగిపోయి వాళ్ళు ఎప్పుడూ అదే స్థితిలో ఉండిపోవుదురు గాక!”
ROM 11:11 నేను ఇంకొక ప్రశ్న వేస్తాను: యూదులు లేవలేనంత క్రిందపడి పొయ్యారా? లేదు. వాళ్ళు పాపాలు చేయటం వల్ల యూదులు కాని వాళ్ళకు రక్షణ లభించింది. యూదుల్లో ఈర్ష్య కలగాలని ఇలా జరిగింది.
ROM 11:12 వాళ్ళు పాపాలు చెయ్యటం వల్ల ప్రపంచానికి ఐశ్వర్యం కలిగింది. వాళ్ళకు నష్టం కలగటం వల్ల యూదులు కానివాళ్ళు భాగ్యవంతులయ్యారు. అలాగైతే వాళ్ళు సంపూర్ణంగా క్రీస్తును అంగీకరించియుంటే ఇంకెంత లాభం కలుగుతుందో గ్రహించండి.
ROM 11:13 యూదులుకాని ప్రజలారా! ఇప్పుడిక నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీ కోసం క్రీస్తు అపొస్తలునిగా పని చేస్తున్నాను కనుక, నేను చేస్తున్న పనిపట్ల నాకు ఎంతో గౌరవం ఉంది.
ROM 11:14 ఈ విధంగానైనా నా వాళ్ళలో ఈర్ష్య కలుగచేసి, వాళ్ళలో కొందర్నైనా రక్షించ కలుగుతానని ఆశిస్తున్నాను.
ROM 11:15 వాళ్ళు నిరాకరించటం వల్ల ప్రపంచానికి దేవునితో స్నేహం కలిగింది. అలాంటప్పుడు వాళ్ళు అంగీకరించియుంటే మరణంనుండి జీవానికి వచ్చినట్లే. పిండిముద్దలో ఒక భాగం ప్రథమ ఫలంగా సమర్పిస్తే అది పవిత్రమైతే
ROM 11:16 దేవునికి పవిత్రమైనట్లే కదా! వేర్లు పవిత్రమైతే కొమ్మలు పవిత్రమైనట్లే కదా!
ROM 11:17 చెట్టు కొమ్మల్ని కొన్నిటిని కొట్టివేసి, అడవి ఒలీవ చెట్ల కొమ్మలవలెనున్న మిమ్మల్ని దేవుడు అంటుకట్టాడు. తద్వారా వేరులోనున్న బలాన్ని మీరు పంచుకొంటున్నారు.
ROM 11:18 కాని ఆ కొమ్మలపైగా గర్వించకండి. మీ వల్ల వేరు పోషింపబటలేదు. వేరు వల్ల మీరు పోషింపబడుతున్నారు.
ROM 11:19 మమ్మల్ని అంటు కట్టాలని కొమ్మలు కొట్టివేయబడ్డాయి అని మీరనవచ్చు.
ROM 11:20 నిజమే! విశ్వాసం లేనందువల్ల అవి కొట్టి వేయబడ్డాయి. మీలో విశ్వాసం ఉండటం వల్ల మీరా చెట్టునంటుకొని ఉన్నారు. అలా అని గర్వించకండి. భయంతో ఉండండి.
ROM 11:21 ఎందుకంటే, సహజంగా పెరిగిన కొమ్మల్ని దేవుడు లెక్క చేయలేదంటే మిమ్మల్ని కూడా లెక్క చేయడు.
ROM 11:22 అందువల్ల దేవుని కరుణను, కోపాన్ని అర్థం చేసుకొనండి. విశ్వసించని కొమ్మల్ని నరికి వేసి ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు. మీరు ఆయన కరుణను అంటి పెట్టుకొని జీవిస్తుంటే కరుణను చూపుతూ ఉంటాడు. లేని పక్షాన మిమ్మల్ని కూడా కొట్టివేస్తాడు.
ROM 11:23 వాళ్ళు, మేము విశ్వాసహీనంగా ఉంటామని మొండి పట్టు పట్టకుండా ఉంటే, దేవుడు మళ్ళీ వాళ్ళను అంటు కడతాడు. వాళ్ళను తిరిగి అంటుకట్టే శక్తి దేవునికి ఉంది.
ROM 11:24 స్వాభావికంగా అడవి జాతికి చెందిన ఒలీవల చెట్లనుండి కొట్టిన కొమ్మలవలెనున్న మిమ్మల్ని మేలురకపు చెట్టుకు అంటు వేయగలిగితే, మేలు రకపు ఒలీవల చెట్ల కొమ్మల్ని స్వజాతికి చెందిన చెట్టుకు అంటు వేయటం ఇంకెంత సులభమో ఆలోచించండి.
ROM 11:25 సోదరులారా! మీరు తెలుసుకోవాలని మీకీ రహస్యం చెప్పాలనుకొంటున్నాను. మీరు అజ్ఞానులుగా ఉండటం నాకిష్టం లేదు. కొందరు ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖత్వంతో ఉన్నారు. నాటబడాలని కోరుకొంటున్న యూదులుకాని ప్రజలు నాటబడే వరకు ఈ మూర్ఖత్వం వీళ్ళలో ఉంటుంది.
ROM 11:26 శాస్త్రాల్లో వ్రాసినట్లు ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా రక్షింపబడతారు: “రక్షకుడు సీయోను నుండి వస్తాడు; అతడు యాకోబు వంశీయుల్లో ఉన్న చెడును తొలగిస్తాడు.
ROM 11:27 నేను వాళ్ళ పాపాలను తొలగించినప్పుడు, వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను.”
ROM 11:28 ఒక విధంగా చూస్తే వాళ్ళు సువార్తను బట్టి మీకు శత్రువులు. మరొక విధంగా చూస్తే వాళ్ళు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళు కనుక, వాళ్ళ మూల పురుషుల్ని బట్టి వాళ్ళు ప్రేమించబడ్డారు.
ROM 11:29 ఎందుకంటే, దేవుడు “వరాల” విషయంలో, ‘పిలుపు’ విషయంలో మనస్సు మార్చుకోడు.
ROM 11:30 యూదులు కాని మీరు ఒకప్పుడు దేవుణ్ణి నిరాకరించారు. కాని ఇప్పుడు యూదులు సువార్తను నిరాకరించటం వల్ల దైవానుగ్రహం మీకు లభించింది.
ROM 11:31 అదే విధంగా ఇప్పుడు యూదులు దేవుణ్ణి నిరాకరిస్తున్నారు. అందువల్ల, మీకు లభించిన అనుగ్రహం ద్వారా వాళ్ళకు కూడా దైవానుగ్రహం లభిస్తుంది.
ROM 11:32 ఎందుకంటే, దేవుడు అందరిపై అనుగ్రహం చూపాలని అందర్ని కలిపి అవిధేయతకు బంధించి వేసాడు?
ROM 11:33 దేవుని దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది. దేవుని జ్ఞానం, విజ్ఞానం అతీతమైనది. ఆయన తీర్పులు ఎవ్వరికీ అర్థం కావు. ఆయన మార్గాల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు.
ROM 11:34 “ప్రభువు మనస్సు ఎవరికి తెలుసు? ఆయనకు సలహా చెప్పేవాడెవరు?” యెషయా 40:13
ROM 11:35 “దేవునికి ఎవరు అప్పిచ్చారు? ఆయన ఎవరికీ ఋణపడలేదు.”
ROM 11:36 అన్ని వస్తువులు, ఆయన్నుండి వచ్చాయి. ఆయన ద్వారా వచ్చాయి, అన్నీ ఆయన కొరకే ఉన్నాయి. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
ROM 12:1 అందువల్ల నా సోదరులారా! నేను మీకీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుడు తన అనుగ్రహం చూపించాడు కనుక మీ జీవితాల్ని ఆయనకు అర్పించుకోండి. ఆయనకు ఆనందం కలిగేటట్లు పవిత్రంగా జీవించండి. ఇదే మీరు చేయవలసిన నిజమైన సేవ!
ROM 12:2 ఇక మీదట ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనస్సు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అప్పుడు మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని, అది ఉత్తమమైనదనీ, ఆనందం కలిగిస్తుందనీ, పరిపూర్ణమైనదనీ గ్రహిస్తారు!
ROM 12:3 దేవుడు నాకిచ్చిన అనుగ్రహాన్ని ఆధారంగా తీసుకొని మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మిమ్మల్ని గురించి మీరు ఉన్నదాని కంటే గొప్పగా భావించకండి. సక్రమంగా ఉండి దేవుడిచ్చిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి.
ROM 12:4 దేహానికి ఎన్నో అవయవాలుంటాయి. ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు.
ROM 12:5 అదే విధంగా అధిక సంఖ్యలో ఉన్న మనమంతా క్రీస్తులో ఒకే దేహంగా రూపొందింపబడ్డాము. ప్రతి సభ్యునికి మిగతా సభ్యులతో సంబంధం ఉంది.
ROM 12:6 దేవుని అనుగ్రహం వల్ల మనందరికి రకరకాల కృపావరాలు లభించాయి. దైవసందేశాన్ని గురించి మాట్లాడే వరాన్ని పొందిన వాళ్ళు ఆ పనిని విశ్వాసంతో చెయ్యాలి.
ROM 12:7 సేవ చేసే వరం పొందిన వాళ్ళు సేవ చెయ్యాలి. బోధించే వరం పొందిన వాళ్ళు బోధించాలి.
ROM 12:8 ప్రజలను ప్రోత్సాహపరచే వరం పొందిన వాళ్ళు ప్రోత్సాహ పరచాలి. దానం చేసే వరం పొందిన వాళ్ళు ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహించాలని వరం పొందిన వాళ్ళు శ్రద్ధతో నాయకత్వం చెయ్యాలి. దయ చూపాలని వరం పొందిన వాళ్ళు ఆనందంగా దయ చూపాలి.
ROM 12:9 ప్రేమలో నిజాయితీగా ఉండండి. దుర్మార్గాన్ని ద్వేషించండి. మంచిని అంటి పెట్టుకొని ఉండండి.
ROM 12:10 సోదర ప్రేమతో, మమతతో ఉండండి. మీ సోదరులను మీకన్నా అధికులుగా భావించి గౌరవిస్తూ ఉండండి.
ROM 12:11 ఉత్సాహాన్ని వదులుకోకుండా ఉత్తేజితమైన ఆత్మతో ప్రభువు సేవ చేయండి.
ROM 12:12 పరలోకం లభిస్తుందన్న ఆశతో ఆనందం పొందుతూ, కష్ట సమయాల్లో సహనం వహించి, అన్ని వేళలా విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండండి.
ROM 12:13 మీ సహాయం అవసరమున్న దేవుని ప్రజలతో మీకున్న వాటిని పంచుకోండి. ఆతిథ్యాన్ని మరువకండి.
ROM 12:14 మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళను ఆశీర్వదించండి. ఆశీర్వదించాలి, కాని దూషించకూడదు.
ROM 12:15 ఆనందంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, దుఃఖంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి.
ROM 12:16 అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించండి. గర్వించకండి. తక్కువ స్థాయిగల వాళ్ళతో సహవాసం చెయ్యండి. మీలో మాత్రమే జ్ఞానం ఉందని భావించకండి.
ROM 12:17 కీడు చేసిన వాళ్ళకు కీడు చెయ్యకండి. ప్రతి ఒక్కరి దృష్టిలో మంచిదనిపించే దాన్ని చెయ్యటానికి జాగ్రత్త పడండి.
ROM 12:18 అందరితో శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
ROM 12:19 మిత్రులారా! పగ తీర్చకోకండి. ఆగ్రహం చూపటానికి దేవునికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే లేఖనాల్లో, “పగ తీర్చుకోవటం నా వంతు. నేను ప్రతీకారం తీసుకొంటాను” అని వ్రాయబడి ఉంది.
ROM 12:20 దానికి మారుగా, “మీ శత్రువు ఆకలితో ఉంటే అతనికి ఆహారం ఇవ్వండి. అతనికి దాహం వేస్తుంటే నీళ్ళివ్వండి. ఇలా చేయటం వల్ల కాలే నిప్పులు అతని తలపై కుమ్మరించినట్లు అతనికి అనిపిస్తుంది” అని వ్రాయబడివుంది.
ROM 12:21 చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి.
ROM 13:1 ప్రభుత్వాన్ని దేవుడే నియమించాడు కనుక ప్రతి ఒక్కడూ ప్రభుత్వం చెప్పినట్లు చెయ్యాలి. ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని కూడా దేవుడే నియమించాడు.
ROM 13:2 అందువల్ల ప్రభుత్వాన్ని ఎదిరించిన వాడు దేవుని ఆజ్ఞను ఎదిరించిన వానితో సమానము. వాళ్ళు శిక్షననుభవించవలసి వస్తుంది.
ROM 13:3 సక్రమంగా నడుచుకొనే వాళ్ళు పాలకులకు భయపడరు. తప్పు చేసిన వాళ్ళకే ఆ భయం ఉంటుంది. ప్రభుత్వానికి భయపడకుండా ఉండాలంటే, సక్రమంగా నడుచుకోండి. అప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని మెచ్చుకుంటుంది.
ROM 13:4 మీ మంచి కోసం ప్రభుత్వ అధికారులు దేవుని సేవకులుగా పని చేస్తున్నారు. కాని మీరు తప్పు చేస్తే భయపడవలసిందే! వాళ్ళు ఖడ్గాన్ని వృధాగా ధరించరు. దేవుని సేవకులుగా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళను శిక్షించటానికి ఉన్నారు.
ROM 13:5 అందువల్ల శిక్షింపబడుతారనే కాకుండా మీ అంతరాత్మల కోసం కూడా అధికారులు చెప్పినట్లు చెయ్యటం అవసరం.
ROM 13:6 అధికారులు దేవుని సేవకులు. వాళ్ళు తమ కాలాన్నంతా దీని కోసమే ఉపయోగిస్తున్నారు. అందువల్లే మీరు పన్నులు చెల్లిస్తున్నారు.
ROM 13:7 ఎవరికేది ఋణపడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు ఋణపడి ఉంటే పన్నుల్ని, సుంకాలు ఋణపడి ఉంటే సుంకాల్ని, మర్యాదను ఋణపడి ఉంటే మర్యాదను, గౌరవాన్ని ఋణపడి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.
ROM 13:8 తోటి వాళ్ళను ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్నంతా అనుసరించినట్లే కనుక ఇతర్లను ప్రేమించటం అనే ఋణంలో తప్ప మరే ఋణంలో పడకండి.
ROM 13:9 “వ్యభిచారం చెయ్యరాదు; హత్య చెయ్యరాదు; దొంగతనం చెయ్యరాదు; ఇతర్లకు చెందిన వాటిని ఆశించరాదు” అనే మొదలగు ఆజ్ఞలన్నీ, “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగు వాణ్ణి ప్రేమించు” అనే ఆజ్ఞలో మిళితమై ఉన్నాయి.
ROM 13:10 ప్రేమ పొరుగు వానికి హాని కలిగించదు. కాబట్టి ధర్మశాస్త్రం సాధించాలి అనుకొన్న దాన్ని ప్రేమ సాధిస్తుంది.
ROM 13:11 యేసు క్రీస్తును మనం నమ్మిన నాటి కంటే నేడు రక్షణ దగ్గరగా ఉంది కనుక ప్రస్తుత కాలాన్ని అర్థం చేసుకోండి. ఆ గడియ అప్పుడే వచ్చేసింది. కనుక నిద్రనుండి మేలుకోండి.
ROM 13:12 రాత్రి గడిచిపోతోంది. అంతం కాని పగలు త్వరలోనే రాబోతోంది. అందువల్ల చోకట్లో చేసే పనుల్ని ఆపి, పగటి వేళ ధరించే ఆయుధాల్ని ధరించండి.
ROM 13:13 పగటి వేళకు తగ్గట్టుగా మర్యాదగా మసలుకొండి. ఉగ్రత తాండవం చెయ్యకుండా, త్రాగి మత్తులు కాకుండా, వ్యభిచారం చెయ్యకుండా, నీతి లేని పనులు చెయ్యకుండా, కలహాలు, అసూయలు లేకుండా ప్రవర్తించండి.
ROM 13:14 యేసు క్రీస్తు ప్రభువును వస్త్రంగా ధరించండి. శారీరక వాంఛల్ని ఏ విధంగా తృప్తి పరుచుకోవాలా అని ఆలోచించటం మానుకోండి.
ROM 14:1 సంపూర్ణమైన విశ్వాసం లేని వాణ్ణి నిరాకరించకండి. వాదగ్రస్తమైన సంగతుల్ని విమర్శించకండి.
ROM 14:2 ఒకడు అన్నీ తినవచ్చని విశ్వసిస్తాడు. కాని సంపూర్ణ విశ్వాసం లేని ఇంకొకడు కూరగాయలు మాత్రమే తింటాడు.
ROM 14:3 అన్నీ తినే వ్యక్తి అలా చెయ్యని వ్యక్తిని చిన్న చూపు చూడకూడదు. అదే విధంగా అన్నీ తినని వాడు, తినేవాణ్ణి విమర్శించకూడదు. అతణ్ణి కూడా దేవుడు అంగీకరించాడు కదా.
ROM 14:4 ఇతర్ల సేవకునిపై తీర్పు చెప్పటానికి నీవెవరవు? అతడు నిలిచినా పడిపోయినా అది అతని యజమానికి సంబంధించిన విషయం. ప్రభువు అతణ్ణి నిలబెట్ట గలడు కనుక అతడు నిలబడ గలుగుతున్నాడు.
ROM 14:5 ఒకడు ఒక రోజు కన్నా మరొక రోజు ముఖ్యమైనదని భావించవచ్చు. ఇంకొకడు అన్ని రోజుల్ని సమానంగా భావించవచ్చు. ప్రతి ఒక్కడూ తాను పూర్తిగా నమ్మిన వాటిని మాత్రమే చెయ్యాలి.
ROM 14:6 ఒక రోజును ప్రత్యేకంగా భావించే వాడు ప్రభువు పట్ల అలా చేస్తాడు. మాంసాన్ని తినేవాడు తినటానికి ముందు దేవునికి కృతజ్ఞతలు చెపుతాడు. కనుక అతనికి ప్రభువు పట్ల విశ్వాసం ఉందన్నమాట. తినని వాడు కూడా ప్రభువుకు కృతజ్ఞతలు చెపుతాడు కనుక అతనికి కూడా ప్రభువు పట్ల విశ్వాసము ఉందన్నమాట.
ROM 14:7 మనలో ఎవ్వరూ తమకోసం మాత్రమే బ్రతకటం లేదు. అదే విధంగా తమ కోసం మాత్రమే మరణించటం లేదు. మనం జీవిస్తున్నది ప్రభువు కొరకు జీవిస్తున్నాము.
ROM 14:8 మనం మరణించేది ప్రభువు కోసం మరణిస్తున్నాము. అందువల్ల మనం మరణించినా, జీవించినా ప్రభువుకు చెందిన వాళ్ళమన్నమాట.
ROM 14:9 ఈ కారణంగానే మరణించిన వాళ్ళకు, జీవించే వాళ్ళకు ప్రభువుగా ఉండాలని క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతికి వచ్చాడు.
ROM 14:10 ఇక ఇదిగో నీవు! నీ సోదరునిపై ఎందుకు తీర్పు చెపుతున్నావు. మరి మీలో కొందరెందుకు మీ సోదరుని పట్ల చిన్న చూపు చూస్తున్నారు? మనమంతా ఒక రోజు దేవుని సింహాసనం ముందు నిలబడతాము.
ROM 14:11 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రభువు ఈ విధంగా అన్నాడు: నాపై ప్రమాణం చేసి చెపుతున్నాను. నా ముందు అందరూ మోకరిల్లుతారు, దేవుని ముందు ప్రతి నాలుక ఆయన అధికారాన్ని అంగీకరిస్తుంది.”
ROM 14:12 అందువల్ల మనలో ప్రతి ఒక్కడూ తనను గురించి దేవునికి లెక్క చూపవలసి ఉంటుంది.
ROM 14:13 కాబట్టి ఇతర్లపై తీర్పు చెప్పటం మానుకొందాం. అంతేకాక, మీ సోదరుని మార్గంపై అడ్డురాయి పెట్టనని, అతనికి ఆటంకాలు కలిగించనని తీర్మానం చేసుకోండి.
ROM 14:14 ఏ ఆహారం అపవిత్రం కాదని యేసు ప్రభువు ద్వారా నేను తెలుసుకొన్నాను. కానీ ఎవరైనా ఒక ఆహారం అపవిత్రమని తలిస్తే అది అతనికి అపవిత్రమౌతుంది.
ROM 14:15 నీవు తినే ఆహారం వల్ల నీ సోదరునికి దుఃఖం కలిగితే నీవు ప్రేమగా ఉండటం మానుకొన్నావన్న మాట. నీ ఆహారం కారణంగా నీ సోదరుణ్ణి నాశనం చెయ్యవద్దు. అతని కోసం క్రీస్తు మరణించాడు.
ROM 14:16 నీ మంచి పనుల్ని ఇతర్లు దూషించకుండా ప్రవర్తించు.
ROM 14:17 దేవుని రాజ్యం అంటే తినటం త్రాగటం కాదన్నమాట. అది పవిత్రాత్మ ద్వారా లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది.
ROM 14:18 ఈ విధంగా క్రీస్తు సేవ చేసిన వాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. ఇతర్లు కూడా మెచ్చుకొంటారు.
ROM 14:19 అందువల్ల మనము శాంతికి, మన అభివృద్ధికి దారి తీసే కార్యాలను చేద్దాం.
ROM 14:20 ఆహారం కొరకు దేవుని పనిని నాశనం చెయ్యకూడదు. అన్ని ఆహారాలు తినవచ్చు. కాని, ఇతర్ల ఆటంకానికి కారణమయ్యే ఆహారాన్ని తినటం అపరాధం.
ROM 14:21 నీ సోదరుడికి ఆటంక కారకుడివి అవటం కన్నా, మాంసాన్ని తినకుండా ఉండటం, ద్రాక్షారసం త్రాగకుండా ఉండటం, అలాంటి పన్లేవీ చెయ్యకుండా ఉండటం ఉత్తమం.
ROM 14:22 అందువల్ల వీటి విషయంలో నీవు ఏది నమ్మినా ఎలా ఉన్నా అది నీకు, దేవునికి సంబంధించిన విషయం. తానంగీకరిస్తున్న వాటి విషయంలో తనను తాను నిందించుకోని వ్యక్తి ధన్యుడు.
ROM 14:23 సందేహిస్తూ తినే వ్యక్తి విశ్వాసం లేకుండా తింటున్నాడు. కనుక దేవుడతనికి శిక్ష విధిస్తాడు. విశ్వాసంతో చేయని పనులన్నీ పాపంతో కూడుకొన్నవి.
ROM 15:1 సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేని వాళ్ళ బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు.
ROM 15:2 ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి.
ROM 15:3 క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించిన వాళ్ళు నన్నూ అవమానించారు.”
ROM 15:4 గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం.
ROM 15:5 మనలో సహనము, ప్రోత్సాహము, కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక!
ROM 15:6 అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి ఐనటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము.
ROM 15:7 దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి.
ROM 15:8 మూల పురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు.
ROM 15:9 యూదులు కాని వాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను. నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.”
ROM 15:10 మరొక చోట: “యూదులు కాని ప్రజలారా! మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.”
ROM 15:11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది: “యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి. ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!”
ROM 15:12 యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు: “యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది. ఆయన దేశాలను పాలిస్తాడు. యూదులు కాని వాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.”
ROM 15:13 రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.
ROM 15:14 సోదరులారా, మీలో మంచితనముందని, సంపూర్ణమైన జ్ఞానం మీలో ఉందని, పరస్పరం బోధించుకోగల సామర్థ్యం మీలో ఉందని నాకు నమ్మకం ఉంది.
ROM 15:15 అయినా నేను కొన్ని విషయాల్ని గురించి మీకు జ్ఞాపకం చెయ్యాలని వాటిని గురించి మీకు ధైర్యంగా వ్రాసాను. దేవుడిచ్చిన వరం వల్ల ఇది చెయ్యగలిగాను. ఆ వరము ఏదనగా
ROM 15:16 నేను యాజకునిగా పని చేస్తూ దైవసందేశాన్ని యూదులు కాని వాళ్ళకు బోధించాలని దేవుడు నన్ను యేసు క్రీస్తుకు సేవకునిగా చేసాడు. ఇందువలన యూదులు కాని వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రం చేయబడి దేవునికి అంగీకారమైన సంతానం కాగలరు.
ROM 15:17 అందువల్ల, నేను యేసు క్రీస్తు ద్వారా దేవుని సేవ చేస్తున్నందుకు గర్విస్తున్నాను.
ROM 15:18 క్రీస్తు నా ద్వారా చేసిన వాటిని గురించి మాత్రమే నేను ధైర్యంగా చెప్పుకుంటాను. యూదులు కాని వాళ్ళు నేను చేసిన బోధనల ద్వారా, నా కార్యాల ద్వారా దైవసందేశాన్ని అనుసరించేటట్లు క్రీస్తు చేసాడు.
ROM 15:19 గుర్తుల ద్వారా, అద్భుతాల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ పని సాధించాడు. అందుకే యెరూషలేము నుండి ఇల్లూరికు దాకా అన్ని ప్రాంతాలలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించగలిగాను.
ROM 15:20 క్రీస్తును గురించి తెలియని ప్రాంతాలలో సువార్తను ప్రకటించాలనే ఆశయం నాలో ఉంది. మరొకడు వేసిన పునాదిపై ఇల్లు కట్టటం నాకిష్టం లేదు.
ROM 15:21 అందుకే ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఆయన్ని గురించి చెప్పబడిన వాళ్ళు చూస్తారు. కాని వాళ్ళు తెలుసుకొంటారు. ఆయన్ని గురించి వినని వాళ్ళు అర్థం చేసుకొంటారు.”
ROM 15:22 మీ దగ్గరకు రావటానికి ఈ పరిస్థితుల కారణంగా నాకు ఎన్నో ఆటంకాలు కలిగాయి.
ROM 15:23 ఈ ప్రాంతంలో నేను చేయవలసిన పని ముగిసింది. అంతేకాక ఎన్నో సంవత్సరాల నుండి మిమ్ముల్ని కలుసుకోవాలనుకొంటున్నాను.
ROM 15:24 నేను స్పెయిను దేశానికి వెళ్ళేటప్పుడు రోము నగరానికి వచ్చి కొన్ని రోజులు మీతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను. అక్కడి నుండి నేను ప్రయాణం సాగించినప్పుడు మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను.
ROM 15:25 కాని ప్రస్తుతం నేను యెరూషలేములోని దేవుని ప్రజలకు సహాయం చెయ్యటానికి అక్కడికి వెళ్తున్నాను.
ROM 15:26 ఎందుకంటే యెరూషలేములోని దేవుని ప్రజల్లో ఉన్న పేదవాళ్ళ కోసం మాసిదోనియ, అకయ ప్రాంతాలలోని సోదరులు చందా ఇవ్వటానికి ఆనందంగా అంగీకరించారు.
ROM 15:27 వాళ్ళు ఈ చందా ఆనందంగా ఇచ్చారు. వాళ్ళకు, వీళ్ళు సహాయం చెయ్యటం నమంజసమే. ఎందుకంటే, యూదులు కానివాళ్ళు, యెరూషలేములోని దేవుని ప్రజలు ఆత్మీయ ఆశీర్వాదంలో భాగం పంచుకొన్నారు. కనుక తమకున్న వాటిని వీళ్ళు వాళ్ళతో పంచుకోవటం సమంజసమే.
ROM 15:28 ఈ కార్యాన్ని ముగించి వాళ్ళందరికీ చందా తప్పక ముట్టేటట్లు చూసి స్పెయిను దేశానికి వెళ్ళే ముందు మిమ్మల్ని చూడటానికి వస్తాను.
ROM 15:29 నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తునుండి సంపూర్ణంగా ఆశీస్సులు పొంది వస్తానని నాకు తెలుసు.
ROM 15:30 సోదరులారా! మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా మిమ్మల్ని వేడుకొనేదేమిటంటే, నా కోసం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించండి.
ROM 15:31 యూదయ ప్రాంతంలోని విశ్వాస హీనులనుండి నేను రక్షింపబడాలని, యెరూషలేములోని దేవుని ప్రజలు నా సహాయాన్ని ఆనందంగా అంగీకరించాలని ప్రార్థించండి.
ROM 15:32 తదుపరి, నేను దేవుని చిత్తమైతే మీ దగ్గరకు ఆనందంగా వచ్చి మీతో సమయం గడుపుతాను.
ROM 15:33 శాంతి ప్రదాత అయినటువంటి దేవుడు మీ అందరికీ తోడుగా ఉండు గాక! ఆమేన్.
ROM 16:1 కేంక్రేయ పట్టణంలో ఉన్న సంఘానికి సేవ చేస్తున్న మన సోదరి ఫీబే చాలా మంచిది.
ROM 16:2 దేవుని ప్రజలకు తగిన విధంగా ప్రభువు పేరిట ఆమెకు స్వాగతం చెప్పండి. ఆమె అనేకులకు చాలా సహాయం చేసింది. నాకు కూడా చాలా సహాయం చేసింది. కనుక ఆమె మీ నుండి సహాయం కోరితే ఆ సహాయం చెయ్యండి.
ROM 16:3 నాతో కలిసి యేసు క్రీస్తు సేవ చేస్తున్న ప్రిస్కిల్లకు, ఆమె భర్త అకులకు నా వందనాలు చెప్పండి.
ROM 16:4 వాళ్ళు నా కోసం తమ ప్రాణాలనే తెగించారు. నేనే కాక, యూదులు కాని వాళ్ళ సంఘాలన్నీ వాళ్ళకు కృతజ్ఞతతో ఉంటాయి.
ROM 16:5 వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యే వాళ్ళందరికీ నా వందనాలు చెప్పండి. ఆసియ ప్రాంతంలో క్రీస్తును నమ్మిన వాళ్ళలో నా ప్రియమిత్రుడు ఎపైనైటు మొదటివాడు. అతనికి నా శుభములు అందించండి.
ROM 16:6 మీ కోసం చాలా కష్టపడి పని చేస్తున్న మరియకు నా వందనములు చెప్పండి.
ROM 16:7 నాతో సహా కారాగారంలో గడిపిన నా బంధువులు ఆంద్రొనీకును, యూనీయకును నా వందనాలు చెప్పండి. వాళ్ళు అపొస్తలులలో గొప్పవారు. అంతేకాక వాళ్ళు నాకన్నా ముందే క్రీస్తును అంగీకరించారు.
ROM 16:8 ప్రభువు వల్ల నేను, అంప్లీయతు స్నేహితులమయ్యాము. అతనికి నా వందనాలు చెప్పండి.
ROM 16:9 మాతో కలిసి క్రీస్తు సేవచేస్తున్న ఊర్బానును, నా ప్రియ మిత్రుడైనటువంటి స్టాకుకు నా వందనాలు చెప్పండి.
ROM 16:10 అపెల్లెకు క్రీస్తు పట్ల నిజమైన భక్తి ఉన్నట్లు నిరూపించబడింది. అతనికి నా వందనాలు చెప్పండి అరిస్టొబూలు కుటుంబానికి చెందిన వాళ్ళకు వందనాలు చెప్పండి.
ROM 16:11 హెరోదియోను నా బంధువు. అతనికి వందనాలు చెప్పండి. ప్రభువుకు చెందిన నార్కిస్సు కుటుంబాన్ని అడిగానని చెప్పండి.
ROM 16:12 ప్రభువు కోసం కష్టించి పని చేస్తున్న త్రుపైనా, త్రుఫోసా అనే స్త్రీలకు నా వందనాలు చెప్పండి. మరొక స్త్రీ పెర్సిసు చాలా కష్టించి పని చేసింది. ఆమెకు నా వందనాలు చెప్పండి.
ROM 16:13 ప్రభువు ఎన్నుకొన్న రూపునకు, అతని తల్లికి నా వందనాలు చెప్పండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిది.
ROM 16:14 అసుంక్రీతును, ప్లెగోనును, హర్మేను, పత్రొబను, హెర్మాను, వాళ్ళతో ఉన్న ఇతర సోదరులకు వందనాలు చెప్పండి.
ROM 16:15 పిలొలొగును, యూలియా అనే సోదరిని, నేరియను, అతని సోదరిని, ఒలుంపాను వాళ్ళతో ఉన్న దేవుని ప్రజలందరికి వందనాలు చెప్పండి.
ROM 16:16 మీరు ఒకరినొకరు కలిసినప్పుడు పవిత్రమైన ముద్దులతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోండి. క్రీస్తు సంఘాలన్నీ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.
ROM 16:17 సోదరులారా! నేను మిమ్మల్ని అర్థించేదేమిటంటే చీలికలు కలిగించే వాళ్ళను, మీ దారికి ఆటంకాలు కలిగించే వాళ్ళను, మీరు నేర్చకొన్న వాటికి వ్యతిరేకంగా బోధించే వాళ్ళను గమనిస్తూ వాళ్ళకు దూరంగా ఉండండి.
ROM 16:18 అలాంటి వాళ్ళు యేసు క్రీస్తు ప్రభువు సేవ చెయ్యరు. దానికి మారుగా వాళ్ళు తమ కడుపులు నింపుకొంటారు. మంచి మాటలు ఆడుతూ, ముఖస్తుతి చేస్తూ అమాయకుల్ని మోసం చేస్తూ ఉంటారు.
ROM 16:19 మీరు క్రీస్తును చాలా విధేయతతో అనుసరిస్తున్నారన్న విషయం అందరూ విన్నారు. అందువల్ల మీ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మీరు మంచివాటిని గురించి జ్ఞానం సంపాదిస్తూ చెడు విషయంలో అజ్ఞానులుగా ఉండాలని నా కోరిక!
ROM 16:20 శాంతి దాత అయినటువంటి దేవుడు త్వరలోనే సైతాన్ను మీ కాళ్ళ క్రింద అణగ త్రొక్కుతాడు. మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండుగాక!
ROM 16:21 నాతో కలిసి సేవ చేస్తున్న తిమోతి మీకు వందనములు తెలుపుతున్నాడు. నా బంధువులు, లూకియ, యాసోను, సోసిపత్రు కూడా మీకు వందనాలు తెలుపుతున్నారు.
ROM 16:22 పౌలు చెప్పుచున్న ఈ లేఖను వ్రాస్తున్న తెర్తియు అనే నేను ప్రభువు పేరిట మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ROM 16:23 మొత్తం సంఘానికి, నాకు, ఆతిథ్యమిస్తున్న గాయియు, మీకు వందనాలు చెపుతున్నాడు. పట్టణ కోశాధికారి అయిన ఎరస్తు, మా సోదరుడు క్వర్తు మీకు వందనాలు తెలుపమన్నారు.
ROM 16:24 నేను బోధించే సువార్తానుసారం, యేసు క్రీస్తును గురించి ప్రకటించిన సందేశానుసారం ఎన్నో సంవత్సారాలనుండి దాచబడి ప్రస్తుతం వ్యక్తం చెయ్యబడిన ఈ రహస్య సత్యం ప్రకారం, మీలో ఉన్న విశ్వాసాన్ని దృఢ పరచగలుగుతున్న ఆ దేవుణ్ణి స్తుతించుదాం.
ROM 16:26 కాని ఇప్పుడు ప్రవక్తల వ్రాతల మూలంగా ఆ రహస్య సత్యం బయటపడింది. అందరూ దేవుణ్ణి విశ్వసించి విధేయతతో ఆయన్ని అనుసరించాలని అమరుడైన దేవుని ఆదేశానుసారం అన్ని దేశాలకు ఆ రహస్యం తెలుపబడింది.
ROM 16:27 సర్వజ్ఞుడైనటువంటి దేవునికి, యేసు క్రీస్తు ద్వారా సదా మహిమ కలుగుగాక! ఆమేన్.
1CO 1:1 వ్రాసిన మొదటి లేఖ దైవేచ్ఛవల్ల యేసు క్రీస్తు అపొస్తలుడుగా వుండటానికి పిలువబడ్డ పౌలు నుండి, మరియు సోదరుడైన సొసైవేసు నుండి.
1CO 1:2 కొరింథులోని దేవుని సంఘానికి అంటే యేసు క్రీస్తులో పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన మీకును, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న వారందరికి శుభం కలుగుగాక!
1CO 1:3 మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు శాంతి, అనుగ్రహం లభించుగాక!
1CO 1:4 యేసు క్రీస్తు ద్వారా మీకు తన అనుగ్రహం ప్రసాదించిన దేవునికి నేను మీ పక్షాన అన్ని వేళలా కృతజ్ఞతలు అర్పిస్తాను.
1CO 1:5 మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీ మాటలో, మీ జ్ఞానంలో అన్ని విధాలా అభివృద్ధి చెందారు.
1CO 1:6 క్రీస్తును గురించి చెప్పబడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది.
1CO 1:7 మరియు ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు మీరు కాచుకొని ఉన్నారు. ఆత్మీయ జ్ఞానానికి మీలో ఏ కొరతా లేదు.
1CO 1:8 మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చిన రోజున మీరు నిర్దోషులుగా పరిగణింపబడతారు. దానికి తగినట్లు దేవుడు మీకు చివరిదాకా శక్తినిస్తాడు.
1CO 1:9 తన కుమారుడును, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుతో సహా వారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్తుడు.
1CO 1:10 సోదరులారా! మీలో చీలికలు కలుగకుండా అంతా ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, ఒకే మనస్సుతో ఉండాలని మన యేసు క్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను.
1CO 1:11 నా సోదరులారా! మీలో మీరు పోట్లాడుకుంటున్నారని క్లోయెకుటుంబం నాకు తెలియ చేసింది.
1CO 1:12 నేను చెప్పేదేమిటంటే మీలో ఒకడు, “పౌలును అనుసరిస్తున్నానని” ఇంకొకడు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” మరొకడు, “నేను కేఫాను అనుసరిస్తున్నానని” నాలుగో వాడు, “నేను క్రీస్తును అనుసరిస్తున్నానని” అంటున్నారు.
1CO 1:13 అంటే క్రీస్తు విభజింపబడ్డాడా? పౌలు మీకోసం సిలువపైచనిపొయ్యాడా? పౌలు పేరిట మీరు బాప్తిస్మము పొందారా?
1CO 1:14 నేను క్రిస్పుకు, గాయియుకు తప్ప ఎవ్వరికీ బాప్తిస్మము నివ్వలేదు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి.
1CO 1:15 కనుక మీరు నా నామంలో బాప్తిస్మము పొందినట్లు ఎవ్వరూ అనలేరు.
1CO 1:16 ఔను, నేను సైఫను కుటుంబానికి చెందిన వాళ్ళకు మాత్రమే బాప్తిస్మము ఇచ్చితిని. వీరికి తప్ప మరెవ్వరికైనా ఇచ్చితినేమో జ్ఞాపకం లేదు.
1CO 1:17 ఎందుకంటే, క్రీస్తు బాప్తిస్మము యివ్వటానికి నన్ను పంపలేదు. సువార్త ప్రకటించటానికి పంపాడు. తెలివిగా మాట్లాడి బోధించటానికి నన్ను పంపలేదు. అలా చేస్తే క్రీస్తు సిలువకు ఉన్న శక్తి తగ్గిపోతుంది.
1CO 1:18 ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి.
1CO 1:19 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “విజ్ఞానుల్లో ఉన్న విజ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను. పండితుల్లో ఉన్న తెలివిని నిష్ప్రయోజనం చేస్తాను.”
1CO 1:20 మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా!
1CO 1:21 తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు “మూర్ఖత్వం” అని భావిస్తున్న “మా సందేశాన్ని” విశ్వసించిన వాళ్ళు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు.
1CO 1:22 యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు.
1CO 1:23 మేమైతే, సిలువపైనున్న క్రీస్తును ప్రకటిస్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, యూదులుకాని వాళ్ళకు అర్థం లేని దానిగాను కనిపిస్తుంది.
1CO 1:24 కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదులుకాని వాళ్ళకు “క్రీస్తు” దేవుని శక్తితో, ఆయన జ్ఞానంతో సమానము.
1CO 1:25 దేవునికి అవివేకంలా కనిపించేది, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్టమైనది. దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తివంతమైనది.
1CO 1:26 సోదరులారా! మిమ్నల్ని పిలిచినప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం ఉందా? ప్రపంచ మిమ్నల్ని జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్టలు లేవు. మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు.
1CO 1:27 కాని దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని, ప్రపంచంలోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు.
1CO 1:28 ప్రపంచం ముఖ్యమైన వాళ్ళని భావిస్తున్న మనుష్యుల ప్రాముఖ్యతను తీసివేయటానికి, దేవుడు ఈ లోకంలో చిన్న చూపుతో చూడబడే వాళ్ళనూ, ఏవగించుకొనబడే వాళ్ళనూ, లెక్క చెయ్యబడని వాళ్ళను ఎన్నుకొన్నాడు.
1CO 1:29 తనముందు ఎవ్వరూ గర్వించరాదని ఆయన ఉద్దేశ్యం.
1CO 1:30 కాని దేవుని కారణంగా మీకు యేసు క్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును మీకు జ్ఞానంగా యిచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, విమోచన కలిగిస్తాడు.
1CO 1:31 అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు. “గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.”
1CO 2:1 సోదరులారా! నేను మీ దగ్గరకు వచ్చి దేవుని రహస్యాన్ని ప్రకటించినప్పుడు మాటల చాతుర్యంతో గాని లేక ఉత్కృష్టమైన విజ్ఞానంతో గాని ప్రకటించలేదు
1CO 2:2 ఎందుకంటే నేను మీతో ఉన్నప్పుడు యేసు క్రీస్తునూ ఆయన సిలువ మరణాన్ని తప్ప మిగతా వాటిని గురించి మరచిపోవాలని నిర్ణయించుకొన్నాను.
1CO 2:3 నేను మీదగ్గరకు వచ్చినప్పుడు నా శక్తిపై నమ్మకం పెట్టుకొని రాలేదు. భయంతో వణుకుతూ వచ్చాను.
1CO 2:4 మిమ్నల్ని సమ్మతింప చెయ్యాలని నేను జ్ఞానంతో నిండిన పదాలుపయోగించి నా సందేశం బోధించలేదు. దేవుని ఆత్మ యిచ్చిన శక్తినుపయోగించి నా సందేశంలో ఉన్న సత్యాన్ని ఋజువు చేసాను.
1CO 2:5 మీ విశ్వాసానికి మానవుల పాండిత్యం కాకుండా దేవుని శక్తి పునాదిగా ఉండాలని నా ఉద్దేశ్యం.
1CO 2:6 కాని ఆత్మీయ పరిపూర్ణత పొందినవాళ్ళకు మేము జ్ఞానంతో నిండిన సందేశం చెపుతాము. ఆ సందేశం ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కాదు. అది ప్రపంచాన్ని పాలించే పాలకులకు సంబంధించిన జ్ఞానమూ కాదు. చివరికి ఆ పాలకులు లేకుండా పోతారు.
1CO 2:7 నేను చెపుతున్నది దేవుడు చెప్పిన రహస్య జ్ఞానం. “ఇది” ఇంతదాకా మానవులనుండి రహస్యంగా దాచబడిన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకు మహిమ కలగాలని కాలానికి ముందే దేవుడు నిర్ణయించాడు.
1CO 2:8 ఈనాటి పాలకులు దాన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని అర్థం చేసుకొనివుంటే మహిమా స్వరూపి అయిన మన ప్రభువును సిలువకు వేసి చంపేవాళ్ళు కాదు.
1CO 2:9 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “దేవుడు తనను ప్రేమించిన వాళ్ళకోసం సిద్ధంగా ఉంచిన వాటిని ఎవరి కళ్ళూ చూడలేదు. ఎవరి చెవులు వినలేదు. ఎవరూ వాటిని ఊహించలేదు.”
1CO 2:10 కాని దేవుడు ఈ రహస్యాన్ని మనకు తన ఆత్మ ద్వారా తెలియచేసాడు. ఆత్మ అన్నిటినీ పరిశోధిస్తాడు. దేవునిలో దాగి ఉన్న వాటిని కూడా పరిశోధిస్తాడు.
1CO 2:11 మానవునిలో ఉన్న ఆలోచనలు అతనిలో ఉన్న ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. అదేవిధంగా దేవునిలో ఉన్న ఆలోచనలు అయన ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు.
1CO 2:12 మనం ఈ ప్రపంచానికి సంబంధించిన ఆత్మను పొందలేదు. దేవుడు పంపిన ఆత్మను మనం పొందాము. తాను ఉచితంగా యిచ్చిన వాటిని గురించి మనం తెలుసుకోవాలని ఆయన ఉద్ధేశ్యం.
1CO 2:13 మానవులు తమ జ్ఞానంతో బోధించిన పదాలను వాడకుండా ఆత్మ బోధించిన పదాలను వాడి, ఆత్మీయ సత్యాలను ఆత్మీయ భాషలో చెపుతూ ఉంటాము.
1CO 2:14 తనలో దేవుని ఆత్మలేని మానవుడు, దేవుని ఆత్మ ఇచ్చే వరాలను అంగీకరించడు. అతనికవి మూర్ఖంగా కనిపిస్తాయి. వాటిని ఆత్మీయంగా మాత్రమే అర్థం చేసుకోగలము కనుక అతడు వాటిని అర్థం చేసుకోలేడు.
1CO 2:15 ఆత్మీయంగా ఉన్నవాడు అందరిపై తీర్పు చెప్పకలడు. కాని అతనిపై ఎవడూ తీర్పు చెప్పలేడు.
1CO 2:16 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రభువులో ఉన్న జ్ఞానం ఎవరు తెలుసుకోగలరు? ప్రభువుకు ఎవరు సలహా యివ్వగలరు?” కాని మన విషయం వేరు. మనలో క్రీస్తు మనస్సు ఉంది.
1CO 3:1 సోదరులారా! ఆత్మీయత కలవాళ్ళతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేక పొయ్యాను. ఆత్మీయత లేనివాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడాను. క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితంలో, మిమ్నల్ని పసిపిల్లలుగా పరిగణించి మాట్లాడాను.
1CO 3:2 మీరు అన్నం తినటానికి సిద్ధంగా లేరు. కనుక పాలు యిచ్చాను. మీరు ఇప్పటికి సిద్దంగా లేరు. మీరింకా ఆత్మీయత లేని వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు.
1CO 3:3 మీలో అసూయలు, పోట్లాటలు, ఇంకా ఉన్నాయి. అంటే మీరు ఆత్మీయత లేని వాళ్ళలా జీవిస్తున్నట్లే కదా! అంటే మీరు మిగతావాళ్ళలా జీవిస్తున్నట్లే కదా!
1CO 3:4 మీలో ఒకడు, “నేను పౌలును అనుసరిస్తున్నానని” మరొకడు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” అంటున్నారు. అలా మాములుమనుష్యులు అంటారు.
1CO 3:5 ఇంతకూ అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? మేము కేవలం దేవుని సేవకులం. మా ద్వారా మీరు క్రీస్తును విశ్వసించారు. అంతే. ప్రభువు అప్పగించిన కర్తవ్యాన్ని మాలో ప్రతి ఒక్కడూ నిర్వర్తించాడు.
1CO 3:6 నేను విత్తనం నాటాను. అపొల్లో నీళ్ళుపోసాడు. కాని దాన్ని పెంచుతున్నవాడు దేవుడే.
1CO 3:7 విత్తనం నాటటం, నీళ్ళు పోయటం ముఖ్యంకాదు. దాన్ని పెంచే దేవుడు ముఖ్యమైనవాడు.
1CO 3:8 విత్తనం నాటేవానికి, నీళ్ళు పోసేవానికి ఉద్ధేశ్యం ఒక్కటే. చేనిన పనిని బట్టి ప్రతీఒక్కనికి ప్రతిఫలం లభిస్తుంది.
1CO 3:9 ఎందుకంటే, మేము దేవునితో కలిసి పని చేసేవాళ్ళం. మీరు ఆయన పొలమునూ ఆయన భవనమునై యున్నారు.
1CO 3:10 దేవుని అనుగ్రహం వల్ల నేను నేర్పుగల నిర్మాణకుడుగా పునాదులు వేసాను. ఇతరులు ఆ పునాదిపై కడుతున్నారు. ప్రతి ఒక్కడూ తానేవిధంగా కడుతున్నాడో గమనిస్తూ జాగ్రత్తగా కట్టాలి.
1CO 3:11 ఆ “పునాది” యేసు క్రీస్తు కనుక ఇదివరకే వేసిన ఆ పునాది తప్ప వేరొక పునాదిని ఎవ్వరూ వేయలేరు.
1CO 3:12 కొందరు బంగారము, వెండి, విలువైన రత్నాలు ఉపయోగించి ఈ పునాది మీద కడుతారు. మరికొందరు చెక్కను, గడ్డిని, ఆకుల్ని ఉపయోగించి కడుతారు.
1CO 3:13 వాళ్ళ పనితనము క్రీస్తు వచ్చిన రోజున ఆయనయొక్క వెలుగులో బయటపడుతుంది. “ఆ రోజు” నిప్పువలె వస్తుంది. ఆ నిప్పు ప్రతి ఒక్కరి పనితనాన్ని పరీక్షిస్తుంది.
1CO 3:14 వాళ్ళు నిర్మించింది నిలిస్తే వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది.
1CO 3:15 అది కాలిపోతే వాళ్ళకు నష్టం కలుగుతుంది. కాని మంటలనుండి అతనొక్కడే తప్పించు కొన్న విధంగా రక్షింపబడతాడు.
1CO 3:16 మీరు దేవుని మందిరమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా?
1CO 3:17 కనుక దేవుని మందిరాన్ని నాశనం చేసిన వాణ్ణి దేవుడు నాశనం చేస్తాడు. దేవుని మందిరం పవిత్రమైనది. మీరే ఆ మందిరం.
1CO 3:18 మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ప్రాపంచిక విషయాల్లో తెలివి ఉందని భావించేవాడు మొదట తనను తాను జ్ఞానహీనునిగా ఎంచుకొంటే తర్వాత జ్ఞాని కాగలడు.
1CO 3:19 ఎందుకంటే దేవుడు ఈ ప్రాపంచిక జ్ఞానాన్ని మూర్ఖమైన దానిగా పరిగణిస్తాడు. దీన్ని గురించి లేఖనాల్లో, “తమ చమత్కారము ఉపయోగించే జ్ఞానుల్ని దేవుడు పట్టేస్తాడు” అని వ్రాయబడివుంది.
1CO 3:20 మరొకచోట, “జ్ఞానుల ఆలోచనలు పనికిరావని ప్రభువుకు తెలుసు” అని వ్రాయబడివుంది.
1CO 3:21 కనుక మానవుల తెలివిని పొగడకండి. అవన్నీ మీవి.
1CO 3:22 పౌలు, అపోల్లో, కేఫా, ప్రపంచము, బ్రతుకు, చావు, ప్రస్తుతము, భవిష్యత్తు అన్నీ మీవి.
1CO 3:23 మీరు క్రీస్తుకు చెందినవారు. క్రీస్తు దేవునికి చెందినవాడు.
1CO 4:1 అందువల్ల మమ్మల్ని మీరు క్రీస్తు సేవకులుగా, దేవుని రహస్యాలు అప్పగింపబడ్డ వాళ్ళుగా పరిగణించండి.
1CO 4:2 బాధ్యత అప్పగింపబడిన సేవకుడు ఆ బాధ్యతను నమ్మకంతో నిర్వర్తించాలి.
1CO 4:3 మీరు నాపై తీర్పు చెప్పినా, ఇతరులు తమ నియమాల ప్రకారము తీర్పు చెప్పినా నేను లెక్కచెయ్యను. నాపై నేనే తీర్పు చెప్పుకోను.
1CO 4:4 నా మనస్సు నిర్మలమైనది. అంత మాత్రాన నేను నిర్దోషినికాను. ప్రభువు నాపై తీర్పు చెపుతాడు.
1CO 4:5 అందువల్ల తీర్పు చెప్పే సమయం వచ్చే దాకా, ఎవరిమీదా తీర్పు చెప్పకండి. ప్రభువు వచ్చేదాకా ఆగండి. ఆయన చీకట్లో దాగివున్నదాన్ని వెలుగులోకి తెస్తాడు. మానవుల హృదయాల్లో దాగివున్న ఉద్దేశ్యాలను బహిరంగ పరుస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కడూ తనకు తగిన విధంగా దేవుని మెప్పు పొందుతాడు.
1CO 4:6 సోదరులారా! “లేఖనాల్లో వ్రాయబడినవాటిని అతిక్రమించకండి” అనే లోకోక్తి యొక్క అర్థం మీరు నేర్చుకోవాలని, దానివల్ల మీరు లాభం పొందాలని మేము, అంటే నేను, అపొల్లో ఆ లోకోక్తి ప్రకారం నడుచుకొన్నాము. మీరు ఒకరిని పొగిడి యింకొకరిని వేషించకండి.
1CO 4:7 ఇతరులకన్నా మీలో ఏమి ప్రత్యేకత ఉంది? మీదగ్గరున్నవన్నీ మీరు దేవుని నుండే కదా పొందింది. మరి అలాంటప్పుడు మీకు అవి దేవుడు యివ్వనట్లు ఎందుకు చెప్పుకొంటున్నారు?
1CO 4:8 ఇప్పటికే మీకు కావలసినవన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ధనవంతులైపొయ్యారు. మేము రాజులం కాకపోయినా, మీరు రాజులైపోయ్యారు. మీరు నిజంగా రాజులు కావాలని మా అభిలాష. అప్పుడు మేము మీతో సహా రాజులమౌతాము.
1CO 4:9 మరణ శిక్ష పొందిన నేరస్థుల్లాగా, దేవుడు అపొస్తులులమైన మమ్మల్ని చివరన ఉంచాడు. లోకమునంతటికీ, దేవదూతలకు, మానవులకు అపొస్తులమైన మేము ప్రదర్శనా వస్తువులయ్యాము.
1CO 4:10 క్రీస్తు కొరకు మేము మూర్ఖులమయ్యాము. కాని మీరు క్రీస్తు విషయంలో తెలివిగా నడచుకొన్నారు. మేము బలహీనులము. మీరు బలవంతులు. మీకు గౌరవం లభిస్తోంది. మాకు అవమానం లభిస్తోంది.
1CO 4:11 ఇప్పటికీ మేము ఆకలిదప్పులతో బాధపడ్తున్నాము. చినిగిన దుస్తులు వేసుకొని జీవిస్తున్నాము. నిర్దాక్షిణ్యమైన హింసలు అనుభవిస్తున్నాము. మాకు ఇల్లు వాకిలి లేదు.
1CO 4:12 మేము మా చేతుల్తో కష్టపడి పనిచేస్తున్నాం. మమ్మల్ని దూషించిన వాళ్ళను మేము దీవిస్తున్నాం. మాకు శిక్ష విధిస్తే అనుభవిస్తాం.
1CO 4:13 అవమానిస్తే, మర్యాదగా సమాధానం చెపుతున్నాం. ఇంతదాకా మేము ఈ ప్రపంచానికి చెందిన చెత్తలాగా, పారవేసిన కసువులాగా చూడబడ్డాము.
1CO 4:14 మిమ్మల్ని సిగ్గుపరచాలని ఇలా వ్రాయటంలేదు. నా పుత్రులవలె ప్రేమించి హెచ్చరిస్తున్నాను.
1CO 4:15 క్రీస్తులో మీకు పదివేల మంది ఉపదేశకులు ఉన్నా మీకు తండ్రులు అనేకులు లేరు. యేసు క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితం మూలంగా సువార్త తెచ్చి మీకు తండ్రినయ్యాను.
1CO 4:16 కనుక నన్ను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను.
1CO 4:17 ఈ కారణంగా నాకు ప్రియమైన నా కుమారునిలాంటి తిమోతిని, మీ దగ్గరకు పంపుతున్నాను. తిమోతి ప్రభువు ప్రేమించిన కుమారుడు. అతడు యేసు క్రీస్తుతో నేను సాగిస్తున్న జీవిత విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఈ జీవిత విధానాన్ని గురించి ప్రతి సంఘంలో బోధిస్తుంటాను.
1CO 4:18 నేను రాననుకొని మీలో కొందరు గర్వాన్ని ప్రదర్శించటం మొదలు పెట్టారు.
1CO 4:19 కాని ప్రభువు చిత్తమైతే నేను త్వరలోనే వస్తాను. గర్వంతో మాట్లాడుతున్నవాళ్ళు ఏమి చెయ్యకలుగుతారో చూస్తాను.
1CO 4:20 దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు. అది శక్తితో కూడినది.
1CO 4:21 మీకేమి కావాలి: మిమ్మల్ని శిక్షించటానికి మీ దగ్గరకు రావాలా? లేక దయ, ప్రేమ చూపటానికి రావాలా?
1CO 5:1 మీలో లైంగిక అవినీతి బాగా వ్యాపించి పోయిందని నాకు సృష్టంగా తెలిసింది. అలాంటి అవినీతి, క్రైస్తవులు కానివాళ్ళలో కూడా లేదు. ఒకడు తన సవతి తల్లితో సంబంధం పెట్టుకొన్నాడని విన్నాను.
1CO 5:2 ఇది గర్వించతగిన విషయమా? ఇది చాలా దుఃఖించవలసిన విషయము. ఈ పని చేసిన వాణ్ణి మీరు సంఘం నుండి బహిష్కరించవలసి ఉంది.
1CO 5:3 నేను శరీరముతో మీ దగ్గర లేకున్నా నా ఆత్మతో మీతోఉన్నాను. నేను మీతోవున్నట్లు భావించి ఈ అపరాధము చేసిన వానిపై తీర్పు చెపుతున్నాను.
1CO 5:4 మీరు యేసు ప్రభువు పేరిట సమావేశమైనప్పుడు నా ఆత్మలో మీతో ఉంటాను. యేసు ప్రభువు శక్తి మీలో ఉంటుంది.
1CO 5:5 అప్పుడు అతణ్ణి సైతానుకు అప్పగించండి. తద్వారా వాని పాపనైజం నశించి అతని ఆత్మ మన ప్రభువు వచ్చిన రోజున రక్షింపబడుతుంది.
1CO 5:6 “మీరు గర్వించటం మంచిది కాదు. పులుపు కొంచెమైనా, పిండినంతా పులుపు చేస్తుందని తెలియదా?”
1CO 5:7 పులిసిన పాత పిండిని పారవేయండి. క్రీస్తు మన పస్కా గొఱ్ఱెపిల్లగా బలి ఇవ్వబడ్డాడు. అప్పుడు మీరు క్రొత్త పిండిలా ఉంటారు. నిజానికి మీరు పులియని క్రొత్త పిండివంటి వాళ్ళు.
1CO 5:8 కనుక పులియని రొట్టెతో పండుగ చేసుకొందాము. ద్వేషంతో, పాపంతో కూడుకొన్న పాత పులిసిన పిండితో కాక నిష్కపటంతోనూ, సత్యంతోనూ కూడుకొన్న పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము.
1CO 5:9 నేను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్ళతో సాంగత్యం చేయవద్దని వ్రాసాను.
1CO 5:10 అంటే, సంఘానికి చెందని అవినీతిపరులతో, లోభులతో, మోసగాళ్ళతో, విగ్రహారాధకులతో సాంగత్యం చేయవద్దని నేను చెప్పటం లేదు. అలా చేస్తే మీరు ఈ ప్రపంచాన్నే వదిలివేయవలసి వస్తుంది.
1CO 5:11 నేను ప్రస్తుతం వ్రాసేది ఏమిటంటే తాను సోదరుణ్ణని చెప్పుకొంటూ, లైంగిక అవినీతితో జీవించే వానితో, లోభత్వం చేసేవానితో, విగ్రహారాధన చేసే వానితో, ఇతరులను దూషించే వానితో, త్రాగుబోతుతో, మోసంచేసే వానితో, సహవాసం చేయవద్దని చెపుతున్నాను. అలాంటి వానితో కలిసి భోజనం కూడా చేయవద్దు.
1CO 5:12 సంఘానికి చెందని వానిపై తీర్పు చెప్పే అధికారం నాకు లేదు. కాని సంఘంలో ఉన్న వానిపై తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది.
1CO 5:13 “సంఘానికి చెందని వాళ్ళపై దేవుడు తీర్పు చెపుతాడు. కాని ఆ దోషిని మీ సంఘం నుండి వెలివేయండి.”
1CO 6:1 ఒకవేళ మీ మధ్య తగువులొస్తే, మన సంఘంలో ఉన్న పవిత్రుల దగ్గరకు వెళ్ళాలి కాని, సంఘానికి చెందని వాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు మీ కెంత ధైర్యం?
1CO 6:2 పవిత్రులు ప్రపంచం మీద తీర్పు చెపుతారన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రపంచంమీద తీర్పు చెప్పగలిగినప్పుడు, సాధారణమైన విషయాలపై తీర్పు చెప్పే స్తోమత మీలో లేదా?
1CO 6:3 మనము దేవదూతల మీద కూడా తీర్పు చెపుతామన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ జీవితానికి సంబంధించిన విషయాలు ఏ పాటివి?
1CO 6:4 మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యని వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా?
1CO 6:5 సిగ్గుచేటు! సోదరుల మధ్య కలిగే తగువులు తీర్చగలవాడు మీలో ఒక్కడు కూడా లేడా?
1CO 6:6 సంఘానికి చెందినవాని దగ్గరకు వెళ్ళకుండా ఒక సోదరుడు మరొక సోదరునిపై నేరారోపణ చేయటానికి న్యాయస్థానానికి వెళ్ళుతున్నాడు. అంటే సంఘానికి చెందనివాళ్ళను అడుగుతున్నాడన్న మాట.
1CO 6:7 మీ మధ్య వ్యాజ్యాలు ఉండటం వల్ల మీరు పూర్తిగా ఓడిపొయ్యారని చెప్పవచ్చు. వ్యాజ్యాలు పెట్టు కోవటంకన్నా అన్యాయం సహించటం, మోసపోవటం మంచిది.
1CO 6:8 దానికి మారుగా మీరే అన్యాయాలు, మోసాలు చేస్తున్నారు. ఇతరులను కాక, మీ సోదరులనే మోసం చేస్తున్నారు.
1CO 6:9 దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకండి. లైంగిక విషయాల్లో అవినీతిగా జీవించేవాళ్ళకు, విగ్రహారాధికులకు, వ్యభిచారులకు, మగ వేశ్యలు, మగవాళ్ళతో మగవాళ్ళు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు తమ కామాన్ని తీర్చుకొనే వాళ్ళకు,
1CO 6:10 దొంగలకు, దురాశాపరులకు, త్రాగుబోతులకు, అపవాదాలు లేవదీసేవాళ్ళకు, మోసగాళ్ళకు, దేవుని రాజ్యం దొరకదు.
1CO 6:11 మీలో కొందరు ఆ విధంగా జీవించారు. కాని దేవుడు మీ పాపాలు కడిగివేశాడు. కనుక మీరు పవిత్రంగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు పేరిట మన దేవుని ఆత్మ ద్వారా మీరు నిర్దోషులుగా పరిగణింపబడ్డారు.
1CO 6:12 “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది.” కాని వాటివల్ల లాభం కలుగదు. “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది” కాని నేను దానికి బానిసను కాను,
1CO 6:13 “తిండి కడుపు కోసము, కడపు తిండి కోసం సృష్టింపబడినాయి.” కాని దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. దేహం ఉన్నది వ్యభిచారం చేయటానికి కాదు. అది ప్రభువు కోసం ఉంది. ప్రభువు దేహం కోసం ఉన్నాడు.
1CO 6:14 దేవుడు తన శక్తితో ప్రభువును బ్రతికించాడు. అదే విధంగా మనల్ని కూడా బ్రతికిస్తాడు.
1CO 6:15 మీ దేహాలు క్రీస్తుకు అవయవాలని మీకు తెలియదా? మరి అలాంటప్పుడు క్రీస్తు అవయవాల్ని, వేశ్యదేహంతో కలుపమంటారా? అసంభవము.
1CO 6:16 తన దేహాన్ని వేశ్య దేహంతో కలిపిన వాడు ఆ దేహంతో ఒకటైపోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, “రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయి” అని లేఖనాల్లో వ్రాయబడివుంది.
1CO 6:17 కాని ప్రభువుతో ఐక్యమైన వాడు ఆయన ఆత్మతో ఐక్యమౌతాడు.
1CO 6:18 లైంగిక అవినీతికి దూరంగా ఉండండి, మనిషిచేసే మిగతా పాపాలు తన దేహానికి సంబంధించినవి కావు. కాని వ్యభిచారం చెయ్యటంవల్ల వ్యక్తి తన స్వంత దేహంపట్ల పాపం చేసినట్లౌతుంది.
1CO 6:19 మీ దేహం పరిశుద్ధాత్మకు మందిరమని మీకు తెలియదా? దేవుడు యిచ్చిన పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మీ దేహంపై మీకు హక్కులేదు.
1CO 6:20 మీ కోసం వెల చెల్లించబడింది. కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కోసం ఉపయోగించండి.
1CO 7:1 ఇక మీరు వ్రాసిన ప్రశ్నలకు నా సమాధానం ఇది: ఔను. వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది.
1CO 7:2 కాని లైంగిక అవినీతి చాలా వ్యాపించిపోయింది కనుక స్త్రీపురుషులు వివాహం చేసుకోవటం మంచిది.
1CO 7:3 ప్రతీ పురుషుడు భర్తగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. అలాగే ప్రతీ స్త్రీ భార్యగా తన కర్తవ్యాలు నిర్వహించాలి.
1CO 7:4 భార్యకు తన శరీరంపై అధికారం లేదు. భర్తకు మాత్రమే ఆమె శరీరంపై అధికారం ఉంది. అలాగే భర్తకు తన శరీరంపై అధికారం లేదు. అతని శరీరంపై అతని భార్యకు మాత్రమే అధికారం ఉంది.
1CO 7:5 భార్యాభర్తలు ఇరువురు సమ్మతించి దేవుని ప్రార్థించటంలో తమ కాలాన్ని గడపదలిస్తే తప్ప వేరువేరుగా ఉండకూడదు. ప్రార్థనా సమయం ముగిసాక మళ్ళీ మీరు కలిసికొనండి. మీలో ఆత్మనిగ్రహంలేదు. కనుక సైతాను ప్రేరేపణకు లోంగిపోకుండా జాగ్రత్త పడటానికి ఇలా చెయ్యటం అవసరం.
1CO 7:6 ఇలా చెయ్యుమని నేను ఆజ్ఞాపించటం లేదు. ఇలా చెయ్యటానికి నా అనుమతి తెలుపుతున్నాను.
1CO 7:7 అందరూ నాలా ఉండాలని నా కోరిక. కాని ప్రతి ఒక్కనికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకనికి ఒక వరం, ఇంకొకనికి ఇంకొక వరం ఇచ్చాడు.
1CO 7:8 అవివాహితులకు, వితంతువులకు నా సలహా ఇది: వాళ్ళు నాలాగే పెళ్ళి చేసుకోకుండా ఉండటం మంచిది.
1CO 7:9 కాని వాళ్ళలో నిగ్రహం లేకపోతే వెళ్ళి చేసుకోవటం ఉత్తమం. కామంతో కాలిపోవటం కన్నా పెళ్ళి చేసుకోవటం మంచిది.
1CO 7:10 వివాహితులకు నా ఆజ్ఞ ఇది. ఇది నా ఆజ్ఞ కాదు ప్రభువుయొక్క ఆజ్ఞ. భార్య తన భర్తను వదిలి వేయరాదు.
1CO 7:11 అలా వదిలివేస్తే ఆమె తిరిగి పెళ్ళి చేసుకోకూడదు. లేదా భర్తతో సమాధాన పడాలి. అలాగే భర్త తన భార్యకు విడాకులు ఇవ్వకూడదు.
1CO 7:12 మిగతా వాళ్ళకు నా ఆజ్ఞ యిది. ఇది ప్రభువు ఆజ్ఞ కాదు. నా ఆజ్ఞ. ఒక విశ్వాసి భార్య ప్రభువును నమ్మనిదై అతనితో ఉండటానికిష్టపడితే అతడు ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.
1CO 7:13 అలాగే ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి అతడు ఆమెతో జీవించాలని అనుకొంటే ఆమె అతనికి విడాకులు ఇవ్వకూడదు.
1CO 7:14 అంటే, విశ్వాసం లేని భర్త విశ్వాసురాలైన భార్యతో కలిసి జీవించటంవల్ల పవిత్రమౌతాడు. అదేవిధంగా అవిశ్వాసియైన భార్య విశ్వాసియైన భర్తతో కలసి జీవించటం వల్ల పవిత్రమౌతుంది. అలాకానట్లయితే మీ సంతానం అపవిత్రంగా ఉంటుంది. కాని ఇప్పుడున్న ప్రకారం వాళ్ళు పవిత్రులే.
1CO 7:15 కాని, విశ్వాసి కానివాడు వెళ్ళిపోవాలని అనుకొంటే వెళ్ళిపోనివ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసికి కాని, విశ్వాసురాలికి కాని ఏ నిర్భంధం ఉండకూడదు. దేవుడు శాంతితో జీవించటానికే మనల్ని పిలిచాడు.
1CO 7:16 ఓ స్త్రీ! నీ వల్ల నీ భర్త రక్షింపబడుతాడో లేదో! నీకేమి తెలుసు? ఓ పురుషుడా! నీ వల్ల నీ భార్య రక్షింబడుతుందో లేదో! నీకేమి తెలుసు?
1CO 7:17 ప్రతి ఒక్కడూ తన జీవితాన్ని ప్రభువు ప్రసాదించిన వరం ప్రకారం జీవించాలి. మీ జీవితం ప్రభువు నియమించిన ప్రకారముగా పిలుపుకు తగినట్టుగా ఉండాలి. ఈ నియమాన్ని అన్ని సంఘాలు పాటించాలని ఆజ్ఞాపిస్తున్నాను.
1CO 7:18 సున్నతి చేయించుకొన్నవాడు దేవుని పిలుపును అంగీకరిస్తే, అతడు ఆ సున్నతి లేనివానిగా ఉండుటకు ప్రయత్నించరాదు. సున్నతి చేయించుకొననివాడు దేవుని పిలుపును అంగీకరిస్తే అతడు సున్నతి చేయించుకోవటానికి ప్రయత్నంచేయరాదు.
1CO 7:19 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోక పోయినా జరిగేది ఏమిలేదు. దేవుని ఆజ్ఞల్ని పాటించటం ముఖ్యం.
1CO 7:20 ప్రతి ఒక్కడూ, దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా ఉండాలి.
1CO 7:21 దేవుడు పిలిచినప్పుడు నీవు బానిసవా? చింతించకు. కాని నీవు స్వేచ్ఛ పొందగలిగితే అందుకు ప్రయత్నంచేయి.
1CO 7:22 ప్రభువు పిలిచినప్పుడు బానిసగా ఉన్నవాడు, ప్రభువులో ఐక్యత పొందటంవల్ల స్వేచ్ఛను పొందుతాడు. అదేవిధంగా ప్రభువు పిలిచినప్పుడు స్వేచ్ఛగా ఉన్నవాడు ప్రభువుకు బానిస అవుతాడు.
1CO 7:23 మీకోసం వెల చెల్లించి దేవుడు మిమ్మల్నికొన్నాడు. మానవులకు బానిసలు కాకండి.
1CO 7:24 సోదరులారా! దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేవిధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదేవిధంగా ఉండి దేవువునితో కలిసి ఉండండి.
1CO 7:25 ఇక కన్యలను గురించి: ప్రభువు మీకు ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. కాని దేవుని అనుగ్రహంవల్ల నేను మీకు చెపుతున్న సలహాలు నమ్మతగినవి.
1CO 7:26 ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల వల్ల మీరు కన్యలుగా ఉండిపోవటం మంచిది.
1CO 7:27 ఇక పురుషులు, మీరు వివాహితులైనట్లయితే విడాకులు ఇవ్వకండి. మీరు అవివాహితులైనట్లయితే భార్యల కోసం వెతక్కండి.
1CO 7:28 అలాగని మీరు వివాహం చేసుకొంటే పాపం కాదు. అదే విధంగా కన్యలు కూడా వివాహం చేసుకొంటే పాపం కాదు. కాని వివాహం చేసుకొన్నవాళ్ళు జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారు. మీకా కష్టాలు కలుగరాదని ఇలా చెపుతున్నాను.
1CO 7:29 సోదరులారా! ఇక వ్యవధి లేదు. ఇక మీదటనుండి భార్యలున్నవాళ్ళు భార్యలు లేనట్లు జీవించాలి.
1CO 7:30 దుఃఖించేవాళ్ళు దుఃఖించనట్లు, ఆనందిస్తున్నవాళ్ళు ఆనందించనట్లు, కొనేవాళ్ళు కొన్నవి తమని కానట్లు జీవించాలి.
1CO 7:31 ఇప్పుడున్న ప్రపంచం నశించబోతోంది. కనుక ఈ ప్రపంచంలో జీవిస్తున్నవాళ్ళు దానిలో ఉన్న వస్తువుల పట్ల ఆశ పెంచుకోకుండా జీవించాలి.
1CO 7:32 మీరు చింతించరాదని నా కోరిక. “వివాహం చేసుకోనివాడు ప్రభువును ఏ విధంగా ఆనంద పరచాలా” అని, అంటే ఆత్మీయమైన విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
1CO 7:33 కాని వివాహితుడు తన భార్యను ఎలా ఆనందపరచాలని ఆలోచిస్తూ ఉంటాడు. కనుక ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
1CO 7:34 అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. పెళ్ళికాని స్త్రీలు, కన్యలు ప్రభువు ఆజ్ఞల్ని పాటించటంలో నిమగ్నులై ఉంటారు. తమ మనస్సును, శరీరాన్ని ప్రభువుకు అర్పించి పని చేస్తుంటారు. కాని పెళ్ళిచేసుకొన్న స్త్రీలు తమ భర్తను ఆనందపరచటానికి, ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు.
1CO 7:35 ఇది నేను మీ మంచి కోసం చెపుతున్నాను. అనవసరమైన కట్టుబాట్లు నియమించాలని కాదు. మీరు సక్రమంగా నడుచుకోవాలని, మనస్ఫూర్తిగా మిమ్నల్ని మీరు ప్రభువుకు అర్పించుకోవాలని నా ఉద్ధేశ్యం.
1CO 7:36 తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావించినవాడు, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటంవల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావించినవాడు, పెళ్ళి చేసుకోవచ్చు. ఇది పాపం కాదు.
1CO 7:37 కాని పెళ్ళి చేసుకోరాదని తన మనస్సులో నిశ్చయించుకొన్నవాడు, పెళ్ళి చేసుకోవాలనే నిర్బంధం లేనివాడు, తన మనస్సును అదుపులో పెట్టుకోగలవాడు కూడా, పెళ్ళిమాని సరియైన పని చేస్తున్నాడు.
1CO 7:38 కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.
1CO 7:39 భర్త బ్రతికి ఉన్నంత కాలము భార్య అతనికి కట్టుబడి ఉండాలి. అతడు చనిపోతే ఆమె తనకు ఇష్టమున్నవాణ్ణి వివాహం చేసుకోవచ్చు. కాని అతడు ప్రభువు యొక్క విశ్వాసియై ఉండాలి.
1CO 7:40 ఆమె విధవరాలుగా ఉండిపోతే ఆనందంగా ఉంటుందని నా అభిప్రాయం. నాకును దేవుని ఆత్మ సహాయం ఉన్నదని తలస్తున్నాను.
1CO 8:1 ఇక విగ్రహాలకు బలి యిచ్చిన వాటిని గురించి: మనలో జ్ఞానం ఉందని మనకు తెలుసు. జ్ఞానం గర్వాన్ని కలిగిస్తుంది. ప్రేమ మనిషిని అభివృద్ధి పరుస్తుంది.
1CO 8:2 తనలో జ్ఞానముందని భావిస్తున్న వానిలో నిజానికి ఉండవలసిన జ్ఞానం లేదు.
1CO 8:3 కాని తనను ప్రేమిస్తున్న మనిషిని దేవుడు గుర్తిస్తాడు.
1CO 8:4 ఇక విగ్రహాలకు బలి ఇచ్చిన వాటి విషయం: విగ్రహానికి అర్థం లేదని, ఒక్కడే దేవుడున్నాడని మనకు తెలుసు.
1CO 8:5 దేవుళ్ళని పిలువబడేవాళ్ళు ఆకాశంలోగాని, భూమిమీదగాని ఉన్నా, వాళ్లు “దేవుళ్ళని”, “ప్రభువులని” పిలవబడుచున్నారు.
1CO 8:6 అయితే నిజానికి మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయనే మన తండ్రి. అన్నిటినీ ఆయనే సృష్టించాడు. ఆయన కోసమే మనము జీవిస్తున్నాము. మనకు ఒక్కడే ప్రభువు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారానే అన్నీ సృష్టింపబడ్డాయి. ఆయనవల్ల మనము జీవిస్తున్నాము.
1CO 8:7 కాని ఈ విషయం తెలియని వాళ్ళు చాలమంది ఉన్నారు. ఈనాటికీ విగ్రహారాధనకు అలవాటు పడ్డ కొందరు ఆ పదార్థాన్ని తిన్నప్పుడు అది విగ్రహానికి అర్పించింది అనుకొని తింటారు. వాళ్ళ మనసులు బలహీనమైనవి కనుక వాళ్ళు మలినమయ్యారు.
1CO 8:8 ఆహారంవల్ల మనము దేవునికి సన్నిహితులము కాలేము. ఆ ఆహారం తినకపోతే నష్టం ఏమీ లేదు. తింటే వచ్చిన లాభం లేదు.
1CO 8:9 కాని మీ నిర్ణయము, దృఢ విశ్వాసం లేనివాళ్ళకు నష్టం కలిగించకుండా జాగ్రత్తపడండి.
1CO 8:10 ఈ విషయంపై గట్టి అభిప్రాయంలేని వాడొకడు, ఈ విషయాన్ని గురించి జ్ఞానమున్న మిమ్మల్ని గుడిలో నైవేద్యం తినటం చూస్తాడనుకోండి. అప్పుడు అతనికి విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం తినటానికి ధైర్యం కలుగుతుంది.
1CO 8:11 బలహీనమైన మనస్సుగల మీ సోదరుని కోసం క్రీస్తు మరణించాడు. కాని మీ “అజ్ఞానం” వల్ల ఆ సోదరుడు నశిస్తాడు.
1CO 8:12 అలా చేస్తే మీ సోదరునిపట్ల పాపం చేసి అతని మనస్సును గాయపరచిన వాళ్ళవుతారు. తద్వారా మీరు క్రీస్తుపట్ల పాపం చేసిన వాళ్ళవుతారు.
1CO 8:13 నా సోదరుడు పాపం చేయటానికి నా ఆహారం కారణమైతే నేనిక మీదట మాంసం తినను! ఏ విధంగానైనా అతని పతనానికి కారకుణ్ణి కాకుండా ఉంటాను.
1CO 9:1 నాకు స్వేచ్ఛ లేదా? నేను అపొస్తలుడను కానా? నేను మన యేసు క్రీస్తు ప్రభువును చూడలేదా? “మీరే” ప్రభువు కోసం నేను చేసిన సేవా ఫలితంకదా?
1CO 9:2 నేను ఇతరులకు క్రీస్తు అపొస్తులుడను కాకపోవచ్చు. కాని నేను మీకు క్రీస్తు అపొస్తులుడను. నేను క్రీస్తు అపొస్తులుడనన్న దానికి మీరే నా రుజువు.
1CO 9:3 నాపై తీర్పు చెప్పాలనుకొన్నవాళ్ళకు నా సమాధానం యిది:
1CO 9:4 అన్న పానాలకు మాకు అధికారం లేదా?
1CO 9:5 ఇతర అపొస్తులవలె, ప్రభువు సోదరులవలె, కేఫావలే, విశ్వాసురాలైన భార్యను వెంట తీసుకెళ్ళటానికి మాకు అధికారం లేదా?
1CO 9:6 నేనూ, బర్నబా మాత్రమే జీవించటానికి పనిచేయాలా?
1CO 9:7 తన స్వంత డబ్బుతో సైనికునిగా ఎవరు పని చేస్తారు? ద్రాక్షా మొక్కల్ని నాటి వాటి ఫలాన్ని తినకుండా ఎవరుంటారు? పశువుల మందలను కాస్తూ, వాటి పాలు త్రాగకుండా ఎవరుంటారు?
1CO 9:8 నేను దీన్ని మానవ దృష్టిలో చెపుతున్నానా? ధర్మశాస్త్రం కూడా ఈ మాటే చెబుతుంది.
1CO 9:9 మోషే ధర్మశాస్త్రంలో, “ధాన్యం త్రొక్కే ఎద్దు నోటికి చిక్కం వేయరాదు” అని వ్రాయబడివుంది. ఎద్దులకోసం మాత్రమే దేవుడు ఈ మాట అన్నాడా?
1CO 9:10 ఈ మాట మనకోసమే వ్రాయబడిందని నేను గట్టిగా చెప్పగలను. పొలం దున్నేవాడూ, పంట నూర్చేవాడూ, పంట ఫలంలో భాగం లభిస్తుందన్న ఆశతో ఆ పనులు చేస్తారు.
1CO 9:11 మేము మీలో ఆత్మీయ విత్తనాలు చల్లాము. మీనుండి మా అవసరాలు తీర్చుకోవటం తప్పా?
1CO 9:12 మిగతావాళ్ళకు మీనుండి ఈ సహాయం పొందే హక్కు ఉన్నప్పుడు మాకు వాళ్ళకంటే ఎక్కువ హక్కుఉందికదా? కానీ, మేమాహక్కు ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తా ప్రచారంలో ఏ ఆటంకం కలుగకుండా ఉండాలని మేము ఎన్నో కష్టాలు అనుభవించాము.
1CO 9:13 మందిరంలో పనిచేసే వాళ్ళకు మందిరం నుండి ఆహారం లభిస్తుంది. బలిపీఠం దగ్గర పనిచేసేవాళ్ళకు బలి ఇవ్వబడిన వాటిలో భాగం లభిస్తుందని తెలియదా?
1CO 9:14 అదే విధంగా సువార్త బోధించే వాళ్ళకు సువార్త ద్వారా జీవితావసరాలు తీరాలని ప్రభువు ఆజ్ఞాపించాడు.
1CO 9:15 కాని నేను ఈ హక్కుల్ని ఉపయోగించుకోలేదు. మీరు నాకు సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో నేను ఇది వ్రాయటం లేదు. అభిమానం దెబ్బతినటం కన్నా నాకు చావటం మేలనిపిస్తుంది.
1CO 9:16 కాని నేను సువార్త ప్రకటిస్తున్నందుకు గొప్పలు చెప్పుకోలేను. సువార్త బోధించటం నా కర్తవ్యం. నేను సువార్త బోధించటం ఆపేస్తే నాకు శాపం కలుగుగాక!
1CO 9:17 స్వయంగా ఈ పని చేస్తే నాకు బహుమానం ఉంది. ఈ పని చెయ్యాలని నేను స్వయంగా కోరలేదు. ఆ బాధ్యతను నాకు దేవుడే అప్పగించాడు.
1CO 9:18 మరి నా ప్రతిఫలం ఏమిటి? ప్రతిఫలం పుచ్చుకోకుండా, నా హక్కులు అడగకుండా సువార్తను ప్రకటించటమే నా ప్రతిఫలం.
1CO 9:19 నేను స్వేచ్ఛాజీవిని, ఎవ్వరికీ బానిసను కాను. కాని చేతనైనంతమందిని గెలవాలని నేను ప్రతి ఒక్కనికీ బానిసనౌతాను.
1CO 9:20 నేను యూదులతో ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలని యూదునిలా జీవించాను. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు గెలవాలని, నేను ధర్మశాస్త్రం అనుసరించవలసిన అవసరం లేకపోయినా ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళకోసం దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లు జీవించాను.
1CO 9:21 ధర్మశాస్త్రం లేనివాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలని, ధర్మశాస్త్రం లేనివానిగా ప్రవర్తించాను. అంటే నేను దేవుని న్యాయానికి అతీతుడను కాను. నిజానికి నేను క్రీస్తు న్యాయాన్ని అనుసరిస్తున్నాను.
1CO 9:22 బలహీనుల్ని గెలవాలని బలహీనుల కోసం బలహీనుడనయ్యాను. ఏదో ఒక విధంగా కొందరినైనా రక్షించగలుగుతానేమో అని నేను అందరికోసం అన్ని విధాలుగా మారిపొయ్యాను.
1CO 9:23 నేను ఇవన్నీ సువార్త కోసం చేసాను. అది అందించే దీవెనలు పొందాలని నా అభిలాష.
1CO 9:24 పరుగు పందెంలో అందరూ పాల్గొన్నా ఒక్కనికే బహుమతి లభిస్తుందని మీకు తెలియదా? కనుక ఆ బహుమతి పొందాలనే ఉద్దేశ్యంతో పరుగెత్తండి.
1CO 9:25 పరుగు పందెంలో పాల్గొనదలచిన వాళ్ళందరూ మంచి క్రమశిక్షణ పొందుతారు. విజయకిరీటం పొందాలనే వాళ్ళ ఉద్దేశ్యం. కాని వాళ్ళు పొందే కిరీటం చిరకాలం ఉండదు. మనం చిరకాలం ఉండే కిరీటం కోసం పోరాడుతున్నాం.
1CO 9:26 నేను గమ్యం లేకుండా పరుగెత్తను. గాలితో పోరాడుతున్న వానిలా పోరాడను.
1CO 9:27 నేను నా దేహానికి సరియైన శిక్షణనిచ్చి, అదుపులో ఉంచుకొంటాను. బోధించిన తర్వాత కూడా ఆ బహుమతి పొందే అర్హత పోగొట్టుకోరాదని ప్రయాస పడుచున్నాను.
1CO 10:1 సోదరులారా! ఈ సత్యమును గ్రహించకుండా యుండుట నాకిష్టం లేదు. మన పూర్వీకులు మేఘం క్రింద యుండిరి. సముద్రాన్ని చీల్చి ఏర్పరచబడిన దారి మీద వాళ్ళు నడిచి వెళ్ళారు.
1CO 10:2 వాళ్ళు మేఘంలో, సముద్రంలో బాప్తిస్మము పొందాక, మోషేలోనికి ఐక్యత పొందారు.
1CO 10:3 అందరూ ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు.
1CO 10:4 అందరూ ఒకే విధమైన ఆత్మీయ నీటిని త్రాగారు. ఈ నీటిని వాళ్ళ వెంటనున్న ఆత్మీయమైన బండ యిచ్చింది. ఆ బండ క్రీస్తే.
1CO 10:5 అయినా వాళ్ళలో కొందరు మాత్రమే దేవునికి నచ్చిన విధంగా జీవించారు. మిగతా వాళ్ళు ఎడారిలో చనిపొయ్యారు.
1CO 10:6 వాళ్ళలా మనం చెడు చేయరాదని వారించటానికి ఇవి దృష్టాంతాలు.
1CO 10:7 కొందరు పూజించినట్లు మీరు విగ్రహాలను పూజించకండి. ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రజలు తిని, త్రాగటానికి కూర్చొన్నారు. లేచి నృత్యం చేసారు.”
1CO 10:8 మనం వాళ్ళు చేసినట్లు వ్యభిచారం చేయరాదు. వ్యభిచారం చెయ్యటం వల్ల ఒక్క రోజులో వాళ్ళలో ఇరవైమూడు వేలమంది మరణించారు.
1CO 10:9 వాళ్ళు ప్రభువును శోధించిన విధంగా మనం శోధించరాదు. పరీక్షించిన వాళ్ళను పాములు చంపివేసాయి.
1CO 10:10 వాళ్ళవలె సణగకండి. సణగిన వాళ్ళను మరణదూత చంపివేశాడు.
1CO 10:11 మనకు దృష్టాంతముగా ఉండాలని వాళ్ళకు ఇవి సంభవించాయి. మనల్ని హెచ్చరించాలని అవి ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ యుగాంతములో బ్రతుకుతున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి.
1CO 10:12 కనుక గట్టిగా నిలుచున్నానని భావిస్తున్న వాడు క్రింద పడకుండా జాగ్రత్త పడాలి.
1CO 10:13 మానవులకు సహజంగా సంభవించే పరీక్షలు తప్ప మీకు వేరే పరీక్షలు కలుగలేదు. దేవుడు నమ్మకస్తుడు. భరించగల పరీక్షలకన్నా, పెద్ద పరీక్షలు మీకు ఆయన కలుగనీయడు. అంతేకాక, పరీక్షా సమయం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని జయం పొందే మార్గం కూడా దేవుడు చూపుతాడు.
1CO 10:14 కనుక నా ప్రియ మిత్రులారా! మీరు విగ్రహారాధనకు దూరంగా ఉండండి.
1CO 10:15 మీరు తెలివిగల వాళ్ళు కనుక ఇలా మాట్లాడుతున్నాను. నేను చెపుతున్న వాటిని గురించి మీరే నిర్ణయించండి
1CO 10:16 మనము కృతజ్ఞతతో దీవెన పాత్రనుండి త్రాగటం క్రీస్తు రక్తాన్ని పంచుకోవటము, కదా? మనము విరిచిన రొట్టెను పంచుకోవటము, క్రీస్తు శరీరాన్ని పంచుకోవటము కదా?
1CO 10:17 రొట్టె ఒకటే గనుక ఆ ఒకే రొట్టెలో పాలుపొందే మనం అనేకులమైనప్పటికిని ఒకే శరీరమైయున్నాము.
1CO 10:18 ఇశ్రాయేలు ప్రజల్ని చూడండి. బలి ఇచ్చిన దాన్ని తినేవాళ్ళు బలిపీఠానికి భాగస్వాములు కారా?
1CO 10:19 మరి నేను చెపుతున్న దానికి అర్థం ఏమిటి? విగ్రహాల్లో కాని, ఆరగింపు చేసిన ప్రసాదంలో కాని, ఏదో ప్రత్యేకత ఉందని చెపుతున్నానా?
1CO 10:20 లేదు. నేను చెపుతున్నది ఏమిటంటే యూదులుకాని వాళ్ళు బలిపీఠాలపై బలి ఇచ్చినవి దయ్యాల కోసం బలి ఇవ్వబడ్డాయి. అవి దేవునికి అర్పితం కావు. మీరు దయ్యాలతో భాగస్వాములు కారాదని నా విన్నపం.
1CO 10:21 మీరు ప్రభువు పాత్రనుండి త్రాగుతూ దయ్యాల పాత్రనుండి కూడా త్రాగాలని ప్రయత్నించరాదు. మీరు ప్రభువు పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ దయ్యాల పంక్తిలో కూడా కూర్చోవటానికి ప్రయత్నం చేయరాదు.
1CO 10:22 మనం దేవుని కోపాన్ని రేపటానికి ప్రయత్నిద్దామా? మనం ఆయన కంటే శక్తిగల వాళ్ళమా? ఎన్నటికీ కాదు.
1CO 10:23 “మనకు ఏది చెయ్యటానికైనా స్వేచ్ఛ ఉంది” కాని అన్నీ లాభదాయకం కావు. “మనకు అన్నీ చెయ్యటానికి స్వేచ్ఛ ఉంది” కాని అన్నిటి వల్ల వృద్ధి కలుగదు.
1CO 10:24 ఎవరూ తమ మంచి కొరకే చూసుకోరాదు. ఇతరుల మంచి కోసం కూడా చూడాలి.
1CO 10:25 మీ మనస్సులు పాడు చేసుకోకుండా కటికవాని అంగడిలో అమ్మే ఏ మాంసాన్నైనా తినండి.
1CO 10:26 “ఎందుకంటే ఈ భూమి, దానిలో ఉన్నవన్నీ ప్రభునివే.”
1CO 10:27 క్రీస్తును విశ్వసించని వాడు మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీకు ఇష్టముంటే వెళ్ళండి. మనస్సుకు సంబంధించిన ప్రశ్నలు వేయకుండా మీ ముందు ఏది ఉంచితే అది తినండి.
