﻿సంఖ్యా..
3.
సీనాయి పర్వతం మీద మోషేతో యెహోవా మాట్లాడిన సమయంలో అహరోను, మోషేల కుటుంబ చరిత్ర ఇది. 
అహరోనుకు కుమారులు నలుగురు. నాదాబు మొదటి కుమారుడు. ఆ తర్వాత అబీహు, ఎలీయాజరు, ఈతామారు. 
ఈ కుమారులు అభిషేకించబడిన యాజకులు. యాజకులుగా యెహోవాను సేవించే ప్రత్యేక పని ఈ కుమారులుకు ఇవ్వబడింది. 
అయితే నాదాబు, అబీహు యెహోవాను సేవిస్తూనే పాపంచేసారు గనుక వారు చనిపోయారు. వారు యెహోవాకు ఒక అర్పణ తయారు చేసారు కాని, యోహోవా అనుమతించని అగ్నిని వారు ఉపయోగించరు. ఇది సీనాయి అరణ్యంలో సంభవించింది. కనుక నాదాబు, అబీహు అక్కడే చనిపోయారు. వారికి కుమారులు లేనందుచేత ఎలీయాజరు, ఈతామారు యాజకులై యెహోవాను సేవించారు. వారి తండ్రి అహరోను జీవించి ఉండగానే వారు ఇలా చేసారు. 
మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 
“లేవీ కుటుంబంలోని వాళ్లందర్నీ తీసుకునిరా, అహరోను యాజకుని దగ్గరకు వాళ్లను తీసుకునిరా. వారు అహరోనుకు సహాయకులు. 
అహరోను సన్నిధి గుడారంలో పరిచర్య చేసేటప్పుడు లేవీయులు అహరోనుకు సహాయం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు పవిత్ర గుడారంలో ఆరాధించటానికి వచ్చినప్పుడు వాళ్లందరికి లేవీయులు సహాయం చేస్తారు. 
సన్నిధి గుడారంలో సామగ్రి అంతటినీ ఇశ్రాయేలు ప్రజలు కాపాడాలి. అది వారి బాధ్యత. కానీ లేవీయులు వీటి విషయం జాగ్రత్త పుచ్చుకొని ఇశ్రాయేలు ప్రజలందరికీ సేవచేస్తారు. పవిత్ర గుడారంలో ఆరాధించటంలో ఇది వారి విధానం. 
“లేవీయులు అశ్రాయేలు ప్రజలందరిలో నుండి ఏర్పాటు చేసుకోబడ్డారు. ఈ లేవీయులు అహరోనుకు, అతని కుమారులకు సహాయం చేసేందుకు ఏర్పాటు చేయబడ్డారు.” 
“అహరోనును, అతని కుమారులను యాజకులుగా నీవు నియమించు. వారు, వారి బాధ్యతను నిర్వహిస్తూ యాజకులుగా సేవ చేయాలి, పవిత్ర వస్తువులను సమీపించేందుకు ప్రయత్నించే ఏ వ్యక్తి అయినా చంపివేయబడాలి.” 
ఇంకా మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 
“ఇశ్రాయేలీయులు ప్రతి కుటుంబంలోను పెద్దకుమారుణ్ణి నాకు ఇవ్వాలని, నేను నీతో చెప్పాను, కానీ నన్ను సేవించేందుకు ఇప్పుడు లేవీయులను నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. వారు నా వారై ఉంటారు. అందుచేత మిగిలిన ఇశ్రాయేలు ప్రజలంతా వారి పెద్ద కుమారులను నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. 
మీరు ఈజిప్టులో ఉన్నప్పుడు, ఈజిప్టు ప్రజల పెద్ద కుమారులందర్ని నేను చంపాను. ఆ సమియంలో ఇశ్రాయేలు పెద్ద కుమారులందరిని నా వాళ్లగా నేను అంగీకరించాను. పెద్ద కుమారుందరు నా వారు, పశువులలో ప్రథమంగా పుట్టినవన్నీ నావే. కానీ మీ పెద్దలందరినీ నేను మీకు తిరిగి ఇచ్చివేస్తున్నాను, మరియు లేవీయులను నా వారిగా చేసుకుంటున్నాను. నేను యెహోవాను.” 
సీనాయి అరణ్యంలో మోషేతో మరోసారి యెహోవా మాట్లాడాడు: యెహోవా ఇలా చెప్పాడు, 
“లేవీ వంశంలో ఉన్న లేవీలను, కుటుంబాలను అన్నింటినీ లెక్కించు. ప్రతి పురుషుని, ఒక నెలగాని అంతకంటె ఎక్కువగాని వయస్సు ఉన్న ప్రతి బాలుని లెక్కించు.” 
