﻿కీర్తన..
3.
దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్న సమయంలో వ్రాసిన కీర్తన. యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు. అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. 
చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు. 
ఆయితే, యెహోవా, నీవు నాకు కేడెము. నీవే నా అతిశయం. యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా చేస్తావు. 
యెహోవాకు నేను ప్రార్థిస్తాను. ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు! 
నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును. ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక! 
వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును. కానీ ఆ శత్రువులకు నేను భయపడను. 
యెహోవా, లెమ్ము నా దేవా, వచ్చి నన్ను రక్షించుము! నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట శత్రువుల దవడమీద నీవు కొట్టి, వారి పళ్లన్నీ నీవు విరుగగొడతావు. 
యెహోవా తన ప్రజలను రక్షించగలడు. యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము. 