1CO 10:28 కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ప్రసాదం” అని అంటే, ఈ విషయం మీతో చెప్పినవాని కోసం, వాని మనస్సుకోసం దాన్ని తినకండి
1CO 10:29 అంటే, మీ మనస్సు కోసం అని కాదు, ఆ చెప్పిన వాని మనస్సు కోసం దాన్ని తినకండి. నా స్వాతంత్ర్యం విషయంలో అవతలి వాని మనస్సు ఎందుకు తీర్పు చెప్పాలి?
1CO 10:30 నేను కృతజ్ఞతలు అర్పించి భోజనం చెయ్యటం మొదలుపెడ్తాను. నేను కృతజ్ఞతలు అర్పించి తినే భోజనాన్ని గురించి ఇతరులు నన్నెందుకు విమర్శించాలి?
1CO 10:31 కానీ మీరు తిన్నా, త్రాగినా, ఏది చేసినా అన్నీ దేవుని ఘనత కోసం చేయండి.
1CO 10:32 యూదులకు గాని, యూదులుకాని వాళ్ళకు గాని, దేవుని సంఘానికి గాని, కష్టం కలిగించకుండా జీవించండి.
1CO 10:33 నేను చేస్తున్నట్లు మీరు చెయ్యండి. నేను అన్ని పనులూ ఇతరులను సంతోషపెట్టాలని చేస్తాను. నా మంచి నేను చూసుకోను. వాళ్ళ మంచి కోసం చేస్తాను. వాళ్ళు రక్షింపబడాలని నా ఉద్దేశ్యం.
1CO 11:1 నేను క్రీస్తును అనుసరించిన విధంగా, మీరు నన్ను అనుసరించండి.
1CO 11:2 నన్ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొంటూ, నేను చెప్పిన బోధనల్ని పాటిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
1CO 11:3 క్రీస్తుకు ప్రతీ మనిషిపై అధికారం ఉంది. ప్రతీ పురుషునికి తన భార్యపై అధికారం ఉంది. దేవునికి క్రీస్తుపై అధికారం ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలని నా కోరిక.
1CO 11:4 కనుక తన తల కప్పుకొని బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించేవాడు లేక దైవసందేశాన్ని ప్రకటించేవాడు తన తలను అవమానపరచిన వానితో సమానము.
1CO 11:5 తల మీద ముసుగు వేసుకోకుండా బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించే స్త్రీ, లేక దైవసందేశాన్ని బోధించే స్త్రీ తన తలను అవమానపరచినట్లు అవుతుంది. ఆమె తలగొరిగించుకొన్న దానితో సమానము.
1CO 11:6 స్త్రీ తన తల మీద ముసుగు వేసుకోకపోతే ఆమె తన తలవెంట్రుకలు కత్తిరించుకోవటం మంచిది. తలవెంట్రుకలు కత్తిరించుకోవటంకాని, లేక తల గొరిగించుకోవటం కాని అవమానంగా అనిపిస్తే ఆమె తన తలపై ముసుగు వేసుకోవాలి.
1CO 11:7 పురుషుడు దేవుని ప్రతిరూపం. దేవునికి కీర్తి కలిగించేవాడు పురుషుడు. కనుక అతడు తన తల కప్పుకొనకూడదు. కాని స్త్రీ వల్ల పురుషునికి కీర్తి కలుగుతుంది.
1CO 11:8 ఎందుకంటే పురుషుడు స్త్రీ నుండి సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడింది.
1CO 11:9 అంతేకాక పురుషుడు స్త్రీ కొరకు సృష్టింప బడలేదు స్త్రీ పురుషుని కొరకు సృష్టింపబడింది.
1CO 11:10 ఈ కారణంగా మరియు దేవదూతల కారణంగా స్త్రీ తనపై ఒకరికి అధికారముందని చూపటానికి తన తలపై ముసుగు వేసుకోవాలి.
1CO 11:11 కాని ప్రభువు దృష్టిలో పురుషుడు లేకుండా స్త్రీ, స్త్రీ లేకుండా పురుషుడు జీవించలేరు.
1CO 11:12 ఎందుకంటే, స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడినట్లే, పురుషుడు కూడా స్త్రీ నుండి సృష్టింపబడ్డాడు. కాని అన్నిటినీ దేవుడే సృష్టించాడు.
1CO 11:13 తలపై ముసుగు వేసుకోకుండా స్త్రీ దేవుణ్ణి ప్రార్థించటం సరియేనా? మీరే నిర్ణయించండి.
1CO 11:14 పురుషునికి పొడుగాటి వెంట్రుకలు ఉండటం వలన అతనికి అవమానమని ప్రకృతే మీకు తెలియచెయ్యటం లేదా?
1CO 11:15 స్త్రీకి తన తల వెంట్రుకలు ముసుగుగా ఉండటానికి పొడుగాటి వెంట్రుకలు ఇవ్వబడ్డాయి. దాని వల్ల ఆమెకు గౌరవం లభిస్తుంది.
1CO 11:16 దీన్ని గురించి ఎవరైనా వాదించాలనుకొంటే మా సమాధానం యిదే తప్ప వేరొకటి లేదు. దేవుని సంఘం కూడా దీన్నే అనుసరిస్తుంది.
1CO 11:17 మీ సంఘ సమావేశాలు మంచికన్నా చెడును ఎక్కువగా చేస్తున్నాయి. కనుక ఈ క్రింది ఆజ్ఞలు మిమ్మల్ని పొగుడుతూ వ్రాయటం లేదు.
1CO 11:18 మీరు సమావేశమైనప్పుడు మీలో విభాగాలు కలుగుతున్నట్లు నేను విన్నాను. ఇందులో నిజముండవచ్చు.
1CO 11:19 సక్రమ మార్గాల్లో నడుచుకొనే వాళ్ళు రుజువు కావాలంటే మీలో విభేదాలు ఉండటం అవసరం.
1CO 11:20 మీరు సమావేశమైనప్పుడు నిజమైన “ప్రభు రాత్రి భోజనం” చెయ్యటం లేదు.
1CO 11:21 ఎందుకంటే మీరు తినేటప్పుడు ఎవరికోసం కాచుకోకుండా తింటారు. బాగా త్రాగుతారు. కాని కొందరు ఆకలితో ఉండిపోతారు.
1CO 11:22 తినటానికి, త్రాగటానికి మీకు ఇళ్ళు లేవా? మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. అంటే, మీరు దేవుని సంఘాన్ని లెక్క చెయ్యనట్లే కదా! మీరు ఇలా చేస్తున్నందుకు మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో మిమ్మల్ని పొగడను.
1CO 11:23 నేను ప్రభువు నుండి పొందిన సందేశాన్ని మీకు చెప్పాను. యేసు ప్రభువు అప్పగింపబడిన రాత్రి రొట్టె చేత పట్టుకొని
1CO 11:24 దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని విరిచి, “ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చేయుడి” అని అన్నాడు.
1CO 11:25 అదే విధముగా వారు భోజనమయిన తర్వాత ద్రాక్షారసం ఉన్న పాత్రను తీసుకొని, “ఈ పాత్ర నా రక్తంవలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనండి”
1CO 11:26 కనుక మీరు ఈ రొట్టెను తిని, ద్రాక్షారసమును త్రాగినప్పుడెల్ల ఆయన మరణాన్ని ఆయన వచ్చేదాకా ప్రకటిస్తారు.
1CO 11:27 కనుక ప్రభువు పట్ల అయోగ్యముగా ఎవరు ఆయన రొట్టె తింటారో, ఎవరు ఆయన పాత్ర నుండి త్రాగుతారో అతడు ప్రభువు శరీరం పట్ల, ఆయన రక్తం పట్ల పాపం చేసిన వాడగును.
1CO 11:28 ప్రతీ వ్యక్తి రొట్టెను తినే ముందు, ఆ పాత్రనుండి త్రాగే ముందు తన ఆత్మను స్వయంగా పరిశోధించుకోవాలి.
1CO 11:29 ప్రభువు శరీరమని గ్రహించక రొట్టెను తినువాడు, మరియు ద్రాక్షారసం త్రాగువాడు శిక్షావిధికి గురి అవుతాడు.
1CO 11:30 అందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగగ్రస్తులు అయినారు, కొందరు మరణించారు.
1CO 11:31 కనుక మొదటే మనల్ని మనం పరీక్షించుకొంటే మనం శిక్ష పొందం. దేవుడు మనల్ని శిక్షించడు.
1CO 11:32 కాని, మనకు సరియైన శిక్షణ యివ్వాలని ప్రభువు మనల్ని శిక్షిస్తాడు. ప్రపంచంతో పాటు మనకు శిక్ష లభించరాదని ఆయన ఉద్దేశ్యం.
1CO 11:33 అందువల్ల నా సోదరులారా! మీరు భోజనానికి సమావేశమైనప్పుడు ఒకరి కోసం ఒకరు కాచుకోండి.
1CO 11:34 మీరు సమావేశమైనప్పుడు ఒకవేళ మీలో ఎవరికైనా ఆకలి వేస్తే, అలాంటి వాడు యింట్లోనే తిని రావాలి. అలా చేస్తే మీరు సమావేశమైనప్పుడు తీర్పుకు గురికారు. నేను వచ్చినప్పుడు మీకు మిగతా ఆజ్ఞలు యిస్తాను.
1CO 12:1 సోదరులారా! పరిశుద్ధాత్మ యిచ్చే వరాలను గురించి మీరు తెలుసుకోవాలని నా అభిప్రాయము.
1CO 12:2 మీరు క్రీస్తులో విశ్వాసులు కానప్పుడు ఏదో ఒక విధంగా ప్రేరేపింపబడి త్రోవతప్పి, మాట్లాడలేని విగ్రహాల వైపుకు మళ్ళారు. ఇది మీకు తెలుసు.
1CO 12:3 అందువల్ల నేను చెప్పేదేమిటంటే, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేవాడెవ్వడూ, “యేసు శాపగ్రస్తుడని” అనడు. అదే విధంగా ఆత్మ ద్వారా మాత్రమే “యేసే ప్రభువు” అని అనగలడు.
1CO 12:4 దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు.
1CO 12:5 ప్రభువు ఒక్కడే కాని, ఆయనకు ఎన్నో విధాలుగా సేవ చేయవచ్చు.
1CO 12:6 దేవుడు నలుగురిలో పలువిధాలుగా పని చేస్తాడు. దేవుడు ఒక్కడే అయినా ఆయన అన్నీ చేస్తాడు. అందరిలో చేస్తాడు.
1CO 12:7 దేవుడు ప్రతీ ఒక్కరిలో తన ఆత్మ ఉండేటట్లు చేసాడు. ఇది మనము చూస్తున్నాము. అందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన ఉద్దేశ్యం.
1CO 12:8 ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడే వరాన్ని, ఆ ఆత్మ ద్వారానే బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడు.
1CO 12:9 అదే పరిశుద్ధాత్మ ద్వారా ఒకనికి విశ్వాసము ఇచ్చాడు. మరొకనికి వ్యాధులు నయం చేసే వరము నిచ్చాడు.
1CO 12:10 ఒకనికి అద్భుతాలు చేయు శక్తిని, మరొకనికి ప్రవచించే శక్తిని ఇచ్చాడు. ఒకనికి ఆత్మలను గుర్తించే శక్తిని, మరొకనికి రకరకాల భాషల్లో మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఇంకొకనికి వాటి అర్థాలను విడమర్చి చెప్పే శక్తినిచ్చాడు.
1CO 12:11 ఆ ఒక్క ఆత్మయే అన్నీ చేస్తున్నాడు. ఆయన తన యిచ్చానుసారం ప్రతీ ఒక్కనికి వరాల్ని ఇస్తాడు.
1CO 12:12 శరీరంలో అనేక భాగాలు ఉన్నా అవి కలిసి ఒక దేహంగా పని చేస్తాయి. క్రీస్తు కూడా అంతే.
1CO 12:13 అంటే మనమంతా ఒక ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది, ఒక శరీరంలో ఐక్యం అయ్యాము. మనము యూదులమైనా, గ్రీకులమైనా, బానిసలమైనా, బానిసలము కాకపోయినా, మనకందరికీ ఒకే ఆత్మ యివ్వబడినాడు.
1CO 12:14 మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి కాదు.
1CO 12:15 ఒకవేళ, కాలు, “నేను చేతిని కాను, కనుక నేను ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు.
1CO 12:16 అదే విధంగా ఒక వేళ చెవి, “నేను కన్నును కాను. కనుక ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు.
1CO 12:17 శరీరమంతా కన్నైపోతే దేనితో వింటాం? శరీరమంతా చెవియైతే దేనితో వాసన చూస్తాం?
1CO 12:18 కాని నిజానికి దేవుడు ఈ శరీరంలోని ప్రతి అవయవాన్ని తాను అనుకొన్న విధంగా అమర్చాడు.
1CO 12:19 అన్ని అవయవాలు ఒక అవయవంగా మారితే శరీరం ఉండదు.
1CO 12:20 నిజానికి శరీరంలో అనేక భాగాలు ఉన్నా శరీరం ఒక్కటే.
1CO 12:21 కన్ను చేతితో, “నీవు నాకు అవసరం లేదు” అని అనలేదు. అదే విధంగా శిరస్సు పాదాలతో, “మీరు నాకు అవసరం లేదు” అని అనలేదు.
1CO 12:22 సున్నితంగా కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి.
1CO 12:23 ముఖ్యం కాదనుకొనే భాగాలను మనము ప్రత్యేకంగా కాపాడుతాము. బహిరంగ పరచలేని భాగాల పట్ల మనము ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాము.
1CO 12:24 బహిరంగ పరచగల భాగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపనవసరం లేదు. కాని దేవుడు శరీరానికి సంబంధించిన భాగాల్ని ఒక చోట చేర్చి ప్రాముఖ్యత లేని భాగాలకు ప్రాముఖ్యత కలిగించాడు.
1CO 12:25 శరీరంలో చీలికలు ఉండరాదని, దాని భాగాలు పరస్పరం శ్రద్ధ చూపుతూ ఉండాలని, ఆయన ఉద్దేశ్యం.
1CO 12:26 ఒక భాగానికి కష్టం కలిగితే ప్రతీయొక్క భాగం దానితో సహా కష్టం అనుభవిస్తుంది. ఒక భాగానికి గౌరవం లభిస్తే మిగతా భాగాలన్నింటికీ దానితో సహా ఆనందం కలుగుతుంది.
1CO 12:27 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు.
1CO 12:28 దేవుడు సంఘంలో ఉన్న వాళ్ళందర్నీ తమతమ స్థానాల్లో ఉంచాడు. మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తల్ని, మూడవ స్థానంలో బోధించే వాళ్ళను, ఆ తర్వాత మహాత్కార్యాలను చేసే వాళ్ళను, వాళ్ళ తర్వాత వ్యాధులు నయం చేసే శక్తి గలవాళ్ళను, ఇతరులకు సహాయం చేసే వాళ్ళను, పరిపాలించే వాళ్ళను, తమకు తెలియని భాషల్లో మాట్లాడగల శక్తి గలవాళ్ళను ఉంచాడు.
1CO 12:29 వీళ్ళలో అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధించే వాళ్ళు కారు, అందరూ అద్భుతాలు చేసే వాళ్ళు కారు.
1CO 12:30 వీళ్ళలో అందరికి వ్యాధులు నయం చేసే శక్తి లేదు. తెలియని భాషలో మాట్లాడే శక్తి లేదు. ఆ మాటలకు అర్థం విడమర్చి చెప్పే శక్తి లేదు.
1CO 12:31 కనుక మీ హృదయాలను ముఖ్యమైన వరాల వైపుకు మళ్ళించండి. ఏది ఏమైనా అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం చూపిస్తాను.
1CO 13:1 ఇతరుల భాషల్లో, దేవదూతల భాషల్లో మాట్లాడగలిగిన నాలో ప్రేమ లేకపోతే నా మాటలకు అర్థం ఉండదు.
1CO 13:2 నాకు దైవసందేశం చెప్పే వరం ఉన్నా, నాలో సంపూర్ణ జ్ఞానం ఉన్నా, నాకు అన్ని రహస్యాలు తెలిసినా, నాలో పర్వతాలను కదిలించగల విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోయినట్లయితే నేను నిరర్థకుణ్ణి.
1CO 13:3 నేను నా సర్వము పేదలకు దానం చేసినా, నా దేహాన్ని అగ్నికి అర్పితం చేసినా నాలో ప్రేమ లేకపోతే అది నిరర్థకము.
1CO 13:4 ప్రేమలో సహనము ఉంది. ప్రేమలో దయ ఉంది. ప్రేమలో ఈర్ష్య లేదు. అది గొప్పలు చెప్పుకోదు. దానిలో గర్వము లేదు.
1CO 13:5 దానిలో క్రూరత్వము లేదు. దానిలో స్వార్థం లేదు. దానికి ముక్కు మీద కోపం ఉండదు. అది తప్పులు ఎంచదు.
1CO 13:6 ప్రేమ చెడును గురించి ఆనందించదు. అది సత్యాన్నిబట్టి ఆనందిస్తుంది.
1CO 13:7 ప్రేమ అన్ని సమయాల్లో కాపాడుతుంది. అది అన్ని వేళలా విశ్వసిస్తుంది. ఆశను ఎన్నటికీ వదులుకోదు. అది ఎప్పుడూ సంరక్షిస్తుంది.
1CO 13:8 దైవసందేశాన్ని చెప్పే వరము మనము పొందాము. అది అంతమౌతుంది. తెలియని భాషల్లో మాట్లాడే శక్తి మనకు ఉంది. అది అంతమౌతుంది. మనలో జ్ఞానం ఉంది. అది నశించిపోతుంది. కాని ప్రేమ నిశించి పోదు.
1CO 13:9 ఎందుకంటే, మన జ్ఞానం మితమైంది, మనకుండే ఈ సందేశము అసంపూర్ణమైనది.
1CO 13:10 అయితే సంపూర్ణత కలిగినప్పుడు ఈ అసంపూర్ణత అంతమౌతుంది.
1CO 13:11 నేను పసివానిగా ఉన్నప్పుడు పసివాని మాటలు, అనుభవాలు, ఆలోచనలు నాలో ఉండేవి. నేను యవ్వనంలోకి వచ్చాక నా బాల్యంలో ఉన్న గుణాల్ని మరిచిపోయాను.
1CO 13:12 ప్రస్తుతం అద్దంలో మసకగా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని మాత్రమే మనము చూస్తున్నాము. తదుపరి మనము ఆ ముఖాన్ని స్పష్టంగా చూస్తాము. ఇప్పుడు నాకు తెలిసింది సంపూర్ణం కాదు. కాని తదుపరి నా గురించి దేవునికి తెలిసినంత సంపూర్ణంగా నాకు ఆయన్ని గురించి తెలుస్తుంది.
1CO 13:13 అంతందాకా ఈ మూడు, అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంటాయి. వీటిలో ప్రేమ గొప్పది.
1CO 14:1 కనుక ప్రేమ మార్గాన్ని అనుసరించండి. ఆత్మీయ శక్తి లభించాలని, ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం లభించాలని ఆశించండి.
1CO 14:2 తనకు తెలియని భాషలో మాట్లాడే వాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. మానవులతో కాదు. అతని మాటలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతడు పవిత్రాత్మ శక్తితో రహస్యాలను చెబుతూ ఉంటాడు.
1CO 14:3 కాని దైవసందేశం చెప్పేవాడు విశ్వాసాన్ని బలపరచాలని ప్రజల్లో ఉత్సాహము, శాంతి కలిగించాలని దైవసందేశం చెపుతాడు.
1CO 14:4 తనకు తెలియని భాషలో మాట్లాడేవాడు తనకు మాత్రమే మేలు కలిగించుకొంటాడు. కాని దైవసందేశం చెప్పేవాడు సంఘానికి మేలు కలిగిస్తాడు.
1CO 14:5 మీలో ప్రతి ఒక్కడూ తెలియని భాషల్లో మాట్లాడితే నాకు యిష్టమే. కాని మీరు దైవసందేశం చెప్పటం నాకు ఇంకా ఎక్కువ యిష్టం. తెలియని భాషల్లో మాట్లాడే వాని మాటలకు అర్థం విడమర్చి చెప్పేవాడు ఉంటే సంఘానికి లాభం కలుగుతుంది. అది సంభవించకపోతే తెలియని భాషల్లో మాట్లాడే వానికన్నా దైవసందేశం చెప్పేవాడే గొప్ప.
1CO 14:6 సోదరులారా! నేను అక్కడికి వచ్చి తెలియని భాషలో మాట్లాడితే మీకు ఏం లాభం కలుగుతుంది? నా ద్వారా మీకు దేవుడు ఒక క్రొత్త విషయం తెలియచెయ్యాలి. లేక నా ద్వారా మీకు జ్ఞానం కలగాలి. లేక మీకు నా ద్వారా దైవసందేశం తెలియాలి. లేక నేను మీకు ఒక క్రొత్త విషయం బోధించగలగాలి. అలా జరగనట్లయితే లాభం ఏమిటి?
1CO 14:7 పిల్లన గ్రోవి, వీణ వంటి ప్రాణం లేని వస్తువులు కూడా శబ్దం చేస్తాయి. వాటి స్వరాల్లో భేదం లేకుంటే ఏ రాగం వాయిస్తున్నారో ఎట్లా తెలుస్తుంది?
1CO 14:8 బాకా సక్రమంగా ఊది పిలవకుంటే యుద్ధానికి ఎవరు సిద్ధమౌతారు?
1CO 14:9 అదే విధంగా మీ నాలుకతో అర్థం అయ్యే పదాలు మాట్లాడితే తప్ప మీరేం మాట్లాడుతున్నారో యితరులకు ఎట్లా అర్థం అవుతుంది. మీరు గాలిలో మాట్లాడినట్లు ఉంటుంది.
1CO 14:10 ప్రపంచంలో చాలా రకాల భాషలు ఉన్నాయి. సందేహం లేదు. కాని అర్థం లేని భాష ఏదీ లేదు.
1CO 14:11 ఒకడు మాట్లాడే విషయం నేను అర్థం చేసుకోలేకపోతే, నేను అతనికి పరదేశీయునిగా, అతడు నాకు పరదేశీయునిగా ఉంటాము.
1CO 14:12 మీకు ఆత్మీయ శక్తి లభించాలని ఆసక్తి ఉంది. కనుక సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను అమితంగా కోరుకొండి.
1CO 14:13 కనుక తనకు తెలియని భాషల్లో మాట్లాడేవాడు తాను మాట్లాడిన వాటికి అర్థం చెప్పగలిగే శక్తినివ్వమని దేవుణ్ణి ప్రార్థించాలి.
1CO 14:14 ఎందుకంటే నేను నాకు తెలియని భాషల్లో ప్రార్థిస్తే నా ఆత్మ ప్రార్థిస్తుంది కాని నా బుద్ధి అందులో పాల్గొనదు.
1CO 14:15 మరి నేను ఏం చెయ్యాలి? నేను నా ఆత్మతో మాత్రమే కాక, నా బుద్ధితో కూడా ప్రార్థిస్తాను. నా ఆత్మతోను నా మనస్సుతోను కూడా పాడుతాను.
1CO 14:16 మీరు దేవుణ్ణి ఆత్మతో స్తుతిస్తున్నారనుకోండి. మీ సమావేశంలో సభ్యుడు కానివాడుంటే, అతనికి మీరు ఏమంటున్నారో తెలియదు. కనుక, మీరు చేస్తున్న ప్రార్థనలకు ఎప్పుడు, “ఆమేన్” అని అనాలో అతనికి ఎట్లా తెలిస్తుంది?
1CO 14:17 మీరు సక్రమంగా స్తుతించినా ఆ వ్యక్తికి దాని వల్ల మేలు కలుగదు.
1CO 14:18 మీ అందరికంటే ఎక్కువగా యితర భాషల్లో మాట్లాడగలందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి.
1CO 14:19 నేను సంఘంలో మాట్లాడినప్పుడు తెలియని భాషల్లో పదివేల పదాలు మాట్లాడటం కన్నా నాకు తెలిసిన భాషల్లో ఐదు పదాలు ఉపయోగించి బోధించటం ఉత్తమమని నా అభిప్రాయము.
1CO 14:20 సోదరులారా! చిన్నపిల్లలవలె ఆలోచించకండి. చెడు విషయంలో చిన్నపిల్లల్లా ఉండండి. కాని ఆలోచించేటప్పుడు పెద్దవాళ్ళలా ఆలోచించండి.
1CO 14:21 లేఖనాల్లో ఇలా వ్రాయబడివుంది: “ఇతర భాషలు మాట్లాడే వాళ్ళ ద్వారా, విదేశీయుల పెదాల ద్వారా వీళ్ళతో నేను మాట్లాడుతాను. అయినా వాళ్ళు నా మాటలు వినరు.”
1CO 14:22 తెలియని భాషల్లో మాట్లాడగల శక్తివుంటే, అది విశ్వాసం లేని వాళ్ళకు రుజువుగా ఉంటుంది. కాని ఆ రుజువు విశ్వాసం ఉన్న వాళ్ళకు అవసరం లేదు. అయినా దైవసందేశం విశ్వాసం ఉన్న వాళ్ళకే గాని, విశ్వాసం లేని వాళ్ళకు కాదు.
1CO 14:23 సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకేచోట సమావేశమై, తమకు తెలియని భాషల్లో మాట్లాడటం మొదలు పెడతారనుకోండి. అప్పుడు సభ్యులు కాని వాళ్ళు లేక విశ్వాసం లేని వాళ్ళు ఆ సమావేశంలో ఉంటే మీకు పిచ్చి ఎక్కిందని అనుకోరా?
1CO 14:24 దానికి మారుగా మీరంతా దైవసందేశాన్ని చెపుతున్నారనుకోండి. అప్పుడు విశ్వాసం లేనివాడో లేక సభ్యుడు కానివాడో సమావేశంలో ఉంటే మీరు చెపుతున్నది విని తప్పు తెలుసుకుంటాడు. అంటే దైవసందేశం అతనిపై తీర్పు చెప్పిందన్నమాట.
1CO 14:25 అతని మనస్సులో ఉన్న ఆలోచనలు బయట పడతాయి. అతడు మోకరిల్లి దేవుణ్ణి ఆరాధిస్తూ, “దేవుడు నిజంగా యిక్కడ మీతో ఉన్నాడు” అని అంగీకరిస్తాడు.
1CO 14:26 సోదరులారా! యిక మేము ఏమని చెప్పాలి? మీరంతా సమావేశమైనప్పుడు ఒకడు స్తుతిగీతం పాడుతాడు. మరొకడు ఒక మంచి విషయాన్ని బోధిస్తాడు. ఇంకొకడు దేవుడు తనకు తెలియచేసిన విషయాన్ని చెపుతాడు. ఒకడు తనకు తెలియని భాషలో మాట్లాడుతాడు. మరొకడు దాని అర్థం విడమరచి చెపుతాడు. ఇవన్నీ సంఘాన్ని బలపరచటానికి జరుగుతున్నాయి.
1CO 14:27 తెలియని భాషల్లో మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే, ఇద్దరు లేక ముగ్గురి కంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఒకని తర్వాత ఒకడు మాట్లాడాలి. దాని అర్థం విడమర్చి చెప్పగలవాడు ఉండాలి.
1CO 14:28 అర్థం చెప్పేవాడు లేకపోయినట్లయితే తెలియని భాషలో మాట్లాడేవాడు మాట్లాడటంమానెయ్యాలి. అతడు తనలో తాను మాట్లాడుకోవచ్చు. లేదా దేవునితో మాట్లాడవచ్చు.
1CO 14:29 దైవసందేశాన్ని యిద్దరు లేక ముగ్గురు మాట్లాడవచ్చు. మిగతావాళ్ళు చెప్పిన దాన్ని జాగ్రత్తగా గమనించాలి.
1CO 14:30 ఒకవేళ అక్కడ కూర్చున్న వాళ్ళకు దేవుడు తన సందేశాన్ని చెప్పమంటే, మాట్లాడుతున్నవాడు మాట్లాడటం ఆపివెయ్యాలి.
1CO 14:31 అలా చేస్తే ఒకరి తర్వాత ఒకరు దైవసందేశం చెప్పవచ్చు. అలా చెయ్యటం వల్ల అందరూ నేర్చుకొంటారు. ప్రతీ ఒక్కరికి ప్రోత్సాహం కలుగుతుంది.
1CO 14:32 దైవసందేశం చెప్పే వాళ్ళు తమ ప్రేరణను అదుపులో పెట్టుకోవచ్చు.
1CO 14:33 దేవుడు శాంతి కలుగ చేస్తాడు. అశాంతిని కాదు.
1CO 14:34 ఇతర సంఘాలలో జరుగుతున్నట్లు స్త్రీలు సమావేశాలలో మౌనం వహించాలి. మాట్లాడటానికి వాళ్ళకు అధికారం లేదు. ధర్మశాస్త్రంలో, “స్త్రీలు అణకువతో ఉండాలి” అని వ్రాయబడి ఉంది.
1CO 14:35 స్త్రీలు సంఘంలో మాట్లాడటం అవమానకరం. కనుక ఒకవేళ స్త్రీ ఒక విషయాన్ని గురించి తెలుసుకోదలిస్తే, తమ ఇండ్లలో తమ భర్తల్ని అడిగి తెలుసుకోవాలి.
1CO 14:36 దైవసందేశం మీ నుండి ప్రారంభం కాలేదు. అది మీకు మాత్రమే లభించలేదు.
1CO 14:37 దేవుడు తన ద్వారా సందేశం పంపాడన్నవాడు, లేక తనలో ఆత్మీయ శక్తి ఉందని అనుకొన్నవాడు నేను మీకు వ్రాసినది ప్రభువు ఆజ్ఞ అని గుర్తించాలి.
1CO 14:38 అతడు యిది గుర్తించకపోతే దేవుడు అతణ్ణి గుర్తించడు.
1CO 14:39 సోదరులారా! దైవసందేశం చెప్పాలని ఆశించండి. తెలియని భాషలో మాట్లాడే వాళ్ళను ఆపకండి.
1CO 14:40 కాని అన్నిటినీ చక్కగా, సక్రమమైన పద్ధతిలో జరపండి.
1CO 15:1 సోదరులారా! నేను మీకు ప్రకటించిన సువార్తను విని దాన్ని సంపూర్ణంగా విశ్వసించారు. దాన్ని మీకు మళ్ళీ జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం.
1CO 15:2 నేను బోధించిన సువార్తను మీరు విడవకుండా అనుసరిస్తే అది మీకు రక్షణ కలిగిస్తుంది. లేనట్లయితే మీ విశ్వాసం వృధా అయిపోతుంది.
1CO 15:3 నేను పొందిన దాన్ని మీకు మొదట అందించాను. లేఖనాల్లో వ్రాయబడిన విధంగా క్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించాడు.
1CO 15:4 లేఖనాల్లో వ్రాయబడిన విధంగా ఆయన పాతి పెట్టబడి మూడవ రోజున బ్రతికింపబడ్డాడు.
1CO 15:5 పేతురుకు కనిపించాడు. ఆ తదుపరి పన్నెండు మందికి కనిపించాడు.
1CO 15:6 ఒకేసారి ఐదు వందల మందికి కనిపించాడు. వాళ్ళలో చాలా మంది ఇంకా జీవించివున్నారు. కొందరు మాత్రమే చనిపొయ్యారు.
1CO 15:7 ఆ తర్వాత ఆయన యాకోబుకు కనిపించాడు. అపొస్తలులందరికీ కనిపించాడు.
1CO 15:8 చివరకు అయోగ్యుడనైన నాకు కూడా కనిపించాడు.
1CO 15:9 ఎందుకంటే, అపొస్తలుల్లో నేను అధముణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి. కనుక అపొస్తలుడనని అనిపించుకోవటానికి కూడా అర్హుణ్ణి కాను.
1CO 15:10 కాని దేవుని దయవల్ల ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన దయ వృధా కాలేదు. నేను వాళ్ళందరికన్నా కష్టించి పని చేసాను. ఇది నిజానికి నేను చెయ్యలేదు. దేవుని దయ నాతో ఈ పని చేయించింది.
1CO 15:11 నేను బోధించినా లేక వాళ్ళు బోధించినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని విశ్వసించారు.
1CO 15:12 కాని మేము, క్రీస్తు చావు నుండి బ్రతికి వచ్చాడని బోధించాము కదా! మరి మీలో కొందరు చనిపోయిన వాళ్ళు బ్రతికి రారని ఎందుకంటున్నారు?
1CO 15:13 అది నిజమైతే క్రీస్తు కూడా చనిపోయి బ్రతికి రాలేదనే అర్థం వస్తుంది.
1CO 15:14 క్రీస్తు చనిపోయి బ్రతికి రానట్లయితే మా బోధన, మీ విశ్వాసము వృధా అయినట్లే కదా!
1CO 15:15 అంతే కాదు దేవుడు చనిపోయిన క్రీస్తును బ్రతికించాడని మేము చెప్పాము. అలాకాని పక్షంలో మేము దేవుణ్ణి గురించి తప్పు సాక్ష్యము చెప్పిన వాళ్ళమౌతాము. కాని ఒకవేళ దేవుడు చనిపోయిన వాళ్ళను నిజంగా బ్రతికించనట్లయితే ఆయన్ని కూడా బ్రతికించలేదు.
1CO 15:16 ఎందుకంటే చనిపోయిన వాళ్ళను బ్రతికించనట్లయితే క్రీస్తును కూడా బ్రతికించలేదు.
1CO 15:17 క్రీస్తును బ్రతికించలేదు అంటే, మీ విశ్వాసం వ్యర్థం. మీకు మీ పాపాలనుండి విముక్తి కలుగలేదన్న మాట.
1CO 15:18 అంటే చనిపోయిన క్రీస్తు విశ్వాసులు కూడా తమ పాపాల నుండి విముక్తి పొందలేదన్నమాట.
1CO 15:19 మనకు క్రీస్తు పట్ల ఉన్న ఆశాభావం ప్రస్తుత జీవితం కోసం మాత్రమే అయినట్లయితే మన స్థితి అందరికన్నా అధ్వాన్నం ఔతుంది.
1CO 15:20 కాని నిజానికి చనిపోయిన క్రీస్తు బ్రతికింపబడ్డాడు. చనిపోయి బ్రతికింపబడ్డ వాళ్ళలో ఆయన ప్రథముడు.
1CO 15:21 ఒక మనుష్యుని ద్వారా మరణం వచ్చినట్లు, పునరుత్థానం కూడా ఒక మనుష్యుని ద్వారా వచ్చింది.
1CO 15:22 ఆదాములో ఐక్యత పొందటం వల్ల మానవులు మరిణిస్తున్నట్లుగానే క్రీస్తులో ఐక్యత పొందటం వల్ల చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు.
1CO 15:23 ప్రతీ ఒక్కడు తన వరుసను బట్టి బ్రతికింపబడతాడు. మొదట క్రీస్తు, ఆయన వచ్చిన తరువాత ఆయనకు సంబంధించిన వాళ్ళు బ్రతికింపబడతారు.
1CO 15:24 అన్నీ అంతమయ్యే కాలం వస్తుంది. అప్పుడాయన రాజ్యాలన్నిటినీ, అధికారంలో ఉన్న వాళ్ళందరి శక్తిని నాశనం చేసి తండ్రి అయిన దేవునికి తన రాజ్యం అప్పగిస్తాడు.
1CO 15:25 ఎందుకంటే, దేవుడు శత్రువులందరిని తన పాదాల ముందు పడవేసే దాకా ఆయన రాజ్యం చెయ్యాలి.
1CO 15:26 చివరి శతృవైన మృత్యువు నాశనము చేయబడుతుంది.
1CO 15:27 ఎందుకంటే లేఖనాల్లో, “అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు” అని వ్రాయబడి ఉంది. “అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు” అని అంటే, వీటిలో దేవుడు కూడా ఉన్నాడని కాదు. దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల క్రింద ఉంచాడు.
1CO 15:28 కాని అన్నీ తన పాదాల క్రింద ఉంచబడగా కుమారుడు తనకు తానే దేవునికి విధేయుడై ఉన్నాడు. ఆ తదుపరి దేవుడు అన్నిటినీ పాలిస్తాడు.
1CO 15:29 పునరుత్థానం లేనట్లయితే, మరి చనిపోయిన వాళ్ళ కోసం, బాప్తిస్మము పొందిన వాళ్ళ సంగతేమిటి? వాళ్ళు ఏ విధంగా బ్రతికి వస్తారు? చనిపోయిన వాళ్ళు బ్రతికి రానట్లయితే ఇంకా బాప్తిస్మము ఎందుకు ఇస్తున్నారు.
1CO 15:30 మరి మేము ప్రతి గడియ మా ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో వేసుకొంటున్నాం?
1CO 15:31 సోదరులారా! నేను ప్రతీరోజు మరణాన్ని ఎదుర్కొంటున్నాను. మన క్రీస్తు ప్రభువులో మిమ్మల్ని చూసి గర్విస్తాను. కనుక మీకు ఈ విషయం చెపుతున్నాను.
1CO 15:32 ఒకవేళ నేను ఎఫెసులో క్రూరమృగాలతో పోట్లాడటం, మానవ కారణంగా మాత్రమే అయినట్లయితే నాకొచ్చిన లాభం ఏమిటి? చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతకనట్లయితే, “తిని, త్రాగుదాం, ఎలాగో మరణిస్తాంగదా.”
1CO 15:33 మోసపోకండి, “చెడు సహవాసం మంచి వాణ్ణి చెడుపుతుంది.”
1CO 15:34 మేలుకోండి. పాపం చెయ్యటం మానుకొండి. మీలో కొందరికి దేవుణ్ణి గురించి తెలియదు. అది సిగ్గుచేటు.
1CO 15:35 కొందరు, “చనిపోయిన వాళ్ళు ఏ విధంగా బ్రతికింపబడతారు? వాళ్ళు ఎలాంటి దేహంతో వస్తారు?” అని అడగవచ్చు.
1CO 15:36 ఎంతటి మూర్ఖులు! నీవు భూమిలో నాటిన విత్తనం చనిపోకపోతే అది మొలకెత్తదు.
1CO 15:37 నీవు ఒక చిన్న విత్తనాన్ని, ఉదాహరణకు ఒక గోధుమ విత్తనాన్ని నాటుతావు, కాని పెరగబోయే మొలకను నాటవు.
1CO 15:38 దేవుడు తాను అనుకొన్న విధంగా ప్రతీ విత్తనానికి దానికి తగిన దేహాన్ని యిస్తాడు.
1CO 15:39 మాంసాలన్నీ ఒకే రకం కావు. మానవుల మాంసం ఒక రకం. జంతువుల మాంసం ఒక రకం. పక్షుల మాంసం ఒక రకం. చేపల మాంసం ఒక రకం.
1CO 15:40 ఆకాశంలో జ్యోతులున్నాయి, భూమ్మీద జ్యోతులున్నాయి, గాని వాటి వాటి ప్రకాశం వేరు.
1CO 15:41 సూర్యుడు ఒక రకంగా, చంద్రుడు ఒక రకంగా, నక్షత్రాలు ఒక రకంగా ప్రకాశిస్తాయి. ఒక నక్షత్రం ప్రకాశించిన విధంగా మరొక నక్షత్రం ప్రకాశించదు.
1CO 15:42 చనిపోయిన వాళ్ళు బ్రతికి రావటం కూడా అదే విధంగా ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి నశించని శరీరాన్ని పొందుతారు.
1CO 15:43 గౌరవం లేని శరీరంగా నాటబడి మహిమగల శరీరంగా లేపబడుతుంది. బలహీనమైన శరీరంగా నాటబడి శక్తిగల శరీరముగా లేస్తుంది.
1CO 15:44 భౌతికమైన శరీరాన్ని నాటి, ఆత్మీయమైన శరీరాన్ని పుట్టిస్తాడు. భౌతికమైన శరీరం ఉంది అంటే, ఆత్మీయ శరీరం కూడా ఉంటుంది.
1CO 15:45 ఈ విధంగా వ్రాయబడింది: “ప్రథమ పురుషుడైన ఆదాము జీవించే నరుడయ్యాడు, చివరి ఆదాము జీవాన్ని ఇచ్చే ఆత్మ అయ్యాడు.”
1CO 15:46 ముందు ఆత్మీయత రాలేదు. ముందు భౌతిక శరీరం వచ్చింది. ఆ తర్వాత ఆత్మీయత వచ్చింది.
1CO 15:47 మొదటి పురుషుడు భూమ్మీద ఉన్న మట్టితో సృష్టింపబడ్డాడు. రెండవ మనుష్యుడు పరలోకంనుండి దిగివచ్చాడు.
1CO 15:48 భూమ్మీద ఉన్న వాళ్ళు మట్టితో సృష్టింపబడిన వానివలే ఉన్నారు. పరలోకానికి సంబంధించిన వాళ్ళు పరలోకంనుండి వచ్చిన వానివలె ఉన్నారు.
1CO 15:49 మట్టితో సృష్టింపబడిన వాని పోలికలతో మనము జన్మించినట్లే పరలోకం నుండి వచ్చిన వాని పోలికలను కూడా మనము పొందుతాము.
1CO 15:50 సోదరులారా! నేను చెప్పేదేమిటంటే, రక్త మాంసాలతో ఉన్న వాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు. నశించిపోయేది అమరత్వం పొందదు.
1CO 15:51 మీకో రహస్యం చెపుతాను వినండి. మనలో ఎవ్వరూ చనిపోరు. అందరూ మారిపోతారు.
1CO 15:52 చివరి బూర ఊదినప్పుడు, మనమందరము ఒక్క క్షణంలో, కనురెప్ప పాటులో మారిపోతాము. ఆ క్షణంలో చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చి చిరంజీవులైపోతారు. మనలో మార్పు కలుగుతుంది.
1CO 15:53 ఎందుకంటే నశించిపోయే ఈ దేహం నాశనం కాని దేహాన్ని ధరించాలి. చనిపోయే ఈ దేహం అమరత్వం పొందాలి.
1CO 15:54 ఇది జరిగినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినట్లు జరుగుతుంది: “మరణం ఓడిపోయి, సంపూర్ణ విజయం కలిగింది.”
1CO 15:55 “ఓ మరణమా! నీ విజయం ఎక్కడ? ఓ మరణమా! నీ కాటు వేసే శక్తి ఎక్కడ?”
1CO 15:56 మరణం కాటు వేయగల శక్తిని ధర్మశాస్త్రం నుండి పొందుతుంది.
1CO 15:57 కాని దేవుడు మన యేసు ప్రభువు ద్వారా మనకు విజయం యిస్తాడు. కనుక దేవునికి వందనాలు.
1CO 15:58 కనుక నా ప్రియమైన సోదరులారా! ఏదీ మిమ్మల్ని కదిలించలేనంత స్థిరంగా నిలబడండి. ప్రభువుకోసం పడిన మీ శ్రమ వృధాకాదు. ఇది మీకు తెలుసు. కనుక సదా ప్రభువు సేవలో లీనమై ఉండండి.
1CO 16:1 పరిశుద్ధుల కోసం సేకరించవలసిన చందాల విషయంలో ఏం చెయ్యాలో, గలతీయలో ఉన్న సంఘాలకు చెప్పాను. మీరు కూడా అదే విధంగా చెయ్యండి.
1CO 16:2 తన సంపాదనను బట్టి ప్రతి ఒక్కడూ కొంత డబ్బు ఆదివారం రోజు దాచాలి. అలా చేస్తే నేను వచ్చిన రోజెల్లా చందానెత్తనవసరం ఉండదు.
1CO 16:3 నేను వచ్చాక మీరెన్నుకొన్న వాళ్ళకు పరిచయ పత్రాలు వ్రాసి వాళ్ళతో మీరు సేకరించిన డబ్బును యెరూషలేము పంపుతాను.
1CO 16:4 నేను కూడా వెళ్ళటం ఉచితమని అనిపిస్తే అంతా కలిసి వెళ్తాం.
1CO 16:5 నేను మాసిదోనియ ద్వారా వెళ్ళాలి కనుక అక్కడికి వెళ్ళి, మీ దగ్గరకు వస్తాను.
1CO 16:6 అలా చేస్తే నేను మీతో కొంతకాలం గడపవచ్చు. బహుశా చలికాలమంతా అక్కడే ఉంటానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు.
1CO 16:7 అందుకే ప్రస్తుతం మీ దగ్గరకు రావాలని లేదు. అలా చేస్తే, నేను వెళ్తూ మిమ్మల్ని చూసినట్లు మాత్రమే ఔతుంది. అలా కాక! ప్రభువు చిత్తమైతే మీతో కొంతకాలం గడపాలని ఉంది.
1CO 16:8 నేను ఎఫెసులో పెంతుకొస్తు పండుగ దాకా ఉంటాను.
1CO 16:9 అక్కడ ఫలవంతమైన కార్యాలు చెయ్యటానికి నాకొక గొప్ప అవకాశం కలిగింది. కాని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.
1CO 16:10 తిమోతి మీ దగ్గరకు వస్తే అతనికి ధైర్యం చెప్పండి. ఎందుకంటే, నాలాగే అతడు కూడా ప్రభువు కార్యాన్ని చేస్తున్నాడు.
1CO 16:11 ఎవ్వరూ అతణ్ణి నిరాకరించకండి. అతని ప్రయాణం శాంతంగా సాగేటట్లు చూడండి. అతడు యితర సోదరులతో కలిసి నా దగ్గరకు రానున్నాడు. అతని కోసం నేను ఎదురు చూస్తున్నాను.
1CO 16:12 ఇక మన సోదరుడైన అపొల్లోను గురించి: నేను మిగతా సోదరులతో కలిసి మీ దగ్గరకు వెళ్ళుమని చాలా వేడుకొన్నాను. అతనికి ప్రస్తుతం వెళ్ళటానికి కొంచెం కూడా యిష్టం లేదు. కాని తనకు మనస్సున్నప్పుడు అతడు వస్తాడు.
1CO 16:13 మెలకువగా ఉండండి. సంపూర్ణంగా విశ్వసించండి. ధైర్యంగా ఉండండి. శక్తిని వదులుకోకండి.
1CO 16:14 చేసే కార్యాలు ప్రేమతో చెయ్యండి.
1CO 16:15 అకయ ప్రాంతంలో విశ్వాసులుగా మారిన వాళ్ళలో స్తెఫను కుటుంబం మొదటిది. ఇది మీకు తెలుసు. వాళ్ళు తమ జీవితాన్ని విశ్వాసుల సేవకు అంకితం చేసారు.
1CO 16:16 వాళ్ళను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను. వాళ్ళనే కాక వాళ్ళతో కలిసి సేవ చేస్తున్న ప్రతి ఒక్కణ్ణీ మీరు అనుసరించాలి.
1CO 16:17 స్తెఫను, పొర్మూనాతు, అకాయికు వచ్చి మీరు తీర్చలేని కొరత తీర్చారు. వాళ్ళు రావటం వల్ల నాకు ఆనందం కలిగింది.
1CO 16:18 వాళ్ళు మీ ఆత్మలకు, నా ఆత్మకు ఆనందం కలిగించారు. వాళ్ళను గౌరవించటం సమంజసం.
1CO 16:19 ఆసియ ప్రాంతంలోని సంఘాలు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. అకుల, ప్రిస్కిల్ల మరియు వాళ్ళింట్లో సమావేశమయ్యే సంఘము మీకు ప్రభువు పేరిట తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
1CO 16:20 ఇక్కడున్న సోదరులందరు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోదరుల ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకోండి. పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు వందనాలు చెప్పండి.
1CO 16:21 నేను పౌలును ఈ శుభాకాంక్షలు నా స్వహస్తాలతో వ్రాస్తున్నాను.
1CO 16:22 ప్రభువును ప్రేమించని వాడు శాపగ్రస్తుడు అవుతాడు! ప్రభువా రమ్ము!
1CO 16:23 యేసు ప్రభువు యొక్క అనుగ్రహము మీకందరికి లభించుగాక.
1CO 16:24 యేసు క్రీస్తు పేరిట నా ప్రేమ మీకందరికీ తెలుపుతున్నాను. ఆమేన్.
2CO 1:1 దైవేచ్ఛ వల్ల యేసు క్రీస్తు అపొస్తులునిగా ఉన్న పౌలు నుండి, మన సోదరుడైన తిమోతి నుండి కొరింథులో ఉన్న దేవుని సంఘానికి మరియు అకయ ప్రాంతంలోని పవిత్రులకు.
2CO 1:2 మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించాలని కోరుతున్నాను.
2CO 1:3 మన యేసు క్రీస్తు ప్రభువును తండ్రియైన దేవుణ్ణి స్తుతిద్దాము. దేవుడు దయామయుడు. మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు.
2CO 1:4 ఆయన మన కష్టాలు తొలిగిపోవటానికి సహాయం చేస్తాడు. ఆయనలాగే మనము కూడా యితరుల కష్టాలు తొలగించటానికి సహాయం చెయ్యాలని ఆయన ఉద్దేశం.
2CO 1:5 క్రీస్తు కష్టాల్ని మనము పంచుకొన్న విధంగా ఆయన ద్వారా కలిగే సహాయాన్ని కూడా పంచుకొందాము.
2CO 1:6 మీకు సహాయం చెయ్యాలని రక్షణ కలగాలని మేము కష్టాలు అనుభవిస్తున్నాము. మీకు సహాయం చెయ్యటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఈ సహాయం వల్ల మేము అనుభవించిన కష్టాలు మీరు కూడా అనుభవించేటట్లు మీలో సహనం కలుగుతుంది.
2CO 1:7 నాకు మీ పట్ల గట్టి నమ్మకం ఉంది. మీరు మా కష్టాలు పంచుకొన్నట్లుగానే, మాకు కలిగే సహాయాన్ని కూడా పంచుకొంటారని మాకు తెలుసు.
2CO 1:8 మేము ఆసియ ప్రాంతంలో అనుభవించిన కష్టాలు మీకు చెప్పకుండా ఉండలేము. మాకు అక్కడ తీవ్రమైన కష్టాలు కలిగాయి. అవి మేము మోయలేనంతగా ఉండినవి. జీవిస్తామనే ఆశ కూడా పోయింది.
2CO 1:9 మా మనస్సులకు మరణదండన పొందినట్లు అనిపించింది. మమ్మల్ని మేము నమ్ముకోరాదని, చనిపోయినవాళ్ళను బ్రతికించే దేవుణ్ణి నమ్మాలని ఇలా జరిగింది.
2CO 1:10 దేవుడు మమ్మల్ని ఆ ప్రమాదకరమైన చావునుండి రక్షించాడు. ఇక ముందు కూడా రక్షిస్తాడు. మాకు ఆయన పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది.
2CO 1:11 మీరు ప్రార్థించి మాకు సహాయం చెయ్యాలి. ఎంతమంది ప్రార్థిస్తే దేవుడు మాకు అంత సహాయం చేస్తాడు. దేవుడు మాకు ఆ సహాయం చేసాక, అందరూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం కలుగుతుంది.
2CO 1:12 మేము ఈ ప్రపంచంలో నిజాయితీగా, సదుద్దేశాలతో జీవిస్తున్నాము. ముఖ్యంగా మీకోసం చేసినవి సదుద్దేశంతో చేసాము. మేము చేసినవన్నీ దేవుని దయవల్ల సంభవించాయి. ఇది మానవ ప్రయత్నంవల్ల సంభవించ లేదు. ఇది నిజమని మా అంతరాత్మలు చెపుతున్నాయి. ఇది మేము గర్వించదగ్గ విషయం.
2CO 1:13 మేము మీరు చదవ కలిగింది, అర్థం చేసుకోగలిగింది మాత్రమే వ్రాస్తున్నాము.
2CO 1:14 మీరు మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకొన్నారు. మున్ముందు పూర్తిగా అర్థం చేసుకొంటారని ఆశిస్తున్నాను. యేసు ప్రభువు వచ్చిన రోజు, మీ కారణంగా మేము గర్విస్తున్నట్లే, మా కారణంగా మీరు గర్వించ కలుగుతారు.
2CO 1:15 నాకు ఈ విషయంలో నమ్మకం ఉంది. కనుకనే మీకు రెండుసార్లు లాభం కలగాలని నేను మొదట మిమ్మల్మి దర్శించాలని అనుకొన్నాను.
2CO 1:16 మాసిదోనియకు వెళ్ళే ముందు, తిరిగి వచ్చేముందు మీ దగ్గరకు రావాలనుకొన్నాను. అక్కడి నుండి నేను యూదయకు వెళ్ళేటప్పుడు మీ నుండి సహాయం లభిస్తుందని ఆశిస్తున్నాను.
2CO 1:17 నేను ఈ ఏర్పాట్లు ఆలోచించకుండా చేసానని అనుకొంటున్నారా? నేను అందరిలా ఒకసారి “ఔనని” ఒకసారి “కాదని” అనను.
2CO 1:18 దేవుని సాక్షిగా చెపుతున్నాను. మీకు బోధించిన విషయంలో “ఔను” “కాదు” అనే ప్రశ్నే లేదు.
2CO 1:19 నేను, సిల్వాను, తిమోతి, మీకు బోధించిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు విషయం “ఔను” “కాదు” అని అనలేదు. ఆయన అన్నివేళలా “ఔను” అని అన్నాడు.
2CO 1:20 దేవుడు క్రీస్తునందు చేసిన ఎన్ని వాగ్దానాలైనను “ఔను” అని అన్నట్లుగానే ఉన్నవి. అందువల్ల యేసు క్రీస్తు ద్వారా మనము “ఆమేన్” అని అంటున్నాము. ఇలా అని దేవునికి మహిమ కలిగిస్తున్నాము.
2CO 1:21 దేవుడు మనకు, అంటే మీకు, మాకు క్రీస్తు పట్ల ధృఢవిశ్వాసము ఉండేటట్లు చేస్తున్నాడు. మనకు అభిషేకమిచ్చినవాడు దేవుడు.
2CO 1:22 దేవుడు మనము తన వాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు. తన ఆత్మను రానున్నదానికి హామీగా మన గుండెల్లో ఉంచాడు.
2CO 1:23 నేను దైవసాక్షిగా చెపుతున్నాను. మిమ్మల్ని నొప్పించరాదని నా ఉద్దేశ్యం. కనుక నేను కొరింథుకు తిరిగి రాలేదు.
2CO 1:24 మీ విశ్వాసము ద్వారా ధృఢంకాగలరు. కనుక మీరు ఏ విధంగా విశ్వసించాలో మేము చెప్పటంలేదు. మీ ఆనందం కోసం మీతో కలిసి పని చెయ్యాలని మా ఉద్దేశ్యము.
2CO 2:1 అందువల్ల నేను మళ్ళీ మీ దగ్గరకువచ్చి మిమ్మల్మి దుఃఖపెట్టరాదని నిర్ణయించుకొన్నాను.
2CO 2:2 నేను మిమ్మల్ని దుఃఖపెడితే దుఃఖపడిన మీరు తప్ప నన్ను సంతోష పెట్టటానికి ఇతరులు ఎవరున్నారు?
2CO 2:3 కనుక మీకా ఉత్తరం వ్రాసాను. నేను వచ్చినప్పుడు నన్ను సంతోషపెట్టాలనుకొన్న వాళ్ళు నాకు దుఃఖం కలిగించరాదని నా ఉద్దేశ్యం. నేను ఆనందంగా ఉంటే మీరు కూడా ఆనందిస్తారని నాకు తెలుసు.
2CO 2:4 దుఃఖంతో కన్నీళ్ళు కారుస్తూ, వేదన పడుతూ మీకా ఉత్తరం వ్రాసాను. మీకు దుఃఖం కలిగించాలని కాదు. మీ పట్ల నాకున్న ప్రేమను మీకు తెలియ చెయ్యాలని అలా వ్రాసాను.
2CO 2:5 ఎవరైనా దుఃఖం కలిగించి ఉంటే, అతడు నాకు కాదు, మీకు దుఃఖం కలిగించాడు. అందరికీ కాకున్నా మీలో కొందరికన్నా దుఃఖం కలిగించాడు. అతని పట్ల కఠినంగా ప్రవర్తించటం నాకు యిష్టం లేదు.
2CO 2:6 మీలో చాలా మంది అతణ్ణి శిక్షించారు. అతనికి ఆ శిక్ష చాలు.
2CO 2:7 అతణ్ణి క్షమించి ఓదార్చండి. అలా చెయ్యకపోతే అతడు ఇంకా ఎక్కువ దుఃఖంలో మునిగిపోతాడు.
2CO 2:8 అతని పట్ల మీకున్న ప్రేమను అతనికి తెలియ చెయ్యమని వేడుకొంటున్నాను.
2CO 2:9 మీరు పరీక్షకు నిలువగలరా లేదా అన్నది చూడాలని, దేవుని ఆజ్ఞల్ని అన్నివేళలా పాటిస్తారా లేదా అన్నది గమనించాలని, నేను మీకా ఉత్తరం వ్రాసాను.
2CO 2:10 మీరు క్షమించిన వాళ్ళను నేనూ క్షమిస్తాను. నేను క్షమించింది, నిజానికి నేను క్షమించవలసింది ఏదైనా ఉండి ఉంటే అది మీకోసం క్రీస్తు అంగీకారంతో క్షమించాను.
2CO 2:11 సైతాను కుట్రలు మనకు తెలియనివి కావు. వాడు మనల్ని మోసం చెయ్యరాదని ఇలా చేసాను.
2CO 2:12 నేను క్రీస్తు సందేశం ప్రకటించటానికి త్రోయకు వెళ్ళాను. నా కోసం ప్రభువు ఎన్నో అవకాశాలు కలిగించాడు.
2CO 2:13 నా సోదరుడైన తీతు నాకు కనిపించలేదు. కనుక నా మనస్సుకు శాంతి కలుగలేదు. వాళ్ళ నుండి సెలవు తీసుకొని మాసిదోనియకు వెళ్ళాను.
2CO 2:14 దేవుడు, క్రీస్తు ద్వారా అన్ని వేళలా మనకు విజయం కలిగిస్తాడు. అందుకు మనము దేవునికి కృతజ్ఞతతో ఉందాము. క్రీస్తు యొక్క జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అన్ని చోట్లా ఆయన వెదజల్లాడు.
2CO 2:15 రక్షింపబడే వాళ్ళకు, నాశనమవుతున్న వాళ్ళకు మనము క్రీస్తు పరిమళంగా ఉండేటట్లు దేవుడు మనల్ని ఉపయోగించాడు.
2CO 2:16 మన పరిమళము ఒకరికి మరణము కలిగిస్తే మరొకరికి అది జీవాన్నిస్తుంది. ఇది చెయ్యటానికి ఎవరు అర్హులు?
2CO 2:17 అనేకులు దైవసందేశాన్ని సంతలో అమ్మే సరకులా అమ్ముతున్నారు. మేము అలాంటి వాళ్ళము కాదు. మేము క్రీస్తు సేవకులము. దేవుని సాక్షిగా చెపుతున్నాము. దేవుడే మమ్మల్ని పంపాడు.
2CO 3:1 ఇలా మాట్లాడటం మమ్మల్ని మేము పొగడుకొంటున్నట్లు అనిపిస్తోందా? మీ నుండి మాకు పరిచయపత్రాలు కావాలా? లేక మీ దగ్గరకు వచ్చినప్పుడు యితరులవలే పరిచయ పత్రాలు తీసుకురావాలా?
2CO 3:2 మీరే మా పరిచయ పత్రం. మిమ్మల్ని గురించి మా హృదయాలపై వ్రాయబడి ఉంది. ఇది అందరికీ తెలుసు. దాన్ని అందరూ చదివారు.
2CO 3:3 మీరు క్రీస్తును గురించి వ్రాసిన పత్రంలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ పత్రం సిరాతో కాక, సజీవమైన దేవుని ఆత్మతో వ్రాయబడింది. అది రాతి పలకపై కాక, మానవుల హృదయాలపై వ్రాయబడింది. మీరు మా సేవా ఫలితం.
2CO 3:4 మేము దేవుణ్ణి క్రీస్తు ద్వారా విశ్వసిస్తున్నాము. కనుక మాకానమ్మకం ఉంది.
2CO 3:5 మేము చేస్తున్న కార్యాలు చేయగల సామర్థ్యం మాలో ఉందని చెప్పటం లేదు. ఆ శక్తి మాకు దేవుడు ప్రసాదించాడు.
2CO 3:6 దేవుడు మేము క్రొత్త నిబంధనకు సేవకులుగా ఉండేటట్లు మాకు శక్తినిచ్చాడు. ఈ నిబంధన వ్రాత రూపంలో లేదు. అది దేవుని ఆత్మ రూపంలో ఉంది. వ్రాత రూపంలో ఉన్న నియమాలు మరణాన్ని కలిగిస్తాయి. కాని దేవుని ఆత్మ జీవాన్నిస్తాడు.
2CO 3:7 రాతిపలకపై అక్షరాలతో చెక్కబడిన నియమాలను దేవుడు యిచ్చినప్పుడు, మోషే ముఖం మీద మహిమాప్రకాశం కనిపించింది. తదుపరి ఆ మహిమ తగ్గుతూ పోయింది. అయినా ఇశ్రాయేలు ప్రజలు అతని ముఖం చూడలేక పోయారు. చావును కలిగించే పాలనలో మహిమ అంత గొప్పగా ఉంటే,
2CO 3:8 దేవుని ఆత్మనిచ్చే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి.
2CO 3:9 శిక్షను కలిగించే పాలనలో అంత మహిమ ఉంటే, నీతిని స్థాపించే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి.
2CO 3:10 ఇప్పుడు మనకు లభించిన గొప్ప మహిమతో పోలిస్తే, గతంలో ఉండిన ఆ మహిమకు ప్రకాశం లేదు.
2CO 3:11 నశించిపోతున్న ఆ మహిమకు అంత ప్రకాశం ఉంటే చిరకాలం ఉండే మహిమకు యింకెంత ప్రకాశం ఉంటుందో ఆలోచించండి.
2CO 3:12 మాకు అంత నిరీక్షణ ఉంది కనుకనే మాలో యింత ధైర్యముంది.
2CO 3:13 తగ్గిపోతున్న తన ప్రకాశాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడరాదని మోషే తన ముఖానికి ముసుగు వేసుకొన్నాడు. మేము మోషేలాంటి వాళ్ళము కాదు.
2CO 3:14 వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఈ నాటికీ వాళ్ళు పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు వాళ్ళకు ముసుగు కనిపిస్తూవుంటుంది. దాన్ని ఎవ్వరూ తీయలేరు. క్రీస్తు మాత్రమే ఆ ముసుగు తీసివేయగలడు.
2CO 3:15 ఈ నాటికీ మోషే గ్రంథాలు చదివినప్పుడు ఆ ముసుగు వాళ్ళ బుద్ధిని కప్పివేస్తుంది.
2CO 3:16 కాని ప్రభువు వైపుకు మళ్ళిన వాళ్ళ “ముసుగు తీసివేయబడింది.”
2CO 3:17 ప్రభువే “ఆత్మ”. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వేఛ్చ ఉంటుంది.
2CO 3:18 ముసుగు తీసివేయబడ్డ మా ముఖాల్లో ప్రభువు మహిమ ప్రకాశిస్తోంది. అది ఆత్మ అయినటు వంటి ప్రభువు నుండి వచ్చింది. అనంతమైన ఆ మహిమ మమ్మల్ని ప్రభువులా మారుస్తోంది.
2CO 4:1 దేవుని అనుగ్రహం వల్ల మేము ఈ సేవ చేస్తున్నాము. కనుక ధైర్యం కోల్పోము.
2CO 4:2 నిజానికి అవమానం కలిగించే రహస్య మార్గాలను మేము వదిలివేసాము. మేము మోసాలు చెయ్యము. దైవసందేశాన్ని మార్చము. సత్యాన్ని అందరికీ స్పష్టంగా తెలియచేస్తాము. తద్వారా మేము ఎలాంటి వాళ్ళమో మేము దేవుని సమక్షంలో ఏ విధంగా జీవిస్తున్నామో ప్రజలు తెలుసుకున్నారు.
2CO 4:3 మేము చెప్పే దైవసందేశం మూయబడితే నశించే వాళ్ళకు మాత్రమే అది మూయబడింది.
2CO 4:4 క్రీస్తు దేవుని ప్రతిరూపం. దైవసందేశం ఆయన మహిమను ప్రకాశింప చేస్తుంది. దాన్ని చూడనీయకుండా ఈ యుగపు పాలకుడు నమ్మని ప్రజల హృదయాలను గ్రుడ్డి చేసాడు.
2CO 4:5 మమ్మల్ని మేము ప్రకటించుకోము. యేసు క్రీస్తు ప్రభువని ప్రకటిస్తాము. యేసు కొరకు మేము మీ సేవకులమని ప్రకటిస్తాము.
2CO 4:6 “చీకటి నుండి వెలుగు ప్రకాశించనీ!” అని అన్న దేవుడు తన వెలుగు మా హృదయాల్లో వెలిగించాడు. క్రీస్తు ముఖంలో దేవుని మహిమ ప్రకాశిస్తోంది. ఆ మహిమలో ఉన్న జ్ఞానాన్ని మాలో ప్రకాశింప చేసాడు.
2CO 4:7 దేవుడు ఇచ్చిన ఈ ఐశ్వర్యం మాములు మట్టికుండల్లో దాగివుంది. మేమే ఆ కుండలము. దీనివల్ల ఈ శక్తి మాది కాదని, దేవునిదని స్పష్టంగా తెలుస్తోంది.
2CO 4:8 మా చుట్టూ కష్టాలు ఉన్నాయి. కాని మేము ఆ కష్టాలకు నలిగిపోలేదు. మాకు అవమానాలు కలిగాయి. కాని మేము వాటివల్ల దిగులుపడలేదు.
2CO 4:9 మేము హింసించబడుతున్నాము కాని, మేము దిక్కులేని వాళ్ళము కాము. మేము క్రింద పడ్డాము కాని నశించిపోలేదు.
2CO 4:10 మేము అన్ని వేళలా యేసు మరణాన్ని మోసుకొని తిరుగుతూ ఉంటాము. “ఆయన” జీవితం మా జీవితాల ద్వారా వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం.
2CO 4:11 బ్రతికి ఉన్న మేము యేసుకోసం మా జీవితాలను మరణానికి అప్పగిస్తూ ఉంటాము. ఆయన జీవితం మా భౌతిక దేహాల్లో వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం.
2CO 4:12 కనుక ఆయన మరణం మాలో పనిచేస్తోంది. ఆయన జీవితం మీలో పని చేస్తోంది.
2CO 4:13 లేఖనాల్లో, “నేను విశ్వసించాను. కనుక మాట్లాడుతున్నాను” అని వ్రాయబడివుంది. మేము కూడా అదేవిధంగా విశ్వసించాము. కనుక మాట్లాడుతున్నాము.
2CO 4:14 ఎందుకంటే, చనిపోయిన యేసు ప్రభువును బ్రతికించిన వాడు, ఆయనతో సహా మమ్మల్ని కూడా బ్రతికిస్తాడని మాకు తెలుసు. ఆ విధంగా మమ్ములను కూడా లేపి, మీతో సహా మమ్మల్ని కూడా దేవుని సమక్షంలో నిలబెడతాడు.
2CO 4:15 ఇవన్నీ మీ కోసమే జరుగుతున్నాయి. దైవానుగ్రహం ప్రజల్లో వ్యాపిస్తూ పోవాలనీ, దేవుని మహిమ నిమిత్తమై ప్రజలు అర్పించే కృతజ్ఞతలు పెరుగుతూ పోవాలని యిందులోని ఉద్దేశ్యం.
2CO 4:16 కనుక మేము అధైర్యపడము. భౌతికంగా మేము క్షీణించిపోతున్నా, మా ఆంతర్యం ప్రతి రోజూ శక్తి పొందుతూ ఉంది.
2CO 4:17 క్షణికమైన మా మామూలు కష్టాలు మా కోసం శాశ్వతమైన మహిమను కలిగిస్తున్నవి. మనము పొందుతున్న మహిమతో, అనుభవింపనున్న కష్టాలను పోలిస్తే ఈ కష్టాలు లెక్కింపతగినవి కావు.
2CO 4:18 అందువల్ల కనిపించే వాటిపై మా దృష్టి ఉంచక కనిపించని వాటిపై మా దృష్టి కేంద్రీకరిస్తున్నాము. కనిపించేది క్షణికము. కనిపించనిది అనంతము.
2CO 5:1 భూలోక నివాసులమైన మనము నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనము నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు.
2CO 5:2 పరలోకపు గుడారాన్ని ధరించాలని ఆశిస్తూ మనము ఇంకా మూల్గుతూ ఉన్నాము.
2CO 5:3 మనము ఆ శరీరాన్ని ధరించాక మనకు నగ్నత ఉండదు.
2CO 5:4 ఈ గుడారంలో నివసిస్తున్నంతకాలం మనం పెద్దభారంతో మూల్గుతూ ఉంటాము. ఈ భౌతిక శరీరాన్ని ధరించిన మనము ఈ జీవితం యొక్క అంతంలో పరలోకపు శరీరాన్ని ధరించుకొంటాము.
2CO 5:5 ఆ శరీరాన్ని ధరించటానికి దేవుడు మనల్ని సిద్ధం చేసాడు. దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చాడు.
2CO 5:6 అందువల్ల మనము ఈ శరీరంలో నివాసమున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు ఖండితంగా తెలుసు.
2CO 5:7 మనము దృష్టి ఉండటం వల్ల జీవించటం లేదు. విశ్వాసం ఉండటం వల్ల జీవిస్తున్నాము.
2CO 5:8 మనమీ శరీరానికి దూరమై, ప్రభువుతో నివసించాలని కోరుకొంటున్నాము. మనకు ఆ ధైర్యం ఉంది.
2CO 5:9 అందువల్ల మనమీ శరీరంలో నివసిస్తున్నా లేక దానికి దూరంగా ఉన్నా ఆయన్ని ఆనంద పరచటమే మన ఉద్దేశ్యం.
2CO 5:10 ఎందుకంటే మనమంతా క్రీస్తు సింహాసనం ముందు నిలబడవలసి వస్తుంది. అప్పుడు, ఈ శరీరంలో మనముండగా చేసిన మంచికి, చెడుకు తగిన విధంగా ప్రతి ఒక్కడూ ప్రతిఫలం పొందుతాడు.
2CO 5:11 కనుక ప్రభువుకు భయపడుట అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. కనుక ఆయన సందేశాన్ని అంగీకరించుమని ఇతరులను కూడా ఒత్తిడి చేస్తాము. మా గురించి దేవునికి బాగా తెలుసు. మీ హృదయాలకు కూడా ఈ విషయం తెలుసునని నా విశ్వాసం.
2CO 5:12 మా గురించి మేము చెప్పుకోవాలని లేదు. మా విషయంలో గర్వించటానికి మీకు అవకాశం యిస్తున్నాము. అప్పుడు మీరు మనిషి గుణాన్ని కాక, అతని వేషం చూసి పొగిడే వాళ్ళకు, సమాధానం చెప్పగలుగుతారు.
2CO 5:13 మాకు మతి పోయిందా? ఔను, అది దేవుని కోసం పోయింది. మాకు మతి ఉందా? ఔను అది మీకోసం ఉంది.
2CO 5:14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం ఆయన మరణించాడు. అందువల్ల అందరూ ఆయన మరణంలో భాగం పంచుకొన్నారు. ఇది మనకు తెలుసు.
2CO 5:15 ఆయన అందరి కోసం మరణించాడు. కనుక జీవిస్తున్న వాళ్ళు యిక మీదట తమ కోసం జీవించరాదు. మరణించి ప్రజలకోసం మళ్ళీ బ్రతికింపబడిన వాని కోసం జీవించాలి.
2CO 5:16 ఇక నుండి మేము ఎవ్వరినీ లౌకికంగా పరిగణించము. ఒకప్పుడు మనం క్రీస్తును లౌకికంగా పరిగణించాము, గాని ఇప్పుడు అలా కాదు. ఆయన్ని గురించి మా అభిప్రాయం మారిపోయింది.
2CO 5:17 క్రీస్తులో ఐక్యత పొందినవాడు క్రొత్త జీవితం పొందుతాడు. పాత జీవితం పోయి క్రొత్త జీవితం వస్తుంది.
2CO 5:18 ఇదంతా దేవుడు చేసాడు. శత్రువులుగా ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా తన మిత్రులుగా చేసుకొన్నాడు. ఇతరులను కూడా తన మిత్రులుగా చేసే బాధ్యత మనపై ఉంచాడు.
2CO 5:19 క్రీస్తు ద్వారా దేవుడు అందరినీ తన మిత్రులుగా చేసుకొనుచున్నాడన్నదే మా సందేశం. దేవుడు ప్రజలు చేసిన పాపాలను క్షమిస్తాడు. వాళ్ళను తన మిత్రులుగా ఏ విధంగా చేసుకొంటాడన్న సందేశం చెప్పాడు.
2CO 5:20 మేము క్రీస్తు రాయబారులం. దేవుడే మా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్న విషయం గ్రహించండి. క్రీస్తు పక్షాన దేవునితో సమాధానపడుమని మిమ్మల్ని వేడుకొంటున్నాము.
2CO 5:21 క్రీస్తు పాపం చెయ్యలేదు. కాని మనకోసం దేవుడు ఆయన్ని పాపంగా చేసాడు. మనం క్రీస్తులో ఐక్యత పొంది దేవుని దృష్టిలో నీతిమంతులంగా ఉండాలని ఇలా చేసాడు.
2CO 6:1 దేవునితో సహపనివారంగా మేము, దైవానుగ్రహాన్ని వృధా చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము.
2CO 6:2 ఎందుకంటే, దేవుడే ఈ విధంగా అన్నాడు: “నేను సరియైన సమయానికి మీ మనవి విన్నాను. రక్షించే రోజున మీకు సహాయం చేసాను.” నేను చెప్పేదేమిటంటే, దేవుడు అనుగ్రహించే సమయం ఇదే. రక్షించే రోజు ఈ దినమే.
2CO 6:3 మేము చేసే సేవ చెడుపేరు పొందరాదని, మేము ఎవరి దారికి ఆటంకాలు కలిగంచము.
2CO 6:4 దానికి మారుగా మేము అన్ని విషయాలలో దేవుని సేవకులమని రుజువు చేసుకొంటున్నాము. ఆ గొప్ప సహనం మాకు కష్టాలు, దుఃఖాలు, అవసరాలు కలిగినప్పుడు,
2CO 6:5 దెబ్బలు తిన్నప్పుడు, చెరసాలలో పడినప్పుడు, ప్రజలు ఎదురు తిరిగినప్పుడు, నిద్రాహారాలు లేక కష్టపడి పని చేసినప్పుడు,
2CO 6:6 నిష్కల్మషంగా ఉండటంలో, యితర్లను అర్థం చేసుకోవటంలో, సహనం, దయ చూపటంలో, పరిశుద్ధాత్మ విషయంలో, నిజమైన ప్రేమ వ్యక్తం చేయటంలో,
2CO 6:7 సత్యంగా మాట్లాడటంలో, దేవుని శక్తి విషయంలో, కుడి ఎడమ చేతుల్లో ఉన్న నీతి ఆయుధాల విషయంలో,
2CO 6:8 కీర్తి వచ్చినా, అవమానాలు కలిగినా, పొగడ్తలు వచ్చినా, నిందలు కలిగినా, సత్యవంతులన్నా, మోసగాళ్ళన్నా,
2CO 6:9 మేము తెలిసినా మమ్మల్ని తెలియని వాళ్ళుగా చూసినప్పుడు, చనిపోవుచున్నను చనిపోని వారిగా ఉన్నప్పుడు, కొట్టబడినా, చంపబడకుండా ఉన్నప్పుడు,
2CO 6:10 దుఃఖంతో ఉన్నా ఆనందంగా ఉన్నప్పుడు, దరిద్రులమైనా యితరులను ధనవంతులుగా చేస్తున్నప్పుడు, మా దగ్గర ఏమీ లేకున్నా అన్నీ ఉన్నాయన్నట్టుగా వున్నప్పుడు మేము దేవుని సేవకులంగా రుజువు చేసుకొంటున్నాం.
2CO 6:11 కొరింథులోని ప్రజలారా! మేము మీతో దాచకుండా మాట్లాడి మిమ్మల్ని హృదయ పూర్వకంగా అంగీకరించాము.
2CO 6:12 మేము మా ప్రేమ దాచకుండా మీకు చూపాము. కాని మీరు మీ ప్రేమ మాకివ్వకుండా దాస్తున్నారు.
2CO 6:13 నేను మిమ్మల్ని నా బిడ్డలుగా భావించి మాట్లాడుతున్నాను. మేము మిమ్మల్ని హృదయ పూర్వకంగా అంగీకరించినట్లే, మమ్మల్ని మీరు హృదయపూర్వకంగా అంగీకరించండి.
2CO 6:14 అవిశ్వాసులతో అంటిపెట్టుకోకండి. నీతికి, దుర్మార్గతకు పొత్తు ఏ విధంగా కుదురుతుంది? వెలుగుకూ, చీకటికి ఏమి సహవాసము?
2CO 6:15 క్రీస్తుకు, బెలియాలుకు మధ్య సంబంధము ఎలా ఉంటుంది? విశ్వాసం ఉన్న వానికి, విశ్వాసం లేని వానికి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది?
2CO 6:16 దేవుని ఆలయానికి, విగ్రహాలకు ఒడంబడిక ఎలా ఉంటుంది? మనం జీవంతో ఉన్న దేవునికి ఆలయంగా ఉన్నాము. దేవుడు ఈ విధంగా అన్నాడు: “నేను వాళ్ళ మధ్య నడుస్తూ వాళ్ళతో జీవిస్తాను. వాళ్ళు నా ప్రజగా, నేను వాళ్ళ దేవునిగా ఉంటాము.”
2CO 6:17 “కాబట్టి వాళ్ళను వదిలి వేరుగా ఉండండి. అపవిత్రమైన దానికి దూరంగా ఉంటే నిన్ను స్వీకరిస్తాను అని ప్రభువు అన్నాడు.”
2CO 6:18 “నేను మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారు అని సర్వశక్తిసంపన్నుడైన ప్రభువు అంటున్నాడు.”
2CO 7:1 మిత్రులారా! మనకు ఈ వాగ్దానాలు వున్నాయి. కనుక మన దేహాలకు, మన ఆత్మలకు కలిగిన మలినాన్ని కడిగి పరిశుద్ధమౌదాం. మనకు దేవునిపట్ల భయ భక్తులు ఉన్నాయి. కనుక పరిపూర్ణత పొందటానికి ప్రయత్నం చేద్దాం.
2CO 7:2 మీ హృదయాల్లో మాకు స్థానం ఇవ్వండి. మేము ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. ఎవ్వరినీ తప్పుదారి పట్టించలేదు. మా స్వలాభానికి ఎవ్వరినీ దోచుకోలేదు.
2CO 7:3 మిమ్మల్ని నిందించాలని ఇలా అనటం లేదు. మా హృదయాల్లో మీకు ఎలాంటి స్థానం ఉందో మీకు ముందే చెప్పాను. మేము మీతో కలిసి జీవించటానికి, మరణించటానికి కూడా సిద్ధంగా ఉన్నాము.
2CO 7:4 మీ పట్ల నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. మీ విషయంలో నేను గర్విస్తూంటాను. మీ ప్రోత్సాహం వల్ల మేము మా కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నాము. నాకు చాలా ఆనందంగా ఉంది.
2CO 7:5 మేము మాసిదోనియ దేశానికి వచ్చినప్పటినుండి మా ఈ దేహాలకు విశ్రాంతి లేదు. ప్రతిచోటా మమ్మల్ని కష్టపెట్టారు. బయట ఆందోళనలు, లోపల భయాలు.
2CO 7:6 కాని క్రుంగిన మనస్సులకు శాంతిని కలిగించే దేవుడు తీతును పంపి మాకు సహాయం చేసాడు.
2CO 7:7 అతడు రావటం వల్ల మాత్రమే కాకుండా మీరతనికి చేసిన సహాయాన్ని గురించి, ఆదరణను గురించి, అతడు చెప్పటం వల్ల మాకు ఆనందం కలిగింది. అతడు మీ కోరికను గురించి, మీ దుఃఖాన్ని గురించి, మీరు నా పట్ల చూపిన అభిమానాన్ని గురించి చెప్పాడు. దానివల్ల ఇంకా ఎక్కువ ఆనందపడ్డాను.
2CO 7:8 నా లేఖ మీకు దుఃఖం కలిగించినా, అది వ్రాసినందుకు నేను బాధ చెందటం లేదు. అది మీకు కొంత దుఃఖం కలిగించిందని నాకు తెలుసు. అది నాకు కూడా కొంత దుఃఖం కలిగించింది. అయినా అది కొంచెం సేపు మాత్రమే.
2CO 7:9 కాని యిప్పుడు నాకు ఆనందంగా ఉంది. మీకు దుఃఖం కలిగించానని కాదు, మీ దుఃఖం మారుమనస్సుకు నడిపింది. దేవుని చిత్తానుసారంగా మీరు దుఃఖపడ్డారు. గాని మేము మీకు ఏ హానీ కలిగించలేదు.
2CO 7:10 దేవుడు కలిగించిన దుఃఖం, మారుమనస్సు పొందేటట్లు చేసి రక్షణకు దారితీస్తుంది. దాని వల్ల నష్టం కలుగదు. కాని ఈ ప్రపంచం కలిగించే దుఃఖం మరణానికి దారితీస్తుంది.
2CO 7:11 దేవుడు కలిగించిన దుఃఖం వల్ల మీలో కలిగిన మార్పుల్ని గమనించండి. మీలో ఎంత నిజాయితీ కలిగిందో చూడండి. నిర్దోషులని నిరూపించుకోవటానికి మీరు ఎంత ఉత్సాహంతో ఉన్నారో గమనించండి. ఎంత ఆందోళన కలిగిందో గమనించండి. మీ అభిమానం ఎంతగా అభివృద్ధి చెందిందో గమనించండి. మీ విశ్వాసం ఎంతగా పెరిగిందో, న్యాయం చేకూర్చాలనే ఆత్రుత ఎంతగా కలిగిందో గమనించండి. మీరు ఈ సమస్యవల్ల కలిగిన ప్రతీ నిందనుండి తప్పించుకొన్నారు.
2CO 7:12 కనుక నేనా ఉత్తరం మీలో అన్యాయం చేసిన వానికొరకు గాని, ఆ అన్యాయానికి గురి అయిన వానికొరకు గాని, వ్రాయలేదు. దేవుని సాక్షిగా చెపుతున్నాను-మీరు కనబరుస్తున్న అభిమానాన్ని, మీరు చూడగలగాలని వ్రాసాను.
2CO 7:13 అది మాకు ప్రోత్సాహం కలిగించింది. మా ప్రోత్సాహంతో పాటు, తీతు యొక్క ఆనందాన్ని చూసి మాకు ఇంకా ఎక్కువ ఆనందం కలిగింది. మీరు అతని మనస్సుకు శాంతి చేకూర్చారు.
2CO 7:14 నేను మిమ్మల్ని అతని ముందు పొగిడాను. మీరు నా మాట నిలబెట్టారు. మేము మీతో ఎప్పుడూ సత్యం మాట్లాడాము. మిమ్మల్ని పొగుడుతూ తీతునకు చెప్పినవి కూడా సత్యమని మీరు రుజువు చేసారు.
2CO 7:15 మీరు అతణ్ణి విధేయతతో, భయంతో, వణుకుతూ ఆహ్వానించారు. ఆ విషయం అతడు జ్ఞాపకం చేసుకొని మీ పట్ల ఉన్న వాత్సల్యాన్ని పెంచుకొన్నాడు.
2CO 7:16 నేను మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించగలను. అందుకు నాకు ఆనందంగా ఉంది.
2CO 8:1 సోదరులారా! మాసిదోనియ దేశంలోని సంఘాల పట్ల దేవుడు చూపిన అనుగ్రహాన్ని గురించి మీకు తెలపాలని మా అభిప్రాయం.
2CO 8:2 వాళ్ళ కష్టాలు వాళ్ళను తీవ్రంగా పరీక్షించాయి. వాళ్ళు చాలా పేదరికం అనుభవించారు. అయినా వాళ్ళలో చాలా ఆనందం కలిగి, వాళ్ళు యివ్వటంలో మిక్కిలి ఔదార్యం చూపారు.
2CO 8:3 వాళ్ళు యివ్వగలిగింది స్వయంగా యిచ్చారు. అంతే కాదు, తాము యివ్వగలిగినదానికన్నా ఇంకా ఎక్కువే యిచ్చారని నేను ఖచ్చితంగా చెప్పగలను.
2CO 8:4 విశ్వాసులైన వారికి చేసే సహాయంలో తాము కూడా చేరుతామని వాళ్ళు మమ్మల్ని ప్రాధేయపడ్డారు.
2CO 8:5 మేము ఆశించినంతగా చేయలేదు. అయినా వాళ్ళు మొదట తమను తాము ప్రభువుకు అర్పించుకొన్నారు. తర్వాత దేవుని చిత్తానుసారంగా మాకును అప్పగించుకున్నారు.
2CO 8:6 ఈ కార్యాన్ని ప్రారంభించిన తీతును దీన్ని కొనసాగించుమని వేడుకొన్నాము. మీరు చేయాలనుకొన్న ఈ సేవాకార్యాన్ని అతడు పూర్తిచేసాడు.
2CO 8:7 మీరు విశ్వాసంలో, మాటలో, జ్ఞానంలో, సంపూర్ణ ఆసక్తిలో, మా పట్ల వ్యక్తపరుస్తున్న ప్రేమలో అందరిని మించిపోయారు. మీ దాతృత్వంలో కూడా అందరిని మించిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను.
2CO 8:8 నేను మీకు ఆజ్ఞాపించటం లేదు. ఇతరులు చేస్తున్న సేవతో మీ ప్రేమను పోల్చి చూడాలని ఉంది. మీ ప్రేమ ఎంత నిజమైందో చూడాలని ఉంది.
2CO 8:9 మన యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహం ఎంత గొప్పదో మీకు తెలుసు. ఆయన ఐశ్వర్యవంతుడైనా మీ కొరకు పేదవాడయ్యాడు. ఆయన పేదరికం వల్ల మీరు ఐశ్వర్యవంతులు కావాలని ఆ విధంగా చేసాడు.
2CO 8:10 ఈ విషయంలో మీకు ఏది మంచిదో అది చెబుతాను. పోయిన సంవత్సరం మీరు అందరికన్నా ఎక్కువగా యివ్వటమే కాకుండా అలాంటి ఉద్దేశ్యం ఉన్న వాళ్ళలో మీరే ప్రధములు.
2CO 8:11 కార్యాన్ని మొదలు పెట్టటంలో చూపిన ఆసక్తి దాన్ని పూర్తి చెయ్యటంలో కూడా చూపండి. మీ శక్త్యానుసారం చెయ్యండి.
2CO 8:12 మీకు యివ్వాలనే ఆసక్తి ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. మీ దగ్గర లేని దాన్ని బట్టి కాకుండా ఉన్నదాన్ని బట్టి మీరిచ్చింది అంగీకరిస్తాడు.
2CO 8:13 మీ మీద భారం మోపి యితరుల భారం తగ్గించాలని కాదు కాని అందరికీ సమానంగా ఉండవలెనని నా ఉద్దేశ్యం.
2CO 8:14 ప్రస్తుతం మీ దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కనుక అవసరమున్న వాళ్ళకు మీరు సహాయం చెయ్యటం సమంజసమే. అలా చేస్తే మీకు అవసరం వున్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. అప్పుడు సమంజసంగా ఉంటుంది.
2CO 8:15 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఎక్కువ కూడబెట్టిన వాని దగ్గర ఎక్కువ లేదు. తక్కువ కూడబెట్టిన వాని దగ్గర తక్కువ లేదు.”
2CO 8:16 మీపట్ల నాకున్న చింతనే, దేవుడు తీతు హృదయంలో కూడా పెట్టాడు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి.
2CO 8:17 తీతు మా నివేదన అంగీకరించాడు. అంతే కాక, చాలా ఉత్సాహంతో స్వయంగా మీ దగ్గరకు వస్తున్నాడు.
2CO 8:18 అతని వెంట యింకొక సోదరుణ్ణి పంపుతున్నాము. ఈ సోదరుడు సువార్త ప్రకటించి చేసిన సేవను అన్ని సంఘాలు అభినందిస్తున్నాయి.
2CO 8:19 పైగా, అతడు మా వెంట ఉండి, మాతో సహా ఈ కానుకను తీసుకు వెళ్ళాలని సంఘాలు అతణ్ణి ఎన్నుకొన్నాయి. మేమీకానుక ప్రభువు మహిమ కోసం తీసుకు వెళ్తున్నాము. సహాయం చేయాలన్న మా ఉత్సాహాన్ని చూపాలని మా ఉద్దేశ్యం.
2CO 8:20 ఈ గొప్ప విరాళాలు విమర్శకు గురి కాకుండా జాగ్రత్తగా యిస్తాము.
2CO 8:21 ప్రభువు దృష్టిలోనే కాకుండా ప్రజల దృష్టిలో కూడా ఏది ధర్మమో అది చెయ్యాలని మేము శ్రద్ధతో కష్టపడుతున్నాము.
2CO 8:22 అందువల్ల మా సోదరుణ్ణి కూడా వాళ్ళతో పంపుతున్నాము. ఇతన్ని మేము చాలా సార్లు పరీక్షించాము. సేవ చెయ్యాలనే ఉత్సాహం అతనిలో ఉన్నట్లు గ్రహించాము. ఇక అతనికి మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉండటంవల్ల అతని ఉత్సాహం ఇంకా ఎక్కువైంది.
2CO 8:23 ఇక తీతు విషయమా! అతడు నేను మీకోసం చేస్తున్న సేవలో భాగస్తుడు. నాతో కలిసి పని చేసేవాడు. ఇక మేము పంపిన సోదరులు, సంఘాల ప్రతినిధులు, క్రీస్తుకు గౌరవం కలిగించే వాళ్ళు.
2CO 8:24 అందువల్ల, మీకు ప్రేమ ఉన్నట్లు వాళ్ళకు రుజువు చెయ్యండి. మేము మీ విషయంలో ఎందుకు గర్విస్తున్నామో వాళ్ళకు చూపండి. అలా చెయ్యటం వల్ల సంఘాలన్నీ దీన్ని గమనిస్తాయి.
2CO 9:1 భక్తులకు చేయవలసిన సహాయాన్ని గురించి నేను మీకు వ్రాయవలసిన అవసరం లేదు.
2CO 9:2 సహాయం చెయ్యాలనే ఉత్సాహాం మీలో ఉన్నట్లు నాకు తెలుసు. అకయలో ఉన్న మీరు, పోయిన సంవత్సరం నుండి యివ్వటానికి సిద్ధంగా ఉన్నారని మాసిదోనియా ప్రజలకు నేను గర్వంగా చెప్పాను. మీ ఉత్సాహం వాళ్ళలో చాలా మందిని ప్రోత్సాహపరిచింది. వాళ్ళు కార్యనిర్వహణకు పూనుకొన్నారు.
2CO 9:3 ఈ విషయంలో మేము మిమ్మల్ని గురించి పొగుడుతూ చెప్పిన మాటలు వ్యర్థం కాకూడదని నా ఉద్ధేశ్యం. మీరు సహాయం చెయ్యటానికి సిద్ధంగా ఉంటారని నాకు తెలుసు. కనుక సోదరుల్ని పంపుతున్నాను.
2CO 9:4 ఒకవేళ మాసిదోనియ వాళ్ళు నాతో వచ్చి మీరు సిద్ధంగా లేరని తెలుసుకొంటే, మీకే కాక, మీపై యింత నమ్మకం ఉన్న మాకు కూడా అవమానం కలుగుతుంది.
2CO 9:5 కనుక సోదరుల్ని ముందే మీ దగ్గరకు పంపటం అవసరం అనిపించింది. వాళ్ళు వచ్చి మీరు ధారాళంగా వాగ్దానం చేసిన విరాళాన్ని ప్రోగుచేస్తారు. అలా చేస్తే మేము వచ్చినప్పుడు ఆ కానుక సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆ కానుక అయిష్టంగా కాక, ఆనందంగా యిచ్చినట్లు అందరికీ తెలుస్తుంది.