కనుక మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. అతడు వాళ్లందర్నీ లెక్కించాడు. 
లేవీకి ముగ్గురు కుమారులు. వారి పేర్లు: గెర్షోను, కహాతు, మెరారి. 
ఒక్కో కుమారుడు ఎన్నో వంశాలకు నాయకుడు. గెర్షోను కుటుంబంలో, లిబ్నీ, షిమీ. 
కహాతు కుటుంబంలో, అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు, 
మెరారి కుటుంబంలో, మహలి, ముషి. ఇవి లేవీ వంశానకి చెందిన కుటుంబాలు. 
లిబ్ని, షిమివంశాలు గెర్షోము కుటుంబానికి చెందినవి. అవి గెర్షోనీ వంశాలు. 
ఈ రెండు కుటుంబాలలోను ఒక నెల వయసు దాటిన బాలురు, పురుషులు 7,500 మంది ఉన్నారు. 
గెర్షోని కుటుంబాలు పశ్చిమాన నివాసం చేయాలని చెప్పబడింది. పవిత్ర గుడారం వెనుకవైపు వారు నివాసము చేసారు. 
లాయెలు కుమారుడు ఎలీయా సావు గెర్షోనీ ప్రజల కుటుంబాలకు నాయకుడు. 
పవిత్ర గుడారం, దాని కప్పు, వెలుపలి గుడారం కాపాడుట పవిత్ర గుడారంలో గెర్షోనీ ప్రజలు బాధ్యత. సన్నిధి గుడారం ప్రవేశంలో ఉన్న తెర బాధ్యత కూడా వారే తీసుకున్నారు. 
ఆవరణలో తెర బాధ్యత కూడా వారే వహించారు. ఆవరణానికి గల ప్రవేశం యొక్కతెర విషయం కూడా వారే శ్రద్ధ పుచ్చుకున్నారు. పవిత్ర గుడారానికి, బలి పీఠానికి చుట్టూ ఉంది ఈ ఆవరణ. తాళ్ల విషయం, తెరలకు సంబంధించిన వాటన్నింటి విషయం వారే జాగ్రత్త తీసుకున్నారు. 
అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు వంశాలు కహాతు కుటుంబానికి చెందినవి. వారు కహాతీ వంశపువారు. 
పురుషులు ఒక నెల వయసు దాటిన బాలురు, 8,600 మంది ఈ కుటుంబంలో ఉన్నారు. పవిత్ర స్థలంలోని వాటిని కాపాడే బాధ్యత కహాతు ప్రజలకు ఇవ్వబడింది. 
పవిత్ర గుడారం దక్షిణ దిశ కహాతీ వంశానికి ఇవ్వబడింది. ఇది వారు నివాసం చేసిన ప్రదేశం. 
ఉజ్జీయేలు కుమారుడు ఎలీషాపాను కహాతీ వంశాల నాయకుడు. 
పవిత్ర పెట్టె, బల్ల, దీపస్తంభం, పవిత్ర స్థలంలోని పాత్రలను కాపాడటం వారి బాధ్యత. తెర విషయం, దానితోబాటు ఉపయోగించిన వస్తువులన్నింటి విషయంకూడా వారు శ్రద్ధ తీసుకున్నారు. 
అహరోను కుమారుడును యాజకుడైన ఎలియాజరు లేవీ ప్రజానాయకులకు నాయకుడు. పవిత్ర పరికరాలను కాపాడే వారందరిపై ఎలియాజరు పరీశీలకుడు. 
మహలీ, మూషి కుటుంబాలు మెరారి వంశానికి చెందినవి. ఒక నెల దాటిన బాలురు, పురుషులు మహలీ కుటుంబంలో 6,200 మంది ఉన్నారు. 
అబీహాయిలు కుమారుడైన సూరీయేలు మెరారి వంశానికి నాయకుడు. పవిత్ర గుడారం ఉత్తర ప్రదేశం ఈ వంశానికి ఇవ్వబడింది. ఇది వారు నివాసం చేసిన ప్రదేశం. 
పవిత్ర గుడారపు చట్రాలను కాపాడే బాధ్యత మెరారి ప్రజలకు ఇవ్వబడింది. పవిత్ర గుడారపు చట్రాలతో బాటు వాటి పలకలను, అడ్డకర్రలను, స్తంభాలను. దిమ్మలను, పరికరాలను, దానికి సంబంధించిన వాటన్నింటినీ వారు కాపాడారు. 
