﻿యోబు.
22.
అప్పుడు తేమానువాడైన ఎలీఫజు జవాబు యిచ్చాడు: 
“దేవునికి నరుడు ఉపకారికాగలడా? జ్ఞానం గల వ్యక్తి తప్పక తనకు తానే ఉపయోగికారిగా వుంటాడు. 
ఒకవేళ నీవు సక్రమమయినదే చేసినప్పటికీ, సర్వ శక్తిమంతుడైన దేవునికి అది సంతోషం కలిగించదు. నీవు ఎల్లప్పుడూ మంచివాడివిగానే వున్నా దేవునికి ఏమీ లాభంలేదు. 
యోబూ, దేవుడు నిన్ను శిక్షించినది ఆయనను నీవు ఆరాధించినందుకా? 
కాదు, అది నీవు విస్తారంగా పాపం చేసినందువల్లనే. యోబూ, నీ పాపాలు ఎప్పటికీ నిలిచిపోవు. 
యోబూ, నీ సోదరులు నీకు ఋణపడి ఉన్న ధనాన్ని నీకు తిరిగి చెల్లించేందుకు నీవు వారిని బలవంతం చేశావు. అది కారణం లేకుండా నీవు చేశావు. ప్రజల దగ్గర్నుండి వస్తాలు నీవు లాగేసు కొని, వారు ధరించటానికి ఏమీ లేకుండా చేశావు. 
అలసిపోయిన మనుష్యలకు నీవు నీళ్లు ఇవ్వలేదు. ఆకలిగొన్న మనుష్యలకు నీవు అన్నం పెట్టలేదు. 
యోబూ! నీవు అధికారం, ఐశ్వర్యం గలవాడవై నప్పటికీ నీవు ఆ ప్రజలకు సహాయం చేయలేదు. నీకు చాలా భూమి ఉంది, నీవు చాలా గౌరవం పొందినవాడవు. 
కాని విధవలకు నీవు ఏమీ ఇవ్వకుండానే వారిని పంపించివేశావు. యోబూ! అనాధ పిల్లలను నీవు దోచుకొని నీవు వారి యెడల చెడుగా ప్రవర్తించావు. 
అందుకే నీ చుట్టూరా బోనులు ఉన్నాయి. మరియు ఆకస్మిక కష్టం నిన్ను భయ పెడుతుంది. 
అందుకే నీవు చూడలేనంత కటిక చీకటిగా ఉంది. మరియు అందుకే నీళ్ల ప్రవాహం నిన్ను కప్పేస్తుంది. 
“ఆకాశంలో అతి ఉన్నత స్థానంలో దేవుడు నివసిస్తాడు. మహా ఎత్తయిన నక్షత్రాలను దేవుడు వంగి కిందికి చూస్తాడు. నక్షత్రాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో నీవు చూడగలవు. 
కాని యోబూ, ‘నీవు దేవునికి ఏమీ తెలియదు! అంధకార మేఘాల్లోంచి దేవుడు మాకు ఎలా తీర్పు తీరుస్తాడు? 
ఆయన ఆకాశపు అత్యున్నత స్థానంలో నడిచేటప్పుడు మనం చూడకుండా మేఘాలు ఆయనను కప్పివేస్తాయి.’ అని అంటావు. 
“యోబూ! దుర్మార్గులు తిరిగే పాత మార్గంలోనే నీవు నడుస్తున్నావు. 
దుర్మార్గులు మరణించాల్సిన సమయం రాకముందేవారు తీసుకోబడ్డారు. ఒక వరదలో వారు కొట్టుకొని పోయారు. 
‘మమ్ముల్ని ఒంటరిగా విడిచిపెట్టండి. సర్వశక్తి మంతడైన దేవుడు మమ్ముల్ని ఏమీ చేయలేడు’ అని దేవునితో చెప్పేవాళ్లు ఆ మనుష్యులే. 
కానీ ఆ మనుష్యలనే దేవుడు విజయం పొందిన ధనికులుగా చేశాడు. దుర్మార్గులు తలచే పద్ధతి నేను అంగీకరించలేను. 
దుర్మార్గులు నాశనం అయినప్పుడు మంచివాళ్లు చూచి సంతోషిస్తారు. నిర్దోషులు దుర్మార్గులను చూచి నవ్వుతూ. 
‘మన శత్రువులు నిజంగా నాశనం చేయబడ్డారు. వారి ఐశ్వర్యాలను అగ్ని కాల్చేస్తుంది’ అని అంటారు. 
“యోబూ, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. అప్పుడు నీకు ఆయనతో శాంతి ఉంటుంది. ఇలా నీవు చేస్తే, నీవు ధన్యుడవవుతూ, విజయం పొందుతావు. 
ఈ ఉపదేశము స్వీకరించి ఆయన మాటలు నీ హృదయంలో భద్రం చేసికో. 
యోబూ! సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరకు నీవు తిరిగి వస్తే, నీకు మరల మామూలు స్థితి ఇవ్వబడుతుంది. నీవు మాత్రం దుర్మార్గాన్ని నీ ఇంటినుండి దూరంగా తొలగించి వేయాలి. 
నీ బంగారాన్ని నీవు మట్టిపాలు చేయాలి, ఓఫీరునుండి తెచ్చిన నీ బంగారాన్ని నదుల్లోని బండలకేసి విసిరికొట్టు. 
సర్వశక్తిమంతుడైన దేవుడే నీకు బంగారంగాను, వెండిగాను ఉండనియ్యి. 
అప్పుడు నీవు ఎంతో సంతోషిస్తావు. సర్వశక్తి మంతుడైన దేవునిలో ఆనందం కనుగొంటావు. నీవు నీ ముఖాన్ని దేవుని వైపు ఎత్తగలవు. 
నీవు ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు. నీవు ఏం చేస్తానని ఆయనకు ప్రమాణం చేస్తావో దానిని నీవు చేస్తావు. 
నీవు చేసే ప్రతి దానిలో విజయం పొందుతావు. నీ త్రోవలో వెలుగు ప్రకాశిస్తుంది 
గర్విష్ఠులను దేవుడు సిగ్గు పరుస్తాడు కానీ దీనులను దేవుడు రక్షిస్తాడు. 
నిర్దోషి కాని మనిషిని కూడా దేవుడు రక్షిస్తాడు. నీ చేతుల పవిత్రత మూలంగా అతడు రక్షించ బడతాడు.” 