2CO 9:6 కొంచెముగా విత్తేవాడు కొద్దిపంటను మాత్రమే పొందుతాడు. అదే విధంగా ఎక్కువగా విత్తేవానికి పంటకూడా ఎక్కువగా లభిస్తుంది. మీరిది జ్ఞాపకం ఉంచుకొండి.
2CO 9:7 ఆనందంగా యిచ్చే వాణ్ణి దేవుడు ప్రేమిస్తాడు. కనుక ప్రతి ఒక్కడూ గొణుక్కోకుండా యివ్వాలి. ఒకరి బలవంతంతో కాకుండా తాను స్వయంగా నిర్ణయించుకొని యివ్వాలి.
2CO 9:8 అప్పుడు దేవుడు మీకవసరమున్న దాని కన్నా ఎక్కువే యిస్తాడు, మీకు అవసరమున్నవన్నీ అన్ని వేళలా మీకు లభించేటట్లు చెయ్యటమే కాకుండా సత్కార్యాలు చెయ్యటానికి కావలిసినవి సమృద్ధిగా యిస్తాడు.
2CO 9:9 దీన్ని గురించి లేఖనాల్లో ఇలా వ్రాసారు: “అతడు పేదలకు ధారాళంగా యిచ్చాడు అతని నీతి చిరకాలం ఉంటుంది.”
2CO 9:10 రైతుకు విత్తనాలు, తినటానికి ఆహారము యిచ్చే దేవుడే మీ పంటను సమృద్ధిగా పండించటానికి కావలసిన విత్తనాలు యిస్తాడు. తద్వారా మీ నీతికి ఫలం కలిగిస్తాడు.
2CO 9:11 మీరు అన్ని విషయాల్లో ధారాళంగా ఉండేటట్లు మీకు సకల ఐశ్వర్యాలు యిస్తాడు. మాద్వారా మీరిచ్చిన విరాళాలు తీసుకొని విశ్వాసులు దేవునికి కృతజ్ఞతలు చెపుతారు.
2CO 9:12 మీరు చేసిన సహాయం విశ్వాసుల అవసరాలను తీరుస్తుంది. అంతేకాక, వాళ్ళు దేవుణ్ణి అన్నివేళలా స్తుతించేటట్లు చేస్తుంది.
2CO 9:13 మీరు ఈ సేవ చేసి మీ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను అంగీకరించారు. దాన్ని విధేయతతో పాటించారు. మీకున్న దాన్ని వాళ్ళతో మాత్రమే కాక, అందరితో ధారాళంగా పంచుకొన్నారు. ఇది చూసి ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తారు.
2CO 9:14 దేవుడు మీపై యింత కరుణ చూపినందుకు, వాళ్ళు ప్రార్థించినప్పుడు మనసారా మిమ్మల్ని ప్రేమతో తలచుకుంటారు.
2CO 9:15 దేవుడు యిచ్చిన వర్ణనాతీతమైన ఆ కానుకకు మనము ఆయనకు కృతజ్ఞతతో ఉందాము.
2CO 10:1 క్రీస్తులో ఉన్న సాత్వికం పేరిట, దయ పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను. కొందరు నేను మీ సమక్షంలో ఉన్నప్పుడు నాలో ధైర్యం ఉండదని, మీకు దూరంగా ఉన్నప్పుడు నాలో ధైర్యముంటుందని అంటున్నారు.
2CO 10:2 నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడవలసిన అవసరం లేదు. మేము లౌకికంగా జీవిస్తున్నామని అనుకొనేవాళ్ళతో కూడా ధైర్యంగా మాట్లాడనవసరం లేదు.
2CO 10:3 మేము ఈ ప్రపంచంలో జీవిస్తున్నా, ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు యుద్ధం చేసినట్లు మేము చెయ్యము.
2CO 10:4 మేము ఉపయోగించే ఆయుధాలు ఈ ప్రపంచంలోని వాళ్ళు ఉపయోగించేవి కావు. కాని శత్రువుల కోటలను పడగొట్టగల దైవికమైన శక్తి మా ఆయుధాల్లో ఉంది.
2CO 10:5 మేము దేవుని జ్ఞానాన్ని ఎదిరించే తర్కాలను, డాంబిక వాదాలను ఓడించి పడగొడతాము. ప్రతి భావాన్ని బంధించి అందరినీ క్రీస్తుకు విధేయులు అయ్యేటట్లు చేస్తాము.
2CO 10:6 మిమ్మల్నందర్నీ విధేయులుగా చేసాక అవిధేయతతో ఉన్న ప్రతి సంఘటనను శిక్షించటానికి సిద్ధంగా ఉంటాము.
2CO 10:7 మీరు పైకి కనిపించే వాటిని మాత్రమే చూస్తున్నారు. తాను క్రీస్తుకు చెందినవాణ్ణని విశ్వసించినవాడు, తాను ఏ విధంగా క్రీస్తుకు చెందాడో మేము అతనిలాగే క్రీస్తుకు చెందిన వాళ్ళమని గమనించాలి.
2CO 10:8 మిమ్మల్ని నాశనం చెయ్యటానికి కాకుండా అభివృద్ధి పరచటానికి ప్రభువు మాకు అధికారమిచ్చాడు. దాన్ని గురించి నేను గొప్పలు చెప్పు కోవటానికి సిగ్గుపడను.
2CO 10:9 నా లేఖల ద్వారా మిమ్నల్ని భయపెట్టాలని ప్రయత్నించటం లేదు. మీరు అలా అనుకోకండి.
2CO 10:10 ఎందుకంటే కొందరు, “అతని లేఖలు బలంగా, ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. కాని మనిషిని ఎదురుగా ఉన్నప్పుడు చూస్తే బలహీనంగా ఉంటాడు. మాటలు నిస్సారంగా ఉంటాయి” అని అంటారు.
2CO 10:11 వాళ్ళు మేము దూరంగా వుండి లేఖల్లో వ్రాసిన విధంగా సమక్షంలో ఉన్నప్పుడు కూడా నడుచుకొంటామని గమనించాలి.
2CO 10:12 ఆ ప్రగల్భాలు పలికే గుంపుతో పోల్చుకొనే ధైర్యం కూడా మాకు లేదు. మేము వాళ్ళతో పోల్చుకోము. తెలివిలేని వాళ్ళు తమ గొప్పతనాన్ని తామే కొల్చుకుంటూ, తమతో తమను పోల్చుకొంటారు.
2CO 10:13 మేము యితర విషయాల్లో గొప్పలు చెప్పుకోము. కాని, దేవుడు మాకప్పగించిన విషయంలో గొప్పలు చెప్పుకోవటం మానము. ఆ విషయాలు మీకు కూడా చెప్పాము.
2CO 10:14 మేము మా హద్దులు మీరిపోవటం లేదు. మీరు ఆ హద్దుల్లో ఉన్నారు కనుక మేము క్రీస్తు సువార్త తీసుకొని మీ దగ్గరకు వచ్చాము. మేము మా హద్దులు మీరలేదు.
2CO 10:15 లేక మేము యితరులు చేసిన కార్యాల్ని గొప్పగా చెప్పి మా హద్దులు దాటిపోలేదు. మీ విశ్వాసం అభివృద్ధి చెందుతుందని మాకు నమ్మకం ఉంది. మేము చేస్తున్న సేవాకార్యం మీ ద్వారా నలువైపులా వ్యాపించాలి.
2CO 10:16 దైవసందేశాన్ని మీ ప్రాంతంలోనే కాక, మీకు ముందున్న ప్రాంతాల్లో కూడా ప్రకటించాలని మా ఉద్దేశం. ఇతరులు తమ ప్రాంతాల్లో యిదివరకే చేసిన కార్యాల్ని గురించి మేము గొప్పలు చెప్పుకోవాలని మాకు లేదు.
2CO 10:17 కాని, “గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి” అని వ్రాయబడింది.
2CO 10:18 ప్రభువు ఎవరిని యోగ్యుడని సమ్మతిస్తాడో వాడే యోగ్యుడౌతాడు. కాని తనకు తాను యోగ్యుడని చెప్పుకొనే వాడు యోగ్యుడు కాడు.
2CO 11:1 నా తెలివి తక్కువ తనాన్ని మీరు కొద్దిగా సహిస్తారని ఆశిస్తున్నాను. మీరు సహిస్తున్నారని నాకు తెలుసు.
2CO 11:2 మీ విషయంలో నాకు అసూయగా ఉంది. ఆ అసూయ దేవుని కోసం. మిమ్మల్ని ఒకే భర్తకు అంటే క్రీస్తుకు అప్పగిస్తానని వాగ్దానం చేసాను. మిమ్మల్ని పవిత్ర కన్యగా ఆయనకు బహూకరించాలని అనుకున్నాను.
2CO 11:3 సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్దాలవల్ల “హవ్వ” మోసపోయినట్లే మీరునూ మోసపోతారని, మీ మనస్సులు మలినం అవుతాయని నా భయం. మీకు క్రీస్తుపట్ల ఉన్న భక్తి పవిత్రమైంది. సంపూర్ణమైనది. అది విడిచివేస్తారని నా భయం.
2CO 11:4 ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము యేసును గురించి బోధించినట్లుగాక, వేరే విధంగా బోధిస్తే మీరు దాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. మా నుండి పొందిన దైవసందేశానికి, ఆత్మకు వ్యతిరేకంగా దైవసందేశాన్ని, ఆత్మను ఎవరైనా యిస్తే మీరు వాటిని అంగీకరిస్తారు.
2CO 11:5 ఆ “గొప్ప అపొస్తలుల కన్నా” నేను కొంచెం కూడా తక్కువ కానని అంటున్నాను.
2CO 11:6 మాట్లాడటంలో నాకు అనుభవం లేకపోయినా జ్ఞానం ఉంది. దీన్ని గురించి మేము అన్ని విధాలా మీకు స్పష్టంగా తెలియజేసాము.
2CO 11:7 దైవసందేశాన్ని మీకు ఉచితంగా ప్రకటించాను. మీకు ప్రాముఖ్యత యిచ్చి నేను తగ్గించుకొన్నాను. అలా చెయ్యటం పాపమా?
2CO 11:8 ఇతర సంఘాలు నన్ను పోషించాయి. అందువలన మీకు సేవ చేయటానికి వాటిని దోచినట్లయింది.
2CO 11:9 నేను మీతో ఉన్నప్పుడు ఎవ్వరికీ భారంగా ఉండలేదు. మాసిదోనియ నుండి వచ్చిన సోదరులు నాకు కావలసినవన్నీ తెచ్చారు. నేను మీపై ఏ విధమైన భారం మోపలేదు. ఇకముందు కూడా మోపను.
2CO 11:10 దీన్ని గురించి నేను గర్వపడకుండా అకయ ప్రాంతంలో ఉన్న వాడెవ్వడూ నన్ను ఆపలేడు. ఇది నేను క్రీస్తు సత్యంగా చెపుతున్నాను.
2CO 11:11 ఎందుకు, మీ పట్ల నాకు ప్రేమ లేదనా? నేను ప్రేమిస్తున్నానని దేవునికి తెలుసు.
2CO 11:12 వాళ్ళు తమను గురించి గర్వంగా చెప్పుకోవాలని చూస్తారు. తాము మాతో సమానంగా ఉన్నట్లు మీరు గమనించాలని వాళ్ళ ఉద్దేశ్యం. ఆ అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు గర్వించటానికి కారణం లేకుండా చెయ్యటానికి నేను చేస్తున్నది చేస్తూపోతాను.
2CO 11:13 అలాంటి వాళ్ళు దొంగ అపొస్తలులు. మోసాలు చేస్తారు. క్రీస్తు అపొస్త్తలుల వలే నటిస్తారు.
2CO 11:14 దీనిలో ఆశ్చర్యమేలేదు! సైతాను కూడా తాను వెలుగుదూత అయినట్లు నటిస్తాడు.
2CO 11:15 మరి సైతాను సేవకులు నీతిమంతులవలె నటించటంలో ఆశ్చర్యమేలేదు! చివరన వాళ్ళు చేసిన పనుల్ని బట్టి ఫలితం పొందుతారు.
2CO 11:16 నన్నొక తెలివతక్కువవానిగా పరిగణించవద్దని మళ్ళీ చెపుతున్నాను. మీరు నేను తెలివతక్కువ వాణ్ణని అనుకొంటే, తెలివిలేని వాణ్ణి అంగీకరించినట్లు నన్ను అంగీకరించండి. అప్పుడు దానికి నేను కొద్దిగా గర్వపడవచ్చు.
2CO 11:17 నాలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల గర్వంగా మాట్లాడుతున్నాను. ప్రభువు మాట్లాడమన్నట్లు కాకుండా తెలివిలేనివాడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాను.
2CO 11:18 అందరూ లౌకికులవలె తమను గురించి గర్వంగా మాట్లాడుకుంటున్నారు. కనుక నేను కూడా గర్వంగా మాట్లాడుతున్నాను.
2CO 11:19 మీరు బుద్ధిమంతులైయుండి తెలివిలేనివాళ్ళ పట్ల మీరు ఆనందంగా సహనం చూపిస్తున్నారు.
2CO 11:20 మిమ్మల్ని బానిసలుగా చేసుకొన్న వాళ్ళ పట్ల, దోచుకొనే వాళ్ళ పట్ల, మీ వల్ల లాభం పొందే వాళ్ళపట్ల, మిమ్మల్ని అణచి పెట్టే వాళ్ళ పట్ల, మీ చెంపమీద కొట్టిన వాళ్ళ పట్ల, మీరు సహనం చూపుతారు.
2CO 11:21 వాళ్ళలా ప్రవర్తించే ధైర్యం మాకు లేదు. ఇది చెప్పుకోవటానికి నాకు సిగ్గు వేస్తోంది. ఎవరికైనా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంటే, నేనూ ఒక అవివేకిగా మాట్లాడుతున్నాను, నాకు కూడా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంది.
2CO 11:22 వాళ్ళు హెబ్రీయులా? నేను కూడా హెబ్రీయుణ్ణి, వాళ్ళు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడను. వాళ్ళు అబ్రాహాము వంశీయులా? నేను కూడా అబ్రాహాము వంశీయుణ్ణి.
2CO 11:23 వాళ్ళు క్రీస్తు సేవకులా? ఈ విధంగా మాట్లాడాలంటే నాకు మతిపోతుంది. నేను వాళ్ళకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను. నేను వాళ్ళకన్నా ఎక్కువ కష్టించి పని చేసాను. వాళ్ళకన్నా ఎక్కువ సార్లు కారాగారానికి వెళ్ళాను. వాళ్ళకన్నా తీవ్రమైన కొరడాదెబ్బలు తిన్నాను. ఎన్నోసార్లు చావుకు గురి అయ్యాను.
2CO 11:24 యూదులు నన్ను ఐదు సార్లు ముప్పైతొమ్మిది కొరడాదెబ్బలు కొట్టారు.
2CO 11:25 మూడు సార్లు ఇనుప కడ్డీలతో కొట్టారు; ఒకసారి రాళ్ళతో కొట్టారు. మూడు సార్లు పడవ పగిలి ఒక రాత్రి, ఒక పగలు సముద్రం మీద గడిపాను.
2CO 11:26 విరామం లేకుండా ప్రయాణం చేసాను. ఆ ప్రయాణాల్లో నదులవల్ల ప్రమాదం కలిగింది. బందిపోటు దొంగలవల్ల ప్రమాదం కలిగింది. నా జాతీయులవల్ల ప్రమాదం కలిగింది. యూదులుకాని వాళ్ళవల్ల ప్రమాదం కలిగింది. పట్టణాల్లో ప్రమాదం కలిగింది. నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రమాదం కలిగింది. సముద్రం మీద ప్రమాదం కలిగింది. దొంగ సోదరుల వల్ల ప్రమాదం కలిగింది.
2CO 11:27 నేను కష్టాలు ఎదుర్కొని, కష్టించి పని చేసాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఆకలి దప్పులు అంటే ఏమిటో తెలుసుకొన్నాను. ఎన్నోసార్లు ఆహారం లేక గడిపాను. చలిలో వస్త్రాలు లేకుండా గడిపాను.
2CO 11:28 ఇవే కాక, సంఘాల కొరకు నేను ప్రతిరోజూ దిగులు పడుతుంటాను.
2CO 11:29 మీలో ఒకడు బలహీనుడైనప్పుడు, నేనూ బలహీనుడు కాకుండా ఉండగలనా? ఒకడు పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండి పోకుండా ఉండగలనా? పాపం చెయ్యటానికి మీలో ఎవరైనా కారకుడు అయితే అతని పట్ల నాకు కోపం కలగదా?
2CO 11:30 నేను గర్వంగా చెప్పుకోవాలి అంటే బలహీనతను చూపే వాటిని గురించి గర్వంగా చెప్పుకొంటాను.
2CO 11:31 యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి, సర్వదా స్తుతింపతగిన దేవునికి, నేను అసత్యం ఆడటం లేదని తెలుసు.
2CO 11:32 నేను డెమాస్కసులో ఉన్నప్పుడు అరెత అను రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాధికారి, నన్ను బంధించాలని ఊరి చుట్టూ కాపలా ఉంచాడు.
2CO 11:33 కాని కొందరు నన్ను గంపలో ఉంచి గోడ మీదనుండి క్రిందికి దింపారు. నేను చిక్కకుండా తప్పించుకొని పారిపోయాను.
2CO 12:1 లాభం లేకపోయినా నేను గర్వంగా చెప్పుకొంటూ పోవాలి. ప్రభువు వలన కలిగిన దర్శనాలు, ప్రత్యక్షతలు గురించి చెప్పనివ్వండి.
2CO 12:2 క్రీస్తును విశ్వసించే ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశమునకు తీసుకు వెళ్ళాడు. అతణ్ణి శరీరంతో తీసుకొని వెళ్ళాడో లేక అతని ఆత్మను తీసుకొని వెళ్ళాడో, నాకు తెలియదు. అది దేవునికే తెలుసు.
2CO 12:3 నాకు తెలిసిన ఈ వ్యక్తి శరీరంతో వెళ్ళాడో లేక అతని ఆత్మ మాత్రమే వెళ్ళిందో నాకు తెలియదు. దేవునికే తెలుసు.
2CO 12:4 దేవుడు యితణ్ణి పరదైసునకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అతడు పవిత్రమయిన విషయాలు విన్నాడు. ఇవి చెప్పటానికి అనుమతి లేదు.
2CO 12:5 నేను అతణ్ణి గురించి గర్వంగా చెపుతున్నాను. కాని నా గురించి నేను గర్వంగా చెప్పుకోను. నా బలహీనతను గురించి మాత్రమే గర్వంగా చెప్పుకొంటాను.
2CO 12:6 ఒకవేళ నేను గర్వంగా మాట్లాడినా, నేను ఎప్పుడూ నిజం చెబుతాను కనుక తెలివిలేని వాణ్ణని అనిపించుకోను. నేను చెప్పిన వాటి కన్నా, చేసిన వాటి కన్నా నన్ను గురించి మీరు గొప్పగా అనుకోరాదని నా అభిలాష. కనుక నేను నన్ను గురించి గర్వంగా చెప్పుకోకుండా నిగ్రహించుకొంటాను.
2CO 12:7 దేవుడు కనుపరచిన ఈ గొప్పవిషయాల వల్ల నాకు గర్వం కలుగరాదని నా శరీరంలో ఒక ములు ఉంచబడింది. అది సైతానుదూత. అది నన్ను బాధపెడుతూ ఉంటుంది.
2CO 12:8 ఆ ముల్లు తీసివేయమని ప్రభువుతో మూడు సార్లు మొరపెట్టుకొన్నాను.
2CO 12:9 కాని ప్రభువు నాతో, “నీకు నా అనుగ్రహం చాలు. నా శక్తి నీ బలహీనత ద్వారా పరిపూర్ణత పొందుతుంది” అని అన్నాడు. అందువల్ల క్రీస్తు శక్తి నాలో ఉండాలని నా బలహీనతను గురించి ఇంకా ఎక్కువ ఆనందంతో, గర్వంగా చెప్పుకొంటాను.
2CO 12:10 అందువల్లే క్రీస్తు కోసం నేను బలహీనతల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, కష్టాల్లో ఆనందం పొందుతూ ఉంటాను. నేను బలహీనంగా ఉన్నప్పుడు బలంగా ఉంటాను.
2CO 12:11 నేను తెలివిలేని వానిలా ప్రవర్తిస్తున్నాను. కాని దీనికి మీరే కారకులు. నేను ఏమీకాకపోయినా ఆ “గొప్ప అపొస్తలుల” కన్నా తీసిపోను. కనుక మీరు నన్ను మెచ్చుకోవలసింది.
2CO 12:12 అపొస్తలుడని అనిపించుకొనుటకు తగిన ఋజువులు, అద్భుతాలు, మహాత్కార్యాలు మీ మధ్య నేను పట్టుదలతో చేసాను. అని నేను మీ కోసం పట్టుదలతో చేసాను.
2CO 12:13 నేను మీకు ఎన్నడూ భారంగా ఉండలేదు, అన్న విషయంలో తప్ప ఇతర సంఘాలకన్నా మీరు ఏ విషయంలో తీసిపోయారు? దీనికి నన్ను క్షమించండి.
2CO 12:14 ఇక యిప్పుడు మూడవసారి మీ దగ్గరకు రావటానికి సిద్ధంగా ఉన్నాను. ఈసారి కూడా నేను మీకు భారంగా ఉండను. నాకు కావలసింది మీ దగ్గరున్న వస్తువులు కాదు. మీరు నాకు కావాలి. పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తిని కూడపెట్టరు. కాని తల్లిదండ్రులే తమ పిల్లల కోసం ఆస్తి కూడబెడ్తారు.
2CO 12:15 అందువల్ల నా దగ్గరున్నదంతా ఆనందంతో మీకోసం వ్యయంచేస్తాను. “నన్ను” మీకోసం ఉపయోగించుకోండి. నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తే నన్ను మీరు తక్కువగా ప్రేమిస్తారా?
2CO 12:16 అది అలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా ఉండలేదని తెలుసు కాని, “నేను పన్నాగాలు పన్ని మిమ్మల్ని వలలో వేసుకొన్నానని” కొందరు అనవచ్చు.
2CO 12:17 నేను పంపిన మనుష్యుల్లో ఎవర్నైనా మిమ్మల్ని మోసగించటానికి ఉపయోగించుకొన్నానా? లేదని నాకు తెలుసు. నేను వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకొన్నానా?
2CO 12:18 నేను తీతును మీ దగ్గరకు వెళ్ళుమని వేడుకొన్నాను. మా సోదరుణ్ణి అతని వెంట పంపాను. తీతు మిమ్మల్ని వంచించలేదు కదా? వంచించాడా? లేదు. మేమంతా ఒకే ఆత్మతో, ఒకే మార్గాన్ని అనుసరించామని మీకు తెలుసు.
2CO 12:19 మమ్మల్ని మేము మీ ముందు సమర్థించుకోవాలని మా పక్షాన మేము వాదిస్తున్నామని అనుకొంటున్నారా? లేదు. మేము దేవుని ముందు క్రీస్తులో మాట్లాడుతున్నాము. సోదరులారా! మీ విశ్వాసాన్ని ధృఢపరచాలని, మేము యివి చేస్తున్నాము.
2CO 12:20 ఎందుకంటే, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అనుకొన్నట్లు మీరు, మీరనుకొన్నట్లు నేను ఉండమేమోనని నాకు భయం వేస్తోంది. కలహాలు, అసూయలు, కోపాలు, కక్షలు, వదంతులు, గుస గుసలు, అహంభావాలు, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాము.
2CO 12:21 నేను మీ దగ్గరకు మళ్ళీ వచ్చినప్పుడు నా దేవుని ముందు నాకు తలవంపులు కలుగుతాయేమోనని భయం వేస్తోంది. గతంలో కామక్రీడలు, వ్యభిచారం లాంటి అపవిత్రమైన పనులు చేసి ఆ పాపాలకు పశ్చాత్తాపం పొందని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళవల్ల నాకు దుఃఖం కలుగుతుందనే భయం వేస్తోంది.
2CO 13:1 మూడవసారి మీ దగ్గరకు వస్తున్నాను. “ప్రతివిషయం యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యాలతో రుజువు పరచాలి.”
2CO 13:2 నేను రెండవ సారి వచ్చి మీతో ఉన్నప్పుడు ఈ విషయంలో మిమ్నల్ని యిదివరకే హెచ్చరించాను. నేను యిప్పుడు మీ సమక్షంలో లేను కనుక మళ్ళీ చెపుతున్నాను.
2CO 13:3 కనుక నేను ఈ సారి వచ్చినప్పుడు ఇదివరలో పాపంచేసిన వాళ్ళను ఇప్పుడు పాపంచేసిన వాళ్ళను శిక్షిస్తాను. క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడన్న దానికి మీరు రుజువు అడుగుతున్నారు. మీ పట్ల క్రీస్తు బలహీనంగా ఉండడు. ఆయన మీ మధ్య శక్తివంతంగా ఉన్నాడు.
2CO 13:4 బలహీనతల్లో ఆయన సిలువ వేయబడ్డాడు. అయినా, దైవశక్తివల్ల జీవిస్తున్నాడు. అదే విధంగా మేము ఆయనలో బలహీనంగా ఉన్నా, దైవశక్తి వల్ల ఆయనతో సహా జీవించి మీ సేవ చేస్తున్నాము.
2CO 13:5 మీరు నిజమైన “విశ్వాసులా, కాదా” అని తెలుసుకోవాలనుకొంటే మిమ్నల్ని మీరు పరిశోధించుకోవాలి. మీలో యేసు క్రీస్తు ఉన్నట్లు అనిపించటం లేదా? మీరు ఈ పరీక్షల్లో ఓడిపోతే క్రీస్తు మీలో ఉండడు.
2CO 13:6 మేము ఈ పరీక్షల్లో విజయం సాధించిన విషయం మీరు గ్రహిస్తారని నమ్ముతున్నాను.
2CO 13:7 మీరు ఏ తప్పూచేయకుండా ఉండాలని మేమే దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము పరీక్షల్లో నెగ్గినట్లు ప్రజలు గమనించాలని కాదు కాని, మేము పరీక్షల్లో నెగ్గినట్లు కనపడకపోయినా మీరు మంచి చెయ్యాలని దేవుణ్ణి ప్రార్థిస్తాము.
2CO 13:8 మేము సత్యానికి విరుద్దంగా ఏదీ చెయ్యలేము. అన్నీ సత్యంకొరకే చేస్తాము.
2CO 13:9 మీరు బలంగా ఉంటే, మేము బలహీనంగా ఉంటానికి సంతోషిస్తాం. మీలో పరిపూర్ణమైన శక్తి కలగాలని మేము ప్రార్థిస్తున్నాము.
2CO 13:10 అందువల్లే నేను మీ సమక్షంలో లేనప్పుడు యివి వ్రాస్తున్నాను. అలా చేస్తే నేను వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. ఈ అధికారం ప్రభువు మీ విశ్వాసాన్ని వృద్ధిపరచటానికి యిచ్చాడు, కాని నాశనం చేయటానికి కాదు.
2CO 13:11 తుదకు, సోదరులారా! పరిపూర్ణులుగా ఉండటానికి ప్రయత్నించండి. నేను చెప్పేవాటిని చెయ్యండి. ఒకరితో ఒకరు సహకరిస్తూ జీవించండి. ప్రేమను, శాంతినిచ్చే దేవుడు మీతో ఉంటాడు.
2CO 13:12 పవిత్రమైన ముద్దుతో పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇక్కడున్న విశ్వాసులందరు తమ శుభాకాంక్షలు తెలుపమన్నారు.
2CO 13:13 యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీ అందరితో ఉండుగాక!
GAL 1:1 మనుష్యుని నుండియైనను, మనుష్యుని ద్వారానైనను కాక, యేసు క్రీస్తు ద్వారాను, ఆయనను మరణములో నుండి లేపిన తండ్రియైన దేవుని ద్వారాను అపొస్తలుడైన పౌలు నుండియు,
GAL 1:2 మరియు నాతో ఉన్న యితర సోదరుల నుండియు, గలతీయలో ఉన్న సంఘాలకు:
GAL 1:3 మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని కనికరించి మీకు శాంతి ప్రసాదించుగాక!
GAL 1:4 ప్రస్తుతం మనము అనుభవిస్తున్న చెడుకాలం నుండి రక్షించటానికి మన పాపాలకోసం క్రీస్తు బలి అయ్యాడు. తద్వారా మన తండ్రియైన దేవుని యిచ్ఛను పూర్తి చేసాడు.
GAL 1:5 దేవునికి మహిమ చిరకాలం ఉండుగాక! ఆమేన్.
GAL 1:6 తనలో దయ వుండటం వల్ల దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఆయన్ని యింత త్వరలో వదిలివేయటం, మరొక సువార్తవైపు మళ్ళటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
GAL 1:7 నిజానికి మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త లేనేలేదు. కొందరు మిమ్మల్ని కలవరపెట్టటానికి క్రీస్తు సువార్తను మార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు.
GAL 1:8 నేను గాని, లేక పరలోకం నుండి వచ్చిన దేవదూత గాని మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను ప్రకటిస్తున్నట్లయితే అలాంటి వాడు నిత్యనాశనానికి గురియగుగాక.
GAL 1:9 మేము యిదివరకు చెప్పినదాన్ని యిప్పుడు నేను మళ్ళీ చెపుతున్నాను. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొక సువార్తను ఎవడైనా మీకు భోధిస్తున్నట్లయితే వాడు నిరంతరము శాపగ్రస్తుడవును గాక!
GAL 1:10 నేనిప్పుడు మానవుని మెప్పు పొందటానికి ప్రయత్నిస్తున్నానా లేక దేవుని మెప్పునా? మానవుణ్ణి నేను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను ఇంకా మానవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నట్లయితే క్రీస్తు సేవకుణ్ణి కాదు.
GAL 1:11 సోదరులారా! నేను ప్రకటించిన సువార్త మానవుడు కల్పించింది కాదు. అది మీరు గమనించాలి.
GAL 1:12 నేను ఆ సువార్తను మానవుని ద్వారా పొందలేదు. దాన్ని నాకెవరూ బోధించనూ లేదు. దాన్ని నాకు యేసు క్రీస్తు తెలియచేసాడు.
GAL 1:13 నేను యూదునిగా ఎట్లా జీవించానో మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించిన విషయం మీకు తెలుసు. దాన్ని ఏ విధంగా నాశనం చెయ్యాలని చూసానో మీకు తెలుసు.
GAL 1:14 నేను యూదునిగా నా వయస్సులో ఉన్న వాళ్ళందరికన్నా చురుకైనవాడను. నా పూర్వీకుల సాంప్రదాయాల విషయంలో నాకు చాలా పట్టుదల ఉంది.
GAL 1:15 కాని దేవుడు తన దయతో నేను పుట్టినప్పుడే నన్ను ప్రత్యేకంగా ఉంచాడు. నన్ను పిలిచి తన కూమారుణ్ణి తెలియ చెయ్యటానికి నిశ్చయించుకొన్నాడు.
GAL 1:16 నేను యూదులు కానివాళ్ళకు తన కుమారుని గూర్చిన సువార్తను బోధించాలని ఆయన ఉద్దేశ్యం. నేనీ విషయంలో మరొక వ్యక్తిని సంప్రదించ లేదు.
GAL 1:17 నాకన్నా ముందునుండి అపొస్తలులుగా ఉన్న వాళ్ళను చూడటానికి నేను యెరూషలేము కూడా వెళ్ళలేదు. దానికి మారుగా నేను వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి ఆ తర్వాత డెమాస్కసుకు తిరిగి వచ్చాను.
GAL 1:18 మూడు సంవత్సరాలు గడిచాక పేతురును పరిచయం చేసుకోవటానికి యెరూషలేము వెళ్ళాను. అతనితో పదిహేను రోజులు గడిపాను.
GAL 1:19 ఆ సమయంలో ప్రభువు సోదరుడైన యాకోబు తప్ప మిగతా అపొస్తలులెవరూ నాకు కనిపించలేదు.
GAL 1:20 నేను అబద్ధం వ్రాయటంలేదని దేవునిపై ప్రమాణం చేసి చెపుతున్నాను.
GAL 1:21 ఆ తర్వాత నేను సిరియ, కిలికియ దేశాలకు వెళ్ళాను.
GAL 1:22 యూదయ ప్రాంతంలోని క్రీస్తు సంఘాలు నన్ను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు.
GAL 1:23 “ఇదివరలో మన వాళ్ళను హింసించిన వ్యక్తి యిప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు అతడు సువార్తను నాశనం చెయ్యాలని చూసాడు” అని యితర్లు అనగా వాళ్ళు విన్నారు.
GAL 1:24 మరియు నా గురించి వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు.
GAL 2:1 పద్నాలుగు సంవత్సరాల తర్వాత బర్నబాతో కలిసి నేను మళ్ళీ యెరూషలేము వెళ్ళాను. తీతు కూడా నా వెంట ఉన్నాడు.
GAL 2:2 దేవుడు ఆదేశించటం వల్ల నేను అక్కడికి వెళ్ళాను. యూదులు కాని వాళ్ళకు నేను ప్రకటిస్తున్న సువార్తను రహస్యంగా ముందు అక్కడి నాయకులకు చెప్పాను. నేను ప్రస్తుతం చేస్తున్న సేవ, యిదివరకు చేసిన సేవ వ్యర్థంకాకూడదని నా అభిప్రాయం.
GAL 2:3 నా వెంటనున్న తీతు గ్రీకు దేశస్థుడైనా సున్నతి చేయించుకోమని వాళ్ళు బలవంతం చెయ్యలేదు.
GAL 2:4 మాలో కొందరు దొంగ సోదరులు చేరారు. వాళ్ళలో కొందరు తీతు సున్నతి పొందాలని బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. వీళ్ళు గూఢచారులుగా సంఘంలో మేము యేసుక్రీస్తులో విశ్వాసులముగా అనుభవిస్తున్న స్వాతంత్ర్యాన్ని పరిశీలించాలని వచ్చారు. మమ్మల్ని మళ్ళీ బానిసలుగా చెయ్యాలని వాళ్ళ ఉద్దేశ్యం.
GAL 2:5 సువార్తలో ఉన్న సత్యం మీకు లభించాలని మేము వాళ్ళకు కొంచెం కూడా లొంగలేదు.
GAL 2:6 సంఘంలో ముఖ్యమైన వాళ్ళలా కనిపించే వాళ్ళు, వాళ్ళ అంతస్థు ఏదైనా సరే నేను లెక్క చెయ్యను. అంతేకాక అంతస్థును బట్టి దేవుడు తీర్పు చెప్పడు, నేను చెప్పిన సందేశాన్ని మార్చలేదు.
GAL 2:7 పైగా యూదులకు బోధించే బాధ్యత పేతురుకు ఇవ్వబడినట్లే, యూదులు కాని వాళ్ళకు బోధించే బాధ్యత నాకివ్వబడిందని వాళ్ళు గమనించారు.
GAL 2:8 పేతురు యూదులకు అపొస్తలుడుగా చేసిన సేవలో దేవుడు సహకరించినట్లే, అపొస్తలుడనుగా యూదులు కాని వాళ్ళ కోసం నేను చేస్తున్న సేవలో కూడా దేవుడు నాకు సహకరించాడు.
GAL 2:9 ముఖ్యమైన వాళ్ళని పేరు పొందిన యాకోబు, కేఫా, యోహాను దేవుడు నాపై చూపిన అనుగ్రహాన్ని గుర్తించి నాకు, బర్నబాకు సహాయం చెయ్యటానికి అంగీకరించారు. మేము యూదులు కానివాళ్ళ దగ్గరకు వెళ్ళేటట్లు, వాళ్ళు యూదుల దగ్గరకు వెళ్ళేటట్లు నిర్ణయించుకొన్నాము.
GAL 2:10 మేము పేదవాళ్ళకు సహాయం చెయ్యాలని మాత్రం వాళ్ళు కోరారు. మాకును అదే అభిలాష వుంది.
GAL 2:11 పేతురు అంతియొకయకు వచ్చినప్పుడు అతని తప్పు స్పష్టంగా కనిపించటం వల్ల అది నేను అతని ముఖం ముందే చెప్పాను.
GAL 2:12 ఇదివరలో ఏం జరిగిందంటే యాకోబు దగ్గరనుండి కొందరు వ్యక్తులు పేతురు దగ్గరకు వెళ్ళారు. అప్పటి దాకా పేతురు యూదులు కానివాళ్ళతో కలిసి తింటూవుండేవాడు. కాని, వాళ్ళు రాగానే సున్నతి గుంపుకు చెందిన వాళ్ళకు భయపడి వాళ్ళతో కలిసి తినటం మానుకొని వాళ్ళకు దూరంగా వెళ్ళాడు.
GAL 2:13 మిగతా యూదులు కూడా అతడు చేస్తున్న ఈ వంచనలో పాల్గొన్నారు. దీని ప్రభావం వల్ల బర్నబా కూడా తప్పుదారి పట్టాడు.
GAL 2:14 సువార్త బోధించిన విధంగా వాళ్ళు నడుచుకోవటం లేదని నేను గ్రహించి పేతురుతో అందరి ముందు, “నీవు యూదుడుకాని వానివలె జీవిస్తున్నావు. మరి అలాంటప్పుడు యూదులు కాని వాళ్ళను యూదుల సాంప్రదాయాల్ని అనుసరించుమని ఎందుకు ఒత్తిడి చేస్తున్నావు?” అని అడిగాను.
GAL 2:15 పుట్టుకతో మనము యూదులము. యూదులు కాని వాళ్ళలా పాపం చేసేవాళ్ళము కాదు.
GAL 2:16 ధర్మశాస్త్రాన్ని ఆచరించటం వల్ల నీతిమంతుడు కాడని, యేసుక్రీస్తును విశ్వసించటం వల్ల మాత్రమే ఒకడు నీతిమంతుడౌతాడని మనకు తెలుసు. ధర్మశాస్త్రం వల్ల ఎవ్వరూ నీతిమంతులుగా కాలేరు. కనుక మనం కూడా ధర్మశాస్త్రం వల్ల కాకుండా యేసుక్రీస్తు పట్ల మనకున్న విశ్వాసం వల్ల నీతిమంతులం కావాలనే ఉద్దేశ్యంతో ఆయన్ని విశ్వసించాము.
GAL 2:17 మనము క్రీస్తు వల్ల నీతిమంతులం కావాలని ఆయన్ని విశ్వసించామంటే దాని అర్థం మనం పాపులమనే కాదా! అంటే క్రీస్తు పాపానికి తోడ్పడుతున్నాడా? ఎన్నటికీ కాదు.
GAL 2:18 నేను వదిలివేసిన ధర్మశాస్త్రాన్ని నేనే మళ్ళీ బోధిస్తే నేను ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాణ్ణవుతాను.
GAL 2:19 నేను దేవుని కోసం జీవించాలని ధర్మశాస్త్రం పట్ల మరణించాను. ధర్మశాస్త్రమే నన్ను చంపింది.
GAL 2:20 నేను క్రీస్తుతో సహా సిలువ వేయబడ్డాను. కాబట్టి నేను జీవించటం లేదు. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఈ దేహంలో నన్ను ప్రేమించి నా కోసం మరణించిన దేవుని కుమారుని పట్ల నాకున్న విశ్వాసంవల్ల నేను జీవిస్తున్నాను.
GAL 2:21 దేవుని దయను నేను కాదనలేను. ధర్మశాస్త్రం వల్ల ఒకడు నీతిమంతుడు కాగలిగితే మరి క్రీస్తు ఎందుకు మరణించినట్లు?
GAL 3:1 గలతీయ ప్రజలారా! మీరు అవివేకులు. మిమ్ములను ఎవరు మోసగించారు? యేసు క్రీస్తు సిలువకు వేయబడినదానిలో వున్న అర్థం మీ కళ్ళ ముందు స్పష్టంగా చిత్రించాము.
GAL 3:2 మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగనివ్వండి. ధర్మశాస్త్రం అనుసరించటం వల్ల మీరు పరిశుద్ధాత్మను పొందారా? లేక సువార్త విశ్వసించటం వల్ల పొందారా?
GAL 3:3 మీరింత అవివేకులా? పరిశుద్ధాత్మతో ప్రారంభించి ఇప్పుడు మానవ ప్రయత్నం ద్వారా నీతిమంతులు కావాలని చూస్తున్నారా?
GAL 3:4 మీరు ఇన్ని కష్టాలు వ్యర్థంగా అనుభవిస్తున్నారా? అది నేను అంగీకరించను.
GAL 3:5 దేవుడు పరిశుద్ధాత్మను పంపి మీ కోసం మహత్కార్యాలు చేస్తున్నది మీరు ధర్మశాస్త్రం అనుసరించినందుకా? లేక సువార్తను విశ్వసించినందుకా?
GAL 3:6 అబ్రాహామును పరిశీలించండి. “అతడు దేవుణ్ణి విశ్వసించాడు. కనుక దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.”
GAL 3:7 కనుక విశ్వాసమున్న వాళ్ళే అబ్రాహాము కుమారులని గ్రహించండి.
GAL 3:8 యూదులు కానివాళ్ళను దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా నిర్ణయిస్తాడని లేఖనాలు వ్రాసినవాళ్ళు దివ్యదృష్టితో చూసి చెప్పారు. ఈ విషయాన్ని దేవుడు అబ్రాహాముతో, “అన్ని జనముల వారు నీ కారణంగా ధన్యులౌతారు!” అని ముందే చెప్పాడు.
GAL 3:9 కనుక అబ్రాహాము విశ్వసించి ధన్యుడయ్యాడు. అదే విధంగా అతని వలె విశ్వసించిన వాళ్ళు కూడా ధన్యులౌతారు.
GAL 3:10 ధర్మశాస్త్రంపై ఆధారపడిన వాళ్ళందరి మీద శాపం ఉంది. “ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని అన్ని వేళలా ఆచరిస్తూ జీవించని వాడు దేవుని శాపానికి గురి ఔతాడు” అని వ్రాయబడి ఉంది.
GAL 3:11 ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవ్వరినీ నీతిమంతునిగా చెయ్యడని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, “విశ్వాసం ద్వారా నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు” అని ప్రవచనంలో వ్రాయబడి ఉంది.
GAL 3:12 ధర్మశాస్త్రానికి విశ్వాసం పునాది కాదు. పైగా, “ధర్మశాస్త్రం చెప్పినట్లు అన్నీ చేసినవాడు మాత్రమే అనంత జీవితం పొందుతాడు” అని వ్రాయబడి ఉంది.
GAL 3:13 “చెట్టుకు వ్రేలాడవేయబడిన ప్రతి ఒక్కడూ శాపగ్రస్థుడు!” అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కనుక మనకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విముక్తి కలిగించాలని క్రీస్తు ఆ శాపానికి గురి అయ్యాడు.
GAL 3:14 దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం తన ద్వారా యూదులు కానివాళ్ళకు కూడా లభించాలని క్రీస్తు మనకు విముక్తి కలిగించాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనకు విశ్వాసం ద్వారా లభించాలని ఆయన ఉద్దేశ్యం.
GAL 3:15 సోదరులారా! ఇక మన నిత్యజీవితం నుండి ఒక ఉదాహరణ తీసుకొంటాను. అంగీకరించిన ఒడంబడికను మనం రద్దు ెచెయ్యలేము, లేక మార్చలేము. ఈ విషయం కూడా అలాంటిదే.
GAL 3:16 అబ్రాహాముకు, అతని వారసునికి దేవుడు వాగ్దానం చేసాడు. కాని ధర్మశాస్త్రంలో, “వారసులకు” అని వ్రాయబడలేదు. కాని “అనేకులు” అని అర్థం రాకుండా “ఒకనికి” అనే అర్థం వచ్చేటట్లు వ్రాయబడి ఉంది. ఆయనే క్రీస్తు.
GAL 3:17 నేను చెప్పేది ఏమిటంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టబడిన ధర్మశాస్త్రం గతంలో దేవుడు చేసిన ఒడంబడికను ప్రక్కకు త్రోసి ఆయన చేసిన వాగ్దానాన్ని రద్దు చెయ్యలేదు.
GAL 3:18 అయితే వారసత్వం ధర్మశాస్త్రంపై ఆధారపడలేక అది వాగ్దానంపై ఆధారపడి వుందన్న మాట. ఆ రీతిగా దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానం ద్వారా అబ్రాహాముకు యిచ్చాడు.
GAL 3:19 మరి అలాగైతే ధర్మశాస్త్రం ఉండటంలో ఉద్దేశ్యమేమిటి? పాపాన్ని ఎత్తి చూపటమే దాని ఉద్దేశ్యం. వాగ్దానం చెయ్యబడిన అబ్రాహాము వంశీయుడు వచ్చే వరకే దాని ఉపయోగం. దేవదూతల ద్వారా ఒక మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం మనకు అందజేయబడింది.
GAL 3:20 కాని వాగ్దానం విషయంలో దేవుడు ఒక్కడే కనుక మధ్యవర్తి అవసరం కలుగలేదు. రెండు పక్షాలుంటే కదా మధ్యవర్తి కావాలి.
GAL 3:21 మరి అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరుద్దమా? ఎన్నటికీ కాదు. ధర్మశాస్త్రానికి అనంత జీవితాన్నిచ్చే శక్తి వుండి ఉంటే దాని ద్వారా నీతిమంతులం అయ్యేవాళ్ళం.
GAL 3:22 కాని లేఖనాల్లో, “ప్రపంచం పాపాల్లో చిక్కుకు పోయింది.” అని వ్రాయబడి ఉంది. ఇలా ఎందుకైందంటే యేసుక్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం వల్ల వాగ్దానం చెయ్యబడిన వరము విశ్వాసం ఉన్న వాళ్ళకే యివ్వబడుతుంది.
GAL 3:23 విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసం మనకు బయలు పడేదాకా మనము ఖైదీలుగా ఉన్నాము.
GAL 3:24 మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్ళటానికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడింది.
GAL 3:25 ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది. కనుక ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏ మాత్రం అధికారం లేదు.
GAL 3:26 యేసుక్రీస్తులో మీకు విశ్వాసం వుండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు.
GAL 3:27 ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు.
GAL 3:28 ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని, వ్యత్యాసం లేదు. క్రీస్తుయేసులో మీరందరు సమానం.
GAL 3:29 మీరు క్రీస్తుకు చెందితే అబ్రాహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమౌతాం.
GAL 4:1 నేను చెప్పేదేమిటంటే వారసుడు చిన్నవానిగా ఉన్నంత కాలం, అతడు ఆస్తికంతా వారసుడైనా అతనికి, బానిసకు వ్యత్యాసం లేదు.
GAL 4:2 అతని తండ్రి నియమించిన కాలం వచ్చేదాకా అతడు సంరక్షకుల ఆధీనంలో ఉండవలసిందే.
GAL 4:3 అదే విధంగా మనము పిల్లలంగా ఉండినప్పుడు ప్రపంచం యొక్క నియమాలకు బానిసలమై జీవించాము.
GAL 4:4 కాని సరైన సమయం రాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు ఒక స్త్రీకి జన్మించాడు. ఆయన కూడా ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు.
GAL 4:5 మనము దేవుని సంతానం కావాలని ఆయన మనలను ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి కలిగించాడు.
GAL 4:6 మీరు దేవుని కుమారులు గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ “అబ్బా! తండ్రీ!” అని తన తండ్రిని పిలుస్తూ ఉంటాడు.
GAL 4:7 కనుక మీరు బానిసలు కారు. మీరు దేవుని సంతానం. కనుక దేవుడు మిమ్మల్ని కూడా తనకు వారసులను చేసుకొన్నాడు.
GAL 4:8 ఇదివరలో మీకు నిజమైన దేవుణ్ణి గురించి తెలియదు. కనుక మీరు వట్టి దేవుళ్ళకు బానిసలై జీవించారు.
GAL 4:9 కాని యిప్పుడు మీకు దేవుడెవరో తెలుసు. లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకొన్నాడు. అలాంటప్పుడు బానిసలు కావటానికి నిస్సారమైన, నిరర్థకమైన ఆ శక్తుల వైపు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు?
GAL 4:10 మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను యింకా పాటిస్తున్నారు.
GAL 4:11 మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తోంది. మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తోంది.
GAL 4:12 సోదరులారా! నేను మీలా అయ్యాను. కనుక మీరు నాలా కావాలని విన్నవించుకుంటున్నాను. మీరు నా పట్ల ఏ అపరాధమూ చెయ్యలేదు.
GAL 4:13 నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది.
GAL 4:14 నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా మీరు నన్ను తిరస్కరించలేదు. విసుక్కోలేదు. దానికి మారుగా నేనొక దేవదూతనైనట్లు, నేను యేసు క్రీస్తునైనట్లు నాకు స్వాగతం చెప్పారు.
GAL 4:15 మీ ఆనందం ఏమైంది? మీరు నా సహాయం కోసం మీ కళ్ళు కూడా పీకి నాకిచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను.
GAL 4:16 నిజం చెప్పటంవల్ల యిప్పుడు నేను మీ శత్రువునయ్యానా?
GAL 4:17 వాళ్ళు మిమ్మల్ని లోబరచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు మంచి కలుగదు. మానుండి మిమ్మల్ని వేరు చెయ్యాలని వాళ్ళ ప్రయత్నం. మీరు వాళ్ళను మాత్రమే అనుసరించాలని వాళ్ళ ఉద్దేశ్యం.
GAL 4:18 ఉద్దేశ్యం మంచిదైతే పట్టుదలతో ఉండటం మంచిదే. కనుక నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ అదే విధంగా ఉండండి.
GAL 4:19 నా ప్రియమైన బిడ్డలారా! క్రీస్తులో మీరు మరలా రూపం దాల్చే వరకూ నేను మీకోసం మళ్ళీ ఈ ప్రసవవేదనపడ్తూ ఉండవలసిందే.
GAL 4:20 మీ విషయంలో నాకు చాలా దిగులుగా ఉంది. కనుక మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, మరొక విధంగా మీకు చెప్పాలని ఉంది.
GAL 4:21 ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలని అనుకొన్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెపుతుందో తెలియదా?
GAL 4:22 అబ్రాహాముకు ఇద్దరు పుత్రులని, ఒకడు బానిస స్త్రీకి జన్మించాడని, మరొకడు స్వంత స్త్రీకి జన్మించాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి వుంది.
GAL 4:23 బానిస స్త్రీ వల్ల అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్ధంగా జన్మించాడు. కాని స్వంత స్త్రీకి జన్మించిన వాడు వాగ్దానం వల్ల జన్మించాడు.
GAL 4:24 ఈ వృత్తాంతం అలంకారికంగా చెప్పబడింది. ఆ యిరువురు స్త్రీలు రెండు ఒడంబడికలతో పోల్చబడ్డారు. సీనాయి పర్వతం మీద నుండి ఒక ఒడంబడిక వచ్చింది. దీని వల్ల జన్మించిన వాళ్ళు బానిసలు కావాలని ఉంది. “హాగరు”ను ఆ మొదటి ఒడంబడికతో పోల్చవచ్చును.
GAL 4:25 అరేబియాలో ఉన్న సీనాయి పర్వతంతో కూడా “హాగరు”ను పోల్చవచ్చు. ఆమెను ప్రస్తుతం యెరూషలేముతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ పట్టణపు ప్రజలు కూడా ఆమె సంతానంలా బానిసలు.
GAL 4:26 కాని పరలోకంలో ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది. అది మన తల్లి.
GAL 4:27 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఓ గొడ్రాలా! పిల్లల్ని కననిదానా! ఆనందించు, పురిటి నొప్పులు పడనిదానా! గట్టిగా కేకలు వేయి! ఎందుకనగా భర్త వున్న స్త్రీకన్నా భర్త లేని స్త్రీకి పిల్లలు ఎక్కువ.”
GAL 4:28 కనుక సోదరులారా! మీరు ఇస్సాకువలే వాగ్దానపు పిల్లలుగా జన్మించలేదు.
GAL 4:29 ఆనాడు ప్రకృతి సిద్ధంగా జన్మించిన కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన కుమారుణ్ణి హింసించాడు. ఈనాడు కూడా అదే జరుగుతోంది.
GAL 4:30 కాని ధర్మశాస్త్రం ఏమి చెపుతున్నది? “బానిస స్త్రీ కుమారుడు, స్వంత స్త్రీకి జన్మించిన కుమారునితో ఆస్తి పంచుకోలేడు. కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బయటికి తరిమివేయండి” అని వ్రాయబడి ఉంది.
GAL 4:31 సోదరులారా! మనము స్వంత స్త్రీకి జన్మించిన బిడ్డలం. బానిస స్త్రీకి జన్మించిన బిడ్డలం కాము.
GAL 5:1 మనము స్వతంత్రంగా ఉండాలని క్రీస్తు మనకు స్వేచ్ఛ కలిగించాడు. కనుక పట్టుదలతో ఉండండి. “ధర్మశాస్త్రం” అనే బానిసత్వంలోనికి పోకుండా జాగ్రత్త పడండి.
GAL 5:2 నా మాట వినండి. మీరు సున్నతి చేయించుకోవటానికి అంగీకరిస్తే క్రీస్తు వల్ల మీకు ఏ మాత్రమూ ప్రయోజనంలేదని పౌలను నేను చెపుతున్నాను.
GAL 5:3 సున్నతి చేయించుకోవటానికి అంగీకరించినవాడు ధర్మశాస్త్రాన్నంతా పాటించవలసి వస్తుందని నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెపుతున్నాను.
GAL 5:4 ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా కావాలనుకొంటున్న మీరు స్వయంగా క్రీస్తులోనుండి విడిపోయారు. తద్వారా దైవానుగ్రహాన్ని పోగొట్టుకొన్నారు.
GAL 5:5 కాని, మనము పరిశుద్ధాత్మ ద్వారా ఆశిస్తున్న నీతి, విశ్వాసం ద్వారా లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించి దానికోసం నిరీక్షిస్తున్నాము.
GAL 5:6 ఎందుకంటే యేసుక్రీస్తు దృష్టిలో సున్నతికి విలువ లేదు. సున్నతి చేసుకొన్నా, చేసుకోకపోయినా ఒకటే. ప్రేమ ద్వారా వ్యక్తమయ్యే విశ్వాసానికి మాత్రమే విలువ ఉంటుంది.
GAL 5:7 మీరు పందెంలో బాగా పరిగెత్తుచుండిరి. ఈ సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆటంకపరిచారు?
GAL 5:8 మిమ్మల్ని పిలిచిన వాడు ఆటంక పరచలేదు.
GAL 5:9 “పులుపు కొంచెమైనా, పిండినంతా పులిసేటట్లు చేస్తుంది” అని మనకు తెలుసు.
GAL 5:10 మీరు మరో విధంగా ఆలోచించరని ప్రభువునందు నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మీ దృఢ విశ్వాసాన్ని కదిలిస్తున్నవాడు, ఎవడైనా సరే వాడు తప్పక శిక్షననుభవిస్తాడు.
GAL 5:11 నా సోదరులారా సున్నతి చేయించుకోవాలని నేనింకా బోధిస్తున్నట్లైతే, నన్ను వాళ్ళెందుకు ఇంకా హింసిస్తున్నారు? నేను ఆ విధంగా ఉపదేశిస్తున్నట్లయితే నేను సిలువను గురించి బోధించినా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు.
GAL 5:12 మిమ్మల్ని కలవర పెట్టేవాళ్ళు పూర్తిగా అంగచ్ఛేదన జరిగించుకోవటం మంచిది.
GAL 5:13 నా సోదరులారా! మీరు స్వేచ్ఛగా జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరీ స్వేచ్ఛను మీ శారీరక వాంఛలు తీర్చుకోవటానికి ఉపయోగించకండి. దానికి మారుగా ప్రేమతో పరస్పరం సహాయం చేసుకొంటూ ఉండండి.
GAL 5:14 “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగు వాణ్ణి ప్రేమించు” అన్న ఒకే నియమంలో ధర్మశాస్త్రమంతా యిమిడి ఉంది.
GAL 5:15 మీరీ విధంగా కలహములాడుకొంటూ హింసించుకొంటూ ఉంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకొంటారు. అలా జరగక ముందే జాగ్రత్త పడండి.
GAL 5:16 కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించండి. అప్పుడు మీ మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని తీర్చుకోకుండా ఉండగలరు.
GAL 5:17 ఎందుకంటే మానవ స్వభావము పరిశుద్ధాత్మ కోరుకొంటున్న దానికి విరుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కోరేది మన స్వభావం కోరేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. తద్వారా మీరు చెయ్యాలనుకుంటున్న దాన్ని చెయ్యలేకపోతున్నారు.
GAL 5:18 కాని పరిశుద్ధాత్మ చూపిన మార్గాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రం మిమ్మల్ని బంధించదు.
GAL 5:19 మానవ స్వభావం యొక్క పనులు మనకు బాగా తెలుసు. అవేవనగా వ్యభిచారము, అపవిత్రత, కామము,
GAL 5:20 విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషము, కలహము, ఈర్ష్య, కోపము, స్వార్థము, విరోధము, చీలికలు,
GAL 5:21 అసూయ, త్రాగుబోతు తనము, కామకేళీలు మొదలగునవి. వీటిని గురించి నేనిదివరకే వారించాను. మళ్ళీ వారిస్తున్నాను. ఈ విధంగా జీవించేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
GAL 5:22 కాని పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలాలు, ప్రేమ, ఆనందం, శాంతం, సహనం, దయ, మంచితనం, విశ్వాసం,
GAL 5:23 వినయం, ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు.
GAL 5:24 యేసుక్రీస్తుకు చెందినవాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహాలను, కోరికలను సిలువకు వేసి చంపారు.
GAL 5:25 మనము పరిశుద్ధాత్మ వలన జీవిస్తున్నాము. కనుక ఆయన ప్రకారము నడుచుకొందాము.
GAL 5:26 ఒకరికొకర్ని రేపకుండా, ద్వేషించకుండా, గర్వించకుండా ఉందాం.
GAL 6:1 నా సోదరులారా! మీలో ఎవరైనా పాపం చేస్తే, మీలో ఆత్మీయంగా జీవిస్తున్న వాళ్ళు అతన్ని సరిదిద్దాలి. ఇది వినయంగా చెయ్యాలి. కాని మీరు స్వతహాగా ఆ పాపంలో చిక్కుకుపోకుండా జాగ్రత్త పడండి.
GAL 6:2 పరస్పరం కష్టాలు పంచుకోండి. అప్పుడే క్రీస్తు ఆజ్ఞను పాటించిన వాళ్ళౌతారు.
GAL 6:3 తనలో ఏ గొప్పతనమూ లేనివాడు, తాను గొప్ప అని అనుకొంటే తనను తాను మోసం చేసుకొన్న వాడౌతాడు.
GAL 6:4 ప్రతి ఒక్కడూ తన నడవడికను స్వయంగా పరీక్షించుకోవాలి. అప్పుడు తాను మరొకరితో పోల్చుకోకుండా తన నడతను గురించి గర్వించవచ్చు.
GAL 6:5 ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
GAL 6:6 దేవుణ్ణి గురించి బోధన పొందినవాడు, బోధించిన వానికి అన్ని విధాల సహాయం చెయ్యాలి.
GAL 6:7 మోసపోకండి, ప్రతి ఒక్కడూ తాను నాటిన చెట్టు ఫలాన్నే పొందుతాడు. ఈ విషయంలో దేవుణ్ణి మోసం చెయ్యలేము.
GAL 6:8 శారీరిక వాంఛలు అనే పొలంలో విత్తనం నాటితే మరణాన్ని ఫలంగా పొందుతాడు. పరిశుద్ధాత్మను మెప్పించే విధంగా నాటితే పరిశుద్ధాత్మ నుండి అనంతజీవితం అనే ఫలం పొందుతాడు.
GAL 6:9 కనుక మనం విశ్రాంతి తీసుకోకుండా మంచి చేద్దాం. మనము విడువకుండా మంచి చేస్తే సరియైన సమయానికి మంచి అనే పంట కోయగలుగుతాము.
GAL 6:10 మనకు మంచి చేసే అవకాశం ఉంది కనుక అందరికీ మంచి చేద్దాం. ముఖ్యంగా విశ్వాసులకు మంచి చేద్దాం.
GAL 6:11 ఇది మీకు నేను నా స్వహస్తాలతో వ్రాసాను. మీరు గమనించాలని అక్షరాలు ఎంత పెద్దగా వ్రాసానో చూడండి.
GAL 6:12 నలుగురిలో మంచి పేరు పొందాలనుకొన్నవాళ్ళు సున్నతి చేయించుకోమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళీ విధంగా చెయ్యటానికి ఒకే ఒక కారణం ఉంది. అది క్రీస్తు సిలువను గురించి బోధించటం వల్ల కలిగే హింసనుండి తప్పించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం.
GAL 6:13 సున్నతి చేసుకొన్నవాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించరు. కాని శారీరకంగా వాళ్ళు గర్వించటానికి మిమ్మల్ని సున్నతి చేయించుకోమంటున్నారు.
GAL 6:14 యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించను. ఎందుకనగా క్రీస్తు సిలువ ద్వారా లోకానికి నేను, నాకు లోకం చచ్చియున్నాము.
GAL 6:15 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోకపోయినా ఒకటే. క్రొత్త జీవితం పొందటం ముఖ్యం.
GAL 6:16 ఈ నియమాల్ని పాటించే వాళ్ళందరికీ, దేవుని ఇశ్రాయేలు ప్రజలకు శాంతి, అనుగ్రహం లభించును గాక.
GAL 6:17 చివరకు, నా దేహంపై యేసును గురించి పొందిన గుర్తులు ఉన్నాయి. కనుక నాకెవ్వరూ ఆటంకం కలిగించకుండా ఉండండి.
GAL 6:18 సోదరులారా! యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహము మీ ఆత్మకు తోడై ఉండుగాక! ఆమేన్.
EPH 1:1 దైవేచ్ఛవల్ల యేసుక్రీస్తు అపొస్తలుడు అయిన పౌలు నుండి యేసుక్రీస్తును విశ్వసించే ఎఫెసులోని పవిత్రులకు:
EPH 1:2 మన ప్రభువైన యేసు క్రీస్తు, మన తండ్రియైన దేవుడు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించు గాక!
EPH 1:3 మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవునికి స్తుతి కలుగుగాక! దేవుడు పరలోకానికి చెందిన మనకు ఆత్మీయతకు కావలసినవన్నీ మనలో క్రీస్తు ద్వారా సమకూర్చి మనల్ని దీవించాడు.
EPH 1:4 మనము తన దృష్టియందు పవిత్రంగా ఏ తప్పూ చెయ్యకుండా ఉండాలని ప్రపంచాన్ని సృష్టించక ముందే క్రీస్తులో మనల్ని తన ప్రేమవల్ల ఎన్నుకొన్నాడు.
EPH 1:5 యేసు క్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా ప్రేమతో దగ్గరకు చేర్చుకోవాలని సృష్టికి ముందే నిర్ణయించాడు. ఇదే ఆయన ఉద్దేశ్యము. ఇలా చేయటమే ఆయన ఆనందం!
EPH 1:6 కనుక ఈ అద్భుతమైన అనుగ్రహాన్ని తాను ప్రేమిస్తున్న క్రీస్తులో ఉన్న మనకు ఉచితంగా యిచ్చిన దేవుణ్ణి మనము స్తుతించుదాం.
EPH 1:7 ఆయన రక్తం వల్ల మనకు విడుదల కలిగింది. మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన అనుగ్రహం ఎంతో గొప్పది.
EPH 1:8 ఆ అనుగ్రహాన్ని దేవుడు మనపై ధారాళంగా కురిపించాడు. ఇది బాగా ఆలోచించి దివ్య జ్ఞానంతో చేసాడు.
EPH 1:9 ఆయన తాను క్రీస్తు ద్వారా ఆనందముతో చెయ్యదలచిన మర్మాన్ని తన యిచ్ఛానుసారం మనకు తెలియచేసాడు.
EPH 1:10 సరియైన సమయం రాగానే తాను పూర్తి చేయదలచిన దాన్ని పూర్తి చేస్తాడు. సృష్టినంతటిని, అంటే భూలోకాన్ని, పరలోకాన్ని ఒకటిగా చేసి దానికి క్రీస్తును అధిపతిగా నియమిస్తాడు.
EPH 1:11 అన్నీ ఆయన ఉద్దేశ్యానుసారం, ఆయన నిర్ణయించిన విధంగా సంభవిస్తాయి. తాను సృష్టికి ముందు నిర్ణయించిన విధంగా తన ఉద్దేశ్యం ప్రకారం మనము క్రీస్తులో ఐక్యత పొంది ఆయన ప్రజలుగా ఉండేటట్లు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు.
EPH 1:12 క్రీస్తు మనకు రక్షణ యిస్తాడని విశ్వసించిన వాళ్ళలో మనము మొదటివాళ్ళము. మనము ఆయన మహిమకు కీర్తి కలిగించాలని ఆయన ఉద్దేశ్యము. ఆయన మహిమను బట్టి ఆయన్ను స్తుతించుదాం.
EPH 1:13 మీరు రక్షణను గురించి చెప్పబడిన సువార్త విన్నారు. ఆ గొప్ప సత్యం మీకు లభించింది. కనుక మీకు కూడా క్రీస్తులో ఐక్యత కలిగింది. ఆయన్ని మీరు విశ్వసించినప్పుడు మీపై ముద్ర వేయబడింది. ఆ ముద్రే దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ.
EPH 1:14 తన ప్రజలందరికీ రక్షణ కలిగే వరకూ వారసత్వానికి హామీగా ఆయన పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంచాడు. ఇది ఆయన మహిమ కోసం జరిగింది.
EPH 1:15 ఈ కారణాన నేను మీకు యేసు ప్రభువుపట్ల ఉన్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసులపట్ల మీకున్న ప్రేమను గురించి విన్నప్పటినుండి
EPH 1:16 దేవునికి కృతజ్ఞతలు చెప్పటం మానలేదు. ప్రార్థించినప్పుడు మిమ్మల్ని తలుచుకోవటం మానలేదు.
EPH 1:17 నేను ఎల్లప్పుడు మన క్రీస్తు ప్రభువు యొక్క దేవుడు అయిన ఆ మహిమగల తండ్రి మీకు పరిశుద్ధాత్మను యివ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ మీకు జ్ఞానాన్నిచ్చి, దేవుణ్ణి తెలియజేయాలని నా అభిలాష. అప్పుడు మీరు దేవుణ్ణి యింకా ఎక్కువగా తెలుసుకోగలుగుతారు.
EPH 1:18 మీ మనోనేత్రాలు తెరుచుకోవాలని, మీరు ఆశిస్తున్న వారసత్వాన్ని గురించి తెలుసుకోవాలని నా ప్రార్థన. ఆ వారసత్వం మీకివ్వటానికి ఆయన మిమ్మల్ని పిలిచాడు. అప్పుడు ఆయన తన విశ్వాసులకు వాగ్దానం చేసిన ఆశీస్సులు ఎంత అద్భుతమైనవో మీరు చూడగలుగుతారు.
EPH 1:19 క్రీస్తును విశ్వసించే మనలో పని చేస్తున్న ఆయన శక్తి ఎంత ఉత్తమమైనదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన.
EPH 1:20 ఈ శక్తి ద్వారా క్రీస్తును బ్రతికించి పరలోకంలో తన కుడివైపు కూర్చోబెట్టుకున్నాడు.
EPH 1:21 దేవుడు క్రీస్తుకు యిచ్చిన స్థానం అన్ని హోదాలకన్నా, అన్ని అధికారాలకన్నా, అన్ని శక్తులకన్నా, అన్ని రాజ్యాలకన్నా గొప్పది. అది ప్రస్తుతమున్న బిరుదులకన్నా, భవిష్యత్తులో లభించే బిరుదులకన్నా గొప్పది.
EPH 1:22 దేవుడు అన్నిటిని ఆయన పాదాల క్రింద ఉంచి, ఆయన్ని సంఘానికి సంబంధించిన వాటన్నిటిపై అధిపతిగా నియమించాడు.
EPH 1:23 సంఘము ఆయన శరీరం. ఆయన అన్నిటికీ అన్ని విధాల పరిపూర్ణత కలిగిస్తాడు. సంఘం కూడా ఆయన వల్ల పరిపూర్ణత పొందుతుంది.
EPH 2:1 ఇక మీ విషయమా! ఇదివరలో మీరు మీ పాపాల్లో, అతిక్రమాల్లో మరణించారు.
EPH 2:2 అప్పుడు మీరు ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండలాధికారిని అనుసరించే వాళ్ళు. ఆ వాయుమండలాధికారి అత్మ దేవునికి అవిధేయతగా ఉన్నవాళ్ళలో ఇప్పుడూ పని చేస్తుంది.
EPH 2:3 నిజానికి మనం కూడా మన మానవ స్వభావంవల్ల కలిగే వాంఛల్ని, శారీరక వాంచల్ని, మన ఆలోచనల వల్ల కలిగే వాంఛల్ని తృప్తి పరుచుకుంటున్న వాళ్ళలా జీవించాము. కాబట్టి వాళ్ళలా మనము కూడా దేవుని కోపానికి గురి అయ్యాము.
EPH 2:4 కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది.
EPH 2:5 మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది.
EPH 2:6 మనకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చెయ్యటానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు.
EPH 2:7 యేసు క్రీస్తు ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేసి, తన అపారమైన దయ మనపై చిరకాలం ఉంటుందని నిరూపించాడు.
EPH 2:8 మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండటంవల్ల మీకా అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు. దాన్ని దేవుడు మీకు ఉచితంగా యిచ్చాడు.
EPH 2:9 అది మీ కృషివల్ల లభించింది కాదు. కనుక గొప్పలు చెప్పుకోవటానికి అవకాశం లేదు.
EPH 2:10 దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు.
EPH 2:11 మీరు యూదులుగా పుట్టలేదు. కనుక యూదులు మిమ్మల్ని “సున్నతి చేయించుకోని వాళ్ళు” అని అంటారు. తాము సున్నతి పొందిన వాళ్ళైనందుకు వాళ్ళు గర్విస్తూవుంటారు. వీళ్ళ సున్నతి శారీరకమైనది. ఆత్మవల్ల పొందింది కాదు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి.
EPH 2:12 అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో కాక విడిగా ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో మీకు పౌరసత్వం లేదు. దేవుడు వాగ్దానం చేసిన ఒడంబడికలో మీకు భాగం లేదు. మీరు రక్షణ లభిస్తుందన్న ఆశలేకుండా, ఈ ప్రపంచంలో దేవుడనే వాడు లేకుండా జీవించారు. ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి.
EPH 2:13 కాని ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం వల్ల దేవునికి దగ్గర అయ్యారు.
EPH 2:14 మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు. ఆయన యిద్దరినీ ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు.
EPH 2:15 ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం.
EPH 2:16 ఈ విధంగా సిలువ ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదర్చాలని ఆయన ఉద్దేశ్యం.
EPH 2:17 క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు, మరియు దగ్గరగా ఉన్న వాళ్ళకు శాంతి సువార్తను ప్రకటించాడు.
EPH 2:18 ఆయన కారణంగా మన యిద్దరికి, తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్ళే అవకాశం కలిగింది.
EPH 2:19 అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీయులు కారు. పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు.
EPH 2:20 మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి.
EPH 2:21 ఆయనవల్ల ఈ ఇల్లు సక్రమంగా నిర్మింపబడి అభివృద్ధి చెందుతుంది. అది ప్రభువు పవిత్ర దేవాలయము.
EPH 2:22 ఆయనలో ఐక్యత పొందిన మిమ్మల్ని కూడా యితర్లతో చేర్చి ఈ ఇల్లు నిర్మింపబడుతుంది. ఈ యింటిలో దేవుని ఆత్మ నివసిస్తాడు.
EPH 3:1 అందువల్ల యూదులు కాని మీ కోసం పౌలు అని నేను, యేసు క్రీస్తు ఖైదీని అయ్యాను.
EPH 3:2 దేవుడు నన్ను అనుగ్రహించి మీకోసం ఈ పని నాకు అప్పగించినట్లు మీరు తప్పకుండా వినే వుంటారు.
EPH 3:3 ఈ రహస్యం నాకు తెలుపబడినట్లు నేను యిదివరకే క్లుప్తంగా మీకు వ్రాసాను.
EPH 3:4 క్రీస్తును గురించి రహస్య జ్ఞానం నాకు అర్థమైనట్లు నేను వ్రాసింది చదివితే మీకు తెలుస్తుంది.
EPH 3:5 ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు మన పూర్వీకులకు ఇవ్వలేదు. ఇప్పుడా రహస్య జ్ఞానాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులైన అపొస్తలులకు, ప్రవక్తలకు, తెలియచేసాడు.
EPH 3:6 ఆ రహస్యం ఏమిటంటే, సువార్తవల్ల యూదులు కానివాళ్ళు ఇశ్రాయేలు వాళ్ళతో సహా వారసులౌతారు. వాళ్ళు ఒకే శరీరానికి సంబంధించిన అవయవాలు. అంతేకాక దేవుడు యేసు క్రీస్తు ద్వారా చేసిన వాగ్దానానికి వాళ్ళు భాగస్తులు. ఇది సువార్త వల్ల సంభవిస్తోంది.
EPH 3:7 దేవుడు తన శక్తిని నాపై ఉపయోగించి తన అనుగ్రహాన్ని నాకు వరంగా ప్రసాదించటం వల్ల నేను ఈ సువార్తకు దాసుణ్ణయ్యాను.
EPH 3:8 దేవుని ప్రజలందరిలో నేను అధముణ్ణి. అయినా దేవుడు నాకీవరం ప్రసాదించాడు. క్రీస్తులో ఉన్న అనంతమైన ఐశ్వర్యాన్ని గురించి యూదులు కానివాళ్ళకు బోధించే అవకాశం నాకిచ్చి నన్ను అనుగ్రహించాడు.
EPH 3:9 అన్నిటినీ సృష్టించిన దేవుడు తరతరాల నుండి తనలో దాచుకొన్న ఈ రహస్య ప్రణాళికను ప్రతి ఒక్కరికీ స్పష్టం చేయుమని నాకు అప్పగించాడు.
EPH 3:10 వాయుమండలంలో ఉన్న పాలకులకు, అధికారులకు సంఘం ద్వారా అన్నిటిలో అతీతుడైన దేవుని జ్ఞానాన్ని తెలియచేయాలని ఆయన ఉద్దేశ్యం.
EPH 3:11 దేవుడు యిలా చెయ్యాలని కాలానికి ముందే అనుకున్నాడు. ఆ అనుకొన్న దాన్ని ఇప్పుడు మన యేసు క్రీస్తు ద్వారా సాధించాడు.
EPH 3:12 క్రీస్తుతో మనకు కలిగిన ఐక్యతవల్ల మరియు ఆయనలో మనకున్న విశ్వాసం వల్ల మనము దేవుని సమక్షంలో ధైర్యంగా సంపూర్ణమైన స్వేచ్ఛతో నిలబడగలుగుతున్నాము.
EPH 3:13 మీ కోసం నేను కష్టాలు అనుభవిస్తున్నందుకు అధైర్యపడకండి. ఇది నా విజ్ఞప్తి. నా కష్టాలవల్ల మీకు గౌరవం లభిస్తుంది.
EPH 3:14 ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను.
EPH 3:15 కనుక భూలోకంలో, పరలోకంలో ఉన్న విశ్వాసులందరు ఆయన పేరులో ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు.
EPH 3:16 ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచుమని వేడుకొంటున్నాను.
EPH 3:17 అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. మీ వేర్లు ప్రేమలో నాటుక పోయేటట్లు చేయుమనీ మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయుమనీ ప్రార్థిస్తున్నాను.
EPH 3:18 అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం చేసుకోకలుగుతారు.
EPH 3:19 జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన.
EPH 3:20 దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది.
EPH 3:21 సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్.
EPH 4:1 ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపు సార్థకమయ్యేటట్లు జీవించుమని ప్రభువు యొక్క ఖైదీనైన నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
EPH 4:2 అన్ని వేళలా విధేయతగా, శాంతంగా ఉండండి. వినయంతో, దయతో, సహనంతో జీవించండి. ఇతర్ల తప్పులను ప్రేమతో క్షమించండి.
EPH 4:3 శాంతి కలిగించిన బంధంతో పరిశుద్దాత్మ యిచ్చిన ఐక్యతను పొందటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి.
EPH 4:4 శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే,
EPH 4:5 ఆ ఒకే నిరీక్షణ యందుండుటకే ఆయన మనలను పిలిచాడు. అదే విధముగా ప్రభువు ఒక్కటే విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. దేవుడు ఒక్కడే.
EPH 4:6 ఆయనే అందరికి తండ్రి. అందరికి ప్రభువు. అందరిలో ఉన్నాడు. అందరి ద్వారా పని చేస్తున్నాడు.
EPH 4:7 క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప యివ్వబడింది.
EPH 4:8 అందువల్ల లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: “ఆయన పైకి వెళ్ళినప్పుడు బంధితుల్ని వరుసగా తనతో తీసుకు వెళ్ళాడు. మానవులకు వరాలిచ్చాడు.”
EPH 4:9 “ఆయన పైకి వెళ్ళాడు” అని అనటంలో అర్థమేమిమటి? ఆయన క్రిందికి, అంటే భూమి క్రింది భాగాలకు దిగి వచ్చాడనే అర్థం కదా!
EPH 4:10 క్రిందికి దిగి వచ్చిన వాడే ఆకాశములను దాటి పైకి వెళ్ళాడు. ఆ విధంగా పైకి వెళ్ళి లోకాలన్నిటిని నింపి వేసాడు.
EPH 4:11 కొందరు అపొస్తలులు కావాలని, కొందరు ప్రవక్తలు కావాలని, కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘ కాపరులు కావాలని, మరి కొందరు బోధకులు కావాలని ఆదేశించి వాళ్ళకు తగిన వరాలిచ్చాడు.
EPH 4:12 పవిత్రుల్ని సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ, దాని వల్ల క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశ్యం.
EPH 4:13 అప్పుడు మనము విశ్వాసంతో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాము. క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము.
EPH 4:14 అప్పుడు మనము పసిపిల్లల వలె ఉండము. అలలకు యిటు అటు కొట్టుకొనిపోము. గాలిలాంటి ప్రతి బోధనకు కదిలిపోము. కపటంతో, కుయుక్తితో పన్నిన మాయోపాయాలకు మోసపోకుండా ఉంటాము.
EPH 4:15 మనము ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాల అభివృద్ధి చెంది శిరస్సైన క్రీస్తును చేరుకోవాలి.
EPH 4:16 శరీరంలోని అన్ని భాగాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి ఆధారమిస్తాయి. ఇలా ప్రతీ భాగం తన పని చెయ్యటంవల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది.
EPH 4:17 ప్రభువు పేరిట నేను ఈ విషయం చెప్పి వారిస్తున్నాను. ఇక మీదట యూదులుకాని వాళ్ళవలే జీవించకండి. వాళ్ళ ఆలోచనలు నిరుపయోగమైనవి.
EPH 4:18 వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళలో ఉన్న మూర్ఖత కారణంగా వాళ్ళ హృదయాలు కఠినంగా ఉండటం వల్ల వాళ్ళకు దేవుడిచ్చిన జీవితంలో భాగం లభించలేదు.
EPH 4:19 వాళ్ళు మంచిగా ఉండటం మానుకొన్నారు. అంతులేని ఆశతో శారీరక సుఖాలు అనుభవిస్తూ అన్ని రకాల అపవిత్రమైన సుఖాలకు మరిగారు.
EPH 4:20 కాని మీరు క్రీస్తును గురించి నేర్చుకొన్నది యిది కాదు.
EPH 4:21 మీరు యేసును గురించి విన్నారు. ఆయనలో ఉన్న సత్యాన్ని ఆయన పేరిట నేర్చుకొన్నారు.
EPH 4:22 మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది. దాన్ని మరిచిపొండి. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పు దారి పట్టించాయి. తద్వారా మీ గత జీవితం మిమ్మల్ని నాశనం చేసింది.
EPH 4:23 మీ బుద్ధులు, మనస్సులు మారి మీలో నూతనత్వం రావాలి.
EPH 4:24 దేవుడు తన పోలికలతో సృష్టించిన క్రొత్త మనిషిగా మీరు మారాలి. ఆ క్రొత్త మనిషిలో నిజమైన నీతి, పవిత్రత ఉన్నాయి.
EPH 4:25 మనమంతా ఒకే శరీరానికి చెందిన వాళ్ళము కనుక అబద్ధం చెప్పటం మానుకోవాలి. సత్యమే మాట్లాడాలి.
EPH 4:26 మీరు మీ కోపంలో పాపం చెయ్యకండి. ఒకవేళ కోప్పడినా సూర్యాస్తమయం కాక ముందే మీ కోపం తగ్గిపోవాలి.
EPH 4:27 సాతానుకు అవకాశమివ్వకండి.
EPH 4:28 దొంగలు యికమీదట దొంగతనం చెయ్యరాదు. వాళ్ళు తమ చేతుల్ని మంచి పనులు చెయ్యటానికి ఉపయోగించాలి. అప్పుడు వాళ్ళు పేద వాళ్ళకు సహాయం చెయ్యగలుగుతారు.
EPH 4:29 దుర్భాషలాడకండి. ఇతర్ల అభివృద్ధికి తోడ్పడే విధంగా, వాళ్ళకు అవసరమైన విధంగా మాట్లాడండి. మీ మాటలు విన్న వాళ్ళకు లాభం కలగాలి.
EPH 4:30 మీకు విమోచన కలిగే రోజుదాకా మీలో ముద్రింపబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి.
EPH 4:31 మీలో ఉన్న కక్షను, కోపాన్ని, పోట్లాడే గుణాన్ని, దూషించే గుణాన్ని, మీ నుండి తరిమివేయండి. మీలో ఎలాంటి చెడుగుణం ఉండకూడదు.
EPH 4:32 దయాదాక్షిణ్యాలు అలవరచుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి.
EPH 5:1 మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి.
EPH 5:2 క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటి వాళ్ళను ప్రేమిస్తూ జీవించండి.
EPH 5:3 కాని మీరు వ్యభిచారాన్ని గురించి గాని, అపవిత్రతను గురించి గాని, దురాశను గురించి గాని మాట కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసుల్లో ఉండకూడదు.
EPH 5:4 అంతేకాక మీరు బూతు మాటలు, అర్థంలేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి.
EPH 5:5 ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యాశాపరులు, నిజానికి ఇలాంటి వాళ్ళు విగ్రహారాధకులతో సమానము, ఇలాంటి వాళ్ళు దేవుడు మరియు క్రీస్తు పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు.
EPH 5:6 వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు.
EPH 5:7 వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి.
EPH 5:8 ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి.
EPH 5:9 ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి.
EPH 5:10 ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి.
EPH 5:11 చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్న వాళ్ళను గురించి అందరికీ చెప్పండి.
EPH 5:12 అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం.
EPH 5:13 వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది.
EPH 5:14 వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది: “నిద్రిస్తున్న ఓ మనిషీ మేలుకో! బ్రతికి లేచిరా! క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.”
EPH 5:15 మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి.
EPH 5:16 ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
EPH 5:17 మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి.
EPH 5:18 మత్తు పదార్థాలు త్రాగుతూ త్రాగుబోతుల్లా జీవించకండి. త్రాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది. కనుక దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి.
EPH 5:19 స్తుతి గీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ స్తుతిగీతాలు, పాటలు పాడండి.
EPH 5:20 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట తండ్రియైన దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించండి.
EPH 5:21 మీకు క్రీస్తు పట్ల భయభక్తులు ఉన్నాయి. కనుక ఒకరికొకరు లోబడి ఉండండి.
EPH 5:22 స్త్రీలు మీరు ప్రభువుపట్ల విశ్వాసం కనబరచండి. అలాగే మీ భర్తలపట్ల కూడా గౌరవము కనబరుస్తూ జీవించండి.
EPH 5:23 క్రీస్తు సంఘానికి శిరస్సు. సంఘము ఆయనకు శరీరంలాంటిది. ఆయన దాన్ని రక్షిస్తున్నాడు. అదే విధంగా భర్త, భార్యకు శిరస్సులాంటివాడు.
EPH 5:24 సంఘం క్రీస్తుకు విధేయతగా ఉన్నట్లే భార్య తన భర్తకు అన్ని విషయాల్లో విధేయతగా ఉండాలి.
EPH 5:25 క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను అర్పించుకున్నట్లే భర్త తన భార్యను ప్రేమించి తనను అర్పించుకోవటానికి సిద్ధంగా ఉండాలి.
EPH 5:26 క్రీస్తు తన సంఘాన్ని పవిత్రం చేయాలని తనను తాను అర్పించుకున్నాడు. ఆ సంఘాన్ని దేవుని వాక్యమను నీళ్ళతో కడిగాడు; సువార్త సందేశంతో దాన్ని శుద్ధీకరించాడు.
EPH 5:27 దాన్ని తేజోవంతంగా, పవిత్రంగా మరకా మచ్చా లేకుండా, మరే తప్పూ లేకుండా, అపకీర్తి లేకుండా చేసేందుకు ఆ సంఘం కోసం తనకు తానే అర్పించుకొన్నాడు.
EPH 5:28 అదే విధంగా భర్త తన భార్యను తన శరీరంగా భావించి ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తే తనను తాను ప్రేమించుకొన్నదానితో సమానము.
EPH 5:29 సహజంగా ఎవ్వరూ తమ శరీరాన్ని ద్వేషించరు. అందరూ తమ శరీరాన్ని పోషించుకొంటూ రక్షించుకొంటారు.
EPH 5:30 అదే విధంగా మనము క్రీస్తు శరీరంలో భాగాలము. కనుక ఆయన సంఘంగా ఉన్న మనల్ని ఆయన పోషించి రక్షిస్తాడు.
EPH 5:31 “ఈ కారణంగా పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే శరీరంగా జీవిస్తారు.”
EPH 5:32 ఇది గొప్ప రహస్యం. కాని నేను క్రీస్తును గురించి ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను.
EPH 5:33 ఏది ఏమైనా ప్రతి ఒక్కడూ తనను తాను ప్రేమించుకొన్నంతగా తన భార్యను ప్రేమించాలి. భార్య తన భర్తను గౌరవించాలి.
EPH 6:1 బిడ్డలారా! ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఇది మంచిపని,
EPH 6:2 “మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి” అన్న దేవుని ఆజ్ఞ వాగ్దానముతో కూడినవాటిలో మొదటిది.
EPH 6:3 “మీకు శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు.”
EPH 6:4 తండ్రులు తమ పిల్లలకు కోపం కలిగించరాదు. దానికి మారుగా ప్రభువు చెప్పిన మార్గాన్ని వాళ్ళకు బోధించి, అందులో శిక్షణనిచ్చి వాళ్ళను పెంచాలి.
EPH 6:5 బానిసలు తమ యజమానుల పట్ల విధేయతతో ఉండాలి. వాళ్ళకు మనస్ఫూర్తిగా క్రీస్తుకు విధేయులైనట్లు సేవ చెయ్యాలి.
EPH 6:6 వాళ్ళ అభిమానం సంపాదించాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు గమనిస్తున్నప్పుడు మాత్రమే కాక అన్ని వేళలా మీ పనులు మీరు చెయ్యాలి. మీరు క్రీస్తు బానిసలు. కనుక మనస్ఫూర్తిగా దైవేచ్ఛానుసారం చెయ్యండి.
EPH 6:7 సంతోషంగా సేవ చెయ్యండి. మానవుల సేవ చేస్తున్నామని అనుకోకుండా ప్రభువు సేవ చేస్తున్నట్లు భావించండి.
EPH 6:8 ప్రభువు మనిషి చేసిన సేవను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. అతడు బానిస అయినా సరే. లేక యజమాని అయినా సరే. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి.
EPH 6:9 యజమానులు బానిసల పట్ల మంచిగా ఉండాలి. యజమానులు బానిసలను భయపెట్టరాదు. మీ యజమాని, వాళ్ళ యజమాని పరలోకంలో ఉన్నాడు. ఆయన పక్షపాతం చూపడు.
EPH 6:10 చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది.
EPH 6:11 సైతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి.
EPH 6:12 మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు. చీకటిని పాలించే వాళ్ళతో, దానిపై అధికారమున్న వాళ్ళతో, చీకటిలోని శక్తులతో ఆకాశంలో కనిపించని దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాము.
EPH 6:13 కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగంలో మీరు నిలబడగలుగుతారు.
EPH 6:14 కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి.
EPH 6:15 శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి.
EPH 6:16 వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సైతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధంకండి.
EPH 6:17 రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి.
EPH 6:18 ప్రార్థనలు, విన్నపాలు, పరిశుద్ధాత్మ ద్వారా చెయ్యండి. అన్ని వేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. దేవుని ప్రజలకోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ళ కోసం అన్ని వేళలా ప్రార్థించండి.
EPH 6:19 నేను నా నోరు కదల్చినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నాకోసం కూడ ప్రార్థించండి. అప్పుడు నేను దైవసందేశంలో ఉన్న రహస్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాను.
EPH 6:20 సంకెళ్ళలోవున్న నేను ఈ సందేశం బోధించటానికి రాయబారిగా వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి కనుక ఆ ధైర్యం నాలో కలిగేటట్లు నాకోసం ప్రార్థించండి.
EPH 6:21 ప్రభువును విశ్వసిస్తున్న సేవకుడును, మన ప్రియ సోదరుడైన “తుకికు” మీకు అన్నీ చెబుతాడు. అతని ద్వారా మీకు నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తున్నానో తెలుస్తుంది.
EPH 6:22 మేము ఏ విధంగా ఉన్నామో మీరు తెలుసుకోవాలని మరియు అతడు మీకు ప్రోత్సాహం కలిగించాలని అతణ్ణి నేను మీ దగ్గరకు పంపుతున్నాను.
EPH 6:23 సోదరులందరికీ తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి విశ్వాసంతో పాటు శాంతి, ప్రేమ లభించుగాక!
EPH 6:24 మన యేసు క్రీస్తు ప్రభువును ప్రేమించే వాళ్ళకు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ లభించుగాక!
PHI 1:1 యేసు క్రీస్తు సేవకులైన పౌలు మరియు తిమోతియు, యేసు క్రీస్తులో ఐక్యమై, ఫిలిప్పీ పట్టణంలో నివసిస్తున్న పవిత్రులకు, పెద్దలకు, పరిచారకులకు వ్రాయునది ఏమనగా:
PHI 1:2 మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించును గాక!
PHI 1:3 నేను మిమ్మల్ని తలచుకొన్నప్పుడెల్లా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను.
PHI 1:4 కనుక మీకోసం ప్రార్థించినప్పుడెల్లా ఆనందంతో ప్రార్థిస్తాను.
PHI 1:5 దైవసందేశం ప్రచారం చెయ్యటానికి మీరు మొదటి రోజు నుండి ఈ రోజుదాకా నాతో కలిసి పని చేసారు.
PHI 1:6 ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించినవాడు అది పూర్తి అయ్యేదాకా, అంటే యేసు క్రీస్తు వచ్చేదాకా కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది.
PHI 1:7 మీరు నా హృదయంలో ఉన్నారు. కనుక మీ అందర్ని గురించి నేనీవిధంగా ఆలోచించటం సమంజసమే. ఎందుకంటే నేను సంకెళ్ళలో ఉన్నా, లేక సువార్తను ప్రకటిస్తూ దానిలో ఉన్న నిజాన్ని నిరూపిస్తూ, స్వేచ్ఛగా పర్యటన చేస్తున్నా దైవానుగ్రహాన్ని మీరు నాతో కలిసి పంచుకొన్నారు.
