﻿కీర్తన..
58.
సంగీత నాయకునికి. “నాశనం చేయవద్దు.”దావీదు అనుపదగీతం. న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు. మీరు ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పటంలేదు. 
లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు. ఈ దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు. 
ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు. పుట్టినప్పటి నుండి వారు అబద్దికులే. 
వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు. వినతలచని తాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు. 
తాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే వాని నాగ స్వరంగాని వినవు. ఆ దుర్మార్గులు అలాన్నారు. 
యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు. కనుక యెహోవా, వారి పళ్లు విరుగగొట్టుము. 
ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయమవుదురుగాక. బాటలోని కలుపు మొక్కల్లా వారు అణగదొక్కబడుదురు గాక. 
మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక. చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని శిశువులా వారు ఉందురు గాక. 
కుండకింద వున్న నిప్పువేడిలో అతిత్వరగా కాలి పోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక. 
మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతోషిస్తాడు. ఆ దుర్మార్గుల రక్తంలో అతడు తన పాదాలు కడుగుకొంటాడు. 
అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది. లోకానికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.” 
