﻿కీర్తన..
63.
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది. దేవా, నీవు నా దేవుడవు. నాకు నీవు ఎంతగానో కావాలి. నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా నీకొరకు దాహంగొని ఉన్నాయి. 
అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను. నీ బలము నీ మహిమలను నేను చూశాను. 
నీ ప్రేమ జీవం కన్నా గొప్పది. నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి. 
అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను. నీ వేరిట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను. 
నేను శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను. నా నోరు నిన్ను స్తుతిస్తుంది. 
నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను. రాత్రి ఝాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను. 
నీవు నిజంగా నాకు సహాయం చేశావు. నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను. 
నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది. నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది. 
కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు. వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు. 
ఖడ్గములతో వారు చంపబడతారు. అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి. 
అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు. ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్దికులందరినీ ఆయన ఓడించాడు. 