PHI 1:8 మీ పట్ల నాకున్న ప్రేమ యేసు క్రీస్తు నుండి వచ్చిందని నేను దైవసాక్షిగా చెపుతున్నాను.
PHI 1:9 ఇదే నా ప్రార్థన: మీ ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, దానితోబాటు మీకు నిజమైన జ్ఞానము, ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకొనే శక్తి కలగాలి.
PHI 1:10 అప్పుడు మీకు మంచి, చెడు విడమరిచే శక్తి కలుగుతుంది. క్రీస్తు వచ్చే వరకు మీరు పవిత్రంగా ఎలాంటి అపవాదులు లేకుండా ఉండగలుగుతారు.
PHI 1:11 మీరు నీతిగా జీవించటంవల్ల ఫలం పొందుతారు. ఆ ఫలం యేసు క్రీస్తు నుండి వచ్చి మీలో నిండిపోతుంది. తద్వారా దేవునికి కీర్తి, స్తుతి కలుగుతుంది.
PHI 1:12 సోదరులారా! నాకు జరిగిన సంఘటనలు దైవసందేశాన్ని ప్రచారం చేయటానికి తోడ్పడుతాయని మీరు గమనించాలి.
PHI 1:13 ఈ సంఘటనలు సంభవించటం వల్ల క్రీస్తు కోసం సంకెళ్ళలో బంధింపబడ్డానని అందరికీ తెలిసిందే. ఇది రాజభవనంలో ఉన్న రక్షకభటులకు కూడా తెలిసిందే.
PHI 1:14 ఈ సంకెళ్ళ మూలంగా, ప్రభువు కారణంగా నా సోదరులైన అనేకులకు దైవసందేశం బోధించటానికి ప్రోత్సాహం కలిగింది. వాళ్ళు ఇంకా ఎక్కువ ధైర్యంతో భయం లేకుండా మాట్లాడగలుగుతున్నారు.
PHI 1:15 కొందరు నాపై అసూయవల్ల పగతో క్రీస్తును గురించి బోధిస్తున్నారు. కాని మరి కొందరు మంచి ఉద్దేశ్యంతో బోధిస్తున్నారు.
PHI 1:16 వీళ్ళు, దైవసందేశాన్ని ప్రకటించటానికి నేనిక్కడ ఉంచబడ్డానని గమనించి ప్రేమతో బోధిస్తున్నారు.
PHI 1:17 మొదట పేర్కొనబడ్డ వాళ్ళు స్వార్థంతో, విశ్వాసహీనులై క్రీస్తును గురించి బోధిస్తున్నారు. ఎందుకంటే నేనిక్కడ సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ కష్టాలు కలిగించాలని వాళ్ళ ఉద్దేశ్యం.
PHI 1:18 దాని వల్ల కలిగేది ఏమీలేదు. ముఖ్యమైన విషయమేమిటంటే సదుద్దేశాలతో అయితేనేమిటి, దురుద్దేశాలతో అయితేనేమిటి క్రీస్తును గురించి బోధింపబడుతోంది. కనుక నాకు ఆనందంగా ఉంది. ఔను నేను యిదే విధంగా ఆనందిస్తూ ఉంటాను.
PHI 1:19 ఎందుకంటే మీ ప్రార్థన వల్ల యేసు క్రీస్తు యొక్క ఆత్మ చేసిన సహాయం వల్ల నేను అనుభవిస్తున్న ఈ కష్టాలే నా విడుదలకు దారితీస్తాయని నాకు తెలుసు.
PHI 1:20 నాకు ఎలాంటి అవమానం కలుగరాదని, నాకు ధైర్యం కలగాలని మనసారా కోరుకొంటున్నాను. ఎప్పటిలాగే యిప్పుడు కూడా క్రీస్తు, నా దేహంలో మహిమ పొందాలని ఆశిస్తున్నాను. ఇది నేను జీవించటంవల్ల సంభవించినా, లేక మరణంవల్ల సంభవించినా నాకు చింత లేదు.
PHI 1:21 ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే.
PHI 1:22 నేను ఈ దేహంతో జీవిస్తే దానివల్ల నా శ్రమకు తగిన ఫలం లభిస్తుంది. అయినా నేను ఏది కోరుకోవాలో నాకే తెలియదు.
PHI 1:23 ఈ రెంటి మధ్య నేను నలిగిపోతున్నాను. ఒక విధంగా చూస్తే ఈ దేహాన్ని వదిలి క్రీస్తు సమక్షంలో ఉండాలని అనిపిస్తోంది. ఇది అన్నిటికన్నా ఉత్తమం.
PHI 1:24 కాని యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో ఉండటం చాలా అవసరం.
PHI 1:25 ఇది నాకు బాగా తెలుసు. అందువల్ల నేను బ్రతికి ఉండి అందరితో కలిసి విశ్వాసం ద్వారా సంభవిస్తున్న మీ అభివృద్ధి కోసం, ఆనందం కోసం పని చేస్తాను.
PHI 1:26 నేను మళ్ళీ మీతో కలిసి జీవించునప్పుడు మీకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత కారణంగా యింకా ఎక్కువ గర్విస్తాను.
PHI 1:27 ఏది ఏమైనా క్రీస్తు సువార్తకు తగిన విధంగా జీవించండి. అప్పుడు నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా, మీరు ఒక ఆత్మగా, ఒక మనిషిగా సువార్త వల్ల సంభవించే విశ్వాసంకోసం పని చేస్తున్నారని నేను వినాలి.
PHI 1:28 మీ శత్రువులకు ఏ మాత్రం భయపడకండి. అన్ని వేళలా ధైర్యంగా ఉండండి. అప్పుడు మీరు గెలుస్తారని, తాము ఓడిపోతామని వాళ్ళకు తెలుస్తుంది. ఇది దేవుడు చేసాడు.
PHI 1:29 ఎందుకంటే, క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం మీకు కూడా దేవుడు కలిగించాడు.
PHI 1:30 గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి విన్నారు. మీరు కూడా ఆ పోరాటాన్ని సాగిస్తున్నారు.
PHI 2:1 క్రీస్తులో ఐక్యత పొందటం వలన మీకు శక్తి కలిగింది కదా! ఆయన ప్రేమ మీకు ఆనందం యిస్తుంది కదా! ఆయన ఆత్మతో మీకు స్నేహం కలిగింది గదా! మీలో దయాదాక్షిణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి కదా!
PHI 2:2 అలాగైతే ఒకే మనస్సుతో, ఒకే ప్రేమలో పాలుపంచుకొంటూ, ఒకే ఆత్మతో, ఒకే ఉద్దేశంతో ఉండి నన్ను పూర్తిగా ఆనందపరచండి.
PHI 2:3 స్వలాభం కోసంగాని, స్వాభిమానం కోసంగాని ఏదీ చేయకండి. వినయంగా ఉండండి. మీరు యితరులకన్నా గొప్ప అని భావించకండి.
PHI 2:4 మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకోకుండా యితరుల అవసరాలను కూడా గమనించండి.
PHI 2:5 యేసు క్రీస్తులో ఉన్న మనస్సును పెంచుకోండి.
PHI 2:6 ఆయన దేవునితో సమానము. అయినా ఆయన ఆ స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు.
PHI 2:7 ఆయన అంతా వదులుకొన్నాడు. మానవ రూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు.
PHI 2:8 మానవుని వలే కనిపిస్తూ, వినయంగా వుంటూ, మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి, సిలువపై మరణించాడు.
PHI 2:9 అందువల్ల దేవుడాయనకు ఉన్నత స్థానం ఇచ్చి అన్ని పేర్లకన్నా ఉత్తమమైన పేరు యిచ్చాడు.
PHI 2:10 యేసు పేరు విన్నప్పుడు పరలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో ఉన్న వాళ్ళంతా ఆయన ముందు మోకరిల్లాలని ఈ విధంగా చేసాడు.
PHI 2:11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు. తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక!
PHI 2:12 నా ప్రియ మిత్రులారా! నేను మీతో ఉన్నప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించలేదు. ప్రస్తుతం నేను మీతో లేను కనుక యిప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని పాటించుచూ మీ స్వంత రక్షణను భయముతోను, వణకుతోనూ, కార్యసాధకము చేయండి.
PHI 2:13 దేవుడు మీలో ఉండి తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవటానికి కావలసిన ఉత్సాహము, శక్తి మీకు యిస్తాడు.
PHI 2:14 మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించకుండా చెయ్యండి.
PHI 2:15 అప్పుడు మీరు నిష్కళంకులై మంచి వాళ్ళుగా ఉంటారు. దుర్మార్గులై నీతి లేకుండా జీవిస్తున్న వీళ్ళ మధ్య ఏ అపరాధమూ చెయ్యని దేవుని బిడ్డల్లా ఉంటారు. మీరు వాళ్ళ మధ్య ఆకాశంలోని నక్షత్రాల్లా ప్రకాశిస్తారు.
PHI 2:16 మీరు జీవంగల దైవసందేశాన్ని ప్రకటిస్తున్నారు. కనుక క్రీస్తు వచ్చిన రోజున మీ విషయంలో గర్వించటానికి నాకు ఆస్కారం ఉంటుంది. నా కృషి, సాధన వ్యర్థం కాలేదని ఋజువౌతుంది.
PHI 2:17 మీ విశ్వాసం వల్ల అర్పిస్తున్న బలికి తోడుగా నా రక్తాన్ని బలిగా ధార పోయవలసివస్తే నేను వెనుకాడను. చాలా ఆనందిస్తాను. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని నా కోరిక.
PHI 2:18 అందువల్ల మీరు కూడా ఆనందించి, మీ ఆనందాన్ని నాతో పంచుకొండి.
PHI 2:19 మిమ్మల్ని గురించి తెలిస్తే నాకు కూడా ఆనందం కలుగుతుంది. కనుక తిమోతిని మీ దగ్గరకు పంపే అవకాశం యేసు ప్రభువు త్వరలో కలిగిస్తాడని నిరీక్షిస్తాను.
PHI 2:20 మీ క్షేమం విషయంలో నిజంగా శ్రద్ధ వహించే వ్యక్తి అతను తప్ప నా దగ్గర మరొకడు లేడు.
PHI 2:21 ప్రతి ఒక్కడూ తన స్వార్థం కోసం ఆలోచిస్తాడే కాని యేసు క్రీస్తును గురంచి ఆలోచించడు.
PHI 2:22 సువార్త ప్రచారం చెయ్యటానికి అతడు నా కుమారునిలా పని చేసాడు. అలా చేసి తన యోగ్యతను ఋజువు చేసుకొన్నాడని మీకు తెలుసు.
PHI 2:23 నా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియగానే అతణ్ణి మీ దగ్గరకు పంపటానికి ఎదురు చూస్తున్నాను.
PHI 2:24 నన్ను కూడా త్వరలో మీ దగ్గరకు పంపుతాడనే నమ్మకం నాకు ప్రభువుపట్ల ఉంది.
PHI 2:25 నాకు సహాయం చెయ్యటానికి మీరు ఎపఫ్రొదితును పంపారు. అతడు మీరు పంపిన దూత. అతణ్ణి తిరిగి మీ దగ్గరకు పంపటం అవసరమని భానిస్తున్నాను. ఎపఫ్రొదితు నాతో కలిసి నా సోదరునివలే పోరాడి, పని చేసాడు.
PHI 2:26 మిమ్మల్ని చూడాలని, మీ దగ్గరకు రావాలని అతడు ఎదురు చూస్తున్నాడు. అతడు జబ్బుతో ఉన్నాడన్న విషయం మీరు విన్నట్లు అతనికి తెలిసి అతడు చాలా చింతిస్తున్నాడు.
PHI 2:27 అతనికి నిజంగా చనిపోయేటంత జబ్బు చేసింది. కాని దేవుని దయ అతనిపై ఉంది. కనుక అతను బ్రతికాడు. దేవుడు అతనికే కాకుండా, నాకు మరొకసారి దుఃఖం కలుగరాదని నాపై కూడా దయచూపాడు.
PHI 2:28 అందువల్ల అతణ్ణి మీ దగ్గరకు పంపాలని ఎదురు చూస్తున్నాను. అతణ్ణి చూసి మీరు ఆనందించాలని నా ఉద్దేశ్యం. అప్పుడు నాకు నిశ్చింతగా ఉంటుంది.
PHI 2:29 కనుక ప్రభువు పేరిట ఆనందంతో అతనికి స్వాగతం చెప్పండి. అలాంటి వాళ్ళను మీరు గౌరవించాలి.
PHI 2:30 మీరు చేయలేని సహాయం తాను చేయాలని అతడు తన ప్రాణం కూడా తెగించాడు. క్రీస్తు అప్పగించిన పని పూర్తిచేయటం కొరకు మరణించటానికి కూడా అతడు సిద్ధమయ్యాడు.
PHI 3:1 సోదరులారా! చివరి మాట, ప్రభువు మీకు కావలసినంత ఆనందం ప్రసాదించుగాక! వ్రాసిన విషయాలే మళ్ళీ వ్రాయటానికి నేను వెనుకాడను. దాని వల్ల మీకు యింకా ఎక్కువ లాభం కలుగుతుంది.
PHI 3:2 దుర్మార్గులైన ఆ కుక్కల విషయంలో శరీరాన్ని ముక్కలు చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
PHI 3:3 మనం దేవుణ్ణి ఆయన ఆత్మ ద్వారా ఆరాధిస్తున్నాము. ఇది నిజమైన సున్నతి. వాళ్ళు పొందిన సున్నతిలాంటిది కాదు. మనము యేసు క్రీస్తులో ఉన్నందుకు గర్విస్తున్నాము. కనుక బాహ్యంగా కనిపించే ఈ ఆచారాలను మనము విశ్వసించము.
PHI 3:4 కాని అలాంటి ఆచారాలను విశ్వసించటానికి నాకు కారణాలు ఉన్నాయి. బాహ్యమైన ఈ ఆచారాలను నమ్మటం ముఖ్యమని యితరులు అనుకొంటున్నట్లైతే వాటిని నమ్మటానికి వాళ్ళకన్నా నాకు ఎక్కువ కారణాలు ఉన్నాయి.
PHI 3:5 నేను పుట్టిన ఎనిమిదవ రోజు నాకు సున్నతి చేసారు. నేను బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. పుట్టుకతో ఇశ్రాయేలు దేశస్థుణ్ణి. హెబ్రీయులకు జన్మించిన హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రాన్ని అనుసరించే పరిసయ్యుణ్ణి.
PHI 3:6 ఉత్సాహంతో సంఘాన్ని హింసించిన వాణ్ణి. ధర్మశాస్త్రాల్లోని నియమాలను పాటించటంలో నేను ఒక్క తప్పు కూడా చేయలేదు.
PHI 3:7 నేను క్రీస్తు విశ్వాసిని అయినందుకు, ఇదివరలో లాభంగా పరగణించిన వాటిని నేను ప్రస్తుతం నష్టంగా పరిగణిస్తున్నాను.
PHI 3:8 అంతేకాక, నా ప్రభువైన యేసు క్రీస్తును తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. ఆయనతో పోల్చి చూస్తే అన్నీ వృధా అనిపిస్తుంది. ఆయన కొరకు నేను అన్నీ వదిలి వచ్చాను. క్రీస్తును పొందాలని వాటిని చెత్తగా పరిగణిస్తున్నాను.
PHI 3:9 ఆయనలో ఐక్యత పొంది ఉండటమే నా ఉద్దేశ్యము. ధర్మశాస్త్రాన్ని అనుసరించి పొందే నీతి నాకు అనవసరం. క్రీస్తులో విశ్వాసం ఉండటంవల్ల లభించే నీతి నాకు కావాలి.
PHI 3:10 నాకు క్రీస్తును తెలుసుకోవాలని ఉంది. చావునుండి బ్రతికి రాగల శక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన పొందిన కష్టాల్లో పాలుపంచుకొని ఆయనతో స్నేహం పొందాలని ఉంది. ఆయనతో మరణించి ఆయనలా అయిపోవాలని ఉంది.
PHI 3:11 ఇవన్నీ చేసి తిరిగి బ్రతికి రావాలని ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా సాధించాలని ఉంది.
PHI 3:12 వీటన్నిటిని నేను యింకా సాధించలేదు. నాలో పరిపూర్ణత యింకా కలుగలేదు. కాని క్రీస్తు దేనికోసం నన్ను ఎన్నుకొన్నాడో దాన్ని నేను చేజిక్కించుకోవాలని పట్టుదలతో సాగిపోతున్నాను.
PHI 3:13 సోదరులారా! అది నాకు చిక్కిందని నేను అనుకోవటం లేదు. కాని ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. గతాన్ని మరచిపోయి భవిష్యత్తులో ఉన్న దానికోసం కష్టపడుతున్నాను.
PHI 3:14 గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు పరుగెత్తుతున్నాను. దేవుడు నేను ఈ గమ్యాన్ని చేరుకోవాలని యేసు క్రీస్తు ద్వారా నన్ను పరలోకం కొరకు పిలిచాడు.
PHI 3:15 ఆత్మీయంగా పరిపూర్ణత పొందిన మనమంతా అన్ని విషయాల్లో యిలాంటి దృక్పథం ఉంచుకోవాలి. ఒకవేళ మీలో ఎవరికైనా దేని మీదనన్నా వేరు అభిప్రాయం ఉంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు.
PHI 3:16 మనం మాత్రం, మనమిదివరలో సాధించిన వాటికి అనుగుణంగా నడుచుకొందాము.
PHI 3:17 సోదరులారా! నావలె జీవించండి. మేము బోధించిన విధానాన్ని అనుసరిస్తున్న వాళ్ళను గమనించండి.
PHI 3:18 నేనిదివరకే ఎన్నో సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కన్నీళ్ళతో చెబుతున్నాను. క్రీస్తు సిలువ పట్ల శత్రుత్వంతో జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
PHI 3:19 వినాశనమే వాళ్ళ గమ్యం. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. అవమానమే వాళ్ళ కీర్తి. వాళ్ళ మనస్సులు ఐహికమైన వాటిపై ఉంటాయి.
PHI 3:20 కాని మన నివాసం పరలోకంలో ఉంది. మనల్ని రక్షించటానికి పరలోకము నుండి రానున్న క్రీస్తు ప్రభువు కోసం మనం ఆశతో ఎదురు చూస్తున్నాము.
PHI 3:21 అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకోగల శక్తి ఆయనలో ఉంది. ఆ శక్తితో ఆయన మన నీచమైన శరీరాలను తన తేజోవంతమైన శరీరంలా ఉండేటట్లు చేస్తాడు.
PHI 4:1 నా ప్రియమైన సోదరులారా! మిమ్మల్ని చూడాలని నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. మీరు నాకు చాలా ఆనందం కలిగించారు. మీ విషయంలో నేను చాలా గర్విస్తుంటాను. ప్రియ మిత్రులారా! ప్రభువును అనుసరించటం మానుకోకండి.
PHI 4:2 యువొదియ, సుంటుకే అనేవాళ్ళు ప్రభువు విశ్వాసులు కనుక వాళ్ళు పరస్పరం ఒక అంగీకారానికి రావాలని అర్థిస్తున్నాను.
PHI 4:3 నిజమైన జత పనివాడా! నీవు నాతో కలిసి పని చేసావు. నీవు నమ్మకంగా పని చేసేవాడవని నాకు తెలుసు. ఈ స్త్రీలకు సహాయం చేయి. దైవసందేశాన్ని ప్రకటించటంలో వీళ్ళు క్లెమెంతుతోను, మరియు మిగతా వాళ్ళతోను కలిసి నా పక్షాన నిలిచారు. ఈ మిగతా వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి.
PHI 4:4 అన్ని వేళలందును మీరు ప్రభువునందు ఆనందించండి, మళ్ళీ చెపుతున్నాను. ప్రభువునందు ఆనందించండి.
PHI 4:5 మీరు దయగల వాళ్ళనే పేరు పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు.
PHI 4:6 ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి. ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞతా హృదయంతో అడగండి.
PHI 4:7 దేవుడు యిచ్చే శాంతిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అది మీ హృదయాలను, మీ బుద్ధిని, యేసు క్రీస్తులో ఉంచి కాపలాకాస్తుంది.
PHI 4:8 కనుక సోదరులారా! నేను చివరకు చెప్పేదేమిటంటే, సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైన వాటిని, పవిత్రమైన వాటిని, ఆనందమైన వాటిని, మెచ్చుకోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్న వాటిని గురించి, ప్రశాంతమైన వాటిని గురించి మీ మనస్సులో ఆలోచించండి.
PHI 4:9 మీరు నా ద్వారా నేర్చుకొన్న వాటిని, నా నుండి పొందిన వాటిని, నా నుండి విన్నవాటిని, నాలో చూసిన వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు శాంతిని కలిగించే దేవుడు మీతో ఉంటాడు.
PHI 4:10 మీకు నా పట్ల ఉన్న అభిమానం మళ్ళీ మొలకెత్తినందుకు నేను ప్రభువు పేరిట చాలా ఆనందిస్తున్నాను. ఔను మీకు నా పట్ల అభిమానం ఉంది కాని, దాన్ని చూపించుకొనే అవకాశం మీకు చిక్కలేదు.
PHI 4:11 నాకు మీ అవసరముందని ఈ విధంగా మాట్లాడటం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా తృప్తిగా ఉండేందుకు నేను నేర్చుకొన్నాను.
PHI 4:12 అవసరంలో ఉండటం అంటే ఏమిటో, అధికంగా కలిగి ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండి ఉండుటను ఆకలితో ఉండుటను, అవసరాలలో ఉన్నప్పుడును అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తికరంగా ఎలా ఉండాలో, దాని రహస్యమేమీటో, నేను తెలుసుకున్నాను.
PHI 4:13 నాకు శక్తినిచ్చే క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను.
PHI 4:14 అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి పని చేసారు.
PHI 4:15 పైగా దైవసందేశాన్ని గురించి మీరు క్రొత్తగా విన్నప్పుడు, ఫిలిప్పీలోవున్న మీరు తప్ప ఎవ్వరూ నాకు సహాయం చెయ్యలేదు. నేను మాసిదోనియ నుండి ప్రయాణం సాగించినప్పుడు ఒక్క సంఘం కూడా నాకు సహాయం చెయ్యలేదు. నాకు వాళ్ళు ఏమీ యివ్వలేదు. నానుండి ఏమీ పుచ్చుకోలేదు.
PHI 4:16 నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా నా అవసరాన్ని బట్టి మీరు నాకు ఎన్నోసార్లు సహాయం చేసారు.
PHI 4:17 నేను మీ నుండి విరాళాలు పొందాలని యిలా మాట్లాడటం లేదు. మీ జీవితం యొక్క లెక్కలకు కొంత లాభం చేకూర్చాలని నా అభిప్రాయం.
PHI 4:18 నాకు కావలసిన దానికన్నా ఎక్కవే చెల్లించారు. మీరు ఎపఫ్రొదితు ద్వారా నాకు పంపిన విరాళాలు నాకు ముట్టాయి. దానితో నా అవసరాలు పూర్తిగా తీరిపోయాయి. సుగంధ పరిమళాల వలే ఉన్న మీ విరాళాలను దేవుడు ఆనందంగా అంగీకరిస్తాడు.
PHI 4:19 నా దేవుడు యేసు క్రీస్తులో ఉన్న గొప్ప ఐశ్వర్యంతో మీ అవసరాలన్నీ తీరుస్తాడు.
PHI 4:20 మన తండ్రియైన దేవునికి చిరకాలపు కీర్తి కలుగుగాక! ఆమేన్.
PHI 4:21 యేసు క్రీస్తులో ఐక్యత పొందిన ప్రతి పవిత్రునికి నా వందనాలు తెలుపండి. నాతో వున్న సోదరులందరూ మీకు వందనాలు తెలుపుతున్నారు.
PHI 4:22 పవిత్రులందరు, ముఖ్యంగా చక్రవర్తి భవనంలో నివసించే వాళ్ళు, మీకు వందనాలు తెలుపుతున్నారు.
PHI 4:23 యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహము మీ ఆత్మకు తోడుగా ఉండుగాక!
COL 1:1 దైవేచ్ఛవల్ల యేసు క్రీస్తు ప్రభువుయొక్క అపొస్తలుడైన పౌలు నుండి, మరియు మన సోదరుడైన తిమోతి నుండి;
COL 1:2 విశ్వాసంతో పరిశుద్ధతలో సోదరులుగా క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న కొలొస్సయి పట్టణంలోని పవిత్రులకు, మన తండ్రియైన దేవుడు మీకు శాంతిని, కృపను ప్రసాదించుగాక!
COL 1:3 మేము మీ గురించి విన్నందుకు మన యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి సర్వదా కృతజ్ఞులము. మేము మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము.
COL 1:4 క్రీస్తు పట్ల మీకున్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసుల పట్ల మీకున్న ప్రేమను గురించి మేము విన్నాము.
COL 1:5 నిజమైన సందేశాన్ని, అంటే సువార్తను మొదటినుండి మీరు విన్నారు. అది రక్షణ కలుగజేస్తుందన్న ఆశ మీలో కలిగింది. మీ విశ్వాసము, ప్రేమ, మీ ఆశపై ఆధారపడి ఉంటాయి. దేవుడు మీ నిరీక్షణను మీకోసం పరలోకంలో భద్రంగా దాచి ఉంచాడు.
COL 1:6 దైవసందేశాన్ని విని, దేవుని అనుగ్రహాన్ని గురించి సంపూర్ణంగా అర్థం చేసుకొన్న నాటినుండి మీరు ఫలం పొందారు. అదే విధంగా యిప్పుడు కూడా దేవుడు తన ఆశీస్సులు అందరికీ ప్రసాదిస్తాడు. సువార్త ప్రపంచమంతా వ్యాపిస్తోంది.
COL 1:7 మీరీ సువార్త “ఎపఫ్రా” ద్వారా విన్నారు. అతడు మాకు ప్రియమైనవాడు. మాతో కలిసి మా పక్షాన విశ్వాసంతో క్రీస్తు సేవ చేస్తున్నవాడు.
COL 1:8 మీకు పరిశుద్ధాత్మ యిచ్చిన ప్రేమను గురించి అతడు మాకు చెప్పాడు.
COL 1:9 ఆత్మీయత జ్ఞానము, తనను గురించిన జ్ఞానము, మీకు ప్రసాదించుమని మిమ్మల్ని గురించి విన్న నాటి నుండి విడువకుండా మీకోసం దేవుణ్ణి ప్రార్థించాము: మీకు “దైవేచ్ఛ”ను తెలుసుకొనే జ్ఞానం కలగాలని మా అభిలాష.
COL 1:10 మీరు ప్రభువు యిచ్ఛానుసారం జీవించాలనీ, అన్ని వేళలా ఆయనకు ఆనందం కలిగించే వాటిని మాత్రమే చేయాలనీ మా అభిలాష. సత్కార్యాలు చేసి ఫలం చూపించండి. దేవుణ్ణి గురించి మీకున్న జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోండి.
COL 1:11 సర్వశక్తి సంపన్నుడైన దేవుడు మీకు శక్తినిచ్చు గాక! అప్పుడు అన్నిటినీ సంతోషంతో భరించగల సహనము మీలో కలుగుతుంది.
COL 1:12 దేవుడు తన వెలుగు రాజ్యంలో, అంటే తన విశ్వాసుల కోసం ప్రత్యేకంగా ఉంచిన దానిలో మీకు భాగం లభించేటట్లు చేసాడు. దానికి మీరు తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉండండి.
COL 1:13 మనల్ని చీకటి రాజ్యం నుండి రక్షించి, తాను ప్రేమించే కుమారుని రాజ్యంలోకి రప్పించాడు.
COL 1:14 కుమారుడు మన పక్షాన మన పాపాల నిమిత్తం తన ప్రాణం చెల్లించాడు. కనుక ఆయన కారణంగా దేవుడు మనల్ని క్షమించాడు.
COL 1:15 క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు.
COL 1:16 క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు. పరలోకంలో ఉన్న వాటిని, భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని, సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, అన్నిటినీ ఆయనే సృష్టించాడు. అన్నీ తన కోసం సృష్టించుకొన్నాడు.
COL 1:17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు. ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి.
COL 1:18 సంఘం ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు. ఆయనే అన్నిటికీ మూలం. చనిపోయి తిరిగి బ్రతికిన వాళ్ళలో ఆయన మొదటివాడు. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు.
COL 1:19 దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు.
COL 1:20 దేవుడు అన్నిటినీ, అంటే భూమ్మీద ఉన్నవాటినీ, పరలోకంలో ఉన్నవాటిని, కుమారుని ద్వారా తిరిగి తనలో చేర్చుకోవాలనుకొన్నాడు. తన కుమారుడు సిలువపై చిందించిన రక్తం ద్వారా ఈ సంధి కలగాలని ఆయన ఉద్దేశ్యం.
COL 1:21 మీ దుష్ప్రవర్తనలవల్ల, మీ మనస్సులో ఉన్న దురాలోచనలవల్ల ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండి, ఆయనకు శత్రువులుగా జీవించారు.
COL 1:22 కాని ప్రస్తుతం తన కుమారుని భౌతిక మరణం ద్వారా మీతో సంధి చేసి, మిమ్మల్ని పవిత్రం చేసి, మిమ్మల్ని నిష్కళంకులుగా, నిరపరాధులుగా తన ముందు నిలబెట్టుకోవాలని ఆయన ఉద్దేశ్యం.
COL 1:23 మీరు విన్న సువార్త వలన రక్షణ కలుగుతుందన్న ఆశ మీలో కలిగింది. దాన్ని పోగొట్టుకోకుండా, ధృఢంగా స్థిరంగా ఆయన్ని విశ్వసిస్తూ ఉంటేనే అది సంభవిస్తుంది. మీరు విన్న ఈ సువార్త ఆకాశం క్రింద ఉన్న ప్రతీ జీవికి ప్రకటింప బడింది. నేను ఈ సందేశానికి సేవకుణ్ణి అయ్యాను.
COL 1:24 మీ కొరకు నేను కష్టాలు అనుభవించినందుకు యిప్పుడు నాకు ఆనందం కలుగుతోంది. ఎందుకంటే క్రీస్తు సంఘం అనబడే తన శరీరం ద్వారా అనుభవించవలసిన కష్టాలు నా దేహం అనుభవించి పూర్తి చేస్తోంది.
COL 1:25 తన సందేశాన్ని మీకు సంపూర్ణంగా ఉపదేశించుమని దేవుడు నన్ను నియమించాడు. తత్కారణంగా నేను క్రీస్తు సంఘానికి సేవకుణ్ణి అయ్యాను.
COL 1:26 యుగయుగాలనుండి, తరతరాలనుండి రహస్యంగా దాచబడిన ఈ దైవసందేశం ప్రస్తుతం భక్తులకు చెప్పబడింది.
COL 1:27 భక్తులకు ఈ రహస్యంలోని గొప్ప మహత్యాన్ని తెలియచేసి, యూదులుకాని వాళ్ళకు చూపాలని ఆయన ఉద్దేశ్యం. మీలో ఉన్న “క్రీస్తే” ఆ రహస్యం. ఆయన వల్ల మహిమను తప్పక పొందుతామనే ఆశ మనలో ఉంది.
COL 1:28 ఆయన్ని గురించి మేము ప్రకటిస్తున్నాము. మాలో ఉన్న జ్ఞానాన్నంతా ఉపయోగించి ప్రతి ఒక్కరికీ బోధిస్తున్నాము. సలహాలిస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరినీ క్రీస్తు ద్వారా దేవుని ముందు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత పొందిన వాళ్ళలా నిలబెట్టాలని మా ఉద్దేశ్యము.
COL 1:29 దీన్ని సాధించటానికి నేను నా శక్తినంతా ఉపయోగించి కష్టపడి పని చేస్తున్నాను. నాలో ఉన్న ఈ బలవత్తరమైన శక్తి క్రీస్తు నాలో ఉండి పని చేయటం వల్ల కలుగుతోంది.
COL 2:1 మీకోసం, లవొదికయలో ఉన్న వాళ్ళకోసం, నన్ను ఇంతవరకూ కలుసుకోకుండా వున్న వాళ్ళకోసం నేను ఎంత శ్రమిస్తున్నానో మీరు గ్రహించాలని నా కోరిక.
COL 2:2 మీ హృదయాలు ధైర్యంతో నిండిపోవాలనీ, ప్రేమతో మీరు ఐక్యము కావాలనీ నా అభిలాష. అప్పుడు మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. అదే ఒక సంపద. ఈ విధంగా మీరు దేవుణ్ణి గురించి, అంటే క్రీస్తును గురించి, రహస్య జ్ఞానం పొందుతారు.
COL 2:3 క్రీస్తులో వివేకము, జ్ఞానము అనే సంపదలు దాగి ఉన్నాయి.
COL 2:4 తియ్యటి మాటలతో మిమ్మల్నెవ్వరూ మోసం చెయ్యకుండా ఉండాలని మీకీ విషయాలు చెబుతున్నాను.
COL 2:5 నేను శరీరంతో అక్కడ మీ దగ్గర లేకపోయినా నా ఆత్మ మీ దగ్గరే ఉంది. మీ క్రమశిక్షణను, క్రీస్తు పట్ల మీకున్న సంపూర్ణ విశ్వాసాన్ని చూసి నా ఆత్మ ఆనందిస్తోంది.
COL 2:6 మీరు యేసు క్రీస్తును ప్రభువుగా స్వీకరించినట్లే ఆయనలో ఐక్యమై జీవించండి.
COL 2:7 మీ వేర్లు ఆయనలో నాటి, ఆయనలో అభివృద్ధి చెందుతూ జీవించండి. మీకు ఉపదేశించిన విధంగా సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. మీ కృతజ్ఞత పొంగిపోవాలి.
COL 2:8 మోసంతో, పనికిరాని తత్వజ్ఞానంతో మిమ్మల్ని ఎవ్వరూ బంధించకుండా జాగ్రత్త పడండి. వాళ్ళ తత్వజ్ఞానానికి మూలం క్రీస్తు కాదు. దానికి మానవుని సాంప్రదాయాలు, అతని నైజంవల్ల కలిగిన నియమాలు కారణం.
COL 2:9 ఎందుకంటే, దేవుని ప్రకృతి క్రీస్తులో సంపూర్ణంగా మానవ రూపంతో జీవిస్తోంది.
COL 2:10 మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీకు ఆ సంపూర్ణత లభించింది. క్రీస్తు అన్ని శక్తులకూ, అన్ని అధికారాలకూ అధిపతి.
COL 2:11 ఆయనతో మీకు కలిగిన ఐక్యతవల్ల మీరు సున్నతి పొందారు. ఈ సున్నతి మానవులు చేసింది కాదు. ఇది క్రీస్తు స్వయంగా చేసిన సున్నతి. పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి విముక్తి పొందటమే ఈ సున్నతి.
COL 2:12 మీరు బాప్తిస్మము పొందటంవల్ల క్రీస్తులో సమాధి పొందారు. క్రీస్తును బ్రతికించిన దేవుని శక్తి పట్ల మీకున్న విశ్వాసం వలన మిమ్మల్ని కూడా దేవుడు ఆయనతో సహా బ్రతికించాడు. అంటే బాప్తిస్మము వల్ల యిది కూడా సంభవించింది.
COL 2:13 మీరు చేసిన పాపాలవల్ల, పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి స్వేచ్ఛ పొందకుండా మీరు గతంలో ఆత్మీయంగా మరణించారు. కాని దేవుడు మీ పాపాలన్నిటినీ క్షమించి క్రీస్తుతో సహా మిమ్మల్ని బ్రతికించాడు.
COL 2:14 ఆ పద్ధతులను గురించి, నియమాలను గురించి మనం వ్రాత మూలంగా అంగీకరించిన పత్రాన్ని, అది మనకు వ్యతిరేకంగా ఉంది కనుక, ఆయన దానిని తీసుకెళ్ళి మేకులతో సిలువకు కొట్టాడు.
COL 2:15 అధికారాలను, శక్తుల్ని పనికి రాకుండా చేసి వాటిని బహిరంగంగా హేళన చేసి, సిలువతో వాటిపై విజయం సాధించాడు.
COL 2:16 అందువల్ల అన్నపానాల విషయంలో గాని, మత సంబంధమైన పండుగ విషయాల్లో గాని, అమావాస్య పండుగ విషయంలో గాని, యూదుల విశ్రాంతి రోజు విషయంలో కాని యితరులు మీపై తీర్పు చెప్పకుండా జాగ్రత్తపడండి.
COL 2:17 ఇవి నీడలా రానున్న వాటిని సూచిస్తున్నాయి. కాని సత్యం క్రీస్తులో ఉంది.
COL 2:18 కొందరు తాము దివ్యదర్శనం చూసామని, కనుక తాము గొప్ప అని చెప్పుకొంటారు. అతి వినయం చూపుతూ దేవదూతల్ని పూజిస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని అయోగ్యులుగా పరిగణించకుండా జాగ్రత్త పడండి. వాళ్ళు ప్రాపంచిక దృష్టితో ఆలోచిస్తారు. కనుక, నిష్కారణంగా గర్విస్తూవుంటారు.
COL 2:19 శిరస్సు కారణంగా కీళ్ళు, నరాలు దేహాన్ని ఒకటిగా ఉంచి ఆ దేహానికి శక్తిని కలిగిస్తున్నాయి. శిరస్సు కారణంగా దేవుని ఆదేశానుసారం ఆ దేహం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటి శిరస్సుతో వాళ్ళు సంబంధం తెంచుకొన్నారు.
COL 2:20 మీరు క్రీస్తుతో మరణించినప్పుడే ఈ ప్రపంచం యొక్క ప్రాథమిక నియమాల నుండి స్వేచ్ఛను పొందారు. మరి అలాంటప్పుడు ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళైనట్లు ఆ ప్రాథమిక నియమాలను ఎందుకు పాటిస్తున్నారు:
COL 2:21 “ఇది వాడకు, దాన్ని రుచి చూడకు, ఇది ముట్టుకోకు”
COL 2:22 ఈ నియమాలు మానవుల ఆజ్ఞలతో, బోధనలతో సృష్టింపబడినవి కనుక అవి వాడుక వల్ల నశించిపోయే వస్తువులలాంటివి.
COL 2:23 ఇలాంటి నియమాలు పైకి తెలివైనవిగా కనిపిస్తాయి. అవి దొంగపూజలకు, దొంగవినయం చూపటానికి, దేహాన్ని అనవసరంగా, కఠినంగా శిక్షించటానికి ఉపయోగపడవచ్చు. కాని శారీరక వాంఛల్ని అదుపులో పెట్టుకోవటానికి పనికి రావు.
COL 3:1 మీరు క్రీస్తుతో కూడా సజీవంగా లేచి వచ్చారు. ఆయన పరలోకంలో దేవుని కుడిచేతి వైపు కూర్చొని ఉన్నాడు. కనుక పరలోకంలో ఉన్నవాటిని ఆశించండి.
COL 3:2 మీరు మరణించారు. ఇప్పుడు మీ ప్రాణం క్రీస్తుతో సహా దేవునిలో దాగి ఉంది. కనుక భూమ్మీద ఉన్న వాటిని కాకుండా పరలోకంలో ఉన్న వాటిని గురించి ఆలోచించండి.
COL 3:4 క్రీస్తు మీ నిజమైన ప్రాణం. ఆయన వచ్చినప్పుడు మీరాయనతో సహా దేవుని మహిమలో భాగం పంచుకొంటారు.
COL 3:5 మీరు మీ భౌతిక వాంఛల్ని చంపుకోవాలి. అంటే, వ్యభిచారము, అపవిత్రత, మోహము, దురాశ, అత్యాశ, ఇవి ఒక విధమైన విగ్రహారాధన కనుక, వీటన్నిటినీ వదులుకోవాలి.
COL 3:6 వీటివల్ల దేవునికి కోపం వస్తుంది.
COL 3:7 మీ గత జీవితంలో ఈ గుణాలు మీలో ఉన్నాయి.
COL 3:8 కాని యిక మీరు ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్టత్వాన్ని వదులుకోవాలి. ఇతరులను దూషించరాదు. బూతులు మాటలాడరాదు.
COL 3:9 మీరు మీ పాత స్వభావాల్ని, పద్ధతుల్ని వదిలి వేసారు, కనుక అసత్యములాడరాదు.
COL 3:10 మీరు క్రొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతిరూపంలో మలుస్తూ, తనను గురించిన జ్ఞానాన్ని మీలో అభివృద్ధి పరుస్తున్నాడు.
COL 3:11 ఇక్కడ గ్రీకు దేశస్థునికి, యూదునికి భేదం లేదు. సున్నతి పొందిన వానికి, పొందనివానికి భేదంలేదు. విదేశీయునికి సిథియనుడికి భేదం లేదు. బానిసకు, బానిసకాని వానికి భేదం లేదు. క్రీస్తే సర్వము. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు.
COL 3:12 మీరు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళు. ఆయన ప్రేమిస్తున్న పవిత్రులు. అందువల్ల మీరు సానుభూతి, దయ, వినయము, సాత్వికము, సహనము అలవర్చుకోవాలి.
COL 3:13 మీలో ఎవడైనా మీకు అన్యాయం చేసినవాడనిపిస్తే కోపగించుకోకుండా అతణ్ణి క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి.
COL 3:14 అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమను అలవర్చుకోండి. అది సంపూర్ణమైన బంధాన్ని, పరిపూర్ణమైన ఐక్యతను కలుగ చేస్తుంది.
COL 3:15 క్రీస్తు కలుగచేసిన శాంతిని మీ హృదయాలను పాలించనివ్వండి. మీరు ఒకే శరీరంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీలో శాంతి కలుగచేయాలని ఆయన ఉద్దేశ్యం. కృతజ్ఞతతో ఉండండి.
COL 3:16 క్రీస్తు సందేశాన్ని మీలో సంపూర్ణంగా జీవించనివ్వండి. మీ తెలివినంతా ఉపయోగించి పరస్పరం సహాయం చేసుకోండి. దైవసందేశాన్ని బోధించుకోండి. దేవునికి మీ హృదయాల్లో కృతజ్ఞతలు తెలుపుకొంటూ స్తుతిగీతాలు, కీర్తనలు పాడుకోండి. వాక్యాలు చదవండి.
COL 3:17 మాటద్వారా కాని, క్రియా రూపంగా కాని మీరేది చేసినా యేసు ప్రభువు పేరిట చెయ్యండి. ఆయన ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతతో ఉండండి.
COL 3:18 స్త్రీలు తమ భర్తలకు విధేయులై ఉండాలి. ఇది ప్రభువును బట్టి విశ్వాసులు చేయవలసిన విధి.
COL 3:19 పురుషులు తమ భార్యలను ప్రేమించాలి. వాళ్ళతో కఠినంగా ప్రవర్తించరాదు.
COL 3:20 పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల అన్ని విషయాల్లో విధేయతతో ఉండాలి. అప్పుడు వాళ్ళను ప్రభువు మెచ్చుకొంటాడు.
COL 3:21 తండ్రులు తమ పిల్లలకు చిరాకు కలిగించరాదు. అలా చేస్తే వాళ్ళకు నిరుత్సాహం కలుగుతుంది.
COL 3:22 బానిసలు తమ యజమానుల పట్ల అన్ని విషయాల్లో విధేయతతో ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నప్పుడే కాకుండా, వాళ్ళ అభిమానం సంపాదించటానికి మాత్రమే కాకుండా, మీకు ప్రభువు పట్ల ఉన్న విశ్వాసం కారణంగా మనస్ఫూర్తిగా పని చేయాలి.
COL 3:23 అలా చేసేది మనస్ఫూర్తిగా చేయండి. ఎందుకంటే మీరు సేవ చేస్తున్నది క్రీస్తు ప్రభువు కోసం.
COL 3:24 మీరు ప్రభువుకు దాసులని మీకు తెలుసు. కనుక ఏది చేసినా అది మానవుల కోసమే కాకుండా ప్రభువు కోసం కూడా చేయండి.
COL 3:25 తప్పు చేసిన వాడు ఆ తప్పుకు తగిన శిక్ష అనుభవించాలి. దేవుడు పక్షపాతం చూపకుండా తీర్పు చెబుతాడు.
COL 4:1 యజమానులు తమ సేవకుల పట్ల మంచిగా, న్యాయంగా ఉండాలి. మీకు కూడా పరలోకంలో ఒక యజమాని ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకోండి.
COL 4:2 మనస్సు నిమగ్నం చేసి, భక్తితో దేవుణ్ణి ప్రార్థించండి. దేవునికి మీ కృతజ్ఞత తెలుపుకోండి.
COL 4:3 మా సందేశానికి దేవుడు దారి చూపాలని, ఆయన క్రీస్తును గురించి తెలియ చేసిన రహస్య సత్యాన్ని మేము ప్రకటించగలగాలని మాకోసం కూడా ప్రార్థించండి. నేను దాని కోసమే సంకెళ్ళలో ఉన్నాను.
COL 4:4 నేను ఆ సందేశాన్ని స్పష్టంగా, యితరులకు అర్థమయ్యేలా ప్రకటించగలగాలని కూడా ప్రార్థించండి. ఇది నా కర్తవ్యం.
COL 4:5 అవిశ్వాసులతో తెలివిగా ప్రవర్తించండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి.
COL 4:6 మీరు మర్యాదగా, తెలివిగా మాట్లాడాలి. మీ మాటలు అందరి ప్రశ్నలకు సమాధానం యిచ్చేటట్లు ఉండాలి.
COL 4:7 “తుకికు” నా గురించి అన్ని విషయాలు మీకు చెప్పుతాడు. అతడు విశ్వాసం గల పరిచారకుడు. ప్రభువు సేవ చేయటంలో నా సహచరుడు.
COL 4:8 మా పరిస్థితులు మీకు తెలియాలనీ, అతడు మీ మనస్సుకు శాంతి కలిగించాలనే ముఖ్యోద్దేశంతో అతణ్ణి మీ దగ్గరకు పంపుతున్నాను.
COL 4:9 మనకు ప్రియ సోదరుడు, విశ్వాసం కలవాడు అయినటువంటి ఒనేసిముతో కలిసి అతడు వస్తున్నాడు. “ఒనేసిము” మీ వద్దనుండి వచ్చినవాడే. ఇక్కడ జరుగుతున్నవన్నీ వాళ్ళు చెబుతారు.
COL 4:10 నాతో కారాగారంలో ఉన్న “అరిస్తార్కు”, “మార్కు” మీకు వందనములు తెలుపుతున్నారు. మార్కు బర్నబాకు మేనల్లుడు. మార్కు కోసం మీరు చేయవలసిన వాటిని గురించి యిదివరకే చెప్పాను. అతడక్కడికి వస్తే అతనికి స్వాగతం చెప్పండి.
COL 4:11 “యూస్తు” అని పిలువబడే యేసు కూడా మీకు వందనములు చెప్పమన్నాడు. దేవుని రాజ్యం కొరకు నాతో కలిసి పని చేస్తున్న వాళ్ళలో ఈ ముగ్గురు మాత్రమే యూదా మతము నుండి మనలో చేరిన వారు. నా ఈ కృషిలో వాళ్ళు నాకు చాలా ఆదరణగా ఉన్నారు.
COL 4:12 మీలో ఒకడైన “ఎపఫ్రా” మీకు వందనములు తెలుపుతున్నాడు. ఇతడు యేసు క్రీస్తు సేవకుడు. మీకు దైవేచ్ఛపై పూర్తిగా విశ్వాసం ఉండాలనీ మీరు ఆత్మీయంగా పరిపూర్ణత పొందాలనీ, మీ కొరకు అతడు దేవుణ్ణి పట్టుదలతో ప్రార్థిస్తూ ఉన్నాడు.
COL 4:13 ఇతడు మీకోసం “లవొదికయ” “హియెరాపొలి” గ్రామాలలోని వాళ్ళ కోసం కష్టపడి పని చేస్తున్నాడని నేను గట్టిగా చెప్పగలను.
COL 4:14 మన ప్రియమిత్రుడు, వైద్యుడైన “లూకా” మరియు “దేమాయు” మీకు వందనములు చెపుతున్నారు.
COL 4:15 లవొదికయలోని సోదరులకు, “నుంఫా”కు, ఆమె యింట్లోని క్రీస్తు సంఘానికి నా శుభాకాంక్షలు.
COL 4:16 ఈ లేఖను మీ సంఘంలో చదివాక, లవొదికయలోనున్న సంఘంలో కూడా చదివేటట్లు చూడండి. ఆ తర్వాత లవొదికయ నుండి వచ్చిన లేఖను మీ సంఘంలో చదవండి.
COL 4:17 ప్రభువు అప్పగించిన కార్యాన్ని పూర్తి చెయ్యుమని “అర్ఖిప్పు”తో చెప్పండి.
COL 4:18 ఈ శుభాకాంక్షలు పౌలను నేను స్వయంగా నా చేతులతో వ్రాస్తున్నాను. నా “సంకెళ్ళను” జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని యొక్క అనుగ్రహం మీపై ఉండుగాక!
1TH 1:1 మన తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీక పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు, సిల్వాను మరియు తిమోతి వ్రాయటమేమనగా, మీకు దైవానుగ్రహము, శాంతి లభించుగాక!
1TH 1:2 మేము మీకోసం ప్రార్థిస్తూ మీరు మా సోదరులైనందుకు మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉన్నాము.
1TH 1:3 విశ్వాసంవల్ల మీరు సాధించిన కార్యాన్ని గురించి, ప్రేమ కోసం మీరు చేసిన కార్యాల్ని గురించి యేసు క్రీస్తు ప్రభువులో మీకున్న ధృఢవిశ్వాసం వల్ల మీరు చూపిన సహనాన్ని గురించి విన్నాము. దానికి తండ్రియైన దేవునికి మేము అన్ని వేళలా కృతజ్ఞులము.
1TH 1:4 సోదరులారా! దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకొన్నాడని మాకు తెలుసు.
1TH 1:5 ఎందుకంటే, మేము సువార్తను మీకు ఒట్టి మాటలతో బోధించలేదు. శక్తితో, పరిశుద్ధాత్మతో, గట్టి నమ్మకంతో బోధించాము. మేము మీకోసం మీతో కలిసి ఏ విధంగా జీవించామో మీకు తెలుసు.
1TH 1:6 మీరు మమ్మల్ని, ప్రభువును అనుసరించారు. మీకు కష్టం కలిగినా పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంతో సందేశాన్ని అంగీకరించారు.
1TH 1:7 కనుక మాసిదోనియ, అకయ పట్టణాలలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. ఆ పట్టణాలలో మీ ద్వారా ప్రభువు సందేశం ప్రచారమైంది.
1TH 1:8 దేవుని పట్ల మీకున్న విశ్వాసం, ఆ పట్టణాలలోనే కాక, ప్రతి చోటా తెలిసింది. దాన్ని గురించి మేమేమీ చెప్పనవసరం లేదు.
1TH 1:9 మీరు మాకెలాంటి స్వాగతమిచ్చారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. అంతేకాక, సజీవమైన నిజమైన దేవున్ని పూజించటానికి మీరు విగ్రహారాధనను వదిలి నిజమైన దేవుని వైపుకు ఏ విధంగా మళ్ళారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు.
1TH 1:10 పరలోకంలో నుండి రానున్న దేవుని కూమారుడైన యేసు కొరకు మీరు ఏ విధంగా కాచుకొని ఉన్నారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. దేవునిచే సజీవంగా లేపబడిన ఈ యేసు రానున్న ఆగ్రహం నుండి మనల్ని రక్షిస్తాడు.
1TH 2:1 సోదరులారా! మేము మీ దగ్గరకు రావటంవల్ల లాభం కలుగకపోలేదు. ఇది మీకు తెలుసు.
1TH 2:2 మేము యిదివరలో కష్టాలు అనుభవించిన విషయము, ఫిలిప్పీలో అవమానాలు భరించిన విషయము మీకు తెలుసు. మాకు అనేక ఆటంకాలు కలిగినా మేము మా దేవుని సహాయంతో యేసు సువార్తను మీకు బోధించటానికి ధైర్యం చేసాము.
1TH 2:3 మేము తప్పుగా బోధించలేదు. లేక దురుద్దేశ్యాలతో బోధించలేదు. మేము మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేయటంలేదు.
1TH 2:4 దేవుడు మా యోగ్యతను గమనించి మాకు సువార్తను అప్పగించాడు. మా హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నాము కాని, మానవుల్ని కాదు.
1TH 2:5 మేము పొగడ్తలు ఉపయోగించలేదని మీకు తెలుసు. స్వార్థానికోసం మేము దొంగవేషాలు వేయలేదు. దీనికి దేవుడే సాక్షి.
1TH 2:6 మీ పొగడ్తలు కాని, లేక ఇతర్ల పొగడ్తలు కాని మాకు అవసరం లేదు.
1TH 2:7 క్రీస్తు అపొస్తలులముగా మేము మా భారం మీపై మోపగల్గినా అలా చేయలేదు. తల్లి తన పిల్లల్ని చూసుకొన్నట్టు మిమ్మల్ని చూసుకొని మీ పట్ల దయతో ఉండినాము.
1TH 2:8 మేము మిమ్మల్ని మనసారా ప్రేమించాము. తద్వారా మీరు మాకు సన్నిహితులయ్యారు. దానితో సువార్తే కాకుండా, మా జీవితాలను కూడా మీతో పంచుకొన్నాము.
1TH 2:9 సోదరులారా! మా శ్రమ, కష్టము మీకు తప్పక జ్ఞాపకం ఉండి ఉండవచ్చును. మేము దేవుని సువార్తను మీకు ప్రకటించినప్పుడు మేము మీకు భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు పని చేసాము.
1TH 2:10 విశ్వాసులైన మీ మధ్య మేము ఎంతో పవిత్రంగా, నీతిగా, అపకీర్తి లేకుండా జీవించాము. దీనికి మీరే సాక్షులు. దేవుడు కూడా దీనికి సాక్షి.
1TH 2:11 మేము మీ అందరితో, తండ్రి తన పిల్లలతో ఏ ధంగా ఉంటాడో ఆ విధంగా ఉన్నాము.
1TH 2:12 మీకు ఆధ్యాత్మిక శక్తినిస్తూ, మిమ్మల్ని ఓదారుస్తూ, తన రాజ్యంలోకి ఆహ్వానించి, తన మహిమలో మీకు భాగం యిచ్చే దేవుని మెప్పు పొందేటట్లు మిమ్మల్ని జీవించుమని చెప్పాము.
1TH 2:13 దైవసందేశాన్ని మీరు మా నుండి విని దాన్ని మానవుల సందేశంలా కాకుండా, దైవసందేశంలా అంగీకరించారు. ఇలా జరిగినందుకు మేము దేవునికి సర్వదా కృతజ్ఞులము. అది నిజంగా దైవసందేశము. అది భక్తులైన మీలో పని చేస్తోంది.
1TH 2:14 సోదరులారా! యేసు క్రీస్తులో ఐక్యత పొందిన యూదయలోని దేవుని సంఘాలవలే మీరు కూడా కష్టాలు అనుభవించారు. యూదుల వల్ల ఆ సంఘాలు అనుభవించిన కష్టాలే మీరు మీ ప్రజలవల్ల అనుభవించారు.
1TH 2:15 ఆ యూదులు యేసు ప్రభువును, ప్రవక్తలను చంపారు. మిమ్మల్ని తరిమివేసారు. వాళ్ళు దేవుణ్ణి దుఃఖపెట్టారు. మానవులందరికి శత్రువులై జీవించారు.
1TH 2:16 రక్షణ కలిగించే సందేశాన్ని యూదులుకాని వాళ్ళకు చెప్పనీయకుండా మమ్మల్ని అడ్డగించారు. ఈ విధంగా చేసి తమ పాపాలను అంతులేకుండా పెంచుకొంటూ పోయారు. చివరకు దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చింది.
1TH 2:17 సోదరులారా! కొద్దికాలం మేము మీ నుండి దూరంగా ఉండవలసి వచ్చింది. మా శరీరాలు మాత్రమే మీ నుండి దూరంగా ఉన్నాయి. కాని మా మనసులు కాదు. మిమ్మల్ని చూడాలని మా మనస్సుల్లో చాలా ఉంది. కనుక మేము ఎన్నో విధాల ప్రయత్నించాము.
1TH 2:18 మాకు మీ దగ్గరకు రావాలని ఉంది. పౌలునైన నేను ఎన్నోసార్లు రావటానికి ప్రయత్నం చేసాను. కాని సైతాను మమ్మల్ని అడ్డగించాడు.
1TH 2:19 ఎందుకంటే మా ఆశలు మీ మీద పెట్టుకున్నాము. మా ఆనందం మీరే. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో గర్వించటానికి కిరీటం మీరే కదా!
1TH 2:20 మాకు కీర్తి లభించటానికి నిజంగా మీరే కారణం. మీరే మా ఆనందం.
1TH 3:1 మేము మీ దగ్గరకు రావాలని ఎంతో ప్రయత్నించి రాలేకపోయాము.
1TH 3:2 అందుచేత తిమోతిని పంపించి మేము ఏధెన్సులో ఉండి పొయ్యాము. కనుక దేవుని సేవ చేయటంలో మరియు క్రీస్తును గురించి సువార్త ప్రచారం చేయటంలో మాతో కలిసి పనిచేసిన మా సోదరుడు తిమోతిని ప్రోత్సాహ బలం కోసం మీ దగ్గరకు పంపాము.
1TH 3:3 ఈ హింసల కారణంగా మీలో ఎవ్వరూ వెనుకంజ వేయరాదని మా ఉద్దేశ్యము. ఈ హింసలను అనుభవించటం మన విధి అని మీకు బాగా తెలుసు.
1TH 3:4 నిజానికి, మేము మీతో ఉన్నప్పుడే మనము ఈ హింసల్ని అనుభవించవలసి వస్తుందని మీకు చెప్పాము. మేము అన్నట్టుగానే జరిగింది. మీరు గమనించే ఉంటారు.
1TH 3:5 ఆ కారణంగా నేనిక ఓపికతో ఉండలేక మీ విశ్వాసాన్ని గురించి తెలుసుకోవటానికి అతణ్ణి పంపాను. ఏదో ఒక విధంగా సైతాను మిమ్మల్ని శోధిస్తాడని, నా శ్రమ వృధా అయిపోయిందని భయపడ్డాను.
1TH 3:6 కాని తిమోతి మీ దగ్గర నుండి యిప్పుడే వచ్చాడు. మీ విశ్వాసాన్ని గురించి, మీ ప్రేమను గురించి మంచి వార్త తీసుకొని వచ్చాడు. మమ్మల్ని గురించి అన్ని వేళలా మీరు మంచిగా భావిస్తున్నారని తెలిసింది. మేము మిమ్మల్ని చూడటానికి ఎదురు చూస్తున్నట్లే, మీరు కూడా మమ్మల్ని చూడటానికి ఆశిస్తున్నారని అతడు మాకు చెప్పాడు.
1TH 3:7 సోదరులారా! మేము దుఃఖంతో ఉన్నప్పుడు, హింసలను అనుభవిస్తున్నప్పుడు మీ విశ్వాసం చూసి ఆనందించాము.
1TH 3:8 మీకు ప్రభువు పట్ల ఉన్న విశ్వాసాన్ని మీరు విడువకుండా ఉంటే మా జీవితం సార్థకమౌతుంది.
1TH 3:9 మేము దేవుని సమక్షంలో ఉన్నప్పుడు మీ విషయంలో చాలా కృతజ్ఞులము. మేము ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అవి తక్కువే!
1TH 3:10 మిమ్మల్ని చూసే అవకాశం కలగాలని, మీ విశ్వాసం దృఢపడాలని, దానికి కావలసినవి దేవుడు ఇవ్వాలని, రాత్రింబగళ్ళు మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము.
1TH 3:11 మన తండ్రియైన దేవుడు, మన ప్రభువైన యేసు మేము మీ దగ్గరకు రావటానికి మాకు దారి చూపుగాక!
1TH 3:12 మీపై ఉన్న మా ప్రేమ అభివృద్ధి చెందుతున్నట్లే, మీలో పరస్పరం ప్రేమ అభివృద్ధి చెందేటట్లు, యితరుల పట్ల కూడా మీ ప్రేమ అభివృద్ధి చెందేటట్లు ప్రభువు అనుగ్రహించుగాక.
1TH 3:13 మన యేసు ప్రభువు భక్తులతో వచ్చినప్పుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు ఏ అపకీర్తి లేకుండా పవిత్రంగా ఉండేటట్లు దేవుడు మీకు శక్తి ననుగ్రహించు గాక!
1TH 4:1 సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే దేవుని మెప్పు పొందటానికి ఏ విధంగా జీవించాలో మేము మీకు బోధించాము. మీరు మేము చెప్పినట్లు జీవిస్తున్నారు. కాని మేము ప్రస్తుతం యేసు ప్రభువు పేరిట మిమ్మల్ని అడిగేదేమిటంటే మీరు ఆ జీవితాన్ని యింకా సంపూర్ణంగా జీవించాలి. ఇది మా విజ్ఞప్తి.
1TH 4:2 యేసు ప్రభువు యిచ్చిన అధికారంతో మేము చెప్పిన ఉపదేశాలు మీకు తెలుసు.
1TH 4:3 మీరు పవిత్రంగా ఉంటూ వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి. ఇది దేవుని యిచ్ఛ.
1TH 4:4 మీరు పవిత్రంగా, గౌరవప్రదంగా జీవించాలి. మీ దేహాలను మీరు అదుపులో పెట్టుకోవాలి.
1TH 4:5 పవిత్రులు కాని వాళ్ళు లైంగిక వాంఛలతో బ్రతుకుతూ ఉంటారు. ఆ విధంగా మీరు జీవించకూడదు.
1TH 4:6 ఈ విషయంలో ఎవరూ తమ సోదరుల్ని మోసం చేయరాదు. వాళ్ళను తమ లాభానికి ఉపయోగించుకోరాదు. అలాంటి పాపం చేసిన వాళ్ళను ప్రభువు శిక్షిస్తాడు. మేము దీన్ని గురించి ముందే చెప్పి వారించాము.
1TH 4:7 దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రంగా ఉండేందుకు కాదు. పవిత్రంగా జీవించేందుకు పిలిచాడు.
1TH 4:8 అందువల్ల ఈ ఉపదేశాన్ని తృణీకరించిన వాడు మానవుణ్ణి కాదు, తన పరిశుద్ధాత్మనిచ్చిన దేవుణ్ణి తృణీకరించిన వాడౌతాడు.
1TH 4:9 సోదర ప్రేమను గురించి మేము వ్రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరస్పరం ప్రేమించుకొనుమని దేవుడే మీకు బోధించాడు.
1TH 4:10 నిజానికి మాసిదోనియ ప్రాంతంలో ఉన్న సోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. కాని సోదరులారా! మీరు యింకా ఎక్కువ ప్రేమించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
1TH 4:11 మేమిదివరకే చెప్పిన విధంగా శాంతితో జీవించాలని ఆశించండి. మీ స్వహస్తాలతో పని చేస్తూ యితర్ల జోలికి పోకుండా జీవించండి.
1TH 4:12 అలా చేస్తే మీ నిత్య జీవితాన్ని చూసి యితర్లు మిమ్మల్ని గౌరవిస్తారు. అప్పుడు మీరు యితర్లపై ఆధారపడనవసరం ఉండదు.
1TH 4:13 సోదరులారా! చనిపోయిన వాళ్ళను గురించి మీకు తెలియాలని మా కోరిక. బ్రతుకుపై ఆశలేని వాళ్ళవలే దుఃఖించరాదని మా కోరిక.
1TH 4:14 యేసు చనిపోయి తిరిగి బ్రతికివచ్చాడని మనం నమ్ముతాము. అందుకే యేసును విశ్వసించిన వాళ్ళు మరణించినప్పుడు దేవుడు వాళ్ళను ఆయనతో సహా బ్రతికిస్తాడని కూడా మనం విశ్వసిస్తాము.
1TH 4:15 ప్రభువు వచ్చేవరకు మనం బ్రతికి ఉంటే, యింతకు క్రితము చనిపోయిన వాళ్ళకంటే ముందు వెళ్ళము. ఇది ప్రభువు స్వయంగా చెప్పాడు.
1TH 4:16 ప్రభువు పరలోకం నుండి దిగివచ్చినప్పుడు ప్రధాన దూతతో అధికార పూర్వకంగా వస్తాడు. అప్పుడు ప్రధాన దూత శబ్దము, దేవుని బూర శబ్దం వినిపిస్తాయి. అప్పుడు క్రీస్తులో చనిపోయిన వాళ్ళు మొదటలేస్తారు.
1TH 4:17 ఆ తర్వాత యింకా బ్రతికి ఉన్న మనల్ని ప్రభువు వాళ్ళతో సహా ఆకాశంలో ఉన్న మేఘాల్లోకి తీసుకువెళ్తాడు. అప్పటినుండి మనం ఆయనతో చిరకాలం ఉండిపోతాము.
1TH 4:18 అందువల్ల వీటిని గురించి మాట్లాడుకొని పరస్పరం ధైర్యం చెప్పుకోండి.
1TH 5:1 సోదరులారా! ఇవి ఎప్పుడు జరుగనున్నాయో, వాటి సమయాలను గురించి, కాలములను గురించి మేము వ్రాయనవసరం లేదు.
1TH 5:2 ప్రభువు రానున్న దినము అకస్మాత్తుగా రాత్రిపూట దొంగ వచ్చినట్లు వస్తుందని మీకు బాగా తెలుసు.
1TH 5:3 ప్రజలు, “మేము శాంతంగా, క్షేమంగా ఉన్నాము” అని అంటున్నప్పుడు గర్భిణీయైన స్త్రీకి అకస్మాత్తుగా నొప్పులు వచ్చినట్లే వాళ్ళు నాశనమౌతారు. తప్పించుకోలేరు.
1TH 5:4 కాని సోదరులారా! మీరు చీకట్లో లేరు. కనుక ఆ దినం మిమ్మల్ని దొంగల్లా ఆశ్చర్యపరచదు.
1TH 5:5 మనం వెలుగుకు, పగటి వేళకు సంబంధించిన వాళ్ళము. రాత్రికి, చీకటివేళకు సంబంధించిన వాళ్ళము కాము.
1TH 5:6 మరి అలాంటప్పుడు యితరుల వలె నిద్రపోకుండా, హుషారుగా, ఆత్మ నిగ్రహంతో ఉందాము.
1TH 5:7 ఎందుకంటే, నిద్రపొయ్యే వాళ్ళు రాత్రివేళ నిద్రపోతారు. త్రాగుబోతులు రాత్రివేళ త్రాగుతారు.
1TH 5:8 మనం పగటికి చెందిన వాళ్ళము కనుక ఆత్మ నిగ్రహంతో ఉందాము. విశ్వాసాన్ని, ప్రేమను కవచంగాను; రక్షణ, నిరీక్షణలను శిరస్త్రాణంగా ధరించుదాము.
1TH 5:9 ఎందుకంటే దేవుడు కోపాన్ని చూపటానికి మనల్ని ఎన్నుకోలేదు. మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ ఇవ్వటానికి ఎన్నుకొన్నాడు.
1TH 5:10 మనం మరణించినా, లేక బ్రతికి ఉన్నా తాను వచ్చినప్పుడు తనతో కలిసి జీవించాలని క్రీస్తు మనకోసం మరణించాడు.
1TH 5:11 మీరు ఎప్పటిలాగే పరస్పరం ఉత్సాహ పరుచుకుంటూ, యితర్ల అభివృద్ధికి తోడ్పడుతూ ఉండండి.
1TH 5:12 సోదరులారా! మేము ప్రస్తుతం కోరేదేమిటంటే, కష్టపడి పని చేస్తూ ప్రభువు సేవలో మీకు దారి చూపుతూ మీకు బోధిస్తున్న వాళ్ళను గౌరవించండి.
1TH 5:13 వాళ్ళు మంచి కార్యం చేస్తున్నారు కనుక వాళ్ళను అందరికన్నా ఎక్కువగా ప్రేమించి గౌరవించండి. శాంతంగా జీవించండి.
1TH 5:14 సోదరులారా! సోమరులను వారించండి. పిరికి వాళ్ళకు ధైర్యం చెప్పండి. అందరి పట్ల శాంతంగా ఉండండి. బలహీనుల్ని బలపర్చండి. ఇది మా విజ్ఞాపన.
1TH 5:15 కీడు చేసిన వాళ్ళకు తిరిగి కీడు చేసే వాళ్ళను గమనిస్తూ వాళ్ళను అలా చేయనీయకుండా జాగ్రత్త పడండి. పరస్పరం దయ కలిగి యితర్ల పట్ల దయచూపుతూ ఉండండి.
1TH 5:16 ఎప్పుడూ ఆనందంగా వుండండి. విడువకుండా ప్రార్థించండి.
1TH 5:17 దైవ నియమాన్ని తప్పక పాటించండి.
1TH 5:18 అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. యేసు క్రీస్తు వల్ల కలిగిన జీవితంలో మీరు ఈ విధంగా ఉండాలని దేవుని కోరిక.
1TH 5:19 ఆత్మ వెలిగించిన జ్యోతిని ఆర్పివేయకండి.
1TH 5:20 ప్రవక్తలు చెప్పిన వాటిని తూలనాడకండి.
1TH 5:21 అన్నిటినీ పరీక్షించండి. మంచిని విడువకండి.
1TH 5:22 చెడుకు దూరంగా ఉండండి.
1TH 5:23 శాంతిని ప్రసాదించే ఆ దేవుడు మిమ్మల్ని పూర్తిగా పవిత్రం చెయ్యనీయండి. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేరోజు, మీ అంతరాత్మ, ప్రాణం, దేహం ఏ అపకీర్తి లేకుండా ఉండుగాక!
1TH 5:24 మిమ్మల్ని పిలిచేవాడు విశ్వసింపదగ్గవాడు. ఆయన మేము కోరింది తప్పక చేస్తాడు.
1TH 5:25 సోదరులారా! మా కోసం ప్రార్థించండి.
1TH 5:26 సోదరులందరినీ ప్రేమతో హృదయాలకు హత్తుకోండి.
1TH 5:27 ప్రభువు సమక్షంలో ఈ లేఖను సోదరులందరికీ చదివి వినిపించుమని నేను ఆజ్ఞాపిస్తున్నాను.
1TH 5:28 మన యేసు ప్రభువు అనుగ్రహం మీపై ఉండుగాక!
2TH 1:1 పౌలు, సిల్వాను మరియు తిమోతిల నుండి మన తండ్రియైన దేవునికి మరియు యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి:
2TH 1:2 మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహము, శాంతి ప్రసాదించు గాక!
2TH 1:3 సోదరులారా! మీ విశ్వాసం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. మీ మధ్య ఉన్న ప్రేమ వర్థిల్లుతోంది. కనుక మీ విషయంలో మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతగా ఉండాలి.
2TH 1:4 మీరు ఓర్పుతో సహిస్తున్న హింసలను గురించి, కష్టాలను గురించి విశ్వాసాన్ని గురించి మేము పొగడుతూ దేవుని ఇతర సంఘాలకు చెపుతూ ఉంటాము.
2TH 1:5 దేవుడు న్యాయంగా తీర్పు చెబతాడన్న దానికి ఇది సాక్ష్యం. మీరు దేనికొరకు వీటిని అనుభవిస్తున్నారో ఆ రాజ్యానికి దేవుడు మిమ్మల్ని అర్హులుగా చేస్తాడు.
2TH 1:6 దేవుడు నీతిమంతుడు. మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళకు కష్టం కలిగిస్తాడు.
2TH 1:7 ఆయన మనందరి కష్టాలు తొలిగిస్తాడు. ఇది యేసు ప్రభువు పరలోకం నుండి, శక్తిగల దేవదూతలతో, అగ్నిజ్వాలలతో వచ్చినప్పుడు సంభవిస్తుంది.
2TH 1:8 దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళను, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించని వాళ్ళను ఆయన శిక్షిస్తాడు.
2TH 1:9 వాళ్ళు ప్రభువు సమక్షంలో నుండి, ఆయన గొప్పశక్తి నుండి దూరమై శాశ్వతంగా నాశనమై పోతారు.
2TH 1:10 ఆయన వచ్చినప్పుడు ఆయన విశ్వాసులు ఆయనతో సహా మహిమను పొందుతారు. అప్పుడు ఆయనయందు విశ్వసించిన వాళ్ళు ఆయన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతారు. మేము చెప్పిన సందేశాన్ని మీరు కూడా విశ్వసించారు కనుక మహిమను పొందే వాళ్ళలో మీరు కూడా ఉన్నారు.
2TH 1:11 ఇది మనస్సులో పెట్టుకొని తాను పిలిచిన పిలుపుకు తగినట్లు మీ జీవితాలను నడుపమని మేము దేవుణ్ణి ప్రతిరోజూ ప్రార్థిస్తూ ఉంటాము. అంతేకాక, మీరు మంచి చేయాలని ఆశిస్తూ కోరుకొన్న ప్రతి కోరికను, విశ్వాసంవల్ల మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు తన శక్తి ద్వారా పూర్తి చేయాలనీ ప్రార్థిస్తూ ఉంటాము.
2TH 1:12 మీ ద్వారా మన యేసు క్రీస్తు ప్రభువు మహిమ పొందాలని, మీకు ఆయన ద్వారా తన మహిమలో భాగం కలగాలని మేము ప్రార్థిస్తూ ఉంటాము. ఇది మన దేవుని అనుగ్రహంవల్ల, యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృప వల్ల సంభవిస్తుంది.
2TH 2:1 సోదరులారా! మన యేసు ప్రభువు రాకను గురించి, ఆయనతో జరుగబోయే సమావేశాన్ని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి.
2TH 2:2 ఎవరైనా వచ్చి తమకు మేము ఏదైనా ఉత్తరం వ్రాసినట్లు లేదా ప్రభువు రానున్న దినం వచ్చినట్లు తెలిసిందని చెప్పినా, లేక ఆత్మ ద్వారా ఆ విషయం తెలిసిందని చెప్పినా, లేక ఆ విషయాన్ని గురించి మిమ్మల్ని ఎవరైనా వారించినా భయపడకండి. దిగులు చెందకండి.
2TH 2:3 మిమ్మల్ని ఎవ్వరూ ఏ విధంగా మోసం చేయకుండా జాగ్రత్త పడండి. దేవుని పట్ల తిరుగుబాటు జరిగి, ఆ నాశన పుత్రుడు, దుష్టుడు కనిపించేదాకా ఆ రోజు రాదు.
2TH 2:4 అంతేగాక దేవునికి సంబంధించిన ప్రతిదానిపై ఆ భ్రష్టుడు తనను తాను హెచ్చించుకొంటూ మందిరంలో ప్రతిష్టించుకుని తానే దేవుణ్ణని ప్రకటిస్తాడు.
2TH 2:5 నేను మీతో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాను. మీకు జ్ఞాపకం ఉంది కదా?
2TH 2:6 ఆ భ్రష్టుని రాకను ఏది అడ్డగిస్తుందో మీకు తెలుసు. సరియైన సమయానికి రావాలని వాని రాక ఆపబడింది.
2TH 2:7 వాని అధర్మం రహస్యంగా పనిచేస్తూ తన శక్తిని చూపటం అప్పుడే మొదలు పెట్టింది. దాన్ని అడ్డగించే వాడు ఒకాయన ఉన్నాడు. వాణ్ణి అడ్డగిస్తున్న వాడు తీసివేయబడేదాకా ఆయన వాణ్ణి అడ్డగిస్తూనే ఉంటాడు.
2TH 2:8 అప్పుడు ఆ భ్రష్టుడు కనిపిస్తాడు. యేసు ప్రభువు వాణ్ణి తన వూపిరితో హతమారుస్తాడు. యేసు తేజోవంతంగా ప్రత్యక్షమై ఆ భ్రష్టుణ్ణి నాశనం చేస్తాడు.
2TH 2:9 ఆ భ్రష్టుడు సైతాను శక్తితో వచ్చి రకరకాల మహాత్కార్యాలు చేస్తాడు. దొంగ చిహ్నాలు, అద్భుతాలు చేసి మోసం చేస్తాడు.
2TH 2:10 నాశనం కానున్న వాళ్ళను అన్ని విధాలా మోసం చేస్తాడు. వాళ్ళు సత్యాన్ని ప్రేమించటానికి, దేవుని రక్షణను స్వీకరించటానికి నిరాకరించారు కనుక నశించిపోతారు.
2TH 2:11 ఈ కారణంగా దేవుడు వాళ్ళకు మోసం చేసే శక్తిని పంపుతాడు. వాళ్ళు దాన్ని నమ్ముతారు.
2TH 2:12 సత్యాన్ని నమ్మక అధర్మంగా జీవించాలని నిశ్చయించుకొన్న వాళ్ళందరినీ శిక్షిస్తాడు.
2TH 2:13 సోదరులారా! ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ కోసం మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉండాలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరచుటవల్ల, సత్యంలో మీకున్న విశ్వాసం వల్ల దేవుడు మిమ్మల్ని రక్షించటానికి కాలానికి ముందే ఎన్నుకొన్నాడు.
2TH 2:14 మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క మహిమలో మీరు భాగం పంచుకోవాలని, మీరు రక్షణ పొందాలనీ, దేవుడు మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాడు.
2TH 2:15 సోదరులారా! మేము లేఖ ద్వారా మరియు మా బోధన ద్వారా బోధించిన సత్యాలను విడువకుండా నిష్టతో అనుసరించండి.
2TH 2:16 యేసు క్రీస్తు ప్రభువు, మనల్ని ప్రేమించిన మన తండ్రియైన దేవుడు మనల్ని అనుగ్రహించి మనకు అనంతమైన ధైర్యాన్ని, మంచి ఆశాభావాన్ని ఇచ్చారు.
2TH 2:17 దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిచి, మంచి పనులు చేయటానికి, మంచి మాటలు ఆడటానికి, మీకు ధైర్యం కలుగజేయునుగాక!
2TH 3:1 సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే మా కోసం ప్రార్థించండి. ప్రభువు సందేశం మీలో వ్యాపించిన విధంగా త్వరలోనే మిగతా వాళ్ళలో కూడా వ్యాపించి కీర్తి చెందాలని ప్రార్థించండి.
2TH 3:2 విశ్వాసం అందరిలో ఉండదు. కనుక దుర్మార్గుల నుండి, దుష్టుల నుండి మేము రక్షింపబడాలని ప్రార్థించండి.
2TH 3:3 కాని ప్రభువు నమ్మతగినవాడు. కనుక ఆయన మిమ్మల్ని సైతాను నుండి రక్షించి మీకు శక్తి కలిగిస్తాడు.
2TH 3:4 మా ఆజ్ఞల్ని పాటిస్తున్నారనీ ఇక ముందుకునూ పాటిస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ నమ్మకం మాకు ప్రభువు వల్ల కలిగింది.
2TH 3:5 తండ్రియైన దేవునిలో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న సహనము మీ హృదయాల్లో నింపబడాలని మా అభిలాష.
2TH 3:6 సోదరులారా! యేసు క్రీస్తు ప్రభువు పేరిట మేము ఆజ్ఞాపిస్తున్నదేమనగా మా నుండి విన్న క్రీస్తు సందేశం ప్రకారం జీవించక అక్రమంగా జీవిస్తున్న ప్రతి సోదరునితో సాంగత్యం చెయ్యకండి.
2TH 3:7 మమ్మల్ని అనుసరించాలని మీకు బాగా తెలుసు. మేము మీతో ఉన్నప్పుడు సోమరులంగా ఉండలేదు.
2TH 3:8 అంతేకాక మేము ఎవరి ఇంట్లోనైనా వూరికే భోజనం చేయలేదు. మీలో ఎవ్వరికీ కష్టం కలిగించరాదని మేము రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసాము.
2TH 3:9 మీ నుండి అలాంటి సహాయం కోరే అధికారం మాకు ఉంది. కాని మీకు ఆదర్శంగా ఉండాలని అలా చేసాము.
2TH 3:10 మేము మీతో ఉన్నప్పుడే, “మనిషి పని చేయకపోతే భోజనం చేయకూడదు” అని చెప్పాము.
2TH 3:11 మీలో కొందరు సోమరులని విన్నాము. వాళ్ళు పని చెయ్యక పోవటమే కాకుండా ఇతరుల విషయంలో జోక్యం కలుగ చేసుకొంటున్నారని విన్నాము.
2TH 3:12 వాళ్ళు ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోరాదని, తాము తినే ఆహారం పనిచేసి సంపాదించాలని యేసు క్రీస్తు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము.
2TH 3:13 ఇక మీ విషయమంటారా, మంచి చెయ్యటం మానకండి.
2TH 3:14 ఈ లేఖలో వ్రాసిన మా ఉపదేశం ఎవరైనా పాటించకపోతే అలాంటి వాళ్ళను ప్రత్యేకంగా గమనించండి. అలాంటి వాణ్ణి సిగ్గుపడేటట్లు చెయ్యటానికి అతనితో సాంగత్యం చేయకండి.
2TH 3:15 అయినా అతణ్ణి శత్రువుగా పరిగణించకుండా సోదరునిగా భావించి అతణ్ణి వారించండి.
2TH 3:16 శాంతిని ప్రసాదించే ప్రభువు మీకు అన్ని వేళలా, అన్ని విధాలా శాంతి ప్రసాదించు గాక! పైగా ఆయన మీ అందరికీ తోడై ఉండుగాక!
2TH 3:17 పౌలను నేను, నా స్వహస్తాలతో మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా లేఖలన్నిటిలో నేను ఇదే విధంగా సంతకం చేస్తాను. ఇది నా పద్ధతి.
2TH 3:18 మన యేసు క్రీస్తు అనుగ్రహం మీ అందరికీ లభించుగాక!
1TI 1:1 విశ్వాసంలో నా కుమారునితో సమానమైన తిమోతికి పౌలు వ్రాయడం ఏమనగా, నేను మన రక్షకుడైన దేవుని ఆజ్ఞానుసారమూ, మనకు రక్షణ లభిస్తున్న ఆశకు మూలకారకుడైన యేసు క్రీస్తు ఆజ్ఞానుసారమూ, యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను.
1TI 1:2 తండ్రి అయినటువంటి దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు, నీపై అనుగ్రహం చూపాలనీ, నిన్ను కరుణించాలనీ, నీకు శాంతి చేకూర్చాలనీ ఆశిస్తున్నాను.
1TI 1:3 నేను మాసిదోనియకు వెళ్ళినప్పుడు నీకు చెప్పిన విధంగా నీవు ఎఫెసులో ఉండుము. అక్కడ కొందరు తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. వాళ్ళతో ఆ విధంగా చెయ్యవద్దని చెప్పు.
1TI 1:4 అంతేకాక, వాళ్ళు పుక్కిటి పురాణాలు చెప్పకూడదనీ, అంతు పొంతులేని వంశావళితో సమయం వ్యర్థం చేయవద్దని కూడా ఆజ్ఞాపించు. ఇలాంటివి దైవకార్యానికి తోడ్పడడానికి బదులుగా చీలికలు కల్గిస్తాయి. దైవకార్యం విశ్వాసంతో కూడుకొన్నపని.
1TI 1:5 ఇందులోని ఉద్దేశ్యం ఏమిటంటే, పవిత్ర హృదయం నుండీ, స్వచ్ఛమైన అంతరాత్మ నుండీ, నిజమైన విశ్వాసం నుండీ ఉద్భవించే ప్రేమను కలిగియుండటమే.
1TI 1:6 కొందరు వ్యక్తులు నిజమైన ధ్యేయం మరిచిపోయి, వ్యర్థంగా తిరిగిపోయారు.
1TI 1:7 తాము ధర్మశాస్త్ర పండితులు కావాలనుకొంటారు. కాని వాళ్ళకు వాళ్ళు చెప్పే మాటలే తెలియదు. నమ్మకంతో మాట్లాడుతున్న విషయాలను గురించి వాళ్ళకు తెలియదు.
1TI 1:8 ధర్మశాస్త్రాన్ని మానవుడు సక్రమంగా ఉపయోగిస్తే మంచిదని మనకు తెలుసు.
1TI 1:9 మంచి వాళ్ళ కోసం ధర్మశాస్త్రం వ్రాయబడలేదని మనకు తెలుసు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళకోసం, తిరుగుబాటు చేసే వాళ్ళ కోసం, దేవుణ్ణి నమ్మని వాళ్ళకోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం, అపవిత్రమైన వాళ్ళకోసం, తల్లిదండ్రులను గౌరవ పరచని వాళ్ళకోసం, హంతకుల కోసం,
1TI 1:10 వ్యభిచారుల కోసం, కామంతో అసహజంగా ప్రవర్తించే వాళ్ళకోసం, బానిస వ్యాపారం చేసేవాళ్ళకోసం, అసత్యాలాడే వాళ్ళకోసం, దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళ కోసం, నిజమైన బోధనకు వ్యతిరేకంగా నడుచుకొనే వాళ్ళకోసం, అది వ్రాయబడింది.
1TI 1:11 నాకందించిన దివ్యమైన ఆ సువార్తలో ఈ ఉపదేశం ఉంది. దాన్ని తేజోవంతుడైన దేవుడు నాకందించాడు.
1TI 1:12 నాకు శక్తినిచ్చి, నన్ను విశ్వాసపాత్రునిగా ఎంచి, ఈ సేవకోసం నన్ను నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకు నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను.
1TI 1:13 ఒకనాడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నేను అమాయకంగా నాలో విశ్వాసం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించానని దేవుడు నన్ను కనికరించాడు.
1TI 1:14 మన ప్రభువు తన అనుగ్రహాన్ని నాపై ధారాళంగా కురిపించాడు. ఆ అనుగ్రహంతో పాటు యేసు క్రీస్తులో ఉన్న విశ్వాస గుణాన్ని, ప్రేమను కూడా నాకు ప్రసాదించాడు.
1TI 1:15 పాపులను రక్షించటానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది విశ్వసింపదగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. ఆ పాపుల్లో నేను ప్రథముణ్ణి.
1TI 1:16 నేను ప్రథముణ్ణి కనుకనే యేసు నాపై దయ చూపాడు. ఈ విధంగా తనను విశ్వసించబోయే వాళ్ళకు, తనవల్ల విముక్తి పొందబోయే వాళ్ళకు అనంతమైన తన సహనము ఆదర్శంగా ఉండాలని అంతులేని సహనాన్ని ప్రదర్శించాడు.
1TI 1:17 చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని, చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ చిరకాలం కలుగుగాక! ఆమేన్.
1TI 1:18 తిమోతీ, నా కుమారుడా! గతంలో ప్రవక్తలు నీ భవిష్యత్తును గురించి చెప్పారు. దాని ప్రకారం మంచి పోరాటం సాగించి ఆ ప్రవక్తలు చెప్పినవి సార్థకం చేయుమని ఆజ్ఞాపిస్తున్నాను.
1TI 1:19 విశ్వాసంతో, మంచి హృదయంతో పోరాటం సాగించు. కొందరు వీటిని వదిలి తమ విశ్వాసాన్ని పోగొట్టుకొన్నారు.
1TI 1:20 హుమెనైయు, అలెక్సంద్రు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు దైవదూషణ చెయ్యకుండా ఉండటం నేర్చుకోవాలని వాళ్ళను సైతానుకు అప్పగించాను.
1TI 2:1 నేను మిమ్మల్ని వేడుకొనేదేమిటంటే మొదట విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతలు ప్రజలందరి పక్షాన చెయ్యండి.
1TI 2:2 ముఖ్యంగా రాజుల పక్షాన, అధికారుల పక్షాన దేవునికి విజ్ఞాపన చెయ్యండి. అప్పుడు మనము నిశ్చింతగా, శాంతంగా సత్ప్రవర్తనతో, ఆత్మీయతతో జీవించగల్గుతాము.
1TI 2:3 ఇలా చెయ్యటం ఉత్తమం. మరియు మన రక్షకుడైన దేవునికి అది సంతృప్తి కలిగిస్తుంది.
1TI 2:4 మానవులందరూ రక్షింపబడాలనీ, సత్యాన్ని గ్రహించాలనీ దేవుని ఇష్టం.
1TI 2:5 ఎందుకంటే ఒకే ఒక దేవుడున్నాడు. దేవునికి, మానవులకు మధ్య సంధి కుదుర్చటానికి ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే మానవునిగా జన్మించిన యేసు క్రీస్తు.
1TI 2:6 ఆయన మానవులకు విమోచన కలిగించాలని సరియైన సమయానికి తనను తాను ఒక వెలగా అర్పించుకొన్నాడు. మానవులందరూ రక్షింపబడటమే దేవుని ఉద్దేశ్యమన్న దానికి యిది నిదర్శనము.
1TI 2:7 అందువలన దేవుడు నన్ను ఒక దూతగా, అపొస్తలునిగా నియమించి యూదులు కాని వాళ్ళకు నిజమైన విశ్వాసాన్ని బోధించటానికి పంపాడు. ఇది సత్యం. అబద్ధం కాదు.
1TI 2:8 అన్ని స్థలాల్లో పురుషులు ఆగ్రహం చెందకుండా, వాదనలు పెట్టుకోకుండా తమ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలని నా అభిలాష. వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నా ఈ విధంగా ప్రార్థించాలి.
1TI 2:9 స్త్రీలు గౌరవం కలిగించే దుస్తులు ధరించి వినయంగా, మర్యాదగా ఉండాలి. బంగారు నగలు, ముత్యాలు, ఖరీదైన దుస్తులు, తలవెంట్రుకలతో నానా విధపు ముడులు వేయటం. ఇవి మీకు అలంకారముగా అనుకొనక,
1TI 2:10 దైవభక్తులమని చెప్పుకొనుటకు తగినట్లుగా సత్కార్యములనే ఆభరణాలను అలంకారంగా ధరించాలి.
1TI 2:11 స్త్రీలు నెమ్మదిగా ఉంటూ సంపూర్ణమైన వినయంతో ఉండటం నేర్చుకోవాలి.
1TI 2:12 స్త్రీలు బోధించటంగాని, పురుషులపై అధికారం చెయ్యటంగాని నేను ఒప్పుకోను. వాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదు.
1TI 2:13 దేవుడు ఆదామును మొదట సృష్టించాడు. ఆ తర్వాత హవ్వను సృష్టించాడు.
1TI 2:14 మోసపోయింది ఆదాము కాదు. స్త్రీ మోసపోయి పాపియైనది.
1TI 2:15 దేవుని పట్ల విశ్వాసము, పవిత్రత, ప్రేమ, మర్యాద అనే గుణాలు అలవర్చుకోవాలి. సంతానం కలుగుట ద్వారా ఆమెకు క్షేమం కలుగుతుంది.
1TI 3:1 ఇక్కడొక నమ్మదగిన సంగతి: సంఘంలో పెద్ద కావాలనుకొన్నవాడు గొప్ప సంగతినే కోరుకొనుచున్నాడు.
1TI 3:2 పెద్దనిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు ఏకపత్నీవ్రతుడై ఉండాలి. మితంగా జీవించాలి. వివేకవంతుడై ఉండాలి. సంఘంలో గౌరవం కలిగి ఉండాలి. ఇతర్లకు సహాయం చేస్తూ ఉండాలి. బోధించగల సామర్థ్యం ఉండాలి.
1TI 3:3 అలాంటివాడు మద్యం త్రాగరాదు. అతనిలో కోపానికి మారుగ వినయం ఉండాలి. పోట్లాడే గుణం ఉండకూడదు. ధనం మీద ఆశ ఉండకూడదు.
1TI 3:4 తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోగలిగి ఉండాలి. అతడు, తన పిల్లలు తనపట్ల విధేయతగా ఉండేటట్లు, తనను మనస్పూర్తిగా గౌరవించేటట్లు చేసుకోవాలి.
1TI 3:5 తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోలేనివాడు, దేవుని సంఘాన్ని ఏ విధంగా నడపగలడు?
1TI 3:6 అతడు క్రొత్తగా నమ్మినవాడై ఉండకూడదు. అటువంటి వ్యక్తి ఉబ్బెక్కిపోయి సైతాను పొందిన శిక్షనే పొందవచ్చు.