పవిత్ర గుడారం చుట్టు ప్రక్కల స్తంభాలన్నింటినీ వారు కాపాడారు. వాటి దిమ్మలు, మేకులు, తాళ్లు కూడ ఇందులో ఉన్నాయి. 
సన్నిధి గుడారం ఎదుట పవిత్ర గుడారానికి తూర్పున మోషే, అహరోను, అతని కుమారులు విడిదిచేసారు. పవిత్ర స్థలాన్ని కాపాడే బాధ్యత వారికి ఇవ్వబడింది. ఇది ఇశ్రాయేలీయులందరి పక్షంగా వారు చేసారు. వేరే వారెవరైనా పవిత్ర స్థలం దగ్గరగా వస్తే చంపేయాల్సిందే. 
లేవీ వంశంలో ఒక నెలగాని, అంతకు మించిగాని వయస్సున్న బాలురను పురుషులను లెక్కించమని మోషే, అహరోనులకు యెహోవా ఆజ్ఞాపించాడు. మొత్తం సంఖ్య 22,000. 
మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులలో ఒక నెలగాని అంతకంటె ఎక్కువగాని వయసుగల మొదట పుట్టిన బాలురను, పురుషులను అందరినీ లెక్కించు, వారి పేర్ల జాబితా ఒకటి తయారుచేయి. 
ఇప్పుడు ఇశ్రాయేలీయుల పెద్ద కుమారులను నేను తీసుకోను. ఇప్పుడు యెహోవానగు నేను లేవీయులను స్వీకరిస్తాను. ఇశ్రాయేలీయులలో ఇతరుల పశువులలో మొదటి ఫలమంతటినీ తీసుకొనే బదులు లేవీయుల పశువుల మొదటి ఫలాన్ని నేను తీసుకుంటాను.” 
కనుక యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషేచేసాడు. ఇశ్రాయేలు ప్రజలు పిల్లల్లో పెద్ద వారినందరినీ మోషే లెక్కించాడు. 
ఒక నెల, అంతకంటె ఎక్కువ వయసుగల మొదట పుట్టిన బాలురను, పురుషులను మోషే జాబితా చేసాడు. ఆ జాబితాలో 22,273 మంది ఉన్నారు. 
మోషేతో యెహోవా ఇంకా ఇలా అన్నాడు: 
“నేనే, యెహోవాను ఈ ఆజ్ఞ ఇస్తున్నాను: ‘ఇశ్రాయేలీయుల ఇతర కుటుంబాల్లోని మొదట పుట్టిన వారందరి బదులు లేవీయులను తీసుకో. మిగిలిన ప్రజల పశువులకు బదులు లేవీయుల పశువులను నేను తీసుకుంటాను. లేవీయులు నా వారు. 
లేవీయులు 22,000 మంది ఉన్నారు కానీ, ఇతర కుటుంబాల్లోని పెద్ద కుమారులు 22,273 మంది ఉన్నారు. అనగా లేవీయులకంటె 273 మంది పెద్ద కుమారులు ఎక్కువగా ఉన్నారు. 
కనుక ఆ 273 మందిలో ప్రతి ఒక్కరి వద్దా అధికారిక కొలతనుపయోగించి అయిదు తులాల వెండి తీసుకో. (ఇది 20 చిన్నములు బరువుగల అధికారిక కొలత.) ఇశ్రాయేలు ప్రజలవద్ద ఆ వెండి వసూలు చేయి. 
ఆ వెండిని అహరోనుకు అతని కుమారులకు ఇవ్వు. అది 273 మంది ఇశ్రాయేలీయులకు విమోచనా ధనం.’” 
కనుక 273 మంది కొరకు ఈ ధనాన్ని మోషే వసూలు చేసాడు. ఈ 273 మంది స్థానాన్ని లేవీ వంశం వహించలేకపోయింది. 
ఇశ్రాయేలు ప్రజలలో మొదట పుట్టినవారినుండి వెండిని మోషే వసూలు చేసాడు. అధికారిక కొలత ప్రకారం 1,365 వెండి తులాలను అతడు వసూలు చేసాడు. 
యెహోవాకు మోషే విధేయుడయ్యాడు. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అహరోనుకు, అతని కుమారులకు ఆ వెండిని మోషే ఇచ్చాడు. 