1TI 3:7 సంఘానికి చెందని వాళ్ళలో కూడా అతనికి మంచి పేరు ఉండాలి. అప్పుడే అతడు చెడ్డ పేరు పొందకుండా సైతాను వలలో పడకుండా ఉంటాడు.
1TI 3:8 అదే విధంగా సంఘ పరిచారకులు గౌరవింపదగిన వాళ్ళై ఉండాలి. నీతిపరులై ఉండాలి. త్రాగుబోతులు కాకూడదు. మోసాలు చేసి లాభాలు పొందేవాళ్ళు కాకూడదు.
1TI 3:9 దేవుడు చెప్పిన సత్యాలను వాళ్ళు పవిత్ర హృదయంతో ఆచరించాలి.
1TI 3:10 వాళ్ళు మొదట పరీక్షింపబడాలి. ఆ తర్వాత ఎవ్వరికీ ఏ ఆక్షేపణ లేనట్లయితే వాళ్ళను పరిచారకులుగా ఎన్నుకోవచ్చు.
1TI 3:11 ”అదే విధంగా పరిచర్యచేయు స్త్రీలు కూడా గౌరవింపదగిన వాళ్ళై ఉండాలి. వాళ్ళు యితర్లను నిందిస్తూ మాట్లాడరాదు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. నమ్మదగిన వాళ్ళై ఉండాలి.
1TI 3:12 పరిచారకుడు కూడా ఏకపత్నీ వ్రతుడై ఉండాలి. తన పిల్లల్ని, కుటుంబాన్ని సక్రమంగా నడపాలి.
1TI 3:13 ఆ విధంగా నడిపేవాళ్ళు క్రీస్తులో మంచి పేరు, బలమైన విశ్వాసం సంపాదించుకొంటారు.
1TI 3:14 నేను నీ దగ్గరకు త్వరలోనే రావాలనుకొంటున్నాను. అయినా నేనీ ఆజ్ఞల్ని ఎందుకు వ్రాస్తున్నానంటే,
1TI 3:15 ఒకవేళ నేను రావటం ఆలస్యం అయితే ప్రజలు దేవుని కుటుంబంలో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఈ లేఖ ద్వారా నీకు తెలియజేస్తున్నాను. దేవుని సంఘం ఒక స్తంభంలాంటిది. అది సత్యానికి ఆధారమైనది.
1TI 3:16 ఆత్మీయతలో ఉన్న రహస్యం నిస్సందేహంగా చాలా గొప్పది. క్రీస్తు మానవ రూపం ఎత్తాడు. పరిశుద్ధాత్మ వలన ఆయన నిజమైన నిర్దోషిగా నిరూపించబడ్డాడు. దేవదూతలు ఆయన్ని చూసారు. రక్షకుడని ఆయన గురించి ప్రజలకు ప్రకటింపబడింది. ప్రజలు ఆయన్ని విశ్వసించారు. ఆయన తన మహిమతో పరలోకానికి కొనిపోబడ్డాడు.
1TI 4:1 చివరిదినాల్లో కొందరు విశ్వాసాన్ని వదిలి మోసగించే దయ్యాల బోధనల్ని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా చెపుతున్నాడు.
1TI 4:2 దొంగ మాటలు చెప్పేవాళ్ళు దొంగ ఉపదేశాలు చేస్తారు. వాళ్ళ అంతరాత్మలు మొద్దుబారాయి.
1TI 4:3 అలాంటి వాళ్ళు వివాహం చేసుకోవటం తప్పని, కొన్ని రకాల ఆహారాలు తినకూడదని బోధిస్తారు. కాని దేవుడు అన్ని ఆహారాలూ తినటానికే సృష్టించాడు. విశ్వాసులు, సత్యాన్ని తెలుసుకొన్న వాళ్ళు, దేవునికి కృతజ్ఞతలర్పించి ఆహారాన్ని భుజించాలి.
1TI 4:4 దేవుడు సృష్టించినవన్నీ మంచివే కనుక మనం దేన్నీ నిరాకరించకూడదు. అన్నిటినీ దేవునికి కృతజ్ఞతలర్పించి భుజించాలి.
1TI 4:5 అవి దేవుని వాక్యం వల్లను, ప్రార్థన ద్వారాను పవిత్రం చేయబడినాయి.
1TI 4:6 నీవీ బోధనలు సోదరులకు చెబితే యేసు క్రీస్తు యొక్క మంచి సేవకునిగా పరిగణింపబడతావు. నీవు విశ్వసించిన సత్యాలను, సుబోధనలను నీవు అనుసరిస్తున్నావు కనుక నీకు అభివృద్ధి కల్గుతుంది.
1TI 4:7 ఆత్మీయత లేని కాకమ్మ కథలకు, ముసలమ్మ కథలకు దూరంగా ఉండు. భక్తితో ఉండటానికి అభ్యాసం చెయ్యి.
1TI 4:8 శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది. దైవభక్తివల్ల ప్రస్తుత జీవితంలోనూ, రానున్న జీవితంలోనూ మంచి కల్గుతుంది. కనుక అది అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది.
1TI 4:9 ఇది నమ్మదగిన విషయం. సంపూర్ణంగా అంగీకరించదగినది.
1TI 4:10 మానవ జాతి రక్షకుడైన దేవుణ్ణి, ముఖ్యంగా తనను నమ్మిన వాళ్ళను రక్షించే సజీవుడైన దేవుణ్ణి మనం విశ్వసించాము. కనుకనే మనము సహనంతో కష్టించి పని చేస్తున్నాము.
1TI 4:11 ఈ విషయాలు మిగతా వాళ్ళకు బోధించి, వాటిని ఆచరించుమని ఆజ్ఞాపించు.
1TI 4:12 నీవు వయస్సులో చిన్నవాడైనందుకు నిన్నెవ్వడూ చులకన చెయ్యకుండా జాగ్రత్త పడుము. క్రీస్తును విశ్వసించే వాళ్ళకు మాటల్లో, జీవిత విధానంలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు.
1TI 4:13 నేను వచ్చేవరకు నీ కాలాన్ని దైవవాక్యాలు బహిరంగంగా చదవటానికి, వాటిని ఉపదేశించటానికి ఉపయోగించు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందింప చేయుము.
1TI 4:14 పెద్దలు తమ చేతుల్ని నీపై ఉంచినప్పుడు ప్రవక్తలు చెప్పిన భవిష్యత్తు ప్రకారం నీకు వరం లభించింది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు.
1TI 4:15 నేను చెప్పిన విషయాలపై నీ మనస్సు లగ్నం చేయి. అప్పుడు అందరూ నీ అభివృద్ధిని గమనిస్తారు.
1TI 4:16 నీ వ్యక్తిగత జీవితాన్నీ, నీవు బోధించే వాటినీ జాగ్రత్తగా గమనించు. వాటిని పట్టుదలతో సాధించు. అలా చేస్తే నిన్ను నీవు రక్షించుకొన్నవాడవౌతావు. నీ బోధన విన్నవాళ్ళను రక్షించినవాడవౌతావు.
1TI 5:1 వృద్ధులతో కఠినంగా మాట్లాడవద్దు. వాళ్ళను తండ్రులుగా భావించి సలహాలు చెప్పు. చిన్న వాళ్ళను నీ తమ్ములుగా భావించు.
1TI 5:2 వయస్సు మళ్ళిన స్త్రీని నీ తల్లిగా, పిన్న వయస్సుగల స్త్రీని పవిత్ర హృదయంతో నీ సోదరిగా భావించు.
1TI 5:3 అవసరంలోవున్న వితంతువులకు సహాయం చేయుము.
1TI 5:4 వితంతువులకు పిల్లలు గాని, పిల్లల పిల్లలు గాని ఉన్నట్లైతే, వాళ్ళు తమ కుటుంబాన్ని పోషించుకోవటం ముఖ్యంగా నేర్చుకోవాలి. ఆ విధంగా తమ మతానికి సంబంధించి కర్తవ్యాలను నిర్వర్తించాలి. అలా చేస్తే తమ తల్లిదండ్రుల ఋణం, తాత ముత్తాతల ఋణం తీర్చుకొన్నట్లవుతుంది. అది దేవునికి సంతృప్తి కలుగ చేస్తుంది.
1TI 5:5 ఒంటరిగా దీనావస్థలో ఉన్న వితంతువు తన ఆశల్ని దేవునిలో పెట్టుకొని, సహాయం కోసం రాత్రింబగళ్ళు ప్రార్థిస్తుంది.
1TI 5:6 కాని భోగాలకొరకు జీవించే వితంతువు జీవిస్తున్నా మరణించినట్లే.
1TI 5:7 ఈ ఉపదేశాలను ప్రజలకు బోధించు. అప్పుడు వాళ్ళలో ఎవ్వరూ నీలో తప్పు పట్టలేరు.
1TI 5:8 తన స్వంతవారిని ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడలేని వాడు మనం నమ్మే సత్యాలను విడిచి అవిశ్వాసి అయిన వానితో సమానం. అతడు దేవుణ్ణి నమ్మని వానికన్నా అధ్వాన్నం.
1TI 5:9 ఒకే పురుషుణ్ణి పెండ్లాడి అరవై ఏండ్లు దాటి ఉంటే తప్ప ఆమె పేరు వితంతువుల జాబితాలో చేర్చరాదు.
1TI 5:10 అంతేకాక, సత్కార్యాలు చేసే స్త్రీయని ఆమెకు మంచి పేరుండాలి. పిల్లల్ని సక్రమంగా పెంచటం, అతిథి సత్కార్యాలు చెయ్యటం, పవిత్రుల కాళ్ళు కడగటం, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చెయ్యటంలాంటి గుణాలు ఆమెలో ఉండాలి. తన జీవితాన్ని యిలాంటి మంచి పనులు చెయ్యటానికి అంకితం చేసిన స్త్రీగా ఉండాలి.
1TI 5:11 పిన్న వయస్సుగల వితంతువుల్ని ఈ జాబితాలో చేర్చవద్దు. వాళ్ళ వాంఛలు క్రీస్తు పట్ల వాళ్ళకున్న భక్తిని మించిపోయినప్పుడు, వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకొంటారు.
1TI 5:12 తద్వారా తమ మొదటి ప్రమాణాన్ని ఉల్లంఘిస్తారు. ఇలా చెయ్యటంవల్ల వాళ్ళకు శిక్ష లభిస్తుంది.
1TI 5:13 పైగా వాళ్ళు వ్యర్థంగా కాలయాపన చెయ్యటానికి, ఇంటింటికి తిరగటానికి అలవాటు పడిపోతారు. వాళ్ళిలా కాలాయాపన చెయ్యటమే కాకుండా కబర్లకు, యితర్ల విషయాల్లో జోక్యం కలిగించుకోవటానికి అలవాటుపడ్తారు. వాళ్ళకు మౌనంగా ఉండటం చేతకాదు.
1TI 5:14 అందువల్ల పిన్న వయస్సులో ఉన్న వితంతువులు పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని, తమ యిండ్లను చూసుకోవాలి. ఇది నా సలహా. అప్పుడు వాళ్ళను నిందించడానికి యితర్లకు ఆస్కారము ఉండదు.
1TI 5:15 నిజానికి కొందరు సైతాన్ను అనుసరించటానికి యిదివరకే తిరిగి వెళ్ళారు.
1TI 5:16 ””క్రీస్తును విశ్వసించే స్త్రీ, తన కుటుంబంలో వితంతువులున్నట్లైతే, వాళ్ళకు సహాయం చేయాలి. సంఘంపై ఆ భారం వేయరాదు. అప్పుడు క్రీస్తు సంఘం నిజంగా ఆసరాలేని వితంతువులకు సహాయం చేయకల్గుతుంది.
1TI 5:17 క్రీస్తు సంఘం యొక్క కార్యక్రమాలు నడిపించే పెద్దలు, ముఖ్యంగా ఉపదేశించటానికి, బోధించటానికి కష్టపడి పని చేస్తున్న పెద్దలు రెట్టింపు గౌరవానికి అర్హులు.
1TI 5:18 ఎందుకంటే ధర్మశాస్త్రంలో, “ధాన్యము తొక్కే ఎద్దు మూతి కట్టరాదు” మరియు “పని చేసే వానికి కూలి దొరకాలి” అని వ్రాయబడి ఉంది.
1TI 5:19 ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉంటే తప్ప సంఘం పెద్దల మీద మోపిన నేరాన్ని పరిశీలించవద్దు.
1TI 5:20 తప్పు చేసిన వాళ్ళను బహిరంగంగా ఖండించు. అలా చేస్తే అది చూసి మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు.
1TI 5:21 నేను దేవుని సమక్షంలో, యేసు క్రీస్తు సమక్షంలో, దేవుడు ఎన్నుకొన్న దేవదూతల సమక్షంలో ఆజ్ఞాపిస్తున్నాను. ఒకని పక్షం వహించి మరొకని పట్ల వ్యతిరేకంగా ఉండవద్దు. నిష్పక్షపాతంగా ఈ ఆజ్ఞల్ని అమలులో పెట్టు. ఏది పక్షపాతంతో చెయ్యవద్దు.
1TI 5:22 నీవు తొందరపడి ఎవరి మీద హస్తనిక్షేపణ చేయవద్దు. ఇతర్ల పాపాల్లో భాగస్తుడవు కావద్దు. నిన్ను నీవు పవిత్రంగా చూచుకో.
1TI 5:23 నీళ్ళు మాత్రమే త్రాగవద్దు. నీ కడుపు బాగు కావటానికి కొద్దిగా ద్రాక్షారసము త్రాగు. అప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటావు.
1TI 5:24 కొందరు చేసిన పాపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి వాళ్ళకన్నా ముందు తీర్పుకై పరుగెత్తుచున్నాయి. మరి కొందరి పాపాలు ఆలస్యంగా కనిపిస్తాయి.
1TI 5:25 అదే విధంగా మంచి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. రహస్యంగానుండే మంచి పనులు కూడా బయలు పరచబడును.
1TI 6:1 బానిసత్వంలో ఉన్నవాళ్ళు తమ యజమానులను పూర్తిగా గౌరవించాలి. అప్పుడే దేవునికి, మా బోధనకు చెడ్డపేరు రాకుండా ఉంటుంది.
1TI 6:2 యజమానులు దేవుని కుటుంబానికి చెందినంత మాత్రాన బానిసలు వారిని గౌరవించటం మానుకోరాదు. అలా కాక వాళ్ళకు యింకా ఎక్కువ సేవ చేయాలి. ఎందుకంటే ఈ సేవ పొందే వాళ్ళు భక్తులు. వీరు ప్రేమ చూపుతున్న వాళ్ళు. ఈ విధంగా నీవు వీటిని ఉపదేశించి ఆచరణలో పెట్టుమని వాళ్ళకు చెప్పు.
1TI 6:3 మన యేసు క్రీస్తు ప్రభువు బోధించిన చక్కటి ఉపదేశాలను, మన దేవుని సేవకు సంబంధించిన సక్రమ మార్గాలను వదిలి యితర మార్గాలను బోధించువాడు
1TI 6:4 మోసగాడు అన్నమాట. అలాంటి వానికి ఏమీ తెలియదన్నమాట. అలాంటి వానిలో వివాదాస్పదమైన విషయాలను అనవసరంగా తర్కించాలనే అనారోగ్యకరమైన ఆసక్తి ఉంటుంది. అది ద్వేషానికి, పోరాటానికి, దూషణలకు, దుష్టత్వంతో నిండిన అనుమానాలకు దారి తీస్తుంది.
1TI 6:5 అంతేకాక, సత్యాన్ని గ్రహించక దైవభక్తి, ధనార్జనకు ఒక సాధనమని భావించే దుష్టబుద్ధి గలవాళ్ళ మధ్య నిరంతరమైన ఘర్షణలు కలుగుతాయి.
1TI 6:6 కాని సంతృప్తితో ఉండి, భక్తిని అవలంభిస్తే అదే ఒక గొప్ప ధనము.
1TI 6:7 ఈ లోకంలోకి మనమేమీ తీసుకురాలేదు. ఈ లోకంనుండి ఏమీ తీసుకుపోలేము.
1TI 6:8 మనకు తిండి, బట్ట ఉంటే చాలు. దానితో తృప్తి పొందుదాము.
1TI 6:9 కాని ధనవంతులు కావాలనుకొనేవారు, ఆశలకులోనై మూర్ఖత్వంతో హానికరమైన ఆశల్లో చిక్కుకుపోతారు. అవి వాళ్ళను అధోగతి పట్టించి పూర్తిగా నాశనం చేస్తాయి.
1TI 6:10 ధనాశ అన్ని రకాల దుష్టత్వానికి మూలకారణం. కొందరు, ధనాన్ని ప్రేమించి, క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసానికి దూరమైపోయారు. తద్వారా దుఃఖాల్లో చిక్కుకుపోయారు.
1TI 6:11 కాని నీవు విశ్వాసివి. కనుక వీటికి దూరంగా ఉండు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, వినయాన్ని అలవరచుకో.
1TI 6:12 నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని సంపాదించు. దీని కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీకరించావు.
1TI 6:13 అన్నిటికీ ప్రాణం పోసే దేవుని పేరిట, పొంతి పిలాతు సమక్షంలో అదే గొప్ప సత్యాన్ని అంగీకరించిన యేసు క్రీస్తు పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.
1TI 6:14 మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేదాక ఈ ఆజ్ఞను పాటించు. దాన్ని పాటించటంలో ఏ మచ్చా రానీయకుండా, ఏ అపకీర్తీ రానివ్వకుండా చూడు.
1TI 6:15 “మన పాలకుడు,” రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సర్వాధిపతి అయిన దేవుడు తగిన సమయం రాగానే యేసు క్రీస్తును పంపుతాడు.
1TI 6:16 మనం సమీపించలేని వెలుగులో ఉండే అమరుడైన దేవుడాయన. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, మరి ఎవ్వరూ చూడలేరు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆయన శక్తి తరగకుండా ఉండుగాక! అమేన్.
1TI 6:17 ధనవంతులు గర్వించరాదనీ, క్షణికమైన ధనాన్ని నమ్మకూడదనీ, వాళ్ళతో చెప్పుదానికి మారుగా మన ఆనందానికి అన్నీ సమకూర్చే దేవుణ్ణి నమ్ముమని ఆజ్ఞాపించు.
1TI 6:18 సత్కార్యాలు చేస్తూ సత్ ప్రవర్తన కలిగి అవసరమైనవాటిని యితర్లతో ఔదార్యముగా పంచుకుంటూ ఉండుమని ఆజ్ఞాపించు.
1TI 6:19 ఈ విధంగా ఆత్మీయతలో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది భవిష్యత్తుకు చక్కటి పునాది వేస్తుంది. తద్వారా నిజమైన జీవితం పొందకల్గుతారు.
1TI 6:20 తిమోతీ, నీకు అప్పగింపబడిన సత్యాన్ని జాగ్రత్తగా కాపాడు. ఆత్మీయతలేని చర్చలకు దూరంగా ఉండు. జ్ఞానంగా చెప్పబడే వ్యతిరేక సిద్ధాంతాలకు దూరంగా ఉండు.
1TI 6:21 కొందరు ఈ వ్యతిరేక సిద్ధాంతాలు బోధించారు. ఇలా చేసిన వాళ్ళు, మనము విశ్వసిస్తున్న సత్యాలను వదిలి తప్పు దారి పట్టారు. దైవానుగ్రహం మీకు తోడుగా ఉండుగాక!
2TI 1:1 పౌలు నుండి నా ప్రియమైన కుమారుడు తిమోతికి వ్రాయడమేమనగా మన తండ్రియైన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి నీకు కృప, దయ, శాంతి లభించుగాక!
2TI 1:2 నేను దైవేచ్ఛానుసారం యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను. దేవుడు వాగ్దానము చేసిన అనంతజీవితము యేసు క్రీస్తు వలన సంభవిస్తుంది. దాని కారణముగా నేను అపొస్తలుడనయ్యాను.
2TI 1:3 నేను నిష్కల్మష హృదయంతో నా పూర్వీకుల దేవునికి సేవచేస్తూ కృతజ్ఞుడనై యున్నాను. రాత్రింబగళ్ళు నిన్ను జ్ఞాపకము పెట్టుకొని నీ కోసం ప్రార్థిస్తూ ఉంటాను.
2TI 1:4 నీలాంటి వాణ్ణి నాకు యిచ్చినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞుణ్ణి. నీ కన్నీళ్ళు జ్ఞాపకం వస్తున్నాయి. నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూసాక నా మనస్సు ఆనందంతో నిండిపోతుంది.
2TI 1:5 నీలో ఉన్న నిజమైన విశ్వాసం నాకు జ్ఞాపకము ఉంది. అటువంటి విశ్వాసం మీ అమ్మమ్మ లోయిలోనూ ఉండేది. నీ తల్లి యునీకేలో కూడా ఉండేది. నీలో కూడా అలాంటిది ఉందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.
2TI 1:6 అందుకోసం, నా చేతులు నీ తలపై ఉంచడం వల్ల నీకు దేవుడు యిచ్చిన వరాన్ని ఉపయోగిస్తూ ఉండుమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను.
2TI 1:7 దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, స్వయం క్రమశిక్షణ గల ఆత్మనిచ్చాడు.
2TI 1:8 కనుక ప్రభువును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు గాని, అతని ఖైదీనైన నా విషయము చెప్పవలసి వచ్చినప్పుడు గాని సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించి, సువార్త కోసం నాతో కలిసి కష్టాలు అనుభవించుము.
2TI 1:9 దేవుడు మనల్ని రక్షించి తన ప్రజలుగా మాత్రమే ఉండటానికి పిలిచాడు. మనము చేసిన పనులను బట్టి ఆయన ఇలా చేయలేదు. కాని ఇది కేవలం ఆయన అనుగ్రహం వల్ల, ఆయన ఉద్దేశానుసారం చేసాడు. దేవుడు కాలానికి ముందే యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించాడు.
2TI 1:10 కాని ఇప్పుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వచ్చి దాన్ని మనకు వ్యక్తము చేసాడు. ఈయన తన సువార్త ద్వారా మరణాన్ని నిర్మూలించి అనంత జీవితాన్ని, అమరత్వాన్ని వెలుగులోకి తెచ్చాడు.
2TI 1:11 ఈ సువార్తను ప్రకటించటానికి, నన్ను వార్తాహరునిగానూ, అపొస్తలునిగానూ, ఉపాధ్యాయునిగానూ నియమించాడు.
2TI 1:12 ఆ కారణంగా నేను ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నాను. అందుకు నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను విశ్వసించిన వాణ్ణి గురించి నాకు బాగా తెలుసు. ఆ రానున్న రోజు దాకా ఆయన నాకు అప్పగించిన దాన్ని, కాపాడుతాడని నాకు విశ్వాసం ఉంది.
2TI 1:13 నేను నీకు బోధించిన ఉపదేశాలను ఆదర్శంగా పెట్టుకో. యేసు క్రీస్తులో వాటిని విశ్వాసంతో, ప్రేమతో వాటిని మార్గదర్శంగా ఉంచుకో.
2TI 1:14 దేవుడు దాచమని నీకు అప్పగించిన గొప్ప సత్యాన్ని, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయముతో కాపాడు.
2TI 1:15 ఆసియ ప్రాంతములో ఉన్న వాళ్ళంతా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపొయ్యారని నీకు తెలుసు. “పుగెల్లు” “హెర్మొగెనే” కూడా నన్ను వదిలి వెళ్ళిపొయ్యారు.
2TI 1:16 నా చేతికి సంకెళ్ళు ఉన్నాయని సంకోచించక “ఒనేసిఫోరు” ఎన్నోసార్లు వచ్చాడు. అది నాకు చాలా ఆనందం కలిగించింది. అతని కుటుంబాన్ని దేవుడు కాపాడు గాక!
2TI 1:17 అంతేకాక అతడు రోములో ఉన్నప్పుడు నేను కనిపించేవరకు నా కోసం కష్టపడి వెతికాడు.
2TI 1:18 ఆ “రానున్న రోజున” కనికరము పొందేటట్లు ప్రభువు అతనికి కృప అనుగ్రహించుగాక! నేను ఎఫెసులో ఉన్నప్పుడు అతడు నాకు ఎన్ని విధాల సహాయం చేసాడో నీకు బాగా తెలుసు.
2TI 2:1 నా కుమారుడా! యేసు క్రీస్తులోనున్న కృప ద్వారా బలవంతుడుగా నుండు.
2TI 2:2 నేను బోధించిన వాటిని నీవు విన్నావు. వాటిని నేను అనేకుల సమక్షంలో బోధించాను. ఆ ఉపదేశాలను నీవు నమ్మగల వాళ్ళకు, యితరులకు బోధించగల సామర్థ్యము ఉన్న వాళ్ళకు అప్పగించు.
2TI 2:3 యేసు క్రీస్తుకు మంచి సైనికునివలే, మాతో కలిసి విశ్వాసంతో కష్టాలు సహించు.
2TI 2:4 సైనికునిగా పని చేసేవాడు సామాన్య ప్రజల విషయాల్లో తలదూర్చడు. గాని అతడు, తన సైన్యాధిపతిని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు.
2TI 2:5 అదే విధంగా ఆట పందెంలో పాల్గొనేవాడు ఆ ఆట నియమాల్ని పాటిస్తే కాని విజయం సాధించలేడు.
2TI 2:6 కష్టించి పని చేసే రైతుకు, వచ్చిన పంటలో భాగము అందరికన్నా ముందు లభిస్తుంది.
2TI 2:7 నేను చెప్పే వాటిని గురించి ఆలోచించు. ప్రభువు నీకు వీటన్నిటిని గురించి తెలుసుకొనే జ్ఞానం కల్గిస్తాడు.
2TI 2:8 దావీదు వంశానికి చెందిన యేసు క్రీస్తు బ్రతికింపబడ్డాడన్న విషయం జ్ఞాపకం పెట్టుకో. ఇదే నేను బోధించే సువార్త.
2TI 2:9 ఈ సువార్త బోధించటం వల్ల నేను సంకెళ్ళతో నేరస్తునివలె కష్టాలు అనుభవిస్తున్నాను. కాని దేవుని సందేశానికి సంకెళ్ళు లేవు.
2TI 2:10 కనుకనే, దేవుడు ఎన్నుకొన్న వాళ్ళ కోసం ఈ కష్టాలు సహిస్తున్నాను. యేసుక్రీస్తు వల్ల లభించే రక్షణ, శాశ్వతమైన మహిమ, వాళ్ళకు కూడా లభించాలని నా అభిలాష.
2TI 2:11 ఈ విషయము నమ్మటానికి యోగ్యమైంది: మనం ఆయనతో సహా మరణిస్తే ఆయనతో కలిసి జీవిస్తాం.
2TI 2:12 మనం సహిస్తే ఆయనతో కలిసి రాజ్యం చేస్తాం! మనం ఆయన్ని కాదంటే ఆయన మనల్ని కాదంటాడు.
2TI 2:13 మనం నమ్మతగని వాళ్ళమైనా ఆయన నమ్మతగినవాడుగానే ఉంటాడు. తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు.
2TI 2:14 వాళ్ళకు ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉండు. వ్యర్థమైన మాటల్ని గురించి వాదించరాదని దేవుని సమక్షంలో వాళ్ళను వాదించు. అలాంటి వాదనవల్ల ఏ లాభం కలుగదు. పైగా విన్నవాళ్ళను అది పాడుచేస్తుంది.
2TI 2:15 దేవుని సమక్షంలో ఆయన అంగీకారం పొందే విధంగా నీ శక్తికి తగినట్లు కృషి చేయి. అప్పుడు నీవు చేస్తున్న పనికి సిగ్గు పడనవసరం ఉండదు. సత్యాన్ని సక్రమంగా బోధించు.
2TI 2:16 విశ్వాస హీనమైన మాటలు, పనికి రాని మాటలు మాట్లాడవద్దు. అలాంటి వాళ్ళు దేవునికి యింకా దూరమైపోతారు.
2TI 2:17 వీళ్ళ బోధన పైకి కనిపించని వ్యాధిలా వ్యాపిస్తుంది. హుమెనైయు, ఫిలేతు, ఈ గుంపుకు చెందిన వాళ్ళు.
2TI 2:18 వీళ్ళు సత్యాన్ని విడిచి తప్పు దారి పట్టారు. పునరుత్థానం జరిగిపోయిందని చెప్పి కొందరి విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు.
2TI 2:19 అయినా, దేవుడు వేసిన పునాది గట్టిది. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఈ పునాదిపై, “తనవాళ్ళెవరో ప్రభువుకు తెలుసు. ప్రభువు నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కడు దుర్మార్గాలు వదిలి వెయ్యాలి” అని వ్రాయబడి ఉంది.
2TI 2:20 గొప్ప వాళ్ళ యిండ్లలో వెండి, బంగారు వస్తువులే కాక, చెక్కతో మట్టితో చేయబడిన వస్తువులు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉపయోగించేవి, మరికొన్ని ప్రతిరోజు ఉపయోగించేవి.
2TI 2:21 దుర్మార్గాలను వదిలినవాణ్ణి దేవుడు ప్రత్యేకమైన కార్యాలకు ఉపయోగిస్తాడు. అలాంటివాడు పవిత్రంగా ఉండి దేవునికి ఉపయోగకరంగా ఉంటాడు. మంచి కార్యాలను చేయటానికి సిద్ధంగా ఉంటాడు.
2TI 2:22 యవ్వనంలో కలిగే చెడు కోరికలకు దూరంగా ఉండు. ప్రభువును పవిత్ర హృదయంతో కొలిచే వాళ్ళతో కలిసి నీతిని విశ్వాసాన్ని ప్రేమను, శాంతిని అనుసరించు.
2TI 2:23 కొందరు అర్థం లేకుండా మూర్ఖంగా వాదిస్తారు. అవి పోట్లాటలకు దారి తీస్తాయని నీకు తెలుసు. కనుక అలాంటి వివాదాల్లో పాల్గొనవద్దు.
2TI 2:24 అంతేకాక ప్రభువు సేవకుడు పోట్లాడరాదు. అందరి పట్ల దయ చూపాలి. బోధించ కలిగి ఉండాలి. సహనం ఉండాలి.
2TI 2:25 తనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు శాంతంగా బోధించాలి. వాళ్ళ హృదయాలు మార్చి దేవుడు వాళ్ళకు సత్యం తెలుసుకోనే మార్గం చూపిస్తాడని ఆశించాలి.
2TI 2:26 అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చి సైతాను వేసిన వలనుండి తప్పించుకోగల్గుతారు. ఎందుకంటే సైతాను వాళ్ళను తన యిచ్ఛ నెరవేర్ఛటానికి బంధించి పెట్టాడు.
2TI 3:1 ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. చివరి రోజులు ఘోరంగా ఉంటాయి.
2TI 3:2 మనుష్యుల్లో స్వార్థం, ధనంపై ఆశ, గొప్పలు చెప్పుకోవటం, గర్వం, దూషణ, తల్లితండ్రుల పట్ల అవిధేయత, కృతఘ్నత, అపవిత్రత,
2TI 3:3 ప్రేమలేని తనం, క్షమించలేని గుణం, దూషించే గుణం, మనోనిగ్రహం లేకుండుట, మంచిని ప్రేమించకుండటం,
2TI 3:4 ద్రోహబద్ధి, దురుసుతనం, అహంభావం, దేవునికంటె సుఖాన్ని ప్రేమించటం.
2TI 3:5 పైకి భక్తిపరుల్లా వుండి దాని శక్తిని అంగీకరించకుండటం, అలాంటి వాటికి దూరంగా ఉండు.
2TI 3:6 వాళ్ళు యిళ్ళల్లోకి చొరబడి, దురాశల్లో చిక్కుకు పోయి, పాపాలతో జీవిస్తున్న బలహీనమైన మనస్సుగల స్త్రీలను లోబరచుకొంటారు.
2TI 3:7 ఈ స్త్రీలు ఎప్పుడూ నేర్చుకొంటారు. కాని, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు.
2TI 3:8 యన్నే, మరియు యంబ్రే అనువారు మోషేను ఎదిరించిన విధంగా వీళ్ళ బుద్ధులు పాడై సత్యాన్ని ఎదిరిస్తున్నారు. మనం నమ్ముతున్న సత్యాన్ని వీళ్ళు నమ్మలేక పోతున్నారు.
2TI 3:9 వీళ్ళు ముందుకు పోలేరు. మోషేను ఎదిరించిన వాళ్ళలాగే వీళ్ళ అవివేకం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.
2TI 3:10 కాని, నీకు నా ఉపదేశాలు, నా జీవితం, నా ఉద్దేశ్యం, నా విశ్వాసం, నా శాంతం, నా ప్రేమ, నా సహనం,
2TI 3:11 అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర పట్టణాల్లో నేను అనుభవించిన హింసలు, నా బాధలు, ఇవన్ని పూర్తిగా తెలుసు. ఇన్ని జరిగినా దేవుడు నన్ను వీటినుండి రక్షించాడు.
2TI 3:12 యేసు క్రీస్తులో ఆధ్యాత్మికంగా జీవించాలనుకొన్న ప్రతీ ఒక్కడూ హింసింపబడతాడు.
2TI 3:13 దుష్టులు, వేషధారులు, మోసంచేస్తూ, మోసపోతూ ఉంటారు. ఇది రోజు రోజుకూ అధికమవుతుంది.
2TI 3:14 కాని, నీవు ఎవరినుండి నేర్చుకొన్నావో తెలుసు. కనుక, నీవు నేర్చుకొన్న వాటిని, విశ్వసించిన వాటిని పాటిస్తూ ఉండు.
2TI 3:15 అంతే కాక, నీవు నీ చిన్ననాటినుండి పవిత్ర గ్రంథాలు తెలిసిన వాడవు. అవి నీలో జ్ఞానం కలిగించి యేసు క్రీస్తు పట్ల నీకున్న విశ్వాసం మూలంగా రక్షణను ప్రసాదించాయి.
2TI 3:16 లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపింపబడినవి. నీతిని బోధించటానికి, గద్దించటానికి, సరిదిద్దటానికి, నీతి విషయం తర్ఫీదు చేయటానికి, ఉపయోగపడతాయి.
2TI 3:17 వీటి ద్వారా దైవజనుడు ప్రతి మంచి కార్యాన్ని చేయటానికి సంపూర్ణంగా తయారుకాగలడు.
2TI 4:1 చనిపోయిన వాళ్ళపై, బతికివున్న వాళ్ళపై తీర్పు చెప్పే దేవుని సమక్షంలో యేసు క్రీస్తు సమక్షంలో నీకొక ఆజ్ఞ యిస్తున్నాను. ఆయన ప్రత్యక్షం కానున్నాడు కనుక, ఆయన రాజ్యం రానున్నది కనుక, నీకీ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను.
2TI 4:2 దైవసందేశాన్ని ప్రకటించు. అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండు. తప్పులు సరిదిద్దుతూ, అవసరమైతే గద్దిస్తూ, ప్రోత్సాహమిస్తూ, సహనంతో భోదిస్తూ ఉండు.
2TI 4:3 ప్రజలు మంచి ఉపదేశాలు వినటం మాని వేసే సమయం వస్తుంది. వాళ్ళు తమ యిష్టం వచ్చినట్లు చేస్తారు. తాము వినదల్చిన లౌకికమైన వాటిని చెప్పగలిగే పండితుల్ని తమ చుట్టూ ప్రోగుచేసుకొంటారు.
2TI 4:4 సత్యం వినటం మాని, పురాణాలను వింటారు.
2TI 4:5 కాని అన్ని విషయాల్లో నిగ్రహంగా ఉండు. కష్టాలు ఓర్చుకో. సువార్త ప్రచారం చెయ్యటానికి కష్టించి పనిచెయ్యి. నీ సేవా సంబంధంలో చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తిగా నిర్వర్తించు.
2TI 4:6 నా ప్రాణాలు ధారపోయవలసిన గడియ దగ్గరకు వచ్చింది. నేను వెళ్ళే సమయం వచ్చింది.
2TI 4:7 ఈ పోటీలో నేను బాగా పరుగెత్తాను. విశ్వాసాన్ని వదులుకోకుండా పందెం ముగించాను.
2TI 4:8 ఇప్పుడు “నీతి” అనే కీరీటం నా కోసం కాచుకొని ఉంది. నీతిగా తీర్పు చెప్పే ప్రభువు “ఆ రానున్న రోజు” దాన్ని నాకు బహుమతిగా యిస్తాడు. నాకే కాక, ఆయన రాక కోసం నిరీక్షిస్తున్న వాళ్ళందరికీ ఆ బహుమతి లభిస్తుంది.
2TI 4:9 నా దగ్గరకు త్వరలో రావటానికి సాధ్యమైనంత ప్రయత్నం చెయ్యి.
2TI 4:10 ఎందుకంటే, “దేమా” ప్రపంచం మీద వ్యామోహం వల్ల నన్ను వదిలి థెస్సలొనీకకు వెళ్ళిపొయ్యాడు. క్రేస్కే, గలతీయకు వెళ్ళిపొయ్యాడు. తీతు, దల్మతియకు వెళ్ళిపొయ్యాడు.
2TI 4:11 లూకా మాత్రము నాతో ఉన్నాడు. మార్కు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని నీ వెంట పిలుచుకొని రా. నా ఈ సేవా కార్యక్రమంలో అతని సహాయం నాకు ఉపయోగపడుతుంది.
2TI 4:12 తుకికును ఎఫెసుకు పంపాను.
2TI 4:13 నేను త్రోయలో ఉన్నప్పుడు కర్పు యింట్లో నా అంగీ మరిచిపొయ్యాను. దాన్ని, గ్రంథాలను, ముఖ్యంగా తోలు కాగితాల గ్రంథాలను, తీసుకొనిరా.
2TI 4:14 కంచరి అలెక్సంద్రు నాకు చాలా అపకారం చేసాడు. అతడు చేసిన దానికి ప్రభువు అతనికి తగిన శిక్ష విధిస్తాడు.
2TI 4:15 అతడు మన సందేశాన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తాడు కనుక, అతని విషయంలో నీవు కూడా జాగ్రత్తగా ఉండు.
2TI 4:16 నా విషయంలో మొదటి సారి విచారణ జరిగినప్పుడు నాకు ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. అందరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపొయ్యారు. దేవుడు వాళ్ళను క్షమించు గాక!
2TI 4:17 నా ద్వరా సువార్త ప్రకటింపబడాలని యూదులుకాని వాళ్ళందరు వినాలని ప్రభువు నా ప్రక్కన నిలబడి నాకు శక్తినిచ్చాడు. సింహాల నోటినుండి నన్ను కాపాడాడు.
2TI 4:18 ప్రభువు నాకు ఏ విధమైన కీడు సంభవించకుండా నన్ను కాపాడి, క్షేమంగా పరలోకంలో ఉన్న తన రాజ్యానికి పిలుచుకు వెళ్తాడు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
2TI 4:19 ప్రిస్కిల్లను, అకులను, ఒనేసిఫోరు కుటుంబం వాళ్ళకు నా వందనాలు చెప్పు.
2TI 4:20 ఎరస్తు, కొరింథులోనే ఉండిపొయ్యాడు. త్రోఫిము జబ్బుతో ఉండటం వల్ల అతణ్ణి మిలేతులో వదలవలసి వచ్చింది.
2TI 4:21 చలి కాలానికి ముందే నీవిక్కడికి రావటానికి గట్టిగా ప్రయత్నించు. యుబూలు, పుదే, లిను, క్లౌదియ, మిగతా సోదరులందరు నీకు వందనాలు చెప్పుచున్నారు.
2TI 4:22 ప్రభువు నీ ఆత్మకు తోడైయుండును గాక! దైవానుగ్రహం నీపై ఉండుగాక!
TIT 1:1 దేవుని సేవకుడును, యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడయినటువంటి పౌలు నుండి, దేవుడు తానెన్నుకున్న ప్రజల విశ్వాసాన్ని ధృఢపరచడానికి, వాళ్ళను భక్తి కల్గించే మన సత్యం వైపు మళ్ళించటానికి నన్ను ఎన్నుకొన్నాడు.
TIT 1:2 ఈ సత్యం, అనంత జీవితం లభిస్తుందని విశ్వసించటంపై ఆధారపడి ఉంది. అబద్ధం ఆడని దేవుడు మనకీ జీవితం యిస్తానని కాలానికి ముందే వాగ్దానం చేసాడు.
TIT 1:3 సరియైన సమయానికి దాన్ని తన సందేశం ద్వారా మనకు తెలియచేసాడు. ఈ సందేశం నాకప్పగింపబడింది. మన రక్షకుడైనటువంటి దేవుడు దాన్ని మీకు ప్రకటించుమని ఆజ్ఞాపించాడు. కనుక దాన్ని మీకు ప్రకటిస్తున్నాను.
TIT 1:4 మనలో ఉన్న విశ్వాసం మూలంగా నా ప్రియ కుమారునిగా భావిస్తున్న తీతుకు వ్రాయుటమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన రక్షకుడైన యేసు క్రీస్తునుండి నీకు శాంతి, కృప లభించుగాక!
TIT 1:5 అసంపూర్ణంగా వదిలి వేయబడిన వాటిని పూర్తి చేయటానికి, నేను ఆదేశించిన విధంగా ప్రతి పట్టణంలో పెద్దలను నియమించటానికి నిన్ను క్రేతులో వదిలి వచ్చాను.
TIT 1:6 క్రీస్తు సంఘంలోయున్న అధ్యక్షుడు నిందారహితుడై, ఏకపత్నీ వ్రతుడై ఉండాలి. తన పిల్లలు అవిధేయతగా ఉండక అవినీతిగా ఉండక చెడ్డపేరు లేకుండా విశ్వసించిన వాళ్ళుగా ఉండాలి.
TIT 1:7 సంఘాధ్యక్షుడు దైవకార్యాన్ని నడిపించే బాధ్యత కలవాడు కనుక అతడు నిందారహితుడై ఉండాలి. అతనిలో గర్వము ఉండరాదు. ముక్కోపి కాకూడదు. త్రాగుబోతు కాకూడదు. పోట్లాడరాదు. అధర్మంగా లాభాలు సంపాదించ రాదు.
TIT 1:8 అతిథులను పరామర్శించే వాడైయుండాలి. మంచి పనులు చెయ్యాలి. మనో నిగ్రహం, నీతి, పవిత్రత, క్రమశిక్షణ మొదలగు గుణాలు అతనిలో ఉండాలి.
TIT 1:9 తనకు బోధింపబడిన సందేశాన్ని విశ్వాసంతో ఆచరించాలి. అప్పుడే యితరులకు ఈ గొప్ప సత్యాన్ని చెప్పి వాళ్ళను కూడా ప్రోత్సాహపరచగలడు. ఈ సందేశాన్ని అంగీకరించని వాళ్ళకు వాళ్ళు చేస్తున్న తప్పు చూపగలడు.
TIT 1:10 తాము అవిధేయతగా ఉంటూ, అధికంగా మాట్లాడి నమ్మించాలని ప్రయత్నించే మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సున్నతి అవసరమని వాదించే యూదులు ఈ విధంగా చేస్తున్నారు.
TIT 1:11 అన్యాయంగా లాభం గడించటానికి బోధించరాని విషయాలు బోధించి కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళను ఆపటం అవసరం.
TIT 1:12 “క్రేతీయులు అబద్ధాలాడుతున్నారనీ, క్రూర మృగాల్లాంటి వాళ్ళనీ, సోమరిపోతులనీ, తిండి పోతులనీ” క్రేతీయులలో ప్రవక్త ఒకడు అన్నాడు.
TIT 1:13 ఈ సాక్ష్యము నిజము. వాళ్ళను గట్టిగా వారించటం అవసరం. అలా చేస్తే, వాళ్ళ విశ్వాసం ధృఢమౌతుంది.
TIT 1:14 అప్పుడు వాళ్ళు యూదుల కల్పిత కథలను మరిచిపోయి, మన సత్యాన్ని నిరాకరించే వాళ్ళ బోధలను లెక్క చెయ్యరు.
TIT 1:15 పవిత్రంగా ఉన్నవాళ్ళకు అన్నీ పవిత్రంగా కనిపిస్తాయి. కాని దుష్టులకు, విశ్వాసం లేని వాళ్ళకు ఏదీ పవిత్రంగా కనిపించదు. వాళ్ళ బుద్ధులు, మనస్సులు చెడుతో నిండి ఉంటాయి.
TIT 1:16 వాళ్ళు తమకు దేవుని గురించి తెలుసునంటారు కాని, వాళ్ళ ప్రవర్తన ఆ దేవుణ్ణి నిరాకరిస్తున్నట్లు చూపిస్తుంది. వాళ్ళు ద్వేషంతో, అవిధేయతతో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి పని చేయటానికి అంగీకరించరు.
TIT 2:1 ఉత్తమ సిద్ధాంతాల ప్రకారం సత్యాన్ని అనుసరించుమని ప్రజలకు బోధించు.
TIT 2:2 వృద్ధులకు శాంతంగా ఉండుమని, గౌరవంగా జీవించుమని, ఆత్మనిగ్రహం, సంపూర్ణమైన విశ్వాసం, ప్రేమ, సహనము కలిగి ఉండుమని బోధించు.
TIT 2:3 అదే విధంగా వృద్ధ స్త్రీలకు పవిత్రంగా జీవించుమని, ఇతర్లను దూషించకూడదని, త్రాగుబోతులు కాకూడదని, మంచిని మాత్రమే ఉపదేశమిమ్మని చెప్పు.
TIT 2:4 అలా చేస్తే వాళ్ళు యౌవన స్త్రీలకు తమ భర్తల్ని, తమ పిల్లల్ని ప్రేమించాలని,
TIT 2:5 ఆత్మనిగ్రహం కలిగి ఉండి పవిత్రంగా జీవించాలని, తమ గృహనిర్వాహక కర్తవ్యాలను పూర్తి చెయ్యాలని, దయను అలవరచుకోవాలని, వారి భర్తలకు విధేయతగా ఉండాలని ఉపదేశించి శిక్షణనిస్తారు. అప్పుడు దైవసందేశాన్ని ఎవ్వరూ విమర్శించరు.
TIT 2:6 అదే విధంగా మనోనిగ్రహం కలిగి ఉండుమని యువకులకు భోధించు.
TIT 2:7 నీవు స్వయంగా ఉత్తమ కార్యాలు చేస్తూ వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. నీవు బోధించేటప్పుడు మనస్పూర్తిగా, గంభీరంగా బోధించు.
TIT 2:8 విమర్శకు గురికాకుండా జాగ్రత్తగా బోధించు. అప్పుడు నీ శత్రువు విమర్శించటానికి ఆస్కారం దొరకక సిగ్గుపడతారు.
TIT 2:9 బానిసలు తమ యజమానుల యిష్టానుసారం నడుచుకోవాలని బోధించు. తమ యజమానులకు ఆనందం కలిగేటట్లు మసలుకోవాలనీ, వాళ్ళకు ఎదురు తిరిగి మాట్లాడరాదని వాళ్ళకు బోధించు.
TIT 2:10 తమ యజమానులనుండి, దొంగిలించరాదనీ, తమ యజమానులు తమను విశ్వసించేటట్లు నడుచుకోవాలనీ బోధించు. అప్పుడే మన రక్షకుడైన దేవుని గురించి నేర్చుకొన్నవి సార్థకమౌతాయి.
TIT 2:11 ఎందుకంటే, మానవులకు రక్షణ కలిగించే దైవానుగ్రహం అందరికి ప్రత్యక్షమైంది.
TIT 2:12 అది నాస్తికత్వాన్ని, ఐహిక దురాశల్ని మానివేయుమని బోధిస్తుంది. మనోనిగ్రహం కలిగి, క్రమశిక్షణతో, ఆత్మీయంగా ఈ ప్రపంచంలో జీవించుమని బోధిస్తుంది,
TIT 2:13 మనం ఆశిస్తున్న ఆ గొప్ప రోజు వస్తుందని, ఆ రోజున మన గొప్ప దేవుడునూ మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కనిపిస్తాడని నిరీక్షిస్తూ ఉన్నాము.
TIT 2:14 అన్ని పాపాలనుండి మనకు విముక్తి కలగాలని యేసు క్రీస్తు తనను తాను అర్పించుకొన్నాడు. సత్కార్యాలు చెయ్యాలని ఉత్సాహపడుతున్న ఈ ప్రజలు ఈ యేసు క్రీస్తుకు చెందిన వాళ్ళు. ఆయన వాళ్ళను తనకోసం పవిత్రంగా చేసాడు.
TIT 2:15 నీవు ఈ విషయాలను బోధించాలి. సంపూర్ణమైన అధికారంతో ప్రజలను ఉత్సాహపరుస్తూ, ఖండిస్తూ, నిన్ను ఎవ్వరూ ద్వేషించకుండా జాగ్రత్త పడుము.
TIT 3:1 పాలకులు, అధికారులు ఆజ్ఞాపించినట్లు నడుచుకోమని ప్రజలకు జ్ఞాపకం చేయి. విధేయతగా ఉండుమని, సత్కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉండుమని బోధించు.
TIT 3:2 ఇతర్లను దూషించకుండా శాంతిని, మంచితనాన్ని అలవర్చుకోమని, అందరిపట్ల దయ చూపుమని బోధించు.
TIT 3:3 గతంలో మనం కూడా మూర్ఖంగా, అవిధేయంగా ఉంటిమి. తప్పులు చేస్తూ మానసిక వాంఛలకు, సుఖాలకులోనై అసూయతో యితర్ల చెడును కోరుతూ, ద్వేషిస్తూ, ద్వేషింపబడుతూ జీవించాము.
TIT 3:4 అలాంటి సమయంలో మన రక్షకుడైనటువంటి దేవుని దయ, ప్రేమ మనకు కనిపించాయి.
TIT 3:5 మనం నీతికార్యాలు చేసినందుకు ఆయన మనలను రక్షించలేదు కాని తన కృప ద్వారానే మనల్ని పవిత్రపరచి, మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ పునర్జన్మ కల్గించాడు. క్రొత్త జీవితాన్నిచ్చి, మనల్ని రక్షించాడు.
TIT 3:6 పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ధారాళంగా మనపై కురిపించాడు.
TIT 3:7 ఆయన అనుగ్రహం వల్ల మనం నీతిమంతులంగా వారసులం కావాలని ఆయన ఉద్దేశ్యం. ఈ విధంగా మనమాశిస్తున్న అనంత జీవితం పొందగలుగుతాము.
TIT 3:8 ఇది నిజం. నీవు ఈ విషయాన్ని నొక్కి చెప్పాలి. అలా చేస్తే దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండి, మంచి చేయటంలో నిమగ్నులౌతారు. ఇది మంచిది. దాని వలన ప్రజలకు లాభం కలుగుతుంది.
TIT 3:9 కాని మూర్ఖంగా వాదించే వాళ్ళకు, వంశ చరిత్రల్ని చర్చించే వాళ్ళకు, ధర్మశాస్త్రాన్ని గురించి వాదించే వాళ్ళకు, పోట్లాడే వాళ్ళకు దూరంగా ఉండు. అలాంటి చర్చలవల్ల ఉపయోగమేమీ ఉండదు. వాటివల్ల లాభం కలుగదు.
TIT 3:10 చీలికలు కలిగించే వాణ్ణి ఒకటి రెండు సార్లు గద్దించు. ఆ తర్వాత అతనితో సంబంధం తెంపుకో.
TIT 3:11 అలాంటివాడు దుర్మార్గుడని, పాపి అని నీకు బాగా తెలుసు. అతడు తనకు తాను శిక్ష విధించుకొన్నాడు.
TIT 3:12 అర్తెమానును, తుకికును, నీ దగ్గరకు పంపిన తక్షణం నీవు నికొపొలికి వచ్చి నన్ను కలుసుకో. ఈ చలికాలం నేనక్కడ గడపదలిచాను.
TIT 3:13 న్యాయవాది జేనా, అపొల్లోల ప్రయాణానికి కావలసినవన్నీ సమకూర్చి వాళ్ళకు సహాయం చెయ్యి.
TIT 3:14 మన వాళ్ళు సత్కార్యాలు చేయటానికి నేర్చుకొని వాటిలో నిమగ్నులై ఉండాలి. తమ నిత్యావసరాలకు కావలిసినవి సంపాదించుకోవాలి. వ్యర్థంగా జీవించకూడదు.
TIT 3:15 నాతో ఉన్న వాళ్ళు నీకు వందనాలు తెలుపుతున్నారు. విశ్వాసం మూలంగా మన స్నేహితులైన వాళ్ళకు నా శుభాకాంక్షలను తెలుపుము. మీ అందరిపై దేవుని కృప ఉండునుగాక!
PHM 1:1 యేసు క్రీస్తు కోసం ఖైదీనైన పౌలును మరియు మన సోదరుడైన తిమోతియు, మా ప్రియ తపనివాడైన ఫిలేమోనుకు,
PHM 1:2 మరియు మన సోదరి అప్పియకు, మనతో సహా పోరాటం సాగిస్తున్న అర్ఖిప్పుకు, మీ యింట్లో సమావేశమయ్యే సంఘానికి వ్రాస్తున్న సంగతులు:
PHM 1:3 మన తండ్రియైన దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని అనుగ్రహించి మీకు శాంతి ప్రసాదించు గాక!
PHM 1:4 కాబట్టి నేను ప్రార్థలను చేసినప్పుడెల్లా నిన్ను జ్ఞాపకం పెట్టుకొని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను.
PHM 1:5 యేసు ప్రభువు పట్ల నీకున్న భక్తిని గురించి, భక్తులపట్ల నీకున్న ప్రేమను గురించి నేను విన్నాను.
PHM 1:6 క్రీస్తు మనకు చేసిన మంచిని నీవు పూర్తిగా అర్థం చేసుకోవాలనీ, తద్వారా మన విశ్వాసాన్ని నీవు యితరులతో ఉత్సాహంగా పంచుకోగల్గాలనీ నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
PHM 1:7 సోదరా! నీవు భక్తులకు సహాయం చేసి వాళ్ళను ఆనందపరిచావు. కనుక నీ ప్రేమ నాకు చాలా ఆనందమును, తృప్తిని కల్గించింది.
PHM 1:8 క్రీస్తు పేరిట నీవు చేయవలసిన కర్తవ్యాలను ఆజ్ఞాపించగల అధికారం నాకున్నా,
PHM 1:9 నేను ప్రేమతో నీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలను నేను, వయస్సు మళ్ళిన వాణ్ణిగా, యేసు క్రీస్తు ఖైదీని.
PHM 1:10 నా కుమారునితో సమానమైన ఒనేసిము విషయంలో నిన్ను ఒకటి వేడుకొంటున్నాను. నేను ఖైదీగా ఉన్నప్పుడు అతడు నా కుమారుడయ్యాడు.
PHM 1:11 గతంలో అతనివలన నీకు ఉపయోగం లేదు. కాని యిప్పుడు అతనివలన నీకూ, నాకూ, యిద్దరికీ ఉపయోగం ఉంది.
PHM 1:12 నా గుండెలాంటివాడైన అతణ్ణి తిరిగి నీ దగ్గరకు పంపుతున్నాను.
PHM 1:13 నేను సువార్త కారణంగా ఖైదీగా ఉన్నాను. ఈ సమయంలో నీ స్థానంలో అతడు నాకు సహాయం చేయాలని నా అభిలాష, కనుక అతణ్ణి నా దగ్గరే ఉంచుకోవాలనుకొన్నాను.
PHM 1:14 కాని నీ అనుమతి లేకుండా నేనిది చేయదలచుకోలేదు. నీవు చేసే ఈ సహాయం నా ఒత్తిడివల్ల కాకుండా నీ యిష్టం ప్రకారం చెయ్యాలని నా ఉద్దేశ్యం.
PHM 1:15 ఒనేసిము నీ నుండి కొంతకాలం దూరం అయ్యాడు. చిరకాలం నీ దగ్గర ఉండాలని యిలా జరిగిందేమో.
PHM 1:16 అతడు యిప్పుడు దాసుడు మాత్రమే కాదు. క్రీస్తును నమ్మిన మన ప్రియ సోదరుడు. అతడు నాకు చాలా దగ్గరి వాడు. తోటి మనిషిగా, ప్రభువువల్ల కలిగిన బంధంలో ఒక సోదరునిగా, అతన్ని నీవు యింకా దగ్గరివానిగా భావిస్తావు.
PHM 1:17 నీవు నన్ను నీ భాగస్వామిగా భావిస్తూన్నట్లయితే నాకు స్వాగతం చెప్పినట్లే, అతనికి కూడా స్వాగతం చెప్పు.
PHM 1:18 అతడు నీ పట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేక అతడు నీకు ఏదైనా అప్పు ఉంటే అది నా లెక్కలో వ్రాయి.
PHM 1:19 నేను ఆ అప్పును తీరుస్తానని పౌలు అను నేను నా స్వహస్తంతో వ్రాస్తున్నాను. కాని నీవు నీ జీవితంతో సహా నాకు బాకీ ఉన్నావని చెప్పనవసరం లేదు.
PHM 1:20 కనుక నా సోదరా! ప్రభువు కోసం దయచేసి నాకీ సహాయం చేయుము. క్రీస్తు కారణంగా మనం సోదరులం కనుక నాకీ తృప్తి కలిగించు.
PHM 1:21 నీ విధేయతపై నాకు నమ్మకం ఉంది. నేను అడిగిన దానికన్నా ఎక్కువే చేస్తావని నాకు తెలుసు. అందుకే నీకు వ్రాస్తున్నాను.
PHM 1:22 మరొక విషయం. అతిథుల కోసం ఉంచిన గదిని నా కోసం సిద్ధంగా ఉంచు. నీ ప్రార్థలను విని దేవుడు నన్ను నీ దగ్గరకు పంపుతాడని ఆశిస్తున్నాను.
PHM 1:23 యేసు క్రీస్తు నిమిత్తం నాతో సహా కారాగారంలో ఉన్న ఎపఫ్రా నీకు వందనాలు తెలుపమన్నాడు.
PHM 1:24 నాతో పని చేస్తున్న మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా కూడా నీకు వందనాలు తెలుపుతున్నారు.
PHM 1:25 యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం మీ ఆత్మకు తోడుగా ఉండుగాక!
HEB 1:1 దేవుడు గతంలో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు, ఎన్నోవిధాలుగా మన పూర్వీకులతో మాట్లాడాడు.
HEB 1:2 అన్నిటిపై తన కుమారుణ్ణి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ చివరి రోజుల్లో ఆయన ద్వారా మనతో మాట్లాడాడు.
HEB 1:3 కుమారుడు దేవుని మహిమ యోక్క ప్రకాశం. తండ్రి యొక్క ఉనికిలో పరిపూర్ణ ఉనికిగలవాడు. కుమారుడు శక్తివంతమైన తన మాటతో అన్నిటినీ పోషించి సంరక్షిస్తున్నాడు. పాపపరిహారం చేసాక ఈయన పరలోకంలోకి వెళ్ళాడు. అక్కడ, మహా తేజ స్వియైన దేవుని కుడివైపు కూర్చున్నాడు.
HEB 1:4 ఆయన దేవదూతలకన్నా గొప్పవాడు. దానికి తగ్గట్టుగా ఆయన గొప్ప పేరు కూడా వారసత్వం పొందాడు. దేవదూతలకన్నా కుమారుడు గొప్పవాడు.
HEB 1:5 ఎందుకంటే దేవుడు ఏ దేవదూతతో కూడా ఈ విధంగా అనలేదు: “నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినయ్యాను.” మరొక చోట: “నేనతనికి తండ్రి నౌతాను. అతడు నా కుమారుడౌతాడు.”
HEB 1:6 మరొకచోట, దేవుడు తన మొదటి సంతానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ విధంగా అన్నాడు: “దేవదూతలు ఆయన్ని ఆరాధించాలి!”
HEB 1:7 దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ: “దేవుడు తన దూతల్ని ఆత్నలుగాను తన సేవకుల్ని అగ్ని జ్వాలల్లా చేస్తాడు!”
HEB 1:8 కాని కుమారుణ్ణి గురించి ఈ విధంగా అన్నాడు: “ఓ దేవా! నీ సింహాసనం చిరకాలం వుంటుంది. నీతి నీ రాజ్యానికి రాజదండంగా వుంటుంది.
HEB 1:9 నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు. అందువల్ల దేవుడు! నీ దేవుడు ఆనందమనే నూనెతో నిన్ను అభిషేకించి నీ స్నేహితులందరి కన్నా నిన్ను అధికంగా గౌరవించాడు.”
HEB 1:10 ఆయనింకా ఈ విధంగా అన్నాడు: “ఓ ప్రభూ! ఆదిలో ఈ ప్రపంచానికి నీవు పునాదులు వేశావు. ఆకాశాలను నీ చేతుల్తో సృష్టించావు.
HEB 1:11 అవి నశించి పోతాయి ఒక వస్త్రంలా పాత బడతాయి. కాని, నీవు చిరకాలం వుంటావు.
HEB 1:12 వాటిని నీవు ఒక వస్త్రంలా మడుస్తావు. వాటిని నీవు దుస్తులు మార్చినట్లు మారుస్తావు. కాని నీవు మాత్రం అలాగే వుంటావు! నీ సంవత్సరములకు అంతంలేదు!”
HEB 1:13 దేవుడు ఏ దేవదూతతోనైనా: “నీ శత్రువుల్ని నీ పాద పీఠంగా చేసే వరకు నా కుడివైపు కూర్చో,” అని ఎన్నడైనా అన్నాడా?
HEB 1:14 ఈ దేవదూతలందరూ సేవ చేయటానికి వచ్చిన ఆత్మలే కదా! రక్షణ పొందే వ్యక్తుల సేవ చేయటానికే గదా దేవుడు వీళ్ళను పంపింది?
HEB 2:1 అందువల్ల, మనం విన్న సత్యాలను మనం ముందు కన్నా యింకా ఎక్కువ జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడే మనం వాటికి దూరమైపోము.
HEB 2:2 దేవదూతలు చెప్పిన సందేశంలో సత్యం ఉందని రుజువైంది. ఆ సందేశాన్ని అనుసరించని వానికి దాన్ని వినని వానికి తగిన శిక్ష లభించింది.
HEB 2:3 మరి, అటువంటి మహత్తరమైన రక్షణను మనం గమనించకపోతే శిక్షనుండి ఏ విధంగా తప్పించుకోగలం? ఈ రక్షణను గురించి మొట్ట మొదట మన ప్రభువు ప్రకటించాడు. ఆ సందేశాన్ని విన్నవాళ్ళు అందులో వున్న సత్యాన్ని మనకు వెల్లడిచేసారు.
HEB 2:4 దేవుడు ఎన్నో సూచనల్ని, అద్భుతాల్ని, మహిమల్ని చూపాడు. తన యిష్టానుసారం పరిశుద్ధాత్మ యొక్క వరాల్ని పంచి పెట్టాడు. తద్వారా ఆ సందేశంలో ఉన్న సత్యాన్ని మనకు రుజువు చేసాడు.
HEB 2:5 మనం మాట్లాడుతున్న ప్రపంచాన్ని, అంటే రాబోవు ప్రపంచాన్ని దేవుడు తన దూతలకు లోపర్చ లేదు.
HEB 2:6 ధర్మశాస్త్రంలో ఒకచోట ఈ విధంగా వ్రాయబడింది: “మానవుణ్ణి గురించి నీవాలోచించటానికి అతడెంతటి వాడు? మానవ కుమారుణ్ణి నీవు చూడడానికి అతడెంతటి వాడు?
HEB 2:7 నీవతనికి దేవదూతలకన్నా కొద్దిగా తక్కువ స్థానాన్ని యిచ్చావు! మహిమ గౌరవమనే కిరీటాన్ని నీవతనికి తొడిగించి,
HEB 2:8 అన్నిటినీ అతని పాదాల క్రింద వుంచావు.” దేవుడు అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు అంటే, ప్రతి ఒక్కటి ఆయన అధికారానికి లోబడి ఉండాలన్నమాట. కాని ప్రస్తుతం, అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నట్లు మనకు కనిపించటం లేదు.
HEB 2:9 యేసు, దేవదూతల కన్నా కొంత తక్కువ వానిగా చేయబడ్డాడు. అంటే ఆయన మానవులందరి కోసం మరణించాలని, దేవుడాయన్ని అనుగ్రహించి ఈ తక్కువ స్థానం ఆయనకు యిచ్చాడు. యేసు కష్టాలను అనుభవించి మరణించటంవలన ‘మహిమ, గౌరవము’ అనే కిరీటాన్ని ధరించగలిగాడు.
HEB 2:10 దేవుడు తన కుమారుల్లో చాలామంది తన మహిమలో భాగం పంచుకొనేటట్లు చెయ్యాలని, వాళ్ళ రక్షణకు కారకుడైనటువంటి యేసును కష్టాలనుభవింపజేసి, ఆయనలో పరిపూర్ణత కలుగ చేసాడు. ఎవరికోసం, ఎవరిద్వారా, ఈ ప్రపంచం సృష్టింపబడిందో ఆ దేవుడు ఈ విధంగా చేయటం ధర్మమే! యేసు మానవుల్ని పవిత్రం చేస్తాడు.
HEB 2:11 ఆయన పవిత్రం చేసిన ప్రజలు, పవిత్రం చేసే ఆయన ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. అందువలనే, వాళ్ళు తన సోదరులని చెప్పుకోవటానికి యేసు సిగ్గుపడటంలేదు.
HEB 2:12 ఆయన ఈ విధంగా అన్నాడు: “నిన్ను గురించి నా సోదరులకు తెలియ చేస్తాను. సభలో, నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను!”
HEB 2:13 మరొక చోట “నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!” అంతేకాక ఇలా కూడా అన్నాడు: “నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ ఉన్నాము!”
HEB 2:14 ఆయన “సంతానమని” పిలువబడిన వాళ్ళు రక్తమాంసాలుగల ప్రజలు. యేసు వాళ్ళలా అయిపోయి వాళ్ళ మానవనైజాన్ని పంచుకొన్నాడు. ఆయన తన మరణం ద్వారా మరణంపై అధికారమున్న సైతాన్ను నాశనం చేయాలని ఇలా చేశాడు.
HEB 2:15 తద్వారా జీవితాంతం మరణానికి భయపడి జీవించే వాళ్ళకు స్వేచ్ఛకలిగించాడు.
HEB 2:16 నిజానికి, ఆయన దేవదూతలకు సహయం చెయ్యాలని రాలేదు. అబ్రహము సంతానానికి సహయం చెయ్యాలని వచ్చాడు.
HEB 2:17 ఈ కారణంగా ఆయన అన్ని విధాల తన సోదరులను పోలి జన్మించవలసి వచ్చింది. ఆయన మహాయాజకుడై తన ప్రజలపై దయ చూపటానికి మానవ జన్మనెత్తాడు. ఆయన ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యాలని వారిలో ఒకడాయెను.
HEB 2:18 శోధన సమయాల్లో యేసు కష్టాలను అనుభవించాడు. కనుక యిప్పుడు శోధనలకు గురౌతున్న వాళ్ళకు ఆయన సహాయం చేయగలడు.
HEB 3:1 పరలోక దేవుని పిలుపులో పాలివారైన సోదరులారా! మీరు పవిత్రత గలవాళ్ళు. మనం బహిరంగంగా విశ్వసిస్తున్న ప్రధాన యాజకుడు, దేవుని అపొస్తలుడు అయినటువంటి యేసు పట్ల మీ మనస్సు లగ్నం చెయ్యండి.
HEB 3:2 మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అలాగే యేసు కూడా తనను నియమించిన దేవునియందు నమ్మకస్తుడుగా ఉండెను.
HEB 3:3 ఇంటికంటే, ఇల్లు కట్టిన వానికి ఎక్కువ గౌరవముంటుంది. అలాగే మోషే కన్నా యేసు ఎక్కువ గౌరవవానికి అర్హుడనిపించుకొన్నాడు.
HEB 3:4 ఎందుకంటే, ప్రతి ఇంటిని ఎవరో ఒకడు కడతాడు, కాని దేవుడు అన్నిటినీ నిర్మించాడు.
HEB 3:5 దేవుని ఇల్లంతటిలో మోషే సేవకునిగా విశ్వాసంతో పని చేసాడు. ఆ కారణంగా, చాలా కాలం తర్వాత మోషే జరుగబోవువాటికి సాక్షిగా ఉండెను.
HEB 3:6 కాని క్రీస్తు దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడైన కుమారుడు. మనం అతిశయించే నిరీక్షణ, ధైర్యంను గట్టిగా పట్టుకొన్న వారమైతే మనం ఆయన ఇల్లౌతాం. అందువల్ల మనం అశిస్తున్న దానికోసం, విశ్వాసంతో ధైర్యంగా ఉంటే ఆ యింటికి చెందిన వాళ్ళమౌతాము.
HEB 3:7 అందువల్ల పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు: “ఆనాడు ఎడారిలో మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు. ఆయన సహనాన్ని పరీక్షించారు. కాని నేడు మీరాయన మాట వింటే మీ హృదయాలు కఠిన పర్చుకోవద్దు.
HEB 3:9 నేను నలభై సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా మీ పూర్వీకులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు.
HEB 3:10 ఆ కారణంగానే, ఆ ప్రజలంటే నాకు కోపం వచ్చింది, ‘వాళ్ళ హృదయాలు పెడదారులు పట్టాయి, నేను చూపిన దారుల్ని వాళ్ళు చూడ లేదు’ అని అన్నాను.
HEB 3:11 అందుకే, ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వనని కోపంతో ప్రమాణం చేశాను.’”
HEB 3:12 సోదరులారా! సజీవంగా ఉన్న దేవునికి దూరమైపోయే హృదయంకాని, విశ్వాసంలేని హృదయంకాని, మీలో ఉండకుండా జాగ్రత్త పడండి.
HEB 3:13 ఆ “నేడు” అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మీలో మూర్ఖత్వం ఉండదు.
HEB 3:14 మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం.
HEB 3:15 ఇంతకు ముందు చెప్పబడినట్లు: “ఆనాడు మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు కాని, నేడు మీరాయన మాట వింటే అలా చెయ్యకండి.”
HEB 3:16 వీళ్ళందరూ ఈజిప్టు దేశంనుండి మోషే పిలిచుకొని వచ్చిన ప్రజలే కదా! దేవుని స్వరం విని ఎదురు తిరిగింది వీళ్ళే కదా!
HEB 3:17 నలభై సంవత్సరాలు దేవుడు కోపగించుకొన్నది ఎవరిమీద? పాపం చేసి ఎడారిలో పడి చనిపోయిన వాళ్ళమీదనే కదా!
HEB 3:18 “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని, అవిధేయతగా ప్రవర్తించిన వాళ్ళ విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదా?
HEB 3:19 వాళ్ళు విశ్వసించలేదు గనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపొయ్యారు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాము.
HEB 4:1 దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్ధానం యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం.
HEB 4:2 ఎందుకంటే, వాళ్ళకు ప్రకటింపబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కాని, వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక అది వాళ్ళకు నిష్ర్పయోజనమైపోయింది.
HEB 4:3 సువార్తను విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము. “నా కోపంతో ప్రమాణం చేసి చెప్పుచున్నాను: “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని దేవుడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన కార్యం ముగిసింది.
HEB 4:4 కాని, “దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను” అని ఏడవ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది.
HEB 4:5 దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు.
HEB 4:6 ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకావుంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్నవాళ్ళు, వాళ్ళ అవిధేయతవల్ల లోపలికి వెళ్ళలేక పొయ్యారు.
HEB 4:7 అందువల్ల దేవుడు మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని “ఈ రోజు” అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు చాలాకాలం తర్వాత దేవుడు దావుదు ద్వారా ఈ విధంగా మాట్లాడాడు: “ఈ రోజు మీరాయన స్వరం వింటే, మూర్ఖంగా ప్రవర్తించకండి.”
HEB 4:8 యోహూషువా వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడిఉండేవాడు కాదు.
HEB 4:9 అందువల్ల, దేవుని ప్రజల కోసం ‘విశ్రాంతి’ కాచుకొని ఉంది.
HEB 4:10 దేవుడు తన పని ముగించి విశ్రమించాడు. అలాగే, దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ప్రతి ఒక్కడూ తన పనినుండి విశ్రాంతి పొందుతాడు.
HEB 4:11 అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం.
HEB 4:12 దైవసందేశం సజీవమైంది. దానిలో చురుకుదనం ఉంది. అది రెండు వైపులా పదునుగానున్న కత్తికన్నా పదునైంది. అది చొచ్చుకొని పోయి ఆత్మను, ప్రాణాన్ని, కీళ్ళను, ఎముకలో ఉన్న మూలుగను విభాగించగలదు. అది మనస్సు యొక్క భావాలమీద, ఆలోచనల మీద తీర్పు చెప్పగలదు.
HEB 4:13 సృష్టిలో ఉన్న ఏ వస్తువూ దేవుని దృష్టినుండి తప్పించుకోలేదు. కళ్ళ ముందు పరచబడినట్లు ఆయనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం మనకు సంబంధించిన లెక్కల్ని చూపవలసి వుంటుంది.
HEB 4:14 పరలోకానికి వెళ్ళిన యేసు దేవుని కుమారుడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మనం బహిరంగంగా అంగీకరించిన విశ్వాసాన్ని విడువకుండా దృఢంగా ఉండాలి.
HEB 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను చూసి సానుభూతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనలాగే అన్ని రకాల పరీక్షలకు గురి అయ్యాడు. కాని, ఆయన ఏ పాపమూ చెయ్యలేదు.
HEB 4:16 అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా చేస్తే మనకు అవసరమున్నప్పుడు, ఆయన దయ, అనుగ్రహము మనకు లభిస్తాయి.
HEB 5:1 ఆధ్యాత్మిక విషయాల్లో, తమ పక్షాన పని చెయ్యటానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని ఎన్నుకొంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, బలుల్ని దేవునికి యితడు సమర్పిస్తాడు.
HEB 5:2 ఇతనిలో కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక, అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల యితడు సానుభూతి కనుబరుస్తాడు.
HEB 5:3 ఈ కారణంగానే, ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి వుంటుంది.
HEB 5:4 ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ, స్వయంగా ఆక్రమించలేరు దేవుడు అహరోనును పిలిచినట్లే ఈ స్థానాన్ని ఆక్రమించటానికి అర్హత గలవాణ్ణి పిలుస్తాడు.
HEB 5:5 క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో, “నీవు నా కుమారుడవు. నేడు నేను నీకు తండ్రినయ్యాను” అని చెప్పి మహిమ పరచెను.
HEB 5:6 మరొక చోట, ఇలా అన్నాడు: “నీవు మెల్కీసెదెకు వలె చిరకాలెం యాజకుడవై వుంటావు.”
HEB 5:7 యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను చావునుండి రక్షించగల దేవుణ్ణి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని పెద్ద స్వరంతో ప్రార్థించి వేడుకొన్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటంవల్ల దేవుడాయన విన్నపం విన్నాడు.
HEB 5:8 యేసు దేవుని కుమారుడైనా, తాననుభవించిన కష్టాల మూలంగా విధేయతతో ఉండటం నేర్చుకొన్నాడు.
HEB 5:9 పరిపూర్ణత పొందాక, తన పట్ల విధేయతగా ఉన్న వాళ్ళందరికీ శాశ్వతమైన రక్షణ ప్రసాదించ గలవాడయ్యాడు.
HEB 5:10 దేవుడు మెల్కీ సెదెకు యొక్క క్రమంలో యేసును ప్రధానయాజకునిగా నియమించాడు.
HEB 5:11 ఈ విషయాన్ని గురించి మేము చెప్పవలసింది ఎంతో ఉంది. కాని మీలో గ్రహించే శక్తి తక్కువగా ఉండటంవల్ల, విడమర్చి చెప్పటానికి చాలా కష్టమౌతుంది.
HEB 5:12 నిజం చెప్పాలంటే, మీకిదివరకే భోధించి ఉండవలసింది. కాని దైవసందేశంలోని ప్రాథమిక సత్యాలను మీకు మళ్ళీ నేర్పించవలసిన అవసరం కలుగుతోంది. అంటే, మీరు పాలు త్రాగగలరు కాని, ఆహారం తినగల శక్తి మీకింకా కలుగలేదు.
HEB 5:13 పాలతో జీవించేవాళ్ళు యింకా పసికందులే కనుక వాళ్ళకు మంచి చెడులను గురించి తెలియదు.
HEB 5:14 కాని, ఆహారం ఎదిగిన వాళ్ళు తినగలుగుతారు. అంటే, వాళ్ళు జీవితానికి అలవాటు పడి మంచి చెడులను గుర్తించటంలో నేర్పు సంపాదించారన్న మాట.
HEB 6:1 అందువల్ల క్రీస్తును గురించి బోధింపబడిన ప్రాథమిక పాఠాలను చర్చించటం మాని ముందుకు వెళ్తూ పరిపూర్ణత చెందుదాం. ఘోరమైన తప్పులు చేసి మారుమనస్సు పొందటం, దేవుని పట్ల విశ్వాసం,
HEB 6:2 బాప్తిస్మమును గురించి బోధించటం, చేతులు తల మీద ఉంచి అభిషేకించటం, చనిపోయన వాళ్ళు తిరిగి బ్రతికి రావటం, శాశ్వతమైన తీర్పు, యివి మన పునాదులు. ఈ పునాదుల్ని మళ్ళీ మళ్ళీ వేయకుండా ఉందాం.
HEB 6:3 దేవుడు సమ్మతిస్తే అలాగే జరుగుతుంది.
HEB 6:4 ఒకసారి వెలిగింపబడిన వాళ్ళు, పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసిన వాళ్ళు, ప్రవిత్రాత్మలో భాగం పంచుకున్న వాళ్ళు.
HEB 6:5 దైవసందేశం యొక్క మంచితన్నాన్ని రుచి చూసిన వాళ్ళు, రానున్న కాలం యొక్క శక్తిని రుచి చూచిన వాళ్ళు
HEB 6:6 పడిపోతే మారుమనస్సు పొందేటట్లు చేయటం అసంభవం. ఎందుకంటే, వాళ్ళు ఈ విధంగా చేసి దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువవేసి చంపుతున్నారు. ఆయన్ని నలుగురిలో అవమానపరుస్తున్నారు.
HEB 6:7 తన మీద తరచుగా పడ్తున్న వర్షాన్ని పీల్చుకొనే భూమి, తనను దున్నిన రైతులకు పంటనిచ్చిన భూమి దేవుని ఆశీస్సులు పొందుతుంది.
HEB 6:8 కాని, ముళ్ళ మొక్కలు, కలుపుమొక్కలతో పెరిగేభూమి నిరుపయోగమైనది. అలాంటి భూమిని దేవుడు శపిస్తాడు. చివరకు దాన్ని కాల్చి వేస్తాడు.
HEB 6:9 ప్రియమైన సోదరులారా! మేము మాట్లాడుతున్న ఈ రక్షణ సంబంధమైన విషయాల ద్వారా మీకు మంచి కలుగుతుందనే విశ్వాసం మాకుంది.
HEB 6:10 దేవుడు అన్యాయం చెయ్యడు. మీరు దేవుని ప్రజలకు సహాయం చేసారు. యిప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన కార్యాలను మీరాయన పట్ల చూపిన ప్రేమను ఆయన మరిచిపోడు.
HEB 6:11 మీ నిరీక్షణ సంపూర్ణమగునట్లుగా మీలో ప్రతి ఒక్కడు మీరిదివరకు చూపిన ఆసక్తి చివరివరకు చూపాలి.
HEB 6:12 మీరు సోమరులుగా నుండకూడదు. కాని వాగ్దానము చేయబడిన దానిని విశ్వాసము ద్వారా, సహనము ద్వారా పొందినవారిని అనుసరించండి.
HEB 6:13 దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడెవ్వడూ లేనందు వలన స్వయంగా తన మీదే ప్రమాణం తీసుకొంటూ,
HEB 6:14 ఇలా అన్నాడు: “నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని అభివృద్ధి పరుస్తాను.”
HEB 6:15 అబ్రాహాము ఓర్పుతో కాచుకొన్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు.
HEB 6:16 ప్రజలు తమకన్నా గొప్ప వాళ్ళ మీద ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలు వివాదాలు సాగనీయకుండా చేసి మాటల్లో మీ సత్యాన్ని దృఢ పరుస్తాయి.
HEB 6:17 దేవుడు తన వాగ్దానం విషయంలో తన ఉద్దేశ్యాన్ని మార్చుకోనని వాగ్దానం పొందిన వారసులకు స్పష్టం చేయాలనుకున్నాడు. అందువల్ల ఆ వాగ్దానాన్ని తన మీద ప్రమాణం చేసి ధృఢపరిచాడు.
HEB 6:18 అందువల్ల ఈ “రెండూ” మార్పు చెందలేవు. వీటివిషయంలో దేవుడు అసత్యమాడలేడు. తానివ్వబోయే వాటికోసం ఆశాభావంతో పరుగెత్తుతున్న వాళ్ళకు ప్రోత్సాహం కలగాలని ఈ ప్రమాణం చేశాడు.
HEB 6:19 భద్రతను దృఢత్వాన్ని కలిగించే ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరు లాంటిది. ఈ నిరీక్షణ తెరవెనుక లోపలి భాగంలో స్థిరముగా ప్రవేశించగలదు.
HEB 6:20 యేసు మన కోసం, మనకన్నా ముందు ఆ తెరలోపలికి వెళ్ళాడు. మెల్కీసెదెకు క్రమంలో యేసు కూడా శాశ్వతంగా ప్రధాన యాజకుడుగా ఉంటాడు.
HEB 7:1 ఈ మెల్కీసెదెకు షాలేము రాజు; మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు.
HEB 7:2 అబ్రాహాము తాను జయించిన వాటిలో పదవవంతు మెల్కీసెదెకుకు యిచ్చాడు. మొదటిదిగా “మెల్కీసెదెకు” అనే పదానికి నీతికిరాజు అనే అర్థం. రెండవదిగా “షాలేమురాజు” అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా వుంది.
HEB 7:3 మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వీకులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించికాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు.
HEB 7:4 మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను జయించిన దానిలో పదవ వంతు అతనికిచ్చాడంటే, అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి.
HEB 7:5 ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందిన వాళ్ళు, లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించిన దానిలో పదవవంతు సేకరించాలని ఉంది.
HEB 7:6 మెల్కీసెదెకు లేవి జాతికి చెందిన వాడు కాకపోయినా, అబ్రాహాము నుండి అతని ఆదాయంలో పదవవంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు.
HEB 7:7 ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు.
HEB 7:8 ఒకవైపు చనిపోయేవాళ్ళు పదవ వంతు సేకరిస్తున్నారు. మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు పదవ వంతు సేకరిస్తున్నాడు.
HEB 7:9 ఒక విధంగా చూస్తే పదవవంతు సేకరించే లేవి, అబ్రాహాము ద్వారా పదవవంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు.
HEB 7:10 ఎందుకంటే, మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవి యింకా జన్మించ లేదు. అతడు, తన మూల పురుషుడైన అబ్రాహాములోనే ఉన్నాడు.
HEB 7:11 మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజకుల గురించి వ్రాసాడు. ఒకవేళ, ఆ యాజకుల ద్వారా ప్రజలు పరిపూర్ణత పొంద గలిగి ఉంటే అహరోనులాంటి వాడు కాకుండా మెల్కీసెదెకులాంటి యాజకుడు రావలసిన అవసరమెందుకు కలిగింది?
HEB 7:12 దేవుడు మన కోసం క్రొత్త యాజకుణ్ణి నియమించాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు,
HEB 7:13 ఈ విషయాలు ఎవర్ని గురించి చెప్పబడ్డాయో, ఆయన వేరొక గోత్రపు వాడు. ఆ గోత్రానికి చెందిన వాళ్ళెవ్వరూ ఎన్నడూ బలిపీఠం ముందు నిలబడి యాజకునిగా పనిచేయ లేదు.
HEB 7:14 మన ప్రభువు యూదా వంశానికి చెందిన వాడనే విషయం మనకు స్పష్టమే! ఈ గోత్రపు వాళ్ళు యాజకులౌతారని మోషే అనలేదు.
HEB 7:15 పైగా మెల్కీసెదెకు లాంటి మన ప్రభువు యాజకుడై ఈ విషయం ఇంకా స్పష్టం చేశాడు.
HEB 7:16 మన ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వంశావళిని అనుసరించి యాజకుడు కాలేదు. ఆయన చిరంజీవి గనుక యాజకుడయ్యాడు.
HEB 7:17 ఎందుకంటే, “నీవు మెల్కీసెదెకు క్రమంలో చిరకాలం యాజకుడవై ఉంటావు” అని లేఖనాలు ప్రకటిస్తున్నాయి.
HEB 7:18 పాత నియమం సత్తువ లేనిది, నిరుపయోగమైనది. కనుక, అది రద్దు చేయబడింది.
HEB 7:19 ఆ ధర్మశాస్త్రం ఎవనిలోనూ పరిపూర్ణత కలిగించలేక పోయింది. అందువల్ల దేవుడు మనలో క్రొత్త నిరీక్షణను ప్రవేశపెట్టాడు. ఈ నిరీక్షణ మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది.
HEB 7:20 దీని విషయంలో దేవుడు ప్రమాణం కూడా చేశాడు. మిగతా వాళ్ళు యాజకులైనప్పుడు ఎవ్వరూ ప్రమాణం చెయ్యలేదు.
HEB 7:21 కాని యేసు ప్రమాణం ద్వారా యాజకుడైనాడు. ఈయన విషయంలో దేవుడాయనతో ఇలా అన్నాడు: “ప్రభువు ప్రమాణం చేశాడు. తన మనస్సును మార్చుకోడు: ‘నీవు చిరకాలం యాజకుడుగావుంటావు.’”
HEB 7:22 ఈ ప్రమాణం ద్వారా యేసు శ్రేష్టమైన క్రొత్త ఒడంబడికకు బాధ్యుడయ్యాడు.
HEB 7:23 ఎందరో యాజకులయ్యారు కాని, చావు వాళ్ళని యాజకులుగా పనిచేయకుండా అడ్డగించింది.
HEB 7:24 కాని యేసు చిరంజీవి గనుక చిరకాలం యాజకుడుగా ఉంటాడు.
HEB 7:25 అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ పక్షాన దేవుణ్ణి వేడుకోవటానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు.
HEB 7:26 పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు, ఇలాంటి ప్రధాన యాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు.
HEB 7:27 ఆయన, ఇతర ప్రధాన యాజకులవలె తన పాపాల కొరకు గానీ, ప్రజల పాపాల కొరకు గానీ ప్రతి రోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే!
HEB 7:28 ధర్మశాస్త్రం బలహీనులైన వాళ్ళను యాజకులుగా నియమించింది: కాని, ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధాన యాజకునిగా నియమించింది. అంతేకాక, ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు.
HEB 8:1 మేము చెబుతున్న దానిలో ముఖ్య అంశం ఏమిటంటే: పరలోకంలో మహోన్నతుని సింహాసనానికి కుడివైపు కూర్చోగల అధికారమున్న ప్రధాన యాజకుడు మనకున్నాడు.
HEB 8:2 అంతేకాక ఆయన నిజమైన గుడారంలో, అంటే ప్రభువు నిర్మించిన పరిశుద్ధాలయములో సేవ చేస్తున్నాడు. ఈ గుడారం మానవుడు నిర్మించింది కాదు.
HEB 8:3 కానుకల్ని, బలుల్ని అర్పించటానికి ప్రధాన యాజకుడు నియమించబడతాడు. అందువల్ల ఈయన దగ్గర కూడా అర్పించటానికి ఏదైనా ఉండవలసిన అవసరం ఏర్పడింది.
HEB 8:4 ఈయన భూలోకంలో ఉండినట్లయితే యాజకుడుగా పని చేసేవాడు కాదు. ఎందుకంటే, ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా కానుకలు అర్పించే యాజకులు యిదివరకే భూలోకంలో ఉన్నారు.
HEB 8:5 వాళ్ళు భూమ్మీదనున్న పరిశుద్ధ స్థలములో సేవచేస్తూ ఉంటారు. భూలోకంలో ఉన్న ఈ పరిశుద్ధ స్థలము పరలోకంలో ఉన్న దానికి నీడ లాంటిది, అంటే ప్రతిబింబం. ఈ కారణంగానే, మోషే గుడారాన్ని నిర్మించటానికి మొదలు పెట్టినప్పుడు దేవుడు అతనితో, “నేను నీకు కొండమీద చూపించిన విధంగా దాన్ని నిర్మించు!” అని హెచ్చరించాడు.
HEB 8:6 యేసు మధ్యవర్తిగా ఉండి నియమించిన ఒడంబడిక పాత దానికన్నా ఉత్తమమైనది. అందులో ఉత్తమ వాగ్దానాలున్నాయి. అందువల్ల దేవుడు యేసుకిచ్చిన యాజకత్వము వాళ్ళు చేసే యాజకత్వం పనికన్నా ఉత్తమమైనది.
HEB 8:7 ఎందుకంటే ఒకవేళ మొదటి ఒడంబడికలో ఏ తప్పూ లేక పోయినట్లయితే యింకొక ఒడంబడిక యొక్క అవసరం ఉండక పోయేది.
HEB 8:8 కాని ప్రభువు ప్రజల పొరపాట్లను కనిపెట్టి వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు, యూదా, ప్రజలతో క్రొత్త ఒడంబడిక చేయవలసిన సమయం వస్తుంది!
HEB 8:9 వాళ్ళ ముత్తాతల్ని ఈజిప్టు దేశంనుండి, చేయి పట్టుకొని వెలుపలికి పిలుచుకొని వచ్చాను. ఆనాడు వాళ్ళతో ఒక ఒడంబడిక చేసాను. నేను మీతో చేయబోతున్న ఒడంబడిక ఆనాటి ఒడంబడికలా ఉండదు. వాళ్ళు నా ఒడంబడిక ప్రకారం నడుచుకోలేదు గనుక వాళ్ళను నేను లేక్క చేయ్యలేదు.
HEB 8:10 ఆతర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా ఒడంబడిక చేస్తాను: నా నియమాల్ని వాళ్ళ మనస్సుల్లో ఉంచుతాను. వాటిని వాళ్ళ హృదయాలపై వ్రాస్తాను. నేను వాళ్ళ దేవునిగా ఉంటాను. వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.
HEB 8:11 అప్పుడు ప్రభువుని తెలుసుకోమని ప్రక్కింటి వానికి గాని, తన సోదరునికి గాని బోధించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ రోజుల్లో అధముడు, గొప్పవాడు, అందరు నన్ను తెలుసుకొంటారు.
HEB 8:12 నేను వాళ్ళ దోషాల్ని క్షమిస్తాను. వాళ్ళ పాపాల్ని మరచిపోతాను.
HEB 8:13 ఈ ఒడంబడికను “క్రొత్త ఒడంబడిక” అని పిలవటం వల్ల మొదటిది పాత ఒడంబడిక అయిపోయింది. పురాతనమైనది, శిథిలమైనది, త్వరలోనే అదృశ్యమైపోతుంది.
HEB 9:1 సేవా నియమాలను గురించి, మానవ నిర్మితమైన గుడారమును గురించి మొదటి ఒడంబడికలో వ్రాయబడి ఉంది.
HEB 9:2 గుడారం వేసి మొదటి గదిని సిద్ధం చేసేవాళ్ళు. ఆ గదిలో ఒక దీప స్థంభం, ఒక బల్ల, ప్రతిష్టించబడిన రొట్టె ఉంచేవాళ్ళు. ఈ గదిని పవిత్రస్థానమని పిలిచేవాళ్ళు.
HEB 9:3 మరొక తెరవేసి రెండవ గదిని సిద్ధం చేసేవాళ్ళు. దీన్ని అతి పవిత్ర స్థానమని పిలిచే వాళ్ళు.
HEB 9:4 ఇక్కడ బంగారు ధూప వేదిక, మరియు బంగారు రేకుచేత కప్పబడిన ఒడంబడిక మందసము ఉండేవి. ఈ మందసంలో మన్నా ఉంచబడిన బంగారుగిన్నె, చిగురు వేసిన అహరోను చేతికర్ర, ఒడంబడిక పలకలు ఉండేవి.
HEB 9:5 ఈ మందసం మీద కరుణాపీఠం ఉండేది. దానికి యిరువైపులా దేవదూతలు ఉండేవారు. వారి రెక్కలు ఆ కరుణాపీఠాన్ని కప్పి ఉంచేవి. కాని వీటిని గురించి ప్రస్తుతం వివరంగా చర్చించలేము.
HEB 9:6 అన్నీ ఈ విధంగా అమర్చబడిన తర్వాత, యాజకులు నియమానుసారం ముందున్న గదిలోకి ప్రవేశించి సేవ చేసేవాళ్ళు.
HEB 9:7 కాని ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అతిపరిశుద్ధ స్థలంలోకి రక్తంతో ప్రవేశించేవాడు. తన పక్షాన, అజ్ఞానంతో పాపాలు చేసిన ప్రజల పక్షాన తప్పకుండా రక్తాన్ని తెచ్చి దేవునికి అర్పించేవాడు.
HEB 9:8 అంటే మొదటి గది ఉన్నంతకాలం అతి పవిత్ర స్థానానికి ప్రవేశం కలుగదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు.
HEB 9:9 ఇది ప్రస్తుత కాలాన్ని సూచిస్తోంది. అంటే కానుకలు, బలులు అర్పించటం వల్ల యాజకుని అంతరాత్మ పరిశుద్ధం కాదని పరిశుద్ధాత్మ సూచిస్తున్నాడు.
HEB 9:10 ఇవి కేవలం అన్నపానాలకు పలురకాల పరిశుద్ద స్నానాలకు సంబంధించిన ఆచారాలు. క్రొత్త క్రమం వచ్చేదాకా ఈ బాహ్య నియమాలు వర్తిస్తాయి.
HEB 9:11 దేవుడు చేసిన మంచి పనులు సాగించటానికి క్రీస్తు ప్రధాన యాజకుడై పరలోకంలోని గుడారానికి వెళ్ళాడు. ఆ గుడారం చాలా పెద్దది. శ్రేష్టమైనది. అది మానవుడు నిర్మించింది కాదు.
HEB 9:12 ఆయన మేకల రక్తం ద్వారా, దూడల రక్తం ద్వారా, ఆ గుడారంలోకి వెళ్ళలేదు. తన స్వంత రక్తంతో అతి పవిత్రమైన ఆ స్థానాన్ని శాశ్వతంగా ప్రవేశించి, మనకు శాశ్వతమైన రక్షణ కలిగించాడు.
HEB 9:13 మేకల రక్తాన్ని, ఎద్దుల రక్తాన్ని, దూడలను కాల్చిన బూడిదను, అపవిత్రంగా ఉన్న వాళ్ళపై ప్రోక్షించి, వాళ్ళను పవిత్రం చేసేవాళ్ళు. ఇలా చేయటం వల్ల వాళ్ళు బాహ్యంగా మాత్రమే పవిత్రులౌతారు.
HEB 9:14 కాని, నిష్కళంకుడైన యేసు శాశ్వతమైన తన ఆత్మను దేవునికి అర్పించుకొన్నాడు. తద్వారా క్రీస్తు రక్తం మన చెడు అంతరాత్మల్ని కూడా పరిశుద్ధం చేస్తోంది. మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలని ఆయనీవిధంగా చేసాడు.
HEB 9:15 ఈ కారణంగా క్రీస్తు క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయ్యాడు. ఈయన దేవుడు పిలిచిన వాళ్ళకు దేవుడు వాగ్దానం చేసిన శాశ్వత వారసత్వం లభించేటట్లు చేస్తాడు. మొదటి ఒడంబడిక చెలామణిలో ఉండగా ప్రజలు చేసిన పాపాలకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి వాళ్ళకు స్వేచ్ఛ కలిగించాడు.
HEB 9:16 వీలునామా చెలామణిలోకి రావాలంటే, దాన్ని వ్రాసిన వ్యక్తి యొక్క మరణాన్ని నిరూపించటం అవసరం.
HEB 9:17 ఎందుకంటే, వ్రాసిన వాడు మరణిస్తే వీలునామా చెలామణిలోకి వస్తుంది. వీలునామా వ్రాసిన వాడు జీవిస్తుంటే, అది ఎలా చెలామణిలోకి వస్తుంది?
HEB 9:18 ఈ కారణంగానే, మొదటి ఒడంబడిక కూడా రక్తాన్ని ఉపయోగించకుండా చెలామణి కాలేకపోయింది.
HEB 9:19 ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని మోషే ప్రజలకు ప్రకటించిన తర్వాత దూడల రక్తాని నీళ్ళలో కలిపి, ఆ మిశ్రమాన్ని హిస్సోపు చెట్ల కొమ్మలతో, సింధూర వర్ణముగల గొఱ్ఱె బొచ్చుతో ధర్మశాస్త్రగ్రంథం మీద, ప్రజల మీద చల్లాడు.
HEB 9:20 ఆ తర్వాత మోషే వాళ్ళతో, “దేవుడు తన ఒడంబడికను ఆచరించమని ఆజ్ఞాపించి ఈ ఒడంబడిక రక్తాన్ని మీకిచ్చాడు” అని అన్నాడు.
HEB 9:21 అదేవిధంగా అతడు గుడారం మీద, సేవా సామగ్రి మీద ఆ రక్తాన్ని ప్రొక్షించాడు.
HEB 9:22 నిజానికి, యించుమించు అన్ని వస్తువుల్ని రక్తంతో పరిశుద్ధం చెయ్యాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. రక్తం చిందించకపోతే పాపపరిహారం కలగదు.
HEB 9:23 అందువల్ల పరలోకంలో ఉన్న వస్తువుల ప్రతిరూపాలను బలి యిచ్చి పరిశుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడింది. కాని, పరలోకంలో ఉన్న వాటిని పవిత్రం చెయ్యటానికి యింకా మంచిరకమైన బలులు కావాలి.
HEB 9:24 భూమ్నీదవున్న ఈ పవిత్ర స్ధానం నిజమైన దానికి ప్రతిరూపం మాత్రమే. క్రీస్తు మానవుడు నిర్మించిన ఈ పవిత్ర స్థానాన్ని కాదు ప్రవేశించింది. ఆయన మనకోసం పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు వెళ్ళాడు.
HEB 9:25 ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం పశువుల రక్తంతో అతి పవిత్ర స్థానాన్ని ప్రవేశించినట్లు, ఆయన తనను తాను పదే పదే బలిగా సమర్పించుకోవటానికి పరలోకానికి వెళ్ళలేదు.
HEB 9:26 అలా అర్పించి ఉంటే ప్రపంచం సృష్టింప బడినప్పటి నుండి క్రీస్తు ఎన్నోసార్లు మరణించ వలసి వచ్చేది. కాని, ప్రస్తుతం యుగాల అంతంలో తనను తాను ఒకే ఒకసారి బలిగా అర్పించుకుని పాపపరిహారం చెయ్యాలని ప్రత్యక్ష్యమయ్యాడు.
HEB 9:27 ప్రతి ఒక్కడూ, ఒక్కసారే మరణించాలి. తర్వాత దేవుని తీర్పుకు గురి అవ్వాలి. వాళ్ళపై తీర్పు చెబుతాడు.
HEB 9:28 అందువల్ల, అనేకుల పాపపరిహారం కోసం క్రీస్తు ఒకసారి మాత్రమే తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన రెండవసారి ప్రత్యక్ష్యమౌతాడు. పాపం మోయటానికి కాదు తనకోసం కాచుకొని ఉన్నవాళ్లకు రక్షణ కలిగంచటానికి ప్రత్యక్ష్యమౌతాడు.
HEB 10:1 ధర్మశాస్రం రాబోవు మంచి విషయాల నీడలాంటిది. అది అస్పష్టమైనది. అంటే, ఆ మంచి విషయాలు అప్పటికింకా రాలేదన్నమాట. ధర్మశాస్రం ఆదేశించిన విధంగా ప్రజలు దేవుని దగ్గరకు ప్రతి సంవత్సరం వచ్చి తప్పకుండా ఒకే రకమైన బలులు అర్పించే వాళ్ళు. కాని ధర్మశాస్త్రం వాళ్ళలో పరిపూర్ణత కలిగించలేదు.
HEB 10:2 అలా చేసినట్లైతే, వాళ్ళు ఆ బలులు యివ్వటం మాని ఉండేవాళ్ళు. పాపాలు శాశ్వతంగా పరిహారమై వాళ్ళు పశ్చాత్తాపం చెందవలసిన అవసరం ఉండేది కాదు.
HEB 10:3 కాని దానికి మారుగా ఆ బలులు వాళ్ళు చేసిన పాపాల్ని ప్రతి సంవత్సరం వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి.
HEB 10:4 ఎద్దుల రక్తంతో, మేకల రక్తంతో పాప పరిహారం కలుగటమనేది అసంభవం.
HEB 10:5 ఆ కారణంగానే, క్రీస్తు ఈ ప్రపంచంలోకి వచ్చాక దేవునితో ఈ విధంగా అన్నాడు: “బలుల్ని, అర్పణల్ని నీవు కోరలేదు కాని, నేనుండటానికి ఈ శరీరాన్ని సృష్టించావు.
HEB 10:6 జంతువుల్ని కాల్చి అర్పించిన ఆహుతులు కాని, పాపపరిహారం కోసం యిచ్చిన బలులు కాని, నీకు అనందం కలిగించలేదు.
HEB 10:7 అప్పుడు నేను, ‘ఇదిగో దేవా! ఇక్కడ ఉన్నాను! నన్ను గురించి గ్రంథాల్లో వ్రాశారు. నేను నీ యిచ్చ నెరవేర్చటానికి వచ్చాను’ అని అన్నాను.”
HEB 10:8 “బలుల్ని, అర్పణల్ని, జంతువుల్నికాల్చి యిచ్చిన ఆహుతుల్ని, పాప పరిహారం కోసం యిచ్చిన ఆహుతుల్ని, నీవు కోరలేదు. అవి నీకు ఆనందం కలిగించలేదు” అని మొదట అన్నాడు. కాని, ధర్మశాస్త్రం ఈ ఆహుతుల్ని యివ్వమని ఆదేశించింది.
HEB 10:9 ఆ తర్వాత క్రీస్తు, “ఇదిగో దేవా!ఇక్కడ ఉన్నాను. నీ యిచ్ఛ నెరవేర్చటానికి వచ్చాను” అని అన్నాడు. ఆయన రెండవ దాన్ని నెరవేర్చటానికి మొదటి దాన్ని రద్దుచేశాడు.
HEB 10:10 దైవేచ్ఛ నెరవేర్చటానికి క్రీస్తు తన శరీరాన్ని బలిగా అర్పించి మనల్ని శాశ్వతంగా పవిత్రం చేశాడు. ఆయన యిచ్చిన మొదటి బలి, చివరి బలి యిదే.
HEB 10:11 ప్రతి యాజకుడు మత సంబంధమైన కర్తవ్యాన్ని ప్రతిరోజు నెరవేరుస్తూ ఉంటాడు. ఇచ్చిన బలుల్నే మళ్ళీ మళ్ళీ యిస్తూ ఉంటాడు. ఈ బలులు పాప పరిహారం చెయ్యలేవు.
HEB 10:12 కాని క్రీస్తు మన పాప పరిహారార్థం ఒకే ఒక బలి యిచ్చి దేవుని కుడిచేతి వైపు శాశ్వతంగా కూర్చుండి పొయ్యాడు.
HEB 10:13 అప్పటినుండి, ఆయన శత్రువుల్ని దేవుడు ఆయన పాదపీఠంగా చెయ్యాలని కాచుకొని ఉన్నాడు.
HEB 10:14 ఆయన ఒకే ఒక అర్పణ చేసి పరిశుద్ధులలో శాశ్వతమైన పరిపూర్ణత కలిగించాడు.
HEB 10:15 ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ మనకు యిలా ప్రకటిస్తున్నాడు:
HEB 10:16 “ఆ తర్వాత నేను వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను. నా నియమాల్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుతాను. వాటిని వాళ్ళ మనస్సులపై వ్రాస్తాను.”
HEB 10:17 ఆ పరిశుద్ధాత్మ ఇంకా యిలా అన్నాడు: “వాళ్ళ పాపాల్ని, దుర్మార్గాల్ని నేను మరిచిపోతాను!”
HEB 10:18 వాళ్ళ పాపాల్ని దేవుడు క్షమించాడు కాబట్టి, పాపం కోసం బలుల్ని అర్పించవలసిన అవసరం తీరిపోయింది.
HEB 10:19 సోదరులారా! యేసు తన రక్తాన్ని అర్పించాడు. తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది.
HEB 10:20 ఆయన శరీరం ఒక తెరగా ఉంది. దాన్ని తొలగించి మనకోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు.
HEB 10:21 అంతేకాక, ఆ ప్రధాన యాజకుడు మన దేవాలయంపై అధికారిగా పనిచేస్తున్నాడు.
HEB 10:22 తప్పు చేసి బాధపడ్తున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్ళతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో, సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరుకొందాం.
HEB 10:23 మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం.
HEB 10:24 ప్రేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం.
HEB 10:25 సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని, మనం పరస్పరం కలుసుకొంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్నదినం సమీపిస్తోంది గనుక పరస్పరం ప్రోత్సాహ పరచుకొంటూ ఉందాం.
HEB 10:26 సత్యాన్ని గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా, మనం కావాలని పాపాలు చేస్తూ ఉంటే, యిక అర్పించటానికి మన దగ్గర బలి ఎక్కడుంది?
HEB 10:27 తీర్పు జరుగుతుందనే భయము, దేవుని శత్రువుల్ని కాల్చివేసే మంటలురానున్నాయనే భయము మాత్రమే మిగిలిపోతాయి.
HEB 10:28 మోషే నియమాల్ని ఉల్లంఘించిన వానిపై యిద్దరు లేక ముగ్గురు చెప్పిన సాక్ష్యాలతో దయ చూపకుండా మరణ శిక్ష విధించే వాళ్ళు.
HEB 10:29 మరి దేవుని కుమారుణ్ణి కాళ్ళ క్రింద త్రొక్కినవాణ్ణి, తనను పవిత్రం చేసిన ఒడంబడిక రక్తాన్ని అపవిత్రంగా పరిగణించేవాణ్ణి, అనుగ్రహించే ఆత్మను అవమాన పరిచేవాణ్ణి, యింకెంత కఠినంగా శిక్షించాలో మీరే ఊహించండి.
HEB 10:30 “పగ తీర్చుకోవలసిన పని నాది, తిరిగి చెల్లించేవాణ్ణి నేను” అని అన్నవాడు, “ప్రభువు తన ప్రజలపై తీర్పు చెపుతాడు” అని అన్న వాడు ఎవరో మనకు తెలుసు.
HEB 10:31 సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపాత్ములు చిక్కుకోవటమనేది భయానకమైన విషయము.
HEB 10:32 మీరు వెలిగింపబడిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజుల్లో మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా మీరు వాటిని సహించారు.
HEB 10:33 కొన్నిసార్లు మీరు అవమానాన్ని, హింసను బహిరంగంగా అనుభవించారు. మరికొన్నిసార్లు అవమానాన్ని, హింసను అనుభవించే వాళ్ళ ప్రక్కన నిలుచున్నారు.
HEB 10:34 అంతేకాక, చెరసాలల్లో ఉన్న వాళ్ళ పట్ల మీరు సానుభూతి చూపించారు. పైగా “మీ ఆస్తుల్ని” దోచుకొంటుంటే ఆనందంగా అంగీకరించారు. ఎందుకంటే, మీరు పొందిన ఆస్తి మీరు పోగొట్టుకొన్న ఆస్తికన్నా ఉత్తమమైనదని మీకు తెలుసు. అది శాశ్వతమైనదని కూడా మీకు తెలుసు.
HEB 10:35 అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి. దానికి మంచి ప్రతి ఫలం లభిస్తుంది.
HEB 10:36 మీరు పట్టుదలతో ఉండాలి. దైవేచ్చే ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు, తాను వాగ్దానం చేసిన దాన్ని ప్రసాదిస్తాడు.
HEB 10:37 ఎందుకంటే, త్వరలోనే, “వస్తున్నాడు, వస్తాడు, ఆలస్యం చెయ్యడు!
HEB 10:38 నీతిమంతులైన నా ప్రజలు నన్ను విశ్వసిస్తూ జీవిస్తారు. కాని వాళ్ళలో ఎవరైనా వెనుకంజ వేస్తే నా ఆత్మకు ఆనందం కలుగదు.”
HEB 10:39 కాని, మనం వెనుకంజ వేసి నశించిపోయే వాళ్ళలాంటి వారం కాదు. గాని విశ్వాసం ద్వారా రక్షంచబడే వాళ్ళ లాంటివారం.
HEB 11:1 ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం, మనకు కనిపించనివాటిని ఉన్నాయని నమ్మటం. ఇదే విశ్వాసం.
HEB 11:2 మన పూర్వీకుల్లో యిలాంటి విశ్వాసముంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకొన్నాడు.
HEB 11:3 దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ఈ ప్రపంచం సృష్టింపబడిందని మనము విశ్వశిస్తున్నాము. అంటే, కనిపించని వాటితో కనిపించేది సృష్టింపబడిందన్న మాట.
HEB 11:4 హేబెలుకు దేవుని పట్ల విశ్వాసముంది గనుకనే అతడు కయీను అర్పించిన బలికన్నా విలువైన బలిని దేవునికి అర్పించాడు. హేబెలు అర్పించిన బలిని దేవుడు మెచ్చుకొని అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. అందుకే హేబెలు మరణించినా అతనిలో ఉన్న విశ్వాసం ద్వారా యింకా మాట్లాడుతునే ఉన్నాడు.
HEB 11:5 హనోకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే దేవుడతణ్ణి సజీవంగా పరలోకానికి తీసుకు వెళ్ళాడు. ఆ కారణంగానే అతడు ఎవ్వరికీ కనపడలేదు. పరలోకానికి వెళ్ళకముందు అతడు దేవుణ్ణి సంతోషపరచినందుకు దేవుడు అతణ్ణి మెచ్చుకొన్నాడు.
HEB 11:6 విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆనందపరచటం అసంభవం. దేవుని దగ్గరకు రావాలను కొన్నవాడు ఆయనున్నాడని, అడిగిన వాళ్ళకు ప్రతిఫలం యిస్తాడని విశ్వసించాలి.
HEB 11:7 నోవహు దేవుణ్ణి విశ్వసించినందువల్ల దేవుడతనికి, “ప్రళయం రాబోతున్నది” అని ముందే చెప్పాడు. అతనిలో భయభక్తులుండటంవల్ల అతడు దేవుని మాట విని, తన కుటుంబాన్ని రక్షించటానికి ఒక ఓడను నిర్మించాడు. అతనిలో ఉన్న విశ్వాసము ప్రపంచం తప్పు చేసిందని నిరూపించింది. ఆ విశ్వాసం మూలంగా అతడు నీతిమంతుడయ్యాడు.
HEB 11:8 అబ్రాహాములో విశ్వాసముంది కనుక అతడు దేవుడు చెప్పిన దేశానికి, తానెక్కడికి వెళ్తున్నది తనకు తెలియక పోయినా విధేయతతో వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడతనికి ఆ దేశాన్ని అతని పేరిట యిచ్చాడు.
HEB 11:9 విశ్వాసముంది కనుకనే అతడు దేవుడు చూపిన దేశంలో ఒక పరదేశీయునిగా నివసించాడు. దేవుడు వాగ్దానం చేసిన వాటిల్లో తనతో సహా వారసులైన ఇస్సాకు మరియు యాకోబులతో కలిసి గుడారాల్లో నివసించాడు.
HEB 11:10 దేవుడు తన నమూన ప్రకారం శాశ్వతమైన పునాదులు వేసి నిర్మించిన పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉండేవాడు.
HEB 11:11 శారా వృద్ధురాలు, పైగా గొడ్రాలు. అబ్రాహాము వృద్ధుడయినా, దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించి నందువల్ల అబ్రాహాము తండ్రి కాగలిగాడు.
HEB 11:12 చనిపోవటానికి సిద్ధంగా ఉన్న అబ్రాహాముకు ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లా, సముద్ర తీరానవుండే యిసుక రేణువల్లా లెక్కలేనంత మంది వారసులు కలిగారు.
HEB 11:13 వీళ్ళందరు దేవుణ్ణి విశ్వసిస్తూ జీవించి, మరణించారు. దేవుడు వాగ్దానం చేసినవి వాళ్ళకు లభించలేదు. వాళ్ళు అవి రావటం దూరం నుండి చూసి ఆహ్వానించారు. ఈ భూమ్మీద తాము పరదేశీయుల్లా జీవిస్తున్నట్లు వాళ్ళు అంగీకరించారు.
HEB 11:14 వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు తమ స్వదేశానికోసం వెతుకు తూండేవాళ్ళని అనిపిస్తుంది.
HEB 11:15 ఒక వేళ వాళ్ళు తాము వదలివచ్చిన దేశాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే తమ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉండింది.
HEB 11:16 కాని వాళ్ళుయింకా గొప్ప దేశానికి, అంటే పరలోకానికి వెళ్ళాలని ఆశించారు. అందువల్ల దేవుడు యితర్లు తనను “వాళ్ళ దేవుడు” అని పిలిచినందుకు సిగ్గుపడలేదు. పైగా తన వాళ్ళ కోసం ఒక పట్టణం నిర్మించాడు.
HEB 11:17 దేవుడు అబ్రాహామును పరీక్షించినప్పుడు అతనిలో విశ్వాసముండటంవల్ల ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. దేవుడు ఇస్సాకు ద్వారా నీ వంశం అభివృద్ధి చెందుతుంది అని యింతకు పూర్వం వాగ్దానం చేశాడు. అయినా అబ్రాహాము తన ఏకైక పుత్రుణ్ణి బలిగా అర్పించబోయాడు.
HEB 11:19 దేవుడు చనిపోయిన వాళ్ళను బ్రతికించగలడని అబ్రాహాముకు తెలుసు. ఒక విధంగా చూస్తే దేవుడు ఇస్సాకును బ్రతికించి అబ్రాహాముకు ఇచ్చాడనే చెప్పుకోవచ్చు.
HEB 11:20 ఇస్సాకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి, యాకోబును, ఏశావును వాళ్ళ భవిష్యత్తు ప్రకారం దీవించాడు.
HEB 11:21 దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబు, తాను మరణించే ముందు యోసేపు కుమారుల్ని దీవించ గలిగాడు. అంతేకాక తన చేతి కఱ్ఱపై వ్రాలి దేవుణ్ణి ప్రార్థించాడు.
HEB 11:22 యోసేపు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి తాను చినిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం నుండి వెళ్ళిపోతారని ముందుగానే చెప్పగలిగాడు. అంతే కాక, అప్పుడు తన ఎముకల్ని ఏమి చెయ్యాలో వాళ్ళకు చెప్పాడు.
HEB 11:23 మోషే తల్లి తండ్రులకు దేవుని పట్ల విశ్వాసముంది గనుక, మోషే జన్మించాక అతడు సాధారణమైన శిశువు కాడని గ్రహించగలిగారు. తద్వారా వాళ్ళు రాజశాసనానికి భయపడకుండా అతణ్ణి మూడు నెలల దాకా దాచివుంచారు.
HEB 11:24 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే, అతడు పెద్దవాడైన తర్వాత ఫరోకుమార్తె యొక్క కుమారునిగా గుర్తింపబడటానికి నిరాకరించాడు.
HEB 11:25 పాపం ద్వారా లభించే సుఖాల్ని కొద్దికాలం అనుభవించటానికన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలను అనుభవించటానికి అతడు సిద్ధమయ్యాడు.
HEB 11:26 అతడు ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కనుక, ఈజిప్టులోని ఐశ్వర్యానికన్నా క్రీస్తు కొరకు అవమానం భరించటం ఉత్తమమని భావించాడు.
HEB 11:27 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కనుక, అతడు రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదలి వెళ్ళి పోయాడు. అదృశ్యంగా ఉన్నవాణ్ణి చూసినట్లు అతడు భావించటంవల్ల అతని పట్టుదల పెరిగింది.
HEB 11:28 అతడు దేవుణ్ణి విశ్వసించటం మూలంగానే పస్కా పండుగను, రక్తాన్ని ద్వారాలపై ప్రోక్షించాలనే ఆచారాన్ని నియమించాడు. మృత్యు దూత ఇశ్రాయేలు ప్రజల మొదటి సంతానాన్ని తాకరాదని ఈ ఆచారం నియమించాడు.
HEB 11:29 దేవుణ్ణి విశ్వసించినందుకే ప్రజలు ఎఱ్ఱ సముద్రంలో ఏర్పడిన ఆరిన నేల మీద నడిచారు. కాని ఈజిప్టు దేశస్థులు అలా చెయ్యాలని ప్రయత్నించి సముద్రంలో మునిగిపొయ్యారు.
HEB 11:30 ప్రజలు యెరికో కోట చుట్టు ఏడు రోజులు విశ్వాసంతో తిరగటం వల్ల ఆ కోట గోడలు పడిపొయ్యాయి.
HEB 11:31 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే, వేశ్య అయినటువంటి రాహాబు యెహోషువా పంపిన గూఢచారులకు తన యింట్లో ఆతిథ్యమిచ్చింది. ఆ కారణంగానే, అవిశ్వాసులతో సహా ఆమె మరణించలేదు.
HEB 11:32 ఇంకేం చెప్పమంటారు? గిద్యోనును గురించి, బారాకు గురించి, సమ్సోను గురించి, యెఫ్తా గురించి, దావీదు గురించి, సమూయేలును గురించి మరియు ప్రవక్తల గురించి చెప్పటానికి నాకు వ్యవధి లేదు.
HEB 11:33 వీళ్ళు దేవుణ్ణి విశ్వసించటంవల్ల రాజ్యాలు జయించారు. న్యాయాన్ని స్థాపించారు. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని పొందారు. సింహాల నోళ్ళు మూయించారు.
HEB 11:34 భయంకరమైన మంటల్ని ఆర్పివేశారు. కత్తి పోట్లనుండి తమను తాము రక్షించుకొన్నారు. వాళ్ళ బలహీనత బలంగా మారిపోయింది. వాళ్ళు యుద్ధాలలో గొప్ప శక్తి కనబరుస్తూ పరదేశసైన్యాలను ఓడించారు.
HEB 11:35 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే కొందరు స్త్రీలు చనిపోయిన తమ వాళ్ళను తిరిగి సజీవంగా పొందారు. కొందరు చావునుండి బ్రతికి వచ్చాక ఉత్తమ జీవితం గడపాలనే ఉద్దేశ్యముతో చిత్రహింసలనుండి విడుదల కోరలేదు.
HEB 11:36 భక్తిహీనులు వీళ్ళలో కొందర్ని పరిహాసం చేస్తూ కొరడా దెబ్బలు కొట్టారు. మరి కొందర్ని సంకెళ్ళతో బంధించి చెరసాలలో వేశారు.
HEB 11:37 కొందర్ని రాళ్ళతో కొట్టారు; రంపంతో కోసారు; కత్తితో పొడిచి చంపారు. ఆ భక్తులు మేకల చర్మాలను, గొఱ్ఱెల చర్మాలను ధరించి అనాధలై తిరిగారు. అంతేకాక హింసను, దుష్ప్రవర్తనను సహించారు.
HEB 11:38 ఎడారుల్లో పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సొరంగాల్లో, నివసించారు. ఈ ప్రపంచం వాళ్ళకు తగిందికాదు.
HEB 11:39 వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకొన్నాడు. కాని దేవుడు వాగ్దానం చేసింది వాళ్ళకు యింకా లభించలేదు.
HEB 11:40 దేవుడు మనకివ్వటానికి ఉత్తమమైన దాన్ని దాచి ఉంచాడు. మనతో కలిసి మాత్రమే వాళ్ళకు పరిపూర్ణత కలగాలని యిలా చేసాడు.
HEB 12:1 అందువల్ల మన పక్షాన కూడా ఇందరు సాక్షులున్నారు గనుక మన దారికి అడ్డం వచ్చిన వాటన్నిటిని తీసిపారవేద్దాం. మనల్ని అంటుకొంటున్న పాపాల్ని వదిలించుకొందాం. మనం పరుగెత్తవలసిన పరుగు పందెంలో పట్టుదలతో పరుగెడుదాం.
HEB 12:2 మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం పుట్టించిన వాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగ చేయువాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన సిలువను భరించాడు. సిలువను భరించినప్పుడు కలిగిన అవమానాల్ని ఆయన లెక్క చెయ్యలేదు. ఇప్పుడాయిన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చొని ఉన్నాడు.
HEB 12:3 పాపాత్ములు తనపట్ల కనుబరచిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీరు అలిసిపోకుండా, ధైర్యం కోల్పోకుండా వుంటారు.
HEB 12:4 మీరు పాపంతో చేస్తున్న యుద్ధంలో రక్తం చిందించవలసిన అవసరం యింతవరకు కలుగలేదు.
HEB 12:5 మిమ్మల్ని కుమారులుగా భావించి చెప్పిన ప్రోత్సాహకరమైన ఈ సందేశాన్ని పూర్తిగా మరిచిపోయారు: “నా కుమారుడా! ప్రభువు విధించిన క్రమశిక్షణను చులకన చెయ్యకు! నీ తప్పు ప్రభువు సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు!
HEB 12:6 ఎందుకంటే, ప్రభువు తనను ప్రేమించిన వాళ్ళనే శిక్షిస్తాడు. అంతేకాక తన కుమారునిగా అంగీకరించి ప్రతిఒక్కణ్ణి శిక్షిస్తాడు.”
HEB 12:7 కష్టాల్ని శిక్షణగా భావించి ఓర్చుకోండి. దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా చూసుకొంటాడు. తండ్రి నుండి శిక్షణ పొందని కుమారుడెవడున్నాడు?
HEB 12:8 మీకు శిక్షణ లభించకపోతే మీరు దేవుని నిజమైన కుమారులు కారన్న మాట. ప్రతి ఒక్కడూ క్రమశిక్షణ పొందుతాడు.
HEB 12:9 మన తండ్రులు మనకు శిక్షణనిచ్చారు. ఆ కారణంగా వాళ్ళను మనం గౌరవించాము. మరి అలాంటప్పుడు మన ఆత్మలకు తండ్రి అయిన వానికి యింకెంత గౌరవమివ్వాలో ఆలోచించండి.
HEB 12:10 మన తండ్రులు, వాళ్ళకు తోచిన విధంగా కొద్దికాలం పాటు మనకు క్రమశిక్షణ నిచ్చారు. కాని దేవుడు మన మంచికోసం, ఆయన పవిత్రతలో మనం భాగం పంచుకోవాలని మనకు శిక్షణనిచ్చాడు.
HEB 12:11 శిక్షణ పొందేటప్పుడు బాధగానే వుంటుంది. ఆనందంగా ఉండదు. కాని ఆ తర్వత శిక్షణ పొందిన వాళ్ళు నీతి, శాంతి అనే ఫలం పొందుతారు.
HEB 12:12 అందువల్ల మీ బలహీనమైన చేతుల్ని, వణకుతున్న మోకాళ్ళను శక్తివంతం చేసుకోండి.
HEB 12:13 మీరు నడిచే దారుల్ని సమంగా చేసుకోండి. అప్పుడు ఆ దారులు కుంటి వాళ్ళకు అటంకం కలిగించటానికి మారుగా సహాయపడ్తాయి.
HEB 12:14 అందరిపట్ల శాంతి కనబరుస్తూ జీవించటానికి ప్రయత్నించండి. పవిత్రంగా జీవించండి. పవిత్రత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడలేరు.
HEB 12:15 ఒక్కరు కూడా దైవానుగ్రహానికి దూరం కాకుండా జాగ్రత్తపడండి.
HEB 12:16 వ్యభిచారం చెయ్యకండి. ఒక పూట భోజనం కోసం జ్యేష్టపుత్రునిగా తన హక్కుల్ని అమ్మివేసిన ఏశావువలె భక్తిహీనులై జీవించకండి.
HEB 12:17 ఏశావు ఆ తర్వాత ఆ ఆశీర్వాదం పొందాలని కోరినప్పుడు దేవుడు నిరాకరించిన విషయం మీకు తెలుసు. అతడు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని పశ్చాత్తాపం చెందుతూ కన్నీళ్ళు పెట్టుకొన్నాడు. కాని లాభం కలుగలేదు.
HEB 12:18 తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు. అగ్నిజ్వాలలతో మండుతున్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. కారు మబ్బులు, చీకటి, తుఫాను కమ్ముకొన్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు.
HEB 12:19 ఆ పర్వతం నుండి బూర ధ్వని, మాట్లాడుతున్న కంఠ ధ్వని వినటానికి రాలేదు. ఆ కంఠం విన్నవాళ్ళు భయపడి వినడానికి నిరాకరించారు.
HEB 12:20 ఎందుకంటే, “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా ఆ జంతువును రాళ్ళతో కొట్టాలి” అని ఆ స్వరం ఆజ్ఞాపించింది. ఈ ఆజ్ఞను వాళ్ళు భరించలేక పొయ్యారు.
HEB 12:21 ఆ దృశ్యము ఎంత భయంకరంగా ఉందంటే, మోషే “నేను భయంతో ఒణికి పోతున్నాను” అని అన్నాడు.
HEB 12:22 కాని మీరు సీయోను పర్వతం దగ్గరకు వచ్చారు. ఇదే పరలోకపు యెరూషలేము! సజీవుడైన దేవుని నగరం. ఆనందంతో సమూహమైన వేలకొలది దేవదూతల దగ్గరకు మీరు వచ్చారు.
HEB 12:23 మొట్టమొదటగా జన్మించిన వాళ్ళ సంఘానికి మీరు వచ్చారు. వీళ్ళ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయి. మానవుల న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు మీరు వచ్చారు. దేవుడు పరిపూర్ణత కలిగించిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు.
HEB 12:24 క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు మీరు వచ్చారు. హేబేలు రక్తానికన్నా ఉత్తమసందేశాన్నిచ్చే “ప్రోక్షింపబడే రక్తం” దగ్గరకు మీరు వచ్చారు.
HEB 12:25 జాగ్రత్త! మనతో మాట్లాడుతున్న ఆయన్ని నిరాకరించకండి. ఆయన ఇహలోకానికి వచ్చి పలికిన మాటల్ని ఆనాటి వాళ్ళు నిరాకంచారు. తద్వారా ఆయన ఆగ్రహంనుండి తప్పించుకోలేకపోయ్యారు. మరి ఆయన పరలోకంనుండి పలికే మాటల్ని నిరాకరిస్తే ఆయన ఆగ్రహంనుండి ఎలా తప్పించుకొనగలము?
HEB 12:26 ఆనాడు ఆయన కంఠం భూకంపం కలిగించింది. కాని యిప్పుడు ఆయన, “నేను భూమినే కాక ఆకాశాన్ని కూడా, మరొక్కసారి కదిలిస్తాను” అని వాగ్దానం చేసాడు.
HEB 12:27 “మరొక్కసారి” అన్న పదాలు, కదిలే వాటిని, అంటే సృష్టింపబడ్డవాటిని నాశనం చేస్తాడని సూచిస్తున్నాయి. కదలనివి అలాగే ఉండిపోతాయి.
HEB 12:28 ఎవ్వరూ కదిలించలేని రాజ్యం మనకు లభింపనున్నది కనుక దేవునికి మనము కృతజ్ఞులమై ఉందాం. ఆయన్ని భయ భక్తులతో, ఆయనకు యిష్టమైన విధంగా ఆరాధించుదాము.
HEB 12:29 ఎందుకంటే, మన దేవుడు “మండుచున్న అగ్నిలాంటివాడు.”
HEB 13:1 పరస్పరం సోదరుల్లా జీవించండి.
HEB 13:2 తెలియని వాళ్ళకు ఆతిథ్యమివ్వండి. కొందరు యిలా చేసి తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చారు.
HEB 13:3 చెరసాలల్లో ఉన్నవాళ్ళను, మీరు వాళ్ళతో సహా ఉన్నట్లు భావించి జ్ఞాపకంచేసుకోండి. అదేవిధంగా కష్టాలనుభవిస్తున్న వాళ్ళను, మీరు వాళ్ళతో సహా కష్టాలనుభవిస్తున్నట్లు భావించి జ్ఞాపకంచేసుకోండి.
HEB 13:4 వివాహాన్ని అందరూ గౌరవించాలి. వివాహపాన్పును నిష్కళంకంగా ఉంచాలి. వ్యభిచారుల్ని, వివాహితులతో లైంగిక సంబంధాలను పెట్టుకొన్నవాళ్ళను దేవుడు శిక్షిస్తాడు.
HEB 13:5 ధనాశ లేకుండా జీవితాలు గడపండి. మీ దగ్గరున్న దానితో సంతృప్తి చెందండి. ఎందుకంటే దేవుడు ఈ విధంగా అన్నాడు: “నేను నిన్ను ఎన్నటికీ విడువను నిన్నెన్నటికీ ఒంటరివాణ్ణి చెయ్యను.”
HEB 13:6 అందువల్ల మనం ధృడవిశ్వాసంతో, “ప్రభువు నా రక్షకుడు, నాకే భయంలేదు. మానవుడు నన్నేమి చెయ్యగలడు?” అని అంటున్నాము.
HEB 13:7 మీకు దైవసందేశాన్ని ఉపదేశించిన గురువుల్ని జ్ఞాపకముంచుకోండి. వాళ్ళ జీవిత విధానం వలన కలిగిన మంచిని గమనించండి. వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి.
HEB 13:8 నిన్న, నేడు, నిరంతరం యేసు క్రీస్తు ఒకే విధంగా ఉంటాడు.
HEB 13:9 ఎన్నో రకాల విచిత్రమైన బోధనలు ఉన్నాయి. వాటివల్ల మోసపోకండి. దైవానుగ్రహంతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహారంతో కాదు. ఆహార నియమాలవల్ల వాళ్ళకు లాభం కలుగదు.
HEB 13:10 యూదుల గుడారంలో సేవచేసే యాజకులకు మన బలిపీఠం మీద బలి ఇచ్చిన దాన్ని తినే అధికారంలేదు.
HEB 13:11 పాపాలకు ప్రాయశ్చిత్తంగా అర్పించటానికి ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని అతి పవిత్రస్థానంలోకి తీసుకు వెళ్ళేవాడు. ఆ జంతువుల దేహాల్ని శిబిరానికి ఆవలి వైపు కాల్చేవాడు.
HEB 13:12 మనుష్యుల్ని తన రక్తంతో పవిత్రం చెయ్యాలని యేసు నగరపు సింహద్వారానికి ఆవల మరణించాడు.
HEB 13:13 అందువల్ల శిబిరం వెలుపలనున్న ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన అవమానాన్ని పంచుకుందాం.
HEB 13:14 మనకు స్థిరమైన పట్టణం లేదు. కాని మున్ముందు రానున్న పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము.
HEB 13:15 అందువల్లే మనం యేసు ద్వారా దేవుణ్ణి అన్ని వేళలా స్తుతించుదాం. మన నోటి ద్వారా కలిగే స్తుతిని ఆయనకు బలిగా అర్పించి, ఆయన పేరులో ఉన్న కీర్తిని పంచుకుందాం.
HEB 13:16 ఇతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్న దాన్ని యితరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి చాలా యిష్టం.
HEB 13:17 మీ నాయకుల పట్ల విధేయతగా ఉంటూ, వాళ్ళు చెప్పినట్లు చెయ్యండి. మీ ఆత్మల్ని కాపాడవలసిన పని వాళ్ళది. వాళ్ళు దేవుని ముందు లెక్క చెప్పవలసివుంటుంది. వాళ్ళకు మీరు విధేయులైవుంటే, వాళ్ళు తాము చేయవలసిన పనిని ఆనందంగా చేయగలుగుతారు. అది వాళ్ళకు భారంగా వుండదు. వాళ్ళకు భారం కలగటం మీకు మంచిది కాదు.
HEB 13:18 మా కోసం ప్రార్థించండి. మా అంతరాత్మలు నిర్మలమైనవనే విశ్వాసం మాకు ఉంది. మేము అన్ని విధాలా గౌరవప్రదంగా జీవించాలనుకొంటున్నాము.
HEB 13:19 నేను ముఖ్యంగా వేడుకునేదేమిటంటే, నేను త్వరలోనే మిమ్మల్ని కలుసుకోవాలని దేవుణ్ణి ప్రార్థించండి.
HEB 13:20 శాంతిని స్థాపించే దేవుడు, గొఱ్రెల గొప్ప కాపరి అయిన మన యేసు ప్రభువును తిరిగి బ్రతికించాడు. ఈ కార్యాన్ని దేవుడు శాశ్వతమైన ఒడంబడిక రక్తం ద్వారా జరిగించాడు.
HEB 13:21 ఆ దేవుడు మీరు ఆయన యిష్టానుసారం నడుచుకునేటట్లు మీకు కావలసినవి సమకూర్చు గాక! ఆయన మనలో ఉండి, యేసు క్రీస్తు ద్వారా తన యిష్టాన్ని నెరవేర్చుగాక! ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
HEB 13:22 సోదరులారా! నేనీ లేఖను క్లుప్తంగా వ్రాసాను. ప్రోత్సాహం కలుగ చేసే ఈ సందేశాన్ని సహృదయంతో చదువమని వేడుకుంటున్నాను.
HEB 13:23 మన సోదరుడైన తిమోతిని విడుదల చేసినట్లు మీకు తెలియ జేస్తున్నాను. అతడు నా వద్దకు త్వరలో వస్తే అతనితో కలిసి మిమ్మల్ని చూడటానికి వస్తాను.
HEB 13:24 మీలోవున్న పెద్దలకు, దేవుని ప్రజలకు వందనాలు తెలుపండి. ఇటలీ దేశానికి చెందిన విశ్వాసులు మీకు వందనాలు తెలుపుతున్నారు.
HEB 13:25 మీ అందరికి ప్రేమానుగ్రహము తోడుగా వుండునుగాక!
JAM 1:1 దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకు సేవకుడైన యాకోబునైన నేను, చెదరిపోయి పలు ప్రాంతాలలో నివసిస్తున్న పన్నెండు గోత్రాల వారికి శుభాకాంక్షలు తెలపుతూ వ్రాయునదేమనగా:
JAM 1:2 నా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు.
JAM 1:4 మీరు చేసిన పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణతపొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు.
JAM 1:5 మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు.
JAM 1:6 కాని దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సముద్రం మీది తరంగంతో సమానము.
JAM 1:7 అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు.
JAM 1:8 అలాంటివాడు ద్వంద్వాలోచనలు చేస్తూ అన్ని విషయాల్లో చంచలంగా ఉంటాడు.
JAM 1:9 దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు గొప్ప స్థానం లభించినందుకు గర్వించాలి.
JAM 1:10 ధనవంతుడు తాను కూడా గడ్డిపువ్వులా రాలిపోవలసిన వాడే కనుక తనకు దీనస్థితి కలిగినందుకు ఆనందించాలి.
JAM 1:11 ఎందుకంటే, సూర్యుడు ఉదయిస్తాడు. మండుటెండకు గడ్డి ఎండిపోతుంది. దాని పువ్వులు రాలి దాని అందం చెడిపోతుంది. అదేవిధంగా ధనవంతుడు తన వ్యాపారం సాగిస్తుండగానే మరణిస్తాడు.
JAM 1:12 పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు. ఆ విధంగా పరీక్షింపబడినవాడు జీవకిరీటాన్ని పొందుతాడు. అంటే దేవుడు తనను ప్రేమించిన వాళ్ళకు చేసిన వాగ్దానం అతడు పొందుతాడన్నమాట.
JAM 1:13 ఒకడు శోధింపబడినప్పుడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. ఎందుకంటే దేవుడు చెడు ద్వారా శోధింపడు. ఆయన ఎవర్నీ శోధించడు.
JAM 1:14 దురాశలకు లోనై ఆశల్లో చిక్కుకు పోయినప్పుడు నీతికి దూరమై చెడును చెయ్యాలనే బుద్ధి పుడుతుంది.
JAM 1:15 దురాశ గర్భం దాల్చి పాపాన్ని ప్రసవిస్తుంది. ఆ పాపం పండి మరణాన్ని కంటుంది.
JAM 1:16 నా ప్రియమైన సోదరులారా! మోసపోకండి.
JAM 1:17 ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్టమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు.
JAM 1:18 దేవుడు తన సృష్టిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జన్మనివ్వటానికి సంకల్పించాడు.
JAM 1:19 నా ప్రియమైన సోదరులారా! ఈ విషయాల్ని తెలుసుకోండి: ప్రతి మనిషి వినటానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపాన్ని అణచుకోవాలి.
JAM 1:20 ఎందుకంటే కోపం ద్వారా దేవుడు ఆశించే నీతి కలుగదు.
JAM 1:21 అందువల్ల దుర్మార్గాల్ని, అవినీతిని పూర్తిగా వదిలివెయ్యండి. మీలో నాటుకు పోయిన దైవసందేశాన్ని విధేయతతో ఆచరించండి. అది మీ ఆత్మల్ని రక్షించగలదు.
JAM 1:22 దైవసందేశం చెప్పినట్లు చెయ్యండి. దాన్ని విని కూడా మీరు ఏమీ చెయ్యలేక పోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొన్న వాళ్ళవుతారు.
JAM 1:23 దైవసందేశం విని అది చెప్పినట్లు చెయ్యని వాడు అద్దంలో తన ముఖం చూసుకొని తానేవిధంగా కనిపించాడో వెంటనే మరచిపోయే వ్యక్తిలాంటివాడు.
JAM 1:25 స్వేచ్ఛను కలిగించే పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తూ దాని ప్రకారం జీవించేవాడు క్రియచేస్తున్న వానిగా పరిగణింపబడతాడు. అలాంటివాడు విని మరచిపోయే రకం కాదు. అతడు చేస్తున్న ప్రతీ కార్యము ఫలించాలని దేవుడు అతణ్ణి దీవిస్తాడు.
JAM 1:26 తానొక విశ్వాసినని తలంచి తన నాలుకకు కళ్ళెం వేసుకోకపోతె తనకు తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. అతని విశ్వాసం నిష్ప్రయోజనమౌతుంది.
JAM 1:27 అనాథుల్ని, వితంతువుల్ని కష్టాల్లో ఆదుకోవటం, ఈ ప్రపంచంలో ఉన్న చెడువల్ల మలినం కాకుండా ఉండటము. ఇదే మన తండ్రియైన దేవుడు అంగీకరించే నిజమైన భక్తి. అదే నిజమైన భక్తి.
JAM 2:1 నా సోదరులారా! తేజోవంతుడైన మన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్న మీరు పక్షపాతం చూపకూడదు.
JAM 2:2 బంగారు ఉంగరాలు, మంచి దుస్తులు వేసుకొన్న వాడొకడు, మాసిన దుస్తులు వేసుకొన్న వాడొకడు మీ సమావేశానికి వస్తారనుకోండి.
JAM 2:3 అప్పుడు మీరు మంచి దుస్తులు వేసుకొన్న వాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ద కనపరుస్తూ, “రండి! ఈ మంచి స్థానంలో కూర్చోండి” అని అంటూ పేదవానితో, “నీవక్కడ నిలబడు!” అనిగాని “నా కాళ్ళ దగ్గర కూర్చో” అనిగాని అంటే,
JAM 2:4 మీరు వ్యత్యాసము చూపుతున్నట్లే కదా! దుర్బుద్ధితో తీర్పు చెప్పినట్లే కదా!
JAM 2:5 నా ప్రియమైన సోదరులారా! ప్రపంచ దృష్టిలో పేదవాళ్ళు విశ్వాసంలో ధనికులు కావాలనీ, వాళ్ళు తన రాజ్యానికి వారసులు కావాలనీ దేవుడు వాళ్ళను ఎన్నుకోలేదా? తనను ప్రేమించిన వాళ్ళకు రాజ్యాన్నిస్తానని దేవుడు యింతకు క్రితమె వాగ్దానం చేసాడు.
JAM 2:6 మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. మిమ్మల్ని దోచుకొనే వాళ్ళు ధనికులే కదా! వాళ్ళేకదా మిమ్ములను న్యాయస్థానానికి ఈడ్చేది?
JAM 2:7 మీరు ఎవరికి చెందారో గౌరవప్రదమైన ఆయన పేరును దూషిస్తున్నది వాళ్ళే కాదా?
JAM 2:8 “నీ పొరుగింటి వాణ్ణి నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా ప్రేమించు” అని ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞను మీరు నిజంగా పాటిస్తే మీలో సత్‌ప్రవర్తన ఉన్నట్లే.
JAM 2:9 కాని ఒకవేళ మీరు పక్షపాతం చూపితే పాపం చేసిన వాళ్ళౌతారు. తద్వారా ధర్మశాస్త్రం ప్రకారం మీరు నీతిని ఉల్లంఘించిన వాళ్ళౌతారు.
JAM 2:10 ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలన్నిటినీ పాటిస్తూ ఒకే ఒక నియమాన్ని ఉల్లంఘిస్తే అలాంటి వాడు ధర్మశాస్త్రాన్నంతా ఉల్లంఘించిన వాడౌతాడు.
JAM 2:11 ఎందుకంటే, “వ్యభిచారం చేయరాదు” అని అన్నవాడే “హత్యచేయరాదు” అని కూడా అన్నాడు. మీరు వ్యభిచారం చేసివుండక పోవచ్చు. కాని హత్య చేసి ఉంటే! అలాంటప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లే కదా!
JAM 2:12 స్వేచ్ఛను కలిగించే క్రొత్త ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు పొందనున్న వాళ్ళలా ప్రవర్తించండి. అదేవిధంగా మాట్లాడండి.
JAM 2:13 దేవుడు తీర్పు చెప్పేటప్పుడు దయాహీనులపై దయ చూపడు. కాని దయచూపిన వాళ్ళు తీర్పు చెప్పే సమయంలో ఆనందిస్తారు.
JAM 2:14 నా సోదరులారా! “నాకు విశ్వాసం ఉంది” అని అన్న వ్యక్తి ఆ విశ్వాసాన్ని క్రియా రూపకంగా చూపకపోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి రక్షించగలదా?
JAM 2:15 ఒక సోదరుడో లేక సోదరియో కూడూ గుడ్డా లేక బాధపడ్తున్నారనుకోండి.
JAM 2:16 అప్పుడు మీరు అతనితో, “క్షేమంగా వెళ్ళిరా! కడుపునిండా తిని ఒంటి నిండా దుస్తులు వేసుకో!” అని అంటూ వాళ్ళ అవసరాలు తీర్చకపోతే దానివల్ల వచ్చిన లాభమేమిటి?
JAM 2:17 విశ్వాసంతో పాటు క్రియ లేకపోతే ఆ విశ్వాసం పూర్తిగా నిష్ప్రయోజనమై పోతుంది.
JAM 2:18 కాని, “ఒకనిలో విశ్వాసం ఉండవచ్చు. మరొకనిలో క్రియ ఉండవచ్చు!”అని మీరనవచ్చు! అలాగైతే క్రియలు లేకుండా మీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపండి. నేను క్రియారూపకంగా నా విశ్వాసాన్ని చూపుతాను.
JAM 2:19 ఒక్కడే దేవుడున్నాడని మీరు విశ్వసిస్తారు. మంచిదే. దయ్యాలు కూడా దాన్ని నమ్ముతాయి. అయినా, దేవుడు తమను శిక్షిస్తాడేమోనని భయపడ్తూ ఉంటాయి.
JAM 2:20 ఓ మూర్ఖూడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న దానికి నీకు ఋజువు కావాలా?
JAM 2:21 మన పూర్వీకుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై బలిగా యివ్వటానికి సిద్ధమైనందుకు దేవుడతణ్ణి, అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణించలేదా?
JAM 2:22 అతనిలో ఉన్న విశ్వాసము క్రియతో కలిసి పని చెయ్యటం మీరు గమనించారు. అతడు చేసిన క్రియ అతని విశ్వాసానికి పరిపూర్ణత కలిగించింది.
JAM 2:23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. తద్వారా దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు” అని లేఖనాల్లో చెప్పిన విషయం నిజమైంది. దేవుడతణ్ణి తన మిత్రునిగా పిలిచాడు.
JAM 2:24 మానవునిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే కాకుండా అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణింపబడటం మీరు చూసారు.
JAM 2:25 మరొక ఉదాహరణ రాహాబు. ఆమె గూఢచారులకు ఆతిథ్యమిచ్చి వాళ్ళను వేరొక దారిన పంపివేసింది. ఆమె చేసిన క్రియను బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలిగా పరిగణించ లేదా?
JAM 2:26 ఆత్మలేని శరీరం ఏ విధంగా నిర్జీవమైందో అదే విధంగా క్రియలేని విశ్వాసము నిర్జీవమైనది.
JAM 3:1 నా సోదరులారా! దేవుడు మిగతా వాళ్ళ కన్నా, బోధించే మనల్ని కఠినంగా శిక్షస్తాడని మీకు తెలుసు. కనుక అందరూ బోధకులు కావాలని ఆశించకండి.
JAM 3:2 మనమంతా ఎన్నో తప్పులు చేస్తుంటాము. తాను ఆడే మాటల్లో ఏ తప్పూ చేయనివాడు పరిపూర్ణుడు. అలాంటివాడు కళ్ళెం వేసి తన శరీరాన్ని అదుపులో పెట్టుకోగలడు.
JAM 3:3 చెప్పినట్లు వినాలనే ఉద్దేశ్యంతో మనం గుఱ్ఱం నోటికి కళె?్ళం వేస్తాం. అలా చేస్తేనే మనం దాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోగలము.
JAM 3:4 ఓడను ఉదాహరణగా తీసుకొండి. అది చాలా పెద్దగా ఉంటుంది. బలమైన గాలివల్ల అది నడుస్తుంటుంది. కాని దాన్ని నావికుడు చిన్న చుక్కానితో తన యిష్టం వచ్చిన చోటికి తీసుకు వెళ్ళగలడు.
JAM 3:5 అదేవిధంగా నాలుక శరీరంలో చిన్న భాగమైనా గొప్పలు పలుకుతుంది. చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని ఏ విధంగా కాలుస్తుందో గమనించండి.
JAM 3:6 నాలుక నిప్పులాంటిది. అది చెడుతో నిండిన ప్రపంచానికి ప్రతినిధిగా మన శరీరంలో ఉంది. అది మన శరీరంలో ఒక భాగంగా ఉండి శరీరమంతా చెడును వ్యాపింపచేస్తుంది. మనిషి యొక్క జీవితానికే నిప్పంటిస్తుంది. నాలుక ఈ నిప్పును నరకం నుండి పొందుతుంది.
JAM 3:7 మానవుడు అన్ని రకాల జంతువుల్ని, పక్షుల్ని, ప్రాకే జీవుల్ని, సముద్రంలోని ప్రాణుల్ని మచ్చిక చేసుకొంటున్నాడు: ఇదివరకే మచ్చిక చేసుకొన్నాడు.
JAM 3:8 కాని నాలుకను ఎవ్వరూ మచ్చిక చేసుకోలేదు. అది ప్రాణాంతకమైన విషంతో కూడుకున్న ఒక అవయవం. అది చాలా చెడ్డది. విరామం లేకుండా ఉంటుంది.
JAM 3:9 మనం, మన నాలుకతో ప్రభువును, తండ్రిని స్తుతిస్తాము. అదే నాలుకతో దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుణ్ణి శపిస్తాము.
JAM 3:10 స్తుతి, శాపము ఒకే నోటినుండి సంభవిస్తున్నాయి. నా సోదరులారా! ఇది తప్పు.
JAM 3:11 ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు ఒకే ఊట నుండి పారుతున్నాయా?
JAM 3:12 నా సోదరులారా! అంజూరపు చెట్టుకు ఒలీవ పండ్లు, లేక ద్రాక్షతీగకు అంజూరపు పండ్లు కాస్తాయా? అలాగే ఉప్పు నీటి ఊట నుండి మంచి నీళ్ళు ఊరవు.
JAM 3:13 జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే వాళ్ళను సత్‌ప్రవర్తనతో, వినయంతో కూడుకొన్న విజ్ఞానంతో సాధించిన కార్యాల ద్వారా చూపమనండి.
JAM 3:14 ఒకవేళ మీ హృదయాల్లో అసూయతో కూడుకొన్న కోపము, స్వార్ధంతో కూడుకొన్న ఆశ ఉంటే మీలో వివేకముందని ప్రగల్భాలు చెప్పుకోకండి. అలా చేస్తే నిజాన్ని మరుగు పరచినట్లౌతుంది.
JAM 3:15 మీలో ఉన్న ఈ జ్ఞానము పరలోకంలో నుండి దిగి రాలేదు. ఇది భూలోకానికి చెందింది. ఇందులో ఆధ్యాత్మికత లేదు. ఇది సైతానుకు చెందింది.
JAM 3:16 ఎందుకంటే అసూయ, స్వార్థము, ఎక్కడ ఉంటాయో అక్కడ అక్రమాలు, అన్ని రకాల చెడు పద్ధతులు ఉంటాయి.
JAM 3:17 కాని పరలోకం నుండి వచ్చిన జ్ఞానం మొదట పవిత్రమైనది. అది శాంతిని ప్రేమిస్తుంది, సాధుగుణం, వినయం, సంపూర్ణమైన దయ, మంచి ఫలాలు, నిష్పక్షపాతం, యథార్థత కలిగియుంటుంది.
JAM 3:18 శాంతి స్థాపకులు శాంతిని విత్తి నీతి అనే పంటను కోస్తారు.
JAM 4:1 మీలో మీకు యుద్ధాలు, పోట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? మీ ఆంతర్యంలోని ఆశలు మీలో యుద్ధం చేయటం వల్లనే గదా యివి జరగటం?
JAM 4:2 మీరు కోరుతారు. అది లభించదు. దాని కోసం మీరు చంపటానికి కూడా సిద్ధమౌతారు. మీలో అసూయ కలుగుతుంది. అయినా మీ కోరిక తీర్చుకోలేరు. మీరు పోట్లాడుతారు. యుద్ధం చేస్తారు. కాని మీరు దేవుణ్ణి అడగరు కనుక మీ కోరిక తీరదు.
JAM 4:3 మీరు దురుద్దేశ్యంతో అడుగుతారు. కనుక మీరు అడిగినా మీకు లభించదు. మీరు అడిగేది మీ సుఖాలకు ఖర్చు పెట్టాలని అడుగుతారు.
JAM 4:4 నమ్మక ద్రోహులారా! ప్రపంచంతో స్నేహం చేస్తే దేవుణ్ణి ద్వేషించినట్లని మీకు తెలియదా? ప్రపంచంతో స్నేహం చెయ్యాలనుకొన్నవాడు దేవునికి శత్రువు అవుతాడు.
JAM 4:5 లేఖనాల్లో ఈ విషయం వృధాగా వ్రాసారనుకుంటున్నారా? “ఆయన మనకిచ్చిన ఆత్మను మనం ఆయన కోసం మాత్రమే వాడాలని చూస్తుంటాడు.”
JAM 4:6 దేవుడు మనపై ఎంతో అనుగ్రహం చూపుతున్నాడు. అందువల్ల లేఖనాల్లో, “దేవుడు అహంకారం కలవాళ్ళను ద్వేషిస్తాడు. వినయం కలవాళ్ళను కనికరిస్తాడు” అని వ్రాయబడింది.
JAM 4:7 అందువల్ల దేవుని పట్ల విధేయతతో ఉండండి. సైతాన్ను ఎదిరించండి. అప్పుడు ఆ సైతాను మీ నుండి పారిపోతాడు.
JAM 4:8 దేవుణ్ణి మీరు సమీపిస్తే దేవుడు మిమ్మల్ని సమీపిస్తాడు. పాపాత్ములారా! మీ పాపాలు కడుక్కోండి. చంచలమైన మనస్సుగల ప్రజాలారా! మీ హృదయాల్ని పవిత్రం చేసుకోండి.
JAM 4:9 విచారించండి, దుఃఖించండి, శోకించండి. మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి. మీ ఆనందాన్ని విషాదంగా మార్చుకోండి.
JAM 4:10 ప్రభువు సమక్షంలో మీరు తగ్గింపు కలవారుగా ఉండండి. అప్పుడు ఆయన మిమ్మల్ని పైకిలేపుతాడు.
JAM 4:11 సోదరులారా! పరస్పరం దూషించుకోకండి. తన సోదరుల్ని దూషించినవాడు, లేక సోదరునిపై తీర్పు చెప్పినవాడు, ధర్మశాస్త్రాన్ని దూషించిన వానిగా పరిగణింపబడతాడు. మీరు అలా చేస్తే ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి మారుగా, న్యాయాధిపతివలె ఆ ధర్మశాస్త్రంపై తీర్పు చెపుతున్నారన్నమాట.
JAM 4:12 ధర్మశాస్త్రాన్నిచ్చిన వాడును, న్యాయాధిపతియు ఆయనే. రక్షించగలవాడు, నాశనం చెయ్యగలవాడు ఆయనే. మరి యితర్లపై తీర్పు చెప్పటానికి నీవెవరు?
JAM 4:13 వినండి! “ఈ రోజో లేక రేపో మేము ఈ పట్టణానికో లేక ఆ పట్టణానికో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం గడిపి వ్యాపారం చేసి డబ్బు గడిస్తాము” అని మీరంటూ ఉంటారు.
JAM 4:14 అంతెందుకు, రేపేమి జరుగబోతుందో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనిపించి ఆ తర్వాత మాయమైపోయే పొగమంచు లాంటి వాళ్ళు.
JAM 4:15 మీరు దానికి మారుగా, “ప్రభువు అనుగ్రహిస్తే మేము జీవించి యిదీ అదీ చేస్తాము” అని అనాలి.
JAM 4:16 మీరు గర్వంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలా ప్రగల్భాలు పలకటం తప్పు.
JAM 4:17 అందువల్ల మంచి చెయ్యటానికి నేర్చుకొన్నవాడు మంచి పనినే చెయ్యాలి. అలా చెయ్యకపోవటం పాపం అవుతుంది.
JAM 5:1 ధనికులారా! వినండి. మీకు కష్టాలు కలుగనున్నవి. కనుక దుఃఖించండి. శోకిస్తూ కేకలు వేయండి.
JAM 5:2 మీ ధనం చెడిపోతుంది. మీ దుస్తులకు చెదలుపడ్తాయి.
JAM 5:3 మీ దగ్గరున్న వెండి బంగారాలకు త్రుప్పు పడుతుంది. వాటి త్రుప్పు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మీ శరీరాల్ని నిప్పులా కాల్చి వేస్తుంది. చివరి దినాలకు మీరు ధనాన్ని దాచుకొన్నారు.
JAM 5:4 మీ పొలాల్ని సాగుచేసిన పనివాళ్ళకు మీరు కూలి యివ్వలేదు. వాళ్ళు ఏడుస్తూ మీపై ఫిర్యాదు చేస్తున్నారు. ఆ కూలివాళ్ళ ఏడ్పులు సర్వశక్తి సంపన్నుడైన ప్రభువు చెవిలోపడ్డాయి.
JAM 5:5 మీరు ఐశ్వర్యంతో విలాసాలు చేసుకొంటూ ఈ ప్రపంచంలో జీవించారు. మీరు మీ హృదయాల్ని కొవ్వెక్క చేసి చివరి రోజు వధింపబడటానికి సిద్ధపరుస్తున్నారు.
JAM 5:6 తప్పు చేయని వాళ్ళపై మీరు శిక్ష విధించారు. వాళ్ళను చంపారు. అయినా వాళ్ళు మిమ్మల్ని ఎదిరించటం లేదు.
JAM 5:7 అందువల్ల సోదరులారా! ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే విలువైన పంటకోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో గమనించండి. అతడు, తొలకరి కడవరి వర్షం దాకా సహనంతో కాచుకొని ఉంటాడు.
JAM 5:8 ప్రభువు రానున్న సమయం సమీపిస్తోంది. కనుక ధైర్యం చెడకుండా సహనంతో ఉండండి.
JAM 5:9 సోదరులారా! ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ న్యాయాధిపతి మీ తలుపు ముందు నిలుచున్నాడు.
JAM 5:10 సోదరులారా! ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు కష్టాలు అనుభవించారు. వాళ్ళలో సహనం ఉంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి.
JAM 5:11 కష్టాలు అనుభవించి కూడా విశ్వాసంతో ఉన్న వాళ్ళను మనము ధన్యులుగా భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసిన దాన్ని చూసారు. ప్రభువులో దయా దాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి.
JAM 5:12 నా సోదరులారా! అన్నిటికన్నా ముఖ్యమైనదేమిటంటే, పరలోకం పేరిట గాని, భూమి పేరిట గాని, మరేదానిపై గాని ఒట్టు పెట్టుకోకండి. మీరు “ఔను” అని అనాలనుకొంటె “ఔను” అనండి. “కాదు” అని అనాలనుకొంటె “కాదు” అని అనండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షించడు.
JAM 5:13 మీలో ఎవరైనా కష్టాల్లో ఉంటే అలాంటి వాడు ప్రార్థించాలి. ఆనందంగా ఉన్నవాడు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడాలి.
JAM 5:14 అనారోగ్యంగా ఉన్నవాడు సంఘ పెద్దల్ని పిలవాలి. ఆ పెద్దలు వచ్చి, ప్రార్థించి ప్రభువు పేరిట అతనికి నూనె రాయాలి.
JAM 5:15 విశ్వాసంతో చేసిన ప్రార్థన ఆ రోగికి ఆరోగ్యం కలుగచేస్తుంది. ప్రభువు అతనికి ఆరోగ్యం కలుగచేస్తాడు పాపం చేసి ఉంటె అతన్ని క్షమిస్తాడు.
JAM 5:16 అందువల్ల చేసిన తప్పుల్ని పరస్పరం ఒప్పుకోండి. ఒకిరికొకరు ప్రార్థించండి. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. నీతిమంతుని ప్రార్థన బహు బలముగలది. కనుక ఎంతో మేలు చేయగలదు.
JAM 5:17 ఏలీయా మనలాంటి మనిషే. ఒకప్పుడు వర్షాలు కురియరాదని అతడు ఆసక్తితో ప్రార్థించాడు. మూడున్నర సంవత్సరాల దాకా వర్షాలు కురియలేదు.
JAM 5:18 ఆ తర్వాత మళ్ళీ ప్రార్థించాడు. ఆకాశం నుండి వర్షాలు కురిసాయి. భూమి నుండి పంటలు పండాయి.
JAM 5:19 నా సోదరులారా! మీలో ఎవరైనా నీతిమార్గానికి దూరంగా పోయిన వాణ్ణి వెనక్కు పిలుచుకు వస్తే యిది గమనించండి.
JAM 5:20 పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించినవాడు అతని ఆత్మను పాపాలన్నిటి నుండి రక్షించినవాడౌతాడు. అదీగాక అతన్ని చావు నుండి తప్పించిన వాడౌతాడు.
1PE 1:1 చెదరిపోయి పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితూనియ, ప్రాంతాలలో పరదేశీయులుగా నివసిస్తున్న వాళ్ళకు, యేసు క్రీస్తు అపొస్తలుడైన పేతురు వ్రాయునదేమనగా, ప్రియులారా! మీరు దేవునిచే ఎన్నుకోబడ్డ వాళ్ళు. మీకు ఆయన అనుగ్రహము, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను.
1PE 1:2 మీరు యేసు క్రీస్తుకు విధేయులై ఉండాలని, ఆయన రక్తం చేత ప్రోక్షింపబడాలని, తండ్రి అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన దివ్యజ్ఞానంతో ఎన్నుకున్నాడు; పరిశుద్ధాత్మ మిమ్మల్మి పవిత్రం చేసాడు.
1PE 1:3 మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించుదాం. ఆయనకు మనపై అనుగ్రహం ఉండటం వల్ల యేసు క్రీస్తును బ్రతికించి మనకు క్రొత్త జీవితాన్ని యిచ్చాడు. అంతేకాక మనలో సజీవమైన ఆశాభావాన్ని కలిగించాడు.
1PE 1:4 నాశనంకాని, మచ్చలేని, తరగని వారసత్వం పొందటానికి ఆశించండి. దేవుడు మీకోసం దాన్ని పరలోకంలో దాచి ఉంచాడు.
1PE 1:5 చివరి దశలో మనకు వ్యక్తం కావటానికి రక్షణ సిద్ధంగా ఉంది. మీలో విశ్వాసం ఉండటంవల్ల, అది లభించే వరకూ మీకు దైవశక్తి రక్షణ కలిగిస్తుంది.
1PE 1:6 కొంతకాలం సంభవించిన అనేక రకాల కష్టాల్ని అనుభవించవలసి వచ్చినప్పుడు మీరు అనుభవించారు. దానికి ఆనందించండి.
1PE 1:7 మీ విశ్వాసం యథార్థమైనదని రుజువగుటకు ఈ శ్రమలు మీకొచ్చాయి. బంగారం నిప్పుచేత కాల్చబడి శుద్ధి అయినా, చివరికది నాశనం కాక తప్పదు. మీ విశ్వాసం బంగారం కంటే విలువైనదిగా యుండి యేసు క్రీస్తు వచ్చినప్పుడు ప్రశంస, మహిమ, ఘనత పొంద తగినదిగా వుంటుంది.
1PE 1:8 మీరాయన్ని చూడలేదు. అయినా ప్రేమిస్తున్నారు. ప్రస్తుతం చూడటం లేదు. అయినా విశ్వసిస్తున్నారు. వ్యక్తం చేయలేని దివ్యమైన ఆనందం మీలో నిండిపోయింది.
1PE 1:9 ఎందుకంటే ఏ ఉద్దేశ్యంతో మీరు విశ్వసిస్తున్నారో ఆ ఉద్దేశ్యం నెరవేరుతొంది. మీ ఆత్మలకు రక్షణ లభిస్తోంది.
1PE 1:10 ఈ రక్షణ విషయంలో, ప్రవక్తలు మీకోసం రాబోవు కృపను గురించి మాట్లాడుతూ అతిజాగ్రత్తతో తీవ్రంగా పరిశోధించారు.
1PE 1:11 వాళ్ళలో ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు బాధల్ని గురించి, ఆ తర్వాత ఆయన పొందనున్న మహిమను గురించి వాళ్ళకు ముందుగానే తెలియజేసాడు. ఆ ఆత్మ సూచించిన కాలాన్ని, పరిస్థితుల్ని తెలుసుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేసారు.
1PE 1:12 తమ లాభం కోసం కాకుండా మీకు సేవ చేయాలని ఇలా చేసారు. ఈ విషయం దేవుడు వాళ్ళకు తెలియచేసాడు. పరలోకం నుండి దేవుడు పంపిన పరిశుద్ధాత్మ ద్వారా, సువార్తను బోధించిన వాళ్ళు మీకు వాటిని గురించి తెలిపారు. వాటిని గురించి తెలుసుకోవాలని దేవదూతలు కూడా ఎదురు చూస్తున్నారు.
1PE 1:13 అందుచేత కార్యసిద్ధికోసం మీ మనసుల్ని సిద్ధం చేసికొంటూ మిమ్మల్ని అదుపులో పెట్టుకోండి. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కందివ్వబోయే అనుగ్రహంపై సంపూర్ణమైన ఆశాభావంతో ఉండండి.
1PE 1:14 మీరు అజ్ఞానంతో జీవించినప్పుడు దురాశలకు లోనై జీవించారు. ఇప్పుడావిధంగా జీవించకుండా చిన్న పిల్లలవలే విధేయతతో జీవించండి.
1PE 1:15 మిమ్మల్ని పిలిచిన వాడు ఏ విధంగా పవిత్రుడో అదేవిధంగా మీరు కూడా పవిత్రమైన కార్యాలను చేస్తూ పవిత్రంగా జీవించండి.
1PE 1:16 ఎందుకంటే ధర్మశాస్త్రంలో, “నేను పవిత్రుణ్ణి; కనుక మీరు కూడా పవిత్రంగా ఉండండి” అని వ్రాయబడిఉంది.
1PE 1:17 పక్షపాతము చూపకుండా ఒక వ్యక్తి చేసిన కార్యాలను బట్టి తీర్పు చెప్పే దేవుణ్ణి మీరు ‘తండ్రి’ అని పిలుస్తారు కనుక మీరు భయ భక్తులతో పరదేశీయులుగా మీ జీవితాలను గడపండి.
1PE 1:18 ఎందుకంటే, మీ పూర్వీకులు వంశపారంపర్యంగా మీ కందించిన వ్యర్థజీవితం నుండి మీకు విడుదల కలుగలేదు. నశించిపోయే వెండి, బంగారం వంటి వస్తువుల వల్లనూ కలుగలేదు. ఈ విషయం మీకు తెలుసు.
1PE 1:19 ఏ లోపమూ, మచ్చాలేని గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మీకు విముక్తి కలిగింది.
1PE 1:20 ఈ ప్రపంచానికి పునాది వేయకముందే దేవుడు క్రీస్తును ఎన్నుకున్నాడు. కాని మీకోసం ఈ చివరి రోజుల్లో ఆయన్ను వ్యక్తం చేసాడు.
1PE 1:21 ఆయన కారణంగా మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. ఆయన్ని బ్రతికించి మహిమ గలవానిగా చేసాడు. తద్వారా మీకు దేవుని పట్ల విశ్వాసము, ఆశ కలిగాయి.
1PE 1:22 సత్యాన్ని విధేయతతో ఆచరించటంవల్ల మీ జీవితాలు పవిత్రమయ్యాయి. తద్వారా మీ సోదరుల పట్ల మీకు నిజమైన ప్రేమ కలిగింది. పరస్పరం హృదయపూర్వకంగా చిరకాలం ప్రేమించుకుంటూ ఉండండి.
1PE 1:23 నశించిపోయే సంతానంగా మీరు తిరిగిపుట్టలేదు, గాని నశించని సంతానంగా సజీవమైన దేవుని వాక్యం ద్వారా తిరిగి పుట్టారు.
1PE 1:24 ఎందుకంటే, “మానవులు గడ్డిపోచల్లాంటి వాళ్ళు వాళ్ళ కీర్తి గడ్డి పువ్వులాంటిది గడ్డి ఎండిపోతుంది, పువ్వురాలిపోతుంది,
1PE 1:25 కాని, ప్రభువు సందేశం చిరకాలం నిలిచిపోతుంది.” మీకు ప్రకటింపబడిన సందేశం యిదే!
1PE 2:1 అందువలన మీరు దుష్టత్వమంతటినీ, మోసమంతటినీ, వేషధారణను, అసూయను మరియు ప్రతివిధమైన దూషణను మీ నుండి తీసివేయండి.
1PE 2:2 అప్పుడే జన్మించిన శిశువులు పాలకోసం తహతహలాడినట్లు, మీరు కూడా దేవుని వాక్యమను పరిశుద్ధ పాల కోసం తహతహలాడండి. ఆ పాల వల్ల మీరు ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతారు.
1PE 2:3 ప్రభువు మంచి వాడని అనుభవ పూర్వకంగా మీరు తెలిసికొన్నారు.
1PE 2:4 మీరు సజీవమైన రాయియగు ప్రభువు వద్ధకు రండి. మానవులు ఈ సజీవమైన రాయిని తృణీకరించారు. కాని, దేవుడు ఆయన్ని అమూల్యంగా పరిగణించి ఎన్నుకొన్నాడు.
1PE 2:5 మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఆత్మీయమైన మందిర నిర్మాణంలో కట్టబడుచున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మీయబలుల్ని అర్పించడానికి మీరు పవిత్ర యాజకులుగా ఎన్నుకోబడ్డారు.
1PE 2:6 ఎందుకంటే, ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “అదిగో చూడు! సీయోనులో ఒక రాయి స్థాపించాను! పునాది రాయిగా ఎన్నుకున్న అమూల్యమైన రాయి అది. ఆయన్ని నమ్మిన వానికెవ్వనికి అవమానం ఎన్నటికి కలుగదు!”
1PE 2:7 ఇప్పుడు నమ్మిన మీకు అది అమూల్యమైన రాయి. కాని నమ్మిన వాళ్ళకు: “ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది.”
1PE 2:8 మరొక చోట యిలా వ్రాయబడి ఉంది: “ఈ రాయి, మానవులు తొట్రుపడేటట్లు చేస్తుంది ఈ బండ వాళ్ళను క్రింద పడవేస్తుంది.” దైవసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తొట్రు పడతారు. వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు.
1PE 2:9 కాని, మీరు దేవుడు ఎన్నుకొన్నప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మ్మిమ్మల్ని పిలిచాడు.
1PE 2:10 పూర్వం మీరు దేవుని ప్రజ కాదు. ఇప్పుడు మీరు దేవుని ప్రజ. పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు. కాని యిప్పుడు లభించింది.
1PE 2:11 ప్రియమైన సోదరులారా! ఈ ప్రపంచంలో మీరు పరదేశీయుల్లా, యాత్రికుల్లా, జీవిస్తున్నారు. మీ ఆత్మలతో పోరాడుతున్న శారీరక వాంఛల్ని వదిలి వేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
1PE 2:12 యూదులుకాని వాళ్ళ మధ్య నివసిస్తున్న మీరు మంచి నడవడక గలిగి జీవించాలి. ఎందుకంటే, “దుర్మార్గులని,” మిమ్మల్ని నిందిస్తున్న వాళ్ళు మీ మంచి నడవడికను చూసి దేవుడు తీర్పు చెప్పనున్న రోజు ఆయన మహిమను బట్టి ఆయన్ని స్తుతిస్తారు.
1PE 2:13 మీరు ప్రభువు కోసం అధికారుల పట్ల విధేయతతో ఉండండి. అది సర్వాధికారమున్న చక్రవర్తికానివ్వండి,
1PE 2:14 లేక, ఆ చక్రవర్తి నియమించిన రాజ్యాధికారులు కానివ్వండి. చక్రవర్తి ఈ రాజ్యాధికారుల్ని తప్పుచేసిన వాళ్ళను శిక్షించటానికి, ఒప్పు చేసిన వాళ్ళను మెచ్చుకోవటానికి పంపించాడు.
1PE 2:15 మీరు మంచి పనులు చేసి, అవివేకంగా మాట్లాడే మూర్ఖుల నోళ్ళను కట్టి వేయాలని దేవుని కోరిక.
1PE 2:16 స్వేచ్ఛగా జీవించండి. కాని ఈ స్వేచ్ఛను మీ దుష్ట స్వభావాన్ని కప్పిపుచ్చటానికి ఉపయోగించకండి. దేవుని సేవకులవలె జీవించండి.
1PE 2:17 అందర్నీ గౌరవించండి. తోటి విశ్వాసులైన సోదరులను ప్రేమించండి. దేవునికి భయపడండి. రాజును గౌరవించండి.
1PE 2:18 బానిసలారా! తమ యజమానులను, వాళ్ళు దయాదాక్షిణ్యాలతో మంచిగా ప్రవర్తించే యజమానులు కానివ్వండి, లేక దౌర్జన్యంతో ప్రవర్తించే యజమానులు కానివ్వండి పూర్తిగా గౌరవిస్తూ విధేయతతో ఉండండి.
1PE 2:19 ఎందుకంటే, తనకు అన్యాయంగా సంభవిస్తున్న బాధల్ని, దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని అనుభవించే వ్యక్తి శ్లాఘనీయుడు.
1PE 2:20 నీవు చేసిన తప్పులకు దెబ్బలు తిని ఓర్చుకుంటే అందులో గొప్పేమిటి? కాని మంచి చేసి కూడ బాధల్ని అనుభవించి ఓర్చుకుంటే అది దేవుని సాన్నిధ్యంలో శ్లాఘనీయమౌతుంది.
1PE 2:21 దేవుడు మిమ్మల్ని పిలిచింది అందు కోసమే! మీకు ఆదర్శంగా ఉండాలనీ, మీరు తన అడుగు జాడల్లో నడచుకోవాలనీ క్రీస్తు మీకోసం కష్టాలనుభవించాడు.
1PE 2:22 “ఆయన ఏ పాపం చేయలేదు! ఆయన మాటల్లో ఏ మోసం కనబడలేదు!”
1PE 2:23 వారాయన్ని అవమానించినప్పుడు ఎదురుతిరిగి మాట్లాడలేదు. కష్టాలను అనుభవించవలసి వచ్చినప్పుడు ఆయన ఎదురు తిరగలేదు. దానికి మారుగా, న్యాయంగా తీర్పు చెప్పే ఆ దేవునికి తనను తాను అర్పించుకున్నాడు.
1PE 2:24 ఆయన మన పాపాలను సిలువపై భరించాడు. పాపం చేస్తూ జీవించటం మానుకున్న మనం నీతిగా జీవించాలని యిలా చేసాడు. ఆయన దెబ్బల ద్వారా మన రోగాలు మాని పోయాయి.
1PE 2:25 ఎందుకంటే, ఇదివరలో మీరు దారి తప్పిన గొఱ్ఱెల్లా ప్రవర్తించారు. కాని యిప్పుడు మీరు, మీ ఆత్మల్ని కాపలా కాచే కాపరి, అధిపతి దగ్గరకు తిరిగి వచ్చారు.
1PE 3:1 అదే విధంగా భార్యలు తమ భర్తలకు అణిగి ఉండాలి. అప్పుడు ఒక వేళ ఏ పురుషుడైనా దైవసందేశానుసారం నడుచుకోక పోతే ఆ సందేశాన్ని గురించి ప్రస్తావించకుండానే స్త్రీలు, తమ నడత ద్వారా
1PE 3:2 మీ పవిత్రతను, భక్తిని వాళ్ళు చూడటంవల్ల మీ భర్తలు మంచి దారికి రాగలరు.
1PE 3:3 జడ వేసి, బంగారు నగలు ధరించి, విలువైన దుస్తుల్ని కట్టుకొని శరీరాన్ని బాహ్యంగా అలంకరించటంకన్నా
1PE 3:4 మీ అంతరాత్మను, సాత్వికత, శాంతత అనే నశించని గుణాలతో అలంకరించుకోండి. దేవుడు యిలాంటి అలంకరణకు ఎంతో విలువనిస్తాడు.
1PE 3:5 దేవుణ్ణి విశ్వసించి పవిత్రంగా జీవించిన పూర్వకాలపు స్త్రీలు యిలాంటి గుణాలతో అలంకరించుకునేవాళ్ళు. వాళ్ళు తమ భర్తలకు అణిగిమణిగి ఉండే వాళ్ళు.
1PE 3:6 శారా తన భర్త అబ్రాహముకు అణిగిమణిగి ఉండి, అతణ్ణి “యజమాని” అని పిలిచేది. మీరు కూడా నీతిగా ప్రవర్తిస్తూ, భయపడకుండా ఉంటే దేవుడు మిమ్మల్ని శారా కుమారైల్లా పరిగణిస్తాడు.
1PE 3:7 భర్తలు, తమ భార్యలు తమకన్నా శారీరకంగా తక్కువ శక్తి కలవాళ్ళని గుర్తిస్తూ కాపురం చెయ్యాలి. మీతో సహ వాళ్ళు కూడా దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని పంచుకుంటున్నారు. కనుక వాళ్ళను మీరు గౌరవించాలి. అలా చేస్తే మీ ప్రార్థనలకు ఏ ఆటంకము కలుగదు.
1PE 3:8 చివరకు చెప్పేదేమిటంటే మీరంతా కలిసిమెలిసి ఉంటూ దయా సానుభూతులతో పరస్పరం సోదరులవలే ప్రేమించుకుంటూ, నమ్రతగలవారై జీవించండి.
1PE 3:9 అపకారం చేసిన వాళ్ళకు అపకారం చేయ్యకండి. అవమానించిన వాళ్ళను అవమానించకండి. అంతటితో ఆగక అలాంటి వాళ్ళను దీవించండి. ఎందుకంటే, దేవుడు తన దీవెనలకు మీరు వారసులు కావాలని మిమ్మల్ని పిలిచాడు.
1PE 3:10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివుంది: “బ్రతకాలని ఇష్టపడే వాడు, మంచిరోజులు చూడదలచినవాడు, తన నాలుక చెడు మాటలాడకుండా చూసుకోవాలి. తన పెదాలు మోసాలు పలుకకుండా కాపాడు కోవాలి.
1PE 3:11 చెడు చెయ్యటం మాని, మంచి చెయ్యాలి. శాంతిని కోరి సాధించాలి.
1PE 3:12 నీతిమంతులను దేవుడు గమనిస్తూ ఉంటాడు. వాళ్ళ ప్రార్థనల్ని శ్రద్ధతోవింటూ ఉంటాడు. కాని దుష్టుల విషయంలో ముఖం త్రిప్పుకుంటాడు.”
1PE 3:13 ఉత్సాహంతో మంచి చేస్తున్న మీకు ఎవరు హని చేస్తారు?
1PE 3:14 కాని ఒకవేళ నీతికోసం మీరు కష్టాలు అనుభవిస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. “వాళ్ళ బెదిరింపులకు భయపడకండి. ఆందోళన చెందకండి.”
1PE 3:15 క్రీస్తును మీ హృదయ మందిరంలో ప్రతిష్టించండి. మీ విశ్వాసాన్ని గురించి కారణం అడుగుతూ ఎవరైనా ప్రశ్నిస్తే, అలాంటి వాళ్ళకు సమాధానమివ్వటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండండి.
1PE 3:16 కాని మర్యాదగా గౌరవంతో సమాధాన మివ్వండి. మీ మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోండి. సత్ప్రవర్తనతో క్రీస్తును అనుసరిస్తున్న మిమ్నల్ని అవమానించి దుర్భాషలాడిన వాళ్ళు స్వయంగా సిగ్గుపడిపోతారు.
1PE 3:17 చెడును చేసి కష్టాలను అనుభవించటంకన్నా మంచి చేసి కష్టాలను అనుభవించటమే దైవేచ్ఛ. యిదే ఉత్తమం.
1PE 3:18 క్రీస్తు మీ పాపాల నిమిత్తం తన ప్రాణాన్ని ఒకేసారి యిచ్చాడు. దేవుని సన్నిధికి మిమ్మల్ని తీసుకు రావాలని నీతిమంతుడైన క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు. వాళ్ళాయనకు భౌతిక మరణం కలిగించినా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునర్జీవం పొందాడు.
1PE 3:19 పరిశుద్ధాత్మ ద్వారా చెరలోబడిన ఆత్మల దగ్గరకు వెళ్ళి బొధించాడు.
1PE 3:20 గతంలో ఈ ఆత్మలు దేవుని పట్ల అవిధేయతతో ప్రవర్తించాయి. నోవహు కాలంలో, నోవహు ఓడ నిర్మాణాన్ని సాగించినంతకాలం దేవుడు శాంతంగా కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత కొందరిని మాత్రమే, అంటే ఓడలో ఉన్న ఎనిమిది మందిని మాత్రమే నీళ్ళనుండి రక్షించాడు.
1PE 3:21 అదేవిధంగా మీరు బాప్తిస్మము పొందటంవల్ల దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. బాప్తిస్మము పొదంటం అంటే శరీరం మీదినుండి మలినాన్ని కడగి వేయటం కాదు. దేవుణ్ణి స్వచ్ఛమైన మనస్సునిమ్మని వేడుకోవడం. ఇది యేసు క్రీస్తు చావు నుండి బ్రతికి రావటం వల్ల సంభవిస్తోంది.
1PE 3:22 ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడి చేతి వైపు కూర్చొని, దేవదూతల మీద, అధికారుల మీద శక్తుల మీద రాజ్యం చేస్తున్నాడు.
1PE 4:1 క్రీస్తు శారీరకమైన బాధననుభవించాడు గనుక మీరు కూడా ఆ గుణాన్ని ఆయుధంగా ధరించండి.
1PE 4:2 ఎందుకంటే శారీరకమైన బాధననుభవించే వ్యక్తి తన మిగతా భౌతిక జీవితాన్ని, మానవులు కోరే దురాశల్ని తీర్చుకోవటానికి ఉపయోగించకుండా దైవేచ్ఛ కోసం ఉపయోగిస్తాడు. అలాంటి వానికి పాపంతో సంబంధముండదు.
1PE 4:3 గతంలో మీరు యూదులుకాని వాళ్ళవలే పొకిరి చేష్టలు, దురాశకు, త్రాగుడుకు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుడు విందులకు, చేయతగని విగ్రహారాధనలకులోనై జీవించారు. వారి ఇష్టము నెరవేర్చుచుండటకు గడచిన కాలమే చాలును.
1PE 4:4 కాని ప్రస్తుతం మీరు వాళ్ళ వలె మితిమీరిన దుష్ప్రవర్తనకులోనై వాళ్ళతో సహ పరుగెత్తనందుకు, వాళ్ళు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు.
1PE 4:5 అయితే చనిపోయిన వాళ్ళ మీద బ్రతికియున్న వాళ్ళ మీద, తీర్పు చెప్పే ఆ దేవునికి వాళ్ళు సమాధానం చెప్పుకోవలసిఉంటుంది.
1PE 4:6 ఈ కారణంగానే సువార్త ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు కూడా ప్రకటింపబడింది. వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా జీవించాలని దేవుడు మానవులపై తీర్పుచెప్పినట్లు గానే వాళ్ళ మీద కూడా తీర్పు చెపుతాడు.
1PE 4:7 అన్నీ అంతమయ్యే సమయం దగ్గరకు వచ్చింది. అందువల్ల స్థిరబుద్ధితో, ఆత్మనిగ్రహంతో ఉండండి. అప్పుడే మీరు ప్రార్థించ గలుగుతారు.
1PE 4:8 అన్నిటికన్నా ముఖ్యంగా, “ప్రేమ” పాపాలన్నిటినీ కప్పివేస్తుంది గనుక పరస్పరం హృదయపూర్వకంగా ప్రేమించుకోండి.
1PE 4:9 సణగకుండా, పరస్పరం అతిథి సత్కార్యాలు చేసుకోండి.
1PE 4:10 ప్రతి ఒక్కడూ ఆత్మీయంగా తాను పొందిన వరాన్ని యితర్ల సేవ చేయటానికి ఉపయోగించాలి. అనేక రకాలుగా లభించిన ఈ దైవానుగ్రహాన్ని విశ్వాసంతో ఉపయోగించాలి.
1PE 4:11 మాట్లాడాలని అనుకున్నవాడు దైవసందేశానుసారం మాట్లాడాలి. సేవ చేయదలచిన వాడు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి సేవచెయ్యాలి. అలా చేస్తే, శాశ్వతంగా తేజోవంతుడూ, శక్తివంతుడూ అయినటువంటి దేవుణ్ణి యేసు క్రీస్తు ద్వారా అన్ని విషయాల్లో స్తుతించినట్లు అవుతుంది.
1PE 4:12 నా ప్రియమైన సోదరులారా! మీకు అగ్నిపరీక్ష జరుగుతోంది. తద్వారా ఏదో జరుగరానిది జరిగినట్లు ఆశ్చర్యపడకండి.
1PE 4:13 క్రీస్తు కష్టాల్లో మీరు పాలు పంచుకుంటున్నందుకు ఆనందించండి. అలా చేస్తే ఆయన మహిమ వ్యక్తమైనప్పుడు మీరు చాలా ఆనందిస్తారు.
1PE 4:14 ఒకవేళ క్రీస్తు పేరు కారణంగా మీకు అవమానం కలిగితే, మీరు ధన్యులు. అంటే దేవుని తేజోవంతమైన ఆత్మ మీలో ఉన్నాడన్నమాట.
1PE 4:15 హత్య చేసి కాని, దొంగతనం చేసి కాని, దుర్మార్గంగా ప్రవర్తించి గాని, లేక యితర్ల విషయాల్లో జోక్యం కలిగించుకోవటం వలన కాని, మీరు శిక్షను అనుభవించకూడదు.
1PE 4:16 మీరు క్రైస్తవులైనందు వలన శిక్షననుభవించవలసివస్తే సిగ్గుపడనవసరం లేదు. మీరు క్రైస్తవులైనందుకు దేవుణ్ణి స్తుతించండి.
1PE 4:17 ఎందుకంటే, తీర్పు చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. మొదట దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళ మీద తీర్పు చెప్పబడుతుంది. మరి ఆ తీర్పు మనతో ప్రారంభమైతే దేవుని సువార్తను నిరాకరించిన వాళ్ళగతేమౌతుంది?
1PE 4:18 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “నీతిమంతులకే రక్షణ లభించటం కష్టమైతే, నాస్తికుని గతి, పాపాత్ముని గతి, ఏమౌతుంది?”
1PE 4:19 అందువలన, దైవేచ్ఛ ప్రకారం కష్టాలనుభవించే వాళ్ళు, విశ్వసింప దగిన సృష్టికర్తకు తమను తాము అర్పించుకొని సన్మార్గంలో జీవించాలి.
1PE 5:1 మీలో ఉన్న సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేయట మేమనగా, మీలాగే నేను కూడ ఒక పెద్దను. క్రీస్తు అనుభవించిన బాధల్ని చూసినవాణ్ణి. దేవుడు వ్యక్తం చేయనున్న మహిమలో భాగస్తుణ్ణి.
1PE 5:2 సంరక్షణలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండి దాన్ని జాగ్రత్తగా కాపాడండి. కర్తవ్యంగా కాకుండా మీ మనసూర్త్పిగా ఆ కార్యాన్ని చేయండి. దైవేచ్ఛ కూడా అదే! డుబ్బుకు ఆశపడి కాకుండా మీ అభీష్టంతో ఆ కార్యాన్ని చేయ్యండి.
1PE 5:3 దేవుడు మీకప్పగించిన వాళ్ళపై అధికారం చూపకుండా ఆ మందకు ఆదర్శ పురుషులుగా ఉండండి.
1PE 5:4 ముఖ్య కాపరి ప్రత్యక్షం అయినప్పుడు ఎన్నిటికీ నశించిపోని వెలుగు కిరీటం మీకు లభిస్తుంది.
1PE 5:5 అదే విధంగా యువకులు పెద్దలకు అణిగిమణిగి ఉండాలి. వినయమనే వస్తాన్ని ధరించి యితర్ల సేవ చెయ్యండి. ఎందుకంటే లేఖనాల్లో: “దేవుడు గర్వంతో ఉన్నవాళ్ళకు వ్యతిరేకంగా ఉంటాడు, కాని, వినయంతో ఉన్న వాళ్ళకు కృపననుగ్రహిస్తాడు.” అని వ్రాయబడి ఉంది.
1PE 5:6 అందువల్ల దేవుని బలమైన చేతి క్రింద వినయంతో ఉండండి. సరియైన సమయం రాగానే ఆయన మిమ్మల్ని పైకి తెస్తాడు.
1PE 5:7 ఆయన మీ గురించి చింతిస్తాడు. గనుక మీ చింతల్ని ఆయనపై వదలివేయండి.
1PE 5:8 మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని మెలుకువతో ఉండండి. మీ శత్రువైనటువంటి సైతాను సింహంలా గర్జిస్తూ మిమ్నల్ని మ్రింగి వేయాలని మీ చుట్టు తిరుగుతూ ఉన్నాడు.
1PE 5:9 ఈ ప్రపంచంలో ఉన్న మీ సోదరులు యిలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు. గనుక దృఢవిశ్వాసంతో ఉండి ఆ సైతానుకి ఎదురు తిరగండి.
1PE 5:10 దయామయుడైన దేవుడు, మీరు క్రీస్తులో శాశ్వతమైన తన మహిమను పంచుకోవాలని మిమ్మల్ని పిలిచాడు. మీరు కొన్ని కష్టాలనుభవించాక, ఆయన స్వయంగా మీకు శక్తిని, దృఢత్వాన్ని యిచ్చి గట్టి పునాది వేసి మీలో పరిపూర్ణత కలిగిస్తాడు.
1PE 5:11 ఆయన యొక్క అధికారం చిరకాలం ఉండుగాక! ఆమేన్.
1PE 5:12 నా సోదరునిగా భావించే విశ్వాసనీయుడైన సిల్వాను సహయంతో మీకీ లేఖను పంపుచున్నాను. మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని, ఇది దేవుని నిజమైన అనుగ్రహమని సాక్ష్యం చెప్పాలని ఉద్దేశించి ఈ లేఖను వ్రాస్తున్నాను. ఆ అనుగ్రహాన్ని వదులుకోకండి.
1PE 5:13 మీతో సహా ఎన్నుకోబడి బబులోనులో ఉన్న ఆమెయు, నా కుమారునితో సమానమైన మార్కు, మీకు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
1PE 5:14 ప్రేమలో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకొని శుభాకాంక్షలు తెలుపుకోండి. క్రీస్తులో నున్న మీ అందరికి శాంతి కలుగుగాక!
2PE 1:1 యేసు క్రీస్తు సేవకుడును, అపొస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు, మన రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతినిబట్టి మాలాగే అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవాళ్ళకు వ్రాస్తున్నది.
2PE 1:2 దేవుణ్ణి గురించి, మన ప్రభువైన యేసు క్రీస్తును గురించి మీరు జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ద్వారా మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను.
2PE 1:3 మన దేవుడు తనను గురించి మనలో ఉన్న జ్ఞానం ద్వారా తన మహిమను, మంచితనాన్ని పంచుకోవటానికి మనల్ని పిలిచాడు. అంతేకాక రక్షణ, ఆత్మీయ జీవితానికి కావలసినవాటిని దేవుడు తన శక్తి ద్వారా మనకిచ్చాడు.
2PE 1:4 ఈ విధంగా, అమూల్యమైనటువంటి గొప్ప వాగ్దానాన్ని మనకోసం చేసాడు. ఆ వాగ్దానాల సహాయంతో దురాశ వల్ల సంభవించే ఈ ప్రపంచంలోని పాపాలనుండి తప్పించుకొని, తన స్వభావంలో మీరు భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేసాడు.
2PE 1:5 అందువల్ల మీలో ఉన్న విశ్వాసానికి తోడుగా మంచితనాన్ని కూడా అలవరుచుకోవటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. మంచితనానికి తోడుగా జ్ఞానాన్ని,
2PE 1:6 జ్ఞానానికి తోడుగా ఆత్మనిగ్రహాన్ని, ఆత్మనిగ్రహానికి తోడుగా పట్టుదలను, పట్టుదలకు తోడుగా ఆత్మీయతను,
2PE 1:7 ఆత్మీయతకు తోడుగా సోదర ప్రేమను, సోదర ప్రేమకు తోడుగా అనురాగంతో నిండిన ప్రేమను అలవరుచుకోండి.
2PE 1:8 ఈ గుణాలు మీలో పెరుగుతూ ఉండాలి. మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానం మీలో ఉంది. పై గుణాలు మీలో ఉంటే ఈ జ్ఞానాన్ని ఫలవంతంగాను, ఉపయోగకరంగాను చేస్తాయి.
2PE 1:9 ఆ గుణాలు లేనివానికి దూరదృష్టి ఉండదు. అలాంటివాడు గ్రుడ్డివానితో సమానము. అంటే ఇలాంటి వ్యక్తి, తాను యిదివరలో చేసిన పాపాల్ని దేవుడు క్షమించాడన్న విషయం మరిచి పోయాడన్నమాట.
2PE 1:10 సోదరులారా! దేవుని పిలుపు, మీ ఎన్నిక ఫలించేటట్లు యింకా ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇవన్నీ చేస్తూవుంటే మీరేనాటికీ క్రిందపడరు.
2PE 1:11 తద్వారా మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి మీకు ఘనస్వాగతం లభిస్తుంది.
2PE 1:12 వీటిని గురించి మీకిదివరకే తెలుసు. ప్రస్తుతం మీరంగీకరించిన సత్యంలో మీకు దృఢమైన విశ్వాసముంది. అయినా ఈ విషయాల్ని గురించి మీకు ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను.
2PE 1:13 గుడారమనే ఈ శరీరంలో ప్రాణమున్నంతవరకు, మీకు జ్ఞాపకం చేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.
2PE 1:14 ఎందుకంటే, మన యేసు క్రీస్తు ప్రభువు ముందే స్పష్టం చేసినట్లు, నేను త్వరలోనే ఈ దేహాన్ని వదిలివేస్తానని నాకు తెలుసు.
2PE 1:15 నేను వెళ్ళాక కూడా మీరీ విషయాల్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొనేటట్లు నేను అన్ని విధాలా పాటుపడతాను.
2PE 1:16 యేసు క్రీస్తు ప్రభువు రాకను గురించి, ఆయన శక్తిని గురించి తెలివిగా అల్లిన కథల ద్వారా మేము మీకు చెప్పలేదు. మేము ఆయన గొప్పతనాన్ని కళ్ళారా చూసాము.
2PE 1:17 ఆయన తన తండ్రి అయిన దేవుని నుండి కీర్తిని, మహిమను పొందుతుండగా, గొప్ప బలముగల స్వరము వినిపించింది:“ఈయన నా కుమారుడు. ఈయన పట్ల నాకు చాలా ప్రేమ ఉంది. ఈయన కారణంగా నాకు చాలా ఆనందం కలుగుతోంది” అని,
2PE 1:18 పవిత్రమైన పర్వతంపై మేము ఆయనతో ఉన్నప్పుడు పరలోకంనుండి ఈ స్వరం వినిపించటం మేము స్వయంగా విన్నాము.
2PE 1:19 అందువల్ల, ప్రవక్తలు చెప్పిన సందేశమంటే మాకు యింకా ఎక్కువ విశ్వాసం కలిగింది. మీరు ఆ సందేశాన్ని గమనించటం మంచిది. ఆ సందేశం చీకటిలో వెలిగే వెలుగులాంటిది. సూర్యోదయమయ్యే వరకూ, వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వెలుగును మీరు గమనిస్తూ ఉండాలి.
2PE 1:20 అన్నిటికన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ప్రవచనాల్లో వ్రాయబడిన విషయాలు, ప్రవక్తలు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో వ్రాయలేదు.
2PE 1:21 ఎందుకంటే, “ప్రవచనం” మానవులు తమ యిష్ట ప్రకారం పలికింది కాదు. పవిత్రాత్మచే ప్రేరేపణ పొంది వాళ్ళు దేవుణ్ణుండి సందేశాన్ని పలికారు.
2PE 2:1 కాని పూర్వం ప్రజల మధ్య దొంగ ప్రవక్తలు కూడా ఉండేవాళ్ళు. అదే విధంగా మీ మధ్యకూడా దుర్భోధకులు ఉంటారు. వాళ్ళు నాశనానికి దారితీసే సిద్ధాంతాల్ని రహస్యంగా ప్రవేశపెడుతూ, తమను కొన్న ప్రభువును కూడా కాదంటారు. తద్వారా తమను తాము నాశనం చేసుకుంటారు. ఇది త్వరలోనే జరుగుతుంది.
2PE 2:2 అవమానకరమైన వాళ్ళ పద్దతుల్ని అనేకులు పాటించి సత్యానికే అపకీర్తి తెస్తారు.
2PE 2:3 ఈ దుర్భోధకులు తమలో ఉన్న అత్యాశలవల్ల తాము సృష్టించిన కథలతో తమ స్వలాభం కొరకు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. దేవుడు వాళ్ళకు విధించిన శిక్ష చాలాకాలం నుండి వాళ్ళ కోసం కాచుకొని ఉంది. రానున్న ఆ వినాశనం ఆగదు.
2PE 2:4 దేవుడు పాపం చేసిన దేవదూతల్ని కూడా విడిచిపెట్టకుండా నరకంలో వేసాడు. తీర్పు చెప్పే రోజుదాకా అక్కడ వాళ్ళను అంధకారంలో బంధించి ఉంచుతాడు.
2PE 2:5 దేవుడు పురాతన ప్రపంచంపై సానుభూతి చూపలేదు. దుర్మార్గులైన ఆనాటి ప్రజలమీదికి ప్రళయం రప్పించాడు. నీతిని బోధించిన నోవహు, మిగతా ఏడుగురు తప్ప అందరూ నాశనమై పొయ్యారు.
2PE 2:6 దుర్మార్గులకు ఏమి సంభవిస్తుందో చూపడానికి దేవుడు సొదొమ, గొమొఱ్ఱా పట్టణాలను భస్మం చేసి వాటిని ఉదాహరణలుగా చూపించాడు.
2PE 2:7 కాని దేవుడు నీతిమంతుడైన లోతును రక్షించాడు. ప్రజలు అరాచకంగా, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంవల్ల లోతు చాలా బాధపడ్తూ ఉండేవాడు.
2PE 2:8 ఆ నీతిమంతుడు దుర్మార్గుల మధ్య ప్రతిరోజూ నివసిస్తూ, వాళ్ళ దుష్ప్రవర్తనల్ని చూస్తూ వింటూ ఉండేవాడు. వాళ్ళు చేస్తున్న దుష్ట పనులు చూసి అతని హృదయం తరుక్కుపోయేది.
2PE 2:9 విశ్వాసుల్ని పాపాలు చేయకుండా చేసి ఎలా కాపాడుకోవాలో ఆ ప్రభువుకు తెలుసు. తీర్పు చెప్పే రోజుదాకా దుర్మార్గుల్ని ఎలా శిక్షిస్తూ ఉండాలో కూడా ఆ ప్రభువుకు తెలుసు.
2PE 2:10 అధికారాన్నుల్లంఘిస్తూ, అసహ్యకరమైన ఐహిక వాంఛల్ని తీర్చుకుంటూ గర్వాంధులై పరలోక నివాసుల్ని దూషించటానికి భయపడని వాళ్ళ విషయంలో యిది ముఖ్యంగా నిజమౌతుంది. ఇలాంటి దుర్భోధకులు ధైర్యంగా గర్వంతో గొప్పవాళ్ళను దూషిస్తారు.
2PE 2:11 వాళ్ళకన్నా బలవంతులు, శక్తివంతులు అయినటువంటి దేవదూతలు కూడా ప్రభువు సమక్షంలో ఆ గొప్పవాళ్ళపై నేరారోపణ చేసి దూషించారు.
2PE 2:12 తమకు తెలియని వాటిని ఆ దుర్భోధకులు దూషిస్తారు. వాళ్ళు అడివి జంతువుల్లాంటి వాళ్ళు. ఇలాంటి జంతువులు పట్టుకుని చంపబడటానికే పనికి వస్తాయి. ఆ జంతువుల్లాగే వాళ్ళు కూడా నశించిపోతారు.
2PE 2:13 వాళ్ళు చేసిన చెడ్డకార్యాలకు ప్రతిఫలంగా వాళ్ళకు హాని కలుగుతుంది. పట్టపగలు శారీరక వాంఛల్ని తీర్చుకోవటమే వాళ్ళకు ఆనందం. వాళ్ళు తాము చేసిన మోసాలకు ఆనందిస్తూ మీతో కలిసి విందులు చేయటం మీకు అవమానం. అది మీకు తీరని కళంకం.
2PE 2:14 వాళ్ళు కళ్ళనిండా కామాన్ని నింపుకొని, పాపం చేయటం ఎన్నటికీ మానరు. వాళ్ళు మనస్సు స్థిరంలేని వాళ్ళను అడ్డదారి పట్టిస్తారు. దేవుని శాపానికి గురియైన వాళ్ళు, డబ్బు లాగటంలో నిపుణులు.
2PE 2:15 వాళ్ళు సక్రమ మార్గాన్ని వదిలేసి, దారితప్పి బిలాము మార్గాన్ని అనుసరిస్తారు. బిలాము, అధర్మంగా ధనార్జన చేసిన బెయోరు కుమారుడు.
2PE 2:16 కాని ఈ బిలామును అతడు చేసిన తప్పుకు మాటలురాని ఒక గాడిద మానవుని గొంతుతో గద్దించి, ఆ ప్రవక్త పిచ్చితనాన్ని ఆపింది.
2PE 2:17 ఇలాంటి దుర్భోధకులు నీళ్ళు లేని బావుల్లాంటి వాళ్ళు. తుఫాను గాలికి కొట్టుకొని పోయే మేఘాల్లాంటివాళ్ళు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ళకోసం దాచి ఉంచాడు.
2PE 2:18 ఆ బోధకులు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అంతేకాక, అప్పుడే మోసగాళ్ళ నుండి తప్పించుకొన్న వ్యక్తుల శారీరక వాంఛల్ని ప్రేరేపించి, అడ్డదారి పట్టిస్తూ ఉంటారు.
2PE 2:19 తాము స్వయంగా దుర్వ్యసనాలకు బానిసలై ఉండి, యితరులకు స్వేచ్ఛ కలిగిస్తామని వాగ్దానం చేస్తూ ఉంటారు. తనను జయంచిన దానికి మానవుడు బానిసై పోతాడు.
2PE 2:20 ప్రపంచంలో ఉన్న దుర్నీతి నుండి తప్పించుకోవాలంటే, మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తును తెలుసుకోవాలి. వాళ్ళు మళ్ళీ ఆ దుర్నీతిలో చిక్కుకొని బానిసలైతే యిప్పటి స్థితి మునుపటి స్థితికన్నా అధ్వాన్నంగా ఉంటుంది.
2PE 2:21 వాళ్ళకందివ్వబడిన పవిత్ర ఆజ్ఞను తెలుసుకుని వెనక్కి మళ్ళటం కన్నా ఆ ధర్మమార్గాన్ని తెలుసుకోకపోయినట్లయితే ఉత్తమంగా ఉండేది.
2PE 2:22 అలా వెనక్కు మళ్ళిన వాళ్ళ విషయంలో ఈ సామెతలు నిజమౌతాయి: “కుక్క తాను కక్కిన దాన్ని తిరిగి తింటుంది. దేహాన్ని కడిగిన పంది బురదలో పొర్లాడటానికి తిరిగి వెళ్తుంది.”
2PE 3:1 ప్రియమైన సోదరులారా! ఇది నా రెండవ ఉత్తరం. కల్మషం లేని మీ హృదయాలను ఉత్తేజపరచాలని మీకీ రెండు ఉత్తరాలు వ్రాసాను.
2PE 3:2 పవిత్రులైన ప్రవక్తలు చాలాకాలం క్రిందటే చెప్పిన సందేశాలను మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా యిచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం.
2PE 3:3 చివరి రోజుల్లో కొందరు వ్యక్తులు వచ్చి తమ వాంఛల్ని తీర్చుకుంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి:
2PE 3:4 “వస్తానని వాగ్దానం చేసాడే, ఎప్పుడు వస్తాడు? మా పూర్వీకులు మరణించినప్పుటి నుండే కాదు ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండీ అన్నీ సక్రమంగానే నడుస్తున్నాయి” అని వాళ్ళంటారు.
2PE 3:5 చాలా కాలం క్రితమే దేవుడు తన మాటతో ఆకాశాలను, భూమిని సృష్టించాడు. వాళ్ళు ఈ విషయాన్ని కావాలనే మరిచిపోతారు. ఈ భూమి నీళ్ళనుండి, నీళ్ళ ద్వారా సృష్టింపబడింది.
2PE 3:6 నీళ్ళ కారణంగా ప్రళయం వచ్చి ఆనాటి ప్రపంచం నాశనమై పోయింది.
2PE 3:7 దేవుడు ఆ మాటతోటే ఈనాటి ఆకాశాన్ని, భూమిని మంటలతో నాశనం చెయ్యటానికి దాచి ఉంచాడు. తీర్పుచెప్పే రోజుదాకా, అంటే దైవభక్తి లేనివాళ్ళను నాశనంచేసే రోజుదాకా దాచి ఉంచుతాడు.
2PE 3:8 కాని ప్రియమైన సోదరులారా! ఈ విషయాన్ని మరచిపోకండి. ప్రభువుకు ఒక రోజు వెయ్యి సంవత్సరాలుగాను, వెయ్యి సంవత్సరాలు ఒక రోజుగాను ఉంటాయి
2PE 3:9 ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని కొందరు అనుకుంటారు. కాని, ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ఆలస్యం చెయ్యడు. ఎవ్వరూ నాశనం కాకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన మీపట్ల సహనం వహిస్తున్నాడు.
2PE 3:10 కాని ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది. ఆ రోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమైపోతాయి. ఆకాశాల్లో ఉన్నవన్నీ మంటల్లో కాలి నాశనమై పోతాయి. పృథ్వి, దానిలో ఉన్న సమస్త వస్తువులూ కాలిపోతాయి.
2PE 3:11 అన్నీ ఈ విధంగా నాశనమైపోతాయి కనుక దేవుని ప్రజలై పవిత్రంగా జీవించటం ఎంత అవసరమో గ్రహించండి.
2PE 3:12 దేవుని దినం రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఆ దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి. ఆ రోజు వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. ఆ వేడికి పరమాణువులు కరిగి పోతాయి.
2PE 3:13 దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిపై నీతి నివసిస్తుంది. వాటికోసమే మనం ఎదురు చూస్తున్నాం.
2PE 3:14 ప్రియ సోదరులారా! మీరు వీటికోసం ఎదురు చూస్తున్నారు గనుక మీలో ఏ దోషమూ, కళంకమూ లేకుండా ఉండేటట్లు అన్నివిధాల ప్రయత్నం చెయ్యండి. శాంతం వహించండి.
2PE 3:15 మన ప్రభువు యొక్క సహనము మనకు రక్షణను యిస్తుందని గ్రహించండి. దేవుడు యిచ్చిన విజ్ఞానంతో మన ప్రియమిత్రుడు పౌలు మీకు ఈ విషయాల్ని గురించి వ్రాసాడు.
2PE 3:16 అతడు వ్రాసిన ఉత్తరాలన్నీ యిదేవిధంగా వ్రాసాడు. వాటన్నిటిలోనూ ఈ విషయాల్ని గురించే మాట్లాడాడు. అతని ఉత్తరాల్లోని కొన్ని విషయాలు అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటాయి. జ్ఞానం లేనివాళ్ళు, చపల చిత్తం గలవాళ్ళు యితర లేఖనాలపై తప్పుడు వ్యాఖ్యానం చేసినట్లే దీనిమీద కూడ తప్పడు వ్యాఖ్యానం చేస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళు నాశనమైపోతారు.
2PE 3:17 అందువల్ల ప్రియమైన సోదరులారా! ఇప్పుడీ విషయాలు మీకు తెలుసు. కనుక జాగ్రత్తగా ఉండండి. నీతికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తుల తప్పుడు మాటలకు మోసపోకండి. మీలో వున్న స్థిరత్వాన్ని వదులుకోకండి.
2PE 3:18 మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు పట్ల మీకున్న కృతజ్ఞతను పెంచుకుంటూ, ఆయన్ని గురించి జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉండండి. ఆయనకి ఇప్పుడూ, చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
1JO 1:1 ఏది మొదటినుండి ఉన్నదో, దాన్ని మేము విన్నాము మా కళ్ళారా చూసాము. చూసి మా చేతుల్తో తాకాము. అదే జీవం కలిగించే వాక్యం. దాన్ని గురించే మీకు ప్రకటిస్తున్నాము.
1JO 1:2 జీవం కనిపించింది. మేము దాన్ని చూసాము. చూసినట్టు సాక్ష్యం కూడా చెపుతున్నాము. ఆ జీవాన్ని గురించి మీకు ప్రకటిస్తున్నాము. ఆ జీవం తండ్రితో ఉంది. అది మాకు కనిపించింది.
1JO 1:3 తండ్రితో ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు సహవాసం ఉంది కనుక, మీరు కూడా మాతో సహవాసం చెయ్యాలనే ఉద్దేశ్యంతో మేము చూసినదాన్ని, విన్నదాన్ని మీకు ప్రకటిస్తున్నాము.
1JO 1:4 మన ఆనందం సంపూర్ణంగా ఉండాలని యిది మీకు వ్రాస్తున్నాను.
1JO 1:5 దేవుడు వెలుగై వున్నాడు. ఆయనలో చీకటి ఏ మాత్రం లేదు. ఈ సందేశాన్ని ఆయన మాకు చెప్పాడు. దాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం.
1JO 1:6 మనకు ఆయనతో సహవాసముందని అంటూ చీకట్లో నడిస్తే మనము అసత్యమాడినట్లే కదా! సత్యాన్ని ఆచరించటం మానుకొన్నట్లే కదా!
1JO 1:7 దేవుడు వెలుగులో ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగులో నడిస్తే మన మధ్య సహవాసం ఉంటుంది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తం మన పాపాలన్నిటిని కడుగుతుంది.
1JO 1:8 మనలో పాపం లేదని అంటే, మనల్ని మనము మోసం చేసుకొన్న వాళ్ళమౌతాము. సత్యం మనలో ఉండదు.
1JO 1:9 మనం చేసిన పాపాన్ని ఒప్పుకొంటే దేవుడు సత్యవంతుడు సక్రమంగా న్యాయం జరిగించే వాడు కనుక మన పాపాల్ని క్షమిస్తాడు. మనలో ఉన్న అవినీతిని కడిగి వేస్తాడు.
1JO 1:10 మనం పాపాలు చెయ్యలేదని అంటే ఆయన్ని మనం అబద్ధమాడుతున్న వానిగా చేసినట్లౌతుంది. ఆయన సందేశానికి మన జీవితాల్లో స్థానం ఉండదు.
1JO 2:1 బిడ్డలారా! మీరు పాపం చెయ్యకూడదని మీకు లేఖను వ్రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, మన పక్షాన తండ్రితో మాట్లాడేందుకు న్యాయవాది అయిన యేసు క్రీస్తు ఉన్నాడు.
1JO 2:2 ఆయన మన పాప పరిహారార్థం బలి అయ్యాడు. మన పాపాల కోసమే కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పాపాలకోసం బలి అయ్యాడు.
1JO 2:3 ఆయన ఆజ్ఞల్ని మనం ఆచరిస్తే ఆయన మనకు తెలుసుననే విశ్వాసం మనలో కలుగుతుంది.
1JO 2:4 ఆయన నాకు తెలుసని అంటూ ఆయన ఆజ్ఞల్ని పాటించని వాడు అబద్ధాలాడుతున్నాడన్నమాట. అలాంటి వ్యక్తిలో సత్యం ఉండదు.
1JO 2:5 యేసు ఆజ్ఞల్ని పాటించిన వానిలో దేవుని ప్రేమ సంపూర్ణంగా ఉంటుంది. తద్వారా మనం ఆయనలో ఉన్నామని తెలుసుకొంటాము.
1JO 2:6 యేసులో జీవిస్తున్నానని చెప్పుకొనే వాడు, ఆయనలా నడుచుకోవాలి.
1JO 2:7 ప్రియ మిత్రులారా! నేను మీ కోసం క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మొదటి నుండి మీ దగ్గర వున్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. మీరు విన్న సందేశమే ఈ పాత ఆజ్ఞ.
1JO 2:8 అయినా, ఆ ఆజ్ఞను ఒక క్రొత్త ఆజ్ఞగా మీ కోసం వ్రాస్తున్నాను. దాని సత్యం అందరిలో కనిపిస్తోంది. చీకటి గతిస్తోంది. నిజమైన వెలుగు ప్రకాశించటం మొదలు పెట్టింది.
1JO 2:9 తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు యింకా అంధకారంలో ఉన్నాడన్నమాట.
1JO 2:10 సోదరుణ్ణి ప్రేమించే వాడు వెలుగులో జీవిస్తాడు. అతనిలో ఏ ఆటంక కారణం ఉండదు.
1JO 2:11 కాని సోదరుణ్ణి ద్వేషించేవాడు అంధకారంలోనే ఉండిపోతాడు. అంటే, ఆ అంధకారంలోనే తిరుగుతూ ఉంటాడన్న మాట. చీకటి అతణ్ణి గ్రుడ్డివానిగా చేసాయి కాబట్టి తానెక్కడికి వెళ్తున్నది అతనికే తెలియదు.
1JO 2:12 బిడ్డలారా! ఆయన పేరిట మీ పాపాలు క్షమించబడ్డాయి. అందుకే మీకు వ్రాస్తున్నాను!
1JO 2:13 వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాడెవరో మీకు తెలుసు! అందుకే మీకు వ్రాస్తున్నాను! యువకులారా! మీరు సైతాన్ను గెలిచారు. అందుకే మీకు వ్రాస్తున్నాను!
1JO 2:14 బిడ్డలారా! తండ్రిని మీరెరుగుదురు. అందుకే మీకు వ్రాస్తున్నాను. వృద్ధులారా! మొదటి నుండి ఉన్నవాణ్ణి మీరెరుగుదురు. అందుకే మీకు వ్రాస్తున్నాను! యువకులారా! మీలో బలం ఉంది. దేవుని సందేశం మీలో జీవిస్తోంది. మీరు సైతానును గెలిచారు. అందుకే మీకు వ్రాస్తున్నాను.
1JO 2:15 ప్రపంచాన్ని కాని, ప్రపంచంలో ఉన్నవాటిని కాని ప్రేమించకండి. అంటే, ప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తిలో తండ్రి ప్రేమ ఉండదన్నమాట.
1JO 2:16 శారీరక వాంఛలు, కళ్ళలోని దురాశలు, ఒకడు చేసేదాన్ని బట్టి, కలిగియున్న దాన్ని బట్టి కలిగే గర్వం. ఇవి తండ్రికి సంబంధించినవి కావు. ఇవి ప్రపంచానికి సంబంధించినవి.
1JO 2:17 ఈ ప్రపంచము, దానిలో ఉన్న ఆశలు నశించిపోతాయి. కాని దైవేచ్ఛానుసారం జీవించే వ్యక్తి శాశ్వతంగా జీవిస్తాడు.
1JO 2:18 బిడ్డలారా! ఇది చివరి గడియ. క్రీస్తు విరోధి రానున్నాడని మీరు విన్నారు. ఇప్పటికే క్రీస్తు విరోధులు చాలా మంది వచ్చారు. తద్వారా యిది చివరి గడియ అని తెలిసింది.
1JO 2:19 క్రీస్తు విరోధులు మననుండి విడిపొయ్యారు. నిజానికి, వాళ్ళు మనవాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళైనట్లయితే మనతోనే ఉండిపొయ్యేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళలో ఎవ్వరూ మనవాళ్ళు కారని తెలుపుతోంది.
1JO 2:20 కాని దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. తద్వారా మీరంతా సత్యాన్ని గురించి తెలుసుకొన్నారు.
1JO 2:21 మీకు సత్యాన్ని గురించి తెలియదని భావించి నేను మీకు వ్రాస్తున్నాననుకోకండి. సత్యాన్ని గురించి మీకు తెలుసు. పైగా సత్యం నుండి అసత్యం బయటకు రాదు.
1JO 2:22 అసత్యమాడేవాడెవ్వడు? యేసే క్రీస్తు కాదని అనేవాడు. అతడే క్రీస్తు విరోధి. అలాంటి వ్యక్తి తండ్రిని, కుమారుణ్ణి నిరాకరిస్తాడు.
1JO 2:23 కుమారుణ్ణి నిరాకరించే వ్యక్తికి తండ్రి రక్షణ ఉండదు. కుమారుణ్ణి అంగీకరించే వ్యక్తికి తండ్రి రక్షణ తోడుగా ఉంటుంది.
1JO 2:24 మొదట మీరు విన్నవి మీలో ఉండిపోయేటట్లు చూసుకోండి. అప్పుడే మీరు కుమారునిలో, తండ్రిలో జీవించగలుగుతారు.
1JO 2:25 పైగా ఆయన మనకు నిత్యజీవం గురించి వాగ్దానం చేసాడు.
1JO 2:26 ఇవన్నీ మిమ్మల్ని తప్పుదారి పట్టించటానికి ప్రయత్నం చేస్తున్నవాళ్ళను గురించి వ్రాస్తున్నాను.
1JO 2:27 ఇక మీ విషయం అంటారా? దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. దానివల్ల కలిగిన ఫలం మీలో ఉంది. మీకెవ్వరూ బోధించవలసిన అవసరం లేదు. ఆ అభిషేకం వల్ల మీలో జ్ఞానం కలుగుతుంది. దేవుడు మీకు నిజంగా అభిషేకమిచ్చాడు. అది అసత్యం కాదు. ఆయన బోధించిన విధంగా ఆయనలో నివసించండి.
1JO 2:28 బిడ్డలారా! ఆయన ప్రత్యక్ష్యమైనప్పుడు మనలో ధైర్యం ఉండేటట్లు, ఆయన సమక్షంలో సిగ్గు పడకుండా ఉండేటట్లు ఆయనలో జీవిస్తూ ఉండండి.
1JO 2:29 ఆయన నీతిమంతుడని మీకు తెలిసి ఉంటే నీతిని అనుసరించే ప్రతి ఒక్కడూ ఆయన నుండి జన్మించాడని మీరు గ్రహిస్తారు.
1JO 3:1 మనం దేవుని సంతానంగా పరిగణింపబడాలని తండ్రి మనపై ఎంత ప్రేమను కురిపించాడో చూడండి. అవును, మనం దేవుని సంతానమే. ప్రపంచం ఆయన్ని తెలుసుకోలేదు కనుక మనల్ని కూడా తెలుసుకోవటం లేదు.
1JO 3:2 ప్రియ మిత్రులారా! మనం ప్రస్తుతానికి దేవుని సంతానం. ఇకముందు ఏ విధంగా ఉంటామో దేవుడు మనకింకా తెలియబరచలేదు. కాని యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయనెలా ఉంటాడో చూస్తాము. కనుక మనం కూడా ఆయనలాగే ఉంటామని మనకు తెలుసు.
1JO 3:3 ఇలాంటి ఆశాభావాన్ని ఉంచుకొన్న ప్రతి ఒక్కడూ ఆయనలా పవిత్రమౌతాడు.
1JO 3:4 పాపాలు చేసిన ప్రతి ఒక్కడూ నీతిని ఉల్లంఘించిన వాడౌతాడు. నిజానికి, పాపమంటేనే ఆజ్ఞను ఉల్లంఘించటం.
1JO 3:5 కాని, యేసు పాప పరిహారం చెయ్యటానికి వచ్చాడని మీకు తెలుసు. ఆయనలో పాపమనేది లేదు.
1JO 3:6 ఆయనలో జీవించేవాడెవ్వడూ పాపం చెయ్యడు. ఆయన్ని చూడనివాడు, ఆయనెవరో తెలియనివాడు మాత్రమే పాపం చేస్తూ ఉంటాడు.
1JO 3:7 బిడ్డలారా! మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. యేసు నీతిమంతుడు. ఆయనలా నీతిని పాలించే ప్రతివ్యక్తి నీతిమంతుడు.
1JO 3:8 ఆదినుండి సైతాను పాపాలు చేస్తూ ఉన్నాడు. అందువల్ల పాపం చేసే ప్రతివ్యక్తి సైతానుకు చెందుతాడు. సైతాను చేస్తున్న పనుల్ని నాశనం చెయ్యటానికే దేవుని కుమారుడు వచ్చాడు.
1JO 3:9 దైవేచ్ఛవల్ల జన్మించిన వానిలో దేవుని బీజం ఉంటుంది. కనుక పాపం చెయ్యడు. అతడు దేవుని వల్ల జన్మించాడు కనుక పాపం చెయ్యలేడు.
1JO 3:10 అదే విధంగా తన సోదరుణ్ణి ప్రేమించనివాడు దేవుని సంతానం కాదు. నీతిని పాటించనివాడు దేవుని సంతానం కాదు. దీన్నిబట్టి దేవుని సంతానమెవరో, సైతాను సంతానమెవరో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం.
1JO 3:11 “పరస్పరం ప్రేమతో ఉండాలి” అనే సందేశాన్ని మీరు మొదటినుండి విన్నారు.
1JO 3:12 సైతాను సంబంధియైన కయీను తన సోదరుణ్ణి హత్య చేసాడు. మీరు అతనిలా ఉండకూడదు. కయీను తన సోదరుణ్ణి ఎందుకు హత్య చేసాడు? కయీను దుర్మార్గుడు. అతని సోదరుడు సన్మార్గుడు.
1JO 3:13 ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి.
1JO 3:14 మనం మన సోదరుల్ని ప్రేమిస్తున్నాము కనుక మరణం నుండి బ్రతికింపబడ్డాము. ఈ విషయం మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు.
1JO 3:15 సోదరుణ్ణి ద్వేషించేవాడు హంతకునితో సమానము. అలాంటివానికి నిత్య జీవం లభించదని మీకు తెలుసు.
1JO 3:16 యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణాలర్పించాడు. మనం మన సోదరుల కోసం ప్రాణాల్ని ధారపోయాలి. అప్పుడే “ప్రేమ” అంటే ఏమిటో మనం తెలుసుకోగలము.
1JO 3:17 ఒకని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి. కాని, అతడు తన సోదరునికి అవసరాలు ఉన్నాయని తెలిసి కూడా దయ చూపకుండా ఉంటే అతని పట్ల దేవుని దయ ఎందుకు ఉంటుంది?
1JO 3:18 బిడ్డలారా! మనం మాటలతో కాక క్రియా రూపంగా, సత్యంతో మన ప్రేమను వెల్లడి చేద్దాం.
1JO 3:19 మన హృదయాలు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడు. అన్నీ తెలిసినవాడు కనుక, మనం నోటి మాటలతో కాక క్రియారూపంగా సత్యంతో ప్రేమను చూపుదాం. అలా చేస్తే మనం సత్యానికి చెందిన వాళ్ళమని తెలుసుకొంటాం. పైగా ఆయన సమక్షంలో దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడని, మన హృదయాలకు నచ్చ చెప్పగలుగుతాం.
1JO 3:21 ప్రియ మిత్రులారా! మన హృదయాలు మన మీద నిందారోపణ చేయలేనిచో మనకు ఆయన సమక్షంలో ధైర్యం ఉంటుంది.
1JO 3:22 దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయనకు ఆనందం కలిగే విధంగా నడుచుకొంటే మనం అడిగింది మనకు లభిస్తుంది.
1JO 3:23 ఆయన ఆజ్ఞ యిది: దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచండి. ఆయనాజ్ఞాపించిన విధంగా పరస్పరం ప్రేమతో ఉండండి.
1JO 3:24 దేవుని ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళు ఆయనలో జీవిస్తారు. ఆయన వాళ్ళలో జీవిస్తాడు. ఆయన మనకు ఇచ్చిన ఆత్మద్వారా ఆయన మనలో జీవిస్తున్నాడని తెలుసుకోగలుగుతాం.
1JO 4:1 ప్రియ మిత్రులారా! అన్ని ఆత్మల్ని నమ్మకండి. ఆ ఆత్మలు దేవుని నుండి వచ్చాయా అన్న విషయాన్ని పరిశీలించండి. ఎందుకంటే, మోసం చేసే ప్రవక్తలు చాలామంది ఈ ప్రపంచంలోకి వచ్చారు.
1JO 4:2 యేసు క్రీస్తు దేవుని నుండి శరీరంతో వచ్చాడని అంగీకరించిన ప్రతీ ఆత్మ దేవునికి చెందినదని దేవుని ఆత్మద్వారా మీరు గ్రహించాలి.
1JO 4:3 యేసును అంగీకరించని ప్రతి ఆత్మ దేవుని నుండి రాలేదన్నమాట. అలాంటి ఆత్మ క్రీస్తు విరోధికి చెందింది. ఆ ఆత్మలు రానున్నట్లు మీరు విన్నారు. అవి అప్పుడే ప్రపంచంలోకి వచ్చాయి.
1JO 4:4 బిడ్డలారా! మీరు దేవుని సంతానం కనుక వాటిని జయించగలిగారు. పైగా మీలో ఉన్నవాడు, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకన్నా గొప్పవాడు.
1JO 4:5 క్రీస్తు విరోధులు ప్రపంచానికి చెందినవాళ్ళు. అందువల్ల వాళ్ళు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతారు. ప్రపంచం వాళ్ళ మాటలు వింటుంది.
1JO 4:6 మనం దేవునికి చెందిన వాళ్ళం. అందువల్ల దేవుణ్ణి తెలుసుకొన్నవాడు మన మాటలు వింటాడు. కాని దేవునికి చెందనివాడు మన మాటలు వినడు. దీన్నిబట్టి మనము, ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో తెలుసుకోగలుగుతాము.
1JO 4:7 ప్రియ మిత్రులారా! ప్రేమ దేవుని నుండి వస్తుంది. కనుక మనం పరస్పరం ప్రేమతో ఉందాం. ప్రేమించే వ్యక్తి దేవుని వలన జన్మిస్తాడు. అతనికి దేవుడు తెలుసు.
1JO 4:8 దేవుడు ప్రేమస్వరూపం గలవాడు. ప్రేమలేని వానికి దేవుడెవరో తెలియదు.
1JO 4:9 మనం కుమారుని ద్వారా జీవించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపి తన ప్రేమను మనకు వెల్లడి చేసాడు.
1JO 4:10 “మనం ఆయన్ని ప్రేమిస్తున్నందుకు ఆయన ఈ పని చెయ్యలేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, మన ప్రాయశ్చిత్తానికి బలిగా తన కుమారుణ్ణి పంపాడు.” ఇదే ప్రేమ.
1JO 4:11 ప్రియ మిత్రులారా! దేవుడు మనల్ని యింతగా ప్రేమించాడు కనుక మనం కూడా పరస్పరం ప్రేమతో ఉండాలి.
1JO 4:12 దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు. మనం పరస్పరం ప్రేమతో ఉంటే దేవుడు మనలో నివసిస్తాడు. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణత చెందుతుంది.
1JO 4:13 ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. తద్వారా మనము ఆయనలో జీవిస్తున్నామని, ఆయన మనలో జీవిస్తున్నాడని మనం తెలుసుకోగలుగుతున్నాము.
1JO 4:14 దేవుడు తన కుమారుణ్ణి ప్రపంచాన్ని రక్షించటానికి పంపాడు. ఆయన్ని మేము చూసాము, కాబట్టి సాక్ష్యం చెపుతున్నాము.
1JO 4:15 యేసు దేవుని కుమారుడని అంగీకరించిన వానిలో దేవుడు నివసిస్తాడు. దేవునిలో వాడు నివసిస్తున్నాడు.
1JO 4:16 దేవునికి మనపట్ల ప్రేమ ఉందని మనం నమ్ముతున్నాము. ఆ ప్రేమ మనకు తెలుసు. దేవుడే ప్రేమ. ప్రేమలో జీవించేవాడు దేవునిలో జీవిస్తాడు. దేవుడు అతనిలో జీవిస్తాడు.
1JO 4:17 తీర్పు చెప్పేరోజు మనం ధైర్యంతో ఉండాలని మన మధ్యనున్న ప్రేమ పరిపూర్ణం చెయ్యబడింది. ఎందుకంటే, మనమీ ప్రపంచంలో ఆయనవలె జీవిస్తున్నాము.
1JO 4:18 ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణత పొందిన ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంటే, భయం శిక్షకు సంబంధించింది. భయపడే వ్యక్తి ప్రేమలో పరిపూర్ణత పొందలేడు.
1JO 4:19 దేవుడు మనల్ని ప్రేమించినందుకు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము.
1JO 4:20 “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని అంటూ తన సోదరుణ్ణి ద్వేషించే వాడు అసత్యమాడుతున్నాడన్న మాట. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించలేనివాడు కనిపించని దేవుణ్ణి ప్రేమించ లేడు.
1JO 4:21 దేవుడు మనకీ ఆజ్ఞనిచ్చాడు: నన్ను ప్రేమించే వాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి.
1JO 5:1 యేసే క్రీస్తు అని నమ్మినవాణ్ణి దేవుడు తన సంతానంగా పరిగణిస్తాడు. తండ్రిని ప్రేమించిన ప్రతీ ఒక్కడు కుమారుణ్ణి ప్రేమించినట్లుగా పరిగణింపబడతాడు.
1JO 5:2 దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్ని పాటించటం వల్ల ఆయన కుమారుణ్ణి ప్రేమిస్తున్నట్లు మనము తెలుసుకోగలము.
1JO 5:3 ఆయన ఆజ్ఞల్ని పాటించి మనము మన ప్రేమను వెల్లడి చేస్తున్నాము. ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కావు.
1JO 5:4 దేవుని కారణంగా జన్మించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనలో ఉన్న ఈ విశ్వాసం వల్ల మనము ఈ ప్రపంచాన్ని జయించి విజయం సాధించాము.
1JO 5:5 యేసు దేవుని కుమారుడని విశ్వసించే వాళ్ళే ప్రపంచాన్ని జయిస్తారు.
1JO 5:6 యేసు క్రీస్తు నీళ్ళ ద్వారా, రక్తంద్వారా వచ్చాడు. ఆయన నీళ్ళ ద్వారా మాత్రమే రాలేదు. నీళ్ళ ద్వారా, రక్తం ద్వారా కూడా వచ్చాడు. ఆత్మ సత్యవంతుడు. అందుకే ఆ ఆత్మ సాక్ష్యం చెపుతున్నాడు.
1JO 5:7 సాక్ష్యం చెప్పేవారు ముగ్గురున్నారు.
1JO 5:8 ఆత్మ, నీళ్లు, రక్తం ఈ ముగ్గురూ ఒకే సాక్ష్యాన్ని చెపుతున్నారు.
1JO 5:9 మనము మనుష్యుల సాక్ష్యం అంగీకరిస్తాము. కాని యిది దేవుని సాక్ష్యం కనుక యింకా గొప్పది. ఈ సాక్ష్యం తన కుమారుణ్ణి గురించి యిచ్చింది.
1JO 5:10 దేవుని కుమారుని పట్ల విశ్వాసమున్నవాడు ఈ సాక్ష్యాన్ని నమ్ముతాడు. దేవుడు తన కుమారుని విషయంలో యిచ్చిన సాక్ష్యం నమ్మనివాడు దేవుడు అసత్యవంతుడని నిందించినవాడౌతాడు.
1JO 5:11 ఆ సాక్ష్యం యిది! దేవుడు మనకు నిత్యజీవం యిచ్చాడు. ఈ జీవము ఆయన కుమారునిలో ఉంది.
1JO 5:12 కుమారుణ్ణి స్వీకరించిన వానికి ఈ జీవము లభిస్తుంది. ఆ కుమారుణ్ణి స్వీకరించనివానికి జీవం లభించదు.
1JO 5:13 దేవుని కుమారుని పేరులో విశ్వాసం ఉన్న మీకు నిత్యజీవం లభిస్తుంది. ఈ విషయం మీకు తెలియాలని యివన్నీ మీకు వ్రాస్తున్నాను.
1JO 5:14 దేవుణ్ణి ఆయన యిష్టానుసారంగా మనము ఏది అడిగినా వింటాడు. దేవుణ్ణి సమీపించటానికి మనకు హామీ ఉంది.
1JO 5:15 మనమేది అడిగినా వింటాడని మనకు తెలిస్తే మన మడిగింది మనకు లభించినట్లే కదా!
1JO 5:16 మరణం కలిగించే పాపము తన సోదరుడు చెయ్యటం చూసిన వాడు తన సోదరుని కోసం దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు అతనికి క్రొత్త జీవితం యిస్తాడు. ఎవరి పాపం మరణానికి దారితీయదో వాళ్ళను గురించి నేను మాట్లాడుతున్నాను. మరణాన్ని కలిగించే పాపం విషయంలో ప్రార్థించమని నేను చెప్పటం లేదు.
1JO 5:17 ఏ తప్పు చేసినా పాపమే. కాని మరణానికి దారితీయని పాపాలు కూడా ఉన్నాయి.
1JO 5:18 దేవుని బిడ్డగా జన్మించిన వాడు పాపం చెయ్యడని మనకు తెలుసు. తన బిడ్డగా జన్మించిన వాణ్ణి దేవుడు కాపాడుతాడు. సైతాను అతణ్ణి తాకలేడు.
1JO 5:19 మనము దేవుని సంతానమని, ప్రపంచమంతా సైతాను ఆధీనంలో ఉందని మనకు తెలుసు.
1JO 5:20 దేవుని కుమారుడు వచ్చి నిజమైన వాడెవడో తెలుసుకొనే జ్ఞానాన్ని మనకు యిచ్చాడు. ఇది మనకు తెలుసు. మనము నిజమైన వానిలో ఐక్యమై ఉన్నాము. ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో కూడా ఐక్యమై ఉన్నాము. ఆయన నిజమైన దేవుడు. ఆయనే నిత్యజీవం.
1JO 5:21 బిడ్డలారా! విగ్రహాలకు దూరంగా ఉండండి.
2JO 1:1 దేవుడు ఎన్నుకున్న అమ్మగారికి, ఆమె సంతానానికి, పెద్దనైన నేను వ్రాస్తున్నది ఏమనగా,
2JO 1:2 మీ పట్ల నాకు నిజమైన ప్రేమవుంది. సత్యం మాలో శాశ్వతంగా ఉంది కాబట్టే, నాకే కాకుండా సత్యం తెలిసిన వాళ్ళందరికీ మీ పట్ల ప్రేమ ఉంది.
2JO 1:3 తండ్రి అయిన దేవుడు, తండ్రి యొక్క కుమారుడైన యేసు క్రీస్తు మనకు సత్యంతో, ప్రేమతో ఇచ్చిన కృప, దయ, శాంతి, మనలో ఉండాలని కోరుతున్నాను.
2JO 1:4 మీ సంతానంలో కొందరు, తండ్రి ఆజ్ఞాపించినట్లు నిజాయితీగా జీవిస్తున్నారని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది.
2JO 1:5 అమ్మా! మొదటినుండి ఉన్న ఆజ్ఞనే నేను మీకు వ్రాస్తున్నాను. కాని, క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మనము పరస్పరం ప్రేమతో ఉండాలని అంటున్నాను.
2JO 1:6 ఆయన ఆజ్ఞల్ని విధేయతతో పాటించటమే ప్రేమ. మీరు మొదటి నుండి విన్నట్లు, ప్రేమతో జీవించుమని ఆయన ఆజ్ఞాపించాడు.
2JO 1:7 యేసు క్రీస్తు శరీరంతో రాలేదనే మోసగాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో వ్యాపించారు. వాళ్ళు మోసగాళ్ళు; క్రీస్తు విరోధులు.
2JO 1:8 పని చేయటంవల్ల లభించే ఫలాన్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి. సంపూర్ణమైన ఫలం లభించేటట్లు చూసుకోండి.
2JO 1:9 క్రీస్తు ఉపదేశాన్ని ఉల్లంఘించిన వానిపై దేవుని అనుగ్రహం ఉండదు. ఆ ఉపదేశానుసారం నడుచుకొనే వానిపై తండ్రి, కుమారుల అనుగ్రహం ఉంటుంది.
2JO 1:10 ఈ ఉపదేశం తమ వెంట తీసుకురాకుండా మీ దగ్గరకు వచ్చిన వాణ్ణి మీ ఇంట్లోకి రానివ్వకండి. అలాంటి వాణ్ణి పలుకరించకండి.
2JO 1:11 ఎవరైనా అలాంటి వాణ్ణి పలుకరిస్తే, ఆ పలుకరించబడినవాడు చేసిన చెడ్డ పనుల్లో భాగస్తుడౌతాడు.
2JO 1:12 నాకింకా ఎన్నో విషయాలు వ్రాయాలని ఉంది. కాని కాగితాన్ని సిరాను ఉపయోగించటం నాకు యిష్టం లేదు. నేను మిమ్మల్ని కలిసి ముఖాముఖి మీతో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాను. అప్పుడు మనకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది.
2JO 1:13 దేవుడు ఎన్నుకొన్న మీ సోదరి యొక్క సంతానం, వాళ్ళ అభివందనాలు మీకు తెలుపుతున్నారు.
3JO 1:1 నా ప్రియ మిత్రుడైన గాయునకు, పెద్దనైన నాకు నీపట్ల నిజమైన ప్రేమ ఉంది.
3JO 1:2 ప్రియ మిత్రమా! నీ ఆత్మ క్షేమంగా ఉన్నట్లు నీవు ఆరోగ్యంగా ఉండాలని, నీ జీవితం చక్కటి మార్గాల్లో నడవాలని ప్రార్థిస్తున్నాను.
3JO 1:3 కొందరు సోదరులు వచ్చి నీలో ఉన్న సత్యాన్ని గురించి చెప్పారు. నీవేవిధంగా సత్యాన్ని అనుసరిస్తున్నావో చెప్పారు. అది విని నాకు చాలా ఆనందం కలిగింది.
3JO 1:4 నా పిల్లలు సత్యాన్ని అనుసరిస్తూ ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవటంకన్నా మించిన ఆనందం నాకు మరొకటి లేదు.
3JO 1:5 ప్రియ మిత్రమా! ఆ సోదరులు నీకు పరాయి వాళ్ళయినా వాళ్ళకోసం నీవు చేస్తున్నది విశ్వాసంతో చేస్తున్నావు.
3JO 1:6 నీ ప్రేమను గురించి వాళ్ళు సంఘానికి చెప్పారు. వాళ్ళు క్రైస్తవులు కాని వాళ్ళనుండి సహాయం కోరక క్రీస్తు పేరు కోసం బయలుదేరారు. నీవు దేవునికి నచ్చే విధంగా వాళ్ళను సాగనంపి మంచి పని చేసావు.
3JO 1:8 సత్యం కోసం మనం కలిసి పని చెయ్యాలంటే, అలాంటివాళ్ళను ఆదరించాలి.
3JO 1:9 నేను సంఘానికి వ్రాసాను. కాని దియొత్రెఫే తనకు ప్రాముఖ్యత కావాలని కోరుకుంటున్నాడు కనుక, మనకు సుస్వాగతం చెప్పలేదు.
3JO 1:10 దానితో తృప్తి పడక సోదరులకు సుస్వాగతం చెప్పటానికి అంగీకరించటం లేదు. పైగా సుస్వాగతం చెప్పే వాళ్ళను అడ్డగిస్తూ వాళ్ళను సంఘంనుండి బహిష్కరిస్తున్నాడు. అందువల్ల నేను వస్తే అతడు మనల్ని గురించి ద్వేషంతో ఎందుకు మాట్లాడుతున్నాడో కనుక్కుంటాను.
3JO 1:11 ప్రియ స్నేహితుడా! చెడుననుసరించటం మాని మంచిని అనుసరించు. మంచి చేసిన వాణ్ణి దేవుడు తనవానిగా పరిగణిస్తాడు. చెడు చేసిన వాడెవ్వడు దేవుణ్ణి ఎరుగడు.
3JO 1:12 దేమేత్రిని గురించి అందరూ సదాభిప్రాయంతో మాట్లాడుకొంటారు. సత్యమే అతణ్ణి గురించి సదాభిప్రాయము కలిగిస్తుంది. మేము కూడా అతణ్ణి గురించి సదాభిప్రాయంతో మాట్లాడుకుంటున్నాము. మేము చెపుతున్నది నిజమని నీకు తెలుసు.
3JO 1:13 నేను నీకు వ్రాయవలసినవి ఎన్నో ఉన్నాయి. కాని సిరాతో కలంతో వ్రాయాలని అనిపించటం లేదు.
3JO 1:14 నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందాము.
3JO 1:15 నీకు శాంతి కలుగుగాక! ఇక్కడి స్నేహితులు తమ అభివందనాలు తెలుపుతున్నారు. అక్కడి స్నేహితుల్ని ఒక్కొక్కరిని పేరుతో పిలిచి అభివందనాలు తెలుపు.
JUD 1:1 యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయినటువంటి యూదా, తండ్రియైన దేవుని ద్వారా పిలువబడి, ప్రేమింపబడి, యేసు క్రీస్తులో భద్రం చేయబడిన వారికి వ్రాయునదేమనగా:
JUD 1:2 దేవుని అనుగ్రహం, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా లభించునుగాక!
JUD 1:3 ప్రియ మిత్రులారా! మనమందరము కలిసి పంచుకొంటున్న రక్షణను గురించి మీకు వ్రాయాలనిపించింది. కాని మరొక విషయాన్ని గురించి వ్రాయటం చాలా ముఖ్యమనిపిస్తోంది. అదేమిటంటే దేవుడు తన పవిత్రులకు అప్పగించిన సువార్తలో ఏ మార్పు రాకుండా మీరు పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
JUD 1:4 కొందరు దుర్భోధకులు మీలో రహస్యంగా చేరి ఉన్నారు. వీళ్ళు శిక్షింపదగిన వాళ్ళని చాలా కాలం క్రిందటే లేఖనాల్లో వ్రాయబడింది. వీళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించువారు. వీళ్ళు దైవానుగ్రహాన్ని ఉపయోగించుకొంటూ అవినీతిగా జీవిస్తారు. వీళ్ళు మన ఏకైక ప్రభువు, పాలకుడు అయిన యేసు క్రీస్తును నిరాకరిస్తూ ఉంటారు.
JUD 1:5 మీకీ విషయాలన్నీ తెలుసు. అయినా కొన్ని విషయాలు జ్ఞాపకం చెయ్యాలని అనుకొంటున్నాను. ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉండిన తన ప్రజలకు, ప్రభువు స్వేచ్ఛ కలిగించాడు. కాని ఆ తర్వాత వాళ్ళలో విశ్వాసం లేని వాళ్ళను నాశనం చేసాడు.
JUD 1:6 తమ తమ స్థానాలను, అధికారాలను వదిలిన దేవదూతలను దేవుడు చిరకాలపు సంకెళ్ళతో అంధకారంలో బంధించి ఉంచాడు. చివరి రోజుదాకా అదేవిధంగా బంధించి ఉంచుతాడు.
JUD 1:7 సొదొమ, గొమొఱ్ఱా పట్టణాల ప్రజలు, వాటి పరిసర పట్టణాల్లోని ప్రజలు లైంగిక అవినీతికి, అసహజమైన లైంగిక సహవాసాలకు లోనైపొయ్యారు. అందువల్ల వాళ్ళు శాశ్వతమైన మంటల్లో శిక్షననుభవించారు. తద్వారా ఈ సంఘటన కూడా ఇతరులకు నిదర్శనంగా నిలిచిపోయింది.
JUD 1:8 వాళ్ళలాగే కలలుగనే ఈ దుర్భోధకులు తమ శరీరాల్ని మలినం చేసికొంటూ, అధికారాన్ని ఎదిరిస్తూ, దేవదూతల్ని దూషిస్తూ ఉంటారు.
JUD 1:9 కాని ప్రధాన దేవదూత అయిన మిఖాయేలు కూడా తాను మోషే దేహం విషయంలో వాదించినప్పుడు ఆ సాతాన్ని నిందించలేదు. వాణ్ణి దూషించ లేదు. అతడంత ధైర్యం చెయ్యలేకపొయ్యాడు. ఆ సాతానుతో, “ప్రభువు నిన్ను గద్దిస్తాడు” అని మాత్రం అన్నాడు.
JUD 1:10 ఈ దుర్భోధకులు తమకర్థం కాని విషయాన్ని గురించి దూషిస్తూ మాట్లాడుతారు. తెలివిలేని లౌకికంగా అర్థం చేసికొంటారు. పశువుల్లా వీటి ద్వారా నశించిపొతారు.
JUD 1:11 వీళ్ళు కయీను మార్గాన్ని అనుసరించారు. లాభం కోసం బిలాము చేసిన తప్పునే చేసారు. కోరహు వలె తిరుగుబాటు చేసి అతనిలాగే నశించిపొయ్యారు. వీళ్ళకు శ్రమ కలుగుగాక!
JUD 1:12 వీళ్ళు మీరు చేసే సమాజ విందుల్లో ఏ మాత్రం సిగ్గు లేకుండా పాల్గొంటారు. తమ కడుపులు బాగా నింపుకొంటారు. గాలికి ఎగిరే నీళ్ళులేని మేఘాల్లాంటి, ఫలమివ్వని ఎండిన వృక్షంలాంటి వాళ్ళు. వ్రేళ్ళు పెకిలింపబడి రెండు సార్లు చనిపోయిన వృక్షంలాంటి వాళ్ళు.
JUD 1:13 అవమానమనే నురుగు కక్కే సముద్రపు కెరటాల్లాంటి వాళ్ళు. ఆకాశంలో గతితప్పి తిరిగే నక్షత్రాల్లాంటి వాళ్ళు. వారి కోసం దేవుడు గాఢాంధకారాన్ని శాశ్వతంగా దాచి ఉంచాడు.
JUD 1:14 ఆదాము తర్వాత ఏడవ వాడైన హనోకు వీళ్ళను గురించి ఈ విధంగా ప్రవచించాడు: “అదిగో! ప్రభువు వేలకొలది పరిశుద్ధులతో కలిసి వస్తున్నాడు.
JUD 1:15 వచ్చి అందరిపై తీర్పు చెపుతాడు. దుర్మార్గపు పనులు చేసే అవిశ్వాసుల్ని, తమకు వ్యతిరేకంగా చెడు మాట్లాడే పాపుల్ని శిక్షిస్తాడు.”
JUD 1:16 ఈ దుర్భోధకులు సణుగుతూ తప్పులెంచుతూ ఉంటారు. తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ, ప్రగల్భాలు చెప్పుకొంటూ తమ లాభం కోసం ఇతర్లను పొగుడుతూ ఉంటారు.
JUD 1:17 కాని ప్రియ మిత్రులారా! మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలులు చెప్పిన ప్రవచనాల్ని జ్ఞాపకం ఉంచుకోండి.
JUD 1:18 “చివరి రోజుల్లో దేవుణ్ణి దూషించే వాళ్ళు తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ వస్తారు” అని అపొస్తలులు చెప్పారు.
JUD 1:19 వాళ్ళు ప్రస్తావించిన ఈ దుర్భోధకులే మిమ్మల్ని విడదీస్తారు. ఈ దుర్భోధకులు పశువుల్లా ప్రవర్తిస్తారు. వీళ్ళలో దేవుని ఆత్మ ఉండదు.
JUD 1:20 కాని ప్రియ మిత్రులారా! మీలో ఉన్న విశ్వాసం అతి పవిత్రమైనది. దానితో మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోండి. పవిత్రాత్మ ద్వారా ప్రార్థించండి.
JUD 1:21 దేవుని ప్రేమను వదులుకోకండి. మీకు నిత్యజీవం ఇచ్చే మన యేసు క్రీస్తు ప్రభువు దయకొరకు కాచుకొని ఉండండి.
JUD 1:22 సంశయాలున్న వాళ్ళపట్ల కనికరం చూపండి.
JUD 1:23 మంటల్లో పడబోయే వాళ్ళను బయటకు లాగి కాపాడండి. దుర్నీతిలో మలినమైన దుస్తుల్ని వేసుకొన్న వాళ్ళ పట్ల మీకు అసహ్యము, భయము కలిగినా వాళ్ళ పట్ల కనికరం చూపండి.
JUD 1:24 ఆ దేవుడు క్రిందపడకుండా మిమ్మల్ని కాపాడగలడు. మీలో ఏ లోపం లేకుండా చేసి తేజోవంతమైన తన సమక్షంలో నిలుపుకొని ఆనందాన్ని కలిగించగలడు. అలాంటి ఆయనకు
JUD 1:25 మన రక్షకుడైనటువంటి ఏకైక దేవునికి, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా గొప్పతనము, తేజస్సు, శక్తి, అధికారము, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో లభించుగాక! ఆమేన్.
REV 1:1 దేవుడు త్వరలోనే జరగనున్న వాటిని తన సేవకులకు తెలియచేయుమని యేసు క్రీస్తుకు చెప్పాడు. యేసు తన దూతను, తన భక్తుడైన యోహాను దగ్గరకు పంపి ఈ విషయాలు తెలియచేసాడు. ఈ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయి.
REV 1:2 యోహాను దేవుని సందేశాన్ని, యేసు క్రీస్తు చెప్పినదాన్ని దివ్య దర్శనంలో చూసాడు. అందులో చూసినవన్నీ చెప్పాడు.
REV 1:3 ఈ దైవసందేశంలో ఉన్న వాటిని చదివిన వాళ్ళు, వాటిని విని, వాటిలో వ్రాయబడిన వాటిని ఆచరించే వాళ్ళు ధన్యులు. సమయం దగ్గరగానున్నది.
REV 1:4 యోహాను నుండి, ఆసియ ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు, భూత, భవిష్యత్ వర్తమానకాలాల్లో ఉన్నవాడు, ఆయన సింహాసనం ముందున్న ఏడు ఆత్మలు మీకు తమ అనుగ్రహాన్ని, శాంతిని ప్రసాదించుగాక!
REV 1:5 మరియు, చనిపోయి బ్రతికింపబడిన వాళ్ళలో మొదటివాడు, నిజమైన విషయాలు చెప్పేవాడు రాజులకు రాజైన యేసు క్రీస్తు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించుగాక! ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనే తన రక్తంతో మనల్ని మన పాపాలనుండి రక్షించాడు.
REV 1:6 మనకోసం ఒక రాజ్యాన్ని స్థాపించాడు. మనము ఆయన తండ్రియైన దేవుని సేవ చేయాలని మనల్ని యాజకులుగా చేసాడు. ఆయనకు చిరకాలం మహిమ శక్తి కలుగుగాక! ఆమేన్.
REV 1:7 చూడు! ఆయన మేఘాలపై వస్తున్నాడు. ప్రతీ నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచిన వాళ్ళు కూడా ఆయన్ని చూస్తారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆయన్ని చూచి భయాందోళనలతో దుఃఖిస్తారు. అలాగే జరుగుగాక! ఆమేన్.
REV 1:8 భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఉండేవాడు. సర్వశక్తి సంపన్నుడైనవాడు, మన ప్రభువైన దేవుడు “ఆదియు, అంతమును నేనే” అని అన్నాడు.
REV 1:9 నేను యేహానును, మీ సోదరుణ్ణి యేసుతో పొందిన ఐక్యత వల్ల మనము ఆయన రాజ్యంలో ఒకటిగా ఉన్నాము. సహనంతో కష్టాలు అనుభవిస్తున్నాము. యేసు చెప్పిన సత్యాన్ని దేవుని సందేశాన్ని ప్రకటించటం వల్ల నన్ను వాళ్ళు పత్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉంచారు.
REV 1:10 ఆదివారము నాడు నేను దేవుని ఆత్మపూర్ణుడనైయుండగా బూర వూదినట్లు నా వెనుకనుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది.
REV 1:11 అది నాతో, “నీవు చూసిన దాన్ని ఒక గ్రంథంగా వ్రాసి ఈ ఏడు సంఘాలకు అనగా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయకు పంపుము” అని అన్నది.
REV 1:12 నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరిదో చూడాలని వెనక్కు తిరిగి చూసాను. వెనక్కు తిరిగి చూడగా ఏడు బంగారు దీపస్తంభాలు కన్పించాయి.
REV 1:13 వాటి మధ్య ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన మనుష్యకుమారునిలా ఉన్నాడు. ఆయన వేసుకొన్న అంగీ ఆయన పాదాల వరకు ఉంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టబడివుంది.
REV 1:14 ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయి. ఆయన వెంట్రుకల్ని మంచుతో కూడా పోల్చవచ్చు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి.
REV 1:15 ఆయన పాదాలు కొలిమిలో కాలే యిత్తడిలా ఉన్నాయి. ఆయన కంఠధ్వని జల ప్రవాహం చేసే శబ్దంలా ఉంది.
REV 1:16 ఆయన తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. ఇరువైపులా పదునుగానున్న ఒక కత్తి ఆయన నోటి నుండి బయటకు వచ్చింది. ఆయన ముఖం దివ్యంగా ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.
REV 1:17 నేనాయన్ని చూసి, ప్రాణం పోయిన వానిలా ఆయన పాదాల ముందు పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా తలపై ఉంచి, “భయపడకు. ఆదిని, అంతాన్ని నేనే!” అని అన్నాడు.
REV 1:18 “నేను చిరకాలం జీవించేవాణ్ణి. ఒకప్పుడు నేను మరణించి ఉంటిని. కాని యిక శాశ్వతంగా జీవించి ఉంటాను. మరణంపై నాకు అధికారం ఉంది. మృత్యులోకపు తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి.
REV 1:19 అందువల్ల యిప్పుడున్న వాటిని, ముందు జరుగబోయే వాటిని, నీవు చూసిన వాటిని గురించి వ్రాయి.
REV 1:20 నీవు నా కుడి చేతిలో చూసిన ఏడు నక్షత్రాల రహస్యము, ఏడు దీపస్తంభాల రహస్యము యిది. ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకు చెందిన దూతలు, ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలన్నమాట.
REV 2:1 “ఎఫెసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి: “ఏడు నక్షత్రాలను తన కుడి చేతిలో పట్టుకొని, ఏడు బంగారు దీపస్తంభాల మధ్య నడిచేవాడు ఈ విధంగా అంటున్నాడు.
REV 2:2 “నీవు చేసిన పనులు నాకు తెలుసు. నీవు పట్టుదలతో శ్రమించి పని చేసావు. నీవు దుష్టుల్ని సహించలేవని నాకు తెలుసు. అపొస్తలులమని చెప్పుకొంటున్న వాళ్ళను నీవు పరీక్షించి వాళ్ళు మోసగాళ్ళని తెలుసుకొన్నావు.
REV 2:3 నీవు పట్టుదలతో అలసిపోకుండా నా పేరిట కష్టాలు ఓర్చుకొన్నావు.
REV 2:4 ““కాని నీ తొలి ప్రేమను నీవు పూర్తిగా మరిచిపోయావు. ఇది నాకు యిష్టము లేదు.
REV 2:5 నీవు ఎంత దిగజారిపోయావో జ్ఞాపకం తెచ్చుకో. మారు మనస్సు పొందు. మొదట చేసిన విధంగా చేయి. నీవు మారు మనస్సు పొందకపోతే, నేను వచ్చి నీ దీపాన్ని దాని స్థలం నుండి తీసివేస్తాను.
REV 2:6 నీకొలాయితులు చేసే పనులు నీకు యిష్టం లేదు. నాకు కూడా యిష్టం లేదు. ఆ విషయంలో మనం ఏకీభవిస్తున్నాము.
REV 2:7 “ఆత్మ సంఘాలకు చెపుతున్న వాటిని ప్రతీవాడు వినాలి. గెలుపు సాధించిన వానికి పరదైసులో ఉన్న జీవవృక్షం యొక్క ఫలం తినే అధికారం యిస్తాను.
REV 2:8 “స్ముర్నలోని క్రీస్తు సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి: “ఆదియు, అంతము అయిన వాడు, చనిపోయి తిరిగి బ్రతికి వచ్చినవాడు ఈ విధంగా చెబుతున్నాడు:
REV 2:9 “మీ దుఃఖాలను గురించి, మీ దారిద్ర్యాన్ని గురించి నాకు తెలుసు. అయినా మీరు భాగ్యవంతులు. మిమ్మల్ని గురించి కొందరు చెడుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తాము యూదులమని చెప్పుకొంటారు గాని నిజానికి వాళ్ళు యూదులు కారు. వాళ్ళు సైతాను సమాజానికి చెందిన వాళ్ళు.
REV 2:10 మీరు అనుభవించబోయే శ్రమలను గురించి భయపడకండి. సైతాను మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు. మీరు పది రోజులు హింసను అనుభవిస్తారు. ఇది మీకొక పరీక్ష. మరణానికి కూడా భయపడకుండా విశ్వాసంతో ఉండండి. నేను మీకు జీవ కిరీటాన్ని యిస్తాను.
REV 2:11 “ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతీవాడు వినాలి. వీటిని జయించిన వాడు రెండవ మరణాన్నుండి తప్పించుకొంటాడు.
REV 2:12 “పెర్గములోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి: “రెండు వైపులా పదునైన కత్తిగలవాడు ఈ విధంగా చెబుతున్నాడు.
REV 2:13 “సైతాను సింహాసనం ఎక్కడ ఉందో అక్కడే నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నీకు నా పేరంటే విశ్వాసం ఉంది. విశ్వాసంతో నా విషయంలో అంతిపయి తన భక్తిని వ్యక్తపరిచిన కాలంలో కూడా నా పట్ల నీకున్న విశ్వాసాన్ని నీవు వదులుకోలేదు. సైతాను నివసించే పట్టణంలో అంతిపయి చంపబడ్డాడు.
REV 2:14 “కాని కొన్ని విషయాల్లో నాకు నీవు నచ్చలేదు. బిలాము బోధనలు పఠించే వాళ్ళు కొందరు నీ సంఘంలో ఉన్నారు. ఈ బిలాము, ఇశ్రాయేలీయులను రేకెత్తించి వాళ్ళతో పాపపు పనులు చేయించమని బాలాకుకు బోధించాడు. బాలాకు వాళ్ళు విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ఆహారం తినేటట్లు అవినీతిగా బ్రతికేటట్లు చేసాడు.
REV 2:15 నీకొలాయితులను అనుసరించే వాళ్ళు కూడా నీ దగ్గరున్నారు.
REV 2:16 మారుమనస్సు పొందండి. అలా చేయకపోతే నేను త్వరలోనే మీ దగ్గరకు వచ్చి, నా నోటి నుండి బయలు వెడలు కత్తితో యుద్ధం చేస్తాను.
REV 2:17 “ఆత్మ క్రీస్తు సంఘాలకు చెప్పిన వాటిని ప్రతీవాడు వినాలి. “విజయం సాధించిన వానికి నేను దాచి ఉంచిన ‘మన్నా’ను తినుటకు యిస్తాను. ఒక తెల్ల రాయి మీద ఒక క్రొత్త పేరు వ్రాసి దాన్ని కూడా అతనికి యిస్తాను. నేను ఆ రాయి ఎవరికి యిస్తానో అతనికి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది.
REV 2:18 “తుయతైరలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి: “అగ్ని జ్వాలల్లా మండుతున్న కళ్ళు కలవాడు కొలిమిలో కాల్చి మెరుగు పెట్టబడిన యిత్తడిలా పాదాలు కలవాడు ఈ విధంగా చెబుతున్నాడు.
REV 2:19 “నీవు చేస్తున్న పనులు, నీ ప్రేమ, విశ్వాసము, సేవ, పట్టుదల నాకు తెలుసు. నీవు మొదట చేసినదానికన్నా, యిప్పుడు ఎక్కువ చేస్తున్నావని నాకు తెలుసు.
REV 2:20 తానొక ప్రవక్తనని చెప్పుకొంటున్న యెజెబెలు చెస్తున్న పనుల్ని నీవు సహిస్తున్నావు. ఇది నాకు యిష్టం లేదు. ఆ స్త్రీ తన బోధనలతో నా సేవకులను తప్పు దారి పట్టిస్తోంది. దాని కారణంగా వాళ్ళు నీతి లేని కామ కృత్యాలు చేస్తున్నారు. విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ఆహారం తింటున్నారు.
REV 2:21 అది చేసిన అవినీతికి మారుమనస్సు పొందమని నేను దానికి కొంత గడువునిచ్చాను. కాని అది దానికి అంగీకరించలేదు.
REV 2:22 “అందువల్ల దానికి కష్టాలు కలిగిస్తాను. అవినీతిగా దానితో కామకృత్యాలు చేసిన వాళ్ళు తమ పాపానికి మారుమనస్సు పొందకపోతే, వాళ్ళను తీవ్రంగా శిక్షిస్తాను.
REV 2:23 దాని బిడ్డల్ని చంపివేస్తాను. అప్పుడు హృదయాల్ని, బుద్దుల్ని శోధించేవాణ్ణి నేనేనని అన్ని సంఘాలు తెలుసుకొంటాయి. చేసిన కార్యాలను బట్టి ప్రతీ ఒక్కరికి ప్రతిఫలం యిస్తాను.
REV 2:24 “తుయతైరలో ఉన్న మిగతా ప్రజలకు, అంటె, దాని బోధనల్ని ఆచరించని వాళ్ళకు, మరియు సైతాను రహస్యాలను అభ్యసించని వాళ్ళకు నేను చెప్పేదేమిటంటే, నేను మీ మీద మరే భారము వెయ్యను.
REV 2:25 నేను వచ్చేదాకా మీరు అనుసరిస్తున్న వాటినే అనుసరిస్తూ ఉండండి.
REV 2:26 “విజయాన్ని సాధించి నా ఇచ్ఛానుసారం చివరిదాకా ఉన్నవానికి నేను జనములపై అధికారం యిస్తాను.
REV 2:27 ‘అతడు వాళ్ళను కఠిన శాసనాలతో పాలిస్తాడు. వాళ్ళను కుండల్ని పగులకొట్టినట్లు పగులగొడ్తాడు.’
REV 2:28 ఈ అధికారం నేను నా తండ్రినుండి పొందాను. అదే విధంగా వాళ్ళు నా నుండి అధికారం పొందుతారు. నేను అతనికి వేకువ చుక్కను కూడా యిస్తాను.
REV 2:29 ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతీవాడు వినాలి.
REV 3:1 “సార్దీసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి: “దేవుని ఏడు ఆత్మలను, ఏడు నక్షత్రాలను తన ఆధీనంలో ఉంచుకొన్నవాడు ఈ విధంగా చెపుతున్నాడు: “నీవు చేస్తున్న పనులు నాకు తెలుసు. ప్రజలు నీవు బ్రతికి ఉన్నావని అనుకొంటున్నారు. కాని నీవు నిజానికి చనిపోయిన వానితో సమానము.
REV 3:2 నా దేవుని దృష్టిలో నీవు చేస్తున్న పనులు యింకా పూర్తి కాలేదు. ఇది నేను గమనించాను. కనుక జాగ్రత్త. నీలో ఉన్న శక్తి పూర్తిగా నశించకముందే నీ శక్తిని కాపాడుకో.
REV 3:3 నీకు లభించిన దాన్ని, నీవు విన్నదాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆచరించు. మారుమనస్సు పొందు. కాని నీవు జాగ్రత్తగా ఉండకపోతే నేను ఒక దొంగలా వస్తాను. నేను ఎప్పుడు వస్తానో నీవు తెలుసుకోలేవు.
REV 3:4 “మలినంకాని కొందరు వ్యక్తులు అక్కడ సార్థీసులో నీ దగ్గరున్నారు. వాళ్ళు యోగ్యులు కనుక, తెల్లని దుస్తులు ధరించి నాతో సహా నడుస్తారు.
REV 3:5 విజయం సాధించిన వాళ్ళలా తెల్లని దుస్తులు ధరించండి. అలా చేసిన వాని పేరును నేను జీవగ్రంథంనుండి తుడిచివేయను. అతణ్ణి నా తండ్రి ముందు, దేవదూతల ముందు అంగీకరిస్తాను.
REV 3:6 సంఘాలకు ఆత్మ చెపుతున్న దాన్ని ప్రతీవాడు వినాలి.
REV 3:7 “ఫిలదెల్ఫియలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి: “పవిత్రమైన వాడు, సత్యవంతుడు, దావీదు తాళంచెవి ఉన్నవాడు ఈ విధంగా చెపుతున్నాడు. ఆయన తెరిచిన దాన్ని ఎవ్వరూ మూయలేరు. ఆయన మూసినదాన్ని ఎవ్వరూ తెరువలేరు.
REV 3:8 “నీ పనులు నాకు తెలుసు. అదిగో చూడు! ఎవ్వరూ మూయలేని ద్వారాన్ని నీ ముందు ఉంచాను. నీ దగ్గర ఎక్కువ బలంలేదని నాకు తెలుసు. అయినా నా పేరును తృణీకరించకుండా అంగీకరించావు.
REV 3:9 సైతాను మందిరానికి చెందిన వాళ్ళను, యూదులు కాకున్నా యూదులమని చెప్పుకొనే వాళ్ళను, అబద్ధాలాడేవాళ్ళను, నీ కాళ్ళ ముందు పడేటట్లు చేస్తాను. నాకు నీ పట్ల ప్రేమ ఉందని వాళ్ళు తెలుసుకొనేటట్లు చేస్తాను.
REV 3:10 సహనంతో కష్టాలు అనుభవించమని నేను ఆజ్ఞాపించాను. నీవా ఆజ్ఞను పాటించావు. కనుక విచారించే సమయం వచ్చినప్పుడు నిన్ను రక్షిస్తాను. ఈ ప్రపంచంలో నివసిస్తున్న వాళ్ళందరిపై విచారణ జరిగే సమయం రాబోతోంది.
REV 3:11 “నేను త్వరలోనే రాబోతున్నాను. నీ దగ్గరున్న దాన్ని అంటిపెట్టుకొని ఉండు. అలా చేస్తే నీ కిరీటాన్ని ఎవ్వరూ తీసుకోలేరు.
REV 3:12 అలా విజయం సాధించిన వాణ్ణి, నేను నా దేవుని మందిరంలో ఒక స్తంభంలా ఉంచుతాను. అతనా స్థానాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళడు. నేను అతనిపై నా దేవుని పేరు వ్రాస్తాను. నా దేవుని నగరమైన క్రొత్త యెరూషలేము పేరు వ్రాస్తాను. ఈ క్రొత్త యెరూషలేము పరలోకంలో ఉన్న నా దేవుని దగ్గరినుండి వస్తోంది. అతని మీద నా క్రొత్త పేరు కూడా వ్రాస్తాను.
REV 3:13 ఆ సంఘాలకు ఆత్మ చెబుతున్న విషయాలను ప్రతీవాడు వినాలి.
REV 3:14 “లవొదికయలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి: “ఈ విషయాలకు ఆమేన్ అనువాడును, దేవుడు సృష్టించిన వాటన్నిటికీ మొదటివాడును నిజమైన సాక్షి అయినవాడును చెప్పుచున్నాడు.
REV 3:15 “నీవు చేసిన పనుల్ని గురించి నాకు తెలుసు. నీలో చల్లదనం గాని వేడిమి గాని లేదు. రెండింటిలో ఏదైనా ఒకటి నీలో ఉండాలని నా కోరిక.
REV 3:16 నీవు వేడిగానూ లేవు, చల్లగానూ లేవు. గోరు వెచ్చగా ఉన్నావు. కనుక నిన్ను నా నోటి నుండి బయటకు ఉమ్మి వేయబోతున్నాను.
REV 3:17 ‘నేను ధనవంతుణ్ణి, నా దగ్గర ఐశ్వర్యం ఉంది. నాకు ఏ కొరతా లేదు’ అని నీవంటున్నావు. కాని నీవు దౌర్భాగ్యుడవు. దీనావస్థలో ఉన్నావు. నీవు దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు.
REV 3:18 నీవు ధనవంతుడవు కావాలనుకొంటే, నిప్పులో పుటం వేయబడిన బంగారాన్ని నా దగ్గర నుండి కొనుమని సలహా ఇస్తున్నాను. సిగ్గు కలిగించే నీ దిగంబరత్వాన్ని దాచుకోవటానికి నా నుండి తెల్లని దుస్తులు కొనుమని సలహా ఇస్తున్నాను. నా నుండి కాటుకను కూడా కొనుక్కొని నీ కళ్ళకు పెట్టుకో. అప్పుడు చూడగల్గుతావు.
REV 3:19 “నేను ప్రేమించిన వాళ్ళను గద్దిస్తాను. వాళ్ళను శిక్షిస్తాను. అందువల్ల నిజాయితీతో ఉండి పశ్చాత్తాపం చెందు.
REV 3:20 ఇదిగో! నేనిక్కడ తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపుతెరిస్తే నేను లోపలికి వచ్చి అతనితో కలిసి తింటాను. అతడు నాతో కలిసి తింటాడు.
REV 3:21 “నేను విజయం సాధించి నా తండ్రితో కలిసి ఆయన సింహాసనంపై కూర్చున్నాను. అదే విధంగా విజయం సాధించినవాడు నాతో సింహాసనంపై కూర్చుంటాడు.
REV 3:22 సంఘాలకు ఆత్మ చెబుతున్న వాటిని ప్రతీవాడు వినాలి.”
REV 4:1 ఇది జరిగిన తర్వాత నేను కళ్ళెత్తి చూశాను. పరలోకంలో ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారము తెరుచుకొని ఉంది. బూర ఊదినట్లు యింతకు ముందు మాట్లాడిన స్వరం నాకు మళ్ళీ వినిపించింది. అది నాతో, “ఇలా మీదికి రా; దీని తర్వాత ఏమి జరుగుతుందో నీకు చూపిస్తాను” అని అంది.
REV 4:2 నేను వెంటనే పరిశుద్ధాత్మ ఆధీనమయ్యాను. పరలోకంలో ఉన్న సింహాసంనం నాముందు కనిపించింది. దాని మీద ఎవరో కూర్చొని ఉన్నారు.
REV 4:3 దాని మీద కూర్చున్నవాడు సూర్యకాంత మణివలే, పద్మరాగము వలె వున్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతమును పోలిన ఆకాశ ధనుస్సు ప్రకాశిస్తూ ఉంది.
REV 4:4 దాని చుట్టూ యిరవై నాలుగు యితర సింహాసనాలు ఉన్నాయి. వాటి మీద యిరవై నాలుగు మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళ తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి.
REV 4:5 సింహాసనం నుండి మెరుపులువచ్చాయి. పెద్ద గర్జనలు ఉరుములు దాన్నుండి వినిపించాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి. ఇవి దేవుని ఏడు ఆత్మలు.
REV 4:6 గాజుతో కప్పిన సముద్రంలా కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు కనిపించింది. అది స్ఫటికంలా నిర్మలంగా ఉంది. సింహాసనం మధ్య, చుట్టూ, అంటే ముందు, వెనుకా, నాలుగు ప్రాణులు ఉన్నాయి. వాటి దేహాలు ముందు, వెనుకా, కళ్ళతో కప్పబడి ఉన్నాయి.
REV 4:7 మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే పెద్ద పక్షిలా ఉన్నాయి.
REV 4:8 ప్రతీ ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి శరీరాలుపైన, క్రిందా కళ్ళతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. రెక్కల క్రింద కళ్ళతో కప్పబడి ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక: “భూత, భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడును ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” అని పాడుతూ ఉన్నాయి.
REV 4:9 సింహాసనంపై కూర్చొన్న వానికి, చిరకాలం జీవించే వానికి, మహిమ, గౌరవము కలగాలని అంటూ ఈ ప్రాణులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ పాడాయి.
REV 4:10 అవి ఆ విధంగా పాడినప్పుడు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు ఆ సింహాసనంపై కూర్చొన్నవానిముందు సాష్టాంగపడి చిరకాలం జీవించే ఆయన్ని స్తుతించారు. తమ కిరీటాల్ని సింహాసనం ముందువేసి,
REV 4:11 “మా ప్రభూ! దైవమా! నీవు తేజమును, గౌరవమును, శక్తిని పొందతగిన యోగ్యుడవు, నీవు అన్నిటినీ సృష్టించావు. అవి నీ యిష్టానుసారం సృష్టింపబడి జీవాన్ని పొందాయి” అని అన్నారు.
REV 5:1 ఆ తర్వాత, సింహాసనంపై కూర్చొన్న వాని కుడి చేతిలో చుట్టబడియున్న ఒక గ్రంథాన్ని చూసాను. దాని యిరువైపులా ఏదో వ్రాయబడి ఉంది. దానిపై ఏడు ముద్రలు ఉన్నాయి.
REV 5:2 శక్తివంతమైన ఒక దేవదూత నాకు కనిపించాడు. అతడు పెద్ద స్వరంతో, “ఆ ముద్రలను విప్పి ఆ గ్రంథాన్ని తెరువగల యోగ్యుడెవరు?” అని ప్రకటించటం నేను చూసాను.
REV 5:3 పరలోకంలోగాని, భూమ్మీదగాని, పాతాళంలోగాని ఆ గ్రంథాన్ని తెరువగలవాడు, దాని లోపలవున్నది చూడగలవాడు ఎవ్వడూ నాకు కనిపించలేదు.
REV 5:4 ఆ గ్రంథాన్ని తెరువగలవాడు దాని లోపల ఏముందో చూడగల యోగ్యుడు కనిపించనందుకు నేను చాలా విలపించాను.
REV 5:5 అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “విలపించవద్దు. యూదాతెగకు చెందిన సింహము, దావీదు వంశాంకురము విజయం పొందాడు చూడు. ఆ గ్రంథాన్ని, దాని ఏడు ముద్రల్ని తెరువగలవాడు ఆయనే!”అని అన్నాడు.
REV 5:6 అప్పుడు నాకొక గొఱ్ఱెపిల్ల కనిపించింది. అది సింహాసనం మధ్య ఉంది. అది వధింపబడినదానిలా నాకు కనిపించింది. దాని చుట్టూ ఆ నాలుగు ప్రాణులు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ళు ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. దేవుడు ప్రపంచమంతా వ్యాపింపచేసింది ఈ ఆత్మలనే.
REV 5:7 ఆయన వచ్చి సింహాసనంపై కూర్చొన్న వాని కుడి చేతినుండి ఆ గ్రంథాన్ని తీసుకొన్నాడు.
REV 5:8 ఆయన ఆ గ్రంథాన్ని తీసుకొన్న వెంటనే, ఆ నాలుగు జీవులు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు, ఆ గొఱ్ఱెపిల్ల ముందు సాష్టాంగపడ్డారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సితార ఉంది. సాంబ్రాణితో నిండిన బంగారు గిన్నెలు ఉన్నాయి. ఇవి విశ్వాసుల ప్రార్థనలన్న మాట.
REV 5:9 వాళ్ళు ఒక క్రొత్త కీర్తన పాడారు: “నీవు వధింపబడినందుకు ప్రతీ జాతినుండి ప్రతీ భాషనుండి, ప్రతీ దేశంనుండి, ప్రతీ గుంపునుండి, నీ రక్తంతో మానవుల్ని దేవుని కోసం కొన్నావు. కనుక ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పే అర్హత నీవు పొందావు.
REV 5:10 మా దేవుని కొరకు ఈ ప్రజలతో ఒక రాజ్యాన్ని సృష్టించావు. వాళ్ళను యాజకులుగా నియమించావు. వాళ్ళు ఈ ప్రపంచాన్ని పాలిస్తారు.”
REV 5:11 ఆ తర్వాత చూస్తే నాకు చాలామంది దేవదూతల స్వరం వినిపించింది. వాళ్ళ సంఖ్య కోట్లకొలదిగావుంది. వాళ్ళు సింహాసనం చుట్టూ, ప్రాణుల చుట్టూ, పెద్దల చుట్టూ గుమికూడి ఉన్నారు.
REV 5:12 వాళ్ళు బిగ్గరగా, “శక్తిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, గౌరవాన్ని, మహిమను స్తుతిని పొందటానికి వధింపబడిన గొఱ్ఱెపిల్ల యోగ్యమైనవాడు” అని పాడారు.
REV 5:13 ఆ తర్వాత పరలోకంలో, భూమ్మీద, పాతాళంలో, సముద్రం మీద ఉన్న ప్రతీ ప్రాణి, ఈ విధంగా పాడటం విన్నాను: “సింహాసనంపై కూర్చున్న వానికి, గొఱ్ఱెపిల్లకు చిరకాలం స్తుతి, గౌరవము, మహిమ, శక్తి కల్గుగాక!”
REV 5:14 ఆ నాలుగు ప్రాణులు, “ఆమేన్” అని అన్నాయి. పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించిరి.
REV 6:1 ఆ గొఱ్ఱెపిల్ల ఆ ఏడింటిలో మొదటి ముద్రను తెరవటం చూసాను. ఆ నాలుగు ప్రాణుల్లో ఒక ప్రాణి “రా!” అని ఉరుముతూ అనటం విన్నాను.
REV 6:2 నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దానిమీద స్వారి చేస్తున్నవాడు విల్లు పట్టుకొని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం యివ్వబడింది. అతడు విజయం సాధించాలని నిర్ణయించుకొన్న వీరునిలా స్వారీ చేస్తూ యుద్ధరంగానికి వెళ్ళిపోయాడు.
REV 6:3 ఆ గొఱ్ఱెపిల్ల రెండవ ముద్రను తీసినప్పుడు రెండవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను.
REV 6:4 అప్పుడు యింకొక గుఱ్ఱం వెలుపలికి వచ్చింది. అది ఎఱ్ఱటి రంగులో ఉంది. భూమ్మీద శాంతి లేకుండా చేయటానికి, మానవులు ఒకరినొకరు వధించుకొనేటట్లు చేయటానికి, దాని రౌతుకు అధికారం యివ్వబడింది. అతనికి ఒక పెద్ద ఖడ్గం యివ్వబడింది.
REV 6:5 ఆ గొఱ్ఱెపిల్ల మూడవ ముద్రను తీసినప్పుడు మూడవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. నా ముందు ఒక నల్లటి గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు చేతిలో ఒక తక్కెడ ఉంది.
REV 6:6 అప్పుడు ఆ నాలుగు ప్రాణులనుండి ఒక స్వరం, “ఒక దేనారమునకు ఒక సేరు గోధుమలనియు ఒక దేనారమునకు మూడు సేర్లు యవలనియు నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు!” అని అనటం వినిపించింది.
REV 6:7 ఆ గొఱ్ఱెపిల్ల నాల్గవ ముద్రను తీసినప్పుడు నాల్గవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను.
REV 6:8 అక్కడ నా ముందు పాలిపోయినట్టుగా ఉన్న ఒక గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు పేరు “మృత్యువు.” మృత్యు లోకము వానిని అనుసరిస్తూ వాని వెనుకనే ఉంది. భూమి నాల్గవ వంతుపై అతనికి అధికారం యివ్వబడింది. కత్తితో, కరువుతో, తెగులుతో, క్రూర మృగాలతో భూనివాసులను చంపటానికి అతనికి అధికారం యివ్వబడింది.
REV 6:9 ఆ గొఱ్ఱెపిల్ల ఐదవ ముద్రను తీసినప్పుడు, వధింపబడిన ఆత్మల్ని బలిపీఠం క్రింద చూసాను. వీళ్ళు దేవుని సందేశాన్ని బోధించటంవల్ల మరియు సాక్ష్యం చెప్పటంవల్ల వధింపబడిన వాళ్ళు.
REV 6:10 వాళ్ళు పెద్ద స్వరంతో, “మహా ప్రభూ! నీవు పరిశుద్ధుడవు, సత్యవంతుడవు. ఈ భూమ్మీద నివసించే వాళ్ళపై తీర్పు చెప్పటానికి, మా రక్తము నిమిత్తము పగ తీర్చుకోవటానికి యింకా ఎంతకాలం పడ్తుంది?” అని అన్నారు.
REV 6:11 ఆ తర్వాత ప్రతీ ఒక్కరికి ఒక తెల్లటి వస్త్రం యివ్వబడింది. “మీరు చంపబడినట్లే, మీ తోటి సేవకులు, సోదరులు చంపబడతారు. వాళ్ళ సంఖ్య ముగిసే వరకు మీరు మరికొంత కాలం కాచుకొని ఉండాలి” అని వాళ్ళకు తెలుపబడింది.
REV 6:12 ఆయన ఆరవ ముద్రను విప్పుతూ ఉంటే నేను చూసాను. ఒక పెద్ద భూకంపం కలిగింది. గొఱ్ఱె బొచ్చుతో చేసిన గొంగళిలాగా, సూర్యగోళం నల్లగా మారిపోయింది. పున్నమి చంద్రబింబం ఎఱ్ఱటి రక్తంలా మారిపోయింది.
REV 6:13 తీవ్రంగా గాలి వీచినప్పుడు, కాలం కాని కాలంలో కాచిన అంజూరపు పండ్లు క్రింద పడినట్లు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు భూమ్మీద పడ్డాయి.
REV 6:14 ఆకాశం కాగితంలా చుట్టుకుపోయి మాయమైపోయింది. అన్ని పర్వతాలు, ద్వీపాలు స్థానం తప్పినవి.
REV 6:15 అప్పుడు ఈ భూమిని పాలించే రాజులు, యువరాజులు, సైన్యాధిపతులు, శ్రీమంతులు, శక్తివంతులు, బానిసలు, బానిసలు కానివాళ్ళు గుహల్లో, పర్వతాలపై ఉన్న రాళ్ళ మధ్య దాక్కొన్నారు.
REV 6:16 వాళ్ళు పర్వతాలను, రాళ్ళను పిలుస్తూ, “మాకు అడ్డంగా పడి మమ్మల్ని సింహాసనంపై కూర్చొన్న వానినుండి, ఆ గొఱ్ఱెపిల్ల కోపం నుండి కాపాడండి.
REV 6:17 ఆయన ఆగ్రహం చూపించే గొప్ప దినం వచ్చింది! దాన్ని ఎవరు ఎదుర్కోగలరు?” అని అన్నారు.
REV 7:1 ఇది జరిగిన తర్వాత భూమి నాలుగు మూలలా నలుగురు దేవదూతలు నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు భూమ్మీద, సముద్రం మీద, చెట్ల మీద, గాలివీయకుండా భూమి యొక్క నలుదిశలనుండి వీచే గాలిని పట్టుకొన్నారు.
REV 7:2 అతడు వారిని పిలిచాడు. ఈ నలుగురి దూతలకు భూమికి, సముద్రానికి హాని చేయగల శక్తి ఉంది. మరొక దూత తూర్పునుండి రావటం చూసాను. అతని దగ్గర చిరంజీవి అయిన దేవుని ముద్ర ఉంది.
REV 7:3 అతడు బిగ్గరగా ఆ నలుగురి దూతలతో, “దేవుని సేవకుల నొసళ్ళపై ముద్ర వేసే వరకు, భూమికి గాని, సముద్రానికి గాని, చెట్లకు గాని హాని కలిగించకండి” అని అన్నాడు.
REV 7:4 ఆ తర్వాత ముద్రలు వేయబడ్డవారి సంఖ్య నాకు వినబడింది. వాళ్ళ సంఖ్య మొత్తం ఒక లక్ష నలభై నాలుగు వేలు. వీళ్ళందరు ఇశ్రాయేలు జనాంగం, అన్ని గోత్రాలకు చెందిన వాళ్ళు.
REV 7:5 యూదా గోత్రం నుండి పన్నెండు వేలమందికి, రూబేను గోత్రం నుండి పన్నెండు వేలమందికి, గాదు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
REV 7:6 ఆషేరు గోత్రం నుండి పన్నెండు వేలమందికి, నఫ్తాలి గోత్రం నుండి పన్నెండు వేలమందికి, మనష్షే గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
REV 7:7 షిమ్యోను గోత్రం నుండి పన్నెండు వేలమందికి, లేవి గోత్రం నుండి పన్నెండు వేలమందికి, ఇశ్శాఖారు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
REV 7:8 జెబూలూను గోత్రం నుండి పన్నెండు వేలమందికి, యోసేపు గోత్రం నుండి పన్నెండు వేల మందికి, బెన్యామీను గోత్రం నుండి పన్నెండు వేలమందికి, ముద్ర వేయబడింది.
REV 7:9 దీని తర్వాత ఎవ్వరూ లెక్క వెయ్యలేని ఒక పెద్ద ప్రజల గుంపు నా ముందు కనిపించింది. వాళ్ళలో ప్రతి దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ప్రతి భాషకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెల్లటి దుస్తులు వేసుకొని, చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు, గొఱ్ఱెపిల్ల ముందు నిలబడి ఉండటం నాకు కనిపించింది.
REV 7:10 వాళ్ళందరు, “సింహాసనంపై కూర్చున్న మన దేవునికి, మన గొఱ్ఱెపిల్లకు, జయము!” అని బిగ్గరగా అన్నారు.
REV 7:11 సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ ఆ నాలుగు ప్రాణుల చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు సాష్టాంగపడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు.
REV 7:12 “ఆమేన్! మన దేవుణ్ణి స్తుతించుదాం! ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొందాం. ఆయనలో తేజస్సు, జ్ఞానము, గౌరవము, అధికారము, శక్తి చిరకాలం ఉండుగాక! ఆమేన్!”
REV 7:13 పెద్దల్లో ఒకడు నాతో, “తెల్లటి దుస్తులు వేసుకొన్న వాళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు.
REV 7:14 “అయ్యా! మీకే తెలియాలి!” అని నేను సమాధానం చెప్పాను. “అనేకమైన కష్టాలు అనుభవించిన వాళ్ళు వీళ్ళే. తమ దుస్తుల్ని గొఱ్ఱెపిల్ల రక్తంలో ఉతికి శుభ్రం చేసుకొన్నారు.
REV 7:15 అందువల్ల వాళ్ళు దేవుని సింహాసనం ముందున్నారు. రాత్రింబగళ్ళు ఆయన మందిరంలో ఉండి ఆయన సేవ చేస్తున్నారు. ఆ సింహాసనంపై కూర్చొన్న వాడు వాళ్ళందరిపై తన గుడారం కప్పుతాడు.
REV 7:16 వాళ్ళకిక మీదట ఆకలి కలుగదు. దాహం కలుగదు. సూర్యుడు తన ఎండతో వాళ్ళను మాడ్చడు. వాళ్ళకు ఏ వేడీ తగులదు.
REV 7:17 సింహాసనంపై కూర్చొన్న గొఱ్ఱెపిల్ల వాళ్ళ కాపరిగా ఉంటాడు. ఆయన సజీవమైన నీటి ఊటల దగ్గరకు వాళ్ళను పిలుచుకు వెళతాడు. దేవుడు వాళ్ళ కళ్ళనుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచి వేస్తాడు.”
REV 8:1 ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో అరగంటదాకా నిశ్శబ్దంగా ఉండెను.
REV 8:2 దేవుని ముందు నిలబడి ఉన్న ఆ ఏడుగురు దేవదూతల్ని చూసాను. వాళ్ళకు ఏడు బూరలు యివ్వబడ్డాయి.
REV 8:3 బంగారు ధూపార్తి పట్టుకొన్న మరొక దూత వచ్చి ధూప వేదిక ముందు నిలుచున్నాడు. సింహాసనం ముందున్న ధూప వేదికలో ధూపం వేయటానికి అతనికి ఎన్నో ధూపద్రవ్యాలు యివ్వబడ్డాయి. పవిత్రుల ప్రార్థనలతో ధూపం వేయబడింది.
REV 8:4 దూత వేసిన సుగంధ ధూపము, పవిత్రుల ప్రార్థనలతో పాటు దేవునికి అందింది.
REV 8:5 దూత ధూపార్తిని తీసుకొని ధూప వేదికలో ఉన్న నిప్పు అందులో ఉంచి దాన్ని భూమ్మీదకు విసిరివేసాడు. దాంతో ఉరుములు, పెద్దగర్జనలు, మెరుపులు, భూకంపాలు కలిగాయి.
REV 8:6 ఏడు బూరలు పట్టుకొన్న ఆ ఏడుగురు దూతలు ఆ బూరలు ఊదటానికి సిద్ధపడ్డారు.
REV 8:7 మొదటి దూత బూర ఊదాడు. వెంటనే రక్తంతో, నిప్పుతో కూడిన వడగండ్లు భూమ్మీదికి విసిరివేయబడ్డాయి. భూమిపైనున్న మూడవ భాగం కాలిపోయింది. మూడవ భాగం చెట్లు కూడా కాలిపోయాయి. పచ్చిగడ్డి పూర్తిగా కాలిపోయింది.
REV 8:8 రెండవ దూత బూర ఊదాడు. ఒక మండుతున్న పెద్ద పర్వతం లాంటిది సముద్రంలో పారవేయ బడింది. సముద్రంలో మూడవ భాగం రక్తంగా మారిపోయింది.
REV 8:9 సముద్రంలో ఉన్న ప్రాణులలో మూడవ భాగం చనిపోయాయి. మూడవ భాగం ఓడలు నాశనమయ్యాయి.
REV 8:10 మూడవ దేవదూత తన బూర ఊదాడు. ఒక పెద్ద నక్షత్రం దివిటీలా మండుతూ ఆకాశం నుండి వచ్చి నదుల మూడవ భాగం మీద, నీటి ఊటల మీద పడింది.
REV 8:11 ఆ నక్షత్రం పేరు మాచిపత్రి. దానివల్ల మూడవ భాగం నీళ్ళు చేదుగా మారిపోయాయి. చేదుగా మారిన ఆ నీటివల్ల చాలామంది మరణించారు.
REV 8:12 నాలుగవ దేవదూత బూర ఊదాడు. అప్పుడు సూర్యునిలో మూడవ భాగము, చంద్రునిలో మూడవ భాగము, నక్షత్రాలలో మూడవ భాగము నాశనమయ్యాయి. తద్వారా అవి చీకటిగా మారిపోయాయి. దాని మూలంగా దినంలో మూడవ భాగం, రాత్రిలో మూడవ భాగం చీకటితో నిండుకుపోయాయి.
REV 8:13 నేను ఇంకా చూస్తూనే ఉన్నాను. ఇంతలో గాలిలో ఎగురుతున్న ఒక పెద్ద పక్షి గొప్ప స్వరంతో, “భూమ్మీద జనులకు శ్రమ! శ్రమ! శ్రమ! ఎందుకనగా ఇంకా ముగ్గురు దేవదూతలు ఊదబోతున్నారు” అని కేకలు వేయటం విన్నాను.
REV 9:1 ఐదవ దేవదూత తన బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమ్మీద పడ్డ నక్షత్రాన్ని చూశాను. పాతాళం యొక్క తాళం చెవి ఈ నక్షత్రానికి యివ్వబడింది.
REV 9:2 అతడు పాతాళాన్ని తెరిచాడు. అప్పుడు దాన్నుండి పెద్ద పొగ లేచింది. అది ఒక పెద్ద కొలిమి నుండి వచ్చినట్లు అనిపించింది. పాతాళం నుండి వచ్చిన పొగవల్ల సూర్యుడు, ఆకాశం చీకటైపోయాయి.
REV 9:3 ఆ పొగనుండి మిడతలు భూమ్మీదికి వచ్చాయి. తేళ్ళవలె కుట్టే శక్తి ఆ మిడతలకివ్వబడింది.
REV 9:4 భూమ్మీద ఉండే గడ్డికి కాని, మొలకకు కాని, చెట్టుకు కాని హాని చేయవద్దని, నుదుటిమీద దేవుని ముద్రలేనివాళ్ళకు మాత్రమే హాని కలిగించమని ఆ మిడతలకు చెప్పబడింది.
REV 9:5 మనుష్యుల్ని ఐదు నెలల దాకా హింసించే శక్తి వాటికి యివ్వబడింది. వాళ్ళను చంపే శక్తి వాటికి యివ్వబడలేదు కాని అవి కుట్టినప్పుడు తేళ్ళు కుట్టినట్లు నొప్పి కలుగుతుంది.
REV 9:6 ఆ కాలంలో మనుష్యులు చావే మంచిదని చావును వెతుకుతారు. కాని వాళ్ళకది దొరకదు. వాళ్ళు చావాలని చాలా ఆశిస్తారు. కాని చావు వాళ్ళను తప్పించుకొని వెళ్ళిపోతుంది.
REV 9:7 ఆ మిడుతలు యుద్ధానికి సిద్ధం చేయబడిన గుఱ్ఱాలలా కనిపించాయి. వాటి తలలమీద బంగారు కిరీటాల్లాంటివి ఉన్నాయి. వాటి ముఖాలు మనుష్యుల ముఖాల్లా ఉన్నాయి.
REV 9:8 వాటి తలవెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి కోరలు సింహపు కోరల్లా ఉన్నాయి.
REV 9:9 అవి ఇనుప కవచాలు వేసుకొని ఉన్నాయి. వాటి రెక్కల ధ్వని గుఱ్ఱాలు, రథాలు యుద్ధానికి వెడుతున్నప్పుడు కలిగే ధ్వనిలా ఉంది.
REV 9:10 వాటి తోకలు తేళ్ళ తోకల్లా కొండ్లతో ఉన్నాయి. వాటి తోకల్లో ఐదు నెలల దాకా ప్రజల్ని హింసించే శక్తి ఉంది.
REV 9:11 పాతాళ లోకపు దూత వాటికి రాజుగా ఉన్నాడు. హీబ్రూ భాషలో వాని పేరు అబద్దోను. గ్రీకు భాషలో వాని పేరు అపొల్లుయోను.
REV 9:12 మొదటి శ్రమ సమాప్తమయింది. మిగతా రెండు శ్రమలు యింకా జరుగవలసి ఉన్నాయి.
REV 9:13 ఆరవ దేవదూత తన బూర ఊదాడు. దేవుని ముందున్న బంగారు ధూపవేదిక యొక్క నాలుగు కొనల నుండి నాకు ఒక స్వరం వినిపించింది.
REV 9:14 ఆ స్వరం బూర ఊదుతున్న ఆరవ దూతతో, “యూఫ్రటీసు మహానది దగ్గర బంధింపబడిన నలుగురి దూతల్ని విడుదల చేయి” అని అనింది.
REV 9:15 ఇదే గడియ, ఇదే రోజు, ఇదే నెల, ఇదే సంవత్సరము, విడుదల చేయటానికి వాళ్ళు యింతవరకు బంధింపబడ్డారు. మనుష్యులలో మూడవ భాగాన్ని హతమార్చటానికి వాళ్ళు విడుదల చేయబడ్డారు.
REV 9:16 ఆ రౌతుల సంఖ్య ఇరవై కోట్లు అన్నట్లు నేను విన్నాను.
REV 9:17 నాకు కనిపించిన రౌతులు, గుఱ్ఱాలు ఈ విధంగా ఉన్నాయి. రౌతుల కవచాలు అగ్నివలె ఎరుపు, ముదురు నీలం, గంధకాన్ని పోలిన పసుపు రంగుల్లో ఉన్నాయి. గుఱ్ఱాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. వాటి నోళ్ళనుండి మంటలు, పొగ, గంధకము బయటికి వచ్చాయి.
REV 9:18 వాటి నోళ్ళనుండి వచ్చిన ఈ మూడు పీడలు, అంటే మంటలు, పొగలు, గంధకాల వల్ల మనుష్యులలో మూడవ భాగం హతులై పోయారు.
REV 9:19 ఆ గుఱ్ఱాల శక్తి వాటి నోళ్ళల్లో, తోకల్లో ఉంది. వాటి తోకలు పాముల్లా ఉన్నాయి. ఆ తోకలకు పాము తలలు ఉన్నాయి. వాటిలో అవి కాటువేసి భాధిస్తాయి.
REV 9:20 ఈ మూడు పీడలు యింత నాశనం చేసినా, మరణించని మానవ జాతి తాము చేసిన పాపాలకు పశ్చాత్తాప పడలేదు. వాళ్ళు దయ్యాల్ని పూజించటం మానుకోలేదు. బంగారమూ, వెండి, కంచు, రాతి విగ్రహాలను, చెక్కతో చేసిన విగ్రహాలను పూజించటం వాళ్ళు మానుకోలేదు. ఈ విగ్రహాలు చూడకపోయినా, వినకపోయినా, కదలకపోయినా, వాటిని పూజించటం మానుకోలేదు.
REV 9:21 అంతేకాక, వాళ్ళు తాము చేసిన హత్యలకు, మంత్రతంత్రాలకు, లైంగిక అవినీతికి, దొంగతనాలకు మారుమనస్సు పొందలేదు.
REV 10:1 శక్తివంతుడైన మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి రావటం చూశాను. ఆయన మేఘాన్ని ఒక వస్త్రంగా ధరించి ఉన్నాడు. ఆయన తలపై మేఘధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యునిలా ఉంది. ఆయన కాళ్ళు మండుతున్న స్తంభాల్లా ఉన్నాయి.
REV 10:2 ఆయన చేతిలో ఒక చిన్న గ్రంథం ఉంది. అది తెరువబడి ఉంది. ఆయన తన కుడి కాలు సముద్రం మీద ఎడమకాలు భూమ్మీద ఉంచి బిగ్గరగా అరిచాడు.
REV 10:3 ఆ అరుపు సింహ ఘర్జనలా ఉంది. ఆయనలా అరచినప్పుడు ఏడు ఉరుములు మాట్లాడాయి.
REV 10:4 ఏడు ఉరుములు మాట్లాడిన వాటిని నేను వ్రాయటం మొదలుపెట్టాను. కాని పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఏడు ఉరుములు అన్న మాటల్ని దాచి ముద్ర వేయి, వాటిని వ్రాయవద్దు” అని అన్నది.
REV 10:5 సముద్రం మీద, భూమ్మీద నిలబడి ఉన్న దూత నేను చూస్తుండగా తన కుడి చేతిని పరలోకం వైపుకు చాపాడు.
REV 10:6 చిరకాలం జీవించే వాని మీద, పరలోకం అందులో ఉన్న వాటిని సృష్టించిన వాని మీద, భూమిని అందులో ఉన్న వాటన్నిటినీ సృష్టంచిన వాని మీద, సముద్రాన్ని అందులోవున్న వాటన్నిటినీ సృష్టించిన వాని మీద ప్రమాణం చేసి ఈ విధంగా అన్నాడు: “ఇక ఆలస్యం ఉండదు.
REV 10:7 కాని ఏడవ దూత తన బూర ఊదటం మొదలు పెట్టే రోజులు వచ్చినప్పుడు దేవుని రహస్య ప్రణాళిక సమాప్తమౌతుంది. దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ఈ రహస్యాన్ని ముందే చెప్పాడు.” అని అన్నాడు.
REV 10:8 నేను పరలోకం నుండి విన్న స్వరం మళ్ళీ నాతో, “వెళ్ళు. సముద్రం మీదా, భూమ్మీదా, నిలబడి ఉన్న దూత చేతిలో తెరువబడివున్న గ్రంథాన్ని తీసుకో!” అని అన్నది.
REV 10:9 అందువల్ల, నేను దేవదూత దగ్గరకు వెళ్ళి, ఆ చిన్న గ్రంథాన్నివ్వమని అడిగాను. ఆయన నాతో, “ఇది తీసుకొని తిను. అది నీ కడుపుకు చేదు కలిగిస్తుంది. కాని నీ నోటికి తేనెలా మధురంగా ఉంటుంది” అని అన్నాడు.
REV 10:10 నేనా చిన్న గ్రంథాన్ని, దూత చేతినుండి తీసుకొని తినివేసాను. అది నా నోటికి తేనెలా మధురంగా ఉండెను. కాని అది తిన్నాక నా కడుపుకు చేదుగానుండెను.
REV 10:11 ఆ తర్వాత ఆ దూత నాతో, “నీవు చాలా మంది ప్రజల్ని గురించి, దేశాల్ని గురించి, రాజుల్ని గురించి మళ్ళీ ప్రవచనం చెప్పాలి” అని అన్నాడు.
REV 11:1 ఒక దేవదూత ఒక కొలత బద్ద లాంటిది నాకిచ్చి ఈ విధంగా అన్నాడు: “వెళ్ళు, దేవుని మందిరాన్ని, బలిపీఠాన్ని కొలత వేయి. ఎంతమంది ప్రజలు ఆరాధిస్తున్నారో కూడ లెక్కపెట్టు.
REV 11:2 కాని వెలుపలి ఆవర్ణం, యూదులుకాని వాళ్ళకివ్వబడింది. కనుక దాన్ని కొలత వేయకుండా వదిలేయి. వాళ్ళు నలభైరెండు నెలలు దాకా ఈ పవిత్ర నగరాన్ని త్రొక్కుతూ నడుస్తారు.
REV 11:3 నేను నా యిరువురి సాక్షులకు శక్తినిస్తాను. వాళ్ళు గోనె పట్ట కట్టుకొని పన్నెండువందల అరువది దినాల దాకా దైవసందేశం చెబుతారు.”
REV 11:4 రెండు ఒలీవ వృక్షాలు, రెండు దీపస్తంభాలు ఆ సాక్షులు. ఇవి ఈ భూమిని పాలించే దేవుని సమక్షంలో ఉన్నాయి.
REV 11:5 వారికి హాని కలిగించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ నోళ్ళనుండి మంటలు వచ్చి, తమ శత్రువుల్ని మ్రింగివేస్తాయి. వారికి హాని తలపెట్టిన వాళ్ళు ఈ విధంగా మరణిస్తారు.
REV 11:6 తాము దేవుని సందేశం బోధించే కాలంలో వర్షం కురియకుండా చేయటానికి వాళ్ళు ఆకాశాన్ని మూసి వేస్తారు. వాళ్ళకా శక్తి ఉంది. అంతేకాక, నీళ్ళను రక్తంగా మార్చగల శక్తి కూడా వాళ్ళకు ఉంది. రకరకాల తెగుళ్ళను తమకు యిష్టం వచ్చినప్పుడు ప్రపంచంలో వ్యాపింప చేయగల శక్తి కూడా వాళ్ళకు ఉంది.
REV 11:7 వాళ్ళు తమ సందేశం చెప్పటం ముగించాక, మృగం పాతాళంనుండి మీదికి వచ్చి, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి చంపి వేస్తుంది.
REV 11:8 వాళ్ళ దేహాలు మహానగరపు వీధుల్లో పడి ఉంటాయి. ఈ మహానగరం సొదొమతో, ఈజిప్టుతో పోల్చబడింది. ఇక్కడ ప్రభువు సిలువకు వేయబడ్డాడు.
REV 11:9 మూడున్నర రోజులు ప్రతీ దేశానికి, ప్రతీ జాతికి, ప్రతీ భాషకు, ప్రతీ గుంపుకు చెందిన ప్రజలు, ఆ శవాలను చూస్తారు. వాళ్ళు వాటిని సమాధి చేయటానికి నిరాకరిస్తారు.
REV 11:10 ఈ యిరువురు ప్రవక్తలు భూమ్మీద నివసిస్తున్న వాళ్ళకు కష్టాలు కలిగించారు. కనుక ప్రజలు ఆ ప్రవక్తలు మరణించటం చూసి ఆనందించారు. పరస్పరం కానుకలు పంపుకున్నారు. వేడుకలు చేసుకొన్నారు.
REV 11:11 కాని మూడున్నర రోజుల తర్వాత దేవుడు ప్రవక్తల్లో మళ్ళీ ప్రాణం పోశాడు. వాళ్ళు లేచి నిలుచున్నారు. వీళ్ళను చూసిన ప్రజలు చాలా భయపడిపోయారు.
REV 11:12 అప్పుడు పరలోకంనుండి ఒక స్వరం బిగ్గరగా, ‘మీదికి రండి’ అని అనటం వాళ్ళు విన్నారు. శత్రువులు చూస్తుండగా, వాళ్ళు ఒక మేఘం మీద పరలోకానికి వెళ్ళిపోయారు.
REV 11:13 అదే క్షణంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. పట్టణంలో పదవ భాగం నాశనమైపోయింది. భూకంపంవల్ల సుమారు ఏడువేల మంది మరణించారు. బ్రతికున్న వాళ్ళు చాలా భయపడిపోయి పరలోకంలో ఉన్న దేవుణ్ణి స్తుతించారు.
REV 11:14 రెండవ శ్రమ ముగిసింది. మూడవ శ్రమ త్వరలో జరుగనుంది.
REV 11:15 ఏడవ దేవదూత తన బూర ఊదాడు. పరలోకం నుండి అనేక స్వరాలు యిలా బిగ్గరగా అనటం వినిపించింది: “ప్రపంచం మన ప్రభువు రాజ్యంగా మారింది. ఆయన క్రీస్తు రాజ్యంగా మారింది. ఆయన చిరకాలం రాజ్యం చేస్తాడు.”
REV 11:16 దేవుని సమక్షంలో సింహాసనాలపై కూర్చొన్న యిరువది నాలుగు మంది పెద్దలు సాష్టాంగపడ్డారు.
REV 11:17 వాళ్ళు దేవుణ్ణి పూజిస్తూ ఈ విధంగా అన్నారు: “ప్రభూ! సర్వశక్తివంతుడవైన దైవమా! నీవు ప్రస్తుతం ఉన్నావు. గతంలో ఉన్నావు. నీ గొప్పశక్తిని ఉపయోగించి మళ్ళీ పాలించటం మొదలుపెట్టావు. కనుక నీకు మా కృతజ్ఞతలు!
REV 11:18 దేశాలు ఆగ్రహం చెందాయి. ఇప్పుడు నీకు ఆగ్రహం వచ్చింది. చనిపోయిన వాళ్ళపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. నీ సేవకులైన ప్రవక్తలకు ప్రతిఫలం యిచ్చే సమయం వచ్చింది. నీ పవిత్రులకు, నీ నామాన్ని గౌరవించే వాళ్ళకు, సామాన్యులకు పెద్దలకు, అందరికి ప్రతిఫలం యిచ్చే కాలం వచ్చింది. భూమిని నాశనం చేసే వాళ్ళను నాశనం చేసే కాలం వచ్చింది.”
REV 11:19 అప్పుడు పరలోకంలో ఉన్న దేవుని మందిరం తెరువబడింది. ఆ మందిరంలో ఉన్న ఆయన పరిశుద్ధమైన ఒడంబడిక మందసం కనిపించింది. అప్పుడు మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపము, పెద్ద వడగండ్ల వాన వచ్చాయి.
REV 12:1 పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, చంద్రుణ్ణి తన పాదాల క్రింద, పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని తలపై పెట్టుకొన్న ఒక స్త్రీ కనిపించింది.
REV 12:2 ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటంవల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది.
REV 12:3 అప్పుడు పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. ఒక పెద్ద ఘటసర్పం, ఏడు తలలతో, పది కొమ్ములతో కనిపించింది. అది ఎర్రగా ఉంది. ఆ ఏడు తలలమీద ఏడు కిరీటాలు ఉన్నాయి.
REV 12:4 ఆ ఘటసర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాలలో మూడవభాగాన్ని ఊడ్చి, వాటిని భూమ్మీదికి పారవేసింది. ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఆ శిశువును మ్రింగి వేద్దామని, ఆ ఘటసర్పం ప్రసవించబోయే ఆ స్త్రీ ముందు నిలబడివుంది.
REV 12:5 ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ బాలుడు దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆ శిశువును ఎవరో ఎత్తుకొని దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళారు.
REV 12:6 ఆ స్త్రీ ఎడారి ప్రాంతానికి పారిపోయింది. ఆమెను పన్నెండువందల అరువది రోజుల దాకా జాగ్రత్తగా చూసుకోవటానికి దేవుడు ఒక స్థలం ఏర్పాటు చేశాడు.
REV 12:7 పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు, ఘటసర్పంతో యుద్ధం చేసారు. ఘటసర్పం తన దూతలతో తిరిగి యుద్ధం చేసింది.
REV 12:8 ఆ ఘటసర్పానికి తగినంత శక్తి ఉండనందువల్ల ఓడిపోయి పరలోకంలో వాటి స్థానాన్ని పోగొట్టుకొన్నాయి.
REV 12:9 వాళ్ళు ఆ ఘటసర్పాన్ని భూమ్మీదికి త్రోసి వేశారు. ఇది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఆది సర్పం. చాలాకాలం నుండి ఉన్న ఈ ఘటసర్పానికి దయ్యమని, సైతాను అని పేరు. ఆ ఘటసర్పాన్ని, దాని దూతల్ని వాళ్ళు క్రిందికి త్రోసివేశారు.
REV 12:10 పరలోకం నుండి ఒక పెద్ద స్వరం బిగ్గరగా యిలా అనటం విన్నాను: “మనదేవుని ముందు మన సోదరుల్ని రాత్రింబగళ్ళు నిందించే వాడు క్రిందికి త్రోసివేయబడ్డాడు. అందుకే మన దేవుని రాజ్యం వచ్చింది. రక్షణ శక్తి లభించింది. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది.
REV 12:11 గొఱ్ఱెపిల్ల రక్తంతో, తాము బోధించిన సత్యంతో మన సోదరులు వాణ్ణి ఓడించారు. వాళ్ళు తమ జీవితాల్ని, చావుకు భయపడేటంతగా ప్రేమించ లేదు.
REV 12:12 కనుక పరలోకమా! ఆనందించు. పరలోకంలో ఉన్న ప్రజలారా! ఆనందించండి. ప్రపంచమా! నీలో సైతాను ప్రవేశించాడు కనుక నీకు శాపం కలుగుతుంది! సముద్రమా! నీకు శాపం కలుగుతుంది! సైతానుకు తన కాలం తీరిందని తెలుసు. కనుక వాడు చాలా కోపంతో ఉన్నాడు.”
REV 12:13 ఘటసర్పం తాను భూమ్మీదకు విసిరివేయబడటం గమనించి మగ శిశువును ప్రసవించిన స్త్రీని వెంటాడింది.
REV 12:14 ఆమెకోసం ఎడారి ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన స్థలానికి ఆమె ఎగిరి పోవటానికి, దేవుడు ఆమెకు రెండు పక్షిరాజు రెక్కల్ని యిచ్చాడు. అక్కడ ఆ ఘటసర్పానికి దూరంగా ఆమె మూడున్నర సంవత్సరాలు జాగ్రత్తగా పోషించబడుతుంది.
REV 12:15 ఆ సర్పం తన నోటినుండి నీళ్ళను వదిలింది. ఆ నీళ్ళు ఒక నదిలా ప్రవహించాయి. ఆ నీళ్ళు ఆమెను కొట్టుకు పోయేటట్లు చేయాలని ఆ ఘటసర్పం ప్రయత్నించింది.
REV 12:16 కాని భూమి తన నోరు తెరిచి ఘటసర్పం కక్కిన నీటిని త్రాగి ఆ స్త్రీని రక్షించింది.
REV 12:17 ఆ స్త్రీని చూసి ఘటసర్పానికి చాలా కోపం వచ్చింది. అది ఆమె యొక్క మిగతా సంతానంతో యుద్ధం చేయాలని వెళ్ళింది. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ యేసును గురించి సాక్ష్యం చెప్పింది ఈమె మిగతా సంతానమే.
REV 12:18 వారితో యుద్ధం చేయుటకై ఆ ఘట సర్పం సముద్రతీరం దగ్గర నిలబడి ఉంది.
REV 13:1 సముద్రం నుండి ఒక మృగం రావటం నేను చూసాను. దానికి పది కొమ్ములు, ఏడు తలలు ఉన్నాయి. ఆ పది కొమ్ములమీద పది కిరీటాలు ఉన్నాయి. ప్రతి తలపై ఒక దేవదూషణ పేరు వ్రాయబడి ఉంది.
REV 13:2 నేను చూసిన ఆ మృగం ఒక చిరుత పులిలా ఉంది. కాని దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలా ఉన్నాయి. దాని నోరు సింహం నోరులా ఉంది. ఆ ఘటసర్పం ఆ మృగానికి తన శక్తిని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని యిచ్చింది.
REV 13:3 ఆ మృగానికి ఉన్న తలల్లో ఒక తలకు ప్రమాదకరమైన గాయం ఉన్నట్లు కనిపించింది. కాని ఆ ప్రమాదకరమైన గాయం మానిపోయింది. ప్రపంచమంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని అనుసరించింది.
REV 13:4 ఘటసర్పం ఆ మృగానికి అధికారమిచ్చినందువల్ల మానవులు ఆ ఘటసర్పాన్ని పూజించారు. వాళ్ళు మృగాన్ని కూడా పూజిస్తూ, “మృగం వలె ఎవరున్నారు? మృగంతో ఎవరు యుద్ధం చేయగలరు?” అని అన్నారు.
REV 13:5 గర్వంగా మాట్లాడటానికి, దైవదూషణ చేయటానికి, తన అధికారాన్ని నలుబది రెండు నెలలు చెలాయించడానికి ఆ మృగానికి నోరు యివ్వబడింది.
REV 13:6 ఆ మృగం తన నోరు తెరచి దేవుణ్ణి దూషించింది. ఆయన నామాన్ని, ఆయన నివసించే స్థానాన్ని, పరలోకంలో నివసించే వాళ్ళను దూషణ చేసింది.
REV 13:7 భక్తులతో యుద్ధం చేసి జయించటానికి దానికి శక్తి యివ్వబడింది. అంతేకాక, అన్ని జాతుల మీద, అన్ని గుంపుల మీద, అన్ని భాషల మీద, అన్ని దేశాల మీద ఆ మృగానికి అధికారమివ్వబడింది.
REV 13:8 ఈ భూమ్మీద నివసించే వాళ్ళంతా, అంటే ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి ఎవరి పేర్లు వధింపబడిన గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడలేదో, వాళ్ళు ఈ మృగాన్ని పూజిస్తారు.
REV 13:9 చెవులున్న వాళ్ళు వినండి:
REV 13:10 బంధింపబడవలసిన వాడు బంధింపబడతాడు. కత్తితో వధింపబడవలసిన వాడు వధింపబడతాడు. కనుక భక్తుల్లో శాంతము, విశ్వాసము ఉండాల్సి వస్తుంది.
REV 13:11 తదుపరి మరొక మృగం భూమిలోపలి నుండి రావటం చూసాను. ఆ మృగానికి గొఱ్ఱెకు ఉన్నట్లు రెండు కొమ్ములు ఉన్నాయి. కాని అది ఘటసర్పం మాట్లాడినట్లు మాట్లాడింది.
REV 13:12 అది ప్రమాదకరమైన గాయం నయమైన మొదటి మృగం పక్షాన, దాని అధికారమంతా ఉపయోగించి భూమిని, దానిపై నివసించే వాళ్ళను, మొదటి మృగాన్ని పూజించేటట్లు చేసింది.
REV 13:13 అది అద్భుతమైన సూచనలు చూపింది. ప్రజలు చూస్తుండగా ఆకాశం నుండి మంటల్ని కూడా భూమ్మీదికి రప్పించింది.
REV 13:14 మొదటి మృగం పక్షాన సూచనలు చూపటానికి దానికి అధికారమివ్వబడింది. ఈ అధికారంతో అది భూమ్మీద నివసించే వాళ్ళను మోసం చేస్తోంది. కత్తితో గాయపడి కూడా జీవించిన మృగానికి గౌరవార్థంగా ఒక విగ్రహాన్ని స్థాపించమని ప్రజల్ని ఆజ్ఞాపించింది.
REV 13:15 మొదటి మృగం యొక్క విగ్రహానికి ప్రాణం పోసే శక్తి యివ్వబడింది. ఆ విగ్రహం మాట్లాడి, తనను పూజించటానికి నిరాకరించిన వాళ్ళను చంపేటట్లు చేసింది.
REV 13:16 అంతేకాక చిన్నా, పెద్దా, ధనికుడూ, పేదవాడు, బానిస, స్వతంత్రుడు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కడూ తన కుడి చేతి మీదగాని, నుదుటిమీదగాని, ఒక ముద్ర వేసుకోవాలని నిర్భంధం చేసింది.
REV 13:17 ఈ ముద్ర లేకుండా ఎవ్వరూ అమ్మటం కాని, కొనటం కాని, చేయరాదని యిలా చేసింది. ఈ ముద్రలలో ఆ మృగం పేరు, లేక వాని పేరు సంఖ్య వ్రాయబడి ఉంది.
REV 13:18 ఇక్కడే తెలివి కావాలి. ఆ పరిజ్ఞానం ఉన్నవాడు ఆ మృగం యొక్క సంఖ్య ఏదో చెప్పనీ! ఎందుకంటే అది ఒక మనుష్యుని సంఖ్య. వాని సంఖ్య ఆరువందల అరువదియారు.
REV 14:1 అప్పుడు నేను చూశాను. నా ముందు ఆ గొఱ్ఱెపిల్ల కనబడినాడు. ఆయన సీయోను పర్వతంపై నిలబడి ఉన్నాడు. ఆయనతో ఒక లక్షా నలుబది నాలుగు వేల మంది ఉన్నారు. వాళ్ళ నొసళ్ళపై ఆయన పేరు, ఆయన తండ్రి పేరు వ్రాయబడి ఉంది.
REV 14:2 పరలోకం నుండి నాకొక శబ్దం వినిపించింది. ఆయన ధ్వని జలపాతపు ధ్వనిలా, పెద్ద ఉరుము ధ్వనిలా ఉంది. నేను విన్న ఆ ధ్వని వీణను మీటినప్పుడు కలిగే ధ్వనిలా ఉంది.
REV 14:3 వాళ్ళు సింహాసనం ముందు, ఆ నాలుగు ప్రాణుల ముందు, పెద్దల ముందు నిలబడి ఒక క్రొత్త పాట పాడారు. భూలోకం నుండి విమోచించబడ్డ ఒక లక్షా నలువది నాలుగు వేల మంది తప్ప యితరులు ఆ పాట నేర్చకోలేక పోయారు.
REV 14:4 వీళ్ళు స్త్రీ సంపర్కంతో మలినం కాకుండా పవిత్రంగా ఉన్నవాళ్ళు. వీళ్ళు గొఱ్ఱెపిల్ల ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని అనుసరించే వాళ్ళు. వీళ్ళు మానవులనుండి కొనుక్కోబడి ప్రథమ ఫలంగా దేవునికి, గొఱ్ఱెపిల్లకు ప్రత్యేకింపబడినవాళ్ళు.
REV 14:5 వీళ్ళ మాటల్లో అసత్యం లేదు. వీళ్ళు నిర్దోషులు.
REV 14:6 ఆ తర్వాత మరొక దూత మధ్యాకాశంలో ఎగరటం చూసాను. ప్రపంచంలో నివసించే ప్రజలందరికీ, అంటే ప్రతీ దేశానికి, ప్రతీ జాతికి, ప్రతీ భాషకు ప్రతీ గుంపుకు చెందిన ప్రజలకు ప్రకటించటానికి అతని దగ్గర “అనంత జీవితాన్ని” గురించిన సువార్త ఉంది.
REV 14:7 అతడు బిగ్గరగా, “దేవునికి భయపడండి. ఆయన మహిమను స్తుతించండి. ఆయన తీర్పు చెప్పే గడియ దగ్గరకు వచ్చింది. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీటి ఊటలను సృష్టించిన వాణ్ణి పూజించండి” అని అన్నాడు.
REV 14:8 రెండవ దూత మొదటి దూతను అనుసరిస్తూ, “బాబిలోను పతనమైపోయింది. బాబిలోను మహానగరం పతనమైపోయింది. ‘వ్యభిచారం’ అనబడే మధ్యాన్ని దేశాలకు త్రాగించింది ఇదే” అని అన్నాడు.
REV 14:9 మూడవ దూత మొదటి యిద్దరిని అనుసరిస్తూ బిగ్గరగా, “మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించి దాని ముద్రను నుదుటి మీద గాని, చేతిమీద కాని వేయించు కొన్నవాడు దేవుని కోపమనే మద్యాన్ని త్రాగక తప్పదు.
REV 14:10 ఈ మద్యం దేవుని ఆగ్రహం అనబడే గిన్నెలో పూర్తి ఘాటుతో చేయబడింది. అంతేకాక పరిశుద్ధమైన దూతల ముందు, గొఱ్ఱెపిల్ల ముందు మండుతున్న గంధకంతో వానిని హింసిస్తారు.
REV 14:11 వాళ్ళు కాలటంవల్ల రగులుతున్న పొగ చిరకాలం లేస్తూనే ఉంటుంది. మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించే వాళ్ళకు, లేక దాని పేరును ముద్రగా పొందిన వాళ్ళకు పగలు, రాత్రి విరామం ఉండదు” అని అన్నాడు.
REV 14:12 అంటే దేవుని ఆజ్ఞలను పాటించే పవిత్రులు యేసుపట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు సహనంగా ఉండాలి.
REV 14:13 ఆ తదుపరి పరలోకం నుండి ఒక స్వరం, “ఇది వ్రాయి. ఇప్పటి నుండి ప్రభువులో చనిపోయిన వాళ్ళు ధన్యులు” అని అన్నది. “అది నిజం. వాళ్ళకిక విశ్రాంతి ఉంటుంది. ఇది వరకు వాళ్ళు చేసిన మంచిపనులు వాళ్ళ వెంట ఉంటాయి” అని పరిశుద్ధాత్మ అన్నాడు.
REV 14:14 ఒక తెల్లటి మేఘం నా ముందు కనిపించింది. దానిమీద “మనుష్యకుమారుని” లాంటివాడు కూర్చొనివుండటం చూశాను. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది.
REV 14:15 ఆ తర్వాత మందిరం నుండి మరొక దూత వచ్చాడు. అతడు బిగ్గరగా మేఘం మీద కూర్చొన్నవాణ్ణి పిలిచి, “భూమ్మీద పంట పండింది. పంటను కోసే సమయం వచ్చింది. నీ కొడవలి తీసుకొని పంటను కోయి!” అని అన్నాడు.
REV 14:16 మేఘంమీద కూర్చొన్న వాడు తన కొడవలిని భూమ్మీదికి విసిరాడు. వెంటనే ఆ కొడవలి పంటను కోసింది.
REV 14:17 పరలోకంలో ఉన్న మందిరం నుండి యింకొక దూత వచ్చాడు. అతని దగ్గర కూడా ఒక పదునైన కొడవలి ఉంది.
REV 14:18 మరొక దూత బలిపీఠం నుండి వచ్చాడు. అగ్నికి అధికారియైన యితడు బిగ్గరగా పదునైన కొడవలి ఉన్నవాణ్ణి పిలుస్తూ, “ద్రాక్ష పండింది. నీ పదునైన కొడవలి తీసుకెళ్ళి భూమ్మీద వున్న ద్రాక్షా తోటనుండి ద్రాక్షాగుత్తుల్ని కోయి” అని అన్నాడు.
REV 14:19 ఆ దూత కొడవలిని భూమ్మీదికి విసిరి ద్రాక్షా పండ్లు కోసి వాటిని దేవుని కోపం అనబడే పెద్ద తొట్టిలో వేసాడు.
REV 14:20 ఊరికి అవతలవున్న ద్రాక్షా తొట్టిలో ద్రాక్షా పళ్ళను వేసి వాటిని త్రొక్కారు. దాన్నుండి రక్తం ప్రవహించింది. ఆ రక్తం గుఱ్ఱం నోటి కళ్ళెం అంత ఎత్తు లేచి, సుమారు రెండు వందల మైళ్ళ దూరందాకా ప్రవహించింది.
REV 15:1 నేను పరలోకంలో యింకొక అద్భుతమైన దృశ్యం చూశాను. ఏడుగురు దూతలు ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉండటం చూశాను. వీటితో దేవుని కోపం సమాప్తమౌతుంది. కనుక యివి చివరివి.
REV 15:2 నిప్పుతో కలిసిన గాజు సముద్రం లాంటి ఒక సముద్రం నాకు కనిపించింది. మృగాన్ని, దాని విగ్రహాన్ని జయించిన వాళ్ళు దాని నామానికున్న సంఖ్యను జయించిన వాళ్ళు సముద్రతీరం మీద నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు తమ చేతుల్లో దేవుడుంచిన వీణల్ని పట్టుకొని ఉన్నారు.
REV 15:3 దేవుని సేవకుడైన మోషే గీతాన్ని, గొఱ్ఱెపిల్ల గీతాన్ని వాళ్ళు ఈ విధంగా పాడుతూ ఉన్నారు: “ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన దైవమా! నీ కార్యాలు గొప్పవి. అద్భుతమైనవి. యుగయుగాలకు రాజువు నీవు. నీ మార్గాలు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.
REV 15:4 ఓ ప్రభూ! నీకెవరు భయపడరు? నీ నామాన్ని స్తుతించనివారెవరున్నారు? నీ వొక్కడివే పరిశుద్ధుడవు. నీ నీతికార్యాలు ప్రత్యక్షమైనవి. కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”
REV 15:5 దీని తర్వాత పరలోకంలో ఉన్న మందిరాన్ని చూసాను. అంటే సాక్ష్యపు గుడారము తెరుచుకోవటం చూసాను.
REV 15:6 ఆ మందిరం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళతో బయటకు వచ్చారు. వాళ్ళు తెల్లటి మెరిసే నార బట్టలు వేసుకొని ఉన్నారు. రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు.
REV 15:7 ఆ తర్వాత ఆ నాలుగు ప్రాణుల్లో ఒకటి ఆ ఏడుగురి దూతలకు, చిరంజీవి అయిన దేవుని ఆగ్రహంతో నిండిన ఏడు బంగారు పాత్రల్ని యిచ్చింది.
REV 15:8 ఆ మందిరమంతా దైవశక్తి వల్ల మరియు ఆయన తేజస్సు వల్ల కలిగిన పొగలతో నిండిపోయింది. ఏడుగురు దూతలు తెచ్చిన ఏడు తెగుళ్ళు పూర్తి అయ్యేవరకు ఆ మందిరంలో ఎవ్వరూ ప్రవేశించలేక పోయారు.
REV 16:1 మందిరం నుండి ఒక స్వరం బిగ్గరగా ఆ ఏడుగురు దూతలతో, “వెళ్ళండి, దేవుని కోపంతో నిండిపోయిన ఆ ఏడు పాత్రల్ని భూమ్మీద కుమ్మరించండి” అని నాకు వినిపించింది.
REV 16:2 మొదటి దూత వెళ్ళి తన పాత్రను భూమ్మీద కుమ్మరించాడు. మృగం ముద్రవున్న వాళ్ళ దేహాల మీద, మృగం విగ్రహాన్ని పూజించిన వాళ్ళ దేహాలమీద, బాధ కలిగించే వికారమైన కురుపులు లేచాయి.
REV 16:3 రెండవ దూత ెవెళ్ళి, తన పాత్రను సముద్రం మీద కుమ్మరించాడు. ఆ సముద్రం శవంలోని రక్తంలా మారిపోయింది. సముద్రంలో ఉన్న సమస్త జీవరాసులు మరణించాయి.
REV 16:4 మూడవ దూత తన పాత్రను నదులమీద, నీటి ఊటలమీద కుమ్మరించాడు. వాటి నీళ్ళు రక్తంగా మారాయి.
REV 16:5 నీటి మీద అధికారమున్న దూత ఈ విధంగా అనటం విన్నాను: “నీవు న్యాయంగా తీర్పు చెప్పావు. నీవు ప్రస్తుతం ఉన్నావు. గతంలో ఉండిన వాడవు. నీవు పవిత్రమైన వాడవు, ఎందుకంటే నీవు ఆ విధంగా తీర్పు తీర్చావు.
REV 16:6 వాళ్ళు నీ భక్తుల రక్తాన్ని, నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు. దానికి తగిన విధంగా నీవు వాళ్ళకు త్రాగటానికి రక్తాన్నిచ్చావు.”
REV 16:7 బలిపీఠం ఈ విధంగా సమాధానం చెప్పటం నేను విన్నాను: “ఔను ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన ఓ దైవమా! నీ తీర్పులు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.”
REV 16:8 నాల్గవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించాడు. ప్రజల్ని వేడితో మాడ్చివేయటానికి సూర్యునికి అధికారమివ్వబడింది.
REV 16:9 తీవ్రమైన వేడివల్ల ప్రజలు మాడిపోయారు. వాళ్ళు ఈ తెగుళ్ళ మీద అధికారమున్న దేవుని నామాన్ని దూషించారు. వాళ్ళు పశ్చాత్తాపం చెందటానికి నిరాకరించారు. ఆయన్ని స్తుతించటానికి నిరాకరించారు.
REV 16:10 ఐదవ దూత తన పాత్రను మృగం యొక్క సింహాసనం మీద క్రుమ్మరించాడు. వెంటనే వాని రాజ్యం చీకటిలో మునిగి పోయింది. ప్రజలు నొప్పితో తమ నాలుకలు కొరుక్కున్నారు.
REV 16:11 తమ బాధలకు, తమ కురుపులకు పరలోకంలోవున్న దేవుణ్ణి దూషించారు. కాని తాము చేసిన చెడ్డ పనులను మాని మారు మనస్సు పొందటానికి నిరాకరించారు.
REV 16:12 ఆరవ దూత, తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద క్రుమ్మరించాడు. తూర్పున ఉన్న రాజులకు మార్గం సిద్ధం కావాలని ఆ నది ఎండిపోయింది.
REV 16:13 ఆ తర్వాత కప్పల్లా కనిపించే అసహ్యకరమైన మూడు దయ్యాలు కనిపించాయి. అవి ఘటసర్పం నోటినుండి, మృగం నోటినుండి, దొంగ ప్రవక్త నోటినుండి బయటికి వచ్చాయి.
REV 16:14 అవి భూతాత్మలు. వాటికి మహాత్కార్యాలు చేసే శక్తి ఉంది. అవి సర్వశక్తి సంపన్నుడైన దేవుని “మహాదినం” నాడు జరిగే యుద్ధాని కోసం రాజుల్ని సిద్ధం చేయటానికి ప్రపంచంలోని రాజులందరి దగ్గరకి వెళ్తాయి.
REV 16:15 “జాగ్రత్త! నేను దొంగలా వస్తాను. తన దుస్తులు తన దగ్గర ఉంచుకొని, మేలుకొని ఉన్నవాడు ధన్యుడు. అలా చేయకపోతే అతడు నగ్నంగా వెళ్ళి తన నగ్నతకు అవమాన పడవలసి వస్తుంది.”
REV 16:16 ఆ భూతాత్మలు హీబ్రూ భాషలో “హర్‌మెగిద్దాను” అనే ప్రదేశంలో రాజుల్ని సమావేశ పరిచాయి.
REV 16:17 ఏడవ దూత తన పాత్రను గాలిలో క్రుమ్మరించాడు. మందిరంలో ఉన్న సింహాసనం మీదినుండి ఒక స్వరం బిగ్గరగా “సమాప్తం” అని అన్నది.
REV 16:18 వెంటనే మెరుపులు మెరిసాయి. ఉరుములు, గర్జనలు వినిపించాయి. తీవ్రమైన భూకంపం వచ్చింది. మానవుడు భూమ్మీద పుట్టిననాటి నుండి అటువంటి భూకంపం ఎన్నడూ జరుగలేదు. ఆ భూకంపం అంత తీవ్రంగా ఉంది.
REV 16:19 మహానగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లో ఉన్న పట్టణాలు కూలిపోయాయి. దేవుడు బాబిలోను మహానగరాన్ని శిక్షించటం మరచిపోలేదు. దాని పాత్రలో “తీవ్రమైన ఉగ్రత” అనబడే మద్యాన్ని పోసాడు.
REV 16:20 ద్వీపాలు, పర్వతాలు మాయమైపోయాయి.
REV 16:21 ఆకాశం నుండి పెద్ద వడగండ్లు వచ్చి ప్రజలమీద పడ్డాయి. అవి ఒక్కొక్కటి అయిదేసి మణుగుల బరువు ఉన్నాయి. ఈ వడగండ్ల వాన కలిగించినందుకు ప్రజలు దేవుణ్ణి దూషించారు. ఈ వడగండ్ల వల్ల ప్రజలకు చాలా బాధ కలిగింది.
REV 17:1 ఏడు పాత్రలున్న ఏడుగురి దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఈ విధంగా అన్నాడు: “అది పేరుగాంచిన వేశ్య. బహు జనముల మీద కూర్చున్న ఆ వేశ్యకు యివ్వబడే శిక్షను నీకు చూపిస్తాను. నా వెంట రా.
REV 17:2 దానితో భూపతులు వ్యభిచరించారు. ఈ భూమ్మీద నివసించే ప్రజలు అది అందించే వ్యభిచారమనే మద్యంతో మత్తెక్కిపోయారు.”
REV 17:3 ఆ తర్వాత ఆ దేవదూత నన్ను ఆత్మద్వారా ఒక ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఎర్రటి, ఊదా రంగులుగల మృగం మీద కూర్చొని ఉండటం చూసాను. ఆ మృగం మీద దూషణలు వ్రాయబడి ఉన్నాయి. ఆ మృగానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి.
REV 17:4 ఆ స్త్రీ ఊదా, ఎరుపు రంగుగల వస్త్రాల్ని కట్టుకొని ఉంది. బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన మెరిసే ఆభరణాలను వేసుకొని ఉంది. అది తన చేతిలో ఒక బంగారు పాత్రను పట్టుకొని ఉంది. ఆ పాత్ర అసహ్యమైన వాటితో, అది చేసిన వ్యభిచార కల్మషంతో నిండి వుంది.
REV 17:5 ఈ పేరు దాని నుదుటి మీద వ్రాయబడి ఉన్నది: బాబిలోను మహానగరం వేశ్యలకు తల్లి! ప్రపంచంలోని కల్మషాలకు తల్లి!
REV 17:6 ఆ స్త్రీ భక్తుల రక్తాన్ని త్రాగి, మత్తుగా ఉండటం చూసాను. ఆ రక్తం యేసును గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళది. నేనా స్త్రీని చూసి ఆశ్చర్యపడ్డాను.
REV 17:7 అప్పుడు ఆ దేవదూత నాతో ఈ విధంగా అన్నాడు: “నీవెందుకు అంత ఆశ్చర్యపడుతున్నావు? ఆ స్త్రీ యొక్క రహస్యం నీకు చెబుతాను. ఆమె స్వారీ చేసే ఏడుతలల, పది కొమ్ముల మృగాన్ని గురించి చెపుతాను.
REV 17:8 నీవు చూసిన మృగం ప్రస్తుతం లేదు. ఒకప్పుడు ఉండింది. పాతాళం నుండి లేచి వచ్చి అది నాశనమౌతుంది. ఆ మృగం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు లేదు. భవిష్యత్తులో వస్తుంది. కనుక ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఆ మృగాన్ని చూసి దిగ్ర్భాంతి చెందుతారు. సృష్టి మొదలైనప్పటి నుండి వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు.
REV 17:9 “దీన్ని అర్థం చేసుకోవటానికి బుద్ధి అవసరం.” ఆ ఏడుతలలు ఆ స్త్రీ కూర్చొన్న ఏడుకొండలు. ఆ ఏడు తలలు ఏడుగురు రాజులతో పోల్చబడ్డాయి.
REV 17:10 ఐదుగురు పడిపోయారు. ఒకడు ఉన్నాడు. ఇంకొకడు యింకా రాలేదు. అతడొచ్చాక కొద్దికాలం ఉంటాడు.
REV 17:11 ఒకప్పుడు ఉండి ప్రస్తుతము లేని మృగము ఎనిమిదవ రాజు. అతడు ఏడుగురిలో ఒకడు. అతడు కూడా నాశనమౌతాడు.
REV 17:12 “నీవు చూసిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వాళ్ళకు యింకా రాజ్యము లభించలేదు. కాని వాళ్ళకు రాజులకున్న అధికారము, మృగంతో పాటు ఒక గంట సమయం మాత్రమే లభిస్తుంది.
REV 17:13 వాళ్ళందరి ఉద్దేశ్యం ఒకటి. దాని కోసం తమ శక్తిని, అధికారాన్ని ఆ మృగానికిచ్చారు.
REV 17:14 వాళ్ళు గొఱ్ఱెపిల్లతో యుద్ధం చేస్తారు. కాని గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు. కనుక విజయం పొందుతాడు. ఆయన వెంట ఆయన పిలిచిన వాళ్ళు, ఆయన ఎన్నుకొన్నవాళ్ళు, ఆయన్ని విశ్వసించే వాళ్ళు ఉంటారు.”
REV 17:15 ఆ తర్వాత దూత నాతో ఈ విధంగా అన్నాడు: “నీవు ఆ వేశ్య కూర్చున్న నీళ్ళను చూసావు. ఆ నీళ్ళు ప్రజల గుంపుల్ని, జాతుల్ని, దేశాలను, భాషలను సూచిస్తోంది.
REV 17:16 నీవు చూసిన మృగము, దాని పది కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమె దగ్గర ఉన్నవన్నీ తీసుకొని ఆమెను నగ్నంగా వదిలేస్తాయి. ఆమె దేహాన్ని తిని, ఆమెను మంటల్లో కాల్చివేస్తాయి.
REV 17:17 దేవుడు తన ఉద్దేశ్యం నెరవేర్చుమని వాటి హృదయాలకు చెప్పాడు. కనుక ఆ పది కొమ్ములు తమ రాజ్యాన్ని దేవుడు చెప్పిన మాట నెరవేరే వరకు ఆ మృగానికి యివ్వటానికి అంగీకరించాయి.
REV 17:18 నీవు చూసిన ఆ స్త్రీ భూలోకంలోని రాజులను పాలించే మహానగరం.”
REV 18:1 ఇది జరిగిన తర్వాత పరలోకం నుండి మరొక దూత దిగి రావటం చూసాను. అతని తేజస్సు భూమిని ప్రకాశింప చేసింది.
REV 18:2 అతడు బిగ్గరగా యిలా అన్నాడు: “బాబిలోను మహానగరం కూలిపోయింది, కూలిపోయింది. అది అక్కడ దయ్యాలకు నివాసమైంది. ప్రతి దురాత్మకు అది తిరుగులాడు స్థలమైంది. ప్రతి ఏవగింపు కలిగించే అపవిత్రమైన పక్షికి అది సంచరించు స్థలమైంది.
REV 18:3 దేశాలన్నీ దాని వ్యభిచారమనే మద్యాన్ని త్రాగాయి. దేవుని ఆగ్రహమనే మద్యాన్ని త్రాగి మత్తెక్కి పోయాయి. భూరాజులు దాంతో వ్యభిచరించారు. ప్రపంచంలోని వర్తకులు, దాని మితి మీరిన విలాసాలతో ధనవంతులయ్యారు.”
REV 18:4 ఆ తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఈ విధంగా అనటం విన్నాను: “నా ప్రజలారా! దానిలో నుండి బయటకు రండి. ఎందుకంటే దాని పాపాల్లో మీరు పాలుపంచుకోరు. అప్పుడు దానికున్న తెగుళ్ళు మీకు రావు.
REV 18:5 దాని పాపాలు ఆకాశం అంత ఎత్తుగా పేరుకుపోయాయి. దేవునికి దాని నేరాలు జ్ఞాపకం ఉన్నాయి.
REV 18:6 అది యిచ్చింది తిరిగి దానికే యివ్వండి. అది చేసిన దానికి రెండింతలు దానికి చెల్లించండి. దాని పాత్రలో రెండింతలు ఘాటుగా ఉన్న మద్యాన్ని పొయ్యండి.
REV 18:7 ఆ పట్టణం అనుభవించిన పేరు ప్రతిష్టలకు సమానంగా అది అనుభవించిన సుఖాలకు సమానంగా దానికి దుఃఖాలు కలిగించి హింసించండి. అది తన మనస్సులో, ‘నేను రాణిలా సింహాసనంపై కూర్చుంటాను. నేను ఎన్నటికీ వితంతువును కాను. నేను ఎన్నటికీ దుఃఖించను’ అని తనలో గర్విస్తుంది.
REV 18:8 అందువల్ల చావు, దుఃఖము, కరువు, తెగులు ఒకేరోజు వచ్చి దాన్ని బాధిస్తాయి. దానిపై తీర్పు చెప్పే మన ప్రభువైన దేవుడు శక్తివంతుడు కనుక దాన్ని మంటల్లో కాల్చి వేస్తాడు.
REV 18:9 “దానితో వ్యభిచరించి సుఖాలనుభవించిన భూరాజులు అది మండుతున్నప్పుడు వచ్చిన పొగలు చూసి దానికోసం గుండెలు బాదుకొని దుఃఖిస్తారు.
REV 18:10 దానికి జరుగుతున్న హింసను చూసి భయపడి దూరంగా నిలబడి, ‘అయ్యో! అయ్యో! మహానగరమా! శక్తివంతమైన బాబిలోను నగరమా! ఒకే ఒక గంటలో నీకు నాశనం వచ్చింది’ అని విలపిస్తారు.
REV 18:11 “ప్రపంచంలోని వర్తకులు తమ వస్తువులు యిక మీదట కొనేవారు ఎవ్వరూ ఉండరు కనుక తమ నష్టానికి దానిమీద విలపిస్తారు.
REV 18:12 వీళ్ళు బంగారు, వెండి వస్తువులు, రత్నాలు, ముత్యాలు, సున్నితమైన నార బట్టలు, ఊదారంగు వస్త్రాలు, పట్టు వస్త్రలు, ఎర్రటి రంగుగల వస్త్రాలు, దబ్బచెట్ల పలకలు, దంతంతో, మంచి చెక్కతో, కంచుతో, ఇనుముతో, చలువరాతితో చేసిన అన్ని రకాల వస్తువులు,
REV 18:13 దాల్చిన చెక్క, ఓమము, అగరుబత్తులు, మంచి అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, ఒలీవ నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు, గుర్రాలు, బండ్లు, బానిసలు, మనుష్యుల శరీరాలు, ప్రాణాలు అమ్మేవాళ్ళు.
REV 18:14 వాళ్ళు, ‘నీవు కోరిన ఫలము దొరకలేదు. నీ ఐశ్వర్యము, నీ భోగము నశించిపొయ్యాయి. అవి మళ్ళీ రావు’ అని అన్నారు.
REV 18:15 “వస్తువులు అమ్మి ధనం గడించిన వర్తకులు ఆమె అనుభవిస్తున్న హింసను చూసి భయపడి దూరంగా నిలుచుంటారు. వాళ్ళు దుఃఖంతో విలపిస్తారు.
REV 18:16 వాళ్ళు, ‘అయ్యో! అయ్యో! సున్నితమైన వస్త్రాల్ని, ఊదారంగు వస్త్రాల్ని, ఎర్రటి రంగు వస్త్రాల్ని ధరించిన మహానగరమా! బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన నగలు ధరించిన మహానగరమా!
REV 18:17 ఒకే ఒక గంటలో నీ ఐశ్వర్యమంతా నశించిపోయిందే!’ అని విలపిస్తారు. “ప్రతి నావికాధికారుడు, ఓడలో ప్రయాణం చేసే ప్రతి యాత్రికుడు, నావికులు, సముద్రం ద్వారా తమ జీతం గడించి జీవించే వాళ్ళు అందరూ దూరంగా నిలబడి ఉన్నారు.
REV 18:18 ఆ పట్టణం కాలుతున్నప్పుడు వచ్చే పొగలను చూసి వాళ్ళు ఆశ్చర్యంతో, ‘ఈ మహానగరమంత గొప్పగా ఏ పట్టణమైనా ఉందా?’ అని అంటారు.
REV 18:19 వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ, దుమ్మును నెత్తిన వేసుకొంటూ, ‘అయ్యో! అయ్యో! మహానగరమా! సముద్రంలో ఓడ ఉన్న ప్రతి ఒక్కడూ దాని ధనంవల్ల ధనికులయ్యారే! ఒకే ఒక గంటలో ఆమె నాశనమయ్యిందే! అని ఏడుస్తారు.
REV 18:20 పరలోకమా! దాని పతనానికి ఆనందించు! విశ్వాసులారా! అపొస్తలులారా! ప్రవక్తలారా! ఆనందించండి. అది మీతో ప్రవర్తించిన విధానానికి దేవుడు దానికి తగిన శిక్ష విధించాడు’” అని అంటారు.
REV 18:21 అప్పుడు ఒక శక్తివంతుడైన దూత తిరుగటిరాయి వంటి పెద్దరాయిని ఎత్తి సముద్రంలో పారవేసి ఈ విధంగా అన్నాడు: “గొప్ప శక్తితో బాబిలోను మహానగరం క్రిందికి పారవేయబడుతుంది. అది మళ్ళీ కనిపించదు.
REV 18:22 వీణను వాయించే వాళ్ళ సంగీతం, యితర వాయిద్యాలు వాయించే వాళ్ళ సంగీతం, పిల్లనగ్రోవి ఊదేవాళ్ళ సంగీతం, బూర ఊదేవాళ్ళ సంగీతం, నీలో మళ్ళీ వినిపించదు. పని చేయగలవాడు నీలో మళ్ళీ కనిపించడు. తిరుగటి రాయి శబ్దం మళ్ళీ నీలో వినిపించదు.
REV 18:23 దీపపు కాంతి నీలో మళ్ళీ ప్రకాశించదు. కొత్త దంపతుల మాటలు నీలో మళ్ళీ వినిపించవు. నీ వర్తకులు ప్రపంచంలో గొప్పగా ఉన్నారు. నీ ఇంద్రజాలంతో దేశాలు తప్పుదారి పట్టాయి.
REV 18:24 ఆ పట్టణంలో ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం కనిపించింది. ప్రపంచంలో వధింపబడిన వాళ్ళందరి రక్తం, ఆ పట్టణంలో కనిపించింది.”
REV 19:1 ఇది జరిగిన తర్వాత పరలోకంలో ఒక పెద్ద ప్రజాసమూహం మాట్లాడుతున్నట్లు నాకు ఒక స్వరం వినిపించి యిలా అన్నది: “దేవుణ్ణి స్తుతించండి! రక్షణ, మహిమ, అధికారం మన దేవునిదే.
REV 19:2 ఆయన నీతిమంతుడు కనుక న్యాయంగా సత్యంగా తీర్పు చెబుతాడు. తన వ్యభిచారంతో ప్రపంచాన్ని పాడు చేసిన ఆ వేశ్యను ఆయన శిక్షించాడు. తన సేవకుల రక్తానికి దానిపై కక్ష తీర్చుకొన్నాడు.”
REV 19:3 వాళ్ళందరు మళ్ళీ, ఇలా అన్నారు: “దేవుణ్ణి స్తుతించండి! కాలిన ఆ మహానగరం నుండి పొగ ఆగకుండా మీదికి వెళ్తుంటుంది.”
REV 19:4 ఆ యిరవై నాలుగు మంది పెద్దలు సాష్టాంగ పడి సింహాసనంపై కూర్చొన్న దేవుణ్ణి ఆరాధించారు. అదే విధంగా ఆ నాలుగు ప్రాణులు కూడా ఆరాధించాయి. వాళ్ళు ఇలా అన్నారు: “ఆమేన్! దేవుణ్ణి స్తుతించండి!”
REV 19:5 అప్పుడు సింహాసనం నుండి ఒక స్వరం యిలా అన్నది: “ఆయన సేవకులైన మీరంతా, చిన్నా, పెద్దా అనే బేధం లేకుండా మన దేవుణ్ణి స్తుతించండి. ఆయనకు భయపడే మీరంతా మన దేవుణ్ణి స్తుతించండి.”
REV 19:6 ఆ తర్వాత నాకు ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వని పెద్ద ప్రజాసమూహం చేసిన ధ్వనిలా జలపాతం చేసే ధ్వనిలా పెద్ద ఉరుముల ధ్వనిలా ఉంది. వాళ్ళు, యిలా అన్నారు: “దేవుణ్ణి స్తుతించండి. సర్వశక్తిసంపన్నుడు, మన ప్రభువు అయిన దేవుడు మనల్ని పాలిస్తున్నాడు.
REV 19:7 మనం ఆనందించుదాం. సంతోషంతో ఆయన్ని ఘనపర్చుదాం. గొఱ్ఱెపిల్ల వివాహం కానున్నది. ఆయన పెళ్ళి కూతురు తనకు తానే సిద్ధం అయింది.
REV 19:8 సున్నితమైన నార బట్టలు ఆమె ధరించటానికి యివ్వబడ్డాయి. అవి స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి.” (సున్నితమైన నారబట్టలు పవిత్రులు చేసిన నీతి పనులను సూచిస్తున్నాయి.)
REV 19:9 ఆ తదుపరి దూత నాతో, “ఇది వ్రాయి. గొఱ్ఱెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానింపబడ్డ వాళ్ళు ధన్యులు.” అతడు యింకా ఇలా అన్నాడు, “ఇవి నిజంగా దేవుని మాటలు.”
REV 19:10 ఇది విన్నాక అతన్ని ఆరాధించాలని నేను అతని కాళ్ళ మీద పడ్డాను. కాని అతడు నాతో, “అలా చేయవద్దు. నేను నీ తోటి సేవకుణ్ణి. యేసు చెప్పిన దాన్ని అనుసరించే సోదరుల సహచరుణ్ణి. దేవుణ్ణి ఆరాధించు. యేసు చెప్పిన విషయాలనే ప్రవక్తలు కూడా చెప్పారు” అని అన్నాడు.
REV 19:11 నేను తెరుచుకొని ఉన్న పరలోకాన్ని చూసాను. నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు నమ్మకమైన వాడని, సత్యవంతుడని పేరున్న వాడు. అతడు నీతిగా తీర్పు చెబుతాడు. న్యాయంగా యుద్ధం చేస్తాడు.
REV 19:12 ఆయన కళ్ళు నిప్పులా మండుతూ ఉన్నాయి. ఆయన తలమీద ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు వ్రాయబడి ఉంది. ఆయనకు తప్ప మరెవ్వరికీ ఆ పేరు తెలియదు.
REV 19:13 ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఆయన పేరు దేవుని వాక్యం.
REV 19:14 తెల్లగా పరిశుద్ధంగా ఉన్న సున్నితమైన దుస్తులు వేసుకొని పరలోకంలో ఉన్న సైనికులు తెల్లటి గుర్రాలపై స్వారీ చేస్తూ ఆయన్ని అనుసరించారు.
REV 19:15 దేశాలను ఓడించటానికి ఆయన నోటినుండి పదునైన కత్తి బయటకు వచ్చింది. ఆయన దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడైన దేవుని ఆగ్రహమనబడే ద్రాక్షా గానుగను త్రొక్కుతాడు. ఆ ఆగ్రహం తీవ్రమైనది.
REV 19:16 ఆయన వస్త్రంమీద, ఆయన తొడమీద: రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని వ్రాయబడి ఉంది.
REV 19:17 ఒక దూత సూర్యునిలో నిలబడి ఉండటం చూసాను. అతడు బిగ్గరగా గాలిలో ఎగురుతున్న పక్షులతో, “దేవుని గొప్ప విందుకొరకు అందరూ సమావేశం కండి.
REV 19:18 మీరు వస్తే రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, వీరుల మాంసం, గుఱ్ఱాల మాంసం, రౌతుల మాంసం, ప్రజల మాంసం, బానిసలుకాని వాళ్ళ మాంసం, బానిసల మాంసం, ముఖ్యమైన వాళ్ళ మాంసం, తినటానికి లభిస్తుంది” అని అన్నాడు.
REV 19:19 ఆ తదుపరి మృగము మరియు భూపాలకులు, వాళ్ళ సైన్యాలు, అంతా కలిసి గుఱ్ఱంపై స్వారీ చేస్తున్న వానితో, ఆయన సైన్యంతో యుద్ధం చేయటానికి సిద్ధం అయ్యారు.
REV 19:20 కాని ఆ మృగము బంధింపబడింది. ఆ మృగం పక్షాన మహత్వపూర్వకమైన సూచనలు చూపిన దొంగ ప్రవక్త కూడా బంధింపబడ్డాడు. వాడు ఈ సూచనలతో మృగం యొక్క ముద్రను పొందిన వాళ్ళను, ఆ మృగాన్ని ఆరాధించిన వాళ్ళను మోసం చేస్తూపోయాడు. వీళ్ళందరిని గంధకంతో మండుతున్న భయానకమైన గుండంలో ఆ గుఱ్ఱంపై స్వారీ చేస్తున్న వాడు సజీవంగా పడవేసాడు.
REV 19:21 గుఱ్ఱపు రౌతు నోటినుండి వచ్చిన కత్తితో మిగతా వాళ్ళు చంపబడ్డారు. పక్షులు వచ్చి వీళ్ళ దేహాలను కడుపు నిండా తిన్నాయి.
REV 20:1 పరలోకంలో నుండి ఒక దూత దిగి రావటం చూసాను. అతని దగ్గర పాతాళలోకపు తాళం చెవి ఉంది. అతని చేతిలో ఒక పెద్ద గొలుసు ఉంది.
REV 20:2 అతడు ఘటసర్పాన్ని పట్టుకొని వెయ్యి ఏండ్లదాకా బంధించి వేసాడు. దీన్ని ఆది సర్పమని, దయ్యమని, సైతానని అంటారు.
REV 20:3 అతడు దాన్ని పాతాళలోకంలో పడవేసి, తాళం వేసి, దాని మీద ముద్ర వేసాడు. వెయ్యి ఏండ్లు ముగిసేదాకా, అది దేశాలను మళ్ళీ మోసం చెయ్యకుండా ఉండాలని ఈ విధంగా చేసాడు. ఆ తర్వాత కొద్ది సమయం దానికి విడుదల ఇవ్వబడుతుంది.
REV 20:4 నేను సింహాసనాలు చూసాను. తీర్పు చెప్పటానికి అధికారం పొందినవారు ఆ సింహాసనాలపై కూర్చొని ఉన్నారు. యేసు చెప్పిన సందేశాన్ని నమ్మకంగా బోధించినందుకు దేవుని సందేశాన్ని ప్రకటించినందుకు తలలు కొట్టివేయబడినవాళ్ళ ఆత్మల్ని చూసాను. వీళ్ళు మృగాన్నిగాని, దాని విగ్రహాన్ని దాని ఆరాధించ లేదు. వాళ్ళు దాని ముద్రను వాళ్ళ నొసళ్ళ మీదగాని, చేతుల మీదగాని వేయించుకోలేదు. వాళ్ళు మళ్ళీ బ్రతికి క్రీస్తుతో పాటు వెయ్యి ఏండ్లు పాలించారు.
REV 20:5 మిగతా చనిపోయిన వాళ్ళు వెయ్యి ఏండ్లు పూర్తి అయ్యేదాకా బ్రతికి రాలేదు. ఈ విధంగా చనిపోయి బ్రతికి రావటం యిది మొదటిసారి.
REV 20:6 మొదటిసారి బ్రతికి వచ్చినవాళ్ళ గుంపుకు చెందిన వాళ్ళు ధన్యులు. పరిశుద్ధమైన వాళ్ళు. ఇక రెండవ మరణానికి వాళ్ళపై అధికారము ఉండదు. వాళ్ళు దేవునికి, క్రీస్తుకు యాజకులుగా ఉండి క్రీస్తుతో సహా వెయ్యి ఏండ్లు రాజ్యం చేస్తారు.
REV 20:7 వెయ్యి ఏండ్లు గడిచాక సైతాను కారాగారం నుండి విడుదల చేయబడతాడు.
REV 20:8 వాడు బయటకు వచ్చి దేశాలను మోసం చేస్తాడు. వాడు ప్రపంచం నలుమూలలకు, అంటే గోగు, మాగోగులకు వెళ్ళి యుద్ధం చేయటానికి ప్రజల్ని సమకూరుస్తాడు. సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువుల సంఖ్యతో సమానంగా వాళ్ళ సంఖ్య ఊంటుంది.
REV 20:9 వాళ్ళు భూమి నలుమూలలకు వెళ్ళి భక్తుల శిబిరాలను ఆక్రమించారు. దేవుడు ప్రేమించే పట్టణాన్ని చుట్టుముట్టారు. కాని పరలోకంలో నుండి అగ్ని కురిసి వాళ్ళను నాశనం చేసింది.
REV 20:10 ఇక వాళ్ళను మోసం చేసిన సైతాను మండుతున్న గంధకపు గుండంలో పారవేయబడ్డాడు. దానిలో క్రూర మృగం, దొంగ ప్రవక్త యింతకు ముందే పడవేయబడ్డారు. గుండంలోనే వాళ్ళు రాత్రింబగళ్ళు నిరంతరం హింసింపబడతారు.
REV 20:11 తర్వాత నాకు ఒక పెద్ద సింహాసనము కనిపించింది. అది తెల్లగా ఉంది. దానిపై కూర్చొన్నవాణ్ణి చూసాను. భూమి, ఆకాశం ఆయన నుండి పారిపొయ్యాయి. వాటికి స్థలం దొరకలేదు. అవి అదృశ్యమయ్యాయి.
REV 20:12 నేను చనిపోయిన వాళ్ళను చూసాను. అందులో గొప్పవాళ్ళు, కొద్దివాళ్ళు ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు నిలబడి ఉన్నారు. అప్పుడు గ్రంథాలు తెరువబడ్డాయి. మరొక గ్రంథంకూడా తెరువబడింది. అది జీవగ్రంథం. చనిపోయిన వాళ్ళపై తీర్పు చెప్పబడింది. వాళ్ళు చేసినవి ఆ గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. వాటి ప్రకారం వాళ్ళ మీద తీర్పు చెప్పబడింది.
REV 20:13 సముద్రం తనలో చనిపోయిన వాళ్ళను విడుదల చేసింది. మృత్యువు తన మృత్యులోకంలో ఉన్నవాళ్ళను విడుదల చేసింది. వాళ్ళు చేసిన వాటిని బట్టి తీర్పు చెప్పబడింది.
REV 20:14 ఆ తర్వాత మృత్యువు, మృత్యులోకము, మంటలు ఉన్న గుండంలో పారవేయబడ్డాయి. మంటల గుండం రెండవ మరణం.
REV 20:15 జీవ గ్రంథంలో పేరులేని వాడు మంటల గుండంలో పారవేయబడ్డాడు.
REV 21:1 ఆ తర్వాత నేను ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూసాను. మొదటి ఆకాశం, మొదటి భూమి అదృశ్యమయ్యాయి. ఇప్పుడు సముద్రము లేదు.
REV 21:2 నేను పరిశుద్ధ పట్టణమైన క్రొత్త యెరూషలేము పరలోకం నుండి దిగిరావటం చూసాను. అది దేవుని నుండి, పెళ్ళి కుమారుని కోసం పెళ్ళికూతురిలా అలంకరించుకొని దిగి వచ్చింది.
REV 21:3 సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక నుండి దేవుడు మానవులతో ఉంటాడు. వాళ్ళతో నివసిస్తాడు. వాళ్ళు ఆయన ప్రజలు; ఆయన వాళ్ళ దేవుడై వాళ్ళతో స్వయంగా ఉంటాడు.
REV 21:4 వాళ్ళ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు. పాత సంగతులు గతించిపోయాయి. కనుక యిక మీదట చావుండదు. దుఃఖం ఉండదు. విలాపం ఉండదు, బాధ వుండదు.” అని అన్నది.
REV 21:5 సింహాసనంపై కూర్చొన్నవాడు, “నేను ప్రతి వస్తువును క్రొత్తగా చేస్తాను” అని అన్నాడు. “ఇవి విశ్వసింప దగినవి, సత్యం, కనుక యివి వ్రాయి” అని అన్నాడు.
REV 21:6 ఆయన నాతో, “అంతా సమాప్తమైంది. అల్ఫా, (ఆదిని) ఓమెగా (అంతాన్ని) నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. దాహంతోవున్న వానికి ఊటనుండి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాను.
REV 21:7 జయించినవాడు వీటన్నిటికీ వారసుడౌతాడు. నేను అతనికి దేవునిగా, అతడు నాకు కుమారునిగా ఉంటాము.
REV 21:8 కాని, పిరికి వాళ్ళు, విశ్వాసం లేనివాళ్ళు, నీచులు, హంతకులు, అవినీతిపరులు, ఇంద్రజాలకులు, విగ్రహారాధకులు, అసత్యాలాడే వాళ్ళు మండే గంధకమున్న భయానకమైన గుండంలో ఉంటారు. యిది రెండవ మరణం” అని అన్నాడు.
REV 21:9 ఏడు పాత్రలతో ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉన్నవారిలో ఒక దూతవచ్చి నాతో, “పెళ్ళికూతుర్ని, అంటే గొఱ్ఱెపిల్ల భార్యను చూపిస్తాను రా!” అని అన్నాడు.
REV 21:10 అతడు నన్ను ఆత్మ ద్వారా ఎత్తుగా ఉన్న గొప్ప పర్వతం మీదికి తీసుకు వెళ్ళాడు. పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుండి దిగివస్తున్న పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును చూపించాడు.
REV 21:11 అది దేవుని మహిమతో వెలుగుతూ ఉంది. దాని మహిమ అమూల్యమైన ఆభరణంగా, అంటే సూర్య కాంతమణిలా ఉంది. అది స్పటికంలా స్వచ్ఛంగా ఉంది.
REV 21:12 దాని చుట్టూ ఎత్తైన ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి పన్నెండు ద్వారాలు ఉన్నాయి. పన్నెండుమంది దేవదూతలు ఆ ద్వారాల యొద్ద ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాయబడ్డాయి.
REV 21:13 తూర్పు వైపు మూడు ద్వారాలు, ఉత్తరం వైపు మూడు ద్వారాలు, దక్షిణం వైపు మూడు ద్వారాలు, పడమర వైపు మూడు ద్వారాలు ఉన్నాయి.
REV 21:14 ఆ నగర ప్రాకారానికి పన్నెండు పునాదులున్నాయి. వాటి మీద గొఱ్ఱెపిల్ల యొక్క పన్నెండుగురి అపొస్తలుల పేర్లు ఉన్నాయి.
REV 21:15 నాతో మాట్లాడిన దూత దగ్గర బంగారంతో చేసిన కొలత బద్ద ఉంది. అతడు దాని పట్టణాన్ని, దాని ప్రాకారాన్ని, ద్వారాలను కొలవటానికి తెచ్చాడు.
REV 21:16 ఆ పట్టణం చతురస్రంగా కట్టబడి ఉంది. దాని వెడల్పు, పొడవు సమానంగా ఉన్నాయి. అతడు కొలతబద్దతో పట్టణాన్ని కొలిచాడు. దాని పొడవు, వెడల్పు, ఎత్తు, 1,500 మైళ్ళు ఉన్నట్లు కనుగొన్నాడు.
REV 21:17 ఆ పట్టణం యొక్క ప్రాకారాన్ని కొలిచి దాని ఎత్తు ఆ నాటి కొలత పద్దతి ప్రకారం 144 మూరలు ఉన్నట్లు కనుగొన్నాడు.
REV 21:18 ఆ ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడి ఉంది. ఆ పట్టణం బంగారంతో కట్టబడి ఉంది. అది గాజువలె స్వచ్ఛంగా ఉంది.
REV 21:19 ఆ ప్రాకారాల పునాదులు రకరకాల రత్నాలతో అలంకరింపబడి ఉన్నాయి. మొదటి పునాదిరాయి సూర్యకాంతం, రెండవది నీలం, మూడవది యమున, నాలుగవది పచ్చ,
REV 21:20 ఐదవది వైఢూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణ సునీయము, పదకొండవది పద్మరాగము, పన్నెండవది సుగంధము.
REV 21:21 ఆ పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలతో చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ముత్యంతో చేయబడి ఉంది. ఆ పట్టణపు వీధులు మేలిమి బంగారంతో చేయబడి ఉన్నాయి. అవి గాజువలె స్వచ్ఛంగా ఉన్నాయి.
REV 21:22 ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు.
REV 21:23 దేవుని తేజస్సు ఆ పట్టణానికి వెలుగునిస్తుంది. గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి జ్యోతి కాబట్టి ఆ పట్టణానికి వెలుగునివ్వటానికి సూర్యచంద్రులు అవసరం లేదు.
REV 21:24 జనులు ఆ వెలుగులో నడుస్తారు. ప్రపంచంలో ఉన్న రాజులు తమ ఘనతను ఆ పట్టణానికి తీసుకు వస్తారు.
REV 21:25 ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదు. కనుక ఆ పట్టణం యొక్క ద్వారాలు ఎన్నటికీ మూయబడవు.
REV 21:26 జనముల గౌరవము, వారి కీర్తి, ఈ పట్టణానికి తేబడుతాయి.
REV 21:27 అపవిత్రమైనది ఆ పట్టణంలో ప్రవేశింపదు. అదే విధంగా అవమానకరమైన పనులు చేసేవాళ్ళు, మోసగాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించరు. గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు.
REV 22:1 ఆ తర్వాత ఆ దేవదూత స్పటికంలా స్వచ్ఛంగా ఉన్న నదిని నాకు చూపాడు. దానిలో జీవజలం ఉంది. ఆ నది దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల కూర్చున్న సింహాసనం నుండి మొదలై,
REV 22:2 పట్టణంలోని గొప్ప వీధి మధ్యనుండి పారుతూ ఉంది. ఆ నదికి యిరువైపులా జీవ వృక్షం ఉంది. ఆ వృక్షానికి పన్నెండు కాపులు కాస్తాయి. ప్రతి నెలా ఆ వృక్షం ఫలాలనిస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను నయం చేయటానికి ఉపయోగింపబడుతాయి.
REV 22:3 ఇక మీదట ఏ శాపం ఉండదు. దేవునికి మరియు గొఱ్ఱెపిల్లకు చెందిన సింహాసనం పట్టణంలో ఉంటుంది. ఆయన భక్తులు ఆయనకు సేవ చేస్తారు.
REV 22:4 వాళ్ళు ఆయన ముఖం చూస్తారు. ఆయన పేరు వాళ్ళ నొసళ్ళపై ఉంటుంది.
REV 22:5 ఇక మీదట చీకటి ఉండదు. ప్రభువైన దేవుడు వాళ్ళకు వెలుగునిస్తాడు. కనుక వాళ్ళకు దీపపు వెలుగు కాని, సూర్యుని వెలుగు కాని అవసరం ఉండదు. వాళ్ళు చిరకాలం రాజ్యం చేస్తారు.
REV 22:6 ఆ దూత నాతో, “ఇవి నమ్మదగినవి, నిజమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలోనే జరుగనున్న వాటిని తన సేవకులకు చూపించటానికి తన దూతను పంపాడు.
REV 22:7 ‘చూడు! నేను త్వరలోనే రాబోతున్నాను. ఈ గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్కును ఆచరించే వాడు ధన్యుడు’” అని అన్నాడు.
REV 22:8 యోహాను అనబడే నేను ఈ విషయం చూసాను. నేను అవి విని, చూసినప్పుడు నాకు యివి చూపిస్తున్న దూతను ఆరాధించటానికి అతని కాళ్ళ మీదపడ్డాను.
REV 22:9 కాని అతడు నాతో, “నేను నీ తోటి సేవకుణ్ణి, నీ సోదరులతో, ప్రవక్తలతో, ఈ గ్రంథంలో ఉన్న సందేశాలు ఆచరించే వాళ్ళతో కలిసి సేవ చేసేవాణ్ణి. నన్ను ఆరాధించకు. దేవుణ్ణి ఆరాధించు” అని అన్నాడు.
REV 22:10 అతడు యింకా ఈ విధంగా అన్నాడు: “కాలం సమీపిస్తుంది, కనుక ఈ గ్రంథంలోని ప్రవచన వాక్కును రహస్యంగా దాచవద్దు.
REV 22:11 తప్పు చేసేవాణ్ణి తప్పు చేయనీ! నీచంగా ప్రవర్తిరచేవాణ్ణి నీచంగా ప్రవర్తించనీ! నీతిగా ఉండేవాణ్ణి నీతిగా ఉండనీ! పవిత్రంగా ఉండేవాణ్ణి పవిత్రంగా ఉండనీ.”
REV 22:12 “జాగ్రత్త, నేను త్వరలో రాబోతున్నాను. ప్రతి ఒక్కనికి అతడు చేసే వాటిని బట్టి నా దగ్గరున్న దాన్ని బహుమతిగా ఇస్తాను.
REV 22:13 ఆదియు, అంతమును నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే, ఆరంభాన్ని, సమాప్తాన్ని నేనే.
REV 22:14 “జీవవృక్షం మీది ఫలాన్ని తినటానికి అర్హత పొందేందుకు, గుమ్మాల ద్వారా పట్టణంలోకి వెళ్ళే అర్హత పొందేందుకు తమ తమ దుస్తుల్ని శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉన్నవాళ్ళు ధన్యులు.
REV 22:15 పట్టణానికి వెలుపట కుక్కలు, ఇంద్రజాలికులు, అవినీతిపరులు, హంతకులు, విగ్రహారాధకులు, అసత్యాన్ని ప్రేమించి జీవించేవాళ్ళు రకరకాల మనుష్యులు ఉంటారు.
REV 22:16 “నేను యేసును. ఈ విషయాన్ని సంఘాలకు చెప్పటానికి నా దూతను నీ దగ్గరకు పంపాను. నేను వేరును, దావీదు వంశాంకురాన్ని, ప్రకాశించే వేకువ చుక్కను.”
REV 22:17 ఆత్మ మరియు పెళ్ళికుమార్తె “రండి” అని అంటున్నారు. ఇది విన్నవాడు “రండి!” అనాలి. దాహంతో ఉన్నవాళ్ళు రావచ్చును. ఇష్టమున్న వాడు ఉచితంగా లభించే జీవజలాన్ని త్రాగవచ్చు.
REV 22:18 ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్కును వినే ప్రతి ఒక్కణ్ణి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను.
REV 22:19 ఒకవేళ ఎవరైనా దీనికి ఏదైనా చేర్చితే, ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వాని మీదకువస్తాయి. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథంనుండి ఏవైనా మాటలు తీసి వేస్తే, ఈ గ్రంథంలో వర్ణింపబడిన జీవవృక్షంలో, పవిత్ర పట్టణంలో అతనికున్న హక్కును దేవుడు తిసివేస్తాడు.
REV 22:20 యేసు ఇవన్నీ నిజమని చెపుతున్నాడు. ఇప్పుడు ఆయన, “ఔను, నేను త్వరలోనే వస్తాను” అని అంటున్నాడు. ఆమేన్! రండి యేసు ప్రభూ!
REV 22:21 యేసు ప్రభువు అనుగ్రహం దేవుని జనులపై ఉండుగాక. ఆమేన్.
